Archives for May 2015

గాయం తో పాటు జయం కూడా వీరుడిదే !! 

పి. విక్టర్ విజయ్ కుమార్
వీరుడంటే ఎవరు ?
శతృవు తల్చుకుని తల్చుకుని కుళ్ళి కుళ్ళి
ఏడ్వడానికి ఒకే కారణంగా –
స్వయంప్రతిపత్తి రాజ్యంలో
ఒక ఝంఝ మారుతమై
నిరసన జెండాపై నిలిచిన వాడు
 
భీరువంటే ఎవడు ?
అనుక్షణం అభద్రతతో నూతి నీళ్ళ నుండి
ఆకాశం చూసి వీరుడొస్తాడేమోనని
వణుకు గర్భాన్ని నఖక్షతం చేసిన వాడు –
ఈత చాప చేతిలో చుట్టుకుని
పోటెత్తే సంద్రాన్ని ఇసుక దాటి రానీవ లేదనుకునేవాడు !
* *
 
గీత చదవడం రాజ్య వ్యతిరేకం కానప్పుడు
గీత దాటడం ఇంకెలా ఉంటుంది ?
అధ్యయనాలు అగ్రహారాలు దాటనప్పుడు
అభినివేశం ఇంక ఏ తీరుగుంటుంది ?!
గిరి గీసిన వలయం లో గొంతుకను
మంత్ర దండం వేసి బిగిస్తే
భీరువుల స్వయంపాలనకు
వీరులు ప్రేతాత్మలే ఔతారు…..
  * *
 
నీకు నాకూ
భూమిక ఒకటే !
నీలో ఉరుకులెత్తేది
నాలో ఉరుకులెత్త్తేది
మట్టుబెట్టాలనే ఆరాటం !!!
నీ ఛాతీ కి అడ్డంగా మంత్రించిన పత్తితో ఏకిన దారపు పోగు…
నా చేతి నిండా పిడి పై అనుశాసనంగా నిల్చున్న ఉక్కు కరవాలం …..
నీవు భీరువు వేపు !!
నేను వీరుడి వేపు !

 

ఒక ఆకాశ రామన్న ఉత్తరం ఆధారంగా ” అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ ” అనే స్టూడెంట్ అసోసియేషన్ ను ‘ డీరికగ్నైజ్ ‘ చేయాలని ఐ ఐ టీ – మద్రాస్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ నిర్ణయం తీసుకుంది. ఈ విధాన నిర్ణయానికి ఒక పక్క ‘ స్వయం ప్రతిపత్తి ‘ కలిగిన సంస్థ అంటూనే , ఇంకో పక్క నారద జోక్యం తో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ విధాన నిర్ణయానికి అనుకూల  వాతావరణాన్ని కల్పించింది. ‘వివేకానంద స్టడీ సర్కిల్  పేరుతో గీతా ప్రభోధాలను బ్రాహ్మిణీక మత చాందస వాదాన్ని ఆయా మత శక్తులు విరివిగా వాడుకునే విషయం ఇంత వరకు సంస్థ పట్టించుకోక పోవడం గమనార్హం.

విద్యాసంస్థలు తార్కిక చర్చలకు ప్రధాన సంధాతలుగా ఉండడం సర్వ సాధారణ విషయం. అంబేద్కర్ , పెరియార్ వంటి ఆలోచనా విధాన పరుల భావాలు ఖచ్చితంగా ప్రస్తుత నమ్మకాలకు విభిన్నంగా ఉంటాయి. అయినంత మాత్రాన అంబేద్కర్ తో రాజ్యాంగం ముసాయిదా వ్రాయించుకోకుండా ఉండలేదు – ఈ స్వతంత్ర భారత దేశం. నిజానికి ఆకాశ రామన్న ఉత్తరాలపై రియాక్ట్ కాకూడదనే విధానం ను కూడా పట్టించుకోకుండా మంత్రిత్వ శాఖ విద్యా సంస్థను  ‘ ప్రాంప్ట్ ‘ చేయడం, ముందస్తుగా వివరణ కూడా అడక్క పోవడం ఒక కుట్ర గా విదితమౌతుంది. ఏది ఏమైనా వాక్స్వాతంత్ర్య హక్కును నియంత్రించడం అప్రజాస్వామికం. …

మమత “సుస్వరం” వచ్చే వారం నుంచి…!

కవి Walter De La Mare ఇలా పాడుకుంటున్నాడు సంగీతం గురించి:

When music sounds, gone is the earth I know,
And all her lovely things even lovelier grow;
Her flowers in vision flame, her forest trees
Lift burdened branches, stilled with ecstasies.

Mamata Vegunta

Mamata Vegunta

ఒక సుస్వరం మన చెవిలోకి ప్రవహిస్తున్నప్పుడు ఇంత కంటే ఎక్కువే ఏమన్నా జరగచ్చు.

చెవి చుట్టూ ఒక పూల ప్రహరీ కట్టుకున్నట్టు వుంటుంది.

లేదూ, ఎక్కడో జారిపోతున్న జలపాతపు నీటి గలగల అందంగా చుట్టుకున్నట్టు వుంటుంది.

చల్లని వెన్నెలని చిదిమి బొట్టు పెట్టుకున్నట్టూ వుంటుంది.

మండే ఎండ నుదుటి మీద ఎట్నించో ఒక్కటంటే ఒక్కటే వాన చినుకు రాలినట్టూ వుంటుంది.

కాని,  ఆ సుస్వరానికి రంగుల భాష అద్దితే … అది నిస్సందేహంగా మమత పెయింటింగ్ లా వుంటుంది,

వచ్చే వారం నించి-

మమత “సుస్వరం” వినిపిస్తుంది ఏడు రంగులై!

మరీ రహస్యమేం కాదు గానీ…!

 మోహన తులసి 

 

 

మబ్బు పుట్టలేదనో, చినుకు రాలలేదనో,
ఆకు కదలలేదనో, నువు పలకరించలేదనో
చివరకి నీతో మిగిలే
ఒంటరి సాయంకాలం గురించనో
జీవితం బాధిస్తూనే ఉంటుంది
 

తన నుదుటి మీద
నెమలీకల్నో, నివురు కప్పిన క్షణాల్నో
ఘనీభవించిన మౌన ఘడియల్నో
నిర్ణయించుకోకుండానే కాలం వచ్చేస్తుందనుకుంటా
ఆనవాలు చూపించని వానలా.
 

గతం నీడలో గోడవ పడటం రోజూవారీ రివాజే
అయినా
వాడిపోయే పూల వెనకాల
దాటెళ్ళిపోయే వెన్నెలనీడల వెనకాల
జీవితం సాగిపోతూనే ఉంటుంది

 
జీవన రాగ రహస్యం తెలియాలంటే
ఒక్కోసారి గుండె తడయ్యేలా ఏడవాలి
ఒక్కోసారి పొర్లి ఏడ్చేంత నవ్వాలి
 

ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి
 

ఒకే ఒక్కసారైనా
నీరెండ మెరుపులో ఉరికే వాగునీళ్ళల్లో
గులకరాళ్ళ నడుమ గుండెని విసిరేయాలి.

*

Painting: Anupam Pal

రచన వ్యక్తపరిచే తాత్వికతే రచయిత!

సామాన్య  

 ” రచయితని ” అని నాకు నేను ట్యాగ్ చేసుకునేంత విస్తృతంగా రాయలేదు నేను . ఎవరన్నా అలా పిలిచినా నాకేవిటో కొత్తగా, భయంగా వుంటుంది . కానీ ఆ కారణం చేత మాత్రమె ”కథన రంగం” కిరాయకుండా ఇన్ని రోజులూ  ఆగలేదు . అది కూడా ఒక కారణమైనప్పటికీ …ఇంకో కారణమేమిటంటే నా వరకు నాకు రచయిత , రచన వేర్వేరు . రోలాండ్ బార్ట్ ”డెత్ అఫ్ ది ఆథర్ ” తో నేను ఏకీభవిస్తాను .

రచనకి మించి రచయిత తో సంభాషించడమూ , రచనకిమించి పాఠకులు, రచయిత జీవితాలలోకి వెళ్ళడమూ రచనని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా సహాయ పడతాయి అని నాకో మీమాంస . అస్తిత్వ వాదాలని గౌరవించినప్పటికీ రచయితకి పరిధి ఉండటాన్ని ,ఒకే అస్తిత్వంలో ఆగిపోవడాన్ని  నేను అంగీకరించను . రచన చెయగలగడమనేది జెనటికల్ గా వచ్చిన ఒక ప్రత్యేక సామర్ధ్యమనీ , ఆ సామర్ధ్యం చేత రచయిత ఇతరుల అంతరంగాలను శోధించగలద/డనీ, ఇతరులకు అర్థంకాని విషయాలను అర్థం చేసుకోగలద/డనీ నేను నమ్ముతాను .

ఈ రోజు ఉదయం నన్ను పలకరించిన ”కేర్లీ రే జెప్సిన్”పాట నన్ను ముచ్చట పరిచింది ” i know this isn’t love ,but i need to tell you something / i really really really really really like you ” అని విన్నపుడు నాకు భలే అనిపించింది కానీ దానికోసంనేను జెప్సిన్ ఈ  వాక్యాలని ఎలా రాసింది ?అసలు జెప్సిన్ ఎవరు ?ఇది ఆమె అనుభవమేనా అని వెతకను . రచయిత ఇతరుల అనుభవాలని తన అనుభవాలుగా చేసుకోగలదనీ ,సామాన్య అనుకున్నదిజెప్సిన్ రాయగలదని నమ్ముతాను . ”మన మనసులోక్కటి అయితే మాయ పెళ్లి ఏటికి చల్ మోహన రంగా /మంగళ సూత్రమేటికి ”అన్న చల్ మోహన రంగ గీత రచయిత ఇంటర్వ్యూ చదవకపోవడం వల్లఆ భావానికి ఏమయినా లోపమొచ్చిందా అని ఒక ఆలోచన .

”పుష్పవర్ణ మాసం” వచ్చినపుడు ఒక స్నేహితుడు అనేక ఏళ్ళ తరువాత ఆ కథనో సందర్భం చేసుకుని   పలకరిస్తూ   నన్ను ”వీణాధరీ” అని సంభోధించాడు . అందులో నేను వీణాధరినని అతనికి ఎందుకు అనిపించింది ?రచయితలం తప్పకుండా రచనలో ఎక్కడో ఓ చోట వుంటాం కానీ నేను వీణాధరినే ఎందుకయ్యాను ?”విషాద కామరూప ”లోకథా నాయకుడు ఇంద్రజిత్ ని తానేనని చెప్తుంది రచయిత్రి ఇందిరా గోస్వామి ,ఏం … నేను పుష్పవర్ణ మాసం లో గదిలో గూడు కట్టుకుని ఆకుపచ్చటి పాటతో ఆ అమ్మాయి ప్రేమను అతనికి చెప్పినకోయిలని అయి ఉండొచ్చు కదా … ”ఏరియల్ ”ని అర్థం  చేసుకోవడానికి ”సిల్వియ ప్లేత్” ఆత్మహత్య చేసుకుందని తెలుసుకొని తీరాలా…  ఇవన్నీ రచయితగా ఇది రాయాలనుకున్నపుడు నన్ను ఇబ్బందిపెట్టిన  ఆలోచనలు . ఇదంతా ఎందుకంటె రచయిత మనస్థత్వమో, నేపధ్యమోమొ  , మతమో ,  పాఠకులకు  దగ్గరగా తెలియడం వల్ల పాటకులు రచనని ఆస్వాధించడంలోనో ,అర్థం చేసుకోవడంలోనో తమకుతెలియకుండా కొన్ని పరిమితులకు లోబడి పోతారు ,చాలా సార్లు రచన అంతరార్థం బిట్వీన్ లైన్స్ కూడా వుంటుంది బహుశా రచయిత పరిచయం పాటకులలోని ఈ ఆలోచనావిస్తరణ యొక్క సామర్ధ్యాన్నిదెబ్బ తీస్తుందనీ అనుకుంటాను .

ఇలాటి భావాలతోనే రచయితగా ఎక్కడయినా పరిచయం కావాలన్నా, మాట్లాడాలన్నా నాకు అయిష్టం. అయినా ఇది ఎందుకు రాసానంటే కొన్ని స్నేహాలు , ప్రేమలూ మనసిద్ధాంతాల కంటే విలువైనవీ , లెక్కింపదగినవీ గా భావిస్తాను గనుక రాసాను .

అదలా ఉంచితే ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచిస్తున్నాను రచయితగా నేనేమిటీ అని ? మూడు అంశాలు తట్టాయి . నేను ఎందుకు రాస్తాను ?ఏం రాస్తాను ?ఎలా రాస్తాను ?అని  .అసలు నేను ఎందుకు రాస్తానుఅని ఆలోచిస్తే ఆశ్చర్యమేసింది , నాకు ఏడుపొచ్చినప్పుడు నేను రాస్తున్నాను  . ఏడ్చి ఏడ్చి చాలా ఏడ్చాక గుండెలో ఏదో నొప్పిలాంటిది వస్తుంది నాకు అది  భరించలేక రాస్తున్నాననుకుంటా బహుశా .కిషన్ జీ ని గమనిస్తూ వుండేదాన్ని ఎప్పుడూ … ఎన్కౌంటర్ జరిగాక ”కబీర్ సుమన్ ” ఒక పాట  రాసి పాడాడు ”బీర్ మొరె   బీరేర్ మతో బీర్ మొరె  ఏకా …”[వీరుడు వీరుడిలా మరణిస్తాడు ,వీరుడువొంటిగా మరణిస్తాడు ]అని అది విన్నపుడు నాకు నన్ను నేను అదుపులో వుంచుకోలేనంత ఏడుపొచ్చింది .

 

సామాన్యఇంట్లో వాళ్ళు ఓపికగా ఓదార్చి దాన్ని చానలైజ్ చేయించినపుడు రాసిన కవిత ”జనగణ్ ”అలాగే2007 నుండి మహిత శవాన్ని గుండెల మీద మోసుకు తిరిగి తిరిగీ ఇక తిరగలేక రాసిన కథ మహిత , అంతరాల సమాజం  ఆత్మాభిమానపు అనితను నా ముందు ఏడ్చేలా చేసినపుడు  సిగ్గుతో నాకుఏడుపు వచ్చి రాసిన కథ ”అనిత పాడిన పాట ”.. అలా నేను రాసిన లేదా రాయబోయే కథలైనా  లేదా కవితలైనా  ఎందుకు రాస్తానంటే నా దుక్కాన్ని ఏం చెయ్యాలో తెలియక ,రాయడమనేది అయాచితంగావచ్చింది కనుక ఆ రూపంలోకి నా కన్నీటిని ఒంపేసి వదిలించుకోనే సౌకర్యం వుంది కనుక వదిలించుకోవడానికి రాస్తాను . అందుకని రాస్తాను .

ఏం  రాస్తానంటే .. నాది చాలా చిన్న ప్రపంచం , ఏకాంత ప్రపంచం . నా జీవితంలో అత్యధిక భాగాన్ని నేను ఏకాంతపు గదులలో గడిపాను ,గడుపుతూ వుంటాను . ఆ గదిలోకి ఆత్మీయులు వస్తూ  వెళ్తూవుంటారు .అంతర్బాహిరాలలో నన్ను పెనవేసుకుపోయి వున్న  ఏకాంతాన్ని చిద్రం చేయడానికి రకరకాల కాల్పనిక మనుష్యులను నా గదులలోకి , హృదయంలోకి తెచ్చుకోవడం నేర్చుకున్నాను చాలాచిన్నపుడే . అలా మొదలయింది చదవడం .

నాకు పుస్తక జ్ఞానం అంతో ఇంతో వుంటుంది కానీ ప్రాపంచిక జ్ఞానం చాలా తక్కువ . ప్రాపంచిక జ్ఞాన శూన్యురాలనయిన నా దగ్గరికి పిల్లల కోసం మేత తెచ్చేఅమ్మలా బయటి ప్రపంచాన్ని మోసుకోస్తారు  నా తమ్ముళ్ళు ఉదయ చైతన్య ,శ్రీకాంత్ నా సహచరుడు కిరణ్ .  ఆ మేత పెట్టడమే కాదు ,నాతో చర్చించి  నా హృదయంలో…  అవును మెదడులో కాదుహృదయంలో ఎలా ఆలోచించాలనే  విధానాన్ని ఓపికగా పొదుగుతాడు కిరణ్ . అలాగే ”వినయ” లాటి నా స్నేహితులు స్త్రీ అంతరంగాన్ని ,మోస్తున్న భరువులని,వారి   దుక్కాలకి సంబంధించిన పిక్టోగ్రాఫ్ నినా హృదయం పై పరుస్తారు . నాకోచ్చే సందేహాలని నేను వ్యక్త పరుస్తాను ,వెదుక్కుంటాను ,చదువుకుంటాను ,ఆలోచించుకుంటాను .

దుక్కమనిపిస్తే సంగీతమనే డ్రగ్ ని హృదయం లోకి ఇంజెక్ట్ చేసుకునిదుక్కాన్ని వదిలించుకుంటాను ,లేదంటే ”మిల్స్ అండ్ బూన్”లోకి పారిపోయి ప్రపంచమంతా భలే రొమాంటిక్ గా ఉందనీ కాసేపు భ్రమ పెట్టుకుంటాను . ఇంకా .. మరీ రాయాలని చాలా అనిపిస్తే రాస్తాను . నాఆదిమ సహజాతం ఏంటంటే నాకు ఎవరైనా ఇంకోరి మీద పెత్తనం చేస్తే నచ్చదు ,కొందరు ఒదిగి వుండటం ,కొందరు చాతీ విరుచుకుని వుండటం అసహ్యం . అసూయ, ద్వేషం ,దురాశ…  బైబిల్ లో చెప్పినసైతాన్  అంటే వీటి కలయికే   అని నమ్ముతాను . ఈవిల్ అంటే అసహ్యం నాకు . వీటన్నిటి గురించి రాయాలని ,అంత పరిణతి రావాలని తాపత్రయ పడతాను. ”ఎంత జ్ఞాన విహీనమయినది మానవహృదయం !భ్రాంతి అనేది ఒక పట్టాన తొలగి పోదు .యుక్థి , వివేచన ఎంతో ఆలశ్యంగా ప్రవేసిస్తాయి మనస్సులో ..”అంటూ రత్న గురించి రాసిన టాగోర్ లాగా  ,”  మొపాసా లాగా   ,హెన్రీ లాగా  ,గోగోల్ లాగా ,”తిరగేసి కొట్టు అనే వ్యూహాత్మక సిద్ధాంతాన్ని ”తెలియ చెప్పిన పతంజలిలలాగా .. ఇలా అత్యద్భుత ప్రతిభా సంపన్నులయిన రచయితలని చూసి దిగ్భ్రమ చెంది వారి లాగా  రాయాలని ఆశ పడతాను.

నాకు అంత ప్రతిభ లేదు కనుక నేను రాసినవి తిరిగి చూసుకోవడం కూడా నాకు అసహ్యం . నాకు నచ్చవు . అందుకని రాసినవన్నీ అచ్చుకివ్వను . అచ్చయిన వాటి మొహం కూడా చూడను . ఇంకా అత్యంత రహస్యం  ఏంటంటే నా హృదయంలో విన్సెంట్ వాంగో ,కాఫ్కా .. అఫ్ కోర్స్ చండీ దాస్ వంటి వాళ్ళు ఇల్లు కట్టుకుని వున్నారు .చాలా ఏళ్ళుగా వాల్లిక్కడ  రెసిడెంట్స్  . నా పిచ్చితో వాళ్ళు ,వాళ్ళమేజిక్ తో తో నేను ,మా మూడ్ స్వింగ్స్ తో కిరణూ సహజీవనం చేస్తుంటాం . నా రాతనీ ముఖ్యంగా జీవితాన్ని ఇలాటి వాళ్ళందరూ లీడ్ చేస్తుంటారు . కిరణ్ పాపం మార్క్స్ ని ,మావో ని, బుద్ధుడ్నీ ,అంబేద్కర్ ని తోడు పెటుకుని నా తిక్కకి మందులు నూరుతుంటాడు   .  నేను రాసే రాతలో ఆత్మ కిరణ్ అక్షరం నేను . చేసే పనిలో ఆలోచన కిరణ్ ఆచరణ నేను .

ఎలా రాస్తాను అనేది శైలీ శిల్పాలకి సంబంధించిన విషయం కదా .. . నేనేమనుకుంటానంటే వస్తువు దాని శిల్పాన్ని అదే వెతుక్కుంటుందీ అని . రాయడమనేది” రివర్ కోర్స్” లాటిది అనుకుంటా  . మనంకలం పట్టుకుంటాం అంతే . మన నిమిత్త మాత్రత్వంతో రక్తమాంస భరితమయిన పాత్రలు నది లాగే ఊహించని రీతిలో వాటి గమనాన్ని అవే నిర్దేసించుకుంటూ సాగుతాయి . కాకపోతే రచయితహృదయంలోని సౌజన్యం ,సౌశీల్యత ,సహన శీలత,ధీరత  రచనలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుంది . ముగింపుని అదే  నిర్దేశిస్తుందనుకుంటా . రచన వ్యక్త పరిచే తాత్వికతే రచయిత .

మనిషిగా నాకు రిజిడిటీ అంటే అయిష్టం ,సరళత అంటే ప్రేమ . ఎరాక్లితోస్ చెప్పినట్లు ”There is nothing permanent except change..” [ఇంక్లూడింగ్ మై అబౌవ్ వోర్డ్స్ ]

 

 

వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు ఇంతకీ?!

కందుకూరి రమేష్ బాబు
Kandukuri RameshYour children are not your children.
They are the sons and daughters of Life’s longing for itself.They come through you but not from you,
And though they are with you yet they belong not to you.You may give them your love but not your thoughts,
For they have their own thoughts.

You may house their bodies but not their souls,
For their souls dwell in the house of tomorrow,
which you cannot visit, not even in your dreams.

Kahlil Gibran

+++

ఒక్కోసారి.
కొన్ని చరణాలతో పిల్లల పాదాలను ముద్దాడాలి.

లేదా మొక్కాలి.

అవును.

ఈ పిల్లలు పిల్లలు కాదు.

అసలు ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు మన పిల్లలు మన పిల్లలు కాదు,

మనం ఎన్నడు కూడా ఊహించనైనా ఊహించని భవితకు చిరునామాలు.

వాళ్ల ఆలోచనలు వాళ్లవే. వాళ్లకు మనం ప్రేమను పంచగలమేమోగానీ మన ఆలోచనలు అస్సలు రుద్దకూడదు. నిజం.

వీళ్లనే చూడండి.
డిస్టర్బ్ చేయగలమా?

వాళ్లనలా మాట్లాడుకోనిద్దాం.
మన మాటలేమో మనం చెప్పుకుని తప్పుకుందాం.

+++

నిజం.
మనం ఎందర్నిచూడం.

రోజూ బడికి వెళుతున్న పిల్లల్ని ఎందర్నో చూస్తుంటాం.
కానీ ఎపుడో ఒకసారి వాళ్లలో పెద్దరికాన్నికూడా  చూస్తుంటాం.కొన్నిసార్లు వాళ్లు చర్చిస్తుంటే ముచ్చట వేస్తుంది.
మరికొన్నిసార్లు విస్మయానికీ గురవుతాం.
ఈ చిత్రం అటువంటిదే…వాళ్ల మేధోమధనానికి దృశ్యాదృశ్యం.+++

ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఇద్దరు పిల్లలు ఒక విషయంలో ఆగిపోయారు.
బడికి వెళుతూ వెళుతూ ఆగిపోయి ఒకచోట కూచుండి ఏదో విషయం చర్చించుకుంటూ ఉన్నారు.
బహుశా ఒకబ్బాయి తాను రూపొందించిన ప్రాజెక్టు గురించి ఇవతలి అబ్బాయికి వివరిస్తూ ఉన్నాడనుకుంటాను. కానీ ఆ వివరణ సామాన్యంగా లేకపోవడమే నన్ను కట్టిపడేసింది.

వాళ్ల బ్యాగులు, బూట్లూ, యునిఫారాలూ, అసలు వాళ్లూ..
చూస్తుంటే ఒక అబ్దుల్ కలాం ఇంకో అబ్దుల్ కలాంతో సెషన్ లో ఉన్నాడనిపించింది.
చప్పున తీశాను. తీసి చూస్తుంటే ఒక గొప్ప భవితను నేను భవిష్యత్తుకే కాదు, వర్తమానానికీ భద్రపర్చానన్న ఆనందం కలిగింది.

ఎంత బాగున్నారు పిల్లలు!
వాళ్లట్లా తరగతి గురించి మరచిపోయి అంతలా తీవ్ర ఏకాగ్రతతో నిమగ్నమవడం ఉందే? అది నిజంగా చిత్రం. అంతటి లోతైన నిమగ్నత, నిబద్ధతా పిల్లల్లో కానరావడం నిజంగా చిత్రమే.
అందుకే అనడం, వాళ్లు మన పిల్లలు కాదని!

+++

మామూలుగా వాళ్లను ఆ వీధిలో ఆ చప్టామీద కూచుని మాట్లాడుకోవడం నేనెప్పుడూ చూడలేదు.
రోజూ హడావిడిగానే వెళతారు. కానీ ఆ ఉదయం వాళ్లట్లా పెద్ద మనుషుల్లా ఒక అంశంపై లోతుగా చర్చించుకుంటూ ఉంటే, అలా కూచుని డిస్కస్ చేయడం చూస్తుంటే నిజంగానే నేనిప్పటిదాకా పిల్లల్ని అట్లా చూడలేదనిపించింది. ‘చూడలేదనడం’ కంటే ‘నా కంట పడలేద’నాలి.

నిజం.
మళ్లీ చూడండి.

వాళ్ల ఎనర్జీ. వాళ్ల ఎక్ర్ ప్రెషన్. బాడీ లాంగ్వేజ్…
అంతా కూడా ఒక దృశ్యం. శ్రవణం.
ఒక సజీవ రంగస్థలం. ఒక గొప్ప భరోసా.

ముని అంటే ఏమిటో అర్థం అయింది.మునిగిపోయారు మరి!
+++నిజానికి పిల్లల్ని పట్టించుకోంగానీ -ఏమో, ఎవరెట్లా చర్చిస్తున్నారో మనకేం తెలుసు?
పిల్లలు నిజంగా ఇంతలా అధ్యయనంలో, అనుభవంలో, షేరింగ్ లో ఉన్నారని మనకు తెలియాలనేం ఉంది?
కానీ తెలుస్తుంది. ఎపుడో ఒకసారి తెలుస్తుంది. ఇట్లా ఎపుడో ఒకసారి కంట పడితే అప్పట్నుంచీ వాళ్లను నిజంగానే చూడటం షురువవుతుంది. చూడగా చూడగా వాళ్లు రేపటి పౌరులు అన్న భావనా కలుగుతుంది.
ఖలీల్ జిబ్రాన్ చెప్పిన ‘కవితాతత్వం’ ఎన్నిసార్లు చదివినా అర్థంకానిది ఆ క్షణాన ఒక్కపరి విశదమవుతుంది.
‘మీ పిల్లలు మీ పిల్లలు కాదన్న’ సంగతీ తక్షణం బోధపడుతుందితర్వాత…
అవును తర్వాత చిత్రం గొప్పదనం అర్థమవుతుంది.
దృశ్యాదృశ్యం అంటే ఏమిటో ఎరుకలోకి వస్తుంది.
ఒక నిశ్చలన చిత్రం మనల్ని చలనంలోకి తేవడం అంటే  ఏమిటో కూడా తెలుస్తుంది.

+++

థాంక్యూ కిడ్స్.

ఏవేవో మాట్లాడుకున్నాం.
ఇంతకీ మీరేం మాట్లాడుకుంటున్నారు?
ఈ సారి దొరకబట్టుకుని ఫొటోలు తీయకుండా ఆ సంగతులే అడుగుతాను.
బై ఫర్ నౌ.

ఆ ఇంట్లో దెయ్యముంది..

avvariఆ ఇంటి గురించి వాకబు చేసినపుడు అన్నింటి కన్నా ఆమెకు ముందుగా  తెలిసిన విషయం, ఆ ఇంట్లో దెయ్యముందని.
 
ఇదేమిట్రా నాయనా అనుకొని, ఆ పక్కనే ఉంటోన్న తెలిసిన టీచరునొకాయన్ని అడిగితే ఆయన అన్నాడు గదా-” మేడం, నాలుగైదేళ్ళ నించీ ఆ ఇల్లు ఖాళీగా ఉందన్నది మాత్రం వాస్తవం. ఇంతకు ముందు అద్దెకు ఉన్న ఆమె  అక్కడే ఆత్మహత్య చేసుకొని  చచ్చిపోయిందంట. అదికూడా అనుకుంటుంటే విన్నదే గానీ వాస్తవం మాత్రం మనకు తెలియదు. అయినా దెయ్యాల్లాంటివి ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు? ఇల్లు మాత్రం ఏ ఇబ్బందీ లేకుండా అన్ని విధాలుగా మీకు బాగుంటుంది” అన్నాడు.
దెయ్యాలంటే నమ్మకమా అపనమ్మకమా అన్న మీమాంసలో పడేంత సమయం అప్పుడు లేకపోయింది తనకు. వొచ్చి ఇల్లు చూడడం, చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే ఆ ఇంట్లో చేరిన నెల రోజుల వరకూ చుట్టు పక్కల వాళ్ళంతా తన గురించే అనుకుంటూ ఉన్నారు.  నాలుగైదు రోజులుండి ఖాళీ చేసి పోతుందిలే అనుకన్నారు. ఈ విషయాలన్నీచాలారోజుల  తర్వాత పక్కింటామె చెప్పింది తనకు.
ఉండగా ఉండగా తనకు తెలిసి వొచ్చిన విషయం ఏమిటంటే నమ్మకమైనా, అపనమ్మకమైనా అవి అనుభవం మీదనే తేలతాయి. ఆ అనుభవం కూడా మనమున్న స్థితిని బట్టే ఉంటుంది. అందునా, ఇప్పుడు అనిపించిన విషయాలు రేపటికి  కూడా ఇట్టానే అనిపించాలని లేదు. ఇలాంటి తెలివిడి తనకు ఆ ఇంటి నుండే వొచ్చింది. ఇప్పటికిప్పుడు ఎవరైనా తనను ఆ ఇంట్లో నిజంగా దెయ్యముందా అనడిగితే ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేదు. ఒకోసారి ఉంటుంది, ఒకోసారి ఉండదు అని మాత్రమే చెప్పగలదు.
చాలా సార్లు ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంటే అది ఆ ఇంటి గురించి కాక తన గురించి, తన ఆంతరంగిక విషయాల గురించి తరచి తరచి చూసుకున్నట్టుగా   ఉంటుంది ఆమెకు .
అట్లా తరచి చూసుకోవడం ఒకోసారి తనకు తెలియకుండానే ఇష్టంగా ఉంటుంది. మరోసారి అసలు ఆ ఇంటి నుంచీ, చివరకు తన ఉనికి నుంచే తప్పించుకొని ఎక్కడకయినా పారిపోదామా అన్నంత భయం గొలిపేదిగా కూడా ఉంటుంది.
****                                                                              *****                                                             ****
ఆలోచనలు అనేక విధాలుగా కదులుతూ అదుపు తప్పి పోతున్నాయి. అట్లా కావడం ఎంతమాత్రమూ  మంచిది కాదని డాక్టర్ హెచ్చరించడం తను గుర్తు చేసుకున్నది. అట్లా కాకూడదు, అట్లా కాకూడదు అని తనను తాను సంభాళించుకొనేందుకు ప్రయతించింది. కాసేపు వేరే విషయాల మీదకు దృష్టి మళ్ళించేందుకు చూసింది.
చెట్టు కింద అరుగు మీద కూర్చున్నదే కానీ  ఎండ సెగ తెలుస్తూనే ఉంది. బయటి సెగకు తోడు లోపలి సెగ కూడా జతయి నోరంతా పిడచగట్టుక పోతున్నట్టుగా అనిపిస్తోంది. పెదాలను నాలుకతో తడుపుకొని, బాటిల్‍లోని నీళ్ళను లోపలికి వొంపుకున్నది. దాహమయితే తీరింది కానీ నోరంతా ఏదో చేదుగా అనిపించింది.
కాసేపటికి పి.ఎచ్. సి లోనించి “సరోజక్కా” అని పిలుస్తూ తన దగ్గరికొచ్చింది నీలిమ.
వొచ్చీ రాగానే ,”వొంట్లో వుషారుగా ఉందా, జెరం తగ్గి పోయిందా” అని అడిగింది.  అలా అడుగుతూనే చొరవగా నుదురు మీద చేయి వేసి చూసింది.
బదులుగా- ” నయమే లేవే, మరీ నిన్నటంత లేదు గానీ” అనింది తను.
“ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సింది. ఈ ఎండకు పడి తిరిగితే లేని రోగం కూడా వొస్తది” హెచ్చరింపుగా అనింది నీలిమ
“కొద్దిగా బాగానే ఉన్నట్టుగా ఉంటే, చిన్నగ బయల్దేరాను లేవే. మరీ ఇబ్బందిగా ఉంటే ఈ బండ చాకిరీ నేను మాత్ర ఎలా చేయగలను. ఇంతకీ ఇప్పుడు మీటింగు ఉంటదంటనా, లేదంటనా” అడిగింది తను.
“అందరూ అదే అనుకుంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకన్నారు కదా. పాపం అందరూ ఈ ఎండన పడి వొస్తానే ఉన్నారు. ఇంకాసేపాగితేగానీ ఏమయ్యేదీ తెలియదు”
వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ  ఉండగానే చాలా మంది ఏఎన్నెంలు వ్యాక్సిన్ బ్యాగ్‍లు లోపల పెట్టేసి ఒక్కొక్కరుగా చెట్ల కిందకి చేరుతున్నారు. డిపార్ట్‍మెంట్‍కు సంబంధించిన కబుర్లు, వాళ్ళు పని చేసే ఏరియాలో ఉండే సమస్యలు – ఇట్లా మాట్లాడేసుకుంటా ఉన్నారు. మరికొంత మంది వాచీలు చూసుకుంటూ మీటింగు ఉంటుందా, ఉండదాని వాకబు చేస్తున్నారు.
టైం రెండు దాటుతున్నది. కాసేపటికి పిఎచ్‍సి స్టాఫొకరు వొచ్చి “డాక్టరు గారికి ఏదో ఫోనొచ్చింది. అర్జెంటుగా వెళ్ళి పోయారు. రేపు మీటింగుంటదని ఇప్పుడే ఫోన్లో చెప్పా”రని అన్నాడు.
“మళ్ళా రేపా “, అన్నారు కొంతమంది. “ఎటూ తప్పేది కాదుగా ఈ రోజుకు బతికాం” అనుకున్నారు చాలా మంది. ఎవరి దారిన వాళ్ళు ఒక్కొక్కరిగా బయలు దేరుతున్నారు. తను, నీలిమా కూడా కాంపౌండ్ దాటి బయటకొచ్చారు.
దారిలో, “ఈ ఎండకు ఏం పోతావుగానీ మా ఇంటి కాడికి పోదాంరాక్కా” అనింది నీలిమ.
“లేదే, మా అన్న కాడికి పోయి రావాలి. పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది”.
“సరే, అయితే రాత్రికి వొచ్చి తోడు పడుకునేనా. అసలే వొల్లు బాగాలేదు. ఈ పరిస్థితుల్లో మల్లా ఒక్క దానివే ఉన్నావంటే మీ డార్లింగొచ్చి ఎదురుగా కూర్చుంటదేమో!”
ఆ పిల్ల డార్లింగన్న పదాన్ని వొత్తి పలికిన తీరుకి చిన్నగా నవ్వుతూ – “వొద్దులేవే, బాగానే ఉందిగా. పాపం రోజూ నువ్వు మాత్రం ఎక్కడకని వొస్తావు. అంత ఇబ్బందిగా ఉంటే నేనే ఫోన్ చేస్తాలే” అనింది సరోజ.
****                                                                         *****                                                                               ****
ఎండకు వొళ్ళంతా గుచ్చుక పోతున్నట్టుగా ఉంది ఆమెకు. ఉదయం పని, ఆ తర్వాత ప్రయాణం- వీటితో  వొళ్ళు తూలిపోతున్నట్టుగా నీరసం అయింది. కాసేపు ఎక్కడన్నా నీడలో ఆగుదామానిపించింది. కానీ ఇక్కడెక్కడా తను ఆగడానికి లేదు. ఆగితే షాపుల ముందర ఆగాల్సిందే. ఇదంతా ఎందుకు లెమ్మని ఓపిక తెచ్చుకొని చిన్నగా నడవడానికే ఆమె నిర్ణయించుకున్నది.  ఈ రెండు రోజుల నుంచీ కాసిన జ్వరం తనని బాగా నీరసం చేసేసింది.
ఈ సమయంలో నీలిమ తోడు లేకుంటే ఎలా ఉండేదోననిపించింది తనకు. ఒంట్లో ఏ కాస్త నలత చేసినా, మనసు కాస్త తేడాగా ఉన్నా, తన బలహీనతలోనించీ “ఆమె” తన ముందర ప్రత్యక్షమవుతుందేమోనని  ఒకోసారి భయం వేస్తుంది.
ఆలోచనల్లో ఉండగానే బస్టాప్ దగ్గరకొచ్చేసింది. బస్సు వొస్తే ఎక్కి టిక్కెట్ తీసుకొని ఎందుకైనా మంచిదని కిటికీ దగ్గర కూచ్చుంది. ఆలోచనలు వాటి కొసల నుండీ తిరిగి మళ్ళా మొదలవుతున్నాయి. ఒక ధారలాగా ఎడ తెగకుండా తనను తమ లోపలికి పీల్చుకుంటున్నాయి.
“ఇలా కాకూడదు” అనుకున్నది తను. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే లేని రోగం కూడా వొస్తుందన్న సైకియాట్రిస్ట్ హెచ్చరికను గుర్తుకు చేసుకున్నది. ఊరికే అలా ఆలోచనల్లో పడి లోలకంలా పడి కొట్టుకోకుండా ఏం ఆలోచిస్తున్నావో గమనించు అన్న ఆయన సలహాను తలుచుకున్నది.
నెమ్మదిగా అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా పోగు చేసుకునేందుకు  ప్రయత్నం మొదలు పెట్టింది.
అసలిదంతా అమ్మ ఉదయాన్నే ఫోన్ చేయడంతో మొదలయ్యింది. ఫోన్లో ఆమె ఏడుస్తున్న గొంతుతో “అన్నను పోలీసోల్లు పిలచక పోయార” ని అన్నది.
” ఎందుకు” అని అడిగితే “ఎస్సై గారు పిలచక రమ్మన్నారు. మళ్ళీ పంపిస్తాం “, అని అన్నారంట.
“ఊళ్ళొ ఇంకా మరో ఇద్దర్ని కూడా పిలచక పోయార”ని ఆమె అన్నది.
రెండు రోజుల నుండి డ్యూటీకి సెలవు. ఈ రోజేమో వ్యాక్సినేషన్. నిన్న సాయంత్రమే తను హాస్పిటల్‍కు ఫోన్ చేసి రేపు వొస్తానని చెప్పింది కూడాను. ఇప్పుడు తను డ్యూటీకి వెళ్ళక పోతే ఎక్కడిదక్కడ ఆగి పోతుంది. ఏం చేయాలో తోచక “సాయంత్రానికల్లా ఇంటికొస్తాన”ని అమ్మతో పోన్లో చెప్పింది.
ఎలాగైతే అలాగవుతుందని లోపల్లోపల ధైర్యం చెప్పుకుంటుందేగానీ లోపలి గాబరా ఎంతకీ ఆగడం లేదు.
“ఎక్కడా ఏమీ అలికిడి లేదే. మళ్ళీ ఎందుకని ఇలా వెంటబడుతున్నారు?”
“మళ్ళి ఏమన్నా నెత్తి మీదకు తెచ్చుకున్నాడా?”
Sketch18116461చుట్టుపక్కల ఎక్కడా నక్సలైటన్న పేరు వినపడకుండా పోయేదాకా పోలీసులు ఆయనెమ్మటి పడుతూనే ఉన్నారు.
“ఎవరికీ లేని ఖర్మ నీకెందుకురా” అని అమ్మ నెత్తీ నోరూ మొత్తుకుంటే మౌనమే వాడి సమాధానం. ఇంకా గట్టిగా నిలదీస్తే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు.
ఇట్లా మొత్తుకున్న కొన్ని రోజుల దాకా తగ్గినట్టే తగ్గి ఇక ఏమీ లేదులే అని అనుకునేటప్పటికీ మళ్ళీ మనకు తెలియకుండానే పీకల్లోతు కూరుకుని పోయేవాడు.
“మీ వాడి పేరు రికార్డుల్లోకి ఎక్కింది. ఎక్కడ ఏమీ జరిగినా మీ వాడినే ముందు తీసుకొని పోయేది”, అనే వాళ్ళు అందరు.
“అట్లా రికార్డుల్లోకి ఎక్కిందాన్నేనా, చుట్టూ ఏమీ లేక పోయినా మళ్ళీ మళ్ళీ పట్టుకొని పోతా ఉంది?” అనుకున్నది తను.
అట్లా అనుకుంటూనే గబగబా తయారయి వ్యాక్సిన్ బ్యాగ్ పికప్ చేసుకుంది. ఆటో ఎక్కి తను పని చేసే ఊర్లో దిగే సరికే ఎండ దంచేస్తా ఉంది. ఆటోలు ఆగే దగ్గర  ఆశా వర్కర్ రమణమ్మ సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ బ్యాగ్‍ను ఆమె తన చేతుల్లోకి తీసుకున్నది.
గబగబా నడుస్తూ చిన్నబడి దగ్గరికొచ్చేసరికి వాళ్ళకు సుమారు ఒక పది మంది డ్రస్సుల్లో, తుపాకులతో ఎదురయ్యారు. ఊహించని ఈ సన్నివేశానికి తనకు ఒక్కసారిగా ఊపిరాడనంత పనయ్యింది. ఒక్క క్షణం వాళ్ల వైపు చూస్తూ నిలబడింది. వాళ్ళు గబగబా వరుసగా ఒకళ్ళ వెనుక ఒకళ్ళుగా తమను దాటి మెయిన్ రోడ్‍కు  అవతల ఉన్న గుట్టల వైపు పోతున్నారు.
లోపల తను ఆలోచిస్తున్న దానికి, బయట తను చూస్తున్న దానికీ సంబంధం ఏమయినా ఉందేమోనని ఆమె కాసేపు సంకోచపడింది. తను మాట్లాడేది వాళ్ళకు వినపడుతుందేమోనన్న భయంతో , ” రమనమ్మా, ఏందీ వీళ్ళూ?” అని చిన్నగా అడిగింది.
“ఎర్ర సెందనం కోసమంటమ్మా. అడివిలోకి ఎవురూ కూడా పోవడానికి బయపడి సస్తా ఉండారు. మొన్న తిరపతి కాడ కట్టె కొట్టడానికి పోయినోళ్ళను కూడా సంపిండ్రంట గదా. మనకెల్లంతా కూడా అడవడివీ గాలిస్తా ఉండారు”
ఒక్క క్షణం నింపాదిగా గాలి పీల్చుకున్నది తను. అంగన్‍వాడీ  సెంటర్ దగ్గరికొచ్చేసరికి అప్పటికే బాలింతలు చంటిబిడ్డల్ని తీసుకొని తన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళను ఒక్కొక్కళ్ళనూ పలకరిస్తూ పనిలో పడింది తను.
****                                                                        *****                                                                                         ****
తిరిగి వొస్తున్నప్పుడు దారిలో అటో తోలుతున్న చాకలి గురవయ్య అంటున్నాడు. “పెద్ద పెద్ద వాళ్ళను వొదిలేసి సన్నా సపకా వాళ్ళను చంఫుతున్నారు మేడం”.
 
