సామూహిక జ్ఞాపకంలోంచి ….ఒక అన్వేషణ!

 

 

-ఎన్ వేణుగోపాల్

~

(అఫ్సర్ ఆక్స్ ఫర్డ్  ప్రచురణ  “‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్” గురించి యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ లో  మార్చి తొమ్మిదిన జరగబోతున్న ప్రత్యేక చర్చా గోష్టి సందర్భంగా..)

venuప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన, కవిమిత్రుడు అఫ్సర్ గ్రంథం ‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’  మన గతం గురించీ వర్తమానం గురించీ అద్భుతమైన పరిశోధన. గూగూడు పీరు స్వామి గురించి వివరిస్తూ, సామాన్యుల మతవిశ్వాసాలనూ ఆచారాలనూ వాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలను విశ్లేషిస్తూ మతం గురించి కొత్త ఆలోచనలను ప్రేరేపించే పుస్తకం అది. వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ, విశ్లేషిస్తూ మరొక పుస్తకమే రాయగలిగినంత, రాయవలసినంత విలువైన, విశాలమైన, లోతైన పుస్తకం అది. అఫ్సర్ ను ఇంతకాలం కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా చూసినవాళ్లకు ఈ పుస్తకం అఫ్సర్ గురించి ఒక కొత్త తెలివిడిని ఇస్తుంది. అఫ్సర్ లోని నిశితమైన పరిశీలకుడినీ, నిష్ణాతుడైన విశ్లేషకుడినీ, అద్భుతమైన సామాజిక చరిత్రకారుడినీ పరిచయం చేస్తుంది. కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా తాను ఇదివరకే సాధించిన వివరణాత్మక, వర్ణనాత్మక శైలినీ, విభిన్న పొరల ఆలోచనలు ప్రేరేపించగల శక్తినీ అన్వేషణకూ, ఆ అన్వేషణాసారాన్ని వ్యక్తీకరించడానికీ ఎలా వాడుకున్నాడో ఈ పుస్తకం చూపుతుంది.

‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’ ఏకకాలంలో నన్ను ఎంతో రాయడానికీ పురికొల్పుతున్నది, అసలేమైనా రాయగలనా, ఎంత రాస్తే ఆ పుస్తకానికి తగిన న్యాయం చేయగలను అని భయపెడుతున్నది. ముఖ్యంగా కరడుగట్టిన మతోన్మాదం జడలు విప్పుతున్న నేపథ్యంలో, ఇతర భావాల పట్ల హంతక అసహనాన్ని ప్రదర్శిస్తున్న మత భావజాలాల, మతోన్మాదాల వాతావరణంలో ఈ పుస్తకం అవసరం గురించి చెప్పవలసినది చాల ఉంది. రాయలసీమలో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా సాగుతున్న హిందూ ముస్లిం మత సామరస్యం (బహుశా మత సామరస్యం కూడ కాదేమో, మత అభేదం, మత సమ్మేళనం అనాలేమో) పునాదిగా మన బహుళత్వ సమాజానికి ఎత్తిపట్టిన దర్పణంగా ఈ పుస్తకానికి ఇవాళ చాల ప్రాసంగికత ఉంది. ఈ పుస్తకంలో ప్రతి వాక్యమూ, ప్రతి వాదనా, ప్రతి పుటా, ప్రతి అధ్యాయమూ నన్ను గత వర్తమానాల ఆశ్చర్య విషాదాల మధ్య ఊగిసలాడేలా చేశాయి.

పీర్ల పండుగ అనే ఒకానొక గ్రామీణ విశేషాన్ని ఆధారం చేసుకుని అనేక సంక్లిష్ట, సంకీర్ణ, బహుళత్వ ఆలోచనలనూ వాద ప్రతివాదాలనూ ముందుకు తెస్తూ, అంతకన్న లోతైన ఆలోచనలు సంఘర్షించేలా చేస్తూ సాగిన ఈ పుస్తకం గురించి రాసేముందు అసలు ఈ పీర్ల పండుగ గురించి నా అనుభవంతో ప్రారంభిస్తాను. తెలంగాణ అంతటా పీర్ల పండుగ వ్యాపించి ఉంది. నేను మా రాజారంలో ఉన్న నా పన్నెండో ఏటివరకూ ప్రతి ఏటా పీర్ల పండుగ చూశాను. ఇరవయో ఏట ఆ ఊరితో సంబంధం పూర్తిగా తెగిపోయింది గనుక ఆ తర్వాత పీర్లపండుగను పట్టణాల్లో, నగరాల్లో చూశాను గాని ఆ అనుభవాలు కాస్త భిన్నమైనవి. ఇక్కడ పూర్తిగా బాల్యానికి సంబంధించిన అనుభవాన్ని మాత్రమే పంచుకుంటాను. మా ఊళ్లో పీర్ల పండుగ ఊరందరి పండుగలాగే జరిగేది. ఊళ్లో ఉన్న పీర్ల కొట్టం నుంచి పీరీలను తీసి అలంకరించి, పది రోజులు గద్దె మీద ఉంచేవారు. పదోరోజున ఆ పీరీలను ఎత్తుకుని ఊరివాళ్లందరూ, ప్రధానంగా శూద్రకులాలు, దళితులు కూడ ఊరేగింపు చేసేవారు. ముందర మాదిగడప్పులు మోగుతుండేవి. ఆ పీరీల ఊరేగింపు ఊరంతా తిరిగేది. బ్రాహ్మల, కరణాల, రెడ్ల ఇళ్లు పెద్దవి గనుక వాళ్ల ఇళ్లముందూ, వాడల్లో అక్కడక్కడా ఆగేవి. ప్రతిచోటా ఇళ్లలోంచి ఇంటి పెద్దలు స్వయంగా కుండలతో, బిందెలతో నీళ్లు తెచ్చి పీరీలు ఎత్తుకున్నవాళ్ల కాళ్లమీద గుమ్మరించేవాళ్లు. ఆ పీరీల వెంటనడిచే వాళ్లు ఇచ్చే “విభూతి”ని తీసుకునేవాళ్లు. ఫతేహాలు చదువుతుంటే వినేవాళ్లు. అది “తురక దేవుడి” ఆరాధన అనీ, పీరీలు ముస్లింల ఆచారమనీ, అది ముహర్రం అనే ముస్లిం సంస్మరణ సందర్భమనీ, అందులో ముస్లిమేతరుల పాత్ర ఏమిటనీ ఆలోచనలు ఆ నైసర్గిక గ్రామీణ అవగాహనల్లో ఎంతమాత్రం ఉండేవి కావు. నిజానికి అప్పటికి మా ఊళ్లో ముస్లిం కుటుంబాలు మూడు నాలుగు కూడ లేవు. నాకు తెలిసినవి పోస్ట్ మాన్ లాల్ మియా, చిన్న చిల్లర దుకాణం నడుపుతుండిన అబ్బాస్ అలీ రెండు కుటుంబాలు మాత్రమే. అప్పటికి ఐదారువందల గడప ఉన్న ఊళ్లో నాలుగు కుటుంబాలంటే ఊరి జనాభాలో ఒక్క శాతం కూడ కాదు. కాని ఆ ఒక్కశాతం ప్రజల సంస్మరణ ఆచారం ఊరందరి ఆచారంగా జరిగేది. అదంతా నాలుగున్నర దశాబ్దాల వెనుకటి కథ. ఇప్పుడు మా ఊళ్లో కూడ పీర్ల పండుగ అంత బహుళత్వంతో అంత సామూహికంగా జరుగుతున్నదో లేదో తెలియదు.

కాని అనంతపురం జిల్లాలో గూగూడు అనే చిన్న గ్రామంలో ప్రతి ఏటా పీర్ల పండుగ మహోజ్వలంగా జరుగుతున్నది. ఆ ఊళ్లో ముస్లిం జనాభా స్వల్పమే. మొత్తం జనాభా దాదాపు మూడు వేలు కాగా, ముస్లింలు (దూదేకులు) రెండువందల లోపు. కాని ఆ ఊరు ఊరంతా ఆ పండుగను సొంతం చేసుకుంటున్నది. కనీసం మూడు లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవం మత విభజనలను అధిగమించింది. ఒకానొక మత విశ్వాసపు మౌలిక అంశాల మీద నిర్మాణమైనప్పటికీ ఇతర మత విశ్వాసాలు కూడ కలగలిసినది. ఒక సామూహిక నైసర్గిక సంస్మరణ ఉత్సవం అది. ఆ ఉత్సవం నేపథ్యంగా ‘దక్షిణ భారతదేశంలో జనప్రియ ఇస్లాం – సాముదాయక భక్తి’ అనే విశాలమైన పరిశోధన, అన్వేషణ, వివరణ, విశ్లేషణ సాగించడానికి పూనుకున్న అఫ్సర్ తొమ్మిది నెలల పాటు ఆ గ్రామంలోనూ, సంబంధిత స్థలాల్లోనూ పరిశోధించి ఈ పుస్తకం రాశాడు.

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, ముగింపు కాక ఐదు అధ్యాయాలున్నాయి. ‘గూగూడు: సాముదాయక భక్తి స్థలం ఆవిర్భావం’ అనే మొదటి అధ్యాయం గూగూడు ప్రాధాన్యత గురించీ, దాని ఆవిర్భావ వికాసాల గురించీ వివరిస్తుంది. ‘టోపీ పెట్టుకున్న పీర్: కుళ్లాయప్ప కథనం’ అనే రెండో అధ్యాయం గూగూడు ప్రాముఖ్యతలోకి రావడానికి మాలమైన కుళ్లాయప్ప అనే పీర్ గురించి ఉన్న కథనాలను వివరిస్తుంది. ‘కుళ్లాయప్ప – ముహర్రం బహిరంగ ఆచారాలు’ అనే నాలుగో అధ్యాయం పదమూడు పరిశుద్ధ దినాలలో రోజువారీ జరిగే కార్యక్రమాలను, ప్రత్యేకంగా ఏడో రోజు, పదో రోజు జరిగే ఆచారాలను వివరిస్తుంది. ‘ఫకీరి: తాత్కాలిక సన్యాస ఆచరణ’ అనే నాలుగో అధ్యాయం కుళ్లాయప్ప భక్తిలో భాగంగా ప్రజలు ఆచరించే ఫకీరి ఉపవాసదీక్ష గురించి వివరిస్తుంది. ‘ఆచారాల చర్చ: ‘శుద్ధ’ ఇస్లాం రాజకీయాలు’ అనే ఐదో అధ్యాయం సమకాలీన మతతత్వ విస్తరణ నేపథ్యంలో గూగూడు ముహర్రంను పోల్చి చూసి విశ్లేషిస్తుంది. దాదాపు ఇరవై పేజీల పాదసూచికలు, నాలుగు పేజీల అర్థ వివరణలు, ఏడెనిమిది పేజీల ఉపయుక్త గ్రంథ సూచి రచన ఎంత పకడ్బందీగా సాగిందో చూపుతాయి. అఫ్సర్ తన కవితల, కథల, సాహిత్య విమర్శ వ్యాసాల నిర్మాణంలో ఎటువంటి శ్రద్ధ చూపుతాడో ఈ రెండు వందల పేజీల రచనలో అంతకు మించిన శ్రద్ధ కనబరచాడు.

ఈ పుస్తకం గురించి చెప్పుకోవలసిన అనేక అంశాలలో ఒకటి, మన గ్రామసీమల్లో హిందూ ముస్లిం సంప్రదాయాలు, బహుశా అవి వేరువేరని కూడ తెలియనంతగా ఎంత గాఢంగా కలిసిపోయాయనేది. ఇవాళ మతోన్మాద రాజకీయాలు చూపుతున్నట్టుగా హిందూ, ముస్లిం అస్తిత్వాలు విభిన్నమైన, ఎదురుబొదురుగా నిలబడిన, నిత్య సంఘర్షణాయుతమైన, వైరి అస్తిత్వాలు అనే ఆలోచన దాదాపుగా లేని సమాజపు ఆచారవ్యవహారాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. బహుశా భిన్న భావాల పట్ల సహజంగా ప్రజాస్వామిక సహనం పాటించే, ఆదాన ప్రదానాలతో సాగే, బహుళత్వ చిహ్నాలను ఆమోదించే గ్రామీణ సమాజ వివేకపు చిత్రణ ఇది. ఈ వివేకం భాషలో, భావనల్లో, ఆచారాల్లో అన్ని చోట్లా కనబడుతుంది.

అసలు కర్బలా యుద్ధంలో చనిపోయిన మహమ్మద్ ప్రవక్త మనుమల సంస్మరణలో రూపొందిన విషాద సంస్మరణ ఆచరణ ముహర్రం. దానికి షియా ముస్లింల వ్యాఖ్యానం, అది దక్షిణ భారతదేశంలోకి సూఫీల ద్వారా వచ్చిన తీరు, అది చివరికి ప్రధానంగా ముస్లిమేతర (హిందూ కాదు, హిందువులు అనడానికి కూడ వీలులేని అనేక సమూహాలు మన గ్రామసీమల్లో ఉన్నాయి) భాగస్వామ్యంతో, వారి కథలతో, వారి ఆచారవ్యవహారాలతో, వారి ఆదానప్రదానాలతో కలగలిసి ఒక అమాయక సామూహిక మత ఉత్సవంగా మారిందో అఫ్సర్ చాల వివరంగా, విశ్లేషణతో చూపుతాడు.

గూగూడులో ఉన్నది ప్రధానంగా ముస్లిం పీర్ ప్రార్థనాస్థలం. ఆ పీరు పేరు కుళ్లాయప్ప. కుళ్లాయి (తల మీది వస్త్రం – టోపీ) అనే పర్షియన్ మాటకూ అప్ప అనే రాయలసీమ మాటకూ మైత్రి కుదిరి కుళ్లాయి పెట్టుకున్న అప్పగా రూపాంతరం పొందింది. అలా ఆయన పీరు స్వామి అయ్యాడు. ఆయన స్థలం, ఆరాధనా స్థలం, ఆశ్రయం – పీర్, మకాన్ (ఇల్లు) అనే రెండు మాటలు కలిసి, మొదటి మాట అజంతంగా తెలుగీకరణ పొంది, మకానం అనే కొత్త మాట పుట్టుకొచ్చి పీరు మకానం అయింది. నిజంగా ప్రజల సృజనాత్మకత ఎంత విశిష్టమైనది! అలాగే ముస్లిం సంప్రదాయంలోంచి ఒక మాట ముస్లిమేతర, హిందూ సంప్రదాయంలోంచి మరొక మాట కలిసి గూగూడు పదజాలం చాల తయారయింది. జియారతు దర్శనం, ఫతేహా ప్రసాదం, ముజావరు పూజారి, దీన్ గోవిందా, షహర్ గస్తీ – సెరిగట్టి, ఎర్రదారం కట్టుకుని ఫకీరు దీక్షకు పూనుకోవడం, ఫకీరి ఉపవాసాలు, ముహర్రం జాతర, కందూరి సామూహిక భోజనాలు లాంటి ఎన్నో పదాలు పుట్టుకొచ్చాయి. చదివింపులు, ప్రదక్షిణలు, నిప్పుల గుండం నుంచి బూడిద తీసి నుదుటికి, వంటికి రాసుకోవడం, పీరు మకానంలో ఒక పక్కన ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టడం, కుంకుమ తీసుకోవడం, పొర్లు దండాలు, విశ్వరూపం, పీర్ ను అవతారం (రాముడి అవతారం)గా, విష్ణువు పదకొండో అవతారంగా భావించడం వంటి ఎన్నో ప్రధానంగా హిందూ లేదా అంతకు ముందరి ఆచారాలు ఈ పీరు ఆరాధనలో కలిసి పోయాయి. బలి ఇవ్వడానికి ముస్లిమేతరులు తెచ్చిన జంతువులను కూడ ముస్లింలు ఫతేహా చదివి బలి ఇచ్చినతర్వాతనే వండుకోవడం జరుగుతుంది. అనేక సందర్భాలలో అది ఇస్లాం ఆచారమా, హిందూ ఆచారమా, హిందుత్వతో సంబంధంలేని శూద్ర కులాల ఆచారమా చెప్పలేని స్థితి ఉంటుంది. నియ్యా అనే అరబిక్ మాట నియ్యతు (పరిశుద్ధ సంకల్పం) గా మారడం, బర్కత్  (దైవ ప్రసాదం) అనే మాట బర్కతుగా మారడం సరే సరి. ప్రతి ఏటా గూగూడు ముహర్రం ఉత్సవాలు (వాటిని బ్రహ్మోత్సవాలు అనడం కూడ మొదలైంది!) చూడడానికి రావడం తీర్థయాత్రలాగ భావించేవాళ్లూ, పేదవారి హజ్ యాత్రగా భావించేవాళ్లూ కూడ ఉన్నారు. ఇతర చోట్ల ముహర్రం గాథలనుంచి గ్రహించి మార్చుకున్నవీ, సొంతంగా తయారు చేసుకున్నవీ ఎన్నో గూగూడు కథలు, గాథలు, సంగీతం, పాటలు, నమ్మకాలు పుట్టుకొచ్చాయి.

గూగూడుకు దానిదైన ఒక ప్రత్యేక స్థల పురాణం కూడ ఉంది. అది దండకారణ్యలో భాగమైన ప్రాంతమని, అది సీతారామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చిన గుహుడి గూడు అని ఒక కథనం. కాలక్రమంలో అది చంద్రాయణపేట అయింది. ఆ గ్రామం ఏ కారణం వల్లనో దగ్ధమైపోయింది. ఆ గ్రామదహనం, కొత్త గ్రామ పునర్నిర్మాణం బహుశా మారుతున్న నాగరికతలకు, పాత గ్రామాలు విధ్వంసమై కొత్త గ్రామాలు రూపొందడానికి ప్రతీకలు కావచ్చు. పాత గ్రామంలో పోషణ లేని చెన్నకేశవస్వామి ఆలయం ఇంకా ఉంది. ఆ దగ్ధమవుతున్న గ్రామం నుంచి బైటపడడానికి చేసిన ప్రయత్నమే తరతరాల సంచిత జ్ఞాపకంలో నిప్పుల గుండం మీద నడకగా మారి ఉండవచ్చు. అక్కడి నుంచి జనాన్ని కుళ్లాయప్పే ఇక్కడికి తీసుకువచ్చి తన మకానం చుట్టూ కొత్త ఊరు ఏర్పరచాడు. కుళ్లాయప్ప వాస్తవానికి ముస్లింల పవిత్ర ప్రతీక అయిన పంజా. పాత గ్రామం తగులబడిపోయినప్పుడు కంసాలులు బావిలో పడేసిన ఆ ప్రతీకను కొండన్న అనే వ్యక్తి తీసుకువచ్చి పీరు మకానంలో స్థాపించాడు. ఇప్పటికీ కొండన్న వారసులే ఈ ఉత్సవంలో ప్రధానభాగం వహిస్తారు. ఇది చదువుతున్నప్పుడు నాకు బుద్ధుడు మొట్టమొదట తన బోధనలను వినిపించిన ఐదుగురు శిష్యులలోని కొండన్న గుర్తుకు వచ్చాడు. ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసానికి మారడానికి, లేదా రెండు విశ్వాసాల సమ్మేళనానికి కొండన్న ప్రతీక కావచ్చునా?

ఈ క్రమంలో గూగూడు ప్రాదేశిక సరిహద్దులు, గూగూడు భూగోళం కూడ కొత్త అర్థాలు సంతరించుకున్నాయి. కొత్త వ్యాఖ్యానాలు పొందాయి. “పీరు రాకముందు ఇదంతా దట్టమైన అరణ్యం. పీరు రాకతోనే ఇది సంపన్నమైంది” అంటాడు హుస్సేనప్ప. కర్బలా యుద్ధం వాస్తవంగా ఇవాళ్టి ఇరాన్ లో జరగలేదని, గూగూడు సరిహద్దులలోనే జరిగిందని, అందులో ప్రవక్త మనుమలతో పాటు కుళ్లాయప్ప కూడ పోరాడి అమరుడయ్యాడని, కర్బలా అమరులు హసన్, హుసేన్ లు కుళ్లాయప్ప తమ్ములని ప్రజల విశ్వాసం. అలాగే వాస్తవ కర్బలా గాథలో హసన్, హుస్సేన్ లను చంపిన యాజిద్, గూగూడు గాథలో మొఘల్ చక్రవర్తికి సామంతుడైన స్థానికుడిగా మారిపోతాడు. మొఘల్ చక్రవర్తి కుళ్లాయప్పతో సహా తొమ్మిదిమంది పీర్లను నిర్బంధించడానికి ప్రయత్నించినప్పుడు వారందరూ ఆ పోరాటంలో చనిపోయారని స్థానిక కథనం చెపుతుంది. నిజానికి కథనం అని ఏకవచనంలో చెప్పడం కూడ సరికాదు. పునాదిగా ఒక మౌలికాంశం ఉండవచ్చు గాని దాని మీద లేచి నిలిచిన అనేక కథనాలున్నాయి. కులం, లింగం, ప్రాంతం, సాన్నిహిత్యం, ఆరాధనాపద్ధతి, సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలు ఆ కథనాలకు కొత్త కోణాలను కలుపుతున్నాయి. ఏకీకృత, శిలాసదృశ, సార్వజనిక మత విశ్వాసం గురించి ఇవాళ మాట్లాడుతున్నవాళ్లు గూగూడు సూక్ష్మ ఉదాహరణ నుంచి పరిశీలిస్తే భారత సమాజంలో మతవిశ్వాసాల బహుళత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది.

pirsఅసలు కుళ్లాయప్ప “ఆరాధన”లో కొంత అధిభౌతిక శక్తి ఆరాధన, కొంత హేతురహితమైన విశ్వాసం కూడ ఉండవచ్చుగాని అంతకన్న ముఖ్యంగా అది ఒక గ్రామీణ సమాజ సామూహికతా చిహ్నం. అది వ్యవస్థీకృతం కానంతవరకు అమాయకంగా, బహుళత్వంతో, ప్రజాస్వామికంగా కూడ ఉన్నది. మత విశ్వాసం వల్ల గూగూడు జన్నత్ కా దర్వాజా (స్వర్గ ద్వారం) అని ముస్లింలు భావించవచ్చు, వైకుంఠం అని ముస్లిమేతరులు భావించవచ్చు. కాని గూగూడు నుంచి నలబై ఐదు సంవత్సరాల కింద కర్నాటకకు వలస వెళ్లిపోయి, ప్రతి సంవత్సరం ముహర్రంకు మళ్లీ గూగూడుకు వచ్చే మదార్ సాహెబ్ మాటల్లో, “కుళ్లాయప్ప గాని, ముహర్రం గాని లేకపోతే మేం ఒకరిని ఒకరం కలుసుకోవడానికి, సంబంధంలో ఉండడానికి అవకాశమే దొరకదు” అన్నట్టు ఇది సామూహిక కలయిక వేడుక.  ఈ సామూహికతలో హిందూ బ్రాహ్మణీయ మత కార్యక్రమాలకు భిన్నంగా శూద్ర, దళిత, మహిళా భాగస్వామ్యానికి అవకాశం ఉంది. విభిన్న కులాల వ్యక్తులు, ముస్లింలు, మహిళలు, ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు, చిరు వ్యాపారస్తులు, ఇతర ప్రాంతాలలో ఉన్న కుళ్లాయప్ప భక్తులు వంటి ఎంతో మంది అభిప్రాయాలు ఈ సంకీర్ణతను వివరిస్తాయి.

అట్లని ఇది మత రహితమైన, అంధవిశ్వాస రహితమైన సామాజిక ఉత్సవం మాత్రమే అనడానికీ వీలులేదు. ఇక్కడ మహత్యాలున్నాయి. నాదస్వర వాద్యాలున్నాయి. స్వర్గపు ఆలోచనలు, పునర్జన్మ ఆలోచనలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే, అసలు పీరు మకానంలోనే ఆంజనేయ విగ్రహం ఉంది. పక్కనే పెద్దమ్మ ఆరాధన ఉంది. పొరుగున పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం బోధించిన కొండ ఉంది. హిందూ బ్రాహ్మణీయ మడి – వెలికి సమానమైన నిరంకుశత్వంతో కాకపోయినా పవిత్రత – అపవిత్రత ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలకు సమాంతరంగానే శూద్రకులాల సమైక్యత ఉంది.  అందువల్ల, ఈ ముహర్రంలో ప్రవక్త, అమరులైన ప్రవక్త కుటుంబసభ్యులు, ఖురాన్ ఫతేహా, జియారత్, నియ్యత్, బర్కత్ వంటి భావనలు ఉన్నప్పటికీ దీన్ని పూర్తిగా ముస్లిం ఉత్సవంగా చెప్పడానికీ వీలులేదు.

అసలు పీర్ల పండుగ అనడమే ముస్లిం మౌలిక ఆచారానికి భిన్నమైనది. పీర్లు కర్బలా యుద్ధంలో మరణించిన హసన్, హుసేన్ ల ప్రతిరూపాలు. విగ్రహారాధనను వ్యతిరేకించే ఇస్లాంలో ఆ మృతవీరుల చిహ్నాలను స్మరించడం, ఆరాధించడం కూడ “అనాచారాలే”. అలాగే మరణాన్ని సూచించే రోజును పండగగా జరపడం మరొక “అనాచారం.” కాని వాటిని అనాచారాలు అనడం కూడ ప్రామాణికత వైపు నుంచి, ఛాందస ఆచారాల వైపు నుంచి, ఆచారాలలో మార్పులేనితనం వైపు నుంచి చూసినప్పుడే గాని, మత విశ్వాసాలూ, ఆలోచనలూ, ఆచారాలూ ప్రజల నిత్యజీవిత వ్యవహారంలో, సంబంధాలలో, ఆచరణలో రూపొంది తలెత్తి లేచి నిలుస్తాయని, నిత్యం మార్పులకు లోనవుతాయని కూడ గుర్తించవలసి ఉంది.

“హిందువులు లేరు, ముస్లింలు లేరు. అందరిదీ ఒకటే మతం. దానిపేరు కుళ్లాయప్ప భక్తి” అని సత్తార్ సాహెబ్ అన్నమాట ఇవాళ్టి వివాదాల నేపథ్యంలో మతాన్ని కొత్తగా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని సూచిస్తున్నది. అలాగే గూగూడులో ఈ పీర్ల పండుగ, ముహర్రం జరిపే పద్ధతి కూడ ఇతర ప్రాంతాలకూ, హైదరాబాద్ కూ భిన్నంగా ఉన్నదని సత్తార్ సాహెబ్ ఎత్తి చూపుతాడు. హైదరాబాద్ లో మాతం పేరుతో కొరడాలతో, ముళ్ల గొలుసులతో శరీరాల మీద కొట్టుకుంటూ నెత్తురు కార్చే ఆధారం ఉంది. గూగూడు నిప్పుల గుండంలో నడక దాని స్థానంలోనే వచ్చి ఉండవచ్చు.

ఈ మొత్తంలో కనబడేది స్థానిక ఆరాధనా పద్ధతులు, ఆచారాలు పెద్ద ఎత్తున సంలీనం కావడం, ప్రతి ఆచారమూ పునర్నిర్వచనానికి, భిన్నమైన ఆచరణకు గురికావడం. మొత్తం మీద కుళ్లాయప్పకు ఉన్న అనేక వ్యాఖ్యానాలలో, అర్థాలలో గ్రామదేవత, ముస్లిం ఆరాధనా చిహ్నం, కుల దైవం, అమరుడైన మహాత్ముడు అనే నాలుగు ప్రధాన అర్థాలున్నాయి. ఈ నాలుగు భిన్న నిర్వచనాలకు భిన్నమైన సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలున్నాయి.

ఇవాళ్టి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణంలో హిందూత్వవాదులు చెపుతున్నట్టు ఇస్లాం అనేది పరాయి నేల నుంచి వచ్చిన దురాక్రమణ మత విశ్వాసమే అయితే అది ఒక స్థానిక బహిరంగా ప్రజాస్థలంలో ఎటువంటి పరివర్తన పొందిందో, ఎంతగా స్థానికతతో మమేకమైందో, ఎంతగా స్థానికమైందో అనే ఆసక్తిదాయకమైన చర్చకు గూగూడు పరిశీలన వీలు కల్పిస్తుంది. అయితే సమస్య కేవలం హిందూత్వ వాదుల ‘వాతాపిజీర్ణం’ వాదానిదో, గుత్తాధిపత్యానిదో మాత్రమే కాదు. గూగూడు మార్పు చేర్పులను ఇస్లాం కూడ సమాదరించడం లేదు. అసలు వ్యవస్థీకృత మతాలకు ప్రజల అవ్యవస్థీకృత, ప్రజాస్వామిక, నైసర్గిక ఉమ్మడి మత జీవనం గిట్టదు.

ఈసందర్భంగానే కుల విభజనలు లేని, సార్వజనిక సోదరత్వాన్ని ప్రతిపాదించే ఇస్లాం, కుల విభజనల, అంతరాల హిందూ సమాజంలో ప్రవేశించినప్పుడు ఎలా మారుతుంది, దేన్ని మారుస్తుంది, ఏ కొత్త రూపాలను సంతరించుకుంటుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు అఫ్సర్ విశ్లేషణలు దారితీస్తాయి. తాత్విక పరిభాషలో చెప్పాలంటే సాధారణత్వానికీ ప్రత్యేకతకూ, సార్వజనీనతకూ నిర్దిష్టతకూ మధ్య ఐక్యత, ఘర్షణలు ఎలా ఉంటాయో విస్తృత చర్చ చేయడానికి నమూనాగా నిలుస్తుంది గూగూడు గాథ.

ఇక్కడ అఫ్సర్ స్థానిక ఇస్లాం, స్థానికీకృత ఇస్లాం అనే విశ్లేషణా పరికరాలతో ఈ సమస్యను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. ‘స్థానిక ఇస్లాం’ గురించి గతంలోనే కొందరు పరిశోధకులు చర్చించి ఉన్నప్పటికీ గూగూడు దృశ్యం మరింత సంక్లిష్టమైనదనీ, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో సూక్ష్మాంశాలను, మరెన్నో పొరలను విప్పిచూసే పరిశోధనాపద్ధతి అనుసరించాలని అఫ్సర్ అంటాడు. స్థానిక ఇస్లాం అనేది గూగూడు లాగ అనేక మత విశ్వాసాల సమ్మేళనం కాగా, ‘స్థానికీకృత ఇస్లాం’ విశ్వవ్యాప్త, ఏకశిలా సదృశ మత విశ్వాసాన్ని మాత్రమే అస్లీ ఇస్లాంగా అభివర్ణిస్తుంది. దాన్నే గీటురాయిగా పెట్టుకుని స్థానిక ఆచారాలను పరిశీలిస్తుంది. అందువల్ల సహజంగానే గూగూడు ‘స్థానికీకృత ఇస్లాం’కు విమర్శనీయ ఉదాహరణగా కనబడుతుంది. గూగూడు ముహర్రం విశ్వాసాలను సంస్కరించవలసి ఉందని అన్నవారిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. దేవుడు ఒక్కడే, మరెవరినీ దేవుడితో సమానం చేయగూడదు అని భావించే ఇస్లాం కుళ్లాయప్ప స్థానాన్ని ప్రశ్నిస్తున్నదని అఫ్సర్ చూపాడు. చివరికి కుళ్లాయప్ప పేరు మీద ప్రచారంలో ఉన్న మహిమలను విమర్శిస్తూ, ఆ విమర్శకు హేతుబద్ధతను తోడు తెచ్చుకున్న ఒక మతాధిపతిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. ఈ అస్లీ ఇస్లాం ప్రభావం యువతరం మీద ఎక్కువగానే ఉన్నదని, అందుకు ఇస్లామిక్ గ్రంథాలు స్థానిక భాషల్లో విరివిగా వెలువడడం కూడ దోహదం చేస్తున్నదనీ వివరంగా చర్చించి, ఈ ఆలోచనలు ముందుకుసాగితే, గూగూడు ముహర్రం ఉత్సవాలలో ముస్లింల పాత్రకు ఏమవుతుంది అని కూడ ఆలోచనలు చేస్తాడు.

చిట్టచివరిగా, ముగింపులో భారత సమాజం వంటి మత బాహుళ్య సమాజాలలో ఎటువంటి సమన్వయ, సర్వాంగీణ, సమ్యగ్ దృక్పథం ఉండాలో చర్చించే ప్రాతిపదికను సూచించడానికా అన్నట్టు గురజాడ వంద సంవత్సరాల వెనుక రాసిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ లో పీర్ల ప్రస్తావనతో వచ్చిన చర్చను ప్రస్తావిస్తాడు. వంద సంవత్సరాల తర్వాత నిసార్ రాసిన ‘ముల్కీ’ కథను ప్రస్తావించి సమకాలీన సమస్యలనూ సూచిస్తాడు.

మొత్తానికి ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. తరతరాల సామూహిక జ్ఞాపకం ఒక సమకాలీన బహుళత్వ ఉత్సవంగా మారి ఏకీకరణ, గుత్తాధిపత్య ఆలోచనలకు ఎదురుగా ఎలా నిలుస్తున్నదో ఒక సజీవ ఉదాహరణనుంచి చూపడమే ఈ పుస్తకపు విశిష్టత.

*

available at: http://www.amazon.in/Festival-Pirs-Popular-Shared-Devotion/dp/0199997594/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1457107819&sr=1-1&keywords=afsar%20mohammad

http://www.flipkart.com/festival-pirs-english/p/itmdhsyu8e4cknhg?pid=9780199997596&ref=L%3A2859794214406078613&srno=p_1&query=afsar%20mohammad&otracker=from-search

అమాయకత్వం కోల్పోతున్న కొత్త జీవితాల కథలు

ఎన్‌. వేణుగోపాల్‌

~

Loss of Innocense Cover (1)కుప్పిలి పద్మ కథలను ఇరవై సంవత్సరాలకు పైగానే చూస్తున్నాను. పదిహేను సంవత్సరాల కింద తాను రాసిన సాలభంజిక కథ చదివి, సమాజంలోకి వస్తున్న కొత్త జీవితాలను, కొత్త జీవన విధానాలను అర్థం చేసుకుని రాయగలిగిన రచయితగా గుర్తించి, అటువంటి రచయితలకు ప్రోత్సాహం అవసరమని అప్పుడు నేను రాస్తున్న ఒక వారం వారం శీర్షికలో ఆ కథ గురించి రాశాను. అప్పటి నుంచి అడపాదడపా తన కథల గురించి నా అభిప్రాయాలు చెపుతున్నాను.

ఈ కథలలోకి వెళ్లేముందు అసలు ఇటువంటి కొత్త జీవితాల పట్ల, ఆ జీవిత సమస్యల పట్ల సమాజపు దృక్పథాన్ని, ప్రత్యేకించి ఆలోచనా పరుల దృక్పథాన్ని, జాగ్రత్తగా పరిశీలించవలసి ఉందనుకుంటాను. ఈ కొత్త జీవితం ఇప్పటికింకా రెండు మూడు దశాబ్దాలు గడిచి నప్పటికీ సార్వత్రికం కాలేదు. దాని స్వభావం వల్లనే అది సార్వత్రికం కాజాలదు కూడ. ఎక్కువలో ఎక్కువ అది ఎగువ మధ్యతరగతిని తాకి, ఆ కింది వర్గాల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం వేయగలుగుతున్నది. అది అల్పసంఖ్యాకుల జీవితాల్లోకి మాత్రమే ప్రవేశించి ఉండవచ్చుగాని అంచులలో ఉన్నదని కూడ అనలేం. ప్రచార సాధనాల హడావిడి వల్ల ఒక రకంగా అదే ప్రధానస్రవంతి అనే అపోహ కలగడానికి కూడ అవకాశం ఏర్పడుతున్నది.

ఇళ్లు, ఇళ్లలో వస్తువులు, అలంకరణలు, వాహనాలు, దుస్తులు, తిను బండారాలు, సంబంధాలు, మాటతీరు, వ్యక్తీకరణలు వంటి ఎన్నో వ్యక్తిగత అంశాల మీద ఈ ప్రభావం ఉంటున్నది. సినిమాలో, టెలి విజన్‌లో, పత్రికలలో ఇదే ప్రామాణిక జీవనస్రవంతి అన్నట్టుగా చూపు తుండడం వల్ల రెండు ప్రమాదకరమైన పరిణామాలు కూడ చాప కింది నీటిలా సమాజమంతా విస్తరిస్తున్నాయి. జిలుగువెలుగులతో ఆకర్షణీయంగా చూపడం వల్ల అదే అనుసరణీయమైన జీవన ప్రమాణం అనుకుని, అనుకరించడానికి ఎక్కువమంది ప్రయత్నిం చడం ఒక పరిణామం కాగా, ఆ జీవన ప్రమాణాన్ని అందుకోలేమని తెలిసి, అందువల్ల తమ జీవితమే వ్యర్థమనే న్యూనతా భావనకు మరింతమంది గురికావడం మరొక పరిణామం. అటు అనుకరణ సంస్కృతి అయినా ఇటు ఆత్మన్యూనతా సంస్కృతి అయినా మనిషిని తన నుంచి తనను దూరం చేసేవే. అంటే మనిషిని సంఘం నుంచి, సమష్టితత్వం నుంచి దూరం చేసేవే. అలా మన సమాజంలో ఈ కొత్త జీవితాల ప్రవేశం అంతకు ముందు ఉన్న అంతరాలకు మరొక కొత్త అంతరాన్ని కలుపుతున్నది. ఒక కొత్త ఘర్షణనూ వేదననూ సృష్టిస్తున్నది. ఒక కొత్త పరాయీ కరణను ప్రవేశపెడుతున్నది.
ఈ నేపథ్యంలో ఈ కొత్త జీవనరంగాల గురించీ, వాటిలోపలా, వాటి వల్లా సమాజంలో తలెత్తుతున్న ఘర్షణల గురించీ, వాటి ప్రభావం గురించీ మరింత ఎక్కువగా అర్థం చేసుకోవలసిన, మాట్లాడుకో వలసిన అవసరం పెరుగుతున్నది. ఈ జీవితాల గురించి సాను కూలంగా, ఆకర్షణతో, మోజుతో, సమ్మోహకంగా చెపుతున్న ధోరణి పెరుగుతున్నందువల్ల, వాస్తవికంగా వాటిలోని గుణదోషాలను, సమస్య లను, ఆందోళనలను అర్థం చేసుకోవలసి ఉన్నది. ఆ జీవితాలలోని మంచిగాని, చెడుగాని సమాజంలోని ఇతర వర్గాల జీవితాల మీద ఎటువంటి ప్రభావం వేయగలవో తెలుసుకోవడానికి ఆ జీవితాల గురించీ తెలుసుకోవాలి, ఆ ప్రభావాల గురించీ తెలుసుకోవాలి. ఇంత బలమైన జీవన ప్రభావం సహజంగానే కళకూ కథకూ వస్తువు కాకతప్పదు. ఆ అత్యవసరమైన పనిని పద్మ తన కథల ద్వారా గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నదని నాకనిపిస్తున్నది. ఇప్పుడిక్కడ సంకలనం చేసిన పదకొండు కథలు కూడ ఆ పనిలో భాగమే అనుకుంటాను.

 

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌ అనే పుస్తక శీర్షిక ఈ పుస్తకంలో భాగమైన ఒకానొక కథ శీర్షిక మాత్రమే కాదు. ఈ కథలన్నిటికీ ఆధారభూమిక అయిన సార్వత్రిక ఇతివృత్తంగా అర్థవంతమైనది. మరోమాటలో చెప్పా లంటే అది మన సమాజపు ఒకానొక స్థితి. నైసర్గికమైన, సహజమైన అమాయకత్వాన్ని కోల్పోతున్న స్థితిలో ఇవాళ సమాజంలో గణనీయ మైన భాగం ఉంది. ఈ అమాయకత్వం కోల్పోతే దాని స్థానంలో వచ్చేది ఏమిటనేది చర్చనీయాంశం కావచ్చు. కాని వలసవాద మార్కెట్‌ ప్రవేశించిన నాటి నుంచీ భారతీయ సామాజిక జీవితం అమాయ కత్వాన్ని కోల్పోతూనే ఉంది. ఆ మూడు వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ అవసరంలేదు గాని గత రెండు మూడు దశాబ్దాలలో ఈ అమాయకత్వాన్ని కోల్పోయే ప్రక్రియ వేగవంతంగానూ, విస్తారం గానూ, లోతుగానూ జరుగుతున్నది. ఒక మనిషయినా సమాజ మయినా అమాయకత్వం కోల్పోతే, ఆ స్థానంలో జ్ఞానమో, వివేకమో రావచ్చు. లేదా, తెంపరితనమో, తుంటరితనమో రావచ్చు. అజ్ఞానమూ అవివేకమూ కూడ ఆకర్షణీయమైన ముసుగులు వేసుకుని రావచ్చు. ఈ పరిణామం ఎలా జరిగినప్పటికీ, సామాజిక అమాయకత్వం కోల్పోయే క్రమం ఆసక్తి కరమైనది. అది వ్యక్తిగత జీవితాలలో ప్రతి ఫలిస్తూ వ్యక్తులు తమ అమాయకత్వం కోల్పోయే క్రమాన్ని ఒక కళారూపంలో చిత్రించడం మరింత ఆసక్తికరమైనది. ఒకరకంగా చూస్తే ఈ పదకొండు కథలూ కూడ ఒక సమాజం అమాయకత్వాన్ని కోల్పోయే క్రమానికి వ్యక్తిగతస్థాయి ప్రతిఫలనాల చిత్రణలే.

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌లో విహాన్‌ – దర్శనల మధ్య ఉన్న సంబంధానికి పాత పద్ధతిలో పరస్పర నమ్మకం పునాది కాదు. బహుశా పరస్పర అపనమ్మకమే, అవతలి వాళ్లు అబద్ధం చెపుతున్నారన్న నమ్మకమే పునాది కావచ్చు. అమాయకత్వం కోల్పోవడం అంటే అదే. కాకపోతే దానికి లాంగ్‌ కమిట్‌మెంట్స్‌ యివ్వలేకపోవడం అనీ, బ్యాగేజ్‌ వద్దను కోవడం అనీ, కెరీర్‌లో సెటిల్‌ కావడం అనీ కొత్త అర్థాలు చెప్పుకునే తెలివితేటలు ఇప్పుడు వచ్చాయి. ‘యే ఫీల్డ్‌ అయితేనేం కేట్‌ రేస్‌లో అందరం… యేదో రకంగా భాగస్తులమే…’ అనడం అలా అమాయ కత్వం కోల్పోతున్నవాళ్ల అంతరంగానికీ, బహిరంగ సమర్థనకీ ఒక సూచిక. అసలు ఆ కేట్‌ రేస్‌ ఎవరు సృష్టించారు, ఎవరి ప్రయోజనాల కోసం సృష్టించారు, ఆ కేట్‌ రేస్‌లోకి వెళ్లేవాళ్లు ఇష్టపూర్వకంగా వెళుతున్నారా, సామాజిక స్థితి వాళ్లను అటు నెట్టి, వాళ్ల నుంచి అమాయకత్వాన్ని కొల్లగొడుతున్నదా, అలా వెళ్లినందువల్ల వాళ్లేమి సాధిస్తున్నారు అని ఆలోచించడానికి పురికొల్పడమే కథ సాధించదలచిన ప్రయోజనం.

ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవడాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్థం చేసుకోవలసి ఉంది. అది సంఘ పరివార్‌, ఖాప్‌ పంచాయతీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురు షాధిపత్య అర్థంలో మాత్రమే జరగడం లేదు. సంక్లిష్టమైన, అసాధారణమైన రూపాల్లో జరుగుతున్నది. నైతిక పోలీసులు చెపుతున్న సద్యోలైంగిక సంబంధం, కాజువల్‌ సెక్స్‌, వైవాహికేతర సంబంధం, స్వేచ్చాయుతమైన ప్రవర్తన వంటి పాత నైతిక అర్థాలు మాత్రమే ఈ అమాయకత్వ విచ్చేద పరిణామాన్ని పూర్తిగా వివరించజాలవు. అసలు ఆ ప్రక్రియకు ప్రతిసారీ ప్రతికూల అర్థం మాత్రమే ఉంటుం దని కూడ అనుకోలేం. ఒక్కోసారి అధ్యయనం వల్ల, స్పందనల వల్ల, భావుకత వల్ల ప్రపంచానికి కొత్త కిటికీలు తెరుచుకుని, వ్యక్తిత్వం వికసించి, జీవన సార్థకతకు వినూత్న అర్థాలు స్పురించి కూడ అమాయకత్వం కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఆ సానుకూల అర్థాలలో కూడ అమాయకత్వ విచ్చేదాన్ని అర్థం చేసుకోవలసి ఉంది.

మెరుగైన ఆర్థికస్థితి ఉన్న మధ్యతరగతి కుటుంబాలలో అంతర్లీనంగా ఎంత పితృస్వామిక భావజాలం ఉన్నప్పటికీ, అమ్మాయిల పట్ల ప్రేమాభిమానాలు కనబరచడం, ముద్దు చేయడం, వాళ్ల ఇష్టాయిష్టాలు తీర్చడం కొంత మెరుగ్గానే ఉన్నాయి. కాని కూతురికి ఉండే ఆ హోదా అదే వయసులో ఉండే కోడలికి లేకపోవడంలోనే పితృస్వామ్యం బయటపడు తుంది. ‘నీకున్న ఫ్రీడవ్‌ు నాకు కూడా మా యింట్లో వుండేది. యిది నా యిల్లు అంటారు. కానీ కాదు. యిది నేను పెళ్లి చేసుకొన్న అబ్బాయి, అంటే నా భర్త యిల్లు. అదీ తేడా… నీకున్నలాంటి ఫ్రీడమ్  నాకు రాదు. పైకి కనిపించని రూల్స్‌ చాలా ఉంటాయి. మ్యారేజి అయ్యాకే నాకు యివన్నీ యెక్స్‌పీరియెన్స్‌లోకి వచ్చాయి,’ అని ‘ఫ్రంట్‌ సీట్‌’లో గ్రీష్మ తన ఆడబిడ్డ ధాన్యతో అనే మాటలు పితృస్వామిక నిర్బంధానికీ, కొత్త తరం యువతుల గ్రహింపుకూ నిదర్శనం. ఇది కూడ మరొకస్థాయిలో అమాయకత్వ విధ్వంసమే.

కొత్తతరం పోగొట్టుకుంటున్న అమాయకత్వంలో, తెచ్చుకుంటున్న కొత్త అలవాట్లలో, విలువల్లో అధికారాన్ని, సంప్రదాయాన్ని ప్రశ్నించడం అనే సానుకూల లక్షణంతో పాటే అనారోగ్యానికీ, అసాంఫిుకత్వానికీ దారితీసే అలవాట్లు కూడ ఉంటున్నాయి. మద్యపానాన్నీ, మాదక ద్రవ్యాల వాడకాన్నీ నైతిక కారణాలవల్ల వ్యతిరేకించనక్కరలేదు గాని అవి మరొకరు మప్పుతున్నందువల్ల, మరొకరి వ్యాపారం కోసం, యువతరాన్ని జోకొట్టడం కోసం వస్తున్నాయా ఆలోచించవలసి వుంది. ‘గాల్లో తేలి నట్టుందే’ కథ ఈ విలువల ఘర్షణను చిత్రిస్తుంది. ‘వో మైగాడ్‌… మమ్మీ నిజంగా నువ్వు యిన్నోసెంట్‌. క్రైమ్  యేంటి? నీకు తెలుసా 21 ఏళ్లు నిండని వాళ్లకీ డ్రింక్స్‌ యిస్తారు పబ్స్‌లో. హుక్కా క్లబ్స్‌లో, పబ్స్‌లో రకరకాల పేర్లతో గంజాయే కాదు, కొన్ని రకాల డ్రగ్స్‌ దొరుకు తాయి. యిదంతా కామన్‌. క్రైమ్ కాదు.  వీటికొచ్చే వాళ్లంతా యెలీట్‌ రిచ్‌ సెక్షన్స్‌ నుంచే. వీటిని రన్‌ చేసేది పవర్‌ఫుల్‌ పీపుల్‌. అలా వాళ్లు సర్వ్‌ చేయటం క్రైమ్  కానప్పుడు మేం తీసుకోవటం క్రైమ్ ఏలా అవుతుంది…’ అన్న సుస్మిత మాటలు కొత్త మార్పులను మాత్రమే కాదు, ఆ మార్పుల వెనుక ఉన్న, లాభ పడుతున్న శక్తులను కూడ చూపుతున్నాయి. ‘యీ జనరేషన్‌ చాలా అందమయినది. తెలివైనది. యెన్నెన్నో విషయాలని సునాయాసంగా కనిపెడ్తూ ఉంది. యిదే జనరేషన్‌లో కొంతమంది యిలాంటి అలవాట్లకి బానిసలవుతూ యిదంతా ఫన్‌ అంటారు. యిలాంటి వాళ్లు యెక్కువగా డిస్ట్రక్షన్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. వాళ్లకసలు భయం లేదు. ప్రాణాల మీద మమకారం లేదు…. నువ్వంటున్నావు రూల్స్‌ బ్రేక్‌ చేయడాన్ని యిష్టపడుతున్నారని. అన్ని జనరేషన్స్‌లో రూల్స్‌ని బ్రేక్‌ చేయటం వుంది. కాకపోతే అప్పుడు యెక్కువగా వొక వికాసం కోసం చేసేవారు. యిప్పుడు అదంతా వొక విధ్వంసం. అదే మానసికానందం…’’ అని నందినికి వివరిస్తారు మాస్టారు.

పద్మ భాషలో సమ్మోహకమైన, ఆకర్షణీయమైన లక్షణమూ ఉంది. ఒక్కొక్కసారి అది సహజత్వానికి దూరమైందని అనుమానించడానికి ఆస్కారం ఇచ్చే లక్షణమూ ఉంది. ఆమె సృష్టించే సన్నివేశాలు, సంభా షణలు, చివరికి పాత్రల పేర్లు కూడ అసహజమైనవని అనుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కచోట పాత్రల, సంభాషణల, ప్రవర్తనల ఔచిత్యం మీద కూడ సందేహం కలుగుతుంది. కళారూపానికి విశ్వ సనీయత, సంభావ్యత పునాది అంశాలు. అవి లేవని లేశమాత్రం అనిపించినా ఆ కళారూపం ఇవ్వదలచిన సందేశం కూడ దెబ్బ తింటుంది.

ఈ చిన్న లోపాలు అలా ఉంచి ఈ కథల గురించి మొత్తంగా ఆలో చిస్తే, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో మార్క్స్‌, ఎంగెల్స్‌లు బూర్జువా వర్గ ప్రాబల్యం, మార్కెట్‌ ప్రవేశించిన చోట ఏం జరిగిందని చెప్పారో గుర్తుకొచ్చింది: ‘బూర్జువావర్గం… మత, రాజకీయ భ్రమల ముసుగులు కప్పిన దోపిడీ స్థానంలో నగ్నమైన, సిగ్గులేని, ప్రత్యక్షమైన, అమాను షమైన దోపిడీని ప్రవేశపెట్టింది. ఇంతవరకూ గౌరవనీయంగానూ, భక్తిపూర్వక మైన భయంతోనూ పరిగణించిన ప్రతి వృత్తి మీది ఆచ్చాదననూ బూర్జువావర్గం పీకి పారేసింది. వైద్యుడినీ, న్యాయవాదినీ, మతగురువునీ, కవినీ, శాస్త్రవేత్తనూ డబ్బుకోసం తనకు ఊడిగంచేసే కిరాయి కూలీలుగా మార్చివేసింది. బూర్జువావర్గం కుటుంబం నుంచి దాని రాగబంధురమైన మేలిముసుగును చించి పారవేసి కుటుంబ బంధాన్ని కేవలం డబ్బుతో కూడిన సంబంధంగా దిగజార్చింది… సమస్త సామాజిక స్థితులను ఎడ తెగకుండా కలతపెట్టడం, అనిశ్చి తత్వాన్నీ, ఆందోళననూ నిరంతర పరిణామాలుగా మార్చడం బూర్జువాశకపు ప్రత్యేకతలు… గడ్డ కట్టుకుని, తుప్పుపట్టిపోయిన సంబంధాలూ, వాటితో పాటు సనాతమైన, పూజనీయంగా చూసిన దురభిమానాలూ తుడిచిపెట్టుకుపోతాయి. కొత్తగా ఏర్పడిన సంబంధాలు గట్టిపడక ముందే పాతబడిపోతాయి. ఘనీభ వించిన ప్రతీదీ కరిగి గాలిలో బాష్పమైపోతుంది. పవిత్రమైన ప్రతిదీ మలినమై పోతుంది…’

ఈ మాటలు రాసింది 1848లో. ఆ తర్వాత గడిచిన నూట అరవై సంవత్సరాలలో ఆ స్థితి మరింత తీవ్రతరమైంది. ఆ బూర్జువావర్గం తన తొలినాటి ప్రగతిశీల స్వభావాన్నీ, సమాజాన్ని ఇలా సమూలంగా మార్చే బాధ్యతనూ వదులుకుంది. భారత సమాజం వంటి సమాజా లలో పాత, అభివృద్ధి నిరోధక వ్యవస్థలలో తనకు పనికి వస్తాయనుకునే చెడుగులతో మిలాఖత్తు పెట్టుకుంది. ఇప్పుడిది పాతనంతా ఊడ్చి పారేసే కొత్త కాదు. పాత కొత్తల మేలు కలయిక కూడ కాదు. పాత కొత్తల కీడు కలయిక. ఇక్కడ డాలర్ల వేట, ఇంగ్లిష్‌ చదువులు, అపార ప్రపంచజ్ఞానం, అందరాని జీవనశౖలివంటి అత్యాధునిక అంశాలూ, స్త్రీపురుష అసమానత, కులవివక్ష, మతోన్మాదం, మూఢనమ్మకాల వంటి ప్రాచీన అంశాలూ సామరస్యంగా సహజీవనం చేస్తుంటాయి. ఆ పాతకొత్తల కీడు కలయిక స్థితికి సూచికలు ఈ కథలు.

*

 

 

దిగంబర కవులను మరిచిపోయేంత మారామా?

 

గతాన్ని చదువుకుని, దానితో వర్తమానాన్ని పోల్చుకుంటూ గతానికీ వర్తమానానికీ మధ్య ఉండే అవినాభావ సంబంధం గురించి సిద్ధాంతరీత్యా తెలిసిఉండడం ఒక ఎత్తు. ఆ సంబంధాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్న ఘటనలనూ దృశ్యాలనూ పరిణామాలనూ ప్రతిక్షణమూ అనుభవిస్తూ గతవర్తమానాల అవిభాజ్యతను గుర్తించడం మరొక ఎత్తు. వర్తమానం ఒక సూచన చేస్తుంటే, గతంలో అటువంటి సూచనే ఉండిందని గుర్తింపు కూడ రాకపోవడం మరొక ఎత్తు. తెలుగు సమాజం నిరంతర గతంలో జీవిస్తున్నదనీ, మార్పు అనుకుంటున్నదేదీ రూపంలో మార్పే తప్ప సారంలో మార్పు కాదనీ చూపడానికి ఎన్నో ఆధారాలుండగా, పాత అవ్యవస్థే రంగు మార్చుకుని కొనసాగుతుండగా, కనీసం ఆ అవ్యవస్థ మీద గతం ప్రకటించిన ఆగ్రహాన్ని ఇవాళ గుర్తు చేసుకోవడానికి కూడ శక్తి లేకుండా ఉన్నదనీ చూడడం ఆసక్తికరం కన్న ఎక్కువగా విచారకరం.

సమాజం నిలువనీటి గుంట అయిందనీ, దీన్ని ధిక్కరించాలనీ, ఛీత్కరించాలనీ తెలుగునాట కోపోద్రిక్త యువతరపు అసంతృప్తికీ, ఆగ్రహానికీ ప్రతిఫలనంగా దిగంబరకవులు (నగ్నముని – మానేపల్లి హృషీ కేశవరావు, నిఖిలేశ్వర్ – కె యాదవరెడ్డి, జ్వాలాముఖి – ఆకారం వీరవెల్లి రాఘవాచార్యులు, చెరబండరాజు – బద్దం భాస్కర రెడ్డి, భైరవయ్య – మన్మోహన్ సహాయ్, మహాస్వప్న – కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు) పొలికేక వేసి ఈ మే 6 కు సరిగ్గా యాబై సంవత్సరాలు నిండాయి. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (1944-1982), జ్వాలాముఖి (1938-2008) మరణించారు. నగ్నముని (1939), నిఖిలేశ్వర్ (?), భైరవయ్య (1942), మహాస్వప్న (1940?) ఇంకా మనమధ్యనే ఉన్నారు. తెలుగు సమాజ సాహిత్యాల్లో దిగంబర కవుల ప్రాధాన్యత గురించి ఆలోచనాపరుల్లో తగినంత స్పృహ ఉంది. అయినా అర్ధ శతాబ్ది నిండిన సందర్భంగా ఉత్సవమో, జ్ఞాపకమో, గుర్తింపో ఎక్కడా జరిగినట్టు లేదు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ రచనలు కూడ పెద్దగా వచ్చినట్టు లేదు.

దిగంబర కవుల ఆవిర్భావం జరిగి యాబై ఏళ్లయిందని మనం ఇవాళ గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా, మొత్తంగా దిగంబర కవులు తెలుగు సమాజం మీదా, సాహిత్యం మీద వేసిన ప్రభావం అపారమైనది. దాన్ని చారిత్రక సందర్భంగానైనా మననం చేసుకోకతప్పదు. వాళ్లు వేసిన ప్రశ్నలూ, వాళ్ల విశ్లేషణలూ కొన్ని ఇవాళ్టికీ సంబద్ధతను కోల్పోలేదు సరిగదా బహుశా మరింత ఎక్కువ సంబద్ధంగా ఉన్నాయెమోననిపిస్తున్నది.

‘ఇతి శాసనమ్’ అనే శీర్షికతో “దిగంబర శకం నగ్ననామ సంవత్సరం ఆశ రుతువు (సరిగ్గా క్రీ.శ. 1965 మే) న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్ లో ప్రప్రథమంగా తాము దిగంబరకవులమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్తరక్తాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికొస్తున్న నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని ఈ పేజీల్లో పట్టుకోడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ” అనే ప్రకటనతో దిగంబర కవులు తమ మొదటి సంపుటాన్ని వెలువరించారు. ఆ సంపుటాన్ని మే 6 అర్ధరాత్రి (దిగంబర కవులు జీరో అవర్ అన్నారు) హైదరాబాద్ ఆబిడ్స్ చౌరస్తాలో నాంపల్లి పాండు అనే రిక్షావాలా ఆవిష్కరించారు.

మంటలు మాట్లాడినట్టు రాసిన ‘దిగంబరశకంలోకి’ అనే ముందుమాట అర్ధశతాబ్ది తర్వాత చదువుతుంటే ఒకటి రెండు చోట్ల మినహా ఇవాళ్టి గురించి రాసినట్టే ఉంటుంది.

“కీర్తి, డబ్బు, యినప బూట్ల క్రిందపడి నలిగి కొనవూపిరితో గిలగిలా కొట్టుకుంటున్న మీ అసలు స్వరూపాన్ని ఎన్నడైనా, ఒక్కనాడైనా చూసుకున్నారా?

మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. మీ ముసుగు – నటన జీవితం. అధికార జీవితం. డబ్బు జీవితం, గౌరవ జీవితం. వాటికోసం పడిచచ్చి వాటికోసం ఏదయినా సరే, చివరికి మిమ్మల్ని సైతం చంపుకునే దిక్కుమాలిన జీవితం.

ఏం, ఈ ముసుగు లేకపొతేనేం? స్వేచ్ఛగా అసలు స్వరూపంతో బతకడానికి యత్నిస్తేనేం?” అని యాబై ఏళ్ల కింద వాళ్లు చేసిన నిర్ధారణలు, వేసిన ప్రశ్నలు ఇవాళ్టికీ ప్రతిధ్వనిస్తున్నాయి.

మొదటి సంపుటం తర్వాత ఏడాదిన్నరకు దిగంబర కవుల రెండో సంపుటం వెలువడింది. మొదటి సంపుటం లోనే తాము రాసే ప్రక్రియను వచన కవిత అనే పేరుతో పిలవడం తమకు ఇష్టం లేదని, దానికి దిక్ అనే కొత్త పేరు పెడుతున్నామనీ ప్రకటించిన దిగంబర కవులు రెండో సంపుటానికి ‘దిక్ లు 30’ అనే శీర్షిక పెట్టారు. “దిగంబర శకం నిఖిలేశ్వర నామ సంవత్సరం మదిర రుతువు (సరిగ్గా క్రీ.శ. 1966 డిసెంబర్) లో ఇంకా భయం భయంగా బానిసత్వంగా దుర్భరంగా హేయంగా ఛండాలంగా ఉన్న ఆంధ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితా ప్రచురణ సమర్పిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటాన్ని విజయవాడ గవర్నర్ పేట సెంటర్ లో డిసెంబర్ 18 జీరో అవర్ లో జంగాల చిట్టి అనే హోటల్ క్లీనర్ ఆవిష్కరించారు.

ఆ తర్వాత ఇరవై నెలలకు, “నేటి ‘కుష్ఠు వ్యవస్థ’ పై దిగంబర కవులు సంపుటి 3” వెలువడింది. “ప్రజల అవిద్యని అజ్ఞానాన్ని అశక్తతని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాల వాళ్లు నేడు ప్రజలపై రుద్దుతున్న ‘కుష్ఠు వ్యవస్థ’ ని ఎదుర్కొంటూ దిగంబర కవులు పలికిన దిక్ లను జ్వాలా నామ సంవత్సరం అశ్రు రుతువు (సరిగ్గా క్రీ.శ. 1968 సెప్టెంబర్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటిని “ఈ ‘కుష్ఠు వ్యవస్థ’ ఫలితంగా బిచ్చగత్తెగా మారి దుర్భరంగా బతుకుతున్న ఎడమనూరి యశోద (వయస్సు 20 సం.) విశాఖపట్నం, లక్ష్మీ టాకీస్ సెంటర్ లో 14.9.68 రాత్రి 12 గంటలకి” ఆవిష్కరించింది అని దిగంబర కవుల మూడో సంపుటిలో అతికించిన చిన్న వివరణ చెపుతుండగా, సాహిత్య చరిత్రకారులు కొందరు ఆమెను “వేశ్య” అని ప్రస్తావించారు.

digambara kavulu-3a

దిగంబర కవులు తమ కవిత్వం ద్వారా మాత్రమే కాక, పేర్లు, ప్రకటనలు, ఆవిష్కరణలు, ఆవిష్కరణ సమయాల ద్వారా కూడ సంచలనం సృష్టించారు. సమాజంలో, సాహిత్యలోకంలో దిగ్భ్రాంతిని కలిగించారు. సమకాలీన యువతరంలోని అశాంతినీ, అసంతృప్తినీ తమ కోపోద్రిక్త, ధర్మాగ్రహ అభివ్యక్తిలో ప్రతిఫలించి, యువతరం నుంచి అశేష ఆదరాభిమానాన్ని చూరగొన్నారు. వలస పాలన ముగిసి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిందని రాజకీయ నాయకత్వం ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఒక తరం జీవితకాలం గడుస్తున్నప్పటికీ వలసవ్యతిరేక ప్రజా ఉద్యమ ఆకాంక్షలలో ఏ ఒక్కటీ ఫలించకపోవడం ఒకవైపు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ (1951), ఆంధ్ర రాష్ట్ర ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల పరాజయం (1955), సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ఇరవయో కాంగ్రెస్ లో నికిటా కృశ్చెవ్ శాంతియుత పరివర్తనా సిద్ధాంతంతో వర్గపోరాటానికి ప్రకటించిన సెలవు (1956), ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన ఇరవై ఏడు నెలల ముచ్చట అయి రద్దయిపోవడం (1957-59) వంటి పరిణామాలు మరొకవైపు సమాజాన్ని నిర్లిప్తతలోకీ, స్తబ్దతలోకీ నెట్టాయి. అలా నిరాశలో నిరుత్సాహంలో కూరుకుపోతున్న యువతరంలో, ప్రగతిశీల శక్తులలో, పోరాట స్ఫూర్తిని కొనసాగించాలనుకున్న శక్తులలో దిగంబరకవుల పెనుకేకలు ఆనందాన్ని నింపాయి. అటువంటి శక్తులన్నీ నిరభ్యంతరంగానో, కొన్ని అభ్యంతరాలతోనో దిగంబరకవులను ఆహ్వానించాయి. మరొకవైపు దిగంబరకవుల కవిత్వం, ప్రకటనలు వ్యవస్థా సమర్థకులకూ సాహిత్య పీఠాధిపతులకూ మర్యాదస్తులైన సాహిత్యకారులకూ సమానంగా ఆగ్రహం కూడ కలిగించాయి.

దిగంబరకవులు తన ప్రశంస, సిఫారసు, విమర్శ, నింద అవసరమైన స్థితిలో లేరనీ, వాళ్ల కవిత్వాన్ని తాను ఇంగ్లిషులోకి అనువదించి ధైర్యం ఉన్న ప్రచురణకర్త ఉంటే ప్రచురించదలచానని శ్రీశ్రీ రాశారు. పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యాక దిగంబర కవులను విమర్శించేవారికి శ్రీశ్రీయే చాల చోట్ల జవాబు చెప్పారు. “అభ్యుదయ కవిత్వం ఆంధ్రదేశంలో తన పాత్ర నిర్వహించి తెరవెనక్కి తప్పుకుంది. ఇప్పుడు కొత్త శక్తులు పెరుగుతున్నాయి. కొత్త మంటలు రగులుతున్నాయి. అభ్యుదయ కవిత్వం ఇప్పుడు వెస్టెడ్ ఇంటరెస్ట్ కాకూడదు. ఇవాళ రాస్తున్నవాళ్లు దిగంబరకవులు, తిరుగబడు కవులు, సంఘర్షణ కవులు. చేతనైతే వాళ్లకి చేయూతనివ్వండి, లేకపోతే నోరు ముయ్యండి” అని శ్రీశ్రీ రాశారు. “దిగంబర కవులు ఈ ద్వేషాన్ని ప్రజలలో పుట్టించడం అవసరం” అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు. “నెగెటివ్ గానే సంఘాన్ని విమర్శిస్తూ ఉండిన దిగంబర కవులు పాఠకలోకానికి విద్యుచ్ఛికిత్స చేయడంలో కృతార్థులయ్యారు. గండ్రగొడ్డళ్లలా అవినీతిమీద విరుచుకుపడ్డారు. వాళ్ల కోపం ఉన్మాదానికి గల తీవ్రతను సంతరించుకొంది” అని కె వి రమణారెడ్డి అన్నారు. “కూచిమంచి జగ్గకవి తిట్టు కవిత్వం చదివినప్పుడు కవికి కోపం వచ్చిందని పాఠకుడికి తెలుస్తుంది. దిగంబర కవిత్వం చదివినప్పుడు పాఠకుడికి కోపం వస్తుంది” అని వెల్చేరు నారాయణ రావు అన్నారు. “సాహిత్య రంగంలో ఏర్పడిన స్తబ్దత, సమకాలీన జీవితంలో కొట్టవచ్చినట్టు కనిపించే అక్రమాలు, అన్యాయాలు, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, వీటన్నిటిలో నుండి పుట్టిన విపరీత ధోరణిగల ఉద్యమం దిగంబర కవితోద్యమం” అని పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.

మరొకవైపు, “దిగంబర కవితోద్యమం తాటాకు మంట. ఎలా వచ్చిందో అలా పోతుంది” అని విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. దిగంబర కవులను చాల తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమసుందర్ వారి మొదటి సంపుటం ఆవిష్కరణ రోజే పిఠాపురం నుంచి ఉత్తరం రాస్తూ “…ఆవిష్కరణోత్సవం కవితా బహిష్కరణోత్సవంగా శ్రాద్ధయోగంగా జరుగుతుందని ఆశిస్తాను. ఈ ఆరుగురు కవులూ ఈ రాత్రి జీరో అవర్సు నుంచి ప్రారంభించి దిగంబరులుగానే సమాజంలో మసులుతారని కూడా నేనూహిస్తున్నాను… మీకు నా బట్ట విప్పిన అభినందనలు” అని రాశారు.  “మంత్రిని పిలవడం స్నాబరీ లేక స్లేవరీ. రిక్షావాణ్ని పిలవడం ఒక పోజు లేకపోతే ఓ రకమైన ఆత్మవంచన” అని తిలక్ అన్నారు. “దిగంబరకవులకు ఏ కోశానా భావుకత్వం లేదు. కవిత్వం రాయడం బొత్తిగా చేతకాదు. వచనం రాయడం, గేయం రాయడం చేతకాని వాళ్లందరూ వచనగేయం రాసినట్టే వీళ్లు వచనగేయం రాసినారు. కాని లిటరరీ లంపెన్ ప్రొలిటేరియట్ గనక వాళ్లు వచనగేయం అనకుండా ‘దిక్ లు’ అన్నారు. ఈ లిటరరీ అండర్ వరల్డ్ సాహిత్య రౌడీలు కనిపించినవాళ్లనందరినీ బూతులు తిట్టినారు. సమాజంలో పీడకులను వంచకులను మాత్రమే కాదు వాళ్లు తిట్టింది. సకల రాజకీయ పార్టీలను తిట్టి పీడిత జన కార్మిక జన పక్షపాతం వహించే పార్టీలను కూడా తిట్టినారు. గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత నీచమైన కుసంస్కారపు రచన మనకెప్పుడూ రాలేదు” అని రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నారు. “సమాజం ఎంత చెడిపోయినా దిగంబరకవులది కవిత్వం అనుకునేంత చెడిపోయిందా” అని కూడ రారా ప్రశ్నించారు.

అటు పూర్తిగా ప్రశంసో, ఇటు పూర్తిగా తృణీకారమో కాక మధ్యే మార్గంగా గుణాన్నీ దోషాన్నీ చూసినవాళ్లు కూడ ఉన్నారు.

digambara kavulu-3

ఈ చర్చోపచర్చలన్నీ ఎలా ఉన్నప్పటికీ దిగంబర కవులు తెలుగు సమాజానికీ, సాహిత్యనికీ ఇవ్వదలచిన షాక్ ట్రీట్ మెంట్ పని చేసింది. లేదా, తెలుగు సమాజ సాహిత్యాలు అప్పటికి ఒక షాక్ ట్రీట్ మెంట్ అవసరమైన దుర్భర అనారోగ్యంతో ఉండి దిగంబరకవుల ఆవిర్భావానికి కారణమయ్యాయి.

దిగంబర కవుల సంచలనాన్నీ, కవిత్వాన్నీ అర్ధశతాబ్ది తర్వాత నిర్మమంగా పరిశీలిస్తే వాటిలో వస్తుగతంగానూ, వాటి ఫలితాల రీత్యానూ గణనీయమైన సానుకూలాంశాలు కనబడతాయి. సాహిత్య సంప్రదాయం నుంచి చూసినప్పుడు భాషా ప్రయోగం, తీవ్రత వంటి అంశాలు, స్త్రీలను అవమానించే సాంప్రదాయిక పురుషాహంకార పదప్రయోగాలు ప్రతికూలాంశాలుగా కనబడినా అవి సాధించదలచిన, సాధించిన ప్రయోజనం దృష్ట్యా, ఆ కాలపు అవగాహన పరిమితుల దృష్ట్యా అభ్యంతరకరమైనవి కావనీ, అర్థం చేసుకోవలసినవనీ అనిపిస్తుంది.

కొనసాగుతున్న అన్ని విలువలనూ ప్రశ్నించడం అనేది దిగంబర కవుల ప్రధానాంశం. నిజంగా వలస పాలన అనంతరం ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశంలోనూ మార్పు లేకపోవడం, వలస పాలనా కాలపు దుస్థితి మరింత పెరుగుతూ ఉండడం అన్ని విలువల్నీ ప్రశ్నించే ఆగ్రహావేశాల్ని ప్రేరేపించకపోతే ఆశ్చర్యపోవాలి గాని ప్రేరేపించినందుకు కాదు. ఆ ఆగ్రహం నుంచే దిగంబర కవులు ఆచ్ఛాదనలన్నిటినీ తొలగించాలనుకున్నారు. తమ పేర్లు మార్చుకున్నారు. ఆశ్చర్యం కలిగించే, కొట్టవచ్చినట్టు కనిపించే పేర్లు పెట్టుకున్నారు. కాలమానాన్ని, కాలానికి అప్పటిదాకా సమాజం ఇచ్చిన పేర్లను మార్చదలచారు. తమ పేర్ల మీదనే సంవత్సరాలను, ఆశ, తపన, అశ్రు, మదిర, విరహ, విషాద రుతువులను, స్నేహ, విశృంఖల, క్రాంతి, సృజన, వికాస, అనంత వారాలను సృష్టించారు. ఏ వస్తువు చెపుతున్నారనేదానితో సంబంధం లేకుండా వచన కవిత ఒక ఉద్యమంగా మారి, వచన కవితను ప్రచారం చేయడానికి ఒక సంస్థ ఏర్పడిన వాతావరణంలో తమ రచనాప్రక్రియను వచనకవిత అనే పేరుతో పిలవడానికి నిరాకరించారు. దిక్ అనే కొత్త పేరు పెట్టారు. అప్పటిదాకా సాగుతున్న పూలదండల, శాలువాల, సన్మానాల, పరస్పర ప్రశంసల, వందిమాగధ భజనల పుస్తకావిష్కరణల సంప్రదాయాన్ని తిరస్కరించదలచారు. ఆవిష్కరించిన మూడు సంపుటాలనూ మూడు ప్రధాన పట్టణాలలో జీరో అవర్ లో, రిక్షావాలాతో, హోటల్ క్లీనర్ తో, బిచ్చగత్తె (వేశ్య) తో ఆవిష్కరింపజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవస్థ మీద తమ తిరస్కారాన్ని, కసిని, ధిక్కారాన్ని అనేక రూపాలలో, అనేక వ్యక్తీకరణలలో ప్రకటించదలచారు. బుద్ధిజీవులను తనలోకి లాగేసుకుంటున్న, కొనేస్తున్న, మౌనంలోకి నెడుతున్న వ్యవస్థను చీల్చి చెండాడదలచారు. కొనసాగుతున్న విలువలను, యథాస్థితిని ధిక్కరించదలచారు. ఆ పనులను మూడు సంపుటాల కవిత్వంతోనూ, రాష్టవ్యాప్తంగా కవితా పఠనం తోనూ, ఉపన్యాసం తోనూ విజయవంతంగా నిర్వహించారు.

