Archives for March 2016

బాహుబలానికేనా బహుమతి ?

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

ల.లి.త.

‘మొత్తానికి మన తెలుగువాళ్ళకి వందకోట్ల లాటరీ తగిలినట్టు ఏకంగా ఉత్తమ సినిమా జాతీయ పురస్కారం వచ్చేసిందోచ్’ అని సంబరపడాలో లేక మన సినిమాతో ఉత్తమ సినిమా బహుమతి స్థాయి కిందకి దిగిందని విచారించాలో తెలియటం లేదు. పక్కనున్న తమిళ, మళయాళ, కన్నడ, మరాఠీ సినిమాల్లా బుద్ధిబలంతో కాకుండా బాహుబలంతో సాధించిన బహుమతిలాగా ఉందిది.  వేరే సినిమాలేవీ చూడకుండానే తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు రాలేదేమని నూతిలోకప్పల్లా బాధపడేవాళ్ళకి మాత్రమే ఈ గుర్తింపు ఆనందాన్నిస్తుంది.

అందరినీ అలరించే పాపులర్ సినిమా, కొంతమంది మేధావుల సృష్టికే పరిమితమయే ఆర్ట్ హౌస్ సినిమాల మధ్య అవార్డుల పోటీలో ప్రభుత్వం ఇచ్చే సినిమా పురస్కారాలు ఆర్ట్ హౌస్ కే ఇంతవరకూ దక్కుతున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికయే సినిమాకు ఖచ్చితంగా మంచి ప్రమాణాలను అనుసరిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉత్తమ నటుడు, నటి బహుమతులు నెమ్మదిగా ఆర్ట్ హౌస్ నుంచి ప్రధాన స్రవంతి సినిమాలకు కూడా రావటం మొదలయింది. ఇప్పుడు బాహుబలికి ఉత్తమచిత్రం పురస్కారం రావటంతో ఈ అత్యున్నత బహుమతి కూడా  ప్రధానస్రవంతి సినిమావైపుకి చూడటం మొదలు పెట్టిందని అనుకోవచ్చు. ఇది ఎలాంటి మార్పుకు ప్రారంభమో చూడాలి.

ఒక చిత్రం గానీ ఒక రచనగానీ ఉత్తమమైనదని నిర్ణయించటానికి దాని జనరంజకత్వాన్ని లెక్కలోకి తీసుకునే పద్ధతి సరైనది కాదు. ఈ ప్రమాణం సాహిత్యంలోకి కూడా వస్తే చేతన్ భగత్ కి  సాహిత్యంలో అత్యున్నత పురస్కారం ఇవ్వాలి.  ప్రపంచంలో ఎక్కడైనాసరే పాపులర్ సినిమా ఏ ప్రశ్నలూ వెయ్యదు.  కొత్త ఆలోచనలకు అవకాశం అక్కడ తక్కువ. ఓ రెండుగంటలు ప్రేక్షకులకు కలల్ని అమ్మటమే దానిపని.  వ్యాపారవిలువల్ని పక్కనపెట్టి, జీవితాన్ని అన్నిరంగుల్లోనూ నిజాయితీగా చూపించే ప్రయత్నం ఆర్ట్ హౌస్ సినిమాల్లో ఎక్కువగా ఉంటుందిగనుక జాతీయ బహుమతులు వాటికే వస్తాయి.  కలల్ని అమ్మి జనాన్ని నిద్రపుచ్చే సినిమాలు కాకుండా నిజాలు చెప్పి జనాన్ని ఆలోచింపజేసే సినిమాలకు బహుమతులు ఇవ్వటం ప్రభుత్వధ్యేయంగా ఉండేది. ఉండాలి కూడా.  సహజంగానూ  కళాత్మకంగానూ సినిమా తీసే పద్ధతిలో నిజానికి ఆర్ట్ హౌస్, పాపులర్ సినిమాల తేడా రానురానూ చెరిగిపోయి  మల్టీప్లెక్స్ సినిమాగా కుదురుకుంది.  కానీ అవి  నగరాల్లోని మధ్యతరగతి జీవితాన్నీ ప్రముఖుల జీవితచరిత్రలనే  ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.  సారంలో మాత్రం తక్కువ డబ్బుతో తీస్తున్న ప్రాంతీయ సినిమాదే ఇప్పటికీ పైచేయి. సరైన ఆకృతి దిద్దుకోకపోయినా  సారవంతమైన సినిమాకే  ఉత్తమ చిత్రం బహుమతి వచ్చిన సందర్భాలూ లేకపోలేదు.  నేలమీద నిలబడటమే ఉత్తమ చిత్రం బహుమతికి  ప్రధాన అర్హతగా ఉంటూ వస్తోంది ఇప్పటివరకూ. డెబ్భైల్లో ఎక్కువగా వచ్చే ప్రాంతీయ సినిమాల మధ్య ఈ బహుమతి కోసం పోటీలూ వివాదాలూ లేకపోలేదు గానీ బాలీవుడ్ వీటి మధ్యలో ఎప్పుడూ దూరలేకపోయింది.

తెలుగులో తీసిన సినిమాలకు జాతీయ స్థాయిలో ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అందులో అనుమానం లేదు. తెలుగులో మృణాల్ సేన్ తీసిన ‘ఒకవూరి కథ’ ( ప్రేంచంద్ కఫన్ కథ ఆధారంగా తీసిన సినిమా), రవీంద్రన్ తీసిన ‘హరిజన్’, గౌతమ్ ఘోష్ తీసిన ‘మాభూమి’, శ్యాం బెనెగల్ తీసిన ‘అనుగ్రహం’  చాలా బలమైన సినిమాలు. ‘ఒకవూరి కథ’ కనీసం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానైనా ఎన్నికయింది. మిగతా మూడిటికీ ఏ బహుమతీ రాలేదు. ‘హరిజన్’ ప్రింట్ కూడా మిగలకుండా మాయమవటం గొప్ప విషాదం. కానీ ఈ సినిమాలను తెలుగువాళ్ళు కాదు, ఇతర భాషల దర్శకులు తీశారు. బహుమతులు రాకపోయినా ఎంతోమంది మెప్పు పొందిన సినిమాలివి.

