డా .నీరజ అమరవాది
నీలాకాశంలో నల్లటి మబ్బుల మధ్య నిండు చందమామని చూపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే , నలుపూ , తెలుపుల కలనేత ఎంత బాగుందో అనిపించింది .
పంతులుగారు నల్లబల్లమీద ముత్యాలలాంటి అక్షరాలతో బోధిస్తుంటే అజ్ఞాన తిమిరాలు తొలగి , విజ్ఞాన కిరణాలు సోకినట్లనిపించింది .
తెల్లటి కాగితం పై నల్లటి అక్షరాలతో పరీక్ష రాస్తున్నప్పుడు నలుపంటే విజయం అనుకున్నాను .
గురజాడని చదువుకున్న తర్వాత “ మంచి చెడులు రెండె జాతులు ఎంచి చూడగ “ అని తెలుసుకున్నాను .
21 వ శతాబ్దంలో నాయకుల అభిలాషలు సాకారం అయి కులాతీత , మతాతీత , వర్ణరహిత అంతర్జాతీయ సమాజంలో నివసిస్తున్నందుకు గర్వపడ్డాను .
జాతివివక్షలు ఆనాడే తొలగిపోయాయి . నల్లజాతీయులు , తెల్లజాతీయులతో సోదరులలాగా కలసిమెలసి జీవిస్తున్నారని శ్వేతసౌధం సాక్షిగా నమ్మాను . మానవత్వమే నిజమైన ‘ జాతి ‘ అనుకున్నాను .
ఐక్యరాజ్యసమితి సైతం అక్షరాస్యత , పేదరిక నిర్మూలనతో పాటు జాతి వివక్ష , జాత్యహంకార భావజాలాన్ని తుదముట్టించేందుకు నడుం బిగించి ఎజెండాలు తయారుచేసింది .
నిరాడంబరమైన జీవితం , ఉన్నతమైన ఆలోచనలే మనిషిని ‘ మనీషి ‘ గా చేసే లక్షణం అంటూ జాతిపితలు సెలవిచ్చారు . వారి అడుగుజాడలే శిరోధార్యంగా , గాంధీ జయంతులను జరుపుకుంటూ , అహింసా సిద్ధాంతాలను మననం చేసుకుంటూ , గాంధీ టోపీలను పెట్టుకుంటూ , గాంధీ జోడును , కర్రను స్వచ్ఛతకు , స్వేచ్ఛకు చిహ్నాలుగా అంతర్జాతీయ సమాజం భావిస్తూ , గౌరవిస్తోంది .
ఇన్ని భావనల మధ్య పెద్దన్న సమక్షంలో ఒక నల్ల జాతీయుడిని , శ్వేతజాతి పోలీసులు కేవలం కళ్లల్లో కళ్లు పెట్టి చూసినందుకు , అమానుషంగా , సంకెళ్లు బిగించి ‘ రఫ్ రైడ్ ‘ లతో పాశవికంగా ఈడ్చుకెళ్లి , వెన్ను విరగ్గొట్టి , ప్రాణాలను హరించి , మృగరాజులా మీసం దువ్వుకున్నారు . అధికారులు వంతపాడారు .
రక్షకభటుల దుస్తులతో పాటు అంతరంగం కూడా నల్లనిదే అని శ్వేతజాతి పోలీసులు తమ చర్యలతో చెప్పకనే చెప్పినట్లు చూపారు .
చర్మపు రంగు ఆధారంగా , సాటి సోదరుని పై జాత్యహంకార బలుపును ప్రదర్శించిన భక్షక భటులను అందరూ ఉలిక్కిపడి చూస్తున్నారు . తమ అస్తిత్వాన్ని ప్రశ్నించుకుంటున్నారు .
మనిషి ప్రవర్తన , ఆలోచనా విధానం చర్మపురంగుతో ముడిపడి ఉంటుందేమో అని పరిశోధనలు చేయాల్సిన సమయం వచ్చింది .
మాటలలో ఒక రంగును , చేతలలో మరొక రంగును చూపే నాయకులారా ! ఇది రంగుల ప్రపంచం అని మళ్లీ మళ్లీ నిరూపించబడింది .
*
తాజా కామెంట్లు