కొంత సిగ్గు మిగిలి వుండాలని…

dabral

మంగలేష్ డబ్రాల్ 1948 మేలో వుత్తరాఖండ్ లో జన్మించారు.అక్కడే ప్రాధమిక విద్యను అభ్యసించారు. అనేక పత్రికల్లో సంపాదక, వుపసంపాదకులుగా పనిచేసారు. నేషనల్ బుక్ ట్రస్ట్ లో సంపాదక బాధ్యతను నిర్వహించారు.

హిందీ పేట్రియాట్,ప్రతిపక్ష్, పూర్వగ్రాహ్ లాంటి పత్రికలు ఆయన సంపాదక వర్గంలో వూపందుకొన్నాయి.లోవా యూనివర్శిటీ నుంచి రైటర్స్ ప్రోగ్రాం ఫెలోషిప్ ను పొందారు.సాహిత్య అకాడమి అవార్డునూ పొందారు.

వర్తమాన హిందీ కవిత్వంలో వో ప్రముఖ గొంతుక మంగలేష్ డబ్రాల్. యితని కవిత్వం భారత దేశపు ప్రముఖ భాషల్లోనే కాక ప్రపంచ ప్రధాన భాషలైన ఆంగ్లం,రష్యన్,స్పానిష్,పోల్స్ కీ,బల్గేరియన్ లలో అనువదింపబడింది. యితను నాలుగు కవిత సంపుటాలు వెలువరించారు.యితని కవిత్వంలో సామంత,పెట్టుబడిదారి విధానాల పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది.తనే వో ప్రతిపక్షమై వో అందమైన కళ ప్రపంచాన్ని స్వప్నిస్తారూ. యితని కవిత్వం సూక్ష్మంగా సౌందర్యముతో,  పారదర్శిక భాషతో పాఠకులను ఆలోచింపజేస్తుంది.

*

నేను కోరుకొంటున్నాను
——————————

నేను కోరుకొంటున్నాను
కవుల్లో కొంత సిగ్గు మిగిలి వుండాలని

స్పర్శ మిగిలివుండాలని కోరుకొంటున్నాను
అది భుజాలను చెక్కుతూ
అత్యాచారిలా వెళ్ళాలని కోరుకోను
యెందుకంటే
అది వొక అపరిచితయాత్ర తరువాత
భూమి చివరి అంచుపై చేరినట్లు వుండును

నేను రుచి మిగిలివుండాలని కోరుకొంటున్నాను
తీపు చేదులకు అతీతంగా
తినని వస్తువులను కాపాడే
వొక ప్రయత్నపు పేరు

వొక సరళ వాక్యం కాపాడడం నా లక్ష్యం
మనం మనుషులం కదా!
యీ వాక్యపు నిజాయితీ బతికి వుండాలని కోరుకొంటున్నాను

దారిపై విన్పించే వో నినాదం
దాని అర్థంతో పాటు
అది మిగిలి వుండాలని
నేను కోరుకొంటున్నాను
నిరాశ మిగిలి వుండాలని

మళ్ళీ వొక ఆశ
మన కోసం జన్మిస్తుంది

పక్షుల్లా అప్పుడప్పుడూ
దొరకని పదాలు మిగిలి వుండాలి
కవుల్లో కొద్దిగా సిగ్గు మిగిలి వుండాలి

*

నేను యిరోంని!

arya

డాక్టర్  కర్మానంద్ ఆర్య అనే యీ యువకవి బీహార్ లోని గయలో నివసిస్తున్నాడు. దక్షిణ బీహార్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో హిందీ అసిస్టెంట్ ప్రొఫెసరుగా పని చేస్తున్నాడు.యితని కవితలు ప్రముఖ హిందీ సాహిత్యపత్రికలలో ప్రచురింపబడ్డాయి. త్వరలోనే తన మొదటి సంకలనం బోధి ప్రకాషన్, జైపూర్ వారు ప్రచురించనున్నారు.

“నీ దిగులు నా కవిత్వం సాధించిన అపజయమ”నే యీ కవి అడవి చరిత్రను కొత్తగా లిఖించే ప్రయత్నం కవితల్లో కనిపిస్తుంది. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే మోచీనీ చూసి దుఖిస్తాడు. నదుల్లోని చేపల ప్రాణాన్ని యెంత గణిస్తాడో, విద్యా,ప్రజాస్వామిక వ్యవస్థలలోని అసమానతలను ఖండిస్తాడు. వొకటి చూస్తే మరొకటి కనిపించే అడవిపుత్రుల దుఖాన్ని చూసి కవితై ప్రవహిస్తాడు. చరిత్రలేని అడవిని గొంతెత్తి పాడుతాడు. తనను తాను వెతుక్కునే ప్రయత్నంలో వో ప్రత్యేక అస్తిత్వం కోసం చేసే కృషి కనిపిస్తుంది. విపరీతమైన ఆర్తి ఆవేశాలు యితని కవిత్వంలో మెండు.
యిరోమ్ షర్మిలా గురించి దాదాపు భారతదేశపు అన్ని భాషల్లో కవితలు లిఖింపబడిన కర్మానంద్ రాసిన యీ కవిత పాఠకులను కదిలిస్తుంది.