సాహిత్యమూ సినిమా చెయ్యాల్సిన పని జీవితపు కిటికీలన్నిటినీ తెరిచి వెలుగు ప్రసరించటం ఒక్కటే కాదు. ఆ వెలుగుల్ని సొగసుగా పట్టి చూపిస్తేనే అది మంచి సాహిత్యమో  సినిమానో అవుతుంది. జీవమున్న చిత్రాలకు బహుమతులు రావటంతోపాటు వాటిని జనం అంతో కొంతో ఆదరించిన మంచిరోజులు ఉండేవి. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రాలను చాలామంది చూసేవాళ్ళు.  రానురానూ ఉత్తమ జాతీయ చిత్రాలుగా ఎన్నికైన ప్రాంతీయ సినిమాల గురించి మీడియాలో పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారు.  నెమ్మదిగా జాతీయ బహుమతులు ప్రధాన స్రవంతి సినిమావైపుకు రావటంతో వీటికి ఆకర్షణ పెరిగినట్టయింది. అంటే ఇవి కూడా  ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లాగా మారుతున్నాయని అనుకోవాలి.  దీని అర్థం .. చివరికి బాలీవుడ్ కే అన్నీ దక్కుతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాంతీయ సినిమా బడుగులు ఈ బహుమతుల ఆశ కూడా వదులుకోవాల్సిందే. బాలీవుడ్ మెరుపుల ముందు ప్రాంతీయ సినిమాల లోచూపూ నిరాడంబరత్వమూ ఎక్కడ ఆనుతుంది? బాహుబలికి వచ్చిన బహుమతి తెలుగువాళ్ళ కళాత్మక దృష్టికి వచ్చిన మెప్పుకోలు కాదు. CGI హంగులతో హిందీలో బాలీవుడ్ నీ, కరణ్ జోహార్నీ, రమేష్ సిప్పీవంటి వ్యాపార సినిమా దర్శకుడినీ మురిపించినందుకు వచ్చిన బహుమతి. జ్యూరీలో ఉన్న సభ్యుల తెలివిమీద కూడా అనుమానాలు వచ్చే సందర్భం ఇది. సాంస్కృతిక సంస్థల సింహాసనాలమీద ఆ రంగాల్లో కనీసార్హతా, విద్యా లేని అనామకులు కూర్చుంటున్న రోజుల్లో రమేష్ సిప్పీ జ్యూరీ విచక్షణకూడా ఏమంత గొప్పగా లేదు.

హాలీవుడ్ లా భారీ సినిమాలు తీయటమే సినిమా కళ అనుకుంటే అస్థిపంజరానికి కిలోలకొద్దీ నగలు తగిలించినట్టే ఉంటుంది. రక్తమాంసాలున్న మనుషులను చూపించే సినిమాలనూ, మనఆలోచనలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళి మానవత్వాన్ని ఆవిష్కరించే సినిమాలనూ  ప్రోత్సహించటం ఒక్కటేకాదు. వాటిని ప్రచారం చేసి జనంలోకి తీసుకెళ్ళే పని కూడా నిజానికి ప్రభుత్వమే చేయాల్సిన రోజులివి. ప్రభుత్వమే ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు వచ్చిన సినిమాలను దేశంలోని అన్నిభాషల్లోకీ డబ్ చేయించి అన్ని ప్రైవేటు టీవీ చానెల్స్ లో వేయటాన్ని తప్పనిసరి చేస్తే ఎంత బాగుంటుందో!  కానీ, అందరికీ కావలసిన చదువునీ వైద్యాన్నే వదిలేసిన ప్రభుత్వాలు కళాపోషణ పనుల్ని  నెత్తిన వేసుకుంటాయనుకోవటం అత్యాశ.  కనీసం ఉన్న అవార్డులు ఇచ్చేటప్పుడైనా బాధ్యత వహించకపోతే  బాలీవుడ్ అన్నిటినీ మింగేస్తుంది. కిందటి సంవత్సరం ఉత్తమ చిత్రంగా బహుమతి పొందిన ‘కోర్ట్’ సినిమా చూద్దామంటే ఎక్కడా దొరకదు. ‘షిప్ ఆఫ్ తిసియస్’ ను కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ లు భుజాన వేసుకున్నారు కాబట్టి నలుగురికీ తెలిసింది. బాలీవుడ్ తారలకు జాతీయ బహుమతి వస్తే ప్రముఖ వార్త అవుతుంది. ట్రాన్స్ జెండర్ గా నటించిన సంచారి విజయ్ కి కిందటి సంవత్సరం ఉత్తమ నటుడి బహుమతి వచ్చింది. ఒక్క కన్నడిగులకు తప్ప అతనెవరో దేశంలో ఎవరికీ తెలియదు.

బాహుబలిని జ్యూరీ “మహోన్నత స్థాయి నిర్మాణ విలువలతో సినిమాటిక్ మెరుపుతో తెరమీద కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన ఊహాత్మక చిత్రం” అని మెచ్చుకుంది.  చిన్నపిల్లకి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ అని తెలిసిపోయే దృశ్యాలు బాహుబలిలో చాలా ఉన్నాయి. శివలింగాన్ని ఎత్తటంలో, వందలమంది లాగలేని విగ్రహాన్ని ఒంటి చేత్తో ఆపటంలో, ఒక్కోటీ కిలోమీటరు దూరానున్న కొండలమీదనుంచి దూకటంలో హీరో దైవ సమానుడిలా ఉంటాడు.  అలసట, కష్టం వంటివి అంటని మానవాతీత హీరోని చూస్తూవుంటే  ఏ ఉద్వేగమూ కలగదు.  కొన్నిచోట్ల చాలాబాగా, చాలాచోట్ల నాసిరకంగా ఉన్న గ్రాఫిక్స్ ని బాహుబలి సినిమాటోగ్రాఫర్  సెందిల్ కుమార్ కూడా సమగ్రంగా ఉన్నాయని అనలేకపోయాడు.  సరిగ్గా అతకని గ్రాఫిక్స్ నీ దేవుళ్ళలాంటి హీరోలనీ పూజించే సినిమాల్లో తెలివైన ప్రేక్షకుల ఊహలు ఎంతదూరం వెళ్ళగలవు? అక్కడే చతికిలబడతాయి. అద్భుతకాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన బాహుబలిలో, విశ్వాసం పేరుతో బానిసత్వాన్ని romanticise చేయటం ఉంది. యుద్ధవిద్య నేర్చిన అమ్మాయిని వొట్టి అందమైన బేలగా మార్చటం ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ లోకాల్లో తిరిగే మూసలు తప్ప మనుషులు లేరు. తెలుగు పాపులర్ సాంఘిక సినిమాలోంచి బాహుబలిలోకి పాకిన మూసలివి.  సుమోలు గాల్లో పేల్చేసి, యాభైమందిని నరికి పారేసే తెలుగుసాంఘికాల హీరో  జానపద బాహుబలిలో గ్రాఫిక్ కొండలమీదా జలపాతాలమీద దూకుతూ తేలుతూ, బాలీవుడ్ చేరి, అవార్డు కొట్టేశాడు. ‘దబాంగ్’ లాంటి మగ దబాయింపు మూస హిందీ చిత్రసీమలో ఎలాగూ ఉండనే ఉంది.  తల్లిస్థానంలో స్త్రీని కీర్తిస్తూ, భార్యగా ప్రియురాలుగా స్త్రీని తనకంటే తక్కువగా చూసే మగవాళ్ళు ఎక్కువగా ఉన్న ఉత్తరాదికి, దాన్నే తెరమీద  చూపించిన బాహుబలి నచ్చటంలో ఆశ్చర్యం లేదు. బాహుబలి అందించినది ఏ కొత్తదనమూ సున్నితత్వమూ లేకుండా ఒట్టి వ్యాపారంగా మారిపోయిన కళ.

