సంభాషణలకు ముగింపు మాటలు  

 

మిగతా విషయాల్లో ఎలా ఉన్నా … ఆహార నిద్రా భయ మైధునాలు మనిషి మౌలిక జీవలక్షణాలనే అంశంలో ప్రపంచమంతటా ఏకాభిప్రాయం ఉంది. ఇవి జీవ లక్షణాలే కాదు, జీవి చైతన్య లక్షణాలు కూడా. వీటి ఉనికిలోని హెచ్చుతగ్గులే జీవుల కార్మిక విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

సంపాదించడం, నిల్వ చేయడం… ఆహార సంబంధ క్రియలు గానూ,

రాజకీయాలూ, కొట్లాటలూ, సాహసాలూ, అధికార కాంక్షలూ… భయ సంబంధులు గానూ,

పునరుత్పత్తి, జీవన పరంపర, వగైరాలను మైధున సంబంధులుగానూ…

విశ్రాంతిని, పునరుత్తేజాన్నీ, ఊహాశక్తినీ చేకూర్చే లలిత కళల వంటి ప్రక్రియలను నిద్రా సంబంధులు గానూ స్థూలమైన వర్గీకరణ చేయవచ్చు.

ఆహారం కావాలంటే ఎవరినైనా పోయి అడగవచ్చు, లేదా స్వంతంగా ఏదైనా ప్రయత్నం చేసి సంపాదించు కోవచ్చు. భయం కలిగితే రక్షణ కోసం ఎవరినైనా ఆశ్రయించవచ్చు లేదా స్వయంగానే తగు రక్షణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. నిద్ర కోసం ఎక్కడైనా ఇంత నీడను కోరవచ్చు.

మైధున క్రియకు ఇలాంటి సౌకర్యం లేదు. ఒకప్పుడుండేది. ఇంటికి అతిథిగా వచ్చిన వాడికి కామతృష్ణను తీర్చడం గృహిణి ధర్మంగా ఒకప్పుడు భావించేవారు. ఈ ధర్మాన్ని ఉద్ధాలక మహర్షి కుమారుడైన శ్వేతకేతువు తీవ్రంగా వ్యతిరేకించి కొత్త ధర్మాన్ని ప్రతిపాదించినట్టు మనకు మహాభారతం ద్వారా తెలుస్తుంది. శ్వేతకేతువు గమ్యాగమ్యాలను నిర్దుష్టంగా నిర్వచించాడు. అంటే ఎవరు ఎవరితో గమించవచ్చు, కూడదు అనేవి స్పష్టం చేశాడు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియలో భారతీయ సమాజం వేసిన తొలి అడుగుగా దీన్ని మనం భావించవచ్చు. ఈ మార్పు తర్వాత లైంగికావసరాలకు వివాహ వ్యవస్థ ఒక్కటే సర్వామోదమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంది.

వివాహ వ్యవస్థకు ఆవల ఉన్న వారికి, అందులో ఉండి కూడా మైధునానందం పొందలేని వారి అవసరాలు తీర్చే మార్గంగా బహుశా వేశ్యావృత్తి ఏర్పడి ఉండవచ్చు. ఈ ఊహకు అనేకమైన ఆధారాలు ఆరుద్ర రాసిన గుడిలో సెక్స్ అనే పుస్తకం లోనూ, తాతాజీ రాసిన దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు అనే పుస్తకం లోనూ మనకు కనిపిస్తాయి. అంతే కాదు, కుటుంబ వ్యవస్థ స్త్రీ సౌశీల్యం మీద ఆధారపడి ఉందని నమ్మిన సనాతనులు వేశ్యావృత్తిని సమర్ధించారు. కుల స్త్రీల శీలం కాపాడు కోవడానికి ఈ వ్యవస్థ అవసరమని వాళ్ళు నమ్మారు. భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను రద్దు పరిచి నప్పుడు, ఆ చర్య వల్ల కుటుంబ వ్యవస్థకు తీరని ప్రమాదం ఏర్పడుతుందని ఆనాటి సనాతనులు వాదించారు.

వేశ్యల పట్లా, ఆ వ్యవస్థ పట్లా నేటి సమాజంలో చాలా చిన్నచూపు ఉన్నప్పటికీ 19వ శతాబ్దం వరకూ ఆ వృత్తిలోని వారు గౌరవాదరాలతోనే జీవించారని చెప్పవచ్చు. భారతదేశంలోని ఎన్నో రాజవంశాల మూల పురుషులు, ప్రసిద్ధి చెందిన అనేక మంది ఋషులు వేశ్యల సంతతి వారే. వేశ్యలు కళాకారులుగా పండితులుగా గొప్ప కీర్తి నార్జించారు. వారు దేశంలో ఒక గొప్ప సాంస్కృతిక వ్యవస్థను నిర్మించారు. అనేక దేవాలయాలకు, సమాజ సంక్షేమ కార్యాలకు వారు భూరి విరాళాలిచ్చారు.

మనుషులు ఎంచుకొనే పనులు, వృత్తులు వ్యవస్థీకృతం కావడాన్ని భారత దేశంలో కులం అనే పేరుతో వ్యవహరిస్తారు. అలాగే వేశ్యావృత్తి కూడా తొలినాళ్ళలో కులం లేనిదిగా వ్యవహరించబడినా వ్యవస్థీకృతమయ్యే కొద్దీ కులం రూపు సంతరించుకుంది. ఐతే సంతానాన్ని పొందే విషయంలో ఉన్న పరిమితులవల్ల ఇతర కులాలనుంచి ఈ కులంలోకి ఆదానాలు బహుళంగా జరుగుతూనే వచ్చాయి.

దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం బలపడ్డాక, బ్రిటిష్ భావజాలం ఇక్కడి మేధావుల మనసులు చూరగొన్నాక, ‘సామాజిక స్వచ్ఛత’ అనే అంశం బలంగా ముందుకొచ్చింది. వ్యభిచారం వ్యవస్థీకృతం కావడం సామాజిక స్వచ్ఛతను కళంకితం చేస్తుందని బ్రిటిష్ వారూ, నాటి సంఘ సంస్కర్తలూ ప్రచారం చేశారు. దేవదాసీల వంటి కొన్ని కులాలు సామాజిక స్వచ్ఛతకు భంగకరంగా ఉన్నాయని భావించి ఆయా వ్యవస్థలను నిషేధించారు. వేశ్యావృత్తి పురుషుల కామప్రవృత్తి వల్ల రూపుదిద్దు కుందనీ, స్త్రీలను అణిచివేసే భారతీయ సమాజపు దుర్లక్షణాలలో ఇది కూడా ఒకటనే వాదం కూడా ఈ నిషేధానికి కారణమయ్యింది.

1999లో నళినీ జమీలా రాసిన ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’ అనే పుస్తకం ఇలాంటి అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడింది. జమీలా సెక్స్ వర్కర్ గా పనిచేస్తూ వారికి సంబంధించిన ఒక స్వచ్ఛందసంస్థను నడుపు తున్నారు. ఆవిడేమంటుందంటే ‘సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేనని, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తుంటారు. చాలామంది ఫెమినిస్టుల ఆలోచన కూడా అందుకు భిన్నంగా లేదు. ఇది తప్పు. మాకు కావాల్సింది మీ దయాదాక్షిణ్యాలు కాదు. మా అస్తిత్వానికి గుర్తింపు.’