మృత్యువు అర్థాన్ని గ్రహించిన షర్మిలా కోసం యీ కవిత..

Irom-Sharmila-t40807

షర్మిలా యిరోమ్
———————–

నేను పోరాడుతున్నాను
మనుషులు పోరాడడం ఆపేసారు
వొక కలకు,వొక వొడంబడికకు వ్యతిరేకంగా
యేమౌతుంది?
గుర్రపు డెక్కల శబ్దం కంటే భయంకరంగా
యిప్పుడు నా గొంతు పదునెక్కి హెచ్చింది

నాకు జీవితమంటే  ప్రేమ యెక్కువే
నాకు చావు విలువ తెలుసు
అందుకే పోరాడున్నాను
గాయపడ్డ వేటగాడు నేర్పరి
అందుకే పోరాడుతున్నాను
నా పిల్లల నోళ్ళల్లో నా స్థన్యం వుంది
నన్ను నలువైపులా చుట్టుముట్టేసారు
పోరాడుతూనే వున్నాను

వేటగాడికి నా దంతాలు,నా గోళ్ళు, నా  అస్థికలు కావాలి.
నా సాంస్కృతిక ధనస్సు,బాణాలును
మార్కెట్టు లో అన్నింటి విలువలు
నిర్ణయింపబడ్డాయి
నా నల్లమందు మట్టి కూడా అమ్ముడైంది
నాకు నా దేశంలోనే నిర్వాసిత శిక్ష. విధింపబడింది
నేను నా దేశాన్ని వెతుక్కుంటున్నాను
డిల్లీ వీధులలో ఫిర్యాదులతో
తిరుగుతున్నప్పుడు
నా దేశం యేదని అడిగారు
నేను వారి చేరికకు లోపలే వున్నానని
నన్ను అంగీకరిస్తారు

వారు యెక్కడ కోరుకుంటే
అక్కడ జెండా పాతేస్తారు
మా పచ్చని దేహాలను పిసకడం
యీ వేటగాళ్ళను మోహింపచేయును
కామ పురుషులకు విరిగిన మా
యెముకలు కనిపించవు
సైనికుల చప్పుళ్లతో మా నిద్దుర
ముక్కలౌతుంది
వారు మమ్మల్ని వేశ్యలుగా భావించారు
మా పనులు చూస్తే వారికి అసహ్యం కలగదు
మమ్మల్ని చెరపడమే వారికి యిష్టం
వాడి అల్ప ప్రతిక్రియలలో నేను వోడిపోతానని ఆలోచిస్తాడు

గాయపడ్డ వేటగాళ్ళారా రండి చూడండి
నీ కోరిక కంటే యెతైన కఠినమైన నా వక్షోజాలను
నీవు నా స్తనాలను తాగాలనుకొన్నావు కదూ
రా వుప్పుతో విషంతో కలిసిన నా
నెత్తురును రుచి చూడూ!
రా చూడు! బూడిదను వెచ్చగా వుంచే రాతిరి నాలో ప్రాణాలతో వుంది

బ్రహ్మపుత్ర యెలా నవ్వుతుందో చూడూ
వితస్తా నన్నెలా కాపలా కాస్తుందో చూడూ
మా పగుళ్ళలో నుంచి ప్రవహిస్తన్న సిరా
యెంత యెర్రగా మత్తును యిస్తుందో వుందో చూడు
నేను మళ్ళీ పుట్టనని అనుకోకు
నేను నా తరాల్లో స్థిరంగా వున్నాను
నేను యిరోంని
యిరోమ్ షర్మిలా చాను

*

ఆమె కవిత రాస్తే కొరడా పడ్డట్టే!

subham

పాతికేళ్ళ  శుభమ్ శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిని.శుభమ్ శ్రీ యెప్పుడు రాసిన చర్చనీయాంశమే.ఆమె  బుఖార్(జ్వరం) ,బ్రేక్ అప్ ఐ లవ్ యూ కవితలు రాసినపుడు కూడా చాలా చర్చలు, విముఖతలు,సుముఖతలెన్నో విన్పించాయి.యీమెకు హిందీ కవిత్వానికిచ్చే ప్రతిష్టాత్మకమైన భరత్ భూషణ్  అగ్రవాల్ పరస్కారం 2016 వ సంవత్సరానికి గానూ లభించింది. హిందీ సాహిత్యప్రపంచం జీర్ణించుకోలేక పోయింది.జ్యూరీ సభ్యులలో వొకరైన వుదయ్ ప్రకాష్ మాత్రం సరైన యెంపికేనని కొత్త వొరవడిని ఆహ్వానించాలని చెప్పారు.

