బాల్కనీ లోవూయల! 

 డా. కోగంటి విజయ బాబు

 

 

బాల్కనీ లోవూయల!

తన ఉనికి,అస్తిత్వం తెలుసుకోకుండానే,

వంటరిగా!

 

ఎదురుగా నిండుగా పూచిన వేప చెట్టుని,

రోడ్డుపై ఆడే పిల్లల్ని,

ఎదురింటి మనుషుల్ని,

చూస్తూ కూడా చూడనట్లుగా

ఖాళీగా,గాలిలో,

గాలినిచూస్తున్నట్లున్న ఊయల!

 

నాలానే, నా మనసు లానే

అన్నిటిని మోస్తూ, ఊగుతూ

కానీ వంటరిగా,

మనసులేని,మనసంటే తెలియని వూయల!

 

దానికి ఇంద్ర ధనువు,ఎండ వేడీ ఒకటే!

కొందరి మనుషుల్లా

చూరును పట్టి వ్రేలాడే గొలుసుకు తగిలింపబడి ఉండటమే దానికితెలుసు.

అపుడపుడూ నావైపుతిరిగి,

ఖాళీగా పిలుస్తున్నట్లుండే ఊయల!

 

కాలం గడుస్తుందని దానికి తెలుసో లేదో!

ఎవరినీ, ఏ భావాలనూ పట్టించుకోక

ఏభావమూ కాక, కాలేక

వంటరిగా!

 

అశరీరికి, మనసున్న వారికి

స్థిత ప్రజ్ఞత

కుదరదేమో!

ఆ అవసరమూ లేదేమో!

*

koganti

 

 

 

 

 

 

 

ఎవరు కవి?

 డా. కోగంటి విజయ బాబు

KVB photo

‘ ఉగాది ముందు రోజు విరాట్ కవి సమ్మేళనమట విన్నావా ‘ అడిగాడు మూర్తి ఆసక్తిగా.

‘ ఆ నిన్నే తెలిసింది ‘ అన్నాను కొంత చిరాగ్గా.

‘ అదేమిటి, కవిత్వమంటే చెవి కోసుకుంటావు గదా’ అన్నాడు మూర్తి.

నేనేమీ మాట్లాడలేదు. కాసేపాగి అడిగాను. ‘సరే  ఉదయమా, సాయంత్రమా ?వెళ్దామా?’  అని.

‘సాయంత్రమే! వెళ్దాం గురూ కాస్త టైం పాస్ గా ఉంటుంది’ ఉత్సాహంగా చెప్పాడు మూర్తి.

నాక్కొంచెం ఆశ్చర్యమేసింది. ఎప్పుడూకవిత్వమంటే ఆసక్తి చూపించని మూర్తి ఉన్నట్లుండి ఇలా గుర్తు చేసి మరీ అడుగుతుంటే. 20 వ తారీకు సాయంత్రం ఐదు గంటలకే ఇంటి దగ్గర తయారయ్యాడు మూర్తి. లాల్చి పైజమా భుజాన వేలాడే ఓ గుడ్డ సంచి తో సహా.

‘ ఏం మూర్తి నువ్వు కవి వేషం ధరించావ్?’ అడిగాను నవ్వుతూ.

‘ఎంతైనా కవి సమ్మేళనం కదా’ అన్నాడు. అంటూనే జేబు లోంచి ఓ డబ్బా తీసి ఒక ఆకుపచ్చని గుళిక నోట్లో వేసుకున్నాడు . ‘ఏమిటో అది.’ అడిగాను ఆసక్తిగా. ‘గొంతులొ కిచ్ కిచ్ ని దూరం చేసే కొత్తా హాల్స్ గుళికలు. ఒకటికొంటే ఒకటి ఫ్రీ’. అన్నాడు ఎడ్వర్టైజ్ మెంట్ లా.