ఏది ఏమైనా వేశ్యావృత్తి ఉండటం మంచిదా కాదా అని చర్చించడం నా ఉద్దేశ్యం కాదు. స్త్రీ పురుష సంబంధాలూ, కుటుంబ వ్యవస్థా తీవ్రంగా ఒడుదొడుకులకు గురవుతున్న కాలమిది. లెస్బియనిజమూ, హోమోసెక్సువాలిటీ పుంజుకుంటున్న కాలమిది. బాలికలపైనా, స్త్రీలపైనా మునుపెన్నడూ లేనంతగా లైంగిక వేధింపులు జరుగుతున్న కాలమిది. ఈ నేపధ్యంలో మానవుల మౌలికావసరాల్లో ఒకటైన సెక్సు గురించి, మనుషుల లైంగిక ప్రవృత్తుల గురించి విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది. కానీ సెక్స్ అనేది మర్యాదస్తులు బహిరంగంగా మాట్లాడదగ్గ అంశం కాదనే భావన నేటి సమాజంలో బలంగా ఉంది. అదేదో అధోజగత్సంబంధి అనే అభిప్రాయంతో ఈ అంశంపై ఉదాశీనతను, మౌనాన్నీ ఆశ్రయించడం జరుగుతోంది. కావచ్చు. కానీ, మిత్రుడు రాణీ శివశంకర శర్మ ఒకచోట చెప్పినట్టు ‘అధోజగత్తును అధ్యయనం చెయ్యనిదే ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థను అర్ధం చేసుకోవడం అసాధ్యం.’

మనుషుల లైంగిక ప్రవృత్తులపై ఒక చర్చను ఆహ్వానించడమే సానివాడల సంభాషణల కూర్పు వెనక ఉన్న ఉద్దేశ్యం. క్రీస్తు శకం 1వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది వరకు ఆ వ్యవస్థ పొందిన పరిణామం ఏమిటనేది, ఆ వ్యవస్థ ద్వారా మనుషుల లైంగిక ప్రవృత్తులు ఎలా వెల్లడయ్యాయనేది ఈ సంభాషణల ద్వారా చూచాయగా వ్యక్తమౌతోంది. ప్రసిద్ధులైన రచయితల సాహిత్యం నుండే వీటిని తీసుకోవడం జరిగింది. వీటిని ప్రచురణకు తీసుకుంటూ ఈ సంభాషణలు మంచి అధ్యయనానికి దారితీయాలని అఫ్సర్ ఆకాంక్షించారు. వీటిపై వచ్చిన స్పందన నిరాశాజనకంగా ఉన్నా పట్టువదలకుండా పూర్తయ్యేదాకా వీటిని ప్రచురించారు. వారికి ధన్యవాదాలు.

 

ఓ పేదనావికుడి ప్రేమ

 

కామిని, వేశ్యరంగరాజు, ఆమె విటుడు-నావికుడు

 

రంగ:      కామినీ, నువ్వు నన్ను బికారిని చేశావు. ఇప్పుడేమో నన్ను లోపలి రానివ్వడం లేదు. లోగడ నేను విదేశాలనుంచి నీకోసం అద్భుతమైన బహుమతులు తెచ్చినప్పుడు నన్ను నీ ప్రియుడిగా నీపురుషుడిగా నీ యజమానిగా మర్యాద చేసేదానివి. నేనిప్పుడు చితికిపోయి వీథినపడితే నువ్వేమో ఆ బొంబాయి షావుకారుని వల్లో వేసుకొని నన్ను దూరంగా ఉంచు తున్నావు. వాడు నీ పెదాలతీపినీ నీ పొందులోని ఆనందాన్నీ ఆస్వాదిస్తుంటే నేను నీ గుమ్మంలో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నాను. నువ్విప్పుడు ఆ షావుకారుతో పిల్లల్ని కూడా కంటానంటున్నావు. (పెద్దగా ఏడ్చాడు)

కామిని:  నువ్వు నన్ను విసిగిస్తున్నావు రంగారాజూ! ఏంటీ… నువ్వు నన్ను బహుమతుల్తో ముంచె త్తితే నేను నిన్ను బికారిని చేశానా? నీముఖానికి నువ్వు ఎన్ని బహుమతులిచ్చావు నాకు? చెప్పు, ఎన్నిచ్చావు?

రంగ:      కామినీ, లెక్క కోసం కాకపోయినా, నీమీద నాకున్న ప్రేమకు సాక్ష్యం కోసమైనా నేనది చెప్తాను. బాగ్దాద్ నుంచి తెచ్చిన చెప్పుల జత విలువ రెండు వరహాలు. ఆ జత అంత ఖరీదు చేస్తుందని నీకు తెలుసు కదా!

కామిని:  నిజమే కానీ అందుకోసం నేన్నీతో రెండురాత్రులు గడిపాను కదా!

రంగ:      నేను సిరియా నుంచి తిరిగొచ్చినప్పుడు ఒక చలువరాతి పెట్టె నిండా రకరకాల అత్తర్లు తెచ్చిచ్చాను. దాని ఖరీదు ఒట్టేసి చెబుతున్నా రెండువరహాలు.

కామిని:  మరి నేను నీకేమీ ఇవ్వలేదా? ఆ సిరియాకే నువ్వెళ్ళబోయేముందు జమీందారు వెంకట రాజు గారు నాయింట్లో మరచిపోయి వెళ్ళిన పొడుగు చొక్కా నీకిచ్చాను కదా! పడవ తెడ్డు వేసేటప్పుడు తోడుక్కోడానికి బావుంటుందని కూడా అన్నావు నువ్వు, గుర్తొచ్చిందా? జమీందారే నాపొందు కోసం పడిచస్తుంటే, నీలాంటి పకీరుగాడిచ్చే బహుమతుల్ని కూడా గుర్తుంచుకోవాలా నేను?

రంగ:      సరేలే, విశాఖ సముద్రపొడ్డున తిరుగుతుంటే నువ్వు చెప్పే ఆ వెంకటరాజొచ్చి ఆచొక్కా కాస్తా లాక్కుపోయాడు. దానికి చాలా పెద్ద గొడవే అయ్యింది. అదట్లా వదిలేయ్! సైప్రస్ నుంచి ఉల్లిగడ్డల్ని, ఆపక్క దేశం నుంచి వాలిగ చేపల్నీ తేలేదా? టర్కీ నుంచి రొట్టెల్నీ, అంజూరపళ్ళనీ, బంగారు జరీ అల్లిన అందమైన చెప్పులజతనీ తెచ్చివ్వలేదా? విశ్వాసం లేదు నీకు! ఒక పేద నావికుడు నీకోసం బంగారు జరీ అల్లిన అందమైన చెప్పులజతను కొన్నాడు. అంతేనా, ఈజిప్టు నుండి పెద్దడబ్బా నిండా జున్ను తెచ్చిచ్చాను.

కామిని:  (నిరసనగా) అంతాకలిపి ఐదు వరహాలో అంతకంటే తక్కువో అవుతుంది.

రంగ:      అవును. ఒక నావికుడు ఖర్చు పెట్టగలిగే పెద్దమొత్తం అంతకంటే ఎక్కువుండదు కదా! ఇప్పుడు నాపదవి పెరిగింది. తెడ్లేసేవాళ్ళమీద పెత్తనం చేసే పనిచ్చారు. ఏంటలా జాలిగా చూస్తావు? మర్చిపోయా, పోయిన కాముని పున్నమికి నేన్నీకు ఒక వెండి వరహా ఇచ్చాను. మీ అమ్మకు చెప్పులు కొనుక్కోవాలంటే రెండు రాగి కాసులిచ్చాను. ఆమెకి అప్పుడప్పుడూ పావలో అర్ధో ఇస్తూనే ఉంటాను. ఇదంతా నాలాంటి పేద నావికుడు చేయగలిగిందానికంటే ఎక్కువే!

కామిని:  ఉల్లిగడ్డలూ, వాలిగచేపలూ….

రంగ:      నిజమే, ఉల్లిగడ్డలూ వాలిగచేపలూ అంటే నీకు తేలిగ్గానే ఉంటుంది. కానీ అంతకంటే గొప్ప కానుకలు నేనివ్వలేనే! నాకంత స్థాయే ఉంటే ఆ నౌకల్లో పడి దేశాలు తిరుగుతూ గొడ్డు చాకిరీ చెయ్యాల్సిన పనేముంది? నీకివన్నీ ఇచ్చాక మా అమ్మకివ్వడానికి కాసిని చిన్నుల్లి పాయలు తప్ప మరేమీ మిగల్లేదు. సరే ఇంతకీ ఆ బొంబాయి షావుకారు నీకిచ్చిన అంత గొప్ప బహుమతులేంటో తెలుసుకోవచ్చా?