బాహుబలి హాలీవుడ్ సినిమాలాగా వచ్చిందని చాలామంది సంతోషపడుతున్నారు. మరి ఏ ఒక్క హాలీవుడ్ చిత్రంలోనైనా ఆ కథ జరిగిన స్థల కాలాలు మనకి అర్థం కాకుండా ఉంటాయా? నాసిరకం హాలీవుడ్ సినిమాల్లో కూడా ఆ మనుషులు తిరిగే చోట్లు, బతికిన కాలం, నివసించే భవనాలు ఎలా ఉండాలో ఆలోచించుకున్నాకే వాళ్ళు సినిమా తియ్యడానికి దిగుతారు.  బాహుబలిలో నయాగరాని మించిన జలపాతాలు, ఆపైన మంచు కొండలు, ఇంకా పైన పచ్చని నేలలో దేవాలయాలలాంటి కోటలూ, యుద్ధం చేసే చోట తాటితోపులూ ఉంటాయి.  ఈ సినిమా కోసం భూగోళాన్ని ఇన్నిరకాలుగా సాగ్గొట్టేరు. మనకి తెల్సిన జాగ్రఫీ మర్చిపోవాల్సిందే. ఎంత చందమామ కథ అనుకున్నా ఇలాంటి రసహీనతని భరించటం కష్టం.  ఇంత అడ్డూ అదుపూ లేని కాల్పనిక ప్రపంచంలో విహరింపజేయటం హాలీవుడ్ కి కూడా చేత కాదు. వాళ్ళ సినిమాల్లో ఎంత పెద్ద హీరో అయినా పాత్రలోకీ ఆ పాత్రకు సంబంధించిన ప్రపంచంలోకీ చుట్టూరా ఉండే మనుషుల మధ్యలోకీ ఒదగాల్సిందే. మన హీరోలు దేవతలు కాబట్టి,  వాళ్ళకోసం పాత్రలనూ ప్రదేశాలనూ దర్శకులు రత్నాలు పొదిగిన దుస్తుల్లా తయారుచేసి తొడుగుతారు. ఆ దేవతావస్త్రాలను మెచ్చుకు తీరాలి కాబోలనే నిరంతర భ్రమలో వున్న జనం చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు.  ఇప్పుడు ప్రభుత్వం కూడా చప్పట్లు కొట్టడానికి తయారయింది.

సున్నితమైన కొత్త ఫాంటసీలా కథ చెప్తూ ‘ఈగ’ తో దేశమంతటినీ ఆకర్షించిన రాజమౌళి మంచి ప్రజారంజక దర్శకుడు. ఇప్పుడు పెద్ద హీరోల అహంకారానికీ దర్జాకూ తగ్గ కథల దుస్తులు అల్లుతూ, హాలీవుడ్ కలలుకంటూ, ఆత్మలోపించిన సినిమాలు తీస్తున్నాడు. ఆయన్ను అందుకు తగ్గట్టే గుర్తించి, బాహుబలికి ఉత్తమ ప్రజారంజక సినిమా కేటగిరీలో బహుమతి ఇచ్చివుంటే బాగుండేది. ఒకప్పటి ప్రమాణాల ప్రకారం శంకరాభరణం ఉత్తమ ప్రజారంజక సినిమాగానే ఎన్నికయింది. ఇప్పటి భారీ ప్రమాణాల ప్రకారం బాహుబలిని ఈ విభాగంలోనే చేర్చొచ్చు.

బాహుబలికి (అదీ ఇంకా సగం సినిమానే) అర్హతలేని బహుమానం దక్కింది. మన సినిమాల ఆరోగ్యానికి ఈ కొత్తధోరణి జాతీయ బహుమతులు మంచి చెయ్యవు.

 

 

 

అమానత్

 

 

-పప్పు నాగరాజు 

~

 

అనగనగా అంటూ మెదలయ్యే కథలు కొన్నుంటాయి.

స్థలకాలాలతో మొదలయ్యేవి మరికొన్ని.

చెప్పుకునేవి కొన్ని,

చదువుకునేవి కొన్ని,

కోవెల ఎదురుగా, కోనేరు వారగా,  ఓ వేసవి మధ్యాహ్నం పెద్ద రావిచెట్టు చప్టా మీద పడుకునుండగా, ఉండుండి వీచే గాలివాటుకి జల జలమంటూ రావాకులు వినిపించిన కథ ఒకటుంది.

****

 

దశాశ్వమేథ్ ఘాట్ కూడా గంగలాగే కాలాన్ని ఎప్పుడూ లెక్కచెయ్యనట్టే ఉంటుంది. అక్కడి చెక్క బల్లలు, గొడుగులు, పడవలు, పూజారులు, మంగలివాళ్ళూ అనాదిగా అలానే ఉన్నారేమో అనిపిస్తుంది.  నిరంతరంగా ప్రవహించే నదీ, నిశ్చలమైన ఘాట్లూ, ఎప్పుడూ సజీవంగా ఉండే చావూ, సనాతనమైన భక్తీ  కలగలిసిన స్టిల్ ఫొటో అది.

డెబ్భైఏళ్ళ జీవితం జ్ఞాపకంగా మారగా, మిగిలింది మట్టికుండలో పట్టుకుని పడవమీద గంగ మధ్యకి పోయి, తండ్రి అస్ఠికలు గంగలో కలుపుతున్నప్పుడు మొదటిసారిగా వచ్చింది పొగిలి పొగిలి దుఃఖం – లోలోపల పొరల్లోంచీ, నరాలని తెంపుతూ, తెరలు తెరలుగా, ఒక వరదగా.

“జీ భర్ కే రో లో బేటా, తుమ్హారే ఆఁసూ గంగా మాఁ కో  బహుత్ ప్యారే  హై, యే ఆఁసూ హీ తో ఉన్ కీ  ప్యాస్ మిటాతే హై” అన్నాడు పడవ నడుపుతున్న ముసలితాత.

పదమూడోరోజు తెల్లార్నే రామ్ నగర్ దుర్గామందిరం మెట్లు ఎక్కుతుంటే, పొగమంచుతో ఆర్ద్రమైన కోవెలలోంచి, చీకటిని మాత్రం చూపించే చిట్టి దీపాల కాంతిలో కనిపించాడతను – పొడుగాటి గడ్డం, తీక్షణమైన చూపులు, చేతిలో వంకర్లు తిరిగిన పెద్ద కర్ర, అది దేహమో, ఏ అగ్నిపర్వతంలోంచో పెల్లుబికిన లావానో చెప్పడం కష్టం. ఒక్కదాటులో దగ్గరకొచ్చి, భుజంమీద కర్రతో తాటించి “మాకా ఆశీర్వాద్ హై. మగర్, తుమ్కో బహుత్ దర్ద్ సహానా పడేగా”. అంటూ, గిరుక్కున వెనక్కి తిరిగి ఎటో వెళ్లిపోయాడు.

లోతుతెలియని ఆర్తిలోకి దూకడం దుస్సాహసం. అనాటి నుండీ ఏదో తెలియని వెలితి – నిజం కోసం, స్పూర్తి కోసం, మెదడుని, మనస్సుని, ఆత్మని, దేహాన్నీ కలిపే ఏకసూత్రం కోసం.

తిరగని చోటూ లేదు, కలియని జ్ఞానీ లేడు, చదవని పుస్తకమూ లేదు.

వెతుకులాటలో నిజాయితీ ఉంటే, వెదుకుతున్న తీగ ఏదో ఒకరోజు దానంతట అదే కాలికి తగులుతుంది.

“Saying yes to this path is saying no to all imagined escapes”.

