ప్రయాణ ప్రణవం

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

 

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

బ్లిస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్

ఆనందమే నా సామాను అతి సౌకర్యవంతంగా

అహంకారాల సంచులన్నీ విడిచి పెట్టాను

రుజు స్ఫూర్తులు తప్ప

ఏ భుజ కీర్తులూ నాతో  తెచ్చుకోవడం లేదు

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

ఎక్కడో కలుస్తాను నిన్ను

పొద్దులు సద్దు లేక ముద్దాడుకునే

తెలుపు నలుపు చుంబనాలలోనో-

అవునూ,  ఆకాశం పెదవులపై

మిగులుతుంది కందిపోయిన ఎర్రదనం

వెలుతురు , చీకటి ముద్దాడుకునే సంజలలో –

సిగ్గులేని సూర్య భూతాలవి!

భూమిని మరిగించి కరిగించే

రసవిద్య పేరు రాత్రీ, పవలూ-

ఎక్కడో కలుస్తాను నిన్ను

పాతాళ  ఆకాశంలోనో

పర్వతాలయిన నదుల శిఖరాలపైనో

ఆకుపచ్చ అలల కడలి అడవిలోనో

పిట్టల ఎర్రని గొంతుల దాగిన

బ్రహ్మాండ భానుగోళ భావనలోనో

నాలుక్కాళ్ళ ధర్మపు గోష్పదీ చిహ్నాలలోనో

తనూరహస్య ఖనులలో

తరుణ మణులున్నలోతులలోనో

ఎక్కడో కలుస్తాను నిన్ను  

దిక్కులు దిక్కుమాలిపోయిన ఎత్తులలో

చుక్కలు సృక్కి బూడిదయ్యే బలివితర్ది వీధుల్లో

ఎడారి ఎడతెరిపి లేక కనే నీటి గలగలల కలలో

చొక్కాలు కుట్టిచ్చి కుట్టిచ్చి దేవుడికి

ప్రతి మత దర్జీలూ అలసిపోయిన ,

కుట్టు యంత్రాలు  మూల పడిన

గోపురాల మీద పాదాలు శుభ్రం చేసుకుని –

ధ్వజ స్తంభాల చేయూతలొదులుకుని

చంద్ర వంకలను ఇంకా ఎదగాల్సిన

దశలున్నాయని హెచ్చరించి

సురలో గల దైవ రక్త బంధాన్ని నిరాకరించి

నిన్నుకలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

కాలమిక్కడ ఆకస్మిక కాస్మికం

కార్య కారణాతీతం

కర్త కర్మ క్రియల సాలె గూటి దారపు జ్ఞానానికి  

తన పొట్టలోంచి తనే  దారాలు తీసి

తన పుట్ట తానే నిర్మించుకునే సాలెపురుగు

అర్ధమవుతుందా –

దారపు పొగునే నేను

బయలుదేరాను విశ్వ వస్త్రంలో కలవడానికి –

చీరలోని దారం చీరనెరుగుతుందా –

నువ్వెవ్వడివిరా బయలుదేరడానికి –

విశ్వ వస్త్రం లో  కలవడానికి నీ చేతనౌతుందా –

ఎరుగు – నువ్వున్నదే విశ్వ వస్త్రంలో

సూర్యుడు నీ అద్దకాల కుంచె

భూగోళం నీ ఆకలి కుండ

అంటోంది బరువు చూసుకుందామని

వెయింగ్ మెషీన్ పై నిలబడితే –బయటకొచ్చిన టికెట్టు

చూపిస్తోంది బరువు సున్నా అని –

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

తోడేళ్ళ గుంపులో నిలబడ్డ ఏడేళ్ళ మౌగ్లీలా

ఆటవిక జ్ఞానమే నాకు అమ్మా నాన్నా

ఆదిమ నిరక్షరాస్యతే – నా ఆధునిక పట్టభద్రత

సనాతన జీవ కషాయం నాలోనూ పారుతోంది

భూమి విచిత్రమైన  కుమ్మరి

ప్రాణం చిప్పిల్లే పచ్చి కుండలనే

పదికాలాలు మననిస్తుంది

ఎండి పోయామా – మండిస్తుంది కప్పెడుతుంది

మృత్తిక కావాలి కదా కుత్తుకబంటి దాకా

పిసికి పిసికి మట్టిపాయసం చేసి సారె కెక్కించడానికి

ఎన్నిసార్లు మండి పోయానో , ఖననమైనానో

ఎన్నెన్ని సార్లు సారె పైనుంచి పచ్చి కుండనయ్యానో –

ఎక్కడ వాసన చూడను తల్లిని

పచ్చికుండలేమై పోతాయోనని తల్లడిల్లే తల్లి తనువంతా

బాలింత వాసన –

నా ప్రయాణ సందోహం చూసి నవ్వాయి గడ్డిపరకలు

నువ్వు బయలుదేరడమేమిటి

తిరిగే నేలమ్మే ప్రయాణిస్తున్నది కాల సొరంగంలోకి

తెలుసుకో నీది రజ్జు సర్ప భ్రాంతి –

ఇది తాడు కాదు నిన్ను నువ్వు చేదుకు పైకి పోవడానికి

ఇది పామే –

అరక్షణంలోనే అనంతమూ అవగతమైన పుణ్యశ్లోకులం

అనేకాకులం, మేం బహుళం –

గడ్డి పరకలం –పాము పడగలం –

అనంత కాలం వేచి ఉన్నా అరక్షణాన్ని అర్ధం చేసుకోలేని

జనాభా మీరు –

పామే ఇది  – ఇది కాల మహోరగం  –

నెమ్మదిగా మింగుతున్నది విశ్వపదార్ధాన్ని

అయినా వెళ్ళిరా కాలు సాగినంత మేరా

అయినా వెళ్ళిరా లోకాలు సాగినంత మేరా –

నది మూలం , ఋషి మూలం, తృణమూలం అడగరాదు

అవిజ్ఞానపు చీకటి నుయ్యిలు – మహా కృష్ణ బిలాలు

అమ్మ పాల పుట్ట లో వాంఛా మథనాలు జరిగి

అమృతంగమయులైన మానవుల్ని

పుట్టిస్తుంది జగత్కార్మిక శాల

పుణ్య తిలకం దిద్ది బతుకు పేరంటానికి పిలుస్తుంది

తానే జననీజనక ద్వయమని చెప్పక

ఓ ఇద్దర్ని పేరెంట్లు అని చూపిస్తుంది –

అక్కడే బయలుదేరిపోయావు నువ్వు ఎరుక లేకనే

అమ్మ కడలి లోపలి చిచ్చులో –

అడిగింది గడ్డం కింద చేయి పెట్టుకుని గడ్డి పరక

అప్పుడే బయలుదేరి పోయావు నువ్వు

ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కడికి బయలుదేరుతావు చెప్పు?

అయినా సరే –

గడ్డి పరకల విశ్వవిద్యాలయానికి నమస్కరించి

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

వెనుక దారి తరిగి పోతోంది

ముందు దారి పెరిగి పోతోంది

చక్రాల్లేని రైళ్లు , తెడ్లు లేని పడవలు , రెక్కల్లేని పక్షులు

వేళ్ళు  లేని చెట్లు, కాళ్ళు లేని ప్రాణులు

 అందరూ గోచరమౌతున్నారు

తమకు తెలీకుండానే ప్రయాణిస్తున్నారు

ఇప్పుడే తెలిసింది ఒక సంచారి ఇచ్చిన సమాచారం

నువ్వూ నన్ను కలవడానికే బయలుదేరావట

యుగాల ముందర

తీరా  నీవున్న చోటికి నే చేరిన వేళ అక్కడ నువ్వుండవు

నువ్వొచ్చే  వేళకి – నా చోట నేనూ ఉండను

ఖాళీ, సున్నా, శూన్యం ఎదురవుతుంది ఇద్దరికీ –

ఇద్దరిలోనూ ఇద్దరమూ ఉన్నామన్న

పూర్ణత్వ భావన కలుగుతుంది

పూర్ణస్య పూర్ణమాదాయ – ఈశావాస్య  వాక్యం మిగులుతుంది

ఎక్కడున్నాం, ఎక్కడుంటాం, ఎప్పుడుంటాం,  ఎప్పుడు  లేం

శూన్యపు సూది ఒకటి కుడుతోంది  –

పాలపుంతల మగ్గం నడుస్తోంది

దారపు పోగుల మధ్య దూరమెంత ఉన్నా

అవి ఈ ఆకస్మిక కాస్మికం లోనే ఉన్నాయి

శూన్య పూర్ణానికి , పూర్ణ  శూన్యానికి నమస్కరిద్దాం

బయలుదేరడానికి ముందే చేరిపోయిన యాత్ర లో –

ఇక ఎప్పటికీ కలుసుకోలేము

ఎందుకంటే ఎప్పుడూ విడిపోనే లేదు కనుక.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కొంత కదలిక…కొంత గలగల!

 

-రామతీర్థ

~

 

ramateerthaఒట్టాప్ళాక్కన్ నీలకండన్  వేలు కురుప్ గా జన్మించి (27.05.1931 – 13.02.2016)  ఎనభై నాలుగేళ్ల ఒ.ఎన్.వి.కురుప్ శనివారం 13.02.2016న మరణిస్తే,  కేరళ శాసన సభ ఆయన పట్ల గౌరవ సూచకంగా, ఈ ఒక్క విషయాన్నే ప్రస్తావించి, మరుసటి పనిదినానికి వాయిదా పడ్డది. ఒక్క శాసన సభ్యులకే  దక్కే ఈ గౌరవాన్ని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తొలిసారిగా ఒక మహాకవికి ప్రకటించింది. 2011-12 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, కేరళ ఆర్థిక శాఖ మంత్రి “దినాంతం” అన్న  కురుప్ దీర్ఘ కవిత నుంచి ప్రారంభ చరణాలు చదివి  తన బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు.

 మలయాళ కవిత్వంలో గేయ ఫణితి లయాత్మకత, గాన లక్షణం,  సాహిత్యంలో ఇప్పటికీ అంతర్భాగాలే. వాటిని తన కవిత్వపు అంతర్భాగాలుగా మలుచుకుంటూనే, కురుప్ “నేను ప్రాచీన కవినే” అని చెప్పే వారు, ఎంతలా  ఆధునిక విషయాలపై రాసినా. కురుప్ ఉన్నత విలువలతో రాసిన సినిమా పాటలు ఆయనను, ఈ తరం యువ మలయాళీలకు కూడా  చిర పరిచితుడిని  చేసాయి. ఒకింత శృంగార సన్నివేశాలకు కూడా, మనోహర గేయాలు రచించిన ఖ్యాతి కురుప్ దే. మొదటి సారిగా “కాలం మారున్ను” 1954 సినిమాకు పాటలు రాసిన కవిగా కురుప్,   పలు దశాబ్దాలు అటు సాహిత్య రంగంలో, ఇటు సినిమా రంగంలో కూడా, తన సృజన ప్రమాణాలను రాజీ పడకుండా నిలబెట్టుకున్నారు.