కామిని:  ఈ జలతారు దుస్తులు చూస్తున్నావు కదా, ఇవి అతనిచ్చినవే! ఈ కంఠహారం చూశావా? నువ్వు తెచ్చిన ఎన్ని చేపలైతే ఈ హారం విలువకు సరితూగుతాయి?

రంగ:      అది, ఆ హారం నీ దగ్గర ఇదివరకే ఉండేది కదా!?

కామిని:  ఇదివరకు నువ్వు నాదగ్గర చూసిన హారం చాలా సన్నటిది. రత్నాలు లేనిది. ఇది వేరు. ఈ చెవిదిద్దులు, ఈ కాశ్మీరశాలువలు చూడు. ఇవే కాదు, నిన్నటికి నిన్న అతను నాకు రెండొందల వరహాలిచ్చాడు. ఇంటి అద్దె కూడా ఈ నెల నుంచి తనే కడతానన్నాడు. నువ్విచ్చే ఒక జత చెప్పులూ, కాస్త జున్నూ, ప్రేమ గురించి బోలెడంత సొల్లువాగుడూ వీటికి సాటిరావు కదా!?

రంగ:      ఇంతకీ ఆ షావుకారెలా ఉంటాడో చెప్పలేదు నువ్వు. నా పేదరికాన్నీ అతని దగ్గరున్న డబ్బునీ పోలుస్తున్నావు కానీ అతన్నీ నన్నూ కూడా పోల్చి చూడు. వయసు యాభై పైనే. బట్టతల. ఎండ్రకాయలాంటి ఎర్రని రంగు. సరిగ్గా చూశావో లేదో, బోసినోరు కూడా! ఇక ఆ హుందాతనం చెప్పుకోకపోవడమే మేలు. ఇట్లాంటి ఆకారంతో వాడు కుర్రాడి లాగా ఆడి పాడబోవడం… ముసలోడికి దసరా పండగంటారే, అట్లా ఉంది.

సరే, నీకంతగా నచ్చితే ఆ మన్మధుణ్ణే ఉంచుకో! వాడే నీకు సరైనవాడు. వాడిలాంటి కొడు కునే కను. నన్నిష్టపడే వాళ్ళెవరో నాకు దొరక్కపోరు. నువ్వేమీ విచారించకు. నీ పొరుగింట్లో పిల్లంగ్రోవి వాయించే పిల్ల నాకు బాగా నచ్చింది. తివాచీలు, కంఠాభరణాలు, వందలకొద్దీ డబ్బూ, ఇవేవీ తీసెయ్యాల్సినవి కాదు గానీ, వాటికోసం నాలాంటి అందగాణ్ణొదులుకొని ఒక డొక్కు ముసలాడి పక్కలో చేరడం దరిద్రం. ప్రతిదీ మనకే కావాలంటే దొరకదు కదా!

కామిని:  (వ్యంగ్యంగా) నీప్రేమని పొందినందుకు ఆ పిల్ల చాలా సంతోషిస్తుంది, ఎందుకంటే నువ్వు సైప్రస్ నుంచి ఉల్లిగడ్డల్నీ, ఈజిప్టు నుంచి జున్నుముక్కల్నీ తెచ్చిపెడతావు కదా!

*

అమ్మ చెప్పింది…

కూతురు, వేశ్య

ఆమెతల్లి, తెలివైనది.

 

తల్లి:       నిన్న నీకు పిచ్చేమైనా ఎక్కిందేమిటే, రాత్రి విందులో దెయ్యం పట్టినట్టు ప్రవర్తించావట? పొద్దున్నే ఆ కుర్రాడు కృష్ణమూర్తి ఏడుపొక్కటే తరువాయిగా ఇక్కడికొచ్చాడు. నువ్వతన్ని చాలా బాధపెట్టావని చెప్పాడు. బాగా తాగావట. తన ప్రక్కనే కూర్చోమని చెబుతున్నా వినకుండా విందు మధ్యలో లేచి నృత్యం చేశావట. అంతటితో ఆగకుండా అతని స్నేహితుడు గోపాలాన్ని ముద్డాడావట. అదేమని కోప్పడినందుకు అతన్ని వదిలేసి ఏకంగా గోపాలం కౌగిట్లోనే చేరిపోయావట. పోనీలే అనుకున్నా, అసలు కృష్ణమూర్తితో పడుకోనని చెప్పి అతని ఖర్మ కతన్ని వదిలేసి వేరే మంచం మీద నిగడదన్ని పడుకున్నావట. ఏమిటిదంతా!?

కూతురు: (చిరాగ్గా) నేను చేసిందంతా బాగానే గుర్తుపెట్టుకొని మరీ చెప్పాడు కానీ, అతను నాకు చేసిన అవమానం మర్చిపోయినట్టున్నాడు. అక్కడేం జరిగిందో తెలిస్తే నువ్విలా అతన్ని వెనకేసుకొచ్చి మాట్లాడవు. మదనిక లేదూ, అదేనే ఆ గోపాలం ప్రియురాలు, దాంతో మాట్లాడటం కోసం ఇతను నన్నొదిలేసి దాని దగ్గర చేరాడు. అప్పటికి గోపాలం ఇంకా అక్కడికి రాలేదు. నాకు అయిష్టంగా ఉందని తెలిసి కూడా అతనా పనికి పూనుకున్నాడు. దాన్నొదిలేసి నాదగ్గరికి రమ్మని సైగ చేశాను. వెనక్కి రాకపోగా అతనేం చేశాడో తెలుసా, ఏం చేశాడో తెలుసా…

తల్లి:       ఏం చేశాడమ్మా?

కూతురు: మదనిక కూర్చున్న కుర్చీ వెనక నిలబడి, దాని చెవులు పట్టుకొని వెనక్కు వంచి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. మదనికకి దాని పెదాలను విడిపించుకోడానికి చాలాసేపు పట్టింది. నాకు ఏడుపొచ్చి ఏడ్చేశాను. కానీ అతను నాఏడుపును కూడా నిర్లక్ష్యం చేసి దాని చెవిలో ఏవేవో ముచ్చట్లు చెప్పడం మొదలెట్టాడు. నాకుతెలుసు, అతను నాగురించే దానికేదో చెప్తున్నాడు.

తల్లి:       అట్లా ఎందుకనుకోవాల్లేమ్మా…

కూతురు: నువ్వింకా…. సరే, అతను చెప్తున్నంతసేపూ అది నావైపే చూస్తూ ఒకటే చిరునవ్వులు.. నాకు ఒళ్ళు మండిపోయింది. ఈ బాగోతం ఎంతసేపు సాగేదో కానీ, గోపాలం రావడం చూసి వీళ్ళిద్దరూ ముద్దులాపేసి విడిపోయారు. అప్పుడొచ్చాడు దొర నాదగ్గరికి.

తల్లి:       పోన్లేమ్మా, నీప్రియుడు నీదగ్గరికి చేరాడు కదా…

కూతురు: అక్కడితో కాలేదు. ఇంకా విను. విందులో మదనిక ముందుగా నృత్యం చేసింది. అక్కడున్న ఆడవాళ్ళకెవరికీ తనకున్నంత అందమైన కాళ్ళు లేవని చెప్పడానికి కాబోలు, తొడల దాకా కనబడేట్టు బట్ట ఎగ్గట్టింది. కాసేపటికి దాని నృత్యం పూర్తయ్యింది. దాని ప్రియుడు మౌనంగానే ఉన్నాడు. నాప్రియుడికి మాత్రం ఎక్కడలేని ఉత్సాహం పుట్టు కొచ్చింది. ఇకదాని నృత్యాన్ని ఒకటే పొగడ్డం. దాని హావభావాల్ని గురించీ, దాని లయ విన్యాసం గురించీ… వింటున్నావా? దాని పాదాలకు సితారతో పరిణయం జరిగిందట, కవిత్వం ఒలకబోశాడమ్మా, కవిత్వం. దాని కాళ్ళ అందాల గురించి ఒకటే పలవరింత… అదంతా దాన్ని మెచ్చుకున్నట్టు లేదు. నన్ను తక్కువ చేసినట్టుంది.

