నలుగురు కవులకు రమణ సుమన శ్రీ అవార్డులు

 

దెంచనాల శ్రీనివాస్

సిద్ధార్థ

ఎం.ఎస్‌.నాయుడు

ఉత్తమ కవితా సంకలనాలకిచ్చే రమణ సుమన శ్రీ ఫౌండేషన్‌ పురస్కారాలను ఫౌండేషన్‌ అధ్యక్షులు సుమనశ్రీ ప్రకటించారు. 2015కుగానూ సౌభాగ్య (సౌభాగ్య సమగ్ర కవిత్వం), దెంచనాల శ్రీనివాస్‌ (భస్మ సారంగీ); 2016కుగానూ సిద్ధార్థ (బొమ్మల బాయి), ఎం.ఎస్‌.నాయుడు (గాలి అద్దం) పురస్కారం అందుకుంటారు. జనవరి 18న సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్‌ హాల్లో జరిగే ఈ ప్రదాన వేడుకలో శివారెడ్డి, చినవీరభద్రుడు, నున్నా నరేశ్, కె.బి.లక్ష్మి, సి.వి.కృష్ణారెడ్డి పాల్గొంటారు.

రమణ సుమనశ్రీ

 

కౌముది-రచన కథల పోటీ

kathalapotee

శకలాలూ, విడి శిబిరాలూ వద్దు: శిఖామణి

yanam1శిఖామణి.

ఆధునిక తెలుగు కవిత్వంలో వొక ప్రత్యేకమైన గొంతు. తొలి కవితా సంపుటి ‘మువ్వల చేతికర్ర’ నుంచి నిన్నటి ‘పొద్దున్నే కవిగొంతు’ కవితాసంపుటి వరకు వొక గొప్ప సాహితీయానం ఆయనది. అతనిలానే అతని కవిత్వమూ అతని కవిత్వంలానే అతనూ వుంటారు. శిఖామణి గారి కవిత్వం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన అనేక విమర్శనాగ్రంధాలూ వెలువరించారు. సంపాదకత్వ బాధ్యతలనూ అంతే ధీటుగా నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక అధ్యయనకేంద్రం డైరెక్టర్ గా ఇటీవల పదవీవిరమణ చేసిన శిఖామణి గారి పర్యవేక్షణలో అనేక మంది పి.హెచ్.డి, ఎం.ఫిల్ పట్టాలు పొందారు.

ఈ నవంబర్ 26,27 తేదీలలో యానాంలో పొయిట్రీ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా కవిసంధ్య యానాం ఫెస్టివల్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ వుంటుంది. ఆ మొత్తం కార్యక్రమం గురించి ఆయనతో కొద్దిసేపు :

 యానాం పోయిట్రీ ఫెస్టివల్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ? ఈ ఆలోచనకు మూలం ఏమిటి ?

హైదరాబాద్ వంటి ఒకటి రెండు చోట్ల జరిగిన లిటరరీ ఫెస్టివల్స్ / పొయిట్రీ ఫెస్టివల్స్ లో తెలుగు సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అవకాశం లేకపోవడం, వున్నా అవి ప్రాతినిధ్యం వహించేవి కాకుండా నామమాత్రంగా వుండటం చూసి బాధ కలిగించింది. కేవలం కవిత్వానికే మనమే ఒక ఉత్సవం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుండి పుట్టిందే యానాం పొయిట్రీ ఫెస్టివల్.

 యానాం పొయిట్రీ ఫెస్టివల్ అన్న పేరే ఎందుకు పెట్టారు ?

నిన్నటి వరకూ ఉమ్మడిగా ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయింది. ఎవరి అస్థిత్వాలు, మూలాల అన్వేషణలో వారున్నారు. దీని ప్రభావం సాహిత్యంపైనా తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో నేను పుట్టిన ఊరు యానాం పేరుతో కవితోత్సవం జరపాలని మిత్రులం అనుకున్నాం ! యానాంలో జరుగుతుంది కనుక యానాం కవితోత్సవం అనేది పేరుకే గానీ నిజానికి ఇది తెలుగు కవితోత్సవం. ఆ మాటకొస్తే భారతీయ కవితోత్సవం !

ఈ ఫెస్టివల్ నిర్వహణ ప్రధాన ఉద్దేశం ?

 లలితకళల్లో కవిత్వానిదే ప్రథమ స్థానం. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ సమాజం పట్ల, సంఘటనల పట్ల కవిత్వానిదే ప్రథమ స్పందన. దురదృష్టవశాత్తు అస్థిత్వ ఉద్యమాల పేరుతో కవిసమూహం శకలాలు శకలాలుగా విడిపోయివుంది. ఈ శకలాలు ఎప్పటికైనా ఒకటి కావాల్సి వుంది. అందరి స్వప్నమూ ఒక సర్వోన్నత మానవుడే కనుక అది సాధ్యమే ! అందుకు ఇటువంటి ఫెస్టివల్స్ దోహదం చేస్తాయినుకుంటున్నాను.

 ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ?

‘మానవ నాగరికత – కవిత్వం’ అనే అంశంపై ప్రముఖ కవి కె. శివారెడ్డి గారు ఫెస్టివల్ ని ఉద్దేశించి కీలకోపన్యాసం చేయబోతున్నారు. ఈ అంశం మీద ఆయన్ని మాట్లాడ్డానికి ఆహ్వానించినప్పుడు ఇంత వరకు ఇటువంటి విషయంపై మాట్లాడమని ఎవ్వరూ అడగలేదని ఆయన ఒకింత ఆనందం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒకప్పుడు తెలుగునాట ఏ పుస్తకం ముఖచిత్రం చూసినా ప్రముఖ చిత్రకారులు శీలా వీర్రాజు గారి బొమ్మ వుండేది. చిత్రకారులు సాహిత్యానికి పరోక్ష ప్రచారకులు. కానీ వారిని సాహిత్యరంగం పెద్దగా గుర్తించినట్టు కనబడదు. ఈ ఉత్సవంలో శీలా వీర్రాజు గారి చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. ప్రధానంగా సమకాలీన భారతీయ కవిత్వంపై సదస్సు – బహు భాషా కవిసమ్మేళనం, సమకాలీన తెలుగు కవిత్వంపై సదస్సు – తెలుగు కవిసమ్మేళనం నిర్వహిస్తున్నాం !

 రెండు రోజుల కార్యక్రమానికి ఎవరెవరు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ?

 రెండు రాష్ట్రాల నుండి, తెలుగేతర రాష్ట్రాల నుండి ప్రసిద్ధులయిన కవులు, రచయితలు, విమర్శకులు చాలా మందే హాజరవుతున్నారు. కొలకలూరి ఇనాక్, మృణాళిని, తనికెళ్ల భరణి , దేవరాజు మహారాజు ( హైద్రాబాద్ ), నలిమెల భాష్కర్ ( కరీంనగర్ ), బన్న ఐలయ్య ( వరంగల్ ), మేడిపల్లి రవికుమార్ ( తిరుపతి ), ఎన్. వేణుగోపాల్, దర్భశయనం శ్రీనివాసాచార్య, యాకూబ్ ( తెలంగాణ ), తుర్లపాటి రాజేశ్వరి ( బెర్హంపూర్ ), మువ్వా శ్రీనివాసరావు, సీతారాం ( ఖమ్మం ), ఖాదర్ మొహియుద్దీన్ ( విజయవాడ ), రసరాజు రాజు, కొప్పర్తి ( తణుకు ), జి. లక్ష్మీనరసయ్య, వినోదిని, ఎం. సంపత్ కుమార్, చందు సుబ్బారావు, ఎల్. ఆర్. స్వామి, రామతీర్ధ, సుధామ వంటి అనేక మంది హాజరవుతున్నారు

 ఇతర భాషా కవులు…. ?

 నిజానికి ఇతర భాషా కవులు సదానందశాలీ, గురుమూర్తి పెండేకురు, గౌరీ కృపానందన్, డేనియల్ నెజెర్స్, జయంత్ పర్మార్, సంతోష్ ఎలెక్స్ వంటి వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఫెస్టివల్ అనివార్యంగా నవంబర్ 19 నుండి 26 కి వాయిదా పడటం వల్ల వీరిలో ఎంత మంది హాజరవుతారో చెప్పలేను.

 ఈ కార్యక్రమంలో ఇంకేవైనా ప్రత్యేకతలు…. ?

 లేకేం ! చాలనే వున్నాయి. ‘ కవిసంధ్య – కవిత్వపత్రిక – యానాం కవితోత్సవ ప్రత్యేకసంచిక ‘ సుమారు 125 పేజీలలో వెలువడుతోంది. ఇది ఫెస్టివల్ కు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. నా మొత్తం కవిత్వంలోంచి దళిత కవితలను ఎంచి ఒక సంకలనంగా ముద్రించి ఉత్సవ వేదిక మీద ఆవిష్కరిస్తున్నాం ! ఇంకా కవులు ప్రసాదమూర్తి, విన్నకోట రవిశంకర్, జి. వి. రత్నాకర్, నేతల ప్రతాప్ కుమార్, నేలపూరి రత్నాజీ, రఘుశ్రీ వంటి వారి కవితా సంపుటులు ఆవిష్కరించబడుతున్నాయి.

 కొత్తగా శిఖామణి సాహితీ పురస్కారం ఏర్పాటు చేసారు కదా ? దాని గురించి.. !

 గత 30 ఏళ్లుగా కవిత్వంలో వున్నాను. ఎందరో కవిత్వాభిమానుల్ని సంపాదించుకున్నాను. వారి మాటలను విన్నప్పుడు ఈ జీవితానికిది చాలు అన్నంత గొప్ప తృప్తి కలుగుతుంది. తెలుగు నాట వున్న దాదాపు అన్ని సాహితీసంస్థలు నా కవిత్వాన్ని పురస్కారాలతో సత్కరించాయి. నాకు ఇంత యిచ్చిన కవిత్వానికి నేను కూడా ఏమైనా యివ్వాలని చంద్రునికో నూలుపోగు చందాన ఈ ఏడాది నుండి ‘శిఖామణి’ సాహితీ పురస్కారం, పదివేల రూపాయల నగదు బహుమతిగా ప్రారంభించాను.

 మొదటి పురస్కారం ఎవరికిస్తున్నారు ?

 పురస్కారం ఏర్పాటు వరకే నా ప్రమేయం ! ఎంపిక కమిటీ చూసుకుంటుంది. ఈ సంవత్సరం పురస్కార కమిటీ సభ్యులుగా సుప్రసిద్ధ సాహితీవేత్తలు డా. సి. మృణాళిని, ప్రముఖ కవి యాకూబ్, కవి – కథారచయిత దాట్ల దేవదానం రాజులు ఏకగ్రీవంగా ప్రముఖ కవి కె. శివారెడ్డి గారిని ఎంపిక చేసారు. ‘శిఖామణి’ సాహితీ పురస్కారానికి ప్రధమంగా ఎంపికైన శివారెడ్డి గారికి శుభాకాంక్షలు.

 కవిసంధ్య నిర్వహణ బాధ్యత, సంచారం, వొక కొత్త పాత్రలోకి ప్రవేశం ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు ?

పాతికేళ్లుగా కవిసంధ్యను నిర్వహిస్తూ వస్తున్నాను. అయితే అది సాహిత్య సంస్థ – ఇది కవిత్వ పత్రిక. ఇష్టంగా చేసే ఏ పని అయినా కష్టం అనిపించదు. ఇదీ అంతే. ఉగాది నుండి పత్రికను తెస్తున్నాం ! మారుమూల యానాం నుండా అని సందేహించినవాళ్లు, సంశయించినవాళ్లు వున్నారు. దాన్ని పటాపంచలు చేయడానికి పత్రికను క్షేత్రస్థాయి కవిత్వ పాఠకుల వద్దకు తీసుకెళ్లడానికి ఈ ఆరునెలలూ పెద్ద సంచారమే చేసాను. సభలకు పిలిచిన చోటల్లా అడిగి మరీ కవిసంధ్య ఆవిష్కరణ పెట్టించాను. అభిమానించారు. ఆదరించారు. ఇలాంటి పత్రిక అవసరం వుందన్నారు. గోరంత పూనికతో మొదలు పెట్టిన ప్రయత్నానికి కొండంత అండనిచ్చారు. నాక్కొంచెం నమ్మకమిచ్చారు. వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను – ఒక రకంగా ఇది కొత్త అనుభూతి. నిన్నటి వరకు పత్రికలకు పంపి ఎదురుచూసే నాకు కవిత్వాన్ని ఎంపిక చేసి, అచ్చేసే అరుదైన అవకాశం రావడం గొప్ప ఆనందాన్ని అనుభూతిని యిచ్చింది. కవిత్వం రాయడం ఎలా కవుల బాధ్యతో, దాన్ని అచ్చేయడం పత్రికల బాధ్యత. కారణాలు ఏమైనా సరే సుదీర్ఘ నిరీక్షణ, సహనాన్ని పరీక్షించడం, కవులను ప్రమోట్ చేస్తున్నాం వంటివి తొలగిపోవాలి. కవిసంధ్య ఇటువంటి వాటికి దూరంగా వుంటుంది.

 ఆధునిక వచన కవిత్వంలో కవిసంధ్య ఎలాంటి పాత్రని నిర్వహించబోతోంది ?

 ఇప్పుడే స్పష్టంగా చెప్పలేను గానీ నాకు కొన్ని ఖచ్చితమైన ఆలోచనలున్నాయి. వచనకవిత్వం మొదలై 75 సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా ప్రాతినిధ్య రచనలతో 75 సంవత్సరాల వచన కవిత సంకలనం తీసుకురావాలని వుంది. వచనకవితా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి ! అలాగే కవిత్వంలో ఒక పెద్ద తరం నెమ్మదిగా తరలి వెళ్లిపోతోంది. ఎవరో ఒకరిద్దరు తప్ప తమ రచనానుభవాలను నమోదు చేయలేదు – ‘ నా కవిత్వానుభవాలు ‘ పేరుతో ప్రముఖ అనుభవాలను రాయించాలనే ఆలోచన వుంది. ఇవి కొత్త తరం కవులకు పాఠ్యాంశాలుగా ఉపయోగపడతాయి. రకరకాల పేర్ల మారు వేషాల్లో అకవిత్వం కవిత్వంగా చలామణి అవుతోంది – విషాదం ఏమిటంటే కవితాతత్వం తెలిసిన వాళ్లే ఇటువంటి దుశ్చర్యలను ప్రోత్సహించడం – అచ్చమైన కవిత్వాన్ని పట్టి చూపడం, నిలబెట్టడం కవిసంధ్య చేయబోయే పని !

మున్ముందు కవిసంధ్య నిర్వహణలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ?

 చాలానే వున్నాయి. కవితోత్సవం సందర్భంగా చాలా మంది ఫోను చేసి మేం రావచ్చా, పాల్గొనవచ్చా అని అడిగారు. నేను వాళ్లను అడిగిన ప్రశ్న వినడానికా ? అని – దానికి వాళ్లు ఇక్కడ శతాధిక సమ్మేళనంలో, అక్కడ 36 గంటల సమ్మేళనంలో పాల్గొన్నాం అని సమాధానం. కానీ కవి సమ్మేళనాలు కవిత్వాన్ని ప్రాక్టీసు చేసే వేదికలు కావు. వాటికి శిక్షణా శిబిరాలు అవసరం – అలాగే – అనువాద వర్క్ షాపులు నిర్వహించడం, ఆధునిక కవిత్వ పారిభాషిక పదాలతో వివరణిక రూపొందిచడం, ఎంపిక చేసిన కవుల రచనల నుండి కవితలతో ప్రాతినిధ్య కవితా సంఫుటాలను వెలువరించడం వంటి ప్రణాళికలు వున్నాయి – కాలం కలిసొస్తే ఒక్కటొక్కటి పూర్తి చేయాలని వుంది.

*

yanam

ముస్లిం ఆకాంక్షల “చమన్” 

 chaman

దేశానికి స్వాతంత్రం సంభవించి డెబ్భై వసంతాలు గడిచిపోయాయి. గడిచిపోయాయి అని చెప్పటం చాలా తేలిక. కానీ…మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అంత సులభం గా మనకు చిక్కలేదంటే రాబోయే తరాలకు నమ్మశక్యం కాకపోవచ్చు. అంతగా స్వేచ్ఛకు అలవాటు పడిపోయాం. కానీ ఈ ఫలాలు మనకు అందించడానికి ఎంతోమంది వారి ప్రాణాలను ఫణంగా పెట్టారు. అప్పట్లో వారికి ఒక్కటే లక్ష్యం. భారత్ ను దాస్య శృంఖాలలనుంచి విముక్తి పొందించాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం ముందు ఎంతటి సమస్య అయినా దిగదుడుపే. అందుకే హిందూ,ముసల్మానులు స్వాతంత్య్రోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వర్తించారు. అమరులయ్యారు.

గతం గడిచింది. భారత యవనికపై ఎన్నెన్ని మార్పులు సంభవించాయో. అన్ని రకాలుగా ఎదుగుతున్నాం. సాంకేతికంగా అందనంత ఎత్తుకు దూసుకుపోయి అరుణ గ్రహానికి నిచ్చెన వేశాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత యాభై ఏళ్లు ఒకలా గడిస్తే, ఆ తరువాత ఇరవయ్యేళ్లు వేగంగా దూసుకుపోయాయి అని చెప్పవచ్చు. కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇంటర్నెట్, ఎల్సీడీలు, ఎల్యీడీలు, బ్లూటూత్, వైఫై, కార్డ్ రీడర్….ఇలా సాంకేతిక భాషను వంటబట్టించుకోనివారు లేరు. పూట గడవనివారైనా సాంకేతికతకు అనుసంధానం కాకుండానైతే లేరు.
 మరి ఇంతటి వర్తమానంలోనూ ఒక వర్గం అత్యంత వెనకబాటుకు గురై చైతన్యలేమితో బాధపడుతోంది. అదే ముస్లిములు. వీరి వెనుకబాటు పాలకుల దృష్టికి వెళ్లలేదా? అంటే లేదు అని చెప్పడం అసత్యమే అనిపించుకుంటుంది. ఎందుకంటే..ఎన్నికలకు ముందు ప్రత్యేక బ్యాంకుగా ఆ వర్గం పాలకును ఆకర్షిస్తుంటుంది మరి. అటువంటి వర్గం నుంచి ఒక విద్యావేత్త, ఒక వైద్యుడు, ఒక ఇంజనీరు, ఒక పైలట్, ఒక లాయరు…బయటకు రావాలంటే ఆ కుటుంబం ఎన్నెన్నో త్యాగాలు…త్యాగాలంటే ఇక్కడ మిగతావారిలాగా చేసే పనులు వాయిదా వేయడం లాంటివి కాదు. పొట్ట మాడ్చుకోవడం. తాము తినాల్సిన తిండిని కూడా సదరు చదువుకునే కొడుకుకో, కూతురికో పెట్టడం లాంటివన్నమాట. ఆ వర్గమే మైనారిటీ వర్గం. చాలామంది అంటుంటారు. “ఏం…వాళ్లు మాత్రమే నిర్లక్ష్యానికి గురయ్యారా? మిగతావారిలోనూ పేదరికమే ఉంది కదా?” అని. నిజమే! లేదని కాదు. కానీ మిగిలిన వర్గాలలో ఎంతమంది అక్షరాస్యులున్నారో, ఎంతమంది ఉద్యోగస్తులున్నరో గమనిస్తే సరిపోతుంది. అంతేకాదు నిత్యం మన కళ్లముందు కనిపించేవారిపైనే కాస్త దృష్టి పెట్టండి చాలు. మిగిలిన వారు ఎటువంటి వృత్తులు చేస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఏ వృత్తులలో కొనసాగుతున్నారో. సైకిల్ పంక్చర్ చేసేవాడు, గాజులు అమ్మేవాడు, హోటల్ లో చాయ్,పాన్లు అమ్మేవారు ముసల్మానులే. అక్షరాస్యులు తక్కువ. రాబడీ తక్కువే. సంతానం ఎక్కువ. చైతన్య పరిచేవారు కూడా సరైన విధివిధానాలతో ముందుకు రావట్లేదేమో అనిపిస్తుంటుంది.
“చమన్” అవసరం చాలా ఉంది
ముస్లింలు అనగానే ఒకప్పుడు పరిపాలించిన రాచరికపు మర్యాదలనే ప్రస్తావిస్తుంటాయి చాలా పత్రికలు. గతం విడిచి వర్తమానంలో జీవించాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటిదాకా మనకు పత్రికలు రాలేదని కాదు. సమాచారం అందుబాటులో లేదనీ కాదు.ముస్లిముల అవసరాలను గుర్తించిన పత్రికలు ఉర్తూలో వెలువడ్డాయి. ఉర్దూ చదవగలిగిన వారికే ఆ పత్రికలు చేరాయి. చేరుతున్నాయి. ముస్లిముల ఉనికి సమాజానికి చేరువ కావాలంటే తెలుగు భాషలోనే ప్రత్యేక పత్రిక రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ బాధ్యతను చమన్ ఎత్తుకుంది. ముస్లింలకు కావాల్సిన అంశాలను స్పష్టంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చడానికి చక్కటి వారధిగా నిలుస్తుందనడంలో సందేహంలేదు. పాత్రికేయులుగా, కవిగా, రచయితగా, ఉద్యమకర్తగా అందరికీ స్కై బాబాగా సుపరిచితమైన ఎస్.కె.యూసుఫ్ బాబా సంపాదకత్వం వహిస్తూ త్రై మాసిక పత్రికగా త్వరలో  మన అందరిముందుకు రాబోతుంది “చమన్”. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలను ఊపిరిగా చేసుకుని, జర్నలిజంలో అనుభవం సంపాదించి, జనజీవనంతో మమేకమైన ఉద్ధండుల సారథ్యంలో మలి ప్రతిగా వస్తున్న చమన్ లో ముస్లింలకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నింటిని స్కై బాబా గారు ఎంతో ధ్యానంతో తీర్చిదిద్దారు.
“చార్ సవాల్” అంటూ దున్న యాదగిరి, కోడూరి విజయ్ కుమార్, వి.బాలరాజు, వేదన భూపతి…వేసిన ప్రశ్నలు, సమాధానాలు పాజిటివ్ నెగెటివ్ అంశాలను ప్రస్తావించడం పత్రికకు  ప్రత్యేకతను ఆపాదించాయి. ముస్లింవాదంపై ప్రత్యేక గళమెత్తిన సారా అబూబకర్ ఇంటర్వ్యూ. మన అందరికీ సుపరిచితమైన, ఇష్టమైన కవి అఫ్సర్ ఇంటర్వ్యూను కూడా ఇదే ప్రతిలో చూడవచ్చు. అంతేనా…ముస్లింల మూలాలెక్కడ ఉన్నాయో, వారి పేదరికానికి కారణాలేమిటి?, వారెందుకు వెనుకబడ్డారు, ఈ వెనుకబాటుతనంలో ముస్లిం మహిళల వెనుకబాటు ఎక్కడ దాగుంది, ముస్లింలంటే ద్రోహులా?, రాజకీయంగా వారిపై జరుగుతున్న, జరిగిన కుట్రలేమిటి?…ఇలా అనేక అంశాల సమాహారంగా ఈ పత్రిక మనముందు ఉంటుంది.
చదవడానికి అందరూ సిద్ధమే కదా?!
*

డాక్యుమెంటరీ సినిమాగా “కొయ్యగుర్రం”

ఓల్గా కథల ఇంగ్లీషు అనువాదం

olga

కొత్త ఆలోచనలతో…

katha

 

(కథాసాహితి పక్షాన)

ఈ 26వ సంకలనంలో కొత్త ఆలోచనలు, అభిరుచులతో మీ ముందుకొస్తున్నాం.

అందులో మొదటిది సంపాదకుల మార్పు. ప్రతి సంవత్సరం మా పక్షాన ఇద్దరు సంపాదకులు ఎన్నిక చేసిన కథలతో ఈ సంకలనాన్ని ప్రచురించాలని భావించాం. ఈ ప్రయత్నంలో తొలి అడుగు ఇది. ఈ కథ 2015కి ఆడెపు లక్ష్మీపతి, ఎ.వి. రమణమూర్తి సంపాదకులు. దాదాపు వారి తుది నిర్ణయం మేరకే ఈ కథల ఎన్నిక జరిగింది. ఒకటి, రెండు విషయాల్లో మా సలహాలు తోడయ్యాయి. అడిగిన వెంటనే బాధ్యతలు స్వీకరించి, అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో చర్చలు సాగించి, కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నా ఎంతో సంయమనంతో వ్యవహరించి, కథలను ఎన్నిక చేసిన సంపాదకులిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మరో ఇద్దరు సంపాదకుల ఎన్నికతో కథ 2016 వస్తుంది.

ఈ సంకలనం నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రసిద్ధ కథారచయిత రాసిన ముఖ్యమైన కథను చివర్లో అనుబంధంగా ఇవ్వాలనేది మరో కొత్త ఆలోచన. ఈ తరం రచయితలు, గతకాలపు గొప్ప కథలను చదివి కథారచనలో మెళకువలను నేర్చుకోగలరని, పాఠకులు ఈ మేలు కథల్లోని గొప్పదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష. అందుకే ఈ సంవత్సరం తొలి ప్రయత్నంగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కలుపు మొక్కలు కథని ప్రచురిస్తున్నాం. అనితరసాధ్యమైన వారి రచనాశైలికి, కథానిర్మాణానికి మచ్చుతునక ఈ కథ.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలా పట్టణాల్లో బాలోత్సవ్ లు నిర్వహిస్తున్నారు. అందుకు స్పూర్తి కొత్తగూడెం బాలోత్సవ్. ఈ ఉత్సవాల్లో తెలుగు సాహితీసృజన పై పలు పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి కథారచన, అప్పటికప్పడు కథా వస్తువును ప్రకటించి, కథ రాయమని కోరితే వందలమంది బాలబాలికలు గంటలో కథ రాసి మెప్పించగలుగుతున్నారు. అలాంటివారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే వారు రాసిన కథల్లో ముఖ్యమైన వాటిని అనుబంధాలుగా ఈ సంకలనంలో చేర్చాలని ఇంకో ఆలోచన.

ఎక్కడో లోతట్టు తమిళనాడులో నివసించే తెలుగు అక్షరం రాని తెలుగువారి గోసను తెలియజెప్పే అట్ట పుట్టింది ఆ ఊరు కథను అందిస్తున్నాం. దీన్ని రాసిన మార్టూరి సంజనాపద్మం పదమూడు సంవత్సరాల వయస్సులో తెలుగు అక్షరాలు నేర్చుకుని వారి యాసలో ఈ కథను రాసింది. ఇలాంటి మరో పదిహేను కథలతో రేగడి నీడల్లా అనే సంపుటిని ప్రచురించింది. కాకినాడలోని క్రియ సంస్థ నిర్వహించిన బాలోత్సవ్ కథల పోటీలో మొదటి బహుమతి వచ్చిన తాడాల కుసుమ సాయిసుందరీ రాణి కథ దైవం మానవ రూపేణని కూడా ఈ అనుబంధంలో చేర్చాం, ఈ అమ్మాయి ఓ మారుమూల గ్రామం (మాచర) జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. పిల్లల్లో సృజనాత్మక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించి, ప్రోత్సహించాలనే ఉద్దేశ్యమే ఈ ప్రయత్నం.

ఎప్పట్లాగే ఈ సంకలనాన్నీ తెలుగు కథాప్రియులు, పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…

 

*

“సొరాజ్జెం” ఇంగ్లీష్ అనువాదం ఆవిష్కరణ

అక్కినేని కుటుంబ రావు నవల " సోరాజ్జెం" కు   అల్లాడి ఉమా, శ్రీధర్ చక్కటి ఇంగ్లీష్ అనువాదాన్ని ఓరియంట్ బ్లాక్ స్వాన్ వాళ్ళు ప్రచురించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆవిష్కరణ సభలో పాల్గొన్న కల్పనా కన్నాభిరాన్, అనువాదకులు శ్రీధర్, అల్లాడి ఉమా, రచయిత అక్కినేని కుటుంబరావు, ప్రొఫెసర్ గోపాల్, ప్రొఫెసర్ సునీతా రాణి.

అక్కినేని కుటుంబ రావు నవల ” సోరాజ్జెం” కు అల్లాడి ఉమా, శ్రీధర్ చక్కటి ఇంగ్లీష్ అనువాదాన్ని ఓరియంట్ బ్లాక్ స్వాన్ వాళ్ళు ప్రచురించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆవిష్కరణ సభలో పాల్గొన్న కల్పనా కన్నాభిరాన్, అనువాదకులు శ్రీధర్, అల్లాడి ఉమా, రచయిత అక్కినేని కుటుంబరావు, ప్రొఫెసర్ గోపాల్, ప్రొఫెసర్ సునీతా రాణి.

ఆటా సాహిత్య పండగ సందడి

 

 ata2016
-నారాయణ స్వామి వెంకట యోగి
~

జూలై 1  నుండి ౩ వరకు షికాగో లో రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో ఆటా  ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ రజతోత్సవ వేడుకలు ప్రధానంగా సాంస్కృతిక వేడుకలుగా జరుగనున్నాయని ఆటా నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు సంస్కృతిని అద్భుతంగా విరాజిల్లే విధంగా ఈ మహాసభలు జరుగుతున్నయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించినరు. అదే పద్ధతిలో యేర్పాట్లు ఘనంగా జరుగుతున్నయని కూడా చెప్పినరు. సాహిత్యం సాంస్కృతికమూ సాధారణంగా జమిలిగా కలగలిసి ఉంటయి కాబట్టి ఈ సారి ఈ కన్వెంషన్ సందర్భంగా సాహిత్యానికి కూడా పెద్ద పీట వేసినరు. సాంస్కృతిక కార్యక్రమాలకు సమఉజ్జీగా , సమాంతరరంగా,కలుపుగోలుగా , కాంప్లిమెంటరీ గా సాహిత్య కార్యక్రమాన్ని కూడా నిర్వాహకులు తీర్చిదిద్దినరు.

 

https://www.ataconference.org/Committee-Literary

 

జయదేవ్ మెట్టుపల్లి గారు ప్రదాన సంచాలకులుగా తీర్చి దిద్దిన సాహిత్య కార్యక్రమాలు అద్భుతంగా జరుగనున్నయి. తెలుగు సాహిత్యం లోని అన్నిరంగాలను కూలంకషంగా పరిశీలించే విధంగా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిభావంతంగానూ , ఆలోచనా స్ఫోరకంగానూ తీర్చి దిద్దారు.  జయదేవ్ గారూ వారి సాహితీ బృందం సభ్యులూ , తెలుగు సాహిత్యం లోని అన్ని క్రియలనూ పరిశీలిస్తూ సమకాలీన సాహిత్య రంగం లోని అనేక అంశాలను క్రియాశీలకంగా పరిశీలించేటట్టు కార్యక్రమం రూపొందించినరు. సమకాలీన సాహిత్యం పరిశీలించకుండా తెలుగు సాహిత్యాన్ని అంచనా వేయలేము. అందుకనే సాంప్రదాయ సాహిత్య ప్రక్రియలైన అవధానమూ లాంటి వాటికి పెద్ద పీట వేసినా, సమకాలీన సాహిత్య అంశాలను క్రియలను, పోకడలను, ఉన్న సమయంలో కూలంకషంగా చర్చిస్తూ సాహిత్య కార్యక్రమాలున్నయి. అందుకు ఆటా నిర్వాహకులను, ముఖ్యంగా సాహితీ కమిటీ నిర్వాహకులను ప్రత్యేకంగా భినందించాలి.

 

ఆటా కన్వెన్షన్  మొదటి రోజు,  జూలై 2 నాడు, మధ్యాహ్నం వొంటి గంటకు సాహిత్య కార్యక్రమం ప్రారంభమౌతుంది. ఇవాళ తెలుగు సాహిత్యం లో ఉధృతంగా ముందుకొస్తున్న ప్రాతీయ సాహిత్యం గురించిన చర్చ మొదటి సెషన్ లో జరుగుతుంది.

ప్రముఖ కవి కథకుడు విమర్శకుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా లో ప్రొఫెసర్ అఫ్సర్ ఈ సెషన్ ను నిర్వహిస్తున్నారు.