సాంప్రదాయ శిల్పపు నడుములను విరచి ముక్కలుగా చేసి రాస్తున్నప్పుడంతా యిలాంటి చర్చలు జరగడం సహజమే అన్పిస్తోంది.

శుభం శ్రీ యీ కవితలో నెరేటివ్ వ్యాఖ్యానపు వుత్తరాధునిక శిల్పమైన పెరడి గొప్పగా కనిపిస్తుంది.కవిత్వపు జడత్వాన్ని విదిలించే వొక కావ్యాత్మక ప్రయత్నాన్నీ తిరస్కరించే కంటే దానిని అర్థం చేసుకొనే దృష్టిని అలవరచుకోవాలి. యీ కవితలో కవిత్వం రాయడం వొక వ్యాపారంగా,వొక కెరీర్గా భావించే వారిపై తిరుగుబాటు కనిపిస్తుంది.సోషల్ మీడియాపై వొక గర్జన, యింకా వామపక్ష భావజాలం, స్త్రీ పట్ల మగవాడి పెత్తందారి ప్రవర్తన,రాడికల్ స్త్రీవాద చర్చలు యీమె కవిత్వంలో అంతర్లీనంగా వుంటాయి.యిది మౌఖిక కవిత యిందులో కవిత్వాన్ని యెలాంటి ఫలాలు యివ్వని చర్యగా,ప్రపంచ వ్యాప్తంగా యే వుద్దేశ్యాలను పూరించలేక పోతుందని వాపోవడం కనిపిస్తోంది.

పొయెట్రీ మేనేజ్మెంట్
—————————

కవిత్వం రాయడం బోగస్!
అరే,పనికిరాని పని
మొత్తంగా….
పనిపాటలేని పని!
పార్ట్ టైం!

మావాఁ,యేదో నెమరేసినట్టు
యెంబియే సేమ్ బియే టైపు అన్పిస్తోంది
గుజ్జు వచ్చేస్తోంది గురూ!

యిటు వొక కవిత రాసారనుకో;
సెన్సెక్స్ పడిపోతుంది
కవి లింగరాజు వొక కవిత రాసారు
పెట్టుబడివాదాన్ని వ్యతిరేకిస్తూ
సెన్సెక్స్ పడిపోయింది
ఛానల్ లో చర్చ
యిది వొక నమూన
అమెరికా సామ్రాజ్యవాదం పడిపోయిందని
వెనిజులతో ప్రేరేపింపబడిన కవులను
అమెరికా నియంత్రించగలదా?
ఆర్థికమంత్రి వుపన్యాసంలో
చిన్న యిన్వెష్టర్లకు నమ్మకం లభిస్తుంది
ఆర్బీఐ వెంటనే రెపోరేటును పెంచేస్తుంది
మీడియాలో గందరగోళం
సమకాలీన కవిత్వం
వొక సంకలనంగా ప్రచురింపబడుతోంది
వొక సామాన్యుడు యీ కవితాసంకలనాన్ని
యెలా యెదుర్కుంటాడో ?దీని గురించి
మీరే చెప్పండి
మీ స్పందనలు మాకు యెస్యంమెస్ చేయండి

అరే, సీ పీ వో (చీఫ్ పొయెట్రీ ఆఫీసర్)పేరు
ఆకాశంలో మెరుస్తుంటుంది
యాడ్లు ప్రతి కార్యక్రమంలో చూపిస్తుంటారు
రిలయన్స్ డిజిటల్ కవిత
లైఫ్ ను యిచ్చును
టాటా కవిత
ప్రతి పదం మీ కోసమే
ప్రజలు తమ డ్రాయింగు రూముల్లో
వేలాడదీస్తారు
అరే, వావ్ భలే వుందే! అని
యే అకాడమీ వాడికో అనిపిస్తుంది
లేదండీ, యింపోర్టెడ్
అసలైనది కోట్ల డాలర్లది
మేము డూప్లికేటు కొనుక్కున్నాం
పిల్లలు వ్యాసాలు రాస్తారు
నేను యం పీ యే చదువుతానని
యలైసీ పొయెట్రీ యిన్సురెన్స్
మీ కల కూడా మాదే
డియూ, పొయెట్రీ ఆనర్సు, ఆకాశంలో
కట్ ఆఫ్ ప్యాట్ (పొయెట్రీ ఆప్టిట్యూడ్ టెస్టు)
పరీక్షలో మళ్ళీ అమ్మాయిలే సత్తా చాటారు
ప్యాట్ రిజర్వేషన్లలో జరిగిన అవినీతికి
వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో
వి.సీ.దిష్టిబొమ్మ దహనం చేయబడుతుంది
దేశంలో యెనిమిది కొత్త కవితాసంస్థల
స్థాపనకు ఆమోదముద్ర లభిస్తుంది