తల్లి:       అట్లా ఎందుకు చేస్తాడు లేవే!

కూతురు: ఇంకా అతన్నే వెనకేసుకొస్తున్నావా? సరే, తర్వాత జరిగింది కూడా విని అప్పుడు చెప్పు. ఈయన పొగడ్తలకి ఆ మదనికకి ఒళ్ళు తెలియలేదు. అది నావంక హేళనగా చూస్తూ, ‘ఇక్కడ ఉన్న వాళ్లెవరైనా వాళ్ళ కాళ్ళ అందాన్ని గురించి సిగ్గుపడకుండా ఉండేట్టయితే లేచి నృత్యం చేయొచ్చు’ అంది. అప్పుడు నేనేం చెయ్యనమ్మా? లేచి నృత్యం చేశాను. లేకపోతే దాని మాటలే నిజమని అక్కడి వాళ్ళందరూ అనుకుంటారు కదా!?

తల్లి:       నువ్వనవసరంగా ఉద్వేగానికి గురయ్యావు. ఆ విషయాన్ని అంతగా మనసుకు పట్టించుకోవాల్సింది కాదు.

కూతురు: అందరూ నానృత్యాన్ని బాగా మెచ్చుకున్నారు తెలుసా? నాప్రియుడు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా చూస్తూండిపోయాడు గానీ, మెచ్చుకోడానికి నోరు పెగల్చుకోలేకపోయాడు. పోనీ నానృత్యాన్నయినా చూశాడా అంటే అదీ లేదు. అంతసేపూ కప్పు వంక చూస్తూ కూర్చున్నాడు.

తల్లి:       ఐతే తర్వాత నువ్వు గోపాలాన్ని ముద్దాడటం, కృష్ణమూర్తి పక్కనుంచి లేచివెళ్ళి అతగాడిని కౌగిట్లోకి తీసుకోవడం నిజమా కాదా?

కూతురు: (మౌనం)

తల్లి:       మాట్లాడవేమే, నిజంగా నువ్వు చేసిన పని క్షమార్హం కాదు. తెలుసా?

కూతురు: నామనసు నొప్పించాడు కాబట్టి అతని మనసు కూడా నొప్పించాలనుకున్నాను.

తల్లి:       పోనీ అంతటితో ఆగావా? కృష్ణమూర్తిని రాత్రి పక్కలోకి కూడా రానివ్వలేదు. అతను చిన్నబుచ్చుకొని కన్నీళ్ళతో ఉంటే నువ్వు పుండు మీద కారం చల్లినట్టు వేరే మంచం మీద చేరి కూనిరాగాలు తీశావు.

కూతురు: (మౌనం)

తల్లి:       అతను నిన్ను చేరదీయకముందు మనం పేదరికంలో మగ్గుతున్నాం. అలాంటి స్థితిలో అతను మననెంత ఆదుకున్నాడో నువ్వు మర్చిపోయావు. మన్మధుడు దయతలిచి అతన్ని నీకు చేరువ చేయకపోతే పోయినేడు మనం కూటికి మాడి చచ్చేవాళ్ళం.

కూతురు: అందుకని అతనెంత అవమానించినా నేను భరిస్తూ ఉండాలా?

తల్లి:       అలా అని నేనన్నానా? నీకోపాన్నంతా నీప్రియుడి మీద చూపించు, తప్పులేదు. కానీ అతన్ని అవమానించకు. ఒక్కసారి నీ హేళనకు గురైనవాడు మళ్ళీ నిన్ను ప్రేమించగలడా, చేరదీయగలడా? నువ్వు నీప్రియుడితో చాలా దురుసుగా తప్పుగా ప్రవర్తించావు. సామెత చెప్పినట్టు తెగేదాకా లాగకూడదమ్మా! ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

*

విదూషకుడు పాడిన విషాద గీతం ‘మూలింటామె’

మూలింటామె‘ నవల చదవడం పూర్తి చేసి పుస్తకం మూతపెడుతూ ‘ఏమిటీ రంకు ముండా గోల? నామినికి మతిపోయిందా యేమి?’ అనుకున్నాను. ‘ఎలావుంది పుస్తకం?’ అని అత్యంత కుతూహలంగా అడిగిన మిత్రుడు మోదుగుల రవికృష్ణతో కూడా ఆ మాటే అన్నాను.

ఐతే, ఈ కథను గురించిన ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. కథంతా ముక్కలు ముక్కలుగా గుర్తొస్తూ వెంటాడుతూనే వుంది. ఎందుకో ‘బీభత్సరస ప్రధాన విషాదాంతం’ అని శ్రీశ్రీ కన్యాశుల్క నాటకాన్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటలు ఆ నాటకానికి వర్తిస్తాయో లేదో గానీ, ఈ నవలకు మాత్రం పూర్తిగా వర్తిస్తాయి.

పుస్తకం మరోసారి చదవడం మొదలెట్టాను. ఇది నామిని రాసిన పూర్వపు గ్రంథాల్లా తమాష తమాషగా నడిచే పుస్తకం కాదు. నామిని గొంతులోని చిలిపితనం మాయమయ్యింది. సీరియస్‌ టోన్‌లో ఈ కథ చెప్తాడు. ఈ మార్పు నామిని రెగ్యులర్‌ పాఠకుణ్ణి కొంచెం చకితుణ్ణి చేస్తుంది. హాస్యం తగ్గించినా వ్యంగ్యం అంతర్లీనంగా నడుస్తూనే వుంటుంది. వర్తమాన వ్యవస్థపైన ఆక్రోశంతో కూడిన వ్10521865_10154366304195385_905769971_nయంగ్యం అది.

 

మూలిల్లు అంగిడిల్లుగా మారడం మూలింటామె నవలలోని యితివృత్తం. మూలిల్లు అంగిడిల్లుగా మారే క్రమంలో పూర్వ సంప్రదాయాలు ఎలా అంతరించి పోతాయో, నైతిక విలువలు కొత్త రూపాన్ని ఎలా సంతరించుకుంటాయో, సమాజంలోని అన్ని రకాల విలువలూ ధన దౌర్జన్యాలకు ఎలా ప్రభావితమౌతాయో ఆసక్తికరంగా వివరిస్తుందీ కథ. వెరసి సంప్రదాయ జీవితాన్ని మార్కెట్‌ శక్తులు ఎలా కబళిస్తాయో, మనుషులెలా పరాయీకరణ చెందుతారో వివరిస్తుందీ కథ.

మూలింటోళ్లది ఒద్దికైన యిల్లు. ముగ్గురాడవాళ్లు. ఒక మగవాడు, ఇద్దరు పిల్లలు… ఆ యింట్లో ఉండే మనుషులు. అందరికంటే పెద్దావిడని మొదుటామె అనీ, ఆమె కూతుర్ని నడిపామె అనీ, ఆమె మనవరాల్ని కొనమ్మి అనీ పిలుస్తారు. మొదుటామె కొడుకు పేరు నారాయుడు. అతని చెల్లెలు నడిపామె. ఈ నడిపామె కూతురు కొనమ్మినే నారాయుడు పెళ్లాడాడు. వీళ్లకిద్దరు పిల్లలు.

