నే రాసేది సమకాలీన కథ అన్న భ్రమ లేదు : శ్రీరమణ

saaranga2‘మిథునం’ శ్రీరమణగారు అమెరికా పర్యటిస్తూ మా వూళ్ళో (డెట్రాయిట్) కూడా నాలుగు రోజులున్నారు. మూడు పూటల పాటు ఆయనతో గడిపి తీరిగ్గా సంభాషించే అవకాశం చిక్కింది. ఎలాగూ మాట్లాడుకుంటారు కదా, ఆ మాట్లాడుకున్నదాన్ని ‘సారంగ’కి రాసివ్వమని అఫ్సర్ గారి ఆదేశం. రాస్తామన్న స్పృహ మనసులో ఉన్నా, జరిగింది సంభాషణే కానీ ఇంటర్వ్యూ కాదు. శ్రీరమణ గారిని ఎవరూ ఇంటర్వ్యూ చెయ్యలేరు. ఎందుకంటే ఆయన నడిచే అనుభవాల, జ్ఞాపకాల పుట్ట. ఏదో యథాలాపంగా అడిగిన ప్రశ్నకి ఆయన మొదలు పెట్టిన జవాబు అరగంట తరవాత ఎక్కడో తేలుతుంది. శ్రీరమణగారితో కాస్త తీరిగ్గా సంభాషించిన వారికెవరికైనా ఇది అనుభవమే. ఇంతకీ ఇంత సుదీర్ఘమైన ముందు మాట ఎందుకంటే ముందస్తుగానే కొన్ని షరాలు చెప్పుకుంటే మంచిదని. అంచెలంచెలుగా సాగిన తీరిక సంభాషణని పత్రిక కోసమని ఇంటర్వ్యూ రూపంలోకి కుదిస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఆయన మాటల్ని శుకానువాదం చెయ్యడమే తప్ప మొదలంటా మార్చకుండ ఉండడానికి నా యథాశక్తి ప్రయత్నించాను. ఓపిగ్గా నాతో మాట్లాడినందుకు శ్రీరమణగారికీ, ఈ ఎసైన్మెంటు నా నెత్తికెత్తినందుకు అఫ్సర్‌కీ ధన్యవాదాలు.

Q 1970లలోనే అంధ్రజ్యోతిలో ఫీచర్లతో బాగా పేరు తెచ్చుకున్నారు, పుస్తకాలు కూడా వేశారు కదా, ఒక కథ బయటికి రావడానికి ఇంత సమయం పట్టిందేం?

ఫీచర్లు రాయడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఆలోచనలు, చమక్కులు, భాష – ఇలా రచనకి అవసరమైన శక్తులన్నీ కూడా ఆ ఫీచర్ల మీదనే కేంద్రీకృతమై ఉండేవి. ఆ తరవాత పది పదిహేనేళ్ళు సినిమాల్లో మునిగి తేలాను. ఒక సినిమాకి రాయడమంటే ఒక యాభయ్యో వందో కథలకి కావలసిన సృజన శక్తి ఖర్చవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఇంక కథలు రాయడానికి కుదిరేది కాదు. తీరిక చిక్కలేదు అనడం కంటే, ఆ రాసే శక్తి మిగిలేది కాదు. సినిమాల్లో పని చేస్తున్నప్పుడు కూడా ఫీచర్ ‘కాలం’ రాస్తూనే ఉండేవాణ్ణి. రంగుల రాట్నం (అంధ్రజ్యోతిలో రాసిన వ్యంగ్య రచనల శీర్షిక, పుస్తకంగా వచ్చింది) చూస్తే, అందులో ఒక్కో రచనా ఒక్కో కథ కావచ్చు. కథగా రాస్తే పది పన్నెండు పేజీలు వచ్చే మెటీరియల్ ని ఒకట్రెండు పేజీల కాలంలోకి కుదిస్తున్నామంటే ఒక విధంగా ఆ కథని శేక్రిఫైస్ చెయ్యడమే. కానీ ఆ పేరిట ‘కాలమ్’కి మంచి పేరొచ్చింది. తరవాత ఎప్పుడైనా ఆ పాయింటు ఒకటి తీసుకుని కథగా రాస్తే, చూడు, తన కథనే మళ్ళీ రీసైకిల్ చేస్తున్నాడు అంటారు.

Qఅలా కథ అనే రూపంలో రాయడానికి వీల్లేకుండా పోయిందన్న మాట. మరి ఈ కథలు ఎలా రూపు దిద్దుకున్నాయి?

అంటే, 90లలో కొద్దిగా గేప్ వచ్చింది. అలా మొదట బంగారు మురుగు రాశాను. ఆ రోజుల్లో ఇండియాటుడే తెలుగు పత్రిక వాళ్ళు సక్రమంగా తెలుగు కథల్ని ప్రచురిస్తూ ఉండేవారు. వాళ్ళు అడగడం మీదట, ఆ వొరవడిలో ఈ అయిదారు కథలు రాశాను. ఎప్పుడైనా, ఎవరన్నా అడిగితేనే రాయడం.
అదీ కాకుండా, నా కథలని గురించి నాకో దృష్టి ఉంది. అవేవీ కొద్ది రోజుల ఇతివృత్తాలతో నడిచేవి కాదు. బంగారు మురుగు ఉందంటే ఆ అబ్బాయి పుటకల నించీ అతని పెళ్ళిదాకా అంటే పాతిక ముప్పయ్యేళ్ళ కథ. మిథునం అయితే సుమారు అరవయ్యేళ్ళ కథ. కథలో దృశ్యం చిన్నదే అయినా, అక్కడ బుచ్చిలక్ష్మీ దాసు, వాళ్ళ పెళ్ళిలో పల్లకీలో ఊరేగడం గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇక్కడ రచయితగా నేను ఆ కాలంలోకి వెళ్ళిపోవాలి. ఆ రోజుల్లో పల్లకీ ఊరేగింపు అంటే అక్కడ ఏమేం ఉండేవి, ఎలా ఉండేది వాతావరణం అంతా .. అది జాగ్రత్తగా పట్టుకోలేక పోతే, ఇంత కథా ఒక లిటరరీ జోకై కూర్చుంటుంది. పైగా, పత్రికలో ఉద్యోగం రీత్యా వందలకొద్దీ కథలు చదివే వాళ్ళం కాబట్టీ, ఆ రోజుల్లో రావిశాస్త్రి, కాళీపట్నం లాంటి మహామహులు రాస్తూండేవారు కాబట్టీ, మనం కూడా కథ అంటూ రాస్తే అది ఒక స్థాయికి తగ్గ కూడదు. నిలబడేలా ఉండాలి, పేరు నిలబెట్టేలా ఉండాలి అని ఒక పట్టుదల. కథ ఎత్తుగడ కానీ, పాత్ర చిత్రణ కానీ, భాష కానీ సజీవంగా ఉండాలి. ఇదిగో ఇలాంటి పట్టుదల వల్ల మునుపు రాయలేదు. ఇప్పుడైనా రాసింది ఆ గుప్పెడే కథలు.

