సంపన్న ‘దాసు’లు, ‘అసుర’ దేవతలు!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఇంతా చెప్పుకున్న తర్వాత కూడా, యయాతి కథ పశ్చిమాసియాలో జరిగిందనేది ఒక ఊహా లేక వాస్తవమా అన్న సందేహం అలాగే ఉండిపోతుంది. ఇందుకు కచ్చితమైన సమాధానాన్ని రాబట్టడం కష్టం. మహా అయితే మనం ఒకటి చేయగలం. అది: నిరంతర సంచారజీవితమూ, సమూహాల మధ్య ఘర్షణలు, వలసల నేపథ్యంలో పశ్చిమాసియా-భారతదేశాల మధ్య ఒక సంబంధాన్ని ఊహించడం. అప్పుడు వ్యక్తులు లేదా పాత్రల స్థానంలో పరిస్థితులు ప్రాధాన్యం వహిస్తాయి. ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ From Lineage to State అనే రచనలో క్రీ. వె. ప్రథమ సహస్రాబ్ది మధ్యలో గంగానదీ లోయలోని సమాజపు అమరికలను పురావస్తు ఆధారంగా చర్చించారు. నాటి పరిస్థితుల అవగాహనకు  ఆ చర్చ ఏమైనా తోడ్పడవచ్చేమో…

అంతకంటే ముందు, భిన్న వృత్తిదారుల మధ్య ఘర్షణలు ఎలా పురాణకథలకు ఎక్కాయో చెప్పుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

కొత్త వృత్తులు, లేదా ఆయా వృత్తులలో కొత్త పోకడలు పుంజుకున్న కొద్దీ పాత వృత్తులు, లేదా వాటి పద్ధతులు క్షీణముఖం పట్టడం ఇప్పటికీ మనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఉదాహరణకు, సాంప్రదాయిక వ్యవసాయం, చేతి వృత్తులు మనదేశం ఆధునికమయ్యే క్రమంలో కొత్త వృత్తులనుంచీ, కొత్త పోకడలనుంచీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ వచ్చాయి. ఆ పోటీలో అవి ఓటమి చెందడమూ చూస్తున్నాం. భిన్న వృత్తులవారు ఒకే సహజవనరును ఉపయోగించుకుంటున్నప్పుడు వారి మధ్య పోటీ అస్తిత్వ ఘర్షణగా మారుతుంది. అలాగే ఒక వృత్తి ప్రాబల్యం కలిగిన ప్రాంతాన్ని ఇంకో వృత్తి ప్రాబల్యం కలిగిన జనం ఆక్రమించుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వారి వృత్తికీ ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ రెండు రకాల సన్నివేశాలూ విడివిడిగానో, జమిలిగానో పురాణకథలకు ఎలా ఎక్కాయో జోసెఫ్ క్యాంప్ బెల్ Occidental Mythology లో చర్చించారు.

స్థూలంగా చెప్పుకుంటే పశుపాలన తొలి వృత్తిగానూ,  వ్యవస్థీకృత వ్యవసాయం మలివృత్తిగానూ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రారంభంలో పశుపాలకవృత్తి దారుల మధ్య, వ్యవసాయవృత్తిదారుల మధ్య ఆధిపత్యం కోసం ఘర్షణలు జరిగినా క్రమంగా అన్న పుష్కలత్వానికి ఎక్కువ దోహదం చేసే పురోగామి వృత్తిగా వ్యవసాయం వైపు పశుపాలకవృత్తిదారులు కూడా మళ్లడం కనిపిస్తుంది. ఈ పరిణామం భారతదేశం వెలుపలే కాక లోపల కూడా జరిగింది. ఒక కోణం నుంచి చూస్తే, మన పురాణ, ఇతిహాసాలు; పురాచరిత్ర ఈ వృత్తి పరివర్తన గురించే చెబుతున్నాయి. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఆ కోణంలోకి నేనిప్పుడు వెళ్ళను.

అయితే, ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మన పురాణాల్లో కశ్యపుడు, మొదలైన ప్రజాపతులు ఉన్నట్టే, బైబిల్ లోనూ ప్రజాపతులు ఉన్నారు. బైబిల్ పేర్కొన్న తొలి ప్రజాపతి పశుపాలక యూదుల అబ్రహాం అని ‘జనకథ’లో రాంభట్ల కృష్ణమూర్తి  అంటూ, (మధ్య ఆసియా, పశ్చిమాసియా పురాణకథలలో ఉన్నట్టుగా) మన పురాణాలలో పశుపాలన తొలినాళ్ళ సమాచారం లేదనీ, కనీసం పేర్లు అయినా మిగిలాయనీ అంటారు.

జోసెఫ్ క్యాంప్ బెల్ దగ్గరికి వద్దాం. సృష్టి ఎలా జరిగిందో చెప్పే పురాణకథలు ప్రపంచమంతటా ఉన్నాయి. యూదులకు సంబంధించిన పౌరాణిక, చారిత్రక ఆవృత్తు(cycles)లను నిర్మించిన మౌలిక పాఠాలు(basic texts) అయిదు ఉన్నాయనీ, ఈ అయిదూ క్రీ.వె. 9-4 శతాబ్దుల మధ్య కాలంలో అభివృద్ధి  చెందినవనీ క్యాంప్ బెల్ అంటారు. క్రీ.వె. 9వ శతాబ్దికి చెందిన సృష్టిగాథ(Genesis)ను యెహోవాయిస్ట్(జె) పాఠంగానూ, క్రీ.వె. 4వ శతాబ్దికి చెందిన సృష్టిగాథను పూజారుల పాఠంగానూ గుర్తించగా;  వీటి కంటే పురాతనమైన కథలో లేని  అంశాలు వీటిలోకి ఎలా ప్రవేశించాయో క్యాంప్ బెల్  వివరించారు. పురాణకథలను భౌతిక వాస్తవికతకు అనుగుణంగా ఎలా సవరిస్తారో, వాటిలో చారిత్రక అంశాలు ఎలా ప్రతిఫలిస్తాయో తెలుసుకోడానికి ఈ వివరాలు తోడ్పడతాయి.

 

యెహోవాయిస్ట్ పాఠంలో దేవుడైన యెహోవా ఒక రోజున భూమినీ, ఆకాశాన్నీ సృష్టించాడు. ఆ తర్వాత భూమినుంచి పొగమంచు పుట్టి భూమిని తడిపింది. అప్పుడు యెహోవా మట్టితో మనిషిని తయారు చేశాడు.  అతని ముక్కుపుటాలలోకి ఊపిరి ఊది ప్రాణం పోశాడు. తూర్పు దిక్కున గల ఈడెన్ లో ఒక తోటను కల్పించాడు. ఆ తోటలో మనిషిని ఉంచాడు. ఆ తోటలో ఆహ్లాదం గొలిపే అందమైన చెట్లను, మంచి ఆహారాన్ని అందించే మొక్కలను సృష్టించాడు. తోట మధ్యలో రెండు చెట్లను ప్రతిష్టించాడు. ఒకటి, జీవన వృక్షం; రెండోది, మంచి-చెడుల జ్ఞానవృక్షం. తోటను తడపడానికి ఒక నదిని సృష్టించాడు. ఆ నది ఆ తర్వాత నాలుగు పాయలు అయింది. యెహోవా ఆ మనిషిని తోటలో ఉంచి, దానిని సాగు చేస్తూ, సంరక్షిస్తూ ఉండమని చెప్పాడు. అయితే, ఏ చెట్టు ఫలాలనైనా నువ్వు స్వేచ్ఛగా తిను కానీ జ్ఞానవృక్షఫలాలను మాత్రం తినవద్దనీ, తింటే మరణిస్తావనీ హెచ్చరించాడు. ఆ తర్వాత యెహోవా అన్ని రకాల జంతువులను, పక్షులను సృష్టించాడు. నువ్వు వాటిని ఎలా పిలిస్తే అవే వాటి పేర్లు అవుతాయని మనిషికి చెప్పాడు. అంతలో, మనిషికి తోడు కావాలికదా అనుకున్నాడు. జంతువులు అతనికి తగిన తోడు అవుతాయని యెహోవాకు అనిపించలేదు. మనిషికి నిద్ర ఆవహిల్లేలా చేశాడు. ఆ తర్వాత అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి, ఆ ప్రదేశాన్ని తిరిగి మాంసంతో పూరించి, ఆ పక్కటెముకను స్త్రీగా మార్చాడు.  చివరికి వాళ్ళిద్దరూ వద్దన్న పని చేయడంతో వారిని తోటలోంచి బహిష్కరించాడు.

ఈ కథ పురుష ప్రాధాన్యాన్ని స్థాపిస్తున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆవిధంగా ఇది మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్య స్థాపనకు సంకేతం కూడా. ఈ పరివర్తనను సూచించే కథలు మన పురాణ, ఇతిహాసాలలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు, పురుషుడైన బ్రహ్మ మన పురాణాలలో సృష్టికర్త. ఆయనకు పుట్టిన సరస్వతే ఆయనకు అర్థాంగి అయిందని మన పురాణాలు చెబుతాయి. అయితే, మన పురాణ, ఇతిహాసకథల ప్రత్యేకత ఏమిటంటే, స్త్రీప్రాధాన్యాన్ని చెప్పే కథలూ వాటిలో ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ మళ్ళీ జగన్మాత సృష్టిగా ఈ కథలు చెబుతాయి. ఈ అంశంలోకి ఇప్పుడు మరీ లోతుగా వెళ్లలేం కనుక, యెహోవా కథ దగ్గరికి మళ్ళీవద్దాం.

Cain_and_abel_painting_a_Dennis_Van_Alsloot_paintings

యెహోవా సృష్టించిన ఆది దంపతులకు కెయిన్, ఎబెల్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కెయిన్ వ్యవసాయదారుడుకాగా, ఎబెల్ గొర్రెల కాపరి. కెయిన్ తన వ్యవసాయంలో ప్రథమ ఫలాన్ని, ఎబెల్ తన గొర్రెల మందలో ప్రథమఫలాన్ని తెచ్చి యెహోవాకు సమర్పించారు. కెయిన్ ప్రథమఫలాన్ని యెహోవా నిరాకరించి, ఎబెల్ ప్రథమఫలాన్ని  ఆమోదించాడు. దాంతో కెయిన్ కోపం పట్టలేకపోయాడు. తమ్ముణ్ణి చంపేశాడు. యెహోవా దానిని సహించలేకపోయాడు. ‘నువ్వు సాగుచేసుకునే భూమి క్రమంగా నిస్సారమైపోతుంది, తగినంత పంట నివ్వదు, నువ్వు ఈ భూమిమీద ఒక పలాయిత నేరస్థునిలా దేశదిమ్మరి జీవితం గడుపు’ అని కెయిన్ ను శపించాడు. కెయిన్ యెహోవాకు దూరమై సంచారజీవనులు ఉండే ఈడెన్ తూర్పు ప్రాంతానికి వెళ్లిపోయాడు.

విశేషమేమిటంటే, యూదులకు చెందిన ఈ తొలి పురాణగాథకు ప్రతిరూపాలు ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా, మెలెనేసియా, పొలినేసియా, మెక్సికో, పెరు, బ్రాజిల్ సహా వ్యవసాయ సంస్కృతి నెలకొన్న ప్రతిచోటా ఉన్నాయని క్యాంప్ బెల్ అంటారు. వాటన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్న అంశాలనూ, ప్రతీకలనూ ఆయన ప్రస్తావిస్తారు. వాటిలోకి లోతుగా వెళ్లలేం కానీ, యూదుల కథకు భిన్నంగా ఈ కథల్లో ఆది దంపతుల పతనం, లేదా పాపం, బహిష్కరణ అనేవి లేవు.  లేకపోగా ఈ కథలు భౌతికజీవితాన్ని వ్యతిరేకదృష్టితో కాక, సానుకూల దృష్టినుంచి నొక్కి చెబుతాయి. ఈవిధంగా వ్యవసాయసంస్కృతికి చెందిన కథ కాస్తా, ఎడారి జీవితానుభవం ఉన్న యూదుల దగ్గరికి వచ్చేసరికి మారిపోయింది. వ్యవసాయదారుడైన కెయిన్, గొర్రెల కాపరి అయిన ఎబెల్ ను హత్య చేసినట్టు చెప్పుకున్నాం. ఈ ‘హత్య’ అనేది వ్యవసాయసంస్కృతికి చెందిన కథలో కూడా ఉంది కానీ, అది మరణం నుంచి(విత్తనాలను పూడ్చి పెట్టడం, లేదా బలి ఇవ్వడం) పునరుత్పత్తి జరుగుతుందని చెప్పే క్రతు(ritual) సంబంధమైన హత్య.  వ్యవసాయ సంస్కృతి కథలో ఈ ‘హత్య’ ముందే జరిగితే, యూదుల కథలో తర్వాత జరిగింది.

ఇంతకీ యూదుల కథ సూచించే చారిత్రకాంశం ఏమిటంటే, వ్యవసాయదారుల దేశమైన కనాన్ ను గొర్రెలకాపరులైన యూదులు ఆక్రమించుకున్నారు. కనుక  పెద్దవాడైన వ్యవసాయదారుని కాక, చిన్నవాడైన గొర్రెల కాపరినే యూదుల దేవుడు సహజంగా అభిమానిస్తాడు. ఇక్కడే కాదు, ఈ సృష్టిగాథ పొడవునా పెద్ద కొడుకును కాదని, చిన్నకొడుకుకు ప్రాధాన్యమివ్వడం కనిపిస్తుందని క్యాంప్ బెల్ అంటారు. మన యయాతి కథలో కూడా, పెద్ద కొడుకు యదువుకు బదులు చిన్న కొడుకు పూరునికి యయాతి పట్టం కట్టడంలో ఈ కథా ఛాయలు ఏమైనా ప్రతిఫలిస్తున్నాయా అన్నది ఆసక్తికరం. యదువు పేరు పసుల కాపరులైన యాదవులను సూచిస్తోందనుకుంటే, పురులు వ్యవసాయదారులని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం.

అదలా ఉంచితే, క్రీ. వె. 2050కి చెందిన ఒక సుమేరియా పాఠం, పై యూదుల కథను తలకిందులు చేస్తోంది. యూదుల కథలో యెహోవా అనే పురుష దేవుడు ఉండగా, ఈ సుమేరియా కథలో  ఇనన్న అనే స్త్రీదేవత ఉంటుంది.  పై కథలో లానే దేవత అనుగ్రహం కోసం వ్యవసాయదారుడు, గొర్రెల కాపరి పోటీ పడతారు. అయితే దేవత వ్యవసాయదారునివైపే మొగ్గు చూపుతుంది. అంతే కాదు, నేను అతన్నే వివాహమాడతానని కూడా అంటుంది. అప్పుడు గొర్రెల కాపరి,

రైతు నా కన్నా ఎందులో ఎక్కువ, అతడు నాకు ఖర్జూరపు మద్యాన్ని పోస్తే, నేను అతనికి నా పసుపు పాలను పోస్తాను, నాకు అతడు రొట్టె పెడితే, నేను అతనికి తేనెలోలికే జున్ను పెడతాను, రైతు నా కన్న ఎందులో ఎక్కువ, నా దగ్గర లేనివి అతని దగ్గర ఏమున్నాయి?’

అని దేవతతో అంటాడు. దానికి దేవత,

ఎన్ని ఉన్నా నేను గొర్రెల కాపరిని పెళ్లాడను; పుష్కలంగా మొక్కలను పెంచుతూ, రాశుల కొద్దీ ధాన్యాన్ని పండించే రైతునే నేను పెళ్లి చేసుకుంటాను’

అంటుంది. వెయ్యేళ్ళ తర్వాత, ఎడారికి చెందిన పితృస్వామిక, సంచారజీవులైన యూదులు వ్యవసాయదారుల దేశాన్ని ఆక్రమించుకుని ఈ కథను తలకిందులు చేశారని క్యాంప్ బెల్ అంటారు.

చెప్పొచ్చేదేమిటంటే, పశుపాలకులైన వైదికార్యులకు, వ్యవసాయదారులైన అసురులకు మధ్య సంభవించిన శత్రుత్వం కూడా ఇలాంటిదే. కాకపోతే, ఈ శత్రుత్వ కారణాలు పైన చెప్పుకున్న పశ్చిమాసియా కథలలో ఉన్నంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మన పురాణాలలో పశుపాలన తొలినాళ్ళ సమాచారం లభించడం లేదన్న రాంభట్ల వారి మాటలో ఈ అస్పష్టతకు కారణం దొరకచ్చు.

ఇప్పుడిక రోమిలా థాపర్ పరిశీలనకు వెడదాం:  సింధు-గంగానదుల మధ్యప్రాంతంలో, గంగకు పశ్చిమంగా ఉన్న లోయలో కొన్ని పురావస్తు ఆధారాలు దొరికాయి. ఆ ప్రాంతాలలో క్రీ.వె. 2000 నాటికి జనావాసాలు ఉన్నట్టు అవి సూచించాయి. ముఖ్యంగా సింధు-గంగా నదుల ఎగువభాగంలో హరప్పా సంస్కృతి మలిదశకు చెందిన ఆనవాళ్ళు కనిపించాయి. అవి కాషాయ మృణ్మయపాత్రల (Ochre-Colour Pottery) సంస్కృతికి చెంది, పరస్పర సంబంధం లేని జనాలు ఆ ప్రాంతంలో ఉండేవారని వెల్లడించాయి. ఇదే ప్రాంతంలో క్రమంగా చిత్రిత మృణ్మయపాత్ర(Painted Grey Ware)ల సంస్కృతి పుంజుకుంది. దానికి సంబంధించిన జనావాసాలు పెద్ద సంఖ్యలో అవతరించాయి. బియాస్-సట్లెజ్ నదుల మధ్య జరిగిన తవ్వకాలు మలి హరప్పా, చిత్రిత మృణ్మయ పాత్రల సంస్కృతుల మధ్య కలయికను సూచించాయి. అంతేకాదు, పరోక్షంగానో, పలచబడో అప్పటికి ఇంకా హరప్పా సంప్రదాయాలు కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. సింధు, పంజాబ్, సరస్వతీనదీ ప్రాంతాలలో వివిధ తెగలవారు ఉన్నట్టు ఋగ్వేదం కూడా చెబుతోంది. ‘సప్తసింధవః’ అనే మాటతో ఋగ్వేదం ఈ ప్రాంతాలను సూచించింది.

ఈ చిత్రితమృణ్మయ పాత్రల సంస్కృతికి చెందినవారే వైదికార్యులు. ఋగ్వేదసమాజం ప్రధానంగా పశుపాలక సమాజమే అయినా పరిమితస్థాయిలో వ్యవసాయం కూడా ఉండేది. ఋగ్వేదం మలి భాగాలలో వ్యవసాయ చర్యల వర్ణన తరచుగా వస్తుంది. అయితే, ఋగ్వేదకాలానికి ముందునుంచే సింధు-గంగా ప్రాంతంలో వ్యవసాయదారులు స్థిరజీవితం గడుపుతున్నట్టు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి.  హరప్పా మలి దశకు చెందిన కాషాయమృణ్మయపాత్రల సంస్కృతికి చెందినవారు వీరే కావచ్చు. వీరిని అసురులుగా భావించారనడానికి శతపథ బ్రాహ్మణం అవకాశమిస్తోంది. అసురులు దేవతలకంటే నాగరికులనీ, వ్యవసాయపు మెళకువలు తెలిసినవారనీ, వారు ఇళ్ళు కట్టుకుని స్థిర నివాసానికి అలవాటుపడితే; దేవతలు రథాల మీద తిరుగుతూ సంచారజీవితం గడుపుతూ ఉంటారనీ శతపథ బ్రాహ్మణం(vi.8.1. 1-2) చెబుతోంది. ఏయే ఋతువులలో ఎలాంటి వ్యవసాయచర్యలు చేపట్టాలో అసురులకు కచ్చితమైన అవగాహన ఉండేదని చెబుతారు.

అయితే, వీరు వ్యవసాయదారులు కనుక వ్యవసాయదారులను శత్రువులుగా చూసే ఆర్యులు తమ మధ్య, పశ్చిమాసియాల అనుభవంతో వీరిని కూడా అసురులు అన్నారా; లేక ఆర్యులకంటే ముందే పశ్చిమాసియా అసురులు సింధు-గంగా మధ్యప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. పశ్చిమాసియా వ్యవసాయసంస్కృతికి పుట్టిల్లు అన్న సంగతి ప్రసిద్ధమే.

అదలా ఉంచితే, ఇరానియన్ పురాణ కథలు మన పురాణ కథలను తలకిందులు చేస్తాయి. ఎలాగంటే, ఇరానియన్ పురాణకథలలో దేవతలది అసురుల స్థానమైతే, అసురులది దేవతల స్థానం. ఇరానియన్ పురాణాలలో అసుర శబ్దం ‘అహుర’ అయింది. అలాగే, మన ‘దాస’ శబ్దం ‘దాహ’ అయింది. ఇరానియన్ భాషలో ఆ మాటకు మగవాడు, నాయకుడు అని అర్థం. అసురులు అనే మాట ఒకప్పుడు లేదా ఒక ప్రాంతంలో గౌరవవాచకమే కానీ నిందార్థకం కాదు. అలాగే దాస శబ్దం కూడా.  ఋగ్వేదం ఆర్య, దాస అనే రెండు వర్ణాలను పేర్కొంది. ఆర్యులకు భిన్నమైన రంగు(కృష్ణ వర్ణం) కలిగినవారిని సూచించడమే ఆ విభజనలో ఉద్దేశం. ఎందుకంటే, దాసులలో సంపన్నులు, దృఢమైన ఇళ్ళు కట్టుకుని ఉంటున్నవారు ఉన్నారని చెప్పి ఋగ్వేదం కొందరి సంపన్నుల పేర్లు కూడా ఇచ్చింది. సంపన్న దాసులైన బల్బూత, తారుక్ష, అంబస్త్య అనేవారిని బ్రాహ్మణులు స్తుతించడమూ కనిపిస్తుంది. బలవత్తరులైన కొందరు దాసులతో ఇంద్రుడు యుద్ధం చేసినట్టు కూడా ఋగ్వేదం చెబుతోంది. వారిలో శంబరుడు ఒకడు. విశేషమేమిటంటే, శంబరుని అసురునిగానూ పురాణాలు పేర్కొన్నాయి.  సింధు నది వెంబడి ‘అరియో’లు(ఆర్యులు), దాహలు(దాసులు) స్థిరపడ్డారని టాసిటస్ అనే చరిత్రకారుడు రాశాడు. దీనినిబట్టి  హరప్పా మలి సంస్కృతికి చెందిన వ్యవసాయ తెగలవారు ఈ దాసులు కావడానికీ అవకాశముంది.

సారాంశమేమిటంటే, అసుర, దాస శబ్దాలు మొదట్లో నిందార్థకాలు కావు. ఆ తర్వాతే క్రమంగా నిందార్థకాలుగా మారాయి.

మిగతా అంశాలు తర్వాత….

–కల్లూరి భాస్కరం

యూరపు వరకూ ఆర్యావర్తమే!

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

మళ్ళీ నేనిప్పుడు ఓ పెద్ద చిక్కులో పడిపోయాను…!!

తెలియకుండానే రాంభట్ల పురాచరిత్రాధ్యయనం అనే అఖాతంలోకి అడుగుపెట్టేశాను. దీనినుంచి ఎలా గట్టెక్కాలన్నది ఈ క్షణాన నా ముందు వేలాడుతున్న ప్రశ్న. ఎలాగూ మునిగాను కనుక ఇంకా లోపలికి వెళ్లిపోతే ఎప్పటికి ఒడ్డు చేరతానో నాకే తెలియదు. ఇందుకు బహుశా మరో ఇరవై వ్యాసాల వ్యవధి పడుతుందని నా అంచనా. అది కూడా ప్రాథమిక అంచనా మాత్రమే. కానీ నేను గత తొమ్మిది వ్యాసాలుగా యయాతి-దేవయాని-శర్మిష్టల కథ గురించి రాస్తున్నాను. ముందుగా ఆ కథను గట్టెక్కించవలసిన బాధ్యత నాకుంది.

విషయంలోకి వెడుతూనే  ఆ కథతో పాటు నన్ను నేను గట్టెక్కించుకునే ఉపాయాలను వెతుక్కోవడం తప్ప గత్యంతరం కనిపించడం లేదు…

అయితే, ఇంతటి చిక్కులోనూ నాకు అమితమైన సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించే అంశం ఒకటుంది. అది, రాంభట్ల కృష్ణమూర్తిగారి అధ్యయనం గురించి రాయడం! దశాబ్ద కాలం క్రితం కన్ను మూసిన ఆయన గురించి ఇప్పుడు ఎంతమంది తలచుకుంటున్నారో నాకు తెలియదు. పత్రికా రచయితగా, వ్యంగ్యచిత్రకారుడిగా ఆయన ప్రస్తావన ఎక్కడైనా వస్తూ ఉండచ్చు. కానీ ఆయనకు అత్యంత ఇష్టమైనదీ, ఆత్మీయమైనదీ అయిన పురాచరిత్ర లేదా పురామానవ చరిత్రాన్వేషణ గురించి ఎవరూ మాట్లాడుకుంటున్నట్టు లేదు. అదాయన ఒక తపస్సుగా సాగించిన ఓ కృతజ్ఞతారహిత (thankless) వ్యాసంగం. ‘నేను మాత్రమే’ దాని గురించి రాస్తుండడం నా సంతృప్తికీ, సంతోషానికీ కారణం.  ఇలా ‘నేను మాత్రమే’ ననుకోవడంలో కొంత అజ్ఞానమూ ఉంటే ఉండచ్చు. అందుకు మన్నించాలి. ఇప్పుడాలోచిస్తే, నాలాంటి ఒకరినో, పదిమందినో పాఠకులను సృష్టించుకున్న ఆయన తపస్సు వృథా కాలేదనీ అనిపిస్తుంది. ఒక గొప్ప తపః ఫలితమైన ఒక సృష్టి కాలం వెంబడి తన అస్తిత్వాన్ని పొడిగించుకోడానికి ఆయా కాలాలలో ఒక్క పాఠకుడు ఉంటే చాలదా అనిపిస్తుంది.

ప్రస్తుతానికి వస్తే…

పశ్చిమాసియా రంగస్థలమే భారతదేశానికి మారినట్టు రాంభట్ల గారి పరిశీలన వెల్లడిస్తుందని కిందటి వ్యాసంలో చెప్పుకున్నాం.  వైదికార్యులకూ, అసురులకూ మధ్య మొదలైన వైరం కూడా అందులో భాగం. ఇంతకీ ఆ వైరం ఎందుకు సంభవించింది అంటే, వారి ఆహారపు అలవాట్లలోనూ, ఆహారోత్పాదన పద్ధతుల్లోనూ ఉన్న తేడాల వల్ల. అది  మనుగడకు సంబంధించిన  పెనుగులాట.

ఎలాగంటే,  అసురులు వ్యవసాయదారులు. అలాగని వారు పూర్తిగా శాకాహారులు కాదు, మాంసమూ తింటారు. ఆవిధంగా వారు మిశ్రాన్న భోక్తలు.  వైదికార్యులు సంచారజీవనులైన  పశుపాలకులు. వారి ప్రధానాహారం పశుమాంసం. పశుమాంస భక్షణం వల్ల, పాలు, వెన్నల వల్ల వారు నిజానికి రాక్షసుల కంటే బలిష్ఠులు. వ్యవసాయదారులకు ఆహారాన్ని పండించే పంట పొలాలు, వైదికార్యుల దృష్టిలో ప్రధానంగా తమ పశుగణాలకు ఆహారాన్ని అందించే పచ్చిక పొలాలు మాత్రమే. వారు తమ ఆలమందలను పంట పొలాల మీదికి తోలేసరికి అసురులు సహజంగానే వారిని ప్రతిఘటిస్తారు. ఆవిధంగా మొదలైంది వారి మధ్య శత్రుత్వం.

అయితే, వైదికార్యులు సంచారజీవులు కనుక వారికీ, అసురులకూ మధ్య యుద్ధాలలో కూడా కొంత విరామం ఉంటుంది. సంచారజీవనం వల్ల అసుర భూమి కన్నా ఆర్యభూమి చాలా విశాలంగా కూడా ఉంటుంది. మైదానాలలో గడ్డి పుష్కలంగా దొరకడం వల్ల మందలు త్వర త్వరగా పెరిగాయి. అప్పటికి ఆర్యులు యూరప్ లో ఉన్నారు. అక్కడ మూడే కాలాలు: శరత్, హేమంత, వసంత కాలాలు. ‘నూరు శరత్తులు, నూరు హేమంతాలు, నూరు వసంతాలు జీవించు’ అని నేటికీ వైదికాశీర్వచనం. శరత్కాలం చివరిలో భూహిమం ప్రారంభమవుతుంది. భూహిమాన్ని ‘ground frost’ అన్నారు. అప్పుడు పచ్చగడ్డి మాడినట్లు అయిపోతుంది. దాంతో ఆర్యులు ఆలమందలను తోలుకుని సమీపంలోని అరణ్యాలకు వలసపోతారు. అక్కడ చర్మంతో కుటీరాలు నిర్మించుకుని ఉంటారు. ఆలమందల రక్షణ కోసం ఒక వసతీకీ, ఇంకొక వసతికీ మధ్య కొంత నిర్జనారణ్యాన్ని విడిచిపెడతారు. ఆ దశలోనే త్రేతాగ్నులు అవతరించాయి. వాటి గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.

వసంతాగమనంతోనే వైదికార్యుల నిర్బంధ అరణ్యవాసం ముగుస్తుంది. వారు యధాప్రకారం ఆలమందలను తోలుకుని నదీ మైదానాలకు తిరిగివస్తారు. అప్పటికి మైదానాల రూపం మారిపోతుంది. వ్యవసాయం పెరటి నుంచి పొలాలకు పాకుతుంది. అక్కడక్కడ కూరాకులు, కూరగాయ పాదులు పచ్చపచ్చగా ఎదిగివస్తాయి. ఆ దృశ్యం వైదికార్యులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ మందలను పొలాల మీదికి తోలతారు. అలా వ్యవసాయదారులతో వారి ఘర్షణ ప్రారంభమవుతుంది.

aurora-borealis-by-ship-2-thomas-kolendra

అదలా ఉండగా, మధ్య ఆసియాలో రష్యా, అజర్బైజాన్, ఇరాన్, కజక్ స్తాన్, తుర్క్ మెనిస్తాన్ లను ఆనుకుని ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక జలాశయం ఉంది. అది ఎంత పెద్ద దంటే, దానిని సముద్రంగానే చెప్పుకున్నారు. అదే- కాస్పియన్ సీ. దీనిని మన పూర్వులు కాశ్యపీ సముద్రం అన్నారు. ఆ పేరునుబట్టి ఆ జలాశయం పరిసర ప్రాంతాన్ని కూడా కాశ్యపి అంటూ వచ్చారు. కాశ్యపి అన్నా భూమే. విశేషమేమిటంటే, కాశ్యపి ఒకప్పుడు  యూరోపియన్లు, నిగ్రాయిడ్లు, మంగోలాయిడ్లు వంటి అనేక జాతులవారికి, భాషల వారికి ఆవాసం. ఆనాడు జాతులంటే వర్ణాలే. యూరోపియన్లది తెలుపు రంగు, నిగ్రాయిడ్లది నలుపు రంగు, మంగోలాయిడ్లది పసుపు రంగు. సంస్కృతం తోబుట్టువులైన ఇండో-యూరోపియన్ భాషలు; మ్లేచ్ఛ భాషలైన హిబ్రూ, అరబ్బీ, అరమాయిక్, ఆగద, అసుర, ఈజిప్టు భాషలు; చీనా, జపాన్, మంగోలు, కాకస పర్వత భాషలు మాట్లాడేవారు కాశ్యపిలో ఉండేవారని రాంభట్ల ‘జనకథ’లో అంటారు. అందుకే ఈ మూడు రకాల భాషల్లోనూ కొన్ని సామాన్య పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, భూమిని అరబ్బులు ‘అర్దున్’ అంటారు. జెర్మన్లు ‘ఎర్దీ’ అంటారు. ఇంగ్లీష్ వారు ‘ఎర్త్’ అంటారు. వేదభాష ‘రజ’ అంది.

 

అదలా ఉంచితే, పశ్చిమ పండితుల ప్రకారం ‘కస్’ అనే ధాతువునుంచి కశ్యప శబ్దం పుట్టింది. ఆ ధాతువునుంచే ఇంకా మరికొన్ని మాటలు పుట్టాయి. వాటిలో ‘కుశ’ ఒకటి. వైదికార్యులకు కుశ చాలా పవిత్రమైనది. దానికే ‘దర్భ’అనీ, ‘బర్హిస్సు’ అనీ పేర్లు. ఇంకా విశేషంగా, కస్ ధాతువునుంచే తెలుగు మాట అయిన ‘కసవు’ పుట్టిందని రాంభట్ల అంటారు. గడ్డి అనే అర్థం కలిగిన ‘పులు’, ‘పూరి’  కసవుకు సమానార్థకాలు. ఇవి పుష్కలంగా ఉన్న కాశ్యపిలోనే పశుపాలన పెరిగి పెద్దదై ఉంటుందని రాంభట్ల  ఊహ.  క్రమంగా కాశ్యపిలో స్థిర నివాసం ఉండగల అవకాశం లోపించడంతో కాశ్యపీజనం కొత్త భూముల్ని వెతుక్కుంటూ వలసపోయారు. ఆ వలసల్లో కొన్ని పశ్చిమాసియాలో చరిత్రను సృష్టించాయి.

మనం ఇంతకుముందు ఒక వ్యాసంలో కశ్యప ప్రజాపతి గురించి చెప్పుకున్నాం. దేవతలు, దైత్యులు, దానవులు ఆయన సంతానమే నని కూడా చెప్పుకున్నాం. కశ్యపుని పేరు కాశ్యపిని తలపిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్వదేవులు అనే పేరు కూడా ఉన్న దైత్యదానవులే అసురులు. పశుపాలక దేవులైన వైదికార్యులకూ, ఈ అసురులకూ మధ్య యుద్ధాలు కాశ్యపిలోనే ప్రారంభమయ్యాయి. బలవంతులైన వైదికార్యులు యుద్ధాలలో పై చేయిని చాటుకుని అసురులను పశ్చిమాసియా ఆవలలోకి తరిమేసి ఉంటారని రాంభట్ల ఊహ.

ఆవలు అంటే చిత్తడి నేలలు. ఆ నేలల్లో దోమలు, తేళ్ళ బాధ ఎక్కువ. ఒకప్పుడు నైలు, యూఫ్రటిస్, టైగ్రిస్(ఈ రెండు నదులనూ సంస్కృతంలో వరుణ, తిగృథ అన్నారు) నదీ ముఖద్వారాలు ఆవలుగా ఉండేవి. అసురులు కాందిశీకులుగా ఈ ఆవలకు వలసవచ్చారు. అక్కడి దోమలు, తేళ్ళ బాధను సహిస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. ఆ ఆవల్లో రకరకాల తుంగ మొలిచేది. ఆ తుంగ ముస్తల కోసం వరాహాలు వచ్చి నీటిని ఓడ్చి పొడి భూమిని పైకి తేల్చేవి. ఆవిధంగా, నేల దున్ని సాగించే వ్యవసాయానికి వరాహాలు ఆదిగురువులయ్యాయి. ఆవల్లో చేపలు కూడా పుష్కలంగా దొరికేవి. అడవి పందులు, జలపక్షుల మాంసం దొరికేది. ఈ అన్న పుష్కలత్వం వల్ల, అది కలిగించిన స్థిరతవల్ల ఇక్కడికి వలస వచ్చిన జనం గొప్ప సంస్కృతిని నిర్మించారు.  నైలు నది ఆవలలోని జనం ఈజిప్టు(ఐగుప్త) సంస్కృతినీ, మేరువులనూ సృష్టిస్తే; మెసపొటేమియాగా పిలవబడిన యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల ఆవల్లోని జనం సుమేరు సంస్కృతిని సృష్టించారు. మన పురాణాలలోని వరాహావతార, మత్స్యావతార కథలకు ఈ ఆవలే ఆధారమని రాంభట్ల అంటారు. ఇనుము కరిగించడం నేర్చింది కూడా ఈ పశ్చిమాసియా లంక జనమే నని ఆయన అంటారు. పశ్చిమాసియా ఆవలలో పదివేల ఏళ్లక్రితం ‘సుబరు’ లనే గొప్ప సంస్కారులు ఉండేవారని, వారే ‘శంబరు’లు అయుంటారనీ ఆయన అభిప్రాయం. పశ్చిమాసియాలో శంబరుల చారిత్రక పాత్ర చాలా ఉంది. అక్కడ వారు మారి, అస్సూరు, నినవే అనే నగరాలను నిర్మించి రాజ్యాలు చేశారు. మన పురాణాలలో శంబరుడు ఒక అసురుడు, మన్మథుడికి శంబరారి అనే బిరుదు ఉంది. పశ్చిమాసియా నుంచి  శంబరులు భారతదేశానికి వచ్చినట్లు దాఖలాలు ఉన్నాయి.

 

పశుపాలకులకు, వ్యవసాయదారులకు మధ్య యుద్ధాలు కాశ్యపి పరిసరాలలోనే కాక ఆఫ్రికా ఖండంలో కూడా జరిగాయి. ఆ వివరాలు అన్నిటిలోకీ వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం.  అదలా ఉంచితే, రాంభట్ల గారి పరిశీలనలు పశుపాలన, వ్యవసాయాల మధ్య శత్రుత్వాన్నే కాక; పశుపాలననుంచి వ్యవసాయానికి  జనం పెద్ద ఎత్తున మళ్లిన క్రమాన్నీ; వ్యవసాయం వల్ల ఏర్పడిన స్థిరజీవనాన్నీ, స్థిరజీవనం నుంచి రాజ్యమూ, సంస్కృతీ పుట్టిన విధానాన్నీ చర్చలోకి తీసుకొస్తున్నాయి. ఈ పరిణామక్రమం మన పురాణ ఇతిహాసాలలోనే కాక ప్రపంచ పురాణ ఇతిహాసాలలో కూడా ప్రతిఫలించింది.  అంతేకాదు, ఈ క్రమంలోనే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి; గణదశనుంచి జనదశకు మళ్ళడంవంటి అనేకానేక పరిణామాలు  సంభవించాయి. రాంభట్లతో పాటు, లూయీ హెన్రీ మోర్గాన్, జార్జి థామ్సన్, జోసఫ్ క్యాంప్ బెల్ తదితర దిగ్దంతుల పరిశీలనలను కూడా కలుపుకుని చెప్పుకోవలసిన మహత్తర విషయాలు ఇవన్నీ. అవకాశాన్ని బట్టి ముందు ముందు వాటి లోతుల్లోకి వెళ్లచ్చు.

Rambatla Krishna Murthyఅంతకంటే విశేషంగా రాంభట్ల పరిశీలనలు, ఆర్యావర్తం గురించిన మన భావనలను మనదేశం నుంచి సుదూర పశ్చిమానికి పొడిగిస్తున్నాయి. యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియాలను కూడా ఆర్యావర్తంలోకి తీసుకొస్తున్నాయి. వేదాలలో ఉన్న పురా చరిత్రను, పురా మానవ పరిణామ చరిత్రను పుష్కలంగా తవ్విపోస్తున్నాయి. రాంభట్ల ప్రకారం, మన పురాణాలలోని కొన్ని కథలు, పాత్రల మూలాలు భారతదేశం వెలుపల ఉన్నాయి. యయాతి కథ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. సుకన్య-చ్యవనుల కథ, అశ్వనీ దేవతల ఉదంతం మరో రెండు ఉదాహరణలు. తెలుగువారమైన మనకు ప్రత్యేకించి ఆసక్తి గొలిపే విషయం ఏమిటంటే,  రాంభట్ల పరిశీలనలు మన సంబంధాలను మెసపొటేమియాలోని సుమేరుకు తీసుకువెడుతున్నాయి.

భారతదేశంలోని సప్తసింధు ప్రాంతానికి రావడానికి ముందు వైదికార్యులు ఉత్తర ధ్రువాన్ని, యూరప్ ఖండాన్ని, కాశ్యపిని, పశ్చిమాసియాను చుట్టబెట్టి వచ్చారని రాంభట్ల గారు మాత్రమే అనడంలేదు. ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ కూడా వేదరుషులకు ఉత్తరధ్రువం తెలుసుననీ, దీర్ఘ హేమంత నిశాంతంలో ఆరోరా బొరియాలిస్ ను చూసినవారు తప్ప ఎంతటి భావుకులైనా వేదాలలోని ఉషోసూక్తులను చెప్పడం కష్టమనీ అన్నట్టు రాంభట్ల ఉటంకిస్తారు. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే, తూరుపు దిక్కున కొన్ని రోజులపాటు రంగులు నాట్యమాడతాయి. ఆ తర్వాత కాంతిమంతమైన ఆకుపచ్చరంగు ఆకాశమంతా అలముకుంటుంది. ఈ ఆకుపచ్చరంగు క్రమంగా తగ్గిన తర్వాత ఎర్రని బింబం వస్తుంది. ఈ ఆకుపచ్చని రంగును సూర్యుని గుర్రాలు అన్నారు వేదరుషులు. ఆ గుర్రాలకు హరిదశ్వాలని పేరు. ఆ తర్వాత కనిపించే ఎర్రని బింబం సూర్యసారథి అరుణుడు. ఆ తర్వాత అసలు సూర్యబింబం దర్శనమిస్తుంది. ఈ అందమైన వర్ణన ప్రత్యక్షంగా చూసినవారు, వారి నోట విన్నవారు తప్ప మరొకరు చేయలేరని తిలక్ పండితుడు అంటాడు. అరుణుడు అనే మాట వర్ణవ్యత్యయం వల్ల పౌరాణికుల నోట అనూరుడు అయింది. దాంతో దానికో కథ పుట్టింది. అనూరుడు అంటే తొడలు లేనివాడు అనే అర్థం చెప్పారు.

రాంభట్ల ‘వేదభూమి’లో రాసిన వాక్యాలనే ఉటంకించుకుంటే; వైదికార్యులు గుర్రాలు, రథాలు ఎక్కి ఆలమందలను తోలుకుంటూ కైబర్, బొలాన్ కనుమల గుండా సప్తసింధు ప్రాంతానికి చేరారు. కైబర్, బొలాన్ కనుమల గుండా వచ్చినప్పుడు ఆ ప్రాంత జనం అయిన ఫక్తులు, బొలాన్ లు కూడా వారి వెంట సప్తసింధు ప్రాంతానికి వచ్చారని రాహుల్ సాంకృత్యాయన్ అంటాడు. ఋగ్వేద మంత్రాల్లో ఫక్తులు, బొలాన్ ల ప్రస్తావన ఉంది. పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ లలోని ఫక్తులు లేక పఠాన్ల గురించి ఇంతకుముందు ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. ఇక్కడికి రాకముందునుంచీ వైదికార్యులు  యజ్ఞాలు చేసేవారు కనుక బళ్ళమీద అగ్నిహోత్రాలను కూడా పెట్టుకుని వచ్చారని మార్క్సిస్టు పండితుడు శ్రీపాద అమృత డాంగే అంటాడు…

ఈ చిన్న వ్యాసంతో  రాంభట్లగారికి న్యాయం చేయలేకపోయాయని నాకు తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు ఆయన  పురాచారిత్రాధ్యయనం అనే అఖాతంలో నేనిక ఆట్టే లోతుకు వెళ్లలేను. ఇక అత్యవసరంగా పైకి వచ్చేయాలి. యయాతి కథ దగ్గరికి వెళ్ళాలి. వైదికార్యులకు, అసురులకు పశ్చిమాసియాలోనే మొదలైన యుద్ధాలు లేదా సంబంధాలు  భారతదేశానికి బదిలీ అయాయని చెప్పడమే ఈ పరిశీలన అసలు లక్ష్యం. దీని గురించి చరిత్రకారులు ఏమంటున్నారో…తర్వాత…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

యయాతి కథావేదిక పశ్చిమాసియా!?

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

మనం పొగమంచుకు దూరంగా ఉండి చూస్తున్నప్పుడు అది ఆవరించిన వస్తువులు స్పష్టంగా కనిపించవు. పొగమంచులోకే మనం వెళ్ళడం ప్రారంభించామనుకోండి…అప్పుడవి స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో మనం మన భౌతిక నేత్రాల సాయమే తీసుకుంటాం తప్ప అతీంద్రియదృష్టిని ఆశ్రయించం.

పురాణ, ఇతిహాసకథల్లోకి వెళ్ళడం కూడా అలాగే ఉంటుంది. వాటిని కాలమనే పొగమంచు కప్పుతుంది. అందువల్ల అవి అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ  అస్పష్టతను తొలగించే విషయంలో స్థూలంగా రెండు వైఖరులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది, ఆ కథలను కప్పిన పొగమంచుతో, అందువల్ల ఏర్పడిన అస్పష్టతతో సహా వాటిని ఉన్నవున్నట్టుగా తీసుకోవడం. వాటిని భౌతికవాస్తవికత అనే కొలమానంతో హేతుదృష్టినుంచి చూడవద్దని చెప్పడం. మరి అస్పష్టతను తొలగించడం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎంత పనికిరాదని శాసించినా హేతుదృష్టి చికాకు పెడుతూనే ఉంటుంది. దానినుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం…భౌతికనేత్రం స్థానంలో అతీంద్రియనేత్రం తీసుకువచ్చి ఆ కథలను భౌతికవాస్తవికతనుంచి వేరుచేసి అతీంద్రియ మార్గం పట్టించడం. మతమూ, విశ్వాసమూ, ఆ రెండూ ప్రాబల్యం వహించే సంప్రదాయమూ ఈ మార్గాన్ని నిర్మించి దానికి పెట్టని కోటలా కాపలా కాస్తుంటాయి.

అయితే, అవి మీ అన్వేషణను అడ్డుకోవు. కాకపోతే, మీ అన్వేషణ మీ ఇష్టానుసారం సాగడానికి వీల్లేదు; మేము  అనుమతించిన పరిధిలోనే సాగాలని శాసిస్తాయి. ఇంతకు ముందే ఒకసారి చెప్పినట్టు ఈ సంప్రదాయ శాసనానికి తలవంచడం శతాబ్దాల కాలగతిలో ఎంత అసంకల్పితచర్యగా మారిపోయిందంటే, పురాణ ఇతిహాసకథలను పరిశీలించేటప్పుడు మన భౌతికనేత్రం దానంతట అదే మూసుకుపోయి, అతీంద్రియనేత్రం అప్రయత్నంగా తెరచుకుంటుంది.

కవిత్రయభారత (టీటీడీ ప్రచురణ) వ్యాఖ్యాతలు పైచూపులకే స్పష్టంగా కనిపించే కొన్ని వైరుధ్యాలను ఎలా దాటవేశారో వెనకటి వ్యాసాలలో చెప్పుకున్నాం. అదే ఇందుకు  తార్కాణం.

రెండో మార్గం, పైన చెప్పినట్టు పొగమంచు ఆవరించిన వస్తువులను స్పష్టంగా పోల్చుకోడానికి మన మామూలు భౌతికనేత్రాన్ని ఉపయోగించుకోవడం. జాగ్రత్తగా గమనిస్తే, ఇది మార్గాలలో తేడాయే తప్ప చూసే వ్యక్తులలో తేడా కాదని మీకే అనిపిస్తుంది. నేనే కాదు, మీరైనా సరే, భౌతికనేత్రంతో పురాణ ఇతిహాసకథలను చూడదలచుకుంటే అవి మీకు భిన్నంగానూ, మన సాధారణబుద్ధికి అర్థమయ్యేవిలానూ కనిపిస్తాయి. వాటిలోని పాత్రలు మనలానే రక్తమాంసాలు, ఈతిబాధలు, రాగద్వేషాలు వగైరాలు కలిగిన మనుషుల్లానే కనిపిస్తాయి. ఒకానొక కాలంలో వాళ్ళు కూడా మనలానే జీవించారనిపిస్తుంది. అదే మీరు అతీంద్రియనేత్రంతో చూడదలచుకుంటే, ఆ పాత్రలు భూమికీ, ఆకాశానికీ మధ్య గాలిలో ఈదుతున్నట్టు కనిపిస్తాయి. మీరు ఏ నేత్రంతో  చూడదలచుకున్నారనేది మీ ఇష్టం.

అంతిమంగా చెప్పాలంటే, ఇది ‘ఛాయిస్’ కు సంబంధించిన ప్రశ్న.

పురాణ ఇతిహాసకథలను కప్పింది కాలం అనే పొగమంచు కనుక, ఎంతో కాలంగా ఆ పొగమంచు అలాగే ఉండిపోయింది కనుక; అది కప్పిన కథలు, పాత్రలు అస్పష్టంగానే కాక మనకు అపరిచితాలుగా కూడా మారిపోతాయి. అప్పుడు వాటిని చూడడానికి భౌతికనేత్రంతోపాటు ఇతరేతర వనరులు కూడా అవసరమవుతాయి. అయితే, అన్వేషణే మన వంతు తప్ప ఆ అన్వేషణ రెండు రెళ్ళు నాలుగన్నంత కచ్చితమైన ఫలితాలను ఇస్తుందన్న హామీ ఏమీ ఉండదు. అయితే, ఒక్కొక్కసారి ఫలితం కన్నా అన్వేషణే ఉత్తేజకరంగానూ, ఉత్సాహవంతంగానూ ఉంటుంది. ఇంకో సంగతి ఏమిటంటే, ఈ అన్వేషకుని స్థానంలో ఇప్పుడు నేను ఉండచ్చు కానీ, ఒకవేళ మీరే ఉంటే నేను ఎదుర్కొనే ప్రశ్నలనే మీరు కూడా ఎదుర్కొంటారు.

కనుక,  అసలు విషయంలోకి వెడుతూ అన్వేషణలో ఉండే మజాను కలసి ఆస్వాదిద్దాం.

   ***

యయాతి-దేవయాని-శర్మిష్టల కథను ఒక స్పష్టమైన చారిత్రక సందర్భంలో ఇమడ్చగలమా అనే ప్రశ్న వేసుకుని, ముందుగా మహాభారతం ఆధారంగానే యయాతి ఎంత ప్రాచీనుడో అంచనా వేయడానికి ప్రయత్నించాను. అందులో ఇచ్చిన రాజుల పట్టికలో, యయాతినుంచి పాండవుల మునిమనవడైన జనమేజయుని వరకూ (జనమేజయుని వరకే ఎందుకంటే, అతడే మహాభారతప్రసిద్ధులైన రాజులలో చివరివాడు) లెక్కిస్తే 26 తరాలు లెక్కకు వచ్చాయి. ఈ పట్టిక ఎంతవరకూ ప్రామాణికం, ఈ మధ్యలో కొన్ని తరాలు ఎగిరిపోయి ఉండే అవకాశం లేదా అన్న అనుమానానికి కచ్చితంగా అవకాశముంది కనుక; మొత్తం మీద యయాతి అతి ప్రాచీనుడని గ్రహించే మేరకే దీనిని తీసుకుందాం.

యయాతి ప్రాచీనతను స్థాపించే అంతకంటే ముఖ్యమైన వివరం ఏమిటంటే, అతని తండ్రి నహుషుడు ఇంద్రపదవికి ఎన్నిక కావడం. ద్వీప, అరణ్యాలతో కూడిన భూమండలాన్ని అంతటినీ తన బాహుబలంతో పాలించిన నహుషుడు నూరు యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడని మహాభారతం చెబుతోంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ‘వేదభూమి’ అనే వ్యాససంపుటిలో ’వేదకాలపు ఆయగా’ర్ల గురించి రాస్తూ ఇంద్రపదవికి ఎన్నిక కావడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్పారు:  అతడు నూరు యాగాలు చేసినవాడై ఉండాలి. అందుకే ఇంద్రుడికి ‘శతక్రతు’ వనే బిరుదు ఉంది. అతడు బలిష్ఠుడై ఉండాలి. మంచి ధనవంతుడు, విద్వాంసుడు అయుండాలి. మూడేళ్లకు మించిన ఆహారపు నిల్వలు ఉన్నవాడై ఉండాలి. అలాంటివాడే సోమపానానికి కూడా అర్హుడు. ఒక కొడుకును కని ఉండాలి. జుట్టు నెరిసి ఉండకూడదు!

అయితే, ఇన్ని అర్హతలూ ఉన్న ఇంద్రుడు సమాజ సేవకుడే కానీ, నిరంకుశప్రభువు కాదు. ఇంద్రుడు కాక మరో అయిదుగురు సమాజసేవకులు ఉన్నారు. వారు: అగ్ని, యముడు, వరుణుడు, నాసత్యులు, అంటే అశ్వినీ దేవతలు. సేవకులలో ఇంద్రుడిది ప్రథమస్థానం.  గోగణాన్ని దొంగల బారినుంచి రక్షించడం, ఇతరుల గోగణాన్ని స్వాధీనం చేసుకోవడం, యుద్ధాలకు నాయకత్వం వహించడం ఇంద్రుడి బాధ్యతలు. అగ్ని యజ్ఞ నిర్వాహకుడు. యముడు గణధర్మ పరిరక్షకుడు. వరుణుడు జలవనరులను నిర్వహించేవాడు. ఇక అశ్వినీ దేవతలు ఇద్దరిలో అశ్విని నేత్రవైద్యుడు. అతనితోపాటు ఉండే అశ్విపుడు భూతవైద్యుడు. సమాజసేవకులనే అర్థంలో ఈ ‘ఆయగా’ర్ల సంప్రదాయం నిన్న మొన్నటి వరకూ కొనసాగింది. కాకపోతే వీరి సంఖ్య పన్నెండుకు పెరిగి ‘పన్నిద్దరు ఆయగార్లు’ అనే మాట ప్రసిద్ధిలోకి వచ్చింది. చర్మకారులు, కుంభకారులు(కుండలు చేసేవారు), వడ్రంగులు, కమ్మరులు, రజకులు వగైరాలు ఈ జాబితాలోకి వస్తారు. సంఖ్య పెరగచ్చు కానీ, ఏదో ఒక రూపంలో ఈ వ్యవస్థ ఇప్పుడూ ఉంది.

ప్రస్తుతానికి వస్తే; మహాభారతం, ఆదిపర్వంలో చెప్పిన రాజుల పరంపరలో ఇంద్రపదవిని నిర్వహించిన రాజుగా నహుషుడు ఒక్కడినే చెప్పారు. కనుక అతడు అతి ప్రాచీనుడయుండాలి. ఎందుకంటే, అప్పటికి రాజరికాన్ని ఇంద్రపదవితోనే సంకేతించేవారు. ఆ తర్వాత ఇంద్రుని ఒక దేవుడిగా మార్చి రాజును అతనినుంచి విడదీశారు. ఇంద్రుడే కొందరిని రాజుగా నియమించడం కూడా కొన్ని ప్రారంభకథలలో కనిపిస్తుంది. వసురాజు ఒక ఉదాహరణ.

నహుషుని నుంచి కొంచెం వెనక్కి వెడితే, అతని తాత పురూరవుడు! పురూరవునితోనే ఈ రాజుల పరంపర ప్రారంభమవుతుంది.  మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసంలోని కౌరవవంశ వివరణ ఘట్టాన్ని పరిశీలిస్తే, ఒక రాజుల పరంపర విచ్ఛిన్నమైన తర్వాత, మనువు పుత్రిక అయిన ఇలకు, చంద్రుడి కొడుకైన బుధుడికి పుట్టిన పురూరవునితో ప్రస్తుత రాజుల పరంపర ప్రారంభమైనట్టు అర్థమవుతుంది.  అంటే, మనువు పుత్రుడి వైపునుంచి కాకుండా పుత్రిక వైపునుంచి ఈ రాజుల పరంపర మొదలైందన్నమాట. అది కూడా చంద్రుడి కొడుకైన బుధుడి ద్వారా.  ఇక్కడ బుధుడికి కన్నా, ఇలకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది.  ఈ పరంపరకు చెందిన రాజులను ‘ఐలులు’ అని కూడా అనడం దానినే సూచిస్తుంది. ఇది మాతృస్వామ్యాన్ని సంకేతిస్తోందా అని నాకో అనుమానం. ఇక్కడ చంద్ర సంబంధంలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటే, చంద్రుడు పైరు పంటలకు రాజు. ఆ విధంగా చూసినప్పుడు ఈ రాజుల చంద్ర సంబంధం వీరి వ్యవసాయ సంబంధాన్ని సూచిస్తూ ఉండచ్చు. ఇవన్నీ ప్రత్యేకంగా మరింత వివరంగా చెప్పుకోవలసిన విషయాలు కనుక వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి వద్దాం.

