జర్నీలో తోడు సంగీతం: రంజని

chaya1

 

ఛాయ (సాంస్కృతిక సంస్థ) నిర్వహిస్తున్న తమ పదమూడవ కార్యక్రమం – ఛాయ తరంగిణి (సెప్టెంబర్ 4- 6PM) కార్యక్రమంలో రంజని శివకుమార్ పాల్గొంటున్న సందర్భంగా తనతో ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ చేసిన సంభాషణ.

—-*—

నెలవంక పసివెలుగులా దినదినమూ ప్రవర్ధమానమై పూర్ణచందమామ వెన్నెల్లా  మనోలోయలని సంపూర్ణంగా నవరాగ సంమ్మిళితంలో మంత్రముగ్ధులని చేసే రాగరంజని  ఆమె.

దైనందిన జీవితపు ప్రతిమలుపులో మనపై చిలకరించే ఆ స్వరపరాగపు అంతరంగమంతా సంగీతమే.

ఆ సుస్వరాల ప్రవాహపు గమనాన్ని వినటం వొక అందమైన అనుభవం.

మీ అందరితో పంచుకోవటం చాల సంతోషం.

యిక విందామా?

 

రంజని, చిన్నప్పుడు మీరు విన్నపాటల్లో యే పాట మీకు బాగా గుర్తుంది?

రంజని : మా బామ్మ గారు వాళ్ళంతా కృష్ణ భక్తులు. యింట్లో నామావాళి పాడుతుండే వాళ్ళు. చిన్న చిన్నవి. అవి యెలా అంటే బృందగానం లాగ. భజన సాంప్రదాయం. యెలా వుంటుందంటే ‘ఆనందకందా గోపాలా గోవిందా – జే జే నందా యశోదా చందా…’ అలా చాల ఫోక్సీగా వుంటుంది ట్యూన్. యింట్లో జస్ట్ అవి పాడతారు. అవి నాకు కాస్త కాస్త జ్ఞానం తెలిసినప్పటి నుంచి బాగ జ్ఞాపకం వున్న పాటలు.

అంతే కాకుండా అప్పా ఫ్లూట్ వాయిస్తారు. నిజానికి మా అమ్మ అప్పా సంగీతం వల్లే ప్రేమలో పడ్డారు. మా అమ్మ అప్పాకి కాంభోజివర్ణం, సరసిజనాభ నేర్పించే వారు.

మా యింట్లో యెప్పుడు సంగీతం గురించిన మాటలు మాటాడుతుంటారు. అమ్మ పాడతారు. నిజానికి వాటిని మాటలు, సంభాషణ అనడానికీ లేదు. జస్ట్ ప్లే మ్యూజిక్… యింటి వాతావరణం అంతా నిత్యం సంగీతంతో నిండివుండేది. సంగీతోత్సవంలా వుండేదనుకో యిల్లు. రిచువలిస్టిక్ కాదుకానీ పండగలతో మ్యూజిక్ ముడిపడి వుండేది.

మార్గశిర మాసం వస్తే యం యల్ వి అమ్మ పాడిన ఆండాళ్ తిరువప్పై మా యింట్లో వుదయం వేళ కాసేట్ ప్లే అవుతుండేది. అనుకోకుండా అది చెవ్వుల్లో పడిపడి చాల యెంజాయ్ చేసేవాళ్ళం. వినీవినీ మాకు యం యల్ వి అమ్మ పై యిష్టం వచ్చేసింది. అలా ఆ కేసెట్ తో మేమూ కలసి పాడుకునే వాళ్ళం. అలానే భద్రాచల రామదాస్ కృతీస్ బై బాలమురళి కృష్ణ సర్ వి ప్లే అవుతుండేవి. ‘తక్కువేమి మనకూ రాముడొక్కడుండు వరకు’ అని వస్తుంటే మధ్యలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాసేజ్ వచ్చేది. అవి కూడా బట్టీ అయిపోయేవి. అమ్మ కర్నాటిక్ పాడేవారు. అప్పా ఫ్లూట్ వాయించేవారు. తమ్మూ మృదంగం వాయించేవారు. అలా యెప్పుడు మా యిల్లు సంగీతంతో నిండి వుండేది. అంతే కాని కూర్చోని విను, విను… పాడుపాడు… నేర్చుకో నేర్చుకో… అలా అసలు వుండేది కాదు. సంగీతమంటే సరదాగా వుండేది. యిష్టంగా వుండేది.

అమ్మ అప్పా యిండియన్ బ్యాంక్ లో పనిచేసే వారు. వాళ్ళు వాళ్ళ కెరీర్లో బిజీ. అయినా యెప్పుడూ యింట్లో మ్యూజిక్కే వుండేది.

రంజని, మనం చిన్నప్పుడు పెరిగిన యిల్లు మనల్నిచాల influence చేస్తుంది కదామీకు మీ యిల్లు యెలా వుండేది?

రంజని: చెన్నైలోని ఐనవరంలో మాది చిన్ని యిండిపెండెంట్ యిల్లు. నా పర్సనాలిటి రూపు దిద్దుకోవటంలో ఆ యిల్లు పెద్ద పాత్రే పోషించింది. యింట్లో వొక్కొక్కరికి వేరువేరుగా గదులు వుండేవి కావు. అందరం వొకే గదిలోనో, హల్లోనో పడుకునే వాళ్ళం. కాని మా యింటి చుట్టూ చాల పెద్ద తోట వుండేది.

తోటాయేయే చెట్లు పూల మొక్కలు వుండేవి?

రంజని: సపోటా రెండు రకాల మామిడి, పారిజాతం, గొయ్య , పనస, సామంది కొబ్బరి చెట్లు టిపికల్ హౌస్ హోల్డ్… అడివి మాదిరి వుండేది. మైంటైన్ చెయ్యటం పెద్ద పని.

డాబా యిల్లా

రంజని: డాబా యిల్లే. ఆ డాబా మీద కొట్టాయి (ఆస్బెస్టస్ షెడ్డు) వుండేది. యెక్కడ నుంచి వచ్చారో యెవరికి తెలీదు కాని నేను పుట్టేటప్పటికే అందులో వరదరాజన్ గారు వుండేవారు. 50 యేళ్ళు వుండేవి. అతని దగ్గరకి వీణ, వయిలన్, వోకల్ నేర్చుకోడానికి చాల మంది వచ్చేవారు. అమ్మ యింట్లో యేది వండితే అది అతనికి పెట్టేది. అతని దగ్గర వొక్క కిరోసిన్ స్టవ్ మాత్రమే వుండేది. అతను టీ మాత్రం చేసుకునేవారు.

photo: Meena

photo: Meena

యింట్రస్టింగ్యెలా వుండేవారు చూడటానికి… .

రంజని: బీడీ తాగేవారు. పొడవుగా వుండేవారు. యెప్పుడు తెల్లని పంచె, లాల్చితో వుండేవారు. బీడీ తాగటం వలన sunken cheeks వుండేవి. Nonviolent person. ఆ జమానాలో చాల మందిలానే చాల సింపుల్ లివింగ్. హ్యాపీ పర్సన్.. వరదరాజన్ గారి దగ్గర చాల ఫ్లూట్స్ వుండేవి. అతనికి అన్ని రకాల యింస్ట్రుమెంట్స్ రిపేర్ చెయ్యటం వచ్చు. అతని స్నేహితులు మృదంగాన్ని బాగు చేసేవారు. నాకు మొట్ట మొదట సరిగమ పదనిసలు… వరదరాజన్ సర్ నేర్పించారు. వొక రోజు ఆయన కనిపించకుండా వెళ్ళిపోయే వరకు అంటే ఆరేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వరకు వరదరాజన్ గారి దగ్గరే సంగీతంలో బేసిక్స్ నేర్చుకున్నాను. యెక్కడి నుండి వచ్చారో తెలియనట్టే యెక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. యెస్… వెరీ వెరీ యింట్రస్టింగ్ పర్సన్. అతనికి మ్యూజిక్ యింస్ట్రీమెంట్స్ గురించి యిన్ అండ్ అవుట్ తెలుసు.

 

రియల్లీ యింట్రస్టింగ్ పర్సన్ఆ తరువాత సంగీతం యెక్కడ నేర్చుకున్నారు…?

రంజని : ఆ తరువాత, తమిళియన్నే కాని జంషడెపూర్ లో సెటిల్ అయిన సీతనారాయణన్ చెన్నై కి తిరిగి వచ్చారు. ఐనవరంలోనే మా యింటికి దగ్గరలో వుండేవారు. కర్నాటిక్ సంగీతం నేర్పించటమే కాదు సీతా అమ్మకి భజన్స్, హిందుస్తానీ సంగీతంలో కూడా ట్రైనింగ్ వుంది. కర్నాటిక్ మ్యూజిక్ తో పాటు భజన్స్ కూడా సీతా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.అప్పుట్లో పిల్లల్లా వున్నప్పుడు మనకి వీడియో గేమ్స్ అలా యేమి వుండేవి కాదు కదా. స్కూల్ నుంచి మూడు లేదా మాక్సిమమ్ మాడున్నరకి వచ్చేసే వాళ్ళం. బయట ఆడుకోవటం, మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళటం, భారత నాట్యం క్లాస్ కి వెళ్ళటం, సమ్మర్ హాలిడేస్ వస్తే వాలీబాల్ కోచింగ్, స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళటం యిలా అప్పట్లో టైం అంతా యాక్టివిటీస్ తో నిండిపోయి వుండేది.

