Archives for July 2016

ఈ గంట గణగణ మోగాలి..!

 shool

 

 

గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి-

నమస్కారం!

సార్.. మీతో మాట్లాడడానికి మాకు అవకాశం లేదు. అందుకే వుత్తరం రాస్తున్నాము. పేరు లేదని ఏదో ఆకాశ రామన్న వుత్తరమనుకోకండి. ఇది రాసేది ఒక్కరమే అయినా యివి మా బడి పిల్లలందరి అభిప్రాయాలు వరుసగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి, యింకా ప్రాధమిక – మాధ్యమిక –  ఉన్నత – సాంకేతిక – చదువుల మంత్రి మీరు. అంటే.. మీరు మా మంత్రి!

మన ప్రధానమంత్రిగారిలాగే మన ముఖ్యమంత్రిగారిలాగే మీరూ దేశ విదేశాల్లో తిరగడం తప్పు కాదు. కాని అక్కడైనా యెక్కడైనా మన దేశ ప్రతిష్ట జెండా కర్రలా- మనకుండాల్సిన వెన్నెముకలా- నిటారుగా వుండాలి! తలెత్తుకు తిరగాలి! రండి బాబూ రండి.. మా దేశంలో వ్యాపారాలు చేసుకోండి.. యవ్వారాలు చేసుకోండి.. మా దేశంలో తాగడానికి నీళ్ళు లేకపోయినా మీకు నీళ్ళిస్తాం.. మాదేశంలో ప్రజలకు పవర్ కట్లున్నా మీకు పూర్తి కరెంటు యిస్తాం.. మా వాళ్ళు భూముల కోసం సొంత అన్నదమ్ములే తలలు పగలగొట్టుకొంటున్నా, పోలీసుల్ని పెట్టయినా కొట్టయినా కేసుకట్టయినా కాల్పించయినా ప్రజలదగ్గర లాక్కొనయినా పీక్కోనయినా మీకు కావలసినంత భూమి యిస్తాం. మా దేశంలో ప్రజలకి వొక్కో రాయితీ తీసేసి.. రాయితీలు లేకుండా చేసి.. మీకు మాత్రం అడిగినన్ని రాయితీలు యిస్తాం.. అని దండోరా వేసుకు తిరుగుతున్నప్పుడు ‘దేశం పరువు తీసేస్తున్నార్రా’ అని చెప్పకేం ఈ దేశ నాయకులని తిట్టుకున్నాం. తిట్టుకుంటూనే వున్నాం!

మీరనుకోవచ్చు.. యివన్నీ నాకెందుకు రాస్తున్నారని? చెప్పాము కద సార్.. మీరు మా మంత్రి. మా విద్యార్థుల మంత్రి. అంతే కాదు, మీరు కూడా యీ మధ్య పై దేశముకెళ్ళి మా పరువు తీసారు. మా పరువు అంటే మా బడి పరువు. మన బడి పరువు!

మేము పేపర్లో చదివాము. కొలంబస్ నుండి ఆవార్త వొచ్చింది. మీరు యిక్కడికి మన దేశానికి వొచ్చాక కూడా అవే మాటలన్నారు. ఆ వార్తా చదివాము. యాభై లక్షలు విరాళంగా యిస్తే, అలా యిచ్చిన వారి పేర్లను, లేదా వారు సూచించిన వారి పేర్లను స్కూళ్ళకు పెడతాము.. అన్నారు. అలాగే పది లక్షలు యిస్తే తరగతి గదులకు పేర్లు పెడతాము.. అన్నారు. మా బడిలో చదివే ఆడపిల్లలు యేమంటున్నారో తెలుసా సార్.. లక్ష రూపాయలు యిస్తే యేకంగా టాయిలెట్స్ కట్టించి మరీ వారి పేర్లేకాదు, వారి మొత్తం కుటుంబం పేర్లూ పక్కనే శిలా ఫలకం మీద మీ పేర్లూ పెడతామని కూడా మీరు చెప్పివుంటే బాగుణ్ణు అని అనుకున్నారు. మీరు అమెరికాలో పర్యటనలో వున్నప్పుడే ఆ పని సిగ్గులేకుండా చెయ్యాల్సింది అని అన్నారు. ఓహియో తెలుగు సంఘం, టాకో వారు నిర్వహించిన సభలో మీరు పాల్గొన్నప్పుడే టాయిలెట్ల విషయమూ ప్రకటించి వుండాల్సింది..

సార్.. మన దేశంలో చదువుకొనే పిల్లలకి ఉచ్చపోసుకోవడానికి కూడా లేదూ అంటే సిగ్గు చేటు కాదా సార్.. మీ తెల్ల చొక్కాల మీద మురికి మాకందరికీ కనిపిస్తోంది, మీది మీకు కనిపించడం లేదా సార్.. ప్రభుత్వంలో వున్న మీకు ప్రభుత్వమంటే గౌరవం లేదా సార్.. ‘ప్రభుత్వ పాఠశాల’ అంటే బాగోలేదా? ‘సర్కార్ స్కూల్” అంటే బాగోలేదా? మీకీ దృష్టి వుండడం వల్లే కొందరు మా బడులను ‘దుంపల బడి’ అంటున్నారు. మీకు లేని సిగ్గు మాకేల? అని యిన్నాళ్ళూ వూరుకున్నాం. కాని మా బడి యెంత దిక్కుమాలిన పరిస్థితుల్లో వుందో మీరు విదేశాల్లో అడుక్కుంటూ వుంటే మీకు లేదేమో గాని మాకు అవమానంగా వుంది సార్. సార్.. మమ్మల్ని మీరు ముష్టివాళ్ళను చేసేసారు సార్.. ప్రభుత్వంలో వున్న మీరు ముష్టెత్తుకుంటుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మేము ముష్టివాళ్ళం కాక మరేమీ అవుతాం సార్..?

నిజం సార్.. మా బడికి కోట్ని గురుమూర్తి గేటు కొనిచ్చాడు.. గేటు మీద ‘ధర్మదాత కోట్నిగురుమూర్తి గారిచే దానము చేయబడినది’ అని వుంటుంది. ‘గది గచ్చులు పెంట భాస్కరమ్మ జ్ఞాపకార్ధం’ అని వుంటుంది. ‘గోడలకు చెక్క సున్నాలు చేయించినవారు బెహరా జగన్నాథ్’ అని రంగుల అక్షరాలతో రాయించి వుంటుంది. తాగే నీళ్ళ డేక్సా మీద ‘బిస్వజిత్ పాఠక్ గారి పాప సునంద రజస్వల సందర్భంగా యిచ్చిన కానుక’ అని వుంటుంది. డేక్సా సరే, ఆఖరికి చైను కట్టి వుంచిన నీళ్ళు తాగే గ్లాసు మీద కూడా ‘చైన్లు మాస్టారు గృహప్రవేశం సందర్భంగా యిచ్చినది’ అని వుంటుంది. బ్లాకు బోర్డులు, బెంచి బల్లలు, టేబుళ్లు, కుర్చీలు, హెడ్ మాస్టారి చైరు దాక.. అన్నీ దానం చేసినవే! ధర్మం చేసినవే! దయ తలచినవే!

సార్.. ఈ పేర్ల వెనుకన యెవరి పేర్లున్నాయో తెలుసా సార్..? ‘సత్యమేవ జయతే -మహాత్మా గాంధి’, ‘దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా -గురజాడ, ‘దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు’, ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా- ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా- పొగడరా నీ తల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవము! -రాయప్రోలు సుబ్బారావు’, ‘ మా తెలుగు తల్లికి మల్లెపూదండ – మాకన్న తల్లికి మంగళారతులు -శంకరంబాడి సుందరాచారి’… యిలా యెంతోమంది గది పెచ్చులు రాలిపడ్డప్పుడే పెచ్చులతో పాటు రాలిపోయారు. గోడలు కూలినప్పుడే గోడలతో పాటే కూలిపోయారు. వెల్ల వేసినప్పుడే వెల్ల కింద వుండి చెరిగి పోయారు! దారి చూపే పేరున్న దీపదారులే కాని దాన ధర్మాల పేర్ల కింద ఆరిపోయారు! అగుపడకుండా పోయారు!

సార్.. మీకు తెలుసా? మాబడిలో యిప్పటికే వొక్కో తరగతి గదికి వొక్కో పేరుంది. ‘చాచా నెహ్రూ తరగతి గది’, ‘కోడి శ్రీరామ మూర్తి తరగతి గది’, ‘ఆదిభట్ల నారాయణ దాసు తరగతి గది’, ‘కవికోకిల సరోజినీ నాయుడు తరగతి గది’, ‘సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గది’, ‘ఐన్ స్టీన్ తరగతి గది’, ‘అబ్దుల్ కలాం తరగతి గది’, ‘కల్పనా చావ్లా ప్రయోగ శాల’, ‘భగత్ సింగ్ ప్లే గ్రౌండ్’.. యిలా చాలా వున్నాయి సార్.. పెట్టుకున్నాం సార్.. కావాలంటే మీరు మా బడికొచ్చి చూడండి సార్.. మదర్ ప్రామిస్ సార్..

మరిప్పుడు యెలాంటి పేర్లు వొస్తాయి సార్? జొన్నలగడ్డ జోగేస్వరరావో.. చౌదరి మురళీ మన్మధరావో.. పూసపాటి నారాయణ రాజో.. వేదుల కాంతమో.. పెంట లక్ష్మీ కాంతమో.. యిలానో మరోలానో దాతల పేర్లు మా బడికీ తరగతి గదికీ పెట్టారే అనుకోండి.. యెవరైనా అడిగితే యేమని చెప్పాలి? మా తమ్ముడో చెల్లో అడిగితే యేమని చెప్పాలి? దేశభక్తులా? కారు!, దేశ నాయకులా? కారు!, కవులూ కళాకారులా? కారు!, శాస్త్రవేత్తలా? కారు, స్వాతంత్ర్య సమర యోధులా? కారు!, సంఘ సేవకులా? కారు!.. మరెవరు? అనంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్లనో.. లేకపోతే మన బడికి బెంచి బల్లలు కొనిపెట్టారనో.. గది కట్టారనో గోడ కట్టారనో.. యిటుకలు యిచ్చారనో.. లేదూ అంటే మన పేద గవర్నమెంటుకు డబ్బులిచ్చి ఆదుకున్నారనో.. చెపితే బావుంటుందా? దేశంపట్ల భక్తిని కలిగి వుండడం కన్నా- ప్రజల కష్టసుఖాలు యెరిగిన నాయకులుగా వుండడం కన్నా – కవిత్వములోనో కళలలోనో రాణించడంకన్నా – తమ జీవితాన్నిచ్చిన శాస్త్రవేత్తలకన్నా – సంఘ సేవకులకన్నా – దేశం కోసం ప్రాణాలిచ్చిన సమర యోధులకన్నా – అన్ని కష్ట నష్టాలు పడేకన్నా డబ్బు సంపాదిస్తే సుఖము. సౌఖ్యము. కీర్తి. కాబట్టి బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించాలి.. డబ్బు ముందు అన్నీ దిగదుడుపేనంటే.. యేదో యెక్కడో బాగోలేదు సార్. మంచిది కాదు సార్.. మంచిగా లేదు సార్.. సారీ సార్..

జనం కూడా గుర్తుపెట్టుకోరు సార్.. యిప్పుడు నవీన్ జిందాల్ యెంతమందికి తెలుసు సార్.. జిందాల్ ఫ్యాక్టరీ వల్ల కొంతమందికి తెలుసు. తండ్రి ఓం ప్రకాష్ జిందాలే తెలీదు. నవీన్ జిందాల్ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ యెట్ డల్లాస్ లో చదువుకొని, ఆర్ధిక సాయం చేసినందుకు అక్కడ అతని పేరుతో ‘నవీన్ జిందాల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంటు’ అని వొకటి పెట్టారు. చెప్పనా సార్.. మనదేశంలో జిందాల్ అంతడబ్బు యెలా సంపాదించాడు అని ఆలోచిస్తారు గాని వేరేలా ఆలోచించరు. డబ్బు లేనివాళ్ళంతా డబ్బు వున్న వాళ్ళదగ్గర యెలా వుందో వచ్చిందో ఆలోచిస్తారు. మీ మంత్రులు కూడా డబ్బు యెలా సంపాదిస్తున్నారో మా తలిదండ్రులూ టీచర్లూ మాట్లాడుకుంటూ వుంటే వింటూనే వుంటాము. అలా తెలిసిన విషయాలే యివి.

మరో విషయం.. ఆమధ్య వొక టీవీ వాళ్ళు.. ఆంధ్రులు.. ప్రవాసాంధ్రులు.. పూర్వ విద్యార్థులు.. వాళ్ళనీ వీళ్ళనీ అందర్నీ పిలిపించి.. ‘నీ బడి పిలుస్తోంది.. సాయం కోరుతోంది’ అని గజల్ శ్రీనివాస్ తో పాట పాడించి.. మరీ పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసారు. ప్రభుత్వ పాఠశాలలు దీనంగా హీనాతి హీనంగా వున్నాయని అందరూ చెప్పారు. మేము చాలా సంబరపడ్డాము. అంతా కలిసి ప్రభుత్వాన్ని అడుగుతారనుకున్నాం. నిలదీస్తారని అనుకున్నాం. ప్రభుత్వంలో దానికో శాఖ వుంది.. మంత్రి వున్నాడు.. విద్యకి కూడా బడ్జెట్ వుంది.. మాట్లాడుతారు.. అని ఆశ పడ్డాం. లేదు, అడగలేదు. అవస్థ యిది అని వ్యవస్థని అడగలేదు. అడుక్కున్నారు. తప్పితే హక్కులు మరిచిపోయారు. కలిగిన వాళ్ళని జాలి చూపించమన్నారు. దయ చూపించమన్నారు. మన వూరు.. మన మట్టి.. మన బడి.. అని సెంటిమెంటుల ఆయింట్ మెంటులు రాసారు. లక్షల బడుల్లో వంద బడులు అదీ అప్పటికి బాగుపడితే చాలా? వుమ్ముతడి పనులు తప్ప శాశ్వత పనేనా యిది? ఇచ్చిన వాళ్ళ ఔదార్యం యెంత కాలముంటుంది? ఎందరికి వుంటుంది? అదికూడా బడి నుండి వెళ్లి బాగా చదువుకొని బాగుపడిన వాళ్ళు వున్నప్పుడే. లేనప్పుడు? లేదు! అంతే! మా బడులనుండి బాగా చదివి వెళ్ళిన వాళ్ళు లేరు. మా బడులు అలాగే వున్నాయి. అప్పటికీ వినాయక చవితికీ దసరాకీ చందాలు అడిగినట్టు డబ్బా పట్టుకు వెళ్లి అడుక్కున్నాము. బడిలో ‘బడికి సాయం చేయండి’ అని రాసి హుండీ కూడా పెట్టాము. అది గుడా? హుండీ నిండడానికి!? బడి కదా?!

సార్.. హక్కుగా అడగాల్సిన వాటికి.. అమలు పరచాల్సిన వాటికి.. అడుక్కోవడం బాగోలేదు సార్.. ఒకరి దయా దాక్షిణ్యాలమీద యెల్లకాలము నడవదు సార్.. మా పెద్దలు చెప్పారు సార్.. సార్ మీ మంత్రులంతా ప్రయివేటు బడుల ప్రారంభోత్సవానికి వస్తుంటారు. తప్పితే వొక్క సారి మా బడిలోకి రండి సార్.. స్లాబ్ పడిపోదు. పెంకులు జారి నెత్తి పగలదు. గోడ కూలి గాయం కాదు. పోనీ తలకు హెల్మెట్ పెట్టుకొని, వొంటికి బులెట్ ప్రూఫ్ తొడుక్కొని, సెక్యూరిటీ సిబ్బందిని పిలుచుకొని రండి సార్.. ఒక్క రోజుకి అలా అయితే భయపడితే యెలా సార్.. మేం నిత్యమూ చిన్నపిల్లలతో సహా యిక్కడే చదువుకుంటాము. వుంటాము. మేం మీరు పెట్టిన మీటింగులకి మా హెడ్ మాష్టారు చెపితే యెండలో రోడ్డు పొడుగునా నిలబడి మీకు స్వాగతాలు పలక లేదా సార్.. మానవహారాలు కాట్టాము సార్.. మరిచిపోయారా సార్..?

ప్రయివేటు విద్యాసంస్థలకి వేల యెకరాలు యిస్తున్నారే.. యెంకరేజ్ చేస్తున్నారే.. పెద్ద మాటలు అనుకోవద్దు, మేం రోజూ పేపరు చదువుతాము.. సార్.. ప్రయివేటు రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. మరి ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం కాక యెవరు ప్రోత్సహిస్తారు? లేదు సార్.. ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు సార్.. సార్ యేమిటో సార్.. ప్రభుత్వరంగంలో వున్నవన్నీ నీరసించి నశించి పోతున్నాయి.. అది విద్యయినా.. వైద్యమైనా.. యేదయినా.. ప్రభుత్వ బడులు వెనక బడితే అధికారులూ మంత్రులూ వెనకబడినట్టు కాదా? మాకేనా మార్కులు? మీకుండవా? ప్రభుత్వ బడులు దీటుగా నడపకుండా మూసేస్తే పోతుంటే మీరు ఫెయిల్ అయినట్టా? పాసయినట్టా?

దయచేసి డబ్బుకోసం ధరలు నిర్ణయించి బడిని బద్నాం చేయకండి. చేస్తామంటారా? అంతకన్నా ముందు వొక పని చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమో.. భారత ప్రభుత్వమో.. అని కాక యిక్కడ పెట్టుబడులు పెట్టే టాటా ప్రభుత్వమో.. బిర్లా ప్రభుత్వమో.. రిలయన్స్ ప్రభుత్వమో.. విప్రో ప్రభుత్వమో.. హేచ్సీయల్ ప్రభుత్వమో.. హిందూజా ప్రభుత్వమో.. అదాని ప్రభుత్వమో.. అని పేరు మార్చుకోండి అంటే మార్చుకుంటారా? వాళ్ళంతా మన పేద దేశంలో డబ్బుగలవాళ్ళు.. వాళ్ళ వ్యాపారాల వల్ల మనకు ఉపాధి కలుగుతోంది అని అంటే పేర్లు మార్చేస్తారా? అంతెందుకు.. మీ ప్రభుత్వ శాఖల పేర్లు అయినా మార్చేస్తారా? మన చదువుల శాఖే వుంది. ప్రాధమిక విద్యని విజ్ఞాన్ విద్యనో భాష్యం విద్యనో కృష్ణవేణి విద్యనో మార్చమంటే మార్చేస్తారా? అలాగే మాధ్యమిక విద్యని చైతన్యా నారాయణల ‘చై.నా’ విద్యాశాఖ అని మార్చమంటే మార్చేస్తారా? మీకు కోర్టులు కూడా అనుకూలంగా వున్నాయి. ఈమధ్య విద్యా విషయాల మీద కోర్టు స్పందించింది. ప్రభుత్వ బడులను ప్రభుత్వం నడపలేకపోతే ప్రయివేటుకి అప్పగించమంది. అప్పుడే చాలా మంది ప్రయివేటు విద్యా వ్యాపారులు అందుకు సిద్ధంగా వున్నామని అన్నట్టుగా కూడా పేపర్లో చదివాము. అంచేత మీరు సిద్ధమే అయితే యింక మీకు శాఖ వుండదు! మీ అవసరమూ వుండదు!

సరే సార్.. ఆఖరిగా వొక మాట.. మా బడిలో పేద్ద సరస్వతీ దేవి పటం వుంది సార్.. అది కూడా మా బడికి యెవరో బహుమతిగా యిచ్చిందే సార్.. దానమిచ్చిందే సార్, జిల్లా ఫస్టు వొస్తే. సార్.. మా సరస్వతీ దేవి యెలా వుంటుందో తెలుసా సార్.. తెల్ల చీర కట్టుకొని చేతిలో వీణతో హంస మీద కూర్చొని మెరిసిపోతుంటుంది సార్.. ఆ చీర గురించి చాలా సార్లు మా అమ్మకు చెప్పాను సార్, సరస్వతీ దేవి అందమంతా చీరలోనే వుందని! కాని సార్.. యిప్పుడెప్పుడు చూసినా సరస్వతీ దేవి అందంగా కనిపించడం లేదు సార్.. తెల్ల చీర మాసిపోయి చిరిగిపోయి వీణ తీగలు తెగిపోయి ఆముఖంలో నవ్వు మాయమైపోయి దిక్కుమాలిన దానిలా వుంది సార్.. అచ్చం మాలాగే!

పెద్ద వుత్తరం రాస్తే చేట భారతమని చదవరట గదా సార్.. అందుకే రాయాలని వున్నా రాయకుండా ఆపేస్తున్నాము. తప్పులుంటే మన్నించండి. అయినా వొక తప్పు వల్ల వొంద తప్పులు జరుగుతాయి. మా తప్పులు అలాంటివేనని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము!

మళ్ళీ నమస్కారాలతో-

మీ

విద్యార్థులు

(ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులు)

ఆమె ఒక సైన్యం!

mahasweta

 

(కల్పన రెంటాల  2007 లో మహాశ్వేత దేవిపై ఈటీవీ -2 మార్గదర్శి కార్యక్రమం కోసం రాసి ఇచ్చిన స్క్రిప్ట్ )

ఆదివాసులంటే భయంకరమైన మనుష్యులనీ, వాళ్ళకు సభ్యతా సంస్కృతి లేవన్న అపోహల్ని ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగలు, దోపిడీ ముఠాలు నెలవుండే చోటన్న కట్టుకథల్నీ ఆమె చెదరగొట్టింది. అక్కడి మనుష్యులు రాక్షసులైన అసురతేగలకి చెందిన వాళ్ళన్న ప్రచారాల్నీ ఆమె పట్టించుకోలేదు. ఆత్మ స్థైర్యాన్నే దివ్వెగా వెలిగించుకొని, ఆమె అడవుల్లోకీ వెళ్లింది. నగర జీవితం లో పుట్టి పెరిగిన మహాశ్వేతా దేవి కీకారణ్యాల గుండెల్లో ఏ మారుమూలనో దాక్కుని బతుకుతున్న అడివి బిడ్డల ఆక్రందనల్నీ వింటూ వాళ్ళ గుండెల్లోకి అడుగుపెట్టింది. భయం, ఆకలి, దారిద్ర్యం, అమాయకత్వం ….వీటన్నింటికి పర్యాయ పదాలుగా బతుకుతున్న ఆదివాసులకి కొండంత అండగా నిలబడింది. ఇప్పుడు ఆమె అడివి బిడ్డలకుఅమ్మ. తరతరాల దోసిళ్లకు ఆనవాలుగా మిగిలిన గిరిజనానికి కనుపాప. ఒకవైపు ఆయుధాలతో కొండ బతుకుల్నీ తీర్చిదిద్దే నక్సల్బరీ పోరాటం సాగుతున్న దశ లోనే ఒకే ఒక్క కలం బలంతో తానే ఒక సైన్యం గా పోరాడి గెలిచిన యోధ మహా శ్వేత దేవి.

ఇప్పటికీ ఎనభై ఏండ్ల క్రితం ఢాకా లోని ఒక సాహిత్య సంప్రదాయ కుటుంబం లో పుట్టిన మహా శ్వేతా దేవి చిన్న వయస్సులోనే ‘ గణ నాట్య ‘ అనే ఒక ధియేటర్ బృందం తో కలిసి పని చేసింది. 1930,40 ల్లో ‘ గణ నాట్య ‘ అంటే సామాజిక రాజకీయ విప్లవ సంకేతం. ఆనాడు బెంగాల్ లోని పల్లె సీమల్లో ‘ గణ నాట్య ‘ గజ్జెల మోత వినిపించని ఊరు లేదు. ‘ గణ నాట్య ‘ అడుగు పెట్టిన చోట అజ్నానానికి నిలవ నీడ లేదు. కలకత్తా విశ్వ విద్యాలయం లో ఆంగ్ల సాహిత్యం లో ఎమ్మే చదువుతున్న కాలం లో కూడా మహాశ్వేత ‘ గణ నాట్య ‘ ప్రభావం తో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక రంగం లో తలమునకలుగా వుండేది. అతి కొద్ది కాలం లోనే ఆమె అధ్యాపకురాలిగా , పత్రికా రచయితగా ఉద్యోగ జీవితం లోకి అడుగిడింది.

మన దేశాన్ని చేజిక్కించుకొని దుష్ట పాలన సాగిస్తున్న తెల్లవాళ్లని గజ గజ వణికించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాన్ని ఆధారం గా తీసుకొని చేసిన ప్రయోగాత్మక రచన “ ఝాన్సీర్ రాణి ‘ తో ఆమె సాహిత్య జీవితం 1956 లో మొదలైంది.

కేవలం గ్రంధాలయాలు శోధించి, చరిత్ర పుస్తకాల ఆధారాలతోనే ఆమె ఈ జీవిత చరిత్ర రాయలేదు. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగిందో, ఆ నేల మీద జీవిస్తున్న సామాన్య జన హృదయాలో ఝాన్సీ లక్ష్మీ బాయి ఎలా శాశ్వతం గా నిలిచి పోయిందో, ఇప్పటికీ ఆ నేల మీద, ఆ ప్రజానీకం లో ఆ వీరనారి జ్నాపకాలు ఏ విధంగా సజీవం గా వున్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహా శ్వేత చేసిన ప్రయోగం. నిరుద్యోగ రక్కసి ఒక వైపు పట్టి పీడిస్తున్నా, కుటుంబం లో భార్య భర్తలిద్దరికీ ఉద్యోగం కూడా లేని దుర్భర స్థితి వున్నప్పటికీ నాలుగు వందల రూపాయలు అప్పు చేసి బుందేల్ ఖాండ్ కి ప్రయాణమైంది మహా శ్వేత. బుందేల్ ఖాండ్ చుట్టూరా ఎన్నో ఉర్లు తిరిగింది. మామూలు జనం తో ముఖ్యం గా స్త్రీలతో కలిసి మాట్లాడింది. తరాలుగా చెప్పుకునే కథల్ని రికార్డ్ చేసింది. ఆ పరిశోధన ఫలితమే ఆమె మొదటి రచన ‘ ఝాన్సీర్ రాణి’.

ఆ తరువాత నాలుగు దశాబ్దాల పైబడిన సాహిత్య జీవితం లో ఆమె ఇరవై సంపుటాల కథలు, వందకి పైగా నవలలు, వందల కొద్దీ వ్యాసాలూ, ఉపన్యాసాలూ ఆమె బహుముఖ ప్రతిభా కి నిలువుటద్దాలు. భారత దేశం లోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన జ్నానపీఠ పురస్కారాన్ని ఆమె గెలుచుకుంది. ‘ ఆసియా నోబెల్ గా  పేరు పొందిన రామన్ మెగాసెసే అవార్డ్ ఆమెకు దక్కింది. ఒక తల్లి ఆత్మ ఘోష ని అక్షరబద్ధం చేసిన ‘ హజార్ చౌరాసీ మా ‘నవల ప్రసిద్ధ దర్శకుడు గోవింద్ నిహలానీ దర్శకత్వం లో చిత్రం గా వెలువడి , ఆమె కీర్తి ని అంతర్జాతీయ పటం మీద నిలబెట్టింది.

mohaseta1468494824

1965 లో పలమావు అనే ఒక గిరిజన గూడేన్ని చూసిన తర్వాత మహాశ్వేత లో చాలా మార్పు వచ్చింది. “ ఈ ఊరు గిరిజన భారతానికి అద్దం” అని ఆమె అనుకుంది. ఆ ఊళ్ళోని భూమి లేని నిరుపేద గిరిజనుల దారుణ జీవన స్థితిగతులూ, భూమి వున్న ధన స్వాముల అరాచకాలూ ఆమె ఆలోచనల్ని మేల్కొలిపాయి. నిజమైన భూమి బిడ్డలకీ, భూమి ని బలవంతాన స్వాధీనం చేసుకొని గిరిజనుల నోటి మట్టికొట్టి విలాసం గా బతుకుతున్న భూస్వాములకీ మధ్య జీవితం లో ఇన్ని వ్యత్యాసలున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పు పేరిట గిరిజనుల మీద పెత్తనం సాగిస్తున్న భూస్వాముల దాష్టీకాన్ని ఎండ కట్టాలని ఆనాడే ఆమె ప్రతిజ్న చేసింది. ఇంక కాలినడకన గిరిజన గూడేలన్నీ తిరగడం మొదలుపెట్టింది.

తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహా శ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రం గా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నారో ఆ పీడితుల నిజ జీవితం లో, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేత దేవిది.

ఒక వైపు దేశం 21 వ శతాబ్దం లోకి ఉరుకులు పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న దశ లోనే మరో వైపు అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కక ఆదివాసులు బాధిత, పీడిత ప్రేక్షక జన సమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని కంకణం కట్టుకుంది. అడవి బిడ్డల హక్కుల సాధన కోసం నడుం బిగించింది. వివిధ అవార్డుల నుంచి తనకు అందిన వేల కొద్దీ ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రి గా కాకుండా ఒక క్రియాశీల కార్యకర్త గా భారతీయ గిరిజన జీవిత చరిత్ర పైన చెక్కు చెదరని ముద్ర వేసింది.

గిరిజనల బతుకుల్లో వెలుగులు నింపే దశ లో ఆమె మొదటి మెట్టు: వాళ్ళ ఆర్ధిక స్థాయి ని పెంచడం, జీవన స్థితి ని మెరుగు పరచడం. ఇప్పటికే గిరిజనులకు అందుబాటు లో వున్న వ్యవసాయం, పాడి సంపాదల్ని ఆధారం గా తీసుకొని , వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలో శాస్త్రీయం గా శిక్షణ ఇవ్వడం మహాశ్వేత సాధించిన తొలి విజయం. అదే సమయం లో వాళ్ళను అక్షరాస్యులుగా చేయడం. అందుబాటు లో వున్న వనరులు, అక్షరాస్యత రెండూ గిరిజనుల బతుకుల్ని మార్చాయంటుంది మహా శ్వేత. ఇంతకు ముందు ఒకే ఒక్క పంట వేసి, భూమిని పోడు తో పాడు చేసే స్థితి నుంచి ఇప్పుడు అదే భూమి లో మూడు పంటలు వేసే స్థితి కి గిరిజనులు వెళ్లారు. దాంతో గిరిజనులు ఆర్ధిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరగడమే కాదు, వాళ్ళలో కొండంత ఆత్మ విశ్వాసం మేల్కోంది. ఇంతకు ముందు పూట కింత సరిపోయేటంత మాత్రమే పండించిన గిరిజనం ఇప్పుడు శక్తి సామర్ధ్యాలున్న రైతులుగా మారి, ధాన్యం తో పాటు బంగాళా దుంపలు, వేరుశనగల్లాంటివి కూడా పండిస్తున్నారు. కాసింత నమ్మకమిస్తే చాలు, కొండల్ని పిండి చేస్తాం అనే గొప్ప జీవన సూత్రం ఇప్పుడు వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.

ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకు వచ్చిన వెలుగులు లెక్కలేనన్నీ. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్య సమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతి వృత్తుల్ని, హస్త కళా నైపుణ్యాన్ని వినియోగం లోకి తీసుకువస్తున్నాయి. వాళ్ళ చేతుల్లోంచి తయారైన అద్భుతమైన , కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యం తో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని ఛిన్నాభిన్నామయిపోతున్న స్థానిక కళా రూపాలకు పునర్జన్మనిస్తున్నారు ఈ గిరిజన మహిళలు.

కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి, నేరమే జీవితం గా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయడం మహా శ్వేత ఇటీవలి గొప్ప విజయం. సమాజం, అధికార వ్యవస్థ చెక్కిన వికృత నేర శిల్పాలుగా మారిన దాదాపు రెండున్నర కోట్ల మందిని నేర కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నది మహా శ్వేత శపథం. విషాదం ఏమిటంటే పురిలియా లోని ఖేరియా శబర అనే తెగకు చెందిన వీళ్లని గిరిజనుల్లోని మిగిలిన తెగలవారు కూడా నేరస్తులు గానే పరిగణించే ఈ తెగను అక్కున చేర్చుకుని, వారి జీవితాల్నీ మార్చడానికి, వాళ్ళ పట్ల సమాజ దృక్పథం లో మార్పు తీసుకురావడానికి మహాశ్వేత పోరాడుతోంది. దారుణం ఏమిటంటే , పోలీసు వ్యవస్థ వీళ్లను ఇంకా నేరస్తులు గానే మారుస్తోంది.
9 ఏళ్ల క్రితం శబర తెగకు చెందిన బుధాన్ అనే ఒక గిరిజనుడ్ని పోలీసులే కొట్టి చంపిన ఉదంతం తో ఈ పోరాటానికి నాంది పలికింది మహా శ్వేత. బుధాన్ ని కొట్టి చంపిన పోలీసుల్ని కలకత్తా హై కోర్ట్ కి ఈడ్చి న్యాయపోరాటం మొదలెట్టింది మహాశ్వేత . ఈ పోరాటం లో శబర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ళ చరిత్ర లో మొట్ట మొదటిసారిగా ఒక శబర గిరిజనుడు కోర్టులో నిలదొక్కుకొని విజయం సాధించాడు.

మహాశ్వేత పోరాటంతో అనేక సంఘాల కళ్ళు తెరుచుకున్నాయి. తరతరాలుగా నేర జీవితం వైపు నెత్తివేయబడిన శబర తెగల హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. అప్పటి నుంచీ శబర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమైంది. దేశం నలుమూలలా తిరిగి శబర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ళ కష్టాల్ని రికార్డ్ చేసింది. “ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ రైట్ యాక్షన్ గ్రూప్ “ అనే ఒక సంస్థ ఆమె ఆలోచనలకు అక్షర రూపం. దేశం లోని రెండు వందలకు పైగా గిరిజన తెగల్ని ఈ సంస్థ పరిధి లోకి తీసుకువచ్చింది.

2006 లో ఫ్రాంక్ఫర్డ్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి మహాశ్వేత దేవి విశిష్ట అతిధిగా హాజరైంది. ఇది భారతీయ సాహిత్యానికి, భారత దేశం లో పీడిత ఉద్యమాలకీ గర్వ కారణం. ఆ ఉత్సవంలో మహాశ్వేత కీలకోపన్యాసానికి కరగని గుండే లేదు. ఆమె మాట్లాడుతున్నంత సేపు ఆ ఉత్సవానికి వచ్చిన వందల కొద్దీ రచయితల కళ్ళు చెమరుస్తూనే వున్నాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల మతాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆమె బాధ పాడింది. దుష్ట శక్తుల పన్నాగం లో భిన్న సంస్కృతుల నాగరికత అణిగిపోయిందనీ ఆవేదన పడింది.

*

ఆధునిక తెలుగు కవితా సదస్సు

 

 

 

~

ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో మొదలైన ఆధునిక తెలుగు వచన కవిత్వం ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిలోకీ అత్యున్నత స్థాయిలో కొనసాగుచున్నది. కవుల సంఖ్య, వెలువడుతున్న కవితల, కవితా సంపుటాల సంఖ్య, కవిత్వ పాఠకుల సంఖ్య, పత్రికలలో కవిత్వానికి దొరుకుతున్న స్థలం వంటి ఏ ప్రమాణాలతో చూసినా, కవితల వస్తు శిల్పాల విశిష్టత దృష్ట్యా చూసినా, కవిత్వంలో ప్రతిఫలిస్తున్న సామాజిక సమస్యల, పరిష్కారాల, అనుభూతుల దృష్ట్యా చూసినా కవిత్వానిదే అన్ని ప్రక్రియల్లోకీ అత్యున్నత స్థానం. వెయ్యి సంవత్సరాల తెలుగు లిఖిత సాహిత్య చరిత్రలో ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా ఏకైక, అతి ప్రధాన ప్రక్రియగా రాజ్యం చేసిన కవిత్వం ఇవాళ అనేక ప్రక్రియల్లో ఒకటిగా ఉన్నప్పటికీ సమాజపు ఆదరణలో తన గత వైభవాన్ని కోల్పోలేదు.

మరీ ముఖ్యంగా గత అర్థశతాబ్ది పరిణామాలనే చూస్తే తెలుగు కవిత్వ ప్రక్రియ విప్లవవాదం, స్త్రీవాదం, దళితవాదం, బహుజనవాదం, మైనారిటీవాదం, ప్రాంతీయవాదం వంటి సామాజిక ఉద్యమాలతో జవజీవాలు పెంచుకుని పరిపుష్టమయింది. తెలుగు కవిత్వం అంతకుముందు తెలియని వస్తువులనూ, శిల్ప శైలీ పద్ధతులనూ, నుడికారాన్నీ ఎన్నిటినో గత నాలుగైదు దశాబ్దాలలో సంతరించుకున్నది. ఈ కవిత్వ సంరంభాన్ని సన్నిహితంగా పరిశీలించడం ఆసక్తిదాయకంగా, ప్రేరణాత్మకంగా ఉంటుంది.

అటువంటి ఆసక్తిదాయకమైన, ప్రేరణాత్మకమైన పనికి దేశ రాజధానీ నగరంలో వేదిక కల్పించాలనీ, ఢిల్లీ లోని తెలుగువారికి ఈ కవిత్వ రుచులు ఉదాహరణప్రాయంగానైనా అందించాలనీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ,   విభిన్న దృక్పథాలకు, కవితా పద్ధతులకు ప్రాతినిధ్యం వహించే ఏడు మంది కవులతో ఒక రోజంతా కవిత్వం గురించి చర్చించడానికీ, వారి కవిత్వాన్ని వినడానికీ, ఇతర ప్రభావశీల కవిత్వం గురించి తెలుసుకోవడానికీ ఢిల్లీ లోని తెలుగు వారికి ఇది ఒక అరుదైన అవకాశం.

అంతే కాక సాహిత్యానికి రంగస్థలానికి ఉన్న దగ్గర సంబందాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రఖ్యాత రంగస్థల కార్యకర్త , కేంద్ర  సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మాయా కృష్ణరావు గారి “Walk the Talk” ఏకపాత్రాభినయంను ఏర్పాటు చేయడం జరిగింది.

Sadassu

      ఆఖరి మెట్టుపైనుండి..

 

 

 

                                                         రామా చంద్రమౌళి

 

 

ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టుపైనుండి

ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ

ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర

ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా –

ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా

పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు

అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ

గజల్ గాయని  ఒక్కో వాక్యకణికను

యజ్ఞం లోకి సమిధగా అర్పిస్తున్నపుడు

అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో

సముద్ర జలాలపై లార్క్ పక్షుల్లా –

భూమిలో విత్తనమైనా, పిడికిట్లో నిప్పైనా

ఎన్నాళ్ళు దాగుంటుంది

మొలకెత్తడం.. దహించడం అనివార్యం కదా –

 

అర్థరాత్రి  దాటుతూంటుంది.. అంతా మత్తు.. స్వరమధురిమ మైకం

వజ్రాల హారాలేవో తెగిపోతున్నట్టు

దీపజ్వాలలేవో తీయగా కాలుస్తూ నిశ్శేషపరుస్తున్నట్టు

శరీరం ఉంటుంది

కాని ఉన్మత్తచిత్తయైన ఆత్మ ఉండదు

అడవివంటి అంతరంగం నిండా వందలవేల పక్షుల కలకలం

ఒక మనిషి  సున్నా ఔతుండగా..  మరొకరు ఒక ఒకటౌతారు

సున్నా ప్రక్కన ఒకటి.. ఒకటి ప్రక్కన సున్నా

విలువలు విలోమానులోమాలై

వడ్రంగి పిట్టొకటి తాటిచెట్టును ముక్కుతో పొడుస్తున్న చప్పుడు

పెక్ పెక్ పెక్

తొర్ర ఎక్కడేర్పడ్తోందో తెలియదు

 

రాత్రి ముషాయిరాకు వస్తున్నపుడు

సందు మలుపు చీకటి నీడలో

వీధికుక్క అతనిలోని మరకను పసిగట్టి

మొరిగిన చప్పుడు .. ఫడేళ్మని తెగిన ఫిడేల్ తీగ

పశ్చాత్తాపం ఎప్పుడూ భళ్ళున పగిలిన పింగాణీ పాత్రే

ముక్కలెప్పుడూ తిరిగి అతకవు

కరిగించాలి.. అతకనివాటిని కరిగించాలి

విరుగుట.. పగులుట.. అతుకుట

జీవితమంతా ఆత్మరక్షణే-

ఆరిన దీపం చుట్టూ.. రెండు చేతుల దడి

చివరికి ముందర ఒక ఖాళీ పాత్ర

నిండడంకోసం ఎదురుచూపు

మాసిన గోడలపై .. ఉమ్మేసిన పాన్ మరకలు

ఎక్కడిదో గాలిలో తేలివస్తూ

నిన్నటి ముషాయిరాలో పాడిన ఎంగిలిపాట ఖండిత వాక్యం

కానీళ్ళోడ్తూ-

ఇంకా తెల్లవారక ముందే

నది ఒడ్డుపై ఎవరో.. జలహారతిస్తున్నారు

రెండు చేతుల్లో ఇత్తడి పళ్ళెం ధగధగా మెరుస్తూ .. ఎర్రగా మంట

ఆకాశం తగలబడి పోతోంది –

 

*

 

 

 

 

Sent to Sri Afsar SARANGA

Dt: 12-04-2016

 

చీకటీగలు -4

 

(గత వారం తరువాయి)

శ్రీమన్నారాయణే చీకటీగ తాత్పర్యానికి దగ్గరిగా వస్తాడనిపించింది. ఎంత మేధావైతేనేం… పెళ్ళానీకీ కొడుక్కి ఇలా ఒక్కోమాటు స్నేహితులమయినా మాకూ చీకాకు కలిగించే శ్రీమన్నారాయణ చీకటీగలాగన్పిస్తాడు… పాపం అతనికీ సమాజమే చీకటీగ మూక… అస్వామాఫ్‌ ఐన్యాట్స్‌… నిజానికతని మానసిక వ్యవస్థ తోటి సమాజానికి సంబంధమెందుకుండాలి? అసలుండదు కూడానూ… వ్యష్టికి సమష్టితో అవసరంకానీ సమష్టికి వ్యక్తి మానసిక జీవితంతో అవసరం లేదు. తనకనుగుణంగా వ్యక్తి అంతర్భహిర్ప్రపంచాలుండాలనే సమాజం కోరుకుంటుంది… అట్లా బ్రతకలేని వ్యక్తికి సమాజం అనునిత్యం చీకాకు కలిగిస్తూనే వుంటుంది. తప్పెవరిదన్న ప్రశ్న అస్సలుదయించడానికే వీల్లేదు.

అనాదినించీ జరిగిపోయిన నిర్ణయమది… పూర్‌ శ్రీమన్నారాయణలు… ఎంతమందో… కన్పించే శ్రీమాన్నారాయణొక్కడుంటే నాకళ్ళముందే అదృశ్య శ్రీమన్నారాయణులెంతమంది తిరుగాడుతున్నారో…

చీకటీగల్లా ముసురుకుంటూ పుండైన మెదడు చుట్టూ ఆలోచనలు… అయాం నాటోన్లీ సారీఫార్‌ శ్రీమన్నారాయణ… అయాం సారీ ఫర్మైసెల్ఫ్‌… అయ్‌ పిటీ యూ మై ఓన్‌ సెల్ఫ్‌ అనుకొంటూ ఇంటర్మీడియట్‌ పిల్లలకి  ఖలీక్‌ జిబ్రాన్‌ క్లాసు తీసుకునేందుకు సిద్ధమయ్యా…

జిబ్రాన్‌ జిబ్రాన్‌, లెబనాన్‌. పలెస్తీను… దర్జీతల్లి జూదరి తండ్రి… చిరంజీవిగా వుండాలనే కోరికతో ఏభై నిండకనే మరణించీ… క్షయించకూడదని క్షయతో క్షయించి, తను పుట్టిన మట్టి మీది మమకారంతో… అదే మట్టిలో లయమయిపోయి. అటు జియాదాతో… యిటు హ్యాస్కెల్‌తో ఉత్తుత్తి ఉత్తర ప్రేమాయణం నడపీ… సమాధి శిలాఫకం మీద తను చిరంజీవినని చెపుతూ రాయించుకున్న మాటలు..

‘‘నా సమాధి శిలమీద నే చూసుకోవాలనుకున్న వాక్యం…. నేను మీలా జీవించే వున్నాను. మీ పక్కనే నించుని రెప్పలార్పి ఒక్కసారి కలియచూడండి మీముందే వుంటాను…’’

నిజమే ప్రాణమున్న మనందరికీ ఖలీల్‌ జిబ్రానుంటాడు. అతని సమాధి రాతి మీద వాక్యముంటుంది. కానీ జిబ్రాన్‌కు ఈ ప్రపంచమే లేదు కదా మన ప్రపంచమేకాదు తనదైన ప్రపంచమే లేదు కదా… అప్పుడెప్పుడో ఎనభై ఏళ్ళ క్రితమే క్షయతో క్షయించిన లివరు జబ్బుతో అంతరించి పోయిన ‘నేను జిబ్రాన్‌ జిబ్రాన్ని’ అన్న ఆలోచనతోపాటే అతని ప్రపంచం కూడా లుప్తమయిపోయింది కదా…. ఇవన్నీ పిల్లలకి పాఠంతోపాటు చెబితే…. ఇంగ్లీషు సారుకు పిచ్చిపట్టింద్రోయ్‌ అనంటారు.

ముసురుతున్న చీకటీగ ఆలోచనల్ని విసురుకుంటూ కదిలా…

***

సాయంత్రం ఏడైనా సుభద్ర రాలే… ఉదయాన్నే చెప్పింది కదా వసంతతో షాపింగని… ఏమేం కొంటారో…. సుభద్రెళ్ళిందంటే ఏదో ఖరీదైందే అయి వుంటుంది…

ఇంటికి రాగానే తిని మిగిల్న వంకాయ కూరా చారూ ఫ్రిజ్‌లో సర్ది…. మిగిలిన అన్నంగడ్డని ఇంటిగేటు బయట కాలువగట్టు మీదేసి…. రెండుసార్లు శ్రీమన్నారాయణకి ఫోన్‌ ట్రైచేసి… విసుక్కుని కాస్సేపు నడుం వాల్చి…. టీవీ ఆన్జేసి వార్తనబడే నాన్సెన్స్‌… ఓ తెలుగూ… ఓ ఇంగ్లీష్‌… ఓ హిందీ సినెమాల్ని కలిపి ముక్కలు ముక్కులుగా చూసి విసుగేసి… టీ కాచి… ఎండిపోయిన అల్లం ముక్కని విషాదంగా చూసి యాలక్కాయ దొరక్క…. అంచు విరిగిన పింగాణీ కప్పును ప్రేమగా నిమిరి…. ఇంటిబయట కడియం మొక్కల కుండీ మధ్య నిబడి సిగరెట్‌ని మళ్ళీ ఓ రోజులా పీల్చి…. సాయంత్రం ప్రశ్నని భుజానికి తగిలించుకుని…. లోపలికెళ్ళి చల్లారిన్టీని వేడిచేసి థర్మాస్‌లో నింపి… మిగిలించుక్కల్ని మళ్ళీ నోట్లో పోసుకుని…. సాయంత్రం ప్రశ్నకి సమాధానంగా రంగరాజుల్కి ఫోన్కొట్టా… ‘‘సారు పొద్దున దాసు క్యాంటీన్కిపోయి టిఫిన్దిని దాస్కాడ వెయ్యి రుపాయలిప్పించుకున్నాంట… యాటికి బోయినాడో… సాయింత్రం మీనాక్షి కాటికిరా… సుబ్బార్డికి ఫోన్చేస్తా… ఒగ్గంటకి మనకి రూమిస్తాడ్లే కంటమన్నగ్గూడ రింగిస్తా’’ ఓ సంక్లిష్టతకి ముక్కలు ముక్కలు సమాధానంగా రంగరాజు…

శ్రీమన్నారాయణెటెళ్ళుంటాడూ? ఎందుకో అసంకల్పితంగా మెదడు మైత్రి బొమ్మను కళ్ళముందు ఫ్లాష్‌ చేసింది… శ్రీమన్నారాయణ ఆంతరంగికత ఆ అమ్మాయికి సుపరిచితమేమో! అన్పించింది. అనిపిస్తుంది.. స్త్రీ పురుష స్నేహాలూ, సంబంధాలూ… కొన్ని యుగాలుగా పాతుకుపోయిన చట్రాల్లోకాక భిన్నంగా వుండటం… ఎంత రేషనల్‌ మనుషులకైనా పొసగదేమో…. ‘అయితే ఏం?’ అన్న ప్రశ్న రాకూడదసలు… తల విదిలించుకుని. బియ్యం కడిగి ఎలెక్ట్రిక్‌ కుక్కరాన్చేసి… దాదాపు అర్ధ శతాబ్దంగా చూసుకుంటున్నా ఎప్పటికీ పరిచయం లేని నా ముఖాన్ని అద్దంలో చూసుకుని…. టీ ఫ్లాస్క్‌… ఓ ఖాళీ కప్పుతో పాటు నాలుక్కుర్చీ డైనింగ్టేబిల్మీదుంచి… ‘సీయూ సుభద్రా’ అనుకుని తలుపు ఆటోలాక్చేసి తాళాలు బైక్‌ డబ్బాలో వేసుకుని రోడ్డెక్కా… కదిలీ కదలంగానే ‘మామయ్యా!’ అన్న గొంతు… గుర్తుపట్టా అది కంఠం కూతురు కంఠం దమయంతిది… ఆపి… దగ్గిర్రా అన్నట్టు తలూపా… ‘‘ఏమిటే నువ్వీ డకోటామీదా… అంతంత పెద్ద బళ్ళు నడిపే మీ నాన్నకే మాటిందిదీ… నువ్వు నడిపేస్తున్నావ్‌… ఇటెక్కడికొచ్చావ్‌?’’ అడిగా.