నిజానికి దిగంబరకవుల ఆవిర్భావానికి దారి తీసిన సామాజిక రాజకీయ సాంస్కృతిక నేపథ్యాన్నీ, వాళ్ల కృషినీ, దాని పర్యవసానాలనూ తెలుగు సమాజం ఇంకా పూర్తిగా విశ్లేషించలేదనీ, విశ్లేషించినంత మేరకైనా సంలీనం చేసుకోలేదనీ అనిపిస్తుంది. ఒకరకంగా యథాస్థితిమీద తీవ్ర విమర్శతో, కోపావేశాలతో సర్వ విధ్వంసకవాదులుగా, నిహిలిస్టులుగా మొదలైన దిగంబరకవులు రెండో సంపుటం నాటికి విధ్వంసం ఒక్కటే సరిపోదనీ, ప్రత్యామ్నాయ నిర్మాణ ఆలోచనలు కావాలనీ అవగాహనకు వచ్చారు. మూడో సంపుటం నాటికి ఆ అవగాహన ఇంకా స్పష్టతను సంతరించుకుంది. మూడు సంపుటాలనూ కలిపి మార్చ్ 1971లో ఎమెస్కో ప్రచురించిన సమగ్ర సంకలనంలోని కవితలను వరుసగా చదివితే వాళ్ల అవగాహనలలో క్రమానుగత పరిణామం, కొందరి కవితలలో గుణాత్మక పరిణామం కూడ కనబడుతుంది. బహుశా ఏ చరిత్ర వాళ్ల ఆవిర్భావానికీ, కవిత్వానికీ, సంచలనానికీ కారణమయిందో, ఆ చరిత్ర గమనమే వాళ్ల గురించి చర్చను కూడ పక్కన పెట్టే స్థితి కల్పించినట్టుంది.

దిగంబర కవులు విశాఖపట్నంలో 1968 సెప్టెంబర్ లో తమ మూడో సంపుటం ఆవిష్కరించారు. అప్పటికే శ్రీకాకుళ విప్లవోద్యమం నక్సల్బరీ పంథాలోకి మళ్లింది. విశాఖపట్నానికి ఆ వేడి తగులుతున్నది. ఆ సంపుటంలోని చెరబండరాజు ‘వందేమాతరం’ గాని, ‘యాభై కోట్ల మంటలు’ కవితలో “యాబై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి” అనే పాదాలు గాని ఆ పోరాట వాతావరణానికి స్పష్టాస్పష్ట ప్రతిఫలనాలే. ఆ విశాఖపట్నంలోనే మరొక ఏడాది తర్వాత, 1970 ఫిబ్రవరి 1న శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు జరిగింది. మామూలుగా సన్మానాలను వ్యతిరేకించేవాళ్లు గనుక దిగంబరకవులు దానికి వెళతామని అనలేదు. కాని అంతకుముందు కటక్ లో జరిగిన సభకు వెళ్లి వెనక్కి తిరిగి వస్తూ జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లు విశాఖపట్నంలో ఆగి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలో ‘రచయితలారా మీరెటువైపు’ అని ఎలుగెత్తిన సవాల్ కు ఆ ఇద్దరూ సానుకూలమైన జవాబు ఇచ్చారు. అప్పటికే భైరవయ్య, మహాస్వప్నలు మిగిలిన నలుగురితో విభేదిస్తున్నారు గనుక వాళ్లిద్దరూ విడిగా ఉండిపోయినా నలుగురు దిగంబరకవులూ 1970 జూలై 4 ఉదయాన ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో భాగమయ్యారు. నాలుగు సంవత్సరాల తర్వాత జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ విరసం నుంచి బైటికి వచ్చి జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య స్థాపించారు. నగ్నముని 1979లో విరసం నుంచి వైదొలిగారు. చెరబండరాజు 1982 జూలై 2న బ్రెయిన్ ట్యూమర్ తో మరణించేదాకా విరసంలో కొనసాగారు. భైరవయ్య, మహాస్వప్న కూడ దిగంబర కవిత్వ సంప్రదాయాన్ని కొనసాగించలేదు. వ్యవస్థ మీద అంత ధిక్కారాన్ని, ఆగ్రహాన్ని ప్రకటించిన దిగంబర కవులలో కొందరు తాము విమర్శించిన, ఈసడించుకున్న సన్మానాల, రాజీల, శాలువాల, పరస్పర ప్రశంసల, మొహమాటాల సంస్కృతికి కూడ లొంగిపోయారు.

కాని వ్యక్తులుగా వాళ్లు ఏమైనప్పటికీ, వాళ్లు ప్రారంభించిన, వాళ్లు స్థిరపరచిన వ్యవస్థా ధిక్కార ధోరణులకు, న్యాయమైన ఆగ్రహానికి, కోపోద్రిక్త అభివ్యక్తికి ఎప్పటికీ కాలం చెల్లదు. ఆ గతం ఎప్పటికీ వర్తమానమే. ఆగతానికి కూడ మార్గదర్శకమే. మరీ ముఖ్యంగా దిగంబర కవులు అసహ్యించుకున్న, తిరస్కరించిన సామాజిక, సాహిత్య ధోరణులు మళ్లీ ఒకసారి మనమధ్య కోరలు చాస్తున్నప్పుడు, మళ్లీ ఒకసారి సాహిత్యలోకంలోకి సాహిత్యేతర కృతిభర్తలు ప్రవేశిస్తున్నప్పుడు దిగంబరకవులను తలచుకోవడం అత్యవసరం. మనమింకా వాళ్లను మరిచిపోయేంతగా మారలేదు.

  • ఎన్ వేణుగోపాల్

వివాద కవిత మీద వివాదం

ఎన్. వేణుగోపాల్ 

 

venuఅంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నప్పుడు వివాదం కాని కవిత్వం ఉంటుందా అనుమానమే. నిజానికి కవిత్వమంతా యథాస్థితితో పేచీయే. ఒక అనుభూతిని, ఘటనను, పరిణామాన్ని, దృశ్యాన్ని మరొకరు చూసిన పద్ధతికి భిన్నంగా చూడడమే అనే అర్థం లోనూ కవిత్వమంతా వివాదమే అని చెప్పుకోవచ్చు. కాని కవిత్వంలో భాగమైన ఒక ప్రత్యేక ప్రక్రియగా కూడ వివాద కవిత (పాలిమికల్ పొయెమ్) ఉంది. ఒక కవితనో, రచననో చదివి, దాన్ని ఖండిస్తూ, భిన్న దృక్పథాన్ని ప్రకటిస్తూ కవిత్వం రాయడం వివాద కవిత. ‘వివాద కవిత అంటే ఒక నైతిక లేదా రాజకీయ సమస్య పట్ల ఏ నిర్దిష్ట వైఖరి తీసుకోవాలనే దిశగా పాఠకులను కదిలించే సాహిత్య పాఠపు ప్రక్రియ’ అని ఆఫ్రికన్ కవిత్వంలో వివాద కవిత్వం గురించి రాస్తూ హ్యూ వెబ్ అనే సాహిత్య విమర్శకుడు అన్నాడు.

పార్లమెంటరీ రాజకీయాలను తిరస్కరిస్తూ, సాయుధ పోరాట రాజకీయాలతో ప్రయాణం ప్రారంభించిన సత్యనారాయణ సింగ్ అనే నాయకుడు ఏప్రిల్ 1977లో ఎన్నికలలో పాల్గొనవచ్చుననే సిద్ధాంతాన్ని ప్రకటించినప్పుడు పంజాబీ కవి అమర్ జిత్ చందన్ ‘ఏప్రిల్ థీసిస్’ అని ఒక కవిత రాశాడు. బోల్షివిక్ విప్లవానికి దారి తీసిన లెనిన్ చరిత్రాత్మక ఏప్రిల్ థీసిస్ ను ప్రస్తావిస్తూ, సత్య నారాయణ సింగ్ ఏప్రిల్ ప్రకటనను వ్యంగ్యంగా ఎత్తిపొడిచిన కవిత అది. దాన్ని ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువదించడంతో వివాద కవిత్వంతో నా పరిచయం మొదలైంది. అంతకుముందే శ్రీశ్రీ – దాశరథి మధ్య సాగిన వివాద కవిత్వం పరిచయం ఉంది గాని ఆ వివాదం కొంత అనవసరమైన సంచలనాత్మకతకు, దూషణకు, నిందలకు కూడ జారిపోయిందనే అభిప్రాయం ఉన్నందువల్ల అమర్ జిత్ చందన్ కవిత మరింత నచ్చింది. ఆ తర్వాత నా ఓల్డ్ పిజి హాస్టల్ సహవాసి, అప్పటి మంచి కవి లక్నారెడ్డి రాసిన కవితకు ఆ కవితలోని పదబంధాలనే వాడుకుంటూ నేనూ ఒక వివాద కవిత రాశాను. అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, మైనారిటీ వాద, ప్రాంతీయవాద కవిత్వంలో ఎన్నో వివాద కవితలున్నాయి.

kannabiran1

స్త్రీవాద సిద్ధాంతకర్త, కార్యకర్త, రచయిత వసంత కన్నబిరాన్ ఈ వారం “ఆంధ్రజ్యోతి వివిధ”లో రాసిన కొత్త వివాద కవిత ప్రస్తుతం కొంత దుమారాన్ని రేపే అవకాశం ఉందని అనిపిస్తున్నది. ఆ కవిత వెలువడి ఇంకా పన్నెండు గంటలు నిండకుండానే అనుకూలంగానూ ప్రతికూలంగానూ ఎన్నో అభిప్రాయాలకు దారితీసింది. వసంత కన్నబిరాన్ గతంలో పెద్దగా కవిత్వం రాసినవారు కాదు. ఎప్పుడో వరవరరావు జైలులో ఉన్నప్పుడు ఆయన సహచరి హేమలత తో మాట్లాడి రాసిన నిరీక్షణ అనే కవితలో కూడ వివాద కవిత ఛాయలున్నాయి.

ప్రస్తుత కవిత వివాద కవిత అవునా, అసలు కవిత అవునా, బిలో ది బెల్ట్ (అన్యాయమైన) ప్రతిస్పందనా, తిట్లా అని చర్చ జరుగుతున్నది. ఒక పరిణామం మీద ఒక రచన వెలువడినప్పుడు ఆ రచనను, రచయితను, సందర్భాన్ని భిన్నమైన కోణంలో చూపించడమే వివాద కవిత లక్షణం అనుకుంటే ఇది కచ్చితంగా వివాద కవితే. పదప్రయోగాలు విమర్శకు లక్ష్యంగా ఉన్న కవిత/రచన నుంచి, రచయిత నుంచి ఉండడం, లేదా ఆ రచనను, రచయితను స్ఫురించేలా ఉండడం వంటి వివాద కవిత్వ ముఖ్య లక్షణాలు ఉన్నందువల్ల కూడ అది వివాద కవితే.

*

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు!

ఎన్ వేణుగోపాల్

 

venu1చాల ఇష్టమైనవాళ్లు, కౌగిలిలోకి తీసుకొని ఆ స్పర్శను అనుభవించాలని అనిపించేవాళ్లు మూడడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య మాత్రమే అయిన సన్నిహిత, సున్నిత, ఆంతరంగిక సంభాషణ సాగించాలని అనిపించేవాళ్లు ఒక గజం అవతల నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? కాని మీకూ వాళ్లకూ మధ్య అడ్డుగోడ. వాళ్లు కనబడుతూనే వినబడుతూనే ఉంటారు. మీరు చెయ్యి చాపలేరు. అవతలివాళ్లు చెయ్యి అందించలేరు. వాళ్లను మీరు దగ్గరికి తీసుకోలేరు. మీ కంటి తడిని వాళ్ల మునివేలుతో తుడవలేరు. మీకూ వాళ్లకూ మధ్య రెండు ఇనుప జాలీల తెర, ఆ రెండు జాలీల మధ్య ఇటు మూడు అంగుళాలు అటు మూడు అంగుళాలు వదిలి ఇనుప ఊచలు. అప్పుడు మీ హృదయం ఎట్లా రవరవలాడుతుంది? దేహం ఎట్లా స్పర్శ కోసం తపిస్తుంది? అరచెయ్యి అవతలి అరచేతి వేడిని అనుభవించాలని ఎంత కొట్టుకులాడుతుంది? గుండెలోని మాటను చెప్పనూలేక, చెప్పకుండానూ ఉండలేక గొంతు తానే గుండెను ఎలా పొదివి పట్టుకుంటుంది? మనశ్శరీరాలు వాగర్థాల లాగ కలిసిపోయి ఏ అనంతవేదనను అనుభవిస్తాయి? సామీప్యమే సుదూరమైన ఆ కఠినమైన, భయానకమైన, దుఃఖభాజనమైన ఎరుక ఎలా ఉంటుంది?

పది సంవత్సరాల కింద అటువంటి అనుభవం ఎన్నోసార్లు కలిగింది.

నిజామాబాదులో రఘునాథాలయం అనే బోర్డు ఉన్న ఎత్తైన పెద్ద కోట సింహద్వారంలోంచి లోపలికి వెళ్లి, ఒక మలుపు తిరిగితే గుట్ట మీదికి ఓ వంద మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కితే ఒక పక్కన పాత కాలపు గడీ బంకుల లాంటి వరండా, మరొక పక్కన కొండ అంచు పిట్టగోడ. ఆ వరండాను కూడ గదిగా మార్చి అక్కడ కాపలా జవాన్లు ఉంటారు గనుక అక్కడ కూచోవడానికీ నిలబడడానికీ వీల్లేదు. ఆ వరండాకూ ఇటు లోయ పిట్టగోడకూ మధ్య సరిగ్గా ముగ్గురు మనుషులు నిలబడగలిగినంత స్థలంలో అన్నిటికన్న పై మెట్టు. దాని అవతల ‘ప్రధాన జైలు’ అని రాసి ఉన్న దిట్టమైన తలుపు. ఆ తలుపు పైభాగంలో ఇనుప జాలీ, దాని వెనుక ఇనుప ఊచలు. ఆ వెనుక మరొక ఇనుప జాలీ. ఆ తర్వాత కటకటాల తలుపు. అక్కడినుంచి ఆరడుగుల నడవా. దానికి ఒకపక్కన జైలు అధికారుల గదులు. ఆ నడవా చివర కిందికి దిగడానికి నాలుగైదు మెట్లు. మెట్ల చివర మళ్లీ ఒక చిన్న చెక్క గేటు. అది దాటి లోపలికి వెళ్లి రెండు మలుపులు తిరిగి ఇరవై ముప్పై గజాలు నడిస్తే మళ్లీ గేటు. అది దాటితే నాలుగు వైపులా ఖైదీల బారక్ లు, మధ్యలో కాపలా జవాన్ల గది, దాని పక్కన నీళ్ల ట్యాంక్. అక్కడున్న బారక్ లలో ఒకదాంట్లో దాదాపు ఇరవై రోజులు నిర్బంధంలో గడిపి పది సంవత్సరాలు గడిచింది.

 

మహారాష్ట్ర ఔరంగాబాదులో జరిగిన అరెస్టు, మానసిక హింసతో, ప్రశ్నల వేధింపులతో మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధం, అబద్ధపు ఆరోపణలతో నిజామాబాదులో కేసు, ఇరవై రోజుల పాటు నిజామాబాదు జైలు జీవితం, ఐదు సంవత్సరాల పాటు సాగిన విచారణ, ఆ విచారణలో పోలీసుల అబద్ధాలు ఒకటొకటిగా తుత్తునియలు కావడం, చివరికి కేసు కొట్టివేత, నిర్దోషిగా విడుదల ఎన్నో స్థాయిలలో నామీద ప్రభావం వేశాయి. అంతకు ముందు రెండు మూడు సార్లు పోలీసు నిర్బంధంలోకీ, జైలులోకీ కూడ వెళ్లాను. అంతకు ముప్పై సంవత్సరాల ముందు నుంచీ కుటుంబ సభ్యుల, మిత్రుల అరెస్టుల సందర్భంగా వారిని కలవడానికి జైలుకు వెళ్తూ ఉన్నాను. కాని ఈసారి అనుభవం పూర్తిగా కొత్తది. మన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల పనితీరు గురించి ఆ నిర్బంధం నాకు అనుభవైకవేద్యమైన పాఠాలు నేర్పింది. స్టేట్ వర్సస్ గంటి ప్రసాదం అండ్ అదర్స్ అనే ఆ కేసులో నా సహనిందితుడు, గురువు, మిత్రుడు గంటి ప్రసాదం హత్యకు గురయి రెండు సంవత్సరాలయింది. ఆ కేసు నాటికి విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉండిన నేను ఇవాళ ఆ స్థానంలో లేను గాని, ఏ విశ్వాసాలతో ఆ నిర్బంధాన్ని అనుభవించానో ఆ విశ్వాసాలు ఇవాళ మరింత దృఢంగా ఉన్నాయి. పది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, ఆ భయోద్విగ్న అనుభవాలను, అవి ఇచ్చిన అవగాహనలను పంచుకోవాలనిపిస్తున్నది.

“ఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనా విధానాలు ఏ రకంగా ఉన్నాయో నగ్నంగా, బహిరంగంగా చూపిన వ్యవహారాలు. అందువల్ల ఆ అంశాలను తెలుసుకునే హక్కు, తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన పన్నులలోంచి జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ మనకోసం ఏం చేస్తున్నాయో, మనలో కొందరిని నిర్బంధించడానికి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నాయో, ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నాయో మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉంది” అని నా అరెస్టు సమయానికి ప్రజాతంత్ర వారపత్రికలో నేను రాస్తుండిన ‘ఆఖరిపేజీ’ కాలంలో విడుదలై రాగానే రాశాను. (ప్రజాతంత్ర 2005 జూన్ 19-25)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య 2004 అక్టోబర్ లో హైదరాబాదులో తొలివిడత చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు చెందిన నక్సలైట్ల ప్రతినిధులతో ఆ చర్చలు జరిగాయి. ఒకటి అంతకు ముందు వరకూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (పీపుల్స్ వార్) గా ఉండి, సరిగ్గా చర్చల సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గా మారినది. మరొకటి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) (జనశక్తి). రెండో విడత చర్చలకు నవంబర్ లో ఆహ్వానిస్తామనే ప్రభుత్వ హామీతో, రెండువైపులా కాల్పుల విరమణ ఒప్పందంతో నక్సలైట్లు వెనక్కి వెళ్లారు. కాని ఆ రెండో విడత చర్చలు జరగనే లేదు. మళ్లీ ఆహ్వానిస్తామన్న ప్రభుత్వం ఆ ప్రస్తావనే మానేసి మళ్లీ నిర్బంధం ప్రారంభించి, జనవరి 2005 తర్వాత ఎన్ కౌంటర్లు, దాడులు, కూంబింగులు, అరెస్టులు మొదలుపెట్టింది.

ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది గనుక తామూ కట్టుబడి ఉండబోవడం లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. నక్సలైట్ల వైపునుంచి ప్రతిదాడులు, ఇన్ఫార్మర్ల హత్యలు, పోలీసుస్టేషన్లపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఎలాఉన్నదో తెలుసుకోవాలని మావోయిస్టుపార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నదనీ, విస్తృత ప్రజా సంబంధాలతో ప్రజాభిప్రాయం ఏమిటో చెప్పగల ప్రముఖులనూ, రచయితలనూ, పాత్రికేయులనూ కలవదలచుకున్నామనీ. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ మీడియా ప్రతినిధిగా ఉన్న బలరాం (గంటి ప్రసాదం) కబురు పంపారు. ఈ విషయం మాట్లాడడానికి నేను తనను కలవడం వీలవుతుందా అని అడిగారు. ప్రభుత్వ నిర్బంధం పెరిగిన స్థితిలో తన భద్రత దృష్ట్యా ఈ కలయిక రాష్ట్రం బైట జరిగితే మంచిదని, అందువల్ల రెండు రోజుల కోసం ఔరంగాబాదు రమ్మని అడిగారు. నాతోపాటు విరసం ఉపాధ్యక్షులు, అరుణతార మాజీ సంపాదకులు, కావలి జవహర్ భారతిలో తెలుగు అధ్యాపకులు వి. చెంచయ్య, అరుణతార సంపాదకులు పినాకపాణి, అరుణతార మేనేజర్ రవికుమార్ కూడ వస్తారని రాశారు.

venu2

నేను అప్పటికి ఇరవై సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఎట్లా ఉన్నానో, అట్లాగే విరసం సభ్యుడిగా కూడ ఉన్నాను.  పాత్రికేయుడిగానూ, విరసం సభ్యుడిగానూ ఆయనను కలవడానికి నాకేమీ అభ్యంతరం కనిపించలేదు. నా వ్యక్తిత్వంలోని ఈ రెండు పార్శ్వాలమధ్య పెద్ద విభజన రేఖ ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు. అట్లని పాత్రికేయ వృత్తి విధి నిర్వహణలోకి రాజకీయ విశ్వాసాలను తీసుకురాలేదు. మాట్లాడతానంటున్నది ఒక రాజకీయపార్టీ మీడియా ప్రతినిధి. మాట్లాడదలచుకున్నది పాత్రికేయుడిగా, విరసం సభ్యుడిగా ఉన్న నాతో. అటువంటప్పుడు అభ్యంతరం ఎందుకుండాలి? అంతకు ఆరు నెలల ముందే ఆ పార్టీ రాష్ట్రకమిటీ కార్యదర్శితో, ఇతర నాయకులతో స్వయంగా రాష్ట్ర హోంమంత్రి, మరి ముగ్గురు మంత్రులు వారంరోజులపాటు ప్రభుత్వ భవనంలోనే మాట్లాడారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాదులో ప్రభుత్వ మంజీర అతిథి గృహంలో ఉన్నప్పుడు వేలాది మంది కలిసి మాట్లాడారు. మరి నాకెందుకు అభ్యంతరం ఉండాలి?

నిజానికి ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజుల్లోనే ఆ పార్టీ అగ్రనాయకులెందరినో డజన్లకొద్దీ పాత్రికేయులు రహస్యంగా కలిసి పత్రికలలో, ప్రచార సాధనాలలో ఎన్నో వార్తాకథనాలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజులలోనే ఎస్ ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొ. హరగోపాల్ తదితరులు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి, మాట్లాడి, తిరిగి వచ్చి తాము మాట్లాడిన విషయాలు అప్పటి ముఖ్యమంత్రికి తెలియజేశారు. నిషేధం ఉన్నరోజులలోనే తమ సంభాషణలను పుస్తకరూపంలో వెలువరించారు. మరి ఆ పార్టీ మీద నిషేధం కూడ లేనప్పుడు, నాయకులలో ఒకరిని కలవడానికి నాకెందుకు అభ్యంతరం ఉండాలి? ఇరవై సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో, పది సంవత్సరాలకు పైబడిన విలేకరి వృత్తిలో, ఇరవై రెండు సంవత్సరాలుగా విరసం సభ్యుడిగా కొన్ని వేల మందిని కలిసి, చర్చించి, పత్రికలలో రాసిఉన్న నేను ఇవాళ ఈయనను కలవడానికి ఎందుకు సంకోచించాలి?

అందుకే 2005 మే 28 సాయంత్రం కాచిగూడ – మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో ఔరంగాబాదు బయల్దేరాను. మర్నాడు ఉదయమే మహారాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గెస్ట్ హౌజ్ లో నా పేరు మీదనే గది తీసుకున్నాను. కాసేపటికి ప్రసాదం, ఇతర మిత్రులు వచ్చారు. ఆ గదిలోనే ఆ రోజంతా, ఆ మర్నాడూ కూచుని మాట్లాడుకున్నాం. మే 30 సాయంత్రం ఏడు – ఏడున్నర మధ్య తలుపు తోసుకుని దాదాపు ఇరవై మంది ఆయుధధారులైన మఫ్టీ పోలీసులు వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు. ఒకరోజంతా అక్కడ ఉంచి ప్రశ్నలతో వేధించారు. చంపుతామని బెదిరించారు. మర్నాడు రాత్రి వాహనాలు ఎక్కించి, ఏడెనిమిది గంటలు ప్రయాణం చేయించారు. మరొక చోట మళ్లీ రెండు రోజులు అట్లాగే కళ్లకు గంతలతో, చేతులు వెనక్కి విరిచికట్టి ఒక గదిలో నిర్బంధించారు. అప్పటిదాకా మాపక్కన ఉన్నవాళ్లు మమ్మల్ని పట్టుకున్న మూడో రోజు మధ్యాహ్నం, “ఇక మామూలు పోలీసులు వచ్చి మీ బాధ్యత తీసుకుంటారు” అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక అరగంటకు వచ్చిన పోలీసులు మమ్మల్ని అలాగే కళ్లకు గంతలతో, విరిచికట్టిన చేతులతో ఒక వ్యాన్ ఎక్కించి అరగంట ప్రయాణం చేయించారు. అక్కడ మా కట్లు విప్పదీస్తే అది నిజామాబాదు డిఐజి కార్యాలయం అని మాకు తెలిసింది.

అక్కడ పత్రికా సమావేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టినదాకా, అంటే మే 30 సాయంత్రం ఏడు నుంచి జూన్ 2 సాయంత్రం నాలుగు దాకా, దాదాపు 70 గంటలు మేం కళ్లకు గంతలతో, కట్టేసిన చేతులతో, ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి వీలులేకుండా, మధ్యలో ప్రశ్నల వేధింపులతో, చంపుతామనే బెదిరింపులతో నిర్బంధంలో, మా అదృశ్యం గురించి మా కుటుంబాలు ఎలా ఆందోళన పడుతున్నాయో వేదనతో ఉన్నాం. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల కంటె ఎక్కువసేపు కోర్టులో హాజరుపరచకుండా ఉంచుకోగూడదని, హింసించగూడదని, నిందితుల పట్లనైనా వ్యక్తిగత గౌరవాన్ని చూపాలని, చట్టబద్ధమైన విచారణలో నిస్సందేహంగా రుజువయ్యేవరకూ నిందితులను కూడ నిర్దోషులుగానే పరిగణించాలని చెప్పే చట్టాలు, ప్రజాజీవనంలో ప్రముఖులుగా, రచయితలుగా ఉన్న మాపట్లనే ఇంతగా ఉల్లంఘనకు గురైతే ఇక దేశంలో అనామకులకు, పేదలకు న్యాయం అందుతుందంటే ఎవరు నమ్ముతారు? చట్టం గురించి చదువుకుని, రాసే, మాట్లాడే, వ్యక్తీకరించుకోగలిగిన మమ్మల్నే పోలీసు వ్యవస్థ ఇలా వేధించగలిగితే, ఇక ఈ దేశంలోని కోట్లాది మంది నిరుపేద, నిరక్షరాస్య, అమాయక ప్రజానీకం మీద ఎంతటి దుర్మార్గం, దాష్టీకం అమలు కావడానికి అవకాశం ఉంది!

ఔరంగాబాదుకు మా ప్రయాణాలు, ఔరంగాబాదులో మా బస అన్నీ సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో ఉన్నాయి గనుక పోలీసులకు వాటిని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. అందువల్ల మేం ఔరంగాబాదులో సమావేశమయ్యామనే నిజం చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహారాష్ట్రలోని పట్టణానికి వెళ్లి అక్కడినుంచి ఐదుగురు వ్యక్తుల్ని ఎత్తుకురావడానికి చట్టబద్ధంగా వీల్లేదు గనుక నిజామాబాదులో అరెస్టు చేశామని అబద్ధం చెప్పారు. మేం ఔరంగాబాదు సమావేశం నుంచి నల్లమలకు తిరిగివెళ్తూ, నిజామాబాదు పరిసరాల్లో దిగి తచ్చాడుతుండగా జూన్ 2 మధ్యాహ్నం పోలీసుల చేతికి చిక్కామని కట్టుకథ అల్లారు. పోలీసు రచయితల భౌగోళిక పరిజ్ఞానం అంత ఘనంగా ఉంది! ఎవరైనా ఔరంగాబాదునుంచి నల్లమలకు వెళ్లదలచుకుంటే ఏమార్గంలో వెళతారో పటం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. అందుకు నిజామాబాదు వెళ్లనక్కరలేదు. అంతేకాదు, నా హైదరాబాద్ తిరుగుప్రయాణపు టికెట్ మన్మాడ్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో మే 31 సాయంత్రానికి బుక్ అయి ఉంది. చెంచయ్య, పినాకపాణి, రవికుమార్ లకు తిరుగు ప్రయాణపు టికెట్లు హమ్ సఫర్ ట్రావెల్స్ బస్సులో మే 31 సాయంత్రానికి హైదరాబాదుకు బుక్ అయిఉన్నాయి. పోలీసులు మా జేబుల్లోంచి లాగేసుకున్న ఆ టికెట్లను చించివేసి ఉండవచ్చు గాని బుక్ చేసుకున్న ఆసాములు రాలేదని రైల్వేవారి దగ్గర, బస్సు కంపెనీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండే ఉంటాయి.

ఏదయినా నేరం జరిగినప్పుడు, లేదా నేరం జరగబోతున్నదని తెలిసినప్పుడు ఆ నేరస్తులను, అనుమానితులను నిర్బంధంలోకి తీసుకుని, దర్యాప్తు జరిపి, న్యాయవిచారణ కోసం న్యాయస్థానం ముందుపెట్టి, తమ ఆధారాలు చూపి, శిక్ష విధించడం ఎందుకు అవసరమో వాదనలు వినిపించవలసిన బాధ్యత పోలీసు శాఖది. అందులోనూ శాంతిభద్రతల విభాగానిది. కాని మహత్తర ప్రజాపోరాటాల చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంప్రదాయం ఎప్పుడో కనుమరుగయి పోయింది. ప్రజలను నిష్కారణంగా అనుమానించడం, ప్రజాపోరాటాలను అణచివేయడం, పోరాట నాయకులను దొంగచాటుగా పట్టుకుని చంపడం, ప్రజల పక్షం తీసుకునే బుద్ధిజీవులను నిరంతర నిఘాతో వేధించడం, అందుకోసం తోచిన అబద్ధమల్లా చెప్పడం మాత్రమే పోలీసుశాఖకు తెలిసిన పనులయిపోయాయి.

ఈ క్రమంలో పోలీసులు మామూలు నేరాలను అరికట్టడం, ఆ నేరస్తులను పట్టుకోవడం, సరయిన దర్యాప్తు జరపడం, పటిష్టంగా నేరారోపణచేసి న్యాయవిచారణకు సహకరించడం వంటి అసలు పనులు మరచిపోయారు. ప్రజలను అణచివేయడం అనే ఒక్క పని చేస్తే చాలునని, అది చేస్తే లెక్క చూపనక్కరలేని నిధులూ, పదోన్నతులూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామని పాలకులు పోలీసులకు నేర్పిపెట్టారు. ఎంతమందిని చంపితే అంత తొందరగా పదోన్నతులు కల్పించే దుర్మార్గమైన హంతక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాలా ప్రకటించి అమలు చేసింది. ఈ ప్రభుత్వ ప్రోత్సాహంవల్ల పోలీసులు ప్రజాపోరాటాలను అణచగలిగారో లేదో తెలియదు గాని, వాళ్లకు వృత్తిధర్మంగా ఉండవలసిన తెలివీ, నైపుణ్యమూ కూడ కోల్పోయారు. ఎవరి పని ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని అరాచకం రాజ్యం ఏలడం మొదలయింది.

ఆ అరాచకంలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖలోకెల్లా క్రూరమైన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ ఐ బి) అనే వ్యవస్థ తయారయింది. ఈ ఎస్ ఐ బి ఎవరికి జవాబుదారీయో ఎవరికీ తెలియదు. విప్లవకారులను దొంగతనంగా పట్టుకుని కాల్చిచంపడమే వాళ్ల పని. అందుకొరకు దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో వాళ్ల స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి ఆ నగరాలలో తమకు కావలసిన వాళ్లకోసం వేటాడుతూ ఉండడం మినహా వాళ్లకు మరొక పని లేదు. ఔరంగాబాద్ లో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కూచుని మాట్లాడుకుంటున్న మామీద దాడి చేసినదీ, అక్కడ తాము నిర్వహిస్తున్న రహస్య స్థావరంలో ఒకరోజంతా పెట్టుకున్నదీ వాళ్లే. రెండున్నర రోజులపాటు మాతోపాటు ఉన్నది వాళ్లే. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని మామూలు పోలీసులకు అప్పగించి వెళ్లిపోయారు. వాళ్లను మేం చూడకుండా, గుర్తు పట్టకుండా ఉండడం కోసమే మా కళ్లకు గంతలు.

ఇక మమ్మల్ని నిజామాబాదులో అప్పుడే పట్టుకున్నట్టు శాంతిభద్రతల పోలీసులు చెప్పిన అబద్ధం మీద ఆధారపడి మా మీద కేసు నిర్మాణమయింది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్ లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి నల్లమల వెళుతుండగా నిజామాబాదులో పట్టుకున్నామని అల్లిన కట్టుకథ మామీద నేరారోపణ. ఆ ఎఫ్ ఐ ఆర్ తో మమ్మల్ని జుడిషియల్ కస్టడీకి పంపించడానికి నిజామాబాదు మెజస్ట్రీటు ముందర హాజరు పరచవలసి ఉండింది. నిజామాబాదులో హాజరు పరుస్తామని చివరిదాకా చెపుతూ వచ్చారు. కాని అంతకు ముందురోజు సాయంత్రం నుంచే మా అరెస్టు వార్త టివిల్లో వచ్చినందువల్ల నిజామాబాదు కోర్టుకు చాలమంది రావడంతో, చివరి నిమిషంలో ఏదో సాంకేతిక కారణం చూపి బోధన్ మెజస్ట్రీట్ ముందర హాజరుపరిచారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) (నేరస్వభావంగల కుట్ర), సెక్షన్ 121 (ఎ) (భారతప్రభుత్వంపై యుద్ధం చేయడానికి, లేదా యుద్ధాన్ని ప్రోత్సహించడానికి కుట్ర), సెక్షన్ 122 (భారత ప్రభుత్వంపై యుద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆయుధాలు, తదితరాల సేకరణ) అనే అభియోగాలతో మా మీద కేసు నమోదు చేశారు. మా అక్రమ నిర్బంధం గురించీ, శారీరక, మానసిక చిత్ర హింసల గురించీ, పోలీసులు చెపుతున్న అబద్ధాల గురించీ బోధన్ మెజస్ట్రీట్ ముందు నేను పావుగంట పాటు వినిపించిన వాదన అరణ్యరోదన అయింది. చిన్నకోర్టులన్నిట్లోనూ న్యాయమూర్తులకు తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదనే గుర్తింపే ఉండదు. హాలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పక్కన నిలబడి ఉన్న సర్కిల్ ఇనస్పెక్టర్ వైపో, డీ ఎస్పీ వైపో చూస్తూ వాళ్ల కనుసన్నలను బట్టి ప్రవర్తిస్తుంటారు.

venu4

మా అరెస్టుల గురించి మొత్తంగానూ, నా అరెస్టు గురించి ప్రత్యేకంగానూ చాల నిరసన వ్యక్తమయింది. అప్పటికి పదమూడు సంవత్సరాలుగా రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవలసిన డయాబెటిక్ గా ఉన్న నా ఆరోగ్య పరిస్థితివల్ల మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెందారు. అంతర్జాతీయ సంస్థల నుంచి స్థానిక సంస్థల దాకా మా అరెస్టులను ఖండిస్తూ, మాకు సంఘీభావం తెలుపుతూ ప్రకటనలు ఇచ్చాయి. సెక్రటేరియట్ లో జరిగిన పత్రికా సమావేశంలో నా ప్రస్తావన వస్తే స్వయంగా ముఖ్యమంత్రి “ఆయనకు బెయిల్ పిటిషన్ దాఖలయితే ప్రభుత్వం వైపు నుంచి దాన్ని వ్యతిరేకించబోము. ఆయనను మళ్లీ పోలీసు విచారణకు పిలిపించబోము” అన్నారు. కాని నిజామాబాదు కోర్టులో నా బెయిల్ పిటిషన్ దాఖలు కావడానికి ముందే, విచారణకోసం తమకు అప్పగించాలని పోలీసులు కోరి ఉన్నందువల్ల నాకు బెయిల్ రాలేదు.

వెంటనే ముఖ్యమంత్రిని హైదరాబాదులోనూ, కర్నూలులోనూ పాత్రికేయ మిత్రులు ప్రశ్నించారు. “ఏదో సమాచార లోపం వల్ల అలా జరిగింది” అన్నారాయన! హైటెక్ ప్రభుత్వానికి అంత సమాచార లోపం! మళ్లీ ఐదు రోజుల తర్వాత రెండోసారి బెయిల్ దరఖాస్తు దాఖలయింది. కాని నిజామాబాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించగూడదనే ఆదేశమేమీ లేదు. ఆయన అన్ని బెయిల్ దరఖాస్తులనూ వ్యతిరేకించినట్టే, ఈ దరఖాస్తును కూడ వ్యతిరేకించారు. అయినా మా న్యాయవాది వాదనలోని బలంవల్ల నేనూ, మిత్రులందరమూ బెయిల్ మీద విడుదలయ్యాం. అలా నిజామాబాదు జైలులో దాదాపు ఇరవై రోజులు ఉండే అవకాశం వచ్చింది.

నిజామాబాదు జైలు తెలంగాణ జనజీవితంలో, సాహిత్యంలో ముఖ్యమైనది. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య వంటి మహామహులు నిజాం వ్యతిరేకపోరాటంలో ఆ జైలులో బందీలుగా ఉన్నారు. ‘నాతెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి పద్యాలు రాసినది ఆ జైలులోనే. పోలీసులు చెరిపినకొద్దీ ఆ పద్యాలను మళ్లీ మళ్లీ గోడలమీద బొగ్గుతో ఆళ్వారుస్వామి రాసినదీ ఆ జైలు లోనే. ఆ జైలులోకి వెళ్లడం ఒక అపురూపమైన అనుభవం. అక్కడి గోడల మీద ఆరు దశాబ్దాల కింది దాశరథి, ఆళ్వారుస్వామి అక్షరాలు ఉన్నాయా అని వెర్రిగా వెతికాను. జైలు నుంచి బైటికి రాగానే ‘ఖిలా జైలు – దాశరథి నుంచి ఇవాళ్టి దాకా’ అని నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయింది.

జైలు జీవితం చిత్రమైనది. ఎవరు తయారు చేశారో, ఎందుకు తయారు చేశారో ఎవరికీ తెలియకుండానే ఖైదీలను శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేసే దారుణమైన నిబంధనలు అమలవుతుంటాయి. అన్నిటిలోకీ విచిత్రమైనది జీవితాన్ని కురచబార్చడం. ఉదయం ఆరింటికి బారక్ ల తాళాలు తెరుస్తారు. సాయంత్రం ఆరింటికి తాళాలు వేస్తారు. అంటే పన్నెండు గంటలు మాత్రమే బారక్ బైటి జీవితంతో సంబంధం ఉంటుంది. ఆ పన్నెండు గంటలలోకే మొత్తం ఇరవై నాలుగు గంటల జీవితాన్ని కుదించుకోవాలి. రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవలసిన రోగగ్రస్తుడిగా నాకు ఈ నిబంధన ప్రాణాంతకమయింది. ఖైదీలను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి రక్షించడానికి ఖైదీల దగ్గర అందుకు ఉపయోగపడే పరికరాలేవీ ఉండనివ్వగూడదని ఒక నిబంధన. అందువల్ల బారక్ లో నా దగ్గర ఇంజక్షన్ ఉంచుకోవడానికి వీలులేదు. అది జైలర్ గదిలో రక్షణలో ఉండేది. నా బారక్ తాళం తెరిచిన తర్వాత అరగంటకో, గంటకో ఏడు గంటల సమయంలో ఉదయపు ఫలహారం తినే ముందు జైలర్ గదికి వెళ్లి ఇంజక్షన్ తీసుకుని రావాలి. మధ్యాహ్న భోజనం పదకొండు, పన్నెండు మధ్య మళ్లీ జైలర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ తీసుకోవాలి. రాత్రి భోజనం బారక్ తాళాలు వేయక ముందే అంటే ఐదు, ఐదున్నర ప్రాంతాలలో పెడతారు గనుక మూడో ఇంజక్షన్ అప్పుడు తీసుకోవాలి. పోనీ ఆ అన్నం తీసుకుని పక్కన పెట్టుకుని కొన్ని గంటల తర్వాత తిందామనుకుంటే, ఆ మొద్దు బియ్యం అన్నం అరగంట ఆలస్యమైనా తినడం అసాధ్యం. అంటే కనీసం ఆరు-ఎనిమిది గంటల వ్యవధి ఉండవలసిన నా ఇన్సులిన్ ఇంజక్షన్లు నాలుగు-ఐదు గంటల వ్యవధికి మారిపోయాయి. మరొకపక్క సాయంత్రం ఇంజక్షన్ కూ ఉదయం ఇంజక్షన్ కూ మధ్య పన్నెండు గంటల వ్యవధి వచ్చింది. ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామమో చెప్పనక్కరలేదు.

venu5

అలాగే జైలు జీవితం గొప్ప అనుభవం, మహత్తర పాఠశాల. జాలీ ములాఖాత్ సంభాషణలు మానవ సంబంధాల మీద ఇనుపతెరలు కప్పుతాయి. అతి చిన్న నేరాలు చేసినందువల్లనో, అసలు నేరాలే చేయకుండానో నెలల తరబడీ, సంవత్సరాల తరబడీ జైలులో గడిపే అమాయకుల విభిన్న జీవన దృశ్యాలు కంట తడి పెట్టిస్తాయి. జైలు గ్రంథాలయంలో దొరికే పుస్తకాలూ, దినపత్రికలూ తక్కువ గనుక దొరికిన ప్రతి అక్షరాన్నీ ఆబగా చదవడం అలవాటవుతుంది. సహఖైదీలతో ఎడతెరిపిలేని చర్చలు వాటికవే వివరంగా రాయవలసిన గ్రంథాలు అవుతాయి.

బెయిల్ మీద విడుదలైన తర్వాత ఐదు సంవత్సరాలపాటు ప్రతి నెలా రెండుసార్లు మేం నిజామాబాద్ కోర్టుకు హాజరు కావలసివచ్చింది. వాదనల సమయంలో పది రోజులు నిజామాబాదులోనే ఉండవలసి వచ్చింది. ఈ వాయిదాల కోసం ప్రతిసారీ కావలి, ప్రొద్దటూరు, కర్నూలు, హైదరాబాదు వంటి సుదూర ప్రాంతాలనుంచి గంటలకొద్దీ ప్రయాణాలు చేసి, కోర్టులో రోజంతా పడిగాపులు పడి, న్యాయస్థానం చుట్టూ తిరగడంలో ఐదు సంవత్సరాల విలువైన కాలం వ్యర్థమయింది. అలా మా సమయమూ, ఆర్థిక వనరులూ, ఆరోగ్యాలూ దెబ్బతిన్న తర్వాత మామీద నేరారోపణలను పోలీసు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. అడిషనల్ సెషన్స్ జడ్జి సి వెంకటేష్ 2010 ఆగస్ట్ 2 న కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. మమ్మల్ని నిరపరాధులుగా వదిలేశారు. మరి మేం నిరపరాధులమైతే, మమ్మల్ని అపరాధులుగా నిరూపించడానికి విఫల ప్రయత్నం చేసినవాళ్ల అపరాధం మాటేమిటి?

పోలీసులు కేసు నడిపినతీరు తప్పులతడక అని వర్ణిస్తే అది చాల చిన్నమాట అవుతుంది. మా అరెస్టు చూపిన పత్రికాసమావేశంలో భయంకరమైన నేరం జరగబోతుండగా పట్టుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు ఏ ఒక్క ఆరోపణనూ రుజువు చేయలేకపోయారు. అసలు ఎవరిమీదనైనా సెక్షన్ 120 (బి) కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయదలచుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ అనుమతి, మెజస్ట్రీట్ అనుమతి తీసుకోవాలని చట్టం చెపుతుంది. కాని ఆ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు, కేసు నడిపారు. పోలీసు రాజ్యం నడుస్తున్నదనడానికి, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ చట్టవ్యతిరేక ప్రవర్తనకు అది తొలి నిదర్శనం. అసలు నేరారోపణలు అబద్ధం కనుకనే తర్వాత విచారణలో పోలీసు సాక్షులలో ఒక్కరు కూడ ఆ అబద్ధాన్ని రుజువు చేసే కథనం చెప్పలేకపోయారు. వాస్తవమయితే ఒకటే కథనం ఉంటుంది కాని అబద్ధం ఆడినప్పుడల్లా మారుతుంది. మమ్మల్ని నిజామాబాదు పొలిమేరల్లో అరెస్టుచేయడానికి ఒకే వాహనంలో వెళ్లామని చెప్పిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వాహనం తూర్పుకు వెళ్లిందని ఒకరు చెపితే పడమటికి వెళ్లిందని మరొకరు చెప్పారు. మమ్మల్ని నిజామాబాదులో అరెస్టు చేసేటప్పుడు చూశామని పంచనామా మీద సంతకం చేసిన ఇద్దరు సాక్షులు ఆటోడ్రైవర్లు. తమ ఆటోలను పోలీసులు జప్తు చేసుకుని పోలీసు స్టేషన్ లో పెట్టుకుంటే అడగడానికి వెళ్లినప్పుడు తెల్లకాగితాల మీద పోలీసులు తమ సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఆ కాగితాలేమిటో తమకు తెలియదనీ, మమ్మల్ని తామెప్పుడూ చూడలేదనీ, మా అరెస్టుకూ పంచనామాకూ తాము సాక్షులం కాదనీ చెప్పారు.

మరొక పోలీసు సాక్షి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు మాదగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని చిలకపలుకులు అప్పగించాడు. ‘విప్లవ సాహిత్యం అంటే ఏమిటి’ అని మా న్యాయవాది ప్రశ్నవేశారు. ‘విప్లవ సాహిత్యం అంటే బానిస సంకెళ్లు తెంచుకొండి అని ప్రజలకు చెప్పేది’ అని ఆ కానిస్టేబుల్ అమాయకంగా నిజం చెప్పాడు. ‘మరి అది మంచిపనే కదా’ అని న్యాయమూర్తి అడగవలసి వచ్చింది. ‘మా డిపార్టుమెంటుకు మంచిది కాదు’ అన్నాడా పోలీసు సాక్షి.

ఇక తాను చేయని అరెస్టులను చేశానని చెప్పుకోవలసి వచ్చిన దర్యాప్తు అధికారి మేం కుట్ర చేశామని చూపడానికి చాల ప్రయత్నించాడు.  మాదగ్గర తాను జప్తు చేశానని ఆయన చెప్పిన ఒక్కొక్క వస్తువునూ చూపుతూ ‘దీనిలో కుట్ర ఉందా’, ‘దీనిలో కుట్ర ఉందా’ అని మా న్యాయవాది ప్రశ్నించారు. ఏ ఒక్క వస్తువులోనూ కుట్రకు ఆధారం లేదని ఆ దర్యాప్తు అధికారి తన నోటనే చెప్పకతప్పలేదు. మరి కుట్ర చేశారనడానికి ఆధారం ఏమిటి అనే చివరి ప్రశ్నకు ‘ఆధారమేమీ లేదు’ అని దర్యాప్తు అధికారి ఒప్పుకున్నాడు.

దర్యాప్తూ లేదు, ఆ అధికారికి సంబంధమూ లేదు. కుట్రా జరగలేదు, అరెస్టు చేసినదీ ఆయన కాదు. సాక్షులుగా ప్రవేశపెట్టిన వాళ్లు సాక్షులూ కాదు. ఆధారాలుగా ప్రదర్శించినవి ఆధారాలూ కావు. అరెస్టు చేయడానికి వెళ్లామన్న పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు కాదు. అలా ఎన్నెన్నో ‘కాదు’ల మీదా, ‘లేదు’ల మీదా ఆధారపడి పోలీసులు మా నేరం రుజువు చేయదలిచారు.

మమ్మల్ని మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో పాటు అరెస్టు చేశారు గాని అప్పటికి ఆ పార్టీ మీద నిషేధం లేదు. నిషేధం ఉన్నదో లేదో తెలియదని ఛార్జిషీటు తయారు చేసిన పోలీసు అధికారి అన్నాడు. అధికారికంగా నిషేధం లేకపోవచ్చు గాని నిషేధం ఉన్నట్టేనని తమకు ఉత్తర్వులు ఉన్నాయన్నాడు. ఆ ఉత్తర్వు చూపమంటే అది లేదన్నాడు. తాము చేస్తున్న పని అధికారికంగా సరైనదా కాదా, చట్టానికి లోబడినదా కాదా చెప్పలేని స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారన్నమాట. అలా విచారణలో మా న్యాయవాది గొర్రెపాటి మాధవరావు చాల సమర్థంగా పోలీసుల అబద్ధాలనూ కట్టుకథలనూ అబద్ధపు సాక్ష్యాలనూ తుత్తునియలు చేశారు.

అయితే, ఇదంతా కేవలం పోలీసు అధికారుల, సాక్షుల సమర్థత, అసమర్థతలకు సంబంధించిన విషయం కాదు. స్వయంగా పాలకులే పోలీసుల శాఖకు ఈ అబద్ధపు సంస్కృతిని, హింసా సంస్కృతిని నేర్పిపెట్టారు. ‘ప్రజలు మాకు శత్రువులు. మీరు మా ఉద్యోగులు గనుక ప్రజలు మీకూ శత్రువులే. మీరు వాళ్లను అలా తప్ప మరొకరకంగా చూడడానికి వీల్లేదు. వాళ్లను ఏమిచేసినా, వేధించినా, చిత్రహింసలు పెట్టినా, చంపినా ఫరవాలేదు. హక్కుల చట్టాలు రాతకోసం మాత్రమే, పాటించనక్కరలేదు’ అని బ్రిటిష్ కాలంలో పాలకులు పోలీసుశాఖకు శిక్షణ ఇచ్చారు. (‘అన్నా తమ్ముడూ బంధువూ అని చూడకు, చంపడమే నీ ధర్మం’ అని సరిగ్గా అర్జునుడికి కృష్ణుడు బోధించిన గీత లాగ!) 1947 తర్వాత కూడ పోలీసు శాఖ పాటిస్తున్నది అవే చట్టాలను, అదే సంస్కృతిని, అదే శిక్షణను. అంతకుముందరి వలసపాలకుల సేవ నుంచి ప్రజాసేవ స్థానానికి మారడానికి తగిన శిక్షణ లేదు. ఇక 1967 తర్వాత, నక్సల్బరీ ప్రజా ప్రజ్వలనం తర్వాత ప్రజలను శత్రువులుగా చూసే సంస్కృతిని మరింత పెంచారు.

అందువల్లనే అబద్ధాలు చెప్పడం, చట్టవ్యతిరేక దమనకాండ సాగించడం, తప్పుడు కేసులు తయారుచేయడం, అవి తప్పుడువి గనుక వాటిని రుజువు చేయలేకపోవడం, కేసులు పెట్టి సంవత్సరాల తరబడి వేధిస్తే చాలుననుకోవడం పోలీసులకు అలవాటయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కుట్రకేసు, పార్వతీపురం కుట్రకేసు, సికిందరాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు, బెంగళూరు కుట్రకేసు, ఔరంగాబాద్ కుట్రకేసు వంటి సుప్రసిద్ధమైన కుట్రకేసులలో ఒక్కకేసులోకూడ ప్రాసిక్యూషన్ తాను చేసిన నేరారోపణలను రుజువు చేయలేకపోయింది. ఒక్కకేసులో కూడ న్యాయస్థానాలు శిక్షలు విధించలేదు. ఇతర కేసుల సంగతి సరేసరి.

“మావోయిస్టు పార్టీ నాయకులు ఇద్దరితో (గంటి ప్రసాదం, సురేందర్) కలిసి కుట్రపన్నామని, ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం మేం ఆయుధాలు వగైరా సేకరించామని, అది శిక్షార్హమైన నేరమని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కాని మేం కుట్ర చేశామని రుజువు చేసే ఒక్క సాక్ష్యాన్ని కూడ ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది. మేం ఆయుధాలు వగైరా సేకరించామని, ఈ ప్రభుత్వ చట్టాల ప్రకారమైనా నేరం చేశామనడానికి ఒక్క ఆధారం కూడ చూపలేకపోయింది. మొత్తం కేసు అంతా మేం ఔరంగాబాదులో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో కలిసి మాట్లాడుకున్నామనే ఆధారం తప్ప మరేమీ లేదు. అంటే మనుషులు కలిసి మాట్లాడుకోవడమే ఈ ప్రభుత్వానికి, పాలకులకు, పోలీసులకు తమను కూలదోసే కుట్రలా కనబడిందన్నమాట. ప్రభుత్వాలను కూలదోసే పని పాలకవర్గ ముఠాలు చేసుకుంటూనే ఉన్నాయి. మేం చేయదలచుకున్న పని ఈ వ్యవస్థను కూలదోసే శక్తులకు కలమూ గళమూ ఇవ్వడం. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీద ఆధారపడి ఉన్నది గనుక, ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తున్నది గనుక ఈ వ్యవస్థను కూలదోయడం అవసరమనీ, అనివార్యమనీ, సహజమనీ, న్యాయమనీ మేం భావిస్తున్నాం. అందులో దాపరికమేమీ లేదు. అందుకొరకు మేం కుట్రలు చేయం. ప్రజలకు నిజాలు చెపుతాం. పోరాట అవసరం చెపుతాం. వారు పోరాడుతున్నప్పుడు అండగా నిలబడతాం. వారి పోరాటాలను గానం చేస్తాం. ఆ పోరాటాల గురించి ఎవరితోనైనా మాట్లాడుతాం” అని మా కేసు కొట్టివేత తర్వాత విరసం పత్రికా ప్రకటనలో ప్రకటించింది.

కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత చివరిగా న్యాయమూర్తి నిందితులను ‘మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా’ అని అడుగుతారు. దానికి జవాబుగా నిందితులు చేసే ప్రకటనను క్రిమినల్ ప్రొసేజర్ కోడ్ సెక్షన్ 313 వాంగ్మూలం అంటారు. నిజామాబాదు కోర్టులో 2010 జూలై 12న నేను ఆ 313 ప్రకటన చేశాను. దానిలో భాగాలు:

“మొట్టమొదట ఇటువంటి కోర్టు ప్రకటన చదవడం అనే సంప్రదాయం భారతదేశపు న్యాయస్థానాలలో వంద సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని మీ దృష్టికి తేదలచాను. బాలగంగాధర తిలక్, అరవింద ఘోష్, వి డి సావర్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, భగత్ సింగ్, బటుకేశ్వర దత్, ఎం ఎన్ రాయ్ మొదలయిన భారత జాతీయోద్యమ నాయకులు, మీరట్ కుట్రకేసు వంటి ప్రఖ్యాత కేసుల నిందితులు కూడ ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. ఆశ్చర్యమూ విషాదమూ ఏమంటే సరిగ్గా ఇవాళ మామీద ప్రాసిక్యూషన్ వారు బనాయించిన సెక్షన్లే – ఐపిసి 120 (బి), 121 (ఎ), 122 – ఈ నాయకులందరిమీద కూడ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ బనాయించింది. ఆ నేరారోపణలకు జవాబుగా ఆ ముద్దాయిలందరూ న్యాయస్థానాలలో తమ మీద బనాయించిన తప్పుడు కేసుల గురించి, తమ రాజకీయ విశ్వాసాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చదివారు. అవన్నీ బ్రిటిష్ వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమ చరిత్రలో భాగమైనవే.

1947 అధికార మార్పిడి తర్వాత కూడ ఇటువంటి నేరారోపణలు, వాటికి జవాబుగా న్యాయస్థానాలలో ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో అచ్చయిన ఐదువందల పేజీల పుస్తకం తరిమెల నాగిరెడ్డి హైదరాబాదు కుట్రకేసులో ముద్దాయిగా చేసిన కోర్టు ప్రకటనే. ఆ కుట్రకేసులోనే ముద్దాయిలందరి తరఫున దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘విప్లవ కమ్యూనిస్టుల కార్యక్రమం – ఎత్తుగడల వివరణ’ అనే సుదీర్ఘమైన కోర్టు ప్రకటన చదివారు. పార్వతీపురం కుట్రకేసు నిందితులలో చాలమంది కోర్టులో తమ రాజకీయ విశ్వాసాలను తెలియజెప్పే కోర్టు ప్రకటనలు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి అనేక కేసులలో ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. రచయితల విషయానికే వస్తే సికింద్రాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు వంటి వాటిలో ముద్దాయిలైన కె. వి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం టి ఖాన్ మొదలయిన వారు సుదీర్ఘమైన కోర్టు ప్రకటనలు చేశారు. అవన్నీ పుస్తకాలుగా కూడ అచ్చయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

venu6ఈ వ్యవస్థలో సాగుతున్న దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ రచనలు చేసేవారిని, ఉపన్యాసాలు ఇచ్చేవారిని ‘ఇదిగో ఇలా వేధిస్తాం, అక్రమ నిర్బంధాల పాలుజేస్తాం, అబద్ధపు కేసులు బనాయిస్తాం’ అని బెదిరించడానికే ఈ కేసు. ఈ దోపిడీ పీడనల వ్యవస్థను మార్చాలని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న వారిని కలుసుకున్నా, వారితో మాట్లాడినా వేధింపులు తప్పవు అని హెచ్చరించడానికే ఈ కేసు. ఈ వ్యవస్థ మీద వచ్చే ప్రశ్నలను మూసిపెట్టడానికే ఈ కేసు. ప్రశ్నించేవారిని, తమ ప్రశ్నల గురించి ఇతరులను ఆలోచించేలా చేసినవారిని వేధించడానికి పాలకవర్గాలు, అధికార యంత్రాంగం నిరంతరం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కేసు.

నావరకు నేను గత మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయుడిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా ప్రభుత్వ దుర్మార్గాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వాలన్నీ ప్రజా ప్రభుత్వాలుగా పాలన నెరపడం లేదని, భారత ప్రజలు తమకు తాము ఇచ్చుకున్న రాజ్యాంగంలోని ప్రవేశికను గాని, ప్రాథమిక హక్కులను గాని, ఆదేశిక సూత్రాలను గాని గౌరవించే, చిత్తశుద్ధితో అమలుచేసే ప్రభుత్వం ఇంతవరకు ఏర్పడలేదని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని సోదాహరణంగా ప్రజలకు వివరించడం బుద్ధిజీవిగా నా బాధ్యత అనుకుంటున్నాను. నేను ఆ బాధ్యత నిర్వహించడం పాలకులకు కంటగింపు అయినందువల్లనే, నన్ను శారీరకంగాను, మానసికంగాను వేధించడానికే, నా కృషిని అడ్డుకోవడానికే నాపై ఈ అబద్ధపు కేసు బనాయించారు.

కాని ఈ కేసు వల్ల ప్రభుత్వాలు, పోలీసులు చెప్పే అబద్ధాలే బయటపడ్డాయి. నా తాత్విక, రాజకీయ విశ్వాసాలు బలపడ్డాయి. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీదనే ఆధారపడి ఉన్నదని, దీన్ని రద్దుచేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా ఒక కొత్త వ్యవస్థను నిర్మించక తప్పదని నా విశ్వాసం బలపడింది. ఆ కొత్త వ్యవస్థ గురించి కలలు కనేవారిని, ఆ కలలను ఇతరులతో పంచుకునే వారిని నిర్మూలించడం, నిర్బంధించడం, భయపెట్టడం, వేధించడం ఈ వ్యవస్థ లక్ష్యం అని నాకు ఈ కేసు తెలియజెప్పింది. మనిషికి కలిగే ఆలోచనలనూ, వాటిని ఇతరులతో పంచుకునే మాటలనూ చూసి ఈ వ్యవస్థ భయపడుతోందని ఈ కేసు తెలియజెప్పింది. ఈ కేసులో మాట్లాడుకోవడాన్నే నేరంగా చిత్రిస్తున్నారు. మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను.”

నిజామాబాదులో ఒక హైటెక్ జైలు కట్టి, ఆ జైలును మార్చేశారు. మా కేసు తీర్పు నాటికే ఆ మార్పు జరిగిపోయింది. వాదనల సందర్భంగా పది రోజులు నిజామాబాదులో ఉన్నప్పుడు మేమందరమూ రఘునాథాలయంలోనుంచి పాడుబడిపోయిన పాత జైలు భవనాల పైకప్పు మీదికి ఎక్కి మాకు ఇరవై రోజులు ఆశ్రయం ఇచ్చిన ఆ స్థలాల ఫొటోలు జ్ఞాపకంగా తెచ్చుకున్నాం. పది సంవత్సరాలు గడిచిపోయింది. జ్ఞాపకంగా మిగిలిన ఆ జైలు శిథిలమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా మారింది. కాని పోలీసులూ, న్యాయవ్యవస్థా, చెరసాలలూ, నిర్బంధ సంస్కృతీ ఏమీ మారినట్టు లేదు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

దాశరథి రంగాచార్య – తెలంగాణ సమాజపు మోదుగుపువ్వు

  • ఎన్ వేణుగోపాల్

 

దాశరథి రంగాచార్య (1928-2015) మరణంతో తెలంగాణ సాహిత్య ప్రపంచం, తెలుగు మేధో ప్రపంచం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలినీ ఆలోచనాపరుణ్నీ ప్రజాజీవితాన్ని అద్భుతంగా చిత్రించిన రచయితనూ కోల్పోయింది. ఎనబై ఏడు సంవత్సరాల నిండు జీవితంలో, డెబ్బై సంవత్సరాలకు మించిన సామాజిక జీవితంలో, కనీసం ఆరు దశాబ్దాల రచనలతో ఆయన తెలంగాణ సామాజిక జీవితానికీ, తెలుగు సాహిత్యానికీ అసాధారణమైన సేవలందించారు. చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు, రానున్నది ఏది నిజం, పావని, నల్లనాగు, అమృతంగమయ నవలలు, ఉమ్రావ్ జాన్ వంటి నవలల అనువాదం, కథల అనువాదం, కవిత్వం, వ్యాసాలు లాంటి రచనలు, జీవనయానం ఆత్మకథ, బుద్ధుడి జీవితచరిత్ర మాత్రమే కాక, రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాలు అన్నిటినీ ఒంటి చేత్తో తేటతెలుగులో రాసి, పదహారు వేల పేజీల పైన రచనలు చేసిన రంగాచార్య ఏ కోణం నుంచి చూసినా విశిష్టమైన రచయిత. ముఖ్యంగా నవలా ప్రక్రియ ద్వారా ఇరవయో శతాబ్ది తెలంగాణ జనజీవనానికి, అప్పటి ప్రజా పోరాటాలకు అద్దంపట్టిన మహా రచయిత ఆయన.

అంతటి విస్తారమైన జీవితానుభవం, ఆచరణ ఉండి కూడ దాశరథి రంగాచార్య రెండు విరుద్ధ ప్రకృతుల సమ్మేళనం అనిపిస్తుంది. ఆలోచనలలోనూ ఆచరణలోనూ చివరికి ఆహార్యంలోనూ కూడ ఆధ్యాత్మిక, ఆస్తిక, మత భావనలు ఒకవైపు. తనను తాను మార్క్సిస్టుగా చెప్పుకుంటూ, మార్క్సిజం ప్రేరణతో, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమాన్ని నిజాయితీగా అక్షరబద్ధం చేయడం, ఏ రాజ్య వ్యతిరేక ప్రజా ఉద్యమానికైనా తన మద్దతు ఇవ్వడం మరొకవైపు. అది వైరుధ్యమా, విరుద్ధ భావాల మధ్య సమన్వయమా? ఆయనే చెప్పుకున్నట్టు మనిషి, మానవత్వం, సమానత్వం తన ప్రాథమిక లక్ష్యాలుగా మతం, ఆధ్యాత్మికత, ప్రత్యేకించి వేదాలు కూడ సమానత్వాన్నే బోధించాయని నమ్మినందువల్ల, ఆ నమ్మకాన్ని నిరూపించడానికి ప్రయత్నించారా? తాను ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిని కాదని అంటూనే, తాను మార్క్సిస్టునని, మార్క్స్ మహర్షి అని అనడం ఆయనలో వైచిత్రికి నిదర్శనాలు.

పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత ఖమ్మం జిల్లా చిన్నగూడూరులో శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టిన దాశరథి రంగాచార్య పన్నెండో ఏట ఖమ్మంలో పాఠశాల విద్యార్థిగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సమ్మె చేయించి, పాఠశాల నుంచి బహిష్కృతులయ్యారు. హైదరాబాదు రాజ్యంలో మరెక్కడా పాఠశాలల్లో చేర్చుకోగూడదని ఉత్తర్వులతో ఆయన చదువు ఆగిపోయింది. “నాకు పాఠశాల విద్య లేదు. గురువుల వద్ద చదవలేదు” అని ఆయనే చెప్పుకున్నారు. ఈ రాజకీయాభిప్రాయాలను సహించని తండ్రి ఆయనను ఇంటి నుంచి గెంటేశారు. ఒకరకంగా గోర్కీ లాగ ప్రజాజీవితమే, ప్రజాఉద్యమ భాగస్వామ్యమే రంగాచార్య మేధాశక్తికీ సృజనశక్తికీ పదును పెట్టాయి. అన్న, ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య (1925-1987) అనుచరుడిగా రంగాచార్య నిజాం వ్యతిరేక ప్రజాఉద్యమంలో కార్యకర్తగా మారారు. వేరువేరు కారణాలతోనైనా, వేరువేరు భావజాలాలు గల కమ్యూనిస్టు పార్టీ, స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం నిజాం వ్యతిరేక ప్రజా ఉద్యమంలో భాగస్వాములైనందువల్ల ఆ ఉద్యమ కార్యకర్తలలో కూడ కొన్ని ప్రగతిశీల, ప్రజాస్వామిక భావాలు, కొన్ని మతవాద, అప్రజాస్వామిక భావాలు కలగలిశాయి. ఆంధ్ర మహాసభ చీలిక (1944) తర్వాత ఆయా కార్యకర్తల భావజాలాలలో కొంత స్పష్టత వచ్చినప్పటికీ, కొంత గందరగోళం తదనంతర పరిణామాలలో కూడ కనిపిస్తుంది. ముస్లింలు భారతీయులేననీ, భారతీయ కళా సంస్కృతులకు వారు ఎంతో దోహదం చేశారనీ, ఒక ముస్లిం రాజు ప్రజల మీద సాగించిన తప్పుడు పనులను వెయ్యి సంవత్సరాల ముస్లిం పాలనకు అంటగట్టగూడదనీ చాల సమన్వయపూరితమైన వ్యాఖ్యలు చేస్తూనే, తమ పోరాటం “తురక రాజుకు వ్యతిరేకంగా”నని రంగాచార్య రాయడం ఈ గందరగోళం ఫలితమే. నిజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కొద్దికాలంలోనే పోరాట నాయకత్వం పట్ల కూడ ఆయనకు విశ్వాసం సన్నగిల్లింది. ఆయనే చెప్పుకున్నట్టు “ఈ వ్యవస్థలో త్యాగానికి స్థానం లేదని తేల్చుకుని” “స్వయంకృషితో రెండు డిగ్రీలూ రెండు డిప్లొమాలూ సాధించి” హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి 1988లో పదవీ విరమణ చేశారు.

పోరాట కాలంలో భారతీయ సాహిత్యమంతా పనికిరానిదని ఈసడించుకున్నామనీ, కాని పోరాట అనంతరం ఆ సాహిత్యాన్ని చదవడం ప్రారంభించి ఆకర్షితుడినయ్యాననీ ఆయన రాశారు. ఈ సమయంలోనే 1960ల మొదట్లో వచన రామాయణం, వచన భాగవతం రాశారు. 1966 తర్వాత నవలలు, కథలు, వ్యాసాలు రాయడం, అనువాదాలు చేయడం ప్రారంభించారు. వచన మహా భారత రచనను 1962లో ప్రారంభించి 1993లో పూర్తి చేశారు. వేదాలను తెలుగులోకి తీసుకురావాలనే కోరికతో 1995లో రుగ్వేదంతో ప్రారంభించి 2008 నాటికి చతుర్వేదాలనూ తెలుగులోకి తెచ్చారు. ఈ మధ్యలో ఉపనిషత్తులను కూడ తెలుగు చేశారు. బహుశా రామాయణం, మహాభారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు అన్నిటినీ అనువదించిన/రాసిన ఏకైక రచయిత ఆయనే కావచ్చు.

ఆ ఆధ్యాత్మిక రచనల కోసం, అందులో ఆయన ప్రచారం చేసిన హేతువిరుద్ధ భావాల కోసమూ ఆయనను గౌరవించేవాళ్లు కూడ ఉండవచ్చు గాని, 1930ల నుంచి 1950ల దాకా తన జీవితాన్ని యథాతథంగా, కళాత్మకంగా చిత్రించినందుకు తెలంగాణ సమాజం ఆయనను గుర్తు పెట్టుకుంటుంది. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రారంభించి అసంపూర్ణంగా వదిలిన తెలంగాణ సంక్షుభిత జనజీవన చిత్రణను ఆయన కొనసాగించారు. ముఖ్యంగా చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు నవలల్లో ఆయన గడీల దౌర్జన్యాలను, రైతు కూలీల మీద, ఆడబాపలమీద, సబ్బండవర్ణాల మీద దొరల దుర్మార్గాలను, రజాకార్ల దాడులను, నిజాం నిరంకుశత్వాన్ని, ప్రజల పోరాటాలను అత్యద్భుతంగా చిత్రించారు.  తెలంగాణ నుడికారపు సొగసును తెలుగు పాఠకుల అనుభవానికి తెచ్చారు. మానవ స్పందనలను, ఉద్వేగాలను స్వచ్ఛంగా, స్పష్టంగా పట్టుకున్నారు.

1940లో ప్రారంభమైన రాజ్య వ్యతిరేకతనూ, ఆధిపత్యం మీద ధిక్కారాన్ని చివరివరకూ నిలుపుకున్నారు. 1990ల మధ్య నుంచి దాదాపు 2010 దాకా హైదరాబాదులోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా సాగిన ప్రతి ఆందోళనలో ఆయన సంతకం ఉంది.

దాశరథి కృష్ణమాచార్య లాగ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించకపోయినా, ఈ ఉద్యమం వల్ల ప్రజా తెలంగాణ ఏర్పడబోదని, అధికారం ఒక పాలకవర్గ ముఠా చేతినుంచి మరొక ముఠా చేతికి మారుతుందని ఆయన పదే పదే అన్నారు. ఫజలలీ కమిషన్ సూచనను పాటించి 1956లోనే తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసి ఉండగూడదని, తెలంగాణకు అన్యాయం జరిగిందని అంటూనే, ఆ అన్యాయంలో “రెండు వైపుల వాళ్ల బద్మాషీ ఉంది” అని రెండు ప్రాంతాల పాలకవర్గాలనూ తప్పు పట్టారు. కేంద్ర పాలన నడుస్తున్నప్పుడు, ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏం చేయగలుగుతుందని అన్నారు.

ఆయనలో, ఆయన రచనలో ప్రశ్నించవలసినవీ, చర్చించవలసినవీ, బహుశా తిరస్కరించవలసినవీ కూడ ఉండవచ్చు గాని, ఆయన తెలంగాణ సమాజం పూచిన మోదుగుపువ్వు. దానికి నల్లని తొడిమా ఉంది, ఎర్రెర్రని పూవూ ఉంది. వసంతోత్సవ వేళ సమాజం మొత్తాన్నీ రంగుల్లో ముంచెత్తే శక్తీ ఉంది.

 

అవ్యవస్థపై అపహాస్యం, ధిక్కారం పతంజలి అక్షరం

ఎన్ వేణుగోపాల్

 

venuమళ్లీ మళ్లీ చదివినకొద్దీ, ఆలోచించినకొద్దీ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రేరేపించగల శక్తి పతంజలి రచనలది. అందుకు కొంతవరకు కారణం ఆ రచనలలోని బహుళార్థ సూచన, బహుళార్థబోధకత కావచ్చు. రచయిత అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నపూర్వకంగా ఆ బహుళార్థ సూచన ఉద్దేశించారని చెప్పడం అతిశయోక్తే అవుతుంది. ఆయన అలా ప్రత్యేకంగా రాసిన సందర్భాలు కూడ కొన్ని ఉన్నాయి గాని అంతకన్న ముఖ్యంగా రెండు కారణాలు ఉండవచ్చునని అనిపిస్తుంది.

ఒకటి, విస్తృతమైన అధ్యయనం వల్ల, వస్తుశిల్పాలలో అపార వైవిధ్యం ఉన్న సాహిత్యాన్ని చదవడం మాత్రమే గాక జీర్ణం చేసుకున్నందువల్ల ఆయన రచనల్లోకి ఈ బహుళార్థకత సహజంగా ప్రవహించి ఉంటుంది. రెండు, ఆయన రచనలన్నిటిలోను మానవ అనుభవ, మానవ అస్తిత్వ సారాంశాన్ని నైసర్గికంగా, సహజంగా పట్టుకున్నారు గనుక మానవ అస్తిత్వంలో గుణాత్మక మార్పు వచ్చేవరకూ ఆ విభిన్న కోణాలు పఠిత స్ఫురణకు వస్తూనే ఉంటాయి. అంటే ఆ బహుళత్వం వ్యక్తీకరణ పొందుతూనే ఉంటుంది. అలాగే, మానవ అస్తిత్వ సారం అన్నప్పుడు కూడ సాధారణంగా సాహిత్యానికి, ప్రత్యేకంగా తెలుగు సాహిత్యానికి తెలిసిన పరిమిత, సంకుచిత, ఏకైక రూపంలో ఆయన అర్థం చేసుకోలేదు. దాన్ని కేవలం వేదనగానో, సంతోషంగానో, విచికిత్సగానో మాత్రమే ఆయన అర్థం చేసుకోలేదు, అన్నీ కలగలసినదిగా, విశాలమైనదిగా, లోతైనదిగా అర్థం చేసుకున్నారు. అందువల్ల కూడ ఆయన రచనలకు బహుళార్థ బోధకత వచ్చిఉండవచ్చు.

