నామినికి తను గొప్ప రచయితనని నమ్మకం. అది నిజం కూడా!
గోర్కీలాగా తెలుగులోరాయగల రచయిత ఎవరు? అని ఎవరయిన ప్రశ్నిస్తే నూటికి డెభ్భైమందిసాహిత్య పాఠకులయిన సందేహం లేకుండా నామిని పేరు చెపుతా రు అది కూడా నిజమే! నామిని తాజా సృజన ‘‘మూలింటామె’’ చదివిన తరువాత ఎవరికైనా పైన వివరించినవన్నీ ప్రశంశలు కాదు అతిశయోక్తులు అనిపిస్తే బహుశా తప్పే మీ వుండకపోవచ్చు.
నామిని ఇంతకు ముందుకు రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు, ఈ మూలింటామె ఒక్కటి ఒక ఎత్తు. పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టురోడి కతలు, ఇస్కూలుపిల్లకాయల కతలు, ముని కన్నడి సే ద్యం ఇవన్నీ నామిని బాల్యం చుట్టూ, నామిని నోస్టాల్జియా చుట్టూ తిరిగితే, మూలింటామె మాత్రం అందుకు విరుద్ధంగాసమాజం మీద అందున సమకాలీన సమాజం మీద, ఒక పదునయిన వ్యాఖ్యానం చేయడానికిప్రయత్నం చేసింది. అంటే నామిని రచయితగా సమాజం తనను గుర్తించిన జానర్నుండి వేరే జానర్ లోకి ప్రవేశించాడ న్నమాట మాట. ఒక ఉత్తమ శ్రేణికి చెందిన రచయిత సమాజంతో పాటు తనూ మారుతూ, రూపాన్నీ , సారాన్నీ మార్చుకుంటూ, పదే పదే అంతర్ బాహిర్ రంగాలతో యుద్ధం చేయటాన్ని అభిలషించవలసిందే! అది సమాజానికి అవసరం కూడా !
కానీ ఆ పని సమర్ధవంతంగా చేయకపోతే, అప్పటిదాకా పేరుకు ముందు వున్న విశేషణాలు అన్నీ కేవలం అవశేషాలుగా మారిపోయే ప్రమాదం వుంది. నామినికి ఇప్పుడా ప్రమాదం ఎదురయింది.
‘‘మూలింటామె’’ ఒక కథ కాదు. రెండు కథల సమాహారం. మొదటి భాగాన్ని మూలింటామె నడిపిస్తే రెండవ భాగాన్ని మూలింటామె కోడలు పంది వసంత, లేదూ పందొసంత నడిపిస్తుంది.
మిట్టూరులో ఒక మూలమీద విశాలమయిన ఇంట్లో మూలింటామె వుంటుంది. మూల మీద ఇంట్లో వుంటుంది కనుక ఆమె మూలింటామె అయింది కానీ ఆమె పేరు కుంచమమ్మ.
మూలింటామెకు భర్త చిన్న వయసులోనే చనిపోతే, కొడుకునీ, కూతురునీ, రెండెకరాల పొలాన్నీ ఒంటి చేత్తో సాకుతూ వస్తుంది. కొడుకుకి యుక్త వయసు వచ్చాక , మనవరాలు రూపావతిని ఇచ్చి పెళ్ళి చేస్తుంది. మూలింటామె, ఆమె కూతురు నడిపామే , మనవరాలు రూపావతి, కొడుకు నారాయుడు ఇదీ ఆ కుటుంబం. నారాయుడుతో కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నాక రూపావతి, ఒకరోజు చెప్పా పెట్టకుండా ఒక అరవ మాదిగాయనతో వెళ్ళిపోతుంది. రూపావతి నే కొనమ్మి అనికూడా పిలుస్తారు.
కొనమ్మి వెళ్ళిపోయిందన్నవార్త నడిపామేకి,, మూలింటామెకి తెలియడంతో నవల మొదలవుతుంది. మొదటి భాగమంత , రూపావతి కనపడకుండా కథను నడిపిస్తుంది.
