కొందరు స్త్రీలు, కొన్ని సమయాలు!

konninakshtralu-cover-page

 

నేనెన్నో పుస్తకాలను పరిచయం చేశాను. నాకు నచ్చిన పుస్తకాలను చదవమని చాలామందికి చెబుతుంటాను. కాని ఓ పుస్తకం నాకు బాగా నచ్చినా – దాన్ని చదవమని నేను అందరికీ ధైర్యంగా రికమెండ్ చేయలేకపోతున్నాను. అయినప్పటికీ… చదవాల్సిన ఆ పుస్తకం – విమల గారి కథల సంకలనం కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు‘. ఎందుకంటే ఈ పుస్తకం చదువరులను ఓ రకమైన నిర్వేదంలో ముంచుతుంది. వాళ్ళ మనసులను వ్యథాభరితం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సమస్యలుంటాయి, కాని మరీ ఇన్నా అని అనిపిస్తుంది. పరిష్కరించలేని, జటిలమైన సమస్యలు ఎందరి జీవితాలను ఊపిరాడకుండా చేస్తున్నాయో ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది.

స్త్రీలు, బాలికలు, ఆసరా కోల్పోయినవాళ్ళూ, నిరాశ్రయులూ, చాలీ చాలని ఆదాయాలు సంపాదించేవాళ్ళూ, కుల మత లింగ భేదాల ఆధారంగా వివక్షకు గురైనవారూ… ఇలా ఎందరెందరివో దుఃఖాలు, వెతలు… భద్రజీవుల మొద్దుబారిన మనసును కదిలిస్తాయి. స్పందించే గుణం ఉన్నా ఏ రకంగానూ సాయం చేయలేని సానుభూతిపరుల నిస్సహాయత… ఇవన్నీ కలగలిసి మన మీద మనకే ఓ రకమైన రోత కలుగుతుంది. మనసులోని కల్లోలాన్ని అదుపు చేసుకుని, గుండెని దిటవు చేసుకుని ఈ పుస్తకాన్ని చదవాలి, ఇతరులతో చదివించాలి కూడా. అభద్రతా వలయంలో బతుకుతున్న అనేకానేక జీవులకు మనమీయగలిగే కనీసపు ఊతం – ఈ పుస్తకం చదివి – వాళ్ళని కాస్తయినా అర్థం చేసుకోవడం! అలాంటివాళ్ళూ తారసపడినప్పుడు తలవంచుకుని తప్పుకునిపోకుండా – కాస్త సాంత్వన కలిగేడట్టు పలకరింపుగా ఓ చిరునవ్వయినా నవ్వగలగడం!

ఇక ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

***

నాలుగేళ్ళపాటు భరతనాట్యం నేర్చుకుని, నృత్య కళాకారిణి అవ్వాలనుకున్న ఓ యువతి ఆశలు ఎలా తారుమారయ్యాయో “నల్లపిల్ల నవ్వు” కథ చెబుతుంది. అయినా ఆమె జీవన పోరాటం ఆపదు. ఏం చేసైనా బ్రతకాలనుకుంటుంది. ఇద్దరు పిల్లల్ని పోషించాలి. గత్యంతరం లేక సినిమాల్లోనూ/టీవీ సీరియళ్ళలోనూ గ్రూప్ డాన్సర్‌గా మారి జీవిక కల్పించుకుంటుంది. జీవిక కోసం కష్టపడే వ్యక్తుల ధైర్యాన్ని చాటుతుంది ఈ కథ.

ఉద్యమంలో పనిచేసేవారి అవసరాలు, ప్రాధాన్యతా క్రమాలు వేరు. లక్ష్యం కోసం వ్యక్తిగత ఆసక్తులను/ఆకాంక్షలను అణుచుకుంటారు. విప్లవ నేపథ్యం నుంచి రాసిన ప్రేమ కథ “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు“. జీవితం పట్ల ప్రేమ కథ ఇది. ఒకే ఊరిని కథ ఆరంభంలోనూ, చివర్లోనూ రెండు కోణాలలో చూపించి; మారని జీవితాలనీ, మారిన ఊరుని పరిచయం చేస్తుందీ కథ.

యాభై నాలుగేళ్ళ వయసున్న మాధవి అనే లెక్చరర్‍ మొబైల్‌కి వేళాపాళా లేకుండా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతుంటారు కొందరు. అత్యంత జుగుప్సాకరంగా వర్ణనలు చేస్తూ ఆమెని వేధిస్తూంటారు. విసిగి వేసారిన ఆమె పోలీస్ కంప్లయింట్ ఇస్తే, ఆ కాల్స్ ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుంటారు పోలీసులు. తీరా వెళ్ళి చూస్తే, అందులో ఇద్దరు ఆమె స్టూడెంట్సే! “నీ వయసెంతయినేం, నువ్వెవరైతేనేం..?” అంటూ తన అవయవాల గురించి మాట్లాడిన పిల్లల్ని ఏం చేయాలో ఆమె కర్థం కాదు. పోలీసులు వాళ్ళని తిట్టినా… ఆ తిట్లు కూడా స్త్రీలకే తగులుతున్నాయని గ్రహిస్తుంది. ఆ రాత్రి ఎవరెవరు “దేహభాష“ను మాట్లాడబోతున్నారో… అని అనుకుంటూ ఒకానొక అచేతన స్థితిలో ఉండిపోతుందామె.

విడివిడిగా మంచివాళ్ళయిన ఇద్దరు స్త్రీ పురుషులు ఎందుకు మంచి భార్యాభర్తలు కాలేకపోతారో చెబుతుంది “వదిలెయ్” కథ. పురుషాహంకారంతో భార్యపై చేసే కామెంట్లు, హేళనలు, విసుర్లు – వారినెంత ఆవేదనకి గురి చేస్తాయో, అటువంటి స్త్రీలు తమలోని సృజనాత్మకతని ఎలా కోల్పోతున్నారో చెబుతుందీ కథ. ఇటువంటి పరిస్థితులలో తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని, మరి కొంతమందికి స్ఫూర్తినిచ్చిన ఓ మహిళ కథ ఇది.

మనని వద్దనుకున్న మనిషితో కలసి జీవించాల్సి రావడం ఎంత దుర్భరమో “మా అమ్మా, ఆమె దోస్త్ మల్లి” కథ చదివితే అర్థమవుతుంది. మానసికంగా ఒంటరిగా ఉండడం ఎంత వేదన కలిగిస్తుందో, ఎంత క్రుంగదీస్తుందో తెలుస్తుంది. భౌతికంగా అందరితో కలిసి ఉన్నా, జీవితానందం కోల్పోయిన మహిళ కథ పాఠకులని కదిలిస్తుంది.

ఆడపిల్లల శరీరమే కాదు, వాళ్ళ ఆలోచనలూ ఎందుకో ఒక్కసారిగా ఎదిగిపోయినట్లనిపించిన ఓ తల్లికి – తన కూతురిక లేదనే వాస్తవం జీర్ణించుకోడం కష్టమవుతుంది “దౌత్య” కథలో. ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునే ముందు తల్లిదండ్రులకీ, అన్నయ్యకీ ఓ ఎస్.ఎమ్.ఎస్. పంపుతుంది. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడిన క్షణాల్లో తాము ఆమె దగ్గర లేమని విలవిలలాడిపోతాడా తండ్రి. స్త్రీల హృదయ భాషని అర్థం చేసుకోలేని వ్యక్తిని ప్రేమించి మోసపోయినందుకు బలవంతంగా తనువు చాలించి తల్లిదండ్రులకు క్షోభని మిగిల్చిన ఆ అమ్మాయి లేవనెత్తిన ప్రశ్నలకు ఎవరు జవాబిస్తారు?

అరణ్యంలోకి నిస్సంకోచంగా వెళ్ళిన ఓ మహిళ అడుగులు జనారణ్యంలోకి వచ్చేసరికి ఎందుకు తడబడ్డాయి? తాము నమ్మిన నమ్మకాలపైనే నమ్మకం ఎందుకు సడలిపోయిందామెకు? దేన్నయినా, ఎవరినైనా ప్రశ్నించగల ధైర్యాన్ని, ఒంటరి పోరాటాలలో కోల్పోయిన “కనకలత” జీవితం విషాదమయం!

‘జీవితాన్ని రకరకాల దారులలో తిప్పి, అలసి సొలసి, లోలోన విధ్వంసమై, చివరికి వీధుల పాలై, దేశద్రిమ్మరులై….’ బ్రతుకుతున్న వారితో ఒక రాత్రి గడిపేందుకు ప్రయత్నించిన బృందానికి – కలవరం కలిగించే ప్రశ్నలు ఎదురవుతాయి. “చుక్కల కింది రాత్రి” మనలో ఓ పెనుగులాటకి కారణమవుతుంది.

విశాలమైన ప్రపంచంలో, తానెక్కడో ఒక ఇరుకు మధ్య కూలబడి బ్రతుకుతున్నానని అనుకున్న ఓ యువతి, మిత్రుడి సహాయంతో కొత్త రెక్కలు తొడుక్కుంటుంది. అతని ప్రభావంతో ఉద్యమాలలోకి అడుగుపెడుతుంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ కలసి కొన్నేళ్ళు పని చేశాకా, అతన్నీ మరి కొంతమందిని అరెస్టు చేస్తారు. విచారణ అనంతరం అతనికి యావజ్జీవ శిక్ష పడుతుంది. ‘ఎవరో ఒకరికి ఎడబాటు శాశ్వతమైన చోట, మరొకరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి’ అంటూ ఓ ఉత్తరం ద్వారా ఆమెకి సూచిస్తాడు. ఉద్యమాలలో పని చేసే ఆప్తుల్ని కోల్పోవడం ఎంత విషాదంగా ఉంటుందో “మార్తా ప్రేమకథ” చెబుతుంది.

‘మన చిరునవ్వును, అందాన్ని చూపితే మోజుపడతారే తప్ప, మన మనసు గాయల్ని చూపితే బాధపడి బాధ్యత తీసుకునే వాళ్ళెవరూ ఉండర’న్న వాస్తవాన్ని ముగ్గురు మహిళల జీవన నేపథ్యంతో చెప్పిన కథ “వాళ్ళు ముగ్గురేనా?“. పులిస్వారీ ఆటలో పులి తనని తినేయకుండా కాచుకుని కాచుకుని అలసిపోయిన ఓ స్త్రీ గొప్ప మనోనిశ్చయంతో తనకిష్టమైన జీవన విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తుంది.

బయటకి తక్కువగా మాట్లాడుతుందని అనిపించే నీల – తన లోలోపల, తనతో తానే ఎడతెగని సంభాషణ సాగిస్తుంది. జీవితం సంక్లిష్టమైన, పూరించడం కష్టమైన గళ్ళ నుడికట్టులా మారిన యువతి కథ “నీలా వాళ్ళమ్మ, మరి కొందరు“. భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే దాని ఆనవాళ్ళు భార్య ముఖంపైనే ఎందుకు కనబడతాయని ఈ కథ ప్రశ్నిస్తుంది. తమకి శారీరకంగా బలం తక్కువ అనీ, పురుషులనే అహంకారంతోనూ భార్యలపై భర్తలు చేసే దాష్టీకాన్ని ఒక్క వాక్యంలో చెప్పారు రచయిత్రి. చావంటే మనుషులు హఠాత్తుగా మాయమైపోవడం’ అని రచయిత్రి మరణం గురించి చెప్పిన మాటలు చదువుతుంటే అప్రయత్నంగానే ఒళ్ళు జలదరిస్తుంది.

‘కలలకీ కన్నీళ్ళకీ కాలం కాదిది’ అని భావించే విరాళి తనిష్టపడిన వ్యక్తితో జీవితం పంచుకోలేకపోతుంది. మనసులో తడి ఆరి, బీటలువారి బండరాయిలా ఘనీభవించిపోతుందామె. ‘మాడుగ వాసన వేస్తున్న జీవితం నాది’ అని అనుకుంటుంది. పాతమిత్రులు కలసినప్పుడు, “ఒక్కోసారి ఒడ్డున కూర్చుని మనం నదిలా ప్రవహించడాన్ని మనమే చూసుకుని నవ్వుకోవాలి” అంటూ ఓ మిత్రుడు చెప్పిన మాటలు ఆమెలో జీవితేచ్ఛని మళ్ళీ రగిలిస్తాయి. మనకి ఇష్టమున్నా లేకున్న మన జీవితాలలోకి చొచ్చుకువచ్చే మార్పులని అధిగమించి ముందుకు సాగాలని సూచిస్తుంది “సూర్యుడి మొదటి కిరణం” కథ.

***

ఇంతమంది స్త్రీల బాధలను మన గుండెల్లోకి పంపి మనల్ని సున్నితం చేయబూనుకున్న విమల కథలను ఇష్టపడటం మొదలుపెడతాం. విమల కథలను ఇష్టపడటం అంటే బాధను అర్థం చేసుకోవడం. బలహీనులను అర్థం చేసుకోవడం. బలహీనులుగా కనిపించేవారిలో బాధితులుగా కనిపించేవారిలో ఉన్న బలాన్ని అర్థం చేసుకోవడం” అంటారు ఓల్గా. ఈ కథలు చదివాక, ఓల్గా గారి అభిప్రాయంతో ఏకీభవించని పాఠకులు ఉండరని నా ఉద్దేశం.

చినుకు ప్రచురణలు, విజయవాడ వారు ప్రచురించిన ఈ 215 పేజీల పుస్తకం వెల 120/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.

ప్రకృతి – మనుషులు – అండమాన్లు!

 

Andaman Diary Front Page

 

-కొల్లూరి సోమశంకర్

~

వాక్యాల వెంట పాఠకులను పరుగులు తీయించే రాయడం ఫిక్షన్‌ని విజయవంతం చేస్తే, రచయిత చేసే యాత్రలలో పాఠకులను తన వెంటే తీసుకువెళ్ళి వాళ్ళు కూడా మానసికంగా ఆయా ప్రాంతాలలో తిరుగాడినట్లుగా వ్రాయడం – యాత్రారచనలు ఎక్కువమందిని ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది. ఈ కోవలోకొచ్చే యాత్రా కథనం – దాసరి అమరేంద్ర గారి “అండమాన్ డైరీ”.

అమరేంద్ర గారికన్నా ముందు ఎంతో మంది అండమాన్ దీవులను చూసుంటారు, ఎంతో కొంత రాసుంటారు. భవిష్యత్తులో కూడా మరెందరో అక్కడికి వెడతారు, వాటి గురించి రాస్తారు కూడా. దర్శనీయ స్థలాలు మారవు… ఏం చూసాం, ఎలా చూసాం, ఎలా తిరిగాం అన్నవి వ్యక్తుల దృక్కోణాన్ని బట్టి మారుతాయి. అందువల్ల యాత్రాకథనాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అండమాన్ యాత్రల గురించి గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా చదివినా, ఈ పుస్తకం మళ్ళీ చదివిస్తుంది.

ఎవరైనా యాత్రలెందుకు చేస్తారు? ప్రదేశాలని, మనుషులనీ తెలుసుకోడానికి! తెలుసుకుని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కొంతమందికి కేవలం సందర్శనా స్థలాలను దర్శించితేనే తృప్తి కలుగుతుంది. మరికొందరికి ఆయా ప్రాంతాలలోని స్థానికుల జీవితాలను తెలుసుకోడంలో ఆసక్తి ఉంటుంది. తెలుసుకోడం – నేర్చుకోవడం – జీవితాన్ని మెరుగుపరిచే అంశాలు! జాగ్రత్తగా వింటే ప్రకృతి మౌనంగానే ఎంతో చెబుతుంది; ఆసక్తిగా వింటే మనుషులు తమ జీవితాల్ని వివరిస్తారు. వాళ్ళకుండి మనకి లేనివేవిటో లేదా మనకు ఉండీ వాళ్ళకి లేనివేవిటో అర్థమవుతుంది. పై పై మెరుగుల కోసం జీవితాన్ని సంక్లిష్టం చేసుకునే బదులు… జీవితాన్ని సరళంగా ఉంచుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుంది.

ఈ పుస్తకంలో – సముద్రం ఉంది, దీవులున్నాయి, కోరల్స్ ఉన్నాయి, అందమైన ప్రకృతి ఉంది. వీటన్నిటిని మించి మంచి మనుషులు ఉన్నారు. మెయిన్‌లాండర్స్‌ జీవన విధానాలకూ ఐలాండర్ల బతుకుతీరుకి ఉండే వ్యత్యాసంపై స్పష్టమైన అవగాహన ఉన్న మనుషులు వీళ్ళు. స్థానికులుంటారు; దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉంటారు.

ఇక ప్రకృతి విషయానికొస్తే, పుస్తకం ఉపశీర్షికలోనే చెప్పేసారు రచయిత – పచ్చల ద్వీపాలూ.. పగడాల సంద్రాలూ.. అని. రాస్ ద్వీపం గురించి,  సీతానగర్ బీచి రచయిత చేసిన వర్ణన – పాఠకుల మనస్సుల్లో కూడా అండమాన్స్ వెళ్ళిరావాలనే కోరికని నాటుతుంది. ఎలిఫెంట్ బీచ్‌లో స్నోర్‌కెలింగ్ చేసిన సందర్భంగా సముద్రం లోపల విహరించడం ఎలా ఉంటుందో చెబుతారు రచయిత. మనం కూడా స్నోర్‌కెలింగ్‌లో పాల్గొన్నట్లుగా అనిపిస్తుంది చదువుతూంటే. నీల్ ద్వీపం గురించి, బారాటాంగ్‌లోని మాన్‌గ్రోవ్‌ కెనోపీ వాక్‌ గురించి చదువుతుంటే ఉన్నపళాన అక్కడ వాలిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. మానసిక విహారం చేసి, అక్కడి అందాల్ని ఆస్వాదిస్తాం.

