మైత్రీ మకరందం  “స్నేహఫలము”

visanaa

— శివరామకృష్ణ

~

 

“మానవర్మ రాను క్రొత్తగా నిర్మించిన మహా సౌధమునకు నామకరణము చేసెను. ఆ పేరు కోట ముందు ప్రభాతోరణము మీద, మంచి రంగులతో అర్థ యోజనము దూరము కనిపించునట్లు పెద్ద యక్షరములతో చెక్కించెను.

ఆ మహా సౌధము పేరు “స్నేహ ఫలము”

 

***

 

వెయ్యి పేజీల వేయి పడగలు వచన మహాకావ్యాన్ని రచించిన విశ్వనాథ సత్యనారాయణ గారు కొన్ని చిన్న నవలలను కూడా రాసారు. నలభై పేజీల ‘వీరవల్లడు’, యాభై పేజీల ‘హాహా హూహూ’, తొంభై పుటల ‘స్నేహ ఫలము’ వాటిలో కొన్ని.

 

రాజవంశీయులైన ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడిన మైత్రీ బంధం గురించి, దాని పరిణామంగురించీ విశ్వనాథ వారు చారిత్రక సత్యాలకు కొంత కల్పన జోడించి రాసిన రమ్యమైన చిన్న  నవల ‘స్నేహఫలము’. దీని చారిత్రక నేపధ్యాన్ని చూద్దాం. దక్షిణ భారత దేశాన్ని ఏలిన వారిలో ప్రముఖులు పల్లవులు. దాదాపు ఐదు వందల సంవత్సరాలపాటు పల్లవ సామ్రాజ్యం నిరాఘాటంగా వర్ధిల్లిందట. పల్లవ సామ్రాజ్యం తమిళ దేశంలో చాలా ప్రాంతాలను, కృష్ణా నదికి దిగువనున్న తెలుగు ప్రాంతాలనూ, కన్నడ ప్రాంతాల్లో కొంత భాగాన్నీ కలుపుకొని వర్ధిల్లింది. పల్లవ చక్రవర్తుల్లో మామల్ల నరసింహ వర్మ ఒకరు. ఈయన సుమారు  క్రీ. శ. 630-675 మధ్య కాంచీపురం రాజధానిగా పల్లవ రాజ్యాన్ని యేలిన మహా పరాక్రమవంతుడైన రాజు. ఈయన కాలంలో పల్లవులకూ, కాదంబ రాజు లకూ, పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుధ్ధాలు జరిగాయి. పల్లవులకు ప్రధాన శత్రువు పశ్చిమ చాళుక్య రాజు రెండవ పులకేశి. అనేక మార్లు కాంచీపురంపై ఆతడు దండెత్తివచ్చినా, మామల్ల నరసింహ వర్మ పరాక్రమానికీ, ఆయన ప్రధాన సేనాని పరంజ్యోతి ధాటికీ ఆగలేక పలాయనం చిత్తగించాడు. పులకేశిని దక్షిణాపథం వైపు రాకుండా వీరు అడ్డగించారు. అంతే కాదు, చక్రవర్తి అంగరక్షకుడైన  మానవర్మ చక్రవర్తిని పలుమార్లు మృత్యుముఖం నుంచి తప్పించాడు, తనప్రాణాలను లెక్కచెయ్యకుండా. ఈ నేపధ్యంలో నడిచిన కథ ‘స్నేహఫలము’. చక్రవర్తి మామల్ల నరసింహ వర్మకు సింహళ దేశపు రాజపురుషుడు మానవర్మకు యేర్పడిన అపూర్వ స్నేహబంధమే ఈ నవలలో వస్తువు.

***

వసంత ఋతువులోని ఒక మధ్యాహ్నం పల్లవ చక్రవర్తి తన అలవాటు ప్రకారం వాహ్యాళికి బయలుదేరాడు, ఏనుగు మీద. వెంట అంగరక్షకుడు మానవర్మ ఉన్నాడు. దారిలో చక్రవర్తికి దాహం వేసింది. దగ్గరలో కనబడిన కొబ్బరితోట వద్ద ఏనుగుని నిలిపి కొబ్బరి బొండాలు కొట్టించాడు మావటి. రాజు తనకు సరిపడినత నీరు తాగి, తన వెనకనున్న మానవర్మకి బొండాన్ని ఇచ్చాడు, పారవేయమనే ఉద్దేశంతో. కాని, మానవర్మ మిగిలిన నీటిని తనను తాగమనే ఉద్దేశంతో రాజు తనకిచ్చాడని అనుకున్నాడు.

బొండమును పుచ్చుకొని మానవర్మ “ఈ రాజు నాకు మిత్రుడు. నాకాశ్రయమిచ్చినవాడు. మిగిలిన నీరు నేను త్రావవలయునని ఇచ్చెను కాబోలు. తన యెంగిలి నన్ను త్రావమనునా? రాజు ధూర్తుడు కాడు. దురహంకారి కాడు. సాధువైన సత్పురుషుడు. నాయందు మిక్కిలి ప్రేమకలవాడు. గతిలేక తన పంచన చేరిన నన్ను మిత్రునివలె, ఆంతరంగికునివలె పరిపాలించుచున్నాడు. నాయందెంత ప్రేమలేకున్నచో తా నెంగిలి చేసిన నీటిబొండమును నాకందించును? నేను దీనిని పారవేయుట దురహంకారమగును. న్యాయము కూడ కాదు. నేను యెంగిలి నీరమును త్రావినచో నాకు వ్యాధి పుట్టదు. నాకు మర్యాద భంగము లేదు” అనుకొని వెంటనే ఆ నీటిబొండాన్ని తాగుతుండగా రాజు చూశాడు.

“తాను అతణ్ణి తాగమని ఇచ్చాననుకున్నాడు కాబోలు. మానవర్మ గొప్ప వంశము నందు పుట్టినవాడు. అతడొక రాజ్యమునకర్హుడు. దినములు బాగుండక తన్నాశ్రయించినవాడు. అతనికి తనయందింత స్నేహభావమున్నదని ఇదివరకు తనకు తెలియలేదు.  తానిట్లీయగ మరొకడైనచో మనసస్సులో మిక్కిలి కోపము తెచ్చుకొనును. ఇది రాజయోగ్యమైన పనికాదు”  అనుకొని రాజు నరశింహ వర్మ వెంటనే మానవర్మ చేతిలోని బొండాన్ని తీసుకొని మిగిలిన నీటిని తాగేశాడు. మానవర్మ ఆశ్చర్యపోయాడు.

ఈ సంఘటన చూసిన మావటి ఆశ్చర్యపోయి, మానవర్మ మంచితనాన్ని, రాజు ఔదార్యాన్ని మనసులో మెచ్చుకున్నాడు. “మానవర్మ లేకుండా మహారాజు కాలు బయటపెట్టడు. మానవర్మదే అదృష్టము. ఇదివఱకు నేనెప్పుడూ చూడలేదు. మహరాజు కొంత త్రావి మానవర్మకిచ్చెను. అతడు కొంత త్రావి మరల మహారాజున కందిచ్చెను. ఇట్లు సురాపానము చేయువారు చేయుదురు. పరమ మిత్రులు చేయుదురు” అని తన పరిధిలో అనుకున్నాడు.

మానవర్మ కూడా మహారాజు యెంతటి సత్పురుషుడోనని అనుకున్నాడు. సేవకుడైన తన యెంగిలిని మళ్ళీ ఆయన త్రాగాడంటే తనని ప్రాణస్నేహితుడిగా తలచాడు కదా అనుకున్నాడు. “రెండు మూడు సార్లు నేను రాజును రక్షించిన మాట నిజమే. అది సేవకుని ధర్మము. రాజులు మెచ్చినచో ధనమిత్తురు. అధికారమిత్తురు. ప్రాణమీయరు. ఈ రాజు తన ప్రాణములు నాకిచ్చుచున్నాడు. నేనీ రాజును ఆశ్రయించి నా రాజ్యమును నేను సంపాదించుకొనవలయునని యనుకొనుచున్నాను.ఇట్టి ప్రాణస్నేహితుని వదిలిపెట్టి నేనెట్లు పోగలను?”