 సినిమా రంగపు హడావిడి, రాత్రుల పార్టీలు, అవసరానికి మించి సినీ రంగపు వ్యాపార వేత్తలతో  కలిసి మెలిసి తిరగడాలు వీటన్నిటికీ, కురుప్ ఎప్పుడూ దూరంగా ఉండే వారు. ఒక యువ దర్శకుడు ఒక సారి, కొని పదాలు వాడి ఆయనను  పాట  రాయమంటే, అలాంటివి కుదరవని నిక్కచ్చిగా చెప్పిన  కళాకారుడు ఆయన. అయినా, “వ్యాపార రంగంలో  మేం డబ్బులు పెడుతున్నాము కనుక, సరకును మా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాము” అనే ఈ కాలపు పద్ధతి అయిన  లాభాల పంట పండించుకునే బండ వాదన ప్రభావంలో పడ్డ, ఆ యువ దర్శకుడు, పాట  రికార్డింగ్ సమయంలో ఏ మాటలైతే, కురుప్ రాయలేదో, వాటిని చేర్చిన విషయం  తెలిసి, పెద్ద  యెత్తున  అభ్యంతర పరిచిన వేళ , ఆ దర్శకుడు, ఆ మాటలను తొలగించడమే  కాక, కురుప్ కు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పిన సంఘటన, కురుప్ సాహిత్య నైతిక స్థాయి పట్ల కేరళ సమాజంలో ఎంతటి గౌరవాదరాలు ఉన్నాయో తెలియ చేస్తుంది.  రెండు వందల ముప్ఫై రెండు సినిమాలకు రాసిన తొమ్మిది వందలు పైగా సినీ గీతాలు కురుప్ కలం  నుంచి వెలువడ్డాయి.

 ముణ్ణోట్టు ( ముందుకు) అనే కవితను తన పదహారేళ్లకే రాసిన ఈ కవి “దాహికున్న పానపాత్రం” కవితా సంపుటి తో  మొదలై, ఇరవైఒక్క సంపుటాలు రచించారు.  ఆరు  వచన రచనలు కూడా వీరు వెలువరించారు. “భూమిక్కొరు చరమ గీతం” పేరిట, వెలువడ్డ కురుప్ రచన గానయుక్త లక్షణంతో, మలయాళ  సమాజంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.  రష్యా దేశపు పుష్కిన్ పురస్కారం, మన దేశపు పద్మశ్రీ , పద్మ విభూషణ్, కేరళ విశ్వవిద్యాలయపు డాక్టరేట్,  కమలా సురయ్య పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం ఇలా ఎన్నో గౌరవాలు కురుప్ ను వరించాయి. “వైశాలి”  చలన చిత్రానికి, జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయిత గా(1989)  పురస్కారం పొందారు. కేరళ రాష్ట్ర చలన చిత్ర పరిషద్  కురుప్ ను పదమూడు సార్లు ఉత్తమ సినీ గీత రచయితగా పలు వార్షిక గౌరవాలను అందచేసింది.

 2013లో గోర్కీ ఇన్స్టిట్యూట్  ఈయన  రాసిన యాభై కవితలను రష్యన్ భాషలోకి అనువాద ప్రచురణ గా ఆ దేశ ప్రజలకు అంద చేసింది. రష్యా దేశం “పుష్కిన్  ఆఫ్ కేరళ” అని గౌరవప్రదంగా సంభావించింది కూడా. రాజకీయాలు, విభేదాలు ఎన్ని ఉన్నా కేరళ సమాజం మౌలికంగా ఒక సాంస్కృతిక విలువల సమాజం. అది  కురుప్ విషయంలో, అసెంబ్లీ ఆయన మృతికి సంతాప సూచకంగా ఒక రోజు మూత పడితే, అటు  ఆయన అంత్యక్రియల్లో, సంగీతం ప్రధాన పాత్ర వహించింది. ఆయనే పేరి పెట్టిన కేరళ ప్రభుత్వ  శ్మశానవాటిక “శాంతికవాటం” లో, ఆయన  వయసు ఎనభై నాలుగేళ్ల సంఖ్యకు సరిపోయేట్టుగా, ఎనభైనాలుగు మండి గాయకులు, కురుప్ రచించిన గీతాలను ఆలపిస్తుండగా, ఆయన  పంచభూతాల్లో లీనమయాడు. కూచుని అంత్యక్రియలను తిలకించిన వారిలో కేరళ ముఖ్య మంత్రి ఊమెన్ చాండీ ముందు వరసలో ఉన్నారు.

కేరళ సాంఘిక రంగంలో ప్రముఖులు, ప్రఖ్యాతులు, భిన్న భిన్న రంగాలనుంచి, ఆయన కడసారి  చూపులకు తరలి వచ్చి, తమ ప్రేమ, గౌరవం, తెలుపుకున్నారు.భాషా  రాజకీయాల్లో పడి , మాతృభాషలను అలక్ష్యం చేయవద్దన్నది, కురుప్  హెచ్చరిక. విశాల వామపక్ష చింతనకు నెలవైన ఆయన రచనల్లో ఏదో ఒక రకంగా మనుషులను వేరులు పెట్టే  వివక్షల, ఆధిపత్య సంస్కృతుల పట్ల ఆగ్రహ ప్రకటన ఒక కేంద్ర స్వభావంగా కనిపిస్తుంది. అశాంతిపర్వం అనే కవితలో, ఆయన మందలింపు చాలా తీవ్రమైనది. “ కొయ్యి, ముక్కలు చెయ్యి, విడగొట్టు, వేరుపరచు, పల్లెనూ,పట్నాన్ని, తెగలనూ, నగరాన్నీ, భాగాలుగా ఎడం పెట్టు, వాటాలుగా ఎడ పెట్టు, ఒప్పందాలుగా పంచేసుకో – మృగాల్లా బతకండి, చంపుకుంటూ, కబళిస్తూ, పీక్కుంటూ, పులుల్లా, సింహాల్లా – ఒక్క  క్షణమైనా మనుషులుగా బతకవద్దు – మృగత్వానికి  పట్టం  కట్టి పండుగ చేసుకోండి”

 తన కవిత్వ రచన పట్ల కురుప్ విశ్వాసం  ఇది –

 “కవిత్వం నాకు అలా కలుగుతుంది అంతే. ఏది దాన్ని ఎగసన  తోస్తుందో నాకు అవగతం కాలేదు. అలాగని అదేదో కాలక్షేపపు ఆలోచన అని అనుకోలేను. ఒక స్ఫూర్తి అయితే తప్పకుండా ఉన్నది. మనం జీవితాన్ని గాఢంగా జీవిస్తాము. అన్నిటి పట్లా అదే గాఢ  భావన కలిగి ఉంటాము. జీవితమే నాకు ఒక కవిత్వ దోహద కారి. అదే నా స్ఫూర్తి, నాకు మరింకే ఆలంబనలూ లేవు. సూర్యుడి కింద ఉన్నదేదీ, కవిత్వానికి అతీతం కాదు.  లోకపు సంఘటనలన్నీ, కవి పట్టించుకోదగ్గవే. ప్రతీ రాత్రీ కొన్ని పీడకలలు మన తలల చుట్టూ తిరుగుతుంటే మనం నిదురిస్తాము. చెట్లు నరికే గొడ్డళ్ళ  చప్పుడో, బాంబులు పేలుతున్న బీభత్సారావాలో,  ఆడపడుచుకో, అవని తల్లికో, నిర్దయా  హైన్యంలో జరిగే మాన భంగాలో, అవి ఆందోళన కలిగించి మెదడులో ఉత్పాతాలకు కారణమవుతాయి. ప్రతీ విషాదంలో, ఇంకా తీవ్రమైన మరుసటి విషాదపు బీజాలు ఉండనే  ఉంటాయి. ఒక దుర్ఘటన, మరొక దుర్ఘటనకు పురిటి పక్క అవుతుంది. అవి అలా రెట్టింతలవుతాయి. ఒక నగరం అంతా  మత విద్వేషాల మంటల్లో మాడి  మసి అయితే, అది కవిత్వాన్ని, సాహిత్యాన్ని తప్పక ప్రభావితం చేస్తుంది. కవిగా నా కర్తవ్యం ఏమిటని నేను అనుకుంటున్నానంటే, ఈ దుఖాల, పెనుగులాటల, తీవ్ర వేదనల ఒడ్డు నుంచి, స్వేఛ్చ  అనే మరొక ఒడ్డుకు, వంతెనలు కట్టడమే. ఎక్కడో ఒక చోట, నా పాట  కొంత కదలిక,  కొంత గల గల,   కలిగిస్తే నేను గర్వ పడతాను. గౌరవం దక్కిందని భావిస్తాను, ఇదే నా పని అని కొనసాగిస్తాను. కవిత్వం పట్ల నా దృష్టి ఇది.”                          

 కురుప్ కవితలు రెండు 

క్షణికమే కానీ –
మంచుబిందువును నేను

ఆకుకొస నా ఆకుపచ్చ సింహాసనం

నింగి నిమ్మళమైన నీలం కరిగిపోతుంది నాలో

నా శిరసు పై సూర్య కిరణాలుశిలువ గుర్తులు గీస్తాయి

ఉదయ రవిబింబ మూర్తినా ఒళ్ళో  కిలకిలా నవ్వుతాడు

రొమ్ము తాగుతున్న అల్లారు ముద్దు బిడ్డలా –

కొంచెం ఒంగి చూసుకో ఒక సారి

నీ చిన్నదయిన ప్రతిబింబం స్పష్టంగా ప్రతిఫలించడం లేదూ  నాలో –

అయినప్పటికీ

నన్ను పొదివి పట్టుకున్నా ఆకు కొస

ఒకింత రవంత కదిలినా

ఏ అలికిడీ లేకుండా ముగిసిపోతుంది నా కథ

రాలిపోతూ కటిక నేలపై –

నాలో కరిగిపోయిన  సూరీడూ, ఆకాశమూ,

నావయినవన్నీ అంతరిస్తాయి – అప్పుడిక శూన్యమే –

ఆవిరై ఆ ఎగువనున్న స్వర్గాలకు వెళ్లాలనుకోను  నేను

అవసరమైతే నా చెమ్మను అంద చేస్తా

ఈ నేల  మట్టి రేణువుకు.

 

 

 పల్లె పదం

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా

పాడిన పాటలు బాట తప్పి పోయాయి

నడిరేయి కాక గళం ఒరిసి అరుస్తున్నది

ఆ కాకిగోలలా  పదే పదే  పాడమా పాడమా

కను తెరవని వేకువలకు స్తుతి సంగీతాలూ

పిట్టలకు ముంగిలినా గింజలు జల్లేసి

పావురాళ్ల రాకకై పిట్ట పాట  పాడమా

లేని మావి చెట్టుకు ఊహ మావి కొమ్మకు

ఊగి ఊగేలా ఉయ్యాల పాట  పాడమా

ఎండిన వాగుల నెర్రెల  పర్రల బీడులా

హైలెస్స హైలెస్సా కాగితపు పడవలై

ఎండిన గొంతులా మేము పాటలు  పాడాలా

పాడాలా పాటలు తడి లేని మబ్బులకు

ఎత్తాలా గొంతులు మనసు లేని వానలకు

నిదరలు నటించే లేవని  వారిని లేపేలా

మేము డప్పులు మోగిస్తూ చప్పుడై రేగాలా

అలనాటి విందుల ఆ నిండు కథలన్నీ

చెప్పాలా పిల్లలకు కడుపుకోత జోలలుగా

ఆకొన్న బిడ్డలకు చేత లేని ముద్దలుగా

పాడాలా తీయగా పాడాలా  హాయిగా

ఆ పట్టు పుట్టాల సుతిమెత్తందనాలను

ఆ రాజు, ఈ రాజు ఎక్కినా  రథాలను

పాడాలా  జోరుగా, పాడాలా హోరుగా

ఈ నేల పాలకుల దిస మొల దర్పాలూ

ఊరేగే డాబులా ఆ బట్టబయలులూ

మునుపు పాడిన పాటలన్నీ ఏక మొత్తంగా

బాట తప్పి పోయాయి, దారి ఎరుగకున్నాయి

చెప్పండి అన్నలూ, చెప్పండి నాన్నలూ

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా..