మూలింటోళ్లు పెరట్లోనూ, చేనిగెనిమల కాడా ఉన్న చెట్లను చక్కగా సాక్కుంటారు. పెంపుడు జంతువుల్ని కూడా కన్నబిడ్డల్లా ప్రేమిస్తారు. ఆకలో తల్లా అని యింటి కొచ్చిన వాళ్లకు ఉన్నదాంట్లోంచి యింత తీసి పెడతారు. ముప్పొద్దులా చాకిరి చేస్తారు, సంతృప్తిగా జీవిస్తారు. సాటి మనుషుల కొచ్చే కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు.

ఇట్లా సుఖంగా జరిగిపోతున్న దశలో ఆ యింటి ఇల్లాలు కొనమ్మి మొగుణ్ణీ పిల్లల్నీ వదిలేసి కళాయి బోస్కునే ఒక అరవ మాదిగోడితో లేచిపొయ్యింది. ఈ విషయం సహజంగానే ముందు ఊళ్లోవాళ్లకు, చివరిగా యింట్లో వాళ్లకు తెలిసింది. ఊళ్లో పెద్దమనుషులు, పతివ్రతలు మూలింటి దగ్గర గుంపుకట్టారు. అనాల్సిన మాటలన్నీ అన్నారు. లేచిపోయిన పిల్లని వెనక్కి తేవాలని తీర్మానం చేశారు. లేచిపోయిందాన్ని వెనక్కి తెచ్చేదెందుకు? రేపు మనగ్గూడా కొంగు పరవక పోతుందా అని పెద్దమనుషులు ఆశ. మనలో మరొకటి చేరుద్దిగదా అని పతివ్రతల కులుకు.

పోయిన పిల్ల మొండిది. ‘నాకు మూదేవి గమ్మి గడప దాటొచ్చేసి తప్పు జేసినా. యింగా గడప తొక్కను. బావ మొకం చూళ్లేను. నేను కర్మురాల్ని. చచ్చిందాంతో సమానమని నన్ను మర్సిపోండి’ అని తలకొట్టుకొని ఏడుస్తూ వెళ్లిన వాళ్లను వెనక్కు పంపేసింది.

ఆడమనిషి ఇలా లేచిపోవడమనేది గుట్టుగా నడుపుకొనే సంసారాల్లో ఎంత కల్లోలం రేపాలో అంతా రేపింది. లేచిపోయిన పిల్ల అత్తకు మనవరాలు మొగుడికి మేనకోడలు. తానులో తాను, ముక్కలో ముక్క. ఆ కుటుంబాన్ని లోకులు పెట్టిన హింసకు పరాకాష్ట రంజకం వొక్కలు ముక్కలుగా మాట్లాడిన మాటలు. ‘ఏమే మొదులా! కొనదానికీ కళాయోడికీ నడిమద్దిన తడిక మాదిర వుండింది నువ్వేనంటనే! కళాయోణ్ణి కోడలితో కులకమని జెప్పి నువ్వు అడ్డాపింటి ముందర కావిలుండే దాని వంటనే! అవరా! అవరా! కొడుకని అన్నా జూసినావా నువ్వు? నీ మనవరాలు జిల్లా పటంగవితే నువ్వు దేశిపటంగివే!’

 

ఎన్ని అవమానాలు జరిగినా మొదలామెకి మనవరాలి మీద మమకారం చావలేదు. ఏదో ఒక రోజుకి తిరిగి ఇంటికి వస్తుందనే ఆశ పోలేదు. అప్పుడు కూతురు (నడిపామె) తల్లికి ఉపదేశం చేసింది. ‘అమా, నీకు పున్నెముంటాది. దాన్ని మర్సిపో. మనం గానీ ఆ యమ్మిని కడుపులోనే పెట్టుకొంటే యింట్లో వుండే లేదర పిలకాయల్ని కూడా సాక్కోలేము, చదివించుకోలేము. అన్నకు మళ్లీ పెండ్లి చేద్దారి’. మొదులామె అంగీకరించలేదు. కానీ ఆమె అంగీకారం కోసం ఎవరూ ఎదురు చూడలేదు.

లేచిపోయిన కొనమ్మికి ఎవరి సానుభూతీ దక్కలేదు. బహిరంగంగా ఆమె చేసిన తప్పును అసహ్యించుకోవడం ద్వారా ఊరు తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంది. కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలబడలేని స్థితి. సమాజం కుటుంబంపైనా వ్యక్తిగత విషయాలపైనా ఎంత దౌర్జన్యం చెయ్యగలదో అంతా చేసింది. అంతటి దుఃఖాన్నీ, అవమానాన్నీ దిగమింగుకుంటూ చెట్టూ చేమల్నీ, కయ్యా గనుమల్నీ, పిల్లీ పిచికనీ ఏమరలకుండా సాక్కుంటూనే ఉన్నారు, నడిమింటోళ్లు.

సమాజం లోకువగా ఉన్న మనుషుల్ని ఊరికే వదిలిపెట్టదు. వాళ్ల ఏడుపు కూడా వాళ్లను ఏడవ నివ్వదు. మరీ ముఖ్యంగా బంధువులైతే సానుభూతి మిషతోనో, మేలు చేసే మిషతోనో వాళ్ల వ్యవహారాల్లో వేలు పెడుతూనే ఉంటారు. మొదుటామె అక్క తన తోటికోడలి మనవరాల్ని నారాయుడికి మారు మనువుకి మాట్లాడుకొచ్చింది. నడిపామె కూడా సహకరించింది. మొదుటామెకి ఇష్టం లేకపోయినా నారాయుడి పెళ్లి పందొసంతతో జరిగిపోయింది.

పందొసంత లేచిపోయిన పిల్ల లాగా నోట్లో నాలుక లేనిది కాదు. తనకు నచ్చినపని, తాను చెయ్యాలనుకున్న పని ఎవరు ఔనన్నా కాదన్నా చేసెయ్యగల తెంపరి. మొదుటామె తనకు సానుకూలంగా లేదని వచ్చిన వెంటనే గ్రహించింది. ఐనా ‘ముసిల్దానా! దేనికెప్పుడూ ముటముటా అంటా మూతి నల్లంగా పెట్టుకోనుంటావు? నవ్వతా పేల్తా వుండలేవా నువ్వు? నవ్వు! మా ముసిల్దిగదా, నవ్వు! నవ్వు! నిన్ను ఆ పక్కట్టితో నాలుగు దొబ్బితే గానీ దోవకు రావా ఎట్ట?” అని చక్కిలిగిలి పెడుతూ ఆసికాలాడింది. మొగుడితో గూడా అంతే. మంచం మింద కుచ్చోనుంటే మెడమింద చేతులెయ్యడం, పక్కన పొనుకోని కాళ్లెయ్యడం – ఆ కులుకు నింక చెప్పలేమసలికి. వూరికొచ్చి పద్దినాలు గాకనే దానికి యిల్లిల్లూ తెలిసిపోయింది. సినమ్మా అనాల్సినోళ్లని సినమ్మా అనీ, అత్తా అనాల్సినోళ్లను అత్తా అనీ బావా అనాల్సినోళ్లను బావా అనీ పిల్సుకుంటా ఊరంతా పోయ్‌ అరట్లు దొబ్బేసి వస్తా వుంటింది. ఇంట్లో కడిగిన చెయ్యి ఆమెకు పరావోళ్ళింట్లో ఆరాల్సిందే. మొలకమ్మ యిల్లు మొదులుకోని, రంజకం యిల్లు మొదులుకోని, చాకలోళ్లిండ్లు మొదులుకోని యాడ జూసినా తిరగతానే వుంటుంది. మొదటామెకి ఆమె తిరుగుళ్లు నచ్చక పోయినా ఒకటంటే నాలుగు వినాల్సొస్తుందని గమ్మునుండేది. వూళ్లో మొగోళ్లకూ ఆడోళ్లకూ మాత్రం ‘పందొసంతకు కొత్తా పాతా లేదు. మనూరికి రావాల్సిన బిడ్డే!’ అని పేరెత్తుకొనింది.