అప్పుడు మహారాజు కూడా ఇలా అనుకున్నాడు “ఈ నాటితో మానవర్మ నాకు పాణస్నేహితుడైనాడు. ఇతడు నా ప్రాణములను రెండుమూడు సార్లు రక్షించెను. అర్థరాత్రముల యందైన నీడ సూర్యునెడబాసి యుండును. కాని ఇతడు నన్నెడ బాయడు. రాజ్యభ్రష్టుడై నన్నాశ్రయించెను. నేను గొప్ప పదవినిచ్చితిని కాని, యతనిని రాజును చేయలేదు కదా! నేటి నుండి యతడును నేనును నా రాజ్యమున కిద్దరు రాజులము. నా మాట యెట్లు చెల్లునో నేటి నుండి యీతని మాట కూడ యట్లే చెల్లును. ఇతడు నా మీద చూపిన ప్రేమకు వేరొక విధముగా నేను కృతజ్ఞత చూపలేను. చూపకపోయిన నరకమునకు పోయెదను. ఒక ప్రాణదాతకు కృతజ్ఞత చూపుట వేరు, యెడములేకుండ ఇంతటి ప్రేమ చూపిన వానియందు కృతజ్ఞత నెఱపుట వేరు”

ఇలా అనుకొని రాజు మానవర్మని ఏనుగుమీద తన పక్కనే కూర్చోబెట్టుకొని, అతని భుజం మీద చెయ్యివేశాడు. “ప్రొద్దు వాటారిన తరువాత ఇంటికి తిరిగి వచ్చు రాజును, మానవర్మను ప్రజలిట్లు చూచిరి”

నవల మొదట్లోనే విశ్వనాథ వారు ఈ స్నేహబంధానికి బలమైన పునాది వేశారు ఈ సంఘటనతో.

 

***

 

మానవర్మ సింహళదేశ రాజకుమారుడు. యువరాజు. కొన్ని వ్యాపారసంబంధ విషయాలను పరిష్కరించడానికి మలయా దేశానికి వెళ్ళాడు.  అక్కడ ఉండగా మలయా రాజకుమారి సంఘను వివాహమాడాడు. మానవర్మ అక్కడ ఉండగానే సింహళరాజు చనిపోయాడు. మలయా రాకుమారిని పెళ్ళాడి అకార్యం చేశాడని మానవర్మపై దుష్ప్రచారం చేసి, అతని జ్ఞాతి దధోపతిస్సుడు అనే అతను సింహళ సింహాసనాన్ని ఆక్రమించాడు.  ఇది తెలుసుకున్న మానవర్మ ఖిన్నుడై, తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే బలవంతుడైన పల్లవ చక్రవర్తి అండ అవసరమని భావించి, కాంచీపురం చేరాడు. భార్యను మలయాలో పుట్టింటనే ఉంచాడు. అంతకు కొన్నేళ్ళ క్రితం అతడు కాంచీపురం లో విద్యాభ్యాసం చేసిం ఉన్నందున పరిచయమైన వారున్నారు. వారి సహాయంతో మహాసేనాని పరంజ్యోతి అనుగ్రహం సంపాదించి మహారాజు కొలువులో చేరాడు.  కొద్దిరోజుల్లోనే పల్లవ రాజ్యం మీద రెండవ పులకేశి దండెత్తి వచ్చాడు. మహారాజు, సేనాపతి  వేరొకచోట యుధ్ధంలో ఉండగా, పెద్ద శత్రువుల దండు కంచి కోట ద్వారాన్ని స్వాధీనపరచుకోడానికి వచ్చింది. అప్పటికి పల్లవ యువరాజు మహేంద్రవర్మ చిన్నవాడు. ఆ సమయంలో కోటలోనున్న మానవర్మ తన పటాలంతో కోట తలుపులు తెరిచి, శత్రుసమూహం మీద విరుచుకుపడ్డాడు. శత్రువులను ఊచకోతకోశాడు. కోటను కాపాడాడు. పులకేశి సేనలను ఓడించి రాజు, సేనాని కంచికి తిరిగివచ్చి, మానవర్మ పరాక్రమమాన్ని మెచ్చుకున్నారు. నరసింహవర్మ మానవర్మను తనకి అంగరక్షకుడిగా నియమించుకున్నాడు.

ఆ తరువాతి కాలంలో రాజుకి మానవర్మ కేవలం మహావీరుడే కాదు, సాహిత్యం, శిల్పం, జ్యోతిషం, సంగీతం వంటి కళల్లో కూడా నిష్ణాతుడని తెలిసింది.

ఇలా ఉండగా మానవర్మ చక్రవర్తి జాతకాన్ని సంపాదించి, ఆయనకున్న అనేక యోగాలను పరిశీలించాడు. ఆయనకు ఆపదలు వచ్చే కాలాన్ని పసిగట్టి చక్రవర్తిని అనేక హత్యాప్రయత్నాలనించి రక్షించాడు. ఒకసారి కాపాలికులనించి, మరొకసారి పల్లవ రాజవంశీయుడైన గోవింద వర్మ రాజుపై చేసిన చేతబడి ప్రయోగం నించి రక్షించాడు. ఈ గోవిందవర్మే రహస్యంగా మరోసారి అంత:పుర ఉద్యానం లో రాజును హత్యచేయించ డానికి పన్నిన కుట్రను కూడా మానవర్మ విఫలం చేశాడు. కాని ఎప్పుడూ తన గొప్పని చక్రవర్తి వద్ద చెప్పుకోలేదు. ఈ కారణాల వల్ల రాజుకి అభిమానపాత్రుడయ్యాడు. మరొకసారి సేనాని పరంజ్యోతి తో కలిసి రాజు చాళుక్య రాజధాని బాదామిపైకి దండెత్తుతుంటే అది తగిన సమయంకాదని వారించి, వారిని ఆపదనించి కాపాడాడు.  మొదట పరంజ్యోతి, తనవల్ల రాజు వద్ద చేరిన మానవర్మ రాజునే శాసిస్తున్నాడని విసుగు చెందినా, మానవర్మ ప్రవర్తన చూసి ” అతనికి గర్వము లేదు. అహంకారము లేదు. అతనికవి యుండవలసిన యవసరమునూ లేదు. అతడొక రాజ్యమున కధిపతి. మఱియొక యల్పునకు వచ్చిన యధికారము వలె అతనికి ఈ యుద్యోగము గర్వహేతువు కాదు” అనుకొని మానవర్మ పట్ల స్నేహంతో ఉన్నాడు.   మరొక సందర్భంలో పరంజ్యోతి “ఆతని యందు రాజు యొక్క మైత్రి ఆతని నహంకార కలుషితుని చేయక, పరమ సుకుమారభావుని, ఆర్ద్ర మనస్కుని చేసెను. సత్పురుషులిట్లుందురు కాబోలు” అని అనుకున్నాడు.

యుధ్ధాలు సమసి, శాంతి నెలకొన్న కొన్నాళ్ళకి, చక్రవర్తి మానవర్మతో మలయా దేశంలో ఉన్న అతని భార్యని కాంచీపురానికి తీసుకురమ్మని చెప్పాడు. తాను చక్రవర్తి ఆజ్ఞను తిరస్కరించలేడు కనుక, మానవర్మ సంఘని కాంచీపురం రప్పించాడు. ఆమె వచ్చి, తన సత్ప్రవర్తన చేత చక్రవర్తికి, పట్టపురాణికీ అత్యంత ప్రీతిపాత్రురాలయింది. మహాసేనాని పరంజ్యోతి కూడా ఆమెని తన కుమార్తెగా ఆదరించాడు.  మానవర్మకి తన కోట అంతటి మరో మహాసౌధాన్ని నివాసంగా సమకూర్చాడు చక్రవర్తి.

 

మరికొన్నాళ్ళకి గత పరాజయానికి  ప్రతీకారం తీర్చుకోవాలని చాళుక్య రాజు పులకేశి తన రాజ్యం లోని ఒక మండలానికి అధిపతైన వల్లభుడు అనే మొరటువాడైన మహావీరుడిని కాంచీపురంపైకి పంపాడు. పల్లవరాజు నరసింహవర్మని కడతేర్చడమే వల్లభుడి పని. ఆ సమయంలో సేనాని రాజ్యం లో లేడు. యువరాజుని, మానవర్మని కోట రక్షణకి ఉంచి, చక్రవర్తే బయలుదేరాడు వల్లభుడితో యుధ్ధానికి. కాని రాజుకి రానున్న ఆపదని ఊహించిన మానవర్మ, ఆయనకి తెలియకుండా బయలుదేరి, యుధ్ధంలో రాజు అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉన్న సమయంలో వల్లభుడి మీద విరుచుకుపడి అతన్ని పరాజితుడిని చేసి, బంధించి, తన రాజుని రక్షించుకున్నాడు. “మానవర్మ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాడు. భార్యను కూడా తెచ్చుకున్నాడు. ఆమె గర్భవతి. ఐనా, తనయాజ్ఞను ఉల్లంఘించి కూడా కోటను విడిచివచ్చి తనను రక్షించిన విధానము ఆతని నిజమైన స్నేహశీలతకు గుర్తు”  అని చక్రవర్తి ఆనందించాడు.  “మానవర్మ లేకున్న తాను చక్రవర్తి కాడు”

 

చక్రవర్తి నరసింహవర్మ విజయోత్సవ సభ చేసి, వీరసైనికులను సత్కరించాడు. తరువాత ఆయన మానవర్మ పరాక్రమాన్ని కొనియాడి, ప్రజలతో  “నేను జీవితములో అతనికి ఋణపడి యున్నాను. లోకములో కృతజ్ఞత యన్న గుణము సులభ్యము కాదు. రాజులయందది మృగ్యము. రాజు తన సేవకుడు తన కుపకారము చేసినచో అది వాని ధర్మమనుకొనును. అట్లు చేయుట వాని విధి యనుకొనును.  ఇట్టి  దుష్టలక్షణము రాజులయందుండును. కృతఘ్నుడు నరకమునకు పోవును. మీరు నా ప్రజలు….నా కృతజ్ఞత మానవర్మకు చూపించవలెనన్న నేనేమి సేయవలయునో మీరే చెప్పుడు” అన్నాడు. అప్పుడు సేనాని పరంజ్యోతి “మానవర్మ రాజ్యము మానవర్మకిప్పించుట యొక్కటియే మహారాజు కృతఘ్నలోకములకు పోకుండ చేసెడిది. ఆ సైన్యములను నేను నడిపించుకొని పోయెదను” అన్నాడు.

