Archives for July 2016

ఆటా సాహిత్య పండగ సందడి

 

 ata2016
-నారాయణ స్వామి వెంకట యోగి
~

జూలై 1  నుండి ౩ వరకు షికాగో లో రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో ఆటా  ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ రజతోత్సవ వేడుకలు ప్రధానంగా సాంస్కృతిక వేడుకలుగా జరుగనున్నాయని ఆటా నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు సంస్కృతిని అద్భుతంగా విరాజిల్లే విధంగా ఈ మహాసభలు జరుగుతున్నయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించినరు. అదే పద్ధతిలో యేర్పాట్లు ఘనంగా జరుగుతున్నయని కూడా చెప్పినరు. సాహిత్యం సాంస్కృతికమూ సాధారణంగా జమిలిగా కలగలిసి ఉంటయి కాబట్టి ఈ సారి ఈ కన్వెంషన్ సందర్భంగా సాహిత్యానికి కూడా పెద్ద పీట వేసినరు. సాంస్కృతిక కార్యక్రమాలకు సమఉజ్జీగా , సమాంతరరంగా,కలుపుగోలుగా , కాంప్లిమెంటరీ గా సాహిత్య కార్యక్రమాన్ని కూడా నిర్వాహకులు తీర్చిదిద్దినరు.

 

https://www.ataconference.org/Committee-Literary

 

జయదేవ్ మెట్టుపల్లి గారు ప్రదాన సంచాలకులుగా తీర్చి దిద్దిన సాహిత్య కార్యక్రమాలు అద్భుతంగా జరుగనున్నయి. తెలుగు సాహిత్యం లోని అన్నిరంగాలను కూలంకషంగా పరిశీలించే విధంగా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిభావంతంగానూ , ఆలోచనా స్ఫోరకంగానూ తీర్చి దిద్దారు.  జయదేవ్ గారూ వారి సాహితీ బృందం సభ్యులూ , తెలుగు సాహిత్యం లోని అన్ని క్రియలనూ పరిశీలిస్తూ సమకాలీన సాహిత్య రంగం లోని అనేక అంశాలను క్రియాశీలకంగా పరిశీలించేటట్టు కార్యక్రమం రూపొందించినరు. సమకాలీన సాహిత్యం పరిశీలించకుండా తెలుగు సాహిత్యాన్ని అంచనా వేయలేము. అందుకనే సాంప్రదాయ సాహిత్య ప్రక్రియలైన అవధానమూ లాంటి వాటికి పెద్ద పీట వేసినా, సమకాలీన సాహిత్య అంశాలను క్రియలను, పోకడలను, ఉన్న సమయంలో కూలంకషంగా చర్చిస్తూ సాహిత్య కార్యక్రమాలున్నయి. అందుకు ఆటా నిర్వాహకులను, ముఖ్యంగా సాహితీ కమిటీ నిర్వాహకులను ప్రత్యేకంగా భినందించాలి.

 

ఆటా కన్వెన్షన్  మొదటి రోజు,  జూలై 2 నాడు, మధ్యాహ్నం వొంటి గంటకు సాహిత్య కార్యక్రమం ప్రారంభమౌతుంది. ఇవాళ తెలుగు సాహిత్యం లో ఉధృతంగా ముందుకొస్తున్న ప్రాతీయ సాహిత్యం గురించిన చర్చ మొదటి సెషన్ లో జరుగుతుంది.

ప్రముఖ కవి కథకుడు విమర్శకుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా లో ప్రొఫెసర్ అఫ్సర్ ఈ సెషన్ ను నిర్వహిస్తున్నారు.

ఇందులో ప్రముఖ కళింగాంధ్ర కథకుడు అప్పలనాయుడు గారు కళింగాంధ్ర సాహిత్యం గురించి మాట్లాడుతారు. శ్రీకాకుళ పోరాటం కంటే ముందు నుండీ ఎట్లా కళింగాంధ్ర సాహిత్యం తెలుగు సాహిత్యం లో ఒక పాయ గా కొనసాగిందో కళింగాంధ్ర ప్రజల జీవితాన్ని, కలల్నీ, ఆకాంక్షలనీ ఎట్లా సాహిత్యం ప్రతిఫలించిందో అప్పలనాయుడు గారు వివరిస్తారు, అట్లే శ్రీకాకుళ ఉద్యమ లో సాహిత్యం నిర్వహించిన పాత్రనీ ఉద్యమం నిర్బంధానికి లోనై సద్దు మణి గిన తర్వాత సాహిత్యం ఎట్లా శ్రీకాకుళ జనజీవితాన్ని ఫ్రతి బింబించిందో వివరిస్తారు.

స్త్రీ సాహిత్యం గురించి ప్రముఖ కథకులు భూమిక పత్రిక సంపాదకులు కొండవీటి సత్యవతి గారు ప్రసంగిస్తారు. స్త్రీవాద ఉద్యమం ప్రారంభం కాకముందునుంచీ స్త్రీ రచయితలు స్త్రీల జీవితాన్ని వారి కష్ట నష్టాలను సాహిత్యం లో ప్రతిఫలించిన విధానాన్ని దాన్ని స్త్రీ వాద ఉద్యమం సుసంపన్నం చేసిన వివరాలనూ సత్యవతి గారు తమ ప్రసంగం లో వివరిస్తారు.

తెలంగాణ సాహిత్యం గురించి ప్రముఖ కవీ గాయకుడు వక్త దేశపతి శ్రీనివాస్ వివరిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం లో వెలువడ్డ తెలంగాణ సాహిత్యాన్ని గురించి శ్రీనివాస్ తమ ప్రసంగం లో కూలంకషంగా సోదాహరణంగా వివరిస్తారు.

తరతరాలుగా వివక్షకు గురవుతూ పాలకులు ప్రాంతం వారైనా తీవ్రమైన అన్యాయానికి గురైన ప్రాంతంగా, ఫాక్షన్ సీమగా హత్యలు దొమ్మీ లు జరిగే హంతక సీమగా అపఖ్యాతి పాలై ఫాక్షనిస్టుల చెరలో నెత్తురోడింది రాయలసీమ సాహిత్యాన్ని గురించి అప్పిరెడ్డి హర్నాథ రెడ్డి వివరంగా ప్రసంగిస్తారు.

అదే రోజు మధ్యాహ్నం శొంఠి శారద గారి నిర్వహణ లో ‘తరతరాల తెలుగు సాహిత్యం విభిన్న ధోరణులు ‘ అనే అంశం పై సెషన్ జరుగుతుంది.

ఈ సెషన్ లో మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి ప్రభల జానకి గారు , యద్ధనపూడి సులోచన గురించి కొమురవోలు సరోజ గారు, అమెరికన్ షార్ట్ స్టోరీస్ గురించి నారాయణ స్వామి శంకగిరి గారు, తెలుగు నవల గురించి అమరేంద్ర దాసరి గారు, తాము నిర్వహస్తున్న పత్రిక భూమిక గురించి కొండవీటి సత్యవతి గారు , దేవులపల్లి సాహిత్యం అభ్యుదయం గురించి నిడమర్తి నిర్మల గారు ప్రసంగిస్తారు.

తర్వాత శ్వీయ కవితా పఠనం , పుస్తకావిష్కరణ చర్చ లు జరుగుతాయి.

తర్వాత సాయంత్రం ‘పాట వెనుక మాట’ అని తాము రచించిన అనేక గొప్ప పాటల వెనుక ఒదిగి పోయిన సందర్భం గురించి జీవితం గురించి సంఘటన ల గురించి ప్రముఖ కవులు వాగ్గేయ కారులు గోరటి వెంకన్న అందెశ్రీ ప్రముఖ సినీ కవి చంద్రబోస్ గార్లు ప్రముఖ కవి అఫ్సర్ సంచా లకత్వం లో అద్భుతంగా వివరిస్తారు.

సభల రెండో రోజు సాహిత్య కార్యక్రమం లో ఉదయం  అవధాని సార్వభౌమ అవధాని కంఠీరవ శ్రీ నరాల రామిరెడ్డి గారి చే తెలుగు సాహిత్యావధానం జరుగుతుంది. దీనిలో ఆచార్య శ్రీనివాస్ వేదాల గారు, కందాళ  రమానాథ్ గారు,  వడ్డేపల్లి కృష్ణ గారు, కొంక పాక లక్ష్మీ గారు,  ప్రభల జానకి గారు, శొంఠి శారద గారు, యడవల్లి  రమణ మూర్తి గారు పాల్గొంటారు.

మధ్యాహ్నం సాహిత్య కార్యక్రమానికి ప్రముఖ సాహితీ విమర్శకులు కథకులు ఈమాట సంపాదకులు వేలూరి వెంకటేశ్వర రావు గారు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఈ సెషన్ తెలుగు సాహిత్యం కొత్త దారులు అనే అంశం పై జరుగుతుంది. ఇందులో వేలూరి గారు అనువాదాల గురించి ప్రసంగిస్తారు. తెలుగు భాష పరిణామాలు అనే అంశం గురించి మిట్టపల్లి రాజేశ్వర రావు గారు , తెలుగు కవిత్వ సామాజిక ఉద్యమాలు అనే అంశంపై నారాయణ స్వామి వెంకటయోగి గారు, అమెరికన్ తెలుగు సాహిత్యం గురించి ప్రముఖ రచయిత గొర్తి సాయి బ్రహ్మానందం గారు స్త్రీవాద సాహిత్యం గురించి ప్రముఖ కథకులు కవీ కల్పన రెంటాల గారు, తెలుగు సాహిత్య వాడల గురించి ప్రముఖ కవి విమర్శకులు హెచ్చార్కె గారు భవిషత్తులో తెలుగు భాష గురించి ప్రముఖ భాషా శాస్త్రవేత్త సురేష్ కొలిచాల గారు ప్రసంగిస్తారు

మొత్తం కార్యక్రమాన్ని చూస్తే ఈ ఆట సభలు సాహిత్యానికి సంస్కృతి కి పెద్ద పీట వేసినాయి. నిర్వాహకులు చాలా శ్రద్ద తీసుకొని సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు తీర్చిదిద్దారు.

అమెరికా నలుమూలల నుండీ వేలాదిగా తెలుగు వారు తరలి వచ్ఛే ఈ ఆట సభల్లో తెలుగు సాహిత్య సాంస్కృతిక పరిమళాలు గుబాళించబోతున్నాయి. తెలుగు సాహిత్యప్రియులకు సాంస్కృతిక ప్రియులకు ఈ రెండు రోజులూ పండగే!

చీకటీగలు-1

 

ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం నన్ను చంకనెత్తుకుని

నేడు నిర్ధాక్షిణ్యంగా దించేసి,

వెనుతిరిగి చూడకుండా

వెళ్ళిపోయిన

అమ్మ జయక్క

స్మృతికి

                                                – వేణయ్య

*******

 

 

Autumn-Fall-Leaves-HD-Wallpaper

 

 

‘అనిబద్ధమైన జీవితంలోకి అడుగుపెట్టి ప్రయాణం సాగించడానికి ధైర్యమూ, బంధరాహిత్యమూ మాత్రమే చాలవు… యంచాతనంటే బాంధవ్య రాహిత్యమన్నది ఓ పేద్ద మిథ్య. నిన్ను తగులుకు వేల్లాడే ‘నిన్ను’ వదుల్చుకోవడం జరిగేపనేనా? ‘నువ్వు’ లేని నువ్వు ఎలా వుంటావో ఊహించు. మనమన దొంగ తృప్తికోసం… నేనన్నది లేనేలేదూ… ఆత్మ రాహిత్యంతో బతుకుతున్న నన్ను చూడండి అని ఓ తెగ గొప్ప లమ్డీ మాటలు మాట్లాడొద్దు… కంట్లో చివర్న కట్టిన పుసిని చిటికెనవేల్తో తీసేసినంత సుళువుగా… కానీ పుసులే కట్టని కళ్ళుంటాయని ధైర్యంగా చెప్పగలవా? నిజం చెప్పు. ‘‘నువ్వు’’ నువ్వు అన్నదుంది కాబట్టి ‘నీదీ… నీవీ’ అన్న పల్లేరు కాయలు నీవేసుకున్న దొంగ ముసుగు బట్టలకి తగులుకుని ఎన్ని వున్నాయో… చెప్పగలవా? ‘‘సగం ఖాళీ అయిన బీడి కట్టని సగం నలిపి… ఓ కొత్త బీడీ బైటకి తీసి చూపుడువేలూ బొటనవేలూ మజ్జెన్నలిపి… ‘నీయమ్మ యిదీ నాలాగే’ అని నాలుగువేళ్లూ బొటనవేలూ మధ్యకు ఆ లొత్త బీడీని జార్చి విరిచి విసిరేసి ‘‘యంతసేపైందీ యీ ముండ రంగరాజుల్గాడెళ్ళీ నా నాలుక నేనే మింగేట్టున్నా… యిచ్చావా వాడికి డబ్బూ?’’ పక్కనలేని భుజమ్మీదున్న మాసి దారాలు వేల్లాడ్తోన్న తువ్వాలనబడే తుండుకోసం తడుంకుంటూ… ఎడం చేతి మడమతో తడారిన పెదాల్ని రుద్దుకుంటూ నన్ను చూశాడు శ్రీమన్నారాయణ.  బైటి బహుళ పక్షపు మెత్తటి చీకటి… గదిలో నీరసంగా వెలుగుతోన్న నలభై క్యాండిళ్ళ బల్బు పచ్చటి నీరసకాంతిని నిర్లక్ష్యం చేసి లోపలికి తన్నుకొచ్చేస్తోంది….

‘‘ఇచ్చావ్కదా?’’ రెట్టించాడు శ్రీమన్నారాయణ…

‘‘ఇచ్చా… వెళ్ళాడు కదా నీ ముందే…. మిరబ్బజ్జీలు తెమ్మన్నావ్‌ వాణ్ణి. చెక్‌పోస్ట్‌ దగ్గరికెళ్ళాలి గదా వాడూ… వచ్చేస్తాడు… చెప్పు… ఈ రోజున మృచ్ఛకటికం గురించి చెప్తానన్నావ్‌ మొదలుపెట్టూ….’’ కూచున్న చాప పిర్ర కింద నించీ జారుతూ మడతలు పడ్తూంటే ముడ్డి గాల్లోకి లేపి చాపముడతల్ని సరిచేసుకొంటూ అన్నా….

‘‘చెప్తా చెప్తా…. గొంతు తడి చేసుకోనీ… అదీకాక కంఠం రాలేదు ఆ పిల్ల మైత్రీ… దాని మొగుడు కూడా రానివ్వూ…. ఆ పిల్ల పాటినాలి ముందు… ఏం గొంతు ఏంగొంతూ… వోడ్కాలోకి తేనె చుక్కా నిమ్మచుక్కా అయిసుపిండి వేసుకు చప్పరించినట్టు. వస్తుందంటావా?’’ క్రష్డ్‌ ఐస్‌ను ‘అయిసుపిండి’ అంటాడతను.. సందులోకి చప్పడుగా అనిపించింది….  సైకిలు స్టాండ్‌ వేసిన్చప్పుడు రంగరాజులే…

బైటి చీకటి బూజున్దులుపుకుంటూ ‘‘నీయమ్మ లంజకొడుకు దొంగ లంజకొడుకు’’ అంటూ….

వాడికంటే ముందు తెగ కాల్చిన నూనెలో కాలిన శెనగపిండి మిరపకాయ పరిమళం.

నీలం రంగు అతి పల్చటి ప్లాస్టిక్సంచీని లోపలి గాజు శబ్దంతో నిశ్శబ్దంగా పెట్టే ప్రయత్నంతో కూచోబోతూ మళ్ళీ ‘‘లంజకొడుకులు… వీళ్ల…’’ అని మిగిలిన తిట్టు మింగేస్తూ అన్నాడు.

‘‘ఎవర్నిరా అంత పరిమళ భరితంగా తిడ్తూన్నావూ…’’?  శ్రీమన్నారాయణ ‘‘సుభాన్గాడి చీకుల బండినా…. పూర్తి రోడ్డునిండా బండ్లే… సందు తిరిగే దానికేల్యా… ఎవున్దో బండికి నా ఫెడల్తగిలి పడిపాయ…. వాడు రోడ్డుకడ్డం పెట్టింది గాక నా మిందికొచ్చి… వానెమ్మ యాడ మందు సీసాలు పగుల్తాయోనని గమ్మునొచ్చేస్తి’’ రంగరాజులు యింకా నాకపరిచితుడయిన వ్యక్తితో దెబ్బలాడ్తూనే వున్నాడు. శ్రీమన్నారాయణ రేకు గదిలో చాప మీద కూచుని… ఆ సంఘటన చెరిగిపోడానికి రంగరాజు మెదడు మీద యింకో యింతే బలమయిన సంఘటన బొమ్మ పరుచుకోవాలి…. రంగరాజుల్వేపు చూసా..