ఈ పుస్తకం మరో విశేషం… సంతృప్తికరమైన జీవితాన్ని గడిపే వ్యక్తులను పరిచయం చేయడం.. వీళ్ళ గురించి చదివినప్పుడు మనం అబ్బురపడతాం. వారి ఆలోచనా విధానానికీ, మానసిక పరిపక్వతకీ జోహార్లంటాం. కాస్తో కూస్తో వారి నుంచి నేర్చుకుంటాం.

తనకంటూ ఒక ఉనికి లేకపోవడమే మంచిదని భావించే ఓ గెస్ట్‌హౌస్ యజమానురాలు తన ఇంటినీ, జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం పాఠకులకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వీళ్ళే నావాళ్ళు అనుకోకుండా ఎవరైనా నా మనుషులే అనుకునే ఆవిడ పట్ల గౌరవభావం కలుగుతుంది.

తాగుడికి బానిసై భర్త చనిపోతే, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తూ చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉన్నంతలో గొప్పగా బ్రతుకుతున్న ఓ మహిళది స్ఫూర్తిదాయక గాథ. ప్రపంచం మీద భరోసా ఉన్న వ్యక్తి. బతుకు భయం లేని మనిషావిడ..

లక్ష్మణపూర్ అనే ఊరిలో రెండో బీచ్‌కి సమీపంలో ఓ కొబ్బరిబోండాల దుకాణం నడుపుతున్న పెద్దావిడది బంగ్లాదేశ్ మూలాలున్న కుటుంబం. భారత ప్రభుత్వం పునరావాసంపై వీళ్ళని ఇక్కడకి తరలించింది. ఈవిడ కొడుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్‌ పీజీ చేస్తున్నాడు. కూతురు బెంగుళూరులో ఐ.టి. ఉద్యోగం.. ‘ఇంకా ఈ కొట్టెందుకూ. మూసెయ్యి’ అంటారట పిల్లలు. ఆవిడేమో ‘ఇది నాకు అలవాటయిన జీవన రీతి. ఎలా వదిలిపెట్టాలీ! అసలు ఎందుకు వదిలిపెట్టాలీ’ అని బదులిస్తారు. ఎంత మానసిక దృఢత్వం కావాలి ఈ నిర్ణయం తీసుకోడానికి?

కాలాపత్థర్ అనే చోట బంగ్లాదేశీ మూలాలున్న మొండల్ అనే వ్యక్తితో మాటలు కలిపిన రచయిత అతని కుటుంబపు జీవన సరళి, ఆర్థిక వనరులు, స్నేహితులు, బంధువులు… గురించి ఎంతో తెలుసుకుంటారు.

కర్తవ్యపాలనని మించిన ఆర్తి కనబరుస్తాడో డ్రైవర్. అండమాన్ దీవుల జాతీయ పక్షులను యాత్రికులకు చూపిస్తూ వాటి సంఖ్య తగ్గిపోతోందని బాధ పడతాడు. ఇదే డ్రైవర్ తన వాహనంలో వచ్చిన యాత్రికులకిచ్చే బ్రేక్‌ఫాస్ట్ పాడయిపోయిందని తెలుసుకున్నాక స్పందించిన తీరు అతని నిబద్ధతని చాటుతుంది.

కొత్త జవసత్వాలతో నిండిన గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీకగా కనిపించే ఓ కుర్రాడు – రచయితకి ఆతిథ్యం ఇస్తాడు. ప్రపంచమంటే పట్టలేని ఆసక్తి అతనికి. చదువుకోవాలన్న తపన… ముంబయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మహా నగరాలు చూడాలన్న అభిలాష అతని మాటల్లో వ్యక్తమవుతుంది. సంస్కారవంతమైన వ్యక్తిత్వం!

రచయితకి ఆతిథ్యం ఇచ్చిన నౌకాదళం అధికారి ప్రకాష్‌ గారిది మరో కథ. డెహ్రాడూన్ మిలటరీ కాలేజి, నేషనల్ డిఫెన్స్ అకాడెమీలలో చదివి – కావాలానే నేవీని ఎంచుకున్నారాయన. పోటీ విపరీతంగా ఉండే రక్షణ రంగంలో వడపోత ఎక్కువనీ, ఎన్నికైన మెరికలంతా పదవీకాలమంతా పోటీ పడుతూనే ఉంటారని; ఒక్కోసారి మంచి ప్రతిభావంతులైనా వెనుకబడిపోక తప్పదనీ, అది జీవనసూత్రమని చెబుతారాయన. భవిష్యత్తుపై భయమూ, బెంగ లేకుండా – వ్యవస్థని గౌరవించే వ్యక్తి ఆయన. భావి జీవితం గురించి ఉద్వేగం లేకుండా ఆయన చెప్పిన తీరు బావుంది.

ఇంకా ఎందరెందరో మనుషులు… అందమైన వాతావరణంలో జీవిస్తూ… బ్రతుకుని శోభాయమానం చేసుకుంటున్న తీరు మనకీ జీవితంపై కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. జీవన సరళిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుందో అర్థమవుతుంది.

అండమాన్ దీవుల గురించి, స్థానిక తెగల గురించి, సెల్యులర్ జైలు గురించి, పురాతన సామిల్ గురించి, మ్యూజియంల గురించి, ఇతర దర్శనీయ స్థలాల గురించి తగినంత వివరణ ఉందీ పుస్తకంలో.

ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, కినిగెలోను లబిస్తుంది. 104 పేజీల ఈ పుస్తకం వెల రూ. 100/-.

InvitationAD1

 

చారిత్రక కాల్పనిక నవల “శ్రీకృష్ణ దేవరాయలు”

 

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఒకనాటి పాలకుల, చరిత్రలో పేరుగాంచిన వ్యక్తుల జీవితాలకు కాల్పనికత జోడించి సృజనాత్మక రచనగా వెలువరించడం చాలా కష్టమైన పని. ఆ యా పాత్రలపై అతి ప్రేమ లేదా అతి ద్వేషం చూపితే వాస్తవాలు మరుగునపడే ప్రమాదం ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితంనాటి పాలకులపై రచన చేస్తున్నప్పుడు – అప్పటి ఆ యా పాలకుల పరిపాలనని లేదా పరాక్రమాన్ని తెగ పొగడడం లేదా ఆ రాజ్యంలో పాలితు లెదుర్కున్న కడగండ్లు, కష్టాలను మాత్రమే ప్రస్తావించడం – సమంజసం కాదు. అప్పటి పరిస్థితులు వేరు, వర్తమాన స్థితిగతులు వేరని గుర్తుంచుకుని; రచనలో ఏ మాత్రం అతిశయోక్తులు, లేదా వ్యక్తిత్వ హననాలు జొప్పించకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే సమాజంలో అనవసరమైన కలతలు రేగుతాయనే అంశాన్ని రచయితలు మనసులో ఉంచుకోవాలి.

ఈ విధంగా, చరిత్రలో సుప్రసిద్ధుడైన ఓ మహారాజుని, అతని పాలనని వివరిస్తూ, అతని వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు కస్తూరి మురళీకృష్ణ. ఆ మహారాజు వేరెవరో కాదు, భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి సుపరిచితుడైన శ్రీకృష్ణ దేవరాయలు.

నవల ప్రారంభంలో – నిరంతరం శత్రుదాడులతో భారతదేశం బలహీనపడడం గురించి ప్రస్తావిస్తారు రచయిత. భారతీయ సమాజం దిశారహితమై దిక్కుతోచకుండా బిక్కుబిక్కుమంటున్న కాలమని పేర్కొంటు శ్రీకృష్ణ దేవరాయలు పాలనా పగ్గాలు చేపట్టే ముందరి పరిస్థితులని కళ్ళకు కట్టినట్టు వివరించారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో మహామంత్రి తిమ్మరుసు, ఇతర ముఖ్యులు కలసి రాజ్యాధికారాన్ని శ్రీకృష్ణ దేవరాయలకు అప్పగిస్తారు. రాజ్యం పరిస్థితి ఏమీ బాగాలేదని విన్నవిస్తాడు తిమ్మరుసు.

పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం అత్యంత ఆవశ్యకం.. ఏం చేస్తే పరిస్థితులు బాగవుతాయో సూచనలు కావాలి నాకు. సమస్యలను ఎత్తి చూపించి సమయం వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు. సమస్య స్వరూపాన్ని వివరించి, పరిష్కారాలు సూచించండి.” అంటాడు కృష్ణదేవరాయలు.

రాయలు సింహాసనమెక్కి వారమైనా కాకముందే తురుష్కులు విజయనగర సరిహద్దులను దాటి చొచ్చుకువస్తున్నారని తెలుస్తుంది. రాయలకింకా రాజ్యవ్యవహారాలపై అవగాహన పూర్తిగా రాలేదనీ; అప్పుడే యుద్ధానికి వెళ్ళడం అంత క్షేమకరం కాదని తిమ్మరుసు భావించాడు.

అయితే ఓటమి అనే పదాన్ని సైతం ఇష్టపడని కృష్ణదేవరాయలు తన సైన్యాన్ని ఉత్తేజితులను చేసి యుద్ధరంగం వైపు నడుపుతాడు, ఓడిస్తాడు. అదే ఊపులో మరికొన్ని రాజ్యాలను గెలవాలని ఆలోచిస్తాడు. కాని తిమ్మరుసు వద్దంటాడు. రాయలు మౌనంగా వచ్చి గుడారం బయట నిలుచుంటాడు. ఎదురుగా పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణానది. రాయల దృష్టి, నది నడుమన నిలిచిన బండరాయిపై పడింది. అతి వేగంగా ప్రవహిస్తున్న నీరు బండరాయిని బలంగా తాకుతోంది. దాన్ని కూడా తనతో పాటు ప్రవహింపజేయాలన్న దూకుడు చూపిస్తోంది. కాని రాయి నిశ్చలంగా ఉంది. దాంతో ఓ వైపు రాయిని కోసే ప్రయత్నం చేస్తూనే పక్కకి తిరిగి, రాయి పక్క నుంచి ప్రవహిస్తోంది. అది చూసిన రాయల ముఖంపై చిరునవ్వు వెలసింది. ఆ క్షణంలో ప్రకృతి అతనికి ఓ చక్కని పాఠం నేర్పింది.

ఓ సందర్భంలో, పాలకులకు ఉండాల్సిన లక్షణం గురించి రాయలు ఇలా అంటారు:

ముందుగా మనం మన ప్రజలకు కలలు కనడం నేర్పాలి. జీవితాన్ని అనుభవించడం నేర్పాలి. రకరకాల భయాలతో, బాధలతో, మనవారు జీవించడం మరచిపోయారు, బ్రతుకులోని ఆనందాలను అనుభవించడం మరచిపోయారు. ఎంత సేపూ గతాన్ని తలచుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. ముందుగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్నివ్వాలి, వారికి భద్రతనివ్వాలి”.  ఈనాటి నేతలకి సైతం వర్తించే సూచనలివి అనడంలో సందేహం ఏ మాత్రం  లేదు.

తర్వాత రెండేళ్ళపాటు రాజ్యంలో అభివృద్ధి పనులు చేపడుతూ, సైన్యాన్ని బలోపేతం చేశాడు. వివాహం చేసుకున్నాడు. రాచరిక, వైయక్తిక ధర్మాలను నెరవేర్చాడు. ఒక్కో శత్రువునీ జయిస్తూ, సామ బేధ దాన దండోపాయాలతో దక్షిణాపథాన్నంతా ఏకఛత్రం క్రిందకి తెచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నో సంస్కరణలు చేపట్టి జనరంజకంగా పాలించాడు, విశిష్ట కట్టడాలని నిర్మించాడు.

పరిపాలనాదక్షుడుగా, వీరుడిగా, సాహితీప్రియుడిగా, కవిగా, గొప్ప కట్టాడాలను కట్టించిన రాజుగా మనకి తెలిసిన శ్రీకృష్ణ దేవరాయల లోని ఆధ్యాత్మికతను, ధర్మదీక్షని పరిచయం చేసారు రచయిత ఈ నవలలో. విజయనగర రాజ్యాధికారం లభించడమంటే ధర్మరక్షణ చేసే అవకాశం లభించడమేనని శ్రీకృష్ణ దేవరాయలు భావించాడని, దైవం తనకి నిర్దేశించిన కర్తవ్యం అదేనని ఆయన నమ్మాడని రచయిత చెబుతారు. తన సామ్రాజ్యంలో ఎన్నో దేవాలయాలకు నిధులిచ్చి, వాటిని పునరుద్ధరించి, నిత్యపూజలు జరిగేలా చూసాడు. ఆలయాలు జనసామాన్యంలో ధార్మికత నెలకొల్పగలిగే కేంద్రాలని రాయలు విశ్వసించాడు.

శ్రీకృష్ణ దేవరాయలు వేంకటేశ్వరుని భక్తుడు. వీలైనన్ని సార్లు తిరుపతి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకునేవాడట. “ఏడుకొండలు ఎక్కలేము, ఇంకోసారి రాలేము” అనుకునే వారందరూ కూడా మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి ఎందుకు వస్తారో రచయిత చక్కగా వివరించారు. “ఏడుకొండలపై తిష్టవేసుకున్న కోనేటి రాయుడి దర్శనం కోసం ఏడు కొండలు నడిచి వెళ్ళాలి. ఒక్కో అడుగు వేస్తూ.. కొండలెక్కుతుంటే, మానవ ప్రపంచానికి దూరమవుతూ, దైవ ప్రపంచంలో అడుగుపెడుతున్న భావన కలుగుతుంది. ఇంత కష్టపడి ఏడు కొండలు అధిరోహించి, దైవమందిరంలో అడుగిడితే, ఆ చీకటిలో, దీపాల వెలుతురులో ధగధగా మెరిసే వజ్రాభరణాల వెలుగులో, నల్లటి రాతివిగ్రహం నుండి మనల్ని చూస్తున్న ఆ స్వామి విరాట్స్వరూపాన్ని ఎంత చూస్తే తనివితీరుతుంది?” అంటాడు రాయలు.

ఆలయ దర్శనం పూర్తయ్యాక, ఉదయగిరి కోటపై దాడి చేసి గెలుచుకుంటాడు. మరల తన దేవేరులతో కలసి తిరుమల వేంచేస్తాడు. ఎప్పుడూ స్వామి వారి సన్నిధిలోనే ఉండిపోవాలని అభిలషిస్తుంది చిన్నాదేవి. రాయలకి కూడా అదే కోరిక ఉన్నా పాలనా బాధ్యతల దృష్ట్యా సాధ్యం కాని పని. తిమ్మరుసు చేసిన ఓ ఆలోచన వల్ల – నిరంతరం స్వామి దగ్గరే ఉండాలన్న రాయల కోరికను పరోక్షంగా, ప్రతీకాత్మకంగా నెరవేరింది. ఫలితమే – తిరుమల గుడిలో శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరి భార్యలతో ఉన్న విగ్రహాల ఏర్పాటు!

రాచకార్యాలు, యుద్ధవ్యూహాల నడుమ సాహిత్య సమాలోచనలు, సాంసృతిక ఉత్సవాలను నిర్వహించేవాడు రాయలు. శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు ఆలయంలో దైవదర్శనం చేసుకున్నాకా, రాయల హృదయంలో ప్రేరణ కలిగి ఆముక్తమాల్యద రచనకి బీజం పడుతుంది. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణ దేవరాయల నోటి నుంచి “దేశభాషలందు తెలుగు లెస్స” అనే పద్యం వెలువడింది.

ఆముక్తమాల్యద రచన ప్రారంభించినప్పటినుంచి రాయల ప్రవర్తనలోనూ, మానసిక స్థితిలోనూ మార్పు రావడం గమనిస్తాడు తిమ్మరుసు. తన తదనంతరం, విజయనగర సామ్రాజ్యం ఏమై పోతుందో అని చింతిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు మానసిక స్థితిని వర్ణిస్తూ – “తన జీవితంలో ఒక దశకి చేరిన తరువాత ఇతరుల పొగడ్తలు వింటున్న వ్యక్తి మనసులో అహంకారం జనిస్తుంది, దాని వెంటే సంశయం కలుగుతుంది. ఈ పొగడ్తలకు అర్హుడినా అనే అనుమానం కలుగుతుంది, మరో వైపు ‘నేనింత సాధించాను’ అన్న అహంభావం పెరుగుతుంది. ఈ రెండిటి నడుమ జరిగే ఘర్షణలోంచి, ‘ఇది పోతేఅన్న భయం జనిస్తుంది. ఆ భయాన్ని వ్యక్తి ఎలా ఎదుర్కుంటాడన్నది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది” అని అంటారు రచయిత.