Q బాగా పేరు తెచ్చుకున్న మీ కథలన్నీ – మిథునం, ధనలక్ష్మి, బంగారు మురుగు – అన్నీ గతాన్ని ఆధారంగా చేసుకున్నవే. ఎందుకలాగ?

నేనేదో కాంటెంపరరీ కథని, ఈ నాటి, ఈ కాలపు కథని రాస్తున్నాననే భ్రమ నాకెప్పుడూ లేదు. నేను నా చిన్నప్పటి విషయాలే, అంటే యాభయ్యేళ్ళ కిందటి విషయాలే రాస్తున్నాననే విషయం నాకు బాగా తెలుసు. అంటే, ఆ కాలంలోనే బతకమనీ కాదు, అది గొప్పది – ఇది చెడ్డది అని కాదు. అప్పట్లో ఉన్న జీవితం కనుమరుగై పోయింది. ఆ రోజుల్లో ప్రసిద్ధంగా రాసిన రచయితలు ఈ విషయాల్ని పట్టించుకోలేదు. వాళ్ళు వేరే ఇతివృత్తాలతో రాశారు. నేను దగ్గరగా చూసి అనుభవించిన జీవితాన్ని వాళ్ళెవరూ రాయలేదు. ఐతే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జీవనవిధానం, అప్పటి పరిస్థితులూ, అలాంటి మనుషులూ – ఇప్పుడు మాయమై పోయినాయి గనక వాటిని తలుచుకోవడం, రికార్డు చేసుకోవడం ముఖ్యమని నాకు తోచింది. ఆ తలుచుకోవడమే ప్రయోజనం. కొన్నేళ్ళ కిందట జీవితం ఇలా ఉండేది, మనుషులు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పుకోవడమే ప్రయోజనం. అది జరిగితే చాలు.