ఇందులో ప్రముఖ కళింగాంధ్ర కథకుడు అప్పలనాయుడు గారు కళింగాంధ్ర సాహిత్యం గురించి మాట్లాడుతారు. శ్రీకాకుళ పోరాటం కంటే ముందు నుండీ ఎట్లా కళింగాంధ్ర సాహిత్యం తెలుగు సాహిత్యం లో ఒక పాయ గా కొనసాగిందో కళింగాంధ్ర ప్రజల జీవితాన్ని, కలల్నీ, ఆకాంక్షలనీ ఎట్లా సాహిత్యం ప్రతిఫలించిందో అప్పలనాయుడు గారు వివరిస్తారు, అట్లే శ్రీకాకుళ ఉద్యమ లో సాహిత్యం నిర్వహించిన పాత్రనీ ఉద్యమం నిర్బంధానికి లోనై సద్దు మణి గిన తర్వాత సాహిత్యం ఎట్లా శ్రీకాకుళ జనజీవితాన్ని ఫ్రతి బింబించిందో వివరిస్తారు.

స్త్రీ సాహిత్యం గురించి ప్రముఖ కథకులు భూమిక పత్రిక సంపాదకులు కొండవీటి సత్యవతి గారు ప్రసంగిస్తారు. స్త్రీవాద ఉద్యమం ప్రారంభం కాకముందునుంచీ స్త్రీ రచయితలు స్త్రీల జీవితాన్ని వారి కష్ట నష్టాలను సాహిత్యం లో ప్రతిఫలించిన విధానాన్ని దాన్ని స్త్రీ వాద ఉద్యమం సుసంపన్నం చేసిన వివరాలనూ సత్యవతి గారు తమ ప్రసంగం లో వివరిస్తారు.

తెలంగాణ సాహిత్యం గురించి ప్రముఖ కవీ గాయకుడు వక్త దేశపతి శ్రీనివాస్ వివరిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం లో వెలువడ్డ తెలంగాణ సాహిత్యాన్ని గురించి శ్రీనివాస్ తమ ప్రసంగం లో కూలంకషంగా సోదాహరణంగా వివరిస్తారు.

తరతరాలుగా వివక్షకు గురవుతూ పాలకులు ప్రాంతం వారైనా తీవ్రమైన అన్యాయానికి గురైన ప్రాంతంగా, ఫాక్షన్ సీమగా హత్యలు దొమ్మీ లు జరిగే హంతక సీమగా అపఖ్యాతి పాలై ఫాక్షనిస్టుల చెరలో నెత్తురోడింది రాయలసీమ సాహిత్యాన్ని గురించి అప్పిరెడ్డి హర్నాథ రెడ్డి వివరంగా ప్రసంగిస్తారు.

అదే రోజు మధ్యాహ్నం శొంఠి శారద గారి నిర్వహణ లో ‘తరతరాల తెలుగు సాహిత్యం విభిన్న ధోరణులు ‘ అనే అంశం పై సెషన్ జరుగుతుంది.

ఈ సెషన్ లో మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి ప్రభల జానకి గారు , యద్ధనపూడి సులోచన గురించి కొమురవోలు సరోజ గారు, అమెరికన్ షార్ట్ స్టోరీస్ గురించి నారాయణ స్వామి శంకగిరి గారు, తెలుగు నవల గురించి అమరేంద్ర దాసరి గారు, తాము నిర్వహస్తున్న పత్రిక భూమిక గురించి కొండవీటి సత్యవతి గారు , దేవులపల్లి సాహిత్యం అభ్యుదయం గురించి నిడమర్తి నిర్మల గారు ప్రసంగిస్తారు.

తర్వాత శ్వీయ కవితా పఠనం , పుస్తకావిష్కరణ చర్చ లు జరుగుతాయి.

తర్వాత సాయంత్రం ‘పాట వెనుక మాట’ అని తాము రచించిన అనేక గొప్ప పాటల వెనుక ఒదిగి పోయిన సందర్భం గురించి జీవితం గురించి సంఘటన ల గురించి ప్రముఖ కవులు వాగ్గేయ కారులు గోరటి వెంకన్న అందెశ్రీ ప్రముఖ సినీ కవి చంద్రబోస్ గార్లు ప్రముఖ కవి అఫ్సర్ సంచా లకత్వం లో అద్భుతంగా వివరిస్తారు.

సభల రెండో రోజు సాహిత్య కార్యక్రమం లో ఉదయం  అవధాని సార్వభౌమ అవధాని కంఠీరవ శ్రీ నరాల రామిరెడ్డి గారి చే తెలుగు సాహిత్యావధానం జరుగుతుంది. దీనిలో ఆచార్య శ్రీనివాస్ వేదాల గారు, కందాళ  రమానాథ్ గారు,  వడ్డేపల్లి కృష్ణ గారు, కొంక పాక లక్ష్మీ గారు,  ప్రభల జానకి గారు, శొంఠి శారద గారు, యడవల్లి  రమణ మూర్తి గారు పాల్గొంటారు.

మధ్యాహ్నం సాహిత్య కార్యక్రమానికి ప్రముఖ సాహితీ విమర్శకులు కథకులు ఈమాట సంపాదకులు వేలూరి వెంకటేశ్వర రావు గారు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఈ సెషన్ తెలుగు సాహిత్యం కొత్త దారులు అనే అంశం పై జరుగుతుంది. ఇందులో వేలూరి గారు అనువాదాల గురించి ప్రసంగిస్తారు. తెలుగు భాష పరిణామాలు అనే అంశం గురించి మిట్టపల్లి రాజేశ్వర రావు గారు , తెలుగు కవిత్వ సామాజిక ఉద్యమాలు అనే అంశంపై నారాయణ స్వామి వెంకటయోగి గారు, అమెరికన్ తెలుగు సాహిత్యం గురించి ప్రముఖ రచయిత గొర్తి సాయి బ్రహ్మానందం గారు స్త్రీవాద సాహిత్యం గురించి ప్రముఖ కథకులు కవీ కల్పన రెంటాల గారు, తెలుగు సాహిత్య వాడల గురించి ప్రముఖ కవి విమర్శకులు హెచ్చార్కె గారు భవిషత్తులో తెలుగు భాష గురించి ప్రముఖ భాషా శాస్త్రవేత్త సురేష్ కొలిచాల గారు ప్రసంగిస్తారు

మొత్తం కార్యక్రమాన్ని చూస్తే ఈ ఆట సభలు సాహిత్యానికి సంస్కృతి కి పెద్ద పీట వేసినాయి. నిర్వాహకులు చాలా శ్రద్ద తీసుకొని సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు తీర్చిదిద్దారు.

అమెరికా నలుమూలల నుండీ వేలాదిగా తెలుగు వారు తరలి వచ్ఛే ఈ ఆట సభల్లో తెలుగు సాహిత్య సాంస్కృతిక పరిమళాలు గుబాళించబోతున్నాయి. తెలుగు సాహిత్యప్రియులకు సాంస్కృతిక ప్రియులకు ఈ రెండు రోజులూ పండగే!

పండు వెన్నెల…ప్రతి చోటా!

 

 

-చందు తులసి 

~

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వ్యాప్తిలో వున్న ఓ పోస్టు….
ఓ పాప వాళ్లమ్మను అడిగిందట…..
”అమ్మా…మీరు మన బీరువా తాళాలు మన ఇంటి పనిమనిషికి ఎందుకివ్వరు…?” అని…తల్లి ఆశ్చర్యపోయింది. ఐనా అడిగింది తన చిన్నారి తల్లి కాబట్టి ఓపికగా….
” నువ్వు చిన్నపిల్లవు కదా…నీకు తెలీదమ్మా. అలా ఇవ్వకూడదు …”అని చెప్పింది.
 

మళ్లీ ఇంకో ప్రశ్న.
”పోనీ మీ ఏటీఎమ్ కార్డు…మన వంటమనిషికి ఎందుకివ్వవు…?”
తల్లి ఈ సారి…ఆశ్చర్యపోతూనే కోప్పడింది.
”నీకు ఇపుడు చెప్పినా అర్థం కాదమ్మా…చిన్న పిల్లవు కదా”  అంది.
” పోనీ మన దగ్గర ఎంత డబ్బు ఉందో మన ఇంట్లో పనిచేసే తోటమాలికి ఎపుడైనా చెప్పావా..?”
 

ఈ సారి తల్లికి విసుగు, అంతకన్నా కోపం వచ్చింది.
” వొక్క సారి చెబితే అర్ధం కాదా.. మన దగ్గరున్న విలువైన వస్తువుల గురించి పరాయివాళ్లకు చెబుతామా..? చెబితే వాళ్లు దోచుకోరూ…”అంది.
” డబ్బులు, ఏటీఎమ్ కార్డులు, మాత్రం జాగ్రత్తగా చూసుకుంటారు. మరి నన్ను మాత్రం ఎందుకు ఆయా దగ్గర వదిలేసి వెళతారు.  నేను మీకు విలువైన దాన్ని కానా..? ”  అని ఏడుస్తూ అడిగిందట చిన్నారి.

***
కొంత అతిశయోక్తిగా అనిపించినా……ఆ పాప అడిగిన ప్రశ్నలో మాత్రం నిజం వుంది.  ఆ ప్రశ్న కేవలం ఆ చిన్నారిదే కాదు. మన సమాజంలోని అందరి చిన్నారులది.  కారణాలేవైనా కావచ్చు కానీ ఇవాళ అన్నిటికన్నా ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతోంది బాల్యం.
సరైన తిండి పెట్టక పోవడం, వయసుకు మించిన పని చేయించడం, చిత్రహింసలు పెట్టడం….ఎంత నేరమో వాళ్లకు అవసరమైన జ్ఞానాన్ని అందించకపోవడమూ అంతే నేరం. వాళ్ల ఆలోచనలను పట్టించుకోకపోవడం, వాళ్లను సక్రమ మార్గంలో తీర్చిదిద్దక పోవడమూ అంతే నేరం.
పిల్లలంటే కేవలం…ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్….ఇలా రకరకాల ముసుగులు తగిలించుకొన్న కార్పోరేట్ కోళ్లఫారాల్ని నింపడానికే పుట్టే అభాగ్యులు కాదు కదా….??
తల్లిదండ్రుల సాధించలేని కోరికలు,  సాధించి పెట్టడానికి దొరికిన కోరికల కొనసాగింపులూ కాదు కదా……??
మరో ఇరవై ఏళ్ల తర్వాత…..మల్టీ నేషనల్ కంపెనీల అవసరాలు తీర్చడం కోసం….తయారవుతున్న రోబోలు కాదు కదా..! …??
 

హరివిల్లుపై జారాలనో, నెలవంకకు ఊయల కట్టి ఊగాలనో…వెన్నెల్లో గోరు ముద్దలు తినాలనో కాకున్నా…..
అమ్మా నాన్నతో కబుర్లు చెప్పాలనో, నాన్నమ్మ, తాత దగ్గర కథలు వినాలనో….లేదా తమకు నచ్చినట్లు తామే కథలు చెప్పుకోవాలనో ఉంటుంది కదా….!
పిల్లలకూ ఆలోచనలుంటాయని, వాళ్లకూ అంతులేని సృజన ఉంటుందనీ ఎవరు గుర్తించాలి…? అవకాశం ఇవ్వాలే కానీ వాళ్లూ సృజనాత్మకత విషయంలో పెద్దవాళ్లకూ తీసిపోరని ఎవరు నిరూపించాలి…? పంజరాల్లాంటి తరగతి గదుల్లోంచి బయటకు తీసుకొచ్చి…. పాఠాలు, పంతుళ్లు, పుస్తకాలకు అందనంత దూరంగా తీసుకెళ్లి, ఓ పెన్నూ పేపరూ ఇచ్చి…. ” పిల్లలూ మీకోసం మీరే ఏం రాసుకుంటారో రాసుకోండర్రా”  అని అంటే….పిల్లలు ఏం రాస్తారు…? ” పిల్లలూ మీకు రెక్కలొచ్చాయి అనుకోండి….అపుడేం చేస్తారు….” అని అడిగామే అనుకోండి. ఊహకైనా అందని ఆ ఆనందాన్ని పిల్లలు ఎలా పంచుకుంటారు.? అలాంటి అబ్బుర పరిచే ఆలోచనల సమాహారమే  సంస్కృతి పబ్లికేషన్ ప్రచురించిన పండు వెన్నెల పుస్తకం. తమ లాంటి చిన్నారుల కోసం…తామే కవులూ, రచయితలూ అయిపోయి కలాలు భుజాన వేసుకుని రచనల సంకలనం.  ఇంతకీ ఈ పండు వెన్నెల ఎలా మొదలైందో చెప్పాలంటే ఓ నెల వెనక్కు వెళ్లాలి.
 

చిన్నారుల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాషను, అభిరుచులను, కళలను వెలికి తీసేందుకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు సంస్కృతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం నవతరంతో యువతరం అని ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్నంతా భుజాల మీద మోసింది  ప్రముఖ కథా రచయిత్రి  డా. కె.ఎన్. మల్లీశ్వరి ( ప్రజాస్వామిక రచయితల వేదిక),  కత్తి పద్మ ( మహిళా చేతన సంస్థ),  నిశాంత్ లు. చిన్నారి సాహిత్య కారులు….యువతరం రచయితలతో సమ్మేళనం చేసే ఈ కార్యక్రమంలో సీనియర్ రచయితలూ చాలామంది పాల్గొని తమ ఆలోచనలూ పంచుకున్నారు.
 

కేవలం కథలు చదవడం, రాయడం…వాటి గురించి చర్చించడమే కాదు. పక్కనే ఉన్న గిరిజన ప్రాంతాన్ని సందర్శించారు. దోపిడీని ప్రతిఘటిస్తున్నందుకు అణచివేతను ఎదుర్కొంటున్న అడవిబిడ్డలతో మీకు తోడుగా మేమున్నాం…అని ధైర్యం చెప్పారు.  ఇలా సాహిత్యం, సామాజిక స్పృహ కలగలిసిన ఈ కార్యక్రమం  కేవలం విశాఖ జనాన్నే కాకుండా….తెలుగు సాహిత్య కారులందరినీ ఆకట్టుకున్నది.
 
ఆ నవతరంతో యువతరం కార్యక్రమంలో పాల్గొన్న నేటి, రేపటి తరం సాహిత్య కారుల ఆలోచనలని పండు వెన్నెల పేరుతో ప్రచురించింది సంస్కృతీ పబ్లికేషన్ సంస్థ. ఈ పుస్తకంలో అనుభవాలే కాకుండా బాల రచయితల కథలు, కవితలు కూడా ఉన్నాయి. రాసింది చిన్నారులే ఐనా ….పెద్ద రచయితలకు తామే మాత్రమూ తీసిపోమని నిరూపించారు.
 

కంటనీరు కూడా కలుషితమవుతున్న కాలమిది…అంటూ తన కవితలో ఆవేదన వ్యక్తం చేస్తుంది సోనా-శాంతి. సాహిత్య కారులు ఎటువైపు నిలబడాలో సూచిస్తాడు పృధ్వీ.  పెన్నుతో కాదు భావోద్వేగంతో రాస్తున్నానంటాడు జస్వంత్.   ప్రకృతి విధ్వంసాన్ని ప్రశ్నిస్తుంది…. మన్విత.   అంతం కాదిది ఆరంభం అంటుంది మహాలక్ష్మి. శ్రీశ్రీని గాఢంగా అభిమానించడమే
కాదు…శ్రీశ్రీలా కవిని అవుతానంటాడు మరో చిన్నారి. ఇలా ఈ బుల్లి సాహిత్య కారులు తమ రచనల్లో వయసుకు మించిన పరిణతి ప్రదర్శించారు.  చిన్నారులతో పాటూ కార్యక్రమంలో పాల్గొన్న యువ రచయితలు, సీనియర్ రచయితలూ తమ అనుభవాలనూ, పరిశీలనలూ వివరించారు.
 
సంపాదకులు చెప్పినట్లు ఈ పుస్తకం బాల సాహిత్యం మాత్రమే కాదు…పెద్దల సాహిత్యమూ కాదు. ఈ పుస్తకం విడి విడిగా రాసిన రచనల సంకలనమూ కాదు. అందరి ఆలోచనల సమాహారం.  ప్రతీ పేజీని అందంగా,  చిత్రాలతో రూపొందించడం వల్ల
పిల్లలను ఆకట్టుకుంటుంది.

చివరగా ..ఇలా రేపటి తరం సాహిత్య కారులను గుర్తించి, వారికి సానబెట్టి సమాజానికి అందించే అరుదైన కార్యక్రమాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా …ప్రభుత్వ పాఠశాలల్లో చేపడితే ఎంతో మేలు జరుగుతుంది. తెలుగు నాట అనేక సాహిత్య కార్యక్రమాలు జరుగుతుండడం అందరికీ తెలిసిందే. సన్మానాలు, అభినందన సభల కన్నా…ఇటువంటి కార్యక్రమాల వల్ల సాహిత్యానికి ఉపయోగం. సాహిత్య సంస్థలు, సాహిత్య కారులు  దృష్టి సారించాల్సిన విషయమిది.

(ఈ నెల 16వ తేదీన విశాఖలో పండు వెన్నెల పుస్తకం ఆవిష్కరణ సభ సందర్భంగా…..)

కుంచెకీ, రంగుకీ మధ్య సం‘చారి’   !

 

-శివాజీ 

~

       చాలా మంది ఆర్టిస్టు లకి మల్లె చారిలోనూ పాత ప్రశ్నే వచ్చి పడింది… జనం మెచ్చినది మనం చేయవలెనా?  మనం చేయునది జనం చూడవలేనా?  అనే.  కానీ  మధ్యస్తంగా వుంటే పోలా ?  అనే మరోప్రశ్న బిట్క్వశ్చన్లా వచ్చి పడిందతనికి.  ఫలితంగా ‘ చారి చిత్రకళ’ అనేది చారి ‘ఇలస్ట్రేషన్ ‘ పనితో మొదలయింది.

పూర్వంనుంచీ గల డ్రాయింగుల పిచ్చి పాకానపడింది, అది మోహన్ ఆశ్రమంలో మొగ్గలు వేసింది.  కొన్ని పత్రికలకు పని చేసి చూశాడు.  ఇతని పాదాలకు పేద్ద చక్రాలు కలవని, వున్నచోట ఉండడనీ చక్కని పేరు పొందాడు.  కథలకి, వ్యాసాలకి, అట్టమీది బొమ్మలకీ ఇతనినే వాడండి అనే పబ్లిసిటీ వచ్చేలోగానే చిత్రకళ అనే కేన్వాస్ పెయింటింగ్ లో శ్రద్ధ వహించాడు.   అడపాదడపా గేలరీ గ్రూప్ షోల్లో చిన్నపాటి తడాఖా ప్రదర్శించాడు.  నల్లటి రేఖలతో కళకళ లాడే రంగుల్లో బొమ్మల్ని వృద్ది  చేశాడు…

chari2

         ఇది ఇలా వుండగా చారి ఇంట్లో గల పొయ్యి లో పిల్లి  లేవకపోగా పిల్లల్ని పెట్టి పెద్ద చేస్తోంటే, మరోవంక చారి చార్కోల్, అక్రిలిక్స్ తో పెయింటింగుల సంఖ్య పెంచాడు.
ఆమధ్య కొన్ని పెయింటింగ్స్ చేసేకా అతనికి మరొక చిక్కని సందేహం వచ్చింది.   తను వేస్తున్నది రంగుల ఇలస్ట్రేషనా ?  రేఖలు గల పెయింటింగా ?  అని.  అలాగే మనం చూసేది, చదివే పదార్ధం వలె ఆధునికమైనది కాదా?  శైలి పెంచినపుడు వేసిన బొమ్మ వెలిగిపోతే అదే చాలదా? …  ఒకసందేహం మరో సందేహానికి దారి వేసింది.  అంతా ఒకటే అని, వేసింది ఏదయినా బాగా వేయాలి, పనితనం గొప్ప తెలియాలి, అప్పుడదే అద్భుతం కాదా అనే సమాధానమూ పుత్తుకొచ్చిన్దతనికి.  అసలు ఏ చింతా లేకుండా గోడలకు తగ్గ బొమ్మలు, రంగులకు  తగ్గ ఫ్రేములతో మార్కెట్ రంగంలో రాణించే చిత్రకళ కన్నా సొంత బుద్ధితో, నేర్చి శ్రమించి   మంచి  పెయింటింగ్ అని మనకి ముందుగా నచ్చేదే నయం  అని
చారీకి అనిపించింది.  అందుకే కేన్వాస్ లపై తన ముచ్చట తీర్చి దిద్దుకుంటున్నా…  ‘ నిన్నటికంటే ఇవ్వాళ, నేటికంటే రేపు  ఇంకా బాగా అనిపించేదాకా ఊరుకునే ప్రసక్తే లేదంటాడు.  ఇకనేం?!  ఉద్యోగం సద్యోగం లేకుండా పెయిన్టింగే  పనిగా  పెట్టుకుని బోలెడు పెయింటింగ్ లు చేసేడు.  “నడుస్తుందిలే ” అని సరిపెట్టుకునే ధోరణికి పొదల్చుకోలేదన్నాడు.
         ‘మార్కెట్ బూమ్’ వల్ల మాత్రమే స్థిరపడిన చిత్రకళాకారులు, పెద్దకళాకారులూ ఆశీర్వదిస్తేనే ముందుకు పోవాలన్న ముచ్చట కట్టిపెట్టి పెయింటింగ్ చేయడం  మీదనే మనసు పెట్టడం వలన కాబోలు కేన్వాసులు అతనిచేతిలో ధగ ధగలాడాయి. మన ఊరే, మన పాటే, మన మాటే కావచ్చుగాక, అది సుస్వరం, సు’వర్ణం’ (రంగులేనండీ బాబోయ్) స్వీయశైలీ కావడం అత్యవసరం అన్న చూపు కలిగిన పని మొదలయింది చారిలో –
chari3
మనుషులూ, వస్తువులూ, కదలికలు- దేనిమీద మనసుపడినా చారి వాటిని రంగుల్లోకి ‘దించే’ శ్రద్ధలో పడ్డాడు.  ఫలితమూ బాగుంది.  సిద్దిపేటలో పుట్టి ,  కార్తూనింగ్ తో కొంచెం పెరిగి  ఇంకా బాగా ఎదగటానికి 90 ల్లో హైదరాబాదుకు సరఫరా అయ్యాడు.  చిత్రకళాశాల సర్టిఫికేట్ పేచీలేదతనికి.  బ్రష్ లు, పెన్సిళ్ళు, చార్ కోల్ లు అరిగి, కరిగేలా బోలెడు కృషి చేశాడు.  ఇప్పుడు కొత్త బొమ్మల్లో కొత్తదనం కోసం, శైలి కోసం పడ్డ చారి తపన నెరవేరింది.  వీలయితే ఓసారి అతని బొమ్మల్ని నెట్లోనో, ఎగ్జిబిషన్ లోనో చూసి చారిని మనసారా అభినందించండి.
చారీ నువ్వింక ఎనక్కి తిరిగి చూడాల్సిన పని లేదన్నట్టు ….
                                                                                       *

వ్యక్తుల హక్కులా? వ్యవస్థల హక్కులా?

 

krishna1

-కృష్ణుడు 

~

దేశ రాజధాని ఢిల్లీలో మనకు అత్యంత అందమైన, చరిత్రాత్మకమైన పార్లమెంట్ భవనం ఉంది. దాని ప్రక్కనే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లు ఉన్నాయి. మధ్యలో సువిశాలమైన రాష్ట్రపతి భవన్ ఉన్నది. ఇండియాగేట్ ముందు పచ్చిక బయళ్లలో సాయంత్రం కుటుంబాలు సేదదీరుతూ కనిపిస్తాయి. ఇండియాగేట్‌కు సమీపంలోనే ఢిల్లీ హైకోర్టు, ఆ పై సుప్రీంకోర్టు కనిపిస్తాయి. మొత్తం దేశ రాజకీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఈ భవనాలనుంచే నిర్ణయమవుతుంది. పార్లమెంట్ సమావేశాలు అవుతుంటే చాలు చుట్టుప్రక్కల ఎంతో హడావిడి కనిపిస్తుంది. భద్రత కట్టుదిట్టంగా మారుతుంది. పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రులు, అధికారులు హడావిడిగా తిరుగుతుంటారు. మొత్తం దేశాన్ని ఇక్కడినుంచే నడిపిస్తున్నామన్న భావన వారిలో కనిపిస్తుంది. మనకూ అనిపిస్తుంది.

దేశాన్ని వారు ఇక్కడినుంచే నడిపిస్తున్నారన్న మాట వాస్తవమే. కాని ఎలా నడిపిస్తున్నారు? మన భారత రాజ్యాంగం నిర్మించిన వ్యవస్థలనన్నిటినీ వారు సవ్యంగా నడిపిస్తున్నారా? లేక తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా అన్న అనుమానాలు మనకు కలగక మానదు. అన్ని వ్యవస్థలూ రాజకీయ వ్యవస్థకు అనుకూలంగా మారుతున్నాయి. అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సిబిఐ, పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్, సివిసి, మానవ హక్కుల కమిషన్ ఆఖరుకు సమాచార కమిషన్ కూడా రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా మారుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకే కాక తమ ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక నేరాలు, అవినీతి, నేరాలు, కాపాడుకునేందుకు ఈ వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారు. అవినీతి అక్రమ భూయిష్టం కాని వ్యవస్థలేవీ కనిపించడం లేదు. న్యాయాస్థానాలే కాదు, సివిసి, సిబిఐ, కమిషన్‌లు అన్ని చోట్లా అస్మదీయుల్ని నియమించుకుంటున్నారు. పార్లమెంట్ లో కూడా నేరచరితుల్ని, కాంట్రాక్టర్ల్ని, మాఫియాను నియమిస్తున్నారు. వారే కలిసి తమకు అనుకూల చట్టాల్ని చేసుకుంటున్నారు. సభలో 50 మంది ఉంటే చాలు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల్ని మార్చి పడేసే నిర్ణయాల్ని తీసుకోగలుగుతున్నారు. తాము తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుందో న్న ఆలోచన లేకుండా గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టులు, టెండర్లు,కేటాయింపులు, అనుమతుల్లోనే కాదు, రక్షణ శాఖ కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. కూడా నలుగురైదుగురు ఉంటే చాలు, ఏ నిర్ణయాన్నైనా నిలిపివేయగలుగుతున్నారు. నింగినుంచి నేల వరకు దేన్నైనా కబళించడానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అవకాశం కల్పిస్తున్నది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లే కాదు, మాఫియా కూడా పరస్పర ఆశ్రితాలుగా మారిపోయాయి.

మరో వైపు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల్ని పెంచి పోషించడం, తద్వారా తాము ప్రయోజనం పొందడమే అభివృద్దికి కొలమానం అనుకుంటున్నారు.క్రోనీ కాపిటలిజం విశ్వరూపంగా పార్లమెంట్, చట్ట సభలు మారుతున్నాయి. నిదేశాల్లో ఉన్న నల్లధనం గురించి కమిటీలు వేసేందుకు మనం ఆలోచిస్తున్నాం కాని అసలు మన ఎంపిలు ఎన్నికలల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెట్టారని ఆరా తీసిన వారు లేరు. విదేశాల్లో ఉన్న మన వారి నల్లధనం కంటే ఎక్కువ అక్రమ సంపద మన దేశంలోనే ఉన్నదన్న విషయంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో కోల్పోయిన సొమ్నును తిరిగి ఆర్జించడానికి అధికారంలోకి వచ్చాక అక్రమాలు తప్పవు. ఈ విషవలయంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ సాగుతోంది. ఆఖరుకు ఎంపి లాడ్స్ నిధులను కూడా స్వాహా చేస్తున్నారు. తాము ఓట్లు కొనుగోలు చేసి అ«ధికారంలోకి వచ్చాము కనుక తమ అక్రమాలను ప్రశ్నించే హక్కు వారికి లేదని భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఒక్కర్ని కూడా జైలుకు పంపించిన దాఖలాలు లేవు.

ఒక అంచనా ప్రకారం తిరుపతి కి ప్రతి ఏటా 8 నుంచి 9 కోట్ల మంది భక్తులు వెళతారు. ఇతర మందిరాలు, మసీదులు, మఠాలు, తీర్థయాత్రలకు వెళ్లేవారినికలిపితే 50 కోట్లమంది దాటుతారు. వీరంతా పాపపుణ్యాలపై నమ్మకం పెట్టుకున్నవారు. హత్య, మోసం, దొంగతనం, అత్యాచారాలు అక్రమాలు చేసిన వారిని నేరస్తులని వారు భావిస్తారు. కాని నేరం చేసిన వారే అ«ధికారంలో ఉంటారని వారు ఊహించలేరు.ఊహిస్తే వారు దేవుళ్లను వ్యవస్థలను బాగు చేయాలని, వాటిని నేరస్తులనుంచి ప్రక్షాళన చేయాలని భావిస్తారు. కాని మన దేశంలో ఓటర్లను కూడా నేరాలకు పురికొల్పుతున్నారు. వారిని కొనుగోలు చేస్తున్నారు. అవినీతిపరులు, నేరచరితులు కూడా అభిమాన సంఘాలు, భక్తులు తయారవుతున్నారు. ముహూర్తం చూసి జైలుకు వెళ్లేవారు తయారయ్యారు.

దేశంలో పలుకుబడి గల వారికి, ధనికులకు మాత్రమే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఇతర యంత్రాంగాలు సహకరిస్తున్నాయి. రాజకీయ అవసరాలు దేశంలో అవినీతికి అక్రమాలకు చట్టబద్దత కల్పిస్తున్నాయి. న్యాయ వ్యవస్థకూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. రాజకీయ నాయకుల కేసులను విచారించేందుకు ఏళ్ల పాటు సమయం తీసుకుంటున్న కోర్టులు కొట్టివేయడానికి ఎక్కువ కాలం తీసుకోవడం లేదు,. అదే సామాన్యుల కోస్లు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈదేశంలో వేలాది మంది అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారు.. అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల వాపోయారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చట్టాలు చేసేందుకు, దమనకాండను అమలు చేసేందుకు న్యాయాస్థానాలు తోడ్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. న్యాయమూర్తులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, తమ పదవీ కాలం ముగిసిన తర్వాత వారు చేపడుతున్న పదవులు న్యాయవ్యవస్థ విశ్వనీయతపైనే అనుమానాలు కలిగించేలా చేస్తున్నాయి.

ఆర్థిక సంస్కరణలు ప్రవేశించిన తర్వాత దళితుల అణిచివేత తగ్గలేదు సరికదా, పెరిగింది. గతంలో రాజకీయ ప్రాబల్యం కోసం దళితుల అణిచివేత జరిగితే ఇప్పుడు ఆర్థిక కారణాల రీత్యా అణిచివేత జరుగుతున్నది. అభివృద్ది పేరిట దళితుల ఆవాసాలు, స్థలాలు కూల్చివేసిన సంఘటనలు ఎన్నో. అడిగితే రిక్షా తొక్కేవాడి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండటమే సామాజికన్యాయమేనని మురిసిపోతున్నారు. చరిత్ర అంటే గ్రామాలు కూలిపోవడం, జీవితాలు శిథిలం కావడం, నెత్తుటి మరకలపై రహదారులు వేయడం, మాల్స్‌ను బహుళ అంతస్తులు నిర్మించడంగా భావించే రోజులు వస్తున్నాయి.

ముఖ్యంగా అధికార వ్యవస్థ దాదాపు అవినీతి, అక్రమాల మయంగా మారింది. అధికార వ్యవస్థ రాజకీయ నాయకులు అడ్డదారిన తొక్కడానికి సహకరిస్తున్నది. చాలా మంది అధికారులు రాజకీయనేతల అడుగులకు మడుగులొత్తడమే కాక, కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. అందుకే వారు రిటైరైన తర్వాత ప్రభుత్వ పదవుల్లోనో, కార్పొరేట్ పదవుల్లో నో కొనసాగుతున్నారు. ఆఖరుకు విదేశీ దౌత్యసంబంధాలు కూడా వ్యాపార ప్రయోజనాలకు అనుగణంగా సాగుతున్నాయి. మనకు స్వతంత్ర విదేశాంగ నీతి అంటూ లేకుండా పోయిందని చెప్పడానికి పలు ఉదాహరణలున్నాయి.

