కల్లూరి భాస్కరం
ఆదిమ సమాజాలలో ఋతుస్రావం చుట్టూ అల్లుకున్న ఊహలు, నిషేధాలు, మాంత్రిక చర్యల గురించి రాస్తున్నప్పుడే కాకతాళీయంగా ఒక టీవీ చానెల్ కు చెందిన వెబ్ మేగజైన్ లో ఒక వ్యాసం కనిపించింది. దాని శీర్షిక, ‘Dear Universities, Is Menstruation Unacceptable?’. రచయిత్రి, ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్ గా ఉన్న రుక్మిణీ భయా నాయర్.
సందర్భం ఏమిటంటే, విద్యార్థినుల పట్ల చూపుతున్న వివక్షను నిరసిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థినులు శానిటరీ నేప్ కిన్స్ మీద వివిధ నినాదాలు రాసి శాంతియుత ప్రదర్శన జరిపారు. ఇది కోల్కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి కూడా పాకింది. శానిటరీ నేప్ కిన్స్ ను ప్రదర్శించడాన్ని రెండు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలూ తప్పు పట్టాయి. జామియా మిలియా అయితే విద్యార్థినులకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. “ఇది సామాజిక ఆమోదం కలిగిన నిరసన మార్గం కాదు. దేనిని ప్రదర్శించవచ్చో, దేనిని ప్రదర్శించకూడదో మీరు తెలుసుకోవాలి” అని జాదవ్ పూర్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ అన్నారు. దానిపై, “దేనికి సామాజిక ఆమోదం లేదు? శానిటరీ నేప్ కిన్స్ కా, ఋతుస్రావానికా, లేక మొత్తం స్త్రీలకేనా?” అని ఒక విద్యార్థిని అడిగింది.
“మా నిరసన కేవలం శానిటరీ నేప్ కీన్స్ ను అధికధరకు అమ్మడం మీదా, క్యాంపస్ లో వాటిని అమ్మే దుకాణాలు లేకపోవడం మీదా కాదు. స్త్రీని న్యూనతతో చూసే ఇటువంటి విషయాల చుట్టూ అల్లుకున్న మౌనాన్ని బద్దలు కొట్టడం కోసం” అని ఇంకో విద్యార్థిని అంది.
దీనిపై అందరు బురోక్రాట్లూ చేస్తున్నట్టే వైస్-ఛాన్సలర్ కూడా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకున్నారని వ్యాసరచయిత్రి అంటారు.
ఋతుస్రావం, ఋతుకాలం, ప్రసవకాలాలకు చెందిన తంతులు, నిషేధాలే తదుపరి తంతులకు, నిషేధాలకు మాతృకలనుకుంటే; ఆదిమ కాలం నుంచి నేటి అత్యాధునిక కాలంవరకూ అవి ఎలా నిరంతరాయంగా కొనసాగుతున్నాయో పై ఉదంతం ఆశ్చర్యకరంగా వెల్లడిస్తోంది. మనం ఆధునికతలోకి వచ్చామన్నది కేవలం భ్రమ మాత్రమే, ఇంకా ఆదిమ కాలంలోనే ఉన్నాం.
ఈ వ్యాసంలోనే, మనం నిషేధం అనే అర్థంలో వాడుతున్న ‘టేబూ’(Taboo) అనే మాట గురించి రచయిత్రి కొంత చర్చ చేశారు. ఇది టోగాన్-పొలినేసియన్ పదమనీ, ఇంగ్లీషు దానినే స్వీకరించిందనీ ఆమె అంటారు. రాంభట్ల గారినే ఉటంకించుకుంటే(జనకథ), ‘తప్పు’ అనే తెలుగు మాటే ‘టేబూ’ అయింది. లేదా ‘టేబూ’ అనే మాటే తెలుగులో ‘తప్పు’ అయిందనుకున్నా అనుకోవచ్చు. న్యూజీలాండ్ లోని మావోరీ తెగవారు సరిగ్గా తెలుగు ‘తప్పు’నే, అదే అర్థంలో వాడతారు. పోలినేసియన్లలో హవాయి దీవుల వాళ్ళు ‘తాపు’ అంటారు. మొత్తం మీద మన తెలుగు ‘తప్పు’ అతి పురాతన పదమే కాక, ఒకవిధంగా ప్రపంచభాషాపదం అన్నమాట.