Q కాసేపు ప్రత్యేకంగా మిథునం గురించి మాట్లాడుకుందాం.
తెలుగు కథల్లో కనీ వినీ ఎరుగని ప్రజాదరణ పొందింది కదా ఈ కథ. ఐతే దీని మీద వ్యాఖ్యానాలు, విమర్శలు కూడా చాలానే వచ్చాయి. ఏముంది ఇందులో తిండియావ ఉన్న ఒక బ్రాహ్మడి కథ అన్నారు, బ్రాహ్మినిక్ కల్చర్ని గ్లోరిఫై చేస్తోంది అన్నారు. దానితో కొంత ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళేమో ఇది మన అమ్మానాన్నల, లేదా తాతా బామ్మల ప్రేమ కథ అనుకున్నారు. మీ దృష్టిలో, ఈ కథలో ఈ పై పై విషయాలని దాటి లోతైన తాత్త్విక విషయం ఏమన్నా ఉన్నదా?
తప్పకుండా ఉన్నది. బ్రాహ్మడి కథ, బ్రాహ్మినిక్ కల్చర్ అంటే, మరి నేను ఎరిగిన వాతావరణం అది. ఏ రచయిత అయినా వాళ్ళకి గాఢంగా తెలిసిన విషయాన్ని రాయాలి తప్ప, తెలిసీ తెలియని విషయాన్ని రాయబూనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది. నాకు గాఢంగా లోతుగా అనుభవమైనదే నేనా కథలో రాశాను. ఇక తాత్త్విక చింతన అంటే .. మన సాంప్రదాయంలో దాంపత్యాన్ని గురించిన ఒక కామెంటరీ. మన దాంపత్యమనే కాదు, చాలా కాలం జంటగా ఉన్న ఏ దంపతులైనా .. వయసులో ఉన్నప్పుడు ఒక ఆకర్షణ, మోహం, అటుపైన సంసార బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ తీరిపోయాక ఒక స్నేహం, ఒక ఆప్యాయత, ఒక కంపేనియన్షిప్ మిగులుతాయి. ప్రధానంగా చెప్పాలనుకున్నది ఇది.
ఈ కథ ఎన్నో భారతీయ భాషల్లోకీ కొన్ని పాశ్చాత్య భాషల్లోకీ అనువదించబడింది. అలా ఢిల్లో జరిగిన ఒక సదస్సులో ఒక జర్మనీ ఆయనతో సంభాషిస్తుంటే ఆయనన్నాడూ – ఆ దంపతుల చేష్టలు, రహస్యాలు అన్నీ రాశారు కదా, వారి సెక్స్ లైఫుని గురించి కూడా రాయవలసిందీ అని. అంటే నేనన్నానూ – మా సాంప్రదాయంలో అదసలు మర్యాద కాదు. అదలా ఉండగా ఇక్కడా కథలో అసలు విషయం వారిద్దరి మధ్యనా మిగిలింది ఆ స్నేహం అని చెప్పడమే. ఆ స్నేహానికి పునాది వారు గడిపిన యాభై అరవయ్యేళ్ళ జీవితం. అంతేకానీ వేరే కోరికలేమీ లేవు.
Q అంటే, ఒక విధంగా చూస్తే, పెళ్ళిలో చేసే ప్రమాణాలు .. ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతి చరామి; సఖా సప్తపదీ భవ – ఇలా పరస్పరం చేసుకున్న ప్రమాణలని చివరిదాకా పాటించడం.
కరక్ట్. వాళ్ళ మధ్యలో నడిచే వ్యవహారం అంతా .. పోట్లాడుకోవడం ఒక టైం పాస్. పాత విషయాలని గురించి దెప్పి పొడుచుకోవడం ఆ పాత విషయాల్ని గుర్తు చేసుకోవడం. అలా షేర్ చేసుకుంటున్నారు, మళ్ళీ కాసేపు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అలాగే ఇదంతా చూస్తున్న ఆ మేనల్లుడూ పిల్లవాడు – వాడో పది పన్నెండేళ్ళ పిల్లవాడు. అంటే వయసులో చూస్తే అప్పాదాసు మనవళ్ళ తోటివాడు. ఆ పిల్లవాడు వీళ్ళిద్దరి జీవితాన్నీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అంటే .. దీనికి సూచనలు కూడా కథలో స్పష్టంగా ఉన్నై .. వాడూ ఆవు పాలు ఇవ్వడానికని రెండు పూటలా వాళ్ళింటికి వస్తూ ఉన్నాడు, అప్పాదాసు వాణ్ణి పట్టుకుని ఏరా నేను మా లేడీసుకి జడేశానని నువ్వు ఊళ్ళో చెబుతున్నావా అని గద్దిస్తాడు – ఇవన్నీ ఆ పిల్లవాడు చూస్తున్నాడు. అంటే రేపు వాడూ పెద్దవాడయ్యాక, ఆహా, దాంపత్యమంటే ఇలాగ కూడా ఉంటుందని వాడు తెలుసుకుంటున్నాడు అని నా ఉద్దేశం.
Q ఈ కథని కొంత అకస్మాత్తుగా ముగించేశారు అని మరో విమర్శ విన్నాను. అప్పాదాసు పోతే బుచ్చి లక్ష్మికి దిక్కేవిటి ఇప్పుడు?
ఈ కథని చదివిన చాలా మంది పాఠకులు బహుశ ఆ దంపతుల పిల్లల వయసు వారై ఉంటారు. ఎక్కడో నేటివ్ ప్లేసులో వృద్ధురాలైన తల్లి ఉండిపోయింది అనే ఆలోచన చాలా బాధ కలిగిస్తుంది విడవకుండా.
నిజానికి బుచ్చిలక్ష్మిని గురించి వర్రీ అవాల్సిందేమీ లేదు. ఆమే చెబుతుంది కదా చివర్లో, నాక్కావలసిన వన్నీ మామయ్య నేర్పే వేళ్ళాడురా అని. అదీ కాక కథలో తోటకి ఒక ముఖ్య పాత్ర ఉన్నది. కని పెంచి పెద్ద చేసి సమాజంలోకి పంపేసిన పిల్లలు కాక, ఆ దంపతులిద్దరూ కలిసి సృష్టించిన మరో అద్భుతమైన సృష్టి ఆ తోట. అది వాళ్ళిద్దరి కలిసిన జీవితాల తీపి జ్ఞాపకాలతో నిండి ఉన్నది.