నిజానికి తెలుగుసాహిత్య చరిత్రలో పతంజలి రచనలు రాశి రీత్యా చాల ఎక్కువేమీ కావు. పది నవలలు (ఖాకీవనం – 1980, పెంపుడు జంతువులు – 1982, రాజుగోరు – 1983, వీరబొబ్బిలి – 1984, అప్పన్న సర్దార్ – 1986, గోపాత్రుడు – 1992, పిలకతిరుగుడు పువ్వు – 1995, ఒక దెయ్యం ఆత్మకథ – 1992, నువ్వేకాదు – 1996, రాజుల లోగిళ్లు – 2002 అసంపూర్ణం), ముప్పై లోపు కథలు, పదిహేనో పదహారో అనువాద/జ్ఞాపక కథలు, కొన్ని వ్యాసాలు, సంపాదకీయాలు…అన్నీ కలిపినా పద్నాలుగు వందల పేజీల సాహిత్యసంపద మాత్రమే. ఆ సాహిత్యరాశి కొంతవరకు తక్కువే అనిపించినా, అది సందర్భం మారినప్పుడల్లా, బహుశా మారనప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొత్త పాఠకులను, కొత్త అర్థాలను, కొత్త చూపును పునరుత్పత్తి చేస్తున్నది. ఒక పఠనంలో అర్థం కాని విషయాలు మరో పఠనంలో తెలియవస్తున్నాయి. ఒక పఠనంలో తెలియని వైశాల్యమూ లోతూ మరొక పఠనంలో బైటపడుతున్నాయి. కొత్త అర్థాలు గోచరిస్తున్నాయి. పతంజలి సాహిత్యానికి ఈ అసాధారణమైన శక్తినిచ్చిన విశిష్టత గురించి కొన్ని ఆలోచనలు పంచుకోవడమే ఈ వ్యాసలక్ష్యం.

ప్రక్రియ ఏమైనప్పటికీ, పతంజలి రచనలన్నిటికీ సాధారణ లక్షణం అవ్యవస్థను అపహాస్యం చేయడం, అవ్యవస్థ మీద ధిక్కారాన్ని ప్రకటించడం. నిజానికి ఈ లక్షణంలో పతంజలి ప్రత్యేకత ఏమీ లేదు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధాన ధోరణి ఆ లక్షణమే. కందుకూరి వీరేశలింగం నాటి నుంచి ఇవాళ్టిదాకా ప్రతి తెలుగు రచయితా ఏదో ఒక స్థాయిలో అవ్యవస్థ గురించే రాస్తూ ఉన్నారు. అవ్యవస్థను కొందరు ఊరికే యథాతథంగా చిత్రించి ఉండవచ్చు, మరి కొందరు అసహ్యం కలిగేట్టు చిత్రించి ఉండవచ్చు. కొందరు అపహాస్యం చేయడమో, ధిక్కరించడమో చేసి ఉండవచ్చు. మరికొందరు ఇంకా ముందుకు వెళ్లి ఈ అవ్యవస్థను ధ్వంసం చేసే, ఒక కొత్త వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలూ చేసి ఉండవచ్చు. మొత్తం మీద అవ్యవస్థ గురించి రాయని సాహిత్యకారులు, ఈ వ్యవస్థ బాగుందని రాసిన సాహిత్యకారులు తెలుగులో దాదాపుగా లేరనే చెప్పాలి.

అయితే పతంజలి విశిష్టత ఏమంటే వ్యవస్థనూ, అవ్యవస్థనూ అర్థం చేసుకునే పద్ధతిలో ఆయన గణనీయమైన మార్పు తెచ్చాడు. అప్పటివరకూ అసమగ్రంగా ఉన్న అవగాహనను ఆయన రచనలు విశాలం చేశాయి. అంతకు ముందు వ్యవస్థ పట్ల సమగ్ర అవగాహన ఉన్నవారిలో కూడ ప్రాధాన్యతల హెచ్చుతగ్గుల వల్ల దృష్టి పడని అవ్యవస్థలను, అవ్యవస్థల సూక్ష్మ, విస్మృత కోణాలను కూడ ఆయన రంగస్థలం మీదికి లాగి వాటిని తన విమర్శకు లక్ష్యం చేశాడు. నిజానికి అపహాస్యాన్నీ, ధిక్కారాన్నీ ప్రధాన సాధనాలుగా చేసుకుని, ఆయన అప్పటివరకూ విమర్శ అంటే ఉండిన అర్థాన్ని కూడ మార్చాడు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు వీరేశలింగం దగ్గరే అవ్యవస్థ మీద విమర్శ ప్రారంభమయిందనుకుంటే, పితృస్వామిక వ్యవస్థలోని (లేదా అవ్యవస్థలోని) స్త్రీ విద్యకూ పునర్వివాహానికీ అవకాశం ఇవ్వని ఒకటి రెండు చిన్న అంశాల మీదనే ఆయన ఎక్కుపెట్టాడు. అప్పటినుంచి బహుశా విప్లవ సాహిత్యోద్యమం వచ్చేవరకూ తెలుగు సాహిత్యంలో అవ్యవస్థను ఖండించిన రచయితలందరూ కూడ ఏదో ఒక అవ్యవస్థను, లేదా కొన్ని అవ్యవస్థలను, లేదా సామాజిక అవ్యవస్థలోని కొన్ని అంశాలను మాత్రమే పట్టించుకున్నారు, విమర్శించారు, మార్చడానికి ప్రయత్నించారు.

patanjali choopu

ఈ క్రమంలో సామాజిక అవ్యవస్థ అంతటికీ మూలకారణం అసలు వ్యవస్థలోనే చూడాలని, విడివిడి అంశాలలో కాదని అవగాహన పెరిగింది. కాని దానితోపాటే, వ్యవస్థను మార్చడమంటే ప్రధానంగా అధికార వ్యవస్థలను మార్చడమనే, విమర్శించడమనే అవగాహన కూడ పుట్టిపెరిగింది. అధికార వ్యవస్థలను విమర్శించడమే వ్యవస్థ మీద విమర్శగా సాగింది. సాధారణంగా పాశ్చాత్య ప్రజాస్వామిక సంప్రదాయంలో అధికార విభజనలో భాగంగా అధికార వ్యవస్థను మూడు అంగాలుగా – శాసననిర్మాణ, పాలక, న్యాయ విభాగాలుగా – విభజించడం అందరికీ తెలిసిందే. వీటినే సమాజానికీ, ప్రజాస్వామ్యానికీ మూల స్తంభాలుగా భావిస్తారు. నాలుగో స్తంభంగా పత్రికా వ్యవస్థను కూడ గుర్తించడం ప్రారంభించారు. ఈ నాలుగు రంగాలే సామాజిక అవ్యవస్థకు పాదులుగా ఉన్నాయి గనుక పతంజలి రచనలు ఈ నాలుగు రంగాల మీద విమర్శను ఎక్కుపెట్టాయి. ఈ నాలుగు వ్యవస్థలలోని అవ్యవస్థను ఆయన ఒక పద్ధతి ప్రకారం అపహాస్యం చేశారు, ధిక్కరించారు, అసహ్యం కలిగేలా చిత్రించారు, ఈ అవ్యవస్థ ధ్వంసమై, సువ్యవస్థ ఏర్పడక తప్పదనీ, ఆ సువ్యవస్థ నిర్మాణానికి తనవంతు కృషి చేయాలనీ పాఠకులు ప్రేరణ పొందడానికి అవసరమైన పేలుడు పదార్థమంతా తన రచనల్లో దట్టించారు.

అయితే ఈ అధికార వ్యవస్థల మీద, ప్రత్యేకించి మొదటి మూడు అధికారవ్యవస్థల మీద, ఇంకా తీవ్రమైన విమర్శ విప్లవ సాహిత్యోద్యమంలో కూడ ఉన్నదే. విప్లవ సాహిత్యం కన్న ఎక్కువ ఆదరణనూ, విస్తృతినీ పతంజలి రచనలు సాధించడానికి కారణమేమిటో అన్వేషించవలసి ఉంది. విప్లవ సాహిత్యం ప్రధానంగా ఈ అధికార వ్యవస్థల మీద గురి పెట్టింది గాని, అధికారం అమలు చేసే ఇతర వ్యవస్థలను గుర్తించలేకపోయింది. గుర్తించినా వాటి మీద విమర్శను తన సాహిత్యంలో భాగం చేయలేకపోయింది.

సమాజ చరిత్ర క్రమంలో “అనధికార వ్యవస్థలు” కూడ అధికారవ్యవస్థలతో సమానంగానో ఎక్కువతక్కువలుగానో అధికారాన్ని చలాయించడం ప్రారంభిస్తాయి. అధికారవ్యవస్థల మీద దృష్టి కేంద్రీకరణలో ఈ “అనధికార వ్యవస్థలు” విస్మరణకు గురి కాగూడదు. ఫ్రెంచి మార్క్సిస్టు తత్వవేత్త లూయీ ఆల్థూసర్  రాజ్యాంగయంత్రం గురించి వివరిస్తూ, ప్రభుత్వం, పాలన, సైన్యం, పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు వంటి రాజ్యసాధనాలతో పాటే, అంతకన్న ఎక్కువగా వ్యవస్థా నిర్వహణలో పాల్గొనే మతం, విద్య, కుటుంబం, న్యాయభావన, రాజకీయాలు, కార్మికరంగం, ప్రచార సాధనాలు, సాహిత్య కళారంగాలు, క్రీడలు వంటి భావజాల రాజ్య సాధనాలు (ఐడియలాజికల్ స్టేట్ ఆపరేటస్) ఉంటాయని గుర్తించాలన్నాడు. రాజ్యసాధనాలు హింస మీద, బలప్రయోగం మీద ఆధారపడే ఏకీకృత శక్తిగా ఉండగా, భావజాల రాజ్య సాధనాలు బహుళత్వపు శక్తులుగా భావజాలం ద్వారా అదే పని చేస్తాయని అన్నాడు.

మరోమాటల్లో చెప్పాలంటే మతం, కులం, వంశం, కుటుంబం వంటి ఆభిజాత్యాలు, దురభిప్రాయాలు, అవకాశాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నుడికారం వగైరా ఎన్నో మానవసంబంధాల వ్యవస్థలు మన ఆలోచనల మీద, అభిప్రాయాల మీద, ప్రవర్తన మీద బలమైన ప్రభావం వేస్తున్నాయి. అవన్నీ అవ్యవస్థ స్థితిలోనే ఉన్నాయి. అంటే అవ్యవస్థ మనకు బైట ఎక్కడో కాదు మనలోపలే ఉంది. మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో ఉంది. మనం గురి చూడవలసిన లక్ష్యం అవతల ఉన్నమాట ఎంత నిజమో, మనలోపల ఉన్నమాట కూడ అంతే నిజం. అందుకే పతంజలి పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ వంటి ప్రత్యక్ష అధికార వ్యవస్థల అవ్యవస్థ మీద ఎంతటి పదునైన విమర్శ ఎక్కుపెట్టారో, అన్నిరకాల భావజాల సాధనాల అవ్యవస్థ మీద అంతకన్న పదునైన విమర్శ ఎక్కుపెట్టారు. పతంజలి రచనల్లో ఏ ఒక్కటి తీసుకున్నా అధికారిక అవ్యవస్థ మీద ఎంత అపహాస్యం, ధిక్కారం ఉన్నాయో, స్వయంగా చదువరి భావాల్లో, ప్రవర్తనలో ప్రబలంగా ఉన్న భావజాల అవ్యవస్థల మీద అంత వెటకారమూ, ధిక్కారమూ ఉంటాయి.

అందుకే పతంజలి రచన సమాజం మీద ఎంతగా విమర్శో, అంతగా ఆత్మవిమర్శ. చదువరులంగా మనం ఏకకాలంలో ఒక పోలీసు అధికారినీ, రాజకీయ నాయకుడినీ, న్యాయమూర్తినీ, పత్రికాధిపతినీ అపహాస్యం చేస్తున్నట్టుగానే, ధిక్కరిస్తున్నట్టుగానే, మనలో ఉన్న మోసకారితనాన్నీ, నంగితనాన్నీ, అధికారాపేక్షనూ, లాభాపేక్షనూ, అటువంటి అవలక్షణాలన్నిటినీ కూడ అపహాస్యం చేసుకోవలసి ఉంటుంది. సమాజాన్ని శాసిస్తున్న, నిర్వహిస్తున్న వారి మీద ఎంతగా విమర్శ చేయవలసి ఉందో, ఆ శాసనాన్నీ నిర్వహణనూ ఆమోదిస్తున్న, అనుకరిస్తున్న, మౌనంగా భరిస్తున్న మనమీద మనం కూడ అంతగా విమర్శ చేసుకోవలసి ఉంటుంది. పతంజలి రచనల ఆకర్షణా బలమూ అదే. సాధారణంగా ప్రత్యర్థిని బైట చూసి విమర్శ చేసినప్పుడు మనకు ఒక సంతృప్తీ గర్వమూ కలుగుతుంటాయి. కాని ఆ ప్రత్యర్థి లక్షణాల్లో ఎంతో కొంత, శతాంశమో, సహస్రాంశమో మనలో కూడ ఉన్నప్పుడు, ప్రత్యర్థి మీద విమర్శకు పదను తగ్గుతుంది. అప్పుడు తప్పనిసరిగా అవసరమైనది ఆత్మవిమర్శ. లోచూపు. అది కలిస్తేనే అవ్యవస్థ మీద విమర్శ బలోపేతమవుతుంది.

“సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నాచుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఫలితంగా ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్థాయిలో సామూహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నాకంట్లో ఒక నీటి బొట్టవుతుంది. ఏది సమూహం, ఏది వైయక్తికం” అని పతంజలి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆయన రచనల సమాజం-వ్యక్తి సమ్మేళనానికి, విమర్శ-ఆత్మవిమర్శ స్వభావానికి నిదర్శనం.

మరొక అంశం కూడ చెప్పుకోవాలి. పతంజలి కేవలం సామాజిక విమర్శకుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప కళాత్మకత ఉన్న సృజనాత్మక రచయిత. అందువల్ల ఆయన రచన నిస్సారమైన విమర్శగా, విశ్లేషణగా ఉండదు. అది అపహాస్యం, వెటకారం, వ్యంగ్యం వంటి కళాత్మక దినుసులు అద్దుకుని ఆకర్షణీయంగా తయారవుతుంది. అది ధిక్కారంలా కనిపించకుండానే ధిక్కారం అవుతుంది. అది మళ్లీ ఉట్టి వెటకారమేనా, ఉట్టి ధిక్కారమేనా అంటే అంతమాత్రమే కూడ కాదు. మరింత ఉన్నతమైన సందేశం వైపు చూపుతుంది. తెలుగు సాహిత్యంలో అలవాటైన మొరటు, తక్కువస్థాయి పద్ధతిలో సందేశం చెప్పలేదు గనుక అసలు పతంజలి సాహిత్య లక్ష్యం సందేశం కానేకాదని వాదించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వాచ్యంగా సందేశం ప్రకటించిన ‘పతంజలి భాష్యం’ వంటి రచనలు ఆయనలోని కళాకారుడివి కావనీ, ఆయన కథలూ నవలలూ సందేశం లేనందువల్లనే గొప్ప కళాత్మక రచనలనీ ఆయన మౌలిక స్వభావాన్నే ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

కాని పతంజలి రచనల్లో సందేశం ఉందా లేదా, సాహిత్య ప్రయోజనం అనే ఉదాత్త లక్ష్యానికి పతంజలి రచనలు లొంగుతాయా లేదా, ఆయన కేవలం కళ కోసమే కళ అనుకున్న రచయితేనా అనే చర్చే అనవసరం. వాస్తవంగా చెప్పాలంటే, వాచ్య రూప సందేశం కన్న ధ్వని రూప, వ్యంగ్య రూప సందేశమే ఎక్కువ శక్తిమంతమైనది. అలా చూస్తే సామాజిక అవ్యవస్థ గురించీ, వ్యవస్థ మారవలసిన అవసరం గురించీ పతంజలి ఇచ్చినంత బలమైన సందేశాన్ని ఇచ్చినవాళ్లు తక్కువమంది.

*

“కాస్త సాహిత్యం ఇప్పించండి”

 

గౌరవనీయ మిత్రులు కాళిదాసు పురుషోత్తం దాదాపు నాలుగు దశాబ్దాల వెనుక పి ఎచ్ డి కోసం చేసిన విస్తారమైన పరిశోధన ఫలితమైన సిద్ధాంతవ్యాసాన్ని ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం’ పేరుతో ఇప్పుడు ప్రచురించారు. అలా పరిశోధనకూ ప్రచురణకూ మధ్య సుదీర్ఘకాలం గడిచి ఈ పుస్తకమే గత వర్తమానాల వారధిగా నిలుస్తుందంటే, అందులోని వస్తువు వెంకటగిరి ఆస్థానంలో సాహిత్యం గురించి మాట్లాడుతూ ఇంకా వెనక్కి గతంలోకి వెళ్తుంది. గతం గురించి అద్భుతమైన, ఆలోచనాస్ఫోరకమైన, విస్తృత సమాచారం నింపుకున్న ఈ సిద్ధాంత వ్యాసం చదువుతున్న సమయాన్నే వర్తమానం కూడ అటువంటి సూచనలిస్తున్నదని అనిపిస్తున్నది. వర్తమానంలో కూడ కొత్త సంస్థానాలు తలెత్తుతున్నాయనీ, సాధారణంగా నిర్బంధాన్ని సహించబోమని చెప్పే, తమను తాము స్వేచ్ఛాజీవులుగా భావించుకునే, నిత్య ప్రతిపక్షమని చెప్పుకునే సాహిత్యకారులు, కళాకారులు కొత్త సంస్థానాల కడగంటి చూపుకైనా సరేనని పరుగెత్తుతున్నారనీ కనబడుతున్నది. గతవర్తమానాల మధ్య సారూప్యమూ విభేదమూ మరింత కొట్టవచ్చినట్టు కనబడి, తెలుగు సమాజపు ప్రతిష్టంభన మరొకసారి కళ్లకు కడుతున్నది.

వెయ్యి సంవత్సరాల అధికారిక తెలుగు సాహిత్య చరిత్రలో అత్యధికభాగం, బహుశా ఎనిమిది వందల సంవత్సరాల పైన, ఆస్థాన సాహిత్యమే రాజ్యమేలింది. ఆ రాజాస్థానాలు కాకతీయ, విజయనగర రాజ్యాల వంటి సువిశాలమైనవా, రాజమహేంద్రవరం, కొండవీడు, నెల్లూరు, రాచకొండల నుంచి జటప్రోలు, గద్వాల, వెంకటగిరి, దోమకొండ వంటి చిన్న రాజ్యాలవా అనేది కేవలం వివరణ కోసం తెలుసుకోవలసిందే తప్ప, అధికారిక తెలుగు సాహిత్య చరిత్రలో రాజాస్థానాలలో వెలువడిన సాహిత్యానికే ఎక్కువ ప్రాధాన్యత దొరికింది. ఆస్థానాలకు బైటనే ఎంతో సాహిత్యం వచ్చినప్పటికీ దానికి సాహిత్యంగా గుర్తింపు దొరకలేదు. అటువంటి గుర్తింపు దొరికి ప్రధానస్రవంతి సాహిత్యచరిత్రలో నమోదైన సాహిత్యకారులు అతి తక్కువమంది.

ప్రతి మానవమేధకూ సహజంగా సృజనశక్తి ఉంటుంది. సామాజిక సంపర్కంతో అది వికసించే అవకాశం ఉంటుంది. అన్ని రూపాల సృజనాత్మక కార్యకలాపాలూ శ్రమతోనే వికసిస్తాయి. అందువల్ల బహుశా శ్రమజీవుల మౌఖిక సృజన కార్యకలాపాలే ఏ సమాజంలోనైనా రాశిలో అధికంగా ఉంటాయి. జీవితానుభవం వల్ల వాటి వాసి కూడ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాని రాజాస్థాన సాహిత్య చరిత్ర రచనా సంప్రదాయం మౌఖిక సాహిత్యాన్నంతా విస్మరించి, లిఖిత సాహిత్యాన్ని మాత్రమే సాహిత్యంగా గుర్తించడం ప్రారంభించింది. ఆ లిఖిత సాహిత్యంలో కూడ రాజాస్థానానికి బైట స్వతంత్రంగా ఉండిన సాహిత్యకారులను చిన్నచూపు చూసింది.

Venkatagiri

స్వభావసిద్ధంగానే లిఖిత సాహిత్య సృష్టికి అదనపు వనరులు అవసరమవుతాయి. లేఖన సంప్రదాయం ఏర్పడి ఉండాలి. లేఖన పరికరాలు అభివృద్ధి అయి ఉండాలి. ఉత్పత్తిలో మిగులు ఏర్పడి, కొన్ని వర్గాలు తమ ఉత్పత్తి తాము చేసుకోనక్కరలేని విశ్రాంతివర్గంగా మారిన తర్వాతనే లిఖిత సాహిత్య వికాసం జరిగే అవకాశం ఉంది. ఈ విశ్రాంతి వర్గం తమ విశ్రాంతికీ విలాసాలకూ సమర్థన కల్పించుకోవడానికి విశ్రాంతి వర్గ సాహిత్య రచనా, ఆస్వాదనా, శ్రవణ వాతావరణాన్ని, అందుకు తగిన సాహిత్య సిద్ధాంతాన్ని తయారు చేసింది. ఆ వాతావరణాన్ని, సిద్ధాంతాన్ని కల్పించడంలో మతమూ, రాజ్యమూ సహకరించాయి. అందువల్లనే లిఖిత సాహిత్య సంప్రదాయం తప్పనిసరిగా శ్రామికవర్గాల, ప్రజల పునాదిపై కాకుండా మతం పునాదిపై, రాజ్యం పునాదిపై బలపడింది.

లిఖిత సాహిత్యమంతా విశ్రాంతివర్గ సాహిత్యమే, రాజాస్థాన సాహిత్యమే అనే అతివాద సూత్రీకరణ చేయనక్కరలేదు గాని, విశ్రాంతివర్గం ఏర్పడడమే లిఖిత సాహిత్య విస్తరణకు అవకాశాలు పెంచింది. విశ్రాంతి వర్గం ఏర్పడడమంటే శ్రామికవర్గం తమ అవసరాల కొరకు మాత్రమే కాక మరొకవర్గం అవసరాలకు కావలసిన అదనపు ఉత్పత్తి కూడ చేయవలసి వచ్చిందన్నమాట. అలా తాము శ్రమించకుండానే, ఉత్పత్తిని అనుభవించే హక్కు తమకు ఉందని చూపుకోవడానికి విశ్రాంతివర్గం పాలన సాగిస్తున్నట్టుగా, పౌరోహిత్యం చేస్తున్నట్టుగా, రక్షణ కల్పిస్తున్నట్టుగా, సమాజపు విజ్ఞాన, వినోద అవసరాలు తీరుస్తున్నట్టుగా నటించడం మొదలయింది. ఈ విశ్రాంతివర్గపు ఒకానొక కార్యకలాపమే ఆస్థాన సాహిత్యం.

ఈ ఆస్థాన సాహిత్యంలో ఎక్కడైనా ఒకచోట వాస్తవికత, మానవీయత, గొప్ప భావాలు ఉన్నట్టు కనిపించినప్పటికీ దాని పునాది మాత్రం శ్రామికవర్గాల అదనపు ఉత్పత్తిని సంగ్రహించడంలోనే ఉంది. ఆ సంగ్రహం ఎంత పెద్ద ఎత్తున జరిగితే ఆస్థానాల వైభవం అంతగా విలసిల్లింది. ఆస్థానంలో విలాసాలు పెరిగినకొద్దీ ఆస్థాన సాహిత్యపు మైమరపూ పెరిగింది. ఆ విలాసభరిత, వైభవోపేత ఆస్థానాలలో సాహిత్య పోషణ భువనవిజయంగా సాగింది.

Upstairs_at_the_palace,_Kondapalli,_Kistna_District

అయితే వందల ఏళ్ల పాటు సాగిన ఈ ఆస్థానాల సాహిత్యసేవ అంతా వ్యర్థమే అనుకోనక్కరలేదు. సామాజిక శ్రమవిభజనలో భాగంగా బహుశా భౌతిక ఉత్పత్తి కార్యక్రమంతో పాటుగా ఈ మానసిక ఉత్పత్తుల కార్యక్రమం కూడ జరగవలసిందే. కాని అది సామాజిక అవసరాలకు, ప్రాధాన్యతలకు, ఉపయోగానికి లోబడి జరగాలి. సమాజానికి అవసరమైన మేరకే జరగాలి. సమాజానికి అధినాథులమని తమను తాము భావించుకునే కొందరి వీర, శృంగార, బీభత్స, ఔదార్య చర్యల వర్ణన మాత్రమే కాదు, సమాజాన్ని చిత్రంచే బాధ్యత చేపట్టాలి. కాని ఆస్థాన సాహిత్యం, ప్రత్యేకించి తెలుగులో ఆస్థాన కవిత్వం ఆ పని చేయలేదు. కవులు సమాజపు సమస్యలు కనబడని, అర్థం కాని ఏకాంత దంత ప్రాకారాలలో నివసించారనడానికి ఆధారాలేమీ లేవు. వారు కొంతవరకైనా సామాన్య ప్రజల జీవితం చూసే ఉంటారు. కాని అటు ఆస్థాన అవసరాలూ, ఇటు లక్షణ శాస్త్రాలూ వస్తువు మీద, శిల్పం మీద నిర్దేశించిన కఠిన నియమాలు, వ్యాకరణాల సంకెళ్లు, ఛందస్సుల సర్పపరిష్వంగం, కవులను సామాజిక వస్తువులవైపు చూడకుండా చేశాయి. సృజనకర్తకు సహజమైన ప్రయోగపరత్వం, అన్వేషణ, నవత అనే కార్యకలాపాలు చివరికి చిత్ర, బంధ, ద్వంద్వార్థ, నిరోష్ట్య వంటి సాముగరిడీలకు పరిమితమైపోయాయి.

ఈ స్థితి కొన్ని వందల ఏళ్లు గడిచి, శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యంలో సాహిత్య పోషణ ప్రచారార్భాటం మితిమీరి ఆస్థాన కవిత్వమే ఏకైకం అన్నట్టు తయారయింది. “మూడు వందల యేళ్లపాటు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, కుట్రలు, దోపిడులతో లక్షల, కోట్ల సామాన్య ప్రజల్ని పీడనకూ హింసలకూ గురిచేసిన విజయనగర సామ్రాజ్యం” అని కంభంపాటి సత్యనారాయణ ‘ఆంధ్రుల సంస్కృతి – చరిత్ర’ లో రాసిన వాస్తవం ఆంధ్రభోజుడి ఆస్థానంలో వెల్లువెత్తిన సాహిత్యంలో ప్రస్తావనకే రాలేదు. కృష్ణరాయల కీర్తి ఘల్లుమని మారుమోగుతుంటే మరుగున పడిపోయిన డజన్ల కొద్దీ దుర్భరమైన పన్నుల వివరాలను, ప్రజల మీద పన్నుల పీడనను కంభంపాటి సత్యనారాయణ సమకాలిక యూరపియన్ ఆధారాలనుంచి సేకరించగలిగారు గాని ప్రజల కష్టాల గురించి ఒక్కటంటే ఒక్కటైనా ఆస్థాన సాహిత్య రచన మాట్లాడలేదు.

మరొక మాటల్లో చెప్పాలంటే “ఆ రాజు పారేసిన ఎంగిలి పెరుగన్నం మెక్కి/ ఆస్థానకవి నాటకం రాసాడు” అని ఆ తర్వాతెప్పుడో సరోజ్ దత్తా ‘శకుంతల’ కవితలో రాసినట్టు రాజ్య దుర్మార్గానికి మేలి ముసుగు కప్పడానికే అత్యధిక భాగం ఆస్థాన కవిత్వం ప్రయత్నించింది. ఆస్థాన సాహిత్యకారులు తమకు ఉప్పుపెట్టిన రాజును సంతోషపెట్టడమే తమ సాహిత్య బాధ్యత అనుకున్నారు. నిజానికి ఆ ఉప్పు రాజుది కాదని, అసంఖ్యాక శ్రమజీవులనుంచి సంగ్రహించినదని గుర్తించలేదో, గుర్తించీ విస్మరించారో తెలియదు. మొత్తానికి బుద్ధిజీవులు ప్రభువులవైపా ప్రజలవైపా అనే ప్రశ్న వేసుకోకుండానే ప్రభువుల కొమ్ము కాశారు.

తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు విజయనగర (హంపి) సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఏర్పడిన విశాలమైన కుతుబ్ షాహి రాజ్యమైనా, ఆ తర్వాతి కాలంలో ఎక్కడికక్కడ ఏర్పడిన చిన్న చిన్న సంస్థానాలైనా, చివరికి ఆర్థిక వనరులు మరీ అంత ఎక్కువ లేని సంస్థానాలు కూడ సాహిత్యపోషకులుగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాయి. తమ శక్తికి మించి కూడ సాహిత్య పోషణ చేశాయి. అటువంటి సాహిత్య పోషక సంస్థానాలలో ఒకటి వెంకటగిరి. విజయనగరం (ఉత్తరాంధ్ర) తర్వాత అతి పెద్ద జమీందారీగా వెంకటగిరి 730 గ్రామాలతో, 617 శివారు పల్లెలతో, 2,171 చదరపు మైళ్ల విస్తీర్ణంతో, 1900 నాటికే సాలీనా రు. 14,46,222 ఆదాయంతో ఉండేది. ఆ సంస్థాన ప్రభువులలో ఒకరైన సర్వజ్ఞ కుమారయాచమనాయకుడు కవిపండిత పోషకుడు. స్వయంగా కవి అయి విద్వత్ కుమార యాచమనాయకుడని పేరు పొందాడు. వెంకటగిరి సంస్థానాన్నే విద్వత్సంస్థానం అని పిలిచేవారు.

ఈ సంస్థాన చరిత్రను, సామాజికాంశాలను కాళిదాసు పురుషోత్తం ఈ సిద్ధాంత గ్రంథంలో రెండు అధ్యాయాలలో చాల ఆసక్తిదాయకంగా వివరించిన తర్వాత ఆ సంస్థానంలో జరిగిన సాహిత్య సృజనను మూడు అధ్యాయాలలో వివరంగా చర్చించారు. వీటిలో మొదటి అధ్యాయంలో సాహిత్యాన్ని మూడు ఉప అధ్యాయాలలో (1600-1850, 1850-1950 – గోపీనాథుని  వెంకయ్యశాస్త్రి, 1850-1950) చర్చించి, ఆ తర్వాత పదకవిత (1700-1950), సంస్కృత సాహిత్యం (1600-1950) కూడ చర్చించారు. ఆయాకాలాలలో ఒక్కొక్క కవినీ, ఆ కవి రచనలనూ తీసుకుని, ప్రాతినిధ్య, ఆసక్తికర పద్యాలను, సందర్భాలనూ ఉదహరిస్తూ సాధారణ పి ఎచ్ డి సిద్ధాంత గ్రంథాల కన్న విశిష్టంగా సాగిన గ్రంథం ఇది. ఉదహరించిన రచనల ఆధారంగానే ఇంతకన్న లోతైన సామాజిక, ఆర్థిక విశ్లేషణకు అవకాశం ఉంది గాని ఒక తెలుగు పి ఎచ్ డి పరిశీలన నుంచి అంతకన్న ఎక్కువ ఆశించలేం.

ఈ పుస్తకం చదవడం గత కాలపు సాహిత్య తీరుతెన్నుల గురించి, సాహిత్య సృజన గురించీ, సాహిత్య అనుభవం గురించీ, సాహిత్య వస్తురూపాల గురించీ చాల ఆలోచనలను ప్రేరేపిస్తుంది.

సంస్థాన సాహిత్యం ఎంతగా పాలకవర్గ, విశ్రాంతివర్గ సాహిత్యం అయినప్పటికీ, అది ఆ వ్యవస్థ దుర్మార్గాలకు మేలి ముసుగుగా పనిచేసినప్పటికీ అందులో ఒకటి రెండు సానుకూల అంశాలున్నాయనిపిస్తుంది. ఒకటి, సమాజ సంపదలో నుంచి కొంత మిగులును సాహిత్య, కళా రంగాల మీద తప్పనిసరిగా ఖర్చు పెట్టాలనే నియమం. అప్పటికి సాహిత్యానికి మార్కెట్ ఏర్పడలేదు గనుక సాహిత్య సృజన పూర్తికాలపు వృత్తిగా మారే అవకాశం లేదు. సాహిత్యం ఎవరో ఒకరి పోషణలో ఉండవలసిందే. (సాహిత్యం – పోషణ అనే మాటలు రాస్తున్నప్పుడు ఒక బాల్యపు జ్ఞాపకం గుర్తుకొస్తున్నది: మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే యాయవారపు బ్రాహ్మణుడు ‘సాహిత్యం ఇప్పించండి’ అని పంచె పరిచేవారు. మా అమ్మ సోలెడు బియ్యమూ, దోసెడు కందిపప్పూ, కొన్ని కూరగాయలూ, చింతపండూ, మిరపకాయలూ ఆ పంచెలో వేస్తుండేది. సాహిత్యానికే స్వయంగా పోషణ అనే అర్థం ఉండిందన్నమాట!!) అందువల్ల ఆ నాటి స్థితినిబట్టి సామాజిక మిగులులో సాహిత్యానికి ఒక నియమబద్ధమైన వాటా కేటాయింపు మార్గంగా ఆస్థాన సాహిత్యం, కళాపోషణ పనిచేశాయా ఆలోచించాలనిపిస్తుంది.

Kalidau Purushotham

రెండో అనుకూలాంశం, ఎంత దుర్మార్గ పాలకులైనా, ప్రజల పట్ల ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, వారిలో కూడ కళాకారుల పట్ల, సాహిత్యకారుల పట్ల కొంత ఔదార్య, దాతృత్వ లక్షణాలుండేవని ఆస్థాన సాహిత్యం చూపుతుంది. కవిత్వం పట్ల, కళల పట్ల అభిమానం ఉండడమంటేనే మానవీయ లక్షణం ఎంతో కొంత ఉన్నట్టు లెక్క. కనుక ఆ రాజులు, ఆ పాలన రాజకీయార్థిక అర్థంలో ఎంత దుర్మార్గమైనవైనా సాహిత్య, కళా అర్థాలలో కొంత సున్నితత్వాన్ని మిగుల్చుకున్నాయనుకోవాలి.

అది విశ్రాంతి వర్గాల సాహిత్యం కావడం వల్ల, ఒత్తిడి లేకపోవడం, విలాసాలు, ప్రశంసలు, కానుకలు వంటి ప్రోత్సాహకాలు ఉండడం వల్ల కవితాశిల్పానికి కొంత మేలు జరిగిందనిపిస్తుంది. కొండొకచో అది వేలంవెర్రిగా మారి పాండిత్య ప్రదర్శనకూ, భేషజాలకూ, తప్పుడు, సాగదీత మార్గాలకూ దార్ తీసి ఉండవచ్చు గాని, సాధనకు, మెరుగు పెట్టడానికి అవకాశం దొరికినందువల్ల కవితాశిల్పం ప్రశంసార్హంగా, ‘పూత మెరుంగులు’ తీర్చిదిద్దినట్టు తయారయిందని ఒప్పుకోక తప్పదు.

“…ఆ వ్యవస్థ దోపిడిని, హేయత్వాన్ని కొంతవరకు కప్పి పుచ్చేవి ఈ సాహిత్య కళాపోషణలే! సామాజిక శాస్త్రవేత్తలూ, కళాదార్శనికులూ భూస్వామ్య వ్యవస్థ నాణేనికున్న రెండో పార్శ్వాన్ని అధ్యయనం చేసి, అప్పటి సాహిత్య కృషికి దోహదం చేసిన సామాజిక స్థితుగతులను అంచనా వేయాలి. మధ్యయుగాల్లోని సాహిత్యకృషిని, ఒక్కమాటలో, భూస్వామ్య వ్యవస్థకు పుట్టిన వికృతశిశువుగా అభివర్ణించడం సమంజసమా? సాహిత్య వస్తువును అటుంచుదాం. సాహిత్యాభివ్యక్తిలోని సొగసులను, మెలకువలను పట్టించుకోనవసరం లేదా? ఆ యుగపు సాహిత్య కృషిలో అంతర్భాగమైన శతక వాంగ్మయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సామాజికదృష్టితో చూసినప్పుడు, నీతి వైరాగ్య శతకాలతో పాటు, స్థానిక పాలకులను ధిక్కరిస్తూ నిరసనను తెలియజేసిన రచనలు (ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన శార్దూల శతకం వంటివి) నారసింహ శతకం, వేమన పద్యాలు అప్పటి సాహిత్య సృష్టిలో భాగం కావా? సంస్థానాలు సాహిత్య పోషణకేగాక, భాషోద్ధరణకు, సంఘ సంస్కరణకు, కళాభివృద్ధికి దోహదం చేశాయి. గురజాడ, వీరేశలింగం, రఘుపతిగార్ల కృషికి తోడ్పాటునందించినవి సంస్థానాలే” అని ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో వకుళాభరణం రామకృష్ణ అన్న మాటలు చర్చనీయాలు.

అయితే, ఆస్థాన సాహిత్యం మన సాహిత్యంలో ప్రవేశపెట్టిన అపసవ్యతలను గురించి తక్కువ చేయడానికి వీలులేదు. ప్రతి రచననూ ఒక కన్యగానూ, కృతి కర్తను దాని తండ్రి గానూ భావించి ఒక కృతి భర్తకు, సాధారణంగా పోషణ బాధ్యత తీసుకున్న రాజుకు, అంకితం ఇవ్వడం అనే దుష్ట సంప్రదాయాన్ని ఆస్థాన సాహిత్యమే ప్రవేశపెట్టింది. సాధారణంగా ఈ సాహిత్యం రాజుల కోరికల మేరకు, రాజుల మెప్పు కొరకు సృష్టి అయింది గనుక కొంత, అత్యధిక ఆస్థాన రచయితలు బ్రాహ్మణులు కావడం వల్ల కొంత ఆస్థాన సాహిత్యంలో ఎక్కువ భాగం వర్ణాశ్రమ ధర్మాన్ని, మత ప్రాధాన్యతను, కుల అంతరాలను ప్రచారం చేశాయి.

అలాగే, ఆస్థాన సాహిత్యం తనను తాను పీఠం మీద స్థిరపరచుకోవడానికి ఆస్థానాల బైటి సాహిత్య సంప్రదాయాల మీద చిన్నచూపును ప్రదర్శించింది. అసలు అది సాహిత్యమే కాదన్నట్టు ప్రవర్తించింది. నిజానికి మన ప్రజా సాహిత్యంలో, మౌఖిక సాహిత్యంలో, కొంతవరకు లిఖిత సాహిత్యంలో కూడ ఆస్థానాల బైట వెలువడిన ఆణిముత్యాలెన్నో ఇలా విస్మరణకు గురయ్యాయి. ఆ రచనల్లో ఆస్థానేతర వస్తువు ఉందని మాత్రమే కాదు, అవి ఆస్థానాలకు బైట వెలువడడమే, ఆస్థాన పీఠాధిపతులకు కంటగింపయింది.

అలాగే ఆస్థాన సాహిత్యం తనకు బైటి ప్రజాజీవితంలో ఏమి జరుగుతున్నదో పట్టించుకోని బధిరాంధకతను ప్రదర్శించింది. సమాజ సాహిత్య సంబంధాలను వక్రీకరించింది. సాహిత్యాన్ని సమాజానికి దూరం చేసింది.

సరిగ్గా ఈ అవలక్షణాలకు వ్యతిరేకంగానే సాహిత్యంలో ప్రజాస్వామికత కోసం సామాజిక, సాహిత్య ఉద్యమాలు చెలరేగాయి. ఒకవైపు నుంచి సమాజం తన ఉత్పత్తి అయిన సాహిత్యం తన నుంచి దూరం కావడాన్ని నిరసించగా, స్పందనాశీలురైన సాహిత్యకారులు సామాజిక పరిణామాలకు స్పందించడం ప్రారంభించారు. తొలినాటి ఈ పరిణామాలలో కూడ సంస్థానాల పాత్ర కొంత ఉండడం సామాజిక చలనశీలతకు ఒక నిదర్శనం. సాహిత్యంలో ప్రజాస్వామిక భావాలు, ఆస్థాన వ్యతిరేక భావాలు, భూస్వామ్య వ్యతిరేక భావాలు క్రమక్రమంగా విస్తరించి తెలుగు సాహిత్యం ఎన్నో ఉద్యమాలకు, ధోరణులకు, కొత్త గాలులకు వేదిక అయింది.

అదంతా గడిచిపోయి ఎన్నో దశాబ్దాలు దాటింది. కాని క్రమక్రమంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలనేవి కూడ రాజాస్థానాలుగా మారిపోవడం, సంపన్నులు, నయాసంపన్నులు సాహిత్య, కళాపోషణలోకి రావడానికి ప్రయత్నించడం జరిగాయి గాని, మొత్తంగా తెలుగు సమాజంలో ఈ వ్యవస్థానుకూల ధోరణులపట్ల వ్యతిరేకతదే పైచేయిగా ఉంటూ వచ్చింది. తనను తాను ప్రజాస్వామికమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆస్థానకవి పదవిని కొనసాగించడం పట్ల తీవ్రమైన విమర్శలే వచ్చాయి. దిగంబర కవితోద్యమానికి వచ్చిన విస్తృత ప్రజాదరణలో ప్రధానభాగం ఈ అధికారిక ప్రాపకాన్ని నిరసించడం వల్ల వచ్చిందే. శ్రీకాకుళ గిరిజనోద్యమ నేపథ్యంలో నక్షత్ర సప్తకం అనే సాహిత్య సంస్థను ముందు పెట్టి శ్రీశ్రీని కొనివేసి ఆస్థాన సాహిత్యంలో భాగం చేయడానికి ప్రభుత్వమూ, పాలకవర్గాలూ, వ్యవస్థతో సామరస్యం కుదుర్చుకున్న రాజకీయపక్షాలూ ప్రయత్నించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎంతటి తీవ్రపరిణామాలు జరిగాయో సాహిత్య చరిత్రకు తెలిసిందే.

అదంతా కూడ గడిచిపోయి నాలుగు దశాబ్దాలు కావస్తున్నది. ఈ మధ్య కాలంలో వ్యవస్థానుకూల ఆస్థానాలను పునరుద్ధరించే ప్రయత్నాలు అడపాదడపా జరిగాయి గాని అవి చెప్పుకోదగిన విజయం సాధించలేదు. కాని గత కొద్ది సంవత్సరాలుగా మళ్లీ వ్యవస్థా సమర్థకులకు సాహిత్య పోషణ చేయాలనే వెంపరలాట పెరుగుతున్నట్టు కనబడుతున్నది. సాహిత్యకారులలో కొందరిలోనైనా మళ్లీ ఆస్థానాల వైపు , పీఠాలవైపు ఆసక్తి పెరుగుతున్నట్టు కూడ కనబడుతున్నది.

శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని రక్తపుటేర్లలో ముంచిన పోలీసు అధికారులు ఆ తర్వాతి కాలంలో సాహిత్య కళాసంస్థల నిర్వాహకులుగా, సాహిత్య పోషకులుగా అవతారమెత్తారు. జరపవలసిన హింసాకాండ అంతా జరిపి, రెండున్నర లక్షల మంది సైనికులను చంపి, కళింగ రాజ్యపు దయానదిలో నెత్తురు ప్రవహింపజేసి, ఆ తర్వాత బౌద్ధ మతాన్ని అవలంబించిన అశోక చక్రవర్తి లాగ ఈ అధికారుల్లో కొందరు సాహిత్య పోషణతో పాటు బౌద్ధధర్మ నిర్వాహకులు కూడ అయ్యారు. ఇక ఆ తర్వాతి తరంలో అత్యంత క్రూరులుగా, మనుషులను పట్టుకుని చంపిన కర్కోటకులుగా పేరుపొందిన పోలీసు అధికారులు ఇవాళ ప్రచురణ సంస్థల నిర్వాహకులు, సలహాదారులు, పుస్తక ఆవిష్కర్తలు, రచయితలు కూడ అయిపోతున్నారు. అధికారులు, రాజకీయనాయకులు, వ్యాపారులు ఏర్పరుస్తున్న సాహిత్యేతర అధికార పీఠాల సాహిత్య పోషణ సజావుగా సాగిపోతున్నది. కొత్త కృతిభర్తలు తయారవుతున్నారు. సాహిత్యకారులు ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా ఉండాలనే మాట వెనుకపట్టు పట్టి ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమనీ, అందువల్ల ప్రభుత్వ పక్షం ఉండడమే సాహిత్యకారుల బాధ్యత అనీ కొత్త ప్రవచనాలు వస్తున్నాయి. ప్రజాధనంతో నిర్వహించబడే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం ఉండడమంటే ప్రజాధనంలో సాహిత్యకారులకు న్యాయంగా రావలసిన వాటాను నిరాకరించడమనే వాదన వస్తున్నది. ప్రజాధనాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల ప్రచారం కోసం, భజన కోసం వాడుతున్నప్పుడు కూడ అది ప్రజా కార్యక్రమం ఎలా అవుతుందన్న ప్రశ్న రావడం లేదు. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పేర కార్పొరేట్ సంస్థల సాహిత్య కళాపోషణలు, సాహిత్య ఉత్సవాలు పెద్ద ఎత్తున ఎటువంటి ప్రశ్నలూ లేకుండా జరుగుతున్నాయి. ప్రశ్నించేవాళ్లు చాదస్తులుగా కనబడుతున్నారు. భూముల్ని గుంజుకుని ఉపాధి పోగొట్టి ప్రజలను నిర్వాసితుల్ని చేస్తున్న, విషపదార్థాలు గాలిలో, నీటిలో, నేలలో కలిపి సమాజాన్ని కలుషితం చేస్తున్న, నామమాత్రపు ప్రజా సంక్షేమ చట్టాలకు కూడ తూట్లు పొడుస్తున్న కార్పొరేట్ సంస్థలు ప్రజా సాహిత్యాన్ని ఆదరిస్తున్నట్టు నటిస్తున్నాయి.

తెలిసో తెలియకో, అమాయకత్వంతోనో తమ రచనలకు గుర్తింపు వస్తుందనో ఆశతోనో, తమ రచనలు అచ్చవుతాయనో ప్రలోభంతోనో సాహిత్యకారులు, కళాకారులు ఈ ఆకర్షణలకు లోబడుతున్నారు. అటునుంచి ఉద్దేశపూర్వకమైన బలమైన పుల్ ఫాక్టర్, ఇటునుంచి తెలిసీతెలియని కొంత పుష్ ఫాక్టర్ కలిసి సాహిత్యలోకంలో మళ్లీ ఆస్థానాలవైపు చూపు పెరుగుతున్నది. ఇటీవలికాలంలో రాజకీయ, అధికార, వ్యాపార రంగాలలో వ్యక్తులతో సాహిత్యకారులకు గతంలోకన్న ఎక్కువ పరిచయాలు పెరగడం వల్ల, మొత్తంగానే సమాజంలో 1960ల్లో, 70ల్లో కంటె మధ్యతరగతి మొహమాటాలు పెరగడం వల్ల కూడ ఈ కొత్త ఆస్థానాలు బలపడుతున్నాయి.

ఆస్థానంలో ఉండి కూడ ‘రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు’, ‘రాజశబ్దంబు ఛీ జన్మాంతరమందునొల్లను’ అన్న ధూర్జటి, ‘హాలికుడైననేమి నిజదార సుతోదర పోషణార్థమై’ అని సంతృప్తి చెంది ‘నినునాకటికైగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ’ అనీ, రాజులను “ఇమ్మనుజేశ్వరాధములు” అనీ అన్న పోతన, ‘కులము గలవాడు గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగువాడు పసిడి గలుగువాని బానిసకొడుకులు’ అన్న వేమన వంటి ఉజ్వల సంప్రదాయం ఏమైపోతున్నది? దిగంబరకవుల ధర్మాగ్రహ వారసత్వం ఏమైపోతున్నది? విప్లవ సాహిత్యోద్యమ ధిక్కారం ఏమైపోతున్నది? అస్తిత్వ ఉద్యమాల ప్రతిఘటనా స్వరాలు ఏమైపోతున్నాయి? “…కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?” అని కొడవటిగంటి కుటుంబరావు గారు 1970లో వేసిన ప్రశ్న వినిపించడం ఆగిపోయిందా?

 

  • -ఎన్ వేణుగోపాల్
  • venu

ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!

గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన పాచి అన్నానికి మళ్లీ ఒకసారి మసాలా దట్టించి తిరగమోత పెట్టి వడ్డించజూస్తుంటే ఎలా ఉంటుంది? ఇంతకన్న అర్థరహితమైన, ప్రమాదకరమైన, హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని రాజకీయ సామాజిక నిర్వాహకులు నిస్సిగ్గుగా సాగిస్తుంటే సమాజమంతా మౌనంగా నిర్లిప్తంగా చూస్తున్నది. కాలం మారుతున్నదా లేదా, మనం మారుతున్నామా లేదా అని సందేహం కలుగుతున్నది. సంఘపరివార్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఘర్ వాపసీ కార్యక్రమం చూసి, దాని పట్ల సమాజం స్పందించవలసినంతగా స్పందించకపోవడం చూసి నిస్సహాయ ఆగ్రహం నన్ను రెండు మూడు నెలలుగా కలవరపెడుతున్నది.

ఘర్ వాపసీ గురించి వినగానే నాకు ‘ప్రజలమనిషి’లో వట్టికోట ఆళ్వారుస్వామి మతాంతరీకరణ గురించి సృష్టించిన అద్భుతమైన సన్నివేశాలు గుర్తొచ్చాయి. ‘దేశభక్తి’ తొలిపాఠంలో ‘నిన్న వచ్చారింగిలీషులు/ మొన్న వచ్చిరి ముసలమనులటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి వేరులు పెట్టకోయ్’ అని రాసిన, ఆ తర్వాత ‘పెద్ద మసీదు’ కథ రాసిన గురజాడ అప్పారావు గుర్తొచ్చారు. ‘మనకా మతాభిమానం’ అంటూ ‘హిందూ’ మతస్థులమనుకునేవాళ్ల కుహనా ఆభిజాత్యాన్ని తుత్తునియలు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గుర్తుకు వచ్చారు. గత శతాబ్ది తొలి పాదంలో, మధ్య భాగంలో కనబడిన ఆ స్పందన, చైతన్యం, ప్రశ్నించే స్ఫూర్తి ఇప్పుడు కరవైపోతున్నదా అని తీవ్ర విచారం కలిగింది. మతోన్మాదుల ఘర్ వాపసీ ప్రేలాపనలకు గతానికీ వర్తమానానికీ ఎడతెగకుండా జరుగుతున్న సంభాషణ నుంచి ఎన్ని జవాబులు చెప్పవచ్చు గదా అనిపించింది.

ఘర్ వాపసీ నినాదం నిజానికి మతవిద్వేషానికి ముసుగు. ‘ఇంటికి తిరిగిరండి’ అని పిలుస్తున్నవారు చూపుతున్నది ఇల్లూ కాదు, తిరిగివస్తే ఏ ఇంట్లో ఉంచుతారో, అసలు ప్రాణాలతో ఉంచుతారో లేదో తెలియదు. ఇంతకూ అది పిలుపు కూడ కాదు. అది ఒక బెదిరింపు. నేరారోపణ. వేధింపు. భీతావహ వాతావరణం సృష్టించడానికి హంతకశక్తులను ప్రేరేపించే ఉచ్ఛాటన. అది సరిగ్గా అడాల్ఫ్ హిట్లర్ ఇతర మతస్తుల పట్ల, ముఖ్యంగా యూదుల పట్ల ప్రదర్శించిన వ్యతిరేకత లాంటిది. కాకపోతే ఈసారి అది తోసేసే, చిత్రహింసలు పెట్టే. చంపేసే రూపాన్ని కాసేపటికోసం దాచుకుని పిలిచే ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. ‘ఈ పిలుపుకు రాకపోయావో, చూసుకో ఏం చేస్తానో’ అనే బెదిరింపు అది. పిడికెడు మందిని ఆకర్షించగలిగినా లేకపోయినా, కోట్లాది మందిని బెదురుకు, అభద్రతకు గురిచేసి, తమ నేల మీద తాము బెరుకుబెరుకుగా జీవించేలా చేసే యుద్ధారావం అది. అనేక సంస్కృతుల, భాషల, మతాల, కులాల బహుళత్వపు భారతీయతను ఏకత్వంలోకి, అది కూడ సంఘపరివార్ నిర్వచించే బ్రాహ్మణీయ సంకుచిత హిందుత్వలోకి కుదించదలచిన మతరాజకీయాల ఎత్తుగడ అది. ఘర్ వాపసీ అనే మాటకు ఇంటికి తిరిగిరావడం అనే తటస్థమైన అర్థమే కనబడుతుంది. అది ఆత్మీయ పునరాగమనం లాగే, పునర్మిలనం లాగే అనిపిస్తుంది. కాని అసలు లక్ష్యం ఇతర మతాల పట్ల ద్వేషం. ఇతర మతస్తుల పట్ల ద్వేషం. మతాల మధ్య, మనుషుల మధ్య భేదాన్ని, అసహనాన్ని, అనుమానాన్ని, విద్వేషాన్ని, రక్తపిపాసను, హంతక దాడులను ప్రోత్సహించి, మతం పెట్టుబడిపై రాజకీయ లాభాలను సంపాదించదలచిన క్షుద్రక్రీడ అది.

‘భారతదేశంలో ఉండాలంటే హిందువులు కావలసిందే’ అనే సంఘ పరివార్ శక్తుల బెదిరింపులకు కొనసాగింపే ఘర్ వాపసీ. ప్రస్తుతం ఇతర మతాలను అవలంబిస్తున్న భారతీయుల పూర్వీకులందరూ హిందువులేననీ, వారు పాలకుల బలప్రయోగం వల్లనో, మతబోధకుల ప్రలోభాల వల్లనో మతాంతరీకరణ చెందారనీ, అందువల్ల ప్రస్తుత హైందవేతరులందరూ తిరిగి ఇంటికి రావాలనీ ఒక అచారిత్రక కుతర్కాన్ని సంఘపరివార్ శక్తులు తయారు చేశాయి. ఈ తర్కానికి పరాకాష్టగా ఒక కేంద్ర మంత్రి ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను రామ్ జాదే (రాముడి సంతానం) అవుతారా, హరామ్ జాదే (అక్రమ సంతానం) అవుతారా తేల్చుకొమ్మని సవాల్ విసిరింది. ముస్లిం యువకులు హిందూ యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని, హిందూ మతస్తుల సంఖ్య తగ్గించడానికీ, ముస్లింల సంఖ్య పెంచడానికీ కుట్ర పన్నుతున్నారనీ, ఈ లవ్ జిహాద్ ను అడ్డుకోవాలనీ సంఘ పరివార్ పిలుపునిస్తోంది. దీనికి ప్రతిగా ‘బహు లావో – బేటీ బచావో’ అని నినాదం ఇస్తోంది.

rss-muslims-conversions-pti

ఈ ప్రమాదకర మత రాజకీయాల నేపథ్యంలోనే ఘర్ వాపసీ నినాద స్థాయి నుంచి ఆచరణ స్థాయికి మారింది. సంఘపరివార్ లో బలప్రయోగశక్తిగా పేరుపొందిన బజరంగ్ దళ్ తో పాటు, కొత్తగా ఇందుకోసమే పుట్టిన ధర్మ్ జాగరణ్ సమితి ఆగ్రాలో దాదాపు 350 మంది వీథి బాలలను, ఫుట్ పాత్ నివాసులను, అనాథలను పోగుచేసి, వారిని “శుద్ధి” చేసి, హిందూ మతంలోకి తిరిగి చేర్చుకున్నాయి. ఈ ఘర్ వాపసీలను విస్తృతంగా సాగించి 2021 కల్లా క్రైస్తవులు, ముస్లింలు లేని, హిందువులు మాత్రమే ఉండే భారతదేశాన్ని తయారుచేస్తామని ధర్మ్ జాగరణ్ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ అన్నాడు. ఇటువంటి ప్రకటనలనే దేశవ్యాప్తంగా సంఘ పరివార్ నాయకులు పునరుక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు, బెదిరింపులు మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని ఎందరో హెచ్చరించిన తర్వాత స్వయంగా ప్రభుత్వాధినేతలు కాస్త స్వరం తగ్గించి, మార్చి ఈ పామును ఇప్పటికి బుట్టలో పెట్టారు గాని, మళ్లీ ఎప్పుడు ఆ బుట్ట మూత తీసి ప్రజలను పాముకాటుకు ఎరచేస్తారో తెలియదు.

ఈ ప్రకటనలకు, వ్యాఖ్యలకు, బెదిరింపులకు ఉపయోగిస్తున్న తర్కం అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మతస్వేచ్ఛ మీద, ఆదేశిక సూత్రాలలో ప్రకటించుకున్న శాస్త్రీయ దృక్పథ ప్రాధాన్యత మీద దాడి ఇది. ఈ తర్కం అచారిత్రకమైనదీ, అసంబద్ధమైనదీ, అర్థరహితమైనదీ కూడ. ఎందుకంటే, హిందూ మతం అనే మతం ఒకటి ఉందా అనే ప్రశ్నను అలా ఉంచినప్పటికీ, హిందూ మతానికి ప్రాతిపదిక వర్ణాశ్రమ ధర్మం. కుల అంతరాలు. మరి ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా, వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు. పూర్వీకుల కులంలోకే వెళతారని కొందరు, కోరుకున్న కులంలోకి వెళ్లవచ్చునని కొందరు అంటున్నారు. పూర్వీకుల కులంలోకే వెళ్లవలసి ఉంటే ఘర్ వాపసీ కి అర్థం లేదు. కోరుకున్న కులంలోకి వెళ్లే అవకాశం ఉంటే హిందూ మతమే మిగలదు. అసలు ‘హిందూ మతం’ అనేదేదైనా ఉంటే, ఒకప్పుడు మతాంతరీకరణకు గురయ్యారనుకునేవాళ్లందరూ ఎప్పుడైనా ఆ మతం పరిధిలోనే ఉన్నారా, ఆ మతం వారిని తనలోపలికి తీసుకుందా అనేవి అనుమానాస్పదమైన, ఆధారాలు లేని అంశాలని చరిత్ర చెపుతున్నది.

అలాగే గతంలో పాలకులు బలప్రయోగంతో, మతబోధకులు ప్రలోభాలతో మతాంతరీకరణ జరిపారనే వాదన కూడ పూర్తి సత్యం కాదు. సాధారణంగా హిందుత్వవాదులు బలప్రయోగం అన్నప్పుడు ముస్లిం పాలకుల కాలాన్ని, ప్రలోభాలు అన్నప్పుడు క్రైస్తవ మతబోధకుల కాలాన్ని సూచిస్తారు. కాని నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు. అసలు మతాంతరీకరణకు ఇలా ఆకర్షించడమే (పుల్ ఫాక్టర్) ఏకైక కారణం అనడం సరికాదు. భారత సమాజంలో మతాంతరీకరణకు అనేక సంక్లిష్ట కారణాలు ఉండే అవకాశం ఉంది. కాని ప్రధాన కారణం మాత్రం హిందూ వర్ణాశ్రమధర్మ, కుల అసమానతల సమాజం బైటికి తోయడం, వికర్షించడం (పుష్ ఫాక్టర్) కావచ్చు. ఈ సమాజంలో వివక్షకు, అసమానతకు, పీడనకు, అంటరానితనానికి గురైన వర్గాలలో అత్యధికులు అవకాశం వచ్చినప్పుడు మరొక మతం వైపు చూశారు. అందులోనూ అసమానత సహజమైనదని, భగవంతుడే సృష్టించాడని “హిందూ” మతం అంతరాలకు దైవిక సమర్థన ఇస్తుండగా, ఆ అంతరాల పీడనకు గురవుతున్నవారిని చేరవచ్చిన మతాలు కనీసం సైద్ధాంతికంగానైనా ప్రేమను, కరుణను, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాయి.

సరే, ఈ చర్చంతా ఎలా ఉన్నా ఇంత ప్రధానమైన అంశం మీద బుద్ధిజీవులు స్పందించవలసి ఉంది. కాని తెలుగు బుద్ధిజీవులలో అతి తక్కువ మంది మాత్రమే ఘర్ వాపసీ గురించి ఆలోచించడం, స్పందించడం, మరింత తక్కువ మంది ఆ స్పందనను రచనల్లో చూపడం చూస్తే విచారం కలుగుతున్నది. కనీసం వంద సంవత్సరాల కింద గురజాడ అప్పారావు, డెబ్బై సంవత్సరాల కింద శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అరవై సంవత్సరాల కింద వట్టికోట ఆళ్వారుస్వామి ఈ విషయంలో చూపినంత స్పందననైనా మనం ఇవాళ చూపలేకపోవడం ఎందుకో ఆలోచించాలనిపిస్తున్నది.

ఈ దేశం మాదే అని ప్రకటించే అధికారం “హిందువుల”మని చెప్పుకునేవారికి లేదని గురజాడ, శ్రీపాద ఇద్దరూ చాల స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిష్ వారు నిన్న వచ్చారని, ముస్లిములు మొన్న వచ్చారని అనుకుంటే అటు మొన్న నువ్వు వచ్చావని మరచిపోయి, విభేదాలు పెట్టగూడదని గురజాడ ప్రబోధించారు. ఆ మాటలో కూడ ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తే, బ్రిటిష్ వారిని భాషతోనూ, ముస్లింలను మతంతోనూ గుర్తించడం వంటి బ్రిటిష్ చరిత్రకారులు మనకు అంటించిన లోపం ఉన్నప్పటికీ, ఈ మతవైవిధ్యం విభేదాలకు, విద్వేషాలకు కారణం కాగూడదని సూచించడం ఇవాళ్టికీ అవసరమైన ప్రజాస్వామిక అవగాహన.

అలాగే ‘పెద్దమసీదు’ కథలో “కాకుళేశ్వరుడి గుడి పగలగొట్టి మ్లేచ్ఛుడు మసీదు కట్టాడు” అని ఒక పాత్రతో అనిపిస్తూనే “దేవుడెందుకూరకున్నాడు స్వామీ” అని ప్రశ్నవేయించి, “ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా…” అని వ్యంగ్యంగా మనిషి చేసిన దేవుడి నిస్సహాయతను చూపించారు. అట్లాగే ‘మీ పేరేమిటి?’ కథలో హిందూ మతంలో భాగమనుకునే శైవ వైష్ణవ శాఖల మధ్య ఘర్షణలను చిత్రించారు. ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని ఒక అమాయకమైన, కాని అవసరమైన ఆశను ప్రకటించారు.

ఆ తర్వాత రెండు మూడు దశాబ్దాలకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మత మౌఢ్యాన్ని విమర్శిస్తూ, వెటకరిస్తూ రాసిన అనేక రచనల్లో ‘మనకా మతాభిమానం’ అనే అద్భుతమైన వ్యాసం ఇక్కడ గుర్తు తెచ్చుకోదగినది.

“…మన మతం యేది?

దీనికి సమాధానం రావాలంటే, ముందు, మనం యెవరమో తేల్చుకోవాలి.

మనం అంటే హిందువులం అనుకుందామా, మన సనాతనత్వం పోతుంది.

ఏమంటే?

ఈ పేరు మనకి దరిమిలా వచ్చింది.

పైగా, యిది జాతివాచకం గాని మతవాచకం కాదు.

నిజం గుర్తిస్తే, అసలు, మనం హిందువులమే కాము.

హిందూ శబ్దం మనం సృష్టించుకున్నది కాదు.

ఆ శబ్దానికి సాఫీ అయిన అర్థమూ లేదు…”

అంటూ ప్రారంభించి పాండిత్యమూ తర్కమూ వ్యంగ్యమూ కలగలిసిన, ఆయనకు సహజమైన వాదనాశక్తితో అపురూపమైన చర్చ చేసి చివరికి,

”ఈ మతాల ఉల్బణం పాతవాటితో నిలిచిపోయినా వొక దారే; కాని, యిప్పటికీ కొత్త మతాలు పుడుతూనే వున్నాయి.

బ్రహ్మ సమాజం,

ఆర్యసమాజం,

రాధాస్వామి మతం,

హరనాథ మతం,

సాయిబాబా మతం,

దివ్యజ్ఞాన మతం,

పులిమీద పుట్ర అన్నట్టు, అన్నిటికీ పైన రాజకీయమతాలు.

ఇలాగ ఆర్యుల దగ్గరినుంచీ – అంటే, ఆర్యులలోనూ ఉత్తమోత్తములైన బ్రాహ్మల దగ్గిరనుంచీ – ఆ బ్రాహ్మలలోనూ, భిన్నమతాల – భిన్న శాఖల – భిన్ననాడుల దగ్గిరనుంచీ, వేద బాహ్యుల దాకా, వేదబాహ్యులలోనూ, అస్పృశ్యులదాకా, అస్పృశ్యులలోనూ మళ్లీ అస్పృశ్యులదాకా వున్న నానావర్ణ, నానాకుల, నానావర్గ, నానాదృక్పథాల వారూ, నానా ప్రాప్యాలవారూ హిందువులు.

ఆ హిందువులం మనం.

ఈ ‘మన’కా మతాభిమానం?

థిక్!” అని ఛీత్కరించారు.

అలా గురజాడ, శ్రీపాదలలో మతం గురించి కొంత హేతువాద దృష్టితో, కొంత ప్రజాస్వామిక దృష్టితో, కొంత పాశ్చాత్య ప్రభావపు ఉదారవాద దృష్టితో కనబడిన వైఖరిని, వట్టికోట ఆళ్వారుస్వామి తన అపారమైన ప్రజాజీవితానుభవం నుంచి, మార్క్సిస్టు అవగాహన నుంచి మరింత విస్తరించారు.

హైదరాబాదు రాజ్యంలో 1938కి ముందు పరిస్థితులు ఇతివృత్తంగా రాసిన ‘ప్రజలమనిషి’ నవల సహజంగానే మతం గురించి రాయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. నవలా కాలపు హైదరాబాద్ రాజ్యం మతరాజ్యం కాదు గాని, పాలకుల వ్యక్తిగత మతం ఇస్లాం. పాలితులలో అత్యధికులు హిందువులు అనడం కూడ నిశితంగా చూస్తే సరికాదు గాని, అటూ ఇటూ కూడ మతం పునాది మీద ప్రజాసమీకరణలు మొదలయినది ఆ కాలంలోనే. ప్రత్యక్షంగా రాజకీయ సంస్థలు ఏర్పడడానికి అవకాశం లేని స్థితిలో హిందువుల లోనూ, ముస్లింల లోనూ ఆర్యసమాజ్, హిందూ మహాసభ, ఆర్యరక్షణ సమితి, శుద్ధి ప్రచార్, హిందూ సబ్జెక్ట్స్ కమిటీ, సేవాదళ్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్-ఇ-ఇస్లాం, అంజుమన్-ఇ-ఖాక్సరన్ వంటి మతసంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. వీటిలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్ హిందువులను మతాంతరీకరించడానికి, అనల్ మాలిక్ (ముస్లిం అయిన ప్రతి ఒక్కరూ రాజే) అనే కుహనా ఆభిజాత్యం ప్రచారం చేయడానికి ప్రయత్నించగా, అలా మారిన వారిని “శుద్ధి” చేసి తిరిగి హిందువులుగా మార్చడానికి ఆర్యసమాజ్, ఆర్య రక్షణ సమితి, శుద్ధి ప్రచార్ వంటి సంస్థలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు భౌతిక ఘర్షణలుగా పరిణమించిన తర్వాత నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ లో నాలుగు హిందూ సంస్థలను, మూడు ముస్లిం సంస్థలను నిషేధించింది.

ఆ చరిత్ర వివరాలు ఇక్కడ అవసరం లేదు గాని, తబ్లీగ్ (మత పరివర్తన), శుద్ధి అనే పేర్లతో అప్పుడు సాగిన వ్యవహారమే ఇప్పుడు మతాంతరీకరణ, ఘర్ వాపసీ పేర్లతో పునరావృతమవుతున్నది. ఈ తబ్లీగ్, శుద్ధి కార్యక్రమాల మత రాజకీయాలను ఆళ్వారుస్వామి ‘ప్రజలమనిషి’ లో రెండు అధ్యాయాలలో వివరంగా చిత్రించారు.

అప్పటిదాకా దొర రామభూపాల్ రావు అనుయాయిగా ఉండిన హైదరలీ “…దిమ్మెగూడెంలో హరిజనులను మహమ్మదీయులుగా చేసే సన్నాహాలు” ప్రారంభిస్తాడు. “హైదరలీ ప్రతిరోజు చావడి ముందర కూర్చొని హరిజనులతో సానుభూతిగా మాట్లాడేవాడు. వాండ్ల కష్టాలు పోయే రోజులు వచ్చాయని, ఇన్నాళ్లకు భగవంతుడు హరిజనులకు మేలు చేయబోతున్నాడని, హరిజనుల కష్టాలకు ఆలా హజ్రత్ హృదయం నీరైపోతున్నదని హరిజనులతో అంటుండేవాడు. భూములు, చదివించిన తర్వాత ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుందని, మొత్తంపై హరిజనుల గూడెంలో సుముఖ వాతావరణం కల్పించాడు.”

ఇంతకాలమూ తమను దూరం చేసి ఉంచిన మొత్తం గ్రామంపై ఇది ఒక ప్రతీకారంగా దళితులు భావించారు. చివరికి అంజుమన్ నాయకుడు వచ్చి మతపరివర్తన జరిపే రోజున “వచ్చినప్పుడల్లా హరిజనులతో వెట్టి పనులు చేయించుకునే పోలీసు వాండ్లు ఆ రోజు చాకలి, మంగలి, కుమ్మరి వాండ్లతో చేయించుకున్నారు. హరిజనుల స్థాయి పెరిగినట్టు తోచి పోలీసువాండ్లకు ఈర్ష్య కలిగింది.” అంజుమన్ నాయకుడు తన ఉపన్యాసంలో “ఈ గ్రామంలో అందరివలె పుట్టిపెరిగినా మీరు ఊరికి దూరంగా మురికికొంపల్లో ఉంటున్నారు. మీరు పందుల్లాగ బ్రతుకుతున్నారు. వేరేవాండ్లవద్ద మీకు కుక్కలకున్న గౌరవం లేదు. మీతో పొద్దస్తమానం పని చేయించుకొని కడుపుకు నిండని కూలి, జీతాలు ఇస్తున్నారు…” అని వాస్తవ స్థితి చెపుతాడు. ప్రచారకుడు “మీరు మహమ్మదీయుల్లో కలిస్తే మీ కష్టాలు పోతాయి. మీరంతా మహమ్మదీయులతో సరిసమానముగా విద్య, ఉద్యోగాలు పొందవచ్చును. హిందువుల దేవాలయాల్లోనికి వెళ్లలేనివారు, ఊరి చేదబావులవద్దకి పోజాలనివారు స్వేచ్ఛగా మస్జిద్ లోకి వెళ్లవచ్చును. చేదబావుల్లోకి వెళ్లవచ్చును…” అంటాడు.

ఒక మతంలోని అసమానత, వివక్ష, అన్యాయం ఎట్లా మరొక మతంవైపు చూడడానికి పునాది కల్పిస్తున్నాయో వాస్తవికమైన చిత్రణ ఇది. ఆళ్వారుస్వామి అక్కడితో కూడ ఆగిపోలేదు. ఆ వికర్షణ కావలసిన ఫలితం సాధించబోదనే విమర్శ కూడ అందులోనే భాగం చేశారు. ఆ ఉపన్యాసాలు సాగుతుండగానే “యిగ హైదరలీ ఎంత జీతం యిస్తడో చూస్తం గద” అనీ, “దొర గుంజుకున్న భూములు, తీసుకున్న లంచాలు ఇప్పిస్తరా” అనీ మౌలిక సమస్యల వైపు కూడ దృష్టి మళ్లించారు.

“మహమ్మదీయులుగా మారిన హరిజనులు జీతగాండ్లుగా పనిచేయడానికి వెనుక ముందాడారు. అయితే ఏమీ పని చేయకుండా ఎన్నాళ్లు ఏ విధంగా బ్రతకడం? వెంటనే చదువులు, ఉద్యోగాలు, భూములు పొందడం సంభవమా? భూములు ఏవిధంగా లభిస్తాయి? ఎవరివల్ల, ఎవరివి, ఎప్పుడు, ఏ విధంగా భూములు హరించబడ్డాయి?…” అని మతాన్ని, మత పరివర్తనను మించిన ప్రాథమిక మానవావసరాల గురించి, రాజకీయార్థిక కారణాల గురించి మాట్లాడించారు.

ఈ మతాంతరీకరణ వెనుక రాజ్యం ఉన్నదనే అవగాహనతో కంఠీరవం దాన్ని వ్యతిరేకించినప్పుడు, “చెప్పుదెబ్బలు తింటూ, గులాములై పడివున్న మాదిగోండ్లు ఆత్మగౌరవం, సంఘమర్యాద పొంది ఉండటం ఈ బాపనోడికి సహింపరాకుండా ఉంది” అని అంజుమన్ నాయకుడితో అనిపించి, బహుశా ఆరు దశాబ్దాల తర్వాతి అస్తిత్వవాదం చేపట్టబోయే అతివాద వ్యాఖ్యలను కూడ ఆళ్వారుస్వామి ఊహించారు. “…ఇతరులు హరిజనులను అణగదొక్కుటే మీ కార్యక్రమానికి మూలకారణమైతే, ఆ హరిజనులకు మీరు ఒరగపెట్టేది కూడా ఏమీ లేదు. వాండ్లగతి ఇట్లాచేస్తే అసలే మారదు” అని కంఠీరవంతో జవాబు కూడ చెప్పించారు.

