తండ్రి లేని దేవుడు లేని అనాథ లోకం!
మతము-నాస్తికత్వము-నాస్తిక మతము
– రాణి శివ శంకర శర్మ
~
మనం ఆధునిక కాలంలో మతచాందసత్వాన్ని కాదు. ఎథీస్ట్ ఫండమెంటలిజాన్ని అంటే నాస్తిక చాందసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేయడం ద్వారా మనం సంఘర్షిస్తున్నాయి అని అనుకుంటూన్న శక్తులు ఒకే కుదురులోనివనీ, తోబుట్టువులనీ అర్థమవుతుంది. వైరుధ్యాలు అనుకున్నవి మిత్ర వైరుధ్యాలనీ వైరుధ్యం ముసుగులోని మైత్రీపూర్వక సంబంధాలనీ అవగతమవుతుంది. అప్పుడు కమ్యూనిజము, హిందూవాదము లాంటి అనేక పేర్లు ఒకే సత్యానికి సహస్ర నామాలని అవగతమవుతుంది.
నిజానికి కమ్యూనిజం వ్యాన్ గార్డులుగా వ్యవహరించిన కొన్ని అగ్ర కులాలని గ్రామీణ బంధనాల నుండి విముక్తం చేసి పెట్టుబడి దారీ వ్యవస్థలో తగిన భాగస్వామ్యం పొందడానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల ఆవిర్భావానికి చోదక శక్తిగా పని చేసినట్లేనన్న మాట. చైనాలో కూడా అంతే. కమ్యూనిజం చిన్న కమతాలని సమిష్టి వ్యవసాయంలోకి లయం చేసి ప్రాచీన గ్రామీణ వ్యవస్థని బలహీనపరిచింది. ఇప్పుడు అలా సమీకరించబడిన భూమి పెట్టుబడికి ప్రశ్నకవకాశం లేని వనరుగా మారింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ఆవిర్భవించిన కమ్యునిష్టు వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థకి దుర్భేధ్యమైన కవచంగా మారింది. తావోయిజం ప్రకారం ప్రతీదీ పూర్తి విరుద్ధంగా మారుతుంది. ఆ మాటని మావో తాత్వీకరించాడు. ఇప్పటి పరిణామాలు కూడా ఆ తాత్వీకరణలో భాగమేనా? తాత్విక సూత్రాలు స్వయం చలనంగా ఉండి తమ అర్థాలని తామే నిర్ణయించుకుంటాయా? మానవ ప్రగతి అనే భావనలో ఏ మానవుడి ప్రగతి, ఏ జాతి ప్రగతి అనే ప్రశ్నలకి సరైన సమాధానం లేదు. దురదృష్టవశాత్తూ కమ్యూనిజం ఈ భావన మీదే కాళ్ళూనుకొని ఉంది. నిజానికి ఆధునికత అంతా అంతే.
హిందూ వాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ, కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.
ఈ క్రమంలో పెట్టుబడి దారీ వ్యవస్థలో, గ్లోబలైజేషన్లో తగిన భాగం పొందలేక, గ్రామీణ వ్యవస్థ విచ్చిన్నమై నూతన అవకాశాలు కూడా పొందలేక బాధపడుతున్న దళిత, బహుజనులు, ముస్లీంలు తమ అస్తిత్వాలతో, మతాలతో, సంస్కృతులతో ముందుకు వచ్చి వాటినే అగ్ర కులాల ముందు ప్రశ్నలుగా ఎగరవేశారు. దాంతో అగ్ర కులాలు నాస్తికత్వం, ఆర్థిక సమానత్వం, హిందూ నేషనలిజం లాంటి సెక్యులర్ అబ్స్ట్రాక్ట్ పదాల్ని ఆశ్రయించారు. దళితులు, బహుజనులు తమ ప్రత్యేక అస్తిత్వాలని కరిగించుకొని అబ్స్ట్రాక్ట్ గా మారిపోవాలని ఆదేశిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అబ్స్ట్రాక్ట్ స్వభావాన్ని ఇష్టపడుతుంది. ప్రత్యేక అస్తిత్వాలని కాక కొనుగోలుదార్లని వాంఛిస్తుంది. నగరీకరణలో ప్రత్యేకతలు, ప్రత్యేక సంస్కృతులు లయమైపోవాలని ఆదేశిస్తుంది. కమ్యునిష్టు, హిందూ ముసుగుల్లోని అగ్రవర్ణాలది మొదటి నుంచీ అబ్స్ట్రాక్ట్ పరిభాషే. భూస్వామి అన్నా, బూర్జువా అన్నా, పెటీ బూర్జువా అన్నా, హిందుత్వ అన్నా, నేషనలిజం అన్నా అంతా వలసవాదుల నుంచీ దిగుమతి చేసుకున్న అబ్స్ట్రాక్ట్ సరుకే. ఈ పదాలతోనే వీళ్ళు నగరీకరణలోకీ, గ్లోబలైజేషన్లోకీ సులభంగా ఎగబాకారు. అదే సమయంలో దళిత, బహుజన, ముస్లీంలు ఈ నిచ్చెన మెట్లు ఎక్కకుండా ఉండడం కోసం ప్రత్యేకతల్నీ, కులాల్నీ, మతాల్నీ, సంస్కృతుల్నీ ఉపరితలం అంటూ అగ్రకులాలు విసిరి కొట్టారు. హిందూవాదులైతే బహుళత్వాన్ని హిందూ జాతీయతకి ముప్పుగా పరిగణించారు.