ఊర్వశీ-పురూరవుల కథ పురాణప్రసిద్ధంగా కన్నా కావ్యప్రసిద్ధంగా మనకు బాగా తెలుసు. కవులు ఆ పాత్రల చుట్టూ గొప్ప కాల్పనిక ప్రణయ వలయాన్ని సృష్టించడం తెలుసు. కాళిదాసు విక్రమోర్వశీయం ఊర్వశీ-పురూరవుల కథే. ఈ కథకు కోశాంబీ అన్వయం అద్భుతంగానే కాక,  ‘షాకింగ్’ గా కూడా ఉంటుంది. దాని గురించి చెప్పుకునే సందర్భం ముందు ముందు తప్పకుండా వస్తుంది. అయితే,  మహాభారతంలో చెప్పిన పురూరవుడు మునుల దృష్టిలో రాజుగా ఒక పెద్ద వైఫల్యం, ఒక తప్పుడు ఎంపిక. ధనాశతో బ్రాహ్మణోత్తముల ధనాలను అపహరించాడని అతనిపై ఆరోపణ. ఆ ఆరోపణను విచారించడానికి వచ్చిన మునులను కలసుకోడానికి కూడా అతను నిరాకరిస్తాడు. పైగా వారిని ఎగతాళి చేస్తాడు. దాంతో వారు అతనిని ఉన్మత్తుడివి కమ్మని శపిస్తారు. అప్పడతను పదవీచ్యుతుడై ఊర్వశితోపాటు గంధర్వలోకంలో ఉండిపోతాడు. వారిద్దరికీ కలిగిన ఆరుగురు కొడుకులలో పెద్ద అయిన ఆయువుకు పుట్టినవాడే నహుషుడు.

01Kach

ఆయువు గురించి వివరాలు చెప్పలేదు కానీ, తాత పురూరవుడితో పోల్చితే నహుషుడు రాజుగా కొంత ఆమోదాన్ని పొందినట్టు కనిపిస్తాడు. కానీ  విచిత్రంగా అతడు కూడా మునులను అవమానించినందుకు పదవీచ్యుతుడై, వారిచ్చిన శాపఫలితంగా కొండచిలువ అవుతాడు. పురూరవుడూ, నహుషుడూ కూడా ఇలా ఇంచుమించు ఒకే విధంగా పదవీచ్యుతులు కావడం ఎందుకు సంభవించిందని ప్రశ్నించుకుంటే రెండు సంభావ్యాలు(probabilities) కనిపిస్తాయి.  వీరిద్దరూ రాచరికం ఒక వ్యవస్థగా పూర్తిగా కుదురుకోని కాలానికి చెందినవారు అయుండచ్చు. అది కూడా వీరి ప్రాచీనతకు సాక్ష్యం కావచ్చు. రాజుపై ఒక అంకుశంగా వ్యవహరించే ప్రజాప్రాతినిథ్యవ్యవస్థను ఇక్కడ మునులు సంకేతిస్తూ ఉండచ్చు. మొత్తం మీద అప్పటికి ఇంకా రాచరికం ప్రయోగాత్మకదశలో ఉండి ఉండవచ్చు. రెండో సంభావ్యత- అప్పటికే రాచరికవ్యవస్థ కుదురుకునీ ఉండచ్చు. ఆ వ్యవస్థను ఉల్లంఘిస్తూ స్వతంత్రతను చాటుకుని శిక్షపొందినవారు కనుక వీరి గురించి ప్రత్యేకంగా చెప్పి ఉండవచ్చు.

అదలా ఉంచితే, రాంభట్ల వారి పరిశీలన యయాతి కథను మరింత ఆసక్తికరమైన సన్నివేశంలోకి తీసుకువెడుతోంది. ఆయన అనుమానం ప్రకారం,  యయాతి కథ జరిగింది అసలు భారతదేశంలోనే కాదు, పశ్చిమాసియాలో!

ఇంతకుముందు ఒక వ్యాసంలో దీని గురించి క్లుప్తంగా ప్రస్తావించాను. ఒకింత వివరాలలోకి వెడితే, ‘నహుషుడు’ అనే మాట మ్లేచ్ఛభాషాపదమని , ‘వేదకాలపు ఆయగార్లు’ వ్యాసంలో ‘ రాంభట్ల గారు అంటారు. ఇంకా చెప్పాలంటే అది సుమేరు పదం. సుమేరు భాషలో  ఆ మాటకు ‘అజగరం’, అంటే కొండచిలువ అని అర్థం. నహుషుడు, యయాతి అనే పేర్లే కాక; యయాతి కొడుకుల పేర్లు కూడా (యదు,తుర్వసు, అను, దృహ్యు, పురు) వారు సుమేరులు కావచ్చునని సూచిస్తాయని రాంభట్ల అంటారు. ఆ రకంగా చూస్తే; యతి, సంయాతి, ఆయాతి, అయతి అనే యయాతి సోదరుల పేర్లే కాక; పురూరవుని పేరు కూడా అలాంటిదే అనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా గమనించాను. ఈ రాజుల పేర్లు కొత్తగా ధ్వనించినా, వారి భార్యల పేర్లు కొత్తగా కనిపించకపోవడం. ఉదాహరణకు, నహుషుని భార్య ప్రియంవద. యయాతి భార్యలు దేవయాని, శర్మిష్ట; పురూరవుని ప్రేయసి ఊర్వశి. ఇందులోని మర్మ మేమిటన్నది మరో ఆసక్తికరమైన ప్రశ్న.

దీనినిబట్టి తేలుతున్న దేమిటంటే, వేదభాషకు మ్లేచ్ఛభాష అయిన సుమేరుతో సంబంధం ఉండడమే కాక; వైదికార్యులకు సుమేరు ప్రాంతమైన పశ్చిమాసియాతో సంబంధం ఉంది. పశ్చిమాసియా ఉత్తర ప్రాంతంలో, అంటే నేటి టర్కీలో పురాణ ప్రసిద్ధులు, క్షత్రియులు అయిన కుశులు, మైతాణులు(మితానీలు), భృగులు రాజ్యాలను స్థాపించి పశుపాలనను, వ్యవసాయాన్ని సమన్వయపరిచారని రాంభట్ల అంటారు. ఎందుకంటే, ఆనాడు పశ్చిమాసియాలో వ్యవసాయం చాలా ఉచ్చదశలో ఉండేది. వేదాలకు మ్లేచ్ఛభాషతో ఉన్న సంబంధాలకు సాక్ష్యం, పూర్వమీమాంసా సూత్రకర్త జైమిని మాటల్లో దొరుకుతుంది. వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు ఏ మాటకైనా ఆర్యభాషార్థం దొరకనప్పుడు మ్లేచ్ఛభాషార్థాన్ని చూడమని జైమిని అంటాడు. నహుషుడంటే కొండచిలువ అనే అర్థం ఆర్యభాషలో లేదు, మ్లేచ్ఛభాషలో ఉంది. ఒక మాటకు రెండు అర్థాలు ఉన్నప్పుడు, ఒక అర్థానికి కథ కల్పించడం పౌరాణికులకు అలవాటు అన్న రాంభట్ల గారు, నహుషుడు అనే మాటకు కొండచిలువ అనే అర్థం ఉంది కనుక దానిని సమర్థించడానికి మునుల శాప రూపంలో పౌరాణికులు ఓ కథ సృష్టించారంటారు.

Rambatla Krishna Murthy

అదలా ఉండగా, రాంభట్ల గారి ప్రకారం యయాతి కొడుకుల్లో తుర్వసు, పురు పేర్లకు సుమేరులో అర్థాలు దొరుకుతున్నాయి. ‘తురు’ అంటే పల్లపు భూమి. దానికి భూమి అనే అర్థం కలిగిన  ‘వసువు’ అనే సంస్కృత పదం చేరి తుర్వసు అనే మాట ఏర్పడింది. సుమేరు భాషలో ‘కీ’ అంటే భూమి. సుమేరులు పల్లపు భూమి అనే అర్థంలో నేటి టర్కీని తుర్కీ అనేవారు. ఇంకా విశేషం ఏమిటంటే తెలుగు గ్రామనామమైన మొగలితుర్రులోని ‘తుర్రు’ ఈ ‘తురు’ నుంచే వచ్చింది. అలాగే, సుమేరు భాషలో ‘పురు’ అంటే గడ్డి. పూరిల్లు అనే మాటలో ‘పురు’ ఉంది. ఈవిధంగా సుమేరు, తెలుగుభాషలకు సంబంధం కలుస్తోందని రాంభట్ల ప్రతిపాదన…

చూడండి…ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చామో! తీగ కదిపితే డొంకంతా కదలడమంటే ఇదే. రాంభట్ల గారి పరిశీలనలలో ఈ అనుభవం మనకు అడుగడుగునా ఎదురవుతుంది. మనకు తెలియకుండానే ఒక అజ్ఞాత, ఆశ్చర్యకరప్రపంచంలోకి వెళ్లిపోతాం. అంతేకాదు, ఈ పెద్దమనిషి వాస్తవాల నేల విడిచి ఊహావిహారం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. దీనికితోడు ఆయనది ఒకవిధమైన హ్రస్వలిపి. తన ప్రతిపాదనలకు ఆధారాలు ఇచ్చే అలవాటు కూడా ఆయనకు అంతగా లేదు. ఆవిధంగా ఆయనది ఓ గుప్తలిపి కూడా. రాంభట్ల అధ్యయనాంశాలతో నాది పదిహేనేళ్ళ సాహచర్యం. అయినాసరే, ప్రతిసారీ అవి నాకు కొత్తగానే ఉంటాయి.

అయితే, రాంభట్ల గారు చెప్పీ, చెప్పకుండా సూచిస్తూ వచ్చిన కొన్ని ప్రామాణిక అధ్యయనాలతో నాకు పరిచయం కలిగినప్పటినుంచీ ఆయనవి మరీ నేల విడిచిన ఊహలు కావనే సంగతీ అర్థమవుతూ వచ్చింది. అది వేరే విషయం.

ఇప్పుడు అర్జెంటుగా అసలు విషయంలోకి వచ్చేస్తే, రాంభట్ల యయాతి కథకు పశ్చిమాసియాను రంగస్థలం చేసి, పశ్చిమాసియా-భారతదేశాల మధ్య పురావారధిని నిర్మిస్తున్నారు. పశ్చిమాసియా రంగస్థలమే క్రమంగా భారతదేశానికి మారినట్టు ఆయన పరిశీలనను బట్టి అర్థమవుతూ ఉంటుంది.

మరిన్ని విశేషాలు వచ్చే వారం…

 

 

 

 

 

 

 

 

‘రాక్షసులు’ ఎవరు?!

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

‘రాక్షసులు’ ఎవరు?!

ఈ వ్యాసం ప్రారంభించబోయేసరికి, ఉన్నట్టుండి  నేను మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరా ననిపించింది…!

కిందటి వ్యాసం చివరిలో జాతిభేదాల గురించిన ప్రస్తావనలను ఉదహరించాను. ఆనాటి జాతులు, తెగల సాంకర్యాన్ని అవి సూచిస్తూ ఉండచ్చని అన్నాను. ఆధునిక చరిత్రకారుల రాతలు ఇందుకు సంబంధించిన పురాచరిత్రను నిర్మించుకోడానికి ఏమైనా సాయపడచ్చు అన్నాను.  అలా అనేటప్పుడు, ఆ అంశాలలోకి నేరుగా వెళ్లచ్చునని ఆ క్షణంలో అనిపించింది. తీరా ఈ వ్యాసం మొదలెట్టేసరికి అదంత తేలికనిపించలేదు. ఇందులో విప్పుకుంటూ వెళ్లవలసిన పొరలు చాలానే కనిపించడం ప్రారంభించాయి. తీరా విప్పడం ప్రారంభిస్తే దృక్కోణాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలూ చాలానే కనిపించాయి.  దాంతో ఎటు వెళ్లాలో తోచని స్థితిలో కాసేపు ఉండిపోవలసివచ్చింది. చివరికి దగ్గరి దారి కాకుండా దూరపు దారి పట్టడం తప్పదన్న నిర్ణయానికి వచ్చాను.

రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు అనే మాటలు మనకు బాగా తెలుసు. వీటి మధ్య స్వల్పంగా అర్థభేదాలు ఉండచ్చు కానీ వీటన్నిటినీ మనం రాక్షసులు అనే ప్రసిద్ధ అర్థంలోనే తీసుకుంటూ ఉంటాం. మన పురాణ, ఇతిహాస కథలు; వాటి ఆధారంగా తీసే సినిమాల పుణ్యమా అని  రాక్షసుల గురించి మనలో కొన్ని ఊహలు స్థిరపడిపోయాయి. వారు భారీ ఆకారంతో చాలా వికృతంగా భయంకరంగా ఉంటారు. వాళ్ళకు కొమ్ములు, కోరలు ఉంటాయి. వాళ్ళు మనుషుల్ని తినేస్తారు. వాళ్ళ దగ్గర ఏవో మాయలు ఉంటాయి. రాక్షసులను ఇలా ఊహించుకోవడంలో మనలో పెద్దవాళ్ళు, పండితులూ కూడా పసివాళ్లు అయిపోతూ ఉంటారు. ఇటువంటి రాక్షసులు నిజంగానే ఉండేవారని వారు నమ్మడమే కాక మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మహాభారతంలో నరమాంసభక్షణ చేసే రాక్షసజాతికి చెందినదిగా చెప్పే హిడింబ నరుడైన భీముని వరించడమే కాక అతనివల్ల కొడుకుని కూడా కంటుంది. అయినాసరే, ఆమె రాక్షసియే!

వేల సంవత్సరాలుగా సంస్కృతి, సారస్వతం, మతం వగైరాలు మన ఆలోచనలపై ముద్రించే నమ్మకాలు ఎంత బలీయంగా ఉంటాయో తెలుసుకోడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇలాంటి నమ్మకాల చరిత్రను తవ్వుకుంటూ కాస్త లోపలికి వెడితే వాటి వెనుక ఉన్న హేతుత్వం అర్థమవుతుంది. కుక్కను చంపాలంటే మొదట దానిమీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని నానుడి. అలాగే ఒకప్పుడు(బహుశా ఇప్పుడు కూడా) శత్రువు మీద; లేదా భిన్న ఆచారవ్యవహారాలు పాటించేవారి మీద  అలాంటి ముద్రలే వేసేవారు. ఆ విధంగా జాతి వాచకాలు ఎన్నో తిట్టుపదాలుగా, అవహేళన పదాలుగా మారిపోయాయి. ‘అప్రాచ్యులు’ అనే మాటనే తీసుకోండి. తూర్పుదేశానికి చెందినవారు కారనే దాని సామాన్యార్థం. కానీ అదిప్పుడు తిట్టుపదంగా, అవహేళన వాచకంగా మారిపోవడం మనకు తెలుసు. అలాంటివే మ్లేచ్ఛుడు, పిండారీ లేదా పింజారీ వగైరా మాటలు.

cambell

‘రాక్షసులు’ అనే మాట కూడా అలాంటిదే. ఇంకా విశేషం ఏమిటంటే, శత్రువుపై రాక్షసులుగా ముద్రవేసే ప్రక్రియ పురాచరిత్రలో ఒక నిర్దిష్టసందర్భంలో ప్రారంభమైంది. అంతకన్నా విశేషం ఏమిటంటే, ఆ ప్రక్రియ కేవలం మనదేశంలోనే కాదు; ప్రపంచంలో అనేక చోట్ల జరిగింది. ప్రపంచ పురాణ గాథలను అనేక ఆధునిక వనరుల సాయంతో, అనేక కోణాలనుంచి విశ్లేషిస్తూ నాలుగు బృహత్సంపుటాలను వెలువరించిన జోసెఫ్ క్యాంప్ బెల్ అనే పండితుడు దీని గురించి Occidental Mythology అనే సంపుటంలో చర్చించాడు. పూజారులు ప్రయోగించిన ‘పౌరాణిక అపకీర్తికర చర్య’ (Mythological Defamation) గా దీనిని వర్ణించిన క్యాంప్ బెల్, ప్రధానంగా దీనిని పాశ్చాత్య మతశాస్త్రకారులు ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చినా, మిగతా చోట్ల కూడా కనిపిస్తుందంటాడు. ఒక బాబిలోనియా పురాణగాథను విశ్లేషించే సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ పురాణగాథ సంగ్రహంగా ఇదీ:

తియామత్, అప్సు అనే ఆది దంపతులు ఉంటారు. తియామత్ మన జగజ్జనని లాంటి దేవత. వారి కుమారుడు ముమ్ము. అప్పటికి ఇంకా ఆకాశాదేవత, భూదేవతల నియామకం జరగలేదు. పచ్చిక భూములు లేవు. అంతా జలమయం. తియామత్, అప్సుల వల్ల దేవతలు ఉద్భవించినా వారికి ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. ఇదొక అద్వైత స్థితి. కొంతకాలానికి ఇద్దరికి అధికారమిచ్చారు. అయితే, ఆ తర్వాత ఆ దంపతులు సృష్టించిన మరో ఇద్దరు తెలివిలో, స్థాయిలో మొదటి ఇద్దరినీ మించిపోయారు. వీరికి కలిగిన సంతానం వారిని కూడా మించిపోయి చివరికి జగజ్జననితోనే యుద్ధానికి దిగి ఆమెను, ఆమె మరో సంతానాన్ని ఓడించారు. ఈ యుద్ధంలో గెలుపొందిన దేవతల పక్షానికి  మర్దుక్ అనే దేవుడు నాయకత్వం వహించాడు.

క్యాంప్ బెల్ ప్రకారం, మాతృస్వామ్యంపై పురుషస్వామ్యం విజయాన్ని సంకేతించడంతో సహా ఈ కథ వెనుక చాలా విశేషాలు ఉన్నాయి. అంతా జలమయంగా ఉన్న ఆదిమకాలపు అద్వైతస్థితినుంచీ, నిష్క్రియతనుంచీ మనిషి బయటపడి, భూమిని స్వాధీనం చేసుకుని, దానిని ప్రధాన ఉత్పాదకవనరుగా చేసుకున్న క్రమాన్ని ఈ కథ సూచిస్తుంది. అంతేకాదు, రాజ్యం పుట్టుకను, వీరపురుషుల ఆవిర్భావాన్నీ కూడా ఇది వెల్లడిస్తుంది. క్యాంప్ బెల్ ఈ కథ వెనుక గల చారిత్రక నేపథ్యాన్ని తేదీలతో సహా సూచించడం మరింత ఆసక్తిదాయకం. క్రీ.పూ. 3000 సంవత్సరం నాటికి మెసపొటేమియా ఉత్తరప్రాంతం నుంచీ, సైరో-అరేబియా ఎడారి నుంచీ వచ్చిన సంచారజీవులైన దురాక్రమణదారులు రాజ్యాలు స్థాపించడం; క్రీ.పూ. 2500 నాటికి వీరు మెసపొటేమియాను ఆక్రమించుకోవడం ఈ కథకు పూర్వరంగం అని ఆయన అంటాడు. అన్ని వివరాలలోకీ ఇప్పుడు వెళ్లలేము కానీ, ఒక నూతన సామాజిక వ్యవస్థ ఆవిర్భాన్నీ, ఒక నూతన మనస్తత్వాన్నీ, మనిషి ఆలోచనలో, అనుభూతిలో కలిగిన ఒక నూతన నిర్మాణాన్నీ పౌరాణికపు ముసుగులో ఈ కథ సూచిస్తుందని క్యాంప్ బెల్ అంటాడు. మన ప్రస్తుతాంశానికి సంబంధించి అంతకంటే ముఖ్యంగా, శత్రుప్రజలు కొలిచే దేవతలపై రాక్షసులన్న ముద్రవేయడం (అంటే, శత్రుప్రజలను కూడా రాక్షసులుగా  చిత్రించడమే),  విశ్వంపై తమ దేవతల గుత్తాధిపత్యాన్ని స్థాపించడం, అందుకు అవసరమైన పురాణ కథలను సృష్టించడం ఇందులో భాగమని ఆయన అంటాడు. రాక్షసులను నిర్వీర్యులుగా, దుష్టశక్తులుగా; దేవతలను ఉన్నతులుగా, ధర్మపరులుగా చిత్రించడం ఇక్కడితోనే మొదలైందని కూడా అంటాడు.

joseph-campbell-power-of-myth

క్యాంప్ బెల్ ను ఉటంకించుకునే సందర్భాలు ముందు ముందు చాలావస్తాయి. దానినలా ఉంచితే, ఆయన పాశ్చాత్యుడు కనుక పై పౌరాణిక ప్రక్రియ పాశ్చాత్యంలోనే ఎక్కువగా జరిగిందని ఆయనకు అనిపించి ఉండచ్చు. కానీ మన పురాణ ఇతిహాసాలలోనూ దీని సామ్యాలు అచ్చుగుద్దినట్టు కనిపించి ప్రపంచపురాణకథల మధ్యగల పోలికలను ఆశ్చర్యకరంగా వెల్లడిస్తాయి. ఈ సందర్భంలో, ఒకే రకమైన పురాణకథలు ప్రపంచమంతటా వ్యాపించాయన్న క్యాంప్ బెల్ సూత్రీకరణనూ దృష్టిలో ఉంచుకోవాలి.

మన పురాణ ఇతిహాసాల ప్రకారం, దేవతలు, రాక్షసులు, పక్షులతో సహా సమస్త జీవరాశీ కశ్యపుడు అనే ప్రజాపతి సంతానం. దక్షుడు అనే మరో ప్రజాపతి; అదితి, దితి, దను, కాల మొదలైన పదముగ్గురు కూతుళ్లను కశ్యపునికి ఇచ్చాడు. కశ్యపునికి అదితి వల్ల ఆదిత్యులు అనగా దేవతలు, దితి వల్ల దైత్యులు అనగా రాక్షసులు, దనువల్ల దానవులు కలిగారు. దైత్యులను, దానవులనూ కూడా మనం స్థూలంగా రాక్షసులుగానే చెప్పుకుంటాం. దీని ప్రకారం దేవతలు, రాక్షసులు ఒకే తండ్రికి పుట్టిన సంతానం, అంటే సోదరులన్నమాట. అందుకే రాక్షసులను కూడా దేవతలుగానే గుర్తించిన మన పురాణాలు వారిని పూర్వ దేవులని, పూర్వ గీర్వాణులనీ అన్నాయి. అయితే ఈ సోదరుల మధ్య శత్రుత్వం ఏర్పడింది. యుద్ధాలు జరిగాయి. అవి దేవాసురసంగ్రామాలుగా ప్రసిద్ధి కెక్కాయి.

గమనించండి…పైన చెప్పిన బాబిలోనియా పురాణకథలో జరిగింది కూడా అదే. తియామత్, అప్సు అనే ఆది దంపతులకు కలిగిన తొలి సంతానమైన దేవతలతో మలిసంతానమైన దేవతలు శత్రుత్వం వహించారు. యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో తియామత్ తొలి దేవతల పక్షం వహించింది. ఆ పక్షం ఓడిపోయింది. విజేతల పక్షం పరాజిత పక్షంపై రాక్షసులన్న ముద్ర వేసింది. నిజానికి మన పురాణకథలలోని రాక్షసుల లానే వారు కూడా పూర్వదేవులే నన్నమాట. బాబిలోనియా కథను తియామత్ పరంగా, అంటే మాతృస్వామ్యపరంగా చెబితే; మన పురాణ కథను కశ్యపుని పరంగా, అంటే పితృస్వామ్యపరంగా చెప్పారు. అంటే అప్పటికి మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం ఏర్పడిందన్న మాట. ఆవిధంగా చూసినప్పుడు బాబిలోనియా పురాణ కథ మన పురాణకథల కన్నా ప్రాచీనం అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కోణంలోకి లోతుగా వెళ్లలేం.

ఈవిధంగా శత్రువులైన దాయాదులపై రాక్షసులుగా ముద్ర వేయడం అనేది క్రమంగా శత్రువులైన ఇతర జాతులకు, తెగలకు విస్తరించడంలో ఆశ్చర్యం లేదు. ఆ క్రమంలో పరాజితులైన శత్రువుల జాతివాచకాలు కూడా తిట్టు పదాలుగా, ఆక్షేపణ వాచకాలుగా మారిపోయాయి. ప్రస్తుత సందర్భంలో ‘దాసులు’ అనే మాట కూడా అలాంటిదే. ఆ మాట ఒకప్పుడు జాతివాచకం మాత్రమే. క్రమంగా అది నిందార్థకంగా మారింది. దాని గురించి మరింత వివరంగా చెప్పుకునే ముందు ఇంకో విషయం చెప్పుకోవాలి.

ఆయా అంశాలను కప్పిన పొరలు విప్పుకుంటూ వెడితే దృక్కోణాలకు సంబంధించిన సమస్యలూ చాలానే ఎదురవుతాయని పైన అన్నాను. రాక్షసులు అనే మాట ఒకే వర్గానికి చెందినవారి గుణ గుణాలలో తేడాను చూపించే గుణవాచకమే తప్ప జాతి వాచకం కాదని కొందరు అనవచ్చు. అలాగే, దేవతలు అనే మాట సత్వగుణాన్ని సూచిస్తుందనీ, రాక్షసులు అనే మాట తమోగుణాన్ని సూచిస్తుందనీ అంటూ ఆ మాటలను భౌతికస్థితినుంచి తప్పించి వేదాంత గగనవిహారం చేయించవచ్చు. ఒక కోణంలో అదీ అవసరమే కావచ్చు కనుక దానిని నేను తప్పుపట్టను. అయితే, ఈ ధోరణికి చరిత్రను మూలమట్టంగా నిరాకరించే స్వభావం ఉంది. దాంతోనే చిక్కు వస్తుంది. చరిత్రలో ఆయా సమూహాల మధ్య యుద్ధాలే జరగనట్టు, సోదర జాతుల మధ్య, భిన్న జాతుల మధ్య అసలు ఘర్షణలే జరగనట్టు; అవి పురాణ కథలకు ఎక్కనట్టు ఒక అవాస్తవిక, అసహజ చింతనకు అది దారితీయిస్తుంది. మౌలికంగా సంచారజీవనులైన గుంపుల మధ్య యుద్ధాలు, ఘర్షణలు జరగడం సహజాతి సహజం. పరాజిత పక్షాల జాతి,  లేదా తెగ వాచకాలను విజేతల పక్షం తిట్టుపదంగా, ఆక్షేపణ వాచకంగా మార్చడం అంతే సహజం.

213px-Lord_Brahma_and_Adhiti_-_19th_Century_Illustration

ఇక రెండో సమస్య; ఆర్యులు-అనార్యులన్న విభజనకు సంబంధించినది. ఇది చాలా వివాదాస్పదమైన సమస్య. ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించేవారు ఉన్నారు. అది పాశ్చాత్యచరిత్రకారుల కుట్రగా వీరు అభివర్ణిస్తారు. ఆర్యులు-ద్రావిడులుగా చెప్పబడేవారు మొదటినుంచీ ఈ దేశంలో ఉన్నవారే ననీ;  అసలు ఆర్యులు-ద్రావిడులు అనే విభజనే అర్థంలేనిదనీ, ఆర్యులనే వారు ఎక్కడినుంచో వచ్చారనే సిద్ధాంతం తప్పనీ వీరు అంటారు. చరిత్రకారులు ఎంతోమంది నమ్మే ఆర్య-ద్రావిడ విభజనను గుడ్డిగా సమర్థించాలన్న ఉత్సాహం నాకేమీ లేదు. ఆర్యులు ఎక్కడినుంచో వచ్చారన్న సిద్ధాంతం పరమ ప్రామాణికంగా, వేదవాక్కుగా భావించాలనీ నాకు లేదు. చరిత్ర శోధనా క్రమంలో పై వాదానికి విరుద్ధమైన సాక్ష్యాలు లభిస్తే ఆమోదించడానికి నేనూ సిద్ధమే. సైన్సు లానే చరిత్ర కూడా ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పరిశోధనలు పాత సిద్ధాంతాలను త్రోసి రాజనే అవకాశం ఇక్కడా ఉంటుంది. అయితే, ప్రధానసమస్య ఏమిటంటే; ఆర్య-అనార్య లేదా ద్రావిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారివైపు చరిత్ర శూన్యత ఉండడం. కనీసం దానిని ప్రామాణిక చరిత్రశూన్యతగా చెప్పచ్చు. రెండోవైపు, సమగ్రమో, అసమగ్రమో  చరిత్ర ఉంది. కనుక నేను నిర్దిష్టమైన ఇలాంటి అభిప్రాయభేదాల జోలికి వెళ్లకుండా ఒకనాటి సమూహాల సంచారజీవనం, ఆ క్రమంలో భిన్న సమూహాల మధ్య జరిగిన యుద్ధాలు, ఘర్షణల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చరిత్ర ఆకరా(సోర్సు)లను వాడుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

మిగతా అంశాలు తర్వాత…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

సంప్రదాయం విస్మరించిన మరికొన్ని ప్రశ్నలు!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అవిచారంబని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ! నీ యగ్రసం

భవు డత్యున్నతశక్తియుక్తుడు మహీభారప్రగల్భుండు భా

ర్గవదౌహిత్రుడు పాత్రు డీ యదుడు లోకఖ్యాతు డుండంగ నీ

భువనేశత్వభరంబు బూన్ప దగునే పూరున్ జఘన్యాత్మజున్

                                                         -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

ధర్మం తెలిసిన ఓ యయాతి మహారాజా! (నువ్వు చేసిన పని) అనుచితమని చెప్పడానికి జంకుతున్నాము. నీ పెద్దకొడుకు, శుక్రుని మనవడు, మంచి శక్తియుక్తులు కలిగినవాడు, భూభారాన్ని మోయగలవాడు, కీర్తిమంతుడు, యోగ్యుడు అయిన యదువు ఉండగా; నిమ్నస్త్రీకి పుట్టిన పూరునికి రాజ్యభారం అప్పగించడం సమంజసమేనా?

               ***

యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి నేటి సంప్రదాయ పండితులనుంచి సమాధానం దొరకదని   కిందటిసారి చెప్పుకున్నాం. అటువంటివే ఈ కథలో మరో మూడు ఉన్నాయి…

మొదటిది, యయాతికి శుక్రుడు ఇచ్చిన శాపం. శర్మిష్టతో సంబంధం పెట్టుకోవద్దన్న తన ఆదేశాన్ని యయాతి ఉల్లంఘించాడు కనుక, అతనికి అకాల వృద్ధాప్యం విధించి శుక్రుడు శిక్షించాడని అనుకుంటాం. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, శుక్రుని శాపం యయాతికి ఏవిధంగానూ శిక్ష కాలేదు. అతడు యవ్వన సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాతే సహజగతిలో వృద్ధుడయ్యాడు. శాపాలనే నమ్మవలసివస్తే, నిజంగా శిక్ష అనుభవించింది, అతని వృద్ధాప్యాన్ని మోసిన అతని కొడుకుల్లో ఒకడు. యయాతికి ఎలాంటి శిక్షా లేకపోగా మొదటినుంచి చివరివరకూ ప్రతీదీ అతనికి అనుకూలించాయి.  తను తొలిచూపులోనే శర్మిష్ట పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమెను కోరుకున్నాడు. ఆమెను పొందాడు. ఆమెతో సంతానం కన్నాడు. చివరికి ఆమెకు కలిగిన పూరునే తన రాజ్యానికి వారసుని చేశాడు. ఈవిధంగా అన్నీ అతని ప్రణాళిక ప్రకారం, లేదా అతనికి అనుకూలించే ప్రణాళిక ప్రకారమే జరిగాయి.

దేవయాని కథ ఇందుకు భిన్నం. ఆమెకు దాదాపు అన్నీ ప్రతికూలంగానే జరిగాయి. ప్రేమించిన కచుడు  దక్కలేదు. రాచగర్వంతో తనను అవమానించిన శర్మిష్టను దాసినైతే చేసుకోగలిగింది. కానీ, ఆ దాసియే ఆమె కాపురంలో చిచ్చు పెట్టింది. ఒక మహారాజును పెళ్లిచేసుకోగలిగింది. కానీ, అతనిని దాసితో కలసి పంచుకోవలసివచ్చింది. తను ఎంతో తెలివీ, గడుసుదనమూ, మాట నేర్పూ ఉన్నదే. కానీ యయాతి తెలివి ముందు చిత్తుగా ఓడిపోయింది! తండ్రికి ఆమె మీద విపరీతమైన మమకారం ఉంది. ఆమె కోరింది ఆయన కాదనే ప్రశ్నే లేదు. కానీ, విచిత్రం, తండ్రికి తన మీద ఉన్న అంత గొప్ప మమకారమూ ఆమెకు కలసిరాలేదు. అంతకంటే విచిత్రం, శుక్రుడు కూతురి ప్రణాళికకు పెద్దగా సహకరించకపోగా, యయాతి  ప్రణాళికకు సహకరించడం!

ఎలాగంటే…శర్మిష్టతో పడక సుఖం మాత్రం పంచుకోవద్దని పెళ్లి సమయంలో యయాతికి శుక్రుడు చెప్పడంలో బహుశా దానికి విరుద్ధమైన ధ్వని ఉండచ్చని ఇంతకుముందు అనుకున్నాం.  ఇప్పుడు యయాతికి శాపమిచ్చే సమయంలో శుక్రుడు అన్న మాటలు దానికి పొడిగింపుగానూ, ధృవీకరణగానూ అనిపిస్తాయి.  యవ్వనగర్వంతో నా కూతురిని నొప్పించావు కనుక నీపై వృద్ధాప్యభారం పడుగాక అని శపించిన శుక్రుడు; ఆ తర్వాత శాప సవరణ చేస్తూ, నీ కొడుకుల్లో ఒకరు నీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే నువ్వు మరికొంతకాలం యవ్వనసుఖాలు అనుభవించవచ్చు నన్నాడు. అంతవరకు అర్థవంతంగానే ఉంది. కానీ శుక్రుడు అంతటితో ఊరుకోకుండా, నీ వృద్ధాప్యాన్ని స్వీకరించినవాడే నీ రాజ్యానికి వారసుడవుతాడన్నాడు! సమయ, సందర్భాలను దృష్టిలో పెట్టుకుంటే శుక్రుడు ఆ మాట అనవలసిన అవసరం, ఔచిత్యం కనిపించవు. ఆ ఘట్టంలో, యయాతికి కాబోయే వారసునికి ఒక కఠినమైన అర్హతను నిర్దేశించడం చీకట్లో రాయి విసరడం లాంటిది. ఎలాగంటే, దేవయాని కొడుకులైన యదు, తుర్వసులు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తారో లేదో ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. కనుక శుక్రుని నిర్దేశం దేవయానికి ఉపకారం కన్నా అపకారం చేసే అవకాశమూ ఉంది. ఈ కథను మలచడం వెనుక ఒక ప్రణాళికా, ఆ ప్రణాళికలో శుక్రుని భాగస్వామ్యమూ లేవనుకుంటే; ఎంతో బుద్ధిశాలి అనుకునే శుక్రుడు ఇలాంటి అనాలోచిత నిర్దేశం చేస్తాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

కథ వెనుక ఒక ప్రణాళికా, అందులో శుక్రుని భాగస్వామ్యమూ ఉన్నాయనుకున్నప్పుడే ఆ ప్రశ్న తలెత్తదు.  శుక్రుని పాత్రను మొదటినుంచీ గమనించండి… అతనికి దేవయాని ప్రవర్తనతో ఏకీభావం ఎప్పుడూ లేదు. దానికితోడు శర్మిష్టపై అతనికి ఆదరభావం ఉంది. ఆమెకు అన్ని సౌఖ్యాలూ సమకూర్చి బాగా చూసుకోమని యయాతికి ప్రత్యేకంగా చెప్పాడు. పడక సుఖానికి మాత్రం ఆమెను దూరంగా ఉంచమన్నాడు. ఆమెతో పడక సుఖం పంచుకోమన్న ధ్వనీ అందులో ఉండచ్చని చెప్పుకున్నాం. అందుకే, శర్మిష్టతో సంబంధం పెట్టుకున్నందుకు యయాతిపై అతనికి నిజంగా కోపం లేదు. కూతురికోసం కోపం నటించాడు. శపించిన వెంటనే శాప సవరణ చేయడం దీనికి మరో సాక్ష్యం. పైగా, నీ వృద్ధాప్యాన్ని స్వీకరించిన వాడే నీ రాజ్యానికి వారసుడవుతా డన్నాడు. శర్మిష్ట కొడుకుల్లోనే ఒకడు ఆ అర్హతను సాధించుకోగలడన్న నమ్మకం అప్పటికే ఆయనకు ఉండి ఉండాలి. లేనప్పుడు చీకట్లో రాయి విసరడం లాంటి ఆ  శాపసవరణను ఆయన చేసి ఉండేవాడు కాదు. అంతకంటే ముఖ్యంగా, శర్మిష్ట కొడుకు రాజు కావడమే అతిక్రమించరాని ధర్మమన్న బలమైన భావనా ఆయనకు ఉండచ్చు. ఎందుకంటే, ఆమె రాచకూతురు కనుక.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. కథకుడు జరిగిపోయిన కథను చెబుతున్నాడు. తను చెప్పదలచుకున్న ఫలశ్రుతికి అనుగుణంగా కథను మలచుకుంటున్నాడు. ఆయా పాత్రలను ఆ ఫలశ్రుతికి కలసివచ్చేలా నిర్మించుకుంటున్నాడు. శర్మిష్ట చిన్న కొడుకు పూరుడు రాజు కావడమే ఈ కథలో ఫలశ్రుతి. అతడు భరతవంశ మూల పురుషులలో ఒకడు కాబోతున్నాడని చెప్పడం కథకుని దృష్టినుంచి చాలా ముఖ్యమైన అంశం. కథకుడు ఉద్దేశించిన ఈ ఫలశ్రుతికి కలసివచ్చే అతి ముఖ్య పాత్ర, ఇక్కడ శుక్రుడు. ఎలాగంటే, శర్మిష్ట రాచకూతురే కానీ, మధ్యలో దాసి అయింది. ఆమె కొడుకులపై దాసిపుత్రులన్న ఆక్షేపణ ఉంటుంది. అయినాసరే, ఆమె కొడుకు పూరుడు రాజయ్యాడు. దానికి సామాజిక ఆమోదం లభించాలి. ఆ ఆమోదాన్ని పొందడం వివిధ అంచెలలో సాగుతుంది. వాటిలో శుక్రుని ఆమోదం ఒకటి. అతడు పురోహితుడు, ధర్మాధర్మనిర్ణయవేత్త, నీతికోవిదుడు, గురుస్థానంలో ఉన్నవాడు. కనుక అతని ఆమోదం తప్పనిసరి.

సామాజిక ఆమోదం సాధించే ఈ ప్రక్రియలో మరో అంచె, పౌరజానపదపరిషత్తు ఆమోదం. ఇది ఈ కథలో సంప్రదాయ  పండితుల మౌనముద్రను వెల్లడించే మరో సందర్భం కూడా. పౌరజానపదపరిషత్తు నేటి ప్రజాప్రతినిధుల సభ లాంటిది. యయాతి తనకు ‘విధేయులైన’ బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన అన్ని వర్ణాలలోని ముఖ్యులనూ రప్పించి; మంత్రి, పురోహిత, సామంత, పౌరజన సమక్షంలో పూరునికి పట్టాభిషేకం చేశా డని కథకుడు చెబుతున్నాడు. అంటే, పూరుని రాజుగా అభిషేకించే విషయంలో యయాతి ముందుగా వారిని సంప్రదించి, ఆమోదం పొందలేదనీ; స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాడనే అభిప్రాయానికి ఇక్కడ అవకాశమిస్తున్నాడు. పైగా వారందరికీ ‘నిజాజ్ఞా విధేయు’ లనే విశేషణం వాడాడు. ఆ మాట ద్వారా యయాతి సర్వస్వతంత్రాధికారాలు గల రాజు అనీ, అతని మాట శిలాశాసనమనే భావన కలిగిస్తున్నాడు.

విచిత్రం ఏమిటంటే, కథకుడు ఆ వెంటనే ‘సర్వ ప్రకృతి జనా’లకూ యయాతి చర్య నచ్చలేదనీ సూచిస్తున్నాడు. వారు తమ అభ్యంతరాలను సూటిగానే వెల్లడించారు. పై పద్యం అదే చెబుతోంది. ‘నీ పెద్దకొడుకు, అన్ని విధాలా సమర్థుడు, శుక్రుని మనవడు అయిన యదువు ఉండగా, ఒక నిమ్న స్త్రీకి జన్మించిన పూరునికి రాజ్యమెలా ఇస్తా’వని వారు అడిగారు.  దానికి యయాతి జవాబిస్తూ, ‘మీరన్నట్టు యదువు నా పెద్దకొడుకే, నా హృదయంలోంచి పుట్టినవాడే; కానీ, నా మాట పెడచెవిని పెట్టి నన్ను అవమానించాడు. తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించనివాడు కొడుకెలా అవుతాడు, తండ్రి ఆస్తికి వారసుడెలా అవుతాడు? పూరుడు అలా కాదు. చిన్నవాడైనా నా ఆదేశాన్ని పాటించాడు. గుణసంపదలో అతనే పెద్ద. పైగా భూభారం మోయగల సహనం అతనికి ఉంది’ అన్నాడు.  అంతటితో ఆగకుండా, శుక్రుని కూడా తనకు సమర్థనగా ముందుకు తెచ్చాడు. ‘నా వృద్ధాప్యభారాన్ని మోసిన కొడుకే నా రాజ్యానికి అర్హుడూ, వంశకర్తా అవుతాడు. ఇది శుక్రుని మాట’ అన్నాడు. ఆ విధంగా యయాతి ప్రకృతిజనాలను ఒప్పించి పూరుని భూభారదురంధరుని, అంటే పట్టాభిషిక్తుని చేశాడని అంటూ కథకుడు మరోసారి పట్టాభిషేక ప్రస్తావన చేస్తున్నాడు.

ఇలా ఒకే సందర్భంలో, అందులోనూ వెంట వెంటనే యయాతిని ఒకసారి సర్వస్వతంత్రుడైన రాజుగానూ; ఆ తర్వాత ‘ప్రకృతి జనాల’ అభ్యంతరాలకు సమాధానం చెప్పి, వారిని ఒప్పించవలసిన రాజుగానూ కథకుడు చిత్రించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ క్రమంలో పూరుని పట్టాభిషేక ప్రస్తావన రెండుసార్లు చేసి అనవసరంగా తన కథనానికి పునరుక్తి దోషాన్ని  ఆపాదించడమూ వింతగానే కనిపిస్తుంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే స్ఫురించే కారణాలు ఇవే:

నేటి ప్రజాప్రతిధుల సభలాంటి పౌరజానపదపరిషత్తు ప్రాముఖ్యం, పనితీరుల గురించి కథకునికి స్పష్టమైన అవగాహన లేకపోవచ్చు. రాజుకు సర్వస్వతంత్ర అధికారాలు ఉంటాయని మాత్రమే కథకుని అవగాహన కావచ్చు. అయితే, యయాతి నిర్ణయాన్ని మొదట (పౌరజానపదపరిషత్తు రూపంలోని) ‘ప్రకృతి జనాలు’ ప్రశ్నించారనీ, యయాతి వారిని సమాధానపరచిన తర్వాతే పూరునికి పట్టాభిషేకం చేశాడని మూల కథ చెబుతోంది కనుక, కథకుడు దానిని తప్పించుకోలేకపోయాడు. సందిగ్ధస్థితిలోనే దానినీ అనువదించి ఉంటాడు. లేదా, పౌరజానపదపరిషత్తు గురించి తనకు అవగాహన ఉన్నా, దాని గురించి తెలియవలసిన అవసరం లేని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు కథ చెబుతున్నాడు కనుక ఆ వివరాన్ని ఇలా స్పష్టాస్పష్టంగా తేల్చి వేసి ఉండచ్చు. లేదా, రాజుకు సర్వస్వతంత్ర అధికారాలు ఉంటాయని చెప్పడం మీదే తనకు ఎక్కువ ఆసక్తి ఉండి ఉండవచ్చు. మొత్తానికి కఃథలోని ఈ వివరాన్ని తప్పించుకోడానికి కథకుడు చేసిన విఫలయత్నం పైన చెప్పిన అస్పష్టతకు, పునరుక్తికి అవకాశమిచ్చింది. విశేషమేమిటంటే, నేను పరిశీలించిన టీటీడీ ప్రచురణలో వ్యాఖ్యాతలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు.

సంప్రదాయ పండితుల మౌనముద్రను పట్టి చూపే మూడో అంశాన్ని చూద్దాం…శర్మిష్ట కొడుకులు ముగ్గురినీ దేవయాని ఎప్పుడు చూసింది? వారు యయాతి దగ్గర ఆడుకుంటుండగా. అంటే, వారు బాల్యదశలో ఉండి ఉండాలి. కథకుడు కూడా వారిని బాలకులనే అన్నాడు. కనీసం వారు కౌమారదశలో కూడా లేరు. మీ తల్లిదండ్రులెవరని దేవయాని వారిని అడిగినప్పుడు వారు నోటితో కూడా సమాధానం చెప్పలేదు. తమ ‘లేత చూపుడివేలితో’ యయాతీ, శర్మిష్టలను చూపించారు. శర్మిష్టవల్ల యయాతి ఈ ముగ్గురినీ కన్నాడని అర్థమైన దేవయాని అప్పటికప్పుడు పుట్టింటికి బయలుదేరివెళ్లింది. తండ్రికి అంతా చెప్పింది. ఆమె వెనకే యయాతీ వెళ్ళాడు. అప్పుడు వృద్ధుడివి కమ్మని శుక్రుడు శాపమిచ్చి, శాప సవరణ కూడా చెప్పాడు. శాపం పని చేసి, ఆ వెంటనే యయాతిపై వృద్ధాప్యభారం పడిందని కథకుడు చెబుతూ ఆ అవస్థను కూడా వర్ణించాడు. అప్పుడు యయాతి అయిదుగురు కొడుకులనూ పిలిచి, ‘మీలో ఒకడు నా వృద్ధాప్యం తీసుకుని తన యవ్వనం నాకు ఇవ్వా’లని అడిగాడు. మొదటి నలుగురూ తిరస్కరించగా, ఆఖరి కొడుకు పూరుడు ఒప్పుకుని తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని వృద్ధాప్యం తను తీసుకున్నాడు.

ఇదంతా మహా అయితే కొన్ని రోజుల వ్యవధిలో జరిగిపోయి ఉండాలి. అప్పటికి శర్మిష్ట కొడుకులే కాదు సరికదా, దేవయాని కొడుకులు కూడా యవ్వనవంతులు కావడానికి అవకాశం లేదు. కనీసం కౌమారదశలో ఉండే అవకాశమూ తక్కువే. అందులోనూ శర్మిష్ట చివరి కొడుకు పూరుడు మరింత శైశవదశలో ఉండి ఉంటాడు. అతడు యవ్వనవంతుడు ఎప్పుడయ్యాడు? తన యవ్వనాన్ని తండ్రికి ఎప్పుడు ఇచ్చాడు? అతడు పెరిగి పెద్దయ్యే దాకా యయాతి వృద్ధాప్యాన్ని అనుభవించాడా? అప్పుడు దేవయానితో అతడు సుఖించడం ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ, పూరుడు యవ్వనవంతుడయ్యాక యయాతి అతని యవ్వనం తీసుకున్నాడనుకున్నా; అప్పుడు యయాతి దేవయానితో సుఖించడం ఎలా సంభవం? దేవయాని యవ్వనం అప్పటికి తరిగిపోతుంది కదా? శుక్రుడు తన శాపసవరణ ద్వారా కూతురికి చేసిన మేలు ఏమిటి?

సంప్రదాయ పఠన పాఠనాలలో సమాధానం దొరకని ఇలాంటి అనేక ప్రశ్నలను అలా ఉంచి, మరో అంశాన్ని ఎత్తుకుంటే…

శర్మిష్టతో యయాతి సంబంధం పెట్టుకోవడమే కాక, ఆమెవల్ల కొడుకులను కూడా కన్న ఈ ఘట్టంలో కథకుడూ, దేవయానీ, ప్రకృతిజనులూ కూడా జాతిభేదాన్ని ముందుకు తెస్తున్నారు. ఇందులో అంతర్లీనంగా వారసత్వ వివాదం ఉన్న సంగతి స్పష్టమే. శర్మిష్టతో యయాతి కొడుకుల్ని కన్నట్టు తెలిసి దేవయాని దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసిందని చెబుతున్న సందర్భంలో కథకుడు శర్మిష్టను ‘దానవి’గా పేర్కొని ఈ వారసత్వ వివాదానికి సూచనప్రాయంగా తెరతీశాడు. ‘ఈ రాజు ధర్మం తప్పి రాక్షసపద్ధతిలో రాక్షసి వల్ల ముగ్గురు కొడుకుల్ని కని నన్ను అవమానించా’డని దేవయాని తండ్రితో అంది. ‘ఒక నిమ్న జాతి స్త్రీకి పుట్టినవాడికి రాజ్యభారం ఎలా అప్పగిస్తా’వని ప్రకృతిజనులు యయాతిని అడిగారు.

జాతిభేదం గురించిన ఈ ప్రస్తావనలు బహుశా ఒకనాటి జాతులు, తెగల సాంకర్యాన్ని సూచిస్తూ ఉండచ్చు. ఆధునిక చరిత్రకారుల రాతలు ఇందుకు సంబంధించిన పురాచారిత్రక పరిణామక్రమాన్ని పునర్నిర్మించుకోడానికి ఏ కొంచెమైనా సాయపడచ్చు. అలాగే, దేవయాని రాక్షస పద్ధతిలో అనడం వివాహచరిత్రనూ, వివాహభేదాలనూ స్పృశిస్తూ ఉండచ్చు.

వాటి గురించి తర్వాత…

–కల్లూరి భాస్కరం

ఖాళీలలోనే ఉంది కథంతా…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

ఋతుమతి యై పుత్రార్థము

పతి గోరిన భార్యయందు బ్రతికూలుండై                                    

ఋతువిఫలత్వము సేసిన

యతనికి మరి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్

                                             -నన్నయ

 (శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

ఋతుమతి అయిన భార్య, పుత్రుని ఇవ్వమని భర్తను కోరినప్పుడు నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేసినవాడికి గర్భస్థ శిశువును చంపిన పాపం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతారు.

  ***

అదీ విషయం…ఋతుమతి అయిన భార్య పుత్రుని ఇమ్మని భర్తను కోరినప్పుడు, భర్త నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకోదా అని శుక్రుని యయాతి అడుగుతున్నాడు!

  ఋతుకాలాన్ని విఫలం చేయడం, భ్రూణహత్య అనే మాటలు చర్చను మరో ప్రాంగణంలోకి తీసుకెడుతున్నాయి. బహుశా అవి పురాదశకు చెందిన  స్త్రీ-పురుష సంబంధాలను ఇప్పటి మన అవగాహనకు భిన్నంగా నిర్వచిస్తున్నాయి. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన ఇక్కడ చాలా కీలకం. భ్రూణహత్యా పాపం అనేది ఒక విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఒక మతవిశ్వాసం అంత బలీయమైనది. అంతేకాదు, స్త్రీ-పురుష సంబంధాల గురించి నేటి మన విశ్వాసాలు, భావనల కంటే కూడా అది బలీయం. పురా మానవుడి దృష్టిలో విశ్వాసాన్ని మించిన బలవత్తర శక్తి ఇంకొకటి లేదు. పురామానవుడు నూటికి నూరుపాళ్లూ విశ్వాసజీవి.  స్త్రీ-పురుష సంబంధాల గురించిన ఊహలు, శీలం, ఏకపత్నీవ్రతం,లేదా ఏకపతీవ్రతం మొదలైనవి మానవ పరిధిలోకి చెందినవి. సామాజిక కల్పనలు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన వాటిని మించినది. అది మానవ పరిధినీ, సామాజిక పరిధినీ దాటేది. ఒక అతీతశక్తి పట్ల, లేదా ప్రకృతిపట్ల జరిగే దారుణ అపచారానికీ, ద్రోహానికీ అది సూచన. 

ఈ సందర్భంలో నాకు ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ’ నవల గుర్తుకొస్తోంది. ఆ నవల ప్రారంభమే ఋతుకాల భయాలతో జరుగుతుంది. మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ  భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ, స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.

books

భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది.

ఋతుకాల విఫలత్వం భ్రూణహత్యా పాపాన్ని చుట్టబెడుతుందన్న ఆదిమ విశ్వాసం ఆధునిక కాలంలోనూ మొన్న మొన్నటివరకూ శ్రోత్రియ కుటుంబాలలో కొనసాగింది. ‘రజస్వలాత్పూర్వ వివాహం’ గతంలో ఒక పెద్ద చర్చనీయాంశం.  పాటించి తీరవలసిన ఒక నియమం. దీనికి ఏవేవో సామాజిక కారణాలు చెబుతారు. వాటిలోనూ నిజం ఉంటే ఉండచ్చు కానీ, నా ఉద్దేశంలో భ్రూణ హత్యా పాపం గురించిన భయాలే ఆ నియమానికి అసలు కారణం. రజస్వలాత్పూర్వ వివాహాల పట్టింపు క్రమంగా కొంత సడలి, రజస్వల అయిన వెంటనే పెళ్లి చేసే తొందరకు దారి తీసింది. ఇప్పుడు ఆ పట్టింపు కూడా చాలావరకూ పోయింది. చట్టం కూడా బాల్యవివాహాలను నిషేధించింది.

మరికొంత వివరించుకుంటే, పైన చెప్పుకున్న ఋతుకాల భయాలనేవి స్త్రీ-పురుష సంబంధాలను వివాహం అనే సామాజిక రూపంలో వ్యవస్థీకరించడానికీ; స్త్రీకి ఒకే పురుషుడన్న నియమానికీ; స్త్రీ శీలం గురించిన నేటి భావనలకూ కూడా పూర్వదశకు చెందిన వనడానికి అవకాశం ఉంది. ఆవిధంగా ఋతుకాలభయాలకూ, వివాహానికీ ముడి అనంతర కాలంలో ఏర్పడిందనుకుంటే, బహుశా ఋతుకాలం ప్రాప్తించిన స్త్రీకి వివాహం వెలుపల సైతం దానిని సఫలం చేసుకునే హక్కూ, తద్వారా సంతానం పొందే హక్కూ ఉండి ఉండాలి. పురుషుడికి ఉన్నట్టే స్త్రీకి కూడా ఋతుకాల వైఫల్యం వల్ల కలిగే భ్రూణ హత్యాభయాలు ఉంటాయి కనుక, ప్రస్తుత సందర్భంలో కథకుడు చెప్పకపోయినా శర్మిష్ట ఆ భయాలను యయాతిపై ప్రయోగించే ఉంటుంది.

దీనిని విస్తరించుకుంటూ వెడితే ఈ చర్చ క్రమంగా మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల గురించిన చరిత్రలోకి తీసుకువెడుతుంది. మాతృస్వామ్యంపై పితృస్వామ్యానిది పై చేయి అయి, స్త్రీ క్రమంగా పురుషుడి ప్రైవేటు ఆస్తిగా మారి, వివాహ వ్యవస్థ బిగుసుకునే క్రమంలో దానికీ;  స్త్రీ ఋతుకాల హక్కుకూ, సంతాన హక్కుకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉండాలి.  భైరప్ప ప్రకారం శల్యుడి కాలానికే ఆ పరివర్తన జరిగిపోయి ఉండాలి. అయితే వ్యవస్థ మారినంత వేగంగా విశ్వాసం మారదు. దాని ఫలితమే శల్యుని భ్రూణహత్యా భయాలు.

పై వివరణ ఇప్పటి నమ్మకాలను, మనోభావాలను గాయపరిచేలా ఉండచ్చు కానీ, స్త్రీకి ఒకే పురుషుడన్న నీతిని మించి ఋతుకాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పే సాక్ష్యాలు మహాభారతంలోనే పుష్కలంగా ఉన్నాయి. ముందుగా మూడు ఉదాహరణలు చెప్పుకుంటే…

ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో కథకుడైన వైశంపాయనుడు వ్యాసుని పుట్టుక గురించి జనమేజయునికి చెప్పి, ఆ వెంటనే, దేవదానవుల అంశతో భీష్మాది వీరులు పుట్టి భారతయుద్ధం చేశారని అంటాడు. అలా పుట్టిన రాజులందరూ భారతయుద్ధంలో నశించడానికి కారణమేమిటని జనమేజయుడు అడుగుతాడు. వైశంపాయనుడు సమాధానం చెబుతూ, పరశురాముడు ఇరవయ్యొక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ సంహరించాడనీ, అప్పుడు ఆ రాజుల భార్యలు సంతానం కోరి ఋతుకాలంలో ధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారనీ, దాంతో రాజవంశాలు వర్ధిల్లాయనీ అంటాడు. ఎన్నో ఆసక్తికర విశేషాలున్న వైశంపాయనుని సమాధానం మొత్తాన్ని నేను ఇక్కడ ఇవ్వడం లేదు. వేరొక సందర్భంలో దాని గురించి చెప్పుకుందాం. ప్రస్తుతానికి వస్తే…

మృతులైన రాజుల భార్యలు ఋతుకాలంలో ధర్మం తప్పకుండా, అంటే ఋతుకాలధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారని పై సమాచారం వెల్లడిస్తోంది. ఇక్కడ ఋతుకాల ప్రస్తావన చేయకుండా, విప్రుల ఆశీస్సులతో సంతానం పొందారని చెప్పి ఉంటే, దానికి ఏదో మహిమను ఆపాదించి సమర్థించుకోవచ్చు. కానీ ఋతుకాలాన్ని ప్రస్తావించి మరీ కథకుడు ఈ సంగతి చెప్పాడుకనుక దీనిని వాస్తవికార్థంలోనే తీసుకోవలసి ఉంటుంది.