బాగా లోతుకి వెళ్లి చూడాలంటే, వాళ్ళిద్దరూ వేరు వేరుగా కనిపిస్తున్న రూపాలే తప్ప నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే ప్రాణం అనే అద్వైత దృష్టి దీనికి ప్రాణం. నాకు స్వతహాగా ఆ అద్వైతం అంటే చాలా ఇష్టం. అదే ఇక్కడ ఈ రూపంలో దర్శనమిచ్చింది. ఐతే, మన తెలుగు కథల్లో అట్లాంటి బరువైన తాత్త్విక చర్చలూ అవీ ఇమడవు. అక్కడ మనం ఆత్మ పరమాత్మ లాంటి చర్చల్లోకి వెళ్తే కథ పండదు సరిగదా ఏవిటీ చెత్త అని పాఠకుడు పక్కన పెట్టేస్తాడు. ఐతే ఇవన్నీ కాదు. నామట్టుకి నాకు బాగా తృప్తినిచ్చేదేవిటంటే .. ఆ పల్లె జీవితంలో, ఆ రైతు జీవితం నేపథ్యంలో .. నేను రైతు కుటుంబం నించే వచ్చాను. ఆమె పేరంటానికి వెళ్ళి శనగలు పట్టుకొస్తే, ఒక గుప్పెడు శనగలు ఆవుకి తినిపిస్తాడు చేత్తో. తినేసిన ఆవు అతని చేతిని నాకితే ఆ యజమానికి ఎంత తృప్తిగా ఉంటుందో, అతను దాని గంగడోలు దువ్వితే ఆ ఆవుకి ఎంత పరవశంగా ఉంటుందో .. ఇలా నేను నా చిన్నతనంలో చూసి అనుభవించిన విషయాలు రాశాను కథలో. ఆ రాసే సమయానికి నాకీ సంఘటనలు, దృశ్యాలు గుర్తుకొచ్చి, అవి కథలో రాయగలిగానని .. అది నాకు చాలా తృప్తినిచ్చే విషయం. ఇలా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలున్నై. అవన్నీ వదిలేసి .. ఇది కేవలం తిండి గురించే అంటే .. (నవ్వేశారు)
Q ఈ కథలో నేను అని కథ చెబుతున్న కుర్రవాడు బహుశా పది పన్నెండేళ్ళ వాడు. ఇంకా జంఝప్పోగు పళ్ళేదేవిరా అని అప్పదాసు వాణ్ణి గదమాయిస్తాడు. కానీ కథని నేరేట్ చేస్తున్న గొంతు పసి గొంతు కాదు.
అవును. ఆ పిల్లవాడు పెద్దయినాక ఫ్లేష్ బేక్ గా చెబుతున్నాడు అనుకోవచ్చు. ఐతే, కథలో ఉన్నంత మట్టుకు ఆ పిల్లవాడు పిల్లాడిగానే ఉంటాడు తప్ప ఆరిందాగా ఉండడు. అదీ కాక ప్రతి రచయితకీ రచనలో ఒక ఆల్టర్ ఈగో ఉంటుంది. నేను మిత్రులతో వాదిస్తూ ఉంటాను, వాల్మీకి రామాయణంలో వాల్మీకికి ఆల్టర్ ఈగో సీతలో ఉన్నది. ఒక్కోచోట సీత మాట్లాడినప్పుడల్లా, అదిగో వాల్మీకి మాట్లాడిస్తున్నాడూ అనిపిస్తుంది. అలాగే కన్యాశుల్కంలో అప్పారావుగారి ఆల్టర్ ఈగో మధురవాణిలో ఉన్నది. వేయిపడగలులో ధర్మారావు విశ్వనాథవారే.
Q మిథునం కథ ఎందుకింత ప్రాచుర్యం పొందింది అనుకుంటున్నారు?
ఎవరికైనా పోగొట్టుకున్న దానిమీద మోజెక్కువ కదండీ. ఆ కథలో చూపించిన జీవితం ఐపోయింది, ఇప్పుడు లేదు, దొరకదు అనే విషయం గ్రహింపుకొచ్చింది.
Qపెళ్ళి అనే కథలో చాలా గాఢమైన సెటైరు రాశారు. ఆ తరవాత నాయుడిగారి పాలనలోనూ, రెడ్డిగారి పాలనలోనూ, ఏతన్మధ్య తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలోనూ సెటైరుకి చాలా అవకాశాలే ఉండి ఉండాలి. మరో సెటైరు కథ రాలేదేమి?
మళ్ళీ అసమయానికి కాలంస్ రాస్తూ వచ్చాను. ఒకే వ్యవధిలో రెండు మూడు పత్రికలకి కాలమ్స్  రాసిన పరిస్థితికూడా కొన్నాళ్ళు నడిచింది. అందుకని అప్పటి రాజకీయ పరిస్థితుల ముచ్చట్లన్నీ ఆ కాలమ్స్ రాయడంలో ఖర్చయిపోయేయి. ఆయా కాలమ్స్ కి రెగ్యులర్ గా ఫాలో అయిన పాఠకులుండేవారు. వార్తాపత్రికలో పని చెయ్యడం వల్ల అదొక ఎడ్వాంటేజ్ ఉండేది. ఆ న్యూస్ ఐటంకి సంబంధించిన సమాచారం అంతా వార్తా విభాగంలో ఉండేది, ఫొటోలతో సహా. అది తరవాత కాలంకి ముడిసరుకయ్యేది. సంఘటన జరిగిన మరునాడే దాని మీద సెటైరుగా కాలం వచ్చేది. పాఠకులు కూడా అప్పుడే టీవీలో చూసి, పేపర్లో చదివి ఉంటారు కదా .. వెంటనే కాలం రావడంతో త్వరగా దానిలోని వ్యంగ్యంతో కనక్ట్ అవుతుండేవారు. ఆ రోజుల్లో పురాణం గారు (పురాణం సుబ్రహ్మణ్య శర్మ) ఇల్లాలి ముచ్చట్లని కాలం రాశారు, పురాణం సీత పేరుతో. దానికోసమని ఒక ప్రత్యేకంగా ఒక గొంతుని రూపొందించుకుని .. ఇంకా ఫెమినిజం అని సాహిత్య ధోరణిగా రాని రోజుల్లోనే కొన్ని ఫెమినిస్టు ఐడియాలు అక్కడ పరిచయం చేశారు. న్యూసులో ఏదో అమెరికాలో ఎగిరే పళ్ళేలు (ఫ్లయింగ్ సాసర్లు, UFO) అని వచ్చింది. మర్నాడు ఈయన ఎగిరే పెళ్ళాలు అనే పేరిట కాలం రాశారు. ఆ పంచ్‌కీ, సమయస్ఫూర్తికి పాఠకులు సంతోషిస్తారు.
ఆ రోజుల్లో బెజవాడకి ఏదో సర్కసు వచ్చింది. వెంటనే సర్కసు డేరా అని రాశారు. అందులో సర్కసులో కనబడే జంతువులన్నీ ఇంట్లో మనుషులని .. పిల్లలు కోతులనీ, మామగారు సింహమనీ .. ఇలాగు అందర్నీ చెప్పుకొచ్చి, చివరికి నీటియేనుగు (హిప్పోపోటమస్) ఎవరంటే చెప్పనంటుంది – అంటే మొగుడన్న మాట (నవ్వారు). ఇలాగు ఆ సమయానికి పండే కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డులని ఉన్నాయి. ఎవరిద్దరు కలుసుకున్నా తెచ్చుకున్నారా? ఎంత సేపు పట్టింది, ఎంత ఖర్చయింది – ఇవే కబుర్లు. మళ్ళి వాటి చుట్టుతా కొన్ని రూమర్లు. అలాగే ఇప్పుడూ సమ్మర్లో పవర్ కట్. ఇలాంటి విషయాల్లో ఏదైనా ఒక కొత్త పాయింటుని పట్టుకుని రాస్తే .. విషయం అప్పటికే మనుషుల్లో చర్చలో ఉంది కదా అందుకని ఎక్కు పెట్టి ఉన్న విల్లులాగా .. బాణం తగిలించి వదలడమే మనం చెయ్యాల్సింది.
