ఇంకేం రాయనూ ?

 

 

11 ఏళ్ల క్రితం మా అమ్మ (వైజాగ్ లో) చనిపోయినప్పుడు ఈ ఉత్తరాన్ని కృష్ణాబాయిగారు హైదరాబాద్ నుండి నన్ను ఓదారుస్తూ రాశారు . మళ్లీ ఇన్నాళ్ళకు ఈ ఉత్తరాన్ని టైప్ చేస్తుంటే గుండె బరువెక్కి , అమ్మ మరణం కళ్ళలో మెదిలి మెదడు మొద్దుబారి పోయింది. బహుశా అప్పట్లో వర్మ, మధు (ఆకాశవాణి ) వంటి మిత్రుల తోడు , కృష్ణాబాయి, రంగనాయకమ్మ , కె. వరలక్ష్మి , ప్రతిమ గార్ల ఉత్తరాలే నన్ను ఆ బాధనుండి కొంత విముక్తుణ్ణి చేసాయనుకుంటా. కృష్ణాబాయిగారికి ప్రణమిల్లుతూ – గొరుసు
………………………….

Date: 26.02.05

జగదీశ్వర రెడ్డికి ,

బాగున్నావా అని ఎలా అడగను? ఇంత vaccum కష్టమే .
 

నిన్ను పొగడ్డానికి రాయడం లేదని నీకూ తెలుసు. తల్లి మాత్రమే బిడ్డకి చేయగలిగినట్టు , అనితరసాధ్యంగా , అమ్మని చూసుకున్నావ్ . ఎవరితో పోల్చడానికీ లేదు . నీకెంతో ఇష్టమయిన పనుల్నీ, అభిరుచుల్నీ పక్కకి పెట్టి మరీ చూసుకున్నావ్ . తల్లీ బిడ్డా సంబంధమే కాదు, మానవతా దృక్పధమ్ తో , గొప్ప మనసుతో అమ్మని చూసుకున్నావ్ . నీకు చేతులెత్తి నమస్కరిస్తా నెప్పుడూ మనసులోనే . ఒకటి రెండుసార్లు పద్మినితో అన్నాను కూడా – చేపల కూర చేసి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళాలమ్మా ఎప్పుడో అని . ఆమె “ఆ వాసనున్నా చాలురా ” అన్న మాట నన్ను కుదిపేసింది , కాని మేం చేప వండనూ లేదు, నేను తేనూ లేదు .
ఒక్క ఊరిలో ఉండి , అనుకుని కూడా ఆమెని ఒక్క సారన్నా చూడని నా మీద నాకే చికాగ్గా ఉంది .
 

“60 ఏళ్ళు దాటిన వాళ్ళెవరి నైనా చూడాలను కుంటే వెంటనే వెళ్లి చూడాలి, ఆలస్యం చేయ కూడదు” అనేవాడు ప్రసాదు – BN రెడ్డి గారిని చూద్దామనీ వెళ్ళలేక పోయినందుకు . దిక్కుమాలిన ఒత్తిడీ, టైమ్ సెట్ చేసుకోలేక పోవడమూ ఫలితం ఇది .
ఇది నిన్ను ఓదార్చడానికి కాదు, నన్ను నేను మందలించు కోడానికే .
 

రాత్రి గాంధీ చెప్పాడు – వర్మ చేసాడని . ప్రతిమతో మాట్లాడా .
 

ఎలా ఉన్నావో నిన్ను ఒక్కసారి చూడాలి . మన మిత్రులందరూ నీ చుట్టూ ఉన్నారనుకో . నేను ఓదార్చ గలిగింది మాత్రం – ఇంత దూరాన్నుంచీ – ఏముంది?
అమ్మ – ఘోరమైన హింసనుంచి విముక్తు రాలయింది . అది తృప్తిగా మిగలాలి నీకు .
 

ఇంకేం రాయనూ ?
 

– కృష్ణాబాయి