చదువుతున్న పుస్తకం చేతిలోంచి అప్రయత్నంగా జారింది. ఆ ఒక్క వాక్యం, అప్పటివరకూ బతికిన అబద్ధపు జీవితం మీద పడి  బద్ధలైన అణుబాంబు. రాత్రి గడిచేలోగా, కొన్ని వందల జీవితాలు,  కొన్ని వేల గొంతుకలు కాలి బూడిదైపోయాయి. అనాటినుండీ, ఏవో అనుభవాలూ, కొన్ని అదృష్టాలూ, అర్థంకాని ఇన్‌ట్యూషనూ బంతిని లాగే దారంలా ఎటో లాక్కుపోతుండేవి. మానవ జీవితానికి సంబంధించిన సాధారణమైన ఆనంద విషాదాలు ఏవీ అంతగా పట్టేవి కావు – అన్నిటిలోనూ ఉన్నా, అన్నీ ఉన్నా, ఏదీ తనది కానట్టుగా ఒక మైమరపు ఆవహించి ఉండేది.

అలాటి ఉన్మాదంలో, కొలొంబియాలో సాంతామార్టాకి దూరంగా అమేజాన్ అడవుల మధ్య మూడువారాలు..

ఎనిమిదో రోజు కనిపించింది ఆమె, కొండ కింద సెలయేరులోంచి, కర్ర బిందెలో నీళ్లు ఎత్తుకుంటూ.

పేరు మెండోజా.

జగన్మోహనమైన చిరునవ్వు, భక్తినీ, విశ్వాసాన్ని, పాటని ఒక బిందువుగా గుండెలో బంధించినట్టు ఏదో అలౌకికమైన సంతోషం ఆమె దేహమంతా వ్యాపించికుని ఉండేది.

ఎన్ని మాటలో, అంతకంటే ఎక్కువ మౌనం,  ఎంత సాంగత్యమో అంతకంటే ఎక్కువ ఎడబాటు.

 

“ప్రేమించావా, ఋజువేంటి?” అనేది పగలబడి నవ్వుతూ.

“ఎప్పటికీ మర్చిపోలేను, అది చాలదూ?”

మళ్లీ అదే నవ్వు, జలజలమని రావాకులు రాలుతున్నట్టే.

చుబుకం పట్టుకొని, తల ఆడిస్తూ, ఆకతాయిగా, “మరిచిపోవూ? భలే.. అది చాలా సుళువు కదూ? నిరంతరంగా జ్ఞాపకంలో ఉండాలి, నీకది సాధ్యమా?”

 

“అయితే, నాలోని నేనుని ఇకనుంచీ నీపేరుతోనే పిలుచుకుంటా, అది చాలా?”

ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో మునుపెన్నడూ లేని తీక్షణత. క్షణ క్షణానికి బరువెక్కుతున్న మౌనం ఒక అరగంట తర్వాత ఇద్దరినీ కలుపుతున్న ధ్యానంగా మారింది.

ఏదో నిర్ణయానికి వచ్చినదానిలా, దిగ్గునలేచి నిలబడి, ప్రాణాలన్నీ పెదాలలోకి లాక్కుంటూ ముద్దుపెట్టుకుంది. తన జేబులోంచి కొన్ని మష్రూములు తీసి ఇచ్చింది. “ఈ రాత్రికి వీటిని తిను. జీవితంలో మరోసారెప్పుడో తప్పకుండా కలుసుకుందాం” అని చెప్పి వడివడిగా కొండదిగి వెళ్లిపోయింది.

ఆ రాత్రి, నిద్ర గగనం – గుండెల్లో కర్పూరం వెలిగించినట్టూ,శరీరంలోని అణువణువూ మొదటిసారి మేల్కొన్నట్టూ. అంతలోనే, ఏదో విషం ఒళ్ళంతా పాకుతున్నట్టుగా  వెన్నులోంచి భయంకరమైన నొప్పి. ఇంతలో, బయట వీధిలోంచి ఎవరో పిలిచారు. బయటకి వచ్చి చూస్తే, ఇద్దరు నేటివ్ ఇండియన్లు ఉన్నారు. తమ వెంట రమ్మన్నట్టుగా సైగ చేసారు.  మౌనంగా నడుస్తూ, ఊరి చివరకి రాగానే, ఇద్దరూ చెరో వైపు నిలబడి, చేతిలో చెయ్యి పట్టుకున్నారు. అంతే, ముగ్గురూ కలిసి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి పక్షుల్లా పయనించసాగారు.

amanata

ఆండీస్ పర్వాతాలమీదనుండీ ఎంతో సేపు ఎగిరాక, ఒక చిన్న ఊరు కనిపించింది అడవుల మధ్యలో. అక్కడ దింపారు, అక్కడ ఉన్న ఒక గుడిసెలోకి తీసుకుపోయారు. అందులో కొంతమంది మనుషులు వలయాకారంగా కూర్చుని ఉన్నారు. మధ్యలో ఒక చిన్నదీపం వెలుగుతోంది.

ఒక మనిషి డప్పు వాయించటం మెదలెట్టాడు. అది ఒక చిత్రమైన లయ అందుకోగానే, గుంపు నాయకుడు అందరికీ నానక్టల్ మష్రూములు ఇచ్చాడు. అతని సైగతో ఒకామె అడవులని, ప్రకృతిని గానంచేసే పియోటే ఇండియన్ పాట పాడడం మొదలెట్టింది. ఆమె గొంతులో అడవిలోని చెట్లమధ్య వీచే గాలీ, కీచురాళ్ల రొదా, పులుల ఘాండ్రింపూ, నెమళ్ల క్రేంకారం –  అన్నీ కలగలసి అడవే మూర్తిమంతమై పాడుతున్నట్టుగా ఉంది:

హే యా నా హీ యానా నీ

హే యానా హీ యా నా నీ

హే యానా హీ యోయి నా నీ, హె యానా హా యోయి హెయ్ నీ

హే యానా హీ నీ నా డోక్ ఇగో హా కో ఒంటా

(May the Gods bless me.

Help me, and give me power and understanding)

పాట పూర్తయ్యేసరికి అడవి, నది, చుట్టూ మనుషులూ అందరితోనూ ఐక్యం అయిపోతూ, అంతకు ముందెన్నడూ ఎరగని వేరే స్పృహ.

పక్కన కూర్చున్న వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.  “నా పేరు మైకేల్, మైకేల్ బారెట్”  మామూలు మాటల్లో పరిచయం చేసుకుంటున్నట్టే,  న్యూస్ పేపర్ చదివినట్టు, మైండంతా చదివేసాడు.

“You are looking for the king – El Shah, the one who can teach you?”

“…”

చెవిలో రహస్యం చెప్పినట్టుగా అన్నాడు

“రాంచియో డి అమీగోస్, తెహువాఖాన్, మెక్సికో”

“ఓ మూడు నెలల్లో అక్కడికి రా”

“Have faith in your heart and a song in your eyes. you will find the way”.

 

తెల్లవారు ఘామున తిరిగి ఆకాశమార్గన్నే హొటల్ దగ్గర దింపేసారు ఆగంతకులిద్దరూ. కలో, నిజమో ఎప్పటికీ తెలియకపోయినా, అనుభవంగా మాత్రం అది గొంతులో దాహం లాంటి పచ్చినిజం.

