‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని!

our-legend-of-cinema-christopher-nolan-1007037965

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న ‘‘ఇంటర్ స్టెల్లార్’’ సినిమాని బాగా అర్ధం చేసుకోవాలన్నా మరో కీ కావాలనిపిస్తోంది. శాస్త్రీయ నారికేళ పాకం చెట్టుదింపుకుని కాయకొట్టుకుని కొబ్బరిముక్క జాగ్రత్తగా తీసుకుని తింటే కానీ రుచితెలియని విధంగా. సినిమాని అర్ధం చేసుకోవడానికి నామట్టుకు నాకయితే మరికొంత రిపరెన్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మిత్రులతో ఆ తాళం చెవిని పంచుకుందాం అనుకుంటున్నాను.

భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంటే ఏం చేయాలి. తినడానికి తిండి పండించుకోలేని స్థితి, వుండటానికి అనువుగా లేని వాతావరణం ఏర్పడుతుంటే ఏం చేయాలి. ప్లాన్ ఏ, లేదంటే ప్లాన్ బి పనిచేస్తాయేమో ననే ప్రయత్నం ‘‘ ఇంటర్ స్టెల్లార్’’ భూమిలాగానే నివాసానికి అనుకూలంగా వుండే ఇతర గ్రహాలను అన్వేషించడం అక్కడ మళ్ళి మానవ జీవితాన్ని ప్రారంభించడం కోసం చేసే ప్రయాణం తాలూకు కథనం ఇది. ఇక ఈ చిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడు క్రిస్టొఫర్ నోలాన్ గురించి చెప్పాలంటే దీనికిముందు తీసింది పట్టుమని పదిసినిమాలే అయినా వందల సంవత్సరాలు గుర్తుంచుకోవలసిన అంశాలని వాటిలో చర్చించాడాయన. నగరాన్ని దాని ఆస్తులనూ నేరస్తుల పాల బడకుండా అడ్డుకునే సూపర్ హీరో బ్యాట్ మెన్ ఆయన సృష్టే, ట్రయాలజీలు తీసినా వెయ్యికోట్ల బిజినెస్ చేయగలగటం అంటే ఫిక్షన్ తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నా ప్రేక్షకుల నాడివదలడు అనడానికి నిదర్శనం.

సినిమాలో కీలకంగా వచ్చే కొన్ని పదాలు తెలిస్తే సినిమాలోకి ప్రవేశించడం మరీ సులభం అవుతుంది.

టైటిల్ గా వున్న ఇంటర్ స్టెల్లార్ అంటే తారాతీరం (occurring or situated between stars) అనే అర్ధంలో డిక్షనరీలు ఇచ్చాయి కానీ విశ్వంలోని నక్షత్రాల మధ్య వున్న ఖాళీని కాకుండా రెండు విశ్వాల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. అవును ప్రపంచంలో ఒక్కటే విశ్వం కాదు అనేక విశ్వాలు వున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు ఒకవిశ్వానికీ మరో విశ్వానికీ మధ్యనున్న ఖాళీ ప్రదేశాన్నే ఇంటర్ స్టెల్లార్ అని పిలుస్తున్నారు.

AI

ఐదు డైమెన్షన్ల(5D) ప్రపంచం : మనం మనుగడ సాగిస్తున్న ప్రపంచానికి పొడవు, వెడల్పు, లోతు అనే మూడు డైమెన్షన్లతోనే(3D) గమనిస్తున్నాం. కానీ కాలం (time), ప్రదేశం/స్థలం (space) అనే మరో రెండు డైమెన్షన్లు కూడా విశ్వానికి వున్నాయి. కాంతి వేగంతో ప్రయాణించేప్పుడూ, వేర్వేరు గురుత్వాకర్షణలలలో వున్నప్పుడూ మనం లెక్కించుకునే కాలంలోనూ, ప్రదేశం లోనూ మార్పులు వస్తాయి. ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అత్యధిక ద్రవ్యరాశుల వద్ద కాలం నెమ్మదిస్తుంది. ప్రదేశం సాగుతుంది. అందుకే హీరో కూపర్ వెళ్తూ వెళ్తూ తన పదేళ్ళ కూతురికి తను వచ్చే సరికి తనవయస్సు కూతురు వయస్సు ఒకటిగానే వుంటాయని చెపుతారు.

 

బ్లాక్ హోల్ (కాల రంధ్రంకాలబిలం, కృష్ణ బిలం, కర్రి గుండం) : విశ్వంలోని ప్రతి ద్రవ్యరాశికీ ఆకర్షించే గుణం వుంటుంది దాన్నే గురుత్వాకర్షణ అంటున్నాం. దాన్నుంచి ఏదైనా విడిపోవాలంటే కొంత వేగంతో దూరంగా వెళ్ళాలి దాన్ని పలాయన వేగం అంటున్నాం. భూమిమీదనుంచి బయటకు పంపే రాకెట్లకు ఈ వేగాన్ని అందిస్తేనే అవి భూమి ఆకర్షణనుంచి బయటకు వెళ్తున్నాయి. కానీ బ్లాక్ హోల్ అనే ప్రాంతంలో కాంతికూడా ఆకర్షణనుంచి విడివడలేదు. అంటే కాంతివేగంతో ప్రయాణించగలవస్తువైనా ఈ కృష్ణబిలం నుంచి బయటకు రాలేదు. అందుకే బ్లాక్ హోల్ అంటే నిర్వచనంగా పలాయన గమన వేగము కాంతి యొక్క వేగం కన్నా ఎక్కువ ఉంటుందో దానినే కాల రంధ్రం లేదా కాలబిలం అంటున్నారు. కాంతి కూడా బయటకు రాదు కాబట్టే అది చీకటి గుహ అయ్యింది. విశ్వంలో గుర్తించిన విశాలమైన ఖాళీలు దానివైపు ఆకర్షింపబడుతున్న దూరపు నక్షత్రాల ఆదారంగా దీన్ని పరోక్షంగా గుర్తించడమే.