మూడేళ్ళ వయసుకే
మూడువేల కవితలు వల్లెవేస్తుంది
భారతదేశపు పసిఅధ్భుతం
అమెరికా యిరాన్ ప్రవృత్తితో దిగులు పడి
ఫారసీ కవితాసాంప్రదాయాన్ని వోడిస్తుంది.

యిది ఆల్ యిండియా రేడియో
వార్తలు చదువుతున్నది దేవానంద రావు
నమస్కారం
యీ రోజు ప్రధానమంత్రి అంతర్జాతీయ
కావ్యసమ్మేళనంలో పాల్గొనేందుకు
మూడురోజుల పర్యటన కోసం బయలుదేరారు
యిందులో కవితాగుంపుల నుంచి
ప్రతినిధులుగా పాల్గొంటున్నారు.
భారతదేశం యెలాంటి పరిస్థితులలోనూ
తన విధానాన్ని మార్చుకోదని స్పష్టం చేసింది
భారత్ – పాకిస్తాన్ ల కవితా దైపాక్షిక చర్చలు మళ్ళీ విఫలం.
పాకిస్తాన్‌ యిక్బాల్,మంటో, ఫైజ్ ల
వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకోమటోంది

చైనా నేడు మళ్ళీ కొత్త కావ్యాలంకారాలను పరీక్షించింది
యిప్పుడు అతిశక్తివంతమైన కావ్యసంపుటాలను
సృష్టిస్తుందనే కథనాలు విన్పిస్తున్నాయి
యీ రోజు వుదయాన్నే ప్రముఖ కావ్యనిర్మాత ఆషిక్ ఆవారా ప్రాణాలొదిలారు
వారి అకాల మరణానికి రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు
వుత్తరప్రదేశ్ లో మళ్లీ దళితులపై దాడి
అటు క్రీడల్లో భారత్ వరుసగా మూడోసారి
కవిత అంతాక్షరిలో పసిడిపతాకాన్ని సాధించింది
భారత్ వరుస సెట్లలో 6 -4, 6-4, 7-2 తో
మ్యాచ్ ను గెల్చుకుంది
వార్తలు సమాప్తం

వచ్చేసింది నేడే హిందూ,హిందుస్తాన్ టైమ్స్, యీనాటి పత్రిక, ఆంధ్రనాడు
తెలంగాణ జ్యోతి
యువకుల్లోకి ప్రవేశించిన పొయెట్ హేర్ స్టైల్ జ్వరం
కవయిత్రులు తమ కురచైన,పొడవైన
అచ్చుల రహస్యాలను పంచుకున్నారు
ముప్పై యేళ్ళ యెం పీ యే అబ్బాయికీ
సంస్కార,సాంప్రదాయబద్ధమైన వధువు కావాలి
యిరవై ఐదు సంవత్సరాల యెం పీ యే చేసిన
సన్నని పొడవైన వధువు కోసం యోగమైన
వరుడు సంప్రదించగలరు

గురూ! తమాషాగా వుందే
మాట్లాడుతూనే వుండూ
నేనూ హీరో అవుతాను
యెక్కడికెళితే అక్కడ ఆటోగ్రాఫ్ లు
యిస్తూనే వుంటాను
చాల్లే రా
థార్డ్ డివిజనులో యెం .యే
యెం పీ యే ఫీజు యెవరిస్తారు?
కూర్చోని ప్రూఫ్ రుద్దూ.

*

ఆదివాసీల కొత్త గొంతుక!

jacinta

జార్ఖండ్ రాంచిలో నివశించే 32 యేళ్ళ జసింత కేర్ కెట్టా వోరాన్ అనే ఆటవి తెగకు చెందిన వో సాహస పాత్రికేయురాలు,ఆవేశపూరితమైన కవయిత్రి.కార్పోరెట్ వుద్యోగాలను  వొదలి తను పుట్టిన, తాను సంబంధపడిన ఆదివాసి మూలాలలోని కష్టాలకూ,మౌఖికంగా,రాతపూర్వకంగా,కవితాత్మకంగా ఫుల్ టైం శ్రమిస్తూ,బయటి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రకటిస్తున్న ధైర్యవంతురాలు.తన ఆదివాసి సమాజంలో బాలికలలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆదివాణి అనే వో ప్రచురణ సంస్థను సొంతంగానే స్థాపించింది.