****

amanata

ఎడ్వంచర్ ప్రారంభించినప్పుడు తొలకరి చినుకుల్లో తడిసినట్టు గమ్మత్తుగా,  అమాయకంగా ఉంటుంది.   హఠాత్తుగా అపనమ్మకం రూపంలో ఆందోళన ఎదురవుతుంది.  ఏదో ఆవేశంలో మెక్సికోకి విమానం ఎక్కేసినా, మెక్సికోసిటీ లో దిగగానే లక్ష అనుమానాలు – ఎవరో ఒకతని మాట పట్టుకుని, దేశం కాని దేశంలో ఎడ్రసు కూడా తెలియకుండా ఎక్కడకని వెళ్ళడం? అసలా మైక్ అనే వ్యక్తి ఉన్నాడా, అప్పుడు జరిగింది అంతా కలా? ఆ రాంచ్ ఉందా, అదో మెటాఫరా? అక్కడికి తోవ ఎలా తెలుసుకోవడం?

మెక్సికోసిటీ నుండి తెహువాఖాన్ కి ఆరుగంటల బస్సుప్రయాణం అనుమానాల చక్రాలమీద ఊగిసలాడుతూ జరిగింది. బస్టాండులో దిగేసరికి రాత్రి పదయ్యింది.

 

ఎందుకో మైక్ చెప్పిన ఆఖరి మాటలు గుర్తొచ్చాయి.

అంతలోనే, “అమీగో.. are you the one from the East?”, అంటూ వెనకనుంచీ ఎవరో భుజం చరిచారు.

“ఆ, అవును… రాంచియో అమీగోస్…” అస్పష్టమైన గొణుగుడు.

“Mike told us that you would be coming, how nice to see you..”  చిరకాల స్నేహితుడిని పలకరించినట్టు, అలవోగ్గా మాట్లాడుతూ, “నా పేరు పెట్రీషియా, చీలీ నుంచి వస్తున్నా” అని గలగలా మాట్లాడుతూనే, చెయ్యి పట్టుకుని కాంపుకి వెళ్లే బస్సువైపు లాక్కెళ్లింది.

బస్సులో లగేజీ పెడుతుంటే “అదేంటి – నువ్వు టెంట్ తెచ్చుకోలేదా, రెండు వారాలు ఎక్కడుంటావూ, చెట్టుకిందా?” అంది పగలబడి నవ్వుతూ.

సుమారుగా ఐదొందల మంది ఎన్నో దేశాలనుంచీ వచ్చిన వాళ్లంతా ఉన్నారక్కడ – గాలంతా నిండిన ఒకరకమైన కేరింత. చిన్న చిన్న గుంపులుగా గూడి ఏవో మాటలు, పాటలు, రాత్రి స్పాంటేనియస్గా స్పానిష్ గిటార్లతో పాటలు, ఆడా, మగా అనిగానీ, చిన్నా పెద్దా అనిగానీ, దేశాలు, రంగులూ గానీ ఏ తేడాలూ, ఏ అహాలు లేని చోటది.

రెండు రోజులయినా, షేక్ జాడ లేదు.

“ఆయన ఎక్కడా కనిపించలేదామిటా అని ఆశ్చర్యపోతున్నావా”? నవ్వుతూ అడిగింది కాథరీన్. షికాగోనుంచి వచ్చిందామె.

“ముందు వంట రుచి చూడు, వచ్చింది అందుకే కదా? వంటాయనతో ఏం పని?”

“…..”

“ఇంకా రాలేదు, ఇంకో నాలుగురోజుల్లో వస్తారేమో.  కానీ పైకోసారి చూడు – పైన ఎగురుతున్న గద్దని చూసావా? అది అలా గిరికీలు కొడుతూ ఉంటుంది, కింద చిన్న సూది కదిలినా అది పసిగడుతుంది. It will dive exactly at the right moment. ఆయన కూడా నీకలానే తారసపడతాడు, దాని గురించి నువ్వింక పెద్దగా ఆలోచించకు” అనేసి, సాక్సఫోను అందుకుని వాయించటం మొదలెట్టింది.

 

కాంపింగ్ స్థలానికి కాస్త దూరంగా, పెద్ద చెట్ల మధ్య ఒక ధ్యానమందిరం లాంటిది కనిపించింది. దాన్ని శ్రద్ధతో ప్రేమతో కట్టినట్టు అక్కడి వాతావరణంలోని అనుభూతి వల్ల తెలుస్తుంది. చుట్టూ గులాబీ తోట, కాలిమార్గం అంతా ఎవరో శ్రద్ధగా అమర్చిన గులకరాళ్లు. మందిరం చుట్టూ చిన్న ఫౌంటెన్లు. ఆ మందిరంలోంచి ప్రసరిస్తున్న ఒకానొక అలవికాని ఆనందాన్ని, అక్కడంతా పరచుకున్న నిశ్శబ్దం తన ఒళ్లంతా నింపుకుంటూ అక్కడనుంచీ కదలడం ఇష్టంలేక బాసింపట్టువేసుకుని కూర్చుంది.

అక్కడ ఉన్న బెంచీమీద కూర్చునుండగా, మందిరం తలుపుతీసుకుని, తెల్లటి బట్టలలో దేవకన్యలా మెరసిపోతూ వచ్చింది టుటూసు. దగ్గరకొచ్చి నవ్వుతూ పలకరించింది.

“టుటూసూ, నేను లోపలకి వెళ్ళొచ్చా?”

“Yes my friend. By all means go. Experience the baraka, and keep it in your heart” అని చెంపలమీద చిన్నగా ముద్దుపెట్టి, వెళ్లిపోయింది.

 

లోపల గడిపిన అరగంట మాటల్లో చెప్పలేని అనుభూతి.

ఉలివెచ్చని తాకిడికి

రాతిదుప్పటిలో నిద్రపోతున్న శిల్పం

బద్ధకంగా బయటపడింది

 

ధ్యానముద్రలో కాలాన్ని బిగపెట్టిన మౌనికి

మనసుతెరుచుకొని,

పెదాల జారిన చిర్నవ్వొకటి

పాటై,

గాలిగోపురం గూటికి చేరింది

 

మరుసటి రోజు వచ్చాడాయన. తెల్లటి బట్టల్లో, ఆరడుగుల పొడుగు, గద్దముక్కు, ఒళ్ళంతా ఒకరకమైన వెలుగు. ఆ కళ్ళల్లో బిగ్ బాంగ్ విస్ఫోటం ఇంకా అలాగే ఉంది. ఆయన చూపులు ఒకపక్క మొత్తం కాంపంతా పరుచుకుంటూనే, మరో పక్కనుంచీ ప్రతి వ్యక్తినీ ప్రత్యేకంగా పలకరిస్తున్నాయి. ఎవరెవరో ఆయనతో ఏదేదో మాట్లాడుతున్నారు.

ఆయన్ని చూస్తుంటే ఒక్కో క్షణం ఒక్కో అనుభూతి – ఒకసారి ఆయనో దిగుడుబావి, కాని అది దాహం తీర్చే బావి కాదు, అందులోకి దూకి ఆత్మార్పణం చేసుకోవాల్సిన బావి. మరోక్షణం ఆయనో పచ్చని లోయ, కొండ అంచులనుంచీ అందులోకి అమాంతంగా జారిపోవాలనే తపన.

ఇంతలో మైక్ కనిపించాడు.

“హౌ ఎబౌటె బీర్?”

“ష్యూర్”

మౌనంగానే మూడు బీర్లు అయాయి.