వైరుధ్యం, అంతకన్నా విచిత్రం ఏమిటంటే; ఈ టేబూ అనేది రెండంచుల కత్తిలాంటిది. ఒక అంచు ‘పవిత్రత’కు సూచన, ఇంకొక అంచు ‘అపవిత్రత’కు సూచన. ‘Sacra’ అనే రోమన్ మాటకు కూడా ఇలాగే రెండర్థాలున్నాయని కిందటి వ్యాసంలో అనుకున్నాం. అన్ని మతాలూ స్త్రీలను చూసే చూపులో కూడా ఇదే వైరుధ్యం ఉందని పై వ్యాసరచయిత్రి అంటారు. ఒక పక్క స్త్రీలకు అత్యంత గౌరవం ఇస్తామని చెబుతాం, ‘దేవత’గా భావిస్తాం; మరో పక్క ప్రకృతిధర్మంగా ఆమె శరీరంలో సంభవించే మార్పులను అశుభ్రంగానూ, అపవిత్రంగానూ చూస్తాం. స్త్రీ పట్ల ఉన్న ఈ చులకన భావానికీ, ఈసడింపుకు కొనసాగింపే ఆమెపై జరిపే హింస, అత్యాచారాలంటారు వ్యాస రచయిత్రి.
***
అదలా ఉంచితే, మన జ్ఞానశూన్యతకు ఎల్లలు లేవు. నెల నెలా మూడురోజులపాటు బయట చేరడం అనేది మనలోనే, అందులోనూ ఒకటి, రెండు పై కులాలలలోనే ఉందని అనుకుంటాం. కానీ ఇది దాదాపు ప్రపంచమంతటా అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉంది. ఇంకా చెప్పాలంటే, మనకు తెలిసినదానికంటే కూడా కర్కశంగా, పట్టువిడుపులు లేనంతగా ఉండేది. కొన్ని చోట్ల మూడు రోజులు కాక, వారం, నెల, చివరికి ఏళ్ల తరబడి ‘బయట’ ఉంచేవారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.
సర్ జేమ్స్ ఫ్రేజర్ ‘The Golden Bough’ లో ఈ ఆచారం ఎక్కడెక్కడ ఉందో విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చారు. ఋతుమతులైన అమ్మాయిలు నేలను తాకరాదనీ, సూర్యుణ్ణి చూడరాదనే నిషేధం ప్రపంచంలో అనేక చోట్ల ఉందని ఆయన అంటారు. లొవాంగోలోని నల్ల జాతి అమ్మాయిలను ఋతుమతులు కాగానే విడిగా పూరిళ్లలో ఉంచుతారు. వారి శరీరం నేలకు తాకకూడదు. మన దగ్గర కూడా అమ్మాయిలను తాటాకు చాప మీద కూర్చోబెడతారు. దక్షిణాఫ్రికాలోని జులూ, తదితర తెగల్లో అమ్మాయిలు పగలు పని పాటలు చేసుకుంటున్నప్పుడు మొదటిసారి ఋతుసూచనలు కనిపిస్తే వెంటనే నది వైపో, చెరువు వైపో పరుగెత్తి, మగవాళ్ళ కంటబడకుండా పగలంతా పొదల్లో దాక్కుంటారు. తమపై సూర్యకాంతి పడకుండా శరీరాన్ని దుప్పటితో కప్పుకుంటారు. చీకటి పడిన తర్వాతే ఇంటికి వెళ్ళి వేరుగా కూర్చుంటారు. లేక్ న్యాసా అనే ప్రాంతానికి ఉత్తరం కొసన జీవించే అవాన్ కొండే అనే తెగలో అమ్మాయి ఋతుమతి అయినప్పుడు, మరికొందరు అమ్మాయిలతో కలిపి ఒక చీకటి గుయ్యారంలో, కింద అరిటాకులు పరచి కూర్చోబెడతారు.