కాలబిలం లోపలనే అనేక పిల్ల విశ్వాలున్నాయనీ భూమ్మీద నివసిస్తున్నామనుకుంటున్న మనం కూడా ఒకానొక కాలబిలంలో బంధీలమేననేది ఒక సిద్ధాంతం. అయితే ఒక కాలబిలంలోపటి విశ్వలోకి ప్రవేశించిన మనుషులు మరోకాలబిలంలోని మనుషులతో కొంతమేరకు గమనించడం, వారితో సంభాషించేందుకు కొంత అవకాశం వుంటుంది అనేదాని బేస్ మీదనే సినిమా మొదట్లో ప్రయోగశాల ప్రదేశం తాలూకు అక్షాంశ రేఖాంశాలను మోర్స్ కోడ్ పద్దతిలో కనుక్కోవడం దగ్గరనుంచి, చివర్లో హీరో మన ప్రపంచంలోకి చేరుకోవడం వరకూ వుంటుంది. కాల బిలంలో ప్రవేశించిన వారు చనిపోవడం అంటే కాలబిలాలలోని ఈవెంట్ హారిజన్ (నిర్ణీత సరిహద్దు) ప్రవేశమార్గాలను దాటేసి పై భాగంలోని వెనక్కి వెళ్లలేని చోటు (పాయింట్ ఆఫ్ నో రిటర్న్) కు చేరుకోవడమే అని దానికిలోకి పడిపోయే లోగానే ఈ ప్రపంచంలోకి లాక్కోబడటంతో అతను మళ్ళీ భూమ్మీద జీవించేలా దేహంతో చేరతాడు. అయినా ఈవెంట్ హారిజన్‌కు ఆవల మరో లోకముందని దాన్ని క్యాచీ హారిజన్ (Cauchy horizon) అంటారట, ఈ ప్రదేశంలో కాలం, రోదసి రెండూ సుస్థిర దశల్లోకి చేరిపోయి, నిలకడగా ఉంటాయి. ఈ క్యాచీ సరిహద్దు లోపలే ఆధునాతన నాగరికతా ప్రపంచాలు మనుగడలో ఉండి ఉంటాయని ప్రొఫెసర్ డొకుచోవ్ బలంగా వాదిస్తున్నప్పటికీ బిగ్ బ్యాంగ్ సిధ్దాంత కారులు దీన్ని కొట్టిపారేస్తున్నారు.

warmhole

వామ్ హోల్ : విశ్వాంతరాళంలో కాంతిసంవత్సరాలదూరాన్ని దాటుకుంటూ ప్రయాణించేందుకు కనుక్కున్న ఒకానొక షార్ట్ కట్ రూట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని ఐన్ స్టీన్ రోసెన్ వంతెన అని పిలుస్తారు. రెండు చివరల మధ్య నున్న ఒక టన్నెల్ లాంటి వంతెన ఇది. బ్లాక్ హోలో లో ప్రవేశించిన ఏ పదార్ధాన్నీ బయటకి వదలని స్థితి వుంటే దీనిలోకి వచ్చిన పదార్ధాన్ని కాంతివేగంతో మరో చివరకు నెట్టేస్తుంది. దీనినే సినిమాలో ప్రయాణానికి కీలక సూత్రంగా వాడారు. ప్రయాణానికి కావలసిన ఇంధనాన్నీ, కాలాన్నీ మన పరిమితుల రీత్యా సరఫరా చేయడం అసంభవం అందుకే వార్మ్ హోల్ కున్న ఈ శక్తిని వాడుకోవడం ద్వారా కావాలసిన తీరానికి సులభంగా చేరవచ్చనే ఊహాత్మక లెక్కలతో వీరి ప్రయాణం ప్రారంభం అవుతుంది. నిజానికి ప్రయాణం ప్రారంభం అయ్యేప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఎటువంటి సక్రమమైన దారీ వీరికి తెలియదు.

మోర్స్ కోడ్ : ఈ మధ్యే టెలిగ్రాఫుల ద్వారా సందేశాలను పంపుకునే శకం ముగిసింది కానీ టెలిగ్రాఫుకు కారణం అయిన మోర్స్ కోడ్ ఉపయోగం మాత్రం ముగిసి పోలేదు. కేవలం ఆన్ ఆఫ్ ద్వారా బైనరీ విధానాన్ని (ద్విసంఖ్యామానాన్ని) కంప్యూటర్లలో వాడుకున్నట్లు బిప్ అండ్ గ్యాప్ ద్వారా డాట్ (చుక్క) మరియు డాష్(గీత) అను మాత్రం వాడుతూ సందేశాలను పంపేందుకు ఈ మోర్స్ కోడింగ్ విధానం ఉపయోగపడుతుంది. అందుకే అంతరిక్షంలోకి పంపే అనేక సందేశాలను కోడింగ్ విధానంలోనే తయారు చేసారు. సినిమా మొదట్లో పరిశోధన శాల అడ్రస్ ను ఇదే పద్దతిలో మరో కాలబిలంలో నివసించే వారెవరో అక్షంశరేఖాంశాల (longitude and latitude) కో ఆర్డినేషన్ ను అందించటం ద్వారా గైడ్ చేస్తారు. చివర్లో హీరో కూడా వాచ్ లో సెకన్ల ముల్లులో సహాయంతో తన బిడ్డకు ఈ మోర్స్ సందేశాన్నే పంపించి తన ఉనికిని తెలియజేస్తాడు.

కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) : కేవలం మనిషి తలలో వుండేదే మేధస్సా అస్సలు శరీరంతోనే పనిలేకుండా తెలివితేటలు తమంతట తామే పనిచేస్తే ఎలావుంటుంది. పరిస్థితులను అర్ధం చేసుకోవడం, స్పందించడం, నిర్ణయాలు తీసుకోవడం, లాంటివన్నీ మనిషికి ఆవల జరిగే పద్దతి కృత్రిమ మేధస్సు. ఈ మధ్య అగ్రరాజ్యం అమెరికానుంచి మానవ మెదడును మ్యాప్‌ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించిన కార్యక్రమం కింద భారత నాడీ శాస్త్రవేత్త పార్థా మిత్రాకు గ్రాంట్‌ లభించింది కూడా. ఇలా శరీరమో దేహమో ఆకారమో లేకుండా కేవలం ఎఐ తీసుకునే నిర్ణయాలు వగైరా ఈ సినిమాలో కనిపిస్తాయి.

కథనం : నాసాలో పైలెట్ ఇంజనీర్ గా పనిచేసిన కూపర్ (మాథ్యూ) మానవాళికి తిండిగింజల అవసరం గుర్తించి వ్యవసాయం చేస్తుంటాడు. అతనితో పాటు పదేళ్ళ కూతురు మర్ఫి (మెంకజీ ఫాయ్) , కొడుకు మరియు మామగార్లతో కలిసి వుంటాడు. పదేళ్ళ పాప ఘోస్టుగా పిలుచుకునే ఒకానొక మేధాశక్తి ఆమెను కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలోనే ఒకనాటి ఇసుకతుఫాను గాలివల్ల గదిలో ఏర్పడిన గీతలను మోర్సు పద్దతిలో అర్ధం చేసుకుని అవి సూచించే అక్షాంశరేఖాంశాలున్నప్రాంతానికి చేరతారు తండ్రీ కూతుళ్ళు.

