మార్పుని ఆహ్వానించాలి: జానకీ బాల

janaki1

ప్రతి నెలా లేఖినీ  మహిళా చైతన్య సాహితీ, సాంస్కృతిక సంస్థ  జరుపుకునే ముఖాముఖి సమావేశంలో భాగంగా లేఖిని సభ్యులు  అక్టోబర్ రెండున  సమావేశమయ్యారు. ఆ రోజు కలిశాను   ఇంద్రగంటి జానకీ బాలగారిని!

జానకీ బాల  ‘కనిపించే గతం’ నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం అందుకున్నారు.

మొదటగా మీ బాల్యం,గురించి చెప్పండి

1945  డిసెంబర్ నాలుగున  రాజమండ్రి లో పుట్టాను.  కానీ  ఆ తరువాత  బాల్యం అంతా  తణుకులో   గడిపాను. నా పుట్టిన రోజున  ఇద్దరు మహా గాయకులైన ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ పుట్టారని  చాలా గొప్పగా అనిపిస్తుంది.

సమాజం లో ఒక ఉన్నత వర్గం లో పుట్టినప్పటికి చాల దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చింది. మా అమ్మగారు సూరి లక్ష్మినరసమాంబ గారు  రచయిత్రి కూడా . ఆ నాటి  పరిస్థితిల  దృష్ట్యా  ఆవిడ  తన రచనలను కొన్ని ప్రచురించినప్పటికీ  తరువాత అజ్ఞాతంగానే ఉండిపోయారు  ఆవిడ నాకు తల్లిగానే కాకుండా సంగీతం నేర్పిన గురువు గారు కూడా, నా స్కూల్ ఫీజులు కట్టిన గుఱ్ఱాల శకుంతల గారిని  ఈ సందర్భంగా  నన్ను చదువుకోమని ప్రోత్సహించి,  స్మరించుకోవాలి. సాయం చేసే చేతులకు కులమతాలు అడ్డు రావు.  ఆ తరువాత  నేను ఆమె ఋణం తీర్చేసాను.అది వేరే సంగతి.

మీ మీద ప్రభావం చూపించన రచయితలు

ఒక్కరని చెప్పలేను  ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు,బుచ్చిబాబు గారు, మల్లాది వారే కాదు ఇంకా ఎందరో ఉన్నారు,అలాగే  రంగనాయకమ్మ గారి రచనలు  నాకు అత్యంత  ఇష్టమైనవి నచ్చినవి.

మీరు కవయిత్రి కదా? దానికి ప్రేరణ ఎవరు?

స్కూల్ లో ఉన్నప్పుడే  చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. నాకు కవిత్వం మీద ఇష్టం కలగటానికి గల కారణం  ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. వారు స్కూల్ లో జరిగే పోటీలకి జడ్జీగా వచ్చేవారు.  ఆయన అప్పటికే గొప్ప కవి,కానీ ఒక విధమైన  అమాయకత్వంతో నేను రాసిన  కవితలు చదవండి అంటూ ఆయనకి చూపించేదాన్ని. ఆయన  నా కవితలు చదివి ఎంతో ప్రోత్సహించేవారు. భవిష్యత్తులో చక్కటి కవయిత్రివి అవుతావని అనేవారు.

మీ మొట్ట మొదటి కధ ఎప్పుడు రాసారు ఆ వివరాలు తెలపండి

అంటే జగతి పత్రికలో ఓ  రెండు స్కెచ్ లు రాసాను.  ఆ తరువాత 1970 లో మనిషికి మరో మలుపు  అనే కధ  ఆంధ్రపత్రికకి రాసాను.ఆ కధ ప్రచురించబడినప్పుడు ఏదో సాధించినట్లు ఆనందపడిపోయాను. ఈ నలబై ఏళ్ళ కాలం లో దాదాపుగా 130 కధలు రాసాను. మొదటి కధా సంకలనం 1980 లో వేసాను. మొత్తం ఆరు సంకలనాలు వచ్చాయి. అవన్నీ కలిపి జానకీబాల కధలుగా 2013 లో ఒక బృహత్’సంకలనంగా వచ్చింది.

మీరు విలక్షణ మైన కొన్ని  రచనలు చేసారు  దాని గురించిన వివరాలు పంచుకుంటారా?

‘కొమ్మాకొమ్మా కోకిలమ్మా’ అని సినీ నేపధ్య గాయనీమణుల అంతరంగాలను ఆవిష్కరించే దిశగా  ఒక్కో గాయనిమణిని  కలిసి వాళ్ళ అనుభవాలను  అక్షరబద్ధం చేశాను. నా అదృష్టం కొంత మంది  ప్రఖ్యాత గాయనీ మణులను కలిసే అవకాశం  అస్మిత ఫౌండర్  వోల్గా ద్వారా కలిగింది. ముఖ్యంగా, పి.శాంతకుమారి, పి.భానుమతి. పి.లీల, జిక్కిలని  కలవడం  వారి అనుభవాలను వారి ముఖతాః  వినడం జరిగింది.  అలాగే  రావు బాలసరస్వతి, సుశీల,జానకి  గార్లను  కలిసి  వారి అనుభవాలను  కూడా రాసాను.

ఇక్కడ ఇంకో  విషయం నేను పాటలు పాడుతానని తెలిసి  మా తణుకులో ఉండే పి సుశీల వదినగారు రాయసం రాజ్యలక్ష్మి గారి ద్వారా  రెండేళ్లు సుశీలగారి దగ్గర మద్రాసులో ఉన్నాను. అప్పటికింకా నేను చాలా చిన్నదాన్ని.  యశస్విని :సినీ నటి,గాయనీ పి.భానుమతి గారి బయోగ్రఫీ, మార్గదర్శి  దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర, సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి కూడా పుస్తకాలు రాసాను.

janaki2

మీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు మీ వివాహం ఆ వివరాలు చెప్పండి.

తప్పకుండా! తణుకు లో శ్రీకాంతశర్మగారి అన్నగారు ఉండేవారు. వారు మాకు దూరపు బందువులే. ఆ కారణంగా వారు వచ్చిపోతూఉండేవారు. వారి తో పాటు శ్రీకాంతశర్మగారు కూడా వచ్చేవారు. అప్పట్లో పుస్తకాలు చదవడం, వాటిని గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉండేది. శ్రీకాంతశర్మగారు మనం పెళ్లి చేసుకుందామా అన్నారు. అలా మా పెళ్లి జరిగిపోయింది.

మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి కిరణ్మయి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, అబ్బాయి మోహన్ కృష్ణ అచ్చమైన తెలుగుదనానికి అద్దంపట్టే  చిత్రాలు తీస్తున్నాడు.

మీ కధా రచనలకు ప్రేరణ?

ఇంట్లో ఎక్కువ సాహిత్య వాతావరణం ఉండటం వల్ల రాయగలిగే అవకాశం లబించింది. పెళ్లి  తరువాత ఆర్టీసీలో  ఉద్యోగినిగా అకౌంట్స్ డిపార్టుమెంటులో అంకెలతో సావాసం చేస్తూ  అక్షరాలతో రచనలు చేసేదాన్ని, ఆంధ్రజ్యోతి లో శ్రీకాంత్ శర్మగారు ఉద్యోగం విజయవాడలో  జీవితం ఆరంభం. శ్రీకాంత్ శర్మగారు నా కధలు చదివి సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారు.

ఎక్కువగా ఎవరినీ ప్రశంసించని నండూరి  రామ్మోహన్ రావు గారు నువ్వు కధలు బాగా రాస్తావమ్మా! అనడం, అలాగే వాకాటి పాండురంగారావు గారు లాంటి మహానుభావులు నా కధని మెచ్చుకోవడం నిజంగా ఆనందంగా, సంతోషంగా  అనిపించింది.

మీ నవలల గురించి?

పన్నెండు నవలలు రాసాను. కాకపోతే నాకు  వీక్లీ సీరియల్ రచయిత్రిగా నాకు పేరు రాలేదు. అందుకు బాధ లేదు. నా నవలలు అన్ని కూడా డైలీ సేరియల్స్ గా వచ్చేవి.

చివరగా మీ మాటలు?

రచనలు చేసేటప్పుడు, ప్రాక్టికల్ ప్రొబ్లెంస్ ని గురించి  రచనలు రావాలి. ఆదర్శాలు,మానవత్వం,నీతులు లాంటివి  వట్టి  పేలవమైన పదాలే

అదే విధంగా పూజలు, వ్రతాలూనోముల పట్ల ఆసక్తి లేదు, దేవుడంటే కనిపించని ఒక శక్తి నడిపిస్తోందని నమ్ముతాను.

కొన్ని సార్లు మనలని మనం మార్చుకుంటూ, అంటే ముందు ఒక విధంగా ఉన్న కొన్ని అనుభవాల దృష్ట్యా  మార్పు తప్పనిసరి అవుతుంది. అప్పుడు అలా అన్నావు? ఇప్పుడు ఇలా మారిపోయా వేమిటీ? అనే వారు గమనించవలసిన విషయం, కొన్ని అనుభవాలు జీవితపు దిశను మార్చేస్తాయి కాబట్టి వాటి తో పాటు సాగి పోవలసినదే!

మంచి రచన, చెడ్డ రచన అనేవి లేవు. అది మనం  రిసీవ్ చేస్కోవడంలో ఉంది.

అన్నింటికంటే చాల ముఖ్యమైన విషయం పుస్తకపఠనం అనేది అన్ని వయసుల వారికీ మంచిది. అందుమూలంగా ఆలోచనా శక్తి పెరుగుతుంది.

ఒక లలిత గీతం పాడి  ముగిస్తాను

“రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో..చల్లినారమ్మా… వెన్నెల చల్లినారమ్మా..!
కరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా   మరిగే రాధ మనసూ పైన తరక తరకలుగా
ఎవరో పరచినారమ్మ… వెన్నెల పరచినారమ్మా..!! కడమి తోపుల నడిమీ బారుల
ఇసుక బైళుల మిసిమీ దారుల  రాసి రాసులుగా…రాసి రాసులుగా…
ఎవరో…పోసినారమ్మా.. వెన్నెల పోసినారమ్మా”

అంటూ మధురమైన గొంతు తో అతి మధురంగా పాడిన కృష్ణశాస్త్రి గీతం  పట్ట పగలే వెన్నెల జల్లులు కురిపించింది

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తెలిసిన కథే నవల అయితే…!