‘‘ఫ్రెండుంది మావయ్యా ఇక్కడా… అత్తయ్యలేదా… చాల్రోజులైంది మాటాడించెళ్దామనిటొచ్చా… నాన్నగారికి తెలీకుండా ఎత్తుకొచ్చీసా బండీ’’ పదహారు దాటినా పసితనపు ఛాయలు వదల్లేదీ పిల్లకి.

‘‘అత్తయ్య లేదు కానీ నే బైటికెళ్తున్నా… తిన్నగా యింటికెళ్ళు… వెనకాలి రోడ్డు మీదెళ్లు. మెయిన్రోడ్లో వద్దు… ఇంటికెళ్ళింతర్వాత నాన్నకు చెప్పు నాకు ఫోన్చేయమని… జాగ్రత్తా… అదాగిందంటే తోసుకెళ్ళే శక్తి కూడా లేదు నీకు. వంకాయలు బాగున్నాయనమ్మకి చెప్పు. వెళ్ళు… వెళ్ళు.. నాన్నరుస్తూ వుంటాడు…’’ కదలా.

ఇదే ఓ నలభై ఏభై ఏళ్ళ క్రితమయితే యీ పిల్లకి పెళ్ళై ఓ ఇంటి ఇల్లాలై.. బరువు బాధ్యతలు తకెత్తుకునుండేది…

మార్పు… మార్పు చాలా చాలా త్వరగా వచ్చేస్తోంది.

వచ్చేయడమేమిటి కమ్ముకొస్తోంది…

సాంకేతిక విస్ఫోటం… మేధో విస్ఫోటం…

ఇదెంత వరకు విస్తరిస్తుందీ? ‘నికొలాడ కాండార్సె అన్నట్టు యీ విస్తరణకు పరిమితుల్లేవ్‌… పరిపూర్ణతవేపు మానవమేధ, ‘ఈ ప్రకృతిలో, అనంత విశ్వంలో ఈ భూమి మనుగడ వున్నంత వరకూ విస్తరిస్తూనే వుంటుంది. ఎన్ని అవరోధాలెదురైనా’ కానీ 2040కల్లా కృత్రిమ మేధ, మానవ మేధను జయించేస్తుందని కొందరు… అంటే ఇంకో రెండు మూడు దశాబ్దాల్లో యిప్పటి నాలాంటి వాళ్ళ మట్టి బుర్ర వూహకతీతంగా నాగరికతలు మారిపోతాయా… అచ్చూటానికి నేను బ్రతికేవుంటానా? ఆర్టిఫిషల్‌ జనరల్‌ ఇన్టలిజెన్స్‌ ప్రపంచాన్ని పాలిస్తుందా? చూస్తుండగానే కళ్ళెదుటే మారిపోతోంది కాలం. ఏదో టెక్నలాజికల్‌ సింగ్యులారిటీ… నా పిండాకూడూ న్యుమనో ఓల్ట్‌మనో 2050 కల్లా అయిపోతుంది అడ్వాన్స్‌మెంటంటాడే! నేనిట్లాగే వుంటా.. వుండి తీరతా… నా ఆలోచనిట్లాగే వుంటాయి… ఎన్ని చరిత్రలు చదివినా… ఎంత భవిష్యత్తు గురించి తొలుస్తున్నా నా మౌలిక ఆలోచనా వ్యవస్థ మారదుకదా… అదీ మారనుందా? పీపుల్స్‌ పార్క్‌ దగ్గర రోడ్డుకు అటువేపు స్కూటీ మీద వెళ్తూ మైత్రి కన్పించింది. ఒక్కసారి… ఓ క్షణం ట్రాఫిక్‌ ఐలాండ్‌ దగ్గర యూటర్న్‌ తీసుకుని మైత్రిని వెంబడించి… శ్రీమన్నారాయణ గురించడగాలన్పించింది… ఆ ఆలోచన్ని తరిమేశా…

అక్భర్‌ భాయ్‌ పాన్‌షాపు ముందు కన్పించాడు కంఠం కొలీగ్‌ కండక్టర్‌ దయానంద్‌… ఆర్టీసీ సాంస్కృతిక ఉత్సవాల పోటీల్లో ఎప్పుడూ సంగీతం విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ వస్తాడు దయానంద్‌… మంచి కంపోసర్‌ కూడా… హిందుస్తానీ బాసురీ నేర్పరి… ఆగి అతన్ని పలకరించి… కాలే… సురేంద్రనాథ్‌ కాలే గురించి వాకబు చేసా…

‘‘అవున్సార్‌… కాలేసార్కి పెరాలిసిస్‌ అటాకయ్యింది. ఎడం కాలూ చెయ్యీ పన్చేయడం లేదు మాట కూడా రావడం లేదు… కంటమన్న చెప్పినట్టున్నాడు మీకు… కట్టించుకున్న బాబా ప్రభాత్‌ జర్దాపాన్లు జేబులో వేసుకుని నావేపు చూసి పెద్దగా నవ్వి ‘‘ఫోర్‌ట్వంటీ పాన్‌ సార్‌ రతన్‌ తీన్‌సౌ బాబా ఎక్‌సౌబీస్‌… మిల్కే బాబా ప్రభాత్‌ ఫోర్‌ ట్వంటీ’’ జేబులో వేస్కున్న పాన్‌ను తడుంకుంటూ ఎదరుగా వున్న హనిమిరెడ్డి వైన్స్‌ వేపు కదుల్తూ… ‘‘ఏస్తరా?’’ అనడిగి జవాబాసించకుండా వెళ్ళిపోయాడు. దయానంద్‌ సాంకల్కర్‌ ది ఫ్లాటిస్ట్‌… ఆర్టీసీ కండక్టర్‌… అతనో విరుద్ధ భాసాలంకారం. ఆక్సిమొరాన్‌ నాకు….

***

మీనాక్షి లాడ్జ్‌ ముసలి రిసెప్షనిస్ట్‌ నన్ను చూడగానే వేళ్ళ మద్య బాల్పెన్నున్న కుడిచెయ్యి పైకెత్తి ‘వన్లెవన్‌’ అన్నాడు…

గదిలో ఎవ్వరూలేరు… రూం బాయ్‌ గ్లాసు కడిగి ప్లాస్టిక్‌ జగ్గుతో నీళ్ళు టీపాయ్‌ మీద పెట్టి నాకు ఒంటి చెయ్యి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ప్లాస్టిక్కుర్చీలో కూaబడి మంచం మీదకి కాళ్ళు చాచి కంఠంకు ఫోన్చేసా… రింగైంది లిఫ్ట్‌ చేయలేదు… దార్లో వుండుంటాడనుకుని… రంగరాజుల్కిచేసా… ‘‘సార్‌… వికట్రీ టాకీస్కాడున్నా. రెన్నిమిషాల్లో ఆడుంటా…. ఏం తెప్పియ్యాకు…. మిల్ట్రీదుంది నాకాడ… వచ్చేస్తాలే… కంఠమన్నగ్గూడ చెప్నా వస్తాంటాడు… సోడాలూ నీల్లూ కోలా దెప్పిచ్చు… శంకర్‌ మిటాయిలో స్టఫ్‌ తీస్కున్న వన్టౌన్కి పోయింటి… వచ్చేస్తాండా’’ తన రివాజు హడావుడి మాటలు మాట్లాడాడు రంగరాజు.

ఫోన్కట్చేసేంతలో… కంఠం వచ్చేసాడు..

‘‘మేషారెటెళ్ళాడో సార్‌… ఉదయాన్నే దాసు క్యాన్టీన్కెళ్ళి టిఫినీు చేసి ఓ వెయ్యిరూపాయు తీసుకెళ్ళాట్ట… గది తాళమెట్టుంది… రెండు మూడు మాట్లెళ్ళి చూసా… ఎటెళ్ళుండొచ్చంటారూ? ఏవిటో ఆయనా ఆయన పద్దతులూ… ఎప్పటికీ అర్థమవని మనిషి… అయినా ఏదో పారిపోయినట్టిదేమిటీ… అంతా ఆయన స్వార్జితమే… ఎవ్వళ్ళకీ భయపడక్కర్లే… దాసుకూడా వస్తా వీలవుతే అన్నాడు.. క్యాష్లో అమ్మాయిని కూచోబెట్టి యిటొస్తానన్నాడు… రాజుల్కి ఫోన్కొట్టారా? పాపొచ్చిందిటగా… ఒద్దే అన్నా విందండీ చెప్పా చెయ్యక మోపెడ్‌ కాస్తదూరం తోసుకెళ్ళి స్టార్ట్‌చేసుకుని వెళ్ళిపోతుంది… స్కూటీ కావాల్ట… ఎక్కడ్సార్‌… సెకండ్హాండైనా ఇరవై పాతిక పెట్టంది రాదు… వాళ్ళమ్మగారమెక్కువైంది… నాదికూడా లెండి. ఉదయాన వాళ్లమాయ్య, మా బామ్మర్దొచ్చాడు కద్సార్‌… వాడు కొనిపెడ్తానన్నాడు దానికి… వాడికీ పిల్లల్లేరుగా… ఇదంటే మరీ గారం…’’ కంఠం కళ్ళల్లో కూతురి పట్ల ప్రేమ దిగంబరంగా బహిర్గతమవుతోంది..

***

కోడీ కోడి పిల్లలూ.. పేద్దగంపా గుర్తుకొచ్చాయి… జస్ట్‌ యానిమలిన్ట్సింక్ట్‌? కేశవరెడ్డి పందీ… పిల్లలూ కూడా గుర్తొచ్చాయి.

పాపమాపిల్ల దయమంతిని కోడిపిల్లతోటీ, పందిపిల్లతోటీ పోల్చటం బాలేదనిపించింది…. ఆ పిల్ల దమయంతి చాలా అదంగా వుంటుంది… కోడిపిల్లలూ, పంది పిల్లలూ ముద్దుముద్దుగానే వుంటాయి కదా? ఏమిటీఅందం కాన్సెప్టు? ఒక్క మనిషికే అందమూ… వికారమూ… ఆలోచనన్నదేడిచింది కాబట్టి… ఈస్తటిక్‌ యాటిట్యూడూ… అనుభూతి ఇంద్రియజ్ఞానం… ఈస్తటిక్సూ తాత్త్వికచింతనా… నానా గందరగోళం… కంటికీ మనసుకీ చూడగానే హాయిగొలిపేదంతా అందమే… మళ్ళీ హాయి ఏమిటో? అదీ ఓ గజిబిజీ. అన్నీ… అందాలూ… హాయిూ… వికృతాలూ… రుచులూ… మంచీచెడూ అన్నీ అన్నీ సాపేక్షాలే… అస్సలు పోలిక లేక గుణమనేదుంటుందా?  ఈ ఆలోచన్లన్నీ ఉత్తి పనికిమాలినాలోచల్లే… దమయంతీ, కోడిపిల్లా, పందిపిల్లా అన్నీ అందరూ… ఏమిటో వ్యాకరణం? ముద్దుగా అందంగానే అనిపిస్తాయి…

‘‘వీడు ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కలే వున్నాడు… మందుందన్నాడు.. బాయ్‌ని పిల్చి… కోలా… సోడా… నీళ్ళూ తెప్పిద్దాం..’’ కంఠంతోటన్నాను.

కంఠం అందమే అతని కూతురు దమయంతికొచ్చింది. స్ఫురద్రూపి కంఠం… మళ్ళీ దీన్సిగ్గోసినందం. సార్త్ర్‌, సోక్రెటిస్‌ లు కురూపితనంపై తమతమ వైయక్తిక యుద్ధాలు… తాత్త్విక చింతనలు… అందం వికృతత్వాతాత్త్వికత.. ష్‌… హూష్‌… తోలేయ్‌ తోలేయ్‌ చీకటీగలు…

(సశేషం)

 

తాతరాయి చెప్పిన చరిత్ర

Tatarai Cheppina Katha

అప్పటికి కొంతకాలమైంది నేను నా కొండ నుంచి విడిపడి. పక్కనే వున్న అడ్డరాయితో బాగా పరిచయం కుదిరింది. ఎన్నాళ్ళ నుంచి అలా వుందో కానీ బాగా నునుపుతేలి మిలమిల మెరుస్తూ వుంటుంది. ఆ రోజు కూడా ఎండ నా ఒళ్ళు చుర్రెక్కిస్తుంటే, అడ్డరాయితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. సరిగ్గా అప్పుడే ఓ చిన్న గులకరాయి దొర్లుకుంటూ వచ్చి మా ముందర ఆగింది. నేనేమో అంత ఎత్తు ఇంత లావు వుంటాను. నా ముందు ఆ గులకరాయి ఏ పాటిది. నేను పెద్దగా పట్టించుకోలేదు.

“ఏంట్రా అబ్బాయిలూ మాట్లాడుకుంటున్నారు” అంటూ అటూ ఇటూ దొర్లింది గులకరాయి.

ఆ మాటతీరు అదీ నాకు బాగా చిరాకు కలిగించాయి. ఏదో పెద్దబండవాళ్ళం మాట్లాడుకుంటుంటే, మా మధ్యలో చేరి అలా మాట్లాడినందుకు నాకు చాలా కోపం వచ్చింది.

“ఏయ్… నీకు చిన్నంతరం పెద్దంతరం లేదా? ఏమిటా మాటలు?” గద్దించాను. చిన్నరాయి గరగరా నవ్వింది.

“ఎవరు? నువ్వు పెద్దా? నిన్నగాక  మొన్న పుట్టావు… అంతెత్తున శారీరం వుంటే సరిపోయిందా? వయసు బట్టి గౌరవం కానీ ఒడ్డుపొడవు బట్టి కాదోయ్..” అంది గులకరాయి.

నా కోపం ఇంకా పెరిగిపోయింది. “అయితే నీ వయసు నా వయసు కంటే ఎక్కువంటావు?” అన్నాను.

“ఓరి నీ బండపడ… కనిపించేదాన్ని బట్టి అంచనాలు వెయ్యకూడదురా… సరిగ్గా చూస్తే నేను మీకు తాతనవుతాను” అంటూ తన మీద పడ్డ ఎదురెండ నా ముఖానికి తిప్పికొడుతూ నిలబడిందా గులకరాయి.

అడ్డరాయి భళ్ళున నవ్వింది. “మేము గట్టిగా దొర్లితే భూమిలోకి దిగిపోతావు… నువ్వు మా తాతవా” అంది నవ్వలేక ఒగురుస్తూ.

“సరే, నా చరిత్ర చెప్తా వినండి. తాతనో కాదో మీరే చెప్పండి.” అని కథ మొదలుపెట్టింది. “మా ముత్తాత ఇరవై వేల ఏళ్ళ క్రితం ఒక పెద్ద కొండగా వుండేవాడు. అప్పుడప్పుడే మనుషులుగా మారుతున్న కొన్ని కోతులు ఆ కొండ మీద వుండేవంట. వాళ్ళు తల దాచుకోడానికి, అక్కడక్కడ సేకరించిన తిండి, జంతుకళేబరాలు పెట్టుకోడానికి మా తాతని తొలిచి ఒక గుహ చేసుకున్నారంట. ఆ కాలంలో అట్టా ఏర్పాటు చేసుకున్నోళ్ళే లేరని ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. మా తాత ఒంటిమీద ఏందేందో బొమ్మలు కూడా గీసినారంట ఆ మనుషులు.

కొన్నాళ్ళకి మా తాత ఆ కొండ నుంచి విడిపడి చదరంగా వుండే నేల మీద స్థిరపడ్డాడు. ఇంకొన్ని వేల ఏళ్ళ తరువాత ఓ ఎండాకాలం అనుకోకుండా ఓ చినుకు పడి రెండు ముక్కలయ్యాడు. వాళ్ళే మా పెదనాయన, మా నాయన. వాళ్ళిద్దరూ  ఓ శిల్పి కంట్లో పడ్డారు. ముందు మా నాయనని ఆయన చెక్కి చెక్కి ఓ శిల్పంగా మార్చాడు. అయితే దానికన్నా పెద్దది కావాలని రాజుగారు చెప్పాడంట. మా నాన్నని వదిలేసి పెదనాన్నని పెద్ద శిల్పంగా చేశారట. ఆయన్ని ఆ తరువాత దేవుడు అని పూజలు చేశారు. మతం అని ఒక కొత్త మంత్రం చదివారు. అదో రకం విప్లవం. అయితే పెద్దగా పనికిరాలేదంట.

ఇక్కడ మా నాన్న ఎండకి ఎండి, వానకి నాని నాన్న ఎన్నో ముక్కలయ్యాడు. నేనూ, ఇంకోంతమంది తమ్ముళ్ళు ఈ లోకంలో పడ్డాం. ఆ తరువాత ఒక చోటని లేదు, ఒక ఊరని లేదు. తిరిగి తిరిగి, అరిగి అరిగి అదిగో ఆ లారీలో పడి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి కాస్త సర్దుకునిందా రాయి.

“అట్నా. అయితే నువ్వు ఖచ్చితంగా మా తాతవే… అయితే నాలాంటి పిల్లరాయికి నీ లాంటి తాతరాయి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వుంటాయే… అవన్నీ నాకు నేర్పించు తాతా…” అని మనవడి గోమంతా పడ్డాను నేను.

“అలాగే చెప్తాలే కానీ మనవడా… ఇంతకీ మీరంతా ఎవరు? మిమ్మల్ని ఎవరు పుట్టించారు? ఆ కథలు చెప్పండి ముందు” అంటా పక్కనే వున్న మెత్తటి గడ్డి మీద కుదురుకున్నాడు తాతరాయి.

“మాదేముంది తాతా! అదిగో కొంచెం అవతలగా రాళ్ళని పగలగొడుతూ కొన్ని వింత జంతువులు తిరుగుతున్నాయే అక్కడ వుండేవాళ్ళం. అందరం కలిసి వున్నప్పుడు కొండగుట్ట అనేవాళ్ళు.”  అని నా పక్కనున్న అడ్డరాయి చెప్తుంటే నేను మధ్యలో అందుకున్నా.

“మధ్యలో ఆ వింత జంతువులు పైన ఎక్కి కొంత మనుషులు వచ్చారు. అప్పుడె తెలిసింది వాటిని మెషీన్లంటారని. ఏదో డెవలప్మెంట్ అంటా తలా ఒక జంతువుని మా మీదకు ఎక్కించి గడగడ మంటూ మమ్మల్ని ఇట్టా పుట్టించారు” అన్నాను.

“డెవలప్మెంటా?” అన్నాడు తాతరాయి ఆశ్చర్యంగా. ముసిలిరాయి చాదస్తం చూస్తే మా ఇద్దరికీ నవ్వొచ్చింది.

“నీకు తెలవదులే తాతా… డెవలప్మెంట్ అంటే అభివృద్ధి” అంది అడ్డరాయి అర్థం చెప్తూ.

తాతరాయి గడ్డి మొత్తం గిరగిరా దొర్లుకుంటూ నవ్వాడు. కాస్త ఆగి మళ్ళీ వెనక్కి దొర్లుకుంటూ నవ్వాడు. “ఈళ్ళకి ఇంకా ఈ అభివృద్ధి పిచ్చి చావలేదా?” అన్నాడు ఆగాక.

“అదేంది తాతా? వీళ్ళ అభివృద్ధి గురించి నీకు తెలుసా?” అన్నాను నా నీడ తాతరాయి మీద పడేలా సర్దుకుంటూ.

“తెలియకేం మనవడా… నేను చెప్పానే మా తాత, ఆయన కూడా ఈ అభివృద్ధి గురించి మా నాయనకి చెప్పాడంట. అంటే పదివేల ఏళ్ళ క్రితం సంగతి. ఆ కథ మీక్కూడా చెప్పమంటారా?” అన్నాడు

మేమంతా “చెప్పు తాతా, చెప్పు తాతా” అంటూ అటూ ఇటూ దొర్లాము. తాత కథ చెప్పడం మొదలుపెట్టాడు.

“ఒకప్పుడు… అంటే మా తాత కాలంలో కూడా ఈ మనుషులు వుండేవాళ్ళు…!! వాళ్ళు ఎప్పుడూ వుంటార్లే. చచ్చేవాళ్ళు చస్తుంటే, పుట్టేవాళ్ళు పుడుతుంటారు… అందువల్ల మునుషులు చచ్చినా మనిషి అనే ప్రాణి బతికే వుంటదంట. మనలాగ కాదు… సరే ఏం చెప్తున్నాను… ఆ… ఆ కాలంలో వాళ్ళు అడవుల్లో బతుక్కుంటా, చెట్టుచేమా ఎక్కుతా దిగుతా, కాయదుంప తినుకుంటా వుండేవాళ్ళు. ఒకోసారి గుంపులు గుంపులుగా పోయి, మీ లాంటి రాళ్ళ వెనక నిలబడి ఏదైనా జంతువు దొరికితే వేటాడి, దాన్ని తిని హాయిగా వుండేవాళ్ళు.” మధ్యలో ఆపి అటూ ఇటూ చూసి కొనసాగించాడు తాతరాయి –

“కొన్నాళ్ళయ్యాక ఒక పెద్ద విప్లవం వచ్చింది. దాన్ని ఇప్పటివాళ్ళు వ్యవసాయ విప్లవం అంటున్నారంట కానీ అప్పట్లో దానికేమీ పేరుండేది కాదు… ఏదైతేనేంది మనుషులందరూ, వేటాడ్డం మానేసి వడ్లు, గోధుమలు, దుంపలు పెంచడం మొదలుపెట్టారు. రాన్రాను పరిస్థితి మారిపోయింది. ఎకరాలకెకరాలు అవే వడ్లు, అవే గోధుమలు, అయ్యే దుంపలు… ఎక్కడో చీకటి రాజ్యంలో మొదలైందంట. ఆ తరువాత ఒక రాజ్యామని లేదు, దేశమని లేదు, నదని లేదు, సముద్రమని లేదు …అన్నింటినీ దాటుకోని పొయ్యినాయి. ఎక్కడ చూసినా అవే. ఓ వందా నూటాభై ఏళ్ళు గడిచినాయి. కావల్సినంత పంట, తిన్నంత తిండి… అప్పటిదాకా ఏడాడో తిరిగిన మనుషుల జాతి ఒక చోట కుదురుకున్నారు. గూడేలు, రాజ్యాలు, దేశాలు పుట్టుకొచ్చినాయి. అదే అభివృద్ధి అని పాటలు గట్టి పాడుకున్నారు..”  నేను ఏదో అడగబోతున్నానని తెలిసి అక్కడ ఆపాడు తాత.

నేను అడిగా –“తాతా! నువ్వు చెప్పినట్లు అభివృద్దే జరిగింది కదా… మరి ఆ మాట విని ఎందుకు నవ్వావు?” అన్నాను.

“నీక్కూడా మనుషుల్లానే తొందర ఎక్కువున్నట్లుందే మనవడా ఒక్కరవ్వ ఆగు… చెప్తున్నా కదా… ఎందాక చెప్పాను? ఆ… ఆపాట్న… అందరూ వ్యవసాయ విప్లవం వచ్చిందని సంబరపడ్డారు. నీలాగా నా లాగా కదలకుండా అంతా చూస్తున్న రాయి రప్పా గట్టిగట్టిగా నవ్వుకున్నాయంట. మా తాత (అప్పటికి ఇంకా పిల్లాడే) ఇదంతా చూసి, నీలాగే – “రాళ్ళల్లారా రప్పల్లారా ఎందుకు నవ్వుతున్నారు? అభివృద్ధి జరిగిన మాట నిజమే కదా” అని అడిగినాడంట.

అప్పుడు ఆ పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ నవ్వేసి – “ఒరేయ్ నాయనా… వాళ్ళకంటే బుద్ధి లేక అనుకుంటున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు?” అని అడిగినాయంట. ఇంకా వివరంగా చెప్పమని అడిగితే అయ్యి చెప్పడం మొదలెట్టినాయంట.

“ఒరేయ్ నాయనా… నువ్వింకా చిన్నరాయివి… సుత్తి దెబ్బకు, ఉలిదెబ్బకి తేడా తెలియనివాడివి. వాళ్ళు చెప్పగానే అభివృద్ధి జరిగిపోయిందని నమ్మితే ఎట్లా? ఒక్కసారి వాళ్ళని చూడు. ఇంతకు ముందు పూటకో రకం తినేవాళ్ళు. ఒకపూట ఆకులు, ఇంకోపూట తేనే, ఇంకోరోజు మాంసం, మళ్ళి ఒకరోజు పండ్లు ఇట్టా అన్ని రకాలు తినేవాళ్ళు, ఇప్పుడు చూడు పొద్దున బియ్యం, మధ్యాన్నం బియ్యం, రాత్రికి బియ్యం… ఇదీ ఒక తిండేనా? ఇట్టా తిని తిని, ఏదో ఒకరోజు శరీరానికి సరిపోయే పోషకాలు అందటంలేదని వాళ్ళే ఏడుస్తారు చూడు” అంది ఓ పెద్దతలరాయి.

“అంతేనా… అప్పుడు ఒకచోటని కాకుండా నాలుగు చోట్ల తిరిగే వాళ్ళు… ఆడవాళ్ళు కూడా అడవుల్లో, గుట్టల్లో తిరిగేవాళ్ళు. అట్టా తిరగడానికి బిడ్డలు ఎక్కువుంటే కష్టమని ఒక బిడ్డకి నడకొచ్చిందాకా ఇంకో బిడ్డని కనకుండా వుండేవాళ్ళు. మరి ఇప్పుడు? ఇల్లు కట్టుకున్నారు. చాటు మాటు కుదిరింది. పంటలు పండించేదానికి ఇంకో రెండు చేతులు వస్తాయిలే అని ఒకళ్ళ తరువాత ఒకళ్ళని కంటూనే వున్నారు. జనాభా పెరిగింది. చేతులున్నోళ్ళకి నోళ్ళు కూడా వుంటాయిగా… దానికోసం ఇంకా ఎక్కువ వడ్లు, గోధుమలు పండిస్తున్నారు…  దానికింకా నేల కావాల. ఇది నాదంటే ఇది నాదంటున్నారు. రేపు ఆ నేలకోసం తలకాయలు పగలగొట్టుకుంటారు…” అన్నాడు ఓ రాయప్ప.

తాతరాయి అక్కడ ఆపి కాస్త ఊపిరి తీసుకున్నాడు.

“ఇట్టా వ్యవసాయ విప్లవం గురించి మా తాతకు కథలు కథలుగా చెప్పాయి ఆ రాయీ రప్పా. ఆ కథలే మా తాత నాకు చెప్పాడు. నేను మీకు చెప్పాను” అన్నాడు తాతరాయి

“ఒక్క విప్లవం వెనక ఇన్ని కథలు వుంటాయా తాతా?” అన్నాను నేను ఆశ్చర్యంగా.

Kadha-Saranga-2-300x268

తాతరాయి నవ్వేసి – “అక్కడితో కథ అయిపోలేదు మనవడా… కాలం గడిచి, మా నాయన ఎదిగేసరికి ఇంకా చానా విషయాలు తెలిసాయి. అంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు, పంటలు పండిచడం మొదలుపెట్టాక ఒకే చోట కుదురుకున్నారు… ఆ పొలం చుట్టూ కాపలా వుండాలికదా… అందుకే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇళ్లు కట్టుకున్నారు. అక్కడే తినడం, అక్కడే పిల్లలు, అక్కడే జంతువులు… అప్పటిదాక లేని అంటు రోగాలు మొదలైనాయి. అట్టా కొంతమంది చస్తా వుంటే ఇంకొంత మంది ఇంకో రకంగా చచ్చేవాళ్ళు.

అడవుల్లో వున్నప్పుడు ఇంకో జాతి జనం కొట్లాటకి వస్తే చేతనైతే తిరగబడేవాళ్ళు, చేతకాకపోతే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు పారిపోవటం ఎట్లా? పొలం, పాడి, కొంప, గోడు… అన్నీ అక్కణ్ణే వున్నాయయ్యపోయె..!! కాపాడుకోవాల… కాదని పోతే పస్తులుండి చావాల… కొంతమంది కొట్లాడి చచ్చినారు, ఇంకొంత మంది పస్తులుండి చచ్చినారు. ఎప్పుడన్నా వరి మింగే పురుగొచ్చిందంటే వాళ్ళ దిగుబడి తగ్గి చచ్చినారు…”

“అదేంది తాతా… అంతకు ముందు ఒక పండు దొరకకపోతే ఇంకో కాయో, ఆకో, జంతువో తినేవాళ్ళు కదా?”

“అప్పుడు తినేవాళ్ళురా… విప్లవం దెబ్బకి అయన్నీ మర్చిపోయారు… అదే మనిషికి వుండే శాపం. అభివృద్ధి అభివృద్ధి అని అనుకుంటూ ముందుకు పోతాడా… ఇంక అంతే… చానా దూరం పొయ్యాక వెనక్కి వచ్చే దారి మర్చిపోతాడు. కష్టమో నష్టమో కానీలే అనీ అక్కడే పడి కొట్టుకుంటా వుంటాడు… అదే అభివృద్ధి అని పాటలు కట్టి పాడుకుంటా వుంటాడు. అసలు ఇంకో రహస్యం చెప్పనా?”

“చెప్పు చెప్పు” అన్నాం మేమిద్దరం

“మనిషి అందరికన్నా తెలివైనవాణ్ణని అనుకుంటాడు కానీ వాడంత ఎర్రోడు ఎవరూ లేరు…”

“అదేంది తాతా అంత మాట అన్నావు?” అని ఆశ్చర్యపోయాను.

“చెప్తా చూడు… ఈ వరి, గోధుమలు పెంచడం మొదలయ్యాక ఇదంతా జరుగుతోంది కదా. ఆ వరి మొలకల్లో ఏదో రహస్యం వుందని, అదేందో తెలుసుకుందామని చాలా సార్లు పొలాల్లోకి దొర్లుకుంటూ పొయ్యాను.”

“కనుక్కున్నావా?”

“యాడ కనుక్కునేది… నన్ను పొలంలో వుండనిస్తే కదా మనిషి… రాత్రి పగులు పొలం మీదే కదా వాడి ధ్యాస… నేను కనపడగానే ఎత్తి అవతలకి పారేసేవాడు. ఆ మొక్కలని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడని… నీళ్ళు తెచ్చి పోస్తాడు, మందు తెచ్చి చల్లుతాడు, రాయి రాకూడదు, పురుగు రాకూడదు ఆ పంటకి కుక్క కాపలా కాసేవాడనుకో…” అన్నాడు తాతరాయి.

“తాతా… అంతా బాగానే వుంది కానీ… కుక్క కాపలా అంటావే? కుక్కని మనిషి పెంచుకున్నాడు. అందుకని అది విశ్వాసంగా మనిషిని చూసుకుంది… వరిని గోధుమని కూడా మనిషే పెంచుకున్నాడు కదా…” చెప్పింది అడ్డరాయి.

“అక్కడే బురదలో పడుతున్నావు. ఎంతసేపు మనిషి వైపు నుంచే చూస్తే ఎట్లా? ఒకసారి ఆ మొక్కల వైపు నుంచి ప్రపంచాన్ని చూడు. అసలు రహస్యం ఏంటో తెలుసా… గోధుమని, వరిని మనిషి పెంచలేదు. గోధుమలు, వరి ప్రపంచమంతా పాకడానికి మనిషిని వాడుకున్నాయి. వాడి బతుకేదో వాడు బతక్కుండా, వాటి మాయలో పడ్డాడు తెలివితక్కువ మనిషి. మనిషి కుక్కని పెంచితే అది అడవి నుంచి వచ్చి మనిషి దగ్గర బతికింది. అట్టాగే అడవిలో వుండాల్సిన మనిషి అడవి వదిలేసి, వరి చేలు పక్కన ఇల్లు కట్టుకుంటే ఎవరు ఎవరిని పెంచుకున్నట్లు?” అన్నాడు తాతరాయి. ఆయన చెప్పింది అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని తొక్కుకుంటూ ఎవరో వచ్చారు. సరిగ్గా మా ముందు నిలబడి దూరంగా వున్న నేలని చూపిస్తూ మాట్లాడుకుంటున్నారు.

“అదిగో సార్… అక్కడ టెక్నో పార్క్ వస్తుంది. రోబోటిక్స్ ఇక్కడ, ఎనలటిక్స్ ఈ పక్క. అవర్ కంపెనీ విల్ రెవెల్యూషనైజ్ టేక్నాలజీ. ఈ భూమి మీద మనుషుల లైఫ్ మారిపోతుంది మన ప్రాడక్ట్స్ తో…” అంటున్నాడతను.

నేను తాతరాయి వైపు చూసేసరికి ఆయన దూరంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

***

భలే మలుపుల గెలుపుల సితార !

 

vamsy1

 

నా జీవితంలో పహాడీ రాగం వాయించింది సితార, మాసిపోయిన నా ముఖాన్ని వెన్నెల నీళ్ళతో కడిగింది సితార, అరిగి పోయిన నా కాళ్ళకి బూరుగు దూది చెప్పులు తొడిగింది సితార.

*               *               *

నా మహల్లో కోకిల పట్టుకుని రాత్రీ పగళ్ళు కూర్చుని పదహారు రోజుల్లో సితార సినిమాకి స్క్రీన్ ప్లే రాశాను.

కానీ,

నా లాస్ట్ ఫిల్మ్ సరిగ్గా ఆడక పోడంవల్లనుకుంటాను, ఈ సినిమా డ్రాప్ అవుదామని ఏడిద నాగేశ్వరరావుగారనుకుంటే, వారి బావమరిదీ అల్లుడు… నాకు మిత్రుడు అయిన తాడి బాబ్జీగారు ఏడిద గారితో గొడవపడతా నాకు ఫర్ గా చాలా మాటాడేటప్పటికి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది.

మళ్లీ ఇదో క్లాసిక్ అన్న ఫీల్ వచ్చేంత బాగా వర్కవుటయ్యింది క్లైమాక్స్. మొత్తం కథంతా విన్న నాగేశ్వరరావు గారు ‘’బాగుందయ్యా ….కానీ ,హీరో చచ్చిపోడం బాలేదు మార్చు ‘’అన్నారు.

vamsy

మొదట్నుంచీ వాళ్ళ సినిమాలకి అసిస్టెంట్ గా పనిచెయ్యడమే గాకండా, వాళ్ళింట్లో ఒకడిగా కలతిరగడం వల్ల నాగేశ్వరరావు గారితో బోలెడు చనువుంది నాకు. దాంతో కొంచెం చిరాగ్గానే “హీరోని బతికించడం చేస్తే ,కధ ప్రీ క్లైమాక్స్ నుంచీ మార్చుకుంటా రావాలి’’ అన్నాను.

“మార్చు …నాకు మాత్రం హీరో బతకాలి ‘’అన్నారు .

చిరాకు పెరిగిపోయిన నేను ‘’మీరే చెప్పండి ఎలా మార్చాలో” అన్నాను.

“ఏంటయ్యా …. ఆ పౌరుషం హీరో చచ్చిపోతేనే గొప్ప క్లైమాక్స్ అవ్వుద్దా ?…. సిరిసిరిమువ్వ చూడు కావాలంటే!” అన్నారు.

ఎన్ని రాత్రుళ్ళు ,పగళ్ళు ఆలోచించినా ఫస్ట్ టైం రాసిన క్లైమాక్స్ లా రావడం లేదు.అసలు స్క్రిప్టులో నాకు నచ్చిందే ఆ క్లైమాక్స్. కానీ , నేను నొచ్చుకున్నా పర్లేదు నాగేశ్వరరావు గార్ని నొప్పించ కూడదు అనుకుంటా ఆవేళ అనుకున్నకొత్త క్లైమాక్స్ పేపర్ మీద పెట్టి, మర్నాడు ఆఫీసు కెళ్ళి ఆయనకి చెపితే బాగుందన్నారు.

1 (1)

2 (1)

*               *               *

 

‘’మంచి పేరు పెట్టవయ్యా  వంశీ…. ‘’శ ‘’తోగానీ’’ స’’తో గానీ మొదలవ్వాలయ్యా టైటిల్ ఇది మా సెంటిమెంటు’’అన్నారు.

‘’ఇది మన డైరెక్టర్[విశ్వనాథ్] గారి సెంటిమెంటు గదండీ ?’’అంటే ‘’మా సెంటిమెంటు గూడా అదే’’అన్నారు.

సీతామాలక్ష్మి హిందీ వెర్షన్ టీ.వీలో వస్తుందా సాయంత్రం . గుల్జార్ అసిస్టెంట్ డైరెక్ట్ చేసిన సినిమాకి “సితార’’ అని పెట్టారు .

ఇక్కడ జూస్తే  “స’’తో మొదలవ్వాలంటున్నారు నాగేశ్వరరావు గారు. ఇదేదో బాగుంది గదాని ఆయనకి చెపితే “సరే ” అంటా అదే ఖాయం చేసేసారు .

7 (1)

ఇళయరాజా గారి దగ్గర కెళ్ళాం. కధ చెప్పడం ఏమాత్రం (ఇప్పటికి కూడా) రాని నేను నోటికొచ్చింది చెప్పాను. “ఒక మహల్లో ఎండపొడ తగలకండా ఆ చీకట్లోనే కలతిరుగుతుంటుంది కధానాయిక” అన్న లైన్ పట్టుకున్న రాజాగారు ‘’బాగుంది’’అంటా నేను చెప్పిన ఒక పాట సిచ్యువేషన్ విని “ఇంతవరకూ రాని పాట చేస్తాను’’ అంటా కంపోజ్ చేసారో పాట. అది ‘’కుకుకూ  కోకిలరావే’’

సాగర సంగమం సినిమా కోసం చేసి వాడ్డం మానేసిన ‘’కిన్నెరసాని’’ పల్లవిని ఫుల్ సాంగ్ చేద్దామని నాగేశ్వరరావు గారంటే దానికి చరణం చేసారు రాజా గారు. తర్వాత నా గురువు భారతీరాజా గారు నిళల్గల్ అనే సినిమాకి చేసి వాడడం మానేసిన ఇంకో పాట “ఈ సినిమాలో పెడదాం” అన్నాను ఇలా … ఒక దాని తర్వతొకటి చాలా మంచి ఆల్బం కుదిరింది.

అన్నింటికీ సాహిత్యం వేటూరి గారే రాశారు .

ప్రసాద్ ఓల్డ్ దియేటర్ లో పూజ …‘’వెన్నెల్లో గోదారి అందం’’అన్న ముహూర్తం సాంగ్ తో మొదలెడదాం ‘’అంటే ‘’శుభమా అని పని ఈ పేథాస్ సాంగ్ తో మొదలెడతారేంటయ్యా’’ అని నాగేశ్వరరావు గారనేటప్పటికి ‘’నీ గానం మృదుమధురం ….’’అనే చిన్న బిట్ చేశాకా ఈ పాట రికార్డ్  చేశాం.

 

*               *               *

 

‘’హీరోయిన్ గా ఎవర్ని అనుకుంటున్నావయ్యా?’’అడిగేరు నాగేశ్వరరావుగారు.

‘’నేను రాసుకున్న కేరెక్టర్ కి రాధ సరిపోద్దండి’’అన్నాను.

మర్నాడు ఆ రాధ గురించి ఎంక్వయిరీ చేయించిన నాగేశ్వరరావుగారు ‘’లక్షరూపాయిలoటయ్యా…. మన బడ్జెట్ అంతలేదు గదా…. పదివేలిద్దాం ఎవరైనా కొత్తమ్మాయిని చూడు’’ అన్నారు.

ఆవేళ పొద్దుట పొడుగాటి ఫ్రాక్ లాంటిదేసుకుని ఆఫీస్ కొచ్చిన ఒకమ్మాయి నల్లగావుంది, పెద్ద కళ్ళు. “పేరేంటి?’’ అన్నాను.

“భానుప్రియ’’

‘’ఇది నీ అసలు పేరయ్యుండదే’’

“ఔను…ఈ పేరు తమిలోళ్ళు పెట్టేరిది ……నా  అసలు పేరు మంగ భాను’’

1 (6)

“రేపు ఫోటో సెషన్ పెడదాం’’ అని భానుప్రియకి  ప్రోగ్రాం చెప్పి పంపేశాక ‘’రేపు ఆ అమ్మాయికి కట్టడానికి బట్టలేంటి’’అనుకుంటుంటే ….మొన్న తీసిన సాగర సంగమం లో జయప్రదకి వాడిన చీరలున్నాయిగదా అవి వాడెయ్యండి పర్లేదు’’అన్నారు నాగేశ్వరరావు గారు.

కాస్టుమ్స్ బాక్స్ లు ఓపెన్ చేస్తుంటే వాటిల్లోంచి బయటికి లాగిన చీరల్లో , గులాబిరంగు చీరొకటి బాగుంది తక్కిన వాటితో పాటు దీనిక్కూడా మేచింగ్ జాకెట్ కుట్టమన్నాను కాస్ట్యూమ్స్ సూర్రావు గార్ని.

మర్నాడు ఈ కొత్తమ్మాయి భానుప్రియకి మేకప్ వేస్తున్నాడు ముండూరి సత్యం అక్కడికొచ్చి నిలబడ్డ నేను “మరి హీరో వేషానికనుకున్న సుమన్ రావడం లేదాండీ’’ అన్నాను

“అతనికి విజయా గార్డెన్స్ లో దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా షూటింగ్ ఉందంట, మధ్యాన్నం తర్వాతొదులుతామన్నారా ప్రొడక్షన్ వాళ్ళు’’ అన్నారు నాగేశ్వరరావు గారు.

1 (8)

“సరేమరి’’ అనుకుంటా పనిలోకి దిగిన మేం , నాగేశ్వరరావు గారింటి పక్కనే మలయాళీ సింగర్ మధురి గారింటి డాబా మీద ఖాళీగా ఉంటే దానిమీద మొదలెట్టాం.

సినిమా షూటింగ్ లాగే చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే లైటింగ్ చేస్తున్నాడు కెమెరామేన్ రఘు.

ఆ కొత్తమ్మాయి క్లోజప్పులు తీస్తున్నప్పుడడిగేను. “ఇంతకుముందు ఎవన్నా సినిమాల్లో చేసావా?’’అని.

“మెల్ల పెసున్గల్ అనే తమిళ్ సినిమాలో చేసేను’’అంది.

మధ్యాన్నం దాకా తీస్తానే ఉండగా సుమన్ జాయిన్ అయ్యేడు. చీకటి పడేదాకా కాంబినేషన్ స్టిల్స్ తీశాక ముందు కాంటాక్ట్ ప్రింట్స్ వేసి నాకు చూపించు ,,, తర్వాత ఏమేం ఎన్లార్జ్ చెయ్యాలో చెపుదాం’’ అని  స్టిల్ కెమెరామేన్ సత్యనారాయణతో చెప్పాను.

*          *         *

1 (9)

 

సత్యనారాయణ పట్టుకొచ్చిన  కాంటాక్ట్ ప్రింట్స్ లోంచి బ్లోఅప్ చెయ్యాల్సిన ఫ్రేములు మార్క్ చేసి కలర్ ప్రింట్స్ వేసే 7 స్టార్స్ క్రిష్ణకిచ్చాం.

పెద్ద సైజు ప్రింట్లు వచ్చాయి.

ఆ అమ్మాయిది ఫొటోజెనిక్ ఫేస్. విశాల నేత్రాలంటే అవే అనిపించాయినాకు. అందరికీ బాగుందా మనిషి .

ఈలోగా ఏదో పనుండి అక్కడికొచ్చిన మా గురువు కె. విశ్వనాథ్ గారు ఆ ఫోటోలు చూసి ‘’బావుందోయ్ ‘’ అన్నారు.

కాస్త దూరంగా తలుపు దగ్గర నిలబడ్డ ఏడిద నాగేశ్వరరావుగారి భార్య జయలక్ష్మిగారు ‘కొంచెం మెల్ల ఉందిగదండీ’’ అన్నారు.

‘’మెల్ల ఉంటే అదృష్టం గదమ్మా ?’’ అన్నారు విశ్వనాధ్ గారు.

ఆయనెళ్ళాక “ఆ అమ్మాయిని పిల్చిమనం  కన్ఫర్మ్ చేసుకున్నట్టు చెప్పండి వంశీ’’ అన్నారు నాగేశ్వరరావు గారు.

సాయంత్రం కబురుచేస్తే వచ్చిన భానుప్రియతో “మా సినిమాలో హీరొయిన్ నువ్వే”  అన్నాను.

చాలా సంబర పడ్డ ఆ భానుప్రియ “చాలా థాంక్సండి ఒక సారి డైరెక్టర్ గారిని పిలిస్తే ఆయనక్కూడా థాంక్స్ చెప్పి వెళతాను’’అంది .

“నేనే డైరెక్టర్ ని” అన్నాను.

“అదేంటి విశ్వనాథ్ గారు కాదా ? ఈ కంపెనీ సినిమాలన్నింటికీ ఆయనే కదా డైరెక్టరు?’’ అంది.

*             *             *

1 (15)

హీరోయిన్ గా ఆ భానుప్రియ ఫైనలైజ్ అయింది గానీ , నా మహల్లో కోకిల నవలలో అయితేనేం , సినిమా స్క్రిప్టులో నయితేనేం , నేను రాసుకున్న కథానాయిక రూపం వేరే…తెల్లగా గిల్లితే పాలుగారినట్టుండే శరీరంతో మిసమిస లాడతా, మెరిసిపోతా ఉంటుంది. నిత్యం కలలు కనే పెద్ద పెద్ద కళ్ళు. ఒక్క కళ్ళు తప్ప , ఓకే చేసుకున్నఈ మనిషిలో ఆ లక్షణాలు లేవుగదా….సరే తనని బట్టి ఇప్పుడు మార్చు కోవాలి అనుకున్నాను.

మిగతా వేషాల్లో సితార అన్నయ్య వేషానికి శరత్ బాబు ,లాయర్ కి జే.వి. .సోమయజులుగారు, దేవదాస్ వేషానికి భానుచందర్, జర్నలిస్ట్ కి శుభలేఖ సుధాకర్ . అనుకుంటే “తక్కినవన్ని ఓకే గానీ ,ఆ దేవదాసు కి శుభలేఖ సుధాకర్నేసి, జర్నలిస్ట్ కి మన రాంబాబు (ఏడిద శ్రీ రాం )నెయ్యి” అన్నారు నాగేశ్వరరావు గారు.

*                    *                    *

ప్రధానమైన లొకేషన్ ఎక్కడా అని నాగేశ్వరరావు గారడిగితే’’వెంకటగిరి కోట బాగుంటుంది’’అన్నాను.

“సరే ….వెళ్లి చూసి రండి” అన్నారు.

నేను నవల రాసింది సత్యం ధియేటర్ లోపల వేంకటగిరి రాజావారి భవనం వెనక శాస్త్రి రూములో. ఆ టైములో వెంకటగిరి రాజావారి రెండో అబ్బాయి సాయికృష్ణ యాచేంద్ర గారు పరిచయమే నాకు. కలిసి అడిగితే నవ్వినాయన “వెళ్లి చూసుకోండి బాగుంటే మాకు అభ్యంతరం లేదు’’అన్నారు.

*                     *                   *

ఒక తెల్లవారుఝామున ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి , ఎమ్వీ రఘు , నేనూ కారులో వెంకటగిరి బయలుదేరాం.

కోట లోపల పాతకాలంనాటి సరంజామాతో చాలా రిచ్ గా ఉందికానీ, సీలింగ్ చాలా కిందికుంది. హాలు పర్లేదు, గదులు చాలా చిన్నవి .సగం కథ ఇక్కడే తియ్యాలి గాబట్టి కుదరదిక్కడ. అదే మా వాళ్లకి చెబితే “మా ఫీలింగ్ కూడా అదే” అన్నారు.

రాజావారి పిల్లలకి సత్యసాయిబాబా అన్నా క్రికెట్ అన్నా చాలా ఇష్టం. ఊరికి ఆ చివర క్రికెట్ పిచ్ చాలా బాగా మెయింటెయిన్ చేస్తున్నారని తెలిసి వెళ్ళాం.