ఈ స్థితిలో రాయలికి ధైర్యం చెబుతాడు తిమ్మరుసు. “మనిషి మనసు ఎల్లప్పుడూ భవిష్యత్తుని తలచుకుని భయపడడానికే ఇష్టపడుతుంది. ఆ భయాన్ని మనం నిర్మాణాత్మకంగా వాడుకోవాలి. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఊహిస్తూ, ఇప్పటి నుంచే బాధపడుతుంటే, భవిష్యత్తు అటుంచి, వర్తమానం చేజారిపోతుంది.” అంటూ మృదువుగా హెచ్చరిస్తాడు.

సామ్రాజ్యం విస్తరిస్తుంది, బలపడుతుంది. కాలచక్రం గిర్రున తిరిగి, పుత్రుడికి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమవుతుంది. రాయలు తన పుత్రుని భవిష్యత్తు గురించి బెంగపడుతున్న సమయంలో యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, రాయల అప్పటి మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు రచయిత. “మనిషికి ఆత్మస్థైర్యం ఇవ్వవలసిన మానవ సంబంధాలే మనిషిని బలహీనం చేయడం సృష్టిలో చమత్కారం” అంటారు.

ఆముక్తమాల్యద రచన పూర్తి కాగానే శ్రీకృష్ణ దేవరాయలు తృప్తిగా కన్నుమూయడంతో నవల పూర్తవుతుంది.

ఉత్కంఠగా చదివించే ఈ నవల తొలుత ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది. నవలగా మొదటిసారి “కస్తూరి ప్రచురణలు” వారు ప్రచురించారు. 124 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- ప్రచురణకర్తల వద్ద ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

~ కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్తల చిరునామా:

Kasturi Prachuranalu

Plot No. 32, Dammaiguda,

Raghuram Nagar Colony,

Nagaram Post Office,

Hyderabad – 83,

Cell : 98496 17392.

 

కొంత చరిత్రా, కొంత కల్పన – “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం”

 

~ కొల్లూరి సోమ శంకర్

~

కొల్లూరి సోమ శంకర్

11 సెప్టెంబర్ 2001 – చరిత్ర గతిని మార్చిన రోజు. ప్రత్యక్షంగా అగ్రరాజ్యాన్ని, పరోక్షంగా ఎందరో సామాన్యులని ప్రభావితం చేసిన రోజు. ఉగ్రవాదులు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క ట్విన్ టవర్స్‌ను విమానాలతో కూల్చేయడంతో అమెరికాలో ప్రారంభమైన భయం – ప్రపంచంలోని చిన్నా, పెద్దా దేశాలకు పాకిపోయింది. తీవ్రవాదులు ప్రయాణీకుల వేషంలో దాడి చేయచ్చనే భయం నుంచి మొదలైన అనుమానాలు పెనుభూతాలై, భద్రతాచర్యలు విపరీతమయ్యాయి. కొత్త చట్టాల ఏర్పాటుకు నాంది పలికాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో అనుమానస్పదంగా కనబడే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎందరో అమాయకులను అనుమానితులుగా భావించి, వారిని అరెస్ట్ చేసి, విచారణ జరిపి తాపీగా విడుదల చేయడాలు ఎక్కువైపోయాయి. అంతేకాదు, విమానం గాల్లో ఉన్నప్పుడు కొందరు ప్రయాణీకుల ప్రవర్తన నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా భయపడడం, ఉగ్రవాదాన్ని ఓ మతానికి ఆపాదించి – నామరూపాలు విభిన్నంగా ఉంటే – వాళ్ళని అరెస్ట్ చేయడం వంటివి ఎన్నో విమానాశ్రాయాలలో కలకలం రేపాయి.

ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారి నవల “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం” కూడా ఈ నేపథ్యంలోనే సాగుతుంది. “రోజురోజుకూ పెరుగుతున్న మత తీవ్రవాదపు పరిణామాలేమిటో అర్థమయింది. ఈ ఆందోళనల్లో సామాన్యుడి జీవితమెంత అతలాకుతలంగా తయారవుతుందో చూపెట్టడంతో బాటూ దీనికంతా మూలకారణమైన మతం, దాని పుట్టుక, స్వభావం గురించిన అన్వేషణకు కూడా నేనీ నవలను రాయడానికి పూనుకున్నాను.” అని చెబుతారు రచయిత.

అనుకోని ఘటనల వల్ల ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ముప్ఫయి గంటలకి పైగా చిక్కుకుపోయిన ప్రయాణీకులలో ఇద్దరి ద్వారా ఈ కథ సాగుతుంది. మెక్సికోలోని ఓ అంతర్జాతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సెమినార్‌లో పేపర్ ప్రెజెంట్ చేయడానికి వెడుతున్న ఓ తెలుగు ప్రొఫెసర్‌కి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిచయమవుతాడు ఓ హిందీ భాషీయుడు దమ్మలాల్ చోప్రా. అతనికి ఇంగ్లీషు అంతంత మాత్రంగానే వచ్చు. ప్రొఫెసర్ గారికి హిందీ అంత బాగా రాదు. వీరిద్దరి సంభాషణలు, ఇతరులతో వీరి సంభాషణలు పాఠకులను ఆకట్టుకుంటాయి. దమ్మలాల్ తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తి. మన ప్రొఫెసర్ గారేమో హద్దుల్లేకుండా పెరుగుతున్న నేటి సాంకేతిక ప్రపంచం పట్ల అబ్బురపడే మనిషి. మరి వీరిద్దరికి ఎలా పొసుగుతుంది? దమ్మలాల్ చర్యల వల్ల ప్రొఫెసర్ గారు ఏ ఇబ్బందులు పడ్డారు?  అసలీ భయాలకి మూలం ఏమిటి? తోటివారి ప్రాణాలు తీయమని ఏ మతమైనా చెబుతుందా? మత విశ్వాసాలకు విపరీత భాష్యాలు ఎలా మొదలయ్యాయి? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు పాఠకుల మనస్సుల్లో అలజడి కలిగిస్తాయి.

దమ్మలాల్ చోప్రా ప్రవర్తన ప్రొఫెసర్ గారికి అసమంజసంగా అనిపించినా, అతనికి మాత్రం తన నడవడికలో ఏ లోపమూ కనిపించదు. పైగా తాను స్వాభావికంగా ఉన్నట్లే ప్రవర్తిస్తాడు. ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో అద్భుతం జరగబోతోందని భావిస్తూంటాడు. అదే మాట పదే పదే వల్లిస్తూంటాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని ఉన్నప్పుడు తాము 22 గంటల పాటు ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సి వస్తోందని ప్రొఫెసర్ గారు వాపోయినప్పుడు తోటి ప్రయాణీకుడైన చైతన్య అనే తెలుగు కుర్రాడు, “ఆమ్‌స్టర్‌డాంలో కాలం గడపడమంటే అదొక పెద్ద అవకాశమంకుల్…. ఆ యెయిర్‌పోర్టొక మాయాబజార్…. యిక ఆ వూరే పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కు. యెన్ని పార్కులూ, యెన్ని కాఫీ షాపులూ, యెన్ని మ్యూజియంలూ…. వొక్క రోజేం చాలుతుంది? యువార్ లక్కీ!…” అని అంటాడు. “వూళ్ళోకి వెళ్ళడానికి మాకు వీసా లేదు… యెయిర్‌పోర్ట్‌లోనే కాలంతోయాలి..” అని ప్రొఫెసర్ గారు విచారంగా జవాబిస్తే, “అయినా పర్వాలేదంకుల్! వోన్లీ ట్వెంటీ హవర్స్…. వొక్కో షాపును చూడ్డానికో అరగంట వేసుకోండి. మీరెంత వేగంగా తిరిగినా షాపులే మిగిలిపోతాయి…” అని అంటాడు. వీళ్ళ దృక్పథాలలో ఎంతటి వ్యత్యాసం? బహుశా అనుభవాలే మనిషికి ధైర్యాన్ని, భయాన్నీ కూడా కలిగిస్తాయేమో!

ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ఆగినప్పుడు రెస్ట్ రూంకి వెళ్ళాల్సివస్తుంది దమ్మలాల్ చోప్రాకి. ఆ సమయంలోనే చైతన్య వాలెట్ పోతుంది. దాన్ని వెతకడానికి చోప్రాని సహాయంగా తీసుకువెడతారు చైతన్య మిత్రబృందం. గంటల సమయం గడిచిపోతూంటుంది. దమ్మలాల్ రాడు. ప్రొఫెసర్ గారికి టెన్షన్ పెరిగిపోతుంది. ఆయన ఎక్కాల్సిన విమానానికి బోర్డింగ్ ఎనౌన్స్ చేస్తారు. ఇద్దరిదీ కలిపి జాయింట్ టికెట్ కావడంతో తన తోటి ప్రయాణీకుడు రాకపోతే ఏమంటారో అని భయపడతాడు. చివరికి తెగించి సెక్యూరిటీ చెక్ ముగించుకుని విమానం ఎక్కేస్తాడు. అదే సమయంలో దమ్మలాల్ కూడా విమానంలోకి వచ్చేస్తాడు. ఎందుకాలస్యం అంటే… ఓ అద్భుతానికి నాందీ ప్రస్తావన జరిగిందని చెబుతాడు? ఏమిటా సంఘటన? అతను అద్భుతానికి టీజర్‌గా భావించిన ఆ ఘటన యొక్క అసలు స్వరూపం తెలిసాక ప్రొఫెసర్ గారికి ఒళ్ళు జలదరిస్తుంది.

***

తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆమ్‌స్టర్‌డాం సమీపిస్తుంటారు. ఇక్కడ విమానం భూమి మీదకి దిగడం గురించి రచయిత చెప్పిన తీరులోని భావుకత పాఠకులను మైమరపిస్తుంది. “విమానం మేఘాల దొంతరలను చీల్చుకుంటూ కిందకి దిగసాగింది. కిటికీలోంచీ కనబడుతున్న భూమి క్రమంగా దగ్గరవసాగింది. నగరాన్ని పాయలు పాయలుగా కమ్ముకున్న నదీ, నదీ పాయల మధ్య పెరుగుతున్న చెట్లూ, చెట్ల మధ్యలో యిండ్లూ, యిండ్ల మధ్యలో యెండిన కాలవల్లాంటి రోడ్లూ, రోడ్లపైన పరిగెడుతున్న వాహనాలూ, అన్నీ క్రమంగా దగ్గరకు వచ్చాక, నిర్జనమైన విమానాశ్రయపు రన్‌వే పైకొచ్చిన విమానం, అలవోకగా టైర్లు దించి, రోడ్డు పైన పరిగెత్తసాగింది.” ఈ వాక్యాలు చదువుతున్న పాఠకులు స్వయంగా తామూ ఆ విమానంలో ఉన్నట్లు, ఆకాశం నుంచి నేలకు దిగుతున్నట్లు భావిస్తారు కదూ?

సరే, మొత్తానికి విమానం నేలని తాకుతుంది. కానీ ప్రయాణీకులెవరూ కిందకి దిగడానికి అనుమతి లభించదు. కారణం, ప్రయాణీకులలోని కొందరి ప్రవర్తన. ఎయిర్ మార్షల్స్ వారిని అదుపులోకి తీసుకుని, దూరంగా తీసుకెళ్ళాక గాని మిగతా ప్రయాణీకులకి విముక్తి లభించదు. వీళ్ళిద్దరూ ఓ మూల లాంజ్‌లో కూర్చుంటారు. సెక్యూరిటీ చెక్‍లో దమ్మలాల్ సంచీలో ఉన్న మందులు, పుస్తకాలు తీసుకుంటారు విమానాశ్రయపు అధికారులు. సమయం గడుస్తూ ఉంటుంది. దమ్మలాల్ చోప్రా డైరీలోని రాతలని చదివి అర్థం చెప్పమని ప్రొఫెసర్‌ని పిలుస్తారు అధికారులు. డైరీలో రాసి ఉన్నది కవిత్వమనీ… ఆ కవితల భావాన్ని వివరిస్తాడు ప్రొఫెసర్. “అనంతమెపుడూ యేకవచనమే! అనంతమెపుడూ అద్వయితమే! అనంతానికి మధ్యవర్తులెందుకు? అనంతానికి చేతులెందుకు? అనంతానికి మాటలెందుకు?” అని రాసున్న ఓ కవితని చదివి వినిపిస్తే, “టెల్ మీ ది ఆన్సర్ ఆల్సో!” అంటూ అడ్డు తగులుతాడో సెక్యూరిటీ ఆఫీసర్. అప్పుడక్కడ జరిగిన ఉదంతం పాఠకులని ఉక్కిరిబిక్కిరి చేసేలా నవ్విస్తుంది.

జరగబోయే అద్భుతం కోసం ఎదురుచూస్తున్న దమ్మలాల్ తన మాటలతో, చేష్టలతో ప్రొఫెసర్ గారిని బెంబేలెత్తిస్తాడు. జేబుల్లో ఉన్న నాలుగువేల రూపాయల ఇండియన్ కరెన్సీ ఇక్కడ చెల్లకపోవడం పట్ల అంతర్జాతీయ విప్లవం లేవదీయాలనుకుంటాడు. అతని మాటలకు జాలి చూపెడుతూ, సానుభూతి చెందుతూ, కంగారు పడుతూ, వంత పాడుతాడు ప్రొఫెసర్. అద్భుతం జరగబోతోందంటూ ఊదరగొడతాడు దమ్మలాల్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఓ హోటల్లో హౌస్ అరెస్ట్ లాగా పడేస్తారు అధికారులు. “మేము తీవ్రవాదులయివుంటామనే అనుమానం, దేశాల ఎంబసీలే చేయలేని పనిని చిటికెలో చేసి పారేసింది. యిప్పుడిక్కడ మాకు పైసా ఖర్చు లేకుండా, అయిదు నక్షత్రాల హోటల్లో వసతీ, భోజనమూ దొరుకుతున్నాయి. యింతకంటే చిత్రమేముంటుంది? మొదటి నుంచీ దమ్మలాల్ చోప్రా చెబుతున్న అద్భుతం యిదేనేమో!” అనుకుంటాడా ప్రొఫెసర్.

చివరికి ఢిల్లీ వెళ్ళే విమానం ఎక్కి కూర్చుంటారు. ఈ విమానం కూడా సమయానికి ఎగరదు. ప్రయాణీకులందరూ ఎక్కినా విమానం బయల్దేరదు. ఓ పిల్లాడి దుందుడుకు చర్య వల్ల బాగా ఆలస్యం అవుతుంది. చివరికి విమానం గాల్లోకి ఎగురుతుంది. ప్రయాణం కొనసాగి ఢిల్లీ సమీపిస్తుంది. ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం జరిగిపోయిందని అంటాడు దమ్మలాల్ చోప్రా. “యింత ప్రమాదకరమైన పరిస్థితులలో, చివరకు సెక్యూరిటీ వాళ్ళు మనల్ని అనుమానించినా, తప్పకుండా తీవ్రవాదులే అనిపించే వ్యక్తులతో బాటూ మనం కలిసి తిరగవలసి వచ్చినా, యిలా తప్పించుకుని తిరిగీ మనం మన దేశానికి చేరుకుంటున్నాం చూడూ, అదీ అదీ అద్భుతం!” అంటాడు ప్రొఫెసర్.

విమానం ఢిల్లీలో లాండవుతుందనగా… వాళ్ళిద్దరు అప్పటిదాక దాచివుంచిన తమ మనోభావాలను వెల్లడించుకుంటారు. పాకిస్తానీలాగానో, అఫ్ఘనిస్తాన్ వాడిలానో అనిపించే దమ్మలాల్‌తో కలసి ప్రయాణం చేసినందుకు ప్రొఫెసర్ భయపడినట్లే, ముస్లిం అయిన ప్రొఫెసర్‌తో కలసి ప్రయాణించినందుకు దమ్మలాల్ భయపడతాడు. అయితే ఇందుకు తామిద్దరం కారణం కాదని అంటాడు ప్రొఫెసర్. మరెవరు కారణం?

***

కారణాలను, కారకాలను అన్వేషించే ప్రశ్నలతో పాఠకులను ఆకట్టుకుంటుందీ పుస్తకం. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2013లో “కథాకోకిల ప్రచురణలు” వారు ప్రచురించారు. 100 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

 

ప్రచురణకర్తల చిరునామా:

Kathakokila Prachuranalu

15-54/1, Padmavathi Nagar,

Tirupati West – 517 502

Phone: 0877-2241588

 

పదుగురికీ తెలియాల్సిన నడత – వికర్ణ

cover page and back page quark4.qxd

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమ శంకర్

పురాణాలలోని కొన్ని పాత్రల గురించి చాలామందికి సమగ్రంగా తెలియదు. ముఖ్యంగా పురాణగాథలని పునః కథనం చేసేడప్పుడు ఆ యా పాత్రల స్వరూప స్వభావాలు మార్పులకు లోనవుతుంటాయి. కొన్ని పాత్రలు ప్రజల నోట్లో నానుతాయి, మరికొన్ని మరుగున పడిపోతాయి. వందల మందిలో ఒకడిని గుర్తుంచుకోవాలంటే ఆ వ్యక్తి గుణవంతుడైనా అయ్యుండాలి లేదా పరమ నీచుడైనా అయ్యుండాలి. దుష్టుల దుష్కార్యాలను ఎక్కువగా ప్రాచుర్యంలోకి తేవడం వల్ల, కొందరు మంచివాళ్ళు చేసిన  సత్కార్యాలు, చూపిన తెగువ వెలుగులోకి రావు. మహా భారతంలోని పాత్రలలో చాలా మటుకు ఇలా విస్మృతికి గురైనవే ఎక్కువ. దుస్సల కాకుండా, మిగిలిన నూరుగురు కౌరవ సోదరులలో మహా అయితే నలుగురు లేదా అయిదుగురు పేర్లు గుర్తుంటాయేమో. మిగతావారి ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటివాడే వికర్ణుడు. అతడు గాంధారి పుత్రుడు. కౌరవులలో పదిహేడవవాడు. వికర్ణుని జీవితానికి కాల్పనికతను జోడించి నవలగా సృజించారు డా. చింతకింది శ్రీనివాసరావు. రచయితకి ఇది తొలి నవల.

మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన దుశ్శాసనులను – నేటికాలంలో మహిళలను అగౌరవపరిచేవారికి ప్రతీకలుగా వ్యవహరిస్తున్నారు. “దేశంలో సందుకో గాంధారి సుతుడు”న్నాడనే నానుడి ఏర్పడిపోయింది. దేశ రాజధానిలో జరిగిన నిర్ఘయ ఘటన పౌరులందరినీ కలచివేసింది. అదే ఈ నవల వ్రాయడానికి ప్రేరణగా మారింది. ‘‘అక్కడా ఇక్కడా అని లేదు. వారూవీరూ అని తేడాలేదు. ప్రతీ వీధిలోనూ, వాడలోనూ, కోటలోనూ, పేటలోనూ స్త్రీలమీద దాడులు దారుణంగా సాగిపోతున్నాయి. వీటన్నింటి గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడే మహాభారతంలోని వికర్ణుణని ఘట్టం గుర్తుకువచ్చేది. ద్రౌపది చీర వొలిచేయాలని తలచిన దుర్యోధనునికి వికర్ణుడే అడ్డుతగలటం ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ గాంధారీ సుతులు. ఏకోదరులు అప్పుడనిపించింది. అప్పటి భారతంలో ఒక వికర్ణుడున్నాడు గానీ, ఇప్పటి భారతావనిలో వీధికో వికర్ణుడుంటేనే కానీ కాంతల కష్టాలు తీరబోవని. అలా వికర్ణుడు నా మటుకు నాకు హీరో అయిపోయాడు’’ అంటారు రచయిత. అధర్మాన్ని ఎదిరించి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేవారే నేటి భారతావనికి అవసరం. అటువంటి ఋజువర్తన కలిగినవాడే మహాభారతంలోని వికర్ణుడు.

వికర్ణుడంతటి నిజాయితీపరుడు బాల్యంలో ఎలా ఉండి ఉంటాడు. కాస్త పెద్దయ్యాక మరెలా ఉంటాడు. ఇంకాస్త పెరిగాక ఇంకెలా ఉంటాడు… వంటి అంశాలను నాలో నేనే తర్కించుకున్నాను. ఆ విధంగా ఈ పుస్తకానికో రూపం వచ్చింది” అంటారు రచయిత.

వికర్ణుడి జీవితం విలక్షణమైనది. అతని ధీరోదాత్తమైన జీవితానికి – “మహోదయం, విషభేది, ప్రతిభకు పట్టం, నీతిబాట, కణికవ్యూహం, గురి..సిరి.., తప్పిన శిక్ష, రాజ(అ)సూయం, బహిష్కరణ, పూరుడు.. పూర్వజన్మ, త్రివిష్టపం కొండల్లో, యుద్ధం యుద్ధం, పునరాగమనం, మహాభినిష్క్రమణం” అనే అధ్యాయాలతో నవలారూపమిచ్చారు రచయిత.

వికర్ణుడి జననం, తోటి సోదరుల కంటే విభిన్నంగా పెరగడం, దుర్యోధనుడి కుతంత్రాలకు అడ్డు చెప్పడం, ధృతరాష్ట్రుడికి సుఖదకు పుట్టిన యుయుత్సుని మర్యాద కోసం సభలో వాదించడం, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో దుర్యోధనుడిని ఎదిరించి రాజ్య బహిష్కరణ శిక్షకి గురవడం, తుదకు గాంధారి మాటకు కట్టుబడాలన్న ‘ధర్మానికి’ బద్ధుడై కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడి తనువు చాలించడం వరకూ సాగుతుంది కథ.

ధర్మాధర్మ విచక్షణ ఏ యుగంలోనైనా మానవులకు అవసరమైనదే. తాను తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అనేదీ ప్రతీ మనిషికి తెలుస్తునే ఉంటుంది. కానీ ఆ క్షణంలో మనిషిని ఏదో ఉన్మత్తత్తో లేదా దురావేశమే ఆవరిస్తుంది. ఒక్క క్షణం పాటు తనని తాను నిలవరించుకుని ఆలోచిస్తే.. ధర్మమార్గంలో చరించడానికి అవకాశం లభిస్తుంది. తనది కాని దానికి ఆశపడడం, బలవంతంగా చేజిక్కించుకోవాలనుకోవడం, విపరీతంగా కూడబెట్టాలనుకోవడం, ఎదిరించినవారిని అడ్డు తొలగించుకోవాలనుకోవడం, కుయుక్తులు పన్ని అప్రతిష్ఠ పాలు చేయడం, శారీరకంగా… కుదరకపోతే మానసికంగా వేధించడం, రాజనీతి పేరుతో తాము చేసేవాటిని సమర్థించుకోడం, పలుకుబడి సాయంతో తాము చేసిన నేరాలకు శిక్షను తప్పించుకోడం వంటివి ప్రతీ యుగంలోనూ ఉన్నాయి. ఇలాంటివి చేయకూడదు, తప్పు అని చెప్పేవాళ్ళూ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అయితే ఆ కాలంలో వారి గొంతులు దృఢంగా వినబడేవి. ఈనాడు బలహీనమయ్యాయి. మంచి మాటలు చెబుదామన్నా, సమాజపు పోకడలకు వెరచి మాకెందుకులే అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. మంచితనం చేతకానితనమైన కాలంలో వికర్ణుడిలాంటి వారి అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు రచయిత.

ఓ ధర్మపరుడి కథని సులభమైన శైలిలో, తేలికపాటి పదాలతో ఆసక్తిగా చదివించేలా వ్రాశారు రచయిత. పౌరాణిక కథకి తగ్గట్టుగా సంభాషణలున్నాయి.

‘‘సమయం వచ్చినపుడు మాట్లాడగలగాలి. వేళ మించిపోకుండా బలం చూపగలగాలి. కలసిరాని కాలంలో సైతం మంచివైపు నిలవగలగాలి. ధర్మం మాట్లాడగలగాలి. అదీ మనిషి జీవితానికి అర్థం. మానవ జీవితానికి పరమార్థం’’ అని నిండుసభలో ధర్మరాజుతో వికర్ణుడు పలికిన మాటలు ఏ కాలంలోనైనా ఆచరించదగ్గవే.

యుద్ధం ఎటువంటి వినాశనానికి దారితీస్తుందో వికర్ణుడు గాంధారితో చెప్పిన ఈ మాటలు – యుద్ధపిపాసులందరికీ ఓ హెచ్చరిక లాంటివి. “గౌరవం యుద్ధాల వల్ల రాదమ్మా. ధర్మం వల్ల వస్తుంది. నీతి నిజాయితీల వల్ల వస్తుంది. సమరం అంటే ఏమనుకుంటున్నావమ్మా. అది కలిగినవారి కొంగుబంగారం. లేనివారి దౌర్భాగ్యం. రాజులు చేసే యుద్ధంలో ఓడిపోయేది ఎవరమ్మా. పేదలే కదా. మహా అయితే కొందరు రాకుమారులు ఈ పోరులో చనిపోవచ్చు. కానీ, అక్షౌహిణీల కొద్దీ మరణించే సైనికులు బీదలు కాదూ. మీ వద్ద సేవకులుగా పనిచేస్తున్నవారూ కాదూ. రాజ్యకాంక్ష ఎంతటి ప్రమాదకరమో తెలుసా అమ్మా. అది కన్నవారిని, తోబుట్టువులను, బంధుమిత్రులను కూడా పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు కబళిస్తుంది…”.

యుద్ధం తర్వాతి పరిణామాలు ఎంత వేదనాభరితంగా ఉంటాయో అద్భుతంగా చెప్పారు రచయిత. “ఇరుపక్షాలవారు ఒక్కలానే ఉన్నారు. యుద్ధానికి ముందు వారిలో ఎన్నయినా తేడాలుండవచ్చు. ఇప్పుడు మాత్రం వారిలో సమానతలు చాలానే ఉన్నాయి. కన్నీరు. బాధ. బెంగ. యాతన… ఇవీ ఇప్పుడు వారు సాధించుకున్నవి.”

“పోరాటంలో ఓడేవాడు మనిషి, ఓడించేవాడు మనిషే. మనిషి అనగానే ఎక్కడో ఒక మూల మానవత ఉండకపోదు. అది ఏదో ఒక క్షణాన బహిర్గతం కాకనూపోదు.” అంటారు రచయిత. ఆ మానవతకి వెలికితీయడానికి దోహదం చేసే వ్యక్తుల గురించి తెలుసుకోవడం అవసరం. అటువంటి వాడే వికర్ణుడు. వికర్ణుడి జీవితాన్ని తెలియజెప్పే ఈ పుస్తకం ఆశించిన ప్రయోజనం గొప్పది.

‘‘రాజ్యాన్ని సక్రమంగా పాలించడానికి, పేదలను ఆదుకోవడానికి కొన్ని సందర్భాల్లో శాస్త్రాలు ఉపకరించకపోవచ్చు. ధర్మగుణం, నీతి నిజాయితీలు తప్పక ఉపయోగపడతాయి. స్త్రీలు గౌరవాన్ని అందుకునేచోట మానవత ప్రకాశిస్తుంది. మహిళల ఔన్నత్యాన్ని కాపాడగలిగేది వికర్ణుని వంటివారే. వీరి సంఖ్య ఎంత పెరిగితే ప్రపంచానికి అంత ప్రయోజనం. వికర్ణుని చరితను ఔదలదాల్చగల సమాజం అమ్మలను గౌరవించగలదు. ఆరాధించగలదు. అందుకే వికర్ణుని నడత పదుగురికీ తెలియజేయండి. అతని గుణగానం చేయండి. ఇదే నేను ప్రధానంగా చేయగల ధర్మబోధ. ఈ యుగానికైనా, రేపటి కలియుగానికైనా…’’అని భీష్ముడి ద్వారా నవల చివరలో పలికించిన మాటలకు క్రియారూపం ఈ నవలే.

వృత్తిరీత్యా విలేఖరి అయిన డా. చింతకింది శ్రీనివాసరావు గారు రచించిన అలివేణీ ఆణిముత్యమా, దాలప్ప తీర్థం, నవ్య కవితారూపం నానీ – వివేచన, స్వరూపసుధ పుస్తకాలు కూడా ప్రఖ్యాతిగాంచినవే.

శ్రీనిజ ప్రచురణలు, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ 160 పేజీల నవల వెల 110/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్త చిరునామా:

శ్రీనిజ ప్రచురణలు,

6-60/1, రవీంద్రనగర్, పాత డెయరీ ఫారం

విశాఖపట్నం-40

దేవరహస్యాన్ని వెల్లడించిన ‘సేతు రహస్యం’

SetuRahasyamFrontCover

 కొల్లూరి సోమ శంకర్

~

SomaSankar2014ఒక బర్నింగ్ ఇష్యూని ప్రధానాంశంగా తీసుకుని చేసే రచన ఆ ఇష్యూ ప్రజలలో నానుతున్నంతవరకూ వెలుగులో ఉంటుంది. సమస్య విస్మృతికి గురయ్యేసరికో లేదా తాత్కాలికంగా పరిష్కారమయ్యేసరికో, ఆ రచన మరుగున పడే ప్రమాదం ఉంటుంది. అయినా రిస్క్ చేసి ఆ రచనని ప్రచురించడం అంటే రచయితకి తనమీద, కథావస్తువుమీద అంత గట్టి నమ్మకం ఉన్నట్లు. ఈ విషయాన్నే మరోసారి ఋజువు చేసారు గంగ శ్రీనివాస్.

2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ఆమోదించడంతో దేశవ్యాప్తంగా సంచలానికి దారితీసింది. రవాణా నౌకలు భారతదేశపు తూర్పుతీరం నుంచి పశ్చిమ తీరానికి చేరాలంటే శ్రీలంక మీదుగా వెళ్ళవలసి ఉంది. అంతే కాకుండా సమయం ఎక్కువ పడుతోంది. ఈ సమస్యని అధిగమించేందుకు గాను రామాయణ కాలంలో శ్రీరాముడిచే నిర్మించబడిందిగా భావిస్తున్న రామసేతువును కూల్చి ఆ ప్రాంతంలో కాలవ ఏర్పాటు చేయడం ద్వారా భారీ నౌకల ప్రయాణానికి వీలు కల్పించి, సరుకు రవాణా సమయాన్ని తగ్గించవచ్చనీ, ఇంధనాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలతో ప్రభుత్వం పలు కమిటీలు వేసింది. ప్రజల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

విశ్వాసానికి, హేతుబద్ధతకీ పొసగడం ఎప్పుడోగాని జరగదు. శ్రీరాముడు కట్టించిన వారధిని కూలిస్తే ఊరుకోమని హిందూ సంస్థలు, ప్రాజెక్టును అమలుచేస్తే ఆ ప్రాంతంలో వాణిజ్యం అభివృద్ధి చెంది, పరిశ్రమలు వస్తాయనీ, స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని మరికొన్ని సంస్థలు జగడానికి దిగాయి. ఈ నేపథ్యంలో రామసేతు పూర్వపరాలను వివరిస్తూ వ్రాసిన నవల “సేతు రహస్యం”. వాస్తవాలకి కాస్త కల్పన జోడించి రామాయణ గాథలోని పద్యాలను అవసరమైన చోట ఉపయోగించుకుంటూ కథని నడిపారు రచయిత.

దేశ విదేశాలలో రామసేతువు ఒక బర్నింగ్‌ ఇష్యూగా మారి, ఈ సెగలు విదేశాలలోని ప్రవాస భారతీయులను కూడా తాకుతాయి. అక్కడ కూడా వాదోపవాదాలు జరుగుతాయి, కాని సత్యాన్వేషణ మాత్రం జరగటం లేదని తలచి, ఆ దిశగా సన్నాహాలు చేస్తారు ప్రవాస భారతీయులు. వివిధ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులంతా కలసి ”వరల్డ్‌ విశ్వశాంతి ఫెడరేషన్‌” గా ఏర్పడి, వివిధ సంస్థలతో కలసి పని చేయాలని ఏకాభిప్రాయానికి వస్తారు.
వారి ప్రయత్నాలలో భాగంగా ఒక కోర్‌ టీమ్‌ భారతదేశానికి సత్యాన్వేషణకై వస్తుంది. వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఏవిధంగా వారి సత్యాన్వేషణ సాగుతుంది, సత్యం ఏమి అనేదే ఈ నవలలోని అంశం.

GangaSrinivas

లక్ష్యానికి తగిన కార్యసాధకులను ఎంచుకోవడంతోనే విజయానికి తొలి అడుగు పడుతుంది. సాగర గర్భంలో అన్వేషణలు కొనసాగించడంలో అనుభవమూ, విశేష నైపుణ్యం ఉన్న శ్రీధర్ చాగంటి, ఓ పరిశోధనా నౌకలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేసే రాజేశ్, సముద్ర సంపదనీ, పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేసే కేథరిన్, శ్రీలంక ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ డా. విజయ సోమదేవ రామసేతువు సహజసిద్ధమైనదా, మానవ నిర్మితమైనదో నిగ్గు తేల్చే బృందంలో కీలక సభ్యులు.

తమ ఈ ప్రయత్నాలనీ అమెరికాలోని ఓ యూనివర్సిటీ, భారతదేశంలోని మరో ప్రముఖ విశ్వవిద్యాలయం యొక్క సంయుక్త పరిశోధనా ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. కార్యాచరణ మొదలై, బృందంలోని సభ్యులు తమ ప్రయత్నాలను వేగవంతం చేసేసరికి కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. రామాయాణాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటారు. రామాయణాన్ని వ్యాఖ్యానించడంలో విశేష అనుభవం ఉన్న భట్టుమూర్తి అనే పండితుడిని కలసి రామాయణం గురించి తెలుసుకుంటారు, తమ సందేహాలు తీర్చుకుంటారు. వీరు తమ పరిశోధనలలో ఎదురైన ఆటంకాలను ఎదుర్కోడానికి ఆధ్యాత్మికతనీ, శాస్త్రీయతని సమన్వయం చేస్తారు. ప్రాచీన గ్రంథాలలో చెప్పిన అంశాలకు వర్తమాన సాంకేతికని అన్వయించి ఆ యా అంశాలను ధృవీకరించుకుంటారు.