 

-మణి వడ్లమాని

~

 

“అబ్బా! భారతం విప్పకు ,లేదా చేట భారతం చెప్పకు. తొందరగా అసలు సంగతి చెప్పు”  లాంటి  మాటలు మనం  సాధారణంగా వింటూ ఉంటాము. అంటే ఒక విషయం గురించి చెబుతూ మరో దానిలోకి వెళ్ళిపోవడం,లేదా దానికి అనుబంధమైన విషయం మాట్లాడటం వల్ల  మూల విషయం లోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి.

కానీ అదే సరాసరి మూల విషయం లో నేరుగా  వెళితే? అవును, అదే వ్యాసమహర్షి రాసిన కావ్యం ‘జయేతిహాసమ్’  24 వేల శ్లోకాల భారతం, లక్షశ్లోకాలకు మించి మహాభారతం అయింది.

మూల కధ జయమ్ ని ఉపాఖ్యానానలు లేకుండా రచయత నాయుని కృష్ణమూర్తి   నవలా రూపంగా వ్యావహారికంగా,ఆధునిక దృక్పథం తో  రాసారు .

జయమ్ ఒక ఇతిహాసం. ఇది నిజంగా జరిగింది అని చరిత్ర కారులు విశ్వసించారు. ఆ నాడు  వ్యాసుడు జీవించిన కాలం లోని వారె పాండవులు,కౌరవులు  వారి మధ్య జరిగిన ఘర్షణ ఒక మహా యుద్ధానికి దారి తీసింది. తన కళ్ళముందే తన వాళ్ళందరూ సర్వ నాశనమవడం తో వ్యాసుడు క్షోబతో  ఆ పరిస్థితి రావడానికి గల కారణాలను వివరిస్తూ  జయమ్ అనే కావ్య  రచన చేసాడు.

రచయత  మాటలలో:

అయితే ఈ కావ్యం ఎక్కడా విడిగా లేదని  వ్యాసుని తరువాత ఈ కావ్యాన్ని జనమేజయుడికి  వైశంపాయనుడు కొన్ని వివరణలు,పూర్వకధలు చరిత్రలు చేర్చి భారతంగా మార్చాడని లక్ష శ్లోకాలకు పైగా ఉన్న మహా భారతం లో నే ఈ  8800 శ్లోకాలతో ఉన్న  జయమ్ ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని వేల సంవత్సరాలనుంచి పౌరాణికులు భారతాన్ని పెంచి చెబుతున్నారు కాని అసలు మూలకధ  ఏమయి ఉంటుంది అన్న  ఆలోచన చేయలేదు.

1883- 1894  లో ఒక స్కాండేవియన్ సాహిత్య వేత్త సోరెన్-సోరన్ సన్ మహా భారతం నుండి మూల కధను వేరు చేసే ప్రయత్నం మొదలు పెట్టాడు. లక్ష శ్లోకాలనుండి 27 వేల శ్లోకాలు వేరు చేసి  ఆ క్రమం లో దాన్ని 7-8  వేలకు తగ్గించే సమయం లో ఆయన మరణించాడు.  ఆ తరువాత 80 ఏళ్ళకి గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అహమ్మదాబాదు బ్రాంచి  గౌరవ డైరెక్టర్  ప్రొఫెసర్ కే కే .శాస్త్రి ఒంటరిగానే మహాభారతం నుండి విజయవంతంగా 8801 సంస్కృత శ్లోకాలతో  ‘ జయమ్’ ని వేరు చేసారు. తరువాత గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు  దాన్ని ‘జయసంహిత’ గ ప్రచురించారు.

జయమ్ ను యధాతధంగా కాకుండా నవలా రూపంలో రాయాలని అనుకున్న ఉద్దేశ్యం ఇలా జరిగి ఉంటుందని ఊహించి రాసే అవకాశం కొంత స్వేచ్ఛ లబిస్తాయని.

ఇక నవల లోకి వెళితే:

తింటే గారెలే తినాలి,వెంటే  మహాభారతమే వినాలి. ఒక వేళ ఇది కల్పన అయితే మహా గొప్ప గ్రంధం, నిజం అనుకుంటే భలే అద్భుతం. మనం కూడా టైం మెషిన్ లో ఆ కాలానికి  వెళ్లి ఆ పాత్రలను చూసి కలిస్తే! అప్పుడు  అది మహాద్భుతం.

jayam

ఇక కధ మొదలు  కురుదేశపు వర్ణన తో  మొదలవుతుంది. శంతనుడికి సత్యవతికిపుట్టిన కొడుకులు చిత్రాంగదుడు,విచిత్రవీర్యుడు. వీరిద్దరూ సంతానహీనులుగా మరణించటం వల్ల వంశం  అంతరించి పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సత్యవతి తనకి పెళ్లి కాకుండా పుట్టిన కొడుకు కృష్ణద్వైపాయనుడుని పిలిచి దేవర న్యాయం ప్రకారం  తన  కోడళ్ళ కి సంతానం కలిగేలా చేసింది  ఈ కృష్ణద్వైపాయనుడే వ్యాస మహర్షి గ ప్రసిద్ధి కెక్కాడు.

వ్యాసుడు చూస్తూ ఉండగానే అందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. అన్నదమ్ముల మధ్య  రాజ్యం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసే పరిస్థితి కి  ఏర్పడుతుంది.అందువల్ల వంశం నాశనం అవుతుందని వ్యాసునికి తెలిసినా  ఎవరూ అతని మాట వినలేదు. తన మూలంగా ఏర్పడిన కురువంశం తన కళ్ళముందే సర్వ నాశనం అవడం వ్యాసునికి క్షోభ కలిగించింది.

దాయాదుల మధ్య వైరం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ  ఏ విధంగా వినాశనానికి దారితీసిందో ఆ  చరిత్రనే  కావ్య రూపంగా తేవాలన్న ఆలోచన వచ్చింది.

మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడేళ్లు కాలం లో  దీక్షతో ఈ కావ్యాన్ని రచించాడు.

“రెండుకుటుంబాల మద్య జరిగిన ఇతివృత్తం. పాండురాజు మరణం తరువాత అడవుల్లోనుండికుంతీదేవి పాండవులను వెంట బెట్టుకొని హస్తినకు రావడం తో మొదలయ్యి కౌరవ పాండవుల మధ్య జరిగిన మహా భారత  యుద్ధం చివరి రోజు రాత్రి  అశ్వద్ధామ నిద్రపోతున్న ఉపపాండవులని చంపడం తో కధ పూర్తవుతుంది.”

ముగింపు :

గంగా నది లో తర్పణాలు వదిలి శోకం తో కుమిలిపోతున్న ధర్మరాజు తో అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు అంటాడు “ నువ్వు ఇప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు.అర్ధం లేకుండా  వందమంది .కొడుకులని, మనవలన్ని పోగొట్టుకున్న నేను గాంధారి ఏడవాలి ‘అంటాడు. పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు  ధర్మరాజుకి చేయి అందిస్తూ “పోయిన వాళ్ళను నువ్వు ఎలాగూ చూడలేవు.జరగాల్సినది జరిగింది. అంతా విధి నిర్ణయం. తెలివిలేనివాడిలా ఏడవకు” అంటాడు.

ధర్మరాజు హస్తినలోకి అడుగు పెట్టగానే వృద్ధులు,స్త్రీలు,పిల్లలు చావగా మిగిలిన సేనలు జయమ్, జయమ్ అని అంటారు.

అది విన్న ధర్మరాజు  పెదవులు కూడా  ఆ పదానికి అర్ధం వెతుకుతున్నట్లు  జ…య…మ్ అని గొణిగాయి.

ఇక్కడ తో నవల ముగుస్తుంది

తెలిసిన కధనే నవలా రూపంగా చదవటం  కొత్తదనంగా  బావుంది. సరళమయిన బాషతో చదువుతున్నంత సేపు చాల  ఆసక్తి కరంగా ఉంది.

కొన్ని గుర్తుంచు కో దగ్గ  వాక్యాలు:

  • ఎవరు యెంత చేర్చినా కొన్నివేల సంవత్సరాల బాటు భారతం నిలబడింది అంటే అది ఆ కధ గొప్పదనం. మూల కధలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు.
  • నాగరికత ఒక స్రవంతి.పుట్టినప్పుడు చిన్న చెలమ. కాలం గడిచిన కొద్దీఎన్నో జ్ఞాన,అ జ్ఞానప్రవాహాలు ఏకమై చెలమలో చేరి ఉంటాయి. చెలమ ఏరుగా సాగి నదిగా మారి తన వేగాన్ని విస్తృతిని పెంచుకొని ఉంటుంది.
  • ఉరుములు మెరుపులు,వర్షాలు,వరదలు,ఎండలు సుడిగాలులు,పెనుతుఫానులు మానవుణ్ణి అయోమయ స్థితి లో పడ వేశాయి. పైన ఆకాశం లో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారని నమ్మారు.
  • భయం భగవంతుడిని పుట్టించింది
  • ప్రాణికోటికి మేలు జరగడానికి చెప్పబడిన అసత్యం సత్యం కంటే గొప్పది. కీడు కలిగించే సత్యం అసత్యం తో సమానం.
  • భారతం లో ఉన్నది ఇంకెక్కడయినా ఉంటుంది. భారతం లో లేనిది ఎక్కడా ఉండదు

***

“రండర్రా, పిల్లలూ, మీకు సినిమా చూపిస్తా!”

 

మణి వడ్లమాని 

 

Mani Vadlamaniఈ ప్రపంచంలో కష్టాలు కన్నీళ్ళే కాదు సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులు కూడా ఉంటాయి. అని హాస్యం, నవ్వు గురుంచి ఎందరో పెద్దవాళ్లు చెప్పిన మాటలు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి రచనలలో మనకి  పుష్కలంగా కనిపిస్తాయి అలాంటిదే మరో హాస్యపుగుళిక స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది  సినిమా తియ్యండి!. అంటూ నవ్వుల గని  శ్రీమతి పొత్తూరివిజయలక్ష్మి గారు రాసిన పెద్ద కధ . “మొదటి కధ  అయినా గాని ఉత్తరాల ద్వారా ఎన్నో ప్రశంసల అందుకున్నాను.  అది పెద్ద హిట్ అని” తన ముందు మాటలో పేర్కొన్నారు రచయిత్రి-

“రండర్రా, పిల్లలూ, మీకు సినిమా చూపిస్తా!” అని మన అక్కో పిన్నో, అత్తో మనలని పిలచినట్లుగా, విజయలక్ష్మి గారు మనందరికీ స్క్రిప్ట్ తోనే సినిమా చూపిస్తున్నారు..  ఒట్టండి.. నమ్మండి… తప్పకుండా చూడండి… కాదు కాదు చదవండి…. నవ్వి నవ్వి  డొక్కలు ఎగిరేలా, కళ్ళవెంబడి నీళ్ళు కారుతూ, ఇక చాలు బాబోయి అని మీరు అనక పోతే చూడండి. చెప్పదలచిన విషయాన్ని సున్నితంగా, సరసంగా, ఆకర్షణీయంగా చెప్పడానికి హాస్యం  పయోగపడుతుంది.

