అపరిచితులు      

      శివ్

                                                                                                                 

      shiv photo “సార్ ఐ.ఐ.టి నుంచి ప్రొఫెసర్ మోహన్ గారు మన కళాశాలలో అతిధి ఉపన్యాసం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దాని వల్లమన ఎలెక్ట్రికల్ స్టూడెంట్స్ కు బాగా ఉపయోగముంటుంది  అన్నాను”. నేను ఖరగ్పూర్ ఐ.ఐ.టిలో సెమినార్ నుంచి వచ్చినతర్వాత మా ప్రిన్సిపల్ను కలిసినప్పుడు, ఈ సంభాషణ జరుగుతోంది. “అలాగేనండి, నేను సెక్రటరీ గారితో మాట్లాడతాను,తర్వాత మీరు డేట్స్ కన్ఫర్మ్ చేద్దురుగాని” అన్నారాయన. నాలుగైదు రోజులు పోయాక ఆయన్ని వేరే పని మీద కలిసినప్పుడు ఆ విషయం మళ్ళీ ప్రస్తావించాను. “కమిటీ వాళ్ళు ఒప్పుకోవడం లేదండి. ఇప్పుడు పాతిక వేలు ఖర్చు పెట్టలేమంటున్నారు”అన్నారు. “అలాగే సార్” అనాల్సొచ్చింది నాకు.

            కొన్ని రోజుల తర్వాత ఓ నాడు మధ్యహ్నంనుంచి  కాలేజ్ లో హడావిడి మొదలయ్యింది. కమిటీ మెంబర్లు,  ప్రిన్సిపల్,ఇంకా కొందరు స్టాఫ్, అటెండర్లూ, ఏదో మహత్కార్యం జరగబోతున్నట్లు సందడిగా అటూ ఇటూ తిరుగాడుతున్నారు. ఓ ప్రక్కఎర్ర తివాచి  కొత్తది తెప్పించి, దానిని అట్టహాసంగా ఆఫీసు గది మెట్ల దగ్గర్నుంచి సెమినార్ హాల్లోకి పరుస్తున్నారు.ఇంకొంతమంది,పూలు పెద్ద బుట్టలలోంచి తీసి, తివాచీకిరువేపులా జాగ్రత్తగా అమరుస్తున్నారు. సెమినార్  హాల్లో వేదిక పైనఅసలైన ఆర్భాట కార్యక్రమం జరుగుతోంది. బయటినుంచి వచ్చిన సిమ్హాసనపు విడిభాగాల్ని అక్కడ సన్యాసుల్లాకనబడుతున్న కొంతమంది జాగ్రత్తగా,ఆసనంగా మార్చడానికి పూనుకుని ఉన్నారు. నేను తెలుసుకున్నదేమిటంటే, పొరుగురాష్ట్రం నుంచి, ఒకానొక ప్రసిధ్ధి చెందిన స్వామి వారు అక్కడికి కొద్ది సేపట్లో వేంచెయ్యబోతున్నారట. ఆయననుస్వాగతించడంకోసమే ఈ ఏర్పాట్లు. ఆయన  అనుగ్రహ భాషణా కటాక్షంకోసం నిరీక్షణ. స్టాఫ్ అందరూ కార్యక్రమంపూర్తయ్యేవరకూ ఉండాలని ఆదేశిస్తూ  సర్కులర్ కూడా వచ్చిందట. అది  నేను చూడలేదు.