ఆ ప్రదేశం ప్రొఫెసర్ బ్రాండ్ ( మైఖెల్ ఖైనే) ఆద్వర్యంలో నిర్వహింపబడుతున్న నాసా వారి రహస్య ప్రయోగశాల. వీరు మానవాళిని రక్షించేందుకు ప్లాన్-A, ప్లాన్ –B అంటూ రెండు పద్దతులు తయారుచేసుకుని వాటిని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తుంటారు. దానిలో కూపర్ ని కూడా ఒక నిపుణుడైన పైలెట్ గా సహాయం చేయమని అడుగుతారు. దీనిలో ప్రధానాంశం జీవనానికి అనువుగా వుండే గ్రహాలపైకి మానవాళిని పంపించడం. అందుకు పిండదశలో జీవాన్ని నిల్వచేసి అక్కడికి పంపి మళ్ళీ జీవం ప్రారంభం అయ్యేలా చూడటం. దీనిలో ప్రొఫెసర్ బ్రాండ్ కూతురు స్వయంగా బయాలజిస్టు అయిన అమెలియా ( అన్నే హాత్ వే), ఫిజిస్టు రొమిల్లీ ( డేవిడ్ గాసీ) జియో గ్రాఫర్ డోయల్ ( వెస్ బెన్ ట్లీ) లతో పాటు మరో రెండు కృత్రిమ మేధస్సుకలిగిన రోబోట్లు TARS మరియు CASE కూడా పనిచేస్తుంటాయి. అతి సుధీర్ఘ ప్రయాణాన్ని సులభతరం చేసుకునేందుకు వార్మ్ హోల్ సహాయం తీసుకోవాలనేది ఈ ప్రయత్నంలో ముఖ్యమైన అంశం. దానివల్ల కాలంతో పాటు ఇంధనం కూడా కలిసి రావడంతో అసాధ్యం అనుకున్న ఈ గ్రహాంతరాలను మించిన విశ్వాంతర ప్రయాణం సాధ్యం అవుతుంది అని ప్రొఫెసర్ బ్రాండ్ వివరిస్తాడు.

తన తండ్రి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడానికి పదేళ్ళ మర్ఫీ ససేమిరా అంటుంది. కానీ తను తరిగి వస్తానని తను వచ్చేటప్పటికి ఆ అమ్మాయి వయసు, తనవయసూ ఒకేలా వుంటుందని నచ్చజెప్పి, కూపర్ బయలుదేరతాడు. అనుకున్నట్లుగానే ప్రయాణంలో వార్మ్ హోల్స్ సహాయం ఉపయోగపడుతుంది. అచ్చం నీళ్ళతోనూ, పూర్తిగా మంచుతోనూ వున్న వివిధ గ్రహాలను గమనించుకుంటూ వీరి ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలోనే భూమినుంచి పంపే విడియో ఫుటేజిలను గమనిస్తూ తమ వారు ఎలావున్నారో కూపర్ తదితరులు గమనిస్తుంటారు. కూపర్ మామగారు చనిపోతాడు. కొడుకు బిడ్డ పెద్దవాళ్ళవుతారు. మర్ఫీ కూడా ప్రొఫెసర్ బ్రాండ్ కు సహాయంగా వుంటూ తన తండ్రి ప్రయాణ సమాచారాన్ని తెలుసుకుంటూ వుంటుంది. ప్రొఫెసర్ బ్రాండ్ తన తుదిగడియల్లో చెప్పిన నిజం అసలు తిరుగు ప్రయాణంపై తన సమీకరణాల్లో సరైన ఆధారాలేవీ లేవనే విషయం ఆమెను హతాసు రాలిగా చేస్తుంది. అయినా తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం తిరిగొస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తూ బ్రాండ్ అసంపూర్తిగా వదిలేసిన ఆ సమీకరణాన్ని తను పూర్తి చేసేందుకు శాయశక్తులా తన ప్రయత్నాలు చేస్తూ గడుపుతుంది. 40 సంవత్సరాల వయస్సుకూడా దాటుకుని ముసలి తనానికి కూడా వచ్చేస్తుంది.

 

అక్కడ ప్రయాణంలో ఇంధనం అయిపోవస్తుంది. మరొక్క గ్రహాన్ని మాత్రమే చూడగల స్థితికి వస్తారు. అయినా సరే అవకాశం వున్న గ్రహాలను వెదికేందుకు చేతనైనంత ప్రయత్నం చేయడంతోపాటు. స్వంతంగా ఆలోచించగల రెండు రోబోట్లనూ ఆ సమాచార సేకరణ కోసం అంతరిక్షంలో వదిలుతారు. సింగ్యులారిటీ పై సమాచారాన్ని గ్రహించే సందర్భంలో కూపర్ అదనపు డైమెన్షన్ లోకి పడిపోతాడు. అక్కడినుంచి పాక్షిక పద్దతిలోనే ప్రపంచాన్ని గమనించే స్థితిలోకి మారతాడు. కూపర్ కి అప్పుడే అర్ధం అవుతుంది. ఈ అదనపు డైమెన్షన్ లో నివసించగలిగే వారే భవిష్యత్తు మానవులు అని, అక్కడి నుంచి తన బిడ్డతో పూర్వపు ఘోస్ట్ లాగా కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు.

Morse Code

గురుత్వ తరంగాలను ప్రయోగించటం ద్వారా ఒక వాచ్ లోకి మోర్స్ కోడ్ పద్దతిలో సమీకరణాన్ని సాధించే పద్దతిని తెలియజేస్తాడు. ఆ సమీకరణం ఆధారంగా ఆమె తండ్రిని భౌతిక ప్రపంచంలోకి తీసుకు వస్తుంది. పూర్తిగా ప్రపంచంలోకి వచ్చిన కూపర్ కి తన కూతురు ముసలి వయస్సులో మంచపట్టిన స్థితిలో కనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులకైనా చూడలేని స్థితి తమ బిడ్డలు మరణం అంచున వున్నారని తెలియటం అందుకే నువ్వు నాకోసం ఆలోచించకు దానికి నా బిడ్డలున్నారు అంటుంది మర్ఫీ. అతని తర్వాతి కర్తవ్యంగా వదిలేసిన ఎడ్మండ్ గ్రహాన్నీ, అమెలియానీ అన్వేషించడం ప్లాన్ బిలో భాగంగా జీవ పిండాలను ఆ గ్రహంపై పెంచేందుకు తగిన పద్దతులను అన్వేషించడం ప్రారంభించమంటుంది. ఇతని ప్రయాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది. అడ్మండ్ పై అప్పటికే అమెలిన్ తన ప్రధమిక ప్రయత్నాలలో వుందన్న విషయం చూపటంతో సినిమా ముగుస్తుంది.

కేవలం శాస్త్రీయతే కాకుండా మానవీయకోణంలో నడిచే సంభాషణలు కూడా ఈ సినిమాలో కట్టిపడేస్తాయి. మచ్చుకు స్థల కాలాలను అధిగమించగలిగేది ప్రేమ ఒక్కటే అంటూ ప్రొఫెసర్ బ్రాండ్ చెప్పటం. మానవజాతి భూమ్మీద పుట్టిందంటే దానర్ధం భూమ్మీదే అంతరించి పోవాలని కాదు లాంటి డైలాగులు బావున్నాయి. ఇంత సంక్లిష్టమైన ‘సైన్స్‌ ఫిక్షన్‌’ చిత్రాన్ని తండ్రీ కూతుళ్ళ మధ్య వున్న అనుబంధం చుట్టూ అల్లి, ఏమాత్రం సైన్సు పరిజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యే టంతగా తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.

