కొండేపూడి నిర్మల
మధ్యప్రదేశ్ లో ఏడేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదన్ లాల్, కోర్టులో శిక్ష ఖరారయన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులతో రాజీ పడ్డాడు. దీ౦తో నిందితునికి విధించిన ఏడాది జైలు శిక్ష సరిపోతుందంటూ హైకోర్టు అతని విడుదలకు ఆదేశించీంది. ( నేరస్తుల పట్ల కోర్టులు ఎంత సహోదర ప్రేమతో వుంటాయో మనకి తెలుసు.). దీనిపై మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి౦ది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మాత్రం అత్యాచార కేసుల్లో రాజీ ఒప్పందాలు చెల్లవని, మెతక వైఖరిని ప్రదర్శించడం, నిందితులను రాజీకి అనుమతించడ౦ తీవ్రమైన తప్పిదమని అది మహిళల ఆత్మగౌరవాన్ని కీంచపరఛడమే అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇంతవరకు బానేవుంది.. మధ్యప్రదేశ్ హైకోర్టు కంటే మన సుప్రీకోర్టు కొ౦చెం విచక్షణతో వ్యవహరించింది అని సంతృప్తి కూడా కలిగింది.
ఎందుకంటే అవిచ్చినంగా నడుస్తున్న కాఫ్ పంచాయితీల దగ్గర నుంచి సుప్రీ౦కోర్టు దాకా అత్యాచార బాధితురాల్ని, ఆ నేరం చేసినవడు లగ్గం చేసుకు౦టే న్యాయం జరుగిపోయినట్టే భావిస్తాయి. . “గృహ ప్రవేశం” సినిమా ఇదే కధా వస్తువుతో 350 రోజులు ఆడింది. కర్తవ్యం లో ఒక పోలీసు ఆఫీసరు దగ్గరుండి బాధితురాలికి నేరస్థుడితో పెళ్లి జరిపిస్తుంది. చివరికి ఆ పెళ్ళిలో కూడా నేరస్థుడూ అతని తండ్రీ కలిసి బాధితురాలిపై హత్యా ప్రయత్నం చేస్తారు . అయినా ఆ ప్రయత్నాన్ని ఆ పోలీసు ఆఫీసరు తెలుసుకుని కాపాడి “ కలకాల౦ కలిసి వుండ “ మని ఆశీర్వదిస్తు౦ది. ఇలాంటివన్నీ జనం కళ్ళకి అసహజంగా కాకుండా ఆనందబాష్పాలతో తిలకించేలా చెయ్యడానికి ఒక భావజాల౦ వుంది . మధ్యయుగాలకు చెందినట్టు కనిపించే ఈ భావజాలాన్ని చదువూ వివేకం , సాంకేతిక పరిజ్ణానమ్ ఏవీ మార్చలేవు. అందుకు ఒక చిన్న ఉదాహరణగా పై కేసులో సంచలనాత్మక తీర్పు ఇచ్చిన న్యాయాకోవిదులు అత్యాచారాల గురి౦చి ఇచ్చిన నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు. ఏమిటా నిర్వచనం ;
“ఆత్యాచారానికి పాల్పడటం అంటే దేహాన్ని దేవాలయంగా భావించే మహిళపై దాడి చేయడమే . దానివల్ల అత్యాచార బాధితులు మాన మర్యాదలు కోల్పోతారు. అది వారి ప్రాణాలను హరించడంతో సమానం. ‘
తీర్పు హేతు బద్ధంగానూ , నిర్వచనం దానికి భిన్నంగా వుండటానికి వెనకగల కారణ౦ నాకు చాలా ఆసక్తి కలిగించింది. పై మాటలు స్త్రీలందరి దేహ దేవాలయాల శీలా సంపదల గురించి న్యాయమూర్తులూంగారు అంటున్నప్పటీకీ సందర్భం మాత్రం ఏడేళ్ళ పాప గురించే. అదృష్టవశాత్తూ అంత లావు భావజాల౦ ఆ పాప కెలాగూ అర్ధాంకాదు.