ఐతే , ఎంట్రీ ఒక కోట లాగ చాలా బాగుంది. డోర్ తెరుచుకుని లోపలికెల్తే ఒక పిచ్ తప్ప ఇంకేమీ లేదు .అది చూసిన తరణి , రఘు “వంశీ….కోట ఎక్స్ టీరియర్ గా ఇది వాడుకుని ఇంటీరియర్ కింద వాహినీ స్టుడియోలో నైన్త్ ఫ్లోర్ వాడుకుంటే ?’’అన్నారు .

మర్నాడు వాహినీ కెళ్ళి చూశాం.

నాకు నచ్చింది. నా కథానాయిక అక్కడ కల తిరుగుతున్నట్టు ఆ సీన్స్ ఊహించుకోగలుగుతున్నాను. ’’ఓకే గానీ సెట్ చాలా బ్రైట్ గా ఉందిగదా?’’ అన్నాను .

bhanu

 

“డల్ చేస్తాను …ఇందులో చాలా యాంటిక్స్ కూడా యాడ్ చేయాలి” అన్నాడు తరణి.

షూటింగ్ మొదలయ్యింది.

ఆ ఫ్లోర్ లోపలే ముప్పై రెండు రోజుల షూట్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు.తీసుకుంటా పోతుంటే ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఒకరోజు నన్ను పిలచిన నాగేశ్వరరావు గారు’’ ఇప్పటివరకూ తీసింది ఎడిట్ చేస్తే ఎంత ఫుటేజ్ వస్తుంది ……ఇంకా ఈ సెట్లో ఎన్నాళ్ళు వర్క్ ఉంటుంది?’’ అనడిగితే చెప్పాను.

లెక్కలు గట్టిన ఆయన ‘’ఈ లెక్కన టోటల్ షూటింగ్ డేస్ 70 రోజులయ్యేలాగున్నాయి…… మన 16 లక్షల బడ్జెట్ దాటకూడదు. స్పీడ్ చెయ్యి’’ అన్నారు.

లాయర్ సోమయాజులు గారి పాతిల్లు . షూట్ జరుగుతావుంటే వచ్చిన ఇంటి ఓనర్స్.’’ఎట్టి పరిస్తితుల్లోనూ తెల్లవారేలోపు మీరు షూటింగ్ ఫినిష్ చేసుకోవాలి…లేక పోతే మీకు చాలా ప్రాబ్లం’’ అన్నారు .

” వేరే వాళ్ళేవరికన్నా షూటింగ్ కిచ్చారా?’’ అడిగేడు మేనేజర్ రాజగోపాల్.

“తెల్లవారుఝాము నుంచే పడగొట్టడం మొదలెడుతున్నాం ….ఎల్లుండి పొద్దుట కొత్తింటికి శంఖుస్థాపన’’ అనెళ్ళి పోయారాళ్ళు.

శరత్ బాబు షర్ట్ చిరిగిపోయే సీను అదీ చాలా వర్క్ ఉందిక్కడ…….ఇంక చూస్కోవాలి నాలో టెన్షన్.

తర్వాత రాజమండ్రి షెడ్యూల్,

దేవీపట్నం , గూటాల వీధులు, హుకుంపేట రోడ్డు ఇలా చాలా చోట్ల షూటింగ్. దేవీపట్నం గట్టు మీద సుమన్ని జనం తరుముతుంటే తప్పించుకు పారిపోతా కదుల్తున్న లాంచీ లోకి జంప్ చెయ్యాలి. ఈ షాట్ తీస్తుంటే లాంచీ పడిచెక్కకి తగిలిన సుమన్ కాలు, విరిగిపోయింది. దాంతో కొన్నాళ్ళు షూటింగ్ గ్యాప్.

ఇది చివరి షెడ్యుల్.

National Award Certificate

వెంకటగిరి వెళ్లి వాహిని స్టూడియో ఇంటీరియర్ని మేచ్ చేస్తూ అక్కడ తియ్యాలి. వాహిని ఫ్లోర్ చివర్లో కుడికాలు పైకెత్తిన హీరోయిన్ ఈ వె౦కటగిరి గుమ్మం దగ్గర అదే కాలు బయటకి ఆన్చడం లాంటి మాచింగ్  షాట్స్ . పగటి వేషగాళ్ళు ఇక్కడ ముఖ ద్వారం ముందు ఆట కడ్తుంటే వాహినీ ఫ్లోర్లో విన్న కథానాయిక పరిగెత్తు కుంటా  ఇక్కడ పగిలిన రంగుటద్దాల కిటికీ వెనక్కి రావడం లాంటి షాట్స్.

ఈ ప్రాంతంలో షూటింగ్ ఇదే ఫస్ట్ టైమవ్వడంతో జనం విరగబడతా రావడంతో కొన్ని షాట్స్ తీసి “జిలిబిలిపలుకుల’’ సాంగ్ లో వాడాను.

ఈ సినిమా కోసం ఒక అవుట్ డోర్ రౌండ్ ట్రాలీ తయారు చేశాం. ఇండస్ట్రీలో ఇది మొట్ట మొదటి ట్రాలీ. చాన్నాళ్ళ నించి వాడుతున్నారు గానీ దీని చుట్టుకొలత గురించి ఎవర్ని అడిగినా చెప్పలేరు. వెంకటగిరి బిల్డింగ్ మీద ఒక రౌండ్ ట్రాలీ షాట్ తియ్యల్సొచ్చి అక్కడి చుట్టు కొలత తీసుకుని ట్రాలీ చేయించి “కుకుకూ కోకిలరావే “  సాంగ్ లో వాడాం. షూటింగ్ మొత్తంలో ఆఖరి రోజు షాట్ అదే.

ఈ సినిమాకి ఎడిటర్ అనిల్ మల్నాడ్. ఎడిటింగ్ అంతా విక్రమ్ స్టుడియోలో.ఇళయరాజా గారు రీరికార్దింగ్ కి డేట్స్ ఇవ్వడంతో రాత్రీపగలనక కష్టపడి డబుల్ పాజిటివ్ తాయారు చేశాం.

రేపు రాజాగారు చూస్తారనగా ఆ రాత్రి సురేష్ మహల్లో ప్రోజక్షనేసి ఏడిద నాగేశ్వరరావు గారికి చూపించాను. వారి ఫ్యామిలీ ,ఇంకా యూనిట్ అంతా చూసారు..చాలా తక్కువ డైలాగులు, కామెడీ లేదు, ఏ థ్రిల్లు లేదు. ఏ ఒక్కరికీ నచ్చలేదు. నాతో ఏమీ మాటాడకండా కారెక్కి వెళ్లిపోయేరు నాగేశ్వరరావు గారు.

E Nagesh receiving Award

జాతీయ పురస్కారం అందుకుంటూ ఏడిద నాగేశ్వరరావు

మర్నాడు మద్యాన్నం ఇళయరాజా చూస్తున్నారంటే ఇష్టం లేకపోయినా యూనిట్లో కొందరొచ్చేరు.

ఇంటర్వెల్లో ఒక మూల డల్ గా కూర్చున్న నన్ను పిల్చిన రాజా గారు పక్కన కూర్చోమని మిగతా సినిమా చూశాక “ బాగుంది సినిమా” “చాన్నాళ్ళ తర్వాత చాలా పని నాకు. అంతా మ్యూజిక్కే.’’ అంటుంటే అప్పుడు చూసాను నాగేశ్వరరావు గారి ముఖంలో వెలుగు.

ప్రసాద్ 70mm లో మర్నాటినుంచీ R.R.

Hundred Days Shield

ఒకో రీలు మ్యూజిక్ తో నిండిపోతుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. దాంతో నాలోంచి పారిపోయిన శక్తి పదింతలై పెరిగి, తిరిగి వెనక్కొస్తుంది. ప్రేతకళకీ జీవకళకీ తేడా అర్ధమవుతుంది.

రిరికార్డింగ్ అయ్యేకా మళ్ళీ ఆ సినిమా ముఖం చూసే అలవాటులేని ఇళయరాజా సవేరాలో షో వేయమని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని సినిమా  చూసిన ఆ ఇన్సిడెంటుని నేను మర్చిపోవడం కుదరదు.

మేనా దియేటర్లో షో జరుగుతున్నప్పుడు రెండు రీళ్ల తర్వాతొచ్చిన నా గురువు భారతీరాజా సినిమా అంతా అయ్యేక మొదటి రెండు రీళ్ళు వేయించుకుని చూశాక…సినిమా గురించి నా గురించీ చాలా ఎక్కువగా మాటాడతా, “ఏడీ వాడు?” అని నన్నడిగితే నే లేను.

సినిమా షో లు వేస్తున్నారు. ఒకరోజు నాగేశ్వరరావు గారి దగ్గర కొచ్చిన సీనియర్ జర్నలిస్ట్ ఐ.అర్జునరావు ‘’సినిమా టాక్ అఫ్ ది టౌన్ అయ్యిందండి’’ అన్నారు.

“అవ్వొచ్చు గానీ …ఇంకా బిజినెస్ అవ్వాలండీ” అంటా అక్కడే ఉన్న నన్ను పిల్చి “ఫస్ట్ హాఫ్ లో కొంత తీసేద్దామయ్యా నిన్న చూసిన మన సీడెడ్ బయ్యర్స్ చాలా ఇబ్బంది పడ్డారు’’ అంటా ఎక్కడెక్కడ తియ్యాలో చెపుతుంటే  “అదంతా మంచి పొయెటిక్ ఏరియా’’ అంటున్నాను నేను .”తప్పదు వంశీ ఇది వ్యాపారం గదా..పద ఎడిటింగ్ రూమ్ కి”అని తీసుకెళ్ళి పొయెట్రీ పార్ట్స్ చాలా వరకూ తీయించేశారు.

రిలీజయ్యింది.

మాకు పోటీ సినిమా ఆనందభైరవిలో కామెడి ఉండటం వల్ల మా సినిమా కంటే అది బాగుందన్న టాక్ వచ్చింది గానీ, తర్వాత వారంలో మాది కూడా నిలబడి పోయింది.

అట్లూరి పూర్ణ చంద్రరావు గారి ద్వారా ఈ సిన్మా షో నేయించుకు చూసిన అమితాబ్ బచ్చన్ చాలా మెచ్చుకుంటా మర్నాడు పొద్దున ప్రొడ్యూసర్నీ నన్ను కెమరామేన్ని, హీరోయిన్ని, తాజ్ కోరమండల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ కి పిల్చినప్పుడు నాకిష్టమైన జయబాధురితో ఎక్కువ మాటాడేను.

హిందీలో చేస్తావా అని భానుప్రియని అడిగేరు అమితాబ్ బచ్చన్.

శ్రీదేవిని పెట్టి హిందీలో చేసే ప్రపోజల్ తీసుకొచ్చారో నిర్మాత. కానీ, వేరే కారణాల వల్ల వర్కవుటవ్వలేదు.

ఈ సిన్మా రష్యన్ భాషలోకి డబ్ అయ్యింది.

స్టేట్ అవార్డ్స్ అన్నీ ఆనంద భైరవి కెళ్ళిపోయాయి.

“మనకి ఏ అవార్డు రాలేదు…..శంకరాభరణం తీసిన కంపెనీ మనది’’అని నాగేశ్వరరావు గారు తెగ ఫీలయిపోయారు.

అక్కడే ఉన్న వాళ్ళ ఆఖరబ్బాయి రాజా ‘’మనమో తప్పు చేశాం డాడీ …. క్లైమాక్స్  తీసేసి అవార్డ్స్ కి పంపించాం……ఈ సారి సెంట్రల్ అవార్డ్స్ కి పంపేటప్పుడు ఏ ట్రిమ్మింగు చెయ్యకండా పంపిద్దాం’’అని అలాగే చేసాడు.

నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయ్యాయి.

వెన్నెల్లో గోదారి అందం పాడిన జానకి గారికి బెస్ట్ ఫిమేల్ సింగర్ అవార్డు, ఎడిటర్ అనిల్ మల్నాడ్ కి బెస్ట్ ఎడిటర్ అవార్డ్ , సినిమాకి బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అవార్డు వచ్చాయి.

1 (23)

ఆ ఉదయం మీనం బాక్కం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఆ ఫ్లైట్లో అందరూ అవార్డ్ విన్నర్సే. దాంతో అంతా కల్సి దానికి అవార్డ్ విన్నర్స్ ఫ్లైట్ అని పేరు పెట్టారు.

మాలాగే రీజనల్ అవార్డ్ సంపాదించిన తమిళ్ సినిమా “ఆచమిల్లై ..అచ్చమిల్లై ‘’దర్శకుడు కె. బాలచందర్ గారు ఫ్లైట్ లో నా పక్కన కూర్చుంటా నన్ను పలకరించేరు.

కంగారు పడిపోయిన నేను లేచి నిలబడి “మీ దగ్గర అసిస్టెంట్ గా పని చేద్దామని చాన్నాళ్ళ పాటు మీ ఇంటి గేటు దగ్గర నిలబడ్డాను గానీ,  మీ నేపాలీ  ఘూర్కా లోపలికి వెళ్ళనియ్యలేదు సర్” అన్నాను.

నవ్వేసిన ఆయన “మనమిలా కలిసి అవార్డ్స్ తీసుకోడానికెళ్ళాలని రాసి పెట్టుంటే, నా దగ్గర కెలా రానిస్తాడా దేవుడు చెప్పు ?’’ అంటా నన్ను ఆశీర్వదించిన ఆ దర్శక మేధావి పక్కన కూర్చోబెట్టింది సితార. నాకు ప్రాణమైన నా గురువు భారతీరాజాతో నాగురించి మాట్లాడించింది  సితార. ప్రెసిడెంట్ అఫ్ ఇండియా తో కరచాలనం చేయించింది సితార. ఇంకా ఎందర్నో .ఎన్నో విధాలుగా నాకు దగ్గర చేసిన సితార ఏ వెన్నెల వేడికీ వాడిపోని పరిమళించే జ్ఞాపకం ఐపోయింది……

ఎంత పని చేసింది ‘’మహల్లో కోకిల’’ నవల???

*

మిథ్యా జీవన రథ్యలలో…

MythiliScaled

 

” నమ్మటం సహజం. నమ్మకపోవటాన్ని సాధన చేసి నేర్చుకోవాలి ”

వింతగా అనిపిస్తున్నా మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇది నిజమట. పసిపిల్లలు కనబడేదాన్నంతా , వింటున్నదాన్నంతా నమ్ముతారు , మనకి తెలుసు. ‘ ఎదిగే ‘  కొద్దీ పెంపకం వాళ్ళకి అపనమ్మకాన్ని నేర్పుతుంది . ప్రపంచపు అనేకానేకమైన సంక్లిష్టతలలో బతికి బట్టకట్టేందుకు ఆ అవిశ్వాసం అవసరమే – కాని , దాన్ని కొన్నేసి సార్లు పక్కనపెట్టుకోవటమూ కావాలి.

ఎందుకంటే ప్రపంచం , అందులో వస్తువులూ విషయాలూ మనకి పూర్తిగా అలవాటైపోతాయి.  దాన్నంతా పూర్తిగా అర్థం చేసేసుకుంటామని కాదు – కొన్ని అనుభవాల వల్ల మొత్తం తెలిసిపోయిందనీ మరిక కొత్తదేమీ ఉండదనీ అనేసుకుంటాము. దీనికి – చుట్టూ ఉన్న సమాజపు తీర్మానాలు చాలావరకూ కారణం [cognitive bias ] . అయితే – ఆ తీర్మానాలకి పరిమితులు ఉంటాయి. అవి కొత్తగా వచ్చిన పరిమితులేమీ కాదు .  ఒకరి  నిజం మరొకరికి  అబద్ధం. ఒక చోట సహజమైనది మరొకచోట అసభ్యం. ఒక కాలపు న్యాయం మరొక యుగం లో అన్యాయం. అర్థసత్యాలను కూడా కలిపితే ఈ జాబితాకి అంతు ఉండదు.

దీన్ని సాగదీసి  – అసలు సత్యం అనేదేమీ లేదనీ ఒక hyper reality  లో మనం వేలాడుతున్నామనీ Jean Baudrillard వంటి  postmodernist లు తేల్చేయాలని ప్రయత్నించారు.

అవునా ?  ఒప్పుకుని ఏమని బతకాలి – కనీసం మనలో కొంతమంది ?

అక్కర్లేదు.

ఆ ముడినో వంతెననో వేసేందుకు ఆధ్యాత్మికత ఆ వైపు ఉండనే ఉంది . ప్రస్తుతం నేను వెళ్ళదలచుకున్నది అటు కాదు.

ఈ వైపున ఉన్న జలతారు పందిరి కిందకి – అది కళ.

భారతీయులమైన మనకి , సంప్రదాయాన్ని అనుసరిస్తూ వెనక్కి వెళితే – ఉత్తమమైన కళావిష్కరణ కూ ఆధ్యాత్మికానందానికీ ఖచ్చితం గా పోలికలు కనిపిస్తాయి. వాటి రెంటికీ స్థాయిల్లో మాత్రమే తేడా అనేంతవరకూ మనకి వాదనలు ఉన్నాయి. మరింకొకలాగా రసానందానికి అవధి గా మానుషానందం , దాన్ని ఎన్నో రెట్లు హెచ్చవేస్తే రాగల బ్రహ్మానందం – ఇలాంటి లెక్కలు  ఉన్నాయి.

 

కళాస్వాదన ని బుద్ధి తో గాక హృదయం తో , లేదా అంతకు తక్కువదైన మనస్సుతో చేస్తుండటం ఇక్కడ జరిగిన మేలు.   హేతువాదమో [తక్షణ ] ప్రయోజనాత్మక  దృక్పథమో  అడ్డు రావటం మనకి ఆ మధ్యన మొదలైందే.

పడమటి దేశాల్లో ఆ నీరసం 18 వ శతాబ్ది అంతానికే వచ్చేసింది. వారి ఆధునిక విద్య పాత నమ్మకాలని బద్దలుకొట్టి తీరాలని పట్టుబట్టుకు కూర్చుంది – ఆత్మల దినాలనీ హాలోవీన్ లనీ అనుమతించుకుంటూ వచ్చిన క్రైస్తవపు సహనమూ అప్పటికి అంతరించింది. మంత్రగత్తెలని వేటాడి తగలబెట్టటం [witch hunt ] 1750 కి దాదాపు గా పూర్తయిపోయింది. Folk tales, fairy tales మౌఖికం గా ఎప్పటినుంచో వ్యాపిస్తూ వచ్చాయి. ఆ కాలం లోనూ వాటిని  ఉద్ధరించినవారున్నా , ఆ సాహిత్యాన్ని ప్రధాన స్రవంతి లోకి రానీయక పోవటం మొదలైంది . బాలసాహిత్యం గా ముద్ర వేసి ఒక పక్కన పెట్టేశారు. [ 1930 లలో Tolkien వచ్చేవరకూ ఆ కథలు చిన్నపిల్లలకే పరిమితం ]

0415-william-wordsworth-daffodils

1798 లో Lyrical ballads  సంపుటం ప్రచురించబడింది. William Wordsworth, Samuel Taylor Coleridge ల సంయుక్త కృషి గా చెప్పబడిన అందులోWordsworth  ఇలా అంటారు.

” వీటిలో చాలా పద్యాలు ప్రయోగాత్మకం గా రాయబడినాయి. మధ్య, దిగువ తరగతి ప్రజలు మాట్లాడే భాష కవిత్వానికి ఎంత మేరకు తగుతుందో నిర్ధారించుకోవాలని ”

1802 లో , ఆ సంపుటాన్ని తిరిగి ముద్రించినప్పుడు Wordsworth ముందు మాట ని ఇంకాస్త పెద్దది చేశారు. అనుకుని అన్నారో అలా ధ్వనించిందో తెలియదు గాని , ‘ వాస్తవాధీనం ‘ కాని కవిత్వాన్ని ఆయన తిరస్కరిస్తున్నట్లుగా అర్థమైంది. అంతకుముందు వరకూ పాతపద్ధతులలో రాసిననదంతా కృత్రిమం అనేస్తే తిరగబడి  వెక్కిరించినవారు చాలా మందే ఉన్నారు. కాని – Wordsworth కవిత్వం లోని వైశాల్యం, సౌందర్యం, ప్రవహించే గుణం – దాన్ని కాపాడుకొచ్చింది. రాను రాను ఆయనను అతి ఎక్కువ భావోద్వేగాలతో [religious fervor ] ఆరాధించేవారు బయలుదేరిపోయారు.

అవును, Wordsworth ఒక path breaker  . అది ఒక కొత్త మతం కింద పరిణమించింది కొన్నేళ్ళ పాటు.

Coleridge 1817  లో నోరు విప్పారు. మొదట్లో వారిద్దరూ సంకల్పించుకున్నది అంతకన్న విస్తృతమైనదని తన Biographia Literaria లో బయటపెట్టారు.

” రెండు విధాలైన కవిత్వసృష్టి గురించి మేము మాట్లాడుకునేవాళ్ళం. ప్రకృతి సత్యాలను విశ్వసించటం ద్వారా  చదువరి సహానుభూతిని మేల్కొలపటం ఒక పద్ధతి. ఊహలకి రంగులు వేసి వినూత్నమైన ఆసక్తిని కల్పించటం రెండవది.

వెలుగునీడలు ఆడుకునేప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా  , చిరపరిచితమైన చోటంతా – ఆ చంద్రకాంతి లోనో సంజ వెలుగు లోనో కొత్త గా మోహపెట్టగలగటం …అటువంటిది మేము తలచుకున్న రెండు పద్ధతులూ మేళవించేందుకు వీలు ఇవ్వగలది. నిజానికి మేము కలిసి చెప్పదలచుకున్నది అదే ”

Coleridge , ఇంకా విశదం గా అంటారు – ”  మానవాతీతమైనవో , కనీసం అద్భుతమైనవో అయిన వ్యక్తుల గురించీ శక్తుల గురించీ నేను రాయాలని అనుకున్నాను .  ఆ ఊహల ఛాయలలో సత్యం వంటి మరొక సత్యాన్ని   ఆవిష్కరించాలనే ప్రయత్నం.   అప్పటికి, ఆ సందర్భం వరకూ – అపనమ్మకాన్ని కావాలని అణచిపెట్టటం ద్వారా[ Willing suspension of disbelief ]  , ఆ ‘ కవిత్వ సత్యా ‘ న్ని[ poetic truth ]  చదువరులు , తమ లోలోపల – తెలుసుకోవాలని. Wordsworth  – రోజూ కనబడేవాటినే కొత్త గా దర్శించగలగటం గురించి రాద్దామనుకున్నారు.  ప్రకృతి అందానికీ ఆకర్షణకీ కళ్ళు తెరవటం వల్ల ఆత్మ లోపలి బద్ధకం వదిలిపోతుందని . ఈ రెండు మార్గాలూ ఒకే లక్ష్యం లోకి పర్యవసిస్తాయని మేము నిశ్చయించుకున్నాము ”

కారణాలు ఏవైతేనేమి, Coleridge వి సంపుటం లో కొన్ని పద్యాలే ఉండినాయి. The Rime of the ancient mariner, Christabel, Kubla Khan వంటి ప్రముఖ కృతులని  తాను అనుకున్న పద్ధతిలోనే రాశారు.

ఆయన మొదట వాడిన ఆ పదబంధానికి,  కాలాంతరాలలో – చాలా విస్తృతమైన అన్వయమూ ప్రచారమూ జరిగాయి.

ఈ willing suspension of disbelief ని అన్నిందాలా చూడచ్చు మన  సంస్కృతి లో . కేవలం చెవుల ద్వారా మహా ఇతిహాసాలన్నిటినీ వంటబట్టించుకున్నాం. జంతువుల కథలతో నీతిచంద్రికలని వెలిగించుకున్నాం.

యుద్ధపర్వాలను పురాణం చెప్పే ముందు కోటలో ఆయుధాలన్నిటినీ గదిలో పెట్టి తాళం వేయించమని అన్న పౌరాణికులు ఉన్నారు. అయినా పురాణం విని ఒట్టి చేతులతోనే ఒకరి మీదికొకరు లంఘించిన సభికులు  ఉన్నారు వారికి. హరి కథ లు కార్పించిన కన్నీరు, బుర్ర కథలు ఎక్కించిన శివాలు – నమ్మకపోవటం అన్నదే లేదు. నమ్మను అన్న స్త్రీ కి  ప్రత్యక్షపురాణం చెబుతూ  లంకిణి ని లాగా మర్దించి బోధించిన వికటకవులున్నారు.

ప్రతీకాత్మకమైన భారతీయ శిల్పం, చిత్రకళ – నిజాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశాన్ని పెట్టుకున్నవి కావు.   పాశ్చాత్య చిత్రాలలో వాస్తవిక చిత్రకళ అత్యుత్తమమైన స్థాయికి వెళ్ళింది  . వాటిని నమ్మేందుకు శ్రమ అక్కర్లేదు. పారిశ్రామికవిప్లవం  తర్వాత ఫోటోగ్రఫీ అభివృద్ధి చెందినాక – impressionism  మొదలైందట. ఉన్నదాన్ని ఉన్నట్లు కాక , దాన్ని విడగొట్టి వెనక్కి తీసుకుపోయి చూసేవారి లో ఆ భావాన్ని ముద్రించేందుకు చేసిన ప్రయత్నమని impressionism ను నిర్వచించటం ఒక తీరు. ఇక్కడా suspension of disbelief  తిరిగి అవసరమైంది. ఫలితం గా మళ్ళీ గొప్ప సౌందర్య సృష్టి కూడా జరిగింది.

[  పిడివాదం ఏ ప్రక్రియనైనా ఎలా భ్రష్టు పట్టించగలదో ఇక్కడ మరొక ఉదాహరణ. ఆ కాలం లో వాస్తవిక చిత్రాలను వేసిన William – Adolphe Bouguereau వంటి దిగ్దంతుడిని నానా మాటలూ అన్నారు. 1974 వరకూ ఆయనను పట్టించుకున్నవారు లేరు, ఆ తర్వాత ఆయనకు తిరుగూ లేదు – అది వేరే కథ ] . ఈ ‘ విడగొట్టటం ‘ లోంచి జరిగిన వక్రీభవనం లోంచే Cubism, Dadaism  పుట్టాయి- వాటి సౌందర్యం తెలిసినవారికి తెలియగలది

ఒక జంతువు ని చెప్పేందుకు కొన్ని అక్షరాలతో ఒక పదాన్ని రాస్తున్నాం. ఆ అక్షరాలకూ జంతువుకూ ఉన్న సంబంధం మనం కల్పించుకున్నదే – ‘ వాస్తవం ‘ కాదు. ఆ భాష రానివారికి ఆ సంబంధమూ లేదు. ఇలాగ – భాషా పరిణామం లో , అపనమ్మకాన్ని అణచుకోవటం అనేది చాలా ముఖ్యమైన సంగతి.

దీన్ని కాస్త పొడిగిస్తే – షేక్ స్పియర్ పాత్రలు – డెన్మార్క్ యువరాజు హామ్ లెట్, వెనిస్ లో పుట్టిన పోర్షియో – ఇంగ్లీష్ మాట్లాడి ఉంటారా ? మన పౌరాణిక నాటకాలలో రాముడూ కృష్ణుడూ తెలుగు మాట్లాడి ఉంటారా ?

20, 21 వ శతాబ్దపు కామిక్ లూ  విడియో గేమ్ లూ  సినిమా లూ  ఈ ప్రక్రియ ని అతి పుష్కలం గా ఉపయోగించుకున్నాయి. Color blindness ఉన్న వారికి  తప్పితే తెలుపు నలుపు చిత్రాలలో లాగా మనుషులు కనిపిస్తారా ఎవరికైనా ?ఒక నాయకుడు వంద మందిని కొట్టటం దగ్గర నుంచి గాల్లో ఎగిరే సూపర్ మాన్, బాట్ మాన్ దాకా అసాధ్యమైన విషయాలను చూస్తూనే ఉన్నాం.

ఎందుకు ఇదంతా అవసరమైంది ?

నిజ జీవితపు పరిస్థితులను విస్తరించటమూ , కేంద్రీకరించటమూ – రెండూ కళారూపాలలో జరుగుతాయి. విస్తరించటం వల్ల ఒక సాధారణీకరణ [generalization ] జరిగి ఊరట వస్తుంది. కేంద్రీకరించటం వల్ల , ఆ ఒక్క చోటా జరిగే న్యాయం మనమే గెలిచిన భావాన్ని ఇస్తుంది.  ఇది సవ్యం గా జరగటానికి , ఆ కథ లోనో సినిమా లోనో – వాస్తవానికి అతీతమైనదైనా సరే, ఒక ‘ అంతర్గత తర్కం ‘[inner logic ] ఉండాలి.  ” అబ్బే, ఇదంతా ఉత్తినే ” అని రచయితో దర్శకుడో చెప్పేయటమూ జరగకూడదు.  ప్రేక్షకులూ చదువరులూ వారి వంతు కృషి చేసి కళ లో లీనమవుతారు.

అప్పుడొస్తుంది ఆనందం. ” కొండెక్కినంత సంబరం ” అంటారు కదా, అది. పడ్డ కష్టం ఫలించి Endorphin లు విడుదలయి జీవితాన్ని ఇంకొంత బాగా లాగేందుకు ఓపిక వస్తుంది.

*****

John Ronald Reuel Tolkien ( 1892 - 1973) the South African-born philologist and author of 'The Hobbit' and 'The Lord Of The Rings'. Original Publication: Picture Post - 8464 - Professor J R R Tolkien - unpub. Original Publication: People Disc - HM0232 (Photo by Haywood Magee/Getty Images)

1939 లో JRR Tolkien  , తన ‘ On Faeries ‘లో – suspension of disbelief ని తిరస్కరిస్తారు. అది అపనమ్మకాన్ని అణచటం కాదు  కాదు, మరొక నమ్మకాన్ని [ secondary belief ] సృష్టించుకోవటం  అని.

గంధర్వగాథలు [fairy tales ] చిన్న పిల్లల కోసమేననే వాదాన్ని ఆయన కొట్టి పారేస్తారు. పెద్దవాళ్ళు ఆ కథలకి దగ్గరవటం కేవలం పరిశోధన కోసమో సేకరణ కోసమో అవనక్కర్లేదని  బల్ల గుద్ది చెప్పారు. ” పిల్లలు ఎదుగుతూంటారు, వారి బుర్రలకి చక్కగా ఆకలి వేస్తుంటుంది – అందుకని అవి వాళ్ళకి చక్కగా అరుగుతాయి – ఆ లక్షణాలు పోని పెద్దవాళ్ళూ వాటిని అంత బాగానూ హరాయించుకోగలరు . Fantasy ఊహాశక్తి కి పరాకాష్ట . అందులోని వ్యక్తులూ సంఘటన లూ వాస్తవ ప్రపంచం లో ఉండవు అని ఒప్పుకుంటాను – అయితే నా దృష్టిలో అది దోషం కాదు, గుణం. ఆ రకం గా ఒక కళా రూపం గా fantasy ఎక్కువైనదీ మరింత స్వచ్ఛమైనదీ – ఫలితం గా ఎక్కువ శక్తివంతమైనది. అటువంటి సమాంతర ప్రపంచాన్ని మొదటి నుంచీ మొదలెట్టి సృజించటానికి ఎంత నేర్పైనా  కావలసి వస్తుంది.

వాస్తవ వాద సాహిత్యం లో లాగా కాదు – చెడు అంతమయేదాకా, సత్యదర్శనం జరిగే దాకా fantasy నడుస్తూనే ఉంటుంది. అది వాస్తవాన్ని గుర్తిస్తుంది, కాని దానికి దాస్యం చేయదు, పోరాడుతుంది.  ఒకవేళ సత్యమే అక్కర్లేని దశ కి మానవాళి చేరుకుంటే – అప్పుడు, అప్పుడు మాత్రమే, దాని అవసరం అంతమవుతుంది. ”

Fantasy ఏం చేయగలదు ? కోలుకునేలా  చేస్తుందని సమాధానం. ”  దృష్టి ని స్పష్టం చేస్తుంది. మన కిటికీ ల అద్దాలని శుభ్రం చేస్తుంది. వస్తువులని ‘ ఉన్నవాటిని ఉన్నట్లుగా ‘ కాక ‘ ఎలా చూడవలసి ఉందో అలా ‘ చూడటాన్ని నేర్పుతుంది. అతి పరిచయం వల్ల వచ్చిన చులకనను తీసేస్తుంది. సొంతం కావటం వల్ల వచ్చిన నిర్లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. ఒకప్పుడు చూసి, తాకి, విని – అనుభవించి , దాచేసుకున్న  వాటికేసి మళ్ళీ చూపును తిప్పిస్తుంది ”

పలాయనం అన్న మాటను Tolkien ఒప్పుకోరు. దాన్ని విడుదల అంటారు. మనం తప్పించుకుని వీలైనంత మందిని మనతోబాటు తీసుకుపోవాలని బోధిస్తారు.

శత్రు నిర్బంధం లో ఉన్నాం మనం – ఈ ఇరుకు, చిరాకు , చీదర –  మన స్వస్థానమా  ?

కాదు, ఆనందం [glory of joy ] మనిషి సొంత స్థితి అనీ, దానికి fantasy లోంచి [ కూడా ] దారి ఉందనీ – అటువంటి మాటలు విడ్డూరం గా తోచగల పడమటి వైపున, యుద్ధ బీభత్సాల మధ్యన – Tolkien  ప్రకటించారు.

కనిపిస్తున్న  వాస్తవం ఎప్పుడూ సాపేక్షమే.

“Imagination is everything. It is the preview of life’s coming attractions.”
― Albert Einstein

Sources : Notes on Willing Suspension Of Disbelief [ Greg Martin ], Tales of middle earth [ JRR Tolkien ], Biographia Literatia chapter 15 [Samuel Taylor Coleridge ] , Some articles from wikipedia

 

అమ్మ కడుపు చల్లగా..

damayanti

 

 

శనివారం –  ఒకపూట భోజనమే కాబట్టి, పెద్ద వంట పనేమీ లేదులే! ఆయనొక్కడికీ  ఇంత,  – చారెడు పెసరప్పేసి,  ఒక టొమోటా పడేస్తా. రెండు బంగాళ దుంపలు వేయించి జీలకర్ర కారం జల్లి విస్తట్లో వడ్డించానంటేపిచ్చి మా రాజు  సంతొషం గా తిని లేస్తాడు. అక్కడితో అయిపోతుంది.

తనకా? ఆ, తనదేం లెక్కనీ? ఏం తింటే సరిపోదనీ? తనకేమైనా స్పెషల్స్ కావాలా ఏవిటీ?

అయినా! కొత్తగా తిరగమూతేసిన మాగాయి వుందిగా! ఇంకానేమో , గోంగూర – పళ్లమిరపకాయలేసి నూరిన పచ్చడుంది, సున్ని పొడుంది. నిన్నటి పెరుగుంది, ఇవాళ్టిదీ వుంది అబ్బో! చాలు చాలు. ఇంకెందుకూ, కూరలు నారలు?

ఇక రాత్రికంటావా, మిగిలిన ఇడ్లీ పిండి –  నాలుగు ప్లేట్లొస్తాయి. అంటే పదహారు ఇడ్లీలు. పది ఆయనకి, ఆరు నాకు అక్కడితో చెల్లు.   గుల్ల శనగపప్పు,  పచ్చి కొబ్బరి చిప్ప వేసి పచ్చడి నూరుతా.  చక్కరకేళీలున్నాయి గా! తలా ఒకటి నోట్లో వేసుకుని పడుకుంటే తెల్లారుతుంది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు.  ఇహ ఇవాళ్టికి  పెద్ద వంట హడావిడేం లేనట్టేలే..’ అనుకుంటూ జానకి –  పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది.

దీపం వెలిగిస్తూ – ఒకసారి, అష్టోత్తరం  చదువుతూ –  మరోసారి, పాలు, బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ ఇంకొక సారి – ఇలా – పూజలో ప్రతి ఘట్టంలోనూ..  ఆ రోజు  చేయఖర్లేని వంట గురించే ఆలోచించింది.

‘యానికానిచ పాపానిచ ..’ కళ్ళు మూసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి..నాలుగు అక్షింతలు తల మీద జల్లుకుని, ‘నాయనా, ఏడుకొండలవాడా! ఎక్కడ్లేని ఆలోచన్లు నీకు పూజ చేసేటప్పుడే వస్తాయెందుకు తండ్రీ?.. క్షమించు క్షమించు..’ అంటూ చెంపలేసుకుంది. ఆ పైన  సాష్టాంగ నమస్కారం చేసుకుని, పూజ గదిలోంచి బయటకొచ్చింది.

మరో సారి ఫిల్టర్ కాఫీ తగిలిద్దామా?, లేక ఆయనొచ్చేదాకా అగుదామా? అని  సందేహపడుతుండగా..అప్పుడు..అప్పుడు వినిపించింది  “అమ్మా” అనే పిలుపు. ఎంత ప్రియమైన స్వరం. ప్రాణాలు కదిలినట్టౌతుంది, ఆ పిలుపెప్పుడు విన్నా ఆమెకి.

ఆ రెండక్షరాలలోనే కదా మరి సృష్టి జనియించబడింది. అందుకే అంత పరవశమేమో మాతృమూర్తికి.

ఆ గొంతు వినీవింటమే –   ఒక్క అంగలో చెంగున వరండాలోకి వచ్చింది.

కొడుకు – వంశీ!  లోపలకొస్తూ కనిపించాడు. “మా నానే, వచ్చావురా కన్నా?!..” అంటూ ఆనందంగా  ఎదురెళ్ళి,  అతన్ని  చేతుల్తో చుట్టేసుకుంది.

చేతిలో బాగ్ కిందపెట్టి, తల్లి బుజాలు చుట్టూ చేతులేస్తూ  ‘ఎలా వున్నావమ్మా? ఆరోగ్యం బావుందా?” అడిగాడు.

“బాగున్నాం రా ! మాకేం? బ్రహ్మాండంగా వున్నాం.”  అంటూ ఏదో గుర్తుకొచ్చినదాన్లా, రెండడుగులు వెనక్కేసి – “ఎప్పుడొచ్చావు, వూళ్ళొకి?” అడిగింది.

“వారమైంది విజయవాడకొచ్చి. పనైపోంగానే ఇటే వస్తున్నా. అమ్మా, ఆకలేస్తోందే..” – పొట్ట మీద అర చేత్తో రాసుకుంటూ గారాలు పోయాడు.

ముఫైఐదేళ్ళ కొడుకు ఆ క్షణం లో ఆ తల్లి కంటికి మూడేళ్ళ వాడిలా కనిపించాడు. దేవుడికి  – మనం కూడా అలానే కనిపిస్తుంటాంట. అమ్మ దేవుని ప్రతినిధి కదా!

ఎంత పెద్దవాడైనా, ‘అమ్మా ఆకలి ‘ అని అడిగే బిడ్డ –  తల్లి కళ్ళకెప్పుడూ పసివాడుగానే కనిపిస్తాడు.

‘అయ్యొ, అయ్యో, నా మతి  మండిపోను.  రా.. రా! ముఖం  కడుక్కుని రా!  చేసిన ఉప్మా  వుంది.  తిని, కాఫీ తాగుదువు గానీ..” అంటూనే, ఒక్క గెంతులో వంటింట్లోకి పరుగు తీసింది.

పెరట్లో బావి దగ్గర బట్టలుతికే నల్ల రాయి మీద కుర్చుని, అమ్మ పెంపుడు బిడ్డైన పెరటి తోటని ఆనందంగా చూస్తూ.. బ్రష్ చేసుకుని వచ్చాడు.

వంటింటి గుమ్మా నికెదురుగా  కుర్చీ పీటేసుకుని కుర్చున్నాడు.  ఎదురుగా – తులసి కోట లో గుచ్చిన    అగరు ధూపం గాల్లోకి మెలిక తిరిగి,  గాల్లో  మాయమౌతూ  చక్కటి పరిమళాల్ని విరజిమ్మి పోతోంది.  మందారాలు తురుముకున్న తులసమ్మ అచ్చు అమ్మంత పవిత్రం గా కనిపిస్తోంది.

” ఇదిగో ముందు  ఉప్మా తిను.”  అంటూ ప్లేట్ చేతికిచ్చింది. వెండి పళ్ళెం లో బొంబాయి రవ్వ ఉప్మా!  దోరగా వేగిన జీడిపప్పులతో, కర్వేపాకు ఘుమాయింపుతో  తెగ నోరూరించేస్తోంది.  కొత్తావకాయ గుజ్జు, దాన్లోంచి ఊరిన వెల్లుల్లి రెబ్బ, వూటా, నూనె కలిసిన చిక్కటి ద్రవం  గుజ్జులోకి కలిపి, చెంచాలోని ఉప్మాకి పట్టించి, నాలుగు నిముషాల్లో  మొత్తం ఉప్మా అంతా  లాగించేసాడు.

తింటున్నంత సేపూ ఎప్పుడూ ఏదో ఒకటి వాగే కొడుకు – కళ్ళు దించుకుని అదే పనిగా ఉప్మా తింటుంటె..చూస్తున్న ఆ తల్లి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి.

‘పిచ్చి వాడు. ఎంత ఆకలి మీదున్నాడు! ఎప్పుడనగా తిన్నాడొ, ఏమిటో! ఈ కాంపుల ఉద్యోగం కాదు కానీ, వాడికి సరైన తిండీ నిద్రా రెండూ కరువైపోయాయి.

‘ ఆ సిటీ వొద్దు, ఆ వుద్యోగమూ వొద్దు.  వచ్చి హాయిగా  మాతో బాటు  వుండరాదురా? ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకు బ్రతుకుదువుగానీ’ అని చెప్పి చూసింది.

ఒక నవ్వు నవ్వి మిన్నకుండిపోతాడు తప్ప, జవాబు చెప్పడు. అయినా కోడలికి ఇష్టముండదని కూడా తెలుసు కానీ, పైకి అనదు. అది ఆమె సంస్కారం.

కళ్ళొత్తుకుంటున్న తల్లిని క్రీగంట గమనిస్తూనే వున్నాడతను.

మనకోసం అలా కంట తడిపెట్టే వాళ్ళు వుంటం చాలా అదృష్టం. కానీ ఆమె అలా కన్నీటిలోనే ఆనందిస్తుందని తెలిసి, చేరువగా నిలవడం ఇక్కడి విచిత్రం.

ఎంత బావుంది. ఉత్తి ఉప్మా.  మెత్తగా, వెన్న విచ్చుకున్నట్టు,  అప్పుడే కాచిన నేతి సువాసనతో, తింటుంటే జీడిపపప్పులు పంటికింద కమ్మటి రుచిని పెంచుతూ..నంజుకున్న ఆవకాయ కారం కారంగా పుల్ల పుల్ల గా..జిమ్హ్వ లూరుతూ రుచినిఊరిస్తూ..గుటక గుటకకీ మధ్య కొత్త రుచులు రేపుతూ..

అబ్బ ఏం కాంబినేషన్లే!

నీరజ కూడా ఉప్మా చేస్తుంది. కానీ, వేగని ఆవాలు ఎసట్లో ఉబ్బి, పచ్చిమిరప కాయ వేగకపోవడం వల్ల నాలిక మీద ఒకసారి అలా మండి,  కర్వేపాకు పచ్చి వాసన తేలి,  జీడిపప్పు మెత్తబడిపోయి,  నీళ్లతో రవ్వ – అనుపానం కాకపోవడం వల్ల .. ఉప్మా  ఉండలు కట్టి తింటున్నప్పుడు చెంచా తో అన్నీ తీసి పక్కన పెట్టె వ్యర్ధ పదార్ధాలౌతాయి. అందులో ఉప్మా రుచి తెలిసిన మనసు వెంటనే బుస్సుమంటుంది. -‘ఛ. నీకు ఉప్మా చేయడం కూడా రాకపోతే ఎలా? మా అమ్మ దగ్గర నేర్చుకోరాదూ?’ అని మందలించబోతే, వెంటనే రిటార్ట్. – “ఓహో, ఐతే మీ అమ్మదగ్గరే  వెళ్ళి వుండొచ్చు గా! ఎంచక్కా రోజూ ఉప్మా తినొచ్చు. అమ్మ చేసిన ఉప్మా..” మూతి తో బాటు కనుబొమలు విరుస్తూ ముఖమంతా మొటమొట లాడించుకుంటున్న నీరజ రూపం చటుక్కున కళ్ళ ముందు మెదిలింది.

నిట్టూర్చాడు.

ఇంతలో – సురలకు కూడా దక్కని అమృతపు సువాసన  ముక్కుకి తగలడంతో ఈ లోకంలోకొచ్చి పడ్డాడు.

–   ఫిల్టర్  ఫిల్టర్ పై కప్పులో వేసిన కాఫీ పొడి మీద ప్రెస్సింగ్ డిస్క్ వుంచి, పై నించి మరగ కాగిన నీళ్ళు    దిమ్మరిస్తున్నప్పుడు..అది బుస్సున పొంగి ఆగిపోతున్నప్పుడు..చూసారా?..ఆ కాఫీ డికాషన్ సువాసన!?.. మాటల్లో చెబితే ఫీలింగ్ పోతుంది. ఇదిగో వంశీ లా కళ్ళు మూసుకుని  ఊపిరి పీల్చి, ఆ కాఫీ పరిమళాన్ని గాఢంగా గుండెలకెత్తుకున్నప్పుడు తెలుస్తుంది ‘ ఆహా! ఇలాటి కాఫీ – ఒక్క కప్పు.. కాదు, కాదు.  ఒక్క బొట్టయినా చాలు.   కాలం చేసే జాలాలు తట్టుకుని ముందుకెళ్ళిపోడానికి..’ అని అనుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు కొన్ని క్షణాల సేపు.

“ఆహా.   అమ్మా, మన వంటింట్లో ఇన్నేసి   ఘుమఘుమలెలా సృష్టిస్తావ్?” అన్నాడు తల్లిని ప్రశంసిస్తూ.

నిజానికి ఇల్లాలి సిగ్నేచర్ కి ఒక తెల్ల కాగితం లాంటిది – వంటిల్లు.

అభిరుచికి అమరిక తార్కాణమైతే ,  అద్భుత రుచులకు – లేని ఆకలి రేగడం  ప్రత్యక్ష సాక్ష్యం.

“చాల్లేరా, నీ పొగడ్తలకి పడిపోతాననుకోకు. నువ్వుస్తొన్నావని ఒక్క ఫోన్ కొడితే  నీ సొమ్మేంపోతుందిరా  వంశీ? బిడ్డ వాయిట్లోకొచ్చాడని, నాలుగు రకాల వంటలు చేసి  పెట్టక పోదునా? ఆ?!”

తల్లి ప్రేమని  అర్ధం చేసుకున్న వాడిలా నవ్వి అన్నాడు. “ఇప్పుడు మాత్రం నువ్వు తక్కువ చేస్తావా ఏమిట్లే..’ అంటూ   ఆమె  చేతిలోంచి కాఫీ కప్పుని అబగా అందుకున్నాడు. కప్పులోంచి సొగసుగా చిమ్ముతున్న పొగని  గట్ఠిగా ఆఘ్రాణించి,  మైమరచిపోయాడు.  ఆ తర్వాత – అపురూపం గా ఒక సిప్ తీసుకుని..’ అహా..ఏం రుచి. చక్కటి చిక్కటి కమ్మటి రుచి. అమ్మా! నీకు నువ్వే సాటి. రాలేరెవరూ కాఫీ తయారీలో నీకు పోటీ..’ అంటూ..తన గదిలోకొచ్చి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు-  ఎంతో ఎంతో హాయిగా సేద తీరుతూ.

తెరిచి వున్న కిటికీల్లోంచి పచ్చని తోటని, గాలికి ఊగే పూల రెమ్మల్ని,  బీర తీగకు  పూసిన చామంతుల్ని చూస్తూ… కాఫీ ని పూర్తి చేసాడు.

జానకీ, రామారావు దంపతులకు వంశీ ఒక్కడే కొడుకు. కృష్ణా జిల్లా పామర్రు పక్కన చిన్న గ్రామం. ఆవిడ తెలుగు టీచర్. ఆయన గ్రామ పంచాయితీ లో ఉద్యోగం. కొడుకుని కష్టపడి ఇంజినీరింగ్ చదివించారు.

చాలామంది అనుకున్నట్టు ఇంజినీర్లందరకీ   –  పెద్ద పెద్ద జీతాలుండవు.  వంశీ కూడా ఆ కోవకు చెందినవాడే. హైదరాబద్ లో నీటిమోటార్లు తయారు చేసే ఒక ప్రైవేట్ కంపెనీలో మర్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా, టూర్లు తిరుగుతుంటాడు.  ఆఫీస్ పని మీద  విజయవాడ కి వచ్చినప్పుడు  అక్కడ పనులయ్యాక, వెంటనే తల్లి దగ్గరకొచ్చి వాలి,  ఒక పూటుండి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతుంటాడు.

రిటైరైన తల్లి తండ్రుల్ని తన దగ్గర వుంచుకుని బాధ పెట్టటం అతనికి ఇష్టం వుండదు. ఎందుకంటే, వీళ్ళిప్పుడున్నంత రిచ్ గా వుండదు తనుంటున్న అపార్ట్ మెంట్.  ఈ పచ్చని లోగిలి, స్వచ్చమైన గాలి, వెలుతురు ముందు –  తన ఫ్లాట్  ఏ పాటిది? తమ బాల్కనీ కుండీలో ముళ్ళ మొక్క కూడా ఏపుగా పెరగదు. కొన్ని వాతావరణాలు అలాంటివి.