మానవర్మ మహారాజుకి నమస్కరించి, ” పరంజ్యోతి దయామయులు. ఆయన నా భార్యకు పెంపుడు తండ్రి వంటివారు. అందుచేత నా మీద అంత దయ చూపించుచున్నారు. మహారాజు యొక్క అనుజ్ఞ యైనచో నేను నా దండు నడుపుకొనగలను. నేనే దండయాత్ర పోవలయును. నేనే నా రాజ్యమును సంపాదించుకొనవలయును.” అన్నాడు.

 

అనంతరం మానవర్మ సింహళం పైకి దండెత్తి వెళ్ళాడు. మొదటి సారి ఆ దేశాన్ని వశపచుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, మరొకసారి ప్రయత్నించి, దధోపతిస్సుని ఓడించి, తన రాజ్యాన్ని తాను సాధించుకున్నాడు. మానవర్మ తన దేశం లో వ్యవసాయాన్ని వృధ్ధి చేశాడు. భారత దేశంతోనూ, మలయా తదితర ద్వీపాలతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సర్వమతాలనూ అభిమానిం చాడు. ప్రజలు అధికులు బౌధ్ధులు కనుక ఆ మతాన్ని ప్రోత్సహించాడు.

సింహళ రాజభవనం అంతకుముందు సామాన్యంగా ఉండేది. దాని బదులు కంచిలోని  వైకుంఠపెరుమాళ్ళు కోవెల వంటి రాజభవనాన్ని నిర్మించాడు. దాని పేరే “స్నేహఫలము.”

 

***

 

ఈ నవలలో కథాసంధర్భంలో విశ్వనాథవారు పలుచోట్ల హృదయానికి హత్తుకునే మాటలు రాశారు.

“మధురమైన సంగీతము వినుచు, శాస్త్రములు, కవిత్వములు నిత్యాభ్యాసము చేయుచు, హృదయమునందు పరమ సుకుమారుడైన మనుష్యునకు ఇట్టి ధ్వనులు (మనకు తెలియకుండా చెవుల్లో పడే పక్షి కూజితాలు మొదలైనవి) వినిపించును. ఆలోచన లేని వాని కేవియు వినిపించవు.”

“అందరును మనుజులే కాని వారిలో కొందరు రాక్షసులు. కొందరు దేవతలు.  రాక్షసాంశ కలవారును మానవులవలెనే కనిపింతురు.”

ఇంకా ప్రాస్తావికంగా బౌధ్ధ మతం గురించి, కాపాలిక మతం గురించీ కూడా వివరించారు. పల్లవుల నాటి దాక్షిణాట్య సంగీతానికీ, మలయా దేశపు సంగీతానికీ భేదాలను వివరించారు తన సంగీత శాస్త్ర పరిజ్ఞానంతో. ఈ వ్యాసంలో ఎక్కువగా తెలపని గోవిందవర్మ రాజవంశంవాడైనా, సకల భ్రష్టుడై దొమ్మరి వాళ్ళతోనూ, కాపాలికులతోనూ తిరిగి, ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న ప్రయోగ విద్య (చేతబడి) నేర్చుకున్న వైనం, గొడగూచి అనే ఒక నాట్యకత్తె రాజు ముందు నాట్యం చేసే సమయం లో ఆయనపై ప్రయోగం చెయ్యడానికి కుట్రపన్నడం, దాన్ని మానవర్మ భగ్నం చెయ్యడం చాలా ఆసక్తికరంగా చెప్పారు విశ్వనాథ.   ఆ సమయంలో రాజు “నాకు  రాబోవు సకలాపదలను నీవు ముందు చూతువు. వానికి ప్రతిక్రియలాలోచింతువు. నీవు దీనినెట్లు పసిగట్టితివి?” అని అడుగుతాడు ఆశ్చర్యపడుతూ.

 

ఒకరు ఒక మహా సమ్రాజ్యానికి చక్రవర్తి. మరొకరు ఒక రాజ్యానికి వారసుడైనా విధి వశాన ఆ చక్రవర్తి కొలువున చేరిన వ్యక్తి. వీరిద్దరి మధ్య నెలకొన్న మైత్రి ఎంతో గొప్పగా వర్ణించారు విశ్వనాథ. చక్రవర్తి దయకు మానవర్మ ప్రతివచనం చాలు వీరిద్దరి ఆత్మీయతను, హృదయాలనూ ఆవిష్కరించడానికి:

 

“మహామల్లుడా, నేనిది వరకు తమ సద్గుణములకు, తమరికి నా యందుగల కృపకు మనస్సులో బానిసనై యున్నాను. మరియు అధికమైన దయ చూపించినచో మనుష్యుడైనవాడు బానిస యగుటకంటె తక్కువ స్థితి యేమి పొందగలడు? నా యందు తమరికి ఎంత ప్రేమయున్నను నన్ను తమ యంగరక్షకునిగా నుంచుకొనుటయే నాకు చేసెడి మహోపకారము. తమ యేనుగు మీద నన్ను తమ ప్రక్కన గూర్చుండ బెట్టుకొనుటకంటె అధికమైన గౌరవ మేమి చేయవలయును?”

 

ఏకబిగిని చదివించే మంచి నవల ‘స్నేహఫలము’

 

*

 

  వసంత ఋతువు అక్కడే కనబడింది! 

శివరామకృష్ణ

sivaramakrishna    ఎన్నో యేళ్ళనించీ వాయిదా పడుతున్న గురువాయూరు యాత్ర మా పిల్లల చొరవ వల్ల ఇటీవల సాధ్యపడింది.  ఎప్పుడో, నేను ఉద్యోగంలో చేరినప్పుడు కొన్నాళ్ళు మంగళూరులో పనిచేశాను. అప్పుడు కేరళ రాష్ట్రాన్నీ, పశ్చిమ కన్నడ ప్రదేశాన్నీ చక్కగా చూశాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు.

అసలు కేరళ అంటేనే నాకు పూనకం వస్తుంది. ఎందుకంటే అది దేవభూమి. God’s own country అంటారు కదా దీన్ని! పరశురాముడు ఈ సీమని సముద్రంలోంచి తన గండ్రగొడ్డలితో బయటికి లాగాడట.  చాలా కాలం అక్కడే ఉన్నాట్ట కూడా! దట్టమైన అరణ్యాలూ, చిన్న చిన్న నదులూ, ఆ నదులనే తలపిస్తూ సముద్రం వరకూ సాగే కాలువలూ, ఉప్పునీటి కయ్యలూ, మన కోనసీమ తలదన్నే విస్తారమైన కొబ్బరితోటలూ, ఎక్కడ చూసినా విరగకాచి ఉన్న పొడవైన పనస, మామిడి చెట్లూ (వాటి కాలం లో నన్నమాట), మండువేసవిలో కూడా చలిపుట్టించే కొండవసతులూ(hill resorts), అందమైన సాగరతీరం అన్నీ ఈ రాష్ట్రపు ప్రత్యేకతలు. ఇవేకాక, కొండవాలుల్లో పరచుకొని ఉన్న టీ తోటలూ, సుగంధద్రవ్యాల చెట్లూ కేరళ స్వంతం. గురువాయూరులోని శ్రీకృష్ణ దేవాలయం, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి మందిరం, అయ్యప్ప వెలసిన శబరిమల, అనేక పెద్దపెద్ద చెర్చిలు, మశీదులూ ఉన్న ప్రదేశం కూడానూ కేరళ.

హైదరాబాదు నించి కొచ్చిన్‌ చేరి, అక్కడి నించి రోడ్డు మార్గం ద్వారా గురువాయూరు చేరాము. దారి పొడుగునా కన్నులవిందైన ప్రకృతి! పచ్చటి చెట్లూ, కొబ్బరితోటలూ, కాలువలూ మైమరపిస్తాయి.  రైల్లో ఐతే త్రిచూర్లో దిగి అక్కడినించి 30 కి. మీ. బస్సులోకాని, టాక్సీలో కాని వెళ్ళొచ్చు. గురువాయూరులో చిన్న రైల్వే స్టేషన్‌ కూడా ఉంది.