హైదరలీ గురించి “హరిజనులను మహమ్మదీయులను చేసి ఉద్ధరించ బయలుదేరిన ఈ పెద్దమనిషి అన్యాయంగా తోటి మతం వాండ్లయిన దూదేకులవారి భూమిని హిందువైన ఒక దొర ఆసరాతో హరించాడని మీరు తెలిసికోవాలె” అని న్యాయస్థానంలో కంఠీరవం చేత మళ్లీ ఒకసారి మౌలికమైన భూమి సమస్య లేవనెత్తించారు. గ్రామంలో కొమరయ్య భూమి తగాదాతో దొరకు వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణం ఈ మత పరివర్తనతో మారిపోయి, మహమ్మదీయులైన వాండ్లను శత్రువులుగా చూసే స్థితికి ఎలా దారితీసిందో చిత్రించి ఈ వ్యవహారాలు అసలు సమస్యలను ఎలా పక్కదారి పట్టిస్తాయో చెప్పారు.

తబ్లీగ్ గురించి ఎంత తీవ్రంగా రాశారో, శుద్ధి గురించి కూడ అంత తీవ్రంగానే రాశారు. మరీ ముఖ్యంగా శుద్ధి కార్యక్రమాన్ని ఊళ్లోకి దొర తెచ్చాడు గనుక దాని వెనుక ఉన్న స్వార్థప్రయోజనాలను ఎత్తి చూపారు.

శుద్ధి కార్యక్రమాన్ని విమర్శిస్తూ “తురకలైతే ఒరిగింది లేదు. హరిజనులైతే అనుభవిస్తున్నది లేదు. అన్ని ఎప్పటోల్నే ఉన్నయి” అనీ, “ప్రధానిగారు తురక, హిందువు అని అంటున్నరు. మరి ఇప్పుడు కష్టాలు చెప్పుకున్నోళ్లంతా హిందువులేనయిరి. దొర హిందువేనాయె. మానుకుంటె ఎవడన్న కొట్టొచ్చిండా” అనీ పరంధామయ్యతో అనిపించారు.

“సర్కారు మన్సులు తురకలైనా మనోడైనా చేసే గోల, ఆరాటం, తిట్లు, కొట్లు, అది కావలె, ఇది కావలె అని అల్లుండ్లోలె అన్ని సాగించుకొని పొట్టపగుల మెక్కి, మిగిలింది మూటలు కట్టుకొని పోటం లేదే” అని చాకలి సర్వయ్య, “ఆ యిందువేందో, తుర్కేందో, హైదరలీ బీట్లకు పోయినా, దొరగారి ఏనెకు పోయినా, రైతుల గెట్ల పొంటి పోయినా జీవాలను అడుగు పెట్టనియ్యరు….” అని గొల్ల వీరయ్య తమ నిత్య జీవిత అనుభవం నుంచి అసలు విషయాలు చెపుతారు.

ప్రధానంగా ఆ రెండు అధ్యాయాలు, మొత్తంగా నవల మౌలికమైన దోపిడీ, పీడనలకు మతం లేదని, అందువల్ల తబ్లీగ్, శుద్ధి అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించే అర్థరహితమైన వివాదాలని పాఠకులకు అవగాహన కలిగిస్తాయి.

ఇవాళ మళ్లీ ఒకసారి ప్రపంచీకరణ, కార్పొరేట్ దౌర్జన్యం, పెరిగిపోతున్న సామాజిక అసమానతల నేపథ్యంలో పాలకవర్గాలకు అందివస్తున్న నినాదం ఘర్ వాపసీ. హిందుత్వవాదుల గతకాలపు శుద్ధి ఇవాళ ఘర్ వాపసీ ముసుగు తగిలించుకుని బుసలు కొడుతున్న ఈ సందర్భంలో, హిందుత్వ మతోన్మాద, మతవిద్వేష రాజకీయాల గురించీ, మొత్తంగా మతవాదం గురించీ బుద్ధిజీవులు ఇంకా ఎక్కువగా మాట్లాడవలసి ఉన్నది. ఈ అనవసర వివాదాలు అసలు సమస్యల మీద ప్రజల ఆరాట పోరాటాలను పక్కదారి పట్టించడానికేనని చెప్పవలసి ఉన్నది. కనీసం గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వట్టికోట ఆళ్వారుస్వామి సాధించిన కృషిని విస్తరించి బలోపేతం చేయవలసి ఉన్నది.

గతకాలానికి చెందిన ఆ అవగాహనలో సగమో పావో అయినా ఈ అత్యాధునిక వర్తమానంలో ఉంటే ఎంత బాగుండును!

                                                                                                                                                     -ఎన్ వేణుగోపాల్

venu

కోసంబి అన్వేషణలో వెలుగు దివ్వె…

దామోదర్ ధర్మానంద్ కోసంబి రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ ఇంగ్లిషులో వెలువడిన ఆరు దశాబ్దాలకు తెలుగులోకి వస్తున్నది. తెలుగు సమాజానికీ, తెలుగు మేధో ప్రపంచానికీ అత్యంత అవసరమైన ఈ పుస్తకాన్ని ఇంత ఆలస్యంగానైనా తెలుగు చేసే అవకాశం రావడం వ్యక్తిగతంగా నాకు గొప్ప సంతోషం. ఈ పుస్తకాన్ని మాత్రమే కాక, ఎన్నో ప్రామాణిక గ్రంథాలను భారతీయ భాషలన్నిటిలోకీ అనువదింపజేసే మహత్తర బాధ్యతను తలకెత్తుకున్న నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్, ఆ బాధ్యతను తెలుగులో పంచుకుంటున్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ గ్రంథానువాదానికి నన్ను ఎంపిక చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

భారత చరిత్రకు సంబంధించి నిశితమైన ఆలోచనలు చేసి, మూడు పుస్తకాలు, దాదాపు వంద వ్యాసాలు రాసినప్పటికీ దామోదర్ ధర్మానంద్ కోసంబి (31 జూలై 1907 – 29 జూన్ 1966) ప్రాథమికంగా చరిత్రకారుడు కాదు. ఆయన అనేక శాస్త్రశాఖలతో సంబంధం ఉన్న అరుదైన మేధావి. గణితశాస్త్ర అధ్యయనం దగ్గర ప్రారంభించి ఆయన ఎన్ని శాస్త్రాలలో ప్రవేశించారో, ఎన్ని శాస్త్రాలలో మౌలిక ఆలోచనలు చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గణిత శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, జన్యుశాస్త్రం, రేఖాగణితం, నాణాల్ని బట్టి చరిత్రను కనుకొనే పణశాస్త్రం, సాహిత్య విమర్శ, పురాతత్వశాస్త్రం, భారత అధ్యయన శాస్త్రం, రాజకీయార్థిక శాస్త్రం,  చరిత్ర వంటి అనేక శాస్త్రాలలో ఆయన చెరగని ముద్ర వేశారు. మాతృభాష కొంకణితో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, పాళీ, ప్రాకృతం, లాటిన్, గ్రీకు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ భాషల్లో మూల రచనలు చదివేంత, రచనలు చేసేంత ప్రావీణ్యం సంపాదించారు.

ఆయన తండ్రి ఆచార్య ధర్మానంద్ దామోదర్ కోసంబి బౌద్ధ అధ్యయనాలలో, పాళీ భాషలో నిష్ణాతుడుగా పూనాలోని ఫెర్గూసన్ కాలేజిలో అధ్యాపకుడిగా ఉండేవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను అతిథి అధ్యాపకుడిగా, ప్రత్యేక ప్రణాళికల సభ్యుడిగా మూడు వేరువేరు సందర్భాలలో ఆహ్వానించింది. అలా తండ్రి రెండవసారి హార్వర్డ్ వెళ్లినప్పుడు ఆయన వెంట దామోదర్ కోసంబి తన పదకొండో ఏట హార్వర్డ్ కు వెళ్లి ఉన్నత పాఠశాల విద్య అక్కడే అభ్యసించారు. తర్వాత తండ్రి భారతదేశానికి వచ్చినప్పటికీ దామోదర్ కోసంబి కళాశాల విద్య కోసం అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. గణితశాస్త్రంలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని 1929లో భారతదేశానికి తిరిగివచ్చి మొదట బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు, తర్వాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు అధ్యాపకుడిగా పని చేశారు. తన తండ్రి పనిచేసిన పూనా ఫెర్గూసన్ కాలేజిలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా 1933లో చేరి, పద్నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఆతర్వాత, 1946లో అప్పుడే ప్రారంభించిన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమి భాభా ఆహ్వానంతో అక్కడ శాస్త్రవేత్తగా చేరారు గాని అణుశక్తి వంటి శాస్త్ర విషయాలలోనూ, నెహ్రూ విధానాల వంటి రాజకీయాంశాలలోనూ భాభాతో విభేదాల వల్ల 1962లో ఆ పదవి వదులుకున్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ 1964లో ఇచ్చిన సైంటిస్ట్ ఎమెరిటస్ గుర్తింపుతో పూనాలో తానే స్వయంగా మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రారంభించారు. ఖడక్ వస్లా లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందే విద్యార్థుల కోసం ఆర్కియలాజికల్ సొసైటీ స్థాపించారు. యాభైతొమ్మిదో ఏట, 1966 జూన్ 29న హఠాత్తుగా మరణించారు. దాదాపు 1920ల నుంచీ రచనలు చేస్తూ అనేక రంగాలలో వందలాది వ్యాసాలు రాసినప్పటికీ ఆయన జీవితకాలంలో ప్రచురితమైనవి చరిత్ర మీద రెండు పుస్తకాలు మాత్రమే.

కోసంబి మేధో పరిణామం, ఆయన ఒక్కొక్క శాస్త్రంలోకీ విస్తరించిన తీరు, చివరిదాకా ఆయనలో సాగిన అన్వేషణా తపన ఆశ్చర్యపరుస్తాయి. స్టెప్స్ ఇన్ సైన్స్ అనే పాక్షిక ఆత్మకథాత్మక వ్యాసంలో తాను ఏయే శాస్త్ర రంగాలలోకి ఎలా ప్రవేశించవలసి వచ్చిందో ఆయనే చెప్పుకున్నారు. అది చూస్తే యూరప్ లో పునరుజ్జీవన యుగంలో సకల శాస్త్రాలలో ప్రవేశించిన వ్యక్తులు, ‘సమస్త జ్ఞానాన్నీ నా పరిధిలోకి తీసుకున్నాను’ అని ఫ్రాన్సిస్ బేకన్ అన్నట్టు అనగల వ్యక్తులు గుర్తుకొస్తారు. “కోసంబిని చాల తరచుగా మహామేధావిగా, ‘పునరుజ్జీవన యుగపు వ్యక్తి’ గా, అసాధారణమైన మేధో మూర్తిగా వర్ణిస్తూ ఉంటారు. ఆయనను సన్నిహితంగా చూసి ఉండకపోతే అటువంటి మనిషి ఉండగలడని నేను నమ్మేదాన్ని కాదు” అని ఆయన కూతురు మీరా కోసంబి ఆయన శతజయంతి సందర్భంగా ఆయన వ్యక్తిగత, సామాజిక, మేధో జీవితం గురించి రాసిన వివరమైన వ్యాసంలో అన్నారు.

గణితశాస్త్రం కచ్చితమైన శాస్త్రమనీ, అది ప్రకృతి భాష అనీ, తనను అది సమ్మోహపరిచిందనీ ఆయనే చెప్పుకున్నారు. ఆయన తొలి ఆలోచనలు, పరిశోధనలు, రచనలు గణితశాస్త్రంలో, ప్రత్యేకించి టెన్సర్ అనాలిసిస్ పాథ్ జామెట్రీ వంటి రంగాలలో సాగాయి. ఆ క్రమంలోనే ఆయన 1943లో జన్యు శాస్త్రంలో ప్రవేశించి క్రోమోజోమ్ మాపింగ్ మీద ఒక రచన చేసి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘కోసంబి సూత్రం’ అనేదాన్ని తయారుచేశారు. గణితశాస్త్రం నుంచి సహజమైన కొనసాగింపుగా సంఖ్యాశాస్త్రంలో ప్రవేశించి 1944లో ప్రాపర్ ఆర్థోగొనల్ డికాంపోజిషన్ అనే విశిష్ట సాంకేతిక పద్ధతిని కనిపెట్టారు. ఆ క్రమంలో నాణాల పరిశోధన ప్రారంభించారు. ఏడువేల నాణాలను తాను స్వయంగా తూచానని ఆయనే చెప్పుకున్నారు. ఆ నాణాల తూకం మార్పుల గురించి చేసిన ఆలోచనలతో ఆయన పణశాస్త్రానికి శాస్త్రీయమైన పునాది వేశారు. నాణాలను అవి ముద్రించిన రాజుల కోసమో, వాటి లోహాల కోసమో కాక, వాటి మీద సంతకం చేసిన సమకాలీన సమాజం కోసం అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. ఈ నాణాల అధ్యయన క్రమంలోనే ఆయనకు ప్రాచీన చరిత్ర పట్ల, మొత్తంగా చరిత్ర పట్ల ఆసక్తి కలిగింది. అదే మరొకవైపు ప్రాచీన సంస్కృత, పాళీ సాహిత్య అధ్యయనానికీ, పరిష్కరణకూ, సాహిత్య విమర్శకూ దారి తీసింది. చరిత్ర రచనకు గతకాలపు ఆధారాలు ఎంత కీలకమో, ‘భారతదేశం అనేది ఒక సుదీర్ఘ అవశేషాల దేశం’ అనే అవగాహనతో వర్తమానంలో జీవిస్తున్న గతాన్ని అధ్యయనం చేయడమూ అంతే ముఖ్యమని ఆయన అనుకున్నారు. అందువల్ల పురాతత్వ శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఇంకా ఆదిమ తెగ జీవితం గడుపుతున్న సమూహాలకూ, ఆధునికులమనుకుంటున్నవారిలోని ఆదిమ ఆచారాలకూ అంతే ప్రాధాన్యమిచ్చారు. ఆ రకంగా కోసంబి అసాధారణమైన చరిత్రకారుడిగా, పురాతత్వవేత్తగా ఎదిగారు.

కోసంబి మరణం తర్వాత అర్ధశతాబ్ది గడిచాక ఆయన మేధో జీవితం నుంచి మాత్రమే కాదు, సామాజిక జీవితం నుంచి కూడ గ్రహించవలసినవి ఉన్నాయి. ఆయన తనది చారిత్రక భౌతికవాద దృక్పథమని, అంటే మార్క్సిజమని స్పష్టంగానే ప్రకటించుకున్నారు. అయితే తాను చూస్తున్న భారత కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కొందరు అనుసరిస్తున్న మార్క్సిజం నుంచి తనను తాను వేరు చేసి కూడ చూపుకున్నారు. వారికి అధికార మార్క్సిస్టులు (అఫీషియల్ మార్క్సిస్టులు) అని పేరు పెట్టి, ఆ ఇంగ్లిషు మాట పొడి అక్షరాలలో ఒ ఎం – ఓం – అవుతుంది గనుక అలా వ్యంగ్యంగా కూడ పిలిచారు.

“రాజకీయ అనివార్యతో కోసమో, పార్టీ సంఘీభావం కోసమో అయినా సరే, మార్క్సిజాన్ని ణితశాస్త్రం లాగ మొరటు రూపవాదానికి కుదించగూడదు. అలాగే దాన్ని ఒక ఆటోమాటిక్ కోతయంత్రం మీద పని వంటి ప్రామాణిక సాంకేతిక పరిజ్ఞానంగానూ చూడడానికి వీలులేదు. మానవసమాజం అనే దానిలో ఉన్న పదార్థానికి అనంతమైన వైవిధ్యం ఉంది. పరిశీలకుడు తాను కూడ పరిశోధిస్తున్న జనాభాలో భాగమే. పరిశీలకుడు పరిశీలిస్తున్న జనాభాతో బలంగానూ, పరస్పరంగానూ చర్య-ప్రతిచర్యలో ఉంటాడు. అంటే అర్థం సిద్ధాంతాన్ని విజయవంతంగా అన్వయించాలంటే విశ్లేషణాశక్తి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఒక నిర్దిష్ట స్థితిలో కీలక అంశాలేవో వెలికితీయగల సామర్థ్యం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇది కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునే విషయం కాదు. దాన్ని నేర్చుకోవాలంటే ప్రజానీకంలోని ప్రధాన భాగాలతో నిరంతర సంబంధంలో ఉండాలి. ఒక మేధావి విషయంలో, దాని అర్థం, కొన్ని నెలలైనా శారీరక శ్రమలో గడపడం, శ్రామిక వర్గంలో ఒకరిగా తన జీవనోపాధి సంపాదించుకోవడం. ఏదో ఉన్నతవ్యక్తిలాగనో, సంస్కరణవాదిలాగనో, మురికివాడలను సందర్శించే సున్నితమనస్కుడైన “ప్రగతిశీల” వ్యక్తిగానో కాదు” అని ఆయన రాసిన మాటలు గుర్తుంచుకోదగ్గవి.

ఈ దృక్పథంతోనే ఆయన శాంతి ఉద్యమంలో పనిచేశారు. యన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీని భారత – సోవియట్ మైత్రికి అంకితం చేశారు. చైనా ప్రభుత్వానికి ప్రణాళికా రచనలో సలహాదారుగా పనిచేశారు. భారత ప్రభుత్వం కొత్తొక వింత అన్నట్టుగా ప్రమాదకరమైన అణుశక్తి వైపు చూస్తున్నదనీ, నిజానికి భారత దేశం సౌరశక్తి అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టాలనీ అన్నారు.

10933839_10152645132701700_7940360244292075573_n

“…యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ని మళ్లీ చదవడం ఒక గొప్ప అనుభవమని రుజువవుతుంది. అది అపారమైన ప్రతిభతో మాత్రమే కాదు, హేతువాదపు బలోపేతమైన నిర్ధారణతో ముఖాముఖీ కూడ…. ఆ అధ్యయనంలో పాథకులు కోసంబిలోని మరొక మౌలికమైన అంశాన్ని కూడ గుర్తించగలరు. అది నిజమైన మార్క్సిస్టు చరిత్ర అధ్యయనం ప్రయత్నాలన్నిటికీ ఉమ్మడి అంశం. అదేమంటే గతాన్ని వర్తమానంతోనూ, (భవిష్యత్తు తోనూ) కూడ అనుసంధానించడం. అణచివేతకూ దోపిడీకీ గురవుతున్నవారి విముక్తి సాధించాలనే మౌలిక నిబద్ధత” అని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.

సరిగ్గా అరవై సంవత్సరాల కింద 1954లో, న్యూయార్క్ నుంచి వెలువడే మాసపత్రిక ‘మంత్లీ రివ్యూ’ లో ‘ఆన్ ది క్లాస్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా’ అనే వ్యాసంలో “భారత దేశానికి పరిష్కారం సోషలిజమే. అది మాత్రమే పెరుగుతున్న సరఫరాకు తగిన గిరాకీని సృష్టించగలదు. అటువంటి పరిష్కారాన్ని ఉపయోగించుకోగలిగినది అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాదనీ, వెనుబడిన దేశాలు కూడ ఉపయోగించుకోగలవనీ చైనా చూపుతున్నది. అటువంటిది లేకపోతే ప్రణాళికా విధానం నిష్ప్రయోజకమవుతుంది. అయితే, భారత బూర్జువావర్గం ఉత్పత్తి కోసం ఆధునిక విదేశీ యంత్రాలను దిగుమతి చేసుకున్నట్టే, మిగిలిన పరిష్కారాలన్నీ విఫలమైనప్పుడు, రాజకీయాలలో తాజా పెట్టుబడిదారీ పరిణామాలను కూడ దిగుమతి చేసుకుంటుంది. అంటే సోషలిజానికి దీర్ఘకాలికంగా ఏకైక ప్రత్యామ్నాయమైన ఫాసిజాన్ని దిగుమతి చేసుకోవడం అని అర్థం. ఇప్పటికే ‘ఉక్కు మనిషి’ కావాలి అనే మాట అభిజ్ఞవర్గాలలో వినబడుతున్నది. అందుకు నమూనాలు కూడ అందుబాటులో ఉన్నాయి” అని డి డి కోసంబి రాశారు.

ఆ మాటలకు ప్రాధాన్యత పెరిగిన రోజుల్లో ఈ తెలుగు అనువాదం వెలుగు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది.

**

డి డి కోసంబి రచనలతో నా పరిచయం 1978 మొదట్లో జరిగిందని గుర్తు. ‘సంస్కృత సాహిత్యం – వర్గ పరిణామాల ప్రతిబింబం’ అనే కోసంబి వ్యాసాన్ని సృజన మార్చ్ 1978 సంచికలో అచ్చువేశాం. ఆ వ్యాసానికి రచయితగా కోసంబి పేరు ఉంది గాని అది కోసంబి రాసిన వ్యాసానికి పరిచయ వ్యాసమే. పరిచయకర్త పేరు అచ్చు కాలేదు గాని బహుశా అంతకుముందు ఎమర్జెన్సీ సమయంలో జైలులో నడిపిన లిఖిత పత్రికలలో కె వి రమణారెడ్డి రాసిన వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసం చదివిన నాటి నుంచీ కోసంబి గురించి వింటూ ఆయన రాసిన పుస్తకాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉండగా మూడు నాలుగేళ్ల తర్వాత బెజవాడలో ఈ పుస్తకం నాచేతికి దొరికింది. ఏలూరు రోడ్డులో నవోదయ బుక్ హౌజ్ లో ముందు రెండు పెద్ద గదుల్లో పుస్తకాలు కాక రామమోహనరావు గారు కూచునే వెనుక గదిలో చరిత్ర, అర్థశాస్త్రం పుస్తకాల బీరువా ఉండేది. అక్కడ ఈ యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకం మొదటిసారి చూశాను. ఇప్పటికి ఎన్నోసార్లు చదివి తోలులా మారిపోయిన ఆ పుస్తకం మీద సంతకాన్ని బట్టి దాన్ని 1982 ఏప్రిల్ 17న కొన్నాను. అప్పుడది ఇరవై ఎనిమిది రూపాయల పుస్తకం. ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ పుస్తకం నా కాపీ 1984 ఏప్రిల్ 19న మద్రాస్ మూర్ మార్కెట్ లో కొన్నానని సంతకం ఉంది. అలాగే మిగిలిన పుస్తకాలన్నీ సంపాదించి చదవడం, కోసంబికి అభిమానిగా మారడం జరిగాయి. కోసంబి ఆలోచనల్లో, సూత్రీకరణల్లో కొన్ని మారవలసిన అవసరం ఉన్నదని తెలిసినా ఆయన తీసుకున్న మౌలిక దృక్పథం వల్ల, విస్తారమైన పరిజ్ఞానాన్ని అలవోకగా అందించే ఆయన పద్ధతి వల్ల ఆ అభిమానం తగ్గలేదు. ఇరవై సంవత్సరాల కింద ఒక ఔత్సాహిక ప్రచురణకర్త ఈ పుస్తకాన్ని అనువదించమని అడిగితే వెంటనే అంగీకరించాను, కారణాంతరాలవల్ల ఆ ప్రచురణ ప్రతిపాదనే వెనక్కిపోయి, ఇప్పుడిది మాత్రం వెలుగు చూస్తోంది.

పుస్తకావిష్కరణ సభలో ఉమా చక్రవర్తితో వేణు

పుస్తకావిష్కరణ సభలో ఉమా చక్రవర్తితో వేణు

కోసంబి రచనల ప్రభావం తెలుగు మేధోప్రపంచం మీద గత ఆరు దశాబ్దాలుగా విస్తృతంగానే ఉన్నప్పటికీ, ఆయన రచనలలో ప్రధానమైన ఈ పుస్తకం ఇంతవరకూ తెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తంగా కొశాంబి భారత చరిత్ర రచనలో ప్రవేశపెట్టిన కొత్తచూపును పరిచయం చేస్తూ కె. బాలగోపాల్ ‘భారత చరిత్ర – డి డి కోసంబి పరిచయం’ (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986) అనే స్వతంత్ర గ్రంథం రాశారు. దానికన్నముందే కోసంబి రచనలలో ‘భగవద్గీత – చారిత్రక పరిణామం’ ఒక్క వ్యాసమే ఒక పుస్తకంగా (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1985) వెలువడింది. ఆ తర్వాత కోసంబి వ్యాసాల సంపుటాలు రెండు – ‘భారత చరిత్ర – పరిచయ వ్యాసాలు’ (అనువాదం: హెచ్చార్కె, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986); ‘ఆచరణలో గతితర్కం’ (ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ కు గొర్రెపాటి మాధవరావు అనువాదం, జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ప్రచురణ, 1991) వెలువడ్డాయి. తర్వాత ‘ప్రాచీన భారతదేశ సంస్కృతి, నాగరికత’ (కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇన్ ఏన్షియెంట్ ఇండియాకు ఆర్ వెంకటేశ్వర రావు అనువాదం, తెలుగు అకాడమి ప్రచురణ, 1998) కూడ తెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో కోసంబి శతజయంతి కూడ రావడంతో ఇంగ్లిషులో ఆయన గురించీ, ఆయన కృషి గురించీ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి.

నిజానికి ఇతర పుస్తకాల కన్న, వ్యాసాల కన్న యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకంలోనే కోసంబి ఆలోచనలు లోతుగా, విస్తృతంగా పరిచయం అవుతాయి. ఈ పుస్తకం దాదాపు మూడువేల సంవత్సరాల భారత చరిత్ర మీద స్థూల అవగాహన ఇవ్వడం మాత్రమే కాదు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది గనుక ఇది ఎప్పుడో తెలుగులోకి రావలసి ఉండింది. ఎందువల్లనో గతంలో జరిగిన ప్రయత్నాలు ఫలించక, చివరికి ఇది నాకోసం మిగిలిపోయింది.

దాదాపు ముప్పై సంవత్సరాలకింద రాస్తూనే కోసంబి గురించి ఇప్పుడెందుకు అనే ప్రశ్న వస్తుందని బాలగోపాల్ అనుమానించారు. నిజంగానే ఈ ఆరు దశాబ్దాలలో కోసంబి ఆలోచనలను సమర్థించే, బలపరిచే అధ్యయనాలు, పరిశోధనలు ఎన్ని జరిగాయో, ఆయన ఆలోచనల్లో కొన్నిటిని విమర్శించే, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసే, పూర్వపక్షం చేసే అధ్యయనాలు అన్ని జరిగాయి.

ఈ పుస్తక అనువాదంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, అవరోధాలు, నేను ప్రయత్నించిన పరిష్కారాలు పాఠకులకు తెలియజేయడం నా బాధ్యత. కోసంబి రచనాశైలిలో అనువాదానికి లొంగని, అనువాదంలో ఇబ్బందికరంగా కనబడే అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ పుస్తక రచనలో ఆయన అధ్యాయాల విభజన, ప్రతి అధ్యాయంలోనూ ఉప అధ్యాయాల విభజన సరిగానే చేశారు గాని పేరాగ్రాఫుల విభజన అంత సరిగా చేయలేదు. ఒక ఆలోచన, ఒక వాదన ఒక పేరాగ్రాఫులో ఉండాలనే సాధారణ ఆనవాయితీకి భిన్నంగా ఆయన ఒకే పేరాలో అనేక ఆలోచనలు, వాదనలు గుదిగుచ్చారు. అందువల్ల ఒక ఆలోచన ముగించే వాక్యం తర్వాత అదే పేరాగ్రాఫులో మరొక ఆలోచన సాగుతుంది. ఒక్కోసారి ఆ ఒక్క వాక్యమే ఒక ఆలోచన కూడ కావచ్చు. ఒక్కోసారి హఠాత్తుగా ఒక ఆలోచన ఆగిపోయి ఏదో సుదూరమైన అంశంలోకి వెళ్లడం కూడ జరుగుతుంది. రచయితకు ఉండిన విస్తారమైన భాషా పరిజ్ఞానం, విభిన్న దేశాల, చరిత్రల పరిచయం వల్ల హఠాత్తుగా ఎక్కడో సుదూరపు ఉదాహరణ, పోలిక కూడ ప్రవేశిస్తాయి. లోతుగా, మననం చేసుకుంటూ, రచయితతో పాటు ఆలోచిస్తూ చదవని పాఠకులను ఈ పద్ధతి ఇబ్బంది పెడుతుంది. ఆ సంగతి పూర్తిగా తెలిసినా నేను ఆయన రచనా శైలిని మార్చే, పేరాగ్రాఫులను మార్చే సాహసం చేయలేదు. ఇటువంటి సైద్ధాంతిక రచనలో అనువాదకులు వీలైనంత తక్కువ చేయి చేసుకోవాలనే ధోరణి నాది.

గతంలో కోసంబి గురించి తెలుగులో రాసినవారు, రచనలను అనువాదం చేసినవారు కోసంబి వాడిన పైనుంచి భూస్వామ్యం అనే మాటకు సామంత భూస్వామ్యం అనీ, కింది నుంచి భూస్వామ్యం అనే మాటకు గ్రామీణ భూస్వామ్యం అనీ వాడారు. ఆ పదప్రయోగాలు వివరణాత్మకంగా సరిపోయేవే గాని, సంపూర్ణంగా కోసంబి అవగాహనను తెలిపేవి కావని నేననుకున్నాను. అందువల్ల కోసంబి వాడినట్టుగా పైనుంచి భూస్వామ్యం, కింది నుంచి భూస్వామ్యం అనే మాటలే వాడాను.  ఒక భాషా పదానికి మరొక భాషలో నిర్దిష్టమైన అర్థం ఇచ్చే పదం ఉండడం ఎంత వాస్తవమో, అనువాదంలో అటువంటి సమానార్థక పదాలను వాడాలనడం ఎంత సరైన అనువాద పద్ధతో తెలిసి కూడ, నేను ఏ పదానికైనా అది వాడిన సందర్భం ఒక అర్థం ఇస్తుందనీ, కనుక ఒక పదానికి ఒక అర్థం అనే సూత్రం ఎల్లవేళలా సరిపోదనీ భావిస్తాను. అందువల్ల పారిభాషిక పదాలు మినహా మిగిలిన పదాలకు భిన్న అర్థాలు వాడిన సందర్భాలు ఉండవచ్చు.

అనువాద పద్ధతికి సంబంధించిన  నా ఈ అవగాహనతో పాటు ఈ అనువాదం గురించి చెప్పవలసిన మరొక అంశం కూడ ఉంది. నామవాచకం విశిష్టమైనదనీ, పరభాషా నామవాచకాలను మార్చగూడదనే ఆలోచనా ధోరణి నాది. ఆయా భాషల ఉచ్చారణ ఏమిటో తెలియని రోజుల్లో మనకు తోచినట్టుగా, లేదా ఆ భాషా సంప్రదాయంతో సంబంధం లేకుండా, కేవలం వర్ణక్రమాన్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో నామవాచకాలను తెలుగీకరించి ఉన్నాం. అది తప్పు అని నా అభిప్రాయం. మరీ ముఖ్యంగా సంస్కృత నామవాచకాలను కూడ తెలుగీకరించి చివర డు, ము, వు, లు చేర్చిన సంప్రదాయం మనది. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరిగిపోయింది గనుక ఇప్పుడు దాన్ని సవరించడమూ ఎబ్బెట్టుగానే ఉంటుందని యథాతథంగా ఉంచాను.

కోసంబి తాను ఉటంకించిన వనరులన్నిటికీ – అవి పుస్తకాల పేర్లయినా, రచయితల పేర్లయినా – అబ్రివియేషన్స్ (పొడి అక్షరాలు) వాడారు. తెలుగులో అటువంటి పొడి అక్షరాలు పంటికింద రాళ్ల లాగ ఉంటాయి గనుక నేను పూర్తి పేరు, సంక్షిప్తం చేసిన పేరు వాడాను. ఉపయుక్త గ్రంథసూచి ఇంగ్లిషులోనే ఇచ్చాను. అలాగే ఇంగ్లిషులో ఒక్క పేజీ నుంచి ఉటంకిస్తే పి. అనీ, ఒకటి కన్న ఎక్కువ పేజీల నుంచి ఉటంకిస్తే పిపి. అనీ రాసే సంప్రదాయం ఉంది. తెలుగులో అది లేదు గనుక అన్నిటికీ పే. అనే వాడాను. ఒక ఉటంకింపు తర్వాత మరొక ఉటంకింపు అదే వనరు నుంచి అయితే ఇంగ్లిషులో ఇబిడ్ అనే సంప్రదాయం ఉంది. తెలుగులో పై.ఉ. (పైన ఉదహరించినది), అ.పు. (అదే పుస్తకం) అని వాడుతున్నారు గాని, మరొకసారి పుస్తకం పేరో, రచయిత పేరో రాయడమే మంచిదని నాకనిపించింది. ఇంగ్లిషులో వేరువేరుగా గుర్తించదగిన అనేక రకాల ఖతులు (ఫాంట్లు), ప్రతి ఫాంట్ లోనూ మళ్లీ పెద్ద అక్షరాలు (కాపిటల్స్) ముద్ద (బోల్డ్), ఏటవాలు (ఇటాలిక్) అక్షరాల సంప్రదాయం ఉండగా, తెలుగులో అన్ని రకాల అచ్చు అక్షరాలూ లేవు, వాలిన అక్షరాలు స్పష్టంగా, పోల్చుకునేటట్టుగానూ ఉండవు. అందువల్ల మూలంలో అట్లా ప్రత్యేకంగా చూపిన అంశాలను తెలుగు అనువాదంలో చూపించలేకపోతున్నాం. అలాగే ఇంగ్లిష్ మూలంలో కోసంబి ప్రచురించిన ఫొటోలను కూడ, వాటి నాణ్యత దృష్ట్యా తెలుగులో పునర్ముద్రించడం సాధ్యం కాలేదు. వాటి వివరణలు మాత్రం యథాతథంగా ఉంచాం.

నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్ మాజీ డైరెక్టర్ ప్రొ. అదితి ముఖర్జీ, ప్రస్తుత డైరెక్టర్ ప్రొ. వి. శరత్ చంద్రన్ నాయర్, అక్కడ తెలుగు విభాగపు బాధ్యుడు డా. ప్రత్తిపాటి మాథ్యూ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకురాలు గీతా రామస్వామి, మొదట ఈ అనువాదపు నమూనా పేజీలనూ, ఆ తర్వాత మొత్తం అనువాదాన్నీ పరిశీలించి విలువైన సూచనలు చేసిన అజ్ఞాత పరిశీలకులు, మొత్తం అనువాదాన్ని జాగ్రత్తగా చదివి, ఎన్నో సూచనలు చేసిన మోతుకూరి నరహరి, ఈ అనువాదాన్ని చెపుతుండగా టైప్ చేసిన రాజశేఖర్ చిమ్మన్, కట్టా కవిత, అనువాదానికి మామూలు కన్న ఎక్కువ సమయం పట్టినా ఆ కాలమంతా నా పనులను పంచుకుని, చికాకు భరించిన వై రామచంద్రం, సి వెంకటేశ్, ఎ మల్లేష్ లకు కృతజ్ఞతలు. నా జీవితంలో అవిభాజ్య భాగాలైన వనజ, విభాతలు ఈ కృషిలో కూడ భాగం పంచుకున్నట్టే.

(కోసంబి పుస్తకానికి అనువాదకుడిగా వేణు ముందు మాట ఇది)

– ఎన్ వేణుగోపాల్

venu

మనిషే కవిత్వం – ఒక చేత కన్నీరు, మరొక చేత ఎర్రజెండా

కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో...

కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో…

హృదయానికి అత్యంత సన్నిహితమైన వాళ్ల గురించి రాయడం కష్టం. మన గురించి మనం రాసుకున్నట్టు. ఏ ఒకటి రెండు సంవత్సరాలు ఆయనను కోదండరాములన్నయ్య అని పూర్తి పేరుతో పిలిచానో గాని, ఆ తర్వాత సొంత అన్నయ్య ఉన్నప్పటికీ, అన్నయ్య అంటే ఆయనే అన్నంతగా మా ఇంట్లో మనిషి, నా హృదయంలో మనిషి, నా విశ్వాసాల మీదా విలువల మీదా ప్రభావం వేసిన మనిషి ఎన్ కె. ఆయన గురించి రాయడం, ఆయనను ఒకింత దూరంగా చూసి, పెట్టి, ఊహించి రాయడం కష్టం. కాని ముప్పై సంవత్సరాల కింద సాహిత్య సాంస్కృతిక రంగాలలో అత్యంత ప్రభావశీలంగా, సమ్మోహకంగా ఉండి, ఎందరినో ఉత్తేజపరచి, కాలక్రమంలో మరుసటి తరానికి దాదాపు తెలియకుండా పోయి, ఆయన ఎవరు అని అడిగే స్థితి వచ్చినందువల్ల ఆయన గురించి చెప్పాలి. ఆయన లేని, ఆయన పాట పాడని, ఆయన మాట్లాడని సభా సమావేశమూ లేని స్థితి నుంచి ఆయన పేరయినా విననివాళ్లు నిండుతున్న సభల రోజుల్లో ఆయన గురించి చెప్పాలి.

చాల శక్తిమంతుడైన కవి, శ్రోతల కంట తడి పెట్టించగల, ఆ కన్నీటిని నిప్పులుగా మార్చగల, నవరసాలనూ తన స్వరపేటికలోంచి పలికించడం మాత్రమే కాదు, శ్రోతల హృదయాల్లో మీటగల గాయకుడు, కార్యకర్త, స్నేహశీలి, ప్రేమాస్పదుడు, మనుషులను ప్రగాఢంగా, బహుశా ఆయన ప్రేమకు లక్ష్యమైనవాళ్లు ఇబ్బంది పడేటంతగా ప్రేమించినవాడు, కనీసం ఇరవై సంవత్సరాలు ఎందరినో ఆకర్షించిన ఉత్తేజకరమైన ప్రజాజీవితం గడిపి, అనేక వ్యక్తిగత, కౌటుంబిక, మానసిక, రాజకీయ కారణాలవల్ల మౌనంలోకి వెళ్లిపోయినవాడు, అక్కడినుంచి అనారోగ్యంలోకీ, చివరికి అకాలంగా మృత్యువులోకీ జారిపోయినవాడూ నెల్లుట్ల కోదండరామారావు (మార్చ్ 6, 1948 – డిసెంబర్ 27, 2014). ఎన్ కె గా సుప్రసిద్ధుడు.

NK Telangana song

ఆయన తండ్రి నెల్లుట్ల రామకృష్ణారావు వరంగల్ జిల్లా కూనూరులో భూస్వామ్య కుటుంబంలో పుట్టి, రామకృష్ణామాత్య పేరుతో 1940ల్లో మెత్తని కవిత్వం రాసినవాడు. తిరుపతి వెంకటకవులను ఎదిరించి కవిత్వం చెప్పినవాడు. “రొమ్ము విరిచి వచింతు విశ్వమ్మునందు ఆంధ్రభారతి మా ఇంటి ఆడపడుచు, ఎవడురా మా యమాత్యుల నీసడించి కలము నడిపెడి మొనగాడు తెలుగునేల” అని సవాలు చేసినవాడు. జాషువాను ఆహ్వానించి, స్వయంగా కాలికి గండపెండేరం తొడిగి, కుల సమాజం నుంచి ‘వెలి’కి గురయినవాడు. ఏ బలవత్తర కారణాలు తోసుకువచ్చాయో తెలియదు గాని, భార్య కేసమ్మనూ, పది పన్నెండు సంవత్సరాల పెద్ద కొడుకు జగన్మోహన రావునూ, రెండు సంవత్సరాలయినా నిండని చిన్న కొడుకు కోదండ రామారావునూ వదిలి ఎటో వెళ్లిపోయాడు. తండ్రి అట్లా ఎప్పటికీ కనిపించని శూన్యంలోకి మాయమయ్యాడనే దుఃఖం బహుశా ఎన్ కె జీవితమంతా వెంటాడింది. ఒకవేళ ఆ తండ్రి ఎక్కడన్నా ఎదురుపడినా ఎట్లా గుర్తుపడతాడు, ఊహతెలియని వయసులో తననుంచి దూరమైన కన్నతండ్రిని? అందుకే యవ్వనంలో రాసిన ఒక పద్యంలో “ఎప్పుడో నీవు అనుకోక ఎదురుపడిన నీటితెర నాకు అడ్డమ్ము నిలుచుననుచు కనుల కొలకుల కన్నీరు కదలనీను కోతపడకుండునా అంత గుండెతీపి కదలి రావయ్య రావయ్య కన్నతండ్రి” అని పద్యాలు రాసుకున్నాడు.

Amma Sparsha

అలా తండ్రి వెళిపోతే తల్లినీ అన్ననూ తననూ చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించినవారు పెద్దమేనమామ దేవులపల్లి రామానుజరావు. ఆయన తెలంగాణ సాహిత్య వైతాళికులలో ఒకరు. ఆయన మాత్రమే కాదు, ఎన్ కె మేనమామలు అయిదుగురూ సాహిత్య జీవులే. అన్న జగన్ ప్రభుత్వోద్యోగి అయి, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులలో ఒకరయి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథులలో ఒకరుగా నిలిచారు. ఆయన పదునైన కలానికి పెట్టింది పేరు. 1969 ఉద్యమ కాలంలో వరంగల్ నుంచి వెలువడిన కరపత్రాలలో అత్యధిక భాగం ఆయన రాసినవే. ఆయన ప్రభావంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రెండు వారాలు జైలు జీవితం కూడ గడిపిన ఎన్ కె ఆయన ప్రోద్బలంతోనే తెలంగాణ పతాక గీతం రాశాడు. ఎన్నో చోట్ల పాడాడు.

ఇలా తండ్రి, మేనమామలు, అన్న అందరికందరూ సామాజిక, సాహిత్య ప్రపంచంలోనే ఉన్నప్పుడు, ఒక పద్య శకలంలో తానే చెప్పుకున్నట్టు “తరతరాలుగ మా యింట నరనరాన కవిత ప్రవహించుచుండె రక్తమ్ము బోలి”.

ఈ సాధనకు, ప్రతిభకు తోడైనది 1969-70 వరంగల్ వాతావరణం. నక్సల్బరీ ప్రభావం శ్రీకాకుళ గిరిజనోద్యమం మీదుగా వరంగల్ గోదావరీతీర అరణ్యాలలోకి ప్రవేశించింది. కాకతీయ మెడికల్ కాలేజి, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజిలు విప్లవ రాజకీయాలకూ, విద్యార్థి ఉద్యమాలకూ కేంద్రాలవుతున్నాయి. కాజీపేట క్రైస్తవ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి నుంచి వరంగల్ లో హోటల్ సర్వర్ గా ఉన్న జగదీశ్ వరకు విప్లవోద్యమ నిర్మాణానికి అజ్ఞాతవాసంలోకి వెళుతున్నారు. ఆజంజాహి మిల్స్, ఆర్టీసీ, రైల్వేలలో కార్మికోద్యమ సంచలనం మొదలవుతున్నది. అప్పుడు ఏర్పడిన చందా కాంతయ్య స్మారక కళాశాలలో అధ్యాపకుడిగా వరవరరావు వరంగల్ తిరిగివచ్చారు. ఆయనతో పాటు అధునిక సాహిత్యవేదిక సృజన వరంగల్ కు వచ్చింది.

Lal Bano cover

బంధుత్వం ఉండినప్పటికీ పరిచయంలేని వరవరరావును, ‘భళ్లున తెల్లవారునింక భయము లేదు’ అనే కవిత చదివినప్పటినుంచీ ఐదారేళ్లుగా అభిమానిస్తున్న వరవరరావును కలుసుకోవడానికి ఆయన ఇంటి ముందు నెలరోజులు పడిగాపులు పడ్డానని ఎన్ కె స్వయంగా రాసుకున్నాడు. మొత్తానికి అలా వరవరరావు సాన్నిహిత్యంలోకీ, సృజన లోకీ, విప్లవ రచయితల సంఘంలోకీ ప్రవేశించి రెండు దశాబ్దాల పాటు “చినబాపు చేతి చిటికెనవేలు పట్టుకుని ఎక్కడికంటే అక్కడికి నడిచినవాడి”గా మిత్రులు హాస్యాలాడేంత అవినాభావ మైత్రి ఆ ఇద్దరి మధ్య సాగింది. ఎన్ కె నే ఒకచోట చెప్పుకున్నట్టు “నాకు మా అమ్మ జన్మనిచ్చింది. మా పెద్దమామయ్య రామానుజరావు ఉద్యోగం యిప్పించి ఉపాధి కల్పించాడు. వరవరరావు సారు నాకు జ్ఞానం యిచ్చాడు. ఆయన నా సారథి, నా సఖుడు, నా బంధువు, నా బాంధవుడు, నా గురువు. ఆయనిచ్చిన జ్ఞానమే లేకుంటే నేను ఏనాడో భ్రష్టుపట్టి పోయేవాడ్ని”.

ఎన్ కె వరవరరావును కలిసేటప్పటికే ‘తిరుగబడు’ కవితాసంకలనం ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, అప్పటికింకా పద్య రచనలో, కృష్ణశాస్త్రి, చలం వంటి ప్రభావాలలో ఉండడం వల్ల కావచ్చు, ఎన్ కె ‘తిరుగబడు’లో భాగం కాలేదు. కాని ఆ కాలం ఎంత వేగంగా చలనశీలంగా ఉండిందంటే, 1970 ఫిబ్రవరి శ్రీశ్రీ షష్టిపూర్తి నాటికి ‘తిరుగబడు’ కవుల్లో చేరని ఎన్ కె, ఆ తర్వాత మూడు నెలలకే సృజన మే 1970 ముఖపత్రం మీద అచ్చయిన ‘మేడే’ కవితతో ‘తిరుగబడు’ కవులకన్న తీవ్రతతో కవితాలోకంలోకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత జూలై 3 న ‘అభ్యుదయ సాహిత్య సదస్సును బహిష్కరించండి’ అని కరపత్రాలు పంచి, పోలీసు లాఠీ దెబ్బలు తిన్న యువకులలో ఉన్నాడు. విప్లవ రచయితల సంఘ స్థాపనలో భాగమయ్యాడు. ఆ చరిత్రాత్మక జూలై 4కు విడుదలైన ‘మార్చ్’ కవితాసంకలనంలో తన కవితలు మూడు ఉన్నాయి.

ఖమ్మంలో 1970 అక్టోబర్ లో జరిగిన విరసం మొదటి మహాసభల్లో ‘తూర్పు పవనం వీచెనోయ్’ పాడానని తానే రాసుకున్నాడు. అప్పటినుంచీ వేరు వేరు పేర్లతో శివసాగర్ రాస్తున్న పాటలన్నిటికీ ఏదో ఒక ట్యూన్ కట్టడం, పాడడం ఎన్ కె పనిగా మారిపోయింది. చెల్లీ చంద్రమ్మా, విప్పపూల చెట్ల సిగను, శత్రు చేజిక్కితినని, తోటారాముని తొడకు, మేరిమి కొండల్లో మెరిసింది మేఘమూ వంటి శివసాగర్ పాటలన్నీ లోకానికి తెలిసినది ఎన్ కె ట్యూన్లతోనే, చాలవరకు ఎన్ కె స్వరంలోనే. 1972 కు ముందు జననాట్యమండలి ఏర్పడకపోవడం, పూర్తి స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండకపోవడం, ఈ పాటలన్నీ సత్యమూర్తి రాసినవనే గౌరవం ఉండడం ఎంత కీలకమైనవో ఎన్ కె స్వరం, గాన శైలి, గానంలో నిమగ్నత అంత కీలకమైనవి. ముఖ్యంగా ఆయా పాటల ద్వారా శివసాగర్ ప్రకటించదలచిన, ప్రసారం చేయదలచిన భావోద్వేగాలను ఎన్ కె చాల శక్తిమంతంగా ప్రసారం చేసేవాడు. కరుణ, వీర రసాలు రెండూ ఎన్ కె గొంతులో అద్భుతంగా పలికేవి.

విరసం ఏర్పాటుకు ముందు నుంచే విప్లవకవిత్వం రాస్తున్న ఎన్ కె కవిత్వం ఆ తర్వాత మరింత పదునెక్కింది. మార్చ్, ఝంఝలను ప్రభుత్వం నిషేధించినప్పుడు “సత్యాన్ని చాటే పుస్తకాల్ని నిషేధించగలరు గాని సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేస్తారు” అనే నాలుగు పాదాల కవితా ఖండికతో తన కవిత్వ శక్తిని ప్రకటించుకున్నాడు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో స్వేచ్ఛ కోరుకుంటున్న బంగ్లాదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, యాహ్యాఖాన్ సైనిక దుర్మార్గాలనూ, ఇందిరాగాంధీ విస్తరణ వాదాన్నీ విమర్శిస్తూ వెలువడిన ‘బంగ్లాదేశ్’ తెలుగు కవితా సంకలనానికి సంకనకర్త ఎన్ కె నే.

lal bano engఆ రోజుల్లోనే సొంత పాటలు కూడ రాయడం ప్రారంభించాడు. ‘కలలు మోసే అయ్య కదలి రావాల’ అంటూ అక్టోబర్ 1971లో రాసిన మొదటి పాటలో “ఏయె ఏయె సెల్లె వలయేయె సెల్లె వలయేయె సెల్లె/ వలలొ సేపల మాట వదిలేయె సెల్లె వదిలేయె సెల్లె/ బతుకు సుట్టూరుత బారి సంద్రమ్ము/ సల్లనీ నీళ్లతో సాగు సంద్రమ్ము/ నీటి కడుపులోన నీలాల నిప్పు/ నిప్పుతో మన కళ్లు యిప్పుకుందాము…” అని రాశాడు. విప్లవంలో స్త్రీల పాత్ర గురించి శివసాగర్ రాసిన ‘ఆకాశంలో సగం’ సృజన జనవరి 1975 సంచికలో వస్తే, ఆ ప్రభావంతో ఎన్ కె రాసిన ‘పోదాం కలిసీ’ పాట ఫిబ్రవరి సంచికలో వచ్చింది. “కళ్లు కళ్లు కలుసుకొని / చేసే బాసలు ఏముంటయి/ మనసూ మనసూ పరచుకొని/ చెప్పే ఊసులు ఏముంటయి/ ఉంటే ప్రాణం పోతే ప్రాణం/ కమ్యూనిస్టులకు ప్రజలే ప్రాణం” అని రాశాడు. ఈలోగా, సికిందరాబాదు కుట్రకేసులో నిందితుడిగా వరవరరావు 1974 మేలో అరెస్టయినప్పటి నుంచి ఎమర్జెన్సీ మొదలై సృజన ప్రచురణ ఆగిపోయేదాకా సమష్టిగా సంపాదక బాధ్యత నిర్వహించిన సాహితీమిత్రులు లో ప్రధాన బాధ్యత ఎన్ కె దే. అలా దాదాపు ఐదు సంవత్సరాలు వరంగల్ విప్లవోద్యమంలో, విప్లవ సాహిత్యోద్యమంలో ప్రధానంగా కనబడ్డాడు గనుకనే ఎమర్జెన్సీ విధించగానే అరెస్టు చేసిన మొదటి బృందంలో ఉన్నాడు.

ఎమర్జెన్సీలో జైలులో ఉండగా రాసిన ‘కామ్రేడ్ నాగరాజుకు’ అటు ఎన్ కె, ఇటు మరెందరో ఔత్సాహిక గాయకులు వేలాది సార్లు పాడి ఉంటారు. ఎమర్జెన్సీ ఎత్తివేసి, ప్రజాస్వామ్య వెల్లువ ప్రారంభమైన 1977 ఏప్రిల్ నుంచి 1985లో ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆట, పాట, మాట బంద్ అని అప్రకటిత నిషేధం విధించేదాకా ఆ పాట ప్రతి సభలోనూ మార్మోగేది. ”ఒకచేత్తో కన్నీరు తుడుచుకొనీ/ వేరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొనీ/ అంటాము మేము నాగరాజు/ గుండెలో మండేవు రాజుకొని రోజురోజు” అనే చరణంతో ప్రారంభమయ్యే ఈ పాట, “నిప్పురవ్వె దావానలమగును/ పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టి తీరును/ విజయానికి మైలురాయి త్యాగం/ చిందిన మన నెత్తురులో చివురు తొడుగు జనరాజ్యం”, “దూరాన తెరచాప అంచు/ క్రమించి నావతీరమాక్రమించు/ ఉదయించే తొలివెలుగుల తూర్పు/ ఆర్పలేదు విప్లవాన్ని ఏ పడమటి గాడ్పు” అనే చిరస్మరణీయ చరణాలతో చివరికి “తెరచాపలు గాలిలోన ఆడుదాక/ ఆకాశం ఎర్రకాంతులీనుదాక/ ఉంటావు నువ్వు నాగరాజు/ నువు అమరుడివి అమరుడివి ఈ రోజు ఏ రోజూ” అని ముగుస్తుంది.

Lal Bano Kannada cover

‘పరిటాలా రాములూ’, ‘కంఠమ్ము ఎత్తవే’, ‘సరిదారి నీదైతే’, ఎర్రాటెన్నెల దేరో’, ‘ఎర్రజండాకె అయితివా’ వంటి పాటలు కూడ అంతగా జనాదరణ పొందినవే. వీటిలో ప్రత్యేకంగా ‘ఎర్రజెండాకె అయితివా’ గురించి చెప్పుకోవాలి. జన్ను చిన్నాలు వరంగల్ అంచులలోని పైడిపల్లి గ్రామానికి చెందిన పేద దళితుడు. కాకతీయ మెడికల్ కాలేజి లో మెస్ బాయ్ గా జీవితం ప్రారంభించి, విప్లవోద్యమ ప్రభావంలోకి వచ్చి, వరంగల్ జిల్లా విప్లవోద్యమ నాయకుడిగా ఎదిగి 1979 నవంబర్ లో గూండాల చేత హత్యకు గురయ్యాడు. చిన్నాలుకు నాగరాజు పాట, అందులో “పడగ విప్పి ఉన్నాము పగను తీర్చుకుంటాము/ నీ నెత్తుటి అప్పును ఇక మానెత్తుట చెల్లిస్తం” అనే పాదాలు చాల ఇష్టం. ఎన్ కె కలిసినప్పుడల్లా పాడమని అడుగుతుండేవాడు. కొన్ని సార్లు ఏదో ఒక కారణంతో ఎన్ కె పాడేవాడు కాదు. చిన్నాలు హత్య తర్వాత రాసిన పాటలో ఎన్ కె “కండ్లల్లొ కండ్లను పెట్టి ఓ చిన్నాలన్నా/ కడుపుతీర సల్లగ నవ్వి/ చేతిలోకి చెయ్యి తీసుక/ చేతివేళ్లు ప్రేమగ దువ్వి/ పదము నువ్వు పాడమంటెను/ ఏదో ఓ వంకను జెప్పి/ అపుడు గాదు యిపుడంటెను/ ఇపుడు గాదు అపుడంటెను/అలిగలిగి నువ్వు పోతెను/ ఆపై నువ్వె వస్తవంటిని/ అయ్యో యిపుడెక్కడుంటివి/ నాగరాజు పాట పాడుతా/ పరిటాలా పదము పాడుతా/ ఏటికి ఎదురీత పాడుతా/ విలుకాని విల్లు ఎత్తుతా/ చెంద్రక్కా కథను సెప్పుతా/ అ అంటే అడవి గీతము/ ఆ అంటే ఆయుధమంటూ/ చారుబాబు సంగతి చెబుతా/ ఎత్తలేక గొంతు చచ్చినా/ నోటిపూత నెత్తురొచ్చినా/ పేగులన్ని పొర్లుకొచ్చినా/ ఏదడిగితే అదే పాడుతా/ ఒక్కసారి వచ్చి యినుమురా/ గద్దరన్న పాట పాడనా/ సికాకులం సీమ కొండనీ/ ప్రసాదన్న పాట పాడనా/ పదం గట్టి పాడాలంటూ/ నువ్వే ఓ పదమైతివా/ నువ్వే నా పాటైతివా/ నువ్వే నా బాటైతివా/ పోరాటం దరువైతివా/ ఇంకిపోని ఎరుపైతివా/ ఎర్ర్రజెండాకె అయితివా/ ఎర్రెర్రని జెండైతివా…” అని రాశాడు.

ఆ సమయంలో సృజన సాహితీమిత్రులు వారానికి ఒకసారి రెండుసార్లు కూడ సమావేశమై రచనల మీద చర్చించేవారు. కవిత్వం విషయంలోనూ, ఇతర రచనల విషయంలోనూ ప్రమాణాల మెరుగుదలకు ఎన్ కె చేసే దోహదం చాల ఉండేది.

వచనకవిత, పాట, వ్యాసం వంటి ప్రక్రియలన్నిటిలోనూ ప్రవేశించినా ఎన్ కె రచనలన్నిటిలోకీ శిఖరాయమానమైనది ‘లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం’. ఆ దీర్ఘ కవిత గురించి ఇప్పటికే చాల చర్చ జరిగింది గనుక మళ్లీ ఇక్కడ అవసరం లేదు గాని, తెలుగులో అంత లోతైన, అంత విశాలమైన చారిత్రక, సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని అంత గొప్పగా కవితాత్మకంగా ఆవిష్కరించిన కవితలు అతి తక్కువ అని మాత్రం చెప్పాలి. అది సుదీర్ఘమైనదైనా, వచన కవిత అయినా, ఇద్దరు ముగ్గురు కూచుని చదువుకున్నప్పుడైనా, పది, ఇరవై వేల మంది ఉన్న సభలోనైనా ఎక్కడ చదివినా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నది. సంఘపరివార వాదనలకు తిరుగులేని జవాబులు చెప్పింది. ఒకసారి సృజనలో అచ్చు కావడం, రెండు సార్లు పుస్తకంగా పునర్ముద్రణ పొందడంతో పాటు, కవితా ఓ కవితా సంకలనంలో కూడ చేరింది. ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషానువాదాలు పుస్తకాలుగా వచ్చాయి. మోడీ పాలనలో పెరిగిపోతున్న సంఘపరివార్ దుర్మార్గాల నేపథ్యంలో ఇవాళ చదువుకుంటే తాజాగా, వర్తమానానికి అన్వయించేలా, అత్యవసరమైనదిగా ఉంటుంది.

Rehearsal coverరిహార్సల్, లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం తర్వాత సృజనలోనూ, అరుణతారలోనూ మరిన్ని కవితలు రాశాడు గాని అవి ఇంకా పుస్తక రూపం ధరించకముందే, ముందు చెప్పినట్టుగా వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఎన్ కె ను ఈ ప్రవాహం నుంచి తప్పించాయి. ఒడ్డు పట్టించాయి. అయినా ఆ మనిషిలో తడి ఆరలేదు. దేవులపల్లి అమర్, అజయ్ లు ప్రజాతంత్ర వారపత్రిక ప్రారంభించినప్పుడు కొన్నాళ్లు కవితావ్యాఖ్యలు రాశాడు. తన జీవిత కథను కొంత విమర్శనాత్మకంగా, కొంత స్వీయ సానుభూతితో చూసుకుంటూ, అప్పటికీ తనకు వచన రచన రాదని చెప్పుకుంటూనే ‘అమ్మస్పర్శ’ అనే ఆత్మకథాత్మకమైన అనుభవాల గుచ్ఛం 2009లో ప్రచురించాడు.

దాదాపు మూడు సంవత్సరాలుగా పార్కిన్సన్ వంటి భౌతిక అనారోగ్యంతోనూ, సంచలనశీల క్రియాత్మక ప్రజా జీవితాన్ని గడిపి ఒంటరి అయిపోయిన మానసిక వేదనతోనూ తనలో తనే కుంగిపోయాడు. అది గుండెజబ్బుకు కూడ దారితీసింది. అయినా తేరుకుంటున్నాడు, మళ్లీ మనుషుల్లో పడతాడు అనుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరి డిసెంబర్ 27 రాత్రి ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచాడు.

డిసెంబర్ 29 మధ్యాహ్నం మా అందరికీ ప్రాణసమానమైన ఆ కుమార్ పల్లి వీథిలో నేలమీద ఏడుకట్ల సవారీ మీద చివరినిద్రకు పడుకున్న అన్నయ్య శీతలదేహం తలమీద చివరిసారి నిమురుతున్నప్పుడు నాలుగు దశాబ్దాల అనుబంధం లోని వేలాది దృశ్యాలతో పాటు, ఆయన తండ్రి రామకృష్ణామాత్య రాసిన పద్యం గుర్తుకొచ్చింది.

“ఏ పొలాల్ వరి పోచలీనుచునున్నవో/పుడమియందలి నాదు పడక గాగ/ ఎవ్వారి బాహువుల్ ఎగయుచు నున్నవో/ నా యొడల్ కాటికి మోయు కొరకు/ ఏ వృక్షమున శాఖ లెదుగుచు నున్నవో/ క్షణమున నన్ను భస్మమ్ము జేయ/ ఏ స్థలం బీ భూమి యీక్షించుచున్నదో/ తనలోన నా బూది దాచుకొనగ/ ఎందరెందరు నా ముందు ఏగినారొ/ ఇంక ఎందరు నా వెన్క ఏగుదెంత్రొ/ ఎందుకో యింతకీ సృష్టి ఎంతవరకొ/ ఎరుక తెలియగా సాధ్యమె యేరికేని?”

 -ఎన్ వేణుగోపాల్   

కారా కధల్లో మానవ సంబంధాల జీవధార

KaRa-Bangalore

కథాసాహితి ప్రచురించిన కథా -94 ఆవిష్కరణ సభావేదిక (బెంగుళూరు ) పై వాసిరెడ్డి నవీన్, కాళీపట్నం రామారావు, ఎన్.వేణుగోపాల్, పాపినేని శివసంకర్, ఓల్గా, కె.శివారెడ్డి ( ఈ ఫోటో ఆంధ్రప్రభ లో అచ్చయింది)

 భాష ఎంత పురాతనమయిందో కధా ప్రక్రియ కూడా అంత పురాతనమయినదయి ఉంటుందని చేకూరి రామారావు ఊహించారు. భాషలోనే కధన ప్రక్రియను సాధ్యం చేసే నిర్మాణాంశాలు ఉండటం ఇందుకు కారణమని ఆయన అన్నారు. (కధా యజ్ఞం, 1982, పే.1)

భాషకూ కధకూ ఉన్న ఉమ్మడి పునాదిని మానవ సంబంధాల వైపు నుంచి కూడా చెప్పవచ్చును. మానవ సమాజం మనుగడకు అత్యవసరమైనది సామాజిక ఉత్పత్తి క్రమం. దీని కోసం మనుషులు కలుసుకోవలసి వస్తుంది. ఉమ్మడి కార్యాచరణలో పాల్గొనవలసి వస్తుంది. ఈ అవసరం వల్ల మనుషుల మధ్య ఏర్పడే సంబంధాలను మౌలికంగా ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఈ ఉత్పత్తి సంబంధాలు సామాజిక పరిణామ క్రమంలో అనేక రకాల మానవ సంబంధాలుగా ప్రతిఫలనం పొందుతాయి. ఆధునిక సమాజంలో భౌతిక వస్తూత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేనట్టు కనబడే మనుషులు ఉండవచ్చు గాని వాళ్ళ మధ్య సంబంధాలకు కూడా సమాజంలోని ఉత్పత్తి సంబంధాలే మూలంగా ఉంటాయి.

ఇటువంటి వివిధ రకాల మానవ సంబంధాలకు భాష ఒక అవసరం, ప్రాతిపాదిక కూడా. ఈ మానవ సంబంధాలను, ఉత్పత్తి క్రమంలో సహజంగా ఏర్పడిన మానవ సంబంధాలను వర్గ సమాజంలోని అనేక అంశాలు వక్రీకరించాయి. వాటి చుట్టూ అనేక మాయలు అల్లాయి. అందువల్ల ఇవాళ మానవ సంబంధాలు సహజంగా, స్వచ్ఛంగా, మానవుల మధ్య సంబంధాలుగా లేవు. రక్తాల మధ్య, వంశాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, డబ్బు మధ్య, సరుకుల మధ్య సంబంధాలుగా మానవ సంబంధాలు కనబడుతున్నాయి.

ఇలా అనేక రూపాలలో, అనేక ఆచ్ఛాదనలతో వ్యక్తమవుతున్న మానవ సంబంధాలను మనుషులు తప్పనిసరిగా తమ చైతన్యంలో ప్రతిఫలిస్తుంటారు. అదే సృజనాత్మక రూపాలలోకి వస్తుంది. కధ ఈ పనినే అద్భుతంగా నిర్వహిస్తుంది. తద్వారా అది ఉనికిలో ఉన్న మానవ సంబంధాల నివేదికగా, విశ్లేషణగా, రానున్న మానవ సంబంధాల వైతాళికురాలుగా నిలుస్తుంది. ఈ అర్ధంలో కధన ప్రక్రియను మానవ సంబంధాల ప్రతిఫలనంగానూ , అవసరంగానూ గుర్తించవచ్చును.

ఐతే మానవ సంబంధాలే వికృతంగా ఉన్నప్పుడూ కధ చిత్రించ వలసిందేమిటి?ఇక్కడనే ప్రక్రియగా కధ నిర్వహించే పాత్ర కన్నా, వ్యాఖ్యాతగా కధకుడు నిర్వహించే పాత్ర ముఖ్యమయినదవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం పరిశీలనా శక్తి ఉన్న కధకుడయినా సమాజంలో ఉన్న కుళ్ళును గుర్తించగలడు, దాన్ని కధలో చిత్రించగలడు. ఇవాళ తెలుగులో వస్తున్న క్షుద్ర సాహిత్యం కూడా తెలుగు సమాజంలోని విలువల పతనానికి ఒకానొక చిత్రణే. ఇక్కడ కధకుడి సామాజిక బాధ్యత రంగం మీదికి వస్తుంది. కధకునిలో పరిశీలనాశక్తి తో పాటే సమాజానికి అర్ధమూ, లక్ష్యమూ తెలిసి ఉంటే ఈ విలువల పఠనం ఎందుకు ఉన్నదో చెప్పగలడు. దాన్నే చిత్రించినా దాని పట్ల అసహ్యం కలిగేలా, దాన్ని కూలదోసే ఆచరణకు పూనుకునేలా చిత్రించగలడు.

కధకుడి పాత్ర ఇంకా ప్రస్ఫుటంగా కనబడే అంశం మానవ సంబంధాల పరిశీలనలో సమగ్రత. ఏ కధకుడయినా మానవ సంబంధాలనే చిత్రించక తప్పదు. మామూలు కధకులయితే ఏదో ఒక కోణాన్ని మాత్రం అర్ధం చేసుకుని ఆ కోణాన్ని పూర్తిగానో, సగమో చిత్రిస్తారు. ఐతే కధా ప్రక్రియ కేవలం మానవ సంబంధాన్నీ ప్రతిబింబించేది మాత్రమే కాదు. అది మానవ సంబంధాలపై గాఢమైన ప్రభావం వేయగలదు కూడా.

ఈ అంశం గుర్తించాలంటే రచయిత సమాజ సారాంశాన్ని, మానవ సంబంధాల చరిత్రను అర్ధం చేసుకొని ఉండాలి. మానవ సంబంధాల గతాన్నీ, వర్తమానాన్నీ, అవగాహన చేసుకుని భవిష్యత్తును వాస్తవికంగా ఊహించగలగాలి. అంటే మానవ సంబంధాల ఏ ఒక్క కోణాన్నో కాక సమస్తాన్ని అవగాహన చేసుకుని చారిత్రక దృక్పధంతో సాన పెట్టుకోవాలి. సామాజిక పరిణామంలోని గతితర్కం మానవ సంబంధాల అభివృద్ధిలో ఎట్లా ప్రతిబింబిస్తుందో గుర్తించగలగాలి.

కాళీపట్నం రామారావు కధలన్నీ ఒకే వరుసలో చదివినప్పుడు మానవ సంబంధాల పట్ల ఆయనకు గల సమగ్ర దృష్టీ, అది పరిణమిస్తూ, పరిణితి చెందుతూ వచ్చిన క్రమమూ, ఆశ్చర్యాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తాయి. (మాష్టారిని స్వయంగా ఎరిగిన వాళ్ళు ఆయనకు అంత మార్క్సిజం తెలియదని చెప్పబోతారు గనుక ఒక వివరణ ఇవ్వాలి. సామాజిక జీవితాన్ని సమగ్రంగా, నిశితంగా పరిశీలించి కనిపెట్టిన సారమే మార్క్సిజం. మౌలికంగా మార్క్సిష్టు పరిజ్ఞానం ఉండిగానీ, కనీసం మార్క్సిష్టు పద్దతి ఉండి కానీ సమాజాన్ని నిశితంగా పరిశీలించ గలవాళ్ళు ఎంత సమగ్రత తో పరిశీలిస్తే అంత ఎక్కువగా సిద్ధాంతానికి దగ్గర కాగలరు. మాష్టారు తన కధల్ని “మార్క్సిస్టు వాసనలు పరోక్షంగా కూడా లేకుండా” రాశారని ఎవరయినా చెప్పబోయినా అది మాష్టారి పరిశీలనా శక్తికీ, మార్క్సిజపు వాస్తవికతకూ తిరుగు లేని నిదర్శనమే అవుతుంది. కానీ “జీవితానికి మార్క్సిజం అవసరం లేద”నే వాదనకు పునాది కాదు)

కారా కధలన్నీ కూడా మానవ సంబంధాల చిత్రణలే. కధా ప్రక్రియ కోసం ఒక్కొక్క కధలో ఒక్కొక్క సంబంధాన్నో, ఒక్కొక్క క్రమాన్నో చిత్రించవచ్చుగాని అక్కడ ఆయనకు ఆయా సంబంధాల గురించి, క్రమాల గురించి సమగ్రమైన అవగాహన ఉన్నదని స్పష్టంగా తెలిసిపోతుంది. అట్లాగే, చాలా సార్లు అమాయకంగా కనబడే ఆ చిత్రణ చాలా పటిష్టంగా పాఠకుణ్ణి ఒక ఉన్నత మానవ సంబంధం వేపు నడిపించే నిర్మాణాత్మక ప్రయత్నంగా ఉంటుంది.

ఇప్పుడు సంకలనంగా వచ్చిన ఆయన కధలు మొత్తం 25, ఈ కధలను వేరువేరు ప్రాతిపదికల మీద గతంలో విమర్శకులు మూడు భాగాలుగానో, రెండు భాగాలుగానో విభజించారు. కానీ ఈ కధలన్నీ మానవ సంబంధాల చిత్రణలనే ప్రాతిపదిక మీద చూసినప్పుడు వాటన్నిటిలోనూ ప్రవహించే అవిచ్ఛిన్న జీవధార కనబడుతుంది. ఐతే మానవ సంబంధాలకు సంబంధించిన ఉద్వేగాల కోణాల్ని చిత్రించడానికి తొలి కధలు పరిమితమైతే, మానవ సంబంధాల పునాదిని, కొంతవరకు ప్రత్యక్షంగా ఉత్పత్తి సంబంధాల్ని తర్వాతి కధలు చిత్రించాయి. బహుశా ఈ కారణం వల్లనే తొలి కధలు ఉన్నత వర్గాల వాతావరణంలో మాత్రమే సాగగా, తర్వాతి కధల వాతావరణం విస్తృతమయింది.

మానవ సంబంధాల వ్యక్తీకరణలో కారా మొట్ట మొదట ఎక్కువగా చిత్రించినది కుటుంబాలలో కొనసాగుతున్న అప్రజాస్వామికత, ముఖ్యంగా ఆయన తన దృష్టిని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద కేంద్రీకరించారు.

కుటుంబం అనే సామాజిక, ఆర్ధిక యూనిట్టు ఎట్లా ఉనికిలోకి వచ్చిందీ, దాని భవిష్యత్తు ఏమిటి అనే చర్చ అలా ఉంచి ఇవాళ కనబడుతున్న కుటుంబ రూపాల్ని పరిశీలించడమే కారా కధలు చేసిన పని. కుటుంబం ప్రధానంగా అంతరాల వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ఈ అంతరాలు కరుడు గట్టిపోయి ఉంటాయి. ప్రాధమిక యూనిట్ నుంచే అంతరాల వ్యవస్థ నెలకొనడం తనకు అవసరం గనుకు రాజ్యం ఈ అంతరాల వ్యవస్థను పెంచి పోషిస్తుంది. ఈ కఠినమైన అంతరాల వ్యవస్థలో ధిక్కారస్వరానికి అవకాశం లేదు. సాంప్రదాయంలో ఇమడని ఆలోచనకు, ఆచరణకు స్థానం లేదు. ఒక అంశం పరిష్కరించవలసి వచ్చినప్పుడు కూలంకషమైన పరిశీలన, చర్చ వేరువేరు అవకాశాల ప్రతిపాదనలు, సమగ్రమైన అవగాహనతో పరిష్కారం అనేది సరైన పద్ధతి. కానీ అంతరాల వ్యవస్థలో ఈ క్రమానికి బదులు కుటుంబ ‘యజమాని’ శాసనమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ పరిష్కారం మంచిదైనా, చెడుదైనా అసలు దాని క్రమం చాలా నిరంకుశమైనది.

ఈ అంతరాల వ్యవస్థ ఎంత నిరంకుశమైనదయినా, బాధాకరమయినదయినా వర్గసమాజం కొనసాగినంత కాలం అది కొనసాగుతుంది. భూస్వామ్యంలో బలమైన కుటుంబ వ్యవస్థతో అది కలగలిసి ఉంటుంది. ఒక తాతో, పెదనాన్నో, మామో కుటుంబానికంతటికీ శాసనకర్తగా ఉంటాడు. ఆయనే నిర్వాహకుడూ, తీర్పరీ కూడా. ఆధునిక రాజ్యాలు విడగొట్టిన మూడు అధికారాలు ఇంటికి సంబంధించి నంతవరకు ఆయన తన గుప్పిట్లోనే పెట్టుకుంటాడు. దుస్సహమైన ఈ స్థితి దుర్మార్గమైనది. ఈ స్థితి అనుభవించవలసి వచ్చిన వాళ్ళు తీవ్రమైన వేదనకు లోనవుతారు. ఈ స్థితిలో సమస్యలు పరిష్కారాలు అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా జరుగుతాయి. ఈ స్థితికి గల వేరువేరు ముఖాలను ‘పెంపకపు మమకారం’ ‘రాగమయి’ ‘అభిమానాలు’ ‘అశిక్ష- అవిద్య’ ‘తీర్పు’ ‘ఇల్లు’ కధల్లో కారా చిత్రించారు.