నీరజ  నీడలో కూడా అంతే. – మరో మనిషి ఆనందం గా వుండలేడు. కారణం ‘ఇది’ అని ఎంచి చూపేంత నేరాలుండవు. అలా అని పట్టించుకోకుండా హాయిగా బ్రతికేంత మంచి తనాలు కనిపించవు.

సమాజం లో చాలామంది తప్పు చేసి  తప్పించుకు తిరుగుతున్న వారిలానే,  కుటుంబం లోనూ  బాధ్యతల నించి తప్పించుకుని, తాము చాలా కరక్ట్ అని చలామణి అయే స్త్రీలూ వున్నారు.

పెళ్ళైన ఈ పదేళ్ళల్లో అమ్మా నాన్నలు  ఏ రెండు సార్లో, మూడు సార్లో తనింటికి వచ్చినట్టు గుర్తు. నెల రోజుల కని వచ్చి వారమైనా కాకముందే..’మేం వెళ్తాం రా కన్నా’అన్నారు. ‘అప్పుడేనా’ అన్నట్టు చూసాడు. ‘ ప్లీజ్ మమ్మల్ని వదిలేయి రా! మా పాలి మేం బ్రతుకుతాం హాయిగా ‘ అని వేడుకుంటున్న భావం చదివాడు వాళ్ళ చూపుల్లో. అప్పుడే అర్ధమైంది తనకి  – తన భార్య వ్యక్తిత్వం ఎలాటిదో అని.

అయినా అమ్మ ఒక్క పొర్లుమాటయినా చెబుతుందా కోడలి మీద!? – ఊహు. చెప్పదు. పైగా తను ఎక్కడ బాధపడతాడోనని.. ‘కొన్నాళ్ళు పోనీరా..అమ్మాయి శుభ్రంగా మనలో కలిసిపోతుంది’ అంటూ ఊరడిస్తుంది తల్లడిల్లుతున్న మనసుని.

కొంతమందిని కలిసినప్పుడు, పోయిన శ్వాస తిరిగొస్తుంది. మరికొంతమందితో కలిసి నడుస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది.

తను చేసినబొమ్మల్లోనే ఇంత  తేడానా ? – అని దేవుడెప్పుడూ విస్తుపోడా?

గంధపు  చెట్టు – తనని చుట్టుకున్న –  పాముకైనా, తన నీడన కుర్చున్న పరమ పురుషునికైనా ఒకేలా పరిమళలాలను పంచుతుంది.

తన ఇంటి కల్పవృక్షం – అమ్మ కూడా  అంతే.

తన నించి అమ్మ ఏమీ కోరుకోదు. ఆ అవసరమే లేదు.  తను కనిపిస్తే చాలు. తను ఈ ఇంట్లో అడుగుపెడితే చాలు..ఇలా గదిలో విశ్రాంతి తీసుకుంటూ..ఇదిగో..ఈ మెత్తని పరుపు మీద నిద్రలోకి జారిపోతుంటే..అమ్మ శబ్దం లేకుండా వచ్చి చూసి, తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ భోజనం సమయం వరకు తనని నిద్ర లేపదు.’ – నవ్వుకుంటూ మెల్ల మెల్లగా గాఢ నిద్రలోకి జారిపోయాడు.

*****

వీడు చెప్పా పెట్టకుండా వచ్చేస్తాడు తుఫాన్లా. సాయంత్రం చీకటి పడుతుండగా ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఈ ఒక్క పూట. ఏం వండాలి ఇప్పుడు. ఏం కూర చేస్తే బావుంటుంది?

కూరల బుట్ట చూసింది. ఒక పెద్ద గట్టి దోసకాయ కనిపించింది. వంటింటి కిటికీ లోంచి ఒక చూపేసి గాలించింది పెరటి తోటని. ఏపుగా నవనవలాడుతూ పెరిగిన  తోటకూర మొక్క – మనిషంత ఎత్తు లో  మంచి ఏపుగా ఎదిగి వుంది.

ఇంకేం, అనుకుంటూ – గబగబా వెళ్ళి, ఒక మొక్క మొక్క బలంగా పెరికి తీసుకొచ్చింది. ముదురాకు వొలిచి  పంపు ధార కింద కడిగి, నీళ్ళు వోడ్చే బుట్టలో వేసి, గోడకి వారగా వుంచింది.

తోటకూర కాడ  చివర వేరు కట్ చేసి, కత్తి పీట తో నాలుగు ముక్కలు గా తరిగింది. ఆ పై, మందమైన చక్రలు గా  తరిగి,  తరిగిన ముక్కల్ని నీళ్ళల్లో వేసింది.

రెండు కుంపట్లంటించి, ఒక దాని మీద మందపాటి ఇత్తడి గిన్నెలో  రెండు గరిట్ల కంది పప్పు వేసి, దోరగా కమ్మటి  సువాసన వచ్చేదాకా వేయించి,  సరిపడ నీళ్ళు పోసి, మూత పెట్టింది.

మరో కుంపటి మీద గిన్నె లో ఎసరు పోసి, అందులో ఒక చుక్క నూనె బొట్టేసి, చిటికెడు ఉప్పు రాల్చి, బాగా మరిగాక – కడిగి, వార్చిన బియ్యం వేసి, గరిటతో నాలుగు వైపులా తిప్పి, మూతేసింది. అన్నం ఉడుకుపట్టగానే – కుంపటిని అటు ఇటూ కుదిపి, గిన్నె చుట్టూ వున్న బొగ్గుల్ని లాగేసి, సన్నసెగ చేసింది.

కత్తి పీట ముందు కుర్చుని, ముందుగా దోసకాయని నిలువుగా రెండు చెక్కలు చేసింది. ఒక దాని మీద పెచ్చు తొలగించి, గింజ  తీసి లావాటి ముక్కలు తరిగి గిన్నెలోకేసుకుని, పసుపు జల్లింది.

రెండో చెక్క చిన్న చిన్న ముక్కలుగా తరిగి చిన్న జాడిలో వేసి, పసుపుతో బాటు సరిపడ ఉప్పు కారం  వేసి పక్కన పెట్టుకుంది. నానబెట్టుకున్న ఆవాలతో బాటు, ఓ ఎండు మిరపకాయ  జోడించి  రోట్లో వేసి బండ తో నూరింది. మెత్తగా అయిన ఆ మిశ్రమాన్ని దోసకాయ  ముక్కలకి పట్టించి, పచ్చి ఆవ  నూనె వేసి నాలుగువైపులా కలియదిప్పి మూతేసింది.

పప్పు గిన్నె ఒక సారి చెక్ చేసింది.  సగం బద్ద ఉడకగానే, దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాముక్కలు వేసి కలిపి మూతేసింది.

అన్నం వుడికి, అడుగున బంగారు వన్నెలో పొర చుట్టుకుంటున్న సువాసన గుప్పు మంది. క్షణమైనా ఆలస్యం చేయకుండా  గబుక్కున గిన్నె కిందకి దింపి, దాని చుట్టూ నీళ్ళు చిలకరించింది. చుయ్..చుయ్ మంటూ రాగాలు తీసింది అన్నం గినె.  మూత అయినా  తీసి చూడకుండానే తెలిసిపోతుంది ఆమెకి. తడి లేకుండా అన్నం ఉడికిన సంగతి.

వంటలకి స్పర్శ వుంటుంది. అది మనసు పెట్టి చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ భాష చాలా అర్ధమౌతుంది.

ఖాళీ అయిన  కుంపటి మీద  మూకుడు వేసి, నూనె వేడయ్యాక బూడిద గుమ్మడొడియాలు, ఊరినమిరపకాయలు, వేయించి తీసింది.  అదే నూనెలో నాలుగు మెంతి గింజలు, ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు, వేసి, అవి వేగాక – జాస్తి ఇంగువ పొడి జల్లి, బుస్సుమని పొంగగానే..  పప్పు గిన్నెలో తిరగమూత బోర్లించి మూతేసేసింది.

mannem

చిత్రం: మన్నెం శారద

అదే మూకుట్లో – పోపు వేయించి,  అందులో – సన్నగా తరిగి,  బిరుసుగా వుడికించి  వార్చిన తోటకూర ముద్దని వేసి, కలియబెట్టింది. తడి ఇంకగానే అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లెల్లి రెబ్బల ముద్ద చేర్చి, కలియబెట్టి దింపేసింది. చల్లారాక గుమ్మడికాయ వడియాలని చేత్తొ నులిమి  కూరలో కలిపింది.

ఒక రెండు కప్పుల అన్నాని చల్లార్చి, నిమ్మకాయ పిండి, జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాలు, వేయించిన పోపు పెట్టి, సన్నగా తరిగిన కొత్తిమీర జల్లింది.  పుల్లటి పులిహోర సిధ్ధం.

లేత సొరకాయ తెంపుకొచ్చి, మజ్జిగ పులుసు కాచింది.

జాడీలోంచి తీపి ఆవకాయ తీసి వుంచింది.

మట్టి కుండలో తోడేసిన పెరుగు, నీళ్ళలో ముంచిన మామిడి రసాలు, వీట్నన్నిట్నీ –  వేటికవి విస్తట్లోకి వివరంగా  అమర్చేందుకు వీలుగా బౌల్స్ , వడ్డించడానికి  స్పూన్లూ, గరిటెలు, బౌల్స్  సిధ్ధం చేసుకుంది.

అలా బావి గట్టు చివరికల్లా వెళ్ళి, మూడు అరిటాకులు కోసుకొచ్చింది. ఆకుపచ్చటి పత్రాలని తడి బట్టతో శుభ్రం చేస్తుంటే –

భర్త వచ్చాడు. “ ఏవిటీ!!వీడొచ్చాడేమిటీ?” అని,  ముసిముసిగా నవ్వుకుంటూ  అడిగాడు.

“అవును. వచ్చాడు. ముందు గదిలో బాగ్ చూసి అడుగుతున్నారా? ” అని అడిగింది,   మంచి నీళ్ళందిస్తూ.

“కాదు. వంటింట్లోంచి ..వీధి వరకు వంటలు ఘుమాయిస్తుంటే అనుకున్నాలే..” సరసమాడాడు.

వంశీ గదిలోంచి బైటకొచ్చాడు.  తండ్రి తో కాసేపు కుశలమాడి, స్నానం చేసొచ్చాడు.

పొద్దున ఉప్మా కుమ్మేయడం తో – ఇక ఆకలి వేయదనుకున్నాడు. కానీ, వంటింట్లో అలా పరిచిన వంటకాలు చూసే సరికి  ఆవురావురుమంటూ ఎక్కడ్లేని ఆకలి పుట్టుకొచ్చేసింది.

చేసే వంటల రుచిని బట్టి ఆకలేస్తుంది. తినాలని మనసు ఉవ్విళ్లూరుతుంది.

జీవితమైనా అంతే.-  భాగస్వామి ప్రెమానురాగాల అభివ్యక్తీకరణలో జీవితం ఒక సంపూర్ణతని సంతరించుకుంటుంది. అయుష్షు తీరిపోతున్నా, ఇంకా బ్రతుకులోని మాధుర్యాన్ని గ్రోలాలనిపిస్తుంది. కాదూ?

అరిటాకు మధ్యలో అన్నం, చుట్టూ రకరకాల పదార్ధాలు, కొసరి కొసరి వడ్డిస్తూ అమ్మ. పక్కనే కూర్చుని, కబుర్లాడుతూ నాన్న.

ఇలా పీట మీద కుర్చుని, ప్రేమ విందు ఆరగించడానికి ఎంత  పుణ్యం చేసుకు పుట్టాలి?

“అమ్మా! నెయ్యి ఇప్పుడే కాచినట్టున్నావ్? గోగు అట్టిపెట్టావా నాకోసం? అరటి గెలేసిందన్నావ్ మగ్గేసారా? తోటకూర కాడల కూర చాలా బావుంది, ఆవ పెట్టావు కదూ? అబ్బ!  దోసావకాయ ఘాటు అంటింది. మజ్జిగ పులుసు నువ్వు చేసినంత అద్భుతం గా నేనెక్కడా తిన్లేదమ్మా! నిజం. ఒట్ట్టు. ఏవో పప్పులు నానేసి రుబ్బుతావు కదూ. నీరజ కి చెప్పాను. ఉత్తి శనగపిండి మాత్రమే కాదు, అమ్మ ఇంకేవెవో ఇం గ్రీడియంట్స్ కలుపుతుందని. ఒక సారి ఫోన్లో చెప్పకూడదూ? మీ కోడలికి. కుండలో పెరుగు ఎంత తీయగా వుందో..మామిడి రసం తో కలిపి తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరం అని అంటారు చూడు..అలా వుంది..”

భోజనం చేస్తున్నంతసేపూ..తన వంట గురించి మాట్లాడుతున్న కొడుకు మాటలకి, పొగడ్తలకి, అతను పొందుతున్న ఆనందానుభూతులకి ఆమె కడుపు నిండిపోతోంది. అతడిలో బాల్యపు వంశీ  మురిపెంగా చూస్తూ వుండిపోయింది.

ఇంత తక్కువ సమయం లో ఏం వంటలు వండి చేసి పెడతానా, భోజనాల వేళకి అందుతాయా లేదా అనుకుంది కానీ, కొడుకు ఒక్కోపదార్ధాన్ని వర్ణించి వర్ణించి చెబుతుంటే..’హమ్మయ్యా! నాలుగు రకాలు చేసానన్నమాట?’ అనుకుంది తృప్తిగా.

నిజమైన తల్లి చూపెప్పుడూ పిల్లల సంపదల మీద వుండదు. పిల్లల సంక్షేమం మీద వుంటుంది.

నిజమైన పుత్రులకు కూడా అమ్మ చూపే చాదస్తపు ప్రేమల మీద కోపం వుండకూడదు. దాని వెనక అంతరార్ధం ఏవిటో కనుక్కొని వుండాలి.

ఇది మనసు కు చెందిన ప్రత్యేకమైన లిపి. రహస్యం గా రాసి వుండే ఒక భాష. కన్న తల్లి ఆంతర్యం కన్న కొడుక్కి మాత్రమే అర్ధమౌతుంది. అయితె, అమ్మ అంటె ఏవిటో అర్ధం తెలిసిన పుత్రులకు మాత్రమే.

అలా..వంశీ   తల్లి మనసుని  పూర్తిగ చదివి తెలుసుకున్నాడు.

భోజనాలు చేసి లేచే సరికి, రెండున్నరైంది.

ఆమె వంటిల్లు సర్ది హాల్లోకొచ్చి కుర్చుని, పిచ్చా పాటి మాట్లాడుకుంది కొడుకుతో.

ఏడింటికి బస్ బయల్దేరుతుందని చెప్పడం తో…లేచి లోపలకొచ్చింది జానకి.

భర్తని పిలిచి, యాభై గట్టి అరటి పళ్ళని పాక్ చేయించింది. దొడ్లో పండిన కూరల పంటంతా కలిపి పది కిలోల పొట్లం కట్టిపెట్టింది.

రెండ్రోజుల కిందట చేసి డబ్బాలో పోసిన కారప్పూస జిప్ లాక్ కవర్లో పోసింది. ఓ పాతిక కొబ్బరి లౌజుండల్ని మరో పాకెట్ లో వేసింది.

వీటన్నిట్నీ రెండు పెద్ద సంచుల్లో వేసి, జిప్ వేసి,  కొడుకి చేతికందించింది.

ఇప్పుడివన్నీ ఎందుకమ్మా అంటూనే..’కారప్పూస మంచి వాము  వాసనేస్తున్నాయి.  బావుంది’ అన్నాడు.

జానకి తనలో తాను నవ్వుకుంది. కొడుకు మాటలకి.

మధ్యాహ్నం హెవీ లంచయ్యిందని ఏమీ తిననన్నాడు. కానీ, ఆమె బలవంత చేసి దిబ్బరొట్టె తాజా వెన్న లో అద్ది, వెల్లుల్లి కారప్పొడితో కలిపి తినిపించింది.

అమ్మ చేతి ముద్దు కాదనలేకపోయాడు. బస్సు ప్రయాణం వేడి చేస్తుందంటూ కవ్వంతో చిలికిన చిక్కటి మజ్జిగ లో పంచదార పొడి, ఇలాచి పొడి వేసి, చిటికెడు ఉప్పు రాల్చి కలిపి స్వీట్ లస్సీ చేసి అందించింది.

ఖాళీ గ్లాస్ అక్కడ పెడుతూ..ఇక వెళ్ళేందుకు లేచాడు.

‘రెండు ఆపిల్స్ ఇవ్వనా మధ్య రాత్రి ఆకలేస్తుందేమో..’ అంటున్న తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఏమీ వద్దమ్మా అన్నట్టు తలూపాడు. అమ్మ ముఖం లోకి..కళ్లల్లోకి..చూస్తుండిపోయాడు.

 

ఏదో చెప్పలేని అద్వితీయమైన భావం అతని మూగవాణ్ణి చేస్తోంది. ఇంత గా తనని ప్రేమించే అమ్మ వుండటం ఒక వరం. ఒక దైవానుగ్రహం. కానీ తిరిగి ఏమిస్తున్నాడు?..ఏమివ్వలేడు. తను ఇవ్వగలిగేవన్నీ ఆమెకి తృణ ప్రాయం. ఆశించని లంచం. ఇలా వండి పెట్టుకోవడం లో ఆవిడ పొదుతున్న అపురూపమైన ఆనందం ముందు అవన్నీ బలాదూర్.

అందుకే వస్తుంటాడు..అమ్మని సంతోష పెట్టటం కోసం.

అఫ్కోర్స్. విందు ఎలానూ వుంటుంది. అమ్మని అంత ఆనందంగా చూడటమూ విందే కదూ?

నిన్ననే ఎండీ తో మాట్లాడాడు. కొత్త రాష్ట్రం లో బ్రాంచ్ ఓపెన్ చేస్తే కంపెనీ లాభాలు పుంజుకుంటుందని.  గుంటూరు, విజయవాడకొచ్చేస్తే..అమ్మని చూడ్డానికి తరచూ రావొచ్చు.

“ఏమిట్రా అలా చూస్తున్నావ్? పిచ్చి వాడిలా?” కొడుకుని నవ్వుతూ అడిగింది.

“ఏం లేదమ్మా..మళ్ళీ ఏ రెండు వారాలకో కానీ రాను కదా.. తనివితీరా చూసుకుంటున్నా..నిన్ను, నీ ప్రేమని..” అంటూ వొంగి, ఆ ఇద్దరి పాదాలనూ స్పృశించాడు కళ్ళకద్దుకున్నాడు.

“అమ్మాయిని అడిగానని చెప్పు. పిల్లలు జాగ్రత్త. ఈసారి సెలవులకి అందరూ కలిసి రండి..”

బస్సులో ప్రయాణిస్తున్న వంశీకి ఇంకా తల్లి మాటలు వినిపిస్తూనే వున్నాయి.

వంట చేసి అమ్మ శ్రమ పడుతుందని పూర్తిగా తెలుసు. కానీ అది ఆమె శ్రమ అనుకోదు. పైగా తన కష్టన్నంతా… కొడుక్కి వడ్డిస్తున్నప్పుడు పొందే ఆనందంలో మరచిపోతుంది. ఆమె ఆనందమే తనకి ముఖ్యం.

తను బ్రతికున్నంత వరకు కొడుక్కి కంచంలో అన్నం పెట్టుకోవాల్నఏ చాలా సామాన్యమైన కోరిక ఎంత విలువైనదో…ఎందరికి  తెలుస్తుంది?

**********

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పంటల్లో మంటలు

gopi

తెల్లారగట్టే పొలానికిపోయి పనులు సేసుకోటం మాకలవాటు. కోడికూయకముందే పొలానికెల్టం, పంటకి నీల్లు పెట్టడం రొజూ మాపని. పూలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తెల్లరిపాటికల్లా కోసి గంపల్లోకో, గోనె సంచుల్లోకో పేర్చి సిద్ధంగా ఉంచుతాం. విజయవాడ నుంచి మారుబేరగాళ్ళు వొచ్చి ఆటోల్లోనో, సిన్న లారీల్లోనో మార్కెట్టుకు తీసుకుపోతారు. అక్కడ సిల్లర బేరగాళ్లకి అమ్ముతారు. ఇంకొంతమంది సిల్లర బేరగాళ్ళు ఈల్లకాడ కొనుక్కొని సిటీ కాలనీల్లోకి పోయి అక్కడ అమ్ముకుంటారు.
పంట తక్కువ పండించే రైతు కూరగాయలు, ఆకుకూరలు సైకిలు మీదనో, మోటర్ సైకిలు మీదనో సిటీకి తీసుకెళ్లి అమ్ముకుంటారు. మావూళ్ళో ఇంకొంతమంది అచ్చంగా యాపారం సెసోల్లు నాబోటి సిన్న రైతు కాడ కూరగాయలు, ఆకుకూరలు కొని పక్కన పల్లెటూళ్లకెళ్లి అమ్ముకుంటారు.
నాది మొత్తం అరెకరం పొలం; అందులో అయిదు సెంట్లు కొత్తిమీర, అయిదు సెంట్లు పుదీనా వుంది. మిగతా 40 సెంట్లలో పది సెంట్లు వంకాయలు, పది సెంట్లు బెండ కాయలు, పది సెంట్లు గోంగూర, పది సెంట్లు తోటకూర వేశా. పంట తక్కువే. అందుకే మా వూరి బాబురావుగాడు మోటరు సైకిలు మీదొచ్చి పొద్దున్నే పంట తీసుకుపోతడు.  సుట్టుపక్కల ఊళ్లళ్లో తిరిగి అమ్ముకుంటడు. ఆడు పొలంలోకి వచ్చేపాటికి వంకాయలు, బెండ కాయలు, గోంగూర, తోటకూర కోసి కట్టమీద పెడతా. ఆడొచ్చి అన్నీ బండిమీద బుట్టలో యేసుకొని పోయి మధ్యాన్నానికల్లా అమ్ముకొని ఇంటికొత్తడు.
నా అరెకరం పొలం నాకు పని సరిపోద్ది. దాని పంట బాబురావు గాడి యాపారానికి సరిపోద్ది.
నేనూ, నా పెళ్ళాం అప్పుడప్పుడు రైతుల పొలాల్లో పనికి కూడా పోతం. ఇద్దరికీ మంచి కూలే వసద్ది. పెద్దగా దూరం పనులకెల్లం… మా పొలంకాడ దగ్గర్లోనే అరటి తోటలు, మల్లెపూలు, బంతిపూల తోటలు ఉన్నయ్. ఆపొలాల్లో పనికే పోతం.
ఇయ్యాల బాబురావు ముందే వొచ్చిండు. ఆడికి గోంగూర, తోటకూర కోసి కట్టలు కట్టి యిచ్చిన. వంకాయలు,  బెండకాయలు సెరో అయిదు కేజీలకొచ్చినియ్. అన్నీ కలిపి ఆడికిచ్చి, ఆడెల్లగానే నేనూ యింటిముఖం పట్టిన. యింటికెల్లి వొక ముద్దతిని కూసేపు అట్టా మంచమ్మీద పడి కునుకేత్తే మల్లీ మాపిటేల పొలానికి పోయి నీల్లు కట్టొచ్చు.
కట్ట మీద నడుత్తుంటే మాగొప్ప ఆనందంగా ఉంటది. రెండు పక్కలా పచ్చని పంట పొలాలు. ఒకపక్క అల్లంత దూరాన నది, ఇంకోపక్క పంటపొలాలకవతల మా వూరు… సూట్టానికి బాగుంటది. పెద్ద పెద్దోల్లు కార్లేసుకొని ఈ కట్టమీదకి వత్తారు పచ్చని పొలాలు సూడ్డానికి, సల్లటి గాలి నది మీదనుంచొచ్చి పొలాల్లోకెల్తది. అబ్బో యెంతబాగుంటదో …
యిక యీ పంటలు కనిపించవేమో!? రాజధాని బిల్డింగులొత్తయ్…. యీ గాలికూడా వుండదేమో!?
వొల్లు జలదిరించినట్టనిపించింది.
యింతలోనే దూరంగా అరుపులు, కేకలు యినిపించినయ్…. ఆపక్కకి తలతిప్పి సూసిన… అరిటి తోటలో మంటలు… జనం తోటవైపు పరుగెత్తుతున్నారు.
ఒక్కసారి గూండాగినంత పనయింది. పచ్చటి పొలంలో మంటలేంటి?
బయమేసింది. వెంటనే తేరుకొని నేను కూడా ఆ కాలే పొలం దిక్కు పరుగెత్తిన.
అరిటి తోటలో కరంటు మోటరు ఉన్న పాక కాల్తoది. మంటలు నేలమీద పాకుతున్నయ్. పొలంలోని నీళ్ల పైపులు కాలిపోతున్నయ్. దగ్గర్లో నీల్లు లేవు మంటలార్పటానికి. ఎవురికాళ్ళు అటూ, యిటూ పరుగెత్తుతున్నారు.
“ఒరేయ్ ఆ పొలంలో మోటరు ఆన్ చేయాండ్రా”
ఎవురో పెద్దగా అరిశారు. ఇంతలోనే పక్కపొలంలో మోటర్ ఆన్ అయింది. తగలబడుతున్న పాక మీదకి పైపు పెట్టి నీళ్లు కొట్టారు.
పాక కాలిపోయింది.
కరెంటు మోటర్ కాలిపోయింది.
పొలంలో నీళ్ల పైపులు కాలిపోయినియ్.
బూడిదే మిగిలింది.
యింతలో పొలం ఆసామి వొచ్చిండు.
గుండెలు బాదుకుంట ఏడుత్తుండు.
ఐదెకరాల అరిటి తోట… మంటలకు పొగసూరింది. అరిటి గెలలు నల్లబడ్డయ్.
బుజమ్మీద కండవా తీసి కళ్ళు తుడుసుకుండు.
“ఏంట్రా యిది? ఎట్ట జరిగింది?” గుంపులో ఒకాయన అడిగిండు.
“ఏమో, ఎవురికి తెలుసు? సిగిరెట్టు, బీడీ ముక్క ఎవురన్న యిసిరుంటే ఆంటుకుందేమో!?”  యింకొకాయన అన్నడు.
“యెహే నోర్ముయ్యండ్రా… సిగిరెట్టు, బీడీ ముక్కలు పక్కమీదికేవుడెత్తాడు.”
“అసలిట్టా ఎప్పుడూ జరగలేదు. పంట పొలాల్లో ఈ మంటలేంట్రా?”
“ఎవుడు సేసుంటాడు ఈపని?”
“ఆడు మనిషా, పశువా?”
“నోటికాడి కూడుకి నుప్పు పెట్టిన ఎదవ ఎవుడ్రా?”
తలొక మాట… తలొక తిట్టు…
ఎప్పుడూ లేదిలా… పంట పొలాల్లో మంటలా …
గుండె చెరువైంది. పంట కోశాక మళ్ళీ దుక్కి దున్నే ముందు చెత్త ఏదన్నా ఉంటే రైతే దగ్గరుండి నిప్పు పెట్టి తగలబెడతడు. అంతేగానీ యిలా పంటకే నిప్పు పెట్టడు. మోటరు షెడ్డు కూడా కాల్చుకుంటడా!!??
అందరం అక్కడే కూసున్నం. యింతలో పోలీసు జీబొచ్చింది. జీబులోంచి పోలీసులు దిగారు. ఆరుగురు పోలీసులు. తోటలోకి నడుసుకుంట వచ్చారు.
అందరం లేసి నిలబడ్డం.
“ఏంటయ్యా… ఏంటి … ఈ మంటలేంటి?” ఒక పోలీసాయన అడిగిండు.
“పాక కాలిపోయిందండి” ఎవురో సెప్పిండు.
“ఎలా కాలింది?” పోలీసాయన మమ్ముల్నీ, కాలిన పాకాని సూసుకుంట అడిగిండు.
“ఏమోనయ్యా… మంటలు చూసి మేం పరుగెట్టుకుంటా వచ్చినం. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినం.”
“ఎవరిదీ పొలం?”
“నాదేనయ్యా” అనుకుంటా, కండవతో కళ్ళు తుడుసుకుంటా వచ్చిండు ఆసామి.
“నీ పేరేంటి?” పోలీసాయన గట్టిగనే అడిగిండు.
“సత్యనారాయణ “
“ఆఁ … ఏం పేరూ?”
“సత్యనారాయణ సార్”
“పాకెలా కాలింది?”
“తెలవదయ్యా… మంటలు చూసి నేనొచ్చా.. అప్పటికే వీళ్లంతా ఉన్నారు.”
“సరే… మేం చూస్తాంలే… పంట కాల్చిన వెధవెవ్వడో దొరక్కపోడు… మేం చూసుకుంటాం లే… ఇక ఇళ్ళకెళ్ళండి.”
పోలీసాయన అందరికేసి సూసిండు. ఆచూపుతో అందరం అక్కణ్ణుంచి కదిలాం.
నేను ఆలోసిత్తన్న… ఏంటిది… పంట పొలాల్లో ఈ మంటలేంటి… పంటలు తగలబెట్టటం ఏంటి…
మనసు పరిపరి విధాలా ఆలోసిత్తంది.
ఇంటికొచ్చిన గాని మనసు కుదుట పళ్ళేదు.
అన్నీ ఆలోచనలే… ఎందుకిలా జరిగింది.
***
యింట్లో టీవీ పెట్టా… వార్తలు … అన్ని టివీల్లోనూ ఒకటే వార్త… రాజధాని పంట పొలాల్లో అగ్ని ప్రమాదం…
“దోషుల్ని పట్టుకుంటాం” అని పోలీసులు.
“ఇది రాయలసీమ వాళ్ళ కుట్ర… ప్రతిపక్షం కావాలనే ఈ దుశ్చ్యర్యకు పాల్పడింది” మంత్రి గారు…
“రైతుల్ని,, ప్రజల్ని బెదిరించడానికే ప్రభుత్వం ఈపని చేసింది.” ఇంకో నాయకుడు.
నాకేం అర్ధం కాలేదు.
పంట పొలాల్లో అగ్ని ప్రమాదం ఏంటి? రాయలసీమ వాళ్ళైతే మాత్రం పంట తగలబెడతారా?”
ఇది నిజంగా ప్రమాదమా లేక రాజకీయమా!!??
అన్నీ ప్రశ్నలే… జవాబే లేదు.
జవాబు అధికార్లు చెప్పటం లేదు  మంత్రులు చెప్పటం లేదు. నాయకులు చెప్పటం లేదు.
అసలేం జరిగింది? మంటలెట్టా  రేగాయి? పంటపొలం ఎట్టా కాలిపోయింది?
***
సాయంత్రం ఊరు ఉలిక్కి పడింది.
పోలీసు జీబులు ఒకదానెంట ఇంకొకటి…. అబ్బో … ఎన్ని జీబులో… ఎంతమంది పోలీసోళ్లో….
“రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదం వంటి అరాచక చర్యలు జరుగుతున్న సందర్భంగా గ్రామాల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటమైనది. అనుమానించదగ్గ వ్యక్తులు కనిపిస్తే వెంటనే  సమాచారం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి.”
ఒక పోలీసు జీబులోనుండి మైకులో ప్రకటన….
***

మానవత్వం తడబడిన వేళ…

 

~

huges

“ పుస్తకాలు గ్రేట్ మైగ్రేషన్ అని మురిపిస్తాయి కాని వలసలు ఇష్టపడటానికి మనుష్యులు పక్షులు కాదు కదా “ అనుకుంటుంది Minnie Bruce Pratt లోని ఒక విస్తాపకురాలు తన  “ది గ్రేట్ మైగ్రేషన్ “ కవిత ద్వారా. ఎంత నిజం కదా మనుష్యులు మట్టిని నమ్ముకుంటారు , బ్రతికున్నన్ని రోజులు మట్టితో కలిసి ఉంటారు బ్రతుకయిపోయాక అదే మట్టిలో కలిసిపోవాలనుకుంటారు . రెక్కలొచ్చిన పక్షుల్లా కొందరు అవసరాల కోసమో ఆడంబరాల కోసమో మట్టినొదలడానికి సిద్ధపడతారే తప్ప ఊరొదిలి పొమ్మంటే ఊపిరొదిలినంత కష్టమేగా ? ఈ మొత్తంలో ప్రాజెక్టుల పేరిటో ప్రపంచీకరణ పేరిటో సాగే ఈ అభివృద్ధికి ఎవరో ఒకరు బలవ్వాల్సిందే అయితే ఆ బలవ్వడం ప్రతిసారి మట్టిని నమ్ముకున్న వాళ్ళే  అవ్వడమే అత్యంత విషాదం .

ది గ్రేట్ మైగ్రేషన్ , దాదాపు 1910 -1970 మధ్య కాలంలో అర్ధ శతాబ్దం పాటు జరిగిన మైగ్రేషన్ , మొత్తం రంగు జాతి మీద చూపిన  ప్రభావం చాల బలమయినది ,అంతేకాకుండా మొత్తం నల్ల జాతీయుల జనాభాలో ఈ మైగ్రేషన్ వల్ల చాలా  జనాభాని  కోల్పోయింది కూడా . ఎక్కువగా నల్లజాతీయులు ఉండే గ్రామీణ దక్షిణ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి అలబామా మిస్సిసిపీ లాంటి 14 రాష్ట్రాలకి బలవంతంగానో బ్రతుకుకోసమో జరిగిన 6 మిలియన్ల  ఆఫ్రికన్ల వలస విషయంలో జరిగిన రంగు కార్మిక దోపిడీ అనేది , యునైటెడ్ స్టేట్స్ ఆమోదంతో జరుగుతున్న ప్రపంచవ్యాప్త కుట్ర గా మొదలయిన సామ్రాజ్య వాదానికి చెల్లించిన ధర , దానివలన తడబడిన మానవత్వానికి అక్షర రూపం ఇది  అంటారు  చరిత్ర కారుడు , సివిల్ రైట్స్ అక్తివిస్ట్ W. E. B. Du Bois, మొత్తం గ్రేట్ మైగేషన్ గురించి రాస్తూ.

L1

50 ఏళ్ళ క్రింద జరిగిన  నష్టానికి దాదాపు మరో 50 ఏళ్ళ తర్వాత కూడా ఫలితాలు అనుభవిస్తున్న రంగు జాతి కష్టాలు ఈరోజుకి ఈ మధ్య జరుగుతున్న హ్యూస్టన్, టెక్సాస్ ,కాలిఫోర్నియా కాల్పులు దాని తర్వాత  జరిగిన ఆందోళనలు నిరూపిస్తున్నాయి . వెరసి మొత్తానికి ఒక శతాబ్దం తర్వాత కూడా ఒక మొత్తం జాతిని బానిసలుగానే చూస్తున్న ప్రపంచీకరణ ఫలితాలు మనల్ని నివ్వెరపరుస్తూనే ఉన్నాయి . నిజానికి మనదయిన లెజిటిమేట్ జీవితాలని కూడా అనుక్షణం భయపడుతూ గడుపుతున్న మనకి ,వలసల సంక్షోభం గురించి చర్చించడం ఒక కష్టమైన అంశం. ఇది నలుపు ,తెలుపు కాదు. ఇది చెడు వర్సెస్ మంచి కాదు. మనలోని మనిషితనం రాజ్యం ముందు పిరికితనంగా మారి ,సమస్య మనది కానప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకొని ముడుచుకొని పడుకొనే మూర్ఖ సివిలియన్ల శాతం పెరిగిపోయి , మనం బలవ్వనంత కాలం మన అభివృద్ధికి త్యాగాలు చేయాల్సిన బాధ్యత మామూలు ప్రజలందరికీ ఉండాల్సిందే అని టాక్స్ పేయర్స్ అనబడే ఎలైట్ గుంపులు . మొత్తం జనం పై పడుతున్న ఆర్ధిక భారాలు  తెలియకుండా వాళ్ళ కళ్ళ ముందు ఆర్ధికాభివృద్ధి తాలుకు మాయలోకం సృష్టించి కాళ్ళ కింద భూమి చల్లగా  లాగేస్తున్న చట్టసభలు తెలివిగా  మల్లన్నసాగర్లు , అమరావతుల పేరిట విస్తాపకులని పెంచుతుంటే , ఆ విస్తాపకుల శోకం మనది కానిదిగా భావరహితంగా బ్రతికేసే బానిస ప్రజలు వాళ్ళ మేధోతనానికి మార్గం చూపాల్సిన కవులు రచయితలు ఆర్టిస్టులు రాజ్యానికి తొత్తులుగా మారి , రాబోయే అవార్డుల కోసమో రాల్చి పడేసే రివార్డుల కోసమో వ్యూహాత్మక మౌనాలు పాటిస్తున్న కాలంలో మనసున్న కొంతమందికోసమయినా  అలాంటివే ఎన్నో కవితలు రాతలు రావాల్సిన అసవరం చాలా ఉంది .

ముఖ్యంగా పదవుల బేరగాళ్ళ ఆకాంక్షల ఫలితంగా కాకుండా ,పసిగుడ్డుల నుండి ప్రాణాలని లెక్క చేయని వీరుల వరకూ ,తమదయిన నేల కోసం , తమకి మాత్రమే దక్కాల్సిన నీటి కోసం అమరవీరుల ఆత్మహత్యలతో తడిసిన తెలంగాణలో “దొంగలెవరో దోచిరి గౌరమ్మా , దొంగలతోపాటు దొరలందరు గౌరమ్మా” అన్న ఫోక్ సాంగ్ పూర్తిగా  నిజం చేస్తూ రాత్రికిరాత్రి 14ఊర్ల తలరాతలు , అందులో నివాసితుల బ్రతుకు రాతలు మార్చేసిన అభివృద్ధి రీ_డిజైన్  , సొంత చెలకలు కుంటల్లో పచ్చబడాల్సిన జీవితాలు రేపొద్దున ఇంకో పాలమూరులా ముంబై మురికివాడల్లో చితికిపోయేలా , వందల్లో కుటుంబాలు అందులో ముఖ్యంగా ఈ దేశ నిజ మట్టి దేహాలయిన దళితులు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ మోసంలో బలవుతున్నప్పుడు ,ఈ రోజుకి కూడా శతాబ్దం క్రితం పరిస్థితులే  ఇంకోచోట ఇంకో వికృత రూపంలో ప్రత్యక్షమై జీవ నదుల్లాంటి మనుష్యులని జీవితాలే లేకుండా చేయడం వెనక కుట్రలని ఆపాల్సిన అవసరం మనందరిది కాదా ?

 

అలాంటి వాళ్ళందరి వ్యధల సమాహారంగా , ఒకపక్క తన నమ్మకాలు కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూనే , ప్రపంచ శాంతి ప్రేమ అనబడే రంగుల కలల సాకారం కోసం రెండు చేతులు ముకిళించి ప్రార్ధిస్తున్న ప్రతి మనిషి “నువ్వెక్కడ నుండి” అని పక్క మనిషిని అడగని రోజుకోసం  , ఒకవేళ అలాంటి ప్రశ్న వచ్చినా , నేనిక్కడ నుండే, ఈ నేల నాది ,ఈ గుండె నిండిన మట్టి పరిమళం నాది అని గర్వంగా ప్రతి ఒక్కరు చెప్పుకొనే రోజుకోసం , ఏ ఒక్క  కుటుంబం బలవంతంగా తన అస్తిత్వానికి దూరంగా బహిష్కరించబడకుండా ఉండే రోజు ఒకటుందనే నమ్మకంతో మనలో మానవత్వపు కోణాన్ని తడిమి చూపడానికి Langston Hughes రాసిన “One Way Ticket” ని తెలుగులో అనుసృజించే చిన్న ప్రయత్నం . వలసలే  ఇంత భయంగా భయంకరంగా ఉంటే, బలవంతంగా ఊర్లు వదులుకోవలసిన పరిస్థితులని సృష్టిస్తున్న వ్యవస్థకు భయపడి  సంతకాలు పెట్టిన రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రతి గుండె చప్పుడులా వినిపించే కవిత ఒకసారి మనకోసం .

 

నా జీవితాన్ని

వెంట తీసుకోని

తూర్పుకో ఉత్తరానికో

చికాగో, డెట్రాయిట్,

బఫెలో, స్క్రాన్టన్,

ఎక్కడో కాని

డిక్సీ మాత్రం కానిచోట

ఉంచడానికి వెళ్తున్నాను

 

నా జీవితాన్ని

వెంట తీసుకోని ఎదో ఒక ట్రైన్

ఉత్తరానో ,పశ్చిమానో ,

దక్షిణం కాని ఏదయినా

లాస్ ఏంజిల్స్, బకేర్స్ఫీఎల్డ్,

సీటెల్, ఓక్లాండ్, లేదా

సాల్ట్ లేక్కో తీసుకెళ్తున్నాను

 

జిమ్ క్రో లాస్తో

క్రూరులైన మనుష్యులతో

విసిగిపోయిన నేను ,

నా నుండి వారు

పరస్పర భయంతో

ఒకరికొకరు దూరంగా

పరిగెడుతున్నాం

 

నా జీవితాన్ని

వెంట తీసుకోని

వన్ వే  టికెట్ తో

ఉత్తరానికో ఈశాన్యానికో

వెళ్తున్నాను .

వెళ్ళిపోయాను (తిరిగిరా(లే)ను ) .

 

*

 

  • Jim Crow laws were state and local laws enforcing racial segregation in the Southern United States. Enacted after the Reconstruction period, these laws continued in force until They mandated de jure racial segregation in all public facilities in states of the former Confederate States of America, starting in 1890 with a “separate but equal” status for African Americans. Facilities for African Americans were consistently inferior and underfunded compared to those available to white Americans; sometimes they did not exist at all.

యెదురుచూసే నేలలా…

arun

వుత్తర్ ప్రదేశ్ బిజనోర్ లో ఫిబ్రవరి 16, 1972 లో పుట్టిన డా. అరుణ్ దేవ్ తన వున్నత విద్యను జవహర్‌లాల్‌  నెహ్రూ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసారు. యువకవి,విమర్శకులైన అరుణ్ దేవ్ “క్యా తో సమయ్” అనే తన కవితా సంకలనాన్నీ 2004 లో భారతీయ జ్ఞానపీఠ్ ప్రచురిస్తే, “కోయితో జగాహ్ హో” అనే మరో సంకలనాన్నీ వాణిప్రకాషన్ వారు ప్రచురించారు. వీరి కవితలు నేపాలీ,అసామీ,ఆంగ్లం,మరాఠీ భాషల్లో అనువదింపబడ్డాయి.గత అయిదు సంవత్సరాల నుంచి సమాలోచన్ అనే హిందీ అంతర్జాల పత్రికను నడుపుతున్నారు.

అరుణ్ దేవ్ గారు కవిత్వమంటే మానవత్వపు అనువాదంగా భావించే కవి.ఆయన కవిత్వం రాస్తూ నాగరికతను రాస్తుంటారు. దీని భూగృహంలో శవమైన విలువలు వుంటాయి.స్త్రీలు,పిల్లలు,నలుపు ముఖం కలవారి శాపంతో భయానకమౌతున్న యీ నాగరికతలో: రోజూ వొక నది మరణిస్తుంటుంది, వొక పక్షుల జాతి మాయమౌతుంటుంది, వొక జానపద పాట తన ప్రాణాలను కోల్పోతుంటుంది. యీ కవి మరో ప్రపంచాన్ని ఆశిస్తూ రాస్తుంటాడు.యితని కవిత్వంలో పొడిబారిన,వాడిన ముఖాల్లోని దుఖం పాఠకులను వెంటాడుతుంటుంది.

వారసత్వం
————–

పగటి వెలుగులో
పసిపిల్లవాడి యేడుపు కరిగిపోయింది
అక్కడే దగ్గరలోనే వొక తల్లి వుంది
ఆమె ముఖంలో
ఆ పసిపిల్లవాడి కలలు, దుఖపు క్లేశాలూ వున్నాయి.

ఆ తల్లి కోరికలో
వెన్నెల రాత్రి వుంది
ఘాఢమైన రాత్రి వాసనలో
అస్పష్టంగా పాడే కొన్ని కీచురాళ్ళు
వుదయం వొక ఆశలా
కొన్ని జాముల కోసం యెదురు చూస్తోంది

అమ్మ లాలిపాటలోని చంద్రుడు యెక్కడికో వెళ్ళిపోయాడు
అక్కడ వొక భయానక స్వరం విన్పిస్తోంది
అందులో నుంచి శతాబ్దాల నాటి పాత గీతాలు విన్పిస్తున్నాయి
అందులో వొక యెడారి వుంది
తాను దానిలో నడచి వెళ్తూవుంది యెందుకో తెలియదు

పిల్లవాడిపై యెండ
యెడారిలా రాలుతోంది
ఆమె యెండమావిలో జింక వొకటి పరుగెత్తుకుంటూ వచ్చింది
సీతాకోకచిలుక వెనుకగా విడివడి వెళ్ళిపోతూ రంగులు
పిల్లవాడి వీపుపై
ఆశకు ముందు వుండే దీర్ఘ నిరాశలు
కాల్చిన గురుతులు వున్నాయి

తల్లి దిగులుగా వుంది
పచ్చగడ్డి కోసం యెదురుచూసే నేలలా

అనువాదం, పరిచయం: పఠాన్ మస్తాన్ ఖాన్ 

*

నాలుగు దిక్కులు

 

 ganga
-గంగాధర్ వీర్ల
~
నడక సాఫీగా సాగినంత మాత్రాన
దిక్కులు తెలిసిపోయినట్టేనా?
సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కనుక
ఆ కనిపించే వెలుగే తూర్పు దిక్కుకావొచ్చేమో?!
మరి ఉత్తర దక్షిణ దిక్కుల్ని ఎలా కనిపెట్టాలి?
000
చేతికి కుడివైపునో..
ఎడమవైపునో దిక్కులుంటాయట
అయినా..దిక్కుల గురించి తెలియడంవల్ల ఏం లాభం?
గమ్యం కనపడేదాకా..
ఇంకా ఇంకా నడవాల్సిందేగా..
నాలో నేను నడవాలి
నడుస్తూనే వెదకాలి
జీవితంలో తెలియందేదో తెలుసుకోవాలి
000
ఆలోచనల ముద్రను దాటుకుంటూ
నడక సాగుతూనే ఉంది.
దారికి అడ్డుకట్ట వేయాలనో ఏమో..
చుట్టూ ఏవేవో కమ్ముకుంటున్నాయి
దారితెలియనంతగా చిమ్మచీకట్లు..
ఆకాశాన్నికమ్మేసినట్టుగా
మీదకు వాలిపోతున్నదట్టమైన చెట్లు
దారంతా ముళ్ళకంపలు
కానీ నడవాలి.. నడక సాగాలి
కాళ్ళకు గుచ్చుకుంటున్న ముళ్ళను
తడిమి తడిమి.. అదిమిపెడితేనే
ధైర్యంగా నాలుగు అడుగులు పడేది
000
గమ్యానికి బాటచూపే
దిక్కులు ఎక్కడోలేవు
నాలోనే ఉన్నాయి
పక్కపక్కనే కుడిఎడమగా ఉంటూ..
నాపై ప్రేమను కురిపిస్తున్నాయి
వెనకాముందు నడిచొస్తూ
కరచాలనం చేస్తున్నాయి
దిక్కులు ఎక్కడో లేవు
నాలోనే ఉన్నాయి
*

విమానం పద్యాలు  

 

mandira

Art: Mandira Bhaduri

 

 

 

-ఆకెళ్ళ రవి ప్రకాష్ 

~

 

1

ఆకాశంలోకి ఎగురుతూ విమానం

పాటలోకి ఎగురుతూ నేను.

 

2

నను ఇంత దగ్గరగా చూసి

విస్తుపోయిన మేఘాలు

 

3

ఆకాశంలో ఒకడే చంద్రుదు

సముద్రం మీద వేల లక్షల చంద్రుళ్ళు

 

4

వీధి దీపాల్ని మెళ్ళొ వేసుకొని

మాయద్వీపంలా వెలుగుతూ నగరం

తళుకులీనుతూ పైన పాలపుంత

మధ్యలొ తేలుతూ నేను

 

5

ఉచితంగా నాతో

ఫ్రయాణిస్తున్న ఒక సాలీడు

 

6

మహా నగరాన్ని

నిమిషంలో దాటిన విమానం

నా కలల్ని దాటి కూడా పోగలదా?

 

7

వర్షంలోంచి

వర్షంలోకి

కప్పలా దూకిన విమానం

*

యీ టెక్ నాగరికతలో మనం…!

rafi1

Art: Rafi Haque

 

-విజయ్ కోగంటి

~
మనం వెతికి మరీ దాక్కున్న గుహలు
ఆధునిక రూపాల్లో
మనలనే అనుక్షణం మూయడానికే చూస్తున్నాయి
మనం వేటాడేందుకు నూరుకున్న పాత రాతి కత్తులు
మన మాటల్లోనే  క్షణక్షణం
నిశ్శబ్దంగా పదును తేలు తున్నాయి.