యిల్లు లానే మనపై స్కూల్ ప్రభావం కూడా వుంటుంది కదా. మీ స్కూల్ గురించి

రంజని: Its an amazing school Padma. భావన్స్ రాజాజీ విద్యాశ్రమంలో. చదువుకున్నాను. కిల్ పాక్ లో వుండేది. చాల మంచి టీచర్స్ వుండేవారు. అక్కడ చదువొక్కటే కాదు. యెక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి చాల యింపార్టేన్స్ వుండేది. వైవిధ్యభరితంగా ఆలోచించేవారుండే వారు. వొక్కోసారి మంజుల మేడం యింగ్లీష్ క్లాస్ లని చెట్ల కింద చెప్పేవారు. చిత్ర సంపత్ మేడం డాన్స్ నేర్పించేవారు. మీరా మిస్ సంస్కృతం, శాంతా మిస్ తమిళం నేర్పించేవారు.స్కూల్ ల్లో ఉదయాళూర్ కళ్యాణ్ రామన్ సర్ మ్యూజిక్ టీచర్. భజన సంప్రదాయం లో సుప్రసిద్దులు. స్కూల్ ల్లో యానివాల్ డే కి అందరూ యేదో వొక యాక్టివిటీలో పాల్గునేవారు. టీచర్స్ అంతా చాల నాలెడ్జబుల్. అలాంటి టీచర్స్ వుండటం నిజంగా లక్కీ. యీ ప్రపంచంలో వివిధ రకాల కెరీర్ ఆప్షన్స్ వున్నాయని అవన్నీ యెక్స్ ప్లోర్ చెయ్య వచ్చనేట్టు యెంకరేజ్ చేసేవారు. యిప్పుడు మా క్లాస్ మేట్స్ ని చూడు పద్మా, స్పోర్ట్స్ మెడిసన్, యోగా, యానిమేషన్ యిలా వొక్కో ఫీల్డ్ లో వున్నారు.

నైస్యింట్లో కెరీర్ గురించి చెప్పేవారాయింజినీరింగ్ చదవాలన్నది యెవరి ఛాయిస్

రంజని: యింట్లో యెప్పుడూ యిదే చెయ్యాలని చెప్పేవారు కాదు. చదువు ,మ్యూజిక్, ఆటలు యెందులోను బలవంతం చేసేవారు కాదు. అన్నీ పూర్తిగా నా ఛాయస్. అప్పాకి నేను B A మ్యూజిక్ ఆ తరువాత M A మ్యూజిక్ చెయ్యాలని వుండేది. కాని

యింజినీరింగ్ చదవాలన్నది నా ఛాయిస్. వేలూరు యింజనీరింగ్ కాలేజీలో చేరడానికి వొక కారణం హాస్టల్ జీవితాన్ని చూడాలనిపించింది. ఐనవరానికి బయట వున్న ప్రపంచం యెలా వుంటుందో చూడాలనే కుతూహలంతో యింజినీరింగ్ కాలేజ్ లో చేరాను.

యిప్పుడు ఆ కాలేజీ ని VIT యింజనీరింగ్ కాలేజీ అంటున్నారు. యింజినీరింగ్ సెకండ్ యియర్ లో వున్నప్పుడు డ్రామా చెయ్యాలనిపించింది. అప్పాకి డ్రామా అంటే చాల యిష్టం సరే చెయ్యి… చెయ్యి అని NSD కి వెళ్ళమన్నారు. నేనే వెళ్ళలేదు. కాని అంతలా మా ఛాయిస్ లని యిష్టంగా వొప్పుకునేవారు.

యిల్లు, స్కూల్ మీ విషయంలో వొక దానిని మరొకటి కాప్లిమెంట్ చేసేట్టు వున్నాయి. కానీ బయట అప్పుడు వేగంగా వచ్చే రకరకాల మార్పులని యెలా చూసేవారు మీరు.

రంజని: చదువుకునేప్పుడు కెరియర్ డే డ్రీమ్స్ చాలానే వుండేవి. I had all career choices in my life. యేయిర్ హోస్టెస్ అవ్వాలనిపించాగానే ‘ లెట్స్ అప్లై అనుకునే వాళ్ళం. యెలక్త్రనిక్స్ చెయ్యాలని, కాపీ రైటింగ్ బాగుంది అందులోకి వెళ్లాలని, యానిమేషన్ స్కెచెస్ గీయాలని, వావ్… MTV విజేస్ అంట అవి ట్రై చేద్దామాని, జింగిల్స్ పాడాలని యిలా అందరికి ఆ యేజ్ లో యేలాగయితే రకరకాల కలలు, ఆలోచనలు వుంటాయో నాకు వుండేవి. అంతా మాలో మేమే నలుగురైదుగురు ఫ్రెండ్స్ మి అనుకునే వాళ్ళం. టీవీ యెక్కువ చూసే వాళ్ళం కాదు కానీ టీవిలో చూసేవి మాత్రం వెరీ ఫైన్ ప్రోగ్రామ్స్. మీఠా విసిట్, దీప్తి నావల్ , షబానా ఆజ్మీ లాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడటం వలన అదీ మన పెర్సనాలిటీకి యాడ్ అవుతుంది కదా… అలానే లిటరేచర్ కూడా సత్య జిత్ రేస్ Feluda, యిలా చాల ఫైన్ గా వుండేవాటికి యెక్స్పోస్ అవ్వటం వల్ల యే ప్రభావం  నుంచి యెప్పుడు బయటకి వచ్చేయ్యాలో తెలిసేది. యిలా అవన్నీ వున్నా సంగీతం నా జర్నీ లో భాగంగా యెప్పుడు వెన్నంటే వుండేది. మ్యూజిక్ మాత్రం పార్ట్ అఫ్ మై లైఫ్.

 

ఫైన్జాబ్ చేసేవారు కదా మరి మీరెప్పుడు సంగీతానికి పూర్తి టైం యివ్వలనుకున్నారు

రంజని: యింజినీరింగ్ తరువాత T C S లో పోస్టింగ్ హైదరాబాద్ లో వచ్చింది. హైదరాబాద్ లో నేను ఫ్లూటిస్ట్ యన్ యెస్ శ్రీనివాసన్ సర్ ని కలిసాను. ఆయన శారదా శ్రీనివాసన్ గారి  హస్బెండ్. హైలీ యింటలేక్చువల్ పర్సన్స్. హెచ్ డి వెల్స్ నుంచి కోట్ చేస్తూ నాకు మ్యూజిక్ ని వివరించే వారు. కాన్సెప్ట్ అఫ్ టైం, కాన్సెప్ట్ అఫ్ సైలెన్స్ ని చెప్పేవారు. మ్యూజిక్ విషయంలో డీప్ థాట్ వున్న వ్యక్తి.

అలా మ్యూజిక్ పట్ల పూర్తి అవగాహన, విజ్ఞానం వున్న యన్ యెస్ సర్ ‘వుద్యోగాలు చెయ్యడానికి చాల మందే వున్నారు. కానీ మ్యూజిక్ అందరికి రాదు. నువ్వెందుకు మ్యూజిక్ పైనే పూర్తి గా కాంసెంట్రేట్ చెయ్యవు. నీ టైం అంతా మ్యూజిక్ పైనే పెట్టు’ అని చెప్పారు.

నాపై యన్ యెస్ మామ ప్రభావం చాలా చాల వుంది. నేను నా కార్పరేట్ వుద్యోగం మానేసి నా సమయమంతా మ్యూజిక్ కే పూర్తిగా యివ్వడానికి యన్ యెస్ మామే కారణం. నేనెప్పుడు అంత బ్రిలియంట్ పర్సన్ని చూడలేదు.

యెప్పటి నుంచి కాన్సర్ట్స్ యిచ్చే వారు రంజని.

రంజని: నేను చైల్డ్ గా వున్నప్పటి నుంచే సీతామామీ చెన్నై లో కాశీవిశ్వనాథ్ టెంపుల్ ల్లో నవరాత్రి వుత్సవాలకు, పరుశువాకం లో త్యాగరాజ ఆరాధనై కాన్సర్ట్స్ కి తీసుకు వెళ్ళేవారు. అలా చిన్నతనం నుంచే టెంపుల్ కాన్సర్ట్స్ లో పాల్గునేదాన్ని.

 

చిన్న పిల్లలాగా మనం వున్నప్పుడు పిల్లల్లో టాలెంట్ ని అంతా చాల మెచ్చుకోవటం చాల కామన్ కదా. చిన్న పాపగా వున్నప్పుడు యీ కాన్సర్ట్స్ లో మీరు పాడినప్పుడు చాలమంది చాల మెచ్చుకొంటుంటే ఆ ప్రశంసల నుండి డిస్టెన్స్ మైంటైన్ చేసేవారాచేస్తే యెలా చెయ్యగలిగే వారు.