Mulintame600

వ్యాపారానికీ, మార్కెట్‌ సంస్కృతి నిలబడటానికీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా ముఖ్యం. పందొసంతలో ఆ స్కిల్స్‌ కొల్ల. ఐతే మార్కెట్‌లో నిలబడాలంటే కేవలం స్కిల్‌ ఒక్కటే చాలదు. ఒక బలమైన అండ ఉండాలి. ఒక గాడ్‌ఫాదర్‌ కావాలి.

రంగబిళ్ల ఆ చుట్టు పక్కలూళ్లల్లో కొంచెం పేరెత్తుకున్నోడు. అతగాడు నారాయుడికి తమ్ముడొరస. పందొసంత కన్ను మొదట అతని మీదే పడింది. ‘రంగబిళ్లా, ఏం మేనమామ కొడకా! మరదాల్ని చూసేసిపోవా? మరదాల్తో మాట్లాడి పోకూవర్తీ కనుక్కోవా?’ అంటా పైయ్యేస్కోని పిలిచేది. ‘నువ్వేంది బావా బీడీలు తాగేది, సిగిరెట్లు తాగు’ అని చెళ్లబడేది. ఒక రోజు సందేళపూట ‘బావా నన్ను ఉప్పు గుర్రం ఎక్కించుకో’ అని రంగబిళ్ల యీపెనకాన ఉప్పుగుర్రం ఎక్కి మిట్ట మిందంతా ఒకటికి పది చుట్లు తిరిగింది. మొదుటామె మనవరాలు లేచిపోయినప్పుడు వొక్కలు ముక్కలుగా మాట్లాడిన రంజకం యిదంతా యీదిలో నుంచి చూసి పకపకా నవ్వేసింది. ‘బావా మరదాలు బలే కులుకు మిందుండారే!’ అని కండ్లారా చూసింది గానీ ఏం యిచ్చిత్ర పోలా!

రంగబిళ్ల కంటే గుడుగుడు చెంద్రడు మరింత శక్తిమంతుడని, లాభకారి అని, పందొసంతలోని వ్యాపార శక్తి కనిపెట్టేసింది. గుడుగుడు చెంద్రడు పది పన్నెండెకరాల ఆసామి. మూడు టాకట్రలకు యజమాని. యాడ టాకట్రు దున్నకం మిందుంటే ఆడికి గుడుగుడు మోట్రమీద పొయ్‌ ఊళ్లు తిరుగుతాడు. అందుకే అతన్ని ఆ పాయకట్టంతా గుడుగుడు చెంద్రడని పిలుస్తారు. సొంత వూళ్లో మాత్రం అతన్ని కర్రెడ్డి అంటారు మనిసి బొగ్గు వర్నంతో వుంటాడు గాబట్టి. పందొసంత మేని వర్ణాన్ని చూసే మనిషికాదు. డబ్బుకు వర్ణభేదం వుండదని తెలిసిన మనిషి. ఆమె చూపు అతని మింద పడిన మరుక్షణం గుడుగుడు మోటారు మూలింటి ముందు ఆగిపోయింది. మంచి మద్యానం వచ్చిన మనిసి రేత్తిరి ఏడు దాకా పందొసంతతో మాట్లాడిన వాడు మాట్లాడినట్టే ఉన్నాడు. నారాయుడు కూడా గుడుగుడు చెంద్రడికి ఎంతో మరేదిచ్చినాడు.

పందొసంత దూరదృష్టి గల మనిషి. క్రైసిస్‌ మేనేజిమెంటు ఆమెకు బాగా తెలుసు. ముందు ముందు వ్యవహారాలు సజావుగా సాగాలంటే గుడుగుడు చెంద్రడికీ నారాయుడికీ మంచి సఖ్యత ఏర్పడాలని గుర్తించింది. అందుకోసం రకరకాల విద్యలు ప్రయోగించింది. మొగుడి బుజాల మింద చేతులేసి పైపైన పడేది. ఏదో ఒగటి మాట్లాడమని గారాం జేసేది. నారాయుడి ముసిముసి నవ్వులు నవ్వతా ఒకటి రెండు మాటలు మాట్లాడగానే ‘పెండ్లాం మాట అట్ట యినాల’ అని చెప్పి ముద్దులు బెట్టేది. గుడుగుడు చెంద్రడొచ్చినప్పుడు అతగాడి దగ్గర సిగరెట్టు పెరుక్కోని మొగుడి కిచ్చేది. ఆ సిగరెట్టు ముట్టించమని గుడుగుడు చెంద్రడికి ఆర్డరేసేది. గుడుగుడు చెంద్రడు ముట్టిస్తా వుంటే, ‘యిప్పుడు పోటాగాన తీస్తే ఎన్టీరామారావుకు నాగేస్పర్రావు ముట్టించినట్టుగా వుంటాది’ అని చెంద్రడి మింద పడిపడి నవ్వేది.

ఒకానొక రేత్రి గుడుగుడు చెంద్రడికి పెండ్లయి పెళ్లాం బిడ్డలుండినా గాజులమండ్యంలో యిల్లూ వాకిలీ వుండినా మూలింటామె యింటి ముందరుండిన టాకట్రను ఎగజూపెట్టుకోని జాగారం చెయ్యాల్సొచ్చింది. నారాయుడు మంచాన్నీ పెళ్లాన్నీ చెంద్రడి కొదిలేసి ఈతాకు చాపమింద వైబోగంగా నిద్దరబొయ్‌నాడు. ఇట్లాంటి వార్తలు ఊరిమీద వేగంగానే పాకుతాయి. మిట్టూరోళ్లంతా మూతుల మింద చేతులేసుకున్నారు. ‘పందొసంత యీ వూరికి కోడలైన పది పదైద్దినాలల్లోనే వూరి పినపెద్ద కొడుకు రంగబిళ్లను పెట్టుకొనింది. నెలైనా వోడితో సావాసం చేసిందో లేదో అష్టతెలువుల్తో పది పన్నెండెకరాలుండి వొకటికి మూడు టాకట్రలుండే గాజులమండ్యం రెడ్డిని ఒళ్లో యేస్కొనింది. అదే యింట్లో పుట్టి పెరిగిన పెవడముండ ఏమి జేసింది? అరవ మాదిగోడితో పూడిసింది. వొకటి మూలింటోళ్లకు తలొంపులు తెచ్చి దాని దోవ అది చూసుకుంటే, యింకొక పున్నాత్మురాలొచ్చి వాళ్ల నెత్తిన కిరీటం పెట్టింది’. అని మూలింటోళ్ల మింద కుళ్లుకున్నారు కూడా!

వ్యాపార సంస్కృతి ప్రబలమయ్యే కొద్దీ సంప్రదాయవాదుల గొంతులు బలం కోల్పోతాయి. పందొసంత వ్యవహారశైలి గురించి చీమంతమ్మ సుకుమార్‌ లాంటి వాళ్లు గొణిగినా వారి నోళ్లను మొలకమ్మ రంజకం లాంటి వాళ్లు తేలిగ్గానే మూయించగలిగారు.

తన చాకచక్యం ఇంటినీ వీధినీ గెలిచిందని పందొసంతకు అర్ధమైంది. తదుపరి కార్యాచరణకు దిగింది. ఇంటి చుట్టూతా, పొలం గట్ల మీదా ఉన్న చెట్లను సామిల్లు వాడికి మంచి రేటుకు అమ్మేసింది. తరతరాలుగా పిల్లలకు కాయా గసురూ అందిస్తూ నీడనిస్తున్న చెట్లను కొట్టేయొద్దని మూలింటామె అడ్డం రాబోయింది. “అడ్డం వొస్తావా! కావాలంటే అరవ మాదిగోడితో దొబ్బుకొని పూడ్సిన నీ మనవరాల్ని కూడా తొడకరాబో? యిద్దురూ చెట్లకాడ అడ్డంగా పొడుకుందురు. పోపోయే ముసిల్దానా! నాలుగు నాళ్లకంతా యింటికాడా, చేనుకాడా కిలీనుగా యిలాశియంగా వుంటాది. నువ్వు పదే ముసిలీ!’ అంటా పందొసంత పకపకా నవ్వుతా ఎనప దూడను జవురుకొన్నట్టుగా జవురుకోని తెచ్చి ముసల్దాన్ని బండమింద మరేదగా కుచ్చనబెట్టింది.