అపుడెపుడో ఆకలితో స్వార్ధసమూహాలుగా
విడిపోయిన మనం
కొంగ్రొత్త ఆకళ్ళతో
ఇంకొన్ని సమూహాలుగా
విడి పడుతూనే వున్నాం

అవసరావసరానికీ భయపెట్టి
వాడుకు విసిరేసే నాగరికతలో
ఆరితేరుతూనే వున్నాం

మనలోని కొందరు మృగాలై పోయిన విషయాల్నీ
మననే లక్ష్యంగా బతుకుతున్న నిజాల్నీ
పంచభూతాల్నీ విషంగా మార్చుతున్న రహస్యాల్నీ
మన నీడకు సైతం మనుగడ తుడిచే విషాదాల్నీ
తేలికగా మరుస్తూ నడుస్తూనే వున్నాం.

రెండు కాళ్ళమీద నడవడమే
నాగరికతలో నవీనత్వం అనుకున్నాం కదా!

నాలుగు నుంచీ రెండుకు
కూతల నుంచీ మాటలకు
ఆకులు చుట్టుకోడంనుంచీ
అందాలు అమ్మిందాకా
ఎదుగుతూనే వస్తున్నాం

అసూయను కొలిచే ‘ఆప్’ నో
బాధల్ని సహించే ‘బార్ కోడ్’ నో
మాత్రంసృష్టించలేకున్నాం.
‘మొబైల్’ సుఖాల వరదల్లో
ఆప్యాయతల పలకరింపును
‘డిలిట్’ చేస్తూనే వున్నాం.

నడుద్దాం ఇంకా ముందుకు
మరో జాతి వచ్చి మనల్ని తుడిచేసిందాకా
ఇలాగే హడావుడిగా, కృత్రిమంగా, అసహజంగా…

*

బొట్టు గుర్తు

chinnakatha

 

~

“అమ్మా! మనం ఎవరు?”

అప్పుడే బడి నుంచీ వచ్చిన నా కూతురు దివ్య అడిగిన ప్రశ్నకు నేను ఆశ్చర్యపోలేదు. ఎప్పుడోకప్పుడు ఈ ప్రశ్న వేస్తుందని నాకు తెలుసు. కానీ ఇంత త్వరగా అడుగుతుందని అనుకోలేదు.

పదో తరగతిలో నా కాస్ట్ సర్టిఫికేట్ చూసి హతాశురాలినై అనుమానాలతో ప్రశ్నలతో గజిబిజితో మా నాన్నని ఉక్కిరిబిక్కిరి చేశాను. అప్పుడు ఆయన పూర్తిగా చెప్పలేదు. బహుశా చెప్పలేకపోయారు. ఇప్పుడు నేనూ నా కూతురి ముందు నాన్న లాగే నిలబడ్డాను. ఏం సమాధానం చెప్పాలి? దానికి చెప్పుకునే కులమూ లేదు నాలా కులం సర్టిఫికెట్టూ లేదు.

మౌనం.

ఇదే మౌనం నేను క్రిస్టియన్ విమిన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఎన్నో సార్లు పాటించాను…

మా హాస్టల్ రూమ్ లో ఆరుగురం ఉండేవాళ్ళం. ఓ ఆదివారాన స్నేహిత ఏమీ తోచక మంచం మీద పడుకుని కాళ్ళూ చేతులూ గాల్లో ఆడిస్తూ జంధ్యాల సినిమాలో సుత్తి వీరబద్ధర్రావులా మా పేర్లన్నీ రాగాలు తీయడం మొదలు పెట్టింది.

“లక్ష్మీ రెడ్డి…

మాధవీ వర్మ…

విజయా నాయుడు…

స్నేహితా చౌదరి…

పూజితా వెలమ…

మౌనికా మౌ? మౌనికా వెనుక ఏంటే?” అనడిగింది నన్ను చూస్తూ.

అదే మౌనం. అలవాటైన అవమానాల మౌనం.

“నా వెనుక ఏమీ లేదే. ఉన్నదల్లా నా ముందే” అన్నాను.

నేను ఎవర్నో నా నుదురే చెబుతుంది. అదే నా గుర్తు! అయినా ప్రశ్నలు వేయడం నా ముఖాన్ని ప్రశ్నార్ధకంగా చేయడం ఒక తమాషా.

“మాలోళ్ళంటే ఎవరమ్మా?” నా కొంగు లాగుతూ అడిగిన దివ్య వైపు చూశాను.

‘ఏయ్ ఎవరు చెబుతున్నారే నీకివన్నీ’ అనబోయి ఆగాను.

అది చెప్పిందేమీ బూతుమాట కాదే! ఎందుకు నాకింత భయం? మాలోళ్ళు అన్నప్పుడు చప్పున తలుపు వైపు ఎందుకు కంగారుగా చూశాను? కిటికీలు మూసే ఉన్నాయా అని ఎందుకు నిర్ధారించుకున్నాను?

‘నీ బానిసత్వాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. అందుకోసం ఏ దేవుడి మీదా ఏ మహానుభావుడి మీదా నువ్వు ఆధారపడొద్దు- అంబేద్కర్’ అని నా కొత్త పుస్తకం మొదటి పేజీలో రాసుకుంటున్నప్పుడు అడిగింది పూజిత-

“అసలు మాల మాదిగోళ్ళు రెల్లోళ్ళoటే ఎవరే?” అని.

విజయ, మాధవీ ‘ష్!’ అన్నారు ఒకేసారి. నేను విన్నానేమో అని కంగారుపడుతూ.

“కాదే మా నాన్న కోపమొస్తే ‘మాదిగ్గూడెం పో!’ అని తిడుతుంటాడే. అందుకే అడుగుతున్నా” అంది అమాయకంగా.

“ఈ వెలమ కమ్మ కాపు రెడ్డి వీళ్ళందరూ ఎవరు?” అని అడిగాను.

“అవన్నీ మా కులాలు. మేమే” అంది పూజిత హుషారుగా.

“మీరు బ్రామ్మిన్స్ కంటే తక్కువ. మీకంటే మాలమాదిగోళ్ళు తక్కువ” అన్నాను శాంతంగా.

“మేం తక్కువేంటి? ఎవడికీ మేం తక్కువ కాదు” అంది విజయ.

నవ్వొచ్చింది నాకు.

“మేం అనేదీ అదే!” అన్నాను.

“చెప్పమ్మా! మాలోళ్ళంటే ఎవరు? మనం బొట్టెందుకు పెట్టుకోవట్లేదు?”

దివ్య వైపు చూశాను. చిట్టి కళ్ళల్లో బోలెడన్ని సందేహాలు.

“ఎవరడిగారు నిన్ను?” దాని స్కూల్ డ్రెస్ తీస్తూ అడిగాను.

“బొట్టు లేకపోతే మాలోళ్ళని గౌతమ్ వాళ్ళ మమ్మీ అన్నారంట” అంది.

రోజులు మారుతున్నాయనే అనుకున్నాను. ఈ మాట వినేంత వరకూ.

“నువ్వు మాల్దానివి కాకపోతే అమ్మోరు తల్లంత బొట్టు పెట్టుకోవే! నలకంత బొట్టు పెట్టుకోడం కాదు” లక్ష్మీ బాయ్ ఫ్రెండ్ ఫోనులో అంటున్నాడు. ఆమె ఒక మగవాడితో మాట్లాడుతుందని లౌడ్ స్పీకర్ పెడితేనేగా అందరికీ తెలిసేది.

లక్ష్మీ అతని మాటలకి మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంది.

“మదిగ్గూడెం తోలుకేల్తానని చెప్పవే” అంటూ మిగతా వాళ్ళు చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నారు.

“మమ్మీ! ఎప్పుడూ ఏదోకటి అలోచిస్తున్నావేంటి?” కోపంగా వచ్చిన దివ్య మాటలకి వాళ్ళ కుల చిలిపి కబుర్లలోంచి బయటపడ్డాను.

“ఆలోచిస్తున్నావు కాదు. అలోచిస్తుoటావు” దివ్య గడ్డం పట్టుకుని గారంగా ఊపుతూ అన్నాను.

“పో మా…నీకు తెలుసా! నెక్స్ట్ సాటర్ డే మా స్కూల్లో సైన్స్ డే. ఈ వీక్ అంతా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి”.

“ఈ సంవత్సరం కాలేజ్ డే అంబేద్కర్ జయంతి రోజు చేస్తున్నారు. కల్చరల్ ఇవెంట్స్ లో పాల్గొనాలనుకునే వారు పేర్లివ్వండి” అసెంబ్లీ హాల్లో అనౌన్స్ చేసింది మా కాలేజ్ ప్రెసిడెంట్.

మా కాలేజి వాళ్ళు ఎప్పుడూ అంబేద్కర్ జయంతి జరపలేదు. కొత్తగా వచ్చిన మా ప్రిన్సిపల్ సిస్టర్ కి కాలేజీలో ఏ చిన్న విశేషం జరిగినా స్థానిక పత్రికల్లోనూ జిల్లా పత్రికల్లోనూ పడాల్సిందే. అలా ఈ ఏడాది కాలేజ్ డే ఫంక్షన్ ని అంబేద్కర్ జయంతితో కలిపి చేస్తే అన్ని విధాలుగా పేరొస్తుందని ఆమె ఆశ.

ఇవెంట్స్ లో పాల్గోడానికి నేనూ పేరిచ్చాను. దేశంలోని ప్రతి రాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహ జంటల్ని చూపించే ప్రోగ్రాంలో క్రిస్టియన్ బ్రైడ్ గెటప్ వెయ్యాలని నా ఆలోచన. ఎలాగూ మా అక్క పెళ్లి గౌన్ ఉంది కాబట్టి డ్రెస్ కోసం కష్ట పడక్కరలేదు కూడా.

కానీ ఫంక్షన్ రోజు వచ్చే సరికి అన్నీ తారుమారయ్యాయి. క్రిస్టియన్ బ్రైడ్ గా పూజిత ముస్తాబయింది. మా అక్క గౌన్ లో. నేను బాల అంబేద్కర్ తల్లి పాత్రలో ముతక చీరలో ఉన్నాను.

క్రైస్తవ పెళ్లికూతురంటే తెల్లని వస్త్రాలలో దేవతలా ఉండాలి. నిజజీవితంలో కాదు. మా కాలేజీ వేదిక మీద. పూజిత నాలా నల్లగా ఉండదు. ఆమె ముక్కు నా ముక్కులా చిన్నగా బండగా ఉండదు. పెళ్లి కూతురిలా తయారవడానికి కావాల్సింది గౌన్ కాదు. మరింకేదో అని తెలుస్తూనే ఉంది నాకు. మొత్తానికి నా మతానికి సంబంధించిన వేషం వెయ్యడానికి నేను సరిపోలేదు. కులానికి తగ్గ వేషమే దొరికింది.

పూజిత స్టేజి మీద అందంగా నడిచి కిందకి దిగగానే తన ఫ్రెండ్స్ వెంటనే పర్స్ లోంచి బొట్టు బిళ్ళ తీసి పెట్టారు “మాల మొకం చూడలేకపోతున్నామే బాబు” అని నవ్వుకుంటూ. బొట్టే వాళ్ళ గుర్తు.

“నీది విధవరాలి పాత్రా?” అని అడిగింది మా డ్రామా చేయించే సీనియర్ నా నుదుటని చూస్తూ.

“కాదక్కా! బాబా సాహెబ్ తల్లి పాత్ర” అన్నాను.

“బాబా సాహెబ్ ఏంటి? అంబేద్కర్ అమ్మగా కదా చేయమన్నాను” అంది హైరానా పడుతూ.

‘కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెద పురుగులు కూడా పుస్తకాన్ని నమిలేస్తాయి. అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా?’ మా నాటకంలో అంబేద్కర్ వేషమేసే అమ్మాయి అంబేద్కర్ చెప్పిన మాటల్ని డైలాగుల రూపంలో బట్టీ పడుతోంది.

“చెప్పు మమ్మీ! ఎన్ని సార్లు అడగాలి. స్పీచ్ కి ఒక టాపిక్ ఇవ్వు” విసిగిపోతూ అంది దివ్య.

“నువ్వే ఆలోచించు. సైన్స్ డే అన్నావు కదా. టెక్నాలేజీ గురించి కూడా ఆలోచించు”

“ఆ…నాకు రాకెట్స్ అంటే ఇష్టం కదా! దాని గురించి రాయనా? మా టీచర్ నేషనల్ డెవలప్మెంట్ కి సంబంధినవే చెప్పమన్నారు”

“అలాగే చేద్దాం. కానీ రాకెట్స్ గురించి మీ స్కూల్ లో అందరికీ తెలిసే ఉంటుంది కదా! కొత్తగా ఆలోచించ రా దివ్యా. మనుషులకు బదులు కంప్యూటర్స్, మేషిన్స్ ని పెట్టి పని తగ్గించవచ్చని  మొన్న మీ టీచర్ చెప్పారన్నావు కదా! దాని గురించి ఆలోచించు. ఆ మధ్యలో ఒకరోజు స్కూల్ బస్సు లోంచి ఏదో చూసి భయపడ్డావ్ గుర్తుందా?”

“ఆ! ఒక ఆయన డ్రైనేజీలో దిగి మొత్తం మునిగిపోయి క్లీన్ చేస్తూ ఒక్కసారిగా పైకి లేచాడు. నల్లగా ఒళ్లంతా డర్టీ” అంది మొహం చీదరించుకుంటూ.

“నిజానికి అతను ఆ రోజు అదే డ్రైనేజీలో పడి చనిపోయాడు తెలుసా? మరి ఆ పని చేయడానికి మెషీన్స్ ఉన్నాయా?”

“చనిపోయాడా! మెషీన్స్ లేవు కదా మమ్మీ. ఉంటే వాడేవాళ్ళు కదా”

“ఆ టాపిక్ మీదే ప్రిపేర్ అవ్వు. ఇంకేం?”

“మరి వాళ్ళకి డబ్బులు? మెషీన్స్ ఉంటే ఇక వాళ్ళకి పనుండదు కదా”

“ఆ పని ఉండదు. ఇంకేదైనా ప్రాణాలు నిలబడే పని చేసుకుంటారు. ఆ పని కంటే న్యాయంగా చేసే ఏ పనైనా ఆత్మ గౌరవంతో చేసే పనే అవుతుంది. అసలు ఆ పని ఎవరు చేస్తారో తెలుసా?”

“తెలుసు మమ్మీ! హోం వర్క్ చేయని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. బాగా చదువుకోకపోతే అలాంటి పనులు చేసే వాళ్ళవుతామని అంటారు కదా అందరు”

“హిహి కాదమ్మా! తక్కువ కులం వాళ్ళే ఇంకా ఆ పనిని కుల వృత్తిగా చేస్తూనే ఉన్నారు. మనం బాగా చదువుకుని ఎవరికీ అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేకుండా మెషీన్స్ తయారు చేయలేకపోతేనే ఫెయిల్ అవుతాం! మన స్వచ్ఛ భారత దేశంలో ఏవేవో కనిపెడుతున్నా ఇంకా డ్రైనేజీ శుభ్రం చేసే మెషీన్స్ రాకపోవడం మన ఫెయిల్యూరేగా!”

“అవును. తక్కువ కులం వాళ్ళంటే ఎవరు? ఒకవేళ అలాంటి టెక్నాలజీ వస్తే  మరి మన దేశం డెవలప్ అయినట్టేనా మమ్మీ?”

“దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు రంగుల గోడలూ కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. అర్ధమయిందా! ఇది ఎవరు చెప్పారో తెలుసా?”

“ఎవరు?”

“డా. బి. ఆర్. అంబేద్కర్!”

“ఆయనెవరు?”

దాని మొదటి ప్రశ్న ముందు నా కులం ఓడిపోయింది. దాని చివరి ప్రశ్న ముందు నేనే ఓడిపోయాను..!

 

 

అవును, నేను దేశద్రోహినే!

husain_motherindia_0

 

-గుఱ్ఱం సీతారాములు

~

 

తారీకులూ దస్తావేజులు, రాజులూ రాణులూ జరిపిన ముట్టడి కి  అయిన ఖర్చు, జమా ఖాతాల శిధిలాల మీద నిర్మితమయిన జాతుల చరిత్రలకు నూతన బాష్యాలు మొగ్గ తొడుగుతోన్న  తరుణం లో జాతీయత చర్చ ప్రాధాన్యత సంతరించుకున్నది. యురోపెయన్ సమాజాల్లో వికశించిన ప్రజా పోరాటాల చైతన్యం మీద నిర్మితమయిన అరువు తెచ్చుకున్న భావన జాతీయత అని కొందరు సామాజిక శాస్త్ర కారుల భావన. జాతీయత అంటే ఒక ప్రాదేశిక ప్రాంతం లో బ్రతికే ఒకే రకమయిన ఆశలూ,అలవాట్లూ, ఆకాంక్షలతో కూడిన ప్రజాశ్రేణులతో తో కూడిన  ఊహాజనిత మయిన భావన. భావోద్వేగాలు పెల్లుభికిన ప్రతి చారిత్రిక సమయం లో జాతి ఉనికి, అస్తిత్వం పలు రూపాలు గా మారుతూనే ఉంది. ఈ తాత్విక చర్చను ఆండర్సన్ మొదలు పార్థ చటర్జీ నుంచి అంబేద్కర్, ఫూలే నిర్మించిన భావనలు, మారుతున్న సామాజిక పోరాటాల వెలుగులో పదునెక్కుతున్న సందర్భం. అలోషియస్ లాంటి తత్వవేత్తలు అసలు ఈ  దేశం లో జాతీయత ఉట్టి డొల్ల అనీ,  ఏకరూప జాతి లేని జాతి నేడు జాతీయతగా పరిగణలో ఉందనీ, ఇక్కడి జాతీయత హిందూ మనువాద పునాదుల మీద నిర్మించ బడినదీ అని చేసిన సూత్రీకరణలు, నిజాలూ మన కళ్ళముందే ఉన్నాయి .

 

ఇరవయ్యో శతాబ్దపు మొదటి బాగం లో మూడో ప్రపంచ దేశాల విముక్తి పోరాటాల స్పూర్తితో ప్రభావితం అయిన గాంధీ ప్రవచించిన జాతి ఆందోళనలు, బొంబాయి నగరాన వినాయక పందిర్ల లోగిళ్ళలో తిలక్ ప్రేరేపిత  జాతీయ ఉద్వేగ భావనలు అంతిమంగా ఏ విలువలను ప్రభోదించాయో చర్చకన్నా, ఈ దేశం లో సంఘీయుల నుండి వామపక్ష మేధో వికాశం దాకా  జాతీయతకు ఒక ప్రామాణిక నిర్వచనం ఉందా? అనే ప్రశ్నా వేయడం అసందర్భం మాత్రం కాదు. జాతి పోరాటాలు వికశించాలి అనే భావనలో ఉన్న సమూహాలు నేడు జరుగుతున్న  జాతీయ చర్చల్లో ఉదాసేనంగా ఉండడం వెనక హిందూ జాతీయ భావన కు భిన్నమయిన ఆలోచన వాళ్ళకు ఉందా అనే ప్రశ్నా ఉత్పన్నం కాకపోదు. ఇలా జాతీయ ఉద్వేగాలు పెల్లుభకడానికి  రోహిత్ ఆత్మహత్య ఒక సందర్భాన్ని ఇచ్చింది.

కేంద్రీయ విద్యాలయాల్లో వికృత క్రీడకు బలయిన దళిత పరిశోదకుడు వేముల రోహిత్ చావు ఈ దేశం లో దనావాలంలా ఒక వెల్లువను,ఆ వెల్లువ వెలుగులో లబ్ది పొందిన రాజకేయ బెహారులూ, వ్యవస్థీకృత మయిన చట్టబద్ద హత్యలకు కారణాలు వెతక కుండా, ఉద్యమ బంతిని కాంగ్రెస్ కోర్ట్ లో ఉంచేందుకు అన్నివిధాలా ప్రయత్నం జరిగింది. ఖైర్లాంజి నుండి లక్షిమ్ పేట దాకా  ముజాఫర్ నగర్ నుండి రోహిత్ దాకా జరిగిన ఘోరాల మీద ఒక్క ప్రకటనా చేయని రాహుల్ గాంధి కి హటాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారు.  ఈ చర్యలను పక్క దోవ పట్టించే క్రమం లో డిల్లీ లో దేశ భక్తులకూ, దేశ ద్రోహులకూ మధ్య నలిగిన ఒమర్ ఖాలీద్ , అనిర్భవ్ బట్టచార్య , కన్నయ్య, లు  దేశానికి దేశ అంతర్గత రక్షణకు ముప్పుగా పరిగించ బడి రోహిత్ చావును డిల్లీ చుట్ట్టూ తిప్పి సప్పున చల్లార్చిన యుక్తి ఈ దేశ అలాగా జనాలకు నిజంగా అర్ధం గాలేదు.

కన్నయ్య జైలు నుండి విడుదల అయ్యాక అయన స్వరం లో మార్పు ఎవరూ పసిగట్ట లేకపోయారు. ఈ దేశంలో అసమ అభివృద్ధికీ , అసమానతలకీ  కారణ భూతులు అయిన రాబందుల నుండి ఆజాది కావాలి అని అనడం వెనక ఈ దేశం లో జరుగుతున్న విముక్తి పోరాటాలను నిర్వీర్యం చేయడమే. గణేశ పందిళ్ళ నుండి పురుడు పోసుకున్న అఖండ భారతానికీ కన్నయ్య  కలగంటున్న ఆజాదీ కి నాకయితే తేడా ఏమీ కనిపించడం లేదు. ఈ చర్చను జాతీయ చర్చలో ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర అర్ధం జేసుకోవాలి.

అమరుడు ప్రొఫెసర్ నాగప్ప గారి సుందర్రాజు గురించి అందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేకున్నా రెండు దశాబ్దాల కింద హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకుడిగా, పరిశోదకుడిగా ఒక గొప్ప కవి, కథా రచయతగా సుపరిచితులు. అవి మండల్ కమిషన్ రిపోర్ట్ బయటికి వచ్చిన రోజులు. ‘గ్రామాలకు తరలండి’ నినాదాలు విశ్వ విద్యాలయాల్లో జేగురు రంగు అక్షరాలు తడి ఆరని రోజులు. దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్ది, అధ్యాపక వైరి వర్గాలు రిజర్వేషన్ అనుకూల వ్యతిరేకులుగా నిట్టనిలువు చీలిన సందర్భం. అప్పుడప్పుడే మొదటి తరం దళిత బహుజన విద్యార్డులు గ్రామీణ ప్రాంతం నుండి నగరానికి కాసింత కుల చైతన్యం తో వస్తున్న దశ.  దళితుల్లోనూ అంటరాని వాళ్ళు ఉన్నారనీ, ఆ కడగొట్టు అలగా జనాలూ జనాభా లెక్కల్లో భాగమే అనీ, దళితుల్లో అంతర్గత రిజర్వేషన్ పంపకాల్లో కూడా అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలి పోయిన సందర్భం.

ఆ సంక్షుభిత దశలో రాటు దేలిన ఆణిముత్యం నాగప్పగారి సుందర్రాజు. ఎమ్మే చదివి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత  జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్  పొంది, పరిశోదన కోసం  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిధ్యాలయం లో ఇంటర్వ్యూ కు  వచ్చిన సుందర్రాజు మాటల్లో కాటిన్యం , నిచ్చిత మయిన అభిప్రాయాలు చూసి ‘వీడు ప్రమాద కారి, వీణ్ణి విశ్వవిద్యాలయం లోకి రానిస్తే ప్రమాదం అని భావించి ఎలా అయినా రీసెర్చ్ లో సీట్ రాకుండా చేయాలి అని నువ్వు ‘’దేశ ద్రోహివి’అని అన్నారు. ఆనాడు కోపంతో ఊగిపోయి విచక్షణ కోల్పోయి నాలుగు తన్నలేదు. కానీ మను స్మృతిని విశ్వవిధ్యాలయ కరదీపిక గా ఉపయోగించుకునే అపర దేశభక్తునిగా అనిపించుకోవడం ఆయన ఆరోజు అనుమానగా భావించి  ‘అవును నేను దేశ ద్రోహినే’ అనే దీర్గ కవిత రాసాడు. ‘అమ్మ చెమటను అక్షరాలుగా మలుచుకొని అయ్యవార్లకు అంజలించా’ అని ‘పాద రక్షలు పాలిష్ చేయాల్సిన వాడిని పద్యములు పాడుతున్నాను’ ‘చదవు రాదని జంధ్యం రెండు మార్కులిస్తే విదిరాతని ఊరకుండా యుజిసి తో పోటీ పడి జేఆర్ ఫ్ సాదించు కున్నాను’ అందుకే నేను దేశద్రోహిని. కేవలం ‘నన్నయ్యకు నమస్క రించ నందుకు, విశ్వనాధుని విధానం కాదన్నందుకు, శేషేంద్రవీ వేయి పడగలె’ అన్నందుకు, ‘ఊరవతల ఉండమంటే ఊరు ఎవరిది అని అన్నందుకు’ విశ్వవిద్యాలయాలు ఆర్య జాతి సొత్తు’ అని. ఆదిపత్య సాహిత్య కారుల కుటిల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేయగల సత్తా ,  ఉన్నోడు కనుక సుందర్రాజు ను వెలివాడ లకు పరిమితం చేయాలనే కుట్ర. అలా అలాగా జనాలు తమ కాలి ధూళితో మలినం చేస్తున్నారు కాబట్టి , సుందర్రాజు, వేముల రోహిత్, సెంథిల్ కుమార్, పుల్యాల రాజు, కన్నయ్య, అనిర్భావ్  నుంచి ఉమర్ ఖాలిద్ దాకా ఇప్పుడు దేశద్రోహుల జాబితాల్లో  కలిసారు. ఇందులో కొందరు బ్రతుకు బారం అయి బలవన్మరణం పొందారు. మరికొందరు బ్రతుకు మీద ఆశతో ఏటికి ఎదురు ఈదుతూ జాతీయతకు కొత్త అర్దాలు కనిపెట్టే క్రమం లో కత్తుల వంతెన మీద నడుస్తున్నారు.

ఇక్కడ మనకు కావాల్సింది జాతి, జాతీయతా లాంటి క్లిష్టమయిన భావనల చర్చలోకి పోవడం కంటే ఎందుకు ఈ దేశం లో కొన్ని కులాలు మతాలే తమ జాతీయ శీల పరీక్షకు గురి కావాల్సి వస్తోంది అనేది తీవ్రంగా చర్చించాల్సిన తక్షణ అవసరం. జాతీయ ఉద్యమ స్పూర్తితో బ్రిటిష్ కు వ్యతిరేకంగా పనిచేసినోల్లని  ‘టెర్రరిస్టు, అని ముద్రేసుకున్న దశనుండి ప్రత్యామ్నాయ రాజకీయ విస్వాశాన్నికలిగి ఉన్నందుకు నక్షలైట్ గా అతివాదిగా ముద్రవేసిన దశ  మొదలు ఇరవై ముప్పై లలో ‘వందేమాతరం’ అన్నందుకు ఉస్మానియా నుండి పదుల సంఖ్యలో బహిష్కరణకు గురయిన రోజు నుండి, డెబ్బయ్యో దశకం లో విధ్యార్ది నాయకుడు జార్జ్ రెడ్డిని కాషాయదళం ధూల్ పేట కిరాయి హంతకులతో అమానవీయంగా చంపబడినప్పుడు, ఉస్మానియా ఇంజనీరింగ్ హాస్టల్లో అరుణ్ కుమార్ ని అత్యంత క్రూరంగా కోసి చంపడం వెనక జాతీయ శీల పరీక్షలో భిన్నాభిప్రాయం ఉండడం అనేది దాచేస్తే దాగని సత్యం. ఈ హత్యల వెనక ఈ దేశంలో నమ్మిన విస్వాశాలకు జరిగిన శిక్షలు. ఈ విదంగా  జాతీయభావనకు భిన్నమయిన రాజకీయ విశ్వాసాల ను క్రూరంగా చిదిమినప్పుడు, అరాచకంగా మారిన ఉస్మానియాను సంతోష్ రెడ్డి మొదలు , వివేక్ విద్యాసాగర్ శ్రుతి దాకా నాగేటి చాళ్ళలో  త్యాగాల విత్తనాలు చల్లి అమరులు అయిన పరంపరను అనేక పౌర ప్రజాస్వామిక వాదులు కొనసాగిస్తూనే ఉన్నారు. నాడు ఉస్మానియాలో అరాచకాలు మితిమీరి  ప్రజాస్వామ్యం కనుమరుగు అయినప్పుడు  ప్రజా ఉద్యమ వెలుగులో నాటి కాషాయ  విద్యార్ది నాయకుడు  చంద్రారెడ్డి చావు ఉస్మానియా లో దళిత బహుజన శ్రేణులకు  కాసింత గాలి పీల్చుకొనే వెసులుబాటు కలిగింది. ఆ తర్వాత మారిన పోరాటాల నేపధ్యం మూలంగా  ఇఫ్లూ, హైదరాబాద్ యూనివర్సిటీ,   జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కేంద్రంగా పెల్లుభుకున్న నయా సాంస్కృతిక అస్తిత్వ భావనలు వాళ్లు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు జాతీయ భావన చుట్టూ పరిబ్రమిస్తున్నాయి. అవి ఏ ఒక్కరోజో ఊడిపడ్డవి కావు. వాటివెనక ఎనభయ్యో దశకం లో పెల్లుభికిన  మండల్ కమిషన్ వెలుగులో , చుండూరు, కారం చేడు రగిల్చిన కసి తో వచ్చిన స్ఫూర్తి నేడు కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో ఇప్పుడిప్పుడే పురి ఇప్పుకుంటోంది .ఒక ప్రజా స్వామిక ప్రాతినిధ్యం ఇప్పు డిపుడే మొగ్గలు తోడుకుంటోంది. దళిత బహుజన విద్యార్థుల సమన్వయం నేడు అగ్రవర్నాలను  గంగ వెర్రులెత్తే లా చేస్తున్నాయి . ఒక మెరుగయిన సమాజం కోసం ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం ఆహార హింస కు వ్యతిరేకంగా ఉద్య మిస్తున్నారు, పురాణాల గుట్టును నిట్ట నిలువుగా ఛీల్చేస్తున్నారు.  ఆ చైతన్యాన్ని చిదిమేసే క్రమం లో మనువాదం స్వైర విహారం చేస్తోంది ఆ క్రమం లోనే నాటి సెంథిల్ కుమార్, మాదిరి వెంకటేష్ , ముదశిర్ ఖమ్రాన్ , మరియు మొహమద్ మొయిన్, రోహిత్ వేముల  దాకా అ సహజ  ఆత్మ హత్య గటనలు.

రెండేళ్ళ కింద అఫ్జజ్ గురు ఉరితీత సందర్భంగా ఈ దేశ సామూహిక భావాల సంతృప్తి కొరకు ఒక  ఉరి అవసరం అని ఒక చట్టబద్ద హత్యను సమర్దించుకుంది. అదే క్రమంలో ముంబై అల్లర్ల బాధ్యడు అని అభియోగం మోపబడిన  యాకుబ్ మెమన్ ఉరి శిక్ష వ్యతిరేకంగా  దేశవ్యాప్తంగా జరిగిన నిరసన లో రోహిత్ వేముల పాల్గొని దేశ ద్రోహి గా మారాడు.  అంతా రోహిత్ చావుకు కారణాల వెతుకులాటలో ఉన్నారు. కానీ  ఎదిగొచ్చిన కొడుకు అర్దాంతరంగా తన ప్రస్థానాన్ని అసంపూర్తిగా ముగిస్తే, అంతిమ సంస్కారలకీ, అయిన వాళ్ళ చుపుకూ నోచుకోకుండా వెలివాడ లో పుట్టిన రోహిత్ ని వెలివేసి   ఒక దిక్కులేని అనాధ శవం లాగా చాదర్ ఘాట్ మురికి కాలవలో కాల్చేసి, బూడిద పక్కేనే ఉన్న మూసీలో కలిపేసారు. కర్కశ పోలీసుల అమానవీయమైన ఈఘటన అందరినీ కలచివేసింది. రాజ్యం రోహిత్ చనిపోయాక ఆయన శవానికి బెదిరింది  ఎక్కడో గుంటూరు జిల్లా  గురజాల లో పుట్టిన రోహిత్ అసహజ మరణం చట్ట బద్ద హత్య వెలివాడ నుండి చాదర్ ఘాట్  మురికి కాలవలో అంతర్ధానం అయింది.

కానీ  ఆ చావు లేవనెత్తిన ప్రశ్నల కు జవాబులు ఇంకా బాకీనే. రోహిత్ హత్య  ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని , కోట్లాదిమంది బడుగు జీవుల ఉనికిని అపహాశ్యం చేసింది. అలా ఈ దేశం సహనం కోల్పోయిన ప్రతి సందర్భం లో భారతమాత సామూహిక సమర్ధనగా తన సహనాన్ని నిరూపించుకుంది.  నేడు దేశ భక్తులకూ, దేశాన్ని అమ్ముతున్న ద్రోహులకూ మధ్య యుద్ధం జరుగుతోంది. స్వదేశీ నినాదం తో గద్దెనెక్కిన మోడీ అరుదుగా ఈ దేశ నేల మీద ఉంటున్నాడు మిగతా కాలం అంతా గాలిమోటార్ల మీద తిరుగుతూ అపారమయిన ఖనిజ సంపద ను బడా దేశాల కు అమ్ముతూ, నమ్ముకున్న నేల చె రబడుతుంటే ప్రాణాలు ఫణంగా అడ్డుపెడుతున్న ఆదివాసుల మీద వైమానిక దాడులులకు పురిగోల్పుతున్న సంక్షుభిత సమయం లో ఒక నాస్తికుడు, ఒక ప్రజాస్వామిక వాది అయిన ఉమర్ ఖాలిద్ కోల్పోయిన తన ముస్లిం అస్తిత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాడు. ఎందుకంటె తాను ముస్లింగా ఉంటూ కూడా నిజమయిన దేశభక్తున్ని కావాలి అనే ప్రయత్నం లో ఉండు పుట్టుక కారణంగా దేశద్రోహుల జాబితాలో కలుపుతున్న కారణాల వెతుకు లాటలో ఉండు. జోరుగా తెలంగాణా ఉద్యమం జరుగుతున్న కాలంలో  కలవని కనురెప్పల్లా ఉన్న రెండు సాంస్కృతిక ప్రేమలను  గ్లిసరిన్ కళ్ళతో ఒలికించిన తెలంగాణా మాత  ఇప్పుడు ఏం చదవాలో చదవకూడదో ప్రవచనాలు ఇస్తోంది.

నిట్టాడి లేని నిర్బాగ్యం నుండి కర్కషమయిన కాటిన్యం నుండి ఒక నిప్పు కణాన్ని కన్న రోహిత్ తల్లి ప్రత్యమ్నాయ జాతీయతను ఎన్నుకున్నది. రాజ్యం దృష్టిలో రోహిత్ తల్లి వేముల రాధిక  ఇప్పుడు  దేశ ద్రోహి.  అలా దేశద్రోహుల జాబితా లో గతం నుండే నమోదు అయిన అరుందతి రాయ్ మొదలు కంచ ఇలయ్య దాకా ఈ దేశ జాతీయ పరీక్షలో విఫలం అవడం మూలంగా దేశ ద్రోహుల జాబితాలో కల్పబడ్డారు. గోవింద్ పన్సారే మొదలు,నరేంద్ర ధబోల్కర్, కన్నడ సాహితీ వేత్త కల్బుర్గి గా ఈ నరహంతక వేటకొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కంచె ఐలయ్య మీద వేట మొదలయ్యింది.

ఉస్మానియా కేంద్రంగా సాగిన అన్ని సాంస్కృతిక పోరాటాల లోనూ కంచ ఐలయ్య వేసిన సైద్దాంతిక భూమిక ఉంది. అది ఎద్దుకూర పండగ కావచ్చు, నరకాశూర, రావణా శూర, మహిశాశూర అమరత్వాన్ని పొలిటి సైజ్ చేస్తూ దళిత బహుజన సాంస్కృతిక పోరాటం గా మార్చిన క్రమం కావొచ్చు, వీటి వెనక  ఐలయ్య  ఉన్నాడనే అక్కసుతో కుట్ర ఇప్పుడు మొదలయింది.  శాకాహారం జాతీయ వాదానికి వ్యతిరేకం అనీ, భారతమాత కేంద్రక ఆలోచనలకు భిన్నమయిన జాతీయభావనకు ఊపిరులు ఊదిన ఆయనను చంపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి . భారత మాత సవితి బిడ్డలుగా బ్రతకడం కన్నా ‘భీం భూమికి జై’ అన్న నినాదం ఇచ్చినందుకు ఆయన ఇప్పుడు దేశద్రోహుల జాబితాలో కల్పబడ్డాడు. ఇలా ఉపేక్షిస్తే ఆ జాబితాలో మనం అందరం చేరే రోజు ఎంతోదూరంలోలేదు. ఫూలే-అంబేద్కర్ తాత్విక చింతనల వెలుగులో నూతన జాతి అస్తిత్వం పురుడు పోసుకోవడం నేరాల్లో కెల్లా నేరం.

విశాల ప్రజా, పౌర పోరాటాల నిర్మాణం ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో నేను దేశద్రోహిని అని చెప్పడానికీ చింతించడం లేదు. ఒక వేల నిజంగా భారత మాత ఉన్నా ఆ భారతమాత ను  బర్బాదీ చేస్తున్న ద్రోహులెవరో తేల్చుకోవాల్సిన చారిత్రిక అవసరం ఇప్పుడు మనందరి మీదా ఉంది.

*

కబాలి గురించి ఎందుకు మాట్లాడాలంటే….

 myspace
    ఇప్పుడే ఓ మిత్రుడు ఫోన్ చేసేడు, “కమర్షియల్” సినిమా గురించి నువ్వు రాయడాన్ని (నా బ్లాగ్ పోస్టు చూసి) ఎవరో తప్పు పట్టేరని చెప్పేడు.
  నేను చెప్పేను, నా ఫ్రెండ్ కి, కబాలి గురించి ఎందుకు రాసేనో. సినిమా చూసివచ్చిన వెంటనే నా అభిప్రాయం చెప్పాలనిపించి అక్కడ కొంచెమే రాసేను. ఇంకొంచెం వివరంగా ఇక్కడ.
  దాదాపు పదేళ్ళ క్రితం నేను మలేసియా వెళ్ళేను, ఆఫీసు పనిమీద. కౌలాలంపూర్, పెనాంగ్ ప్రాంతాల్లో తిరిగేను వార్తల కోసం. మిత్రులతో కలిసి ఈ రెండు ప్రాంతాల్లోని తమిళులను కూడా కలిసేను. హోటళ్లలో, చిన్న చిన్న షాపుల్లో, కొన్ని బస్తీల్లో వున్న ఇండియన్లతో (అంటే, ప్రధానంగా తమిళులతో) మాట్లాడేను.
   మొట్టమొదటి సారిగా కబాలీశ్వరన్ గురించి నేను విన్నది అప్పుడే. అక్కడ వున్న తమిళులకు ఆయన ఒక ఫోక్ హీరో అని అర్ధం అయింది. వందల ఏళ్ల క్రితం అక్కడికి వెళ్లి సెటిలై, ఆ దేశవాసులైన తమిళులకు ఆయన ఓ ముఖ్యమైన నాయకుడు. అంతకంటే ఆ తర్వాత ఆయన గురించి విన్నాలేదు. ఆయన రాజకీయాలు, నడిపిన మాఫియాల గురించి తెలీదు. తెలుసుకోవాలని ప్రయ్నత్నించిందీ లేదు.
   అప్పటికే కమర్షియల్ హీరోగా పేరు సంపాదించిన రజనీకాంత్ సినిమా ‘శివాజీ’ కూడా అప్పుడే రిలీజ్ అయింది. ఆ సినిమా చూడడం కోసం అక్కడ బారులుతీరిన జనాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.   ఆయన ప్రధానంగా, తమిళనాడు నుంచి ఉద్యోగాలకోసం, చిరుద్యోగాలకోసం 1947 తర్వాత వలస వెళ్లిన వాళ్లకు (సినీ) హీరో.
   రజనీకాంత్ కబాలీశ్వరన్ పాత్ర చేస్తున్నాడంటే నాకు అందుకే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కబాలీశ్వరన్, రజనీకాంత్ — ఇద్దరూ అక్కడ పాపులరే.  రెండు పాపులర్ ఇమేజెస్ కలిస్తే హిట్టవుతుందనేది నిర్మాతల లెక్క.
  రజనీకాంత్ కి కబాలి మార్కెట్ విలువ తెలుసు. అటు డయాస్పోరా మార్కెట్, ఇటు దేశంలో అసలు మార్కెట్. దళితుడైన పా. రంజిత్ కు రజనీకాంత్ లాటి కమర్షియల్ హీరో, దేశం కాని దేశంలో అణచివేతకు గురైన తమిళులవైపు నిలుచున్న కబాలి పాత్ర వేస్తే విషయం నలుగురికీ చెప్పవచ్చుకున్నాడు.
  కబాలి గురించి రంజిత్ పరిశోధన బాగా చేసేడు. ఇది నేను చెప్పిన మాట కాదు. కబాలి సినిమా గురించి మలేసియా తమిళుల వైపునుంచి ‘కౌలాలంపూర్ పోస్ట్ లో విశ్లేషించిన విసిత్ర మాణికం రాసేరు. కబాలి సినిమా గురించి మనకి ఎందుకు అని అనేవాళ్ళందరూ తప్పక చదవాల్సిన వ్యాసమిది.
సినిమా చూసేముందు — ముఖ్యంగా మలేసియాకి బయట వున్నవాళ్లు — చదివితీరాలని ఆమె అంటుంది. ఈవ్యాసం చదవక ముందొక సారి (తెలుగు వెర్షన్), చదివిన తర్వాత ఒకసారి (తమిళ వెర్షన్) చూసిన కొలీగ్ చెప్తోంది — ఎంతగా కెనెక్ట్ అయిందో.
  కబాలి పాత్రని అడ్డం పెట్టుకుని పా. రంజిత్ ఎంత గొప్పగా మలేసియా తమిళుల (ముఖ్యంగా మలేసియా దేశ వాసులైపోయిన తమిళుల) జీవితాన్ని చిత్రీకరించాడో ఆమె చెప్తుంది. ఉద్యోగాల్లో, సమాజంలో మైనారిటీలైన తమిళులు అనుభవించిన, అనుభవిస్తున్న వివక్షని దర్శకుడు గొప్పగా పెట్టుకున్నాడని చెప్తుంది.
 ఓ వంద, రెండొందల సంవత్సరాల తమిళుల వ్యథాభరిత జీవితంలోని కొన్ని భాగాల్ని తీసుకుని కథ రాసుకున్నాడని ఆమె అంటుంది. సరిగ్గా ఇంతే కాలంలో దళితులు అనుభవించిన అవమానాలపై, దాష్టీకాలపై సత్యనారాయణ గారు రాసిన ‘మా నాన్న బాలయ్య’ పుస్తకంతో రంజిత్ అందుకే కనెక్ట్ అయ్యాడు.
     ఆఖరికి, సినిమా ముగిసేక కబాలీని కాల్చడానికి వఛ్చిన ‘టైగర్’ కూడా ఎంత రియలిస్టిక్ పాత్రో ఆమె రాస్తుంది.
   మలేసియా జనాభాలో ఏడు శాతం మాత్రం వున్న, అట్టడుగున వున్న ప్రజల (పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చేవాళ్లు కాదు) గురించిన కథ ఇది. స్కోప్ చిన్నదే కావచ్చు. కానీ, ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా కథా వస్తువు కావడం, కథకు ప్రొటాగనిస్ట్ రజనీకాంత్ కావడం విశేషం.
  రజనీకాంత్ సినిమా ఇలా ఎందుకుంది, దీనికన్నా బ్రహ్మోత్సవం బెటర్ అని, బోయపాటి శ్రీను, వినాయక్  లాటి వాళ్ళు రజనీకాంత్ కి ఓ గొప్పహిట్ ఇచ్చి ఉండేవారని రాసేవాళ్ళు తప్పక చదవాల్సిన వ్యాసమిది. (బోయపాటి, వినాయక్ ఎలా తీసి వుండేవాళ్ళు? కబాలీలో ‘కెవ్వుకేక’ లాటి పాట పెట్టివుండేవాళ్ళు. ఓ అరవై సుమోల్ని ఎగిరించి పేలించి వుండేవాళ్ళు.)
 పా. రంజిత్ కాని, రజనీకాంత్ కాని — They are limited by the character. ఈ సంగతి అర్ధం చేసుకోకపోతే ఈ సినిమా ఓ ‘రోబో’ లాగో, ‘శివాజీ’లాగో, లేకపోతే ‘బాషా’లాటి ఓ గాంగ్ స్టర్ సినిమాలా లేదని అనిపిస్తుంది.
  ఆ మూసలోకి వెళ్లకుండా పా. రంజిత్ ఎంత కష్టపడ్డాడో సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ మేన్, బేట్  మేన్, స్పైడర్ మేన్, టార్జాన్ – అన్ని సూపర్ హీరోల కంటే ఎక్కువ శక్తివంతుడైన రజనీకాంత్ కాదు ఈ సినిమాలో వున్నది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర అంతకంటే ఎక్కువ నిడివివున్న, లోతువున్న రక్తమాంసాలతో ప్రజలమధ్య తిరిగిన ఓ నాయకుడు, ఓ డాన్. అందుకే, రజనీ గిమ్మిక్కులకు ఈ సినిమాలో చోటులేదు. ఆ సంగతి రంజిత్ ముందుగానే చెప్పేడు.
  పా. రంజిత్ ట్విట్టర్ id @beemji . ఇది సరిపోతుంది, ఆయన కబాలి పాత్రని ఎలా చూపించదలుచుకున్నాడో. అందుకే, ‘కబాలి’ మా నాన్న బాలయ్య’ పుస్తకం పట్టుకుంటాడు. నల్ల రంగు మీద వున్న వివక్షగురించి మాట్లాడగలుగుతాడు.సూటు, బూటు ఎందుకువేసుకోవాలో మాట్లాడతాడు. వ్యవస్థీకృతమైన హింసని, అందులో భాగమై, అలాటి పరికరాలతోనే ఎదిరించాలనుకున్నాడు కబాలి. ఇది సరైన పరిష్కారం కాదని, ఈ పోరాటాలకి శాస్త్రీయమైన రాజకీయ దృక్పథం తోడవకపోతే అవి నిలవవన్నది వేరే చర్చ. కానీ, ఈ సినిమా కథ ప్రధానంగా కబాలి జీవితంనుంచి తీసుకున్నది. అది దాని పరిమితి.
  ఈ నేపథ్యంతో చూడకకుండా, బాషాలాగా, సుల్తాన్ లాగా, లేకపోతే ఇంకో బ్లాక్ బస్టర్ సినిమాలాగా, లేకపోతే వాటికి మించిన సినిమాలాగా ఉంటుందని ఊహించుకుని, అలా లేదని సినిమాని write off చెయ్యడం ఏం న్యాయం.
  సినిమాలో ‘మాయానది’ పాట, దాన్ని చిత్రీకరించిన విధానం గొప్పగా వుంది. రాధికా ఆప్టే హుందా నటన చాలా బాగుంది.
   అందరికీ సినిమా నచ్చాలనేం లేదు. ఇంకా బాగా తీసివుండొచ్చని కూడా అనొచ్చు.  కానీ, బయో పిక్ లను చూసే విధానం ఇది కాదేమో?
(కబాలి సినిమా చూసొచ్చేక రాసిన చిన్న బ్లాగ్ పీస్: http://kv-kurmanath.blogspot.in/2016/07/blog-post.html)
*

పేదవాడి కుట్ర  

ramana1

 

 

-రమణ యడవల్లి

~

ఇది పవిత్ర భారద్దేశం. ఈ దేశం అటు ప్రాచీన సంస్కృతికీ ఇటు ఆధునికతకీ నిలయం. అలనాడు గంధర్వులు పుష్పక విమానంలో మబ్బుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ‘మనవాళ్ళొట్టి వెధవాయిలు’ కాబట్టి ఆ పుష్పక విమానం ఫార్ములానీ రైట్ బ్రదర్స్ ఎగరేసుకుపొయ్యారు. ఇంకో విషయం – మనం కొన్ని యుగాల క్రితమే వినాయకుడి తలని హెడ్ ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజితో మార్చేసుకున్నాం. ఇవ్వాల్టికీ అదెలా చెయ్యాలో అర్ధంగాక తల పట్టుకుంటున్నారు పాశ్చాత్య వైద్యాధములు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన ప్రధానమంత్రిగారు అనుక్షణం తపన పడుతూ యెక్కే విమానం, దిగే విమానంగా క్షణం తీరిక లేకుండా వున్నారు. ఫలితంగా – ఒకప్పుడు ప్రపంచ పటంలో ఎక్కడుందో తెలీని భారద్దేశం ఒక గొప్పదేశంగా అందరికీ తెలిసిపోయింది. త్వరలోనే అమెరికా, చైనాల్ని తలదన్నేంతగా తయారవబోతుంది. రండి – మన ప్రధానమంత్రులవారి కృషిని అభినందిద్దాం, వారి చేతులు బలోపేతం చేద్దాం.