రామసేతువుని నలుని ఆధ్వర్యంలో ఐదు రోజులలో నిర్మించారు. వరుసగా, 14, 20, 21, 22, 23 యోజనాల చొప్పున నూరు యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు ఉన్న వారధి నిర్మించబడింది. రోజుకి 20 యోజనాలు కాకుండా, ఇలా వివిధ సంఖ్యలతో నిర్మించడం వెనుక ఉన్న దేవరహస్యం ఏమిటి? దానిని ఈ బృందం ఎలా కనిపెట్టిందనేది ఆసక్తికరం. అసలు యోజనం అంటే ఎంత దూరం? క్రోసు అంటే ఎంత దూరం? రాజస్థాన్‌లోని థార్ ఎడారి ఇసుక అడుగున ఒకప్పుడు ఎంతో ఘనమైన సంస్కృతి ఉన్న నాగరికత వర్ధిల్లిందా? ఆ నాగరికతకీ రామాయణానికి సంబంధం ఏమిటి? నవల ముగింపులో రామసేతువు నిర్మాణంలో వాడిన ఓ భారీ శిలను సముద్రం నుంచి బయటకి తెచ్చినట్లు, దానిలో ఓ రహస్య గది ఉన్నట్లు చెబుతారు రచయిత. ఆ గదికున్న తలుపు తెరవడానికి శ్రీధర్ ఏం చేసాడు? ఇంతకీ ఆ గదిలో ఏముంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు ఈ నవల జవాబులు చెబుతుంది.

రామాయణ ఘట్టం ఆధారంగా ఈ నవలని సృజించినా, మతం ముద్ర పడకుండా జాగ్రత్త వహించారు రచయిత. ఎక్కడా విసుగనిపించకుండా, ఆసక్తిగా చదివింపజేస్తుందీ నవల.

పుస్తకంలో అక్కడక్కడా బాక్స్ ఐటమ్స్‌లా ప్రాచీన సాంకేతికతకి, రహస్యాలకి సంబంధించిన చక్కని వివరాలు అందజేసారు. ఎటువంటి సాంకేతిక ఉపకరణాలు లేని రోజులలోనే వెనిస్‌కి చెందిన జెనో సోదరలు 14వ శతాబ్దిలోనే గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్‌ల మాప్ అత్యంత ఖచ్చితంగా తయారు చేయడం; 1895లో దేశంలో మొట్టమొదటి విమానయానం జరిగిన వైనం; సౌదామిని కళ గురించి, అమ్ముబోధిని గురించి చెప్పిన స్వల్ప వివరణ వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిస్తుంది. శ్రీలంకలో సీతను ఉంచిన గాధకి సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్న సీత ఏలా, సువార ఎలియా అనే ప్రదేశాల గురించి వివరించారు. సప్తఋషులలో ఒకరైన భారద్వాజ మహర్షి రచించిన అంశుబోధిని అనే వైమానిక శాస్త్రం గురించి, ప్రాచీన విమానాల గురించి చెప్పారు. 12 రకాల మేఘాల గురించి, వాటి లక్షణాల గురించి, 64 రకాల విద్యుల్లతల గురించి, 32 రకాల పిడుగుల గురించి అత్రి మహర్షి విశదీకరించినట్లు తెలియజేసారు. ప్రకాశ స్థంభన బిడలోహంతోనూ, తమోగర్భలోహంతోనూ నిర్మించే విమానాలు ప్రత్యర్థుల రాడార్లకు అందవని తెలియజేసారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో ఒకప్పుడు డ్యుగోంగ్ అనే మత్స్య జాతి ఉండేడని, ఈ చేపలు క్షీరదాలని, చూడ్డానికి మత్స్యకన్యలుగా ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఈ జాతి చేపలు అంతరించిపోతున్నాయని తెలుస్తోంది. ఈ బాక్స్ ఐటమ్ అంశాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి.

రామసేతువుని అసలైన ప్రేమచిహ్నంగా నిలపాలన్న రచయిత ఆలోచన వినూత్నమైనది. సృష్టి ప్రచురణలు వారు 2008లో ప్రచురించిన ఈ 168 పేజీల నవల వెల రూ. 120/- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ, కినిగె.కాం లోను లభిస్తుంది.
*

ఇరవయ్యేళ్ళ తరవాత కూడా…ధ్యేయం!

 

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

సుమారు పాతికేళ్ళకు పైగా సాహిత్య రంగాన్ని ప్రభావితం చేసిన ఓ సుప్రసిద్ధ రచయిత రచించిన పుస్తకాలలో ఏది మంచిది లేదా ఏది ఉత్తమమైనదనే ప్రశ్న తలెత్తినప్పుడు పాఠకులందరూ ఒకే నవలని లేదా ఒకే పుస్తకాన్ని ది బెస్ట్‌గా పేర్కొనడం చాలా అరుదు.

యండమూరి వీరేంద్రనాథ్! ఈ పేరు చదవగానే ఎన్నో అద్భుతమైన నవలలు మనసులో మెదులుతాయి. వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందోబ్రహ్మ, అంతర్ముఖం, అంకితం, యుగాంతం, చీకట్లో సూర్యుడు, కాసనోవా 99, ఆఖరి పోరాటం, 13-14-15, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, డబ్బు మైనస్ డబ్బు, మరణ మృదంగం, రాక్షసుడు, అనైతికం, రెండు గుండెల చప్పుడు, ప్రార్థన, నల్లంచు తెల్లచీర, ప్రేమ, డేగ రెక్కల చప్పుడు, ఓ వర్షాకాలం సాయంత్రం… ఇలా నవల ఏదైనా… విభిన్నమైన ఇతివృత్తాలతో చదువరులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఆసక్తి కలిగేలా వ్రాయగలడంలో దిట్ట శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. కమర్షియల్ నవలలోనూ చక్కని సందేశాన్ని అంతర్లీనంగా జొప్పించి పాఠకులకు, ప్రచురణకర్తలకూ ఉభయతారకంగా ఉండేలా వ్రాయగల నేర్పరి ఆయన.

యండమూరి గారు నవలలతో పాటు మనోవిశ్లేషణ/వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు కూడా రచించారని పాఠకులందరికీ తెలుసు. “మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?” అనే మనోవిశ్లేషణా రచన వెలువడిన తర్వాత సుప్రభాతం పక్షపత్రికకి ధారావాహిక వ్రాయాల్సి ఉన్నప్పుడు – “నాకు కమర్షియల్ గిమ్మిక్కులు లేకుండా సామాజిక ప్రయోజనం ఉండేట్లు నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఒక నవల వ్రాయండి” అని ఆ పత్రికాధిపతి రత్తయ్య గారు అడిగారట! ఫలితమే “ధ్యేయం” అనే నవల!

20 జనవరి 1993 నుంచి 5 మార్చి 1994 వరకు, కథనానికి తగ్గ బొమ్మలతో (చిత్రకారుడు ‘గడియారం శ్రీ’) సుప్రభాతం పత్రికలో సీరియల్‌గా వెలువడింది [సీరియల్‌ పూర్తయ్యాక ఈ నవలని నేను బైండ్ చేసి ఉంచుకున్నాను… ఈ తేదీల వివరాలన్నీ అందులోంచే…]. తొలిసారి ప్రచురితమై దాదాపు 21 ఏళ్ళు దాటినా నవల ప్రాసంగిత ఏ మాత్రం తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు.

సీరియల్ ఆఖరి భాగంలో ‘ఇదీ కథ’ అనే బాక్స్ ఐటమ్‌లో “చెట్టుని చూసి మనిషి నేర్చుకోవలసింది చాలావుంది. కాండాన్ని కత్తిరించినా పక్కనుంచి చిగురేస్తుంది. కానీ మనిషి – చిన్న కష్టానికే బెంబేలు పడిపోతాడు. అలా పడకూడని శక్తి, పిల్లలకి పెద్దలే ఇవ్వాలి. .. పెద్దలకే ఆ శక్తీ, అవగాహన లేకపోతే మరి పిల్లల భవిష్యత్? తన లక్ష్యాన్ని చేరుకోడానికి మనిషేం చేయాలన్నదే ‘ధ్యేయం’ ఇతివృత్తం.” అంటూ నవల సారాంశాన్ని క్లుప్తంగా చెప్పారు.

***

పిల్లల ఎదుగుదలలో కౌమార, యవ్వన దశలు అతి ముఖ్యమైనవి. వారి జీవితాలను నిర్దేశించే దశలు కూడా ఇవే. ‘చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు’ అనుకునే తల్లిదండ్రులు కొందరు; ‘పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే, వాళ్ళే నేర్చుకుంటారు’ అనుకునే అమ్మానాన్నలు మరికొందరు. ఇద్దరిదీ తప్పే!

తాము చేరుకోలేని గమ్యాలకి తమ పిల్లలని చేర్చి తృప్తి పడాలనుకునే తల్లిదండ్రులది మరో రకం తప్పు. తాము తప్పులు చేస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, ఎదుటి వారి గోరంత పొరపాట్లను కొండంత చేసి ఎగతాళి చేసే పెద్దలది మరో తరహా తప్పు.

ఇన్ని తప్పుల మధ్య ఒప్పుగా పిల్లలని పెంచడం అతి తక్కువ మందికే సాధ్యమవుతుంది. పిల్లల బాల్య, యవ్వన దశలు తల్లిదండ్రులకే కష్టమైన కాలం. పిల్లల వయసుని దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలోనే ఆలోచించాలి.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో పెద్దల ప్రేమా, ఆప్యాయతల మధ్య హాయిగా గడిచేది బాల్యం. కౌమార యవ్వనాలలో ఇబ్బందులు ఎదురైనా తమవారంటూ కొందరున్నారనే భరోసాతో సమస్యలని ఎదుర్కునేవారు.

మారుతున్న కాలంతో పాటు (.. నిజానికి ఈ పద ప్రయోగం సరైనది కాదు. కాలం ఎన్నడూ ఒకేలా ఉంటుంది. మారేది మనుషులే.) సమిష్టి కుటుంబాలు అంతరించి, వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాకా బంధాలు సడలుతున్నాయి. జీవనాన్ని వేగవంతం చేసుకుని, బ్రతుకుని దుర్భరం చేసుకుంటున్నారు జనాలు. పిల్లలకి మార్గదర్శకులుగా ఉండాల్సిన పెద్దలే దారి తప్పుతున్నారు.

పిల్లలకి మొదటి పాఠశాల ఇల్లు. తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్న సత్యాన్ని ఈ నవల మరోసారి చాటుతుంది.

***

Yandamooriఒకే కాలనీలో నివాసముండే ఐదు జంటలు, వారి పిల్లల చుట్టూ నడిచే కథ ఇది. దశరథ్, కౌసల్య ఒక జంట. రాము, నిఖిత వీరి సంతానం. విశ్వేశ్వర్, అన్నపూర్ణ మరో జంట. మహతి, సుకుమార్ వీళ్ళ పిల్లలు. కృష్ణమూర్తి, రుక్మిణి ఇంకో జంట. ప్రియతమ్, ప్రీతి వీళ్ళ పిల్లలు. శంకరం, పార్వతి నాల్గవ జంట. అవినాష్ వీళ్ళ కొడుకు. విష్ణు, శ్రీలక్ష్మిలది ఐదవ జంట. ధాత్రి వీళ్ళ అమ్మాయి.

నిఖిత, రాము, ప్రీతి, ప్రియతమ్, ధాత్రి, అవినాష్, సుకుమార్, మహతిల బాల్యం ఒకే చోట గడచినా, కొన్నేళ్ళ పాటు వాళ్ళంతా ఒకే కాలనీలో పెరిగినా వాళ్ళ ఆలోచనలు, దృక్పథాలు వేర్వేరు. పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది.

చదువు పేరుతో కొడుకుని పుస్తకాలకే పరిమితం చేసి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి తమ అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తారు శంకరం, పార్వతి. నృత్యం, టెన్నిస్ పేరుతో కూతురికి ఊపిరాడనివ్వదు శ్రీలక్ష్మి.  విష్ణు సెక్స్ పర్వర్ట్. కృష్ణమూర్తి, రుక్మిణిల ప్రవర్తన వాళ్ళ సంతానం అదుపు తప్పేలా చేస్తుంది. మగపిల్లాడిపై మోజుతో తొలి కాన్పు ఆడపిల్ల పుట్టిన తర్వాత, అబార్షన్లు చేయించుకుని చివరికి కొడుకుని కంటారు విశ్వేశ్వర్, అన్నపూర్ణ. వీళ్ళందరికి భిన్నంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పిల్లలకి అనురాగం పంచుతారు దశరథ్, కౌసల్య.

ప్రేమించిన ముగ్గురు కుర్రవాళ్లూ మూడు రకలుగా మోసం చేస్తే – వారి మీద పగబడుతుంది ప్రీతి. తనకన్న పదిహేనేళ్లు పెద్దయిన ‘ఆంటీ’ని మంచి చేసుకుంటే ‘జేబు ఖర్చుకు’ లోటుండదని భావిస్తాడు పద్నాలుగేళ్ల ప్రియతమ్. తాను చెడిన ప్రియతమ్ సుకుమార్‌నీ చెరుపుతాడు. ప్రియతమ్‌తో స్నేహం చేసి అతనితో బాటు తాను ఊబిలో కూరుకుపోతాడు సుకుమార్. ప్రియతమ్ చేతిలో వంచనకి గురవుతుంది ధాత్రి. చిన్నప్పుడు తనని నిర్లక్ష్యం చేసినందుకు, గొప్పింటి కోడలుగా వెళ్ళి తల్లిదండ్రులను సాధించాలనుకుంటుంది మహతి. సర్వనాశనమైపోయాడనుకున్న స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నిస్తాడు అవినాష్. తల్లిదండ్రులిద్దరూ అయిదు నిముషాల వ్యవధిలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణిస్తే, అన్న చదువులకు భంగం రాకుండా తన కర్తవ్యం నిర్వర్తిస్తుంది నిఖిత.

***

తను నిరంతరం శ్రమిస్తూ, ఎదుగుతూ, తనతో పాటు మరికొందరికి ఎదిగే మార్గం చూపించిన నిఖిత లాంటి వ్యక్తులు ప్రస్తుత యువతరానికి ఎంతో అవసరం. “When the going gets tough, the tough get going” అనే నానుడిని నిజం చేస్తుంది నిఖిత పాత్ర!

అలాగే తక్కువ నిడివి ఉన్నా, తన పరిధిలో ఒక ప్రయోజన కార్యాన్ని సాధించి, సమాజం పట్ల తన నిబద్ధతని చాటుకుంటుంది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర. ఆమె పేరు సాధన. ఎంసెట్ ర్యాంకుల భాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెట్టి అక్రమార్కులను జైల్లో పెట్టిస్తుంది. కోచింగ్ సెంటర్ల మోసాలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పైరవీలు… ఇలా వ్యవస్థలోని లోపాలని ప్రస్తావిస్తూ తన పరిధిలో తాను చేయగలిన పనిని సక్రమంగా చేస్తుందీ పాత్ర.

“జీవితంలో ఏదో ఒక ఎదురుదెబ్బ తగిలే వరకూ మనిషి ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో తెలియడానికి తరాలు, అంతరాలు ఉంటాయా?” అని అడుగుతుందో పాత్ర. అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇది.

***

యండమూరి గారి నవలలు చదివాక, అందులోని కొన్ని వాక్యాలను కోట్స్‌గా వ్రాసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఈ నవలలోనూ అలాంటి అద్బుతమైన వాక్యాలున్నాయి. ఎన్నో విధాలుగా ప్రేరణిస్తాయి. మచ్చుకు కొన్ని:

జ్జానం పుస్తకాల్లో ఉండదు. అనుభవాల్లో ఉంటుంది. అనుభవాలన్నీ కూర్చి గుచ్చిన జీవితపు దండతో ఉంటుంది.

కష్టం గురించి నిరంతరం ఆలోచించడం కన్నా, దాంట్లోంచి బయటపడే మార్గం ఆలోచించడం మంచి పద్ధతి. కానీ, చాలామందికి మానసికంగా అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే తమకొచ్చిన కష్టాల్ని భవిష్యత్తులో విజయాలకి సోపానాలుగా వాడుకుంటారు.

విజయం సాధించాలంటే నిరంతర ఘర్షణ ఉండాలి. ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం వైపు సాగిపోవాలన్న కృషి, దీక్ష ఉండాలి. కష్టపడాలి.

అస్థిత్వం ఋజువు చేసుకోడం జీవిత ధ్యేయం అయినప్పుడు మనిషి సిన్సియర్‌గా కష్టపడతాడు. అందులో ఆనందం పొందుతాడు.

పరమపద సోపానంలో పెద్ద పాము చేత మింగబడి మొదటికి వచ్చిన వ్యక్తి ఆట మానేస్తే నష్టం అతనికే. చిన్న చిన్న మెట్లు మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళడానికి ప్రయత్నించడమే జీవితం.

వర్షిస్తే బరువు తగ్గి మేఘం తేలికపడుతుంది. రోదిస్తే బరువు తగ్గి మనసు తెరిపిన పడుతుంది.

ముందుకు పోవడం తప్ప వెనుకడుగు వేయడం కాలానికి తెలియదు. అందుకే జరిగిన దాన్ని గురించి విచారించకు. జరగబోయేదాని గురించి ఆలోచించు.