రంజని: మనలని యెవరు యెంత మెచ్చుకున్నా మనకి మనం యెక్కడ వున్నామో తెలుస్తుంటుంది. మనం ఆ పొగడ్త  కాదని తోసైయ్యం. కాని ఆ పొగడ్తలు యిచ్చే సంతోషం క్షణికం. అంతే. తిరిగి మనల్ని మనం చెక్ చేసుకుంటాం. మనకి మనమే అసలైన చెక్. ప్రతి కాన్సర్ట్ లో మనం యెలా పాడేం, యెక్కడ యే పదం బాగ పలక లేదు, యే సంగతి మరింత బాగా మనం యేఫ్ఫోర్ట్ పెట్టాల్సింది, యిప్పటి కంటే అంతకు ముందు యింట్లో పాడిందే బాగున్నట్టు అనిపించవచ్చు. విలువైన వ్యక్తులు మన చుట్టూ వున్నప్పుడు మనల్ని మనం యెప్పుడు త్వరగా గ్రేట్ అనుకోలేం. మనం మన ఫీల్డ్ లో మనకి వున్న నాలెడ్జ్ యెంతో మనకి తెలుస్తుంటుంది. యింకా యెంతో తెలుసుకోవలసింది వుందని మనకి తెలుస్తునే వుంటుంది. యెంతో సాధన చెయ్యాలని తెలుస్తుంటుంది. ఆ రియాలిటీ చెక్ యెప్పుడూ వుంటుంది నాకు.

ranjani1చెన్నై లో చాల కంపిటేటివ్ సర్క్యూట్ వుంటుంది. చిన్నప్పటి నుంచి అక్కడ పార్టిస్స్పేట్ చేసేదానిని. అప్పా చెపుతుంటారు, చిన్నప్పుడు అలా పాడటానికి వెళ్ళినప్పుడు నా పాట పాడటం అయిపోగానే నేను ఆ ప్రాంగణం నుంచి రాకుండా అక్కడ శ్రోతల్లో కూర్చుని మిగిలిన వారు పాడుతుంటే వింటాననే దాన్నంటా. మిగిలిన వాళ్ళు యెలా పాడుతున్నారో చూడటం నాకు చాల ఆసక్తి. వాళ్ళు వాయిస్ ని యెలా వాడుతున్నారు, కృతి యే స్టైల్ ల్లో వుంది, యే కృతి ప్రెజెంట్ చేస్తున్నారు, హై రేంజ్ స్ ని యెలా ప్రెసెంట్ చేస్తున్నారు యిలా మిగిలిన తోటి వాళ్ళని పూర్తిగా గమనిస్తాను. దాంతో నాకు నేను యెక్కడ వున్నానో తెలిసేది. నేను యెక్కడ సరి అవ్వాలో కూడా తెలిసేది.

అదీ కాకుండా మా పేరెంట్స్ నేను కాన్సర్ట్ స్ యిచ్చినప్పుడు చాల త్వరగా గా నేను చేసిన పొరపాట్లని చెపుతారు. గుడ్ క్రిటిక్స్. వొకసారి యేమయిందంటే తాన్పూరాని చాల సేపు వాయించాను. అలా యెలా వాయిస్తావ్… శ్రోతల్ని అలా బోర్ కొట్టించటం కరెక్ట్ కాదు కదా అన్నారు. యీ మధ్య అయోధ్యా మండపం లో నేను కాన్సర్ట్ యిచ్చాను. చాల బాగ పాడేనని నాకు నేను గాల్లో తెల్తున్తున్నాను. యెప్పుడో కాని నాకు అటువంటి సంతోషం కలగదు. మామూలుగా యెలా వుంటుందంటే, అక్కడ సంగతి మరింత ఫీల్ తో పాడాల్సిందనో, లిరిక్ లో యేదో మర్చిపోయాననో యిలా యేదో వొక కొరత వుంటుంది మనసులో పాడిన ప్రతి సారి. ఆ రోజు అలా యేమి లేకుండా చాల సంతోషం గా వున్నప్పుడు మా పేరెంట్స్’ నువ్వు అలా అన్ ప్రోఫ్ఫెషనల్ గా యెలా ప్రవర్తిస్తావ్ అన్నారు. నేనేం చేసాను అని అడిగాను. మా పేరెంట్స్ చెప్పారు ‘మృదంగం వాయించే వారికి తనియావర్తనం ప్లే చేసే సమయం యివ్వకుండా మొత్తం నువ్వే పాడేసావు. స్టేజి మీద యెవరి లైం లైట్ వారికి యివ్వాలి కదా. అలా అన్ ప్రోఫ్ఫేషనల్ గా వుంటే యెలా… ధర్మా అనేది వొకటుం టుంది’ అన్నారు. అతనికి వెళ్ళి సారీ చెప్పాను. అతను నాకు సీనియర్ కూడా. పర్వాలేదు నువ్వు చాల యిన్న్వాల్వ్ అయి పాడేరు అన్నారు. అది గంటన్నర కాన్సర్ట్ . సో.. స్టేజ్ మీద టైం చాల ముఖ్యం.

అలానే రేడియోలో పాడినప్పుడు అరగంట లో లైవ్ యిచ్చేటప్పుడు టైం ఛాలెంజ్ గా వుంటుంది. యెలా వుంటుందంటే వర్డ్ లిమిట్ వున్నప్పుడు రాయటంలా పద్మా. టైం ని సెట్ చేసుకోడానికి NS మామ నాకు టైమర్ యిచ్చారు.

 

పాడేటప్పుడు స్టేజి మీద మిమ్మల్ని మీరు యెప్పుడైనా మైమర్చిపోతారా

రంజని: మర్చిపోతా ఐ లూస్ మై సెల్ఫ్. బాగుంటుంది అలా మర్చిపోవటం.

తిరిగి మళ్ళీ యిక్కడ మా పేరెంట్స్ చెప్పిన విషయాలు గుర్తు వస్తున్నాయి. వొక సారి లిరిక్ మరచి పోయా. you can’t afford to forget a lyric అని చెప్పారు. అలానే నిన్ను నువ్వు పాడుతూ అలా స్టేజి మీద మర్చిపోవటం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నీ డ్యూటీ ని మర్చిపోకూడదు’ అని చెప్పారు. అలా మర్చిపోవటం శ్రోతల ముందు ఆ క్షణాలని వాళ్ళ కి ప్రెసెంట్ చెయ్యటం వొక రకంగా బాగానే వుంటుంది. కానీ మా పేరెంట్స్ చెప్పినట్టు నేను నా డ్యూటీ నీ పేరఫోం చెయ్యటం మీద యెక్కువ దృష్టి పెట్టటం కూడా నేర్చుకుంటున్నాను.

 

మీరు చాల చోట్ల పాడేరు కదామీకు ఫలానా చోట తప్పకుండా పాడాలని వుండేదా

రంజని: కళాక్షేత్రా లో పాడటం చాల యిష్టం. ఆ యామ్బియన్స్ అందంగా వుంటుంది. అక్కడ పాడటానికి అవకాశం వచ్చినప్పుడు చాల సంతోషపడ్డాను.

యెక్కడెక్కడ పాడేరు రంజని?

రంజని: సేలం, కోయింబత్తుర్, మధురై, చెన్నయి లో యిలా దాదాపు చాల వూర్లలో పాడేను. విశాఖపట్నం, కాకినాడ, తెనాలి , బెర్హంపూర్, భద్రాచలం యిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కచేరీలు యిచ్చాను. అలానే బెంగళూరు, యూ యస్ లో, యూకే లో పాడేను.

యింకా మ్యూజిక్ నేర్చు కొంటున్నారా…?

రంజని: కర్నాటిక్ సంగీతంలో అంతా వచ్చేసింది అని యెప్పుడూ వుండదు. ప్రతి వొక్కరికీ యే స్టేజ్ లో అయినా వొక గురువు అవసరం. నేను యుకే నుంచి తిరిగి వచ్చాక చెన్నై మ్యూజిక్ సీజన్ లో పంతుల రమ గారి పాటలు విని మైమరచిపోయాను. అదృష్టవశాత్తూ యిప్పుడు ఆమే నా గురువు. మ్యామ్ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ లో ఫైనర్ యాస్పెక్ట్స్ నేర్చుకొంటున్నాను.

నాకు ఆమె గురువుకంటే కూడా వొక అక్క లాంటిది. నన్ను యెంతో ప్రేమగా చూసుకుంటుంది. తన సంగీతమన్నా, తనన్నా నాకు చాలా యిష్టం.

యిప్పుడు ఛాయాలో ఛాయా తరంగిణిని హైదరాబాద్ లో తెలుగు యూనివెర్సిటీలో పాడబోతున్నారు. మీ పాటని యెప్పుడెప్పుడు విందామాని యెదురు చూస్తూన్నాను.

రంజనినేను కూడా హైదరాబాద్ లో పాడి కొన్ని నెలలయింది. నేను కూడా మీలాగే యెదురుచూస్తున్నాను.

*

 

ఎప్పుడూ వెంట వచ్చే వసంతం!

 

-కుప్పిలి పద్మ

~

 ప్రేమ!!! .

పసివసంతాల సంభ్రమాశ్చర్యాల యింద్రజాలం. గిలిగింతల మాఘపరాగ లేతచల్లదనం. పరవశించే ఫాల్గుణపూలతేనే గాలుల తీయదనం. రంగురంగుల పత్ర సోయగాల శిశిరపు వెచ్చదనం. తడి మెరిసే శ్రావణపు తేమదనం. ఆరు రుతువుల విలక్షణ  దివ్యానుభూతిరాగంతో  మదిచెవిలో మనసుచిలుకలు పాడే మృదుగీతం.

మన అనుభవంలోకి వచ్చే తొలి ప్రేమానుభవం కళ్ళు వీప్పి విప్పగానే అమ్మ స్పర్శా లాలిత్యం.  పలరింపుగా  చిటికలేస్తూ ప్రేమ స్వరాన్ని నాన్న పరిచయం చెయ్యటం తొలి సురాగానుభావం. బంధువులు ఆప్తులు తోడబుట్టిన వాళ్ళు యిరుగుపొరుగు వొక్కరేమిటి అంతా ముద్దల జాతరే … వావ్…  పసితనపు  యీ  జీవితోత్సాహపు  అసలు పేరు  ప్రేమ అని తెలుసుతుంది మనకి మెల్లమెల్లగా. మనం పెంచబడే కొద్దీ ప్రేమ వొక వ్యక్తిగత రాజకీయాల సాలెగూడని అనుభవపూర్వకంగా తెలుసుతుం టుంది. నిదానంగా మనలో దొంతరుదొంతర్లుగా యేర్పడే ఖాళీలు మనకి వొక essential being  తప్పనిసరి అన్వేషణైనప్పుడు మరి కొన్ని కొత్త  ప్రేమల వైపు మనసు మరలుతుంది.