‘ఓటి గానీ వేస్తావేమిటి?’ అంటుండగానే నేను తయారయ్యాను. ఇద్దరం కలిసి స్కూటర్ మీద బయలుదేరాం.

*        *        *

పదిహేను నిమిషాల్లో  సభాస్థలి చేరుకున్నాం. జనం బాగానే తయారయ్యారు. ‘ఈ మధ్య కవిసమ్మేళనాలకూ జనం బాగా వస్తున్నారు గురూ’ అన్నాడు మూర్తి. ‘ఇంట్లో కూర్చుని ఆ చెత్త టివి ప్రోగ్రాములు చూసేకన్న ఇది నయం కదా’. అన్నాన్నేను.  పెద్దవాళ్ళు,  మధ్య వయస్కులు,నాలాగా మూర్తి లాగా ఓ ముఫ్ఫై నలభై మంది ఉంటారేమో. స్టేజ్ పైన ‘విరాట్ కవిసమ్మేళనం’ అనే బేనర్, ఓ పదిహేను ఇరవై కుర్చీలు, ఓ పక్కగా ఇరవై మంది కవుల పేర్లు,- చాలా అట్టహాసంగా ఉంది ముస్తాబు. ‘ఇంత ఖర్చు ఈ రోజుల్లో ఎవరు భరిస్తున్నారో’ అనుకుంటూ ఉండగా, మూర్తి ఎవర్నో చూసి ఇప్పుడే వస్తానంటూ పరిగెత్తాడు.

కిర్లా కుంభేశ్వర భండారీ – కికుంభం అనుకుంటా. ప్రఖ్యాత విమర్శకుడు. వ్యాఖ్యాత. ఆయన్ను చూడగానే భుజాన వేలాడుతున్న సంచి లోంచి ఓ డైరి లాంటి దాన్ని తీసి ముందు గానే గుర్తుపెట్టుకున్న ఓ పేజి దగ్గర తీసి చదువుతున్నాడు. కికుంభం నడుం మిద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని నొసలు చిట్లిస్తూ వింటున్నాడు. ఈ లోపు మైకు దగ్గర ప్రకటన. ‘రసాస్వాదులందరికి ఆహ్వానం’ అంటూ. ‘కార్యక్రమం మొదలౌతుంది కాబట్టి అందరు తమ తమ స్థానాల్లో కూర్చోవాలి’ అని చెబుతున్నారు.

Kadha-Saranga-2-300x268

మూర్తి కొసం చూస్తే రావడం లేదు. నేనే, వీలున్నపుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బయటికి ఎప్పుడైనా వెళ్ళేలా నాకు, మూర్తికి రెందు కుర్చీలు చూసాను. మైకు దగ్గర ఎవరో పిల్లలు  చేరి పాటలకు సమాయత్తం అవుతున్నారు. నిర్వాహకులు హడావుడిగా తిరుగుతున్నారు. ఒక్కొక్కరే కవి దిగ్గజాలందరు రాష్ట్రం నలువైపులా నుండి వస్తున్నట్లున్నారు. సరస కవులు, స్వభావ కవులు, వాస్తవిక కవులు, విప్లవ కవులు, అతివాద, మితవాద, స్త్రీవాద కవులు, కవయిత్రులు అందరు మొదటి వరస లో కూర్చుంటున్నారు. లౌకిక వాతావరణం ఏర్పడేలా అన్ని సామాజిక వర్గాల కవులు ఆహ్వానిప బడ్డారు.