ఢిల్లీ నుంచి క్రింది స్థాయి వరకు వచ్చే సరికి వ్యవస్థల బూటకత్వం, వాటి వి«ధ్వంసం, ఉల్లంఘన మరింత ఎక్కువవుతుంది. గ్రామస్థాయిలో ఉండేవారికి వ్యవస్థల గురించి తెలిసే అవకాశమే తక్కువ. ప్రతి రాష్ట్ర రాజధాని ఒక మినీ ఢిల్లీగా మారింది. ప్రభుత్వాలు మారినా రాజకీయాలు మారడం లేదు. వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మార్చుకునే వారు మారడం లేదు. సామాన్యుడి విలువ తగ్గుతున్నదే కాని పెరగడం లేదు. మనం చూస్తున్న అభివృద్ది ఎవరికోసం? అన్న ప్రశ్న ఎప్పటికీ విలువైన ప్రశ్నగా మిగిలిపోతోంది. గత 34 సంవత్సరాల నా జర్నలిస్టు జీవితంలో వ్యవస్థల పనితీరు దిగజారిందే కాని మెరుగైన దాఖలాలు కనపడడం లేదు.

ఈదేశంలో చాలా మంది వ్యక్తులకోసం పోరాడుతున్నారు. కాని వ్యవస్థల్ని నిజాయితీగా నిర్మించానికి వెనుకాడేవారిని, నిర్మించిన వాటిని విధ్వంసం చేసిన వారిని, వాటిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే వారిని ఎవరూ ప్రశ్నించడం లేదు. వ్యక్తుల హక్కుల కన్నా వ్యవస్థల హక్కులు కాపాడడం ముఖ్యం వ్యవస్థలు లేకుండా సమాజం లేదు. అది లేని రోజు అంతా కుప్పకూలిపోతుంది. అరాచకమే తాండవిస్తుంది.

( కృష్ణారావు రాసిన నడుస్తున్న హీన చరిత్ర పుస్తకావిష్కరణ ఈ నెల మే 29న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం)

కొత్త బాటలో నాటా సాహిత్య సభలు!

 

-సుజాత 

~

nata1

సంస్కృతి, సాహిత్యం అవిభాజ్యాలు! నివాసం విదేశాల్లోనే అయినా సంస్కృతి వేళ్ళు ఎక్కడ పాదుకున్నాయో, అక్కడికి హృదయాలు తరచూ ప్రయాణించడం, ఆ సువాసనల్ని ఇక్కడ ప్రోది చేసుకోవాలని ప్రయత్నించడం , మొగ్గ వేసినంత సహజం, పువ్వు పూసినంత సహజం! అందుకే ప్రవాస సాంస్కృతిక సంఘాలు ఎప్పుడు, ఎక్కడ సభలు నిర్వహించుకుని అంతా ఒక చోట చేరినా, సాహిత్యానికి తొలినాటి నుంచీ పెద్ద పీట వేస్తూనే ఉన్నాయి. మెమోరియల్ వీకెండ్ -మే 27,28 న జరగబోయే నాటా సభల్లో కూడా సాహిత్య వేదిక ప్రధాన భూమిక పోషించబోతోంది.

ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులు, రచయితలు కవులు అంతా కల్సి సాహితీ సౌరభాలు పంచుకోడానికి రంగం సిద్ధం అయింది. కథ, కవిత, నవల, అవధానం వంటి ప్రక్రియల్లో నిష్ణాతులైన వారి ప్రసంగాలు, సభికులు కూడా పాలు పంచుకోనున్న చర్చలు ఈ సాహిత్య వేదికలో ప్రథానాంశాలు గా రూపు దిద్దుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ నూతనత్వాన్ని స్పృశిస్తూ ఎంచుకున్న అంశాల మీద కవులు రచయితల ప్రసంగాలు సాగనున్నాయి.

నాటా సాహిత్య కమిటీలో కొందరు...

నాటా సాహిత్య కమిటీలో కొందరు…

శనాదివారాలు మొత్తం నాలుగు విభాగాలుగా జరగనున్న ఈ కార్యక్రమాల్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకూ జరగనున్న కథా వేదికలో “తెలుగు కథ-ఒక సమాలోచన” కార్యక్రమానికి ప్రముఖ రచయిత చంద్ర కన్నెగంటి సంచాలకులుగా వ్యవహరిస్తారు. “సరైన దారుల కోసం – కొత్త కథకుడి రచనా స్ఫూర్తి” అనే అంశం మీద  మధు పెమ్మరాజు, “ఇండియన్ డయాస్ఫోరా లో తెలుగు డయాస్ఫోరా స్థానం” గురించి గొర్తి సాయి బ్రహ్మానందం, “అమెరికా కథా వస్తువులు, లోపించిన వైవిధ్యత” అనే అంశం మీద వంగూరి చిట్టెన్ రాజు, “సమకాలీన కథ పై ఇంటర్నెట్ ప్రభావం” అనే అంశం మీద రచయిత్రి కల్పనా రెంటాల, ఇంకా , “కథలెందుకు చదవాలి?” అనే అంశం మీద మెడికో శ్యాం ప్రసంగిస్తారు. ఆ తర్వాత “తెలుగు కథ-దశ, దిశ” అనే అంశం పై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ సాహిత్య వేదికలపై ఇంతకు ముందు పెద్దగా చర్చంచని వినూత్నతను ఆపాదించే, కొత్త ఆలోచనల వైపు అడుగులు వేయించే అంశాలే!

మధ్యాహ్నం  3-30 నుంచి 5 గంటల వరకూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం లో భాగంగా “తెలుగు నవల- చారిత్రక నవల ” అంశం మీద  మంథా భానుమతి ప్రసంగం, “తెలుగు నవలా పరిణామ క్రమం (బుచ్చిబాబు)” అనే అంశం మీద  దాసరి అమరేంద్ర, ఆ తర్వాత “తెలుగు నవల-సినిమా” అనే అంశం మీద బలభద్ర పాత్రుని రమణి ప్రసంగం ఉంటాయి .

 

ఆదివారం ఉదయం సాహితీ ప్రియులంతా ఎంతో ఆసక్తి తో ఎదురు చూసే ప్రధాన కార్యక్రమం అష్టావధానం! అవధాన కంఠీరవ నరాల రామారెడ్డి గారి అష్టావధానానికి సంచాలకులుగా వద్దిపర్తి పద్మాకర్ గారు వ్యవహరిస్తారు. పృచ్చకులుగా జువ్వాడి రమణ, పూదూరి జగదీశ్వరన్ మరికొంత మంది సాహితీ ప్రియులు పృచ్చకులుగా పాల్గొంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మూడు గంటల పాటు ఉత్సాహభరితంగా సాగే ఈ కార్యక్రమం ఆదివారం నాటి ప్రధానాకర్షణ గా నిలవబోతోంది.

మధ్యాహ్నం జరిగే కవిత్వ విభాగ కార్యక్రమం మరింత ఆసక్తి గా ఉండబోతోంది. “తెలుగు కవిత-ఓ నూతన దృక్కోణం” శీర్షికన జరిగే ఈ కార్యక్రమానికి అఫ్సర్ సంచాలకులుగా వ్యవహరించనున్నారు . ఈ కార్యక్రమంలో కవులు కవయిత్రులు ఎంచుకున్న అంశాలన్నీ ఇంతకు ముందు ప్రవాస తెలుగు సాహితీ సభలో చర్చకు రాని సమకాలీన నూతనాంశాలే!

“కవిత్వానికి ప్రేరణ”  అనే అంశం మీద పాలపర్తి ఇంద్రాణి,”కవిత్వంలో ప్రయోగాలు” అన్న అంశాల మీద విన్నకోట రవిశంకర్ ప్రసంగించనుండగా, “కవిత్వంలో ప్రాంతీయత” అనే సరికొత్త అంశం మీద వెంకటయోగి నారాయణ స్వామి, “భిన్న అస్తిత్వాలు-వస్తురూపాలు” అనే వినూత్నాంశం గురించి కొండేపూడి నిర్మల ప్రసంగిస్తారు.

హుషారుగా సాగబోయే ఆ తర్వాత చర్చా కార్యక్రమం “తెలుగు సినిమా పాటల్లో సాహితీ విలువలు”! ఈ కార్యక్రమం లో సినీ గీత రచయితలు చంద్రబోస్, వడ్డెపల్లి కృష్ణ, సంగీత దర్శకులు కోటి, దర్శకులు వి.ఎన్ ఆదిత్య పాల్గొంటారు. మాడ దయాకర్ సంచాలకులుగా వ్యవహరిస్తారు

nata

చివరగా నాలుగున్నర నుంచి ఐదున్నర వరకూ మనబడిలో తెలుగు నేరుస్తున్న చిన్నారుల  “ఒనిమా”- ఒక్క నిముషం మాత్రమే పోటీ ల ఫైనల్స్ సాహిత్య వేదిక మీద జరుగుతాయి. తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా వీక్షించబోయే ఈ కార్యక్రమం  ఆదివారం నాటి సాహిత్య కార్యక్రమాలలో చివరిగా తెలుగు భాషా ప్రేమికులకు అందనున్న బోనస్

సాహిత్యాభిమానులను సరికొత్త అంశాలతో, వినూత్న చర్చలతో అలరించనున్న  సాహిత్య వేదిక సభికులతో కళ కళలాడుతుందని నాటా ఆశిస్తోంది.

కొత్త ఆలోచనల సరికొత్త వేదిక: ఇస్మాయిల్ పెనుకొండ (సాహిత్య విభాగం చైర్)

ismail

 

“సమకాలీన సాహిత్యానికి సంబంధించి అన్ని కోణాలు ఒక కొత్త దృక్పథం నుంచి వీక్షించే వీలు కలిగించేట్టుగా నాటా సాహిత్య సభల్ని తీర్చిదిద్దుతున్నాం. ప్రసిద్దులంతా ఒక వేదిక మీద కనిపించడం ఒక ఎత్తు అయితే, వారు భిన్నమైన అంశాల మీద – ముఖ్యంగా ఇప్పటి కాలానికి అవసరమైన వాటి మీద మాట్లాడబోవడం, ఇది ఒక ప్రయోజనకరమైన చర్చకి దారి తీస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. కథ, కవిత్వం, అవధాన, సినిమా సాహిత్యం- వీటన్నిటితో పాటు బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా కేవలం నవల మీద ప్రత్యేకించి ఒక సభ నిర్వహించడం కూడా విశేషమే!”

*

 

 

 

రాతిరి కన్న ఇన కవనం!

 

-అంబటి సురేంద్రరాజు

~

 

 

We love life, not because we are used to living, but because we are used to loving

– Nietzsche

ఎవడడుగు పెడతాడెపుడెపుడోనని

ఎదురు చూస్తానెపుడూనూ 

–      ఒంగిన గగనం

 

సోమాలియాలో సోఫియా లారెన్‌’ జగ్గయ్యపేటలో శివలెంక రాజేశ్వరీదేవి. దూరాభారం ఎంత వున్నా ఇద్దరి మధ్య సామ్యం ఏదో వుంది. అందుకే ప్రపంచానికి నిప్పు పెడదామని అంటున్నారు యుగళంగా. అనంతాకాశాన్ని ముక్కుగా విడగొట్టడం ఇద్దరికీ ఇష్టంలేదు. అందుకే వాక్యం తెగడం లేదు. ‘వాక్యం తెగదుగాక తెగదు’  అంటున్నది వారి ముక్త కంఠం.

శివలెంక రాజేశ్వరీదేవి ఒంటరి. ఒంటరి కాదు. ఒకరు మనిషి, వేరొకరు కవి. ఒంటిగా మనిషి ఊయలూగడం ఎంత నిజమో, కవిగా లోకపు వాకిట ఇష్టులతో జతకట్టడం అంతే నిజం. రావు బాలసరస్వతీదేవి నుంచి సోఫియాలారెన్‌ దాకా, కృష్ణశాస్త్రి, ‘రజని’, మోహన్‌ప్రసాద్‌లనుంచి  శరత్‌, చలం, వడ్డెరచండీదాసు దాకా అందరూ చెలులే, చెలికాండ్రే.

రాజేశ్వరీదేవి అండర్‌గ్రౌండ్‌ కవి. కవిగానే కాదు మనిషిగా కూడా అండర్‌గ్రౌండ్‌ జీవితాన్ని ఎంచుకున్నందున అందుకు అడ్డుగా నిలిచే ఉద్యోగ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని తోసిరాజన్నారు. ఫ్రెంచి కవి, విమర్శకుడు మలార్మే లాగా »»The world exists in order to end up in a bookµµ అని నమ్మి తన ప్రపంచాన్ని పుస్తక రూపంలో మనకు కానుకగా ఇచ్చి సెలవంటూ వెళ్ళిపోయారు.

‘‘నా రాత్రి సుదీర్ఘమయినది’’ అంటూ తెలియని రాత్రిలోకి మనల్ని తీసుకువెళతారు. ఏ నమూనాలోనూ లేనందున రాత్రిని పగలు, పగటిని రాత్రిని చేసే శక్తి ఆమె సొత్తు. ‘‘ఉన్న కాస్త సమయం ప్రేమించడానికే చాలడం లేదు. ఇక ద్వేషానికి తావెక్కడ?’’ అనే సూఫీ కవయిత్రి రూబియా తలపుల్లో మెరుస్తుంది శివలెంక కవిత్వం చదువుతుంటే. ఒక్క రూబియానే కాదు మార్మిక కవులు మీరా, అక్కమహాదేవి గుర్తుకువస్తారు.

దోస్తవిస్కీ ‘నేరము శిక్ష’ నవలలో మన హృదయానికి చేరువై మనను అచ్చెరువొందించే సోనియాను మీరు శివలెంకలో చూడవచ్చు. రాస్కల్నికొవ్‌ను సన్మార్గంలో పెట్టే సోనియానే కాదు రాస్కల్నికొవ్‌ను కూడా మీరు ఆమెలో చూస్తారు. పరస్పర విరుద్ధ అస్తిత్వాలను కలిగివున్న భిన్న ధృవాలు ఒకే మనిషిలో అన్యోన్యంగా వుండటం అరుదుగా తప్ప జరగదు. రాజేశ్వరీదేవి ఇందుమూలాన్నే అరుదయిన కవిగా, మనిషిగా నిలుస్తారు. ‘తోవ ఎక్కడ సోనియా?’ అని కలవరించి పలవరించిన ‘నూతిలో గొంతుక’ బైరాగి కవిత్వ ప్రభావం ఆమెపై వుందంటే అది స్వాభావికమే.

“Despair has its own calms” అంటాడు డ్రాకులా, బ్రామ్‌ స్టోకర్‌ నవలో. అలాగే “It is necessary to work, if not from inclination, at least from despair.” అంటాడు ఫ్రెంచి మహాకవి బోదలేర్‌. రాజేశ్వరీదేవి కవిత్వం ఆమూలాగ్రం despair (నిరాశ) నుంచే జనించింది. కుటుంబ పోషణకుగాను వేతన కూలీగా ఇష్టంలేని పని చేయాల్సిన దురవస్థను సులువుగా తప్పించుకుని కవితా వ్యాసంగాన్ని ఇష్టమైన వ్యాపకంగా ఒక పనిగా పెట్టుకున్న ధీరజ శివలెంక. నిరాశ తాత్విక ప్రాతిపదికగా బోదలేర్‌ మార్గంలో పనిచేస్తూ కవిత్వం సృజిస్తూ ఆమె సాంత్వన పొందారు. నిరాశ ఒక ఆంతరిక  సాంస్కృతిక స్థితి. ఒక సంస్కారంగా దానికదే ప్రశాంతిని చేకూర్చే నిరాశ, కవితా సృష్టి ద్వారా ఆమెకు మరింత లోతైన శాంతిని, స్థిమితాన్ని ప్రసాదించింది.

«««

 

ఆజ్‌ సజన్‌ మొహె అంగ్‌ గాలో

జనమ్‌ సఫల్‌ హోజాయే

హృదయ్‌ కీ పీడా దేహ్ కి అగ్ని

సబ్‌ శీతల్‌ హోజాయే

 

గురుదత్‌ ప్యాసా(1957) సినిమా కోసం సాహిర్‌ లుధియాన్వీ రాసిన ఈ వైష్ణవ భజనగీతం రాజేశ్వరీదేవి వంటి స్త్రీతత్వ కవుల ఆర్తికి ఆరని మోహస్పర్శకి సంకేతంగా నిలుస్తుంది. భారతీయ శైవ వైష్ణవ సంప్రదాయాలలో ఇట్టి మోహార్తి ప్రకటనకు తార్కాణాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ‘‘కవిత్వం రాయవలసిన అగత్యం, రాయక తప్పని అశాంతి  స్త్రీలకు సైతం ఏర్పడటం విషాదం.’’ అని ఇస్మాయిల్‌  దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాఖ్యానించారు. స్త్రీవాద కవిత్వం తెలుగునాట విజృంభిస్తున్న సందర్భం అది. ఇతర సామాజిక, రాజకీయ సాహితీపరులకు మాదిరిగానే స్త్రీవాద కవులకు కూడా సిద్ధాంతరాద్ధాంతం ఎక్కువ. జీవన లాలస తక్కువ. ఫలితంగా అది రాశిలోనే తప్ప వాసిలో ఎదగలేదు. అనుభవాన్ని అనుభూతిగా సాంద్రతరం చేసుకునే సహనం, స్తిమితం కొరవడినందున వారిలో హెచ్చుమందికి నినాదాలను పుక్కిటపట్టక తప్పని స్థితి ఎదురైంది. రాజేశ్వరీదేవి ఇందుకు మినహాయింపు. ఇస్మాయిల్‌ వ్యాఖ్యకు సముచిత రీతిలో సంతృప్తికరమైన సమాధానం చెప్పగల సత్తా ఆమె కవిత్వానికి సమృద్ధిగా ఉంది. ఆమెకు ముందు రేవతీదేవి అటూ ఇటూగా జయప్రభ తర్వాత ఊర్మిళ వంటి కవులు వాదానికి అతీతంగా స్ర్తీలుగా(ఫెమినైన్‌) కవిత్వం రాశారు. వాదం ఛాయలు వారి కవిత్వంలో కూడా పొడచూపినా, స్వానుభవం నుంచి స్వబుద్ధితో రాయడం వలన అవి శుష్క ప్రేలాపనలు కాలేదు. క్షయం అంతకన్నా కాలేదు. కేవలవాద కవులు కనుమరుగై అప్పుడే సుమారు 15ఏళ్ళు గడచిపోయాయి.

స్త్రీలు కేవం ఉదాసీన కాల్పనిక కవిత్వానికే పరిమితమవుతారని, పురుషులైతేనే క్రియాశీల కాల్పనిక కవిత్వానికి పట్టం కడతారని ఒక అపప్రద తెలుగు కవితాలోకంలో బహుళ వ్యాప్తిలో ఉంది. గోర్కీ ఒక యువ రష్యన్‌ కవయిత్రి కవిత్వాన్ని చూసి చేసిన వ్యాఖ్యలను స్థల కాలాలకు అతీతంగా అన్వయించడం వలన ఈ వికారం షికార్లు చేస్తున్నది. రాజేశ్వరీదేవి కవిత్వంలో మనం ఉభయ (ఉదాసీన, క్రియాశీ) కాల్పనికతను చవిచూస్తాం. ఆత్మాశ్రయ కవిత్వం వస్తువును ఆశ్రయించడం అసాధ్యమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చేసిన సూత్రీకరణకు కాలదోషం పట్టిందని చెప్పడానికి ఈ కవిత్వం తిరుగులేని సాక్ష్యాధారం. (కేవల) వస్త్వాశ్రయ కవులకు ఆత్మను ఆశ్రయించడం సాధ్యపడదనే కఠోర వాస్తవాన్ని మరుగు పరచడానికి ఈ విధమైన పాక్షిక ఆవిష్కరణకు పాల్పడటం తెలుగు సాహిత్య పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య.

ఇంతటి ఉత్తమశ్రేణి కవితలు రాసి మనకందించిన రాజేశ్వరీదేవి కవిత్వం ఇంతకాలం పాఠకలోకానికి అందకపోవడం అన్యాయం. తెలుగు సాహితీ ప్రపంచానికి విలువలు లేవని, ‘మ్యూచువల్‌ అడ్మిరేషన్‌ సొసైటీ’గా మారి సొంత ముఠా సభ్యుల సంకలనాలను మార్కెట్‌లోకి వదలడానికి ‘సెలబ్రిటీ’ కవులు పరిమితమయ్యారని చెప్పడానికి ఎవరూ సంకోచించవలసిన అవసరం లేదు.

కాని, యేంలేదు!/ఎప్పటిమల్లే/వుత్త నిస్సారంగా/అవే రాత్రులు/వుదయాలు, అవే బాధలు, బలహీనాలు/

ఎప్పటిమల్లే/నిర్దయగా/మా కంఠాలపైనించి/కఱకు విధి/రథ చక్రాలు

– (నిరాశ-ఎచటికి పోతావీ రాత్రి`వజీర్‌ రహ్మాన్‌)

వజీర్‌ సుమారు ఏభైఏళ్ళ క్రితమే రాజేశ్వరీదేవి ఆత్మబంధువుగా ఆమె హృదయార్తిని ఆవిష్కరించారు. అందుకు నాడు ఆధిపత్య స్థానంలో వున్న తెలుగు విమర్శక మేధావులు ఆయనపై క్షీణ యుగ కవిగా ముద్ర వేశారు. రాజేశ్వరీదేవిపై కూడా అదే ముద్ర వేయడానికి వారి వారసులు వెనుకాడబోరు. కానీ కాలగతి వారిని బుట్టదాఖలా చేసింది.

మనసు మనసు పెనగి మనసు ఏకము చేసి మనసు మర్మము గన్న దెరుక -అని కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన ఎరుకను తన జీవితంలో, కవిత్వంలో అత్యంత అలవోకగా సాధించిన మర్మజ్ఞురాలు, పండితారాధ్య వంశజ, ఆరాధ్య తనయ శివలెంక రాజేశ్వరీదేవి.

సత్యం వద్దు స్వప్నమే కావాలి అన్నారు కవి. ‘సత్యం’ రుజా జరా మృత్యు అవస్థకు ఎలా దారితీస్తుందో సహజసిద్ధంగా ఎరిగిన అభిజ్ఞ కావడంవల్లే ఆమె స్వప్నావస్థను కోరుకున్నారు. ఆధునికతానంతర సౌందర్య శాస్త్రానికి మూలవిరాట్టు నీషేకి రాజేశ్వరీదేవితో ఏకాభిప్రాయం ఉంది. ఆయనా ఆ మాటే అన్నారు తనదైన రీతిలో We have art in order not to die of the truth. (సత్యం బారిన పడి చనిపోకుండా రక్షించేందుకే మనకు కళలున్నాయి.)

***

How free I am,

how wonderfully free

from kitchen drudgery 

free from the harsh grip of hunger

and from empty cooking pots

free too of that unscrupulous man

the weaver of sun shades

calm now and serene I am

all lust and greed purged

to the shade of spreading tree I go

and contemplate my happiness

– Therigatha

(2-3rd century BC)

 

«««

అంతరంగంలో ఆమె బుద్దిస్ట్‌ కావడం వల్లే మన మధ్యా బౌద్ధ సన్యాసివలె ఆమె జీవించారు.

«

peepal-leaves-2013

rajeswari1

శివలెంక రాజేశ్వరీదేవి చిరపరిచితమైన కవి. స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. జననం 1954 జనవరి 16. తల్లిదండ్రులు కీ.శే. వరలక్ష్మి, సుబ్రహ్మణ్యం. ఏడుగురు సంతానంలో ఆమె పెద్ద. ఏలూరులో బి.ఎస్‌.సి. చదివారు.  

బాల్యం నుంచీ సంగీత, సాహిత్యాలను ప్రాణాధికంగా ప్రేమించారు.  1970లో రచనావ్యాసంగం ఆరంభిం చారు. కడవరకు కొనసాగించారు. అద్భుతమైన కవితలు రాశారు. అరుదైన కవిగా ఆదరణ పొందారు. గత నలభై ఏళ్ళలో ఆమె రచనలు కొన్ని రేడియోలో ప్రసారం కాగా పత్రికల్లో అనేకం అచ్చయ్యాయి.

రాజేశ్వరీదేవి గుంపున ఎపుడూ లేరు. జీవితంతో ఏకాకిగానే తలపడ్డారు. చంద్రుడికి జతగా జాగరణ చేశారు. ఆ కత, కవరింతలే ఆమె కవిత్వం.

స్వప్నం మీంచి కోకిలవలె పాడుతో పాడుతో 2015 ఏప్రిల్‌ 25న నక్షత్ర లోకంలోకి ఎగిరిపోయారు.

 

నామాడి శ్రీధర్.

సంపాదకుడు

సత్యం వద్దు స్వప్నమే కావాలి

ప్రేమలేఖ ప్రచురణ

‘రూఢి’ని తోసిరాజనే రౌడీ!

 

 

– చింతలపల్లి అనంతు
~

పదైదేళ్ళుగా ఊరించిన అద్దం మనముందు ప్రత్యక్షమైందని పసిపిల్లల్లా కేరింతలు కొట్టాలా?
తీరా అది గాలిఅద్దం అయి కూర్చున్నందుకు బెంబేలెత్తిపోవాలా?
అలవాటయిన బింబాలనే చూపే అద్దాల ముందు నిలబడే మన అలవాటుపైన పెనుకాటు వేసాడు కదా ముసనం సుబ్బయ్యనాయుడు aka ఎమ్మెస్ నాయ్డు.
*
All these poems appear on the surface as illogical and disjointed emotions camouflaged in worldly words. Known word here is a subterfuge to the unknown. And a familiar womb surrogates an unfamiliar embryo.
*
అందుకే ఇవన్నీ అర్థంపర్థం లేని పదాలు/మాటలు/వాక్యాలు. తలాతోకా లేని రాతలు. తలలూ, తోకలు తెగిన కవితలు. మనం అలవోకగా గుర్తుపట్టే వీలుకల్పించే ఆనవాళ్ళయిన ఆ తలా, ఆ తోకలను అదేపనిగా కత్తిరించిన కవన కవాతు ఇది.
మనకింకా మచ్చిక కాని వన్యమృగాల వంటి మాటలు, భావాలు, ఉద్వేగాలు, పదచిత్రాలు, పదబంధాలు, ప్రతీకలతో విన్యాసం సలిపే రింగ్ మాస్టర్ కేళి ఎమ్మెస్ నాయుడి గాలిఅద్దం.
చట్రమే తన అస్తిత్వమయిన అద్దానికి, చట్రంలో అస్సలు ఇమడని గాలిని జతగాడిని చేయడంలోనే వుంది కదా ఆ కేళి.
అందుకే ‘రూఢి’ ని వ్యతిరేకించే రౌడీయిజంలా అగుపిస్తుంది నాయుడి కవిత్వం.
*
ఈ కవితా సంకలనానికి ఒక అంచున అద్దం-కిటికి కవితా, చివరన గాలిఅద్దం అనే కవితా వుండటం కేవల యాధృచ్చికత కాదు.
కిటికి – అది సామర్ల కోటదయినా, సాన్ ఫ్రాన్సిస్కో దయినా బయటి నుంచి దాని సౌష్టవం సుమారుగా ఒక్కటే.
చిత్రికలో, సామాగ్రిలో, కొలతల్లో, పటాటోపంలో చిరు తేడాలుండొచ్చు మహా అయితే.
బయటినుంచి చూస్తే కిటికీ అనే ఊహ మూసరీతే.
చూడాల్సింది కిటికీ అటువైపునుంచి కదా?
అయినా మనం కిటికీలకేసే చూస్తూ వుంటాం.
ఇంతలో నాయుడు మాత్రం కిటికీల నుంచి బయటికి.
అలా ఆ కిటికీల్లోంచి బయటికి తొంగిచూడటమే బాల్యం.
అది కోల్పోతేనే కవిత్వం రాయలేం. చదవలేం. నచ్చలేం. ఒప్పలేం.
ఆ కిటికీల్లోంచి బయటికి చూసి భిన్న స్థలాల, భిన్న కాలాల, భిన్న ఉద్వేగాల ను ఆఘ్రాణించి అంతే విభిన్న స్థలాల, విభిన్న కాలాల, విభిన్న ఉద్వేగాలను అందదిపుచ్చుకునే నిరత నవ శిశువు నాయుడు.
వాటినే మాల కడతాడు; అవి తన దారంలో ఇమడకపోయినా ఓపికగా.
విరాటపర్వంలో తన అస్థిత్వం మరో అస్తిత్వాన్ని తొడుక్కున్నప్పుడు సైరంధ్రి కట్టే మాల లాంటి మాటలమాల సతతం గుదిగుచ్చుతూవుంటాడు వీడు.
*
నాయుడు వాడే లెన్స్…. వైడూ కాదు, టెలీ కాదు. అది సూపర్ మెగా మైక్రో లెన్స్ విత్ నైట్ విజన్.
ఈ కటకం వల్లే రక్తమాంసాలను, రాగద్వేషాలను సునాయసంగా దర్శించగలుగుతాడు నాయుడు. ఇలా దర్శించి diagnose చేస్తాడు, prescription రాస్తాడు.
మాటలకు స్వస్థత చేకూర్చే వెటర్నీరీ వెజ్జు కదా నాయుడు.
ఆ Diagnosis కీ, ఆ prescription కీ మధ్య ఎలాంటి సంబంధం వుండదు. వాటి మధ్య హేతుబద్ధంగా వుండవలసిన బొడ్డుపేగును కత్తిరించిన మంత్రసాని నాయుడే కదా మరి.
Independently profound అయిన వాడి diagnosis, వాడి prescription ల మధ్య connectivity ని వెతుక్కోవడం మన మూస మూర్ఖత్వం అని నవ్విపోతాడు తుంటరిగా, ధీమాగా.
అందుకే ఈ గాలిఅద్దం ముందు మనం నిలుచున్నప్పుడు మనకు మనదో, లేదా అసలేదైనా తెలిసిన (లౌకిక)బింబమో కనిపిస్తుందన్న భరోసా అస్సలు వుండదు. అసలు తెలియనిదేదోనయినా ఎపుడైనా ఎదురవుతుందన్నహామీ కూడా వుండదు. ఈ కఠిన నిరాకరణలకు మనం సంసిద్ధమైతేగానీ, మన లోపలి ఇదివరకటి తెలివిడిని రద్దుచేసుకునే అనహంకార చొరవ చేయగలిగితే తప్ప గాలిఅద్దం ముందు నిలిచి అందులోకి తొంగి చూసే సాహసం చేయలేం.
చందమామ కతల్లోలాగా దక్షిణం దిక్కుకు వెళ్ళొద్దని పేదరాసి పెద్దమ్మ ఎంత చెప్పినా అదే దిక్కుకు తన గుర్రం కళ్ళెం విదిలించే రాకుమారుడి దుస్సాహసం చేసే నవనవయవ్వనోత్సవ ఉబలాట, పసితనోత్సుకత వుంటే మాత్రం ప్రస్ఫుటంగా గాలిఅద్దం దర్శనమిస్తుంది.
అప్పుడు, అప్పుడు మాత్రమే ఆ అద్దంలోపలి మైదానాల్లో, లోయల్లో నాయుడు దృశ్యస్వరచించిన బింబోత్సవంలో కనీసం పాల్గొనగలం మనమూ.

*

naidu

“స్వాప్నికుడి మరణం” ఆవిష్కరణ!

swapnikudi

స్వాప్నికుడి మరణం ….ఆ పేరు ఆ పుస్తకానికి అందులో రోహిత్ కు అచ్చుగుద్దినట్టు సరిపోయింది, అవును స్వాప్నికుడే..అయన తెలియాలంటే  ఆయన స్వప్నంతెలియాలి …నిశీధి  రోహిత్ ను “రో ” అంటూ సంబోదించారు , బోల్షివిక్ నాయకుడు , బోల్షివిక్ లా ఉద్యమ వీరుడు చేగోవేర ను పోల్చుతూ  చెప్పి ఉండవచ్చు , ఔను అక్షరాల చేగోవేరా నే…..ఇంకా మరణం తద్యమని తెలిసిన యుద్ధంచేయ సంకల్పించిన స్పాంటాన్స్ యోధుడు కూడా….అంతేకాకుండా….భారత దేశ ముఖ చిత్రం లో దళితులను,అణగారిన వర్గాలను వారి హక్కులకై పోరాడిన , కల్పించిన బాబా సాహెబ్  అంబేద్కర్ గారి అలోచోన విధానం కోసం పరితపించిన , స్వప్నించిన స్వాప్నికుడు రోహిత్ ….