 

మంటల ఫౌంటెన్

 

-రామతీర్థ

~

 

మాధ్యమాలన్నీ చెప్పేస్తున్నాయి నువ్విక మా మధ్య లేవని. అందిన పుస్తకమ్మీద సమీక్ష రాద్దామనుకున్నాము, చదువుతూ నీ పోలవరం కవిత్వాన్ని, చట్టి గ్రామం వద్ద ఒదిశా, ఛత్తీస్ ఘర్ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాలుగు రాష్ట్రాల మధ్య ఇరుక్కుపోయి ఇంకా బయటకు రాకుండా మేం ఉంటే, ఎలా సమయం వెదుక్కున్నావయ్యా నువ్వు నీ గుండెనాపేసుకోవడానికి.

బాగా చదువుకున్న వాడికి మంది బాగు కోరడానికీ,  ఎక్కువ తెలుసుకున్న వాడికి  ఎక్కువ కాలం బతికే అవకాశం ఉండడానికీ సంబంధం లేదేమో. కవిత్వం లోకి ఒక సమష్టి అశాంతి, కొంత వైయక్తిక అరాచకం ప్రవేశిస్తే, ఒకడు అలనాడు అల్లెన్ గిన్స్ బెర్గ్  అయ్యాడు. మాటలు వివాదాస్పదంగా విసిరి, సౌకర్యవంతంగా ఉండాలనుకునే భద్రలోగ్ సంఘానికి, ఆదిసూకర వేద వేద్యంగా, అడివి పందుల్లాంటి  గిరిజనులున్నారని, సిద్ధాంతాల వాగ్దాన భంగాలు జరిగి,  డబ్బు వేటాడుతున్న సమాజంలో, ఆధునిక, అత్యాధునిక ఆటవికులున్నారని చెప్పిన నీ వాక్యాలకు ఒక ప్రజాస్వామ్య ఉష్ణోగ్రత ఉంది.

ధన్య మనస్కంగా విభిన్న శృంగార హక్కుల పసి కేరింతలు, కసి  కసుర్లూ, అస్తిత్వ సంచార యాత్రలో, పోస్ట్ మాడర్న్ ఖెయాస్ లో మనిషికెవరూ దిక్కు లేరని చెప్పే వాతావరణ హెచ్చరికలూ, పలు జిహ్వల్లో నాగరికుల మిశ్రమ దుఖార్తి, నువ్వు రాస్తే, సంక్లిష్ట నిరసనయ్యింది.

రాయాల్సినంత రాశావా, చెప్పాల్సినంత చెప్పావా, లేక కొత్త ఉద్యోగాలయిన దృశ్య మాధ్యమాల్లో, నిన్ను నువ్వు ఖర్చు పెట్టేసుకున్నావా  ఎవరూ చెప్పరు. సాంకేతిక మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, యంత్ర భూతముల కోరలు తోమే,   ఇనుప అడుగుల నాగరికత, ఇసుక రేణు సూక్ష్మ ఫలకం, సిలికాన్ చిప్ లో దాచిన జ్ఞాన బీజం, స్వార్థ స్వర్గాలకే పయనిస్తుందా, ఒంటి కంటి సిద్ధాంతపు, ఒంటి స్తంభ సంస్కృతుల, ఒంటరి పట్టా పై, మోనో రైలు లా – – అడగాల్సిన ప్రశ్నలున్నాయి.

పాత జవాబులేవీ రాయకుండా పరీక్షలు రాయాల్సిన రోజులివి. మార్కుల పద్ధతిని దాటిన జవాబు పత్రం కావాలి ఇవాళ కవిత్వం. ఠావు  అంతా ఖాళీగా ఉంచి, మార్జిన్ లోనే ఉంచిన వారిని,  ఫుల్ స్కేప్ బతుకు లోకి తీసుకురావాలి. అలా జవాబులు రాయవలసిన కాలం ఇది. కోటానుకోట్ల బతుకు పేపర్లను ఇలానే దిద్దాలి అంటూ దిద్దుతున్న వారిని, జన జీవన విద్యలో జ్ఞాన  శూన్యులు  గా కోలహాల ప్రకటన చేయాల్సిన రోజులివి.

కొత్త సహస్రాబ్దికి, ఇంకా పదిహేనేళ్ళే, నీకా అర్థ శతాబ్దపు ఆయుష్షు  నిండ  లేదు. ఆయుధమై పదునెక్కి, సాయుధ పటాలాలు గా   అక్షరాలను నడపాల్సిన నిర్ణాయక దశలో, మరణ వాంగ్మూలాన్ని పౌర సరఫరా చేసి, బతుకు లగేజీలు వదిలేసి, మరణాన్నే ఒక్క మూట  కట్టుకుని , జల క్రోధం జన క్రోధంగా  మారే దారి లో మోసుకెళ్తున్నావు.

కనిపించని డబ్బు కరిగిపోయిందని  స్టాక్ మార్కెట్లు మోరలెత్తి ఏడుస్తున్నాయి. పని లేని ఆయుధ సంపత్తి ఎవరి సంపదో చెప్పలేక రాజకీయం నీళ్ళు నముల్తోంది. ఏర్పడని దేశాల కోసం, ప్రజలు పురిటి పడకల నుంచే ఉద్యమ ఉంగాలాపనలు చేస్తున్నారు.  నాగరికుడా – నువ్వు స్వైర సంగీత జీవ శక్తిని ఆటవికతలో విన్నావు, అమెరికాలో విన్నావు. ఆటవికుడా, నువ్వు కోయ వేషంలో కూచుని ఏదో ఆండ్రోమెడా  చానెల్లో, ఆక్స్ ఫర్డ్  ఇంగ్లీష్ లో, అడవి బిడ్డల హక్కుల గురించి, బతుకులు అడవులైపోయిన ఆధునిక దిశాహీనత గురించి, మాట్లాడుతూ, మాట్లాడిస్తున్నావనుకోనా?

పాంటూ, చొక్కా వేసుకు తిరిగిన కోయ రాజా – నీకు పెన్ను నిండా గోదారి.  కూనవరం రేవే దగ్గర ఒంటరి పడవలో నువ్వొదిలేసిన అక్షరాలు ఇప్పుడిక  ఈ తరాలు రాయాలి.

అల్విదా జెంటిల్ జ్వాలారుణ  సాగరుడా,  నిప్పు పెట్టెల్లోంచి  పేలాల్సిన ప్రజాగ్రహ గంధక ధూళి, నీకు ఎప్పటికైనా  నివాళి.

 

*

 

ఏడు పదుల “నయాగరా”… నవ కవిత్వ నగారా!

 

అది మార్చి 1944 అప్పటికే ఒకటో రెండో కవితలు మినహా మొత్తం మహా ప్రస్థాన గీతాల రచన శ్రీశ్రీ పూర్తి చేశారు. చలం గారి ముందు మాటలూ వచ్చి చేరాయి. అయినా , 1950 దాకా ,‘మహా ప్రస్థానం’ ఒక సంపుటంగా వెలువడే అవకాశాలు సానుకూల పడలేదు. ఆ గీతాలన్నీ ఎన్నో ఏళ్లుగా ఎందరో కవుల  నోళ్ల ద్వారా , సభల్లో గానం చేయడమూ, అవి బహుళ ప్రాచుర్యాన్ని పొందడమూ జరుగుతూ వస్తోంది.

చూడబోతే  యుద్ధపు రోజులు , సామ్రాజ్య పంజరాలు బద్దలయ్యేలా సామాన్యుల సాహసాలు నమోదవుతున్నాయి. దగ్గరలోనే తెలంగాణ కూడా వ్యతిరేక పవనాలకు ఊతమిచ్చి ప్రతిఘటన తల దాల్చింది. అటు సోమసుందర్ , ఆరుద్ర,, కుందుర్తి వంటి కవులు జన గళాలకు తమ అక్షర నివాళులిచ్చిన , కొత్త నమ్మకాలు వెలార్చిన దశాబ్దం అది. 1948, 49 వత్సరాలలో కానీ ఈ కావ్య దుందుభులు మోగలేదు వజ్రాయుధాలుగా ,‘తెలంగాణా’ లుగా.

కవులు రాజుల ఏనుగులేక్కే కాలం కాదిది. ప్రజలు రాజుల్ని సింహాసనాల మీంచీ ఏనుగుల మీంచి కిందికి దింపే కాలం. అది కవుల చేతుల్లో అక్షరాల కరవాలం . మరీ ముఖ్యంగా ముగ్గురు అభ్యుదయ కవుల యవ్వనాల నయాగరా హోరెత్తిన దశాబ్దం అది. అది మార్చ్ 1944, బెల్లం కొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ల మూడు ముళ్లు తొమ్మిది కవితల ‘నయాగరా’ కవితల సంపుటి వెలువడిన నెల. ఈ నవ కవితల నవ్య ధార నగారాకు, ఇది సప్తతి పూర్తి నగారా మొగుతున్న వత్సరం(1944-2014).

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

అభ్యుదయ కవితా యుగం లో అచ్చైన తొలి కావ్యంగా దీని విశిష్టత ఎనలేనిది. ఈ కవులు ప్రగతి శీల భావ దురంధరులు. కోస్తా జిల్లాల యువకులు. వామ పక్ష జన ప్రయోజనాభిలాషులు. రోజూ యుద్ధ మృగంతో తల పడుతున్న ప్రపంచం లో . సామాన్యుల ముందర ఉన్నది ఒక్కటే ఆశ, ప్రజానుకూల శక్తులు గెలవాలి. నియంతలు, సైన్యాధికారోన్మాదులు . నర హంతలు ఓటమి పాలవ్వాలి. దేశాదేశాలను మెల్లగా యుద్ధపు ఊబిలోనికి లాక్కుపోతున్న ప్రపంచ పరిస్థితుల కాలంలోనే ఈ ‘నయాగరా’ ప్రపంచాగ్నికి సమిధగా వెలువడింది. ఈ కవితలు కొద్ది సంఖ్యలో వున్నా, వీటి చైతన్య స్థాయి గొప్పది. అది ప్రజల పక్షాన నిలిచింది.

ఎర్నస్ట్ టాలర్

ఎర్నస్ట్ టాలర్

అందుకే ఏ చిరు కవితల పొత్తం అంకితం ఇచ్చారు వీరు ఒక జన్మతః యూదుడైన , జర్మన్ నాటకకర్త , వారం రోజుల పాటు బవేరియా సోషలిస్ట్ రిపబ్లిక్ కు అధ్యక్షుడిగా పని చేసిన ఎరన్స్ టాలర్ కు , అతని పంక్తులనే ఊటంకిస్తూ.

“ఎప్పుడు మనం ప్రేమలో బతుకుతాము

ఎప్పుడు మనం ఇష్టమొచ్చిన పని చేయ గల్గుతాము

ఎప్పుడు విముక్తి???”

యుద్ధ పిశాచి దురంతాలకు లోనయి ఉన్న యావత్ ప్రపంచమూ, సామ్రాజ్య వాదుల పెచ్చుమీరిన దోపిడీ పరిపాలనలో ఉన్న ఎన్నో బడుగు దేశాలూ, బహుశా ఇదే ప్రశ్న తో పడే పడే సతమవుతున్న కాలం అది . అందుకే తెలుగులో తొలి అభ్యుదయ కవిత్వ సంపుటి ఇదే ప్రశ్నలు వేసింది. మొదటి మూడు కవితలు ‘నా గీతం’,’ఈ రోజున’. ‘చెరసాల’, బెల్లం కొండ రామ దాసు గీతాలు. వీటిని ఆయన రెండు నెలల ముందే అంటే జనవరి 1944 లోనే రాశారు. వీటిలో అంతర్జాతీయ స్పృహ, గుచ్చెత్తి చూపే అభివ్యక్తి , అచంచలమైన ప్రజాపేక్ష విశ్వాసం మెండుగా ఉన్నాయి.