మంచివారు మంచిపన్లే చేస్తారు, చెడ్డవారు చెడ్డపన్లే చేస్తారు. అలాగే – ఒక మంచిపనికి అడ్డుపడే దుర్మార్గులు అన్ని యుగాల్లోనూ వుంటూనే వున్నారు. అలనాడు ఉత్తములైన ఋషుల చేసే యజ్ఞాల్ని భగ్నం చెయ్యడానికి దుష్టులైన రాక్షసులు అనేక కుట్రలు పన్నారు. ఆ రాక్షస సంతితే ఇవ్వాళ మరోరూపంలో దేశాభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకొడానికి కుట్ర చేస్తుంది.

ఇదంతా యెందుకు చెబుతున్నానంటే – ఈమధ్య గుజరాత్‌లో నలుగురు కుర్రాళ్ళని కారుకి కట్టేసి ఇనప రాడ్లతో చావగొట్టార్ట. దేశంలో మరే వార్తలు లేనట్లు మీడియా ఈ విషయాన్ని చిలవలు పలవలు చేసి చెబుతుంది. నేను శాంతికపోతాన్ని, హింసని ఖండిస్తాను. కానీ – ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో హింసని సమర్ధించక తప్పదు. ఇప్పుడు ఆ కుర్రాళ్ళని కొట్టిన సంఘటన వెనుక కారణాల్ని విశ్లేషించుకుందాం.

ఈ దేశంలో పుట్టిన ప్రతివారూ హిందువులే, అందరికీ దైవం ఆ శ్రీరాముడే. ఇందులో ఎటువంటి వాదప్రతివాదాలకి తావు లేదు. మన ప్రభుత్వం పేదవారికి అనేక పథకాల ద్వారా సహాయం చేస్తోంది. తద్వారా అనేకమంది తమ జీవితాల్ని మెరుగు పర్చుకుంటున్నారు. అయితే – కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పథకాలకి దూరంగా వుంటున్నారు. చదువుకొమ్మంటే చదువుకోరు, ఉద్యోగం వున్నా చెయ్యరు, ఆహారం వున్నా తినరు. యెందుకు?

యెందుకంటే – కుళ్లుకంపు కొడుతూ డొక్కలు యెండిన తమ పేదరికాన్ని ప్రపంచం ముందు దీనంగా ప్రదర్శించుకోవాలి, అంతర్జాతీయంగా మన దేశం పరువు పోగొట్టాలి. ఇది ఖచ్చితంగా కుట్రే! అందుకు ఋజువు – ఆ దెబ్బలు తిన్న కుర్రాళ్లే. చావుకు అంగుళం దూరంలో వున్నట్లు, దరిద్రానికి దుస్తులు వేసినట్లు.. జాలిజాలిగా, నిస్సహాయంగా, బాధతో అరుస్తూ, భయంతో వణికిపోతూ యెంత అసహ్యంగా వున్నారో కదా! గుండెని కలచివేసే వారి పేదరిక ప్రదర్శనకి ప్రపంచం కదిలిపోవచ్చు గాక, కానీ మన్లాంటి మేధావులు మోసపోరాదు.

ఈ దేశంలో అందరూ సమానమే. మనం కష్టపడ్డాం, అవకాశాలు అంది పుచ్చుకున్నాం, జీవితంలో స్థిరపడ్డాం, సుఖంగా బ్రతికేస్తున్నాం. ఇవ్వాళ మనకి గాలి యెలా పీల్చుకోవాలో చెప్పేందుకు బాబా రాందేవ్‌గారు వున్నారు, యెలా జీవించాలో చెప్పేందుకు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌గారు వున్నారు, యెలా ఆసనాలు వెయ్యాలో చెప్పేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రిగారే వున్నారు. ‘ఇవన్నీ మాకు అక్కర్లేదు, మేం మా పేదరికంలోనే మగ్గిపొతాం’ అని మొరాయించేవాళ్ళని యెవరు మాత్రం యేం చెయ్యగలరు!?

మనది పుణ్యభూమి, కర్మభూమి. అన్నిరకాల ఆహారాల్లోకి శాకాహరం మాత్రమే అత్యున్నతమైనదని వేదాలు ఘోషిస్తున్నయ్. అసలు ఆహారం కోసం ఇంకో ప్రాణిని చంపడమే దారుణం, అంచేత మాంసాహారం నీచమైనది. ఈ మహాసత్యాన్ని గుర్తించని కొందరు ‘మా ఆహారం, మా అలవాటు, మా ఇష్టం’ అంటూ వితండ వాదం చేస్తున్నారు.

మనం శాంతి కాముకులం, ఇతరుల అలవాట్లని గౌరవించే సంస్కారం వున్నవాళ్ళం. కాబట్టే అత్యంత దయతో – “వురేయ్ అబ్బాయిలూ! మాంసాహారం మహాపాపం. ఈ విషయాన్ని ముందుముందు మీరే తెలుసుకుంటారు. సరే! కోళ్ళు, కుక్కలు.. మీ ఇష్టం.. మీరేవైఁనా తినండి, మాకనవసరం. కానీ – గోవు మా తల్లి, దయచేసి మా తల్లి జోలికి మాత్రం రాకండి.” అని చిలక్కి చెప్పినట్లు చెప్పాం.

నేను ముందే మనవి చేసినట్లు వీళ్ళు పేదరికం ముసుగేసుకున్న అరాచకవాదులు. మనం యేది వద్దంటామో అదే చేస్తారు, యెంత సౌమ్యంగా చెబుతామో అంతగా రెచ్చిపోతారు. మన మంచితనాన్ని అసమర్ధతగా భావిస్తారు. అందుకే గుజరాత్‌లో మన తల్లి చర్మం వలిచేందుకు తెగబడ్డారు. మీరే చెప్పండి, మీ మాతృమూర్తి చర్మం వలిచేవాళ్ళని మీరైతే యేం చేస్తారు?

“మీరు వాళ్ళని గొడ్డుని బాదినట్లు బాదడం తప్పు.”

“అయ్యా! మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఆ నలుగురు కుర్రాళ్ళు తప్పుడు పని చేశారు. చెడుమార్గం పట్టిన కొడుకుని తండ్రి శిక్షించకుండా ఉపేక్షిస్తాడా? యెంత కొట్టినా దాని వెనుక ప్రేమ తప్ప ఇంకేమీ వుండదు కదా? ఇదీ అంతే! వాళ్ళు చేసింది హత్య, మానభంగం లాంటి సాధారణ నేరం కాదు – అత్యంత హేయమైన నేరం. నేరానికి తగ్గ శిక్ష పడాలి కదా! అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో (యెంతో బాధ పడుతూ) ఇనప రాడ్లతో బాదాల్సి వచ్చింది. ఇది మన దేశ సాంప్రదాయతని కాపాడ్డానికి చేసిన పుణ్యకార్యంగా మీరు భావించాలి.”

“నిందితుల్ని పట్టుకుని పోలీసులకి అప్పజెప్పాలి. వాళ్ళు నేరస్తులని చట్టబద్దంగా నిరూపణ కావాలి. మీరిలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అన్యాయం.”

“ఊరుకోండి సార్! మీరు మరీ అమాయకుల్లా వున్నారు. నేరం, చట్టం లాంటి పదాలు లలిత్ మోడీ, విజయ్ మాల్యాలకే గానీ సాధారణ ప్రజానీకానిక్కాదు. వాళ్ళు నీచులు, నీచులకి నీచభాషలోనే చెప్పాలి. అందుకే తాట వూడేట్లు బాది పడేశాం. అయినా మనకెందుకు భయం!? స్టేట్‌లో మనవేఁ, సెంటర్లో మనవేఁ. ఈ హడావుడి రెండ్రోజులే. ఆ తరవాత మళ్ళీ మామూలే.”

“ఆవుని చంపడం నేరం అని దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేసే చర్యలు చేపడదాం. అవసరమైతే రాజ్యంగ సవరణ చేయిద్దాం. ఆ కుర్రాళ్లని చావగొట్టడం.. ”

“ఎళ్ళెళ్ళవయ్యా! పెద్ద చెప్పొచ్చావ్! నీ మాత్రం మాకు తెలీదనుకున్నావా? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మేం మా పని చేసుకుంటూ పోతాం. కాబట్టే మేం గోరక్షక ముఠాలుగా యేర్పడ్డాం.”

“కానీ, చట్టబద్ద పాలన.. ”

“అసలెవడ్రా నువ్వు? ఇందాకట్నించీ ఒకటే లెక్చర్లిస్తున్నావ్! ఎవర్రా అక్కడ? ముందీ గాడ్దె కొడుకుని ఆ కారుకి కట్టేయ్యండి. మొన్న మనం వాడి పడేసిన ఆ ఇనప రాడ్లు తీసుకురండి.”

“హెల్ప్.. హెల్ప్.. ”

 

*

ఎదురు చూడని కల “మంచు పల్లకీ”

vamsy1

లోగో: భవాని ఫణి

 

ఐతే, నేను అసిస్టెంట్ గా పనిచేసే సినిమా ఆఫీసు, లేకపోతే జ్యోతి మంత్లీ ఆఫీసు, అదీ గాకపోతే ఏడిద నాగేశ్వరరావు గారిల్లు, ఒకోసారి జ్యోతి ఎడిటర్ వేమూరి సత్యనారాయణ గారిల్లు… ఇవీ ఆనాడు మద్రాసులో నేను కలతిరిగిన ప్రదేశాలు.

సీతాకోకచిలుక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాకా చాన్నాళ్ళు పనిలేకండా పోయింది నాకు. సరిగ్గా ఆ టైములోనే జ్యోతిలో మానేసి ఇంట్లో ఉంటున్న వేమూరి సత్యంగార్ని రెగ్యులర్ గా కలుస్తుండే వాడ్ని. సరిగ్గా అదే టైములో రాజమండ్రి నించి వచ్చిన ఎం ఆర్ ప్రసాదరావు గారు సినిమా తీస్తానంటే దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుదిరారు సత్యం గారు.

కమలహాసన్ కి అన్నయ్య, సుహాసినికి తండ్రి అయిన చారుహాసన్ గారు ఒక కథకి స్క్రీన్ ప్లే రాస్తే, వాళ్ళ దగ్గర మేనేజర్ గా పనిచేసిన వడివేల్ అనే ఆతను సుహాసిన్ని హీరొయిన్ గా పెట్టి సినిమా తీశాడు.పేరు ‘’పాలయ వన్న సోలై’’. హిట్ అయింది.

ఆ సినిమాని  తెలుగులో తియ్యడానికి రైట్స్ కొన్న ప్రసాదరావు, ప్రొడక్షన్ ఆఫీసు ఓపెన్ చెయ్యడం కోసం ఇల్లు కోసం తిరుగుతున్నారు.

ట్రస్ట్ పురంలో నేను ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఏడిద నాగేశ్వరరావు గారుండే వారు. శంకరాభరణం తర్వాత కామదార్ నగర్లో బాలసుబ్రహ్మణ్యం గారింటి అవతల ఇల్లు కొనుక్కుని అక్కడిడికి షిప్ట్ అవడంతో ఈ ఇల్లు ఖాళీ గావుంది .

కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న ఈ బాచ్ తో తిరుగుతున్న నేను ఖాళీ అయిన ఈ ఇంటిగురించి చెప్పేటప్పటికి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి ఇందులోకి దిగిపోయేరు.

vamsy

డైరెక్టర్ బాపూ గారయితే బాగుంటుందని వెళ్లి వార్ని కలిశారు.కానీ, వేమూరి సత్యనారాయణ గారన్న ఒక మాటకి హర్ట్ అయిన బాపుగారు ఆ సినిమా చెయ్యనన్నారు.తర్వాత జంధ్యాల దగ్గర కెళ్ళారు. మీరు కొత్తవాళ్ళు డబ్బుసంచి పట్టుకుని నా వెనకాల తిరిగితే చాలు సినిమా తీసి పెడతాను లాగేదో జంధ్యాలగారు అనేటప్పటికి ,సినిమా మేకింగ్ లో మా ఇన్వాల్వ్ మెంటు కూడా ఉంటుంది. అనుకున్న వీళ్ళు ఆయన్నొద్దను కున్నారు. వేజెళ్ళ సత్యన్నారాయణని కలిస్తే లక్ష రూపాయిలడిగేరు. వీళ్ళు వేసుకున్న బడ్జెట్ కి చాలా ఎక్కువ ఎమౌంట్ అది. దాంతో ఆయన్నీ వద్దనుకున్నారు.

‘’డైరెక్ట్ చేసే ఆయనెవరా’’ అని తెగ ఆపసోపాలు పడిపోతుంటే ‘’నాలాగ ఎందరో’’…..కుక్క కాటుకి చెప్పుదెబ్బ ‘’చూసేను.బాగున్నాయి  నాకు వాటి డైరెక్టర్ ఈరంకి శర్మ. మనకాయన బాగుంటారు అనిపిస్తుంది” అన్నాను .

భళే చెప్పేడే అని నన్ను తెగ మెచ్చుకుని, తెల్లరేకా మైలాపూర్ లో ఉన్న ఆ శర్మ గారింటికెళ్ళి పరిచయం చేసుకున్నాకా, వచ్చిన పనేంటో చెప్పారు.

Manchupallki_001 copy

విన్న శర్మ గారు ‘’నాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ….ఇవ్వాళ మంగళవారం ….రేపు మాటాడుకుందాము’’ అని ఆఫీస్ అడ్రస్ అడిగితే చెప్పి బయల్దేరేరీళ్ళు.

వీళ్ళకి శ్రేయోభిలాషి అయిన ఒక ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళా ఈరంకి శర్మ గారి ఇంటికెళ్ళిన విషయం తెలిసి పోయింది .కారేసుకుని ఆఫీసు కొచ్చేసినాయన ” అసలా శర్మ గారిని పెట్టమని సలహా ఇచ్చిన చెత్త నా కొడుకు ఎవరు” అంటా చాలా అల్లరి చేసేటప్పటికి ,చాలా డల్లయిపోయిన నిర్మాతలు ,మర్నాడు బుధవారం నాడు ఆ శర్మ గారింటికెళ్ళలేదు.సరిగదా ,ఆఫీసు తాళాలేసుకుని బయటికెళ్ళి పోయేరు.

వస్తానన్న వీళ్ళకోసం ఎదురు చూసి చూసిన ఆ ఈరంకి శర్మ గారు, ఆటో వేసుకుని ట్రస్ట్ పురంలో ఉన్న ఆఫీసు కొచ్చేసి ,తాళం కప్ప వేసి ఉండటంతో చాలా సేపు వెయిట్ చేసి ,చేసి వెళ్లిపోయేరు.

డైరెక్టర్ ఫైనలైజవ్వడం లేదని తెగ ఇదయ్యిపోతున్న ప్రసాదరావుగారు ప్రోబ్లం ని ,నాతోకూడా పాలుపంచు కుంటా “ఎవరన్నా డైరెక్టర్ పేరు చెప్పవయ్యా” అన్నారు. మొన్న అనుభవానికి చాలా ఇన్సల్ట్ అయిపోయిన నేను ఇంక చెప్పనన్నాను.

ఒక రోజు పొద్దుటి పూట మేం అద్దె కుంటున్న ఒకే గది కటకటాలింటి కొచ్చిన సత్యం గారు ‘’డైరెక్టర్ ఫైనలైజయి పోయేడు వంశీ’’అన్నారు .

‘’అనుకున్నాను …ఈ చిరాకులో ఎవడో ఒకడ్ని చేసి పారేస్తారని ఎవరు ?’’అన్నాను.

నవ్వేసిన సత్యంగారు ‘’నువ్వే’’అన్నారు.

‘’భళే వోరే …. ముప్పై ఏళ్ళు వచ్చేదాకా నేను డైరెక్టర్ అవ్వను.’’అన్నాను .

‘’ఇప్పుడు ….నీ వయసెంత ?’’ అడిగేరు సత్యం గారు .

‘’ఇరవై రెండు ‘’చెప్పేను.

‘’ముప్పై ఏళ్ల దాకా ఎందుకు?’’

‘’ నా దృష్టిలో సినిమా డైరెక్టర్ అంటే మాటలు కాదండి …..చాలా నేర్చు కోవాలి ,చాలా సబ్జెక్ట్స్ మీద చాలా అవగాహన కావాలి …….వరల్డ్ ఫిల్మ్ గురించి ……..’’

‘’నేర్చుకున్నది చాల్లే గానీ ఆఫీసుకి పద చెప్తాను’’అంటా లాక్కెళ్ళి పోయేరు నన్ను.

మూడు రోజుల పాటు రాత్రి పగలు ఆలోచించిన నేను ‘’సరేనండి …. ఒక రోజు షూటింగ్ కి కావలసినవన్నీ ఎరేంజ్ చెయ్యండి….అది నాకు రిహార్సలు ‘’అన్నాను.

నేను చెప్పినవన్నీ చేసిన సత్యం గారు, నాకు అసిస్ట్ చెయ్యడానికి ఒక సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ ని కూడా పెట్టారు.

ఆఫీసు లోనే షూట్ .

Manchupallki_002 copy

హాఫ్ డే పాటు షూట్ చేశాక పాజిటివ్ ప్రింట్ చేయించి ,కోడంబాక్కంలో లిబర్టీ దియేటర్ ఎదురుగావున్న అప్సర  లాడ్జిలో చిన్న ప్రివ్యూ ధియేటర్ ఉంటే అందులో చూసుకున్నాను .నాతోపాటు చూసినోళ్ళంతా ….బాగుందన్నారు.

మర్నాడు ఆఫీసు కెళ్ళిన నేను ‘’సరే మీ సినిమా డైరెక్ట్ చేస్తాను గానీ ,ఆ సీనియర్ అసోసియేట్ డిరెక్టర్ని పనిలోంచి తీసెయ్యండి ముందు ‘’అని మొన్న సీతాకోకచిలుక సినిమాకి నాతోపాటు అసిస్టెంట్ గా చేసిన ముడుచూరి దొరసామి రెడ్డిని ,వైజాగ్ మిత్రుడు (ఇప్పుడు హీరోలకి ట్రైనింగ్ ఇస్తున్న ) ఎల్ .సత్యానంద్ నీ అసిస్టెంట్స్ గా పెట్టుకుని సిన్మా డైరెక్ట్ చెయ్యడం మొదలెట్టిన నాకు నెల జీతం 6.50 రూపాయిలు.

మాటల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారూ,నేనూ ఆ సాయంత్రం మా ఆఫీసు ఎదురుగుండా ఉన్న వీధిలో ఉన్న స్వర్గీయ కొడవటిగంటి కుటుంబరావు గారింటి  ముందు నుంచి వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు ‘’ఈ సినిమాకి నీ మొదటి నవల టైటిలే పెడితే బాగుంటుంది గదా ?’’ అన్నారు.

ఈ ఐడియా అందరికీ నచ్చడం తో అదే పెట్టాం ‘’మంచుపల్లకీ’’.

ఒరిజినల్ వెర్షన్లో హీరోయిన్ గా చేసిన సుహాసిన్నే దీంట్లో కూడా పెట్టాం. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న చిరంజీవి గారి డేట్లు 13 రోజులు మాత్రం ఖాళీగా ఉన్నాయి .తక్కినవి ఎలాగోలా సర్దొచ్చులే  సిన్మా చేద్దాం’’ అన్నారు అరవింద్ గారు.

హైదరాబాద్ వచ్చేం.

Manchupallki_003 copy

సంజీవరెడ్డి నగర్లో (ఎస్.ఆర్ .నగర్ ) పిట్ట గోడల మీద షూటింగ్. యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులకి నా మీద నమ్మకం చాలా తక్కువగా ఉంది.వాళ్ళలా ఫీలవ్వడంలో తప్పులేదు.ఎందుకంటే ,సిన్మా డైరెక్ట్ చెయ్యడానికి నాకున్న అనుభవం ఏమాత్రం చాలదు.

ఫస్ట్ షెడ్యూల్ల్లో చేసింది ఎడిట్ చేసి సారధి స్టూడియోలో డబ్ చేస్తుంటే స్కీన్మీద చూసిన నటీ నటులు నమ్మడం వల్ల,మిగతాది షూట్ చేస్తున్నప్పుడు అసలు మాటాడలేదు. ఫైనల్ ప్రోడక్ట్ చూసిన చారుహాసన్  సిగరెట్ కాలుస్తా దియేటర్లోనుంచి బయటి కొచ్చి ఎవరితోనూ మాటాడకుండా కారెక్కి వెళ్లి పోయేరు.

ఈ రీమేక్ సినిమాలతో ప్రోబ్లం ఏమిటంటే ఎవరికైనా సరే ఒరిజినల్ వెర్షనే బాగుంటుంది .తర్వాత ఎన్ని వెర్షన్స్ ఎంత బాగా తీసినా ఒప్పించలే౦. ఒరిజినల్ అంత బాగా లేదనేస్తారు. చారుహాసన్ గారి విషయానికొస్తే………. సినిమాల మీద చాలా అవగాహన ఉన్న మేధావి ,పైగా ఒరిజినల్ వెర్షన్ స్కీన్ ప్లే రైటర్ .ఈ తెలుగు వెర్షన్ ఆయనకి నచ్చదు ఎందుకంటే నేనిందులో చాలా మార్చేసేను..

Manchupallki_004 copy

కానీ,

ఇక్కడ కొంచెం రివర్స్ అయ్యింది.మర్నాడు పొద్దుట నిర్మాతలకి ఫోన్ చేసిన చారుహాసన్ ‘’మీ సినిమా నెల్లూరు జిల్లా నేను కొనుక్కుంటున్నాను’’ అని రేటు మాటాడి ఫైనలైజ్ చేసుకున్నారు.

మద్రాసు లక్ష్మి కాలనీలో ఈ సినిమా షో వేస్తే సుహాసినితో పాటు వచ్చిన వాణి గణపతి (కమలహాసన్ మొదటి భార్య )లాస్ట్ లో సుహాసిని మీద పడి ఏడుస్తా ‘’నువ్వూ, ఆ హీరో చిరంజీవీ చివర్లో పెళ్లి చేసుకునే ఇంకొకటి సినిమా చూసేదాకా నా మనసు శాంతిoచదు’’అంటా కారెక్కి వెళ్లి పోయింది.

సురేష్ మహల్లో ప్రివ్యూ చూసిన మా గురువు శ్రీ కె .విశ్వనాద్ గారు నన్ను ఆశీర్వదించిన క్షణాలు మర్చిపోలేను.

అందరికంటే ,అన్నింటికంటే మా గొప్పగా గుర్తుంచు కోవాల్సిన మహానుభావులు లక్ష్మి ఫిలిమ్స్ లింగమూర్తిగారు.శ్రీ కె.ఎస్.రామారావు గారు చెపితే వచ్చి ఈ సినిమా చూసినాయన చాలా ఇష్టపడతా రిలీజ్ చేసారు .

కానీ ,

పేరయితే వచ్చింది గానీ ,తమిళ్లో అంత బాగా తెలుగులో ఆడలేదు. ఇక్కడ సక్సెస్ ప్రధానం అని తెలిసిన నాకు ,ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా బాగా తెలిసింది .

దాంతో ,

నిద్ర పట్టేది కాదు.తెలుగులో నా గురువుల్తో పాటు బిమల్ రాయ్,రిత్విక్ ఘటక్ ,అకిరాకురసోవా, జోల్డాన్ ఫాబ్రి లాంటి గొప్పగొప్ప దర్శకులు గుర్తుకొచ్చేవారు. అసలు ఫిల్మ్ డిరెక్టర్ అంటే మాటలా ……..అసలెందుకు దిగేను? ఎంత తప్పు చేసేను?….

Manchupallki_005 copy

మళ్ళి అసిస్టెంటుగా చేసి ,చాలా చూసి,చాలా చదివి ,చాలా టెక్నాలజీని ఔపోసన పట్టి ,తోక్కేసిన వాకిట్లో పండగ ముగ్గుని సరిదిద్దే వాడినేమో కానీ ,

నేను రాసిన ‘’మహల్లో కోకిల ‘’నవలని ‘’సితార’’ సినిమాగా తియ్యడానికి. ఆ సాయంత్రం పూట ఏడిద నాగేశ్వరరావు గారి దగ్గర్నుంచి కబురొచ్చింది.

 

*

 

 

 

 

 

 

 

 

 

మానవుడితో…

 

 

-బాలసుధాకర్ మౌళి

~

( చ‌ల‌సాని వ‌ర్థంతి స‌భ‌ ఈ 24 ఉదయం  9.30గంట‌ల‌కు  విశాఖ‌ప‌ట్నం పౌర గ్రంథాల‌యం, ద్వార‌కాన‌గ‌ర్‌

అధ్య‌క్ష‌తః వ‌ర‌వ‌ర‌రావు
చ‌ల‌సాని ప్ర‌సాద్ సాహిత్య స‌ర్వ‌సం – 1 ఆవిష్క‌ర‌ణ‌
ఆవిష్క‌ర్తః కృష్ణాబాయి)

*

రెండేళ్ల కిందటి సంగతి – విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ‘జనకవనం సభ’ ప్రారంభకులుగా కె. శివారెడ్డి గారు వచ్చారు. పబ్లిక్ లైబ్రరీకి దగ్గర్లోనే ఏదో హోటల్లో రూం.

సాయంత్రం సభ అయింతర్వాత – శివారెడ్డి గారు వున్న హోటల్ రూంకి వెళ్లాను. ఒక అరగంట సేపు కవిత్వం – వర్తమానం ..ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత – ‘ హాఫ్ చేతుల తెల్లని షర్ట్, వొక మామూలు ప్యాంట్ ‘ వేసుకుని ‘చలసాని ప్రసాద్ గారు’ వచ్చారు. అదే మొదట – నేను ఆయనతో మాట్లాడింది. ఆయన గొంతుని, మాటని దగ్గరగా వినడం. చూడడం.. నాకు మిగిలిన అనుభవాలు. అంతకు ముందు విజయనగరంలో, విశాఖలో వొకటి, రెండు సభల్లో చూసాను. శ్రీశ్రీ కి పరమ భక్తుడని, విప్లవానికి నిబద్ధుడని -నేను ఆయన గురించి విన్నవి. చలసాని గారి సాహిత్యంతో పరిచయం వుంది నాకు. ఆయన వ్యాసాలు, కవిత్వం చదివాను. ‘జైలు’ మీద రాసిన అతని కవిత్వం, ఆ కవిత్వ నిర్మాణం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఆ రోజు శివారెడ్డి గారే నన్ను చలసాని గారికి పరిచయం చేసారు. నా కవిత్వసంపుటి గురించి చెప్పి.. ఆయనకి వొక కాపీ యిమ్మన్నారు. నేను బ్యాగ్ లోంచి తీసి.. ఆయనకు అందించాను – ‘ గురుతుల్యులు… చలసాని ప్రసాద్ గారికి’ అని రాస్తూ –   ఆయన వొక నిమిషం అటు యిటూ తిప్పి చేతిలో వుంచుకున్నారు. నేను చాలా ఆనందపారవశ్యానికి లోనయ్యాను. అదే ఆయనతో తొలుత నేను వుండటం.

మళ్లీ..

2015 ఏప్రిల్లో విశాఖలోనే ‘వైజాగ్ ఫెస్ట్’ లో భాగంగా ‘పుస్తక మహోత్సవం’ లో వొకసారి కలిసాను. వీక్షణం బుక్ స్టాల్ ముందు కూర్చున్న  ఆయన వద్దకు వెళ్లాను. నేను ఆయనకు జ్ఞాపకంలో లేను. ‘ఆనాటి హోటల్లో శివారెడ్డి గారితో వున్నప్పటి సందర్భం’ – గుర్తుచేసాను. గుర్తు తెచ్చుకున్నారు. ‘ఓహో నువ్వా… ‘ అని వొక చిరునవ్వు నవ్వి నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. మళ్లీ మురిసిపోవడం నా వంతు.

ఆ తర్వాత..

రెండు మూణ్ణెళ్లు పోయాక ఆయన ఇక లేరని వార్త తెలిసింది. జూలై 25, 2015 న విశాఖలో ఆయన ఇంటి వద్ద ఆయన పార్దీవ దేహాన్ని చూడడమే చివరిసారి. ఒక స్వాప్నికుడు – ఒక మానవుడు.. నాకు తెలిసిన కొన్ని నెలలకే భౌతికంగా లేకపోవడం నన్ను చాలా బాధకు లోను చేసింది. వెంటనే ఆయన అంతిమ యాత్రకు వెళ్లటం – నా తీవ్ర కాంక్ష. చాలా ఉద్విగ్నంగా అనిపించింది. మనసులో ఆ ఉద్విగ్నతతోనే విశాఖ బయలుదేరాను. అంతిమ యాత్రకి ముందు – చలసాని ప్రసాద్ గారి ఇంటి వద్దే జరిగిన సభలో వి.వి, కాత్యాయని విద్మహే గారు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు యింకా చాలా మంది చలసాని జ్ఞాపకాలను రుద్ధకంఠంతో పంచుకున్నారు.

సభంతా వొక గంభీర వాతావరణం పరచుకుంది. అలాంటి సభల్లో వుంటేనే నేను వున్నట్టనిపించింది. జీవించినట్టనిపించింది. నిజంగా ప్రాణంతో వున్న మనుషుల మధ్య బతికినట్టనిపించింది. వొక వీరుని మరణం గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ” నా హృదయం దుఃఖించింది – స్పూర్తిని పొందింది. ” వక్తల మాటల్లో చలసాని గారి ‘ఆ గొప్ప ఆకాంక్ష’ గురించి అప్పుడే విన్నాను. అదే : ” తలుపుల్లేని ఇళ్లు, జైళ్లు లేని దేశం, తరగతి గదులు లేని బడులు ” నిజంగా అది అందరి ఆకాంక్ష కూడా. నేను… అప్పుడు అందరి ముఖాల్లోకి చూసాను. ఎవరి ముఖంలోనైనా కురవడానికి సిద్ధంగా వున్న మేఘాలే కనిపించాయి. ముఖాల అడుగున వున్న తేజోవంతమైన కాంతీ కనిపించింది.

chalasani

అంతిమ యాత్ర మొదలయ్యింది.

రాష్ట్రం నలుమూలల నుంచి తెలిసిన, తెలియని అనేక మంది మనుషులతో నడవడం, ప్రయాణించటం – నా జీవితంలో వొక ఉద్విగ్నపూరిత అనుభవం. విశాఖ రోడ్డు మీద యాత్ర సాగి.. A.U medical institute కి దేహాన్ని అప్పగించటం – చలసాని గారితో అనుబంధం వున్న వొక్కొక్కరు వెళ్లి ఆయన దేహం ముందు భోరున విలపించటం – ఇంక నాలో కంపనం మొదలయ్యింది. వరవరరావు, పాణి, కె. వరలక్షి గారు, అరసవిల్లి కృష్ణ గారు , ప్రసాద వర్మ గారు, కెక్యూబ్ వర్మ గారు, రివేరా, అద్దేపల్లి ప్రభు గారు వొకరా ఇద్దరా అనేకులు అనేకులు. నేను వరవరరావు గారి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాను- అంతకు వొకసారి కలిసాను.  నా కవిత్వం చదివానని చెబుతూ..  అనంతమైన ప్రేమ  నిండిన ఆ చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆ చేతులు నాకు అలాగే అనిపించాయి.

ఇక.. ఎనభై యేళ్ల పైబడిన నిర్జీవదేహాన్ని అక్కడ అప్పగించాక.. నాకు దేన్నో వెతుక్కోవాలనిపించింది. వెతుక్కుంటూ వెళ్లాలనిపించింది. సముద్రం గుర్తొచ్చింది. తిన్నగా సముద్రానికే నడిచాను.

సముద్రం , జనం – వొక్కటేనేమో.

జనంలో వున్నప్పుడూ, సముద్రం దగ్గర వున్నప్పుడూ – వొకే అనుభూతి. ఈసారి అనుభూతి – దుఃఖం. రెండింటి దగ్గరా దుఃఖమే. అన్ని అనుభూతులకూ, అనుభవాలకూ వాహిక ‘కవిత్వమే’  అవుతుంది.

 

ఈ కవిత : అప్పుడే – సముద్రం దగ్గరే రాసుకున్నాను.

chalasani1

 

 

కొన్ని ఉద్విగ్నక్షణాల మధ్య..

 

 

మౌనంగా పిడికిళ్లెత్తి

జోహార్లు చెబుతున్న దృశ్యమే కళ్ల ముందు –

ఏ స్వప్నాలు

కెరటాల్లా ఎగిసివస్తున్నాయో

ఏ దుఃఖాలు

లావాలా ఉబికి వస్తున్నాయో

ఆత్మీయులు

భుజం భుజం కలిపి కొత్త వారధిని నిర్మిస్తున్నవాళ్లు

ఏం కాకపోయినా

కన్నీళ్లు కార్చినవాళ్లు

ఎక్కడ నుంచో

పిడికెడు స్థైర్యాన్ని పొందినట్టు

అక్కడికక్కడే కాసింత స్ఫూర్తిని పొందినవాళ్లు

అంతా వొక దగ్గరే

అమరుని దేహం చుట్టూ చేరి

రేపటిని వాగ్దానం చేస్తున్నారు

 

2

 

తీరం వెంబడి నడుస్తున్నాను

వొక దిగులును దిగమింగుకుంటూ

గొంతెత్తి

అమరత్వాన్ని గానం చేస్తున్న

వొక సమూహాన్ని

అలల ఘోషలో పోల్చుకుంటున్నాను

ఇసుకపర్రల మీద

పాదాల గమ్యాన్ని వెతుక్కుంటున్నాను

చుట్టూ

జనసమూహం

సముద్రంతో

తమని తాము విభిన్నరూపాల్లో

వ్యక్తం చేసుకుంటూ…

 

3

 

సముద్రానికా శక్తి ఎక్కడినుంచొస్తుందో…

ఊయలలూపుతుంది

లాలిస్తుంది

అట్నుంచి యిటు

ఇట్నుంచి అటు తోస్తూ

ఈనిన దూడని

నిలబెడుతున్న తల్లి ఆవులా

అచ్చం

విప్లవాగ్నిలా…

 

4

 

వెళ్తూ వెళ్తూ

కొన్ని ఉద్విగ్నక్షణాల్ని

రక్తనాళాల్లోకి ఊదుకుంటున్నాను –

 

( చలసాని గారితో అల్పకాల పరిచయాన్ని తలచుకుంటూ… )

 

 

చలసాని గొంతులో …https://www.youtube.com/watch?v=IfqTbEzYAzo

 గోడకో కిటికీ!

 

 

– రాధ మండువ

~

 

1.

సూర్యోదయం అయి చాలా సేపయింది.  పిల్లలంతా మామిడి చెట్ల మీదకి చేరి గోల చేస్తున్నారు.

ఈ రోజు మా ఆవిడ – కొత్త వధువు, నెల రోజుల క్రితమే నా భార్య అయిన శ్రావణి వస్తోంది.  ఆమెని గురించిన ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్రపట్టకనో,  ఈరోజు ఎలాగూ సెలవు పెట్టాను కదా అనో ఆలస్యంగా నిద్ర లేచాను.

లేచి నిలబడ్డానో లేదో మామిడి చెట్టు మీద నుండి కిటికీ వైపుకి చూస్తూ “గోవిందన్నా,  ఇన్నికి ఆఫీసుకు పోలియా?”  అని అరిచాడొకడు.  నేను నవ్వి చెయ్యి ఊపి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.

ఈ పిల్లలు తెల్లవారనివ్వరు కదా!  శని ఆదివారాలైతే మరీ గోల.  కాస్త పొద్దెక్కేటప్పటికే  చెట్ల మీదకి చేరి ఆటలు ఆడుతుంటారు.  చేరితే చేరారు కిటికీలో గుండా తొంగి తొంగి చూస్తూ మధ్య మధ్యలో నన్ను వెక్కిరిస్తూ ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు.  ఏం మాట్లాడుకుంటారో!?  ఆ కబుర్లకి ఓ అంతూ దరీ ఉండదు.

నేనుండే ఆ రేకుల ఇంటికి ఆ కిటికీ ఒక్కటే ఉంది.  అదంటే నాకు చాలా ఇష్టం.  రాత్రింబవళ్లు అది తెరిచే ఉంచుతాను.  దాన్ని ఈరోజు సాయంత్రం మూసేయాలి,  పూర్తిగా కాదులే అప్పుడప్పుడూ మూసేయాల్సిందే ఇక…   ఆవిడ వస్తుంది కదా?  ఇంట్లో ఆవిడతో కబుర్లు చెప్తూ పక్కన నిలబడితేనో,  ఆమె పక్కన కూర్చుంటేనో – ఈ పిల్లలు చూస్తే ఇంకేముందీ!  ఇక పగలబడి నవ్వుతారు ఎగతాళిగా చూస్తూ.  నాలుక బయటపెట్టి వెక్కిరిస్తారు కూడా!

నేను ఆంధ్రానుండి చెన్నైలో తాంబరంలో ఉండే ఈ ఇంటికొచ్చి దాదాపు నాలుగేళ్ళవుతోంది.  ఇంటి ఓనర్స్ ముందు భాగంలో ఉన్న పెద్ద ఇంట్లో ఉంటారు.  వెనుక ఉన్న రెండు ఇళ్ళల్లో రేకుల ఇల్లు నాది.  మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫెన్సింగ్ కి ఆనుకుని ఉంటుంది.  రెండో వైపు ఖాళీ స్థలం.  ఎవరో ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం కొనుక్కున్నారు.   దాన్లో రెండు మామిడి చెట్లు వేశారో పడి మొలిచాయో మరి – ఉన్నాయి.   స్థలం ఓనర్లు ఎవరో తెలియదు.  చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఎవరూ లోపలకు రాకుండా జాగ్రత్త మాత్రం చేసుకున్నారు.   లోపలున్న చెట్లకి కాసిన్ని నీళ్ళు పోయడం, కాయలు కాస్తే కోసుకుని తినడం,  వాళ్ళకిష్టమైన వాళ్ళకి కాయలు ఇవ్వడం అన్నిటికీ హక్కుదార్లు ఈ చుట్టుప్రక్కల ఉండే ఇళ్ళల్లోని పిల్లలే.  వీళ్ళు నాకు సంతోషాన్ని కలిగించే పిల్ల స్నేహితులు.

మా ఆఫీసు ఉండేది మరైమలైనగర్లో.  తాంబరం నుండి రోజూ ఉదయాన్నే లోకల్  ట్రైన్   పట్టుకుని ఆఫీస్ కి వెళతాను.  బావుంటుంది ఆ ప్రయాణం.   ఉదయం రైల్లో వచ్చే జనమంతా ఫ్రెష్ గా ఉంటారు.  పూలోళ్లు, కూరలోళ్ళు, పాలోళ్ళు, వస్తువులు అమ్మేవాళ్ళతో రైలు బండి కళకళలాడుతుంటుంది.  ప్రతి ఆడామె తల్లో పూలు ఉండాల్సిందే.  ముఖాన ముచ్చటగా కుంకుమ బొట్టు,  పైన అడ్డంగా విభూది.  మగాళ్ళ నుదుటన అడ్డంగానో, చుక్కగానో విభూది ఉంటుంది.   అన్నం, సాంబార్ వారి భోజనంలో నిత్యం ఉండాల్సిందే –  కనుకనేనేమో దాదాపు అందరూ లావుగా ఉంటారు.  అయితేనేం లావుగా ఉన్నా హుషారుగా…  తమిళంలో చెప్పాలంటే సురుసురుపుగా ఉంటారు.

ఎందుకో ఇవాళ పొద్దున్నే వీళ్ళని తల్చుకుంటున్నాను.  ఇవన్నీ నా భార్యకి చెప్పాలనే ఆలోచన వల్ల కలుగుతున్న తలపులేమో!  ఆలోచనల్లోంచి బయటపడి లేచి ఇల్లంతా సర్దాను.  టేబుల్ మీదున్న పుస్తకాల వెనక్కి చేరిన పెళ్ళి ఫోటో గాజు ఫ్రేమ్ నిండా దుమ్ము చేరింది.  నాలుక్కరుచుకుని గబగబా తుడిచి కనపడేట్లు ముందుకి పెట్టాను.

కిటికీ లో నుండి ఓ తల లోపలకొచ్చింది.  “హే గోవిందన్నా ఆఫీసుకి పోలా?”  అంది ప్రక్క పోర్షన్ లో ఉండే వాళ్ళ పిల్ల.  ఏం పేరబ్బా…  ఈ పిల్ల పేరు!?  ఎప్పుడూ మర్చిపోతుంటాను.  “ఇల్లె. పోలా.  ఆంటీ వరాంగో”  అన్నాను.

“ఆంటీ యారూ?”

“ఆంటీ”.

“ఆంటీ అన్నా యారు?”  చిరాకు ఆ పిల్ల గొంతులో.  నాకేం చెప్పాలో అర్థం కాలేదు.  చెప్పినా ఎనిమిదేళ్ళ పిల్లకేం అర్థం అవుతుంది?  గభాల్న ఫోటో తీసి చెయ్యి పైకెత్తి కిటికీలో నుంచి చూపిస్తూ “ఈ ఆంటీ”  అన్నాను.

“ఓ ఉంగళ పొండాటీయా?”  అంది నోరు అంతా తెరిచి నవ్వుతూ.

‘ఓయమ్మ ఈ పిల్ల భలేదే!’  అనుకుని నేను సిగ్గుపడేలోపు ఆ పిల్ల అక్కడనుండి తుర్రుమంది.

హమ్మయ్య ప్రశ్నలతో చంపకుండా వెళ్ళిపోయింది అనుకుని ఫోటో టేబుల్ మీద పెట్టి కిటికీ రెక్కలు వేసేశాను.  అలా వేశానో లేదో “గోవిందూ,  గోవిందూ”  అంటూ కిటికీ మీద కొట్టారు – ప్రక్కింటి బామ్మ…  ఆ పిల్ల నాయనమ్మ.  అబ్బ!  ఆ పిల్ల పేరేంటో గుర్తే రాదు అనుకుంటూ “ఆఁ ఆఁ”  అంటూ కిటికీ రెక్కలు తీశాను.  ఎవరూ లేరు.  ఈలోపే చుట్టుతిరిగి వచ్చి గది తలుపు మీద బాదుతూ ఆమె పిలుస్తోంది.  తెరిచిన కిటికీ రెక్కలని అలాగే వదిలేసి ముందు గదిలోకి ఒక్క గెంతేసి వాకిలి తలుపు తీశాను.

“మనోజ్ఞ సొల్లరా…  ఉంగ పొండాటి ఇన్నికి వరాంగ్లామే!?”  అంది.

ఆఁ…  ఆ పిల్ల పేరు మనోజ్ఞ.  “అవును మామీ!”  అన్నాను.

“సరి సరి నాకు చెప్పొద్దా?  ఎన్ని గంటలకి వస్తున్నారు?”  అంది తమిళంలో.

“సాయంకాలం ఆరుకి రైలొస్తుంది,  ఇంటికి వచ్చేప్పటికి ఏడు అవుతుందేమో”

“పర్వాలేదు,  ఎంత సమయమైనా కానీయ్ లే.  నేరుగా ఇంట్లోకి తీసుకురాకూడదు.  గేటు దగ్గర ఆపి నాకొచ్చి చెప్పు.    దిష్టి తీసి,  హారతిచ్చి లోపలకి తీసుకురావాలి, బ్రాహ్మణుల పిల్లాడివి అయినా ఏమీ తెలియదు ఏమిటో!?”  అంది.  నేను నవ్వుకున్నాను.  ఈ తమిళియన్స్  ఆచార వ్యవహారాలు పాటించడానికి ఎంత శ్రమకైనా ఓరుస్తారు, సహాయం చేస్తారు

“సరే మామీ”  అని నేనంటుండగానే ఆవిడ గబగబా గుమ్మం దాటి గది మలుపు తిరిగింది.  తలుపేసుకుంటుండగా కిటికీలోకి తలపెట్టి చూస్తా “గోవిందూ మీ మామగారు కూడా వస్తున్నారా?” అంది ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి.

“లేదు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు మామీ.  ఈవిడ ఒక్కత్తే వస్తోంది”

“అయ్యో,  భద్రంగా వస్తుంది కదా?”  అంది.

“ఆఁ రాగలదులెండి,  అక్కడ రైలెక్కిస్తే ఇక్కడ నేను దించుకుంటాను,  భయమేమీ లేదు”  అన్నాను.

“సరీ…  వరుంబోదు పూలు పళం వాంగికోంగో”  అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తనింటికే చుట్టం వస్తుందన్నంత హడావుడిగా.

 

2.

 

గడియారం పది గంటలు కొట్టింది.  గంటల శబ్దానికి పిల్లలంతా చెట్ల కొమ్మల మీద నుండే కిటికీ వైపుకి చూశారు.  ఆ పురాతన గడియారం అంటే పిల్లలకి చాలా మక్కువ.   అది గంటలు కొట్టినప్పుడంతా దాన్ని చూడటానికీ,  తమ ఇంటికొచ్చిన కొత్త పిల్లలకి దాన్ని చూపించడానికీ ఆ చువ్వలు లేని కిటికీ లోంచి తలలు లోపలకొస్తూనే ఉంటాయి.  దాన్ని ఈరోజు సాయంత్రం అర్జంటుగా మూసేయాలి అనుకోగానే నవ్వు వచ్చింది.

బజారుకెళ్ళి ఇంట్లోకి కావలసినవి కొనుక్కుని వస్తుంటే మా వీధి వాళ్ళంతా పలకరించారు.  అప్పటికే న్యూస్ వీధి చివరి వరకూ చేరింది.  ఇంట్లోకి వచ్చానో లేదో మూసిపెట్టిన కిటికీ రెక్కల మీద పిల్లలు బాదుతూనే ఉన్నారు.   నేను పట్టించుకోకుండా వంట పనిలో పడిపోయాను – వాళ్ళే కొట్టి కొట్టి పోతార్లే అనుకుంటూ…  నవ్వుకుంటూ…

సమయం నిదానంగా గడుస్తున్నట్లనిపించింది.  మధ్యాహ్నం అన్నం తిని ఎన్నో గంటలయినట్లుంది.  టైమ్ చూస్తే ఇంకా రెండు కూడా కాలేదు.

“గోవిందన్నా,  ఓ గోవిందన్నా”  కిటికీ బాదుతోంది గట్టిగా.  వదలకుండా అరుస్తూనే ఉంది.  ఏం పేరు ఈ పిల్ల పేరూ!!?  ఆఁ మనోజ్ఞ – మనసుకి ఉల్లాసం కలిగించేదా?  ఉత్తేజం కలిగించేదా!?  ఏమోగాని ఇప్పుడు మాత్రం ‘తలుపు తీస్తావా తీయవా’ అని నా గుండెల్ని అదరగొడుతోంది.  లేచి కిటికీ రెక్కలు తీశాను.  గభాల్న ఇద్దరు పిల్లలు లోపలకి తల పెట్టగానే వెనక్కి గంతు వేశాను – నా తల వాళ్ళకి ఢీ కొట్టుకోకుండా…

ఎదురింటి నాడార్ గారి అబ్బాయి కృష్ణని తీసుకోనొచ్చింది.   నాడార్ గారు మా ఫ్యాక్టరీలోనే అకౌంట్స్ క్లర్క్.  ఈ ఇల్లు ఆయన వల్లే దొరికింది నాకు.   “హహహ గోవిందన్నా!  ఎనక్కూ ఉంగ పొండాటి ఫోటో కామింగో” అన్నాడు.

“ఏంటిరా గోల?”  అన్నాను విసుక్కుంటూ…

“నాకు తెలియదు,  నేను కూడా మీ పెళ్ళాం ఫోటో చూడాలి.  మనోజ్ఞ అందరి దగ్గరా ఎచ్చులు కొడుతోంది – ‘నేను గోవిందన్న పెళ్ళాం ఫోటో చూశా’  అని.  నాక్కూడా చూపించు”  అన్నాడు.  వాడు మాట్లాడుతుంటే డబ్బాలో గులకరాళ్ళు పోసి ఊపినట్లుంటుంది.

“అబ్బబ్బ!  ఇరుప్పా,  చెవులు నొప్పి పుడుతున్నాయి, అరవొద్దుండు చూపిస్తా”  అంటూ ఫోటోని తీసి చూపించాను.  చూస్తున్న వాడు కాస్తా గభాల్న నా చేతుల్లోంచి ఫోటో లాక్కుని పరిగెత్తాడు.

“అరేయ్,  ఆగు ఆగు!  ఆగు కృష్ణా!”  అంటూ ముందు గదిలోకి దూకి తలుపు తీసుకుని తిరిగి వెళ్ళే లోపు మామిడి చెట్టు మీదికి చేరారు.   శనివారం కదా,  పెద్దపిల్లకోతి మూకంతా కూడా చెట్ల మీద ఉంది.  ఫోటో ఒకళ్ళ చేతిలోంచి మరొకళ్ళ చేతుల్లోకి మారుతోంది.