యీమె మొదటి కవితాసంకలనం అంగోర్ (నిప్పు) హిందీ ఆంగ్ల భాషల్లో వొకే సంకలనంగా విడుదలైంది.యిదేకాక హిందీ-జర్మన్ అనువాదం,హిందీ-డచ్ అనువాదాలు ప్రపంచవ్యాప్తంగా గత మే నెలలో ప్రచురింపబడ్డాయి. యీమె కవితాసంకలనం వొక సంచలనం.భారత దేశంలో కంటే విదేశాల్లో అనేక స్పందనలు, అనేక సమీక్షలు వొచ్చాయి.

యీమె కవిత్వంలో అడవి సౌందర్యంతో పాటు ఆదివాసీల భయం, పీడన,అభద్రత,బయటి ప్రపంచపు దోపిడీ, వారి సంస్కృతి పరిరక్షణ,అడవిని తవ్వకాలపట్ల విపరీత వ్యతిరేకత కన్పించే ప్రధాన వస్తువులు.చిన్నప్పటి నుంచి నాలో యేదో బూడిదలో దాగిన నిప్పులా లోలోపల యెక్కడో దహించివేస్తుండేది-అది యిప్పుడు అర్థం అయి యీ బాటను యెంచుకున్నాను అంటోది జసింత. యీమె కవిత్వం చదువుతుంటే పాఠకుడిలో సంభవించే విస్పోటనాలు,కోపం,ఆవేశాలను, నొప్పినీ  పర్సానిఫై చేస్తుంది.

~

satya2

చిత్రం: సత్యా సూఫీ

సుడిగాలులు – దిక్కులు
——————————

యీ నేల పైన
పిడికెడు గింజలు
మిగిలివుండాలి
అందుకే వరిపొట్టు
తూర్పార పట్టేందుకు
నిలబడి వుందొక వూరు
వేడిగాలులకు యెదురుగా

యిలా పని చేస్తున్న వొక సాయం వేళ
పెంకుల రంధ్రాలలో నుంచి
చూసుకొంటోంది దీపపు వెలుగును
కాలిబాటల నుంచి నిశబ్దంగా నడిచి
వచ్చే సుడిగాలులను
పరుగెత్తుతున్న తాజావాసనపు వొరిగింజల నుంచి తీగలను
యెండ యొక్క నిప్పులాటి కత్తిపదునును, కొడవలిని
సుడిగాలుల వక్షస్థలంపై పూడ్చిపెట్టేందుకు..

తటాలున నిలబడి చూసి

వేగంగా వీస్తున్న గాలుల కత్తితో
ధృఢమైన వూరిగాయం పైన
దిక్కుల్ని చీల్చి వేస్తోంది

వారి చరిత్ర పాత గుడ్డపేలికే
అది తనని తాను
మెల్లమెల్లగా ఘాఢమైన చీకట్లోకి
వోదార్పునిచ్చే దిక్కుల ఆధీనంలోకి …

చివరికి దిక్కులు
వెలుగు అభయాన్ని యిచ్చి
సుడిగాలుల్లోకి తోసేస్తాయి

వూడ్చుకొంటారూ
అధికారమిచ్చి
అధికారాన్నే

“యీ నేలను కాపాడేందుకు
యెవరో వొకరూ
ప్రాణాలర్పించుకోక తప్పదు”.

మూలం :జసింత కెర్ కెట్టా

యెదురుచూసే నేలలా…

arun

వుత్తర్ ప్రదేశ్ బిజనోర్ లో ఫిబ్రవరి 16, 1972 లో పుట్టిన డా. అరుణ్ దేవ్ తన వున్నత విద్యను జవహర్‌లాల్‌  నెహ్రూ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసారు. యువకవి,విమర్శకులైన అరుణ్ దేవ్ “క్యా తో సమయ్” అనే తన కవితా సంకలనాన్నీ 2004 లో భారతీయ జ్ఞానపీఠ్ ప్రచురిస్తే, “కోయితో జగాహ్ హో” అనే మరో సంకలనాన్నీ వాణిప్రకాషన్ వారు ప్రచురించారు. వీరి కవితలు నేపాలీ,అసామీ,ఆంగ్లం,మరాఠీ భాషల్లో అనువదింపబడ్డాయి.గత అయిదు సంవత్సరాల నుంచి సమాలోచన్ అనే హిందీ అంతర్జాల పత్రికను నడుపుతున్నారు.