మధ్య లోని మూడు కవితలు కుందుర్తి ఆంజనేయులు రాసినవి ‘మన్యంలో’,(ఏప్రిల్, 1943),‘జయిస్తుంది’, (అక్టోబర్ , 1941),‘తర్వాత’,(సెప్టెంబర్. 1942) లో రాయబడ్డాయి. వీటిలో మన్యం లో కవిత , విశాఖ మన్యం వీరోచిత పోరాట కారుడు అల్లూరి సీతారామరాజు గురించిన కదన కధనం. బహుశా అల్లూరికి అక్షర తర్పణాలు ఇచ్చిన అభ్యుదయ కవులలో కుందుర్తి ముందు వరుస లో వుంటారు. అల్లూరి బలిదానం(07/05/1924), తర్వాత పందొమ్మిదేళ్ళకు వెలుగులోకి వచ్చిన కవిత ఇది. కుందుర్తి అల్లూరి పై అంగార మాల రచిస్తే , ఏల్చూరి సుబ్రహ్మణ్యం తన మూడు కవితలలో ఇంకాస్త భిన్నంగా కనిపిస్తాడు.

ఈయన ‘ఠాకూర్ చంద్ర సింగ్” (జూలై, 1943), “ప్రజాశక్తి’, (జూన్, 1941),‘విజయ ముద్ర’(మార్చి, 1941) కవితలను నయాగరాకు అందించాడు. కవితల్లో ఎక్కడా ‘నయాగరా’ పదాన్ని ఈయన ముందు కవులిద్దరివలే వాడలేదు. బెల్లం కొండ రామదాసు ‘నా గీతం’ లో ,‘జగత్తునొక నయాగరా జల ధారలుగా వర్షించిన నా గీతం’, అని రాయగా , కుందుర్తి ‘గబ గబ గబ గబ నయాగరా జల పాతం లా నడిచే విప్లవ సైన్యం జయిస్తుంది’ అంటారు తన గీతం ‘జయిస్తుంది’ లో.

Kundurti anjaneyalu

1938 కి ముందే అత్యధిక శాతం శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థాన గీతాలు , భావావేశ సంపన్నతకు ప్రతిబింబాలై , ఒక తాత్విక స్థాయి నుంచి ప్రజా పక్షం వహిస్తాయి. తక్షణ సందర్భాలు, కవితా వస్తువు కావల్సిన అవసరం శ్రీశ్రీ కి జూన్ 22, 1941, దాకా కలగ లేదు. అప్పుడే ‘గర్జించు రష్యా ‘ గీతం చండ ప్రచండంగా వెలువడింది. ఇంచుమించు యుద్ధకాలపు నీడలే నల్లగా వ్యాపించిన ప్రపంచం గురించి, ప్రగతి అనివార్యత గురించి, శ్రీశ్రీ ని ఆరాధించే , అభిమానించే ముగ్గురు తెలుగు కవులముప్పేట హారం ఈ కవిత్వ నయాగరా!

భాషా పరంగా , ఒకింత మోతాదు ఎక్కువగా అలంకారిక గ్రాంధికమా అన్పించే నడక బిగి , ఏల్చూరి సుబ్రహ్మణ్యం రచనల్లో విరివిగా కన్పిస్తుంది. ‘సముద్ధర్త’,‘రూక్షోజ్వాల రుధిర దీప్తి’. ‘తమసా గర్భ ధళన హేతి’,’‘సుప్తోధృత జీవ శక్తి’ అంటూ మొదలైనా ఏల్చూరి విశ్వాసం తిరుగులేనిది. ‘వొస్తున్నది ప్రజా శక్తి’ అంటూ సాగే ఈ నయాగరా గీతం, యుద్ధాన్ని నిలదీస్తుందిలా ,‘హత్యకు హారతులిచ్చే , అగ్నికి దాహం పెంచే చీకటి కాటుక దిద్దిన యుద్ధం’. వామ పక్ష శక్తుల విజయాన్ని విశ్వసనీయంగా ప్రకటిస్తుంది. ‘ఎగిరే ఎగిరే ఎర్రటి జెండా , కరకరలాడే కొడవలి పదునూ, లోహం వంచిన సమ్మెట పెట్టూ, వైప్లవ్యపు వైతాళికులై నినదించెను నిప్పుల గొంతుక!’. ఈ ఏల్చూరి గీతం , అదే కాలం లో వెలువడిన మఖ్దూం మొహియుద్దీన్ కవిత ,‘వస్తున్నది , వస్తున్నది సామ్యవాద మహా నౌక , యువకుల బలిదానాలను అందుకుంటూ వస్తున్నది’ ను బలంగా మన మనసుల్లో మెరిపిస్తుంది.

Bellamkonda ramadasu

‘నా గీతం’ అనే బెల్లం కొండ రామదాసు గీతం, అంతర్జాతీయ సంఘర్షణామయ ప్రపంచ గందరగోళం లో, ఒక ప్రజల చేతి ఆయుధం ‘ నా గీతం’ అంటూ బెల్లం కొండ దర్శించేది , బహురూపాలైన జన ప్రతిఘటనను. 1944 లో రాస్తున్నాడేమో, యూరప్ నగరాల బాంబు మోతలు తన కవితల్లో సాకారమౌతాయి. “గత సాంఘిక నరబలి నగరం పై బాంబులు దూకించిన నా గీతం”, అంటూ వర్గ రహిత సంఘ స్వర్గానికి పూల నిచ్చెనలు వేసిందట, నరహంతలకు చెరసాలలకు , ఊరి తీర్పులకు , నిరంకుశ నియంతలకు తల కొరువులు పెట్టిందట’ అని కవన వ్యాఖ్యానం చేస్తూ జీవితాన్ని విహంగం చేసిందట’ అని నయాగరా అంతా నవ మోహన విహంగం అవుతాడు ఈ కవి కుమారుడు.

ఉన్నవి తొమ్మిది కవితలే . రాసింది ముగ్గురే . అయినా ఇదొక ప్రయాణానికి పచ్చ జెండా. ప్రపంచ విప్లవ శక్తుల గుర్తింపు, దేశదేశాల రూపు రేఖలు మారి పోనున్న మహత్తర సందర్భాలు , వాటిలో అతలాకుతలమయే మానవుడి పాత్ర , ఇవన్నీ వీటిలో సముచితంగా , సమున్నతంగా ప్రస్తావితం కావడం , ఈ నవ కవితల నయా గరాకు కొత్త వడిని, వరవడినీ తెచ్చి పెట్టింది. అల్లూరి గురించి కుందుర్తి రాయగా , దండి ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 18 గర్వాల్ దళ నాయకుడు ‘ఠాకూర్ చంద్ర సింగ్ ‘ కు ప్రశంసగా తన గీతం అదే పేరుతో రాశారు ఏల్చూరి .

యుద్ధ కల్లోల దశాబ్దాలలో కవిత్వ రచనా చేస్తున్నా, తమ జీవన సౌకుమార్యతలను కోల్పోని ఈ ముగ్గురు నయాగరా త్రేతాగ్నులు (ఇది ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి మాట ), ఈ సంపుటిని అనిశెట్టి సుబ్బారావు (మరొక ప్రముఖ తెలుగు అభ్యుదయ కవి), లక్ష్మిల వివాహ సందర్భంగా ‘అని-ల’ కు అంకితం ఇచ్చారు.

ఇంకా ముందుగా ప్రస్తావించబడ్డ ఎరన్స్ టాలర్, దేశాలు వేరైనా ఫ్రెంచ్ వారయినా ఫ్రెంచ్ వారూ జెర్మన్ వారూ సోదరులే అని చెప్పడం తో పాటు , ఆనాటి హిట్లర్ ఆధిపత్య దేశంలో హీరోలను, హీరోయిజాలను తిరస్కరిస్తూ, “అసలు ఉదాత్త నాయకులనే భావనే అన్నిటికన్నా అతి తెలివి తక్కువ ఆలోచన” అన్నందుకు ఏళ్ల తరబడి చెరసాలల్లో బతికాడు. జెర్మనీలోని ఫాసిజపు ముష్కర మూకలు, నాజీల స్నేహాన్ని నిలదీస్తూ , యూరప్ అంతా ఉపన్యాసాలు ఇచ్చాడు. 1939 లో ఒక హోటల్ గదిలో ఉరిపోసుకు చనిపోవడం వెనుక వివాదాస్పద కధనాలు వున్నాయి.

ఇలా డెబ్భైయ్యేళ్ళకు వచ్చిన ‘నయాగరా’ ఒక సంఘటనల సమాహారం. జాతీయంగా , అంతర్జాతీయంగా , ప్రాంతీయంగా 1940లకు అటూ , ఇత్తూ గల సామాజిక పరిణామాలకు దర్పణంగా నిలుస్తూ దార్శనిక సంపన్నతను నిండుగా కలిగున్న మైలు రాయి ఈ కవిత్వ సంపుటి. ఏడు దశాబ్దాలు నిండిన ‘నయాగరా’, తెలుగు ఆధునిక కవిత్వం లో శిఖరమూ, జల పాతమూ కూడా .