న్యూ ఐర్లాండ్ లోని అమ్మాయిల పరిస్థితి నమ్మశక్యం కానంత ఘోరంగా ఉంటుంది. అమ్మాయిలను ఒక వయసు రాగానే పాతిక అడుగులు ఎత్తున వెదురుకర్రల మీద నిర్మించిన ఒక ఇంట్లో, ఒక్కో పంజరంలో ఉంచుతారు. ఆ పంజరం భూమిని తాకకుండా నాలుగు అడుగుల ఎత్తున, శంఖం ఆకారంలో ఉంటుంది. వెలుతురు, గాలి కొంచెమైనా చొరడానికి వీలు లేకుండా దగ్గరగా కుట్టిన దట్టమైన ఆకులతో దానిని నిర్మిస్తారు. అందులో కూర్చోడానికి, ముడుచుకుని పడుకోడానికి మాత్రమే చోటు ఉంటుంది. నేల మీద కాలు మోపకుండా, సూర్యరశ్మి సోకకుండా అమ్మాయిలు అలా రోజులు, వారాలు కాదు; ఏకంగా నాలుగైదేళ్లు గడపాలి! అన్నేళ్లూ వాళ్ళు మగపురుగును కూడా చూడడానికి వీల్లేదు. ఆ పంజరాల దగ్గర ఒక వృద్ధస్త్రీ కాపలా ఉంటుంది. కొస మెరుపు ఏమిటంటే, వేరే ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడికి ఈ వింత ఆచారం మీద ఆసక్తి కలిగి ఆ పంజరాలను, అందులోని అమ్మాయిలను చూడాలనుకున్నాడు. తెగ ముఖ్యుని అడిగితే అది కుదరదన్నాడు. అప్పుడా ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిలకు కొన్ని పూసల్ని కానుకగా ఇస్తాననే సరికి మెత్తబడ్డాడు. అతి కష్టం మీద ఆ వృద్ధస్త్రీ ఒప్పుకుని కింద దట్టమైన ఆకులు పరచి ఆ అమ్మాయిలను పంజరాల లోంచి బయటికి రప్పించిందట. అప్పుడా ఉపాధ్యాయుడు పంజరం లోపలికి తొంగి చూసేసరికి లోపల విపరీతమైన వేడిగానూ, ఉక్కపోతగానూ ఉందట. ఈ ఉపాధ్యాయుడే తనకు ఈ వివరాలు చెప్పాడని ఫ్రేజర్ అంటారు.
ఇలాంటి అజ్ఞానానికి అద్దం పట్టే దేశ దేశాల ఉదాహరణలను ఇంకా అనేకం ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు కానీ వాటన్నింటిలోకీ వెళ్లలేం. ఇప్పటి సంగతి ఏమో కానీ నిన్న మొన్నటి వరకూ మనదేశంలో పరిస్థితి ఏమంత భిన్నం కాదు. బాలెంతల విషయమే తీసుకుంటే, వారిని గాలీ, వెలుతురూ చొరని చీకటి కొట్టాలలో ఉంచి పుష్టికరమైన ఆహారం పెట్టకుండా మాడ్చే మూర్ఖత్వాన్ని—నాకు గుర్తున్నంతవరకూ—‘సత్యవతీ చరిత్రము’ అనే రచనలో కందుకూరి వీరేశలింగంగారే వదలగొట్టే ప్రయత్నం చేశారు. పై ఉదంతంలో పూసల మీద ఆశపడి కట్టుబాటును సడలించినట్టుగా; స్త్రీల చదువూ, ఉద్యోగం, చిన్న కుటుంబాల అవసరం పెరగడంతో చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు కానీ, వెనకటి రోజులే అయితే ఇలాంటి పద్ధతులను మనవాళ్లు ఇప్పటికీ అమలు చేస్తూనే ఉండేవారు.