మిడిగుడ్లు… యింకా బైటి వాడెవడినో కసిగా చూస్తూ తెగిన తమ్మెతో కుడి చెవి పెద్దగా… మీద నూనె కార్తోన్న ఉంగరాల జుత్తు….

బండముక్కు కొసన నల్లటి శెనగబద్దంత పులిపిరి…

నున్నగా గొరిగేసిన మూతి…

వెడల్పాటి గెడ్డం మజ్జెన గుంట….

సగం నెరిసిన మూడ్రోజు గెడ్డమ్మీసాలు…

వ్యాకరణబద్ధ పజ్జ్యాల మీద మక్కువ చావని రంగరాజు. ‘‘దో మాండ్‌లో పాడ్తాన్నా… దీనికి మాండేన్నా… శ్రీలో పాడ్తారు గానీ మాండ్‌లో వుంటే జారుడు శ్రీకిరాదునా… మజాన్నా… రంగరాజ మకుటంతో రాశ్నా యినూ…’’

యాస ఒకటీ సాహిత్య భాషొకటీ… రంగరాజు

ఇంకా రోడ్డుమీద జరిగిన సంగటన్ని తల్చుకుంటూ బూతు గొణుక్కుంటూ…

‘‘ఈ రోజు ఫుల్‌ బెంచి వుండేట్టు లేదుగానీ మొదలు పెట్టుమరీ’’ శ్రీ మన్నారాయణ వేపు చూస్తూ అన్నా… మందూ… ప్రసంగం రెండూ అన్నట్టు…

చిన్నగా నవ్వి ‘‘మందుతో ఫరీదా ఖానుమ్‌ని నంచుకున్న మజా యీ మిరబ్బజ్జీల్తో రాదుగాక రాదు… ఆపిల్ల మైత్రొస్తుందేమోనన్చూస్తున్నా యింకా యేడూ యాభైయ్యేకదా… ఆగుదాం ఓ పదినిమిషాలు,… రంగరాజా! యింతలో ఓ పజ్జెమెత్తుకోగూడదా’’ శ్రీమన్నారాయణ…

ప్లాస్టిక్సంచీలోంచీ గాజుకుప్పెల్లో బందీ అయిన మత్తును జాగ్రత్తగా బైటికి తీసి చాపమీద పడిపోకుండా బ్యాలెన్స్‌ చేస్తూ రంగరాజు ‘‘నీయమ్మ యిప్పుడివి నిలబడవు తాగినెంక మనల్ని నిలబన్నీవు ఏం బోసింటారో ఆనాకొడ్కులు దీన్ల.. అవునా చెప్పు’’ అన్నవ్వుతూ మిరబ్బజ్జీ పొట్లం విప్పి వాటి పరిమళానికి మరింత విడుదల ప్రకటించాడు…. దానిక్కట్టిన దారాన్ని మూడు ఎడం చేతి వేళ్ళకి చుట్టుకుంటూ… పొట్లం పేజీని ముడతలు సాపుచేస్తూ చదవడానికి ప్రయత్నం చేస్తూండగా ‘‘సారీ సార్‌ లేటయింది పాపను ట్యూషన్నించీ తీసుకొచ్చేసరికి అదీగాక మళ్ళీ ఇంటి దగ్గర మోపెడ్‌ స్టార్ట్‌ కాలే… పెళ్ళాం దొబ్బులు వదిలించేసీ. హిహ్హిహ్హీ నేనేసేది కాకీ అంగీ నన్నేసేది కనకాంగి నా పెళ్ళాం. ఆటో… వాడు కూడా చౌరస్తాలో దింపేసి వెళ్ళాడు షేరాటో’’ ముక్కలు ముక్కలుగా క్షమాపణలనేవి విసిరేసి నీలకంఠమూర్తి… బజ్జీలు సర్దుతోన్న రంగరాజు భుజమ్మీద చెయ్యేసి ‘‘వచ్చేసిందా సింగారి ముండా’’ అంటూ రెండు సీసాల్లో పెద్ద సీసా హాఫ్‌ని నిమిరి వేళ్ళు పెదాలకానించుకుని ముద్దాడాడు… గోడకానుకుని కూచుని ‘‘ఎవర్దీ యీ రోజు బిల్లూ మీదేనా?’’ అని నా వేపు చూసి నవ్వి… చొక్కా జేబులో చెయ్యిపెట్టి వేళ్ళతో తడుంతూ ఓ వందా ఆనొక యాభై బైటికి లాగి రంగరాజుల్కేస్చూసి ‘‘రాజా యింకో హస్తముంటేగానీ సభ సాగదుగానీ నువ్వెళ్తావా, నన్నే వెళ్ళమంటావా?’’ అడిగాడు.

రంగరాజులేమో అనేంతలో శ్రీమన్నారాయణ ‘‘ముందిది కానిద్దాం, ఓ పన్జేయండి’’ అంటూ మూసిన దిండుకి జారగిలి పక్కన తడుంకున్నాడు మాసిన తుండుకోసం… యీ మాటది భుజానున్నట్టు గ్రహించి… దాంతో ఎండిన పెదాలు తుడుచుకున్నాడు.

‘‘సార్‌ మన కాలే గార్కి పెరాల్సిస్సట సార్‌. మజ్జానం మా దయానంద్‌ చెప్పాడు.. ఏంధన్చేస్తాడు సార్‌ పాటల్ని…! ఎయిర్‌లో గ్రేడ్‌ వన్‌ ఆర్టిస్ట్‌గా మిగిలాడు గానీ,

‘రమ్మంటె చాలుగానీ…రాజ్యాలు గడిచిరానా’ ఏం ట్యూనండీ మేష్టారూ.. బ్‌బ్బా… హార్మోనియం మెట్ల మీద ఏమి కదుల్తాయీ ఆయన వేళ్ళు… అద్దమ్మీద పాదరసం పారినట్లే కదండీ… మాటకూడా ముద్దముద్దగా వస్తోందట సార్‌… ప్చ్’’ కంఠం పెద్ద నిట్టూర్పుతో అన్నాడు….

శ్రీమన్నారాయణ సగం బీడీ కట్ట నలుపుతూ యింకో బీడీ తీసి దాని తలన్నలిపి ‘ఫూ’ అనూపి కొరికినట్టు నోట్లో పెట్టుకుని దవడలు లొట్టలు పడేట్టు పీలుస్తూ అంటించుకుని దాని పొగకు ఎడం కన్ను చిన్నగ చేసి కుడి కన్ను కంఠం వేపు తిప్పి. ‘‘ఏం సాధించాడు లే… కనీసం ఆత్మతృప్తైనా మిగుల్చుకున్నాడా? ఏం జీవితాలు మనవి…. మన కోసం మనం కాక అంటించుకున్న అందరికోసం బతుకుతూ లమ్డీ అని దొంగలమ్డీ బతుకు ఛీఁ’’ అన్నాడు.

‘‘అవన్నా సూరజేర్‌ చందాలోది రఫీసాబ్‌ భలే పాన్నాడు. నందకౌస్‌ రాగమన్నా కాలేసార్‌ కూడా చెప్నాడు. ఆ పాట ఆ రాగంలోనే చేస్నా అనీ తెరేనామ్‌కా దివానా తెరె ఘర్‌కు ఢూండ్‌తాహూ’’ నాలుగు పదాలు పాడాడు రంగరాజు.

‘‘నీ మాటకీ పజ్జానికీ పాటకీ యోజనా దూరం రాజా’’ రంగరాజు భుజం తడుతూ అన్నాడు నీలకంఠం….

ల్యా ఎత్తుకునేది ఎత్తుకునేది సమ్మసరిగా అట్టనే చూడు…

రమ్మంటే చాలుగాని…రాజ్యాలు గడచి కాదనా… విడిచి… విడిచిరానా… దాశరది సార్‌ పజ్యమన్నా… అదే పాట, పాటనాలేమోగదా… రఫీసాబ్‌ పాటింటిరా..

తేరే నామ్‌కా దివానా తేరే ఘర్‌కొ ఢూంఢ్‌ తాహై… జబ్బర్దస్త్‌ పాటనా’’

‘‘ఊఁ’’ అంటూ హమ్‌ చేస్తూ పెద్ద సీసా మూత తీడానికి ప్రయత్నిస్తూ రంగరాజు… ఆ మూత రాక తిరుగుతునేవుంది… ‘‘థూత్‌ దీనెమ్మ’’ మళ్ళీ రంగరాజు బూతు.

‘‘ఇట్లాతే రాజా’’ అంటూ ఆ సీసాను దాదాపు లాక్కుని, మూతని పళ్ళ మధ్య కరిచిపట్టుకుని పటపట శబ్దం చేస్తూండగా మూతను లాగేశాడు నీలకంఠం. నాలుగైదు చుక్కలు ఒలికి కారింది విస్కీ…. రూమంతా ఒక్కసారి వాసన కమ్మింది.

శ్రీమన్నారాయణ బీడీపొగ

మిరబ్బజ్జీ ఘాటూ…

విస్కీవాసనా…

గది ముక్కవాసనా కలసి కాక్‌టెయిలయి…

శ్రీమన్నారాయణ ఫోను ‘కుయ్‌’ మంది. మెసేజ్‌ అయివుంటుంది… డిస్ల్పేనిండా సర్రియలిస్టిక్‌ ఆర్ట్‌లాగా గీతలు…

కీ ప్యాడ్‌ మీది కీస్‌ తీవ్ర వాడకంతో అరిగిపోయి సగం సగం అక్షరాలూ అంకెలూ కనబడ్తూ ఏదో పురా నాగరిక లిపిలాగా… కీస్‌ మధ్య పేరుకున్న మట్టితో… అది పన్జేస్తూన్న ఫోనంటే ఆశ్చర్యం కలిగేలా… మేసేజ్‌ని కళ్ళు చిన్నవి చేసి చదూకొంటున్న శ్రీమన్నారాయణ… అతన్దగ్గరున్న పెద్ద ఫోను దాచుకోడం చూసాన్నేను…

‘‘ఫ్చ్‌ మైత్రి రాటంలేదుట…. ఈ రోజు ఫరీదా ఘజల్‌ ‘ఆజ్‌ జానేకి జిద్‌ నాకరో’ లేనట్టనమాట… మిరబ్బజ్జీలే నంజుడుకు కానిద్దాం’’

చాలా గొప్ప నిరాశ అతని గొంతుకలో…

ఆ అమ్మాయి మైత్రికీ ఈనకీ పాతికేళ్ళ వ్యత్యాసం… వాళ్ళ మధ్య వున్న సంబంధమెలాంటిదో ఊహించడం కష్టం…

ఆ అమ్మాయి వచ్చీరాంగానే యీన మెడచుట్టూ చేతులేసి గట్టిగా కౌగిలించుకుంటుంది…. అందరి ముందూ భర్తముందు కూడా…

అప్పుడు శ్రీమన్నారాయణ కళ్ళలో మెగు చూడాలి. అచ్చు ఓ కుర్రాళ్ళా అనిపిస్తాడు..

మైత్రి భర్త దాసు ఓ సెల్ఫ్‌సర్వీసు క్యాంటీను నడుపుతూ ఓ మూడు ఆటోలూ ఓ కారూ అద్దెకు తిప్పుతుంటాడు… ఆ అమ్మాయి ఓపెన్లో తెలుగెమ్యే చేస్తోంది.

నల్లగా వున్నా పెద్దపెద్ద కళ్ళతో… నున్నటి శరీరంతో తలనిండా వెంట్రుకల్తో అన్నింటికన్నా అతి ముఖ్యమైన కమ్మని కంఠంతో… అందగత్తెల్లోకే లెక్క…

ఈ భార్యాభర్తలకి శ్రీమన్నారాయణ పరిచయమెట్లా అయ్యిందో నాకు చూచాయిగా తెలుసంతే… మైత్రి మరాఠీ అమ్మాయి. ఇక్కడే చదివింది. శ్రీమన్నారాయణ తనకు తెలుగు చెబుతాడు. దాసుకు గూడా శ్రీమన్నారాయణ మాటలంటే యిష్టంలాగే కనబడుతుంది.

 

(మళ్ళీ  వచ్చే  వారం)

కాశీభట్ల వేణుగోపాల్ @9550079473

ఆత్మని పలికించే గానం

 

 

రేఖా జ్యోతి  – సరస్వతీ ప్రసాద్ 

~

 

“అతని పాడెదను అది వ్రతము” అంటూ అన్నమయ్య సంకీర్తనలను” అన్ని మంత్రములు” గా జపిస్తూ ఆ “షోడశ కళానిధికి షోడశోపచారములు” చేస్తూ “వినరో భాగ్యము విష్ణు కధ” అని మధురానుభూతిని మధురంగా ఆలపిస్తూ, సంగీతాన్ని సాధనంగా మలచి ఎందరినో భక్తి మార్గంలోకి మళ్ళించిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ధన్యజీవులు. అన్నమయ్య పాట  అనగానే మొట్టమొదటగా మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి  శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఎన్నో అన్నమయ్య పదకవితలకు చక్కని బాణీలను కూర్చి అతిసులభంగా శ్రోత యొక్క మనసును, బుద్ధినీ స్వామీ వైపు నడిపించినవారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్య కీర్తనలపై గల మక్కువతోనే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారిని తిరుపతి రప్పించుకొని తన ఆస్థానంలో కొలువిచ్చి తన సేవ చేయించుకుంటున్నారు.

అన్నమయ్య దివ్యాశీస్సులతో ప్రసాద్ గారు ఆణిముత్యాల వంటి పదకవితలకు ప్రాణం పోసి మనకు అందిస్తున్నారు. ఇది ప్రసాద్ గారి పూర్వజన్మ పుణ్యఫలం. మనందరి భాగ్యం.  నిరంతరం అన్నమయ్య సాహిత్యాన్ని చదువుతూ ఆస్వాదిస్తూ అందులోని అతి సూక్ష్మమైన లలితమైన బిందువు నుండి అనంతమైన భక్తి తీరాలకు తీసుకెళ్ళే బాణీలను అందిస్తున్న శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీత సాహిత్య రంగాలతో తన అనుభవాలను అనుభూతులను అభిప్రాయాలనూ ‘సారంగ’ తో ఇలా పంచుకున్నారు.

 

మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మాధుర్యం మీ బాణీదా, గొంతుదా

నా పాటలో ఏముందో ఇంకా నాకే తెలీదు, కానీ ఈ ఆదరాభిమానాలు చూసినప్పుడు మాత్రం ఏదో ఉందేమో అనిపించి ‘పాట’ విషయంలో నా బాధ్యతను మరింత బలపరుచుకుంటూ ఉంటాను. ఈ పాట ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది, ఆయనే శ్రద్ధగా కూర్చొని .. కూర్చిన బాణీలు ఇవి. కానీ వ్యక్తిగా ఒక మాధ్యమంగా నేను కనిపిస్తున్నాను కనుక అందరి మెప్పు నాకు చేరుతోంది.  పదాన్ని పలికే విధానమే శ్రోతకు గాయకుడి యొక్క సందేశం. అన్నమయ్య పాటలోని వెన్నెల ద్వారా సదా ఆ శ్రీనివాసుడనే చందమామ వైపు అందరి చూపు మరల్చే ప్రయత్నం నాది!  ఇరవై యేళ్ళ క్రితం ‘ఇక మీరు మాట్లాడనే కూడదు, మెడలో పలక తగిలించుకోండి’ అని అన్న డాక్టర్లు గెలవలేదు, నాతో ఇంకా పాడించుకుంటున్న ‘స్వామి’ గెలిచారు. ఈ శక్తి  నాది కాదు అని నాకు అనిపించినప్పుడు అది భగవంతుడిదే కదా… నా జీవితం ఈ ‘మిరాకిల్’ కి అంకితం  !!

సంగీత దర్శకుడే గాయకుడు అయినప్పుడు …

సంగీత దర్శకుడి ఒక ఊహకు తన గాన కళతో, సంగీత ప్రజ్ఞతో, మధురమైన కంఠంతో ప్రాణం పోస్తాడు గాయకుడు. సంగీత దర్శకుడి భావాన్ని తానూ అనుభూతి చెంది పూర్తిగా తన performance తో పలికించిన పాటలే ప్రాచుర్యంలోకి నేరుగా వెళ్ళగలుగుతాయి.  లలిత సంగీతం విషయంలో సంగీత దర్శకుడే గాయకుడు అయినప్పుడు ఆ మాధుర్యంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఊహ, కృషి రెండూ ఆ భావం పలికించడంలో సమాన పాత్ర పోషిస్తాయి కనుక. విలువ బాణీకి … ప్రశంసలు గాయకుడికి లభిస్తాయి. పాడేటప్పుడు గాయకుని యొక్క మనసు ఒక ఆనందాన్ని మించి మరొక ఉపశాంతికి చేరుతుంది … అది అతని పాటలో స్పష్టమైపోతుంది. ఈ లక్షణం గాయకుడి దగ్గరున్నప్పుడు శ్రోత అక్కడే కట్టుబడి పోతాడు.