రామతీర్థ

ramateertha

భయం వరం

ram

గోడల మీద డైనొసార్లు తిరుగుతున్నాయి

మహా సముద్రాలు పెరటి కొలనులయ్యాయి

గ్రహ గృహాల కిటికీలు తెరిస్తే

పక్క  గ్రహాల ఇళ్ల వాకిళ్ళలో

ఆకు పచ్చ ముగ్గుల్లా హరితారణ్యాలు కన్పిస్తున్నాయి

మధ్యలో మందార చిచ్చులా అగ్గి కనుమలు

ప్రతీ తారా విద్యుత్తు అమ్ముకుంటోంది

ప్రతీ గ్రహమూ రోదసీ ట్రాన్స్ ఫార్మర్ కు దగ్గరగా

తన విద్యుత్ స్తంభాల్ని నిలబెట్టుకుంటుంది

గ్రహాంతర దూరాల్ని

ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య దూరంగా

ఈ స్టోన్ హౌస్ పేటలో

ఆవలీలగా దాటిపోతున్నారు

గ్రహులందరూ

ఆ గ్రహులు, ఈ గ్రహులు

అందరూ నిగ్రహులు, ఆజాను బాహూ విగ్రహులు

ఏనుగులు ఎలకలైన ఇళ్ళలో

బాత్ రూముల్లో

నాయాగారా జలపాతాలు ధారపోతున్నాయి

అంగారక వారి అప్పారావుకీ

భూమి వారి శ్యామలకీ

శని గ్రహం షామియానాలో పెళ్లి –

పాల పుంత పథం మీద అది వాహనాల బారా –

కాదది

కదులుతున్న ఎవరెస్టుల కిల్మంజారోల కాన్వాయీ

చక్రవాహన విశ్వ ఘోష

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, తాజ్ మహల్ లు

తెచ్చారు భూమి నుంచి

మగ పెళ్లి వారు అంగారక వారి ఇంటికి –

గడ్డ కట్టిన అంగారక బంగారు నది –

ఎక్కుపెట్టిన బాణపు మొన పై గుచ్చుకున్న తిమింగలం

తెచ్చారు భూమి వారి శ్యామలమ్మకు

అనంత పౌరుషాల అప్పారావు శక్తికి ధీటుగా

పాలపుంత  కొనలలో ఒక సూర్య చితి మండుతోంది

వేల సూర్యులు జీవన ప్రభాతం లో యవ్వన ప్రాదుర్భావులై

ఉదయిస్తున్నారు

లక్షల చంద్రులు ఆకాశ కర్మాగారాలలో

అసెంబ్లీ లైను మీద తయారై, ప్రతి షిఫ్టులో

గ్రహ గృహాల ఇళ్ల దీపాలవుతున్నారు

రెండు తాళ ప్రమాణాల చుట్ట కాలుస్తూ

చెప్తున్నాడు ప్రాక్సిమా సెంటారీ నుంచొచ్చిన పెదనాన్న

కోట్ల మైళ్ళ నుంచోచ్చిన వార్తను

సుదూరాల నక్షత్ర గుచ్ఛమొకటి కాలి బూడిదైపోయిందట

అక్కడినుంచి పుట్టిందట జీవం –

పాపం ఇప్పుడు జీవనికి పుట్టినిల్లు లేదు

గ్రహాలన్నీ ఎక్కే దిగే గుమ్మాలే

ఉబ్బిపోయిందట లోకం –

ఎందుకిలా అడిగాడొక బలహీనుడు

వాడు నిండా ఆరడుగులు లేడు

మన గ్రహ గృహాలలోని చీమ కన్నా చిన్న వాడు

ఎగేసి తన్నిందట ప్రకృతి ఒకసారి

ఏదో ఒక నాడు వాడి దేవుడి పుట్టినరోజున

అడవులు, ఆకాశ నైరూప్య నిశారణ్యాలు

పట్టిపోయాడు దాంతో –

వాడూ మన పూర్వీకుడేనట –

ఎందుకిలా —

ఎవడీ అల్పిష్టి అక్కు పక్షి –

మన గ్రహాంతర వివాహ వేళ –

ఏమో ఎరగం మనం

ఏదో తెలియం మనం

అయినా ఈదుకుంటూ వచ్చాడట రోదసి నదిలో

మన మహా పారదర్శక ప్రవాహంలో

ఈ మానవ కణాన్ని జాగ్రత్తగా పంట నొక్కి పెట్టి

తెచ్చాయి రెండు సొర కాంతలు –

ఆకలేస్తే గ్రహాల దొంతర్లని తినేయగలవవి

అయినా మనిషి వలె వున్నాడని

మనిషిలో వెయ్యో వంతుగా వున్నాడని

తెచ్చాయట ఈ పెళ్ళికి –

జల గాలక్సీల కానుకగా –

వాడే అంటున్నాడు మనం ఉబ్బి పోయామని

మనకి సౌందర్య శాస్త్రం తెలీదని –

కొత్త గ్రహాల గృహాలకై పాతబడి కూలిన గృహ భస్మాల్ని

వాడుకునే మనం

ఎక్కడ వెదక గలం ఎప్పుడు బూడిద బూడిదయి

ఎన్ని సార్లు బూడిదయ్యిందో

వీడు చెప్పే భూమనే గ్రహం?

అయినా విందాం, వీడి మాట ఏమిటో ?

అంగారక అప్పారావు , భూమి శ్యామలల పెళ్ళికి

వీడే కదా ఒక అపురూప కానుక

వీడి మంటల స్థాయి , మన ఇంట సూది పడినట్టయినా లేదు –

విందాం శబ్దోల్బణ యంత్రాలతో  –

అలనాడు మనం ఎరుగని గ్రహాన –

ఆసియా మైనర్ లో ఎగిరిందట వీడి బతుకు జెండా –

మన మానవ బహు గ్రహ భాషా ప్రొసెసర్

మారుస్తోంది వీడి పలుకులు – మన గాలి ఊసుగా –

ఉబ్బిపోయాం మనం

అదీ వాడి తెలివి తక్కువ వల్లేనట

ఎవరూ  ఏ వరమూ అడగని వేలుపు

వుండే వాడట ఒకడు

అలనాటి ఆ తొలి భూమి దేవరలతో ఒకడిగా –

అట్టి వరమేవరూ అడగని  వామనుడ్ని

అడిగాడీ మానవుడు –

ఒకసారి నీ వామనత్వం నుంచి

త్రివిక్రమత దిశగా ఎదిగిన

అనుభవాన్ని తనకిమ్మని –

ఎవరమూ వైయుక్తికం కాదు – అది లౌకికం అవుతుంది

అన్నాడట వీడిలో సగముండే

ఆ మూడడుగుల వాడు – గడుసుగా –

రక్త పాతం లేకుండా

రాజ్యాధికారాన్ని మార్చిన చతుర మందహాసంతో

తన చిన్ని పాదాలు పరిశీలించుకుంటూ –

లౌకికమే అయినా సమ్మతమే –

కావాలా త్రివిక్రమత తాలూకు అనుభవం-

అడుగుతున్నదొక ఋషి

భరించలేని కోరిక, సహించలేని వరం ఇది

ఇదే కావాలా అన్నాడట ఆ వడుగు  –

అవశ్యం కోరాడీ ఋషి –

అయితే కోటి సూర్యుల, శతకోటి చంద్రుల

కాలం నాది –

నా ప్రతి వేకువలో నాలుగు వేల యుగాల కాలపు కొమ్మ

ఒకటి కూలిపోతుంది

అనంత కాలం ఈ కోరిక సాగరాదు

అయినా సాగుతుంది పన్నెండు గంటల పాటు

పన్నెండు గంటల వామన కాలంగా –

త్రివిక్రమాకార ఊహాతీత ప్రవాహంగా

ఇది నీవు వరమనుకుని కోరి

పొందుతున్న శాపం –

లోకం ఎంత పెరుగుతుందో –

ఇంతేగా వుండిపోతావు నువ్వు

ఈ పన్నెండు గంటల కాలమూ

ఆహా ఎంత బావుందీ కథ  –

వీడట మన పూర్వీకుల పూర్వీకుల ముందు వాడట –

మన సొర కాంత కసక్కన నమిలి ఉంటే  –

ఈ పాటికే చరిత్ర హీనుడయేవాడు –

అయినా వీడి నేత్రాలలో

ఆ తొలి సూర్యుడి జ్వాలలున్నాయి

ఆ ఒక్క సూర్యుడి    ఒక్క భూమికి   ఒక్క

సజీవ వారసుడా _

అయితే – ఆ వామనుడెవరయి వుంటాడు –

ఏమో –

భూమి శ్యామలకి బరువు గుండెలకెక్కింది

భృకుటి బంగాళాఖాతం  ముడుచుకున్నట్టు

ముడి వడింది –

అది చూసి లేచాడు అంగారక అప్పారావు

మా పెళ్లి వేళ మంచి ముచ్చట ఇది –

అయినా ఎవరు నువ్వు –

చెప్పి పుణ్యం కట్టుకో –

లేదా ఈ పెళ్లి వేళ విల్లు తీసి –

తిమింగలాస్త్రం ప్రయోగిస్తా –

అది వేల అణుబాంబుల పెట్టు –

చాలు నీ ఒక్క ప్రాణానికి –

పెళ్లి కొడుకు పౌరుషం చూసి మురిసారందరూ

ఆరడుగుల వాడు –

మరెప్పుడో , మరెక్కడో , వేరే కొలువులో, వేరే స్థలం లో

ఆజానుబాహుడు , అరవింద దళాయతాక్షుడు –

బాణం ముందు నిల్చున్నాడు

అంగారక ఇంటివారు

భూమి శ్యామల వంశజులూ ముచ్చట చూస్తుండగా

అంగారక అప్పారావు

అవసరం లేక పోయినా విల్లెక్కు పెట్టాడు –

నిర్వికారంగా ఉన్నాడు

నీలి మేఘపు ఛాయ వాడు –

ఉబ్బిపోయిన లోకాలన్నీమరో అణువిస్ఫోటనానికి సిద్ధమయ్యాయి

రగిలే గ్రహ భస్మరాశులు

పర్వతాల ప్రమాణపు లారీల కెత్తి –

రోదసి రోడ్డు పై కొత్త గ్రహాల తయారీకి

సిద్ధమయ్యారు శాస్త్రులు , మేస్త్రులు, తాపీ పని వారు

ఒకానొక ప్రాణ జన్య యంత్రాలే వారంతా –

అంగారక అప్పారావు తల పెట్టిన

అస్త్ర ప్రయోగం –

అబ్బుర పాటే భూమి శ్యామలకు

చూడాలని – కాబోయే వాడి శౌర్య గరిమ

వరమాల ఎలానూ చేతిలోనే ఉంది

బాణం వదలడమేమిటి , దండ వేయడమేమిటి

ఎప్పుడెప్పుడా ఉవ్విళ్లూరుతోంది

భూమి శ్యామల

అంతా ఒక ప్రళయ కాల నిశ్శబ్దం

అంతా ఒక విలయ కాల ఉలికిపాటు

నవ్వుతున్నది అంగారక అప్పరావొక్కడే

అకారణంగా అయినా ఆయుధ ప్రయోగం చేసేవాడి

అహంకార అందం తో    నారి సంధించాడు

తిమింగలాన్ని సంధించాడు –

వేయి అడుగుల విల్లు మీద

ఆరడుగుల వాడు అందులో శతాంశం లేడు

అయినా నిలుచున్నాడు

ఒకానొక ప్రాచీన సూర్యరశ్మి స్వర్ణ భస్మపు పోత లాగ

అఖండ కాలపు అనంతాకృతి లాగ

అంగారక అప్పా రావు ఎక్కు పెట్టిన విల్లు మీది

తిమింగలాస్త్రం మీద కూర్చున్న శతాంశం లో సగం వాడొకడు

అన్నాడు – ఆగాగు తొందర పడకు –

కాలాలు వేరైన మనం

ఏక కాలస్థులం కావడమే వింతల్లోకెల్లా వింత –

నడుస్తున్నదింకా పన్నెండు గంటల కాలం

ఇది వామనుడి కాలం – ఇది నాకు సంబంధించి సత్యమైన కాలం

ఇది ఈ త్రివిక్రముడి పన్నెండు గంటల కాలం

నీ బాణం భావిష్యత్తులోకి వెళ్లదు

ఇదింకా వామనావతార వేళ –

రాముడింకా పుట్టనూ లేదు – రామాయణం జరగనూ లేదు

ఇది నాకు సంబంధించిన నిజమైన కాలం

ఇక ఆ ఆరడుగుల వాడా –

వాడి జీవితం లో సీతా వియోగ వేళ కోరుకుంటాడొక

వరం – తన అవశాన దశలో –

వామనుడ్ని –

సరయూ నదిలో ఉబ్బిన రాముడి దేహం లో జరుగుతున్న కథ ఇది –

ఆ సరయూ భూమికి చెందదు

ఆ రాముడు భూమికి చెందడు

అంగారక అప్పారావు – అహంకరించిన పాదం చూడు

పాదం చూశావా – విశ్వం కన్నా పెద్దది

బాణాలు, అణు క్షిపణులు, సూర్య మండల సహస్రాలు

ఆగవు –

అర చేత విల్లు విరిచి , ఒళ్ళు మరిచి వేషాలేం

వెయ్యక్కర్లేదు

అన్నాడు పిడుగుల పాటగా ఆ వడుగు

అప్పారావు అంగారక్ చెవిలో –

తిమింగలం వణికి –  కింద పడింది

అతి కష్టం మీద నిలబడ్డాడు అంగారక అప్పారావు

తాను కింద పడితే భూమి శ్యామల పెళ్లాడదని –

ఎవరిదీ కాలం – రాముడిదా – అంగారక అప్పారావుదా,

వామనుడిదా – ఎవరిది , ఎవరిది , ఎవరిది ,

ఇదొక కలగాపులగపు విలయావర్త బలవత్ ఝరవత్ పరివర్తన

ఆ పరివర్తన లో కాలింగ్ బెల్ మోగింది –

తలుపు తీసుకు లోనికొచ్చిన అతిధి గాలి –

కాళ్ళు లేని అతిధికి ఏ కుర్చీ వేయనూ –

మెలుకువొచ్చింది – కాఫీ కప్పుతో వచ్చింది జగతి

“జగతి పై రామయ్య జన్మించినాడూ” పాట పాడుతూ

 

(వాల్మీకికి , పోతనకి , శ్రీశ్రీ , ఎమిలీ డికిన్సన్ కి క్షమాపణలతో )

-రామతీర్థ  

(శ్రీరామ నవమి 2014 , మంగళ వారం 7.30రాత్రి )

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇంగ్లీష్ సూరన కు నాలుగున్నర శతాబ్దాలు!