రెండో ఉదాహరణ, ఉదంకుని ఉదంతం. ఉదంకుడు పైలుడనే ముని శిష్యుడు. ఫైలు డొకసారి దేశాంతరం వెడుతూ ఇంటి బాధ్యతలు ఉదంకునికి అప్పజెబుతాడు. అంతలో ఫైలుని భార్యకు ఋతుకాలం సంభవిస్తుంది. ఇతర స్త్రీలు ఉదంకునితో ఈ విషయం చెప్పి, గురువు దగ్గరలో లేరు కనుక ఆయన స్థానంలో నువ్వు ఆమెకు ఋతుకాలోచితాన్ని నిర్వర్తించాలని చెబుతారు. ఉదంకుడు అందుకు తిరస్కరిస్తాడు. గురువు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం ఆయనకు చెబుతాడు. అప్పుడు గురువు ఉదంకుని మెచ్చుకుంటాడు. ఉదంకునికి స్త్రీలు ఆ సూచన చేశారంటే, అప్పటికి అలాంటి ఆనవాయితీ ఉందనుకోవాలి. ఉదంకుడు తిరస్కరించాడంటే, ఆ ఆనవాయితీకి కాలం చెల్లుతూ ఉండాలి. ఈ సందర్భాన్ని కథకుడు ప్రధానంగా మరొకందుకు వాడుకున్నాడు. అది, ఉదంకుని గురుభక్తిని చెప్పడం.

నాకు ఈ ఉదంతంలో లీలగా ఇంకొకటి కూడా స్ఫురిస్తూ ఉంటుంది. యజమాని దేశాంతరం వెళ్ళడం, ఒక కట్టుగా ఉన్న స్త్రీలు మాతృస్వామ్యం తాలూకు ఒక ఆనవాయితీని అమలుచేయడానికి ప్రయత్నించడం, యజమాని ప్రతినిధి అయిన ఉదంకుడు అందుకు నిరాకరించడం -ఋతుకాలోచితం విషయంలో  స్త్రీ-పురుషుల మధ్య అప్పటికింకా కొనసాగుతున్న ఘర్షణను సూచిస్తూ ఉండచ్చు.  విశేషమేమిటంటే, సంస్కృత భారతంలో ఉన్న ఈ ఉదంతాన్ని అనువాదంలో నన్నయ పరిహరించాడు.

ఇక మూడో ఉదాహరణకోసం నేరుగా కథలోకి వెడదాం:

శర్మిష్టకు కొడుకు పుట్టాడు. పేరు, దృహ్యువు. దేవయాని ఆశ్చర్యపోయింది.  ‘చిన్నదానివైనా మంచి వినయశీలాలతోనూ, గౌరవంగానూ, మనోవికారాలకు దూరంగానూ ఉంటున్న ఈ పరిస్థితిలో నీకు కొడుకు ఎలా పుట్టాడు? చాలా ఆశ్చర్యంగా ఉందే!’ అంది.

శర్మిష్ట సిగ్గుపడుతూ తలవంచుకుని, ‘ఎక్కడినుంచో ఒక మహాముని, వేదవేదాంగపారగుడు వచ్చి ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకును ప్రసాదించాడు’ అంది.

దేవయాని (ఏమీ మాట్లాడకుండా) తన నివాసానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత శర్మిష్టకు వరసగా అనువు, పూరువు అనే మరో ఇద్దరు కొడుకులు కలిగారు.

దేవయానికి శర్మిష్టలో హఠాత్తుగా వినయశీలాలు, గౌరవనీయత కనిపించడం విశేషం. దానినలా ఉంచితే, శర్మిష్ట సమాధానం గమనించండి…ఎవరో మహాముని వచ్చి, ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకునిచ్చా’ డని చెబుతోంది. పైన రాజుల భార్యల విషయంలో చెప్పుకున్నదే ఇక్కడా వర్తిస్తుంది.  శర్మిష్ట ఋతుకాలం లో ఉన్నప్పుడే ఆ ‘మహాముని’ ఆమెకు కొడుకునిచ్చి వెళ్ళాడు. అది అబద్ధమైనా, అది వెల్లడిస్తున్న ఆనవాయితీ అబద్ధం కాదు. ఆ ఆనవాయితీ దేవయానికి కూడా తెలుసు. అందుకే శర్మిష్ట అలా చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్లిపోయింది. నిజానికి ‘నీకు కొడుకు ఎలా పుట్టా’ డన్నదే దేవయాని ప్రశ్న అయుంటుంది. యయాతి వల్ల కలిగాడా అన్నది తేల్చుకోవడమే ఆమెకు కావాలి.  యయాతి వల్ల కాకుండా, ఇంకెవరి వల్ల శర్మిష్టకు కొడుకు పుట్టినా దేవయానికి అభ్యంతరం లేదు, అందులో ఆశ్చర్యమూ లేదు.

ఇక, ఆమె ప్రశ్నలోని మిగతా భాగమంతా కథకుని కల్పన. ఎందుకంటే, ఋతుకాల ప్రాధాన్యాన్ని వెల్లడించే ఆ ఆనవాయితీ చర్చలోకి రాకూడదు. అందుకే, దేవయాని నోట తన మాటలు పలికిస్తూ ఆ ఆనవాయితీపై  కథకుడు ముసుగు కప్పుతున్నాడు. కారణం ఇంతకుముందు చెప్పుకున్నదే:  ఆ ఆనవాయితీ గురించి తెలియని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు అతడు కథ చెబుతున్నాడు. లేదా, తనే ఆ ఆనవాయితీని సరిగా పోల్చుకోలేకపోయీ ఉండచ్చు.

కథలోకి వెడితే…శర్మిష్ట కొడుకులు ముగ్గురూ, ఒంటి మీద ఆభరణాలు లేకపోయినా సహజకాంతితో మూడు అగ్నుల్లా ప్రకాశిస్తూ తన ముందు ఆడుకుంటుండగా వినోదిస్తున్న యయాతి దగ్గరికి; శర్మిష్టనూ, ఇతర దాసీ కన్యలనూ వెంటబెట్టుకుని వైభవం చాటుకుంటూ శచీదేవిలా దేవయాని వచ్చింది. తేజస్సు ఉట్టిపడుతుండగా, యయాతి ప్రతిబింబాల్లా ఉన్న ఆ ముగ్గురినీ చూసి ‘ఈ పిల్ల లెవ’ రని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పలేదు. ‘మీ తల్లిదండ్రు లెవ’ రని ఆ పిల్లలనే అడిగింది. వారు లేత చూపుడు వేళ్ళతో యయాతినీ, శర్మిష్టనూ చూపించారు.

తనకు తెలియకుండా యయాతి శర్మిష్టవల్ల సంతానం పొందాడని దేవయానికి తెలిసిపోయింది. కోపమూ, దుఃఖమూ ఆమెను ముంచెత్తాయి. ఈ ‘దానవి’తో సంబంధం పెట్టుకుని యయాతి తనను నిలువునా వంచించాడనుకుంది. తక్షణమే పుట్టింటికి వెళ్ళి, తండ్రి పాదాలమీద పడి దీర్ఘనేత్రాలనుంచి ఉబికివచ్చే జలధారలతో వాటిని కడిగింది.

యయాతి కూడా బతిమాలుతూ దేవయాని వెంటే వెళ్ళి శుక్రుని దర్శించి నమస్కరించాడు.  ‘ధర్మం తప్పి ఈ రాజు రాక్షస పద్ధతిలో ఆ రాక్షసిమీద అనురక్తుడై ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. నన్ను అవమానించాడు’ అని దేవయాని గద్గదస్వరంతో అంది. శుక్రునికి కోపం వచ్చింది. ‘యవ్వన గర్వంతో కళ్ళు మూసుకుపోయి నా కూతురికి అప్రియం చేశావు కనుక నువ్వు వృద్ధాప్యభారంతో కుంగిపోతావు’ అని యయాతికి శాపమిచ్చాడు.

అప్పుడు, ‘ఋతుమతియైన భార్య కొడుకునిమ్మని భర్తను కోరినప్పుడు అతడు నిరాకరించి ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యా పాపం సంభవిస్తుందని పెద్దలు చెప్పలేదా, దానికి భయపడే ఆ మానవతి కోరిక తీర్చాను, ఇందుకు ఆగ్రహించడం న్యాయమా’ అని యయాతి ప్రశ్నించాడు. ఆ వెంటనే గడుసుగా, కూతురిపై శుక్రునికి ఉన్న మమకారానికి గురి పెడుతూ, ‘ఈ దేవయానిపై నాకింకా కోరిక తీరలేదు. ఇప్పుడే వృద్ధాప్యాన్ని ఎలా భరించను?’ అన్నాడు. ఆ మాటకు శుక్రుడు మెత్తబడ్డాడు. ‘అలా అయితే నీ వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఒకరికిచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. విషయసుఖాలతో తృప్తి చెందిన తర్వాత తిరిగి వాడి యవ్వనాన్ని వాడికి ఇచ్చేసి, నీ వృద్ధాప్యాన్ని తిరిగి పుచ్చుకో. ఇంకో విషయం, నీ వృద్ధాప్యాన్ని తీసుకున్నవాడే నీ రాజ్యానికి అర్హుడు, వంశకర్త అవుతాడు’ అన్నాడు.

02Kach

దేవయానీ, శుక్రుల పరంగా ఇందులో విశ్లేషించుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రస్తుతానికి అలా ఉంచితే, ఋతుమతి అయిన భార్య కొడుకునిమ్మని అడిగితే భర్త ఎలా నిరాకరిస్తాడని యయాతి అనడాన్ని గమనించండి… ఇంతకీ శర్మిష్టకు యయాతి ‘భర్త’ ఎలా అయ్యాడు?! ఈ సందర్భం, భర్త అనే మాటకు నేడున్న అర్థాన్ని దాటిపోతోంది. ఇక్కడ భర్త అంటే ఒక స్త్రీకే పరిమితుడైన మొగుడు కాదు. తన పోషణలో ఉన్న దాసీలపై కూడా లైంగిక హక్కు ఉన్న యజమాని, నాథుడు, మాస్టర్. ‘భార్య-దాసి-కొడుకు వారించరాని ధర్మా’లన్న శర్మిష్ట మాట దానినే చెబుతోంది. ఇది ఒకనాటి గృహ ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది.

విశేషమేమిటంటే, శర్మిష్టకు తనను భర్తగా యయాతి చెప్పడంలోని మర్మం ఏమిటన్న సందేహం సంప్రదాయ పండితులెవరికీ వచ్చినట్టు లేదు. కనీసం, దివాకర్ల వేంకటావధాని, జీవీ సుబ్రహ్మణ్యం గార్ల వ్యాఖ్యానంతో టీటీడీ ప్రచురించిన కవిత్రయ భారతం, ఆదిపర్వంలో దీనిపై ఎలాంటి వివరణా లేదు. సంప్రదాయ పఠన పాఠనాలు విడిచిపెట్టిన ఇలాంటి సందేహాల ఖాళీలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఆ ఖాళీలలోనే ఉంది అసలు కథ అంతా!

 

 – కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

ఋతుకాలోచితం –స్త్రీ కి ప్రకృతి వరం !!

అసదృశయౌవనం బిది యనన్యధనం బగునొక్కొ! నాకు ని

క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గ వల్లరీ

కుసుమ సముద్గమం బగునొకో! పతిలాభము లేమి జేసి; యొ

ప్పెసగగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో!

                                                       -నన్నయ

   (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

సాటిలేనిది కదా ఈ యవ్వనం! ఈ సంపద అన్యధనం అవుతుందో కాదో! నాకు కలిగిన ఈ కుసుమ(రజో)దర్శనం, భర్త లేకపోవడం వల్ల, ఎవరూ ప్రవేశించలేని కోటలోని తీగకు పూసిన పూవు చందమైపోతుందేమో!  భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో!?

***

అమ్మలకు, అమ్మలగన్న అమ్మలకు, అక్క చెల్లెళ్లకు ముందుగా భక్తిపూర్వకంగా నమస్కరించి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని ఒక చరిత్రకారుని దృష్టితో పరిశీలించినప్పుడు, ఆ ప్రయత్నం నేటి విశ్వాసాలకు, మనోభావాలకు నొప్పి కలిగించవచ్చు. అశ్లీలంగానూ తోచవచ్చు. కనుక, ఇది తటస్థబుద్ధితో చేసే విశ్లేషణ మాత్రమే సుమా అని ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకుంటున్నాను.

ఇంతవరకు మౌననాయికగా పొడగట్టిన శర్మిష్ట,  పై  పద్యంలోని మాటలు అనుకుంటుంది.

[su_note]పురుషుడు స్త్రీకి సొంతభాష లేకుండా చేసి వంచించవచ్చు. తన ప్రతిధ్వనిగానే ఆమెను మలచి ఉండవచ్చు. కానీ ప్రకృతి కరుణామయి. తను స్త్రీని వంచించలేదు. స్త్రీకి తనదైన భాష నిచ్చింది. యవ్వనమనే వశీకరణ సాధనాన్నీ, పునరుత్పత్తి అనే హక్కునూ ప్రసాదించింది. స్త్రీకి తన శరీరంలో వచ్చే మార్పుల గురించిన భాష తెలుసు. స్త్రీకి తన శరీరంతో మాట్లాడడం తెలుసు. అది ప్రకృతి దత్తమైన వరం.

శర్మిష్ట ఇక్కడ తన శరీరంతో మాట్లాడుతోంది. ఇది ఎంత గొప్ప యవ్వనం అనుకుంటోంది. ఇతరులకు అనుభవయోగ్యమైన సంపద కాకుండా, ఎవరూ చొరలేని కోటలోని తీగకు పూసిన పూవులా ఇది వాడి పోతుందా అనుకుని బాధపడుతోంది. భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో అనుకుంటోంది.

శర్మిష్ట హృదయంలో గూడు కట్టుకున్న ఆ గుబులు శతాబ్దాలుగా, బహుశా సహస్రాబ్దాలుగా స్త్రీనుంచి స్త్రీకి ప్రవహిస్తోంది కాబోలు. ఈ సందర్భంలో, శారద అనే కలం పేరుతో ఒక పురుష రచయిత (నటరాజన్) రాసిన ‘మంచి-చెడు’ నవలలోని పద్మ పాత్ర గుర్తుకొస్తోంది. ఆ నవల గురించి ఎలాంటి విశ్లేషణలు వచ్చాయో నాకు గుర్తులేదు. ప్రకృతిధర్మం అనే కోణం నుంచి నేను ఆ నవలను విశ్లేషించాను(కాలికస్పృహ: మరికొన్ని సాహిత్యవ్యాసాలు). ప్రకృతిధర్మాన్ని పై కెత్తి చూపించిన ఆ నవల నాకు ఓ అద్భుతంగా, అసాధారణంగా తోస్తుంది. పద్మను వయసు మళ్లిన ఒక సంపన్న వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. యవ్వన సహజమైన కోరికలు తీరక పద్మ చిత్రవధ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె అనుకున్న మాటలు నాకు గొప్ప కవిత్వంలా తోస్తాయి:

వసంతకాలాలూ, చలిరాత్రులూ, వర్షపు రోజులూ ఏటేటా వస్తూనే ఉంటాయి. ప్రకృతిధర్మం ఒక్కలానే ఉంటోంది- దశాబ్దాల తరబడి. కానీ వ్యక్తి జీవితంలో అనుభవనీయమైన రాత్రులు కొన్నే! అవి ఇట్లా మానవకల్పితమైన నీతులకు, కట్టుబాట్లకు లోబడి వ్యర్థం కావలసిందేనా? [/su_note]

సమవయస్కుడైన సవతి కొడుకుపై ఆమె దృష్టి పడుతుంది. సంఘభయంవల్ల వెనకడుగు వేస్తుంది. అంతలో వ్యాపారంలో భాగస్వామి వంచన వల్ల భర్త ఆస్తి హరించుకుపోతుంది. భర్త కూడా చనిపోతాడు. పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి ఉన్నంతకాలం శరీరసౌఖ్యం కోసం పరితపించినా, ఆమె నీతి తప్పే ధైర్యం చేయలేకపోతుంది. ఆస్తి కరిగిపోగానే అంతవరకూ తనను బంధించిన భయాలనుంచి ఆమెకు విముక్తి లభించినట్లవుతుంది. శారీరకవాంఛను ఎలాగో అణచుకున్నా, ఆకలి అనే ప్రాకృతికధర్మాన్ని అణచుకోవడం ఆమెకు అసాధ్యమవుతుంది. చివరికి అయిదు రూపాయిలకు శీలాన్ని అమ్ముకుని కడుపాకలినీ, శరీరపు ఆకలినీ కూడా తీర్చుకుంటుంది. అప్పుడామె శారీరక, మానసిక స్థితులను రచయిత ఇలా వర్ణిస్తాడు:

నునుపుగా, ఎన్నడూ లేనంత అందంగా కనబడుతోంది ఆమె మొహం. అది ఈ రెండురోజుల నుంచి కలిగిన సౌఖ్యప్రాప్తి వల్ల, ఇష్టం వచ్చిన తిండి తినడం వల్ల ఏర్పడ్డ నునుపేమో…పద్మ మనస్సు లేడిలా, పంజరం నుంచి విడిపించుకున్న చిలకలాగా ఎగురుతోంది. తన ప్లాను వీళ్ళకు తెలియడం అసంభవం. తెలిస్తే అది వ్యభిచారమని అంటారు. కానీ ఏవిధంగా తన క్షుద్బాధను తీర్చుకోగలదు? తన తృష్ణను న్యాయమైన విధాన చల్లబరచుకోవడానికి అవకాశం ఎక్కడ?…

సవతి కొడుకు పాత్ర మరో అపురూప సృష్టి. అతడు సంఘనీతికి బద్ధుడు. అయినాసరే, సాక్షి మాత్రుడుగా ఉంటూనే సంఘనీతికీ, ప్రకృతిధర్మానికీ మధ్య పద్మలానే అతను కూడా నలిగిపోతాడు. పద్మ నడవడిని అతను గమనిస్తూనే ఉంటాడు. తప్పుపట్టకపోగా ఆమెపై సానుభూతితో కరిగి నీరైపోతాడు. ఇలా అనుకుంటాడు:

నిజానికామె ఈ యవ్వనకాలాన్ని ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో హాయిగా గడపవలసింది. సహజవాంఛల్నీ, ఆకలినీ తీర్చుకోవడంలో కలిగే ఆనందాన్ని, ప్రకృతిదత్తమైనదిగా, సమాజ శుభాశీస్సులతో అనుభవించవలసింది. కానీ నేడామె ఆ ఆనందాన్ని రహస్యంగా, దొంగలాగా అనుభవించవలసివస్తోంది.

ప్రకృతిధర్మం అనే గీటురాయి మీద లైంగికవాంఛను పరిశీలిస్తున్న ఈ వాక్యాలు ప్రకృతి అంత సహజంగానూ, సూటిగానూ, స్వచ్ఛంగానూ  నా చెవులకు ధ్వనిస్తాయి. ఎంతో సాంద్రమైన ఆర్ద్రతా, అనుకంపల లోతులనుంచి ఇవి పలుకుతున్నట్టుంటాయి. లైంగికవాంఛను ఇలా వ్యాఖ్యానించిన రచయిత ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

ప్రస్తుతానికి వస్తే…

sarmishta

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది. ఏ ఆడదైనా కోరుకునేది భర్తనూ, కొడుకులనూ పొందాలనే, ఆ రెండూ దక్కిన దేవయాని అదృష్టమే అదృష్ట మనుకుంటోంది.

యయాతి తొలిసారి తనను చూసినప్పుడే ఆ చూపుల్లో తన మీద ఉట్టిపడుతున్న ఇష్టాన్ని శర్మిష్ట పోల్చుకుని ఉంటుంది. అప్పుడే నిశ్శబ్దంగా తన హృదయంలో అతనిని నిలుపుకుని ఉంటుంది.  అతనిమీదే నా హృదయం ఎప్పుడూ లగ్నమై ఉంటుందని ఇప్పుడు కూడా అనుకుంటున్న శర్మిష్ట, ‘నన్నీతడు గరము  కారుణ్యమున  బ్రీతి గలయట్ల జూచు…’ ననుకుంది.

సామాజిక స్థాయీ భేదాలు మానవసంబంధాలలోనే కాక; వాటి వ్యక్తీకరణకు ఉపయోగించే మాటల్లో కూడా తేడా ఎలా తీసుకొస్తాయో పౌరాణికుడు ఇక్కడ అలవోకగా సూచిస్తున్నాడు. యజమాని ఒక దాసిపై  చూపించే అనురక్తిని ప్రేమ అనో, అనురాగమనో అనకూడదు; కారుణ్యం అనాలి. దాసి కూడా యజమాని నుంచి కారుణ్యాన్ని మాత్రమే ఆశిస్తుంది. పై వాక్యం శర్మిష్ట దాసిత్వాన్నే కాక ప్రస్తుత సందర్భంలో ఆమె దయనీయతను కూడా వెల్లడిస్తోంది.

దేవయానిలానే నేను కూడా ఇతనినే భర్తను చేసుకుంటానని శర్మిష్ట అనుకుంది. సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’ అంది.

‘పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు.

‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.

[su_note note_color=”#ff6696″] శర్మిష్టకు శరీరంతో మాట్లాడే భాషే కాదు, దానికి కావలసినవి సాధించుకునే తర్కమూ తెలుసు. అందుకు అవసరమైన పాండిత్యమూ ఆమెకు ఉంది. మగవాడి బలహీనతపై ఒడుపుగా గురిచూసి కొట్టి లొంగదీసుకునే నేర్పూ ఉంది. ప్రకృతి ప్రతి ప్రాణికీ ఆయాచితంగా ప్రసాదించిన నేర్పు అది. ప్రకృతి సిద్ధమైన ఆమె బలవత్తర వాంఛ ఆ క్షణంలో దేవయానిపట్ల భీతిని కూడా జయించింది.

శర్మిష్టను, యయాతిని కాసేపు పక్కన ఉంచి కథకుని దగ్గరకు వద్దాం. నిజానికి వాళ్ళ ఇద్దరి ముఖంగా కథకుడే శ్రోతలతో ఇక్కడ సంభాషిస్తున్నాడు. వారిద్దరి సంబంధానికి సమర్థన అందించే వ్యూహంతో ఈ ఘట్టాన్ని నిర్మిస్తున్నాడు. ఎలాగంటే, శర్మిష్టతో యయాతి సుఖించడానికి ఎలాంటి సమర్థనలూ అవసరం లేదు. దాసీతో సంబంధం ఆనాడు తప్పు కాదు. కాకపోతే, దేవయానికి ఇష్టం లేదు కనుక అది రహస్య సంబంధంగా పరిణమించి ఉండచ్చు. శుక్రునికి ఇచ్చిన మాట ఎలా తప్పనని  యయాతి అన్నప్పుడు, కొన్ని సందర్భాలలో మాట తప్పవచ్చునని శర్మిష్ట గుర్తుచేయడంలో అర్థముంది. కానీ, నా యజమానురాలికి భర్తవు కనుక నాకు కూడా భర్తవే ననీ; భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయరాని ధర్మాలనీ విడమరచి బోధించడంలో అర్థం లేదు. ఎందుకంటే, రాజూ, యజమానీ అయిన యయాతికి ఆ విషయం తెలియకుండా ఉండదు. కనుక, ఆ బోధ శర్మిష్ట యయాతికి చేస్తున్నది కాదు; కథకుడు శ్రోతలకు చేస్తున్నది! కారణం, ‘భార్య-దాసి-కొడుకు’ అనే విడదీయలేని ధర్మాలకు చెందని, భిన్న సామాజిక దశలోని శ్రోతలకు కథకుడు ఆ విషయం చెబుతున్నాడు!

అయితే, భిన్న సామాజిక దశకు చెందిన శ్రోతలను ఉద్దేశించడంలో కథకుడు  తెలిసో, తెలియకో అంతకంటే కీలకమైన ఒక అంశాన్ని కలగా పులగం చేస్తున్నాడు. అది, తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని శర్మిష్ట అడిగిన సందర్భం.[/su_note]

ఋతుమతి అనే మాట ఉంది. దాని అర్థం మనకు తెలుసు. అది మొదటిసారి పెద్దమనిషి కావడాన్ని సూచిస్తుంది. ఋతుకాలం వేరు. అది నెల నెలా సంభవిస్తుంది. ఋతుకాలం సంతానం పొందడానికి యోగ్యమైన కాలం. శర్మిష్ట తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతోంది. అంటే, తనిప్పుడు ఋతుకాలంలో ఉన్నాననీ, సంతానం ఇవ్వమనీ అడుగుతోంది. ఇలా ఆయా స్త్రీలు ఋతుకాలోచితం ప్రసాదించమని అడగిన సందర్భాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. వాటి ప్రస్తావనను ప్రస్తుతానికి వాయిదా వేస్తే; కథకుడు తెలివిగానో, లేక అతి తెలివితోనో, నిజంగానే తెలియకో ఋతుమతి-ఋతుకాలోచితం అనే రెండు మాటలనూ ఒకే అర్థంలో ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించడంలో ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చి సందేహాలకు తావిస్తున్నాడు.

ఎలాగంటే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాత, శర్మిష్ట-యయాతుల మధ్య సమాగమం గురించి చెబుతూ,  ‘శర్మిష్ట సంప్రాప్తయవ్వనయు, ఋతుమతియు అయిం’ దని అంటున్నాడు! అంటే, కొత్తగా ఆమె ఋతుమతి అయిందనే భావన కలిగిస్తున్నాడు. అంతవరకు జరిగిన కథను గమనిస్తే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాతే శర్మిష్ట యవ్వనవతి, ఋతుమతి అయిందనడం నమ్మశక్యంగా ఉండదు. దేవయానికీ, శర్మిష్టకూ స్పర్థ ఉంది కనుక వారిద్దరూ ఇంచుమించు సమవయస్కులే అవుతారు. మహా అయితే, ఇద్దరి మధ్యా ఒకటి రెండేళ్ల అంతరం ఉండచ్చు. వయసులో తేడా ఎలా ఉన్నా; శర్మిష్ట దేవయాని పెళ్ళికి ముందే యవ్వనవతి అయుండాలి. ‘అతిశయ రూప లావణ్య సుందరి’ అయిన శర్మిష్టను దేవయాని పక్కన చూసి యయాతి ఆమె ఎవరో తెలుసుకోగోరాడని చెప్పడం ద్వారా అతడు ఆమెవైపు ఆకర్షితుడయ్యాడని కథకుడు అప్పుడే సూచించాడు. కనుక అప్పటికే ఆమె యవ్వనవతీ, ఋతుమతీ అయుండాలి.

మరి కథకుడు ఎందుకీ  కల్పన చేసినట్టు?! ఎందుకంటే,ఋతుమతి, ఋతుకాలోచితం అనే మాటల మధ్య ఉన్న అర్థభేదాన్ని అతడు గమనించి ఉండకపోవచ్చు. శర్మిష్ట ఋతుకాలోచితం ప్రసాదించమని అడుగుతోంది కనుక అప్పుడే ఆమె ఋతుమతి అయిందని పొరబడి ఉండచ్చు. ఇంకొకటి జరగడానికీ అవకాశముంది. కథకుడు ఉద్దేశపూర్వకంగానే ఋతుకాలోచితం అనే మాటకు ఉన్న భిన్నార్థాన్ని మరుగుపుచ్చే ప్రయత్నం చేసి ఉండచ్చు. ఎందుకంటే, ఋతుకాలోచితం ప్రసాదించమని అడగడం కూడా ఒకానొక సామాజిక దశకు చెందిన ప్రయోగం. కానీ, కథకుడు వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు కథ చెబుతున్నాడు…

మిగతా విశేషాలు తర్వాత….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

పెళ్లి ఒకరితో…ప్రేమ ఒకరిపై…

శర్మిష్టను కోరి దేవయానికి తాళి

 

నన్ను వివాహమై నహుషనందన! యీ లలితాంగి దొట్టి యీ

కన్నియలందరున్ దివిజకన్యలతో నెన యైనవారు నీ

కున్నతి బ్రీతి సేయగ నృపోత్తమ! వాసవు బోలి లీలతో

ని న్నరలోకభోగము లనేకము లందుము నీవు, నావుడున్

                                                       -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

నహుషుని కుమారుడవైన ఓ యయాతీ! నన్ను వివాహం చేసుకుని, దేవకన్యలకు సాటివచ్చే ఈ సుందరి(శర్మిష్ట)తోపాటు ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా నరలోకంలో అనేక భోగాలు అనుభవించు…

   ***

  దేవయాని పరంగా చెప్పిన కథలా కనిపిస్తున్నా నిజానికిది శర్మిష్ట కథ అన్నాను. ఈ కోణం నుంచి ఈ కథను  ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారో లేదో నాకు తెలియదు. సంప్రదాయం అలాంటి పరిశీలనలకు సాధారణంగా అవకాశం ఇవ్వదు. అది పురాణ, ఇతిహాసాల చుట్టూ ఒక బలమైన ఊహా చట్రాన్ని నిర్మించి దానికి కాపలా కాస్తూ ఉంటుంది. తను అనుమతించిన మేరకే స్వతంత్ర పరిశీలనకు స్వేచ్ఛ నిస్తుంది. సంప్రదాయం నిర్మించే చట్రం ఎంత, బలంగా ఉంటుందంటే, ఆ చట్రం లోపలే ఆలోచించడం ఒక అసంకల్పిత చర్యగా మారిపోతుంది.  అనేక సందేహాలు, అసంబద్ధాలు ఆ చట్రం కింద అణిగిపోతాయి.  వాటిపై మౌనం ఒక ఉక్కు తెర వేలాడుతూ ఉంటుంది. మహాభారతం లోంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు. యయాతి-దేవయాని-శర్మిష్టల కథే ఒక గొప్ప ఉదాహరణ.  

అదే సమయంలో ప్రతికాలంలోనూ, ప్రతి తరమూ తన జ్ఞానవారసత్వాన్ని నూతన విజ్ఞానం వెలుగులో సరికొత్తగా దర్శిస్తూనే ఉంటుంది.  మానవ అనుభవానికీ, జ్ఞానానికీ నిత్య నవీనత్వాన్ని, తాజాదనాన్ని సంతరిస్తూనే ఉంటుంది.  దీనిని నేను అదనపు విలువను జోడించడం అంటాను. ఇలా అదనపు విలువను జోడించడం కూడా వాటి అస్తిత్వాన్ని పొడిగించే కారణాలలో ఒకటని నేను భావిస్తాను.  అలాగని సంప్రదాయపాఠాన్ని తక్కువ చేయకూడదు. శతాబ్దాలుగా సంప్రదాయ పఠన పాఠనాలు పురాణ, ఇతిహాసాలను కాపాడుకుంటూ వస్తున్నాయి కనుకే, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకు సంప్రదాయ కవి పండితులకు, పౌరాణికులకు కృతజ్ఞతా వందనాలు అర్పించుకోవలసిందే!

ఇక్కడే ఇంకొక వివరణ కూడా ఇచ్చుకోవాలి. అదనపు విలువ జోడించే ప్రయత్నంలో ప్రతిసారీ ప్రమాణాలూ, ఆధారాలూ, కచ్చితమైన అన్వయాలూ ఇవ్వలేకపోవచ్చు. గ్రంథస్థ విషయాలనుంచి పక్కకు జరగచ్చు. ఊహల మీద ఆధారపడవలసి రావచ్చు. పురాణ, ఇతిహాసాలలో వాస్తవాలను పట్టుకోవడం సాధారణంగా గడ్డిమేటలో సూదిని వెతకడంలా పరిణమిస్తుంది. అయినాసరే, ఊహకు ఉండే విలువ ఊహకూ ఉంటుంది. వాస్తవాల అన్వేషణలో  ఒక్కోసారి ఊహ తొలి అడుగు కావచ్చు.

ప్రస్తుతానికి వస్తే…

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న ’అతిశయ రూప లావణ్య సుందరిఅయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ‘ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు’ అంది.

ఆ వెంటనే, ‘నన్ను నూతిలోంచి  పైకి తీసినప్పుడే ఆ సూర్యుని సాక్షిగా నీ కుడి చేతితో నా చేయిపట్టుకున్నావు. అది నన్ను పెళ్లాడడమే. ఆ సంగతి విస్మరించడం నీకు న్యాయం కాదు’ అని హెచ్చరించింది. ఆపైన, ‘నహుషుని కొడుకువైన  యయాతీ, నన్ను పెళ్లి చేసుకుని ఈ సుందరాంగితోపాటు, దేవకన్యలకు సాటి వచ్చే ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా దేవేంద్రుడిలా ఈ నరలోకంలో అన్ని భోగాలూ అనుభవించు’ అంది. దేవేంద్ర భోగాలు అనుభవించమనడంలో తెలివిగా ‘ఓ నహుషనందనా’ అని సంబోధించింది. నహుషుడు కొంతకాలం ఇంద్రపదవిలో ఉన్నాడు.

01Kach

దేవయాని ప్రతిపాదనకు యయాతి అభ్యంతరం చెప్పాడు. క్షత్రియకన్యలను బ్రాహ్మణులు వివాహం చేసుకోవచ్చు కానీ, బ్రాహ్మణకన్యలను క్షత్రియులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఉందా, వర్ణాశ్రమధర్మాలను కాపాడవలసిన రాజునైన నేనే ధర్మం తప్పితే ప్రపంచం నడక అస్తవ్యస్తమైపోదా అన్నాడు. అప్పుడు దేవయాని, ‘గొప్ప బాహుబలం కలవాడా’ అని అతన్ని సంబోధించి, ‘ధర్మాధర్మాలు నిర్ణయించే లోకపూజ్యుడైన శుక్రుడు ఆదేశిస్తే నన్ను పెళ్లిచేసుకుంటావా?’ అని అడిగింది. ‘బాహుబలం కలవాడా’ అనడంలో, రాజ్యపాలనే నీ బాధ్యత తప్ప ధర్మాధర్మనిర్ణయం కాదు, అది శుక్రుడు చేయవలసిన పని అనే మెత్తని చురక ఉంది. అంతేకాదు, తండ్రిని తను ఒప్పించగలనన్న ధీమా కూడా ఆ మాటల్లో ఉంది.

ఆ మహాముని ధర్మవిరుద్ధం కాదంటే నిన్ను వివాహమాడతానంటూ యయాతి ఆ సంభాషణకు అంతటితో తెర దించాడు. దానిని పొడిగించడం వల్ల అతనికి నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే, అప్పటికే అతను శర్మిష్టవైపు ఆకర్షితుడయ్యాడు. దేవయాని ఆమెను తన దాసిగా పరిచయం చేసింది కనుక, ఆమెను నేరుగా తను పొందగల అవకాశం లేదు. దేవయానిని తను పెళ్లిచేసుకుంటేనే శర్మిష్ట తన దవుతుంది. బహుశా నేరుగా ఆమెను తను స్వీకరించడానికి సామాజిక స్థాయికీ, హోదాకూ చెందిన అభ్యంతరాలు కూడా ఉండి ఉండచ్చు. దేవయాని మాట నేర్పు, స్వభావం అప్పటికే అతనికి అర్థమయ్యాయి. ఆమె తనతో పెళ్ళికి తండ్రిని ఒప్పించగలదన్న నమ్మకమూ అతనికి కలిగి ఉంటుంది. దేవయానితో పెళ్ళికి అంగీకరిస్తేనే శర్మిష్ట  తనకు దక్కుతుంది కనుక దేవయానితో తన పెళ్లి ధర్మమా, కాదా అన్న చర్చ తనకు అనవసరం. అది తేల్చే బాధ్యత దేవయాని తీసుకుంది.

జాగ్రత్తగా గమనించండి…యయాతి దేవయాని పట్ల ఆకర్షితుడు కాలేదు. ఇంతకుముందు ఆమెను నూతి లోంచి పైకి తీసిన తర్వాత అతను తన దారిన తను వెళ్లిపోయాడని చెప్పడం ద్వారా కథకుడు ఆ సూచన చేయనే చేశాడు. ప్రస్తుత సందర్భంలో, ‘అతిశయ రూపలావణ్యసుందరి’ అయిన శర్మిష్ట గురించి తెలుసుకో గోరాడని అనడం ద్వారా ఆమె వైపు అతను ఆకర్షితుడయ్యాడన్న సూచన అంతకంటే స్పష్టంగా ఇచ్చాడు.

దేవయాని, యయాతి ల మధ్య నడిచినది ఒకవిధమైన మైండ్ గేమ్. ఇద్దరిలోనూ లౌక్యమూ, గడుసుదనమూ ఉన్నాయి. ఇద్దరికీ తమవైన వ్యూహాలు ఉన్నాయి. దేవయానికి రాజును పెళ్లాడడం ముఖ్యం. తద్వారా లభించే రాచవైభవం ఆమెకు కావాలి. యయాతికి రూపలావణ్య సుందరి అయిన శర్మిష్ట కావాలి. శర్మిష్ట మనసులో ఆ క్షణంలో ఎటువంటి ఆలోచనలు చెలరేగాయో మనకు తెలియదు. అప్పటికామె ఎటు వంచితే అటు వంగవలసిన మైనపు బొమ్మ!

దేవయాని అప్పటికప్పుడు తండ్రిని రప్పించింది. ‘ఈ రాజు ఇప్పటికే నా పాణిగ్రహణం చేశాడు కనుక వివాహ సంబంధంగా ఇంకొకరు నా చేయి పట్టుకోవడం ఎలా ధర్మమవుతుంది? కనుక ఈ జన్మలో ఇతడే నా భర్త. నువ్వు ఒప్పుకుంటే నన్ను పెళ్లాడతానని ఇతడు కూడా మాట ఇచ్చాడు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడు’ అని తండ్రితో అంది. గమనించండి…దేవయాని ఈ పెళ్లి ధర్మబద్ధమో, కాదో చెప్పమని అడగలేదు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడమని మాత్రమే అడిగింది. అంటే తన terms and conditions ను స్పష్టంగా నిర్దేశించిందన్నమాట. శుక్రుడు వాటిని దాటి మాట్లాడే ప్రశ్నే లేదు. ఈ వివాహంలో ఎలాంటి ధర్మోల్లంఘనా లేదన్న ఒకే ఒక వాక్యంతో ఆమోదం తెలిపేశాడు. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.

ఆ తర్వాత శుక్రుడు శర్మిష్టను యయాతికి చూపించి, ’ఈమె వృషపర్వుని కూతురు. ప్రేమతో ఈమెకు అన్నపానాలు, వస్త్రాభరణాలు, సుగంధలేపనాలు వగైరాలు సమకూర్చి సంతోషపెట్టు. అయితే ఈమెతో నువ్వు పడక సుఖానికి మాత్రం దూరంగా ఉండాలి’ అన్నాడు. యయాతి శుక్రుని వద్ద సెలవు తీసుకుని దేవయానినీ, శర్మిష్టతో సహా దాసీకన్యలనూ  వెంటబెట్టుకుని రాజధానికి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఒక చక్కని మేడలో దేవయానిని ఉంచి; ఆమె అనుమతితో శర్మిష్టనూ మిగిలిన కన్యలనూ అశోకవనం సమీపంలోని ఒక గృహం లో ఉంచాడు.

యయాతితో శుక్రుడు అన్న పై మాటలు అతని స్వభావాన్నీ, దేవయాని స్వభావాన్నీ కూడా మరోసారి వెల్లడిస్తున్నాయి. దేవయానిలో అహమూ, అసూయే కాక; అవకాశవాదమూ, స్వార్థమూ కూడా హెచ్చుపాళ్లలోనే ఉన్నాయి. యయాతిని తనతో పెళ్ళికి ఒప్పించే ముందు; శర్మిష్టనూ, మిగిలిన దాసీ కన్యలనూ చూపించి దేవతాస్త్రీలకు సాటివచ్చే ఈ సుందరాంగులందరూ నిన్ను సుఖపెడతారని ఆశపెట్టింది. తీరా యయాతి పెళ్ళికి ఒప్పుకున్నాక మాట మార్చింది. యయాతిని శర్మిష్టతో కలసి పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆ మాట యయాతితో తను నేరుగా చెప్పకుండా తండ్రితో చెప్పించింది. తండ్రి ఆదేశాన్ని ఉల్లంఘించే సాహసం యయాతి చేయడని ఆమె ధీమా.

శుక్రుడు కూతురి అభిమతాన్ని కాదనే ప్రసక్తే లేదు కనుక, శర్మిష్టను పడక సుఖానికి  మాత్రం దూరంగా ఉంచమని యయాతికి ప్రత్యేకించి చెప్పాడు. అయితే, వృషపర్వుని కూతురైన ఈమెకు అన్నీ సమకూర్చి సంతోషపెట్టు అని కూడా అంతే ప్రత్యేకంగా చెప్పాడు. అలా చెప్పడంలో శర్మిష్టపై అతనికున్న పుత్రికావాత్సల్యమూ, సుకుమారంగా సుఖాల మధ్య పెరిగిన ఆమెను కష్టపెట్టవద్దని చెప్పే ఔదార్యమూ, ధార్మికతా వ్యక్తమవుతూ ఉండచ్చు.

ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, శర్మిష్టకు అన్ని వసతులూ కల్పించి పడక సుఖానికి మాత్రం దూరంగా ఉంచమని శుక్రుడు చెప్పడంలో, ఆమెనుంచి పడక సుఖం కూడా పొందమన్న ధ్వని ఉండడానికీ అవకాశముంది. దాని గురించి వివరించుకోవడం ప్రారంభిస్తే, ఆ వివరణ ఇంతకుముందు చెప్పినట్టు, దేవయాని పరంగా చెప్పిన కథను శర్మిష్ట పరంగా మార్చివేస్తుంది. శర్మిష్టనే కథానాయికగా మనముందుకు తీసుకొస్తుంది.

ఎలాగంటే, యయాతికి శర్మిష్టను చేపట్టడమే ప్రధాన లక్ష్యం. అందులో వ్యక్తిగత ఆకాంక్షే కాక, రాజకీయ అవసరం కూడా ఉండచ్చు. తను రాజు కనుక రాచకన్యద్వారానే వారసుని కనవలసి ఉంటుంది.  అప్పుడే దానికి సమాజం నుంచి హర్షామోదాలు లభిస్తాయి. దేవయానికి కలిగే సంతానానికి సమాజం ఆ ప్రతిపత్తి ఇవ్వదు. వారసుని ఎంపికలో ఆనాటి రాజుకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదు. అది సమాజమూ, రాజూ కలసి తీసుకోవలసిన సమష్టి నిర్ణయం. యయాతికీ, శుక్రుడికీ కూడా ఆ అవగాహన ఉంది. అయితే, ఇక్కడ మధ్యలో దేవయాని ఉంది. ఇంతవరకు శుక్రుడికి నెత్తి మీద దేవతగా ఉన్న దేవయాని ఇకముందు యయాతికి చిక్కుముడిగా మారబోతోంది. బహుశా యయాతి-శర్మిష్టల మధ్య కలగబోయే సంబంధం శుక్రుని ఊహలో ముందే ఉండి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే, అందుకు సంబంధించిన రాజకీయ ప్రణాళికలో శుక్రుడు కూడా భాగస్వామి అయుండచ్చు.

కూతురిపై అపరిమిత మమకారం ఉన్న శుక్రుడు ఆమె కాపురంలో చిచ్చు పెట్టే పాత్ర నిర్వహించాడంటే వినడానికి విడ్డూరంగానూ, విపరీతంగానూ ఉండే మాట నిజమే. అయితే, కాసేపు దేవయాని పరంగా చెప్పిన కథ అన్న సంగతి మరచిపోయి శర్మిష్ట పరంగా చెప్పిన కథగా ఊహించుకోండి. యయాతి అసలు శర్మిష్టనే చేపట్టాలనుకున్నాడు. అయితే, ఆమె దేవయానికి అప్పటికే దాసిగా మారిపోయింది కనుక యజమానురాలిని పెళ్లాడితేనే శర్మిష్ట తనకు దక్కుతుంది. యయాతి వైపునుంచి ఈ మొత్తం వ్యూహానికి సంబంధించిన అవగాహన లోకజ్ఞుడైన శుక్రుడికి పూర్తిగా ఉంది. దేవయానికి లేదు. ఎందుకంటే, ఆమెది పూర్తిగా వైయక్తికమైన అజెండా. అందులో ఇతరేతర అంశాలకు చోటులేదు.

  అసలు శర్మిష్ట కథను దేవయాని వైపునుంచి కథకుడు ఎందుకు చెప్పినట్టు? రెండు కారణాలను ఊహించవచ్చు. మొదటిది, దాసిగా ఉన్న శర్మిష్టను రాజమార్గంలో చేపట్టడానికి యయాతికి అవకాశంలేదు. అందుకు సామాజిక నిర్బంధాలు అడ్డువస్తాయి. రెండవది, కథకుడికి దేవయానిని ప్రధానం చేసి కథ చెప్పడమే ఇష్టం. ఎందుకంటే, ఆమె భృగువంశీకురాలు. కోశాంబీ ప్రకారం మహాభారత పరిష్కరణలో భృగులు ప్రధాన భూమిక పోషించారు. భృగులను విశిష్టులుగా చిత్రించే ఘట్టాలు మహాభారతంలో చాలా ఉన్నాయి. పరశురాముడు ఇంకో ఉదాహరణ.  

కథలోకి వస్తే, ‘దేవయాని అనుమతి’తో శర్మిష్టను ఇతర దాసీ కన్యలతోపాటు యయాతి అశోకవన సమీపంలో ఒక గృహంలో ఉంచాడని కథకుడు చెబుతున్నాడు. ఆ సమాచారంతో యయాతి-శర్మిష్టల మధ్య జరగబోయే సమాగమాన్ని  సూచిస్తున్నాడు. అంటే, ఎంత దేవయాని వైపునుంచి కథ చెప్పినా కథకుడు శర్మిష్ట ప్రాధాన్యాన్ని కప్పిపుచ్చలేకపోతున్నాడన్నమాట!  అదలా ఉంచితే, ‘దేవయాని అనుమతితో’ శర్మిష్టను (తను తరచు విహరించే) అశోకవన సమీపంలో ఉంచాడని చెప్పడం  ద్వారా, అనేకమందితో రహస్య ప్రణయాలు సాగిస్తూ, భార్యపట్ల అతి విధేయతను ప్రదర్శించే దక్షిణనాయకుడిగా యయాతిని కథకుడు మన ముందుకు తెస్తున్నాడు.

అనంతర కథ తర్వాత…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 –కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నువ్వు కట్టిన చీర…!

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

జలధి విలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ

తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ

ద్గళదురుఘర్మవారికణ కమ్ర కరాబ్జము వట్టి నూతిలో

వెలువడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్

                                               -నన్నయ

(శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

కీర్తిమంతుడైన యయాతి, మధురధ్వని చేస్తూ చలించే అలలనే  ప్రకాశించే వడ్డాణాన్ని ధరించిన భూమిని మోయడానికి సమర్థమైన తన కుడి చేతిని చాచాడు. విపరీతంగా చెమట బిందువులు జారుతున్న పద్మం లాంటి అందమైన చేతిని అందుకుని  ప్రేమతో ఆ కోమలిని నూతిలోంచి పైకి తీశాడు.  

***

మహాభారతాన్నేనా?!… కాదు; నన్నయ, తిక్కన, ఎర్రనల కథన శైలిని కూడా నేనిప్పుడు పునర్దర్శిస్తున్నాను. ఇంగ్లీష్ లో దీనిని re-invention అంటారనుకుంటాను.  ఈ మాటకు పునర్దర్శనం, పునరావిష్కారం అనే మాటలు సరైన తర్జుమా అవుతాయో కావో చెప్పలేను.  ఎర్రన రాసింది అరపర్వమే కావచ్చు కానీ, ఆయన అనువదించిన ధర్మవ్యాధోపాఖ్యానం చదువుతూ ఎంత ఆశ్చర్యానందాలు చెందానంటే, ఆ పుస్తకం మార్జిన్ లో అప్పటికప్పుడు ఆయనకు నా సాష్టాంగవందనాలు రాసుకున్నాను. ఆ ఘట్టాన్ని విశ్లేషిస్తూ ఆ తర్వాత ఒక పెద్ద వ్యాసం రాశాను.

ఇక, నన్నయ కథనంలో చక్కదనం ఎక్కువైతే, తిక్కన కథనంలో చిక్కదనం ఎక్కువని నాకు అనిపిస్తుంది. అలాగని, నన్నయ కథనంలో చిక్కదనం, తిక్కన కథనంలో చక్కదనం ఉండవని కాదు. ఒకటి మాత్రం అనకుండా ఉండలేను. నాలుక మీద నాట్యమాడే (quotable) పద్యాలు తిక్కనవి కంటే నన్నయవే ఎక్కువ. ఇప్పుడాలోచిస్తే నన్నయకు ఇవ్వవలసినంత ఘనత ఇచ్చామా అన్న సందేహం కలుగుతుంది. తెలుగులో ఆదికృతిని ఇవ్వడమేకాదు, వెయ్యేళ్లను మించి సరిపోయే పద్యం నమూనాను అందించినవాడు నన్నయ్యే. తెలుగుపద్యం సొగసులన్నీ నన్నయ ఉచ్చిష్టాలే నని  నేను అంటాను. అనంతరకవులందరూ నన్నయ పద్యంలోని మెళకువలనే కొల్లగొట్టారు. అయితే, ఎంత కొల్లగొట్టినా నన్నయవంటూ కొన్ని ప్రత్యేకతలు అలాగే మిగిలిపోవడం విశేషం. ఆ మధ్య నన్నయ విషయంలో ఒక ఘోరమైన వాదం ముందుకు వచ్చింది. తెలుగు భాషకు ప్రాచీనతా ప్రతిపత్తిని ఇవ్వాలంటే, నన్నయకు ముందే తెలుగులో కవిత్వం ఉందని నిరూపించాలి కనుక, అందుకు నన్నయకు ఉన్న ఆదికవి బిరుదు అడ్డువస్తోంది కనుక, ఆదికవి పీఠం నుంచి నన్నయను తొలగించి పారేయాలని కొంతమంది పెద్దలే ఉద్ఘాటించారు. కవి పట్ల ఒక జాతి కృతఘ్నతకు ఇంతకంటే పరాకాష్ట ఉండదు. ఏమైతేనేం, ఆ విపరీతవాదం మరింత పుంజుకుని మన మరుగుజ్జుతనం ప్రపంచానికి తెలిసేలోపల తెలుగు భాషకు ప్రాచీనతా పట్టం లభించి, నన్నయ ఆదికవిపీఠానికి ప్రమాదం తప్పింది!

అయితే, నన్నయ భారతానువాదంలో కొరతగా అనిపించేవి లేకపోలేదు. ముఖ్యంగా మూలంలోని గణసమాజ అవశేషాలను ఆయన అనువాదం కొన్ని చోట్ల గమనించుకోలేదు. కథను సంక్షేపించడంలో కావచ్చు, మరో కారణంతో కావచ్చు, మూలంలోని కొన్ని ముఖ్యమైన వివరాలను ఆయన పరిహరించాడు. అదలా ఉంచి, తిక్కనను తక్కువ చేశానని ఎవరూ అనుకోవద్దు. అంతకన్నా అపచారం ఉండదు. యుద్ధపర్వాలలో ఆయన విశ్వరూపాన్ని చూడగలం. తిక్కనలో నాటకీయత గురించి అందరూ మాట్లాడుతుంటారు. నిజానికి తిక్కన అనువాదం సినిమేటిక్ అంటాను. ఆయనది గొప్ప స్క్రీన్ ప్లే! ఎవరైనా తిక్కన రాసిన మహాభారత ఘట్టాలను సినిమా తీయదలచుకుంటే ఆయన రచననే యథాతథంగా స్క్రీన్ ప్లే గా వాడుకోవచ్చు. అయితే, ఒక షరతు… స్క్రీన్ ప్లే రచయితగా ఆయన పేరు వేసి తీరాలి!

రాస్తున్నది మహాభారతం గురించి కనుక మనసారా ఇలా మహాకవి స్మరణ చేసుకుని ప్రస్తుతానికి వస్తే…

కచుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట అనేకమంది కన్యలను వెంటబెట్టుకుని దేవయానితో కలసి వనవిహారానికి వెళ్లింది. అంతా తమ చీరలు గట్టున పెట్టి ఓ సరస్సులో జలక్రీడలాడారు. అంతలో పెద్ద సుడిగాలి వీచింది. చీరలన్నీ కలసిపోయాయి, గట్టు మీదికి వచ్చి చీర కట్టుకునే తొందరలో శర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది. దాంతో దేవయాని మండిపడింది. ‘లోకోత్తర చరిత్ర కలిగిన శుక్రుని కూతురిని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన బ్రాహ్మణకులంలో పుట్టినదానిని, ఇప్పుడు నువ్వు కట్టి విడిచిన మైల చీర నేను కట్టుకోవాలా?’ అంది.

ఆ మాటకు శర్మిష్ట అహం దెబ్బతింది. ‘నీ తండ్రి మా అయ్య దగ్గర పని చేస్తూ, దీవిస్తూ, ప్రియమైన మాటలు చెబుతూ ఉంటాడు. నీ గొప్పలు నా దగ్గరా, సిగ్గులేకపోతే సరి, నేను కట్టిన చీర నువ్వెందుకు కట్ట కూడదట?!’ అని నిందించి, అంతటితో కోపం తీరక దేవయానిని ఒక నూతిలోకి తోసేసి, కన్యలతో కలసి ఇంటికి వెళ్లిపోయింది.

yayati1

ఆ సమయంలో వేటకు వచ్చిన రాజు యయాతి, ఆ అడవంతా తిరిగి అలసిపోయాడు.  మంచినీళ్లు తాగుదామని దేవయాని పడున్న నూతి దగ్గరకు వచ్చాడు.  లోపలికి తొంగి చూశాడు. కన్నీరు నింపుకుంటూ, ఒక పెద్ద తీగను పట్టుకుని ఉన్న దేవయాని కనిపించింది. ‘నువ్వు ఎవరిదానివి? ఈ నట్టడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?’ అని అడిగాడు. తాము ఎప్పుడూ విహారానికి వచ్చే ఆ అడవికి యయాతి వేటకు రావడం ఇంతకుముందు చూసింది కనుక దేవయాని అతన్ని గుర్తుపట్టింది.  ‘దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను తన సంజీవినీవిద్యతో బతికించే అమితశక్తిమంతుడైన శుక్రుని కూతుర్ని నేను. నా పేరు దేవయాని. పొరపాటున ఈ నూతిలో పడి బయటికి రాలేకపోతున్నాను. నన్ను పైకి లాగి రక్షించు’ అంది. అప్పుడు యయాతి తన కుడి చేతిని ఆమెకు అందించి పైకి తీశాడు. ఆ తర్వాత తన దారిన తను వెళ్లిపోయాడు.

అంతలో ఒక పరిచారిక దేవయానిని వెతుక్కుంటూ వచ్చింది.  దేవయాని ఆమెతో, ‘నేను వృషపర్వుని పురంలోకి  అడుగుపెట్టను. శర్మిష్ట నాకు చేసిన అవమానం గురించి వెళ్ళి నా తండ్రికి చెప్పు’ అని చెప్పి పంపేసింది. సంగతి తెలిసి శుక్రుడు పరుగుపరుగున వచ్చాడు. కోపంతో సుడులు తిరుగుతున్న కళ్ళలో నీరు కుక్కుకుంటున్న కూతుర్ని చూసి అన్నాడు.  ‘వేయి యజ్ఞాలు చేసినవాడి కన్నా కోపం లేనివాడే గొప్పవాడు. ఇతరులు కోపించినా కోపించకుండా, నిందించినా మారు మాట్లాడకుండా, అవమానించినా మన్సులో తలవకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు. బుద్ధిమంతులు కోపాన్ని గొప్ప చేయరు. శర్మిష్ట రాచకూతురు, చిన్నది, దానితో నీకేమిటి, ఇంటికిరా’ అన్నాడు.