Sri Krishna the Lord of Guruvayoor (1)

ఇక్కడి దైవం నారాయణుడు. ఆయన్నే బాలకృష్ణుడుగా భావించి కొలుస్తారు. ఎందుకంటే దేవకీవసుదేవులకు శ్రీకృష్ణావతార సమయంలో నారాయణుడు దర్శనమిచ్చిన చతుర్భుజ స్వరూపం లోనే ఇక్కడి విగ్రహం ఉంటుంది. మూడడుగుల ఎత్తుకూడా ఉండదేమో ఆ మూర్తి. కానీ లోకోత్తరమైన ఆ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. నాలుగుచేతుల ఆ నల్లనయ్యను వెనుకచేతులు కనబడకుండా పూలమాలలు అమర్చి, ఒక చేత వెన్నముద్ద, మరోచేత వేణువు పట్టిన బాలకృష్ణుడిగా అలంకరించి చూపిస్తారు సాధారణం గా! ఊదయాన్నే ఉష:కాలపూజా సమయం లో అసలు రూపాన్ని చూడవచ్చు. భక్తసులభుడనీ, సంతానప్రదాత అనీ ఆయనకు పేరుంది. ఆయన లీలలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.  ఈ ఆలయం లో దర్శనానికి అందరికీ ఒకటే క్యూ! మన రాష్ట్రంలోలాగా వీఐపీలు, వీవీఐపీలూ అంటూ తేడాలు లేవు ఈ స్వామికి. అందరికీ ఉచితం గా కన్నులవిందైన దర్శనం దొరుకుతుంది. సాయంకాలం సూర్యాస్తమయం అవగానే ఆలయ ప్రాంగణం అంతా నూనె దీపాలతో దివ్యకాంతులతో వెలిగిపోతుంది.  ప్రమిదల్లో వెలిగే నూనె దీపాల కాంతికి ఒక అనంతత్వం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ అనంతత్వం లోనే ఏకాకృతిగా వెలిగే దైవత్వం గోచరిస్తుంది. అందుకేనేమో ‘ దీపం జ్యోతి: పరబ్రహ్మ ‘ అన్నారు.

 

గురువాయూరులో ఉండడానికి మంచి హోటెళ్ళు ఉన్నాయి, ఇవేగాక దేవస్థానం వారి సత్రాలు కూడా ఉన్నాయి.  మేము దిగిన హోటల్ కి ఎదురుగా కొన్ని ఇళ్ళున్నాయి. ముందుభాగమంతా చక్కటి గార్డెన్లు పెంచుకున్నారు. లోపలెక్కడో ఇళ్ళున్నాయి. పనస, మామిడి, అరటి, కొబ్బరి, పోక చెట్లూ, మధమధ్య పూలమొక్కలూ, ఉదయాన్నే ఆ చెట్లమీద నించి మేలుకొలుపు పాటల్లాంటి కోయిలమ్మల స్వరసమ్మేళనాలూను! మన ప్రాంతాల్లో కనపడకుండా పోయిన వసంతశోభ అంతా ఇక్కడ కనపడింది! ఆ ఇళ్ళ యజమానులు ఉన్నారో లేరో కాని, చెట్లనిండా గుత్తులు గుత్తులుగా మామిడికాయలూ, పనసపళ్ళూను! చిలకలు కొరికిన మామిడికాయలు-అప్పుడే పళ్ళుగా మారుతున్నవి-రాలిపడుతూనే ఉన్నాయి. అడగకుండానే అమృతఫలాలిచ్చే చెట్ల జన్మలు ఎంత  ధన్యమైనవి!

రెండురోజులు గురువాయూరులో గడిపి అక్కడినించి మున్నార్ బయలుదేరాం.  మున్నార్ చాలా అందమైన వేసవి విడిది.  మండువేసవిలో కూడా చాలా చల్లగా ఉండేప్రదేశం. తేయాకుతోటలకు ప్రసిధ్ధి. ఈ ప్రయాణం లోనే నాకు అనుకోకుండా దొరికిన భాగ్యం కాలడి సందర్శనం.  హైందవధర్మానికి జయకేతనాన్నెగురవేసిన  ఆదిశంకరుల జన్మస్థలం.  కొచ్చిన్‌ విమానాశ్రయానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం లోనే ఉంది కాలడి.  ఈ విషయం నాకు అంతవరకూ తెలియదు! కాలడిలో శృంగేరి శంకరమఠం వారు ఆదిశంకరులకూ, శారదామాతకూ ఆలయం నిర్మించారు.  ఆదిశంకరుల మాతృమూర్తి ఆర్యాంబగారి సమాధి కూడా అక్కడే చూడవచ్చు.  శంకరులు సన్యసించడానికి నిమిత్తమాత్రమైన మొసలి, ఆయన కాలిని పట్టుకున్న ప్రదేశాన్ని కూడా పూర్ణానది ఒడ్డున గుర్తించవచ్చు.  ఈ పూర్ణానదినే ఇప్పుడు పెరియార్ నది అని పిలుస్తున్నారు. ఈ నదిని కేరళ రాష్ట్రానికి ఆనందదాయిని అంటారు. దీనిపై ఎన్నో ప్రోజెక్టులు కట్టారు. పక్కనేఉన్న తమిళనాడుకీ కేరళకీ నడుమ ఈ ప్రోజెక్టులపైనే వివాదాలున్నాయి.

 

Munnar

కాలడి నించి మళ్ళీ బయలుదేరి దారిలోనున్న అందమైన ప్రకృతినిని తనివితీరా చూస్తూ, రోడ్డుకి ఆనుకొని ప్రతీ రెండు మూడు కిలోమీటర్లకీ ఒకటిగా ఉన్న గ్రామాలను దాటుకొని కొత్తమంగళం అనే చిన్న పట్టణాన్ని చేరాం. ఈ వూరి వింత అక్కడున్న ఫర్నిచరు దుకాణాలు. ఊరి పొడుగు సుమారు రెండు కిలోమీటరులుంటే, ఆ రెండు కిలోమీటర్లూ రోడ్డుకి రెండువైపులా ఈ దుకాణాలే! ఊరు మాత్రం ఈ రోడ్డు పొడుగంతే ఉంది. భలే కొత్తకొత్త డిజైన్లలో ఆని రకాల ఫర్నిచరు సామాన్లూ ఉన్నాయి. మా డ్రైవరు ప్రదీప్   కేరళ రాష్ట్రం అన్నిప్రాంతాలనించీ వచ్చి ఇక్కడ ఫర్నిచర్ కొనుక్కుంటారని చెప్పాడు.  చుట్టుపక్కలి అడవుల్లో దొరికే మంచి కలపతో వీటిని చేస్తారట. తరువాత ఆడిమలి అనేచోట మధ్యాహ్న భోజనాలు కానిచ్చి మున్నారుకు చేరువయ్యాం. ఆడిమలి దాటాకా రోడ్డుకి ఇరువైపులా స్పైస్ గార్డెన్‌లు కనబడ్డాయి. వాటిని చూడ్డానికి మనిషికి వంద రూపాయలు టిక్కెట్టు. మనం రోజూ వాడే సుగంధ ద్రవ్యాల  మొక్కలూ, చెట్లూ అన్నీ అక్కడున్నాయి. లవంగం, యాలకులు, జాజికాయ-జాపత్రి, దాల్చినచెక్క (దీని ఆకులే బిర్యానీలో వాడే ఆకులు) మొదలైనవన్నీ ఉన్నాయి. ఇంకా కాఫీ, రబ్బరు చెట్ల వంటివీ ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, కోకో కూడా పండిస్తున్నారక్కడ.   మాకు వీటిని చూపించిన గైడు ఆశా మీనన్‌ అనే మళయాళీ అమ్మాయి గడగడా తెలుగు – మళయాళీయాసలో – మట్లాడేస్తుంటే ముచ్చటేసింది. గైడువృత్తికాబట్టి, అన్ని భాషలవారికీ అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి నేర్చుకున్నానంది.