అందుకే ఇప్పుడు కమ్యునిష్టులు, దళిత బహుజనుల్ని, వారి ప్రత్యేక మతాలనీ , సంస్కృతులనీ గ్లోబలైజేషన్ దుష్పరిణామాలుగా వాదిస్తున్నారు. ఐక్యతకి ముప్పుగా భావిస్తున్నారు. నిజానికి గ్లోబలైజేషన్కీ వాటి ఫలితాలకీ కారణం ఆ కులాల వాళ్ళే. ఐక్యత అనే విశాలార్థం కల పదం ఎప్పుడూ కొద్దిమంది అభివృద్ధికి అనేక మంది అణచివేతకి కారణమవుతూ వచ్చింది. మాదిగ దండోరా ఆవిర్భావానికి కారణమదే. మాదిగల ప్రత్యేక అస్తిత్వ ప్రకటన సాంస్కృతికంగా మరుగుపడిపోయిన అనేక అంశాల్ని బయటికి తెచ్చింది. సంస్కృతి గురించి అగ్రవర్ణాలు కమ్యునిష్టు హిందూవాదులు వ్యక్తం చేసిన ఆధిపత్య కోణాల్ని బట్టబయలు చేసింది.
ఉదాహరణకి ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య చెప్పడానికి నిరాకరించాడనే కథని, కమ్యునిష్టులు కూడా యాధార్ధంగా స్వీకరించారు. ద్రోణుడిని వ్యాన్ గార్డ్ గా ఏకలవ్యుడిని కార్యకర్తగా చూసారు. అసలు ద్రోణుడు గిరిజనుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడమేమిటని ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యునిష్ట్ హిందూ అగ్ర వర్ణాలవారు తాము ప్రజలనుంచీ నేర్చుకోవడం కంటే వారికి నేర్పే వారిగానే తమని తాము చిత్రీకరించుకున్నారు. తాము గురుత్వం వహించారు. అందుకే జాంబ పురాణం వంటి ప్రత్యామ్నాయ పురాణాలని అధ్యయనం చేయలేదు. దళితులు అవిద్యావంతులనీ, అగ్రకులాలు విద్యావంతులనే స్టీరియో టైపుని బద్దలు చేయలేక పోయారు. డక్కలి వారికి చదవడం, రాయడం వచ్చని, వేద పండితులకి రానే రాదనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోనే లేదు. ఎందుకంటే అగ్రకులాలే ఙ్ఞానవంతులనేది వారి అభిప్రాయం. కానీ డక్కలి వారి దృష్టి వేరు. వాళ్ళు ఙ్ఞానాన్ని అగ్ర కులాలు తమ వద్దనుంచే దొంగిలించాయంటారు.
వలసవాద విద్య వల్ల అగ్రకులాలు తమరిదొక్కరిదే ఙ్ఞానమని, విద్య అనీ, మతమనీ ఇతరులందరినీ బ్రిటీషువారిలాగే సంస్కరించే వైట్ మ్యాన్స్ బర్డేన్ తమ మీద ఉందనీ భావించడం మొదలు పెట్టారు. ఇతర సంస్కృతుల్ని అంటరానివిగా చూడడం కాక, వాటిని మొత్తంగా నిర్మూలించి, వాటి స్థానంలో తాము సంస్కృతీ, మతం, నాగరికత అనుకున్నదాన్ని బలంగా ప్రతిష్టించాలని వారు భావించారు. ఈ భావనలకి అత్యాధునిక ప్రతిధ్వనులే గోగినేని బాబు, హెచ్చార్కే, రంగనాయకమ్మ. వీరిది నాస్తిక మతం. ఎథీస్ట్ ఫండమేంటలిజం. గోగినేని బాబు గద్దరు అనే ప్రజా గాయకుడు శివుడ్నీ, బసవడ్నీ సమానత్వ భావాలకి నిలయంగా భావించి పాట రాసినందుకు తీవ్రంగా నిందిస్తాడు. అదే సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతంలో అబ్స్ట్రాక్ట్ విశాల దృష్టినన్వేషిస్తాడు. హెచ్చార్కే కులమతాలు పోవాలనీ, తానే మైనారిటీననీ అంటాడు. రంగనాయకమ్మ బ్యాక్ టూ మార్క్స్ అంటుంది. అంటే తనలోనూ, మార్క్స్ లోనూ తప్ప అన్ని చోట్లా లోపాలే ఉన్నాయని అంటుంది. ఇంతవరకూ లోపాలు లేని వ్యక్తులు, వ్యవస్థలు, సంఘాలు బయట ఎక్కడా ఉదాహరణగా నిలచి లేవు కనుక తన హృదయంలోని మార్క్స్ కలగన్న సమాజం కోసం జపం చేస్తూ ఉండాలని బోధిస్తుంది. మొత్తం మీద వీళ్ళందరూ వాళ్ళు నిర్మించుకున్న అబ్స్ట్రాక్ట్ ఏకాంత మందిరంలో లోపాలు, పక్షపాతాలూ ఏవీలేని స్వచ్చమైన నాస్తిక మతంలో నాస్తికతనే దేవుడిగా ఆరాధిస్తూ జీవిస్తారు. ఈ స్వచ్చతని పాటించడం కోసం అన్ని మతాలకీ, అన్ని కులాలకీ సమదూరం పాటిస్తున్నట్టూ నటిస్తారు.
నట సామ్రాట్
నీ ఇంట్లో అరలెన్నో మరలెన్నో
నాకు తెలుసు నాకు తెలుసు
నీ పాత్ర చిలుం పట్టింది తోముకో
-మహాస్వప్న
*
తాజా కామెంట్లు