“నువ్వొక పులి గుహలోకి వచ్చావు. దానికి ఇప్పుడు నిన్ను వేటాడే తొందరేం ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు అది నిన్ను వేటాడుతుంది. అందుకని, దాని గురించి ఇక ఆలోచించకు, అంతవరకూ.. “ అని చేతులు చుట్టూ చాపి  కేరింతలు కొడుతున్న కాంప్ అంతా చూపించాడు.

 

మర్నాడు ఆయనే దగ్గరకి రమ్మని సైగచేసాడు తర్జనితో.

“That condensed tear in your heart,

that became a precious pearl – give it to me

I give you a life of suffering and everlasting joy in return”

****

 

తప్పిపోయిన చరణం

తిరిగి పద్యాన్ని చేరుకుంటుంది ఎప్పటికైనా

తెంపబడ్డ వాక్యం

ఏ దివ్య చరణ సన్నిధినైనా చేరగలదా,

ఏనాటికైనా?

 

రోజువారీ ప్రపంచంలో ఉద్యోగాలూ, పుస్తకాలూ,కంప్యూటర్లూ, డబ్బులూ, స్నేహాలూ, అనుబంధాలూ ఇవన్నీ నిస్సారంగా చప్పగా ఉండే నిజాలు, దానికి సమాంతరంగా మరో సర్రియల్ జీవితం నడిచేది. విశ్వాసానికి, అపనమ్మకానికి మధ్య వంతెనగా చీలిపోయిన జీవితం కాన్వాస్ మీద  రెండు చుక్కలుగా విడిపోయింది అస్తిత్వం — ఆ చుక్కలు కదులుతాయి, నడుస్తాయి, ఒక్కోసారి అర్థవంతంగా ఆగిపోతాయి, స్థలాలు, కాలాలు, చుట్టూ మనుషులూ వీటన్నింటి మధ్యనుంచీ ఆ చుక్కలు ఆగకుండా, ఒక్కోసారి ఎన్నో ఏళ్లు చాలాదూరంగా నడుస్తూ, తిరిగి కలుస్తూ ఏదో చిత్రాన్ని పూర్తిచెయ్యాలన్న తపనతో కలిసి విడిపోతూ ఉండేవి.

amanata

కాలం గడుస్తున్నకొద్దీ, రాత్రిపూట నడిచే సర్రియల్ ప్రపంచమే నిజం అయిపోయింది, చుట్టూ మనుషుల ఆలోచనలూ, ఆందోళనలూ, ఆత్మవంచనలూ, అహాలు, నమ్మకద్రోహాలు క్రమక్రమంగా భరించరానివిగా మారి పగళ్లన్నీ సమ్మెటపోటుల్లా ఆత్మని ఛిద్రం చేస్తుండేవి.

మాటగా మారిన ప్రతి పదమూ నిస్సారమై, కవితగా మారిన ప్రతి అనుభవమూ విఫలమై, మౌనంగా మిగిలిన కవిత్వ క్షణాలే ఊపిరిపాటకి లయని కూర్చేవి. అదీ ఎంతో కాలం మిగలలేదు. తేనెటీగలు ఖాళీచేసి, వదిలివెళ్లిపోయిన మైనం ముద్దలా మిగిలిన హృదయాన్ని ఎలా నింపుకోవాలో తెలీక, వాస్తవికత నుంచీ అధివాస్తవికతలోకి, అధివాస్తవికతనుంచీ ఒక మంత్రనగరిలోకీ జారిపోయి, కేవలం ఒక భావనా ప్రపంచం మాత్రం మిగిలింది.
నది మీద సూర్యాస్తమయాలు మాత్రం జారవిడుచుకోలేని క్షణాలు. అలాంటి ఒకనాటి సాయంత్రం, నీటిమీద తేలుతూ తామరాకులతో చేసిన ఒక చిన్న దొప్పలాంటిది తేలుకుంటూ వచ్చింది, అందులో నాలుగైదు దేవగన్నేరు పువ్వులు, ఒక పద్యం, వాటి మధ్యలో ఒక ప్రమిదలో ఉప్పగా — బహుశా కన్నీళ్లేమో.

 

ఆనాటి నుండీ ప్రతీరోజూ అదే సమయానికి ఆ దొప్ప వచ్చేది – ప్రతిరోజూ అందులో ఒక పద్యం. ఆ పద్యం నిండా గుండెలుపిండే బాధా, ఒంటరితనమూ, విరహమూ, ఏవో గాయాల మచ్చలూ, స్వేచ్ఛకోసం ఆరాటమూ, వదిలి వెళ్లిపోయిన స్నేహితుడికోసం జీరవోయిన పిలుపూ అన్నిటికీ మించి, పట్టుకుంటే కాటేసే కాంక్ష.

మరో దుస్సాహసానికి తెరచాప ఎత్తక తప్పలేదు. ఆ దొప్ప వచ్చిన దిశగా నదికి ఎదురుగా నడుస్తుంటే, ప్రతిరోజు ముందురోజుకంటే కాస్త ముందుగానే అది దొరికేది. అలా కొన్ని రోజులపాటు నడక.

ఒకచోట నది చాలా వెడల్పుగా పారుతోంది, అక్కడ రెండుగా చీలిన నది పాయల మధ్య ఒక చిన్న లంక కనిపించింది. దానిమీద ఒక దుర్భేద్యమైన కోట, చుట్టూరా దేవగన్నేరు చెట్లు, కానీ వాటికి ఒక్క ఆకుకూడా లేకుండా పూర్తిగా ఎండిపోయి, యుగాలుగా ఒక నీటిబొట్టుకోసం తపిస్తున్నట్టు జడులై ఉన్నాయి.

 

ఆ రోజు మధ్యాహ్నం ఆ మేడలోంచి ఒక స్త్రీ ఆ దొప్పని నదిలోకి విసిరింది. అశ్రుపూరితమైన ఆమె కళ్ళలోని ఎర్రటి జీరలో సూర్యాస్తమయమవుతున్న ఆకాశం గోచరమయ్యింది.

ఆ కోటలోకి పోవడానికి మార్గాలేమీ లేవు. కోట చుట్టూ ఏవో మాయలు దాన్ని రక్షిస్తున్నాయి. లోపలనుంచీ ఒక చీమకూడా బయటకు రావటానికి గానీ, బయటనుండీ ఒక ఈగ లోపలకి దూరడానికి గానీ మార్గంలేదు. అందుకేనేమో, ఆమె విడుదలకోసం, ఆ చెరనుంచీ విముక్తికోసం అంతగా తపిస్తోంది.

ఎన్నోరోజుల పడిగాపుల తర్వాత, హఠాత్తుగా ఒక తెల్లటి చేప ఈదుకుంటూ దగ్గరకి వచ్చింది, తనతో రమ్మంటున్నట్టుగా ఏదో సైగలు చేస్తూ..

మెండోజా!!!???

ఎన్ని యుగాల జ్ఞాపకాలో గుండెలోంచి ఒక్కసారిగా ఉప్పెనగా పెల్లుబికాయి – వాటి పోటు నదిలోకి విసురుగా తోసెయ్యటంతో, ఆ చేప వెనకాలే ఈదుకుంటూ వెళ్ళకతప్పలేదు. ఆశ్చర్యంగా, నీటిలోపల నుంచీ ఆ కోటలోపలకి ఒక చిన్న సొరంగ మార్గం ఉంది.