కాళిదాసు ను భారతీయ షేక్స్పియర్  అని మురిసిపోయిన పాశ్చాత్య సాహిత్య సమాజానికి మనం కూడా షేక్స్పియర్ను ఇంగ్లిష్ సూరన అని పిలిచి ప్రచారం లోకి తీసుకు రావచ్చును.  కాళిదాసు కు, షేక్స్పియర్ కు దాదాపు పదిహేను వందల ఏళ్ల అంతరం వున్నదేమో కానీ పింగళి సూరన కు, షేక్స్పియర్ కు దాదాపు సమకాలీనత వున్నది. 1564 లో పుట్టిన షేక్స్పియర్ కు ఈ ఏడాది నాలుగున్నర శతాబ్దాల  ముచ్చట ఈ ఏప్రిల్ 23న  మరియు 26/27 వారాంతంలోనూ ఘనం గా జరుగుతున్నది. బ్రిటన్ దేశమంతటా, ముఖ్యం  స్ట్రాట్ ఫర్డ్ ఏవన్ లో విశేషించి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఆంగ్ల దేశపు విఖ్యాత నాటక కర్త , కవి  అయిన షేక్స్పియర్ జ్ఞాపకాలలో ఈ ఎలిజబెతియన్ పట్నంలో ప్రజలు  ఈ ఉత్సవ దినాలలో రెండువైపులా బారులు తీరి  తమ దేశానికి ఈ సందర్భం గా  వొచ్చిన అనేక మంది నటులు, సాహితీ సాంస్కృతిక ప్రముఖులు  దాదాపు వెయ్యి మంది ఈ పాదయాత్రలో  26 ఏప్రిల్, శనివారం నాడు పాల్గొంటున్నారు. వారి వెనుకే పలు రకాల వేషాలలో  మేళాలు, తాళాలు, వాద్యాలూ సంరంభం గా కళాకారులు పాల్గొంటున్నారు.  వీరంతా హోలీ ట్రినిటీ చర్చ్ ప్రాంగణంలో షేక్స్పియర్ సమాధి వద్దకు వెళ్ళి పుష్పాంజలి ఘటిస్తారు.

index

వీటికి మించి అక్కడ ఆరోజంతా  షేక్స్పియర్ జన్మస్థల కమిటీ , మరియు  రాయల్ షేక్స్పియర్ కంపెనీ వచ్చిన వారిలోని  అన్నివయసుల సందర్శకులకూ, తగు వినోద కార్యక్రమాలు, షేక్స్పియర్ రచనల నుంచి ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తున్నారు.  వీటిలో భాగం గా, సంగీత కార్యక్రమాలు,  వీధి ప్రదర్శనలూ, కథలు చెప్పే ప్రక్రియలూ,  రంగస్థల పోరాటాలూ,  రకరకాల మేకప్ లలో ఊరంతా కలయ దిరగడాలూ వంటివి చోటు చేసుకోబోతున్నాయి. ఇంకా షేక్స్పియర్ స్మారక భవనాలకు యాత్రలూ, చేయవచ్చు. అవకాశం కలిసొస్తే, ఏ ప్రముఖ నటుడిని అయినా ఒక షేక్స్పియర్ పాత్రలో మనకు సమీపంలోనే కూడా చూడవచ్చు.

2014 లో షేక్స్పియర్ 450వ జన్మదినం కాగా 2016 లో ఆయన నాలుగువందలవ వర్ధంతి వరకూ ఈ ఉత్సవాలను సాంకేతికత సహకారం తో  లైవ్ స్ట్రీమింగ్ సినిమా  గా ప్రదర్శించనున్నారు, ఇది నాటక ప్రదర్శనలు, ఒక స్థలానికి, ఒక కాలానికి, మాత్రమే పరిమితమై ఉంటాయి అనే పడికట్టు ఆలోచనను విప్లవాత్మకం గా మార్చివేయననున్నది. దీని వల్ల, ఒక వూరిలో  ఒక వేదిక పై ప్రదర్శితమవుతున్న నాటకం అదే సమయంలో, ఎన్నో నగరాలలో,   థియేటర్లలో ప్రదర్శన సాధ్యమవుతుంది. ఇలా ఇంగ్లాండ్ లో ఒక చోట ప్రదర్శితమవుతున్న నాటకం, అమెరికా లోని 42 పలు ప్రాంతాలలోని థియేటర్లలో చూడవచ్చు. ఇంకా అదే సమయానికి, , తమ సమయాన్ని సమన్వయం చేసుకుంటున్న ఆస్ట్రేలియా, కెనడా, మాల్టా, స్వీడన్, రష్యా , జర్మని, ఐర్లెండ్ వంటి  దేశ దేశాల థియేటర్లలో  పలు దేశాల ప్రేక్షకులు చూడ సాధ్యమవున్నది. బహుశా  సినిమా రంగానికి ఇటువంటి లైవ్ డ్రామా ( థియేటర్ లో మంచి తెర, మంచి సౌండ్ తో) చూడగలిగే సాంకేతిక సౌలభ్యం, సాంస్కృతిక రంగానికి అందుబాటులోనికి రావడం కొత్త మార్పులకు దారి తీయవచ్చు. దీనివల్ల మన తెలుగు నాటక రంగానికి, మంచి రోజులు రావచ్చు అనే ఆశ కలుగుతున్నది. సినిమాలు లేక మూలన పడిపోతున్న ఎన్నో థియేటర్లు ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం, వాస్తవం గా పరిణమించే రోజులను మనం చూడబోతున్నాము అనిపిస్తున్నది. ఇందుకు, షేక్స్పియర్ నాలుగున్నర శతాబ్దాల  ముచ్చట్లు ఒక ఆరంభ బిందువు కావడం ఒక సబబైన సందర్భం.

గెలిలియో పుట్టిన ఏడాదిలోనే పుట్టి , ఈ శాస్త్రవేత్త అంతరిక్ష లోకాలలోకి  చూస్తే, మనిషి మనోలోకాలలోకి  చూసిన  అక్షర దార్శనికుడు షేక్స్పియర్. తన 52 ఏళ్ల జీవితంలో ఎన్నో నాటకాలూ , కవితలూ రాసిన షేక్స్పియర్, ఆంగ్ల భాషా వికాసంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ కవి రాసిన ఎన్నో మాటలు, పద బంధాలు, ప్రజా జీవనం లో , పత్రికా  రచనలలో, ఆంగ్ల సంస్కృతిలో  ఆంగ్లేయులు రోజూ వాడే ఈ ఇంగ్లిష్ మాటలు ఇలా  కాయిన్ చేసి రాసినది ఈ రచయితే. (dead as a doornail, a laughing stock, fair play, neither here nor there, in stitches వంటివి) ఆల్  ద వర్ల్ద్ ఈజ్ ఎ స్టేజ్, యు టూ బ్రూటస్, ద మోస్ట్ ఆన్ కైన్డెస్ట్ కట్ ఇంకా ఎన్నో షేక్స్పియర్ ఆంగ్ల పలుబదులు, ఆ భాషా సంస్కృతీ సాహిత్యాలలో,  చెరగని   ముద్రలు గా నిలిచిపోయాయి. తన రచనలలో మౌలికమైన ఇతివృత్తాలు తక్కువే అయినా, అనేక నాటకాలు  గ్రీక్, రోమన్ రాజుల కుటుంబాల కథలు అయినా వాటిని ఆంగ్లంలో అందుకున్న ఘనత షేక్స్పియర్ దే. పన్నెండు విషాదాంత   నాటకలూ, పది చారిత్రక నాటకాలూ, పదహారు సుఖాంత నాటకాలు  రాసినా, విషాద, చారిత్రక నాటకాలు వాటి ఇతివృత్త పరిమితులలో గొప్ప ఎత్తులకు ఎదగగా, సుఖాంత నాటకాలైన  వాటిలో సాంఘిక జీవనం ప్రతిబింబించగా, కల్పన, కొత్త యెత్తులకు ఎదిగిన దాఖలాలు, పింగళి సూరన కళాపూర్ణోదయం తో ( ఇదొక పద్య కావ్యమైనా) సాటి గా  షేక్స్పియర్  రచనలో కనిపించవు.

పింగళి సూరన కూడా 1550 ప్రాంతాలకు తన ఉత్తమ కావ్య  రచన  చేస్తున్నాడు, ఆయన కళాపూర్ణోదయం వంటి కల్పన ఆనాటి ప్రపంచ సాహిత్యంలో మరొకటి కనిపించదు. కథా కథన  వైచిత్రి, నవీన కల్పనా గల ఈ రచన,  షేక్స్పియర్ కి కొంచెం ముందే జరిగినా, మనం ప్రపంచ సాహిత్యానికి, పింగళి సూరన స్వకపోల కల్పనా ధురీణత  గురించి తెలియ చేసే ప్రయత్నాలు తగినంతగా చెయ్య లేదు. ఇటీవల వచ్చిన అనువాదాలు ఈ దిశలో కొంత ప్రయత్నం చేశాయి. ఇవి ఇంగ్లిష్ తోనే ఆగక స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి యూరోపియన్ భాషలలోకి కూడా వెళ్లాల్సిన అవసరం వుంది.

కల్పనా వైచిత్రి  విషయంలో పింగళి సూరన తో పోలిక, షేక్స్పియర్ సృజన వైశాల్యత ను తగ్గించడానికి కాదు, కానీ ఒక  పెద్ద  గీత  కింద  మరొక గమనించ దగ్గ వాస్తవ రేఖ ను పొందు పరచడానికే.   పదిహేనో శతాబ్దపు తెలుగు సాహిత్యం, షేక్స్పియర్ పుట్టుకకు ముందే, ప్రబంధ యాత్ర మొదలు పెట్టింది, అనేది, ప్రపంచ సాహిత్యం లో మన స్థానం ఏమిటో, మనం గ్రహించి, ప్రపంచానికి తెలియ పరుస్తూ, ఇందుకు బాధ్యులైన ప్రతిభా మూర్తులైన  రచయితలను వారు ప్రాచ్యులైనా, పాశ్చాత్యులైనా  సమున్నతం గా గౌరవించి అనుసరించటానికే. ఎటొచ్చీ షేక్స్పియర్  అక్షరాలకు కు నివాళి గా  జరుగుతున్న ఈ జాతీయ  సందడి, మన భారతీయ, తెలుగు కవులకు కూడా జరిగేలా, ఆధునిక చేతన, సాంకేతిక సన్నాహాలూ, చేసుకుంటూ  మనం కూడ అడుగులు వేయాలని ఆశించడం సహజమూ, ఆచరణ సాధ్యమూ  అన్న నా విశ్వాసాన్ని జాతి జనులందరూ పంచుకుంటారని విశ్వసిస్తున్నాను.