ఇక అక్కడినించి బయలుదేరాకా ప్రకృతి సౌందర్యంవిశ్వరూపంచూపడంమొదలయింది. కొండలూ, వాటి లోయలూ, లోయల అడుగున మైదానాలూ, వాటిలో ఏవేవో చిన్న చిన్న గ్రామాలూ, అక్కడక్కడ సెలయేళ్ళూ, ఇవన్నీ చాలవన్నట్టు కొండవాలుల్లో టీ తోటలూ!  కొన్ని చోట్ల అసలు కొండే కనబడకుండా పచ్చటి టీ మొక్కలు వరసలు వరసలుగా పెంచారు-ఆకుపచ్చటి తివాచీలు పరిచినట్టు! మధ్య మధ్యలో పాపం పిల్లమొక్కలకి ఎండసోకకుండా మేమున్నాం అన్నట్టున్న వెండిగొడుల్లాంటి సిల్వర్ ఓక్ చెట్లు! ఈ సిల్వర్ ఓక్ లను రోడ్డు మీదనించి చూస్తూ ఉంటే కొండవాలుల్లో అంతా తెల్లటి పొగమేఘాలు కమ్ముకున్నాయా అన్నట్టున్నాయి. సిల్వర్ ఓక్ కలపతో ఫర్నిచర్ తయారు చేస్తారు.  ఒక చోట ఒక పుష్పవనం ఉంది. రకరకాల పూలమొక్కలు పెంచారు.  దాని అందం చూడవలసిందే!  వసంతవాటిక లంటే ఇవేకదా అనిపించింది. గులాబీలు, రంగురంగుల మందారాలూ, డైసీలూ, చామంతులూ , వయొలెట్లూ, ఐరిస్ జాతులూ అన్నీ ఉన్నాయి అక్కడ. Land lotus పేరు విన్నాను కాని ఇక్కడ చూసాను దాన్ని.

Land lotus

అక్కడినించి బయలుదేరి మున్నారు చేరాము.  హోటల్ రూము లో సామాన్లు పెట్టుకుని, రెఫ్రెష్ అయి, అక్కడికి సమీపం లో ఉన్న ఏనుగుల పార్కుకి వెళ్ళాము.  వంద రూపాయలిస్తే గజారోహణం చేయిస్తున్నారు.  ఇదివరలో మహానుభావులను గజారోహణ సన్మానం తో గౌరవించేవారు. ఇప్పుడు వందరూపాయలకే స్వీయసన్మానం చేసుకోవచ్చన్నమాట! అక్కడి పార్కులు వగైరాలు చూసుకొని చీకటిపడ్డాక రూముకి చేరాం.  చలి కొరికేస్తోంది.  రూములో ఏసీ ఉందేమో, ఆపేద్దామని చూస్తే కనబడలేదు. ఓహో, హిల్ స్టేషన్‌ కదా, ఇక్కడ అవి ఉండవని గుర్తుతెచ్చుకున్నాం.  కాలు కిందపెడితే జివ్వుమనేలా ఉంది. అందుకే రూమంతా తివాచీ పరచి ఉంది.

మరునాడు ఉదయమే లేచి చూసేసరికి కిటికీ అద్దాలన్నీ మంచుతో నిండిపోయిఉన్నాయి. మళ్ళీ బయలుదేరి టీతోటలన్నీ తిరిగి చూసాం.  మున్నార్ కి సమీపం లో ‘మట్టుపెట్టి’ డాము ఉంది.  మేము దాన్ని ‘మట్టుపట్టి’ అని అంటువుంటే మా డ్రైవరు మట్టుపెట్టి అనాలి, మళయాళం లో పట్టి అంటే కుక్క అన్నాడు.  మట్టుపెట్టి అంటే మా తెలుగులో అర్థం భయంకరంగా ఉంటుంది లేవయ్యా అన్నాను. పేరెలాఉన్నా, అది చాలా అందమైన ప్రదేశం. దానికి దగ్గరలోనే Echo Point అని ఒకటిఉంది. అక్కడి నది ఒడ్డున నిలబడి అరిచినా, చప్పట్లుకొట్టినా ఆ శబ్దం చుట్టూఉన్న కొండల్లో ప్రతిధ్వనించి మనకు వినబడుతుంది.  అరవడానికి ఐదు రూపాయలు టిక్కెట్టు కూడా ఉంది! ఆ నదిలో నౌకావిహారానికి కూడా ఏర్పాటు ఉంది-పెడల్ బోట్లున్నాయి. అక్కడి నించి బయలుదేరి కానన్‌దేవి హిల్స్ మీదుగా ప్రకృతిసౌందర్యాలను ఆస్వాదిస్తూ కొత్తమంగళం మీదుగా తిరిగి కాలడి వీధుల్లో ప్రయాణించి కొచ్చిన్‌ చేరుకున్నాము. అక్కడినించి మళ్ళీ హైదరాబాద్‌ షంషాబాదు!  చూసి, ఆస్వాదించిన సౌందర్యమంతా ఇంకా స్మృతిపథంలోనే విహరిస్తోంది.  ఈ అందాన్ని మించిన గురువాయూరు కృష్ణుడి అందం స్థిరంగా హృదయం లో నాటుకుపోయింది!

Silver oak

అసలు కేరళరాష్ట్రమంతా ప్రకృతిసౌందర్యాలకు ఆలవాలమే! కుమరకోమ్‌ (కుమరగొమ్‌ అంటారు స్థానికులు) లో నౌకాగృహాల్లో ఉప్పునీటికాలువల్లో (backwaters) విహారం, కొచ్చిన్‌ నగరంలో మరైన్‌డ్రైవ్‌, హార్బరు, బేకాల్‌, కోవలం, త్రిచూర్ సమీపం లోని చవక్కాడ్‌ బీచిలూ, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి ఆలయం, శబరిమల అన్నీ అద్భుతమైనవే! అష్టముడి లో పడవల పోటీలు జగద్విఖ్యాతిమైనవి. ఇక్కడ చెప్పుకోదగ్గది ప్రజల మతసహనం. హిందువులూ, మహమ్మదీయులూ, క్రైస్తవులూ అందరూ సమపాళ్ళలోనే ఉన్నట్టుంది ఇక్కడ. ఎప్పుడూ ఎలాంటి మతకలహాలూ జరిగినట్టు వినలేదు.  మన ఆలయాలను మించిపోయేలా ఉన్నాయి ఇక్కడి చర్చిలు. ఇక్కడి చర్చిల్లో చాలావాటిలో మన ఆలయాల్లోలాగే ధ్వజస్థంభాలుండడం విచిత్రంగా తోచింది నాకు.

కష్టపడి పనిచెయ్యడం ఎలాగో తెలిసిన వారు కేరళీయులు. మనదేశంలోనే కాదు, ప్రపంచం లో ఏ మూల చూసినా కనీసం ఒక్కడైనా ఈ ప్రదేశానికి చెందిన వ్యక్తి ఉంటాడు.  నేను చూసిన దాన్నిబట్టి చెప్పాలంటే, ఇక్కడి ప్రజలు అత్యధికభాగం ధనసంపన్నులు. కుటుంబానికి ఒకరైనా విదేశాల్లో ఉండి సంపాదించేవారే! ఎక్కువమంది మధ్యప్రాచ్య దేశాల్లో (Gulf countries) ఉన్నారు.  అందుకే అక్కడి గ్రామాలూ పట్టణాలూ చక్కటి ఇళ్ళతోనూ, విశాలమైన రోడ్లతోనూ చూడముచ్చటగా ఉన్నాయి. విద్యావంతులు అత్యధికంగా ఉన్నరాష్ట్రం కాబట్టి సంపాదించిన ధనాన్ని తమ ఇళ్ళనూ, ఊళ్ళనూ, రాష్ట్రాన్నీ అభివృధ్ధిపథం లో నడుపుకోడానికి సక్రమ పధ్ధతిలో ఉపయోగించుకుంటున్నారు.

***

విశ్వనాథ షట్పదీ శింజానం ” మ్రోయు తుమ్మెద “

                                                                                శివరామకృష్ణ

 

sivaramakrishnaఒక ఉపాసకుడైన నవలాకారుడు తాను కూడా ఒక పాత్రగా మారి, తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి జీవితాన్నే కథావస్తువుగా తీసుకొని నవల రాస్తే ఎలాఉంటుంది? ఆ రచయిత కూడా విశ్వనాథవారి వంటి ఉన్నతశ్రేణి రచయిత ఐతే ఇంకెలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబే విశ్వనాథ సత్యనారాయణ గారి మ్రోయు తుమ్మెద నవల.

 పురిటిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడు తనకు భూమిమీద నూకలున్న కారణంవల్ల సంతానంలేని ఒక సామాన్య కుటుంబానికి చెందిన దంపతులకు అడవిలో దొరుకుతాడు.  అతనికి జన్మత: మధురమైన కంఠం, అందరినీ సమ్మోహితులను చేయగల స్వరజ్ఞానం ఉంటాయి. బాల్యం లో నీలకంఠం అనే బైరాగి, తరువాత కూచిపూడి భాగవతుడైన వెంపటి వెంకట నారాయణ గారు అతనికి సంగీతంపై అనురక్తి పెరిగేలా చేస్తారు. అప్పటికి అతనికి రాగాలు, వాటి లక్షణాలూ తెలియకపోయినా, శ్రావ్యత అంటే ఇలావుంటుంది అనేలా పాడేవాడు.