ఆ మాటలు తనకు తగలాలనే, తనను ఉద్దేశించే అంటున్నాడు.
అయినా తనకు తెలియకుండానే, “ఆఁ” అన్నది తను.
తను “ఆఁ” అనడం అతనికి ఎలా తోచిందో గానీ దారి పొడగునా వొదురుతానే ఉన్నాడు.
“ఎప్పటికయినా సన్నా సపకా వాళ్ళకేనంట నెత్తి మీదికొచ్చేది”.
“ఈ చుట్టు పక్కల తలకాయ ముదిరిన ప్రతీ వాడూ ఎర్ర చందనం డబ్బు ఏదో రకంగా తిన్నవాడేనంట”.
“మొన్న ఎలక్షన్లో ఇప్పటి ఎమ్మెల్యేని గెలిపించింది కూడా ఆ డబ్బులేనంట”.
“ఇట్టాంటి డబ్బు తినడానికి ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదంట.”
“కట్టె కొట్టబోయిన తన లాంటి వాళ్ళకు మాత్రం తన్నులూ, కోర్టు కేసులూ, చావులూనంట”.
“అట్టాంటి కేసుల్తోనే సంవత్సరంగా డబ్బులు పోసుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడంట”.
చాకలి గురవయ్య మాటల్లో కసంతా తన మీదకే కొడతా ఉంది. అది తనకు తగలాలనీ, తనను బాధ పెట్టాలనీ ఉద్దేశించినట్టుగానే ఉంది.
ఒక్క క్షణం తనకు అతనితో, ’నేనూ నీ లాంటి దాన్నే” అని చెప్పాలనిపించింది. ’నాకూ నీకూ ఎడంలేదు. నీది బయటకు కనపడే బాధ. నాది బయటకు కనపడనిది. నీలా చెప్పుకోలేనిది” అని అనాలనిపించింది. “కానీ అది ఆయనకు అర్థమవుతుందా”?
“అయినా ఇప్పుడు తను ఈ మాటల్నీ,  మాటలతో సలపరించే తన గతాన్నీ తవ్వుకుంటూ కూర్చోలేదు. అది తనని ఇంకా ఇంకా పాతాళానికి తోసేస్తుంది. తను దాన్నించీ తప్పుకోవాలి. బతకాలి”. లోపలికి గట్టిగా గాలిపీలుస్తూ  అనుకుంటూ ఉండిదామె.
****                                                                                      *****                                                                              ****
బస్సు దిగి ఇంటి దగ్గరకొచ్చేసరికి అన్న వొచ్చేసి ఉన్నాడు. తను  ఇంట్లోకడుగు పెట్టేసరికి మొగరానికానుకొని గిట్టకాళ్ళమీద కూర్చొని తనని చూసి పలకరింపుగా నవ్వాడు. అమ్మ పొయికాడ రొట్టెలు చేస్తా ఉంది. అన్న తాగుతున్న బీడీని పక్కన పారేసి గ్లాసు తీసుకొని టీ పోయించుకరాను బయలుదేరాడు.
“ఇప్పుడెందుకులేన్నా”, అంటే , “పోనీలేవే, కాసింత రొట్టె తిన్నాక టీ తాగడం నీకిష్టమేగా” అన్నది అమ్మ.
అన్న బయటికెలితే ఆ సమయంలో ఏదన్నా మాటాడొచ్చని ఆమె ఆలోచన.
అన్న గ్లాసు తీసుకొని బయటకు పోగానే అమ్మ చెప్పడం మొదలు పెట్టింది.
“ఊళ్ళలో ఉండే అన్న లాంటి వాళ్ళందరినీ మళ్ళా పోగేసి మాట్లాడానికి పిలిపిచ్చిండ్రంట. ఆప్పుడప్పుడూ అట్టా పిలిపిచ్చి మాట్టాడితే గానీ బయ్యముండదని ఇదంతా చేస్తా ఉన్నారంట. రేపు మార్కాపురం డీఎస్పీ కాడికి కూడా అందరూ పోయి రావాల్నంట”.
“మళ్ళీ రేపు కూడానా” , అన్నది తను.
“ఏం చేస్తాం. అందరూ బాగానే ఉండారు. మా కర్మే ఇట్టా కాలబన్నది”, పుల్లవిరుపుగా అన్నది వొదిన.
తను వొచ్చిన దగ్గర నుండీ ఆమె ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాటాడలేదు. ఇలాంటి సమయాల్లో ఆమె మూతి ముడుచుకోని ఉంటుందని తనకి తెలుసు. ఆమెలో ఏదో కోపం. ఎవరి మీద చూపాలో తెలియని కోపం.
ఆమె కోపం ఉదయం తను చూసిన చాకలి గురవయ్య లాంటిదేనని అనిపించింది తనకు. కానీ ఆమె కోపము, ఆ పుల్లవిరుపు వైఖరి తనను ఎంతకూ కుదురుగా ఉండనీయడంలేదు.
” ఎవ్వరి బతుకులు మాత్రం బాగున్నాయి. తను కూడా ఆమె లాగా, చాకలి గురవయ్యలాగా ఈసురోమనే కదా బతుకుతున్నది. పైకి మాత్రం ఇదిగో, మంచిగా కనపడే  గుడ్డలు కట్టుకొని, భుజానికి హ్యాండ్ బ్యాగ తగిలించుకొని తెల్లపుల్లగా కనపడుతున్నాను గానీ, నా బతుకు కూడా తగలబడి పోతుందని ఈమెకు తెలియదా? వీళ్ళకన్నా ఏడ్చుకోవడానికి ఉంది. నేను మాత్రం ఈ తెల్లపుల్లని గుడ్డల మాటున శిధిలమైపోతున్నాను” అని గట్టిగా అరవాలనిపించింది.
“కానీ తనకు తెలుసు. మనుషుల మధ్యన ఉండే దూరాలు, ఎత్తు పల్లాలు మనుషులను ఎంతకీ దగ్గర కానీవు.  ఎంత మొత్తుకున్నా ఒకరికొకరు అర్థం కానీయవు. ఒకరికొకరు కాస్త దగ్గరకొచ్చినట్టుగా అనిపించినా అది కాసేపే. తిరిగి మళ్ళీ మనుషుల మధ్య గోడలు పైకి లేస్తాయి. పైకి లేచిన గోడల మధ్యన మనుషులు జంతువుల్లాగా బంధీలై గాలిలోకి కాళ్ళూ చేతులూ విసురుతూ మొత్తుకోవాల్సిందే.”
“లేకుంటే తను ఏమి చేసామని  వొదిన తనతోనూ, అమ్మతోనూ సరిగా మాటాడదు? ఏదన్నా అంటే, ఈ కొంపలో నా కర్మ కొద్దీ వొచ్చి పడ్డానంటుంది. ఆమె ఈ ఇంటికొచ్చిన  దగ్గరనించీ ఇదే తంతు. అంతా అయిపోయీ, అన్న ఇక ఎటూ పోకుండా ఇంటి కాడే ఉండేంత వరకూ ఇట్లాగే కక్షగా ఉండేది ఆమె.”
“తనకూ, మొగునికీ పడక గొడవలై, ఇక కలిసి ఉండలేక వొక్కతిగా  ఉండాల్సొచ్చినపుడు  అన్నా, వొదిన, అమ్మ తన దగ్గరకు వొచ్చి రెండు రోజులున్నారు.  ఆ రెండు రోజులూ మాత్రమే వొదిన మునపటి కన్నా నెమ్మదిగా, మెత్తగా మాటాడింది. ఆ నెమ్మదితనం, మెత్తదనం చూసి తనే ఆమెను దూరం నుంచీ చూసి అర్థం చేసుకున్నానేమో అనుకున్నది. కానీ ఈ రోజు, ఈ సంఘటనతో మళ్ళీ తనకు తెలిసిన వొదిననే చూస్తున్నది తను”.
కళ్ళలో నీళ్ళు మెదలుతున్నాయి తనకు. అన్న వొస్తూ వొస్తూ పిల్లల్ని కూడా పిలుచుకొని వొచ్చాడు. వొస్తూనే వాళ్ళూ “అత్తా” అని మీద పడిపోయారు. హ్యాండ్ బ్యాగ్ లోనుండీ  కొనుక్కోవడానికి వాళ్ళకు డబ్బులు తీసిచ్చింది.
అన్న తెచ్చిన టీ తాగుతూ, “అయితే రేపు కూడా పోవల్నా” అని అడిగింది తను.
“అవును ఉత్త పున్నేనికే తిప్పుతా ఉండారు”, అన్నాడు ఆయన.
ఇంకేం మాటాడడానికి తోచలేదు తనకు.
టీ ఊదుకుంటా తాగుతా ఉంటే అన్న మొకం కెల్లి చూసింది. మొకమంతా డొక్కుపోయినట్టుగా ఉంది. రెక్కల కష్టంతో దేహం ఎండిపోయి కంప మాదిరిగా తయారయ్యింది. ” తనకున్న రెండెకరాల చేను పీల్చి పిప్పి చేస్తున్నది” అనుకున్నది తను.
Sketch18116461
ఈ నిశ్శబ్ధంలో కాసేపు ఆగి అటూ ఇటూ తిరుగుతూ బోకులు సర్దుకుంటున్న వొదిననూ, పిల్లలనూ, అమ్మనూ మార్చి మార్చి చూసింది. వాళ్ళు కూడా అన్న లాగే ఎండిపోయి వొట్టి చేపలల్లే ఉన్నారు. ఒకే ఇంటిలో ఒకే రకమైన కష్టాలతో ఒకరినొకరు ముమ్మూర్తులా పోలి ఉన్నారు.
కానీ వాళ్లందరినీ విడగొడుతున్నదీ, ఒకరంటే ఒకరికి ద్వేషాన్నీ, కోపాన్నీ కలిగించేదీ ఏదో అక్కడే మెసల్లాడుతున్నట్టూగా తోచింది. అది గాలిలాగా అక్కడే తిరుగుతూ ఉన్నది. వొంటికి తాకుతూ ఉంది. అక్కడక్కడే తిరుగుతూ మనుషుల్ని నిస్సహాయుల్ని చేసి దిక్కుకొకరుగా ఈడ్చుక పోతూ ఉంది. అది తనకు తెలుస్తూ ఉంది అనుకున్నది తను.
ఉండి ఉండీ కాసేపటికి, “నిన్న స్టేషను కాడ మీ లాయరు మాట్లాడిండు” అన్నాడు అన్న.
తను ఏమీ మాటాడలేదు.
ఏమయినా మాటాడితే అది ఆ ఇంట్లో మరో విస్పోటనంగా పని చేస్తుందని తనకు తెలుసు. అందుకే తను ఏమీ మాటాడలేదు.
కానీ అమ్మ అందుకోనే అందుకున్నది. అది నెమ్మది నెమ్మదిగా మొదలై తిట్లు, శాపనార్ధాలకు చేరుకుంటున్నది.
****                                                              *****                                                                                                 ****
అందరిలాగే తన బతుకూ ఉంటుదనుకున్నది తను.  పెళ్ళయిన కొన్నేళ్ళ దాకా బాగానే ఉన్నాడు  భర్త వెంకట రమణ. ఉద్యోగస్తుడు కాకపోయినా దగ్గరి సంబంధం బాగుంటుందని చేసారు. కానీ మూడేళ్ళు దాటిన దగ్గర నుంచీ మొదలయ్యిందీ నరకం. పిల్లలు పుట్ట లేదని అత్త, మామా సణుగుడు. దానికి తోడు తను చేసే ఉద్యోగం మీద ఏవేవో సూటిపోటి మాటలు. తన రాకపోకల మీద భరించరాని ఆంక్షలు. కాసింత ముందుగా బయల్దేరినా, కాస్త లేటుగా వొచ్చినా ఎంతదాకా మాటలు పడాల్సొస్తుందోనని గుండెలు బితుకు బితుకు మనేవి.
ఇది చాలదన్నట్టుగా ఎట్టా తగులుకున్నాడోగానీ రాజకీయ నాయకులెమ్మటి తిరగడం, ఎమ్డీవో, ఎమ్మార్వో ఆఫీసులెమ్మటి మరిగి ఊళ్ళో వాళ్లకి పనులు చేపించడం , దానికి గాను ఆఫీసర్లకింత ఇప్పించి తనూ కొంత దండుకోవడం.
“ఎందుకయ్యా ఈ తిరుగుళ్ళు, ఉన్న కాస్త పొలమూ చూసుకోక”, అంటే “తిరుగుతున్నాను కాబట్టే లోకం తెలుస్తుందం”టాడు.
ఇది ఎంత దాకా వొచ్చిందంటే చుట్టూ పక్కల ఏ పనొచ్చినా ఆయన కన్ను దాటి పోని పరిస్థితి.
ఆయన చేసే పనులు వింటుంటే ఒకోసారి తనకే ఆశ్చర్యం వేసేది. హైస్కూలు చదువు దాటని మనిషి ఇన్ని రకాలుగా చేయగలగడం నమ్మశక్యం అయ్యేది కాదు. ఇదంతా తన అన్న నడిచే దిశకు వ్యతిరేకంగా సాగడంగా తనకు అర్థమయ్యేది. ఇది ఇంట్లో ఇంకా ఇంకా హింసకు దారి తీసేది. అన్న జీవితంలో ఎదురయ్యే మలుపులు, ఇబ్బందులు రోజుకొక్క రకంగా తనకు దెబ్బలై తాకడం తనకు తెలుసు.
ఇందులో తన ప్రమేయం ఎక్కడా లేదు. కానీ ఇదీ అని చెప్పలేదు గానీ లోపల మాత్రం తనకు తెలియకుండానే తన మొగ్గు అన్న వైపే ఉన్నట్టుగా కనపడుతుండేది.
మొగుడు మొకాన్నే అనేవాడు, “నీకు ఇదంతా యాడ నచ్చుద్ది లేవే,  గుట్లమ్మటీ, అడువులమ్మటీ తిరుగుతుంటే నచ్చుద్దీ గానీ” అని. అన్న ఇబ్బందులకు గురి కావడం, కేసుల పాలయిన సందర్భాల్లో అయితే ఇక ఆ ఇంట్లో లేకుండా ఉంటే పీడా పోతుందనుకునేది.
ఇదంతా ఏళ్ల పాటు గడిచింది. అన్న జీవిత ఇక ఒక స్తబ్ధ స్థితికి చేరుకుంటున్నదనుకునే సమయానికి తన జీవితం ఇంకో ఇబ్బందిలోకి కూరక పోయింది.
వెంకట రమణ   ఎర్ర్ర చందనం కొట్టించడం మొదలు పెట్టాడు.  మొదట తను ఇది విన్నప్పుడు, ” ఇది, ఇక్కడా” అని ఆశ్చర్య పోయింది. ప్రకాశం, కడప జిల్లాల సరిహద్ధుల్లో ఇది సాధ్యమేనా అనుకున్నది.  కానీ తర్వాత్తర్వాత ఇది నిజమేనని తెలుసుకున్నది. ఫారెస్టోల్లూ, పోలీసుల గొడవ మళ్ళీ తన జీవితంలో మరో విధంగా మొదలయింది. కానీ అవి తన భర్తను బతక నేర్చిన వాడిగా, పలుకుబడి గలిగిన వాడిలాగా నిలబెట్టేందుకే దోహద పడ్డాయి. కేసులూ, రైడింగులూ అన్నీ అయ్యాయి గానీ అవన్నీ ఆయనని మరింత ఎత్తుకు చేర్చేందుకే ఉపయోగ పడ్డాయి.  ఇట్టాంటి డబ్బే కిందటి ఎలక్షన్లల్లో ఏరులై పారిందంట. చివరకు వెంకట రమణ పంచాయితీ సర్పంచ్ కూడా అయ్యాడు.
వీటన్నింటికీ తోడు తను ఇక తట్టుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరైన విషయం వెంకట రమణ  ఒంగోలులో ఎవరితోనో కాపురం పెట్టడం.  ఇది తన సహనానికి ఉన్న ఆఖరి హద్దును కూడా పూర్తిగా చెరిపేసింది.
****                                                            *****                                                                                          ****
బస్సెక్కి తిరిగి ఊరు చేరుకొనేసరికి ఎనిమిది దాటుతుంది. బస్సు దిగగానే పర్సులోనించీ సెల్లు బయటకు తీసి చూసుకుంది. నీలిమ నుంచీ రెండు మిస్‍డు కాల్స్.
తిరిగి ఆ నెంబరుకి కాల్ చేయబోయింది కానీ ఎందుకో ఒక్క క్షణం ఆగి మానేసింది. ఈ క్షణంలో ఆమె ఏది మాట్లాడించబోయినా  తను మాటాడగల స్థితిలో లేదు.
బస్టాప్ నుంచీ ఇంటి దాకా కూడా నడవడానికి ఓపికగా ఉన్నట్టు అనిపించడంలేదు. దగ్గర ఉన్న ఆటో ఒక దాన్ని ఆపి ఇంటి అడ్రస్సు చెప్పి ఎక్కి కూచ్చునింది.
బస్సు ఎక్కినప్పటి నుండే తల ఊరకే కదిలి పోతున్నట్టుగా అనిపిస్తోంది. కడుపులో ఒక పక్కగా మొదలైన మంట రొమ్ము దగ్గరకు పాకుతూ వొస్తుంది. అది ఇప్పుడు మరింత ఎక్కువై నోట్లో నీళ్ళు ఒకటేమైన ఊరుతున్నాయి. ముక్కుతో గాలిని నిండుగా పీల్చుకుంటూ నెమ్మదిగా వొదులుతూ నియంత్రించుకునేందుకు ప్రయత్నించింది. కానీ లోపలి నుంచీ వొస్తున్న హోరును ఆపుకోలేక పోతుంది. ఆటోలో నుండే భళ్ళున వాంతి చేసుకున్నది. నోరు, ముక్కు, కళ్ళ నిండా సుళ్ళు తిరిగుతూ ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టుగా అయింది.
ఆటో నడిపే అతను ఆటోను ఒక పక్కన ఆపి, పుక్కిలించుకోవడానికి నీళ్ళు అందిస్తున్నాడు.
****                                                              *****                                                                                   ****
శరీరాన్ని చిన్నగా ఈడ్చుకుంటూ,  మెట్లెక్కి పై దాకా వొచ్చింది కానీ తాళం తీసుకొని ఇంట్లోకి అడుగు పెడదామనుకునేసరికి వొళ్ళంతా భయంతో జలదరించింది. శరీరమంతా చెమటతో తడిచి ముద్దయింది. చేతులూ, కాళ్ళూ వొణుకుతూ ఉన్నాయి.  ఆ క్షణం  అక్కడ నుంచీ దూరంగా ఎక్కడకన్నా పారి పోదామా అనిపించింది. తాళం తీయాలనే ఆలోచన పక్కన పెట్టి మెట్ల మీద అలాగే కూర్చుండి పోయింది.
 
వొళ్ళూ, మనసూ పుండు మాదిరిగా సలుపుతున్న ఈ స్థితిలో ఇంట్లోకి అడుగు పెట్టడమన్న అలోచనే ఆమెకు ఊపిరి ఆడనీయడంలేదు.
తలుపు తీసి లోపలికెళితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అక్కడ “ఆమె” ఉంటుంది. ఇట్టాంటి సందర్బాల్లో ఆమె ఖచ్చితంగా తనకెదురుగా వొచ్చి నిలబడుతుంది.
ఆమె తనను ఏమీ అనదు. ఊరకే అలా చూస్తూ కూర్చుంటుంది. ఎటు కదిలితే అటు తన కళ్లను తిప్పి అదే పనిగా చూస్తుంటుంది. పారదర్శకమైన ఆ దేహాన్ని తను మొదట ఆ ఇంట్లోనే చూసింది. చూడగానే  మ్రాన్పడిపోయింది. తను చూస్తున్నదేమిటో అర్థమవగానే గబగబా అక్కడ నుంచీ పారిపోయింది.
ఇట్టాంటి అనుభవం తన చదువుకూ, తను చేసే పనికీ వ్యతిరేకంగా తోచింది కానీ త్వరలోనే ఆ పారదర్శకమైన దేహం వెనుకా, ఆ చూపుల వెనకా ఆకర్షణీయమైనదేదో ఉన్నట్టుగా తనకి అనిపించింది. అందులో ఏదో మార్మికమైనదేదో ఉన్నట్టుగా తోచేది. అది తనకు మాత్రమే అర్థమవుతున్నట్టుగా అనిపించేది.
“ఎవరు ఆమె?”
“మొగుడు రైల్వేలో ఉద్యోగమంట.”
“కొత్తగా పెళ్ళయిందంట.”
“అయితే ఈమె మాత్రం మంచిది కాదంట.”
“మొగుడు బయటికి పోగానే ఎప్పుడు మిద్దె మీదే అటూ ఇటూ తిరగతా ఉంటదంట.”
“ఏమయిందో ఏమో గానీ చివరకు ఆమె ఫ్యానుకు ఉరేసుకున్నదంట”
“చంపిండ్రో, ఆమే చచ్చి పోయిందో ఎవ్వరికీ తెలియదంట”.
“చివరకి, అద్దెకిచ్చినోళ్ళక్కూడా తెలియకుండా గప్‍చిప్‍గా బాడీని జీపులో వేసుకొని పోయిండ్రంట”.
“అభాగ్యురాలు పాపం. కానీ చావు ఎంత అదృష్టం”
“చావూ, చావూ  ఆడవాళ్ళంటే ఎందుకు నీకంత ప్రత్యేకమైన ఇష్టం?”
పక్కింట్లో నుండి ఏదో దైవ స్తుతి శ్లోకాలుగా వినవొస్తుంది. రాత్రి ఏడు గంటలకల్లా కల్లా తిని ఎనిమిదిన్నరకల్లా ఇట్టాంటి శ్లోకాలు, ప్రార్థనలు వింటూ అటువంటి ప్రశాంతత ఇచ్చే రక్షణలో సుఖంగా నిద్రపోయే ఆన్నీ అమరిన సుభద్రమైన సంసారం.
“అందరికీ హాయినీ, రక్షణనూ ఇచ్చే దేవుడు తన సంసారాన్ని మాత్రం ఎందుకనీ ఇలా చేసాడు?”
“ఈ రకంగా అలమటిస్తుంటే ఒక్క నాడన్నా తనని పట్టించుకోని గుడ్డి నాబట్ట కాదా వాడు.”
****                                                           *****                                                                                                      ****
మెట్ల సందుల్లోనించీ ఆకాశం చంద్రుని లేత వెలుతురులో సన్నగా మెరుస్తా ఉంది. అలసట తీరినట్టుగా అనిపించింది కానీ జంకు వల్ల కలిగిన అలజడి మాత్రం శరీరంలో ఇంకా ఉన్నట్టుగానే అనిపిస్తొంది
  తన కతంతా చెప్పినపుడు సైకియాట్రిస్టు చెప్పిన మాటలను ఆమెకు గుర్తుకొస్తున్నాయి.
“ఆ ఇంట్లో దెయ్యం ఉండడమా, లేకుంటే ఉండకపోవడమా అనేది మీ చుట్టు పక్కల వాళ్ళకు ఒక నమ్మకం కావొచ్చు. కాకుంటే ఒక భ్రాంతీ అయి ఉండవచ్చు. అంతకు మించి వాళ్ళ అనుభవంలోగానీ, అనుభూతుల్లోగానీ మరేమీ లేదు”.
” కానీ మీ అనుభవంలో మాత్రం ఇది  ఒంటరితనానికీ, జీవితంలోని స్తబ్ధతకు బదులుగా చావు పట్ల మీరు పెంచుకున్న ఆకర్షణగా నాకు తోస్తున్నది.”
“దెయ్యం పేరుతో ఉన్న ప్రతీ అనుభవంలోనూ మీరు ఆత్మహత్యతో తలపడుతున్నట్టుగానే నాకు అనిపిస్తోంది. అది కాసేపు మిమ్మల్ని భయ పెడుతోంది. మరి కాసేపు మిమ్మల్ని ఆకర్షిస్తోంది.  ఈ ఘర్షణ ఇట్లాగే సాగడం మీకు మంచిది కాదు. నిజంగా అట్టాంటి సంఘర్షిత క్షణాలే ఎదురైనప్పుడు వాటిలో ఊరకే పడి కొట్టుక పోకుండా  అదేమిటో తేల్చుకోవడమే బాగుంటుంది….”
ఫోన్ మోగుతోంది.
అవతల నీలిమ.
“రాత్రికి తోడుగా వొచ్చి పడుకునేనా”, అని అడుగుతున్నది.
తను ఇక నిశ్చయించుకోవాల్సిన సమయం వచ్చింది.
బదులుగా, ” పర్వాలేదులే” అని నచ్చచెప్పింది తను.
నీరసంగా అనిపించినా, నింపాదిగా తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది.
లైట్ వెలిగించి, కిందింటి పిల్లాడ్ని పిలిచి, నాలుగిడ్లి కట్టించుకరమ్మని డబ్బులిచ్చి పంపింది.

హేమంతం గోధుమ రంగు ఊహ

 
వసంత లక్ష్మి
 
హేమంతంలో ఆకులు 
నేలపై గోధుమ రంగు ఊహలా 
పరచుకుని ఉన్న రోజున 
సూది మొన లాంటి కర్ర పట్టుకుని 
ఒక్కో ఆకూ గుచ్చుతూ 
తోటమాలి  తిరుగుతూ ఉంటాడు …
 
కాలం అంతే నిర్దాక్షిణ్యం గా 
ఒక్కోక్షణంలో గుచ్చిగుచ్చి ఎన్నుకుంటుంది నిన్ను 
నా వంతు తప్పింది అని 
గుండెలపై చేయి వేసుకోవు నీవు 
ఏం జరుగుతోందో నీకు 
తెలియదు అంత అజ్ఞానివి నీవు .
 
ఆకుపచ్చగా 
పైలాపచ్చీసుగా గాలికి ఊగుతావు 
నీ కొమ్మన ఓ పూవు పూసిందని 
మురుస్తావు … పూలూ మాయం అయిపోతాయి 
అయినా ఆ బాధే లేదు నీకు 
 
కాండం నాకు అండ 
అని గర్వంగా ఎగురుతావు 
హేమంతం చెప్పాపెట్టకుండా తటాలున
ఆకు మొదలుని తుంచితే 
ప్రకటనలుండవు ..అంతా ప్రతీకార చర్యలే 
ఏ తప్పు చేసావో అని 
విచారణా ఉండదు , ఆకాశంతో ముచ్చట్లాడుతూ 
మరుక్షణంలో నేల మీద పడి ఉంటావు 
నీ ఆక్రోశం ఎండి గలగలమని 
ప్రతిధ్వనిస్తుంది . 
 
ఒక్క కణం అగ్ని చాలు 
ఖాండవ దహనానికి అన్నట్టు , 
నేల పడిన ఆకులని ఇంక 
మంట పెట్టాల్సిందే అని ఎవరో 
ఒకరు పిలుపు నిస్తారు ..
 
గోధుమ రంగుగా 
మారినప్పుడే నీ అంతం ప్రారంభం అయింది 
ఇంకా తెలుసుకోలేవా ? 
ఇంకా జవాబు కావాలా ? 
 
వసంతం అదిగోఆ మలుపునే 
ఆగి ఉంది  సమయం రానీ మరి ..
*
vasanta lakshmi

అబ్బో ఏం ప్రేమ!

అలివేణి, వేశ్య, 18 ఏళ్ళు 
మాణిక్యం, వేశ్య, 35 ఏళ్ళు 

 

మాణిక్యం: ఎందుకే అలివేణీ, అంత దిగులుగా ఉన్నావు? ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే దానివి. మన స్నేహితులందరిలో నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. గోపాలనాయుడికి నువ్వంటే అమిత మైన ప్రేమని అందరూ చెప్పుకుంటారు. అలాంటి ప్రేమ ఏ కొద్దిమంది వేశ్యలకో దక్కుతుంది.
అలివేణి: అవున్నిజమే! అతనికి నేనంటే చాలా ప్రేమ! కానీ రాత్రి గనక నువ్వతన్ని చూసి ఉంటే ఈ మాట అనుండే దానివి కాదు. నామీద మరొక మగవాడి నీడ పడిందని అతనికొచ్చిన పిచ్చి కోపం నువ్వు చూడలేదు. రాత్రి నన్నతను కొట్టడం చూసినా, ఇప్పుడు నా వంటి మీదున్న దెబ్బలు చూసినా, అతను గొప్ప ప్రేమికుడని మళ్ళీ అనవు. అబ్బో ఏం ప్రేమ! నీచమైన బానిసని కొట్టే దానికంటే ఎక్కువ కోపంతో నా మీదకి చర్నాకోల విసురుతాడు.
మాణిక్యం: కానీ, ఈ కోపం అతని గొప్ప ప్రేమకి నిదర్శనమని నేనంటాను. అతనలా ఉన్నందుకు నువ్వు సంతోషించాలి కానీ, ఫిర్యాదు చెయ్యకూడదు.
అలివేణి: ఏమంటున్నావు నువ్వు? అంటే అతని చేత రోజూ తన్నులు తింటూ ఉండాలా?
మాణిక్యం: కాదు. నువ్వు మరో విటుడి వైపు చూసినప్పుడల్లా అతనికి కోపం వస్తుంది. అతనికి నువ్వంటే పిచ్చి ప్రేమ. అంత ప్రేమ లేక పోతే నిన్ను మరొక విటుడితో చూసి అంత కోపం తెచ్చుకోడు.
అలివేణి: నాకు మరో విటుడెవ్వడూ లేడే! మొన్న ఒక ముసలి జమీందారుతో మాట్లాడ్డం చూసి అతన్ని నేను వల్లో వేసుకుంటున్నానని అనుమానిస్తున్నాడు.
మాణిక్యం: ధనవంతులు నీ పొందు కోసం అర్రులు చాస్తున్నారని అతననుకోవడం నీకు మంచిదే! అతనలా అనుకొని బాధ పడినంత సేపూ, దానికి ప్రతిక్రియ ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తాడు. ఎలా చేస్తాడో నీకు తెలుసు. కనక అతనా పోటీలో వెనక పడడు.
అలివేణి: ఈలోపు కొరడా తీసుకు చచ్చేట్టు బాదడం తప్ప దమ్మిడీ రాల్చడు.
మాణిక్యం: ఇస్తాడు. అసూయాపరులెప్పుడూ ఇచ్చే విషయంలో ఉదారంగా ఉంటారు.
అలివేణి: వాడేదో ఇస్తాడనే ఆశతో ఇప్పుడు వాడితో చావు దెబ్బలు తినాలా?
మాణిక్యం: నేను చెప్పేది అది కాదు. ప్రేయసి తనను నిరాదరిస్తుందని అనుమానించినప్పుడు మగవాడికి విపరీతంగా ప్రేమ పుట్టుకొస్తుంది. ఆమె తనను ప్రేమిస్తుందని తెలిసినప్పుడు నిర్లక్ష్యంగా వెళ్ళి పోతాడు. అది మగవాడి గుణం.
నేనీ వృత్తిలో ఇరవై ఏళ్ల నుంచి ఉన్నాను. నువ్వు వింటానంటే నా అనుభవం ఒకటి చెబుతాను. అప్పట్లో భూషణం అని నాకొక విటుడుండేవాడు. ఎప్పుడూ ఐదు వరహాల కంటే ఎక్కువ ఇచ్చిన పాపాన పోలేదు కానీ, నన్నుంచు కున్నానని అందరి దగ్గరా గప్పాలు కొట్టేవాడు. వాడి ప్రేమ కృతకం. నాకోసం వాడొక నిట్టూర్పు విడిచింది లేదు, ఒక చుక్క కన్నీరు కార్చింది లేదు, ఒక్క రాత్రి నా వాకిట్లో పడిగాపులు పడింది లేదు. ఒకరోజు నాకోసం వచ్చి తలుపు తట్టాడు. నేను తెరవలేదు. అప్పుడు నా గదిలో పది వరహాలు చెల్లించిన వేరొక విటుడున్నాడు. భూషణం తలుపు కొట్టీ, కొట్టీ ప్రయోజనం లేక తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోయాయి. నేను మాత్రం అతని కోసం కబురు పంపలేదు. కొత్త విటుడు నాతోనే ఉన్నాడు. భూషణానికి పిచ్చెత్తిపోయింది. నా ఇంటి తలుపు పగలగొట్టు కొని లోపలికొచ్చాడు. మనిషి ఏడుస్తున్నాడు. నన్ను జుట్టు పట్టుకు లాగాడు. చంపుతానని బెదిరించాడు. నా బట్టలు చించేశాడు. ఒకటనేముందిలే, అసూయతో దహించుకు పోయేవాడు ఏమేం చేస్తాడో అవన్నీ చేశాడు. చివరికి ఆరువేల వరహాలు నా ఒళ్లో పోశాడు. ఆ డబ్బుకు ఎనిమిది నెలలు అతనితో ఉన్నాను. నేనేదో మందు పెట్టానని వాళ్ళావిడ ఊరంతా ప్రచారం చేసింది. నేను పెట్టిన మందు పేరు అసూయ. అందుకేనే అలివేణీ, గోపాలనాయుడి తో కూడా నువ్వు అలాగే వ్యవహరిస్తే నీకు మేలు జరుగుతుంది. వాడేమన్నా తక్కువ వాడా, దేవుడు మేలు చేసి వాడి తండ్రి టపా కట్టేస్తే, కోటీశ్వరుడు.

     ప్రతి నాటకం ఓ సెన్సేషనే!

  డాక్టర్  వాణి  దేవులపల్లి

 

IMG_0978భారత ఆధునిక నాటక రంగం అనగానే మనకు మొట్ట మొదటగా గుర్తొచ్చే పేరు మరాఠీ నాటక రంగ దిగ్గజం విజయ్ టెండూల్కర్ !  మరాఠీ  నాటక రంగాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేసిన టెండూల్కర్ 1960 వ దశకంలో పేలవంగా, నిర్జీవంగా ఉన్న మరాఠీ థియేటర్ కు ఊపిరులూది నూతన జవసత్వా లందించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి  అయిన టెండూల్కర్ నాటక రంగంలోనే కాక,  తన ప్రతిభను వివిధ రంగాల్లో చాటాడు. సినీ, టెలివిజన్, స్క్రీన్ ప్లే  రచయితగా, నవలా రచయితగా, సాహితీ వ్యాస కర్తగా , రాజకీయ జర్నలిస్టుగా,   గొప్ప వక్తగా, వ్యాఖ్యాతగా  పేరు  గాంచాడు.  టెండూల్కర్ తన మాతృ భాష మరాఠీ లో రాసిన అనేక నాటకాలు ఆంగ్లం లోకి  అనువదింపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆధునిక భారతీయ ఆంగ్ల సాహిత్యం లోనూ తనకంటూ ఓ స్థానం సుస్థిర పరచుకున్నాడు  టెండూల్కర్. 

అతడు రాసిన నాటకాలు చాలా వరకు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్నవే !  నాటకాలు రచించడం పై అమెరికా విశ్వవిద్యాలయ విద్యార్థులకు పాఠాలను భోధించి,  అధ్యాపకుడుగా కూడా అవతారమెత్తిన   టెండూల్కర్ దాదాపు యాభై ఏళ్ళు పైగా భారతీయ నాటక రంగాన్ని ఏలడమే  గాక,  మరాఠీ నాటక  రంగంలో  ఓ సంచలనాత్మక శక్తిగా భారతీయ నాటక రంగానికి ఓ గొప్ప ప్రేరణ గా నిలిచిపోయాడు.

విజయ్ టెండూల్కర్ జనవరి 8, 1928  వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో, బాలవాలీకర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.  అతడి తండ్రి ఓ చిన్న ప్రచురణ సంస్థను నడిపేవాడు. ఆ విధంగా ఇంట్లో ఉన్న సాహితీ వాతావరణం సహజంగానే తెలివైన టెండూల్కర్ కు రచనా రంగం పై మక్కువ పెంచుకోవడానికి దోహద పడింది. తన ఆరేళ్ళ వయసు లోనే ఓ కథ రాసాడంటే ఆ వాతావరణం చిన్ని టెండూల్కర్ పై ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసికోవచ్చు.

ముఖ్యంగా, పాశ్చాత్య నాటకాలను ఎక్కువగా వీక్షించడం కూడా అతను నాటక రంగం పై ఇష్టాన్ని పెంచుకోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్ధర్ మిల్లర్ అమెరికా సమాజం లోని మధ్య తరగతి ప్రజల జీవన విధానాన్ని చిత్రీకరించిన తీరు, ఆ ప్రభావం టెండూల్కర్  రచనల్లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవన చిత్రణ ఆవిష్కరించిన తీరులో ప్రస్పుటంగా కనిపిస్తుంది.  పదునాలుగేళ్ళ వయస్సులో తన చదువును వదిలేసి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తన దేశభక్తిని చాటాడు. చదువుకు స్వస్తి పలికి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు  దూరంగా,  ఒంటరిగా ఉన్న టెండూల్కర్ కు ‘రచనా వ్యాసంగ’ మే లోకమైంది. మొదటగా, పత్రికలకు వ్యాసాలు రాయడం ద్వారా కెరీర్ ను ప్రారంభించిన టెండూల్కర్ తరువాత నాటక రంగం పై ఉన్న అభిమానంతో నాటక రచయితగా మారాడు.

తన కెరీర్ ఆరంభంలో టెండూల్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ముంబాయి లోని పూరి గుడిసెల్లో చాలీ చాలని అవసరాలతో జీవితాన్ని వెళ్ళదీసిన అతడు తాను చూసిన పట్టణాల్లోని మద్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవితాల స్పూర్తిగా వారి జీవన విధానాన్ని తన రచనల్లో ప్రతిబింబించాడు. టెండూల్కర్ తాను చూసిందే రాసాడు. తాను విన్న సంఘటనలనే  కథా వస్తువుగా మలచుకున్నాడు. మానవ నైజాన్ని నిక్కచ్చిగా, నిష్కర్షగా ఆవిష్కరించాడు. మానవ స్వభావం లోని హింసను, దాని అనేక రూపాలను తనదైన శైలిలో ఎత్తి చూపాడు. తద్వారా సామాజిక వాస్తవికతకు పెద్ద పీట వేసాడు టెండూల్కర్.

ఓ చోట ఇంటర్వ్యూ లో ఇలా అంటాడతను. “నేను సమాజం లో చూసిందే నా కథా వస్తువుగా మలచుకున్నాను. లేనిది ఊహించి రాయడం గానీ, కలల్లో విహరించి రాయడం గానీ నేను చేయలేదు. నేను ఓ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. అనేకసార్లు జీవితంలో చేదు నూ చవిచూసాను. నేను అనుభవించినదే నా రచనల్లో చిత్రించాను…….” సామాజిక వాస్తవికత పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది. టెండూల్కర్ లోని నిక్కచ్చి తనం, నిర్మొహమాటం, నిర్భీతి మనల్ని అబ్బురపరుస్తుంది. అతడు తన పదునాల్గవ ఏటనుండి నాటకాలు రాస్తున్నప్పటికీ,  1950 వ దశకం లో అతను రాసిన ‘శ్రీమంత్’ సంకుచితత్వంలో కొట్టు మిట్టాడుతున్న మరాఠీ    వీక్షకులను కదిలించింది. ఈ నాటక కథాంశాన్ని తీసుకుంటే పెళ్లి కాకుండానే తల్లయిన ఓ ఆగర్భ శ్రీమంతుడి  కూతురు సమాజ కట్టుబాట్ల కతీతంగా  బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. సహజంగానే, ఆమె తండ్రి దీనిని  వ్యతిరేకించి, ఈ విషయం బయటకు పొక్కకుండా తన డబ్బుతో కూతురికి భర్తను కొనాలని నిర్ణయిస్తాడు. ఈ విధంగా తన సామాజిక ప్రతిష్టకు భంగం కలగ కూడదని  అతని ఆశ. ఈ కథాంశం సమకాలీన  మరాఠీ నాటక రంగంలో  ఓ పెను తుఫాను సృష్టించింది.

టెండూల్కర్ రచనలు ఆధునిక మరాఠీ థియేటర్ ను తీవ్రంగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా, 1950 మరియు 1960 వ దశకం లో ‘రంగయాన్’ లాంటి నాటక సంస్థలు,  అందులోని సభ్యులు శ్రీరాం లాగు, మోహన్ అగాషి, సుభాష్ దేశ్ పాండే మొదలగు వారు టెండూల్కర్ నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో భాగంగా ఓ నూతన ఒరవడిని సృష్టించారు. అతని ప్రతి నాటకం ఓ సెన్సేషనే! సమాజం లోని కుళ్ళు, కుతంత్రం, కుత్సితత్వం, హింస, అవినీతి, అన్యాయాలకు టెండూల్కర్ రచనలు అద్దం పడతాయి.

1961 లో టెండూల్కర్ రాసిన  ‘ద వల్చర్స్ ‘ (The Vultures) కుటుంబ వ్యవస్థ లోని నైతిక విలువల పతనానికి పరాకాష్ట గా చెప్పుకోవచ్చు. కుటుంబ బంధాలు సైతం వ్యాపార బంధాలుగా మారుతున్న తీరు, ప్రబలే  హింసాత్మక ధోరణులు, ఏ విధంగా మానవ సంబంధాలు అడుగంతుతున్నాయో చెప్పిన తీరు నిజంగా విప్లవాత్మకమే! ఈ నాటకం సమకాలీన మధ్య తరగతి మరాఠీ ఆడియన్స్ కి మింగుడు పడ లేదు.ఎలాంటి హిపోక్రసి లేకుండా కుటుంబ హింస, అక్రమ సంబంధాలను టెండూల్కర్ దిగంబరంగా చూపించడం వారికి నచ్చలేదు. ఇక పోతే, ఫ్రెడ్ రిక్  డ్యురోన్ మాట్ ‘ట్రాప్ స్ ‘ (Traps) కథ ఆధారంగా రాసిన ‘సైలెన్స్ ! ద కోర్ట్ ఈజ్ ఇన్ సెషన్ ‘ (Silence! The Court is in Session) 1967 లో మొట్ట మొదటగా ప్రదర్శింప బడ్డప్పుడు నాటక రంగంలో టెండూల్కర్ పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. తదుపరి సత్యదేవ్ దూబే దాన్ని 1971 లో సినిమాగా మలచినప్పుడు టెండూల్కర్ స్క్రీన్ ప్లే రాసాడు. ఆ తర్వాత అతను రాసిన ‘సఖరాం ద బుక్ బైండ ర్ ‘ (Sakharam The Book Binder), కమల , (Kamala), ‘కన్యాదాన్ ‘ (Kanyaadaan) మరియు  ‘ఘాశీరాం  కొత్వాల్ ‘ (Ghashiram Kotwal);  ఈ ఒక్కో నాటకం సమకాలీన మధ్య తరగతి ప్రజల సమస్యలపై అతడు  సంధించిన ఒక్కో  ఫిరంగి  గుండు.  సామాజిక అసమానతలపై అతను పూరించిన శంఖా రావం.

‘సఖరాం ద బుక్ బైన్దర్ ‘ (Sakharam The Book Binder) కథాంశా న్నే తీసుకుంటే బుక్ బైందర్ గా పని చేసే సఖరాం అనే వ్యక్తి వివాహ జీవితంలో వైఫల్యం పొందిన స్త్రీలను ‘ఆదరిస్తున్న’ ముసుగులో చేరదీసి వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆసరాగా ఉన్న నెపంతో వారిని తన ఇంటి పనులు చేయడానికి మాత్రమే గాక భౌతిక అవసరాలు కూడా తీర్చుకునేందుకు ఉపయోగించుకునే తీరు అతని హిపోక్రసీని, కుటిలత్వాన్ని బట్టబయలు చేస్తుంది. ఆ తర్వాత అతని బంధం ఆ స్త్రీలతో తనకు ఇష్టమున్నంత కాలం కొనసాగుతుంది. తరువాత అతనికి వారిలో ఏ నచ్చని అంశం కనిపించినా బయటకు వెళ్ళ గొడతాడు. సఖరాం  చేరదీసిన లక్ష్మి, చంప ఇద్దరూ రెండు విభిన్న మనస్తత్వాలు. ఇద్దరూ వైవాహిక జీవితం లో ఓడిపోయిన వారే. లక్ష్మి పిల్లల్లేని కారణంగా భర్త నిరాదరణకు గురై వంచించ బడుతుంది. ఇకపోతే, చంప భర్త శాడిజాన్ని భరించలేక ఇంటి నుండి పారిపోయి వస్తుంది.