అరుణ్ దేవ్ గారు కవిత్వమంటే మానవత్వపు అనువాదంగా భావించే కవి.ఆయన కవిత్వం రాస్తూ నాగరికతను రాస్తుంటారు. దీని భూగృహంలో శవమైన విలువలు వుంటాయి.స్త్రీలు,పిల్లలు,నలుపు ముఖం కలవారి శాపంతో భయానకమౌతున్న యీ నాగరికతలో: రోజూ వొక నది మరణిస్తుంటుంది, వొక పక్షుల జాతి మాయమౌతుంటుంది, వొక జానపద పాట తన ప్రాణాలను కోల్పోతుంటుంది. యీ కవి మరో ప్రపంచాన్ని ఆశిస్తూ రాస్తుంటాడు.యితని కవిత్వంలో పొడిబారిన,వాడిన ముఖాల్లోని దుఖం పాఠకులను వెంటాడుతుంటుంది.

వారసత్వం
————–

పగటి వెలుగులో
పసిపిల్లవాడి యేడుపు కరిగిపోయింది
అక్కడే దగ్గరలోనే వొక తల్లి వుంది
ఆమె ముఖంలో
ఆ పసిపిల్లవాడి కలలు, దుఖపు క్లేశాలూ వున్నాయి.

ఆ తల్లి కోరికలో
వెన్నెల రాత్రి వుంది
ఘాఢమైన రాత్రి వాసనలో
అస్పష్టంగా పాడే కొన్ని కీచురాళ్ళు
వుదయం వొక ఆశలా
కొన్ని జాముల కోసం యెదురు చూస్తోంది

అమ్మ లాలిపాటలోని చంద్రుడు యెక్కడికో వెళ్ళిపోయాడు
అక్కడ వొక భయానక స్వరం విన్పిస్తోంది
అందులో నుంచి శతాబ్దాల నాటి పాత గీతాలు విన్పిస్తున్నాయి
అందులో వొక యెడారి వుంది
తాను దానిలో నడచి వెళ్తూవుంది యెందుకో తెలియదు

పిల్లవాడిపై యెండ
యెడారిలా రాలుతోంది
ఆమె యెండమావిలో జింక వొకటి పరుగెత్తుకుంటూ వచ్చింది
సీతాకోకచిలుక వెనుకగా విడివడి వెళ్ళిపోతూ రంగులు
పిల్లవాడి వీపుపై
ఆశకు ముందు వుండే దీర్ఘ నిరాశలు
కాల్చిన గురుతులు వున్నాయి

తల్లి దిగులుగా వుంది
పచ్చగడ్డి కోసం యెదురుచూసే నేలలా

అనువాదం, పరిచయం: పఠాన్ మస్తాన్ ఖాన్ 

*

ఆ లోతైన సముద్రం పేరు…

 

-పఠాన్ మస్తాన్ ఖాన్ 

~

babusha

మధ్య ప్రదేశ్ కు చెందిన బాబుషా కొహ్లీ 2014 సంవత్సరానికి గాను యువ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. ప్రేమ వుడత మనసు జామపండు(ప్రేమ్ గిల్హరీ దిల్ అఖరోట్ ) అనే తన మొదటి కవితా సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు.
బాబుషా కొహ్లీ, తన రచనలో భావాల లోతులను తాకే అనుభూతి, సంవేదనలను వినూత్నంగా వ్యక్తికరిస్తుంది.యీమె కవిత్వంలో ప్రేమ ప్రధాన కవితా వస్తువై కనిపించిన జీవితపు భిన్నత్వంలోని సంగీతం ప్రతిధ్వనిస్తుంది.

యింకా యీమె కవిత్వంలోని సాంద్రత, ఘాఢమైన అనుభవం,భాషా నవ్యతలు పాఠకులను మైమరిపిస్తాయి.సూఫీ ప్రేమతత్వము,విపరీత ఆరాధన యీమెలో కనిపించే ప్రధాన లక్షణం.

యీమె కవిత్వనిర్మాణం సంవేదనలతో పాటు బింబాత్మక ప్రతీకలు, ఆకృతులు మెండుగా వుండి పాఠకుల మనసులలో సులభంగా నిలబడిపోతుంది.

తూరుపు నుంచి పడమర వరకు
——————————————-

మొలకెత్తేందుకు ప్రతి వొక్కరి వద్ద వొక వుదయం వుంది.
మునిగేందుకు సరైన చోటు లేదు అనుకోనక్కర్లేదు .

పిడికెడు చల్లని కోరికను తీసుకొని
నీరసంగా తిరుగాడుతోంది వో యెండ కన్య

యీ ప్రపంచంలో వొక్క ప్రశ్నకు వొందల జవాబులు వున్నాయి.
భిక్షగాడి కోసం కాస్త దయ, పిండి, బియ్యం వున్నాయి.