ఒకనాడు వెంకటనారాయణగారు అతనికి  శాంతము లేక సౌఖ్యము లేదు అనే త్యాగరాజ కీర్తన వినిపించి, శాంతరసాన్ని ”పిల్లవాని జీవశక్తిలో ప్రవేశ పెట్టెను. ఆ కీర్తనయొక్క యర్థమా పిల్లవాని ప్రాణములో జొచ్చెను. జీవశక్తిలో నాడెను. అతని భవిష్యజ్జీవితమునంతయు పాలించుటకు, నాతని యాయుర్దాయమునకు భంగము లేకుండ జేసెను. ”

ఐతే పిల్లవాని తండ్రికి మాత్రం అతడు బాగా చదువుకొని ఉద్యోగంచెయ్యాలని కోరిక. కాని బాలుడు మాత్రంపాటలు పాడుకుంటూ, ఆ వూరికి వచ్చిన ఉత్తరదేశానికి చెందిన నాటకబృందంవారివద్ద హిందుస్తానీ సంగీతాన్ని మొదటిసారి విని, దాని పట్ల మక్కువ పెంచుకుంటాడు. జీవితమంటే సంగీతమనే భావం ఆ దశలో అతనికి కలుగుతుంది. “తాను జన్మించినది పరీక్షలందుత్తీర్ణుడై సంపాదించి చివరకు చనిపోవుటకు మాత్రము కాదు. మరి దేనికి జన్మించినాడు? తాను గాయకుడు అని తాననుకొనినప్పుడెల్ల తనకే నవ్వు వచ్చును. ఏ రాగము యొక్క స్వరూపమెట్టిదో తెలియదు.  తానెవ్వరి యొద్దనూ శుశ్రూష చేయలేదు. మహా విద్వాంసులతో పరిచయము లేదు. కాని తాను పాడుచుండగా వినుచున్నవాడెల్ల తన్ను గాయకుడనుచున్నాడు. దీనిని వదిలిపెట్టి సుఖము గోచరించని లౌకికపు చదువు వెంట పడుట యెందులకు ” అనుకుంటూ ఉంటాడు.

***

ఇంతవరకూ విశ్వనాథ వారు ఆ బాలుడి పేరు చెప్పలేదు. ఇంతవరకే కాదు, 216 వ పేజీ వరకూ చెప్పరు. ఈ నవలను తమ తండ్రిగారు 1960 లో ఈ నవల వ్రాసినట్టు విశ్వనాథ పావనిశాస్త్రి గారు నవల మొదట్లో పేర్కొన్నారు.  ఆ రోజుల్లో కరీంనగర్ పట్టణం లో ఉండే న్యాయవాది, గాయక సార్వభౌముడు నారాయణరావు గారి జీవితాన్ని ఆధారం చేసుకొని రాసిన నవల ఇది. విశ్వనాథవారు నిజజీవిత వ్యక్తుల జీవితాల్ని ఇలా నవలీకరించడం పరిపాటే! ముంజులూరి క్రిష్ణారావు అనే నటుడి కథను ‘ తెరచిరాజు ‘ నవలగా రాయగా, భావకవి నాయని సుబ్బారావు గారిని వేయిపడల్లోని కిరీటి పాత్రగా మలచారు.

 

కరీంనగర్ పరిసరాల్లో మ్రోయు తుమ్మెద అనే వాగు ఉన్నదట. దాని ప్రవాహపు సవ్వడి తుమ్మెద మ్రోతని పోలి ఉంటుందట.  ఆ మ్రోతని, దాని సమీపం లోనే  పుట్టిపెరిగిన ఈ సంగీతసార్వభౌముడి గళధర్మాన్నీ ముడిపెట్టి ఈ నవలకి మ్రోయుతుమ్మెద అని పేరుపెట్టారు విశ్వనాథ.  నవలలో నాయకుడిని తుమ్మెద అనే పిలుస్తారు విశ్వనాథ

***

పెంచిన తల్లిదండ్రులు తుమ్మెదకి వివాహం చేసారు. ఈ దశలో అతనికి హైదరాబాదు వెళ్ళి పై చదువులు చదువుకోవాలనిపిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి అక్కడికి వెడతాడు. తుమ్మెద బస్సెక్కి హైదరాబాదు వెళ్ళడాన్ని మనోహరంగా వర్ణిస్తారు విశ్వనాథ. దారిలో షామీరుపేట వద్ద బస్సు చెడిపోవడం, తుమ్మెద బస్సుదిగి పరిసరాల్లోని పొలాల్లో ఆ వెన్నెలరాత్రిలో విహరించడం, అక్కడ అతనికి వినిపించిన పక్షికూతల్లోను, చేలగట్లవెంబడె ఉన్న నీటిబోదెలలోని తరగల సవ్వడుల్లోనూ కలగలిసి ఆతని నోట మధురాతిమధురమైన రాగం పలుకుతుంది.

   హైదరాబాదు చేరిన తుమ్మెద చదువులో రాణిస్తూనే, సంగీతసాధన కూడా చేస్తూ ఉంటాడు. పలువురు సంగీతవిద్వాంసులతో పరిచయం కలుగుతుంది. అతడు చక్కని పాటగాడని విన్న నిజామునవాబు కొడుకు మోఅజ్జంషా అతన్ని మిత్రుడిగా సమ్మానిస్తాడు. తుమ్మెదకి శాస్త్రీయ సంగీతం లో సరైన శిక్షణ లేకపోయినా, అతడు ఏ రాగాన్నైనా, యే గాయకుడు పాడినదాన్నైనా వింటే చాలు, అది అతని నోట అమృతవాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది.  కాలక్రమం లో తుమ్మెద చదువుపై  శ్రధ్ధ పెంచుకుంటాడు.

      కాని కొన్నికారణాలచేత తుమ్మెద హైదరాబాద్ వదిలి నాగపూర్ లో చదువు కొనసాగించడానికి వెడతాడు. అక్కడ కూడా చదువు, సంగీతసాధన కొన సాగుతూనే ఉంటాయి. కొందరు సంగీత విద్వాంసులను చూస్తాడు. వారిగురించి విశ్వనాథ ఇలా అంటారు: ” వారభ్యాసము చేసిన వాటిలో పది పన్నెండు కీర్తనలు, వారు రాచి రంపానపెట్టి, నూరి, లేహ్యము చేసి యుండలు చేసినవి. ఆ కీర్తనలలోనే వారు యథేచ్చగా  విహరింతురు.”  శంకరరావు ప్రవర్తక్ అనే విద్వాంసుడి దగ్గర హిందుస్తానీ సంగీతం లోని మెళుకువలు తెలుసుకుంటాడు. అతని పాట అమృతధునీప్రవాహంలా సాగుతూ ఉంటుంది.  

MroyuTummeda600

అతని పాటకు ముగ్ధుడైన ప్రవర్తక్ ” ఓయి నాయనా! నీవభ్యాసము చేయుచుండగా శతవిధాల సరస్వతీదేవి వచ్చి నీ యెదురుగా కూర్చుండియుండును. సాక్షాత్సరస్వతీదేవి కుసుమించినప్పుడెవ్వడేమి చెప్పగలడు” అంటాడు. క్రమంగా ప్రవర్తక్ వల్ల  సంగీతవిద్యతో పాటు దానికి సంబంధించిన అనేక విషయాలూ, కావ్యపరిచయం అబ్బుతాయి తుమ్మెదకి. సంగీతకచేరీలు, ఆకాశవాణిలో పాడే అవకాశాలూ వచ్చి అతడు మంచి కీర్తితో పాటు జీవికకి అవసరమైన ధనాన్నికూడా సంపాదించుకుంటూ ఉంటాడు. ఐనా, యెప్పటి డబ్బు అప్పుడే ఖర్చైపోయి, “ఆదివారమునాడందలము, సోమవారమునాడు జోలె ” అన్నట్టు ఉంటుంది.

అప్పటికే వివాహమైన తుమ్మెదకి రెండేళ్ళ కొడుకు కూడా ఉంటాడు. చదువుకోసం హైదరాబాదు వెళ్ళినతరువాత అతడు మళ్ళీ అరిపిరాల పోలేదు. బాగా డబ్బూ, పేరూ సంపాదించాకే తిరిగివెళ్ళాలని అతడి ఆలోచన. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే బొంబాయి వెళ్ళి మరింత సంగీతవిద్యను పెంచుకొని, అక్కడ సినిమాల్లో ప్రవేశించి పేరుప్రఖ్యాతులు, వాటితో డబ్బూ పోగుచేసుకోవచ్చు ననుకుంటాడు. బొంబాయి చేరి, అక్కడ తన  గానవిద్య ప్రదర్శించి నలుగురినీ ఆకట్టుకుంటాడు. డబ్బు కూడా బాగానే వస్తూ ఉంటుంది. కొంతకాలానికి మళ్ళీ సంపాదన తగ్గిపోతుంది. కారణం తుమ్మెదకున్న intellectual arrogance.