ఆకుపచ్చని  ప్రేమలకి  ప్రాచీనారణ్యంలోకి వనవాసిలమై  – సుశాంతి ప్రేమలకి యుద్ధాలని దాటుకుంటూ నటాషాలమై – నిలకడైన ప్రేమలకై  సందిగ్ధ తెరలని  తొలగించుకొంటూ స్కార్లెటై  –   నవసమ జీవనపు ఆకాంక్షలకి నారుపోయాలని  అంటరాని వసంతాలని ప్రశ్నించే రూతులమై – ప్రేమంటే  గులకరాళ్ళ శబ్ధపు రియాలిటి షో కాదని  మంత్రనగరి సరిహద్దులలో నువ్వూ నేను మనమయ్యే వో సరికొత్త ప్రేమహృదయాన్ని రచిద్దాం.

యేక కాలంలో వంద తలలు నరికే మగధీరుని భుజశక్తీ – బాహ్యాకారపు బాహుబలుల బాహువులెంత  విశాలమైన వారి మనసులపై వాలడానికైనా  హత్తుకోడానికి కురచవే అని నిట్టూర్చ క్కరలేదు. ‘సడేలేని అలజడి యేదో యెలా మదికి వినిపిస్తుందో’ అని యవ్వనాశ్చర్యాలకి లోనవుతూ కంచెలని తొలగిద్దామనే  మనసులమై  నిర్భయంగా నిజాయితీగా చెంపల్లో సిగ్గుల ముద్దులవుదామా!

ప్రేమ జైంట్ వీలే కాని దానిని తిప్పే చేతికి  యెక్కడ ఆపాలో యెక్కడ జోరుగా తిప్పాలో యెక్కడ జర్క్ యివ్వాలొ సరిగ్గా  తెలిస్తే వొళ్ళంతా నిలువెల్లా తుళ్ళింతే. లంగరేసే ప్రేమ కథల ముచ్చట యెప్పుడు వొక్క లానే వుంటుంది. వాటిని వదిలేసి  ప్రయాణించే ప్రేమ కథలని కాసేపైన నెమరేసుకుందాం. మనకి తెలీయకుండానే మనందరం ప్రేమని వ్యక్త పరిచే సాధనం వొక్కటే.   ప్రేమని వ్యక్త పర్చటానికి  క్రియేటివిటి కావాలి. యెప్పటికప్పుడు కొత్త ఆనవాలు కావాలి. మనం హృదయం ప్రేమని  వ్యక్త పరిచడానికి సంసిద్ధ మైనప్పుడు మన కోసం వేచి వుండే వొక హృదయముంటే మన మనోసరోవరం చుట్టూ జీవన పువ్వులు సీతాకోక చిలుకలై తేనె జల్లులని కురిపించవా… మన యెద దోనెలో ముద్దులు చినుకులై కురిసి దేహాలు యేక ముత్యమై మృదువు గా  వికసించవా…

valentine

వొక్క ప్రేమ అనేక ముఖాలు. ప్రేమకి కులం వుంటుంది.  మతముంటుంది. వర్గముటుంది. ప్ర్రాంత ముంటుంది. సరిహద్దులుంటాయి. ఆయా ప్రాతిపదికలపై ప్రేమరంగులరాట్నం తిరుగుతుంటుంది. యివేవి లేని లేకుండా  స్వయంప్రకాశియై మెరిసే  ప్రేమ సుదూర స్వప్నం. రెప్పపాటులో వాస్తవమైతే మనశ్శరీరాలు కావా రంగురంగుమైదానావనాలు.

ప్రేమ !!!

వొక అనుమానాల చీమల పుట్ట. అవసరాల ఆయుధాగారం. ఆపదల వడగళ్ళ వాన. అసూయభరిత  పడగనీడ. పొగ చూరిన విలువల భాంఢాగారం. పగిలిన నత్తగుల్లజ్ఞాపకాల రణరణ ధ్వని. మనసులని కలుషితం చేసే విధ్వంస ఫీలింగ్.

ప్రేమ సాగరమై మనల్ని కమ్ముకోవటం వొక నిస్సహాయ అపచారం. ప్రేమ సుడిగుండంలో చిక్కుకోవటం పొరపాటు అంచన. ప్రేమ సునామియై మింగైటం కోరుకొని  భీభత్సం.  ప్రేమ వాయుగుండమై చుట్టుకోవటమొక అనుకోని వుపద్రవం. యీ ఆత్యాధునిక కాలంలో ప్రేమ యాసిడ్ మచ్చలై , పరువు వేటలై,  కత్తుల కాట్లై చెలరేగుతోంది. యీ భయకంపిత ప్రేమల కోసం యెవరు మనసులని తెరచి పెట్టుకోరు. కాని పెద్దపులి నోట్లో మనసు పెట్టి వేటాడే లేడి పిలైయింది ప్రేమ.  అలాంటి ప్రేమలని పెంచే అమానుషపు విషయాల రెక్కలని మనం అడ్డుకోవాలి యీ  ప్రపంచాన్ని ప్రేమించేవారిగా.

ప్రేమ కోసం కత్తి పట్టిన వీరులు – ప్రేమ కోసం సప్తసముద్రాలు దాటే  సాహసవంతులు పోయి   ప్రేమించమని మారణాయుధాలు చేత బూనినవారు సంచరించే యీ కాలంలో ‘నీ సుఖమే కోరుకుంటా’ అని పాడుకునే హృదయాలని ఆశించటం అత్యాశే మాత్రమే బరువు కూడ. ఆల్ యీస్ వెల్ – ఆల్ హాప్పీస్ అయితే మనసు సంతోషపడుతుంది. నిజానికి  ప్రేమేమి మరీ అరుదు కాదు. యెడారి వోయాసిసేం కాదు. Come… fall in Love’  అంటూ రైలు బండినెక్కించే ప్రేమ మనలని పచ్చగా మైమరిపిస్తూనే వుంది. ‘జొన్నకంకి ధూళి పడినట్టు కన్నులలో దూరి తొలచితివే’ అని మన హృదయం తీయని డిస్ట్రబెన్స్ ని హమ్ చేస్తూనే వుంటుంది.  కళ్ళతో మాటడే  ఓకే బంగారం  చాల యెక్కువ కదా  యీ గజిబిజి  మెట్రోలో.  అసలంటూ హృదయంలో ప్రేమనే జీవధార వుంటే జీవితపు అన్ని ప్రయాణాలని  అన్ని వేళలా పచ్చగా విరపూయిచగలం.

Diamonds are forever – అది వొక మిత్ అని తెలుసు. కాని ప్రతిదాన్ని జల్లెడేసి తూర్ర్పార పడితే అందమైన  భ్రమలు కూడ మిగలవ్. ప్రేమగా మరింత ప్రేమగా మనం మనసులని ప్రేమగా ముద్దు పెట్టుకుందాం.  Love forever మాత్రం మిత్ కాదని  మరలమరల హత్తుకోవలసిన అందించాల్సిన అందుకోవలసిన  ప్రాణవాయువని మనకి మనమే యెప్పటికప్పుడు  మన మనసులని తట్టి చెప్పు కోవాలి…

ప్రేమిద్దాం  రహస్యంగా నంగినంగి కాదు. వెలుగంత ప్రకాశవంతంగా…

*

అతనొక వేకువ పసిమి వెలుతురు…

 

కుప్పిలి  పద్మ
(ఆగస్టు పదిహేడు త్రిపురనేని శ్రీనివాస్ కన్ను మూసిన రోజు)
 

త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని,    వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్ని తలచుకోవటం.
* * *
వొకకానొక వసంత కాలపు సాయంకాలం.  వొక సాహితీ  మీటింగ్ ప్రాంగణంలో వుపన్యాసం వింటూ ఆకాశంలో నిండు చందమామని చూస్తున్నాను.
వో నవ్వు మాటలు కలగలసిన పిలుపు. వెనక్కి చూసాను. కిసుక్కున నవ్వుతోన్న చందమామ.  తిరిగి ఆకాశం వైపు చూసాను. ఆ ఆకాశపు చందమామ అక్కడే వున్నాడు.  మరి యెవరీ చందమామ అని తిరిగి చూసాను.  కృష్ణ గాలులు నులివెచ్చగా  వీస్తున్న ఆ మల్లెల కాలంలో ‘ప్రవహించు గోదావరి’ని   చూసాను.
 * * *
‘గోదావ‌రీ ప్ర‌వ‌హించు ‘  అంటూ  తిపురనేని శ్రీ‌నివాస్‌, సౌదా  కలసి సాహిత్యప్రవాహం లోకి కలసి ప్రవహించటం  మొదలుపెట్టారు.అప్పుడు  ఆ కవిత్వనవ్య ధార తళతళతో  చదవురుల మనసులని మిలమిలలాడించింది.