            మా గ్రూపులోని ఇంకో కళాశాలకు ఎప్పటినుంచో తెలుగు పండితుడిగా,ఆస్థాన గాయకుడిగా ద్విపాత్రాభినయంచేస్తున్న ఒకాయన, పాత తెలుగు సినిమాలలోని భక్తి పాటలు, లింగాష్టకం, శివాష్టకం ఇత్యాదులు మైకు ముందు కూచుని పెద్దగొంతుతో పాడడానికి ప్రయత్నిస్తున్నాడు. హాల్లో  ఉన్నవాళ్ళకి అవి వినడం మినహా వేరే గత్యంతరం లేదు. ఆ రోజు ఆకాశం,మేఘావృతమై, నల్లటి దుప్పటి క్రింద దాక్కున్నట్లు, తల నుంచి కాళ్ళ వరకు శ్యామ వర్ణంలో ముంచి తీసినట్లు, చిక్కగా,దట్టంగా ఉంది.కొద్దిసేపట్లోనే, పట్టిన రంగును వదిలించడానికి తల్లి తన పిల్ల వాడికి అభ్యంగన స్నానం చేయిస్తున్నట్లు,పెద్ద పెద్దకుండలతో  తలపైనుంచి  నీళ్ళు దిమ్మరిస్తున్నట్లుగా వర్షం ప్రారంభమయ్యింది. మా కళాశాలలో హడావిడి ఏమాత్రంతగ్గలేదు.చాలాసేపు వేచి ఉన్నతర్వాత,”అదిగో వేంచేస్తున్నారు, తప్పుకోండి, తప్పుకోండి” అంటూ కోలాహలం మొదలయ్యింది.ఐదడుగులకంటే  తక్కువ ఎత్తులో, ఎర్రగా, దాదాపు అరవై యేళ్ళ పైచిలుకు వయసున్న ఒక కుదిమట్టపు ఆకారం, గంగాళందొర్లుకుంటూ వస్తున్నట్లు ఎర్ర తివాచీ మీద నడచుకుంటూ వచ్చింది. మా వాళ్ళు అతి వినయంగా  ఆయనకు ఒంగి దణ్ణాలుపెడుతూ, హాల్లోకి, ఆ తర్వాత స్టేజ్ పైనున్న సిమ్హాసనం మీదకు ఆయన్ను తోడ్కొని వచ్చారు.

            నేను, మరికొందరు సహోద్యోగులు ప్రేక్షకులుగా హాల్లో ఉన్నాం. సందడి సద్దుమణిగాక స్వామివారు  సుఖాశీనులై తమఅనుగ్రహ భాషణం మొదలెట్టారు.అంతలో ఎవరో మాట్లాడుతుండటం  ఆయన చెవినపడింది. వెంటనే ఆగ్రహంతో “ఎవరుమాట్లాడుతున్నారు? నేను మాట్లాడాలా, మీరు మాట్లాడతారా?” అంటూ  గద్దించారు. ఆయన కళ్ళు , కోపం ఎర్రటి గోళీల రూపం దాలిస్తే, ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఆ మాట్లాడిన వ్యక్తి బిక్కచచ్చిపోయి మాట్లాడటం ఆపాడు.నా నోరు అప్రయత్నంగా తెరుచుకుని మళ్ళీ మూసుకుపోయింది. స్వామి వారు ముందుగా  పద్యంతో మొదలెట్టారు. తర్వాత ఇలాఅన్నారు. “నరుడు ముఖ్యంగా మూడు  విషయాలమీద దృష్టి పెట్టాలి. ఒకటి,తన కోపమే తనకు శత్రువు కాబట్టి ముందుగా కోపాన్ని జయించాలి. రెండోది పరస్త్రీని ఆశించకూడదు.అలా చేస్తే వినాశనమే! రావణాసురుడు దీనికి  తార్కాణం, ఇక మూడు,ఇతరుల బాధలను మన బాధలుగా భావించాలి. అంటే మనం ఒకళ్ళని తిడితే వాళ్ళెలా బాధపడతారో,అలాగే మనంభావించి,పరులను దూషించకూడదు” అన్నారు. భాషణం ముగిసింది. చాలా మంది ఆయన కాళ్ళకు పడి, పడి మ్రొక్కారు.