‘ఎలాంటివారినీ లక్ష్యపెట్టకుండా హద్దు మీరి నిందించే బుద్ధిలేని వాళ్ళ దగ్గర ఉండడం కన్నా నీచమేముంటుంది, నేనా వృషపర్వుని పురంలోకి రాను, ఇంకెక్కడికైనా పోతాను’ అని దేవయాని భీష్మించింది. ‘సరే, నీ కంటే నాకింకెవరున్నారు, నేనూ నీతోనే వస్తాను, పద’ అని శుక్రుడు అన్నాడు. చారులద్వారా వృషపర్వునికి విషయం తెలిసింది. హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. ‘మీ విద్యాబలంతోనే రాక్షసులు దేవతలను జయించి స్థిరమైన సంపదనూ, ఉద్ధతినీ పొందగలుగుతున్నారు. లేకపోతే, దేవసేనాపతుల దెబ్బకు సముద్రం పాలయ్యేవారే. ఈ సంపదంతా మీది, ఈ రాక్షసులంతా మీ వాళ్ళు’ అని శుక్రునితో అని, దేవయానితో, ‘తల్లీ నీ కేది ఇష్టమో చెప్పు, అది ఇస్తాను’ అన్నాడు. దేవయాని సంతోషించి, ‘అయితే, శర్మిష్టను, ఆమె వెంట ఉండే కన్యలతో సహా నాకు దాసిని చెయ్యి’ అంది. వృషపర్వుడు అంగీకరించి అప్పటికప్పుడు కూతుర్ని అక్కడికి రప్పించి దేవయానికి దాసిగా ఇచ్చేశాడు. శర్మిష్ట మారు మాట్లాడకుండా తండ్రి ఆదేశాన్ని శిరసావహించి, తనతో ఉన్న కన్యలతోపాటు తను కూడా దేవయానికి దాసిగా సేవలు చేయడం ప్రారంభించింది.

ఈ కథంతా చెప్పాలా, మహాభారతంలో మేము చదువుకోలేమా అని పాఠకుల్లో కొందరైనా ఈపాటికి అనుకుంటూ ఉండచ్చు. అయితే, ప్రధానంగా రెండు కారణాలతో ఈ కథ చెబుతున్నాను. మొదటిది, కథనంలో నన్నయ చూపించిన మెళకువలు! పాత్రల స్వభావచిత్రణనే తీసుకోండి. నన్నయ కథ చెప్పుకుంటూ వెడతాడు తప్ప, ఫలానా పాత్ర స్వభావం ఇదీ అని చెప్పడు. కథాగమనంలోనే దానిని ధ్వనింపజేస్తాడు. శుక్రుడి స్వభావం గురించి కొంత ఇంతకుముందే చెప్పుకున్నాం. అతనికి దేవయాని ప్రవర్తన నచ్చడం లేదు. అయినా ఆమెపై మమకారం అతనిలోని వివేకం పీక నొక్కేస్తోంది. ఇంటికి రానని కూతురు కబురు చేసేసరికి కలవరపడుతూ పరుగు పరుగున ఆమె ఉన్న చోటికి వెళ్ళాడు. ‘కోపం పనికి రాదు, శర్మిష్ట రాచకూతురు, చిన్నపిల్ల, ఆమెతో నీకేమి’ టని చెప్పిచూశాడు. దేవయాని వినలేదు. ‘అయితే, సరే నీతోనే నేనూ’ అన్నాడు. శర్మిష్ట తన కూతురిని అవమానిస్తుందా అనుకుని కూతురిలా అతను  ఆవేశపడలేదు. ఆమె రాచకూతురు అనడంలో అతనిలో తారతమ్యాల స్పృహ ఉంది, చిన్నపిల్ల అనడంలో  పెద్దరికంతోపాటు, ఆమె కూడా తన కూతురిలాంటిదే నన్న వాత్సల్యభావన ఉంది. శర్మిష్టపై శుక్రునికి ఉన్న ఒక ప్రత్యేక ఆదరభావం ముందు ముందు కూడా వ్యక్తం కాబోతోంది.

ఇక్కడ శుక్రుడు-దేవయాని; వృషపర్వుడు-శర్మిష్ట అనే రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య ఉన్న తేడాను గమనించండి. దేవయానిది తండ్రిని శాసించే స్వభావం. శర్మిష్టది తండ్రి శాసనాన్ని మౌనంగా తలదాల్చే స్వభావం. దేవయానికి తండ్రి రాజకీయ అవసరాలమీదా, ఇబ్బందుల మీదా ఖాతరు లేదు. శర్మిష్టకు ఉంది. దేవయానిని నిందించి నూతిలో తోసే సమయంలో ఆ ఖాతరు లేకపోయినా,  ఆ తర్వాత తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో  ఆమెకు అర్థమయ్యుంటుంది.  వృషపర్వుని రాజకీయ అస్తిత్వంలో శుక్రుడు ఒక ముఖ్యమైన భాగం. వృషపర్వుని అస్తిత్వం, మొత్తం రాక్షసుల అస్తిత్వం. తను దూరం ఆలోచించకుండా క్షణికోద్రేకంతో తప్పు చేసింది. ఆ తప్పుకు తండ్రి విధించే శిక్షను కిమ్మనకుండా అనుభవించవలసిందే!

శుక్రుడికి దేవయానిపై ఉన్నంత మమకారమే వృషపర్వునికి శర్మిష్టపై ఉంటుంది. అయినా సరే, రాక్షసుల విశాల అస్తిత్వం కోసం కూతురి సుఖాన్ని బలిచేయడానికి అతను మనసు రాయి చేసుకోక తప్పదు. కూతురి విషయంలో శుక్రుడు ఎక్కడైతే ఓడిపోయాడో  వృషపర్వుడు అక్కడే గెలిచాడు. ఈ  రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య తేడా ఇంకా ఎలాంటిదంటే; గణం నిర్బంధాలు, అవసరాలు ఏమీ లేని వైయక్తిక స్వతంత్ర వ్యవహారశైలి శుక్ర-దేవయానులది. గణ నిర్బంధాలు, ప్రయోజనాల పంజరంలో అస్వతంత్రను పాటించక తప్పని స్థితి వృషపర్వ-శర్మిష్టలది. ఒక్క మాటలో చెప్పాలంటే, గణం వెలుపల కూడా జీవించగలిగిన వెసులుబాటు శుక్ర-దేవయానులకు ఉంది. గణం వెలుపల వృషపర్వ-శర్మిష్టలకు జీవితం లేదు.

కథనంలో కవి ఇంకా ఎన్ని మెళకువలు చూపాడో చూడండి…దేవయాని-శర్మిష్టల వైరానికి తక్షణ కారణం, శర్మిష్ట కట్టి విడిచిన చీర దేవయాని కట్టుకోవలసి రావడం. నువ్వు కట్టిన మైల చీర నేను కట్టుకోవాలా అని శర్మిష్టను నిలదీసింది. ఆ సమయంలో కులాహంకారం ఆమెలో ఎంతగా పడగవిప్పి బుసకొట్టిందంటే, భవిష్యత్తులో దానికి ఆమె ప్రతిఫలం చెల్లించుకోవలసి వచ్చింది. నీ మైల చీర నేను కట్టుకోవాలా అని ప్రశ్నించిన దేవయానే ముందు ముందు తను కట్టుకున్న పురుషుని శర్మిష్టతో కలసి పంచుకోబోతోంది. అంటే, శర్మిష్ట ఎంగిలి చేసినదాన్నే తనూ అనుభవించబోతోందన్నమాట.

ప్రకృతి సమవర్తి. అతి ఎక్కడున్నా సహించదు. ఎక్కడో ఒకచోట సమతూకాన్ని స్థాపించి తీరుతుంది.

‘నువ్వెవరివి, ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నా’వని యయాతి అడిగిన సందర్భంలో, పొరపాటున తను నూతిలో పడ్డానని దేవయాని అబద్ధమాడిన సంగతి గమనించండి. దేవయాని గడుసుదనానికి అదొక నిదర్శనం. శర్మిష్ట అనే రాచకూతురు తనను నూతిలోకి తోసిందని చెబితే, యయాతి ఆలోచన ఆమె వైపుకి మళ్లిపోతుంది. బహుశా తనకంటే శర్మిష్ట అందగత్తె, పైగా రాచబిడ్డ.  ఆ సమయంలో ఆమె పేరు తను ఎత్తడమంటే, ఆమెను తనే తీసుకెళ్లి రాజు చేతుల్లో పెట్టడమే. శర్మిష్ట తనను నూతిలోకి తోసేసి వెళ్ళిన తర్వాత, అంతటి అవమానంలోనూ, దుఃఖంలోనూ కూడా దేవయాని బుద్ధి చురుగ్గా పనిచేస్తోందన్న మాట. శర్మిష్ట రాచవైభవాన్నే కాదు; అది తెచ్చిపెట్టే అతిశయాన్నీ, అహంకారాన్ని కూడా దేవయాని ఇప్పుడు దగ్గరగా చూసింది. శర్మిష్టపై ఆమెకు ఆక్షణంలో ఆగ్రహమే కాదు, అసూయ కూడా ఉంది. దానికి తోడు కచుడు తనను నిరాకరించి వెళ్ళిన నేపథ్యం ఉంది. నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడడన్న కచుని శాపం కూడా ఆమె ఆలోచనల్ని వెంటాడుతూ ఉండచ్చు. నూతిలో పడున్న ఆ క్షణాలలోనే శర్మిష్ట చేసిన అవమానమూ, కచుని శాపమూ కలసి రాజును పెళ్లాడాలన్న సంకల్పాన్ని ఆమె బుద్ధిలో బలంగా నాటి ఉండచ్చు. సరిగ్గా ఆ సమయంలోనే  యయాతి రంగప్రవేశం…

కథనంలో ఇలా నన్నయ చూపించిన మెళకువలను చర్చించడం ఈ మొత్తం కథను ఏకరవు పెట్టడానికి మొదటి కారణమైతే, ఇక రెండో కారణానికి వస్తాను. ఈ కారణం మొదటిదానికంటే కీలకమే కాక, అత్యంత ఆసక్తికరం కూడా. పైన వివరించుకున్న కథలోనే కథకుడు పాత్రల స్వభావాలను, కథ తిరగబోయే మలపులను నేరుగా చెప్పకుండా అక్కడక్కడ ధ్వనింపజేశాడనుకున్నాం. విచిత్రమేమిటంటే, ఇంకో కోణం నుంచి చూసినప్పుడు, ఈ మొత్తం కథానిర్మాణమే ఇంకో కథను ధ్వనింపజేస్తోంది! ఆ కథలో నాయిక దేవయాని కాదు, శర్మిష్ట! పై కథను ఓసారి గమనించండి…అది దేవయాని పరంగా చెబుతున్నట్టు మనకు అనిపిస్తుంది. దేవయానే కథానాయికగానూ అనిపిస్తుంది. కానీ కథలో అంతర్లీనంగా ధ్వనించే అసలు కథ వైపు చెవి యొగ్గి జాగ్రత్తగా వినండి. అది శర్మిష్ట పరంగా చెబుతున్న కథ అని మీకు అర్థమవుతుంది.

అవును, నిజం. అతిగా మాట్లాడే దేవయాని ఈ కథలో నాయిక కాదు…మితంగా మాట్లాడే శర్మిష్టే నాయిక!

ఈ కథ ఫలశ్రుతిని గమనించినా శర్మిష్టే ఈ కథకు నాయిక అని అర్థమవుతుంది.

మిగతా కథ తర్వాత…

 –కల్లూరి భాస్కరం

 

 

భార్య, దాసి, కొడుకు….

ఈ కథానిర్మాణం ఎంతో ఆసక్తికరమైన ఒక పురాసామాజిక సత్యాన్ని వెల్లడిస్తోంది. పుత్రుడు,    శిష్యుడితోపాటు దాసుణ్ణి కూడా చేర్చి, ఋషుల భాషలో ఈ మూడు మాటలకూ అర్థం ఒకటే నని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు(జనకథ).  శునశ్శేపుడనే బాలుణ్ణి యజ్ఞపశువును చేసి హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేస్తున్నప్పుడు, ఆ యాగానికి విశ్వామిత్రుడు వందమందిని వెంటబెట్టుకుని వెళ్లి శునశ్శేపుని రక్షించిన కథ ఉంది. నిజానికి ఆ వందమందీ విశ్వామిత్రుని శిష్యులు. కానీ పురాణాలు వారిని విశ్వామిత్రుని పుత్రులన్నాయి. రామాయణంలో దశరథుని అశ్వమేథయాగానికి వచ్చిన బ్రాహ్మణులలో విద్వాంసులు కాని వారూ, వందమంది అనుచరులను వెంటబెట్టుకుని రానివారూ (నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర  నా శతానుచర స్తథా) లేరని ఒక శ్లోకం చెబుతోంది. ఆ వందమంది అనుచరులూ  వారి శిష్యులన్నమాట. ఆ యాగంలో నిత్యం బ్రాహ్మణులు, నాథవంతులు, తాపసులు, శ్రమణులు భోజనం చేసేవారని ఆ తదుపరి శ్లోకం చెబుతోంది. నాథవంతులు అంటే యజమాని, లేదా గురువు కలిగినవారు. అంటే, యజమాని అనేవాడు  దాసులకు, బానిసలకే కాక శిష్యులకు కూడా ఉంటాడన్నమాట. బానిస యజమానిని ఇంగ్లీష్ లో మాస్టర్ అంటారు. రూట్స్ నవలలో మాస్టర్ కు మాసా అనే మాట వాడారు.

 

నీవును బ్రహ్మచారివి, వినీతుడ, వేనును కన్యకన్; మహీ

దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్

భావజశక్తి నైనయది; పన్నుగ నన్ను పరిగ్రహింపు సం

జీవిని తోడ శుక్రు దయ; చేయుము నాకు ప్రియంబు నావుడున్

                                                             -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

బ్రాహ్మణకులానికి వన్నె తెచ్చేవాడా, సూర్య తేజస్సు కలిగినవాడా, ఓ కచుడా! నువ్వు బ్రహ్మచారివి, వినయశీలుడివి; నేను కన్యను. మన్మథమహిమతో మనిద్దరికీ ముందే పెళ్లైపోయింది. శుక్రుని దయతో సంజీవినితో సహా నన్ను స్వీకరించు, నాకు ప్రియం కలిగించు…

దేవయాని కచునితో ఈ మాటలు అంటుంది.

***

కచుని చూసి కానీ అన్నం ముట్టనని మంకుపట్టు పట్టి అదేపనిగా ఏడుస్తున్న కూతురిని చూసి శుక్రుడు కరిగిపోయాడు. యోగదృష్టితో చూసేసరికి భూమి మీద ఎక్కడా కచుడు కనిపించలేదు. చివరికి తను సేవించిన సురలో బూడిద రూపంలో కచుడు ఉన్నట్టు కనుగొన్నాడు. సురాపానం ఎంత చేటు తెచ్చిందనుకున్నాడు. ఇక నుంచి మద్యపానం ఎవరు చేసినా పాపపు పనుల మీద ఆసక్తితో పతితులైపోతారని శపించాడు. ఆ తర్వాత తన కడుపులో ఉన్న కచుని సంజీవినీ విద్యతో బతికించాడు. అప్పుడు కచుడు, ‘మీ అనుగ్రహం వల్ల దేహాన్నీ, ప్రాణాన్నీ, బలాన్నీ పొందాను. మీ కడుపులోంచి బయటపడే మార్గాన్ని కూడా ఉపదేశించం’ డని శుక్రుని కోరాడు.

శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. నా కడుపును భేదించుకుని కానీ ఇతడు బయటకు రాలేడు, అప్పుడు నా ప్రాణాలు పోతాయి, నేను తిరిగి జీవించాలంటే ఇతనికి సంజీవినిని ఉపదేశించడమే మార్గమనుకున్నాడు. సంజీవినిని ఉపదేశించాడు. తూర్పుకొండ గుహా ముఖం నుంచి ఉదయించిన పూర్ణచంద్రుడిలా కచుడు శుక్రుని కడుపులోంచి బయటకువచ్చాడు. శుక్రుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు కచుడు అతనికి సంజీవినితో ప్రాణం పోశాడు.

కచుని పాత్రను రాజకీయకోణం నుంచి అన్వయించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అతడు రెండు ఉద్దేశాలతో శుక్రుని ఆశ్రయించి ఉండచ్చు. మొదటిది, శత్రురహస్యాలను సంగ్రహించడం. రెండోది, శుక్రుని నుంచి కొన్ని విద్యలు నేర్చుకోవడం. శుక్రునికి రాజనీతి కోవిదుడన్న పేరుంది. శుక్రనీతి ప్రసిద్ధం. అయితే, శుక్రుడు శత్రువుల గురువు. కనుక కచునికి అతని ఆశ్రయం లభించడం అంత సులభం కాదు. ఎంతో యుక్తిని కనబరఛాలి. శత్రువర్గానికి చెందిన కచుని  శిష్యునిగా స్వీకరించడం కూడా శుక్రునికి అలాంటిదే. ఆవిధంగా, కచుని యుక్తికీ; శుక్రుని  జాగ్రత్తకూ ఇక్కడ పోటీ. ఆ పోటీలో  కచుడు నెగ్గాడు. శుక్రుని కడుపులో ఉండి మృతసంజీవినిని ఉపదేశం పొందడం, ఆ తర్వాత శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రావడం, శుక్రుని నుంచి తను నేర్చుకున్న విద్యతోనే తిరిగి అతనికి ప్రాణదానం చేయడం కచుని పైచేయిని చాటతాయి.

దీనినే గురు-శిష్య సంప్రదాయం నుంచి చెప్పుకుంటే, కచుడు గురువును మించిన, లేదా గురువుతో సమానుడైన శిష్యు డయ్యాడు. గురువు మృతుడైనా అతని విద్య శిష్య, ప్రశిష్యుల ద్వారా సంజీవినిగా మారి అతని కీర్తి కాయాన్ని బతికిస్తూనే ఉంటుందన్న ధ్వని కూడా ఇందులో ఉండచ్చు. కచుడు వామనుడి పాత్రను గుర్తుకు తెస్తాడు. వామనుడు కూడా ఇలాగే యుక్తిపరుడు. బలి చక్రవర్తిని మూడడుగుల నేల మాత్రం అడిగి చివరికి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. గణనిర్బంధాలనుంచి బయటపడి నూతన సామాజిక వ్యవస్థకు వేగుచుక్కగా మారిన బ్రాహ్మణులు, ఇతర సామాజికవర్గాలతో పోల్చితే బుద్ధి కుశలతను పెంచుకుంటున్న సంగతిని ఈ రెండు పాత్రలూ ప్రకటిస్తూ ఉండచ్చు.

అదలా ఉంచితే, మృతసంజీవిని పేరిట చనిపోయినవారిని బతికించే విద్య ఏదో  ఉండేదని భావించనవసరం లేదు. అది, కచునిలోని యుక్తిపరుని పైకెత్తడానికి ఉద్దేశించిన ఒక చక్కని పౌరాణిక కల్పన కావచ్చు.

కచుడు శుక్రుని ఇంట అడుగు పెట్టే ముందే వ్యూహరచన జరిగినట్టు పౌరాణికుడు చెప్పనే చెప్పాడు. తను శుక్రుని ఒక్కడినే మెప్పిస్తే చాలదని కచునికి తెలుసు. శుక్రుని అతి పెద్ద బలహీనత అయిన అతని కూతురు దేవయాని మనసునూ గెలుచుకుని, ఆమెను తండ్రిపై ఒడుపుగా ప్రయోగించాలి. అలా రెండు వైపులనుంచీ కచుడు నరుక్కు వచ్చాడు. అతడు కరడుగట్టిన ప్రయోజనవాదిగానూ, శత్రుస్థావరంలోకి అవలీలగా అడుగుపెట్టి, రహస్యాలను కొల్లగొట్టి అజేయంగా తిరిగి రాగలిగిన సుశిక్షితుడైన గూఢచారిలానూ కనిపిస్తాడు. ఏ బలహీనతలకూ లొంగని లక్ష్యశుద్ధి అతనిది. దేవయాని తనపట్ల మనసు పడేలా అద్భుతంగా నటించాడు. తండ్రిని ప్రభావితం చేసి, రాక్షసుల బారినుంచి తనను కాపాడే కవచంలా ఆమెను ఉపయోగించుకున్నాడు. అదే సమయంలో ఆమె ఆకర్షణ వలయంలో తను  చిక్కుకోకుండానూ జాగ్రత్త పడ్డాడు. దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి లేనే లేదు.

ఇందుకు భిన్నంగా దేవయాని కచుని మాయలో పడిపోయింది. శుక్రుడు కూతురి మీద మమకారానికి తలవంచాడు. కచుడు వచ్చిన పని చక్కబెట్టుకుని విజయగర్వంతో స్వస్థలానికి తిరుగు ప్రయణమయ్యాడు. అప్పుడు దేవయాని అతనితో అన్న మాటలే, పై పద్యం.

కచునిలా దేవయాని కూడా తెలివైనదే, గడుసుదే; అయితే ఆ తెలివి అతితెలివి అంచులు తాకుతూ ఉంటుంది. ఆ పైన ఆ తెలివిని కచునిపై మోహం మబ్బులా కమ్మేసింది. ఎక్కడ కాదంటాడో నన్న శంకతో, సంజీవినితోపాటు నన్ను కూడా స్వీకరించు అంటూ, సంజీవినిని కట్నంగా ఎర వేసింది. అది కూడా,  ‘శుక్రుని దయతో’ అనడంలో, తను తండ్రి చాటు బిడ్డననీ, అయితే తండ్రి ఈ పెళ్ళికి కాదనడనీ, ఆయనను ఒప్పించే బాధ్యత తనదనే ధ్వని ఉంది. అంత తెలివిగా మాట్లాడే దేవయాని ఎక్కడ తప్పటడుగు వేసిందంటే, ఒక కచ్చితమైన రాజకీయలక్ష్యంతో వచ్చిన కచుని ఇంగితాన్ని అర్థంచేసుకోలేకపోవడంలో! వ్యక్తిగత ప్రేమకూ, కనికరానికీ తావులేని అతని విశాల రాజకీయ వ్యూహంతో, ఆమె వ్యక్తిగత ఆకాంక్ష పోటీ పడి, ఓడిపోయింది. దేవయాని నిలువునా మోసపోయింది.

ఆమె మాటలు కచునికి ఎంతో విషాదాన్నీ, నొప్పినీ కలిగించాయట. లోకమంతా తప్పు పట్టే మాటలు మాట్లాడడం నీకు తగునా అన్నాడు. నా మనసులో నీకున్నది సోదరి స్థానమే ననేశాడు. ఆ తర్వాత, అంతకంటే ముఖ్యమైన ఒక సత్యాన్ని ప్రస్తావించాడు. గురువులకు శిష్యులు పుత్రులే, ఇదే లోకధర్మం, గురుపుత్రి వైన నువ్వు దీనిని గమనించకుండా మాట్లాడా వన్నాడు. దాంతో హతాశురాలై ఆగ్రహించిన దేవయాని నా కోరికను నువ్వు కాదన్నావు కనుక నీకు సంజీవిని పనిచేయకుండు గాక అని శాపమిచ్చింది. అప్పుడు కచుడు, సంజీవిని నాకు పని చేయకపోయినా నా నుంచి ఉపదేశం పొందిన వారికి పని చేస్తుంది; నువ్వు ధర్మవిరుద్ధమైన ప్రతిపాదన చేశావు కనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్లిచేసుకోడని ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు.

kacha and devayani

నువ్వు నాకు సోదరివని కచుడు ఇప్పుడు దేవయానితో అన్నా, అంతకాలమూ  ఆమెతో సోదరభావనతో  మెలగలేదని స్పష్టమే. అంటే, తన లక్ష్యానికి ఆమెను పరికరంగా వాడుకుంటూ ఆమెలో లేనిపోని ఆశలు కలిగించాడు. కనుక, గురువులకు శిష్యులు పుత్రులన్న ధర్మం పట్ల అతనికి ఎంత నిబద్ధత ఉందో మనకు తెలియదు. ఏమైనా, తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే తప్ప దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి ఎలాగూ లేదు కనుక అతన్ని పక్కన పెడితే; ఆ పెళ్లి విషయంలో, కథ చెబుతున్న పౌరాణికునికీ, బహుశా శుక్రుడికీ కూడా నిజంగానే అభ్యంతరాలున్నాయి. ఎందుకంటే, తప్పించుకునే ఉద్దేశంతోనే చెప్పినా, కచుడు నిజం చెప్పాడు. గురువులకు శిష్యులు పుత్రులే! అదేదో ఆలంకారికం (figurative) గా అన్న మాట కాదు, శాస్త్రనిర్ధారణ!

కచ, దేవయానుల పెళ్లి ధర్మబద్ధమా కాదా అనేది నిర్ణయించడంలో వారిద్దరినీ, శుక్రునీ కూడా పక్కన పెట్టేసి ఇక్కడ పౌరాణికుడే స్వయంగా రంగప్రవేశం చేశాడు. వారిద్దరిదీ సోదర-సోదరీ సంబంధమేనని చెప్పడంపై పౌరాణికునికి ఎంత పట్టింపు అంటే, కేవలం ఆ మాట అని అతడు ఊరుకోలేదు. దానికో సన్నివేశాన్ని సృష్టించాడు. కచుడు శుక్రుని కడుపులో పునర్జన్మ ఎత్తి, ఏకంగా అతని కడుపునే చీల్చుకుంటూ బయటకు వచ్చినట్టు చెప్పాడు. కచుడు శుక్రుని పుత్రుడే తప్ప మరొకటి కాదని మరింత నొక్కి చెప్పడమే ఆ కల్పనలో ఉద్దేశం. ఇలా పౌరాణికుని కోణం నుంచి చూస్తే, గురు-శిష్య సంబంధం తండ్రీ-కొడుకుల సంబంధమేనని చెప్పడానికే అతనీ మొత్తం కథను నిర్మించినట్టు కనిపిస్తుంది.

ఈ కథానిర్మాణం ఎంతో ఆసక్తికరమైన ఒక పురాసామాజిక సత్యాన్ని వెల్లడిస్తోంది. పుత్రుడు, శిష్యుడితోపాటు దాసుణ్ణి కూడా చేర్చి, ఋషుల భాషలో ఈ మూడు మాటలకూ అర్థం ఒకటే నని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు(జనకథ).  శునశ్శేపుడనే బాలుణ్ణి యజ్ఞపశువును చేసి హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేస్తున్నప్పుడు, ఆ యాగానికి విశ్వామిత్రుడు వందమందిని వెంటబెట్టుకుని వెళ్లి శునశ్శేపుని రక్షించిన కథ ఉంది. నిజానికి ఆ వందమందీ విశ్వామిత్రుని శిష్యులు. కానీ పురాణాలు వారిని విశ్వామిత్రుని పుత్రులన్నాయి. రామాయణంలో దశరథుని అశ్వమేథయాగానికి వచ్చిన బ్రాహ్మణులలో విద్వాంసులు కాని వారూ, వందమంది అనుచరులను వెంటబెట్టుకుని రానివారూ (నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర  నా శతానుచర స్తథా) లేరని ఒక శ్లోకం చెబుతోంది. ఆ వందమంది అనుచరులూ  వారి శిష్యులన్నమాట. ఆ యాగంలో నిత్యం బ్రాహ్మణులు, నాథవంతులు, తాపసులు, శ్రమణులు భోజనం చేసేవారని ఆ తదుపరి శ్లోకం చెబుతోంది. నాథవంతులు అంటే యజమాని, లేదా గురువు కలిగినవారు. అంటే, యజమాని అనేవాడు  దాసులకు, బానిసలకే కాక శిష్యులకు కూడా ఉంటాడన్నమాట. బానిస యజమానిని ఇంగ్లీష్ లో మాస్టర్ అంటారు. రూట్స్ నవలలో మాస్టర్ కు మాసా అనే మాట వాడారు.

ఇంకా విశేషమేమిటంటే, పుత్రుడు, శిష్యుడు, దాసులు, చివరికి పశువుల వరసలోనే భార్యను కూడా చెప్పారు. ‘రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా’ అనే వాక్యం ప్రసిద్ధం.  పశువులు, భార్య, కొడుకు రుణానుబంధంగా సంక్రమిస్తారనే వేదాంతార్థంలో ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. రుణం తీసుకునేటప్పుడు తాకట్టు పెట్టడానికి వీరు పనికొస్తారనే ఈ వాక్యానికి అసలు అర్థమని రాంభట్ల అంటుండేవారు. వీరందరూ యజమానికి ఆస్తే. ఇల్లాలు అనే మాటలోని ‘ఆలు’ కు పనివారు, బానిస అని కూడా అర్థం ఉందని రాంభట్ల అంటారు. వ్యవసాయ భూముల్ని పొందిన గణజనాలు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం పనులకు సాయపడే చేతివృత్తులవారు కలసి ఆ భూములకు దగ్గరగా నిర్మించుకున్న గ్రామాలను ‘ఆల’ అనే వారు. ఇప్పటికీ అనేక తెలుగు ఊళ్ళ పేరు చివర ఆల అనే మాట కనిపిస్తుంది(పరిటాల, దోర్నాల వగైరా). పశువులను కూడా ఆలమంద లంటారు. భర్తకు తనను చరణదాసిగా భార్య చెప్పుకోవడం నిన్నమొన్నటివరకూ ఉంది. దాసుల్లో కూడా క్రీత దాసులు, గర్భదాసులు అని రెండు రకాలు. క్రీతదాసులు అంటే డబ్బు ఇచ్చి కొనుక్కున్న దాసులు. గర్భదాసులు అంటే పుట్టించిన దాసులు. వీరినే గృహదాసులు అని కూడా అనేవారు. యుద్ధాల్లో దొరికిన స్త్రీలనుంచి యజమానులు ఈ గృహదాసుల్ని పుట్టించేవారు. ఇంట పుట్టిన పశువులానే వీరు కూడా మచ్చికగా ఉంటారని యాజమానుల నమ్మకం. గర్భదాసుల్ని పుట్టించడం బానిసవ్యవస్థ ఉన్న ప్రతిచోటా ఉండేది. అంతేకాదు, బానిసలకు పుట్టిన సంతానం కూడా యజమాని ఆస్తే. వారు ఆ సంతానాన్ని ఇంకో యజమానికి అమ్మేసేవారు.

రూట్స్ నవలలో కుంటా కింటే యజమాని మాసా వేలర్; కుంటాకీ, బెల్ కీ పుట్టిన కిజ్జీని మాసా లీ అనే మరో బానిస యజమానికి నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తాడు. తల్లిదండ్రులకు కూతుర్ని శాశ్వతంగా దూరం చేసే ఆ ఘట్టం హృదయవిదారకంగా ఉండి, ఎంతటి కరకు గుండెలనైనా కదిలించివేస్తుంది.  కిజ్జీని మాసా లీ బలాత్కారంగా  అనుభవించిన ఫలితంగా ఆమెకు కొడుకు పుడతాడు.  అంటే, అతడు గర్భదాసుడన్నమాట.  మాసా లీ కి ఆ అబ్బాయి తన రక్తం పంచుకుని పుట్టినవాడని తెలిసినా అతన్ని బానిసగానే చూస్తూ ఊడిగం చేయించుకుంటాడు.

dasaradhi-rangacharya-rachanalu-chillara-devullu-400x400-imadg3749yfdfexh

రక్తసంబంధాలనూ; ప్రేమ, కరుణ, కడుపుతీపి, వాత్సల్యం వంటి మానవీయ సహజాతాలనూ కాలరాసే బానిసత్వపు కర్కశరూపాన్ని మన దాశరథి రంగాచార్యగారు కూడా ‘చిల్లర దేవుళ్ళు’ నవలలో కళ్ళకు కట్టిస్తారు. అందులో రామారెడ్డి అనే దొరకు మంజరి అధికారిక సంతానమైతే, వనజ అడబాపకు కలిగిన సంతానం. అంటే, గర్భదాసి. రామారెడ్డి మంజరినే తన కూతురుగా భావిస్తాడు. ఆమె మీదే ప్రేమాభిమానాలు చూపిస్తాడు. వనజను అడబాపగానే ఉంచుతూ గడీకి వచ్చిన అతిథులకు అప్పగిస్తూ ఉంటాడు.

ప్రాచీన గ్రీకు, రోమన్ సమాజాలలో; ఇటీవలి అమెరికాలో ఉన్నట్టు మన దేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ లేకపోవచ్చు. అందుకు భౌగోళిక కారణాలతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని కొశాంబీ తదితరులు అంటారు. అయితే, మన దేశంలో దాస, దాసీ వ్యవస్థ ఉంది. పుట్టింటి అరణంగానో, విజేతలైన రాజులకు కప్పంగానో, కానుకగానో; పండిత సత్కారంగానో దాస,దాసీలను ఇవ్వడం మన పురాణ, ఇతిహాసాలలో కనిపిస్తుంది. ఇలాంటి దాస,దాసీలు కలిగిన గృహ ఆర్థికవ్యవస్థ మన దేశంలో ఎలా అవతరించి అభివృద్ధి చెందిందో రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో ఆసక్తికరంగా వివరించారు. గృహ ఆర్థికవ్యవస్థలోని యజమానికీ, బానిసల యజమానికీ పోలికలు ఉంటాయి.

ప్రస్తుతానికి వస్తే, తనను పెళ్లాడమని యయాతిని కోరబోతున్న దేవయాని, అందమైన తన దాసీలను కూడా అతనికి ఎర వేయబోతోంది. అంతేకాదు, తనకు సంతానం ప్రసాదించమని యయాతిని అడగబోతున్న శర్మిష్ట; ‘భార్య, దాసి, కొడుకు అనేవి వారించలేని ధర్మాలు సుమా’ అని అతనికి గుర్తుచేయబోతోంది.

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 – కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

ఓ త్రికోణ ప్రణయ కథ

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

వాడి మయూఖముల్ గలుగువా డపరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవ దగ్నిహోత్రముల్

పోడిగ వేల్వగాబడియె, బ్రొద్దును పోయె, గచుండు నేనియున్

రాడు, వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెనో!            

                                                            -నన్నయ

 (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

వాడి కిరణాలు కలిగిన సూర్యుడు పశ్చిమసముద్రంలో మునిగాడు. గోవులు ఒంటిగా ఇంటికి చేరాయి. నిష్ఠతో నీ అగ్నిహోత్రాలు వేల్చబడ్డాయి. పొద్దు కూడా పోయింది. అయినా కచుడింకా రాలేదు. అడవిలో మృగాలు, రాక్షసులు, పాములవల్ల అతనికి హాని కలిగిందో, ఏమో!

రాక్షసుల గురువు శుక్రాచార్యునితో అతని కూతురు దేవయాని ఈ మాటలు అంటుంది…

                 ***

kachadevyani (1024x742)

క్షమించాలి, నా ప్రణాళిక మరోసారి దారి తప్పుతోంది. నిజానికి నేనిప్పుడు కోసల, మగధరాజుల కాలానికి వెళ్ళాలి. కానీ కిందటి వ్యాసంలో, గణనిర్బంధాల నుంచి బయటపడడం గురించిన ప్రస్తావన వచ్చింది. క్షత్రియుల కన్నా ముందు బ్రాహ్మణులు గణ నిర్బంధాలనుంచి బయటపడ్డారని కూడా అన్నాను. అనుకోకుండా జరిగిన ఈ ప్రస్తావన, నాకు ఎంతో ఇష్టమైన కథలలో ఒకటైన యయాతి-దేవయాని-శర్మిష్టల కథవైపు నా మనసును అయస్కాంతంలా గుంజేసింది. ఫలితమే ఈ ప్రణాళికాభంగం.

ఇదో త్రికోణ ప్రణయ కథ. పై ముగ్గురిలోనూ శర్మిష్ట పాత్ర నన్ను విశేషంగా ఆకర్షిస్తుంది, ఆ పేరుతో సహా! శర్మిష్ట గురించి తలపోసేటప్పుడు నాకు తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యంలోని నిగమశర్మ గుర్తొస్తాడు. అయితే, ఆ పోలిక కేవలం మితభాషిత్వం దగ్గర మాత్రమే. నిగమశర్మ అంత కాకపోయినా శర్మిష్ట కూడా మితభాషిగానే రూపుగడుతుంది. తెనాలి రామకృష్ణుడు నిగమశర్మ చెడు తిరుగుళ్ళ గురించీ,  చుక్క తెగి పడినట్టు అతనో రోజున ఇంటికి వచ్చినప్పుడు అతని అక్క (ఆమె నిగమశర్మ అక్క, అంతే… పేరు లేదు) అతని శరీరానికీ, బుద్ధికీ కూడా ‘తలంటడం’ గురించీ, అంతా విని ఆ ప్రబుద్ధుడు అక్కగారి ముక్కెరతో సహా ఇంట్లోని నగా నట్రా మూటగట్టుకుని ఉడాయించడం గురించీ, కాపుకోడల్ని లేవదీసుకుపోవడం గురించీ ఓ ఇంటింటి కథలా ఎంతో సహజంగా హాస్యస్ఫోరకంగా చిత్రించుకుంటూ వెడతాడు తప్ప, నిగమశర్మ నోట ఒక్క మాట కూడా పలికించడు. కాపు కోడలి తర్వాత ఇంకో ‘కడజాతి’ స్త్రీతో కాపురం చేసి పిల్లల్ని కన్న నిగమశర్మ, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను తలచుకుని శోకిస్తూ మొదటిసారి నోరువిప్పుతాడు. ఆ పద్యం కూడా నాకు ఇష్టం:

ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షుల గొండ్రు గాని యో

పల్లవపాణి యే బరమపావనవంశము నిచ్చికొంటి నీ

నల్లని రూపు నిక్కమని నమ్మి! ధ్రువంబది గాక నేడు వి      

ద్యుల్లతికాధికాభినయ ధూర్వహమౌట నెరుంగ నింతయున్

విశేషమేమిటంటే, కవి ఈ పద్యంలో కరుణ, హాస్యాలను రెండింటినీ మేళవిస్తాడు. అంతా డబ్బిచ్చి అందమైన స్త్రీలను కొనుక్కుంటారు కానీ నేను నా పరమపావనమైన బ్రాహ్మణవంశాన్ని వెలగా చెల్లించి నిన్ను కొనుక్కున్నానని నిగమశర్మ అంటాడు. ఇందులో కులాతిశయం ఉన్నమాట నిజమే కానీ, నిగమశర్మకు ఆమెపై ఉన్న గాఢమైన అనురక్తీ, ఆమె మృతి కలిగించే దుఃఖతీవ్రతా ఆ కులాతిశయాన్ని కప్పేస్తున్నాయి. ఇక ‘నీ నల్లని రూపు నిజమని నమ్మాను తప్ప మెరుపు తీగ అవుతుందని తెలుసుకోలేకపోయా’ ననడంలో కవిత్వమూ + వికటత్వమూ రెండూ ఉన్నట్టున్నాయి.

నిగమశర్మతో శర్మిష్టను పోల్చడంలోని అనౌచిత్యం ఇప్పటికీ నా మనసును పీకుతూనే ఉంది. ఆ పోలిక కేవలం మితభాషిత్వంలో మాత్రమే సుమా అని మరోసారి సంజాయిషీ ఇచ్చుకుంటున్నాను.

శర్మిష్ట మితభాషిత్వం నిగమశర్మ మితభాషిత్వం లాంటిది కాదు. అది సమాజం, ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పితృస్వామ్య సమాజం ఆమెపై రుద్దిన మితభాషిత్వం. నిజానికి పితృస్వామ్యసమాజంలో స్త్రీ అతిభాషిత్వమూ, మితభాషిత్వమూ రెండూ ఒకలాంటివే. ఆమె మాటకీ మౌనానికీ ఒకే విలువ ఉంటుంది. రేకు డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. విలువ మారదు. పితృస్వామ్యం స్త్రీకి తనదైన భాష లేకుండా చేసింది. పితృస్వామ్యంలో స్త్రీ పురుషుడి భాష మాట్లాడుతుంది, పురుషుడిలా ఆలోచిస్తుంది, పురుషుడి హృదయంతో స్పందిస్తుంది.

ఈ మాటలు అంటున్నప్పుడు, నాకు ఎంతో ఇష్టుడైన ఒక కథకుడూ, ఆయన రాసిన ఒక కథా గుర్తుకొస్తున్నా(రు-యి). ఆ కథకుడు, చెఖోవ్…ఆ కథ పేరు, The Lady.

పురుషస్వామ్యంలో స్త్రీకి సొంత గొంతు లేదు, సొంత సమస్యలు లేవు; ఆమె పురుషుడి గొంతునూ, పురుషుడి సమస్యలనూ వినిపించే సౌండ్ బాక్స్ మాత్రమే నన్న సత్యాన్ని ఇంత గొప్పగా చెప్పిన మరో రచన ప్రపంచసాహిత్యంలో  ఉందని నేను అనుకోను. నా ప్రపంచసాహిత్య పరిచయం ఏమంత గొప్పది కాదనుకుంటే, కనీసం వేళ్ళ మీద లెక్కించదగిన అలాంటి రచనల్లో ఇదొకటి అంటాను. ఆ కథ ఇదీ:

భార్యా, భర్త… భర్త ఒక నాటకశాలను నడుపుతూ ఉంటాడు. రోజూ సక్రమంగా నాటకశాల నిండితేనే అతనికి ఆదాయం. కానీ నాటకాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. నాటకశాల నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. భర్త తన సమస్యలను భార్య దగ్గర వెళ్లబోసుకుంటాడు. జనంలో కళాభిరుచి తగ్గిపోతోందని బాధపడతాడు. భర్త ఆవేదనలో భార్య పాలు పంచుకుంటుంది. అవును నిజమే, జనంలో ఎంతసేపూ సంపాదన యావే తప్ప; ఓ నాటకం, ఓ వినోదం అంటూ ఏమీ లేకుండా పోయాయనుకుంటుంది. భర్త వినిపించే సమస్యలనే పరిచయస్తుల దగ్గర తనూ వల్లిస్తూ  ఉంటుంది.

అలా ఉండగా, కొంతకాలానికి భర్త చనిపోతాడు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అతడు ఓ కిరాణాకొట్టు యజమాని.  కొట్టు నిర్వహణలో ఆమె భర్తకు సాయపడుతూ ఉంటుంది. ఆ వ్యాపారంలో ఉండే సమస్యలు ఆ వ్యాపారంలోనూ ఉన్నాయి. భర్త వాటిని ఏకరువు పెడుతుంటే, అవును కదా అనుకుంటూ సానుభూతి చూపిస్తుంది. తను కూడా పూర్తిగా కొట్టుకే అంకితమైపోతుంది. పరిచయస్తులెవరైనా కొట్టుకు వచ్చినప్పుడు యథావిధిగా భర్త సమస్యలనే వాళ్ళతో పంచుకుంటూ ఉంటుంది. ‘ఏమమ్మా, ఎంతసేపూ కొట్టును పట్టుకుని వేళ్లాడడమేనా?  ఓ వినోదమూ, వేడుకా ఉండద్దా? ఏ నాటకానికైనా వెళ్లచ్చు కదా!’ అని ఎవరైనా అంటే, ‘నాటకాలకు వెళ్ళేలానే ఉంది నా పరిస్థితి… మీకేం మీరేమైనా చెబుతారు. కొట్టు నడపడం మాటలు కాదు. ఎన్ని సమస్యలో!’ అంటుంది.

రెండో భర్త కూడా చనిపోతాడు. ఆమె మరో పెళ్లి చేసుకోదు. తోడుంటారని ఓ యువజంటకు తన ఇంట్లో వాటా అద్దెకిస్తుంది. వాళ్ళకొక కొడుకు. ఇక ఆమెకు ఆ అబ్బాయే లోకం అయిపోతాడు. నీళ్ళు పోయడం, అన్నం తినిపించడం, దుస్తులు వేయడం, స్కూల్లో దింపడం వగైరాలన్నీ ఆమే చేస్తుంది.  ఆ అబ్బాయి సమస్యలన్నీ ఆమె సమస్యలే అయిపోతాయి. ఆ కుర్రాడు బండెడు పుస్తకాలు మోసుకెళ్ళడం చూసి ఆమె కడుపు తరుక్కుపోతుంది. ‘స్కూలు వాళ్ళకు బుద్ధి లేదు, పసివాడి చేత ఇన్ని పుస్తకాలు మోయిస్తారా?!’ అనుకుంటుంది. కనిపించినవాళ్లు అందరితోనూ అంటుంది.

కథ అయిపోతుంది… జ్ఞాపకం మీద ఆధారపడి రాసిన ఈ కథాసంగ్రహంలో కొన్ని వివరాలు లోపిస్తే లోపించవచ్చు.

ప్రస్తుతానికి వస్తే, యయాతి-దేవయాని-శర్మిష్టల కథలో దేవయాని చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, సాధికారంగా కూడా మాట్లాడుతుంది. శర్మిష్ట చాలా తక్కువగా మాట్లాడుతుంది. వారిరువురి సామాజిక నేపథ్యాలలోనూ, సామాజిక దశలలోనూ ఉన్న తేడాయే అందుకు కారణం. బ్రాహ్మణులు అప్పటికి గణనిర్బంధాలనుంచి బయటపడ్డారు. తమ గణం వెలుపల ఎవరికైనా వారు పురోహితులు కావడం, ఎవరినుంచైనా దక్షిణలు తీసుకోవడం ఇందుకు సూచన అని కోశాంబీ అంటాడు. అలాగే, వృత్తి జీవనులుగా బ్రాహ్మణులకు సంచారజీవనమూ ఎక్కువ. ఆవిధంగా వారు నాలుగు ప్రదేశాలు చూస్తారు, ఎక్కువ లోకజ్ఞానాన్ని పొందుతారు. దేవయాని బ్రాహ్మణకన్య కనుక శర్మిష్టతో పోల్చితే ఆమెకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, తెలివి ఎక్కువ. అవి కలిగించే ఆత్మవిశ్వాసం, అహంకారాల పాలు కూడా ఎక్కువే. శర్మిష్ట అలా కాదు, ఆమె రాచకన్య, తండ్రి చాటు బిడ్డ, గణం కట్టుబాట్లకు బందీ, అవసరమైతే తండ్రి రాజకీయ ప్రయోజనాలకు పావుగా మారక తప్పదు. నగరంలో పుట్టి పెరిగి, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయికీ, పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయికీ ఉన్న తేడా లాంటిదే దేవయానికీ, శర్మిష్టకీ ఉన్న తేడా.

కథలోకి వెడుతున్న కొద్దీ ఈ వ్యత్యాసాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

శుక్రుడు దైత్యదానవ గణాలకు ఆచార్యుడిగా ఉన్నాడు. అతని దగ్గర మృతసంజీవిని అనే విద్య ఉంది. దేవతలతో జరిగే యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను ఆ విద్యతో అతను బతికిస్తున్నాడు. దాంతో దేవతల పక్షంలో చావులూ, ఓటమీ సంభవిస్తున్నాయి. దేవతలు బృహస్పతి కొడుకైన కచుని దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎలాగైనా శుక్రుని  మెప్పించి మృతసంజీవినీ విద్యను సాధించాలని కోరారు. శుక్రునికి, కూతురైన దేవయానిపై మమకారం ఎక్కువ, నువ్వు ఆమె మనసు గెలుచుకుంటే నీ పని తేలికవుతుందని కూడా చెప్పారు. కచుడు అంగీకరించి శుక్రుని దగ్గరకు వెళ్ళాడు. శుక్రుడు అతనిని శిష్యునిగా స్వీకరించడమేకాక, అతనికి ఆతిథ్యం ఇవ్వడం స్వయంగా బృహస్పతికి ఆతిథ్యం ఇవ్వడమే ననుకుని సంతోషించాడు. శత్రువైనాసరే, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనాటి మర్యాద.

శిష్యులు గురువుగారి గోవులను కాచడంతో సహా ఇంటిపనులు చక్కబెట్టడం ఆనాటి గురు-శిష్య సంబంధంలో భాగం. కచుడు ఇంటి పనులు చేస్తూ అటు శుక్రునీ; పువ్వులూ, ఫలాలూ తెస్తూ ఇటు దేవయానినీ మెప్పిస్తూ వచ్చాడు.  కచుడు తమ విరోధులైన దేవతల గురువు బృహస్పతికి కొడుకు కనుక, అతడు ఇలా శుక్రుని ఇంట్లో పాగా వేయడంలో  రాజకీయమైన కుట్రను రాక్షసులు పసిగట్టడం సహజమే. ఓ రోజు కచుడు గోవులను తోలుకుని అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు అతన్ని చంపేసి, మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. కచుడు వెంట లేకుండా గోవులు ఒంటిగా ఇంటికి చేరుకోవడం చూసి, దేవయాని కీడు శంకించింది. అప్పుడు తండ్రితో అన్న మాటలే పై పద్యం.

శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని మృతసంజీవినీ విద్యను కచుని వద్దకు పంపించి అతన్ని బతికించాడు. కచుడు ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. మరోసారి రాక్షసులు అడవిలో కచుణ్ణి పట్టుకుని చంపేసారు. ఈసారి అతన్ని బతికించే అవకాశం ఇవ్వకూడదనుకుని మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, దానిని సురలో కలిపి శుక్రునికి ఇచ్చారు. శుక్రుడు ఆ సురను తాగేశాడు.

కచుడు ఇంటికి రాకపోయేసరికి రాక్షసులే అతన్ని చంపేసి ఉంటారని దేవయాని ఊహించింది. శోకించడం ప్రారంభించింది. అప్పుడు శుక్రుడు, ‘రాక్షసులు అతని మీద పగబట్టారు. ఎలాగైనా అతన్ని చంపేస్తారు. అతనికి ఉత్తమలోకాలు కలుగుతాయి. ఎందుకు దుఃఖించడం?’ అన్నాడు.  ఆ మాటకు దేవయాని తండ్రిపై తాచులా లేచింది. ‘మహానుభావా, నువ్వూ ధర్మం తెలిసినవాడివే కదా; ఎంతో బుద్ధిశాలి అయిన అంగిరసుని మనవడు, నీకు ఆశ్రితుడు, నీ శిష్యుడు, బృహస్పతికి కొడుకు, అందగాడు, బ్రహ్మచారి అయిన కచుణ్ణి రాక్షసులు అన్యాయంగా చంపేస్తే, నేను దుఃఖించకుండా ఎలా ఉంటాను? అతను నా కంట పడితే తప్ప నేను అన్నం తిన’ నని, ఎత్తిపొడుపూ, ఏడుపూ, మొండితనమూ దట్టిస్తూ తండ్రిపై మాటల మేకులు చెక్కింది.

ఇక్కడ తండ్రీ, కూతుళ్ల మధ్య అనుభవంలోనూ, పరిణతిలోనూ ఉన్న వ్యత్యాసాన్ని పౌరాణికుడు అద్భుతంగా సూచిస్తాడు. కచుని మరణానికి దేవయాని భావోద్వేగంతో స్పందిస్తే; శుక్రుడు రాజకీయ వివేకంతో స్పందిస్తాడు. కచుణ్ణి రాక్షసులు బతకనివ్వరని అతను అప్పటికే గ్రహించాడు. అది రాజకీయంలో భాగం. దాని వెనుక రాక్షసరాజు వృషపర్వుని ఆదేశం తప్పనిసరిగా ఉంటుంది. ఒక హద్దును మించి తను అందులో జోక్యం చేసుకోలేడు. చేసుకోకూడదు కూడా. చేసుకుంటే తన స్థానం ప్రమాదంలో పడడం అలా ఉంచి, నీతి కూడా కాదు. రాక్షసుల గురువుగా వారి రాజకీయ వ్యూహాలకు, ప్రయోజనాలకు తను కలసి రావలసిందే. మరి కచుని శిష్యునిగా ఎలా స్వీకరించాడన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ముందే చెప్పుకున్నాం. శత్రువైనా సరే, దేనినైనా కోరి, అతిథిగా వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదరించడం వ్యక్తిగత స్థాయిలో అనుసరించవలసిన ధర్మమూ, మర్యాదా. అతిథి మర్యాద గురించి ఆ కాలంలో ఉన్న పట్టింపును సూచించే కథలు చాలా ఉన్నాయి. అలాగే, కచునిపై తన కూతురు మనసు పడుతోందనీ శుక్రునికి తెలుసు. అయితే, అది ధర్మబద్ధం కాదనో, లేక పొసగదనో భావన అతనికి ఉన్నట్టు కథాగమనం సూచిస్తుంది.

అయితే, శుక్రునిలో కూతురిపై  ఉన్న మమకారం వీటన్నిటినీ మించినది. అది అతనిలోని రాజకీయ వివేకంతో పోటీపడుతోంది. ఎట్టకేలకు మెత్తబడ్డాడు…

 

 

 

 

 

కిరాయి సేనగా మారిన క్షత్రియ యోధులు

 

కృష్ణుడు: (అభిమన్యుని మరణానికి శోకిస్తున్న అర్జునునితో)  నీకిది తగునా? శూరులంతా పోయేది ఇలాగే కదా? ఎందుకు దుఃఖిస్తున్నావు? సేనలను సమీకరించుకుని ఆయుధమే జీవనంగా చేసుకోవడం వీరధర్మమని నీకు తెలియదా? శత్రువులను చంపి, భూమిపై కీర్తిని నిలిపి నీ కొడుకు ఒంటరిగా స్వర్గాన్ని అందుకోవడం ప్రియమే తప్ప అప్రియ మెలా అవుతుంది?

                                                                                                                         –తిక్కన

(శ్రీ మదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం)

***

ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్ తెచ్చుకున్న అపకీర్తి గురించి రాద్దామనుకునేసరికి, ఆయుధోపజీవులు లేదా ఆయుధోపజీవనం అనే మాటలు మహాభారతంలో అనేకచోట్ల వాడిన సంగతి గుర్తొచ్చింది. నోట్సు తిరగేస్తుంటే, ఆ మాటలు వాడిన రెండు సందర్భాలు అప్పటికప్పుడు కనిపించాయి. పైన చెప్పింది మొదటిది.

రెండోది, కర్ణపర్వం, తృతీయాశ్వాసంలో దుర్యోధనుడు తన సేనను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. శౌర్యమూ, బలమూ కలిగిన మీరంతా యుద్ధభారమంతా ఒక్క కర్ణుని మీదే వదిలేసి, అర్జునుని ఎదుర్కోకపోవడం ఆయుధోపజీవుల పద్ధతేనా అని దుర్యోధనుడు నిష్టుర మాడతాడు.

మహాభారతకాలంనుంచీ, ఇంకా అంతకంటే చాలా ముందునుంచీ ఉన్నఆయుధోపజీవనం; చరిత్రకాలం మీదుగా నేటి కాలం వరకూ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉండడం ఇక్కడ ప్రధానంగా ఆకర్షించే అంశం. ఆయుధోపజీవనం ఒక  సమస్యగా మారిందని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. మహాభారతం ఎలాంటిదో చెప్పే ఒక ప్రసిద్ధ పద్యం ఉంది. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రమనీ, అధ్యాత్మవేత్తలు వేదాంతమనీ, నీతివిచక్షణులు నీతిశాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ, లాక్షణికులు అనేక లక్ష్యాల సమాహారమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహు పురాణాల సముదాయమనీ మహాభారతాన్ని భావిస్తారని ఆ పద్య సారాంశం. వీటన్నిటికీ అదనంగా నేను ఆయుధోపజీవన కోణాన్ని జోడిస్తాను!

మరో అడుగు ముందుకు వేసి ఇంకో మాట కూడా అంటాను…నా ఉద్దేశంలో ఆయుధోపజీవనం సృష్టించిన సమస్యలను, సంక్షోభాలను చిత్రించి చర్చించడమే మహాభారతంలో ఆద్యంతమూ వ్యాపించిన ప్రధానవస్తువు. మహాభారత ప్రారంభమే క్షత్రియులనే ఒక యోధజాతి అంతరించడం గురించీ, క్షత్రియసతులు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ఆ జాతికి ఎలాగో ప్రాణం పోయడం గురించీ చెబుతుంది. అంతేకాదు, క్రమంగా రాజ్యాధికారం క్షత్రియేతరుల చేతుల్లోకి వెళ్లిపోవడం గురించీ చెప్పి ముగుస్తుంది. ఆవిధంగా చూసినప్పుడు, మహాభారతం ఒక జాతి  క్షీణతను చెప్పే విషాదాంత ఇతిహాసం.

ఇలా ఆయుధోపజీవన కోణం నుంచి చేసే మహాభారత పునర్వ్యాఖ్యానం ఒకటి, రెండు వ్యాసాలకు లొంగేది కాదు. కనుక ఆ లోతుల్లోకి ఇప్పుడే వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకుంటే, మహాభారత పాత్రలనేకం ఆయుధోపజీవనాన్ని, అంటే హింసను ఒక సమస్యగా గుర్తిస్తాయి. దానినుంచి బయటపడడానికి పెనుగులాడతాయి. ఆ పెనుగులాటలో అవి ఓటమీ చెందుతాయి. కొన్ని పాత్రలు హింసకు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా చీలిపోయి చర్చించుకోవడం కనిపిస్తుంది. ఆ చర్చ చాలాచోట్ల హింసా, అహింసావాదాల రూపం తీసుకుంటుంది. పురా కాలంనుంచి చరిత్ర కాలం వైపు సాగుతున్న కొద్దీ  హింసా-అహింసల మధ్య సాగే ఈ అంతర్మథనం ఒక స్పష్టతను తెచ్చుకుంటున్నట్టూ కనిపిస్తుంది. క్రమంగా అది  మహావీరుడు, బుద్ధుడు అనే ఇద్దరు ప్రవక్తలకు; జైన, బౌద్ధాలనే రెండు మతాలకు జన్మనిచ్చింది. అయినాసరే, ఆయుధోజీవనం ఇప్పటికీ ఒక సమస్యగానే ఉందంటే, అజ్ఞాతకాలంలో మొదలైన హింసా-అహింసావాదాల చర్చ నేటికీ అసంపూర్ణంగానే  మిగిలిపోయిందన్నమాట.