ఇప్పుడు మళ్ళీ జార్జి థాంప్సన్ దగ్గరికి వస్తే;
ఋతురక్తంలోనూ, ప్రసవరక్తంలోనూ ప్రాణం పోసే గుణం ఉందన్న నమ్మకం ప్రపంచమంతటా ఎంత బలంగా ఉండేదో, వాటి పట్ల భయమూ, వైముఖ్యమూ అంతే బలంగా ఉండేవని ఆయన అంటారు. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీని తాకడమంటే శవాన్ని తాకడంతో సమానం. వారిని కచ్చితంగా దూరంగా ఉంచవలసిందే. ఇటువంటి స్థితిలో ఉన్న స్త్రీని చూస్తే మగవాడు చనిపోతాడని నమ్మేవారు. వారి చెయ్యి కానీ, కాలు కానీ తగిలితే పంటలు మాడిపోతాయనీ, పశువులు అంగవైకల్యం చెందుతాయనీ అనుకునేవారు. బాలెంతను ఉంచిన చోటికి మంత్రసాని తప్ప ఇంకెవ్వరూ వెళ్లకూడదు. ఆ బందిఖానా పూర్తి కాగానే బాలెంత దుస్తులు, దుప్పట్లు, ఆమెకు వండి పెట్టడానికి వాడిన పాత్రలు, బొడ్డు తాడు, మాయ(placenta), రక్తపు మరకలతో సహా అన్నింటినీ జాగ్రత్తగా ధ్వంసం చేయడం, తుడిచిపెట్టడం చేయాలి. లేదా ఎవరూ తాకడానికి అవకాశం లేని చోట పారేయాలి. కొంతమంది రోడ్డు మీదో, నాలుగు రోడ్ల కూడలిలోనో పారేస్తారు. బాటసారులు ఆ మైలను మోసుకుపోతారని అందులో ఉద్దేశం. శుద్ధి స్నానమూ, ఆయా తంతులూ జరిగిన తర్వాతే బాలెంత తిరిగి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికీ మనదగ్గర ఇంచుమించు ఇలాంటివే జరుగుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
మొదటిసారి ఋతుమతి అయినప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు, తంతులు ఉంటాయి. అమ్మాయికి లైంగిక జీవితాన్ని పరిచయం చేయడం కూడా అందులో భాగం. ఉదాహరణకు, దక్షిణాఫ్రికాలోని బంటూ తెగకు చెందిన అమ్మాయి తను ఋతుమతి అయ్యే సమయం సమీపించినప్పుడు పొరుగూరికి చెందిన ఒక వివాహితను పెంపుడు తల్లిగా ఎంచుకుంటుంది. ఆ రోజు రాగానే పెంపుడు తల్లి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి ఆమెతో కలసి శోకాలు పెడుతుంది. ఆ అమ్మాయిని నెలరోజులు దూరంగా ఉంచుతారు. సాధారణంగా ముగ్గురు, నలుగురు అమ్మాయిలను కలిపి ఒక పూరిపాకలో ఉంచుతారు. ప్రతిరోజూ ఉదయమే వారు నదికో, కాలువకో వెళ్లి స్నానం చేస్తారు. వారి వెంట కొంతమంది మహిళలు అశ్లీలమైన పాటలు పాడుతూ వెడతారు. మగవాళ్ళు ఎదురు పడకుండా అదిలించడానికి వాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయి. మగవారు కనుక ఆ అమ్మాయిలను చూస్తే అప్పటికప్పుడు అంధులైపోతారని నమ్మకం. ఆ అమ్మాయిలు స్నానం చేసి తడిబట్టలతోనే వణకుతూ తిరిగి రావాల్సిందేకానీ, పొడి బట్టతో తుడుచుకోవడం కానీ, మంట దగ్గర చలి కాచుకోవడం కానీ చేయడానికి వీల్లేదు. వెంట ఉన్న మహిళలు అశ్లీలగీతాలు పాడుతూ, వారిని రక రకాలుగా అల్లరి పెడుతూ లైంగిక విషయాలలో శిక్షణ ఇస్తారు. ఋతుస్రావం గురించి మగవాడికి తెలియకూడదని ఆదేశిస్తారు. నెల రోజుల తర్వాత అమ్మాయిలు ఇంటికి చేరుకున్నాక తెగలో అందరికీ సమర్త భోజనం పెడతారు. ఋతుమతి అయినప్పుడు మన దగ్గర కూడా అచ్చంగా ఇలాంటిదే కాకపోయినా, పెద్ద తంతే జరుగుతుంది.
ప్రాచీన గ్రీసులో కూడా పురిటి మైలను, బహిష్టు మైలను కచ్చితంగా పాటించేవారు. ఆ స్థితిలో ఉన్న స్త్రీలు దేవాలయానికి వెళ్లకూడదు. నలుగురిలోకీ రాకూడదు. మన దేశంలో ఇప్పటికీ తగుమాత్రం మడీ, ఆచారం పాటించే కుటుంబాలలో ఇలాంటి నిషేధాలే ఉన్నాయి.