ఇంకోటేవిటంటే హాస్యానికి ఒక లక్షణం ఉన్నది. అంతకు మునుపు నవ్వు అనేది లేని చోట రచయిత నవ్వు పుట్టిస్తాడు. కన్యాశుల్కంతోటే తెలుగు వాళ్ళకి నవ్వడం తెలిసిందన్నారొక పెద్దాయన. అలాగే ఈ వ్యంగ్య రచన, కాలం రాసేటప్పుడు, సాధారణ వ్యవహారాలనించి రచయిత నవ్వు పుట్టిస్తున్నాడు. విసుగు కలిగించే విషయమే, కాలం రూపంలో పాఠకుడికి నవ్వు పుట్టిస్తున్నది. దాంతో పాటే పాఠకుడి అంచనాలు కూడా పెరుగుతాయి. వచ్చే వారం కాలం దీనికంటే బావుంటుందని ఆశిస్తాడు. ఆ అంచనా అందుకో లేకపోతే, ఏవిటి రమణగారూ ఇది వరకు బాగా రాసేవారు అనేస్తాడు. ఒక ఇరవై వారాలు వరసగా రాశాక, అదే స్థాయి మేంటేన్ చెయ్యడం సాధ్యం కాదు.
Q 90లలో తెలుగు కథల వేదిక మీద రాజ్యమేంలింది ప్రధానంగా మూడు విషయాలు – సరళ ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ, అస్తిత్వ వాదాలు. మీరు కథ అంటూ రాసిందే 90ల మధ్యలో మొదలు పెట్టి అసలు ఈ మూడు విషయాలనీ ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు. ఏవిటి దీనర్ధం?
ఈ విషయంలో నాకో కంప్లెయింట్ ఉన్నది. ఉదాహరణకి మిథునాన్నే తీసుకుందాం. ఏవిటి దీనిలో ఉన్న సామాజిక స్పృహ, మెసేజి ఏవిటి అన్నారు. మెసేజి అంటే ఏవిటి, ఆర్ధిక సూత్రాలు చెబితేనో, లేక స్లోగన్లు చెబితేనేనో మెసేజి అవుతుందా? దాంపత్యం అంటే ఇలా ఉండాలి, జీవితాన్ని హాయిగా, ఆనందంగా గడపాలి, ఇలా జీవించవచ్చు అని చెబితే అది మెసేజి కాదా? ఒక boy meets girl ఒక sweet lover story ఎందుకు రాయకూడదు? ఇలా విరసం కానీ, ఇంకో సంఘం కానీ, ఇదే సాహిత్యం, ఇటువంటిదే కథ అని సంకుచితమైన నిర్వచనాలు పెడుతున్నారు. ఎందుకా సంకుచితత్వం?  కాళీపట్నం రామారావుగారు సంకల్పం అనే కథ రాస్తే వీళ్ళంతా చొక్కాలు చించుకున్నారు. ఎందుకుట? అందులో ఒక పాత్ర కాశీకి పోయి గంగలో స్నానం చేసి .. ఇలాంటి తతంగమేదో జరుగుతుంది. రామారావు గారేవిటి, ఇల్లాంటి కథ రాయడమేవిటి అని ఇక్కడ వీరంగాలు. ఆయనేమి పోనీ ఇలా చెయ్యాలని దాన్ని ఎండోర్సు చెయ్యడం కానీ ఏం చెప్పలేదే. కథలో ఒక పాత్ర అలా చేసిందని రాశారు. దానికి పెద్ద అలజడి. వీళ్ళ బుర్రలు తీసుకెళ్ళి చిలక్కొయ్యకి తగిలించేసి, ఎవడో నొక్కే రిమోట్ కంట్రోలుతో కదుల్తూ ఇదే కథ, ఇదే సాహిత్యమని వంత పాడ్డం.
పాఠకుల్ని రీచవ్వాలి, టచ్ చెయ్యాలి. నా మట్టుకి నాకు అది ముఖ్యమైన క్రైటీరియానే. ఏ రూపంగా అయినా కానీ, మిథునం కథ మూడులక్షల ఇరవై వేల కాపీలు సర్క్యులేట్ అయింది. సినిమాగా తీస్తే, మెచ్చుకోడానికి మెచ్చుకున్నారు, డబ్బు కూడా నష్టపోకుండా కొద్దిగా లాభమే వచ్చింది. దాందేవుంది, గడ్డం గీసుకునే బ్లేడు కూడా లక్షల్లో అమ్ముడు పోతుంది, అదొక గొప్పనా అంటారు. తెలుగు సాహిత్యం అచ్చవడం మొదలెట్టాక గయోపాఖ్యానం పద్యనాటకం లక్షకాపీలు అమ్ముడు పోయింది. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ఉదయశ్రీ ఇప్పుడు యాభై నాలుగో ఎడిషను నడుస్తోంది. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా. ఇదే గొప్పది, అది గొప్పది కాదు అనడానికి మనమెవరం? రాయగలిగిన వాడు రాస్తాడు. అది బాగా అమ్ముడు పోతుందో పోదో ముందు రాస్తే గదా? ఇట్లాంటివి రాయకూడదు అంటే . .. ఐదొందల కాపీలు మాత్రమే అమ్ముడుపోయిన చాలా గొప్ప రచనలు ఉన్నాయి. వేలల్లో అమ్ముడు పోయినవీ ఉన్నాయి.
Qరచయితగా తరవాతి అడుగు ఏవిటి మీకు?
రాసినవి పుస్తకాలుగా రావలసిన మెటీరియల్ చాలా ఉంది. ఆ పని కొంత జరుగుతోంది. సి.పి. బ్రౌన్ ఎకాడమీ తరపున కొన్ని మంచి పుస్తకాలు, అనువాదాలు వేశాము. సరే, కథలు రాస్తూనే ఉంటాను. ఉద్యోగపు తొలి రోజుల్లో నండూరి, పురాణం వంటి గొప్ప పాత్రికేయులతో, అటుపైన సినిమాల్లో బాపు రమణలతో కలిసి, సన్నిహితంగా పనిచేసిన అనుభవం. అదీ అదృష్టమంతే. నా జీవితంలో గుర్తు పెట్టుకోదగినది, చెప్పుకోదగినదీ ఏమన్నా ఉందీ అంటే, ఇదే చెప్పుకుంటాను నేను.
ఇంటర్వ్యూ : ఎస్.నారాయణస్వామి

