ఆటా సాహిత్య పండగ సందడి

 

 ata2016
-నారాయణ స్వామి వెంకట యోగి
~

జూలై 1  నుండి ౩ వరకు షికాగో లో రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో ఆటా  ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ రజతోత్సవ వేడుకలు ప్రధానంగా సాంస్కృతిక వేడుకలుగా జరుగనున్నాయని ఆటా నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు సంస్కృతిని అద్భుతంగా విరాజిల్లే విధంగా ఈ మహాసభలు జరుగుతున్నయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించినరు. అదే పద్ధతిలో యేర్పాట్లు ఘనంగా జరుగుతున్నయని కూడా చెప్పినరు. సాహిత్యం సాంస్కృతికమూ సాధారణంగా జమిలిగా కలగలిసి ఉంటయి కాబట్టి ఈ సారి ఈ కన్వెంషన్ సందర్భంగా సాహిత్యానికి కూడా పెద్ద పీట వేసినరు. సాంస్కృతిక కార్యక్రమాలకు సమఉజ్జీగా , సమాంతరరంగా,కలుపుగోలుగా , కాంప్లిమెంటరీ గా సాహిత్య కార్యక్రమాన్ని కూడా నిర్వాహకులు తీర్చిదిద్దినరు.

 

https://www.ataconference.org/Committee-Literary

 

జయదేవ్ మెట్టుపల్లి గారు ప్రదాన సంచాలకులుగా తీర్చి దిద్దిన సాహిత్య కార్యక్రమాలు అద్భుతంగా జరుగనున్నయి. తెలుగు సాహిత్యం లోని అన్నిరంగాలను కూలంకషంగా పరిశీలించే విధంగా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిభావంతంగానూ , ఆలోచనా స్ఫోరకంగానూ తీర్చి దిద్దారు.  జయదేవ్ గారూ వారి సాహితీ బృందం సభ్యులూ , తెలుగు సాహిత్యం లోని అన్ని క్రియలనూ పరిశీలిస్తూ సమకాలీన సాహిత్య రంగం లోని అనేక అంశాలను క్రియాశీలకంగా పరిశీలించేటట్టు కార్యక్రమం రూపొందించినరు. సమకాలీన సాహిత్యం పరిశీలించకుండా తెలుగు సాహిత్యాన్ని అంచనా వేయలేము. అందుకనే సాంప్రదాయ సాహిత్య ప్రక్రియలైన అవధానమూ లాంటి వాటికి పెద్ద పీట వేసినా, సమకాలీన సాహిత్య అంశాలను క్రియలను, పోకడలను, ఉన్న సమయంలో కూలంకషంగా చర్చిస్తూ సాహిత్య కార్యక్రమాలున్నయి. అందుకు ఆటా నిర్వాహకులను, ముఖ్యంగా సాహితీ కమిటీ నిర్వాహకులను ప్రత్యేకంగా భినందించాలి.

 

ఆటా కన్వెన్షన్  మొదటి రోజు,  జూలై 2 నాడు, మధ్యాహ్నం వొంటి గంటకు సాహిత్య కార్యక్రమం ప్రారంభమౌతుంది. ఇవాళ తెలుగు సాహిత్యం లో ఉధృతంగా ముందుకొస్తున్న ప్రాతీయ సాహిత్యం గురించిన చర్చ మొదటి సెషన్ లో జరుగుతుంది.

ప్రముఖ కవి కథకుడు విమర్శకుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా లో ప్రొఫెసర్ అఫ్సర్ ఈ సెషన్ ను నిర్వహిస్తున్నారు.

ఇందులో ప్రముఖ కళింగాంధ్ర కథకుడు అప్పలనాయుడు గారు కళింగాంధ్ర సాహిత్యం గురించి మాట్లాడుతారు. శ్రీకాకుళ పోరాటం కంటే ముందు నుండీ ఎట్లా కళింగాంధ్ర సాహిత్యం తెలుగు సాహిత్యం లో ఒక పాయ గా కొనసాగిందో కళింగాంధ్ర ప్రజల జీవితాన్ని, కలల్నీ, ఆకాంక్షలనీ ఎట్లా సాహిత్యం ప్రతిఫలించిందో అప్పలనాయుడు గారు వివరిస్తారు, అట్లే శ్రీకాకుళ ఉద్యమ లో సాహిత్యం నిర్వహించిన పాత్రనీ ఉద్యమం నిర్బంధానికి లోనై సద్దు మణి గిన తర్వాత సాహిత్యం ఎట్లా శ్రీకాకుళ జనజీవితాన్ని ఫ్రతి బింబించిందో వివరిస్తారు.

స్త్రీ సాహిత్యం గురించి ప్రముఖ కథకులు భూమిక పత్రిక సంపాదకులు కొండవీటి సత్యవతి గారు ప్రసంగిస్తారు. స్త్రీవాద ఉద్యమం ప్రారంభం కాకముందునుంచీ స్త్రీ రచయితలు స్త్రీల జీవితాన్ని వారి కష్ట నష్టాలను సాహిత్యం లో ప్రతిఫలించిన విధానాన్ని దాన్ని స్త్రీ వాద ఉద్యమం సుసంపన్నం చేసిన వివరాలనూ సత్యవతి గారు తమ ప్రసంగం లో వివరిస్తారు.