            తర్వాత ఎన్నోవేలు పెట్టి తయారు చేయించిన ప్రసాదం వినియోగించబడింది. అంతకుముందు  స్వామి వారు మాకళాశాల దిన దిన ప్రవర్ధమానమవ్వాలని, మా యాజమాన్యాన్ని దీవించారు. వాళ్ళు పాదాభివందనం చేసి తమ భక్తిని చాటుకున్నారు. అంతే కాక  పది లక్షల రూపాయలు స్వామివారి ట్రస్టుకు విరాళంగా సమర్పించారని నాకు తర్వాత తెలిసింది.ఇక ఆ కార్యక్రమ ఏర్పాట్లకు భారీగానే ఖర్చయ్యింది. నాకు అప్పుడు, కొద్దిరోజుల క్రితం మా ఇంజనీరింగ్ విద్యార్ధులకోసం ఐ.ఐ.టిఆచార్యులను అతిధి ఉపన్యాసం కోసం పిలవడం గురించి, దానికయ్యే ఖర్చు సంగతి, మా ప్రిన్సిపల్తో జరిపిన సంభాషణ గుర్తుకువచ్చాయి. విద్యార్ధులకు ఐ.ఐ.టి ఆచార్యుల కార్యక్రమం వల్ల ఉపయోగముందో,లేక స్వామి వారి అనుగ్రహ భాషణం ఎక్కువమేలు చేస్తుందో నాకర్ధం కాలేదు.

Kadha-Saranga-2-300x268

#

       నేనడపా దడపా  టెన్నిస్ ఆడతాను. పని దినాలలో ఎలాగూ కుదరదు కాబట్టి కాబట్టి శెలవుల కోసం ఒకింత ఆరాటంగానేఎదురు చూస్తూ ఉంటాను.ఆట ముగిసిన తర్వాత విధిగా రెండు కొబ్బరి బొండాలు తాగుతాను.బొండాలమ్మే వ్యక్తి నాకు బాగాపరిచయస్థుడు.అదే చోట అతను తన బండిని రెండు మూడేళ్ళుగా ఉంచి వ్యాపారం చేస్తున్నాడు.ఒక్కో సారి నా దగ్గర సరిపడాచిల్లర, డబ్బులు లేకపోయినా “పర్లేదు సార్ తాగండి, ఈ సారి వచ్చినప్పుడివ్వచ్చని” ఆప్యాయంగా మంచి బొండాలతో నాఅలసట తీరుస్తాడు.

            ఓ ఆదివారం ఆటయ్యాక  యదావిధిగా బండి దగ్గర బొండాం తాగుతున్నాను.ఇంతలో ఓ అడుక్కునే  అవ్వ “అయ్యా”అంటూ చెయ్యి జాచింది. “చిల్లర లేదమ్మా” అంటూ తాగడంలో ముణిగిపోయాను.”అయ్యా” అంటూ అవ్వ ఈ సారి బొండాలమ్మేఅతని వేపు చెయ్యి చూపింది.నేను యధాలాపంగా అటు తిరిగాను. “ఎళ్ళెళ్ళవమ్మా” అంటాడనుకున్నాను. ఐతే నాకు దిమ్మతిరిగిపోయింది. “ఇదుగో తీసుకో” అంటూ అతను ఆమెకు వందరూపాయల నోటు,చాలా సునాయాసంగా,షాపులోసరుకులో,కూరగాయలో కొన్న తర్వాత డబ్బులు చెల్లించినట్లు,నిర్భావంగా అందించాడు.ఆమె ఓ నిమిషం అవాక్కయ్యి,తర్వాతసంబరంగా నోటును తడుముకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.నాలో భిన్న భావాలు ముప్పిరిగొన్నాయి.నేనిచ్చినడబ్బులు బొండాలతను అందుకున్నాడు.అంతకు ముందు అవ్వకు అంత మొత్తమిచ్చానన్న స్పృహ ఏమాత్రం అతనిలో నాకుకనిపించలేదు. తను నా ముందు, జీవితంలో, ముఖ్యంగా అతని వ్యక్తిత్వం గురించి నేనేమాత్రం ఊహించని మరోసున్నితమైన,మహా గొప్పదైన పార్శ్వాన్ని ఆయత్నకృతంగా ఆవిష్కరించాడు. మనసులోనే అతనికి జోహార్లర్పించుకుంటూవెనుదిరిగాను.