ఒకసారి ఒక ప్రముఖ గాయకుడితో విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా ఇతని అవిధేయ ప్రవర్తన వల్ల చేజారిపోతుంది. ఇంతలో రెండవప్రపంచ యుధ్ధం వచ్చి, బొంబాయిమీద బాంబుదాడులు జరుగుతాయన్న భయం తోను, భార్యాబిడ్డలు, తల్లిండ్రులపైనా గాలిమళ్ళి స్వగ్రామం చేరుతాడు. అక్కడ తన చిన్నప్పటి గురువు మల్లికార్జునరావుగారి సలహామీద ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడతాడు. ఆ ప్రయత్నంలోనే కొన్నాళ్ళు ఇదివరలో తనను అభిమానించిన నిజాము రాజకుమారుడి దగ్గర ఆంతరంగికుడుగా ఉండి, తన స్వేచ్ఛ కు అది భంగంగా ఉందని తలచి, మానేస్తాడు. తరువాత శ్యామరాజబహద్దరు అనే జాగీర్దారు దగ్గర కొన్నాళ్ళుంటాడు. అనవరంగా ఆయననతో తగవుపెట్టుకొని బయటపపడతాడు. ఆయనన మళ్ళీ పిలిచినా నిరాకరిస్తాడు. “ఈ నిరాకరించుట సిరి రా మోకాలడ్డుట యని యతడికి తెలియును. ఐనా అంతే! ”

మళ్ళీ దేశాటనం! ఈసారి బెంగుళూరు! అక్కడ కూడా తన గాత్రమాధుర్యం తో నలుగురినీ ఆకట్టుకుంటాడు. అక్కడ ఒక వైద్యునికి బాగా దగ్గరౌతాడు. ఆయనదగ్గరికి వచ్చిన కృత్తికోటి స్వామివారు సౌందర్యలహరిలోని ‘అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరీ’ అనే శ్లోకాన్ని నిత్యం జపిస్తూ ఉండమని, శ్రీచక్రార్చన చేయమనీ ఉపదేశిస్తారు. ఆ ఉపదేశాన్ని తుమ్మెద పాటిస్తూ ఉంటాడు.

ఈలోగానే తుమ్మెద తన కుటుంబంపెరుగుతూ ఉండటంతో ఉపాధ్యాయవృత్తి వదిలిపెట్టి, న్యాయవిద్య నభ్యసించి, కరీంనగర్లో న్యాయవాదవృత్తి స్వీకరిస్తాడు. సంపాదన కూడా వృధ్ధిపొందుతుంది.

***

ఇదే సమయంలో మనదేశానికి స్వతంత్ర్యం  వస్తుంది. కొన్నాళ్ళకి కరీంనగర్లో నారాయణరావుకి (తుమ్మెదే, ఇక్కడినించీ విశ్వనాథవారు అతన్ని అసలు పేరుతోనే సంబోధించారు) జువ్వాడి  గౌతమరావు గారు పరిచయంఅవుతారు. ఆయనద్వారా ఆ వూరి కళాశాలకి అధ్యక్షుడు గా వచ్చిన విశ్వనాథ సత్యనారాయణ గారూ పరిచయం అవుతారు.  రోజూ రాత్రి వీరంతా నారాయణరావు ఇంట్లో సమావేశం అవుతూ, అతని సంగీతాన్ని విని ఆనందిస్తూ ఉంటారు. వేములవాడనించి రాధాక్రిష్ణ శాస్త్రి అనే ఆయన వచ్చి తుమ్మెదకి శ్రీచక్రాన్ని ఇచ్చి దాని ఉపాసనాక్రమాన్ని నేర్పుతారు.  కాలక్రమం లో తుమ్మెద అనబడే నారాయణరావు గొప్ప దేవీ ఉపాసకుడై, న్యాయవాదవృత్తి కూడా చేసుకుంటూ సుఖంగా ఉంటాడు.

***

ఈ నవల విశ్వనాథవారి నవలల్లో అగ్రేసరాలని చెప్పదగ్గ వాటిలో ఒకటి అని నా అభిప్రాయం.  అప్పటికి సజీవుడై ఉన్న ఒక మహా కళారాధకుడి జీవితాన్ని ఒక కథగా నవలీకరించడం మాటలు కాదు. అందులో తాను కూడా ఒక పాత్రగా ఉండడం కూడా అబ్బురపరిచేదే! తనకు కథానాయకుడితో గల పరిచయాన్ని ఇది తెలియచేస్తుంది.

నవల ఆరంభం లోని ” శ్రీవాణీగిరిజా సమష్ఠి రూపమైన యొక శక్తి అనంతాకాశమున అణ్వణ్వంతర సూక్ష్మవియత్సమ్మర్ద క్లిష్టముగా నున్న యొక వేళ, నెగువనున్న యొక గుట్టపై చక్కగా క్రమ్మికొనియున్న  జాజిమొగడలలోని కింజల్కముల తావికి తాత్కాలికముగా దూరమై పశ్చిమాభిముఖముగా దవ్వునగల మాఘ్యవనీపరీమళాశాగత ప్రసార రమణీయముగా  తెల్లనిరెక్కలుజాచి నేలపారుగా నిస్తులాపురమునకు ప్రక్కగా నెగురుచున్న యొక తుమ్మెద అరిపిరాల వచ్చి, హైదరాబాదు పోయి, నాగపురమున విహరించి, బొంబాయిలో తన కంఠనాదమునందు విద్వత్తునలవరించుకొని అటునిటు తిరిగి మరల నరిపిరాల చేరినది” అన్న వాక్యాలనే అంతంలో కూడా చెబుతారు. దీనివల్ల నారాయణరావు జీవితం ఒక చక్రం లా ఎలా పరిభ్రమణం చెందిందో చెప్పినట్టయింది.

 అరిపిరాలకు సమీపం లో ఉన్న వాగు పేరు మ్రోయు తుమ్మెద. దాని అలలసవ్వడి తుమ్మెదరొదలా ఉంటుందట.  ఆ సమీపం లోనే పుట్టిపెరిగిన నారాయణరావు జీవితమంతా సంగీత సాధన లోనె తుమ్మెదఝంకారం లా సాగుతుంది. ఆ వాగుకీ, ఇతని జీవితానికీ సామ్యం ఈ నిరంతర జుంజుంరావమే!    

    ఇక ఈ నవలలో మనకి ప్రముఖం గా కనిపించేది కవిసమ్రాట్టు యొక్క సంగీతవిద్యాపరిజ్ఞానం. రాగాలూ, వాటి లక్షణాలూ, స్తాయీభేదాలూ, ఒక స్వరాన్ని మారిస్తే యే రాగం ఎలా మరోరాగం గా ధ్వనిస్తుందో అన్నీ చదువరికి ఆశ్చర్యం కలిగేలా చెబుతారు. ఈ నవల చదివిన వారికి విశ్వనాథవారికి ఈ భూమండలం లో తెలియని విషయం లేదేమో ననిపిస్తుంది.  చివరంచులు లేని విస్తృతి ఆయన జ్ఞానసాగరానిది. ఈయన ఇన్ని విషయాలు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారా అనిపిస్తుంది.  

విశ్వనాథవారి నవలలన్నింటిలోనూ స్థూలం గా చూసే చదువరులకి పేజీలకొద్దీ చర్చలు కనిపిస్తాయి. కానీ సూక్ష్మంగా చూస్తే వాటన్న్నింటికీ కథతో ఏదో ముడి ఉంటుంది. నేనేది రాసినా తెలిసే రాస్తాను అని ఆయన అన్నదే1

ఈ నవలలో కూడా అటువంటివి చాలానే ఉన్నాయి. మచ్చుకి కొన్ని చూద్దాం:

శాస్త్రంఅంటే యేమిటోచెబుతున్నారు: “లోకమునందున్న విషయములను పరిశీలించి, విభజించి, వానియందు రసభావములెచ్చటనుండునో నిర్ణయించి, ఆ రసభావములు ప్రకటితములగుటకు నే మార్గము నవలంబించవలెనో యా మార్గమును నిరూపించి బోధించునది శాస్త్రము.”

మరో చోట మతానికి ప్రాణభూతమైనది శమాది షట్కము. అది లేని మతము మతము కాదు అంటారు. నిజమేగా!