ఆ తరువాత
‘కవిత్వం కావాలి  కవిత్వం

అక్షరం నిండా  జలజలలాడిపోయే
కవిత్వం కావాలి
ప్రజల మీదే రాయి
ప్రజలల్లోని  అగాధ గాధల  మీదే రాయి
కవిత్వం రాయి
కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకి
దూసుకు పోయే కవిత్వం రాయి
అలా వొక వాక్యం చదవగానే
శత్రువు ఠారెత్తి  పోవాలి
అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి
కవిత్వం వేరు వచనం వేరు
సాదాసీదా డీలా వాక్యం రాసి
కవిత్వమని బుకాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై తేలిపోతావ్…  అంటూ పదునైన కవిత్వంతో  1989లో త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ ‘ర‌హ‌స్యోద్య‌మం’ ప్రచురించారు. తెలుగు విప్ల‌వ క‌విత్వం సరికొత్తగా  రెపరెపలాడింది. ఆ సరి కొత్త గాలితో  కవిత్వపు హృదయాలు వుప్పొంగాయి.
యిప్పుడు మళ్ళీ  ఆ ‘ర‌హ‌స్యోద్య‌మం’ వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ గారి ఆంగ్లానువాదంతో రెండు  భాష‌ల్లో, కె.శ్రీనివాస్ గారి ముందు మాటతో  రాబోతోన్నయీ పుస్తకాన్ని శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వ‌రావు  గారు ప్ర‌చురించారు. విశ్వేశ్వర రావు గారి  కవిత్వం మీద వున్న గౌరవానికి,  శ్రీను  మీద వున్న  ప్రేమకి, యీ పుస్తకం వొక  నిదర్శనం.  ఆ  పుస్తకం రావటం అన్నది శ్రీను స్నేహితులకి, ఆప్తులకి యెంత  సంతోషాన్ని  కలిగిస్తుందో  కవిత్వాభిమానులకి అంతే ఆనందాన్ని యిస్తుంది.
యిప్పటికీ నవయవ్వనంతో తేజోవంతంగా  ప్రకాశిస్తోన్న  త్రి. శ్రీ. కి కవిత్వం రాయటమే కాదు యెక్కడ కవిత్వంలో కొత్తదనం కనిపించినా , అస్తిత్వాల   ఆనవాలు మెరిసినా  యెంతో  యిష్టంగా ప్రారంభించిన  క‌విత్వ ప్ర‌చుర‌ణ‌ల నుంచి 1990 నుంచి 94 వ‌ర‌కు 14 పుస్తకాలు ప్రచురించాడు. వస్తువు, రూపం వ్యైవిధ్య భరితం.  అవి వరుసగా

1. క్రితం త‌ర్వాత‌… ఆరుగురు యువ క‌వుల సంయుక్త క‌విత 2. యెక్క‌డైనా యిక్క‌డే… ప్రీతిష్‌నంది క‌విత్వానువాదం త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ 3.19 క‌విత‌లు… గాలి నాస‌ర‌రెడ్డి  4. ఒఖ‌డే… స్మైల్  5. బ‌తికిన క్ష‌ణాలు… వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ 6. ఇక ఈ క్ష‌ణం… నీలిమా గోపీచంద్ 7. ఫోర్త్ ప‌ర్స‌న్ సింగుల‌ర్‌… గుడిహాళం ర‌ఘునాథం 8. బాధ‌లూ-సంద‌ర్భాలూ… త్రిపుర 9. గురిచూసి పాడే పాట‌…స్త్రీవాద క‌విత‌లు 10. ఎన్నెలో ఎన్నెలో… రావిశాస్త్రి క‌విత్వం 11. పుట్టుమ‌చ్చ‌… ఖాద‌ర్ మొహియుద్దీన్ 12. మ‌రోవైపు… దేశ‌దే శాల క‌విత్వానువాదం త్రిపురనేని శ్రీ‌నివాస్ 13.స్వ‌ప్న‌లిపి… అజంతా 14.అజంతా 14. చిక్క‌న‌వుతున్న పాట‌… ద‌ళిత క‌విత్వం 15. హో… త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ క‌విత్వం. 1997లో క‌విత్వం ప్ర‌చుర‌ణ‌లు 15వ పుస్త‌కంగా శ్రీను  స్నేహితులు ప్ర‌చురించారు.

*  *  *
అస్తిత్వ‌వాద వుద్య‌మాల  వేకువలో  శ్రీను తను యించార్జ్ గా వున్న  వార్తాపత్రికల్లో స్త్రీ, ద‌ళిత‌, మైనారిటీ వాదాల సాహిత్యానికి  మొదట  ప్రాధాన్యత నిచ్చేవాడు. కధ నైనా,
కవిత్వానైనా  మామూలుగా  రాస్తే నిర్మొహమాటంగా  యిది యీ కాలపు రచన కాదని చెప్పేవాడు.
నేను బలంగా నమ్మే, యిష్టమైన  స్త్రీ వాద ఫిలాసఫీతో  రాసిన మసిగుడ్డ  కథని శ్రీను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో  ప్రచురించాడు.  ఆ కథకి వచ్చిన అద్భుతమైన  రెస్పాన్స్ చూసి నేను   ఆశ్చర్యపోయాను. ఆ కథ  స్త్రీ వాద కధా  ప్రపంచంలో స్పష్టమైన స్త్రీవాద కథకురాలిగా  నిలబెట్టింది.
ఆ తరువాత మరి కొన్ని కథలు వివిధ పత్రికల్లో  అచ్చుఅయ్యాయి. నిర్ణయం కథ చదివి అందులో వైష్ణవి పిల్లల  విషయంలో తీసుకొన్న నిర్ణయం చూసి గట్టిగా నవ్వుతూ  ‘ అరే, యీ విషయంలో కూడా  మా మగవాళ్ళ కి  నిర్ణయించే హక్కుని వుంచవా ‘  అని అడిగాడు. ఆ తరువాతెప్పుడో  ఆ కథలో  నీ నరేషన్ చాల నచ్చింది.  కుటుంబాలకి సంబంధించిన  ఆ ముఖ్యమైన అంశం అంత సునాయాసంగా చర్చించావో అని చెప్పినప్పుడు తిరిగి వొక సీరియస్ చర్చ. భలే  భాద్యతగా చర్చించేవాడు.
నా  రెండవ కథా సంకలనం ‘ ముక్త ‘  శ్రీనివాస్ కి  అంకితం యిచ్చాను.
 * * *
మోడల్స్  జీవితం పై వొక కథ రాసాను.  ఆ కథ చదివి  శ్రీను అటువంటి అనేక లేయర్స్ వున్న వస్తువుని  తీసుకొన్నప్పుడు ఆ విషయాలలో  సంక్లిష్టతని పాత్రల స్వభావాలని  మరింత అవగాహనతో రాయాలని, అందులోని విషయాలని మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి వసంతలక్ష్మి గారు, వసంత  కన్నభిరన్ గారి వంటి అనుభవజ్ఞులతో  మాట్లాడితే  విషయాలు మరింత బాగా అర్ధం అవుతాయని వొక  వుత్తరం రాసాడు. ఆ వుత్తరం  వొక కథకురాలిగా  నన్ను నేను మరింత మెరుగుపరచుకోడానికి  తోడ్పడింది.
 * * *
త్రి శ్రీ.  సాహిత్యానికి  సంబంధించి హితబోధలు  చెయ్యకుండా వొక మంచి మాట, వొక సూచన  చేస్తే మాత్రం అవి ఆ  రచయితకి, సాహిత్యానికి  అత్యంత విలువైనవిగా వుండేవి.
కథలో అస్థిత్వాన్ని అంతర్లీనంగా రాసినా,  ప్రస్పుటంగా రాసినా సరే  కథ యెప్పుడు కథకి  సంబంధించిన యీస్థటిక్స్ తో  కథ కథలానే  వుండాలి వ్యాసం లా  వుండకూడదనే వాడు.
 * * *
అస్తిత్వ వాదరచనలని  అర్ధం చేసుకోవటంలో,  ప్రచురించటం పై యెనలేని అవగాహన వుండేది తనకి.  రాబోయే కాలపు  సాహిత్య ప్రవాహానికి  తను  ముందుగానే తెరచిన తలుపుల్లోంచి  అస్థిత్వ వాద సాహిత్యం యెలా వొప్పొంగిందో  మనం  చూస్తూనే వున్నాం.
 * * *
బిమల్ రాయ్  సుజాతని చూస్తే  కళ్ళు చెమ్మగిల్లే   శ్రీనుకి మన నాగేశ్వరరావు గారి దేవదాసే దేవదాస్…  వొక పాజిటివ్ ద్ధిక్కారపు  సంతకం  యెప్పుడు వొకలానే  యెందుకుండదో, వుండలేదో  త్రిపురనేని శ్రీనివాస్ కి  ఖచ్చితంగా అప్పుడే  తెలుసు. ఆ  తరువాత సాహిత్య ప్రపంచానికి మెల్లమెల్లగా  తెలియసాగింది.
* * *
 త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని, వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్  న్ని తలచుకోవటం మాత్రమే కాదు  వొక సాహిత్య  యవ్వనోత్సాహాన్ని నెమరేసుకోవటమే.
Kuppili Padma Photo

మనోప్రపంచంలో నా హక్కు కోసం…కథలు!