#

            ఆమె నాకు సంవత్సరం పైగానే తెలుసు.చాలా బాగా నేను కూడా ఆమెకు తెలుసని  నేననుకుంటూ ఉంటాను.కళాశాలలో సహోద్యోగులుగా మా మధ్యన మంచి అవగాహన ఉంది.ఎప్పుడూ ముఖమంతా నవ్వుతో నాతోమాట్లాడుతుంది.నాతోనేనేమిటి?అందరితోనూ ఆవిడలాగే ఉంటుందనుకుంటా! ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సార్లునేను ఏ పదాలు వాడతానో,వాటినే ఆమె తిరిగి అంటుంది. దాంతో నాకు,ఆమెకు నాపై గౌరవం కాస్తా ఎక్కువేనని నాకనిపిస్తూఉంటుంది.పైగా ఇద్దరమూ ఆంగ్ల పాఠాలు ఇంజనీరింగ్ విద్యార్ధులకు బోధిస్తామాయె.నేను ఉపాధి మరియు  శిక్షణా విభాగంలోఉన్నప్పటినుంచి మా మధ్యన సమన్వయం బాగానే ఉంది.ఆ ధైర్యంతోనే నేను(నేను ప్రస్తుతమున్న విభాగంలో నా సహచరుడితో నేనిమడలేకపోవడం వల్ల)హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ లో,ఆంగ్ల విభాగంలోకి మారుతానని కమిటీ మెంబర్సుకు,ప్రిన్సిపల్  గారికి చెప్పి ఆమోదం పొందాను. ఇటీవలే మారాను.

            ‘శివ’ సినిమాలో కోట శ్రీనివాసరావన్నట్లు,మొదటి నెల అంతా ఓకే.నాకు చాలా సహకారమందించింది.అంతా సజావుగా ఉన్నట్లుంది.అంతలో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్,నన్ను లాంగ్వేజ్ లాబ్ కు ఇన్ చార్జ్ గా నియమించారు.నా కుర్చీకూడా పాత విభాగంలోంచి  లాబ్ లోకి మారింది.ఇదివరకు  నాకు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కంప్యూటర్ఉండేది.ల్యాబ్లోకి మారింతర్వాత దాన్నే నాకివ్వమని మా హెడ్నడిగాను.అతను చూద్దామన్నాడు.ఐతే అక్కడ లాబ్ లో ఒకకంప్యూటర్ని మేడం వాళ్ళు ఉపయోగించుకునేవారు.మా సిస్టం అడ్మినిస్ట్రేటర్ దాన్ని నా టేబుల్ దగ్గర ఏర్పాటు చేశాడు.ఈచిన్నమార్పు నా ఉద్యోగానికే ఎసరు పెడుతుందని నేనేమాత్రం ఊహించలేకపోయాను.

            ఆమె నా దగ్గరేమీ మాట్లాడలేదు కానీ తర్వాత,‘సిస్టం’ వాళ్ళని బెదిరించినట్లు,”దీని వల్ల ప్రశాంత్  గారు చాలాసమస్యలు ఎదుర్కోబోతున్నారు” అని వాళ్ళతో అన్నట్లు,సిస్టంస్ డిపార్ట్మెంట్లోని రాజు నాకు చెప్పాడు.నేను వెంటనే ఆమెనుకలిసి “నేను నా పాత సిస్టం నాక్కావాలని అన్నానే కానీ,మీరు వాడుతున్నదాన్ని నా కిమ్మని నేనడగలేదు,కానీ చక్రవర్తిహడావిడిగా మీరు వాడుతున్న దాన్ని నాకు కేటాయించాడు.నేను దాన్ని మళ్ళీ మీరు వాడుకునే చోటే ఉంచమని చెపుతాను”అన్నాను. “ఏం పర్వాలేదు సార్, నో  ప్రాబ్లం” అందామె.కానీ   కమిటీ మెంబర్లదీ, ఈమెదీ ఒకే కులం కావడం వల్ల, కొన్నిరోజుల్లోనే నేను కళాశాలనుంచి బయటకు పోవలసిన ఏర్పాట్లు జరిగిపోయాయి.ఆమె నాకు బాగా తెలుసు అనుకుంటున్నసమయంలో నాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఐతే ఆ దెబ్బనుంచి నేను మంచి గుణపాఠం నేర్చు కున్నాను.