GBK3

ఎలాంటి పాటలు  చిరకాలం నిలిచిపోతాయి ?

కొన్ని  కీర్తనలు సాహిత్యానికి రూపం ఇచ్చే క్రమంలో నిర్మితమైన బాణీలు, కొన్ని స్వరాలని ( Notes) పలికించడానికి నిర్మితమైన బాణీలు,మరికొన్ని భావ నిర్మితమైన బాణీలు.ఒక కీర్తనని స్వరస్థానాల మీద, కట్టుదిట్టమైన నోట్స్ మీద శాస్త్రీయంగా ట్యూన్ చేసినప్పుడు ఎవరు పాడినా అదే నోట్స్ అనుసరిస్తారు కనుక అలాంటి బాణీలు చొరవగా రక్తికట్టే అవకాశం ఉంది. కానీ లలిత సంగీతం అలా కాదు … భావమే మేటిగా పలుకుతూ ఉంటుంది, పెర్ఫార్మన్స్ మీద ఆధారపడుతుంది. పాడేటప్పుడు శ్రుతి, లయ, భావం, స్పష్టత కలిసిన ఒక పూర్ణత్వం ఉంటే ఆ పాట పది కాలాలు నిలిచిపోతుంది ఖచ్చితంగా !

ఘంటసాల పాడిన ఆ ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో – రావణాసురుడు కైలాసాన్ని లేపుతున్నప్పుడు ఆ స్తోత్రం ఎట్లాంటి శక్తితో ఉంటుంది..!  అర్కెష్ట్రా కూడా అంతగా ఉండదు .. కానీ భావం మొత్తం ఆ గొంతులోనే పలుకుతుంది. విన్న ప్రతీసారీ నన్ను రోమాంచితుడిని చేస్తుంది. “శివ శంకరీ …”, “మాణిక్య వీణా ..” లాంటివి వింటుంటే ఆశ్చర్యం. అది ఘంటసాల పాటకు చేసిన అత్యుత్తమ న్యాయం. ట్యూన్ ని మాత్రం ప్రెజెంట్ చేయడం కాకుండా పాడేటప్పుడు ఒక fullness … పరిపూర్ణతను భావంతో జొడించగలిగితేనే ఆ పాట రాణిస్తుంది. అంటే ఆ గొంతులో  రాణించిన అన్ని పాటల్లోనూ ఈ టచ్ ఉందని అర్ధం ! ఈ స్పర్శ లేని పాటలు బాహుళ్యం కాలేదు. గొంతు ఆ గాయకుడిదే .. కానీ ఆత్మ నిండుగా ఉన్న పాటలు రాణించాయి. మనసు – భావం లగ్నం చేసిన బాణీలు స్థిరంగా నిలిచిపోతున్నాయి అని !

గాయకుడికి సంగీత జ్ఞానం అవసరమంటారా?

             ప్రతీ గాయకుడికి కనీస సంగీత జ్ఞానం ఉండి తీరాలి. లేదంటే గాయకుడి యొక్క బాధ్యత పెరుగుతుంది,  పాడగలిగే ఆ వైశాల్యం పరిమితంగా ఉంటుంది. అంటే అన్ని రకాల పాటలు పాడలేడని అర్ధం. సంగీతజ్ఞానం లేకుండా పాడేటప్పుడు ప్రతీ వాక్యంలో, పదంలో, స్వరంలో భావాన్ని పెట్టాల్సి వస్తుంది. అది బాధ్యతతో కూడుకున్న పని కదా? అదే సంగీత జ్ఞానం తోడై ఉంటే 50% భావం చూపించి మిగతా 50% బాణీని నోట్స్ మీద నిలబెడితే చాలు… అది పాటని నడిపిస్తుంది. మూడవ అంశం మాధుర్యం. ఇది ఏమిటంటే సంగీత జ్ఞానం, భావం రెండూ అమరినప్పుడు శ్రోతని ఇక కదలనివ్వని అంశం. ‘గొంతు బాగుండడం’ అనే విషయం ఈ చివార్న సహాయ పడుతుంది అని నా అభిప్రాయం!
మహా మంత్రి తిమ్మరుసు – సినిమాలో యస్. వరలక్ష్మి భావం కంటే కూడా ఒక talented expression తో పాడిన పాట ‘తిరుమల తిరుపతి వెంకటేశ్వరా …. ‘ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆమె సంగీత జ్ఞానం ఒక ఆణిముత్యాన్ని ఆమె ఖాతాలో అలవోకగా వేసినట్టయ్యింది కదా !

GBK-SP-RJ2

అన్నమయ్య సాహిత్యానికి సంగీత బాణీలు కూర్చేటప్పుడు కలిగిన మీ అనుభవాలు… !!

             అన్నమయ్య తన సాహిత్యాన్ని – సంగీతంతో కంటే కూడా ఆత్మతో పలికించే ప్రయత్నం చేశారు. ఆ రచించిన కీర్తనల సంఖ్య ముప్పై రెండు వేలు అంటే సామాన్యం కాదు! ఆయన ఎన్నుకున్న కొన్ని రాగాలు,  సాహిత్యాన్ని తాళానికి వదిలే పధ్ధతి చూసినప్పుడు అన్నమయ్య ఎంత ప్రత్యేకమైన పోకడకి ప్రయత్నించారో తెలుస్తుంది. ఆయన సుసంపన్నమైన జీవితకాలం 95 సంవత్సరాలలో ఆయన సంకీర్తనలే కాక ఎన్నో రచనలు చేశారు, ద్విపదలు, శతకాలు, సంకీర్తనా లక్షణ గ్రంథం మొదలైనవి  రాశారు. నాకు వీలైనంత వరకూ అన్నమయ్య  తన సాహిత్యం వద్ద ప్రస్తావించిన రాగంతోనే బాణీ కట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. బాణీ పూర్తయ్యేటప్పుడు లోపల అనిపిస్తుంది ‘బహుశా అన్నమయ్య ఊహ ఇదేనేమో ‘ అని!

కొన్ని బాణీలు పూర్తి కావడానికి నిమిషాలు తీసుకుంటే, మరికొన్ని బాణీలు పూర్తి అయ్యేందుకు కొన్ని సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి.

త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్ వంటి వాగ్గేయకారుల కృతులకు ఒక పటిష్ఠమైన structure ఉంది. అందుకే అది ఒకరు పాడుచెయ్యగలిగేది కాదు.. వాటి వైభవం వాటి కూర్పే! ఆ కీర్తనల్లోని ఎత్తుగడ, పోకడ, సాహిత్యం, భావం .. దేనికదే!! ఆ సాహిత్యం చదువుతున్నా కూడా బాణీ మన లోపల పలుకుతూనే ఉంటుంది ఒక నీడలాగా …, ఆ involvement వల్ల కలిగేదే  మోక్షము.

కీ. శే. శ్రీ నేదునూరిగారితో మీ అనుబంధం, అన్నమయ్య సంకీర్తనల కూర్పులో ఆయన ప్రభావం 

మా గురువులు కీ.శే. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. ఆయన స్వరపరచిన అన్నమయ్య సంకీర్తనలకు లోతైన శాస్త్రీయ శోభను అద్దారు, అవి వినినంత మాత్రమునే సంగీతం చాలా వరకూ నేర్చుకోవచ్చు. సంగీత జ్ఞానం పెంచుకోవచ్చు. అంటే మిగతా వారి బాణీల్లో సంగీతం లేదని కాదు కానీ, ఇక్కడ ఒక తేలికపాటి అందమైన సంగీతపు పలుకు మా గురువుగారి బాణీల్లో ఉందని నా నమ్మకం. Notation చూస్తే వచ్చే పలుకు కాదు అది. ఆ గొంతులో ఒక్కమారు విని ఉంటే తెలిసే మాధుర్యపు కణిక. ఆయన పోకడ నా కంపోజింగ్ లో కనపడదు కానీ, నా లోపల దీపం వెలిగించింది మాత్రం ఆయనే! ఆయన ఒక టార్చ్ లైట్ వేశారు .. ఆ వెలుగులో నేను నడుస్తున్నందుకే నా సంగీతం ప్రపంచానికి కనబడుతోంది! నా గొంతు కంటే ఎంతోమంది గొంతులో ‘మాధుర్యం’ పాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ  .. రేంజ్ ఎక్కువ ఉన్నప్పటికీ నా పాటలో హృదయానికి, ఆత్మకీ తగిలేది ఏదో ఉందేమో! అందుకే చాలా మంది చాలా సార్లు నా కచేరీ అయిపోయాక ‘మా ఆయుష్షు కూడా పోసుకొని హాయిగా కలకాలం పాడండి’ అని దీవిస్తూ ఉంటారు. నిజానికి పాడగలిగే వయసులో ఇన్ని అవకాశాలు రాలేదు. ఇప్పుడు కంపోజింగ్ తోనూ .. పాడుకోవడం తోనూ … ప్రతి నిమిషాన్ని అపురూపంగా వినియోగించుకోవలసి వస్తోంది. మధ్యలో ఏడెనిమిది సంవత్సరాలు కంఠంలో అసౌకర్యం ఏర్పడింది. నా బాధ చూడలేక తిరిగి ఆ స్వామి ఇచ్చినదే ఇవాళ నా సౌకర్యమైన గొంతు. స్వామి దయ వలనే ఇవాళ ఇంత మందికి చేరువ కాగలిగి అందరి అభిమానం సంపాదించుకోగాలిగాను.

గాయకులుగా ఎదగాలనుకొనే వారికి మీ సూచనలు 

కొత్తగా సంగీతరంగంలోకి గాయకులుగా అడుగు పెట్టలనుకొనే వారికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఒక్కటే .. సరైన వెర్షన్ విని మన శక్తి వంచన లేకుండా, ఒరిజినల్ పాట స్థాయి తగ్గకుండా ‘బాగుంది’ అనుకొనేటట్టుగా పాడగలగాలి. సాహిత్యాన్ని అర్ధం చేసుకొని వినేవారికి కూడా అర్ధమయ్యేలా పాడగలగాలి.  స్వతహాగా సంగీతం మీద గాయకుడికి ఉన్న పట్టు, గొంతులోని లాలిత్యం, కమిట్ మెంట్ శ్రోతల్ని అలా పట్టేసుకుంటాయి. వైవిధ్యభరితమైన పాటలు పాడగలగాలి…. చాలు , ఇక వారి కృషే వారిని నడిపిస్తుంది.

‘అన్నమయ్య వరప్రసాద్’ అనే పుస్తకంలో నా ఈ సుదీర్ఘ సంగీత ప్రయాణాన్ని సవివరంగా పొందుపరచిన సోదరి యన్.సి. శ్రీదేవి కి ఇవాళ మరోసారి కృతజ్ఞతలు.  ఎక్కడో ఖండాంతరాలలో కూడా తెలుగు భాషకు ప్రాణం పోస్తూ, తెలుగు భాష మీద ఎంతో మందికి ఆసక్తిని కలిగిస్తూ, తెలుగు సాహిత్య వృద్ధికి సేవలు అందిస్తున్న ‘సారంగ పత్రిక’ సారధులకు నా అభినందనలు..  ఆశీస్సులు !!

*

క్యాంపస్

rafi1

Art: Rafi Haque

 

-ప్రసాద మూర్తి

~

 

మా పక్కనే క్యాంపస్ ప్రవహిస్తుంది

దాని పక్కనే మేం శిలల్లా నిద్రిస్తాము

అప్పుడప్పుడూ

కలలు మోయనంతగా రెప్పలు బరువెక్కినప్పుడు

రెక్కల గుర్రాలను చూడాలని

క్యాపంస్ కి వెళతాను

దేహమంతా రంగుల అద్దాలు అతికించుకుని

లోపల రక్తాన్నితిరగమోత పెట్టుకుంటాను

అప్పుడు క్యాంపస్ నా వీపు మీద

గాఢమైన ముద్దు పెడుతుంది

అది ఛాతీ మీద ముద్రగా బయటకొస్తుంది

 

యూనివర్సిటీనీ సముద్రాన్నీ

అటూ ఇటూ రెండు చేతులతో పట్టుకుని

విశాఖ వియత్తలం మీద

విహరించిన విరగబాటు

ఘాటుగా నరాల్లో కమ్ముకున్నాక

కూర్చుంటాను కుదుటపడతాను

క్రిక్కిరిసిన చుక్కలతో పగలూ రేయీ

పాటలు పాడే ఆకాశంలా క్యాంపస్ పక్కనే వుందని కాని

ఈ కాళ్ళకింద ఇన్ని నదులెలా కదులుతాయి మరి

 

ఇప్పుడు క్యాంపస్ లో పక్షులు

పాటలు మానేసి

దేశభక్తి పరీక్షలు రాస్తున్నాయి

చెట్లు కూడా చప్పుడు చేయకుండా

గాలి చెవిలో జాతీయ  గీతాలు పాడుతున్నాయి

జీవన్మరణ పాకుడురాళ్ళ మీద

ఒక చూపుడు వేలు ఆజాదీ గీత రచన చేస్తోంది

చుక్కల్ని వెదుక్కుంటూ ఎటో వెళ్ళిపోయిన యువకుడు

అప్పుడప్పుడూ గాల్లో వేల నీడలుగా పరుగులు పెడుతూ

ఫకాలుమని నవ్వుతున్నాడు

కలం కుత్తుకల మీద కత్తులు నాట్యాలు చేస్తున్నాయి

క్రొన్నెత్తుటి కోనేటిలో మొసళ్ళు మసలుతున్నాయి

 

అక్కడ  నీలి ఆకాశాలూ ఎర్రసముద్రాలూ

అలాయ్ బలాయ్ ఆడుకుంటున్నాయని ఆనందపడతాను

మరిప్పుడు  ఊరి నుండి క్యాంపస్ దాకా

వెలివాడ కారిడార్ పరచిన ఆధునిక మనుహాసం  భయపెడుతుంది

 

పుస్తకాలు పట్టుకోవాల్సిన క్యాంపస్

ఇప్పుడు ఆయుధాలు పట్టుకుంటే

జీవితాన్ని పట్టుకుని ఇలా ఎలా వేలాడగలం?

——————-  ——————

( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే మేం వుండేది)

Together

 

mamata

Art: Mamata Vegunta Singh

-లాలస

~
~

నగరం మీదకు యుద్ధమై వచ్చిన వానలన్నీ సముద్రంలా ఇంకిపోయాక

కొత్తగా వస్తాయి ఆకాశాలు

 

మనం జీవితాల్లో మునిగిపోయి వాటినే తాగుతాము

ఇంక చాలు మేం అలిసిపోయాం నేనూ, నా హృదయమూ

 

మేం పుస్తకాలు చదివాం, పాటలు విన్నాం, మనుషులతో మాటాడాం

కలమూ పట్టుకుని పట్టుబట్టాక రంగులేమో ఎగరవు

 

తడికి తడిసిన కాగితం మీద విడిపోయిన సిరా పదాలతో

ఇక్కడేం చేయాలి.. నేనూ-హృదయం కలసి ఏం చేయాలి

ఇక సూర్యాస్తమయం చూడాలని ఎవరు మారాం చేస్తారు నేనూ నా హృదయం కాక

ఒంటరి పక్షి ఒకటి మమ్మల్ని ఓరకంట చూడనే  చూసింది.

 

ఎవరూ లేని రాత్రి హృదయాన్ని  గాలికి  వదిలేసి నేను సంగీతంలో మునిగాను

హృదయం తన వేయి కళ్ళు మూసుకుని

హృదయం తన వందల నోళ్ళను కట్టేసుకుని

జిగేలుమనే హృదయం- భగ్గుమనే హృదయం- ముక్కల్లా అతికిన హృదయం

చేతుల నిండా పని బడిన ఉదయం

చరిత్రల చిట్టాలను మరిచే హృదయం

తన ఇల్లు లేని హృదయం

తన  వాకిలి తట్టేదెవరో ఎదురుచూసే హృదయం

విసుగేసి రంగుల సినిమాలు చూసే హృదయం  తన తలుపులేసుకుని ఒక దట్టమైన పొగలా మారింది

చిన్ని అబద్దపు సవ్వడి గుసగుసలా చిన్న పురుగులా ముడుచుకుంటుంది

తన సంగతే మరచిపోతుంది

 

నేనూ హృదయం మళ్ళీ గదిలో నిద్రలేచి చదువుతాం ఉత్తరాలను, సుదీర్ఘ ఉత్తరాలను, పుటలను, పాటలను…

అయినా ఆ గదికి నేనంటే ఆసక్తి లేదు ఎందుకంటే నేను తిలక్ ను కాను.