సఖరాం లక్ష్మి తో అన్న మాటల్లోనే అతని స్వభావం తెలుసుకోవచ్చు. ” నువ్వు ఎవ్వరి వైపు కన్నెత్తి చూడకూడదు. పల్లెత్తి మాటాడకూడదు. కొత్త వారి ముందు తలపై ముసుగు తీయకూడదు. నేను ఈ ఇంటి యజమానిని. ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం…. అంతే!……”  వైవాహిక బంధం పట్ల తనకు నమ్మకం లేదంటూనే వారిపట్ల కపట జాలిని, సహానుభూతిని చూపుతూనే తాను చేరదీసిన స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించడం టెండూల్కర్ అతని పాత్ర కిచ్చిన మరో కోణం.

ఈ నాటకం మరాఠి థియేటర్ లో ఒక రేవల్యుషన్  గా చెప్పుకుంటారు. టెండూల్కర్ రచనల్లోని మరో కోణం మానవీయ కోణం. స్రీలు మానవుల్లా చూడబడాలనే  ఆకాంక్ష అతడి రచనల్లో గోచరిస్తుంది. స్రీలు ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూడబడ టాన్ని, హింసకు బలి కావడాన్ని , అన్యాయానికి గురి కావడాన్ని అతని స్త్రీ పాత్రలు ప్రశ్నిస్తాయి; తిరగబడతాయి. అయితే ఆ పాత్రలు పరిస్థుతులకు తలొగ్గే విధానం మాత్రం విమర్శలకు లోనైంది. అతడి నాటకాలు ముగింపులో ఎలాంటి పరిష్కారాన్ని సూచించకపోవడం ఓ లోపం అంటారు విమర్శకులు. అయితేనేం, అతని స్త్రీ పాత్రలు అన్యాయాన్ని ప్రతిఘటించడం నేర్చుకుంటాయి. పోరాట పటిమను చాటుతాయి. బహుశా టెండూల్కర్ లోని ఈ దృక్కోణమే అతడు స్త్రీల పక్షపాతి అని ముద్ర పడడానికి దోహదం చేసిందేమో!

అతడి మరో నాటకం ‘కమల’ కూడా అశ్విన్ సరీన్ ‘ద ఇండియన్  ఎక్స్ ప్రెస్ ‘ కోసం నిజ జీవిత సంఘటన నేపథ్యంగా రాసిన కథనంతో ప్రేరేపింప బడి రాసిందే! ఎగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యంగా రాసిన ఈ నాటకం లో జైసింగ్ ఓ పేరున్న జర్నలిస్టు. అతని భార్య సరిత విధ్యాదికురాలు అయినప్పటికీ భర్త పురుషాధిక్యతను, నిరంకుశత్వాన్ని, హిపోక్రసీని మౌనంగా భరిస్తుంది. ఆ ఇంట్లో తన స్థానం కూడా  ఓ బానిస వంటిదనే విషయం జైసింగ్ మానవ సంతలో కొనుక్కొచ్చిన కమల అనే గిరిజన మహిళ ” సార్ నిన్నెంతకు కొన్నాడ మ్మా ?” అని ప్రశ్నించే వరకు సరిత గుర్తించదు. జైసింగ్ పేరుకు ఓ పేరున్న జర్నలిస్టు అయినప్పటికీ అతనిలో ఆదర్శ భావాలు, సమభావాలు మచ్చుకైనా కానరావు. పైగా, తన పేరు కోసం, ప్రమోషన్ కోసం చిరిగిన దుస్తుల్లోనే యధాతధంగా కమలను మీడియా ముందు ప్రవేశ పెట్టాలనుకోవడం జైసింగ్ అమానవీయ కోణాన్ని, మీడియా లోని ఎల్లో జర్నలిజాన్ని, హిపోక్రసీని ప్రతిబింబిస్తుంది.

ప్రచారాలను, పై పై మెరుగుల  సంస్కరణలను మాత్రమే  ప్రతిబింబించే నాటకాలకు  పరిమితమైన సమకాలీన మరాఠి థియేటర్ ను టెండూల్కర్ తన సామాజిక పరిశీలనా పటిమతో మరో కొత్త లోకంగా ఆవిష్కరించాడు. నిజాల నిగ్గు తేల్చి, మనిషి అసలు నైజాన్ని, వివిధ సందర్భాల్లో అతని ప్రవర్తనను, హింసా ప్రవృత్తిని, హిపోక్రసీని బట్టబయలు చేసాడు. సామాజిక అసమానతల పై అలుపెరుగని సైనికుడిలా పోరాటం చేసే వైనం అతని సమకాలీనులైన మోహన్ రాకేశ్, బాదల్ సర్కార్, గిరీష్ కర్నార్డ్ ల నుండి అతణ్ణి విభిన్నంగా, విలక్షణంగా, ప్రత్యేకంగా నిలబెడుతుంది.

టెండూల్కర్ తన రచనల్లో మానవ ప్రవర్తనకు, మానవ సంబంధాలకు, విలువలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అతని కథా వస్తువు మనిషి- అతని చుట్టూరా ఉన్న ప్రపంచం. అతని రచనల్లో కుటుంబ ప్రాధాన్యాన్ని కూడా ఎక్కువగా  చూస్తుంటాము. ప్రేమానుబందాలతో అల్లుకున్న చక్కటి కుటుంబాలు, చక్కని సమాజానికి దోహదం చేస్తాయని అతని నమ్మకం. అందుకే, ‘కమల’ నాటకం లో విధ్యాదికురాలైన సరిత, భర్త పురుషాహంకారాన్ని, అమానవీయ ప్రవర్తనను, అణచివేత ధోరణిని, బానిస ప్రవృత్తిని భరించలేక , అతణ్ణి విడిచి వెళ్లి పోవాలని నిర్ణయం తీసుకున్నా, భర్త  ఉద్యోగం కోల్పోయి దిక్కుతోచక బాధలో కోట్టుమిట్టాడుతున్నప్పుడు అన్నీ మరిచిపోయి, తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తుంది ; ఆ క్లిష్ట సమయం లో అతనికి బాసటగా నిలవాలనుకుంటుంది. అంతేనా, భవిష్యత్ లో అతన్నెలాగైనా  మార్చుకుంటాననే ధీమాను, ఆశను వ్యక్తపరుస్తుంది.

విమర్శకులు టెండూల్కర్ ను పెసిమిస్ట్ గా ముద్ర వేసినప్పటికీ చాలా సందర్భాల్లో అతని నాటకాల్లో ఆప్టిమిజం ‘అండర్ కరెంట్ ‘ గా ప్రవహించి, ఆదర్శవంతమైన సమ సమాజ స్థాపనకు అర్రులు చాస్తున్నట్టు అనిపిస్తుంది. బలమైన కథా వస్తువులతో ప్రజల హృదయాల్ని బలంగా తాకిన అతని నాటకాలు మొత్తంగా మరాఠీ నాటక సమాజాన్నే ఓ కుదుపు కుదిపి ఓ సమున్నత మార్పుకు దారి తీసాయి. టెండూల్కర్ సంచలనాత్మక నాటకాలు నాటక ప్రపంచంలో అతణ్ణి ఓ డైనమిక్ నాటక రచయితగా నిలబెట్టి, అవార్డులు, రివార్డులివ్వడం మాత్రమే కాదు; సమాజం లోని కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను, అవమానాలనూ, ఓ దశలో అయితే చెప్పు దెబ్బలనూ మిగిల్చింది. అయితే రెంటినీ సమదృష్టితో చూడగలిగిన అతని ‘స్థితప్రజ్ఞత’ మనల్ని విచలితుల్ని చేస్తుంది. తన వ్యక్తిగత జీవితం లోనూ అనేక ఒడిదుడుకుల నెదుర్కున్న టెండూల్కర్  2008, మే 19 న  ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు.

నాటక రచయితగా, ముఖ్యంగా,   ‘మనీషి’ గా అతని కీర్తి కేవలం మరాఠి థియేటర్ కో, ఇండియన్ థియేటర్ కో మాత్రమే పరిమితం కాలేదు; ప్రపంచ నాటక రంగం లో విజయ్ టెండూల్కర్ ఓ కలికితురాయి.

*

 

చరిత్ర, అచరిత్రల మధ్య మనం!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రెండేళ్ళు పైనే అయింది…

ఏదో పని మీద నాకు బాగా పరిచయమున్న ఒక ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన ఫ్రాక్, పశ్చిమ సాహిత్యాలలో తాత్వికధోరణులలో లోతైన అధ్యయనం ఉన్నవారు. ఎన్నో పుస్తకాలు రచించినవారు. నేను ఎంతో గౌరవించే వ్యక్తి. అప్పటికి ఈ వ్యాసపరంపర ప్రారంభించకపోయినా వీటిలో చర్చకు వస్తున్న అనేక విషయాలను యధాలాపంగా ఆయనతో ముచ్చటించడం ప్రారంభించాను. ఆయన మధ్య మధ్య స్పందిస్తూ ఎంతో ఆసక్తితో వింటున్నట్టు కనిపించారు. అలా గంటన్నర కాలం దొర్లిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాను.

వచ్చిన కాసేపటికి ఆయన ఫోన్ చేశారు. “మీరు మాట్లాడిన విషయాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. వాటిని మీరు తప్పకుండా పుస్తకరూపంలోకి తేవాలి. అది మంచి పుస్తకం అవుతుంది” అన్నారు. నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాను.

మూడు, నాలుగు రోజుల తర్వాత మరోసారి ఆయన ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన వేరే పని గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాను. ఆయన నన్ను సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చారు. నేను చెప్పులు వేసుకుంటుంటే, ఉన్నట్టుండి ఆయన, “మీరు నాతో కిందటిసారి మాట్లాడిన విషయాలు రాయకండి” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానికి రెండు కారణాలు. మొదటిది, అంతకుముందు స్వయంగా ఫోన్ చేసి మరీ నన్ను అభినందించి, పుస్తకరూపంలోకి తేవాలని నొక్కి చెప్పి, అది మంచి పుస్తకం అవుతుందని అన్నవారే ఇంతలో అభిప్రాయం మార్చుకోవడం! రెండవది, అసలు రాయనే వద్దని అనడం!

ఈ మధ్యలో ఇంకో నిజం కూడా ఉంది. అది: నేను మాట్లాడిన విషయాల గురించే ఈ మూడు నాలుగురోజులుగా ఆయన ఆలోచిస్తూ, ఇంకా చెప్పాలంటే, మథనపడుతూ ఉండడం!

నేను ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి క్షణకాలం పట్టినట్టుంది. ఆపైన, “చరిత్ర…” అంటూ ఏదో అనబోయాను.

ఆయన వెంటనే తుంచేస్తూ, “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్నారు.

అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. నేను బయటికి నడిచాను.

***

రెండేళ్ళు దాటిపోయినా అప్పటి ఆ సన్నివేశం నా జ్ఞాపకాలలో నిన్న మొన్నటి దన్నంత స్పష్టంగా ఇప్పటికీ ఉండిపోయింది. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆయన మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.  ఆ మాటల్ని తప్పుపట్టడానికో, విమర్శించడానికో నేనీ విషయం ప్రస్తావించడంలేదు. వాటిని వీలైనంత తటస్థంగా పరిశీలించడం నా ఉద్దేశం.

“మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆ వాక్యం వెనుక-ఆలోచించిన కొద్దీ- ఒక విలక్షణమైన భారతీయ మనస్తత్వం ఉన్నట్టు అనిపిస్తోంది. అంతేకాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మన రక్తంలో లోతుగా ఇంకిపోయిన ఒక తాత్వికత కూడా.  కాలాన్ని గతం, వర్తమానం, భవిష్యత్తుగా విభజించడమే చూడండి. అది కేవలం వ్యావహారిక సౌలభ్యం కోసం. ఆవిధంగా అది ‘వ్యావహారిక సత్యం’ మాత్రమే. అయితే మన తాత్వికత ప్రధానంగా మూడు కాలాలకూ అతీతమైన సత్యానికి చెందినది. దానిని ‘పారమార్ధిక సత్యం’ అందాం. అందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అనే విభజన కుదరదు. అక్కడ కాలాన్ని అఖండంగా చూడవలసిందే.  అందులోకి వెళ్లినప్పుడు వ్యావహారిక సత్యం లానే వ్యావహారిక సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న కాలం కూడా మాయగా లేదా మిథ్యగా పరిణమిస్తుంది.

కనుక పారమార్థిక సత్యానికి భంగం కలగకుండా ఎంత మేరకు వాడుకోవాలో అంత మేరకే వ్యావహారిక కాలాన్ని వాడుకోవాలి తప్ప మరీ లోతుగా వెళ్లకూడదు. పురాణాలు కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలుగా కాలాన్ని విభజించి ఒక్కొక్క యుగానికీ లక్షలాది సంవత్సరాలను ఆపాదించడం, లక్షల సంవత్సరాల వ్యాప్తి ఉన్న మన్వంతరాలను కల్పించడం వ్యావహారిక కాలాన్ని అప్రధానంగా మార్చే ప్రయత్నంలో భాగమనే నేను అనుకుంటాను. దశరథమహారాజు అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడనీ, రాముడు పదివేల సంవత్సరాలు పరిపాలించాడనీ రామాయణం చెబుతోంది. వ్యావహారిక కాలానికి ప్రాధాన్యం లేదని– చెప్పకనే చెప్పడం ఇది.

తాత్విక స్థాయిలో కాలాన్ని అఖండంగా చూడడమంటే కాలానికి గల చలనశీల స్వభావాన్ని కూడా నిరాకరించడమే. అందులో కాలం స్థాణువుగా మారిపోతుంది. పారమార్థిక రంగానికి చెందిన ఆ స్థాణుత్వం అక్కడితో ఆగకుండా వ్యావహారిక రంగం మీదా; అంటే సమాజ, సాహిత్య, ఆర్థిక, రాజకీయాల మీదా ప్రభావం చూపుతుంది. అంటే అవి కూడా స్థాణుత్వాన్ని పొందుతాయి. ఉదాహరణకు ఒక రచన ఒకానొక కాలంలో, సమాజంలో, చారిత్రక పూర్వాపరాల మధ్య అవతరిస్తుంది. కానీ అవతరించిన వెంటనే అది చలన శీలత కలిగిన కాలంతో సంబంధాన్ని తెంచుకుని ఒక కాలాతీత స్వతంత్ర అస్తిత్వాన్ని తెచ్చుకుంటుంది. ఆ రచనకు సంబంధించిన పఠనపాఠన వ్యాఖ్యాన సంప్రదాయమూ దానికి అనుగుణంగానే ఉంటుంది. రామాయణ, మహాభారతాలనే తీసుకుంటే; ఇప్పటికీ వాటిని వ్యాఖ్యానించేటప్పుడు సంప్రదాయ పండితులు వాటి పాఠాన్ని, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన సంప్రదాయాన్ని దాటి వాటి వెనుక ఉన్న సమాజమూ, చరిత్రలలోకి తొంగి చూసే సాహసం చేయరు. ఏ కాస్త స్వతంత్రించినా అది సంప్రదాయం అంగీకరించిన పరిధిలోనే. నా ‘కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు’(2006)లో కూడా దీని గురించి కొంత చర్చ చేశాను.

భారతదేశం ఇప్పటికీ క్రీస్తుపూర్వకాలంలోనే ఉందనీ, క్రీస్తుశకంలోకి రాలేదనీ ఈ వ్యాసపరంపరలో ఆయా సందర్భాలలో అంటూ వచ్చాను. అది పైన చెప్పిన స్థాణుత్వాన్ని సూచించడమే.

చరిత్ర విషయానికి వస్తే, అది చలనశీలత కలిగిన వ్యావహారిక కాలానికి చెందినది కనుక అందులోకి వెళ్ళడం; కాలాన్ని అఖండంగా చూసే తాత్వికతకు విరుద్ధం అవుతుంది. ఆ అఖండతా సూత్రం మీద ఆధారపడే రచనలకు అవాంఛనీయ వ్యాఖ్యానాలూ, వివరణలూ పుట్టుకొస్తాయి. దాంతో సంప్రదాయపాఠమే కాక మన విశ్వాసాలూ దెబ్బతింటాయి. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అని ప్రొఫెసర్ గారు అనడం వెనుక ఇంత లోచూపు ఉందని నేను అనుకుంటున్నాను.

సరే, కాలం గురించిన ఈ దృష్టిభేదం వల్ల, అనువుగా ఉన్నప్పుడు వ్యావహారిక కాలాన్ని, లేనప్పుడు పారమార్థిక కాలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది కనుక దానిని దుర్వినియోగం చేసేవారూ ఉంటారు.

***

కొన్ని ఇతర పురాతన నాగరికతల పరిస్థితి వేరు. వాటితో పోల్చితే “మనకు చరిత్ర అవసరం లేదు” అన్న ప్రొఫెసర్ గారి వ్యాఖ్య ఎంత సనాతన సత్యమో; మనల్ని అది ఎంత విలక్షణ స్థితిలో నిలబెడుతుందో అర్థమవుతుంది. అవి తమ చరిత్రను పదిలపరచడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాయి. వాటికి చెందిన కనీసం నాలుగైదు వేల సంవత్సరాల నాటి ఉత్తర ప్రత్యుత్తరాలు, యుద్ధాల వివరాలు, జామా ఖర్చులు, భూమి పంపకాలు, భూదానాలు, కూలీలకు ఇచ్చిన వేతనాలతో సహా అనేక లిఖిత ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక తవ్వకాలలో దొరికిన పురావస్తు ఆధారాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీటి ఆధారంగా ఈ నాగరికతలకు సంబంధించిన  చరిత్రరచన పెద్ద ఎత్తున జరిగింది.

Heinrich Schliemann

కొన్ని పురాతన లిపులను ఛేదించడానికి ఎందరో పండితులు ఒక జీవితకాల తపస్సుగా ఎంత కృషి చేశారో; ఎండనకా, కొండనకా శ్రమిస్తూ తవ్వకాలు జరిపించి పురా చరిత్ర ఖజానాను వెలికి తీయడానికి జీవితాలను ఎలా ధారపోశారో చెప్పే పుస్తకాలు కూడా వచ్చాయి. ప్రాచీన గ్రీసులో భూగర్భంలో సమాధి అయిన నగరాలను తవ్వి తీసిన Heinrich Schilemann పై Robert Payne రాసిన THE GOLD OF TROY, C.W. Ceram రాసిన THE SECRET OF THE HITTITES ఇప్పటికిప్పుడు నాకు గుర్తొస్తున్న రెండు పుస్తకాలు. ప్రాచీన సమీప ప్రాచ్యంలోని వివిధ దేశాలకు చెందిన పత్రాలు, ఆ దేశాల రాజుల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు వగైరాల ఇంగ్లీష్ అనువాదాన్ని పొందుపరచిన THE ANCIENT NEAR EAST(MARK W. CHAVALAS సంపాదకత్వంలో) లాంటి పుస్తకాలూ వచ్చాయి.THE SECRET OF THE HITTITES

అదే మన విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి  ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు గురించి నికరంగా మనకు తెలిసింది. దీనిపై రొమీలా థాపర్ (A HISTORY OF INDIA, Volume.one)ఇలా అంటారు:

Until a hundred years ago, Ashoka was merely one of the many kings mentioned in the Mauryan dynastic list included in the Puranas.  But in 1837, James Princep deciphered an inscription written in the earliest known Indian script, Brahmi. The inscription referred to a king called Devanamapiya Piyadassi(the beloved of gods, Piyadassi). The mysterious king Piyadassi remained a puzzle, since the name did not tally with any mentioned in the sources. Some years later the Buddhist chronicles of Ceylon were examined and were found to refer to a great and benevolent Mauryan king as Piyadassi. Slowly the clues were put together and seemed to make sense, but the final confirmation came in 1915 with the discovery of another inscription in which the author calls himself King Ashoka, Piyadassi. It was evident that Piyadassi was a second name used by Ashoka.

“మనకు చరిత్ర అవసరం లేదు” అనే నమ్మకాన్ని పట్టుకుని అలా ఉండిపోతే ఆ దారి వేరు. కానీ పాశ్చాత్య గవాక్షం నుంచి చరిత్ర కిరణాలు వేడి వేడిగా మన కళ్ల మీద పడి చురుక్కు మనిపించడం ప్రారంభం కాగానే ఒక విచిత్రమైన పరిస్థితిలోకి జారిపోయాం. మాకూ చరిత్ర ఉంది, మా దగ్గరా చరిత్ర రచనలు ఉన్నాయని చెప్పుకోడానికి పోటీ పడ్డాం. తీరా చూస్తే చరిత్ర లక్షణాలు బొత్తిగా లేని కల్హణుడి రాజతరంగిణి తప్ప మన దగ్గర నిక్కమైన చరిత్ర రచన ఒక్కటీ లేదు. ఇది కోశాంబీ మాట.  ఆయన (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇలా అంటారు:

India, for all its great literary heritage, has produced no historical writers comparable to Herodotus, Thucydides, Polybius, Livy, Tacitus. Many Indian kings of the middle ages were incomparably superior in their education and literary ability to contemporary rulers in Europe; they personally led great armies to victory in heavy warfare. Nevertheless, not one seems ever to have thought of composing a narrative like Caesar’s Commentaries or Xenophon’s Anabasis. The tradition was of graceful drama, an occasional hymn in praise of gods, or a witty epigram. There remains only one Indian chronicle worth the name, the Rajatarangini  by a Kasmiran named Kalhana, composed in Sanskrit verse during A.D. 1149-50, and continued by two successors. This chronicle suffers from all the mannered conventions of Sanskrit poetry, in particular the fatal double entendre that manages only to obscure whatever reality the author meant to portray. The period was of desperate struggle between the central power and feudal lords in Kasmir, but even the portion dealing with the actual time and place can hardly be compared in quality, depth, content to the account by Thucydides Peloponnesian war. For the rest of the country, till the Muslim period, we have nothing even as good as Kalhana,…

The sources for the older period survive as Puranas,  which in their present form, are only religious fables and cant, with whatever historical content the works once possessed heavily encrusted by myth, diluted with semi-religious legends, effaced during successive redactions copied by innumerable, careless scribes; so that one finds great difficulty in restoring as much as the king-lists. Cuneiform records, even the Sumerian, yield much more information, particularly about social conditions in their respective countries.

పై వాక్యాల సారాంశాన్ని చెప్పుకుంటే…గొప్ప సారస్వత వారసత్వం ఉండి కూడా భారతదేశం హెరొడోటస్ తదితరులతో పోల్చదగిన చరిత్రకారులని సృష్టించలేకపోయింది. మధ్యయుగాలనాటి మన రాజులు, తమ కాలం నాటి యూరప్ రాజులతో పోల్చితే విద్యలోనూ, సాహిత్య నైపుణ్యాలలోనూ మిన్న అయినప్పటికీ  సీజర్ కామెంటరీస్, క్జెనోఫోన్ అనబాసిస్ లాంటి రచనలను రూపొందించే ఆలోచన చేయలేదు. ఎంతోకొంత చరిత్రగా చెప్పదగిన కల్హణుని రాజతరంగిణి కూడా శ్లేషతో సహా సంస్కృత కావ్య మర్యాదలను పాటించడంవల్ల రచయిత చెప్పదలచుకున్న వాస్తవాలు కూడా వాటికింద కప్పడిపోయాయి. తూసిడైడ్స్ రచించిన ‘పెలోపొనేసియన్ వార్’ కు అది ఏవిధంగానూ సాటి కాలేకపోయింది. పురాణాలలో ఏ కొంచెం చరిత్ర ఉందనుకున్నా; మతపరమైన కథలు, పరిభాష, కల్పనలు వాటిలో విపరీతంగా పేరుకుపోవడం వల్లా ,లేఖకుల నిర్లక్ష్యం వల్లా  అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. వీటికి భిన్నంగా సుమేరియాకు చెందిన క్యూనీఫామ్ పత్రాలు ప్రత్యేకించి ఆయా దేశాలలోని సామాజిక పరిస్థితులతో సహా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి.

పై వాక్యాలను చూసినప్పుడు నాకు వెంటనే మహాభారతంలోని ఒక ముచ్చట గుర్తొస్తోంది. పాండవులు జూదంలో రాజ్యం కోల్పోయి వనవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వారిని చూడడానికి వెడతాడు. జూద సమయంలో తను ద్వారకలో లేననీ, ఆనర్తదేశంలో సాళ్వుడితో యుద్ధం చేస్తున్నాననీ, ఒకవేళ తనే ద్వారకలో ఉండి ఉంటే, దుర్యోధనుడు పిలవకపోయినా హస్తినాపురం వచ్చి జూదం ఆపించేవాడిననీ ధర్మరాజుతో అంటాడు. మహాభారత కథ నిజంగా జరిగిందా అన్న చర్చను అలా ఉంచితే, కృష్ణుడి ఈ మాటల్లో నాకు అరుదైన చరిత్రస్పర్శ తోచి ప్రాణం లేచొచ్చింది.

తీరా మహాభారతవ్యాఖ్యాత నీలకంఠాచార్యులు ఆ మాటలకు ఇచ్చిన వివరణ చూడగానే నీరుగారి పోయాను. దానికి ఆయన తాత్వికమైన అర్థం చెప్పి ఆ చరిత్రస్పర్శను కాస్తా తుడిచిపెట్టేశారు. ఆయన ప్రకారం, ఇక్కడ ద్వారక అంటే నవద్వారాలు కలిగిన దేహమనే నగరం. అంటున్నది ధర్మరాజుతో కనుక అది అతని దేహనగరం అన్నమాట. తను ద్వారకలో లేడంటే అర్థం, జూదమాడే సమయంలో ధర్మరాజు తనను తలచుకోలేదనీ, తలచుకుని ఉంటే వచ్చి జూదం ఆపించేవాడిననీ కృష్ణుడు చెబుతున్నాడు!

వ్యావహారిక కాలమానాన్ని అనుసరించే చరిత్ర మనకు లేకపోవడం, అది మనకు అలవాటులేని ఔపోసన కావడం; అయినా సరే మాకు చాలా చరిత్ర ఉందని చెప్పుకోవలసి రావడం మనల్ని చాలా గంద్రగోళం లోకీ, ఒక్కోసారి హాస్యాస్పద పరిస్థితులలోకీ నెడుతోంది. మరోవైపు మనది అన్నింటికంటే కూడా అతి పురాతన నాగరికత అని చెప్పుకునే అవకాశాన్నీ చరిత్ర లేమి ఇచ్చింది. అలాగే, మానవ కాలమానానికి లొంగకుండా  దివ్యకాలమానాన్ని అనుసరించే చరిత్రనే అసలు చరిత్రగా చెప్పుకోడానికీ దారి తీయించింది. దానికి మళ్ళీ మన జాతీయతా భావన, ఆత్మగౌరవం లాంటివి కూడా జతపడి దానినో భావోద్వేగ విషయంగానూ, రాజకీయ అంశంగానూ మార్చి వేశాయి.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే, పురా ప్రపంచంలో మన ఉనికి ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రధానంగా ఇతర పురాతన నాగరికతలకు చెందిన ఆకరా(సోర్సులు)లే గతవుతున్నాయి. అవి ఒక్కోసారి మన గురించి మనం కల్పించుకున్న ఊహల్ని తలకిందులు చేసేలానూ ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే, మన దగ్గర ఉన్న అనేక మతవిశ్వాసాలు, ఆరాధనాపద్ధతులు, సాంస్కృతిక ధోరణులు వాస్తవానికి సమీపప్రాచ్యం(నేటి టర్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు)నుంచి వ్యాపించినవని ఆధునిక పురాచరిత్రకారుల నిర్ధారణ. ఆ క్రమంలో అవి క్రీటులోకీ  ప్రసరించాయి.

దాని గురించి తర్వాత…

 

 

 

 

 

చీకటి-రాత్రి-ఆకాశం

  ముకుంద రామారావు

 

 

అగ్గిలా అలుముకుంది చీకటి

చూస్తూ చూస్తూనే

అందరినీ అన్నింటినీ అందులో ఇముడ్చుకుంది

బయటపడడానికి

వెలుగు సాయంకోసం వెతికాయి కళ్లు

***

ఇంటా బయటా

చీకటిలో దీపాలంకరణకు

లెక్కలేనన్ని మార్గాలు

 

పైనుండి

రాత్రుల నగరాలు

నక్షత్రమండలాలు

***

రాత్రి శ్వాస ఆగిపోలేదు

నిద్రిస్తున్న కొమ్మల్ని ఒరుసుకుంటూ

చంద్రకాంతి జారుతోంది

ఒడ్డునంతా కడిగి శుబ్రపరుస్తోంది

సముద్రం

***

రాత్రంతా

తన అద్భుతమైన అందాన్ని

ఆరేసుకున్న ఆకాశం

అన్నింటా చొచ్చుకుపోయే సూర్యకాంతికి

అలసిపోయి పాలిపోయి వెలవెలాపోతోంది 

అవును ఆకాశం అందాన్ని రాత్రులే చూడాలి

వగలుపోయే నక్షత్రాల నగలైనా కనిపించవు పగలు

రోజుకో రకం బొట్టులా మారే చంద్రుడు

ఆకాశం గోడకు ఎక్కడ వేలాడుతుంటాడో

మట్టి తడిని తట్టిలేపే కవిత..

జయశ్రీ నాయుడు 

 

jayasriశివారెడ్డి గారి కవిత “ఏదో ఒక మొక్క”చదివాక మనసులో మట్టి తడి మేల్కొంది. తడి మట్టి సుగంధం తలపుకి వచ్చింది. అరచేతుల్లోకి తడి మట్టిని తీసుకుని, కళ్ళుమూసి, తన్మయత్వంగా ఆ స్పర్శని అనుభవించి ఎన్ని ఋతువులయ్యింది…? మొక్క వేర్లకీ, నీటి తడికీ మద్య మట్టి రేణువుల మౌన సంభాషణ మరిచిపోయానా…?

ఒక్క క్షణమైనా పచ్చదనం వైపు తల తిప్పనివ్వనంతగా కృత్రిమ జీవిత నాగరికతకు నగర జీవనం మనల్ని బానిసని చేసిందా… అవునేమో … లేకపోతే ఈ ప్లాస్టిక్ పువ్వులూ, ఆర్టిఫిషియల్ మొక్కలూ అమ్మే దుకాణాల రాజపోషకులెవరు??? మనమేగా అని ఒక నిష్టూరపు నిట్టూర్పు గుండెని ఎగదన్నుకు వచ్చిన క్షణాలవి.

మనలో అందరూ ప్రకృతి హరితానికి మిత్రులే. కానీ నగర నాగరికత విస్తీర్ణానికి మొదట అడ్డు అనిపించేవి మొక్కలే, మహా వృక్షాలుగా విస్తరించిన హరిత ఛాయలే. అల్లిబిల్లిగా అల్లుకునే తంత్రీ విస్తీర్ణానికి నిర్దాక్షిణ్యంగా ఎన్ని వృక్షాలు అశువులు బాసాయో.. వేర్లు విస్తరిస్తాయని ఎన్ని మామిడి , వేప, పున్నాగ, రావి చెట్లు గొడ్డలి వేటుకు తలవంచాయో లెక్కలేదు. కవి కె. శివారెడ్డి గారి “పొసగనివన్నీ….” కవితా సంపుటిలోంచి ఈ వారం మనం చర్చించుకుంటున్న కవిత “ఏదో ఒక మొక్క” — నగర నాగరికతకీ, ప్రకృతి పచ్చదనానికి మధ్య సంఘర్షణనీ , మొక్కలకీ మనిషికీ మధ్య ఒక అంతస్సూత్రాన్ని స్పృశిస్తూ సాగుతుంది.

ఇంటి ముందో ఇంటి మీదో
ఎక్కడో ఒక చోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని ;మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి.”

నగర జీవికి మొక్కని చూస్తే భయం. అది రాగి మొక్కో వేపమొక్కో తనకనవసరం. దాని వేర్లు తన కాంక్రీట్ గోడల్ని బద్దలు చేస్తుందనే భయంతో, మొక్క గానే వేర్లు పట్టుకుని పీకెయ్యడానికి కూడా వెనుదీయడు.
” మొక్కలేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసే చిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి…”
అని కవి సూటి గా ప్రశ్నిస్తాడు.

చెమట పట్టని గదుల్లో, అన్ని వైపులా మూసేసిన గదుల్లో జీవించే మనిషికి ప్రకృతి సంగీతం ఎలా వినిపిస్తుందీ?

“కళ్ళమ్మటి కురుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా?”

ఈ ప్రశ్నలు రెండూ మానవ సహజాతాలైన స్పందనా చైతన్యాన్ని గుర్తు చేస్తున్నాయి. తోటి మనిషి కష్టానికో, కృతజ్ఞతా పూర్వకంగానో కన్నీరు పెట్టుకుంటాడు. శరీరం ప్రకృతి తో మమేకమై శ్రమించినపుడు అది వెద జల్లే సుగంధం చెమట. ఈ రెండూ లేని మనిషి అసలు మనిషేనా… మన హడావిడి దైనందిన చర్యలకు సూటిగా ఢీకొనే ప్రశ్నలివి.

మొక్కల కేసి తదేకంగా చూస్తున్నపుడు లోకాంతర లోకాల నుంచి సంగీతం వినపడుతుంది. చిన్నపిల్లల కేరింతలు వినబడతాయి. మొక్కల మధ్య కూర్చున్న కవికి బాల్యం , పూల మధ్య శయనించినపుడు యవ్వనం తప్ప మరోటి లేవు. ఇంతకన్న రీ ఛార్జ్ అయ్యేందుకు మరో మార్గముందా మనకు?

కవిత ముగింపు వాక్యాలివి…

“ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడి తడి గా నువ్వు బతకాలి”
మొక్కల్ని ప్రేమించనిదే మట్టి తడి తెలియదు, మనసు తడీ తెలియదు. అందుకే బైటా లోపలా మనం ఎటు వత్తిగిలినా ఒక మొక్క తగలాలి, కన్ను తడి మనసులో చెమ్మ అవ్వాలి. అవే మనిషి మూలాలు, మనసు లోని తడి ఆనవాళ్ళూ. అవే ప్రకృతి తో మనం మమేకం అవ్వగలిగే అపురూప క్షణాలవుతాయి.

**** ****** ****

పూర్తి కవిత ఇక్కడ…

కవి : కె. శివారెడ్డి
కవితా సంకలనం: పొసగనివన్నీ…
కవిత శీర్షిక: ఏదో ఒక మొక్క

 

ఏదో ఒక మొక్క
రాగి మొక్కో, మర్రిమొక్కో, వేపమొక్కో
గోడ పక్కనో, గోడ మీదనో
ఇంటి ముందో, ఇంటి మీదో
ఎక్కడో ఒకచోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి-
ఎక్కడ ఇంకిపోయిందో మొలకనవ్వు బయటికొస్తుంది,
ఏమిటీ గోడ పగుల్తుందా
ఇల్లు కూలుతుందా
గోడ పగలనీ, ఇల్లు కూలనీ
మనిషి చుట్టూ అల్లుకున్న రాతిబంధాలన్నీ
బద్దలు బద్దలు కానీ
******

మొక్క లేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసేచిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి
అంతా బోసిగా, శూన్యం రాజ్యమేలుతున్నట్టు-
మనుషులున్నారా? మనసులున్నాయా?
కళ్ళమ్మటి కుతుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా-?

చెమట పట్టని గదుల్లో
అన్ని వైపులా మూసేసిన గదుల్లో
ఏం కనబడుతుంది
ఏం వినబడుతుంది,
గదిలో బంధించబడ్డ మనిషి
గదే తానయిన మనిషి

పొద్దున్నే పైనుంచి రాలుతున్న ఆకుని చూళ్ళేడు
గాలిలో తేలుతున్న పావురాయి ఈకను చూళ్ళేడు
కళ్ళ ముందు విరుస్తున్న నెమలి పింఛం
పొద్దుటిపూట నృత్యాన్ని చూడలేడు
తదేకంగా మొక్క కేసి చూడు
అది తొడుగుతున్న కొత్త చివురుకేసి చూడు
చిన్నపిల్లల కేరింతలు వినబడటం లేదూ

ఏదో ఒక మొక్క
బతకనీ, బతకనీ,
మొక్కల మధ్యన కూర్చున్న నాకు
బాల్యం తప్ప మరోటి లేదు
పూల మధ్య శయనించిన నాకు
యౌవనం తప్ప మరోటి లేదు

మొక్క వేళ్ళు గోడలోకే కాదు
నీలోకీ, నాలోకీ జొరబడతాయి
గోడల జాడల్ని, చీకటి నీడల్నీ
బద్దలు చేస్తాయి
ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడితడిగా నువు బతకాలి

**

“యే భాయ్.. జర దేఖ్ కె చలో”

భువనచంద్ర

 

bhuvanachandra (5)

” యే భాయ్.. జర దేఖ్ కె చలో”

 “అదంతా ఓ కల.. అంతే..” నిర్లిప్తంగా అన్నాడు  ప్రసాదు. ఒకప్పుడు ప్రసాద్ కోసం టాప్ హీరోలు ఎదురుచూసేవాళ్లు . ప్రొడ్యూసర్లు తమని కాల్‌షీట్స్ అడగంగానే,” ప్రసాద్ కాల్‌షీట్లు తీసుకున్నారా?” అనేవాళ్లు. ప్రసాద్ ఉంటే చాలు.. మినిమం గారంటీ. ప్రసాద్‌కి ఓ ప్రత్యేకమైన ‘ఇమేజ్’ ఉండేది. అతని ‘యాక్షన్’లాగా.

సినిమాల్లోకి ప్రవేశించింది హీరోగానే. రెండు సినిమాలు చేశాక అర్ధమయింది. తన పర్సనాలిటీ  హీరో వేషాలకి సరిపోయినా తాను ఆ వేషంలో ఇమడలేనని. డైరెక్టర్ త్రిమూర్తి ఓ రోజున ప్రసాద్‌తో అదే మాట అన్నాడు. “భాయీ, నువ్వు కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నిస్తే పదికాలాల పాటు పరిశ్రమలో పచ్చగా వుంటావు?” అని.

“మొదట నాకు కోపం వచ్చింది. హీరోని కేరక్టర్ ఆర్టిస్ట్ గా వెయ్యమంటాడేంటీ ? అని” నవ్వాడు ప్రసాద్. గంటన్నర నించీ నేను ప్రసాద్‌గారితోనే వున్నాను. అతన్ని ‘ఫ్రీ’గా వొదిలేస్తే హాయిగా మాట్లాడతాడు. ప్రశ్నలు వేస్తే మాత్రం మౌనంలో కూరుకుపోతాడు. అందుకే నేను ‘వినడమే’ బాగుంటుందనుకున్నాను.

“చిత్రం ఏమంటే   హీరోగా వొచ్చి  కేరక్టర్ వేషాలు  వెయ్యడం ‘’’

“అదేం కొత్తగాదుగా ప్రసాద్‌గారూ.  చాలా మంది హీరోలుగానూ, ముఖ్య పాత్రధారులుగానూ,  నటించారుగా!”

“అవును. రాజ్‌కపూర్ ‘మేరా నామ్ జోకర్’ పిక్చర్‌లో ఒక పాట ఉంది. ‘యే భాయ్ జరా దేఖ్ కె చలో’ అనేది. అందులో  ఓ లైన్ వుంది “హీరోసే జోకర్ బన్ జానా పడ్‌తా హై’ అని. నా జీవితంలో జరిగింది అదే. బట్.. కేరక్టర్ నటుడిగా మారడం వల్లే నా పాప్యులారిటీ పెరిగింది. యమా బిజీ అయ్యాను. లెక్కలేనంత సంపాయించాను.” మళ్ళీ మౌనంలోకి మునిగిపోయాడు ప్రసాద్. నేను సైలెంటుగానే వున్నాను. కొంతసేపు కేవలం గోడ గడియారం చప్పుడు మాత్రమే వినిపించింది.

“మీరో ప్రామిస్ చెయ్యాలి. నా కథని యధాతథంగా వ్రాయకండి. జస్ట్ హింట్ వరకే. పేరు కూడా మార్చండి. ఎందుకంటే నేను ఎవరినీ హర్ట్ చెయ్యదలుచుకోలేదు. కానీ,ఆశగా యీ పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్లకి యీ ‘మలుపులు’ తెలియాలి” మళ్లీ మౌనం. మౌనం తాబేలు డిప్పలాంటిది. తాబేలు కాళ్లూ, తల లోపలికి ముడుచుకున్నట్టు మనుషులు మౌనంలోకి ముడుచుకు పోతారు.

“చక్కని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన బాల్యం. కారణం మా నాన్నగారు గొప్ప గెజిటెడ్ ఆఫీసర్. ఆయన అందగాడు. ఆయన పోలికే నాకూ వచ్చింది. మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ. సో.. డబ్బులు దండిగా వుండేవి. కాలేజీలో అమ్మాయిలకి నేనంటే హీరో వర్షిప్. నాటకాల్లో ఏనాడూ పాల్గొనలేదుగానీ, మా వూరబ్బాయి సినిమాల్లో హీరో అయ్యేసరికి , నాకూ హీరో అవ్వాలనే ఆశ పుట్టింది. దానికి తోడు నా ఫ్రెండ్సందరూ ఊదరగొటారు.” నవ్వాడు. ఒకప్పుడు ప్రసాద్ తనదైన స్టైల్‌లో నవ్వితే జనాలు పగలబడి నవ్వేవాళ్లు. ఓ ప్రత్యేకమైన పద్ధతిలో  సంభాషణలు పలికేవాడు. ఇప్పుడా నవ్వులో ఒంటరితనం వుంది. వేదనా వుంది.

“చాలా మంది హీరోలు, ఆర్టిస్టులలాగా నేనూ  నటనలో కొంత శిక్షణ తీసుకున్నా.  ఓ చిత్రం తెలుసా.. అప్పటివాళ్ళలో చాలామందికంటే మొదట హీరో వేషం దొరికింది నాకే. చాలా మంది అసూయపడ్డారు. విలేజ్ సబ్జక్టు. అల్లరిచిల్లరగా తిరిగే కథానాయకుడిగా మొదలౌతుంది నా పాత్ర. వొదిగిపోయాను. కారణం నా నిజజీవితంలోనూ నాది కాస్త అల్లరి చేసే స్వభావమే..!”

చాలా ఏళ్ల క్రితం ఓ సారి ‘చిరపుంజి’ లో రెండ్రోజులు వున్నాను. చిటుక్కున వర్షం వచ్చి చిటుక్కున మాయమయ్యేది. ఒకోసారి గంటలకొద్దీ సుదీర్ఘంగా కురిసేది. అయితే అక్కడి ‘వర్షం’ పాత్ర ఇక్కడ ‘మౌనం’ పోషిస్తోంది.

“ఆ హీరోయినూ కొత్తదే.. అయితే తను చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. వాళ్లమ్మ మహాముదురు. నేను హీరోగా ఎదిగిపోతాననుకుందో  ఏమో, వాళ్లమ్మాయిని చాలా ఫ్రీగా నాతో వొదిలేసేది. అప్పుడే ‘నరేన్’ నన్ను కంట్రోల్ చేశాడు” ఆగాడు ప్రసాద్. నరేన్ కూడా యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసాద్‌తో పాటు చేరాడు. ప్రసాద్ రెండు సినిమాలు హీరోగా చేసి తరవాత స్టార్ కేరక్టర్ ఆర్టిస్ట్  అయితే, నరేన్ అయిదారు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ హీరో అనిపించుకుని తరవాత సడన్‌గా ప్రొడక్షన్‌లోకి దిగిపోయాడు. చాలా సక్సెస్‌ఫుల్ నిర్మాతేగాక రెండు మూడు హోటల్స్ కి యజమాని కూడా అయ్యాడు.