అందువల్లే హాస్య ప్రధాన రచనలు అనేకం, ఎప్పటి నుండో ఎందరో రాస్తున్నారు.  ఆ ఎందరి లోనో మణి పూస వంటి  పొత్తూరి విజయలక్ష్మి గారుకూడా ఉన్నారు. అందుకే ఆవిడ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హాస్య రచయిత్రి.

విజయలక్ష్మి  గారు ఈ కధని  1982 లో  ఆంధ్రప్రభ  కి  రాసారు.ఇది ఆవిడ తొలి రచన.  అయితే  ఈ కధను  “జయంతి” అన్న కలం పేరు తో వ్రాసారు.  తొలి సంతానాన్నిచూసుకున్నప్పుడు  తల్లి పొందే ఆనందానికి ఎలా కొలమానం ఉండదో తొలి కధను అచ్చులో చూసుకున్నప్పుడు అదే భావం. అది ఒక మరపురాని మధురానుభూతి” అని అంటారు ఆమె.

pothuri

ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వసుంధర  ఇలా అన్నారు “నేటి చిత్రాల ప్రేరణతో సంపూర్ణేష్ బాబు ఒక్క రోజు లో స్టార్ అయిపోయాడు. ఇదే తరహాలో ఆప్పట్లో మీడియా ఉండి ఉంటే అప్పుడే శ్రీమతి విజయలక్ష్మి గారు చలనచిత్ర రంగం లో స్క్రిప్ట్ రచనలో మెగాస్టార్ అయ్యి ఉండేవారు”

వసుంధర గారు అన్నట్లు  పొత్తూరి విజయ లక్ష్మి గారు మన తెలుగు సినిమా వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చినా ఆ కధ వైపు కన్నేస్తే ఒట్టు. ఎందుకంటారా?  ఎంతటి కధా వస్తువునైనా మార్చి సినిమా కధ గా మలచ గలిగే శక్తి ఉన్న మహామహులు కూడా   ఎందుకో నిర్లిప్తత వహించారు.  కారణం  ఆ స్క్రిప్ట్  లో మార్చడానికి  ఏవి లేదు కనుక, మార్చే  అలవాటు ఉన్న వాళ్ళు కావడం  చేత సినిమాని యదాతధంగా తీసే ప్రయత్నం చేయలేదు అనుకోవాలి.

ఇక  సీనియర్  రచయత  కవనశర్మ గారు “ ఈవిడ ఒక మేధావి, ఈ పుస్తకం పూర్తి చేసేసరికి మీరు(పాఠకుల) కూడా ఈ విషయం తెలుసుకుంటారు, నిర్మాతలకి, దర్శకులకి  శ్రేయోభిలాషి గా చాలా సలహాలిస్తారు” అని తన ముందు మాటలో రాసారు.

ఇంతకీ ఈ పెద్ద కధ లో  ఏవుంది,  మేధావులకు కూడా  అర్ధం కాని ఎన్నో గొప్ప గొప్ప చిక్కు ముడులు ఉన్న కధలు మన తెలుగు సినిమాల్లో కనిపిస్తాయి.  అలాంటి కధా లక్షణాలన్నీ అవపోశన పట్టి ఒక చక్కటి చిక్కటి సినిమా స్క్రిప్ట్  ని తయారు చేసారు.

మొదటగా సూచన పట్టిక ఇస్తారు. హీరో, హీరోయిన్  లు కాకుండా, సైడుహీరోయిన్, హీరో,     హీరోయిన్ తండ్రి, దర్శకునికి రచయిత్రి సలహా(ద.ర.స)  నిర్మాతకి రచయిత్రి సలహా(ని.ర.స).

ఇక ఇక్కడ నుంచి సినిమా (కధ)మొదలు. మొదటి  సీను లో హీరో ఓడంత  కారు లో వస్తూ ఉంటాడు . కారు అద్దాలు తో మొదలుపెట్టి  హీరో మొహం మీద దర్శకుడు పేరు తో టైటిల్సు ముగుస్తాయి.

హీరో ముందు అంతా బలాదూర్ గా ఉండి ఆడపిల్లలని వశపరచు కొంటూ ఉంటాడు.

అలా ఓ రోజున సైడ్ హీరొయిన్ని ఎత్తుకు పోతాడు. అక్కడ కొంత సేపు మెలోడ్రామా అయ్యాక  ‘నా చెల్లెలా!, అంటే   హా! అన్నయ్యా !’ అని ఇద్దరు వాటేసుకుంటారు.

ఇక హీరొయిన్ ఎంట్రన్స్ చాలా సినిమా ఫక్కీలో జరుగుతుంది. ఆమె ని విలన్ గ్యాంగ్ రేప్ చెయ్యడానికి ప్రయత్నిస్తుండగా హీరో వీరోచితంగా  పోరాడి  ఆమెని కాపాడుతాడు. అప్పుడు హీరొయిన్ కృతజ్ఞతలు ల తో పాటు తన ప్రేమ ను కూడా తెలుపుతుంది,  అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ  పుడుతుంది. ఆ పారవశ్యం  లో ఇద్దరూ ఎవరూ లేని మైదానాలదగ్గర,జలపాతాల దగ్గర ఆనందంగా పాత పాడుకుంటారు.

ఆ తరువాత అదే ప్రేమ కోసం స్వశక్తితో డబ్బు సంపాదిస్తానని, హీరొయిన్ తండ్రి తో చాలెంజ్ చేసి  ఏం పని చేయాలా అని ఆలోచించి ఒక ఇస్త్రీ దుకాణం పెట్టి మూడు సీన్లు అయ్యేసరికి కోటీశ్వరుడి గా ఎదిగి పోతాడు.

తల్లి కాని దొరికిన గుడ్డితల్లిని,  చెల్లి కాని దొరికిన చెల్లి తో ఇలా అంటాడు, “అమ్మా! చెల్లీ! నేనక్కడ అష్టైశ్వార్యాలూ, మీరు ఇలా పేదరికం అనుభవించడమా? మీరు నాతో రండి” అని తన  భవంతికి, ఓడంత  కారులో తీసుకోని వెళతాడు.

pothuri1

మధ్యలో తన చిన్న తనం లో తప్పి పోయిన తల్లి, చెల్లి ఎక్కడో లేరు  తనతో పాటు ఉంటున్న దొరికిన తల్లి, చెల్లి తన సొంత వాళ్ళే అని తెలుసుకొని చెప్పలేనంత ఆనందంతో  ఉన్న సమయం లో  విలన్ ఎంటర్  అవుతాడు.

హీరొయిన్  కూడా చాలా  స్వతంత్ర భావాలతో ఒక బిజినెస్ మొదలుపెడుతుంది. అది ఆవు, గేదల నుండి వచ్చే పేడ ద్వారా తాయారు చేసే పిడకల కంపెనీ. ఇక్కడ కూడా మూడు సీన్లు అయ్యేసరికి  హీరొయిన్  కూడా చాలా గొప్పదయిపోతుంది. తన పిడకల బిజినెస్ కి ప్రపంచం నలుమూలల నుంచి ఆదరణ రావడం తో ఎంతో పొంగిపోతుంది.

ఇలా కధ నడుస్తుండగా  ఎక్కడ పాటలు పెట్టాలో, ఎలాంటి  కాస్ట్యూమ్స్ వెయ్యాలో  బడ్జెట్ ఎలా తగ్గించుకోవాలో లాంటి విషయాలు  దర్శకుడికి, నిర్మాతకి కూడా  రచయిత్రి సలహాలు ఇచ్చారు. ఒక అడుగు ముందు వేసి రెండు మూడు పాటలు కూడా రచించారు.

ఇక సినిమా చివర్లో యధా విధిగా, హీరో కష్టాల ని అవలీలగా  ఎదుర్కొని   విలన్ గ్యాంగ్ ని మట్టు పెట్టి  విలన్ ని కొట్ట బోతుండగా,  కొన్ని కారణాలవల్ల  తప్పిపోయిన తన తమ్ముడే ఈ విలన్ అని తెలుస్తుంది. పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళతారు, విలన్ అదే హీరో తమ్ముడిని.  సోదరప్రేమతో , కోర్టులో వాదన చేసి తన తమ్ముడు చిన్నప్పుడే తప్పిపోవటం వల్ల పరిస్థితుల ప్రాబల్యం వల్ల విలన్ గా మారాడని, ఒరిజినల్  గా చాలా అమాయకుడు అని, శిక్ష కు అర్హుడు

కాదని  తామే బల్ల గుద్ది వాదించి, గెలిచి తన తమ్ముడు ని  మారిన మనిషిగా చేస్తానని, జడ్జి గారి తో హీరో చెబుతాడు.

హీరో లో ని వ్యక్తిత్వానికి, పట్టుదలకు,  ఎంతో ముగ్ధుడై  ఈ నాటి యువతరానికి ఇలాంటి వాళ్ళే ఆదర్శం అని ఆ జడ్జి కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటాడు.

చివరాఖరికి అందరూ నవ్వుతు గ్రూప్ ఫోటో తీసుకుంటారు. నవ్వుతున్న వాళ్ళ మొహాల మీద శుభం అని వస్తుంది.

సినిమాని బాక్సాఫీస్ దిశగా నడిపే కధనం తో  అడగడుగున  ఉత్కంఠ రేపే సన్నీ వేశాల తో , భారీగా కన్నీళ్ళు కార్చే బరువైన సంబాషణలతో ఆద్యంతం రక్తి కట్టిస్తూ ఉన్న ఈ కధను చూసే వాళ్ళకి, అదేనండి బాబు చదివే వాళ్ళకి ఒక ముఖ్య  సూచన,  మీరు కుర్చీలో కూర్చొని చదివేతే మీ నవ్వుల ధాటికి కుర్చీ విరగావచ్చు, సోఫాలో గనుక  చదువుతుంటే  మీ నవ్వుల అదురుకి సోఫా నట్లు లూజ్  కావచ్చు. అదే మంచం  మీద  పడుకుని చదివితే ఆ నవ్వుల బాంబు పేలి , ఆ విస్ఫోటనం లో గుండ్రం గా దొర్లుతూ కింద పడనూ వచ్చు. మీకు దెబ్బలు తగలా వచ్చు. అందుకే ఈ కధ చదివే టప్పుడు తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిక  జారి చేయడం అయింది.