 

ఇది ఒక బతుకు కవిత. హృదయం రక్తికెక్కిన నాటకం

ఇంతకు ముందు నిన్నెక్కడ కలిశాను చూశాను అని నాతోనే హృదయం అంటుంది

వానలో తడిసిన నున్నటి రాయిలా నేనూ నీలానే తడీ పొడిగా ఉన్నాను అని కూడా చెబుతుంది.

 

అయినా

హృదయమెపుడు రాంగ్ టర్నే తీసుకుంటుంది

పక్క చూపులతోనైనా చూస్తానంటుంది

పూలను..  కలలను… పూల కలలను…కలల పూలను

*

 

 

బాధాపుష్పం.

mandira

Art: Mandira Bhaduri

-వాసు 

~

 

కమలం సూర్యుడినీ కలువ చంద్రుడినీ చూసి వికసిస్తాయని కవులు చెబుతారు
ఈ బాధాపుష్పం నన్ను చూసి వికసిస్తోందేంటి
దీని కోసమే నేను పుట్టినట్టు.
స్వచ్ఛమైన కన్నీటిచుక్కని నా పసిబుగ్గలపైనైనా ఎన్నడూ ఎరగను.
ఈ బాధాపుష్పం మాత్రం తన రేకలని నాకు తాకించింది
దానికీ కన్నీటిచుక్కల్ని కోల్పోవడం తెలుసేమో
లేకపోతే నీకోసం నేనున్నానంటూ ఎందుకొస్తుందీ?
పగటి అనుభవాల పోగులన్నీ రాత్రికల్లా పీడకలల్లా మారడం తెలిసినవాడికి
ఈ బాధాపుష్ప సాహచర్యం ఒక దైవదత్త వరం కదూ
ఈ పరిమళాఘ్రాణమే బరువెక్కిన కళ్ళవెనకని కారని కన్నీటిచుక్క చెలి కదూ
ఎన్నేళ్ళని చూస్తున్నాను
ఎన్ని ప్రేమామృతధారల్ని నేను వర్షించినా
విషసర్పాలు వెయ్యినోళ్ళతో తాగేసి వేయిన్నొక్క దంష్ట్రతో నన్ను కాటేస్తాయి
నొప్పి తెలుస్తుంది కేక పెట్టలేను.
ఎంత సహజ హరితాన్ని పూచిచ్చినా
ఏదో మాయాగ్రీష్మం ఎండగట్టేస్తోంది.
నాకు నమ్మకం చావదు కదా!
పునరపి.
ఎడారికి ఒయాసిస్ చెమర్చిన కన్ను
సరిగ్గా ఈ బాధాపుష్పం నాకూ అంతే
ఇదే లేకపొతే
నేనొక మొండిచెట్టుని
దీన్ని భక్తిగా కళ్ళకద్దుకుంటాను ప్రతిరోజూ పూజగదిలో మంగళాశాసనం తదుపరి
అప్పుడు నాకు నేనే ఒయాసిస్‌ని.

*

సయొనర ఇక.. చెరిగేనా?

 

 

-ఆర్.  దమయంతి 

~

 

‘మన భాషని మనం గౌరవించుకోకపోతే ఎంత తప్పో, మాతృ భాషలో కొన్ని అగౌరవ పదాలని సరిది ద్దుకోపోతేనూ  అంతే తప్పు ‘అని ఋజువు చేస్తున్నారు – కొన్ని దేశాల  ప్రజలు.

ఇక మన మాతృ భాష మాటకొస్తే – మనం మాట్లాడే తెలుగుభాషలో తెలుగుదనమెంత అనేది ఎప్పటికీ పెద్ద ప్రశ్నే. ఈ అంశం పై వాదించుకుంటూ పోతే ఒక యుగమైనా సరిపోదు.

చాలా తెలుగు పదాలు మరుగున పడిపోయిన మాట వాస్తవం. నేను చెప్పేది కేవలం మాట్లాడే మాటల్లో ధ్వనించే భాష గురించి. ఇక రాయడం లో ఐతే – భాష ఎంత సహజం గా వుంటే అంత హాయిగా, సౌకర్యం గా  వుంటుంది చదువరులకు అనే అభిప్రాయానికొచ్చేసాం.

తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకుని కథో, వ్యాసమో తయారు చేసినా..అది అతుకుల బొంత లానే వుంటుంది. అక్కర్లేని ఆర్భాటాలతో –  పెళ్ళి చూపులనాడే పెళ్ళి కూతురిలా తయారై వచ్చిన అమ్మాయి అసందర్భపు అలంకరణ లా ఎబ్బెట్టనిపిస్తుంది. అఖ్ఖర్లేని ఆ ఫోజు లో –  రచనలోని భావం అడుగంటిపోయి చికాకు పుట్టిస్తుంది. పర్యవ సానం గా – పుస్తకం మూత పడిపోతుంది.

ఇంగ్లీష్ పదాలు నాలుగు ఎక్కువేసినా ముందుగా మనకు ఎదుటివారి భావం  అర్ధం కావాలి..

ఉదాహరణకి : ” – ఆమె ఇన్వైట్ చేస్తే పార్టీ కెళ్ళాను. కలిసి డిన్నర్ చేసాం. ఓకే? చిట్ చాట్ చేసుకున్నాం. ఏవో జెన్రల్ టాపిక్స్. అంతా అయ్యాక,  కారులో ఆమెని ఇంటి దగ్గర దింపాను. ఓకే?  ఒకరి కొకరు బై బై , గుడ్ నైట్లు చెప్పుకుని విడిపోయాం. అంతే. దట్సాల్. ” అని అన్నాడురా. ఇదంతా నాకెలా తెలిసిందంటే..నిన్న ‘ఈవినింగ్’ శ్యాం కలిసి చెప్పాడు. అంతకు మించి – తమ ఇద్దరి మద్య ఏమీ జరగలేదు, ‘డొంట్ వర్రీ’ అని కూడా అభయమిచ్చాడు.” –

” ఒహ్హో!.. కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పొద్దనూ! ‘ ఎగ్జాక్ట్లీ వాట్ హాపెండ్’ అన్నది నాకు తెలుసు. – ” సెటైరేశాడు సోమనాధం.

ఇక్కడ మనం గమనించాల్సింది, వీళ్ళు తెలుగు ని ఎంత గొప్పగా మాట్లాడుతున్నారన్న సంగతి గురించి. :-)

వినేటప్పుడు భలే ఆసక్తి కరం గా వుంటుంది. ఆ తర్వాత ఏమైందా అనేంత ఉత్సుకత రేగుతుంది.

కానీ ఇదే సన్నివేశం కథలో రాసేటప్పుడు కొంత ఆంగ్ల భాగం వెళ్ళి పోతుంది. మరి కొంత తప్పని సరి గా మిగులుతుంది. కారణం, ఆంగ్ల పదాలకు సరితూగు పదాలు మన భాషలో లేక కాదు. కాని అవి అతకవు.  కొన్ని సార్లు చాలా ఇబ్బంది పెడతాయి.  కారణమేమిటంటే –  ఆంగ్ల పదాలు  మన నోట్లో ఎక్కువగా నానడం వల్ల, సంభాషణల్లో ఎడా పెడా అతిగా ఆంగ్లం వాడటం వల్ల. వాగడం వల్ల కూడా! ఇంగ్లీష్  మీడియం లో చదువులు ఎక్కువైపోవడం వల్ల… – పాఠకులకు స్వచ్చమైన తెలుగు మింగుడు పడదు. కాబట్టి రచనల్లో ఆంగ్ల పదాలకు  చోటివ్వడం తప్పనిసరైపోతోంది.

అదే అలవాటైపోయింది. రాన్రాను ఈ పోకడ ఇంకా ఎక్కువైపోతోంది కానీ తగ్గడం లేదు. ఒక తెలుగు పదానికి బదులు ఆంగ్ల పదం జేర్చడం వల్ల రచన వన్నె తేలే అవకాశమూ లేకపోవట్లేదు.

sayanora..

మన మైథిలి గారు – ‘అబ్సెషన్’ కి సమానార్ధం కల తెలుగు పదాన్ని సూచించవలసిందిగా కోరారు. అందరం తలో ఒక అర్ధం చెబుతున్నాం కానీ ఇంకా అసలు అర్ధం చేజిక్కలేదు.

కారణం? –

“అబ్సెషన్ అంటే..అబ్సెషనే ఇంకేముంటుంది?”-  అని విసుక్కుంటూ కనిపిస్తున్నారు మా ఇంగ్లీష్ లెక్చరర్. (ఆయన్ని కష్టమైన పదాలకు తెలుగు చెప్పమని అడిగినప్పుడల్లా ..నొసలు చిట్లించి ఇలా.. అంటుండే వారు. ఆయన డైలాగ్ గుర్తొచ్చి నవ్వొస్తోంది.)

అంటే రచనల్లో చాలా ఆంగ్ల పదాలొస్తున్నాయంటే మరి – ఆ యా స్థానాల్లోంచి – తెలుగు పదాలు       తప్పుకుంటున్నట్లే కదా.  వాడుకలో- విస్తృత  తగ్గినట్టే కదా! అందుకేనేమో ‘అలు, అలూ’ – అక్షరాలకి స్వస్తి పలకడం జరిగింది?

మాటల్లో నువ్వెన్ని సార్లు  రోడ్డు రైల్ అనే పదాలు వాడవన్నది నా వాదన కాదు. వాటిని  తెలుగు లో రాయడం లేదెందుకన్నది  అసలు పాయింట్.

రాస్తే చదవబుధ్ధి కాదు. (వ్యక్తిగతం గా చెప్పాలంటే నేనెప్పుడూ రోడ్  అనే రాస్తుంటాను) ఎందుకంటే – ఎక్కడో        అసహజత్వం  కొట్టొస్తూ కనిపిస్తుంది – తెలుగు లో.  పంటి కింద రాయి లా  కసుక్కు మంటుంది. ఇక పాఠకుని పరిస్థితి ఎలా వుంటుందంటే –  కాల్లో ముల్లు గుచ్చుకున్నాక చెప్పులేసుకుని నడవడం లా వుంటుంది. ‘ఇది ఇలానే వుంటుంది. నువ్వు భరించాలి. మన భాష కి వంకలు పెట్ట కూడదు. నొప్పున్నా భరించాల్సిందే ..’ అని చెప్పలేం కదా పాఠకులకి.

మన పెరటి చెట్టే కదా అని,  వేపాకు పచ్చడి చేసుకుని తినలేం. ఇది సత్యం. నేననుకుంటూ ఉంటాను. మనం మనం అని కులానికో మతానికో ప్రాంతానికో దేశానికో జాతి వివక్షత కో ఓటేసుకుని తృప్తి గా బ్రతికేస్తున్నామని. కానీ..అంతర్లీనంగా మనం జీవిస్తోంది వేరే ప్రపంచం లో.  మనం నిజంగా మెచ్చుకుని హృదయంతో స్వీకరించేది  సౌందర్యాన్ని. సౌందర్యారాధనలో విశ్వమంత హృదయాన్ని కలిగి వుంటాం. అందులోనే శాంతిని పొందుతాం. గీతాంజలి రాసింది బెంగాలీ అని ఊరుకుంటామా?  సోక్రటీస్ గ్రీక్ అని వొద్దనుకుంటామా? షేక్స్పియర్ ని కళ్ళకద్దుకున్నా, మిల్టన్ ని మనసులో కొలుచుకున్నా..మాతృ భాషకి సంబంధించిన వారనా? కాదు.

muslim women

సాహిత్యం లో మనకు భాషా భేదాలు లేవు. సుందరమైన ఏ సాహిత్యాన్నైనా అవలీలగా ప్రేమించేస్తుంటాం. ఆరాధిస్తాము అంటే అర్ధం – అందులోని భావ సౌందర్యానికి మనం  బానిసలం అన్నమాట.

అంటే – మన మాతృ భాషని వదిలేయం. కానీ నచ్చిన పర భాషా పదాలెన్నైనా సరే..ఇష్టం గా అక్కున చేర్చుకుంటాం.అది నిన్నటి వరకు జరిగిన సంగతి.

నేడు జరుగుతున్న కొత్త సంచలన సత్యం ఏమిటంటే – మాతృ భాష ఎంత ప్రియమైనదే అయినా.. అందులోని కొన్ని పదాలు – ప్రమాదాలకు దారి తీస్తున్నప్పుడు వాడుకలోంచి బహిష్కరించడమే శ్రేయస్కరం అని పట్టు బడుతున్నారు ప్రజలు.  తీసేయకపోతే – బ్రతుకు లేదన్నంత గా వ్యధ చెందుతున్నారు.  కారణం – మాతృ భాషా పదాలు తమ జీవన విధానానికి ఆటంకం గా వుంటం వల్ల, అసలు జీవితమే లేకుండా చేసేస్తున్నందు వల్ల. – ఏమిటీ? భాష పుట్టినప్పట్నించీ వాడుకై, వేయి నోళ్ళ పాకిన పదాలు ఉచ్చరించినంత మాత్రానే పాపం కలుగుతుందా అని  విస్మయం కలగ వచ్చు. కాని, ఇది నిజం.

‘మాతృ భాషే అయినా ఇక నించి ఈ  పదం మేం వాడం. రేపట్నించీ-  మావూలు గా మేం మాట్లాడుకునే మాటల్లోకి సైతం రానీయం.’ అని ఒట్టేసుకుంటున్నారు ప్రజలు.  పై పెచ్చు ఏమంటున్నారంటే – ‘..’ ఈ ఫలాని మాట చేర్చి మాట్లాడటం మాకు సిగ్గు గా వుంది. తలొంపులుగా వుంటోంది.  పెద్దలు ఏమన్నా అననీ, అనుకోనీ, మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ పలుకు ఎంత పవిత్రమైనదైనా సరే, అదెంత శిలా శాసనం లాంటిదైనా సరే మాకిక వద్దే వొద్దంటూ మొత్తుకుంటున్నారు. దయచేసి మతపెద్దల అంగీకారంతో  ఈ పదాన్ని రద్దు చేయండి.  తొలగించండి. వాడుక నించి బహిష్కరించండి. మాకు విముక్తిని ప్రసాదించండి.’ అంటూ వేడుకుంటున్నారు. పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. అదొక చట్టం గా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇది అధిక శాతం స్త్రీల ఆకాంక్షకి నిదర్శనం’ అంటూ కొన్ని లక్షల సంతకాలను సేకరిస్తున్నారు – ముస్లిం వనితలు.

అంత గా వారి పాలిట శాపమైన పదం ఒక్కటే  – త లా క్.

ఆవేశం లో ఈ ఒక్క మాటని 3 సార్లు  పలకడం వల్ల కలిగే దుష్పరిణామం ఎంత విషాద కరం గా వుంటుందో వుంటుందో

– ఒక మరపు రాని సినిమాగా మలిచారు నిర్మాత.  అదే – నిఖా.

https://www.youtube.com/watch?v=00F9HJlCzs8

 

మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల ఆత్మ పరిశుధ్ధి జరుగుతుంది.

దేవుడంతటి వాడు – తల్లి కోరితే జ్ఞాన బోధ చేసాడు.

‘తల్లి తర్వాత తల్లి వంటింది అయిన మన మాతృ భాషని కూడా సరిద్దుకోవడం లో తప్పు లేదు…’ అని నేననడం లేదు. జపాన్ ప్రజలు ఘోషిస్తున్నారు.

ఇలాటి బాధే జపాన్ ప్రజలకూ కలిగింది. వాళ్ళు వొద్దనుకుంటున్న ఆ పదం ఏమిటంటే – సయొనర.. ‘

భారతీయులకిది జపనీయుల భాష అనిపించదు. ఎందుకంటే మనకంత పరిచయమైనపదం. ఎలా అంటే – ‘సయొనర.. సయొనర ‘ అంటూ లతా మంగేష్కర్ స్వరం దేశం నలుమూలలా మార్మ్రోగి పోయింది కాబట్టి. సయొనర ఖ్యాతి అలాంటిది. ఐతే- అది నిన్నటి మాట. ఇప్పుడు తాజాగా – జపాన్ దేశ ప్రజలు – 70 శాతానికి పైగా  ఏమంటున్నారంటే – అసలీ సయొనర  ఊసే ఎత్తొద్దని వాపోతున్నారు.