‘ఫోటోని ఇవ్వమనీ,  జాగ్రత్తనీ, చిన్నగా – చిన్నగా అనీ’   చెట్ల కింద నిలబడి అరుస్తున్నాను.  ఉన్నట్లుండి ఫోటో అంతెత్తునుండి కింద పడింది.  “అయ్యో!”  అని నేనూ పిల్లలు అందరం ఒక్కసారిగా అరిచాం.  పరిగెత్తి ఫోటోను చేతిలోకి తీసుకున్నాను.  గాజు ఫ్రేము ముక్కలైంది.  అప్పటికే పిల్లలు నా చుట్టూ గుమిగూడారు.  అప్పటి దాకా నవ్వులతో అరుపులతో హోరెత్తిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.   బిక్క ముఖాలేసుకుని నిలబడి ఉన్న పిల్లల్ని చూస్తూ చిన్నగా నవ్వాను.  నేను నవ్వగానే ‘హిహిహి’ అంటూ ఇబ్బందిగా ఇకిలించారు.

“ఫరవాలేదులే,  బజారుకి తీసుకెళ్ళి కొత్త గ్లాస్ వేపించేస్తాను”  అన్నాను.

“కృష్ణా నీదే తప్పు.  వద్దు వద్దు అంటే వినకుండా గోవిందన్న చేతిలోంచి ఫోటో లాక్కొచ్చావు”  అంది మనోజ్ఞ నిష్టూరంగా.

కృష్ణ నా దగ్గరికి వచ్చి “సారీ గోవిందన్నా!”  అన్నాడు.

“సరేలే,  ఈ విషయం ఎవ్వరకీ పెద్దవాళ్ళకి చెప్పొద్దు, సరేనా!?”  అన్నాను వేలు చూపిస్తూ.

ఈ సంగతి మామీకి తెలిస్తే ఇక ‘నేను కాదు గోవిందు నా పని గోవిందు’ అవుతుంది.  పెళ్ళి ఫోటో పెళ్ళికూతురు వచ్చే రోజు పగిలిందని తెలిస్తే ఇక జాతకాలనీ, గుడులనీ, శనిగ్రహపూజలనీ తిప్పుతుంది…  అమ్మో!

పిల్లల ముఖాలు విప్పారాయి.   ‘పిచ్చోడా,  నువ్వెక్కడ మా పెద్దోళ్ళకి చెబుతావోనని మేము భయపడుతుంటే నువ్వే మమ్మల్నిచెప్పొద్దంటున్నావే!?’  అని అనుకుంటున్నట్లు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు.

గోవిందన్నా “ఇందా మాంపళం,  ఉంగ పొండాటికి కుడుంగో”  అని ఓ పిల్లోడు నాలుగు మామిడి పళ్ళు ఇచ్చాడు.  దూరంగా కంచె దగ్గరికి వెళ్ళి గాజుపెంకులు పారేసిన తర్వాత ఆ మామిడికాయలు తీసుకుని లోపలకి వచ్చాను.

అప్పటికి టైమ్ నాలుగయింది.    గబగబానే నీట్ గా తయారై  ఆమెని సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకురావడానికి తాంబరం స్టేషన్ కి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కాను.

radha

3.

 

 

ఆమె వచ్చాక ఆ కిటికీ పూర్తిగా మూతబడిపోయింది.  నేనెప్పుడైనా తీసినా ఆవిడ ఒప్పుకోదు.  వెంటనే మూసేస్తుంది.

“అబ్బ,  ఏమిటండీ ఈ పిల్లరాక్షసులు పడుకోనివ్వకుండా ఒకటే గోల.  పిల్లల్నంటే బెదిరించి పంపించెయ్యొచ్చు,  ఈ మామీకి ఎక్కడనుంచొస్తుందో ఇంత ఓపిక పొద్దస్తమానం ‘ఎన్నాడీ శ్రావణీ,  ఎన్నా పణ్ణరే!?’ అంటా వస్తుంటుంది.  ఇక వీధిలో వాళ్ళు సాయంత్రమైతే చాలు వచ్చే కూరలోళ్ళనీ, పాలోళ్ళనీ,  పూలోళ్ళనీ, పండ్లబళ్ళనీ – ఒక్కట్ని పోనివ్వరు.  అన్నీ కొనాల్సిందే…  కొన్నా కొనకపోయినా ఆపి బేరాలు చేయాల్సిందే.  పైగా రోడ్డంతా రొచ్చురొచ్చుగా నీళ్ళు చల్లి ముగ్గులేయడం,  ఏం పొద్దునేసిన ముగ్గు చాలదా!?  నేను ఏ పుస్తకమో చదువుకుంటా లోపలుంటానా ‘ఎన్నా శ్రావణీ,  పువ్వు వేణుమా,  కొత్త పెళ్ళికూతురివి పూలు కావొద్దా!?’  అని పిలుస్తానే ఉంటారు”  అని అందరినీ వీధిలో వాళ్ళని ఒక్కళ్ళని వదలకుండా విసుక్కుంటోంది.

సరే, చుట్టుప్రక్కలోళ్ళ  రామాయణం ఇదైతే,  బయటికి ఎక్కడికి తీసుకుపోయినా జనాన్ని తిడుతుంటుంది.  పసుపుకుంకుమలూ, విభూదీ గుళ్ళో స్తంభాల మీద,  అరుగుల మీద, వీధుల్లో ఎక్కడంటే అక్కడ పోయడం,  ప్రదక్షిణాలంటూ మురికిలోనే పొర్లు దండాలు పెట్టడం,   పెళ్ళి ఊరేగింపునుండి,  శవాల ఊరేగింపు దాకా ఏ ఊరేగింపు జరిగినా బజార్లు నిండేట్లు పూలు చల్లడం,  ఏ పని మొదలు పెట్టాలన్నా వారం, వర్జ్యం అనడం,  మూఢనమ్మకాలు, అనవసరమైన ఆచారాలు,  ఆ ఆచారల కోసం విపరీతంగా ఖర్చు పెట్టడాలూ – అబ్బా!  ఒకటని కాదు అన్నీ ఈమె కళ్ళకే కనిపిస్తున్నాయి.

రోజులు యాంత్రికంగా – ఇదీ నాకు తక్కువ అని చెప్పలేను కాని – ఏదో చప్పగా గడిచిపోతున్నాయి.  నేను వీధిలో కనపడితే చాలు “విశేషం ఒన్నూ ఇల్లియా గోవిందూ,  కల్యాణం ఆయి ఇవళా నాల్ ఆయెచ్చి!” అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆరోజు…  మా మామగారికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చింది.  ఓ నెల్లాళ్ళు ఉండి ఆయనకి బాగయ్యాకే రమ్మని చెప్పి శ్రావణిని  రైలెక్కించి వచ్చాను.

ఇంట్లోకి రాగానే  ఆ కిటికీ దగ్గరకి దూకినట్లుగా వెళ్ళి రెక్కలు తీశాను.  యుగాల క్రితం దేన్నో కోల్పోయినంత ఆత్రం నా చేతులకి.  కిటికీ అవతల నా కోసం ఎవరో ఉంటారన్న నా భావాన్ని లాగిపడేస్తూ కిటికీ బోసిగా చూసింది నా వైపు.  నిస్సత్తువగా మంచం మీదకి చేరి అలాగే కిటికీ వైపే చూస్తూ పడుకుండిపోయాను.

తమలాగా ఇతరులు బ్రతకడం లేదని ఎందుకీ ఆగ్రహం?  అలవాట్లలో,  ఆచార వ్యవహారాల్లో తేడాలుంటాయేమో కాని సుఖదుఃఖాల భావనల్లో మనిషికీ మనిషికీ ఏమీ తేడా ఉండదని ఈమె ఎప్పటికైనా గ్రహిస్తుందా?  తనలోని రెక్కలని విశాలత్వం పేరుతో మూసుకుంటూ ఉండకుండా తెరిచి వెలుపలకి చూడగలుగుతుందా!?  – నిట్టూరుస్తూ ప్రక్కకి బాగా ప్రక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాను.

“గోవిందన్నా,  హాయ్ గోవిందన్నా,  కిటికీ తీశావే,  భలే”  కృష్ణ గొంతు విని లేచాను.  “ఇంగ వాయే,  వెలియవాయే”  అరుస్తున్నాడు హడావుడిగా.  వాడిని చూడగానే భలే ఆనందం.  నేనంతకంటే వేగంగా కిటికీ దగ్గరకి వెళ్ళి  “ఎన్నా ఆయిచ్చి!?” అన్నాను.

“మా చెల్లి కిటికీలో గుండా లోపలకి చూడాలంట,  నీ గడియారం కూడా చూడాలంట,  చైర్ తెచ్చి ఇక్కడెయ్యవా?  ఎక్కి చూస్తుందంట,  తొందరగా వెయ్యి,  ఏడుస్తుంది వెయ్యి”

“అబ్బబ్బ!  ఉండురా,  నీ అరుపులకి చెవి నొప్పి పుడుతోంది”  అన్నాను కాని వాడి మాటలు నా చెవుల్లో అమృతం ఒలికినట్లుగా ఒదిగిపోతున్నాయి.   కృష్ణ చెల్లి  రోజాకి చైర్ వేయగానే ఆ పిల్ల పైకెక్కి కిటికీలో నుండి తొంగి చూసి “గోవిందన్న ఎంగా!? కానమే”  అంది.  పక్కనున్నా ఎక్కడున్నాడని అడుగుతుందే ఈ పిల్ల?…   లోపల నేనుంటే ఈ పిల్ల బయటనుండి నన్ను చూడాలనమాట.   ఇంకాసేపాగితే ఏడ్చేసిద్దేమో కనపడలేదని –  నేను పరిగెత్తి లోపలకి వెళ్ళాను.  నన్ను చూసి ఆ పిల్ల నోరు పెద్దది చేసి నవ్వింది – అప్పుడే వస్తున్న ఆమె పాల పళ్ళు రెండు తళతళగా మెరిశాయి.

రోజా ఇప్పుడు పిల్లలందరికీ పెద్ద హీరోయిన్ అయిపోయింది.  అంతా తమకే తెలుసన్నట్లు పిల్లలు ఆ పిల్లని చెట్టూ పుట్టా ఎక్కిస్తున్నారు.  ఎక్కడున్నా గడియారం గంటలు మోగితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ పిల్ల.

మామగారికి ఆరోగ్యం బాగానే ఉండటంతో శ్రావణి వచ్చేసింది.

మళ్ళీ ఆ కిటికీ మూతపడింది.    రెండు మూడు సార్లు కిటికీని బాదింది రోజాపిల్ల నేనున్నప్పుడు.  ఇక నేను ఆఫీస్ కి వెళ్ళనప్పుడు ఎన్ని సార్లు బాదిందో మరి,  ఆ పిల్లని మా ఆవిడ తిట్టుకుంటూనే ఉంది.

ఈసారి ఎందుకో నాకు ఆ కిటికీ మూసేయడం గురించి అస్సలు ఇష్టంగా ఉండటం లేదు.  ఆఫీస్ నుండి రాగానే వచ్చి తెరవాలని ప్రయత్నించాను రెండు మూడు సార్లు.  తెరుస్తుంటేనే శ్రావణి పెద్దగా ‘వద్దు వద్దు’ అని అరుస్తుంది.  ఏమైనా అంటే అలగడం వాదనలు.   ఇంట్లో శాంతి ఉండదు.  నేను కిటికీ కోసం ఎందుకులే తగాదాలు అని ఊరుకుంటున్నాను.   జీవితాన్ని సంతోషంగా గడపాలని ఉంటుంది నాకు.   రోజూ సాయంకాలాలు పిల్లలతో బయటే కాసేపు ఆడుకుని అందర్నీ పలకరించుకుని వస్తున్నాను కాని ఆ కిటికీ వైపు చూస్తే అసంతృప్తి కలుగుతూనే ఉంది.

 

 

4.

 

రెండేళ్ళు గడిచినా మాకు పిల్లలు కలగలేదు.   ఇద్దరిలోనూ అనాసక్తి.  ఆరోజు సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి కృష్ణ ఇంటి ముందు పెద్ద గుంపు.  లోపల నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి.  కృష్ణ అమ్మకి మూడోబిడ్డ ప్రసవం కోసం నిన్ననే హాస్పిటల్ లో చేర్పించారని తెలుసు.  ఏమయిందో ఏమో అనుకుంటూ వాళ్ళింటి లోపలకి పరిగెత్తాను.  ఆవిడా, పుట్టిన బిడ్దా ఇద్దరూ చనిపోయారు.

“ఇద్దరు బిడ్డలు చాలదా?  మూడో బిడ్డ ఎందుకు దేశానికి భారం తప్ప”  అన్న శ్రావణి మాటలు గుర్తొచ్చాయి.  ఆమె వచ్చిందేమోనని చూశాను.  బజారు బజారంతా అక్కడున్నారు కాని ఆమె మాత్రం లేదు.  ఈ దుఃఖం ఓ ప్రక్క నన్ను కృంగదీస్తుంటే ఇంత జరిగినా ఆమె రాలేదు అన్న ఆలోచనతో జీవితమంటేనే అసహ్యం వేసింది.

కాళ్ళీడ్చుకుంటూ  గేట్ తీసుకుని మా ఇంటి వైపు నడిచాను.  లోపల నుండి మాటలు వినపడుతున్నాయి.  ఎవరొచ్చారా అని ఆశ్చర్యపడుతూ తలుపు కొట్టాను.  రోజాని ఎత్తుకోని శ్రావణి తలుపు తీసింది.

నన్ను చూడగానే ఆ పిల్ల “గోవిందన్నా”  అంటూ నా మీదకి దూకింది.

పిల్ల ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదండీ.  తీసుకోని వచ్చి స్నానం చేయించి అన్నం పెడితే గబగబా తినేసింది.  పాపం ఎంత ఆకలయిందో ఏమో!”  అంది దిగులుగా.  మానవత్వం లేదని ఆమెని అసహ్యించుకున్నందుకు బాధపడుతూ నా మీదకి దూకిన రోజాని ముద్దుపెట్టుకుని మా ఆవిడని కూడా దగ్గరకి తీసుకున్నాను.

రోజాని తీసుకోని నాడార్ గారి ఇంటికి వెళ్ళి కార్యక్రమాలన్నీ పూర్తయిందాకా అక్కడే ఉన్నాం.

రోజులు ఎవరి కోసమూ ఆగవన్నట్లు గడుస్తున్నాయి.   నాడార్ గారిని నేనే పెద్దవాడినై సముదాయించి ఆఫీసుకు తీసుకెళుతున్నాను.  కృష్ణని,  రోజాని వాళ్ళ పాటీ (నాయనమ్మ) నే చూసుకుంటుంది.   మా ఆవిడకి రోజా బాగా చేరికయింది.  ఈ పిల్ల అల్లరిని ఎంతైనా భరిస్తుంది కాని మిగతా పిల్లల్ని మాత్రం దగ్గరకి చేరనివ్వడం లేదు.  పిల్లలు మాత్రం పాపం రోజాని పిలవాలనో,  రోజా లోపల ఏం చేస్తుందో చూడాలనో వచ్చి కిటికీ తలుపుని,  ఒక్కోసారి తిరిగొచ్చి ఇంటి తలుపుని  కొడుతున్నారు.   వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈమె వాళ్ళని ఇంట్లోకి చేర్చుకోలేదు.  కిటికీ తలుపు తియ్యనే లేదు.

ఆ వారం శనివారం నాడు రోజాకి జ్వరం వచ్చింది.  ఆదివారం శా్రవణి, కృష్ణ నాన్నమ్మ ఇద్దరూ హాస్పిటల్ కి తీసుకెళ్ళి పిల్లని చూపించుకొచ్చారు.   ఆ రాత్రి రోజా ఇంటికి వెళ్ళనని మారాం చేసి మా ఇంట్లోనే పడుకుంది.  సోమవారం సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళేప్పటికి  పిల్ల స్పృహలో లేనట్లుగా ఒకటే కలవరిస్తోంది.  మా ఆవిడ,  మామి,  పాటీ, నాడార్ గారు, కృష్ణ మంచం చుట్టూ కూర్చుని ఉన్నారు.

ఆ రాత్రి పన్నెండు దాకా పిల్ల నుదురు మీద తడిబట్ట వేస్తూ ఒకరం,  అరికాళ్ళకి పసుపు రాస్తూ ఒకరం అందరం మేలుకునే ఉన్నాం.  మామీ అప్పటి దాకా ఉండి ఇంటికెళ్ళిపోయింది.  కృష్ణని తీసుకోని నాడార్ గారు కూడా వెళ్ళిపోయారు.  గోడకి చేరగిలబడి అలిసిపోయిన  పాటీ అక్కడే పడుకుంది.

పన్నెండవుతుండగా  “శ్రావొదినా”  అని అరిచింది రోజా.  శ్రావణి గభాల్న లేచి రోజా మీదకి వంగి “ఏంటమ్మా?  ఏం కావాలి?  తన్నీ వేణుమా?”  అని అడిగింది.

పాప కళ్ళు తెరిచి కిటికీ వైపు చూపిస్తూ “కిటికీ తియ్యవా?  ఫ్రెండ్స్ ని చూస్తాను”  అంది.  నేను ఆ పిల్ల చెయ్యి పట్టుకుని ఇప్పుడు చీకటిగా ఉందమ్మా,  రేపు తీస్తాను,  పొద్దున్నే అందరూ కనపడతారు”  అన్నాను.

“తీసి చూపించు చీకటిని”  అంది.

కిటికీ రెక్కలు తెరిచాను.  చల్లని గాలి లోపలకి తోసుకొచ్చింది.  పుచ్చపువ్వులా వెన్నెల కురుస్తోంది.  మామిడి చెట్లు  రెండూ మరింత పచ్చబడినట్లుగా కనిపిస్తున్నాయి.  రోజా కొంచెంగా నవ్వింది.  నేనూ నవ్వి “పడుకో”  అన్నాను.  కళ్ళు మూసుకుంది కాని ఏవేవో కలవరింతలు.  “గోవిందన్నా నన్ను చెట్టెక్కిస్తావా?  కి్రష్నన్నా నాకు మామిడి కాయలు కావాలి,  నేనేరుకుంటా,  నేనేరుకుంటా.  గోవిందన్నా,  శ్రావొదినకి పిల్లలంటే ఇష్టం లేదా?  కిటికీ ఎందుకు తెరవదు? మేమంటే అస్సలు ఇష్టం లేదా?  పాటీ చెప్పింది – మేము వేరే కులమని రానివ్వదంటగా!?   మా అమ్మేమో  ‘అన్ని కులాలూ ఒకటే’  అనీ, పాపం శ్రావొదినకి తెలియదనీ’ చెప్పింది,  కి్రష్నన్నని మామిడి కాయలు తెమ్మనవా గోవిందన్నా?” –  రోజా కలవరింతలకి శ్రావణి ముఖంలో నెత్తురు చుక్క లేదు.  దిగులుగా చూస్తున్న ఆమె చెయ్యిని నా చేతిలోకి తీసుకున్నాను.

ఏ తెల్లవారు ఝాముకో  ఆ పిల్ల గాఢంగా నిద్రపోయింది.

 

 

5.

 

తెల్లవారింది.  పాటీ లేచి “అబ్బాయిని తీసుకోని వస్తా”  అంటూ  ఇంటికి వెళ్ళింది.  మేము యాంత్రికంగా పనులు చేసుకున్నాం.  నాడార్ గారు  కృష్ణని తీసుకుని వచ్చారు.   “ఈరోజు మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళితే మంచిదా గోవింద్?”  అన్నాడు.

“ఈరోజు జ్వరం దిగిపోతుందిలే అన్నయ్య గారూ,  తగ్గకపోతే సాయంత్రం తీసుకెళతాం”  అంది శ్రావణి.

మా మాటలకి లేచిన రోజా వాళ్ళ నాన్నని ఎత్తుకోమని చేతులు చాపింది.  ఆయన పాపని ఎత్తుకున్నాడు.  “నాన్నా,  నాకు మామిడి కాయలు కావాలి,  కి్రష్నన్నని కోసుకురమ్మను”  అంటోంది కిటికీ వైపు చెయ్యి పెట్టి చూపిస్తూ.

“మామిడికాయలు ఇప్పుడుండవు”  అన్నాడు కృష్ణ.

“మామిడి కాయలు ఇప్పుడు ఉండవమ్మా” అన్నాడు వాళ్ళ నాన్న.

“ఆఁ ఉండవా?  నాకు కావాలి,  నాకు కావాలి”  అని పెద్దగా హిస్టీరియా వచ్చిన దాన్లా ఏడవడం మొదలుపెట్టింది.   వాళ్ళ నాన్న ఎంత నచ్చచెప్పినా వినకుండా అతని భుజం మీద నుండి జారి క్రిందపడి కాళ్ళూచేతులూ నేలకేసి కొడుతూ ఏడుస్తోంది.  ఆ ఏడుపు హృదయవిదారకంగా ఉంది.

నేను గభాల్న రోజాని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి “నాన్నకి తెలియదులేమ్మా…  ఎందుకుండవు?  ఉంటాయి,  కాని నీకు జ్వరం కదా?  నువ్వు తినకూడదు”  అన్నాను.

ఒక్కసారిగా ఏడుపాపేసి నన్నే చూస్తూ “పోన్లే తిననులే ఊరికే చూపించు.  పళ్ళు చూపించు గోవిందన్నా”  అంది.  ఇంకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి.  మంచినీళ్ళు తెమ్మన్నట్లుగా శ్రావణికి సైగచేసి “అవి నీ దగ్గరకి రాకూడదమ్మా ఆ వాసనకే జ్వరం ఎక్కువవుతుంది”  అన్నాను.

“అయితే దూరం నుండి చూపించు”  అంది.

“సరే,  చూపిస్తాలే,  చెట్టెక్కి కోసుకొచ్చి చూపిస్తా”  అన్నాను.

వెక్కిళ్ళు ఆపుకుంటూ “ఆరు కాయలు కోసుకురా గోవిందన్నా,  కి్రష్నన్నకి చెప్పు కోసిస్తాడు”  అంది.

“సరే సరే,  కాసిన్ని నీళ్ళు తాగు”  అని నీళ్ళు తాగించాను.  తాగేసి  పడుకుని నీరసంగా కిటికీ వైపే చూస్తోంది.    పిల్లకి పాలు తీసుకోనొస్తానని మా ఆవిడ లోపలకెళ్ళింది.

“క్రిష్నన్నా,  పో,  కాయలు కోసుకురా పో”  అని కృష్ణకి చెప్తోంది రోజా.  నేను, నాడార్ గారు ముఖముఖాలు చూసుకున్నాం.  ఏం చేయాలో మాకు అర్థం కాలేదు.  కృష్ణ బయటికి పరిగెత్తాడు.  పాలు తాగి కాస్త నిద్రపోతే మర్చిపోతుందిలెండి అన్నాను నేను గుసగుసగా ఆయనతో.   కాసేపు కూర్చుని “అమ్మని పంపిస్తా”  అంటూ ఆయన వెళ్ళిపోయారు.

రోజా పాలు తాగి నిద్రపోయింది.  కిటికీలో గుండా ఎండ రోజా ముఖం మీద పడుతోందని రెక్కలు దగ్గరగా వేశాను.

ఎనిమిదవుతుండగా పిల్లలు కిటికీ దగ్గర తచ్చట్లాడుతుంటే ఏమయిందో చూద్దామని బయటికి వెళ్ళాను.  పిల్లలందరూ గోడకానుకుని నిలబడి ఉన్నారు నిశ్శబ్దంగా.  కిటికీకి కింద నేలమీద  ఆరు మామిడికాయలు కనిపించాయి!  ఆశ్చర్యపడుతూ దగ్గరకి వెళ్ళి చూశాను.  మామిడికాయల్లాగా అట్టముక్కలని అతికించి రంగు వేసి తెచ్చారు.  కొన్ని పూర్తి పసుపు రంగుతో,  కొన్ని అక్కడక్కడా ఆకుపచ్చ రంగుతో!  అచ్చం మామిడికాయల్లాగే!!

“గోవిందన్నా!  వెళ్ళి చెల్లిని లేపి కూర్చోపెట్టు కిటికీలో గుండా వీటిని చూపిస్తాం”  అన్నాడు కృష్ణ.

నాకు కడుపులోంచి ఏమిటో ఇదీ అని చెప్పలేని ఓ ఉద్యేగం కదిలిపోతోంది.  మాట రాని మౌనంతో కళ్ళల్లో తడి వచ్చి చేరింది.   అలాగే నిశ్చేష్టుడినై నిలబడిపోయాను.

మనోజ్ఞ “ఫో, ఫో త్వరగా ఫో,  చూపించి మళ్ళీ బడికి పోవాల”  అంది నా చెయ్యి పట్టి గుంజుతూ.

తెప్పరిల్లి,  మనోజ్ఞని, కృష్ణని పొదువుకుని పిల్లలందరినీ రమ్మన్నట్లుగా చేతులు రెండూ పెద్దగా చాపాను.  అందర్నీ నా కౌగిలిలోకి చేర్చుకున్నాను.    కిటికీ దగ్గరకి వచ్చి రెక్కలు తీసి మా వైపు తొంగి చూస్తున్న శ్రావణి  కళ్ళ నిండా కన్నీళ్ళు.

 

 

6.

 

ఆ తర్వాత ఆ కిటికీ ఎప్పుడూ మూతపడలేదు.  రాత్రుళ్ళు కాదండీ…  పగలు!

*****

 

 

 

 

 

 

 

 

 

చీకటీగలు-4

 

2

 

ఉదయాన్నే సగం చీకటి బాత్రూంలో గడ్డానికి నురగ పట్టించి… మాడిపోయిన బల్బున్చూసి నన్ను నేను తిట్టుకుంటూ వేళ్ళతో తడుంకుంటూ గడ్డం గీక్కుంటూంటే…

హాల్లో మాటల్వినిపించాయి… సుభద్ర ఎవర్నో పలకరిస్తూ మాట్లాడ్తోంది… స్పష్టాస్పష్టంగా వున్న ఆ యింకో గొంతుకను గుర్తించేందుకు కొన్ని క్షణాలు పట్టింది.. కంఠం… కంఠమది… నీలకంఠమూర్తి… అంతుదయాన్నే… ఏమయి  వుండొచ్చు… చేబదులుకొచ్చుంటాడా…? సుభద్రను డైరెక్టుగా అడిగే చనువుందతనికి… వెళ్ళేసరికి సోఫాలో చేత్తో స్టీలుగ్లాసు పట్టుకుని ఊదుకుంటూ కాఫీ తాగుతున్నాడు…డైనింగ్‌టేబిల్మీద ఏదో బట్టలంగడి సంచీ పెట్టుంది.

‘‘గుడ్‌మార్నింగ్సర్‌… వంకాయలు.. బామ్మరిదొచ్చాడు… వాడికో రెండెకరాల తోటుందిగా… ఫ్రెష్గావున్నాయి. కనకమిమ్మన్జెప్తే రాత్తిర వచ్చేసారు త్వరగా మీరెళ్ళింతర్వాత మేషారేమీ మాటాళ్ళే..? అంతా వాళ్ళావిడ అబ్బాయీ గొడవే… ఏమిటోలేండీ జీవితాలు’’ పొడిపొడిగానే విశదంగా తానొచ్చిన కారణం… రాత్రినేనొచ్చేసింతర్వాత విషయాలు చెప్పేసాడు.

గుమ్మం బైటికొచ్చి యిద్దరం సిగరెట్లు వెలిగించాం… సుభద్రకింట్లో సిగరెట్‌ కాలిస్తే మంట, చీదరించుకుంటుంది…

‘‘రాత్తిర రంగరాజుల్చెప్పాడు… ఆఫ్‌ కదా మేషార్ని పిల్చుకునెటేనా తీసికెళ్ళమని… వాళ్ళబ్బాయి తోటి గొడవకదా… అందుకనీ టిఫిన్లు కాంగానే వెళ్తా మేషార్దగ్గర్కి… గొడవేమేనా వుంటే ఫోన్‌ కొడతాలెండి మీకు… వంకాయలు లేతగా బావున్నాయి చూడండి… వస్తా…’’ స్ట్యాండేసిన మోపెడ్‌ పెడల్‌ తొక్కుతూ స్టార్ట్‌ చేయడానికి యత్నిస్తున్న నీలకంఠాన్ని చూస్తూ…. మరో సిసిఫస్‌ అనుకున్నా…

ఈ మాటు శ్రీమన్నారాయణ్తోటి మృచ్ఛకటికం కాదు మిత్‌ ఆఫ్‌ సిసిఫస్‌ గురించి మాట్లాడాలి. కేమూ… అబ్సర్ట్‌… అస్తిత్వవాదం… దేముడూ… ఆత్మహత్యా… చివర్న కాఫ్కా గురించి కేమూ అభిప్రాయాలూ..

లోపల్నించీ నా మొబైల్‌ రింగ్‌… పంఖ్‌హోతెతో… సలామత్‌ హుస్సేన్‌ ఫ్లూట్‌.. సిగరెట్‌ ఆఖరి దమ్ము పీల్చి విసిరేసి లోపలికెళ్ళా.

రోజుకోమాటు జీవితాన్నలా పీల్చేసి గిరాటేయ్యగల్గితే! లివ్‌ యువర్‌లైఫ్‌ వన్స్ ఎడే… వీలయ్యే పనేనా… సుఖాలూ… ఆనందాలు ఎదురుపడి భుజాల్తట్టి పకరించినా గుర్తుపట్టలేని యాంత్రికత్వం… ఈ రోజు నిన్నటికి ఫ్యాక్సిమలీ… రేపీరోజుకి నకలు.

‘బాణల్లో వంకాయ వేసాను… మగ్గింతర్వాత స్టౌ ఆఫ్‌ చెయ్యి… చేసి… మద్దిలేటి దగ్గర ఇడ్లీ వడా కట్టించుకోన్రా… నేను సాయంత్రం లేట్‌. వసంతతో షాపింగ్‌.. స్నానానికి వెళ్తున్నా… తలుపు ఆటోలాక్‌ చేసి వెళ్ళు’’ భుజాన టవల్తో బాత్రూంలోకదృశ్యమైన సుభద్ర.

మనిద్దరం ఒకరికొకరం ఏమవుతాం సుభద్రా… నీకూ నాకూ కలిపి ఒక జీవితమంటూ వుందా? వాట్యామైటుయూ? అన్‌ వాటార్యూ టుమీ? ఇద్దరం కలిసి ఒకే వంకాయ కూరా… ఒకే గిన్నెలో అన్నం… ఒకే గిన్నిచారూ… మజ్జిగా… కలిసి వేరువేరుగా… విడివిడిగా… వేరు వేరు కంచాల్లో… నేత్తో నేనూ.. జిడ్డు లేకుండా నువ్వు భోంచేసి… నువ్వో ఆఫీసుకూ… నేనో ఉజ్జోగానికీ విడివిడిగా వెళ్ళి… వేరు వేరు పను చేసి… సాయంత్రానికి ఒకే కొంపకు చేరి… క…ల…సి… బతుకుతున్నాం. భలేగా వుంది… ఆలోచించే కొద్దీ అసంబద్ధత. మన మన జీవితాలకో పర్పసుందా? అసలిన్ని కోట్ల కోట్ల జనాలకి లక్ష్యాలూ, గమ్యాలూ వున్నాయా? వాళ్ళల్లో తొంభై అయిదు శాతం అసంబద్ధతనీ అసంగతాన్నీ మొనాటనీలనీ ఓ నిర్వికల్పతగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నామనుకుంటూ… బండరాయిని కొండమీదకి తొళ్ళిస్తూ… పదే పదే జారి కిందికి దొళ్ళే దాన్ని మళ్ళీ కొండ దిగొచ్చి పైకెగదోస్తూ… సమాధానాల్లేని ప్రశ్నల్తో ప్రశ్నలూ కాదు ప్రశ్నే ఒకటే…

ఏమిటి? ఏమిటీ జీవితానికీ, ప్రపంచానికీ అర్థం. అన్న నిరంతరప్రశ్న… వాళ్ళ శరీరాలే పెద్ద ప్రశ్నార్థకమై… మళ్ళీ సాలామత్‌ ఫ్లూట్‌ ‘హెల్లో’ కంఠం.

‘‘మేషార్దగ్గిరకెళ్తున్నా సార్‌.. వస్తా అంటే బయటికి తీసుకెళ్తా.. మళ్ళీ ఫోన్జేస్తామీకు… వంకాయలు బావున్నాయి చూడండి…వుంటా…’’

ఇంకో రెండ్రోజులు వంకాయగురించే మాట్లాడ్తాడేమో కంఠం.

భలే భలే కంఠం బామ్మర్ధి తోటనించొచ్చిన నేవళమైన వంకాయలు రెండ్రోజులు… నాలుక చివర్నించీ ముడ్డివరకూ జీవితపు కొలతైపోయింది. నిజమే వంకాయకూర వాసన వంటింట్లోంచీ తలవాకిట్లోకొచ్చి గుబాళిస్తూ బయటకు దారిచూసుకుంటోంది. శ్రీమన్నారాయణ ‘వంకాయా – మనిషి జీవితం’ ఓ గాఢమైన అసంబద్ధ పరిశీలన గురించి మాటాడవూ… మై ఫుట్‌.

అసహనం… చీకాకు… నేనెవరో తెలీని నామీద ఎందుకో నాకు కోపం…

లోపలికెళ్ళి మూత్తీసి మూకుట్లోకి ముక్కుపెట్టి వంకాయవేపుడు వాసన పీల్చా… యింత ముందుటి సిగరెట్‌ అవశేషంతో వంకాయకూర వాసన భేషుగ్గా అనిపించింది. దాన్నోమాటు కెలికి మూతపెట్టేసి స్టౌ కట్టేసి… ప్లాస్టిక్బుట్టా, క్యాసరోల్‌ తీసుకుని నా తాళం చెవిని జేబిలోకేసుకుని, తలుపు ఆటో లాక్జేసి… బయటి ప్రపంచమని భ్రమించే యింకా విస్తృతమైన నాలోకే ప్రవేశించా…

మెయిన్రోడ్డెక్కుతూంటే షట్టరెత్తుతూ మోటార్సైకిల్‌ మొకానిక్‌ కనిపించాడు. బైక్‌ స్టార్ట్‌ కావట్లేదన్న విషయం గుర్తొచ్చి… ఆగి వాడికి చెప్పి… ముందుక్కదిలా… కదిల్తే బండి లే పోతే మొండి…. మోటార్సైకిల్తో సబంధం లేకుండా మెటా ఫిజిక్స్‌ మాట్లాడిన పిర్సిగ్‌ పుస్తకం జెన్‌ అండ్‌ ది ఆర్ట్‌ ఆఫ్‌ మోటార్సైకిల్‌ మెయింటెనెన్స్‌’ గుర్తొచ్చింది. లక్ష కాపీలమ్ముడు పోయిన పుస్తకం. అచ్చుకు ముందు వందకంటే ఎక్కువమంది పబ్లిషర్స్‌ ఛీత్కరించిన పుస్తకమది. నేను శ్రీమన్నారాయణ్ణి ‘వంకాయ – జీవితం ఓ గాఢమైన పరిశీలన’ గురించడగడం, అసంబద్ధం కానేకాదు.. లేదు కాక గాదు.

వం…కా..య్‌…

జీ…వి…తం…

****

ఒకే రోజును పదేపదే ఏళ్ళతరబడి జీవిస్తూ రావడమన్నది జరుగుతూనే వున్నది. గమనించని వాళ్ళకి జీవించడమన్నది వుండదు… గమనించే వాడికదో యాతన అది కేవలం బతికుండడం… అన్న స్పృహ వాడిని ఎటువేపుకి నెడుతుందో… చీకట్లోకి, అర్థరాహిత్యంలోకీ… బతకడం మానేసి జీవించడంకోసం మరణించడం వేపుకి నెడుతుందేమో…. కాదు కాదు… అర్థమవని దాన్ని అర్థం చేసుకునే తీవ్రమైన కసరత్తులాగా. మర్సట్రోజు పేజీలో అర్థం. విడివడి కనబడ్తుందన్న ఆశతో… తనకు తెలీకుండా మొదలై… తనకు తెలీకుండానే అంతమయ్యే పుస్తకాన్ని చదువతొన్నట్టుగా వుంటుందేమో ఆ భావన…

అంతా అబ్సర్డే అని ప్రతొక్కరూ అనుకుంటూంటే, యిన్ని వేల సంవత్సరాలుగా… యిన్నిన్ని… ఇంతింత నాగరికతలుగా… ఐతిహ్యంగా కళగా… మనిషి ఎదుగుదలుండేదా? నిజమే జాతి. ఏ లక్ష్యమూ, గమ్యము లేకుండానే వున్నా… తర్వాత్తర్వాత ఏదో ఓ దానికి తగిలేలా కొక్కేన్ని విసిరి కాలం తాడు పట్టుకు ముందుకు పాకడముంటుంది కదా? లెట్మీ లివ్‌ ఫర్‌ మై అన్నోస్‌ బ్యూటిఫుల్‌ మారో… దో ఫాంలెస్‌ అండ్‌ ఏలియన్‌.. అయ్‌ లవ్‌ మై టుమారో.

అర్థం కాని తత్త్వం వుంటుంది. అది నీ చేతకాని తనమే అననుకుంటే ఓ తృప్తి వుంటుంది. ఈ అసంబద్ధ జీవితానికో అర్థం ఖచ్చితంగా వుందీ… అది నీకు… నీకు బోధపడట్లేదంతే.. కన్‌స్ట్రక్ట్‌ ద మీనింగ్‌ టుది సీమింగ్లీ మీనింగ్లెస్‌… నాకు ఈజిప్షన్‌ చిత్రలిపి అర్థం కాదంటే నా చాతకానితనమే…. అసలా చిత్రలిపికి అర్థమేలేదంటం అసలు అబ్సర్డిటీ.

నిస్సంగత్వే నిర్మోహత్వం… నిర్మోహత్యే నిశ్చలతత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తిః

జీవితాన్నుండీ విడి వడి… బయటినించీ దాన్ని చూస్తూ దానిపట్ల మోహాన్నొదిలేసేసి… స్టెబిలైజయిపోతే చాలు… ఈ భారం నిన్నొదిలేస్తుంది… శబ్బాషో… భజగోవిందం పాడుకుంటూ అస్తిత్వవాదపు అబ్సిర్టిటీ నించీ తప్పించుకోవచ్చు.

మోటార్సైకల్‌ మెకానిక్కొచ్చాడు. పిర్సిగ్‌ స్నేహితుడ్ని సూదర్‌ల్యాంఢ్‌ని నేను… రిపేరీ తెలీదు… బయట్నించెవడేనా వచ్చి యీ కటారా జీవితాన్ని బాగచేసి సాఫీగా నడిచేట్టు చేస్తాడని చూట్టం తప్ప ఏం తేలీదు… ఎవడొస్తాడూ బయట్నించీ దేముడా….? నూటికి తొంభై తొమ్మది మందికి అది దేముడే…

నలభై ఏళ్ళైంది రాబర్ట్‌ పిర్సిగ్‌ ఈ పుస్తకం రాసి.

‘‘ప్లగ్గు కీన్చేశినా సార్‌. ఏం ప్రాబ్లమ్‌ లేదు.. కానీ ఎందుకైనా మంచిది… ఒకసారి సర్వీసింగ్‌కి యియ్యండి…’’ అని నా జీవితానికన్నట్లు భరోసా యిచ్చి వెళ్ళిపోయాడు మెకానిక్‌….

నేనూ, సుభద్రా విడివిడిగా కలిసి… ఒకే మద్దిలేటి హోటల్నించీ తెచ్చిన ఇడ్లీవడా విడివిడి కంచాల్లో పెట్టుకు ఎవళ్ళకి వాళ్ళం, పచ్చడి ఎక్కువతో నేనూ తక్కువతో సుభద్రా తిని కొండమీదకు గుండు ఎగదోయడానికి సిద్ధమయ్యాం… ఒకాడ సిసిఫస్‌… యింకో మగ సిసిఫస్‌…

****

పన్నెండుకు రంగరాజుల్దగ్గర్నించీ కంఠం ఫోన్జేశాడు.

‘‘మేషారు గదిలో లేరు సార్‌… చాల్సేపు గద్దగ్గర వెయిట్చేసా… వూహూఁ… వాళ్ళింటి చుట్టూ కూడా ఓ రెండు రౌండ్లేసా… అక్కడా జనాల్లేరు… యింకిక్కడికి రాజా దగ్గిర కొచ్చుంటారేమోననిటొచ్చా… వూహూ. వుండండి రాజా మాటాడ్తాట్ట… కాస్సేపు నిశ్శబ్దం తర్వాత ‘నాలుగో చీటి నేన్తీస్కుంటానని ముందే చెప్పినాగదనా… వుండు సార్తోని మాట్లాడి నీతో మాట్లాడ్తా….’ సార్‌. నేన్సార్రాజాని మన్సార్యాడికి బొయ్యింటాడ్సార్‌. నాకాడిక్కూడా రాల్యా… కంటమన్న గూడా వూరల్లా దేవులాడొచ్చె నీగ్గూడా తెలిసేట్టు లేదుగదా…?’’ ఆగాడు రంగరాజు…

‘‘లేదులే ఎక్కడికీ వెళ్ళే అవకాశం లేదు…. ఏం గొడవా జరిగినట్టు కూడా లేదుకదా… మజ్జాన్నమ్మూడుకు నాక్ల్కాసులైపోతాయి. ఫోన్చేసొస్తా…’’ అని ఫోన్కట్చేసి… శ్రీమన్నారాయణకి రింగిచ్చా…. స్విచ్ఛాఫ్‌ అనొస్తోంది…. మూడుసార్లు ప్రయత్నించా… విసుగేసింది… ఎందుకో అప్రయత్నంగా ‘చీకటీగలు’ అన్నపదం గుర్తొచ్చింది. వెను వెంటనే ఓ వెర్రి చిర్నవ్వు మొలిచింది.

ఎవరు ఎవరికి చీకాకు కలిగిస్తున్నారు.

సుభద్రకు నేను తక్కువే…. సుభద్రకూడా నాకు చీకాకు కలిగించదు.

రంగరాజు సాధ్యమయినంతమేరా అందరికీ ఊరట కలిగించే పన్లేచేస్తాడు… కంఠం తన మానాన్తాను బతుకీడుస్తుండాడు. భార్యా కూతుర్దగ్గరెట్లా వుంటాడో తెలీదు.

(సశేషం)

వచ్చే వారం నుంచి …”కథ కానిది”

 

 

ప్రియమైన సారంగ వార పత్రిక పాఠకులకు,

నమస్తే!

‘కథ కానిది…’ –  అనే శీర్షిక కింద  వరసగా కథలు రాయాలనే ప్రయత్నాన్ని తలపెట్టాను.

కథలంటే ఊహా జనితాలు కాదు. పోని, ఉత్త నిజాలూ కాదు.

ఈ రోజుల్లో వార్త కూడా కథ లా వుంటే నే చదవడానికి బావుంటోంది. కాదా చెప్పండి?

అందుకే, కొన్ని నిజాల్ని మూలాధారం గా చేసుకుని, కథలు రాయాలని నిర్ణయించుకున్నాను.

ఈ విశాల జగతిలో మనిషి నడిచే ప్రతి  అడుగులోనూ కథ వుంది. విని స్పందించే హృదయముంటే!

జీవితానికి మించిన సస్పెన్స్, థ్రిల్లింగ్, హారర్, ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటూ వేరే ఏదీ వుండదని గాఢం గా నమ్మే వారిలో నేనూ ఒకర్ని.

నే – కనీ, వినీ, ఎరిగిన, జరిగిన విషయాలనే కథ గా రాస్తానని, అదే ఈ శీర్షిక ప్రధానోద్దేశమని  సవినయం గా తెలియచేసుకుంటున్నాను.

రచన చదివి, ఎప్పటిలా మీ ప్రోత్సాహాన్ని నాకందచేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ..

ఈ అవకాశాన్ని కలగ చేసిన పత్రికా సంపాదకులు  అఫ్సర్,  కల్పన గారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,

నమస్సులతో..

-ఆర్.దమయంతి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

టూత్ఏక్.. టూ మెనీ డౌట్స్

 

 

 

 

-రమణ యడవల్లి 

~

సుబ్బు నా చిన్ననాటి స్నేహితుడు. మా స్నేహం ఇప్పటికీ మూడు మసాలా దోసెలు, ఆరు కాఫీలుగా వర్ధిల్లుతుంది. సుబ్బుకి ఉద్యోగం సద్యోగం లేదు, పెళ్ళీపెటాకుల్లేవు. వుండడానికో కొంపా, వండి పెట్టడానికో తల్లీ వున్నారు. మావాడు కబుర్ల పుట్ట, వార్తల దిట్ట.

ప్రస్తుతం నా కన్సల్టేషన్ చాంబర్లో సోఫాలో కూలబడి వున్నాడు సుబ్బు. కుడిబుగ్గ మీద అరచెయ్యి ఆనించుకుని, ఏసీబీ రైడ్సులో దొరికిపోయిన ప్రభుత్వోద్యోగిలా దిగాలుగా వున్నాడు సుబ్బు.

“సుబ్బూ! సిగరెట్లు మానెయ్యమని మొత్తుకుంటూనే వున్నాను, విన్నావు కాదు – అనుభవించు.” అన్నాను.

“ఆ చెప్పేదేదో సరీగ్గా చెప్పొచ్చుగా! ‘సత్యము పలుకుము, పెద్దలని గౌరవింపుము’ టైపులో నీతివాక్య బోధన చేస్తే నేనెందుకు వినాలి?” అన్నాడు సుబ్బు.

“ఇంకెట్లా చెప్పాలోయ్! ‘సిగరెట్లు తాగితే ఛస్తావ్’ అని చెబుతూనే వున్నాగా!?” ఆశ్చర్యపొయ్యాను.

“సిగరెట్లు తాగేవాడు సిగరెట్ల వల్లే చావాలని రూలేమన్నా వుందా? ఈ దేశంలో దోమతో కుట్టించుకుని చావొచ్చు, ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని చావొచ్చు, ఫ్రిజ్జులో మాంసం వున్నందుకు తన్నించుకుని చావొచ్చు, మునిసిపాలిటీ మేన్‌హోల్లో పడి చావొచ్చు. అసలెలా చస్తామో తెలిసి చస్తేనే కదా, అలా చావకుండా ముందు జాగర్తలు తీసుకునేది?” అన్నాడు సుబ్బు.

“అంతేగాని సిగరెట్లు తాగితే చస్తారన్న సంగతి మాత్రం ఒప్పుకోవు.” అన్నాను.

“ఒప్పుకుంటాను. ఈ లోకంలో సిగరెట్ల వల్ల చచ్చేది ఇద్దరైతే, ఇతర కారణాల్తో వెయ్యిమంది చస్తున్నారు. ఇటు సిగరెట్టు మానేసి, రేపింకేదో కారణంతో చస్తే దానికన్నా దారుణం మరోటుంటుందా?” నవ్వుతూ అన్నాడు సుబ్బు.

కొందరు విషయం తమకి అనుకూలంగా వుండేట్లు వితండవాదం చేస్తారు, అందులో మా సుబ్బు గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు సిగరెట్లు ఆరోగ్యానికి మంచిదని ఇంకో లెక్చర్ ఇవ్వగల సమర్ధుడు. సుబ్బు ధోరణి నాకలవాటే.

ఇవ్వాళ సుబ్బుని చూస్తుంటే జాలేస్తుంది. అసలు విషయం – రెండ్రోజులుగా మా సుబ్బు పంటినొప్పితో బాధ పడుతున్నాడు.

నిన్న ఫోన్ చేశాడు సుబ్బు.

“పన్ను నొప్పిగా వుంది.”

“పెయిన్ కిల్లర్స్ వాడి చూడు. తగ్గకపోతే అప్పుడు చూద్దాం.” అన్నాను.

“నేను ఇంగ్లీషు మందులు వాడను, సైడ్ ఎఫెక్టులుంటయ్.” అన్నాడు సుబ్బు.

“మందులకి ఇంగ్లీషు, తెలుగు అంటూ భాషాబేధం వుండదోయ్. నీకు రోగం తగ్గాలా వద్దా?” నవ్వుతూ అన్నాను.

“ఇంగ్లీషు మందులు వాడితే వున్న రోగం పొయ్యి కొత్త రోగం పట్టుకుంటుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.

“అట్లాగా! మరి ఫోనెందుకు చేశావ్?” విసుగ్గా అన్నాను.

“ఊరికే! నువ్వేం చెబుతావో విందామని!” నవ్వాడు సుబ్బు.

‘వీడీ జన్మకి మారడు.’ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను.

ఇవ్వాళ నొప్పి బాగా ఎక్కువైందిట, నా దగ్గరకొచ్చేశాడు – అదీ విషయం.