ఉమ్మడి కుటుంబంలో మమకారం కూడా ఎట్లా సూటిగాకాక వక్రరూపాల్లో ప్రకటితమవుతుందో ‘పెంపకపు మమకారం’ లో చిత్రణ పొందింది. అందువల్లనే చర్చ ద్వారా పరిష్కరించదగిన అతి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారిపోతుంది. ఐతే ఆ సమస్య జటిలం అవుతున్న కొద్దీ కుటుంబంలోని అప్రజాస్వామికత వల్ల పరిష్కారం అప్రజాస్వామికంగానే జరుగుతుంది. నిజానికి అప్పుడు పరిష్కారపు మంచి, చెడులుగాక అది అమలయిన తీరు గురించి ఆలోచించవలసి వస్తుంది. వచ్చిన సమస్యను చర్చ ద్వారా, వస్యంగా ప్రజాస్వామికంగా పరిష్కరించి ఉంటే ఆ స్థితిని అనుభవించిన వ్యక్తులందరి వేదనా సమసిపోయేది.

మధ్య తరగతిలో అంతరాల వ్యవస్థతో ఒక కుహనా ప్రతిష్ట కూడ కొనసాగుతుంది. సామాజిక స్థితికీ, ఈ కుహనా పటిష్ఠకూ ఉన్న విభేధంవల్ల ఆ కుటుంబమంతా తీవ్రమైన ఘర్షణలకు లోను కావలసి వస్తుంది. ఈ ఘర్షణలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోగల వాతావరణం లేనప్పుడు నిష్టూరాలు, నిందలూ, అకారణ కోపాలు, అనవసరమైన ఆదేశాలు రంగం మీదికి వస్తాయి. ఈ స్థితిని చిత్రించింది ‘రాగమయి’. గ్రామీణ వ్యవస్థలోని మంచితనం, పరోపకారత వంటి విలువలు ఉన్నప్పటికీ ఈ స్థితి ఇట్లా కొనసాగఊక తప్పదని ‘రాగమయి’ చూపుతుంది.

ఒక వైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూలి పోతూ, ప్రజాస్వామిక మానవ సమాజ యూనిట్ ఏర్పడని సంది దిశలో వచ్చే విలువల పతనాన్ని ‘అబిమానాలు’ పట్టుకుంటుంది. కొత్త, పాత విలువల మధ్య ఘర్షణ వల్ల, సమన్వయం కుదరక పోవడం వల్ల కుటుంబ వాతావరణంలో అనవసర వైరుధ్యాలే ఎంత ప్రధానంగా కనబడి, ఎంత వేదనకు కారణమవుతాయో ‘అభిమానాలు’ వివరిస్తుంది.

2013-06-16-158

‘అభిమానాలు’ నుండి ఇంకా ముందుకు వెళ్ళి కారా ‘అశిక్ష – ఆవిద్య’, ‘తీర్పు’, ‘ఇల్లు’ రాశారు. ఇవి మూడూ నిజానికి కాల వ్యవధిలో దూరపు కధలైనా ఒకే వరసలో ఉన్న కధలు.

ఉమ్మడి కుటుంబంలో సమస్యా పరిష్కారాలు జటిలంగా ఉండక తప్పదని వివరించాక, ‘అశిక్ష – ఆవిద్య’ కధ, కారా పరిశీలనా శక్తి అనివార్యమైన ములుపుకు చేరిందని చెబుతూ ముగుస్తుంది.

“లోకగతిలో ఇట్లాంటి సంఘటనలనీ ఒక పెద్ద లెక్కలోకి వచ్చే విషయాలు కాక పోయినా వ్యక్తులను వ్యష్టిగా తీసుకొని చూస్తే కొందరి జీవితాలకు ఎంతో అస్తవ్యస్థములుగా మార్చగలిగే ఇంతటి పెద్ద సంఘటనలు కొన్ని కొన్ని కుటుంబాలలో అప్పుడప్పుడూ జరుగుతుండటానికి అసలు మూల కారణాలు – వాటి కుదుళ్ళు – ఏమిటి? ఎక్కడ ఉన్నవి?

“ఈ రెండే అతడు ఎన్నడూ పరిశీలించని విషయాలు – లేక పరిశీలించాలనే స్ఫురణకు గురికాని విషయాలు!” అంటూ ‘అశిక్ష – ఆవిద్య’ ముగుస్తుంది. మనుషుల మధ్య సంబంధాలలో తీవ్రమైన మార్పులు కలిగిస్తున్న మూల కారణాలను- వాటి కుదుళ్ళను – కనిపెట్టాలనే స్ఫురణే లేకుండా చేసింది కుటుంబ వ్యవస్థ. ఆ మత్తు నుంచి తేరుకుని ఆ పరిశీలనకు పూనుకుంటే అద్భుతాలు జరుగుతాయి, సమాజ సారాంశం అవగాహనలోకి వస్తుంది. ఈ కధ తర్వాత తొమ్మిది సంవత్సరాలు పాటు కారా కధలు రాయటం మానేశారు. ఈ రెండు ప్రశ్నలకు ఆయన జవాబులు కనిపెట్టారని తర్వాతి కధలు రుజువు చేస్తాయి. ఐతే ఆయన అంతకుముందు కూడ నిశితమైన, సమగ్రమైన పరిశీలనతో కధలు రాశారు గనుక ధార తెగిపోలేదు. మరీ ముఖ్యంగా సరాసరిగా మూలాలలోకి వెళ్ళేముందు కుటుంబ సంబంధాలలోని మరో రెండు అంశాల్ని ఆయన వివరించవలసి ఉంది. అట్లా వచ్చినవే ‘తీర్పు’, ‘ఇల్లు’.

తీర్పు కధలో సుంద రామయ్య పిల్లల మధ్య వచ్చిన సమస్యను తనకు తోచిన రీతిలో ప్రజాస్వామికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కాని తీర్పు సాధ్యం కాదు. ఎందువల్లనంటే ప్రజాస్వామిక తీర్పు ఒకానొక వ్యక్తిగత, మానసిక చర్య కాదు. అది ఒక ప్రత్యేక సామాజిక, చారిత్రిక నేపధ్యంలో తప్ప కుదరదు. ఇంట్లో అసమానతల చట్రాన్ని యధాతధంగా ఉంచాక ప్రజాస్వామిక తీర్పు సాధ్యం కాదు. అందుకే చాల రకాల తీర్పులు ఏకకాలంలో న్యాయంగానూ, అన్యాయంగానూ కూడా కనబడతాయి. అంతే అంతరాల వ్యవస్థ ఉన్నంత కాలం న్యాయాన్యాయాల నిర్వచనాలు వేరువేరుగానే ఉంటాయి. ప్రజాస్వామిక తీర్పు ఎప్పుడు సాధ్యమవుతుందో గుర్తించకపోతే, ఎంత చిత్త శుద్ధితో చేసినా ఆ తీర్పు నిష్పలమే అవుతుంది.

మధ్య తరగతి కుటుంబాల గురించి, ఆ కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సంబంధాల గురించి పరిశీలనలో గుర్తించవలసిన అంశం భరోసా కోసం వెతుకులాట. కూలి పోతున్న కుటుంబ వ్యవస్థలో ఈ భరోసా కోసం వెతుకులాట ప్రస్ఫుటమవుతుంది. “నేను ఎప్పుడేది చేసినా వాడి మేలుకోరి ఏదీ చేయలేదు. వాడికి చెప్పే నీతులు వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాక నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెప్పేను. వాడికి చెప్పించిన చదువంతా నా కోసమే చెప్పించుకున్నాను …..” అని పావనరామయ్య బహిరంగంగా చెప్పిన విషయం, అనేక తరాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదే. ఐతే ఇప్పుడు, కుటుంబం కూలిపోతున్న దశలో భరోసా నిలిచేది పిల్లలా ఆస్తియా,(ఇల్లా) అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్ననే ‘ఇల్లు’ ప్రతిబింబించింది.

మానవ సంబంధాలు ఇన్ని వేల ఏళ్ళ తర్వాత కొని ఉదాత్తభావనల్ని ఏర్పరచుకున్నాయి. సమాజం వాటిని సాధించవలసిన ఆదర్శాలుగా, ఆహ్లాదకరమైన అంశాలుగా గుర్తిస్తోంది. న్యాయం, మానవతాస్పర్శ, ప్రేమ, స్నేహం, ఆనందం, శాంతి వంటి విలువలు ఇవి. అట్లాగే సమాజం ఈ విలులను నిలబెట్టే క్రమంలో హింసను అధికారాన్ని, భయాన్ని, కుట్రను, శతృత్వాన్ని తోసివేయదలచుకున్నది.

ఇవన్నీ మానవసంబంధాల వ్యక్తీకరణలే. ఇవి వర్గ సమాజంలో ఏ అర్ధాల్ని సంతరించుకుంటాయో, ఎవరెవరు వీటికి ఏ ఏ నిర్వచనాలు ఇచ్చి తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారో ‘వీరుడు – మహా వీరుడు’ నుంచి ‘కుట్ర’ వరకు కధలు వివరిస్తాయి.

ఈ కధలలో ప్రధానంగా చర్చించవసినవి ‘హింస’, ‘నో రూమ్’, ‘స్నేహం’ . మిగిలిన కధలన్నిటినీ కూడా అర్ధం చేసుకోవడానికి తగిన విశ్లేషణా సాధనాలను ఈ కధల నుంచి కనిపెట్టవచ్చును. అందుకే ఇక్కడ వీటిని మాత్రమే చర్చించడం జరుగుతున్నది. ఈ మూడు కధలకు కూడ శీర్షికలే వివరమైన ఆలోచనలను ప్రేరేపించగలవి.

‘హింస’ కధలో ముఖ్యమైన పాత్రలు రెండు – దారుణమైన జీవితానుభవాలు పొందిన పైడమ్మ, ఆ దారుణాలన్నీ ఒకే ఒక్క రోజు స్ఫురణకు వచ్చిన సంగి, పైడమ్మ చెల్లెలు. పైడమ్మ పెళ్ళయి కష్టాల కాపురానికి వెళ్ళింది. అత్తవారింట్లో కూలికి వెళ్ళి అక్కడ ఆ భ్రమలకో, ఏ బలవంతాలాకో లొంగిపోయింది. ఆమె “రంకు” ఒక్కటే బయట పడి చావు దెబ్బలు తింది. అక్కడ్నించి పారిపోయి ఒంటరి స్త్రీ అనుభవించే బాధలనీ అనుభవించి చివరికి విశాఖపట్నంలో సబ్బారపు సంజీవమ్మ కంపెనీకి చేరింది. ఒక్క రోజు కోసం తల్లిని చూడడానికొచ్చి అవహేళనలను ఎదుర్కొంది. తల్లి దగ్గర ఆశ్రయం దొరకదని తెలుసుకుంది. ఈ అవహేళనలూ, అవమాణాలూ మరింత సూటిగా సంగి చెవిన పడ్డాయి. కుటుంబాన్ని ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆనందమూ, ఆప్యాయతా లేకుండానే పైడమ్మ వెళ్ళి పోయింది. ఆ దుఃఖంలో చిట్టడివికి వెళ్ళిన సంగి నక్కలు పొట్టన పెట్టుకున్న మేకపిల్లను చూసింది. ఆ అమ్మాయికి నక్కల పని చెప్పాలన్నంత ఆవేశం రగిలింది.

ఇవాళ సమాజంలో భౌతిక హింసను మాత్రమే హింసగా గుర్తిస్తున్నాం. రక్తం కారడమే, గాయంకావడమే, నక్కలు మేకను చంపివేయడమే హింసగా గుర్తిస్తున్నాం. నిజానికి సంగి అనుభవించిన వేళాకోళంలోనే హింస ఉంది. జగ్గమ్మ, పైడమ్మ, సంగిల ఆశలు, వాళ్ళ మధ్య ఆప్యాయతలు బలవంతాన తుంచివేయడంలో హింస ఉంది. ప్రేమ చంపుకోవలసి రావడంలో హింస ఉంది. ఒక తల్లికీ తన బిడ్డను తన ఒడిలోకి తీసుకునే వీలు లేక పోవడంలో హింస ఉంది. కన్నీళ్ళలో హింస ఉంది. గుండె గాయంలో హింస ఉంది. పేదరికంలో హింస ఉంది. అసలు వర్గ సమాజం కొనసాగుతుండడమే ఒక హింస. వర్గ సమాజంలో ఒక అంతర్గత హింస. భౌతిక హింసను మించిన స్థాయిలో , విస్తృతిలో వేరు వేరు రూపాలలో జరుగుతూ ఉంటుంది. ఐతే వర్గ సమాజం ఉద్దేశ్యపూర్వకంగానే ఆ అన్ని హింసరూపాలకూ అందమైన, మోసగించే పేర్లు పెడుతుంది. ఆ పేర్లతో అవి ఎదురయినపుడు మన, వాటిని హింసగానూ గుర్తించలేం. వాటిని రద్దు చేయడానికి అవసరమైన ప్రతిస్పందననూ పొందలేం.

ఈ అంతర్గత హింసను ‘హింస’ కధ ప్రతిభావంతంగా చిత్రిస్తుంది. జీవితక్రమం మొత్తంలోనూ హింస వ్యాపించి ఉన్నదని ఈ కధ మన దృష్టికి తెస్తుంది. విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్న హింసకు మనుషులు మామూలు ప్రతిస్పందనలు ఎట్లా ఉంటున్నాయో కూడా కధ వివరిస్తుంది. దాసు, అతని బృందం చేసిన హింస సంగికి హింసగా కనబడలేదు. గనుక వాళ్ళతో ఆ అమ్మాయి మర్యాదగానే వ్యవహరించింది. “కంసాలోడిననడవెందుకూ…. మన బంగారం మంచిదైతే ఆడేం సెయ్యగలడూ…. “ అంటాడు చిన్నాయన తప్పు హింసకు గురయిన వాళ్ళదేనన్నట్లు. “యెనకా గోయ్యే, ముందూ గోయ్యే…. ఇది పరిక్కంప మీద పట్టుకోక అప్పా! తీసినా దక్కదు తియ్యకున్నా దక్కదు” అని నిస్సహాయతను ప్రకటిస్తుంది పెద్దమ్మ. అంతర్గత హింసకు మనం స్పందించే పద్దతులలో ఇవి కొన్ని. ఈ హింస వాళ్ళకు అర్ధం కాలేదు. ఎక్కడో ఒక చోట అది హింస అని అర్ధమయినా దాన్ని కూల్చే మార్ధమేమిటో తెలియదు. ఈ సంగతులేమీ స్పష్టంగా అర్ధాంకాని సంగికి మాత్రం తల్లి ఆశను కోసేసుకోవడానికి చాలా బాధపడుతోందని తెలిసింది. ఇట్లా నిరాయుధ హింస గురించి ఏ కొంచెమో అర్ధమైన సంగి చెలకలో దౌర్జన్యాన్ని, భౌతిక హింసనూ చూసింది. అక్కడ ఆమె వెంటనే నక్కల మీదికి కొడవలెత్తింది. సంగి ఆలోచనల్లోనూ, ఆచరణలోను ఇది గుణాత్మక మార్పు. కానీ చాలా మంది కధకులలోలాగా ఇక్కడ దానికి నాటకీయత లేదు. అది చాలా సహజంగా, అనివార్యంగా సంభవించింది.

ఈ గుణాత్మక మార్పే సమాజమంతా వచ్చే క్రమం మొదలయితే సమాజంలో మానవతా స్పర్శ, ప్రేమ, స్నేహం, స్వచ్చమైన ఆనందం నెలకొనే కృషి ప్రారంభమవుతుంది. అప్పటిదాకా వాటికి ఈ సమాజంలో “ నో రూమ్’.

దుర్మార్గం, అనుమానం, దారిద్ర్యం, నిండిన ఈ సమాజంలో మానవతా స్పర్శకు, ప్రేమకు, స్నేహానికి, స్వచ్చమైన ఆనందానికి స్థానం లేదని లాడ్జి గుమస్తా నుంచి, గాంధీ, నెహ్రూలను దేవుళ్ళుగా కొలిచే నూకరాజు వరకు ప్రతిఒక్కరూ మనకు తమ చేతలతో చూపుతారు. అంతంత మాత్రం శుభ్రమైన లాడ్జింగ్ లోనైనా అమ్మడుతో ఒక్క రాత్రి ఏకాంతంగా గడపాలని నూకరాజు కోరిక. నగర సంస్కృతి వాళ్ళకా అవకాశం లేదంటుంది. ఇదివరకెప్పుడో ఇటువంటి ఆనందం కోసమే తపించి నిరాశ చెందిన దేవుడు కొంతసేపయినాకా, ‘ఆ కుర్రదీ కుర్రోడూ ఏమైనారో’ అని ఆలోచిస్తాడు. తాను అప్పాయమ్మ కోరిక తీర్చలేకపోవడం గుర్తొచ్చి ఈ జంటకు సాయ పడదామనుకుంటాడు. ఎక్కడా గది దొరకక విసిగిపోయి ఉన్న నూక రాజుకి, అమ్మడికి ఎదురుపడి ఆప్యాయంగా పలకరించబోతాడు. ఆ పలకరింపునూ, ఆర్ధ్రతను అనుమానించిన నూకరాజు దేవుణ్ణి చితక తంతాడు.

దేవుడు – అప్పాయమ్మ, నూకరాజు –అమ్మడు కోరుకున్నది ఏకాంతం., ఇష్టాపూర్వకమయిన, స్వచ్చమైన ఆనందం. ఒక్క రోజాయినా మరే ఆలోచనా, మరే భయమూ, మరే ఆందోళనా లేకుండా అనుభవించగల ప్రేమ. వాటికి ఈ వ్యవస్థలో స్థానం లేదు. కోర్కె తీరకుండానే చనిపోయిన అప్పాయమ్మను తలచుకుని పేదతనమంత క్రూరమైంది లేదనుకుంటాడు. ఆ క్రౌర్యానికి గురైన జంటను ఆర్ధ్రంగా పలకరిద్దామనుకుంటాడు. స్నేహం చూపుదామనుకుంటాడు. కానీ ఈ వ్యవస్థ ఎటువంటిదంటే ఇక్కడ స్నేహానికీ స్థానం లేదు. స్నేహ హస్తాలు అనుమానించబడతాయి. ఆర్ధ్రమైన పలకరింతకూ, లాభ నష్టాల లెక్కలలోకి ఇమడని స్నేహానికీ ఇక్కడ గౌరవం లేదు. లోకంలో హింస ఎంత విస్తృతమయిందంటే, ఆప్యాయత ఎంత కరవై పోయిందంటే, గాంధీ భక్తుడైన నూకరాజు కూడా తన పట్ల ఆప్యాయత ప్రదర్శించే వాళ్ళు ఉండగలరని ఊహించలేదు. స్నేహానికి హింసతో జవాబు చెప్పకుండా ఉండలేడు.

మరి లోకంలో ఈ ఉదాత్తభావాలు కరవై పోయి ఉన్న స్థితిలో స్నేహామంతా లాభనష్టాల లెక్కలలోకి ఇమడవలసిందేనా? స్నేహామంటే ఏమిటి? అది ఇవాళ ఉన్న రూపం ఏమిటి? ఈ రూపం ఎందువల్ల వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబుల అన్వేషణలో పుట్టిన కధ ‘స్నేహం’.

కొడుకు ఉద్యోగ ప్రయత్నం కోసం, ఎన్నో ఏళ్ళ కింద తెగిపోయిన స్నేహాన్ని, మళ్ళీ గుర్తు చేసుకుంటూ గోపాలరావు దగ్గరికొస్తాడు శివరామయ్య. అప్పటికప్పుడు డబ్బు అవసరం గనుక శివరామయ్యతో స్నేహం నటిస్తాడు రాజారావు. ఉన్నత వర్గంలో కలిసిపోవాలనే తపనతో గోపాలరావుతో స్నేహం చేస్తుంటాడు రాజారావు. గోపాలారావు కూడా శివరామయ్య స్నేహాన్ని తన అవసరం తీరే మార్గంగా వాడుకుంటాడు. పైగా “ఈ లోకంలో ఒకరికొకరు ఏదో అవుతారన్నది ఒట్టి కల్ల…. మనిషి మనిషితో కలిసి తిరుగుతాడంటే … ఎందుకు కలిసి తిరుగుతాడంటే – అవసరం! ఆ అవసరాన్ని బట్టే అన్నితిరుగుళ్ళూ! ఇన్ని తిరుగుళ్ళూ… స్నేహామంటే ఇంతే. అది బాల్యస్నేహమవ్వచ్చు. పడుచు స్నేహమవ్వచ్చు – ఆ స్నేహం, ఈ స్నేహం… ఏ స్నేహమన్నా కానీ – ఏదయినా పేరు తేడాయేగాని సరుకొక్కటే ….” అని సిద్ధాంతం చెబుతాడు.

“మూడు రూపాయల కోసం మూడు పీకలు కోయగల మనుషులున్నారు ఈ లోకంలో. వాళ్ళకీ ఏవో ధీరీలు ఉండే ఉంటాయి. అలాంటప్పుడు మూడు వందల కోసం డాక్టరు ఓ ముండమోపి థియరీ తీసేడంటే వింత కాదనుకొంది మీనాక్షీదేవి.

లోకంలో స్నేహమే లేదంటే ఆమె భావనాలోకంలో బ్రతుక్కి అర్ధమే లేకుండా పోతుంది మరి!

“అవును అదీ ఓ థీరీయే” అంటూ ఈ కధ ముగుస్తుంది.

ఇక్కడ స్నేహాన్ని ఎవరెవరు ఎట్లా చూస్తున్నారు? వర్గ సమాజంలో స్నేహం ఏ ఏ రూపాలలో వ్యక్తమవుతుంది ? లోకంలో స్నేహమనేది ఉందా? ఉన్నదనుకుంటే మరి ఇవాళ అవసరం మాత్రమే పునాదిగా ఉన్నట్లు కనబడుతున్న స్నేహం సంగతేమిటి? లేదనుకుంటే మరి మనిషికీ మనిషికీ మధ్య సంబంధానికి ప్రాతిపదిక ఏమిటి? అవసరమే ప్రాతిపదిక అనేట్టయితే అవసరాలు తీరిపోయిన మనిషికి స్నేహాలు ఉండవా? మనుషుల అవసరాలు తీరిపోయే వర్గరహిత సమాజంలో స్నేహాలుండవా? – ఈ ప్రశ్నలన్నిటికీ వీలు కల్పించి, స్నేహం పట్ల భావనలు ఎంత గందరగోళంగా ఉన్నాయో ఈ కధ మన దృష్టికి తెస్తుంది.

ఈ గందరగోళాన్ని సృష్టించింది వర్గ సమాజమే. వర్గ వైరుధ్యాన్ని చైతన్యంతో గుర్తించి దాన్ని రద్దు చేసే పోరాట                       క్రమంలో ముందుకు సాగుతున్న కొద్దీ ఈ గందరగోళం తగ్గిపోతుంది. రచయిత ఉద్దేశ్యం ఈ గందరగోళాన్ని మాత్రమే ప్రదర్శించి, కొనసాగుతున్న తప్పుడు భావనలకు బలం కలిగించడం కాదు. స్నేహానికి ఇవాళ కనబడుతున్న అర్ధాల, అసందర్భాన్నీ ఆయన వివరిస్తారు. మీనాక్షీదేవికి స్నేహం అవసరం మీద మాత్రమే ఆధారపడనవసరం లేదన్న స్పృహ ఉంది. ఆమె భావనాలోకంలో స్నేహామంటే బతుక్కి అర్ధం. స్నేహాన్ని అవసరంతో సమానం చెయ్యడం ముండమోపి ధియారీగా భావించిన మీనాక్షీదేవి స్నేహాన్ని మరో కొసకు తీసుకుపోయి, వాస్తవాలతో సంబంధం లేకుండా ఊహాలోకపు ఉద్వేగంగా గుర్తిస్తుంది. దీంట్లో మొదటిది స్నేహం పట్ల మామూలు, యాంత్రిక అవగాహన కాగా, రెండోది కాల్పనిక, స్వీయమానసిక అవగాహన.

“మనిషిని మనిషిగానూ ప్రపంచంతో ఆతని సంబంధాన్ని మానవీయమైనదిగానూ భావించండి. అప్పుడు ప్రేమకు ప్రేమ ద్వారా మాత్రమే బదులు తీర్చుకోగలరు. నమ్మకానికి నమ్మకంద్వారా మాత్రమే జవాబివ్వగలరు… మనిషితోనూ, ప్రకృతి తోనూ మీకు గల ప్రతి ఒక్క సంబంధమూ మీ ఆశయ లక్ష్యానికీ, మీ వాస్తవ వ్యక్తిగజీవితానికీ సంబంధించిన విశిష్ట వ్యక్తీకరణగా ఉంటుంది.” అంటాడు మార్క్స్. (ఎకనమిక్ అండ్ ఫిలాసాఫికల్ మాన్యూ స్క్రిప్ట్స్ఆఫ్ 1844)

వర్గరహిత సమాజంలో మనుషుల మధ్య స్నేహం ఒక సహజత్వం, ఒక అనివార్యత, ఒక చారిత్రక, సామాజిక అవసరం. సంఘజీవులుగా మనుషుల్లో ఈ స్నేహాకాంక్ష ఎల్ల వేళలా ఉంటుంది. మానవుల సంఘ జీవితం ఎన్నెన్ని చీలికలకు దారి తీసిందో అన్నీ అడ్డుగోడలు ఈ స్నేహాకాంక్ష మీద పరుచుకున్నాయి. ఈ గోడలన్నీ పగులగొట్టి స్నేహ స్వరూపాన్ని గుర్తించడం, ఆచరించడం శ్రామికవర్గ దృక్పధానికి మాత్రమే సాధ్య పడుతుంది. కధా కాలంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ రాజారావు, శివరామయ్య, గోపాలరావు, మీనాక్షీ దేవి ఒకే తానులో ముక్కలు గనుకనే వాళ్ళకు స్నేహారూపం అర్ధం కావటం అసాధ్యం. అందువల్లనే వాళ్ళు స్నేహపు వికృత రూపాన్నే దర్శించగలరు. ప్రర్శింపగలరు. (స్నేహ స్వరూపాన్ని గుర్తించిన శ్రామిక వర్గ దృక్పధం గలవాళ్ళు కూడా సమగ్రంగా దాన్ని ఆచరించడం ప్రస్తుత సమాజంలో కష్ట సాధ్యం, అసాధ్యం కూడా.)

ఇక్కడి దాకా, 1969 ఏప్రిల్ లో రాసిన ‘స్నేహం’ దాకా ప్రధానంగా మానవసంబంధాలలోని అప్రజాస్వామికత గురించి రాస్తూ వచ్చిన కారా, ఆ తర్వాత రావలసిన ప్రజాస్వామికత గురించి, అంతకన్న ముఖ్యంగా ప్రజాస్వామికత సాధించే ఆలోచనల, ఆచరణల గురించి కధలు రాయటం మొదలు పెట్టారు. పైననే చెప్పినట్టు ఈ ప్రజాస్వామికతను సాధించే మార్గం శ్రామిక వర్గ దృక్పద్ధమే. ఆ దృక్పధాన్ని ఆయన 1951 నవంబర్ లో రాసిన “అప్రజ్ఞాతం” లో చిత్రించే ఉన్నారు. ఐతే తెలుగు సీమలో 1951 నవంబర్ నాటికి కధా నాయకుడు సుదర్శనానికి మాత్రమే గాక, కమ్యూనిష్టు పార్టీకే ఆ ధృక్పథపు మార్గం అప్రజ్ఞాతం కావడం మొదలయింది.

ఆ అప్రజ్ఞాతాన్ని జ్ఞాతం చేయాలనే ‘ఆర్తి’ 1969 తర్వాతనే మొదలయింది. ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, కుట్ర కధల్లో కారా సమాజంలోని అప్రజాస్వామికను చూపడంతో పాటే, ప్రజాస్వామికతను సాధించే వివిధ మార్గాల గురించి ఆలోచనను రేకెత్తించడానికి ప్రయత్నించారు.

మోచేతి కూడు తినదలుచుకోని పైడయ్య (ఆర్తి), తన ఊరిని కొత్తగా కనిపెట్టిన గురవడు (భయం), వర్గ సమాజ ఆవిర్భావం నుంచీ “తేలకుండా చిక్కుపడిపోయిన విషయాన్ని” “ఇహ కుదరదు, ఆ రోజు వెళ్ళిపోయింది, ఆ సంగతి గ్రహించాలి” అని యజమానికీ, ప్రభుత్వానికీ సీరియస్ గా హెచ్చరిక జేసిన విశ్వనాధం (శాంతి), “ అది రావాల. బూమ్మీద యీ వొనాశవంత సూసినప్పుడు నాకదే అనిపిస్తాది. పెళయం తప్ప ఈ బూమ్మీది మురికిని మరేది కడగలేదు. పోతే అన్నీ పోతాయి. మనుషులవూ పోతావు. పోయినా సరే.” అనే కన్నయ్య (చావు), కసురుకున్నా, విసుక్కున్నా, కుక్కల్నీ, పోలీసుల్నీ చూపి భయపెట్టినా కలవారినిబ్బంది పెట్టక వల్లకాదని గుర్తించి, ఇద్దరు ముగ్గురై, ముగ్గురు పదిమందిలో చేరీ రెండంతస్తుల భవనాల సింహద్వారాల వద్ద చేరి “కడ వరకూ” గేటు వదలని ఆడవాళ్ళు (జీవధార), “నువ్వాలాగా, మరీ అంతకంతల్లేని గదిలో కాపరవెట్టి, ఉన్న ఒక్క గుమ్మానికీ మంచం అడ్డేసేస్తే ఆ కాపరం సక్కబెట్ట దలచినోడికి రెండే రెండు దార్లు. నిశిరాత్రి నీ పీక పిసికీడం మొదటిది. లేదా గోడలు బద్దలు గొట్టేయాల. మూడో దారి లేదు” అన్న ‘కుట్ర’ వ్యాఖ్యాత మానవసంబంధాల దుస్థితినే వాఖ్యానిస్తున్నారు. అవి మంచి వైపు మారాలనే ఆర్తినీ, అందుకు తమకు తోచిన మార్గాలనూ ప్రకటిస్తున్నారు. కారా కధల మౌలికాంశం మానవ సంబంధాల విశ్లేషణే. వర్తమానం గురించిన ఈ విశ్లేషణ, వర్తమాన అవ్యవస్థను చిత్రించే మాట నిజమే కాని, దాని సందేశం నిరాశ కాదు. ఆ వ్యవస్థను కూల్చేయవలసిన అవసరం, భవిష్యత్తు పట్ల ఆశ. ఈ అర్ధంలో కారా నిశిత సామాజిక వ్యాఖ్యాత, సామాజిక మనస్తత్వవేత్త.

[ఈ పరిధిలోకి వచ్చినా ఇంకా విస్తృతంగా చర్చించవలసి ఉన్న మరికొన్ని కధల్ని స్థలా భావం దృష్ట్యా వదిలేయడం జరిగింది.]

ఎన్. వేణుగోపాల్

“Modata Arunatara January – March 1987 sanchikalo prachuritamaina ee vyaasam aa tarvaata N Venugopal vyaasa samputam Kathaasandarbham (2000) lo kooda achchayindi”

(  మొదట అరుణతార జనవరి -మార్చి 1987 సంచిక లో ప్రచురితమైన ఈ వ్యాసం ఆ తరువాత ఎన్. వేణుగోపాల్ వ్యాస సంపుటి కథాసందర్భం 2000) లో కూడా అచ్చయింది. )

కొమురం భీం – గతమూ వర్తమానమూ

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

 

ఆదివాసుల వర్తమానంలో “నాగరికుల” గతం అక్షరాలా కళ్లకు కడుతుందని సామాజికశాస్త్రాల పరిశోధకులు, ముఖ్యంగా చరిత్రకారులు, మానుష శాస్త్రవేత్తలు ఎందరో అన్నారు. క్షేత్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆదివాసేతర సమూహాలను “నాగరికులు” అనడం సరైనదా కాదా అనే చర్చలోకి ఇక్కడ పోవడంలేదు గాని అసలు ఆదివాసులకు ఒక వర్తమానం ఉందా, వారింకా ఎడతెగని గతంలోనే ఉన్నారా అని చర్చించవలసి ఉంది. కొమురం భీం చరిత్ర ద్వారా ఆదివాసుల వర్తమానాన్నీ, గతాన్నీ చూస్తే వాటి మధ్య అభేదం కనిపిస్తున్నది.

ఆదివాసుల వర్తమానమూ గతమూ ఒక్కటిలాగే ఉండడం, దశాబ్దాలూ శతాబ్దాలూ గడిచినా ఆదివాసి జీవితాలలో, సమస్యలలో, వ్యక్తీకరణలలో, పోరాటాలలో, ఆదివాసులపట్ల మైదానవాసుల, రాజ్యాంగయంత్రాల వైఖరిలో ఏకసూత్రత ఉండడం ఆశ్చర్యాన్నీ విచారాన్నీ కలిగిస్తున్నది. ఆదివాసుల పట్ల మన వైఖరిలో ఒక అంశం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్లనే ఆదివాసుల చరిత్ర చాలవరకు విస్మరణకూ, నమోదైన చోట్ల కూడ అస్పష్టతలకూ పొరపాట్లకూ గురయింది. మామూలుగానే మనకు చరిత్ర స్పృహ, చరిత్రను నమోదు చేయాలనే ఆలోచన చాల తక్కువ. అది అసలు మనకు చరిత్రే లేదని వలసవాదులు అనేందుకు, ఇతరులు నమ్మేందుకు దారితీసిందని మనకు తెలుసు. మన ఆలోచనాపరిధిలోనే లేని ఆదివాసుల చరిత్ర గురించి పట్టించుకోవడానికి మనకు తీరిక, ఓపిక ఉంటాయా?

చరిత్ర అధ్యాపకులు వకుళాభరణం రామకృష్ణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర అని బహు సంపుటాల బృహత్తర గ్రంథం ఒకటి కొన్ని సంవత్సరాలుగా తయారవుతున్నది. ఆ గ్రంథం కోసం ఇరవయో శతాబ్ది చరిత్ర మీద గతంలో కొన్ని అధ్యాయాలు రాసి ఉన్నాను. ఆ నమ్మకంతోనే ఆయన ఇప్పుడు తయారీలో ఉన్న సంపుటానికి ‘హైదరాబాద్ సంస్థానంలో ఆదివాసి తిరుగుబాట్లు’ అనే అంశం మీద ఒక అధ్యాయం రాసి ఇమ్మని అడిగారు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మల నుంచి రాంజీ గోండు మీదుగా కొమురం భీం దాకా తెలంగాణలో ఆదివాసుల తిరుగుబాట్ల గురించి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాను గనుక ఇదెంత పని అనుకుని ఒప్పుకున్నాను. కాని దిగినాక గాని తెలుసుకోవలసినది చాల ఉందని తెలియలేదు. ‘జ్ఞానం అంటే మన అజ్ఞానం గురించి మనకు క్రమానుగతంగా తెలిసిరావడమే’ అని విల్ డ్యురాంట్ అన్నమాట ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద చదువుకుని ఎన్నోసార్లు వాడాను గాని తెలుగు సమాజంలోని ఆదివాసుల చరిత్ర గురించి తెలుగు సమాజ జ్ఞానం ఇంత అజ్ఞానంతో నిండి ఉన్నదని ఈ వ్యాసం రాసే క్రమంలోనే అర్థమయింది. పగిడిద్దరాజు తిరుగుబాటు నుంచి కొమురం భీం తిరుగుబాటు దాకా (అంతకు ముందూ ఆ తర్వాతా జరిగిన తిరుగుబాట్లను పక్కన పెట్టినప్పటికీ) ఏడు శతాబ్దాలలో తప్పకుండా ఎన్నెన్నో తిరుగుబాట్లు జరిగి ఉంటాయి. కాని పద్దెనిమిదో శతాబ్దం దాకా నమోదైనవే లేవు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ లోని ఏజెన్సీ ప్రాంతాలలో రంప తిరుగుబాట్లు, ద్వారబంధాల చంద్రయ్య, అల్లూరి సీతారామరాజు, వీర గున్నమ్మ వంటి నాలుగైదు, హైదరాబాద్ రాజ్యంలో రాంజీ గోండు, కొమురం భీం మినహా చరిత్రకెక్కినవి లేవు. వాటిలోనూ కొన్ని పరిణామాల గురించీ, ఘటనల గురించీ నాలుగైదు వాక్యాలలో తేల్చివేయడమో, పాదసూచికలో చెప్పడమో జరిగింది గాని సవివరమైన నివేదికలు లేవు. కాస్త వివరమైన నివేదికలు ఉండి, విస్తృతమైన ప్రచారం జరిగిన సందర్భాలలో కూడ అస్పష్టతలు, అన్వయం కుదరని సంగతులు, పొరపాట్లు ఎన్నో ఉన్నాయి. కొమురం భీం ఉదంతమే పెద్ద ఉదాహరణ.

**

కొమురం భీం నాయకత్వం వహించిన, వేలాది మంది గోండులూ, కోలాములూ, ఇతర తెగలూ పాల్గొన్న, కనీసం మూడు సంవత్సరాలు నడిచిన పోరాటం 1940లో అణచివేతకు గురైంది. అది అంత ప్రభావశీలమైన తిరుగుబాటు అయినప్పటికీ ఆదివాసుల సామూహిక జ్ఞాపకంలో తప్ప భీం మరెక్కడా లేకుండాపోయాడు. ఈ ప్రాంత సామాజిక చరిత్రలో భాగం కాకుండా పోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భీం విస్మృత గతంగా మారిపోయాడు. ఆ గతాన్ని తవ్వితీసినదీ, వర్తమానంతో సంభాషింప జేసినదీ, భీంను పునరుజ్జీవింపజేసినదీ విప్లవోద్యమం.

జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాలు కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలుగా విస్తరించిన కాలంలో, 1978-79ల్లో విప్లవోద్యమం ఆదిలాబాద్ జిల్లా అడవులలోకి ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం నిర్మాణమై అది 1981 ఏప్రిల్ 20న ఉట్నూరు సమీపంలోని ఇంద్రవెల్లి గ్రామంలో మహాసభ జరపాలని తలపెట్టింది. ఆ సభకోసం చుట్టూ 60 గ్రామాల నుంచి వస్తున్న ఆదివాసులను అడ్డగించి, లాఠీచార్జిలు, అరెస్టులు చేసి, చివరికి తుపాకి కాల్పులు జరిపి ఆదివాసుల చైతన్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇంద్రవెల్లి కాల్పుల్లో కనీసం 60 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షుల, సమకాలిక ఆధారాలు చెపుతుండగా, 13 మంది మాత్రమే చనిపోయారనే అధికారిక “చరిత్ర” ఇప్పటికీ రాజ్యం చేస్తున్నది. ఆ సందర్భంలో అప్పటికే గిరిజన రైతుకూలీ సంఘంలో సమీకృతమవుతున్న ఆదివాసులు కొమురం భీంను తలచుకున్నారు. ఆ తలపోత కాల్పుల తర్వాత మరింత పెరిగింది. ఆదివాసులు వర్తమాన పోరాటాన్ని గత పోరాటంతో కలిపి చూసుకున్నారు. వర్తమాన దమనకాండను గత దమనకాండతో సమానమైనదిగా పోల్చి చూసుకున్నారు. ఈ వర్తమానం వల్ల గతం మళ్లీ ఒకసారి నవనవోన్మేష జ్ఞాపకమయింది.

ఆ సమయానికి ఆ ప్రాంతంలో విప్లవోద్యమ కార్యకర్తగా పనిచేస్తుండిన సాహు, అప్పటి విప్లవోద్యమ నాయకత్వం ఆ మౌఖిక చరిత్ర శకలాలను జాగ్రత్తగా సేకరించి, అల్లం రాజయ్యతో పంచుకున్నారు. ఇద్దరు రచయితలూ ఆ విషయం మీద అభినివేశం ఉన్న అనేకమంది మిత్రులతో కలిసి లోతైన పరిశోధన సాగించారు. కొమురం భీంను చంపి, ఆ పోరాటాన్ని అణచివేసిన తర్వాత నిజాం ప్రభుత్వం ప్రఖ్యాత మానుషశాస్త్రవేత్త క్రిస్టొఫ్ వాన్ ఫ్యూరర్ హేమెండార్ఫ్ తో చేయించిన పరిశోధనా నివేదికతో సహా లభ్యమవుతున్న లిఖిత ఆధారాలను సేకరించుకున్నారు. అలా ఎంతో కాలం శ్రమించి 1983లో కొమురం భీం అనే అద్భుతమైన చారిత్రక నవల రాశారు. ఆ నవలే కొమురం భీంను తెలుగు సమాజంలోకి మళ్లీ సజీవంగా తీసుకొచ్చింది.

ఇవాళ్టికీ అరకొర వనరులే దొరుకుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే, ముప్పై మూడు సంవత్సరాల కింద దొరికిన వనరుల మీద ఆధారపడి, కొంత విశ్వసనీయ కాల్పనికతకు కూడ అవకాశం ఇచ్చి సాహు, అల్లం రాజయ్య చేసిన ఆ కృషి మహాద్భుత ప్రయత్నమనే చెప్పాలి. వారు అప్పటికి సంప్రదించిన పదకొండు అధికారిక పత్రాల జాబితా కూడ ముందుమాటలో ఇచ్చారు. అప్పటికి ఇంకా భీంతో పాటు కలిసి పనిచేసినవారు, పోరాటంలో పాల్గొన్నవారు, భీంను చూసినవారు, భీం కుటుంబసభ్యులు కొందరైనా సజీవంగా ఉన్నారు గనుక రచయితలు వారందరినీ కలిసి మౌఖిక చరిత్ర వివరాలు సేకరించారు. అందువల్ల భీం రూపం గురించి, భావోద్వేగాల గురించి, పరిశీలనా శక్తి గురించి, నాయకత్వ లక్షణాల గురించి, వేలాది గోండులను ఆకర్షించిన సమ్మోహక శక్తి గురించి నవలలో చిత్రించిన విషయాలు చాలవరకు నిజమే అయి ఉండాలి.

అయితే భీం చివరి పోరాటం ఎప్పుడు జరిగిందనే దాని మీద, భీంను నిజాం పోలీసులు కాల్చి చంపిన తేదీ మీద వాళ్లు కొంత పొరపాటు పడ్డట్టున్నారు. “డర్ నా మత్ సత్తార్ సాబ్…. తారీఖ్ భూల్ గయా! ఆజ్ పెహలీ హై… సెప్టెంబర్…. బుధవారం … సంవత్సరం కూడా చెప్పనా 1940” అన్నాడు కెప్టెన్ – అనే సంభాషణ ద్వారా భీంను కాల్చి చంపిన తేదీ 1940 సెప్టెంబర్ 1 అని వాళ్లు రాశారు. భీం ఒరిగిపోయిన చోట స్మారకచిహ్నంగా అప్పుడే గోండులు పాతుకున్న ఒక రాయి మీద 1.9.1940 అని చెక్కి ఉండడం దీనికి కారణం కావచ్చు. అయితే కొమురం భీం నవల మీద సృజనలో వివరమైన సమీక్షా వ్యాసం రాసిన సి వి సుబ్బారావు, 1940 సెప్టెంబర్ 1 నవలలో రాసినట్టుగా బుధవారం కాదనీ, ఆదివారం అనీ సవరించారు. (1983లో వచ్చిన పిబిసి ప్రచురణ, ఆ తర్వాత వచ్చిన విరసం ప్రచురణ – 1993, ఆదివాసి ప్రచురణలు – 2004, 2010 కూడ ఈ బుధవారం అనే మాటను అలాగే కొనసాగించాయి. పర్ స్పెక్టివ్స్ ప్రచురణ 2013లో సంభాషణలోనే బుధవారం బదులు ఆదివారం అని మార్చారు).

సాహు, అల్లం రాజయ్యల నవల తర్వాత కొమురం భీం మీద, గోడుల జీవన పోరాటాల మీద రెండు మూడు నవలలు, కొన్ని కథలు, ఒక సినిమా, అసంఖ్యాక వ్యాసాలు వెలువడి కొమురం భీం గురించి, ఆయన నడిపిన పోరాటం గురించి ఎన్నో వివరాలను ప్రజల దృష్టికి తెచ్చాయి. కొమురం భీం మరణానంతరం నాలుగు దశాబ్దాల తర్వాత ఉజ్వల స్మృతిగా జీవించడం ప్రారంభించాడు.

**

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమక్రమంలోనూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతా కొమురం భీం ఒక విగ్రహంగా, ప్రతీకగా కూడ మారిపోయాడు. ఆయన పేరు తలవని వాళ్లు దాదాపు లేరు. ఆయన భావాలతో, ఆయన పోరాటంతో ఎంతమాత్రమూ సంబంధం లేనివారి నుంచి, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్ల దాకా అందరూ ఆయనను ఏదో ఒక సందర్భంలో తలచుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ వీర యోధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందనే వాదనకు చిహ్నంగా కొమురం భీం ముందుకొచ్చాడు. పాఠ్యపుస్తకాలలో, హుసేన్ సాగర్ టాంక్ బండ్ మీద విగ్రహాలలో కొమురం భీం ఎందుకు లేడనే ప్రశ్న వచ్చింది. పాఠ్యపుస్తకాలలో ఏదో ఒకస్థాయిలో భీం పాఠంగా కూడ మారాడు. విశాలమైన ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలనే ఆకాంక్షకు, తూర్పు జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలనే కోరిక తోడయింది. చివరికి అక్టోబర్ 8న కొమురం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరిపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోడెన్ ఘాట్ వెళ్లి అక్కడ కొమురం భీం స్మారక ఉద్యానవనానికి శంకుస్థాపన చేసివచ్చారు.

కొమురం భీం నవల తవ్వితీసిన సెప్టెంబర్ 1 స్థానంలో ఈ అక్టోబర్ 8 ఎక్కడినుంచి వచ్చినట్టు? వాస్తవంగా కొమురం భీం వర్ధంతి అక్టోబర్ 8 కాదు. బాబేఝరీలో స్మారక శిల మీద 1.9.1940 అని రాసి ఉందని ఇదివరకే చూశాం. ఆ రోజు ఆశ్వయుజ పౌర్ణమి అని భీం సమకాలికుల జ్ఞాపకం ఆధారంగా, జానపద గాథల ఆధారంగా ఆదివాసులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజున భీం వర్ధంతి జరుపుకునేవారు. ఈ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబర్ 8న వచ్చింది గనుక రాష్ట్ర ప్రభుత్వం ఆరోజునే వర్ధంతి జరిపింది.

కాని ఇక్కడ మరొక చిక్కు ఉంది. 1940లో, విక్రమ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి సెప్టెంబర్ 1న కాదు, అక్టోబర్ 16న వచ్చింది. పోనీ ముందరి నెలలో, భాద్రపద పౌర్ణమి అనుకుందామా అంటే అది సెప్టెంబర్ 16న వచ్చింది. అలా ఇప్పటికి ఉన్న రెండు తేదీలు – స్మారకశిల మీద ఉన్న సెప్టెంబర్ 1 అనే ఇంగ్లిష్ తేదీ, గోండుల జ్ఞాపకంలో ఉన్న ఆశ్వయుజ పౌర్ణమి అనే తెలుగు తిథి – ఒకదానికొకటి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో నిజాం పోలీసులతో పోరులో కొమురం భీం ఒరిగిపోయిన తేదీ గురించి సమకాలీన ఆధారాలు దొరుకుతాయా అని గోలకొండ పత్రిక, ఆంధ్రపత్రిక పాత సంచికల అన్వేషణ ప్రారంభించాను. ఆ అన్వేషణలో కొమురం భీంను కాల్చిచంపిన తేదీ సెప్టెంబర్ 10 అని కచ్చితంగా తెలియడంతో పాటు, మరికొన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు కూడ బైటపడ్డాయి.

ఆంధ్రపత్రిక 1940 సెప్టెంబర్ 16 న ‘పోలీసులనెదిరించిన 500 గోడుల మూకపై తుపాకి కాల్పులు’ అనే శీర్షికతో, ‘హైదరాబాదులో 10 చంపబడిరి 13 గాయపడిరి’, ‘నేరస్థుల అరెస్టును నిరోధించినందుకు పర్యవసానము” అనే ఉపశీర్షికలతో ఒక వార్త వచ్చింది. “హైదరాబాదు (దక్కను), సెప్టెంబర్ 15” అనే డేట్ లైన్ తో వచ్చిన ఈ వార్తలో, “ఆసిఫాబాద్ సమీపమున సెప్టెంబర్ 10వ తేదీన బాభ్జారి ప్రాంతమున 500 మంది గోండులమూక తుపాకులు యితర ఆయుధములతో పోలీసులను ఎదిరించినందుకు పోలీసువారా మూకపై తుపాకులు ప్రేల్చవలసి వచ్చెననియు కాల్పులవల్ల 10 మంది గోండులు చంపబడి మరి 13గురు గాయపడిరనియు యిక్కడ అందిన వార్తలు దెలుపుచున్నవి….” అనే మొదటి పేరాతో నాలుగు పేరాల వార్త ప్రకటించింది. “(అ.ప్రె.)” (బహుశా అసోసియేటెడ్ ప్రెస్) అని చివరన ఉన్న ఈ వార్త మూడో పేరాలో కూడ పోలీసులు అడవిలోకి వెళ్లిన తేదీ సెప్టెంబర్ 10 అని మరొకసారి రాశారు.

ఇక గోలకొండ పత్రిక 1940 సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు వరుసగా ప్రతి సంచికలోనూ ప్రచురించిన వార్తలు, వ్యాఖ్యలు చాల ఆసక్తికరమైనవి, వివరంగా చదవవలసినవి. మొదట సెప్టెంబర్ 16న అచ్చువేసిన వార్త శీర్షిక “200 గోండులు అధికారులను ఎదిరించుట”. దాని ప్రకారం “ఆసిఫాబాదులోని బాబ్ ఝరీ అనే గ్రామంలో గుట్టలు కలవు. అచ్చట 200 గోండులు ఆయుధపాణులై 4 ఆబాన్ నాడు పోలీసు మొహతమీమును, తాలూక్దారును, 100 పోలీసు దళాన్ని ఎదిరించినారని జనులు అనుకొనుచున్నారు. కొన్ని దినాలకు ముందు ఈ గ్రామంలో గోండులు అడవిశాఖ నౌకర్లపై పడి కొట్టియుండిరి. పోలీసులు ఆ సందర్భములో కొందరిని పట్టుకొనిరి. కొందరిని జమానతుపై వదలిరి. కాని మరల వారిని పిలిపించగా వచ్చుటలేదని తిరుగబడిరి. 200 గోండులు గుట్టపైకెక్కి పోలీసులనెదిరించిరి. 4 ఆబాన్ నాడు పోలీసు మొహతెమీమున్ను తాలూక్దారున్ను 100 మంది పోలీసు జవానులతో ఆ గ్రామం వెళ్లిరి. వారిని కూడా గోండులు బెదిరించిరి (అ.న్యూ.)”

ఆ తర్వాతి సంచిక (సెప్టెంబర్ 19)లో ‘గోండులపై పోలీసులు కాల్చుట’ అనే శీర్షికతో, ’10 మంది చచ్చిరి, 13 మందికి గాయాలు’ అనే ఉపశీర్షికతో “ఆసిఫాబాదు, ఆబాన్ 11” డేట్ లైన్ తో కాల్పుల వార్త వచ్చింది. దాంట్లో కూడ స్పష్టంగానే “10 సెప్టెంబరు నాడు అవ్వల్ తాలూక్దారు కొందరి పోలీసులను వెంటబెట్టుకొని వారిని (గోండులను) పట్టుకొనబోయెను. కాని 300 గోండులవరకు వారినెదిరించిరి. తాలూక్దారు వారికి చాలావరకు బుద్ధిచెప్పినా వారు వినలేదు. పైగా అందొకడు తుపాకితో కాల్చెనట. అదృష్టవశాత్తు అదెవ్వరికిని తగులలేదట. మరల రెండవమారు గోండులు తుపాకీ కాల్చిరి. దానిమూలాన ఒక పోలీసు జవానుకు దెబ్బతగిలెను. అటుపై పోలీసువారు తమ తుపాకీలను గోండులపై కాల్చిరి. ఆ దెబ్బలతో 10 మంది గోండులు చచ్చిరి. 13 మందికి గాయములు తగిలెను. 31 మంది పట్టుకొనబడిరి. తక్కినవారు పారిపోయిరి” అని ఉంది.

నేను ఈ అన్వేషణ సాగించి నా వ్యాసం పూర్తి చేసిన వారం తర్వాత చరిత్ర పరిశోధకుడు భంగ్యా భూక్యా కూడ అప్పటి అత్యున్నత పోలీసు అధికారి ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రతి సంపాదించి దాని ప్రకారం కాల్పులు జరిగిన తేదీ సెప్టెంబర్ 10 అని తేల్చారని, అది భాద్రపద శుద్ధ నవమి అని కనుక పౌర్ణమిని వర్ధంతిగా గుర్తించడం మానేయాలని అన్నారని పత్రికలలో వచ్చింది.

ఈ కాల్పుల వార్త తెలిసిన వెంటనే ఆంధ్ర మహాసభ, హైదరాబాదు సంస్థాన హిందూ ప్రజామండలి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ల పక్షాన కనీసం మూడు నిజనిర్ధారణ కమిటీలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. బహుశా ఆంధ్ర మహాసభ పక్షాన వెళ్లిన బద్దం ఎల్లారెడ్డి గోలకొండపత్రిక 23.9.1940 సంచికలో ‘బాబెఝరీ గోండులపై కాల్పులు’ అనే పెద్ద వ్యాసం రాశారు (దురదృష్టవశాత్తూ ఇప్పుడు ప్రెస్ అకాడమీ అర్కైవ్ లో లభ్యమవుతున్న గోలకొండ పత్రిక డిజిటైజ్డ్ ప్రతిలో ఈ వ్యాసం అచ్చయిన పేజీ సగానికి చిరిగిపోయి ఉంది). “సర్కారి లెక్క ప్రకారము 10 మంది ఆ స్థలములోనే మరణించినారు. గాయపడ్డ పదముగ్గురు ఆసిఫాబాద దవాఖానాకు కొనితేబడగా వారిలో 4గురు ఇటీవల మరణించినారు. ఝండాగూడ గ్రామములో మరి ఇద్దరు గాయపడినవారు చచ్చినారని 11 ఆబాన్ నాడు పంచునామా చేయబడినది. ఇట్లు మొత్తం 16గురు చచ్చినారని సర్కారువారి లెక్క. ఇక ఇక్కడి ప్రజల అంచనా 100 మందికిపైగా ఆచోటనే చచ్చినారని” అని, ఈ ఘర్షణ పూర్వాపరాలతో సహా ఎల్లారెడ్డి గారు రాశారు. అదే సంచికలో గోలకొండ పత్రిక సంపాదకీయమూ రాసింది, ప్రభుత్వ ప్రకటన పూర్తి పాఠమూ అచ్చువేసింది.

ఆసిఫాబాద్ లో శ్రీనివాసాచారి, లక్ష్మణ్ అనే వకీళ్లుఈ ఘటనను విచారించడానికి కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన వార్త గోలకొండ పత్రిక 26 సెప్టెంబర్ సంచికలో వచ్చింది.

సెప్టెంబర్ 30 సంచికలో ‘గోండుల గోడు – బాబెఝరీ కాల్పుల గురించి కొన్ని సవరణలు’ అంటూ మళ్లీ ఎల్లారెడ్డి గారు అదనపు వివరాలు రాశారు. “ఆ రోజే కాల్పులు జరిగినప్పుడు బాబెఝరీలో 127 మంది చచ్చినారని రూఢిగా ఒక పోలీసు పటేలు వల్ల తెలియుచున్నది. వీరందరిని పోలీసు అక్కడనే దహనం చేసి గురుతు లేకుండా చేసిరని కూడ తెలియుచున్నది. ఆస్పత్రిలో 4గురు మరణించినారు. మండ్రుమాడలో నొక గాయపడినవాడు మరణించినాడు. గోండు ఝండా గూడలో నిద్దరు గాయపడినవారు మరణించినారు. వీరిద్దరి పంచునామా కూడ అయినదని తెలియుచున్నది. గడలపల్లిలో ఇద్దరు గాయపడ్డవారు మరణించినారని పోలీసు పటేలు రిపోర్టు. చిద్రకుంటలో ఇద్దరు మరణించినారని పోలీసుపటేలు రిపోర్టు. మొత్తం ఇప్పటికి 138 మంది చచ్చినారని తెలియుచున్నది” అని రాశారు. (బద్దం ఎల్లారెడ్డి గారి పర్యటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని ‘శతజయంతి సంస్మరణ సంచిక’ లో ప్రచురించిన పోలీసు రికార్డ్స్ తెలియజేస్తాయి.)

అక్టోబర్ 7 సంచిక రెండు నిజనిర్ధారణ సంఘాల గురించి వార్త ప్రకటించింది. అక్టోబర్ 14 సంచిక న్యాయవిచారణ జరిపించమని కోరుతూ ఆంధ్రమహాసభ చేసిన తీర్మానాన్ని ప్రకటించింది.

అక్టోబర్ 17 సంచికలో ‘గోండుల గోడు – క్రొత్తగా తెలిసిన సంగతులు’ శీర్షికతోనూ, అక్టోబర్ 21 సంచికలో ‘గోండుల గోడు’ శీర్షికతోనూ జి ఎస్ గుప్త చాల వివరమైన నివేదికలు రాశారు. ఎన్నో గ్రామాలు, గోండు గూడాలు తిరిగి సేకరించిన సమాచారంతో ఆయన రాసిన ఈ నివేదికలు చాల విలువైనవి, తప్పనిసరిగా చదవవలసినవి.

**

“ఆసిఫాబాదు జిల్లాలో గోండులపై పోలీసువారు తుపాకులను కాల్చినందుకు 10 మంది చచ్చిరని తెలుపబడి యుండెను. అటుపై ప్రభుత్వము వారీ కింది విధముగా ప్రకటించుచున్నారు:

పోలీసు మంత్రియున్ను, పోలీసు నాజమున్ను ఆసిఫాబాదుకు పోయి విచారం చేసి వచ్చుటచే తెలిసినదేమనగా ఇంతవరకు 10గురు గోండులు చనిపోయినారు.

5 ఏండ్ల క్రిందట ఒక గోండు ఈ రాష్ట్రములోనికి వచ్చి ఆసిఫాబాదుకు 12 మైళ్ల దూరములో ఒక అడవిలో పీఠము వేసినాడు. అచ్చట వాడు దొంగతనంగా వ్యవసాయం సాగించినాడు. క్రమంగా 300 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు. కొందరు శిష్యులు కూడ జతకూడినారు. అడవిశాఖవారు ఆ వ్యవసాయాన్ని ఆపివేయ ప్రయత్నించినారు. కాని వాడు వినలేదు. 2 నెలల క్రిందట కొందరు అడవిశాఖవారు వానిని నిరోధించుటకు వెళ్లగా అందులో ఇద్దరికి దెబ్బలు తగిలెను. ఈ మనిషిని పట్టేది కష్టమని మొహతమీమ్ స్వయంగా వెళ్లి వానినిన్నీ మరివాని వద్దనుండే ఆరు మందిని పట్టుకుని వారు పట్టుకున్న ఆయుధాలను క్రింద పెట్టించి జమానతుపై అచటనే విడిచివేసెను. ఇక్కడికంతా తృప్తికరముగా పరిష్కారమయినదని జిల్లా అధికారులు నివేదించుకొనిరి. విచారణ దినమునాడు కోర్టుకు గోండులు రాకపోయిరి. అందుపై వారంటు పంపబడెను. దానిని వారిపై ప్రయోగించుట కష్టసాధ్యమయ్యెను. ప్రయోగింపుచో జవానులను చంపుదుమన్నారు. ఈ గోండు మరీ బిర్రబిగిసి తాను గోండు రాజాననిన్నీ తనకు 5 జాగీరులిచ్చి అడవి సుంకాలన్నీ వదులుకోవలెననిన్నీ తాలూక్దారుకు పోలీసు అధికారికి చిట్టీలు వ్రాసినాడు. తనవారిపై ప్రభావంజేసినాడు. తనకు మంత్రశక్తి కలదన్నాడు. తుపాకి గుండ్లు తమపై పారవన్నాడు. ఆ మార్గంగా పోవు విమానాన్ని చేయి విసిరి క్రింద పడగొడ్తాను చూడుమన్నాడు. ఇట్టి ముచ్చట్ల చేత వాని అనుయాయి వర్గం 1000 మంది వరకు పెరిగిందని వదంతి. ఇక శ్రుతి మించనీయగూడదని తాలూక్దారు 100 పోలీసులను తుపాకులతో లాఠీలతో తీసుకుని వెళ్లినాడు. జిల్లా పోలీసు అధికారిని, జిల్లా అటవీశాఖ అధికారిని జిల్లా డాక్టరును వెంటబెట్టుకున్నాడు. గాయాలకు చికిత్స చేసే మందు డబ్బాలను కూడ పట్టించుకున్నాడు. ఇంకా ఇద్దరు రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకున్నాడు. గోండులుండే గుట్ట వద్దకు 4 ఆబాన్ నాడు వెళ్లి డేరా వేసినాడు. ఆ గ్రామం పటేలుద్వారా గోండులకు రాయబారాలంపినారు. కాని గోండులు పటేలును మళ్లీ వస్తే చంపివేస్తామని చెప్పంపినారు. మరునాడు గోండులు నగారాలు మోగించినారు. 6 ఆబాన్ నాడు పోలీసువారు 800 అడుగులయెత్తు గుట్టను భద్రముగా ఎక్కినారు. అచట 500 గోండులు ఆయుధాలతోనుండినారు. 4 గంటల కాలం తాలూక్దారు వారికి బుద్ధిరావలెనని చాలా ప్రయత్నం చేసినాడు. కాని లాభము లేకపోయింది. వారు ఆయుధాలను విసర్జించమన్నారు. పైగా మీరు వెళ్లుతారా లేక అందరినీ నరికి వేస్తుమా అని బెదిరించినారు. తుదకు మాటల కాలము పోయినది, వారు కూతలు పెట్టుచూ 80 గజాలు వెనుకకు తగ్గినారు. అనేక గోండులు ఆవేశముతో ఊగుటకు మొదలుపెట్టినారు. ఇక ప్రమాదమే అని తాలూక్దారు గాలిలో రెండుమారులు బెదిరించేదానికి కాల్పించినాడు. దానివల్ల లాభం లేకపోయినప్పుడు గుండ్లను కాల్పించినాడు. గోండు నాయకుడు పోలీసు వారికి 10 గజాల దూరంలో చచ్చి కిందపడినాడు. వాని పక్కనే వాని చుట్టమొకడు చచ్చిపడినాడు. మరి 8 మంది అప్పుడే చచ్చిపడినారు. 13 మందికి గుండుదెబ్బలు తగిలెను. మిగతావారు అడవులలోనికి పారిపోయినారు. గ్రామములోని కొందరు గోండులు తుపాకులతోనుండగా అరెస్టు చేయబడినారు. డాక్టరు గాయాలు పొందినవారికి వెంటనే కట్లు కట్టినాడు. మరునాడు తాలూక్దారుగారున్నూ వారి సిబ్బందియున్నూ పరివారమునూ ఆసిఫాబాదుకు గాయాలు పొందినవారిని, పట్టుకున్న గోండువారిని తీసుకొనివెళ్లిరి. విచారణలు జరుగుచున్నవి.”

ఇది బాబేఝరీ కాల్పుల తర్వాత నిజాం ప్రభుత్వ పోలీసు శాఖ విడుదల చేసిన పత్రికాప్రకటన పూర్తిపాఠం. ప్రజా ఆకాంక్షల గురించి, ఉద్యమాల గురించి, ప్రజానాయకుల గురించి, పోలీసులకూ ప్రజలకూ మధ్య ఘర్షణల గురించి ఏడు దశాబ్దాల తర్వాత కూడ ఇదే పద్ధతి, ఇదే రకమైన వివరణ ఉంటాయి. ఈ ప్రకటన చదివితే అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదని తేలుతుంది. రాజ్యం, రాజ్యపు అంగాలు, ముఖ్యంగా పోలీసులు మాట్లాడే భాష ఒకటే అని తేలుతుంది. గతవర్తమానాల కలనేత మరీ ఇంత చిక్కగా, గాఢంగా ఉండడం, వర్తమానం మీద గతం నీడ వదలకపోవడం, గతమేదో వర్తమానమేదో పోల్చుకోలేని స్థితి ఉండడం మన సామాజిక అవ్యవస్థకు, స్తబ్దతకు, ప్రతిష్టంభనకు, నిశ్చలతకు చిహ్నం కాదా?

  • ఎన్ వేణుగోపాల్
  • venugopalraon@yahoo.com

పెదాల తీరం మీద ఒక ముద్దు

 images92AXZ2FU

-రవీంద్రనాథ్ ఠాగూర్

రెండు జతల పెదవులు

ఒకదాని చెవిలో మరొకటి

గుసగుసలాడుతున్నట్టు

ఒకదాని హృదయాన్ని

మరొకటి జుర్రుకుంటున్నట్టు

స్వస్థలాల్ని వదిలి

తెలియని ఏ లోకాలకో

పయనం ప్రారంభించిన

రెండు ప్రేమలు

పెదాల కూడలిలో కలుసుకున్నట్టు

అనుబంధపు ఉధృతిలో

ఎగసిన రెండు కెరటాలు విరిగి పడి

పెదాల తీరం మీద కలుసుకున్నట్టు

ఆకలిగొన్న రెండు మోహాలు చిట్టచివరికి

దేహపు అంచున కలుసుకున్నట్టు

చిత్రలిపిలో లలిత శబ్దాలతో

పెదాల ముద్దుల పొరల మీద

ప్రేమ గీతం రచిస్తున్నట్టు

ఇంటికి తీసుకువెళ్లి దండ గుచ్చడానికి

ఆ రెండు జతల పెదాల నుంచి

ప్రేమ పుష్పాలను ఏరుకుంటున్నట్టు

వర్ణవిలాసాల శయ్య మీద

ఎంత మధురమీ కలయిక

 

ప్రస్తుతం ముద్దు మీద జరుగుతున్న చర్చనూ రచ్చనూ నిర్బంధాన్నీ సంప్రదాయం పేరుమీద మొరటుదనాన్నీ చూస్తుంటే నూటముప్పై సంవత్సరాల కింది ఈ కవితను పరిచయం చేయాలనిపించింది. 1886లో అచ్చయిన ఠాగోర్ కవితాసంకలనం కోరి ఒ కోమల్ లోని చుంబన్ అనే ఈ కవితకు కనీసం మూడు ఇంగ్లిష్ అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఒకటి బహుశా ఠాగూర్ స్వయంగా చేసుకున్నది కాగా, మిగిలినవి కుముద్ బిశ్వాస్, ఫక్రుల్ ఆలమ్ చేసినవి. ఈ అనుసృజనకు ఆధారం ఆ మూడు అనువాదాలు, అనుసృజనలు.

– ఎన్. వేణుగోపాల్

పుస్తకాలు గతమా, వర్తమానమా, భవిష్యత్తా?

venu

అనేకానేక వ్యక్తిగత, సామాజిక కారణాలవల్ల రెండు మూడు నెలలు నా ఈ శీర్షికకు అంతరాయం ఏర్పడింది గాని ఇటు ‘సారంగ’ ఒత్తిడి వల్లా, ఈ శీర్షికలో రాయదలచిన విషయం పట్ల అభినివేశం వల్లా ఇది రాయవలసి ఉందని ఏ ఒక్కరోజూ మరచిపోలేదు. ఈ శీర్షికలో రాయదగినవీ, ఆలోచించదగినవీ ఎన్నెన్నో తట్టాయి, కనిపించాయి. అలా తోసుకొస్తున్నవాటిలో మిగిలినవాటిని పక్కనపెట్టి ఈసారి పుస్తకాల గురించి రాయదలిచాను. ఒక పుస్తకం అంటే గతంలో రాసినదో, గతం గురించి రాసినదో, గతంలో అచ్చయినదో, గతంలో ఈ కళ్లమీద ప్రవహించి, ఈ మునివేళ్లను ముద్దాడి, ఈ మనసులో స్థిరపడినదో గాని అది గతమేనా? గతమైనా వర్తమానమా? అసలు ఎన్నటికీ తుడిచివెయ్యలేని నిగూఢ భవిష్యత్తా?

‘ఇంతకాలమూ కాయితాల్తోనే గడిచిపోయింది, కన్నీటి కాయితాల్తోనే గడిచిపోయింది’ అని మో అన్నట్టు ఒకసారి పట్టుకున్నదంటే పుస్తకం మనిషిని జీవితపర్యంతం శాసిస్తుంది, ఆ మనిషి తననే శ్వాసించేలా చేస్తుంది. మనిషిని నడిపిస్తుంది, మనిషి వెంట నడుస్తుంది. అటువంటి పుస్తకానుభవాల గురించి ఎన్నోసార్లు రాశాను గాని అనిల్ బత్తుల అనే ఒక కొత్త పుస్తక ప్రేమికుడు వచ్చి నా పుస్తకాల జ్ఞాపకాల కందిరీగల తుట్టెను భూకంప సదృశంగా కదిలించాడు. మూడు వారాల కింద తాను ఏర్పాటు చేసిన పుస్తక జ్ఞాపకాల సభలో మాట్లాడమని నాలుగైదు వారాల కింద అడిగినప్పుడు, ఆ నిప్పురవ్వ నా మనసులో ఇంత దావానలమవుతుందని నేను ఊహించలేదు.

ఇంతకూ అసలు పుస్తక జ్ఞాపకాల సభ ఏర్పాటు చేయడమే ఒక విశిష్ట ఆలోచన. అది సోవియట్ యూనియన్ లో ప్రచురితమైన తెలుగు పుస్తకాల గురించి తలచుకునే సభ. సోవియట్ యూనియన్ అనేది భూగోళం మీది నుంచి చెరిగిపోయి నిండా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది. అంటే ఒక కొత్త తరం పుట్టుకొచ్చింది. బహుశా ఆ తరంలో కూడ పుట్టుకొస్తున్న పుస్తక పాఠకులు ఎప్పుడూ ఎక్కడా ఏ దుకాణంలోనూ ఈ పుస్తకాలు చూసి ఉండరు. అనిల్ బత్తుల కొద్ది ముందుగా పుట్టాడేమో గాని ప్రధానంగా ఆ తరానికి చెందినవాడే. సహజంగానే ఆయన మిత్ర బృందమూ అలా ఈ పుస్తకాలు దుకాణాలలో చూసి ఉండినవాళ్లు కారు.

అక్కడ మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉంటే సోవియట్ పుస్తకాలు నా పఠనం లోకీ, అధ్యయనం లోకీ, అవగాహనల లోకీ, జీవితం లోకీ వచ్చిన నాలుగున్నర దశాబ్దాల కిందటి పురాస్మృతుల సుప్తాస్ఠికలు ‘బతికిన దినాల తలపోత బరువుచేత’ కదిలాయి. నేను సోవియట్ పుస్తకం మొదటిసారి ఎప్పుడు చూశాను, ఎప్పుడు ముట్టుకున్నాను, ఎప్పుడు చదివాను, ఆ పుస్తకాలు ఎట్లా పోగేసుకున్నాను, ఆ పుస్తకాలు మాత్రమే కాదు, ఆ పుస్తకాలకు జన్మనిచ్చిన ఒక అద్భుతమైన సామాజిక ప్రయోగం ఎట్లా కుప్పకూలి పోయింది, ఒక పావుశతాబ్ది గడిచాక ఇప్పుడు ఆ చితాభస్మం లోంచి ఏమి ఏరుకుంటాము, అటువంటి లాభాపేక్ష లేని, చైతన్య విస్తరణ కాంక్షతో మాత్రమే పుస్తక ప్రచురణ అంత పెద్ద ఎత్తున సాగే మరో ప్రపంచం మళ్లీ వస్తుందా…. ఎన్నెన్నో ప్రశ్నలు, ఆలోచనలు.

పుస్తకం గురించి తలచుకోవడమంటే, పుస్తకం రూపురేఖల గురించీ, రచయిత గురించీ, పుస్తకంలోని విషయం గురించీ తలచుకోవడం మాత్రమే కాదు. ఆ పుస్తకం ఉండిన చెక్కబీరువానూ, ఇనుపబీరువానూ, అటువంటి మరెన్నో బీరువాలు నిండిన గదినీ, ఆ గదిలో తలుపు పక్కన నిరామయంగా కూచుని కునికిపాట్లు పడుతూనో, ప్రేమపూర్వకంగా పుస్తకాలను పరిచయం చేస్తూ చెవిలా జోరీగలా వెంట తిరుగుతూనో ఉండే దుకాణదారు గుమస్తానూ, ఆ పుస్తకాలు పట్టుకుని తెరిచి లోపల వాసన చూసి, ఆ తర్వాత దాని విషయ సూచికా, అట్ట మీద వ్యాఖ్యలూ, ధరా చూసినప్పటి సంభ్రమాన్నీ, అంత తక్కువ ఖరీదైనా కొనుక్కోలేని నిస్సహాయ దైన్యాన్నీ, ఎలాగో ఒకలాగ కొనుక్కున్న సంతోషాన్నీ, ఆ పుస్తకాల దుకాణంలోకి మీతోపాటు నడిచి వచ్చిన మిత్రులనూ, ఆ పుస్తకం చదివినప్పటి అనుభూతులనూ, ఆ పుస్తకం గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు పొందిన ఉత్సాహాన్నీ… ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పుస్తకాన్ని గురించి తలచుకోవడమంటే ఒక జీవిత శకలాన్ని మళ్లీ అరచేతుల్లోకి తీసుకుని నాలుగువేపుల నుంచీ దర్శించడం.