నోలన్ ‘సిజిఐ'(కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) తక్కువగా వాడి సహజత్వానికి దగ్గరగా వుండాలని కెమెరాతో తీసిన దృశ్యాలనే ఎక్కువగా వినియోగిస్తాడు. అందుకే తారాతీరాలలోనూ, విచిత్ర వాతావరణలోని గ్రహాలలోనూ సంచరించడాన్ని కళ్ళకు కట్టినట్లే చూపడం వల్ల కావచ్చు బిగ్ స్క్రీన్ టిక్కెట్లకు అంత రష్ ఏర్పడింది. మొత్తానికి ఒక మంచి సైన్సు పిక్షన్ చూడాలని కోరుకునే వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈ ఇంటర్ స్టెల్లార్.

 -కట్టా శ్రీనివాస్

 

మగకాలువ

katta pic

 

 

 

 

 

నారాయణ.. నారాయణ బ్రహ్మలోకం లో తల్లిదండ్రులకు నమస్కరించాడు నారదుడు
అప్పుడు కూడా తాతగారి పేరును ఉచ్చరించడం మర్చిపోనేలేదు.
కుశల ప్రశ్నలయ్యాక భూలోకం ఎలాగుందని అడిగారు బ్రహ్మ, సరస్వతులు.
వాళ్ళకు తెలియక కాదు కానీ. కొడుకుతో ముచ్చటించడంలో వున్న సంతోషం కోరుకుంటున్నారో లేక నిజంగానే లోతైన కారణంవుందో.

‘‘ అది తప్పకుండా చెపుతాను అమ్మా నాన్నలూ ముందుగా నాదో సందేహం తీర్చండి. మీరు నిరంతరం జీవులను తయారు చేసే పనిలోవున్నారు కదా? అసలు జీవికీ నిర్జీవికీ ముఖ్యంమైన తేడా ఏమిటి? లోకం లో సంచరించేటప్పుడు నాకు చాలా సార్లు ఈ సందేహం కలిగింది. నిర్జీవ పదార్ధాలకు మీరు ఏ ముఖ్యమైన లక్షణాన్ని చేర్చడం ద్వారా వాటిని మీరు జీవులుగా మార్చుతున్నారు.’’ మరోసారి మోకరిల్లుతూ అడిగాడు.
‘‘దేవ రహస్యమే అడిగావు నారదా. కానీ నీవడిగాక చెప్పక తప్పుతుందా? అయినా త్రిలోక సంచారివి నీకు తెలియనిదా? నీవేమనుకుంటున్నావో ముందొక మాటచెప్పు’’ నాలుగు ముఖాల్లో ఒక ముఖం మాత్రం నారదుడివైపు ప్రశ్నిస్తే, మరో ముఖం దేవివారివైపు సాలోచనగా చిద్విలాసంగా నవ్వటం నారదుడి కళ్ళలోంచి తప్పుకోలేదు. అయినా ఈ ప్రతిభోధనా పద్దతి  గురించి ఎరిగిన వాడే కావడంతో తనకు తెలిసింది చెప్పటం ప్రారంభించాడు నారదుడు. ‘‘బహుశా చలనాన్ని కలిగివున్నాయా లేదా అనేదాని ఆధారంగానే స్థావర, జంగమాలంటున్నాం కాబట్టి దీన్నే ప్రధాన వ్యత్యాససూత్రంగా తీసుకోవచ్చనుకుంటాను’’ కొంచెం అనుమానంగానే నసిగాడు నారదుడు.
‘‘కాదు’’ అనుకున్నంతా అయ్యింది తప్పనేసాడు బ్రహ్మ తన వివరణతో పాటుగా ‘‘ గ్రహగతులూ, సాగరకెరటాలూ చలనాన్ని కలిగే వుంటాయి అయినా అవి నిర్జీవుల జాబితాలోనే వున్నాయి కదా అలాగే వృక్షాలు స్థానచలనం లేకున్నప్పటికీ అవి జీవులే… మరింకేమైనా ఆలోచించగలవేమో చూడు నారదా?..’ రొట్టె ఇవ్వడం కాదు తయారుచేసుకోవడం నేర్పాలన్న సూత్రంలాగా నారదుడికి విషయాన్ని భోధించే పనిలో పడ్డాడు బ్రహ్మ. ‘‘సరే మరోక్క ప్రయత్నం మాత్రం చేస్తాను. ఈసారి దోషముంటే, సమాధానం మీరే చెప్పాలి మరి’’ నారదుడు ముగింపు ముహూర్తాన్ని కూడా సిద్దంచేస్తూ చెప్పాడు. ‘‘ ఆహారాన్ని తీసుకోవడం అంటే జీర్ణక్రియ, గాలిని పీల్చుకోవడం అంటే శ్వాసక్రియ అయ్యింటాయి అంతేనంటారా? ’’ ఈ సారి కొంచెం పెరిగిన ధైర్యంతో కలగలిసిన సమాధానం వచ్చింది. ‘‘ సరే కొంత మేరకు ఇది సమంజసమే కానీ ఇవే ప్రధాన మూల వ్యత్యాసాలు మాత్రం కాదు కుమారా. ఎందుకంటే ఒక పదార్ధాన్ని లోపలికి తీసుకుని కావలసినంత మేరకు మాత్రమే ఉపయోగించుకుని మిగిలినది వదిలేసే పనిని చాలా ఫ్యాక్టరీలూ, యంత్రాలూ కూడా చేస్తున్నాయి అయినా అవి జీవుల కోవలోకి రావు.అలాగే కొన్ని జీవులు అవాయు శ్యాసక్రియ ప్రక్రియలో మనుగడ సాగిస్తుంటాయి అంటే వాటికి గాలిపీల్చుకోవలసిన అవసరమే లేదు. అదే విధంగా మొక్కల్లో గాలి పీల్చుకునే పద్దతికీ, జంతువుల్లో గాలి పీల్చుకునే పద్దతికీ మధ్య చాలాచాలా తేడా వుంది’’ అంటూ తప్పుని ఎత్తి చూపినట్లుగా కాక విషయాన్ని విశదం చేస్తూ తప్పొప్పుల అవగాహన కలిగిస్తున్నాడు బ్రహ్మ.