స్వాప్నికుడి మరణం ……..స్వప్నం కు మరణం లేదు ఇది స్వాప్నికుడికి మరణం లేదు. తన స్వప్నాలను నిశీది లో వెతుక్కుంటూ బయటకు తీసే ప్రయత్నం లో బాగం ఈ పుస్తకావిష్కరణ. ఈ కృషిలో  భాగమైన అందరికీ  నీల్ సలాం!

  • -శ్యాం కోలా 

 

“చమ్కీ పూల గుర్రం” పై చర్చ!

 

ఈ  శనివారం, అంటే మార్చ్ 12 సాయంత్రం నాలుగున్నరకి- వేదిక  అధ్వర్యంలో  హైదరాబాద్ లో  ఆలంబన  కిడ్స్  ప్రాంగణంలో 

ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చిన అఫ్సర్   కధ ‘చమ్కీ పూల గుర్రం’ మీద చర్చ ఉంటుంది.

 

 

*

 

“ఇప్పుడు ఆ గుర్రం…. ఆ చమ్కీ పూల   గుర్రం … బొమ్మ మీద నిజంగా కోపమొస్తోంది నాకు! ఈ బొమ్మ వల్ల కదా ఇప్పుడు నేను మున్నీతో  మాట్లాడకుండా అయిపోయింది. పో… పోవే..చమ్కీ!”

-అని పైకే అనేస్తూ  చేతిలో వున్న బొమ్మని మంచమ్మీదికి విసిరింది అపూ. ఆ విసరడం ఎంత నాజూకుగా విసిరిందంటే నిజంగా బొమ్మకేమయిపోతుందో అన్న దిగులు మనసులో పెట్టుకొని నెమ్మదిగా, వీలయినంత  మెత్తగా విసిరింది.

విసిరేసిన తరవాత “పోనీలే పాడు చమ్కీ!” అనుకోలేకపోయింది. మళ్ళీ పరుగు పరుగున వెళ్ళి, ఆ బొమ్మని చేతుల్లోకి తీసుకొని, అదేమయినా గాయపడిందేమో, నొచ్చుకుందేమో అన్నంత ఆతృతగా, కంగారుగా దాన్ని తన మెత్తని వేళ్ళతో సవరదీసింది.

అపూకి  ఈ చమ్కీల  గుర్రం బొమ్మ అంటే ఎంత ప్రాణమో! ఆ  మావిచిగురు రంగు గుర్రం వొంటి మీద నల్లని జూలు…దాని వీపు మీద మెరిసే ఎర్ర ముఖమల్ గుడ్డ కుట్టిన తళుక్కు చమ్కీలు. రాత్రి నిద్రలోకి నెమ్మదిగా జారిపోతున్నప్పుడు లైట్లన్నీ ఆర్పేశాక అవి భలే మెరుస్తాయ్! ఆ చిన్ని  మెరుపుల్లో చమ్కీతో బోలెడు కబుర్లు చెప్పుకుంటుంది అపూ.

ఇంకా ఆ బొమ్మ అంటే ఎందుకు ప్రాణం అంటే…అది మున్నీ ఎంత ఇష్టంగా అపూకిచ్చిందో! ఇంకా ఇంకా ఎందుకు అంటే,  మున్నీ  అంటే ప్రాణంలో ప్రాణం కాబట్టి!  మున్నీ వాళ్ళమ్మ భాషలో చెప్పాలంటే మున్నీ – అపూ  వొకళ్ళకొకళ్ళు ‘జిగర్ కా టుకడా’ (ప్రాణంలో  వో ముక్క) కాబట్టి!

మరీ మున్నీకి దూరంగా వున్న క్షణాల్లో చమ్కీని దగ్గిరకు హత్తుకొని, “మున్నీ!” అని ప్రేమ గోముగా పిల్చుకుంటుంది  అపూ మళ్ళీ మళ్ళీ! మున్నీతో చెప్పుకోవాల్సిన  కబుర్లన్నీ దాంతోనే చెప్పుకుంటుంది అపూ. అమ్మ వొడిలో వున్నప్పుడు కూడా కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తూ, చమ్కీకి నక్షత్రాలు చూపిస్తూ, వాటిని లెక్కపెడ్తూ నిద్రలోకి జారుకుంటుంది.

ఇవాల్టికి అయిదు రోజులు- మున్నీని  అపూ  చూడక, మున్నీతో అపూ ఆడుకోక.

మున్నీతో కథలూ లేవు,  కబుర్లూ చెప్పుకోలేదు. మున్నీ  వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మమ్మ ఫాతమ్మ  ముందు కూర్చొని అల్లరీ  చేయలేదు. ఫాతమ్మ కథలు చెప్తూ చెప్తూ వుంటే ‘ఊ’ కొట్టనూ లేదు! అపూకి  ఊహ తెలిసిన తరవాత చూసిన మొదటి పీర్ల పండగనాటి సాయంత్రం పీరు కథ ఫస్టు ఫస్టు చెప్పింది ఫాతమ్మే. అప్పటి దాకా  అపూ దృష్టిలో పీరు అంటే చేతి ఆకారంలో వుండే వొక బొమ్మ మాత్రమే. కాని, ఫాతమ్మ చెప్పిన కథ విన్న తరవాత పీరు అంటే వొట్టి బొమ్మ కాదనీ, వాళ్ళు దేవుళ్ళ లాంటి గొప్ప మనుషులనీ అర్థమైంది. అందుకే, వాళ్ళని వూళ్ళో అందరూ అంత గొప్పగా కొలుస్తున్నారనీ తెలిసింది.

“అవును, మనుషులు వూరికే దేవుళ్ళు అయిపోతారా మరి!” అని అమ్మ కూడా ఫాతమ్మ చెప్పిన కథే మళ్ళీ చెప్పుకొచ్చింది. వూళ్ళో కరువొచ్చినప్పుడు పీరు దేవుడి మహిమే కరువుని వెళ్ళగొట్టిందని వొక కథ. వూరి మీద ఎవరో మూకలు పెద్ద యుద్ధానికి వచ్చినప్పుడు పీరు దేవుడే కత్తి దూసి యుద్ధం చేశాడనీ, తన ప్రాణం అడ్డుపెట్టి, వూరిని కాపాడాడని ఇంకో కథ. చివరి యుద్ధంలో శత్రువులు కుట్ర చేసి, పీరు దేవుడిని యుద్ధ భూమిలో చంపేశారనీ ఇంకో పెద్ద కథ పాటగా పాడుతారు వూళ్ళో పీర్ల చావిడి దగ్గిర!

అదలా వుంచితే, అసలు ఫాతమ్మ పాల కోవా ఎంత బాగా చేస్తుందో!  తన  కోసమే ఎప్పుడూ  దాచి వుంచే  కోవా బిళ్ళని ఇప్పుడు  ఫాతమ్మ ఏం చేస్తోందో! తను లేకుండా దాన్ని మున్నీ తినేస్తోందా? లేకపోతే, అన్నీ దాచిపెట్టి తను కలిసిన రోజున ఇస్తుందా? అపూ ఆలోచనల్లో కలల్లో మున్నీ తప్ప ఇంకోటేమీ లేదు!

అసలు మున్నీతో  మాట్లాడకుండా ఆడుకోకుండా ఈ అయిదు రోజులూ వుండడమే వింతల్లో వింత. కానీ, ఆ ఇంట్లో నాన్న  చండశాసనం ముందు అపూ అమ్మ సత్యా, నానమ్మ కూడా నిజానికి వణికిపోతారు, తొమ్మిదేళ్ళ  అపూ ఎంత? అయినా సరే,  మున్నీ  దగ్గిరకి వెళ్ళి రావాలి దొంగచాటుగా అయినా! కానీ, ఎప్పుడూ ఆ దొంగా పోలీస్ ఆటలోలాగా దొరికిపోతుందేమో అని అపూ భయం!

“ఒరే, నువ్వు పొరపాటున కూడా మున్నీ వాళ్ళ ఇంటివైపు వెళ్ళకు. మీ నాన్నకి  ముందూ వెనకా అన్నీ కళ్లే! ఎలా తెలిసిపోతుందో తెలిసిపోతుంది…నీ  వీపు విమానం మోత మోగిపోతుంది.” అని నానమ్మ ముందే హెచ్చరించేసింది కూడా. ఇంతకుముందు వో సారి వెళ్లి వస్తే, నాన్న  ఎలా కొట్టాడో ఏమైందో ఎలా మరచిపోతుంది అపూ?!

“పూవు లాంటి పిల్లని ఎందుకలా కొట్టి కొట్టి చంపుతావ్?” అని నానమ్మ  ఆ రోజు అడ్డు వచ్చింది  కానీ, సురేష్ అలాంటి క్షణాల్లో ఎవరేమిటని చూసుకోడు…వొక్క చేత్తో విస్సిరి అవతల పడేస్తాడు! “ఒరే, సురేష్ , నీకు పెద్దా చిన్నా అని కూడా తెలియకుండా పోతోంది!” అని అనేసి బయటికి వెళ్లిపోతుంది నానమ్మ  కోపంగా.

ఈ గుర్రం    బొమ్మ తెచ్చిన సాయంత్రం “ఇంకొక్క సారి ఆ గుమ్మం తొక్కావంటే వూరుకోను!” అని కోపంగా అరిచేసి, ఆ రాత్రి గుళ్ళో భజనకి  వెళ్ళిపోయాడు సురేష్.

అంతే! ఆ రోజు నించి మున్నీతో  అపూ మాటలు బంద్…ఆటలు బంద్…ఈ వీధిలో కాకి ఆ వీధిలోకి వెళ్ళి కావ్ కావ్ అనడానికి కూడా వణికిపోయేంత గొడవ అయిపోయింది.

కానీ, గుర్రం  బొమ్మని ఎలాగోలా ఆ గొడవలో కాపాడుకొని కుర్చీ కిందకి నెట్టేసింది అపూ. “జై పీరు బాబా  … కాపాడవా ఈ దెబ్బల నించి…!” అనుకుంటూ. “అది ఎలాంటి కష్టమైనా పీరు బాబాని వొక్క సారి తలచుకుంటే చాలు, ఇట్టే దూరమైపోతుంది,” అని కదా ఆ రోజు ఫాతమ్మ గారు చెప్పారు! పీరు బాబా ఈ గుర్రమ్మీదనే ఊళ్ళోకి వచ్చారట, అప్పుడెప్పుడో పెద్ద యుద్ధం జరిగినప్పుడు- శత్రువులందరినీ తుడిచి పెట్టేసి, ఆ గుర్రమ్మీదనే ఎటో వెళ్లిపోయారట. అందుకే, వూళ్ళో పీర్ల చావిడి మీద అన్నీ గుర్రం బొమ్మలుంటాయి, అవి అన్నీ పీరు ఎక్కి స్వారీ చేసిన గుర్రాలే, అవి పవిత్రమని వూళ్ళో అంతా నమ్ముతారు.

ఇప్పుడు ఈ క్షణాన  ఏ రాముడైనా, పీరు బాబా అయినా పర్లేదు, ఇప్పటికిప్పుడు  అపూకి కావలసిందల్లా తన మొరాలకించి, మున్నీని, తననీ కలపాలి!! అంతే!!

2

“సత్యమ్మా, ఇదిగోనే  నీ కోసం ఈ పటం తెచ్చానే!” అంటూ పీర్ల బొమ్మలున్న వొక క్యాలెండరు తెచ్చి ఇచ్చింది పక్కింటి అరుణ వాళ్ళమ్మ నెలరోజుల క్రితం. అది పక్కూళ్ళో  ఆ వూరి  పీర్ల పండగ సంతలో కొనుక్కొచ్చిందట. అరుణ వాళ్ళు ఈ వూళ్ళో పీరు దర్శనం చేసుకున్న తరవాత, యింకో  రోజు పక్కూళ్ళో పీర్ల పండక్కి కూడా వెళ్లి వస్తూ వుంటారు. ఆ పీరు మరీ చిన్నప్పుడే యుద్ధంలో నేలకొరగడం వల్ల అతని మహిమ ఇంకా పెద్దది అని అరుణ వాళ్ళమ్మ అంటూ వుంటుంది.

“ ఈ పీరు బొమ్మ ఇంట్లో వుంటే దుష్టశక్తులు రావు. నియ్యతూ బర్కతూ బాగుంటయ్యని తెచ్చా!” అంది అరుణ   వాళ్ళమ్మ.

“అక్కా, నీకు తెలుసు కదా! మా ఆయనకి ఇలాంటి తురక బొమ్మలూ, తురక మాటలూ  అవీ ఇష్టం వుండడం లేదీ మధ్య!” అని సత్య  అరుణ  వాళ్ళమ్మకి చెప్పబోయింది కానీ ఆమె వినిపించుకుంటేగా!

“అందరూ పీర్ల సంతకి వెళ్తున్నారు…ఇది మనూరి ఆచారం! మీరూ ఆ రమేష్ వాళ్ళే  కదా ఇట్లా వూరూ వాడా పట్టకుండా…ఎందుకలా? ఈ క్యాలెండరు చూడగానే నువ్వు గుర్తొచ్చావ్. తీసుకో సత్యమ్మా! ఇంట్లో గోడకి వుంచు. నీ ఇంటికి రక్ష,” అని క్యాలెండరు సత్య   చేతుల్లో పెట్టి వెళ్లిపోయింది అరుణ  వాళ్ళమ్మ.

రమేష్  పేరు వినగానే సత్యకి   సర్రున కోపం తన్నుకొచ్చింది లోపల్నించి – ఆ రమేషే వారానికో సారి  వచ్చి, నాన్ననీ, ఇంకో ముగ్గురు గుడి  పెద్దల్ని కూర్చోబెట్టి మన ధర్మం, పరధర్మం అంటూ  లేనిపోనివన్నీ  చెప్తుంటాడు. అది మన  మతం కాదు, మన ధర్మం కాదు …అంటూ. “మన ధర్మం గంగనీరు..పరధర్మం ఎండమావి” లాంటి మాటలు వినడం ఆ రమేష్ దగ్గిరే మొదటి సారి.

ఆ పేరు వినగానే  వెంటనే అడిగేసింది అపూ  అమ్మని వొకటికి రెండు సార్లు  –

“అమ్మా, ధమ్మం ఏమిటి? మతం ఏమిటి? అవేమన్నా కొత్త బొమ్మలా?”

“అమ్మా, ఆ  రమేష్ అంకుల్ వాళ్ళ  వల్లనే కదా మనం పండక్కి  వెళ్లకుండా అయిపోయింది! పండక్కి వెళ్తే ఎంత బాగుంటుందో, నా దోస్తులందరూ కలిసేది. ఆడుకునేది. చాలా తినేది. పక్కింటి అరుణ  వాళ్ళు కూడా వెళ్తారు కదమ్మా పీర్ల పండక్కి! అది మన పండగే కదా! మనం వెళ్లచ్చు కదా!”

“నీకు అర్థం కాదులే…అది నాన్నకి ఇష్టం వుండదు. అది మన పద్ధతి కాదు. నాన్న  వూళ్ళో మన వాళ్ళందరికీ  పెద్ద కదా,  అందరికీ చెప్పాల్సిన పెద్ద. ఆయనే తురక సంతలకీ, పీర్లదగ్గిరకీ వెళ్తే…ఈ నాలుగూళ్ళ మనోళ్ళంతా   పాడయిపోతారు. అసలే మనకీ మనవాళ్ళకీ మంచి కాలం కాదిది,” అంది.     అంత కంటే ఏం చెప్పాలో అర్థం కాలేదేమో మౌనంగా వుండిపోయింది సత్య.

నాన్నకి  ఇష్టం వుండదు …అన్నంత వరకే అపూకి  కూడా అర్థమయింది. ఆ తరవాతది దాని తల మీంచి ఎటో ఎగిరిపోయింది.

ఆ రోజు ఆ క్యాలండరు ఏం చేయాలో తెలీక ముందు గదిలో కనిపించీ కనిపించకుండా వొక మూలకి గోడ మీద పెట్టింది సత్య.

కానీ, అది సురేష్   కళ్ళలో పడనే పడింది. అంతే! ఇంట్లో రామ రావణ యుద్ధం మొదలైపోయింది. ఆ యుద్ధం తరవాత అపూకి  ఇంకోసారి అర్థమయిందేమంటే అరుణ  వాళ్ళింట్లో లాగా తురక దేవుళ్ళ బొమ్మలూ గట్రా ఏమీ తనింట్లో వుండకూడదు అని!

అరుణ  వాళ్ళింట్లో దేవుడి గది అంటే అపూకి ఎంత ఇష్టమో! ఒక ఆదివారం ఆడుకుంటున్నప్పుడు అరుణ  ఆ చిన్ని గదిలోకి తీసుకు వెళ్లింది. గోడ మీద పటాలూ, అవి కాక చిన్ని పెళ్లి మంటపంలాంటి అరుగుల మీద సీతా రాముడూ, శివ పార్వతులూ, వినాయకుడు….వాటితో పాటు పీర్ల గుడి ఫోటోలూ, పీర్ల ఫోటోలూ, అన్నిటికంటే అపూకి ఎంతో  ఇష్టమైన చమ్కీ పూల గుర్రం ఫోటో…అవన్నీ అరుణ  చూపించింది. కానీ, అన్నీట్లోకి అపూకి  బాగా నచ్చింది ఆ గుర్రం  బొమ్మ క్యాలెండర్! ఆ మెరుపు పూలు …దాని నడుమ్మీద చేతి గుర్తు!  ఆ చేయి పీరు దేవుడిదే అని అరుణ వాళ్ళమ్మ, మున్నీ వాళ్ళమ్మ కథల్లో  విన్నదే.

తను గుర్రం  బొమ్మ వేపు పరీక్షగా చూస్తున్న ఆ సమయంలోనే అక్కడ వొక గిన్నెలోంచి కాసింత విభూతి తీసి తన నుదుటి మీద పెట్టింది అరుణ. అది పీర్ల గుండం దగ్గిర నించి తీసుకువచ్చిన బూడిద..కళ్ళకి అద్దుకొని రాసుకుంటే మనసులో బాధలన్నీ పోతాయంటుంది అరుణ.

అపూ  వెంటనే అది చెరిపేసి, “అమ్మో! నాన్నకి కోపమొస్తుంది!” అంది.

అరుణ వాళ్ళమ్మ గారు  “సర్లే… ఎవరి పద్ధతి వాళ్ళది. ఏం కాదులే! ఇలా కూర్చోండి చక్కిలాలవీ పెడతా!” అంటూ ముందు గదిలో  కూర్చోబెట్టి, చక్కిలాలూ అరిసెలూ పెట్టింది. అందుకే, అపూకి  అరుణ వాళ్ళమ్మ  గారంటే మహా ఇష్టం!అసలు ఎన్ని రకాల వంటలు చేస్తారో..ప్రతి పండక్కి! ఆ మాటకొస్తే ఎప్పుడు వాళ్ళింటికొచ్చినా పండగే అపూకి!

“అత్తయ్యా! ఈ చమ్కీ పూల దేవుడి కథ చెప్పవా?” అంది అపూ.

“ఓ …పీరు  స్వామా?!” అంటూ అరుణ వాళ్ళమ్మ  గారు ఆ కథ చెప్పాక పీరు స్వామీ  తెగ నచ్చేశాడు అపూకి.

అందుకే, ఆ రోజు అరుణ వాళ్ళమ్మ  గారు కథ చెప్పగానే “అత్తయ్యా, నా ఫేమరెట్ దేముడు పీరు సామి!” అని ప్రకటించేసింది సంతోషంగా.

ఆ ప్రకటన ఇంత దూరం వచ్చి, ఇవాళ మున్నీనే దూరం చేస్తుందని అనుకోలేదు పిచ్చి అపూ!

3

“వేరేవాళ్ళతో  సావాసం చేస్తే అన్నీ వాళ్ళ  బుద్ధులే వస్తాయి. దీన్ని ఆ తురకల  ఇంటికి పంపద్దు అంటే నువ్వు వినవ్!” అన్నారు నాన్న  అవాళ పొద్దున్న కూడా కోపంగా.

దానికి అమ్మ  ఏం చెప్తుందో అని ఎదురుచూస్తూ వుంది అపూ.

సురేష్  దృష్టిలో అందరూ “వేరేవాళ్ళే” అని తరవాత్తరవాత నెమ్మదిగా అర్థమవడం మొదలైంది.

నానమ్మకి అసలు ఈ గొడవే లేదు. రాముడికీ మొక్కేది, పీరుకీ మొక్కేది. ఇద్దరూ వొకటే కదా అనేది ఇంకేమన్నా అడిగితే! మరి, అరుణ వాళ్ళమ్మ  గారు వొక్క రోజు కూడా పూజ చేయకుండా ఏ పనీ ముట్టుకోరు. అట్లాగే, పీరుకి కూడా మొక్కుకుంటారు. అరుణ పీరు  దేవుడికి దండం పెట్టుకోకుండా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టదు. లక్ష్మి  వాళ్ళమ్మ పొద్దున్న లేవగానే పీర్ల చావిడికి వెళ్ళి, ఆ చావిడి మెట్లని కళ్ళకి అద్దుకొని గాని పనిలోకి దిగదు. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముతారా లేదా?

సురేష్  దృష్టిలో అవన్నీ తప్పుడు పనులు ..ధర్మం కాదట! గుడికి వెళ్తేనే ధర్మం, శుభం.  మిగతావన్నీ- అంటే ఈ పీర్ల దేవుడి పటాలు పెట్టుకొని పూజలు చేయడం, గుడికి వెళ్ళినట్టు పీర్ల చావిడికి వెళ్ళడం, పీర్ల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం- ఇవన్నీ తప్పుడు–అంటే మనవాళ్ళు  చేయకూడని  పనులు!

మున్నీ  చమ్కీ గుర్రం  బొమ్మ ఇచ్చినప్పుడు అపూ దాన్ని కాదనలేకపోయింది. దాన్ని గౌనులో దాచుకొని తెచ్చి, ఇంట్లో పెట్టేసుకుంది. అది తండ్రి  కంట పడితే ఏమవుతుందో తెలుసు.  ముఖ్యంగా అలాంటివి నాన్న  కంటికి కనిపించకుండా చేయడం చాలా   కష్టం!

ఆ బొమ్మ తెచ్చిన రోజే అపూ ఇంటికి వెళ్ళి దానితో ఆడుకునే చివరి రోజు అవుతుందని అనుకోలేదు అపూ.

మున్నీ  వాళ్ళింటికి వెళ్ళడం, దానితో ఆడుకోవద్దనీ అన్న  నాన్న  మీద, ఆయన పద్ధతుల మీదా చచ్చేంత కోపంగా వుంది. అసలు నాన్నని   వొక్క మాట అయినా అడగొచ్చు కదా అమ్మ!  నిజానికి నానమ్మ  అవీ ఇవీ కబుర్లయితే చెప్తుంది కానీ, ‘మున్నీతో ఇవాళ ఆడుకోలేదేం’ అని వొక్క ముక్క అడిగిన పాపాన పోలేదు. వాళ్లెవరికీ ఇదొక పెద్ద సమస్యే కాదు.

“వీడు  ఏ లోకంలో వున్నాడోనమ్మా!” అంటుంది నాన్నమ్మ. “ఈ వూళ్ళో నాకు ఊహ తెలిసీ, మనమూ, పరాయీ అన్నది నా ఊసులో ఎన్నడూ లేదు,” అంది అమ్మతో ఒక సారి- నాన్న ఎంత చెప్పినా, నానమ్మ, అమ్మ నాన్న కంట్లో పడకుండా పీర్ల గుడికి వెళ్లి వస్తూనే వుంటారు. మిగతా అరుణ వాళ్ళమ్మా, అందరూ అంతే.. వాళ్ళు గుడికీ  వస్తారు, ఆ పీర్ల చావిడికి వెళ్ళి అక్కడ పెట్టిన బొమ్మలకూ మొక్కుకుంటారు!

కాని, అపూకి ఇవన్నీ అక్కర్లేదు, తనకేం కావాలి? కాసేపు మున్నీతో  హాయిగా ఆడుకోవాలి, పాడుకోవాలి, దాని బొమ్మల్ని సింగారించాలి. ఇద్దరూ కలిసి ఆ బొమ్మలతో కబుర్లు చెప్పుకోవాలి. అంత వరకే! కాని…అంత వరకూ వెళ్ళడానికి…!?

4

ఆలోచిస్తూ ఆలోచిస్తూ అపూ  ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తెలీదు.  నిద్రలో మున్నీతో  తనదైన లోకంలో  పీర్ల  ఊరేగింపులో పరుగులు తీస్తోందట. పీర్ల సాయిబు పీరు ఎత్తుకోలేక అవస్థ పడుతున్నాడట. మున్నీ అపూ   ఇద్దరూ కలిసి ‘జై ఆంజనేయా!” అనగానే పీరు ఎత్తుకున్న సాయిబుకి కొండంత బలం వచ్చేసిందట.

అపూ  నిద్రలోపలి లోకం చాలా సందడిగా వుంది.  నిద్ర బయట అపూ  గొంతు లోంచి రెండు మాటలే బయటికి వచ్చాయి. అందులో వొకటి:  “జై పీరు సామీ !” రెండోది: మున్నీ!

ఆ రెండు పదాలూ అప్పుడే అపూకి  దుప్పటి కప్పడానికి వచ్చిన సత్య  చెవిన పడ్డాయి. మంచి నిద్రలో వుంది అపూ !  దాని ఛాతీ మీద రెండు చేతుల మధ్యా చమ్కీ గుర్రం  బొమ్మని గట్టిగా హత్తుకుని వుంది.

ఆ బొమ్మని అపూ  చేతుల్లోంచి బయటికి తీయబోయింది సత్య.  అపూ  చేతులు అది పడనివ్వలేదు. సత్య   చేతుల్ని తప్పించుకుని పక్కకి తిరిగి ఇంకా దగ్గిరకి వొత్తిగిలి పడుకుంది అపూ. అలా చేసే ప్రయత్నంలో మళ్ళీ కలవరించింది అపూ. “మున్నీ, రేపు నేనొస్తాగా!” అంటోంది నిద్రలోనే!

మంచం మీద ఓ పక్కకి కూర్చొని అపూ  నుదుటి మీద చేయి వేసింది సత్య. నుదురు వెచ్చగా అనిపించింది.

ఇంతలో  “అమ్మా!” అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సురేష్.

పిలిచింది వాళ్ళ అమ్మనే అయినా తనే జవాబిచ్చింది అలవాటు ప్రకారం-  “ఏమండీ  …ఇక్కడ పాప  దగ్గరున్నా!” అని నెమ్మదిగా.

సురేష్  బయటినించే  “సరే…” అన్నాడు.

“అపూకి కాస్త నలతగా వుంది. దాంతో వున్నా!”

అప్పుడైనా సురేష్ లోపలికి వచ్చి, పాపని చూస్తాడేమో అన్న ఆశ- అలా వచ్చినప్పుడు సురేష్ తో అపూ మనసులోని బాధంతా తన భాషలో  చెప్పేయాలని సత్య  ఆశ.

“అన్నం తిందా?” అని బయటి గది నించే  అడిగాడు.

“లేదు…అది సరిగా తినడం లేదు…” అంది తనే బయటికి వస్తూ.

ఆమె ఏదో చెప్పబోతుందన్న విషయం సురేష్  కి అర్థమవుతోంది. కానీ, ఆ  వేళప్పుడు అపూ  నిద్ర చెడగొట్టడం ఇష్టం లేక కొంతా, బయటికి వెళ్ళే హడావుడి  వల్ల కొంతా ఆ సమయంలో ఎక్కువ మాట్లాడ్డం ఇష్టం లేదు సురేష్ కి!

రెండు మెతుకులు గతికి వెంటనే బయటికి వెళ్ళిపోతూ – “తెలుసు కదా, మందిరం డబ్బు కోసం ఇంకా తిరుగుతూనే వున్నాం. ఇంత చిన్న వూళ్ళో లక్ష రూపాయలు పోగేయాలంటే తల ప్రాణం తోకకొస్తోంది. ఈ పూట  నేనూ, రమేష్ మళ్ళీ రెండు మూడు ఇండ్లకి వెళ్ళాలి!” అన్నాడు.

ఇంకేమీ అనలేక ఆటను అటు వెళ్ళగానే ఇటు అపూ దగ్గిరకి వచ్చి కూర్చుంది. నిద్రపోతున్న అపూ  ముఖాన్ని పరీక్షగా చూస్తూ వుండిపోయింది.  ఆ వయసులో తను ఎలా వుండేదో, ఎంత అల్లరిగా ఆడుకునేదో గుర్తొస్తోంది సత్యకి! తనని తాను ఆ వయసులో ఊహించుకొని ఎన్నాళ్ళయిందో కదా! ఆ అమాయకత్వం, అందరితో యిట్టే కలిసిపోయే తనం! అపూ తన పోలికే అంటుంది అమ్మ!

అపూ   ముఖంలోని అమాయకత్వం, పసితనం, ఏమీ తెలియని తనం అన్నీటినీ పరీక్షగా చూస్తూ చూస్తూ వుండిపోయింది.

బహుశా, ఇంత పరీక్షగా ఇంతకు ముందెన్నడూ తను అపూని చూసి వుండదు. ఆ అమాయకమైన ముఖమ్మీద ఏవేవో నీడలు పడుతున్నాయి. అవి చీకటి నీడలు. తన పసితనంలో తను ఎప్పుడూ చూసెరుగని నీడలు. కాలం ఎంత మారిపోయిందీ…ఎంత మార్చేసిందీ ముఖ్యంగా తన కుటుంబాన్ని! తన అపూని! చూస్తూ వుండగానే, ఆ పిల్ల వొంటరిదై పోతోందా అనిపిస్తోంది.

మున్నీతో గడిపే క్షణాల్లో అపూ  ముఖమ్మీద కదలాడే సంతోషాలన్నీ వూహించుకునే ప్రయత్నం చేస్తోంది తను.

అపూని ఇంకా దగ్గిరకు తీసుకుంది.

“అది చిన్న పిల్ల. దానికి ఈ వయసులో ఇంకేం తెలుస్తుంది? ఆ దేవుడి బొమ్మ కూడా ఆటబొమ్మ తప్ప ఇంకేమీ కాదు దానికి! కాసేపు ఆడుకుంటుంది, అంతే! పిల్లల ఆటలో దేవుడిని తెచ్చిపెడితే ఎట్లా? అక్కడ దానికి భక్తీ   గురించి,దానికి ఇంకా అర్థం కానీ ధర్మం  గురించీ  చెప్తే ఎట్లా?”

ఈ మాటలు సురేష్ తో ఎప్పుడైనా అనాలి. కాని, అలా మనసు విప్పి మాట్లాడుకునే  కాలం అంటూ వొకటి వస్తుందా?! రాదేమో ఇక!                    అపూ  చేతుల్లో వున్న బొమ్మలో చమ్కీ గుర్రం బొమ్మలో గుర్రం తోకా, దాని మూతి చూసి, ఆమె  పెదవి మీద వొక చిరునవ్వు పూసింది. కచ్చితంగా ఆ క్షణాన  ఏమైతే అయింది, తనే అపూని  మున్నీ వాళ్ళింట్లో దిగబెట్టి రావాలని అనిపించింది  సత్యకి.

సురేష్ ఎలాగూ ఇది పడనివ్వడు..కాని, తను దిగబెట్టి రాగలదా? చూడాలి ఎంతవరకు ఆ పని చేయగలదో!  అంత తెగింపు తనలో ఉందా అని ఆలోచనలో పడింది సత్య.

కలలో మున్నీతో ఎక్కడెక్కడో తిరిగి వస్తున్న అపూకి ఆ విషయం  తెలియదు.