ఊరుఊరంతా, రూపావతి కన్నతల్లి నడిపామే తో సహా, కొనమ్మిని నానా మాటలు అంటున్నా అసహ్యించుకుంటున్నా మూలింటామెకు మాత్రం మనవరాలు మీద ప్రేమ తగ్గదు. ఆమె కోసం తపన పడుతూ ఉంటుంది.
కొనమ్మి వెళ్లిపోయిన పది రోజులు తిరగకుండానే,నడిపామే,, నడిపామే పెద్దమ్మ ఎర్రక్క కలసి నారాయుడికి కి రెండో పెళ్ళిచేస్తారు. నిండా ఇరవై ఏళ్లులేని పందొసంత మూలింటామె ఇంట్లోకి కోడలు రూపంలో అడుగుపెడుతుంది.
పందొసంత అడుగు పెట్టాక కథ వేగాన్ని అందుకుంటుంది. వ్యవసాయం దండగని గ్రహించిన వసంత ఇంటిముందు కిరాణా షాపు పెడుతుంది. అత్తింటింకి వచ్చీరాకుండానే భర్తకు వరుసకు తమ్ముడయ్యే రంగ బిళ్ళతో సంబంధం పెట్టుకుంటుంది. ఆ సంబంధం నెల రోజులు కూడా నిలవదు. మూడు ట్రాక్టర్లున్న చంద్రారెడ్డితో సంబంధం పెట్టుకుంటుంది. చంద్రారెడ్డి అండతో వడ్డీవ్యాపారం మొదలుపెడుతుంది. చిట్టీలు నడుపుతుంది.
విశాలమైన ఇంటిచుట్టూ ఉన్న చింత, సీమ చింత లాంటి చెట్లన్నీ అమ్మేస్తుంది. పనిలో పనిగా నారాయుడికి కి సిగరెట్ త్రాగడం నేర్పుతుంది. మందు కొట్టడం నేర్పుతుంది. ప్యాంట్ షర్టూ వేసుకొని మోపెడ్ నడపడం నేర్పుతుంది.
అన్నింటినీ మించి తన ప్రియుడిని తమ్ముడు అనడం నేర్పుతుంది.
చివరకు నారాయుడికి ఉన్న బండిని , ఎడ్లను, రెండేకరాలని అమ్మేస్తుంది. రెండెకరాలు కొనుక్కున్న వారికి పొలం రిజిష్టరు చేయడానికి మూలింటామెను రమ్మంటే, మూలింటామె రానంటే రానని మొండి కేస్తుంది.
మూలింటామెను బెదిరించడానికి ఆమె ఇష్టంగా పెంచుకొనే నాలుగు పిల్లుల్లో రెండింటిని చంపేసి రిజిస్ట్రేషన్ కి రాకపోతే ఏం జరుగుతుందో అన్యాపదేశంగా చెప్తుంది. మూలింటామె విషపు ఆకుతిని చనిపోతే ఇంట్లోనుండి శవం లేచీ లేవకుండానే రెండెకరాల పొలం రిజిస్ట్రేషన్ చేసేస్తుంది.
ఇది మూలింటామె కథ. ఈ కథ ద్వారా నామిని రెండు విషయాలను పదునుగా వ్యాఖ్యానించాలి అనుకున్నాడు . ఒకటి సమాజంలో నీతి, నైతికత అనే రెండు బ్రహ్మ పదార్ధాలను వర్ణం, వర్గం ఆధారంగా సమాజం ఆమోదించడమో, తిరస్కరించడమో
చేస్తుంది. రెండు అభివ ద్ధి అనే జగన్నాధ రధ చక్రాల క్రింద అన్ని రకాల విలువలూ పడి నలిగిపోయి నశించి పోతాయి . నిజానికి ఇవేమి కొత్త విషయాలు కావు.
ప్రపంచీకరణ దుష్పలితా లు భారత, మరీ ముఖ్యంగా తెలుగుదేశ గ్రామీణ సమాజాన్ని కబళించడం మొదలైన దగ్గర్నుండీ ఎంతో మంది చెప్తువస్తున్నవే కానీనామిని ఈ సబ్జెక్టును ఎన్నుకోవడమే కొత్త.