“ఇంగ్లీషు మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి, నువ్వు వాడవుగా!” వ్యంగ్యంగా అన్నాను.

“అవును, కానీ వాడాలని నువ్వు ముచ్చట పడుతున్నావుగా! ఒక స్నేహితుడిగా నీ కోరిక తీర్చడం నా ధర్మం. కాబట్టి నిన్న చెప్పిన ఆ మందులేవో రాసివ్వు, వాడి పెడతాను.” అన్నాడు సుబ్బు.

“బుగ్గ కూడా వాచింది సుబ్బూ! ఇదేదో పెద్దదయ్యేట్లుంది. డెంటల్ డాక్టర్ దగ్గరకి వెళ్దాం పద.” టైమ్ చూసుకుంటూ లేచాను.

సుబ్బు కుర్చీలోంచి లేవలేదు.

“నీతో నేన్రాను. నువ్వూ, ఆ డాక్టరు నా పంటి గూర్చి డిసైడ్ చేసేసి ఏదో చేస్తారు. హడావుడిలో పన్ను పీకించినా పీకేంచేస్తావు, నీదేం పోయింది.” నిదానంగా అన్నాడు సుబ్బు.

“అంటే – నీకు నామీద నమ్మకం లేదా?” కోపంగా అన్నాను.

“ఎంతమాట! నువ్వు నా ప్రాణస్నేహితుడివి. కావాలంటే నీ కోసం నా ప్రాణాన్నిచ్చేస్తాను, కానీ పన్నుని మాత్రం ఇవ్వలేను.” నొప్పిగా నవ్వుతూ అన్నాడు సుబ్బు.

“సుబ్బు! ఎక్కువ మాట్లాడకు. న్యాయంగా మాట్లాడితే నీమీదసలు జాలి చూపకూడదు.” చిరాగ్గా అన్నాను.

“చూడబోతే నా టూత్ఏక్ నీకు సంతోషంగా వున్నట్లుంది.” నిష్టూరంగా అంటూ అరచెయ్యి దవడపై ఆనించి బాధగా కళ్ళు మూసుకున్నాడు.

పాపం! బిడ్డడికి బాగా నొప్పిగా వున్నట్లుంది.

“సరే. నా ఫ్రెండ్ డాక్టర్ సుబ్రమణ్యంకి ఫోన్ చేసి చెబుతాను. సిటీలో ఇప్పుడతనే టాప్ డాక్టర్. నువ్వే వెళ్లి చూపించుకో.” అన్నాను.

“నేను బిజీ డాక్టర్ల దగ్గరకి పోను. వాళ్ళు హడావుడిగా పైపైన చూస్తారు.” అన్నాడు సుబ్బు.

“పోనీ – నీ పంటిని నిదానంగా, స్పెషల్‌గా చూడమని చెబుతాను. సరేనా?” అన్నాను.

“సరే గానీ – నాకో అనుమానం వుంది.” గుడ్లు మిటకరించాడు సుబ్బు.

“యేంటది?” అడిగాను.

“డెంటల్ డాక్టర్లు అవే ఇన్‌స్ట్రుమెంట్లు అందరి నోట్లో పెడుతుంటారు కదా! సరీగ్గా కడుగుతారంటావా?” అన్నాడు సుబ్బు.

“కడుగుతార్లే సుబ్బూ! అయినా ఇన్ని డౌట్లు సర్జరీ చేయించుకునే వాడిక్కూడా రావు.” అసహనంగా అన్నాను.

“పన్ను నాది, నొప్పి కూడా నాదే. అన్ని నొప్పుల్లోకి తీవ్రమైనది పన్నునొప్పి అని నీవు గ్రహింపుము.” నీరసంగా నవ్వాడు సుబ్బు.

“గ్రహించాన్లే, పోనీ డాక్టర్ రంగారావు దగ్గరకి వెళ్తావా?” అడిగాను.

“ఎవరు? బ్రాడీపేట మెయిన్ రోడ్డులో వుంటాడు, ఆయనేనా?”

“అవును, ఆయనే.”

“రోజూ అటువైపుగా వెళ్తుంటాను. యేనాడూ ఒక్కడంటే ఒక్క పేషంటు కూడా నాక్కనపళ్ళేదు.” అన్నాడు సుబ్బు.

“నీక్కావల్సిందీ అదేగా సుబ్బూ! ఆయన దగ్గర జనం తక్కువగా ఉంటారు. శ్రద్ధగా ఎక్కువసేపు చూస్తాడు, ఇన్‌స్ట్రుమెంట్లూ శుభ్రంగా వుంటాయి.” అన్నాను.

“అంత శ్రద్ధగా చూసేవాడైతే ప్రాక్టీసు లేకుండా ఖాళీగా ఎందుకున్నాడంటావ్?” అడిగాడు సుబ్బు.

“యేమో! నాకేం తెలుసు?”

“నీకే తెలీదంటే – ఆయన వైద్యంలో ఏదో లోపం వుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.

“నీకు నీ పంటినొప్పికి ట్రీట్మెంట్ కావాలా? డాక్టర్ల బయోడేటా కావాలా?” విసుక్కున్నాను.

“పేషంటన్నాక అన్నీ విచారించుకోవాలి.”

“వొప్పుకుంటాను. కానీ నీక్కావలసింది పంటి వైద్యం, గుండె వైద్యం కాదు.”

“గుండె ఒక్కటే వుంటుంది. అదే నోట్లో పళ్ళైతే? ముప్పైరెండు! డాక్టర్లు కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ ఎక్కువ. పొరబాటున ఒకదాని బదులు ఇంకోటి పీకేస్తే!” అన్నాడు సుబ్బు.

“నాయనా! నీకో నమస్కారం. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు.” అన్నాను.

“నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు. ఆసనాల బాబా పళ్ళపొడి వేసి పసపసా తోమితే పంటినొప్పి ఇట్టే మాయమౌతుందని టీవీల్లో చెబుతున్నారు.” అంటూ లేచాడు సుబ్బు.

“సుబ్బూ! శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందిట! ఇన్ని కబుర్లు చెబుతావ్, చివరాకరికి నువ్వు చేసే పని ఇదా!” అన్నాను.

“ఈ దేహం భారతీయం, ఈ పన్నూ భారతీయమే. తరతరాలుగా మన పూర్వీకులు ప్రసాదించిన ప్రకృతి వైద్యం గొప్పదనాన్ని నేను నమ్ముతాను. ఆసనాల బాబా పళ్ళపొడిని వాడి మన భారతీయ సాంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచానికి యెలుగెత్తి చాటుతాను. ఇంగ్లీషు డాక్టర్లు డౌన్ డౌన్, ఆసనాల బాబా జిందాబాద్!” అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

నాకు విషయం బోధపడింది! సుబ్బుకి డాక్టర్లంటే భయం. దాన్ని కప్పిపుచ్చుకోడానికి యేదేదో మాట్లాడాడు.

కొద్దిసేపటికి నా పనిలో నేను బిజీ అయిపొయ్యాను.

సాయంకాలం సుబ్బు మదర్ ఫోన్.

“ఒరే నాయనా! ఇక్కడ సుబ్బు పరిస్థితి ఏమీ బాగాలేదు. అదేదో పళ్ళపొడి తెచ్చుకుని మధ్యాహ్నం నించి పళ్ళకేసి ఒకటే రుద్దుడు. నోరంతా పోక్కిపొయింది, మూతి వాచిపోయింది. మాట్లాళ్ళేకపోతున్నాడు, సైగలు చేస్తున్నాడు.” అన్నారావిడ.

“అమ్మా! వాణ్ని నోరు మూసుకుని నే చెప్పినట్లు చెయ్యమను.” అన్నాను.

“వాడిప్పుడు నోరు మూసుకునే వున్నాడు, తెరవలేడు. మళ్ళీ మూసుకొమ్మని చెప్పడం దేనికి?” ఆశ్చర్యపొయ్యారావిడ.

ఈవిడ అన్నివిధాలా సుబ్బుకి తల్లే!

“సరేనమ్మా, కారు పంపిస్తున్నాను. ఆ వెధవని అర్జంటుగా నా దగ్గరకి రమ్మను. వెళ్ళనంటే కర్ర తీసుకుని నాలుగు బాది కార్లోకి నెట్టు.” అంటూ ఫోన్ పెట్టేసి డ్రైవర్ కోసం కాలింగ్ బెల్ నొక్కాను.

~

కృతజ్ఞత –

ఈ రచన ప్రధాన పాయింట్‌కి ఆధారం – చాలాయేళ్ళ క్రితం ‘హిందు’ చివరిపేజిలో వచ్చిన ఆర్ట్ బక్‌వాళ్ (Art Buchwald) కాలమ్.

*

కొన్ని మిగిలే ఉంటాయి ..

 

-మహమూద్

~

అర్ధనిమిళిత నేత్రాలతో
ఎడారి తడిని మోస్తూ కొన్ని ఒయాసిస్సులుంటాయి

బయట వెదుకుతూన్న
సముద్రాలేవో లోపల్లోపల సుడులు తిరుగుతూంటాయి

స్పర్శ నావలను
దేహసముద్రం పై వొదిలే
కొన్ని పవన ప్రవాహాలు సాగుతూ ఉంటాయి

ఇంకొన్ని మిగిలే ఉంటాయి

కళ్ళ కొలను నుంచి చూపు నీళ్ళను తోడుకొని
చుట్టు పక్కల
చిలకరిస్తూ ఉండాలి

కళ్ళకి ఇచ్చినట్టు చూపుకి విరామమివ్వకు

ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి
జాగురూకత లేకపోతే

ఆకాశ సముద్రం నుంచి
ఉదయపు చేప్పిల్లలు జారిపోతాయి

రాలిన మొగ్గల చోటే
నవీన చిగురులను తొడుక్కుంటూ
ప్రాచీన వృక్షాలు నిలిచి ఉంటాయి

ఆకులు రాలిన రుతుదేహపు ఎండుతనాన్ని తొలచి
పచ్చదనపు ఆఛ్ఛాదన తొడిగే తొలకరి చినుకులు
చిలిపి సయ్యాటలాడతాయి

2

ఏమీ లేదని
అంతా ముగిసిందని
వెనుతిరగడం కాదు
ఒక్కసారి
ఆగి తప్పక చూడాలి

ఏవో కొన్ని మిగిలే ఉంటాయి

మోముల పై పత్రహరితపు చిరునవ్వులతో
ఆకు స్నేహితులు చేతులూపుతుంటాయి
చల్లదనపు వ్యక్తిత్వాన్ని ఆలంబన చేసుకున్న
అడవి ఆత్మీయులు పచ్చబాటను పరిచి ఉంటాయి

నీ పేరు మీద ఎదురుచూపుల రుణాన్ని తీసుకొని
నీవు చేసిన మంచేదో నీకు తిరిగిచ్చేయాలనుకునే నీ పరిసరాలను పసిగట్టాలి నీవు
మంచితనం ఒకసారిస్తే తిరిగి తీసుకునే రుణం కాదని సముదాయించాలి

పూరించాల్సిన ఖాళీలు ఎప్పుడైనా ఉండనే ఉంటాయి

ఆకస్మిక విరమణ కు అల్విదా చెప్పు

****
చివరి శ్వాస
ఆడుతున్నపుడు కూడా
నీ పెదవుల మధ్య
కొన్ని వసంతాలు
కొంత పచ్చదనాన్ని పరచి
నీ పాదాల కాగితం మీద
గడ్డి కలాలతో
నీ మస్తిష్కంలోనే ఉండిపోయిన
కొన్ని భావాలని
కవితలా మలచడం బహుశా మిగిలే ఉంటుంది
3
నువ్వొదులుకున్నావనుకున్న
హస్తాలలో ఇంకొన్ని
మైత్రి వనాల జావళీలు
జారిపోకుండా చూసుకో

సప్తవర్ణాలతో నింపడానికి
ఒక శూన్యం ఎపుడూ ఉండనే
ఉంటుంది.

*

మునివేళ్ళ మీది పుప్పొడి!

 

 

-జి. సత్య శ్రీనివాస్

~

విశ్వకవి ‘ stray birds ’ ,బోల్లోజు బాబా  ‘స్వేచ్చా విహంగాలు’ అనువాదం చదువుతునప్పుడు నా అరచేతి ఆకాశం నుండి ఎగిరే గాలి పక్షులు రెక్కల తివాచీ పై పయనించేట్టు చేసింది. అందుకే, ముందుగా బొల్లోజు  బాబా  ముని వేళ్ళని ముద్దాడాలనిపిస్తుంది. సరిగ్గా వందేళ్ళ మునుపు అచ్చయిన స్ట్రె బర్డ్స్  ద్వారా కవిత్వంలో మరో కొత్త ఒరవడిని విశ్వ కవి సృష్టించారు. చైనీస్ ఆధునిక కవిత్వానికి, చైనీస్  వెదురు వేణువు లోనుండి వీచే గాలికి విశ్వకవి కొత్త రుతువుగాలి  కల్పించారు అని  చైనీస్ సాహిత్య కారులే అన్నారు. అటువంటి కవితలలోని భావాన్ని పొల్లుపోకుండా ,చక్కని నైపుణ్యం తో అనువదించారు బొల్లోజు బాబా .

అనువాదం ఒక నెరేటివ్ రీసర్చ్ , ఒక వైవిధ్యమైన ప్రక్రియ. అది భాషా నైపుణ్య పరిధులు దాటే ఏరు.ఎందుకంటే అది కవిని,అనువాదకుడ్ని , పాటకుడ్ని, బాషకల్లుకున్న సాంస్కృతిక మూలాల్లోకి తీసుకువెళుతుంది. అందరూ కలిసి నది ఒడ్డున చేసే ప్రయాణాన్ని బొల్లోజు బాబా గారు ఏర్పచ గలిగారు. మన అడగుజాడల గుర్తులు ఇసుక మబ్బు  గూళ్ళలోని నీటి చుక్కలా  మిగిలి వుంటాయి.

దేశ దిమ్మరి పిల్ల మూకల్లారా

మీ పాద ముద్రలను నా పదాలపై విడువండి.

అనువాదంలో ఒక ఇజ్స్ తో బాటు అల్లుకుపోయిన Colloquialness,నేటివిటీ వుంది.  దానితో బాటు అనువాదానికి కావాల్సిన స్వేచ్చ మంత్రం ధ్వనిస్తుంది. అది ఈ కవితలో స్పష్టంగా కనబడుతుంది

వసంతపు దరహాసాలను కావలి కాసేది

మట్టి అశ్రువులే

ఈ స్వేచ్చకు రహస్యం తెగింపు కూడా అవసరమని చెబుతోంది.అనువాదంలో వుండే కీలకమైన ఇబ్బంది వేరు వేరు బాషల మధ్య వుండే వ్యాకరణ రూపంలోని వైవిధ్యం.కొన్ని పోలి వుంటాయి ,మరి కొన్ని భిన్న దృవాలు గా వుంటాయి. అందుకే అనువాదానికి ప్రేమపూరితమైన బాధ్యతతో  నిండిన స్వేచ్చవుండాలి. రవీంద్రుడు కాక మరొకరు స్ట్రె బర్డ్స్ ని ఆంగ్లంలోకి అనువాదం చేసి వుంటే అది మరోలా వుండేది.కారణం భారతీయ ఆంగ్లం లో స్ధానిక పోపు సామాగ్రిని మిళితం చేయడం చాల అవసరం.  ఆయన అనువాదం తన గూటి పక్షుల్ని, గగనం లోని మరో మార్గంలో లోకి తనే  ఎగరేసాడు. బాబా కి  ఆ  మార్గాన్ని పట్టుకునే స్వచ్చమైన, స్వేచ్చమైన  చూపుంది.

baba

What you are you do not see, what you

see is your shadow.

నీవేమిటనేది నువ్వు దర్శించలేవు

నీవు దర్శించేది నీ ఛాయా

అనువాదం కూడా ఇంతే. అనువాదం ద్వారా కవి మనో భావ బాషని అనువాదకుడు ఇది అనువాదం అని నొక్కివక్కా ణిoచకుండా చెపుతూనే ,మూలాన్ని ,తన – మన అన్న బేధం లేకుండా ఆస్వాదించేలా చేయాలి.అప్పుడే మూల బీజంలో మొలకెత్తే గుణం పొదిగివుంటుంది,అది పరివ్యాపిస్తుంది. సహజంగానే మూలం లోని తాత్విక సంచారి నైజం అనువదoలోనూ వచ్చింది. బీజం లోని మొలకెత్తే గుణం పోలేదు. కారణం విశ్వకవే బెంగాలీనుండి ఆంగ్లంలోకి అనువదించుకున్న మూల ఆనువాదకుడు, అది ఇంకెన్ని బాషల్లో అనువాదమైనా పరివ్యాప్తి చెదే గుణం పోదు.   ‘స్వేచ్చా  విహంగాలు’ తో ప్రయాణం అంటే ,ఈస్ట్ కోస్ట్ లో హౌరాకి వెళ్ళినట్టు.

మన బాషనుండి,ఆంగ్లం లోకి అనువాదం మళ్ళీ వేరే ప్రాంత బాషలోకి అనువాదం అంటే. తెలియందేముంది మన ప్రాంతంలో మాట్లాడే ఆంగ్లానికి కూడా మన రంగు, రుచి, సువాసన వుంటాయి.వందేళ్ళ చరిత్ర గల ఈ పుస్తకానికి మనం నివాళిగా మన కవితల్ని మనమే ఆంగ్లంలో అనువదించి మనమే నేటి గ్లోబల్  విలేజ్లో  మనమే నాటుదాం అని,నేటి తరానికిచ్చే  పచ్చటి స్పూర్తి. పుస్తకం మొత్తం చెప్పేదిఇదే తత్త్వం.

విహంగం తానొక మేఘాన్నైతే

బాగుణ్ణనుకొంటుంది

మేఘం

తానొక విహంగాన్నెందుకు కాలేదా అనుకొంటుంది……

 

మన భావవ్యక్తీకరణ, దాని రూపం మన జనపదాల్నుండి వచ్చిన ఆస్తి, దీన్ని ముందు తరానికి అందించడం అంటే, బాషల కుటుంబ చెట్టు సంరక్షణే. అది జరగాలంటే దీనిని విధ్వంసం చేసే అనువదీకరణకు అడ్డుకట్ట వేయాలి. అందుకు కవిత్మాకంగా అలోచిండడం కంటే గొప్ప ఆయుధం లేదు. అనువాదం అన్నది మూల రూపాన్ని మళ్ళీ నాటే సృజనాత్మక ప్రక్రియ. పలు  చోట్లున్న   పాటకులని, కవికి అందించి ,పాటకులకి కొత్త చిగుర్లని చూపించే దృష్టి. రాతలు కొనసాగాలి వాగుల్లా,వంకల్లా…

చిన్నారి గడ్డిపోచా

నీ పాదం చిన్నదే కావచ్చు కాని

పుడమి మొత్తం నీ అడుగుల కిందే వుంది.

‘స్వేచ్చా విహంగం” గా వెళుతునప్పుడు అక్కడక్కడా కాలిబాటలో అరికాలిలో చిన్ని రాళ్ళు గుచ్చు కుని మనం ఎక్కడున్నాం అని గుర్తుచేసినట్టు చిన్న ఇక్కట్లున్నాయి. అవి మూల స్పర్శ .పరిమళాన్ని వదిలేసిన జాడలు. ఇది అనువాదంలో , లీనమైపోవడం వల్ల  ఏర్పడే పొరపాట్లు  తప్ప తెలిసి చేసినవి కాదు. ఎందుకంటే ,  ప్రతి పదానికి నిఘంటువులో మనకి కావాల్సిన అర్ధం దొరకదు,ముఖ్యంగా కవిత్వానికి.

 

Night’s darkness is a bag that bursts

with the gold of the dawn.

 

రాత్రి చీకటి తిత్తి

సువర్ణోదయం లా పగిలింది

పగిలింది అనే పదానికి బదులుగా విచ్చుకుంది అంటే బాగుoటుంది. కారణం అనువాదం  ఒక శీర్షాసన ముద్ర, కొన్ని జాగ్రత్తలు అవసరం ,వాట్ని విస్మరించలేం,న్యూయాన్సెస్ ని పట్టుకోవాలి.

That which ends in exhaustion is death,

but the perfect ending is in the endless.

అలసటలో  ముగిసేది మృత్యువు మాత్రమే,

సంపూర్ణ ముగింపు అనంతంలోనే వుంది.

అనువాదం ఫర్ఫెక్షన్ కాదు ,పసి పిల్లల అడుగుల సవ్వడి, అవి తడబడే అడుగులు కావు, ఇరువురి చూపులకి  నడకలు నేర్పే లయలు. ‘స్ట్రె బర్డ్స్’  నాకై  నేను ,ప్రపంచానికి ‘కవిత్వ’ మాధ్యమం లో ఆలాపించే ప్రవచనా గీతం. ఆ గీతాన్ని ‘స్వేచ్చా విహంగాలు’ గా  చదువుతునప్పుడు సీతాకోకచిలుక ని పట్టుకుని వదిలేసిన తర్వాత దాని పుప్పిడి మునివేళ్ళకి సింధూర తిలకంలా అద్దుకుంటుంది. అందుకే బాబా మునివేళ్ళని మరోసారి ముద్దాడుతూ…

 

*

 

 

 

మడులన్నీ అన్నపు కుండలే!

 

padam.1575x580 (2)

కవులు రాసే కవిత్వంలో ఏ కాలంలో నైనా ఆయాకాలాల సమాకాలీన ప్రతిఫలనాలు కొన్ని ఉంటాయి.అలాగే తన దృష్టిని ప్రతిబింబించే దర్శనమూ.సమాజ చింతనా ఉంటాయి.అందువల్ల ప్రతీ కవీ,కవిత్వంలో సమాకాలీనత,వైయక్తికత,సామాజికత అనే మూడు అంశాలు మూకుమ్మడిగా కనిపిస్తాయి.కాని ఒకటి లేదా రెండు మూడు సంపుటాలు వచ్చాక ఆ కవి సృజనలోని ప్రధాన మార్గం  ఏమిటనేది గుర్తించడానికి వీలవుతుంది.మట్టిపొత్తిళ్లనుంచి ‘రెండుదోసిళ్లకాలం”దాక రామోజు  హరగోపాల్లో ఈ ప్రతిఫలనాలన్నీ ఉన్నాయి. సమాకాలీనతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీటిని రెండురకాలుకా చూడవచ్చు. ఒకటి పారదర్శక సమకాలీనత.సుస్పష్టంగా వస్తువుయొక్క సందర్భం ,ప్రాంతం,కాలం కనిపిస్తాయి.రెండవది పారమార్థిక సమకాలీనత.ఇది ఒక వస్తువునిచ్చే సందర్భం,కాలం,ప్రాంతాలకు అతీతంగా వస్తువును విశ్వవ్యాప్తంగా ముడివేస్తుంది.అంటే అనేక కాలాలు,ప్రాంతాలు సందర్భాలలో ఈ అంశం యొక్క ఉనికి కవిత్వం లోకనిపిస్తుంది.వస్తువునానుకొని ఉండే సందర్భం, కాలం మొదలైనవి వొలిచి అందులోని సారాన్ని మాత్రమే కవిత్వం చేయడం ఇక్కడ కనిపిస్తుంది.

 

హరగోపాల్ కవిత్వంలో తొలిదశనుంచి కనిపించే విప్లవ కవితావస్తువు పారమార్థిక సమకాలీనతలో కనిపిస్తుంది.ఇందులోని సంఘటనలు ఆర్థమవుతాయి కాని అవి అన్నికాలాల,దేశాల,సందర్భాలను ఒక విశ్వాత్మతో వ్యక్తం చేస్తాయి.ఇవి కొన్ని అంశాల నుంచి ముడిపడి ఉండడాన్ని గమనించవచ్చు.1.వస్తువులో రాజకీయ అణచివేత,వైప్లవికధార కన్నా ఈ అంశాలనానుకొని ఉండే జీవితం పై ధ్యాస ఎక్కువ.2.ఉద్యమంలోనికి వెళ్ళిన పిల్లలకు సంబంధించి,మరణాలకు సంబంధించిన పలవరింత,మానసికమైన సంఘర్షణ ఎక్కువ.తెలంగాణా ఉద్యమ సంబంధమైన కవితలు,రైతులు,చేనేతలు మొదలైన వారిమరణాలపై రాసిన కవితలు పారదర్శకంగా స్థలకాలాలను వ్యక్తం చేసేవి.ఏరకమైన భౌతిక ప్రతిఫలనాలు లేకుండా రాసే కవిత కూడా ఒకటుంది.ఇందులో కనిపించేది సంకల్పవస్తువు అంటే ఒక అంశాన్ని గురించి రాయాలని రాసేది.రాజకీయంశాన్ని వస్తువుగా చేసుకున్న “ఏలినవారిదయ”(27.పే)అలాంటి కవిత.

ఐ.ఏ రిచర్డ్స్ “కవిత్వంలో వాక్యాలు దృక్పథాలను,అనుభవాలను వ్యక్తం చేయడానికి సాధనాలు ‘అన్నాడు.హరగోపాల్ దృక్పథం ప్రజాసంబంధమైన సామాజిక విలువలకు కట్టుబడింది.వైప్లవికమైంది.అనుభావాన్ని వ్యక్తం చేసే విషయంలో మిగతా విప్లవ వస్తువును కవిత్వం చేసే కవులకు హరగోపాల్‌కు మధ్య వైరుధ్యాలున్నాయి.హరగోపాల్ వాక్యాల్లో కళాత్మకత ఎక్కువ.సాధారణంగా వస్తువును కవిత్వం  చేస్తున్నప్పుడు రెండు ధర్మాలుంటాయి.ఒకటి విషయ గత ప్రయత్నం.వస్తువు సంబంధమైన సైద్ధాంతికత,చైతన్యం,ప్రేరణ వంటివాటిని ఇది ప్రసారం చేస్తుంది.మరొకటి కవిత్వీకరణ ప్రయత్నం..విషయాన్ని వస్తువును హృదయానికి చేరేట్టుగా కవిత్వీకరణకు విషయంతో పాటుగా విలువనిచ్చి ప్రయత్నించడం.హరగోపాల్ కవిత అంశాన్ని,తన దృష్టిని పాఠకుడి హృదయానికి చేర్చేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తుంది.అనుభూతి కవులను మరిపించే భావచిత్రాలు,కళాత్మక వాక్యాలు కనిపించడం ఈకారణంవల్లే.

ఒక భావనకు,అంశానికి  కళావ్యాఖ్యానం చేయాలన్నప్పుడు కొంత అస్పష్టత కలిగే అవకాశం ఉంది.పాఠకుడికి ఈ  కష్టంలేకుండా  ఉండడానికి హరగోపాల్ కొన్ని వ్యూహాలనుపాటిస్తారు.హరగోపాల్ కవిత్వభాషలో భావార్థకత,పరిసరాత్మకత రెండూ కనిపిస్తాయి.ఐ.ఏ .రీచర్డ్స్ భావార్థకభాష (Emotive language)గురించిరాసాడు- Emotive language is more massive, more   dense with association than referential language

(భావార్థక భాష సంకేతాత్మకమైన నిర్దేశ భాషతో పోల్చినప్పుడు చాలా స్థూలమైంది.సాంద్రమైంది)..ఈ భావార్థక భాష హరగోపాల్ గొంతులో కళావ్యాఖ్యానాన్ని ప్రోది చేస్తుంది.అదే సమయంలో తాను చెబుతున్న వాతావరణాన్ని తలపించే పరిసరాత్మకభాష (ambient language)ఒకటి ఇందులో కనిపిస్తుంది.

పరిసరాలను తలపించే భాష ద్వార వస్తువాతావరణం లోకి తీసుకువెళ్ళి .. కొన్ని రూపాలు,భావార్థాలనిచ్చే పదాలద్వార కవిత్వీకరణ చేయడం కనిపిస్తుంది.

1.నువ్వులేకుండా నేనెట్లుంటా/నువ్వు లేకుండా నేనెట్ల బతుకుత/నువ్వంటే నేనెత్తిన జెండా/నువ్వు నామదిలో మేనిఫెస్టో“-(తూకం)

 2″ఒక్కటంటే ఒక్కటి /వెన్నెలపాయి సెలయేరులాపారక ముందే/ వేట ఏమిటి/ఒక్కటంటే ఒక్కటి/వెలుగురేఖ కంటి నంటక ముందే/మాటుఏమిటి-(కొండవెన్నెల రాలిపోతుంది)

 3.పచ్చపచ్చని ఆలోచనలేవో/అడవుల్లో కొండవాగులై దుంకుతున్నై

కొమ్మలకు కట్టిన ఎర్రచీమలగూడు-(సభ పెట్టుకుందాం)

ఈవాక్యాల్లో “జెండా,మేనిఫెస్టో,వేట,మాటు,ఎర్రచీమలు“లాంటి పదాలు పరిసరాత్మక భాషకు సంబంధించినవి సాపేక్షంగా ఈ పదాలు విప్లవ ఉద్యమ వాతావరణాలను ప్రతిఫలిస్తాయి.-“వెన్నెలపాయి సెలయేరులా పారక ముందే..వెలుగురేఖ కంటి నంటకముందే”లో కనిపించే కళాత్మకత జీవినానికి సంబంధించినది.”వెన్నెల పాయి,వెలుగురేఖ”అనే పదబంధాలు స్థూలమైనవి,సాంద్రమైనవి.విప్లవపోరాటపు వికాసాన్ని ఇవి సంకేతిస్తాయి.”ఎర్రచీమలు”లోని వర్ణం..ప్రధానంగా చీమలు శ్రీకాకుళపోరాటం దగ్గర్నుంచి విప్లవ ప్రతీకలుకూడా.

దృష్టికి,సృష్టికీ మధ్య కవిత్వాన్ని కళగా నిలపడమే హరగోపాల్ కవిత్వం చేస్తున్నది.సాధారణంగా విప్లవభూమిక,ప్రగతిశీలత లేదా సామాజిక ప్రయోజనాలను ఆనుకుని రాసే కవిత్వం కళాత్మకత,అనుభూతికి దూరమనే మాట ఒకటుంది.హరగోపాల్ కవిత్వం ఇందుకు భిన్నంగా ఉంటుంది.అనేక వాక్యాల్లో మానసికమైన తన్మయీభావన (ecstacy conception),ధ్యానం ఉంటుంది.

dosilla

1.”రాలుతున్న నీటి చినుకుల్లో/ధాన్యపు గింజల రాసులూ

2.”నాట్లేసిన చేతులల్ల నారు పాపాయిలు

3.”మడులు మడులన్నీ అన్నపు కుండలే

4.”ఇన్ని పూలేరి తెచ్చుకుని /తోటలో మొక్కలన్నీ తలలో పెట్టుకున్నాయి

5.”అలసిపోయిన దారిని పాదాలకెత్తుకుని/ఇంటికి తీసుకెళ్తున్న మనుషుల కల లెక్కుంది రాత్రి

6.”రెండుకొమ్మలకు ఉయ్యాలకట్టి/వూగుతున్న ఆకాశం

 “మబ్బు దోసిళ్లలోని వాన చినుకుల్ని దోచుకుంటున్నది

7.”మెట్లు మెట్లుగా అడవుల్ని ఎక్కించుకున్న /గుట్టమీది కోనేరు మునకలేస్తున్నది

8.”బతుకు టెండలో తలకాలకుండ అమ్మకప్పిన కొంగులు చెట్లు

 

ఇలాంటి వాక్యాలు అడుగడుగునా కనిపిస్తాయి.వస్తువుని రూపాల్లోకి అనువదించుకోవటం వల్ల,పరికరాలుగా ప్రాంతీయముద్రగల భాషను వాడుకోవటం వల్ల ఉహాశక్తిని  కవితలో నిక్షిప్తం చేసే అవకాశం ఈ కవిత్వంలో కలిగింది.నిజానికి కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కూడా ఇదే.మొదటి మూడు వాక్యాల్లో తన్మయీభావన ఉంది కాని వీటి మూలాలు వేరు.మొదటి దాంట్లో  ఊహ,రెండవ దాంట్లో అన్వయం చేయగలిగే జీవితాదర్శం,మూడులో చమత్కారం కనిపిస్తాయి.ఈ అంశాలే వస్తువును అనుభూతిగా చేయడానికి శక్తినిచ్చాయి.ఆరవ వాక్యంలో కనిపించేది కూడా ఇదే.నాలుగు ఐదు ఏడు వాక్యాలల్లో సౌందర్యాత్మకమైన ఊహ కనిపిస్తుంది.సౌందర్యాన్ని మానసికంగా అనుభవించడం మాత్రమే కాక ఆవిష్కారం వల్ల మాత్రమే అది కళగా మారుతుంది.అరవిందులు

“Beauty needs a manifestation to show it self”

hara

(సౌందర్యానికి ఆవిష్కారం అవసరం)అన్నారు.ఈ అవసరాన్ని కూర్చే శక్తులే పైన చెప్పుకున్న ఊహ,ధ్యానం,జీవితాన్వయం,చమత్కారాలు.

చమత్కృతిరానంద విశేషః సహృదయ హృదయ ప్రమాణకః“-(చమత్కారం ఆనందపు విశేషం,అది సహృదయుని హృదయానికి ప్రమాణం)అని ప్రాచీన కావ్య మీమాంస.పాశ్చాత్య దర్శన శాస్త్రం కళాతత్వ విచారం మూడు భాగాలలో సాగుతుందని చెప్పింది 1.ప్రకృతి స్వభావం, 2.దాన్నుంచి పొందిన జ్ఞానం,ఆ జ్ఞానం ద్వార జీవితాదర్శాల పరిశీలన. హరగోపాల్ వాక్యాల్లో కనిపించేదికూడా ఇదే.

ఈ అన్వయ శీలత వస్తువుని సాంకేతికంగా ధ్వనింపచేస్తుంది.అది జీవితం,విప్లవ చైతన్యంలోని ఉనికిని స్పష్టంగా ధ్వనిస్తుంది.

1.నీ ఇంటవాకిట అలుకు చల్లిన ఎర్రమట్టిపొద్దుని.

2.ఎన్ని తూటాలైనా ఆకుల్నేరాలుస్తాయ్,పత్ర హరితాన్ని కాదు.

3.నీవు వదిలేసిన పాటొకటి భూజాల మీద కప్పుకున్న.      

4.అడవి పచ్చటాకుల సైగలై నన్ను నిప్పుటేరులో నడిపింది తానే.

5.వాడకట్లన్నీ గుమ్మికట్లూడిన డప్పుల్లెక్క/ఒక్క సారికూడా సంతోషంగ మోగయి.

 

ఇలాంటి వాక్యాలు విప్లవాన్ని ధ్వనిస్తూనే,సౌందర్యాన్ని వ్యక్తం చేస్తాయి.అనేక పొరాటదశలను ఈవాక్యాలు సంకేతిస్తాయి.రెండవ వాక్యంలో వీరులు మరణిస్తారుకాని విప్లవ చైతన్యం కాదని, మూడు,నాలుగు వాక్యాలు  వీరునిమరణం ఇచ్చే ప్రేరణను.నాలగవది మరణం జరిగినప్పుడు ఊరు నిశ్శబ్దాన్ని మూగపోవడాన్ని ధ్వనిస్తుంది.హరగోపాల్ పట్టుకునే పరికరాలుకూడా ఒక పల్లెవాతావరణానికి చెందినవి.వాటి నిర్దిష్ట ప్రాంతాన్ని పరిశీలిస్తే ప్రాంతీయ భాషకు సంబంధించినవి.వీటినుంచి జీవితాన్ని, అనుభవాన్ని,పోరాటాన్ని హరగోపాల్ కవిత్వం చేస్తారు. ఈ కవిత్వం విప్లవ దృక్పథం,చైతన్యంలోని సౌందర్యస్పృహకు ప్రతినిధిగా నిలుస్తుంది.

ఆరు ముత్యాలున్న అడవి!

 

-భవాని ఫణి

~

wild tales1

రోడ్డు మీద మన మానాన మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తెలీని వ్యక్తి వచ్చి మనల్ని తీవ్ర పదజాలంతో దూషిస్తేనో లేక అవమానిస్తేనో మనమేం చేస్తాం?. ఈ ప్రశ్నకి ఒక్కటే సమాధానం ఉండదు. ఎవరికి వారు, వారి వారి పరిణితిని బట్టీ, విజ్ఞతని బట్టీ, ధైర్యాన్ని బట్టీ, అవకాశాన్ని బట్టీ,పరిస్థితుల్ని బట్టీ విభిన్నంగా స్పందిస్తారు. మనుషులందరిలో ఉండే భావోద్వేగాలు ఒకే విధమైనవి అయినప్పటికీ, వారవి ప్రదర్శించే స్థాయిలో మాత్రం హెచ్చు తగ్గులు తప్పనిసరిగా ఉంటాయి. నిజానికి కాస్తంత వివేకమో, భయమో ఆపలేనప్పుడు, పగా ప్రతీకారాలు మనిషిచేత ఎటువంటి నీచ కార్యాలనైనా చేయించగలవు. ఎంతటి అధమ స్థాయికైనా దిగజార్చగలవు. విచక్షణని కోల్పోయేలా చేసి, అతని స్వంత గౌరవాన్నీ, మర్యాదనీ, ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పణంగా పెట్టించగలవు. చివరికి అతడిలోని పశు ప్రవృత్తిని వెలికి తీయగలవు.
అటువంటి పగనీ, ప్రతీకారాన్నీ కథా వస్తువుగా తీసుకుని మనిషిలోని సహనపు స్థాయిని ఒక విభిన్నమైన కోణంలోనుండి సమీక్షించి నిర్మించిన బ్లాక్ కామెడీ చలన చిత్రం “వైల్డ్ టేల్స్” (Spanish: Relatos salvajes). 2014 లో విడుదలైన ఈ ‘అర్జంటైన్ – స్పానిష్’ సినిమా, అర్జెంటీనా సినిమా చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.  2015 ఫారిన్ లాగ్వేజ్ ఆస్కార్ కి నామినేట్ చేయబడింది కూడా . పోలిష్ సినిమా “ఇదా”తో పోటీపడి గెలవలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్నీ చూరగొంది.
wild-tales-2
ఆరు భాగాలు గల ఈ యాంథాలజీ చలన చిత్రపు మొట్టమొదటి కథ “Pasternak”. ఒక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులంతా, తామందరూ ఒక సారూప్యతని కలిగి ఉండటాన్ని గమనిస్తారు. వీరంతా ఏదో ఒక సమయంలోనో, సందర్భంలోనో Pasternak అనే వ్యక్తిని మోసంచెయ్యడమో, ఇబ్బందికి గురి చెయ్యడమో చేసిన వారే. Pasternak ఆ విమానానికి కేబిన్ చీఫ్ అనీ, వారంతా ఒకే విమానంలో ప్రయాణించడం యాదృచ్ఛికం కాదని వారు గుర్తించేలోపుగానే ఆ విమానం నేలకూలిపోతుంది. ఇక్కడ ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎంత చిన్న విషయంలోనైనా అన్యాయానికి గురికావడమనేది మనిషిని తీవ్రంగా బాధిస్తుంది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదలిస్తే, మరి కొందరు తిరుగుబాటు బాట పడతారు. రెండూ చెయ్యలేక పదే పదే అన్యాయానికి, అసమానత్వానికీ బలవుతున్నానని ఒక వ్యక్తి భావించినప్పుడు, అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనై చివరికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, తనకి తోచిన రీతిలో న్యాయాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.  “Pasternak”,అందుకు సరైన ఉదాహరణ.
 రెండో కథలో, లేట్ నైట్ కావడం వల్ల నిర్మానుష్యంగా ఉన్న ఒక హోటల్ కి ఒక వ్యక్తి రావడం, అక్కడ పని చేసే ఒకమ్మాయి అతన్ని, తన తండ్రి చావుకు కారకుడిగా గుర్తించడం, తన బాధని తనతో పాటుగా పని చేసే ఒక ముసలి వంటామెతో పంచుకోవడం, ఆ  ముసలామె ఈ  అమ్మాయి అడ్డు చెబుతున్నా వినకుండా  ఆ వ్యక్తిని చంపెయ్యడం జరుగుతుంది. ఇక్కడ ముసలామె, అమ్మాయి ప్రతీకారాన్ని తనదిగా భావించి ముక్కూ మొహం తెలీని వ్యక్తిని పొడిచి చంపేస్తుంది. ఇందుకు కారణమేమిటా అని ఆలోచిస్తే, ఒకప్పుడు ఆమె ఎదుర్కొన్న అన్యాయానికి  ఈ విధంగా న్యాయం పొందినట్టుగా భావించి ఉండవచ్చని అనుకోవచ్చు. లేదా తన సహోద్యోగిని బాధ ఆమెని అంతగా కదిలించి అయినా  ఉండవచ్చు. లేదంటే ఆమెలోని హింసాత్మక ప్రవృత్తి అటువంటి సందర్భం కోసం వెతుక్కుంటూ ఉండి కూడా ఉండవచ్చు. మొత్తానికి ఈ కథ వేరొకరి పగకి ప్రతీకారం తీర్చుకోవడమనే అంశాన్ని గురించి చర్చిస్తుంది. ఈ కథ పేరు “The Rats”.
ఇక మూడవ కథ “The Strongest” తాత్కాలికమైన చిన్నపాటి రోడ్ రేజ్ సంఘటన కలిగించే కసీ, ద్వేషానికి సంబంధించినది.  కారుకి దారివ్వని కారణంగా రోడ్డు మీద మొదలైన చిన్న గొడవ ఇద్దరు వ్యక్తుల్ని ద్వేషంతో రగిలిపోయేలా చేసి, చివరికి ఇద్దర్నీ కాల్చి బూడిద చేస్తుంది. తాత్కాలికమైన ఆవేశం, తర్వాత కలిగే కష్టనష్టాల గురించి కూడా ఆలోచించనివ్వనంతగా విచక్షణని పోగొడితే ఏం జరుగుతుందో తెలియజేస్తుందీ కథ.
పాలక వ్యవస్థలో గల లోటుపాట్లూ, అది చూపే నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజానీకంలో ఏర్పడే అసహనం, అసంతృప్తుల యొక్క  తీవ్ర రూపాన్ని అతిశయంగా చూపిస్తుంది నాలుగో కథ “Little Bomb”. పార్క్ చెయ్యకూడని స్థలమని స్పష్టమైన సూచనల్లేని ప్రదేశాలనించి, తన కార్ ని మాటి మాటికీ తీసుకెళ్లి జరిమానా వేస్తున్న నిర్లక్ష్యపు వ్యవస్థపై కోపంతో,
అసంతృప్తితో Simón Fischer అనే వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ని బాంబ్ తో పేల్చేస్తాడు. ఈ కథలో మాత్రం సమాజంలో కదలిక ఏర్పడినట్టుగా, Simón న్యాయాన్ని పొందే దిశగా అడుగు వేస్తున్నట్టుగా  అనిపించే విధంగా ఉంటుంది ముగింపు. మొదటి మూడూ పూర్తి స్థాయి హింసాత్మక ప్రతీకారానికి చెందిన కథలైతే, ఇది మాత్రం చైతన్యంతో కూడిన హింసగా దర్శకుడు అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తుంది.
ఒక్కోసారి మన వల్ల ఎదుటివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా, అది మనకి జరుగుతున్న అన్యాయంగా ఊహించుకుని, ఎదుటి వ్యక్తికి కూడా అటువంటి అభిప్రాయాన్నే కలిగించగలిగితే ఎలా ఉంటుందన్నది ఐదో కథ “The Proposal”. తన కుమారుడు చేసిన ఒక కార్ యాక్సిడెంట్ నేరాన్ని తనపై వేసుకునేందుకు తోటమాలిని ఒప్పిస్తాడు ధనికుడైన ఒక వ్యక్తి. కానీ ఒప్పందం సమయంలో లాయరు, ప్రాసిక్యూటరు, తోటమాలీ డబ్బు విషయంలో తనని మోసం చేస్తున్నారని భావించి, వారికి కూడా అదే అభిప్రాయాన్ని కలిగించి చివరికి
తనకి కావలసిన విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడతను. అంతా అతనికి అనుకూలంగా జరిగిపోబట్టి సరిపోయింది కానీ ఆ ఒప్పందం కుదరకపోతే తన కన్నబిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న నిజాన్ని, అతను తన కోపానికి పణంగా పెడతాడు.
కొత్తగా పెళ్లైన ఒకమ్మాయి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి వేరే అమ్మాయితో శారీరక సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఆ కోపంలో, ఆవేశంలో ఆమె తీవ్రమైన దుఃఖానికి లోనై, తన సహజమైన మృదుత్వాన్నీ, సామాజిక లక్షణాన్నీ కోల్పోతుంది. తత్ఫలితంగా తీవ్రమైన విశృంఖలత్వాన్నీ, హింసాత్మక ధోరణినీ ప్రదర్శించి తన పెళ్లి పార్టీలోనే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. చివరికి భర్త చొరవతో స్పృహలోకి వచ్చి సర్దుబాటు చేసుకుంటుంది. ఈ కథ బ్లాక్ కామెడీ అన్న పదానికి పూర్తి న్యాయాన్ని చేకూరుస్తుంది. అమ్మాయి రోమినా ప్రదర్శించే ‘గాలొస్ హ్యూమర్’ చాలా అసహజమైందే అయినప్పటికీ,  నవ్వడానికి కూడా మనస్కరించనంతగా మనల్ని తనలో లీనం చేసుకుంటుంది. ఇది ఈ యాంథాలాజీ సినిమా కథల్లోని ఆఖరి కథ “Till Death Do Us Part”. రోమినాగా నటించిన ‘ఎరికా రివాస్’ అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది.
ఈ కథలన్నిటినీ కలిపే చక్కని సంగీతం, ‘ఇది ఒక కామెడీ సినిమా సుమా’ అని చెప్పే ప్రయత్నం చేసినా, ఆలోచింపచేసే థ్రిల్లర్స్ గానే మనం వీటిని స్వీకరిస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే “అన్యాయాన్ని ఎదిరించగలిగినప్పుడు కలిగే ఆనందానికి చిరునామా”గా ఈ చలన చిత్రాన్ని అభివర్ణిసాడు దర్శకుడు Damián Szifron.
*

ఆ లోతైన సముద్రం పేరు…

 

-పఠాన్ మస్తాన్ ఖాన్ 

~

babusha

మధ్య ప్రదేశ్ కు చెందిన బాబుషా కొహ్లీ 2014 సంవత్సరానికి గాను యువ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. ప్రేమ వుడత మనసు జామపండు(ప్రేమ్ గిల్హరీ దిల్ అఖరోట్ ) అనే తన మొదటి కవితా సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు.
బాబుషా కొహ్లీ, తన రచనలో భావాల లోతులను తాకే అనుభూతి, సంవేదనలను వినూత్నంగా వ్యక్తికరిస్తుంది.యీమె కవిత్వంలో ప్రేమ ప్రధాన కవితా వస్తువై కనిపించిన జీవితపు భిన్నత్వంలోని సంగీతం ప్రతిధ్వనిస్తుంది.

యింకా యీమె కవిత్వంలోని సాంద్రత, ఘాఢమైన అనుభవం,భాషా నవ్యతలు పాఠకులను మైమరిపిస్తాయి.సూఫీ ప్రేమతత్వము,విపరీత ఆరాధన యీమెలో కనిపించే ప్రధాన లక్షణం.

యీమె కవిత్వనిర్మాణం సంవేదనలతో పాటు బింబాత్మక ప్రతీకలు, ఆకృతులు మెండుగా వుండి పాఠకుల మనసులలో సులభంగా నిలబడిపోతుంది.

తూరుపు నుంచి పడమర వరకు
——————————————-

మొలకెత్తేందుకు ప్రతి వొక్కరి వద్ద వొక వుదయం వుంది.
మునిగేందుకు సరైన చోటు లేదు అనుకోనక్కర్లేదు .

పిడికెడు చల్లని కోరికను తీసుకొని
నీరసంగా తిరుగాడుతోంది వో యెండ కన్య

యీ ప్రపంచంలో వొక్క ప్రశ్నకు వొందల జవాబులు వున్నాయి.
భిక్షగాడి కోసం కాస్త దయ, పిండి, బియ్యం వున్నాయి.

సుఖం

దక్షిణగా లభించదు
రాత్రిని
నేను కోరుకొన్నప్పుడల్లా నా కళ్ళలోనికి లాక్కుంటాను
తూరుపు రంగులమయమై వుంది
కాటుక రేఖ ముల్లులా వుంది

తమసోమ జ్యోతిర్గమయ నుంచి
యీ యాత్ర కఠినమైంది
తూర్పు నుంచి పడమర వరకు

పదే పదే తిరుగాడుతూనే వుంది వో యెండ కన్య

అక్కడ
జ్వలిస్తూ
మండుతూ
నిప్పు రథమై
సంతోషంతో యెగురుతూ పరుగెడుతోంది
అక్కడ

అయినను
కాకపోయినను
ఆ లోతైన సముద్రం పేరు
పడమరే.

మూలం : బాబుషా కొహ్లీ

*