చెట్ల నమ్మిన డబ్బు పన్నెండు వేలలోంచి పన్నెండు వందలు తీసి బంకొకటి తెప్పించి యింటి ముందర అంగిడి తెరిపించింది పందొసంత. మరసట్రోజే బంకు నిండికీ సామానొచ్చేసినాయి. ఒక వస్తవ ఉండాది ఒక వస్తవ లేదు అనాల్సిన పన్లా. కొనుక్కోడానికి డబ్బుండక్కర్లా. సమయానికి డబ్బు లేకపోతే పందొసంత వివరంగా గుర్తు రాసుకోని అప్పిచ్చేస్తాది. వూరి జనానికి పందొసంత అంగిడి వల్ల ఇంత మేలుగా ఉండాది. ఏడున్నరా ఎనిమిది కంతా అంత చారూకూడూ తినేసి పొనుకునే వూరు తొమ్మిదీ తొమ్మిదిన్నరకు అంగిట్లో లైట్లు ఆరినాకనే పొనుకునేది నేర్చింది.

పందొసంత అంగిడి తెరిచే దాంతో ఆగలేదు. ఆ వెంటనే చీరల వ్యాపారం, దాంతో పాటే తండల వ్యాపారం, పనిలో పనిగా చీటీల వ్యాపారం కూడా మొదలేసింది. యిన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నా మొగుణ్ణి నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆరుగాలం ఎద్దుల్ని మడికాడకి తోలకపోయి సందేళ వాటి కోసం కసవు మోపును నెత్తిన బెట్టుకోని కాళ్లీడ్చుకుంటూ యింటికి వచ్చే మొగుణ్ణి చూస్తావుంటే ఆమెకు కడుపు రగలకపొయ్యేది. గుడుగుడు చెంద్రడి టాకట్రుండగా ఎద్దుల సేద్యం ఎందుకు చెయ్యాలనిపించింది. బండీ ఎద్దుల్ని ఆరువేలకు అమ్మేసి పట్టిన శని యీడేర్చింది. మొగుడికి మోపెడ్‌ కొనిచ్చింది. నారాయుడిప్పుడు మోపెడ్‌ మీద తిరగతా కొట్లోకి సామాన్లు తెస్తుండాడు. పొరుగూరు పోయి బిలేరి కోడి మాంసం కావాలన్నప్పుడల్లా తెస్తుండాడు.

ఇంక భూమి మిగిలిపోయింది. ఆ రెండెకరాల కయ్యనూ అమ్మితే అరవై వేలన్నా వస్తాయి. ఆ డబ్బు కనుక వొడ్డీల మింద తిరిగితే ఇరై ముప్పై ఎకరాలు సేద్యం చేసే దానికంటే ఎక్కువ మిగల బెట్టుకోవచ్చు. మొగుణ్ణి ఎగదోసింది. ‘నేను నిన్ను బతికినంతకాలం కుచ్చనబెట్టి కూడేస్తాను బావా! నువ్వేంది బావా ఆ మడికాడికి బొయ్‌ వొంగివొంగి పనిచేసేది? నువ్వు కుచ్చుంటే నాకు కుశాల. నువ్వు ఎండలోకి పొయ్‌ చేనులో వొంగితే నాకు బాద” అని కండ్ల నిండికి నీళ్లు పెట్టుకొనింది. గుడుగుడుచెంద్రడితో కలిసి జోరుగా మందు తాగుతున్న నారాయుడు “కయ్యమ్మాలనుకున్నాం గదా. మాయమ్మకు కొంచిం మంచిగా ఉండు. మూకుళ్లలో కూడూ, కోడికూరా దండిగా కలుపుకోని పొయ్‌ పిల్లులకు పెట్టు. చిన్నామున్నుల్లాలా, కానాచ్చుల్లాలా, కొండాచ్చుల్లాలా అని మాయమ్మ యినేటట్టుగా పిల్లుల్ని పిల్చి బండకాడ పిల్లులకు కూడూ కూరా పెట్టేసి రాబో’ అనేసి అన్నాడు ఓ అని నవ్వతా! ఆ ఒక్క మాటతో నారాయుడు తాను తల్లి పక్షం కాదనీ భార్య పక్షమేననీ స్పష్టంగా చెప్పినట్టైంది. ఇది పందొసంతకు గొప్ప విజయం.

ఐతే విజేతకు అడుగడుగునా సవాళ్లు ఎదురౌతూనే ఉంటాయనేందుకు నిదర్శనంగా అప్పుడొక సంఘటన జరిగింది. వాళ్లింటి ముందు గుడుగుడు చెంద్రడి పెళ్లాం ఆటో దిగింది. దిగుతూనే నేరుగా మొగుడి దగ్గరికొచ్చి వాడి మొకాన కేకరించి ఎంగిలూంచి, పందొసంత ఎదుర్రొమ్ము మింద అట్టనే ఎగిసి ఎడం కాల్తో తన్ని, ‘నా మొగుళ్ళంజా! మా కొంప మూడు ముక్కలయ్యే దాకా వీణ్ణొదలవాసేయ్‌’ అంటా ఆగిత్తం పట్టించింది. ఈ గోలకు యింటి ముందు పోగైన జనాన్ని చూసి, ‘యీ వూళ్లో యిట్టాంటి పలుబోటి లంజలు కూడా ఉండాయా! యీ మాదిర్తో వూరోళ్ల మొగుళ్లను పక్కలో యేస్కోని యింటికి రానీకుండా చేసే ఆడదాన్ని ఏం చేస్తే కర్మాలు తీరునో మీరే చెప్పండి. యీనా సవితిని పట్టుకోని నలగ్గుమ్మేద్దామనుండాది’ అని కాసుగ్గాకుండా మాట్లాడింది.

పందొసంతకు జరుగుతున్న అవమానం అక్కడి జనం సహించలేకపోయారు. పందొసంత లాంటి తీరైన మనిషికి, పదిమందికి తల్లో నాలుకలా ఉండే మనిషికి జరగాల్సిన అవమానమా అది? వెంటనే మొలకమ్మ అందుకుంది. ‘పందొసంతకు ఎవురూ సపోరట రారని అనుకోబాక. మేమంతా చచ్చినామా! యిది వూరనుకున్నావా అడివను కున్నావా? నీ మొగ్గుణ్ణి అదుపులో పెట్టుకోవాల్నే గాని వొకమ్మ గన్న బిడ్డిమిందికి వొంటికాలి మింద ఎందుకొస్తావు?” అని మూతి మింద కొట్టినట్టుగా మాట్లాడింది. ఆ వెంటనే రంజకం అందుకుంది. ‘యిందాక పందొసంత ఎదుర్రొమ్ముల మింద తన్నినావంట గదే. నీ కాళ్లల్లో గండుమల్లి పుండు బుట్టదా! యింగొక్కసారి వాళ్ల పనిలో వాళ్లుండగా యీ మాదిర బైసాట్లు చేస్తా వొచ్చినావంటే నీ శిండ చించి, బజిని గుడికాడ కట్టేస్తాం. నీ నాయం నీకుంటే మా నాయం మాకుంటాది’ అనింది. చెంద్రడి పెళ్లాం బిత్తరపోయింది. శత్రువు బలం అర్ధమైంది. ‘మీరు పొండి తల్లుల్లారా! నా బంగారం మంచిది కాదు’. అని మళ్లా మొగుడి మొకాన వూంచి వొచ్చిన ఆటో ఎక్కి మళ్లా తిరుక్కోని పూడిసింది. పందొసంత వూరిని గెలిచింది.