ఈ సంకలనం లో వారి కధలు  మరో నాలుగు  ఉన్నాయి, మధురిమ,ముకుందం,ఆనందరావు-ఆవు మరియు అన్నపూర్ణ కి బ్రాండ్ అంబాసిడర్.

చిన్న చిన్న పదాలతో, మనం రోజూ మాట్లాడుకునే  మాటలతో  హాస్యాన్ని పండించడం  పొత్తూరి విజయలక్ష్మి గారి  మార్కు.

*

భావుకత అంచుల్లోకి ప్రయాణం..గ్లేసియర్!

మణి వడ్లమాని 

10694228_10152765337716095_4192333521636583623_oఅసలు ఏ స్త్రీ మూర్తి లో అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మాతృప్రేమ ని చవి చూస్తాం అందరం . ఆ ప్రేమకి వయసు, జాతి, కుల, మతాల తో సంభందం లేదు. అలాంటి మాతృ ప్రేమ నాకు దక్కింది. జన్మ నిచ్చి అక్షరాలు నేర్పి,విద్యా బుద్దులు నేర్పిన ది మా అమ్మగారు అయితే సాహితీ జన్మనిచ్చి , నాచేత సాహితీక్షరాభ్యాసం చేయించి,నువ్వు రాయగలవు అంటూ నన్ను వెన్ను తట్టి ప్రోత్శాహించిన డాక్టరు మంథా భానుమతి గారి కి మాతృదినోత్సవ సందర్భంగా  శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
డాక్టరు మంథా భానుమతి గారు కధలు మద్య వయసు నుంచి రాయడం మొదలుపెట్టి అనతి కాలం లోనే ప్రాచుర్యం పొందిన రచయిత్రి గా పేరు తెచ్చుకున్నారు. ఆవిడ మొదటి కథానిక 1993 ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురితం అయింది.

ఆమె రాసిన నవలలో నాకు నచ్చిన నవల గ్లేషియర్ . ఇది ఆమె మొదటి నవల , రచన మాసపత్రిక నిర్వహించిన విశ్లేషణాత్మక నవలల పోటిలో. బహుమతి వచ్చిన నవల. ఈ నవల పోటికి పంపేటప్పుడు ఆమె అనుకున్నారట బహమతి వస్తుందా,పెడుతుందా? కాకపోతే ఒక అనుభవం వస్తుంది కదా అని సాహసం చేసారుట. ఆనాటి ఆవిడ సాహసమే ఈ నాడు తెలుగు సాహితీ లోకానికి ఒక చక్కటి విశ్లేషణాత్మక పూర్వమైన నవలని అందించింది. అది అసలు ఆవిడ మొదటి రచనలా అనిపించదు. నవల సహజత్వానికి ఎంతో దగ్గర గా ఉంటుంది. మనమూ కూడా పాత్రధారులతో మమేకం అయ్యి వాళ్ళతో పాటు తెల్లటి కొండలు. వాటి మధ్య నీలం రంగు గ్లేషియర్లు. క్రింద ఆకుపచ్చని నీళ్ళల్లో తేలుతున్న తెల్లటి హిమ శకలాలు. మధ్యే మధ్యే తెల్లటి నీటి పక్షులు ఆ పైన చుట్టూ కొండలూ, అడవులూ, సరస్సులూ, జలపాతాలూ. అలా .అలస్కా అందాలను చూస్తూ వెళుతూ ఉంటాము.

వర్ణనలు చూస్తూ ఉంటె చదువుతున్న రచయిత్రిలోని భావుకతా కోణం కూడా మనకి ఆవిష్కృత మవుతుంది. నవలలో చాలా భాగం క్రూజ్ లో నడుస్తుంది. ఈ నవలలో ముఖ్యపాత్ర గ్లేషియర్ దే! దాని చుట్టురా తిరుగుతుంది కధ ఆసాంతం.

అమలాపురం లో ఉన్న స్కూల్ లో తొమ్మిదో క్లాసు చదువుతున్న శాంత దగ్గరనుంచి కధ ప్రారంభం అవుతుంది.సాంఘిక శాస్త్రం పాఠం వింటూ అందు లో ఓడలు, గ్లేషియర్స్ గురుంచి విని అవి చూస్తె యెంత బావుంటుందో అని అనుకుంటుంది. కాలం తన గతులు మార్చుకుంటూ వెళుతున్నప్పుడు దానితో పాటే మనిషి కూడా జీవితం లో ఎదుగుతుంటాడు. అలాంటి జీవనక్రమం లో శాంత కి కృష్ణ తో పెళ్ళయి,ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళు పెరిగి పెద్దయి, పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలలో స్థిరపడతారు. అది గో అప్పుడు మళ్ళి శాంత లో గ్లేషియర్ చూడాలనే కోరిక బలం గ కలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కులూ మనాలి వెళతారు శాంతా కృష్ణ, కాని అక్కడ శాంతకి గ్లేషియర్ దగ్గరనుంచి చూడాలనే కోరిక తీరదు . దూరం నుంచే ఆ అందాలను చూసి తృప్తి పడుతుంది. అప్పుడు కృష్ణ అంటాడు. ఇక నుంచి మనం ప్రతి ఏడు తప్పక సిమ్లా వద్దాం అప్పుడు చూద్దువు గానే లే, అలా దిగులుపడకు అని సముదాయిస్తాడు. మూడేళ్లు గడచి పోతాయి. కానీ ఏదో కారణాల వల్ల మళ్ళి సిమ్లా వెళ్ళలేకపోతారు.

Glacier_large
ఇంతలో పిల్లలు అమెరికా రమ్మనమని చెబుతారు. మొదట చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళినప్పుడు శాంత తన కోరికనుచెబుతుంది. అమ్మా! నువ్వు అన్నయ్య ఊరు వెళ్తావు కదా అక్కడనుండి అలస్కా ట్రిప్ కి వెళ్ళచ్చు. అన్నయ్య అన్నీ ఏర్పాట్లు చేస్తాడు అని చెబుతాడు. అనుకున్నట్లుగా పెద్ద కొడుకు టికెట్లు కొని అలస్కా ట్రిప్ కి పంపిస్తాడు.
ఇక్కడ రచయిత్రి ప్రతి చిన్న విషయం కూడా చదువరులకు క్షుణ్ణంగా,వివరిస్తూ కధను సాగిస్తారు.ఓడ, తయారీ, అసలు క్రూజ్ లో ఏమేమి ఉంటాయి, వాటిలో ఎన్ని అంతస్తులు ఉంటాయి.,ఎన్ని డెక్ లు ఉంటాయి, ఎలా ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాది విషయాలు ఎంతో విపులంగా,విశ్లేషణ తో వివరించారు.

ఆ వారం రోజుల ట్రిప్ లో ఎంతో మంది సన్నిహితులవుతారు. వేరే వేరే దేశస్థులే కాకుండా ఇద్దరూ ఇండియన్ ఫ్యామిలీ లు కూడా వస్తారు. శాంత పాత్ర ఇలాఅనుకుంటుంది. “పరాయిదేశస్తులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అదే మన దేశంవాళ్ళు,మనబాష బాషమాట్లాడే వారు మాత్రం అంటీముట్టనట్లుగా ఉండటం ఒకింత బాధను కలిగిస్తుంది.”
ఈ నవల ఏదో ఒక టూర్ గురించే కాకుండా,ఆ క్రూజ్ లో కలిసిన బాబ్,ఉర్సులా మధ్య నడిచేప్రేమ లోని సంఘర్షణలను చాలా బాగా మలచారు రచయిత్రి,ఆ నేపధ్యం లో ఉర్సులా ఎప్పుడూ అనుకుంటుంది, బాబ్ గ్లేషియర్ లా చలనం లేకుండా ఉంటాడని. కాని ఆమెకు క్రమేణా అర్థమవుతుంది. “ధీర గంభీరంగా ఉన్న గ్లేషియర్ కొననెమ్మదిగా వంగి కింద ఉన్న మంచు నది లో కలుస్తుందని”
అలాగే క్రూజ్ కెప్టన్, హోటల్ డైరెక్టర్ జో, పర్సర్ టెర్రీ, వీళ్ళందరూ కూడా మనకి మిత్రులుగా అనిపిస్తారు. అంటే ఆ నవల అంత గ ప్రభావితం చేస్తుంది.
“నార్తరన్ లైట్స్ ఎంతో చెప్పుకోదగ్గ విశేషం, ఆగష్టు నెలాఖరి నించీ ఏప్రిల్ మొదటివారం దాకా రాత్రిపూట ఆకాశం రంగులు పులిమేసిన ఒక చిత్రపటంలా, ఆ రంగులు రకరకాల రూపాలను సంతరించుకుంటూ వెలిగిపోతుంది. అది చూడటానికి కృష్ణ ని రమ్మన్నప్పుడు అబ్బ ఇంటికి వెళ్ళాక యు ట్యూబ్ లో చూద్దాం లే అనడం తో ,శాంత కొంత నిరుత్సాహ పడినా తను చూడటానికి ఒక్కత్తే అర్ధరాత్రి అలారం పెట్టుకుని మరీ వెళుతుంది.
మధ్య మధ్యలో అందమైన బొమ్మకు నగిషీలు చెక్కినట్లుగా నవలలో రచయిత్రి శాంత పాత్రకు భావుకతను జోడిస్తారు. ఆ భావుకత్వపు గుబాళింపు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. షిప్ వెళుతున్నప్పుడు సముద్రం లో దారి , ఏర్పడినట్లు రెండు పక్కలాసముద్రం చూస్తూ ప్రపంచంలో అతి సుందరమైన, రంగురంగుల ప్రదేశం అలాస్కా వే,అని శాంత అనుకుంటుంది.
ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి,దానిని పాఠకుల కి చెప్పడంలో సఫలీకృతులు అయ్యారు. అదే విధంగా ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు అలస్కా వెళ్ళడానికి వీలుగా ప్రతి చిన్న విషయం కూడా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎంతైనా అధ్యాపకురాలు కదా !
నవల ఆసాంతం చదివిన తరువాత కలిగిన అనుభూతి గురుంచి మాటలలో వర్ణించడం కష్టం. అది పుస్తకం చదివిన వాళ్ళకే అనుభవైకవేద్యం అవుతుంది. అందుకే ఇది అందరూ తప్పక చదవాల్సిన నవల.
***

మధ్యతరగతి స్త్రీల మనోలోకంలో ద్వివేదుల విశాలాక్షి

untitled

సాహితీ ప్రపంచానికి మణిపూస శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిగారు, ఎన్నో నవలలు,కదలు,వ్యాసాలు వ్రాసారు. పాత తరం,కొత్త తరం ఎవరైనా కాని ఆమె రాసినవన్నీ అందరికీ మార్గదర్శకాలే. ఆమె రచనలు పాఠకులను చేయిపట్టి తమతో పాటే తీసుకోని వెళతాయి. రాజలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎంతోమంది విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.