అలా సోవియట్ పుస్తకాల గురించి తలచుకోవడమంటే బహుశా నా తరానికీ, నా ముందరి తరానికీ ఆత్మకథాత్మక సామాజిక చరిత్ర మననం చేసుకోవడమే.

IMG_20141002_174238

ఊహ తెలిసినప్పటి నుంచీ పుస్తకాలు చూస్తూ వచ్చాను. మా బాపు కొనుక్కున్న ఆధ్యాత్మిక పుస్తకాలు, పురాణాలు, కావ్యాలు మాత్రమే కాదు, సృజనకు సమీక్షకు వచ్చిన పుస్తకాలు, వరవరరావు గారి పుస్తకాలు కొన్నయినా మా రాజారం ఇంటికి చేరుతుండేవి. అలా హనుమకొండ చదువుకు రాకముందే సోవియట్ పుస్తకాలు చూసి ఉంటాను గాని మొట్టమొదట చూసిన సోవియట్ పుస్తకం ఇమాన్యువల్ కజకేవిచ్ ‘మిత్రుని హృదయం’ అని గుర్తు. వరవరరావు గారికీ, మా అక్కయ్య హేమలతకూ పెళ్లి జరిగిన సందర్భంగా 1964లో అది ఎవరో మిత్రులు కానుకగా ఇచ్చినట్టు గుర్తు. దాదాపు మూడు వందల పేజీల నీలి రంగు క్యాలికో బౌండు పుస్తకం. దాని మీద బంగారు రంగులో ఉబ్బెత్తుగా పుస్తకం పేరు, రచయిత పేరు. నలభై సంవత్సరాలు గడిచిపోయాక కూడ ఇప్పటికీ కళ్ల ముందు ఆడుతున్నాయి.

1973లో చదువుకు హనుమకొండ వచ్చాను, ఆ సంవత్సరమే విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. ఆనాటికి కొన్ని పుస్తకాలు ప్రచురించడం కోసం డా. రామనాథం గారి ప్రోత్సాహంతో శ్రామికవర్గ ప్రచురణలు అనే చిన్న ప్రచురణ సంస్థ ప్రారంభమయింది. రామనాథం గారి ప్రోత్సాహంతోనే శ్రామికవర్గ ప్రచురణలు పేరుతో ఒక ప్రత్యామ్నాయ పుస్తకాల దుకాణం వరంగల్ లో ప్రారంభమయింది. ఆ దుకాణం నిర్వహణ బాధ్యత మా అన్నయ్య రాంగోపాల్ ది. నేనూ సాయంకాలం వేళల్లో ఆ దుకాణంలో ఎక్కువ రోజులే కూచోవలసి వచ్చేది. వరంగల్ లో సోవియట్ పుస్తకాలు అమ్మిన మొదటి దుకాణం అదేననుకుంటాను. అక్కడ ఆ పుస్తకాలు చెక్క బీరువాల్లో పేర్చి పెట్టడం నుంచి, తిరగేయడం, చదవడం దాకా సోవియట్ పుస్తకాలతో నా దోస్తీ మొదలయింది. ఎమర్జెన్సీతో ఆ దుకాణం మూతబడిపోయింది.

ఎమర్జెన్సీలోనో, ఎమర్జెన్సీ తర్వాతనో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ దుకాణం వరంగల్ మండీబజార్ లో మొదలయింది. సృజన ప్రూఫులు దిద్దడానికి ప్రెస్ కు వెళ్లి, ఆ పని అయిపోయినతర్వాత మండీబజార్ దాకా నడిచి విశాలాంధ్రలో కాసేపు పుస్తకాలు చూసి, తిరగేసి, కళ్లనిండా మనసు నిండా నింపుకుని ఇంటికి రావడం అలవాటుగా మారింది. ఆ మండీ బజార్ విశాలాంధ్ర దుకాణం రెండు మడిగెల ఇల్లు. లోపల ఎన్నెన్నో సోవియట్ పుస్తకాలు. కొన్ని పాత ఫారిన్ లాంగ్వేజెస్ పబ్లిషింగ్ హౌజ్ పుస్తకాలతో పాటు గుట్టలుగా ప్రొగ్రెస్ పబ్లిషర్స్. ప్రగతి ప్రచురణాలయం, మిర్ పబ్లిషర్స్ పుస్తకాలు. అప్పటికింకా రాదుగ ప్రచురణలు ప్రారంభం కాలేదు. దాదాపు అన్నీ క్యాలికో బౌండ్ పుస్తకాలే. మార్క్స్ ఎంగెల్స్ రచనలు, ముఖ్యంగా లెనిన్ రచనలు పేపర్ బ్యాక్ లు ఉండేవి. లోపల దళసరి తెల్లని తెలుపు కాగితం. సన్నని అక్షరాలు. పిల్లల పుస్తకాలైతే చెప్పనక్కరలేదు. రంగురంగుల బొమ్మలు. పెద్ద పెద్ద అక్షరాలు. చదువుతుంటే భాష కొంచెం చిత్రంగా ఉన్నట్టుండేది గాని దానిలోనూ ఒక సొగసు, ఒక ఆకర్షణ ఉండేవి.

ఆ తర్వాత విశాలాంధ్ర వరంగల్ మండీబజార్ నుంచి హనుమకొండ అశోకా కాంప్లెక్స్ లోకి వచ్చింది. అప్పటికి ఇంటర్మీడియట్ ఒకసారి తప్పి పూర్తి రికామీగా పుస్తకాలే ప్రపంచంగా ఉన్నాను. ఆ తర్వాత బిఎ లో చేరినా, సృజన, రాడికల్ విద్యార్థి సంఘం, సభల దగ్గర పుస్తకాల దుకాణం పెట్టడం లాంటి పనులెన్ని ఉన్నా సోవియట్ పుస్తకాల మైకం ఒకటి ఎప్పుడూ కమ్మి ఉండేది. సోషల్ సామ్రాజ్యవాదం అని విమర్శిస్తూనే, వాళ్లు పుస్తక ప్రచురణ ద్వారా ప్రపంచానికి చేస్తున్న మేలును అంగీకరిస్తుండేవాణ్ని. అక్కా అని పిలిచే ఒక కుటుంబ మిత్రురాలి దగ్గర నెలకు వంద రూపాయల దానాన్ని వరంగా పొంది అదంతా విశాలాంధ్రలో ఖర్చు పెడుతుండేవాణ్ని. (ఆరోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో, సోవియట్ పుస్తకాల ధరలతో పోలిస్తే అది మరెంత పెద్దమొత్తమో!)

Aelita_Puppala Lakshmanarao(ed)_001

పేదజనం – శ్వేత రాత్రులు, అజేయ సైనికుడు – ప్రశాంత ప్రత్యూషాలు, అమ్మ, జమీల్యా, అయిలీత, అన్నా కెరెనీనా, తండ్రులూ కొడుకులూ…. మొదటిసారి రాక్ లోంచి తీసి, అటూ ఇటూ ప్రేమగా తడిమి, తెరిచి వాసన చూసి, అతి భద్రంగా అప్పటి మేనేజర్ విజయప్రసాద్ బల్ల మీద పెట్టి…. ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ప్రతి క్షణమూ ఇప్పుడే అనుభవిస్తున్నట్టుగా ఉంది. పుష్కిన్ కవిత్వం, మరీ ముఖ్యంగా వాట్ మీన్స్ మై నేమ్ టు యు, ఇట్ విల్ డై ఆజ్ డజ్ ది మెలాంకలీ మర్మర్ ఆఫ్ డిస్టాంట్ వేవ్స్ అని గొంతిత్తి చదువుకుంటూ, ఆ పద్దెనిమిదో, పందొమ్మిదో ఏట, అది పుష్కిన్ నాకోసమే రాశాడనుకున్న గుండె సవ్వడి ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. బాలసాహిత్యమో, కవిత్వమో, కథో, నవలో, జానపద గాథలో, సాహిత్య విమర్శో, తాత్విక, రాజకీయార్థిక విషయాలో మాత్రమే కాదు, ఏదైనా సరే అసలు అది ప్రపంచానికి తెరిచిపెట్టిన ఒక కిటికీ. హృదయాన్ని వెలిగించిన ఒక మెరుపు. మనశ్శరీరాలను ముద్దాడి అలౌకిక అనుభూతిని అందించిన వెన్నెల. ఆ ప్రచురణలే లేకపోతే టాల్ స్టాయ్, డాస్టవిస్కీ, గోగోల్, కుప్రిన్, గోర్కీ, షొలఖోవ్, పుష్కిన్, గమ్జతోవ్, కజకేవిచ్, మయకోవస్కీ, లూనషార్స్కీ, సుఖోమ్లిన్స్కీ, మకరెంకో, క్రుపస్కయా, కొల్లోంటాయ్ లాంటి వందలాది పేర్లు మన కుటుంబ సభ్యుల పేర్లంత సన్నిహితమై ఉండేవేనా?

కేవలం రష్యన్ రచయితలు మాత్రమే కాదు, ఎందరో యూరపియన్ రచయితలు కూడ నాకు మొదట తెలిసింది ప్రొగ్రెస్ పబ్లిషర్స్ పుస్తకాల ద్వారానే. షేక్స్పియర్ మాక్ బెత్, ఆస్కార్ వైల్డ్ కథలు, లూయి కారొల్ ఆలిస్ ఇన్ వండర్ లాండ్ మాస్కో మీదుగానే నా కళ్లకు చేరాయి. యూరీ బోరెవ్ ఈస్ఠటిక్స్, యూరీ ఖారిన్, థియొడర్ ఒయిజర్మన్ ల తత్వశాస్త్రం, చేగువేరాతో సహా ఎందరివో జీవితచరిత్రలు, రాజకీయార్థిక శాస్త్రం, విద్యా ప్రయోగాలు, రెండో ప్రపంచ యుద్ధ అనుభవాలు… ఎన్ని జ్ఞాపకాలు….

ఇక నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం, రసాయన మూలకాల రహస్యాలు, చక్షువు-జగచ్చక్షువు లాంటి విజ్ఞాన శాస్త్రాల పుస్తకాలు, గణిత శాస్త్ర పుస్తకాలు, చివరికి చదరంగం మీద పుస్తకాలూ… ఆ పుస్తకాలే లేకుంటే ఏమయ్యేవాళ్లం? ఇట్లా ఉండేవాళ్లమేనా?

తన చరిత్ర పట్ల ఎంత మాత్రమూ స్పృహ లేని, తన చరిత్రను తాను నమోదు చేసుకోవాలనే స్పృహలేని తెలుగు జాతి స్వభావం గురించి ఇదివరకు రాశాను గాని, అనిల్ ఈ సోవియట్ తెలుగు పుస్తకాల గురించి మాట్లాడమన్న తర్వాత తారీఖులు, దస్తావేజుల కోసం తవ్వకం మొదలుపెడితే యాభై సంవత్సరాలకు మించని చరిత్ర కూడ మనకు ఖాళీలు లేకుండా, గందరగోళం లేకుండా, సవ్యంగా, స్పష్టంగా నమోదై లేదని మరొకసారి తెలిసివచ్చింది.

ప్రగతి ప్రచురణాలయం మాస్కో ప్రచురణలు ఎప్పుడు మొదలయ్యాయి, మొదటి పుస్తకం ఏమిటి, సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రగతి ప్రచురణాలయం వెంటనే మూతపడిందా, చివరి పుస్తకం ఏమిటి, నిలువ ఉండిన పుస్తకాలు ఏమయ్యాయి…. ప్రశ్నలే ప్రశ్నలు, సంతృప్తికరమైన సమాధానాలు లేవు.

ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, కొండేపూడి లక్ష్మీనారాయణ, ఉప్పల లక్ష్మణ రావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, నిడమర్తి ఉమారాజేశ్వరరావు, ఆర్ వెంకటేశ్వర రావు (ఆర్వియార్) పని చేశారు. వీరిలో లక్ష్మణరావు గారు తప్ప మిగిలినవారెవరూ తమ ఆత్మకథలు రాసుకున్నట్టు లేరు. కనీసం సోవియట్ అనుభవాలు రాసుకున్నట్టు నా దృష్టికి రాలేదు. లక్ష్మణరావు గారి బతుకు పుస్తకంలో ప్రగతి ప్రచురణాలయం, మాస్కో తెలుగు ప్రచురణలు ప్రారంభమైన సంవత్సరం 1967 అని ఒకచోట అచ్చయింది. అది కచ్చితంగా అచ్చుతప్పు కావచ్చు. ఎందుకంటే మరికొన్ని పేజీల తర్వాత ఆయనే తాను తెలుగు అనువాదకుడిగా ప్రగతి ప్రచురణాలయంలో 1958లో చేరానని రాశారు. ఇంటర్నెట్ మీద కొంచెం పరిశోధిస్తే ప్రోగ్రెస్ పబ్లిషర్స్ మలయాళ విభాగం 1956లో మొదలయిందని ఒక లీలామాత్ర సమాచారం దొరికింది. మొత్తానికి తెలుగు విభాగం కూడ 1950ల మధ్యలో మొదలై ఉంటుందనుకుని ఆ కాలంలో కమ్యూనిస్టుపార్టీలో క్రియాశీలంగా ఉండినవారిని అడిగితే వారూ కచ్చితంగా చెప్పలేకపోయారు.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ తోనూ, పీపుల్స్ పబ్లిషింగ్ హౌజ్ తోనూ చిరకాలం గడిపిన పిపిసి జోషి గారిని అడిగితే ఆయన కూడ, ‘నేనూ కచ్చితంగా చెప్పలేను గాని, కొన్నేళ్ల కింద నేను స్వెత్లానా వ్యాసం ఒకటి అనువాదం చేశాను. స్వెత్లానా అంటే అప్పటి ప్రగతి ప్రచురణాలయం బాధ్యురాలు. విశాలాంధ్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆమెను వ్యాసం రాయమంటే, ఆమె ఇంగ్లిషులో పంపిన వ్యాసంలో కొన్ని తేదీలు, పేర్లు పొరపాటు ఉన్నాయని, అవి దిద్ది అనువాదం చేయమని నాకిచ్చారు. నేను కాపీ కూడ పెట్టుకోకుండా అనువాదం, అసలు వ్యాసం వారికిచ్చేశాను. ఏ కారణం వల్లనో ఆ వజ్రోత్సవ సావనీర్ వెలువడలేదు. ఆ వ్యాసం ఏటుకూరి ప్రసాద్ దగ్గర ఉండవచ్చు. అడిగి తీసుకో’ అన్నారు.

నిజంగా ఆ వ్యాసం మన సామాజిక చరిత్రకు, సోవియట్ తెలుగు పుస్తకాల చరిత్రకు సంబంధించి ఒక విలువైన దస్తావేజు. దాని ప్రకారం సోవియట్ తెలుగు ప్రచురణలు 1956 డిసెంబర్ లో మొదలయ్యాయి. మొదటి పుస్తకం సుతయేవ్ రాసిన ‘ఎవరు మ్యావ్ అన్నారు’ అనే పిల్లల పుస్తకం.

అప్పటి నుంచి 1989 దాకా మాస్కో నుంచి తెలుగులో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనల అనువాదాలతో సహా కనీసం మూడు వందల పుస్తకాలైనా వెలువడి ఉంటాయని నా అంచనా. అవన్నీ ఎక్కడైనా ఒక్కచోట ఉన్నాయా? అసలు జాబితా అయినా దొరుకుతుందా? ఆ మూడువందల పుస్తకాలు కొన్ని లక్షల ప్రతులు అచ్చయి ఉంటాయి. వాటిని ముట్టుకున్న, చదివిన, పంచుకున్న, వాటితో కదిలిపోయిన లక్షలాది మంది అనుభవాలన్నీ ఏమవుతాయి? అదంతా పతనమైపోయిన సోవియట్ యూనియన్ లాగ భూతకాలంలో కలిసిపోయిందా? అది విషాద వర్తమానమా? ఉజ్వల భవిష్యత్తా? అనిల్ బత్తుల వంటి ఔత్సాహికుల వల్ల, అపార అవకాశాలు ఇస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ మళ్లీ ఈ అంతర్జాలం మీద కనబడతాయా? ఆ మాయాజాలం మళ్లీ వికసిస్తుందా?

సోవియట్ యూనియన్ కూలిపోయి ఉండవచ్చు కాని తన వనరులలో గణనీయమైన భాగాన్ని వెచ్చించి ప్రపంచానికంతా ఇంత జ్ఞానదానం చేసిన స్ఫూర్తి సంగతి ఏమిటి? వందలాది భాషలలో కోట్లాది పుస్తకాలు ప్రచురించి దేశదేశాల పాఠకుల అవసరాలను తీర్చడానికి, వారి కొనుగోలుశక్తిని దృష్టిలో పెట్టుకుని కారుచవకగా అందించడానికి, సోవియట్ ప్రజానీకం తమ శ్రమ ఎంత వెచ్చించి ఉంటారు? ఆ స్వార్థత్యాగం గతమా, వర్తమానమా, భవిష్యత్తా? రెండు కోట్ల మందిని బలిపెట్టి హిట్లర్ దుర్మార్గం నుంచి ప్రపంచాన్ని కాపాడిన ఆ మహాత్యాగ శక్తిని అప్పటి కవి ‘కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి’ అని పిలిచాడు. ఆ పుస్తకప్రచురణ స్ఫూర్తినైనా మళ్లీ కోరి రమ్మనడానికి కోటిగొంతులు పలకవలసిన అవసరం లేదా?

-ఎన్ వేణుగోపాల్

ఇప్పుడైనా ఈ చరిత్ర మారుతుందా?!

venu1గతవర్తమానం 04

 

 

జూన్ 1 అర్ధరాత్రి, జూన్ 2 ఉదయించే వేళ. తన అరవై సంవత్సరాల స్వయంపాలనా ఆకాంక్ష నెరవేరిందని తెలంగాణ సమాజం సంబరాలు చేసుకుంటున్న వేళ, రెండు మూడు రోజుల ముందునుంచీ ఆ వర్తమాన సంతోష సందోహంలో భాగమవుతూనే నా మనసు మాత్రం సంక్లిష్ట సందేహ గతంలో తిరుగాడుతోంది. చరిత్రలో తెలంగాణ ఎన్నోసార్లు సంబురపడింది. తన తండ్లాట తీరిందనీ, తన కోరిక నెరవేరిందనీ అనుకుంది. కాని ఎక్కడి గొంగడి అక్కడ్నే అనే నుడికారం తిరిగితిరిగి నిజమయింది. ఈసారీ అంతేనా, ఏమన్నా మారుతుందా అని ప్రశ్నలే ప్రశ్నలు. చారిత్రక ఘటనల మధ్య సామ్యం ఎంత ఉంటుందో భేదమూ అంతే ఉంటుందన్నది నిజమే గాని తేదీలు దాదాపు కలిశాయి గనుక సరిగ్గా డెబ్బై సంవత్సరాల కిందటి ఇటువంటి సందర్భమే గుర్తుకొచ్చింది.

అది తెలంగాణ చరిత్ర ఒక గుణాత్మకమైన మలుపు తిరిగిన సందర్భం. సుప్రసిద్ధమైన పదకొండో ఆంధ్ర మహాసభ బోనగిరిలో 1944 మే 27, 28 ల్లో జరిగింది. అంతకు మూడు నాలుగు సంవత్సరాల ముందునుంచీ సాగుతున్న అభిప్రాయభేదాలు ఒక దశకు చేరి ఆ రోజున ఆంధ్ర మహాసభ చీలిపోయింది. అప్పటికి కనీసం ఆరు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ సమాజపు తండ్లాట ఆ రోజున ఒక పరిష్కార మార్గాన్ని చేపట్టింది. ఆ మార్గం మరిన్ని మలుపులు తిరిగి ఆ తండ్లాట యథావిధిగా మిగిలిపోవడమో, ఇంకా పెరగడమో వేరే కథ. కాని ఆ రోజునూ, ఆ రోజుకు అటూ ఇటూ సాగిన చరిత్ర పురిటి నొప్పులనూ ఇవాళ గుర్తు తెచ్చుకోవడం చాల అవసరం. తెలంగాణ తండ్లాట పరిష్కారమయిందనే అభిప్రాయం ఇవాళ మరొకసారి వ్యాపిస్తున్నప్పుడు, అప్పటి పరిష్కారాన్ని పునర్దర్శించడం చాల అవసరం. సరిగ్గా అప్పటిలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక శక్తులలో ఒక శక్తిది మాత్రమే పైచేయి అవుతున్నప్పుడు నాటి చరిత్రను మననం చేసుకోవడం అవసరం. గత వర్తమానాల మధ్య సంభాషణ ఇవాళ్టి అవసరం.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర మీద దాదాపు వంద పుస్తకాలు వెలువడినప్పటికీ, అది చరిత్ర, జీవిత చరిత్ర, ఆత్మకథ, వ్యాసం, కథ, నవల, కవిత్వం, నాటకం, విశ్లేషణ వంటి అన్ని ప్రక్రియలలోకీ వ్యాపించినప్పటికీ ఇంకా ఆ పోరాటాన్ని చారిత్రక, సామాజిక, స్థానిక నేపథ్యం నుంచి చూడవలసినంతగా, చూడవలసినట్టుగా చూడలేదనే అనిపిస్తుంది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ నడిపిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం ఎంత సముచితమో, తెలంగాణ సమాజం భారత కమ్యూనిస్టు పార్టీకి నేర్పిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం కూడ అంతే సముచితం. నిజానికి 1938-39ల్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో ప్రవేశించడానికి చాల ముందు నుంచే తెలంగాణ సమాజంలో ధిక్కార స్వభావం ఉన్నది. మెరుగైన, మంచి బతుకు కోసం తండ్లాట ఉన్నది. తెలంగాణ సమాజం సాగించిన ఆ తండ్లాటకు స్వయంనిర్ణయాధికారం, స్వావలంబన, స్వాభిమానం అనే మూడు ఆకాంక్షల ఆధార భూమికలున్నాయి. ఆ ఆకాంక్షలు అర్థవంతంగా, సుస్థిరంగా నెరవేరాలంటే విశాల ప్రజారాశుల భాగస్వామ్యంతో, శాస్త్రీయ దృక్పథంతో, సమగ్ర పోరాటం జరగాలనే అవగాహన బలపడిన సందర్భం బోనగిరి ఆంధ్ర మహాసభ.

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

తెలంగాణలో స్వయంనిర్ణయాధికార ఆకాంక్షను ఢిల్లీని ఎదిరించిన ప్రతాపరుద్రుడి నాటికీ, కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ ల దగ్గరికీ తీసుకుపోవచ్చు గాని, అంత వెనక్కి వెళ్లకుండా ఆధునిక యుగం నుంచే చూడవచ్చు. అది 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వ్యక్తమయింది. ఆనాడు విదేశీ అధికారాన్ని ప్రశ్నిస్తూ దేశంలోని నాలుగు వర్గాల (సైనికులు, రైతాంగం, చేతివృత్తుల వారు, సంస్థానాధీశులు) మహత్తరమైన ఐక్యసంఘటన పోరాటాన్ని ప్రారంభించినప్పుడు, ఆ పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించినప్పుడు, బ్రిటిషిండియాలో భాగం కాని హైదరాబాద్ రాజ్యానికి దానితో సంబంధం ఉండనవసరం లేదు. కాని సర్ సాలార్ జంగ్ (1829-1883) నాయకత్వాన అసఫ్ జాహి పాలకులు బ్రిటిష్ వారికి సహకరించడానికీ, పొరుగు ప్రాంతాల భారత స్వాతంత్ర్య సైనికులను అణచడానికీ కూడ ప్రయత్నించినప్పుడు, హైదరాబాద్ తిరుగబడి, తన స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించింది. మరెక్కడా లేనివిధంగా ఒక స్వతంత్ర సంస్థానంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్ ల నాయకత్వాన బ్రిటిష్ వ్యతిరేక అసాధారణ పోరాటాన్ని నడిపినది తెలంగాణ సమాజం. హైదరాబాద్ నడిబొడ్డున బ్రిటిష్ రెసిడెంట్ బంగళాను దిగ్బంధనం చేసి తుపాకి కాల్పులతో గడగడలాడించినది తెలంగాణ సమాజం. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం దేశవ్యాప్తంగా అణచివేతకు గురైనా రెండు సంవత్సరాల దాకా ఆ జ్వాల ఆరిపోకుండా కాపాడిన మరాఠా వీరులకు ఆశ్రయం ఇచ్చినది తెలంగాణ.

 

అలాగే స్వావలంబన కోసం తపన కూడ మొత్తం భారత ఉపఖండంలోనే మొదటిసారిగా తెలంగాణలో వ్యక్తమయింది. ఆ వ్యక్తీకరణలో శాస్త్రీయ దృష్టి ఉందా, విశాల భాగస్వామ్యం ఉందా అని ఇవాళ ప్రశ్నించవచ్చుగాని, అసలు ఆనాటి సమాజంలో ఆ ప్రశ్న వెలువడడమే గణనీయమైన అంశం. ఒకవైపు బ్రిటిష్, ఫ్రెంచి ఆధునికతా పవనాలు రాజ్యంలో నింపుతున్న సాలార్ జంగ్ సంస్కరణలు అమలు జరుగుతుండగానే, స్థానిక మౌలిక సౌకర్యాల కోసం పరాయి దేశపు కంపెనీకి ఎర్ర తివాచీ పరవగూడదని నినదించింది తెలంగాణ, బహుశా దేశంలో బహుళజాతి సంస్థలకు తొట్టతొలి వ్యతిరేకతను ప్రకటించినది తెలంగాణ. సాలార్ జంగ్ మరణానికి ముందే ఆమోదించిన చాందా రైల్వే స్కీమ్ పట్ల, ముఖ్యంగా ఆ స్కీమ్ ను బ్రిటిష్ పెట్టుబడిదారీ సంస్థల లాభాల కోసం తయారు చేయడం పట్ల 1883లో వ్యతిరేక ఆందోళన ప్రారంభమయింది. వాడి నుంచి హైదరాబాదు దాకా ఉండిన రైల్వే లైనును చాందా దాకా విస్తరించడానికీ, ఆ విస్తరణ పనులను బ్రిటిష్ సంస్థలకు అప్పగించడానికీ, ఆ సంస్థల లాభాలకు హామీ ఇవ్వడానికీ నిర్దేశించినది ఈ స్కీము. అప్పటికే ఉండిన అంజుమన్-ఎ-ఇక్వాన్-ఉస్-సఫా నాయకత్వంలోనూ, కొత్తగా ఏర్పడిన చాందా రైల్వే స్కీం వ్యవహారాల కమిటీ నాయకత్వంలోనూ పోరాటం జరిగింది. ప్రభుత్వ పథకపు పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఈ సంస్థలు కోరాయి. రాచరిక ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజెప్పాలని కోరడమంటే, అందులోనూ విదేశీ సంస్థల ప్రయోజనాన్ని వ్యతిరేకించడమంటే ఎంత ప్రగతిశీల ఆలోచనో చెప్పనక్కర లేదు.

అలాగే స్వాభిమానం కోసం తపన అప్పటి సామాజిక, రాజకీయ స్థితిలో మత, కుల, భాషా రూపాలలో వ్యక్తమై ఉండవచ్చు గాని అట్టడుగున ఉన్నది ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచనే. అందుకు, 1895లో మొదటి మరాఠీ గ్రంథాలయంగా భారత గుణవర్ధక సంస్థ, 1901లో మొదటి తెలుగు గ్రంథాలయంగా శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, 1906 జగన్ మిత్ర మండలి వంటి ఎన్నో వ్యక్తీకరణలను చూడవచ్చు. ఆ వరుసలోనిదే 1921లో ఏర్పడిన ఆంధ్ర జనసంఘం, 1923లో రూపొందిన ఆంధ్ర జన కేంద్ర సంఘం. న్యాయవాదులతో, విద్యావంతులతో ఏర్పడిన ఆ సంస్థే 1931 నాటికి విశాల ప్రజారాశుల ఆంధ్ర మహాసభగా మారింది. తమ భాషలో మాట్లాడి అవహేళనకు గురైన తెలుగువారి సంస్థగా సాంస్కృతిక మూలాల నుంచి ప్రారంభమైన ఆ సంస్థ, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, భూమి-భుక్తి-విముక్తినీ కోరే సామాజిక, రాజకీయ సంస్థగా ఎదిగింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర వంటి అంశాల మీద పోరాటం, అంతిమంగా రాజకీయార్థిక మూలాలను ప్రశ్నించకుండా సార్థకమూ అర్థవంతమూ కాజాలదని గుర్తించింది. నాలుగు శాతం కన్న తక్కువ అక్షరాస్యత ఉన్న సమాజంలో గ్రంథాలయోద్యమం ఏమిటనే వైరుధ్యం నుంచి బుద్ధిజీవుల, విద్యావంతుల సామాజిక బాధ్యతా స్పృహ వెలికివచ్చింది. ఆ పరిణామక్రమంలోనే ఆంధ్ర మహాసభ మహాఘనతవహించిన నిజాము రాజుగారి దివ్యసమ్ముఖమునకు మహజర్లు, విన్నపాలు సమర్పించే స్థితి నుంచి వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న అసంఖ్యాక నిరక్షరాస్య జనానికి చేరువయింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి వేదిక అయింది. అక్షరోపజీవులు తమ సమస్య అనుకుని ప్రారంభించిన ఉద్యమానికి నిరక్షరాస్య బండి యాదగిరి పాట మార్గ నిర్దేశనం చేసింది. ఉపరితల భాషా సమస్య దగ్గర ప్రారంభమైన కదలిక పునాది భూమి సమస్యకు చేరింది. రంగస్థలం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నుంచి కామారెడ్డిగూడానికీ, పాలకుర్తికీ, మొండ్రాయికీ, ధర్మాపురానికీ మారింది.

బోనగిరి ఆంధ్ర మహాసభను ఈ నేపథ్యంలో చూడవలసి ఉంది. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతున్నందువల్ల, వారు గ్రామాలలో అశాంతికి కారకులవుతున్నందువల్ల తాము ఆంధ్రమహాసభ నుంచి తటస్థంగా ఉంటామని ‘జాతీయవాదుల’మని చెప్పుకునేవారు బోనగిరి సభలకు సహాయ నిరాకరణ ప్రారంభించారు. ఏ పక్షానికీ చెందనివారమని ప్రకటించుకున్న అప్పటి అధ్యక్షులు కొండా వెంకటరంగారెడ్డి, కార్యదర్శి మందుముల రామచంద్రరావు సభల్లో ప్రారంభోపన్యాసం చేసి, కవిలెకట్టలు అప్పగించి మిగిలిన సభలో కూడ పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రవేశమో, జోక్యమో, ప్రాబల్యమో ఉన్నాయా లేవా అనేది చర్చనీయాంశమే. కాని అంతకన్న ముఖ్యంగా, ఆనాటి తెలంగాణ సమాజంలో అతి పెద్ద ప్రజాసంస్థలో నిజమైన ప్రజాసమస్యల ప్రస్తావన ప్రారంభం కాగానే ఎవరెవరు తప్పుకోజూశారనేది, ఎవరెవరు నిలబడి పోరాడుతామన్నారనేది ప్రధానం. ప్రజాసమస్యలపై పోరాటానికి, పరిష్కారానికి తాను సిద్ధంగా లేనని ఒక వర్గం నాయకత్వం, ఆ తర్వాత మొత్తంగా కాంగ్రెస్ లో చేరిపోయిన నాయకత్వం ప్రకటించిందనేది వాస్తవం. అప్పుడు కమ్యూనిస్టులు మేమున్నామంటూ ముందుకొచ్చారు.

అప్పటి తెలంగాణ సమాజంలో అధికారాన్ని ధిక్కరించిన ఆర్యసమాజం మతంలో కూరుకుపోయింది. దానికి వ్యతిరేకంగా వచ్చిన ఇత్తెహాదుల్ ముసల్మీన్ అధికారంతో అంటకాగింది. ఈ రెండు సంస్థలతో పాటు మరొక అరడజను ఇటువంటి సంస్థలు 1938 నాటికే నిషేధానికి గురయ్యాయి. కుల సంఘాలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి గాని అవి అప్పటికింకా ప్రజల మౌలిక సమస్యలను ప్రస్తావించడం లేదు. భయ సంకోచాలతో పుట్టిన స్టేట్ కాంగ్రెస్ తాను తెలంగాణ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించనని స్పష్టంగానే చెప్పింది. ఆ నేపథ్యంలో జరిగినది బోనగిరి ఆంధ్ర మహాసభ. అక్కడ తాను ప్రజల పక్షం ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం నిర్మిస్తానని, నిర్మాణమవుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కమ్యూనిస్టు పార్టీ మనసా వాచా కర్మణా ప్రకటించింది గనుకనే తెలంగాణ సమాజం కమ్యూనిస్టు పార్టీని తన గుండెలకు హత్తుకుంది. ఏడు దశాబ్దాల తర్వాత కూడ తెలంగాణ సమాజంలో కమ్యూనిస్టుల పట్ల ప్రేమ అందువల్లనే.

స్టేట్ కాంగ్రెస్ మీద 1938లో విధించిన నిషేధాన్ని 1946 వరకూ కూడ తొలగించనందువల్ల పైకి స్టేట్ కాంగ్రెస్ అని చెప్పుకోకపోయినా ఆ భావాలు గలవాళ్లు ఆంధ్ర మహాసభలో ‘జాతీయవాదులు’ పేరిట కొనసాగారు. 1942లో నిషేధం ఎత్తివేసినందువల్ల కమ్యూనిస్టులు బహిరంగంగా పనిచేసే అవకాశం వచ్చింది గాని వారు కూడ ఆంధ్ర మహాసభలోనే కొనసాగారు. ఈ రెండు ప్రత్యర్థి పక్షాలే కాక ఏ పక్షానికీ చెందని వారు కూడ ఆంధ్ర మహాసభలో పెద్ద సంఖ్య లోనే ఉన్నారు. ఆంధ్ర మహాసభ వివిధ వృత్తులవారితో, వివిధ రాజకీయ విశ్వాసాలు గలవారితో నిజంగా ఒక విశాలమైన ఐక్యసంఘటనగా కొనసాగింది. అప్పటికి పదిహేను సంవత్సరాలుగా ఇలా సాగుతున్న సమన్వయం భూపోరాటాలు ప్రారంభం కాగానే చెదిరిపోయింది. ఆ చీలిక బోనగిరిలో స్థిరపడింది. తర్వాత ఆంధ్ర మహాసభ ఎక్కువరోజులు పనిచేయలేకపోయింది గాని, దొడ్డి కొమరయ్య హత్యతో (1946 జూలై 4) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమయింది. ఐదు సంవత్సరాల పాటు సాగిన ఆ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి అటు భూమి-భుక్తి-విముక్తి ఆకాంక్షలనూ, ఇటు స్వయం నిర్ణయాధికారం – స్వావలంబన – స్వాభిమాన ఆకాంక్షలనూ ఒక మేరకు సాధించింది. ఐదు సంవత్సరాల తర్వాత 1951 అక్టోబర్ 20న ఆ పోరాటం అర్ధాంతరంగా ఉపసంహరణ జరిగి ఉండకపోతే ఆ ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరేవే, సుస్థిరంగా ఉండేవా, తెలంగాణ తండ్లాటకు శాశ్వత పరిష్కారం దొరికి ఉండేదా…. ఇప్పుడన్నీ ఊహాత్మకమైన ప్రశ్నలే. కాని ఆ నాడు తెలంగాణ మట్టి మనిషి సంధించిన ప్రశ్నలూ ఆయుధాలూ ఇవాళ్టికీ ఆరని నిప్పుకణికల్లా రగులుతూనే ఉన్నాయి.

telangana 14

ఈ గతం వెలుగులో వర్తమానాన్ని చూస్తే, తెలంగాణ సమాజపు తండ్లాటకు ఇటీవలి వ్యక్తీకరణ ఆంధ్ర మహాసభ కన్న విస్తృతమైనది. వర్గం, బృందం, కులం, మతం, వయసు, స్త్రీపురుష భేదం వంటి అంతరాలన్నిటినీ పక్కనపెట్టి తెలంగాణ సమాజమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది. రాష్ట్ర సాధనే తన తండ్లాటకు పరిష్కారమని భావించినట్టు అనిపించింది. రాష్ట్రం ఏర్పడింది గాని తండ్లాట పరిష్కారమవుతుందా అని అనుమానాలు అట్లాగే ఉన్నాయి. ఇన్ని శక్తులు ఐక్యంగా ఉద్యమించినప్పుడు విజయ ఫలాలు అన్ని శక్తులకూ వాటి భాగస్వామ్యం ప్రకారమైనా అందుతున్నాయా అని ప్రశ్న మిగిలే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వయంనిర్ణయాధికారం సంపూర్ణంగా అందిందా, పరిమితంగా, పాక్షికంగా అందిందా? ప్రపంచీకరణ రాజకీయాల, కార్పొరేట్ పన్నాగాల యుగంలో స్వావలంబన ఏ మేరకైనా సాధ్యమా? సాధ్యమైన మేరకైనా తెలంగాణ పాలకవర్గాలు అమలుచేస్తాయా? బహుశా స్వాభిమానం, ఆత్మగౌరవం గత అరవై సంవత్సరాలలో అనుభవించినదానికన్న కాస్త ఎక్కువే అనుభవించే అవకాశం వస్తుందేమో.

బోనగిరిలో 1944 మే 27-28ల్లో సాధించిన విజయం, తెలంగాణ వ్యాప్తంగా 1951 అక్టోబర్ 20న చెదిరిపోయింది. ‘నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా’ అనే ఆందోళన నిరాశతో అంతమయింది. 2014 జూన్ 2 ఏమవుతుంది?

 

-ఎన్. వేణుగోపాల్

 

సామూహిక జ్ఞాపకంతో సాహిత్యానికి కొత్త ఊపిరి!

venu

“సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్ఞ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు – ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు” అని సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధాన్ని సురవరం ప్రతాపరెడ్డి ఒక కోణం నుంచి చెప్పారు. ఆయన 1940ల చివర ప్రారంభించిన ఆ కృషి ఆ తర్వాత ఏడు దశాబ్దాలకైనా అవసరమైన స్థాయిలో, సమర్థంగా కొనసాగలేదని, కొనసాగడం లేదని గుర్తించక తప్పదు.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధం గురించి లోతుగా ఆలోచించినకొద్దీ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంగతులెన్నో కనబడతాయి. ప్రతాపరెడ్డి చూసినట్టుగా గత సాంఘిక చరిత్ర గత సాహిత్యంలో ప్రతిఫలించిన తీరును మాత్రమే కాదు, గత సాంఘిక చరిత్ర వర్తమాన సాహిత్యంలోకి ప్రవహించగల అవకాశాన్ని, గతంలోనైనా, వర్తమానంలోనైనా ఇటునుంచి అటుగా సాహిత్యం సాంఘిక చరిత్ర మీద వేయగల ప్రభావాన్ని చూస్తే చరిత్రకూ సాహిత్యానికీ కూడ ఎన్నో కానుకలు దొరుకుతాయి, గతం, వర్తమానం, నిన్నటి సాహిత్యం, ఇవాళ్టి సాహిత్యం అనే ఈ నాలుగు భుజాల చతురస్రం లోపల ఎన్నెన్ని పరస్పర సంబంధాలకూ సమ్మేళనాలకూ వియోగాలకూ మార్పులకూ చిక్కుముడులకూ పరిష్కారాలకూ వికాసానికీ అవకాశం ఉందో ఊహిస్తే నిజంగా దిగ్భ్రాంతి కలుగుతుంది.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ పరస్పర అన్యోన్య సంబంధం ఉందని గుర్తించి దానితో సవ్యంగా వ్యవహరిస్తే అటు చరిత్ర రచనా ఇటు సాహిత్యమూ కూడ విస్తృతినీ లోతునూ సంతరించుకుంటాయి. సాహిత్యం నుంచి సాంఘిక చరిత్రను తవ్వితీయడానికి ప్రతాపరెడ్డి చేసిన ప్రయత్నం గురించీ, దాన్ని కొనసాగించవలసిన అవసరం గురించీ మరోసారి మాట్లాడుకుందాం గాని, ఇప్పుడు చరిత్రనుంచి సాహిత్యం ఏమి తీసుకోవచ్చునో, తీసుకుంటే ఎట్లా సంపన్నమవుతుందో, తీసుకుంటున్నదో లేదో కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సాంఘిక చరిత్ర అంటే అక్షరాస్యులకు, విద్యావంతులకు ఒక ప్రచురిత పుస్తకం అనే పరిమిత అర్థమే స్ఫురించవచ్చు గాని, అక్షరాస్యులకూ, నిరక్షరాస్యులకూ, సమాజం మొత్తానికీ అది సామూహిక జ్ఞాపకంగా, తరతరాల వివేక సంచితంగా ఉంటుంది. నిజానికి సాంఘిక చరిత్రకు ప్రతాపరెడ్డి ప్రస్తావించిన పదిహేను ఆకరాలలో ఆరు మాత్రమే లిఖిత, అక్షర ప్రమాణాలు. మిగిలినవాటికి అక్షరాస్యతతో సంబంధం లేదు. ఆయన చెప్పినవాటికి గ్రామ గాథలు, జానపదగాథలు, వీరగాథలు, చిన్నపిల్లలకు చెప్పే కథలు, మాటలు, ఆచారాలు, ఊహల మీద, ప్రగల్భాల మీద నిర్మాణమై క్రమంగా వాస్తవమేమో అనిపించేలా పెరిగి మిగిలిపోయే భ్రమలు వంటి ఎన్నిటినో కూడ కలుపుకోవలసి ఉంది. అవి వస్తురూపంలో ఉన్నా, శబ్దరూపంలో ఉన్నా, అలవాటు రూపంలో ఉన్నా అటువంటి సాంఘిక చరిత్ర ఆకరాలన్నిటినీ గ్రహించడం, వాటిని విశ్వసనీయ, మానవీయ సన్నివేశాలలో అక్షరీకరించడం సాహిత్యానికి చాల ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవన్నీ మానవ ఆలోచనా ప్రపంచంలో ఆయా సమాజాలలో సామూహిక జ్ఞాపకంగా నిలిచి ఉన్నాయి. ఒక రకంగా చూస్తే సామూహిక జ్ఞాపకం ఏ ఒక్క రచయితకూ ఆపాదించడానికి వీలులేని సామూహిక రచన అనుకోవచ్చు. సరిగ్గా సాహిత్యసృజనలో లాగనే సామూహిక జ్ఞాపకంలో కూడ జరిగినది జరిగినట్టుగా కాక, నివేదికగా కాక, వడకట్టిన, జల్లెడ పట్టిన, కాలక్రమంలో మార్పుచేర్పులకు గురైన జ్ఞాపకాల రాశిగా ఉంటుంది. దానిలో వాస్తవమూ ఉంటుంది, కల్పనా ఉంటుంది. విశ్వసనీయతా ఉంటుంది, ఐంద్రజాలికతా ఉంటుంది.

1891055_10202661894681481_1753979965_n

ప్రపంచంలో సుప్రసిద్ధమైన సాహిత్య రచనలు వేటిని పరిశీలించినా అవి ఈ సామూహిక జ్ఞాపకం మీద ఆధారపడ్డాయని అర్థమవుతుంది. నిజానికి మౌఖిక సాహిత్యం మొత్తానికీ దాదాపుగా సామూహిక జ్ఞాపకమే ఇతివృత్తం. ఆ సామూహిక జ్ఞాపకం మనిషిని ఎప్పుడైనా ఆకర్షిస్తుంది గనుకనే మౌఖిక సాహిత్యానికి ఆకర్షణ ఇప్పటికీ తగ్గలేదు. కాని రాజాస్థానాల సాహిత్యం, లిఖిత సాహిత్యం క్రమక్రమంగా ఈ సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై వ్యక్తి ప్రధానంగా, వ్యక్తి జ్ఞాపకంగా పెరుగుతూ వచ్చాయి. ఇవాళ వ్యక్తి ప్రధానమైన ఆధునిక సమాజపు ప్రతిఫలనంగా ఆధునిక సాహిత్యం ఆ మేరకు సామూహికత నుంచి, ముఖ్యంగా ఇతివృత్తంలో సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై మిగిలింది. సామూహిక జ్ఞాపకం ఇతివృత్తాన్ని స్వీకరించి దాని మీద అభివృద్ధి చేసే అవకాశం స్వాభావికంగానే కొన్ని ప్రక్రియలకు ఎక్కువా, కొన్ని ప్రక్రియలకు తక్కువా ఉన్నదనిపిస్తుంది. సామూహిక జ్ఞాపకాన్ని వినియోగించుకో గలిగిన శక్తి ఆధునిక ప్రక్రియలలో మిగిలిన ప్రక్రియల కన్న నవలకే ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంది.

ఇలా ఆలోచించినప్పుడు తెలుగు నవల ఎదగకపోవడానికి సామూహిక జ్ఞాపకం నుంచి, సాంఘిక చరిత్ర నుంచి దూరం కావడమే, తీసుకోవలసినంత తీసుకోకపోవడమే ఒక కారణం కావచ్చునా అని అనుమానం కలుగుతుంది. నవల మొత్తంగా చారిత్రక నవల కానక్కరలేదు, అప్టన్ సింక్లెయిర్ ను ఉదాహరణగా పెట్టుకుని రాశానని మహీధర రామమోహనరావు స్వయంగా చెప్పుకున్న చారిత్రక నవలల పరంపర లాంటిది కూడ అవసరం లేదు. వ్యక్తి ప్రధానమైన, కొన్ని పాత్రలే ప్రధానమైన ఏ ఇతివృత్తపు నవల అయినా సామూహిక జ్ఞాపకం దానికి జవసత్వాలను ఇవ్వగలుగుతుందని నాకనిపిస్తుంది. పాఠకులకు ఆ సామూహిక జ్ఞాపకంతో సంబంధం ఉంటుంది గనుక నవల వికసించడానికి మాత్రమే కాదు, పాఠకులు దానితో తాదాత్మ్యం చెందడానికి కూడ అది దోహదం చేస్తుంది.

సామూహిక జ్ఞాపకంలో మరొక అంశం కూడ అంతర్గర్భితంగా ఉంటుంది. ఎన్నో ఘటనలు, క్రమాలు జరిగి, ఆ ఘటనలు, క్రమాలు చరిత్రకు ఎక్కకపోయినా, గుర్తు లేకపోయినా, ఎక్కడా మౌఖికంగా గాని, లిఖితంగా గాని నమోదు కాకపోయినా వాటి అంతిమ ఫలితమైన ఒక అవగాహన, ఒక స్వభావం, ఒక అమూర్త భావన ఆ సమూహపు జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది. ఒక సాహిత్య రచన ఆ స్వభావానికి సరిపోయే సన్నివేశాన్ని చరిత్రనుంచి తీసుకుని మెరుగుపెట్టినప్పుడు, లేదా ఊహాశాలితతో సృష్టించగలిగినప్పుడు ఆ సన్నివేశం నిజమైనా కాకపోయినా, పూర్తిగా కల్పనే అయినా పాఠకులు దాన్ని తమ సామూహిక జ్ఞాపకానికి ఒక నిదర్శనంగా, వ్యక్తీకరణగా చూస్తారు. తద్వారా అది పూర్తి కల్పనే అయినా విశ్వసనీయతను సంతరించుకుంటుంది. బి. ట్రావెన్, గాబ్రియెల్ గార్షియా మార్కెజ్, ఎడువార్డో గలియనో, ఇసబెల్ అయెండి, మాన్లియో అర్గెటా, ఎరియెల్ డార్ఫ్ మన్, చినువా అచెబె, గూగీ వా థియోంగో, బుచి ఎమిచిటా వంటి లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ రచయితల శక్తి తమ సమాజాలలోని సామూహిక జ్ఞాపకాలకు కళారూపం ఇవ్వడంలో, లేదా తమ రచనలలో ఆ జ్ఞాపకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో ఉందనుకుంటాను.

చరిత్రనుంచీ, జీవితచరిత్రల నుంచీ కొన్ని ఉదాహరణల ద్వారా తెలంగాణ జీవితంలోని అటువంటి సామూహిక జ్ఞాపకాలు సాహిత్యానికి ఎంత మేలు చేయగలవో చూపడానికి ప్రయత్నిస్తాను. ఆధిపత్యం పట్ల ధిక్కారం, పోరాటం తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో భాగం. కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఈ సామూహిక జ్ఞాపకాన్ని బలపరిచే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, పాల్కురికి సోమన, పోతన, సర్వాయి పాపన్న, రాంజీ గోండు, తుర్రెబాజ్ ఖాన్, బందగీ, కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయెబుల్లా ఖాన్ వంటి అనేక చిహ్నాలు ఈ సామూహిక జ్ఞాపకాన్ని సృష్టించాయి, పునరుత్పత్తి చేశాయి. బలోపేతం చేశాయి. ప్రత్యక్షంగా ఈ ప్రతీకలను గాని, ఈ ప్రతీకల ద్వారా వ్యక్తమైన ధిక్కార భావనను గాని ఇతివృత్తంగా తీసుకునే సాహిత్యానికి తప్పనిసరిగా ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

పైన చెప్పిన సామూహిక జ్ఞాపకపు ప్రతీకలన్నీ సుప్రసిద్ధమైనవే, ఇటీవలి కాలంలో మళ్లీ మళ్లీ స్మరణకు వచ్చినవే. కాని తెలంగాణ చరిత్ర సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇటువంటి మరెన్నో ఘటనలు, పరిణామాలు, ప్రతీకలు ఉన్నాయని స్పష్టమయింది.

ఉదాహరణకు పాలకుర్తి గ్రామాన్ని తీసుకొండి. పాల్కురికి సోమన ఆ గ్రామం నుంచి వచ్చి శివకవిగా, ప్రచారకుడిగా, సామాజిక చింతకుడిగా తన కాలం కన్న చాల ముందుకు చూశాడు. మార్గ సంప్రదాయాన్ని ధిక్కరించి దేశి పద్ధతి చేపట్టాడు. ఉరుతర గద్య పద్యోక్తులను, సంస్కృత సమాస భూయిష్ట రచనను తిరస్కరించి జానుతెనుగులో, ద్విపదలో రచించాడు. అప్పటికి ఉన్న ఆనవాయితీని కాదని బసవపురాణం రాశాడు. జాతిభేదాన్ని, స్త్రీపురుష భేదాన్ని, కులగోత్రాలను, కలిమిలేములను గుర్తించని వీరశైవాన్ని అనుసరించాడు. ఆయన జీవితకాలంలో ఒక చాకలి స్త్రీకి శివదీక్ష ఇచ్చాడని ఆధారాలున్నాయి. అదే గ్రామంలో ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక చాకలి స్త్రీ దొరతనాన్ని ధిక్కరించడం సంబంధం లేనిదనీ, యాదృచ్ఛికమనీ అనిపించవచ్చు గాని నేను దాన్ని సామూహిక జ్ఞాపకపు పునరుత్పత్తి అనుకుంటాను. సోమన ధిక్కారం భాషలో, సాహిత్యంలో, సంస్కృతిలో, మతాచారాలలో జరిగితే, ఐలమ్మ ధిక్కారం భూమి మీద, శ్రమ ఫలితం మీద, అధికారం మీద, చట్టం మీద జరిగింది. ఈ రెండు ధిక్కారాలూ వేరువేరు అనుకునే దృక్పథం కూడ ఉంది గాని, నా ఉద్దేశంలో ఈ రెండూ పరస్పరాశ్రితాలు. సోమన ధిక్కారాన్ని బలోపేతం చేయగలిగిందీ, అర్థవంతం చేయగలిగిందీ, సుస్థిరం చేయగలిగిందీ ఐలమ్మ ధిక్కారమే. ఈ అన్యోన్య సంసర్గం, ఇంత సుదీర్ఘకాలపు కొనసాగింపు తప్పనిసరిగా సాహిత్యానికి అద్భుతమైన ముడిసరుకు అవుతుంది.

అలాగే కడివెండి గ్రామాన్ని చూడండి. విసునూరు రామచంద్రారెడ్డి అధీనంలోని గ్రామంగా, కర్కోటకురాలని పేరు తెచ్చుకున్న ఆయన తల్లి స్వయంగా పాలించిన గ్రామంగా ఆ ఊరు సహజమైన ప్రతిఘటనను ప్రకటించింది. ఆ ప్రతిఘటన క్రమంలో తగినంత మిగులులేని గ్రామ రైతుల దగ్గరినుంచి బలవంతంగా వసూలు చేస్తున్న యుద్ధపు లెవీ, గుమ్ములు పొర్లిపారుతున్న దొర గడీకి ఎందుకు వర్తించదని ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న ఊరేగింపు రూపం ధరించింది. ఆ ఊరేగింపు మీద కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించాడు. ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు అదే గ్రామానికి చెందిన పైళ్ల వెంకటరమణ గాని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి గాని మరొక ఐదారుగురు గాని మరొక ప్రజావిముక్తి సమరంలో అటువంటి ప్రశ్నలే వేసి ప్రాణత్యాగాలు చేశారు. ధిక్కార, త్యాగ చరిత్ర ఆ గ్రామపు సామూహిక జ్ఞాపకంలో మాత్రమే కాదు, మొత్తంగానే ఈ ప్రాంతపు, తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో, సాంఘిక చరిత్రలో భాగమైంది. ఇది సాహిత్యంలోకి అనువాదమైతే ఎంత రోమాంచకారి ప్రభావం కలగజేయగలుగుతుంది!

ఇలా వెతుకుతూ పోవాలే గాని, తెలంగాణ చరిత్ర నిండా, ఆమాటకొస్తే ఎక్కడైనా ప్రజల చరిత్ర నిండా ఎన్నెన్నో అద్భుతమైన ఘటనలు, పరిణామాలు దొరుకుతాయి. ఆ సామూహిక జ్ఞాపకాన్ని, సాంఘిక చరిత్రను తవ్వితీసి సాహిత్యరూపం ఇవ్వడం సాహిత్యకారుల బాధ్యతలలో ఒకటనుకుంటాను. ఈ తవ్వితీయడానికి గనులుగా ప్రతాపరెడ్డి చెప్పిన ఆకరాలు మాత్రమే కాదు, మరెన్నో ఆకరాలున్నాయి.

వరంగల్ లో భాగమైన వడ్డెపల్లి భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాగా ఎదిగిన పింగళి జగన్మోహన రెడ్డి తన ఆత్మకథలో ఒక ఉదంతం రాశారు. అది తన ముత్తాత కాలం నాటిదని, అందువల్ల దానిలో వాస్తవం ఎంతో చెప్పలేమని ఆయనే రాశారు. హనుమకొండలో ఇప్పటికీ రాగన్న దర్వాజ అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఆ రాగన్న జగన్మోహనరెడ్డికి పూర్వీకుడు. ఆ రాగన్నను హత్య చేసిన నేరం మీద ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. ఆ శిక్ష అమలు చేయబోయే సమయానికి ఆ వ్యక్తి తమ్ముడు వచ్చి, ‘మా అన్న భార్యాబిడ్డలు ఉన్నవాడు. మరణశిక్ష అమలుచేస్తే వాళ్లు దిక్కులేనివారైపోతారు. నాకు వెనుకాముందూ ఎవరూ లేరు. అందువల్ల మా అన్నకు వేసిన శిక్షను నాకు బదిలీ చేసి, నన్ను ఉరితీయండి’ అని కోరాడట. నిజంగానే ఆ తమ్ముడికే శిక్ష అమలు చేశారట. వాస్తవం కల్పన కన్న అద్భుతంగా ఉంటుందనడానికి ఇంతకన్న నిదర్శనం ఉంటుందా?

తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇటువంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఘటనల వనరులలో ‘హైదరాబాద్ అఫెయిర్స్’ ఒకటి. అసలు ఆ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ కథే తెలుసుకోవలసిన కథ. హైదరాబాదు రాజ్యంలో పందొమ్మిదో శతాబ్దం చివరిలో జరిగిన విశేషాలగురించిఅప్పటి పత్రికలలో వచ్చిన వార్తలన్నిటినీ నిజాం ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శిగా ఉండిన మౌల్వీ సయ్యద్ మహదీ అలీ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ పేరుతో పన్నెండో, పదమూడో పెద్ద సంపుటాలుగా సంకలనం చేసి 1880లలో ప్రచురించాడు. అవి ఫూల్ స్కేప్ సైజులో ఒక్కొక్కటి మూడు వందల పేజీల నుంచి తొమ్మిది వందల పేజీల దాకా ఉంటాయి. ఆ సంపుటాలు చదువుతుంటే నూట యాభై సంవత్సరాల వెనుకటి హైదరాబాద్ రాజ్యం, సమాజం, పాలన, సంస్కృతి కళ్లముందర కదలాడుతాయి. (అయితే దురదృష్టమేమంటే అన్ని సంపుటాలూ ఒక్కచోట ఇంతవరకూ నేను చూడలేకపోయాను. బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లోనూ, డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ కార్యాలయంలోనూ చాల సంపుటాలు ఉండేవి. ఇప్పుడు మొదటి దాంట్లో అన్నీ లేవు, రెండో కార్యాలయమే లేదు. ఇక్కడ కనబడని సంపుటాలు కొన్ని నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ గ్రంథాలయంలో కనబడ్డాయి గాని అవి ఫొటోకాపీ చేయించుకోవడం కుదరలేదు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర ఒక అద్భుతమైన పాత పుస్తకాల ఫోటోకాపీల అమ్మకందారు దగ్గర ఆరేడు సంపుటాలు సంపాదించాను గాని అన్నీ దొరకలేదనే లోటు అలాగే ఉంది.) ఆ సంపుటాలు తెలంగాణ సాంఘిక చరిత్ర గురించి ఎన్నో అరుదైన, ఆశ్చర్యకరమైన విషయాలను, సాహిత్యంలోకి పరావర్తనం చెందగల, ప్రతిఫలించడానికి అవకాశం ఉన్న విషయాలను ఇస్తాయి. అవన్నీ ఏదో ఒక స్థాయిలో మన సామూహిక జ్ఞాపకంలో భాగమయ్యాయనే అనుకుంటాను. ఇక్కడ మచ్చుకు ఒకటి చెపుతాను:

కలకత్తా నుంచి వెలువడుతుండిన ఇంగ్లిష్ మన్ పత్రికలో 1859లో వచ్చిన వార్త ప్రకారం హనుమకొండకు పన్నెండు కోసుల దూరంలో రూపా అనే ఒక లంబాడీ పెద్ద మరొక తండా పెద్దతో వచ్చిన ఘర్షణలో ఆయననూ, ఆయన కుటుంబ సభ్యులనూ మొత్తం ముప్పైతొమ్మిది మందిని నరికేశాడట. ఆ నేరానికి నిర్బంధించి న్యాయస్థానానికి తీసుకొచ్చినప్పుడు, “నాకూ మా అన్నకూ తగాదా వచ్చి నేను ఆయనను చంపేస్తే విచారించడానికి మధ్యలో ఈ అదాలత్ ఎవరు? శిక్ష విధించడానికి సర్కారు ఎవరు? నేనేమన్నా సర్కారు సొమ్ము తిన్నానా? దోపిడీ చేశానా” అని అడిగాడట.

ఇది చదివినప్పుడు నాకు సరిగ్గా ఇటువంటి జ్ఞాపకాలనే లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యకారులు ఎలా కాల్పనీకరించి, అద్భుతమైన దృశ్యాలుగా, ఆలోచనాస్ఫోరకమైన సన్నివేశాలుగా మలిచారుగదా అనిపించింది.

చిట్టచివరిగా, ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజల స్వాభిమానాన్ని వ్యక్తీకరించే సాహిత్య రూపాలు విరివిగా వెలువడుతున్నాయి. నిజానికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ తెలంగాణ ప్రజల స్వాభిమాన కాంక్షకు ఒకానొక వ్యక్తీకరణ మాత్రమే. సాంఘిక చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే, 1950లో రైతాంగ సాయుధ పోరాట ప్రాంతాలలో పర్యటించిన అమెరికన్ విలేఖరి తాయా జింకిన్ ఒక జీపు డ్రైవర్ మాటల్లో వెలువడిన ఆనాటి ఆకాంక్షను నమోదు చేసింది. నువ్వే ప్రభుత్వమైతే ఏం చేస్తావు అని ఆమె అడిగిన ప్రశ్నకు ఆ డ్రైవర్ “జనానికి బాగా అప్పులిస్తాను. బోలెడన్ని బళ్లూ ఆస్పత్రులూ కట్టిస్తాను. దున్నేవాడికే భూమి పంపిణీ చేస్తాను. ఉర్దూ రద్దు చేస్తాను. తెలుగువాళ్లను అధికారులుగా నియమిస్తాను. గ్రామాల రక్షణకు స్వచ్ఛంద సాయుధ దళాలను ఏర్పాటు చేస్తాను…” అన్నాడట. ఈ కోరికలలో రెండిటిని ఇప్పుడు సవరించుకోవలసిన అవసరం ఉందేమో గాని, మౌలికంగా మిగిలిన కోరికలకు కాలం చెల్లలేదు. ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడ వాటిలో ఏ ఒక్కటీ తీరలేదు.

గతమూ వర్తమానమూ జ్ఞాపకమూ జీవితమూ కలగలిసిన సమాజం ఇది. ఈ చరిత్రనూ, సామూహిక జ్ఞాపకాన్నీ, ఊహనూ అద్భుతమైన సృజనగా రసాయనిక సంయోగం సాధించగల గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ వంటి సృజనకర్త కోసం ఈ నేల ఎదురుచూస్తున్నదనుకుంటాను.

-ఎన్. వేణుగోపాల్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

వాస్తవం, జ్ఞాపకం, ఊహల అద్భుత కలనేత

gabrielGarciaMarquez1981-Eva-Rubinstein

గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ మరణించాడన్న వార్త ఒక్కసారిగా పెటిల్లున దుఃఖాన్ని తోసుకొచ్చింది. అమ్మ చనిపోయినప్పుడు, బాపు చనిపోయినప్పుడు, ఎందరెందరో చిన్ననాటి స్నేహితులు, ప్రజావిముక్తి యుద్ధంలో ఆత్మీయులైన వీరయోధులు చనిపోయినప్పుడు జరిగినట్టుగా మనసు నిండా శూన్యం ఆవరించింది. జాతస్య మరణం ధ్రువం కావచ్చు. కాని కొందరి మరణం ఎంతమాత్రమూ అంగీకారయోగ్యం కాదనిపిస్తుంది. ఆ లోటు ఎప్పటికీ తీరదనిపిస్తుంది. మార్కెజ్ మరణ వార్త విన్నప్పటి నుంచి నలభై ఎనిమిది గంటలుగా తెరలు తెరలుగా దుఃఖం వస్తూనే ఉంది.

భాషలో, జాతిలో, భూఖండంలో, వయసులో ఎంతో ఎడం ఉన్న సుదూరమైన ఈ మనిషి, ప్రతిభలో ఆకాశమంత ఎత్తయిన ఈ మనిషి కేవలం భావాల వల్ల దగ్గరివాడైన ఈ మనిషి నా మనిషి అని ఎందుకనిపిస్తున్నాడు? నా హృదయపు ముక్క ఒకటి తెగిపోయినప్పటి మహా విషాదం ఎందుకు ఆవరిస్తున్నది?

అతి ఎక్కువగా ప్రభావితం చేసిన రచయితలు, కళాకారులు ఎవరికైనా ఇలాగే నా మనిషి అని ఆప్తులుగా అనిపిస్తారేమో. వారిని ఎన్నడూ కలవకపోవచ్చు కాని వారినిక కలిసే అవకాశం కూడ ఎప్పటికీ లేదనే ఎరుక కలగడం, వారి అద్భుత ప్రతిభ వెలువడడానికి ఇక వీలులేదని తెలియడం ఒక జీవితకాల విషాదం.

ఆయనను చదివాను. ఆయన అక్షరాల మాయలో చిక్కుకున్నాను. ఆయన వాక్యాల వెంట కన్నీరు కార్చాను. ఆయన సృష్టించిన సన్నివేశాలలో భాగమై అపారమైన ఆనందాన్ని అనుభవించాను. గొప్ప తాదాత్మ్యం పొందాను. మైమరిచిపోయాను. బహుశా ఆ పఠనానుభూతి, ఆ సంభ్రమం, ఆ ఆనందం ఎప్పటికీ మాయం కావు, ఆయన ఇక లేడు. ఆయన రచనలు వెలువడడం ఆగిపోయి పదేళ్లు అయింది గాని ఏమో హఠాత్తుగా ఆ కాన్సర్ నుంచి విముక్తి అయి, ఆ అల్జీమర్స్ నుంచి బైటపడి, ఆ అద్భుత మేధ మళ్లీ ప్రపంచం కోసం ప్రేమతో మరి నాలుగు అక్షరాలు వెదజల్లేదేమో. కాన్సర్ అని తెలిసిన తర్వాతనే, చనిపోయాడని నీలివార్త ప్రచారమైన తర్వాతనే కదా ‘కథ చెప్పడానికే బతుకు’ (లివింగ్ టు టెల్ ది టేల్) అని జీవిత కథ రాశాడు!

ఇక ఆ ఆశ లేదు. కథ చెప్పే మనిషి లేడు. ఆ కలం ఆగిపోయింది. యాభై సంవత్సరాలకు పైగా లాటిన్ అమెరికన్ జీవిత సముద్రాన్ని మథించి, ప్రపంచానికి అమృతాక్షరాలనందించిన ఆయన చేతివేళ్లు దహనమైపోయి చితాభస్మంగా మారిపోయాయి. అనంత కోటి జ్ఞాపకాలను, కోటి ఊహలను, లక్ష వాస్తవాలను కలగలిపి, ఆ రసాయనిక సంయోజనంలో ప్రపంచాన్ని సమ్మోహితం చేసిన ఆ మేధ ఆలోచించడానికి ఇంక అవకాశం లేదు. ఆయన శిష్యురాలు, చిలీ జీవితాన్ని దాదాపు గురువంత అద్భుతంగానూ చిత్రించిన నవలా రచయిత ఇసబెల్ అయెండె అన్నట్టు, “నా గురువు మరణించాడు. కాని ఆయనకు సంతాపం ప్రకటించను. ఎందుకంటే నేనాయనను పోగొట్టుకోలేదు: ఆయన మాటలను మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటాను.”

***

Gabriel-Garcia-Marquez-2-190

ఎక్కడో కొలంబియాలో పుట్టిపెరిగి, స్పానిష్ లో రాసి, మార్క్యూజ్ అనే పొరపాటు ఉచ్చారణతో పిలుచుకున్న ఈ గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ అనే మహా శబ్దమాంత్రికుడు, మాంత్రిక వాస్తవికతా శిల్పి నా జీవితంలోకి ఎలా వచ్చాడు? ఆయన మా వరంగల్ వాడో, తెలంగాణ వాడో అని నేను ఎప్పుడూ ఎందుకు నమ్ముతూ వచ్చాను?

“జీవితమంటే ఒకరు జీవించినది కాదు, వారు గుర్తు పెట్టుకునేది, తిరిగి చెప్పడం కోసం ఎట్లా గుర్తుపెట్టుకున్నారనేది” అని తన ఆత్మకథ లివింగ్ టు టెల్ ది టేల్ లో అన్నాడు మార్కెజ్. బహుశా ఆయన జీవితమూ రచనా అన్నీ ఈ సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. అందువల్లనే ఆయన రచన వాస్తవికత మాత్రమే కాదు, అది వాస్తవికత, జ్ఞాపకం, ఊహల కలనేత. వందల సంవత్సరాల సామూహిక జ్ఞాపకాల దొంతరలు నిత్యజీవన భయానక ఉజ్వల వాస్తవికతతో పడుగూ పేకల్లా కలిసిపోయిన తెలంగాణ వంటి ప్రతి సమాజంలోనూ ఆయన ఉన్నాడు, ఆయన సృజన ఉంది.

మార్కెజ్ ను నాకు పరిచయం చేసింది రాజకీయార్థిక శాస్త్రవేత్త, సురా పేరుతో విమర్శకుడిగా సుప్రసిద్ధుడు, సృజన సాహితీమిత్రుడు సి వి సుబ్బారావు. రాడికల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా ఎమర్జెన్సీ కాలమంతా జైలులో ఉండి, ఎమర్జెన్సీ తర్వాత ఢిల్లీలో లెక్చరర్ గా చేరాడు. అప్పటి నుంచి 1985 దాకా ఎప్పుడు సెలవులు వచ్చినా నేరుగా వరంగల్ వచ్చి, అటూ ఇటూ వెళ్తూ వస్తూ, వరంగల్ లోనే ఎక్కువకాలం గడిపేవాడు. సృజనకూ సాహితీమిత్రులకూ బైటి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆయన ఒక తెరిచిపెట్టిన విశాలమైన కిటికీ. ఆయన నిశాచరుడు. రాత్రంతా మేలుకుని ఉండి ఉదయం ఐదున్నర, ఆరుకు పడుకునేవాడు. రాత్రంతా ఆయనకు తోడుగా చెప్పినవి వింటూ, రోడ్లమీద తిరుగుతూ, అన్నివేళల్లోనూ హనుమకొండ చౌరస్తాలో ఇరానీ హోటళ్లలో చాయ్ తాగుతూ కాలం గడుస్తుండేది. అలా సుబ్బారావు ద్వారానే 1982 చివరిలో మార్కెజ్ గురించి తెలియడమే కాక వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పుస్తకమూ, మార్కెజ్ నోబెల్ ఉపన్యాసం అచ్చయిన ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ కటింగ్ ఫొటోకాపీ చేతికందాయి. ఆ నవలలో మొదటిసారి మంచుముక్కను ముట్టుకున్న మహోగ్ర ఉష్ణమండల వాసిలాగనే నేనూ ఆ అక్షరాలు ముట్టుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ మొదటి పఠనంలోనే నవల మొత్తంగా అర్థమయిందని చెప్పలేను గాని గాఢమైన ప్రభావాన్ని వేసింది. అంతకన్న ఎక్కువగా ఆకట్టుకున్న, దుఃఖావేశాలు కలిగించిన, లాటిన్ అమెరికా చరిత్ర చదవడానికి పురికొల్పిన నోబెల్ ఉపన్యాసం వెంటనే తెలుగు చేశాను.

(http://www.andhraprabha.com/offbeat/hundred-years-of-solitude/15980.html) అది అప్పుడే సృజన జూన్ 1983 సంచికలో అచ్చయింది. తర్వాత గడిచిన మూడు దశాబ్దాలలో వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ చదివినప్పుడల్లా కొత్త అర్థాలు స్ఫురింపజేసింది.

తర్వాత నాలుగైదు సంవత్సరాలకు బెజవాడలో ఉండగా లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా చేతికందింది. సరిగ్గా తెలుగు సీమలో ఆట పాట మాట బంద్ అనే నియంతృత్వం అమలవుతున్న చీకటిరోజులవి. కలరా రోజులవి. పైకి ప్రేమ కథగా కనబడినప్పటికీ అది మానవసంబంధాలను విచ్ఛిన్నం చేసే వాతావరణానికీ, మానవసంబంధాల అపరాజితత్వానికీ ఘర్షణ కథ అని నాకనిపించింది. ఆ తర్వాతెప్పుడో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మార్కెజ్ కూడ ఆ నవల గురించి “పాఠకులు నా వలలో పడగూడదు” అన్నాడని చదివినప్పుడు ఆ నవల పొరలుపొరలుగా ఏమేమి చెప్పిందో ఎన్ని సార్లు చదివితే అన్నిసార్లు కొత్త అర్థాలు దొరుకుతాయనిపించింది.

images

తర్వాత బెంగళూరులో ఉండగా పన్నెండు కథల సంపుటం స్ట్రేంజ్ పిల్ గ్రిమ్స్. ఇరవై ఏళ్ల కింద ఆ పుస్తకం చదువుతున్నప్పటి అనుభవం ఈ క్షణాన అనుభవిస్తున్నట్టే ఉంటుంది. ఆ పుస్తకమంతా ప్రవాసానికీ ప్రవాస వైచిత్రికీ సంబంధించినది. ఆ ప్రవాసం స్థలానిది కావచ్చు, కాలానిది కావచ్చు, వయసుది కావచ్చు. మనసుది కావచ్చు. అధికారానిది కావచ్చు. ఆ డజను కథలూ వస్తుపరంగా గాని, శిల్పపరంగా గాని పాఠ్యపుస్తకాలుగా అధ్యయనం చేయదగినవి. ఆ పుస్తకంమీద నా ప్రేమ ఎంతటిదంటే కనీసం అరడజను మందికి ఆ పుస్తకం కానుక ఇచ్చాను. కనీసం డజను సార్లయినా కథ వర్క్ షాపుల్లోనో, సాహిత్య సమావేశాల్లోనో వాటిలో ఏదో ఒక కథ గురించి చెప్పి ఉంటాను. ఇరవై ఏళ్లు గడిచినా వాటిలో ద ట్రెయిల్ ఆఫ్ యువర్ బ్లడ్ ఇన్ ద స్నో గాని, ఐ ఓన్లీ కేమ్ టు యూజ్ ద ఫోన్ గాని గుర్తుకొస్తే కళ్లు చెమరుస్తాయి. లైట్ ఈజ్ లైక్ వాటర్ ముందర అమాయక, నైసర్గిక బాల్యంలోకి జారిపోయి నిజంగానే ఆ ట్యూబ్ లైట్ పగిలిపోయి దాంట్లోంచి వెలుగు నీటిలా ప్రవహిస్తుందా చూడాలనిపిస్తుంది.

బెంగళూరులో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అని మేం నడుపుతుండిన బృందంలో అందరూ రాజకీయ, సామాజిక కార్యకర్తలే కాక సాహిత్యాభిమానులు కూడ. మార్కెజ్ రచనలు మాకు నిరంతర చర్చనీయాంశాలు. అందుకే నేను బెంగళూరు వదిలేసి వచ్చేటప్పుడు పిడిఎఫ్ మిత్రులు అప్పుడే తాజాగా వెలువడిన ఆఫ్ లవ్ అండ్ అదర్ డెమన్స్ కానుకగా ఇచ్చారు. మళ్లీ ఇది కూడ ప్రేమ కథగా కనబడుతుంది గాని పొరలు విప్పుకుంటూ పోతే వలసవాదం, క్రైస్తవం, స్థానిక ఆచారవ్యవహారాలు, అభూత కల్పనలు, ప్రేమ, ఆధిపత్యం ఒకదానిలో ఒకటి కలిసిపోయి అబ్బురపరుస్తాయి.