 

“వచ్చావా, ఇన్నేళ్లూ ఎందుకు రాలేదు?”

“….”

“నీపేరు?”

“అప్పుడే మరచిపోయావా … మరీచూ”

“ఈ మేడలో ఇలా ఎందుకుండిపోయావు? బయటకెందుకు రావు? రోజూ ఆ పద్యాలు ఎందుకలా నదిలోకి వదులుతావు?”

“మా నాన్న పెద్ద మాంత్రికుడు. నన్ను ఈమేడలో బంధించి, అష్టదిగ్బంధనం చేసి, బయటకు పోయాడు నా చిన్నప్పుడు. మరలా తిరిగి రాలేదు. అప్పటినుండీ ఇక్కడే బంధిగా ఉండిపోయాను. నన్ను విడిపించే నీకోసం ఎదురుచూస్తూ. నిన్ను పిలవడానికే ఆ పద్యాలు నదిలో వదులుతుంటాను.”

“నాతో వచ్చేయి మరీచూ, ఇక నీకు ఎప్పటికీ ఒంటరితనం ఉండదు, విశాలమైన ప్రపంచం అంతా మనదిగా విహరిద్దాం”

“ప్రేమించావా? నీ ప్రేమలో బంధిగా ఉండలేను, అంతకంటే ఈ మేడే నయం నాకు – నువ్వెళ్లిపో ఇక్కడనుండీ” మళ్లీ అదే కన్నీరు, ఒక్కో కన్నీటి చుక్కలో ఒక్కో తుఫాను.

అప్పుడొచ్చాడతను, ఆకాశం నుండీ ఊడిపడ్డ ఉల్కలా.. ఆకుపచ్చని అంగారఖాలో, కరిగించిన వెండిలా ఉన్న బవిరిగడ్డం, నిప్పు కణికల్లాంటి కళ్లు, అదే గద్దముక్కు..

“నీకు స్వేచ్ఛకావాలి కదూ” ఆ గొంతులో ఉరుములు

“అవును బాబా..”

 

చర చరా గోడదగ్గరకి నడుచుకుంటూ వెళ్లాడు, అక్కడ డాలు కింద ఉన్న పెద్ద కత్తిని చర్రున లాగి, ఆమె రెండు చేతులూ, నిర్దాక్షిణ్యంగా నరికేసాడు. బాధతో ఏడుస్తూ కింద పడిపోయింది ఆమె. రక్తసిక్తమైపోయిన ఆమెని, నడుంపట్టుకుని గాలిలోకి ఎత్తాడు సునాయసంగా, రెండు కాళ్లూ విసురుగా నరికేసాడు. మేడపైనుంచీ, ఆమెని నదిలోకి విసిరేసాడు అదే ఊపుతో.

 

నదిని తాకుతూనే ఆమె తెల్లటి చేపగా మారిపోయింది, ఒక్కసారి పైకి ఎగిరి వీడ్కోలు చెప్పినట్టుగా చూస్తూ నీటిలో మునిగి మాయమైపోయింది.

“ఏమిటిదంతా, ఎవరు నువ్వు?”

శరీరాన్ని చీల్చుకుంటూ తీక్షణమైన అదే చూపు

“నువ్వే కదూ, ఆరోజు కాశీలో దుర్గా మందిరం దగ్గర కనిపించిన సాధువ్వి?”

“సరిగ్గా చూడు బేటా, నన్ను నువ్వు చాలా సార్లు చూసావు, నీ తోలు కళ్లతో కాదు, నీ గుండెల్లో పొదిగిన ముత్యంతో చూడు – ఇంకా గుర్తు పట్టలేవా?”

అప్పుడు కనిపించాడు – ఎన్నో రూపాల్లో – మెండోజా, మరీచూ, మైక్, మెక్సికోలో కనిపించిన షా.. అన్నీ అతనే!!

 

అప్పుడు కూలిపోయింది ఆ కోట

వెయ్యి శకలాలుగా

దేవగన్నేరు చెట్లన్నీ

ఒక్కసారిగా పుష్పించాయి,

శతకోటి వెన్నెల రవ్వలుగా

****

చిల్లుపడ్డ గుండెకి తాపడం వేసుకోమని రావిచెట్టు రెండు ఆకులు బొట బొటమని రాల్చింది.

 

 

*

ఒక పాఠక దృక్కోణంలో… కథా రచన!

Book

 – కె.వి.కరుణా కుమార్

~

 

ఈ పుస్తకం మార్చి 20, ఆదివారం నా చేతికొచ్చింది. పూర్తి పుస్తకాన్ని నాలుగు పనిదినాల ఒత్తిడి మధ్య పూర్తి చేశాను. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ప్రయాణంలో, ఎవరి కోసమైనా వేచి చూస్తున్నప్పుడు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. ఇది ఏకబిగిన చదవగలిగే పుస్తకం కాదని ఖదీర్‌బాబు అన్నారు. కానీ అలా అనిపించలేదు. ఈ పుస్తకాన్ని ఏకబికిన చదవొచ్చు. అల్మైరాలో దాచుకుని ప్రతీ పదిరోజులకూ ఓసారి మొత్తం చదువుతూ ఉండొచ్చు. లేదా పోటీ పరీక్షలకు తయారయ్యేవారిలా ఒక్కో అధ్యాయాన్ని చదువుతూ ఆకళింపు చేసుకుంటూ అవసరమైనపుడు మననం చేసుకుంటూ చదవొచ్చు.

అంతగా పదిలపరుచుకోదగిన అపురూప రచన ఇది.

అయితే ఇదంతా కథలు రాసేవాళ్లకేనా? నాలాంటి పాఠకుడికి ఇందులో ఏమీ లేదా? ఉంది.  ఖచ్చితంగా ఇది పాఠకుడి కోసం కూడా. ప్రతి మనిషీ కథకుడే. కనీసం తన స్వంత కథనైనా అతడు రాయగలడు.  దానిని నలుగురూ చదువుకునేలా రాయించడానికి అవసరమైన తర్ఫీదు కోసమే ఈ పుస్తకం రాశారేమో అని కూడా అన్పిస్తుంది. ఒక సాధారణ పాఠకుడిగా ఈ పుస్తకం  పూర్తి చెయ్యగానే నాకు బలంగా అన్పించిన విషయాలు మూడు.

మొదటిది:

ఎప్పుడో రాయటం ఆపేసిన చెయ్యికీ, రాయించే బుర్రకూ మళ్లీ ఏదైనా రాయాలని బలంగా అన్పించేలా ఈ పుస్తకం చేస్తుందని. ఉదాహరణకు నా సంగతే చూడండి. నేనేమీ రచయితను కాను. ఎప్పుడూ రచనలు చేయలేదు. బ్రతుకు బండిని లాగటానికి గుండెల్లో ఉన్న కాస్త చెమ్మనీ, భావుకత్వాన్ని కప్పిపెట్టి నిరంతరం అమ్ముతూ…. కొంటూ.. తాకట్టు పెడుతూ… తాకట్టుగా ఉంటూ నలిగిపోయే కాంక్రీటు జీవిని. నాలాంటి వాడికి కూడా ఏదైనా రాయాలనిపించేలా చేయటం ఈ పుస్తకపు మొదటి గొప్పతనం. అందుకే ఆలస్యం చేయకుండా ఇది రాయటం మొదలుపెట్టాను. ప్రారంభం ఏదైనా మంచిదే కదా!