ఇక వారు రాసిన నవలలో ముఖ్యంగా స్త్రీ పాత్రల కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కొవ్వొత్తి లోని లలిత, మారిన విలువలలో జానకి, గ్రహణం విడిచింది లోని భారతి, గోమతి లో గోమతి, రేపటి వెలుగు లో శారద ,ఎక్కవలసిన రైలు లో మాధవి, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పాత్రలు. వారి రచనలలోని గొప్పదనం ,ఆ పాత్రలు ,ప్రదేశాలు కూడా మనకు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఉదాహరణకి కొవ్వొత్తి లో నాయకుడు ప్రకాశం ఇల్లుని ఈ విధంగా వర్ణిస్తారు “అది ఒక పాత లోగిలి,చిన్న,చిన్న వాటాలు”. ఈ వర్ణన ఇంచుమించుగా అన్ని నవలలో ఉంటుంది. అంటే అప్పటి మధ్యతరగతి జీవితాన్నిదర్పణం పట్టి చూపించారు. నలభైయేళ్ల క్రితం వాళ్ళకి ఇలాంటి ఇళ్ళు గుర్తు ఉండే ఉంటాయి. ముఖ్యంగా ఆవిడ రచనలలో ఎన్నడూ శ్రీమంతుల దర్పం కనిపించదు. మధ్యతరగతి జీవన విధాన గురుంచి ఎక్కువ రాసేవారు ఇప్పుడు మనం down-to-earth అంటాం కదా! అలాంటి పాత్రలనే సృష్టించారు.

వారు రాసిన నవలల నుండి కొన్ని మచ్చుతునకలు.

నాకు బాగా నచ్చిన పాత్రలు   గోమతి, రేపటి వెలుగు(శారద), కొవ్వొత్తి(లలిత) ఎక్కవలసిన రైలు లోని(మాధవి) పాత్రలను వాటి స్వభావాలను గనక పరిశీలిస్తే,

గోమతి: చిన్ననాటి స్నేహం ముగ్గురి మధ్య ముప్పేటలా పెనవేసుకొన్న బంధం. ఇది ఒక triangular love story . నవలలోకి వెళితే   ”అట్లతద్దోయి ఆరట్లోయి” అన్న చిన్న పిల్లల కేకలతో నవల మొదలవుతుంది. కధానాయిక గోమతి కి అది చూసి మనసు గతం లోకి పరగులు తీస్తుంది. చిన్నప్పటి నుంచి. మేనత్త కొడుకు గోపాలం, స్నేహితుడు గోవిందు. ముగ్గురూ ఒక జట్టు. ఊరి చివరనున్న ఆఫీస్ బంగ్లా గేటు ఎక్కి జామ కాయలు కోయడం, అక్కడే ఉన్న ఆకు సంపెంగ పూలు కోసు కోవడం,స్కూల్ లో మాస్టారు చేత దెబ్బలు తినడం ఇవన్నీ ఇంట్లో తెలిసి పెద్దవాళ్లు తిట్టడం జరుగుతూ ఉంటాయి.

పెద్ద అయ్యాక అభిమానాలూ పెరుగుతాయి, బావ మరదళ్ల మధ్య కానీ గోమతి తల్లి వల్ల తెలియని దూరం పెరుగుతుంది . “చిలకలా తిరుగుతోంది పిల్ల,వదినా! మా గోవిందు కి మీ గోమతిని చేసుంటాను” అని తల్లితో నేస్తం,పక్క్టింటి అబ్బాయి గోవిందు వాళ్ళ అమ్మ అడిగిన వెంటనే గోమతి తల్లి తండ్రులు గడపలోకి వచ్చిన సంబంధం,ఎరిగున్న వాళ్ళు,కాదనడానికి తగ్గ కారణం ఏమి లేదని పెళ్లి చేస్తారు. బోటా బొటి సంపాదన, పట్నం లో కాపురం. పైగా అదే సమయం లో గోవిందు కాలు విరగడం,ఉద్యోగంపోవడం ఒకటే సారి జరుగుతాయి. ఈ క్రమం లో గోమతి, సంసారభారాన్ని మోసేందుకు ఉద్యోగం లో చేరుతుంది. అక్కడ ఆమె పై ఆఫీసర్ బావ గోపాలమే. ఆడపడచు మీద ఉన్న చులకన భావం తో మేనల్లుడు గోపాలాన్ని చిన్న చూపు చూస్తుంది గోమతి తల్లి.

అది తెలిసి గోమతి మీద ప్రేమను బయట పెట్టలేకపోతాడు. కానీ స్నేహితుడు గోవిందు ఇది ముందే పసిగట్టి గోమతి తనకే దక్కాలన్న స్వార్ధంతో గోపాలం కంటే ముందు వెళ్లి తన ప్రేమని చెప్పేస్తాడు. వాళ్ళు ఎప్పుడు కలుసుకునే మందార చెట్టు దగ్గర. వెంటనే గోమతి సరే అంటుంది. అది విని భంగపాటు తో గోపాలం ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోతాడు. కొంతకాలానికి తన ఆఫీస్ లోనే ఉద్యోగానికి వచ్చిన గోమతి తో పూర్వంలా చనువుగా ఉండటం సహించలేని గోవిందు గోమతిని సూటి పోటి మాటలు అంటాడు. కొన్ని రోజులు ఘర్షణల మధ్యే జీవితం గడుపుతారు. చివరకి గోవిందు గోమతి జీవితం నుంచి తొలగి పోవడానికి నిశ్చయించుకొని ఉత్తరం రాసి రైలు ఎక్కుతాడు. ఎక్కిన రైలు కొంచెము దూరం వెళ్లి ఆగుతుంది. ఎవరో అంటారు రైలు కిందబడి ఒక ఆడకూతురు ఆత్మహత్య చేసుకుందని అది విన్న గోవిందు మటుకు, గోమతి కి ఆ గతి పట్టదు.చక్కగా గోపాలం తో హాయిగా ఉంటుందిలే అని సమాధానపడతాడు. కానీ అతనికి  తెలియని నిజం  గోమతి  కి తన మీద ప్రేమ ఏమాత్రము తగ్గ లేదని .తన కోసమే రైలు ఎక్కబోయి పది పోయి చని పోయిందని .

  ఈ నవలలో నాయిక  ధైర్య వంతురాలైన  చివరకి  విధి వశాత్తు రైలు కింద పడి  మరణిస్తుంది.

 

రేపటి వెలుగు: ఈ నవలలో కూడా మధ్యతరగతి కుటుంబీకులు శారద తల్లితండ్రులు. ముందు పుట్టిన ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అవుతాయి. అప్పులు, బాధ్యతలతో తల మునగలు గా ఉంటాడు తండ్రి.ఇక రేపో మాపో రిటైర్ అవుతాడు, గుండెల మిద కుంపటి లా పెళ్లికేదిగిన మూడో కూతురు.అని ఆలోచించిన తల్లి కూతురి తో అంటుంది, “చదివిన చదువు చాల్లే ఏదో మా శక్తి కొద్ది గంత కు తగ్గ బొంతను చూసి పెళ్లి చేస్తాను”.

కాని స్వతంత్ర భావాలూ గల శారద అందుకు ఒప్పుకోదు స్వశక్తి మిద నిలబడాలని అనుకుంటుంది. అదృష్టం ఆమెకు అనుకోని విధంగా వేలువిడిచిన మేనమామరూపం లో వస్తుంది. అతనితో వాళ్లింటికి పట్నం వెళుతుంది. అక్కడ తన ఈడుదైన అరవింద తో పరిచయం. ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ క్రమం లో అనిల్ తో పరిచయం ఆమెకి చక్కటి మధురభావనలను కలిగిస్తుంది. అరవింద కి ఒక పంజాబీ తో పెళ్లి అవుతుంది. అతని స్నేహితుడే అనిల్ బెనర్జీ, బెంగాలీ వాడు . శారదను చూసి ఆమె మృదువైన స్వభావం చూసి , ఇష్టపడతాడు. కాని ఆమె ఎటూ నిర్ణయించుకోలేక పోతుంది. ఇంతలో తల్లి “జాగ్రత్తగా ఉండు, ఎక్కడో ఉన్నావు మాకు తలియకుండా కొంపలుముంచకు అంటుంది”.

తల్లి మాటలకూ శారద బాధ పడుతుంది.అప్పుడే అనిల్ దగ్గర్నుంచి ఉత్తరం వస్తుంది “నువ్వు ఇతరుల ఒత్తిడికి,అధికారానికి తల ఒగ్గేదానివి కావన్న సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకింత గౌరవం, ఇష్టం, ఆరాధన” అన్న అనిల్ మాటల తో ఆమె హృదయం ఉప్పొంగుతుంది. అందులోనే నిన్ను కలవడానికి మా అక్క సిద్దేశ్వరి వస్తోంది. రేపు నువ్వు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళు అని ఆమెకి రాస్తాడు.ఆ ఉత్తరం చదువుకున్న శారద ఆ రాత్రి కమ్మని కలలతో తేలిపోతూ ,అందమైన రేపు గురుంచి ఎదురుచూచ్తుంది. ఆ రేపు లో ఎన్నో కొత్త ఆశలు, కోటి కోరికల వెలుగులు విరజిమ్ముతూ అందంగా, మనోహరంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వెలుగుల కాంతులు ఆమె మనసు నిండా పరచు కొన్నాయి.

