-జి. వెంకటకృష్ణ
తలుగు అనేది రాయలసీమలోని ఒక నుడికారం. దానర్థం పగ్గం, బంధం. ఇదే పదానికి ఒక విశిష్టార్థమూ ఉంది. అనంతపురం జిల్లా కర్నాటకసరిహద్దు ప్రాంతంలో తలుగు అంటే “నైవేద్యం’. పండగపూట దేవుళ్లకు తలుగులు పెడతారు. పూజల తర్వాత విస్తరాకుల్లో పెట్టిన ఆహారపదార్థాలను (తలుగుల్ని) ఇంటిపెద్దలు తింటారు.
అయితే వేంపల్లె షరీఫ్ రాసిన “తలుగు’కున్న అర్థం మాత్రం బంధం. కథలోని దౌలా ఒక దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడేకథకు మూలమైన ఒక మూగ ప్రాణి ఎనుము తలుగు తెంచుకుంటూ ఉంటుంది. కథలోని దౌలా ఒక బోరేవాలా. బోరేవాలాలు ముస్లింసముదాయంలో అట్టడుగుస్థాయి వాళ్లు. ఈతచాపలు అమ్ముకుంటూ, గొడ్డుసీలు తింటూ బతికే ఊరిబయటి ముస్లిములు. వాళ్ల బతుకుల్నిచిత్రిస్తూ, వాళ్లపట్ల తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ షరీఫ్ ఈ కథను ఒక నైవేద్యంగా వాళ్లకు సమర్పిస్తున్నాడు.
ఈ కథలో రెండు ఘర్షణల్ని ఎదుర్కొంటాడు దౌలా. గొడ్డుమాంసం అమ్ముతున్నందుకు గొడ్డుమాంసం తినని (ఎక్కువ స్థాయివాళ్లమనిభావించే) ముస్లింల నుంచి అవహేళన రూపంతో ఎదురయ్యే దౌర్జన్యం ఒకటైతే రెండవది- తనకు కోతగొడ్లను వాడుకగా ఇచ్చే శూద్రకులస్థుడైనవెంకటప్ప నుంచి ఎదుర్కొంటున్న దౌర్జన్యం. ఈ రెండింటిమీద దౌలా ప్రతిక్రియనే ఈ కథ. తన బతుకుదెరువు కోసం ఎదురొడ్డి నిలబడ్డమే దౌలాతత్వం.
అస్తిత్వ వాదాలు ఎదిగి వాటి చుట్టూ ఎంతో వెలుగు పరుచుకున్న గత రెండు దశాబ్దాల కాలంలో వినిపించిన నినాదం ఎస్సీ, ఎస్టీ, బీసీమైనార్టీల ఐక్యత. ఇది బహుజనవాదంగా దేశరాజకీయ ఎజెండాగా మారి అంతో ఇంతో నిజం కూడా అయింది. ఇదేకాలంలో మరోవైపుఎదుగుతూవస్తున్న హిందుత్వ ముందు ఈ బహుజన ఐక్యత కుంచించుకుపోయి మాయం అయిపోతోంది. “తలుగు’ కథలో శూద్రకులపువెంకటప్ప, దౌలా అనబడే బడుగు బోరేవాలా ఎదురెదురుగా నిలబడ్డప్పుడు యిద్దరు కూడా ఈ బహుజన ఐక్యతలోకి రావాల్సిన వాళ్లేమోఅనిపిస్తుంది. ఎందుకంటే రచయిత కులం చెప్పకపోయినా కథలోని పెత్తందారు వెంకటప్ప ఒక బీసీగానే కథలో మనకు కనిపిస్తాడు.
అలా చూసినప్పుడు బహుజన ఐక్యతను ఏదైతే ఆశించామో, దేన్నయితే కలగన్నామో అది కూడా ఒక “యుటోపియా’లాగసకలకార్మికులూ ఎట్లా అయితే ఐక్యం కాలేదో (కాలేరని మనం అనుకున్నామో) అట్లాగే సకలబహుజనులూ ఐక్యం కాలేదనిమనకర్థమవుతుంది.
తన గుడిసెముందున్న ఎనుమునూ, దూడనూ దౌర్జన్యంగా వెంకటప్ప తోలుకుని పోయాక, ఇద్దరు మధ్యవర్తులతో వెంకటప్పఇంటిముందరికొచ్చి దౌలా న్యాయం అడిగినప్పుడు పందిరిగుంజకు ఆనుకుని ఉన్న దౌలాను వెంకటప్ప ఎగిచ్చి గుండెలమీద తన్నుతాడు.అప్పుడు దౌలాకు వెంకటప్ప నిజస్వరూపం ఇలా కనబడుతుంది.