“ఫస్ట్ పిక్చర్ హిట్. ఆ వూపులోనే రెండో పిక్చర్‌కి సంతకం పెట్టాను. మొదటిది అల్లరి చిల్లరగా మొదలయ్యే హీరో వేషం అని చెప్పాగా. రెండోది ‘యాక్షన్’తో మొదలౌతుంది. హెవీ యాక్షన్ పేక్‌డ్ సినిమా!”

“అవును ఆ సినిమా నేను చూశాను. హీరోగా మీరు ఎంత బాగా డాన్సులూ, ఫైట్లూ చేసినా ఏదో ‘లోపం’ వుంది అనిపించింది అప్పుడు. బహుశా మీరు హార్ట్ ఫుల్‌గా చెయ్యలేదేమో అనుకున్నాను. అదీగాక హీరోయిన్‌కీ, మీకూ బాడీ లాంగ్వేజ్ కుదర్లేదు. చెప్పాను. నిజంగా ఆ స్టోరీ మంచిది మరో హీరో ఎవరన్నా ట్రై చేస్తే అదే సినిమా అలానే తీస్తే, ఇప్పటికీ సూపర్ హిట్ అవుతుంది.’’ అన్నా . ప్రసాద్ ఎంత బాగా చేసినా అది ఎబౌ ఏవరేజ్ సినిమాగా మాత్రమే నిలిచింది.

“మీరన్నది నిజం. నాకెందుకో ఆ సినిమా అంతా నేను కృత్రిమంగానే చేస్తున్నట్టే అనిపించేది. సినిమా హీరోయిన్ నాకంటే సీనియర్, సక్సెస్ చూసిన మనిషి కావడంతో తనో మెట్టు ‘ఎత్తున’ వున్నట్టు భావించుకుంటూ నన్ను ‘బచ్చా’ గాడిలాగా చూసేది. నేను ఫ్రీగా చెయ్యకపోవడానికి అదీ ఓ కారణమే!” తలపంకించి అన్నాడు ప్రసాద్.

“పోనీ ఆ విషయం మీరు డైరెక్టరుకో,  ప్రొడ్యూసర్‌కో చెబితే బాగుండేదేమో!!” అన్నాను.

“హా..హా..హా.. షీ యీజ్ టూ కాలిక్యులేటివ్. ఎవర్నీ ఎలా ‘అలరించాలో’ ఆమెకి తెలుసు. అందుకే నా కంప్లైంట్లు పనికిరాలేదు”  చాలా సేపటి తర్వాత ఫ్రీగా అదివరకులా నవ్వాడు ప్రసాద్.

నాకూ నవ్వొచ్చింది. ఓ హీరోగారు ప్రేమగా ఓ హీరోయిన్‌కి ‘ప్రొడ్యూసర్‌ డబ్బుల్తో ‘కారు’ బహూకరిస్తే, మరో ప్రొడ్యూసర్ ఓ హీరోయిన్‌కి ఏకంగా కారూ, బంగళా రెండూ సమర్పించాడు. బోంబే నటీమణులు చాలా నాజూగ్గా లాగేస్తారు. దేన్నైనా….! సరే తమిళం  వాళ్లూ తెలివైనవాళ్లే…. ఫీల్డులో పిచ్చివాళ్లు ఎవరంటే మన తెలుగు హీరోయిన్లే.

“ఆ సినిమా తరవాత రెండు మూడు సినిమాల్లో హీరో ఆఫర్ వచ్చినా నేను ఒప్పుకోలేదు. కారణం అవన్నీ మళ్లీ యాక్షన్ పిక్చర్లు. అప్పుడు డైరెక్టర్ త్రిమూర్తి నా దగ్గరికొచ్చి ఓ ‘కేరక్టర్ ‘ రోల్ చెయ్యమని అడిగాడు. అప్పటికే నరేన్, సతీష్, జీవి, కాంతు, అందరూ హీరోలుగా బుక్ అయిపోయారు. నేను చెయ్యాల్సింది కూడా ఓ సీనియర్ హీరోతో  ఫ్రెండ్లీగా ఆల్‌మోస్ట్ అన్ని సీన్లలోనూ వుండే  రోల్ కావటంతో ఒప్పుకున్నాను. రెండు సీన్లు అయ్యాక తెలిసిపోయింది ఏదో కొత్తగా నన్ను నేను మలుచుకోకపోతే ఆ హీరో ముందు నిలబడలేనని. అందుకే నా గెటప్ ని చిత్రంగా మార్చుకున్నా. డైరెక్టరుకీ, హీరోకీ కూడా అది నచ్చి ఆ రెండు సీన్లనీ రీషూట్ చేశారు. పిక్చర్ రిలీజైంది. ఓవర్‌నైట్ నేను స్టార్ ఆర్టిస్ట్ ని అయిపోయా. హీరోలైన నా ఫ్రెండ్స్ అందరూ నా కాల్‌షీట్ల కోసం రిక్వస్టు చెయ్యడం మొదలెట్టారు..!” మళ్లీ చిరపుంజి వర్షం జ్ఞాపకం వచ్చింది.

“సుమిత్రతో మీ రిలేషన్?” కావాలనే అడిగా. ఆ విషయం ఫీల్డులో అందరికీ తెలిసిందే గనక అడిగినా ఫరవాలేదు అనిపించింది.

“అవును. అది ఎఫైర్ స్థితి నించి పెళ్లి దాకా వచ్చింది. బహుశా  పెళ్లికి కూడా సిద్ధపడ్డానేమో. కానీ ఆగిపోయాను. కారణం తను నా మీద ‘హక్కు’ వున్నట్టు ప్రయత్నించడమే!” కొంచెం ఎమోషనల్ అయ్యాడు  ప్రసాదు.

“అంటే?” కుతూహలంగా అడిగాను. ఇక్కడ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. సామాన్యుల జీవితాల్లో ఏం జరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే సెలెబ్రిటీల విషయంలో వేరు. సెలెబ్రిటీలు కూడా మామూలు మనుషులేనని వాళ్లకీ ‘ఉద్వేగాలూ, ఉద్రేకాలూ ఉంటాయనీ జనాలు అనుకోరు. కళాకారులంతా చాలా సెన్సిటివ్ మనుషులు.  ప్రతి చిన్నదానికీ విపరీతంగా స్పందిస్తారు. అందుకే కళాకారుల జీవితాల్లో   చాలా  ఆత్మహత్యలూ, ప్రేమ వైఫల్యాలూ కనబడేది.

“భయ్యా, ప్రేమ అంటే అధికారం కాదు. ప్రేమ అంటే హక్కు కాదు. ప్రేమ అంటే స్వార్ధం కాదు. ప్రేమ అంటే పొసెసివ్‌నెస్ కాదు. ప్రేమ అంటే అహంకారం కాదు. ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకునేది అంతకన్నా కాదు. నా దృష్టిలో ప్రేమ ప్రేమే. దానికి సాటి అయినదో, పోల్చదగినదో మరొకటి సృష్టిలో లేదు. సుమీని నేను ప్రేమించిన మాట వాస్తవం. ఎంతగా అంటే ఆమెకి అంతకుముందే కొందరితో శారీరక సంబంధాలు వున్నాయని తెలిసికూడా, నేను సిన్సియర్‌గానే వున్నానని యీ క్షణంలోనూ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలను. మొదట్లో తనూ ప్రేమగానే ఉండేది. నేనెప్పుడైతే సినిమా సినిమాకీ  ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతున్నానో అప్పుడే ఆమెకి ఓ రకమైన ఇన్‌సెక్యూరిటీ మొదలైంది. మరే నటి అయినా నన్ను ముగ్గులోకి దించేస్తుందేమో అన్న సందేహంతో నా మీద ‘నిఘా’ పెట్టింది. తనూ ‘నటి’ అయినా జనాలు గుర్తించేంతగా గుర్తింపు పొందలేదు. తనకి అందం వున్న మాట వాస్తవమే అయినా, నటనలో ఏవరేజ్.. అంతే కాదు, తను చాలా పర్‌ఫెక్ట్ అనుకునే ‘మెంటాలిటీ .” ఆగాడు.

తలుపు తీసుకుని రూంబాయ్ వచ్చాడు. అతనికి హార్లిక్సు, నాకు కాఫీ తెచ్చాడు. టేబుల్ మీద పెట్టి, “నా డ్యూటీ ఇంకో రెండు గంటలే సార్…!!” అని నా వంక చూసి చెప్పాడు. నేను తల పంకించాను.

“ఔట్‌డోర్ షూటింగ్ వెళ్ళి రెండ్రోజులు కాగానే జ్వరం అనో, గుండెనెప్పి అనో అరగంటకోసారి ఫోన్ చేసేది. తీరా కంగారుపడి ప్రొడ్యూసర్ ని నానా రిక్వెస్టులూ చేసి ఆమె ఇంటికెల్తే, ‘నిన్ను మిస్సవుతున్నాను ప్రసాద్. అందుకే ‘ అని నవ్వేది. ఇండస్ట్రీలో వుంటూ, ఇండస్ట్రీ గురించి తెలిసీ ఇట్లాంటి వెధవ్వేషాలు వేస్తుంటే ఏమనాలీ?

మొదట్లో సైలెంటుగా వూరుకున్నాను. ఆ తరవాత అంటే, నా మీద నిఘాలూ, యీ చండాలపు ‘జబ్బు’ కాల్సూ ఎక్కువయ్యాక ఓ రోజున వాళ్లైంటికెళ్లి ‘నిన్ను భరించడం నా వల్ల కాదనీ, మన మధ్య ఇక ఏ సంబంధానికీ తావు లేదనీ నిర్మొహమాటంగా చెప్పేసాను” మెల్లిగా హార్లిక్స్ గ్లాసు పైకెత్తి అన్నాడు. మరో అయిదు నిముషాలు మౌనసముద్రంలో కలిసాయి.

“నేను ఎంత అమాయకుడ్నంటే , లోకం తీరు నాకు తెలీదు. తెలిస్తే వాళ్లింటికి వెళ్లి మరీ ఎందుకు చెబుతానూ? నా అపార్ట్ మెంట్‌కి తిరిగి వచ్చిన గంటన్నర సేపట్లో పోలీసులు వచ్చారు. నన్ను బలవంతంగా జీప్ ఎక్కించారు. కారణం ఏమిటంటే, నా వేధింపులు భరించలేక సుమిత్ర సూయిసైడ్ అటెంప్ట్ చేసిందిట..” పగలబడి నవ్వాడు. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ‘K’ అనే హీరో తన పలుకుబడి వుపయోగించి ప్రసాద్‌ని బెయిల్ మీద బయటకు  తెచ్చాడు. ఆ లోపులో ఎల్లో పత్రికలు ఎంత బురద జల్లాలో అంతా జల్లాయి. చాలా మంది నటీమణులు తాము ప్రేమించినవాడ్ని లొంగదీయడానికి ఇటువంటి చీప్ ట్రిక్స్‌కి పాల్పడతారు. రెండో మూడో నిద్రమాత్రలు, అదీ ప్రాణహాని కలగదని పూర్తిగా నిర్ధారించుకుని  వేసేసుకోవడం, స్నేహితులకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పడం, వాళ్లు పత్రికలకి విషయం లీక్ చేసి పోలీసులకు ఇన్‌ఫాం చెయ్యడంతో సదరు నటుడు చచ్చినట్టు తలొగ్గడం జరుగుతుంది.

ప్రసాద్ విషయంలో ‘K’  పలుకుబడేగాక దైవబలం తోడైంది. సుమిత్ర వేసుకుంది నిరపయాకరమైన మోతాదులోనని రుజువైంది. అదీగాక ఆమె ప్రేమ పేరుతో ప్రసాద్‌ని హింసించడం కూడా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ల వాంగ్మూలంలో రుజువైంది. అంతవరకూ నాకు తెలుసు.

” ఆ విషయం నాకు తెలుసు. అప్పుడే మీరు మీ పేరెంట్స్ కుదిర్చిన సంబంధం…” ఆగాను.

“అవును. ఫీల్డులో మగవాళ్లకి  పెళ్లి అవడం కూడా ఓ రక్షక కవచంలాంటిదే. కానీ, జీవితంలో నేను చేసిన  తప్పు వెంటనే పెళ్లి చేసుకోవడం. ఓ పక్కన పత్రికలూ, చానల్సూ ఇంత ఘోషించాక ఏ అమ్మాయి మాత్రం నమ్మకంగా వుంటుందీ. సినిమా నటుడ్నని  అందునా స్టార్ ఆర్టిస్ట్  అంటే ఆల్మోస్ట్ హీరోతో సమానమైన వాడ్ననీ నా మీద క్రేజ్ పెంచుకుని రోహిణి, అదే నా భార్య.. పెళ్లికి ఒప్పుకుంది. ఎప్పుడైతే భార్యగా ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే మరో హింస మొదలైంది..” మళ్లీ కాసేపు నిశ్శబ్దం.

“తొలిరాత్రే అడిగింది.. సుమిత్రకీ నాకు ఇంకా రిలేషన్ వుందా అని?” సైలెంటయ్యాడు ప్రసాద్ మళ్లీ. నాకు జాలేసింది. కానీ చెప్పడానికి ఏముందీ? నా మనిషీ, నా మొగుడూ, నాదీ అనే పదాలు వినడానికి బాగుంతాయి. కానీ అవి కంటికి కనపడని భయంకరమైన ‘చెరసాలలు’ అని అనుభవిస్తేగానీ అర్ధం కాదు.

“ఓ పక్క పెద్దవాళ్లయిన నా పేరెంట్స్, మరో పక్క క్షణం తీరిక లేని ప్రొఫెషన్, మరో పక్క అనుమానంతో నా మనసుని తినేసే భార్య.. వీటితో సతమతమైపోయా. మెల్లగా మ౦దుకి అలవాటు పడ్డాను. అయితే ఫుల్ బాటిల్స్ లాగించేంత అలవాటు కాలా. నేను చేసిన తప్పల్లా తాగేసి  ఏమీ తినకుండా మత్తుగా మంచం మీద ఒరిగిపోయేవాడ్ని. తరవాత తెలిసింది. తాగాక ఏదీ తినకుండా వుంటే తాగుడే మనని తినేస్తుందని. అదే జరిగింది. అయితే అందులోంచి బయటపడే ప్రయత్నం చెయ్యకపోలేదు..” ఆగాడు ప్రసాదు.

“కేరళ వెళ్లారుగా!” అన్నాను.

“అవును. రెండు నెలలపాటు చక్కని ట్రీట్‌మెంట్ తీసుకున్నా. ఒంటరిగా ఓ ఆయుర్వేద ఆశ్రమంలో వున్న ఆ రెండు నెలలూ నా జీవితంలో అద్భుతమైనవి..” ప్రసాద్ కళ్లు మెరిశాయి.

” ఓ మాట చెప్పనా భయ్యా… అందరూ మనవాళ్లనే అనుకుంటాం. అదేమీ తప్పు కాదు. కానీ, ఎవరి స్వార్ధం వాళ్లు చూసుకుంటారని మాత్రం మనం అనుకోము. అదే తప్పు. నేను తిరిగి వచ్చేసరికి నాతో పాటు ఇన్‌స్టిట్యూట్‌లో వుండి హీరోలైన నా ఫ్రెండ్సే నన్ను వాళ్ల సినిమాల్లోంచి తొలగించారు. కారణం వాళ్లకంటే నాకు పేరు ఎక్కువ రావడం”

ఇది ముమ్మాటికి నిజం. ఇలాంటి రాజకీయాలకి చాలా మంది బలి అయిపోతాం. మనతో వుంటూ మనకి ఏ ఏ సినిమాల్లొ అవకాశాలు వచ్చాయో మనని అడిగి తెలుసుకుంటూ,  చాలా తెలివిగా వాటిని తమ వేపుకి తిప్పుకుని (అవసరం అయితే ఫ్రీగా వర్క్ చేసి కూడా) మనని ముంచే మహామహులు ఎందరో. అయితే వాళ్లు నిలబడగలరా అంటే అదీ వుండదు. నిలబడటానికి ‘శక్తి’ ఎక్కడిదీ?

“నేను వూళ్ళోలేని రెండు నెలల  సమయమూ , నా స్థానాన్ని ఎప్పుడు  భర్తీ చేద్దామా అని ఎదురు చూపులు చూస్తున్న మిగతా వాళ్లకి   ఓ గొప్ప వరంగా మారింది. అర్జంటుగా వాళ్లు నా ప్లేస్‌లో బుక్కయ్యారు. తిరిగి వచ్చాక చూస్తే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నాకు లేదు. నా ఫ్రెండ్స్ దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి కలిశా. కొందరి ‘సారీరా.. అది డైరెక్టర్ నిర్ణయం’ అని ఓపన్‌గా చైబితే  మరికొందరు ఇంట్లో వుండి కూడా ‘లేమని’ మొహం చాటేశారు. అది నాకు తెలుసు. ఈ ఇండస్ట్రీలో కెరీర్ పాలు పొంగినట్టు పొంగుతుంది. అలానే ఠప్పున చల్లారీపోతూంది. ఎందుకూ? అనే ప్రశ్నకి సమాధానం మాత్రం దొరకదు.’’’’

“భయ్యా.. మొదట్నించీ నేను కాస్త ఖర్చు మనిషినే. అంటే నాకోసం నేను ఖర్చుపెట్టుకునే స్వార్ధపరుడ్ని కాదు. కాలేజీలో వుండగా ఫ్రెండ్స్ కోసం తెగ ఖర్చు పెట్టేవాడ్ని. ప్రైమ్ లో వుండగా రోజూ నా ఇన్‌స్టిట్యూట్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద హీరోలైనా, డ్రింక్స్ ఖర్చూ, ఫుడ్ ఖర్చూ నేనే పెట్టేవాడ్ని. ఇప్పుడు తెలుస్తోంది. అసలు వాళ్లు ఏనాడూ చిల్లుపైసా జేబులోంచి తీసే ప్రయత్నమే చెయ్యలేదని. ఓకే. కొండమీద పడ్డ వర్షం నాలుగు వైపులకీ జారిపోయి కొండ మళ్లీ పొడిబారుతుందనే సామెతలాగ, నా జీవితంలోనూ సంపాయించిన లెక్కలేనంత సంపాదన నా  చుట్టాలకీ, పక్కాల పెళ్ళిళ్లకీ, చదువులకీ, నా భార్య కోరిన సెక్యూరిటీలకీ జారిపోయింది. ఇప్పుడు.. ఇక్కడ.. యీ గదిలో  ఇలా వంటరిగా, అయినా హాయిగా కూర్చున్నా.. రేపేమవుతుందో నాకూ తెలీదు.  చాలామంది వొచ్చారు. వెళ్లారు. మరికొందరు కూడా వస్తారూ, వెళ్తారూ,త్వరలో కలుద్దాం అంటారు . ఆ ‘త్వరలో’ అన్నది రోజులు కావొచ్చు. నెలలూ కావొచ్చు.. మిత్రమా.. ఓ ‘జీవితమూ’ కావొచ్చు. ఏమైనా  మరోసారి మళ్లీ నా జీవితంలోకి తొంగి చూసుకున్నాను. మూసిన తలుపులు చాలానే ఉన్నాయి. మళ్లీ మనం కలిస్తే వాటన్నింటినీ కూడా ఓపెన్ చేద్దాం..ప్రస్తుతానికి ఇంతే!” లేచి నిలబడి అన్నాడు ప్రసాదు. అతన్ని అతని గదిలో ఒదిలిపెట్టాను.

నిజమే మళ్లీ కలిస్తే మరెన్నో తలుపులు తెరుచుకుంటాయి. వేచి చూద్దాం.

 

 (కొన్ని సంఘటనల సమాహారమే  ప్రసాద్ కధ . ఒక్క రిక్వస్ట్ …..మందు తాగొచ్చు ,కానీ మందుకి బానిస కావొద్దు .సమస్యలకి పరిష్కారం మందులో  దొరకదు .  జీవితం అన్నిటికన్నా విలువైనది ,  ‘’విజయం’’కన్నా కూడా .)

 

 

చట్టం అను ఒక దేవతా వస్త్రం!

వై.వి.రమణ

 

ramana‘చుండూరు హత్యల కేసులో క్రింది కోర్టులో శిక్ష. కొన్నేళ్ళకి హైకోర్టులో కేసు కొట్టివేత.’

‘బాలీవుడ్ సూపర్ స్టార్‌కి క్రింది కోర్టులో జైలుశిక్ష. నిమిషాల్లో హైకోర్టు బెయిల్ మంజూరు. రెండ్రోజుల తరవాత అదే కోర్టు శిక్షని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.’

‘తమిళనాడు ముఖ్యమంత్రిపై క్రింది కోర్టులో జైలుశిక్ష. కొన్నాళ్ళకి హైకోర్టులో అవినీతి కేసు కొట్టివేత.’

‘చట్టం కొందరికి చుట్టం’ – ఇటీవల కోర్టు తీర్పుల తరవాత ఈ సత్యం అందరికీ అర్ధమైపోయింది. ఒకప్పుడు ఈ సత్యానికి పట్టు వస్త్రం కప్పబడి సామాన్యులకి కనబడేది కాదు. ఆ తరవాత ఆ వస్త్రం పల్చటి సిల్కు వస్త్రంలా మారి కనబడీ కనబడనట్లుగా కనబడసాగింది. ఇవ్వాళ ఆ పల్చటి వస్త్రం దేవతా వస్త్రంగా మారిపోయింది! ఇకముందు ఎవరికీ ఎటువంటి భ్రమలూ వుండబోవు. ఇదీ ఒకరకంగా మంచిదే. ఈ వ్యవస్థలో సామాన్యుడిగా మనం ఎక్కడున్నామో, మన స్థాయేంటో స్పష్టంగా తెలిసిపోయింది.

శ్రీమతి ముత్యాలమ్మగారు నాకు జ్ఞానోదయం కలిగించే వరకూ – నేనూ “చట్టం ముందు అంతా సమానులే” అనే చిలక పలుకులు పలికిన మధ్యతరగతి బుద్ధిజీవినే. ముత్యాలమ్మగారు నారిమాన్, పాల్కీవాలాల్లాగా న్యాయకోవిదురాలు కాదు. ఆవిడ దొంగసారా వ్యాపారం చేస్తుంటారు, ఒక కేసులో నిందితురాలు. నేర పరిశోధన, న్యాయ విచారణలోని లొసుగుల గూర్చి – రావిశాస్త్రి అనే రచయిత ద్వారా ‘మాయ’ అనే కథలో విడమర్చి చెప్పారు. ‘ఆరు సారా కథలు’  చదివాక అప్పటిదాకా నాకున్న అజ్ఞానానికి మిక్కిలి సిగ్గుపడ్డాను.

క్రింది కోర్టుల్లో శిక్ష పడటం, పై కోర్టులు ఆ కేసుల్ని కొట్టెయ్యడం.. ఈ కేసుల్లో ఒక పేటర్న్ కనిపిస్తుంది కదూ? ‘మన న్యాయవ్యవస్థ పకడ్బందీగా లేకపోతే క్రింది కోర్టుల్లో శిక్షెలా పడుతుంది?’ అని విజ్ఞులు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి నా దగ్గర శాస్త్రీయమైన, సాంకేతికమైన సమాధానం లేదు. ఒక వ్యక్తి ఏ విషయాన్నైనా తనకున్న పరిమితులకి లోబడే ఆలోచించగలడు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని కాబట్టి, వైద్యం వెలుపల విషయాల పట్ల కూడా డాక్టర్లాగే ఆలోచిస్తుంటాను, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది నా పరిమితి, ఆక్యుపేషనల్ హజార్డ్!

ఇప్పుడు కొద్దిసేపు హాస్పిటల్స్‌కి సంబంధించిన కబుర్లు –

ఆనేకమంది డాక్టర్లు చిన్నపట్టణాల్లో సొంత నర్సింగ్ హోములు నిర్వహిస్తుంటారు. వీరికి అనేక ఎమర్జన్సీ కేసులు వస్తుంటయ్. అప్పుడు డాక్టర్లు రెండు రకాల రిస్కుల్ని బేరీజు వేసుకుంటారు. ఒకటి పేషంట్ కండిషన్, రెండు పేషంట్‌తో పాటు తోడుగా వచ్చిన వ్యక్తుల సమూహం. సాధారణంగా డాక్టర్లకి దూరప్రాంతం నుండి తక్కువమందితో వచ్చే పేషంట్‌కి వైద్యం చెయ్యడం హాయిగా వుంటుంది. వెంటనే ఎడ్మిట్ చేసుకుని వైద్యం మొదలెడతారు.

అదే కేసు ఆ హాస్పిటల్ వున్న పట్టణంలోంచి పదిమంది బంధువుల్తో వచ్చిందనుకుందాం. అప్పుడు పేషంటు కన్నా డాక్టర్లకే ఎక్కువ రిస్క్! ఎలా? విపరీతంగా విజిటర్స్ వస్తుంటారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి.. ఒకటే ఫోన్లు, ఎంక్వైరీలు. తమ నియోజక వర్గ ప్రజల రోగాల బారి పడ్డప్పుడు వైద్యులకి ఫోన్ చేసి ‘గట్టిగా’ వైద్యం చెయ్యమని ఆదేశించడం రాజకీయ నాయకులకి రోజువారీ కార్యక్రమం అయిపొయింది. అందరికీ సమాధానం చెప్పుకోడంతో పాటు డాక్టర్లకి కేస్ గూర్చి టెన్షన్ ఎక్కువవుతుంది.

పొరబాటున కేస్ పోతే – పేషంట్‌తో పాటు వచ్చిన ఆ పదిమంది కాస్తా క్షణాల్లో వెయ్యిమందై పోతారు. పిమ్మట హాస్పిటల్ ఫర్నిచర్ పగిలిపోతుంది. డాక్టర్ల టైమ్ బాగోకపొతే వాళ్ళక్కూడా ఓ నాలుగు తగుల్తయ్. పిమ్మట బాధితుల తరఫున ‘చర్చలు’ జరిగి సెటిల్మెంట్ జరుగుతుంది. అంచేత డాక్టర్లకి క్రిటికల్ కండిషన్లో వచ్చే లోకల్ కేసులు డీల్ చెయ్యాలంటే భయం. అందుకే వారీ కేసుల్లో వున్న రిస్క్‌ని ఎక్కువచేసి చెబుతారు. ‘మెరుగైన వైద్యం’ పెద్ద సెంటర్లోనే సాధ్యం, అంత పెద్ద రోగానికి ఇక్కడున్న సాధారణ వైద్యం సరిపోదని కన్విన్స్ చేస్తారు (కేసు వదిలించుకుంటారు). ఆ విధంగా వైద్యం చేసే బాధ్యతని ‘పైస్థాయి’ ఆస్పత్రులకి నెట్టేస్తారు.

మహా నగరాలకి కాంప్లికేటెడ్ కేసులు అనేకం వస్తుంటాయి. డాక్టర్లు హాయిగా వైద్యం చేసుకుంటారు. కేసు పోయినా – ఎలాగూ బ్యాడ్ కేసే అని పేషంట్ తరఫున వారికి తెలుసు కాబట్టి వాళ్ళ హడావుడి వుండదు. ఎవరన్నా ఔత్సాహికులు గొడవ చేద్దామన్నా, ఆ కార్పోరేట్ ఆస్పత్రికి ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయి వారి అండ ఉన్నందున ‘శాంతిభద్రతలు’ కాపాడే నిమిత్తం పోలీసులు ఆ గుంపుని వెంటనే చెదరగొట్టేస్తారు. అంచేత పేషంట్ బంధువులు ‘ఖర్మ! మనోడి ఆయువు తీరింది.’ అని సరిపెట్టుకుని కిక్కురు మనకుండా బిల్లు చెల్లించి బయటపడతారు.

వైద్యవృత్తి వెలుపల వున్నవాళ్ళకి నే రాసింది ఆశ్చర్యం కలిగించవచ్చును గానీ, ఇది రోజువారీగా జరిగే పరమ రొటీన్ అంశం. ఇందులో సైకలాజికల్ ఇష్యూస్ కూడా వున్నాయి. పెద్ద కేసుల్ని పెద్దవాళ్ళే డీల్ చెయ్యాలి. దుర్వార్తల్ని చెప్పాల్సినవాడే చెప్పాలి. రాజు నోట ఎంత అప్రియమైనా తీర్పు భరింపక తప్పదు. అదే తీర్పు గ్రామపెద్ద చెబితే ఒప్పుకోరు, వూరుకోరు. ఈ హాస్పిటళ్ళ గోలకి నే రాస్తున్న టాపిక్‌తో కల సంబంధం ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమయ్యే వుంటుంది.

“బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.” అంటాడు బాలగోపాల్. (‘రూపం – సారం’ 47 పేజి – ‘రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగా యంత్రం’). ఈ పాయింటుని ప్రస్తుత సందర్భానికి నేనిలా అన్వయించుకుంటాను – కొన్ని కేసుల్లో బాధితులు పేదవారు, అణగారిన వర్గాలవారు. వారిపట్ల ప్రజలు కూడా సానుభూతి కలిగి వుంటారు. బాధితుల్ని కఠినంగా ఆణిచేస్తే ప్రజల్లో ప్రభుత్వాల పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం వుంది. అందువల్ల కొన్నిసార్లు (రాజ్యానికి) కేసులు పెట్టకుండా వుండలేని స్థితి వస్తుంది. శిక్షలు విధించకుండా వుండలేని స్థితీ వస్తుంది. అందుకే మధ్యే మార్గంగా క్రింది కోర్టుల శిక్షలు, పై కోర్టుల కొట్టివేతలు!

చిన్నపాటి హాస్పిటల్స్‌కి వున్నట్లే – కింది కోర్టుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. అక్కడ న్యాయమూర్తులు శిక్ష వెయ్యడానికి కొద్దిపాటి ఆధారాల కోసం చూస్తారు. శిక్ష వెయ్యకపోతే బాధితులు ఆందోళన చెయ్యొచ్చు, తద్వారా తాము కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావొచ్చు. ఆపై ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. క్రింది కోర్టుల్లో ముద్దాయిలకి శిక్ష వెయ్యకపోతే ఇబ్బంది గానీ, వేస్తే ఎటువంటి ఇబ్బందీ వుండదు! అందువల్ల కేసు కొట్టేసే బాధ్యతని ఉన్నత స్థానాలకి నెట్టేస్తారు! హైకోర్టులో మాత్రం కేసుల పరిశీలన పూర్తిగా టెక్నికాలిటీస్ మీద ఆధారపడి జరుగుతుంది. వారిపై ఎటువంటి వొత్తిళ్ళూ వుండవు. శిక్ష ఖరారు చెయ్యడానికి ఉన్నత న్యాయస్థానం వారికి కేసు పటిష్టంగా, పకడ్బందీగా వుండాలి. తప్పించుకోడానికే పెట్టిన కేసులు తొర్రల్తోనే వుంటాయి కాబట్టి సహజంగానే ఉన్నత న్యాయస్థానంవారు కొట్టేస్తారు.

ఇక్కడితో నే చెప్పదల్చుకున్న పాయింట్ అయిపొయింది. కింది కోర్టుల్లో శిక్ష పడ్డాక, ఆ శిక్ష ఉన్నత న్యాయస్థానాల్లో ఖరారు కాకపోవడానికి ఎన్నో కారణాలు వుండొచ్చు. నాకు తోచిన కారణం రాశాను. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. నా ఆలోచన పూర్తిగా తప్పనీ, నాకు న్యాయవ్యవస్థపై కొంచెం కూడా అవగాహన లేకపోవడం మూలాన అపోహలతో ఏదేదో రాశానని ఎవరైనా అభిప్రాయ పడితే – ఆ అభిప్రాయాన్ని ఒప్పేసుకోడానికి సిద్ధంగా వున్నాను. ఎందుకంటే – నేను ముందే చెప్పినట్లు నాది ‘వైద్యవృత్తి’ అనే రంగుటద్దాలు ధరించి లోకాన్ని అర్ధం చేసుకునే పరిమిత జ్ఞానం కాబట్టి!

అవసరమే కథల్ని పుట్టిస్తుంది:గంటేడ గౌరునాయుడు

బాలసుధాకర్ మౌళి

 

ఇన్నాళ్లూ ఉత్తరాంధ్ర కథ ఏం మాట్లాడిందంటే మట్టి భాష మాట్లాడింది – మనుషుల వెతలను ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చింది. పోరాట ఆవశ్యకతను చాటిచెప్పింది. సాహిత్యం ఏం చేస్తుంది ? మనుషులను చైతన్యవంతం చేస్తుంది. ఉత్తరాంధ్రా కథ ఆ కర్తవ్యాన్నే నెరవేర్చింది – నెరవేర్చుతుంది. అటు పాటల రచయితగా, కవిగా ; ఇటు కథా రచయితగా – ఏం చేసినా ప్రజా చైతన్యమే పునాధిగా ; అవసరార్థమే కథ రాశాను – రాస్తున్నాను అని చెబుతున్న ‘గంటేడ గౌరునాయుడు’ మాస్టారు ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి. సూక్ష్మంగా ఆయన అంతరంగ అన్వేషణ.

గంటేడ గౌరునాయుడు మాస్టారు – ‘స్నేహకళాసాహితి’ అనే సాహితీ సంస్థని స్థాపించి చాలా మంది యువకవులకు, కథా రచయితలకు వొక వేదికనందించారు అని అనడం కంటే యువతరంతో కలిసి సాహితీసేద్యం చేస్తున్నారు అంటేనే ఆయనకు ఎంతో ఇష్టమౌతుంది.
‘ప్రియభారతి జననీ.. ‘ పాటలు; ‘నాగేటి చాలుకు నమస్కారం – నాగలి’ దీర్ఘ కవితలు; ‘కళింగోర’ పేరుతో కాలమ్ నిర్వహణ; ‘నదిని దానం చేశాక’ కవిత్వసంపుటి; ‘ఏటిపాట – ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ కథాసంకలనాలు; ఈ మధ్య వచ్చిన ‘ఎగిరిపోతున్న పిట్టల కోసం’ కవిత్వం – ఈయన సాహిత్య ఉత్పత్తులు. ‘ఇది నా ఊరేనా ! ‘ పేరుతో పాటల సి.డి వొకటి విడుదల చేశారు. తొలి రోజుల్లో ‘ పోడు మంటలు ‘ అనే నృత్య నాటకం రాసి చాలా ప్రదర్శనలిచ్చారు. ఈ మధ్య ‘ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ తర్వాత వచ్చిన ఆయన ఏడు కథలు చాలా చర్చనీయాంశాలను చెప్పాయి. ‘మాయ, పొద్దు ములిగిపోయింది’ ఈ రెండు కథలు – ముంపు నేపథ్యంలోంచి; ‘ఇండియాగాడి టి.సి, సంధ్య’ కథలు – ట్రైబల్ విద్య నేపథ్యంలోంచిమాట్లాడుతాయి. ‘మూడు దృశ్యాలు’ కథ – ప్రభుత్వపథకాలు ఎవరికి లాభం చేకూర్చుతున్నాయో చెబితే, ‘ఒక ఊరి కథ’ – పెట్టుబడిదారి విధానం మీద పూర్తిగా ఆధారపడిన తర్వాత రైతు పరిస్థితి ఏమిటి ? అనే విషయాన్ని చర్చిస్తుంది. గౌరునాయుడు మాస్టారి కొత్త కథ ‘అల్పపీడనం’ లక్ష్మిం పేట నేపథ్యంలోది. అదింకా ప్రచురితం కావాల్సి ఉంది.

1. మీ నేపథ్యం చెప్పండి?
నేను పుట్టిన ఊరు – దళాయి పేట, కొమరాడ మండలం, విజయనగరం జిల్లా. వ్యవసాయ కుటుంబం. నా చదువు పార్వతీపురంలో సాగింది. ఉద్యోగమూ ఈ పరిసరప్రాంతాల్లోనే.

2. కథా సాహిత్యంలోకి ఎలా వచ్చారు?
నా బాల్యస్నేహితుడు, కథా రచయత ‘అట్టాడ అప్పలనాయుడు’ కథా సంపుటి – ‘పోడు పోరు’ నన్ను కథా సాహిత్యంలోకి లాక్కొచ్చింది. అంతకు ముందూ కథలు రాసేవాణ్ణి కానీ అప్పలనాయుడు కథలు చదివాక కథ రాయడం మీద బాధ్యత పెరిగింది. కారా, భూషణం, చాసో, తిలక్ కథలు ఇష్టంగా చదివాను.

3. మిమ్మల్ని ప్రభావితం చేసిన కథకులు – కథలు ఏవి?
కారా – చావు, చాసో – వాయులీనం, తిలక్ – ఊరి చివర ఇల్లు, రావిశాస్త్రి – తప్పు కథలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.

4. కథ, పాట, కవిత ఈ మూడింటినీ మీరు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు ఈ మూడింటిని ఎలా సమన్వయం చేయగలిగారు ?
పాటతో బయలుదేరాను. కవిత్వాన్ని ఇష్టపడ్డాను. కథ అవసరం కనుక రాస్తున్నాను. కవిత ద్వారా, పాట ద్వారా చెప్పలేని విషయాన్ని కథ ద్వారా విస్తారంగా చెప్పడం సులువు. అందుకే కథనే ప్రధానంగా నా భావప్రసారానికి మాధ్యమంగా ఎన్నుకున్నాను.

IMG_20150428_100723

5. పాట మీ కథల్లోకి ఎలా ప్రవేశించింది?
పాట నాకు ఇష్టం కాబట్టి మొదట నేను పాటతో బయలుదేరాను. పాట కథాగమనానికి దోహదపడుతుందని అనుకున్నప్పుడే అక్కడక్కడ నా కథల్లో ఉపయోగించాను. అయితే శృతి మించిన కవిత్వం కథాగమనాన్ని నాశనం చేస్తుందని నా అభిప్రాయం.

6. మీరు రైతు, వ్యవసాయం ప్రధానంగా కథలు రాస్తారు కదా.. మీ ముందు తరం కథా సాహిత్యంలో రైతు జీవితం ఏమేరకు చిత్రితమయ్యింది ?
నిజానికి కథా సాహిత్యంలోకి రైతు ప్రధాన పాత్రగా ప్రవేశించింది మా తరం కధకులు కథా సాహిత్యంలోకి వచ్చిన తర్వాతే అనిపిస్తుంది. గురజాడ, ఆచంట
సాంఖ్యాయన శర్మ కథలు రాస్తున్న కాలం.. రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్న కాలం. నానా హింసలు పడుతున్న కాలం. అయినా గానీ ఏ కారణం గానో ( బహుశా
సంస్కరణోద్యమ ప్రభావం కావొచ్చు ) రైతు జీవితం కథల్లోకి రాలేదు. అయితే రైతు గురించిన ప్రసక్తి కా.రా మాస్టారు కథ ‘కీర్తి కాముడు’ 1949లో ఉంది.
రైతులు పితృ పితామహార్జితమైన ఆస్తిని దానధర్మాలనీ, పరువు ప్రతిష్టలనీ, పంతాలు పట్టింపులనీ, పౌరుషాలకు పోయి.. హారతి కర్పూరంలా హరాయింప చేసినట్టు
చెప్తారు. 1951 లో అవసరాల సూర్యారావు రాసిన ‘ఊరేగింపు’ కథలో జమిందార్లు వేసే పన్నులు కట్టలేక వారి వేధింపులు తట్టుకోలేక.. రైతులు తిరుగుబాటు
చేసిన వైనాన్ని చిత్రిస్తారు. నాకు తెలిసి ఇవి తప్ప రైతును గురించిన చిత్రణ ఉత్తరాంధ్రా కథా సాహిత్యంలో కనిపించదు. మళ్లీ కా.రా, భూషణం, శ్రీపతి కథల్లో ఉద్యమ చిత్రణ జరిగింది గానీ, రైతు ప్రధాన పాత్ర గాదు. వీరి కథల్లో పాలేర్లపై నాయుళ్ల పెత్తనం ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరువాత మా తరం సాహిత్యరంగంలోకి ప్రవేశించాక మరీ ముఖ్యంగా రైతు కుటుంబాల్లోంచి వచ్చాక.. రైతు జీవితం చిత్రించబడిందని నేననుకుంటాను.
ఇక్కడొకటి గమనించాలి.. రైతు అనగానే అతడొక భూస్వామిలాగ భావిస్తే పొరపాటు. ఏడాదంతా కష్టపడినా.. నేలబుగ్గినెత్తుకున్నా.. అప్పుల ఊబిలోనే కూరుకుపోయే అతి చిన్న, సన్నకారు రైతులూ వున్నారు. వారే మా కథల్లో ప్రధాన పాత్రధారులు. నేను మాట్లాడేది ఆ రైతుల గురించే.
7. మీ కథల్లో ‘నోష్టాల్జియా’ గురించి మాట్లాడుతున్నారని ఒక విమర్శ ఉంది. మీరేమంటారు ?
   ‘నోష్టాల్జియా’ అంటే గతమంతా వైభవంగా ఉందని.. ఆ వైభవం ఇప్పుడు లేదనీ నేనంటున్నట్టా ? నా కథల్లో ఏ రైతూ ఎప్పుడూ సుఖంగా ఉన్నట్టు గానీ, భోగ
భాగ్యాలు అనుభవిస్తున్నట్టు గానీ రాసానా ? నా కథల్లోని రైతులు పండిన పంట అప్పులూ, పాయిదాలూ తీర్చడానికీ.. కళ్లం గట్టునే అన్నీ కొలిచి ఇంకా తీరని
అప్పులతో, ఖాళీ చేతుల్తో మిగిలిపోయిన వాళ్లే. ఆ జీవితమే బాగుందనీ, అలాగే ఉండిపోవాలనీ నా కథలు చెప్తున్నాయా ? అలా అన్న వాళ్లు నా కథలు
చదివారనుకోవాలా ?
8. ‘నాగలి’ దీర్ఘకావ్యం రాసారు కదా.. యంత్రానికి మీరు వ్యతిరేకమా ?
వ్యతిరేకమని ఎందుకనుకుంటారు ? నాగలి రైతుకు దొరికినంత సులువుగా, సౌకర్యంగా ట్రాక్టరు కూడా అందుబాటులోకొస్తే ఎవరు కాదంటారు ? ట్రాక్టరుని
నమ్మి నాగళ్లని దూరం చేసుకున్నాక ట్రాక్టరు యజమాని కాళ్ల దగ్గర పడిగాపులు పడే రైతుల దుస్థితి చూస్తే అర్ధమవుతుంది… దిగువ మధ్యతరగతి రైతు వేదన.
9. ” మార్క్సీయ భావజాలంతో జీవితాన్ని ఎంత వాస్తవికంగా అర్ధం చేసుకోవచ్చునో మీ కథలు రుజువు చేస్తున్నాయని” వొకరు, ”మార్క్సీయ భావజాలమే’ అంటే నమ్మశక్యం కాదనీ” మరొకరూ అన్నారు. మీరేమంటారు ?
ఎవరు ఏమనడానికైనా కథకుడి కంటే కథే ప్రధానం. అటువంటప్పుడు మార్క్సీయ భావజాలం ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించకపోవడానికి కారణమేమైయుంటుంది ?
కథంతా వదిలేసి.. మధ్యలో ఏదో వొక వాక్యాన్ని పట్టుకుని, అదీ సరిగా అర్ధం చేసుకోకుండా భావజాలాన్ని నిర్ణయించడం సరైంది కాదని నా అభిప్రా

10. పాట, కవిత, కథ రాశారు. నవల?
నవల రాయాలని బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వలన, ఆరోగ్య కారణాల వలన అనుకున్న పని చెయ్యలేకపోతున్నాను. అదీకాక కథ రాయడానికే నేను చాలా సమయాన్ని తీసుకుంటాను. నవల అంటే మరి ఎక్కువ సమయం
పడుతుంది. కానీ రాస్తాను.