తెలంగాణ సాహిత్యం గురించి ప్రముఖ కవీ గాయకుడు వక్త దేశపతి శ్రీనివాస్ వివరిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం లో వెలువడ్డ తెలంగాణ సాహిత్యాన్ని గురించి శ్రీనివాస్ తమ ప్రసంగం లో కూలంకషంగా సోదాహరణంగా వివరిస్తారు.

తరతరాలుగా వివక్షకు గురవుతూ పాలకులు ప్రాంతం వారైనా తీవ్రమైన అన్యాయానికి గురైన ప్రాంతంగా, ఫాక్షన్ సీమగా హత్యలు దొమ్మీ లు జరిగే హంతక సీమగా అపఖ్యాతి పాలై ఫాక్షనిస్టుల చెరలో నెత్తురోడింది రాయలసీమ సాహిత్యాన్ని గురించి అప్పిరెడ్డి హర్నాథ రెడ్డి వివరంగా ప్రసంగిస్తారు.

అదే రోజు మధ్యాహ్నం శొంఠి శారద గారి నిర్వహణ లో ‘తరతరాల తెలుగు సాహిత్యం విభిన్న ధోరణులు ‘ అనే అంశం పై సెషన్ జరుగుతుంది.

ఈ సెషన్ లో మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి ప్రభల జానకి గారు , యద్ధనపూడి సులోచన గురించి కొమురవోలు సరోజ గారు, అమెరికన్ షార్ట్ స్టోరీస్ గురించి నారాయణ స్వామి శంకగిరి గారు, తెలుగు నవల గురించి అమరేంద్ర దాసరి గారు, తాము నిర్వహస్తున్న పత్రిక భూమిక గురించి కొండవీటి సత్యవతి గారు , దేవులపల్లి సాహిత్యం అభ్యుదయం గురించి నిడమర్తి నిర్మల గారు ప్రసంగిస్తారు.

తర్వాత శ్వీయ కవితా పఠనం , పుస్తకావిష్కరణ చర్చ లు జరుగుతాయి.

తర్వాత సాయంత్రం ‘పాట వెనుక మాట’ అని తాము రచించిన అనేక గొప్ప పాటల వెనుక ఒదిగి పోయిన సందర్భం గురించి జీవితం గురించి సంఘటన ల గురించి ప్రముఖ కవులు వాగ్గేయ కారులు గోరటి వెంకన్న అందెశ్రీ ప్రముఖ సినీ కవి చంద్రబోస్ గార్లు ప్రముఖ కవి అఫ్సర్ సంచా లకత్వం లో అద్భుతంగా వివరిస్తారు.

సభల రెండో రోజు సాహిత్య కార్యక్రమం లో ఉదయం  అవధాని సార్వభౌమ అవధాని కంఠీరవ శ్రీ నరాల రామిరెడ్డి గారి చే తెలుగు సాహిత్యావధానం జరుగుతుంది. దీనిలో ఆచార్య శ్రీనివాస్ వేదాల గారు, కందాళ  రమానాథ్ గారు,  వడ్డేపల్లి కృష్ణ గారు, కొంక పాక లక్ష్మీ గారు,  ప్రభల జానకి గారు, శొంఠి శారద గారు, యడవల్లి  రమణ మూర్తి గారు పాల్గొంటారు.

మధ్యాహ్నం సాహిత్య కార్యక్రమానికి ప్రముఖ సాహితీ విమర్శకులు కథకులు ఈమాట సంపాదకులు వేలూరి వెంకటేశ్వర రావు గారు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఈ సెషన్ తెలుగు సాహిత్యం కొత్త దారులు అనే అంశం పై జరుగుతుంది. ఇందులో వేలూరి గారు అనువాదాల గురించి ప్రసంగిస్తారు. తెలుగు భాష పరిణామాలు అనే అంశం గురించి మిట్టపల్లి రాజేశ్వర రావు గారు , తెలుగు కవిత్వ సామాజిక ఉద్యమాలు అనే అంశంపై నారాయణ స్వామి వెంకటయోగి గారు, అమెరికన్ తెలుగు సాహిత్యం గురించి ప్రముఖ రచయిత గొర్తి సాయి బ్రహ్మానందం గారు స్త్రీవాద సాహిత్యం గురించి ప్రముఖ కథకులు కవీ కల్పన రెంటాల గారు, తెలుగు సాహిత్య వాడల గురించి ప్రముఖ కవి విమర్శకులు హెచ్చార్కె గారు భవిషత్తులో తెలుగు భాష గురించి ప్రముఖ భాషా శాస్త్రవేత్త సురేష్ కొలిచాల గారు ప్రసంగిస్తారు

మొత్తం కార్యక్రమాన్ని చూస్తే ఈ ఆట సభలు సాహిత్యానికి సంస్కృతి కి పెద్ద పీట వేసినాయి. నిర్వాహకులు చాలా శ్రద్ద తీసుకొని సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు తీర్చిదిద్దారు.

అమెరికా నలుమూలల నుండీ వేలాదిగా తెలుగు వారు తరలి వచ్ఛే ఈ ఆట సభల్లో తెలుగు సాహిత్య సాంస్కృతిక పరిమళాలు గుబాళించబోతున్నాయి. తెలుగు సాహిత్యప్రియులకు సాంస్కృతిక ప్రియులకు ఈ రెండు రోజులూ పండగే!

మీ మాటలు

*