Kadha-Saranga-2-300x268
‘‘ ఇంతకీ ఈ విషయానికి ఇన్ని బైట్ల సమయం కేటాయించడానికి కారణం తెలుసా? ఈరోజు జరగబోయే మన సంభాషణంతా ఈ కేంద్రంగానే విస్తరిస్తుంది నారదా. ఇది తెలిస్తేనే అది బాగా అర్ధం అవుతుంది.మొత్తానికి జీవినీ నిర్జీవినీ వేరుచేస్తున్న ప్రధాన కారకం ‘‘ ప్రత్యుత్పత్తి’’.
‘‘ప్రత్యుత్పత్తి మాత్రమేనా’’ నారదుడు బృకుటి ముడిచాడు.
‘‘ అవును నేను చేసే పనే ‘సృష్టించటం’, అదే పనిని నా తర్వాత అచ్చంగా నాలా కొనసాగించే గుణం వున్నవే జీవులు, అంతేకాదు తనలాంటి జీవిని తనంటిది సృష్టించలేదు అందుకోసమే పెరుగుదల దానికోసం ఆహారసేకరణ, సంతానపాలన, రక్షణకోసం సామాజికీకరణ ఇవ్వన్నీ ఏర్పడ్డాయి.’’ ముడి విప్పుతున్నాడో, మరేదైనా ముడివేయటం కోసం అవసరమైన సామగ్రిగా ఇస్తున్నాడో అర్ధంకాలేదు నారదుడికి అయినా అసలైన తేడా ఇదేనని తెలిసేసరికి కొంచెం మనసు తేలిక పడింది. మరికొంత పరిశీలించుకుంటూ పోతే కానీ ఆ సమాధానం మనసుకి సరిగా జీర్ణం కాదు.

‘‘ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నారదా, భూలోక విశేషాలను ఏవో చేత.పట్టుకొచ్చినట్లున్నావు కదా అవేమిటో చెప్పు దీనిపై మరింత విపులంగా అవసరం మేరకు తర్వాత మాట్లాడుకుందాం’’ సంభాషణను కొనసాగించమన్నట్లు నారదుడి వైపు చూసాడు బ్రహ్మ.
అవును తండ్రిగారూ భూలోకంలో మీరు తయారు చేసిన జీవరాశి ఎలా వున్నారో, అమ్మదయతో చదువులనూ సాహిత్యాన్నీ అవపోసన పడుతున్నవారు ఎలా వున్నారు అనే రెండు విషయాలనూ కలిపి చెప్పేందుకు చిన్న ప్రయత్నం చేస్తాను. భూలోక సాహిత్య ఢింభకుడొకడు అక్కడి ప్రధాన సమస్యపైనా, మీరిచ్చిన శక్తులను వారెట్లా దుర్వినియోగం చేస్తున్నారన్న దానిపైనా ఒక కథలా రాసాడు. దానిని మీరే స్వయంగా చదువుకుంటే అటు విషయం చెప్పినవాడినీ అవుతాను. దానిపై భూలోక వాసుల అభిప్రాయాన్ని చూపిన వాడినీ అవుతాను. అవధరించండి అంటూ తనచేతిలోని అచ్చుకాగితాలను అమ్మ చేతిలో పెట్టాడు నారదుడు.
కొద్దిగా ఒక తలను అందులోకి వంచి తను కూడా ఆ కథను చదవటం ప్రారంభించాడు బ్రహ్మ.
*****
భారత వంశపు జనసభ
అందంగా వుండి నిండుగా కొలువు తీరివుంది. కానీ అక్కడ రాజుతో సహా ప్రధాన సలహాదారులంతా విషణ్నవదలైవున్నారు. అయితే ఆ ఆందోళనకు కారణం యుద్ధప్రమాదమో, అంతర్గత తిరుగుబాట్ల అలజడో కాదు ఆర్ధికలేమో ఎంతమాత్రమూ కాదు చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ పైన చెప్పుకున్న వాటికంటే చాలా రెట్లు ప్రమాదకరమైన అంశం మీద ఆందోళన పడుతున్నారు వారంతా.
‘‘ మహామంత్రీ ఈ మధ్యకాలంలో మరింకేవైనా అంటువంటి ఉన్మాద కృత్యాలు సంభవించాయా?’’ విచారిస్తున్నారు ఈ మధ్యనే ప్రజాస్వామిక పద్దతిలో ఎంపికకాబడ్డ రాజు నరేంద్రజోడీ.
‘‘ లేకేం మహారాజా మరింతగా పెచ్చరిల్లుతున్నాయి కూడా, మహిళల చర్మం కళ్ళబడినా, వారి వంటినుండివచ్చే గజ్జెలు, గాజుల వంటి శబ్దం వినబడినా కృరమైన తోడేళ్ళుగా దేశపు మగవారు మారపోయే మహమ్మారి గుణం అలాగే వుంది. హటాత్తుగా కోరలు పెరిగిపోవటం, కళ్ళు ఎరుపెక్కిపోవడం, ఒక మృగంలా చుట్టూ ఏముందో అనే విషయాన్ని సైతం గమనించకుండా ఆమెను ఆక్రమించేందుకో ఆతర్వాత హత్యచేసేందుకో తెగబడుతున్నారు వీళ్ళు, రాజధానుల్లోనే కాదు మారుమూల పల్లెల్లోనూ ఈ తీవ్రపరిణామాలు చోటుచేసుకున్నాయి మహారాజా’’ ఏకబిగిన వాస్తవ పరిస్థితులను ముందుపరిచాడు మంత్రివర్యుడు.
‘‘ అలాగయితే వెంటనే రక్షకభటుల గస్తీ పెంచండి. మంచి ఆయుధాలూ, అత్యాధునిక వాహనాలూ, మంచి రంగుల్లో సైనికదుస్తులూ, సరికొత్త చిహ్నం కూడా ఏర్పాటు చేయండి’’ ఇంకా కదలరేం అన్నట్లు చూసాడు మంత్రివైపు మహారాజు నరేంద్రజోడీ.
‘‘క్షమించాలి మహారాజా, ఇలా తోడేళ్ళుగా మారుతున్న వారిలో రక్షకభటులుకూడా కొందరున్నారు.’’ లోగొంతుతో చెప్పినా ధృడంగా విషయాన్ని చేరేసాడు మంత్రి. ‘‘