11. ఇప్పటి ఉత్తరాంధ్రా కథాసాహిత్యాన్ని మీరెలా నిర్వచిస్తారు?
వర్తమాన కథ అస్తిత్వ మూలాన్ని అన్వే స్తుంది. ఈ విషయాన్ని అట్టాడ అప్పలనాయుడు కథ ‘షా’ బలంగా మాట్లాడింది. క్షతగాత్రగానం, శిలకోల, వరద ఘోష మరికొన్ని. ఇక్కడి కథా రచయితలు ఈ నేలకే ప్రత్యేకమైన కథలు రాస్తున్నారు. స్థానీయత వుంటేనే సార్వజనీనత వుంటుందని నిరూపిస్తున్నారు.

12. రేపటి ఉత్తరాంధ్రా కథ ఎలా ఉండాలనుకుంటున్నారు?
సాగరతీర గంగ పుత్రుల కథలు రాలేదు. మందస జీడితోటల కథలు రావాలి. స్త్రీ, దళితవాద కథలు యిక్కడ రావాల్సినంతంగా రాలేదు. కాబట్టి ఈ అన్ని మూలాల నుంచి కథలు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడయినా, ఏ కాలంలోనైనా కథ వొక సామాజిక
అవసరం. సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది.

13. సమాజపు అన్ని మూలాల నుంచి ఆయా కథలు రాకపోవడానికి కారణమేమంటారు?
ఒకటి కళింగాంధ్రాలో దళిత, స్త్రీవాద కథకులు లేరు. దళితుల నుంచి కథకులు రావాలి. ఎవరి జీవిత అనుభవాల్లోంచి, వాళ్ల వాళ్ల అనుభవసారాన్నుంచి వచ్చేవే అసలైన కథలు అవుతాయని నా నమ్మకం. నేను రాసిన ‘నాణెం కింద చీమ’ దళిత సానుభూతి కథ – కానీ స్వీయానుభవం నుంచి వచ్చిన కథైతే బలంగా వస్తువును ప్రకటిస్తుంది.

14. తెలంగాణాను, ఉత్తరాంధ్రాను సామాజికగా, సాంస్కృతికంగా ఎలా ముడికడతారు?
ముడి పెట్టడం కాదు గానీ అక్కడ జరిగిన ఉద్యమాన్ని యిక్కడ సాహిత్యం ప్రభావితం చేసింది. భూషణం కొండగాలిలో అదే చెప్పారు.
సంస్కృతి విషయానికొస్తే ఎవరి సంస్కృతి వాళ్లదే. ఆయా సంస్కృతుల నుంచి గొప్ప కథలు వచ్చాయి. ఉద్యమ సంబంధమైన కథలొచ్చాయి. కాబట్టే ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని యిక్కడి సాహిత్యకారులు సమర్ధించారు.

15. ఈనాటి సామాజిక నిర్మాణంలో ఉత్తరాంధ్రా కథాసాహిత్యం ఏ మేరకు తన పాత్రని నిర్వహించాలి?
ఏ ప్రాంత సాహిత్యానికయినా సామాజిక పరిణామంలో గొప్ప పాత్ర వుంటుంది. ఉత్తరాంధ్రాకే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా ప్రాంతాల
నిర్ధిష్టతల్లోంచి.. సాహిత్యం సామాజిక వికాసానికి దోహదపడుతుంది.

16. ఉత్తరాంధ్రా కథా రచయితలు కథానిర్మాణంలో కొన్ని కొత్త పోకడలు పోయినా మరీ వినూత్న పోకడలు పోకపోవడానికి కారణమేమిటి ? పోవాల్సిన అవసరం ఉందా ?
ఇక్కడి రచయితలకు ముఖ్యంగా జీవితం, జీవితంలో వ్యధ ముఖ్యం. ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని నమ్మడం ఒక కారణమైతే, ఆంగ్ల సాహిత్యంతో అంత ఎక్కువగా సంబంధం లేకపోవడం కూడా కారణమే. రాయలసీమ నుంచి తెలంగాణా నుంచి సీరియస్ గా సాహిత్యాన్ని సృష్టిస్తున్న రచయితలకూ ఇదే వర్తిస్తుందనుకుంటాను. ప్రయోగాలు ప్రతిభని చెప్పడానికే తప్ప చెప్పాల్సిన విధంగా జీవితాన్ని చెప్పవని నేను అనుకుంటున్నాను. అయితే ఏ ప్రయోగాలైనా కథా గమనానికే దోహదపడాలి గానీ ఆటంకం కాకూడదు. స్వానుభవ గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చిన ప్రయోగాలు మన సాహిత్యంలో వున్నాయనీ నేను నమ్ముతున్నాను.

17. మేజిక్ రియలిజం గురించి మీ అభిప్రాయం చెప్పండి?
భారతీయ ప్రాచీన సాహిత్యంలో మ్యాజిక్ రియలిజం ఉంది. ఇది మన సాహిత్యంలోకి కొత్తగా వచ్చింది కాదని నా అభిప్రాయం.

18. ఉత్తమ సాహిత్యానికి నిర్వచనం ఇవ్వండి?
ఒకేసారి – ఒక అర్థాన్నిస్తూ, అనేక అర్థాలను స్ఫురింపజేయాలి.

19. ఉత్తరాంధ్రా యువరచయితల గురించి రెండు విషయాలు చెప్పండి?
వర్తమాన సమస్యల మీద స్పందన, వ్యక్తీకరణ బాగుంది. కానీ సాహిత్య సృజన వొక దగ్గరే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం – ప్రధానంగా అధ్యయన లోపం . పూర్వ రచయితల సాహిత్యం విశృంకలంగా చదవాలి. కవిత్వం రాసేవాళ్లు – కారా, చాసో లాంటి కథకుల కథలని చదవటలేదు – సాహిత్యం మొత్తాన్ని చదవాలి. గొప్ప కవులు, గొప్ప కథకులు అనదగినవారు సాహిత్యప్రక్రియలన్నీ చెయ్యకపోయినా, చదివారు. అదే దోవలో యువరచయితలూ వెళ్లాలి. సాహిత్యతరాలలో ఖాళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వుంది –
ప్రతీ తరానికి. ఇక్కడి రచయితలంతా సార్వజనీనమైన మానవ జీవన వికాసాన్ని చెప్పే ప్రయత్నంలో యింకా చాలా చెయ్యాల్సి ఉంది.

20. ఇప్పుడు తక్షణం ఉత్తరాంధ్రా సామాజిక సాంస్కృతిక నిర్మాణం కోసం.. ఏం చేస్తే బాగుంటుంది?
సంస్కృతిని నిలబెట్టడానికి, సామాజిక పునర్వికాసానికి కవులు, కథకులు వొకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ వొక వేదిక మీద నుంచే వొకే గొంతుకగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు జరిగే చర్చ – సమాజానికి ఎక్కువ లభ్యతని చేకూర్చుతుంది.

21. విమర్శని మీరెలా తీసుకుంటారు?
నిర్మాణాత్మక విమర్శ ఎప్పుడూ ఉండాలి. రచయతకి విమర్శ సహాయకారి అవ్వాలి – దారి దీపం కావాలి అంతేగానీ ప్రత్యేకంగా పనికట్టుకొని వ్యంగ్యం విమర్శలోకొస్తే విమర్శకుడు కథకుని మీద ఆధిక్యతని ప్రదర్శించినట్టే. విమర్శకుడు స్నేహితుడిలా ఉండాలి. వైరిపక్షం కాకూడదు. జ్ఞానంతో పాటూ విమర్శకునికి సంయమనం ఉండాలి. అనుకోకుండా దుర్విమర్శ  రచయిత మీద చెడు ప్రభావాన్ని చూపిస్తే అది సాహిత్యలోకానికి చాలా నష్టమవుతుంది.

22. నేటి పత్రికలలో ఉత్తరాంధ్ర కథకి ప్రోత్సాహం ఎలా వుందనుకుంటున్నారు?
కొన్ని పత్రికలు – పేజీలు యిన్ని రాయాలి అని ; మాండలికం వుండకూడదు అని పెట్టే కొన్ని నిబంధనలు – నిరుత్సాహకరంగా కనిపిస్తున్నాయి.

23. ఉత్తరాంధ్రా ప్రాంతం నుంచి కొత్తగా వస్తున్న ప్రచురణ సంస్థల (ఉదాహరణకు – ‘సిక్కోలు బుక్ ట్రస్ట్’ ) గురించి మీ అభిప్రాయం?
ప్రచురణ సంస్థలు అవసరమే. ఉండాలి. ఎన్ని వుంటే అంత మంచింది. ఉత్తరాంధ్రా గొంతును బలంగా ప్రకటించడానికి పత్రికల అవసరమూ ఉంది.

ఇదీ గంటేడ గౌరునాయుడు మాస్టారు అంతరంగం. సాహిత్యం – మనిషి వొక్కటైనప్పుడు అంతరంగం సువిశాలమౌతుంది. గౌరునాయుడు మాస్టారు అంటే నాగావళి అలల ఘోష . ఆయన కథల నిండా ఉత్తరాంధ్రా. ఉత్తరాంధ్రా అంటే దానివైన కొన్ని ప్రత్యేక లక్షణాలు వున్నా ఈ ప్రపంచంలో ఎక్కడయినా వుండే వొక ప్రాంతం మాత్రమే. కథలు – అమ్మమ్మ చెప్పేవైనా, యిప్పుడు ముద్రణలోకి వచ్చినవైనా కథల్లో వొక జీవనాడి వుంటుంది. ఉత్తరాంధ్రా జీవనాడిని వ్యక్తం చేసినవే ఉత్తరాంధ్ర కథలు. మా గౌరునాయుడు మాస్టారు కథలు.

simple picture

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshpicture.
ఈ వారం ఈ పదం గురించి.

అవును.
pickup గురించి మీరు వినే ఉంటారు.
అది వేరనుకుంటారు.

pick అంటుంటారు.

పసిగట్టడం.
పిక్.
పిక్చర్.

చూడగానే దాన్ని పట్టుకోవాలనుకోవడం. ఒడిసి పట్టుకోవడం.
పసిగట్టడం.

పసిగట్టడంలోనూ ఒక బాల్యం ఉంటుంది.

ఒక్క పరి చూసి విభ్రమం చెందడం. అదే కావాలని మంకు పట్టు పట్టడం. పసితనపు చ్ఛాయ.

అట్లే పిక్చర్ లో ఒక కల్చర్ ఉంటుంది.
జీవన సంస్కృతి అంతా ప్రతి పిక్చర్ సెల్లో సంక్షిప్తం అయివుంటుంది.

నిజానికి పిక్చర్ అంటే ఏమిటో కాదు, దృశ్యాదృశ్యం.

అందరూ యధాలాపంగా చూసేదాన్నే పట్టుకోవడం.
అదృశ్యం కాకుండా దృష్టి పెట్టడం.

picking…
pick…

capture…
picture.

A visual representation…
A vivid or realistic description.

అనుక్షణికపు స్వప్నరాగాలీన కాదు.
క్షణికపు వాస్తవాలింగనం.

వడ్డెర చండీదాస్ కాదు.
మామూలు రచయిత పనే.

వాస్తవం.
జీవకళ.

ఎవరైనా ఏముందిలే అని తలవంచుకుని పోతుంటే, కాదు, ఇందులో ఒక సంస్కృతి ఉంది. నాగరికత ఉంది. వర్ణ సంచయమూ ఉంది. ఒక సంభ్రమం ఉంది. విభ్రాంతి ఉందీ అని అనకుండా చాలా మామూలుగా దోచుకోవడం, దాచుకోవడం, వెలుగు నీడల ఛాయలో వడగట్టడం…ఆనందించడం అంతే.

అప్పుడు తెలియదు.
అదే picture.

లేదంటే మీరలా వెళుతూ ఉంటారు.
మౌస్ తో గోడమీద నడుస్తూ ఉంటారు.
ఒక దగ్గరకు రాగానే లైక్ చేస్తారు.
అదీ ఒక రకంగా పిక్.
పిక్చర్.

నిజానికి లైక్ చేయడమే ఫొటోగ్రఫి.

a selection of a work which feasts your imagination or memory or tickles your experiences. ఇదంతా బూతు. మోటు.ఎక్కువ అన్నమాట.
సింపుల్ గా చెప్పాలంటే సునాయసంగా మీలోకి చోరబడే ప్రేమ. ఛాయ.పిక్.

+++

ఇది ఒక ఉదయరాగాన తీసింది.
మహాత్మాగాంధీ లేదా ఇమ్లీబన్ బస్టాండ్…అటువైపు వెలుతుంటే రోడ్డు వారగా ఒక లాంగ్ షాట్.
కానీ దాన్ని ఎంత పట్టుకోవాలో అంత. ఎవరూ అడ్డంగా లేనప్పుడు ఎలా పట్టుకోవాలో అలా…
కాస్త కష్టపడితే ఇలా..
ఇక పట్టుకుంటే లైకులు. వందలకు వందల లైకులు.

బహుశా ఈ చిత్రానికి వచ్చినన్ని లైకులు నాకెప్పుడూ ఇదివరకు రాలేదు.
ఎందుకని ఆలోచిస్తే, రోజూ చూసేదే. కానీ ‘తీస్తే ఇంత బాగుంటుందా?’ అనిపించడం ఒకటి.

సో మై డీయర్ ఫ్రెండ్స్…పికప్.
పిక్చర్ చేయండి.

సింపుల్.

థాంక్స్.

~

లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్…

అల్లం వంశీ

 

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”
ఉట్టిగనే.. రాస్తుంటే మంచిగనిపిస్తుంది కాబట్టి రాస్తున్నా..

మంచిగనిపించుడంటే?
ఓ కథ రాస్తా.. అది ఎన్లనో ఒక దాన్ల పబ్లిష్ ఐతది.. అది చదివి ఓ నలుగురు ఫోన్ చేసి మంచిగున్నది అంటరు.. ఇంకొందరు అక్కడికి ఆగకుంట “నీ కథల, మమ్మల్ని మేం చూస్కున్నం.. అదంత చదివినంక మావోళ్లు మతికస్తున్నరు. మా ఇల్లు మనాది సలుపుతున్నది, పొయి రావాలె.. మాక్కొద్దిగ మారాల్ననిపిస్తున్నది..” అని ఇంకో రెండు మూడు ముక్కలు ఎక్కువ మాట్లాడుతరు.. బస్… అది చాలు.. దిల్ ఖుష్.. అందుకే మంచిగనిపిస్తది అంటున్న..

గంతేనా? ఇంకేం లేదా??
లేదా అంటే మా ఉన్నదికని అందంత చెప్తే క్లాస్ పీకినట్టు ఉంటదని చెప్తలేను..

పర్వాలేదు చెప్పు..
చదువుకుంటె మనిషి సంస్కారవంతుడైతడు అంటరుకదా, అది వంద శాతం నిజం.. కాకపోతే “ఏం” చదువుకుంటే సంస్కారవంతుడైతడనేది చానమందికి తెలువకపోవుడే అసలు సమస్య..
న్యూటన్ గమన నియమాలు బట్టీకొడితెనో, మైటోకాండ్రియా నిర్మాణం పొల్లుపోకుండ యాదుంచుకుంటెనో, మొఘల్ చక్రవర్తుల వంశ వృక్షం మక్కీకి మక్కి అప్పజెప్పగలిగెతెనో కుప్పలు తెప్పలుగా సంస్కారం వచ్చిపడుతది అనుకుంటరు చానమంది!

అంటె? చదువుకు సంస్కారానికి సంబంధంలేదనా నీ ఉద్దేశ్యం?
అరే.. మొత్తం వినూ.. అదే చెప్తున్నా… ఇంతకుముందు చెప్పినయన్ని చదువుతె ఆ సబ్జెక్టుల నాలెడ్జీ పెరుతది కావచ్చు కని దునియాల మంచీ చెడుల గురించి ఏం తెలుస్తది చెప్పు??
ఇక్కడ నీకో చిన్న ఉదాహరణ చెప్తె మంచిగ సమజైతదికావచ్చు! నూట యాభై దేశాల రాజధానులూ + వాటి కరెన్సీలు టకా టక్ అప్పజెప్పే పదేండ్ల పిలగాడొకడు నాకు తెల్సు.. (మా సైడ్ బాగ ఫేమస్, “మస్తు తెలివిగల్లోడు” అని)… ఆ పిలగాడు మొన్నోసారి వాళ్ల కుక్క తోకకు సుతిల్ బాంబు కట్టి పేల్చిండు, పాపం దాని తోక తెగిపొయి, తొడలు మొత్తం కాలి పుండై రక్తం కారుతుండే.. అట్ల చేసినందుకు వాళ్ల అమ్మనాన (ఇద్దరూ గవర్నమెంట్ టీచర్స్) పిలగాన్ని ఏమనకపోంగా ఆ కుక్కను మా కుక్క కానే కాదన్నట్టు ఊరవుతల ఇడ్శిపెట్టచ్చి చేతులు కడుక్కున్నరు.
ఇక్కడ పిలగాడు చదువుకున్నోడే, వాళ్ల అమ్మనానలూ చదువుకున్నోళ్లే! మరి అందరు మంచోళ్లే అయినంక ఆ కుక్క బతుకు నిజంగనే “కుక్క బతుకెందుకైతది” చెప్పు…?

ఎందుకైందంటవ్ మరి?
వాళ్లు చదువుకున్నోళ్లే కనీ, సంస్కారం లేనోల్లు కనుక అట్లైందన్నట్టు..

నువ్ రాసే కథల గురించి నేనడుగుతుంటే, నువ్వింకేదో పిట్టకథల్ చెప్తున్నవ్??
పిట్టకథల్ కాదు భై.. మంచి సాహిత్యానికీ మనిషి వ్యక్తిత్వానికి సంబంధం ఉంటదని చెప్తున్నా.. “మనిషి మనిషి లెక్కనే ప్రవర్తించాలంటే” రెండే రెండు దారులుంటయ్.. ఒకటి మంచోళ్ల సోపతి, ఇంకోటి మంచి పుస్తకాలతోని దోస్తాని..
నీకు తెల్సో తెల్వదో కని, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ప్రపంచం.. ఒక్కో కథ ఒక్కో జీవితం.. అందుకే ఎంత చదివితే మన “ఆలోచనలకు” అంత మంచిది..

అచ్చా.. సమజైంది.. ఇంతకు నువ్వెందుకు రాశుడు షురూ చేష్నవో చెప్పలే..
ఈ రాశుడు సెవెంత్ క్లాస్ ల షురూ అయ్యి ఇక్కడిదాంక వచ్చింది.. అప్పుడు వార్త పేపర్లో “మొగ్గ” అని చిన్న పిల్లల పేజి ఒకటి వస్తుండే, దానికి పోస్టుకార్డు మీద కథలు రాసి పంపుతె ఓ రెండు మూడు సార్లు వాళ్లు పబ్లిష్ చేశిన్లు, అప్పుడు చూడాలె మా స్కూల్ల నా ఫెయితూ.. కథా కార్ఖానా.. అగో అప్పుడు షురూ అయి, నా కథ ఇక్కడి దాంక వచ్చింది..

అప్పటికీ ఇప్పటికీ ఏమన్న తేడా ఉన్నదా లేదా మరి?
అప్పుడు చిన్నగున్నప్పుడు కథ పడకపోయినా పర్వాలేదుకని పేపర్లో మన పేరు కనపడాలె, అది చూశి అందరు మస్తు పొగడాలె అని ఉండేది.. ఇప్పుడు మాత్రం రివర్స్ ల నా పేరు వెయ్యకపొయిన మంచిదే కని కథ మాత్రం బాగ మందికి రీచ్ కావాలె అనిపిస్తుంది.. ఇదికూడా కొంతవరకు స్వార్థపు ఆలోచనే కావచ్చుగని.. నిజాయితిగ చెప్తున్న, నాకైతె అట్లనే అనిపిస్తున్నది, చానమంది చదవాలె అని..
చదివి అందులో వాళ్లను వాళ్లు పోల్చుకోని లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్ తీసుకుంటె చాలు.. ఖుష్..

vamsi

 

వాళ్ల లైఫ్ పాజిటివ్ టర్న్ తీసుకుంటే నీకెందుకు ఖుష్? (నీకేంది లాభం?)
ఇంత పిచ్చి ప్రశ్న నా జిందగీల ఇంకోటి విన్లే.. ఇది చదువుతున్న వాళ్లల్లో చానామందికి దీనికి జవాబు ఎరికేగనీ.. ఇంకేమన్న అడుగవోయ్..

ఓకే.. ఓకే.. సినిమాలకు పనిచేసినట్టున్నవ్.. దాని గురించి కొంచం..
సినిమా రైటర్ ప్రస్థానం మస్తు పెద్ద కథ..
రెండేండ్లల్ల మూడున్నర సినిమాలు రాసిన.. (రెండున్నర వాటికి కథలూ+మాటలు, ఒక దానికి ఉట్టి మాటలు).. వాటిల్లో ఏ ఒక్కటీ కూడా ఇంకా రిలీస్ కాలే.. ఒకటి షూటింగు ఐందని తెలుసు, మిగిలిన రెండున్నర అసల్ సెట్ల మీదికి ఎక్కినయా/ఎక్కుతయా లేదా అన్నది నాకింక డౌటే.. “ఆ ప్రపంచం” మంచిగనే ఉంటది కని రచయితకు వంద “బార్డర్లు” గీసి మద్యల నిల్చోపెడ్తరు… బడ్జెట్ అనీ, భాష అని.. వంద ఉంటయ్..

 

బార్డర్లంటే?? కొంచం క్లియర్ గ చెప్పరాదు..
ఒకరు బూతు జోకులుండాలంటే, ఇంకొకరు పంచు డైలాగులు పడాలంటరు.. ఒకరు లాజిక్స్ లేకున్న పర్వాలేదుకని ఫ్రేము ఫ్రేముకీ ఫిమేల్సు కనిపించాలంటే, ఇంకొకరు నువ్వేం చేస్తవో నాకు తెల్వదు సాంగ్ అయిపోయిన వెంటనే గన్ ఫైర్ జరిగి స్క్రీన్ అంత రక్తం కారిపోవాలె అంటరు!!
తలకాయి తోక ఉండొద్దుకని గొర్రెను గియ్యమంటరు.. ముక్కూ చెవులు ఉండకున్నా మొహం అందంగా రావాలంటరు.. అదే సినిమా ప్రపంచం.. (అందరు అసొంటోళ్లు ఉంటరని కాదు.. కొందరు కత్తిలాంటి మహేషన్నలు, మంచి మహేందరన్నలు కూడా ఉంటరు.. కాని మస్తు అరుదు).. అందుకే అవన్ని నాతోటి కావనిపించి, ఆ ఫీల్డులో మనుషులు నాకు నచ్చినా, “ఆ సిస్టం” నచ్చక వదిలేష్నా..
ఇంక ఆ టాపిక్ లైట్.. వేరే ఏమన్న మాట్లాడుదాం..

ఓకే.. ఓకే.. ఇందాక సాహిత్యం అనుకున్నం కదా మరి సాహిత్యంలో కథా, కవిత, నవల, పాట, పద్యం.. ఇట్ల ఎన్నో ప్రక్రియలు ఉండంగ నువ్వు కథనే ఎందుకు ఎన్నుకున్నవ్?
ఇక్కడ చిన్న థియరీ చెప్పాలె.. “కడుపు నిండుగా తిన్నా కానీ, నోట్లో ఇంకా ఆకలవడం” అన్న కాన్సెప్టు నువ్వెప్పుడన్న విన్నవా?

అహా విన్లే..
చెప్త విను.. – నాకు చిన్నప్పటి నుంచి ఆకలైనపుడు ఎన్నిరకాల ఓల్డ్ స్టైల్ టిఫిన్లు(అంటే ఫర్ ఎక్సాంపుల్ రొట్టె/పూరీ/ గారె/ దోశే లాంటివి) తిన్నా, ఎన్నిరకాల లేటెష్ట్ వెరైటీలు (లైక్- పిజ్జా/బర్గర్/ నూడిల్స్ గీడుల్స్ లాంటివి) తిన్నా.. నా కడుపైతె మస్తుగ నిండుతది కని ఆకలి మాత్రం అస్సల్ తీరదు.. ఇంకా “ఏదో” తక్కువైన ఫీలింగ్ ఉంటది.. చిన్నప్పుడు మా అమ్మకు అదే చెప్పేటోన్ని- “కడుపైతె నిండిందికని నోట్లో ఇంకా ఆకలైతుందమ్మా” అని.. (వాస్తవానికి అది నోట్లో ఆకలవడం కాదుగాని, “తిన్న ఫీలింగ్” రాకపోవడం అన్నట్టు.. దాన్నే తెలుగుల “తృప్తిగా భోంచెయ్యడం” అంటరనుకుంట!) అప్పుడు మా అమ్మ ఆ టిఫిన్లు పక్కకు పెట్టి, ఇంతంత అన్నంలో కూరో చారో కలిపి తినిపించేది.. అదేం విచిత్రమోకాని ఒక్క రెండు బుక్కల అన్నం తిన్నా చాలు టక్కున ఆకలి తీరిపొయ్యేది.. ఇప్పటికి తిండి విషయంలో నాదదే థియరీ, “అన్నం” ఒక్కటే నా ఆకలి తీరుస్తదీ అనీ..
ఈ కథంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే- అన్నం ఎట్లైతె నా ఆకలి తీరుస్తదో, “కథ” కూడ సేం అట్లనే రాయాలన్న నా “కూతి”ని తీరుస్తది..

ఏం “కూతో” ఏందో.. ఇంత వెరైటీ పోలిక నేనైతె ఇప్పటిదాంక విన్లే!!
థాంక్యూ..

రకరకాల టిఫిన్లు ట్రై చేసినట్టు, సాహిత్యంలో కూడా అన్ని రకాలు ట్రై చేసే ఉంటరు కదా?
కావల్సినన్ని ట్రై చేశ్నా… కవితలూ, వ్యాసాలు, పాటలు, మాటలు(సినిమాలకు), కాలేజీల కామెడీ స్కిట్లూ + సగం రాసి విడిచి పెట్టిన నవలలూ…. నేన్ చెయ్యని ప్రయోగంలేదు..

మరి వాటిని ఎందుకు విడిచి పెట్టినట్టు??
నేను వాటిని విడిచి పెట్టుడుకాదుగనీ, అవే నన్ను విడిచి పెట్టినయ్… కథొక్కటే నన్ను పట్టుకోని ఉన్నది పాపం..

అట్లకాదు, కరెక్ట్ కారణం చెప్పు..
ఒక్కటని ఏం చెప్పను..! కవితలను, రాసిన నేను తప్ప ఇంకొకరు చదవకపోవడం కావచ్చు.. పేపర్లకు రాసి పంపిన వ్యాసంలో పావో, సగమో తప్ప మిగిలినదాన్ని వాళ్లు “ఎడిటింగు” చేసి నేన్ రాసినట్టు కాకుండా వాళ్లకు కావల్సినట్టు మార్చడం కావచ్చు, పాటల రికార్డింగు ఖర్చుతో కూడుకున్నదని కావచ్చు, నవలరాస్తుంటే ఒళ్లు బద్దకమవుడు కావచ్చు, స్కిట్ లు రాద్దామంటే ఇప్పుడు నేను కాలేజీలో లేకపోవడం కావచ్చు.. సవాలక్ష కారణాలు..

ఒక్కటడుగుతె ఇన్ని చెప్తున్నవ్? సరే సరే మళ్లీ “కథలోకి” వద్దాం.. ఇంకా చెప్పు కథలెందుకు ఇష్టం..
ఒకటే ప్రశ్నను మార్చి మార్చి ఎన్నిసార్లు అడుగుతవ్ చెప్పు..!

నువ్వు మంచి సాలిడ్ & వ్యాలిడ్ రీజన్ చెప్తలెవ్వు.. అందుకే మళ్ల మళ్ల అడుగుతున్నా ..
కవిత రాస్తే నాకు నేనే(ఎవరో ఒక్కరే) మాట్లాడుకున్నట్టు ఉంటది, మహా ఐతె ఇంకొకర్ని చొప్పించచ్చు కావచ్చు..
కాని కథల అట్లకాదు ఎంతమందిని కావాల్నంటే అంతమందితోని మాట్లాడిపియ్యొచ్చు…

కథలో-“మనకు నచ్చిన విషయం- నచ్చిన పాత్రతోటి- నచ్చిన సంధర్భంలో- నచ్చిన పద్ధతిలో- నచ్చిన చోట- నచ్చిన టైముకు- నచ్చిన భాషలో- నచ్చిన యాసలో- నచ్చిన పదజాలంతోని చెప్పే అద్భుతమైన సౌలత్ ఉంటది”.. (ఇవన్ని నచ్చకపోతే, రచయితగా మనం కూడా ఆ కథా సన్నివేశంలోకి దూరి మరీ మనమేం చెప్పాలనుకున్నమో చెప్పవచ్చు).. “కథ”ల ఇన్ని సౌలత్ లు ఉంటయి కాబట్టే నాకు మిగిలినవాటికన్నా “కథలు” రాశుడంటెనే ఎక్కువ ఇష్టం..

అంత సాలిడ్ గ లేదు కని, కొంచం వ్యాలీడ్ గనే ఉంది కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా…
అవునా.. థ్యాంక్స్..

ఇంకా.. నువ్వు రాసిన కథలకు సంబంధించి హ్యాపీగ అనిపించిన సంధర్భాలు??
చాన్నే ఉన్నయ్.. చదివిన వాళ్లు ఫోన్ చేసి “చదివినం, మంచిగుంది” అన్న ప్రతీసారి నాకు పండుగే.. ఇంకా మస్తు మంచిగనిపించె విషయమేందంటే చాన మంది సీనియర్ రచయితలు కూడా ఎక్కడో ఓకాడ నా కథ ఏదో ఒకటి చదివి, గుర్తుపెట్టుకోని మరీ కాలో, మెసేజో చేస్తున్నరు.. అటువంటివాళ్లు మంచిగుందన్నా, మాములుగ ఉన్నదన్నా నాకానందమే… చదవనైతె చదివిన్లు కాబట్టి..
ఇక్కడ అఫ్సరన్న కు ప్రత్యేకంగ కృతఙ్ఞతలు చెప్పుకోవాలే, ఎందుకంటే ఆన్ లైన్ మ్యాగజైన్ అనే మాధ్యమం తోని మస్తుమంది కొత్తవాళ్లను మస్తు ఎంకరేజ్ చేస్తున్నందుకు.. (ఈ విషయంల అఫ్సరన్న తర్వాతనే ఇంకెవరైనా..)
ఈ ఆన్ లైన్ మ్యాగజైన్స్ గొప్పతనం ఒకటున్నది, అదికూడ ఈ సంధర్భంల చెప్పుకోవాలె…

అదేందంటే… 24X7, 365 రోజులూ దునియాల అందరికీ ఇవి అందుబాటుల ఉంటయ్.. వీక్లీ పేపర్ల అచ్చైనవైతే ఆదివారం దాటితే మళ్ల మనకంటికి కనపడవు, కానీ ఆన్ లైన్ లో పబ్లిష్ అయినవాటిని ఇవ్వాల కాదుకదా ఇంకో పదేండ్లకు కావాల్నన్నా మనకు ఒక్క క్లిక్కు దూరంలనే ఉంటయి.. నాకందుకే ఈ పద్దతి మస్తు నచ్చింది..
(అఫ్సరన్న & టీం తోని పాటూ మిగిలిన ఆన్ లైన్ మ్యాగజైన్స్ నిర్వాహకులందరికీ మళ్లొక్కసారి కృతఙ్ఞతలు..)

ఔను కరెక్టే.. నేనూ అట్లనే అనుకుంటా… సో… ఇంకా?? మరి బాధనిపించిన సంధర్భాలు ఏమన్న ఉన్నయా? (కథలకు సంబంధించి)
ఆ.. అవికూడ కొన్నున్నయ్.. నా దగ్గరి దోస్తులల్ల చానమందికి తెలుగు చదువుడురాదు.. చదువరాదంటే మొత్తానికి రాదని కాదుగని, బస్ మీద “హైదరాబాద్” అనో “వరంగల్” అనో బోర్డు చదవటానికే వాళ్లకు అర నిమిషం పడ్తది.. ఇగ “కండక్టర్ కు సరిపడ చిల్లర………..” చదవటానికైతే సగం జర్నీ ఐపోతది..
అసొంటోళ్లు ఒక కథను చదవాల్నంటే కనీసం ఒక నెలో నెలన్నరో పడ్తది, అందుకే వాళ్లు చదవరు!!! (నా దోస్తులనే కాదు, ఇప్పుడు “బిలో థర్టీ” ఉన్నోళ్లు చానమంది అందుకే తెలుగు పుస్తకాలు చదువుతలేరు) అదొక బాధ.. పోనీ వాళ్లకు సమజయ్యేటట్టు నేనే ఇంగ్లీషులో రాద్దామంటే, రాయస్తలేదు.. అందుకు ఇంకో బాధ..

అబో.. మంచిది.. మంచిది! చివరగా.. ఇంకా నీకున్న ఆశలూ – ఆశయాలూ??
పెద్దగ ఏం లెవ్వు కానీ..
వల్డ్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ ల కనీసం నాయొక ఆరేడు పుస్తకాలన్న పట్టేటట్టు చెయ్యాలె.. ఇంకా..
కుడి చేతిలో నోబెల్ ప్రైజూ, ఎడమ చేతిలో ఆస్కార్ అవార్డూ..
బ్యాగ్రౌండ్ లో జన గణ మన..
ఫ్రంట్ రో లో అమ్మా నానా అన్నా..
మనశ్శాంతీ…..
ప్రపంచ శాంతీ… …. …… ………

అరేయ్.. లే.. వంశీ.. అరేయ్ వంశీ.. లే రా..
ఆ?? ఏందీ?? ఏందిరా??
ఏందో శాంతీ శాంతి అని కలవరిస్తున్నవ్? ఏంది కతా?? ఆ?? లే.. లేశి ఇన్నన్ని మంచినీళ్లు తాగు..
ఏందీ!! కలవరిస్తున్ననా??… షిట్..!! ఇదంత కలనా ఐతే?
(కొన్ని మంచినీళ్లుతాగి మళ్ల పడుకున్నంక సందీప్ గాడు మెల్లగ అడుగుడు బెట్టిండు)-

ఏం కలచ్చింది మామా?? శాంతెవర్రా??
శాంతిలేదు గీంతిలేదు.. అదేదో కలచ్చిందిరా..
ఏం కల రా??
అదేదో ఇంటర్వ్యూ మామా.. నన్నెవరో ఇంటర్వ్యూ చేస్తుండే..

ఇంటర్వ్యూనా? మంచిగ చెప్పినవా మరి? జాబ్ అచ్చిందా రాలేదా??
ఏ…. జాబ్ ఇంటర్వ్యూ కాద్ బే.. అదేదో “కథ”లకు సంబందించింది..

అచ్చా అదా… ఏమడిగిండేంది..?
అదే యాదికస్తలేద్రా.. కొద్దిగ ముక్కల్ ముక్కల్ మతికస్తుందంతే..

ఆ ముక్కలే చెప్పుమంటున్న..
ఆ.. ఆ.. ముందుగాల ముందుగాల ఓ కొచ్చనైతె అడిగిండురా నాకు బాగ మతికున్నది..
ఏం కొచ్చను??

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”

*

చెమట చుక్కే సముద్రం!

Reviewer

డా. నారాయణ గరిమెళ్ళ

 

మనలో చాలా మంది కి సముద్రమంటే వల్లమాలిన ఇష్టం, తెలియని ఆహ్లాదం, అంతులేని పరవశం. గంగ పుత్రులకు సముద్రమంటే బతుకు తెరువు. నావికులకు అదొక ప్రయాణ మార్గం. ఇంకా అనేకమందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంతులేని అనంతమైన కడలితో తప్పని లేదా తప్పించుకోలేని ఏదో సంబంధం  నిత్యం ‘వంటల్లో వేసుకునే ఉప్పులా’ ఉంటూనే వుంటుంది.

ఉప్పగా వుండే సాగర స్వభావాన్ని కేవలం ఉప్పునీరుగా దర్శిస్తే  గొప్పేముంది!?  చెమట చుక్క గా  దర్శించడం లోనే గొప్పతనమంతా దాగి ఉంది. అక్కడే కవిత్వం ఉంది. ఏ అరమరికలూ లేకుండా ఖరా-ఖండీగా ‘ నేను శ్రామికజన  పక్షపాత కవిని ‘ అని  చెప్పగలిగే ధైర్యం ఉంది.

శ్రామిక జీవుల చెమటతో పాటు అనేకమంది ఆర్తుల జీవిత వ్యధలలో చిలికే కన్నీటి బొట్ల  వెతలను కూడా పొందిగ్గా పట్టుకుని ఈ కవి నిజంగానే ఒక కవితా సముద్రాన్నిసృష్టించి మనముందు కు తీసుకొచ్చారు.

మొయిద శ్రీనివాసరావు వ్రాసిన  నలభై కవితల సమాహారం ‘సముద్రమంత చెమట చుక్క’. మనకు పరిచయమున్న దారుల్లో కొంత సేపు నడిపించి, మరికొంత సేపు పరిగెత్తించి పరిచయం లేని వాస్తవాలను సైతం చూసే దృష్టిని ప్రసాదించారు. పరిమాణం దృష్ట్యా అల్పమైన వాక్యాలలో అనల్పమైన అర్ధాలను ఆవిష్కరించడం ద్వారా  ఈ బాధ్యతను నిర్వహించారు.

విజయనగరం జిల్లా లోని నెల్లిమర్ల గ్రామానికి చెందిన కవి, అక్కడి జ్యూట్-మిల్ కార్మికుల మీద జరిగిన కాల్పులకు తల్లడిల్లినప్పుడు, ఆ కార్మికుల త్యాగాలకు ప్రణమిల్లినప్పుడు,  ఆ ఉద్యమానికి ముందూ వెనుకా ఉన్న మూలాల్లో తన కుటుంబమూ ఒక పిడికిలిగా అంతర్భాగమైనప్పుడు ఆ ఉద్యమం తనపై చూపిన ప్రభావాన్ని, కల్గించిన భావావేశాన్ని తదనంతరకాలంలో చిమ్మిన కవిత్వానికి  నాంది లేదా పునాది గా మలచుకున్న విధానం పటిష్టంగా కనిపించే గొప్ప విషయం. ఆ పరిధి విస్తృతమై ఏ ఏ జీవితాలను, వాటి నేపధ్యాలనూ, సాగర మధనం చేసిందో తెలుసుకోవాలంటే ఈ సంకలనం లోని కవితలలోకి ప్రయాణించాలి.

‘నెల్లిమర్ల’ అనే ఊరి పేరే శీర్షికైన మొదటి కవిత లో, నిన్నటి ఆ ఊరి గురించి కవి తెలుసుకోవడానికి చేసిన ప్రయాణం ఆ ఊరి ప్రజలను మరియు నైసర్గిక స్వరూపాలను తడుముకుంటూ సాగుతుంది. తెలిసినట్టనిపించిన సామాన్య విషయాలతో ప్రారంభం అవుతుంది. అందువలన పాఠకుడి కి ఈ కవిత్వం చదవడం ఎంతమాత్రం అసౌకర్యంగా అనిపించక పోగా, చదవాలన్న  ఉత్సుకత  ఏర్పడి చకచకా చదివిస్తుంది.

నిన్నటి నా ఊరు గూర్చి

తెలుసుకోవాలన్న ఆలోచన

నా బుర్ర తొర్రలోకి

వడ్రంగి పిట్టై వచ్చి వాలింది

ఆ ఊరు గురించి నలుగురు పెద్దమనుషులను మాత్రమే అడిగి ఊరుకోకుండా, కాలం కాలికిందపడి నలిగిన ఖాళీ అగ్గి-పెట్టె లా ఉన్న ఆ ఊరి ప్రక్కనున్న కొండమీది కోటను, ఊరిని ఆనుకుని ప్రవహించే ఏరునూ కూడా అడగటం బాగుంటుంది. తెలిసిన చరిత్రని మృదువుగా ప్రేమగా మనకు పరిచయం చేస్తూ ఇష్టాన్ని, ఆసక్తినీ కల్గిస్తుంది. నెల్లిమర్లకు సరైన నిర్వచనం, నారమిల్లు కవి కి ఇచ్చిన సమాధానం లో బహిర్గతమౌతుంది.  కాలే కడుపులు కాగే డప్పులుగా మారిన వైనాన్ని వివరిస్తుంది. కార్మిక కండచీమల తెగువును నినదిస్తుంది.

నలు దిక్కులా నలుగురి నాలుకలపై

నా ఊరెలా నిలిచిపోయిందో విన్నాక

నా ఊరి పేరునే

నా ఇంటి పేరుగా మార్చుకోవాలనుంది.”

అనడం తో కవి ఆ ఉద్యమాన్నుంచి ఎంతటి స్ఫూర్తి పొందాడో మనకి అర్ధమౌతుంది.  బుర్రని తొర్ర గా మార్చి వడ్రంగి పిట్ట అనే తపన తో పొడిచి వెదికే పక్షి కి ఇవ్వడం ఉదారత కాదు. తనకు మాత్రమే సొంతమైన తాత్వికత.

నేతులు తాగిన తాతల మూతుల గురించి, కులం గురించి, వంశాల వారసత్వం గురించి పాకులాడే మామూలు మనుషులు మధ్య, రక్తం చిందించిన శ్రామిక వీరుల విప్లవ జెండాకు నమస్కరిస్తూ నిలబడ్డ ఈ కవి  దృష్టి ఠీవిగా కనబడుతుంది.

 

తూటాలకు సైతం వెరవని కార్మికుల పోరాటం గురించి వారి త్యాగాల వలన ఆ ఊరు చారిత్రాత్మకమైన విధానం గురించి ‘ఔరా’ అని అబ్బుర పడుతుండగానే, మరొక కవిత ‘మంటల జెండా’ లో ‘వీచే పడమటి గాలులకు నేటి రైతు అరటి చెట్టు కూలినట్టు తాత్కాలికంగా కూలినా, రేపు ఫ్యాక్టరీ పొగగొట్టం లోంచి పొద్దయి పొడుచుకు రాక మానడు!’ అంటారు.ఒక సిధ్ధాంతానికి ప్రతీకగా చెప్పడానికి  జెండాతో పోల్చడం సాహితీకారులకు పరిపాటి. అయితే ఈ సంకలనంలోవాడిన పదచిత్రాలు, ఆయా కవితల ఆత్మలను కళ్ళకు కడతాయి.

‘పోరుపిట్ట’ లో శ్రమైక జీవన నాదాన్ని ధ్వనించే కాకిని ‘పోరుపిట్ట’గా ఎత్తి చూపించడం ఎంత మాత్రం అసహజమనిపించక పోగా మనకి ఆ పక్షి లాంటి శ్రమ జీవనాన్ని సాగించే వారి మీద తెలియని గౌరవాన్ని నేర్పుతుంది.

ఎర్రని ఎండలో

పురుగో పుట్రో ఏరి తెచ్చి

కళ్ళు తరవని పిల్లల నోటిలో

ఉషోదయానికి ఊపిరిలూదిన మాతృమూర్తి

కోకిల గుడ్లను కూడా తనే ప్రేమగా పొదిగే కాకి, ఎర్రని ఎండలో కూడా తన పని లేదా బాధ్యతను తను నిర్వహించడాన్ని కవి సునిశితంగా పట్టించుకోవడం ఆసక్తి ని రేపుతుంది. అది కవితంతా కనిపిస్తుంది.

కరెంటు దెబ్బకు రెండు పిట్టలు నేలరాలితే

గుంపు మొత్తంతో కలసి

గాలిలో గింగుర్లు కొడుతూ

సమర సన్నాయినూదిన చైతన్యదీప్తి

శ్రీశ్రీ గారన్న ‘కష్ట జీవికి రెండు వైపులా కాపలా కాసే వాడే కవి’ నిర్వచనం ఈ కవికి అక్షరాలా వర్తిస్తుందనిపిస్తుంది.