సభ మొదలైంది. సభా వ్యాఖ్యాత గంభీర వాచస్పతి గరుడనాథం ముందుగా కవులనందరినీ ఒక్కొక్కరిగా వేదిక మీదకు ఆహ్వానించాడు. ప్రార్ధన జ్యోతి ప్రజ్వలన లాటి కార్యక్రమాలు కాగానే ప్రారంభోపన్యాసం మొదలైంది. కవిత్వం గురించీ, కవిత్వ ప్రస్థానం గురించీ దంచి పారేస్తొంది  ఈ సభాస్థలి దాత. దాదాపు రాతి సభకు ఆధ్యాత్మికమైనా, సాహిత్యమైనా,సంస్మరణైనా ఆమె ఉండాల్సిందే. ఉన్నట్లుండి ఆమెలో ఉన్న కవయిత్రి మేల్కొంది. ‘నాకు కవిత్వం రాదు కాని కవిత పాడతానూ.కోకిల కెవరు నేర్పారూ, చేప కెవరు నేర్పారూ, నేనూ పాడగలనూ’ అంటూ రాగాలు తీస్తూ అవే వాక్యాల్ని అటూ ఇటూ మార్చి మార్చి పాడుతోంది. ఆమెను చప్ప్పట్లతో ఉత్తేజపరుస్తున్నారు. ఇంత డబ్బు విరాళంగా ఇచ్చింది గదా మరి. అనేక సభలలో పాల్గొన్న అనుభవం, శ్రుత పాండిత్యం తో కూడిన సోదాహరణ ప్రసంగం పూర్తయేసరికి మరో గంట పట్టింది. ఆమె ఉపన్యాసం కాగానే ఆమె మరొక కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి ఆమె కు దుశ్శాలువ తో సన్మానం. నేనూ మూర్తి వైపు అసహనంగా చూసాను. కానీ మూర్తి ఈ లోకంలో ఉన్నట్లు లేడు. నోరు తెరుచుకు మరీ వింటున్నాడు. అసలు కవిసమ్మేళనం మొదలయ్యే సరికి ఎనిమిదయ్యింది. ఒక ప్రముఖ విప్లవ కవి తో మొదలైంది. ‘ఉగాదికి సిగ్గులేదు’ అంటూ. ధరలు పెరిగాయని, పేదవాడికి స్ప్రైట్ దొరకడం లేదని, ఏసీ లు కొన్న వాళ్ళని, ఎల్యీడి టివీ లు చూసేవాళ్ళను దుమ్మెత్తి పోసి కూర్చున్నాడు. కాదు సమయం దాటుతోందంటూ కూర్చోబెట్టారు. తరువాత నుదిటిన పెద్ద బొట్టుతో సాంప్రదాయ పంచకట్టుతొ  ఉన్న ఓ సాంప్రదాయ కవి సీసపద్యాల్లో ఉగాది కోయిలను ఆహ్వానిస్తున్నాడు. అవే భావనలు. ఉగాది రుచులు. చందోబద్ధ మయేసరికి భక్తిగా వింటున్నారు.

afsar.evaru kavi

తరువాత ఒక ఆధునిక మొల్ల ను ఆహ్వానించారు. నగరంలో జరిగే ప్రతికవిసమ్మేళనాలకూ ఈమె తప్పని సరిగా రావాల్సిందే! స్త్రీ వాద రచయిత కావడంతో స్వచ్చ భారత్ ను, ఉగాదిని , దుష్ట పురుషుల కవితా వస్తువులను కలిపి ‘ ఉడ్చేసే ఉగాది’ అనే కవిత ను చదివింది. నేనూ మళ్ళీ మూర్తి వైపు చూసాను. ఇంతలో ఒక ఆధునిక కవి లేచి ఎవరికీ అర్ధం కాని కవితొకటి విచిత్రవాక్యాలతో అమర్చి చదివి, ‘ ఇది తనకు సరైన వేదిక కాదనీ మీకు అర్ధం చేసుకునే శక్తీ లేదని’ అన్నట్లుగా నవ్వి కూర్చున్నాడు.