బెంగళూరులో ఉండగానే దొరికిన మరొక మార్కెజ్ అద్భుతం క్లాండెస్టైన్ ఇన్ చిలీ. అకాలంగా మరణించిన సాహితీమిత్రుడు గోపీ స్మృతిలో ఒక పుస్తక ప్రచురణ కార్యక్రమం, ముఖ్యంగా తనకు ఇష్టమైన అనువాద సాహిత్యం ప్రచురించాలని అనుకున్నప్పుడు వెంటనే తట్టినదీ, కొద్ది రోజుల్లోనే అనువాదం, ప్రచురణ అయిపోయినదీ ఆ క్లాండెస్టైన్ ఇన్ చిలీ పుస్తకమే. నేను, సి వనజ అనువాదం చేసిన, చీకటి పాట పేరుతో వచ్చిన ఆ పుస్తకంలో సల్వదోర్ అయెండె పేరు వర్ణక్రమం దగ్గరి నుంచి ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికీ తెలుగులో వెలువడిన మొట్టమొదటి మార్కెజ్ పుస్తకం అది. దాని అనువాదంతో, ప్రచురణతో సంబంధం ఉండడం నాకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది.

IMG_20140422_074326

 

నోబెల్ బహుమతి డబ్బుతో పత్రిక కొని దాంట్లో రిపోర్టర్ గా పని చేస్తాననడమూ, చేయడమూ, ఎప్పటేప్పటి జ్ఞాపకాలనూ, తాత అమ్మమ్మల అభూత కల్పనలకు అక్షరాలు తొడగడమూ, మకాండో అనే ఊహాగ్రామం చుట్టూ అల్లిన అద్భుత గాథలూ, గెరిల్లాలతో చర్చలకు మధ్యవర్తిత్వమూ, అధ్యక్ష పదవి చేపట్టమని కోరడమూ, మరణించాడనే గాలి వార్తా, దానికి జవాబుగా కథ చెప్పడానికే బతికి ఉన్నాననడమూ, కాస్ట్రోతో స్నేహమూ, సామ్రాజ్యవాద వ్యతిరేకతా…. ఆయన చుట్టూ అల్లుకున్న అభూతకల్పనల వంటి జానపదగాథలు ఎన్నెన్నో, మిత్రులతో సంభాషణల్లో ఎన్నిసార్లో….

అనుకోకుండా వనజకు బర్కిలీలో ఫెలోషిప్ వచ్చి, నాకు కూడ మూడు నెలల కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అక్కడ చూడవలసిన మనుషుల, ప్రాంతాల జాబితా తయారు చేసుకున్నాను. గూగీ, జేమ్స్ పెట్రాస్, మార్క్ ట్వెయిన్, పాల్ రాబ్సన్, బాబ్ డైలాన్, ఐన్ స్టీన్, స్వీజీ-మాగ్డాఫ్ లు గడిపిన మంత్లీ రివ్యూ ఆఫీసూ వగైరా… వనజకు బర్కిలీలో పరిచితమైన మెక్సికన్ వలేరియా బ్రబాతా వల్ల మెక్సికో కూడ వెళ్లడం వీలయినప్పుడు అక్కడ మార్కెజ్, ఫ్రీదా కాలో, డీగో రివేరా, వీలైతే దక్షిణాదికి వెళ్లి జపాటిస్టాలు…. కాని సరిగ్గా అప్పుడే మార్కెజ్ మెక్సికో సిటీ లో లేడు. తర్వాత కొద్ది రోజులకు గూగీని కలవడానికి అర్వైన్ కు వెళ్తూ లాస్ ఆంజెలిస్ లో మిత్రులు డాక్టర్లు జ్యోతి, గిల్బర్ట్ ల దగ్గర ఆగినప్పుడు, మాటల్లో ప్రస్తావన వస్తే గిల్బర్ట్ పనిచేసే ఆస్పత్రిలోనే మార్కెజ్ కు కీమోథెరపీయో, ఆ తర్వాత చికిత్సలో జరుగుతున్నాయని తెలిసింది. కాని ఆ షెడ్యూల్ కూడ అప్పుడు లేదు. అంటే రెండు సార్లు కనుచూపుమేర లోకి వెళ్లి కలవలేకపోయాను.

***

images

మార్కెజ్ ఆయన జ్ఞాపకాలను, తన జ్ఞాపకాలను మాత్రమే కాదు, తన జాతి జ్ఞాపకాలనూ, మానవజాతి జ్ఞాపకాలనూ తన రచనకు ముడిసరుకుగా వాడుకున్నాడు. జ్ఞాపకం అన్నప్పుడే కాలం జల్లెడ పట్టగా మిగిలిన వాస్తవం అని అర్థం. ఆ జల్లెడలో పూర్తిగా నెల్లు మిగిలిందా, పోయిందంతా పొల్లేనా ఎవరూ చెప్పలేరు. ఆ జ్ఞాపకాలను ఊహలతో రంగరించి, వాస్తవికతతో మెరుగులు దిద్ది అక్షరాలకెక్కించాడు మార్కెజ్. అందువల్లనే ఆయన రచనల్లో వందలాది కోటబుల్ కోట్స్ ఉంటాయి. అవి మానవజాతి తరతరాల సంచిత ఆస్తికీ, ప్రాచీన వివేకపు నికషోపలానికీ. ఆధునిక, అత్యాధునిక, భవిష్య ఆశాసూచికలకూ ప్రతీకలు. ఆనందంతో బాగుపడని దాన్ని ఏ మందులూ బాగుచేయలేవు అన్నా, ఎప్పుడైనా ప్రేమించడానికి ఏదో మిగిలే ఉంటుంది అన్నా మార్కెజ్ ప్రకటిస్తున్నది మనిషి పట్ల ప్రేమను, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని. ఆ ప్రేమకూ, ఆ ఆశకూ ఎన్నటికీ మరణం లేదు.

దాన్ని ఆయన కాల్పనిక రచనల్లో మాత్రమే కాదు, కఠిన వాస్తవిక ప్రసంగంలోనూ వ్యక్తీకరించాడు.

“…ఇన్ని జరిగినా, మాపట్ల కొనసాగినఅణచివేతకూ, మమ్మల్ని కొల్లగొట్టుకు పోవడానికీ, మమ్మల్ని వెలివేయడానికీమాకు ఒక జవాబు ఉంది. అది బతుకు. మాపై కొనసాగిన దౌర్జన్యానికంతటికీ మేంబతుకుతో జవాబిస్తాం. వరదలు గానీ, రోగాలు గానీ, కరువులు గానీ, ప్రళయాలుగానీ, శతాబ్దాల తరబడి సాగిన అనంత యుద్ధాలు గానీ చావుమీద బతుకు సాధించినవిజయాన్ని కాదనలేకపోయాయి. చావు మీద బతుకు గొప్పతనాన్ని తొలగించలేకపోయాయి” అని ఆయన నోబెల్ ప్రసంగంలో అన్నాడు.

అంతేకాదు, తన సామాజిక వాస్తవికతకూ తన సాహిత్య అభివ్యక్తికీ మధ్య సంబంధం పట్ల కూడ ఆయన ప్రకటించిన సవినయ అవగాహన మనిషి మీద, సమాజం మీద, చరిత్ర మీద, భవిష్యత్తు మీద ఆయన గౌరవానికి నిదర్శనం: లాటిన్ అమెరికా బీభత్స వాస్తవాన్ని వివరంగా చెప్పి, “నిజంగా స్వీడిష్ సాహిత్య అకాడెమీదృష్టికి రాదగిన అర్హత కలిగినది ఈ పెరిగిపోయిన వాస్తవమేగాని, దాని కేవలసాహిత్య వ్యక్తీకరణ కాదు. ఒక కాగితం మీది అక్షరం కాదు. మాలో బతుకుతున్నవాస్తవం. ఆ వాస్తవం మా అసంఖ్యాక రోజువారీ మరణాలను నిర్ణయిస్తున్నది. ఆవాస్తవం అనంతమైన సృజనాత్మకతకు వనరులు చేకూర్చిపెడుతున్నది. ఆ వాస్తవంనిండా కన్నీళ్లు ఉన్నవి, సౌందర్యం ఉన్నది. గతకాలాన్ని నెమరేసుకుటూ దేశదిమ్మరిగా తిరిగే ఈ కొలంబియన్ ఆ వాస్తవానికి ఒకానొక వ్యక్తీకరణ, అదృష్టం వరించినఒకానొక ఉదాహరణ” అని ఆయన నోబెల్ వేదిక మీది నుంచి ప్రకటించాడు.

ప్రపంచమంతా ఆయనకు నివాళి అర్పించింది. కాని అన్నిటిలోకీ నాకు నచ్చినది, ఆయన పుట్టిపెరిగిన నేల మీద దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగిస్తున్న మార్క్సిస్టు విప్లవకారుల సంస్థ కొలంబియా విప్లవ సాయుధ సైన్యం (ఫార్క్) తాము వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పాత్ర కర్నల్ అరెలియానో బెండియా నుంచి ప్రేరణ పొందుతూనే ఉంటామని అంది. ఆ మహాద్భుత వ్యక్తి మరణం తర్వాత మళ్లీ ఒకసారి చెపుతున్నాం. అరెలియానో బెండియా లాగనే మేం కూడ శాంతి గురించి కలగంటూనే ఉంటాం, శాంతిని నెలకొల్పుతాం అంది ఫార్క్.

-ఎన్. వేణుగోపాల్

venu

వందేళ్ల కిందటి తెలుగు మహిళ తిరుగుబాటు

venuరాని ‘సమయం’లో సమ్మె చేసి ఉద్యోగం పోగొట్టుకుని ఆరునెలలు నిరుద్యోగం చేసి, చివరికి బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్ (ఐసెక్) లో రిసర్చ్ అసిస్టెంట్ గా చేరడం నా జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇరవై రెండు సంవత్సరాల కింద జరిగిపోయిన ఆ మార్పు అనేక కారణాల వల్ల ఒక్క క్షణం కింద జరిగినంత బలంగా మనసు మీద ముద్ర వేసుకుంది. ఐసెక్ లైబ్రరీ, అక్కడి మేధో వాతావరణం, స్నేహబృందం గొప్ప వరాలు. ప్రత్యేకించి ఆ లైబ్రరీ మహా ఖజానా. అప్పటికి విని మాత్రమే ఉండి, చూసే అవకాశం కూడ దొరకని ఎన్నో పుస్తకాలు అక్కడ చేతికందాయి. అప్పటికి కొనుక్కోలేని పుస్తకాలెన్నో ఎంతో కొంత సంపాదనవల్ల, ఐసెక్ లో విద్యార్థులకు, ఉద్యోగులకు చౌకగా ఫొటోకాపీయింగ్ సౌకర్యం ఉండడం వల్ల, సొంతానికి సంపాదించుకోగలిగాను. అక్కడ అట్లా దొరికిన విలువైన పుస్తకాలలో ఒకటి ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’.

అప్పటికే రాజకీయాభిప్రాయాలవల్ల పరిచయస్తుడు, ఐసెక్ లో పబ్లికేషన్ అసిస్టెంట్ కె జి వాసుకి నేనక్కడ చేరిన రెండు నెలల లోపలే హఠాత్తుగా “డు యు నో సుందరమ్మ?” అని అడిగాడు. ఎవరా సుందరమ్మ అని ఎదురు ప్రశ్నించాను. అంతటి సుప్రసిద్ధ తెలుగు వ్యక్తి తెలియని నా అజ్ఞానానికి ఆయన చాల ఆశ్చర్యపోయాడు. “దేరీజ్ ఎ రేర్ బుక్ కాల్డ్ రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఇన్ అవర్ లైబ్రరీ. దటీజ్ ఎ సెంచురీ ఓల్డ్ బుక్. యు డోంట్ నో అబౌట్ హర్” అని నా అజ్ఞానానికి జాలిపడుతూ, బైటికి ఇవ్వని, పరిమిత చలామణీకి మాత్రమే అనుమతించే ఆ పుస్తకం నాకిచ్చాడు. ఆ పుస్తకాన్ని రెండు దశాబ్దాల వెనుక చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానో, ఇవాళ చదివినా అట్లాగే ఉంది. ఆ పుస్తకం వంద సంవత్సరాల కిందటి తెలుగు సమాజ శకలం ఒకదాన్ని సజీవంగా చూపుతుంది. మన గతం గురించి చెప్పే ఆ పుస్తకానికి వర్తమానంలో కూడ ఎంతో ప్రాసంగికత ఉంది.

2014-04-02-257

ఆ పుస్తకంలో పొదిలి, పెదారికట్ల, రాజుపాలెం అనే మూడు గ్రామాల పేర్లున్నాయి. వీటిలో మొదటి రెండూ ప్రస్తుత ప్రకాశం జిల్లా గ్రామాలు. ఇంటిపేర్లతో సహా దాదాపు పది, పదిహేను మంది మనుషుల వివరాలున్నాయి. హిందూ కుల మత దురాచారాల పీడనలో మగ్గిన ఒక స్త్రీ తిరుగుబాటు గాథ అది. ఇష్టానికి వ్యతిరేకంగా, అసలు ఇష్టాయిష్టాలు తెలియని బాల్యంలో నాలుగు రెట్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిగి, రెండో భార్యగా వెళ్లి, పదమూడేళ్లు నిండకుండానే కూతురికి జన్మనిచ్చి, ఆ కూతురికి కూడ బాల్య వివాహం చేయబోతుంటే తిరగబడిన స్త్రీ గాథ అది. ఆ స్త్రీ క్రైస్తవమతంలో చేరడమే తిరుగుబాటుగా రచయిత్రి చేసిన నిర్ధారణను పాఠకులు అంగీకరించవచ్చు. అంగీకరించకపోవచ్చు. కాని పదహారు అధ్యాయాల పుస్తకంలో క్రైస్తవం గురించి మాట్లాడినవి మూడు నాలుగు అధ్యాయాలు మాత్రమే. మిగిలిన అధ్యాయాలన్నీ హిందూ కుల మతాచారాలు, బ్రాహ్మణులు తమ భుక్తికోసం సృష్టించిన ఆచారవ్యవహారాల విధినిషేధాలు ఒక స్త్రీని ఎట్లా పీడించగలవో, ఎంత వేదనకు గురి చేయగలవో చూపేవే.

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది. అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

2014-04-02-258

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది.

sundaramma-1 sundaramma-2 sundaramma-3 sundaramma-5 sundaramma-6 sundaramma-7 sundaramma-8 sundaramma-9 sundaramma-10 sundaramma-11 sundaramma-12 sundaramma-13 sundaramma-14

అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

నూట అరవై పేజీల ఈ చిన్న పుస్తకంలో ప్రధాన కథ అయిన తెలుగు సామాజిక జీవన చిత్రణలో భాగంగా దాదాపు ఎనభై చిత్రాలు (అవి ఇండియన్ ఇంక్ డ్రాయింగ్ లు గాని, పెన్సిల్ స్కెచ్ లు గాని కావచ్చు) ఉన్నాయి. తెలుగు ప్రజల ఆచారాలు, వృత్తులు, మనుషులు, పెళ్లి, ఇళ్లు, దేవతా విగ్రహాలు, పశువులు, పంటలు, ప్రకృతి, పక్షులు, ఎడ్ల బళ్లు, చెప్పులు, గొడుగులు, చేతికర్రలు, కోకలు, పంచెలు, తినుబండారాలు, రుద్రాక్షమాల, శంఖం, తాయెత్తు, తాళపత్రాలు, సొరకాయ బుర్ర వంటి ఎన్నో సాంస్కృతిక విశేషాలు జీవం ఉట్టిపడుతూ కాగితం మీదికెక్కాయి, ఆ బొమ్మలు వేసింది గెర్ట్రూడ్ ఎచ్ బి హుకర్. ఆ పుస్తకానికి ముందుమాట రాసినది ఇవరయో శతాబ్ది తొలి దశకాలలో అమెరికాలో అత్యంత ప్రముఖ సంఘసేవకురాలు హెలెన్ బారెట్ మాంట్ గోమరీ. అలా ముగ్గురు అమెరికన్ స్త్రీలు పాలు పంచుకున్న, ఒక భారత, అందునా తెలుగు స్త్రీ గురించి రాసిన ఈ పుస్తకాన్ని 1911లో న్యూయార్క్ కు చెందిన ఫ్లెమింగ్ ఎచ్ రెవెల్ కంపెనీ అనే క్రైస్తవ పుస్తక ప్రచురణ సంస్థ వెలువరించింది. అప్పటికి నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ ప్రచురణ సంస్థ షికాగో, టొరాంటో, లండన్, ఎడింబరోలలో కార్యాలయాలతో పాశ్చాత్య ప్రపంచంలో అతి ప్రధానమైన క్రైస్తవ ప్రచురణ సంస్థగా ఉండేది. ఇప్పుడది బేకర్ పబ్లిషింగ్ గ్రూప్ లో ఒక భాగం.

 

ఒక అమెరికన్ రచయిత్రికీ, చిత్రకారిణికీ, సంఘసేవకురాలికీ, ప్రచురణకర్తకూ ఒకానొక తెలుగు స్త్రీ కథ వెలువరించవలసిన అవసరం ఏమి వచ్చింది? ఆ రచయిత్రి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ లో భాగంగా క్రైస్తవ మత ప్రచారానికీ, వైద్య సేవకూ, బహుశా మతాంతరీకరణకూ కూడ ప్రస్తుత ప్రకాశం జిల్లా, అప్పటి గుంటూరు జిల్లా గ్రామాలకు వచ్చింది. ఆమె జీవిత వివరాలు పుస్తకంలో ఎక్కడా లేవు గాని సుప్రసిద్ధ చర్చ్ సంగీతకారుడైన ఆమె కొడుకు రాబర్ట్ హాల్ ఎల్మోర్ జీవితచరిత్ర ప్రకారం, తల్లిదండ్రులు మాడ్ జాన్సన్ ఎల్మోర్, డా. విల్బర్ థియొడర్ ఎల్మోర్ రామపట్నం (రామయపట్నం) లో ఉండగా 1913లో ఆయన పుట్టాడని, 1915లో తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లిపోయారని తెలుస్తున్నది. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ తరఫున ప్రజలతో సంబంధం పెట్టుకున్న మాడ్ ఆ ప్రజల జీవితాలను, హిందూ మతం కింద ఆ ప్రజలు, ప్రత్యేకించి స్త్రీలు అనుభవిస్తున్న వేదనను స్వయంగా చూసింది. ఆ వేదన నుంచి బైటపడిన ఒకానొక యువతి గాథను చాల ఉద్వేగభరితంగా ఈ పుస్తకంలో చిత్రించింది.

ఇది వాస్తవ గాథనా, కల్పిత గాథనా కచ్చితంగా తెలియదు. ఆ గ్రామాలకు వెళ్లి వంద సంవత్సరాల కింద ఇటువంటి ఘటన జరిగిందా అని పరిశీలించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎంత ప్రయత్నించినా, మద్రాసు ప్రెసిడెన్సీలో క్రైస్తవ మతాంతరీకరణల చరిత్ర గురించి సవివరమైన పుస్తకం/కథనం ఒక్కటి కూడ దొరకలేదు. కాకపోతే క్రైస్తవంలోకి మారిన ఈ పుస్తక కథానాయకురాలి పేరు “వల్పుల” సుందరమ్మ కాగా, రామపట్నం థియొలాజికల్ సెమినరీలో రెవరెండ్ గా ఉండిన “వల్పుల” సి జాకబ్ 1909/10ల్లో దక్షిణాఫ్రికా వెళ్లాడని, ఆయన చరిత్ర తెలిసినవాళ్లు తనను సంప్రదించాలని ఇంటర్నెట్ మీద బ్రెండా ఫ్రాంక్నర్ 2013లో ఒక నోటీసు పెట్టారు!

అది నిజజీవిత గాథ అయినా కాకపోయినా, రచయిత్రికి ఆ నాటి తెలుగు సమాజంతోనూ, ఆచారాలతోనూ, హిందూ మత గ్రంథాలతోనూ తగినంత పరిచయం ఉందనడానికి పుస్తకంలో ఎన్నో అంతర్గత సాక్ష్యాలున్నాయి. బహుశా అందువల్లనే ఆ పుస్తకంలోని అనేక విషయాలు వర్తమానంలో కూడ ప్రాసంగికంగా ఉన్నాయి.

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

పుస్తకంలో బ్రాహ్మణ, అస్పృశ్య కులాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నప్పటికీ, ప్రధాన పాత్ర మధ్యంతర కులానికి చెందినదనే సూచన తప్ప స్పష్టత లేదు. అయినా మొత్తంగా సామాజిక, వ్యక్తిగత జీవితాలలో కుల, మతాల పాత్ర, ఆచార వ్యవహారాల పట్టు, ఆ ఆచార వ్యవహారాల పేరుతో సమాజం మీద బ్రాహ్మణుల ఆధిపత్యం గురించి పుస్తకం చాల సూక్ష్మమైన వివరాలు కూడ ఇస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరణతో ఆ ఆచారాలు తగ్గాయని, బ్రాహ్మణుల పట్టు తగ్గిందని చాల మంది అంటారు గాని సామాజిక జీవితంలో కుల మతాల పట్టు ఇప్పటికీ తగ్గలేదు సరిగదా, పెరిగిందేమో కూడ. పాత ఆచారవ్యవహారాలలో కొన్ని అంతరించి పోయాయేమో, కొన్ని మారిపోయాయేమో గాని ఆ స్థలం లోకి కొత్త ఆచార వ్యవహారాలు, కొత్త మూఢనమ్మకాలు వచ్చి చేరాయి. హిందూ మతం, దానిలో అంతర్భాగమైన కులం నిరంతరం పునరుత్పత్తి అవుతున్నాయి. నిజానికి హిందూ మతం, దాని పవిత్ర గ్రంథాలలో చెప్పిన విషయాల ఆధారంగానే హింసనూ, అసమానతనూ సమర్థించే మతం. ఒక వర్గం ఉత్పత్తిలో భాగం పంచుకోకుండా ఉత్పత్తి ఫలితాలను అనుభవించడానికి భగవంతుడి ఆమోదం ఉందని చెప్పే మతం. పూర్వజన్మ దుష్కృతాల పేరుతో, పునర్జన్మ అవకాశాల పేరుతో ఇప్పటి దోపిడీ పీడనలను సమర్థించే మతం, నిర్దాక్షిణ్యమైన మతం. ఏ మాత్రం ఆలోచనాపరులైనా, సున్నిత, మానవీయ భావాలున్నవాళ్లయినా దాన్ని అసహ్యంచుకోకుండా, అవకాశం వస్తే దాని నుంచి బైటికి వెళ్లకుండా ఉండలేరు. ఇక స్వయంగా ఆ మతగ్రంథాలే, భగవానువాచ ప్రకారమే స్త్రీల మీదా, “నిమ్న” కులాల మీద అణచివేతను, నిమ్నత్వాన్ని సమర్థించినప్పుడు, ఆ స్త్రీలు, నిమ్నకులాలు దానిలో కొనసాగడానికి కారణమే లేదు. బైటికి పారిపోవడం ఎంతమాత్రమూ ఆశ్చర్యకరం కాదు.

మతాంతరీకరణ చర్చ నిజానికి ఈ అంశం మీద, హైందవం నుంచి అత్యధిక సంఖ్యాకులను బైటికి తోసే స్థితి మీద జరగాలి. కాని ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మతాంతరీకరణకు ఆ రెండు మతాల బలప్రయోగమో, ప్రలోభమో కారణమని చర్చ జరుగుతున్నది. ఈ పుస్తకం తప్పనిసరిగా ఆ చర్చను మరొక కోణం నుంచి చూసే అవకాశం కలిగిస్తుంది. ముస్లిం పాలకులు హిందువులను బలప్రయోగం ద్వారా తమ మతంలోకి మార్చుకున్నారని, వలసవాద పాలకవర్గాలు హిందువులను ప్రలోభపెట్టి క్రైస్తవంలోకి ఆకర్షించాయని ఒక అభిప్రాయం బలంగానే ఉంది. కాని మతాంతరీకరణకు భయం గాని, ప్రలోభం గాని మాత్రమే కారణాలు కావు, హిందువులు తమ మతం నుంచి బైటికి పోవడానికి బైటి నుంచి ఆకర్షణ ఎంత కారణమో, అందుకు సమానంగానో, ఎక్కువగానో లోపలి నుంచి వికర్షణ కూడ కారణమవుతుందని ఒప్పుకోవాలి. హైందవంలోని దుస్సహమైన పరిస్థితి కల్పించిన భూమిక మీదనే ఇతర మతాల ఆకర్షణ లేదా బలప్రయోగం బలపడ్డాయి. ఈ పుస్తకం హైందవం తనలోంచి స్త్రీలను ఎట్లా నెట్టి వేస్తుందో చూపుతుంది.

ఇక చివరిగా తెలుగు సాహిత్యంలో ప్రచార సాహిత్యం అనే పేరుతో చిన్నచూపుకు గురవుతున్న సాహిత్యధార గురించి కూడ ఈ పుస్తకం కొన్ని ఆలోచనలను ప్రేరేపిస్తుంది. ప్రచార సాహిత్యం అనే మాట ద్వారా, ఆ సాహిత్యంలో సాహిత్యకత ఉండదని, దానిలో విశ్వసనీయ జీవిత చిత్రణ గాని, సాహిత్యానికి మౌలికమైన అనుభూతి సాంద్రత గాని ఉండవని, ప్రచార లక్ష్యంతో జీవితాన్ని, వస్తువును పలచబారుస్తారని, వక్రీకరిస్తారని ఒక అభిప్రాయం తెలుగు సాహిత్యంలో వంద సంవత్సరాలకు పైగా ఉంది. ప్రజా ఉద్యమాలు, ఉద్యమాలకు అనుబంధంగా సాహిత్యం పెరుగుతూ వచ్చిన కొద్దీ ఈ తప్పుడు అంచనా కూడ పెరుగుతూ వచ్చింది. మరొకవైపు ఆధునిక తెలుగు సాహిత్యమంతా స్పష్టమైన భావ ప్రచారం కోసమే జరిగింది. ఆమాటకొస్తే ప్రాచీన సాహిత్యంలో కూడ రాజాశ్రయం పొందినందువల్ల ఇవాళ్టికీ మిగిలిన సాహిత్యమంతా కూడ వర్ణాశ్రమ ధర్మ ప్రచారసాహిత్యమే. అయినా ప్రచార సాహిత్యం అంటే చిన్నచూపు కొనసాగుతున్నది. ఆ నేపథ్యంలో ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ రచయిత అవగాహనను, మతాన్ని ప్రచారం చేయడానికి రాసిన పుస్తకమే అయినా, ఆ అవగాహనను వ్యతిరేకించేవారిని కూడ మెప్పించగల విశ్వసనీయ, ఉద్వేగభరిత జీవితచిత్రణ ఎలా చేయవచ్చునో చూపింది.

ఈ పుస్తకం చదవగానే, ఐసెక్ లైబ్రరీలో 1910ల నాటి దేశదేశాల సోషియాలజీ పత్రికలన్నీ ఉండేవి గనుక ఏమైనా సమీక్షలు వచ్చాయో వెతకడానికి ప్రయత్నించాను. అమెరికన్ జర్నల్ ఆఫ్ సోషియాలజీ తో సహా అక్కడ కనబడిన ఏ పత్రికలోనూ సమీక్షలు దొరకలేదు. కాని ఈ పుస్తకం వెలువడిన వెంటనే న్యూయార్క్ టైమ్స్ లోనూ, న్యూజిలాండ్ హెరాల్డ్ లోనూ వచ్చిన సమీక్షలు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని దొరికాయి. ఆ సమీక్షలు కూడ చాల ఆలోచనాస్ఫోరకంగా ఉన్నాయి.

ఒక జీవిత చిత్రణగా, ఒక పరాయిదేశపు స్త్రీ తెలుగు స్త్రీ జీవితం గురించి చేసిన ప్రకటనగా, హైందవ పీడన నుంచి మహిళా విముక్తికి ఒక మార్గాన్ని సూచించిన ప్రచార రచనగా, ఒక సామాజిక శాస్త్ర వివరణగా ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’ కు ఆనాడు ఎంత విలువ ఉండిందో అంతకన్న ఎక్కువ విలువ ఇవాళ ఉంది.

-ఎన్. వేణుగోపాల్

ఇప్పుడిక జరగాల్సింది కొత్త చరిత్ర రచన!

గతవర్తమానం 1

venu

‘వర్తమాన కాలమూ గత కాలమూ

బహుశా భవిష్యత్కాలంలో మనుగడ సాగిస్తుంటాయి

భవిష్యత్కాలం గత కాలంలో నిండి ఉంటుంది

కాలమంతా శాశ్వతంగా వర్తమానమే అయితే

కాలానికెప్పుడూ విడుదల లేదు’ అన్నాడు కవి టి ఎస్ ఇలియట్.

 

‘చరిత్రంటే గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే’ అన్నాడు చరిత్రకారుడు ఇ ఎచ్ కార్.

 

గతమూ వర్తమానమూ భవిష్యత్తూ ఒక కలనేత. ఒక పిచికగూడు. వినీలాకాశంలో రకరకాల చిత్తరువులు గీసే మేఘమాల. తెలంగాణలోనైతే దసరా పండుగరోజున శమీవృక్షం మీది నుంచి ఆయుధాలు దించే ప్రాచీన గతమూ, ఊరేగింపులో అటూ ఇటూ ఊగుతున్న, అప్పటికప్పుడు కోసిన జొన్న కర్రల వర్తమానం. పీరీ ఎత్తుకుని ఊగుతున్న అబ్బాసలీ కాళ్ల మీద బిందెడు నీళ్లు గుమ్మరించిన పెద్దింటి హిందూ అగ్రవర్ణ ముత్తైదువు కన్నీటి బిందువుగా రాలుతున్న ఆశన్న – ఊశన్నల అమరత్వం, ఇవాళ్టి గునుగు తంగెడు కట్ల బంతి గొట్టం రకరకాల పూల బతుకమ్మల ముందర ఏడేడు తరాల గాథల పాటల చప్పట్లు తవ్విపోస్తున్న సబ్బండవర్ణాల అక్కచెల్లెళ్ల ఆనందహేల. ఏ వర్తమాన దుఃఖానికైనా తాతముత్తాతల శోకాన్ని ప్రవహించే మా ఇంటి ముందరి చాకలి లచ్చవ్వ రోదన… ఎన్నెన్నో దృశ్యాలు అల్లుకుపోతున్న తెలంగాణ వర్తమానంలో, కాదు గతవర్తమానభవిష్యత్తుల మధ్య విభజన లేని లిప్తలో ఇది రాస్తున్నాను.

 

‘సారంగ’కు ఏదైనా శీర్షిక రాయమని అఫ్సర్ అడిగినప్పుడు, నేనేదో రాయగలనని కాదు గాని, తనతో ముప్పై ఏళ్లకు పైబడిన గాఢమైన స్నేహం వల్ల మాట తీసేయలేక ఒప్పుకున్నాను. తెలుగు సాహిత్య ప్రపంచంలో గత వర్తమానాల సంభాషణ గురించి రాయడానికి ఈ శీర్షికలో ప్రయత్నించ వచ్చుననుకున్నాను. గతమూ వర్తమానమూ కేవలం కాలసూచికలు మాత్రమే కాదు, నిరంతర చలనశీలతకు చిహ్నాలు. ఇవాళ వర్తమానమైనది రేపటికి గతమైపోతుంది. గతమూ నిశ్చలం కాదు. ఇవాళ గతం అనుకున్నదాన్ని కొత్తగా చూసే ఆకరాలు, ఆధారాలు ఆవిష్కృతమై గతం మారుతూనే ఉంటుంది. కాగా వర్తమానం అనే మాటకే కాలసూచికగా మాత్రమే కాక, వార్త, సమాచారం, సందేశం, వృత్తాంతం అనే అర్థాలు కూడ ఉన్నాయి. అందువల్ల కాలానికీ, సమాచారానికీ, వృత్తాంతానికీ, విశ్లేషణకూ, మరో చూపుకూ, కొత్త చూపుకూ అవకాశమిచ్చే ‘గతవర్తమానం’ శీర్షిక ఎంచుకున్నాను.

 

ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో ఇరవయో శతాబ్ది తొలిరోజుల్లో జరిగిన ఒక మతాంతరీకరణ మీద అప్పుడే వెలువడిన ఒక పుస్తకాన్ని ఇప్పుడు కొత్తగా చూసి ఏమి ఆలోచించవచ్చునో రాయడంతో ఈ శీర్షిక ప్రారంభిద్దామనుకున్నాను. కాని ఈలోగా నిరంతర గతమూ, నిరంతర వర్తమానమూ, అనంత భవిష్యత్తూ అయిన నా కన్నతల్లి తెలంగాణ లేతమొగ్గలా పువ్వులోకి విచ్చుకుంటున్న సందర్భం, భవిష్యత్తులోకి గెంతుతున్న సంరంభం నా ఈ శీర్షికకు నాందీప్రస్తావనగా మారాయి.

కుటుంబరావు గారి ‘చదువు’లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ ఓడిపోయి జర్మనీ గెలిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నకు “ఏమవుతుందీ? … ఇంగ్లీషు మానేసి జర్మన్ భాష నేర్చుకోమంటారు” అని జవాబు చెప్పించినట్టు, తెలంగాణ ఎన్నడూ ఓడిపోకుండానే తనది కాని మరొక భాషలో, కాకపోతే మరొక మాండలికంలో, మరొక యాసలో పాఠాలు చదువుకోవలసి వచ్చింది. ఇప్పుడిక్కడ నేను రాస్తున్న భాష, కనీసం అతి ఎక్కువ పదాలు, క్రియాంతాలు నేను మాట్లాడే భాషవి కావు. ఈ దేశంలో పాలకవర్గాలు బలప్రయోగం అవసరం లేకుండానే పాలితులను లొంగదీయ గలిగాయని కొశాంబీ అన్నట్టు, బలప్రయోగం అవసరం లేకుండానే, ఏ యుద్దంలోనూ ఓడిపోకుండానే నా భాష నాకు దూరమైపోయింది. కనుమరుగైపోయింది. నా భాష మాత్రమే కాదు, తెలుగు భాషలోని అద్భుతమైన మాండలికాల సొగసులన్నీ అణగిపోయాయి. తన కాలానికీ, సుదూర భవిష్యత్తుకూ కూడ గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని వ్యక్తం చేసిన గురజాడ అప్పారావు కూడ “…ప్రామాణికమైనదిగా గుర్తింపుపొందిన ఒక వ్యవహార భాష ఉందని ప్రసిద్ధ పండితులూ, తెలుగుదేశ ప్రజలూ అంగీకరిస్తున్నారు. అది కృష్ణా, గోదావరి జిల్లాల తెలుగు తప్ప మరొకటి కాదు” (డిసెంట్ పత్రం) అని, ఈ “ప్రామాణిక” భాష పెత్తందారీతనానికి లొంగిపోయారంటే ఈ అంకుశం ఎంత మెత్తనిదో, ఎంత పదునైనదో అర్థం చేసుకోవచ్చు.

 

ఆ మాట అన్నందుకు ఆయనకు ఏదో దురుద్దేశాన్ని, స్వార్థ ప్రయోజనాన్ని అంటగట్టనక్కరలేదు. ఏ దురుద్దేశమూ, స్వార్థ ప్రయోజనమూ లేకుండానే భావజాలపు మత్తు తన పాత్ర నిర్వహిస్తుంది. ఆ భావజాలపు మత్తే తెలంగాణ భాష ప్రామాణికమైనది కాదన్నది. అసలు తెలంగాణకు భాష లేదన్నది. సాహిత్యం లేదన్నది. చరిత్ర లేదన్నది. మర్యాద తెలియదన్నది. తెలంగాణలో పుట్టి పెరిగి సాహిత్య సృజించారని తేలినవారి స్వస్థలాల గురించి కూడ అపనమ్మకం ప్రకటించింది. సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అని కాలువలు వచ్చి, కాలువల కింద వ్యవసాయం వచ్చి, వ్యవసాయంలో మిగులు వచ్చి, ఆ మిగులు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలకు, ముద్రణ, ప్రచురణ, ప్రచార మాధ్యమాల రంగాలకు, సినిమాకు వ్యాపించి తన భాషే ప్రమాణం, తన జీవన విధానమే ప్రమాణం అని స్థిరీకరించింది.

 

ఒక బహుళ సమాజంలో, వైవిధ్య భరిత సమాజంలో మిగిలిన అంశాలన్నిటినీ తోసివేసి, అణచివేసి, ఒకేఒక్క “ప్రమాణాన్ని” నిర్ణయించడం రెండు దుష్పరిణామాలకు – అనుకరణకైనా, న్యూనతకైనా – దారి తీస్తుంది. అణచివేతకు గురైన సమూహాలన్నీ తామూ ఆ “ప్రమాణాన్ని” అందుకోవాలని వెంపరలాడతాయి, అనుకరిస్తాయి. అనుకరణ సంస్కృతి ప్రబలుతుంది. తమ మూలాలను మరచిపోయి, తొక్కివేసి “ప్రమాణాన్ని” అనుకరించాలని ప్రయత్నించేవారు పెరుగుతారు. మరి ఆధిపత్య ప్రమాణం ఇలా చేరవచ్చేవారందరినీ చేర్చుకోజాలదు గనుక ఆ “ప్రధానస్రవంతి” లోకి కొందరికే ప్రవేశం దొరుకుతుంది. కాగా అణచివేతకు గురైన అసంఖ్యాకులు తాము ఆ ప్రమాణాన్ని అందుకోలేమని, తమకు అది అందుకునే అర్హత, యోగ్యత, సామర్థ్యం లేవని ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. అందువల్ల “ప్రమాణపు” బలం మరింత పెరుగుతుంది.

kancharlagopana

తెలంగాణలో పుట్టిన సాహిత్యకారులలో, తెలంగాణ సాహిత్య సంప్రదాయంలో కనీసం ఇరవయో శతాబ్ది తొలిరోజులనుంచీ ఈ అనుకరణనైనా, న్యూనతనైనా గుర్తించవచ్చు. హైదరాబాదులో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తూ (శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1901), స్థానిక ప్రభువైన మల్కిభరాముడినో (ముల్క్ ఇబ్రహీం కుతుబ్ షా), ఆ గోల్కొండ రాజ్యంలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం రాసిన పొన్నగంటి తెలగానార్యనో, ఆ ప్రాంతంలోనే అద్భుతమైన వాగ్గేయకారుడిగా ఎదిగిన కంచర్ల గోపన్ననో కాకుండా ఆ ప్రాంతంతో ఎన్నడూ సంబంధం లేని, ప్రామాణిక తెలుగు సాహిత్య చరిత్ర కీర్తించిన శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టడం ఈ అనుకరణ – ఆత్మ న్యూనతా సంస్కృతికి చిహ్నమే. అలాగే హనుమకొండలో ఏర్పడిన రెండో తెలుగు గ్రంథాలయానికి (రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం, 1904), తెలుగు జాతినంతా ఏకం చేసిన స్థానిక ప్రభువంశం కాకతీయుల పేరు కాకుండా, స్థానిక కవి పోతన పేరు కాకుండా ఒక చిన్న తెలుగు ప్రాంతాన్ని పాలించిన, హనుమకొండతో ఏ సంబంధమూ లేని రాజరాజ నరేంద్రుని పేరు పెట్టడమూ ఈ అనుకరణ-ఆత్మన్యూనతల ఫలితమే. ఈ సంప్రదాయమే ఇవాళ నేను వాడే భాష దాకా, నా భాష వాడడానికి బెరుకు పడేదాకా కొనసాగుతున్నది.

అయితే ఈ సంప్రదాయాన్ని తోసిరాజని తన ప్రత్యేక అస్తిత్వాన్ని, తన సంస్కృతిని, తన భాషా సాహిత్యాలను, తన ఉజ్వల వారసత్వాన్ని ఎత్తిపట్టిన సంప్రదాయం కూడ కనీసం 1930ల నుంచీ ఉంది. తెలంగాణలో తెలుగు కవులు లేరన్న వ్యాఖ్యకు స్పందనగా 1934లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించి ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక 354 మంది తెలంగాణ కవులను చూపింది. అయినా ఇరవై సంవత్సరాల తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి తన తొలి నవల ప్రజల మనిషి వెలువరిస్తూ, అందులో తెలంగాణ జనసామాన్యం వాడే భాష వాడినందుకు “చాలా భయంతో ఈ నవలను బైటికి తెస్తున్నాను” అని ప్రకటించారంటే తెలంగాణ సాహిత్యకారులు అనుభవించిన ప్రత్యక్ష, పరోక్ష ఒత్తిడి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.

విలీనం తర్వాత, సోదరులనీ, ఒకే భాషకు చెందినవారనీ చెప్పిన తర్వాత ఆధిపత్య, ప్రామాణిక భాషతో పోల్చుకుని ఈ “భయం” తగ్గలేదు సరిగదా పెరిగింది. తెలంగాణ భాష, “ప్రామాణిక” భాషకు, “ప్రామాణిక” నిఘంటువులకు తెలియని తెలంగాణ పదాలు ఇంకా అవహేళనకూ, అవమానానికీ గురవుతూనే వచ్చాయి. తెలంగాణ భాష అయితే తౌరక్యాంధ్రమో, కాకపోతే అలగా జనాల మొరటు భాషో అయిపోయింది. దాదాపు సగం ప్రాంతంలో జనవ్యవహారంలో ఉన్న మాటలు కేవలం తమకు తెలియనందువల్ల, తమ నిఘంటువుల్లోకి ఎక్కనందువల్ల అవమానించదగినవని మహాఘనత వహించిన కోస్తాంధ్ర సాహిత్యకారులు అనుకున్నారు. కోస్తాలో కొన్ని కులాల, చిన్న చిన్న ప్రాంతాల భాషను, చిన్న సమూహాల నుడికారాన్ని తెలంగాణ పాఠకులు చదువుతూ, నేర్చుకుంటూ, ఆనందిస్తూ, తమ పదజాలంలో భాగం చేసుకుంటూ ఉన్న సమయంలోనే తెలంగాణ మాండలికం విస్మరణకు, అవహేళనకు  గురయింది.

 

ఇటువంటి అవహేళనలకు లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. తన మొదటి కవితాసంపుటం ‘చలినెగళ్లు’ లో ఒక కవితలో ‘శ్మశానంలో కోర్కెలు తీరని బొక్కల వలె’ అని వరవరరావు రాస్తే, ఒక సుప్రసిద్ధ కోస్తా సాహిత్య విమర్శకుడు తెలంగాణలో ‘బొక్కలు’ అంటే ఎముకలు అని తెలుసుకోకుండా, తనకు తెలిసిన ‘రంధ్రాలు’ అనే అర్థమే సర్వస్వమైనట్టు ఇంత అశ్లీలం రాయడమా అని విమర్శించారు. ఎమర్జెన్సీ తర్వాత పునః ప్రారంభమైన సృజన లో కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగపోరాటాల వెల్లువలో కరీంనగర్ మాండలికంలో అల్లంరాజయ్య కథలు వెలువడుతున్నప్పుడు చాల మంది ప్రగతిశీల రచయితలు కూడ మాండలిక రచన సరైనది కాదంటూ, సృజన అల్లం వాసన వేస్తున్నదంటూ చర్చోపచర్చలు నడిపారు.

D98571616a copy ఆ మాటకొస్తే తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం కాళోజీ చెప్పినట్టు “రెండున్నర జిల్లాల రెండున్నర కులాల దండిబాస” లోనే ఉంది. ఆ భాషను అందరూ ఆదరించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో వచ్చిన రచనలనూ తెలుగు సాహిత్యమంతా సాదరంగా ఆహ్వానించింది. కాని తెలంగాణ మాండలికంలో సాహిత్య సృష్టి మాత్రం అపరాధమైపోయింది. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలకు గొంతు ఇవ్వడానికి ప్రయత్నించి ‘మీ వాయిస్ కల్చర్ సరిగా లేదు’ అని తిరస్కారానికి గురైన తెలంగాణ పాత్రికేయులు, రచయితలు ఎందరో ఉన్నారు. 2002లో వెలువడిన నా కవితా సంపుటానికి పావురం (పక్షి కాదు, తెలంగాణలో ప్రేమ, నెనరు, వాత్సల్యం) అని పెట్టాలనుకున్నప్పుడు ఏ ఒక్క “ప్రామాణిక” నిఘంటువులోనూ ఆ మాట చేరలేదని గుర్తించాను. “ఎన్నో తెలంగాణ మాండలిక పదాలకు ప్రాచీన కావ్యాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఐనా ఇవి ఇంకా నిఘంటువుల్లోకి ఎక్కలేదు” అంటూ శబ్దరత్నాకరంలో స్థానం పొందని శబ్దాల జాబితా 1988లోనే ఒక పుస్తకం రాశారు రవ్వాశ్రీహరి. ఆ కృషినే కొనసాగించి ప్రధానంగా తెలంగాణ పదాలతో ఒక నిఘంటువు తయారుచేశారు. నలిమెల భాస్కర్ కూడ ఆ ప్రయత్నం చేశారు.

ఇది కేవలం భాష విషయంలో, కొన్ని పదాల విషయంలో మాత్రమే జరిగినది కాదు. తెలంగాణ సాహిత్య చరిత్ర, సాహిత్యకారుల ప్రతిపత్తి, తెలంగాణ చరిత్ర వంటి అన్ని విషయాలలోను ఈ చిన్నచూపు, వివక్ష, నిర్లిప్తత, లోతైన పరిశోధన లేకుండానే తీర్పులు చెప్పడం వంటి తప్పులు, పొరపాట్లు జరిగాయి.

ఉదాహరణకు కాకతీయుల మీద చాల సమగ్రమైన పరిశోధన చేసిన పి వి పరబ్రహ్మ శాస్త్రి 1978లో ప్రచురితమైన తన గ్రంథాన్ని ‘తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల శాసన పరిశోధన కష్టమయింది’ అనే అర్ధ సత్యంతో ప్రారంభించారు. కాని అప్పటికి డెబ్బై ఏళ్లుగా కొమర్రాజు లక్షణరావు, లక్ష్మణరాయ పరిశోధనా మండలి, మారేమండ రామారావు, శేషాద్రి రమణకవులు, ఆదిరాజు వీరభద్రరావు, యాజ్దాని వంటి ఎంతో మంది పరిశోధకులు సాగించిన కృషిని ఇలా ఒక్కమాటతో కొట్టివేయడం ఆశ్చర్యమే గాని అసహజం కాదు.

ఇటువంటిదే మరొక ఉదాహరణ చెప్పాలంటే 1944లో హైదరాబాదులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో కీలకశక్తి, ప్రచురణకర్త, స్వయంగా రచయిత, బ్రిటిషాంధ్ర లో నిర్బంధ పరిస్థితులవల్ల హైదరాబాదు నుంచి తెలుగుతల్లి పత్రిక తేదలచినప్పుడు దాన్ని నిర్వహించినవాడు, 1945 మహాసభల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. కాని 1947లో ఆయనను నిజాం ప్రభుత్వం నిర్బంధించినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం ఆ నిర్బంధాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడానికి నిరాకరించింది. ఆయనను రచయితగా అరెస్టు చేశారనడానికి ఆధారం లేదని తీర్మానాన్ని తోసిపుచ్చారు. తెలంగాణ రచయితల సాహిత్య ప్రతిపత్తి గురించి కోస్తా రచయితల వైఖరి అది.

ఇక బమ్మెర పోతన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడని సకల ఆధారాలూ ఉన్నప్పటికీ ఆయనను కడపకు తరలించడానికి ఒక శతాబ్దం పాటు సాహిత్యకారులనుంచి రాజకీయ నాయకులదాకా ఎందరెందరో ఎంత ప్రయత్నించారో చెప్పనక్కరలేదు.

రెండు తెలుగు భాషల మధ్య, రెండు సాహిత్య సంప్రదాయాల మధ్య, “ప్రామాణిక”, ప్రామాణికేతర సాహిత్య ధారల మధ్య కొన్ని దశాబ్దాలుగా సాగిన సంబంధంలో ఒక పార్శ్వం ఇది. దీన్ని ధిక్కరిస్తూ స్వాభిమానాన్ని ప్రకటించిన పార్శ్వం కూడ అంతే బలమైనది. ఒకరకంగా సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన ఆ స్వాభిమాన కాంక్ష, వాస్తవచరిత్ర రచనాకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో బలోపేతమయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో సాహిత్య చరిత్ర పునర్లేఖనం – వాస్తవ లేఖనం – జరగవలసి ఉంది. వర్తమానం గతంతో సంభాషించవలసి ఉంది. వర్తమానం ప్రసరించే కొత్త వెలుగులో గతం భాసిల్లవలసి ఉంది. గతవర్తమానాల మేలుకలయికగా భవిష్యత్తును సంపద్వంతం చేయవలసి ఉంది.

 

అంచులలో జీవితాలు :దేవులపల్లి కృష్ణమూర్తి ‘బయటి గుడిసెలు’

తనలోని ఒక ముఖ్యమైన భాగాన్ని, బహుశా సంఖ్యాత్మకంగా గణనీయమైన అంతర్భాగాన్ని తనలో భాగం కాదన్నట్టుగా చూడడమే, పట్టించుకోకపోవడమే, విస్మరించడమే, దూరం పెట్టడమే భారత సమాజపు ప్రత్యేకతలలో ఒకటి. భారత పాలకవర్గాలు ఆ గణనీయమైన భాగాన్ని శ్రమకూ సేవలకూ మాత్రం వాడుకుని ప్రతిఫలానికీ, వాటాకూ, హక్కుకూ, అధికారానికీ అవతల పెట్టాయి. అంచుల లోకి నెట్టాయి. నిమ్నమనీ, నీచమనీ, అస్పృశ్యమనీ ప్రకటించాయి. హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన, అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యథాస్థితిని సమర్థించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్తమజ్జాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టు కూడ తన కింద మరొక మెట్టు ఉండాలని కోరుకుంటుంది. ఉందని అనుకుంటుంది. ఆ కిందిమెట్టు కన్న తాను అధికురాలిననీ, దానితో తాను అస్పృశ్యత పాటించాలనీ, పాటించవచ్చుననీ భావిస్తుంది. సహచర మానవ సమూహాలతో అంతర్వివాహ, సహపంక్తి భోజన సంప్రదాయం లేకపోవడమే తమ సమూహపు ప్రత్యేకతగా ప్రతి సమూహమూ భావిస్తుంది. అందువల్ల అట్టడుగున అంచులలో ఉన్న సమూహాల మధ్య కూడ ఐక్యత గాని, ఏకశిలా సదృశ సంఘీభావం గాని సాధ్యం కావడంలేదు. ఆ అంచులలోనే మరెన్నో అంచులు, అక్కడా విభజనలు, అక్కడా నిచ్చెనమెట్లు, అక్కడా దూరాలు విస్తరించాయి.

ఆయా నిమ్నవర్గాలకు తమ జీవితాలను చిత్రించే, సమాజాన్ని తాము అర్థం చేసుకునే పద్ధతిని చిత్రించే సాహిత్య కళా సంస్కృతులు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ లిఖిత రూపం పొందక పోవడం వల్ల కొంత, అగ్రవర్ణ ఆధిపత్యం కింద, పాలక భావజాలపు ప్రభావం వల్ల కొంత నలిగిపోయాయి. ఒకటి రెండు శతాబ్దాలుగా ఆయా వర్గాల నుంచి పుట్టుకు వచ్చిన రచయితల వల్ల, వారితో సహానుభాతి ప్రదర్శించే ప్రగతిశీల భావధోరణులవల్ల, సామాజిక శాస్త్ర పరిశోధనల వల్ల ఆయా అంచుల జీవితం కొంతయినా బయట పడుతున్నది. కాని బయటపడని అపార జీవితంతో పోలిస్తే బయట పడుతున్నది చాల తక్కువ. అందులోనూ ఆ అంచులలో కూడ కొన్ని సమూహాల గురించి వచ్చిన దానితో పోలిస్తే ఇంకా సమాచారం బయటికి రాని సమూహాలు ఎన్నో ఉన్నాయి. సమాచారం ఎంతో ఉంది.

bayatigudiselu.jpg.1b3c128e7e.999x600x600

అటువంటి అనేకానేక అనామక అవ్యక్త అలిఖిత అంచుల జీవితాలలోనుంచి ఒక వర్గాన్ని ఎంచుకుని, ‘బయటి గుడిసెలు’ రూపంలో దానికి కళారూపం ఇవ్వడానికి ప్రయత్నించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారి కృషి ప్రశంసనీయమైనది. ఈ చిత్రణలో మొండి, బుడగ జంగాలు, దాసరి, బైండ్ల వంటి నాలుగైదు కులాలు వాచ్యంగానూ, దొమ్మరి, ఎరుకల వంటి మరికొన్ని కులాలు సూచనప్రాయంగానూ ఉన్నాయి. అవన్నీ దళితుల కన్న కిందివీ, ఆదివాసి, గిరిజన తెగల కన్న పైవీ కావచ్చు. నిజానికి వాటిని కులాలు అనవచ్చునా లేదా అనేది కూడ సందేహమే. అధికారిక, సామాజిక శాస్త్ర అధ్యయనాలన్నీ వాటిని కులాలుగా గుర్తిస్తున్నాయి గాని, సాధారణంగా కులాలు స్థావర ప్రవృత్తితో, స్థిర ఉత్పత్తి విధానాలతో కలిసి ఏర్పడి గడ్డకట్టాయి. మరి ఇక్కడ చిత్రణ పొందిన సమూహాలన్నీ స్థావర ప్రవృత్తికీ, స్థిర ఉత్పత్తి విధానానికీ కూడ చేరనివి. కొంత ఆహారసేకరణ, కొంత పశుపోషణ దశల్లో ఉండి, జనావాసాల అంచులలో భిక్షుక వృత్తిలో ఉన్నవి. మరో మాటల్లో చెప్పాలంటే జంగమ ప్రవృత్తికి చెందినవి.

కాని ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ సమూహాలలో కొన్నిటికి గొప్ప సంస్కృతి ఉంది. సంగీత నృత్య గానాల సంప్రదాయాలున్నాయి. సాధారణంగా ఒక సమూహానికి తగినంత స్థిరత్వం ఉంటేనే సంస్కృతి రూపొంది, విస్తరిస్తుంది గాని, బహుశా ఈ సమూహాలలో జంగమ ప్రవృత్తి వల్లనే సంస్కృతి వర్ధిల్లినట్టుంది. పెద్దగా చలనం లేని పాత సమాజాల స్థితితో పోల్చి చూసినప్పుడు, నిరంతర చలనంలో ఉన్న ఈ సమూహాలు తాము వెళ్లిన ప్రతిచోటి నుంచీ ఎంతో కొంత స్వీకరించాయి, పంచుకున్నాయి. అటువంటి గొప్ప ఆదాన ప్రదానాల వల్ల వీరిలో సంస్కృతీ వికాసం జరిగినట్టుంది. కాలక్రమంలో, సామాజిక పరిణామాలలో ఈ జంగమ సమూహాలు కూడ అక్కడక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోక తప్పలేదు. సమాజం అంచులలో ఉన్నారనడానికి భౌతిక నిదర్శనంగా వారివి ‘బయటి గుడిసెలు’ అయిపోయాయి. దళితుల కన్న, ఆదివాసుల కన్న మరింత ఆవల అంచులలో కూడ అంచులలో ఉన్న మనుషులుగా వాళ్లు మిగిలిపోయారు.

సొంత ఆస్తి భావన తక్కువగానో, అసలు లేకుండానో ఉన్న ఈ ‘బయటి గుడిసెల’ వారిమీద  నేరస్త జాతులుగా ముద్ర వేసే అలవాటు వలస పాలన కాలం నుంచి ఇవాళ్టిదాకా సాగుతూనే ఉంది. సంభాషణలలో మొరటుదనం, బూతులు, అతిగానే మద్యపానం, మార్కెట్ కు లోబడకుండా తమ మద్యాన్ని తామే తయారు చేసుకోవడం, స్త్రీపురుష సంబంధాలలో భేషజాలు, విధినిషేధాలు తక్కువగా ఉండే సహజత్వం వంటి కారణాల వల్ల ఈ జాతులను “సంస్కృతి” లేనివి గానో,   అధోజగత్తుగానో చూసే అలవాటు కూడ పెరిగింది.

కాని ఆ లక్షణాలు సంస్కృతి లేకపోవడానికి చిహ్నాలు కావు, అవే ఒక సంస్కృతి. సరిగ్గా ఆ లక్షణాలు గల మనుషులే ఒక కళారూపానికి, ముఖ్యంగా కథ, నవల వంటి కాల్పనిక ప్రక్రియకు విలువైన ముడిసరుకులవుతారు. అటువంటి అద్భుతమైన నిర్దిష్ట చారిత్రక సామాజిక శకలపు ముడిసరుకును తీసుకుని కృష్ణమూర్తి గారు ఈ కథో, నవలికో, జీవన దృశ్యమో చిత్రించారు. రచయిత అక్కడక్కడ కనబడినా, ఆ జీవితాలతో, వారి జీవన్మరణ ఘర్షణలతో, కష్టాలతో, కడగండ్లతో రచయిత ఆద్యంతమూ సాధించిన మమేకత్వం పాఠకులను అబ్బురపరుస్తుంది. మాటతీరు, స్పందనలు, హావభావాలు, అలవాట్లు, జీవనగమనం, దారుణమైన విషాదాలు, జీవన బీభత్సం, సమాజంలో ఆధునికత ప్రవేశించినకొద్దీ వారి జీవితాలలో వస్తున్న మార్పులు – సమస్తమూ ఎంత వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రణ పొందాయంటే రచయిత తన పాత్రలతో సంపూర్ణంగా తాదాత్మ్యం చెంది ఉండకపోతే అది సాధ్యమయ్యేదే కాదు. నిజానికి చాల సందర్భాలలో అవి పాత్రలు కాదేమోనని, నిజజీవిత వ్యక్తులే తమంత తాముగా, తమ గుణదోషాలన్నిటితో, లక్షణాలన్నిటితో ఈ పుటలమీదికి నడిచివచ్చారేమోనని అనిపిస్తుంది.

ఆ జీవితాలలో ఉండే నిస్సహాయత వల్ల, ఎవరిమీద తీర్చుకోవలసి ఉందో తెలియకుండా పేరుకుపోయే అసంతృప్తి ఆగ్రహాల వల్ల మనుషులు ఒకరికొకరు కనబడితేనే తిట్టుకుంటారు. తిట్టే ఒక పలకరింపు అవుతుంది. సాదాసీదా సంభాషణలు కూడ పోట్లాట స్థాయిలో జరుగుతాయి. బిచ్చమెత్తడానికి ఉదయాన బైటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన భర్తతో “పొద్దున పోతివి, బతికితివా చస్తివా, జాడ తెల్వకపాయె, సావనన్న సావకపోతివి. నాపానాన బడ్తివి’ అంటూ తగులుకుంటుంది పెళ్లం” అని రాసిన వాక్యాలు రచయిత సృష్టించినవి కావు, నిత్యజీవితానుభవం లోనివే. అలాగే ఆ అసహన వాతావరణంలో మంచి మాట, ఆర్ద్రమైన పలకరింపు కూడ ఎట్లా అపార్థానికి, పరస్పర దూషణలకు, నిందారోపణలకు, ఎడతెగని వివాదాలకు, చివరికి భౌతిక హింసకు దారితీస్తాయో రచయిత ఎన్నో చోట్ల చిత్రించారు. ఈ లక్షణాలను దోషాలనుకుంటే అవి ఆ పాత్రల దోషాలు కావు, వారిని అటువంటి అమానవీయ స్థితిలోకి దిగజార్చిన వ్యవస్థ దుర్మార్గాలు. రచయిత చిత్రణ వాచ్యంగా ఆ మాట చెప్పకపోయినా సత్యజిత్ రాయ్ పేదరికపు చిత్రణ లాగ, ఆ అమానవీయ స్థితికి కారణమైన వారి మీద ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

“అరె, భూమి వుంటె ఎన్ని బాధలురా, దాని బాధలు దానికుంటయి కొడకా. అట్లె, సొంత ఇల్లుందనుకో, దాన్ని బాగు చేసుకోవాలె. ఎక్కడికి పోయినా, పానం ఇంటి మీదనే గుంజుద్ది. అందుకే భూమి, ఇల్లు జోలికి పోలేదురా” అని దాసరి రామచంద్రం అన్నమాట పని చేయడానికి ఇష్టపడని, అడుక్కతినడానికి అలవాటు పడిన ఒక సోమరి వృద్ధుడి మాటల్లా అనిపిస్తాయి గాని అట్టడుగున అవి సొంత ఆస్తి అనే బంధం లేని ఒక నైసర్గిక సామూహిక సహజ సంస్కృతి చిహ్నాలు. వేల సంవత్సరాలుగా ఆస్తి, అంతరాల భావనలు ఆ సహజత్వం మీద అభేద్యమైన మకిలి చిమ్మాయి. ఆ మకిలిని వదలగొట్టి మనిషికి మనిషితనాన్ని తిరిగి అందించే మహాపోరాటానికి సిద్ధపడే శక్తి మళ్లీ ఆ బయటి గుడిసెల మనుషులకే ఉంది. వారికి ఒక శాస్త్రీయ, సామాజిక, చారిత్రక భావజాల పరికరం దొరికితే ఆ పోరాటం విజయం సాధిస్తుంది. భారత సమాజానికే బయటి గుడిసెలుగా ఉండిన దండకారణ్యంలోని ఆదివాసులు ఇవాళ చేస్తున్న పని అదే. కృష్ణమూర్తి గారి పాత్రలు ఆ చైతన్యాన్ని అందుకోవడానికి ఇంకా చాల సమయమూ కాలమూ పట్టవచ్చు. కాని అటువంటి అధోజగత్ పాత్రలలో ఆ దందహ్యమాన పదార్థం ఉన్నదని గుర్తించి, ఆ పాత్రలను వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రించడమే విప్లవ పూర్వ రష్యన్ సమాజంలో అటువంటి జీవితాలను చిత్రించిన దాస్తొవిస్కీ, తుర్గేనెవ్, కుప్రిన్ వంటి రచయితలు చేసిన పని. ఆ పనిని మన సమాజపు నిర్దిష్టతతో, వాస్తవికంగా చేసినందుకు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

  ఎన్ వేణుగోపాల్

( ఈ పుస్తకాన్ని ఆన్ లైన్ లో ఇక్కడ కొనుక్కోవచ్చు.)

http://www.logili.com/books/devulapalli-krishnamurthy/p-7488847-26370821871-cat.html#variant_id=7488847-26370821871

అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ

 

ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి, చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలూ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువూ పరిశీలకుడూ సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లెయొనార్దొ చిత్రాలన్నీ కళాఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించీ మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్ఫోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలనీ, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్థాలు అన్వేషిస్తూ ఉండాలనీ అనిపించేలా చేస్తాయి.

ప్రపంచానికంతా తెలిసిన మహానుభావులమీద ఉద్వేగభరితమైన నవలలు రాసిన ఇర్వింగ్ స్టోన్ తన కథానాయకుల జీవితం సమస్తాన్నీ కళ్లకు కట్టే పదబంధాలను సృష్టించి ఆ నవలల శీర్షికలుగా మలిచాడు. ఆ నవలలో ఒకటి పదహారో శతాబ్దపు చిత్రకారుడు మైకెలాంజెలో జీవితకథ అగొనీ అండ్ ఎక్ స్టసీ. ఆ పదబంధం ఆ నవలానాయకుడు మైకెలాంజెలోకు ఎంతగా సరిపోతుందో గాని, ఆయన కన్న ఇరవై ఏళ్లు పెద్దవాడు, చిత్రకళలో ఆయనకు ప్రత్యర్థి, డా విన్సీ అనే పొరపాటు పిలుపుతో ప్రఖ్యాతుడైన లెయొనార్దొ ద వించి కి అక్షరాలా సరిపోతుంది. లెయొనార్దొ జీవితమంతా అంతులేని వేదన, అద్భుత సంరంభం.

వివాహేతర సంబంధపు సంతానంగా, దాదాపు అనాథగా, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం తోసుకువచ్చి ఎక్కడా నిలకడగా ఉండనివ్వని నిరంతర జీవన అస్థిరత. చిన్నచిన్న రాజ్యాల మధ్య యుద్ధాలతో ఆ ప్రభువులను నమ్ముకున్న కళాకారుడిగా ఉత్థాన పతనాలు. బాల్యంలో కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, సోదరుల ప్రేమను పొందడానికేమో శిష్యులతో మెలగిన తీరుకు తప్పుడు వ్యాఖ్యానాలతో స్వలింగ సంపర్క నేరారోపణలు, విచారణలు, ఖైదు. తనకందిన పనుల్లో అనేకం బద్దకం వల్లనో, పరిపూర్ణతా భావనతోనో పూర్తి చేయలేకపోయిన అసంపూర్ణ ప్రజ్ఞ,…. ఆయన జీవితమంతా అంతులేని వేదనే.

మరొకపక్క చిన్ననాటి నుంచే ఆయన వేళ్లకొసలనుంచి జాలువారిన అద్భుత కళానైపుణ్యం. దేశదేశాల రాజుల, మతాధిపతుల, కళాభిమానుల, కళా విమర్శకుల ఆదరణ చూరగొన్న ప్రతిభా వికాసం, ఎప్పుడూ చుట్టూరా ఎంతో మంది శిష్యులు, అభిమానులు, ఒక్క చిత్రకళ మాత్రమే కాదు, దాదాపు ఆధునిక విజ్ఞానశాస్త్ర అన్వేషణలెన్నిటికో బీజరూప వ్యక్తీకరణలు – ఆయన జీవితమే అద్భుత సంరంభానికి ఎత్తిపట్టిన పతాక.

ఏదో ఒక శాస్త్రంలో, ఒక రంగంలో, ఒక చిన్న శాఖలో నైపుణ్యంతో మహా మేధావులుగా పేరు తెచ్చుకోగలుగుతున్న వర్తమాన స్థితితో పోల్చినప్పుడు యూరప్ లో భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారీ విధానానికి సమాజం పరివర్తన పొందుతున్న యుగంలో మేధావులు ఎన్ని శాస్త్రాలలో, ఎన్ని రంగాలలో, ఎంత లోతయిన కృషి చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లెయొనార్దొ ఆ నాటికి శాస్త్రవేత్త, కళావేత్త. ఇవాళ్టి శాస్త్రాల, కళల పరిభాషలో చెప్పాలంటే గణితశాస్త్రజ్ఞుడు, నిర్మాణశాస్త్ర నిపుణుడు, మానవ శరీరశాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త, భూ పటాల చిత్రకారుడు, వృక్షశాస్త్రవేత్త, చిత్రకారుడు, శిల్పి, వాస్తుశిల్పి, నీటిపారుదల వ్యవహారాల నిపుణుడు, సంగీతకారుడు, రచయిత. పునరుజ్జీవన యుగపు మానవుడికి మూర్తీభవ రూపం అని, అతనిది తీరని కుతూహల దాహం అనీ, అతనంత సర్వవ్యాపిత బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞా కలవారు లేరనీ ఎన్నెన్నో విశేషణాలున్నాయి. లెయొనార్దొను అర్థం చేసుకోవాలంటే ఆయన జీవించిన స్థల కాలాలను అర్థం చేసుకోవాలి.

Da Vinci

పద్నాలుగో, పదిహేనో శతాబ్దపు ఇటలీ తొలి పునరుజ్జీవన సంస్కృతికి వేదిక. అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పెట్టుబడిదారీ విధానం భూస్వామ్యపు కరడుగట్టిన విలువలను తోసి రాజంటూ, రాజకీయ స్వాతంత్ర్యం, పట్టణ జీవితం, కళారాధన వంటి వ్యక్తి ప్రధాన, హేతుబద్ధ జీవిత విధానాలను ప్రవేశపెడుతోంది. రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన ఐదో శతాబ్ది నుంచీ ఈ కదలికలు మొదలయిన పద్నాలుగో శతాబ్దం దాకా దాదాపు ఒక సహస్రాబ్ది యూరప్ చీకటిలో మగ్గిపోయిందని ఆ నాటి మేధావులు భావించారు. వాటిని మధ్యయుగాలు అని పిలిచారు. రోమన్ సామ్రాజ్యంలో గొప్ప కళా వికాసం పరిఢవిల్లిందని, అది మళ్లీ తలెత్తుతోందని, అది పునరుజ్జీవనమని వాళ్లు భావించారు. ఇదంతా సంప్రదాయం నుంచి ఆధునికతకు, బర్బరత్వం నుంచి నాగరికతకు ప్రయాణమని అనుకున్నారు. రోమన్, గ్రీక్ నాగరికతలలో లాగ మళ్లీ ఒకసారి పట్టణాలకు ప్రాధాన్యత వస్తున్నదని వాళ్లు వాదించారు. పూర్వీకులు వించి అనే గ్రామం నుంచి వచ్చినప్పటికీ, లెయొనార్దొ పుట్టినదీ, ఎక్కువకాలం గడిపినదీ ఫ్లారెన్స్ నగరంలోనే. ఆ నగరం 1460 నాటికే వర్తక కేంద్రం. అప్పటికే అక్కడ ముప్పై మూడు బ్యాంకులు ఉండేవి. బట్టల వ్యాపారం జోరుగా సాగేది. 270 ఉన్ని దుకాణాలు, ఎనబై ఎనిమిది వడ్రంగి దుకాణాలు, ఎనబై మూడు పట్టుబట్టల అంగళ్లతో యాభైవేల జనాభాతో అలరారుతుండిన నగరం అది.

ఈ చారిత్రక నేపథ్యమే లెయొనార్దొ జీవితాన్ని నిగూఢమూ చేసింది, సుసంపన్నమూ చేసింది. అప్పుడప్పుడే ఒక పెట్టుబడిదారీ వర్గం తలెత్తుతూ, అంతకు ముందరి భూస్వామిక రాచరిక మత కట్టుబాట్ల స్థానంలో లిఖితపూర్వక ఒప్పందాలు, ఆస్తి ఘర్షణలు మొదలవుతున్నప్పుడు పుట్టుకొచ్చిన నోటరీల, న్యాయవాదుల కుటుంబానికి చెందినవాడు లెయొనార్దొ. ఆయన తాత వ్యవసాయంలోకి దిగాడు గాని అంతకు ముందు మూడు తరాలు నోటరీలే. ఆయన తండ్రీ నోటరీయే, అలా ఆయన ఇంట్లోనే కొత్తవిలువల బతుకుకు పునాది ఉంది.

ఇక బైట సమాజంలో, కనీసం ఆలోచనాపర వర్గాలలో ఒక గొప్ప మేధో మథనం, సామాజిక సంచలనం సాగుతున్నది. అదంతా పునరుజ్జీవనమని ఆ నాటి మేధావులు భావించారు గాని మోహన్ అన్నట్టు “నిజానికి సామాన్య మానవుల విషయంలో మధ్యయుగాలకు, పునరుజ్జీవనానికి మధ్య ఎలాంటి తేడా లేదు. కేవలం కవులు, కళాకారులు, మేధావులకు మాత్రమే ఈ విభజన రేఖ పనికొస్తుంది. …పునరుజ్జీవన భావన కేవలం గుప్పెడు మంది కళాకారులకు, ధనిక వ్యాపార, కులీన, పాలక వర్గాలకు సంబంధించిన ఒక తాత్విక లోకం మాత్రమే.”

అయితే పునరుజ్జీవన భావన శిష్ట వర్గాలదే అయినా, పునాదిలో వస్తున్న మార్పులు గాలిలో కొత్త భావాలను వీచాయి. తూర్పు భళ్లున తెల్లవారింది, పాతలోకం కదలబారింది. వ్యక్తి వికాసం మొదలయింది. మానవచరిత్రలో ఇదివరకెన్నడూ లేనట్టుగా, వ్యక్తికి తన సామర్థ్యంపై తనకు అపార విశ్వాసం మొదలయింది. తన శక్తి సామర్థ్యాలు భగవద్దత్తమో, విధిలిఖితమో కాదని, తాను తలచుకుంటే తన భవిష్యత్తును తానే రూపుదిద్దుకోగలనని మనిషికి ఆత్మవిశ్వాసం మొదలయింది. సకల కళల్లో ఆరితేరిన విశ్వనరులు రూపొందాలని మనుషులు తలపోశారు. భూస్వామ్యం, మతం, సంప్రదాయం విధించిన బంధనాలను కూలదోసే వ్యక్తి స్వేచ్ఛా భావనలు తలెత్తాయి. లెయొనార్దొ చనిపోయినాక యాభై ఏళ్లకు పుట్టిన ఇంగ్లిష్ తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ “సమస్త జ్ఞానాన్నీ నా అధీనంలోకి తీసుకున్నాను” అని వ్యక్తీకరించిన ఆత్మవిశ్వాస ప్రకటన ఈ పునరుజ్జీవన భావనకు, ఆ భావన విస్తరణకు సూచికే.

సామాజిక పరివర్తన జరుగుతున్న ఆ పునరుజ్జీవన యుగం గొప్ప సంచలనాలకు, ఉద్వేగాలకు, అన్వేషణలకు ఆలవాలమైన కాలం. ఈ పునరుజ్జీవనం పారిశ్రామిక విప్లవానికి మూలమూ విస్తరణా కూడ. ఆ ప్రవాహంలో నుంచే ఆధునికత, వ్యక్తి ప్రాధాన్యత, హేతుదృష్టి, శాస్త్రవిజ్ఞానం, కాల్పనికత, ప్రకృతి సౌందర్యారాధన, మనిషి కూడ యంత్రమేననే ఆలోచన వంటి ఎన్నో కొత్త భావనలు, ధోరణులు పుట్టుకొచ్చాయి. పారిశ్రామిక విప్లవం యంత్రంలో చలనాన్ని సాధించింది. సమాజంలో చలనానికి కారణమైంది. ఆ కొత్తగాలులు వీచడం చూసిన మనుషులు తమ చుట్టూ చలనంతో పాటు తమ లోలోపలి చలనాల్ని కూడ గుర్తించారు. ఈ మూడు స్థాయిల చలనాలు పరస్పర అన్యోన్య ప్రభావాలతో మరింత విస్తృతమయ్యాయి. అందువల్లనే యూరప్ లో ఆ యుగం అత్యంత ప్రతిభావంతులైన, బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞలు కలిగిన మేధావులెందరినో సృష్టించింది. ఆ మేధావుల సుదీర్ఘ జాబితాలో తొలి తరం నాయకులలో ఒకరు లెయొనార్దొ.