ఈ పదం పట్ల అంత వ్యతిరేకత వెల్లువెత్తడానికి కారణం?  ఈ పదార్ధం – నెగిటివిటీని సంతరించుకుందని మూకుమ్మడిగా అభిప్రాయపడుతున్నారు.  వీరిలో యువత ప్రాముఖ్యత ఎంతైనా వుందని చెప్పాలి.

‘సయొనరా  – అంటే గుడ్ బై అని అర్ధం. ఇది తాత్కాలికమైన గుడ్ బై వంటిది కాదు,  ‘శాశ్వతంగా ఇక సెలవ్’ అనే అర్ధం తో కూడి వుందట.

గుడ్ బై టు సయొనర :

********************

* నాకీ పదం పలకడం ఇష్టం వుండదు. ఎందుకంటే మా కలయిక – ఈ మాటతో అంతమై పోతోందన్న బాధ కలుగుతుంది.

 

* సయొనారా చెప్పుకోవడం తో ఏమనిపిస్తోందంటే ఇక మేము మళ్ళీ కలవమేమో అనే కలవరాన్ని కలిగిస్తోంది. అందుకే, నేనిక ఆ మాటని నేనిక ఉపయోగించ దలచుకోవట్లేదు. సయొనర-  ఇదొక  కోల్డ్ వర్డ్ అనే భావన కలుగుతుంది.

* ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, మిత్రుల దగ్గర కానీ సయొనర కి బదులు నేనెప్పుడూ ‘సీ యు లాటర్’ అనే అంటాను తప్పితే, సయొనర అని అననే అనను.

 

ఇలా – మొత్తం మీద జపాన్ ప్రజలు ఎంతో పూర్వమైన ఈ పదానికి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఎలా అంటే ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ బై కి బదులు ఫేర్ వెల్ అని ఎలా అనరో – జపనీయులు కూడా ఇక మీదట  బైబైలే చెప్పుకుంటారట గానీ, తమ మాతృ భాషా పదమైన సయొనర ని నాలుక మీద రానీయమని నిర్ధారిస్తున్నారు.  అయినా, రేపు తిరిగి కలవబోతున్న ప్రియమైన వారితో సయొనర అని అంటమేమిటీ అర్ధం లేకుండా? అని ఆ పదం పట్ల తమ అయిష్టాన్ని మాటల్లో వెళ్ళగక్కుతున్నారు.

సయొనర అంటే వెంటనే గుర్తుకొచ్చేది జపాన్. భాషా చెక్కిలి మీద ఒక చక్కని సంతకమైన పదం భాషలోంచే తొలగిపోవడం ఎంతైనా విచారకరం. కానీ ప్రజలు వాదుకలో వ్యతిరేకిస్తున్నప్పుడు ఎవరైనా చేయగలిగేదేముంటుందనీ?

ప్రాచీన ఈ  జపనీ పదం ఇక గాల్లో కలిసిపోవాల్సిందేనా అనే బెంగా లేకపోలేదు మాతృ భాషా ప్రియులకి. నిజమే కావొచ్చు. ఎవరూ తిననప్పుడు ఆ పదార్ధం  ఎంత  తీయటి పాయసమైనా వండీ, వృధానే కదా!

అయితే స్వభాషలో సయొనర కి ప్రతి గా ఏమిటా అనే  ప్రశ్న తలెత్తక మానుతుందా?

ప్రజలకిష్టమై ఆమోదించిన పదమే ప్రజా పదం. అదే భాషా పథం. ఏ దేశ భాషా సంస్కృతి కైనా ఇదే సిధ్ధాంతం వర్తిస్తుంది.

ఆ మాట కొస్తే మన తెలుగు లో ఎన్ని సాంప్రదాయపు మాటల్ని మనం మానేశామని? మాటల్లోను, రాతల్లో నూ? (ఒకప్పుడు చాలా వాడుకలో వున్నవి, ఇప్పుడు మాయమైనవి ఒక  లిస్ట్ చేసుకుని చూసుకుంటె – ‘ ఔరా! ఎంత మార్పు’ అని అనిపించక మానదు. )

మనం మోసుకెళ్తున్న మాతృ భాష అనే బంగారపు మూటలోంచి  ఒక్క పదం జారి పడినా ఊరుకోవద్దు, సరే. కానీ, ఎన్ని పర భాషా పదాలొచ్చి చేరనీ, – మానుకోవద్దు. అంగీకరిద్దాం.

ఏమంటారు?

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పెంపుడు జంతువు

 

-అల్లం కృష్ణ చైతన్య

~

 

విపరీతమైన వర్షం..

అర్జునా.. అనుకోడానికి వీలు లేని విధంగా ఉరుములు మెరుపులు..

ఎందుకంటే పైన రాసిన తొమ్మిది పదాలు కూడా ఇంకా కనిపెట్టని రోజులు అవి.

మెరుపు మెరుస్తున్నదనే విషయం మెరుపుకి కాదు కదా దాని కన్నా ముందే వచ్చే ఉరుముకి కూడా అవగాహన లేని రోజులవి.

తిండి తిని మూడు రోజులయింది ఇవాల్టికి.

ముందర ఉరుకుతున్న జింక పిల్ల ని ఛేదింఛే బ్రహుత్కార్యం అనితర సాధ్యం అని తెలుసు. మెదడు వృధా అంటున్నది, మనసు పదా అంటున్నది.

మొత్తానికి జింక పిల్ల తప్పించక పోయింది.

మూడు రోజులక్రితం నిల్వ చేసుకున్న కొద్ది పాటి శక్తి నిల్వలు దేహంలో తరిగిపోయినై.

ఇంకా కొద్దిగా ఉరుకుదాం అనుకున్నడు వాడు.

ఇంచు కూడా కదలడానికి సిద్దంగా లేదు దేహం.

ఉన్న చోటనే నిట్టనిలువునా కూలిపోయిండు.

ఎంత కాలం గడిచిందో..

 

తడి తడిగా ఎదో స్పర్శ.. బంక బంకగా..

ఉన్నంతనే లేచి చూస్తె ఏ ప్రమాదం ముంచుక వస్తదో అని, మెల్లగ ఒక కన్ను తెరిచి చూసిండు.

స్పష్టమైన ఆకారం లేదు.

ఎవరో నాకుతున్నట్టు… తన మొహమంతా ఎదో జిహ్వ తాలూకు ఆచ్చాదన. .

చేతికి ఎదో తగిలింది.

తడిమి చూస్తె అర్ధం అయింది.. గట్టిగా ఉన్న పదార్థమే అని..

ఒక్క అడుగు ముదుకు పడితే తల పగలకోడదామనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు.

మెల్లగ రెండు కళ్ళు తెరిచి చూస్తె, చిన్న కుక్క పిల్ల.

తనలాగే దారితప్పిన జీవితం. మెల్లగ దగ్గర తీసుకున్నాడు వాడు.

గట్టిగ మొత్తుకునే ఓపిక లేదు దానికి, ప్రతిఘటించే శక్తి లేదు, దిక్కరించే తెలివి లేదు.

గుహలో వాడు, తను. చేవలేని రెండు జీవాలు.

 

***

కొన్ని మంచులు, కొన్ని ఆకురాలు కాలాలు గడిచినై. పెద్ద తోడేలు లాంటి ఆకారానికి మారింది అది. ఒకరిది బుద్ది బలం, ఒకరిది నాలుగు కాళ్ళతో వేగంగా వేటాడే కండబలం. ఇద్దరు కలిసి చేసే వేట బాగానే నడుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆకలితో పడుకున్న దాఖలాలు లేవు ఇద్దరికీ.

 

ఊహ తెలిసినప్పటి నుండీ వాడు ఒంటరి వాడే. వాని సమూహం ఉన్నదో లేదో కూడా వానికి తెలవదు. ఇద్దరి మధ్యా భాష లేదు. వల పన్ని సైగలతో వాడేదో చెప్తాడు దానికి. అది తరుముతూ చిన్నా చితకా జంతువులని వలలో పడేటట్టు చేస్తుంది. గుంటలు తవ్వి ఉంచుతాడు. ఒకటి రెండు సార్లు అందులో పడితే వాడు దాన్ని బయటకు తీస్తాడు. తను తప్ప వేరే జంతువేదయినా అందులో పడితే అది వాళ్లకు ఆహారమే. మెల్ల మెల్లగా ఇద్దరూ భాష లేకుండా ఒకరికొకరు సాయపడడం నేర్చుకున్నారు.

 

వేట, తిండి వరకే వానికి దాని మీద ఉన్న దోస్తానా. దానికి మాత్రం వాడే సర్వస్వం. బహూశా వానికి కూడా దాని మీద వాడు అనుకునేదానికన్నా ఎక్కువే అభిమానం ఉండొచ్చు కానీ ఆ విషయం వానికి తెలిసే అవకాశమే రాలేదు.

 

స్వతహాగా వాడు తెలివైన వాడు. జన్యువిశేషం ఉన్నవాడు. అది ఎంత మిత్రపాత్రమైనా వాడు దాన్ని ఒక మూర్ఖ జంతువుగానే చూస్తాడు. తను దానికన్నా ఎక్కువ అనే విషయం ఎప్పుడూ మరచిపోడు. కోపం వస్తే చెయ్యి, కట్టే, బండ కూడా చేసుకుంటాడు దాని మీద. కుయ్ కుయ్ మని తన అపరాధం ఏంటో తెలవకపోయినా వాని కోపాన్ని భరిస్తుంది కానీ అది వాని మీదకు తిరగబడదు. దానికి అదే ఏర్పరుచుకున్న ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అదెప్పుడూ పాటిస్తుంటుంది.

 

***

గత కొన్ని రోజులుగా ఎడతెగని విపరీతమైన వర్షం. ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి నేల మీద దాదాపు రెండు అడుగుల దాకా వర్షపు నీరు ఆగిపోయి ఉంది. ఎండిన ఆకులు నీటి ఉపరితలం మీద తేలుతూ ప్రవాహంతో పాటుగా ప్రయాణిస్తున్నై. ఎత్తుగా పెరిగిపోయిన చెట్ల నీడల వల్లనో, మబ్బు పట్టిన ఆకాశం వల్లనో గానీ కొద్ది పాటి వెలుగు తప్ప రవి కాంచేటందుకు పెద్దగా ఆస్కారం లేదు. పిట్టలు, ఉడతలూ లాంటి చిన్న స్థాయి జీవజాలం దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోయినాయి ఆ వర్షపు హోరుకి. దీంతో ఆహారం గోలుసుకి కొంచెం పైన ఉండే జంతువులన్నీ ఆకలితో అలమటిస్తున్నై. ఇప్పుడు బయటకు పోతే ఎంత ప్రమాదమో తెలిసిన వాడు కాబట్టి వాడు బయటకు పోయేందుకు సాహసించలేదు.

కడుపులో ఆకలి క్రూరంగా దహిస్తుంది. మనసు వద్దంటుంది. మెదడు కుక్కని పంపమని చెప్తుంది. ఉన్న చోట నుండి లేచి కుక్కని ఒక్క తన్ను తన్నిండు.

కుయ్ కుయ్ అన్నది. ఆకలి తో పాటు ఈ శారీరక బాధ కూడా బాధించలేదు దాన్ని. వాని నిస్సహాయత్వం అది అర్ధం చేస్కున్నది.

వాడు ఎడమ చెయ్ నోరు దిక్కు చూపి కుడి చెయ్ గుహ అవతలికి చూపెట్టి దాన్ని ఇకొక్క తన్ను ..

వర్షం, ఆకలి, కడుపులో వాని తన్ను ద్వారా రగులుతున్న నొప్పి అన్నీ మర్చిపోయి బయటకు పోయింది వేట కోసం.

***

ఎన్ని గంటలు గడిచినాయో.. కాలం లెక్క లేదు. బయటికి పోయిన జంతువు జాడ లేదు.

లోపాలున్నా, బయటకు పోయినా చచ్చే పరిస్తితి సమీపించే సరికి తప్పని సరయి బల్లెం తీసుకుని అతి కష్టం మీద చేతకాని ఆ దేహాన్ని లేవదీసుకుని బయటకు పోయిండు వాడు.

దూరంగా ఊళలు, గాండ్రింపులు అక్కడక్కడా వినవస్తున్నై. దాక్కుంటూ, పాక్కుంటూ ఒక్కో చెట్టూ దాటుకుంటూ చిన్నపాటి ఫలమో, జీవమో వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు వాడు.

 

వర్షం ఇంకా భీకరంగానే ఉన్నది. చాలా వరకు ఆ వర్షంలో నాలుగు అడుగుల ముందు ఎం జరుగుతుందో కూడా కనిపించడం లేదు.

ఎంత దూరం పోయినా ఏమీ దొరకలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు మీదకు ఒరిగాడు.

పొదల్లో ఎదో కనిపించింది. చిన్న కుందేలు లాగా ఉంది. దొరికిందిరా అనుకున్నాడు. ఒక్క ఉదుటున దాని మీద పది అందుకునే ప్రయత్నం చేసిండు. ఒక్క సెకన్ లో మొత్తం మారిపోయింది.

అది కుందేలు కాదు. ఆకలితో ఉన్న తోడేలు. గుబురుగా ఉన్న దాని తోకని పట్టుకున్నాడు కుందేలనుకుని. వెతకబోయిన ఆహారం తోకకి తగిలిన తోడేలు కొంచెం కూడా సమయం వృధా చేయలేదు. దాని తోక ఇంకా వాని చేతులో ఉండగానే వెనకకు తిరిగి వాని కాలు అందుకుంది. దాని నుండి తప్పించుకునేందుకు వృధా ప్రయాసలు చేస్తున్నాడు. అడవి పిక్కటిల్లే అరుపులు అరుస్తున్నా వర్షం హోరులో అవి ఎక్కువ దూరాన్ని చేరడం లేదు.

అప్పటికే చాలా రక్తం పోయింది. ఇంక అయిపొయింది నా పని అని వాడు పెనుగులాడడం ఆపెసిండు. స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. ఎదో పెద్ద అరుపు వినిపించింది. నల్లని ఆకారం ఎదో కనిపించింది. తరవాత అంతా చీకటి.

****

ఆ చీకట్లో ఎన్ని రోజులున్నాడో.. అలా ఎన్ని యుగాలు గడిచాయో.

మెల్లగా కళ్ళు తెరిచి చూస్తె పచ్చటి ఆకులు. కొద్ది కొద్దిగా రవి కిరణాలు. చెట్ల పైన, ఎదో అటవీ ఉపరితలం మీద ఉన్నట్టు అర్ధం అయింది వానికి. రాళ్ళూ రప్పలు, చెట్లూ చేమలు ఇదంతా తానెప్పుడూ చూడని అటవీ భాగం. తన దిక్కుగా పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక భారీ కాయం.

గుండె జారి పెద్ద లోయలో పడ్డంత పనయ్యింది వానికి. అదొక పెద్ద కోతి. కాకుంటే నల్లగా గుబురు గుబురుగా ఉంది. తానెప్పుడూ అలాంటి జాతిని చూళ్ళేదు. దాని ఒక్కో చెయ్యి కూడా తన కంటే పెద్దగా ఉంది. గుండె శరవేగంగా కొట్టుకుంటుంది. ప్రాణాలు అరచేతిలో ఉన్నాయ్.

అది దగ్గరకు వచ్చి ఒక వేలుతో తనని మెల్లగా పొడిచింది. బహుశా ఎంత ప్రాణం ఉందొ అని చూస్తుంది కావచ్చు. అసలే సత్తువ లేని ప్రాణానికి ఆ చిన్న పాటి పొడుపు కూడా నొప్పిగా ఉంది. చిన్నగా మూలిగాడు.

తానెప్పుడూ చూడని కొన్ని పళ్ళని ముందుకు తెచ్చి పడేసింది. తినమని చిన్నగా శబ్దం చేసింది.

మరు నిముషంలో అది తెచ్చిన ఆహారం అంతా మాయం చేసాడు వాడు.

పెద్ద బ్రేవ్ తరవాత వాని మెదడు కొంచం లోకం లోకి వచ్చింది. ఎక్కడ ఉన్నది ఏంటనేది అర్ధం అవుతుంది. తిండి పెట్టింది కాబట్టి ఈ కోతి హాని చేయదు అనే నమ్మకం కలిగింది.

మెల్లగా పోదాం అని దాని దిక్కే చూస్తూ చెట్టు కొమ్మ దగ్గరికి పోయే ప్రయత్నం చేసిండు వాడు. అది నిర్దాక్షిణ్యంగా వాడి చెయ్ పట్టుకుని మళ్ళీ వాడున్న దగ్గరికే తీసుకొచ్చి పడేసింది.