తల్లి  వేపు తిరిగి బొమ్మని ఇంకాస్త దగ్గిరకి హత్తుకుంది అపూ..మున్నీని హత్తుకున్నట్టే!

 

*

వెన్నెలదారుల్లో మంచుపూలవాన…

 

-అరణ్య కృష్ణ

~

 

కుప్పిలి పద్మ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.  ఆమె జగమెరిగిన స్త్రీవాద రచయిత్రి.  స్త్రీవాద దృక్పధంతో దాదాపు గత 20 సంవత్సరాలుగా ఎంతో క్రియాశీలకంగా రచనలు చేస్తున్నారు.  కథ, నవల, పత్రికా కాలం, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్….ఇలా అన్ని రకాల రూపాల్లోనూ స్త్రీవాద భావజాలన్ని బలంగా వినిపిస్తున్నారు.  అయితే ఏదో స్త్రీ స్వేచ్చ గురించి ఉపరితల స్పర్శతో వాపోవటంగా కాక మారుతున్న వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళి, అక్కడ వస్తున్న మార్పులు వ్యక్తుల మీద, తద్వారా మానవసంబంధాల మీద, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద చూపుతున్న ప్రభావాన్ని ఒడిసి పట్టుకోవటం, ప్రతికూల ప్రభావాల్ని తన స్త్రీ పాత్రలు అవగతం చేసుకొని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొనే విధానాన్ని సూచించటం కూడా ఆమె రచనల్లో కనిపిస్తుంది.

పద్మ మొత్తం ఆరు కథా సంకలనాలు వెలువరించారు.  ఒక్కో కథా సంకలనం లో స్త్రీలకి సంబంధించిన ఒక్కో అంశం బాటం లైన్  గా ఉంటుంది.

ఒక స్త్రీవాదిగా కుప్పిలి పద్మ తన కథల్లో సమాజాన్ని అవగతం చేయటమే ముఖ్యంగా కనిపిస్తుంది.  అస్తిత్వవాద సాహిత్యకారులందరిలాగే ఆమె ఏ సిద్ధాంత రాజకీయ దృక్పథానికి కట్టుబడినట్లు కనబడరు.  స్త్రీల అస్తిత్వం చుట్టూ మానవసంబంధాల్లో జరిగే రాజకీయాల్ని గొప్పగా పట్టుకున్నప్పటికీ ఎక్కడా వర్తమాన రాజకీయాల ప్రస్తావన వుండదు.  బహుశ ఈ విధానం వలన ఇంకా ఎక్కువమందికి తను రీచ్ అయ్యే అవకాశం వుండొచ్చని ఆమె భావన అయ్యుండొచ్చు.

ఆమె ఎంచుకున్న వస్తువుకి సంబంధించిన పాత్రల నివాస వాతావరణం, ఆహారం, వస్త్రధారణ, భాష….అన్నింటిమీద ఆమెకున్న మంచి పట్టు కనబడుతుంది.  అది హోటల్ కావొచ్చు లేదా ఇల్లు కావొచ్చు లేదా ఆఫీస్ కావొచ్చు…తన పాత్రలు సంచరించే, తన పాత్రల్ని ప్రభావితం చేసే వాతావరణాన్ని చాలా పకడ్బందీగా మన కళ్ళముందుంచగలరామె.  ఆమె తనకు తెలియని వ్యక్తుల జీవితం గురించి, వాతావరణం గురించి ఎప్పుడూ రాయలేదు.  ఇది కథకి ఎంతో బలాన్నిచ్చే అంశం.  ఆమె ప్రధానంగా అర్బన్ రచయిత్రి.   మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, అక్కడక్కడా ఉన్నత వర్గాల స్త్రీలే ఆమె కథానాయికలు.

ఇప్పటి సమాజంలో స్త్రీ ఒంటరి అయినా, వివాహిత అయినా సమస్యలు మాత్రం తప్పవు.  ఒంటరి స్త్రీలకు వారి కష్టాలు వారికుంటాయి.  చుట్టు పక్కల వారి మోరల్ పోలీసింగ్ పెద్ద సమస్య.  సింగిల్ వుమన్ అనగానే చుట్టుపక్కల వారికి అత్యంత సహజంగా చులకన భావం కలగటమో లేదా మోరల్ పోలీసింగ్ చేయటమో లేదా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చి పెత్తనం చేయటమో జరుగుతుంది.  స్వంత కుటుంబ సభ్యులైతే ఆమె సంపాదన మీద, కదలికల మీద, స్వేచ్చా భావనల మీద పెత్తనం చేస్తారు.  శ్రేయోభిలాషుల రూపంలో అధికారం చెలాయిస్తుంటారు.

ఈ సింగిల్ వుమన్ యాతనలన్నీ మనకు “ముక్త” (1997) సంకలనంలో  ఎక్కువగా కనబడతాయి.  ఈ కథల్లోని కథానాయికలు ఇన్నాళ్ళూ స్త్రీల మనశ్శరీరాల మీద అమలవున్న భావజాలాల్ని నిక్కచ్చిగా ప్రశ్నిస్తారు.  “ముక్త” కథలో వర్కింగ్ వుమన్ అయినా     ముక్త తన కుటుంబసభ్యుల చక్రబంధం నుండి విముక్తమయ్యే తీరే కథాంశం. ఇంక “కేసు” అన్న కథలో ఒంటరి స్త్రీని ఒక “కేసు”గా చూసే అనైతిక నైబర్స్ యొక్క విశృంఖల నైతిక పెత్తనం కనబడుతుంది.  “గోడ” కథ స్త్రీలు తమ శరీరాలపై తామెందుకు అధికారం కలిగి ఉండాలనే విషయంపై పద్మగారి సునిశిత అవగాహన, విశ్లేషణ తెలియచెప్పే కథ.  పురుషుడి పట్ల ప్రేమని, మోహాన్ని అధిగమీంచేంత నియంత్రణ ఆడవారికి తమ శరీరాలపై ఎందుకుండాలనే విషయాన్ని ఎంతో ప్రభావవంతంగా చెప్పిన కథ.  ఒక లిబరేటెడ్ వుమన్ అయినంత మాత్రాన స్త్రీలెందుకు ఆచితూచి సంబంధాలేర్పరుచుకోవాలో తెలియచెప్పే కథ.  “నిర్ణయం” కథలో స్త్రీ తను తల్లి అవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం స్త్రీకే వుండాలని బలంగా చెప్పిన కథ.   సూటిపోటి మాటలతో ఎటువంటి సంకోచం లేకుండా దాడి చేసే మొగుళ్ళు,  కొంతవరకు ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ముందుకొచ్చిన పురుషుల్లోనూ కీలకమైన సమయాల్లో స్త్రీకి మద్దతుగా నిలవలేని తనం, వారి దృష్ఠిలో స్త్రీ-పురుష సంబంధాల్లో అస్తిత్వ గౌరవం కంటే శారీరిక సంబంధమే ప్రధానంగా మిగిలిపోవటమే బాధ కలిగించే విషయంగా “నిర్ణయం, గోడ” వంటి కథలు చెబుతాయి.  “విడీఅరెల్” అన్న కథలో పెళ్ళైన యువతి గైనిక్ సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోలేనితనం, ఎవరూ బాధని అర్ధం చేసుకోకుండా ఏకాకిని చేయటం కథాంశం.  అత్యంత సహజమైన శారీరిక సమస్యల్నెదుర్కోవటంలోని ఏకాకితనపు దుర్భరతనాన్ని విశదంగా చిత్రించిన కథ అది.

“మసిగుడ్డ” కథ స్త్రీ సంసార నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వున్నప్పటికీ , ఆమెకు దక్కే అప్రాధాన్య గుర్తింపుని ఎత్తిచూపుతుంది.  పిల్లలు పైకొస్తే “నా పిల్లలు” అని గర్వంగా చెప్పుకునే భర్త అదే పిల్లలు తప్పటడుగు లేస్టెనో లేదా వెనకబడిపోతేనో “ఏం చేస్తున్నావ్ అసలు? నీ పెంపకం అలా ఏడిసింది” అంటూ భార్యని నిష్ఠూరమాడతాడు.  వంటగది తుడుచుకోవటానికి ఉపయోగించే మసిగుడ్డ లాంటి అస్తిత్వాన్ని మోసే స్త్రీల ఆవేదన ఈ కథలో ప్రస్ఫుటంగా కనబడి మనల్ని విచలితుల్ని చేస్తుంది.  “ఆడిపాడిన ఇల్లు” ఒక వైవిధ్య కథాంశం.  తను ఆడిపాడి పెనవేసుకుపోయిన ఇంటికి సంబంధించిన నోస్టాల్జియా ఈ కథాంశం.  శిధిలమైన ఆ ఇల్లు తిరిగి కొనుక్కునే అవకాశం వచ్చినా వసుధ వద్దనుకుంటుంది.  శిధిలమైపోయిన ఇంటిని చదును చేసి ఓ మూడంతస్తుల ఇల్లు కట్టొచ్చు కానీ  ఆ నాటి ఇల్లవదుగా? “ ఆ నాటి బాల్యస్మృతుల ఆనవాలు లేని ఆ ఇల్లెందుకు? వద్దు” అనుకుంటుంది.  ఇలాంటి సున్నిత భావుక ప్రధానమైన అంశంతో కూడిన కథ కూడా ఈ సంకలనంలో వుండటం విశేషమే.

“సాలభంజిక” (2001) కథా సంకలనంలోని కథలు విశ్వవ్యాపితమై, మూడో ప్రపంచపు మానవసంబంధాలను అతలాకుతలం చేస్తున్న గ్లోబలైజేషన్ మీద రాసినవే.  గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే మేధావులు సైద్ధాంతికంగా, ఆర్ధికాంశంగా దాన్ని వ్యతిరేకిస్తే రచయితలు అవి సామాన్యుల జీవితాల్ని అల్లకల్లోలం చేసే తీరుని ఒడిసిపట్టుకోవాల్సి వుంది.  పద్మ గారు ఈ బాధ్యతని గొప్పగా నిర్వహించారు.  “ఇన్ స్టెంట్ లైఫ్” కథలో చిన్న చేపని పెద్ద చేప చందంగా పెట్టుబడి బలంతో ఇడ్లీబండీ ని ఒక ఆధునిక ఈటింగ్ జాయింట్ మింగితే,  దాన్ని మరో స్టార్ హోటల్ మింగుతున్న క్రమానికి సమాంతరంగా కథానాయకి మునీరా జీవితంలో వచ్చిన మార్పులను అనుసంధానిస్తూ చెప్పిన తీరు విస్మయం కలిగిస్తుంది.  ప్రపంచీకరణ బాంకుల దగ్గర ఆగిపోకుండా పడగ్గదుల్లోకి చొచ్చుకొచ్చిన వైనాన్ని చెప్పిన కథ ఇది.  మనిషిని మనిషి అర్ధం చేసుకోవటానికి కార్పొరేట్ ప్రపంచానుకూల వ్యక్తిత్వ వికాస తరగతులు అనివార్యమైన విషాద సందర్భంలో రాసిన కథ ఇది.

“ప్రకంపనం” కథ కార్పొరేట్ రంగం అన్ని సామాజిక పార్శ్వాలకూ వ్యూహాత్మకంగా విస్తరించి వృత్తులను, బతుకు తెరువును పెట్టుబడితో కొల్లగొట్టి, బతుకుల్ని లొంగతీసుకునే క్రమాన్ని, ఈ లొంగుబాటు ఫలితంగా మనుషుల అంతరాత్మల్లోనూ, జీవనశైలుల్లోనూ వచ్చిన మార్పులవల్ల కంపేటిబిలిటీ చెడిపోయి అగాధాలు ఏర్పడిన తీరుని వెల్లడించిన కథ.  ఈ కథలో కార్పొరేట్ వ్యూహాల్ని కూడా సమర్ధవంతంగా చెప్పటం జరిగింది.  ఆర్ధిక పశుబలంతో వస్తువులను మార్కెట్లో తక్కువకు సప్లై చేసి, తద్వారా దేశీయ పెట్టుబడిదారులకు నష్టం కలిగించి, వారు తమ కర్మాగారాలను తమకే అమ్మేసే పరిస్తితి కలిపించి, టేకోవర్ చేసుకున్నాక, పోటీ ఉత్పత్తిదారుడు లేని పరిస్తితుల్లో ఉత్పత్తుల ధరల్ని పెంచేసే కార్పొరేట్ మాయాజాలాన్ని తేటతెల్లం చేసిన కథ ఇది.

“సాలభంజిక” కథ కార్పొరేట్ వ్యాపారం ప్రవేశపెట్టిన ఎస్కార్ట్ విధానం (విదేశీయులు భారత్ వచ్చినప్పుడు వారికి “తోడు”గా వుంటూ ఉల్లాసం కలిగించటం) ఊబిలోకి అమ్మాయిలు ఎలా జారిపడతారో, ఫలితంగా వారి మానసిక, శారీరిక ఆరోగ్యాలు సంక్షోభంలోకి ఎలా వెళ్ళిపోతాయో చెప్పే కథ.  అమ్మాయిల దయనీయ కుటుంబ పరిస్తితులు, భావోద్వేగాల బలహీనతల్ను స్వార్ధపరులు ఎలా ఉపయోగించుకుంటారో చెప్పే కథ ఇది.  ఈ కథ చదివాక మనసు కకావికలమై పోతుంది.   “కుబుసం” కథ కుటుంబ సంబంధాల్లో సరసరా సంచరిస్తూన్న కార్పొరేట్ పాము కక్కే విషం మీద కథ.  లాభార్జనే ధ్యేయంగా మసలే కార్పొరేట్ సంస్కృతికి అనుకూలంగా కుటుంబసంబంధాల్ని పునర్నిర్వచించే యంత్రాంగాన్ని బట్టబయలు చేసే కథ.  కుటుంబం దగ్గరుంటే, సహచరి పక్కనుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉద్యోగులు పనిచేస్తారనే కార్పొరేట్ లాభాపేక్ష ఒక కుటుంబంలో పెట్టిన చిచ్చు ఈ కథాంశం.

“మంచుపూల వాన” (2008) సంకలనం లోని కథలు ప్రేమ, కుటుంబం, దాంపత్యం వంటి విషయాల్లో స్త్రీల భావోద్వేగాలకు సంబంధించిన కథలు.  ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొనే ఎమోషనల్ వయోలెన్స్ గురించి రాసిన కథలు.  “వర్షపు జల్లులలో” కథ సాధారణంగా అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఉండే ఆకర్షణ, అమ్మాయిలకు అబ్బాయిల పట్ల కలిగే భావోద్వేగ స్పందనలతో డీల్ చేసిన కథ.  ఇందులో కథానాయకి మహి తల్లి దెబ్బతిన్న కూతురికి చెప్పే మాటలు చాలా బాగుంటాయి “కొన్ని సార్లు గాయపడటం అనివార్యం. అవసరం. ఒక కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది.”  “మంచుపూల వాన” కథ పెళ్ళికి ముందున్న విలువలు మర్చిపోయి డబ్బు మనిషిగా తయారైన భర్త నుండి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని ఎదుర్కొని అతని నుండి బైటపడ్డ మేఘ కథ.  రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చే ఇన్స్టెంట్ లాభం మనుషుల్ని ఎంతగా పతనం చేస్తుందో చెప్పే కథ ఇది.   “చలెగచలెగా యే ఇష్క్ కా జమానా” కథ కొంత హిలేరియస్ గా సాగుతుంది. ఈ సంకలనంలో ఇదో భిన్నమైన కథ.  తన గర్ల్ ఫ్రెండ్ ప్రేమని పొందటం కోసం ఆమె సామాజిక బాధ్యతగా ఫీలయ్యే విషయాల్లో పాలు పంచుకొనే కుర్రాడి అవస్థ భలేగా అనిపిస్తుంది.  “మంత్రనగరి సరిహద్దులలో” కథ  మంత్రముగ్దంగా సాగే కథ.  ఈ కథలో భావోద్వేగాల హింస కనబడదు కానీ ప్రేమ పట్ల స్త్రీ భావోద్వేగాల ఫోర్స్ కనబడుతుంది.  హృద్యమైన మోహప్రపంచం గురించి పద్మగారి భావుకత పరవళ్ళు తొక్కిన కథనం వున్నదిందులో.   ఒక ఆత్మగౌరవంగల స్త్రీ తనంత తానుగా మోహపడాలంటే  పురుషుడిలో ఎటువంటి ప్రవర్తన వుండాలో సూచించే కథ ఇది.

“వాన చెప్పిన రహస్యం” ఒక వైవిధ్యపూరితమైన కథనంతో సాగుతుంది.  తనని ప్రేమించలేదని క్లాస్ మేట్ మీద కత్తితో దాడి చేసిన యువకుడికి తనకు తెలియకుండానే, అనుకోకుండా ఆశ్రయమిచ్చిన అమ్మాయి కథ ఇది. ప్రేమ గురించి, ప్రేమైక అనుభవం గురించి తనకు ఆశ్రయమిచ్చిన ఆ అమ్మాయి ఆలోచనలతో ఇంటరాక్ట్ అయిన కుర్రాడి పరోక్ష కథ ఇది. “సెకండ్ హజ్బెండ్” కథలో భర్త చనిపోయాక రెండో వివాహం చేసుకున్న యువతి యాతన కథాంశం.  ఆ రెండో భర్త ఇంట్లో తన మొదటి భార్య పటం పెట్టుకోగలడు.  ఆమె పుట్టినరోజుని ఘనంగా చేయగలడు. అందుకు అందరూ అతన్ని ఎంతో మెచ్చుకుంటారు కూడా.  కానీ తన రెండో భార్య తన దివంగత భర్త ఫోటోని అతని వర్ధంతి రోజున బైటకి తీస్తే తట్టుకోలేక పోతాడు.  అతని తల్లి కూడా అభ్యంతర పెడుతుంది.  అతను తన కోపాన్ని లైంగిక హింసలో చల్లార్చుకుంటాడు.  ఇటువంటి పడగ్గది హింసని విచారించే ఏ న్యాయ వేదికలూ ఉండవు.  మంచాల మీది నేరాలు ఏ చట్ట పరిధిలోకీ రావు.  అయితే ఈ కథలన్నింటిలోనూ ముఖ్య పాత్ర సమాజాన్ని, అందులో భాగమైన తననీ అర్ధం చేసుకుంటుంది.  ఎలా నిలబడాలో తెలుసుకుంటుంది.

“ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్” కథ దర్శన, విహాస్ ల మధ్య వుండీ లేనట్లుగా దోబూచులాడే ప్రేమ భావన కథాంశం. వారి మధ్య ప్రేమ అసత్యం కాదు.  కానీ అది సజీవమూ కాదు.  బతకాలంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మరొకరికి లొంగాలి, అబద్ధాలు చెప్పాలి.  ఇంకెక్కడి అమాయకత్వం, స్వచ్చత?  “నా స్నేహితురాలి పేరు సుధీర” కూడా క్విక్ మనీ, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ల క్యాట్ రేస్ లో తనని, తన మనసుని, ఆ మనసులోని సున్నితత్వాన్ని మర్చిపోయి, చివరికి జీవితంలో చతికిల బడ్డ స్నేహితుణ్ని అక్కున చేర్చుకొని “ఇది మన జనరేషన్ క్రైసిస్.  ఇది గ్లోబల్ ఎకానమీ సృష్ఠించే వికృతం” అని ఓదార్చిన సుధీర కథ.   పెళ్ళి చేసుకుంటే తనకొక ఇల్లు ఏర్పడటం కాకుండా తను పెళ్ళి చేసుకున్న వాడింటికి తను వెళ్ళటమనే పరిస్తితి మీద తెలివిగా తిరుగబాటు చేసిన గ్రీష్మ కథ “ఫ్రంట్ సీట్”.

స్త్రీ శరీరాన్ని సరొగసీ రూపంలో సరికొత్త పద్ధతిలో వెలగట్టి వాడుకునే ప్రపంచీకరణ విశృఖలత్వం “మదర్ హుడ్ @ రియాలిటీ చెక్” కథలో కనబడుతుంది.  ఈ కథ ఒక ప్రత్యేక కథనంతో పరుగులు పెడుతుంది.  అద్దె గర్భం చుట్టూ వ్యాపారం చేసే వికృతస్వభావాలు బట్టబయలు చేస్తారు రచయిత్రి.  “హ్యుమన్ టచ్” ఎలిమెంటుతో ఎక్కువ టి.ఆర్.పి.ల కోసం లేని మెలోడ్రామా కోసం ప్రయత్నం చేసే చానెళ్ళ వాళ్ళు, ఎక్కడికక్కడ దండుకునే మధ్యవర్తులు, వచ్చిన సొమ్ముని దోచుకునే కుటుంబసభ్యులు అంతా స్త్రీ గర్భం మీద ఆధారపడే వాళ్ళే. చాలా కదిలించే కథ ఇది.  “గాల్లో తేలినట్లుందే” కథ యువత ఎలా పెడదారి పడతారో, వారు అలా పెడదారి పట్టడాన్ని ప్రోత్సహించే వ్యాపార సంస్కృతి ఏమిటో తెలియచెప్పే కథ.  “మౌన” కథ చాలా భిన్నమైన కథ.   ఇద్దరు స్త్రీల మధ్య పుట్టిన అనురాగం శారీరిక అనుబంధంగా ఎదిగిన తరువాత ఏర్పడిన కల్లోలాన్ని వివరించే కథ.  ఎన్.వేణుగోపాల్ ఈ సంకలనానికి ముందు మాటలో రాసినట్లు “ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవటాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్ధం చెసుకోవలసి ఉంది. అది సంఘ్ పరివార్, ఖాఫ్ పంచాయితీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురుషాధిపత్య అర్ధంలో మాత్రమే  జరగడం లేదు. సంక్లిష్ట, అసాధారణ రూపాల్లో జరుగుతున్నది”.  ఆ అసాధారణ, సంక్లిష్ట రూపాలన్నింటినీ తన కథల్లో పద్మ గారు ప్రస్ఫుటంగానే చూపించారు.

ఆమె కథలన్నీ వర్ష బిందువులు, చిరుజల్లులు, పున్నాగపూలు, మంచు ముత్యాలు, తుషారాలతో నిండి వుంటాయి.  ఒక్కోసారి కథలో ప్రవేశించటానికి ఈ ప్రకృతి మోహం కొన్ని ఆటంకాల్ని కలుగచేస్తుంది కూడా.  ఇంక పాత్రల పేర్లైతే గ్రీష్మ, ధాన్య, దక్షిణ, సుధీర, దర్శన వంటి అందమైన పేర్లతో అలరారుతుంటాయి.  జీవితం ఎంత బీభత్సంగా ఉన్నా సరే,  మొత్తానికి పాత్రలన్నీ జీవితంతో ఘర్షణ పడుతుంటాయి.  మర్రిచెట్లు కూలుతున్న నేపధ్యంలో అవి లొంగిపోకుండా తుఫాను గాలికెదురొడ్డి నిలబడ్డ చిన్న మొక్కల్లా తమని బతికించుకుంటాయి.  అందుకే ఈ కథలు చదివాక జీవితం మీద ధైర్యం, ఆత్మ విశ్వాసం కలిగించే అవకాశం వుంది.  పద్మగారి కథల్లో అమ్మ పాత్రకి చాలా విలువుంది. చాలా కథల్లఉజ జీవితాన్ని అర్ధం చేసుకోవటంలో అమ్మ చాలా దోహదం చేస్తుంది.  అమ్మ అంటే ఒక గొప్ప సపోర్ట్ అనే భావన బలంగా కలుగుతుంది.

సమాజం మీద, జీవితం మీద అపారమైన అవగాహన, నమ్మకం మాత్రమే కాక ప్రేమని కూడా కలిగివున్న కుప్పిలి పద్మ ఇప్పటికే తనదైన సంతకం చేసారు.  ఆమె నుండి మరిన్ని మాస్టర్ పీసెస్ ఆశిస్తూ…

peepal-leaves-2013

ఇంకా అవే భ్రమల్లో ఎందుకు?!

 

 

– నంబూరి పరిపూర్ణ

~

ఆదిమానవుల సామూహిక జీవనదశలో- మాతృస్వామిక వ్యవస్థ ఒక సహజ ప్రాకృతధర్మంగా సుదీర్ఘకాలం కొనసాగింది. తదనంతర కుటుంబవ్యవస్థలో స్త్రీకి బదులు పురుషుడు కుటుంబానికి యాజమాన్యం వహించాడు. పర్యవ సానంగా పురుషస్వామ్య, పురుషాధిక్య సమాజం అస్థిత్వంలోకొచ్చి, ‘మాతృ స్వామ్యం’ అంతమయ్యింది. నేటికీ అదే పురుషస్వామ్య వ్యవస్థ అస్తిత్వంలో ఉన్నదన్న చారిత్రక మానవ సమాజ పరిణామ వాస్తవం- విజ్ఞులందరూ ఎరిగిన విషయమే.

పురుషస్వామ్యంగా రూపొందిన సమాజ వ్యవస్థ- స్త్రీ పురుష సంబంధాన్ని- ‘స్వామి-సేవక’ సంబంధంగా మార్చిన విషయమూ తెలిసిన నిజమే. సమస్త కుటుంబ వ్యవహారాలతో పాటు, సమాజ వ్యవహార పోకడల్ని కూడా శాసించే స్థాయికి చేరిన పురుషుడు- భార్యస్థానపు స్త్రీనేగాక యావత్‌ స్త్రీజాతినీ శాసించే స్థితికొచ్చాడు. స్త్రీని- అశక్త, ఆశ్రిత ప్రాణిగా దిగజార్చి అదుపులో పెట్టుకో సాగాడు. ఆమె మేధో, ఉత్పత్తి శక్తుల్ని బలహీనపరిచి, తనకు సేవలందించే ‘సేవిక’గా మార్చాడు.

ఎన్నో పౌరాణిక స్త్రీల గాథలు- యిందుకు తిరుగులేని నిదర్శనాలు. అవి మనకు  సుపరిచితాలు.  ఆనాటి పతివ్రతల సదాచార, త్యాగ మహాత్మ్యాల ఉదంతాల్ని తెలియజేసే గాథలవి. యుగాల కాలానికి చెందిన సీత, ద్రౌపది, శకుంతల మొదలైన రాజవంశ స్త్రీలు సైతం అనేకానేక కష్టనష్టాలకూ, అవమాన విద్రోహాలకూ బలి అయిన తీరును- హృదయాలు ద్రవించేలా వివరించే గాథలవి.
కానీ, యుగాలు గడిచి, ఎంతో ఆధునికత చోటు చేసుకున్న ప్రస్తుత కాలంలోని అధిక సంఖ్యాక సాంప్రదాయిక మహిళల్లో- యిప్పటికీ పాతివ్రత్య సతీత్వం పట్ల ఆరాధన, విశ్వాసాలు మెండుగానే వుంటున్నాయి. ఆనాటి పురుషవ రేణ్యులు తమ స్త్రీలకు కలిగించిన కష్టాలు, క్రూర అవమానాల్ని నిరసించి, ద్వేషించే బదులు- ఆ కష్టాలు ఎదురవ్వడం వల్లనే- ఆ వనితలంతా అంత గొప్ప సతీమణులుగా, పతివ్రతామతల్లులుగా నిరూపించుకోగలిగారు, ఆదర్శనీయులయినారని- పాతతరం గృహిణులు ఆనందపడుతూ వుండడాన్ని చూస్తున్నాం. మరొకపక్క ఆ యువతుల పట్ల పురుషులు జరిపిన కుటిల చర్యల్నీ, దురంతాల్నీ, తీవ్ర ఆవేశంతో ఖండించే యువతులకూ ప్రస్తుత కాలంలో కొదవలేదు. నేనూ ఆ కోవకు చెందిన స్త్రీగా- ఆనాటి మువ్వురు పౌరాణిక స్త్రీల గాథలకు సంబంధించిన మంచిచెడ్డల్ని, న్యాయ అన్యాయాల్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను.

అతి స్వల్ప కారణంతో- అగ్నిపునీత సీతను శ్రీరాముడు మభ్యపరిచి, అడవులకు తోలడం; జూదవ్యసనంతో- ధర్మజుడు భార్యను సైతం పణంగా పెట్టి, నిండు సభామధ్యంలో ఆమె వలువలూడ్చేంతటి అవమానానికి గురి చెయ్యడం; మున్వాశ్రమ, అనాథ అమాయిక బాలిక శకుంతలను గాంధర్వ విధిని పెండ్లాడి, ఆమె గర్భవతిగా ఉన్న స్థితిలో- దుష్యంతుడు ఆమెను వెడలగొట్టడం- యివి మచ్చుకు కొన్ని. పురుషుల విద్రోహ, కపట చర్యలు నాలో అగ్నినీ, నిరసనజ్వాలల్నీ రగిల్చి- నాదైన దృష్టితో- ఆ ఉదంతాల గాథల పునశ్చరణానికి పురికొల్పాయని సవినయంగా తెలియపరుస్తున్నాను.

పురాతన సాంప్రదాయక ఆచారాల్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ- హింసించి, వేధించే భర్తల పట్ల విధేయత, అణకువ చూపే వనితల్ని చూస్తున్నప్పుడు- మనసు  వికలమవుతుంటుంది.  భర్తల క్షేమం  కోసం-  ఎన్నెన్నో  పూజలు, ఉపవాసాలు, వ్రతాలు చేస్తున్న మహిళలు చాలామంది కనబడుతుంటారు. కొందరు ఉన్నత విద్యలు చదివిన స్త్రీలు కూడా- ఈ తంతుల్ని సదాచారాలుగా భ్రమిస్తుండడం- వింతైన విషయం. మార్కెట్‌ సరుకులై, లక్షలు గుమ్మరిస్తేగాని భర్తలుగా దొరకని యువ విద్యావంతుల వ్యాపార సంస్కృతిని అర్థం చేసుకో లేని మనస్తత్వమే స్త్రీలది యిప్పటికీ! ఉన్నత, సాంకేతిక, వైద్యవృత్తుల్లో రాణిస్తున్న విదుషీమణులు కూడా యిందుకు మినహాయింపుగారే!!

కుటుంబ, సామాజిక స్థితుల్లో- సమాన ప్రతిపత్తి, వ్యక్తిత్వహక్కుల సాధనకు ప్రేరణ కాగలవన్న ఆశతో వ్రాసిన నా వ్యాసాలను- నాటి ఆంధ్రజ్యోతి ‘నవీన’ స్త్రీల అనుబంధం తరచుగా ప్రచురించి, వెలుగులోకి తేవడం ఎంతో తృప్తిని కలిగించిన విషయం. అలాగే వార్త, ప్రజాతంత్ర, విజేత పత్రికలు కూడా- తమ సహకారమందించాయి.

పలురకాల స్త్రీల సమస్యల్నీ, వారెదుర్కొంటున్న సాంఫిుక దురన్యాయాల్నీ- శాస్త్రీయంగా విశ్లేషించి ఖండించే వైఖరినీ, శక్తినీ- దేశభక్తీ, ప్రజల ప్రగతీ కేంద్రంగా కలిగిన రాజకీయ నేపథ్యమున్న మా కుటుంబం నాకు కలిగిం చింది. మార్క్సిస్టు, భౌతికవాద సిద్ధాంత బలం- మరింత తోడ్పడింది. ఇందుకు తోడు- మహిళాసంక్షేమ శాఖలో నా ఉద్యోగ నిర్వహణ- గ్రామీణ మహిళలను నా శక్తిమేర చైతన్యపరిచే సదవకాశాన్ని నాకు గొప్పగా కలిగించింది.

గత ఐదారు దశాబ్దాల నుంచీ విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో సమర్థ నిర్వాహకులుగా స్త్రీలు ముందుకొస్తున్నకొద్దీ- అనేక కొత్త సమస్యల్నీ, హింసల్నీ ఎదుర్కొనవలసి వస్తున్నది. అయినప్పటికీ- అన్ని రంగాల్లో స్త్రీల పురోభివృద్ధి కొనసాగుతూనే వుంది. స్త్రీల ప్రత్యేక హక్కుల పరిరక్షణ, ప్రగతి- ఆశయంతో రచనలు చేస్తున్న రచయిత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనేక మహిళాసంస్థలూ దీక్షతో కృషి చేస్తున్నాయి.