‘ఇనుప కౌగిలి’ లో అందరికీ ఏడాది చివరిలో అనుభవమయ్యే చలి కాలాన్ని, ఒక నాటి రాత్రి నేపధ్యంలో భయం దుప్పటి వదలమనే సంకేతంతో చెబుతారు. కుంపటిలో నిప్పు రాజేసుకున్న గుడిసెలోని ఆమె, నోటిలో చుట్ట అనే నిప్పు కత్తితో పొలిమేర పొలం లోని అతడు,  చలిని ఎదుర్కొన్న విధానాన్ని ఊలు దుస్తులు కప్పుకుని గుడిసెల లో నుండి చూసే పిల్లల దృష్టితో చూపించారు. ఈ కవిత ఇంతటితో ఆగిపోతే పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఆఖరిలో ఇలా అంటారు.

తెల్లారేసరికి

వారి తెగువకు అది (చలి) కాస్తా తల ఒగ్గేది

…………………………..

………………………….

తరువాత తెలుసుకునే వాళ్లం

భయపడితేనే ఏదైనా

ఇనుప కౌగిలిలో బంధించగలదని!

అగ్నిశిఖల్లా కలబడితే పారిపోతాయి

ఆఖరికి చలైనాపులైనా అని!!

Poet Photoనిప్పుని, భయాన్ని ఎదుర్కొనే పనిముట్టుగా చూపించారు. ఒకేలా అనిపించినా కూడా నిప్పులా కలియబడటానికీ, కొవ్వొత్తిలా వెలగడానికీ మధ్య చాలా అంతరం ఉందని నెత్తుటి పూలు కవిత చదివాక మాత్రమే తెలుస్తుంది. ఢిల్లీలో నిర్భయ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వ్రాసినది  ఇది.

కబంద హస్తాల కింద

పూలు నలగడం మూగగా రోదించడం

ఇక్కడ కొత్తేమీ కాదు

…….

రాలిన పూలకై

నెత్తిన నిప్పుకత్తులు ధరించిన కొవ్వొత్తులై

కన్నీరు కారిస్తే

కమ్ముకొస్తున్న పొగమంచు తొలిగిపోదు

………

పూలన్నీ ముళ్ళై కదిలితేనే

నిర్బంధ హస్తాల నుంచి

సరికొత్త సూర్యోదయం సాక్షాత్కరిస్తుంది!”

ఈ రకంగా చలిని నిప్పు బెదిరించగలదు అని ‘ఇనుప కౌగిలి’ లో చెప్పిన కలం తోనే, అత్యాచారం తరువాతి కొవ్వొత్తుల నిరసనలు మాత్రం కంటి తుడుపు చర్యలు మాత్రమే కాగలవని ఉద్భోద చేశారు.

కలియ బడాలి, మాట్లాడాలి, పోట్లాడాలి లాంటి సూచనలన్నీ ఎప్పుడన్నదే కదా ప్రశ్న? ఎందుకు మాట్లాడాలో ‘మౌనం మంచిది కాదు’ లో,

దీపమై మాట్లాడితే కదా

చీకటి చెదిరి

నిజం నలుదిశలా విస్తరించేది!

అంటారు.

మాట్లాడాలి అని అర్ధమయ్యాక, మాట్లాడితే ఎలా ఉండాలి అన్న ప్రశ్న కూడా సహజం. ‘మాట’కు గొప్ప నిర్వచనాన్ని మరొక కవితలో ఏకంగా చూడవచ్చు.

 

మాట ఎలా ఉండాలని

పొగచూరిన పొయ్యిలా ఉన్న

మా అమ్మనడిగాను

ఎండుపుల్ల విరిగినట్టు ఉండాలన్నది

ముఖం చెల్లని రూపాయి కాసులా ఉన్న

మా నాన్నని అడిగాను

 అడిగే ప్రతి మనిషి కీ ఒక సహజ వాతావరణం ఉంటుంది. దానికి లోబడే ఆ మనిషి మాటకు నిర్వచనం చెబుతాడు. అది వారి వ్యక్తిగత నిర్వచనం మాత్రమే అని బయటకు మనకు అనిపించినా, అందులో తొంగి చూసే సార్వజనీనత ఆశ్చర్యపరుస్తుంది. కవిత్వం వ్రాయడమెలాగో తెలియక పట్టువదలని ప్రయత్నాలు చేసే విద్యార్ధులకు ఈ కవిత మంచి పాఠం లా ఉంటుంది. సాధారణమైన విషయాల పరంగా మాట అంటే ఎలా ఉండాలో చెప్పిన తీరు అబ్బుర పరుస్తుంది.

ప్రశ్నిస్తూ, మాట్లాడుతూ, చొరవగా చొచ్చుకుపొమ్మని నిర్దేశించిన కలం, నిరసన జ్వాల గా మాత్రం అర్ధాంతరం గా జీవితాన్ని ఆర్పేసుకుని బుగ్గి కావద్దని హెచ్చరిస్తుంది. సెల్ టవర్లు ఎక్కి బెదిరించడం, వంటిపై కిరోసిన్ పోసుకుని దహించుకోవడం ఇవి పచ్చనైన ఒక్క జీవితాన్ని మాత్రమే బలి తీసుకోవు, ముందూ వెనుకా అనేక ఆశల్నీ జీవితాలానూ కూడా సమూలంగా నాశనం చేసేస్తాయి.

‘పొద్దు తిరగని పువ్వు’ లో బతుకులు రోడ్డున పడటం మరియు రోడ్డు దారి పట్టడం వెనుక ఉన్న నిరాదరణ ను పట్టి చూపించి ప్రస్తావిస్తుంది. ఆ నిరాదరణ అలాగే కొనసాగుతూ ఉంటే, అనాధల బతుకులు ఎప్పటికీ విరబూయక ముడుచుకు పోతున్న పొద్దు తిరగని పువ్వులౌతాయని  దైన్యంగా చెబుతుంది.

  నిరాదరణ

చెట్టు నుండి

నేలరాలిన పుష్పమో?

ఫుట్పాత్ పై ఆకలిమంటతో

ఒంటిని వెచ్చబెట్టుకుంటూ

విసిరేసిన ఆకాశపుటాకులో

మిగిలిన ఎంగిలి ముద్దకై

ఆశగా చూస్తూ

నిత్యం నిద్దట్లో

చిల్లర చుక్కలను కలగంటుంది

అవసరం, అవకాశం, తప్పని సరి జీవితం, తప్పించుకోలేని పరిస్థితులు ఇవన్నీ పలు చట్రాలుగా మనిషిని బంధీని చేస్తున్న తీరు కవితలలో ఏదో ఒక మూల ముల్లులా గుచ్చి మన ఆలోచనలలో ప్రశ్నలను రేకెత్తిస్తాయి.

పెట్టుబడి దారుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న బాల్యాన్ని, చదువు సంధ్యలనూ రూప విక్రయం రూపంలో లార్వా నుండి సీతాకోక చిలుక దశల పరంగా చెప్పారు.

 

సెల్ఫోన్ ను ‘మాటల పిట్ట’ గా ముచ్చటించి సరదాగా సాగే కవిత ప్రారంభం లో:

నా చెమటచుక్కలకు రాలిన

పది పచ్చరూకలు పోసి

మాయాబజారులో

ఒకనాడు

మాటలపిట్టను పట్టుకొన్నాను

అని సెల్-ఫోన్ తనను చేరిన సాధారణ విధానాన్ని సామాన్యంగా ప్రారంభిస్తారు. కవిత అంతానికి తెలిసొస్తుంది దాని మాయజాలం మనిషిని ఎంతలా దాసోహం చేసుకుంటోందో.

అది నా పంచేంద్రియాలను జయించిన

ఆరో ఇంద్రియమై

నన్నుతన ముక్కున కరచుకొని

నిదానంగా నడిచిపోతోంది!

ది మనుషులను ఎంత చాకచక్యంగా వ్యసన పరులని చేస్తోందో చెప్పి వాపోతారు. ఇలాంటి మాటల పిట్టల వలన అనుకోని సౌలభ్యం ఎంతో అందుబాటులోకి వచ్చి అబ్బురపరుస్తున్నట్టనిపించినా, అది కూల్చేస్తున్న లేదా తృణీకరించేస్తున్న సహజ సంబంధ బాంధవ్యాల ప్రస్తావనే  కవికి ఇక్కడ ముఖ్య విషయం.

ఈ సంకలనం లోని మొత్తం కవితలన్నీ వర్తమానం ఆటుపోట్లకి గురవ్వడానికి గత, భవిష్యత్ కి సంబంధించిన అంశాలు ఎలా కారణభూతులౌతున్నాయో  అంతర్లీనంగా నొక్కి చెబుతాయి. ఐతే, వాటిని ఎదుర్కోడానికి కావల్సిన శక్తి యుక్తులూ, ముందు చూపు, చొరవ, పరత్యజించాల్సిన అలవాట్లు, కాపాడుకోవలసిన సంపద లాంటి బంధాలు అన్నీ కూడా ఈ కవితల లోనే కనిపించి పరిష్కార మార్గాలను కూడా సహజంగా నేర్పుతుంటాయి. మాటల పిట్ట లాంటి కవితలను తెలుగు వాచకం పుస్తకాలలో చేర్చితే విద్యార్ధులకు కవిత్వం, భాష మరియు సాహిత్యం పట్ల ఇష్టం కల్గించడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా పలు ఇతర కవితలను తెలుగు సాహిత్యం తలకెత్తుకుని కాపాడు కోవడం చాలా అవసరమనిపిస్తుంది.

జీవితం లోంచి సహజంగా వచ్చిన వాక్యాలు, సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మన ముందు నిలబడితే ఎంత అర్ధవంతంగా ఉంటాయో చూడాలంటె మొయిద శ్రీనివాసరావు గారి సముద్రమంత చెమటచుక్క లోని కవితలను తప్పక చదవాలి.

ఈ పుస్తకం చదివాక, ‘మాట’ కవిత లో లా ‘వందనం’ అంటే ఎలా ఉండాలి అని అడిగితే..

స్వేదానికి చేసే నమస్కారంలా

ఉన్నత విలువలకు కట్టే పట్టంలా

సముద్రమంత చెమట చుక్కలా

అని మనస్పూర్తిగా చెప్పాలనిపిస్తుంది. అదే ఈ చక్కని చిక్కని కవితలలో సమ్మిళితమైన అంతస్సూత్రం.

ప్రతులకు సంప్రదించండి.

Email: moidasrinivasarao@gmail.com

 

గణపతి కొమ్ము కిరీటం చెప్పే ‘శృంగార’గాథ

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ప్రపంచ పురాచరిత్రలోకి వెడుతున్న కొద్దీ మత, తాత్విక, సాంస్కృతికరంగాలలో భారతీయ ప్రత్యేకత గురించి, విశిష్టత గురించి మనం కల్పించుకునే ఊహలు మంచు బిందువుల్లా కరిగిపోయే మాట నిజమే.  అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటిలా వేగవంతమైన ప్రయాణసాధనాలు, సమాచార వినిమయ సదుపాయాలు లేని కాలంలో కూడా దాదాపు ప్రపంచం అంతా ఒకే రకమైన విశ్వాసాలను, తంతులను, తాత్వికతను పంచుకున్న తీరు ఆశ్చర్యచకితం చేసి, మన ఆలోచనావైశాల్యాన్ని అనేకరెట్లు పెంచుతుంది. మనకు పురాప్రపంచాన్ని వినూత్నంగా పరిచయం చేస్తుంది.

సుమేరు పురాణకథ ప్రకారం, మొదట అర్థనారీశ్వరులుగానూ, ‘అంకి’ అనే పర్వతరూపంలోనూ ఒకటిగా ఉన్న స్త్రీపురుషులను ‘ఎన్ లిల్’ అనే కొడుకు విడదీశాడని చెప్పుకున్నాం. బైబిల్ కథలో కూడా ఇలాంటిదే జరుగుతుంది.  మొదట ఈవ్ కూడా ఆడమ్ లో భాగంగా ఉంది. అంటే అర్థనారీశ్వర రూపమన్నమాట. అప్పుడు యెహోవా ఆడమ్ నుంచి ఈవ్ ను వేరు చేశాడు.  వారు వేరు పడగానే సృష్టి ప్రారంభమైంది. ఈవ్ నిషిద్ధఫలాన్ని తినడం దీనికి నాంది. బైబిల్ పూర్తిగా సెమెటిక్ పితృస్వామిక పురాణం కనుక అందులో ఆడమ్ అనే పురుషుని నుంచే ఈవ్ అనే స్త్రీ పుట్టింది. మన పురాణకథలు మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య రాజీకీ, సమన్వయానికీ చెందినవి కనుక మొదట జగజ్జననే పురుషుణ్ణి సృష్టిస్తుంది. ఆ పురుషుడు మిగతా సృష్టి నంతటినీ చేస్తాడు.

అంకి, ఆడమ్ ల గురించిన పై వివరాలు వెంటనే మన పురాణకథను ఒకదానిని గుర్తుచేస్తాయి. అది, కుమారస్వామి పుట్టుక.  ‘కుమారసంభవం’ పేరుతో సంస్కృతంలో కాళిదాసు, తెలుగులో నన్నెచోడుడు ఈ కథను గొప్ప కావ్యాలుగా మలిచారు. శివపార్వతులు కూడా అర్థనారీశ్వరులు. పార్వతికి మరో రూపం సతీదేవి. ఆమె దక్షయజ్ఞ సందర్భంలో యోగాగ్నిని కల్పించుకుని అందులో ఆహుతవుతుంది. దాంతో శివుడు విరక్తుడై తపస్సులో మునుగుతాడు. సతీదేవి హిమవంతుడి కూతురుగా జన్మించి పార్వతి పేరుతో పెరుగుతుంది.  అంతలో, తారకుడనే రాక్షసుడి బాధలు పడలేకపోతున్న దేవతలు, శివపార్వతులకు జన్మించే కుమారుడే అతన్ని చంపగలడు కనుక వారిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. తపస్సులో ఉన్న శివుడిపై మన్మథుని ప్రయోగిస్తారు. శివుడు మూడో కన్ను తెరిచేసరికి మన్మథుడు బూడిదవుతాడు. అతని అర్థాంగి రతీదేవి శోకిస్తుంది. ఈలోపల అక్కడ పార్వతి కూడా శివుని పెళ్లాడడం కోసం తపస్సు ప్రారంభిస్తుంది. చివరికి శివుడు మెత్తబడతాడు. పార్వతి తపస్సు ఫలించి, శివపార్వతుల పెళ్లి జరుగుతుంది. మన్మథుడు మళ్ళీ పుడతాడు. కుమారుడు జన్మిస్తాడు.

ఈ కుమారసంభవ కథ కేవలం ఒక భారతీయ పురాణ ’కథ’ను మాత్రమే చెబుతోందనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే, అది ప్రపంచమంతటా ఉన్న ఒకానొక ఆదిమ తాత్వికతను, దానిని అంటిపెట్టుకుని ఉన్న ఒక తంతును చెబుతోంది. అది కూడా వ్యవసాయసంస్కృతితో గాఢంగా అల్లుకున్న తంతు. సర్ జేమ్స్ ఫ్రేజర్ తన Golden Bough లో ఇందుకు సంబంధించి విస్తారంగా దండగుచ్చిన వివరాలన్నింటిలోకీ ఇప్పుడు వెళ్లలేం కానీ, ఒకటి చూద్దాం:

సుమేరుల మహాదేవుడు దుముజీ; ఇతర చోట్ల తమ్మూజ్, అడోనిస్, డయోనిసస్ అనే దేవుళ్లూ శివునికి ప్రతిరూపాలని చెప్పుకున్నాం. బాబిలోనియా, సిరియాలకు చెందిన సెమెటిక్ ప్రజలు అడోనిస్ ను పూజించేవారు. సెమెటిక్ భాషల్లో అడోన్ అంటే ప్రభువు అని అర్థం. ఆ దేవుని అసలు పేరు తమ్మూజ్. ప్రాచీన గ్రీకులు ఈ సెమెటిక్ దేవుడినే తాము కూడా పూజించడం ప్రారంభించి ‘ప్రభువు’ అనే ఆయన బిరుదునే అసలు పేరుగా మార్చుకున్నారు. బాబిలోనియా పురాణాలలో జగజ్జనని అయిన ఇష్టార్ కు తమ్మూజ్ ప్రియుడు, భర్త. ప్రకృతిలోని పునరుత్పాదక శక్తులకు ప్రతీక ఇష్టార్. అలా ఉండగా, తమ్మూజ్ ఏటా మరణించి అధోలోకానికి వెళ్ళిపోతాడు. అది దుమ్ము, ధూళీ నిండిన ఓ చీకటి గుయ్యారం. దాంతో ఇష్టార్ శోకంలో మునిగిపోయి ప్రియుణ్ణి వెతుకుతూ అధోలోకానికి వెడుతుంది.

ఆమె కనుమరుగవడంతో మనుషులు, పశువులన్న తేడా లేకుండా ప్రతిజీవిలోనూ పునరుత్పాదనకు అవసరమైన పరస్పర వాంఛ అంతరించిపోతుంది. ఫలితంగా సృష్టి స్తంభించిపోతుంది.  ఇష్టార్ అధోలోకంలో ఉన్నట్టు ‘ఈ’ అనే(మన బ్రహ్మదేవుడి లాంటివాడు)దేవదేవుడు తెలుసుకుని ఆమెను పైలోకానికి రప్పించడానికి వార్తాహరుని పంపిస్తాడు. అల్లతు లేదా ఎర్ష్-కిగల్ అనే రాణి అధోలోకాన్ని ఏలుతూ ఉంటుంది.  జీవజలంతో తమ్మూజ్ ను బతికించి ఇష్టార్ తనతో తీసుకువెళ్లడానికి రాణి అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ఇష్టార్ ప్రియుని వెంటబెట్టుకుని సంతోషంగా పైలోకానికి తిరిగివస్తుంది. ఇష్టార్ రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందుతుంది. స్త్రీపురుషులలో తిరిగి వలపులూ, మోహాలూ విజృంభిస్తాయి. సృష్టి యథావిధిగా సాగుతుంది.

తమ్మూజ్ మరణాన్ని సంకేతించే విషాదపూరితమైన తంతును ఏటా వేసవి మధ్యలో జరుపుతారు. ఆ సందర్భంలో స్త్రీ, పురుషులందరూ శోకాలు పెడతారు. బాబిలోనియా పురాణాలలో ఇలాంటి శోకగీతాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ సందర్భంలో తమ్మూజ్ బొమ్మను చేసి, దానిని నీటితో శుద్ధి చేసి, తైలంతో అభిషేకించి, ఎర్రని వస్త్రం చుట్టబెట్టి, దాని ముందు ధూపం వెలిగిస్తారు. ఒక ప్రస్తావన ప్రకారం, జెరూసలెం ఆలయం ఉత్తరద్వారం దగ్గర స్త్రీలు తమ్మూజ్ కోసం శోకాలు పెట్టేవారు.  తమ్మూజ్ మరణం వాడిపోయే మొక్కలకు ప్రతీక. ఆవిధంగా ఇది వ్యవసాయసంబంధమైన తంతు. తమ్మూజ్  బతికి ఇష్టార్ వెంట పైలోకానికి రావడం; వారి రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందడం పంటలకు, మొక్కలకు అనుకూలమైన పరిణామానికి సూచన. ఆవిధంగా అది సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భం కూడా. అప్పుడిక జరగవలసిన తంతు, కళ్యాణం.

పై కుమారసంభవం కథకు, ఇష్టార్-తమ్మూజ్ ల కథకు మధ్య కొన్ని తేడాలు ఉన్నా పోలికలూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. కుమారసంభవం కథలో శివపార్వతులు, రతీమన్మథులు అనే రెండు జంటలు ఉంటే; ఇష్టార్-తమ్మూజ్ ల కథలో ఒక్క జంటే ఉంది.  తమ్మూజ్ ను వెతుక్కుంటూ ఇష్టార్ వెళ్లిపోవడంతో జీవుల్లో లైంగికేచ్ఛ అంతరించి పునరుత్పత్తి ఆగిపోయినట్టు సూటిగా ఉంటే, కుమారసంభవంలో సూచ్యంగా ఉంది. తారకాసురుణ్ణి చంపగల కొడుకును కనడం కోసమే అయినా, మొత్తం మీద దేవతల ప్రయత్నం శివునిలో శృంగారభావన రేకెత్తించి పార్వతిని పెళ్లాడేలా చూసి సృష్టికార్యానికి ఉన్ముఖణ్ణి చేయడమే. మొదట ఆ ప్రయత్నం బెడిసికొట్టి, అక్కడ తమ్మూజ్ మరణించినట్టే ఇక్కడ మన్మథుడు బూడిదయ్యాడు. అంటే, సృష్టి స్తంభించే ప్రమాదం తలెత్తిందన్నమాట. ఇక్కడ మన్మథుని మరణానికి రతీదేవి శోకించినట్టే, తమ్మూజ్ కోసం ఇష్టార్ శోకించింది.  తమ్మూజ్ ను ఇష్టార్ కోరుకున్నట్టే పార్వతి శివుని కోరి తపస్సు ప్రారంభించింది. చివరికి శివుడు మెత్తబడి పార్వతిని పెళ్లాడడానికి అంగీకరించాడు. దాని పర్యవసానంగా మన్మథుడు మళ్ళీ పుట్టాడు. ఈవిధంగా మన్మథుడు ఓడి గెలిస్తే, శివుడు గెలిచి ఓడాడు.

అక్కడ తమ్మూజ్ తిరిగి పుట్టడం, ఇష్టార్ తో కలసి పై లోకానికి రావడం ప్రకృతి పునరుజ్జీవనానికి సంకేతమైనట్టే; ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, మన్మథుని పునరుజ్జీవనం ప్రకృతి పునరుజ్జీవనానికి సూచనలు. ఇందులో జరిగింది ఏమిటంటే, వ్యవసాయ సంబంధమైన ఒక తంతుతోనూ, తాత్వికతతోనూ ముడిపడిన ఒక ఆదిమ పురాణ కథ పునాది మీదే శివపార్వతుల కళ్యాణమూ-కుమారస్వామి పుట్టుకా అనే కథను నిర్మించడం! అదలా ఉంచితే, కుమారస్వామి పార్వతికి పుట్టలేదని చెప్పే కథ కూడా ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్ళడం లేదు.

వ్యవసాయ సంబంధమంటే, భౌతిక వాస్తవికతతోనూ, ప్రయోజనంతోనూ ముడిపడినదన్నమాట. క్రమంగా ఆ భౌతికమైన పునాది నేలలో కప్పడిపోయి పై నిర్మాణం మాత్రం మిగిలింది. ఆ నిర్మాణం మీద మళ్ళీ రకరకాల తాత్విక భాష్యాలు అవతరించాయి. అవి భౌతికమైన పునాదితో ఎలాంటి సంబంధం లేని భాష్యాలు. ఇక కావ్యప్రియులకు ‘కుమార సంభవం’ అనగానే రసం, అలంకారం మొదలైన కావ్యసామగ్రి అంతా అమరిన ఒక గొప్ప కావ్యం మాత్రమే  గుర్తొస్తుంది.

ఇప్పుడొకసారి రాంభట్లగారిని పలకరించడం సందర్భోచితంగా ఉంటుంది. ఆదిమకాలంలో రసాలంకారా లనేవి మనిషి మనుగడనుంచి, అంటే భౌతికవాస్తవికత నుంచి ఎలా అవతరించాయో ఆయన(జనకథ)చాలా ఆసక్తికరంగా వివరిస్తారు. ఎలాగంటే, గణదశలో గుంపు మనువులు ఉండేవి. మనువుకు అర్హమైన గణంలోని ప్రతి మగవాడూ ‘గణపతి’. ప్రతి మగువా గణపత్ని. గణపతులలో శృంగార సామర్థ్యం కలిగిన ఒకరిని ప్రధాన గణపతిగా ఎన్నుకునేవారు. గణకన్యలు అతనిని పూలతో అలంకరించేవారు. తలపై శృంగ(కొమ్ము) కిరీటం పెట్టేవారు. ఈ ‘శృంగం’ అనే మాటనుంచే అలంకరించడం అనే అర్థంలో ‘శృంగారం’, ఆపైన రసరాజమైన శృంగారరసం పుట్టాయి. కొమ్ములు దర్పానికి, అంటే మగటిమికి చిహ్నాలు. మన్మథుడికి కందర్పుడనే పేరు ఉంది. దర్పకలీలకు శృంగారమని పేరు. గణపతికి గణకన్యలు జరిపే అలంకారం నుంచే ఇప్పుడు గుళ్లల్లో జరిపే నిత్య వార మాసాద్యలంకారాలు పుట్టాయని రాంభట్ల అంటారు.

BH-7-ISHTAR-&-TAMMUZ

ఏ కన్య అయినా గణపతి శృంగారసామర్థ్యం మీద పెదవి విరిస్తే, గణకన్య లందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో వేసిన పూలమాలలు పీకి పారేస్తారు. కిరీటం తీసేసి కొమ్ములు విరుస్తారు. ‘అవమానించడం’ అనే అర్థంలో ‘శృంగభంగం’ అనే మాటకు ఇదే మూలం కావచ్చు. గణదాయీలు అడ్డుపడకపోతే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ గణపతి ఆచారాలు నిన్నమొన్నటి వరకూ చాలా తండాలలో ఉండేవి. మన సాహిత్యంలో రసరాజు అయిన శృంగారం పుట్టిన వైనం ఇదీ. శృంగారంతోపాటు హాస్యకరుణలు కూడా గణపతి నుంచే పుట్టాయి. ఈ మూడూ మూల రసాలని రాంభట్ల అంటారు.

ఇప్పుడు వీటి పుట్టుకకుగల భౌతిక నేపథ్యాన్ని చూద్దాం.

మోర్గాన్ పురాచరిత్రను శావేజీ, బర్బర అనే రెండు దశాలుగా విభజించారు. మళ్ళీ ఒక్కొక్క దశలో మూడు అంతర్దశలు ఉంటాయి. శావేజీ మహాదశ ముగిసి, బర్బర ప్రథమదశలోకి అడుగుపెట్టే నాటికి జనం స్థిరనివాసానికి అలవాటుపడి గ్రామాలు ఏర్పరచుకున్నారు. పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని ప్రారంభించేముందు పెరటిసాగు, కంచె పశుపాలన చేపట్టారు. గ్రామాలలో ప్రతి గణానికీ నివేశనస్థలంతోపాటు శ్మశానం కూడా ఉండేది. పురాతత్వ ఆధారాలను బట్టి మొదట్లో మృతదేహాలను పాతిపెట్టేవారు. దహనం చేయడం ఆ తర్వాత వచ్చింది.

గణ మానవుడికి ఇద్దరు తల్లులు. అతను ఒక తల్లి గర్భం నుంచి పుడతాడు. చనిపోయిన తర్వాత ఖననం చేస్తారు కనుక, మరో తల్లి గర్భంలోకి చేరతాడు. భూమి కూడా తల్లే. అందుకే భూమాత అంటాం. గణపతికి ‘ఇద్దరు తల్లులు కలిగినవాడా’(ద్వైమాతుర గణాధిపా) అన్న సంబోధన ప్రసిద్ధమే. ఇది జనన మరణ చక్రం. పుట్టుకకు ముందు శృంగారం, చావుకు తర్వాత కరుణ. ఇదీ ఆ రెండు రసాల పుట్టుక క్రమం. ఇవి రెండూ హాస్యం ద్వారా వ్యక్తమవుతాయని రాంభట్ల అంటారు.

దీనిని వ్యవసాయానికి అన్వయించండి. విత్తనాలను భూమిలో పాతి పెట్టడం చావుకు సూచన. కనుక అది శోకించవలసిన సందర్భం. అయితే అది నిజ శోకం కాదు, కల్లశోకం, లేదా భావశోకం. అది హాస్యం ద్వారా వ్యక్తమవుతుంది. అంటే, అది హాస్యకరుణ. మరణించి తల్లి గర్భం చేరిన విత్తనాలు తిరిగి ఆ తల్లి గర్భం నుంచే పుట్టాలి. అంటే వెంటనే శృంగార చర్యలు మొదలవాలన్నమాట. అది కూడా కల్ల శృంగారం లేదా భావశృంగారం. అదీ హాస్యం ద్వారానే వ్యక్తమవుతుంది కనుక హాస్యశృంగారం.

ఈవిధంగా కరుణశృంగారాల ప్రదర్శన నాడు గణాల మనుగడతో నేరుగా ముడిపడింది. ఎందుకంటే, పాతిపెట్టిన విత్తనాలు మొలకలై తిరిగి పుడతాయి. ఒక విత్తనం నుంచి వంద విత్తనాలు ఆవిర్భవిస్తాయి. ఈ ఎరుక ఆనాటి జనం చేత ఆనందతాండవం చేయించిందని రాంభట్ల అంటారు. ఇలా ఒక భౌతికచర్యతో ముడిపడి, ఒక ప్రయోజనం కోసం అనుకరణ, లేదా అభినయ రూపంలో పుట్టి, హాస్యం ద్వారా వ్యక్తమైనవే కరుణశృంగారాలు. అవే ఆ తర్వాత కావ్యరసాలుగా మారాయి.

ఈ కరుణ శృంగారాల అభినయమే ఆయా పంటల పండుగలకూ మూలమైంది. గణపతి విత్తనాలకు ప్రతిరూపమయ్యాడు. ఖననం స్థానంలో దహనం మొదలైనప్పుడు ఈ పండుగల్లో కామదహనమూ చేరింది. మనం హోలీ పేరుతో జరుపుకునేది అదే. కామదహనమప్పుడు బూడిద ఎత్తిపోసుకోవడం, రంగులు, నీళ్ళు చల్లుకోవడం శృంగార హాస్య కరుణాభినయాలలో ప్రధానాంశమయ్యాయి.

ఈ కామదహనం మన దగ్గరే కాక, యూరప్, మధ్యాసియాలలో కూడా ఉంది. యూరప్ లో ‘కార్నివాల్’ పేరుతో దీనిని జరుపుతారు. కార్నివాల్ అంటే పంటల పండుగ. కేవలం ఖననం చేయడమే ఆనవాయితీగా ఉన్న సెమెటిక్ జనంలో కరుణాభినయం మాత్రమే చేసే పండుగలు ఉన్నాయి. శృంగారం వారి సామాజిక నీతికి విరుద్ధం. ఇలా ప్రపంచమంతటా జరిగే ఈ పంటల పండుగల గురించి జేమ్స్ ఫ్రేజర్ విస్తారమైన సమాచారం ఇచ్చారు. అది భారతీయ విలక్షణత, విశిష్టత, ప్రత్యేకతల గురించి మనం కల్పించుకునే ఊహల్ని పటాపంచలు చేయడమే కాదు; ప్రపంచ మతసాంస్కృతిక రేఖాపటంలో మనల్ని భాగస్వామిని చేస్తుంది.

ఇలా చూసినప్పుడు కుమారసంభవకథకు  ఏ ఆదిమ భౌతికవాస్తవికత మూలమో అర్థమవుతుంది. అది కేవలం కు’మారు’ని పుట్టుక గురించి మాత్రమే కాక, ‘మారు’ని పుట్టుక గురించి కూడా చెబుతోంది. మారుడంటే మన్మథుడు. బహుశా ఇష్టార్-తమ్మూజ్ కథలో లానే ఇందులో కూడా మన్మథుడు మరణించడం, రతీదేవి శోకించడం, మన్మథుడు మళ్ళీ పుట్టడమే మూల కథ అయుంటుంది. ఆ మూల కథను అలా ఉంచుతూనే దాని మీద శివపార్వతుల కథను నిర్మించి, దానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే, మూలకథలో మన్మథుడితోపాటే ప్రకృతి పునరుజ్జీవనం పొందడం ప్రధానం కాగా; దానిని అప్రధానం చేసి, తారకాసురుణ్ణి చంపడం కోసం శివపార్వతులకు కుమారస్వామి పుట్టడాన్ని ప్రధానం చేసి ఉండచ్చు. భౌతికమూలాలనుంచి పురాణకథలను తప్పించి భావాంబరవీథిలో వాటిని ఎలా విహరింపజేశారో గ్రహించడానికి ఇదొక నిదర్శనమూ కావచ్చు.

***

మొదట అద్వైతస్థితిలో ఒకటిగా ఉండి; ఆ తర్వాత కొడుకు పుట్టడంతో ఇద్దరుగా విడిపోయిన స్త్రీ పురుషులను మళ్ళీ ఒకటి చేసే ప్రక్రియే ఏటా దేవీ దేవతలకు జరిపే కళ్యాణమని క్యాంప్ బెల్ అంటారు. ఈ అద్వైతస్థితిని, అర్థనారీశ్వర మూర్తిని పునర్నిర్మించడం రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిది, ధ్యానం ద్వారా భావన చేయడం. రెండవది, సౌభాగ్యవర్ధనంతో ముడిపడిన మాంత్రిక చర్యల ద్వారా ప్రకృతిని పునరుజ్జీవింప జేయడం. మరోవైపు కంటికి, బుద్ధికి రెండు(ద్వైతం)గా కనిపిస్తున్నా; ఒక అంతరవులో లేదా విధానంలో ఆదిమ అద్వైతస్థితినీ గుర్తించడం లేదా భావన చేయడం జరుగుతూనే ఉంటుంది.

ఇది ద్వైత-అద్వైతాల మధ్య నిరంతర ఘర్షణ. ఇదే పురాతన కంచుయుగానికి చెందిన తాత్వికత. నటరాజులోనూ, సుమేరు మట్టిపలక మీదా కనిపించేది ఇదే ననీ, తూర్పుదేశాలలో ఇది ఇప్పటికీ అస్తిత్వంలో ఉందనీ, దీని మూలాలు క్రీటు నాగరికతలో ఉన్నట్టు కనిపిస్తుందనీ క్యాంప్ బెల్ అంటారు.

దాని గురించి తర్వాత…

 

 

 

 

నాలుగో సహస్రాబ్ది స్పేస్ ఒపేరా “కుజుడి కోసం”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఆకాశం’ మనిషికి ఎప్పుడూ ఉత్తేజాన్నిస్తుంది. మాములు జనాలకి నీలి ఆకాశం ప్రశాంతతని అందిస్తే, జిజ్ఞాసువులలో ఎన్నో ప్రశ్నలు రేక్తెత్తిస్తుంది. నాలో ఏముందో తెలుసుకోండంటూ సవాలు విసురుతుంది.  శూన్యం తప్ప అక్కడేం లేదని తెలిసినా మనిషి అన్వేషణ ఆగదు. శూన్యంలో భూమికి పైన ఎంతో ఎత్తులో ఉండే అంతరిక్షం పట్ల కుతూహలం అంతరించదు. మొదట చందమామ, ఆ తర్వాత ఇతర గ్రహాల పరిశోధన కొనసాగిస్తున్నారు. చంద్రుడి తర్వాత, ఖగోళంలో మనిషిని ఎక్కువగా ఆకర్షించింది కుజ గ్రహమేననడంలో ఎటువంటి అనుమానం లేదు.

శాస్త్రవేత్తలు శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తూ, అన్వేషణలు జరుపుతుంటే రచయితలు ఫిక్షన్ ద్వారా సైన్సు పట్ల పాఠకులలో ఆసక్తిని పెంచుతారు. సైన్సు ఫిక్షన్‌లో రచయితలు ఊహించిన కల్పనలెన్నో తరువాతి కాలంలో నిజమయ్యాయి. గత శతాబ్దంలో సైన్స్ ఫాంటసీలనుకున్న ఎన్నో కల్పనలు ఈ శతాబ్దంలో ఫాక్ట్స్ అయిన సంగతి అందరికీ తెలిసినదే.

ప్రముఖ వైద్యులు డా. చిత్తర్వు మధు వైద్యం నేపధ్యంతో ‘ఐసిసియు‘, ‘బై బై పోలోనియా‘, ‘ది ఎపిడమిక్‘ వంటి నవలలు రాసారు. తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసే అతి కొద్ది మంది రచయితల్లో మధు గారు ఒకరు. ఏలియన్స్,  గ్రహాంతర ప్రయాణాలు, రోబోలు, కాలంలో ప్రయాణం… వంటి ఇతివృత్తాలతో రచన చేసి పాఠకులను మెప్పించడం అంత సులువు కాదు. ఖగోళశాస్త్రంపై ఎంతో ఆసక్తి, అవగాహన ఉన్న మధు గారు శాస్త్ర విజ్ఞానాన్ని, ఊహని మిళితం చేసి “కుజుడి కోసం” అనే సై.ఫి రాసారు. స్థూలంగా ఈ నవల కథ ఇది:

కథాకాలం నాలుగో సహస్రాబ్ది 3260. అణుయుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిలో చాలా భాగం నశించి మనుషులు ఇతర గ్రహాలకి వలస వెళ్ళి అంతర్‌గ్రహ నాగరకత విలసిల్లుతున్న రోజులు. వెనకబడిన భూమి నుంచి  గ్రహాలకి వలసపోయే ప్రజలూ, స్పేస్ ప్లాట్‌ఫారంలూ, వివిధ జాతుల మానవులూ, మానవులని పోలిన హ్యుమనాయిడ్స్…. అది ఒక సరికొత్త విశ్వం! భూగ్రహంలోనూ అంతర్‌గ్రహ యానాలు, సమాచార వ్యవస్థా, వైద్య రంగాల్లో  మానవులు ఎంతో ప్రగతిని సాధించారు. ఇంటర్ గెలాక్టిక్ ఫోన్లు, సెవెన్త్ జనరేషన్ రోబోలు, ఇంటర్‌ గలాక్టిక్ నెట్, కాంతివేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలూ…. ఇలా ఎంతో అభివృద్ధి చెందినా మనిషి భావాలు, ఆలోచనలూ, వ్యక్తిత్వమూ మాత్రం పెద్దగా మారలేదు.

అసలు ఈ నాలుగో సహస్రాబ్ది చాలా వింతైన కాలం. ఒకపక్క అద్భుత విజ్ఞాన సాంకేతిక ప్రగతి. మరొకపక్క ఆధ్యాత్మిక మంత్రశక్తులు. ఇదివరకు విజ్ఞాన శాస్త్రంలో తెలియని విశ్వశక్తిని మనుష్యుడు మేధస్సుతో వశపర్చుకోవడం – రెండూ అద్భుతమైన మార్పులే! విశ్వశక్తి (Universal Force) అనేది ఈ నాలుగో సహస్రాబ్దిలోని ఒక అద్భుతమైన, అర్ధంకాని పరిణామం. విద్యుదయస్కాంతశక్తీ, భూమ్యాకర్షణశక్తీ, అణుశక్తీ తర్వాత, ఈ విశ్వశక్తి అనేది కొత్తగా కనిపెట్టబడి, మాంత్రికులచేత స్వాధీనంలోకి తెచ్చుకోబడింది. ఈ శక్తి భూమిలో విజ్ఞాన శాస్రవేత్తలకి ఎవరికీ తెలియదు.

కథా నాయకుడు హనీ మధ్య ఆసియాలోని ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి సయోనీ అనే అందమైన కుజ యువతి కలలోకి వస్తుంటుంది. ఆమెని చూడాలనే కోరికతో కుజగ్రహం చేరుకున్న అతని జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. సయోనీ అద్భుత శక్తులున్న ముసలి మంత్రగత్తె అనీ, ఒక పిచ్చి అన్వేషణలో తనను కుజ గ్రహానికి రప్పించగలిగిందని హనీ గ్రహిస్తాడు. తన తండ్రికీ, తనకి అమరత్వం సాధించాలనే కోరిక తీర్చుకోడానికి హనీని ఉపయోగించుకోవాలనుకోవాలనుకుని అతడిని కుజగ్రహానికి వచ్చేలా చేస్తుంది.

Dr.ChittarvuMadhu2

హనీకి విశ్వాంతరాళపు విశ్వశక్తిని అదుపులోకి తెచ్చుకోగలిగే ప్రత్యేకమైన శక్తులు వున్నాయనీ, అతనికి తెలియకుండనే అతనికి కాస్మిక్‌ ఎనర్జీ, దానికి ప్రతిస్పందించగలిగిన ప్రకంపనలు అతని మెదడులో, శరీరంలో వున్నాయనీ, తను మాత్రమే ఆ అమరత్వ శక్తిని సంపాందిచగలడని ఒత్తిడి చేస్తుంది. ఆమె తండ్రి, అరుణభూముల చక్రవర్తి సమూర హనీని బెదిరిస్తాడు. షాక్‌ తిన్న హనీ – చక్రవర్తి ఆశయసాధనలో తానేం చేయాలో అడుగుతాడు.  బదులుగా చక్రవర్తి – ”హనీ! నువ్వొక గొప్ప శాస్త్రవేత్తవి. మంత్రశక్తులు కలిగిన గొప్ప మానవుడివి. అయితే నీ శక్తి నీకే తెలియదు! నీకు ఇంకా మంత్రశక్తిని సాధించే శిక్షణ ఇచ్చి ఒక ముఖ్యమైన లక్ష్యసాధన కోసం పంపుతాను. భూమి, గురుగ్రహం, శని ఉపగ్రహం టైటాన్‌, కుజుని మానవ కాలనీ – ఇంకా అరుణ భూముల నుంచి ఎన్నుకుని, వాళ్ళ మనసులని ప్రభావితం చేసి ఇక్కడికి తీసుకువచ్చిన కొందరి వ్యక్తులకి నువ్వు నాయకత్వం వహించాలి. వాళ్ళందరూ కూడ నీ వలెనే అద్భుత శక్తులు కలిగివున్నవాళ్ళు. అయితే నువ్వు నాకు, సయోనీకి విశ్వాసపాత్రుడిగా వుండాలి. విశ్వశక్తిని వశపర్చుకుని ఉపయోగించే నేర్పు సంపాదించుకోవాలి నువ్వు. మా కోసం అమరత్వం ప్రసాదించే మహా ఔషధం తీసుకుని రావాలి! ఆ విషయంలో తప్పక కృతకృత్యుడిని కావాలి!” అని చెబుతాడు.

గత్యంతరం లేక, అందుకు అంగీకరించి, విశ్వశక్తి అనబడే ఆ మంత్రవిద్యలో కొంత పట్టు సాధిస్తాడు హనీ. రకరకాల ఇబ్బందులు ఎదుర్కుని ఒలంపస్ శిఖరంపై దాచబడ్డ అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని సంపాదిస్తాడు. ఇదే సమయంలో కుజునిలో నివసిస్తున్న మానవ కాలనీకీ, అదే గ్రహంలో అరుణ భూముల రాజ్యంలో ఉన్న మాంత్రికులకీ ఎప్పటినుంచో ఉన్న ఆధిపత్య పోరు మళ్ళీ రగులుకుని ఓ మహా యుద్ధంగా మారుతుంది.

ఏ సహస్రాబ్దిలోనైనా యుద్ధం భయంకరమైనదీ, మానవత్వానికి వ్యతిరేకమైనదే! మనిషి మనిషిని చంపుకోవడం – దానికోసం వివిధ రకాల సిద్ధాంతాలు, సంజాయిషీలు చెప్పుకోవడం, అనేక విధాల ఆయుధాలు వాడటం – ఇది అప్పటికీ, ఇప్పటికీ ఎప్పుడూ జరుగుతున్నదే! అసలు యుద్దమే ఒక నేరం! మాంత్రికులు ఎంత క్రూరులో మానవులు కూడా అంతే క్రూరులు, చెడ్డవారు. చిత్రహింసలు, జైలు… మళ్లీ గొప్పగా, నిబంధనలు పాటిస్తున్నట్లు మాట్లాడటం. ఎన్ని యుగాలు, సహస్రాబ్దులు గడచిపోయినా, యుద్ధాలలో ఈ ప్రవర్తనలన్నీ మారనే లేదు.