    -రామతీర్థ

ram

మన పదసంపదని కాపాడుకోలేమా?

      ram  ఈ తృతీయ సహస్రపు గుమ్మంలో నిలబడి  మనం, గడిచిన రెండు వేల ఏళ్ల మానవ చరిత్ర లో లెక్కకు  అందుతున్న, కనీసం వెయ్యేళ్ళ  తెలుగు భాషా  వికాస చరిత్ర ను క్రమబద్ధీకరించుకోవలసిన అవసరం ఉన్నది. గడిచిన శతాబ్దాల భాషా వికాసం, సంస్కృతి  సాహిత్యం లోనే లభ్యమవుతుంది. అందువల్ల ఈ వెయ్యేళ్లలో తెలుగు భాష ఎటువంటి వికాసాన్ని పొందుతూ వచ్చిందో,  పరిశోధనల ద్వారా నమోదు చేస్తూ ఒక బృహత్కోశాన్ని మనం తయారు చేసుకోవడానికి  కావలసినంత కాలమూ గడిచింది. తగ్గ వనరులు  కూడా ప్రభుత్వ శాఖల వద్ద ఇప్పుడు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలలో వున్న ఒక భావన ఏమిటంటే తగు సూచనలు, ప్రణాళికలు ప్రతిపాదనలు గా రావడం లేదన్నది , వస్తే గనక భాష విషయంలో లోతైన పరిశోధనలకు మద్దతు, నిధుల కొరత లేదు అని సంబంధిత అధికారులు తెలియచేస్తూ ఉన్నారు.
అనేక తత్సమ పదాలతో  కలిసి, ఆఛ్చిక పదాలుగా తెలుగు పదాలు,మొదటి నుంచీ ప్రతి కవి వాడుకలోనూ వున్నాయి. ఇందుకు నన్నయ నుంచి, నన్నెచోడుడి  నుంచి మొదలు పెట్టి,  ఈ ఇరవయ్యో  శతాబ్దం దాకా తెలుగు ఎలా వికాస పరిణామాలు చెందిందో ఒక పెద్ద ప్రాజెక్టును మన తెలుగు సాహిత్య, భాషా పరిశోధక సమాజం రూపకల్పన చేసుకుని ఆచరణలోకి తీసుకురావలిసిన  అవసరం వున్నది.
ఇప్పుడు  ఇటువంటి కృషి ప్రధాన కార్య క్షేత్రం గా,  ఇంతకు ముందు లేనటువంటి  సంస్థలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రాచీన భాష ప్రాతిపదికన మైసూరు లో ఏర్పడిన ప్రాచీన భాషా విశిష్ట  అధ్యయన కేంద్రం ఒకటి. ఇది తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రకటించాక  ఫలస్వరూపం గా ఏర్పడిన  సంస్థ. ప్రస్తుతం  మన రాష్ట్రంలో ఏర్పడి ఉన్న  సందిగ్ధతల దృష్ట్యా కూడా ఈ సంస్థ “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్”, మైసూరు, ఆధ్వర్యం లో పనిచేస్తున్నది. ఈ ప్రాచీన హోదా వల్ల తెలుగు భాష వికాస పరిశోధనలకు కావలిసిన నిధులను కూడా ఈ సంస్థ ద్వారా మనం పొందగలము. ఆలాగే  కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ, నిర్వహించే భాషా అభివృద్ది సంఘం లో తెలుగు భాష తరపున ఇప్పుడు ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి బాధ్యతలు   చేపట్టారు.
ఒకప్పుడు ఈ ప్రాచీన భాషా హోదాలు,  దాని వల్ల ప్రత్యేక కేటాయింపులుగా నిధులు, వనరులు, వసతులు  అందుబాటులో లేవు. ఇవాళ ఇవి ఏర్పడ్డాక, మన తెలుగు సాహిత్య, విద్యావంత సమాజం తగు లక్ష్యాలను ఏర్పరచుకుని ఈ సంస్థల ద్వారా నిధులు పొంది, తగు కృషి చేయగలిగిన మంచి సందర్భం ఇది. ఇందుకై  మనం ఒక బృహత్ ప్రణాళిక గా ఈ వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు ప్రాజెక్టును ఈ సంస్థల ఆమోదం తో, పలు విశ్వవిద్యాలయాలలోఆయా శాఖల ద్వారా, తదితర సాహిత్య రంగ పరిశోధకులకు  గ్రాంటులు గా నిధులు కేటాయింపులు పొందడం ద్వారా   పెద్ద యెత్తున  మొదలు పెట్టాలిసిన అవసరం, సందర్భం  కూడా ఇప్పుడు ఉన్నాయి.

94917_bapusignature_logo_jpg
ఈ బృహత్కోశం పని మూడు భాగాలుగా మూడు దశలలో జరగవలిసి వుంటుంది. ప్రతీ కవి తన రచనలో భాగం గా  ఎన్నో కొన్ని ( కొద్దిగానో, ఎక్కువ గానో) తెలుగు పదాలను వాడి వుంటాడు అనేది ఒక స్పష్టమైన అంశం.  ఆ పదాలు ఆనాటి సమాజంలో వాడుకలో వుండడానికి ఎన్నో కారణాలు వుంటాయి. ఈ వెయ్యేళ్ళ  కాలాన్ని,  తలా వంద ఏళ్లుగా కాల విభజనలు చేసి కవి పరంగా, కావ్య పరంగా ఈ తెలుగు మాటలు ఎలా కాల ప్రవాహంలో సాహిత్య రూపేణా నమోదు అవుతూ వచ్చాయో గమనిస్తూ పరిశీలనలు, పరిశోధనలు చేయడం ఒక భాగం కావాలి.
ఈ పది శతాబ్దాల తెలుగు భాషా వికాస స్వరూపం గురించి ఒక ప్రాధమిక రూపం ఏర్పాడ్డాక, ఆయా కావ్యాలు , కవుల కాలపు రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎలా ఈ రచనలలోని  పై లేదా కవుల పై పడ్డదో ఒక ప్రత్యేక కృషి గా రెండో దశలో మరో పది విభాగాలు గా విస్తార అధ్యయనాలు జరగాలి.
చివరి భాగం గా ప్రతి కవి, కావ్యం పరంగా  తెలుగు భాషకు తన కాలంలో తన రచనలలో పొందు పరుస్తూ  వచ్చిన  తెలుగు ఆచ్చిక పదాల జాబితా ( ఆఛ్చిక పద కోశం), ఆయా పదాలు తెలుగు భాష లోకి వచ్చి చేరిన క్రమం గురించి  వివరణలు కూడా చేరిస్తే ఇదొక సమగ్ర భాషా వికాస స్వరూప గ్రంధంగా తెలుగు వారం తయారు
చేసుకోగలుగుతాము.
కన్నడ దేశంలో ఇన్ఫోసిస్ సంస్థ  కు చెందిన నారాయణమూర్తి గారు  “ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా” పేరిట భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని అనువాద ప్రచురణలు గా  తీసుకొచ్చే  ముఖ్యమైన పనిని అంతర్జాతీయ స్థాయిలో చేపట్టారు. ఒక పేజీ లో మూల రచనా పక్క పేజీలో అనువాదం ప్రచురించడం పధ్ధతి గా అనేకమంది మన దేశ, విదేశాల పండితులు భారతీయ సంస్కృతి సాహిత్య రంగాలలో కృషి చేసే వారు ఈ అనువాదాలు, ప్రచురణల ఖరారు చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.    మనం కూడా ఇవాళ ప్రభుత్వ శాఖలు, రాష్ట్రంలో గల అనేక మండి వ్యక్తులు, సంస్థలు, రామోజీ ఫౌండేషన్ వంటి ఉన్నత వేదికలు అందరం కలిసి, మన వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు,  ప్రాజెక్టు కు కొన్నియేళ్ళు పట్టినా సరే ఇప్పుడే ప్రణాళికా బద్ధంగా  సంకల్పించడం అవసరం.
దీనికి తగిన ఒక ప్రాధమిక అవగాహనా సదస్సు విశాఖపట్నంలో నిర్వహించడం ఒక ప్రతిపాదన. ఇందుకు తగిన పూర్వ భూమిక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వున్నది. 1931 లో పండిత రాధాకృష్ణన్  ప్రారంభించిన తెలుగు శాఖ , రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో కెల్లా మొదట గా ఏర్పడ్డది. ఆచార్య తోమాటి దొణప్ప, బూదరాజు రాధాకృష్ణ  ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు , ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్ధులే. దొణప్ప ఆరంభించిన
ప్రాజెక్టును ఆచార్య లకంసాని చక్రధరరావు ఒక్కచేత్తో, పూర్తిచేసి  ఏడు భాగాల  తెలుగు పదాల  వ్యుత్పత్తి కోశాన్ని జాతికి అందించారు.
కేంద్ర ప్రభుత్వ భాషాభివృద్ధి సంఘంలో సభ్యులు గా వున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, మన ప్రాతిపదికల మేరకు తీసుకునే చొరవ ఫలించి , మైసూరు లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆమోద, సహాయ సహకారాలు మన ప్రాజెక్టుకు  లభించి , రాష్ట్రంలోని ఇతర పెద్దలు,  ఫౌండేషన్ల పూనిక తో, ఇప్పుడు తెలుగు భాషకు ఒక మంత్రిత్వ శాఖ ను కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపధ్యంలో  మనం స్పష్టమైన లక్ష్యాలతో, ఒక కార్యాచరణ పత్రంతో,  చైతన్యవంతమైన సాహిత్య  సాంస్కృతిక సమాజం గా  ముందడుగు వేయవలసిన తరుణం ఇది అని గుర్తు చేస్తూ, ఇందుకు అందరు పెద్దల నుంచి ఈ ప్రాజెక్టు సుసాధ్యమయే దిశలో ఆచరణాత్మకమైన సలహాలు, సహాయాలు, మార్గ దర్శకాలు లభిస్తాయని ఆశిస్తున్నాను.

-రామతీర్థ

చాసో తన కథలకు తానే కరకు విమర్శకుడు: చాగంటి తులసి

tulasi 4

చాగంటి తులసి గారితో సంభాషిస్తున్న రామతీర్థ

తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి అంటే ‘చాసో’ కూతురు మాత్రమే కాదు. చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తులసి తనదయిన వేరే దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచనా ఆమె విశిష్ట వ్యకిత్వానికి అద్దం పడతాయి. తులసి గారితో ఈ అపురూపమయిన కాఫీ సమయం…

 

మధ్యాహ్నం మూడు గంటలు.

ముందస్తుగా ” మీ ఇంటికి మేం వస్తున్నామండోయ్! ” అంటూ చెప్పేం కదా, తులసిగారు మాకోసం వీధి తలుపులు బార్లా తీసి ఎదురు చూస్తున్నారు.

“నమస్కారం రండి. మీకోసమే ఎదురు చూస్తున్నా,” అంటూ లోపలికి ఆహ్వానించారు.

పెద్ద హాలు. హాలు మధ్య ఉయ్యాల బల్ల. గోడలకి ఆనుకొని పాతకాలపు టేకు బీరువాలు. చేతుల్లేని టేకు కుర్చీలు. టేకు

గుండ్రబ్బల్ల. పొడుగు చేతుల టేకు బెత్తు పడక్కుర్చీ. గోడలకు గురజాడ, చాసో తదితరుల ఫోటోలు. అంతా పాతపాతగా.