చిన్నతనంలో లాటిన్, రేఖాగణితం, గణితం నేర్చుకున్న లెయొనార్దొ పద్నాలుగో ఏట చిత్రకళను అభ్యసించడానికి వెరాకియో స్టుడియోలో చేరాడు. అక్కడ సైద్ధాంతిక శిక్షణతో పాటు ఆచరణాత్మకంగా వైవిధ్యభరితమైన కళానైపుణ్యాలు నేర్చుకుని ఉంటాడని, ఆ సాంకేతిక నైపుణ్యాలలో రచన, రసాయనశాస్త్రం, లోహశాస్త్రం, లోహ వస్తువుల తయారీ, నమూనాల తయారీ, తోలు పని, యంత్రశాస్త్రం, వడ్రంగం, చిత్రకళ, శిల్పకళ వంటివి ఉండి ఉంటాయని చరిత్రకారులు రాస్తున్నారు. అలా ఇరవయో ఏట లెయొనార్దొ ఆనాటి వైద్యుల, కళాకారుల గిల్డ్ అయిన గిల్డ్ ఆఫ్ సేంట్ లూక్ లో సభ్యుడయ్యాడు. ఇటువంటి కళాకారుల, చేతివృత్తిదారుల గిల్డ్ లే  భూస్వామ్య బందిఖానా నుంచి శ్రామికులను విడుదల చేసి, పట్టణాలలో వారికి పని కల్పించాయి. నవనవోన్మేష అన్వేషణకూ, ఇతోధిక ఉత్పాదకతకూ మార్గం సుగమం చేసి చరిత్ర గమనానికి గొప్ప చోదకశక్తిగా అత్యద్భుతమైన పాత్ర నిర్వహించాయి.

అలా ఇటు సొంత ఇల్లు, పట్టణం కల్పించిన వాతావరణం, అటు సమాజంలో చెలరేగుతున్న సంచలనాలు కలిసి లెయొనార్దొ అనే వ్యక్తి వికాసానికి తగిన వనరులను సృష్టించిపెట్టాయి. అయితే, లెయొనార్దొ వంటి అపురూప వ్యక్తి రూపు దిద్దుకోవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు ఆనాటి సామాజిక జీవనం పునాది అయితే, ప్రత్యేకించి కళా ప్రతిభకు కారణమేమై ఉంటుందని ఈ నాలుగు శతాబ్దాలలో చాల అన్వేషణ జరిగింది. కళా చరిత్రకారుల నుంచి కాల్పనిక రచయితల దాకా, రసాయన శాస్త్రవేత్తల నుంచి నేరపరిశోధనా శాస్త్రవేత్తల దాకా, మనస్తత్వశాస్త్రవేత్తల నుంచి సామాజిక శాస్త్రవేత్తల దాకా ఎందరెందరో ఇటు తొంగిచూశారు. లెయొనార్దొ ఫలానా చిత్రంలోని ఫలానా రేఖ, రంగు ఇందుకు సూచన అన్న దగ్గరి నుంచి, ఆయన బాల్యంలో అనుభవించిన ఫలానా సంఘటన, ఆయన బాల్యం నుంచి గుర్తున్న ఫలానా సన్నివేశం, ఆయన రచనలోని ఒక ఖండం ఆయనను ఎలా తీర్చిదిద్దాయో చాల వివరణలు వచ్చాయి.

ఆయన “…బాల్యం సంక్లిష్ట, సంఘర్షణాత్మక అనుభవాలతో గడిచింది. పల్లెలో తల్లి పెంపకం, వించీలో పెంపుడు తల్లి ఆలనా పాలనా, ఏ లోటూ రానివ్వకుండా చూసుకునే తండ్రి, అన్ని కష్టాలతో సతమతమయ్యే తల్లి, సవతి తండ్రి, సమాజంలో అక్రమ సంతానమనే ముద్ర, మరోపక్క గుండెలపై ఆనించుకునీ, భుజాలపై కూర్చోబెట్టుకునీ ముద్దుచేసే చిన్నాన్న. పెరిగి పెద్దయ్యే వయసులో కారుమబ్బులా ఆవరించిన ఒంటరితనం. ఈ అనుభవాలే అతని భావి జీవితానికి, కళకు ధాతువులయ్యాయి. అతని వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలు పరిచాయి” అని మోహన్ అంటాడు.

నానమ్మ లూసియా వైపు కుండలు తయారు చేసేవాళ్లు. ఆ కుండల మీద చక్కని లతలు, జ్యామితీయ ఆకృతులు ఉండేవి. లెయొనార్దొకు ఆ కళావారసత్వం వచ్చి ఉంటుందనీ మోహన్ అంటాడు. “డావిన్సీది పక్కా జానపదుడి హృదయం. ప్రకృతి అతని ఆరాధ్య దేవత” అని బాల్యంలో వించీ చుట్టుపక్కల చూసిన జీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వడ్రంగులు, పశువుల కాపర్లు ఎట్లా లెయొనార్దొ చిత్రాలలోకి ఎక్కారో వివరిస్తాడు. పల్లెల్లోని నూనె గానుగలను బాల్య కుతూహలంతో కళ్లింత చేసుకుని చూసిన లెయొనార్దొలో ఆ యంత్రాలే బీజం వేశాయనీ అతని నోటు పుస్తకాల్లో వందలకొద్దీ మొక్కలు, చెట్లు, పళ్లు కనిపిస్తాయనీ లెయొనార్దొ అనే అద్భుత వ్యక్తి తయారయిన మూల కారణాల సంక్లిష్టతను అర్థం చేయించడానికి మోహన్ ప్రయత్నిస్తాడు.

“దేన్నయినా సరే చూసి, విని, తాకి, శోధించి నిర్ధారణకు రావడం డావిన్సీ సిద్ధాంతం” అటాడు మోహన్. ఇది మొత్తంగానే పునరుజ్జీవన యుగపు సిద్ధాంతం. పెట్టుబడిదారీ అన్వేషణలకు మూలమైన సిద్దాంతం. బైబిల్ చెప్పిందనో, చర్చి చెప్పిందనో దేన్నీ అంగీకరించకు. పంచేంద్రియాలు ఉపయోగించి, హేతుబుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకో అని మనిషి మీద మనిషికి విశ్వాసం కలిగించిన విలువలు అవి. మనిషిని విధి చేతిలోని కీలుబొమ్మలా కాక క్రియాశీల, సృజనాత్మక  ఉత్పత్తి శక్తిగా చూడకపోతే పెట్టుబడిదారీ విధానం లేచి నిలవడమే సాధ్యమయ్యేది కాదు. ఆ తొలిరోజుల, విప్లవాత్మక పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదించాయి. కాని అతి త్వరలోనే ఆ ప్రగతిశీల, ఉదాత్త, సర్వమానవ సౌభ్రాతృత్వ ధోరణి అంతా మణగిపోయింది. పెట్టుబడిదారీ విధానం మనిషిని విడుదల చేయదని, మనిషిని మనిషి దోపిడీ చేసే, పీడించే సాంఘికధర్మాన్ని బలోపేతం చేస్తుందని అర్థమయింది. పెట్టుబడిదారీ విధానం, పునరుజ్జీవన ఆధునికత ఈ వైరుధ్యాల పుట్ట.

పెట్టుబడిదారీ విధానం ఎదుగుతున్న క్రమంలో ఈ వైరుధ్యాలు అంతకంతకూ ఎక్కువగా బహిర్గతం కావడం మొదలయింది గాని ఒక సున్నిత సునిశిత మేధావిగా లెయొనార్దొ జీవితంలోనే ఈ వైరుధ్యాల బీజాలు గోచరిస్తాయి. “…యుద్ధంలో సైనికులను ఊచకోత కోయడానికి చరిత్ర ఎరుగని మారణ యంత్రాలను కూడా ఊహించి వాటికి కాగితాలపై రూపమిచ్చాడు. గుర్రాల వెన్నుతట్టి వాటి హృదయంతో సంభాషించిన డావిన్సీ, వాటిని పొడవాటి పదునైన కత్తుల రథానికి పూన్చి బొమ్మ వేయడానికి వెనుకాడలేదు. రంగుల్లో ప్రేమ జీవననాదాన్ని హృద్యంగా పలికించిన అతడు మనుషుల ఉసురు తీసే రోమాంచిత ఊహల్లోనూ తేలిపోయాడు….” అనీ, “పూలను, గడ్డిపోచలను ముగ్ధమనోహరంగా చూపిన డావిన్సీ ఈ కుత్తుకలు తరిగే మారణ యంత్రాలకు ఊపిరిపోయడం పెద్ద వైచిత్రి” అనీ అంటూనే “ఈ వైరుధ్యం, వైచిత్రి డావిన్సీ వైయక్తికమైంది మాత్రమే కాదు, నాటి సమాజం, రాజకీయాలు సృష్టించిన పరిస్థితులది కూడా” అంటాడు మోహన్.

అయితే లెయొనార్దొ జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాఢమైన అన్వేషణ. అది ప్రకృతి గురించీ కావచ్చు, జంతువుల గురించీ కావచ్చు. నీటి ప్రవాహాల గురించీ కావచ్చు.  కొత్త యంత్రాల గురించీ కావచ్చు, మానవ శరీరం గురించీ కావచ్చు, సమూహంలో వైవిధ్య భరితమైన మానవ ప్రవర్తన గురించీ కావచ్చు. మత భావనల చిత్రీకరణలలోనూ, మనుషుల చిత్రీకరణలోనూ ఆయన ఆ అన్వేషణా ఫలితాలన్నీ రంగరించాడు, రంగుల్లోకి దించాడు. రంగుల్లో కుదించాడు. ఆరు దశాబ్దాలు దాటిన ఆ మహాద్భుత వర్ణమయ జీవితాన్ని మోహన్ ఈ పుస్తకంలో అంతే వర్ణమయంగా అక్షరాలకెక్కించాడు.

నిజానికి ఇది ముందుమాట గనుక, దీనికి నిడివి పరిమితి ఉంది గనుక ఇంక ఎక్కువ రాయను, ఎన్నెన్నో భాగాలను యథాతథంగా ఉటంకించాలనే కోరికను అణచుకుంటున్నాను.

మిలాన్ పాలకుడు లుడొవికో దగ్గర కొలువు కోసం తనకు ఏయే కళలు వచ్చునో లెయొనార్దొ రాసిన లేఖ, లెయొనార్దొ మిగిల్చి పోయిన దాదాపు ఆరువేల పేజీల నోట్స్, లెయొనార్దొ వేసిన చిత్రాలలో చాల భాగం చెడిపోవడంలో కాలం పాత్ర, మనిషి పాత్ర, మిలాన్ సమీపంలో ఆల్ప్స్ పర్వతాలలో నదుల గురించి లెయొనార్దొ చేసిన అన్వేషణలు, లెయొనార్దొ రాసిన చిత్రకళా బోధిని, చేసిన యంత్రాలు, యంత్ర భాగాలు, మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి మృతదేహాలపై లెయొనార్దొ చేసిన ప్రయోగాలు, ప్రకృతి, ఖగోళ శాస్త్ర అన్వేషణలు, అద్దాలపై, కటకాలపై అన్వేషణలు, మతభావనలు, వృద్ధాప్యపు కల వంటి అనేక సందర్భాలలో మోహన్ రచన పాఠకులను సమ్మోహితులను చేస్తుంది, ఐదువందల ఏళ్ల వెనక్కి, ఆ నాటి సామాజిక సాంస్కృతిక వాతావరణంలోకి తీసుకుపోతుంది. ఇక చిత్రాల గురించి – మరీ ముఖ్యంగా జినిర్వా, జెరోమ్, సెయింట్ ఆన్, ఆంగియారి, మోనాలిసా, సెయింట్ జాన్, సిసిలియా, లుక్రీజియా వంటి ఎన్నో చిత్రాల – వివరణలైతే ఒక వచన రచయిత, కళా విమర్శకుడు మాత్రమే చేయగలిగేవి కావు. స్వయంగా చిత్రకారుడు, రంగుల, రేఖల స్వభావ స్వరూపాలు కూలంకషంగా తెలిసిన కళా మర్మజ్ఞుడు మాత్రమే రాయగలిగినవి.

“డావిన్సీ చిత్రకళా సృజనను పక్కనపెడితే అతడు ఇంజనీరింగ్, వాస్తు వగైరా రంగాల్లో కంటే అనాటమీలోనే ఘన విజయాలు సాధించాడు. సుతిమెత్తని కుంచెలు పట్టుకున్న చేతుల్తోనే కరకు కత్తులు పట్టుకుని మృత మానవ దేహాలను రక్తమంటిన చేతులతో శోధించాడు. మానవ గుండెను కుడిచేత్తో పట్టుకుని రక్తపు మరకలంటిన కాగితంపై ఎడమ చేత్తో దాని రూపాన్ని చిత్రించాడు… మనిషి బయటి, లోపలి నిర్మాణాన్ని స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, నిర్దుష్టంగానే కాకుండా కళాత్మకంగా కూడా చూపిన తొలి అనాటమీ కళాకారుడు డావిన్సీనే. అతడు తన అనాటమీ చిత్రాలతో కళాకారుడికి, శాస్త్రవేత్తకు మధ్య ఉన్న తేడాను చెరిపేశాడు…. అతని జ్ఞానపిపాసను మతం అడ్డుకోలేకపోయింది” అనీ, “కళ్ల కదలికలకు కారణమేంటి? కనుబొమలు ఎలా ముడిపడతాయి? కనురెప్పలు ఎందుకు మూతపడతాయి? ముక్కుపుటాలు, నోరు, పెదవులు తెరచుకోవడం, మూసుకోవడం వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఉమ్మడం వెనుక మతలబేంటి? ఎందువల్ల నవ్వుతున్నాం, ఆశ్చర్యపోతున్నాం అని డావిన్సీ ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నలను ఓ పుర్రెబొమ్మ వేసిన కాగితం వెనక రాసుకున్నాడు. చీదడం, ఆకలి, నిద్ర, మైథునం, చెమట, కండరాల కదలికలకు కారణమేంటో తెలుసుకోవాలని రాసుకున్నాడు” అనీ అంటాడు మోహన్.

నిజానికి మోహన్ రచనలో ఇటువంటి ఆర్ద్ర, సున్నిత, కాల్పనిక, కళాత్మక వ్యక్తీకరణలను ప్రేరేపించగల శక్తి లెయొనార్దొ జీవితంలోనే ఉంది. స్వయంగా లెయొనార్దొ మనకోసం వదిలిపెట్టిపోయిన రచనలలో కూడ ఉంది. ఉదాహరణకు, “ఆత్మికోద్వేగాలను భంగిమల ద్వారా చెప్పగలిగితేనే చిత్రానికి విలువ ఉంటుంది”, “నా శ్రమతో ప్రకృతిలోని రహస్యాలు బట్టబయలవుతాయి”, “ఒకసారి అధ్యయనం చేసిన వాటి గురించి రాత్రిపూట ఆలోచిస్తే మంచిదని స్వానుభవంతో చెబుతున్నా. మనం పడుకున్నప్పుడు రాత్రి నిశ్శబం వల్ల ఆలోచన పదునెక్కుతుంది. దాంతో మనం సృజించిన వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దగలం”, “పోషకులు మొదట్లో నిన్ను ఆకాశానికెత్తేస్తారు. తర్వాత కష్టమైన పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత విశ్వాసహీనంగా ప్రవర్తిస్తారు. ఆపై నిన్ను నిందిస్తారు”, “అచ్చేసిన పుస్తకాల మాదిరి చిత్రాలకు పెద్దసంఖ్యలో నమూనాలు ఉండకూడదు. ఒక చిత్రం ఒక చిత్రంగానే ఉండాలి. పిల్లల్ని పుట్టించగూడదు. అప్పుడే అది ప్రత్యేకంగా, మిగతా వాటికంటే గొప్పగా భాసిల్లుతుంది”, “పక్షి గణిత సూత్రాల ఆధారంగా పనిచేసే యంత్రం. ఆ యంత్రాన్ని మనిషి తయారు చేయగలడు. అయితే అతని యంత్రానికి పక్షికున్నంత శక్తి ఉండదు. పక్షి హృదయమూ ఉండదు. కనుక మనిషి ఆ లోపాన్ని యంత్రానికి తన హృదయాన్ని అందించి అధిగమించాలి” వంటి ఆణిముత్యాలెన్నో లెయొనార్దొ రచనల్లో ఉన్నాయి.

“చిత్రకారుడు సమస్త జీవజాలపు, ప్రకృతి సారాంశం. జంతువులు, మొక్కలు, పళ్లు, మైదానాలు, శిఖరాలు, భయం గొల్పే ఆవరణలతో పాటు ఆహ్లాదకర ప్రాంతాలు, గాలి వాలుకు తూలిపోయే రంగురంగుల పూలతో కూడిన పొదలు, ఎత్తయిన పర్వతాల నుంచి బలంగా కిందికి దూకే నదులు, వాటిలో కొట్టుకుపోయే రాళ్లు, చెట్ల వేళ్లు, మన్ను, నురగ, ఝంఝామారుతంతో ఎదురొడ్డి పోరాడే తుపాను కడలి సారాంశం… చిత్రకారుడు… మానవుల్లోని సౌందర్యం నశిస్తుంది. కాని కళలోని సౌందర్యం నశించదు” అన్నాడు లెయొనార్దొ ద వించి.

ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలు గడిచింది. ఆయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహన గానం ఈ పుస్తకం. చదవండి.

Da Vinci – 1/8 demy, 264+8 pages, Rs. 150, Kaki Prachuranalu

For copies: All leading book shops/
Kaki Prachuranalu, Plot No. 304, H.No. 3-5-118/15, Second Floor, GPR Nilayam, Krishnanagar, Hyderguda, Rajendranagar, Hyderabad 500048, Ph: 9949052916

–          ఎన్ వేణుగోపాల్

పుస్తకాల్లో చెదలు…

M_Id_223298_Books_eaten_by_termites_at_Government_Divisional_Library_at_Vishrambaug_wada 

నా పుస్తకాలలోకి చెద పురుగులు ప్రవేశించాయి.

దాదాపు నలభై సంవత్సరాలుగా కూడబెట్టుకుంటున్న పుస్తకాలు.

ఎన్నెన్నో జ్ఞాపకాలూ ఉద్వేగాలూ అనుభవాలూ కన్నీరూ నెత్తురూ కలగలిసిన పుస్తకాలు.

చదివి ఇస్తామని తీసుకుపోయి తిరిగి ఇవ్వని మిత్రులతో తగాదాలు తెచ్చిన పుస్తకాలు. దూరం పెంచిన పుస్తకాలు.

మిత్రులనైతే పుస్తకాలు తిరిగి ఇమ్మని వేధించాను. ఇవ్వకపోతే గొడవపడ్డాను. శత్రువులను చేసుకున్నాను. వందలాది పుస్తకాలు పోగొట్టుకున్నాను. నిజమైన ఆసక్తితో తీసుకుపోయి చదివి, నమ్మకంగా తిరిగి ఇచ్చేవాళ్లతో కూడ ఆ అనుభవంతో కటువుగా మాట్లాడాను. చదివి ఇస్తామని చెప్పి తీసుకుపోయి తిరిగి ఇవ్వనివాళ్లమీద, పరిశోధకులమని చెప్పి పుస్తకాలు ఎత్తుకు పోయినవాళ్ల మీద చాల కోపం తెచ్చుకున్నాను.

పాపం, ఈ చెదల ముందర వాళ్లెంత నయం! పుస్తకాన్ని ఎక్కడో ఒకచోట మిగిల్చారు. నాదగ్గర లేకపోయినా ఆ పుస్తకం ఎక్కడో ఒక అలమరలో భద్రంగానే ఉంది.

మరి ఈ చెదపురుగులను ఏం చేయగలను? లెక్కలేనన్ని పుస్తకాలను నుసిగా, మట్టికుప్పగా, కన్నీటిముద్దగా  మార్చేసిన, ఖండఖండాలుగా విమర్శించి అదృశ్యం చేసిన చెదపురుగులను ఏం చేయగలను? మహావిశ్వమంత పుస్తకాన్ని మటుమాయం చేసిన ఇసుకరేణువంత సన్నని క్రిమిని ఏమనగలను?

నాలుగు ఊళ్లూ, డజను అద్దె ఇళ్లూ, డజన్ల కొద్ది మిత్రులూ వడపోయగా మిగిలిన పుస్తకాలు సొంత ఇంట్లో గోడలకే  షెల్ఫులు పోయించుకుని పెట్టుకున్నాను. ఒక్కవరస పెట్టుకోగలిగితే బాగుండునని ఎంత అనుకున్నా మూడు నాలుగువందల అడుగుల పొడవైన పుస్తకాలు రెండు వరుసలూ మూడు వరుసలూ పెట్టుకోక తప్పలేదు. గోడలకు ఆనుకుని ఉండే వెనుక వరుసలలో ఏ రసాయనిక ప్రక్రియలు జరుగుతున్నాయో తెలియని స్థితిని చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. గోడలలో చెమ్మ పెరిగి చెదలు పుట్టాయి. నాలుగువేల రకాల చెదపురుగులున్నాయట, ఒకరకం చెదపురుగు రోజుకు ఇరవై, ముప్పైవేల గుడ్లు కూడ పెడుతుందట. అలా క్షణక్షణాభివృద్ధి అయ్యే చెదల ప్రధాన ఆహారం సెల్యులోజ్ కుప్పలు కుప్పలుగా పుస్తకాల రూపంలో ఆ గోడల పక్కనే ఉంటే వాటికింకేం కావాలి?

అలా పుస్తకాల మీద ఆహార ఆసక్తితోనో అకడమిక్ ఆసక్తితోనో చెద పురుగులు పుస్తకాలలోకి తొంగిచూశాయి. ఒక్కొక్క పేజీనీ, వాక్యాన్నీ, అక్షరాన్నీ కూడ విమర్శించడం మొదలుపెట్టాయి. కొన్ని నెలల కింద ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే చెద పురుగులు అప్పటికే నాలుగైదు పుస్తకాలను సంపూర్ణంగా చదివేసి తమ నిశిత విమర్శతో తుత్తునియలు చేశాయని బయటపడింది.

నాకు దుఃఖం మొదలయింది గాని అది ఇంగ్లిషు నవలల సెక్షన్ కావడంతో సరే పోనీలే అనుకున్నాను. చెదలు వచ్చే అవకాశం ఉన్నదని నేను అమాయకంగా నమ్మిన రెండు మూడు సెక్షన్లు తీసి అటకెక్కించాను.

చెదలు దావానలంలా వ్యాపిస్తాయని విని ఉన్నాను గనుక వెంటనే ఒక పురుగుల మందుల దుకాణానికి వెళ్లి చెదల మందు అడిగితే కాలకూట విషంలా కనబడే డబ్బా ఒకటి కొనిపించారు. దానితోపాటు ఒక స్ప్ర్రే కూడ కొనిపించారు. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి ఆ విషం డబ్బా విప్పి స్ప్రేలోకి దాన్ని ఒంపబోతే ఒకటి రెండు చుక్కలకే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంటినిండా భరించలేని వాసన వ్యాపించింది. చెదలే మేలు అనుకుని డబ్బా మూతపెట్టి పైన పడేశాను.

కాని రాత్రీ పగలూ కళ్లముందర చెదలే చెదలు. ఓరోజు మళ్లీ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి చెదల మందుల ప్రకటనలు వెతికి పట్టుకుని ఫోన్ చేస్తే పాముల నర్సయ్య లాగ చెదల బాబూరావు ఆపద్బాంధవుడిలా వచ్చాడు. ఒకటి రెండు గంటలలో అయిపోతుందనుకున్న పని ఏడెనిమిది గంటలు పట్టింది.

చెద పురుగులు పుస్తకాలు చదవడమూ విమర్శించి ఖండఖండాలుగా మార్చడమూ మాత్రమే కాదు ప్లైవుడ్ చట్రాలలోకి ప్రవేశించి చెక్కపని కూడ మొదలుపెట్టాయి. కన్నీళ్లే మిగిలాయి గాని పుస్తకాలు మిగలలేదు. చెదల మందు ఘాటు వాసనకు కాదు, పుస్తకాలు పోయినందుకు కళ్ల వెంట ధారాపాతంగా దుఃఖం. అంత దుఃఖంలోనూ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెదపురుగులు అన్ని సెక్షన్ల పుస్తకాల మీద అంతో ఇంతో చేయి (నోరు కావచ్చు) చేసుకున్నాయి గాని, అన్నిటి కన్న పెద్దదయిన తెలుగు కవిత్వం సెక్షన్ వైపు మాత్రం చూడనైనా చూడలేదు!!

reading1

సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణాలూ ఫొటో కాపీయింగ్ సౌకర్యాలూ స్కానింగూ డిజిటలైజేషనూ వచ్చిన తర్వాత, అన్నిటికన్న మిన్నగా మరొకరి దగ్గర ఆ పుస్తకం ఉంటే తస్కరణ సౌకర్యమూ ఉన్నాక పుస్తకాలు పోతే ఏడవనక్కర లేదని అనిపిస్తుందేమో.

పుస్తకం మళ్లీ సంపాదించవచ్చు గాని ఆ పుస్తకంతో కలిసి ఉన్న అనుబంధాలను తిరిగి ఎట్లా సంపాదించగలం?

ఒక్కొక్క పుస్తకం వెనుక, వెనుక మాత్రమేకాదు అట్టమీదా, అట్టవెనుకా, లోపల పేజిపేజికీ ఒక్కొక్క గాథ ఉంటుంది. ఆ అచ్చు పంక్తుల కింద మనం గీసుకున్న గీతలు ఉంటాయి. ఆ పంక్తుల పక్కన అంచులలో మనం చేసిన వ్యాఖ్యలుంటాయి. కొత్త పుస్తకం దొరుకుతుంది గాని ఆ గాథలన్నీ ఎక్కడ దొరుకుతాయి?

ముప్పై ఏళ్ల కింద, ఇరవై ఏళ్లకింద, పదేళ్ల కింద ఏదో ఒక ఊళ్లో ఏదో ఒక దుకాణంలో ఏదో ఒక బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొని పేజీలు తిప్పి వాసన చూసి, మొదటి పేజీలో చేసిన సంతకపు ఆ తొలియవ్వన, గరుకు అక్షరాల ఉత్సాహ సంభ్రమాలు మళ్లీ ఎక్కడ ఎట్లా దొరుకుతాయి?

పుస్తకం పోవడమంటే పుస్తకం మాత్రమే పోవడం కాదు. ఒక పుస్తకం వెనుక ఉన్న అనేక జ్ఞాపకాలు పోవడం. పుస్తకాల ఫొటో కాపీలు సంపాదించవచ్చు గాని ఆ జ్ఞాపకాలను ఎట్లా సంపాదించగలం?

నిజంగానే నాదగ్గర ఉన్న వేల పుస్తకాలలో ప్రతి ఒక్కటీ నాలో ఒక జ్ఞాపకాన్ని ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్క పుస్తకంతోనూ నాకొక ప్రత్యేక అనుబంధం ఉంది. అది కొన్ని చోటు, అది కొనడానికి పడిన తపన, అది కానుకగా ఇచ్చిన మిత్రుల జ్ఞాపకం, అది చదువుతున్నప్పుడు, దాని మీద మాట్లాడినప్పుడు అనుభవించిన ఉద్వేగాలు….ఎన్నెన్ని!

ఎప్పుడో 1981లో మొదటిసారి మద్రాసు వెళ్లినప్పుడు మూర్ మార్కెట్ లోకి వెళ్లి ఒక పూటంతా గడిపి కొన్న సెకండ్ హాండ్ పుస్తకాలు, అందులో ముఖ్యంగా ‘ఏపియార్ కు అభిమానంతో మహీధర’ అని రామమోహనరావు గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన ‘మృత్యువు నీడల్లో…’ ఇప్పుడెక్కడ దొరుకుతుంది? ఆ ఏపీయార్ ‘ఆదర్శజీవులు’ అనువాదం చేసిన అట్లూరి పిచ్చేశ్వరరావు గారు కావచ్చునని ఊహించి పొందిన ఉద్వేగాన్నీ ఆనందాన్నీ ఇప్పుడెట్లా తిరిగి తెచ్చుకోగలను? ఆ మద్రాసు లేదు, చెన్నై అయిపోయింది. ఆ మూర్ మార్కెట్ లేదు, దాన్ని తగలబెట్టి రియల్ ఎస్టేట్ చేసి సెకండ్ హాండ్ పుస్తకాలకు కట్టించి ఇచ్చిన అగ్గిపెట్టెల్లాంటి కొట్లలో ‘అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమిసామి’?’

అలాగే 1982 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ రోడ్లమీద కొన్న వందల సెకండ్ హాండ్ పుస్తకాల జ్ఞాపకాలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మొదటి రోజుల్లో ప్రతి ఆదివారమూ ఎవరో ఒకరికి ప్రేమతో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ సంతకం చేసి ఇచ్చిన పుస్తకాలు దొరికేవి. ముల్క్ రాజ్ ఆనంద్ ఎవరికో సంతకం చేసి ఇచ్చిన అపాలజీ ఫర్ హీరోయిజం దొరికింది. 1983 మధ్యలో కోటీ ఫుట్ పాత్ ల మీద హఠాత్తుగా వేలాది కమ్యూనిస్టు పుస్తకాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో 1940లలో అచ్చయిన తొలి కమ్యూనిస్టు పుస్తకాలు, 1950లలో, 60లలో ప్రపంచ ప్రధాన నగరాలన్నిట్లోనూ కొన్న పుస్తకాలు, ప్రతి పుస్తకం మీద ఎం కె సేన్ అని సంతకం, ఒక తేదీ, ఆ ఊరి పేరుతో సహా దొరికేవి. మొహిత్ సేన్ పుస్తకాలవి.

అంతకు పది, పదిహేను సంవత్సరాల ముందునుంచే జీవితం పుస్తకాల మధ్య, కాగితాల మధ్య గడుస్తోంది. కాని ఎమర్జెన్సీలో, ఇంటర్మీడియెట్ లో నాకన్న చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పి సంపాదించుకుంటున్న నాలుగు రాళ్లతో పుస్తకాలు కొనడం మొదలయింది. వరంగల్ విశాలాంధ్రలో అలా కొన్న పుస్తకాలు, అందులోనూ సోవియట్ పుస్తకాలు ఇప్పుడు చెదలు తినేస్తే ఆ పుస్తకాలూ రావు, ఆ జ్ఞాపకాలూ రావు. ఆ తర్వాత సాహిత్యలోకంలోకి ప్రవేశించాక ఎంతోమంది కవిమిత్రులు, రచయితలు కానుకగా ఇచ్చిన తమ పుస్తకాలు, ఆవిష్కరణ సభల్లో మాట్లాడడం కోసం ఇచ్చిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో నేను రాసుకున్న మార్జినల్ నోట్స్… చెద పురుగుల మీద ఎంత కోపం వచ్చినా, సర్పయాగాన్ని మించిన చెదల యాగం చేసినా, ఆ పుస్తకాలైతే తిరిగి రావు గదా…

  ఎన్ వేణుగోపాల్

venu

అర్ధాంతరంగా….

venu1

నిలువెత్తు మనిషి ఎదుట నిలబడితే

నువ్వేనా, ఆ నాటి నువ్వేనా

నవ్వేనా అప్పటి పారిజాత పువ్వేనా అని

ఆపాదమస్తకం శోధించే చూపులు

ఒక్క కుదుపుకు పూలు జలజలా రాలినట్టు

వేనవేల జ్ఞాపకాల పరిమళాలు

కట్ట తెగి ఒక్కుమ్మడిగా వెల్లువెత్తిన వరదలా

లెక్కలేనన్ని ఉద్వేగాల హోరు

అరమూసిన కళ్లలో సగం ఆరిన వెలుగు

చెంపల మీద జారిపోయిన యవ్వనం

జీవన క్రీడ రెండో సగంలో ప్రవేశించిన జాడ

అక్కడక్కడ వెండితీగలు మెరిసే తల

తెచ్చిపెట్టుకున్నది కాదు, నిజంగానే మీదబడిన పెద్దరికం

ఆత్మీయ మైత్రిని

చాటేదా దాచేదా

ఈ అపరిచిత కౌగిలింత?

mandira1

మాటలు మరచిపోయినట్టు

స్వరం కొత్తగా విప్పుకుంటున్నట్టు

దశాబ్దాల కిందటి పురాస్మృతి

హృదయాంతరాళంలో పోట్లెత్తి

కేరుమనాలా వద్దా అని తడబడుతుంది

కన్నీటి పొత్తిళ్లలో మాట

‘అబ్బ ఎంత మారిపోయావు’ అని ఒక పలకరింపు

‘అప్పట్లా లేవు’ అని ఒక జవాబు

‘బాగున్నావా’ అని ఇద్దరి నోట ఒకే మాటకు

గాలిలో అద్వైతసిద్ధి

కలిసి నడిచిన అడుగులు

పంచుకున్న సంభాషణలు

ఎన్నటికీ మరవని స్నేహం

గుర్తు చేయలేని సంకోచం….

అన్నీ అర్థాంతరంగానే…

(ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన సహాధ్యాయులు రమకూ శబరికీ)

ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 28, 2013

painting: Mandira Bhaduri

గురువు, స్నేహితుడు, నాయకుడు గంటి ప్రసాదం

venu and ganti prasad

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్ మధ్యలో, కుడి వైపున గంటిప్రసాద్

 

ఒక ఎండాకాలపు ముసిముసి వేకువ ఔరంగాబాద్ స్టేషన్ లోకి రైలు ప్రవేశిస్తుండగా దిగడానికి తలుపు దగ్గరికి వచ్చి ప్లాట్ ఫారం మీద నిలబడిన వ్యక్తిని చూడగానే నేను వస్తున్నది ఆయనకోసమే అని పోల్చుకున్నాను. అప్పటికి ఆయన పేరు చాలసార్లే విని ఉన్నాను గాని ఆయనను చూడలేదు. పూర్తిగా ఆయన పోలికలతోనే ఉన్న  తమ్ముడిని విశాఖపట్నంలో ఎన్నోసార్లు కలిశాను గనుక ఆయనను గుర్తు పట్టడం కష్టం కాలేదు. అయినా మా కలయిక సంకేతస్థలం రైల్వే స్టేషన్ లో కాదు గనుక నా మానాన నేను రైలు దిగి గేటు దాటి ఓ వంద గజాలు నడిచి చాయ్ కొట్టు దగ్గర ఆగాను. ఆయన నా వెనుకే వచ్చి చెయ్యి కలిపారు. అది మొదలు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది మామూలుగా నిజమో కాదో తెలియదు గాని ఆయనతో నాకు కుదిరిన ప్రేమానురాగాలు మొదలయినది మాత్రం ఆ క్షణాన్నే. ఆయనతో మొదటి ముఖ పరిచయమే తొలిచూపు వలపు లాగ మొదలయింది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన నా జీవితంలోకి ప్రవేశించి ఎనిమిది సంవత్సరాలు మాత్రమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణసమానమైన ఆత్మీయ మైత్రి అది. యావజ్జీవిత సాన్నిహిత్యం అనిపించేంత గాఢమైన సంబంధం అది. పరస్పరం ఎంత విమర్శించుకున్నా, ఎంత గట్టిగా అరచుకున్నా, ఎన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినా మరుక్షణం అదంతా మరచిపోయి అల్లుకున్న స్నేహం అది. ఒకరిపట్ల ఒకరికి సంపూర్ణమైన నమ్మకం, గౌరవం, చనువు ఉన్న సమస్థాయి సంబంధం అది. పన్నెండు సంవత్సరాల వయసు తేడా ఉన్నదని ఏ ఒక్కక్షణమూ అనిపించని స్నేహాదరం అది. ఆయన పట్ల నాకు అపారమైన గౌరవమూ ప్రేమా ఉండేవి. ఆయనకు నాపట్ల చెప్పలేనంత వాత్సల్యమూ అభిమానమూ ఉండేవి.

ఆయన గంటి ప్రసాదం.

అలా ఔరంగాబాద్ స్టేషన్ ముందు కలుసుకున్న మేం అప్పటికే ఆయన దిగిన లాడ్జికి వెళ్లి అది ఖాళీ చేసి, ఆయన వెంట ఉన్న సహచరుడు సురేందర్ తో సహా మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ గది లోకి మారాం. ఆ తర్వాత ఓ గంటా గంటన్నరలో చెంచయ్యగారు, పాణి, రవి వచ్చేశారు. కాని అప్పటికే ఆయనా నేనూ లోకం మీది విషయాలన్నీ మాట్లాడేసుకుంటున్నాం. ఇక అందరమూ చేరాక మొదలుపెట్టిన సమావేశం మధ్య మధ్య భోజనాలు, చాయలు, కొన్ని గంటల నిద్ర మినహాయిస్తే మర్నాడు సాయంత్రం దాకా నిర్విరామంగా సాగింది. ప్రసాదం గారి పట్ల గౌరవం ఇనుమడించడానికి ఆ సుదీర్ఘ సమావేశం మరొక మెట్టు. సాహిత్యం, సాహిత్య విమర్శ, రాజకీయాలు, పార్టీ చరిత్ర, విరసం చరిత్ర, వ్యక్తులు, వ్యక్తుల సామర్థ్యాలు, బలహీనతలు, వ్యక్తుల పట్ల అంచనాలు, భవిష్యత్తు కార్యక్రమాలు, సాంకేతిక అంశాలు, బహిరంతర రహస్యాలు… ఎన్నెన్నో. కొన్ని వందల అంశాలు చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్క అంశం లోనూ ఆయన సంధించిన ప్రశ్నలు, ప్రతిపాదనలు, అభిప్రాయాలు, చర్చలు, వ్యాఖ్యానాలు, వివరణలు, విశ్లేషణలు, ముక్తాయింపులు ఆయన విశ్వరూపాన్ని చూపాయి. ఆయన నోటి నుంచి వెలువడిన పరిహాసాలు, చరిత్ర నుంచి అనుభవాలు ఎంతో బరువైన సందర్భాన్ని కూడ ఆహ్లాదకరంగా తేలికపరచాయి. ఆయన మాటలన్నిటితో ఏకీభవించానని కాదు, అబ్బురపడినవీ ఉన్నాయి, తీవ్రంగా విభేదించినవీ ఉన్నాయి. కాని ఒక విప్లవోద్యమ నాయకత్వానికి ఎటువంటి సమయస్ఫూర్తి, అవగాహన, సంయమనం, విశాల దృక్పథం ఉంటాయో నాకు మరొకసారి చూపిన అనుభవమది. ఆ విశిష్టత నానాటికీ విస్తరిస్తున్న, పరిణతి చెందుతున్న విప్లవోద్యమ ఫలితం అని ఎంతగా అనవచ్చునో, ఆ విశిష్టతను వ్యక్తీకరిస్తున్న ప్రత్యేక వ్యక్తిలోని నిత్య చలనశీల, ప్రవాహ, విస్తరణ స్వభావానికి సూచిక అని కూడ అంతగా అనవచ్చు.

నిజానికి ఆ రెండు రోజులు జరిగిన సంభాషణంతా నోట్స్ రాసుకున్నాను, ఆయన మాటల్లో ఎక్కువభాగం ఆ నోట్స్ లో ఉండి ఉంటాయి. కాని రెండో రోజు రాత్రి భోజనానికి లేవడానికి ఇంకో అరగంట ఉందనగా ఆ గది మీద దాడి చేసిన ఎస్ ఐ బి తోడేళ్ల గుంపు మా వస్తువులన్నిటితో పాటు ఆ నోట్స్ కూడ ఎత్తుకుపోయింది. దాడి చేసిన వాళ్లెవరో మేం గుర్తించే లోపుగానే ఒక్కొక్కరి మీద పడి మొట్టమొదట చేసిన పని కళ్లకు గంతలు కట్టడం. చేతులు వెనక్కి విరిచి కట్టడం. ఆ తర్వాత మూడు రోజులు అక్రమ నిర్బంధంలో పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకకపోయినా ఒకరికొకరం తోడుగా ఉన్నాం. చిన్న చిన్న మాటలతోనే, స్పర్శతోనే ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. ఆ నిర్బంధాన్నీ, ప్రశ్నల దాడినీ ఎదుర్కున్నాం.

ఆ తర్వాత నిజామాబాద్ డిఐజి కార్యాలయంలో మమ్మల్ని పత్రికల వారి ముందు ప్రవేశపెట్టి అక్కడ్నించి నిజామాబాద్ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కూ, మర్నాడు బోధన్ కోర్టుకూ, అక్కడ్నించి ఆ సాయంత్రానికి నిజామాబాద్ ఖిలా జైలుకూ తీసుకుపోయిన ప్రయాణమంతా ప్రసాదం గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రసాదం గారినీ, నన్నూ పోలీసు కస్టడీకి తీసుకుపోయారు. అప్పటికే డికె బసు కేసు తీర్పులో పోలీసు కస్టడీలో ఖైదీకి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఉండే హక్కు ఉందనీ, పక్కన న్యాయవాదిని ఉంచుకునే హక్కు ఉందనీ విని ఉన్నాం గనుక మళ్లీ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి దాదాపు డజను మంది అధికారులు ఏ ప్రశ్న అడిగినా మేం చెప్పం అని మొండికేశాం. వ్యక్తిగత వివరాలు పేరూ ఊరూ చదువూ ఉద్యోగమూ కుటుంబసభ్యుల పేర్లూ తప్ప మరేదీ చెప్పబోమన్నాం. ఆ తతంగంలో కడప నుంచి వచ్చిన ఒక సిఐ మామీద విపరీతంగా కోపం తెచ్చుకుని, పక్కన న్యాయవాదులు ఉండడంతో ఏమీ చేయలేక పళ్లు పటపట కొరకడం, చూపులతోనే మమ్మల్ని ఎన్ కౌంటర్ చేయడానికి ప్రయత్నించడం ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడ కళ్ల ముందు ఆడుతోంది. మూడు రోజుల కోసం తీసుకున్నవాళ్లు అలా ఒకటిన్నర రోజు గడవగానే నన్ను వెనక్కి పంపేశారు. ప్రసాదం గారిని ఏమైనా చేస్తారా అని భయం. న్యాయవాదులకు కూడ చెప్పకుండా ఆయనను హైదరాబాదుకు తరలించారు. బహుశా నిజామాబాదుకు రాలేని అధికారులు హైదరాబాదులో ఆయనను ప్రశ్నించారు. కళ్లకు గంతలవల్ల వాళ్లెవరో ఆయన పోల్చుకోలేక పోయారు గాని పైస్థాయి వాళ్లెవరో అయి ఉంటారని అన్నారు.

నాలుగో రోజు ఆయనను మళ్లీ నిజామాబాదు జైలుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత మాకు బెయిల్ దొరికి విడుదలయ్యే వరకూ రెండువారాలకు పైగా రోజుకు ఇరవైనాలుగు గంటలూ మేం పంచుకోని విషయం లేదు. చర్చించుకోని అంశం లేదు. కేవలం మాటల్లోనే కాదు, మౌనంలోనూ, రోజువారీ శారీరక, మానసిక కార్యకలాపాలన్నిటిలోనూ ఒకరేమిటో మరొకరికి పూర్తిగా తెలిసివచ్చిన అద్భుతమైన, అనివార్యమైన, నిర్బంధశిబిర సాన్నిహిత్యం అది. బహుశా ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల ప్రగాఢ సంబంధానికి మూలం ఆ రెండు వారాలలో ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన నమ్మకమూ అంచనాలే కావచ్చు. ఆ తర్వాత ఆ కేసు వాయిదాల కోసం ఇరవై ముప్పై సార్లు నిజామాబాదుకు కలిసిచేసిన ప్రయాణాలు, చివరికి సాక్షుల విచారణ, వాదనల సమయంలో నిజామాబాదులో వారం రోజులు కలిసి గడపడం, ఈ మధ్యలో మా ఇంట్లోనూ, రాష్ట్రంలో ఎన్నో చోట్ల సభల సందర్భంగానూ వందలాది గంటల సంభాషణలు అరుణారుణ స్మృతులు. హైదరాబాదు వచ్చిన ప్రతిసారీ పది నిమిషాల కోసమైనా సరే, ఒక రోజో, రెండు రోజులో గడపడానికైనా సరే నా దగ్గరికి వచ్చేవారు. వనజతోనూ, అమ్మతోనూ, విభాతతోనూ కూడ సన్నిహితంగా ఉండేవారు. రావడానికి అసలే కుదరకపోతే ఫోన్ చేసి, ‘ఈ సారి కుదరడం లేదు, మళ్లీ వస్తాను’ అనేవారు.

చాల లోతయిన, సైద్ధాంతికమైన, నిబద్ధమైన, మానవీయమైన దృక్పథం, స్పష్టత ఉంటూనే ఆయనలో చాల ఆశ్చర్యకరమైన అమాయకత్వమూ పసితనమూ కూడ ఉండేవి. ఒక్క క్షణం కింద తత్వవేత్తలా, నాలుగు దశాబ్దాల ఆచరణతో తలపండిన అనుభవజ్ఞుడిగా మాట్లాడిన ఆయనేనా అనిపించేంత అమాయకంగా, స్వచ్చంగా, పసితనంతో ప్రవర్తించేవారు. తనకు తెలియని విషయం తెలియదని ఒప్పుకోవడంలో, అమాయకంగా అడగడంలో ఆయనకు ఎప్పుడూ భేషజం ఉండేది కాదు. మేం జైల్లో ఉన్నప్పుడు వనజ నాకు అదనంగా చొక్కాలు తెచ్చింది. అవి చర్మాస్ లో దొరికే మామూలు నూలు చొక్కాలు. కాని వాటి రంగులు ఆయనను చాల ఆకర్షించాయి. నిజామాబాద్ జైల్లో జాలీ ములాఖాత్ లోనే ‘వనజా నాకు అటువంటి షర్ట్ కావాలి’ అని చిన్న పిల్లవాడిలా అడిగారు. జైల్లో అది వేసుకుని చాల సంతోషించారు. విడుదలై వచ్చాక కూడ మళ్లీ అటువంటిది కొనిపించుకున్నారు. అలాగే జైలులో ఉన్నప్పుడూ, బైటికి వచ్చాక కూడా నశ్యం పొడి కోసం ఆయన ప్రయత్నాలూ, చిరాకూ, అది సమయానికి అందకపోతే చిన్నపిల్లవాడిలా మంకూ ఆయనలోని స్వచ్ఛతకూ, నిష్కల్మషత్వానికీ అద్దం పట్టేవి.

ఇక ఆయనలోని అమాయకత్వానికీ, చిన్నపిల్లవాడి మనస్తత్వానికీ చెప్పుకోవలసిన చిహ్నం తెలుగు పజిల్స్ నింపడం మీద ఆయనకు ఉండిన పిచ్చి. నాదగ్గరికి చాల పత్రికలు వస్తాయి గనుక ఆయనకు పండగలా ఉండేది.  వచ్చినప్పుడల్లా పాత పత్రికలన్నీ వెతికి ముందేసుకుని ఆ పజిల్స్ నింపడంలో మునిగిపోయేవారు. ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే వినకుండా, లేదా పరధ్యానంగా వింటూ పజిల్స్ లో మునిగిపోతున్నారని కోప్పడేవాణ్ని. సారూ, ఇంకెప్పుడూ కోప్పడను, ఒక్కసారి వచ్చిపోరూ….

అట్లాగే, ఆయనకు రచన చేయాలని చాల కోరిక ఉండేది. పనుల్లో ప్రయాణాల్లో తీరిక దొరకక ఎక్కువ రాయలేక పోయారు గాని రాస్తే చాల బాగా రాసేవారు. చంచల్ గూడ జైల్లో ఉండగా తెలంగాణ మీద ఒక వ్యాసం రాసి ఇచ్చారు. ఆరు సంవత్సరాల కింద వీక్షణంలో అచ్చయిన ఆ వ్యాసం ఇప్పటికీ చాల తాజాగా, గొప్ప విశ్లేషణతో ఉంది. నిజంగా తెలంగాణ ఉద్యమం మీద ఆయన అవగాహన చాల సరయినది. ఇటీవల కిషన్ జీ హత్య తర్వాత రాజ్యం జరిపిన దుష్ప్రచారం మీద అరుణతారలో ఒక మంచి వ్యాసం రాశారు. ఈ రెండు మూడు వ్యాసాలు, అమరుల బంధుమిత్రుల సంఘం చరిత్ర, ప్రణాళిక మినహాయిస్తే మిగిలిన రచనలు ఎక్కువగా కరపత్రాలే. కాని రాసిన ప్రతి కరపత్రమూ చూపెట్టి, కూచుని చదివించి, బాగుందా అని చిన్న పిల్లవాడిలా, కొత్త రచయితలా అడిగేవారు. అలాంటప్పుడు, ఆయన చదవాల్సిన కొత్త పుస్తకాలు, వ్యాసాలు ఎన్నెన్ని ఉన్నాయో చెప్పి పనులు కొన్ని తగ్గించుకుని అయినా చదవమని కోప్పడేవాణ్ని. చదువు మానేశారని విమర్శించేవాణ్ని. కాని ఆయన అసలు చదవడం లేదని కొన్నిసార్లు అనిపించేది గాని, ఆశ్చర్యకరంగా ఆయన చాల విషయాల్లో చాల అప్ టు డేట్ గా, తాజా వివరాలతో ఉండేవారు. ఒక పత్రిక వెలువడిన రోజు సాయంత్రం జరిగిన సభలోనే ఆ పత్రిక సంపాదకీయాన్ని ఉటంకిస్తూ విశ్లేషించడం చూసినప్పుడు ఆయన అవసరమని అనుకున్నవి వెంటనే చదువుతారని అనిపించేది.

అలాగే నేను ‘చౌరస్తాలో తెలంగాణ ఇంకెన్నాళ్లు’ అని వీక్షణం నవంబర్ 2012 సంచికలో ఒక వ్యాసం రాస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉన్న అన్ని శక్తుల బలాబలాలను గురించి చర్చించినప్పుడు, ఒక వారంలోపే ప్రసాదం గారు కలిశారు. ‘అందరి గురించీ విమర్శలు ఉన్నాయి మావోయిస్టు పార్టీ గురించి, దాని ప్రభావంలోని తెలంగాణ సంస్థల గురించి విమర్శ లేదేమిటి’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ మాటలు మరొక పేరుతో ఉత్తరంగా వేయనా’ అని అడిగితే సరేనన్నారు. ఒకరకంగా ఆయన విప్లవ నిర్మాణంలో చాల కీలక స్థానాలలో ఉండి కూడ అక్కడి సమస్యల గురించి బైటివాళ్లు ఎలా ఆలోచిస్తారో అలా ఏమాత్రం స్వీయాత్మకత లేకుండా వస్తుగతంగా ఆలోచించేవారు. మరొకవైపు బహిరంగంగా మాత్రం తనకు విభేదం ఉండిన అంశాలను కూడ సంపూర్ణంగా సమర్థించే ఉక్కు క్రమశిక్షణతో ఉండేవారు.

చివరి రోజుల్లో ఆయన పదే పదే చర్చించిన అంశం ఒకటి ఆయనలోని చదువరిని, సిద్ధాంతకర్తను నాకు పట్టి ఇచ్చింది. ‘ఎందుకు ఇటీవలి కాలంలో పాలిమికల్ (సైద్ధాంతిక వాదవివాదాల) రచనలు మనకు తగ్గిపోతున్నాయి? మార్క్స్ ఎంగెల్స్ లు తమ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినది పాలిమిక్స్ తోనే. మన పార్టీ చరిత్రలో ప్రధానమైన పాత్ర పాలిమిక్స్ దే. విరసం కూడ తొలిరోజుల్లో పాలిమిక్స్ ద్వారానే తన అవగాహనలను స్థిరపరచింది, ప్రచారం చేసింది. ఎందుకు ఇప్పుడు ఎవరు ఏమి రాసినా, ఎన్ని తప్పులు రాసినా మీరందరూ పట్టించుకోకుండా ఉండిపోతున్నారు? ఎందుకు పాలిమిక్స్ రాయడంలేదు?’ అని ఆయన చాల తీవ్రంగా ప్రశ్నించేవారు. అలా అడిగి అడిగి ఎవరూ పూనుకోవడం లేదనే అసహనంతోనేమో ఆయనే పాలిమికల్ వ్యాసాలు రాయడానికి పూనుకున్నారు.

చదవడానికి సమయం దొరకకపోయినా గొప్ప ఆచరణ జ్ఞానం వల్ల ఆయన సాధారణంగా సరైన వైఖరే తీసుకునేవారు. చర్చలలో చాల కచ్చితమైన, నిర్దిష్టమైన, నిర్దుష్టమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆయనకు అలవాటైన భాష కొంత పాతదిగా, సాగదీసినట్టుగా అనిపించేది గాని సారంలో ఆయన విశ్లేషణ మాత్రం పూర్తిగా సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా, సరిగ్గా ఉండేది.

మార్చ్ చివరి వారంలో లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్ విజయవాడలో భారత ఉత్పత్తి విధానం మీద సదస్సు పెట్టినప్పుడు మొదట ప్రసాదం గారికీ నాకూ చిన్న ఘర్షణ జరిగింది. అర్ధభూస్వామ్య, అర్ధవలస సూత్రీకరణను పూర్తిగా నమ్ముతూ ఆచరిస్తూ ఉన్న పార్టీ ప్రతినిధిగా ఆయన దానికి తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుందని, ఆయనను పిలవమని నిర్వాహకులకు సూచించాను. కాని కుదురుతుందో లేదో అని ఆయన వారితో అన్నారని తెలిసి నేను ఫోన్ చేశాను. ‘నువ్వున్నావు గదా, నేనెందుకూ, చాల పనులున్నాయి’ అన్నారు. ‘నేనేమీ మీ ప్రతినిధిగా వెళ్లడం లేదు. నేను అర్ధభూస్వామ్య అర్ధవలస సూత్రీకరణను నమ్మే ఒక రాజకీయార్థశాస్త్ర విద్యార్థిగా వెళుతున్నాను. అయినా నేను మీకు అస్పృశ్యుడిని కదా. అక్కడ ఆ సూత్రీకరణను సమర్థించుకోవలసిన బాధ్యత పూర్తిగా మీదే’ అని కటువుగా అన్నాను. నిజానికి మరెవరి మీద కోపమో ఆయన మీద తీర్చుకున్నాను గాని ఆయన నన్నెప్పుడూ ఒక్క క్షణం కూడ అస్పృశ్యుడిలా భావించలేదు. నేనలా మాట్లాడాక వచ్చి ఒక పూటంతా ఉండి, ఆ విషయానికి సంబంధించిన రెండు పుస్తకాలు జిరాక్స్ చేయించుకుని వెళ్లారు. బెజవాడలో కనబడగానే, ‘ఇదిగో వచ్చాను’ అని చిన్నపిల్లవాడిలా చెప్పారు. మొదటి రోజు సాయంత్రం చర్చలో జోక్యం చేసుకుని చాల బాగా మాట్లాడారు. క్లుప్తంగానైనా చాల సూటిగా, స్పష్టంగా ఇటువంటి చర్చల పరమ లక్ష్యం ఏమై ఉండాలో చెప్పారు.

నాలుగైదు నెలల కింద నక్సలైట్ ఉద్యమం మీద ఎవరో పోలీసు ఆఫీసర్ రాసిన పుస్తకం ఒకటి తెప్పించి పెట్టమన్నారు. నేనది తెప్పించి మరుసటిసారి వచ్చినప్పుడు ఇస్తే, నీదగ్గరే ఉండనీ, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటానులే అన్నారు. రెండుమూడు నెలల కింద విశాఖ నుంచో, కోమర్తి నుంచో ఫోన్ చేసి కొలంబియా విప్లవోద్యమ సంస్థ ఫార్క్ (కొలంబియా విప్లవ సాయుధ సైన్యం) మీద, టర్కీ పికెకె (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ) మీద, లాటిన్ అమెరికా ప్రజా ఉద్యమాల మీద సమాచారం కావాలని, తీసిపెట్టమని అడిగారు. అవి పోగేస్తుండగానే తీసుకోలేని చోటికి వెళ్లిపోయారు.

ఆయనలోని ఈ గుణాలూ ప్రత్యేకతలూ విశిష్టతలూ, ఆయనతో ఆత్మీయ మైత్రీ, ఆయన ఆదరాభిమానాలూ అన్నీ నా ఒక్కడి అనుభవమే ఎంత మాత్రమూ కాదు. ఆయన గురించి సరిగ్గా ఇలాగే భావించేవాళ్లు రాష్ట్రంలో కొన్ని వందల మంది ఉండి ఉంటారు. బహుశా ఆయనతో నేను అనుభవించినంత ఆత్మీయతనూ, అంత కన్న ఎక్కువ ఆత్మీయతనూ కూడ అనుభవించిన వారు నాకు తెలిసే డజన్ల కొద్దీ ఉన్నారు. ‘ఆయన నాకు దగ్గరి వారు, నా హృదయంలోని మనిషి. అత్యంత ఆప్తుడు. ఆయన దగ్గర నాకు రహస్యాలేమీ లేవు. నన్ను ఆయన పూర్తిగా తన విశ్వాసంలోకి తీసుకున్నారు’ అని ప్రతి ఒక్కరూ అనుకున్న వ్యక్తి గంటి ప్రసాదం. ఒక మనిషి జీవితంలో అంతకన్న కావలసింది లేదు. ఒక మనిషిని మనీషిగా మార్చేది అదే. గంటి ప్రసాదం అనే మనిషి మార్క్సిజంలో విశ్వాసం వల్ల, నాలుగు దశాబ్దాలకు పైబడిన విప్లవోద్యమ ఆచరణ వల్ల మనీషిగా మారారు. అటువంటి మనీషుల అవసరం మరింతగా పెరుగుతున్న సమయాన రాజ్య దుర్మార్గం ఆయనను మననుంచి దూరం చేసింది. ‘ఆ బుల్లెట్లు నన్ను చంపగలవేమో గాని, నా ఆశయాన్ని కాదు’ అని ఆయన తన వీలునామా లాగ చెప్పిన మాటలే ఆయన మిత్రులందరికీ మిగిలిన ఆశ్వాసం.

–          ఎన్ వేణుగోపాల్

జూలై 13, 2013

మండుటెండలో మోదుగుపువ్వు

అతనొక మోదుగుపువ్వు

మండుటెండలో వసంతాగమన వీచిక

భవిష్యత్ వర్షహర్షానందాల మానవ సూచిక

అతని మునివేలు కొసన ఎప్పుడూ ఒక కంటి తడి

ఎవరెవరి కన్నీళ్లు తుడిచివచ్చాడో

తన కన్నీళ్ల చెలియలికట్టనే ఎన్నిసార్లు కట్టుకున్నాడో

 

వాలిన గరికపోచల చివర్ల అతని ప్రోత్సాహాశ్రు బిందువే

రాలిన తురాయి పూల కనుకొలకుల అతని అనునయ స్పర్శే

కూలిన నిర్మాణాల చెంపల చారికల మీద అతని సాంత్వన బాసలే

ఆగిన దారుల మూలమలుపుల్లో నెత్తుటి మరకలపై అతని గురుతులే

 

అందరూ దూరం కొట్టిన అస్పృశ్యులను ఆలింగనం చేసుకున్నదతడే

కంటిపాప కరువైన తల్లి శోకానికి తల వాల్చే భుజం అందించినదతడే

సహచరుల్ని కోల్పోయిన బంధుమిత్రులకు బాసటగా నిల్చినదతడే

బిడ్డను పోగొట్టుకున్న ఊరికి ఓదార్పు మాటల లేపనాలు పూసినదతడే

ముఖాలు చూసుకోని గడ్డి పరకలను కలిపి

మదగజాలను లొంగదీసే తాళ్లు పేనినదతడే

రాజ్య దుర్మార్గం మీద పెదాల చివరినుంచి నిప్పుకణికలు విసిరినదతడే

ఎప్పుడాగిపోతుందో తెలియని గుండెను అదిమి పట్టుకుని

వేల మైళ్ల దూరాల్ని వందల అవరోధాల్ని అవలీలగా దాటినదతడే

అరెస్టులనూ అనారోగ్యాన్నీ దాడులనూ దుర్భాషలనూ

తోసిరాజని జీవిత చదరంగాన్ని గళ్ల నుడికట్టులా ఆడినదతడే

 

దైవ ప్రసాదం కాదు, జన హృదయ ప్రసాదం, ప్రజా పోరాట ప్రసారం

 

–          వి. కవిత, జూలై 14, 2013

‘చెర’గని జ్ఞాపకం…చెరబండ రాజు!

venu

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్

 

(జూలై 2:  ప్రసిద్ధ కవి చెరబండ రాజు వర్థంతి )

చిన్నా పెద్దా అందరమూ ప్రేమగా ‘చెర’ అని పిలుచుకుంటుండిన చెరబండరాజు చనిపోయి అప్పుడే ముప్పై ఒక్క ఏళ్లు గడిచిపోయాయి. చెర పుట్టినరోజు తెలియదు.“ హైదరాబాదుకు తూర్పున, అంకుశాపురం గ్రామంలో పదిహేను రోజుల ప్రసవవేదనలో అమ్మ చచ్చిపోతుందనగా నేలమీదికి కసిగా విసిరివేయబడ్డాడు. ఎప్పుడో తేదీ లేదు. బంగారమొడ్డించే పల్లెవాసుల చల్లని చూపుల్లో, పైరుపచ్చని పొలాల గట్ల మెద్ద కాలిబాటల చీలికల్లో పెరిగాడు. ఎదురైన ప్రతి హృదయానికీ అంకితమవుతాడు. సాగర తీరాల ఇసుక తిన్నెల మీద ఒంటరిగా కూర్చోవడం, వానలో నానడం, ఏకాకిగా ఉండడం, విషాదం ఇష్టం. మనిషికోసం పడి చస్తానంటాడు. ఒక్క భగవంతుని మీదే కసి, పగ” అని దిగంబరకవులు మొదటి సంపుటంలో పరిచయం రాసుకున్న నాటికైనా, చివరి వరకూ అయినా పుట్టినతేదీ తెలియనే లేదు. జ్ఞాపకం ఉన్న సంఘటనలను బట్టి పుట్టిన సంవత్సరం 1944 అని చెప్పుకునేవాడు. అది సరైనదే అయితే చెర ఇప్పుడు 69 నిండి డెబ్బైలలో ప్రవేశిస్తుండేవాడు.

చెరను బహుశా 1972లో మొదటిసారి చూసి ఉంటాను. అప్పటినుంచి 1982 జూలై 2న చనిపోయేదాకా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మానసాకాశం మీద ఎప్పటికీ చెరగని అరుణారుణతారలు. మనిషిని చూసినది పది సంవత్సరాలే, అందులోనూ ఆయన రెండేళ్లు ముషీరాబాద్ జైల్లోనూ, రెండేళ్ల కన్న ఎక్కువే గాంధీ రోగ నిలయం (గాంధీ ఆస్పత్రికి ఆయన పెట్టిన పేరు) లోనూ గడిపాడు. ఆయనను కలిసింది కూడా సభల్లో, అంబర్ పేట ఇంట్లో, జైలులో, కోర్టులలో, ఆస్పత్రిలో అప్పుడప్పుడూ మాత్రమే గనుక మొత్తంగా నెల కూడ ఉండదేమో. కాని వెయ్యి పున్నముల వెలుగు అది. ఆయన జీవితం మీద, కవిత్వం మీద ఎన్నో చోట్ల మాట్లాడాను, రాశాను. మాట్లాడినప్పుడల్లా , రాసినప్పుడల్లా కొత్త స్ఫురణకు వీలు కల్పించే నవనవోన్మేష స్ఫూర్తి అది.

ఆయన ఎక్కువకాలం గడిపిన అంబర్ పేట కిరాయి ఇల్లు ఇప్పుడు లేదు. ముషీరాబాద్ జైలును కూల్చేసి గాంధీ ఆస్పత్రి చేశారు. గాంధీ రోగనిలయాన్ని కూల్చేసి ఎవరికి రియల్ ఎస్టేట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఆయన ఉద్యోగం నుంచి తొలగింపుకూ, అనారోగ్యానికీ గురయితే తెలుగు సమాజం అసాధారణంగా స్పందించి ఆయన సహాయనిధి సేకరించి కట్టించి ఇచ్చిన రెండుగదుల చిన్న ఇల్లు కూడ ఇప్పుడు అపార్ట్ మెంట్ గా మారిపోయింది. ఆయనకు అన్నివిధాలా సంపూర్ణంగా సహచరిగా ఉండిన శ్యామలక్క అకాలంగా అనారోగ్యంతో మరణించింది. ఆయన కంటిపాప ఉదయిని కాన్సర్ పీడితురాలయి ముప్పై ఏళ్లు నిండకుండానే ప్రాణాలు కోల్పోయింది. కొడుకు కిరణ్ తప్ప భౌతికంగా చెర జ్ఞాపకం అని చూపదగినవి దాదాపుగా ఏమీ లేవనే చెప్పాలి. కాని చిరస్మరణీయమైన చెర కవిత్వం ఉంది.

‘అమ్మమ్మ ఇందిరమ్మ చేసింది సాలుపొమ్మా’ అని గానానికి అనువుకాని, శ్రుతిలయలు తెలియని సన్నని గాత్రంతోనే ఆయన పాడిన పాటలు, ‘పాడుతాం పాడుతాం ప్రజలే మానేతలనీ ప్రజాశక్తి గెలుచుననీ’ అనీ, ‘విప్లవాల యుగం మనది, విప్లవిస్తె జయం మనది’ అనీ, ‘ఈ మట్టిని తొలుచుకొనీ విప్లవాలు లేస్తున్నై, ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వాగతాలు’ అనీ ఆయన చేతి సంకెళ్లనే సంగీత సాధనాలుగా మార్చి కూర్చిన అద్భుతమైన లయబద్ధమైన కవితానినాదాలు ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి.

cherabandaraju1

విప్లవ రచయితల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఎమర్జెన్సీ విధించే దాక అంటే 1970 జూలై నుంచి 1975 జూన్ దాకా  ఐదు సంవత్సరాలలో హనుమకొండ-వరంగల్ లలో కనీసం యాభై సభలు, సమావేశాలు జరిగి ఉంటాయి. నేను 1973 జూన్ తర్వాతనే చదువు కోసం హనుమకొండ వచ్చాను గాని అంతకుముందరి సభలు కూడ చూశాను. అటువంటి సభల్లో ఏదో ఒకదానిలో, బహుశా చెర 1971లో మొదటిసారి ప్రెవెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టయి విడుదలైనాక జరిగిన సభలోనో, లేదా మరేదైనా సభలోనో చూసి ఉంటాను. ఇక నేను హనుమకొండకు చదువుకు వచ్చినాక నాలుగు నెలలకే అక్టోబర్ లో విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. విరసం నాయకులందరినీ మూడు నాలుగురోజులపాటు సన్నిహితంగా చూడడం, వారి మాటలు, కవితలు, ఉపన్యాసాలు వినడం అప్పుడే. అందరితో, ముఖ్యంగా చిన్నపిల్లలతో స్నేహం చేసే చెర ప్రభావం ఆ సభల్లో పుస్తకాల దుకాణం దగ్గర కూచున్న నా మీద పడడం చాల సహజంగా జరిగింది.

ఆ సభలు జరిగిన రెండు మూడు రోజులకే ఒక రోజు పొద్దున్నే ఇంటికి వచ్చిన పోలీసులు మామయ్య (వరవరరావు) ను అరెస్టు చేసి తీసుకుపోయారు. అదే సమయంలో హైదరాబాదులో చెరను కూడ అరెస్టు చేశారు. అప్పటినుంచీ చెర మా కుటుంబ సభ్యుడే అయిపోయాడు. ఆ నిర్బంధం నెలన్నరలోనే ముగిసింది గాని, మరొక ఆరునెలలకు చెరనూ మామయ్యనూ సికిందరాబాదు కుట్రకేసులో ముద్దాయిలుగా కలిపి పెట్టారు. ఇక ముషీరాబాదు జైలులోనో, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోనో చెరను రెగ్యులర్ గా కలుస్తుండేవాళ్లం. కొన్నాళ్లకే చెర బెయిల్ మీద విడుదలై ఎమర్జెన్సీ విధించేదాకా జరిగిన సభల్లో పాల్గొన్నాడు. ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగిన రాడికల్ విద్యార్థి సంఘం మొదటి మహాసభల నాటికి జైలులో ఉన్నాడో విడుదలై పాల్గొన్నాడో గుర్తు లేదు గాని, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో జరిగిన నాలుగైదు ఆర్ ఎస్ యు సభలకు ఉపన్యాసకుడిగా వచ్చాడు. ఏప్రిల్ లో తెలుగు మహాసభల దగ్గర శ్రీశ్రీతో పాటు నిరసన ప్రదర్శన జరిపి అరెస్టయ్యాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ రెండు సంవత్సరాలూ జైల్లో, కోర్టుల్లో కలవడమే.

ఎమర్జెన్సీ తర్వాత చెర బతికింది సరిగ్గా ఐదు సంవత్సరాలు, అందులోనూ రెండు, రెండున్నర సంవత్సరాలు ఆస్పత్రులలోనే ఉన్నాడు. మిగిలిన కాలమంతా ఎన్నో చోట్ల ఎన్నో సభల్లో కలుసుకుంటూ ఉండేవాళ్లం. 1979లో మా బాపును తీవ్రమైన లివర్ సంబంధిత సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చేర్చి, పది పదిహేను రోజులు ఉన్నప్పుడు చెర కూడ ఆపరేషన్ కోసం అక్కడే ఉన్నాడు. అప్పటికే రాయడం మొదలుపెట్టిన నాకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, నా కలం పేరు మీద ఆయన వ్యాఖ్య, ఆ గొంతు నా చెవుల్లో ఇప్పటికీ ధ్వనిస్తూనే ఉంది.

చెర జీవితం గురించి తలచుకున్నప్పుడల్లా ఆ విస్తృతీ, వైవిధ్యమూ చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. బతికినది నిండా ముప్పై ఎనిమిదేళ్లు కూడా కాదు. అందులో మూడు సంవత్సరాలు జైలుకూ మూడు సంవత్సరాలు అనారోగ్యానికీ, ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆర్థిక ఇబ్బందులకూ, కేసులకూ పోతే, పదిహేను సంవత్సరాలు సాహిత్య, సామాజిక జీవితానికి ముందరి వ్యక్తిగత జీవితానికి పోతే ఆయన సాహిత్య, సామాజిక జీవితానికి మిగిలింది అటూ ఇటూగా పదిహేనేళ్లు మాత్రమే. కాని ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండు సాహిత్య ఉద్యమాలకు ప్రధాన భాగస్వామి అయ్యాడు. ఏడు కవితా సంపుటాలు అచ్చు వేశాడు, ఒక డజను దాకా కథలు రాశాడు. మరో డజను నాటికలు, నాటకాలు రాశాడు. మూడు నవలలు రాశాడు. ఒక అసంపూర్ణ నవల వదిలిపోయాడు. ఉపన్యాసాల కోసం, కవితాపఠనం కోసం రాష్ట్రమంతా తిరిగాడు. విప్లవ రచయితల సంఘానికి ఒక సంవత్సరం కార్యదర్శిగా పనిచేశాడు. హైదరాబాదులో విప్లవోద్యమానికీ, విప్లవ విద్యార్థి యువజనోద్యమాలకూ, జననాట్యమండలికీ పెద్దదిక్కుగా ఉన్నాడు.

ఈ పనులన్నీ కూడ ఏదో చేశాడంటే చేశాడన్నట్టు కాకుండా మనసు పెట్టి చేశాడు. శ్రద్ధగా చేశాడు. తెలుగు పండిత శిక్షణ పొంది, ప్రాచీన సాహిత్యం చదువుకున్నా, పాఠాలు చెప్పినా, వచన కవిత్వం మీద పట్టు సాధించాడు. ఎప్పటికప్పుడు వస్తుశిల్పాలను పదును పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 1969లో వ్యతిరేకిస్తూ కవిత రాసినవాడే, 1972 నాటికి తన ఆలోచనలోని పొరపాటు గ్రహించి తెలంగాణ ఆకాంక్షలను సమర్థిస్తూ కవిత రాశాడు. నిరంతర సాధనతో తన వస్తువులను తానే మార్చుకున్నాడు. వస్తువు ఎంపికలో వైవిధ్యం సాధించాడు. అప్పటికి విప్లవ సాహిత్యోద్యమం కూడ సంకోచించిన అంశాలను వస్తువులుగా తీసుకుని రచన చేశాడు. వచన కవితా రూపంతో తన లక్ష్యం నెరవేరదనుకున్నప్పుడు తనను తాను మార్చుకుని పాట వైపు పయనించాడు. తన పాటలు తానే పాడాడు. నిర్బంధంలో చేతికి సంకెళ్లతో కోర్టుకు తీసుకు వస్తున్నప్పుడు అప్పటిదాకా విప్లవకారులకు, విప్లవ రచయితలకు అలవాటైన నినాదాల స్థానంలో సంకెళ్ల దరువుతో కవితా పాదాలు అల్లడం మొదలుపెట్టాడు. అలా రాసిన ఏడెనిమిది పాటల్లో ప్రతి చరణమూ ఆ తర్వాత విప్లవోద్యమ ఊరేగింపులలో నినాదంగా మారింది.

ఆలోచిస్తుంటే చెర కవిత్వం గురించీ, కవిత్వ శక్తి గురించీ, జీవితం గురించీ ఇప్పటికి చాలమంది చాలా చెప్పి ఉన్నప్పటికీ ఇంకా అన్వేషించవలసిందీ, వివరించవలసిందీ, విశ్లేషించవలసిందీ ఎంతో మిగిలి ఉన్నదనే అనిపిస్తున్నది.

అవును, చెరస్మరణ చిరస్మరణీయం.

—ఎన్.వేణుగోపాల్