ఇదే సమయంలో, ఋతుస్రావానికీ, ప్రసవరక్తానికీ ప్రాణం పోసే లక్షణం ఉందన్న విశ్వాసం ఎలా వ్యక్తమయ్యేదో చెప్పుకుందాం. ఉత్తర అమెరికాలో మొక్కజొన్న పంటకు చీడ ఆశించినప్పుడు, ఋతుకాలంలో ఉన్న స్త్రీలు రాత్రిపూట నగ్నంగా పొలంలో తిరిగేవారు. ఇదే ఆచారం ఇప్పటికీ యూరప్ రైతాంగంలో ఉందని థాంప్సన్ అంటారు. పంటను విషక్రిములు ఆశించినప్పుడు ఋతుకాలంలో ఉన్న మహిళలు జుట్టు విరబోసుకుని, దుస్తులు పైకెత్తుకుని, చెప్పులు లేకుండా పొలంలో తిరగాలని ప్లినీ అంటాడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఋతుకాలంలో ఉన్న స్త్రీలు చెప్పులు లేకుండా మూడుసార్లు పొలం చుట్టూ తిరగాలని డెమోక్రిటస్ అనే మరో పండితుడు అంటాడు. ఋతుకాలంలో స్త్రీలలో ఉండే ప్రాణశక్తి పంటకు అందుతుందని దీనివెనుక ఉద్దేశం. స్త్రీలు ఋతుకాలంలో ఉన్నా లేకపోయినా వారు నగ్నంగా పొలంలో తిరిగితే పంటలను చీడపీడలు అంటవన్న నమ్మకం దక్షిణాఫ్రికాలోని జులూ తెగవారిలో ఉంది.
***
ఇప్పుడిక పసుపు, కుంకుమల గురించి చూద్దాం. ఇవి మనదగ్గర మంగళ ద్రవ్యాలు. పవిత్రతకు సంకేతాలు. స్త్రీల జీవితంలో విడదీయలేని భాగాలు. పసుపు, కుంకుమల చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లకు అంతే ఉండదు. వివాహిత అయిన స్త్రీ పసుపు, కుంకుమలతో జీవించడం, ముత్తైదువగా మరణించడాన్నే గొప్ప వరంగా భావిస్తుంది. తన జీవితానికి అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదనుకుంటుంది. పెళ్ళైన అమ్మాయికి పుట్టింటివారు ఇచ్చే తగుమాత్రం ఆస్తిపాస్తులను పసుపు, కుంకుమల కింద ఇచ్చినట్టు చెప్పుకోవడమూ కనిపిస్తుంది. సెంటిమెంటుకు ఇది ఆర్థిక వ్యక్తీకరణ.
అంతేకాదు; పసుపు, కుంకుమలు మన చారిత్రక జ్ఞానశూన్యతకు కూడా గొప్ప వ్యక్తీకరణలే. అవి స్త్రీ జీవితంతో గాఢంగా పెనవేసుకోవడమే కాక; పూజలు, ఇతర శుభకార్యాలలో ముఖ్యమైన సామగ్రి కావడం కేవలం మన మత,సంస్కృతులకే చెందిన విశిష్టతలని అనుకుంటాం. పసుపును అలా ఉంచి, కుంకుమనే తీసుకుంటే ఇదెంత అపోహో అర్థమవుతుంది.