“మీ హాలు ఆధునికంగా లేదే!” అన్నా.

“పాతకొత్తల మేలు కలయిక!” అంటూ హాలుకి ఓ గోడ పొడవునా ఉన్న షోకేసు వైపు చూపిస్తూ ఆవిడ నవ్వేరు.

“అవునవును. ఇదా గురజాడ విజయనగరం. మీరా గురజాడ వారసుడు చాసోగారి  అమ్మాయీ , వారసురాలునూ..!”
మాటలోంచి మాట నా నోట వచ్చింది.

“కాదా మరి! నేను పెరిగిందే పాత కొత్తల మేలు కలయికతో!”

నవ్వులతో మొదలయింది మా సాక్షాత్కారం!!

“మరి అలా ఎలా పెరిగారో చెపుతారా?” అంటూ  నా ప్రశ్నలూ మొదలయ్యాయి.

“నట్టిల్లూ వంటిల్లు పాతవి. సావిడీ నాన్న గది కొత్తవి. బామ్మ, అమ్మ నట్టింటి, వంటింటి వారు. పూజలు  పునస్కారాలు,  పండగలూ పబ్బాలు, సంప్రదాయ వంటలూ శివపూజలు, మనోనైవేద్యాలు! నాన్న, నారాయణ బాబూ, పాటలూ పద్యాలు,  ఫ్రెంచి కవితా గానాలు, కథలూ కబుర్లు, కవిత్వం కొత్త పుస్తకాలు, చర్చలు వాదనలు! చిన్నాజీ కథ నా చిన్నతనం.
“తెలుసు  తెలుసు! చాసో మీ మీద ‘చిన్నాజీ’ కథ రాస్తే, నారాయణబాబు “చిన్నా! అన్న గేయం రాసారు!” అన్నాను.

“చాసో, చాసో స్నేహితులూ గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు, గొప్పవారు అన్న స్పృహ లేకుండా వారి మధ్య వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగాను. అంతే సహజంగా అమ్మా బామ్మల సంప్రదాయ సంస్కారాల ఉత్తమ నడవడికలతో ఎదిగాను. ఆ పెంపకం ఆవురావురమని ఆకలితో అన్నం తిన్నట్టే, ఆవురావురమంటూ చదవడం  అలవర్చింది. నా నిర్ణయాలు నేను చేసుకునే విధంగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇచ్చింది. తీపి చేదుల తలివిడినీ, నలుపు తెలుపుల ఎరుకను కలిగించింది. పైకి కనపడే రంగుడంగులను కాదు. లోపలి గుణాలను గుర్తించడం నేర్పింది. టెనాసిటీని, జోష్‌నీ, జిందాదిలీని ఇచ్చింది. ఆ పెంపకం ఇప్పటి నన్నును నన్నుగా తీర్చి దిద్దింది !!

Q“సాహిత్య ప్రక్రియల్లో మీకు ఏ ప్రక్రియ అంటే ఎక్కువ ఇష్టం?”

“కథంటేనే చెవి కోసుకుంటాను. అన్ని ప్రక్రియల సాహిత్యాన్నీ చదువుతాను.”

Qచాసో తక్కువ సంఖ్యలో కథల్ని ఇచ్చారు. పాత సంకలనాన్ని ఆరో ముద్రణగా తిరిగి ఇటీవలే విశాలాంధ్రవారు వేసారు. ఆ సంకలనంలోకి రాని కథలు ఇంకా ఏమన్నా ఉన్నాయా?”

“చాసో తన కథలకు తానే కరకు విమర్శకుడు. ఏ కథలైతే తనకు తానుగా పెట్టుకున్న గీటురాయికి నిల్చాయో వాటినే సాహిత్య జగత్తుకు ఇచ్చాడు. అదీకాక, తాను కథ రాసే రచనా విధానం కూడా విరివినీ, నిడివిని పెంచేది కాదు. ఢంకా, వినోదిని, వందేమాతరం, ఆంధ్రజ్యోతి, అభిసారిక,  జ్యోతి పత్రికల్లో అచ్చయి  నాకు లభ్యమయిన కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలు సంకలనంలో లేవు.

‘ఆఁవెఁత’ అన్న కథను ఆ సంకలనంలో వేసుకుందామని ఎంత ప్రయత్నించినా ఆ కథ చాసోకు దొరకలేదు. దానిని రాంషా తన అభిసారిక పత్రికలో ఆ మాండలికపు పేరు పాఠకులకు అర్ధం కాదనుకున్నాడో ఏమో, దానిని “విందు” అన్న పేరుతో అచ్చు వేసాడు. పేరు మారిపోవడంతో “ఆఁవెఁత” కోసం ఎంత వెతికినా, చాసోకు తన కథలు తానే జాగ్రత్త పెట్టుకునే లక్షణం తక్కువైన కారణం చేత. తాను బతికి ఉండగా ” ఆఁవెఁత”  దొరకలేదు. చాసో కన్ను మూసాక భరాగో రాంషాగారి అబ్బాయి ద్వారా ‘అభిసారికల’ ప్రతులన్నిటినీ తిరగా బోర్లా వేయించి ఆ కథని లోకం ఎదటకి తెచ్చాడు!!

tulasi 1

చాగంటి తులసి గారితో రామతీర్థ, జగద్ధాత్రి

‘తవ్వెడు బియ్యం’, ‘భాయి భాయి’, ‘సువార్త’ అన్న కథలన్నీ తాను వేసుకునే సంకలనంలో చాసో వేసుకోదల్చుకోలేరని అనిపిస్తోంది. ఆ కథల కాపీలు తన కాయితాల్లో ఉన్నాయి!.. ‘మట్టి’,  ‘పణుకుల వాగు’, ‘లాడ్జింగు హవుసు’, ‘పెంకుపురుగు’, ‘వఱపు’ , ‘దొరలు’ అనే కథలు ఉన్నాయి. ఇంకా ఏవన్నా ఉన్నాయేమో తెలీదు. సాహితీ మిత్రులు తవ్వి తెస్తే అచ్చయినవి ఇంకా కొన్ని దొరుకుతాయేమో.

రాంషాగారు ఉత్తరాంధ్ర మాండలిక మాట ‘ఆఁవెఁత’ అంటే ‘విందు’ అని తెలియపరుస్తూ ఆ కథని అచ్చు వేసి ఉన్నట్లయితే బాగుండి ఉండేది. కాలంతో పాటు బాషా ప్రవాహంలో కొన్ని పాత మాటలు వెనక్కి పోతాయి. కొన్ని పలుకుబడులు నిలుస్తాయి. కొన్ని కొత్తవి వచ్చి చేరతాయి. పాత పలుకుబడులకు, మాండలిక పదాలకు వివరణలు ఇవ్వాలి. వాటి సొగసును తర్వాతి తరాలవారికి అంద చెయ్యాలి. కొన్ని పలుకుబడులు తిరిగి చెలామణిలోకి రావొచ్చు.!!

Q“చాసో వాడిన అలాంటి పలుకుబడులు, మాటలు ఓ రెండింటిని చెప్తారా?”

“అవ్వాకులు చెవ్వాకులు” అనడం ఎప్పుడన్నా విన్నారా? అయినవీ కానివీ అయిన మాటలు అని దాని అర్ధం. అవ్వాకులు చెవ్వాకులు పేలుతున్నాడు అంటాం. ఇది చెరుకు పంటకు సంబంధించినది. ‘ఆగు ఆకు’ అవ్వాకు. చెరుకుకు చెరుకుగడే విత్తనం. గడకే మొలక ఉంటుంది. మొలుస్తుంది కనక అది ఆగు ఆకు. చెడు అంటే మొలవనిది. మొలకలేని గడలోని భాగం. అది చెవ్వాకు. చెవ్వాకులు పిల్లలు తింటారు. అవ్వాకుల్ని నాటుతారు. రెండింటిని కలిపి ఉపమానంగా భావించి అయినవీ కానివీ అని వాడతారు. ‘పరబ్రహ్మం’ కథలో చాసో పిచ్చివాణ్ణి పిలిచి ప్రతీవాళ్లు అవ్వాకులు చెవ్వాకులు పేలించి తిండిపెట్టేవారు అని వాడారు.

‘లేడికి పాములు’ అంటే ఏమిటో తెలుసా??  ఉత్తరాంధ్ర ప్రాంతపు మాట. ఈ పాములు పొలాల్లో పాకుతూ ఉంటాయి. పొట్టిగా ఉంటాయి. తల పైకెత్తలేవు. మట్టిని దొలుస్తూ ఉంటాయి. ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ కథలో పిల్లాణ్ని ఈర్ష్యా, దుఃఖం రెండూ రెండు లేడిక పాములై బాధిస్తున్నాయన్న సందర్భంలో వాడారు.

Qఈ మధ్య ప్రముఖ సాహితీవేత్తల సమగ్ర ప్రచురణలు వస్తున్నాయి. మరి అలాంటి ప్రయత్నం చాసో సమగ్ర సాహిత్య ప్రచురణ గురించిన ప్రస్తావన ఏమన్నా జరిగిందా?

ప్రస్తావన రావడం అయితే వచ్చింది. అయితే చాసోకూ, ఇతర రచయితలకూ పెద్ద వృత్యాసం ఉంది. చాసో రాశికన్నా వాసికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రచయిత. తాను రాసినవైనా అన్నిటినీ అచ్చుకు ఇవ్వని రచయిత. ఆయన రాసిన రచనలు రాశిలో తక్కువ.

ఏడు కథలలో ‘చిన్నాజీ’ అన్న పేరుతో తను 40ల్లో వేసుకున్న మొదటి సంకలనం లభ్యం కాలేదు.

చాసో లోకాన్ని విడిచి వెళ్ళిపోయాకే ఆయన రాసిన కవితలు ‘చాసో కవితలు’గా పుస్తక రూపంలో వచ్చాయి. నేను కవిని అని చెప్పుకోలేదు. నా ప్రారంభం కవితా రచనే అయినప్పటికీ నేను కథకుడిని అంటూ కవితలను వదిలివేసారు.

అప్పుడప్పుడు ఎవరెవరో అడగగా తను రాసిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి.

తన నమ్మకాలు, తన దృక్పథం, తాత్వికత గురించి, తన కథల గురించి వివిధ పత్రికలకూ, ఆకాశవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి.

తన స్నేహితులూ, అరసం, తదితర విషయాల గురించి తను చెప్పగా రామినాయుడు రికార్డు చేసినవి ఉన్నాయి.

పండిత అయల సోమయాజుల నరసింహ శర్మగారూ, నేను సిద్ధపరిచిన చాసో కథల మాండలిక పద వివరణలు ఉన్నాయి.

శ్రీ ద్వారం దుర్గాప్రసాద్‌రావుగారు రచించిన చాసో కథల్లోని సంగీత సంబంధమైన పదాల వివరణలు ఉన్నాయి.

విజయనగరం రాఘవ మెమోరియల్ నాటక పోటీల్లో ఉత్తమ రచనగా పురస్కారం అందుకున్న చాసో నాటిక ‘మెరుగు’ ఉంది.

చాసో శతజయంతి సంవత్సరం 2014 – 2015 లో వీటన్నిటిని కలిపి పుస్తక రూపంలో తేవలసి ఉంది. అయినా మిగతా రచయితల పుస్తకాల్లాగ ఇది బృహత్ గ్రంధం  అవుతుందని నేను అనుకోవడం లేదు.