****

కొన్ని మంచులు కరిగిపోయినై. కొన్ని ఆకులు రాలినై. ఇద్దరూ కలిసి మెలిసి పండో ఫలమో వెతుక్కుని తింటూ ఉన్నారు.ఆకలి సమస్య లేదు, అది ఏ జంతువునీ చంపదు, వీన్ని చంపనివ్వదు. దయా కారుణ్యం అంటే ఏంటో నేర్చుకున్నాడు. తోటి జీవరాశిని గౌరవించడం నేర్చుకున్నాడు. అవసరం అయితే ఆత్మ రక్షణార్ధం తప్ప మరేతర జంతువుకీ హాని తలపెట్టని ఆ  కోతి స్వభావం నుంచి కొంత విచక్షణ అలవడింది.

ఇప్పుడు కొంత జంతుజాలం తనని చూసి భయపడి పారిపోవడం లేదు. తన జాతి, తన వర్గం, తనతో పాటుగా కలిసి మెలిసిపోయే జాతుల వర్గాల వ్యత్యాసాలు అర్ధం అవుతున్నాయి. ఒక రకమయిన కోడ్ తనతో కానవచ్చే జంతుజాలంతో పరస్పరంగా ఏర్పడింది.

అయినా ఏ జంతువుతో తమ సంబధం ఎలా ఉండాలనే దానికి కోతి గారే డెసిషన్ మేకర్.  పళ్ళు కోసుకోడానికి దాని చేతికి అందని చోట వీని చేతులు పనికి వస్తాయి. వీడు సాయం చేసినా, కలిసి ఆహారం సంపాదిస్తున్నా దాని ఆకారం, బలం ముందట వీడు చిన్న మూర్ఖపు జంతువు మాత్రమె. వేట లేని ఈ కొత్త చోట వీని వేట నైపుణ్యం కూడా వృధా అయింది. ఎక్కువ తక్కువల ఆలోచన వచ్చింది. నేను ఈ కోతికి కుక్కని అనుకున్నాడు వాడు.

అవసరం లేదు కావచ్చు, ప్రాథమిక ఆటవిక స్వభావం, వేట ఎదయితేనేమి. పళ్ళూ , ఫలాలూ .. ఇది జీవితం కాదు అనిపించింది వానికి. నా కుక్క.

మొట్ట మొదటి సారి వానికి నా అనేది అనుభవంలోకి వచ్చింది.

ఇద్దరం కలిసి గడిపిన ఎన్నో సంఘటనల సమాహారం అంతా కాళ్ళ ముందర కదలాడుతుంది. వాగుల్లో, పరుగుల్లో, వేటల్లో, ఆటల్లో .. ఆకలిలో, కష్టాల్లో, నష్టాల్లో..  చివరి సారిగా దాన్ని చూసినప్పుడు నిర్దాక్షిణ్యంగా తన్ని పంపించిన సంఘటన గుర్తుకి వచ్చింది. కళ్ళలో నీళ్ళు తిరుగున్నాయ్. వాటితో ఏం చేయాలో తెలవదు వానికి. మొట్ట మొదటి సారిగా వచ్చినై అవి.

 

కోతికి మనసొప్పలేదు. వాని కన్నీళ్లు దాన్ని కలవరపరిచినై. అది అటూ ఇటూ కొమ్మలు పట్టుకుని ఊగింది. వాడి దగ్గరికి వచ్చి కూచుంది. వాని కంట్లో ఇంకా కన్నీళ్లు కారుతున్నై.

అది కిందకు దిగే కొమ్మ దిక్కుకి చూపిస్తూ వాణ్ని తడిమింది.

వాడు నమ్మలేకుండా ఉన్నాడు. అప్రయత్నంగా దాని చెయ్ పట్టుకుని చిన్నగా ఒత్తిండు.

***

చెట్టు దిగి ఆపకుండా ఉరుకుతున్నాడు.

తనూ, తన కుక్కా , గుహా మాత్రమె మనసుల మెదలుతున్నై…

*

గోదావరి మళ్ళీ లేటు

చిత్రం: రాజశేఖర్

చిత్రం: రాజశేఖర్

 

-ఆర్. శర్మ దంతుర్తి

~

విశాఖపట్నం రైల్వే స్టేషను. సాయింత్రం ఐదింటికి ఇంకో అరగంటలో బయల్దేరబోయే గోదావరి ఎక్స్ ప్రెస్ ని సాగనింపడానికి సిద్ధమౌతోంది. ప్లాట్ ఫాం ని ఆనుకుని ఉన్న తూర్పు రైల్వే విద్యుత్ ఇంజినీరు వారి కార్యాలయం పక్కనే ఎస్ సిక్స్ కోచ్ ఆగి ఉంది. కోచ్ దగ్గిర నిల్చున్న కుర్రాళ్ళు గోల గోలగా కబుర్లు చెప్పుకుంటూంటే లోపల కూచున్న అమ్మాయిలు వాళ్ళ గోలలో వాళ్ళున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కుర్రాళ్ళు వేసుకున్న ఇండస్ట్రియల్ టూర్ కి ఎస్ సిక్స్ అంతా నిండిపోయి ఉంది. ఇద్దరు ముగ్గురు కుర్ర లెక్చరర్లు కూడా వస్తూండడంతో కుర్రాళ్ళకి అమ్మాయిల్తో మాట్లాడ్డానికి అంత వెసులుబాటు లేదు. బయటనుంచుని దొంగచూపులు చూడ్డమే.

కుర్ర ఇంజినీర్లకి చూపించడానికి ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా హైద్రాబాదులో మహీంద్రా వారి ఫేక్టరీ, రిఫ్రిజిరేటర్లు చేసే మరో కంపెనీ, పటాన్ చెర్వులో ఉన్న ఒక కెమికల్ కంపెనీ చూసుకుని మర్నాడు సాఫ్ట్ వేర్ కంపెనీ లన్నీ ఓ చుట్టు చుట్టాలి. ఇదీ ప్లాను. హోటళ్ళూ అవీ ముందే ఆన్ లైన్లో బుక్ చేసుకోవడం అయిపోయింది. ఇంటర్నెట్టా, మజాకా? ఇంకా ఫోన్లు వాడేది ఎవడు? గూగిలమ్మని అడిగితే క్షణంలో పదోవంతు చాలు ఎక్కడ హొటల్లో ఖాళీ ఉందో తెలుసుకోడానికి.  అయినా కుర్రాళ్ళు అమ్మా నాన్నలు లేకుండా బతగ్గలరు కానీ ఫోనూ, లేప్ టాపూ లేకుండా బతగ్గలరా? అందులోనూ లేప్ టాప్ చేత్తో పట్టుకుని ట్రైన్ ఎక్కితే పక్కనున్న జనాలు, రైతు బిడ్డలూ డంగై పోరూ? పని ఉన్నా లేకపోయినా ట్రైన్ బయల్దేరగానే ఓ సారి లేప్ టాప్ బయటకి తీస్తే చుట్టూ ఉన్న జనాలు కళ్ళు విప్పార్చి చూడరూ? ముక్కూ మొహం తెలియని వాళ్ళు లేప్ టాప్ కేసి అలా చూస్తే ఒరిగేదేమిటని అడుగుతారేం? అందరి ముందూ ఎంత గొప్ప! మొన్న మొన్నటి దాకా ఇంజినీరింగ్ లో అప్లైడ్ మెకానిక్స్ లోనూ, థర్మో డైనమిక్స్ లోనూ డింకీ కొడితే మాత్రం ఇప్పుడు కుర్రాళ్లందరికీ విజువల్ బేసిక్కూ, జావా వచ్చును కదా? అవి చాలవూ లక్షలు తెచ్చే ఉజ్జోగాలు రావడానికి? పోదురూ మీ బడాయి, ఏదో ఈ ఇంజినీరింగ్ డిగ్రీ అంటారు కానీ ఈ అప్లైడ్ మెకానిక్సూ, లాప్లాసు రూల్సూ, ఫోరీయర్ ట్రాన్స్ ఫార్మూ, కార్నో సైకిలూ తిండిపెట్టేవేనా? వాళ్ళు పాఠాలు చెప్పాలి కనక అలా చెప్తారు, మనకి కావాల్సింది కంప్యూటర్ ప్రోగ్రామింగు. ఎలెక్ట్రికల్ ఇంజినీరింగూ, వాళ్ళు చెప్పే ఆ ఇన్వర్టర్లూ, కన్వర్టర్లూ చదువుతూ కూచుంటే ఉజ్జోగాలు చేసినట్టే.

బయటనుంచున్న కుర్రాళ్ళలో ఒకడన్నాడు గట్టిగా “ఒరేయ్ అందరూ ఫోన్లూ, లేప్ టాప్ లూ తెచ్చుకున్నారా? వాటికి ఛార్జర్లు లేకపోతే మనం ఎందుకూ పనికిరాం మరి.”

పక్కనున్న లక్ష్మీ పుత్రొడొకడు సమాధానం చెప్పేడు, “ఓరి నాయనో చిన్న వైరు ముక్కలకే ఇంత రాద్ధాంతం ఎందుకురా? అవి తెచ్చుకోకపోతే హైద్రాబాదులో ఏ కొట్లో అయినా కొనుక్కోవచ్చు. యాభై రూపాయలు పారేస్తే చవకబారు ఛార్జరు దొరకదూ? నేను ఈ మధ్యనే రెండు మూడు కొన్నాను ఇంట్లో రూముకొకటి ఉంచుకోవడానికి. మన వాడకానికి అవి చాలవూ? పుట్టె మునిగిపోయిందేమీ లేదు.” నవ్వులు సాగాయి. కోచ్ లో కూర్చున్న అమ్మాయిలు కూడా నవ్వు కలిపేసరికి లక్ష్మీ పుత్రుడి ఛాతీ నాలుగంగుళాలు పెరిగింది.

“ఉన్న డబ్బై బెర్తుల్లో దాదాపు అందరం ఫోన్లూ, లేప్ టాపులు తెచ్చేసుకున్నట్టేనన్నమాట.”

“ఒరేయ్ నాయనా గట్టిగా అనకు. మన ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గారు వింటే వీటన్నింటికీ ఎంత పవర్ అవుతుంది ఎన్ని ఏంపియర్లు ఖర్చౌతాయ్ అన్నీ చెప్పమని క్లాసు పీకుతాడు. అసలే మనం వెళ్ళేది జాలీ ట్రిప్పుకి”.

మళ్ళీ నవ్వులు.

ఈ కబుర్లన్నీ దూరంగా నుంచుని వింటూ వీళ్ళనే గమనిస్తున్న రైల్వే లైన్ మేన్ అప్పన్న లోపలకి పరుగెత్తుకుని వెళ్ళి ఏదో చెప్పాడు.  అక్కడే ఉన్న రామారావు క్షణంలో పదోవంతు ఆలోచించి లేచి నిల్చుని ఎదురుగా ఉన్న ఇంజినీర్ తో చెప్పాడు. “బండి కాసేపు ఆలస్యం చేయమని స్టేషన్ మాస్టర్ కి ఫోన్ చేసి చెప్పండి. నేను వెళ్ళి బండి విజయవాడ చేరేలోపుల వీళ్ల సంగతి చూస్తా,” అంటూ ఆఫీసు లోపల ఉన్న బాత్రూంలోకి దూరేడు బట్టలు మార్చుకోవడానికి, సమాధానం కోసం చూడకుండా.

టేబిల్ దగ్గిరున్న ఇంజినీరు “సరేనండి,” అంటూ కంగారుగా స్టేషన్ మేస్టర్ కి ఫోన్ చేసి చెప్పాడు. వెంఠనే ఒక ప్రకటన వెలువడింది ప్లాట్ ఫాం మీద. “దయచేసి వినండి. ఈ రోజు సాయింత్రం 5:30 కి బయల్దేరవల్సిన హైదరాబాదు వెళ్ళే గోదావరి ఎక్స్ ప్రెస్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని నిముషాలు ఆలస్యం అవుతోంది.” మళ్ళీ అదే ప్రకటన ఇంగ్లీషులోనూ, హిందీలోనూ చెప్పబడింది యధావిధిగా.

Kadha-Saranga-2-300x268

బాత్రూంలోంచి బయటకొచ్చిన రామారావు చెప్పేడు లైన్ మేన్ అప్పన్నతో “రావోయ్, వీళ్ళ సంగతి చూద్దాం. మళ్ళీ నాతోబాటు పొద్దున్నలోపులే వెనక్కి వచ్చేయవచ్చు,” స్టేషన్ ఎలెక్ట్రికల్ ఇంజినీర్, అప్పన్నల మొహాలలో కనబడే ఆశ్చర్యం పట్టించుకోకుండా బయటకి నడిచేడు కోచ్ ఎస్ సిక్స్ వేపు రామారావు.

రామారావు రైల్వే కూలీ అవతారం చూసి స్టేషన్ ఇంజినీర్ నోరు వెళ్ళబట్టి అసంకల్పితంగా సరే అన్నాక, ఆఫీసులోంచి రామారావు బయటకి రావడం, లైన్ మేన్ అప్పన్న తో బాటు ఇంజినీరింగ్ కాలేజీ కుర్రాళ్ళ కోచ్ కేసి కదలడం చూసాడు.

అప్పన్నా, రామారావు కోచ్ లోకి ఎక్కబోతూంటే ఒకరిద్దరు కుర్రాళ్లు వారించేరు – “ఇది మేం రిజర్వ్ చేసుకున్న కోచ్. ఇందులో ఎక్కడానికి లేదు.”

“బాబు, ఇక్కడకేనండి. రాజమండ్రీ రాగానే దిగిపోతాం” అప్పన్నా, రామారావు బతిమాలుతున్నట్టూ అడిగేరు.

ఓ కుర్రాడు, “పోనియ్ గురూ” అనడంతో ఏ కళనున్నారో, వద్దనలేకపోయేసరికి ఎస్ సిక్స్ లోపలకి దూరిపోయేడు రామారావు అప్పన్నతో.

మరో పది నిముషాలకి, గంట లేటుగా – ఇటువంటి ఆలశ్యాలు సర్వసాధారణం అన్నట్టూ గోదావరి నత్తలాగా కదిలింది ముందుకి.

 

*****

 

బండి ఇంకా దువ్వాడ చేరకుండానే కుర్రాళ్ళందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టూ లేప్ టాపులూ, ఫోన్లూ బయటకి తీసి ఛార్జ్ చేయడం కోసం కోచ్ లో ఉన్న ఎలెక్ట్రికల్ సాకెట్లకి కనెక్షన్లు పెట్టేసి కీ బోర్డులు టకటకలాడించడం మొదలుపెట్టేరు. ఇదంతా చూస్తున్న రామారావుకి ఒళ్ళు మండింది. ఓ కుర్రాడి పక్కనే కూర్చుని అప్పన్న చూస్తూండగా మాటలు కలిపేడు, “ఎక్కడెకెళ్తన్నారు బావూ?”

సీరియస్ గా ఏదో టైప్ చేస్తున్న కుర్రాడు తలెత్తి చూసాడు – నోట్లోంచి తాయిలం ఎవరో లాగేసుకున్నట్టు మొహం పెట్టి స్టైలుగా చెప్పేడు, “హైద్రాబాద్”

“ఏం చదూకుంటన్నారు బాబు?”

“ఇంజినీరింగు.”

“అబ్బో, కరెంటు వింజినీర్లాండి? లేకపోతే బిడ్జీలు కట్టేవోరా?”

“అవన్నీ పనికొచ్చేవి కాదోయ్, మేం ఏం చదివినా చేసేదొక్కటే ఉజ్జోగం – కంప్యూటర్ ప్రోగ్రామ్మింగు.” ఈ సరికి చుట్టూ చేరిన మిగిలిన కుర్రాళ్ళు గట్టిగా నవ్వేరు.

“మీ ఒళ్ళో ఉండేది ఏటండి అది?” రామారావు ఎప్పుడూ లేప్ టేప్ చూడనివాడిలా అడిగేడు.

“లేపీ అంటారోయ్ దీన్ని”

“ఏటండి? లేపయ్యడవేనా?”

“లేపీ అంటే లేప్ టాప్!”

“అమ్మో అంటే దాంతో టాపు లేచిపోద్దాండి?” రామారావు నోరు వెళ్ళబట్టేడు. అప్పన్న నవ్వురాకుండా నోటికి తువ్వాలు అడ్డంబెట్టుకోవడం చూసి కుర్రాడు చెప్పాడు అందరికీ వినబడేటట్టూ “ఒరేయ్ వినండ్రా ఈ బైతు ఏవంటున్నాడో.”

ఒక్కసారి మరో పది పదిహేనుమంది రామారావు చుట్టూ చేరేరు. “నాను తప్పు ఏటన్నాను బావూ?”