‘వేయిపూలు వికసించనీ’ అన్న నినాదంతో అభ్యుదయ రచయిత్రులూ, మహిళా సామాజిక కార్యకర్తలూ- నిర్మాణాత్మక కృషి సల్పుతూ ముందుకు సాగుతూ ముందడుగు వెయ్యగలరన్న ఆకాంక్ష నాది.

*

 

పుస్తక ప్రేమికులకు రోహిత్ కాన్క!

 

ఈ  వాలంటైన్ డే  రోహిత్  ఒక కొత్త ప్రేమ సందర్భాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఈ ప్రేమ పేరు: పుస్తక పఠనం!

పుస్తక ప్రేమికులకు అతను ఇస్తున్న కాన్క పేరు: అనతపురం పబ్లిక్ లైబ్రరీ!

“సమయమే లేదు..” అన్న  మాట  ఎక్కువగా వింటాం ఈ కాలంలో! కాలాన్ని డబ్బుతో లెక్కించే  ఇప్పటి పరిస్థితిలో  ఒక వ్యక్తి అదనంగా సమయాన్ని సృష్టించుకొని, ఒక పని మీద దాన్ని కేటాయించడం – ఆ వ్యక్తిలోని తపనకి సాక్ష్యం! ఎవరికి వాళ్ళం  పుస్తకాలు చదువుకోవడం, మన ఇండ్లలో దాచుకోవడం మంచి అలవాటే. కాని, చదివిన పుస్తకాన్ని నలుగురికీ అందించాలనుకుంటే అది తపన. చదువు అనే భావనకి  సార్ధకత సాధించాలనే అన్వేషణ.

అనంతపురంలాంటి చోట పుస్తకం దొరకడం కష్టం. అదీ ఇంగ్లీషు పుస్తకం ఇక చెప్పక్కర్లేదు. పుస్తకాల కోసం మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళే తపన వున్నవాళ్ళు ఈ జిల్లాలో వున్నారు. అలాంటి వారి కోసం కవి, అనువాదకుడు రోహిత్ ఒక సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు- తన సొంత డబ్బుతో , ఏర్పాట్లతో  లైబ్రరీ పెట్టడం!

సొంత లైబ్రరీలు వుండడం పెద్ద విశేషం కాదు. కాని, ఆ సొంతం అనే భావన వదులుకొని, దాన్ని పబ్లిక్ లైబ్రరీగా మార్చడం రోహిత్ లాంటి సాహసికులు మాత్రమే చేయగలరు. ఈ లైబ్రరీ ఈ 14 న ప్రారంభమవుతోంది. ఆంద్ర లో మొదటి సారిగా  ఈ ప్రయోగానికి నాంది పలికిన రోహిత్ తో ముఖాముఖి.

 

library2

రోహిత్,  లైబ్రరీ పెట్టాలని ఆలోచన ఎందుకొచ్చింది

గత ఇరవై-ముప్పయ్ సంవత్సరాలుగా పుస్తకాలు సేకరిస్తూ వచ్చాము. అత్యంత అరుదైన పుస్తకాలన్ని అతి కష్టం మీద సంపాదించాము. అలాంటి పుస్తకాలు అందరికీ అందుబాటులోకి రావాలంటే లైబ్రరీ అవసరమని భావించాము . ఉర్సుల లె గ్వయ్న్ అన్నట్టు పుస్తకాలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. అవి అందరికీ అందుబాటులో ఉంచాలి (It(the joy of reading books) must not be “privatised,” made into another privilege for the privileged…. It must be available to all who need it.). ఈ ఆలోచనే మా లైబ్రరీ కి అంతరాత్మ.

ఇక్కడ మరొక ఆసక్తికరమైన సంఘటన చెప్పుకోవాలి. ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఓ ఆదివారం నాడు అనంతపురం లో మా నాన్న – పాత పుస్తకాలు అమ్మే చోట ఓ కుప్పగా (వంద పుస్తకాలు పైచిలుకు) పుస్తకాలు పడిఉండటం చూసాడు. అవన్నీ ఎంతో ఆసక్తికరమైన, అరుదైన రష్యన్ పుస్తకాలు. మార్క్స్ నుండి లెనిన్ దాక, డోస్టొవెస్కి నుండి మయకొవిస్కి దాక అనేక పుస్తకాలు ఉన్నాయట. వాటన్నిటినీ కొని ఇంటికి తెచ్చాడు. ఆ పుస్తకాలన్నిటికీ మొదటి పేజీ లో ‘భైరవప్ప’ అనే సంతకం ఉంది. అనంతపురం లాంటి చోట ఇలాంటి పుస్తకాలు కొన్న ఈ భైరవప్ప  ఎవరబ్బా అని కొంచం కుతూహలం మొదలయ్యిందట. తర్వాత్తర్వాత కొన్ని రోజులయ్యాక ‘విశాలాంధ్ర బుక్ హౌస్’ దగ్గర ఎవరో భైరవప్ప గురించి మాట్లడుతుండటం విని – ఇంతకూ ఎవరతను అని అడిగాడట. అప్పుడు తెలిసింది.

భైరవప్ప రెజిస్ట్రార్ ఆఫీసులో పని చేసే వాడట. ఆయనకు పుస్తకాలంటే పిచ్చి. జీవితాంతం పుస్తకాలు కొంటూనే ఉన్నాడు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎప్పుడూ ఆయన విపరీతంగా పుస్తకాలు కొనేవాడని విసుక్కునేవారట. పుస్తకాలకు తన ఇంట్లో స్థలం సరిపోక ఇంకొక గదిని అద్దెకి తీసుకొని ఆ గదిలో కూడా పుస్తకాలని నింపేసాడు అట. చివరికి అందరి లాగనే ఆయన కూడా ఒక రోజు చనిపోయాడు. అప్పుడు  ఆయన భార్య ఒక్క సారి నిట్టూర్చి ఆ పుస్తకాలన్నీ గుజిరీకి వేసి అమ్మేసిందట.

భైరవప్ప లాంటి పుస్తకప్రేమికులెందరో జీవితాంతం ఇష్టం గా, ఆత్మీయంగా పుస్తకాలను సేకరించి ఉంటారు. అలాంటి పుస్తకాలన్ని చివరకు చేరటానికి అందరికీ అనువుగా, విశ్వజనీయంగా- ఉండే ఒక చోటు ఉంటె బాగుంటుందని- ఈ లైబ్రరీ ని ప్రారంభించదలిచాము.

rohit1

 

లైబ్రరీ కి అనంతపురం ఎందుకు సెంటర్

గత ముప్పయ్ సంవత్సరాలుగా అనంతపురంలో నే మేము నివాసమున్నాము. అనంతపురం లాంటి వెనకబడ్డ జిల్లాలో స్వేచ్చాయుతంగా ఆలోచనలు బయటపెట్టటానికి ఒక ప్రదేశం అవసరం ఎంతగానో ఉంది. సమాజం గ్లోబలైజేషన్ గొడవలో  కొట్టుకుపోతున్న తరుణంలో, కార్పొరేట్ సంస్థలు ప్రతీదానికీ ఓ విలువకట్టి అమ్మటానికి పొంచిచూస్తున్న సందర్భంలో – ఉచితంగా సమాచారం, జ్ఞానం అందరికి అందుబాటులొ ఉంచటం తక్షణం చేయవలిసిన కార్యం అని తలచాము.అందుకుగాను మాకు అనువుగా ఉన్న ఓ చిన్న స్థలం ఎంచుకొని, అక్కడ పుస్తకాలన్నీ సముపార్జించి తదనుగునంగా వేరు వేరు కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. ఈ ప్రయత్నం ద్వారా వివిధ రకాల భావాలున్నవారందరూ ఒక చోటికి చేరి పరస్పరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం.

 

పుస్తకాలు ఎలా సేకరించారు

మాకు వివిధ విషయాల్లో అభిరుచులు ఉండటం చేత ఆయా అంశాలకు సంబంధించి అనేక పుస్తకాలను పోగు చేయగలిగాము. ఇవే కాక బయట నుండి కుడా ఎవరైనా స్వచ్చందంగా పుస్తకాలు ఇవ్వటాన్ని ఆహ్వానించాము. ప్రపంచం నలుమూలల నుండీ మా లైబ్రరీ కి పుస్తకాలు పంపించటానికి ఇప్పటీకే  ఎందరో మమ్మల్ని కాంటేక్ట్ చేసారు. ముఖ్యంగా సాహిత్యం, చరిత్ర, తత్వ శాస్త్రం, జీవిత చరిత్రలు తదితర  విభాగాలకి సంబంధించి ఈ పాటికే  మా దగ్గర ఓ 2500-3000 పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల పై మక్కువ ఉండి – ఒక పట్టున చదవాలి అనుకునే వాళ్ళకు ఈ లైబ్రరీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి

పాశ్చాత్య సాహిత్యం, సైన్స్ ఫిక్షన్, తెలుగు, ఇంగ్లీష్ నవలలు, క్లాసిక్స్, ఫిలాసఫీ, చరిత్ర, పిల్లల పుస్తలాలు, మార్క్సిస్టు సాహిత్యం, అర్థశాస్త్రం, కవిత్వం, జీవిత చరిత్రలు- మొదలగు అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.

పుస్తకాలు మాత్రమేనా వేరే కార్యక్రమాలు కూడా చేస్తారా

నెలకొక సందర్భం పురస్కరించుకొని మిత్రులూ,పుస్తక ప్రియులూ కలిసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయదలిచాము.కవిత్వ పఠనం,పుస్తక సమీక్షలు,సాహిత్య సమాలోచనలు,సినిమా ప్రదర్శన మొదలగు ఎన్నో విధాలుగా అందరినీ కలపాలని మా ఆలోచన. ఫిబ్రవరీ 14 న లైబ్రరీ ప్రారంభం సందర్భంగా “కోర్ట్” అనే మరాఠీ సినిమా ప్రదర్శించదలిచాము.

ఈ లైబ్రరీ కార్యక్రమం వల్ల మీరు కవిత్వం రాయటం తగ్గిపోతుందనుకుంటున్నారా?

నేను అలా భావించను. లెనార్డ్ కోఎన్  అనే కవీ అన్నట్టు “కవిత్వం జీవితానికి రుజువు. జీవితం బాగ మండితే, దాని బూడిదే కవిత్వం అవుతుంది.” (Poetry is just the evidence of life. If your life is burning well, poetry is just the ash. -Leonard Cohen)  జీవితం ఎంత వైవిధ్య భరితంగా ఉంటే కవిత్వం అంత నూతనంగా, నవీనంగా ఉంటుంది. లైబ్రరీ కోసం పని చేసేటప్పుడు -పుస్తకాలు సద్దటం, పుస్తకాలని సరైన క్రమం లో అమర్చటం అన్న ప్రక్రియకీ , అక్షరాలనూ ఆలోచనలను సరైన క్రమంలో అమరుస్తూ కవిత్వం రాయటం అనే ప్రక్రియకీ ఎక్కడో పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది.  “కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిబిళ్ళ” లో కూడా కవిత్వం ఉంటుంది అనుకున్నప్పుడు- లైబ్రరీలో కవిత్వం ఉండదంటారా?

*

ఒక బాటసారి: కొన్ని మాటలూ…

 

 

– కృష్ణ మోహన్ బాబు

~

 

(ఛాయ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 5:30కు హైదరాబాద్, దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో రాజిరెడ్డి రచనల మీద కాకుమాని శ్రీనివాసరావు ‘ఒక బాటసారి బైరాగి పదాలు’ పేరిట ప్రసంగించనున్న సందర్భంగా…)

 

mohanbabu“అక్కడ చెట్లు, మనుషులు వేర్వేరుగా లేరు. మట్టి, మనిషి వేర్వేరుగా లేరు.  ఒక సంస్కృతిగా, జీవన విధానంగా వాళ్ళు కొబ్బరిచెట్లతో మమేకమయ్యారు.  బతుకులో భాగంగా, బతుక్కి ఆలంబనగా కొబ్బరి చెట్లు కనిపించాయి”. 

కోనసీమలో మొదటిసారిగా ఓ పెళ్ళి కోసం అడుగు పెట్టినపుడు, మనుషుల్లా పరుచుకున్న చెట్లు, చెట్లై నిలబడ్డ మనుషుల్ని చూసి, జర్నలిస్ట్, రచయిత, పూడూరి రాజిరెడ్డికి కలిగిన భావన ఇది.  మామూలు, అతి మామూలు విషయాల్ని మెత్తని పదాలతో, గడుసు వాక్యాలతో రంగు రంగుల చిత్రాలుగా మలచగలిగిన నేర్పు రాజిరెడ్డిది. అలాంటి అందమయిన భావ చిత్రాల పొందికే ‘పలక – పెన్సిల్. ఇది రాజిరెడ్డి రెండో పుస్తకం.

బాల్యం నుంచి కౌమారం మీదుగా యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడి గొంతులో, ఆలోచనల్లో వచ్చే మార్పులే బలపం – పెన్సిల్ – పెన్నుగా మారి ఈ పుస్తకంలో మన ముందుకొస్తాయి.  రచయిత జ్ఞాపకాలు, అనుభవాలు చదివితే తమ జీవితంలో కూడా యించుమించు అలాంటి అనుభవాలే ఉన్న స్పృహ పాఠకులకు కలుగుతుంది.  అందుకే రచయిత వాక్యాలు పాఠకుల ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని మోసుకుంటూ వెళ్తాయి.

మొదటి అనుభవాలు రేకులు విప్పినా, ‘అంమ’ అంటూ ముద్దు ముద్దుగా తొలి పలుకు గుర్తు చేసుకున్నా, ఊరి ముచ్చట్లు పెట్టి సందడి చేసినా, సిన్మాల గురించి పిల్ల ఆలోచనల్ని నెమరేసినా, మనం కూడా అమాయకంగా జారి పోయిన క్షణాల్ని తడిమి తడిమి చూసుకుంటాం. ఆనందం లాంటి విచారంలో ములిగిపోతాం.  అంగీ విప్పి హీరోయిజానికి ప్రయత్నించటం, ఆడపిల్లతో కలంస్నేహం గురించి ఆరాటపడటం, వెలుగూ వెన్నెలా అంటూ ఆమెనే కలవరించటం, కౌమారపు పీల గొంతులో మొహమాట్లాడటం, పెదాలు విప్పని నవ్వులో జర జరా జారిపోయే జ్ఞాపకాలే.

‘జీవిత రైలు కొత్త ప్లాట్ ఫామ్ మీదకు రాబోతున్నది!’, ‘డైరీలో ఏం రాయాలి?’,  ‘భోగి మంటల్లో ఏం వేద్దాం?’,  ‘మనుషుల మ్యూజియం’ –  అంటూ గంభీరమైన గొంతుతో పలకరించినపుడు, అప్పుడప్పుడే స్థిరపడుతున్న ఆలోచనలతో కొంచెం తలెత్తుకుని చిరు పొగరుతో మాట్లాడిన కాలం మన ముందుంటుంది.  ‘ప్రేమ’, ‘మనసు కేరాఫ్’,  ‘క్షణికం’,  ‘మాయ’ – చదువుతున్నప్పుడు  అప్పుడే గీసుకున్న లేత గడ్డం తాలూకు సన్నని మంటలా, చేతివేళ్ళ కంటుకున్న సిరా మరకల్లా మన జ్ఞాపకాలు మనల్ని  ఒరుసుకుంటూ వెళ్ళటం చూడొచ్చు.  ఏ రచనైనా ఏదో రూపంలో మనల్ని తనలోకి లాక్కోవడం— అదో ఎక్స్పీరియన్స్.

కొన్ని కొన్ని సందర్భాలలో రచయిత తిరుగులేని స్టేట్మెంట్స్ మన ముందుంచుతాడు.  వాటి నుంచి మనం తప్పించుకోలేము.  ఎలా డీల్ చేయాలో తెలియక తికమక పడతాం.  ‘అల్లరి వీళ్ళ కవల పిల్ల’, అంటూ పిల్లల కోసం రాసిన రచనలో రచయిత ఏమంటున్నాడో చూడండి:

“యుధ్ధాలకు కారణం వాళ్ళు కాదు.  కరువుకు కారణం వాళ్ళు కాదు.  అవినీతికి, ఆర్ధిక మాంధ్యానికి వాళ్ళకు సంబంధం లేదు.  కులం, మతం, పేదరికం అనే శబ్దాలు విన్నప్పుడు వాళ్లెప్పుడూ చప్పట్లు కొట్టలేదు.  గ్లోబల్ వార్మింగ్ కు వాళ్ళే కారణం అని ఎక్కడా ఋజువు కాలేదు.  ఆకలి చావులు, శరణార్థి శిబిరాలు, బాంబు దాడులు… ఇవేవీ వాళ్ళు ఉపయోగించే పదబంధాలు కావు.  అయినా వీటన్నిటినీ వాళ్ళు ఎదుర్కోవాలి.  ఇన్ని సమస్యలు వాళ్ళ ముందుంచి, వాళ్ళకు మేమేం తక్కువ చేశామంటాం.  వాళ్ళు స్వేచ్ఛగా విహరించాలంటాం.  వాళ్ళు సదా సంతోషంగా ఉండాలంటాం.  ఎలా?  పిల్లలే గనక ఈ ప్రశ్న అడిగితే పెద్దల దగ్గర సమాధానం ఏమైనా ఉంటుందా?.”

ఇది చదివాక అనేక విషాద చిత్రాలు మన ముందు మెదుల్తాయి.  ఏమీ చేయలేక పోతున్నామనే నిస్సహాత ఆవరిస్తుంది.  తెలియని గిల్ట్ ఏదో మనల్ని బోనులో నిలబెడ్తుంది.  ఇలా తను చెప్పదల్చుకున్న విషయం పట్ల, మన ఆలోచనల్ని లాక్కెళ్ళగలగడం రచయిత సాధించిన విజయం.

రాజిరెడ్డి రచనలన్నీట్లో సాధారణంగా ఉండే ఒక మార్మిక గొంతు ఈ పుస్తకంలోనూ స్పష్టంగా కన్పిస్తుంది.  చాలా రచనలు ఓ బలమైన తాత్విక అంశంతో ముగియడం వల్ల ఆ రచన తాలూకు ఫీలింగ్స్ చాలా సేపటి వరకు మనల్ని వదలకుండా వెంటాడతాయి.  మచ్చుకు కొన్ని చూడండి:

“జీవితాన్ని పొడిగించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం… వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలు పోగేసుకోవడమే.

“ఏ మార్మిక చిక్కుముడులు విప్పడానికి జీవితం యిలాంటి చిక్కు అలవాట్లను కల్పిస్తుందో!

“ఇల్లు మారినప్పుడు ఎలాగైతే పాత సామానులను వదిలేయక మోసుకెళ్తూ ఉంటామో, అలాగే భావాలను మోసుకెళ్తూ ఉంటాము.

“రోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం తగలబడి పోతూ ఉంటుంది.  బహుశా, అందువల్లేనేమో రాత్రి మరింత నిర్మలంగా కనబడుతుంది.

“నువ్వున్నావన్న ఒకే ఒక్క కారణంగా ఈ ప్రపంచాన్ని క్షమించేశాను.

“బతుకు ప్రవాహం స్థూలంగా అందరిదీ ఒకటే. సూక్ష్మంగా దేనికదే ప్రత్యేకం.”

 

ఇలాంటివి అనేకం, అనేకానేకం.

 

కొన్ని కొన్ని చోట్ల రచయిత ఏ అరమరికలు లేకుండా తన సర్వ గుణాలను మన ముందుంచుతాడు. ‘నేనేమిటి?’ అంటూ మొదలు పెట్టి ఒక్కొక్క పొర విప్పుతుంటే ఆ పదాల్లో మన ప్రతిబింబం కూడా కనబడి ఉలిక్కి పడతాం. పుస్తకం చదవటం పూర్తయ్యేసరికి మనం మండుటెండలో వేడి వేడి నీళ్ల స్నానం చేసి, ఏ.సి.లోకి వచ్చి సేద తీరుతున్న చిత్రమైన అనుభూతి పొందుతాం.

మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు చుట్టుముట్టినప్పుడు, ఏమిటో ఈ జీవితం అని నిర్లిప్తత ఆవరించినప్పుడు ఈ పుస్తకం చదవండి.  అప్పుడు, ఇప్పుడుగా ఎగిరి పోయిన ఆనందపు క్షణాలు పక్షులై మీ గుండె గోడల మీద వాల్తాయి.  మిమ్మల్ని మీరు సంబాళించుకునేలా చేస్తాయి. గ్యారంటీ.

 

 

*

 

 

సామాన్యుడి దారి..

– అడివి శ్రీనివాస్
~

adiviమనకు జీవితంలో ఎంతోమంది తారసపడతారు. కొందరు ఇచ్చే వారుంటారు, కొందరు పుచ్చుకునే వారుంటారు. మరికొందరు ఇచ్చిపుచ్చుకునే వారూ ఉంటారు.
ఈ మూడో రకం మనుషుల్లో ఆ ‘క్రియ’ అద్భుతంగా ఉంటుంది.
ఆ అద్భుతం ‘సామాన్యమైందే.
మనం ఇరుగు పొరుగున నివసించే వాళ్లతో ‘ఇచ్చిపుచ్చుకోమా?’ అటువంటిదే అది
మరి, ఆ సామాన్యమైన అనుబంధాన్ని, అద్భుతాన్ని అలవోకగా నెరిపే వ్యక్తి కందుకూరి రమేష్ బాబు.
అతడు అన్నీ ఇస్తాడు. అన్నీ పుచ్చుకుంటాడు.

గౌరవం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అతడు అన్నీ ఇస్తాడు.
మనకూ ఇవ్వాలనిపిస్తుంది. తాను పుచ్చుకుంటాడు.
ఇచ్చిపుచ్చుకోవడంలోని సామాన్యత ఆయన దగ్గర నాకు విశేషంగా కనిపించింది.

ఈ విషయం చెప్పకుండా ఆయన రాసిన ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ ప్రారంభిస్తే అది సామాన్యంగా అనిపించదు. అందుకే ముందు రచయిత స్వభావం గురించి రెండు మాటలు చెప్పి మరి నాలుగు మాటలు  పంచుకోవాలనుకుంటున్నాను.

+++

సత్యజిత్ రే సినిమాల్లో ఎక్కడా జూమ్ ఇన్ – జూమ్ అవుట్ కనిపించదు.
జీవితంలోని వాస్తవికతను ప్రతిబింబించాలనుకున్నప్పుడు దేన్నీ ఫోకస్ చేయడం వుండదు.
అందుకే సత్యజిత్ రే దేన్నీ జూమ్ చేయడు. జూమ్ ఔటూ చేయడు.
అయితే, టిల్ట్ అప్, టిల్ట్ డౌన్ ఉంటుంది. కెమెరా లెఫ్ట్ పాన్…రైట్ పాన్ అవుతూ ఉంటుంది.
కానీ, జూమ్ చేయడు. ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు యధాతధంగా జీవితాన్ని దర్శిస్తాడు.
వాస్తవికత, సహజత్వంలో లీనమై పోతాడు.
రచయితగా కందుకూరి రమేష్ బాబు ఈ పుస్తకంలో చేసింది అదే.
ఎక్కడా మనల్ని దగ్గరకు తీసుకెళ్లడు. దూరం చేయడు.
వాస్తవికతను రచించి అలా చూపిస్తాడు.

మరొక సంగతి.

టెక్నికల్ పరిభాషలో ‘ఫ్రేమింగ్’ అంటుంటాం.
ఒక ఫ్రేంలో ఏముండాలి? ఎంత వుండాలి? ఆ ఫ్రేం ఎలా పెట్టాలి? అని ఆలోచిస్తాం.
ఆ ఫ్రేంను ఎంత వరకు పెట్టాలో తెలియాలనీ అనుకుంటూ ఉంటాం.
ఈ రచయితకు దాని గురించి తెలుసు.

తనకి ఆ ఫ్రేం తెలుసు. తన ఫ్రేం తెలుసు.
దాన్ని ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడమూ తెలుసు.
ఆ ఫ్రేం పరిధి దాటిపోకుండా ఉండటమూ అతడికి తెలుసు.
ఒక్క మాటలో ఫ్రేమింగ్ తెలిసిన ఆల్కెమిస్ట్ రమేష్ బాబు.

ఆ ఫ్రేమ్ లో ‘సామాన్యతే’ కనిపిస్తుండటం ఈ పుస్తకం విశేషం. సామాన్యత.

జీవితంలో అయినా, రచనలో అయినా, ఫొటోగ్రఫిలో అయినా – ఆ ఫ్రేమింగ్ తెలిసిన అరుదైన మనిషి రమేష్ బాబు. అటువంటి వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు.

తాను ఈ పుస్తకం ప్రారంభంలోనే ఒక చోట రాస్తాడు. నలుపును విస్మరిస్తే తెలుపు భగవంతుడి లీల మాదిరిగా కనిపిస్తుందని! ‘ఫ్రేమింగ్’ అంటే ఇదే. దాన్ని అక్షరాలా నిజం చేసి చూపే రచన ఈ పుస్తకం.

+++

నేననుకుంటాను, ఉత్తమ రచనకు ఉండాల్సిన లక్షణం – ఏదైతే చదువుతున్నానో కాసేపు అదే నేనైపోవడం.
ఆ నేనైపోవడం ఈ పుస్తకంలో సామాన్యంగా జరిగిపోయింది.

E. M. Forster ఎ ప్యాసెజ్ టు ఇండియాలో అనుకుంటాను, ఒక చోట రాస్తాడు…’మనిషి జీవితంలో చాలా భాగం నిరాసక్తమైనదే. కానీ, కవులు, కళాకారులు తమ ఉనికి నిలుపుకునే ప్రయత్నంలో జీవితాన్ని అందంగా, అద్భుతంగా నిర్వచించారు, రచించారు. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాడెపుడూ మౌనంగానే ఉంటాడు.’

ఈ మాట కొంచెం వివాదస్పదమే.
కానీ, ఇక్కడ ఏ వివాదమూ లేదు.

kandukuri ramesh babuనాకనిపిస్తుంది! చాలాసార్లు సాహిత్యం చదువుతున్నప్పుడు ఒక్కోసారి భయమేస్తుంది.
రావిశాస్త్రి గారి ‘వర్షం’ కథలో – వర్షాన్ని సంపిడ్సిపెట్టే నూకరాజును చూస్తే భయమేస్తుంది.
వివినమూర్తి గారి ఏటిమార్గం కథలో రోడ్లు వేసే సంచార జాతికి చెందిన వ్యక్తి చెప్పే మాటలు…అవి గుర్తొస్తే బాధేస్తుంది.
ఆ కథలు గొప్ప కథలు.
ఆ కథలు చాలా సామాన్యుల కథలు.
ఆ కథల వంటి కథలు చాలా ఉన్నాయి.
ఆవి ఆయా రచయితల జీవితానుభవాల్లోంచో, వారికి పరిచయమైన వ్యక్తుల నుంచో వచ్చాయి.
వాటిని అద్భుతంగా మన ముందుంచారు.
అయితే ఈ రొమాంటిసైజ్ చేయడమనే లక్షణం ఈ పుస్తకంలో కనిపించలేదు.
నిజాయితీ, సహజత్వమేదో ఈ పుస్తకంలో ఉంది.
అందుకే ‘మీరు సామాన్యులు కావడం ఎలా’ అన్నఈ పుస్తకం జీవితంలా As it is లా ఉంది.
ఎలా కనిపిస్తే అలా…ఏది ఫీలైతే అలా…సహజంగా, సామాన్యంగా ఉంది.
అందుకే ఈ పుస్తకంలోని రైలు డ్రైవర్ ని చదివినప్పుడు…
అతడు తన విధులనుంచి తాను తప్పుకుంటున్నప్పుడు…
ఆ డ్రైవర్ ని నేనే అయిపోయాను.
ఇది చదువుతున్నంత సేపూ నేను సామాన్యుడినే అయ్యాను.

‘నేనొక సామాన్యుడిని’ అని మనల్ని మనం తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

+++

ఒక ఉదయం ఆర్.ఆర్. షిండే అన్న దర్శకుడితో నేను పంచుకున్న ఒక అనుభవం ఇక్కడ గుర్తు చేసుకోవాలనిపిస్తోంది.
ఆయన వేదాంతి వంటివాడు.
జీవితాన్ని రికామీగా ఫీలయ్యే వ్యక్తి.
ఆయన నాతో మాట్లాడుతూ, ‘జీవితంలో నేనేమీ పెద్దగా సంపాదించుకోలేదు శీనూ’ అన్నాడు.
‘ఒకే ఒకటి సంపాదించుకున్నాను. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకూ నేను నడిచి వెళ్తుంటే ఓ పది కార్లు వచ్చి ఆగుతాయి. ‘ఏంటి షిండే..నడిచి వెళుతున్నావు…రా…కారెక్కు’ అని ఓ పదిమంది అడుగుతారు. నేను జీవితంలో సంపాదించింది ఇది శీనూ…’ అని అన్నారాయన.

నాకెందుకో అప్పుడు తనని ఒక ప్రశ్న అడగాలనిపించింది.
ఇలా అడిగాను. ‘ఎవరూ ఎక్కించుకోకుండా వెళితే ఏం చేస్తారు? అని కుతూహలంగా అడిగాను.
ఆయన అన్నారు, ‘ఏముందయ్యా…నడుచుకుంటూ వెళ్తాను’ అన్నారు.
సామాన్యులు అంతే.
వాళ్లు మీ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు.
మనకు తెలియదు, వాళ్లు సామాన్యులని!
అలాంటి ఎంతోమంది సామాన్యులను రమేష్ బాబు ఇందులో పరిచయం చేశాడు.
సామాన్యతలోని సామాన్యతను ఈ పుస్తకంగా మలిచి చూపించాడు.

+++

ramesh1ముందు చెప్పినట్లు ఈ పుస్తకం చదివి నేనొక రైలు డ్రైవర్ ని అయ్యాను.
ఇంకా చాలా అయ్యాను.
నేనూ అయ్యాను.

మొత్తం పుస్తకంలో నాకు  బాగా నచ్చింది తానే పాట కావడం.
పాటై పోవడం!

మనం ఏదైతే అనుకుంటామో అది కావడం!

ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడట…
గురువు గారూ ‘enlightenment అయ్యాక ఇంకా ఏం జరుగుతుందీ?’ అని!
ఆ గురువు గారు చెప్పారు, ‘ఏం జరగదు. నీ పని నువ్వు చేసుకుంటావు. అంతే’ అన్నారట.
ఈ పుస్తకం పూర్తి చేశాక మనం మన పని మనం చేసుకుంటూ పోతాం.
వేరే వాళ్ల జీవితాలు గడపడం కాదు, మన జీవితాలు మనం గడపడానికి పూనుకుంటాం.
అది నిజమైన అభినందన.
అదే ఈ పుస్తకానికి, రచయితకు నిజమైన అభినందన.

ఇంత గొప్ప ఫిలాసఫినీ ఇంత సింపుల్ గా ఒక చిన్న పుస్తకంగా రాయగలగడం, దాన్ని అంగీకరింపజేయడం చాలా గొప్ప విషయం. అందుకు రమేష్ బాబుకు మనఃస్ఫూర్తిగా అభినందనలు.

*

యాదిలో ఎప్పటికీ మిగిలే దృశ్యాలు!

