-పఠాన్ మస్తాన్ ఖాన్
~
మధ్య ప్రదేశ్ కు చెందిన బాబుషా కొహ్లీ 2014 సంవత్సరానికి గాను యువ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. ప్రేమ వుడత మనసు జామపండు(ప్రేమ్ గిల్హరీ దిల్ అఖరోట్ ) అనే తన మొదటి కవితా సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు.
బాబుషా కొహ్లీ, తన రచనలో భావాల లోతులను తాకే అనుభూతి, సంవేదనలను వినూత్నంగా వ్యక్తికరిస్తుంది.యీమె కవిత్వంలో ప్రేమ ప్రధాన కవితా వస్తువై కనిపించిన జీవితపు భిన్నత్వంలోని సంగీతం ప్రతిధ్వనిస్తుంది.
యింకా యీమె కవిత్వంలోని సాంద్రత, ఘాఢమైన అనుభవం,భాషా నవ్యతలు పాఠకులను మైమరిపిస్తాయి.సూఫీ ప్రేమతత్వము,విపరీత ఆరాధన యీమెలో కనిపించే ప్రధాన లక్షణం.
యీమె కవిత్వనిర్మాణం సంవేదనలతో పాటు బింబాత్మక ప్రతీకలు, ఆకృతులు మెండుగా వుండి పాఠకుల మనసులలో సులభంగా నిలబడిపోతుంది.
తూరుపు నుంచి పడమర వరకు
—————————— ————-
మొలకెత్తేందుకు ప్రతి వొక్కరి వద్ద వొక వుదయం వుంది.
మునిగేందుకు సరైన చోటు లేదు అనుకోనక్కర్లేదు .
పిడికెడు చల్లని కోరికను తీసుకొని
నీరసంగా తిరుగాడుతోంది వో యెండ కన్య
యీ ప్రపంచంలో వొక్క ప్రశ్నకు వొందల జవాబులు వున్నాయి.
భిక్షగాడి కోసం కాస్త దయ, పిండి, బియ్యం వున్నాయి.
సుఖం
దక్షిణగా లభించదు
రాత్రిని
నేను కోరుకొన్నప్పుడల్లా నా కళ్ళలోనికి లాక్కుంటాను
తూరుపు రంగులమయమై వుంది
కాటుక రేఖ ముల్లులా వుంది
తమసోమ జ్యోతిర్గమయ నుంచి
యీ యాత్ర కఠినమైంది
తూర్పు నుంచి పడమర వరకు
పదే పదే తిరుగాడుతూనే వుంది వో యెండ కన్య
అక్కడ
జ్వలిస్తూ
మండుతూ
నిప్పు రథమై
సంతోషంతో యెగురుతూ పరుగెడుతోంది
అక్కడ
అయినను
కాకపోయినను
ఆ లోతైన సముద్రం పేరు
పడమరే.
మూలం : బాబుషా కొహ్లీ
*
మంచి పరిచయం
ధన్యవాదాలు శశికళ గారికి