రేపటి వెలుగు నాయిక శారద మృదుస్వభావి, కార్యసాధకరాలు                                  

కొవ్వొత్తి: ఇందులో కథానాయిక లలిత, …చిన్నప్పటి నుంచి,తన కోసంకాక, ఇతరులకోసమే బ్రతకడం నేర్చుకున్న లలిత. తల్లి కావాలన్న అతి సహజమైన కోరికను తీర్చుకోలేని దురదృష్టవంతురాలు లలిత. కొవ్వొత్తిలా తను కరిగి పోతూ ఇతరులకు వెలుగు నిచ్చే కొవ్వొత్తికి తన చుట్టురా చీకటే మిగుల్తుంది.ఆ నాటి సాంఘిక పరిస్థితుల కి అద్దం పట్టిన నవల ఇది. రచయిత్రి ఒక్క మాట అంటారు చివరిలో “ప్రకాశించే శక్తి ఉన్నంతవరకు వెలుగును ఇస్తూనే ఉండాలని”

లలిత ఒక నాటి మధ్య తరగతి మహిళల కి ప్రతి రూపం

ఎక్కవలసిన రైలు: మాధవి ,పోట్ట్టపోసుకోవడం కోసం ఉద్యోగానికి పట్నం వస్తుంది. ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి చాల మంచి వాడు. ఇంట్లో పిల్లలా చూసుకుంటాడు. వారి బంధువు సుందరమూర్తి, ఒకర్నొకరు ఇష్టపడతారు. జీవితాన్ని ఏంటో సుందరం గ ఊహించుకుంటూ బంగారు కలలుకంటున్న మాధవి ఒక్క సారిగా వాస్తవ ప్రపంచం లోకి వస్తుంది. తనకు సుందరమూర్తి కి గల అంతరం తెలుసుకొని రెండో పెళ్ళివాడైన వాసుదేవమూర్తి ని చేసుకుంటుంది. మాధవి ని పెళ్లి చేసుకోలేక పోయిన సుందరమూర్తి ఎక్కవలసిన రైలు అతడు ఎక్కకుండానే వెళ్ళిపోతున్న రైలు వెనుక ఎర్రదీపాలు అతన్ని చూసి వెక్కిరిస్తున్నాయి, అతని మనసు ,కాలం విలువ తెలుసుకొని బుద్దిహినుడా,జీవితం లో నీకిది గుణపాఠం అంటూ హెచ్చరించింది. అని ముగిస్తారు.

ఇందులో మాధవి పాత్ర ఒక సజీవమైన పాత్ర. కోరింది దొరకక పోయినా,దొరికిన దానితో ఆత్మ వంచన చేసుకోకుండా,తృప్తి పడే పాత్ర.

విశాలాక్షి గారి రచనలలో ఒక గమ్మతైన విషయం కనిపిస్తుంది. ఆమె రాసిన తల్లి పాత్రల కొంచెము,కోపం,దురుసుస్వభావంగా ఉండేవి అయితే, అత్తగారి పాత్రలు మాత్రం ఎప్పుడూ కూడా కోడలని ప్రేమతో చూసుకుంటూ, అభిమానంగా ,సపోర్ట్ ఇచ్చే విధంగా ,ఉంటాయి.

ఇలా మన కళ్ళ ముందు సజీవంగా తిరగాడే పాత్రలు ఎన్నో ఎన్నోన్నో సృష్టంచిన ఘనత శ్రీమతి ద్వివేదులవిశాలాక్షి గారిది. ఆ మహా రచయిత్రికి సారంగ సాహిత్య వార పత్రిక తరపున సాహితీ నివాళులు సమర్పిస్తూ……………

-మణి వడ్లమాని

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఏ గాలివానలకూ కొట్టుకుపోని స్నేహ బంధాలు అవి!

Paparaju Mastar1

మా నాన్నగారు- పి.వి శర్మ- ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. మా పెద్ద నాన్నగారు పి. ఎల్.ఎన్.శర్మగారు (మహా విద్యావేత్త,అధ్యాపకుడుగ, ప్రిన్సిపాల్ గా కూడా విధులు నిర్వర్తించారు) పాలగుమ్మి పద్మరాజు గారు ఇరువురు కూడా భీమవరం కాలేజి లో సహద్యాయులు. పక్క పక్క ఇళ్ళలోనే వుండే వారు.

మానాన్నగారు, మాఅత్తయ్య గారు(ప్రస్తుతం వాళ్ళు ఈ లోకం లోనే లేరు) మా అమ్మగారితో చెప్పిన విషయాలని,అమ్మ నాతో చెప్పగా, నాకు గుర్తుకు ఉన్నంత మటుకు వారి శత జయంతి సందర్భంగా చంద్రునికో నూలుపోగు లా వారి గురుంచి స్మరించు కోవాలని, అవి మన సారంగా మిత్రులతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో రాసిన నాలుగు మాటలు.

పద్మరాజు గారి వివాహం ఆయన 21వ ఏట సత్యానందం గారితో జరిగింది. అప్పుడు ఆవిడ వయస్సు 12,13సంవత్సరాలు మించి లేదట. మా అత్తయ్యగారితో,మా నాన్నమ్మ గారి తో వారి కుటుంబ సభ్యులు చాల స్నేహం గా ఉండేవారుట. వారు మద్రాసు వెళ్ళిపోయినా కూడా ఆ స్నేహబంధం కొనసాగిందిట.

వారిని గురించిన ఒక అరుదైన జ్ఞాపకం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఆ సంఘటన బహుశా 1950-52 మధ్య జరిగినట్లుగా చెప్పారు. అప్పుడు వచ్చిన అతి పెద్ద గాలివానలో వారు నివసిస్తున్న ఇంటి గోడ కూలి వారి శ్రీమతి గారికి దెబ్బతగలటం తో ఒక ఏడాది పాటు ఆవిడ కోలుకోలేకపోయారు. అప్పటి గాలివాన ఉదృతం చూసిన ఆయన తనలో కలిగిన భావాలకి అక్షరరూపం ఇచ్చిన కధే “గాలివాన”

తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజు గారిదే. ప్రపంచ కథల పోటీని న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించింది. భారతదేశం తరఫున హిందుస్థాన్ టైమ్స్ వారు ఈ పోటీని నిర్వహించారు. ఆంధ్రదేశం తరఫున ఆంధ్రపత్రికవారు నిర్వహించారు. ఆయన బహుభాషాకోవిదుడు. ఆయన బహుసౌమ్యుడు అని కూడా చెప్పేవారు మా నాన్నగారు.

మనుషుల్లో ఉండే వ్యతిరేక భావనలని ప్రతికూలంగా చూడటం అనేది అలవాటు చేసుకొమ్మని విద్యార్ధులకు చెప్పేవారట ఆయన.
ఆయన రాసిన కథల్లోని పాత్రలలో చాలా వరకు మన చుట్టూ సజీవంగా ఉన్నవాళ్ళే. దీనివల్ల కొన్ని సార్లు ఆయనకు చిక్కులు కూడా ఎదురయ్యాయంటాయి. బతికిన కాలేజీ, నల్ల రేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ఇవన్నీ మా నాన్నగారికి ఇచ్చారు. కానీ నా దగ్గర మిగిలినది రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన నవల మాత్రమే. అదీ శిధిలావస్థలో ఉంది.
కాకపోతే వారిని చూసి మాట్లాడే అవకాశం మాకు 1978 లో వచ్చింది. అప్పుడు మేము రాజమండ్రిలో, బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర గోటేటి రామారావు గారింట్లో ఉన్నప్పుడు. పక్కనే ఉన్న హనుమంతరావు గారింటికి వచ్చారు.

వారు ఇంకా రిక్షాలోనే ఉండగా మా నాన్నగార్ని చూసి,“ఏం తంబి బావున్నావా?” అని పలకరించారు శిష్యుల కి గురువు గుర్తు ఉండటం సహజం. కాని గురువు శిష్యుడుని గుర్తుపెట్టుకోవడం అరుదు అది విని మా నాన్నగారు ఎంతగానో చెప్పుకొని మురిసిపోయారు. తరువాత వారి కుటుంబ సహితంగా మా ఇంటికి వచ్చారు.

మా నాన్నగారు వారికి పాదాభివందనం చేసి మమ్మల్ని పరిచయం చేసి కాళ్ళకి నమస్కారం చేయమని చెప్పారు. ఏం చదువుతున్నారని నన్ను, మా చెల్లెలిని అడిగారు. డిగ్రీ చదువుతున్నామని చెప్పాము. అప్పటికే వారి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేసారు. కొంతసేపు మాట్లాడుకున్నాకా, మా నాన్నగారు మమల్ని, వాళ్ళకి ఊరంతా చూపించమని చెప్పారు. అప్పుడు నేను మా చెల్లెలు, వారి భార్యని, రెండో అమ్మాయిని తీసుకొని రాజమండ్రి బజారు, కోటగుమ్మం,గోదావరి గట్టు అదీ చూపించాము. వారు ఏదో షాపింగ్ కూడా చేసారు.

వారు వెళ్లి పోయాక మా నాన్నగారు ఒక తమషా సంగతి చెప్పారు. నాన్నగారు కాలేజి నుంచి వెళ్లిపోయేటప్పుడు జరిగిన ఫేర్వెల్ పార్టీ లో తమగుర్తుగా లెక్చరర్ల కి గిఫ్ట్ లు ఇచ్చారుట. అందులో మా నాన్నగారు కొంటె తనంతో పద్మరాజు గారికి ఒక పేస్ పౌడర్, నాన్నగారి స్నేహితుడు మా పెదనాన్న గారికి ఒక తెలుగు కాపీరైటింగ్ పుస్తకం ఇచ్చారుట. వాళ్ళు వాటిని ఏంతో స్పోర్టివ్ గా తీసుకున్నారని ఏ మాత్రం ఫీల్ అవలేదని అన్నారు. అప్పట్లో వాళ్ళ మధ్య ఆ బాంధవ్యం అంత సరదాగా ఉండేది అని అర్ధమైంది.

ఈ సందర్భంగా మరొక విషయం – 2013 లో శిరా కదంబం వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో చదివి వినిపించిన కథ- పడవ ప్రయాణం.

వారి సౌజన్యంతో ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://www.divshare.com/download/24123097-361

Shabdakadambam – Playlist – DivShare
www.divshare.com
ఫోటో సహకారం: కే.కే. రామయ్య                                                                                                                                  -మణి వడ్లమాని

 

 

పు(ని)ణ్యస్త్రీ

chinnakatha

“సాంప్రదాయలని పాటించడమే  జీవితం అనుకొన్న  సీతమ్మ, జీవనభుక్తి కోసం  ఆ సాంప్రదాయానికి ఎదురీదెందుకు నిర్ణయించుకొంది.తను తీసుకొన్న నిర్ణయం ధర్మమో, అధర్మమో కాలమే   చెప్పాలి?”