ప్రొద్దుట్నుంచీ అలసి ఉండటంతో కొంచెం కునుకు పట్టింది. మగతగా శబ్దాలు. మూర్తి కూడా రంగస్థలం మీద చోటు సంపాదించాడు.  చాలా పెద్ద కవిత. ఒక ఇరవై నిముషాలు చదివాడు. ‘గాయం ఎలా మానుతుంది?’ అనే కవిత.  అందరితో పాటు మూర్తికి సన్మానం చేస్తున్నారు. ఇంతలో బాగా తూగు రావడంతో మెలకువ వచ్చింది. ప్రక్కన చూస్తే మూర్తి , విమర్శకుడు కికుంభం. ఇద్దరు కలిసి తీవ్రంగా చర్చిస్తున్నారు. ‘ఇదంతా కలా? మూర్తి చదవడం, సన్మానం,అవున్లే ఇంతటి దిగ్గజాలు అతన్ని రానిస్తారా?’ నాలో నేనే నవ్వుకున్నాను.

 

కవి సమ్మేళనం పూర్తి కాకుండానే మూర్తి కేదో ఫోన్ కాల్. అవతలకెళ్ళి మాట్లాడుతున్నాడు . దగ్గరకొచ్చి, ‘ఇంటి కెళ్దామా? ‘ అన్నాడు గాభరాగా.

‘ ఏరా ఏమయింది?’ అనడిగాను. ‘తాను ఫోన్ చెసింది.’ నాన్న ఫోన్ చేసారట. మళ్ళి ఏదో సమస్య.’ అన్నాడు.

నలుగురు అన్నదమ్ములలో తలిదండ్రులను కనిపెట్టి ఉండేది మూర్తి ఒక్కడే. జలుబు చేసినా సరే పరుగెత్తుకెళ్ళి చూసి వస్తాడు. తమ తాతల ఇల్లంటే ప్రాణం  అంటూ తమ బాల్యాన్ని నెమరువేసుకుంటూ  పల్లెను విడిచి రాని తలిదండ్రులంటె పంచ ప్రాణాలు. నేను వెంటనే బయలుదేరాను.

స్కూటర్ మీద మూర్తి ‘నేను మా అమ్మా నాన్న ల మీద ఒక కవిత వ్రాసాను. నాకు బాగా రాయడం రాక పోయినా నా మనసులో ఉన్న భావన వ్రాశాను. ఆ కికుంభం కు వినిపిస్తే ‘ అసలు కవిత్వమంటే ఏమిటో, కాళిదాసు ఎందుకు వ్రాశాడో పద్య కవిత్వం గొప్పతనమేమిటో గురించి అనర్గళంగా మాట్లాడాడు. అసలు మనలాటి వారు కవిత్వమే వ్రాయకూదదంటాడు. తాను చిన్నప్పుడు వ్రాసిన కవిత ను వెయ్యిన్నొక్క సారి చదివాడు. నా కవితలో, భావం సరిగా ఇమడ లేదని, తగిన పదాలు పడ లేదని, ప్రతి వాడు కవిత్వం వ్రాయకుడదని ఇలా ఏవేవో చెప్పాడం’టూ వాపోయాడు. నేను వెంట నే ఇలా అన్నాను.

‘ నిజ జీవితంలో మానవత్వంలేక, ప్రేమ విలువ తెలియక, ఆచరించని సత్యాలు ఎంత అందంగా చెప్పినా ఒకటే –   అన్నీ ఆచరిస్తూ, ప్రేమ పంచిపెడుతూ నీవు నీలాగా మాట్లాడినా ఒకటే. ప్రతివాడు కవిత్వం వ్రాయాలని లేదు. నిజాయితీ ఆత్మా పరి శీలనా లేనివాడు నలుగురి మెప్పు కోసం వ్రాసినా కవి కాలేడు. నిష్కల్మషమైన మనసుతో నీవు మాట్లాడే ప్రతి మాటా కవిత్వమే మూర్తి. బాధపడకు. ముందు వెళ్లి మీ నాన్న ను చూసిరా’ అంటూ వాళ్ళ ఇంటి దగ్గర దించి బయలు దేరాను.

***