అరవై వేలకు భూమిని అమ్మేందుకు ఒప్పందమైపోయింది. పొలం అమ్మాలంటే మొదుటామె వేలిముద్దరెయ్యాల. ముసల్ది బిగుసుకుపోయింది. పందొసంత చాణక్యాలు ఆమె మీద పనిచెయ్యలేదు.

మార్కెట్‌ శక్తులు తమపని సాఫీగా సాగిపోతున్నప్పుడు ఎంత ఉదారంగా ఉంటాయో వ్యతిరేకత వచ్చినప్పుడు అంత కంతా క్రౌర్యం చూపిస్తాయి. మొదులామె ప్రాణప్రదంగా పెంచుకొనే పిల్లల్లో రెంటికి విషం పెట్టి చంపేసింది పందొసంత. వేలిముద్దరెయ్యకపోతే మిగిలిన వాటికి కూడా అదే గతి పడుతుందని మొదుటామెని హెచ్చరించింది. మొదటామె ఒక నిర్ణయానికొచ్చేసింది. తనబోటి వాళ్లకివి రోజులు కావు. వెంటనే లేచి యింత వొడిశాకు పెరుక్కోని తినేసింది. ముసిల్ది వొడిశాకు తినేసిందని వూళ్లో ఎట్ట తెలిసిపొయ్యిందో గానీ అందురూ యీదిలో వుడ్డ జేరి పొయ్‌నారు. చీమంతమ్మ వొచ్చి ముసిల్దాని తలకాయ వొళ్లో బెట్టుకొంది. ముసిల్దానికి వూపిరి పీల్చేదానికి కష్టిమై ఆపసోపాలు పడుతూ కూడా చీమంతమ్మకు ఒక మాట చెప్పి మరీ కన్నుమూసింది.

“నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతే గానీ మియాం మియాం అంటా నీ కాళ్ల కాడా నా కాళ్ల కాడా చుట్టక లాడే పిల్లిని చంపలేదే!”

ఈ నవల్లో పందొసంత ఆధునికతను అభిమానించే వారు కళ్లకద్దుకోవాల్సిన పాత్ర. వ్యక్తిస్వేచ్ఛ, స్వతంత్ర భావజాలం, సంప్రదాయాలపై తిరుగుబాటు, సంఘ నియమాల ధిక్కరణ, ప్రాక్టికాలిటీ యిలాంటి ఆధునిక లక్షణాలు కలిగి వున్న పాత్ర. మరీ ముఖ్యంగా వ్యక్తి ఔన్నత్యాన్ని డబ్బుతో కొలిచే సంస్కృతికి ప్రతిరూపం యీ పాత్ర. సంప్రదాయవాదులు గొంతు చించుకొనే నీతి నియమాలు ఎంత డొల్లవో అడుగడుగునా నిరూపించడమే కాకుండా నీతి నియమాలకు కొత్త భాష్యాలు చెప్పగలిగిన పాత్ర. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, అది సాధించేందుకు ఉన్న మార్గాలను కనుక్కోవడం, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, తగిన స్ట్రేటజీస్‌ని అమలు చేయడం, అంతిమంగా విజయాన్ని అందుకోవడం…. ఆధునిక కాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు బోధించే అనేక పాఠాలు పందొసంత పాత్ర ఆచరణలో చూపుతుంది. పందొసంత వలన మార్కెట్‌ సంస్కృతి పుట్టుకొస్తుందా, మార్కెట్‌ సంస్కృతి పందొసంతల్ని పుట్టిస్తుందా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్న.

ప్రాచీన సంప్రదాయాలతో మనుగడ సాగించే దేశాలన్నిటిలో వ్యక్తులు పరిమిత స్వేచ్ఛ కలిగి ఉంటూ ప్రకృతితోనూ తోటి సమాజంతోనూ మమేకమై జీవించడం కన్పిస్తుంది. వలసవాదులు సంప్రదాయ జీవనానికి ఆలవాలమైన దేశాలను ఆక్రమించి ఆయా దేశాలకు మార్కెట్‌ సంస్కృతిని, అందుకవసరమైన వ్యక్తి స్వేచ్ఛను విస్తృతంగా ప్రచారం చేశారు. క్రమేపీ మార్కెట్‌ సంస్కృతి ప్రపంచీకరణకు దారితీసింది. మార్కెట్‌ సంస్కృతి కోరుకొనేది ఒక్కటే! లాభం. యీ సంస్కృతిలో లాభం కోసం చేసే కార్యకలాపాలకే గౌరవం. యీ మార్కెట్‌ సంస్కృతి 1984 నాటికే దేశం నలుమూలలా వ్యాపించిందని మూలింటామె నవలలో రచయిత సూచన మాత్రంగా చెబుతాడు. తేదీల సంగతి ఎలా ఉన్నా యీ సంస్కృతి నేడు దేశం మారుమూలలకూ వ్యాపించిందనేది నిజం. దీని ఫలితంగానే పర్యావరణం, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు నశిస్తున్నాయనేది నిజం. దీనికి వ్యతిరేకంగా పోరాడే వారు కూడా ఆధునికతను అక్కున చేర్చుకోవడం విచిత్రం. మార్కెట్‌ సంస్కృతి వ్యాప్తిని రచయిత నిస్సహాయంగా, విషాదంగా, క్రోధంగా పరికిస్తున్నట్టు నవలలో మనకు సూచనలందుతాయి. నామినిలోని ఒక తాత్త్విక దృక్పథం మొట్టమొదటిసారిగా మనకు పరిచయమౌతుంది. మునికన్నడి సేద్యం నవలలో కూడా యీ ఛాయలున్నప్పటికీ ఇంతటి స్పష్టత లేదు.

గ్రామీణ జీవితంలోని దారిద్య్రాన్ని, బతుకు పోరాటాన్ని హాస్యంతో రంగరించి ఆత్మకథాత్మకంగా తన రచనల్లో యింతకు పూర్వం చిత్రించిన నామిని ఆ వొరవడిలో అనేక మంది నూతన రచయితలు ఆవిర్భవించేందుకు కారణమయ్యాడు. పిల్ల వసుచరిత్రలనేకం పుట్టుకొచ్చాయి. మూలింటామె నవల ఇతరులు అనుకరించలేనిది. గతంలో నామిని లోని విదూషకత్వాన్ని (పాపం శమించుగాక) ఆస్వాదించిన పాఠకులకు గానీ సాటి రచయితలకు గానీ మూలింటామె నవలలోని కథావస్తువు దాన్ని చెప్పేందుకు అతనెన్నుకున్న స్వరం ఒక పట్టాన రుచించకపోవచ్చు. కానీ ప్రపంచీకరణ దుష్ఫలితాల్ని, ఒకానొక మారుమూల గ్రామంలో అవి ప్రతిఫలించిన విధానాన్ని అత్యంత సహజంగా నామిని చెప్పిన తీరు మాత్రం అత్యద్భుతమనే చెప్పాలి. ఒక అంతర్జాతీయ సమస్యను అదే స్థాయిలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన నవలగా మూలింటామె నవల విమర్శకుల మెప్పును పొందుతుంది. ఎన్నుకున్న నేపథ్యం, పాత్రల చిత్రణ, ఎలాంటి ప్రతిపాదనలు ఉపదేశాలు చెయ్యకపోవడం, చెప్పదలుచుకున్న అంశం వైపుకే పాఠకుడి దృష్టి ఉండేలా అనవసరమైన విషయాల్ని పరిహరించడం, అతి కొద్ది పేజీల్లో ఒక విస్తృతమైన అంశాన్ని ఆలోచనాత్మకంగా మలచడం ఇవన్నీ నామినిని ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన తెలుగు రచయితగా నిలబెడతాయి. మూలింటామె ప్రపంచ సాహిత్యంలో స్థానం పొందగల రచన. ఈ నవల ఆంగ్లానువాదం కోసం ఎదురుచూడాల్సి ఉంది.

-పిన్నమనేని మృత్యుంజయరావు

Mruthyunjaya Rao