ఈ కథ 1984 లో జరుగుతుంది. మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు భారతదేశంలో మొదలుకావడానికి కనీసం అర్థ దశాబ్దం ముందు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు నాయుడు చెప్పడానికి కనీసం పదేళ్ళముందు. 2014 కళ్ళతో 1984 నాటి సమాజాన్ని వ్యాఖ్యానించడం లోని కాలిక స్ప హ గురించి చెప్పుకోవలసింది ఏం ఉంటుంది?
కొనమ్మి అనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన స్త్రీ కళాయి పోసుకొనే అరవ మాదిగ పురుషుడుతో వెళ్ళిపోతే మిన్నూ , మన్నూ ఏకంచేసి గొడవ చేసిన సమాజమే,అదే సామాజిక వర్గానికి చెందిన మరొక స్త్రీ , మరో బలమైన రెడ్డి సామాజిక
వర్గానికి చెందిన పురుషుడుతో సంబంధం పెట్టుకొని సరాసరి ఇంటికే రప్పించుకుంటే కిక్కురుమనదు పైగా ఆ స్త్రీ కి అండగా నిలుస్తుంది.అటువంటి సమయంలో బాధ్యత గల రచయిత ఏం చేయాలి?
సమాజంలోని అవలక్షణాలను, దుర్నీతిని ఎండగడుతూనే సమాజానికి దిశా నిర్దేశం చేయాలి. మామూలు మనుషులు లాగా ఒక తప్పును మరొక తప్పుతో సరిచేయాలి. అనుకోకూడదు. కానీ నామిని చేసింది అదే. పందొసంతను సమర్ధించడానికో, కొనమ్మిని విమర్శించడానికో, సమాజం యొక్క దుర్నీతిపైన యుద్ధం ప్రకటించి పొయెటిక్ జస్టిస్ సాధించడానికో ఆ సమాజం మొత్తం కలుషితమైపోయిందని చెప్పి ఒక జీవం లేని నవ్వు నవ్వాడు.
జీవితంలో త్వర త్వరగా పైకి ఎదగడానికి అడ్డువచ్చిన ప్రతి దాన్నీ తొక్కేస్తూ వెళ్లిపోవడం అనే ఆధునికి జీవన వ్యాపార సూత్రాన్ని కరతలామలకం చేయడానికి పందొసంతను సృష్టించిన , నామినికి ఆ పాత్ర పట్ల ఉన్న ప్రేమ మిగతా పాత్రలకు అన్యాయం చేసింది. సమర్ధుడైన రచయితకు ఇది తగదు.
చివరకు మిగిలేదిలో బుచ్చిబాబుకి కోమలి పట్ల, కాలాతీత వ్యక్తుల్లో పి. శ్రీదేవికి ఇందిర పట్ల రవ్వంత ప్రేమ ఎక్కువగా ఉంది అన్న విషయం. పాఠకుడికి తెలుస్తూనే ఉంటుంది. బుచ్చిబాబు కానీ, పి. శ్రీదేవి ,కానీ మిగత పాత్రలకు అన్యాయం చేయలేదు .
రచయిత ఒక ప్రపంచాన్ని సృష్టించాక పాత్రలను వాటి మానాన వాటిని ఎదగనిస్తే ,వాటి సంతోషాలను, వాటి దు:ఖాలనువాటిని అనుభవించనిస్తె మంచి నవల పుడుతుంది.
రచయిత ఎప్పుడైతే తన పాత్రలను నియంత్రించడం మొదలుపెడతాడో అప్పుడు అవి తమ సహజ సిద్దమైన పరిమళాన్ని కోల్పోతాయి . బుచ్చిబాబు దయానిధి, విశ్వనాధ ధర్మారావు , గోపీచంద్ అసమర్ధుడు ఇన్నాళ్ళు బతికి వున్నారంటే వారి మీద ఆయా రచయితల నియంత్రణ లేదు.