– కందుకూరి రమేష్ బాబు 
~
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 న బుధవారం సాయంత్రం 5.30 గం.లకు హైదరాబాద్ లోని ఐ.సి.సి.ఆర్ ఆర్ట్ గ్యాలరీ, రవీంద్రభారతిలో సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ కాపు రాజయ్య కుమారులు, దివంగత కాపు వెంకట రఘు ఛాయా చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది.
ప్రదర్శన ప్రారంభకులు ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు శ్రీ కె.వి. రమణాచారి. ముఖ్య అతిథిగా ప్రముఖ కవి  నందిని సిద్దారెడ్డి, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ శ్రీ ఎం.వేదకుమార్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు ఎం.వి.రమణారెడ్డిలు హాజరయ్యారు.
కాపు వెంకట రఘు సిద్దిపేటలో జన్మించి హైదరాబాద్ లోని జె.ఎన్.టి.యులో ఆర్కిటెక్చర్ ని అలాగే ఫొటోగ్రఫిని అభ్యసించారు. తెలంగాణకు, తెలుగు వాళ్లకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా అనేక స్థలాలను సందర్శించి వందలాది చిత్రాలను భావితరాల కోసం భద్రపర్చారు. వివిధ రాష్ట్రాల్లో ఎంతో ఘనతను సొంతం చేసుకున్న కట్టడాలు, నిర్మాణాలు, వారసత్వ సంపదను, అందమైన ప్రకృతి దృశ్యాలను ఆయన ఎంతో సహజంగా, సుందరంగా చిత్రించారు. “ఆర్కిటెక్ట్ గా ఆయన కృషి విశిష్టమైనది. అయితే, వెలుగు నీడల మాధ్యమమైన ఫొటోగ్రఫిలో ఆయన చేసిన అద్వితీయ కృషికి దృశ్యమానం ఈ ఛాయాచిత్ర ప్రదర్శన’ అని కాపు వెంకట రఘు సతీమణి రాధ అన్నారు. సుమారు నలభై చిత్రాలతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఫొటోగ్రాఫర్ గా కాపు వెంకట రఘుని పరిచయం చేసే తొలి ప్రదర్శన కావడం గమనార్హం.
2
కాపు రఘు 2010లో రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో ఆయన కృషి ఒక రకంగా తెరమరుగైంది. జన సామాన్యానికి చవకగా ఇండ్ల నిర్మాణం, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ముఖ్యంగా వారసత్వ సంపదను చిత్రించిన విధానం గురించి అసలే చర్చకు రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాపు రఘును స్మరించుకోవడం, అదీ ఆయన 52 వ జయంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం పట్ల బంధుమిత్రులు హర్షం ప్రకటించారు.
కాపు వెంకట రఘు యాదిలో జరిగే ఈ ఛాయాచిత్ర ప్రదర్శన వేళలు ఉదయం 11 నుంచి సాయంత్రం 7 వరకు. ప్రదర్శన 18 వ తేది సాయంత్రం ప్రారంభమై ఆదివారం 22వ తేదీన ముగుస్తుంది.
Invitatiomn

అక్షరాల పడవ మీద ఊరేగే ఆకాశం ఈ ‘కవిత్వం’ గ్రూప్!

-భవాని ఫణి

~

 

bhavani-phani.అక్కడ ప్రతీ భావావేశం సెలయేటి నీటిలా గలగలా ప్రవహిస్తుంది . అక్కడ ప్రతీ ఆలోచనా రెక్కలు విప్పార్చుకుని స్వేచ్ఛగా రివ్వు రివ్వున ఎగురుతుంది . అక్కడ సర్రియలిజం  నిజజీవితంలోకి సర్రున దూసుకొస్తుంది. అక్కడ పదాల్లోంచి సజీవ పదార్థం పుట్టుకొస్తుంది . రాశి పోసిన మంచి ముత్యాల వంటి, హేమంత తుషారపు తునకల వంటి విలువైన, స్వచ్ఛమైన కవిత్వం అక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుంటుంది . అదే కవిత్వం గ్రూప్.
‘కవిత్వం’ అనే పేరుతో, ‘కవిత..కవిత..కవిత’ అనే సింపుల్ ట్యాగ్ లైన్ తో  ఎటువంటి భేషజాలూ లేని హుందాతనంతో, ఏడాది క్రితం ‘తిలక్ స్వీ’ అనే కవిత్వ ప్రేమికుడి ద్వారా  ఈ గ్రూప్, ఫేస్బుక్ లో ప్రాణం పోసుకుంది . ఆ యువకుడు ఒక మంచి ఆశయంతో అప్పట్లో ఏర్పరిచిన ఈ డొంక దారి, అనుభవజ్ఞులైన, రసజ్ఞులైన అనేకమంది కవుల ప్రోత్సాహంతో, సలహాలతో, సూచనలతో ఇప్పుడు రహదారిగా రూపుదిద్దుకుంది . ఈనాటి నవ యువ కవుల కవిత్వ ప్రయాణానికి అనువైన మార్గమైంది .  రాకెట్లా ఆది నుండీ అత్యంత వేగవంతమైన గమనాన్ని ప్రారంభించిన ఈ గ్రూప్, ఇప్పటికీ అంతే తీవ్రమైన వేగంతో దిగంతాల అంచుల్ని వెతుక్కుంటూ అనంతం వైపుకి సాగిపోతూనే ఉంది . గ్రూప్ లో ఉండే స్నేహపూర్వకమైన ,ఆహ్లాదకరమైన అనుకూల వాతావరణం వల్లనేమో , రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ,హెచ్చార్కె గారు , శ్రీధర్ నామాడి గారు, ఎం ఎస్ నాయుడు గారు,అరణ్య కృష్ణ గారు, కుప్పిలి పద్మ గారు వంటి మహామహులంతా వచ్చి ఇక్కడ తమ తమ కవితల్ని ప్రకటించారు. ప్రకటిస్తున్నారు . ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ యువ కవుల్ని ఉత్సాహపరుస్తున్నారు.
గ్రూప్ అభివృద్ధికి తన భుజాన్ని బోటుగా నిలబెట్టిన గౌతమి (నిశీధి) గారు కూడా అభినందనీయురాలు . ఇంకా గ్రూప్ ని అనుక్షణం గమనిస్తూ , తాము అందివ్వగల సహాయ సహకారాల్ని అందిస్తున్న సహృదయులు మరెందరో ఉన్నారు. వీరందరి నిస్వార్థ సేవకు కారణం, వారికి కవిత్వంపై గల అవ్యాజమైన అనురాగమే. ఇప్పుడు ఈ గ్రూప్, కవిత్వానికి ఒక మెరుగైన వేదికగా మారింది . కొత్తగా రాయడం మొదలుపెట్టిన వారిని ఉత్సాహపరిచే ఉత్ప్రేరకమైంది .కవిత్వం మీద ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తీ ఈ గ్రూప్ ని తమదిగా భావించి ఆదరిస్తున్నారు . కవిత్వం గ్రూప్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ మంచి కవిత్వాన్ని అందిస్తున్న  సాయి పద్మ,శారద శివపురపు , మమత కొడిదెల, అన్వీక్ష నీలం, వాణి, ఇండస్ మార్టిన్ , ఛీ ఛీ, సత్య గోపి , మిథిల్, వినీల్ కాంతి కుమార్ , విజయ్ కుమార్ ఎస్వీకె , నరేష్ కుమార్ , సుభాషిణి పోరెడ్డి ,లాస్య ప్రియ , స్వాతి రెడ్డి, సిద్దార్థ కట్టా, నవీన్ కుమార్ , కిరణ్ పాలెపు, రవీందర్ విలాసాగరం….. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందఱో ఇటువంటి యువ కవుల, కవయిత్రుల  కృషి, ప్రతిభ ప్రశంసార్హమైనవి.  .
ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో , కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడే దారుల్ని వెతుకుతూ ఎన్నో నవ్య నూతనమైన శీర్షికల్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తోంది ఈ గ్రూప్. అలా మొదలుపెట్టిన “ప్రశ్నలూ-జవాబులూ” శీర్షిక అద్భుతమైన విజయాన్ని సాధించి , పాఠకుల నుండి గొప్ప ఆదరణ పొంది ఎందరికో ఉపయోగకరంగా, మార్గదర్శకంగా నిలిచింది . ఆ శీర్షికని నిర్వహించిన అరణ్య కృష్ణ గారు , హెచ్చార్కె గారు , ఇప్పుడు నిర్వహిస్తున్న నారాయణస్వామి వెంకటయోగి గారు  తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, వారి వారి అపారమైన అనుభవాన్నీ, బోలెడంత ఓర్పునీ చమురుగా చేసి ఈ కవిత్వ మార్గాన కోట్ల కొద్దీ దీపాలు వెలిగిస్తున్నారు. ఎన్నో హృదయాల్ని కాంతిభరితం చేస్తున్నారు . మరో కొత్త ప్రయోగం కవితాంత్యాక్షరి కూడా అందరి మనసుల్నీ ఆకట్టుకుంటోంది .అంతేకాక, ఇంచుమించుగా కవిత్వం గ్రూప్ తో పాటుగానే ఊపిరి పోసుకున్న “కవిత్వం పోయెట్రీ పేజ్” కూడా ఇప్పటికే రెండువేలకి పైగా అభిమానుల్ని సంపాదించుకుంది.
మరింతమందికి  కవిత్వ లేఖనంపై ఆసక్తి కలిగించడం , మరికొందరు అనుభవజ్ఞుల సూచనలు ,సలహాలు ఈ కవిత్వ ప్రయాణానికి ఉపయోగపడేలా చెయ్యడం  ద్వారా తెలుగు భాషకీ , కవిత్వానికీ ఎంతో కొంత సేవ చేసే అదృష్టాన్ని పొందాలన్న కోరిక మాత్రమే ఈ ఆర్టికల్ రాయడం వెనకనున్న స్వార్థం.  విజయవంతంగా ఏడాది సమయాన్ని పూర్తి చేసుకుని, మొదటి పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా కవిత్వం గ్రూప్ నీ, గ్రూప్ సభ్యుల్నీ అభినందిస్తూ , కవిత్వానికి మరింత ఆదరణ లభించే విధంగా కృషి చేయమని వారిని సవినయంగా కోరుతూ ఇదిగో కవిత్వం గ్రూప్ లింక్ ఇక్కడ
 
ఆర్టికల్ పూర్తి పాఠం యు ట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ 

హస్తినలో ఉత్తరాంధ్ర కథల జెండా!

ఫోటో: గంగా రెడ్డి

ఫోటో: గంగా రెడ్డి

-దేవరకొండ సుబ్రహ్మణ్యం

~

devarakondaఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఒక విశిష్ట అధ్యాయం. ఆధునిక యుగం  తొలినాళ్లలో ప్రగతిశీల సాహిత్యానికి నారుపెట్టి, నీరుపోసిన వైతాళికులు ఉత్తరాంధ్ర సాహితీ వేత్తలే. అటు కళింగసీమలో వికాసవంతమైన కొండగాలులు పీల్చుకుంటూ,  జీవమిచ్చే  నాగావళి నది తరంగాలలో తేలుకుంటూ, విజయనగర కోట గుమ్మాలు దాటుకుంటూ యారాడకొండంత ఎత్తులో నిలబడి రోజురోజుకూ సరికొత్త చైతన్యం పుంజుకుని  విశాఖ సముద్రం సాక్షిగా  ముందుకు వస్తోంది  ఉత్తరాంధ్ర సాహిత్యం.

ఆధునిక తెలుగు కథకి ఆద్యురాలు బండారు అచ్చమాంబ కారైనట్టి ఉత్తరాంధ్ర లో ఆధునిక తెలుగు కథ కు 1910 లో వచ్చిన  గురజాడ వారి ‘దిద్దుబాటు”   శ్రీకారం చుట్టింది.

స్వాతంత్ర్యానంతర కాలంలో మానవ సంబందాలలోను, మానవ విలువలలోనూ జరుగుతున్న పరిణామాలను,  రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు,ప్రభుత్వ కార్యాలయాలలోని డొల్లతనాన్ని ఉత్తరాంధ్ర కథలు ప్రతిభావంతంగా వెలుగులోకి తెచ్చాయి. తెలుగు కథ సాహిత్య వికాసంలో విశిష్టమైన పాత్ర  ఉత్తరాంధ్ర కథలది.

ప్రముఖ తెలుగు రచయిత చాసో గా అందరికీ సుపరిచితులు అయిన చాగంటి సోమయాజులు గారు తన కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధన స్వామ్య వ్యవస్థ  ప్రధానంగానే చూపెట్టరు. ఆ రకంగా గా కూడా అభ్యుదయ భావాలకు ఉత్తరాంధ్ర  సాహిత్య కారులు ఒకడుగు ముందే ఉన్నారు.

అలాగే పేదల బడుగుల సమస్యలనే కథలుగా మలిచిన రావిశాస్త్రి గారు ఉత్తరాంధ్ర, తెలుగు సాహిత్యానికి ఇచ్చిన మరో  గొప్ప రచయత. ఆయన 1960 లో రాసిన ఆరు సారా కధలు తెలుగు సాహిత్యం లో ఒక మరుపు లేని కొత్త మలుపు.  రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని డొల్లతనాన్ని ప్రత్యక్షంగా చూపించిన ఘనత ఆరు సారా కధలకే దక్కుతుంది . ఇదే మాట ఇక్కడ డిల్లీ లో ఒక సాహిత్య సభలో మాట్లాడుతూ సుప్రీం కోర్టులో జడ్జి గౌరవనీయులు  శ్రీ యెన్.వి.రమణ గారు చెప్పారు. అలా చెప్పటమే కాక ఆ సభలో ఉన్న శ్రోతలందరికీ ఆరు సారా కధల పుస్తకాన్ని పంచిపెట్టారు. ఈ ఒరవడిలో కొన్ని  మంచి కధలు రాసి ఈ కుర్రాడు యెంతో గొప్ప రచయిత అవుతాడని అందరూ ఆశిస్తుండగా  అకాలంగా చనిపోయిన శ్రీరంగం రాజేశ్వరావు గురించి  తప్పక చెప్పుకోవాలి.

తెలుగు కథా  సాహిత్యం లో 1966 లో ప్రచురించిన తన యజ్ఞం కథ  ద్వారా ఇంకో ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత శ్రీ కాళీపట్నం రామారావు గారు తెలుగు సాహిత్యం మీద తమ ముద్రా వేసుకున్నారు. 1960 ల ఆఖరులలో  శ్రీకాకుళం లో  మొదలయిన నక్సల్బరి ఉద్యమం లోంచి అద్భుతమయిన కథకులు,  శ్రీపతి,  భూషణం,  అట్టాడ అప్పలనాయుడు,  యెన్.యెస్.ప్రకాశరావు తదితరుల కధలతో ఉత్తరాంధ్ర తెలుగు కథకు ఇంకో ఒరవడి, ఉద్యమ  ఒరవడి వచ్చింది.

తెలుగు కథకు హాస్య చతురత నేర్పిన భరాగో ,  వ్యంగ్యానికి ఒరవడులు చుట్టిన పతంజలి గార్లు ఉత్తరాంధ్రా వారే. పతంజలి గారి గోపాత్రుడు   అందరూ గొప్పగా చెప్పుకునే తెలుగు కథల్లో ఒకటి. ఇప్పటికీ ఈ ఒరవడి లో రాస్తున్న అనేక రచయితలున్నారు, ఉత్తరాంధ్ర లో.

సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత లు బలివాడ కాంతారావు, అంగర  సూర్యారావు,  రచయిత్రులు, ద్వివేదుల విశాలాక్షి ,రంగనాయకమ్మ, చాగంటి తులసి, కుప్పిలి పద్మలు ఉత్తరాంధ్ర కథ కు వన్నె తెచ్చారు.

ప్రస్తుత సామాజిక పరిస్థితుల  ఆధారంగా రాస్తున్న ఇప్పటి రచయిత(త్రు)లు బమ్మిడి జగదీష్, మల్లీశ్వరి గార్లు ఉత్తరాంధ్ర సాహిత్య వొరవడిని గట్టిగా నిలపెడుతున్నారు. వీళ్ళే కాక ఇంకా యెంతో మంది రచయితలకూ రచయిత్రులకీ ఉత్తరాంధ్ర నేపథ్య మే ఆధారమయింది.

ఉత్తరాంధ్ర తెలుగు కధ గురించి మాట్లాడినప్పుడు , శ్రీకాకుళం లో కాళీపట్నం మాస్టారు నెలకొల్పిన కథానిలయం గురించి తప్పక చెప్పుకోవాలి. కతా నిలయం లో  తెలుగు సాహిత్యం లో (ఒక్క ఉత్తరాంధ్ర సాహిత్యమే కాదు) ఉన్న అన్నీ రచనల వివరాలు పొందు పరిచారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశం లోనే చెప్పుకోదగ్గ గొప్ప సాహిత్య ఘటన .

ఇంత గొప్ప తెలుగు కథ  సాహిత్య సంపద గురించి డిల్లీలో ఉన్న తెలుగు మిత్రులకు తెలియచేయ,  డిల్లీ తెలుగు వారి సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆంధ్రా అసోసియేషన్ “ఉత్తరాంధ్ర తెలుగు కధ పరిణామం” పైన ఒక సదస్సు నవంబర్ 8, 2015  న డిల్లీ తమ భవనం లో జరుపుతోంది.

గమనిక: మా సదస్సును పరిచయడం కోసం కొంత మంది  ప్రముఖ రచయితలనే   గురించే రాసాను. నిజానికి ఉత్తరాంధ్ర  లో ఇంకా ఎంతో  మంది  పేరున్న రచయితలూ రచయిత్రులూ ఉన్నారు. వారి గురించి రాయక పోవడం నా తప్పే. సహృదయంతో మన్నించాలి.

 

ఆహ్వానం 

ఆంధ్రా అసోసియేషన్,  డిల్లీ

ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) తెలుగు కథ పరిణామం

(గురజాడ గారి దిద్దుబాటు (1910) నుంచి ఇప్పటిదాకా) సదస్సు కు మిమ్మల్నందరినీ సాదరం గా ఆహ్వానిస్తోంది

స్థలం : ఆంధ్ర అసోసియేషన్ భవనం (సాయి మందిరం పక్కన)

లోధి రోడ్,  న్యూ డిల్లీ

తేదీ: 8 నవంబర్ , 2015 (ఆదివారం)

సమయం : ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5.30 గం

ముఖ్య అతిథి : శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

ప్రత్యేక అతిథి : శ్రీ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు –సి ఐ సి

పాల్గొను రచయతలు: క్రీ వివిన మూర్తి, శ్రీ అట్టాడ అప్పలనాయుడు , శ్రీ గంటి గౌరి నాయుడు, డా.కె.యెన్.మల్లీశ్వరి, శ్రీ బమ్మిడి జగదీశ్వర రావు , శ్రీ ప్రసాద వర్మ, శ్రీ దుప్పల రవి కుమార్

కోటగీరి సత్యనారాయణ                                                 ఆర్.మణినాయుడు                     ప్రధాన కార్యదర్శి                                                     అధ్యక్షులు

వలస బతుకులోని కొన్ని కోణాలు!

-బూర్ల చంద్రశేఖర్

~

(‘‘కెన్యా టు కెన్యా’’ ఆవిష్కరణ సభ నవంబర్ 1 డెట్రాయిట్ లో)

చంద్రశేఖర్విదేశాలలో  స్థిరపడిపోయినవారి జీవిత చరిత్రలను ‘‘కెన్యా టు కెన్యా’’ కథల రూపంలో చిత్రించిన వారు ఆరి సీతారామయ్యగారు. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఉన్న సంప్రదాయిక, సాంస్కృతిక వారసత్వాన్ని నింపుకొని విదేశాలకు విద్యా, ఆర్థికావసరాలరిత్యా వలస పోయి అక్కడే స్థిరనివాసులుగా మారిన తరాలని, వారి తరువాతి తరాలని గురించి, వారు విదేశాలలో అనుభవిస్తున్న జీవిత పార్శ్వాలని మన కళ్ళముందుంచే ప్రయత్నం చేస్తాడు రచయిత.

వీరి కథల్లోని వస్తువంతా విద్యా,ఆర్థికావసరాల కోసం విదేశాలకు వలస వెళ్ళిన వారి జీవితాలు, అనుభవాలు. అలా వలస వెళ్ళిన వారు అక్కడి పరిస్థితులను ఎదుర్కొంటూ, తమ ఉనికిని కాపాడుకుంటూ జీవనం కొనసాగించి, చివరకు భారతీయ ఆత్మ విదేశీ ఆచ్చాదనను ఎలా జీర్ణించుకోలేదో, అలాంటి జీవనం గడుపుతున్నవారు ఎలాంటి తాత్త్విక ధోరిణికి గురౌతారో చాలా చక్కగా వివరిస్తాడు రచయిత. వలసలు పోయిన భారతీయులు అక్కడి పరిసరాలు, సంస్కతులకు అనుసందానమయ్యే స్థితిలో వారి మానసిక సంఘర్షణలు, వాటితో నిరంతర పోరాటం ఎలా ఉంటుందో ఈ కథలలో మనకు కనిపిస్తుంది. వలస జీవిత వ్యథల్ని కథలరూపంలో చెప్పాలనుకోవడం రచయిత ఉద్దేశం లాగా అనిపిస్తుంది.

‘సుచిత్రాచంద్ర’ కథలో భారతదేశ సంప్రదాయిక వివాహ వ్యవస్థ విరుద్ధంగా ఉన్న సహజీవనం (డేటింగ్) విధానాన్ని తెలుపుతాడు రచయిత. వివాహవ్యవస్థలోని అవస్థలను తెలుపుతూనే, ఆధునిక కుటుంబ జీవన శైలి అయిన సహజీవనంలోని లోటు పాట్లను కూడా అంతర్నిగూఢంగా వివరిస్తాడు. ఇలాంటి విదేశీ సంస్కృతి వల్ల భారతీయతరం ఎంత సంఘర్షణకులోనౌతుందో, అయినా ఆ జీవన శైలి ఎంత అనివార్యమో కూడా ఈ కథ ద్వారా తెలుపుతాడు రచయిత. ఈ కథలో మొఖానికి ముసుగు వేసుకోవడానికి ఇష్టపడని ఒక సాధికారికత కలిగిన ఆధునిక స్త్రీ పాత్రగా సుచిత్రను పరిచయం చేస్తాడు రచయిత. అనివార్యంగా సహజీవనం చేసే పురుషునిగా చంద్రం పాత్ర కనబడుంతుంది. మారుతున్న కాలానికి మారుతున్న జీవనావసారాలు కూడ ముఖ్యమే అని చివరకు పాఠకుడనుకునేలా చేస్తాడు రచయిత.

గింజలు అనే కథలో గింజలను డాలర్లకు ప్రతీకగా, పక్షిని ఆర్థికావసరాల నిమిత్తం విదేశాలకు వలసపోతున్న వారిలాగా వర్ణిస్తూ కథారచన సాగుతుంది. స్వదేశంలో ఉన్నవారు విదేశాలకు వలస పోయిన వారికోసం నిరీక్షంచే సంఘటన ఎంత హృదయ విదరకంగా ఉంటుందో ఇందులో వర్ణితం.

ప్రయాణం అనే కథలో ఆర్థికావసరాలు మానవ, సంస్కృతిక సంబంధాలను ఎలా పేలవం చేస్తాయో చూపిస్తాడు రచయిత.

కెన్యా టు కెన్యా అనే కథలో మనిషి మనుగడ స్వేచ్ఛాయుతమే అయినా అంతిమంగా ఉండే అవసరాలు మనుషుల మధ్యనున్న బంధాలను ఎలా త్రుంచగలవో తెలుపుతాడు రచయిత.

ఇక కథలలోని శిల్పం గురించి తెలిపినట్లైతే రచయిత  కథను అంత సులభంగా నడిపిస్తున్నట్లనిపించదు. కథలోని పాత్ర, ఆ పాత్ర చుట్టూ పెనవేసుకున్న పరిస్థితులను కూలంకషంగా చర్చిస్తూ, వర్ణిస్తూ పాఠకుడికి తను ఏం చెప్పదల్చుకున్నాడో అంతర్నిగూఢంగా వివరిస్తాడు. అంతేకాకా కథలోని పాత్ర ఏదైన ఉద్యోగం చేస్తున్నట్లైతే ఆ ఉద్యోగానికి సంబంధించిన సమగ్రజ్ఞానాన్ని, లోతైన సంఘటనలను వివరించ ప్రయత్నం చేస్తాడు కవి. ఉదా: ‘సుచిత్రాచంద్ర’ కథలో సుచిత్ర ఉద్యోగ జీవితాన్ని, ‘కెన్యా టు కెన్యా’ కథలో  స్టిఫెన్ ఉద్యోగ విషయాలను, ‘ప్రయాణం’ కథలో జర్మణి ఉద్యోగి ఖర్చులను మొదలగు విషయాలను చాలా లోతుగా అందించడం కనిపిస్తుంది.

ari

కథ ఎత్తుగడ నుంచే పాత్రల ప్రవేశం కనిపిస్తూ ఆయా పాత్రలగురించి పరిపూర్ణంగా పరిచయం చేయడం కనిపిస్తుంది. ఆయా పాత్రలు ఏ సంఘటనల్లో, సందర్భాల్లో చిక్కుకున్నాయో పాఠకునికి స్పష్టంగా తెలియాలి అన్న ఆలోచనాధోరణి రచయితలో కనిపించడం ఇందుక్కారణం కావచ్చు. కథల్లో ‘ఏకాంశ వ్యగ్రం , స్వయం సమగ్రం’ అనే  లక్షణాలుండాలి వీరి కథల్లో ఈ లక్షణాలు పరిపూర్ణంగా కనిపిస్తాయి. కథలకు సంక్షిప్తతత కూడా మరో లక్షణం. అయితే ఈ లక్షణం కొన్ని కథల్లో కనిపించదు. కొన్ని కథలు స్కోప్ (పరిధి) దాటి నవలికకు దగ్గరగా వెళుతున్నట్లనిపిస్తుంది. ఉదా: సుచిత్రాచంద్ర, కెన్యా టు కెన్యా. శిల్పరిత్యా చూస్తే ప్రతీకాత్మకంగా రాసిన ‘గింజలు’ అనే కథా కవిత్వానికి దగ్గరగా ఉన్న కథలాగా అనిపిస్తుంది.

వీరి కథలలో వినూత్నమైన, టక్కున మలుపు తిరిగే విధంగా సాగిపోయే ధోరణి కనిపించదు. చాలా నిదానంగా కథ సాగుతూ ఉంటుంది. కథలోని పాత్రల భౌతికావసరాల కోసం మానసిక సంసిద్ధతలను ఏర్పరుస్తూ, ఏదీ కూడా తను నిర్ణయాధికారిగా వ్యవహరించకుండా చివరకు పాఠకుని ఊహకు వదిలేస్తాడు. భాషా విషయంలో చాలా సులభమైన శైలినే వాడడం కనిపిస్తుంది. వాక్యాలలో గాని, పదాలలో గాని కాఠిన్యత, నిర్వచించలేని గూఢత అంతగా కనిపించవు. రచయిత ఎక్కువ శాతం సంభాషణాత్మకంగానే కథను నడిపిస్తాడు.

‘‘కెన్యా టు కెన్యా’’ కథల సంపుటిలో 15 కథలున్నాయి. ఇందులోని కథలన్నిటినీ  రచయిత తన చుట్టూ ఉన్న ఎన్నో జీవితాలను అధ్యయనం చేసి రాసాడనిపిస్తుంది. విదేశాలలో పనిచేసే వారి జీవితాలు చాలా సౌఖర్యవంతంగా (లెగ్జరీగా) ఉంటాయని మన దేశం వారు భావిస్తారు. కాని వారి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ జీవన భద్రత విషయాలను చాలా దగ్గరనుండి గమనించిన వాళ్ళకే తెలుసుంది అందులోని నిజమెంతో. పైన తెలిపిన విషయాలన్నింటిని చాలా చక్కగా కథలలో నిక్షేపించాడు రచయిత. రచయిత విద్యా, వృత్తి అంతా కూడా విదేశాలలో కొనసాగింది, కొనసాగుతుంది. ఈ కథలలోని వస్తువులకు వారు జీవిస్తున్న ప్రాంతీయ నేపథ్యం, వారు చూసిన సంఘటనలు ఆధారం కావచ్చు.

*

 

బైరాగి కోసం..ఒక వెతుకులాట..

నాకు తెలుసు, నాకు తెలుసు

ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య

ప్రేమలు పొసగవని

ఈ బండరాళ్లపైన ఏ మొక్కలు ఎదగవని

మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే

అస్వతంత్ర సైనికులమని,

పెనుతుఫాను చేతులలో చిక్కుకొన్న

త్రోవలేని నావికులమనీ

జీవిత ప్రభంజనం

కలయిక సహించదనీ

ఉన్నగడువు కొద్ది అనీ

నాకు తెలుసు! నాకు తెలుసు!

-ఆలూరి బైరాగి 

.

bairagi

మారుమూల పల్లెలో కవిత్వానికో గూడు!

 

అది ఒక  మామూలు పల్లె. మారుమూల వాగు వొడిలో తలదాచుకున్న పల్లె. దాన్ని కవిత్వ పటం మీద స్ఫుటంగా నిలపాలని యాకూబ్ స్వప్నం. ఆ స్వప్న సాకారానికి కొన్ని రూపాలు: మూడు పురస్కారాలూ, ఒక కవిత్వ లైబ్రరీ. ప్రతి అక్టోబరు పదినా అక్కడ కవిత్వ ఉత్సవం. ఆ సందర్భంగా ఈ ప్రత్యేక విశేషాలు…

~

కవిత్వం ఒక సాంస్కృతిక సంభాషణ. భాషని ఆధిపత్యంలో ఉంచుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తి , సమూహం, ప్రాంతం పెరుగుదలే. కాని భాషని ఇవ్వడం, మరొకరితో పంచుకోవడం అంటే , చాలా ఉన్నతమైన భావన మాత్రమే కాక, ఒక మార్పుకు నాందీసూచన కూడా !

సమకాలిక కవిత్వం కవిని సమూహంతో కలిపే ప్రయత్నం చేయాలి. కవి ‘నేను మీలో ఒకడ్ని అంటే’ పాఠకుడు ‘నువ్వు నాలో ఒకడివి’ అన్న ప్రతిస్పందన రావాలి. కాని ఆధునికత పేరిట మనం మన వేర్లనుండి విడిపోతున్నాం. నానాటికి దూరంగా జరిగిపోతున్నాం.అలా జరిగిపోవడం గమనించినా ఏమీ చేయలేని అశక్తులుగా మిగిలిపోతున్నాం.
మనం గ్రామాల నుండి ఎంత దూరంగా వెళ్ళిపోతే వాటి జ్ఞాపకాలు మనని అంతే వెనక్కు సదా లాగుతుంటాయి .

yakub

ఇలా ఎన్నెన్నో ఙ్ఞాపకాల ఊట రొట్టమాకురేవులోని బుగ్గవాగులా సదా మదిలో నాలో పారుతూనే వుంది. ఈ చిన్నపాయ వివిధ రూపాల్లో ప్రత్యక్షమై వెంటాడుతూనేవుంది.

అలాంటి తరుణంలో కేరళ లో ‘తుంచన్’ అనే కవి స్మారకంగా నిర్మించిన “తుంచన్ మెమొరియల్ ట్రస్ట్ “, కుమారన్ ఆసన్ స్మారక కేంద్రం ; హైదరాబాద్ లోని “లమకాన్”, ‘గోల్డెన్ త్రెషొల్డ్’లను చూడ్డం జరిగింది. కేరళ, కర్ణాటక, ఉత్తర భారత ప్రాంతాలలోని మరికొన్ని గ్రామీణ సాహిత్య కేంద్రాలు చేస్తున్నపనులు ఆకర్షించాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు సాహిత్య, సాంస్కృతిక కేంద్రాలుగా మారవలిసిన అవసరం వుందని అన్పించింది.
చిన్నప్పుడు ప్రతి ఉదయం పల్లెలలో తిరిగే బుర్రకధలవాళ్ళు, తంబురకధలవాళ్లు, బుడబుక్కలవాళ్లు, ఒగ్గు కథలవాళ్లు ఇలా ఎన్నెన్నో కళారూపాలను చూసిన కాలం గుర్తొచ్చింది. రొట్టమాకురేవులాంటి పల్లెటూర్లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షకు ఈ ఎడతెగని ఆలోచనే ప్రేరణగా నిలిచింది . అందుకు వున్న కొద్దిపాటి వనరులతో , మిత్రుల సహకారంతో ఈ చిన్ని ప్రయత్నం, ప్రయోగం చేయడానికి సంకల్పించాం. భవిష్యత్తులో అదొక కల్చరల్,పొయెట్రీ సెంటర్ గా ఎదగాలని,ఈ ప్రయత్నం మరికొన్ని ప్రాంతాలకు స్ఫూర్తిగా మారాలని లోపల ఎక్కడో చిన్ని ఆశ.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తుందని, అతి త్వరగా ఊపందుకుంటుందన్న భరోసా మాత్రం వుంది .
కవిత్వం అంటే కేవలం రాయడం ,చదవడంతో మాత్రమే సరిపోదు. కవిత్వ వాతావరణాన్ని కల్పించడంకూడా ముఖ్యం. పొయెట్రీ స్పేస్ కూడా ముఖ్యం. ఇతర భాషల కవిత్వం వినడం, కవులను కలవడం, మన కవులను కలపడం ఇదంతా జరగాలి. ఇదొక ప్రాసెస్ లో నిరంతరంగా జరగాలి. అప్పుడు మాత్రమే కవిత్వాన్ని గ్లోబల్ స్థాయికి చేర్చడం సాధ్యం.