Draupadi_s_presented_to_a_parcheesi_game

స్థూలంగా చెప్పుకుంటే; మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ.  ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా  చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. ‘నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను’ అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.

వ్యాస, భీష్మ, ద్రోణులలో కులధర్మం గురించిన పట్టింపు ఎక్కువగా కనిపిస్తుంది. తరాల మధ్య అంతరం కూడా  అందుకు  కారణం కావచ్చు. నువ్విక వానప్రస్థానికి వెడితే మంచిదని ధృతరాష్ట్రునికి వ్యాసుడు సలహా ఇస్తూ, ‘రాజులు యుద్ధంలోనైనా చావాలి, దృఢ సమాధితోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతే తప్ప, వృద్ధులై రోగంతో మంచం పట్టి చావడం మేలా, ఓ భరతముఖ్యా?’ అంటాడు. ‘భరతముఖ్యా’ అనడంలో ఉద్దేశం, భరతులు ఆయుధోపజీవులు సుమా అని గుర్తుచేయడమే.  భీష్ముడు కూడా అర్జునుడిలానే ఒక దశలో హింస-అహింసల మధ్య సందిగ్ధతను ఎదుర్కొన్నట్టు కనిపిస్తాడు. అయితే, ఇద్దరి సందిగ్ధతా ఒకలాంటివి కావు. భీష్ముడు  హింసపట్ల విసుగు ప్రకటిస్తూనే, రాజుల హింసను కులధర్మంగా నొక్కి చెబుతాడు. ‘పది రోజుల్లో ఉత్తమ క్షత్రియుల నెందరినో వాడి బాణాలతో చంపేశాను. విసుగుపుట్టింది. ఇక ఈ శరీరం విడిచి పెట్టడం మంచి’దని అనుకుంటాడు. ‘పుట్టినప్పటి నుంచీ క్రౌర్యంతో రాజులను చంపడంలోనే నా కాలం గడచిపోయింది, విసుగుపుట్టింది, ఇక నేనీ రాక్షస కృత్యం చేయలే’నని ధర్మరాజుతో అంటాడు. అర్జునుడిలో హింసా వైముఖ్యం వ్యవస్థాగతమైనదైతే, భీష్ముడి వైముఖ్యం వ్యక్తిగతం.  భీష్ముని మాటల్లో హింస పట్ల విచారాన్ని మించి, ఉత్తమ క్షత్రియులు అంతరించిపోతున్నారే నన్న ఆవేదన కనిపిస్తుంది. ఇదే భీష్ముడు అంపశయ్య మీద అంతిమక్షణాలకు ఎదురుచూస్తున్న సమయంలో కూడా ; ‘విప్రులకు అధ్యయనం ఎలాగో, రాజులకు యుద్ధం అలాగ. పాపపరులైనప్పుడు తల్లిదండ్రులను, పుత్రపౌత్రులను, గురువులనైనా సరే; యుద్ధంలో చంపడం ధర్మమే. రాజులకు యుద్ధాన్ని మించిన ఉత్తమధర్మం లే’దని ధర్మరాజుతో అంటాడు. అంతేకాదు, యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ, ‘ఏ యజ్ఞమూ సంగ్రామయజ్ఞానికి సాటిరావు’ అంటాడు.

ఇక ద్రోణుడి విషయానికి వస్తే, అభిమన్యుని వధలో ముఖ్యపాత్ర పోషించిన సైంధవుడు; అర్జునుడు  తనను చంపుతానని చేసిన ప్రతిజ్ఞకు భయపడి ద్రోణాచార్యుని కలసుకున్నప్పుడు, ‘కులధర్మం శిథిలం కాకుండా వెళ్ళి యుద్ధం చేయి’ అని ద్రోణుడు అతనితో అంటాడు. మరి విప్రుడైన ద్రోణుడు కులధర్మం తప్పలేదా అన్న ప్రశ్న రావచ్చు కానీ దానిని వ్యక్తిగత దోషంగానే చూడాలి. తను చేసిన తప్పు పట్ల  స్పృహతోనే అతను సైంధవుడికి ఆ సలహా ఇచ్చి ఉండచ్చు.

ఇంతకీ చరిత్రకందని ఆ కాలంలోనే హింస-అహింసల మధ్య ఇంత అంతర్మథనం, ఇంత చర్చ ఎందుకు సంభవించాయన్నది మరో కీలకమైన ప్రశ్న. దానికి సంక్షిప్తంగా చెప్పుకోదగిన సమాధానం ఏమిటంటే, హింస సామాజిక పురోగమనానికి తీవ్ర ఆటంకంగా మారే పరిస్థితులు ఆనాటికే తోసుకువస్తున్నాయి. రాజకీయార్థిక రూపంలో మౌలికమైన మార్పు వస్తోంది. అన్న పుష్కలత్వాన్ని సాధిస్తూ పెరుగుతున్న జనాభాను ఆదుకుంటున్న అభివృద్ధికర సాధనంగా వ్యవసాయం నానాటికీ బలం పుంజుకుంటోంది. దానికితోడు ఇనుము లభ్యత అటు వ్యవసాయానికి సాయపడుతూనే, విచిత్రంగా ఇటు హింసా విజృంభణకూ దారితీయిస్తోంది. వ్యవసాయవిస్తరణకు గణసమాజమూ, ఆయుధోపజీవనమూ అడ్డంకిగా పరిణమించడమే అందుకు కారణం. చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ వ్యవసాయ శక్తులకూ, యథాతథవాదులకూ మధ్య సంఘర్షణ మరింత తీవ్ర రూపం ధరించబోతోంది.

దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వచ్చే ముందు, ఒక మాట చెప్పుకోవాలి. భీష్ముడు యుద్ధాన్ని ‘సంగ్రామయజ్ఞం’ అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటి ‘జిహాద్’ లా ధ్వనిస్తుంది!

మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ  వ్యాపించిన క్షత్రియ క్షీణత, అధికారచ్యుతి అనే దారాలను పట్టుకుని నేరుగా అలెగ్జాండర్ దగ్గరికి వద్దాం. మనదేశంలో క్రీ. పూ. నాలుగైదు శతాబ్దాలకు చెందిన సాహిత్యం కానీ, ఇతర పత్రాలుకానీ, స్పష్టమైన తేదీ గల శాసనాలు కానీ ఏవీ లభ్యం కావని కోశాంబీ అంటూనే; కాకపోతే ఈ కాలం మనకు మొదటిసారి ఒక కచ్చితమైన చారిత్రక పరిణామం తాలూకు తేదీని నమోదు చేసి అందించిందని అంటాడు. అదే, పంజాబ్ పై అలెగ్జాండర్ చేసిన దాడి(క్రీ. పూ. 327). నాటి గ్రీకు కథనాలలోంచి ఆనాటి భారతీయ దృశ్యాన్ని చరిత్ర అనే కొత్త కళ్ళద్దాలతో వీక్షించే అవకాశాన్ని ఈ దాడి మనకు ఇచ్చిందని కోశాంబీ అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పౌరాణిక భారతం అలెగ్జాండర్ రాకతో చారిత్రకదశలోకి అడుగుపెట్టింది.

అప్పటికి పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ప్రాంతాలను అలెగ్జాండర్ అవలీలగా జయించుకుంటూ వాటిలో చివరిదైన సింధునదీ ప్రాంతం దాకా వచ్చాడు. సింధుకు పశ్చిమంగా ఉన్న ప్రధాన వర్తక నగరం పుష్కరావతి(నేటి పేరు, చరసద్ద) ముప్పై రోజుల ముట్టడితో చేజిక్కింది. ఆ విజయం కలిగించిన ఉత్సాహంతో అలెగ్జాండర్ సింధు నదిని దాటి గాంధార జనపదంలోకి వచ్చాడు. అక్కడ మరో ప్రసిద్ధ వర్తక, సాంస్కృతిక నగరం ఉంది. అదే, తక్షశిల(ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది). తక్షశిల రాజు అంభి యుద్ధం చేయకుండానే లొంగిపోయి, కప్పం చెల్లించుకున్నాడు. అంతేకాదు, ఇద్దరం పంచుకోవడానికి కావలసినంత ఉంది, ఎందుకొచ్చిన యుద్ధమని కూడా ప్రశ్నించాడు. పైగా, ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు మనం యుద్ధం చేయడంలో అర్థమేముందని కూడా అన్నాడు. తక్షశిల రాజు ఇలా నీళ్ళ ప్రస్తావన చేయడం వెనుక చాలా చారిత్రక వారసత్వం ఉంది. నీళ్ళ కోసమే ఈ ప్రాంతంలో ఋగ్వేదకాలం నుంచీ యుద్ధాలు జరిగాయి. దశరాజ యుద్ధం గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం.

Alexander_the_Great_Founding_Alexandria

అలెగ్జాండర్ కు ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం ఎలాగూ లేదు. అయితే, అంభిని అతను విడిచిపెట్టడానికి అదొక్కటే కారణం కాదు. సైనిక ప్రాముఖ్యం లేని వర్తక నగరాలు అన్నిటివిషయంలోనూ అతను అదే విధానాన్ని అనుసరించాడు.

ఆ తర్వాతే అలెగ్జాండర్ కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. స్వేచ్చా, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్న గణ నగరాలు ఒకటొకటిగా కుప్పకూలినా,  గణయోధులనుంచి అలెగ్జాండర్ తీవ్ర ప్రతిఘటననే ఎదుర్కోవలసివచ్చింది.  ఉమ్మడి శత్రువును కలసి ఎదుర్కొనే ఐకమత్యం గణయోధులలో లేకపోవచ్చు కానీ, యుద్ధం వాళ్ళకు మంచినీళ్ళ ప్రాయం.

ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యవివరం ఏమిటంటే, ఈ గణయోధులకు ఆనాడు క్షత్రియయోధులు సహకరించారు. వారప్పటికి తమవి కాని నగరాల తరపున కూడా పోరాడే కిరాయిసైనికుల స్థాయికి దిగజారిపోయారు. అలెగ్జాండర్ పాలిట ఈ వృత్తి యోధులే సింహస్వప్నమయ్యారు. ప్లూటార్క్ ఇలా రాస్తాడు:

భారతదేశంలోని ఈ అత్యుత్తమ యోధులు (తక్షశిల సమీపంలోని)కిరాయి సైనికులుగా మారి ఆయా నగరాల రక్షణకు బాధ్యత వహిస్తూ వచ్చారు. ఆ పనిలో సాటిలేని శౌర్య సాహసాలు ప్రదర్శిస్తూ అలెగ్జాండర్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఒక దశలో అలెగ్జాండర్ వీళ్లతో సంధి చేసుకున్నట్టే చేసుకుని; వారు విజయగర్వంతో వెనుదిరిగి వెడుతుంటే వెనకనుంచి  దాడి చేయించి ఊచకోత కోయించాడు. ఈ ఒక్క నమ్మకద్రోహమే అతని యుద్ధ విజయాల కీర్తికి ఒక కళంకంగా మిగిలిపోయింది.

ఈ వృత్తి యోధులను ప్రాణాలతో విడిచిపెడితే, రేపు తీవ్ర ప్రతిఘటన కేంద్రంగా మారతారన్న భయంతోనే అలెగ్జాండర్ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు. ఇలా క్షత్రియులు గణనిర్బంధాలనుంచి బయటపడి కిరాయి సైనికులుగా మారి ఏ నగరరక్షణకైనా సిద్ధపడడం, అప్పటికీ కొన్ని ఋగ్వేద గణాలు మిగిలి ఉన్న ఆ ప్రాంతంలో ఒక నూతన పరిణామమని కోశాంబి అంటాడు. గణనిర్బంధాలనుంచి బయటపడడం కూడా ఒక ఆసక్తికరపరిణామం. నిజానికి గణనిర్బంధాలనుంచి క్షత్రియులకన్నా మొదట బయటపడినది  బ్రాహ్మణులు. అందు గురించిన విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేస్తే…

ఒక మల్ల విలుకాడు వేసిన బాణం అలెగ్జాండర్ కాయానికి పెను గాయం చేసిందని గతంలో చెప్పుకున్నాం. అలాగే,  వృత్తి యోధులను నమ్మించి వెన్నుపోటు పొడవడం అతని కీర్తికాయానికి తూట్లు పొడిచింది. అదలా ఉంచితే, మహాభారత కాలంనుంచీ క్షీణతనూ, అధికారచ్యుతినీ ఎదుర్కొంటున్న క్షత్రియులు; అలెగ్జాండర్ కాలానికి వచ్చేసరికి కిరాయి సైనికుల స్థాయికి జారిపోవడంలో ఒక ఆశ్చర్యకరమైన  చారిత్రక అవిచ్చిన్నత కనిపిస్తుంది.  అంతేకాదు, అది మహాభారతకాలాన్ని నేరుగా చరిత్ర కాలంలోకి తీసుకొస్తుంది.

 – కల్లూరి భాస్కరం

 

అర్జున, అశోకుల మీదుగా అమెరికా దాకా…

భీష్ముడు:  ధర్మరాజా, విను. ఒకే ఇంటికి చెందిన జనాలు ఉన్నారు. వాళ్ళలో ధనార్జన చేసేవారు, కార్యనిపుణులు, ఆయుధోపజీవులు, ఇంకా రకరకాల పనులు చేసేవారూ ఉన్నారు. వారే గణాలు. రాజు వాళ్ళతో కలసిమెలసి ఉంటూ వాళ్ళ నడకను కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళను సంతోషపెడుతూ వలలో వేసుకోవాలి.

గణజనాలలో ఓరిమి ఉండదు. బుద్ధిలో, ప్రతాపంలో అవతలివాళ్లు ఎంత గొప్పవాళ్ళైనా సరే, లెక్క చేయరు. వారిలో ఎవడైనాసరే, ఇంకొకడితో శత్రుత్వం వహించగలడు. దాంతో వాళ్ళ మధ్య చీలికలు వస్తాయి. అప్పుడు శత్రురాజులు వాళ్ళలో కొంతమందిని తమవైపు తిప్పుకుంటారు. అది రాజ్య మూలాన్ని తొలిచేస్తుంది. కనుక రాజు ముందే జాగ్రత్తపడాలి. వాళ్ళను మాటనేర్పుతో వశం చేసుకోవాలి. గణముఖ్యులను ఆదరిస్తూ వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. గణజనాలలో ఐకమత్యం చెదిరిపోతే రాజ్యం నాశనమవుతుంది. గణజనాలు ఒక్కమాట మీద ఉంటేనే రాజుకు సిరీ, సంపదా.  కనుక గణపద్ధతులను గమనించుకుంటూ మెలగాలి,

                      -తిక్కన     

(శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం)

***

కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు గణజనాల గురించి ధర్మరాజును పైవిధంగా హెచ్చరిస్తాడు. దాని నేపథ్యం ఏమిటంటే…

సాముదాయిక అధికారంలో ఉండే గణవ్యవస్థ అప్పటికే శిథిలమవుతోంది. ఏకవ్యక్తి అధికారానికి క్రమంగా దారి ఇస్తోంది. కానీ ఆ పరివర్తన అనుకున్నంత తేలిక కాదు. వ్యవస్థ శిథిలమైనంత వేగంగా వ్యక్తుల జీవనవిధానం శిథిలం కాదు. గణజనాలు తమవైన ప్రత్యేక పరిస్థితులకు అలవాటుపడ్డారు. వారిలో ప్రతి ఒకడూ స్వతంత్రుడు. గణంలోని ప్రతి ఒకడితోనూ సమానుడు. ఎవరో ఒకరి అధికారానికి తలవంచడం వాళ్ళకు తెలియదు. దానికితోడు, గణమనస్తత్వంలో పగ, ప్రతీకారదాహం అనేవి అతి సహజంగా కలసిపోయి ఉంటాయి. వారిలో శత్రువుపై పగ దీర్చుకోవడం కేవలం   క్షణికోద్రేక చర్య కాదు. ఎంతో ప్రణాళికాబద్ధంగా, ఒక మతవిధిగా, ఒక కర్తవ్యంగా, కాలపరిమితితో సంబంధం లేకుండా అమలు జరిగే ప్రక్రియ.

దీనికితోడు వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా ఆయుధోపజీవులు.

bhismaarrowbed

గణవ్యవస్థా, గణజనాలూ అనగానే ప్రపంచమంతా మొట్టమొదటగా తలచుకుని మొక్కవలసిన పండితుడు, లూయీ హెన్రీ మోర్గాన్. ఆయన రాసిన Ancient Society  పురామానవ చరిత్రకారులకు ఓ బైబిలూ, ఓ భగవద్గీతా. అది గణజీవనసూత్రాలను దండగుచ్చిన వ్యాకరణం. మోర్గాన్ కు మహాభారతంతో పరిచయం ఉందని చెప్పలేం. తన పుస్తకంలో ఆయన మహాభారతాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అయినాసరే, ఆయన సూత్రీకరణలకు మహాభారతంలోనే ఎన్నో ఉదాహరణలు దొరకుతాయి. ఆసక్తిగొలిపే ఆ విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

గణజనాలు ఒక ‘సమస్య’ అని భీష్ముడికి తెలుసు. ఆయననుంచి మూడో తరానికి చెందిన ధర్మరాజుకు తెలుసు. అందులోనూ అర్జునుడికి మరింత అనుభవపూర్వకంగా తెలుసు. ధర్మరాజునుంచి రెండో తరానికి చెందిన జనమేయజయునికి తెలుసు. అక్కడినుంచి ఒకింత చరిత్ర కాలంలోకి వస్తే కోసల, మగధ రాజులకు తెలుసు.  అలెగ్జాండర్ కీ, మౌర్యరాజు అశోకుడికీ, గుప్తరాజులకూ తెలుసు. ఆ తర్వాతి రాజులకు బహుశా తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే, మహాభారతకాలంలో ప్రారంభమైన గణజనాల ఊచకోత గుప్తరాజులతో ఒక కొలిక్కి వచ్చింది. గణసమాజమూ, సంస్కృతుల జ్ఞాపకాలు మనదేశంలో ఏ మేరకు మాసిపోయాయంటే; మన ప్రాచీన సారస్వతంలోనూ, ధర్మశాస్త్రాలలోనూ ఉన్న గణసమాజలక్షణాలనూ, వాటి అవశేషాలనూ కవులూ, ఇతర బుద్ధిజీవులూ పోల్చుకోలేనంతగా!  నన్నయభారతం నుంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు.

ఆధునిక కాలానికి వస్తే, మోర్గాన్ వెలుగులోనే మనం మళ్ళీ గణసమాజం తీరుతెన్నుల గురించి సాధికారంగా తెలుసుకోగలుగుతున్నాం.

మహాభారతకాలం నుంచి చరిత్రకాలం మీదుగా మనం నేటికాలానికి వచ్చి ఒకసారి మనదేశపు పశ్చిమవాయవ్యాలవైపు వెడదాం. నేటి పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలో కొన్ని గిరిజనప్రాంతాలున్నాయి. అప్ఘానిస్తాన్ వర్తమానం మన గతం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆధునిక కాలంలో తన ప్రాంతంలోని ఆయుధోపజీవుల స్వైరవిహారం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే ఒక ఫక్తూన్ నాయకుడిని తీవ్రంగా కలతపెట్టిందనీ, గాంధీ అహింసావాదానికి ప్రభావితుడైన గఫార్ ఖాన్ తన జాతీయులను హింసామార్గం నుంచి తప్పించడానికి కృషి చేశాడని కూడా చెప్పుకున్నాం.

అప్ఘానిస్తాన్ ను ఆనుకుని ఉన్న వాయవ్య సరిహద్దు రాష్ట్రం (నేటి పాకిస్తాన్ వాయవ్య ప్రాంతాన్ని బ్రిటిష్ రోజుల్లో అలా పిలిచేవారు)లోని గిరిజనుల జీవనవిధానం పట్ల గాంధీకి ఎంతో ఆసక్తి ఉండేదని ఆయన జీవితచరిత్ర చదివితే అర్థమవుతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పఠాన్ల హింసా పార్శ్వం ఆయనకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది కూడా. మీర్ ఆలమ్ అనే ఒక పఠాన్ ఓ వివాద సందర్భంలో గాంధీ మీద దాడి చేశాడు. గాంధీ కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపవలసివచ్చింది. గఫార్ ఖాన్ తనను మొదటిసారి కలసినప్పుడే ఇద్దరూ సరిహద్దు రాష్ట్రంలోని గిరిజనుల గురించి ఎంతో ఇష్టంగా మాట్లాడుకున్నారు. కాబూల్ వరకూ వెళ్ళి, సరిహద్దులకు అతీతంగా జీవించే గిరిజనులతో కలసిపోయి గడుపుతూ వారి మనస్తత్వాన్ని అర్థంచేసుకోవాలని ఉందని అప్పుడే గాంధీ గఫార్ ఖాన్ తో అన్నారట. ఆయన మూడుసార్లు సరిహద్దు రాష్ట్రానికి వెళ్ళి గఫార్ ఖాన్ ఆతిథ్యం అందుకున్నారు. తరచు స్థిరజనావాసాలపై దాడులు చేస్తూ హిందూ, సిక్కు అల్పసంఖ్యాకవర్గాలకు సమస్యగా మారిన గిరిజనులను సంస్కరించాలన్న కోరిక ఆయనకు ఉండేది.

కోశాంబి

కోశాంబి

మహాభారతం, కోశాంబీల పరిచయంతో ఆయుధోపజీవులను పరిశీలిస్తున్న నాకు గఫార్ ఖాన్, ఫక్తూన్ తెగల గురించిన వివరాలు; సరిహద్దురాష్ట్రంలోని గిరిజన తెగలపై గాంధీ ఆసక్తి  ప్రత్యేక కుతూహలం కలిగించడం సహజమే.  గాంధీ ఆసక్తికి కారణం, భారతదేశ ప్రధానజీవనస్రవంతి లోంచి ఆయుధోపజీవనం అదృశ్యమైపోవడమే నని నాకు అనిపిస్తుంది.

మహాభారతంతో మొదలుపెట్టి, చరిత్రకాలం మీదుగా అప్ఘాన్ పరిణామాలను అర్థం చేసుకుంటున్న నన్ను,  ఓరోజు ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రముఖ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు, రాజకీయనాయకుడు ఇమ్రాన్ ఖాన్ అంటున్న మాటలు ఆకర్షించాయి. పాక్-అప్ఘాన్ సరిహద్దుప్రాంతాలలో అమెరికా, దాని మిత్రదేశాల సైనికచర్యను ఆయన ప్రస్తావిస్తూ “అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం వందేళ్లు పోరాడినా ఆ ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సాధించలేకపోయింది. ఎందుకంటే, అక్కడ ఉన్న పదిలక్షలమందిలో ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడు. ప్రతి ఒకడి చేతిలోనూ ఆయుధం ఉంటుంది. కనుక సైనికమార్గంలో వాళ్ళను లొంగదీసుకోవడం అసాధ్యం. అమెరికా మరో ఓటమినే మూటకట్టుకుంటుంది” అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మాటలు నా అవగాహనను ధ్రువీకరిస్తున్నాయి.

అంటే, మహాభారతకాలంతో ప్రారంభించి గుప్తరాజుల వరకూ పైన ఇచ్చిన జాబితా, అక్కడితో పూర్తి కావడం లేదన్నమాట. అందులోకి నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ, మధ్యలో కొంతకాలం అప్ఘానిస్తాన్ లో చేతులు కాల్చుకుని తప్పుకున్న నాటి సోవియట్ యూనియన్, తాజాగా అమెరికా; దాని మిత్రదేశాలు చేరుతున్నాయన్న మాట. అయితే, ఆయుధోపజీవులతో అర్జునుడు, అశోకుడు తలపడడం; భౌగోళిక హద్దులను దాటుకుని నాటి బ్రిటిష్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్, అట్లాంటిక్ ను దాటివచ్చి అమెరికా తలపడడం ఒక లాంటివే కాకపోవచ్చు. తెగలు, దేశాల స్వయంనిర్ణయాధికారంలో జోక్యం చేసుకునే అగ్రరాజ్య దురహంకారంగానో, ప్రపంచశాంతి స్థాపన యత్నంగానో ఎవరి కోణం లోంచి వారు చెప్పుకోవచ్చు. ఆ చర్చను అలా ఉంచి, ఈ సందర్భంలో నన్ను ఆశ్చర్యపరిచేది, చరిత్ర అవిచ్ఛిన్నత!

భారతదేశం వెలుపలికి వెళ్ళి చెప్పుకుంటే, క్రూసేడ్ల పేరుతో చరిత్రకెక్కిన మతయుద్ధాల కొనసాగింపుగా కూడా ఇరాక్, ఇరాన్, అప్ఘానిస్తాన్ లలో పాశ్చాత్య దేశాల జోక్యాన్ని చెప్పుకోవచ్చు. ఈ రోజున  ‘సంస్కృతుల మధ్య యుద్ధం’గా దీనిని చిత్రిస్తున్నా, అది మతయుద్ధాలకు ముసుగు వేసే ప్రయత్నమే. ఈ కోణంలో చూసినప్పుడూ ఇది చరిత్ర అవిచ్చిన్నతకు సాక్ష్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే, తమవైన అజెండాతో క్రీస్తుశకంలోకి అడుగుపెట్టిన శక్తులు, క్రీస్తు పూర్వ దశలోనే ఇప్పటికీ ఉన్న సమాజాలను క్రీస్తుశకంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సమాజాలలో భారతీయ సమాజమూ ఉంది. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది ప్రస్తుతానికి శేషప్రశ్న. అదే కనుక ఫలిస్తే అప్పుడు ఏర్పడే ఏకరూప ప్రపంచపు ఉక్కుపాదాల కింద ఎంత వైవిధ్యం, ఎన్ని అస్తిత్వ కాంక్షలు, ఎంత సంస్కృతి, ఎంత చరిత్ర అణగారిపోతాయో ఊహించుకోవలసిందే. అలాగని ఈ సమాజాలను క్రీస్తు పూర్వ దశలోనే ఉంచాలా అని అడిగినా వెంటనే సమాధానం తోచదు. చెప్పొచ్చేదేమిటంటే, చారిత్రక ఘర్షణలు కాలాల హద్దులను అధిగమిస్తాయి. వర్తమానానికి మాత్రమే మన చూపుల్ని కుదించుకుంటే చరిత్ర అవిచ్చిన్నత ఎప్పటికీ అర్థం కాదు.

పైన ఉటంకించిన భీష్ముడి మాటల్ని స్మరించుకుంటూ వర్తమానంలోకి వద్దాం. పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ ల మధ్య ఉన్న గిరిజనప్రాంతాలు అర్థ-స్వయంపాలితాలు. వాటిని Federally Administered Tribal Areas (FATA) అంటారు. వీటిలో ఏడు గిరిజన జిల్లాలు, ఆరు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. Frontier Crimes Regulations (FCR) అనే ప్రత్యేక నిబంధనల ద్వారా ఇవి నేరుగా పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయి. తెగల ముఖ్యు(nobles)లకు వీటిలో పలుకుబడి ఉంటుంది. మూడు ఆంగ్లో-అప్ఘాన్ యుద్ధాలతో తల బొప్పి కట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు కలసివచ్చే షరతుపై ఈ తెగల ముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చింది. ఇప్పటికీ ఇదే ఏర్పాటు కొనసాగుతోంది.

ఈ వివరాలలో, చరిత్రకందని కాలానికి చెందిన భీష్ముని మాటల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఎంతటి వాళ్ళనూ లెక్క చేయని గణజనాలను మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలని భీష్ముడు అనడంలో ఉద్దేశం, వాళ్లపై కత్తి కడితే ప్రయోజనం లేదనే.  అప్ఘాన్లతో మూఢు యుద్ధాలు చేసిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ,  నిన్నటి సోవియట్ యూనియన్, నేడు అమెరికా నేర్చుకున్న గణపాఠం కూడా అదే.  తన అవసరాలకు కలసివచ్చే షరతుపై గణముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడడం, గణముఖ్యులను ఆదరించి వారితో పనులు చేయించుకోవాలన్న భీష్ముని సూచనకు అనుగుణమే.

ఇంకా విశేషం ఏమిటంటే, పైన చెప్పుకున్న FATA లాంటి ఏర్పాట్లే మన పురాణ ఇతిహాస కాలం లోనూ ఉండడం! ఉదాహరణకు, ‘పౌరజానపద పరిషత్తు’. ఆనాటికి రాజు సర్వస్వతంత్రుడు కాడు. కొన్ని అధికారాలను పౌర జానపదులతో పంచుకునేవాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుడు పౌరజానపదపరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. పౌర జానపదులలో మ్లేచ్చులు, ఆర్యులు, వనశైలాంతవాసులు; అంటే అడవుల్లోనూ, కొండల్లోనూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టాలనుకుని పౌరజానపదపరిషత్తును సంప్రతించినప్పుడు, పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్నకొడుక్కి పట్టం ఎలా కడతావని పౌర జానపదులు ప్రశ్నించారు. అప్పుడు యయాతి వారిని సమాధానపరచి అనుమతి తీసుకున్నాడు. భీష్ముడు పేర్కొన్న గణముఖ్యులను వాల్మీకి గణవల్లభులన్నాడు.

పైన Frontier Crimes Regulations అనే ప్రత్యేక నిబంధనల ద్వారా గిరిజన ప్రాంతాలు పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఒకానొకప్పుడు రాజుతో సమాన ప్రతిపత్తినీ, రాచ మర్యాదలనూ అందుకున్న గిరిజనులు రాజ్యం పట్టు బిగుసుకుంటున్న కొద్దీ నేరస్థ జాతులుగా, నేరశక్తులుగా ముద్రపడుతూ వచ్చారన్నమాట. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు మన పురాచరిత్రలోనూ, చరిత్రలోనూ కూడా  కొల్లలు.

ఖాండవ వన దహనం ద్వారా అర్జునుడు నాగులనే ఆదివాసీ తెగతో తెచ్చుకున్న శత్రుత్వం గురించీ, ఆ తెగవారు దానికి ప్రతీకారం తీర్చుకోడానికి చేసిన ప్రయత్నాల గురించీ, చివరికి అవి అర్జునుడి మనవడైన పరీక్షిత్తు కాలంలో ఫలించడం గురించీ, దానిపై ప్రతీకారంగా పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు నాగులను ఊచకోత కోయడం గురించీ 21 వ్యాసాలలో ఇప్పటికే వేరొక చోట చర్చించాను. కనుక అందులోకి ఇప్పుడు వెళ్ళకుండా; కోసల, మగధ రాజుల కాలంలోనూ, ఆ తర్వాతా జరిగిన విషయాలకు పరిమితమవుతాను.

దానికంటే ముందు ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్  అపకీర్తిని మూటగట్టుకున్న ఒకానొక చర్య గురించి  చెప్పుకోవాలి….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

శల్యుడు చెప్పిన కాకి-హంస కథ

కర్ణుడు: నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్బుద్ధి తప్ప నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? క్షత్రియాధముడివి. నీచుడివి. లోకంలో ఆబాలగోపాలం చెప్పుకునే వాక్యం ఒకటుంది.  మద్రదేశంవాడు కుటిలబుద్ధి, దేనికీ కలసిరాడు, స్నేహానికి అపకారం చేస్తాడు, చెడే మాట్లాడతాడు, దుష్టుడు, అతి కష్టుడు.  ఆ వాక్యం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది.

మీలో ఆడా, మగా  వావీ వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పుకాదు. మీరు మొదట కల్లు, ఆ తర్వాతే తల్లిపాలు తాగి పెరుగుతారు. మీ రెంత గుణవంతులో ప్రత్యేకించి చెప్పాలా?

అనేకమందికి పుట్టి, కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటా ఎలా అబ్బుతాయి? మాటలు కట్టిపెట్టి యుద్ధానికి పద.

(మరికొంత సంభాషణ జరిగాక)

శల్యుడు: ఈ పనికిమాలిన మాటలెందుకు? విను కర్ణా…వేయి మంది కర్ణులైనా సరే, కిరీటిని గెలవగలరా?

కర్ణుడు: (కోపంతో ఎర్రబడిన కళ్ళతో నవ్వుతూ) ఒకసారి ధృతరాష్ట్రుని కొలువులో ఉత్తములైన పండితుల గోష్ఠిలో సకల దేశాచారాలూ తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. బాహ్లిక దేశీయులు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ అసందర్భ ప్రేలాపన చేస్తూ నగ్నంగా తిరుగుతూ ఉంటారట. ఇలా అనేకవిధాలుగా బాహ్లిక దేశీయులను నిందిస్తూ ఆయన మాట్లాడాడు. నువ్వు అలాంటి బాహ్లికులకు దగ్గరివాడివి. కనుక వాళ్ళు చేసే పుణ్యపాపాలలో ఆరోవంతు నీకు సంక్రమిస్తుంది. వాళ్ళ అనాచారాన్ని నువ్వు వారించలేదు కనుక పూర్తి పాపం నిన్నే చుట్టుకుంటుంది. బాహ్లికుల కంటే మద్రదేశీయులు మరింత అనాగరికులని పెద్దలు చెబుతుంటారు. నీ గురించి చెప్పేదేమిటి? నోరుమూసుకో.

శల్యుడు: బలాబలాలను, రథ, అతిరథ సంఖ్యను నిర్ణయించే సందర్భంలో భీష్ముడు (నీ గురించి) చెప్పలేదా? ఆ మాటలు ఓసారి గుర్తు చేసుకో. కోపమెందుకు? అంగదేశం వాళ్ళు డబ్బు కోసం ఆప్తుల్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. కులకాంతల్ని అమ్ముకుంటారు. అలాంటి జనానికి రాజువైన నువ్వు ఇంకొకళ్ళ ప్రవర్తనను ఎంచడం దేనికిలే…                                                                                                             

                                                                                                                        -తిక్కన

(శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ద్వితీయాశ్వాసం)

          ***

నేను కేవలం మహాభారతం గురించి మాత్రమే రాస్తున్నానని పాఠకులు ఈపాటికి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. నిజానికి మహాభారతం గురించి మాత్రమే రాయడానికి ఈ వ్యాసపరంపర ప్రారంభించలేదు. గొలుసుకట్టుగా ఒక విషయంలోంచి ఒక విషయంలోకి వెళ్లవలసిరావడంతో మహాభారతం చుట్టూనే ఈ వ్యాసాలు పరిభ్రమిస్తున్నట్టున్నాయి.  ఇప్పటికే అనేకఅంశాలను ప్రస్తావించి విడిచిపెట్టడం చూసే ఉంటారు. వాటిని పూరించుకుంటూ వెడితే ఎక్కడ తేలతానో నాకే తెలియడం లేదు. మహాభారత కథనం కూడా ఇలాగే ఉపాఖ్యానాల మీదుగా సాగడం ఓ విచిత్రమైన యాదృచ్ఛికత కావచ్చు. నాకు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది. నా జన్యువులలో బహుశా ఒక పౌరాణికుడు దాగి ఉన్నాడు!

అంతకంటే ముఖ్యమైన ఒక వివరణ ఇచ్చుకుంటాను. కేవలం మహాభారతానికీ లేదా గతానికీ పరిమితం కావడం నా ఉద్దేశం కాదు. పురా కాలం, నేటి కాలాల కొసలు రెండూ ముడి వేయడం మీదే ప్రధానంగా నా ఆసక్తి. రెండు కాలాల మధ్య గొప్ప గుణాత్మక విభజన ఉందని నేను అనుకోను. ఊహాప్రాయాలైన  విభజనలను చీల్చుకుంటూ రెండు కాలాల మధ్యా ఒక పొడవైన సరళరేఖను గీయడానికే నా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎంతవరకు విద్వజ్జనాలను ఒప్పించి మెప్పిస్తుందో ఈక్షణాన నాకు కూడా తెలియదు.

విషయానికి వస్తే, బాహ్లిక, మద్ర జనాలకు అంత మంచి పేరు లేదన్న వాక్యంతో కిందటి వ్యాసం ముగించాను కనుక అక్కడినుంచి ఈ వ్యాసాన్ని ఎత్తుకున్నాను.

కర్ణుడు అంగరాజు. అంగరాజ్యం నేటి బీహార్ తూర్పున కొంతభాగం. చంపానగరం దాని రాజధాని. నేటి భాగల్పూర్ ను అంగరాజ్యంలోదిగా గుర్తించారు. ఇక శల్యుడు మద్రదేశీయుడు, క్షత్రియుడు, పాండురాజు రెండో భార్య మాద్రికి సోదరుడు. గమనించే ఉంటారు, పైన ఉటంకించిన సంభాషణలోని కులనింద, ప్రాంత నిందల ఘాటు నసాళానికి అంటేలా ఉంది. అందులోనూ కర్ణుని మాటలు మరింత పరుషంగా ఉన్నాయి. అయితే, వాస్తవంగా నింద ప్రారంభించింది శల్యుడు. అతని మాటలు ఇంకా పరుషంగా ఉంటాయి. అంటే, కర్ణుని నింద ప్రతినింద మాత్రమే.

కర్ణుడు యుద్ధానికి బయలుదేరగానే శల్యుడు నిందకు తెరదీశాడు. కర్ణుని కులాన్ని ఎత్తి చూపి మాటి మాటికీ ‘సూతపుత్రుడి’గా అతనిని సంబోధిస్తూ తూలనాడాడు. అర్జునుడి పరాక్రమాన్ని అదేపనిగా ఆకాశానికి ఎత్తి ఈసడింపు మాటలతో కర్ణుని కుళ్లబొడిచాడు. ఎంగిళ్లు తిని కొవ్వెక్కిన కాకితో అతనిని పోల్చుతూ కాకి-హంస కథ చెప్పాడు.  ఉబికి వచ్చే కోపాన్ని కర్ణుడు మొదట్లో బలవంతాన అణచుకున్నాడు కానీ,  శల్యుడు ఎంతకీ తగ్గకపోవడంతో తనూ నోరు చేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరూ కలసి కుల, ప్రాంత విద్వేష భారతస్వరూపాన్ని అత్యంత నగ్నంగా ఆవిష్కరించారు.

కులనింద, ప్రాంత నింద చరిత్ర పొడవునా జరుగుతూనే ఉన్నాయి. వాటి బీజాలు ఒకనాటి సామాజికమైన అమరికలోనే కాక, నాటి నిరంతరాయమైన వలస జీవితంలోనూ ఉన్నాయి.  మనదేశంలో పశ్చిమ, వాయవ్యాల నుంచి తూర్పుకు వలసలు జరుగుతూ వచ్చాయి. ఆ వలసల క్రమంలోనే వర్ణ లేదా కులవ్యవస్థ; రాజ్యం; నాగరికత, సభ్యత, సంస్కారం, శీలం, గుణగణాల గురించిన భావనలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఇంకొంచెం అర్థమయ్యే పోలికతో చెప్పుకోవాలంటే, నేడు పల్లె నుంచి పట్నానికి మారడం లాంటిదే ఇది కూడా. పట్న జీవితంలోని నాజూకును, వేషభాషలను అలవరచుకున్న కొద్దీ పల్లె జీవితం మోటుగా, అనాగరికంగా కనిపిస్తుంది. పల్లె జనాన్ని పల్లెటూరు బైతులని వెక్కిరించడం ఇప్పటికీ చూస్తుంటాం.

అందరూ కట్ట కట్టుకుని వలసపోరు. కొంతమంది ఉన్నచోటే ఉండిపోతారు. అప్పుడు వలస పోయేవారికీ, వీరికీ మధ్య భౌగోళిక దూరమే కాక; జీవనవిధానాలలో కూడా దూరం పెరుగుతుంది. శల్యుడు ఇంకా బాహ్లిక, మద్రదేశాల దగ్గరే ఉంటే, సాటి క్షత్రియులతో సహా అనేకమంది జనాలు తూర్పుకు వచ్చేశారు. బాహ్లిక, మద్ర దేశాలలో అప్పటికింకా వెనకటి సామాజిక రూపమే కొనసాగుతోంది. కర్ణుడు దానినే ఎత్తిచూపి ఆక్షేపించాడు. అది మాతృస్వామ్య సామాజిక రూపం కావచ్చునా అనే చర్చను ప్రస్తుతానికి పక్కన పెడితే, శల్యుడు కులం రీత్యా ఉన్నతస్థానంలో ఉండగా, కర్ణుడు ప్రాంతం రీత్యా ఉన్నతస్థానంలో ఉన్నాడు. శల్యుడు కర్ణుడి కులాన్ని ఎత్తి కించపరిస్తే; శల్యుని క్షత్రియాధమునిగా కర్ణుడు సంబోధిస్తూ అతని ప్రాంతాన్ని ఎత్తి కించపరిచాడు.

కులదర్పం ఇంతగా కరడుగట్టిన శల్యుడు కర్ణునికి రథసారథి కావడానికి అసలెందుకు ఒప్పుకున్నాడు? అదెలా జరిగిందంటే, శల్యుని తనకు సారథిని చేయమని కర్ణుడే దుర్యోధనుని అడిగాడు. అది కూడా శల్యుని పట్ల ప్రశంసా భావనతోనే. కృష్ణుని సారథ్యంలో అర్జునుడు మరింత అజేయుడవుతున్నాడు కనుక, అశ్వజ్ఞానంలో కృష్ణునికి సాటి వచ్చే శల్యుని నాకు సారథిని చేస్తే అర్జునుని అవలీలగా గెలుస్తానన్నాడు. దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని శల్యుని దగ్గరకు వెళ్లాడు. అతన్ని అనేకవిధాలుగా ఉబ్బేసి కర్ణునికి రథసారథ్యం చేయమని కోరాడు.

ఆ కోరిక శల్యునిపై ఎంత పిడుగుపాటు అయిందో తిక్కన అద్భుతంగా చిత్రిస్తాడు.  అప్పుడు శల్యుని కళ్ళు కోపంతో జేవురించాయి. నుదుట చెమటలు పట్టేశాయి. ఇంత నీచమైన పనికి నన్నెలా నియోగిస్తావు, నీకు వర్ణధర్మాలు తెలియవా, మూర్ధాభిషిక్తులైన రాజులు ఎన్నడైనా శూద్రులకు పరిచర్యలు చేశారా అని దుర్యోధనుని నిలదీశాడు. సూతపుత్రుడైన కర్ణుని దొరగా చేసుకుని నన్ను సారథ్యం ఎలా జరపమంటావు, అదీగాక కర్ణుడు నాకన్నా బలవంతుడా అని ప్రశ్నించాడు. తెలియక నువ్విలా కోరి ఉంటావు, ఒకవేళ తెలిసీ కర్ణుని మీద పక్షపాతంతో నన్నిలా అవమానించదలచుకుంటే ఇప్పుడే మా దేశానికి వెళ్లిపోతానంటూ రాజుల మధ్యలోంచి చివాలున లేచి బయటకు నడిచాడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని ఆపి బుజ్జగించాడు. ఒక్క కర్ణుడే దేనికి, నిన్ను మించిన వీరులు ఎక్కడా లేరు; అశ్వహృదయం తెలియడంలో కృష్ణుని కన్నా కూడా నువ్వు ఎక్కువ కనుకే ఈ కోరిక కోరానన్నాడు. ఆ మాటతో శల్యుడు చల్లబడ్డాడు. ఇంతమంది రాజుల మధ్య నన్ను కృష్ణుడికంటే ఎక్కువన్నావు కనుక ఒప్పుకుంటున్నాను; అయితే ఒక షరతు, నేను కర్ణునితో విచ్చలవిడిగా, తోచినట్లు మాట్లాడతాను, నన్ను తప్పుపట్టకూడదు అన్నాడు.

శల్యుని కులనిందా ప్రతిధ్వనులు ఇప్పటికీ భారతదేశమంతా వినిపిస్తూనే ఉండడం చరిత్ర అవిచ్ఛిన్నతకు సాక్ష్యం. కులనింద; కులం, ప్రాంతం, మతం, ఆచారాలు, విశ్వాసాల పట్టింపు; ఆ పట్టింపుతో ఎంతటి అమానుషానికైనా తెగించడం-ఇవన్నీ ఒకే మానసికప్రవృత్తికి చెందినవి. ఈ మానసిక ప్రవృత్తి కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్గాలలో చాలా ఎక్కువగా, కొన్ని ప్రాంతాలలో సాపేక్షంగా తక్కువగా వ్యక్తమవుతుంది. ఇందుకు చారిత్రక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. దక్షిణభారతంతో పోల్చితే ఉత్తరభారతం, అందులోనూ పశ్చిమ, వాయవ్య ప్రాంతాలే చరిత్రకు అసలైన వారసులు. ఉత్తరభారతమే ఈ దేశానికి అన్నివిధాలుగా ప్రయోగశాల. ఈ దేశంపై జరిగే దాడులను తట్టుకున్నవీ, ప్రతిఘటించినవీ ప్రధానంగా ఆ ప్రాంతాలే. అందుకే అక్కడినుంచే వీరులూ ఉద్భవించారు; అక్కడే రకరకాల మౌఢ్యాలూ  పెద్ద మోతాదులో తిష్టవేశాయి. ఆడశిశువుల భ్రూణ హత్యలూ, పరువు హత్యలూ, మతకల్లోలాల చిరునామా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇండియా-భారత్ అని రెండు ఉన్నాయంటారు. నా ఉద్దేశంలో వాటికి మరో రెండు కలుపుకోవాలి: ప్రైవేట్ భారతం, పబ్లిక్ భారతం. భారతదేశ వాస్తవికత ప్రైవేట్ భారతంలోనూ, ప్రైవేట్ సంభాషణల్లోనే ఉంది.

అదలా ఉంచితే, శల్యుడు చెప్పిన కాకి-హంస కథ వేరే కారణంతో అపురూపంగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తుంది. ఆ కథ ఇదీ:

సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ధర్మవర్తి అనే రాజు పురంలో ఒక సంపన్న వైశ్యుడు ఉండేవాడు. అతనింట్లోకి ఓ రోజు ఓ కాకి ప్రవేశించింది. ఆ వైశ్యుని కొడుకులు ఎంగిళ్ళు తినిపించి దానిని పోషిస్తూ వచ్చారు. దాంతో దానికి  కొవ్వెక్కింది. ఎలాంటి పక్షి అయినా తనకు సాటి రాదన్న అహంకారం పెరిగిపోయింది.  అంతలో ఒకనాడు కొన్ని హంసలు ఆ సమీపంలో కనిపించాయి.  ‘తారతమ్యం తెలియని’ ఆ వైశ్యపుత్రులు వాటిని కాకికి చూపించి, పక్షులలో నీ అంతవారు లేరు కనుక ఆ హంసలతో పోటీ పడి ఎగిరి వాటిని ఓడించు అన్నారు. అప్పుడు కాకి వాటి దగ్గరకు వెళ్ళి, ఓ హంసను గుర్తించి, తనతో సమానంగా ఎగరమని సవాలు చేసింది.  అప్పుడా హంసలన్నీ నవ్వుతూ, మేము మానససరోవరం దగ్గర ఉండేవాళ్లం, మా బలాన్ని వేగాన్ని అన్ని పక్షులూ పొగడుతాయి. మేము ఎక్కడికైనా, ఎంతదూరమైనా వెళ్లగలం, మాకు ఎలాంటి అలసటా రాదు, హంసలను పోటీకి రమ్మని కవ్వించిన కాకిని మేమింతవరకూ చూడలేదు, పైగా మా అందరిలోనూ బలశాలినే ఎంచుకున్నావు, అన్నాయి.

అప్పుడా హంసతో  కాకి, నూటొక్క గతుల్లో నేను ఎగరగలను, ఒక్కొక్క గతిలో వందయోజనాలు వెళ్లగలనంటూ తను చేయగల విన్యాసాలను వర్ణించింది. దానికా హంస, నాకా మార్గాలన్నీ తెలియవు, పక్షులన్నీ ఎగిరే ఒక్క మార్గమే తెలుసు, ఎగురుదాం పద, అంది. రెండూ సముద్రం మీద ఎగరడం ప్రారంభించాయి. చూస్తుండగానే కాకి హంసను దాటిపోయింది. ఇక హంస పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసి గాలిలో తన విన్యాసాలను మొదలుపెట్టింది. మధ్య మధ్య మళ్ళీ వెనక్కి వచ్చి హంసను వెక్కిరించింది. హంస మాత్రం నిబ్బరంగా సమగతిలో సాగిపోయింది.

కొంతసేపటికి కాకి అలసిపోయింది. వేగం తగ్గిపోయింది. మనసులో అలజడి మొదలైంది. కాలు మోపడానికి ఎక్కడా ఓ చెట్టూ, పుట్టా లేవే అనుకుని కలవరపడింది.  దైన్యం ఆవహించింది. ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకుంది. క్రమంగా కిందికి దిగిపోవడం ప్రారంభించింది. అది గమనించిన హంస, ఎన్నో గతులు తెలుసన్నావుగా, ఇది ఏ గతి అని పరిహాసమాడింది.  చివరికి ఎగిరే ఓపిక పూర్తిగా నశించి సముద్రంలో మునిగిపోయే దశలో, ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి నీతో పోటీపడ్డాను, బుద్ధొచ్చింది, నన్ను కాపాడి కాకుల్లో కలుపు అని కాకి ఆ హంసను ప్రార్థించింది. అప్పుడు హంస తన కాళ్లమధ్య కాకిని ఇరికించుకుని పైకిలాగి తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఒడ్డున పడేసింది.

సరే, శల్యుడు ఈ కథ చెప్పడంలో ఉద్దేశం కర్ణుని ఎంగిలి కూడు తినే కాకి తోనూ, అర్జునుని హంసతోనూ పోల్చడమని తెలిసిపోతూనే ఉంది. దానినలా ఉంచితే, ఇక్కడ కుతూహలం కలిగించే అంశం, పరుగు పందెంలో పాటించే ఒక ముఖ్యసూత్రాన్ని ఇది వెల్లడించడం. ఒలింపిక్స్ లో చూసే ఉంటారు, ముందే వేగంగా పరుగెత్తినవారి కన్నా పరుగులో వెనకబడిన వారిలోనే ఒకరు అంతిమంగా ముందుకొచ్చి పతకం గెలుచుకుంటూ ఉంటారు. అంటే సమగతిలో మొదట పరుగెత్తి, తద్వారా శక్తిని కాపాడుకుంటూ చివరి అంచెల్లో దానిని ఒడుపుగా వాడుకుంటారన్నమాట. కాకి-హంసల పరుగులో కనిపించినది ఆ తేడాయే.

ఇంతకీ ప్రశ్న ఏమిటంటే,  భారతదేశంలో కూడా ఆనాడు పరుగుపందేలు ఉండేవా? ఉంటే, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేక శల్యుని కథనం వెనుక నాటి గ్రీసు ఒలింపిక్స్ గురించి విన్న ముచ్చట్ల ప్రభావం ఉందా? నాడు భౌగోళికంగా అది సాధ్యమే కూడా.

పరిశీలించవలసిన కోణమే…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

—కల్లూరి భాస్కరం

 

 

 

 

                                      

గాంధారి పెళ్లి

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అంగములలోన మే లుత్తమాంగ మందు

నుత్తమంబులు గన్నుల యుర్విజనుల

కట్టి కన్నులు లేవను టంతె కాక

యుత్తముడు గాడె సద్గుణయుక్తి నతడు

                                  -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసం)

అవయవాలు అన్నింటిలోనూ ఉత్తమం శిరస్సు, ఆ శిరస్సులోనూ ఉత్తమాలు కన్నులు. అలాంటి కన్నులు లేకపోవడం ఒక్కటే లోటు కానీ, సద్గుణసంపదలో అతడు ఉత్తముడు కాడా ఏమిటని ఈ పద్యం చెబుతోంది. సందర్భమేమిటంటే, గాంధారరాజు సుబలుడు తన కూతురు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానని బంధువుల మధ్య ప్రకటించాడు. అప్పుడు బంధువులు ఇలా అనుకున్నారు.

***

మన వివాహ సంబంధాలు బోర్లించిన గోపురం ఆకారంలో ఉంటాయి. పైన ఉండే వైశాల్యమూ, చుట్టుకొలతా కిందికి వెడుతున్న కొద్దీ తగ్గిపోతాయి. పై భాగాన అంతర్జాతీయస్థాయి వివాహాలు ఉంటే, అట్టడుగున ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకునే వివాహసంబంధాలు ఉంటాయి. ఈ మధ్యలో జాతీయం, రాష్ట్రీయం, ప్రాంతీయం, గ్రామం వగైరా  ఉంటాయి. అంతర్జాతీయస్వభావం కలిగిన వివాహాల సంఖ్య తక్కువే అయినా వాటి  భౌగోళిక వైశాల్యం చాలా ఎక్కువ.

రాజీవ్ గాంధీ, సోనీయా గాంధీల వివాహం అంతర్జాతీయం. అలాగే, చాలాకాలంగా ప్రచారంలో ఉన్నట్టు రాహుల్ గాంధీ కొలంబియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే జరిగితే అది కూడా అంతర్జాతీయం అవుతుంది.  జాతీయ వివాహాలకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. ఇందిరాగాంధీ-ఫిరోజ్ గాంధీల వివాహం జాతీయం. అలాగే, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం. కిందికి వెడుతున్న కొద్దీ ఒకే స్వభావం కలిగిన వివాహ సంబంధాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కానీ, ఎంపిక స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది. కులం, ప్రాంతం వగైరాలకు చెందిన ప్రాధాన్యాలు, పట్టింపులు అందుకు కారణమవుతాయి. ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకోవడం బహుశా వివాహసంబంధాల సంకుచిత, కనిష్ట రూపం.

కులాల పరంగా చూస్తే, బ్రాహ్మణులు, క్షత్రియుల వంటి రెండు మూడు అగ్రవర్ణాల వారి వివాహ సంబంధాలకు జాతీయస్వభావమూ, ఎంపిక స్వేచ్ఛ ఎక్కువ ఉండడానికి సూత్రరీత్యా అవకాశం ఉంది. శూద్రులకు కూడా ఆ అవకాశం ఉండేది కానీ, వారు అనేక కులాలుగా చీలిపోవడం వల్ల అది తగ్గిపోయింది. వెనకటి సంగతి ఎలా ఉన్నా ఈ రోజున కులాంతర వివాహాలతో పాటు  అంతర్ బ్రాహ్మణ వివాహాలు జాతీయస్వభావాన్ని తెచ్చుకుంటున్నాయి. పైగా అవి ఆక్షేపణీయం కావడం లేదు. నేనీ మధ్య అలాంటి ఓ పెళ్ళికి వెళ్ళాను. వరుడు తెలుగబ్బాయి, వధువు అరవమ్మాయి. వరుని అన్న ఒక మరాఠీ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి అన్నయ్య ఓ గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఒకే కులం మధ్య వివాహసంబంధాలు అలా నాలుగు రాష్ట్రాలను, నాలుగు భాషలను ముడి పెట్టాయి.

కులం, శాఖ, ప్రాంతం, భాష వగైరాలతో గిరిగీసుకునే వివాహసంబంధాలే సహజమైనవనీ, శాస్త్రసమ్మతాలనీ, సర్వత్రా అదే ఆనవాయితీ అనే భ్రమ మనలో ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ ఉన్నతవర్గాలలో వివాహసంబంధాలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ  గిరిగీసుకుని లేవు. ఉదాహరణకు, రాజకీయనాయకులు, సినీ నటులు, ఇతర సెలెబ్రటీల వివాహాలు. ఇతరేతర అంశాలు వారి వివాహనిర్ణయాలకు కొలమానం అవుతుంటాయి. వివాహం వ్యక్తిగతం అనుకుంటాం. కానీ వెనకటి రాచకుటుంబాల కాలంలో వివాహం వ్యక్తిగతం కన్నా ఎక్కువ రాజకీయసంబంధి.

రాజకీయ అవసరాలు, ఒప్పందాలలో భాగంగా ఆ వివాహాలు జరగడం సర్వసాధారణం. గజపతుల యువరాజును చెరపట్టిన కృష్ణదేవరాయలు రాజకీయసంధిలో భాగంగా అతని సోదరిని వివాహం చేసుకున్నాడు. అన్నపట్ల క్రూరంగా ప్రవర్తించిన రాయలను ఆమె ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించిందో, ఎంత మనోవ్యధ అనుభవించిందో మనకు తెలియదు. తండ్రి రాజకీయ చదరంగంలో పాచికలుగా మారిన రాచకన్నెలు చరిత్ర పొడవునా ఉన్నారు. వాళ్లలానే వాళ్ళ కన్నీళ్లు కూడా అసూర్యం పశ్యలై అంతఃపుర రహస్యాలుగానే మిగిలిపోయి ఉంటాయి. రాచకుటుంబాలలో వివాహ సంబంధాలకు కులీనత, స్థాయి మొదలైనవి గీటురాళ్ళుగా ఉంటాయి కనుక  భాష, ప్రాంతం తదితరాలను అధిగమించడం అనివార్యమవుతుంది. విజయనగరం మహారాజు పాటియాలా మహారాజుతో వియ్యమందడం లాంటివి సహజంగా జరిగిపోతాయి.