ఇందులోని నారాయుడు పాత్ర రచయిత నియంత్రణ ఉంటే ఎలా నిష్క్రియాపరంగా తయారవుతాయో తెలియజేయటానికి ఒక మంచి ఉదాహరణ. ప్రతి పాత్ర ప్రవర్తన వెనుక ఉన్న కార్య కారణ సంబంధాలు తెలివైన పాఠకుడి కి ఛాయా మాత్రంగానైన గోచరమౌతూఉండాలి.
అప్పుడు మాత్రమే ఆ పాత్రలను పాఠకుడు సానుకూల దృక్పధంతో హృదయంలోకి తీసుకుంటాడు. అలా కానప్పుడు నవలలో పాత్ర అయితే ఉంటుంది కానీ, అందులో ఆత్మ ఉండదు.
మొదటి భార్య కొనమ్మి అరవ మాదిగ ఆయనతో వెళ్ళిపోయినప్పుడు నారాయుడు ప్రతి స్పందన మనకు తెలియదు. రెండో భార్య ప్రియున్ని ఇంట్లోకే తెచ్చిపెట్టుకుంటే అతని స్పందన ఏంటో కూడా మనకు తెలియదు. నారాయుడి మౌనానికి , నిష్క్రియా పరత్వానికి ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. లేక పోతే మామూలు మనుషులు లాగే అతడి కి కోపం, దు:ఖం, నిస్ప హ లాంటి భావోద్వేగాలు ఎందుకు కలగలేదు. అనే సంశయం పాఠకుడి ని వేధిస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ బలమైన కారణం రచయితే.
రచయిత దృష్టి ఎంత సేపటికి పందొసంత మీద ఉంది తప్పిస్తే నారాయుడి మీదకు మళ్ళలేదు. పందొసంత పాత్ర చదువుతుంటే నాకు రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు నవలలోని మంజరి గుర్తుకొచ్చింది. మంజరి కార్యస్థానం వేరు. పందొసంత కార్యస్థానం వేరు. చిత్రసీమలో తప్పనిసరి పరిస్థితులలో తన లక్ష్యాన్ని చేరడం కోసం అందరికి శరీరాన్ని అప్పగించి అత్యున్నత స్థాయికి వెళ్ళి అధమ స్థాయికి పడి పోతుంది మంజరి. కానీ, ఈ నవలలో పందొసంతకి శరీరాన్ని రంగ బిళ్ళకి, చంద్రారెడ్డికి అప్పగించాల్సినంత బలీయమైన కారణాలను పాఠకుడి కి రేఖామాత్రంగానైనా నామని చెప్పలెదు. పాకుడు రాళ్ళూ నవలలో భరద్వాజ చెప్పాడు కనుక మంజరి పట్ల పాఠకుడ కి సానుభూతో, సహానుభూతోకలుగుతుంది. పందొసంత విచ్చలవిడి తనానికి , విశృంఖలత్వానికి ఉండవలసిన తాత్త్విక భూమిక ఏదీ నవలలో కనిపించదు. పోనీ ఆతాత్త్విక భూమిక గ్లోబలైజేషన్ అనుకోవాలనుకున్నా , ఈ కథ నడ చింది మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు మొదలుకావడానికి దశాబ్దం ముందు. పాతికేళ్ల క్రితం ఆంధ్రదేశంలోని పల్లెటూళ్లు ఇప్పుడు కలుషితమైనంతగా అప్పుడైతే కాలేదు. కనుక పొయెటిక్ లిబర్టీ ఇక్కడ అస్సలు అన్వయించదు.
ఈ నవల అంత కామంతో నిండి పోయిన చీకటి పాఠకుడి ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దానికి తోడు రచయిత ధారాళంగా , యధేచ్ఛగావాడిన బూతు, అశ్లీల పదజాలం కొంచెం కఠిన మైన మాటేమోకానీ, రోత కలిగిస్తుంది. ఈ బూతు వాడటం ఏ శిల్ప సౌందర్యం కోసమో నాకయితే అర్ధంకాలేదు. ఈ బూతు పురాణం గురించి నామిని ఏమంటున్నాడో చూడండి.