#

       ఆమె పైకి కనిపించినంత,మాట్లాడినంత సరళమైన వ్యక్తి కాదని,ఆమే కాదు మనచుట్టూ ఉన్నవాళ్ళలో చాలా మంది అదేకోవకు చెంది ఉన్నారని నాకు ఆ చేదు అనుభవం మరొక్క సారి కాస్త గట్టిగానే గుర్తు చేసింది.పని చేసే చోట ఎవరినినమ్మాలో,ఎవరిని  నమ్మకూడదో, ఏది మాట్లాడాలో, మాట్లాడకూడదో అర్థం కావడం లేదు.

             ఆ తర్వాత నేను ఇంకో కళాశాలలో ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురయ్యింది.ఐతే ఇప్పుడు నేనిదివరకు నేర్చుకున్నపాఠాలు కొంతమేరకు ఉపయోగపడుతున్నాయి.ఇంతవరకు నేను మా గత కళాశాల సెక్రటరీ,స్వామీజీ,కొబ్బరి బొండాలమ్మే అతను,నా సహోద్యోగి,ఇంకా తదితరుల ద్వారా పొందిన అనుభవాల మూలంగా ఇప్పుడు నాకు చాలా మంది అపరిచితులుగానూ,తర్వాత పరిచితమైనట్లుగానూ,మళ్ళీ అప్పుడప్పుడూ అర్ధం కాకుండానూ అవగతమౌతున్నారు.వెరసి నాకు జీవితం మొత్తం ఇదే సూత్రం మీద ఆధారపడినట్లు అనిపిస్తోంది,తెలిసీ తెలియనట్లు,అర్ధమౌతూ కానట్లు, చలిస్తూ అంతలోనే నిశ్చలమౌతున్నట్లు,దాదాపు ప్రతి ఒక్కరిలో ఒక జెకిల్ మరియు హైడ్ లాంటి భిన్న స్వభావాలున్నట్లు,ఇప్పుడు మరింత అనుభవమౌతూ ఉన్నది.నాలో కూడా ఇలాంటి స్వభావం ఉండే అవకాశం మెండుగా ఉంది.ఐతే నేను ఇతరులకు హానిచేసే,నష్టం కలిగించే  వాణ్ణా??? కాదనే నేననుకుంటూ ఉంటాను.

*

మీ మాటలు

  1. Rachamalla Upendar says:

    మంచి కథ. పాత్రల విశ్లేషణ చాలా బాగుంది. వ్యక్తుల లోపలి స్వభావాన్ని చక్కగా ఆవిష్కరించారు.
    రాచమళ్ళ ఉపేందర్

  2. Radhakrishna Murthy K says:

    ప్రసాద్ గారు మనిషిలోని ద్వంద వైఖరిని బాగా గుర్తు పట్టారు. మహాభారతంలో ఉద్దవుడు శ్రీ కృష్ణుడిని ద్వాపరయుగానికి కలియుగానికి తేడా ఏమిటి అని అడుగుతాడు. ద్వాపరయుగంలో మనిషి మంచివాడైతేయ్ మంచివాడిగానీ ఉంటాడు,చెడ్డవాడు చేద్దవడిగానే కనపడతాడు కానీ కలియుగంలో చెడ్డవాడు మరియు మంచివాడు కూడా మంచివాడు గానే కనపడతారు అని చెబుతాడు. ఆ విధముగానే ఇప్పుడు మనుషుల మాటలని బట్టి వారి మనస్తత్వం తెలియదు. మీరు కరెక్టుగా తెలియచేసారు

    • B.V.Siva Prasad says:

      ధన్యవాదాలు రాధాకృష్ణ మూర్తి గారు. మీ కామెంట్ ఇప్పుడే చూశాను. అందువల్ల లేటుగా రిప్లై ఇస్తున్నాను.అన్యధా భావించకండి.మీ అభినందనకు కృతజ్ఞతలు.

      శివ్

      సెల్ 9848527109

మీ మాటలు

*