నాలుగో సహస్రాబ్దిలో కుజునిలో మానవులకీ, మాంత్రికులకీ జరిగిన ఈ యుద్ధం కూడా అలాంటిదే! అయితే ఈ సహస్రాబ్దిలో యుద్ధాలలో కొన్ని విశేషాలున్నాయి. మానవుల దగ్గర ఇదివరకటిలాగానే అణ్వాయుధాలున్నా వాటిని ఆఖరి ఆయుధాలుగానే వాడుతున్నారు. దానివల్ల గలిగే ప్రాణనష్టం, రేడియో ధార్మిక శక్తివల్ల వచ్చే అపాయాలూ అనేకం! మానవులు యుద్ధాల్లో ప్రాణనష్టం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దీనికి ఒక పద్ధతి ఏమిటంటే సైనికుల స్ధానంలో రోబోలని వాడటం. వాటిని రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేయించడం! కానీ మానవుల హైటెక్‌ యుద్ధం చేసే యంత్రాంగమంతా, ఎవరికీ తెలియని విశ్వశక్తి అనే మాంత్రికుల శక్తి ముందు ఓడిపోతుంది. అదే సమయంలో నానా తిప్పలు పడి హనీ, ఆ ఔషధాన్ని సమూరికి అందజేస్తాడు. అయితే ఆ ఔషధం తాగిన వారికి మంత్రశక్తులన్నీ నశిస్తాయన్న నిజం దాచిపెడతాడు. ఆ ఔషధం తాగిన సమూరా, తన ప్రత్యర్థి కుజుడి మీది మానవుల కాలనీ అధ్యక్షుడైన కాన్‌స్టాన్‌టైన్‌‌ని వెక్కిరిస్తాడు.

బదులుగా, మంత్రశక్తులు ఉపయోగించకుండా తనతో ద్వంద్వయుద్ధం చేసి ఓడించమని సమూరాని రెచ్చగొడతాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. ఆ ఔషధం తాగిన ప్రభావంతో సమూరా మంత్రశక్తులు క్షీణించి, ద్వంద్వయుద్ధంలో పరాజితుడై పారిపోతాడు సమూరా. కుజుడి మీద మానవులు, మాంత్రికుల మధ్య సంధి కుదురుస్తాడు హనీ. అరుణభూములకు రాజుగా తన మిత్రుడయిన మీరోస్‌ని ప్రతిపాదిస్తాడు. అందరూ ఆ ప్రతిపాదనకి అంగీకరిస్తారు. హనీ గౌరవార్థం  గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. హనీకి కానుకగా – అమృత ఔషధం కోసం ఒలంపస్ పర్వత శిఖరానికి వెళ్ళిన బృందంలోని రోబోని కానుకగా ఇస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. కుజుడి లోని మానవ కాలనీ సైన్యాధ్యక్షుడైన గ్యాని ఆన్‌ గారక్‌ పశుశాలలో జంతురూపంలో బందీలుగా ఉన్న ఏనిమాయిడ్‌, డిమిట్రీ, పోసయిడన్‌‌లను విడిపించే క్రమంలో జనరల్ గ్యాని సైనికులతో పోరాడుతాడు హనీ. ఎలాగొలా సైనికులను తప్పించుకుని అంతర్‌గ్రహ కౌన్సిల్‌ మరియు అంతర్‌ గెలాక్టిక్‌ కౌన్సిల్ శరణు పొందుతారు. ఆయా గ్రహాల అధికారుల సహాయంతో ఏనిమాయిడ్‌ని గురుగ్రహపు ఉపగ్రహమైన గ్వానిమెడ్‌కి; డిమిట్రీ, పోసయిడన్‌‌లను శనిగ్రహపు ఉపగ్రహమైన టైటన్‌కి పంపే ఏర్పాట్లు చేస్తాడు హనీ. అలాగే, భూ గ్రహనికి చెందిన అధికారులు కూడా హనీ నేరస్తుడు కాదనీ, శరణార్థి అని నిర్ధారించి భూమికి పంపుతారు.

ప్రేమ కోసం బయలుదేరిన హనీ తన గురించి కొత్త విషయాలు తెలుసుకోడం, అద్భుత శక్తులు సంపాదించడం, కొత్త లక్ష్యంతో భూమికి తిరిగి రావడంతో కథ ముగుస్తుంది. కథాక్రమంలో కుజగ్రహం గురించి ఎన్నో శాస్త్రీయ వివరాలు అందించారు రచయిత.

పాఠకుల చేత ఔరా అనిపించుకున్న ఈ కథకి కొనసాగింపు (సీక్వెల్) ”నీలీ ఆకుపచ్చ భూమికి తిరిగిరాకకినిగె పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. తాజా ఎపిసోడ్‌ని ఈ లింక్‌లో చదవచ్చు.

వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన “కుజుడి కోసం” ప్రింట్ పుస్తకం నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వద్ద, రచయిత వద్ద, కినిగెలోనూ లభిస్తుంది. 228 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

 

 

Dr. C. MADHU, M.D.

Consultant Physician & Cardiologist

Vijaya Medical & Heart Clinic

2-2-23/2, SBH Colony,

Behind CTI, Bagh Amberpet,

Hyderabad – 500 013

e-mail : madhuchittarvu@yahoo.com

 

భావం నుంచి బాహ్యంలోకి ప్రయాణం..

 జయశ్రీ నాయుడు 
jayasriఒక కవిత రూపు దిద్దుకునే క్షణాలు బహు చిత్రమైనవి. ఒక ఘటన లేదా అనుభూతి, ఒక ఆలోచన — అతి సూక్ష్మ తరంగం గా మనసులో స్థిరపడి, మర్రి విత్తు మహా వృక్షమైనట్టు బాహ్యాంతరంగాలను ఆక్రమిస్తుంది.దాని పరిధిని అధిగమించలేని నిస్సహాయత కొంత, అందులోని ఆనందమో, అవేదనో, ఆత్మార్పణో, భావ పరమావధిని తెలుసుకొమ్మన్న అంతర్గత వేధింపో, ఇక తెల్ల కాగితమ్మీద అక్షరాలుగా అనువదించుకోవలసిందే.  కోడూరి విజయ కుమార్ గారి ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటం లోని ** తిరిగి జన్మిస్తావు** కవితని ఆయన సిగ్నేచర్ కవితగా తీసుకోవచ్చు.
 
 ఒక కవిత రాసే ముందు ఆయన మనసు పడే తపన, చేసే తపస్సుని వర్ణించారిక్కడ. భావాన్ని పైపైన తేలికగా మోసుకొచ్చే పదాలకీ, అంతరంగాన్ని చీల్చి, తన్ను తాను నిక్కచ్చిగా ఆవిష్కరించుకునే కవితా వేశానికీ – గీతానికి, భగవద్గీతానికి వున్నంత వ్యత్యాసముంటుంది. విషాదం నుంచే మహోన్నత కళావిష్కరణలు జరిగేది. అక్షరాల్లోని ఆవేదనే కవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే తరుణం, తనలో తానుగా కనుగొనే సత్యం. అదే కవితా తపస్సు.
 ఇక మనం చర్చించుకునే *తిరిగి జన్మిస్తావు*కవిత విషయానికొస్తే…
 “బాధ” అనే  మన: స్థితి ఎప్పుడూ వర్ణనకు అందనిదే. గాయాలు ఎవరు చేసినా తొలి గాయం కవికి తనకు దొరకని ప్రేమని చెప్పుకుంటాడు . తల్లిదండ్రులు,  భార్య , రక్త సంబంధీకులు,  ఎవరు చేసిన గాయమైన తన తొలినాళ్ళ ప్రేమ వైఫల్యపు గాయం తరువాతే.
  ” ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భం లో ఎలా వుంటావు…”
అని అతని అంతరాత్మే ప్రశ్నించినపుడు…
అతని ఎదురుగా వున్న తెల్ల కాగితం లోతైన బావిలా అనిపిస్తుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను కవిని ముక్కలుగా ఖండించి లోలోని బాధను పెకలించే ఖడ్గంలా వుంటుంది
ఇక యేళ్ళ తరబడి కూడబెట్టుకున్న పద సంపద (కవులకు అవే కదా సంపదలు), బాధని పద్యం చెయ్యగలనన్న అహంకారం నీరవుతుంది.
 ** ఇక అప్పుడేం చేస్తావు నువ్వు?
అన్న ప్రశ్న అంతరాత్మలో సవాల్ చేస్తుంది
“ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ….”
తనని తాను అనువదించుకుంటాడు, తనను వేధిస్తున్న బాధనుండి విముక్తుడవుతాడు.
అక్కడితో వృత్తం పూర్తి కాదు. భావాలన్నవి విశ్వజనీనమైనవి కొన్ని వున్నాయి. కవిత్వంగా  అల్లుకునే ఉదాత్త భావాలు కవి లో పుట్టాక, కవిత గా అనువాదమయ్యాక, పఠిత కళ్ళలోనుండి మెదడుకో మనసుకో అనుసంధానం ఐనపుడు ఆ పదావిష్కరణకు పరిపూర్ణత. అదెలా జరుగుతుందో కూడా విజయ కుమార్ గారిలా చెప్తారు..
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు.
ఒక కవి – భావం నుంచి భాహ్యం లో ప్రయాణించి, మళ్ళీ మరో భావం గా లీనమవ్వడంతో ఆ కవిత ఒక సార్థకతని సాధించుకున్నట్టే.
 పూర్తి కవిత ఇక్కడ…
శీర్షిక: తిరిగి జన్మిస్తావు
కవి: కోడూరి విజయకుమార్
ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి
 
ఒక్కో సారి నీ స్థితి బహు చిత్రంగా మారిపోతుంది
లోపల సుడులు తిరుగుతోన్న బాధ ఒకటి
ఇంకా లోపలే వుండలేక బయటపడే ప్రయత్నంలో
నిన్ను చిద్రం చేస్తూ వుంటుంది
 
 
బాధ ఏదయితేనేం?
గాయం ఎప్పటిదైతేనేం?
 
***
 
బహుశా, కవిత్వం లోకమైన వాళ్ళ తొట్ట తొలి గాయం
దొరకని ప్రేమ చేసినదే కావొచ్చు
ఇక ఆ తదనంతర గాయాలంటావా…
అవి నీ తలిదండ్రులకు నీవు చేసిన  గాయాలు కావొచ్చు
 లేక, నీ తోడబుట్టిన వాళ్ళకో, నీవు కట్టుకున్న స్త్రీకో, నీ పిల్లలకో
నీవు చేసిన గాయాలు కావొచ్చు
కొన్నిసార్లు వాళ్ళు నీకు చేసిన గాయాలు కూడా…
ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భంలో ఎలా వుంటావు?
 
 
ఎదురుగా వున్న తెల్ల కాగితం
నువ్వు దూకితే మింగి వేసే లోతైన బావిలా వుంటుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను
నిన్ను ముక్కలుగా ఖండించి
లోన వున్న బాధని పెకిలించే ఖడ్గంలా వుంటుంది
 
 మరీ దయనీయ స్థితి ఏమిటంటే
నీవు యేళ్ళుగా నేర్చుకున్న అక్షరాలు
నీ భాష, నీ పద సంపద, నీ అలంకారాలు
బాధని పద్యం చేయగలనన్న నీ అహంకారాలూ
అన్నీ అన్నీ
నిన్నొక అనాథని చేసి వెళ్ళిపోతాయి
 
అయినా సరే
లోన మెలిపెడుతోన్న బాధ జాలి పడి
ఇక అప్పటికి నిన్ను వొదిలేసి వెళ్ళదు కదా
జోలెలో గుప్పెడు గింజలు వేసేదాకా వొదలక
గుమ్మం ముందు నిలబడి, వొంటిని కొరడా దెబ్బలతో
గాయ పర్చుకునే పెద్దమ్మల వాడి లాగా
నిన్ను కట్టడి చేస్తుంది కదా
 
ఇక అపుడేం చేస్తావు నువ్వు?
ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క అక్షరాన్నే కూడబలుక్కుంటూ
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ
ఒక్కొక్క ముక్కగా నిన్ను నీవు ఖండించుకుంటూ
అలా ఆ లోతైన బావిలోకి మునిగిపోయి
ఇక ఈ రాత్రికి ఈ బాధ నుండి విముక్తమౌతావు
 
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు
~~

తొలికలుపు

                                              అన్వీక్ష నీలం

  

ఆ రోజు స్కూల్ నుండి వస్తూనే బ్యాగ్ తన రూంలో పడేసి పరుగెత్తుకొచ్చాడు. ఏదో డిమాండ్ తో వస్తున్నట్టు అర్ధమైంది. ఈ మధ్య పిల్లల అవసరాలు కూడా వాళ్లకు కలిగేవి కాదాయే. అవి వాళ్ళ స్నేహితులో, స్కూలో నిర్ణయిస్తుంది. చక్కగా ఫ్రెష్ అయి ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని పరుగెత్తుకొస్తుంటే క్రితం సారి నేను చేసిన ప్రమాణం పూర్తి చేయాల్సిన సమయం వచ్చినట్టే ఉందనిపించింది. క్రితం క్వార్టర్లీ ఎక్సామ్స్ మొదలైనప్పుడు అనుకుంటా  వాడి కోరిక నా ముందు ఉంచాడు.

” మమ్మీ మా క్లాస్ లో దినేష్ లేడు. వాడికి వాళ్ళ డాడి  ఒక డాగ్ గిఫ్ట్ ఇచ్చాడు తెల్సా. లాబ్రడోర్ బ్రీడ్ అంట. అచ్చం హ్యూమన్ బీయింగ్ లాగే బిహేవ్ చేస్తుందంట. వాడు రోజు దానితో ఆడుకుంటున్నాడంటా. మొన్న వాళ్ళింటికెళ్ళా కదా అది నాతో కూడా ఎంత బాగా ఆడుకుందో తెల్సా. ప్లీజ్ మమ్మీ వై డోంట్ యు గెట్ మీ దట్ ప్లీజ్ “అని అడిగాడు. “డాగ్?నో నో “కుదరనే కుదరదు అని అప్పుడే ఖరాకండిగా చెప్పేసా వాడికి. వాడు వింటేనా? వాడి కోసమే కదా ఇవన్నీ చేసేది. వాడు సంతోషంగా లేనప్పుడు మేమెలా సంతోషంగా ఉండగలం అని వెంటనే ఇంకో ఆలోచన. వాడు మా ఒక్కగానొక్క కొడుకు లోహిత్. ఇపుడు ఫోర్త్ స్టాండర్డ్.

******

వాడికి వాల్లమ్మమ్మ అంటే ఎంతిష్టమో. అమ్మమ్మ నుంచి ఫోన్ రాగానే వాడి ముఖంలో సంతోషం చూడాలి. ఇవాళ  స్కూల్ కెళ్ళద్దు ఇంట్లో ఉండమంటే ఉండే సంతోషం ఉంటుందే అంతకు వంద రెట్లు. ఒకప్పుడు మా అమ్మమ్మతో మాట్లాడాలంటే ఎక్కడి ఫోన్లు? ఒక ఉత్తరం ముక్క రాసిపడేస్తే ఎప్పటికో సమాధానం వచ్చేది. అదీ మా మావయ్యలకు సమయం కుదిరినప్పుడు. కొన్ని మాటలు భావాలు ప్రయాణానికి సమయం తీసుకున్నా జీవితపు పుస్తకంలో తిరిగిరాసుకోనవసరం లేనంత స్థిరంగా ముద్రించబడతాయి.

అమ్మతో ఎప్పుడు ఫోన్ మాట్లాడినా  -“అమ్మమ్మా నువ్వెప్పుడొస్తున్నావ్ ?”అన్నదే  వాడి మొదటి ప్రశ్న. ఒక్కడే కదా  వాడికెంత బోర్ కొడుతుందో ? అందుకే అమ్మొస్తే వాడి ఒంటరి తనానికి వెలకట్టలేని  తోడు దొరుకుతుంది. ఉదయం ముగ్గురం ఒకేసారి ఇంటి నుంచి బయలుదేరతామా. నేను, ఆయన ఆఫీస్కి.  వాడు స్కూల్కి. మేమొచ్చే సమయానికన్నా ముందే వాడొస్తాడని వాడి కోసం స్పెషల్ క్లాసులు పెట్టిన్చాం. ఎక్స్’ట్రా కర్రికులర్ యాక్టివిటీస్ , స్పోర్ట్స్ ఉంటాయి. నేనొచ్చి ఏదో ఒక చిరుతిండి చేసేలోపు వాడొస్తాడు. భోజనానికి ముందు ఏ సమయానికో ఆనందొస్తాడు. పాపం ఎన్నెన్ని విషయాలు వాళ్ళ నాన్నతో భోజనమప్పుడు చెప్పాలనుకుంటాడో, కాని అలసిపోయి చెప్పలేక  ఏవో రెండు మాటలు మాట్లాడి పడుకుంటాడు.

అప్పుడప్పుడు లోహిత్ ని చూస్తుంటే “వాడితో గడపాల్సిన ప్రొడక్టివ్ టైం గడపలేక పోతున్నాం” అని బాధపడతాం నేను ఆనంద్. కాని మా జీవనశైలి, ప్రపంచం మమ్మల్ని తీయిస్తున్న పరుగు  విశ్రాంతి తీసుకోడానికి కూడా సమయముండడం లేదు అన్న భావనమాది. ఉరుకులు, పరుగుల జీవితం. పాపం వాడికి రాత్రుళ్ళు ఎప్పుడైనా కథలు వినాల్సి వస్తే వాళ్ళ నాన్న ట్యాబ్ లోంచి అన్నయ్యకు కాల్ చేస్తే వీడియో కాలింగ్ లో అమ్మమ్మతో మాట్లాడుతూ  కధలు వింటాడు. టెక్నాలజీ పెరిగిపోయిందని సంతోషించాలా ? లేక టెక్నాలజీ జీవితాల్ని ఇంత శాసిస్తుందా ? అని బాధపడాలా  తెలియట్లేదు.

ఉదయాన్నే  వాణ్నికూడా లేపి తనతో పాటు వాకింగ్ కని తీసుకెళ్ళే మంచిపని మాత్రం చేస్తాడు ఆనంద్. వాళ్ళ నాన్నతో పోటీ పడి లేవడం వాడిక్కూడా భలే ఇష్టం. నాన్న కన్నా ముందే లేచి షూస్ వేసుకొని వాళ్ళ నాన్నను కొన్ని సార్లు వాడే నిద్రలేపుతాడు. వాకింగ్కెళ్ళి వస్తూ వస్తూ కొన్ని కాగితపుపూలు , మందారాలు , గన్నేరుపూలు ఇంకా నందివర్ధనాలు చేతులనిండా పట్టుకొచ్చి వాడిరూంలో ఉండే వాజ్లో వాడే అలంకరిస్తాడు. ఆ వాజ్ వాడు చేసుకున్నదే. వాళ్ళ స్కూల్లో ఇన్నోవేటివ్ పీరియడ్ లో వాళ్ళ టీచరమ్మ ఇచ్చిన ప్రాజెక్ట్ అది. అది వాడి ప్రాజెక్ట్ లా కాక  నా పనిష్మెంట్లా అనిపించింది. ప్రాజెక్ట్ వర్క్  వాడిది పని నాది ఇప్పటికీనూ. అయినా అనకూడదు కాని వాడు శ్రద్ధగా ఆ పనీ ఈ పనీ  సహాయపడతాడుగా. ఆ వాజ్ గురించి కుండలు తయారు చేసే కుమ్మరి వాళ్ళ దగ్గరకూ వెంటతీసుకుపోయా. అయినా జగమెరిగిన సత్యమే కదా.

ఇంటర్నేషనల్ స్కూల్ అని తగిలించుకున్న వాటిలో చదువు కన్నాఈ కార్యకలాపాలకే డబ్బులు కట్టాలని. లేదంటే పిల్లోడు ఎక్కడ వెనకపడిపోతాడోనన్న భయం. సంవత్సరానికి షుమారు 60 వేలు ఒక సాధారణ ఇంటర్నేషనల్ స్కూల్ లో. అదే మా ఇంటి పక్కనే ఉన్న మా ఆయన కొలీగ్ సూర్యనారాయణ గారి  అబ్బాయి ఇంకేదో ఇంటర్నేషనల్ స్కూల్ అట సంవత్సరానికి లక్ష రూపాయలు. నా చదువంత అవడానికి పట్టినన్ని డబ్బులు వీడి ఒక్క సంవత్సరం ఫీజు. ఇక ఇక్కడితో మొదలు పెట్టి మున్ముందు వాడి చదువుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుని డబ్బుపొదుపు  చేయడానికి మార్గాలు కనిపెట్టడం ఇప్పటి మా భాద్యత. కాదామరీ రేపు వాడు పెద్దయ్యాక మీరేం చేశారు అని ప్రశ్నిస్తే ? . ఈ మధ్య తల్లిదండ్రులు కావాలనుకుంటున్న వాళ్ళను వెంటాడుతున్నప్రశ్న ఇది మరీ. అందుకే జీవితంలో మంచి ఉద్యోగంతోనో, మంచి పదవితోనో, జీతంతోనో స్థిరపడితే తప్ప పెళ్లి చేసుకోవడం లేదు  ఆడైనా మగైనా.

toli kalupu.anveeksha

ఇప్పుడు జీవితాల్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే సూత్రంతో కొలుచుకొని, పక్కవారితో పోల్చుకొని చూసుకుంటూ బ్రతుకుతున్న రోజులు.  ప్రొఫెషన్ ట్యాగ్ లేకపొతే కేర్ చేసే వాళ్ళున్నారా అసలు? పదో తరగతవగానే ఇంటర్ కోసం CEC గ్రూప్ తీసుకుంటాను అంటేనే ఎన్నిమాటలు తిట్టారు మా మావయ్య నన్ను. ఏది చదవాలి ఏది వద్దు అన్నది కూడా మన చుట్టుపక్కల వాళ్ళే నిర్ణయించేస్తున్న కాలం మరి. ఎలా బ్రతకాలో కూడా సమాజమే నిర్ధారిస్తున్న రోజులు.

అమ్మొచ్చినప్పుడల్లా ఇదే గొడవ ఇంకొకరిని కంటే వాడికి తోడు ఉంటుంది కదా అని. ఒక్కడికే మంచి భవిష్యత్తు ఇవ్వడం కష్టమవుతున్న రోజులివి . ఒకప్పుడు ఇద్దరూ లేదా ముగ్గురు చాలు . తర్వాత ఇద్దరు చాలు అనేవాళ్ళు  కానీ ఇప్పుడు ఒక్కరే ముద్దు అనే పరిస్థితొచ్చింది. కాని ఆశ్చర్యమేస్తుంది అమ్మ ఆరుగురిని ఎలా పెంచిందా అని. అందరూ మంచి స్థితిలోకే వచ్చాం. కాని ఇప్పుడు ఒక్కరిని పెంచడమే ఇంత పెద్ద భాద్యత మాకు. భాద్యత అని మేమనుకుంటున్నామా ? సమాజ ముఖచిత్రమే మా భాద్యతల్ని కూడా నిర్ధారిస్తుందా ?? అప్పుడప్పుడు అర్ధమవదు.
* * * * *
ఇక ఇప్పుడు నా బాధ వాడికి కుక్కను కొనివ్వడం కాదు. దాన్ని తెచ్చాక దాని సేవలు చేయాలంటే కూడా నేనే. ఎవరు పెట్టుకున్న పనులు ఇవ్వన్నీ అని. కాని లోహిత్ పట్టుపట్టాడంటే ఇక వదలడం కష్టమే. అందుకే అన్నాను -” నువ్వు  క్లాస్ ఫస్ట్ వస్తే కొనిస్తానని”. వాడు అన్నట్టుగానే క్లాస్ ఫస్ట్ వచ్చాడు. రయ్యి మనొచ్చి కూరగాయలు కోస్తున్న నా ముందు ప్రోగ్రెస్ కార్డుంచి నా భుజాలచుట్టూ చేతులేసి – ” మమ్మీ నౌ ఇట్స్ యువర్ టైం టు కీప్ యువర్ ప్రామిస్ “అన్నాడు. గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉందిప్పుడు నా పరిస్థితి. ఒక వైపు వాడు  ఫస్ట్ పొజిషన్ కొచ్చాడని సంతోషపడాలా లేక కుక్కను తెచ్చి నా ఒత్తిడినింకా పెంచుకోవాలా?.  వాడి సంతోషం కన్నా ఎక్కువేముందిలే అనుకున్నా ఆ క్షణం -“డాడీ వచ్చాక మాట్లాడి చెప్తాను “అని వాణ్ని కొద్ది సేపు ఆడుకోమని పంపా. వాడు ఆడుకోవడం అంటే ఏమాడుకుంటాడు? వీడియో గేమ్స్ లేదంటే ఏ కార్టూన్ నెట్వర్క్ చానెలో పెట్టుకొని చూస్తాడు.

మా చిన్నతనంలో  సాయంకాలం మేమంతా ఈ సమయానికి వీధిలోకి చేరి ఎన్ని ఆటలాడేవాళ్ళం. కాని వాడి బాల్యం చూస్తుంటే బాధగానే ఉంది. పరువు ప్రతిష్ట  అదీ ఇదీ అని ఇక్కడ  గేటడ్ కమ్మ్యూనిటీలో ఇల్లు కొన్నాక జీవితాలకు కూడా గేట్ పెట్టుకున్నట్టే ఉంటుంది. పేరుకు మాత్రం పార్కు, స్విమింగ్ పూల్ ఎన్ని ఉన్నా ఏం లాభం ?. పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకున్న పాపానికి పోరు ఇక్కడ జనాలు. పండగలకు మాత్రం ముస్తాబయి నగలు చీరలు కార్లు చూపించుకోడానికి గుమ్మి గూడి ఆడిపాడతారు అందులో కూడా దర్పం చూపించుకోవడమే. ఎంత మారిపోయాయి  జీవితాలు. పాపం వాడు ఎంతో పెద్దకోరిక కూడా కోరలేదుగా వాడి  ఈ చిన్న కోరికైనా తీర్చాలనుకున్నాను.

* * * *

రాత్రి తొమ్మిదిన్నరకొచ్చాడు ఆనంద్. ఫ్రెష్ అయి భోజనానికి కూర్చున్నాడు. -” లేటయ్యిందేంటి ఆనంద్? . లోహిత్  క్లాస్ ఫస్టొచ్చాడు. నీతో షేర్ చేసుకుందామని పాపం నీ గురించి చూసి చూసి ఇప్పుడే పడుకున్నాడు” భోజనం వడ్డిస్తూ విషయాన్ని ముందుంచా.  -” ఒహ్ అవునా ? ఏం చేయను కొత్త ప్రాజెక్ట్. కొత్త టీం . వర్క్ అలొకేట్ చేసి పోర్ట్ఫోలియో తయారు చేయడానికి ఇంత టైం పట్టింది. రేపటి నుంచి ఇంకొంచెం బిజీ అవ్వచ్చు హేమా ” అంటూ భోజనం చేస్తూ  ఆ రోజుటి ఆఫీస్ విషయాలు షేర్ చేసుకున్నాడు ఆనంద్.” ఇంకేంటి విషయాలు ? “అన్నం కలుపుతూ అడిగాడు ఆనంద్ .
– ” ఏముంది ? మీ సుపుత్రుడు ఒక చిన్న కోరిక కోరాడు ” పెరుగు వడ్డిస్తూ పెట్టిన పిటీషన్ అది.
– ” ఫస్ట్ వచ్చినందుకు నువ్వే ఏదో లంచం ఇవ్వజూస్తున్నావ్ అని చెప్పు ” అన్నాడు ఆయన నవ్వుతూ.

ఏం చేస్తాం కోరిక వాడిది. వేడుకోవడాలు నావి. -” హా అలాంటిదే అనుకోండి.  లోహిత్ వాళ్ళ ఫ్రెండ్ దినేష్ లాబ్రడర్ డాగ్ కొనుక్కునాడట వీడూ అది కావాలంటున్నాడు ” మొత్తానికి కోరిక ఆయన పెన్ను కిందకొచ్చింది ఇక సంతకమే తరువాయి. – ” అనుకున్నా .. లాస్ట్ టైం నువ్వు ప్రామిస్ చేసేప్పుడే చెప్పా ఆలోచించి మాటివ్వు వాడికి  అని ” భోజనం ముగించి చేయి కడుగుతూ అన్నాడు ఆనంద్.  -” ఇప్పుడు కాదంటే వాడు ఇంకా చిన్న బుచ్చుకుంటాడానంద్ ప్లీజ్ “.   బ్రతిమాలించుకోవాలి అనే సరదా ఆనంద్ ఇలా తీర్చుకుంటున్నాడు. -“నాకేం ప్రాబ్లం లేదు. కాని దానికి కూడా సేవ చేసే అంత ఓపిక నీకు ఉంటే తెచ్చుకో “ అని మొత్తానికి ఒప్పుకున్నాడు ఆనంద్.

* * * *

ఇక ఆ కుక్కని కొనడం ఇప్పుడు నా టాస్క్ .ఉదయాన్నే పనంతా అయిపోయాక బ్రేక్ ఫాస్ట్ చేసేప్పుడు చెప్పా –“  లోహిత్  డాగ్ కొనడానికి డాడీ  సరే అన్నారు  . ఎక్కడ కొనేది ఏమైనా తెలుసా ?”. వాన్నే అడిగా ఎప్పుడైనా కొంటే కదా తెలిసేది ఏ విషయమైనా. – “అమ్మా నేనిప్పుడే దినేష్ కి ఫోన్ చేస్తాను” అని పరుగెత్తుకెళ్ళి ఫోన్ చేసి విషయాలన్ని వివరంగా తెలుసుకునొచ్చాడు. ఇంత కమ్మ్యూనికేషన్ డెవలప్మెంట్ చూస్తుంటే ఇంకా మున్ముందు ఎన్నెన్ని మార్పులు చూడబోతానో అని భయమేస్తుంది అప్పుడప్పుడు.
“అమ్మా ఇవ్వాళ ఆదివారం . ఇవ్వాళే కోనేద్దామా ? ” వాడి తొందరకి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. వాడు డాగ్ కొంటునట్టు అమ్మమ్మ కు కూడా ఫోన్ చేసి చెప్పేసాడు. ఫ్రెండ్స్ కి చెప్పేసాడు. –“నా పనంతా అయ్యాక ఇక వెళ్దామా” అని నేను తయారై బయటికి రాగానే వాడు నన్ను చూసి పకపకా నవ్వాడు. నాకెందుకో సందేహం కలిగింది బాగోలేనా ఏంటని?.

ఆ మధ్య ఒక సారి టీచర్స్ పేరెంట్ మీటింగ్ అప్పుడు “అమ్మా నువ్వు రావద్దు నేను డాడీని తీసుకెళ్తా “ అన్నాడు. ఎందుకు అంటే నువ్వు మాడ్రన్ గా ఉండవు. మా ఫ్రెండ్స్ మమ్మీలంతా ఎంత మాడ్రన్గా ఉంటారో తెల్సా ? అని నాకొక పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే మా చెల్లి ఊరి నుంచి రాగానే విషయం చెబితే ఎప్పుడూ చూడని బ్యూటి పార్లర్ కి తీసుకెళ్ళి ఏంటేటో చేయించింది. పిల్లలు స్కూలలో ఎన్నెన్ని నేర్చుకుంటున్నారు ?. వాళ్లను వాళ్ళు , వాళ్ళతో ఇతరులను కూడా కంపేర్  చేసుకుంటున్నారు. అసలు టీవీ సీరియల్స్ , సినిమాలు , అడ్వర్టైస్మెంట్ లు అమ్మల్ని వయసుదాటని పడుచుపిల్లల్లా చూపిస్తున్నారు. వయసుదాచడం  అమ్మలు అమ్మల్లా కనిపించకపోవడమే మోడ్రన్ అందమని తెలుస్కోవడంలో నాలాంటి వాళ్ళం ఎంత వెనకబడి ఉన్నామో  అనిపించింది.

“ఎందుకు నవ్వావురా ” అని భయపడుతూనే అడిగా ఈ సారి ఏ విషయం చెప్తాడోనని. వాడన్నాడు – ” అమ్మా నీ దగ్గర స్మార్ట్ ఫోనే కదా ఉంది”. అవునన్నానేను .”మరి నువ్వెందుకు ఇంత వెనకబడి ఉన్నావ్ ? మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు”.  బయటికెళ్ళే శ్రమ తప్పించాడనుకున్నా.  కాని ఆన్లైన్ లో కుక్కల్ని కొనడమా ?.  సరేలే ఎదో ఒకటి కానీ అని నా లాప్టాప్ తెరిచి OLX వెబ్సైట్  తెరిచాను. పెట్ ఆనిమల్స్ అని టైప్ చేస్తే ఎన్నెన్ని పెంపుడు జంతువుల  ఫోటోలో . ఎన్నెన్ని  ధరలో. ఇంట్లో పెంచుకునే ప్రతి పెంపుడు జంతువూ  ఉందక్కడ. లోహిత్  ఆ సైట్ లో ఉన్న ప్రతి కుక్కను ఫోటో పై క్లిక్ చేసి వివరాలు చూస్తున్నాడు.

నాకు మాత్రం మనసంతా ఎదో బాధ. వెలపెట్టి కొనాల్సి వస్తున్న మూగజీవుల ముఖాలు. అవీ వస్తువుల్లా మారిపోయాయా అన్న ప్రశ్నలు? అసలు ఈ ఆన్లైన్ రోజుల్లో  వ్యాపారం చేయలేని ఏ వస్తువు లేదా ? ఇక దేన్నైనా వస్తువులామార్చి అమ్మిపడేసే కాలం  మొదలైందా అనిపించింది. చివరకి మనిషే ఒక వ్యాపార వస్తువు కింద మారిపోయినట్టుగా  అనిపించింది. నా బుర్రనిండా కుంటా కింటే తిరుగుతున్నాడు. అక్కడ కుంటాను కొట్టి బలవంతంగా దేశం కాని దేశం లాక్కెళ్ళారు. బానిసగా అమ్మారు. ఒక బానిసని ఎన్ని సార్లైనా అమ్మకం కొనడం జరిగిన రోజులు , బలం ఉన్నంత వరకు మనిషిని బలమైన ఆస్థిగా భావించి బలం ఉడిగిపోయాక పట్టించుకోని పరిస్థితులు గుర్తొచ్చాయి. ఇక్కడ ఒక కుక్కని బానిస ట్యాగ్ వేయకపోయినా సెకండ్ హ్యాండ్ వస్తువుల్లా ఒక పట్టికలో చేర్చి కొనుక్కోండి అని అమ్ముతున్నారు. అంతే  తేడా అనిపించింది.

వెంటనే అక్క కొడుకు దీపక్కి ఫోన్ చేశా.” దీపక్ , లోహిత్ డాగ్ కావాలంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ OLX  లో కొన్నాడంట. నేను కూడా చూస్తున్నారా.  కొనమంటావా ? ” అని అడిగా. వాడన్నాడు -” పిన్ని వద్దు ఆన్లైన్ లో అమ్మే కుక్కలు మంచి జాతి కుక్కలు కావు. వ్యాపారం కోసం వాటిని వేరే వేరే బ్రీడ్ కుక్కలతో మేట్ చేయిస్తున్నారు. నాకు రెండు రోజుల టైమివ్వు.  నేను కనుక్కొని చెబుతాను ” అని లోహిత్ కి ఫోన్ ఇమ్మన్నాడు.  వాడితో ఎదో మాట్లాడి వాణ్ని ఒప్పించాడు దీపక్.

జాతి కుక్కలు, జాతి కాని కుక్కలు అని వాటిల్లో కూడా తేడాలా ?. పాపం వాటికి వాటి జాతి తెలుసో లేదో. వాటి జాతి ఇదని పేరు పెట్టిన వాళ్ళెవరో అనైనా తెలుసో లేదో ? మనుషులకే అనుకున్నా ఈ జాతులు. కుక్కల్ని కూడా వదిలిపెట్టలేదే అన్న బాధేసింది. లోహిత్ అల్లరి చేయకుండా మౌనంగా ఉన్నాడు. వాడికి డాగ్స్ గురించి  వాటి జాతి ఎరుక గురించి అర్ధమైందనుకుంటా.

– ” మమ్మీ దీపకన్నా వన్ టూ డేస్ లో చెబుతా అన్నాడుగా వెయిట్ చేద్దాం . దినేష్ గాడి కుక్క నిజంగా మంచి జాతి కుక్క అవునో కాదో రేపు క్లాస్ కెళ్ళాక విషయం చెబుతాను వాడికి ” అని మాట్లాడుతున్నాడు లోహిత్. నా కొడుకు జాతుల గురించి మాట్లాడేఅంత ఎదిగాడు. ఇక వాడికి కుక్కల జాతులతో పరిచయం ఎలాగో కలుగుతుంది.  “రేపెప్పుడో మనుషుల జాతుల గురించి, కులాల గురించి , మతాల గురించి తెలుసుకోవాల్సి పరిస్థితి వాడికి ఏర్పడితే?.  వాడుకూడా వీటిల్లోని దేనికో దానికి నిజాలు మూలాలు తెలుసుకోకుండా  అవగాహన లేకుండా అంశాన్నిగ్రహిస్తే?? ఒక తప్పుడు వాదననో సిద్ధాంతాన్నో తనకు తాను ఆపాదించుకుని  అదే నిజమని దానికి పరిమితమయితే?  అన్న ప్రశ్నలు నా  మెదడులో”.

మనుషులు జాతులుగా కులాలుగా మతాలుగా ఎలా విడిపోయారో  లోహిత్ కి నేర్పించాల్సిన అవసరం ఏర్పడిందని అర్ధమైంది నాకు ఆ క్షణంలో. అందుకే ఎనిమిదేళ్ళ క్రితం అట్ట పెట్టెలో పెట్టిన పుస్తకాల్ని తీసి ఆ సాయంత్రం అంతా దులిపి ఖాళీగా ఉన్న షెల్ఫ్ లో సర్దిపెట్టాను. ఇక ఆ రోజు నుంచి ప్రతి రోజు రాత్రి తనకి నేనే కథలు చెబుతానని వాడికి మాట కూడా ఇచ్చాను.  నా పుస్తక నేస్తాలను తనకిప్పుడు పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయం అనిపించింది.  ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం వదిలిపెట్టదలుచుకోలేదు.

ప్రశాంతంగా  సోఫాలో కూర్చుని ఆ పుస్తకాల వైపు చూస్తున్నాను. చక్కగా అట్ట వేసి పెట్టుకున్న అలెక్స్ హేలీ నవల “ The Roots ” లో నుంచి బయటికొచ్చి కుంటాకింటే  నన్ను చూసి ప్రశాంతంగా నవ్వినట్టే అనిపించింది ఆ క్షణం.

*

Image: Bhavani Phani

w r i t e r ’s  b l o c k                        

ఊడుగుల  వేణు 

 

ఎండావాన కలసివస్తోంది

అక్కడ కుక్కకు నక్కకు పెళ్లి జరుగుతోంది

ఆ వేడుక చూడ్డానికి నేనూ వెళ్లొచ్చాను!

మర్నాడుదయం నిద్రలేచాక తెలిసొచ్చింది

నారెండు చేతుల్ని అక్కడే మరిచొచ్చిన సంగతి!

ఒక్కసారి వెళ్ళిచూడు…

ఆ చేతివేళ్ళ సందుల్లో నీ భావాశ్రిత ఆనవాలు కనిపిస్తాయి!

*

వైకుంఠపాళి నిచ్చెనమెట్ల నడుమ

కాటగలిసిన నా గుండెకాయ

విషసర్పం కడుపులో భానిసత్వం చేస్తోంది

దాని పదబంధశబ్ధాలను డీకోడ్ చేసిచూడు

పుట్టపగిలి చీమలొచ్చినట్టు

మార్మిక పదచిత్రాలన్నీ తిరిగిలేస్తాయి!

*

నేను ద్రవీభవించి సముద్రంలో కలిసిపోయాను

కెరటాలపై ఎగిరిపడే చేపలని చూస్తున్నాను!

dopamine,oxytocin,serotonin

మరియు endorphins…

మెదడులో టన్నులకొద్దీ కెమికల్స్ ఉత్పత్తి …

నా లోలోన ఒక కవిత పురుడుపోసుకుంటోంది

అక్కడిక్కడే somersaults  కొట్టాను

ఉరుముల మెరుపులతో ఆకాశం శివమూగింది

వాయువేగంతో నలువైపులనుండి  pirates…

నాగొంతులోని పసివాక్యాలన్నీ దొంగిలించబడ్డాయి !

నేను పరుగెత్తుకొచ్చి గుజ్జెనగూళ్లలో కూర్చుండిపోయాను

సముద్రం వర్షంలోతడుస్తూ అక్కడే ఉండిపోయింది

చినుకులు కొన్ని నా పాదాలపై రాలిపడగానే

మృతులైన నా అభిమాన కవులంతా

నాకేదో సందేశమివ్వటానికి ప్రయత్నిస్తున్నట్లనిపించింది !

సంతలో,రోడ్డు మీద,ఎక్కడపడితే అక్కడ

Writing pills అమ్మితే ఎంత బాగుండు !

Writing – Writing

Now I am living in one single word : Writing!

లేఖిన్,క్యా ఫైదా…

జహెన్ మే పూల్ నహీ ఖిల్ రే !

*

ఆధునిక వదశాలను నువ్వు చూసి ఉండకపోతే

నా శిరస్సులోపలికి తొంగిచూడు

ఊచకోతలో నెత్తురొడుతోన్న పదాలు కనిపిస్తాయి

పద్యాలలో ఒదగలేక పీనుగలైన అక్షరాలు

అర్ధరాత్రి ఆత్మలై నన్ను పీక్కుతింటాయి

నేనలా నిద్రపోతానో లేదో

నా కనుపాపలురెండు నిన్ను వెతకటానికై పరుగెడుతుంటాయి !

నీకు గుర్తుండే ఉంటుంది “కీట్స్” చెప్పిన మాట…

“only a poem can record the dream”

*

నా చెవిలో ఒకమాట చెప్పివెళ్ళు…

ఈ లోకానికి  నేను కావల్సిన వాడినైనప్పుడు

మరి నీకెందుకంత  కానివాడినయ్యాను !

నిన్ను గాజు సీసాలో బందించి

గ్రహాల అవతలికి విసిరేసిందెవరో చెప్పు

కాలుతోన్న చితి నుండి  – రాలుతోన్న బూడిదలో

నిన్ను కలిపేసిందెవరో చెప్పు

ఇన్నిమాటలెందుకు ,ఓసారిలా వచ్చిపో…

ఒక్క నెత్తుటి చుక్కతో నా గొంతు తడిపి

ఒక్క వేలితో నన్నుతాకి

నా ధర్మాగ్రహాన్ని ఆవాహనం చేసుకునిపో

నాకోసమిప్పుడేమీ లేదు – బతుకు శూన్యమైంది

ప్రపంచాన్ని నడిపే పవిత్రమర్మానివి కదా

నా గుండెకాయను తిరిగి నా దేహంలోకి ప్రవేశపెట్టి చూడు

132 వ గడిని దాటి…

స్వర్గధామం పై పాదం మోపుతాను!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కలల దిక్కు

నారాయణ స్వామి వెంకట యోగి



తొలిపొద్దు కరస్పర్శకు
రెక్కల్ని విచ్చుకున్న
పిట్టల  కొత్త  రాగాల
పాటలు.

యుగాల  యెడబాటులోంచి

గరుకు కొమ్మల చేతులు చాచిన
ఫోర్సీథియా పసుపు పచ్చని పూల
మెత్తని కౌగిళ్ళు.

పచ్చని గడ్డి  వొడిన
వెచ్చగ నిలిచిన
నీటి బిందువుల
ఆత్మీయత.

నింగిన మెరిసే నెమలీకల
వెల్తురు పింఛాల నులివెచ్చని
వింజామరలు.
సుదీర్ఘ శీతల  రాత్రుల
కఠోర తపస్సు లోంచి

డాఫడిల్స్
తొలిపొద్దు గాలులపై వర్షించే
పరాగపు పెదవుల ముద్దులు.

వాకిట్లో
మొండి మంచు కరిగిపోయి,

పూలు విదిల్చిన మాగ్నోలియా
ఆనంద నృత్యం.