రోజు గోదావరి  ఒడ్డున ఉన్న కోటి లింగాల రేవుకి  ఉదయాన్నే వెళ్లి కాలు ఝాడిస్తూ ఉంటాను. గత పదిహేను ఏళ్ళ గా ఉన్న అలవాటు అది, చేసేది కాలేజీ లో అధ్యాపక వృత్తి, ఇంక నా ప్రవృత్తి  అంటారా మనుషులని చదవడం, వాళ్ళ స్వభావాలను అంచనా వెయ్యడం తో పాటు అప్పుడప్పుడు చిన్న-చితక కధలు, కవితలు  రాస్తూ ఉంటాను . అన్నీ మన చుట్టూ జరిగే సంఘటనలని చూసి రాస్తూ ఉంటాను. ఇది నా అర్ధభాగానికి అస్సలు నచ్చని సంగతి. “ఎవరిగురుంచో మీకు ఎందుకండీ  ఇన్ని ఆలోచనలు” అని  ఆవిడ నన్ను సాధిస్తూ ఉంటుంది. అయినా  నా అలవాటు మారలేదు, మార్చుకోను లేదు.  అందుకే   పొద్దునే  వస్తాను  ఏకాంతంగా మనుషులని పరిశీలన చేస్తూనే ఉంటాను.  దాంతోటి  నాలోని  రచయతకు  పని  కలిపిస్తాను. ఇది స్థూలంగా నా దినచర్య.

ఈ మధ్యనే  ఒక ఆవిడను  ఇంచుమించుగ ఒక నెల రోజుల నుంచి గమనిస్తున్నాను.పెద్ద వయస్సు గల ఆవిడలా లేదు. పచ్చగా,  పెద్ద కుంకుమ బొట్టుతో నిండుగ    కనిపించే  రూపం. ముఖమంతా పరుచుకున్న చక్కటి నవ్వు చూస్తుంటే ఎవరో పెద్దింటి ఆవిడ లా వుంది అని అనుకున్నాను. ఆవిడ కూడా ఇంచుమించుగా రోజు పొద్దునే గోదారి గట్టుకు వస్తుంది. రావడమే ఎవరో తరుముతున్నట్లు గా భలే హడావుడి గా  వస్తుంది.  ఎప్పుడు వెళుతుందో మాత్రమూ  అస్సలు తెలియటం లేదు .అసేలే  నా బుర్ర కి  ఇలాంటి వి  చూస్తె కోతి కి కొబ్బరికాయ దొరికినట్లే ! ఈ మారు  శ్రద్ధ పెట్టి చూడాలి అని అనుకుంటూ  ఇంటికి బయల్దేరాను.

ఇల్లు ఇక్కడికి దగ్గరే సీతంపేటలో. మాది డాబా ఇల్లు, మా తాతగారి వారసత్వంగా వచ్చినది.  ఏదో పెద్దవాళ్ల పుణ్యమా అని తలదాచుకునేందుకు  ఓ సొంత గూడు అనేది వుంది. వస్తున్న జీతం తో ఏ ఒడిదుడుకులు లేకుండా  సాఫీగా సాగుతోంది జీవితం. అందుకు భగవంతుడికి సర్వదా కృతజ్ఞడుని.

అలానడుస్తూ వుండగా సన్నగా ఏడుపులు వినిపించాయి. పాపంఎవరో ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకొని ఇక తిరిగిరాని లోకాలికి వెళ్లి పోయిన ట్లున్నారు. గోదారి ఒడ్డునే ఉన్న స్మశానవాటిక  దగ్గరకి  తీసికొనివెళుతున్నారు.  అలా నేను అటువైపు చూస్తూవుండగా తొందర తొందరగా రోజు నేను  చూస్తున్న ఆవిడ  ఆ శవం వెనకాలే వెడుతోంది. పాపం ఆవిడ బంధువులు కామోసు, వాళ్ళు అని నాకు నేనే చెప్పుకున్నాను.

యధాప్రకారం మరునాడు నేను వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నా చూపులు ఆవిడ కోసం వెతికాయి.   కాని  ఆవిడ ఎక్కడా  కనపడలేదు. రోజులాగే నా ఉదయ వాహ్యాళి పూర్తిచేసుకొని వెళ్ళిపోయాను. ఇలా ఓ వారం రోజులు గడిచాయి. ఆ రోజు  ఆదివారం కావటం తో నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. నేను వెళుతుండగానే ఆవిడ  పరుగులాంటి నడక తో వస్తోంది. ఇంతలో  చలపతి గారని మాకు బాగా తెలిసిన బ్రాహ్మణుడే, ఆయన మా ఇంటికి పూజలు చేయించడానికి వస్తారు, ఆయన  ఈవిడని చూసి “ఏమ్మా ఇప్పుడా రావడం? నేను పొద్దున్నే రమ్మనిచెప్పాను కదా! వాళ్ళు అందరు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రయాణం  పొద్దునే అట, ఆలశ్యం అయిపోతోందని విసుక్కుంటున్నారు”  అంటూ  ఈయన కొంచెం గదమాయించి నట్లుగా అన్నాడు. దానికి సమాధానం గా  పాపం ఆవిడ  చిన్నపోయిన మొహంతో  ఎంతో నొచ్చుకుంటూ ‘ఏమీ అనుకోకండి చలపతి గారు,    మా మావగారికి ఒళ్ళు బాలేదు  బాబు,  అందుకే  కొంచెము   ఆలస్యమైంది’   అని అంటోంది .

“సరే  సరే  పదండి  వాళ్ళు ఆ పక్కన మనకోసం ఎదురు చూస్తున్నారు అంటూ  ఆపక్కగ  వున్న  పావంచల వైపు గబ గబా తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఓ ఇద్దరు ఆడవాళ్ళూ, కొంతమంది మగవాళ్లు వున్నారు. వాళ్ళు ఆవిడని గట్టుమీద  కూర్చోమన్నారు ఒకావిడ ముఖానికి పసుపు రాసింది ఇంకో ఆవిడ బొట్టుపెట్టింది మూసివున్న చేటలని  ఆవిడకి అందించింది. అప్పుడు అక్కడే వున్న  వేరే బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలూ చదివి “మీ అమ్మగారిని తలచుకొని నమస్కారం చెయ్యండి”  అని వాళ్ళ ఇద్దరకి చెప్పాడు.

ఆవిడతో చలపతిగారు “సీతమ్మ! ఇక్కడ నీ పని అయింది. ఇహ! ఆ శంకరం గారి భార్యది వుంది అందుకే ఎక్కడకి  వెళ్ళిపోక ఇక్కడే వుండు.! వాళ్ళు వచ్చాక ఆ  నిన్ను సూరిపంతులు పిలుస్తాడు”  అని చెప్పి  ఆయన వెళ్లిపోయాడు.

ఆవిడ  “అలాగే చలపతి గారు”‘అని తల ఊపి తన కూడా తెచ్చుకున్న సంచిలో  వాళ్ళు ఇచ్చిన వన్నీ సర్దుకుంటోంది. మధ్యలో  తలయెత్తి ఇందాక వాయనం ఇచ్చిన ఆడవాళ్ళని వో సారి చూసింది. అంతవరకూ మాములుగా కబుర్లు చెప్పుకుంటూ వున్న వాళ్ళు గబగబా అక్కడనుంచి నడచుకుంటూ కొంచెం పక్కకు వెళ్లారు. అందులోఒకావిడ అంటోంది “చూసావా ఆవిడ వాలకం, ఆ చూపులు వట్టి ద్రిష్టి కళ్ళు, అవి మంచివి కాదు బాబు నరుడి కళ్ళకి నాపరాళ్ళుఅయిన పగులుతాయి అంటారు అందుకే  ఇలాంటి వాళ్ళని శుభాలకి  ఎవరూ  పిలవరు” అంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు,

అంతవరకూ జరిగినదంతా చూస్తూనే వున్నాను. పాపం  ఆవిడ పచ్చటి మొహం  అవమాన భారంతో ఎర్రగా అయ్యి కన్నీళ్ళ పర్యంతం అయింది. ఇంతలో ఇందాకటి  బ్రాహ్మణుడు  అంత దూరమునుంచే “సీతమ్మ రావమ్మా! వాళ్ళు వచ్చేసారు”  అనిపిలుస్తున్నాడు. “ఆ వచ్చే! వచ్చే!”  అనుకుంటూ ఆవిడ  అక్కడనుంచి  ఆ పక్కగా వున్న గట్టు దగ్గర గా వెళ్ళింది. మళ్లి ఇందాక నేను చూసిన తంతు మొదలుపెట్టారు. అప్పటికే చాల పొద్దు పోవటం తో  నేను ఇంటి కి బయల్దేరాను.  కానీ  ఆరోజంతా అదే సంఘటన నా కళ్ళ ముందు కదలాడ సాగింది.

కాలేజీ లో పరీక్షల మూలం గ, అదీ గాక  ఎప్పటి నుంచో  వెళ్ళాలనుకొన్న   కాశి యాత్రకు కు కూడా వెళ్లి రావడంతో నా ఉదయ వ్యాహళ్లి కార్యక్రమం కొన్ని రోజులు గ  వెనుకబడింది. ఇదిగో మళ్ళి  ఈవాళ        ఆదివారం కావటంచేత కొంచెం తీరుబడిగా గోదారి ఒడ్డు కొచ్చి ఆ ప్రత్యూష వేళలో  ఆ నీటి తరగలమీద నుంచి వీచే చల్లని గాలి  మనసుని, శరీరాన్ని కూడా సేద  తీరుస్తూ వుంటే, ఎంతో హాయిగా, ప్రశాంతం గా వుంది. అలా ఏదో లోకాలలో విహరిస్తున్న నన్ను, “ఏం బాబు బావున్నారా?” అన్న చలపతి గారి పిలుపుతో తెప్పరిల్లి, ఆ! ఆ ‘! చెప్పండి చలపతి గారు ఎలా వున్నారు? ఏమిటి లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ ,పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తున్నాము.