” అతను నల్లగా ఏనుగుమాదిరి బలిసి ఉన్నాడు. పైగా ఒట్టి పయ్యిన ఉన్నాడు. నడుముకు కట్టిన తెల్లపంచెను అలాగే కిందికి వదిలేశాడు.అప్పుడే పూజ పూర్తయిన సూచికగా నుదుటిమీద నిలువునా కుంకుమబొట్టు పెట్టాడు. రెండు చేతుల మణికట్లకు వెండికడియాలున్నాయి.వేళ్లకు రెండ్రెండు ఉంగరాలున్నాయి… మెల్లో పులిగోరు మెరుస్తోంది..”
ఇదీ ఈ ఇరవై ఏండ్లలో లేదా అంతకన్నా ముందునుంచో శూద్రకులాల్లోకి పాకిన హిందూ విశ్వరూపం. కులం ఒక నిష్టూర సత్యమై తనకన్నాకింద కులాన్ని తొక్కి పట్టి ఉంచుతూ తాను మాత్రం పైపైకి ఎగబాగుతున్న దౌర్జన్యం. తన కాళ్లకింద ఉన్నది ఒక ముస్లిం అయితే, అందులోనూఒక దళితముస్లిం అయితే అది ఇంకెంత దౌర్జన్యంగా ఉంటుందో ఈ కథ చెబుతోంది.
రాయలసీమ గ్రామాల ఆధిపత్యాన్ని చిత్రించిన ఎన్నో కథల్లా, రాయలసీమ నుడికారాన్ని పలికించిన ఎందరో కథకుల్లా షరీఫ్ కూడా తనతలుగును తానే తెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఈ కథలో కనిపిస్తుంది. తన సమూహంలోకి తొంగిచూడ్డం ఒక బాధ్యత అయితే,దాన్నుంచి కింది స్థాయిలో తన కళ్లముందు మెదులుతున్న జీవితాలను నెత్తికెత్తుకోవడం .. జుమ్మా నుంచి అతను వేసిన ఒక ముందడుగ్గాభావించాల్సి ఉంటుంది. ముస్లిం జీవితం ఎదుర్కొంటున్న నిర్దిష్టతల నుంచి సాగి మెల్లగా తన సమూహపు అంతర్గ స్వరాల్లోకి అతనుపాకుతున్నాడు. మంచి కథకుడిగా, జీవితాన్ని నిశితంగా గమనించి దాని పరిణామశీలతను, తర్కాన్ని పట్టుకుంటున్నాడు. గ్రామాల్లో ఏంజరుగుతోందో, ఏ సంస్కృతీ సామాజిక వివక్షతలు జీవితాన్ని ఎటువైపు తరుముతున్నాయో ఈ కథలో షరీఫ్ చిత్రించాడు. ఎదుగుతున్నకొన్ని సమూహాల ఎదురుగా చితికిపోతున్న అనేక సమూహాలు, వాటిలోని అంతర్గత వైరుధ్యాలూ మనల్ని తప్పక ఆలోచింపచేస్తాయి.
రాయలసీమ కథ – ఆ నేల కథే. రాయలసీమ కథ ఆ ప్రకృతితోనే ముడిపడి ఉంటుందని, అందులో మనిషీ – పశువూ కూడా అంతర్భాగమనిగతంలో ఎన్నో కథల్లో నిరూపించబడింది. ఆ జాడనే షరీఫ్ అనుసరిస్తున్నాడు. రామకృష్ణారెడ్డి గారి మనిషీ-పశువూ ఇంతకాలంలో కొత్తరూపంతీసుకుంటే అది తలుగు -తెంచుకోవడమే అవుతుంది! తనను ప్రేమించిన, తనకు ప్రాణంపోసిన దౌలా పక్షమే పశువుది కూడా అని ఈ కథచెబుతోంది. పశుపక్ష్యాదులతో రాయలసీమ జీవితానికి ఉన్న అనుబంధం “మునెమ్మలో’ చెప్పినా, “మూలింటామె’లో చెప్పినా షరీఫ్ కూడాఆ వారసత్వం వాడేనని తలుగు రూఢీ చేస్తుంది.
*
తాజా కామెంట్లు