***

వయసులో పెద్దలైనా, బుద్ధులలో పిల్లల కంటే హీనంగా ప్రవర్తించేవారున్నట్లే, వయసులో చిన్నవారైనా పెద్దరికం ఆపాదించుకుని హుందాగా ప్రవర్తించేవారు అరుదుగానైనా ఉంటారని చెబుతుంది ఈ నవల.

ఆధునిక జీవితాలకు అద్దం పడుతూ… మధ్యతరగతి మనస్తత్వాలను చిత్రిక పడుతూ… ఎదిగొస్తున్న బాల్యానికి… భవిష్యత్ చిరునామాను వెతుక్కుంటున్న యవ్వనాలకు భాష్యం చెప్పిన నవల ఇదని “సుప్రభాతం” పత్రిక పేర్కొంది. ఏ మాత్రం అతిశయోక్తి లేని వ్యాఖ్యానం ఇది.

టీనేజ్ పిల్లలు… కొత్త కొత్త ప్రలోభాల బారిన పడే ప్రమాదం ఒకప్పటికంటే ఇప్పుడు మరింత అధికంగా ఉంది కాబట్టి ఈ నవల ఇప్పటికీ ఉపయుక్తమనే అనే భావించాలి.

విజయవాడ నవసాహితి బుక్ హౌస్ వారు ప్రచురించిన “ధ్యేయం” నవల అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. పుస్తకం వెల రూ. 90/-

గమనిక:

సీరియల్‌లో ప్రీతి అని ఉన్న పేరు నవల పుస్తకంగా ప్రచురితమయ్యాకా, వరూధిని అని మారింది.

~

 

మహోజ్వల జానపద నవల “మృత్యులోయ”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

సాహిత్యంలో బాలసాహిత్యం ఓ అవిభాజ్యమైన అంగం. పిల్లల మానసిక వికాసానికి బాలసాహిత్యం ఇతోధికంగా దోహదం చేస్తుంది. పిల్లలో ఉత్సుకతని రేకెత్తించి, విజ్ఞానాన్ని అందిస్తుంది. వీటితో పాటు భాషాజ్ఞానమూ అబ్బేలా చేస్తుంది.

పిల్లలలో ఊహాశక్తిని పెంపొందిస్తూ, చక్కని నడవడి నేర్పే కథల కోసం ఒకప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బుజ్జాయి… వంటి పత్రికలు ఉండేవి. చందమామ చదవని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. చందమామ పత్రిక అంతలా జనాదరణ పొందడానికి వ్యవస్థాపకుల విలువలు ఒక కారణమైతే, చక్కని కథలని ఎంచి పత్రికని పరిపుష్టం చేసిన సంపాదకుల దూరదృష్టి, వివేకం మరో కారణం.

పిల్లలను, పెద్దలనూ ఆకట్టుకునేలా చందమామని తీర్చిదిద్దడంలో శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పాత్ర విస్మరించలేనిది. పత్రిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, చందమామలో 12 జానపద సీరియల్స్ వ్రాసి ప్రచురించారు. ఒక్క చందమామలోనే కాదు, బొమ్మరిల్లు, యువ, స్నేహబాల, ప్రమోద వంటి పత్రికలలో జానపద నవలలు ధారావాహికంగా వెలువరించారు.

మృత్యులోయ’ నవల బొమ్మరిల్లు ప్రారంభసంచిక (1971) నుంచి 39 నెలలపాటు (1974) ధారావాహికంగా ప్రచురింపబడింది. జానపద నవలలంటే, రాజులు, రాణులు, రాజకుమారులు, రాకుమార్తెలు, మంత్రులు, మంత్రి కుమారులు, సైన్యాధికారులు, దండనాయకులు, విదూషకులు, కుట్రలు, కుతంత్రాలు, అడవులు, జంతువులు, మాయలు, మంత్రాలు, మాంత్రికులు, ఋషులు, మరుగుజ్జులు, మహాకాయులు… ఇలా ఓ కొత్త ప్రపంచంలోకి పాఠకులను తీసుకువెడతాయి. ఈ నవల కూడా అలాంటిదే.

లలాటమనే దేశాన్ని యశోవంతుడనే రాజు ధర్మబద్ధంగా పాలిస్తూంటాడు. మంత్రి జయవర్మ రాజుకి అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. రాజు గారి శూరత్వానికి, మంత్రిగారి వ్యూహచతురతకి జడిసిన పొరుగు రాజులు లలాటం మీదకి దండెత్తాలని ఉన్నా, వెనుకడుగు వేస్తుంటారు. రాజకుమారుడు యశపాలుడు, మంత్రి కుమారుడు జయకేతుడు అనుంగు మిత్రులు. రాచవిద్యలు, యుద్ధవిద్యలన్నింటిలోను ప్రావీణ్యం సంపాదించుకున్న యువకులు. తమ నైపుణ్యాలను కదనరంగంలో ప్రదర్శించే వీలు లేక, అడవిలో వేటకి వెళ్ళి, తమ విద్యలను మెరుగుపెట్టుకుంటూ ఉంటారు. అలా ఓ సారి అరణ్యంలో వేటకి వెళ్ళి, ప్రమాదానికి గురై, మృత్యులోయలోకి జారిపోతారు. పేరులోనే మృత్యువున్న ఆ లోయలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు, చిత్రవిచిత్రమైన జంతువులు, పక్షులు, నరవానరాలు, రాక్షసులు ఎదురయినా ఆ లోయలోంచి వారు బయటపడిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Dasari Subrahmanyam

***

ఆ లోయ ఎంత భయంకరంగా ఉంటుందంటే… “ఆ ప్రదేశమంతా అంతంగా లోతులేని మడుగులతో, వాటి మధ్య చిన్న చిన్న దిబ్బల మీద ఎత్తుగా పెరిగిన రెల్లు పొదలతో, చెట్లతో, రకరకాల పక్షులతో భీకరంగా వున్నది”.

ఈ లోయలోంచి బయట పడే మార్గం కోసం వెతుకుతారు యశపాలుడూ, జయకేతుడు.

“ఒకసారి యీ లోయలోకి వచ్చి పడిన వాళ్ళు తిరిగి బయటపడడం అంటూ జరగదు. చుట్టూ నిటారుగా వున్న కొండలు చూశారా? వాటిని పాకి పైకి పోవడం ఉడుములాంటి జంతువుకైనా సాధ్యం కాదు” అంటాడు, వీళ్ళిద్దరికన్నా ముందుగానే ప్రమాదవశాత్తు లోయలో పడిన విదూషకుడు.

“ఈ మృత్యులోయ లోంచి పైకి వెళ్ళేందుకు ఎక్కడో ఒకచోట సొరంగమార్గం లాటిది వుండకపోదు” అంటాడు యశపాలుడు ఆశావక దృక్పథంతో.

***

“పాముల కన్నా, క్రూరమృగాల కన్నా పగబట్టిన మనిషి ప్రమాదం. ఈ మృత్యులోయలో భల్లూకనాయకుడి వంటి వాళ్ళను వేళ్ల మీద లెక్కించవచ్చు. క్రూరత్వంలో వాడు రాక్షసి మృగాన్ని మించినవాడు.” అంటుంది సర్పవతి, భల్లూక నాయకుడు అపహరించ ప్రయత్నించిన సర్పజాతి నాయకుడి కూతురు. భల్లూక నాయకుడిని చంపి తమ దేశానికి వెళ్ళిపోతాం అని చెప్పిన జయకేతుడి మాటలు విని ఆశ్చర్య పోతుంది.

“ఈ మృత్యులోయలోంచి బయటకి పోవటమా? అదెలా సాధ్యం? మార్గం ఎక్కడున్నది?” అని అడుగుతుంది.

“మార్గం లేకపోతే, మేం సృష్టించి, మా దేశానికి తిరిగి పోతాం…” అంటాడు యశపాలుడు. తమ శక్తి సామర్థ్యాల మీద అమితమైన విశ్వాసం!

 

***

F1

రాక్షసుడి విదూషకుడైన ముసలివాడికి భల్లూక జాతి వాళ్ళ ప్రవర్తనలో ఏదో మోసం వున్నట్లు అనుమానం కలిగింది. సర్పవతిని ఎత్తుకుపోతున్న వాళ్ళ వైపు నుంచి, ఆ పిల్ల పేరూ, రక్షించమన్న పిలుపూ ఎలా వస్తుంది?  ఆ కంఠస్వరాలు యశపాల జయకేతులవి కావు. బహుశా, భల్లూక జాతివాళ్ళు తమను రెండుగా చీలదీసి తరువాత తేలిగ్గా హతమార్చేందుకు ఏదో ఎత్తు వేసి వుంటారు.

ప్రమాదాలు చుట్టు ముట్టినప్పుడు, సంయమనం కోల్పోకపోతే, దాన్నుంచి బయటపడే ఉపాయం సులువుగా తడుతుంది.

***

ఒకటా రెండా, ఇలా నవలంతా ఎన్నో ఘటనలు. ప్రమాదాలని, అడ్డంకులని కథానాయకులు సానుకుల దృక్పథంతో ఎదుర్కునే తీరు.. నేటి వ్యక్తిత్వ వికాస సూత్రాలకు సరిపోతాయి.

సాహిత్యం ఏదైనా మంచి చెడుల సమ్మేళానాన్ని ప్రతిబించించి, చెడును విసర్జించి, మంచిని స్వీకరించమనే చెబుతుంది. ఈ కథా అంతే. పాత్రధారులలో మంచి వాళ్ళుంటారు చెడ్డవాళ్ళుంటారు. మంచికి చెడుకీ మధ్య పోరాటం ఉంటుంది. అంతిమంగా చెడుపై మంచి విజయం సాధిస్తుంది. ఏ దేశపు సాహిత్యమైన చెప్పేది ఇదే.

మాయలు మంత్రాలు, రాక్షసులు, విచిత్రమైన జంతువులు.. ఇవన్నీ ప్రతీకాత్మకమైనవి. రెండు తలల మహాసర్పం, నరవ్యాఘ్రం వంటి జీవులు కల్పనే కావచ్చు… కాని ఆయా పాత్రలను సృష్టించడం వెనుక ఓ నీతి ఉంది. పిల్లల ఎదిగి, జీవితాన్ని అవగతం చేసుకునే వయసొచ్చే సరికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, కష్టం నష్టం, భీతి, భయం, దిగులు, నిరాశ వంటి ప్రతికూల లక్షణాలు కూడా ఇలాంటి కల్పితాలేనని, ఎటువంటి స్థితిలోనూ ధైర్యం కోల్పోకుండా స్థిమితంగా ఉంటే విజయం తధ్యమని గ్రహిస్తారు.

అలాగే, తాము ఎంతటి ప్రమాదంలో ఉన్నా, తోటివారిని కాపాడడానికి చివరిదాకా ప్రయత్నించడం గొప్ప లక్షణం. ఈ నవలలోని నాయకులు కనపర్చిన అనేక సానుకూల దృక్పథాలలో అదీ ఒకటి.

మంత్రాలు, మాయలు ప్రయోగించడం – తమ లక్ష్యం చేరుకోడానికి అడ్డదారులు తొక్కడం లాంటిది. గొప్ప విలువలున్న వ్యక్తులు కూడా అప్పుడప్పుడు మాయమంత్రాల బారిన పడి తమ విద్వత్తును, పాండిత్యాన్ని నాశనం చేసుకుంటారు. విజయానికి అడ్డదారులు లేవని చెబుతుంది ఈ నవల.

Mryutyuloya Front Cover

నిత్యం ప్రమాదాలతో పోరాడుతున్నా, ఆశావాదం విడువరు కథానాయకులిద్దరూ. చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయి, జీవితాన్ని విషాదభరితం చేసుకునే వ్యక్తులు ఈ పాత్రల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. పాఠకులలో ఉత్కంఠ రేకెత్తించే ఈ నవల పిల్లలకి, పెద్దలకి సైతం ఎన్నో జీవిత పాఠాలు చెబుతుంది.

ఈ నవలకి కథానుగుణంగా గీసిన బొమ్మలు అదనపు ఆకర్షణ. అద్భుతమైన కథనానికి అందమైన బొమ్మలను గీసింది ఎం. కె. బాషా, ఎం.ఆర్.ఎన్. ప్రసాదరావులు.

వాహిని బుక్ ట్రస్ట్, మంచి పుస్తకం వారు సంయుక్తంగా ప్రచురించిన “మృత్యులోయ” అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుని పుస్తకాన్ని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు. 312 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-

~

 

నాలుగో సహస్రాబ్ది స్పేస్ ఒపేరా “కుజుడి కోసం”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఆకాశం’ మనిషికి ఎప్పుడూ ఉత్తేజాన్నిస్తుంది. మాములు జనాలకి నీలి ఆకాశం ప్రశాంతతని అందిస్తే, జిజ్ఞాసువులలో ఎన్నో ప్రశ్నలు రేక్తెత్తిస్తుంది. నాలో ఏముందో తెలుసుకోండంటూ సవాలు విసురుతుంది.  శూన్యం తప్ప అక్కడేం లేదని తెలిసినా మనిషి అన్వేషణ ఆగదు. శూన్యంలో భూమికి పైన ఎంతో ఎత్తులో ఉండే అంతరిక్షం పట్ల కుతూహలం అంతరించదు. మొదట చందమామ, ఆ తర్వాత ఇతర గ్రహాల పరిశోధన కొనసాగిస్తున్నారు. చంద్రుడి తర్వాత, ఖగోళంలో మనిషిని ఎక్కువగా ఆకర్షించింది కుజ గ్రహమేననడంలో ఎటువంటి అనుమానం లేదు.

శాస్త్రవేత్తలు శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తూ, అన్వేషణలు జరుపుతుంటే రచయితలు ఫిక్షన్ ద్వారా సైన్సు పట్ల పాఠకులలో ఆసక్తిని పెంచుతారు. సైన్సు ఫిక్షన్‌లో రచయితలు ఊహించిన కల్పనలెన్నో తరువాతి కాలంలో నిజమయ్యాయి. గత శతాబ్దంలో సైన్స్ ఫాంటసీలనుకున్న ఎన్నో కల్పనలు ఈ శతాబ్దంలో ఫాక్ట్స్ అయిన సంగతి అందరికీ తెలిసినదే.

ప్రముఖ వైద్యులు డా. చిత్తర్వు మధు వైద్యం నేపధ్యంతో ‘ఐసిసియు‘, ‘బై బై పోలోనియా‘, ‘ది ఎపిడమిక్‘ వంటి నవలలు రాసారు. తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసే అతి కొద్ది మంది రచయితల్లో మధు గారు ఒకరు. ఏలియన్స్,  గ్రహాంతర ప్రయాణాలు, రోబోలు, కాలంలో ప్రయాణం… వంటి ఇతివృత్తాలతో రచన చేసి పాఠకులను మెప్పించడం అంత సులువు కాదు. ఖగోళశాస్త్రంపై ఎంతో ఆసక్తి, అవగాహన ఉన్న మధు గారు శాస్త్ర విజ్ఞానాన్ని, ఊహని మిళితం చేసి “కుజుడి కోసం” అనే సై.ఫి రాసారు. స్థూలంగా ఈ నవల కథ ఇది:

కథాకాలం నాలుగో సహస్రాబ్ది 3260. అణుయుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిలో చాలా భాగం నశించి మనుషులు ఇతర గ్రహాలకి వలస వెళ్ళి అంతర్‌గ్రహ నాగరకత విలసిల్లుతున్న రోజులు. వెనకబడిన భూమి నుంచి  గ్రహాలకి వలసపోయే ప్రజలూ, స్పేస్ ప్లాట్‌ఫారంలూ, వివిధ జాతుల మానవులూ, మానవులని పోలిన హ్యుమనాయిడ్స్…. అది ఒక సరికొత్త విశ్వం! భూగ్రహంలోనూ అంతర్‌గ్రహ యానాలు, సమాచార వ్యవస్థా, వైద్య రంగాల్లో  మానవులు ఎంతో ప్రగతిని సాధించారు. ఇంటర్ గెలాక్టిక్ ఫోన్లు, సెవెన్త్ జనరేషన్ రోబోలు, ఇంటర్‌ గలాక్టిక్ నెట్, కాంతివేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలూ…. ఇలా ఎంతో అభివృద్ధి చెందినా మనిషి భావాలు, ఆలోచనలూ, వ్యక్తిత్వమూ మాత్రం పెద్దగా మారలేదు.

అసలు ఈ నాలుగో సహస్రాబ్ది చాలా వింతైన కాలం. ఒకపక్క అద్భుత విజ్ఞాన సాంకేతిక ప్రగతి. మరొకపక్క ఆధ్యాత్మిక మంత్రశక్తులు. ఇదివరకు విజ్ఞాన శాస్త్రంలో తెలియని విశ్వశక్తిని మనుష్యుడు మేధస్సుతో వశపర్చుకోవడం – రెండూ అద్భుతమైన మార్పులే! విశ్వశక్తి (Universal Force) అనేది ఈ నాలుగో సహస్రాబ్దిలోని ఒక అద్భుతమైన, అర్ధంకాని పరిణామం. విద్యుదయస్కాంతశక్తీ, భూమ్యాకర్షణశక్తీ, అణుశక్తీ తర్వాత, ఈ విశ్వశక్తి అనేది కొత్తగా కనిపెట్టబడి, మాంత్రికులచేత స్వాధీనంలోకి తెచ్చుకోబడింది. ఈ శక్తి భూమిలో విజ్ఞాన శాస్రవేత్తలకి ఎవరికీ తెలియదు.