త్యాగయ్య కీర్తన మా గడపలో….!

Sriramana1 (2)నేను నాలుగైదేళ్ల వయసులో వుండగా మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయ ముఖమండపంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని చూశాను. పాట విన్నాను.

అప్పుడు నాగార్జునసాగర్ మలి నిర్మాణ దశలో వుంది. మా అక్కయ్య వాళ్లు మాచర్లలో ఒక మిద్దెలో వుండేవాళ్లు. బావ రోజూ సాగర్ వెళ్లి వస్తూ వుండేవారు. అప్పుడు ఆమె పాడిందో లేదో నాకు తెలియదు.

కాని మెరిసే రాళ్ల దుద్దులు, ముక్కు పుడక, కుంకుమ బొట్టు, నికార్సయిన కంచిపట్టు చీరలో చిగురంత నవ్వులో కర్పూరకళికలా వెలిగిపోవడం మంద్రగించని నా జ్ఞాపకాలలో ఒకటి.

పెద్దవాడిని అయ్యాక ఆమె గురించి, ఎమ్మెస్ సంగీత ప్రజ్ఞ  గురించి కొంత తెలుసుకున్నాను. కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. తమిళ నాటంత కాకపోయినా తెలుగునాట కూడా ఆమెకు గొప్ప ప్రాచుర్యం వుంది.

మళ్లీ చాలా ఏళ్లకు ఎమ్మెస్ గుంటూర్ వచ్చారు. అప్పటికి ఆమె సంగీత సంస్కారలకు ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. ఆమె గుంటూరు రావడం, ఆమె సంగీత గోష్టి జిల్లా వాసులకు మరపురాని మధురానుభూతి అవుతుందని అనుకున్నారు చాలామంది. మరీ ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని సంపూర్తిగా తలమీద వేసుకున్న రవి కళాశాల యజమాని సి.వి.ఎన్.ధన్ (చెన్నావఝుల విశ్వనాధం)  . ఎమ్మెస్ కార్యక్రమానికి లెక్కిస్తే గట్టిగా వందమంది శ్రోతలు కూడా వుంటారని నమ్మకం లేదు. నిర్వాహకులు నీరుకారిపోయారు. కొందరు సంస్కారవంతులు సిగ్గుపడ్డారు. సంగీతజ్ఞులు  బాధపడ్డారు.

ఎమ్మెస్‌కి అది దేవుడిచ్చిన వరమో, సహజంగా అబ్బిన లక్షణమోగాని ఆమె యు.ఎన్.ఓ లో పాడినా, ఆలయ వసంత మండపంలో గళం విప్పినా, కేవలం పదిమందే వున్న గోష్టిలో గానం చేసినా అదే శ్రద్ధ, అదే తన్మయత్వం, అదే ఏకాగ్రత ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. తన కోసం తను పాడుకుంటారు. శ్రోతలు విని ఆనందిస్తారు. కోయిల పాట, నెమలి ఆట యీ కోవకు చెందినవి. ఎమ్మెస్ “కురుంజి ” రాగం అత్యద్భుతంగా పాడతారని ప్రతీతి.

ms

కొన్నాళ్లు గడిచాయి. ప్రముఖ సంగీత విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు విజయవాడ నుంచి తిరువాయూరు వెళుతూ, మద్రాసులో ఒక పూట మా యింటికి విడిది చేశారు. ఎమ్మెస్, సదాశివం దంపతులను కలవాలన్నారు. కర్ణాటక సంగీతంలో ఓలేటి వారిని, పినాకపాణిది ప్రత్యేక వొరవళ్లు.

ఫలానావారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు ఎప్పుడు వీలో చెబుతారా అని ఫోన్ చేశాను. మళ్లీ చెబుతానన్నారు. గంట  తర్వాత ఎమ్మెస్ దంపతులు శివపార్వతుల్లా మా గుమ్మంలో వున్నారు. రెండు పళ్ళు ఓలేటి వారి చేతిలో వుంచి వినమ్రంగా నమస్కరించారు. “మిమ్మల్ని చూడడానికి మేము రావడం మర్యాద” అన్నారు సదాశివం.

ఓలేటి వారి పుణ్యాన త్యాగయ్య కీర్తన “తపమేమి చేసినానో..” మా గడపకి వచ్చినట్లనిపించింది. మేము కొన్ని తరాలు చెప్పుకునే మా అదృష్ట విశేషాలలో యిది మేలు బంతి.

సదాశివం “కల్కి” పత్రికను గొప్ప విలువలతో నడిపేవారు.  ప్రత్యేక సంచికలకు బాపు ముఖచిత్రాలు వేసేవారు. ఆ పత్రిక చాలా డబ్బు హరించింది. కాని వారి గొప్ప నైజాలను గాని, ఎమ్మెస్ ఏకాగ్రతని గాని రేణువంత కూడా హరించలేకపోయాయి. కంచి పరమాచార్య ఆదేశం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అన్నమయ్య పంచరత్నాలు పాడించి రికార్డు చేశారు. దానికి కర్త నాటి తి.తి.దే కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్.కె ప్రసాద్. శ్రీనివాసుడు కానుకగా, పారితోషికంగా చాలా డబ్బు యిచ్చారు.

కాని తమ అనంతరం ఆ డబ్బు శ్రీవారికే చెందేలా  ఎమ్మెస్ దంపతులు ఏర్పాటు చేశారు. “భగవంతుడు గొప్ప గాత్రం  యిచ్చాడు. విద్వత్తు కూడా యిచ్చి వుంటే బావుండేది…” అని విమర్శించిన సంగతి కూడా విన్నాను. అందుకే నాకు ఎమ్మెస్ గానం చేసిన” భజగోవిందం మూఢమతే, మూఢమతే భజగోవిందం” అంటే చాలా ‘యిష్టం.’