అప్పటివరకూ నిలబడి ఆవేశంతో మాట్లాడుతున్న రాజు నరేంద్రజోడీ ఒక్కసారిగా కుంచించుకుని కాళ్ళలో సత్తువ లేనట్లు సింహాసనంమీద కూలబడిపోయాడు. కనిపించని ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలీక నిండుసభ మొత్తం ముఖాలను క్రిందకి దింపుకుని చూస్తున్నారు.
కొంతసేపటికి గొంతుపెగల్చుకుంటూ సాలోచనగా నరేంద్రజోడీనే అన్నాడు ‘‘ పోనీ చట్టపు రక్షణకంటే భద్రమైన కుటుంబ రక్షణకు ప్రాధాన్యత పెంచుదాం. ఎవరికుటుంబంలోని వారే వారివారి ఆడపిల్లలకు రక్షణకల్పించే పద్దతులను గురించి మరింత ప్రచారం చేద్దాం. ’’ తేలికగా ఊపిరి పీల్చుకుంటూ మంచి పరిష్కారమే తాత్కాలికంగా దొరికిందన్నట్లు చెప్పాడు మహారాజు.
‘‘ మరోసారి మన్నించాలి మహారాజా మనుసు ధృఢం చేసుకోండి. నిజాలను చెప్పక తప్పటంలేదు. అసలు చిక్కేమిటంటే ఇలా తోడేళ్ళుగా మారిపోతున్నవారిలో స్వంత కుటుంబం వారుకూడా వున్నారు. తాతలు, మామలు, అంకుళ్ళు ఆ..ఖ..రి..కి.. తండ్రులు సైతం ఈ పిశాచం భారిన పడుతున్నారు, ’’ మంత్రి ఆచితూచి తన మాటల్ని మహారాజుకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడు.
రాజుకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మినట్లు, తలంతా బరువెక్కినట్లూ అయిపోయింది. మొత్తం రాజమహల్ తల్లక్రిందులుగా మారిపోయినట్లూ అనిపిస్తోంది. మంత్రిమాటలకు రెండుచేతులూ చెవులపై ఉంచుకుంటూ ‘‘ అమంగళం ప్రతిహతమగుగాక’’ అంటున్నాననుకుంటూనే ఆసనం మీదనుంచీ జారిపడుతూ మూర్చిల్లాడు మహారాజు.
* * *
కళ్ళింతగా చేస్తూ కథను చదువుతున్న బ్రహ్మ తను సృష్టించిన మానవజన్మలో ఇటువంటి వింతలక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయబ్బా అన్నట్లు ఆశ్చర్య పోతూ మిగిలిన తనపనిని కొద్దిసేపు ఆపి సరస్వతిదేవి చేతుల్లోని ఆ కథా కాగితాలవైపే కన్నార్పకుండా చూస్తున్నాడు.
* * *
వైద్యులూ, అంత: పురవాసమూ రాజుగారి మెలకువకోసం ఆయన ముఖంలోకే చూస్తున్నారు.
కొద్దిగా మెలకువతో రాజు అటూ ఇటూ మెసలగానే చుట్టూవున్న వారిలో చిన్న కలకలం. కళ్ళు తెరవగానే మళ్ళీ అదే ప్రశ్నతో మహామంత్రివైపు తిరిగాడు జోడీ. ‘‘ అసలు అటువంటి వారి అంగాంగాలనూ ఛేదించండి, నడిబజార్లో దారుణంగా కొట్టి చంపేయండి, మిగిలిన వారికి బుద్దొస్తుంది’’ మాటల్లో ఆవేశం కనబడక పోయినా ఆలోచనలో మాత్రం మరుగుతున్న కోపానిని మంత్రి గమనించాడు. ‘‘విషయం అదికాదు మహారాజా ఈ మృగాల భారినుంచి మహిళలను రక్షించడం కోసమే ఆలోచిస్తున్నాం కానీ. కొందరు మృగాలుగా మారకుండా చూడాల్సిన భాద్యతా మనదీ సమాజానిదే. వారిని శతృవులుగా రాక్షసులుగా కాక దుష్టులుగా కాక వ్యాధిగ్రస్తులుగా చూడాలి మనం. వారిని ఆ ఊబినుంచి బయటకు తీసేందుకు కనీసం కొత్త వారు అలా మారకుండా ఏం చేయాలి అనేవి ఆలోచించాలి.’’ మంత్రి ఒక్కో చిక్కుముడి విప్పుతున్నట్లు విపులంగా మాట్లాడుతున్నాడు.
‘‘ఇలాగే జరిగితూ వెళితే మన ప్రభుత్వపు పరువు, విధేశాలతో సంభందాలూ ఏమైపోవాలి. ముఖ్యంగా ప్రతిపక్ష వైరివర్గం మనల్ని ఎండగట్టవా? దానికేంచేద్దాం చెప్పండి మహామంత్రీ’’
‘‘ మీరన్న సంక్షోభం మాట నిజమే కానీ వైరి వర్గానికి అంత దృశ్యం లేదు మహారాజా, వాళ్ళలోనూ చాలామంది మంత్రులు ఈ తీవ్రతకు నలిగిపోయినవారే, మొన్నటి వరకూ అధికారంలో వున్న మదనమోహనుడిని ఈ సమస్య ఇబ్బంది పెట్టలేదు కానీ, యువరాజు రాహుల్దేవుడిపై ఈ ప్రభావం వుంది. చాలాసార్లు దగ్గరదాకా వచ్చి తృటిలో తప్పిపోయిందని వేగుల సమాచారం. మీరు వారిని తలచుకొని ఆందోళనచెందాల్సిన పనిలేదు.’’
‘‘ఇకపోతే రెండవ విషయం ఇది ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు వైధ్యులూ, నేరపరిశోదకులూ, శాస్త్రవేత్తలతో కూడిన ఒక ‘‘నిర్భయ’’ పేరుతో నిపుణుల బృందాన్ని మొన్న మీరు స్పృహకోల్పోయిన రోజే నియమించాం మహారాజా. బహుశా వారి పరిశీలనాత్మక నివేదిక కారణాలను కనుగొని కర్తవ్యాలను సూచిస్తుందనుకుంటున్నాము. అప్పటివరకూ మీరు కొంత విశ్రాంతి తీసుకోండి మహారాజా. ’’ అంటూ వెళ్ళేందుకు అనుమతి కోరుతున్నట్లు కొంచెం వంగి నమస్కరించి బయల్దేరాడు మంత్రి.
మొన్నటినుండి స్పృహలో లేనా? స్వగతంలో అనుకున్నట్లు పైకే అనేశాడు.
పర్వాలేదు రాజా పరిపాలనలో వున్నా నిద్రలోనే వుండే చాలామంది కంటే మీరు మెరుగే అందామనుకున్నాడు మంత్రి కానీ అనకుండానే బయటికెళ్ళాడు.