మహాభారతానికి వస్తే, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహాల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది.  కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.

ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు  ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’నని బంధువుల మధ్య ప్రకటించేశాడు. గాంధారి ఆ మాట వింది. తండ్రి అలా మాట ఇచ్చిన క్షణం నుంచే ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేశాడు. గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.

నిజానికి అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్క గాంధారిని మాత్రమే పెళ్లిచేసుకోలేదు. ఆమెతోపాటు ఆమె చెల్లెళ్ళు పదిమందిని పెళ్లాడాడు. మహాభారతం వాళ్ళ పేర్లను కూడా ఇచ్చింది. అంతేకాదు, కులం, రూపం, శీలం కలిగిన మరో వందమందిని తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. ఆ లెక్కన ధృతరాష్ట్రుని భార్యలు నూటపదకొండుగురు అవుతారు. అప్పుడు అతనికి వందమంది కొడుకులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారందరినీ  గాంధారి సంతానంగానే చెబుతారు.  గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, మహాభారతంలో కొన్ని వివరాలు ప్రచారంలో లేవు. అలాగే, అనేక సందేహాలకు అందులో తగిన సమాధానం ఉండదు. నూటొక్క మందిని గాంధారి సంతానంగా చెప్పడం అలాంటిదే. గాంధారి చెల్లెళ్ళకు, ఇతర భార్యలకు కలిగిన సంతానాన్ని కూడా పట్టమహిషి అయిన గాంధారికే ఆపాదించి ఉండచ్చు. నూటొక్కరు (కూతురు దుశ్శలతో కలిపి) కౌరవులలో పదిహేడుమందే గాంధారికి పుట్టినవారని ఎస్.ఎల్. భైరప్ప తన ‘పర్వ’ నవలలో అంటారు. అయితే, చిక్కుముడులుగా కనిపించే ఈ సంతానం లెక్క లన్నింటికీ శాస్త్రపరమైన ఇతర వివరణలు లేకపోలేదు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

సుబలుడు ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననడం, కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావం’డనడంలా ధ్వనిస్తుంది. మహాభారత కాలం నుంచీ నేటి వరకూ అప్రతిహతంగా సాగుతున్న పితృస్వామ్యం పదునును ఈ రెండు వాక్యాలూ పట్టి చూపుతాయి. ముక్కుపచ్చలారని తన కూతురును ముసలివాడికిచ్చి పెళ్లి చేసే అఘాయిత్యాన్ని సహించలేక అగ్నిహోత్రావధాన్లు భార్య ప్రతిఘటించడం భోజనాల దగ్గర పెద్ద సీను సృష్టిస్తుంది. మరి సుబలుని నిర్ణయాన్ని అతని భార్యా, పిల్లలు వాస్తవంగా ఎలా తీసుకున్నారో తెలియదు. విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఉదాహరణగా ఈ ఘట్టాన్ని పితృస్వామ్య కోణం నుంచి వ్యాఖ్యానించారు.  ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననగానే బంధువులు మారు మాట్లాడక పోగా, కళ్ళు లేకపోతేనేం గుణవంతుడు కాడా ఏమిటని సరిపెట్టుకోవడం; తండ్రి ఆ మాట అన్న క్షణం నుంచీ గాంధారి ధృతరాష్ట్రునే తన భర్తగా భావించి నేత్రపట్టం కట్టుకోవడం -బంధువర్గంలోనూ కుటుంబసభ్యుల్లోనూ సుబలుని మాటకు గల  తిరుగులేని లక్షణాన్ని, గాంధారి పాతివ్రత్యాన్ని సూచిస్తాయని విశ్వనాథవారు అంటారు.  ఇరావతీ కార్వే తన ‘యుగాంత’లో స్త్రీ కోణం నుంచి ఈ ఘట్టాన్ని చూస్తూ గాంధారి నేత్రపట్టం కట్టుకోవడం తండ్రి నిర్ణయంపట్ల నిరసన సూచకంగా అనుమానిస్తారు. కాలంతోపాటు కలిగే దృష్టిభేదం ప్రతి కాలంలోనూ పురాగాథల్ని సరికొత్తగా వ్యాఖ్యానించుకునే అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా ఆ కథలు నిత్యనవీనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటాయి.

అంధత్వాన్నే కాదు, ఏ వైకల్యాన్ని అయినా వేలెత్తి చూపించడం ఇప్పుడు కుసంస్కారం అవుతుందని మనకు తెలుసు. అదలా ఉంచి, ధృతరాష్ట్రునిపై సానుభూతినుంచి కలిగిన ప్రేమతోనే గాంధారి అతనిని భర్తగా అంగీకరించీ ఉండచ్చు.  నిజంగా ఆమె ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు. తెలిసే అవకాశం లేదు.

birth-kaurava-gandhari-mahabharat-indian-mythology

చెప్పుకుంటూ వెడితే ఈ ఘట్టంలోని విశేషాలకు అంతే ఉండదు. ధృతరాష్ట్రునికి వధువుకోసం గాంధారం దాకా వెళ్ళారంటే, సమీపంలో సుక్షత్రియకన్య దొరకలేదనుకోవాలి.  గాంధారి రూపలావణ్య శీలాల గురించి భీష్ముడు బ్రాహ్మణుల ద్వారా వినడం ఇంకో విశేషం. బ్రాహ్మణుల ద్వారానే ఎందుకంటే, వాళ్లే ఆనాడు క్షత్రియ కుటుంబాలకు, బయటి ప్రపంచానికి మధ్య వారధులుగానూ, వార్తాహరులుగానూ ఉన్నారు. అంటే, నాలుగు గోడల మధ్య ఆభిజాత్యాన్ని కాపాడుకునే క్షత్రియులకు బహిరంగ అభివ్యక్తి లేదా బయటి ప్రపంచాన్ని చూపించే కిటికీ బ్రాహ్మణులే. అది మళ్ళీ బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత గురించిన చర్చలోకి తీసుకువెడుతుంది. దానినలా ఉంచితే, ఎక్కడికైనా యధేచ్చగా వెళ్లగలిగే అవకాశమూ, బహుశా అధికారమూ ఆనాడు బ్రాహ్మణులకే ఉండి ఉండాలి. అది మళ్ళీ నాటి సామాజికమైన అమరికవైపూ, గణసమాజపు తీరు తెన్నులవైపు మనల్ని మళ్లిస్తుంది. అలాగే, ధృతరాష్ట్రుడే గాంధారదేశం వచ్చి గాంధారిని పెళ్లాడకుండా, గాంధారే అతని దగ్గరకు తరలి వెళ్లడమూ విశేషమే.

అంతకు మించి గమనించవలసిన విశేషం ఇంకొకటి ఉంది. అది కుంతి- పాండురాజుల వివాహం. ధృతరాష్ట్రునికి వధువు కోసం గాంధారదేశం దాకా వెళ్లవలసివచ్చింది కానీ, పాండురాజుకు వధువు దగ్గరలోనే, యాదవుల ఇంట దొరికింది. ఆ వధువు కూడా అప్పటికే కొడుకును కన్నది. అన్నదమ్ములే అయినా రాజ్యాధికారం ఉన్న వ్యక్తికీ, లేని వ్యక్తికీ వధువును ఎంపిక చేయడంలో ఉండే తరతమ భేదాలకు ఇది సూచన కావచ్చు. అయితే, ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రదేశపు రాచకన్య మాద్రిని కూడా పెళ్లిచేసుకున్నాడు.  మొదటి పెళ్లికీ, ఈ పెళ్లికీ మధ్య ఏం జరిగిందో తెలియదు. కుంతికి సంతానం కలగకపోవడం ఒక కారణంగా కనిపిస్తుంది. లోపం పాండురాజులోనే ఉన్నా దానిని కప్పి పుచ్చడానికి  మాద్రిని ఇచ్చి చేశారని ఎస్.ఎల్. భైరప్ప ఊహిస్తారు. కుంతి చరిత్ర యాదవ-క్షత్రియుల మధ్య నున్న సామాజిక అంతరాన్ని సూచిస్తోందనుకుంటే, అదే కురు-పాండవ శత్రుత్వానికీ అంతిమంగా యుద్ధానికీ దారితీయించిందా అన్నది అన్నింటికంటే ఆసక్తికరమైన ప్రశ్న.

Kunti_Gandhari_Dhrtarashtra

కిందటి వ్యాసం ఆగిపోయిన చోటికి మళ్ళీ వెడదాం.  మధ్య ఆసియాలో ఉన్న నేటి అప్ఘానిస్తానే నాటి గాంధారదేశం. అంటే ధృతరాష్ట్రునికి వధువును మధ్య ఆసియా నుంచి తెచ్చుకున్నారన్నమాట. అంతేకాదు, మాద్రి కూడా అక్కడిదే. మద్రదేశం గాంధారదేశాన్ని ఆనుకునే ఉంటుంది. అది మళ్ళీ ఉత్తర మద్ర, తూర్పు మద్ర అనే రెండు జనపదాలుగా ఉండేది.  ఉత్తరమద్రను ఉత్తర కురుభూములని, బాహ్లిక దేశమని కూడా అనేవారు. గ్రీకులు దానినే బాక్ట్రియా అన్నారు. పురాణ, ఇతిహాస కాలం నాటి భౌగోళిక రేఖా పటాన్ని గీస్తే అది అప్ఘానిస్తాన్ నుంచి  ఉత్తరభారతం వరకూ ఒకే నడవగా ఉన్నట్టు చూపిస్తుందని చెప్పుకున్నాం. అంటే,  మధ్య ఆసియా, భారత ఉపఖండ జనపదాల మధ్య బాంధవ్యాలు, ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు, యుద్ధాలలో పరస్పర సహకారం ఉండేవన్నమాట.

క్షత్రియ వధువుల కోసం గాంధార, మద్రదేశాలవరకూ వెడితే వెళ్లచ్చు కానీ, నిజానికి మద్ర (లేదా బాహ్లిక) జనాలకు మంచి పేరు లేదు. ఆ విషయం కూడా మహాభారతమే చెబుతోంది. దాని గురించి తర్వాత…

 

ఎవరి రహస్యం వాళ్ళదే…ఎవరి భాష వాళ్ళదే!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఆ దుష్యంతు డనంతసత్త్వుడు సమస్తాశాంతమాతంగమ

ర్యాదాలంకృతమైన భూవలయ మాత్మాయత్తమై యుండగా

నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో

నాదిక్షత్రచరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, చతుర్థాశ్వాసం)

దుష్యంతుడు మహాబలవంతుడు; దిక్కుల చివర నున్న ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్యకిరణాలూ, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతోనూ తొలి క్షత్రియుల నడవడితోనూ ఏలాడని ఈ పద్యం చెబుతోంది.

ఇందులోని భాషా పటాటోపం చూసి ‘మహోగ్రారణ్యా’లతో సహా భూమండలాన్ని ఏలిన దుష్యంతుడు ఎంత పెద్ద రాజో అనుకుంటాం కానీ, కాదు. అలా పటాటోపంగా చెప్పడం పౌరాణిక శైలి. సంపదకూ, అధికారానికీ అప్పటికింకా భూమి కొలమానం కాలేదు. సంపదను గోవులతోనే  కొలిచేవారు. అంటే, నాటికి రాజు గోపతే తప్ప భూపతి కాలేదు.  అసలు సంగతేమిటంటే, నాటి ఉగ్రారణ్యాలను పాలించడాని కంటూ ఏమీలేదు. అప్పటి రాజులకు అవి ఆరో వేలు లాంటివి. పైగా వారి పాలన అరణ్యాలలో చెల్లదు. అక్కడ ఆదివాసులున్నారు. తొలి రాజులు ఆదివాసులను స్వతంత్రజీవనులుగా గుర్తించి వారితో కొంతవరకు సఖ్యంగానే ఉన్నారు. వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి, అడవుల్లోకి చొచ్చుకు వెళ్లవలసిన అవసరం ఏర్పడ్డాకే రాజులకూ, ఆదివాసులకూ మధ్య ఘర్షణలు ముదిరాయి. ఆనాటికి మహారణ్యాలను ఛేదించడానికి చాలినంత ఇనుము అందుబాటులోకి రాలేదు. పోడు వ్యవసాయమే ఆధారం. ఇనుము పుష్కలంగా లభించడానికి మరికొన్ని వందల సంవత్సరాలు ఆగాలి. ఇనుము కొరత తీరడంతోనే చాలా మార్పులు జరిగిపోయాయి. జనపదాలు రాజ్యాలు అయ్యాయి. గణాలు జనాలుగా, మహాజనాలుగా మారాయి. అరణ్యాలను పెద్ద ఎత్తున ఛేదించదానికి శ్రామికవర్గం అవసరమై వర్ణవ్యవస్థ బిగుసుకుంది. చివరికి మగధ, కోసల రాజ్యాలతో ఈ సామాజిక పరివర్తన ఒక కొలిక్కి వచ్చింది. అదంతా వేరొక అధ్యాయం.

dushyanta

కాకపోతే, దుష్యంతుడు మహోగ్రారణ్యాలను  ఏలాడన్న కవి, అప్పటికి దేశం అరణ్యమయమనీ, అరణ్యాలు ఇంకా లొంగి రాలేదనే ఒక ముఖ్య చారిత్రక వివరాన్ని అందిస్తున్నాడు.  అదలా ఉంచితే, దుష్యంతుడు ‘ఆదిక్షత్ర చరిత్ర’ తో ఏలాడన్న మాట ఈ వ్యాసానికి ప్రధాన వస్తువు.

నన్నయకు ఇలా ఆదిక్షత్రియులను స్మరించుకోవడం చాలా ఇష్టం. రాజరాజ నరేంద్రుడి గురించి చెబుతూ, అతడు “ఆదిరాజ నిభు డత్యకలంకచరిత్ర సంపదన్’“అంటాడు. “…ఆదిరాజులెల్ల నధిక ధర్మ సత్యయుక్తి జేసి సకల లోకంబులు వడసి భాగదేయ భాగులయిరి” అని అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో మార్కండేయమునితో ద్రౌపదికి చెప్పిస్తాడు.  ఆది క్షత్రియుల గురించి నన్నయ కలవరింత వెనుక పురాచారిత్రక వారసత్వం చాలా ఉందని నేను అనుకుంటాను. ఎప్పుడో చరిత్రకు అందని కాలంలో (సు)క్షత్రియజాతి క్షీణించిపోయింది. అప్పటినుంచీ సాంప్రదాయిక వర్గాలలో క్షత్రియ క్షీణత ఒక విషాదస్మృతిగా మిగిలిపోయింది. ఒక అఖండగ్రహంలోంచి అర్థభాగం విడిపోయి అదృశ్యమైపోతే, రెండో అర్థభాగం దాని కోసం పరిభ్రమిస్తూ, పరితపించడం లాంటిదే ఇది కూడా. క్షత్రియులు-విప్రులు ఆనాడు ఒక నిరంతరద్వయం. ఒకరి ఉనికికి ఇంకొకరు ఆధారం. ఈ జంట ఒక దశలో సమాజగతిని శాసించింది. మహాభారతంలో అంగారపర్ణుడనే గంధర్వుడు క్షత్రియ-విప్ర అన్యోన్యత గురించి అర్జునుడికి బోధిస్తాడు.  ఎంతో అపురూపమైన ఆ సంభాషణ గురించి మరోసందర్భంలో చెప్పుకుందాం.

అజ్ఞాత కాలానికి చెందిన ఆ విషాదస్మృతి ఒక ఆకాంక్షగా మారి, అంతే అజ్ఞాతంగా వందలు, వేల సంవత్సరాలను దాటుకుంటూ వచ్చి నేటి కాలపు సాంప్రదాయిక వర్గాలలోనూ గుప్తంగా ఉండిపోయింది. అదే ఇక్కడ ఆసక్తికరం.  ‘క్షత్రియులు పరిపాలన చేయా’లనే ఆ ఆకాంక్ష ఈ వర్గాలలో నేటికీ వ్యక్తమవుతుంటుంది. అయితే, మారిన కాలమాన పరిస్థితులలో దానిని యథాతథంగా బయటపెట్టే అవకాశం లేదు కనుక, అది భిన్నరూపాలలో వ్యక్తమవుతుంది.

పాశ్చాత్య ప్రపంచంతో పోల్చితే భారతదేశం ప్రత్యేకత ఇదే. ఇక్కడ పురావారసత్వం పూర్తిగా అంతరించలేదు. దానినే గణసమాజ అవశేషంగా చెప్పుకుంటే, ఆ అవశేషం నేటికీ ఈ దేశంలో పదిలంగానే ఉంది. భారతదేశం వైవిధ్యవంతం అనిపించుకోడానికి అదీ ఒక కారణం. వైవిధ్యవంతం అనే మాట అందరినోటా నలిగి, అరిగి ఇప్పుడు అర్థస్ఫూర్తిని కోల్పోయి ఉండచ్చు కానీ, లోతుల్లోకి వెడితే అది చిత్రవిచిత్ర వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఒకరకంగా చెప్పుకుంటే, భారతదేశం నేటికీ మహాభారత కాలంలోనూ, మహాభారత సమాజంలోనే ఉంది. దీనినే మరోలా చెబితే, భారతదేశం ఇప్పటికీ క్రీస్తు పూర్వ దశలోనే ఉంది తప్ప క్రీస్తుశకంలోకి అడుగు పెట్టలేదని నాకు అనిపిస్తుంది. క్రీస్తు శకానంతర పరిణామాలు ఇక్కడ సాంకేతిక ప్రాయాలు మాత్రమే.  పాశ్చాత్య సమాజం దృష్టిలో భారతదేశం ఇప్పటికీ ఒక ‘రహస్య’ ప్రదేశం. ఈ ‘రహస్య’ భారతం ఎంతోమంది పాశ్చాత్యులను అన్వేషణకు పురిగొల్పడం (In Search of Secret India- Paul Brunton)  మనకు తెలుసు. నిజానికి భారతదేశం గురించి చెప్పుకునే వైవిధ్యం ఒప్పుడు పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతటా ఉంది.  పాశ్చాత్యసమాజం తన వైవిధ్యాన్ని పనిగట్టుకుని తుడిచిపెట్టుకుంది. ఏకశిలా సదృశమైన సమాజాన్ని నిర్మించుకోడానికి ప్రయత్నించింది.  అదో పెద్ద చరిత్ర.  ప్రస్తుతానికి దానిని పక్కన పెట్టి చెప్పుకుంటే,  భారతదేశపు వర్తమానం పాశ్చాత్యసమాజానికి గతం. అది వారిలో ఏవో పురాస్మృతులను రేపుతుంది. భారత్ పట్ల దాని ఆసక్తి, ఆకర్షణల రహస్యం అదే.

ఈ రహస్య భారతంలో, ఏ సమూహానికి ఆ సమూహానికే తమవైన తంతులు, విశ్వాసాలు, సాంస్కృతిక అభివ్యక్తులు, ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించినప్పుడు; ఆ సమూహాలను నేను రహస్య సమాజాలు, రహస్య ప్రపంచాలు అంటాను. మళ్ళీ ఈ రహస్య సమాజాల ఉనికి కూడా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తమే. ఆ మధ్య డావిన్సీ కోడ్ అనే నవల వచ్చింది. అంతవరకూ పుస్తక పఠనం అలవాటు పెద్దగా లేని యువత కూడా ఆ నవలను విరగబడి చదివింది. అందులోని సస్పెన్స్, థ్రిల్లర్ మసాలా వాళ్ళను ఆకట్టుకుని ఉండచ్చు. వేరే అంశాలు నన్ను ఆకర్షించాయి. అది రహస్య సమాజాల గురించి, గుప్తలిపుల గురించి మాట్లాడుతుంది. అందులో పాశ్చాత్య సమాజాల పురాచరిత్ర ఉంది. ఆ కోణం నుంచి ఆ నవలను ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అప్పట్లోనే దానిపై నేనొక వ్యాసం రాశాను.

ఇప్పటి సంగతి చెప్పలేను కానీ, నిన్న మొన్నటి వరకు మనదేశంలో ఊరి శివార్లలో కొన్ని రహస్యప్రదేశాలు ఉండేవి. వాటిని పవిత్రమైన తోపులు (sacred groves) అంటారు. మొదట్లో ఆ తోపుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉండేది. పురుషుడు వాటిలోకి అడుగుపెడితే విపరీత పరిణామాలుంటాయనేవారు. మన పురాణాలలోనే కాదు, ప్రపంచ పురాణాలలో కూడా ఇందుకు సంబంధించిన కథలున్నాయి. స్త్రీల రహస్య ప్రదేశం లోకి అడుగుపెట్టిన నారదుడు స్త్రీ అయిపోయాడని ఒక పురాణ కథ. ఇటువంటివే జానపద కథల్లోనూ ఉన్నాయి.  ‘జగదేకవీరుని కథ’ అనే సినిమాలో దేవకన్యలు జలక్రీడలాడుతుండగా చూసిన నాయకుడు శిల అయిపోతాడు. పైన చెప్పిన తోపులు క్రమంగా పురుషుల రహస్య ప్రదేశాలుగా మారిపోయాయనీ, వాటిలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించారనీ కోశాంబి అంటాడు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగిన పరివర్తనకు అది సూచన.

స్త్రీ, పురుషులు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో పక్క పక్కనే ఉంటున్నా ఎవరి రహస్య ప్రపంచాలు వారికి ఉన్నాయనిపిస్తుంది. కొన్ని తంతులలో మా అమ్మ పాటించే గోప్యత, చేసే పనులు నాకు చిన్నప్పుడు విస్మయం కలిగిస్తూ ఉండేవి. స్త్రీలు చేసే నోములు, వ్రతాలు, పేరంటాలు ఒక రహస్య ప్రక్రియలా  అనిపిస్తాయి. వాటి ఆనుపానులు పురుషునికి ఎప్పుడూ పూర్తిగా అర్థం కావు. వాళ్ళు పాడే పాటలు, వాటిలో దొర్లే పలుకుబడులూ పురుషునికి ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తాయి. శుభకార్యాలప్పుడు ఆడవాళ్ళు అందరూ చేరి చెప్పుకునే ముచ్చట్లు, చేసే పనులు  పురుషునికి వ్యతిరేకంగా జరిగే ఏదో ‘కుట్ర’ను తలపిస్తాయి. ఈ రహస్య ప్రపంచ వారసత్వం తల్లినుంచి కూతురికి అతి సహజంగా అందిపోయే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.  ఇక ఉపనయనం తంతు పురుషుల రహస్య ప్రపంచానికి చెందినది. అందులో తల్లి పాత్ర కన్నా, తండ్రి పాత్ర కీలకం.  ఉపనయనం ఒక విధంగా తల్లి ప్రభావాలనుంచి కొడుకును దూరం చేసి, అతనికి పెద్దరికం కల్పించే ప్రక్రియ. ఈ ఉపనయన విధి మన దేశంలోనే, అందులోనూ కొన్ని కులాలలోనే ఉందనేది అపోహ మాత్రమే. ఉపనయనం ప్రపంచమంతటా పురాసమాజాలన్నిటా ఏదో ఒక రూపంలో ఉంది.  దాని గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.

నా చిన్నప్పటినుంచి పోలాల అమావాస్య అనే మాట వింటూ ఉండేవాడిని. మా అమ్మ పోలాల అమావాస్యనాడు కందపిలకను పూజించేది. అది కడుపు చలవకు ఉద్దేశించిన తంతు అని చాలాకాలానికి తెలిసింది. ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు ఒడి కట్టులో కందపిలకను వేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒకానొకప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు అందరూ ఒకే రహస్య ప్రపంచాన్ని పంచుకోవడం! పసిఫిక్ మహాసముద్రంలో టోబ్రియాండ్ దీవులున్నాయి. అక్కడి ఆదివాసుల సౌభాగ్య దేవత పేరు ‘పోలేరు’. వారి ప్రధాన ఆహారం యాం అనే దుంప. పిల్లలు లేని పడతులు ఒక వృద్ధ వనితను ఆశ్రయిస్తారు. ఆమె కడుపు చలవ గల తల్లి కట్టి విడిచిన గడ్డి లంగాను తెచ్చి ఆ పడుచు తల మీద కప్పి, “ఓ పోలేరూ, ఈ పడుచు కడుపు పండించు” అంటూ మంత్రాలు చదువుతుంది. మనకు కూడా పొలి, పోలి, పోలెరు సౌభాగ్య దేవతలే (జనకథ-రాంభట్ల కృష్ణమూర్తి).

images

చెప్పొచ్చేదేమిటంటే, విశ్వాసాలు, ఆచారాలు, ఆకాంక్షలు కాలానికి లొంగినట్టు కనిపిస్తూనే కాలాన్ని ధిక్కరిస్తాయి. కాలాన్ని ఏమార్చడానికి అవి రహస్యాల ముసుగులు ధరిస్తాయి. గుప్తలిపులుగా మారి రహస్య సమాజాలను సృష్టిస్తాయి. ఆదిక్షత్రియుల గురించిన కలవరింత అలాంటిదే నని నేను అనుకుంటాను. అదలా ఉంచి, ఈ దేశంలో ఒకే భాష మాట్లాడుతూ, ఒకే ప్రాంతానికి చెందినవారి మధ్య కూడా నిగూఢత అనే ఇనప తెరలు ఉన్నాయనీ, ఒకరికొకరు తెలియనితనం ఉందనీ ఛళ్ళున చరచి చెప్పిన ఒక ఘటన ఈ సందర్భంలో గుర్తుకొస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు-కొవ్వూరు రైలుమార్గంలో బ్రాహ్మణగూడెం అనే ఊరు, నిజానికి బాపన్న గూడెం అనే పేరుకు అది సంస్కృతీకరణ. ఓ శీతాకాలం సాయంత్రం కొవ్వూరు వెళ్ళడం కోసం బ్రాహ్మణగూడెం స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాను.  అదో చిన్న స్టేషన్. రైలు లేటు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ప్రారంభమైంది. అంతలో స్టేషన్ ను ఆనుకునే ఉన్న ఓ విశాల ప్రదేశంలో కొంతమంది చెరుకు పిప్పి పోగేసి మంట పెట్టారు. బతుకు జీవుడా అనుకుంటూ నేను కూడా  ఆ మంట దగ్గరికి చేరాను. చూస్తూ ఉండగానే ఆ పరిసరాలలో ఉన్న ఆడా, మగా; చిన్నా పెద్దా అంతా వచ్చి వాలిపోయారు. ఆ వెచ్చదనం ఉల్లాసం నింపినట్టుంది, కబుర్లు ప్రారంభమయ్యాయి. మాటలు ఒకరినుంచి ఒకరికి అంత్యాక్షరిలా ప్రవహించసాగాయి. అవి క్రమంగా సరసాలుగా మారాయి. సరసాలు ఒకరి ‘సంబంధాలు’ ఒకరు కెలుక్కునే వరకూ వెళ్ళాయి. ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో విరబూసిన  తుళ్లింతలు, ఇకిలింతలు, చిరునవ్వులు, సిగ్గు దొంతరల కాంతులు  ఆ చలిమంటతో పోటీ పడ్డాయి. పోటాపోటీగా మాటలు రువ్వడంలో ఆడా, మగా ఎవరూ ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు.

నేను అప్రతిభుడినైపోయాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. సభ్యత గురించి, సంస్కారం గురించి  ‘నా ప్రపంచం’ నాలో నూరిపోసిన నమ్మకాలు ఆ క్షణంలోనే ఆ చలిమంటలో దూకి ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అనిపించింది. ఈ దేశంలో భిన్న సమాజాలు, భిన్న ప్రపంచాల ఉనికి అర్థమయింది.

కోశాంబి అంటాడు:

Better-known religious observances can also be traced back into the primitive or prehistoric past. The holi spring festival, an obscene and nowadays rather  depraved saturnalia, has dancing around a great bonfire as its central feature. …it is always followed the next day by a great deal of vociferous public obscenity; in out-of-the-way places by sexual license and promiscuity as well. In prehistory the diet was poor, life hard, procreation none too easy. The obscenity was then necessary as a stimulus. (The Culture & Civilization of Ancient India-in Historical Outline)

ఇప్పుడు తలచుకుంటే, శీతవేళ దేహానికి గిలిగింతలు పెట్టే ఆ వెచ్చని అనుభవం, మనిషి జన్యుసంపుటిలో లోతుగా ఇంకిపోయిన ఏవో ఆదిమస్మృతులను అప్రయత్నంగా రెచ్చగొట్టిందనిపిస్తుంది. ఎప్పుడో ఊహ కందని కాలంలో రాజుకున్న ఆ చలినెగడు అప్పటినుంచీ అలాగే నిలిచి మండుతోందనిపిస్తుంది.

 

 – కల్లూరి భాస్కరం

 

 

నేటికీ ‘పురి’ విప్పుతున్న వంశం

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)హిమకరు దొట్టి పూరు భరతేశు కురుప్రభు పాండుభూపతుల్

క్రమమున వంశకర్తలనగా మహి నొప్పిన యస్మదీయ వం

శమున బ్రసిద్ధులై విమల సద్గుణశోభితులైన పాండవో

త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం)

(చంద్రునితో మొదలు పెట్టి, పూరుడు, భరతుడు, కురువు, పాండురాజు క్రమంగా వంశకర్తలైన నా వంశంలో ప్రసిద్ధులు, సద్గుణవంతులు అయిన పాండవోత్తముల చరిత్ర నాకు ఎప్పుడూ వినాలనే ఉంటుంది)

నన్నయభట్టారకునితో రాజరాజనరేంద్రుడు అన్న మాటలివి.  క్రీ.శ. 11 వ శతాబ్దిలో రాజమహేంద్రవరం రాజధానిగా వేంగీ రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజు -రాజరాజ నరేంద్రుడు తనను పాండవ వంశీకునిగా చెప్పుకుంటున్నాడు! అదెలాగో తెలియదు. ఋషి వంటి నన్నయ ఈ అభూతకల్పనను ఆమోదించి దానికి పద్య రూపం ఇవ్వడం, ఇప్పటి చరిత్ర ప్రమాణాలతో చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వాస్తవం ఏమిటంటే, నన్నయ ఋషితుల్యుడే, అవిరళ జపహోమ తత్పరుడే. కానీ, ‘కుసుమాస్త్రుండైన(మన్మథుడైనా) జొన్న కూడే కుడుచున్’ అంటూ ఒకప్పటి పలనాటి పరిస్థితుల గురించి శ్రీనాథుడు అన్నట్టుగా; ఎంతటివాడైనా దేశకాల పరిస్థితులకు లొంగి ఉండక తప్పదు.

కనుక, నన్నయ తప్పేమీలేదు. తప్పు ఉంటే గింటే మనకు చరిత్ర గురించిన స్పృహ, పట్టింపు, క్రమశిక్షణ లేకపోవడంలో ఉంది. కల్పనను చరిత్రగా చలామణీ చేయడం, చరిత్రను కల్పనగా మార్చడం మొదటినుంచీ మన సంప్రదాయంలో ఉన్నదే. అభూతకల్పన (myth making) అనేది ప్రపంచమంతటా మనిషి స్వభావంలో ఆదిమకాలంనుంచీ ఉందనీ, అది సానుకూల పాత్రను కూడా పోషించిందనీ A SHORT HISTORY OF MYTH లో కరేన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే రచయిత్రి అంటారు. ఘటనాక్రమంతో కూడిన చరిత్రను నమోదు చేసే క్రమశిక్షణ అభివృద్ధి చెందిన తర్వాత myth making కు ఆదరణ తగ్గి, అపహాస్యానికి లోనవుతూ వచ్చిందని ఆమె అంటారు. కాకపోతే, ఈ అభూత కల్పన ప్రక్రియ మన దేశంలో మరింత ఎక్కువ కాలం కొనసాగి, ఇప్పటికీ చలామణిలోనే ఉంది. ఈ రచయిత్రి పరిశీలన గురించి మరిన్ని విషయాలు చెప్పుకునే అవకాశం ముందు ముందు రావచ్చు కనుక ప్రస్తుతానికి వద్దాం.

యయాతి, దేవయాని, శర్మిష్టలు మహాభారత ప్రసిద్ధులు. యయాతికి దేవయాని వల్ల యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; శర్మిష్ట వల్ల ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పై పద్యంలో పేర్కొన్నది ఈ పూరుడినే. అతనిని తన వంశకర్తలలో ఒకడిగా రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటే;  మనుచరిత్రలో అల్లసాని పెద్దన  శ్రీకృష్ణ దేవరాయలను యయాతి మరో కొడుకైన తుర్వసునితో ముడిపెట్టాడు.  1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు ‘తుళువ’ వంశీకుడు.  పెద్దనగారికి తుర్వస-తుళువల మధ్య పోలిక కనిపించింది. అంతే, రాయలవారిని తుర్వస వంశీకుని చేశాడు. పెద్దనను ఒరవడిగా తీసుకుని నంది తిమ్మన కూడా పారిజాతాపహరణములో రాయలవారిని తుర్వస వంశీకునిగా పేర్కొనడమే కాక, మరో అడుగు ముందుకు వేసి యాదవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ దేవరాయలుగా అవతరించారడంటూ శ్లేషయుక్తంగా పద్యాలు రాశాడు.

Krishna3

ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ప్రారంభిస్తే, అది చాతుర్వర్ణ్య(నాలుగు వర్ణాల) చరిత్ర మొత్తంలోకి మనల్ని తీసుకువెడుతుంది.  క్లుప్తంగా చెప్పుకుంటే, నిజానికి నాలుగు వర్ణాలు అనే చట్రం సూత్రరీత్యానే కానీ ఆచరణలో ఉన్నది తక్కువ.  వర్ణవిభజనతో ప్రారంభమై వృత్తి విభజనగా పరిణమించిన ఈ నాలుగు వర్ణాల చట్రాన్ని పకడ్బందీగా ఉంచే ప్రయత్నం ఏనాడూ ఫలించలేదు. వర్ణసాంకర్యంతో పాటు వృత్తి సాంకర్యమూ పెద్ద ఎత్తున జరిగిపోయింది.  దక్షిణభారతానికి వచ్చేసరికి నాలుగు వర్ణాల చట్రం మరింత సడలి పోయింది. అయినాసరే, రాజ్యాధికారం క్షత్రియుడిదనీ, లేదా రాజ్యాధికారం కలిగిన వారు అందరూ క్షత్రియులేననే భావన సాంప్రదాయిక వర్గాలలో నిన్నమొన్నటి వరకూ  ఉండిపోయింది.  రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్లడం చరిత్రపూర్వ కాలంలోనే మొదలై, చరిత్ర కాలంలో సంపూర్ణమైనట్టు కనిపిస్తుంది.  క్షత్రియుల్లో చరిత్రకాలానికి ముందే హెచ్చు, తగ్గులు వచ్చి; వన్నె తక్కువ క్షత్రియులను వ్రాత్య క్షత్రియులనడం ప్రారంభించారు. శాక్య వంశీకుడైన బుద్ధుడు, లిచ్ఛవీ తెగకు చెందిన మహావీరుడు వ్రాత్యక్షత్రియులే. మనదేశంలో నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం మగధ, కోసల రాజ్యాలతో(క్రీ.పూ. 6వ శతాబ్దం) ప్రారంభమైంది. అయితే ఈ రెండు రాజ్యాల పాలకులనూ హీన జాతి క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అన్నారే తప్ప సుక్షత్రియులుగా గుర్తించలేదు. ఎలా పిలిచినా అందులో క్షత్రియ పదం ఉండడం, రాచరికానికీ-క్షత్రియత్వానికీ ముందునుంచీ ఉన్న ముడిని సూచిస్తుంది. మగధ, కోసల రాజులు తమను క్షత్రియులుగా గుర్తింపజేసుకోడానికీ, క్షత్రియులతో వివాహసంబంధం ద్వారా తమ సామాజిక స్థాయిని పెంచుకోడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని ఆసక్తికర ఘట్టాలను సృష్టించాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. దక్షిణ భారతానికి వచ్చేసరికి రాజ్యాధికారానికీ, క్షత్రియత్వానికీ ఉన్న సంబంధం మరింత పలచబారి చతుర్థ కులస్థులు(శూద్రులు) రాజులు కావడం మొదలైంది. అయినా సరే, క్షత్రియులన్న ముద్ర కోసం వారు కూడా  ఆరాటపడడం; సూర్య, చంద్ర రాజవంశాలతో ఏదో ఒక వంశంతో తమను ముడి పెట్టుకోవడం కొనసాగింది. ఇందులో భాగంగా ‘హిరణ్యగర్భ’ క్రతువుల వంటివీ పుట్టుకొచ్చాయి. రాజ రాజనరేంద్రుడు తనను పాండవవంశీకునిగా చెప్పకోవడం, కృష్ణ దేవరాయలను తుర్వస వంశీకునిగా పెద్దన పేర్కొనడం వెనుక ఇదీ అసలు విషయం.

శూన్యం నుంచి పుట్టిన వర్ణ/వృత్తి విభజన మొదట రెండు వర్ణాలతో మొదలై ఆ తర్వాత మూడు, నాలుగు వర్ణాలుగా మారి క్రమంగా అసంఖ్యాక కులాల అవతరణకు దారితీయించింది. వర్ణవ్యవస్థా పరిణామ క్రమాన్ని, ముఖ్యంగా క్షత్రియులనుంచి  వైశ్యవర్ణం ఏర్పడిన తీరును రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో చాలా ఆసక్తికరంగా చర్చించారు. దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం. భారతీయ సమాజంలోనూ, రాజకీయాలలోనూ కులం ఇప్పటికీ పాత్ర పోషిస్తూనే ఉంది. అయినా సరే, కుల/వర్ణ పరిణామక్రమం గురించిన చరిత్ర చర్చలో లేదు. వాటి గురించి అపోహలు, అపార్థాలే ప్రచారంలో ఉన్నాయి తప్ప స్పష్టత లేదు. ఆమధ్య జనగణనతోపాటే కులగణన కూడా చేపట్టాలని పార్లమెంటులో కొన్ని రాజకీయపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం గుండెల్లో రాయి పడింది. కులగణన అంటే కందిరీగల తుట్టను కదపడమేనని అది భావించింది. దేశవ్యాప్తంగా కులాలు వేల సంఖ్యలో ఉండడం అందుకు ఒక కారణం. సాంప్రదాయికంగా చూస్తే, ‘పంచ’ములను కలుపుకుని వర్ణాలు అయిదే. ఇప్పటి భాషలో అగ్ర/అగ్రేతరాలుగా చెప్పుకుంటే, అవి రెండే. జరిగింది ఏమిటంటే, చతుర్థ వర్ణమే వేల కులాలుగా చీలిపోయింది. వాటన్నిటినీ చతుర్థవర్ణంగా గుర్తిస్తే మిగిలేది సాంప్రదాయికమైన పంచమవర్ణ వ్యవస్థే.

కులం గురించిన ఈ పరిశీలన చారిత్రక దృష్టినుంచి చేస్తున్నదే తప్ప మరొకటి కాదని మనవి చేస్తూ ముందుకు వెడతాను.

క్షత్రియేతర వర్ణాలనుంచి రాజులు అవతరించడం ప్రారంభమయ్యాక, వారు సాంప్రదాయిక విభజనలోకి రారు కనుక ప్రారంభంలో వారిని వన్నె తక్కువ క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అంటే; చరిత్రకారులు వారిని అస్పష్ట మూలాలు కలిగినవారుగా చెప్పడం ప్రారంభించారు. నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం వీరితోనే మొదలైంది. దక్షిణభారతానికి వచ్చేసరికి సాంప్రదాయిక వర్ణ విభజన మరింత పలచబారి, స్థానిక తెగలనుంచి రాజులు ఆవర్భవించారు. శాతవాహన రాజులతో ప్రారంభించి, చాళుక్యులు, విజయనగర రాజుల వరకూ దాదాపు అందరినీ చరిత్రకారులు అస్పష్ట మూలాలు కలిగినవారుగానే చెప్పారు. సాంప్రదాయిక విభజన ప్రకారం వీరంతా చతుర్థవర్ణంలోకే వస్తారు. క్షత్రియత్వం వీరిపై కృత్రిమ ఆపాదన మాత్రమే.

ఇంకా విశేషం ఏమిటంటే, ఒక కోణం నుంచి చూసినప్పుడు మహాభారతం ప్రధానంగా రెండు విషయాలు చెబుతోంది. మొదటిది, సాంప్రదాయిక క్షత్రియులు అంతరించిపోవడం గురించి! హోమర్ చెప్పిన ‘ఇలియడ్’ లానే మహాభారతం కూడా ఒక గొప్ప వంశం అంతరించిపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రారంభమవుతుందని కోశాంబి అంటాడు. రెండోది, రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్ళడం గురించి! ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్న ఈ చర్చను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

కోశాంబి మౌలికంగా గణితశాస్త్రజ్ఞుడు. ఆయన నిర్ధారణలు చాలా చోట్ల గణిత సూత్రాలలా ముక్తసరిగా ఉంటాయి. వాటి ఆధారంగా ఒక్కోసారి మనం లెక్కలు చేసుకోవలసిందే. గట్టి ఆధారాలు లేకుండా ఊహల మీద ఆధారపడి నిర్ధారణకు రావడానికి ఆయన ఒప్పుకోడు. అటువంటి వ్యక్తి, అలెగ్జాండర్ తో పోరాడిన పోరస్ పురువంశపు చివరి రాజు అనడమే కాదు, పంజాబ్ లో ఈ రోజున ‘పురి’ అనే ఇంటిపేరు ఉన్న వారు పురువంశీకులే కావచ్చునని అంటాడు. ఆవిధంగా ఇతిహాస కాలాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి రెంటి మధ్యా అవిచ్ఛిన్నత ను కల్పిస్తున్న కోశాంబి పరిశీలన పురాచరిత్రాన్వేషకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఆయన ప్రకారం చూసినప్పుడు, పదకొండో శతాబ్దికి చెందిన రాజరాజనరేంద్రుడు పూరుని తన వంశకర్తలలో ఒకడిగా చెప్పుకున్నా అది కల్పన మాత్రమే. 21వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ సినీ నటులు అమ్రీష్ పురి, ఓం పురి; పాత్రికేయుడు, రచయిత బలరాజ్ పురి; రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ కె.ఆర్. పురి; వ్యాపారవేత్త, ఇండియా టుడే ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పురి తదితరులు అసలు సిసలు పురు వంశీకులు అవుతారు. పురు వంశీకులు వేద కాలం నుంచి నేటి కాలం వరకూ పంజాబ్, దాని చుట్టుపక్కలే ఉన్నారు.
ఓం పురి

ఓం పురి

ఇక యయాతి కొడుకైన తుర్వసునితో కృష్ణ దేవరాయలను పెద్దన ముడిపెట్టాడని చెప్పుకున్నాం. దీని వివరాలలోకి వెళ్ళడం మరింత ఆసక్తిదాయకం.  రాంభట్ల కృష్ణమూర్తి(వేద భూమి) ప్రకారం, యయాతి తండ్రి నహుషుడు పశ్చిమాసియాకు చెందినవాడు. మ్లేచ్ఛ భాషలో నహుషుడు అనే మాటకు కొండచిలువ అని అర్థం. ఆనాడు వైదికార్యులకు పశ్చిమాసియాతో దగ్గరి సంబంధాలు ఉండేవి. పశ్చిమాసియా నుంచి వాయవ్య భారతం వరకూ ఆనాడు ఆర్యావర్తంగా ఉండేదనిపిస్తుంది.  వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు కొన్ని మాటలకు ఆర్యభాషల్లో అర్థం దొరకనప్పుడు మ్లేచ్ఛ భాషార్థాన్ని చూడమని పూర్వమీమాంసా సూత్రకర్త జైమిని చెప్పడాన్ని రాంభట్ల ఉదహరిస్తారు. యయాతి కొడుకు తుర్వసుని పేరులోని ‘తురు’ అనే మాటకు మ్లేచ్ఛ భాష అయిన సుమేరులో ‘పల్లం’ అని అర్థం. తుర్వసును సుమేరులు ‘తుర్కీ’ అంటారు. నేటి టర్కీ యే ఈ తుర్కీ. సుమేరు భాషలో ‘కీ’ అంటే భూమి అని అర్థం. తుర్కీ అంటే పల్లపు భూమి. తుర్వసు అనే మాటలోని వసువుకూ భూమి అనే అర్థం. ‘తురుష్కులు’ అనే మాట కూడా తురు నుంచే పుట్టిందని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఆవిధంగా చూసినప్పుడు, పదిహేనో శతాబ్దికి చెంది, దక్షిణ భారత రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలను కేవలం తుళువ/తుర్వసుల మధ్య ఉన్న స్వల్పమైన ఉచ్చారణ సామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తుర్వస వంశీకునిగా చెప్పడం myth making లో మన కవుల ప్రావీణ్యానికి మచ్చు తునక.

 –కల్లూరి భాస్కరం

 

 

 

శ్రాద్ధమూ, దాని ఎకనమిక్సూ !

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు: బంధుమిత్ర జనాలు అందరికీ పాండవులు ఉదకకర్మ నిర్వర్తించాక మైలదినాలను గంగాతీరంలో గడపడానికి, అక్కడ ఎత్తుపల్లాలు లేని చోట కుటీరాలు నిర్మింపజేశారు. ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన పెద్దలతో; యుద్ధంలో మృతులైన భరతవీరుల భార్యలతో సహా నెలరోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన మునులందరూ శిష్యులను వెంటబెట్టుకుని ధర్మరాజును చూడడానికి వచ్చారు…

                                                                                  (శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం)

మహాభారతంలోని అనేక ఘట్టాలు, విశేషాలు ప్రచారంలో లేవు. ఎన్నో ఆసక్తికర విషయాలు మరుగున పడిపోయాయి. వాటిలో శ్రాద్ధకర్మ గురించిన ముచ్చట్లు ఒకటి. ‘పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి ఖర్చైపోయిం’ దనే నానుడి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.  కథలోకి వెడితే, ఇది సహజోక్తే తప్ప ఏమాత్రం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.

యుద్ధపర్వాల తర్వాత శాంతిపర్వం  పైన పేర్కొన్న వైశంపాయనుని కథనంతో ప్రారంభమవుతుంది. అది ఒకవిధంగా మృతవీరుల ‘ఆత్మశాంతి’పర్వం కూడా.  భరతవంశీకులు మైల పాటించిన ఆ నెలరోజులూ గంగాతీరం లోని ఆ ప్రాంతం ఒక మినీ హస్తినాపురం అయిపోయిందని పై వివరాలను బట్టి అర్థమవుతుంది. పాండవులు, ధృతరాష్ట్రాది పెద్దలూ, మృతవీరుల కుటుంబాలూ  ఉండడానికి ఎన్ని కుటీరాలు నిర్మింపజేసి ఉంటారో, అందుకు ఎంత శ్రామికశక్తిని వినియోగించి ఉంటారో, వంటలూ-వార్పులూ, ఇతర సేవలూ అందించడానికి ఏ సంఖ్యలో సిబ్బందిని నియమించి ఉంటారో ఊహించుకోవచ్చు. దీనికితోడు, పరామర్శకు  శిష్య, పరివార సమేతంగా వచ్చే మునులు, ఇతర రాజబంధువుల వసతికీ, భోజన, సత్కారాలకూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగే ఉంటాయి. ఇక చనిపోయిన వీరులకు వారి వారి స్థాయిని బట్టి నిర్వహించే పరలోక క్రియలలో సువర్ణదానం, గోదానం, భూదానం వగైరాలు విధిగా ఉండి తీరతాయి. ఇలా లెక్కిస్తే కురుపాండవవీరులు, బంధుమిత్రుల అంత్యక్రియలకు పాండవులు వెచ్చించిన సంపద అనూహ్య ప్రమాణంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

09balikakka_large

ఇదిగాక ధర్మరాజుకు ఇంకో నైతిక బాధ్యత కూడా ఉంది.  కౌరవుల అంత్యక్రియలకు తను లోటు చేశాడనే భావన  పెదతండ్రి ధృతరాష్ట్రునికీ, పెత్తల్లి గాంధారికే కాక; ఇతరులకూ కలగకుండా చూసుకోవాలి.  శ్రాద్ధ దినాలలో ధృతరాష్ట్రుడు భారీగా గోవులను, బంగారాన్ని దానం చేసి తన నూరుగురు కొడుకులకూ ఘనంగా పరలోక క్రియలు నిర్వహించే ఏర్పాటు ధర్మరాజు చేశాడని మహాభారతం చెబుతోంది. పైగా ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేపట్టే సమయానికి ఖజానా ఖాళీ అయిపోయింది.  అశ్వమేధయాగం చేయమని ధర్మరాజుకు వ్యాసుడు సూచించినప్పుడు; నా మీద ఈర్ష్యతో దుర్యోధనుడు అనేకమంది రాజులను, సేనలను కూడగట్టుకునే ప్రయత్నంలో భూమినీ, ఖజానాను ఖర్చుపెట్టేశాడనీ, ఇప్పుడు ధనం లేదనీ ధర్మరాజు అంటాడు. అదలా ఉంచి,  ధర్మరాజు పాలనలో కొన్నేళ్ళు గడచిన తర్వాత,  ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి  వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.  ధర్మరాజును పిలిచి ఆ సంగతి చెబుతూ; ఇప్పటికే నా కుమారులకు అనేకసార్లు శ్రాద్ధం పెట్టావు కనుక, వారి కోసం ఇంకేమీ చేయవద్దని అంటాడు. ధృతరాష్ట్రుడంతటి వాడు అలా మొహమాట పడడానికి కారణం, శ్రాద్ధకర్మలు కోశాగారాన్ని చాలావరకూ హరించివేయడమే.  అయితే, శ్రాద్ధకర్మ విశ్వాసానికే కాక, వైభవానికీ కొండగుర్తుగా మారిన ఆ రోజుల్లో తను వానప్రస్థానికి  వెళ్లబోయేముందు చివరిసారి కొడుకులకు వైభవోపేతంగా శ్రాద్ధం నిర్వహించాలనే కోర్కెను ధృతరాష్ట్రుడు  అణచుకోలేకపోయాడు. ధర్మరాజు ముందు నేరుగా దానిని బయటపెట్టడానికి మొహమాటపడి విదురునితో చెప్పించాడు. విశేషమేమిటంటే, భీముడు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా అర్జునుడు అతణ్ణి మందలించి తన వాటాలోంచి ఆ ఖర్చు భరించడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుని మనసులోనే మెచ్చుకున్నాడని మహాభారతం చెబుతోంది.

మహాభారతంలోని ఈ ‘శ్రాద్ధనామిక్స్’ కోణాన్ని ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అయితే, ప్రపంచమంతటా ఉన్న ఈ అంత్యక్రియల ఆచారం(cult of dead) మిగులు సంపదనే కాక, తెగలకు తెగలనే అంతరింపజేసిందని కోశాంబి అంటాడు. ఉదాహరణకు, మృతసముద్రం సమీపంలోని జోర్డాన్ నదీలోయలో క్రీ.పూ. 3800-3350 మధ్యకాలంలో నివసించిన ఘాసూలియన్లు.  వీరు మృతులను పూడ్చిపెట్టిన చోట రాకాసి గుళ్ళు నిర్మించేవారు. మతపరమైన  సంక్లిష్ట అలంకరణలకు వీరు ప్రసిద్ధులు. బ్రిటన్, ఐబీరియా(స్పెయిన్, పోర్చుగల్, అండోరాలను ఐబీరియా దేశాలంటారు), దక్షిణ భారతదేశాలలో ఇంతకంటే భారీగా రాకాసిగుళ్ళ నిర్మాణం జరిగింది. ‘సామాజిక ప్రగతికి ఏమాత్రం దోహదపడని ఈ పితృకర్మలకు ఉన్న కొద్దిపాటి మిగులునూ ఖర్చు పెట్టేశా’రని కోశాంబి అంటాడు.  ఇటలీకి దక్షిణంగా, లిబియాకు ఉత్తరంగా మధ్యధరా సముద్ర మధ్యంలో మాల్టా దీవులున్నాయి. రాతి యుగం అంతానికి మాల్టా ఒక పవిత్రద్వీపంగా పేరుతెచ్చుకుంది.  ఆ దీవులనుంచి అప్పట్లో భారీ ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉండేది. 1930లలో అక్కడ జరిగిన తవ్వకాలలో ప్రతిచోటా అలంకృత అస్థికలశాలు బయటపడ్డాయి. అంటే, వ్యాపారం తాలూకు మిగులునంతటినీ అంత్యక్రియల సంస్కృతి  హరించివేసిందన్నమాట. ఇదే ప్రక్రియను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మెసపొటేమియా, సింధు నాగరికతలు ఇలాగే అభివృద్ధికి దూరంగా స్తంభించిపోయాయి. ఆహారోత్పాదనకు అవసరమైన మెరుగైన సాధనాలు, పద్ధతులు తమకు అందుబాటులో ఉన్నాసరే,  సింధు నగరాల నిర్మాతలు వాటిని వాడుకోలేకపోయారు. ఇక ఈజిప్టు తన వద్ద ఉన్న భారీ మిగులునంతటినీ, గడియారాలను తయారుచేసేవారు చూపించేటంత సునిశితదృష్టితో(with watch-maker’s accuracy) బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి ఖర్చు పెట్టేసింది. క్రమంగా అంత్యక్రియల సంస్కృతీ, పురోహిత వర్గం దేశం మొత్తాన్ని తినేశాయి.

sraddham

పురా కాలం నుంచి మన కాలంలోకి వద్దాం. ఇంగ్లీష్ లో పేట్రియార్క్(patriarch), పేట్రియార్కీ(patriarchy) అనే మాటలు ఉన్నాయి. పేట్రియార్కీ ని పితృస్వామ్యంగా అనువదించి మనం వాడుకుంటున్నా, పేట్రియార్క్ అనే మాట మన దగ్గర పెద్దగా వినియోగంలో లేదు. అయితే, (ఉమ్మడి)కుటుంబ యజమానిని సూచించే ఆ మాట ఇప్పటికీ ఇంగ్లీష్ లో తరచు వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకు సమానార్థకం మన పురాణ,ఇతిహాసాలలో కనిపిస్తుంది. అది, ‘ప్రజాపతి’. మన కశ్యపుడు, దక్షుడు మొదలైనవారు; యూదుల అబ్రహాం ప్రజాపతులు. దీని గురించి మరిన్ని వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

పేట్రియార్క్ గా చెప్పదగిన ఒక వ్యక్తి మా దగ్గరి బంధువులలో ఒకాయన ఉండేవారు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఆయనకు పదిమంది కొడుకులూ, ముగ్గురు కూతుళ్ళు. వీరు కాక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అక్క కొడుకులిద్దరిని కూడా ఆయనే పెంచి పెద్దజేశారు. కొడుకులకు ఉద్యోగాలు వచ్చి, పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగి వారికి పెళ్లీడు వచ్చిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబవ్యవస్థే కొనసాగుతూ ఉండేది. కొడుకులు వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నాసరే, తండ్రిపట్ల భయభక్తులూ, ఉమ్మడి కుటుంబ సంప్రదాయమూ వారిని నీడలా అంటిపెట్టుకునే ఉండేవి. ఆయన ఇంట్లో తగు మాత్రం పాడి-పంట ఉండేవి. గోసేవ విధిగా జరుగుతూ ఉండేది. కుటుంబ సభ్యులకు అదనంగా వచ్చిపోయే సాధు, సంతులతో; అతిథి అభ్యాగతులతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఆయన ఉదయమే స్నానసంధ్యలూ, పూజాదికాలూ ముగించుకుని చావిడిలో పెద్ద కుర్చీలో గంభీరంగా, సింహంలా కూర్చుని నామ జపం చేసుకుంటే ఉండేవారు. అయినా సరే, ఇంటి వ్యవహారాలు ఏవీ ఆయన కనుసన్నలను దాటిపోయేవి కావు.

శ్రాద్ధకర్మ శాస్త్రోక్తంగా జరపడం పట్ల ఆయనకు ఎంత పట్టింపు అంటే, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆయన గోవును కొని మరీ దానం చేశారు. అంతేకాదు, దానిని ఎట్టి పరిస్థితులలోనూ అమ్మబోనని దానం పుచ్చుకున్న బ్రాహ్మణుని నుంచి హామీ తీసుకునేవారు. అప్పటికీ నమ్మకం కుదరక, గోవు ఉందో లేదో, గోసేవ సక్రమంగా జరుగుతోందో లేదో చూసిరమ్మని కొన్ని రోజులపాటు ఆ బ్రాహ్మణుని ఇంటికి కొడుకుల్ని పంపించి ఆరా తీసేవారు.