 

కలయో! వైష్ణవ మాయయో!

rekklagurram-1ఆయన యింత పని చేస్తారని కలలో కూడా వూహించలేదు.

ఇంతకు ఎవరాయన? ఏమిటా పని?

ఆయన మా తాతగారు.

అంటే మా అమ్మనాన్న..  సంస్కృతంలో మాతామహులు.

నేను మనవణ్ణి. దేవభాషలో దౌహిత్రుణ్ణి. మా తాతగారికి ఆరుగురూ ఆడపిల్లలే. లేటు వయసులో ఆయనకు వంశం నిలుపుకోవాలనే ఆలోచన వచ్చింది. నేను మూడో అమ్మాయి రెండో అబ్బాయిని.వాడిని దత్తత తీసుకొని మీరు అనుకున్నట్టు వంశం నిలుపుకోండని అంతా సలహా యిచ్చారు. నాకు హరిశ్చంద్ర నాటకంలో పద్యం జ్ఞాపకం వచ్చేది. “వంశం నిలపనేకద వివాహము. అట్టి వైవాహిక స్ఫురణ..” అని దీర్ఘంగా సాగేది.

నాకప్పుడు పదహారు వెళ్లి పదిహేడు వచ్చింది గాని డిగ్రీ ఫస్టియర్‌లోంచి సెకండియర్‌లో పడలేదు. మా నాన్నమ్మ ససేమిరా,మాకు మాత్రం ఏనూరుగురున్నారని మా యింటి దీపాన్నివ్వడం,పైగా వాడేమన్నా పనికిమాలినవాడా? అని అడ్డంగా తల ఊపారు.

నాకు మాత్రం వుత్సాహంగానే వుంది. హాయిగా వడ్డించిన విస్తరాకులా ఇల్లూ వాకిలీ, పొలమూ పుట్రా, కాలం చేసిన అమ్మమ్మ నగా నట్రా, నల్లమానుతో చేసిన పందిరి పట్టెమంచం యిలా బోలెడు హంగామాకి యజమానిని అయిపోవడం తమాషా కాదు. పోనీ బరువులెత్తాలా అంటే అదీ లేదు. కాకపోతే వంశం నిలపాలి. మరి కొన్ని హక్కులున్నప్పుడు కొన్ని బాధ్యతలు తప్పవు కదా. దత్తత స్వీకారోత్సవం అయిపోయింది.

చదువు జ్ఞానానికే గాని ధనార్జనకి కాదని నాకు తెలిసిన మరుక్షణం చదువుకి స్వస్తి చెప్పాను. తాతగారు కొన్నాళ్ళుండి వెళ్ళిపోయారు. ఆయన దైవభక్తుడు, దేశభక్తుడు. క్విట్ ఇండియా వుద్యమంలో బంగారం లాంటి వుద్యోగాన్ని,వుద్యోగరీత్యా సంక్రమించిన జట్కాబండిని త్యజించారని చెప్పుకునేవారు. అదేం కాదు ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి పెళ్ళికి ఎదిగి వచ్చారు. అంచేత పుల్‌టైమ్ ఆ పని మీద వుంటేగాని మూడు కన్యాదానాలు సాధ్యం కాదని నౌకరీ వదిలేశారు అని కొందru దగ్గిర వాళ్లనుకోగా విన్నాను. ఎందుకో నాకిదే సమంజసంగా అనిపించింది.

బ్యాంకు లాకర్ అంతా ఖాళీ అయింది గాని, ఒక్క రామకోటి పుస్తకం మాత్రం మిగిలింది. వదిల్తే మళ్లీ అంత పెద్ద లాకర్ దొరకదన్నినీ, స్టేటస్ సింబల్‌గా వుంటుందని దాన్ని మేపుతూ వస్తున్నాను. అమ్మమ్మ కట్టె వంకీ మార్చి అప్పట్లో మా ఆవిడకి రెండు జతల గాజులు చేయించడంతో లాకర్ రామనామంతో మిగిలింది. ఆరోజు నాకు వున్నట్టుండి, లాకర్‌ని వృధాగా మెయిన్‌టెయిన్ చేస్తున్నాననే ఆలోచన వచ్చింది. వెళ్ళి తీశాను.

రామకోటి పుస్తకం అందులో మిగిలిన స్థిరాస్థి. నిరాసక్తంగ పుస్తకం తిప్పాను. ఒక మెరుపు. అందులో ఫిక్సెడ్ డిపాజిట్ బాండ్! దాని ముఖవిలువ లక్షా నలభై వేలు. నలభై ఏళ్ళ క్రితం ఆ బ్యాంకులోనే వేశారు. గడువు తీరి ముప్పై ఏళ్లు దాటింది. నా నుంచి తప్పించుకుంది. దాని విలువ యిప్పుడు పదకొండున్నర లక్షలు దాటింది. నాకు అంతా సినిమా చూస్తున్నట్లుంది.

“మీకు చాలా సార్లు రెన్యూ చేయమన్నాం. కాని తమరు పట్టించుకున్నారు కాదు,” అన్నాడు మేనేజరు. మనం రాసే రిమైండర్లు సారుదాకా వెళ్తాయా?  ఆ గుమస్తాలు చించి పడేసి వుంటారని బ్యాంకు పెద్ద గుమస్తా నాకు దన్నుగా నిలబడ్డాడు.

ఆ బాండ్ మీద అప్పటి  మేనేజర్ సంతకం, మొత్తం ఎంత పేరుకుంది లాంటి లెక్కలు సాగిస్తుండగా ఒకాయన దూసుకు వచ్చాడు. “వడ్డీ మీద టాక్స్ పడకుండా  నే చూసుకుంటాను. మీరలా వుండండి,” అన్నాడు చనువుగా.

“టాక్స్‌లు మర్చిపోవడం మన జన్మహక్కు. మీరెందుకు వర్రీ అవుతారు. నేను కట్టనుగాక కట్టను,” అని అరిచాను.