ఆ మాటకొస్తే తన శరీర నిర్మాణమేమిటో , ఎవడు ఎందుకు దాడిచేశాడో, అసలు ఏం జరిగిందో తెలుసుకునే౦త వయసుకూడా లేదు. తెల్సిందల్లా భయానకమైన దాడి, గాయాలు, రక్తస్రావం. మానసికంగా ఒక దిగ్భ్రాంతి. ఇలాంటప్పుడు తక్షణమే వైద్యం జరగాలి. వైద్యమ౦టే ఆస్పత్రిలో వుంచి కట్టుకట్టడం మాత్రమే కాదు. ఏ పరిసరాలు, సంఘటనలు, మనుషులు ఆమెని అంత భీతావహురాల్ని చేశాయో దానికి దూరంగా వుంచడం , .కుటుంబం ,సమాజం ఆమె పట్ల సానుభూతి కాకుండా సహానుభూతి కలిగివుండటం, . క్రమక్రమంగా ఆమె మనసుని చదువు వైపు , ఆటలపాటలవైపు, ఆమె కిష్టమయిన మరో వ్యాపక౦ వైపు మళ్ళీంచడం- ఇవి కదా జరగాలి.. వీటివల్ల మాత్రమే బాధితురాలు కోలుకోవడానికి అవకాశం వుంది. అదే సమయంలో నేరస్థుడికి చట్టబద్ధంగా విచారణ, రిమాండ్ , శిక్ష ఇలాంటి లాంటివన్నీ జరగాలి.
అంటే అటు ఆ పాపకి జరిగిన అన్యాయానికి, ఇటు నేరస్థుడి చర్యకీ చట్టం బాధ్యత వహించాలి. కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది? ఆ నేరస్థుడ్ని తెచ్చి బాధితురాలితో పెళ్ళి చెయ్యడం జరుగుతోంది. దీనివల్ల ఒకసారి అత్యాచారం చేసినవాడికి జీవితాంతమూ అత్యాచారం చెయ్యడానికి బోనస్ లాంటిది దొరుకడంలేదూ| తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పోరాట౦ చేయాల్సిన బాధిత కుటుంబానికి నేరస్థుడే మీసాలు తిప్పుతూ అల్లుడవుతాడు. ఎటువంటి శిక్షా, పరివర్తనా లేకుండా అటువంటి నేర ప్రవృత్తి గలవాడిని ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబంలో ఇతర బాలికలకు , స్త్రీలకు రక్షణ కరువయ్యే ప్రమాదం లేకపోలేదు.. బాధితురాలు సైతం తన ప్రాధమిక , మానవ హక్కులమీద దాడిచేసినవాడ్ని జైలుకి పంపడానికి బదులు ప్రేమిస్తూ, సేవలు చేస్తూ , వారసుల్ని కనివ్వాలి. ఇంత రోతను భరించినా సరే ఆమె ప్రాణానికి రక్షణ వుందో లేదో తెలీదు. అప్పుడు గృహహింస బాధితురాలి చిట్టాలో ఆమే పేరు నమోదవుతుంది. ఇన్ని చట్ట విరుద్ధ , అప్రజాస్వామ్య , పౌరుష హీన చర్యలన్నిటికీ సదరు స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధతో అల్లిన భావజాలమే కారణం.
ప్రస్తావన కోసం మళ్ళీ నిర్వచనాన్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం
స్త్రీలు తమ శరీరాల్ని దేవాలయాలుగా భావిస్తారని సామాజం భావిస్తుందిట.. ముస్లిం స్త్రీలయితే మసీదులుగా , క్రైస్తవ స్త్రీలయితే చర్చీలుగా భావించుకోవచ్చు. పోనీ కాస్సేపు నిరర్ధకమయిన ఈ పోలికతోనే ఆలోచిద్దాం. మామూలుగా దేవాలయాల్లో ఒక పశువు బురదకాళ్లతో అడుగుపెడితే ( రేపిస్టుని నోరులేని పశువుతో పోల్చడం నా కీష్టంలేదు ) ఏం చేస్తారు? అప్పుడు ఆ ప్రాంతమంతా శుద్ధి చేసి సంప్రోక్షం చేస్తారు. దాంతో పవిత్రత తన్నుకుంటూ వచ్చి తీరుతుంది.. కానీ స్త్రీల విషయంలో ఒకసారి పోయిన పవిత్రత మళ్ళీ రాదు. కాబట్టి ఎవడైతే నేరం చేశాడో వాడే ఆమెని చేపట్టాలి. అలా చేపట్టేలోపు ఆమే మాన మర్యాదలు ప్లస్ ప్రాణం కూడా పోయినట్టే భావించుకోవాలి. ఎవదైనా చేపట్టీన తర్వాత అలా భావించనవసరంలేదు. తాళి కట్టీన తుచ్చుడే రక రకాలుగా భావిస్తాడు కనక.
అయ్యా | బాబూ | మేము మీ సాటి మానవుల౦, మీరు ఆపాదిస్తున్న దైవత్వాలూ, పవిత్రతలూ వద్దే వద్దు. రాజ్యాంగం మాకు ప్రసాదించిన హక్కుల మీద ఎవరేనా దాడి చేసినప్పుడు సకాల౦లో స్పందించండి, చాలు- అని మహిళలు ఎప్పటినుంచో తల బాదుకుంటున్నారు. అది మాత్రం జరగడంలేదు.
*
తాజా కామెంట్లు