అలా ఉండగా, ఆయన అర్థాంగి కాలం చేశారు. ఆరుగురు కొడుకులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉన్నారు. మాసికాలు ఉమ్మడిగా, అందులోనూ నరసాపురంలో పెట్టవలసిందే కనుక సంవత్సరం పొడవునా ప్రతి నెలా కొడుకులు, కోడళ్ళు రైల్లో టికెట్లు రిజర్వు చేసుకుని హైదరాబాద్ నుంచి నరసాపురం బయలుదేరి వెళ్ళేవారు. ఇలా ఏడాది గడిచిచింది. తల్లికి సంవత్సరీకాలు జరిగాయి. విచిత్రంగా ఆ మరునాడే పెద్దాయన కాలం చేశారు. దాంతో ఆరుగురు కొడుకులూ-కోడళ్లూ హైదరాబాద్ నుంచి నరసాపురానికి నెల నెలా వెళ్ళే ఆవృత్తి, మధ్యలో ఎక్కడా విరామం లేకుండా, పునఃప్రారంభమైంది. శ్రాద్ధకర్మలకు ఎటూ వ్యయం భారీగానే జరుగుతుంది. దానికి, రెండేళ్లపాటు జరిగిన ఈ శ్రాద్ధయాత్రా వ్యయం ఏ మేరకు తోడయిందో నన్న ప్రశ్న, దీనిని తలచుకున్నప్పుడల్లా నాలో ఆసక్తిని రేపుతూ ఉంటుంది.

నేను ఆర్థికవేత్తను కాదు. ఒకరి వ్యయం ఇంకొకరికి ఉపాధి అవుతుందనే సాధారణ అవగాహనతో చూసినప్పుడు దీనినంతటినీ దుర్వ్యయం అని చటుక్కున తీర్పు చెప్పే సాహసం చేయలేను. అయితే, ఆ వ్యయం వల్ల కలిగే లాభం  అన్ని వర్గాలకూ సమానంగా పంపిణీ కాకుండా, ఏ ఒక్క వర్గం దగ్గరో పోగుబడితేనే సమస్య. మనిషి ఆర్థికజీవి అంటారు. అంతకంటే ఎక్కువగా విశ్వాసజీవి అనీ; మతంలోనూ, క్రతువులోనే మనిషి పురా కాలం నుంచి ఆధునిక కాలం వరకూ తన అస్తిత్వానికి అర్థం వెతుక్కున్నాడనీ నాకున్న పరిమిత చారిత్రిక జ్ఞానంతో స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చాను. వివాదాస్పదమైన ఈ అంశంలోకి ఇప్పుడు లోతుగా వెళ్ళను కానీ; కోశాంబి అన్నట్టు అంత్యక్రియల సంస్కృతి తూకం తప్పి అభివృద్ధిని అడ్డుకుని దేశాలకు దేశాలనే కబళించి వేసే పరిస్థితికి దారితీయిస్తే తప్పక ఆలోచించవలసిందే.

గొప్పింటి పెళ్లిళ్లలో, ముఖ్యంగా రాజకీయనాయకుల ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లలో ఆడంబర వ్యయం తరచు సంచలనాత్మకంగా వార్తలకు ఎక్కడం చూస్తూ ఉంటాం. ఎందుకో శ్రాద్ధకర్మల వార్తలు ఆ స్థాయిలో వెలుగు చూడడం లేదు. అలాగే శ్రాద్ధానికి చెందిన ఆర్థిక కోణాన్ని కూడా ఎవరూ పరిశీలిస్తున్నట్టు లేదు. ఒకనాటి శ్రాద్ధ కర్మల వైభవప్రదర్శన ఇప్పుడు తగ్గుముఖం పట్టిందా, లేక దీనికి మరో కారణం ఉందా అన్నది తెలియదు. పురా కాలంలో బహుశా పెళ్లి కంటే ఎక్కువగా చావే వైభవోపేతం అనిపిస్తుంది.

–కల్లూరి భాస్కరం

 

“దేవదాసు” ఇంకో ప్రేమ కథ కాదు!

మరునాడు పొద్దుటే ఆ వీరజనులు తమ తమ లోకాలకు వెళ్లడానికి గంగానదిలోకి ప్రవేశించారు. అప్పుడు వ్యాసుడు తను కూడా గంగలో మునిగి, తమ భర్తను అనుసరించి వెళ్లదలచుకున్నవారు గంగలోకి దిగండని వీరుల భార్యలతో అన్నాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ధర్మరాజుల అనుమతి తీసుకుని వారు గంగలో మునిగారు. మనుష్యదేహం వదిలేసి, దివ్యదేహం ధరించి, దివ్యాలంకారాలతో భర్తను కలుసుకున్నారు. ఈ విశేషాన్ని చూసిన జనం ఆశ్చర్యానందాలు చెందారు.

                                                           -(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆశ్రమవాసపర్వం, ద్వితీయాశ్వాసం)

కురుక్షేత్ర యుద్ధానంతరం ఒకరోజు, చనిపోయిన వీరులను వ్యాసుడు తన మహిమతో భూలోకానికి రప్పించాడు. వారు తమ భార్యలతో, బంధుమిత్రులతో రోజంతా ఆనందంగా గడిపిన తర్వాత తమ లోకాలకు తిరిగి వెళ్లడానికి గంగలో మునిగారు. మీరు కూడా భర్తతో వెళ్లదలచుకుంటే గంగలోకి దిగండని వీరుల భార్యలతో వ్యాసుడు అన్నాడు. వారు అలాగే చేశారు. దీనిని సహగమనం అనాలో, అనకూడదో మీ ఊహకే వదిలేస్తాను. అక్కడినుంచి బయలుదేరి మన కాలానికి వద్దాం.

***

శరత్ సాహిత్యం నేను ఎక్కువగా చదవలేదు. ఏవో కొన్ని నవలలు, అది కూడా చిన్నతనంలో చదివాను. చదవాలనే కోరిక మాత్రం ఉండేది. కానీ వృత్తిపరమైన కారణాల వల్ల తగిన తీరిక దొరకలేదు. క్రమంగా నా అధ్యయన ఆసక్తులు మారడం వల్ల కూడా ఆ వైపు దృష్టి పెట్టలేకపోయాను. రేపటి సంగతి చెప్పలేను.

అయితే, శరత్ నవల ఆధారంగా తీసిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. ఇన్నేళ్లలో ఆ సినిమా మీద సమీక్షలూ, స్పందనలూ చాలానే వచ్చి ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఒక సన్నివేశాన్ని మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అదే నా ఆలోచనలను నీడలా వెంటాడుతూ ఉంటుంది. అది నాలో విషాద విభ్రమాలు కలగలసిన ఒక విచిత్రానుభూతిని నింపుతూ ఉంటుంది. నిజానికి ఆ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, దర్శకుడుగా గొప్ప పేరున్న వ్యక్తి కాదు. కానీ ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా పండించినందుకు  ఆయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి ఆయువుపట్టు. శరత్ హృదయమంతా అందులోనే నిక్షిప్తమైనట్టు అనిపిస్తుంది. సినిమా చివరిలో వచ్చే ఈ సన్నివేశమే నా అంచనాలో పతాకసన్నివేశం.

ఇదీ ఆ సన్నివేశం…దేవదాసు తన అంతిమ క్షణాలలో పార్వతి అత్తవారి ఊరు చేరుకుంటాడు. బండివాడు అతనిని పార్వతి ఇంటి అరుగు మీదికి చేరుస్తాడు. ఈ సంగతి తెలిసిన పార్వతి అతణ్ణి కలుసుకోడానికి మేడ మీదినుంచి పరుగు పరుగున కిందికి బయలుదేరుతుంది. అప్పుడు “తలుపులు మూసేయండి” అనే గావుకేక వినిపిస్తుంది. అది ఆమె జమీందారు మొగుడి గొంతు. భళ్ళున తలుపులు మూసుకుంటాయి. అప్రమత్తుడైన పార్వతి సవతి కొడుకు “వద్దు, వద్దమ్మా” అని బతిమాలుతూ ఆమెకు మెట్టు మెట్టునా అడ్డుపడతాడు. వినిపించుకోని పార్వతి మెట్లు దిగే తొందరలో దొర్లిపడి తలకు గాయమై ప్రాణాలు కోల్పోతుంది. అదే సమయంలో, వీధి అరుగుమీద పడున్న దేవదాసు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి.

410757

జ్ఞాపకం మీద ఆధారపడి ఈ సన్నివేశం గురించి రాశాను. కొన్ని వివరాలు, వాస్తవాలు తప్పిపోయి ఉండచ్చు. అయితే, పార్వతి దేవదాసును కలసుకోడానికి పరుగు పెట్టడం, భర్త “తలుపులు మూసేయండి” అని గావుకేక పెట్టడం, సవతి కొడుకు బతిమాలుతూ అడ్డుపడడం-ఇవే ఈ సన్నివేశంలో కీలకాలు. ఇద్దరు ప్రేమికులూ ఒకే క్షణంలో కన్నుమూసే ఈ ఘట్టంలో సినిమా అనూహ్యమైన ఉరవడిని, నాటకీయతను తెచ్చుకుని; ఉధృతంగా దూకే జలపాతం మధ్యలోనే స్తంభించిపోయినట్టుగా ఒక్కసారిగా ముగిసిపోతుంది.

ఈ మొత్తం సన్నివేశం ప్రతీకాత్మకం. దీని వెనుక పందొమ్మిదీ, అంతకు ముందు శతాబ్దాలకు చెందిన కరడుగట్టిన బెంగాల్ సాంప్రదాయిక సమాజపు అభివ్యక్తి మొత్తం ఉంది. ముసలి భర్త పార్వతి పట్ల దయ, సౌజన్యం ఉన్నవాడే. కానీ “తలుపులు మూసేయండి” అనే అతని గావుకేకలో నాటి కులీన సమాజపు కర్కశత్వం చెవులు హోరెత్తేలా ప్రతిధ్వనిస్తుంది. “తలుపులు మూసేయండి” అనే ఆ పెనుకేకలో, ఇంటి గౌరవ మర్యాదలనే గుండెలమీది కుంపటిని మౌనంగా, పంటిబిగువున మోయడం తప్ప స్త్రీకి మరో జీవితం లేదన్న చండశాసనం ఉంది.

సవతి కొడుకు కూడా పార్వతి పై భక్తి, మర్యాద, గౌరవం ఉన్నవాడే. కానీ తండ్రి కులీన వ్యవస్థా కాఠిన్యానికి కూడా అతను వారసుడు. కనుక సవతి తల్లిని సగౌరవంగానే కట్టడి చేయక తప్పదు.

ఈనాటికీ దేవదాసు సినిమాపై స్పందనలు, వ్యాసాలు కంటబడినప్పుడల్లా ఈ సన్నివేశ ప్రాముఖ్యం గురించి ఎవరైనా రాసారా అని ఆశగా వెతుకుతూ ఉంటాను. నాకైతే ఒక్కరూ కనిపించలేదు. నా కంటబడనివీ ఉండచ్చని ఒప్పుకుంటున్నాను.

దేవదాసు ఒక మామూలు ప్రేమకథ కాదు. సినిమా వంటశాలలో వండి వార్చే రొటీను ప్రేమకథ అసలే కాదు. దేవదాసు ఒకనాటి సమాజపు విషాదాంత భీభత్స చరిత్ర. అందులోనూ ఆ సమాజాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించిన చరిత్ర. నలుపు-తెలుపులు ఆ కథలో విడదీయలేని పాత్రలు. నలుపు-తెలుపుల నేపథ్యంలోనే ఆ సినిమా చూడాలి. ఒక చరిత్రకారుడి చూపుతోనూ చూడాలి. అప్పుడే ఆ సినిమాకు న్యాయం జరుగుతుంది. ఆమధ్య రంగుల్లో అట్టహాసంగా దేవదాసు సినిమాను పునర్నిర్మించినప్పుడు ఆ అఘాయిత్యాన్నీ, అపచారాన్నీ, నీచాభిరుచినీ ఎవరైనా ప్రశ్నించారో లేదో తెలియదు. టీవీలో ఆ సినిమా ప్రసారమవుతున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున కంటబడితే టీవీ కట్టేసి బ్లాక్ అండ్ వైట్ దేవదాసు దర్శనానుభూతిని కాపాడుకోవడం నేను అదృష్టంగా భావిస్తాను.

ఇప్పుడిక అసలు విషయానికి వస్తాను. ఈ వ్యాసపరంపరలో కోశాంబి తదితరులతోపాటు తరచు ప్రస్తావనకు రాబోతున్న పురామానవ చరిత్రకారులలో రాంభట్ల కృష్ణమూర్తి ఒకరు. నిజానికి రాంభట్లవారిని with a bang ప్రవేశపెట్టాలని నేను కొన్ని రోజులుగా ప్రణాళిక వేసుకుంటున్నాను. కానీ నా ప్రణాళిక తలకిందులై ఇప్పుడే ప్రవేశపెట్టాల్సి వస్తోంది. అప్పుడప్పుడు, మనం ఒకటి తలిస్తే మన కలం (ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్ అనాలి కాబోలు)ఇంకొకటి తలుస్తుంది.

రాంభట్లవారిని తరచు కలసుకుని గంటల తరబడి ఆయన చెప్పే విషయాలు వినే మహదవకాశం నాకు కలిగింది. ఆ వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, అనేక విశేషాలతోపాటు ఒకనాటి బెంగాల్ కులీన సమాజం గురించీ, శరత్ సాహిత్యం గురించీ, శరత్ సాహిత్యం  తెలుగులోకి తర్జుమా అయిన నేపథ్యం గురించీ ఎన్నో ఆసక్తికర వివరాలు ఆయన చెబుతుండేవారు. నాకు తెలిసినంతవరకు వాటిని ఆయన కాగితం మీద పెట్టినట్టు లేదు.  కాగితం మీద పెట్టే ఆయన సమాచారానికి కొంత మండించే స్వభావం ఉంది. బెంగాల్ కులీన సమాజం గురించి తను చెప్పేవి కూడా అటువంటివేననుకుని వాటిని నోటికే పరిమితం చేసుకున్నారేమో తెలియదు. నా విషయానికి వస్తే, ముందు చూపు లోపించడం వల్ల ఆయన చెప్పిన అనేక విషయాలను నేను కూడా భద్రపరచలేకపోయాను. అందుకు ఇప్పుడు విచారిస్తున్నాను.

నాకు గుర్తున్నంతవరకు ఆయన చెప్పినవి క్రోడీకరిస్తే… నాటి బెంగాల్ సమాజంలో కొన్ని కులీన కుటుంబాలు ఉండేవి. ప్రతి ఆడపిల్ల తండ్రీ కూతురిని కులీనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తహ తహ లాడేవాడు.  ఎక్కడో దూరంగా ఉండే ఆ కులీన వరుడికి అప్పటికే ఎన్నో పెళ్లిళ్లు అయుంటాయి. అయినా అభ్యంతరం లేదు. అతను అప్పటికే కాటికి కాళ్ళు చాచే వయసులో ఉంటాడు. అయినా అభ్యంతరం లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, అతడు సాధారణంగా పెళ్లి మంటపానికి వచ్చి స్వయంగా తాళి కట్టడు. అయినా అభ్యంతరం లేదు. ఆడపిల్ల తండ్రి వరుని కలుసుకుని పెళ్ళికి అనుమతి తెచ్చుకుంటాడు. వరుని పరోక్షంలో పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి తర్వాత ఒక్కసారైనా అల్లుడు అత్తింటికి రాకపోతే ఎలా? ముఖ్యంగా శోభనానికైనా రావాలి కదా?! కనుక, అల్లుడు తన ‘ప్రతినిధి’గా ఒక యువకునికి తగినంత ‘కిరాయి’ ఇచ్చి పంపిస్తాడు. ఆ యువకుడు ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అల్లుడి పాత్ర పోషిస్తూ మూడు రోజులు గడిపి వెళ్ళిపోతాడు.

ఒక్కోసారి కథ మరోలా కూడా పరిణమిస్తుంది. ఆ అమ్మాయి కిరాయి అల్లుడినే భర్తగా భావించి అతనిపై మనసు పడుతుంది. ఆ యువకుడి నుంచి  అనుకూల స్పందన వస్తే ఇద్దరూ కూడబలుక్కుని వెళ్లిపోతారు. అయితే, ఎక్కడికి వెళ్ళినా సమాజం వేటకుక్క లా తరుముతూనే ఉంటుంది కనుక వారు బతికి బట్ట కట్టడం కష్టం. దాంతో ఇద్దరూ మతం మారిపోతారు.

దీనికితోడు, ఒక ముస్లిం మతస్తుని చేయి పొరపాటున తగిలినా చాలు, ఆ స్త్రీని నాటి సమాజం వెలి వేసేది. దాంతో ఆమె మతం మారి మనుగడను కాపాడుకోవడం అనివార్యం అయ్యేది. బెంగాల్ లో ముస్లిం జనాభా పెరగడానికి ఇటువంటివన్నీ దోహదం అయ్యాయని రాంభట్ల అనేవారు. దరిమిలా నాటి ఆంగ్లేయ పాలకులు బెంగాల్ విభజన ఆలోచన చేయడం, తూర్పు బెంగాల్ ఏర్పడడం, ఆ తర్వాత అదే బంగ్లాదేశ్ గా అవతరించడం చరిత్ర. మతవిశ్వాసం, లేదా ఛాందసం చరిత్రను తిప్పిన మలుపుకు ఇదొక ఉదాహరణ.

ఒళ్ళు జలదరింపజేసే మరిన్ని దారుణాలు రాంభట్ల వారి కథనంలో దొర్లుతూ ఉండేవి. బెంగాల్ సమాజంలో  వితంతువుల సంఖ్య విపరీతంగా ఉండేది. వారి పోషణ తలకు మించిన భారమయ్యేది. యాత్ర పేరుతో వారిని కాశీకి తీసుకెళ్ళేవారు. పడవ ఎక్కించి గంగ నడిమధ్యకు తీసుకెళ్లి నీళ్ళలోకి తోసేసేవారు! గంగమ్మ తల్లి అలా వితంతువులను తన ఒళ్లోకి తీసుకుని శాశ్వతంగా నిద్రపుచ్చే ప్రక్రియ మహాభారతకాలం నాటికే ఉందనుకుంటే, అది ఇటీవలి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉందనుకోవాలి.  కాశీ, బృందావనాలు నేటికీ ఎందరో వితంతువులకు అంతిమగమ్యాలు కావడం తెలిసినదే.

saratchandra

బెంగాల్ సమాజంలో ఇలా అన్నివిధాలా అన్యాయమైపోయి దిక్కుమాలిన జీవితం గడిపే స్త్రీలో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా సాహిత్యసృష్టి చేసినవాడు శరత్. రాంభట్ల ప్రకారం, తెలుగునాట కూడా, మోతాదు తేడాలో అటువంటి పరిస్థితులే ఉండేవి. శరత్ సాహిత్యం తెలుగులోకి తర్జుమా అవడానికి అదీ నేపథ్యం. ఆ కృషికి ప్రధానంగా ఇద్దరు దంపతులు కంకణ కట్టుకున్నారు. వారు: బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవి. “మో”గా మనందరికీ తెలిసిన కవి వేగుంట మోహన ప్రసాద్, నేను విన్నంతవరకు, వీరి అల్లుడు. నా చిన్నప్పుడు విజయవాడలో విజయా టాకీస్ పక్క సందులోంచి సత్యనారాయణపురం వెడుతుంటే వంతెనకు ఇవతల కుడి పక్కన ఒక గేటుకు “దేశి కవితా ప్రచురణలు” అనే బోర్డ్ వేలాడుతూ ఉండేది. అదే బొందలపాటివారి నివాసం అనుకుంటాను.

మోసపోయో, మరో విధంగానో కాలుజారిన ఆడపిల్లలు ఆ రోజుల్లో కాలువలో పడి ఆత్మహత్య చేసుకునేవారు. వారిని కాపాడే కర్తవ్యాన్ని ఆ రోజుల్లో ఒక ప్రముఖ రచయిత కొంతకాలం మీద వేసుకున్నాడు. ఆయన గుడిపాటి వెంకటచలం. విజయవాడలో ఉన్న రోజుల్లో ఆయన మరికొందరితో కలసి రాత్రిళ్ళు కళ్ళు కాగడాలు చేసుకుని కాలువ గట్టున మకాం పెట్టేవాడు. అంతా కలసి ఆడపిల్లల్ని ఆఘాయిత్యం నుంచి ఒడ్డెక్కించేవాళ్లు. చలంగారి వదిన డా. రంగనాయకమ్మగారు వారిని తన దగ్గర ఉంచుకుని వైద్యసేవలు అందించేవారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో విజయవాడ ప్రముఖుని పేరు కూడా రాంభట్ల వారు చెబుతుండేవారు. దురదృష్టవశాత్తూ ఆ పేరు నేను మరచిపోయాను.

 

గాంధీజీ హత్య-పోలీసు ‘శ్రాద్ధం’

Gandhi_Assassinationవర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను నిషేధించే మతవిశ్వాసమే పురురాజు ఓటమికి ఒక కారణం కావచ్చుననుకున్నాం. ఒకవేళ పురురాజే ఆ యుద్ధంలో గెలిచి ఉంటే భారతదేశచరిత్ర ఏ మలుపు తిరిగేదో!? అదలా ఉంచి, మతవిశ్వాసం లేదా మతఛాందసం చరిత్రను తిప్పిన మలుపులు ఇంకా ఉన్నాయి.  నాకు అర్థమైనంతవరకు గాంధీజీ హత్యోదంతం వాటిలో ఒకటి. ఎంతో కాలంగా నన్ను వెంటాడుతున్న ఆ కథనాన్ని మీతో పంచుకోడానికి ఇంతకంటె తగిన సందర్భం రాకపోవచ్చు. విషయమేమిటంటే, గాంధీ హత్యను నివారించలేకపోయిన అనేక వైఫల్యాలకు తోడు, ఒక పోలీస్ అధికారి మతవిశ్వాసం కూడా కొంత పాత్ర పోషించింది.

గాంధీజీ హత్యకు ఎలా పథక రచన జరిగిందో, దానిని ఎలా అమలు చేశారో, పోలీస్ దర్యాప్తు ఎలా సాగిందో పూసగుచ్చినట్టు వివరించిన రచనలు చాలానే వచ్చాయి. వాటిలో నేను చదినవి రెండు: మొదటిది, The men who killed Gandhi (మనోహర్ మల్గోంకర్). ఈ రచన ఆధారంగా త్వరలో సినిమా కూడా రాబోతోంది. రెండోది, Freedom at Midnight (Larry Collins and Dominique Lapierre).

మొదటగా గాంధీ హత్యలో పాల్గొన్న కుట్రదారుల పేర్లు చెప్పుకుని ముందుకు వెడదాం: 1. నాథూరాం గాడ్సే 2. నారాయణ్ ఆప్టే 3. విష్ణు కర్కరే 4. గోపాల్ గాడ్సే 5. మదన్ లాల్ పహ్వా 6. దిగంబర్ బడ్గే 7. శంకర్ కిష్టయ్య (బడ్గే దగ్గర పనివాడుగా ఉన్న ఇతను తెలుగువాడు)

1948, జనవరి 30న గాంధీ హత్య జరగడానికి పది రోజులముందు, జనవరి 20న గాడ్సే బృందం ఆయనను హతమార్చడానికి ఒక విఫలయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ ప్రసంగ వేదిక సమీపంలో బాంబు పేల్చిన మదన్ లాల్ పహ్వా పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే, గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తుల వివరాలు సేకరించి, ఇంకోసారి ఆ ప్రయత్నం జరగకుండా నివారించే గట్టి ఆధారం పోలీసులకు దొరికిందన్న మాట. పైగా పది రోజుల వ్యవధి కూడా ఉంది. అయినా నివారించలేకపోవడం భారత పోలీస్, పాలనావ్యవస్థలను శాశ్వతంగా సిగ్గుతో తలవంచుకునేలా చేసిన ఒక హాస్యాస్పద విషాదాధ్యాయం.

జనవరి 20 ప్రయత్నంలో కూడా ఒక మతవిశ్వాసం ప్రభావం చూపడం ఆసక్తికరం. ముందస్తు పథకం ప్రకారం, దిగంబర్ బడ్గే గాంధీ ప్రసంగ వేదిక వెనకనున్న సర్వెంట్స్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఒక గది కిటికీ లోంచి గాంధీ మీద కాల్పులు జరపాలి. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ గది గుమ్మంలో ఒక ఒంటి కన్ను మనిషి కనిపించాడు! బడ్గే గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాడు. ఒంటి కన్ను మనిషి కనబడడం పెద్ద అపశకునం కనుక నేను ఆ గదిలోకి వెళ్ళనని చెప్పేశాడు. ఆ తర్వాత, ఆ కిటికీ లోంచి గాంధీ పై బాంబు విసిరే పని గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేకు అప్పగించారు. కిటికీ చాలా ఎత్తుగా ఉండడంతో అతను ఆ పని చేయలేకపోయాడు. అంతలో మదన్ లాల్ బాంబు పేల్చడం, పోలీసులకు పట్టుబడడం జరిగిపోయాయి.

Nathuram

కూర్చున్నవారు-ఎడమనుంచి కుడికి: నారాయణ్ ఆప్టే, సావర్కర్, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే.
నిలబడినవారు-ఎడమనుంచి కుడికి: శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్ లాల్ పహ్వా, దిగంబర్ బడ్గే.

ఆ రోజు 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ డీ.డబ్ల్యూ. మెహ్రాకు సమాచారం అందింది. మదన్ లాల్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగానికి ఆయన ఆదేశించాడు. అంతలో, “ఈ కేసు దర్యాప్తు నేను స్వయంగా పర్యవేక్షిస్తాను, దాని గురించి పట్టించుకోకు” అని, ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ అధిపతిగా కూడా ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ చీఫ్ డీ.జే. సంజీవి ఆయనకు చెప్పాడు. ఏడు గంటలసేపు జరిగిన ఇంటరాగేషన్లో మదన్ లాల్ నుంచి మూడు ముఖ్యమైన క్లూలు దొరికాయి.  వాటి ప్రకారం, కుట్రదారులు ఏడుగురు. మదన్ లాల్ సహా ఏడుగురూ హత్యాయత్నానికి ముందు సావర్కర్ సదన్ కు వెళ్ళి ఆయనను దర్శించుకున్నారు. కుట్రదారులలో ఒకరి పేరు ‘కిర్క్రీ’( కర్కరే పేరు అలా చెప్పాడు). ఇంకొకరు(గాడ్సే) రాష్ట్రీయ లేదా అగ్రణి అనే మరాఠీ వార్తాపత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు(ఆ పత్రిక పేరు నిజానికి ‘హిందూ రాష్ట్ర’). ఇంటరాగేషన్ జరుగుతుండగానే కొంతమంది పోలీసులు హిందూ మహాసభ కార్యాలయానికీ, మెరీనా హోటల్ కూ పరుగుతీశారు. హోటల్ లో రూమ్ నెం.40లో వారికి నాలుగో క్లూ దొరికింది. అది హిందూ మహాసభ నాయకుడు అశుతోష్ లాహిరి సంతకంతో ఉన్న ఒక పత్రం.  గాడ్సే, నారాయణ్ ఆప్టేలు ఎనిమిదేళ్లుగా ఆయనకు తెలుసు. హిందూ రాష్ట్ర అనే పత్రికకు గాడ్సే ఎడిటర్ అని కూడా తెలుసు.

ఆ రోజు అర్థరాత్రికి మదన్ లాల్ ఇంటరాగేషన్ ముగించిన పోలీసులు, తొలి నాటి దర్యాప్తు వివరాలు నమోదుచేసి కేసు డైరీని మూసేశారు. ఆ ఏడుగంటల దర్యాప్తులో సేకరించిన వివరాలు పోలీసులకు ఎంతైనా సంతృప్తి కలిగించి ఉంటాయని Freedom at Midnight రచయితలు అంటారు. గాంధీ హత్యాయత్నం వెనుక ఒక పథకం ఉన్నట్టు పోలీసులకు అర్థమైంది. కుట్రదారుల సంఖ్య తెలిసింది. వారు, అప్పటికి కొన్ని మాసాలుగా పోలీసు నిఘాలో ఉన్న వీర సావర్కర్ అనుయాయులన్న సంగతి తెలిసింది. తమకు లభించిన సమాచారం ఆధారంగా కొద్దిపాటి ప్రయత్నం చేసి ఉంటే గాడ్సే, నారాయణ్ ఆప్టే లను వారు ఇట్టే గుర్తించి ఉండేవారు. వాళ్ళిద్దరూ ఢిల్లీ విడిచి పూణేకు బయలుదేరే లోపలే అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ అది జరగలేదు. కొన్ని గంటల వ్యవధిలో అంత విలువైన సమాచారం సేకరించిన ఆ దర్యాప్తు, ఆ తర్వాత ఆశ్చర్యం కలిగించేంత నత్త నడక నడిచింది. అది ముప్పై ఏళ్ల (1976 నాటికి ) తర్వాత కూడా వివాదం రేకెత్తిస్తూనే ఉందని పై రచయితలు అంటారు.

 

కుట్రదారులు బొంబాయి రాష్ట్రానికి చెందినవారని తెలిసింది కనుక, కేసు బాధ్యతను ఎవరైనా ఒకరికి  అప్పజెప్పవలసిందిగా బొంబాయి పోలీసులను సంజీవి కోరాడు. వారితో దర్యాప్తును సమన్వయం చేయడానికి ఢిల్లీ సీ.ఐ.డీ అధికారు లిద్దరిని బొంబాయి పంపించాడు. అయితే, ఆ ఇద్దరూ మదన్ లాల్ ఇచ్చిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కానీ, గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రికకు సంబంధించిన ఉజ్జాయింపు సమాచారాన్ని కానీ తీసుకెళ్లకుండా చేతులూపుకుంటూ బొంబాయి చేరారు. వాళ్ళ దగ్గర ఉన్నది ‘కిర్క్రీ’ అనే పేరు రాసుకున్న చిన్న కాగితం ముక్క మాత్రమే.

ఆ సమయంలో బొంబాయి రాష్ట్రంలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి హోం మంత్రిగా ఉన్నారు. అప్పటికి వారం రోజుల క్రితం, గాంధీని హత్య చేయబోతున్నామని ఒక వ్యక్తితో మదన్ లాల్ అన్నట్టు వేరే మార్గంలో ఆయనకు సమాచారం అందింది. బొంబాయి సీ.ఐ.డీ స్పెషల్ బ్రాంచ్ కి ఇన్ చార్జిగా ఉన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ నగర్వాలాకు దర్యాప్తు బాధ్యత అప్పగించిన హోం మంత్రి, ఈ సమాచారం కూడా ఇచ్చాడు. అహమ్మద్ నగర్ కు చెందిన విష్ణు కర్కరే పేరు ఆ సమాచారంలో ఉంది.  అంటే, ఢిల్లీ అధికారులు తనను కలసుకునే సమయానికే నగర్వాలా వద్ద వారి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ, మెరుగైన సమాచారం ఉందన్న మాట.

కర్కరేను గుర్తించడానికి నగర్వాలా వెంటనే సిబ్బందిని రంగంలోకి దించాడు. మదన్ లాల్ వారం క్రితం సావర్కర్ ను కలసిన భోగట్టా కూడా తన వద్ద ఉండడంతో సావర్కర్ ను అరెస్ట్ చేయడానికి అనుమతించమని మొరార్జీ దేశాయిని కోరాడు. దేశాయి కోపంతో మండిపడుతూ “నీకేమైనా పిచ్చా? ఈ రాష్ట్రం మొత్తం భగ్గున అంటుకు పోవాలని నీ ఉద్దేశమా?” అన్నాడు. నగర్వాలా దాంతో అరెస్ట్ ఆలోచన విరమించుకుని సావర్కర్ ఇంటి దగ్గర నిఘా పటిష్టం చేశాడు. కొన్నిగంటల్లోనే అతనికి విష్ణు కర్కరే గురించి సమాచారం అందింది. అంతలో పూణేకు చెందిన చిన్నపాటి ఆయుధ వ్యాపారి దిగంబర్ బడ్గే, కర్కరే సహచరుడన్న సంగతి ఒక పోలీస్ ఇన్ ఫార్మర్ ద్వారా తెలిసింది. ఆ భోగట్టాతో పూణే పోలీసులు బడ్గే దుకాణానికి వెళ్లారు. బడ్గే వారికి కనిపించలేదు. విచిత్రం ఏమిటంటే, ఆ తర్వాత పూణే పోలీసులు బడ్గే ఆచూకీ కోసం మళ్ళీ ప్రయత్నించలేదు. తనకోసం పోలీసులు వచ్చి వెళ్ళిన కొన్ని గంటలకే పూణే చేరుకున్న బడ్గే తర్వాత పది రోజులపాటు తన దుకాణంలో కూర్చుని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అల్లుకుంటూ తీరుబడిగా గడిపాడు.

ఢిల్లీ సీ.ఐ.డీ నుంచి వచ్చిన ఇద్దరు అధికారుల వద్దా పనికొచ్చే సమాచారం ఏమీ లేకపోవడంతో వాళ్ళ సాయం తనకు అక్కర్లేదనుకున్న నగర్వాలా తన వద్దనున్న సమాచారం వారికిచ్చి ఢిల్లీ పంపేశాడు.

జనవరి 24 కల్లా మదన్ లాల్ తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని కక్కేశాడు. ముఖ్యంగా గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రిక పేరును హిందూ రాష్ట్రీయ గా దాదాపు కరెక్టుగా చెప్పి, అది పూణే నుంచి వెలువడుతుందని కూడా చెప్పాడు. ఢిల్లీ లోని హోం శాఖకు గానీ, సమాచార-ప్రసార శాఖకు కానీ ఒక్క సబ్ ఇన్ స్పెక్టర్ ను పంపితే, ఆ పత్రిక వివరాలు అన్నీ క్షణాలలో తెలిసిపోయేవి. కానీ ఢిల్లీ పోలీస్ చీఫ్ సంజీవి ఆ పని చేయలేదు. గాడ్సే, ఆప్టే లను ఎనిమిదేళ్లుగా ఎరిగున్న అశుతోష్ లాహిరి అనే హిందూ మహాసభ నాయకుని సంతకం ఉన్న పత్రం మొదటి రోజే దొరికినా ఆయనను ప్రశ్నించలేదు. మదన్ లాల్ ఇచ్చిన తాజా సమాచారాన్ని బొంబాయిలోని నగర్వాలాకు అత్యవసరంగా పంపే ఏర్పాటు కూడా చేయలేదు. పూణే పోలీసులకు ఒక్క ఫోన్ కాల్ చేసి హిందూ రాష్ట్ర ఎడిటర్ గురించి అడిగినా చెప్పేవారు. అదీ చేయలేదు.

ఇప్పుడిక ఆయన కంటే ఘనుడైన పోలీస్ అధికారి గురించి చెప్పుకుందాం. ఆయనే నిజానికి మన కథానాయకుడు.  పేరు యూ.హెచ్. రాణా. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ హోదాలో ఆయన పూణేలో నేర దర్యాప్తు విభాగం ఇన్ చార్జిగా ఉన్నాడు. జనవరి 25వ తేదీన ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చాడు. పూణేలో ఆయన దగ్గర ఉన్న ఫైళ్లలో గాడ్సే, ఆప్టే, బడ్గే, కర్కరేల గురించిన మొత్తం సమాచారం ఉంది. కర్కరే, ఆప్టేల ఫోటోలు కూడా ఉన్నాయి.  వెంటనే చేయవలసింది, ఆ ఫోటోలను బిర్లా హౌస్ లో గాంధీకి కాపలాగా ఉన్న పోలీసులకు పంపడం. అది జరగలేదు.

రాణాను సంజీవి  తన కార్యాలయానికి పిలిపించాడు. 54 పేజీలు ఉన్న మదన్ లాల్ వాఙ్మూలంలో ఒక్కొక్క పేజీనే  రెండుగంటలపాటు ఇద్దరూ పరిశీలించారు. అందులోని ప్రతి వాక్యానికీ రాణా అప్రమత్తుడు కావలసిందే. ఎందుకంటే కుట్రదారులలో కనీసం ఇద్దరు ఆయన అధికార పరిధిలోకి వస్తారు. హిందూ రాష్ట్ర  అనే పత్రిక పేరు ఆయనకు తెలియక పోయే ప్రశ్నే లేదు. ముందు సంవత్సరం జూలై లోనే ఆ పత్రిక మూసివేతకు ఉత్తర్వులిచ్చారు. ఆ పత్రిక పై ఉంచిన పోలీస్ నిఘాను నవంబర్ లో రాణా స్వయంగా రద్దుచేశాడు. అంతకుముందు పూణేలో జరిగిన ఒక బాంబు పేలుడుకు ఆప్టే బాధ్యుడన్న సమాచారమూ ఆయన దగ్గర ఉంది.

తన అధికార పరిధిలోకి వచ్చే ఇన్ని కీలక వివరాలు దొరికినా, రాణా కనీసం తన కింది అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేదు. తక్షణమే దర్యాప్తు ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వలేదు. తనైనా హుటాహుటిన విమానంలో బయలుదేరి వెళ్లాలనుకోలేదు. విమాన ప్రయాణం ఆయన ఆరోగ్యానికి పడదట. రైలులో బొంబాయికి బయలు దేరాడు. అది కూడా చుట్టుదారిలో వెళ్ళే ఒక లంఖణాల బండిని ఎంచుకున్నాడు. దాంతో 36 గంటలు పట్టే ప్రయాణకాలానికి మరో 6 గంటలు జమయ్యాయి. అదలా ఉండగా, Freedom at Midnight ఇవ్వని ఒక అదనపు సమాచారాన్ని, నాకు గుర్తున్నంతవరకు, The men who killed Gandhi ఇచ్చింది.  అది బాధనూ, నవ్వునూ కూడా తెప్పించే సమాచారం. రాణా మార్గ మధ్యంలో (గయలో?) దిగి పితృదేవతలకు పిండప్రదానం చేశాడు!

జనవరి 20 న గాంధీ పై జరిగిన హత్యా ప్రయత్నం పై దర్యాప్తు ఇలా నత్త నడకన సాగుతుండగానే అక్కడ పూణేలో గాడ్సే బృందం మరో ప్రయత్నానికి శరవేగంతో సన్నాహాలు చేసుకుంటూ పోయింది. తన శ్రాద్ధ కర్మ ముగించుకుని రాణా మళ్ళీ లంఖణాల రైలెక్కి బొంబాయిలో దిగే లోపలే గాడ్సే, ఆప్టే లు ఢిల్లీ విమానం ఎక్కేశారు. జనవరి 30 న వారు తమ పథకాన్ని అమలు చేయడం… చరిత్ర.

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)—కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

మూడు అద్భుతాలు

kalluri-1 మహాభారతంలో అశ్వత్థామ చాలా విలక్షణ పాత్ర.  ద్రోణ, శల్య, సౌప్తికపర్వాలలో తిక్కన ఆ పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడు. నిజానికి శల్య, సౌప్తికపర్వాలు రెండింటిలో కథానాయకుడు(లేదా ప్రతినాయకుడు) అశ్వత్థామే. యుద్ధమనే ఒక మహోద్రిక్తఘట్టంలో, అందులోనూ పరాజిత పక్షానికి చెందిన ఒక వీరుడు ఎదుర్కొనే ఆత్మసంక్షోభాన్నీ, మనస్సంఘర్షణను, భావోద్వేగాలను అశ్వత్థామ ముఖంగా తిక్కన ఎంతో లోతుగా, గాఢంగా చిత్రిస్తాడు. ఆ లోతును, గాఢతను తడిమి చూసి ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు. చదువుతూ తిక్కన మహాకవికి మనసులో పాదాభివందనం చేసుకొన్న ఘట్టాలలో ఇది ఒకటి. అశ్వత్థామ చిత్రణపై నా హృదయస్పందనను పూర్తిగా వెల్లడించాలని మనసు ఉత్సాహపడుతున్నా, బలవంతం మీద ఆపుకుని విషయానికి వస్తాను.

అశ్వత్థామను కళ్ళారా చూసిన ఒక వ్యక్తి ఉన్నారనీ, ఆయన ఆ విషయం చెప్పగా విన్న వ్యక్తిని నేను ఎరుగుదుననీ మా నాన్నగారు అంటుండేవారు. అశ్వత్థామనేమిటి, చూడడమేమిటనుకుని మీరు విస్తుపోతూ ఉండచ్చు. చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడని ఒక విశ్వాసం. ఇంతకీ విషయమేమిటంటే, హిమాలయ ప్రాంతంలో కొంతకాలం ఉన్న ఆ వ్యక్తి ఓ ఉషఃకాలాన నదికి స్నానానికి వెళ్లారు. అంతలో ఓ భారీకాయుడు నదిలోకి దిగబోతూ కనిపించాడు. ఆయన శరీరమంతా తూట్లు పడి చర్మం వేలాడుతోంది. జడలు కట్టి ఉన్నాయి. నదిలోకి దిగబోతున్న ఆ వ్యక్తిని చేతితో వారించాడు. దిగ్భ్రమతో గట్టుమీద నిలబడి పోయిన ఆ వ్యక్తి ఆయన స్నానం ముగించుకుని వెడుతుంటే, “తమరెవరు స్వామీ?” అని సంస్కృతంలో ప్రశ్నించారు. “ నేను ద్రోణపుత్రుడను, అశ్వత్థామను” అని ఆయన సంస్కృతంలోనే సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

ఈ ముచ్చట గుర్తొచ్చినప్పుడల్లా ఇందులోని అద్భుతత్వాన్ని ఇప్పటికీ  నేను ఆస్వాదిస్తూ ఉంటాను. ఇది సాధ్యమా అన్న హేతువాదంతో ఆ అద్భుతత్వాన్ని చిత్రవధ చేయడానికి నాకు మనసు రాదు. సంప్రదాయం ఏమిటంటే, వీరులు, లేదా ఇతర కారణాలతో జనహృదయాలకు దగ్గరైనవారు ఎప్పటికీ మరణించరు. జనం జ్ఞాపకాలలో చిరంజీవులుగానే  ఉండిపోతారు.  అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు మనకు బాగా తెలిసిన ఇటీవలి ఉదాహరణలు. నిజానికి ఈ సంప్రదాయం మనలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ఆ వివరాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి అశ్వత్థామ విషయానికి వస్తే, ఆయన చిరంజీవిత్వానికి వివిధ కారణాలను ఊహించవచ్చు. ఒకటి, రెండు చెప్పుకోవాలంటే, యుద్ధం ముగిసిన తర్వాత కౌరవపక్షంలో మిగిలిన ముగ్గురు వీరులలో(మిగతా ఇద్దరూ కృపుడు, కృతవర్మ) ప్రముఖుడు అశ్వత్థామే. అంతేకాదు, ఒకవిధంగా ఆయన కురు, పాంచాల జనపదాలు రెండింటికీ ఉత్తరాధికారి. కనుక ఆ రెండు జనపదాల ప్రజలూ ఆయనను సజీవస్మృతిగా నిలుపుకోడానికి కారణం ఉంది. అలాగే. అంతటి మహాయుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడడం కూడా అతనిని ‘చిరంజీవి’ని చేసి ఉండచ్చు.Mahabharata04ramauoft_1395

 

అశ్వత్థామ ఉదంతం నమ్మలేని అద్భుతం అయితే, నమ్మదగిన అద్భుతం ఒకటి చెబుతాను.  అది: అలెగ్జాండర్-పురుషోత్తముల యుద్ధసమాచారం. ఆ యుద్ధం గురించి చరిత్రపాఠాలలో చదువుకున్నాం కానీ, ప్రత్యక్షకథనాన్ని తోపించే అదనపు సమాచారం మనకు తెలియదు. పురుషోత్తముని గ్రీకులు ‘పోరస్’ అన్నారు. అతని అసలు పేరు పురుషోత్తముడేనా అని నా సందేహం. అతను పురాణ ప్రసిద్ధమైన పురు వంశీకుడు. ఆ వంశంలో చివరి రాజు అని కోశాంబి అంటాడు.  ప్లూటార్క్ అనే చరిత్రకారుడు అలెగ్జాండర్ స్వయంగా రాసిన లేఖలనుంచి సంగ్రహించినదిగా చెబుతూ, ఆ యుద్ధం గురించి కొంత ఆసక్తికర సమాచారం అందించాడు:

(పురు రాజు ఓడిపోయినా) ఆ యుద్ధం అలెగ్జాండర్ సైన్యంలో ధైర్యాన్ని హరించేసింది. వెనకడుగు వేయించింది. కేవలం ఇరవై వేల పదాతిదళంతో, రెండువేల ఆశ్వికదళంతో వచ్చిన పురురాజును ఓడించడానికే వారికి తల ప్రాణం తోకకొచ్చింది. తూర్పు దిశగా ఇంకా ముందుకు వెడితే ముప్పై రెండు ఫర్లాంగుల వెడల్పు, వంద నిలువుల లోతు ఉన్న గంగానదిని దాటవలసివస్తుంది. నదికి అవతల భారీ సంఖ్యలో శత్రుసేనల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. గంగానదీ ప్రాంతరాజులూ(Gangaridans), ఇంకా తూర్పున ఉన్న రాజులూ(Praesians-ప్రాచ్యులు) ఎనభైవేల ఆశ్వికదళంతో, రెండులక్షల పదాతిదళంతో, ఎనిమిదివేల రథికబలంతో, ఆరువేల గజబలంతో తమను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారని అలెగ్జాండర్ సేనకు తెలిసింది. కనుక వాళ్ళు అలెగ్జాండర్ ప్రణాళికను వ్యతిరేకించడం సహేతుకమే.

ఇది అలెగ్జాండర్ సైన్యాన్ని భయపెట్టడానికి చేసిన ప్రచారం కాదని ప్లూటార్క్ అంటాడు. ఆ సమీపకాలానికే చెందిన చంద్రగుప్తుడు ఆరులక్షల పదాతిదళంతో భారతదేశాన్ని లొంగదీసుకోవడమే కాక, సెల్యూకస్ కు ఒక్కసారిగా అయిదువందల ఏనుగులను బహూకరించిన సంగతిని ఉదహరిస్తాడు.  అలాగే, గంగానది గురించి చెప్పినదీ అతిశయోక్తి కాదని కోశాంబి అంటూ;  అలెగ్జాండర్ వచ్చే సమయానికి వర్షాకాలం మొదలైంది కనుక గంగ అంత వెడల్పూ, లోతూ ఉండడంలో ఆశ్చర్యం లేదంటాడు. రెండువేల సంవత్సరాల తర్వాత అహ్మద్ షా దురానీ వర్షాకాలంలోనే దండయాత్రకు దుస్సాహసం చేసి సగం సైన్యాన్ని యమునకు అర్పించుకున్నాడు. ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, పురురాజు ఓటమికి ఒక మతవిశ్వాసం కూడా కారణం. వర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను అది నిషేధిస్తోంది. దాంతో పురురాజు తగినన్ని బలగాలను సమీకరించుకోలేకపోయి ఉండచ్చు.

ఇంకొకటి ఏమిటంటే, భారతీయ ఆశ్విక సేనకన్నా ఉత్తమశ్రేణికి చెందిన గ్రీకు ఆశ్వికసేన ముందు పురురాజు రథికసైన్యం తేలిపోయింది. అయితే, పురురాజు తన గజబలాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే యుద్ధం గెలవడానికి అవకాశం ఉండేదనీ, కానీ యుద్ధంలో ఆరితేరి శరవేగంతో కదిలే శత్రుసేనను ఎదుర్కోడానికి మరింత లోతైన వ్యూహనైపుణ్యం ఉండాలనీ, అప్పటి పంజాబ్ గణ వ్యవస్థలో అది అభివృద్ధి కాలేదనీ కోశాంబి అంటాడు.

alexander

గజసైన్యంతో ఒక ఇబ్బంది ఏమిటంటే, సక్రమంగా వాడుకోకపోతే అది శత్రుసైన్యాన్ని చంపేబదులు, సొంత సైన్యాన్నే చంపుతుంది. పురుసేనలో గ్రీకు దాడిని సమర్థంగా తిప్పికొట్టగల సత్తా ఉన్నవారు విలుకాండ్లు. అయితే వారినీ సక్రమంగా వాడుకోలేకపోగా, వర్షాలు పడుతున్నప్పుడు శరయుద్ధం ప్రభావం తగ్గుతుంది. భారతీయ విలుకాని దెబ్బను ఏదీ అడ్డుకోలేదనీ, పొడవైన ఆ బాణం డాలునూ, కవచాన్నీ కూడా చీల్చి వేస్తుందనీ, భారతీయ ధనువు ఆరడుగుల పొడవు ఉంటుందనీ ఆరియన్ అనే చరిత్రకారుడు రాస్తాడు. ఇది స్వయంగా అలెగ్జాండర్ అనుభవం కూడా. మూడు వేళ్ళ వెడల్పు ఉన్న సూచితో ఒక మల్ల విలుకాడు ప్రయోగించిన బాణం అలెగ్జాండర్ కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళి, పక్కటెముకకు గుచ్చుకుపోయింది. అతి కష్టం మీద దానిని తీయగలిగారు. అతను ఎదుర్కొన్న అతి తీవ్ర గాయం ఇదే.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశచరిత్రను మలుపు తిప్పిన ఒక యుద్ధం గురించిన ఈ మాత్రం సమాచారాన్ని కూడా మనవాళ్ళు ఎక్కడా నమోదు చేయలేదు. గ్రీకు రాతలే ఆధారం. గ్రీకులే కాదు, పశ్చిమాసియా దేశాలు కూడా వేల సంవత్సరాలనాటి చారిత్రక ఘటనలను వివిధ రూపాలలో భద్రపరిచాయి. పురాతనఅస్తిత్వం ఎంతో ఉన్న మనదేశంలోనే ఈ జాగ్రత్త లోపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  దానికితోడు, ఉన్న చారిత్రక సమాచారంపై కూడా ఇతరేతర అన్వయాల ముసుగులు కప్పి మాయం చేయడానికి ప్రయత్నించడం మరింత ఆశ్చర్యకరం. ఎంతో ఆసక్తిని కలిగించే ఈ విషయాలను ముందు ముందు చెప్పుకుందాం. చెప్పొచ్చేదేమిటంటే, మన చరిత్రాదారిద్ర్యం నుంచి చూస్తే పురు-అలెగ్జాండర్ యుద్ధవివరాలు అపురూపంగానే కాక అద్భుతంగా అనిపిస్తాయి.  పురాణానికి, చరిత్రకు మధ్యనున్న హద్దులను చెరిపేసి అవి మనల్ని మహాభారత సమాజానికి దగ్గరగా తీసుకువెడతాయి.

హేలీ రెండువందల ఏళ్లనాటి సమాచారాన్ని సేకరించగలగడం కూడా ఒక అద్భుతమే. చరిత్రను భద్రపరిచడంపై పాశ్చాత్యులలో ముందునుంచీ ఉన్న ఆసక్తికీ, జాగ్రత్తకూ అది నిదర్శనం.

***

మేరీ ల్యాండ్ గెజిట్, అక్టోబర్ 1 సంచికలోని ఆ ప్రకటన పురాతన అచ్చు అక్షరాలలో ఉంది.  JUST IMPORTED  అనే శీర్షికతో అందులో ఉన్న సమాచారం, కెప్టన్ డేవిస్ సారథ్యంలో గాంబియానుంచి వచ్చిన లార్డ్ లిగొనీర్ లోని సరకును అక్టోబర్ 7న విక్రయించబోతున్నట్టు చెబుతోంది. ఆ సరకులో CHOICE HEALTHY SLAVES కూడా ఉన్నారు. విచిత్రంగా ఆ ప్రకటన హేలీ కంటపడిన తేదీ సెప్టెంబర్ 29, 1967. లార్డ్ లిగొనీర్ అన్నాపొలిస్ రేవుకు చేరి అప్పటికి సరిగ్గా రెండువందల సంవత్సరాలు అయింది. ఆ రోజున అన్నాపొలిస్ రేవులో సముద్రజలాలలోకి నిర్మించిన నడవ మీద తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండాలని తనకు అనిపించలేదనీ, అలాగే ఉన్నాననీ హేలీ అంటాడు. ఆ నడవ మీద నిలబడి, తన పూర్వీకుడు కుంటా కింటేను తీసుకొచ్చిన సముద్రజలాలవైపు చూస్తూ మరోసారి దుఃఖం ఆపుకోలేకపోయానని అతను అంటాడు.

1766-67 నాటి ఆ పత్రం గాంబియాలోని జేమ్స్ దుర్గంలో తయారైంది. దాని ప్రకారం లార్డ్ లిగొనీర్ 140 మంది బానిసలతో బయలుదేరింది. వాళ్ళలో ఎంతమంది బతికి బయటపడ్డారు? హేలీ రెండోసారి మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు వెళ్ళాడు. అక్కడ ఆ ఓడలో రవాణా అయిన సరకుల జాబితా దొరికింది: 3,264 ఏనుగు దంతాలు, 3,700 పౌండ్ల తేనెటీగల జిగురు, 800 పౌండ్ల ముడి నూలు, 32 ఔన్సుల గాంబియా బంగారంతోపాటు 98 మంది “నీగ్రో’’లు ఆ జాబితాలో ఉన్నారు. అంటే మార్గమధ్యంలో 42 మంది చనిపోయారు.

అమ్మమ్మ, కజిన్ జార్జియా తదితరులు కూడా తమదైన పద్ధతిలో గాథికులే నన్న సంగతి అప్పటికి హేలీకి అర్థమైంది. అంతలో, అన్న జాన్ వేలర్ నుంచి తమ్ముడు డా. విలియం వేలర్ కుంటాను కొన్నాడు కనుక అందుకు సంబంధించిన రాతకోతలేవైనా జరిగి ఉండచ్చని అతనికి స్ఫురించింది. వెంటనే వర్జీనియాలోని రిచ్ మండ్ కు వెళ్ళాడు. స్పాట్ సిల్వేనియా కౌంటీలో  1767 సెప్టెంబర్ తర్వాత రాసుకున్న దస్తావేజుల మైక్రోఫిల్మ్ ను గాలించాడు. సెప్టెంబర్ 5 తేదీతో పాతకాలపు రాతలో ఉన్న ఒక పొడవైన దస్తావేజు కనిపించింది. అందులో, జాన్ వేలర్, అతని భార్య ఆన్ 240 ఎకరాల వ్యవసాయభూమిని, కొంత సామగ్రిని విలియం వేలర్ కు బదిలీ చేసినట్టు మొదటి పేజీలో ఉంది. రెండో పేజీలో-“and also one Negro man slave named Toby” అని ఉంది!  అతనే కుంటా కింటే!

హేలీ అన్వేషణ ముగిసింది. ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, రొసెట్టా శిల నుంచి పొందిన ప్రేరణతో అతను అన్వేషణ ప్రారంభించి అప్పటికి పన్నెండేళ్ళు గడిచాయి! హేలీ లానే మూలాలనుంచి నిర్దాక్షిణ్యంగా నరికివేయబడి బానిసలుగా అమ్ముడుపోయిన నల్లజాతి పూర్వీకుల వారసులు బహుశా ఇప్పుడు కోట్లలో ఉంటారు. శూన్యంలో ఈదుతున్న వారి  మూలాల అన్వేషణ  ఎప్పటికీ ముగిసే అవకాశం లేదు. అసలా అన్వేషణ ప్రారంభం కాకపోయినా ఆశ్చర్యం లేదు.

కాలానికి బానిసలైన మనదేశంలోని సామాన్యుల జీవితాలూ ఇందుకు భిన్నం కావు.

                                                                                                             -భాస్కరం కల్లూరి

 

 

 

 

ఆఫ్రికన్ వ్యాసవాల్మీకులు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)శిశువు చిత్రనిద్రలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు

అన్న శ్రీశ్రీ కవితా వాక్యం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది.  పురాచరిత్రలో, పురావస్తువులలో ‘ప్రాచీనస్మృతులూచే చప్పుడు’ వినగలిగే చెవి ఉన్నవారందరికీ ఎలెక్స్ హేలీతో చుట్టరికం కలుస్తుంది.  అతని కథ సొంత కథలానే అనిపిస్తుంది. రోసెట్టా శిలను చూసినప్పుడు అతని కళ్ళలో తళుక్కుమన్న మెరుపునూ, అతని హృదయస్పందననూ వారు పోల్చుకోగలరు. న్యూయార్క్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి వెళ్ళినప్పుడు, వేల సంవత్సరాల క్రితం శిలగా ఘనీభవించిపోయిన ఒక వృక్షఖండాన్ని చూసి నేను అటువంటి సంచలనానికే లోనయ్యాను. అక్కడే బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి శిక్షాస్మృతిని చెక్కిన శిలను చూశాను. ఆధునిక చరిత్రకారులను ప్రామాణికంగా తీసుకుంటే హమ్మురాబి(క్రీ.పూ. 1750) మన మహాభారత కాలానికి కూడా వెనకటి వాడన్న సంగతి గుర్తొచ్చి కన్నార్పకుండా దానినే చూస్తూ ఉండిపోయాను.