katta illus
* * *
‘‘నిర్భయ’’ బృందం సమస్య మూలాలను శోధించేందుకు తీవ్రపరిశ్రమ చేస్తోంది. ఇప్పటివరకూ తోడేళ్ళుగా మారిన వారు. వారు నేరం జరిపిన ప్రాంతం. మొదలైన వివరాలను స్పష్టంగా తెలిసేలా వేరు వేరు రంగు ఇంకులతో దేశపటంలో గుర్తిస్తున్నారు, నేరం చేసినవారి నివాసాలను మరోరంగు ఇంకు తోనూ చిత్రం గీస్తూ సంభంధిత వివరాలను అంశాల వారీగా నమోదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. చిన్న తీగయినా దొరకకపోతుందా అన్న ఆశ వారి పనిలో శ్రమతెలియనివ్వడం లేదు.
దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ మరకల్లా ఏర్పడిన నేరపు చుక్కల్ని చూస్తూ ఆలోచిస్తున్న బృందానికి నిస్సత్తువ వస్తోంది. ఆ చుక్కలు శాపగ్రస్తుడైన ఇంద్రుడి వంటిపై వేయి కళ్ళలాగా, ఒక్కో నేరప్రాంతం మరిన్ని నేరాల పిలకలతో రావణుడి తలల్ని మరిపించేలా పదింతలై విచ్చుకుని కీచకగుండాలై నవ్వుతున్నాయి.
వాళ్ళకి పాపం చాలా రోజుల నుంచి సరైన ఆహారం, నిద్రకూడా లేదు. ఈ నేర కారణం దుష్టశక్తి కాకపోవచ్చనీ ఆహారపదార్ధాలో, క్రిమికీటకాలో కలిగించే వ్యాధికూడా కావచ్చనేది వారి ప్రాధమిక అంచనా. అందుకే పరిశీలించిన ఆహారాన్నే తింటున్నారు, ప్రత్యేకమైన దుస్తులను ధరించి జాగ్రత్తగా పరిశీలనలు కొనసాగిస్తున్నారు. కానీ ఆధారాలు దొరకటం లేదన్న అసహనం వల్లనే మరింతగా అశక్తులైపోతున్నారు.
దేశానికి సంభందించిన ఈ అరిష్టాన్ని అరికట్టేందుకు తమవంతు కృషి చేయలేక పోవడంతో తమ ముఖాలను మహారాజుకో ప్రజలకో చూపించే ధైర్యంలేక తమ పాత్రలని ‘మరపు’ నదిలోకి తోసేసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న సమయంలో కనిపించాడతను. పేరుకూడా చెప్పలేదు పరిష్కారాన్ని మాత్రం లీలగా చూపించేశాడు.

పటాన్ని తెరవమని చెప్పి తన వేలితో ఒక గీతలాగా గీసుకుంటూ వచ్చాడు దేశం ఆ కొసనుంచి ఈ కొస వరకూ.
‘‘ ఏమిటి స్వామీ ఇది?’’ నిర్భయ బృందం నాయకుడు అర్ధంకాక సందేశాన్ని వెలిబుచ్చాడు.
‘‘ ఇదే మీ సమస్యకు కారణం అయిన నది……’’
‘‘నదా??’’
‘‘ అవును నదే…. చూడండి అన్ని సంఘటనలూ ఈ నది చుట్టుపక్కలే జరిగాయి. నిజానికి ఈ నదినీటిని తాగిన కొంత సేపటికే వాళ్ళు మృగాలుగా మారారు ‘ప్రతిసారీ’. ఇది కళ్ళకు మాత్రమే కనిపించే నదికాదు. అలాగని చరిత్రకు ముందే అంతర్ధానం అయిన సరస్వతీ నది లాంటిదికూడా కాదు. ఇప్పుడు ఈ కాలంలోకూడా ప్రవహిస్తూనే వుంది అప్పుడెప్పుడో ఎక్కడో పుట్టింది. ఇది కాలం నుంచి కాలంలోకి ప్రవహించే నది. మధ్యలో మనుషులగుండా వేగాన్ని మార్చుకుంటుంటుంది. ఒక్క సారి స్థిమితులై శ్రద్ధగా చూడండి’’ మార్ధవత పోకుండానే కఠినమైన ఆజ్ఞలా చెప్పాడతను.
వాళ్ళకప్పుడే మంచుపొరలు తొలగుతున్నట్లు కొత్తగా అదేపటంపై ఒక నదిలాంటి రూపం కనిపిస్తోంది. పటం మీదనే కాదు ఎక్కడినుంచో వస్తూ తమచూట్టూ ఆక్రమించినట్లు మొత్తంగా కనిపిస్తున్న ఏదో ఆకారం వుంది.
‘‘ దీన్ని గురించి మరికొంచెం చెప్పండి స్వామీ. నివారణోపాయాలు తెలిసే లాగా’’ అడగాల్సిన ప్రశ్నవేశాడు నిర్భయబృంద ప్రధానసభ్యుడొకరు.
‘‘ మాతృస్వామ్య వ్యవస్థ కాలంలో ఈ ప్రవాహం సన్నగా ఉండిలేనట్లుగా, ఉనికే లేనట్లుగా ప్రవహించేది. అప్పట్లో దీనిపేరు ‘మూగ కాలువ’, ఆ తర్వాత పురుషులకి క్రమంగా కుటుంబమూ, సమాజమూ హస్తగతమవుతున్న రోజుల్లో దీని ఉధృతి పెరిగింది అప్పడిది ‘మగకాలువ’ . మగకాలువగా పిలిపించుకునే కాలానికే ఈ నీటికి ప్రాధమిక రోగలక్షణాలు వచ్చాయి. కొంచెం త్రాగగానే పెత్తందారీతనపు ఘాటు నషాళానికి అంటుతుండేది, కానీ దాన్ని వారు రోగలక్షణంగా భావించక సమాజం లెక్కచేయకపోవడం వల్ల వ్యాధి మరింత ముదిరింది. ఇప్పుడు ఏకంగా మనుషులపై దాడిచేసేలా, మనుషుల రక్తమాంసాలనూ వ్యాపారపు, ఆనందపు సరుకుగా చూసేలా చేస్తోంది ఈ మురికి పట్టిన ప్రవాహం. ఇక ఇప్పుడు దీనిపేరు ‘‘మృగకాలువ’’. బుల్ ఫైట్ లో ఎర్రగుడ్డను ఎలాగైతే చూపించి ఎద్దును రెచ్చగొడతారో, అలాగే డబ్బు నడిచొచ్చేందుకు చర్మాన్ని విశాలంగా పరచి వ్యాధిని రెచ్చగొట్టారు. పసికళ్ళలోకి నీలిరంగును వంపుతూ మందులే పనిచేయని ముర్ఖవ్యాధిగా ముదరబెడుతున్నారు. దీనిలో నిరంతరంగా మరిన్ని కలుషితాలు కలుస్తూ పోతున్నాయి. మరీ ప్రవాహాన్ని మీరు ‘సంస్కృతి’ అని కూడా బ్రమపడుతుంటారేమో.
‘‘అయితే ఈ నీళ్ళను ఎవ్వరూ త్రాగకుండా చేయమంటారా స్వామీ? ’’ బృందసభ్యుల మూకుమ్మడి ప్రశ్న.
‘‘దాహంతో నయినా చావడమే శరణ్యం అవుతుంది మేధావులారా, తప్పు నీళ్ళలో లేదు. దానిలో కలుస్తున్న కలుషితాలలోవుంది. ఆ మూలాలను పూర్తిగా నిర్మూలించండి. నీటిని స్వచ్చంగా మార్చితే తాగటం మేలు చేస్తుంది కూడా. మనసు పెడితే ఒకతరం చదువులు పూర్తిచేసుకునే సరికి మొత్తం కాలువనే తేటగా మార్చేయోచ్చు, నాకిక సెలవిప్పించండి వచ్చిన పని పూర్తయ్యింది.’’ ఎవరి సమాదానం కోసం చూడకుండానే వీళ్ళు ఆశ్చర్యంతో విషయాన్ని ఆకలింపు చేసుకునే లోగానే అతను వడివడిగా నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు.
‘‘ మరి ఆడవాళ్ళు తాగుతున్నారు కదా అటువంటి ప్రభావం ఎందుకు చూపడం లేదు’’ అడుగుదామనుకున్నారు. యంత్ర వైవిధ్యం ఏదో సమాధానాన్ని స్పరింపజేస్తున్నట్లే అనిపిస్తోంది. అయినా మిగిలినవి మీరే కనుక్కోండి అన్నట్లు అతడు వెళ్ళిపోయాడు అప్పటికే.
నిపుణుల బృందం ఈ అంశాలన్నింటిపై ఒక క్రమంలో పరిశీలనాత్మక రిపోర్టును మహారాజు ముందుంచింది.
‘‘హల్లో… మీరే నండీ… ఈ కథని చదువుతున్న ప్రియమైన పాఠకులూ’’ ‘‘ అనుకోకుండా అదే కాపీ ఇలా మీముందుకు కూడా వచ్చింది. ‘మృగజలం’ నుంచి కాపాడాల్సిన అవసరం మీమీద, నామీద కూడా వుంది. ఎవ్వరి కోసమో కాదు. బతికుండేందుకు మనం ఈ నీళ్ళే గుటకేస్తున్నాం. రేపు మన బిడ్డలూ ఇవే నీళ్ళు తాగాలి, ఈ నీళ్ళను తాగుతున్న వారిమధ్యే బ్రతకాలి. పట్టండి శుధ్ధిచేసే పని మొదలెడదాం. నిజానికి నేను అందులో భాగంగానే ఇదంతా రాసాను ’’