కథా నాయకుడు హనీ మధ్య ఆసియాలోని ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి సయోనీ అనే అందమైన కుజ యువతి కలలోకి వస్తుంటుంది. ఆమెని చూడాలనే కోరికతో కుజగ్రహం చేరుకున్న అతని జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. సయోనీ అద్భుత శక్తులున్న ముసలి మంత్రగత్తె అనీ, ఒక పిచ్చి అన్వేషణలో తనను కుజ గ్రహానికి రప్పించగలిగిందని హనీ గ్రహిస్తాడు. తన తండ్రికీ, తనకి అమరత్వం సాధించాలనే కోరిక తీర్చుకోడానికి హనీని ఉపయోగించుకోవాలనుకోవాలనుకుని అతడిని కుజగ్రహానికి వచ్చేలా చేస్తుంది.

Dr.ChittarvuMadhu2

హనీకి విశ్వాంతరాళపు విశ్వశక్తిని అదుపులోకి తెచ్చుకోగలిగే ప్రత్యేకమైన శక్తులు వున్నాయనీ, అతనికి తెలియకుండనే అతనికి కాస్మిక్‌ ఎనర్జీ, దానికి ప్రతిస్పందించగలిగిన ప్రకంపనలు అతని మెదడులో, శరీరంలో వున్నాయనీ, తను మాత్రమే ఆ అమరత్వ శక్తిని సంపాందిచగలడని ఒత్తిడి చేస్తుంది. ఆమె తండ్రి, అరుణభూముల చక్రవర్తి సమూర హనీని బెదిరిస్తాడు. షాక్‌ తిన్న హనీ – చక్రవర్తి ఆశయసాధనలో తానేం చేయాలో అడుగుతాడు.  బదులుగా చక్రవర్తి – ”హనీ! నువ్వొక గొప్ప శాస్త్రవేత్తవి. మంత్రశక్తులు కలిగిన గొప్ప మానవుడివి. అయితే నీ శక్తి నీకే తెలియదు! నీకు ఇంకా మంత్రశక్తిని సాధించే శిక్షణ ఇచ్చి ఒక ముఖ్యమైన లక్ష్యసాధన కోసం పంపుతాను. భూమి, గురుగ్రహం, శని ఉపగ్రహం టైటాన్‌, కుజుని మానవ కాలనీ – ఇంకా అరుణ భూముల నుంచి ఎన్నుకుని, వాళ్ళ మనసులని ప్రభావితం చేసి ఇక్కడికి తీసుకువచ్చిన కొందరి వ్యక్తులకి నువ్వు నాయకత్వం వహించాలి. వాళ్ళందరూ కూడ నీ వలెనే అద్భుత శక్తులు కలిగివున్నవాళ్ళు. అయితే నువ్వు నాకు, సయోనీకి విశ్వాసపాత్రుడిగా వుండాలి. విశ్వశక్తిని వశపర్చుకుని ఉపయోగించే నేర్పు సంపాదించుకోవాలి నువ్వు. మా కోసం అమరత్వం ప్రసాదించే మహా ఔషధం తీసుకుని రావాలి! ఆ విషయంలో తప్పక కృతకృత్యుడిని కావాలి!” అని చెబుతాడు.

గత్యంతరం లేక, అందుకు అంగీకరించి, విశ్వశక్తి అనబడే ఆ మంత్రవిద్యలో కొంత పట్టు సాధిస్తాడు హనీ. రకరకాల ఇబ్బందులు ఎదుర్కుని ఒలంపస్ శిఖరంపై దాచబడ్డ అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని సంపాదిస్తాడు. ఇదే సమయంలో కుజునిలో నివసిస్తున్న మానవ కాలనీకీ, అదే గ్రహంలో అరుణ భూముల రాజ్యంలో ఉన్న మాంత్రికులకీ ఎప్పటినుంచో ఉన్న ఆధిపత్య పోరు మళ్ళీ రగులుకుని ఓ మహా యుద్ధంగా మారుతుంది.

ఏ సహస్రాబ్దిలోనైనా యుద్ధం భయంకరమైనదీ, మానవత్వానికి వ్యతిరేకమైనదే! మనిషి మనిషిని చంపుకోవడం – దానికోసం వివిధ రకాల సిద్ధాంతాలు, సంజాయిషీలు చెప్పుకోవడం, అనేక విధాల ఆయుధాలు వాడటం – ఇది అప్పటికీ, ఇప్పటికీ ఎప్పుడూ జరుగుతున్నదే! అసలు యుద్దమే ఒక నేరం! మాంత్రికులు ఎంత క్రూరులో మానవులు కూడా అంతే క్రూరులు, చెడ్డవారు. చిత్రహింసలు, జైలు… మళ్లీ గొప్పగా, నిబంధనలు పాటిస్తున్నట్లు మాట్లాడటం. ఎన్ని యుగాలు, సహస్రాబ్దులు గడచిపోయినా, యుద్ధాలలో ఈ ప్రవర్తనలన్నీ మారనే లేదు.

నాలుగో సహస్రాబ్దిలో కుజునిలో మానవులకీ, మాంత్రికులకీ జరిగిన ఈ యుద్ధం కూడా అలాంటిదే! అయితే ఈ సహస్రాబ్దిలో యుద్ధాలలో కొన్ని విశేషాలున్నాయి. మానవుల దగ్గర ఇదివరకటిలాగానే అణ్వాయుధాలున్నా వాటిని ఆఖరి ఆయుధాలుగానే వాడుతున్నారు. దానివల్ల గలిగే ప్రాణనష్టం, రేడియో ధార్మిక శక్తివల్ల వచ్చే అపాయాలూ అనేకం! మానవులు యుద్ధాల్లో ప్రాణనష్టం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దీనికి ఒక పద్ధతి ఏమిటంటే సైనికుల స్ధానంలో రోబోలని వాడటం. వాటిని రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేయించడం! కానీ మానవుల హైటెక్‌ యుద్ధం చేసే యంత్రాంగమంతా, ఎవరికీ తెలియని విశ్వశక్తి అనే మాంత్రికుల శక్తి ముందు ఓడిపోతుంది. అదే సమయంలో నానా తిప్పలు పడి హనీ, ఆ ఔషధాన్ని సమూరికి అందజేస్తాడు. అయితే ఆ ఔషధం తాగిన వారికి మంత్రశక్తులన్నీ నశిస్తాయన్న నిజం దాచిపెడతాడు. ఆ ఔషధం తాగిన సమూరా, తన ప్రత్యర్థి కుజుడి మీది మానవుల కాలనీ అధ్యక్షుడైన కాన్‌స్టాన్‌టైన్‌‌ని వెక్కిరిస్తాడు.

బదులుగా, మంత్రశక్తులు ఉపయోగించకుండా తనతో ద్వంద్వయుద్ధం చేసి ఓడించమని సమూరాని రెచ్చగొడతాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. ఆ ఔషధం తాగిన ప్రభావంతో సమూరా మంత్రశక్తులు క్షీణించి, ద్వంద్వయుద్ధంలో పరాజితుడై పారిపోతాడు సమూరా. కుజుడి మీద మానవులు, మాంత్రికుల మధ్య సంధి కుదురుస్తాడు హనీ. అరుణభూములకు రాజుగా తన మిత్రుడయిన మీరోస్‌ని ప్రతిపాదిస్తాడు. అందరూ ఆ ప్రతిపాదనకి అంగీకరిస్తారు. హనీ గౌరవార్థం  గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. హనీకి కానుకగా – అమృత ఔషధం కోసం ఒలంపస్ పర్వత శిఖరానికి వెళ్ళిన బృందంలోని రోబోని కానుకగా ఇస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. కుజుడి లోని మానవ కాలనీ సైన్యాధ్యక్షుడైన గ్యాని ఆన్‌ గారక్‌ పశుశాలలో జంతురూపంలో బందీలుగా ఉన్న ఏనిమాయిడ్‌, డిమిట్రీ, పోసయిడన్‌‌లను విడిపించే క్రమంలో జనరల్ గ్యాని సైనికులతో పోరాడుతాడు హనీ. ఎలాగొలా సైనికులను తప్పించుకుని అంతర్‌గ్రహ కౌన్సిల్‌ మరియు అంతర్‌ గెలాక్టిక్‌ కౌన్సిల్ శరణు పొందుతారు. ఆయా గ్రహాల అధికారుల సహాయంతో ఏనిమాయిడ్‌ని గురుగ్రహపు ఉపగ్రహమైన గ్వానిమెడ్‌కి; డిమిట్రీ, పోసయిడన్‌‌లను శనిగ్రహపు ఉపగ్రహమైన టైటన్‌కి పంపే ఏర్పాట్లు చేస్తాడు హనీ. అలాగే, భూ గ్రహనికి చెందిన అధికారులు కూడా హనీ నేరస్తుడు కాదనీ, శరణార్థి అని నిర్ధారించి భూమికి పంపుతారు.

ప్రేమ కోసం బయలుదేరిన హనీ తన గురించి కొత్త విషయాలు తెలుసుకోడం, అద్భుత శక్తులు సంపాదించడం, కొత్త లక్ష్యంతో భూమికి తిరిగి రావడంతో కథ ముగుస్తుంది. కథాక్రమంలో కుజగ్రహం గురించి ఎన్నో శాస్త్రీయ వివరాలు అందించారు రచయిత.

పాఠకుల చేత ఔరా అనిపించుకున్న ఈ కథకి కొనసాగింపు (సీక్వెల్) ”నీలీ ఆకుపచ్చ భూమికి తిరిగిరాకకినిగె పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. తాజా ఎపిసోడ్‌ని ఈ లింక్‌లో చదవచ్చు.

వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన “కుజుడి కోసం” ప్రింట్ పుస్తకం నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వద్ద, రచయిత వద్ద, కినిగెలోనూ లభిస్తుంది. 228 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

 

 

Dr. C. MADHU, M.D.

Consultant Physician & Cardiologist

Vijaya Medical & Heart Clinic

2-2-23/2, SBH Colony,

Behind CTI, Bagh Amberpet,

Hyderabad – 500 013

e-mail : madhuchittarvu@yahoo.com

 

శ్మశానం రంగస్థలం…కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలు

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

అన్యులు సృజించని అంశాలపై రచనలు చేసే రచయితలు తెలుగులో చాలా తక్కువ. సమాజంలో హీనమైన పనులుగా ముద్రబడ్డ చర్యల ఇతివృత్తాలతో సాహితీసృజన చేసి మెప్పించడం అందరికీ సాధ్యం కాదు. సాహిత్యంలో జనన మరణాల సంఘటనలెన్నో ఉంటాయి. కానీ శ్మశానం రంగస్థలంగా, కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలుగా చేసిన రచనలు చాలా అరుదు.

మృత్యువంటే చాలా మందికి జడుపు. కొందరికి ఆసక్తి.. ఎందరికో రోత… జీవమున్నంత కాలం గౌరవించి, ఆదరించిన వ్యక్తులను సైతం, మరణించగానే వీలైనంత త్వరగా అంత్యక్రియలు ముగించడానికి తొందరపడతారు జనాలు. చావంటే మనుషులకున్న భయం అలాంటిది. ఇక శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు లాంటి పదాలను ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు ఎందరో ఉన్నారు.

అయితే అంత్యక్రియలపై ఆధారపడే జీవనం గడుపుకునే వారెందరో ఉన్నారు. కాటికాపరి, శవవాహకులు, శ్రాద్ధ కర్మలు చేయించే బ్రాహ్మలు… ఇలా మాములు మనుష్యులు ఏనాడు పట్టించుకోని ఓ సమూహాం గురించి, వారి జీవితాల గురించి తెలిపే నవల “పితృవనం“. పితృవనం అంటే శ్మశానం. శీర్షికలోనే ఇతివృత్తం ఏమిటో అర్థమయ్యే ఈ నవలని శ్రీ కాటూరి విజయసారథి  వ్రాసారు.

పేదరికం తాండవిస్తూ, నిలకడైన సంపాదన లేని మధ్యతరగతి కుటుంబాలలో ఓ మనిషి చనిపోతే, అంత్యక్రియలకీ, కర్మకాండకీ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చనిపోయినవారి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అంటే… చనిపోయిన వ్యక్తుల ఆఖరి కోరిక  అంత్యక్రియలు సక్రమంగా చేయించమనే అయ్యుంటుంది. ఎందుకంటే…. కర్మకాండలు సరిగ్గా జరగకపోతే… ఏదో అయిపోతుందనే భయం… తదుపరి జన్మ మంచిది లభిస్తుందో లేదో అనే అనుమానం.

అయితే కర్మకాండ నిర్వహించవలసినవారి ఆర్ధిక స్థితిగతులను గూర్చి ఎవరూ పట్టించుకోరు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు కొనసాగించవలసిందే అంటారు. ఇదే అంశంతో ప్రారంభమవుతుంది నవల. ఒకప్పటి వాల్తేరు ఈ నవలకి కార్యరంగం. శవాలను మోసే సూరిగాడిని వెతుక్కుంటూ వస్తాడో కుర్రాడు. అతని తండ్రి చనిపోయాడు. చాలా తక్కువ డబ్బులుంటాయి. ఎలాగొలా శవసంస్కారాలు కానివ్వమని సూరిని బ్రతిమాలుకుంటాడు. మొదట కటువుగా మాట్లాడినా, ఓ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి ధన సహాయం చేయిస్తాడు. మిగతా శవవాహకులను, మంత్రం చెప్పే బ్రాహ్మడు సుబ్బావధానినీ, పాడె కోసం మేదరవాళ్ళకీ పురమాయిస్తాడు.

చివరికి శవం లేస్తుంది. ఊరికే లేచిందా? వందలు చేత్తో పట్టుకుంటే లేచింది. ముష్టెత్తినా, ఎత్తుకొచ్చినా వందలు చేత్తో పట్టుకోకపోతే ఏ శవమూ గుమ్మం ముందు నుంచీ లేవదు. చివరికి శవదహనం పూర్తవుతుంది. ఆ కుర్రాడి పేరు ఆనంద్ అనీ అతని భార్య పేరు శాంత అని తెలుస్తుంది. ఇంటర్ చదివి, టైప్ రైటింగ్ పాసయిన ఆనంద్ జీవిక కోసం ఇద్దరు లాయర్ల దగ్గర పనిచేస్తూంటాడు. వారిచ్చే కొద్దిపాటి డబ్బుతో రోజులు నెట్టుకొస్తుంటాడు. మొత్తం ఖర్చెంతయ్యిందో లెక్కలు వేయించి, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఆనంద్ చేత ఇప్పిస్తాడు సూరి. తన వాటా మాత్రం తీసుకోకుండా ఊరుకుంటాడు. ఆనంద్ ఇంటికి వెళ్ళిపోయాక, కాటికాపరి వీరబాహుడు అడుగుతాడు ఎందుకింత తక్కువ ఇప్పించావని, సూరి ఎందుకు డబ్బులు తీసుకోలేదని. ఇంకో శవమేదయినా వస్తే అప్పుడు సరిగానే ఇస్తాలే… అని చెప్పి విశ్రాంతి కోసం కాసేపు కునుకు తీస్తాడు సూరి. నిద్రలేచే సరికి ఇంకో శవం కాలుతూ కనబడుతుంది. ఆనంద్‌ని జ్ఞాపకం చేసుకుని ఈ జనారణ్యంలో ఏ ఒక్క మృగమూ అతని గోడు ఆలకించనందుకు బాధ పడతాడు.

సూరిలో అంతర్మథనం జరుగుతూంటుంది. ఎన్నెన్నో ప్రశ్నలు. సమాజం తీరు పట్ల కలత. ఆలోచనల నుంచి తేరుకుని వీరబాహుడితో కబుర్లలో పడతాడు. ఊసులయ్యాక, ఆ కాలుతున్న శవం ఎవరిదో వాకబు చేస్తాడు. ఆ శవం పీర్ల కోనేరు సందు మొదట్లో టీ కొట్టు నడిపే నాయర్‌‌దని తెలుసుకుంటాడు. ఆ చీకట్లో ఎవరో పడుకుని ఉండడం చూసి ఎవరో మరో శవాన్ని అక్కడ వదిలేసి పోయారేమోననుకుంటారు సూరి, వీరబాహుడు. అయితే ఆ వ్యక్తి ఇంకా చావలేదనీ, బ్రతికే ఉందనీ గ్రహిస్తారు. ఆమె నాయర్ కొట్లో పనిచేసేదని తెలుస్తుంది. వేరే ఆధారం లేకపోయేసరికి తన ఇంటికే తీసుకువెడతాడు సూరి. ఆమె పేరు జయ అని తెలుసుకుంటాడు. ఆమెకో ఆధారం దొరికే వరకు తనకు వంట చేసి పెడుతూ తన ఇంట్లోనే ఉండమని చెబుతాడు.

సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన సూరి అసలు పేరు సూర్యనారాయణ మూర్తి. చిన్నప్పుడు బడిలో హెడ్మాస్టర్ అకారణంగా దండించడంతో చదువు మానేస్తాడు. చదువు అబ్బకపోవడం వల్ల ఏ ఉద్యోగం దొరక్క తన ఈ వృత్తి చేపట్టాల్సివచ్చిందని బాధపడతాడు. చనిపోయిన నాయర్ టీ కొట్టు సామన్లను అమ్మేస్తున్నారని తెలిసి, వాటి యజమానితో మాట్లాడి వాటిని తను కొనుక్కుంటానని ఎవరికీ ఇచ్చేయద్దని చెబుతాడు. ఇంతలో ఓ బేరం వస్తుంది. చనిపోయినది డబ్బున్న ఆసామి వాళ్ళ నాన్న. ఆ ఆసామి గీరగా మాట్లాడితే తగిన సమాధానం చెప్పి అతని పొగరు దించుతాడు సూరి.  ఈ శవదహనమూ అయ్యాకా ఇల్లు చేరుతాడు. జయ గతం తెలుసుకుంటాడు.. సొంత మనుషులే ఆమెని దుబాయ్ షేకులకి అమ్మేస్తారు. వారి బారినుంచి తప్పించుకుని, ఎన్నో కష్టాలు పడి నాయర్ పంచన చేరుతుంది. నాయర్ దగ్గరనుంచి తమ వాటా డబ్బులు పట్టుకుపోతుంటారు ఆమె బంధువులు. నాయర్ ఆదరణతో మాములు మనిషైన జయ భవిష్యత్తు… నాయర్ చావుతో అగమ్యగోచరమయింది.

PithruvanamFrontCover

నాయర్ అస్థిసంచయనం చేసొచ్చాక సూరిని కలుస్తాడు ఆనంద్. లాయర్ల దగ్గర పనిమానేసి టీ కొట్టు నడుపుకోమని ఆనంద్‌కి సలహా ఇస్తాడు సూరి. తాను హామీగా ఉండి ఆ కొట్టుని ఆనంద్‌కి ఇప్పిస్తాడు. టీ పాటు టిఫిన్లు కూడా అమ్మేలా శాంతను, జయను కుదురుస్తాడు.

తన స్నేహితుడు రాజుకి ఉద్యోగం రావడం కోసం ఓ అధికారితో వాదన వేసుకుంటాడు. కాలు జారినా, తన తప్పు తెలుసుకొని కొత్త జీవితం గడపాలనుకునే ఓ అమ్మాయికి దారి చూపిస్తాడు. నాయర్ చనిపోయాడని తెలిసిన జయ బంధువులు ఆమెని బలవంతంగా ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే, తన తోటివారందరితోనూ కలసి అడ్డుకుని ఆమెను కాపాడుతాడు. జయని పెళ్ళి చేసుకుంటాడు.

సూరి, వీరబాహుడు జానకిరామయ్య తాత, అరుణ, జయ, నాయర్.. ఒక్కొక్కళ్లది ఒక్కో కథ. అందరినీ అంతఃసూత్రంగా కలిపేది పేదరికం, అవసరం… అంతకుమించి మానవత్వం.

రిజర్వేషన్ల వ్యవస్థపైనా, కులమతాల మీద, ఆచార వ్యవహారాల మీద మనుషుల నీతి నిజాయితీల మీద ఎన్నెన్నో ప్రశ్నలున్నాయి, మనసుని కదిలించే వ్యాఖ్యానాలున్నయి ఈ నవలలో.

శ్రామికులూ, కార్మికులు ఒకటికారా? కాదనే అంటుందీ నవల. శ్రామికులందరూ కార్మికులు కారు. కర్మాగారాలలో పనిచేసే కార్మికులకు చట్టపరమైన హక్కులుంటాయి. సంఘటితమైన శ్రామికులను కార్మికులు అనచ్చేమో. అసంఘటితంగా ఉన్న శ్రామికులను తోటి కార్మికులు కూడా పట్టించుకోరని ఈ నవలలో ఓ ఉదంతం తెలుపుతుంది. కార్మికులవలె, తమకు కూడా కనీస సదుపాయలను కల్పించాని, సాంఘిక భద్రత కల్పించాలని అపరకర్మలు చేసే శ్రామికులు కోరితే… వాళ్ళసలు కార్మికుల విభాగంలోకి రానే రారని, చట్టపరమైన నిబంధనలను వారికి వర్తింపజేయనక్కర్లేదని వాదిస్తారు కార్మికులు, వారి నేతలు. అన్ని రకాలుగా నిస్సహాయులైన శవవాహకులు కృంగిపోతారు.

కాలక్రమంలో వచ్చిన ఓ మార్పు మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని సూరి అంటాడు. ఓ మనిషి విగతజీవుడయ్యాక, అంతిమ సంస్కారానికి శవాన్ని మోయడానికి కూడా వెనుకాడుతున్నారని, అదే ఇతర మతాలలో శవాన్ని మోయడం ఓ గౌరవంగా భావిస్తారని.. వాపోతాడు.

KaturiViajayaSarathi

కాటూరి విజయసారధి

 

పేదలూ మనుషులేనని, అవకాశాలు లేక, మరింత పేదలుగా మారుతున్నారని, ఒకరికొకరు సాయం చేసుకుంటే, కొందరైనా ఎదిగి మిగతావారి ఎదుగుదలకి తోడ్పడవచ్చనేది సూరి దృక్పథం. మాట కటువు మనసు వెన్న.. అనే నానుడి సరిగ్గా సరిపోయే మనిషి సూరి. ఇదే అర్థం వచ్చేలా ఓ సందర్భంలో తాత “పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము – నవ్యనవనీత సమానము నిండు మనమ్ము” అని మహాభారతంలోని పద్యాన్ని అన్వయిస్తాడు  సూరికి.

తాను చేసే వృత్తి పాడుదని తాను అనుకోవడం లేదని, అందరూ అలా అనుకుంటున్నందుకే తాను బాధ పడుతున్నానని అంటాడు సూరి. తనకి వీలయినయింత మేర తోటివారికి సాయం చేసి వాళ్ళు జీవనసాగరాన్ని ఈదేలా చూస్తాడు సూరి.

“డబ్బు మీద నమ్మకం పెరిగిన కొద్దీ మనుషుల మీద నమ్మకం తగ్గిపోతుంది మరి.” అంటాడు సూరి ఓ సందర్భంలో. ఈ ఒక్క వాక్యాన్ని ఎన్ని ఇజాలకి అన్వయించుకోవచ్చో!

ఈ నవల చదువుతున్నంత సేపూ సమాజం పట్ల ఓ రకమైన ఏవగింపు కలుగుతుంది. శ్మశాన వైరాగ్యం వల్లకాడులోంచి బయటకొచ్చాక పోతుంది, మరి సమాజ వైరాగ్యం ఎలా పోతుంది? భద్రజనులు, బాధసర్పద్రష్టులు పరస్పర ఘర్షణ లేకుండా జీవనం గడపగలరా? జీవితాలలోని విలువలని పునర్నిర్వచించుకోవాలని అన్యాపదేశంగా సూచించే నవల “పితృవనం”.

1989 దీపావళి సందర్భంగా ఆంధ్రప్రభ వారపత్రిక వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న నవల ఇది.  1992లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ నవలగా వార్షిక పురస్కారం పొందిన నవల “పితృవనం”.

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ నవల అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, జేష్ఠ లిటరరీ ట్రస్ట్ వారి వద్ద, ఇంకా ప్రచురణకర్తల వద్ద దొరుకుతుంది. 141 పేజీల ఈ పుస్తకం వెల రూ.100/-.  కినిగెలోనూ ప్రింట్ బుక్ లభ్యం.

ప్రచురణకర్తల చిరునామా

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్

c/o. విజయ్ నిర్మాణ్ కంపెనీ

 సిరిపురం జంక్షణ్, విశాఖపట్నం – 530003.

ఫోన్: +91 891 2575755

 

మనందరి లోపలి అలజడి ‘పరాయి గ్రహం’

kolluri ఏదైనా ఒక కథ చదివాక, దాని గురించిన ఆలోచనలు మన మనసును వదలకపోతే, ఆ కథలోని సంఘటనలు మనకు రోజూవారీ జీవితంలో ఎదురయ్యేవే అయితే, ఈ కథ నా కథలానే ఉందే అనుకుంటూ పాఠకుడు తనని తాను కథలోని పాత్రలతో ఐడెంటిఫై చేసుకుంటే, ఆ కథ నిజంగానే మంచి కథ.
పాలపిట్ట మాసపత్రిక మార్చి 2013 సంచికలో ప్రచురితమైన బెజ్జారపు రవీందర్ కథ “పరాయి గ్రహం” ఈ కోవకే చెందుతుంది. కథాంశం మధ్యతరగతి వాళ్ళు సొంత ఇల్లు అమర్చుకోవాలనే కలని సాకరం చేసుకునే ప్రయత్నం, దానిలోని ఇబ్బందులు! కథనంలో కథావస్తువుని ఇమిడ్చిన తీరు రచయిత నైపుణ్యాన్ని చాటుతుంది.
మనుషుల ఆశలను, నిరాశలను రమ్యంగా ఆవిష్కరించిదీ కథ. మనుషులలోని లౌక్యాన్ని, తుచ్ఛతని ఎత్తి చూపుతుందీ కథ. ఎదగాలనుకునే మధ్యతరగతి వారి సమర్థతని హేళన చేస్తూ… ‘నువ్వింతే… నీ బతుకింతే…’  అంటూ కృంగదీసే సమాజపు కర్కశ వైఖరిని వెల్లడిస్తుందీ కథ.
వైయక్తిక ఆశలను తీర్చుకోడానికి ప్రయత్నించే వేతన జీవులను నియోరిచ్ వర్గం ఎలా పరిహసిస్తుందో, నీతి నిజాయితీల స్థానంలో అవినీతి, అక్రమార్జన సమాజంలో ఎలా వేళ్ళూనుకుపోతున్నాయో ఈ కథ వ్యాఖ్యానిస్తుంది. వర్తమాన సమాజపు ధోరణికి; జీవితపు చిన్న చిన్న కోరికలు తీర్చుకోడాని ప్రయత్నించి భంగపడి, ఉన్నదాంట్లోనే ఆనందం పొందే ఎందరో నిస్సహాయులకు ప్రతీక ఈ కథ.
పాత్రల మనోభావాలను అత్యంత సహజంగా వర్ణించారు రచయిత.  ఆయా పాత్రల ఔచిత్యం ప్రకారం వారి సంభాషణలు, వాళ్ళ ఇళ్ళ పరిసరాలు, వారి ఆహార్యం గురించి చక్కగా వివరించారు రచయిత. నిజజీవితంలో అటువంటి వ్యక్తులను ఎంతో దగ్గర నుంచి పరిశీలిస్తే గాని పాత్రలు అంత సహజంగా ఉండవు. ఈ కథ చదువరులను అంతగా ఆకట్టుకోడానికి ప్రధాన కారణం మనుషుల సహజ సిద్ధ స్వభావాలను యథాతథంగా వెల్లడించడమే. మనుషుల్లోని సున్నిత భావాల్ని, భావుకతని, ఈర్ష్యాసూయల్ని, కుత్సిత భావాల్ని అతి వాస్తవికంగా ప్రకటించడమే.
రియల్ ఎస్టేట్ బూమ్ అనగానే మనకి చాలా కథల్లో చదివిన హైదరాబాద్ రింగ్ రోడ్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు స్ఫురిస్తాయి. కానీ ఈ కథకి నేపథ్యంగా కరీంనగర్, దాని పరిసర ప్రాంతాలను ఎంచుకోడంలో వైవిధ్యం చూపారు రచయిత.
మనలో చాలామంది మర్చిపోతున్న విషయం ఆదివారం ఆటవిడుపు! ఆదివారం కోసం ఎదురుచూడడంతో ప్రారంభమవుతుంది కథ. కెరీర్ల వెంటా, డబ్బు సంపాదన వెంటా పరిగెడుతున్న జనం, ‘ఆదివారాన్ని ఆస్వాదించి ఎన్నిరోజులయ్యిందో’ – అని అనుకోకుండా ఉండలేరు మొదటి మూడు పేరాగ్రాఫులు చదివాక.
కథ దిగువ మధ్య తరగతికి చెందిన ఓ పొందికైన చిన్నకుటుంబానిది.  చందూది ఓ కాంట్రాక్ట్ ఉద్యోగం. భార్య లలిత ఓ ప్రైవేటు స్కూల్లో టీచరు. పదేళ్ళ కొడుకు. కలతలు లేకుండా సాగిపోతూంటుంది వారి సంసారం. చందూకి భావుకత్వం ఎక్కువ. సామాజిక, రాజకీయ అవగాహన కూడా ఉన్నాయి.
లలితకి పిన్ని వరసయ్యే మాధవి భర్త శ్రీనివాస్‌‍కి హఠాత్తుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసొస్తుంది. ఉన్నట్లుండి సంపన్నవర్గంగా మారిపోతారు. తోటివారితో ప్రవర్తించే తీరు కూడా ఎదుటివారి ఆర్థికస్తోమతని బట్టి మార్చుకుంటూంటారు. తమ ధనాన్ని ప్రదర్శించడం వారికి అత్యంత ప్రీతిపాత్రం. “కార్లు, చీరలు, నగలు, పలుకుబడి వల్ల వాళ్ళకు వచ్చే సంతోషం కన్నా, అవి ఎదుటివాళ్లకు లేవనే భావన అమితమైన ఆనందాన్ని కలుగజేస్తూంటుంది. వాటివల్ల తాము సుఖపడిపోతున్నామని ఎదుటివాళ్ళు అనుకోడాన్ని ఎంజాయ్ చేస్తూంటారు. ఇతరుల లేమిని గుర్తు చేయడంలోనే వారి సంతోషం ఇమిడి ఉంది.  పెరుగుతున్న సంపద, ఎదుటివారిపై అప్రత్యక్ష అధికారాన్ని కట్టబెట్టినట్లు అనుభూతి చెందుతుంటారు మాధవి, శ్రీనివాస్‌లు.”

మొదట్లో ఇలాంటి ప్రదర్శనలు లలితను కదిల్చేవి కావు. భర్తతో కలిసి జీవించడమే మహాభాగ్యమని భావించే ఆమెలో కొద్దికొద్దిగా విషాన్ని నింపడంలో మాధవి విజయవంతమవుతుంది.  “మాధవి మొదటి నుంచి లలితను పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే లలిత ముఖంలో తన ప్రదర్శన పట్ల ఒక రకమైన అసూయను రేఖామాత్రంగా దర్శించిందో, ఆ క్షణం నుంచి మాధవి మహత్తరమైన వేడుక అనుభవించడం మొదలుపెట్టింది.”
చివరికి వీరి తాకిడిని తట్టుకోలేక ఎక్కడోక్కడ స్థలం కొనాలని మరో బంధువు కిరణ్‌తో కలిసి  బయల్దేరుతాడు చందూ.
తన తండ్రి చేసిన ఓ పొరపాటువల్ల తనకి లక్షలు పోయాయని వాపోతాడు కిరణ్. “మా అయ్య గనక శీనన్న అయ్య లెక్క జాగ్రత్త పడితే… ఇంత నాదాని బతుకు అయ్యేదా? ఏమీ లేనోళ్ళు సైతం కొంత కొంత భూమి కూడబెట్టి ఎట్లా కోటీశ్వరులైపోయిన్రు….” అంటాడు. ఆ క్షణంలో చందూకీ భయమేస్తుంది, భవిష్యత్తులో తన పిల్లలు కూడా తనని ఇలాగే తిట్టుకుంటారని.
తన బడ్జెట్‌లో సరిపోయే స్థలం ఎక్కడా లభించదు. ప్రతీ ప్లాటు తనను వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది చందూకి. తానొక అసమర్థుడిననే భావన మొదటిసారి కలుగుతుంది అతనికి. మళ్ళీ బస్సెక్కి ఇంటి ముఖం పడతాడు. పంట పొలాలన్నీ ప్లాట్లుగా, చెరువులు సైతం పూడ్చబడి, గుట్టలు కూల్చివేయబడి సమస్త భూమండలం ‘For Sale’ బోర్డు పెట్టబడిన ఓ పెద్ద ప్లాటుగా కనిపిస్తుంది చందూకి.  ప్రకృతిని కబళిస్తూ, నిర్మాణం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న వైనం రేఖామాత్రంగా వ్యక్తం అవుతుందీ కథలో.
చివరగా, కథకి ‘పరాయి గ్రహం’ అనే పేరు పెట్టడంలోని ఔచిత్యం పాఠకులని ఆలోజింపచేస్తుంది. ఎక్కడా ఓ చిన్న స్థలం కొనుక్కోలేని మధ్యతరగతి జీవి – ఇది తనది కాదు అనుకోడం వలన భూగోళం పరాయి గ్రహంగా కనిపించడం ఒక కారణం కావచ్చు; భావుకులు, పర్యావరణ ప్రేమికులు- ఇక ప్రకృతిని ఆస్వాదించాలంటే భూమి మీద అవకాశం లేదని, పరాయి గ్రహానికి వెళ్ళాల్సిందే అని అనుకోడం మరో కారణం కావచ్చు.  ఈ రెండు కారణాలలో ఏది సరైనది అనేది పాఠకుల ఊహకే వదిలేసారు రచయిత.
మొత్తం మీద చదువుతున్నంత సేపూ మానసికంగా అలజడి కలిగిస్తూ, చదివిన తర్వాత చాలా కాలం వెంటాడుతుందీ కథ.

ParayiGraphamStory