“అబ్బే, నువ్వు టాఫు లేచిపోద్దా అంటే నవ్వొచ్చింది. దీన్ని టాపులు లేపడానిక్కాదు వాడేది. ఇదో కంప్యూటరు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ చేస్తాం దీంతో.”

“పోగ్గామింగా? అంటే ఏటంటారు?”

మళ్ళీ నవ్వులు. ఓ కుర్రాడు ముందుకొచ్చి చెప్పేడు, “ఎప్పుడన్నా సినిమా చూసేవా?”

“ఎప్పుడో ఓ సారి చిన్నప్పుడు మా నాయన చూపిత్తే ఎళ్ళానండి. అదేం చిన్మా? ఆ! సిరంజీవి చిన్మా. జగదేక ఈరుడు, ఏదో అతి బువన సుందరి కాబోల్ను.”

కొంతమంది అమ్మాయిలు ఆసక్తిగా చూడ్డంతో సమాధానం చెప్పే కుర్రాడు రెచ్చిపోయాడు, “ఆ సినిమా వెయ్యాలంటే వెనకనుంచి ఓ డిస్కులో సినిమా ఉంచి అది తిప్పుతారు. అలా తిప్పితే అందులో ఉన్న సినిమా బొమ్మలన్నీ మనకి తెరమీద కనిపిస్తాయ్. అలా కనిపించాలంటే ఆ డిస్కు తిరగడానికి ఇలాంటి ఓ కంప్యూటరు లాంటిదే అనుకో ఒకదాన్ని వాడతారు…..”

“చినిమాకీ ఈ పోగ్గామింగుకీ ఏటండి లంకె? చినిమా కనబడేటప్పుడొచ్చే మిసి మిసి బల్బు ఈ కంపూట్రా?”

“అదే కదూ చెప్తూంటా? మరి డిస్కు తిరుగుతుంటే ఆ బొమ్మలన్నీ తెర మీద కనిపించడానికి కొంత కష్టపడాలి. కంప్యూటర్ అంటే ఒక మెషీన్. దానికి డిస్కుని ఎలా తిప్పాలో అనేది చెప్పాలి. ఇలా డిస్కు తిప్పూ, అలా బొమ్మ చూపించు, అలా పాట బయటకి తీయ్ అంటూ. ఇవన్నీ ఓ వరుసలో పెట్టి చెప్పడాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. ఇలా డిస్కు తిప్పడం బదులు మరో పని కూడా చేయించొచ్చు. అంటే ఉద్యోగాలు చేసే కుర్రాళ్ళకి జీతం ఎంతివ్వాలి? ఎన్ని రోజులు శెలవ ఉంది, ఎన్ని రోజులు వాడుకున్నారు, అనేవన్నీ కాయితం మీద ప్రింట్ చేయొచ్చు. అంటే కంప్యూటర్ ఒకటే కానీ రకరకాల పనులు దాంతో చేయించుకోవచ్చు. అది మనం ఎలా చెప్తే అలా చేస్తుంది. మరి దానికొచ్చిన బాషలో ఇదిగో ఇలా డిస్కు తిప్పు, ఇలా వారానికోసారో నెలకోసారో జీతం ఎంతివ్వాలో చూపించు అనేవి రాసి ఉంచుతాం. అలా రాయడాన్నే ప్రోగ్రామింగ్ అనడం. అర్ధం అయిందా?”

“ఆ, ఏటో బావు. డిస్కు తిప్పడం, డబ్బులివ్వడం అంతా కలబెట్టేసినారు.” బుర్ర గోక్కున్నాడు రామారావు. అప్పన్న కిసుక్కున నవ్వేడు.

ఆంధ్రా యూనివర్సిటీ మళ్ళీ నవ్వులు.

ఈ సారి లేప్ టాప్ పక్కనే ఉన్న ఛార్జర్ కేసి చూపించి, “ఇదేటండి ఈ నల్లగా ఉన్న ఇటుకముక్క” అడిగేడు రామారావు.

“దాన్ని ఛార్జరంటారు. ఇటుకముక్కకాదు.”

“అద్దేనికండి?”

“మన గోదావరి ఎక్స్ ప్రెస్సు ఎలా నడుస్తుందో తెలుసా?” కాసేపు ఆలోచించి అడిగేడు కుర్రాడు

“అంత తెల్దుగానండి, పైన ఏవో తీగలున్నాయి. అందులోచి వింజను కరెంటు లాగుతాది. ఆ కరెంటే బండిని నడుపుతాదంటారు మరి” అంటూ అప్పన్న కేసి తిరిగి అన్నాడు రామారావు, “అప్పన్నా నేంజెప్పింది రైటేనా?” అప్పన్న తలూపేడు అవునన్నట్టూ.

వేగం పుంజుకుంటూ గోదావరి అనకాపల్లె దాటింది.

“అప్పన్న మీ తమ్ముడా?” ఓ రంధ్రాన్వేషి అడిగేడు.

“లేదండి, నాతో పనిజేస్తాడు ఈ రైల్వేలోనే”

“ఓ, నువ్వు రైల్వేలోనా ఉద్యోగం?” హాశ్చర్యపడిపోయింది ఆంధ్రా యూనివర్సిటీ బృందం.

“సరే విను అయితే. పైన తీగల్లో కరెంటు ఉంటుంది కదా? గోదావరి అంత పెద్ద బండి నడవాలంటే మరి పెద్ద పెద్ద లావు తీగలుండాలి. మన కంప్యూటర్ చిన్నది కాబట్టి అంతపెద్ద కరెంటు దీనిమీద వదిల్తే ఏమౌతుందో తెలుసా?”

“కాలిపోదండీ?” రామారావు కళ్ళు పెద్దవిచేసుకుని చెప్పేడు.

“కరెక్టు.” అప్పటిదాకా ఇదంతా వింటూ జోక్యం చేసుకోకుండా ఉన్న ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చెప్పేడు. ఈయనెప్పుడొచ్చాడ్రా అనుకుంటూ కుర్రాళ్లు ఆయనకేసి చూసారు.

“ఆ లావు తీగలమీదనుంచొచ్చే కరెంటు ఈ కంప్యూటర్ కి సరిపోడానికి దాన్ని తగ్గించి ఇందులో వదిలేదే ఈ ఛార్జరు.” మొదట్నుంచే అన్నీ ఓపిగ్గా చెప్తున్న కుర్రాడు చెప్పేడు.

“ముట్టుకోచ్చాండి?” అంటూ రామారావ్ ఛార్జర్ మీద చెయ్యేసాడు. వేడిగా తగిలింది. “అమ్మో చెయ్యి కాల్తన్నాదండి.”

తుని రాబోతూండగా రామారావు లేచి అప్పన్నతో కంపార్ట్ మెంట్ తలుపు దాకా వెళ్ళి చెవిలో ఏదో చెప్పేడు. అప్పన్న సరే అన్నట్టూ తలూపి తలుపు దగ్గిరే నిలబడ్డాడు. బండి తునిలో ఆగింది. తలుపు దగ్గిరే నుంచుని ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడ్డం సాగించేడు. లోపలకి ఎక్కేవాళ్ళని అక్కడే వారించి వాళ్లందర్నీ వదిలేసి తలుపు లాక్ చేశాడు అప్పన్న.

మూడు నిముషాల హాల్టుని పదిహేను నిముషాలకి ఏ కారణం లేకుండానే పొడిగించాక గోదావరి బయల్దేరింది తునిలోంచి బయటకి.

*****

 

కుర్రాళ్లందరూ సమోసాలూ, టీలు కానిచ్చేక బండి కదుల్తుంటే రామారావు వెనక్కొచ్చి మళ్ళీ కుర్రాళ్లతో కబుర్లు మొదలెట్టాడు, ఈ సారి ఎలెక్ట్రికల్ ఇంజీనీరింగు ప్రొఫెసర్ తోటీను. “బావూ, మరి ఇన్నేసి లేప్ టాపులు, ఆ ఫోన్లూ అలా తగిలించేస్తే తీగలు కాలిపోవండీ?”

కుర్రాళ్ళూ, కుర్రమ్మలూ ఈయనేం సమధానం చెప్తాడా అని ఆసక్తిగా చూసేరు ప్రొఫెసర్ వైపు.

ఎలెక్ట్రికల్ ఇంజిరీంగ్ ప్రొఫెసర్ రెండేళ్ల క్రితమే ఉద్యోగంలో జేరేడు, ఇదే కాలేజీలో చదువుకుని, పాసయ్యి నాన్నగారి రికమండేషన్ తోటీ, అక్కడో ఉత్తరం ఇక్కడో దక్షిణా సమర్పించుకుని. సమాధానం చెప్పకపోతే ఈ బైతు ముందూ, ఆత్రంగా చూసే ఈ పిల్లల ముందూ పరువుపోదూ? వెంఠనే చెప్పేడు, “మంఛి ప్రశ్న అడిగావయ్యా, నీ పేరేంటన్నావ్?”

“రామారావండి.”

“సర్లే, పైన ఉన్న కరెంటు తీగలు ఎంత లావున్నాయో చూసావా? గోదారి ఎక్స్ ప్రెస్సు ఎంత కరెంటు లాగుతోందో దానిముందు ఈ కంప్యూటర్ లాగేది ఏ మాత్రం? మరో వంద కంప్యూటర్లు వాడినా ఏమవదు.”

“ఆయ్, బాగా చెప్పేరండి. మరైతే ఆ పైనుంచొచ్చే కరెంటు ఈ లేపుటాపు లోకి తిన్నంగా రాకుండా ఈ ఇటుకముక్క అడ్డుకుంటే ఇదే వేడెక్కిపోతన్నాది. అది కాలిపోదండీ?”

ఈ సారి కాస్త విసుగ్గా అన్నాడు కుర్ర ప్రొఫెసర్, “మరేం ఫర్లేదయ్యా. నేను చెప్తున్నాను కదా? అయినా ఆ తీగల్లో కరెంటు డైరక్టుగా ఇందులోకొచ్చెయ్యదు. మధ్యలో కన్వర్టర్లు అని ఉంటాయి. అవిలేకపోతే ఈ లైట్లూ, పేన్లూ ఏవీ పనిచెయ్యవు.”

“అంటే మద్దెలో మరో ఇటుకముక్కలాటిదున్నాదంటారా? ఎక్కడుంటాదో మరి. అందుకే గదండన్నారు ఈ రైలింజన్లూ, ఈ ఇమానాలు, అంతా తెల్లోడి బిస అనీ. ఆఖరికా తెల్లోడు చంద్రుడిమీదకెళ్ళి కుందేల్ని తడిమాడంట. అబ్బో”

అందరూ నవ్వడంతో వాతావరణం తేలిక పడింది. రామారావు మళ్ళీ నస కంటిన్యూ చేసాడు, “మరి మేష్టారు, ఈ నల్ల ఇటుకముక్కలు ఫోన్లకి వేరేగా ఉంటాయండీ?”

“ఆ ఉంటాయి కాని కాస్త చిన్న సైజులో,” అంటూ ఓ కుర్రాడు ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి వాడే చిన్న ఛార్జర్ చూపించాడు.

“మరో మాటండి, ఈ ఇటుకముక్కలు ఏడెక్కుతూంటే….”

“ఎన్నిసార్లు చెప్పాలోయ్, ఇటుక ముక్క కాదు ఛార్జర్ అనలేవూ?”

“పోనీండి బావ్, ఇయన్నీ ఏడిక్కిపోతే అక్కడే ఉన్న కాయితమో, గుడ్డముక్కో అంటుకుంటే పెమాదం కాదూ?”

“మరీ అంత వేడేక్కిపోదులే. కొంచెం వెచ్చగా ఉండొచ్చు. కానీ నాసి రకం ఛార్జర్లైతే అంటుకుంటాయ్”

“తవరికెలా తెలుద్దండీ ఇయి నాసిరకంవో కావో?”

“దానిమీద పేరు చూసావా? మంచి పేరున్నవి వాడతాం.”

“అలా అంటారేటి బావు, ఈ దేశంలో ఎంత కల్తీ ఉందో తెల్వదా? పేరుదేవుంది అచ్చుగుద్దటవే కదా?”

రామారావ్ ప్రశ్నకి ఈ సారి మొత్తం ఆంధ్రా యూనివర్సిటీ అదిరిపడింది. దీనికి సరైన సమాధానం ఎవరి దగ్గిరా లేదు.

కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చప్పట్లు కొట్టి అన్నాడు, “అదండి అద్భుతమైన ప్రశ్న. బైతు, బైతు అని మనం వెక్కిరిస్తూన్న ఇతనే వేశాడు మనం సమాధానం చెప్పలేని ప్రశ్న”

 

*****

 

బండి పిఠాపురం దాటి సామర్లకోటకి దగ్గిరౌతూండగా రామారావు లేచి బాత్రూంలో దూరేడు.

వెళ్లేటప్పుడు తాను కూర్చున్న చోటునుంచి దగ్గిర్లో ఉన్న బాత్రూంలోకి కాక దూరంగా అటువైపు ఉన్న లావెట్రీ వైపుకి నడిచేడు. వెళ్తూ దారిలో ఎన్ని కంప్యూటర్లున్నాయో ఎన్ని ఫోన్లు ఉన్నాయో ఉరమరగా లెక్కపెట్టేడు. 74 బెర్తులకి ఈ కుర్రాళ్ళు దాదాపు 70 లేప్ టాపులు తెచ్చారు. ఫోనులేని కుర్రాడు కానీ కుర్రమ్మ కానీ లేనేలేదు. మరో కొంతమంది దగ్గిర ఒళ్ళో పెట్టుకుని సినిమాలు చూసే డివిడి ప్లేయర్లుండడం గమనించేడు.

బాత్రూంలోకి దూరిన రామారావు జేబులోంచి సెల్ ఫోన్ బయటకి తీసి సామర్లకోట స్టేషన్ మాస్టర్ నెంబరికి కనెక్టు చేయమని అడిగేడు. రెండునిముషాల్లో అవతలాయన లైన్లోకొచ్చాక చెప్పేడు, “బోగీల దగ్గిర ఎలెక్ట్రికల్ రిపేర్లు చేసే వాళ్లెవరైనా మీదగ్గిర ఉన్నారా సామర్లకోట స్టేషన్లో?”

“లేదండి. మా దగ్గిర చిన్న చిన్న రిపేర్లు చేసేవాళ్లే. ఏదో ఓ లైటూ, ఫేనూ తిరగకపోతే చూడగలరు అంతే గానీ మరీ పెద్ద పన్లు చేయలేరు. మాకు ఆర్డర్లన్నీ రాజమండ్రి నుంచి రావాల్సిందే.”

“అలాగా, రాజమండ్రి ఫోన్ చేసి నేను ఇక్కడ ఎస్ సిక్స్ కోచ్ లో ఉన్నాననీ ఇద్దరు స్పెషలిస్ట్ ఎలెక్ట్రీషిన్లని పంపించమనీ చెప్పండి. బండి రాజమండ్రి లో ఆగాక నేను మళ్ళీ ఫోన్ చేసేవరకూ కదలడానికి లేదు. కాస్త స్తేషన్ కి దూరంగా ఉన్న ప్లాట్ ఫాం మీద కానీ, లూప్ లైన్లో కానీ అపమని చెప్పండి.”

“సరేనండి. ఏదైనా ప్రమాదమా బండికి?”

“ఇంకా ఏమీ లేదు, కానీ ప్రమాదం వస్తే మళ్ళీ ఫోన్ చేస్తాను ఈ సారి ట్రేక్ పక్కనున్న ఫోన్ వైర్ల మీదనుంచి.”

“భోజనం, అవీ… మీకేం కావాల్సినా ఇప్పుడు చెప్పేయండి, నేను చూసుకుంటాను.” కాస్త ఎక్కువగా ఉత్సాహపడిపోయేడు సామర్లకోట స్టేషన్ మాస్టరు.

“ఏమీ వద్దు. చెప్పినది చేయండి చాలు.” మృదువుగానే అన్నా చురుక్కుమని తగిలింది సమాధానం స్టేషన్ మాస్టరికి.

 

****

 

బండి సామర్లకోట వదిలి అనపర్తి దాటుతూండగా ఓ బెర్తు దగ్గిర్నుంచి కేకలు వినిపించేయి. రామారావు ఎంత పరుగెట్టుకుంటూ ముందుకెళ్ళినా కుర్రాళ్ళందరూ అడ్డుండడంతో లోపలకి వెళ్ళే వీలు లేకపోయింది. అరుపుల్లో, కేకల్లో “చైన్ లాగు” అని ఒకరంటూంటే, “నీళ్ళు పోయండి” అని మరొకరు అరుస్తున్నారు. ముందుకెళ్ళే రామారావు అప్పన్నతో చెప్పేడు, “ఆ పక్కన ఎలెక్ట్రికల్ బాక్సు ఆఫ్ చేయగలవేమో చూడు.”