ఇంతలో మళ్ళి ఆవిడ కనిపించింది.కాని మాములుగా కాదు. ఏదో జబ్బు పడి లేచినట్లుగా వుంది. అది చూసిన చలపతి గారు “ ఆ వచ్చేది సీతమ్మకదూ! అయ్యో అలా జబ్బు పడిన దానిలా వుందేమిటి? పాపం సంసారం కోసం మహా కష్ట పడుతుంది,ఏమిటో ఆ దేముడు కొంతమంది నుదుట కష్టాలే రాస్తాడు”  అంటూ కొంచెం ఆందోళనగా.ఎమ్మా! సీతమ్మా ఎలా వున్నారు? ఎవరో అమెరికానుంచి వచ్చిన వాళ్ళకి  వంటా అది చెయ్యడానికి  వాళ్ళతో పాటు వో 15 రోజులు కాశి వెళ్లావు అని చెప్పారు, ఆ విశ్వేశ్వరుని దర్శనం  అదీ బాగా అయిందా? అలా అయిపోయవేమిటమ్మ? ఏమి ఒంట్లో బావుండలేదా?” అంటూ ప్రశ్ర్నించారు.

“ఆ, ఆ ,అయింది చలపతి గారు! అబ్బే పెద్ద జబ్బు ఏమి చెయ్యలేదు,  కాని అక్కడ స్నానాలు అవి పడలేదండి” అంది ! “అవునమ్మా ! అక్కడి వాతావరణం వేరు”, అంటూ నావైపు తిరిగి “మీరుఎన్నయినా చెప్పండి రామారావు గారు మన రాజమండ్రి, వాతావరణమే నాకు నప్పుతుంది” అని అన్నాడు..

అంతవరకు ఏదో యథాలాపంగా చూస్తున్న నేను ఒక్కసారి సీతమ్మగారిని చూసి షాక్ తిన్నాను. కారణం ఆవిడ ముత్తైదువ గ కనిపించడమే . కొంచెసేపు అయిన తరువాత చలపతి గారు వెళ్ళిపోయారు.

అప్పుడు నేను వెంటనే అసహ్యంగా చూసి, ఆగ్రహం నిండిన గొంతుతో “ ఏమండీ సీతమ్మగారు! మీరు ఇలా ఎందరి ని మోసం చేస్తారు, అది తప్పు, పాపం అనిపించటం లేదా మీకు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ పరిస్థితి యెంత దారుణంగ వుంటుందో  గ్రహించారా?    భర్త చనిపోయినా మీరు  ఇలా పుణ్యస్త్రీ గా  కనిపిస్తూ  అవతలవాళ్ళ  ని  నమ్మిస్తూ  ఇలా చేయడం పాపం కాదా? మీరు కుటుంబం కోసం కష్టపడుతున్నారని తెలిసి  అయ్యోపాపం ఒంటరి గా సంసారభారం మోస్తున్నారని అనుకొన్నాను కాని. ఇలా అందర్నీ వంచన చేస్తున్నారని  తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని నేను  కాశి లో చూసాను, పాపం అది మీకు తెలియదేమో” వ్యంగంగా . అన్నాను

నామాటలకి ఆవిడ మొహం నెత్తురుచుక్కలేకుండా పాలిపోయింది. అసలే నీరసంగా ఉన్నదేమో ఒక్కసారిగా తూలి పడబోయి నెమ్మదిగా తమాయించుకుని “అవును బాబు మీరు చూసినది నిజమే ,కాని నేను ఇలా చెయ్యడానికి గల కారణం చెబుతాను. దయచేసి నన్ను అసహ్యహించు కోవద్దు, నేను చెప్పేది వినండి, అంటూ చెప్పడం మొదలు పెట్టింది. “ మాది చాలా పేద కుటుంబం. మేము గంపెడు సంతానం మా అమ్మ నాన్నలకి. ఏదో భుక్తి కోసం నాన్న చావు మంత్రాలూ చెప్పుతూ,అమ్మ వాళ్ళఇళ్ళల్లో వీళ్ళ ఇళ్ళల్లో  వంటలు వండుతూ  కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అందరిలోకంటే నేను పెద్దదాన్ని,చదువా ఏదో అక్షరంముక్క నేర్చుకొన్నాను. పెళ్లివయసు వచ్చింది. కాని  పెళ్లి ఎలా చేస్తారు ? ఏం పెట్టి చేయగలరు?వచ్చే సంపాదన తోఅందరకినాలుగు వేళ్ళు  నోట్లోకి వెళ్ళడ మే గగనమవుతోంది,ఆ సమయం లో మా మేనత్త, అదే మా నాన్నగారి చెల్లెలు వచ్చింది, వాళ్ళ అబ్బాయికి నన్ను అడగటానికి . వాళ్ళకి ఒకడే కొడుకు,అమాయకుడు, వయసు వచ్చినా మానసిక పరిపక్వత లేదు.  ఇకఇందులో నాఇష్టాల ప్రసక్తి అనేదే లేదు. ఇక్కడ నుంచి నేను వెళితే ఒక మనిషి బరువు తగ్గుతుంది. అది ఆలోచించి సరే అన్నాను. మావయ్య   ఏదో చావు మంత్రాలూ చెప్పుకొంటూ  రెండుపూటలా తిండికి లోటులేకుండా బతుకును ఈడుస్తున్నాడు. పెళ్లి జరిగింది అత్తయ్యతో పాటు నేను వంటలు చేస్తూ, ఇలా పుణ్యస్త్రీగా వాయినాలు అందుకొంటూ కాలం గడుపుతున్నాను. మా బావ చిన్న పిల్లాడితో సమానం. ఎప్పుడో ఒక స్వామీజీ “కాశి “గురించి చెప్పాడుట. అప్పటి నుంచి నేను కాశికి పోతానని ఒకటే గొడవ, నన్ను కూడా అడిగాడు  తీసుకొని వెళ్ళమని అలాగే వెళదాము అన్నాను. కాని ఇంతలోనే ఒక రోజున ఇంట్లోంచి చెప్పకుండా  ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడి కి వెళ్ళాడో తెలియదు. అన్ని చోట్ల వెతికించాను. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాను. కాని ఏమి లాభం లేకపోయింది. ఈ సంఘటనతో మావయ్య మంచాన పడ్డారు. అత్తయ్యకి షుగర్ కంప్లైంట్ వుంది దానితో కంటి చూపు బాగా దెబ్బతింది. అత్తయ్య ,మావయ్య కూడా రోజుకోసారి నీకు అన్యాయం చేసామని ఏడుస్తారు. ఈ  కష్ట సమయం లో నేనే వాళ్ళని వదిలి వెళ్ళలేకపోయాను. అప్పుడు అనుకొన్నాను. దేముడు నా నుదుటన ఇలాగ రాసాడు. అని సమాధానపరచుకొని  వాళ్ళని చూసుకొంటూ,ఇది గో ఈ చలపతి గారి ద్వార నాలుగు రాళ్ళూ తెచ్చుకొంటూ బతుకుని వెళ్లదీస్తున్నాను. ఒక పక్క మా బావ కోసం వెతుకుతూనే వున్నాను. నా కెందు కో అతను కాశి కి వెళ్లి వుంటాడు అని అనిపించేది. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ కూడా వెతికించమని చెప్పాను. ఇదంతా జరిగి పది ఏళ్ళు అయింది. అత్తా, మామలు పండుటాకులయ్యారు. ఏ క్షణమైన రాలిపోవచ్చు, ఇలాంటి సమయంలో నాకు కాశి నుంచి ఒక కబురు వచ్చింది.బావ దొరికాడని,కాని అతను ఆరోగ్యం బాగా దెబ్బతిని చివరి దశలో ఉన్నాడని. అప్పుడు నేను ఇక్కడ వీళ్ళకి ఎవరో అమెరికానుంచి వచ్చిన పెద్దవాళ్ళకి  వంటా అది చెయ్యడానికి అక్కడికి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్ళిన కొంచెం సేపటికే బావ చనిపోయాడని చెప్పారు. అక్కడ వాళ్ళనే  బతిమాలుకొని  అన్ని అక్కడే కానిచ్చుకొని వచ్చాను. అదే మీరు చూసి వుంటారు.

నాకు తెలుసు నేను చేస్తున్నది సమాజం దృష్టి లో చాలా పెద్దతప్పు అంటారని, కాని నాకున్న కారణాలు, చాలా వున్నాయి అందులో మొదటిది “ఆకలి”. మేము అవటానికి అగ్రవర్ణం వాళ్ళ మైన సమాజంలో మా స్టాయి వేరు.  మనిషి పోయినప్పుడు,లేదా ఆబ్దికాలు పెట్టానికి మాత్రమె మావాళ్ళు పనికివస్తారు, శుభకార్యాలకు వెళ్ళలేరు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, మేము వేరే వాళ్ళ చావును కోరుతున్నట్లు అనిపిస్తుంది.. ఇలాంటి స్థితిలో మాకు వేరే జీవనాధారం లేనప్పడు ఆ వచ్చే నాలుగు డబ్బులు కోసం నేను విధవనై మూల కూచుంటే,  ఈ ముసలి ప్రాణాలను ఎలా పోషించనూ? శరీరం లో ఊపిరి ఉన్నంతవరకు బతకాలి కదా? ఎలాగూ నాభర్త ఎక్కడి కో వెళ్లిపోయాడని అందరికి తెలుసు.  ఈ విషయం చెప్పి ఆ ముసలి ప్రాణాలు రెంటిని క్షోభ పెట్టదలచుకోలేదు. అందుకే నేను సమాజం కోసం కన్నా ఈ పెద్దవాళ్లని, ఆదుకోవడం ముఖ్యం అనుకున్నాను. ఆఫీస్ ఉద్యోగాలు చేసేందుకు నాకా చదువులేదు . నాకొచ్చినది ఒక్కటే, పది మందికి వంటలు చేసిపెట్టడం, ఇదిగో ఇలా పుణ్య వాయనాలు అందుకోవడము. బతకాడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా  అందుకే ఈ నిర్ణయం. తీసుకొన్నాను”  అంటూ చెప్పటం ముగించింది ఆమె.

ఆమె చెప్పినది విన్నాక  ఒక సంప్రదాయవాదిగా ఆమె నిర్ణయం హర్షించలేకపోయాను. అలాగ అని పరిష్కారమూ చూపలేకపోయాను.

పాపమో,పుణ్యమో సాంప్రదాయలని పాటించడమే  జీవితం అనుకొన్న  సీతమ్మ, జీవనభుక్తి కోసం  ఆ సాంప్రదాయానికి ఎదురీదెందుకు నిర్ణయించుకొంది.ఆమె తీసుకొన్న నిర్ణయం ధర్మమో, అధర్మమో కాలమే   చెప్పాలి? అనుకొంటూ భారమైన మనస్సు తో  ఇంటి ముఖం పట్టాను.

***

Mani Vadlamaniమణి వడ్లమాని