యెడతెరిపిలేకుండ  వొణికించిన  చలిలో
ఆపుకున్న యెన్నాళ్ల దుఃఖమో,
జుట్టు విరబోసుకున్న వీపింగ్ చెర్రీ
పూల శోకమై కలబోసుకునే
శతాబ్దాల ముచ్చట్లు.

అస్తి పంజరాల్లా భయపెట్టిన
చెట్ల చేతివేళ్ళకు చిగుర్లతో,
హృదయాల  కాలింగ్ బెల్ మోగిస్తుంది
వసంతకాలం.

పిట్టకూర్పులు వదిలించుకుని
రెక్కలు టపటపలాడించి
కొత్త కలలదిక్కుగా యెగిరిపోతుంది
యిల్లు.

*

swamy1

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- 7

ఆన్ ప్రార్థన

ఆన్ ని నిద్రపోయేందుకు తీసుకువెళ్ళింది మెరిల్లా.
” ఇదిగో చూడు, నిన్న రాత్రి నువ్వు నైట్ గౌన్ వేసుకుంటూ విప్పిన బట్టలన్నీ చిందరవందరగా పడేశావు. అది అస్సలు మంచి అలవాటు కాదు, నేను ఊరుకోను ”
” అయ్యో…అవునా ? రాత్రి నా బాధలో ఏమీ పట్టించుకోలేదండీ. ఇంకనుంచీ అన్నీ శుభ్రంగా మడత పెట్టి కుర్చీలో సర్దేస్తాను. అనాథాశ్రమం లో అలాగే చేయించేవారు…కాకపోతే కొన్నిసార్లు మర్చిపోతుండేదాన్ని, తొందరగా పక్క ఎక్కి ఏదైనా మంచి సంగతి ఊహించుకోవాలనే హడావిడిలో ”
” ఇక్కడ అలా కుదరదు. సరే, ప్రార్థన చేసుకుని నిద్రపో ఇంక ”
” నాకే ప్రార్థనలూ రావు ” ఆన్ ప్రకటించింది.
మెరిల్లాకి కంగారు పుట్టింది.
” అదేమిటీ ? నీకు దేవుడికి దణ్ణం పెట్టుకోవటం నేర్పలేదూ అక్కడ ? చిన్న పిల్లలు తప్పనిసరిగా రోజూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి …దేవుడంటే ఎవరో తెలీదా నీకు , కొంపదీసి ? ”
” దేవుడు అనగా అనాదిఅయి న, అనంతమైన, అవ్యయమైన శక్తి. ఆయన మంచితనమునకు, సత్యమునకు, జ్ఞానమునకు, పవిత్రతకు నిలయమైనవాడు ” ఆన్ వల్లించింది.
మెరిల్లా ఊపిరి పీల్చుకుంది. ” అమ్మయ్య ! నీకు కొద్దో గొప్పో తెలుసు – మరీ ఏబ్రాసిదానివి కాదు. ఎక్కడ నేర్చుకున్నావు ఇది ?”
” ఆదివారం చర్చ్ లో. పవిత్రగ్రంథం లో ప్రశ్నలూ జవాబులూ కంఠస్తం చేయించేవారుగా. నాకు ఆ పదాలు పలకటం బావుండేది- ‘ అనాది, అనంతం, అవ్యయం…పాటలో మాటల్లాగా లేవూ ? అంటే అది పూర్తిగా కవిత్వం కాదనుకోండీ..”
” ఇప్పుడు కవిత్వం సంగతి అవసరమా ? రోజూ రాత్రి ప్రార్థన చేసుకోనివాళ్ళు ఖచ్చితంగా చెడ్డపిల్ల లే…నువ్వూ అలాంటిదానివేనా ఏమిటి ? ”
” నాలాగా ఇలా ఎర్ర జుట్టు ఉన్నవాళ్ళు చెడ్డగానే ఉంటుంటారు ” ఆన్ ఖిన్నురాలైపోయింది ..” దేవుడు కావాలనే నాకు ఎర్ర జుట్టు పెట్టాడట- థామస్ చెప్పాడు నాకు. అప్పట్నుంచీ దేవుణ్ణి పట్టించుకోవటం మానేశాను. అయినా – రోజంతా పిల్లల్ని ఆడించి బొత్తిగా అలిసిపోయాకగానీ నన్ను నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడింక ప్రార్థన చేసే ఓపికెక్కడుంటుంది చెప్పండి ? ”
ఆన్ కి మతశిక్షణ ని తక్షణమే మొదలుపెట్టాలనీ ఎంతమాత్రం ఆలస్యం చేసేందుకు లేదనీ మెరిల్లా గ్రహించింది.
” ఈ ఇంటి కప్పుకింద నువ్వు ఉన్నంత కాలమూ ప్రార్థన చేసి తీరాలి ” – నిష్కర్ష గా చెప్పేసింది.
” మీరు చెయ్యమంటే ఎందుకు చెయ్యను ? తప్పకుండా చేస్తాను. ఈ ఒక్కసారికీ ఎలా చెప్పాలో చెప్పండి. రాత్రికి ఊహించుకుంటాను, మంచి అందమైన ప్రార్థన ని, రోజూ చేసుకుందుకు ”
” ముందు మోకాళ్ళ మీద కూర్చో ” – ఆ సంగతి కూడా చెప్పాల్సివస్తున్నందుకు మెరిల్లా ఇబ్బందిపడింది.
మోకాళ్ళ మీద కూర్చున్న మెరిల్లాకి ఎదురుగా ఆన్ తనూ మోకరిల్లి గంభీరంగా మొహం పెట్టింది.

Mythili1
” అసలు ప్రార్థన ఇలాగే ఎందుకు చెయ్యాలో ? నేనైతే ఎలా చేస్తానో చెప్పనా – పె..ద్ద విశాలమైన పొలం లోకో, లేకపోతే దట్ట..మైన అడవి లోపల్లోపలికో- వెళ్ళి, తల పై..పై..కి ఎత్తి- అంతులేని ఆకాశపు నీలిరంగుని చూస్తూ – అప్పుడు, ప్రార్థన దానంతట అదే వచ్చేస్తుంది. సరే, నేను సిద్ధం- చెప్పండి ఏం చెప్పాలో ? ‘’
మెరిల్లా ఇంకా ఇబ్బంది పడిపోయింది. బాగా చిన్నపిల్లలు చెప్పుకునే ” నన్ను నిద్రింపనీ దేవా ” నేర్పుదామనుకుంది ముందు. కాని , తల్లి ఒళ్ళోంచి భద్రంగా పక్కమీదికి దొర్లే పాపాయిల ప్రార్థన అది – ఈ పిల్లరాకాసికి తగదనిపించింది ఆమెకి. ఆ పైనున్న దేవుడి ప్రేమ గురించి ఆన్ కి ఏమీ తెలీదు, ఏ లెక్కా జమా లేదు…ఎందుకంటే మనుషుల ఆప్యాయత రూపం లో దాన్ని ఆమె పొందలేదు కనుక – ఈ సంగతి మెరిల్లాకి అర్థమైంది. … ” నీ అంతట నువ్వు ప్రార్థన చేసుకునే వయసు వచ్చింది నీకు. దొరికిన వాటికోసం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని, ఇంకేం కావాలనుకుంటున్నావో వినయం గా అడుగు, చాలు ”
” సరే. నాకు వచ్చినట్లు చెప్తాను అయితే ” – మెరిల్లా ఒళ్ళో చెక్కిలి అనించుకుని అంది ఆన్. ” పరలోకమందున్న మా ఘనమైన తండ్రీ ”… తలెత్తి , ” చర్చ్ లో ఇలాగే కదా చెబుతారు, ఇంట్లోనూ అలాగే అనచ్చా ? ” అడిగి, జవాబుకోసం చూడకుండా కొనసాగించింది.

Mythili2
” పరలోకమందున్న మా ఘనమైన తండ్రీ ! ఆహ్లాద శ్వేత మార్గాన్నీ, ప్రకాశమాన సరోవరాన్నీ, బోనీ [ జెరేనియం ] నీ[ చెర్రీ చెట్టు ] హిమరాణినీ – నాకు ఇచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు. నిజంగా నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఇకపోతే, నాకు కావల్సినవి చాలా చాలా ఉన్నాయి , ఇప్పుడే అన్నీ అడిగెయ్యలేను, . రెండు ముఖ్యమైనవి మాత్రం అడుగుతున్నాను- ఒకటి- నన్ను గ్రీన్ గేబుల్స్ లో ఉండిపోనియ్యాలి . రెండు – నేను పెద్దయాక అందంగా అయిపోవాలి. ఇప్పటికి ఇంతే- ఇట్లు మీ విధేయురాలు, ఆన్ షిర్లే. ”
లేచి నిల్చుంటూ ఆత్రంగా అడిగింది-” బాగా చెప్పానా ? ఇంకొంచెం తీరిగ్గా ఆలోచిస్తే చక్కటి మాటలు వచ్చి ఉండేవి ..”
ఆన్ చేత ఆ అసాధారణమైన ప్రార్థన చేయించింది అజ్ఞానమే గానీ దేవుడి పట్ల ఆమె కి అమర్యాదేమీ లేదని గట్టిగా గుర్తుచేసుకుంది గనుక, మెరిల్లా తేరుకుంది. ఆన్ ని పడుకోబెట్టి దుప్పటి కప్పి కొవ్వొత్తి తీసుకుని వెళ్ళబోతూ ఉంది….వెనక నుంచి ఆన్ పిలిచింది.
” ఇప్పుడే గుర్తొచ్చిందండీ…మీ విధేయురాలు అనే చోట ఆమెన్ అని ఉండాలేమో కదా ? చర్చ్ లో అలాగే అంటారు…ఇందాక మర్చిపోయాను. ప్రార్థన ఎలాగోలా పూర్తిచెయ్యాలి గదా అని, ఉత్తరాలు రాసేప్పుడు లాగా అన్నాను- ఏం పర్వాలేదంటారా ? ”
” ఆ.పర్వాలేదులే. ఇంక నిద్రపో, మంచి పిల్లలాగా. గుడ్ నైట్ ”
”నిన్న చెప్పబుద్ధి కాలేదు… ఇవాళ మటుకు మనస్ఫూర్తిగా గుడ్ నైట్ చెబుతున్నా…” – ఆన్ సుఖంగా దుప్పటి ముసుగుపెట్టుకుంది.
మెరిల్లా వంటింట్లోకి వెళ్ళి కొ వ్వొ త్తిని బల్లమీద పెడుతూంటే మాథ్యూ అక్కడే ఉన్నాడు.
” ఇది విన్నావా మాథ్యూ కుత్ బర్ట్ ? ఈ పిల్లకి తక్షణం మతవిజ్ఞానం ఇవ్వాలి. ఏనాడూ సరిగ్గా ప్రార్థనే చెయ్యలేదట …ఎంత ఘోరమో ! కావల్సిన పుస్తకాలన్నిటినీ రేపు పాస్టర్ ఇంటినుంచి పురమాయిస్తాను…రోజూ నూరిపోస్తేగాని లాభం లేదు. ఆదివారం చర్చ్ కి పంపితే ఇంకా నేర్చుకుంటుంది ..కాని చర్చ్ కి మంచిబట్టలు వేసుకోవాలి కదా , దీనికేమో సరైనవి లేవు…త్వర త్వరగా కుట్టించాలి. నాకిప్పట్లో తీరికన్నది ఉండదనిపిస్తోంది. ఇన్నాళ్ళూ తేలిగ్గా గడిచింది నా జీవితం, ఇప్పుడు నేనేం చెయ్యగలనో పరీక్ష పెట్టినట్లుంది . కానీలే, కష్టపడద్దూ మరి, లేకపోతే ఎంత అప్రతిష్ఠా..బరువు నెత్తికెత్తుకున్నామాయె ! ”
మాథ్యూ చిద్విలాసంగా చూస్తుండిపోయాడు.
[ ఇంకా ఉంది ]

కడు చక్కనిది చిలికిన చల్ల!

 అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకంటికి కనిపించిన ప్రతి దృశ్యమూ, చుట్టూ జరిగే వివిధ ఘటనలు, పచ్చిక బయళ్ళు, కొండలు, రాళ్ళు-రప్పలు, చెట్లు-పుట్టలు, ప్రాణులు, కనుమలు, గొడవలు, మనస్తాపాలు, దౌర్జన్యాలు, వేలాకోలాలు ఏవీ కీర్తనకి అనర్హం కాదన్నట్టు శ్రీవేంకటేశునికి అన్వయం చేసి పాడిన ఘనత అన్నమయ్యది.

విజ్ఞానులూ పండితులేకారు, పామరులూ చోరులూ అల్పులూ కూడా శ్రీవేంకటపతిరూపులే అన్న సర్వసమతా దృష్టి అన్నమయ్యది. కలవారింటి స్త్రీలేకారు, వారికి సేవలు చేసే దాదులనూ దాసీమణులనుకూడా అలమేలుమంగ రూపాలుగానే భావించి కీర్తనలు రాశాడు. ఒళ్ళు అలసిపోయేట్టు కష్టజీవనం చేసుకునే స్త్రీలనే కాదు, ఒళ్ళమ్ముకునే వేశ్యలుకూడా వేంకటపతి భక్తులేనని వారినీ తన కీర్తనల్లోకి ఎక్కించాడు.

అన్నమయ్యకున్న సామాజిక స్పృహ ఈ కీర్తనలో కనవచ్చు. ఇందులోని నాయిక(లు) మజ్జిగమ్ముకునే గొల్లభామ(లు). ఎంత సమయం అయినా సరే తీసుకెళ్ళిన మజ్జిగంతా అమ్మితేగానీ ఇంటికి తిరిగిరాలేదు. అమ్మి నాలుగురాళ్ళు తెచ్చుకుంటేగానీ జీవనం గడవదు మరి ఆ పేదరాలుకి. ఆమెను చూసి జాలిపడుతున్నాడు అన్నమయ్య. ఆమె అమ్ముతున్న మజ్జిగ గొప్పతనమేంటో ప్రకటిస్తూ జనాలచేత కొనిపించే ప్రయత్నం చేస్తున్నాడు కవి!

ఆమె పేదరాలే అయినప్పటికీ సౌందర్యంలో, సొగసులో మాత్రం చాలా ధనికురాలే. ఆమె అందాలను వర్ణిస్తూ, మజ్జిగను అమ్మించే యుక్తిని చూస్తుంటే నేటి advertising techniques అన్నిటికీ తాత అన్నమయ్య అనాలనిపిస్తుంది.

కొన్ని కీర్తనల్లో పైనపైన కనిపించే భావమొకటుంటుంది, అంతరార్థం మరోటి ఉంటుంది. ఈ కీర్తనలో మరో అంతరార్థం ఉంది. అదేమిటో చివర్లో చూద్దాం.

గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరచి పాడిన ఈ కీర్తనని ఇక్కడ విన ఆస్వాదించండి.

AUDIO LINK : మూల మూలన అమ్ముడు చల్ల / mUlamUlana ammuDu challa

 

పల్లవి
మూలమూల నమ్ముడుఁజల్ల ఇది
రేలుఁ బగలుఁ గొనరే చల్ల

చరణాలు
పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ –
జక్కనిది చిలికిన చల్ల
అక్కునఁ జెమటగార నమ్మీని యిది
యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల

వడచల్లు మేని జవ్వని వొకతి కడు-
జడియుచుఁ జిలికిన చల్ల
తడఁబడు కమ్మనితావులది మీ –
రెడయకిపుడు గొనరే చల్ల

అంకులకరముల వొయ్యారొకతి కడు –
జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది
యింకానమ్మీఁ గొనరే చల్ల

కీర్తన మూలం : తితిదే అన్నమాచార్య సంకీర్తనల సంపుటం 5, పుట 231, రేకు 70, కీర్తన 229

తాత్పర్యం  :
వాడవాడకూ మూల మూలకూ, రాత్రనక పగలనక ఎత్తుకెళ్ళి అమ్మబడే మజ్జిగ ఇది, మీరందరు కొనుక్కుని తాగండి.

నిండైన చన్నులతో పసివయసులోనున్న అందమైన యువతి చిలికినది ఈ మజ్జిగని. ఎండలో వీధి వీధీ తిరుగడంవల్ల ఆ గొల్లభామ గుండెలపైన చెమటలు కారిపోతున్నాయి. ఈ మజ్జిగ వెనక ఇంత శ్రమ ఉంది. ఆలస్యం చేస్తే ఇలాంటి మజ్జిగ దొరకదు, త్వరపడి ఇప్పుడే కొనుక్కోండి.

తాపాన్ని వెదజల్లే అందమైన దేహంగల అందగత్తె ఒయ్యారంగా కదులుతు చిలికినది ఈ మజ్జిగని. దారిన వెళ్ళేవారిని తడబాటుకు లోనుచేసే కమ్మని సువాసనగల మజ్జిగ ఇది. దాటెళ్ళిపోకుండా కొనుక్కోండి.

చిగురుటాకులవంటి చేతులున్న వొయ్యారి భామ ఎంతో భయభక్తులతో చిలికినది ఈ మజ్జిగని. వేంకటగిరిపైనున్న స్వామిని పతిగా పొంది అతన్ని వేడుకలలో తేలించే యువతి ఇంకా అమ్ముతూ ఉంది. కాబట్టి జనులారా నమ్మి కొనుక్కోండి. (యింకానమ్మీ కొనరే చల్ల — ఇందులో నమ్మీ అన్నది శ్లేషగా తీసుకోవచ్చేమో)

నా విశ్లేషణ  :

మండేవేసవిలో దేహాన్ని చల్లార్చి ఎండకు ఉపశమనం కలిగించేందుకు ఈ రోజుల్లో పలు రకాల కూల్‌డ్రింకులు, వాటినమ్మే అంగళ్ళు అడుగడుగునా ఉన్నాయి. ఎవరి ప్రాడక్ట్ ను వారు అమ్ముకునేందుకు పోటీలు పడి వైవిద్యమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇన్ని artificial drinks లేవు. పానీయాలను నిలవుంఛే, చల్లబరిచే టెక్నాలజీలు లేదు. ప్రకృతి సిద్ధమైన మజ్జిగ, కొబ్బరి నీళ్ళవంటివి మాత్రమే ఉండేవి. నేటి పానీయాలను ధనవంతులు తయారు చేస్తున్నారు. ఆ రోజుల్లో మామూలు మధ్యతరగతి వాళ్ళు మజ్జిగ చిలికి అమ్మేవారు. వారికి అదే జీవనాధారం. కష్టజీవులు. వారు పడే శ్రమ, మజ్జిగమ్మే తీరు అన్నమయ్యలో కలిగించిన ప్రభావంతో ఎన్నెన్నో “చల్ల”టి కీర్తనలో రాయించింది. గొల్లభామలు, రేపల్లె, పాలు, పెరుగు, నవనీతం, మజ్జిగ, శ్రీకృష్ణుడు – ఇంకేం కావాలి యే వైష్ణవకవికైనా?

“పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకతి, కడు చక్కనిది చిలికిన చల్ల” అమ్మే చోట చిలికిన వనిత చన్నుల చక్కదనం గురించి ప్రస్తావన తీసుకురావడం, అమ్ముతున్న స్త్రీని వర్ణించడం ఇవన్నీ వినియోగదారులను ఊరించే వ్యాపారయుక్తులు. నేడు మగవాళ్ళ షేవింగు క్రీముల ప్రకటనల్లో ఆడవాళ్ళని చూపిస్తున్నట్టయితే కాదు.

వడచల్లు మేని జవ్వని అని అన్నమయ్య అనడంలోని ప్రత్యేక భావం ఏంటి? మజ్జిగ ఎవరు చిలికితేనేం? చల్లగానే ఉంటుందిగా? ఈ గొల్లెత అమ్మే మజ్జిగ ఇంకాస్త ఎక్కువ చల్లగా ఉంటుంది అని నొక్కి చెప్పే ఉద్దేశంతోనే “వడచల్లు మేని జవ్వని” అని చిలికిన యువతిని వర్ణించాడు. వడచల్లు మేని అన్నప్రయోగానికి ‘తాపమును చిమ్మే దేహం’ అనీ, ‘చల్లని దేహం’ అనీ రెండు అర్థాలున్నాయి. పాఠకులు మీ భావుకతకి తగినట్టు అన్వయించుకోండి.

“నువ్వమ్మే మజ్జిగ వేడిన తగ్గించుతుంది, నీ అందమేమో తాపాగ్నిని రగిలిస్తుంది” అని మజ్జిగమ్మే గొల్లభామతో సరసమాడాడు “కాళమేఘం” అనే ఒక ప్రాచీన అరవ కవి.

తడబడు కమ్మనితావులది – అటువైపుగా వెళ్ళేవారిని కమ్మని సువాసన ద్వారా ఆపిమరీ ఆకర్షిస్తుందిట. ఆ సువాసన మజ్జిగదైనా కావచ్చు, పరిమళ కస్తూరిని మేన రాసుకునే ఆ గొల్లెతదైనా కావచ్చు అన్నది కవిచమత్కారం!

“జడియుచుఁ జిలికిన”, “జంకెనలఁ జిలికిన” – ఈ రెండు ప్రయోగాల్లోనూ భయపడుతూ, తికమకపడుతూ చిలికింది ఆ యువతి అని రాశాడు. ఎందుకు అలా రాశాడు? ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది. పెరుగులో నీళ్ళు పోసి వెన్నకోసం కవ్వంతో చిలికితే మజ్జిగ మిగులుతుంది. నీళ్ళు పోసినకొద్ది మజ్జిగ మొత్తం(quantity) పెరుగుతుంది, అయితే పలచనైపోతుంది! నీళ్ళు తక్కువపోస్తే కుండ నిండదు. అందుకే ఆ వొయ్యారిభామ తికమకగా భయపడుతూ మజ్జిగ చిలుకుతుంది అని అన్నాడేమో అన్నమయ్య!

దైవకటాక్షం అనబడే మజ్జిగ రేయనక పగలనక, వాడవాడలా, మూలమూలలా వ్యాపించి ఉంది. శ్రీవేంకటేశ్వరుణ్ణి భక్తితో కొలిచి, మనస్పూర్తిగా నమ్మి మానవ జన్మ అనే మండుటెండనుండి ఉపశమనం పొందండి అని వైష్ణవులు ఈ కీర్తనని అన్వయించి తాత్విక అర్థం చెప్పవచ్చు. నేను మాత్రం అన్నమయ్య సామాజిక దృక్పథాన్నీ, కవి హృదయాన్ని చూస్తున్నాను ఈ కీర్తనలో!

కొన్నిపదాలకు అర్థాలు (Context based Meanings)

చల్ల = మజ్జిగ
రేలు = రాత్రి
పిక్కటిల్లు = పిగులు, ఉబుకు, పొంగు
చన్నులు = రొమ్ములు
గుబ్బెత = దిట్టమైన చన్నులున్న యువతి
అక్కున = రొమ్ములమీద, గుండెపైన
వడచల్లు మేను = తాపము చల్లేటి దేహం, చల్లని దేహం
జవ్వని = అందగత్తె
జడియు = కదులు, చలించు, భయపడు
కమ్మనితావు = కమ్మని సువాసన
నేడయక = వెళ్ళిపోకుండ, దూరమవ్వకుండ
అంకులకరములు = చిగురుపోలిన మెత్తని చేతులు, పల్లవపాణులు
జంకెన = భయపడుతు, తికమకపడుతు

*

మధుర హృదయం

సంపంగి, వేశ్య, 18 ఏళ్లది
ఆమె తల్లి

తల్లి: ఒసే సంపంగీ, రామినీడు లాంటి రసికుడు మళ్ళీ తారసపడితే, అంకాలమ్మ తల్లికి ఒక మేకను బలి ఇవ్వొచ్చు. గోపాలస్వామి గుడికి ఒక మంచి ఆవుదూడను దానం చెయ్యొచ్చు. సంపదలిచ్చే తల్లి కనకమాలక్ష్మికి పూల కిరీటం చేయించొచ్చు. మొత్తానికి దేవుడి దయవల్ల హాయిగా ఉన్నాం.
వాడివల్ల మనకొరిగి పడిందేమిటో ఇప్పటికైనా అర్థమైందా? ఏనాడూ ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్క గుడ్డముక్క కొన్నది లేదు. ఒక జత చెప్పులైనా ఇచ్చింది లేదు. కనీసం కాస్త మంచి సెంటు బుడ్లైనా తెచ్చి పెట్టింది లేదు. వాడిచ్చిందల్లా, శుష్క వాగ్దానాలూ, శూన్య హస్తాలూ, నిష్ఫలమైన ఆశలు. ఎప్పుడు చూసినా ‘మా అయ్య చచ్చి ఎస్టేటు నా చేతికొస్తే అంతా నీదే’ అని గొణగడం తప్ప ఇచ్చిందీ లేదు, చచ్చిందీ లేదు. ఏంటీ, నిన్ను చట్టప్రకారం పెళ్ళాడతానని ప్రమాణం చేశాడా?
సంపంగి: అవునమ్మా! అందరు దేవుళ్ళ మీదా ప్రమాణం చేశాడు.
తల్లి: నువ్వదంతా నిజమని నమ్మేశావా? మొన్నొక రోజు వాడేదో అప్పు తీర్చాలంటే నీ ఉంగరం తీసిచ్చేశావు. నాకొక్కమాట చెప్పలేదు. వాడది అమ్ముకొని తాగేశాడు. జంటపేట గొలుసుకూ అదే గతి పట్టించావు. నాలుగు సవర్ల గొలుసు. తెనాలిలో మంచి కంసాలి ఉన్నాడంటే, మల్లేశాన్ని పురమాయించి తెప్పించానది. ఇప్పటికైనా రామినీడు మనకివ్వాల్సింది ఇస్తే బాగుంటుంది. అతను నీకిచ్చిన పట్టు బట్టల గురించి ప్రత్యేకంగా నేను చెప్పేదేమీ లేదు. అవి ఏ విటుడైనా సాధారణంగా ఇచ్చేవే! ఏమైనా రామినీడు గొప్ప విటుడేమీ కాదు.
సంపంగి: కానీ, అతను చాలా అందగాడమ్మా. ఎప్పుడూ గడ్డం పెరగనివ్వడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. అలా చెప్పే టప్పుడు తరచూ కళ్ళెంట నీళ్ళు పెట్టుకుంటాడు. పైగా అతను జమీందారు భూపతిరాజు కొడుకు. దేవుడు మేలు చేసి ఆ ముసలాయన చచ్చిపోయిన మరుక్షణమే మేము పెళ్లి చేసుకుంటాం.
తల్లి: (వ్యంగ్యంగా) సరేనమ్మా సంపంగీ, మనకు చెప్పులు కావాల్సొస్తే, దుకాణం వాడు ‘రెండు వరహా లివ్వండి’ అంటాడు; మనమేమో, ‘అయ్యో, మా దగ్గర డబ్బు లేదు, ఆశలున్నాయి, కాసిని తీసుకొని చెప్పులివ్వు’ అనాలి. కిరాణా కొట్టు వాడు బియ్యం ఖరీదు ఇవ్వమని కబురు పెడతాడు; మనం ‘కాస్త ఆగండి. భూపతిరాజు త్వరలో చచ్చిపోతాడు. మా అమ్మాయితో అతని కొడుకు పెళ్లి కాగానే మీ బాకీ చెల్లిస్తాం’ అనాలి. సిగ్గులేదంటే నీకు? ఊళ్ళో ఇంతమంది సానులున్నారు. ఒక జత చెవిపోగులు, ఒక నెక్లేసు, కనీసం ఒక ఖరీదైన బట్టల జత లేనిది నువ్వు గాక మరెవ్వతైనా ఉందా?
సంపంగి: నేనెందుకు సిగ్గు పడాలమ్మా? వాళ్ళేమైనా నాకంటే అందంగా ఉన్నారనా, సంతోషంగా ఉన్నారనా?
తల్లి: కాకపోవచ్చు. కానీ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళ పనేంటో వాళ్లకు బాగా తెలుసు. విటుల పొగడ్తలకు వాళ్ళు లొంగిపోరు. నువ్వు రామినీడుకి కట్టుకున్న భార్యలాగా చాలా విశ్వాసంతో ఉంటున్నావు. మరో మనిషిని కన్నెత్తి చూడట్లేదు. అదే నీతో సమస్యగా ఉంది. మొన్నటికి మొన్న ఆ గొల్లపాలెం కుర్రాడు రెండొందల వరహాలు ఇస్తానని వచ్చాడు. వాడి పొలంలో పంట మొత్తం అమ్మితే వచ్చిన సొమ్ము అది. ఆ కుర్రాడు కూడా నీటుగా గడ్డం గీసుకొనే ఉన్నాడు. నువ్వు వాణ్ని ఎగతాళి చేసి పంపేసి నీ మన్మధుడు రామినీడుతో పడుకున్నావు.
సంపంగి: అమ్మా, నువ్వు లక్ష చెప్పు. రామినీడు స్థానంలో పేడకంపు కొట్టే ఆ గొల్లపాలెం వాణ్ని ఎలా అంగీకరిస్తాను? రామినీడు చర్మం మెత్తగా, మృదువుగా పట్టులా ఉంటుంది.
తల్లి: బాగుంది. గొల్లపాలెం వాడు పేడ కంపు కొట్టాడు. మరి మోతుబరి రంగయ్య కొడుకు రాజగోపాలాన్ని ఎందుకు వద్దన్నావు? ఒక్క రాత్రికి నూరు వరహాలిస్తానన్నాడతను. అతనందంగా లేడా? నాగరీకుడు కాదా? పోనీ, నువ్వు ప్రేమించిన బాలాకుమారుడి కంటే ఒక్కరోజైనా వయసులో పెద్దవాడా?
సంపంగి: నన్ను రాజగోపాలంతో చూస్తే, ఇద్దర్నీ కలిపి చంపేస్తానన్నాడు రామినీడు.
తల్లి: ఆహా ఏం బడాయి? ఇట్లా ఐతే నువ్విక వేరే విటుల్ని చూడాల్సిన పనిలేదు. పతివ్రతవై పోవచ్చు. ఈ తళుకు బట్టలు మానేసి గుళ్ళో అమ్మవారిలా తయారవ్వొచ్చు. సరే, వదిలేయ్! ఇవాళ కాముని పున్నమి కదా, నీ ప్రియుడు పండక్కేమి కానుక ఇచ్చాడు?
సంపంగి: నీకెప్పుడూ డబ్బు రంధేనామ్మా? ఏమిచ్చాడు, ఏమివ్వబోతాడు? ఇదే గోలా? అతడు తన్ను తాను నాకర్పించేసు కున్నాడు. అంతకంటే ఎక్కువ పొందగలిగిన వేశ్యలెవరున్నారు? అరె… ఊరుకోమ్మా, ఏడవకు! వాళ్ళ నాన్న ఇవాళ పెద్ద మొత్తంలో డబ్బిస్తానన్నాడట. అది మొత్తం నాకే ఇస్తానన్నాడు. అతను చాలా ఉదారుడమ్మా! భయపడకు.
తల్లి: ఇదింకో అబద్ధం కాకుండా ఉంటే బాగుండు. నామాటలు గుర్తుపెట్టుకోవే సంపంగీ! ఏదో ఒకరోజు నీ తెలివి తక్కువ తనాన్ని నీకు గుర్తు చేసే సందర్భమొకటి తారసపడుతుంది.

బాల్కనీ లోవూయల! 

 డా. కోగంటి విజయ బాబు

 

 

బాల్కనీ లోవూయల!

తన ఉనికి,అస్తిత్వం తెలుసుకోకుండానే,

వంటరిగా!

 

ఎదురుగా నిండుగా పూచిన వేప చెట్టుని,

రోడ్డుపై ఆడే పిల్లల్ని,

ఎదురింటి మనుషుల్ని,

చూస్తూ కూడా చూడనట్లుగా

ఖాళీగా,గాలిలో,

గాలినిచూస్తున్నట్లున్న ఊయల!

 

నాలానే, నా మనసు లానే

అన్నిటిని మోస్తూ, ఊగుతూ

కానీ వంటరిగా,

మనసులేని,మనసంటే తెలియని వూయల!

 

దానికి ఇంద్ర ధనువు,ఎండ వేడీ ఒకటే!

కొందరి మనుషుల్లా

చూరును పట్టి వ్రేలాడే గొలుసుకు తగిలింపబడి ఉండటమే దానికితెలుసు.

అపుడపుడూ నావైపుతిరిగి,

ఖాళీగా పిలుస్తున్నట్లుండే ఊయల!

 

కాలం గడుస్తుందని దానికి తెలుసో లేదో!

ఎవరినీ, ఏ భావాలనూ పట్టించుకోక

ఏభావమూ కాక, కాలేక

వంటరిగా!

 

అశరీరికి, మనసున్న వారికి

స్థిత ప్రజ్ఞత

కుదరదేమో!

ఆ అవసరమూ లేదేమో!

*

koganti

 

 

 

 

 

 

 

నువ్వు చాలా లక్కీ…

వెల్వెట్ కాని వెల్వెట్ 

లాల‌స‌

 

లాలస

నేనొక రహస్యానికి అందమైన నవ్వు ముసుగు వేశాను ప్రియా, బహరూపియా…

 ఈ అందమైన పాట ఇద్దరు హింసా పీడితుల గుండె చప్పుడులా వినపడుతుంది బాంబె వెల్వెట్ లో. సినిమా కూడా అందమైన ముసుగు లాంటిదే. బహరూపియా లా ( మారు వేష కత్తె లేదా మారువేషగాడి)లానే ఉంటుంది.  పరికించి చూడకపోతే ఈ సినిమాలోని  అసలు రహస్య‌మైన  క్రాప్టింగ్, కథనంలో తొణికిసలాడే కవిత్వమే కనపడదు. 60 ల నాటి బొంబాయి నైట్ లైఫ్, నేర ప్రపంచానికి ఒక ఒపెరా లాంటి చిత్రరూపమది. అందుకే సినిమా మేకింగ్ చర్చల్లో, కళాత్మకతకు ప్రామాణికతలు నిర్దేశించుకునే పెంచుకునే క్రమంలో.. ఇవాళ కాదు రేపైనా noir తరహా సినిమాల ఒరవఢిలో ఒక కీలకమలుపుగా ఉండిపోతుంది. 

కథ ఏమీ లేదు అనిపించవచ్చు రెండు ముక్కల్లో చెబితే.

ఇందులో ఒక్కరంటే ఒక్క‌రు  కూడా మర్యాదస్తులు కారు.  కనీసం సగటు మానవులూ కారు. హింసతోనో,  ప్రతిహింసతోనో  తమ భౌతిక లక్ష్యం చేరడానికి  హత్య, మోసం, కుట్ర, ఛిద్రం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే వారే. ఇక్కడ నైతిక‌తకు తావు లేదు. డబ్బు, హోదా, అధికారం నిచ్చెన ఎలాగైనా ఎక్కాల‌నే  అరాటమే వారి ఆత్మ‌. ఇక పాత్రలకు వస్తే  , నేర ప్రపంచం అంచుల్లోబాల్యం చితికిపోయిన వాడు  బాక్సర్ బలరాజ్ ( రణబీర్ కపూర్).  జీవితంలో బిగ్ షాట్ కావాలంటే గన్ షాట్లు త‌ప్ప‌వ‌నుకునే వాడు.   నేరస్తులు తన కుటుంబాన్ని మింగేస్తే పెద్ద పాటకత్తె కావాలనుకుని బొంబాయికి ఒంటరి గా వచ్చిన అందమైన గులాబీ లాంటి జాజ్ సింగర్ రోజీ (అనుష్క శ‌ర్మ‌)..  రోజీ కోసం ఎన్ని తూటాలన్నా పేల్చడానికి సిద్దమయ్యేంత వివశత్వం బలరాజ్కి.  తన వ్యాపార సామ్రాజ్యాన్ని నల్ల బజారులో, రియల్ ఎస్టేట్లో విస్తరించాలనుకునే క్రూరమైన అందమైన వ్యాపారి కంబట్టా ( కరణ్ జోహర్),  కంబట్టా పెట్టుబడి దారు ప్రతినిధి అయితే అతని ప్రత్యర్ధి కమ్యూనిస్టు ప్రతినిధి…. ఈ ఇద్దరు పెద్ద తలకాయల ఉచ్చులో  వేడినెత్తురు బలరాజ్, నిశ్బబ్దం ఖంగుమనిపించే రోజీ చిక్కుకుంటారు.

 చిన్న కథే. కానీ నేర ప్రపంచంలోనూ అంతరాలు ఉంటాయి.లక్ష్యం, కాంక్షా ఒకటే కావచ్చు కానీ  అక్క‌డ కూడా  కొందరు పాత్రధారులైతే మరి కొందరు సూత్రధారులౌతారు. పాత్రధారులు సూత్రధారులవ్వానుకుంటే నెత్తురు ఏరులై పారుతుంది. నీ నేర ప్రపండానికి నేను  కేవలం పాత్రధారును కాదు నాకు కూడా కాస్త వాటా ఇమ్మని బలరాజ్ కంబట్టాను అడుగుతాడు ఒకసారి. కంబట్టా  ఏమీ మాటాడడు.. గది నుంచి బయటకు వచ్చి విరగబడి నవ్వు కుంటాడు. ఈ నవ్వులో మర్మం మీకు అర్ధం అయితే ఈ సినిమా అర్ధమైనట్లే. 

 సినిమాను నేరం, హింస, సంగీతం ఒకదాని తరువాత ఒకటి నిశ్శబ్దంగా ఆవిష్కరించుకుంటే పోతూ ఉంటాయి. కథ బొంబాయిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం నారిమన్ పాయింట్ ఎలా ఏర్పడింది, రియల్ ఎస్టేట్ కుంభకోణాలు, టాబ్లాయిడ్ యుద్ధాలు మధ్య నడుస్తుంది, కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఎటువంటి మెలోడ్రామా లేకుండా ( ఘనత వహించిన మన రాంగోపాల్ వర్మ గారి మార్కు మెలోడ్రామా అసలే లేదు)  ఇందులో మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేసే వేగం ఉండదు, పగలబడే హాస్యమూ లేదు, వేడెక్కించే రొమాన్సూ లేదు. అసాధారణ స్థాయి అందుకోవడానికి నేరం నుంచి బయలు దేరిన అందరినీ చివరకు  నేరమే తరముకుంటూ ఎలా వస్తుందో చూడవచ్చు. ఒక కవితాత్మక న్యాయంతో సినిమా ముగుస్తుంది. 

Bombay-Velvet

కథనం లో నిదానం భరించే ఓపిక లేకపోతే మీకు నచ్చకపోవచ్చు ఒకసారి ధియేటర్ వెళ్ళాక కూడా సినిమా మిమ్మల్ని పట్టుకునే ఉంటుంది అని డైరెక్ట‌ర్ అనురాగ్ కాశ్య‌ప్ సినిమా ఫ్లాప్ త‌రువాత అన్న మాట   ముమ్మూటికీ నిజం. జ్ఞాన్  ప్రకాష్ రాసిన ముంబై ఫాబుల్స్ పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమా గురించి ఇలా చెప్పుకోవచ్చు.కొన్ని నవలలకు గొప్ప విజువల్ అప్పీలు ఉంటుంది. వాటిని చదువుతుంటే ఒక మంచి సినిమాలోని దృశ్యాలు ఒక దాని తరువాత ఒకటి మన కళ్ళ ముందున్నట్లు ఉంటుంది. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఏదైనా సినిమాను  చూస్తే గొప్ప శిల్పంతో అత్యంత సూక్ష్మ వర్ణనతో రాసిన నవలలోని పుటల్లా అనిపిస్తుంది. బాంబే వెల్వెట్ అలాంటి అరుదైన పుస్తకం లాంటి సినిమా.

 ఇందులో  లోపాలు లేవ‌నీ కాదు. ఉన్నాయి. ఒక శిల్పం చెక్కుకుంటూ వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఏ పాత్ర‌నీ,  ఏ స‌న్నివేశాన్నిఇంక‌నివ్వ‌దు. ప్రేమ‌, నేరం స‌హా ఏ భావాభినేశం కూడా  మ‌న‌కి ఎక్కేలోపే ఇంకో స‌న్నివేశం వ‌చ్చేస్తుంది. బ‌హుశా చాలా మందికి న‌చ్చ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మూ అదే. కానీ అదో శిల్పంలా చూస్తే న‌చ్చ‌నూ వ‌చ్చు. అస‌లు విష‌యం ఏమిటంటే సినిమాను ఆర్ట్ ఫాంగా రాసే వాళ్ళు చేసిన స‌మీక్ష‌ల‌లో  ఎవ‌రూ ఈ సినిమాను చూడ‌ద్దు అన‌లేదు. సినిమా మీద కాకుండా  సినిమా మీద త‌మకున్న అంచ‌నాల‌ను ( సిద్దాంతమూ, రెగ్యుల‌ర్ గా సినిమాల్లో ఉండ‌వ‌ల‌సిన మ‌ర్యాదా మ‌ప్పిత‌మూ) రివ్యూ చేసే  చాద‌స్తం,అజ్క్షానం మంద ఇంట‌ర్నెట్  లో పోగై  అంతా పోగై డిజాస్టర్ అంటూ సమీక్షలు రాసి చంపేశారు. ప్రేమించిన వాళ్ళు ప్రేమించుకోక పెళ్ళెందుకు చేసుకుంటారు? ఏస్ త‌ప్పు ఇది విముక్తి సిద్దాంతానికి వ్య‌తిరేకం అనుకునే చాద‌స్తం మంద కూడా సినిమా రివ్యూలు రాసేసే ఇంట‌ర్నెట్ కాలం మ‌రి. అనురాగ్ కాశ్య‌ప్ భారీ మూల్యం చెల్లించాడు. 

 అయితే కొన్ని సినిమాలకు ప్రేక్షకుల మెప్పు కోసం కాదు కానీ సినిమా మేకింగ్ స్థాయిని పెంచడానికి తరువాత కాలంలో ఉపకరిస్తాయి. వక్త్ సినిమా ( గురుదత్) విడుదలై యాభై సంవత్సరాల పై మాటే. అది కూడా ఆ  రోజు ప్రేక్షకులకు నచ్చలేదు.కానీ సినిమా మీద ఇష్టం ఉన్న సినిమా వాళ్ళని అడగండి వక్త్ సినిమా మాకు ప్రాణం అని చెప్పకుండా ఉండరు. ( దేశమంతా అభిమానించే మణిరత్నంకు వక్త్ సినిమా అంటే చాలా అభిమానం, దాన్నుంచి చాలా  నేర్చుకున్నా అని  చాలా సార్లు చెప్పాడు).

 కాశ్య‌ప్ గురువు వ‌ర్మ అయితే కాసింత అసూయ ప‌డ్డ‌ట్లు ఉన్నాడు. నా సినిమా ప్రేక్ష‌కుల‌కు  న‌చ్చ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ అది నా ఫేవ‌రెట్ సినిమా అన్న శిష్యుడిని ట్విట్ట‌ర్ లో మంద‌లించాడు. అహంకారానికి, ఆత్మ విశ్వాసానికీ తేడా ఉంటుంది అని ట్వీటాడు. అంతకు ముందు చాలా సార్లు వ‌ర్మే నా సినిమాలు ఎవ‌రైనా న‌చ్చితే చూడండి లేకుంటే లేదు అన్న‌ట్లు గుర్తు. ఇపుడు హ‌టాత్తుగా ఆయ‌న‌కు విన‌యం గుర్తుకు వ‌చ్చిందంటే అది కితాబే అనే అనుకోవాలి. 

ఇంకా సరిగ్గా చెప్పాలంటే చాలా సార్లు గొప్ప ప్రేమకథలు విషాదాంతాలౌతాయి. బాంబే వెల్వెట్ కూడా అంతే. సినిమా కళతో దర్శకుడి కున్న ప్రేమే ఈ సినిమా అయితే   అది బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. విఫల ప్రేమకథలు కూడా అజరామరాలు, ఈ సినిమా కూడా అంతే..

*