అప్పన్న అటువెళ్ళగానే రామారావు తోసుకుంటూ ముందుకెళ్ళేసరికి మంటలు కనిపించేయి. ఒక లేప్ టాప్ దగ్గిరే ఉన్న బెర్తుమీద ఉన్న దుప్పటి అంటుకుని మంటలు వస్తున్నాయి. వైర్లు ఇంకా కాలుతూనే ఉండడంచేత అది ముట్టుకోడానికెవరికీ ధైర్యం లేనట్టుంది. రామారావు ముందుకెళ్ళి వేసుకున్న హవాయి చెప్పులు రెండు చేతులకీ తగిలించుకుని ఒక్క ఉదుటున కాలుతున్న వైరుని సాకెట్లోంచి బయటకి లాగేడు. కాలిపోయిన వైరు తెగి వచ్చింది.

మంటలు తగ్గడానికి మరో దుప్పటి వేసి పొగ పోవడానికి కిటికీల తలుపులు తీసాక, కుర్రాళ్లందరూ తలో చేయి వేసేసరికి మంటలన్నీ అదుపులోకొచ్చాయి. అప్పన్న ఏదో చేసినట్టున్నాడు, అప్పుడే చిన్న శబ్దంతో కోచ్ అంతా కరెంటు పోయింది. అంతా నిశ్శబ్దం. కంప్యూటర్ల గురించి అనర్గళంగా మాట్లాడిన కుర్రాళ్ళూ, జబ్బలు చరుచుకుని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే ఏమిటో చెప్పిన ప్రొఫెసర్ కీ నోటమ్మట మాటలేదు.

మొత్తానికి రెండు దుప్పట్లు కాలడం, ఇద్దరబ్బాయిలకి చిన్నపాటి గాయాలూ, ముగ్గురమ్మాయిల చుడీదార్ల పైన వేసుకున బట్టలూ కాలాయి అంతే. ప్రాణ నష్టం లేదు; అదో అదృష్టం. రామారావు, అప్పన్నా ఏమీ మాట్లాడకుండా దిగే గుమ్మం దగ్గిరకి పోయి నుంచున్నారు. చిక్కబడుతున్న చీకట్లో గోదావరి పరిగెడుతూనే ఉంది.

కడియం దాటి బండి కాసేపటికి రాజమండ్రిలో ఆగింది.

తలుపుతీసి దగ్గిరలోనే నుంచుని విష్ చేసిన అందర్నీ చూసి రామారావు చెప్పేడు, “ఈ కోచ్ ఖాళీచేయించి మరోటి చూడండి వీళ్లని ఎక్కించడానికి. ఆ తగిలించే కోచ్ కి వెనుకనున్న సర్క్యూట్ బ్రేకర్స్ అన్నీ చూసి చార్జింగ్ పాయింట్స్ అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ కోచ్ ని రిపేర్లకి పంపించే ఏర్పాట్లు చేయండి.  చిన్న చిన్న దెబ్బలు తగిలిన వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఓ గంటలో చేయగలిగితే మంచిది. బండి బయల్దేరే ముందు అన్నీ తనిఖీ చేసిన రిపోర్ట్ నేను చూస్తాను.” చకచకా ఆర్డర్లు వేసి అప్పన్నతో ముందుకి కదిలేడు రామారావు.

ఇదంతా చూస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ నోర్లు వెళ్లబెట్టింది. సామాన్లులన్నీ దింపుకున్నాక వేరే కోచ్ లోకి ఎక్కడానికి మరో నలభై నిముషాలు పట్టింది. ఈ కంగార్లో ఎవరి లేప్ టాపులు పోయాయో ఎవరి ఫోన్ ఎక్కడ తగలబడిందో ఎవరికీ గుర్తులేదు. గుర్తున్నదంతా బైతులా రామారావు వేసిన నాటకం, ఆయన రాజమండ్రీలో రైల్వే వాళ్లకి వేసిన ఆర్డర్లూను.

“మనతో మాట్లాడినాయన పెద్ద రైల్వే ఆఫీసర్లాగున్నాడే?” ఎవరో కుర్రాడు గొంతు పెగుల్చుకుని అన్నాడు.

“ఏమో? ఏం చెప్పగలం?” అంటూ భుజాలు ఎగరేసారు మిగతావాళ్ళు.

*****

దాదాపు గంటా రెండు గంటలు గడిచేక బండి ఎప్పుడు కదులుతుందా అని చూస్తూంటే రామారావు మళ్ళీ అప్పన్నతో కలిసి రావడం కనిపించింది. ఈ సారి వచ్చిన రామారావు హుందాగా ఉన్నాడు బట్టలు మార్చుకుని; ముందు చూసిన బైతు రామారావు కాదు.

చుట్టురా మరో నలుగురున్నారు – రాజమండ్రీ స్టేషన్ మాస్టర్ తో సహా టైలు కట్టుకుని. రామారావు మాట్లాడ్డం మొదలుపెట్టేడు.

“మీరందరూ భవిష్యత్తులో కాబోయే ఇంజినీర్లు. మీరు నేర్చుకోవల్సినది ఇంజినీరింగ్. క్లాసులో పాఠాలు బట్టి పట్టేసి పరీక్షల్లో ఉమ్మేస్తే మార్కులొస్తాయేమో కానీ ఇంజినీరింగ్ ఉజ్జోగాలు రావు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఇంజినీరింగ్ అనవసరం. ఈ ట్రైన్లో నాతో మాట్లాడిన కుర్రాళ్ళకి కానీ మీ ప్రొఫెసర్ కి కానీ ఏమాత్రం ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ కానీ కంప్యూటర్ల గురించి కానీ తెలిసినట్టు లేదు. కోచ్ కి ఉన్న సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏమిటో మీకు తెలియదని నాకు అనిపిస్తూంది. ఒక్కో లేప్ టాప్ ఛార్జరూ ఎన్ని ఏంపియర్లు లాగుతుందో తెలుసా? అన్నీ ఒకేసారి కనెక్ట్ చేస్తే ఏమౌతుంది? నాది కెమికల్ ఇంజినీరింగూ, నాది సివిల్ ఇంజినీరింగూ అని తప్పించుకోవడానికి చూడకండి. ఈ బేసిక్ ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ అన్ని బ్రాంచ్ ల కుర్రాళ్ళూ చదవవల్సిందే. అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పండి. మీరు విశాఖపట్నంలో ఎక్కి దువ్వాడ వచ్చేలోపు లాప్ టాప్ లు కనెక్ట్ చేసి ఏం చేద్దామని? పదినిముషాలు లేప్ టాప్ స్క్రీన్ కేసి గానీ, ఫోన్ స్క్రీన్ కేసి గానీ చూడకుండా ఉండలేరా?

ఒక్కొక్క లేప్ టాప్ మూడు నుంచి నాలుగు ఏంపియర్లు కరెంటు లాగుతుందనుకుంటే మీరు తగిలించిన వాటికి మొత్తం ఎంతైంది? అదీ కాక మీరు పట్టుకొచ్చిన చార్జర్లు అన్నీ సరైనవా? నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఇది – మీరు తెచ్చినవాటిలో ఎన్ని సరైన మంచి ఛార్జర్లు? ఎన్ని చవకబారువి? మీరే చూసారు కదా ఒక ఛార్జర్ వేడెక్కగానే మంటలు అంటుకున్నాయి. ఆ ఛార్జర్ ఎంత చవకబారుదో మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా. మంటలు వచ్చే సమయానికి మనందరం నిద్రలో ఉండి ఉంటే? రోజుకో ట్రైన్ కి ఏక్సిడెంటు అవుతోంది. ఏది ఎలా జరిగినా అందరూ మా రైల్వేదే తప్పు అంటారు. మీరు చేసే వెధవ పనులు ఎవరికీ చెప్పరూ, మేము చూపిస్తే ఒప్పుకోరూ.  ఇంతకీ నేనెవర్నో తెలుసా మీకు?”

డభ్భై ఆరు తలలు అడ్డంగా ఊపబడ్డాయి తెలీయదన్నట్టూ.

“నా పేరు వంగపల్లి రామారావు. నేను సౌత్ ఈస్టర్న్ రైల్వే కి సీనియర్ డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ని. మీలాగే ఇంజినీరింగ్ చదివి యూ పి ఎస్ సి వారు రాసిన పరీక్షలో పాసై డైరక్ట్ గా ఇక్కడకొచ్చాను…”

నాన్నారి రికమండేషన్తో ఉజ్జోగంలో చేరిన ప్రొఫెసర్ మొహంలో కత్తివాటుకి నెత్తురుచుక్కలేదు. ఒకప్పుడు తాను ఈ యూ పి ఎస్ సి పరీక్ష రాయడం గుర్తొచ్చింది. ఇంటర్వ్యూ మాట దేవుడెరుగు మొదట అసలు రాత పరీక్షే పాసవ్వలేదు.

“…ఎన్నేళ్ళు కష్టపడ్డారు ఒక్కొక్కరూ ఇంజినీరింగులో సీటు రావడానికి? ఇదేనా మీ ప్రతాపం? మీకు కంప్యూటర్ ఉద్యోగమే కావలిస్తే ఇంత కష్టపడడం దేనికీ?  బి.ఎస్సీ చదివి ప్రొగ్రామింగ్ నేర్చుకుంటే చాలదూ? ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివేమని చెప్పుకుంటున్నారు కదా? మీ ప్రొఫెసర్ గారు చెప్పారే? ఇంకో వంద లేప్ టాప్ లు కనెక్ట్ చేసినా ఏమీ అవదూ, పైన పెద్ద లావుపాటి వైరు ఉంది కరెంటుకి అన్నారే? ఏమి చదువులండీ మీవి? వైర్లు అంటుకుని మంటలొస్తుంటే నీళ్ళు పోయమనీ, చైను లాగమనీ అరుస్తున్నారే? ఏదీ ఆ ప్రొఫెసర్ గార్ని ఇలా రమ్మనండి ముందుకి…”

కాలిపోయిన లేప్ టాప్ ఛార్జరులా మాడిపోయిన మొహంతో ప్రొఫెసర్ ముందుకొచ్చాడు. తలెత్తి చూడ్డానికి ధైర్యం చాలలేదు. కుర్రాళ్ళ సంగతి సరేసరి.

“…. ఏమిటి సార్, పైనున్న కరెంటుని ఇష్టం వచ్చినంత లాగేసుకోవచ్చా? మరి పైనున్న ఏ. సి. హై వోల్టేజ్ కింద మీకు డి.సి. లో కావాలంటే మధ్యలో కన్వర్టరు కి కెపాసిటీ అనేది ఉంటుందా? లేకపోతే నూటొక్క లేప్ టాప్ లన్నింటికీ కరెంటు సప్లై చేయగలదా? పవర్ సప్లై కి లోడ్ కి ఉన్న సంబంధం తెలుసా మీకు? బోగీ కి ఉన్న కన్వర్టర్ నలభై ఏంపియర్లు సప్లై చేయగలదేమో. ఒక్కో లేప్ టాప్ మూడు ఏంపియర్లు లాగితే – అదీ మధ్యలో ఉన్న చవకబారు ఛార్జర్ తో – ఏమౌతుంది? ఇలాగేనా మీరు చదువుకున్నదీ, చదువులు చెప్పేదీ? పేరుకి పెద్ద కాలేజీల్లో చదువుకున్నట్టు కబుర్లా. ఇదా మీ ప్రతాపం? మనం ఇలా ఉండబట్టే మన దేశం ఇలా ఉంది. ఆలోచించారా?”

ఎవ్వరి దగ్గర్నుంచీ సమాధానం రాకపోవడంతో రామారావే మళ్ళీచెప్పేడు, ఈ సారి కాస్త కరుగ్గా – “వెళ్ళండి. ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి. ఇండస్ట్రియల్ టూర్లు అంటే తల్లితండ్రులు కొనిచ్చిన సెల్ పోన్లూ, లేప్ టాపులూ టకటక లాడించుకుంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించడం కాదు.  మీరు ప్లాట్ ఫారం మీద మాట్లాడేవన్నీ విని మా ఆఫీసులో పనిచేసే లైన్ మేన్ అప్పన్న చెప్పాడు మీ గురించి. మీరెలాగా ఇలాంటి పని చేస్తారని ఊహించి వెంఠనే బయల్దేరాను. అసలు మీకేం తెలుసో చూద్దామని పల్లెటూరి బైతులాగా ఓ నాటకం ఆడాను. విశాఖపట్నం నుంచి దువ్వాడ కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం. బుద్ధి అనేది ఉన్న ఎవరైనా ట్రైన్ ఎక్కిన మూడు నిముషాల్లో లేప్ టాప్ తీస్తారా? ఏమిటా అర్జెంటు అవసరం? ఏదో అవతల వాళ్లకి చూపించాలనే తాపత్రయం తప్ప? ఏమిటి మీకొచ్చే శునకానందం ఆ చూపించడంలో? రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు రాగానే గొప్పవాళ్ళైపోతారా? మీ బుర్రల కన్నా మా లైన్ మేన్ అప్పన్న నయం. మిమ్మల్ని విశాఖపట్నం స్టేషన్ లోనే గమనించి నాకు చెప్పాడు.

మీరు ఎక్కబోయే వేరే బోగీలో ఛార్జ్ చేసుకునే సాకెట్లు అన్నింటినీ ఆఫ్ చేయమని చెప్పాను. అవి పని చేయవు. కేవలం లైట్లు, ఫేన్లు పనిచేస్తాయి.  ఒళ్ళు దగ్గిర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి రండి. హైదరాబాదు వెళ్ళేలోపుల మళ్ళీ నేను కనుక్కుంటాను మీ కోచ్ గురించి. ఏమైనా తేడాలొస్తే ఇప్పుడు రాత్రి అవుతోంది కనక పోతే మీ ప్రాణాలే పోతాయి. రోజువారీ ఎలాగా ఫోనుల్లో టెక్స్ట్ మెసేజీలు పంపించుకుంటూ మొహం మొహం చూసుకోవడం మర్చిపోతున్నారు కనక కనీసం ఈ ట్రైన్లో అయినా అవన్నీ పక్కన పడేసి టూర్ లో ఏదో ఒకటి నేర్చుకోండి.”

ఆంధ్రా విశ్వవిద్యాలయం కోచ్ లోకి ఎక్కుతూంటే రామారావు చెప్పినది విని చుట్టుపక్కలనున్న రైల్వే స్టాఫ్ అందరూ చప్పట్లు కొట్టారు. ఆఖరిగా బండి ఎక్కబోయిన ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రామారావు దగ్గిరకొచ్చి “సారీ సర్, మీకేమీ తెలియదనుకుని అలా అన్నాను…” అంటూ నీళ్ళు నవిలేడు.

రామారావు స్టేషన్ మాస్టరు తీసుకొచ్చిన రిపోర్టు చూసి తలాడించి సరేనన్నాక బండి బయల్దేరడానికి పచ్చజండా ఊపేరు. ఇంక మాట్లాడ్డానికేవీ లేదన్నట్టూ రామారావు ప్రొఫెసర్ తో కరుగ్గా చెప్పేడు, “వెళ్ళండి, అప్పుడే సిగ్నల్ ఇచ్చారు.” ప్రొఫెసర్ బండిలో ఎక్కేక వెనకనే అప్పన్నా మిగతా ఒక్కొక్కరూ చేతులుకట్టుకుని నడుస్తూంటే రామారావు రాజమండ్రీ స్టేషన్ ఆఫీసుల వేపు కాలు సాగించేడు. గోదావరి ఎక్స్ ప్రెస్ మొత్తానికి మూడు గంటలు ఆలశ్యంగా తనకి పెట్టిన పేరు సార్ధకం చేసుకోవడానికి ఆ నదిమీద కట్టిన బ్రిడ్జీ వైపు కదిలింది.

గోదావరి ప్రతీరోజూ లేటౌతున్నందుకు ఎప్పుడూ ప్రభుత్వం మీద అరిచే జనం ఈ సారి మూడు గంటలు లేటైనా మర్నాడు పేపర్లో రాబోయే వార్త చూసి ప్రాణాలు కాపాడినందుకు సీనియర్ డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజినీరు రామారావుకీ, భారతీయ రైల్వేకీ, ప్రభుత్వానికీ ధన్యవాదాలర్పించడానికి సమాయత్తమౌతోంది. ప్రాణాల్తో పోలిస్తే బండి లేటైన మూడు గంటలో లెక్కా?

*