*-*-
కథ అయిపోయింది.

అయినా బ్రహ్మ, సరస్వతి మౌనంగా అవే కాగితాల వైపు చూస్తూనే వున్నారు.
‘‘నీ దీవెనలున్నట్లున్నాయి దేవీ అతని కలంపై, నా సృష్టిలో వెర్రిమొగ్గలేస్తున్న సంస్కృతిని గమనించి జాగ్రత్తగా ఉపమించి ఉపదేశించాలని చూడటం, నిజంగా సాధ్యమా అనిపిస్తుంది కానీ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను.’’ బ్రహ్మ నాలుగు ముఖాలూ సుప్రసన్నంగా వున్నాయి.
‘‘మీరు సమాజంలో స్థూలభాగంగా ఒక ప్రవాహ దర్శనాన్ని గమనించారేమో స్వామీ, కానీ శరీరంలో భాగంగా ప్రవహించే అంతస్స్రావీ వ్యవస్థా ప్రవాహమూ, దానిపై ‘మెదడు అదుపు’ కూడా దీనిలో నిర్ధేశించినట్లనిపించింది నాకయితే ఆ విషయాన్ని మరికొంచెం స్పష్టంగా కథలోనే చెప్పివుండాల్సింది.’’ ఏమంటారు అన్నట్లు సర్వస్వతీ దేవి ప్రశ్నించింది.
‘‘ అవును కదా సృష్టికార్యపు భారాన్ని నాతర్వాత భారం తెలియకుండా జీవులు మోసేందుకు పనికిఆహారం పథకంలా తాయిలపు పొట్లాన్ని అలా అంతస్స్రావీ వ్యవస్థలో నేను దాచిపెడితే, దాన్ని అంగడి సరుకుగా చేసి అనవసరపు పందేలతో రెచ్చగొట్టి ఇలా వక్రీభవించి ఉపద్రవంగా మారేలా చేసుకున్న మానవనైజం ఎంత దౌర్భల్యమైంది’’ అశ్చర్యపోతున్నట్లే తిట్టేశాడు స్వామివారు.
నారదుడు అడ్డొస్తూ తన ప్రశ్న వేశాడు ‘‘ కథలో క్రమాన్ని రాజుకి అప్పగించి ముగించకుండా పాఠకుడిని కూడా అందులోకి లాగటం కొత్తగానే వుంది కానీ స్వామీ నాదొక సందేహం. తప్పుగా అనుకోనంటే అడుగుతాను’’ తన సహజ శైలిలో మాటల ప్రవాహం మొదలెట్టాడు.
‘‘ అటు రాజో, రాజరికమో లేదా పాఠకుడు, రచయితా లేదా వారిలా ఉత్సాహమూ,భాద్యతా వున్నవారు ఎవ్వరూ స్పందించలేదను కోండీ లేదా చాలినంత స్పందనే రాలేదనుకోండి. అప్పుడు ఈ కాలువ పరిస్థితి, జనం పరిస్థితి ఏమవుతుందంటారు?’’ ప్రధానమయినదే అయినా పిడుగులాంటి ప్రశ్న వేశాడు నారదుడు.
ముక్తాయింపు మాటలుగా సమాధానం చెప్పే భాద్యతను తీసుకున్నాడు బ్రహ్మ, నెమ్మదిగా తనపనిలోకి వెళ్తూ రెండు చేతులు మాత్రం ఖాళీగా వుంచి ఈ సమాధానానికి అనువుగా ఆ రెండు చేతులూ కదువుతూ వివరించాడు.
‘‘ ఏముంది నాయనా అదే జరిగితే ప్రకృతి లేదా కాలచక్రం తనపని తనుచేసుకు పోతుంది. సృష్టిక్రమ పరంగా బలహీనుడైన పురుషుడు తనే ఈ విషయంలో అధిపతిననుకుంటున్నాడు. సామ్రజ్య దురాక్రమణలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ కట్టుబాట్ల గదిలో బంధించ బడిన స్త్రీ తన శక్తిని తెలుసుకుంటుంది. మూసిన గదిలో ఎదురు తిరిగే పిల్లిలా ఎదురుతిరగాల్సిన పరిస్థితి వస్తుంది. తన సామర్ధ్యాన్ని అవగాహన చేసుకున్న స్త్రీ అప్పుడు తను కొన్ని విషయాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇక శీలాలను కాపాడుకునే పనిలో గగ్గోలు పెట్టడం పురుషుల వంతవుతుంది. ఆ కాలువ మౌనకాలువగానో, అవసాన కాలువగానో ఎక్కడో ఇంకి పోతుంది.’’
‘‘ ధన్యోస్మి తల్లిదండ్రులారా, మరిన్ని వివరాలు ముచ్చటించుకునేందుకు మిమ్మల్ని మరోసారి కలుస్తాను’’
‘నారాయణ…. నారాయణ….’
**-
కొనసాగుతూ వున్న కలలో అనుకోని మలుపుకి కుదిపేసినట్లై ‘అతనికి’ మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసాడు. మరికొంచేపు పడుకోవాలా? లేక చెయ్యాల్సిన పని ప్రారంభించొచ్చా అన్నట్లు.