‘‘నా పుస్తకంలో బూతులుంటాయనే మాట గురించి. కొన్ని కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం ఇంగొకటుండదు. నేను పల్లెటూరోడి ని, యం.ఎస్సీ దాకా చదువుకున్న . మళ్ళా కతలు రాసేసిన . అదే ఊళ్ళో వాళ్ళ మింద. మా ఊళ్లో పి.జీ. చేసిన మా ఎత్తిరాజులు బావ తమ్ముడు జయ చంద్ర నాయుడు అని ఎకనమిక్స్ లెక్చరర్గా ఇప్పుడు ఉండాడు. మరేదస్తుడు. ఒక్క బూతు పదం మాట్లాడంగా ఎవరూ ఇనిండరు. నేను మా మేనత్త అయిన వాళ్ళమ్మను జుట్టుకు ముడేసుకున్న గుడ్డ పీలికను పెరికేసి ‘‘నువ్వు బోయే లంజా’’ అనే వాడిని . మా జయచంద్ర బావకు మా అమ్మ మేన మామ పెండ్లాం కదా. అత్తా , చిన్నత్తా అని మరేదగా పిలిచేవోడు.
ఎమ్మేస్సీ చదవంగానే నేను ఊళ్లో ఆడోళ్ళందరి దగ్గర మరేదలు పొందుతా, వాళ్ళకు పిలుపుల్లో మరేదలిస్తా, వుండా ననుకోండి , నేనేంది పుస్తకం రాసేది బొచ్చులో కొంచెం’’
ఇవి నా మాటలు కావు. నామిని ఆత్మకథ. నామిని నెం. 1 పుడింగి అనే పుస్తకంలోవి. పుస్తకం నిండా బూతులురాయడానికి చెప్పిన కారణమేమీ నాకు కన్విన్సింగ్గా లేదు. కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం ఇంగొకటుండదు అనే బుకాయింపు ఒకటి.
‘‘మొగోడన్నాక , మొగోడి గా పుట్టినాక మొగోడి ఆటలే ఆడాల. మొగోడు తిరక్కపోతే, తిరక్కపోతే ఏరిగే ఆడది కూడ ముడ్డినట్టా పైకి లేపదు. నువ్వు తాగితే చూడాలని, ఒక లంజని పెట్టుకుంటే చూడాలని ఉండాది. నువ్వియ్యాళకు ఒక లంజని పెట్టుకునేది కూడా నేర్వలేదని ఊరంత నవ్వుకుంటుండారు’’ ఇలాంటి మాటలు ఈ నవల నిండా కోకొల్లలు. వీటిని ఏవో కొన్ని మాటలు అని నామిని అంటే నామినికో నమస్కారం.
ఈ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతిలో సమీక్షిస్తూ జి.ఎస్.రామ్మోహన్ ‘‘నామిని మూలింటామెను కావ్య నాయిక చేశారు. ధర్మారావు , ధయానిధి ప్రక్కన పీట వేసి కూర్చోబెట్టారు.’’ అని చెప్పారు. ధర్మారావు అంటే నాకు వేయి పడగలలోని ధర్మారావే గుర్తుకొచ్చాడు . వేయి పడగలు నవల ఇలా ముగుస్తుంది.
చివరకు ఏమి మిగిలింది?
నీవు మిగిలితివి. నేను మిగిలితిని అంటూ చిన్న ధర్మారావు , చిన్న అరుంధతి వైపు చూస్తాడు.
విశ్వనాధ ఎంత అభివ ద్ధి నిరోధకుడు అయినా కానీ , ఒక సంప్రదాయ వ్యవస్థను నిలబెట్టడం కోసం చిన్న ధర్మారావుని నిలిపాడు.
మరి నామిని ఏ విలువలను కాపాడటం కోసం మూలింటామెను చంపేశాడు ?
‘‘ఒక పుస్తకం చదివాక , మనలో మంచి రసాయన ఊరాల ’’ అని నామిని తన ఆత్మ కథలో అన్నాడు . నాలో అయితే ఈ పుస్తకం చదివాక ఏ రసాయనము ఊరలేదు. కాముకత్వపుచీకటిలో దారీ తెన్నూ కనపడక కూలపడి పోయాను.
నామినీ ఏమిటీ పని?
-వంశీకృష్ణ
తాజా కామెంట్లు