కుంకుమ మంగళ ద్రవ్యం కావడం వెనుక ‘అమంగళ’మైన గతం ఉంది. ఎలాగంటే; ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత గర్భాశయంలో మిగిలిపోయే రక్తం నుంచే పిండం రూపొందుతుందని పురాతన, మధ్యయుగాలకు చెందిన అరిస్టాటిల్, ప్లినీ తదితర నేచురలిస్టులు భావించారని థాంప్సన్ అంటారు. అంటే, అది ప్రాణి పుట్టుకకు కారణమైన రక్తం. ఋతుకాలంలో, ప్రసవ కాలంలో ఉన్న స్త్రీల పట్ల నిషేధాలను అమలు చేయాలంటే; వారు ఆ స్థితిలో ఉన్నట్టు ఇతరులకు తెలియాలి. ఆ అవసరం రీత్యా రక్తాన్నో, లేదా రక్తం రంగులో ఉన్న మరో పదార్థాన్నో నుదుట అలదుకోవడం, ఒంటికి రాసుకోవడం అనే ఆనవాయితీ ప్రారంభమైంది. ఇలా చేయడంలో నిషేధానికి ఉన్న అనుకూల/ప్రతికూల లక్షణాలు రెండూ వ్యక్తమవుతాయని థాంప్సన్ అంటారు. ఎలాగంటే, రక్తధారణ లేదా రక్తం రంగులో ఉండే మరో ద్రవ్యాన్ని ధరించడం అనేవి ఒకవైపు పునరుజ్జీవన శక్తిని సంకేతిస్తూనే, మరోవైపు మైలను, అమంగళతను సంకేతిస్తాయి. ఋతుకాలంలోనో, ప్రసవ కాలంలోనో ఉన్న స్త్రీలు తమ శరీరానికి ఎరుపు రంగు పులుముకోవడం ప్రపంచమంతటా ఉన్న ఆచారం. అది మగవారిని వారినుంచి దూరంగా ఉంచుతూనే, సౌభాగ్యవర్ధనంగానూ ఉంటుంది,
ఈ ఆచారమే క్రమంగా ఇతర నిషేధాలకూ పాకింది. వివాహ సమయాల్లోనూ, వివాహం తర్వాతా వధువు లేదా వివాహిత నుదుట సిందూర ధారణ చేయడం అనేది రెండు సూచనలు చేస్తుందని థాంప్సన్ అంటారు: మొదటిది, ఆమె భర్తకు తప్ప ఇతర మగవాళ్ళకు నిషిద్ధం. రెండోది, ఆమె భర్తకు మాత్రమే సంతానం కంటుంది. ఈ సిందూర ధారణే అలంకరణ ద్రవ్యాలకు మూలం.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కుంకుమ, తిలకం వగైరాల రూపంలో ఎరుపు రంగును శరీరానికి అలదుకోవడం, నుదుట ధరించడం అనేవి కేవలం మన ప్రత్యేకతలు కాక; విశ్వజనీనం కావడం! మన స్త్రీల దగ్గర బొట్టు పెట్టె, కుంకుమ భరిణె ఉన్నట్టుగా, బంటు తెగకు చెందిన వాలెంగే మహిళల దగ్గర జేగురు రంగు పదార్థం కలిగిన కుండ ఉంటుంది. అది వారికి మంగళద్రవ్యం. ఉత్సవసమయాల్లో దానిని ఒంటికి అలదుకుంటారు. పురిటి మైల అయిన తర్వాత తల్లీ, బిడ్డలకు దానినే అలది స్నానం చేయిస్తారు. మన దగ్గర కూడా ఇలాంటి తంతులే ఉన్నాయి.
ఇంకా వెనక్కి వెడితే, ఎరుపు రంగు పునరుజ్జీవనానికి సంకేతం అన్న భావన పాతరాతి యుగం నుంచీ ఉంది. అది కొత్త రాతి యుగంలోనూ కొనసాగింది. ఎరుపు రంగు అలదిన ఆ కాలపు ఎముకలు తవ్వకాలలో లభించడమే ఇందుకు నిదర్శనం.
తమాషా ఏమిటంటే, మన స్త్రీల జీవితంతో, మతసంస్కృతులతో గాఢంగా అల్లుకుపోయిన ‘కుంకుమ’ సంస్కృత భాషా పదం కానీ, ఇతర ప్రాంతీయ భాషా పదం కానీ కాదు. పండితుల నిర్ధారణ ప్రకారం అది అన్యదేశ్యం. ఇంకా చెప్పాలంటే, Merriam-Webster నిఘంటువు ప్రకారం, అది సెమెటిక్ మూలం కలిగిన పదం. హిబ్రూలోని ‘కర్కోమ్’ అనే మాటతో తుల్యమైన మాట ఇది. ఈ మాట కుంకుమ పువ్వు(saffron)ను సూచిస్తుంది. కుంకుమపువ్వునే కొన్ని చోట్ల ‘కేసర్’ అంటున్నారు. కుంకుమపువ్వుకు జన్మస్థానాలు గ్రీసు, టర్కీ, పర్షియా తదితర మధ్యధరాతీరప్రాంతాలు.
మరికొన్ని విశేషాలు తర్వాత…
తాజా కామెంట్లు