ఇప్పటికీ ఎలెక్స్ హేలీ మన బంధువే నన్న విశ్వాసం మీకు కలగకపోతే ఇంకో విషయం చెబుతాను.  అతను తన పూర్వీకుడైన కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎక్కడికో కాదు; మనమూ, మనతోపాటు ప్రపంచమంతా ఒకనాడు జీవించిన గతంలోకి! గణసంస్కృతిలోకి!  గణదశలో ప్రపంచ మానవాళి ఒకే అనుభవాలను, ఒకే విధమైన సెంటిమెంట్లను, చివరికి ఒకే విధమైన పురాణగాథలను పరస్పరం పంచుకున్నారు.

ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యపోకండి… ఎలెక్స్ హేలీ  తన పూర్వీకుని జన్మస్థలానికి వెళ్ళి అక్కడ దర్శించినది మరెవరినో కాదు;  మన వాల్మీకినీ, వ్యాసునీ, వైశంపాయనునీ; గ్రీకుల హోమర్ ను, హెసియాడ్ నే! పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో 1966లో అతను దర్శించిన ఆ వ్యాస/వాల్మీకి/ హోమర్ పేరు:  కెబ్బా కంజీ పొఫానా!

విషయంలోకి వద్దాం.

కుంటా కింటే నుంచి ఏడు తరాలుగా అందుతున్న ఆఫ్రికన్ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవో కనిపెట్టగలమా అన్న ప్రశ్న తన ముందు వేళ్లాడుతున్న దశలో, కన్సాస్ నగరంలో ఉంటున్న కజిన్ జార్జియా ఏండర్సన్ ను హేలీ కలుసుకున్నాడు. తన చిన్నప్పుడు హెమ్మింగ్ ఇంటి వసారాలో అమ్మమ్మ ముచ్చట్లలో పాల్గొన్నవారందరిలో ఆమె చిన్నది. ఎనభై ఏళ్ల వయసులో అనారోగ్యంతో మంచం పట్టింది. హేలీ తన ఆలోచన చెప్పగానే సంభ్రమాశ్చర్యాలతో  ఒక్కసారి లేచి కూర్చుంది. “మంచి పని చేస్తున్నావు బిడ్డా,  పైనుంచి మీ అమ్మమ్మ, మిగితా పెద్దలూ నిన్ను చల్లగా చూస్తారు” అంటూ దీవించింది.

ఆ తర్వాత హేలీ వాషింగ్టన్ డీ,సీ. లో ఉన్న జాతీయ పురాపత్ర ప్రదర్శనశాలకు వెళ్ళి,  అమెరికా అంతర్యుద్ధం(1881-1885) తర్వాత నార్త్ కరోలినాలో సేకరించిన జనాభా వివరాలు కావాలని అడిగాడు. క్షణాలలో అతనిముందు మైక్రోఫిల్మ్ చుట్టలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని మిషన్ లో ఉంచి తిప్పడం ప్రారంభించాడు. 1800 ల నాటి పాతకాలపు రాత పద్ధతిలో రాసిన పత్రాలవి. ఒక చోట అతని కళ్ళు మంత్రించినట్టు ఆగిపోయాయి. ‘టామ్ ముర్రే, బ్లాక్, బ్లాక్ స్మిత్- ఇరేన్ ముర్రే, బ్లాక్, హౌస్ వైఫ్-…’ అనే పేర్లు కనిపించాయి. వాటి కిందే అమ్మమ్మ అక్కల పేర్లు ఉన్నాయి. హెన్నింగ్ ఇంటి వసారాలో చిన్నప్పుడు విన్న పేర్లే అవి! అప్పటికి అమ్మమ్మ పుట్టనే లేదు.

న్యూయార్క్ లో ఉంటున్న హేలీ వాషింగ్టన్  పురాపత్ర ప్రదర్శనశాలకు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు, డాటర్స్ ఆఫ్ అమెరికన్ రివల్యూషన్ లైబ్రరీకి తరచు వెళ్ళడం ప్రారంభించాడు. ఇంతకీ ఆ ఆఫ్రికన్ పదాలు ఏ భాషకు చెందినవన్న ప్రశ్న మాత్రం చిక్కుముడిగానే ఉంది. ఆఫ్రికాలో అనేక తెగలు మాట్లాడే భాషలున్నాయి. తమ పూర్వీకులది ఏ భాషో తెలుసుకోవడం ఎలా? న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో అనేక భాషలవారు ఉంటారు. సాయంత్రం అంతా ఇళ్లకు వెళ్లిపోయే సమయంలో సమితి కార్యాలయానికి వెళ్ళి కనిపించిన ప్రతి ఆఫ్రికన్ కూ ఆ మాటలు వినిపించి అవి ఏ భాషవో చెప్పమని అడుగుతూ వచ్చాడు. అలా వారం రోజుల్లో పాతికమందిని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఒక మిత్రుడి సాయంతో డా. జాన్ వాన్సినా అనే పేరు సంపాదించాడు. బెల్జియంకు చెందిన వాన్సినా కొంతకాలం ఆఫ్రికన్ గ్రామాలలో తిరిగి మౌఖిక సంప్రదాయం గురించి పుస్తకం రాశాడు. విస్కాన్సిన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. హేలీ ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని మ్యాడిసన్ వెళ్ళాడు. హేలీ నోట విన్న ఆ ఆఫ్రికన్ మాటలూ, అమ్మమ్మ ద్వారా అవి తనకు అందాయని అతను చెప్పడం మౌఖిక చరిత్రకారుడైన వాన్సినాను ఆకర్షించాయి. మరో ఆఫ్రికన్ నిపుణుడితో మాట్లాడి, అవి మాండింకా భాషాపదాలని తేల్చాడు. మాండింగో జనం ఆ భాష మాట్లాడతారు. ‘కాంబీ బోలోంగో’ అనే మాటలోని ‘కాంబీ’ గాంబియా నదిని సూచిస్తుందన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా హెలీకి ఎబౌ మాంగా అనే ఆఫ్రికన్ విద్యార్థి గురించి తెలిసింది. అతను న్యూయార్క్ కు అరగంట దూరంలో ఉన్న హామిల్టన్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అవి మాండింకా పదాలేనని అతను కూడా ధ్రువీకరించాడు.

హమ్మయ్య, తమ పూర్వీకులు ఎక్కడివారో తెలిసింది! వారు గాంబియా నది ప్రవహించే గాంబియా అనే దేశానికి చెందినవారు. ఇక నిర్దిష్టంగా ఏ గ్రామానికి చెందినవారో తెలియాలి. ఎబౌ మాంగాతో కలసి హేలీ సెనెగల్ రాజధాని డాకర్ కు, అక్కడినుంచి గాంబియాకు వెళ్ళాడు. అదో చిన్న దేశం. రాజధాని బంజూల్. ఆ దేశచరిత్ర తెలిసినవారిని కొందరిని కలుసుకున్నాడు. మా దేశంలో పాత ఊళ్ళ పేర్లు, శతాబ్దాల క్రితం ఆ ఊళ్ళలో మొదట స్థిరపడిన కుటుంబాల పేర్లతోనే ఉంటాయని వారు చెప్పారు. ఒక మ్యాప్ తెప్పించారు. అందులో ‘కింటే కుండా’ అనే ఊరు పేరు, దానికి దగ్గరలోనే ‘కింటా కుండా జానేయా’ అనే ఊరు పేరు కనిపించాయి.

ఆ తర్వాత, తను కలలో కూడా ఊహించని ఒక విషయం వారు చెప్పారని హేలీ అంటాడు. వందల ఏళ్ళకు విస్తరించిన వంశచరిత్రలను చెప్పే గాథికులు ఇప్పటికీ మారుమూల గ్రామాలలో ఉన్నారనీ, వారు మౌఖిక చరిత్రను వల్లించే సజీవ పురావస్తు పత్రాలని వాళ్ళు చెప్పారు. అదో వ్యవస్థ. గాథికులలో పెద్ద, చిన్న తేడాలు ఉంటాయి. పెద్ద గాథికునికి సాధారణంగా అరవై, డెబ్భై ఏళ్ళు ఉంటాయి. అతని కింద శిష్య గాథికులు ఉంటారు. నలభై, యాభై ఏళ్ల తర్వాత వాళ్ళు పెద్ద గాథికుని హోదాను అందుకుంటారు. వీరు కొన్ని ప్రత్యేక సందర్భాలలో గ్రామ-తెగ-కుటుంబ-వీర గాథలను గానం చేస్తారు.  నల్లజాతీయులు నివసించే ఆఫ్రికా అంతటా ఈ మౌఖిక గాథికులు ఉన్నారనీ, పునరుక్తి లేకుండా మూడు రోజులపాటు ఆఫ్రికా చరిత్రను చెప్పగలిగినవారు కూడా వీరిలో ఉంటారనీ వారు హెలీకి చెప్పారు. చివరగా, కింటే తెగ గాంబియాలో ప్రసిద్ధమే కనుక ఒక గాథికుని గుర్తించి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. న్యూయార్క్ కు తిరిగొచ్చిన హేలీ ఆఫ్రికా చరిత్రను నమిలి తినడం ప్రారంభించాడు.

DeniseArt

గాథికుల దగ్గర కాసేపు ఆగుదాం. హేలీ వారిని griot  అనే మాటతో సూచించాడు. ఆ మాటకు, ‘A storyteller in Western Africa who perpetuates the oral tradition and history of a village or family’ అని ఒక నిఘంటువు అర్థం చెప్పింది. ఫ్రెంచ్ guiriot, బహుశా పోర్చుగీస్ criado, లాటిన్ creatus లకు ఆ మాటతో సంబంధం ఉన్నట్టు చెప్పింది. criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థమూ, creatus అనే మాటకు పెంచబడినవాడు లేదా శిక్షణ పొందినవాడు అనే అర్థాలు ఇచ్చింది. అలాగే, సృష్టించడం అనే అర్థం ఉన్న create అనే మాటకు, creatus కు సంబంధం ఉంది. అదే నిఘంటువు griot అనే మాటకు, ‘(In Western Africa) a member of a caste responsible for maintaining an oral record of tribal history in the form of music, poetry and storytelling’ అని మరికొంత వివరణ ఇచ్చింది.  జార్జి థాంప్సన్ తన ‘Studies In Ancient Greek Society’ అనే రచనలో ‘Ritual origins of Greek Epic’ గురించి రాస్తూ ministrel అనే మాట ఉపయోగించాడు.

మన విషయానికి వస్తే, పురాణ ఇతిహాసాలలో ‘సూతుడు’ అనే మాట ఉంది. రెండు భిన్న కులాలవారికి పుట్టిన సంకీర్ణవర్ణంగా సూతులను పేర్కొంటారు. వాల్మీకిని బోయగా, వ్యాసుని బెస్తకన్యకు పుట్టినవాడుగా చెప్పడం వారి సంకీర్ణవర్ణానికి సూచన. పోర్చుగీస్ criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థం కూడా ఇవ్వడం ఇక్కడ ఆసక్తికరం. కులవ్యవస్థలో పనివాళ్లు కింది కులానికే చెందుతారు. గ్రీకు పురాణ కథకులు హోమర్, హెసియాడ్ లను జార్జి థాంప్సన్ ministrels అన్నాడు. griot అనే మాటతో సహా ఈ మాటలన్నీ స్థూలంగా ఒకే అర్థం చెబుతున్నాయి. స్వల్ప భేదాలు ఉండచ్చు కానీ వీరంతా గణసమాజం సృష్టించిన ఒకే వ్యవస్థకు చెందినవారు. గణపురుషులు, గణ వీరుల గాథలను; వంశచరిత్రలను సంగీత, కవిత్వయుక్తంగా గానం చేయడం వీరి వృత్తి. మళ్ళీ మనదేశంలో ప్రతి కులానికీ ఆశ్రిత కులాలు అనే వ్యవస్థ ఉంది. ఆశ్రిత కులాలవారు తమను పోషించే కులస్థుల చరిత్రను, కుల పురాణాలను గానం చేస్తారు. వీరందరినీ ఏ పేర్లతో పిలిచినా,  ప్రస్తుతానికి ‘గాథికులు’ అనే ఒకే మాటతో పిలుచుకుందాం. ఆఫ్రికన్ గాథికులకు ఉన్నట్టే మన గాథికులకూ శిష్యపరంపర ఉంది. వ్యాసుని శిష్యులు:  సుమంతుడు, జైమిని, పైలుడు, శుకుడు, వైశంపాయనుడు. వ్యాసుడు ఈ అయిదుగురికీ భారత కథనంలో శిక్షణ ఇచ్చాడు. అయితే వైశంపాయనుని కథనమే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక వాల్మీకి కుశలవులకు రామాయణ కథనంలో శిక్షణ ఇచ్చాడు.

అంతలో, కింటా కుంటే వంశచరిత్ర చెప్పే గాథికుని గుర్తించామనీ, గాంబియా కు రావలసిందనీ హేలీకి కబురు వచ్చింది.   అనంతర కథ తర్వాత.

-కల్లూరి భాస్కరం

చరిత్రే అన్నిటినీ మించిన ఉత్కంఠభరితమైన కథ!

“నాకు కథ అంటే చాలా ఇష్ట”మని అన్నాననుకోండి, “కథ అంటే ఎవరికి ఇష్టం కా”దని మీరు వెంటనే అనచ్చు. నిజమే, కథ అంటే ఇష్టపడని వారు ఉండరు. కనుక, చిన్నపాటి ఆత్మకథకు ఉపక్రమణికగానే ఈ వాక్యాన్ని తీసుకోవాలి. అలాగని దీనిని ఆత్మకథగానూ  తీసుకోవద్దని మనవి.

కథ అంటే నాకు ఎంత ఇష్టమంటే, నన్నయభట్టు తనతో రాజరాజనరేంద్రుడు అన్నట్టుగా చెప్పిన ఈ పద్యం నాకు తరచు గుర్తొస్తుంటుంది.:
ఇవి యేనున్ సతతంబు కరం బిష్టంబులై యుండు బా
యవు భూదేవుకులాభితర్పణ మహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజామహో
త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్

అయిదు విషయాలు నాకు చాలా ఇష్టమైనవంటూ, రాజరాజనరేంద్రుడు అవేమిటో చెప్పాడు. వివాదాస్పదమైన మొదటి దానినీ, మరో మూడింటినీ అలా ఉంచితే ఆయన తనకు ఇష్టమైన వాటిలో భారతశ్రవణాసక్తి ఒకటన్నాడు. నాకెందుకో ఆ మాటను నన్నయ యథాలాపంగా ఉపయోగించి ఉండడనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ లో infatuation, passion, obsession;  తెలుగులో తమకం , మోహం(నిజానికి తెలుగు మాటలేవీ నాకు సంతృప్తి కలిగించలేదు)వగైరా మాటలతో  చెప్పుకునే వల్లమాలిన ఆసక్తి భారతకథపై రాజరాజనరేంద్రుడికి నిజంగానే ఉండేదేమో ననిపిస్తుంది. కథ అనగానే మనిషిలో సహజంగా ఉండే చెవికోసుకునే గుణాన్నే ఆ మాట సూచిస్తోందేమో.

కథ నాకు ఇష్టమన్నానా… అందులోనూ అపరాధపరిశోధక కథలన్నా, కొసమెరుపు కథలన్నా, మానవస్వభావంలోని వైచిత్రిని ఆశ్చర్యస్ఫోరకంగా చిత్రించే కథలన్నా మరీ ఇష్టం. కథ అంటే అంత ఇష్టపడే నేను ఎన్ని కథలు రాశానని మీకు  సందేహం కలగచ్చు. పట్టుమని పది కూడా ఉన్నట్టు లేవు. నేను లెక్క పెట్టలేదు. అసందర్భం అనుకోకపోతే చిన్న ముచ్చట. గోదావరిగట్టునే ఉన్న మా ఊళ్ళో ఓ రోజున, రోజంతా నాకు ఎంతో ఇష్టమైన మపాసా కథలు చదువుతూ క్రమంగా ఒకవిధమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఒక ఆహ్లాదకరమైన అస్థిమితం నన్ను ఆవరించింది. సాయంత్రమయ్యేసరికి అది తార స్థాయికి వెళ్లింది. క్షణం కూడా ఇంట్లో ఉండలేననిపించింది. పుస్తకం పక్కన పెట్టి సైకిలు మీద గోదావరి గట్టు మీదికి బయలుదేరాను. ఒక గమ్యం అంటూ లేకుండా యాంత్రికంగా సైకిలు తొక్కుతూ కొంత దూరం వెళ్లిపోయాను. అప్పుడు నాకో కథ స్ఫురించింది. కొన్ని రోజులు మనసులో నానిన తర్వాత దానిని కాగితం మీద పెట్టాను. అప్పుడే ఆంధ్ర సచిత్రవార పత్రిక దీపావళి కథల పోటీ ప్రకటించింది. నా కథను పోస్ట్ చేయడానికి వెడుతుంటే ఒక మిత్రుడు నాతో వచ్చాడు. కవరు మీద స్టాంపులు అంటిస్తూ, “ఈ కథకు బహుమతి వస్తుంది” అన్నాను. వచ్చింది. ఆ కథ పేరు ‘దూరం’. ఇది జరిగింది ఎనభైదశకం ప్రారంభంలో.  చిన్న వివరణ: ఆ కథ మపాసా కథలు వేటికీ కాపీ కాదు.
ఆ తర్వాత మరో అనుభవం ఎదురై ఉండకపోతే బహుశా నేను కథారచనకు ‘దూరం’ అయేవాణ్ణి కాదేమో ననిపించినా, ఆ మాట కచ్చితంగా చెప్పలేను. ఇప్పుడాలోచిస్తే అందువల్ల నాలో ఎలాంటి విచారమూ లేదు. ఎందుకంటే, కల్పన కన్నా అద్భుతమైన కథాప్రపంచంలోకి ఆ అనుభవం నన్ను తీసుకెళ్లింది. ఓరోజు హైదరాబాద్, చిక్కడపల్లి కేంద్రగ్రంథాలయంలో పుస్తకాలు గాలిస్తుంటే డీ.డీ. కోశాంబి రాసిన Myth and Reality కనిపించింది. అందులో కొన్ని పురాణాసంబంధమైన రేఖాచిత్రాలు, చరిత్ర సంబంధమైన ఫోటోలు ఉన్నాయి. చదువుతూ ఉండిపోయాను. ‘చకచ్చకిత’ స్థితి అంటారే, అలాంటి స్థితిలోకి జారిపోయాను. ఆశ్చర్యం, ఉద్విగ్నత లాంటి అనేకానేక అనుభూతులు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. పురాణకథకూ, వాస్తవికతకూ; మరీ ముఖ్యంగా పురాణకథకూ, చరిత్రకూ మధ్య అడ్డుగీతలు చెరిగిపోతూ కళ్ళముందు ఒక అద్భుత స్వాప్నిక ప్రపంచం ఆవిష్కృతం కావడం ప్రారంభించింది. అంతవరకు కల్పనగా కనిపించిన పురాణపాత్రలు రక్తమాంసాలు నిండిన మన లాంటి వాస్తవిక వ్యక్తుల్లా కనిపించ సాగాయి. అనేక నమ్మకాలు, స్థిరాభిప్రాయాలు కూకటివేళ్ళతో కూలి పోవడం ప్రారంభించాయి.

కొన్ని రోజులపాటు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. నడుస్తున్నా గాలిలో తేలిపోతున్న అనుభవం. నిజానికి ఇప్పటికి కూడా నేను మామూలు మనిషినయ్యానని చెప్పలేను. కోశాంబిని మొదట చదివినప్పుడు కలిగిన మానసికస్థితిలోనే ఇప్పటికీ ఉన్నాను. ఇది జరిగింది కూడా ఎనభై దశకం ప్రారంభంలో.
బహుశా ఒక ప్రత్యేక కారణం వల్ల కోశాంబి నాలో ఇంత సంచలనం కలిగించాడని నేను అనుకుంటాను(నా ఊహ తప్పైనా కావచ్చు. కోశాంబిని చదివిన అందరిలోనూ ఇదే సంచలనం కలిగి ఉండచ్చు). ఆ కారణం ఏమిటంటే, పురాణం మా ఇంటి విద్య. నేను పురాణ, రామాయణ, మహాభారతకథల మధ్య పెరిగాను. మా నాన్నగారు అష్టాదశపురాణాలను తెలుగులోకి అనువాదం చేసిన కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. సంస్కృత, ఆంధ్రాలలో కవిత్వం చెప్పినవారు. దేవీ నవరాత్రులలో రామాయణ ప్రవచనం చేసేవారు. ముఖ్యంగా పురాణాలపై పరిశోధన చేసినవారు.  నేను ఒకవిధంగా మా నాన్నగారికి ఆధునికరూపాన్ని. మా పినతండ్రి వీరభద్రశాస్త్రిగారు పౌరాణికులుగా ప్రసిద్ధులు. భాగవతంలో నిష్ణాతులు.
కోశాంబిని  నా పురాణ, ఇతిహాసపరిజ్ఞానానికి అన్వయించుకోవడం, నాకుగా నేను సరికొత్త అన్వయాలను వెలికి తీయడం ఎనభై దశకంలోనే ప్రారంభించాను. నాకూ, మా నాన్నగారికీ మధ్య సంభాషణ జరుగుతూ ఉండేది. ఆయన సాంప్రదాయిక పరిజ్ఞానంతో నా ఆధునిక అవగాహనను బేరీజు వేసుకోడానికి ప్రయత్నించేవాడిని.

[box  title=”‘పురా’గమనం – కల్లూరి భాస్కరం కొత్త కాలమ్” color=”#333333″] Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5) మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉందంటుంటాం;  కానీ అదేమిటో, ఇప్పుడే స్వయంభువులుగా పుట్టినట్టు వర్తమానంలో గిరి గీసుకుని బతికేస్తూ ఉంటామంటారు భాస్కరం కల్లూరి. ఆయన అభిప్రాయంలో మన కథలు, కావ్యాలు, అవి చిత్రించే వస్తువు లేదా సమస్యలు చాలావరకు వర్తమానం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. మన రాజకీయాలూ అంతే. అయిదొందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్న అమెరికన్లు తమ చరిత్రను అత్యద్భుతంగా చూపించుకుంటుంటే, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నా చరిత్రశూన్యుల్లా కాలం దొర్లించే ప్రత్యేకత మనదేనేమో నంటారాయన.

“ఒక్కసారి గతమనే గవాక్షం తెరవండి, మీ ముందు మీకు తెలియని అద్భుతప్రపంచం పరచుకుంటుంది. కాలం వెంబడి నడచివచ్చిన మన అడుగుజాడలు అందులో కనిపిస్తాయి. మన నమ్మకాలను, నిశ్చితాభిప్రాయాలను తలకిందులు చేసి షాకిచ్చే గుప్తసత్యాలు ఎన్నో బహిర్గతమవుతాయి. పురాణకథలు కొత్త రూపం తీసుకుంటాయి. గణం నుంచి జనంగా మారిన మన వైనాన్ని పూసగుచ్చినట్టు చెబుతా” యని ఆయన అంటారు.

చరిత్ర సంపద ఉన్నా లేమిని అనుభవించే మన విలక్షణతను గుర్తు చేస్తూ, చరిత్ర అట్టడుగున పడి కాన్పించని కథలను, విశేషాలను తడుముతూ వ్యక్తిగతస్పర్శతో భాస్కరం కల్లూరి ప్రారంభిస్తున్న కాలమ్ ఇది!  [/box] ఓ రోజు నేనో సందేహాన్ని వ్యక్తం చేశాను.
“తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం అంటారు కదా, చిన్న కొడుక్కి రాజ్యం అప్పగించిన ఉదాహరణలూ కనిపిస్తున్నాయి కదా?”
నాన్నగారు సాలోచనగా నా వైపు చూశారు.
“మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి రాజ్యం ఇచ్చాడు. ప్రతీపుడు పెద్దకొడుకు దేవాపిని కాకుండా చిన్నకొడుకు శంతనుని రాజును చేశాడు. కారణం ఏదైనా శంతనుని పెద్ద కొడుకు భీష్మునికి బదులు చిన్నకొడుకు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కురుపాండవులలో పెద్ద అయిన ధర్మరాజుకు, చిన్న అయిన దుర్యోధనుడికి మధ్య రాజ్యాధికారవివాదం ఏకంగా కురుక్షేత్రయుద్ధానికే దారితీసింది. పెద్దకొడుకైన రామునికి బదులు తన కొడుకు భరతుని రాజును చేయమని కైక దశరథుని అడగడం, రాముడి కథను మహాకావ్యంగా మలుపుతిప్పింది.” అన్నాను.
“ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం. చిన్న కొడుకు రాజైతే దానిని మినహాయింపుగానే చూడాలి తప్ప సార్వత్రిక నియమంగా చూడకూడదు” అని నాన్నగారు అన్నారు.
“చిన్నకొడుకు రాజైన ఘటనలు ఉన్నప్పుడూ, కొడుకుల మధ్య అధికారవివాదం ఘర్షణ సృష్టించినప్పుడూ వాటిని మినహాయింపులుగా ఎందుకు చూడాలి? సార్వత్రిక నియమంగా ఎందుకు చూడకూడదు?” అన్నాను.
నాన్నగారికి ఆ ప్రశ్న అర్థవంతంగానే కనిపించినట్టుంది. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి, తర్వాత అన్నారు:
“వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘మహాభారతతత్త్వకథనం’ ఒకసారి చూడు. అందులో నీ సందేహానికి సమాధానం దొరకచ్చు”.
అందులో కచ్చితంగా సమాధానం దొరకదని నాకు అనిపించింది. సంప్రదాయపండితులకు అలాంటి సందేహం కలిగే అవకాశం లేదని నా నమ్మకం.  నాన్నగారితో ఆ మాట అనకుండా అప్పటికి మౌనం వహించాను.

rajasthani_phad_painting_pb40

కొన్ని రోజుల తర్వాత చిక్కడపల్లి గ్రంథాలయంలోనే రొమీలా థాపర్ రచించిన పుస్తకం ఒకటి కనిపించింది. అందులో మహాభారత వంశానుక్రమణిక(Genealogy of Mahabharata) గురించి ఆమె చర్చించింది. ఒక చోట నా కళ్ళు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. మాతృస్వామ్యంలో చిన్న కొడుకుదే పెత్తనం అని ఆమె రాసింది.
మరోసారి అసందర్భం అనుకోకపోతే, మా నాన్నగారి గురించి మరికొంత చెప్పాలి. ఆయనలో ఒక కవీ, పౌరాణికుడు, పండితుడే కాక; కవి పండిత పౌరాణికులలో చాలా అరుదుగా కనిపించే పరిశోధకుడు, జిజ్ఞాసి ఉన్నారు. అంతకన్నా ఆశ్చర్యంగా సాంప్రదాయిక పాఠానికి సరికొత్త అన్వయాలను గుడ్డిగా నిషేధించని ఆలోచనావైశాల్యం ఆయనలో ఉండేది. కొత్త విషయం, కొత్త అన్వయం తన దృష్టికి వచ్చినప్పుడు ఆశ్చర్యాద్భుతాలను ప్రకటించే ఒక పసితనం ఉండేది. నా దగ్గర ఉన్న తెలుగు పుస్తకాలను చదివి “ఇది పూర్తిగా చదివాను. అద్భుతం, ఆశ్చర్యకరం” అని లోపలి పుట మీద రాసి సంతకం పెట్టేవారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక అట్లాస్ ఉండేది. పురాణాలలో చెప్పిన ద్వీపాలను అందులో గుర్తించడానికి  ప్రయత్నించేవారు. సరిగ్గా మన నేలకిందే అమెరికా ఉందనే వారు.

సగరచక్రవర్తి కొడుకులు అరవై వేలమంది తండ్రి యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ భూమిని తవ్వి కపిలారణ్యానికి వెళ్ళిన కథ పురాణాలలో ఉంది. ఆ కపిలారణ్యమే కాలిఫోర్నియా అని నాన్నగారు అనేవారు. పితృదేవతలు చంద్రమండలంలో ఉంటారని చెప్పేవారు. తద్దినం రోజున పిండ ప్రదానరూపంలో పితృదేవతలకు పెట్టే ఆహారాన్ని సారంగా మార్చి కొన్ని కిరణాలు వారికి అందిస్తాయనేవారు. ఇవన్నీ నిరూపణకు అందేవి కాకపోవచ్చు. కానీ తన విశ్వాసాల పరిధిలో వాటికి అర్థం చెప్పడానికి ప్రయత్నించేవారు. ఆయన సంస్కృత కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన కొవ్వూరు(పశ్చిమ గోదావరి జిల్లా)లో గంధం రామారావు అనే అడ్వకేట్ ఉండేవారు. నాన్నగారి ప్రవచనాలకు, ప్రసంగాలకు ఆయన తప్పనిసరిగా హాజరయ్యేవారు. చివరిలో ఆయనను కలసి, “ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం చెప్పకుండా ఉండరు కదా!” అని అభినందించి వెళ్ళేవారు.
నా ‘జన్యులక్షణా’న్ని ఈపాటికి మీరు పోల్చుకుని ఉంటారు.
మళ్ళీ కథ దగ్గరికి వద్దాం. అపరాధపరిశోధక కథ నాకు ఇష్టమని చెప్పాను. కాలగమనంలో మన పురాణకథలు, ఇతిహాసాలు, పురాచరిత్ర, చరిత్రా అపరాధపరిశోధక కథలుగా మారిపోయాయి. కాలమనే హంతకుడు అసలు అర్థాన్ని, లేదా వాస్తవికతకు దగ్గరగా ఉండే అర్థాన్ని హత్య చేశాడు. అయితే కొన్ని క్లూలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ క్లూలలోనే ఉంది అసలు కథ అంతా. వాటి వెంబడే వెడితే అద్భుతావహమైన నూతన కథా ప్రపంచంలోకి అడుగుపెడతాం. నేటి కథలను తిరగరాసే కొత్త కథలు అనేకం అక్కడ దొరుకుతాయి. నా ఉద్దేశంలో చరిత్ర, కథను మించిన ఉత్కంఠభరితమైన కథ!
అయితే, ఒక గమనిక: చరిత్ర అనే కథలో అద్భుతత్వాన్ని దర్శించాలంటే, భారతశ్రవణంపై రాజరాజనరేంద్రుడికి ఉన్నంత infatuation చరిత్రపై ఉండాలి. అలాగే ఒక హెచ్చరిక: ఈ infatuation కు తగిన మూల్యం చెల్లించుకోవాలి. అంటే, మీరు మ్యూజియంలోని పురావస్తువుగా మారిపోవాలి!

-భాస్కరం కల్లూరి

‘పురుష’ భారతం మీద స్త్రీ స్వరం నిరసన

kalluri-1మహాభారతం గురించి కొంచెమైనా చెప్పుకోకుండా మహాభారత కథాంశంతో రచించిన ఏ రచన గురించీ చెప్పుకోవడం కుదరదు. ప్రసిద్ధ ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్ రచించిన ‘యాజ్ఞసేని’కి కూడా ఇదే వర్తిస్తుంది. మహాభారతం భారతదేశమంత విశాలమైనది. భారతదేశ చరిత్ర, సమాజం, సంస్కృతి, విశ్వాసాలంత లోతైనది. వైవిధ్యవంతమైనది. అసలు మహాభారతమంటే భారతదేశమే. మహాభారతంలో లేనిదేదీ భారతదేశంలో లేదు. భారతదేశంలో ఉన్నదేదీ మహాభారతంలో లేకుండా లేదు. ఒక దేశానికీ, ఒక ఇతిహాసానికీ ఒకే పేరు ఉన్న ఇలాంటి ఉదాహరణ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా?!

మహాభారతం ఈ దేశవాసుల మూలచరిత్ర. ఇప్పటికీ భారతదేశం మహాభారత సమాజంగానే ఉంది ఉంది కనుక మహాభారతం భారతదేశపు నడుస్తున్న చరిత్ర. మహాభారతంలో భారతదేశాన్ని పోల్చుకోలేనివారికీ, భారతదేశంలో మహాభారతాన్ని దర్శించలేనివారికీ భారతదేశమూ, మహాభారతమూ ఎప్పటికీ అర్థంకావు. భారతదేశపు వర్తమానంపై వ్యాఖ్యానించగల సాధికారత ఎప్పటికీ లభించదు. మహాభారతాన్ని సొంతం చేసుకోనివాడు, జీర్ణించుకోనివాడు సంపూర్ణ భారతీయుడు కాలేడు.

భారతదేశపు నడుస్తున్న చరిత్రను ఏ కోణం నుంచి వ్యాఖ్యానించాలన్నా కనీసం అయిదువేల సంవత్సరాల గతంలోకి వెళ్ళాలి. భారదేశపు భవిష్యత్తును ఏ కోణం నుంచి అంచనావేయాలన్నా కనీసం వెయ్యి సంవత్సరాలు ముందుకు చూడాలి.

మహాభారతం లాంటి ఒక జాతి మూలచరిత్ర  ప్రతికాలంలోనూ తనను తాను పునః సృజించుకుంటూ ఉంటుంది. పునర్నవీనమవుతూ ఉంటుంది. ప్రతి తరమూ తన సంస్కృతీ, సాహిత్యవారసత్వాన్ని కొత్త అనుభవాలనుంచి దర్శిస్తుంది. వ్యాఖ్యానిస్తుంది. యవ్వనవంతమైన ప్రతి తరమూ, ప్రతి కాలమూ నూతన వైజ్ఞానిక వనరుల కొత్తరక్తంతో తన వైజ్ఞానిక వారసత్వానికి నూతన యవ్వనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో నిన్నటి తరంనుంచి, లేదా కాలంలో ఘనీభవించిపోయిన వ్యక్తులు, వ్యవస్థలనుంచి ప్రతిఘటననూ ఎదుర్కొంటూ ఉంటుంది.

విశ్వాసానికీ, విజ్ఞానానికీ ఆజన్మ శత్రుత్వం. మహాభారతం సహా మన పౌరాణిక సంపద అంతా కాలగతిలో విశ్వాసంలో భాగమైపోయింది.  ఈ విశ్వాసపు మూకబలం మహాభారత వైజ్ఞానిక మథనానికి ఏయే కాలాలలో ఏమేరకు అడ్డంకిగా మారిందో, ఆ ప్రయత్నం ఎన్నెన్ని ప్రచ్ఛన్న రూపాలు ధరించిందో-దానికదే ఒక అధ్యయనాంశం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది…కవిత్వం, కథ, నవల, ఇతర కళారూపాలు అన్నీ సత్యాన్ని విశ్వాసపు దాడినుంచి తప్పించడానికి ఉద్దేశించినప్రచ్ఛన్న రూపాలు కావచ్చు నేమోనని!

మహాభారతం మౌలికంగా పురుష భారతం. మాతృస్వామ్యంపై పురుషస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కాలంలో జరిగిన భారీ ప్రయత్నంలో అది కూడా భాగం. ఆ ప్రయత్నం చరిత్రే ఒక ఉద్గ్రంథమవుతుంది. ప్రస్తుతానికి వస్తే, పురుషభారతంగా మహాభారతం ‘సగం’ రచన. అయితే, పురుషస్వామ్యాన్ని స్థాపించే కథకుని ప్రయత్నాన్ని ధిక్కరిస్తూ మరెన్నో అవశేషాలతోపాటు మాతృస్వామ్య అవశేషాలూ మహాభారతంలో ఉండిపోయాయి. కథను నేర్పుగా ‘ఎడిట్’ చేసుకోలేకపోయిన కథకుని వైఫల్యం ఒకవిధంగా మనకు వరం అయింది. కథకుడు విడిచిపెట్టిన ఖాళీలనుంచి కొత్త కథలు, కొత్త అన్వయాలు సృజించుకునే అవకాశం కలిగింది.

పురుషభారతంలో స్త్రీపాత్రలు చాలావరకు వ్యక్తిత్వమూ, హృదయమూ వ్యక్తం కాని బుట్టబొమ్మలు. నేను గమనించినంతవరకు ద్రౌపది తన వ్యక్తిత్వాన్ని స్థాపించుకున్న ఘట్టాలు రెండే: మొదటిది, వస్త్రాపహరణ ఘట్టంలో లేవనెత్తిన ధర్మమీమాంస. రెండవది, ఉపపాండవులను వధించిన అశ్వత్థామపై పగ తీర్చుకోడానికి భర్తలపై ఒత్తిడి తెచ్చిన ఘట్టం. కొడుకులనే కాక, తండ్రి ద్రుపదునీ, సోదరుడు ధృష్టద్యుమ్నునీ, అతని కొడుకులనూ కూడా  కోల్పోయిన పాంచాల రాజపుత్రిగా ఆ ఘట్టంలో ఆమె ‘పుట్టింటి పగ’కు అచ్చమైన ప్రతినిధి.  అశ్వత్థామ శిరసున ఉన్న మణిని తెచ్చి భీమార్జునులు తనకు ఇచ్చినప్పుడు ద్రౌపది ఆ మణిని ధర్మరాజుకు ఇవ్వడంలో ఆమె నిర్వహించినది అసలు సిసలు రాచకార్యం. తండ్రి ద్రోణుడి ద్వారానే కాక, ధృష్టద్యుమ్నుని చంపినవాడుగా అశ్వత్థామ పాంచాలసింహాసనంపై కనీసం సాంకేతికంగానైనా హక్కును స్థాపించుకునే అవకాశం ఉంది కనుక, అధికార చిహ్నమైన అతని శిరోమణిన ద్రౌపది ధర్మరాజుకు ఇవ్వడం పాంచాలరాజ్యంపై అధికారం ఇవ్వడమే.
కథకుడు విడిచిపెట్టిన ఖాళీలనుంచి కొత్త కథ, లేదా కొత్త అన్వయం సృజించడానికి ప్రయత్నించిన రచనలలో నేను చదివినంతవరకు ఇరావతీ కార్వే ‘యుగాంత’ ఒకటి. ఆ రచన పురుషభారత ప్రభావాలకు దూరంగా మహాభారతాన్ని స్త్రీ పరంగా, స్త్రీవాదపరంగా వ్యాఖ్యానించింది. ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ మాతృస్వామ్యం, పురా చరిత్ర, పురామానవచరిత్ర కోణాల నుంచి మహాభారతాన్ని పునఃకథనం చేయడానికి ప్రయత్నించింది. ఒక పురుష రచయితగా స్త్రీ హృదయపు లోతును, గాఢతను భైరప్ప పూర్తిగా ప్రతిబింబించగలిగారా అన్న సందేహానికి ఆస్కారం ఎలాగూ ఉంటుంది. అది పురుష రచయితకు సహజంగా ఉండే ఒక పరిమితి.

ఎం.టి. వాసుదేవన్ నాయర్ ‘సెకండ్ టర్న్’ బ్రాహ్మణీయతా వ్యతిరేకతను ధ్వనింపజేస్తూ భీముని గిరిజనుడిగా చూపిస్తూ అతని పరంగా చెప్పిన కథ.ఆ విధంగా అది పురుషభారతానికి ఆధునికమైన కొనసాగింపు. వీటికి భిన్నమైన మరాఠీ రచన విష్ణు సఖారామ్ ఖాండేకర్ ‘యయాతి’. మహాభారతంలోని యయాతి కథను ఈ రచన తాత్విక కోణం నుంచి అన్వయిస్తుంది.నేను చదవని రచనలు ఇంకా ఎన్నో ఉండి ఉండచ్చు.

 

pratibha rayఇక ప్రతిభా రాయ్ ‘యాజ్ఞసేని’. ఈ రచన ‘యయాతి’లా తాత్వికంగా ఉంటూనే తాత్వికతను భౌతికతతో సమన్వయించేలా ఉంటుంది. పాఠకుల రుచి భేదాన్ని బట్టి ఈ రచనలో రుచించని అంశాలూ ఉన్నాయి; ఒక తాత్వికమైన, మానవీయమైన లోతుకలిగిన పరిణత రచనగా రుచి భేదాలకు అతీతంగా ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. మొదట, ఆకట్టుకునే అంశాలలోకి వెడదాం. రచయిత్రి ఈ రచనలో మూల భారతంలో లేని కొన్ని సరికొత్త సన్నివేశాలను సృష్టించారు. అలాంటి మూలాతిక్రమణ ఎంతవరకు భావ్యమన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే, ఆ సన్నివేశాల కల్పన ఆశ్చర్యకరంగానే కాక ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఆ కల్పన మనకు తెలిసిన మహాభారతపాత్రలకు కొత్త పుష్టినీ, కొత్త మెరుపునూ ఇచ్చి మహాభారతకథ నుంచి నూతన అనుభూతిని అందుకునే అవకాశమిస్తుంది. చిరపరిచయం వల్ల  కథను అంటిపెట్టుకుని ఉండే  మొనాటనీని తగ్గిస్తుంది.

కృష్ణ (రచయిత్రి ద్రౌపదికి ఈ పేరునే ఎక్కువగా ఉపయోగించారు)-కర్ణుల మధ్య; కొంతవరకు కృష్ణ-కృష్ణుల మధ్య కల్పించిన సన్నివేశాలు అలాంటివే. వివాహమై భర్తలతో కలసి కృష్ణ హస్తినాపురం వచ్చినప్పుడు వారికి స్వాగతం చెప్పడానికి కౌరవులతోపాటు కర్ణుడు కూడా వెడతాడు. అతను తనకు ఇష్టమైన నీలి గులాబీ గుచ్ఛం సమర్పించినప్పుడు కృష్ణ విచిత్రస్పందనలకు లోనవుతుంది. తన భర్తలెవరూ తనకు నీలి గులాబీలు కానుక చేయలేదని అనుకుంటుంది. కర్ణుని తన ‘ధర్మపుత్రు’డిగా చెప్పుకుంటూ మొదటినుంచీ అతని ఇంటికి రాకపోకలు సాగిస్తూ వచ్చిన కుంతి, ఒక రోజు కృష్ణను కూడా కర్ణుని ఇంటికి తీసుకు వెడుతుంది. అతనికి ప్రణామం చేయిస్తుంది. అప్పటినుంచీ అత్త హృదయం నుంచి కర్ణుని అర్థం చేసుకోడానికి, సానుభూతి చూపడానికి కృష్ణ ప్రయత్నిస్తుంది. స్వయంవర పరీక్షలో పాల్గొనడానికి కర్ణుని నిరాకరించిన క్షణం నుంచే కృష్ణ-కర్ణుల మధ్య ఒక విధమైన హృదయ సంబంధం ఏర్పడింది. అప్పుడు కృష్ణలో కలిగిన సానుభూతి మొలక క్రమంగా పెరిగి పెద్దదైనట్టు కనిపిస్తుంది.

పాండవులు ఇంద్రప్రస్థంలో సభాభవనం నిర్మించుకున్న సందర్భంలో కౌరవులతోపాటు అతిథిగా వచ్చిన కర్ణునికి భోజనం స్వయంగా తీసుకు వెళ్ళమని కుంతి కృష్ణను పురమాయిస్తుంది.  అప్పుడు కర్ణుడి మాటలు కృష్ణ మనసును గాయపరుస్తాయి. రాజ్యం కోల్పోయి పాండవులు వనవాసం వెడుతున్నప్పుడు, కృష్ణ  ఒంటి మీద ఆభరణాలు ఉంచుకోడానికి దుశ్శాసనుడితో కలసి కర్ణుడు అభ్యంతరం చెబుతాడు.  అవి దుర్యోధనుడి సంపద అంటాడు. కృష్ణ ఆభరణాలు ఒలిచి ఇచ్చేస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కర్ణుడు భార్య ద్వారా వేరే ఆభరణాలు కృష్ణకు  పంపుతాడు. ఇవి కర్ణుడి ఆస్తి కనుక తీసుకోమని కర్ణుని భార్య అంటుంది. దుర్యోధనుడు ఇచ్చిన ఆస్తే కాని కర్ణుడికి సొంత ఆస్తి ఎక్కడుంది అంటూ కృష్ణ  తిరస్కరిస్తుంది.  వనవాస సమయంలో యమునా నదిలో కొట్టుకుపోతున్న కృష్ణను కర్ణుడు కాపాడతాడు. మరో సమయంలో అడవిలో పాము కాటుకు గురైన కర్ణునికి తన మంత్రప్రయోగంతో కృష్ణ ప్రాణదానం చేస్తుంది.

ఇటువంటి సన్నివేశాల కల్పనద్వారా కృష్ణ-కర్ణుల మధ్యగల అనుకూల-ప్రతికూల స్పందనలను రచయిత్రి అద్భుతంగా చిత్రిస్తారు. కర్ణుడి గురించి పాండవులకు తెలియని కొన్ని రహస్యస్పందనలను అత్తా-కోడళ్ళు ఇద్దరూ పంచుకుంటున్నారనీ, అవి కేవలం స్త్రీ హృదయానికే తెలిసిన రహస్య స్పందనలనే భావన కలిగిస్తారు. తనలానే అయిదుగురి సంబంధంతో సంతానం కన్న అత్తతో కృష్ణ అడుగడుగునా మమేకం అవుతుంది. కుంతి కర్ణునిపట్ల మాతృత్వంతో స్పందిస్తే, కృష్ణ స్పందనలో అత్తతో సహానుభూతే కాక, మరో రకం స్పందన కూడా ఉందా అన్న అనుమానం కలుగుతుంది.

యుద్ధ ప్రారంభఘట్టంలో పాండవులు అందరితోపాటు తన మానసిక దౌర్బల్యాలను కూడా కృష్ణ వెల్లడిస్తూ, నా హృదయ దౌర్బల్యమే కుంతీమాతకు కూడా ఉందనీ,  కుంతీ పుత్రులే తన దౌర్బల్యమనీ అంటుంది. అంతటితో ఆగకుండా, “కుంతి జ్యేష్టపుత్రుడితో ప్రారంభించి కుంతి కనిష్ట పుత్రుడివరకు అందరివైపు నాకు ఆకర్షణ ఉంది” అంటుంది. అప్పటికే కర్ణుడు కుంతి జ్యేష్టపుత్రుడని తనకు తెలుసు కనుక కర్ణుని కూడా కలుపుకునే ఆ మాట అందా అనిపిస్తుంది. అయితే ఆ వెంటనే, “నా మూడవ దౌర్బల్యం నా మూడవ భర్త అర్జునుడు” అనడం ద్వారా పంచ పాండవులనే ఉద్దేశించిందన్న భావన కలిగిస్తుంది. కర్ణుడి పట్ల కృష్ణ విచిత్రస్పందనను రచన పొడవునా సూచిస్తూ వచ్చిన రచయిత్రి  చివరివరకూ అది ఎలాంటి స్పందనో చెప్పకుండా స్పష్టాస్పష్టంగానే  విడిచిపెట్టారు. మరోవైపు, కర్ణుని ఆరవ భర్తగా కృష్ణ కోరుకుందన్న జానపద చిత్రణ నుంచి స్పూర్తి పొంది రచయిత్రి కృష్ణ-కర్ణ పాత్రలను మలచినట్టు అర్థమవుతూనే ఉంటుంది.

పురుష భారతం లోని స్త్రీ-పురుష పాత్రల చుట్టూ ఇన్ని వందల ఏళ్లలో గాఢంగా అల్లుకున్న కాల్పనిక తేజోవలయాన్ని ఈ రచన మరింత గాఢం చేస్తుంది.

అయితే,  కర్ణుని పట్ల కృష్ణది ఎలాంటి ఆకర్షణ? అది శారీరక సంబంధమైనది కాదని చెప్పలేం. శారీరక సంబంధమైనదే ననీ చెప్పలేం. శారీరక సంబంధానికి అతీతమైనదీ, అంతకంటే అత్యున్నతమైనదీ కూడా కావచ్చు. ఇక్కడే రచయిత్రి స్త్రీ హృదయమూలాలను అత్యద్భుతంగా ఆవిష్కరించారనిపిస్తుంది.  కృష్ణ దేహసంబంధమైన పరిమితులను దాటి హృదయగతంగా జీవించే స్థాయిని అందుకుంది. పత్నీత్వానికీ, మాతృత్వానికీ మధ్య ఆమెలో ఎల్లలు చెరిగిపోయాయి. ఆమె దృష్టిలో దేహసంబంధం ఒక అనాసక్తయోగం. దేహాన్నీ, ఆత్మనూ ఆమె విభజించుకోగలిగింది. వ్యక్తిత్వాలలో ఎంతో వైవిధ్యమున్న అయిదుగురితో తన దేహాన్ని ఎప్పుడైతే ఆమె పంచుకోవలసివచ్చిందో అప్పుడిక ఆమె దేహ చింతనుంచీ అది విధించే పరిమితులనుంచీ విముక్తురాలైంది. ఆమెలోని స్త్రీ హృదయం కట్టలు తెంచుకుని ప్రవహించింది. శత్రు, మిత్ర భేదం లేకుండా ఎందరినో తనలోకి తీసుకుంది. ఎన్నో అద్భుతాలు చేసింది. కామ్యకవనంలో తల్లిని కోల్పోయి తల్లి పాలు లేక శుష్కించిపోయిన ఇద్దరు ఆటవిక శిశువులకు కృష్ణ స్తన్యమిచ్చి జీవం పోయడం ఆమె మాతృత్వ స్పందనకు ఒక నిదర్శనం. స్త్రీ మగజాతి కంతటికీ తల్లిగా సంరక్షణ బాధ్యత తీసుకున్న మాతృస్వామ్యపు రోజులు కృష్ణ పాత్రలో లీలగా స్ఫురిస్తాయి.

కృష్ణ సతీత్వం, పవిత్రతల నిర్వచనాన్ని విశాలం చేసింది. తనలో ఇలా అనుకుంటుంది: ”నిజానికి పంచపతీగ్రహణం నాకోసమే కాదు, సమగ్రస్త్రీజాతికి ఒక ఆహ్వానం. ఒకే సమయంలో ఒకరి కన్నా ఎక్కువమంది భర్తలను వరించినా స్త్రీ పవిత్రత మలినం కాదు-అన్నదానిని రుజువు చేసే సందర్భం.” మరో సందర్భంలో ఇలా అనుకుంటుంది: “ప్రపంచంలో అధికాంశం స్త్రీలు శరీరపరంగా అసతులు కాకపోయినా మానసికంగా అసతులు. ఒకే భర్తకు భార్యగా ఉన్నా ఇతర పురుషులు వారి మనస్సులో అలజడి రేపుతారు. శరీరాలు వేరైనా మానసికంగా వారు పరపురుషులతో శయనిస్తారు. కానీ నా విషయంలో ఇది జరగదు. యుధిష్టరునితో ఏకాంతంలో ఉన్నప్పుడూ నేను అర్జునుని కోరుకోను. సంయమనం, కట్టుబాటుతో ఉండేందుకు నేను సాధన చేశాను” .

అయిదుగురు భర్తలు ఉన్నా మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించిన కృష్ణ జీవన పార్స్వాన్ని కూడా రచయిత్రి కరుణరసాత్మకంగా చిత్రించారు.  స్వయంవరంలో కృష్ణను వాస్తవంగా గెలుచుకున్నది అర్జునుడు. కృష్ణ వరించినది కూడా అర్జునునే. అయితే, కుంతి కోరిక ప్రకారం, అన్నదమ్ముల ఐక్యత కోసం అయిదుగురికీ ఇల్లాలు కావలసివచ్చింది. ఆ పరీక్షా సమయంలో అర్జునుడు తన అసమ్మతిని తెలిపి ఆదుకుంటాడని కృష్ణ అనుకుంది. కృష్ణ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి తనను ఆదుకుంటుందని అర్జునుడు అనుకున్నాడు. అలా జరగలేదన్న అసంతృప్తి ఇరువురిలోనూ ఉండిపోయింది. దాంతో అర్జునుడు ఎక్కువ కాలం కృష్ణను తప్పించుకు తిరుగుతూ ఆమెకు మానసిక క్షోభ కలిగించాడు. హృదయపూర్వకంగా వలచిన అర్జునునితో ఎక్కువ సాంగత్యానికి కృష్ణ  నోచుకోలేకపోయింది. ఇద్దరూ దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా వియోగమే అనుభవించారు. మిగిలిన నలుగురు భర్తలూ ఎవరి ప్రపంచంలో, ఎవరి ఆసక్తులలో వారు గడిపారు తప్ప కృష్ణ హృదయప్రపంచంలోకి అడుగుపెట్టలేకపోయారు. చివరిలో ఆమె కృష్ణుని ఇలా వేడుకుంటుంది: ”ఎప్పుడూ ఏ స్త్రీకీ ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువమంది భర్తలను ఇవ్వవద్దు. అవిభక్తగా ఉండికూడా తనను తాను విభజించుకునే దుఃఖం నాకు తెలుసు”.

కృష్ణ-కృష్ణుల సంబంధం మరో ఆసక్తికర చిత్రణ. కృష్ణలోని దేహాంశ పాండవులదైతే, సూక్ష్మాంశ కృష్ణుడిది. అది భక్తురాలికీ, దైవానికీ ఉండే సంబంధం. కృష్ణ మొదట కృష్ణునే వరించింది. కానీ అర్జునుడే నీ భర్త కావాలని కృష్ణుడు చెప్పాడు. నువ్వు నీ తండ్రి శత్రునాశనానికే యాజ్ఞసేనిగా జన్మించావనీ, ప్రపంచంలోని దుర్మార్గుల వినాశనమే నీ పుట్టుక ఉద్దేశమనీ చెప్పాడు. ధర్మస్థాపన కోసం కోరికలను, ఆశలను, మనసును, హృదయాన్ని, బుద్ధికుశలతను త్యజించాలన్నాడు. వెంటనే కృష్ణ మనసులో అర్జునుని స్థాపించుకుంది.

కృష్ణుడు అన్న ఈ మాటలు ఈ రచనను పురుష భారత ప్రభావంలోకి, పురుష భావజాలంలోకి తీసుకువెడుతున్నాయి.  మహాభారతాన్ని విజేతల పక్షాన చెప్పిన కథగా భావించేవారికీ; ధర్మాధర్మాలు ఎవరి పక్షాన ఉన్నాయో, అవి ఎటువంటివో ఇంకా లోతుగా పరిశీలన జరగాలని భావించేవారికీ ఇది రుచించే విషయం కాదు. పాండవులు ధర్మాత్ములు, కౌరవులు అధర్మపరులన్న స్టీరియో టైపును ఈ రచన అనుసరించింది.  విశేషమేమిటంటే, మూల కథ కూడా ఈ స్టీరియో టైపును ఇంతగా గీత గీసినట్టు అనుసరించలేదు. యుద్ధంలో పెద్ద ఎత్తున బంధునాశనం చేసినందుకు ధర్మరాజు, యుద్ధాన్ని తప్పించనందుకు కృష్ణుడు జననిందను ఎదుర్కొన్నారు. కృష్ణుడు గాంధారీ శాపానికి కూడా గురయ్యాడు.

ఈ రచన ఆయా పాత్రలను మరీ ఆదర్శీకరించడం, మోయలేని ఆదర్శాల బరువు కింద అవి అణిగిపోతున్నట్టు, ఆదర్శాల స్వాప్నిక ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉండడం వాస్తవిక దృష్టిని కోరుకునేవారికి నచ్చదు. పురుష భారతం లోని స్త్రీ-పురుష పాత్రల చుట్టూ ఇన్ని వందల ఏళ్లలో గాఢంగా అల్లుకున్న కాల్పనిక తేజోవలయాన్ని ఈ రచన మరింత గాఢం చేస్తుంది. పురుష భారతంలోని అతీంద్రియ లక్షణాలను, విశ్వాసాలను, మహిమలను యథాతథంగా స్వీకరించడం మరో నిరుత్సాహకర అంశం.  గిరిజనులకు, అసురులకు క్షత్రియులతో ఉన్న సహజ వైరాన్ని, వైరుధ్యాలను కప్పి పుచ్చి వారి మధ్య ఆదర్శవంతమైన మైత్రీనీ, శాంతి సామరస్యాలనూ స్థాపించబోవడం కూడా వాస్తవాల నేల విడిచి సాగించే ఆదర్శాల సాము మాత్రమే. ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన పురా చరిత్ర, పురామానవ పరిణామ చరిత్ర వంటి వనరుల స్పృహ ఈ రచనలో లోపించడం ఒక వెలితి. స్త్రీ హృదయాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన రచయిత్రి తన రచనను వాస్తవికతా పునాదుల మీద కాకుండా నిరూపణకు అందని భావజగత్తు పునాదులమీద నిలబెట్టడం పురుష భావజాల ప్రభావఫలితం.

Front Image: Hidimba Reveals their Identity, Scene from the Story of the Marriage of Abhimanyu and Vatsala, Folio from a Mahabharata ([War of the] Great Bharatas), circa 1850, Painting; Watercolor, Opaque watercolor on paper, Wikimedia Commons