“కవులకు ఊహలు సమృధ్ధిగా గలుగుటకు మన వేదశాస్త్ర  పురాణేతిహాసములందు ననంతములైన వస్తువులు కలవు. కవితాదరిద్రులు మన భాషల నాశ్రయించినచో కవితాసముద్రులగుదురు. ”

కథానాయకుడైన తుమ్మెదను ఒకచోట ఇలా వర్ణిస్తారు విశ్వనాథ వారు:

” అది యొక  పుష్పితోద్యానము! జాజులు, మల్లెలు, పొగడలు, మావులు, తంగెళ్ళు, అవిసెలు పూచియున్నవి. ఒక మదబంభరము జుమ్మని మ్రోయుచు పుష్పోద్యానము నందలి బహు పుష్పముల మీద వ్రాలుచు తన సంచారము చేత పుష్పవనవీధిని పులకితము చేయుచున్నది. ప్రాతర్మందమలయానిలములు వీచుచున్నవి. తోట నడిభాగమున దీర్ఘిక కలదు. దానిలో కపిలను తోలుచున్నారు. కపిలత్రాడు-బరువుగల నీటిబాన పైకి వచ్చునప్పుడు క్రొత్త కట్టె నొరసికొని బొంయి మని ధ్వనిచేయుచున్నది. నీరు తూములోనికి జొచ్చి ప్రక్కకు మరలి బిల్లుమని పోవుచున్నది. చిన్నపిట్ట యేదో యాకాశమున కూయుచున్నది… అట్టి సుందరమైన బాలాతప విహారభూమియైన పూదోటలో సంచరించుచున్న తుమ్మెదవలె నాతడున్నాడు.”

తుమ్మెద ఒకసారి వరంగల్లు కోటను చూడడానికి వెడతాడు. ఆ కోటను చూసేక అతడికి ఆ “దుర్గము సంగీతశాస్త్ర పధ్ధతి మీద నిర్మించినట్లనిపించెను. సంగీతశాస్త్రము సప్తస్వరముల మీద నిర్మింపబడినది. ఓరుగల్లు రాజ్యము సప్తప్రాకారముల మీద నిలువబడెను. కాకతీయప్రభువుల సంఖ్య యేడు. అదియును సప్తస్వరములకు సంబంధించినదే! సహస్ర మంటప నిర్మాణము కూడ సంగీతశాస్త్రము మీదనే నిర్మించబడినది. ఇప్పటికిని జూడవచ్చును, ఏడేడు స్తంభములు గుంపుగా నిర్మించబడిన కట్టడమది. ”

విశ్వనాథవారు ఎక్క డో ఒకచోట మన చదువుల ఔన్నత్యాన్నీ, పాశ్చాత్య విద్య లోని డొల్లతనాన్నీ యెత్తిచూపుతూనే ఉంటారు. ఈ నవలలో ” కడుపున కన్నతల్లి విస్తరిలో నన్నము వడ్డించుచున్నది. పూటకూటింటి యమ్మయు వడ్డించుచున్నది. ఈ రెండు భోజనములకును భేదమున్నదందువా, లేదందువా? ఇది మన చదువయ్యా, మన చదువు! మన ఇంటిలో మనము తినుచున్న యన్నము, వారి ఇంట తినుచున్న యన్నము నొకటి కావు. మనము చదువుచున్న వారి చదువు యెట్టిది? పూటకూటింటి తిండి వంటిది. ఆకలియగుచున్నది కనుక తినుటయే కాని, యది మన యిల్లా? మన కచ్చట స్వేచ్చయున్నదా? ”

ఇక ఈ నవలలోని చివరి అధ్యాయం నవలంతటికీ మకుటాయమానంగా ఉంటుంది. అప్పటికే సిధ్ధసంకల్పుడైన నారాయణరావును మ్రోయు తుమ్మెదతో పోలుస్తూ విశ్వనాథవారు ఇలా రాస్తారు:

” (తుమ్మెద సేకరించిన మధుకణములు) సర్వరోగహర మధురరాగ సంభరితములై, సర్వరక్షాకర మధురనినాద మేదురములై, సర్వార్థసాధక మంత్రాక్షర సముద్గీర్ణములై, సర్వసౌభాగ్యదాయకములై, సర్వసంక్షోభణ విచిత్రారోహణావరోహణ సంచాలన క్షమములై, సర్వాశాపరిపూరకములై త్రైలోక్యమోహనములై విరాజిల్లుచున్నవి. ”

“దాని సవ్వడి ఒకప్పుడు సకార హకారములుగా మారి ‘సోహం’ అన్న పధ్ధతిగా కనిపించును. ఉచ్చ్వాసము సకారమై, నిశ్వాసము హకారమై హంసాకృతి నవలంబించుచుండెను. ఇదియే అజపా గాయత్రి. ఈ తుమ్మెదయొక్క మ్రోత నిరంత కృతోచ్చ్వాస నిశ్వాసరూపపరిణతాజపాగాయత్రి రూపమున కూడ ప్రవర్తిల్లుచుండెను.”

నారాయణరావు శ్రీచక్రార్చకుడయ్యాడు. అతని ఉపాసన పరిపక్వస్థితిని చేరుతుంది. అతడొక మ్రోయు తుమ్మెద. “ఆ బంభరము ఆ తల్లినుపాసించుచున్నది. ఆమెను స్తోత్రము సేయుచుండును. తన యుచ్చ్వాసనిశ్వాసములనామెకు సమర్పించుచుండును” అంటారు విశ్వనాథ. ” మ్రోయు తుమ్మెద యొక్క మధురరావము దేవీచరణకమల మధువన విహారి బంభరారావముగా, మధుర యామినీ సంచరదనిల నవనవాధ్వానములు పులకింపజేయుచున్నవి”  అని ముగిస్తారు విశ్వనాథ వారు.  రచయితకి తనపాత్రల మీద ఉండే మమకారమంతా విశ్వనాథవారికి తుమ్మెద మీద ఉంది. కనుకే అతడు దేవీచరణమంజీరాలవద్ద కూడా వాటికి తోడుగా సుస్వరాలు పాడుతున్నట్టు ముగించారు.

ఇది రచయిత ముందు రక్తమాంసాలతో నడిచిన మనిషి జీవితం కాబట్టి మానవుడి జీవితం లోని సహజమైన విరుధ్ధ భావాలన్నింటినీ మనం తుమ్మెదలో చూడవచ్చు. ముందు సంగీతమే ప్రాణం అనుకోవడం, తరువాత కుటుంబం కోసం ధనాన్ని అధికం గా సంపాదించాలనుకోవడం, కోపతాపాలకు గురవడం, అనవసరమైన పట్టుదలకిపోయి అందిన అవకాశాలు దూరం చేసుకోవడం వంటి గుణాలన్నీ అతనిలో చూస్తాం. ఐనా అతని జీవలక్షణం లో శాంతగుణాన్ని వెంపటి వెంకటనారాయణ గారు బాల్యం లోనే బలంగా నాటారు. చివరికి అదే అతనికి దారి చూపించింది, పురాకృతపుణ్యఫలం అతన్ని గొప్ప ఉపాసకుడిని చేసి దేవీకటాక్షానికి దగ్గరచేసింది.

     ఈ నవలలో విశ్వనాథవారు తన పుత్రవియోగ దుర్భరదశను, తరువాత మధ్యాక్కరలు శివార్పణంగా రాయడాన్నీ కూడా చెప్పారు. ” ఆంధ్ర సారస్వత ప్రక్రియ దేశమునందు మారిపోయినది. పూర్వపధ్ధతియందభిమానము తగ్గినది. తగ్గనిచో నా క్రొత్త మార్గము కొన్నియేండ్లు గడచిన తరువాత సమాదరింపబడును….నా మార్గమునకు కాలముమీద నంగీకృతి కలుగును” అంటారు. అది ఇప్పుడు ఆయన రచనలపట్ల నిజమౌతున్నది.

మ్రోయుతుమ్మెద నవల నిజంగా విశ్వనాథ అనే తుమ్మెద చేసిన మధురమంజుల జుంజుంరావమే!

   ***

శిశిరానికేం తొందర?

winter_rainbow_by_annmariebone-d89tjoe

నా తోటకి హేమంతం వచ్చేసింది
నిన్నటిదాకా హరితఛత్రాన్ని ధరించిన
నా ఆశల తరువులన్నీ
పసుపుదుప్పటీ కప్పుకుంటున్నాయి,
రేపో మాపో ఆకురాల్చడం మొదలైపోతుంది
నా తోటంతా రక్తమాంసాలు కోల్పోయిన
అస్థిపంజరంలా కళావిహీనమవుతుంది!

ఓ కాలమా, తొందర పడకు!
నా సుందర వనాన్ని వివస్త్రను చెయ్యకు!
ఋతుధర్మాన్ని పాటించక తప్పదంటావా?
ఐతే, ఇదిగో, మా మనుషులం తీసుకొనే
అలసత్వపు మందు!
కొంచెం సేవించి రోజుకో ఆకుని మాత్రం రాల్చు!
ఎందుకంటే,
ఈ పత్రసంచయమంతా నా ఆశలకు ప్రతీకలు!
వాటి ఉనికే నా సాఫల్యానికి ఆయువుపట్టు
నిత్యవసంతాన్నే కోరుకుంటూ
నా చెట్లకిందే నేనెన్నో కలల ఇంద్రధనుస్సులపైకెక్కి
నాట్యంచేస్తుంటాను!

నా స్వప్నాలని శీర్ణంచేసే శిశిరాన్ని
నా తోటకి ఆవలే
ప్రతీక్షచేయమను!

-శివరామకృష్ణ

sivaramakrishna