-కుప్పిలి పద్మ 
మాఘ చంద్రకాంతిని సాయంకాలపు నడకలో ప్రేమించి ప్రేమించి  యింటికొచ్చాక  వొక కథ రాసాను. నూట వొకటో  కథ. యిన్ని కథలు 5 సంకలనాలుగా వచ్చిన తరువాత యిప్పుడు యీ కథ దగ్గర నిలబడి  వెనక్కి చూసుకుంటే  అవును నేను  నా వ్యక్తీకరణకి కధాకాన్వాస్ ని  యెందుకు   యెంచుకున్నాను అని ఆలోచించటం వింతగా వుంది.  గమ్మత్తుగాను వుంది. కొత్తగానూ వుంది.  నాలోకి నేను చూసుకోవటం  ఆసక్తిగాను వుంది. థాంక్స్ టూ సారంగ. 
నాకు యేమనిపించిందంటే…
చిన్న పిల్లలు, వృద్ధులు  కథలు  చెపుతారు. సహజంగా వుంటాయి. ఆ  కథలకి యిమీడియట్ గా వొక లక్ష్యం ప్రయోజనం వుండదు. వుండాలని కూడా  యెవ్వరు అనుకోరు. బాల్యానికి  వృద్ధాప్యానికి మధ్యన కథలు చెప్పటం రాయటం అన్నది  యేదో వొక ప్రత్యేకమైన వ్యాపకంగా అని  అనుకుంటారు. కధలు  రాస్తే యెందుకు రాస్తున్నావు అని అడుగుతారు. దానికి అర్ధవంతంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత యేదో మన మీద వుందని మనం అనుకుంటాం. నిజానికి కథలు రాయటం మొదలుపెట్టటం అన్నది బాల్యానికి వొక కొనసాగింపుగానే జరుగుతుందనుకుంటాను. చిన్న పిల్లలకి వృద్ధులకి వొక మనో ప్రపంచంలో విహరించే వెసులుబాటు వుంటుంది.  నాకు ఆ వెసులుబాటు కావాలి అని చిన్నతనం దాటిన తరువాత యెవరైనా అంటే అది నలుగురికీ వొక వింతలా కనపడుతుంది. కాని అలాంటి వెసులుబాటు కావాలని అందరూ కోరుకుంటారు. కొంత మంది అమాయకత్వంతో మొండితనంతో ఆ వెసులుబాటును కల్పించుకొంటారు. చెప్పొచ్చేది యేమిటంటే కధలు చెప్పాలి,  మనకో మనో ప్రపంచం కల్పించుకొని అందులో విహరించాలని  అనుకోవటం ప్రతి వొక్కరి హక్కు.
అందుచేత నేను  కధలు యెందుకు రాస్తున్నాను అంటే చిన్నతనం మీద ప్రేమ వదలక. జీవితాన్ని రోజువారి ప్రపంచంలోనే యింకొంచెం విశాలంగా జీవించాలి అని కోరుకునే హక్కుని వదులుకోలేక అనే చెప్పాలి.
యికపోతే యిలాంటి కథే యెందుకు రాస్తున్నావ్? యింకొకలాంటి కథ యెందుకు రాయలేదు? కవిత్వం యెందుకు రాయవు ? యిలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే చాలా నిర్దిష్టంగా   కాకతాళీయంగా సంభవించిన అనేక సంఘటనలని  చెప్పుకోవాలి. అవి చాలా చెప్పాలి. కాని యిప్పుడు సందర్భం ఆది కాదు కనుక కొద్దిగా ఆ విషయాలని పంచుకొంటాను.
 20141231_171613~2~2
నా  వ్యక్తిత్వంలో  మూడు  ప్రధాన ధోరణులు వున్నాయి. వొకటి  భావుకత్వం.  రెండోది  స్వేచ్ఛ. మూడోది  చుట్టూ వున్నా వాతావరణంలో  లీనమైపోవటం. యిందులో  మొదటి  ధోరణికి కవిత్వం మాధ్యమంగా మారింది. రెండవ, మూడవ ధోరణికి  కథ ప్రధానమైన మాధ్యమంగా మిగిలింది. యీ మూడు ధోరణులకి  కాలమ్స్ మాధ్యమంగా మారాయి.
యీ మూడింటిని  విడదీసి వేరువేరుగా వుంచాలనే ప్రయత్నం నేను చేస్తున్నానా లేక అది మాధ్యమం వొక్క ప్రభావమా అనే ప్రశ్నకి సమాధానం  నాకు  తెలీదు.
యిలాంటి కథలే యెందుకు రాసాను అంటే బ్రీఫ్ గా చెప్పాలంటే వొక స్త్రీ జీవితానుభవం నుంచి నిలబడి ఆలోచిస్తుంటే యివి యే వొక్క స్త్రీ ఆలోచనే  కాదు.  ప్రపంచ వ్యాప్తంగా మా ముందు తరం స్త్రీవాదులు  ఆలోచిస్తున్న అనేక  విషయాలు  అర్ధమవుతూ వచ్చాయి. యీ కథలని స్త్రీవాద సృహ నుంచి రాస్తున్నాననే యెరుక, స్ర్తీ వాదం కూడా ప్రపంచంలో వస్తున్న అనేక ఆర్ధిక సామాజిక మాధ్యమాల మధ్య నిలబడే  తన స్వరాన్ని వినిపించాలన్న విషయం లోతుగా అర్ధమవ్వసాగింది. స్త్రీవాదం కేవలం స్త్రీలకి సంభందించినది మాత్రమే కాదని  పురుషుల జీవితాల గురించి కూడా స్త్రీవాద కోణం నుంచి ఆలోచించాను.  స్త్రీలు కూడా ఆధిపత్య వర్గాలలో ఆధిపత్య రాజకీయాల్లో భాగస్వామ్యం కలిగి వుంటారని తెలిసే కొద్ది   స్త్రీవాదం అంటే కేవలం స్త్రీలని విక్టిమ్స్ గా మాత్రమే చూపించటం కాదు అని ఆ యా రాజకీయాలని కధల్లో రాస్తున్నాను. 

మొదట్లో  కథలు  రాస్తున్నప్పుడు ఆ టీనేజ్ కి సంబంధించిన చూపుని వొక టీనేజర్ ఆంతరంగాన్ని వొక స్త్రీ దృష్టి కోణాన్ని ప్రతిబింబించే కథలు ‘మనసుకో దాహం’లో,  అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే యెలా పెట్టాలని ఆలోచించుకొంటు నిలబడటానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, వున్న నగరం చాలా వేగంగా  మారిపోతుండటం, సంక్లిష్టంగా వుండటం, యిలాంటి చోట యెలా నిలబడాలి అనుకుంటున్నవాళ్ళ  కధలు ‘ముక్త’లో  రాసాను. నగరంలో వస్తున్న మార్పులకి  కారణం  ప్రపంచంలో  వస్తున్న అనేక మార్పుల వల్ల అనే  విషయం అర్ధమవుతున్నప్పుడు ‘ సాలభంజిక ‘  కధలు చెప్పటం,  అన్ని వుండి కూడా యెదురుకొంటున్న యిమోషనల్  వయొలెన్స్ ని ‘ మంచుపూలవాన’ లో, వీటన్నిటి మధ్యా నిలబడి వెతుక్కుంటున్న చోటులో దాదాపు అన్ని విధాలా కోల్పోతోన్న అమాయకత్వం ‘ ది లాస్ అఫ్ యిన్నోసెన్స్’ లో ప్రతిబింబించాయి.

దాదాపు అన్ని కథల్లో ప్రోటోగనిస్ట్ స్త్రీ.

యికపోతే మొదటిసారి  కథ రాసినప్పుడు అది నలుగురు విన్నప్పుడు యెవరెవరు యెమన్నారు ? ఆ  అన్న మాటలకి మనం యెట్లా అర్ధం  చేసుకున్నాం…  యిదీ  చెప్పుకోవాలి. కాని అందుకు యిది సందర్భం కాదు.
మొత్తం మీద కథలు  యెందుకు  రాస్తున్నావ్ అంటే జ్ఞాపకాలని వున్న వాటిని వున్నట్లే వుండనివ్వకుండా తిరిగితిరిగి అనేక రకాల గతాలని వర్తమానాన్ని, భవిష్యత్తులని నా చేతులతో  నేను నిర్మించుకోవటం  కోసం.  

ఆ అడివిలో వెన్నెలా వుంది!

10979273_10205663055756776_1692790498_n

లోగో: బంగారు బ్రహ్మం

 

అప్పుడప్పుడు వాక్యం తడబడుతుంది. గడబిడిగా నడుస్తుంది. వదులుగా వేలాడుతుంది – కాని వాక్యం యెప్పుడూ తడబడకుండా గడబిడిగా నడవకుండా వదులుగా వేలాడకుండా వుంటుందో ఆ వాక్యమే కేశవరెడ్డి గారిది. యెండలో తడిసిన రానెస్, వర్షంలో ఆడిన ఫ్రెష్ నెస్, మంచులో మునిగిన తేమ నిండిన అతని వాక్యం మనలని చుట్టుకుంటుంది. వాక్యాలు వాక్యాలుగా చుట్టుకుపోతుంది. అతని వాక్యాలని మనం వదిలించుకోలేం. పెనవేసుకోనూలేం. వుక్కిరిబిక్కిరవుతాం. మళ్ళిమళ్ళి కావాలనిపించే సొగసుకాఠిన్యం పెనవేసుకున్న ఆ వుక్కిరిబిక్కిరి రాతగాడు మనలని అడవులని జయించమంటారు.