సుఖం

దక్షిణగా లభించదు
రాత్రిని
నేను కోరుకొన్నప్పుడల్లా నా కళ్ళలోనికి లాక్కుంటాను
తూరుపు రంగులమయమై వుంది
కాటుక రేఖ ముల్లులా వుంది

తమసోమ జ్యోతిర్గమయ నుంచి
యీ యాత్ర కఠినమైంది
తూర్పు నుంచి పడమర వరకు

పదే పదే తిరుగాడుతూనే వుంది వో యెండ కన్య

అక్కడ
జ్వలిస్తూ
మండుతూ
నిప్పు రథమై
సంతోషంతో యెగురుతూ పరుగెడుతోంది
అక్కడ

అయినను
కాకపోయినను
ఆ లోతైన సముద్రం పేరు
పడమరే.

మూలం : బాబుషా కొహ్లీ

*

నీ పాదాల గురుతులు…

neel

మూలం :నీలోత్పల్

అనువాదం: పఠాన్  మస్తాన్  ఖాన్ 

~

మధ్యప్రదేశ్, వుజ్జయినికి చెందిన యీ యువకవి నీలోత్పల్ మూడు కవితా సంపుటాలను ప్రచురించాడు. నీలోత్పల్ భారతీయ జ్ఞానపీఠ్ యువకవి పురస్కారం తో పాటు అనాజ్ పక్నే కా సమయ్ (ధాన్యం పక్వానికి వచ్చే సమయం) అనే తన కవితా సంకలనాన్ని ప్రచురించింది.యితని కవితలు అనేక భారతీయ భాషల్లో అనువదింపబడ్డాయి. కెనడా నుంచి ప్రచురింపబడే సౌత్ యేషియన్ మ్యాగజైన్ లోనూ యితని కవితలు ప్రచురింపబడ్డాయి.

యితని కవిత్వపు అభివ్యక్తి విభిన్న స్థాయిలో ప్రకటితమౌతుంటుంది.యితని కవిత్వంలో వొక సంసిధ్ధత కనిపిస్తుంది.అతిపరిచితములను పరిచిత వస్తువులలోకి మార్చి దృశ్యాలకు ప్రాణం పోస్తాడు.యిలా జీవితాలకు కూడా అవసరమే కదా.యితని కవిత్వం తాకనితనాన్ని తాకుతుంది.నేటి సాంకేతిక ఆర్థిక ప్రధాన్య సమాజంలో వొక మనిషిగా తన గుండె చప్పుళ్ళను వినిపిస్తాడు.యితని కవిత్వంలో బౌధ్ధికపరమైన కఠినత్వం సహజంగానే వుంటుంది.యితని కవిత్వ ప్రపంచం మనలో దాగిన మానవత్వాన్ని,ప్రేమను,మార్మిక సందర్భాలను కదిలిస్తుంది.

South asian ensemble అనే పత్రికలో యితని కవితలు ప్రచురింపబడ్డాయి.

———————

అసంభవపు సౌందర్యంలా
—————–

లోయలన్నీ, గాలిపటాల్లా యెగురుతున్నాయి.

నీ అరచేతులు
వొక చల్లని కొండతో అతుక్కున్నాయి.

అతను వుదయాన్ని స్తంభించినపుడు
నీవు నదీ వుపరితలంపై నుంచి లేవడం
ఆవిరిలా వుంది.

నేను యీ తడి మంచు వానలో
నీ రొమ్ముల్లో అణిగివున్న కోరికల వైపుగా వెళుతున్నాను.

వొక మంచుముక్కలో
యెన్నో నీటి చుక్కలు దాగివున్నట్టు
నాకు తెలియదు

కొన్ని సీతాకోకచిలుకలు
వాటిని తాకడం కష్టం
నీవు అక్కడే వుంటావు
నీ కళ్ళల్లో ల్యాండ్ స్కేప్లూ యీతాడుతుంటాయి
నేను వొక్కొక్క దాంట్లోంకి దిగుతుంటాను.