నాకే కాదు, ఇంటిల్ల్లిపాదికి మెలకువ వచ్చింది..

Image: Mahy  Bezawada 

తాతయ్య వేదాంతం- నా గాలిపటం!

పడమటి ఆకాశం తెల్లటి మబ్బు చారలతో విబూది పట్టెలు పులుముకున్న బైరాగి నుదురులా వుంది. జారిపోతున్న సూరీడు కుంకుమబొట్టులా ఆ పట్టీల నడుమ అమరీ, అమరక, అస్థిమితంగా వున్నాడు. సాయంత్రపు ఆటకు బయలుదేరుతున్న నాకు గొప్ప అదృష్టం ఎగురుతూ వచ్చి  నా  కాళ్లముందు వాలింది. అది అందమైన గాలిపటం!

మిరప్పండు రంగులో వుంది. దానికి తెల్ల తగరపు తోక వుంది. నాలుగు మూలలా మెరుస్తున్న డాబురేకులు మొనలను సూచిస్తున్నాయి. గాలిపటం సూత్రం, దానికి పది మూరల దారం కూడా వుంది.

తెగిన గాలిపటం గాలివాటున మా వాకిట్లో నా ముందు పడింది. అది తెచ్చిపెట్టిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎంతో సుతారంగా దాన్ని రెండు చేతులతో అందుకున్నాను. ఎక్కడా చిన్న చిరుగు కూడా లేదు. దాన్ని  అటూ ఇటూ తిప్పి చూసి గుండెలకు హత్తుకున్నాను. విశాల్‌గాడు, బబ్లూ దీన్ని చూస్తే కుళ్లుకుంటారు.  ఆ ఆలోచన నాకు మరింత ఖుషీ ఇచ్సింది.

నా ఆనందం మనసుకి ఇంకుతుండగానే, “అదిగోరా.. అదిగో,” అంటూ కేకలు వినిపించాయి. నా గుండెలు ఝల్లుమనేలోగా మలుపు తిరిగి ముగ్గురు పిల్లలు పరుగులు, కేకలతో వస్తున్నారు. వాళ్లు ఉత్సాహంతో వెలిగిపోతున్నారు.

ఆ ముగ్గురిలో ఓ ఆడపిల్ల కూడా వుంది. ముగ్గురూ ఏడెనిమిదేళ్లు మించని నా తోటివాళ్లే. నా ఎదురుగా, దగ్గరగా వచ్చి నిలబడి ఆయాసపడుతున్నారు. వాళ్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎక్కడో దూరంగా నక్షత్రం నేలకు దిగినప్పుడు, దాని జాడ పసిగట్టిన జ్ఞానులు నిలువెల్లా ఎలా వెలిగిపోయారో తాతయ్య చెబుతుంటాడు. ఆ బొమ్మలు కూడా నాకు ఎరికే.

ఆ పిల్లకి చొరవ ఎక్కువనుకుంటాను. మాటా మంచి లేకుండానే, నేను రెండు చేతులా హత్తుకున్న రంగుహంగుల గాలిపటాన్ని ఆ అమ్మాయి సున్నితంగా లాగేసుకుంది. రెప్పపాటులో ఆ ముగ్గురూ గాలిపడగతో సహా మలుపు తిరిగి మాయమయ్యారు. నాకందుకే మలుపులంటే చచ్చే భయం!

నేను నీరుకారిపోయాను.  నా కళ్లలో నీళ్లురికాయి. అయినా గాలిపటం స్పష్టంగా నాకు కనిపిస్తూనే వుంది. నిస్పృహగా తిరిగి యింట్లోకి వస్తుంటే తాతయ్య గమనించాడు. నా కళ్లలో తడి గమనించాడు తాతయ్య. ఆయన చూపులో ప్రశ్నని గమనించి  జరిగిందంతా చెప్పాను.

తాతయ్య దగ్గరగా తీసుకొని తన కండువాతో కళ్లు అద్దాడు. “నీకో కథ చెప్పనా” అంటూ మొదలుపెట్టాడు. గోదావరి ఒడ్డున నిలబడి ఒకడు నాలాంటివాడు భోరు భోరున ఏడుస్తున్నాడు. ఆ దారిన వెళ్తున్న ఋషి నీకొచ్చిన కష్టమేమిటని అడిగాడు.

ఏడ్చేవాడు శ్రుతి పెంచి నా వెండి పొన్నుకర్ర గోదాట్లో కొట్టుకుపోయింది. చాలా గొప్ప చేతి కర్ర… మంచి కొయ్య, దాన్నిండా చెక్కుడు పని. పైగా వెండిరేకు తాపడం… నా బంగారు వెండిపొన్ను కర్ర అంటూ ఎక్కిళ్లు పెడుతున్నాడు ఆ నా బోటిగాడు. ఋషి తాత్వికంగా నవ్వి “బిడ్డా! నాలుగుక్షణాల క్రితం నీది కాదు. మూడు క్షణాలు నీ చేతిలో వున్నందుకే యింత రోదన అవసరమా,” అని మొదలుపెట్టి రాజ్యాన్ని, రాణుల్ని పోగొట్టుకున్న రాజుల నిజాలు చెప్పాడు.

తాతయ్య చెప్పింది వేదాంతం. నా బాధ నా పోయిన గాలిపటం గురించి.

మా నాన్న ఫోను మాట్లాడుతూనే కారు దిగి ఇంట్లోకి వస్తున్నాడు. పొద్దున నేను చెప్పగానే, “మీరు బ్లాక్ చేసి వుంటే చాలా తేడా పడేది. ఎంతసేపు హోల్డ్ చేశామన్నది కాదు పాయింటు…”

నాన్న మాటల్లో చాలా ఆసహనం ధ్వనిస్తోంది. నేను, తాతయ్య పక్కకి తప్పుకున్నాం. నాన్న అనుక్షణం షేర్ల మీద నడుస్తుంటాడు.

***