కనిపించినవాటినల్లా  పిప్పరమెంట్స్ లా చదివే అలవాటున్న నాకు వొక రోజు మా యింటి లైబ్రెరిలో అనుకోకుండా వో రోజున వో పుస్తకం చేతుల్లోకి తీసుకొన్నాను. ఆంధ్ర పత్రిక లో సీరియల్ గా వచ్చినప్పటి కాగితాలని చక్కగా కుట్టి మామిడిపండు రంగు అట్ట వేసుంది. పుస్తకం పైన ‘అతడు అడివిని జయించాడు’ అని పైన నీలి సిరాతో గుండ్రని చేతిరాత. పుస్తకం తిరగేస్తుంటే బొమ్మలు ఆకర్షించాయ్. చాల యిష్టాన్ని పుట్టించాయి. ఆ బొమ్మలు కేతినీడి భాస్కర్ గారివి. వాటిని అలానే వెయ్యాలని ప్రయత్నిస్తూ వో రెండు రోజులు గడిపాను. చదవటం వదిలేసి- అసలు యింత అందమైన బొమ్మలున్న యీ కథ యేమిటో చూడాలన్న కుతూహలం కలిగింది. చదివాను. మళ్ళి చదివాను. యిప్పటిలానే నన్ను అడివి వెన్నెల పట్టుకున్నాయి.

చలం గారి మైదానం మొదటిసారి చదివినప్పుడు అందులోని చింత చెట్టు అల్లిక నుంచి జల్లులు జల్లులుగా కురిసే మధ్యాన్నపు  యెండ మైమరపించినట్టుగా యిప్పుడు ఆ అడివిలో వెన్నెల్లోని నడకలు  భలే హత్తుకున్నాయి. ఆ తరువాత చాలా కాలానికి కేశవరెడ్డి గారు పరిచయం అవ్వగానే ‘ ఆ వెన్నెల అడివి భలే రాసారు’ అని చెప్పాను. అప్పుడు ఆయన నవ్వారు. మళ్ళి నవ్వారు. నవ్వటం ఆపి ‘ యింత అందంగా, కొత్తగా ఆ పుస్తకం గురించి నాకు యెవ్వరు చెప్పలేదు. యిప్పటి వరకు అంతా చాల గాంభీర్య మైన ఫీడ్ బ్యాక్ చెప్పారు. కుప్పిలి పద్మ అంటేనే అడివి, వెన్నెల, మంచు పువ్వులు, వాన ‘అని నవ్వారు. నేను నవ్వాను. అది మొదటిసారి కలిసినప్పటి సంభాషణ.

కేశవరెడ్డి గారి  యే నవల్లోనైన యితివృతం యీ సమాజం పెద్దగా పట్టించుకోని మనుష్యులు, వర్గాలు, ప్రాంతాలు, వృత్తులు. మనకి అసలు పరిచయం లేని సమాజపు వ్యక్తులు కావొచ్చు లేదా కొద్దిపాటిగా తెలిసిన జీవితాలు కావొచ్చు. కాని మనం ఆయన రచనలు చదివితే ఆ మనష్యులు మన మనుష్యులైపోతారు. ఆ అనుభవాలన్నీ మనవైపోతాయి. నవలలు, కొన్ని కథలు అని లెక్కలు తీయవచ్చు కాని ఆయన వొక నవలనో కథనో రాయరు. రాయలేదు. జీవితాలని ఆవిష్కరించారు . కులం మతం వర్గం వృత్తి, ప్రాంతాల నడుమ మనుష్యుల జీవితానుభవాల వైవిధ్యాల నీడల్ని ఛాయల్ని మన చూపులకి వినమ్రంగా సమర్పిస్తారు. ఆ యా జీవితాల్లోని అంతర్గత సంఘర్షణలు బహు పార్శ్వాలుగా మన మనో రెక్కలపై వాల్తాయి. అవి మనలని సమీపించగానే మనం మనంగా వుండం. వుండలేం. యిలాంటి సమర్పణ అందరు చెయ్యలేరు.

అనేకంగా కనిపించే యింత పెద్దప్రపంచంపు జీవనసారపు అంతస్సారం వొక్కటే అనే అపారమైన అర్ధవంతమైన మానవీయమైన తాత్వికత వుంటేనే అలా సమర్పించగలరేమో… మనకి ఆ పాత్రల ఆలోచనలు, ఆశలు, కోరికలు సమస్త భావోద్వేగాలు వాటి స్వభావస్వరూపాలు అన్ని అర్ధమైపోతున్నట్టే వుంటాయి. అంతలోనే అర్ధం కానట్టనిపించి అసలు ఫలానా పాత్ర యేమంటుంది… యిలా అనలేదా అనిపిస్తుంది. మళ్ళి మరోలా అనిపిస్తుంది. ‘రాముడుండాడు రాజ్జి వుండాది’ చివరి గుడిసె ‘ మూగవాని పిల్లన గ్రోవి, ‘మునెమ్మ’ యే నవలైనా సరే చదువరి యిమేజినేషన్ కి బోలెడంత స్పేస్ యిచ్చిన రచయత కేశవరెడ్డి గారు. అలానే విషయం ఏమైనా కావొచ్చు ఆయన యెప్పుడు ఆ  అంశాలకి సంబంధించిన యీస్థటిక్స్ ని అలవోకగా గుమ్మరించారు. తను తీసుకున్న జీవితాల పట్ల తను నమ్మిన సారవంతమైన సమాజం పట్ల వొక నిబద్ధత వుండటం వల్లే ఆయన రచనలు జీవితాలకి దగ్గరగా వుంటాయి. కొన్ని సందర్భాలల్లో రస్టిక్ బ్యూటీతో మనలని మెస్మరైజ్ చేస్తుంటాయి.

యిలా యెన్నెన్నో విషయాలు కేశవరెడ్డి గారి రచనల్లో నల్లని నీళ్ళ ప్రవాహంలా జరజరా పారుతుంటాయి.

యివన్ని వొక ఎత్తు అయితే,  కేశవరెడ్డి గారికి సినిమాల పై బోలెడంత యిష్టం, ఆసక్తి వున్నాయి. అప్పుడప్పుడు ఆ విషయాలని మాట్లాడుకొనేవాళ్ళం. ‘చిక్కని స్క్రీన్ ప్లే రైటర్ మీరు’అన్నానోసారి. అప్పుడు మాత్రం కేశవరెడ్డి గారు సినిమాలు సినిమా కథలు స్క్రీన్ ప్లే యిలాంటి విషయాలపై ఆగకుండా మాటాడేవారు. సంభాషణ చక్కగా సాగేది. ఆయన రెండు నవలలూ   త్వరలో సినిమాలుగా రూపొందుతాయని ఆశ. తన రచనల గురించి కానీ  తన ఫలానా నవల చదివేరా అని కానీ  ఆయన అడగటం నేనైతే వినలేదు. మనకి అనిపించినవి చెపితే శ్రద్ధగా వింటారు. అవసరమైతే తప్పా తన రచనల గురించి మాటాడరు. అసలు మనం వో విశిష్ట మైన సుసంపన్న మైన రచయతతో మాట్లాడుతున్నామనే భావన కలగదు. ఆయనెప్పుడూ యెదుటివాళ్ళ మీదకి తనలోని రచయితకి సంబంధించిన బలం, బరువు అనే వలలని విసిరేయడం  నేను చూడలేదు. వినలేదు.

నేను కొత్తగా రాస్తున్నప్పుడు తను చదివినప్పుడు కేశవరెడ్డి గారికి నచ్చితే ఆ విషయం చెప్పేవారు. అంత పెద్దాయన చెపితే యెంత సంతోషంగానో అనిపించేది. ‘మైదానం’ కాలమ్ బాగుంది, కొత్తగా అన్నారు. ఆయనెప్పుడూ కొత్తగా express చెయ్యాలనే వారు. కొత్త గా చెప్పేవి ఆయనకి చాలా నచ్చుతాయి. అలా యిప్పటికి ఆయన కొత్త రచయితలవి చదివినప్పుడు నచ్చితే ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తారు. ఆ మధ్య సామాన్య  ‘మహిత’ గురించి చెప్పారు. సంతోషాన్ని, బలాన్ని యిచ్చే మంచిని వొకరి నుంచి మరొకరికి మృదువైన మంచి నీటి ప్రవాహంలా ప్రవహించాలని నమ్మే నేను ఆ విషయం ఆమెకి చెప్పాను.

కేశవరెడ్డి గారు నన్ను అప్పుడప్పుడు ఆశ్చర్యఆనందాలకి లోనుచేసేవారు.’ యే అడివి వెన్నెలా మీరు రాసింది’ అని అడిగాను వొకసారి. ‘మీరు చూసిన అడివి వెన్నెల చెప్పండి’ అన్నారు కేశవరెడ్డి గారు. నన్ను మేస్మరైజ్ చేసిన వో అడివిలో వెన్నెలని ఆయన ముందు మాటలతో కుప్పపోసేను. ఆయన తనెప్పుడు అడివిలో వుండి వెన్నెలని చూడలేదన్నారు. ‘నిజమా’ అంటే చిన్నగా నవ్వేరు.