సీతాకోకచిలుకలన్నీ అలలైనట్టు
నీవు వొక తెలియని నదీ అయినట్టు

లోయపు కొన్ని మెట్లు మునిగే వున్న
నీ పాదాల గురుతులు కనిపిస్తూనే వుంటాయి నాకు

అలల సంపూర్ణపు గోళాల్లో
నా చిత్రాన్ని కొల్లగొట్టావు
అసంభవపు సౌందర్యంలా

*

దహించేస్తున్న శీతల పవనంతో

Art: Rafi Haque

Art: Rafi Haque

 

-పఠాన్ మస్తాన్ ఖాన్

~
1.
వొక పూటలోని కొన్ని దేహాల్లో వేలాడే
అసంధర్భాలలోని పురా వాసనలను
మనిషికి పూసిన వొందల అక్షరాలతో
తనను వెతుక్కొంటూనే వేల యేళ్లుగా
ధ్వనీతీత నిశబ్దం ఆవరించిన వెలుగులో
రేపటికి వానకురుస్తుందనే
యేకరహస్యంలో వివృతమై…
2.
గుండెలకు చేరని శ్వాసలో మనసును చంపిన నిశ్చ్వాస లోని హననపు సత్తువ
నిర్మోహనంగానే గతిస్తున్నా వొక రేపటిదాకా
యీ ఆరిపోతున్న రంగుల్లో తేలిపోతున్న
నిర్మాణహీన ముక్కల్లో
గదులను దాటించి కిటికీలను తీయించి
గీసిన వొక వర్ణపటమౌతున్నప్పుడు
వృక్షపు వేర్ల నీడల బిగుతుతనం సడలింది
3.
యింకా మొలవని రెక్కలతో వాలు జారిన
యీ ధార స్వేదంతో కన్నీళ్ళతో కొండలను
లోయలను తాకి వుప్పు సముద్రమైంది
సలపరిస్తున్న గాయాల బరువును చూసి
పచ్చగా వాలిన వొక తడిలేపనం కరిగాక
మొలిచే ప్రాణమేదో మళ్ళీ కళ్ళతో చూడలేక పోతోంది
4.
కొత్త చివుళ్ళలో కాలిపోతున్న దేహానికి
తీరిగ్గా పాఠాలు వల్లెవేసే పురిటి నొప్పులను
వొక నడకలో మరణించిన వొందల దృశ్యాలను
వొకేసారి చూడలేని చేతకానితనపు కళ్ళజోడులతో
పరిధుల అవధులు మాత్రమే గుర్తొచ్చే
సంస్మరణలు కొన్నీ
5.
అన్నీ వర్ణాలను కిందుగా పరుచుకొన్నాకనే
అస్పష్టంగా మెరిసిపోతున్న బంగారు దిగులేదో
కక్కేసిన యెండుటాకులు ఫళఫళ రాలిపోతుంటే
దాచుకోవాలనుకొన్న మృత్యువును వొక చెట్టై నిండుగా మోసి
యెండకూ వెన్నెలకూ చివరి వరకు వేచి చూసి వాటి చివర్లలో
మళ్ళీ మళ్ళీ బధ్ధలైపోతున్న విశ్వపు ముక్కల విలీనం కోసం …వొక ప్రతీక్షలో
యింకా చనిపోతూనే వున్న…

 *

నను చూడలేని దృశ్యాలేవో నాలో..

 

 

-పఠాన్ మస్తాన్ ఖాన్

~
1.
మండే దీపపు మెత్తని శబ్దంలో
సరసర పాకి పారిపోతున్న సన్నని చీకట్లో
వర్ణాలు వర్షించే రంగుల సవ్వడిలో
రెపరెపలాడే పచ్చని ఆకుల కదలికల్లో
సూర్యతాపం మండుతున్న
వర్ణ రహిత దారిలో …
గబ్బిలపు వింత చర్మపువాపు నేనై…

 

2.
మట్టి పాత్ర నింపుకున్న శూన్యంలో
యింపైన ఆత్మీయ అనుంగత్వంలో
చివరి వరకూ చూసీ తరచిన నృత్తంలో
లోహ నిర్వహణపు నిర్మాణంలో
ముందే ముదుసలౌతున్న గతిలో
జలచుక్కల మబ్బు కణాల
కణతులను తరుముకుంటూ…నేను

 

3.
కఠిన శీతల గోళమేదో
నన్ను కరిగించలేక
అనాత్మిక అంకెలా
ముంపుడు కంచెలలో
ఝంఝాటపు వుచ్చులలో
యే క్రిమియో లోలోనే
తొలిచేసే గుజ్జును …నేనై

 

4.
విసర్జించిన అమలిన జ్ఞానం
ముక్తించలేని సంతోష వదనం
నిర్మోహించే దుఃఖ పటాలాలు
స్వేదజలంలోని యెరుపు ఘాఢత
దహనమూ ఖననమూ కాలేనంత
నిగుడుతనమేదో శిల్పతోరణమై
నెత్తిన మోయలేనంత బరువును మోస్తూ..

 

5.
యిక్కడా…. యెప్పుడూ…
నీలో కురవని తారజువ్వలేవో
కురిపించే వెలుగుల లిపులను లిఖించలేక
పరుగెడుతూ పరుగెడుతూనే
గ్రహాంతరయానంలోకి యెగిరి
వలస వెళుతూ వుంటానూ   ..

*