వేంపల్లె షరీఫ్, మల్ల్లిపురం జగదీష్‌కు విమలాశాంతి పురస్కారాలు

DSC_0062

వేంపల్లె షరీఫ్

IMG_5573

విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్టు ప్రతి ఏడాది అందచేసే విమలాశాంతి సాహిత్య పురస్కారాలు 2013 వ సంవత్సరానికి గాను కథా రచయిత వేంపల్లె షరీఫ్ కు, మల్లిపురం జగదీష్ కు ప్రకటించారు. విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవాట్రస్టు, సమాజ వికాసం కోసం రచనలు చేస్తున్న రచయితలను గౌరవించే దిశలో 2013 కథాపురస్కారం కోసం జాతీయ స్థాయిలో రచయితల నుండి కథాసంపుటాలను ఆహ్వానించింది. ట్రస్టు ఆహ్వానాన్ని మన్నించి 47మంది రచయితలు తమ తమ కథా సంపుటాలను పంపి పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో కొత్తవాళ్లతోపాటు లబ్ధప్రతిష్టులు చాలామంది పాల్గొన్నారు.  “2013 – విమలాశాంతి సాహిత్య పురస్కారాల”ను “శాంతి రజనీకాంత్ స్మారక సాహిత్య పురస్కారాలుగా” అందజేస్తున్నారు . “2013 శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారాన్ని” వేంపల్లి షరీఫ్ (కడప జిల్లా) “జుమ్మా” కథా సంపుటికి, మల్లిపురం జగదీష్ (శ్రీకాకుళం జిల్లా) “శిలకోల” కథా సంపుటికి సంయుక్తంగా ప్రకటించారు.

ఉత్తమ సాహిత్య ప్రతిఫలన రూపంగా ఎదుగుతున్న మా  చిన్నబ్బాయి “శాంతి రజనీకాంత్ (27) ఒక ప్రయివేట్ ఉద్యోగ రాక్షసి కర్కశ కరాళ నృత్యఘంటికల హోరులో నలిగి తటాలున కాలగర్భంలో కలిసిపోయాడు. కళకళలాడుతూ కళ్లముందే కరిగి మాయమయి పోయిన ఆ మానవత్వపు సుగంధ పరిమళానికి స్మృత్యర్ధంగా ఈ పురస్కారాలను అందజేస్తున్నామని విమలా శాంతి సాహిత్య సాంఘిక  సేవా ట్రస్ట్ చైర్మన్ డా. శాంతినారాయణ  ఒక ప్రకటన లో తెలియచేసారు.

అక్టోబర్ నెలలో జరిగే పురస్కార ప్రధానోత్సవ సభలో రచయితలకు జ్ఞాపికల్తో పాటు ఒక్కొక్కరికి రూ.5,000/= చొప్పున నగదును బహూకరించి సత్కరిస్తారు. . ఈ పురస్కారాల ఎంపికలో ఆచార్య కాత్యాయని విద్మహే, గంటేడ గౌరునాయుడు డా. వి.ఆర్.రాసాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.