కేశవరెడ్డి గారు అప్పుడప్పుడు ‘మా వూరిలో వెన్నెల వచ్చింది.’- ‘ మీరు మీ వూరి వెన్నెలతోనే వున్నారా’ అనో ‘వెన్నెల్లాంటి మీ అక్షరాలని చదివాననో ‘ యిలా పలకరించేవారు. పోయినసారి కేశవరెడ్డి గారు ‘ వూరు వూరంతా వెన్నేలేనండి. మీరు వెన్నెల్లో వున్నారా?’ అని పలకరించారు. ఆ రోజు వాసంతోత్సవం. నేను ఫాం హౌస్ లో వున్నాను. అవునండి యిక్కడ తెల్లగులాబీల నిండుగా వెన్నేలేనండి ‘ అని చెప్పాను. ‘చూడండి ‘ నేను రాసిన అడివిలో వెన్నెలకంటే బాగుంది కదా… నిజానికి మీరు రాసే వెన్నెలా ,వాన నాకు నచ్చుతాయి’ అన్నారు కేశవరెడ్డి గారు. వో అద్భుతమైన తన రచనలో అడివిలో వెన్నెల బాగుంది అని అమాయకంగా చెప్పటం ఆ విశిష్ట మైన రచయిత యెప్పుడు మరచిపోలేదు. తన రచనల నిండుగా యెవ్వరు పట్టించుకోని సమాజం వైపు స్థిరంగా నిలబడిన కేశవరెడ్డి గారు మనుష్యుల పట్ల మృదువుగా, ప్రేమగా వుంటూ ఆత్మీయంగా పలకరిస్తూ యెందరో అభిమానుల హృదయాలని జయించారు వెన్నెలంత తేటగా.

నమస్సులు కేశవరెడ్డి గారు.

-కుప్పిలి పద్మ

Kuppili Padma Photo

అవును కదా గుల్జారే లేకపోతే –

M_Id_419679_Gulzar

అవును కదా గుల్జారే లేకపోతే –

సంతోషానికి పర్యాయ పదమేదో  తెలిసేది కాదు.
కన్నీటికి వుప్పుతనం వుందనీ  తెలిసేదే కాదు.
ప్రేమకి స్పర్శ వుంటుందనీ  తెలిసేది కాదు.
కోల్పోవటానికి వునికొకటి వుంటుందని తెలిసేది కాదు.

రహస్య స్థావరాల్లో మెలుకువే ఆయువని  తెలిసేది కాదు.

అవును ఆ ‘పూలతోటే ‘ లేకపోతే హృదయం అత్యంత భావరహిత పేదరికాన్ని చవిచూసేదేమో  బహుశా!!!
ఆ ‘మకరంద హృదయమే’ లేకపోతే –
మంచువాలుల్లో పాటల పూలవనాన్ని  విరగబూయించేదెవ్వరు.
ఆకాశాన్న వేలవేల అక్షర తారకల్ని  వెలిగించెదెవ్వరు.
నదీమ ప్రవాహంలో పదాల పడవల తెరచాపల్ని రెపరెపలాడించెదెవ్వరు.
నగర వీధుల్లో రణరణధ్వనులని జలపాతపు సవ్వడిలో నాట్యం చెయించెదెవ్వరు.
పురాత సైధీల్యపు నిశబ్ధంలోంచి రెండు ప్రేమల గొంతుని వెలిగించెదెవ్వరు.
అవును ఆ ‘పరాగ రేణువే’ లేకపోతే నిదురలేని రాత్రులల్లో భగ్న  ప్రేమికులకు ఆలపించేందుకు పాటలు మిగిలేవి కాదు కదా!!!
ఆ ‘శీతాకోకచిలుకే’ లేకపోతే –
ఆకుపచ్చని తోటల గాలినిండా శతసహస్ర రంగుల్ని మరెవ్వరు వెదచల్లేవారు.
అడివి దారుల్లో పేరు తెలియని పువ్వుల సోయగాన్ని వేరెవ్వరు పోల్చుకునేవారు.
లోయల వాలుల్లో మొలిచే గరిక పచ్చదనాన్ని చెవి వొగ్గి వినేదెవ్వరు.
మైదానాల సువిశాల మట్టి దారుల్లోని స్వేచ్చా సుగంధాన్నిశ్వాసించేదెవ్వరు.   
యెడారి చురచుర యెండమావుల్లో అసలుసిసలు వోయాసిస్సుని పట్టించెదెవరు.
గుల్జార్!!!
నువ్వే లేకపోతే పాట వొకే శిఖరం మీద నిలిచి వుండేది. పాటని మహాన్నత సంగీత శిఖరాలని అధిరోహింప చేసావ్.
అరవై వసంతాలుగా మా కవిత్వదాహం తీరుస్తున్న సజల నేత్రాలకవికి యెనభైవ పుట్టినరోజున వేలవేల రంగురంగుల తులీఫ్ పూల శుభాకాంక్షలు.!!!

-కుప్పిలి పద్మ.

Kuppili Padma Photo

వచనాన్ని నిండుగా ప్రేమించిన మాస్టారు చేరా

Image - Copy (2)

చేకూరి  రామారావు గారి  చేరాతలంటే భలే  యిష్టం – అని  త్రిపురనేని  శ్రీనివాస్  కి చెప్పాను.

అప్పుడు శ్రీను మాస్టార్ గారి భలే ఆసక్తిగా చెప్పారు. అప్పటికి శ్రీను విజయవాడ లో వుండేవారు. హైదరాబాద్ లో వున్నప్పటికి చేరా మాస్టార్ ని  సభల్లో చూడటం , పలకరించటం  తప్పా సాహిత్యం గురించి  మాటాడింది లేదు. వొక  రోజు ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధం వుత్తరాల పేజిలో  మసిగుడ్డ కథ మెచ్చుకొంటూ  చేరా మాస్టార్ రాసిన వుత్తరం వుంది. శ్రీనుతో  ‘అరే భలే  రాసారే’ అంటే ‘స్పార్క్ ని  బాగా పట్టుకొంటారు’ అన్నా.

ఆ వుత్తరం సంతోషంతో  పాటు బాధ్యతని తీసుకొచ్చినట్టు అనిపించింది.అదే శ్రీనుతో చెపితే గట్టిగా నవ్వి నీకే కాదు యెవరికైనా  ఆ స్పృహ వుండాల్సిందే అన్నాడు.  ఆయన గమనిస్తుంటారు. ‘మాస్టార్  మెచ్చుకోపొతే బాగుండదు కదా’ అని మనసుకి అనిపించింది. “మనసుకో దాహం పుస్తకాన్ని చేరాతల్లో పరిచయం చేద్దామని రాసాను. జ్యోతికి పంపిద్దాం అనుకుంటుండగా ఆ కాలమ్ యిక ముందు రాదని తెలిసింది. కాని యీ వ్యాసాన్ని ప్రచురణకి యిస్తాను” అని ఫోన్  చేసి చెప్పారు.

‘అగాధ నీలిమ’ కథ వచ్చినప్పుడు కథ మొత్తాన్ని వొక వాతావరణంలోకి  తీసుకెళ్ళి కథ స్థాయిని  భలే పెంచావ్… యీ టెక్నిక్  నీ కథలకి చాలా బాగా అమిరింది’ అని  మాస్టార్ అన్నప్పుడు అవే 24 గంటలు కదా అందరికి. వచ్చినవన్ని చదువుతారు. అంతకు ముందు వచ్చినవి చదువుతారు. ప్రపంచ సాహిత్యాన్ని చదువుతారు. సభలకి వస్తారు ,మాటాడతారు. శ్రోతగా వస్తారు. స్నేహితులతో గడుపుతారు. యింట్లో నేలపై పరచిన బేతం చర్ల  టైల్స్ ని  యెంత బాగా పరిచారో చెపుతారు. వంట చెయ్యగలరు. ముఖ్యంగా మనుష్యులని రోజు కలుస్తుంటారు. టైం మేనేజ్ మెంట్  భలే  చేస్తారు – అంటే మొదట్నుంచి  అలా అలవాటైపోయింది అంటారు. మాస్టర్ గారి స్నేహంతో  నాకు రంగనాయకి గారు అమ్మ అయ్యారు.  సంధ్య తో  స్నేహం. హేమంత్ ని మాస్టర్ ని చూస్తుండటం భలే వుండేది. చేరాగారి  అబ్బాయి క్రిస్ నాకు యిష్టమైన స్నేహితుడు. యింటికి యెప్పుడు వెళ్ళినా సాహిత్యం, కమ్మని ఆహారం తో సంతోషమే సంతోషం.

మాస్టార్గారి ఫెమినిజం గురించి చాలా విలువైన విషయాలని  చెప్పేవారు. ఫెమినిస్ట్ థీయరి, ఫిలాసఫిని  బాగా  అర్ధం  చేసుకోడానికి మాస్టర్ చెప్పే విషయాలు , ఆయనతో సంభాషణ  చాల  వుపయోగపడేవి.  Instant Life కధ పై మాస్టర్ రాసిన  విశ్లేషణ నాకెంతో అపురూపం. అలానే ‘శీతవేళరానీయకు’ పై  ఆయన స్పందన నాకెంతో యిష్టం.

వచనాన్ని ప్రేమించే మాస్టార్ ,భాష – సాహిత్యం  శిఖరమంత యెత్తున తెలిసిన మాస్టర్, తెలుగు సాహిత్యానికి – భాషకి చేసిన మేలు అనంత ఆకాసమంతా.

ఆకాశం యెప్పుడు మనకి కనిపిస్తూనే వుంటుంది. అంత మాత్రాన మనకి ఆకాశం పూర్తిగా తెలుసని కాదు. యెప్పటికప్పుడు కొత్తగా ఆకాశాన్ని తెలుసుకొంటున్నట్టు మాస్టార్  రాసిన పుస్తకాలన్నీ మళ్ళిమళ్ళి చదువుకొంటుండాలి.

నిన్న మాస్టార్ గది షల్ఫ్ లో అనేకానేక పుస్తకాలు అటుయిటు వాలి వున్నాయి నిరంతరం చదువుతున్నట్టు… అంతే కాకుండా కొత్తవాటికి చోటిస్తు…!!!!

-కుప్పిలి పద్మ