ఇన్ని ఆలోచనలు, సంకల్పాలతో ఇలా మొదలైన ప్రయాణంలోని తొలి అడుగుగా – ప్రతి సంవత్సరం అక్టోబరు 10 న “షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్. నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారం “ను గుదిగుచ్చి “రొట్టమాకురేవు కవిత్వ అవార్డు “గా ఇవ్వడం . ఒక ఊరి పేరుతో అవార్డు నెలకొల్పి యివ్వడం ద్వారా పల్లెలు, స్ధానికత అనే అంశాలకు ప్రాధాన్యత పెరగాలని కాంక్షించాం.
నిజానికి 2010 లో ప్రారంభించాలనుకున్న ఈ అవార్డును 2014 లో మొదలుపెట్టాం.
గత సంవత్సరం(2010-2014) అవార్డు గ్రహీతలు సౌభాగ్య(సాభాగ్య కవిత) , అరుణ్ సాగర్ (మేల్ కొలుపు) ,షాజహానా(దర్దీ) ,నంద కిషోర్ (నీలాగే ఒకడుండేవాడు) లకు అవార్డులు ప్రదానం చేశాం.
2015 సంవత్సరం నందిని సిధారెడ్డి (ఇక్కడి చెట్ల గాలి) ,మోహన్ రుషి (జీరో డిగ్రీ) ,హిమజ (సంచీలో దీపం) అవార్డులు ప్రదానం చేస్తున్నాం.

ఇలా తొలి అడుగు పురస్కారాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొదించడం అయితే, ఆ అడుగుకు జోడుగా అందర్ని కలుపుతూ వెళ్ళే ప్రయత్నం, రొట్టమాకురేవులో లైబ్రరీని ఏర్పాటు చేయడం. దానికి కె.యల్. పుస్తకసంగమం గా పేరు పెట్టాం. లైబ్రరీ కేంద్రంగా చదవడం, రాయడం, చర్చించడం లాంటి విషయాలు కొంతైనా జరగాలని కోరిక.

లైబ్రరీ కోసం పుస్తకాల సేకరణలో తొలుత గుంటూరు నుండి రావెల పురుషోత్తమరావు గారి పుస్తకాలతో శుభారంభం జరిగింది. పుస్తకాలు ఇవ్వడానికి ఇంకా ఎందరో మిత్రులు సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే, కవి దేశరాజు ఇచ్చిన 100కు పైగా పుస్తకాలను యింటికి వచ్చి మరీ వచ్చి యిచ్చి వెళ్ళారు.

రొట్టమాకురేవు గురించి ::

రొట్టమాకురేవు ఖమ్మం జిల్లాలో కారేపల్లికి అతి సమీపంలో వున్న అతి చిన్న పల్లెటూరు. పట్టుమని యాభై, అరవై ఇళ్లకు మించి వుండవు. పక్కనే పారే చిన్న బుగ్గవాగు. బుగ్గవాగు మీద రైలు వంతెన. డోర్నకల్ నుండి కొత్తగూడెం (భద్రాచలం రోడ్) ,మణుగూరుకు వెళ్లే రైళ్లు ఆ పట్టాలమీంచే వెళ్తాయి. మరో పక్క మాధవరం డొలమైట్ ను రవాణా చేసేందుకు కారేపల్లి నుండి మాధవరం వరకు వేసిన రైల్వే ట్రాక్.

ఊరు మొత్తం నాలుగు ఇళ్లు తప్ప అన్నీ గిరిజన కుటుంబాలే. ఎక్కువగా రైతుకూలీలు. కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు. ఇంకొందరు రైతుల దగ్గర జీతానికి కుదిరినవాళ్లు. కొందరు పనికి ఆహారపథకం కోసం పనులకు పోయేవాళ్లే !
తరచూ ఇల్లందు, ఖమ్మం వెళ్లి వస్తుంటారు. కారేపల్లి/ సింగరేణి కి అయితే రోజుకు ఒకసారైనా వెళ్లాల్సిందే ! అంత దగ్గర.
పాలు అమ్మడానికో, చేను మందులు కొనడానికో, ఏమీ పనిలేకపోయినా ఉబుసుపోక కూడా వెళ్లిరావాల్సిందే.
ఇక ఖమ్మం నుంచి ఇల్లెందుకు రోడ్డు. ముప్పై కి.మీ. ప్రయాణించాక కారేపల్లి క్రాస్ రోడ్. అక్కడినుంచి అయిదు కి.మీ. కారేపల్లి. కారేపల్లి నుండి ఒకటిన్నర కి.మీ.రొట్టమాకురేవు. ఆటోలు అటూఇటూ తిరుగుతుంటాయి.

123.pmd

ఇక్కడ ఈ రొట్టమాకురేవులో కవిత్వ అవార్డు ప్రదానం. పైగా ఊరు పేరుమీద అవార్డు. ఇలానైనా పల్లెల ప్రామినెన్స్ పెరగాలని, కేవలం నగరాలకు , పట్టణాలకు పరిమితం అవుతున్న కవిత్వం/సాహిత్యం పల్లెలకు చేరాలని, పల్లెలు చూడాలని, తద్వారా క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వినూత్నమైన దిశగా పల్లెలు అడుగులు వేయాలని ఎక్కడో, ఏదో చిన్న ఆశ.

ఈ దిశలో ఇదివరకే అడుగులు వేసినవారు లేరనికాదు, కానీ ఇప్పుడు ఇది కొత్త సందర్భం. కాబట్టి స్ఫూర్తినింపే దిశగా ఈ ప్రయోగం కొంతైనా పనిచేయకపోదా అనే ఆకాంక్ష.
అదీ సంగతి !

రొట్టమాకురేవుకు చేరే మార్గం:
Rottamaku Revu Library &Poetryspace
(RRLP)
Rottamaku Revu
Karepalli, Khammam Dist.

ఖదీర్ బాబు కొత్త సంభాషణ

సురేష్ వంగూరి 
 suresh vanguriఖదీర్ బాబు  ‘మెట్రో కథలుచదివినవాళ్ళకి అనివార్యంగా రెండు విషయాలు అర్ధమవుతాయి.
1. మెట్రో బతుకుల్లోని helplessness 2. మెట్రో వ్యవస్థలోని ugliness.
ఒకసారి మెట్రో చట్రంలో చిక్కుకున్నాక, వేరే ప్రత్యామ్నాయం లేక బలవంతంగా బతకటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయతను మనకు అవగతం చేసే ప్రయత్నమే ఖదీర్ బాబుమెట్రో కథలు.
* * *
భార్యాభర్తల మధ్య ‘డిస్టెన్స్’ పెరగటానికి నగరంలో ఒక ప్రాంతానికీ మరో ప్రాంతానికీ మధ్య ఉండే డిస్టెన్స్ కూడా ఒకబలమైన కారణం.  ఆర్ధిక ఇబ్బందుల వల్ల, తప్పని సరై, కొన్ని వదిలించుకోవాల్సి వస్తుంది. అది ఇష్టంగా పెంచుకున్న,మనసుకు పెనవేసుకుపోయిన గారాల కుక్కసుకీఅయినా సరే. గిల్టీ ఫీలింగ్ జీవితకాలం వెంటాడినా సరే,తప్పదు. భర్త స్పర్శకు నోచుకోని భార్యలకు, మసాజ్ గురించి ఏమీ తెలీనిదీదీ అవసరం చాలా ఉంది. భార్యాభర్తల మధ్య యాంత్రికతనూ దాని పర్యవసానాల్నీ సెల్ఫీ’ కథ హెచ్చరిస్తుంది.  మహానగరంలో బైటికొస్తే ఆడవాళ్ళ టాయిలెట్సమస్య ఎంత హృదయవిదారకమోషీకథ కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఒక మహిళా ఉద్యోగి దైనందిన జీవితంలోనిసంఘర్షణల్ని, వాటితో పాటు పేరుకుపోతున్న అసంతృప్తినీనిద్రా సమయం‘, ‘రొటీన్కథల్లో చెబితే, ఇరుకుఅపార్ట్మెంట్లోఅమ్మమ్మపరిస్థితి ఎంత దుర్భరమో చూపిస్తాడు.
ఖదీర్ బాబు మెత్తగా, ఆర్ద్రతగా కథ చెబుతూనే, మధ్యలో అక్కడక్కడ మనసుని మెలిపెట్టే వాక్యాలు సంధిస్తాడు.కథకు అవి ప్రాణం. పాఠకునికి అవి పాఠం. మచ్చుకు కొన్ని వాక్యాలు చూడండి
జీవితంలో మాత్రం కష్టమైనా ఉన్నందుకు ఆమెకు అపుడప్పుడు సంతోషంగా ఉంటుంది (అమ్మమ్మ).
దప్పిక ప్రాణం తీస్తుందని ఎవరు చెప్పాలిఎలా చెప్పాలి? (దీదీ).
ఇక్కడికొచ్చాక భర్తే కాపాడాలి అనే భయం దాదాపు పోయింది (రొటీన్).
అయినా నిన్ను పొందాలంటే నేనేమైనా కోల్పోవాలా? (సెల్ఫీ).
వేళ్ళు మాత్రమే పని చేస్తూ మిగిలిన శరీరమంతా పారలైజ్ అయ్యే వ్యవస్థ ఏదో మనల్ని బిగిస్తోంది (ప్రొఫైల్ పిక్చర్).
* * *
సెల్ఫీషీడిస్టెన్స్… ఈ మూడూ నా దృష్టిలో అచ్చమైన ‘మెట్రో కథలు.’
మెట్రో వ్యవస్థ వికృత రూపాన్ని దగ్గరగా చూసాడు కనుకే ఖదీర్ బాబు తన కథల్లో దాన్ని బట్టబయలు చేస్తున్నాడు. వ్యక్తుల్ని చూసి జాలిపడమనీ, వ్యవస్థ విషయం జాగ్రత్తపడమనీ చెబుతున్నాడు.
*

‘స్టిల్ లైఫ్’ లో ప్రాణం పొదుగుతున్న రమేష్!

 

సామాన్యశాస్త్రం ‘జీవనచ్ఛాయ’

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19 ) సందర్భంగా హైదరాబాద్‌లోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సామాన్యశాస్త్రం ఏకచిత్ర ప్రదర్శన (సింగిల్ ఎగ్జిబిట్ షో) 18వ తేదీ మంగళవారం సాయంత్రం ఐదున్నరకు ప్రారంభం. ముఖ్య అతిథులు జి.భరత్ భూషణ్, అల్లం నారాయణ, కె.వి.రమణాచారి. candid picture, life photography ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ ప్రదర్శన ఆదివారం దాకా ఉంటుంది. అందరికీ ఆహ్వానం.

– కందుకూరి రమేష్ బాబు, 99480 77893

ఈ సందర్భంగా  రామా చంద్రమౌళి ప్రత్యేక రచన 

raamaa chaMdramouliప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని..ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,బాగ్ లింగంపల్లి,హైదరాబాద్ లో ప్రఖ్యాత ’ లైఫ్ ’ ఛాయాగ్రాహకులు  కందుకూరి రమేష్ బాబు ఒక విలక్షణతతో..అత్యంత సాహసోపేతంగా 19 నుండి 23 ఆగస్ట్ 2015 వరకు ఏర్పాటు చేస్తున్న ‘ ఏక ఛాయాచిత్ర ప్రదర్శన ‘ (single exhibit show) సందర్భంగా..రమేష్ బాబు గురించిన ముచ్చట.

ఈ ప్రదర్శనలో కేవలం 3′ X 5’ సైజ్ గల క్రింద చూపిన ఒకే ఒక్క ఛాయాచిత్రం మాత్రమే ప్రదర్శితమౌతుంది. సాధారణంగా ఆర్ట్ ఎగ్జ్బిషన్ లలో ఒకే లేదా భిన్న కళాకారులకు సంబంధించిన పలు చిత్రాలు ప్రేక్షకుల సందర్శనార్థం ప్రదర్శితమౌతాయి.కాని ఈ విధంగా ఒకే ఒక్క విలక్షణమైన చిత్రాన్ని రసజ్ఞులైన  వీక్షకులకోసం  ఏర్పాటు చేయడం ఒక సాహసోపేతమైన .. కించిత్తు దర్పంతోనూ, ఒక ప్రత్యేక లక్ష్యంతోనూ కూడుకున్న చర్యగా భావించవలసి వస్తోంది.ఒక జీవనచ్ఛాయా చిత్రకారునిగా గాఢ గంభీరతనూ,అర్థాన్నీ,లోతైన జీవన సంక్షోభాన్నీ అత్యంత గరిష్ఠ స్థాయిలో వ్యక్తీకరిస్తున్న ఈ చిత్రం నిజంగానే  ‘ ఒక్కటే అనేక చిత్రాలకు సమానం కదా ‘ అన్న ఒక ప్రశంసాత్మక అబ్బురాన్ని కలిగిస్తున్న విషయంకూడా తప్పక స్ఫురిస్తుంది అందరికీ . ఈ నేపథ్యంలో..

ramesh

పై ఫోటోకూ నాకూ ఒక వ్యక్తిగత సంబంధముంది.’ నమస్తే తెలంగాణ ‘ పత్రిక కొత్తగా పుట్టిన రోజుల్లో ప్రతి ఆదివారం అనుబంధ పుస్తకం ‘బతుకమ్మ ‘ సంచిక చివరి అట్టపై ఒక పూర్తిపేజి ఛాయాచిత్రం ప్రచురించబడి కళాత్మకమైన  ఫోటో ప్రియులను అలరించేది.ఆ విధంగా..ఒకటా రెండా..అనేకం వచ్చాయి.ఆ క్రమంలో నా హృదయాన్ని దోచుకుంటున్న ఈ  కె ఆర్ బి..అన్న ఫోటోగ్రాఫర్ ఎవరబ్బా అని ప్రత్యేకంగా వాకబుచేసి ఒకరోజు ఫోన్ చేసి..తర్వాత్తర్వాత పలుమార్లు కలుసుకుని..స్నేహించి..ఆత్మీయులమై..రమేష్ బాబు ఫోటోలంటే నాకు ఎంత పిచ్చి ఏర్పడిందంటే..2012 లో వెలువడ్డ ( తెలుగులో..ఇంగ్లిష్ లో ప్రసిద్ధ అనువాదకులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం చేత తర్జుమా చేయబడిన) నా ఎనిమిదవ కవితా సంపుటి ” అంతర “పుస్తకంలోని  ప్రతి కవితకూ ఒక పూర్తి పేజి ఫోటో చొప్పున  అరవై కవితలకు అరవై ఫోటోలను  ఉపయోగించుకున్నాను.ఆ పుస్తకం అంతర్జాతీయ ప్రమాణాలతో వెలువడి తర్వాత ప్రతిష్టాత్మక ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్-2012 ‘,’ సహృదయ-2013′ వంటి ఎన్నో పురస్కారాలను సాధించింది.

ఆ పుస్తకంలో..’ పాదాల కింది నేల ‘ అన్న కవితకు ఈ రోజు రమేష్ బాబు ఎంతో గర్వంగా ‘ ఏక చిత్ర ప్రదర్శన ‘ గా పెడ్తున్న ఈ అద్భుత చిత్రం ఉపయోగించబడింది.ఇదే కవితను నేను 2012 లో ఆగ్రాలో జరిగిన తొమ్మిది దేశాల ‘సార్క్ ‘ సాహిత్య శిఖరాగ్ర సదస్సులో చదివినప్పుడూ, 22 దేశాల ప్రతినిధులు పాల్గొన్న “2013-జైపూర్ అంతర్జాతీయ సూఫీ సదస్సు” లోనూ చదివినప్పుడు ఈ ఫోటో తో సహానా కవిత కూడా  గ్యాలరీలో ప్రదర్శించబడ్డప్పుడు అనేకమంది విదేశీ ప్రముఖుల ప్రశంసలను పొందింది..ఫోటో..కవితకూడా.అప్పుడు అనేక ప్రాచ్య  ప్రతినిధులు ఈ ఫోటోలోని విలక్షణతను నన్నడిగి తెలుసుకోవడం ఒక మధురమైన జ్ఞాపకం.

krb-5

photo: C.M.Praveen Kumar

నాకున్న వ్యక్తిగత అనుబంధంతో రమేష్ ను అడిగానొకసారి..’నీకూ ఇతర ఫొటోగ్రఫర్లకూ తేడా ఏమిటి ‘అని. అతను చెప్పిన జవాబు నన్ను ముగ్దుణ్ణి చేసి నిజమేకదా అని అబ్బురపర్చింది.అది..” అందరూ తమకు నచ్చిన దృశ్యాన్ని capture  చేస్తే..నా ఎదుట తారసపడే సజీవ జీవన చిత్రం మాత్రం అదే నన్ను capture చేస్తుందన్నా..” అన్నాడు.అది అక్షరాలా నిజం.అప్పుడప్పుడు రమేష్ తో కొన్ని రోజులు గడిపిన నేను..ఒక్క నిద్రపోయేటప్పుడు తప్పితే నిరంతరం కెమెరా అతని శరీరంలో ఒక భాగంవలె వెంట ఉండడం గ్రహించాను .ఎందుకలా అంటే..’ ప్రత్యేకంగా వెదుకకుండానే అనుక్షణం మన నిత్య గమనంలో ఎక్కడ ఒక అద్భుతమైన సామాన్య మానవుని సజీవ జీవన పోరాట సౌందర్యం కంటబడ్తుందో చెప్పలేం ..ఆ క్షణమే ఆ అద్భుత దృశ్యాన్ని  ఒడిసిపట్టుకుని..నిక్షిప్తం చేయాలి.. ‘ అని జవాబు.అతని  గాఢాసక్తి అది .శివునికి మూడో కన్నులాగ రమేష్ కు కెమరా ఒక మూడో భుజం.

ప్రదర్శనలో ఉన్న ఈ బొమ్మ గురించి తన స్వంత అన్వయింపు గురించి అడిగినప్పుడు..రమేషన్నాడు…

 ‘ అందులో  ఉన్న ఒక స్త్రీ..ఒక పురుషుడు ఈ మన భారతదేశ వర్తమాన సంక్షుభిత సమాజంలోని అట్టడుగు వర్గ విస్మృత వ్యక్తుల జీవన పొరాటాన్ని ప్రతిబింబిస్తున్న సజీవ చిత్రం.వాళ్ళు గారడీ వాళ్ళు కావచ్చు.సంచారజాతులకు సంబంధించిన గ్రామీణ కళాకారులు కావచ్చు..ద్రిమ్మరులు కావచ్చు.ఎవరైనా ఒక స్థిరత్వమూ..ఒక ప్రత్యేక అస్తిత్వమూ లేక నిత్య జీవిక కోసం..ఆకలి కడుపులతో అలమటిస్తున్నవాళ్ళు.జూబ్లీ హిల్స్ ,హైదరాబాద్ లో నడిరోడ్డు మధ్య ఎవరి పరుగులు వారివిగా పరుగెత్తుతున్న తీరికలేని నగరవాసుల మధ్య ప్రదర్శిస్తున్న జఠిలమైన ఒక ఫీట్ అది.ఎంతో అర్థవంతమైన..మనుషులను లోతుగా ఆలోచింపజేసే ఒక విన్యాసమది.పురుషుని కాళ్ళకింద కనబడని భూమి..పురుషుని తలపై ఒక భూదేవిలా భారాన్నంతా మోపి ప్రతిష్ఠితమైన స్త్రీ పాదాలు. ఒట్టి మట్టి పాదాలు..మాసిన బట్టలతో దీన పేద ప్రజల ప్రతినిధులుగా చూపులనిండా కొట్టొచ్చినట్టు దైన్యం.శూన్యం వాళ్ళ కళ్ళలో . తాత్విక దృష్టితో చూస్తే..ఒకరి భారాన్ని మరొకరు మోస్తూ స్త్రీ పురుష సంయోగ సంగమాల్లో,విలీనతలో ఏకత్వభిన్నతలో అభిన్నమై నిలిచిన బింబం..ప్రతీక అది. నిరాడంబరమైన అతిసహజ  స్త్రీపురుష  సమన్వయ  సహాకారాలతో కొనసాగే శ్రామిక క్రతువు అది. సంయోగ యోగం. ‘ అని. నిజమే కదా.

ఒక కళాకారునిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి..రీ డిస్కవర్ చేసేందుకు ఎవరో ఒక దార్శనికుడైన మహానుభావుడు అతనికి తారసపడ్డం యాదృచ్ఛికమే ఐనా అది అదృష్టమే. ఒక కమలాహాసన్ ను,ఒక రజనీకాంత్ నూ గుర్తించగలిగిన కె.బాలచందర్..ఒక ఎ.ఆర్.రెహమాన్ ను,ఒక సంతోష్ శివన్ నూ గుర్తించేందుకు ఒక మణిరత్నం..కావాలి.ఐతే మన రమేష్ ను ఎవరూ గుర్తించలేదుగాని..తనే తనలో క్షిప్తమై ఉన్న కళను గుర్తించగలిగిన  వ్యక్తిని వెదుక్కుంటూ వెళ్ళి తన గురువును అన్వేషించుకుని శిష్యరికం చేశాడు ఓ ఏదాదిపాటు దీక్షతో..చేస్తున్న ఉద్యోగాన్నికూడా వదలి.

రమేష్ గురువు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ .ఒక ఏడాదికాలం హైదరాబాద్,తిరుపతి,ఢిల్లీ,కోల్ కటా..ఇలా అనేక ప్రాంతాలను ఒక శిష్యునిగా,సహచరునిగా,విద్యార్థిగా,మిత్రునిగా వెంట తిరిగి  తనలో దాగిఉన్న’ అగ్ని’ ని తాను గుర్తించి కెమెరాను ఒక ఆయుధంగా స్వీకరించినవాడు రమేష్ బాబు.గురువు చెప్పిన  ప్రధాన విద్య..’ నువ్వు అతి సహజంగా ఫోటోను తీసి దాన్ని ప్రజాపరం చేయ్.అదే నీ వస్తువు,నీ శ్రమ,నీ సృజన.నువ్విక నిష్క్రమించు .ఇక నీ కృతే ప్రజలతో సంధానమై నువ్వేమిటో నీకు చెబుతుంది ‘ అని.అందుకే అందరు ఫోటోగ్రాఫర్లు వాడే ‘ఫోటో షాప్ ‘ ను రమేష్ వాడడు.తన కెమెరాలో అతి సహజంగా జన్మించిన చిత్రాన్ని ఉన్నదున్నట్టుగా మనకందిస్తాడు.మెరుగులూ,అలంకారాలూ,మేకప్పులూ ఉండవు.సహజమైన సృష్టి ఎప్పుడూ జీవాన్ని నింపుకుని అందంగానే ఉంటుంది.అందుకే..’ ఫేస్ బుక్’ మిత్రులకు గత కొన్నేళ్ళుగా 2000 కు పైగా అద్బుతమైన ఫోటోలను ‘ మై సిటీ అండ్ మై పీపుల్’ పేర అందిస్తున్నాడు

.’ వన్ ఇండియా.కాం’ దినపత్రికలో..రోజుకొక్కటి చొప్పున ఇప్పటికి కొన్నేళ్ళుగా వేయికి పైగా ఫోటోలను ‘మై సిటీ..మై పీపుల్ ‘ పేర ప్రచురిస్తున్నాడు. బహుళ పాఠకాదరణ గల ప్రసిద్ధ అంతర్జాల వారపత్రిక ” సారంగ” లో గత వంద వారాలనుండి ‘దృశ్యాదృశ్యం’ శీర్షికన ఒక పులకింపజేసే ఫొటోతో పాటు అర్థవంతమైన వ్యాఖ్యనుకూడా జతచేసి అందిస్తున్నాడు.ఈ మూడు నిత్యకృత్యాల్లోనూ వేలాదిమంది వీక్షకులు విభ్రమంతో పెట్టే వారి వారి కామెంట్స్ ను నేనెరుగుదును.నేనుకూడా అనేకసార్లు మైమరచి సూపర్ లేటివ్స్ లో వ్యాఖ్యలను పోస్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు.అందుకే మొన్న నేనన్నా రమేష్ తో..’నీ ఈ ప్రదర్శనలో వాడిన ” A pictureis worth A thousand words  ” అన్న వ్యాఖ్య సరియైంది కాదేమో రమేష్..వేయి పదాలుకాదు..అసలు అనేక సాహిత్య ప్రక్రియలూ,రూపాలూ ఏవీ కూడా వ్యక్తీకరించలేని అత్యంత సంక్లిష్ట  మహానుభూతులను నీ ఒక్క ఫోటో మాత్రమే వ్యక్తీకరించగలదు..వేరే ఏ ఇతర కళారూపాలూ చేయలేవా పనిని’ అని.

కందుకూరు రమేష్ బాబు ఫేస్ బుక్ లో ‘తల్లి కొంగు ‘ శీర్షికన అందించిన అనేక వందల అర్థవంతమైన,ఆర్ద్రమైన ఫోటోలు కూడా ఎందరు ప్రేక్షకుల మన్ననలను పొందాయో చెప్పలేము.అసలు ఇంత సహజమైన నిర్ణయాత్మక క్షణాలను (decisive moments)  ఇతను ఎలా బంధించగలిగాడబ్బా..అని చకితులమైపోతాము.తల్లి కొంగు ఎలా తన బిడ్డకు ఒక రక్షణ కవచమై..పరిష్వంగమై..అక్కున చేర్చుకునే ప్రాణధాతువౌతుందో ప్రతి ఫోటో చెబుతూనే ఉంటుంది.

అసలు నువ్వు నీ ఫోటోలతో..ఇంత బీభత్స  ఆర్ద్ర రస విన్యాసాన్ని ఎందుకోసం చేస్తున్నట్టు రమేష్..అని  నేనడిగినప్పుడు..’ఈ భిన్న అణచివేతల మధ్య నలిగిపోతున్న..నిస్సహాయంగా అణగారిపోతున్న అతి సామాన్య భారత పౌరులనూ, వాళ్ల వెతలనూ చూస్తున్నప్పుడల్లా నేను ఒకసారి ఒక ఏక పాత్రాభినయాన్ని..కొన్నిసార్లు బహు పాత్రాభినయాన్ని..మరికొన్నిసార్లు..జనంలోనుండే అకస్మాత్తుగా ఏ మేకప్పూ లేని పాత్రలతో ఒక వీధి నాటకంగా నన్ను నేను మార్చుకుని మౌన వేదననూ,దుఃఖాన్నీ ప్రకటిస్తూ ప్రదర్శిస్తున్నానన్నా..’ అని వాపోయినప్పుడు..నిజంగానే నేను స్తబ్దుణ్ణైన  సందర్భాలు చాలా ఉన్నాయి.రమేష్ కు తన ఈ ‘ లైఫ్ ఫోటోగ్రఫీ ‘ ఒక ఎమిటివ్ మీడియా(emittive media)..ఒక బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ఒక ప్రత్యేక భాష..ఛాయా చిత్ర  భాష అది.ఉద్వేగపూరితుడైన ఒక కళాకారుడు తన్ను తాను ఖాళీ చేసుకుంటే తప్ప మళ్ళీ తనను తాను తాజా ఆలోచనలతో పునరావేశపర్చుకోలేడు.అదే జరుగుతోంది ఇతని ఈ అనంత ప్రయాణంలో.

ఒక సృజనకారుని ఆలోచనలూ,అన్వయింపులూ నిజగానే చాలా చిత్రంగా ఉంటాయి.ప్రతి భారతీయ స్త్రీకి..ముఖ్యంగా తెలుగు స్త్రీలకు..తన ఇంటి వాకిలే ఒక కాన్వాస్..రంగస్థలం.ప్రతిరోజూ తన నిత్యనూతన సృజనాత్మకతతో తన ఇంటి చారెడు మట్టి వాకిలిని తన ముగ్గులతో (రంగవల్లులతో) శోభింపజేసి  సౌభాగ్య ప్రదాతయైన దేవునికీ,తన ఇంటికి వచ్చే ప్రతి అతిథికీ స్వాగతం పలుకుతుంది స్త్రీ.ప్రతి దినమూ ఒక కొత్త ముగ్గు.కొత్త రూపు.కొత్త అలంకరణ. కొత్త రంగులు.ఇంత ప్రశస్తమైన ‘ముగ్గులను ‘ ఒక అంశంగా తీసుకుని రమేష్ బాబు 5000 చిత్రాలను తీశాడు.అంటాడు..” అన్నా..ఈ ముగ్గుల ఫోటో లైబ్రరీ 2020 తర్వాతి తరంకోసం.ఎందుకంటే..ఇక రాబోయే తరానికి మట్టి వాకిళ్ళుండవు.అన్నీ కాంక్రీట్ జంగళ్ళే.వాళ్ళు ఈ నా ఫోటోలలోనే తమ  గత వైభవాన్ని చూసుకుంటూ మున్ముందు మురిసిపోవాల్సి  ఉంటుంది” అని.నిజమే ఇది.

కెమరా అనే ఆయుధంతో..భిన్న విన్యాసాలను విజయవంతంగా చేస్తున్న రమేష్ బాబు..తన గురువైన రఘురాయ్ జీవిత కథను అత్యంత ప్రేమతో..భక్తితో..’ సత్యం శివం సుందరం’ పేరుతో ఒక బృహత్ గ్రంథాన్ని  వెలువరించాలని 2010 నుండి శ్రమిస్తున్నాడు.బహుశా రఘురాయ్ జన్మదినమైన రాబోయే డిసెంబర్ 18 న ఆవిష్కరిస్తాడేమో.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించిన తన తండ్రి కె.కిషన్(కె కె)..తమ ఊరు..ఎల్లారెడ్డి పేట లో నడిపిన  జ్యోతి చిత్రాలయ..స్వాతి ఫోటో స్టూడియో..లో ఫోటో కళ ‘అ ఆ’ లను నేర్చుకున్న రమేష్ బాబు..ఇప్పటికి ఆ కళలో పోస్ట్ డాక్టోరల్ డిగ్రీని సాధించాడనే నావంటి ‘ సామాన్యు ‘ లం అనుకుంటున్నాం.ఐనా ఇంకా సాధించవలసింది అనంతమే కదా.

సామాన్యుని గురించే నిరంతరం తపించే రమేష్..తన పాత్రికేయ,ఛాయచిత్ర కృతులన్నింటినీ ‘ సామాన్య శాస్త్రం ‘ పేరనే వెలువరిస్తూ వస్తున్నాడు.తనకు నచ్చిన కొన్ని ఫోటోలతో 2012 లో ‘ జీవనచ్ఛాయ ‘ పేర,2014 లో ‘ చిత్రలిపి..మగువల ముగ్గులు ‘ పేర నిర్వహించిన రెండు ఫోటో ఎగ్జిబిషన్ లలో తనేమిటో ఋజువు చేసుకున్నాడు. ప్రదర్శనశాలల్లో సాధారణంగా ఒక కళాకారుడు తనకు నచ్చిన తన చిత్రాలనే పెడుతాడు.ఆ విధంగా..నేను చూచినంత వరకు రమేష్ బాబు ఫోటోలన్నీ ఎగ్జిబిషన్ లలో ప్రదర్శన కనువైనవే..అర్హమైనవే. వాటినే గనుక  ప్రదర్శిస్తే..ఆ హాల్ కొన్ని కిలోమీటర్ల పొడవు వుండి..ఒక ‘ వరల్డ్ రికార్డ్ ‘ ఎగ్జిబిషన్ ఔతుందేమో.ఐనా కందుకూరు రమేష్ బాబు తప్పకుండా అందరూ గుర్తించవలసిన ” రేపటి  ప్రపంచ స్థాయి  లైఫ్ ఫోటోగ్రాఫ రే ” కదా.

*