రెండవది:

ఇది మన తల్లినో తండ్రినో ఒక గొప్ప శ్రేయోభిలాషినో గుర్తు చేస్తుందని కూడా అనిపించింది. నా వరకైతే ఈ పుస్తకం ఆద్యంతమూ నా తండ్రిని గుర్తుచేసింది. ఖదీర్‌బాబు ఈ పుస్తకాన్ని రాసిన విధానం ఒక తండ్రి- కొడుకు వేలు పట్టుకుని నడుస్తూ మంచీ చెడ్డలు మాట్లాడుతున్నట్లుంది. మా నాన్న కూడా ఇలాగే. కొన్ని వెన్నెల రాత్రులు… కొన్ని చీకటి రాత్రులు… ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ పక్కపక్కనే పడుకుని ఇద్దరం మాట్లాడుతూ ఉండేవాళ్లం. ఆయన కథలు, పద్యాలు చెప్పేవారు. ఊ… కొట్టుకుంటూ ఆయన చెమట వాసనను పీలుస్తూ, గట్టిగా వాటేసుకుని నిద్రపోయిన ఆ రోజుల్ని పుస్తకాన్ని చదువుతున్నంతసేపు గుర్తుచేశాడు ఖదీర్‌బాబుగారు. పుస్తకం అంతా ఒక తండ్రి కొడుకునో కూతుర్నో వేలు పట్టుకుని నడిపిస్తూ ఓర్పుగా వివరిస్తూ ఉన్నట్లుంది. స్థిరంగా మన అడుగు పడేవరకు నేర్పించటమే అతని ఉద్దేశ్యం. ఆ నడకతో నువ్వు శిఖరాన్ని అధిరోహిస్తావో, పాదయాత్ర చేస్తావో, తాగి బజారులో తూలుతూ నడుస్తావో అతడికనవసరం. నడకను నేర్పించటమే అతని పని.

ఇక మూడవది:

దాహం… అన్యాయమైన దాహం. వెంటనే తీర్చుకోలేని దాహం. ఈ దాహం అందరికీ కలిగేలా చేస్తుందని ఈ పుస్తకం చదివితే బలంగా అనిపించింది. ముఖ్యంగా  ‘కథలెందుకు రాస్తారు’, ‘మంచి ప్రారంభాలు – గొప్ప ముగింపులు’, ‘కథలెప్పుడు రాస్తారు’, ‘థీమ్-ప్లాట్’ ఇలాంటి అధ్యాయాల్లో ఇంతవరకు నేనెరుగని, చదువని సాహిత్యకారుల్నీ, కథలనూ పరిచయం చేస్తూ, ఆ కథలను అసలు కథలంత బలంగా తిరిగి చెప్తూ, ఊరిస్తూ ఉంటే వాటన్నింటినీ ఇప్పటికప్పుడు చదివేయాలనీ అన్ని పనులనూ ఒక సంవత్సరం పాటు ఆపేసి, ఆ పుస్తకాలన్నీ కొనుక్కుని, దొరకనివి ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని ఏకబిగిన దీక్షగా చదువుతూ ఆ ప్రపంచంలో మునిగిపోవాలన్నంత దాహం వేయటం ఈ పుస్తకం చదువుతుండగా కలిగిన ఇంకో భావన.

saranga6

ఖదీర్‌బాబు ఈ పుస్తకం రాసి నాలాంటోడికి చాలా మేలు చేశాడు. మిడిమిడి జ్ఞానం, ఉడికీ ఉడకని అవగాహన ఉన్న నాలాంటి పాఠకుడికి ప్రపంచ కథాసాహిత్యం వైపు కుతూహలం రేకెత్తించాడు. అట్టను చూసి పుస్తకాలను నిర్లక్ష్యం చేసిన నా చవుకబారు తెలివితేటలను అపహాస్యం చేశాడు. రాసేవాళ్లకు సరే… కానీ చదివేవాడికి కూడా బోలెడు తాయిలాలు ఈ పుస్తకంలో…

 

 మచ్చుకు… మెచ్చుకు… కొన్ని. నేను ఇష్టపడినవి!

* ‘కథలెవరు రాస్తారు?’ అధ్యాయంలో ‘ప్రతీదానికి చిలువలు, పలువలుగా ఊహించుకుంటూ ఉండాలి’ అని మొదలుపెట్టి ‘తర్వాతి పేరా అప్పటికే సిద్ధమైపోయి ఉంటుంది’ అని ముగించే ఓ పేరా ఉంటుంది. అది చదువుతూ ఉంటే పెదవులు మెల్లగా విచ్చుకుని మందహాసంగా మొదలై, ఫక్కున నవ్వటం మీరు చేయకపోతే నన్నడగండి.

* అదే అధ్యాయంలో ‘రాత్రి శ్వాస సోకితే చాలు ఆయువు వదిలేసి రాలిపోయే పూల మృత సౌందర్యాన్ని పరికిస్తూ’అని మనలో భావుకత్వం ఏ స్థాయిలో ఉండాలో వివరిస్తాడు రచయిత. మృత సౌందర్యం అనే ఆ పదాన్ని వాడినందుకు ఖదీర్‌బాబు వేళ్లను ముద్దాడాలనిపిస్తుంది.

* ‘అవంతీపుర రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పాలిస్తున్న రోజులవి’ అని మొదలెట్టి ‘వక్కాకు ఊంచి అరుగు మీద కూర్చున్నాడు గోవిందప్పా’ అని పాతకథలను గుర్తు చేస్తూ ఏకబిగిన నోస్టాల్జియాను కళ్ల ముందు మెరిపిస్తాడు. ఒక్క క్షణం గిర్రున కాలం వెనక్కు వెళ్తుంది.  పక్కింట్లో, ఎదురింట్లో, రెండు వీధుల తర్వాత ఉన్న మేనత్తగారి ఇంట్లో, షావుకారు కొట్టు ముందుర, మంగలిషాపులో వేచి ఉన్నప్పుడు, ముత్యాల చెరువు గట్టుమీద గ్రంథాలయంలో దీక్షగా బాసింపట్టు వేసుకుని మర్రిచెట్టు గాలికీ, చెరువు పైనుంచి వచ్చే వింత వాసననూ పీలుస్తూ చదువుకున్న అన్ని పుస్తకాలు, రచయితలు వచ్చి పలకరించి వెళ్తారు. స్థలం మారొచ్చు. పాత్రలు మారొచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కో నోస్టాల్జియా మాత్రం నిశ్చయం.

* ‘కథలెందుకు రాస్తారు?’ అధ్యాయంలో రచయిత మానసిక పరిస్థితినీ, కథా రచయితకుండే అవగాహనను, సమాజం పట్ల చిత్తశుద్ధినీ నిజాయితీగా ఆవిష్కరించాడు రచయిత. ‘అదొక పిచ్చి… సైకలాజికల్ ప్రాబ్లమ్’ అన్న పేరాను చదువుతూ ఉంటే దుఃఖం కలుగుతుంది. కళ్లల్లో నీటి పొర ఏర్పడుతుంది. ‘ఆలోచన… ఆలోచన… ఆలోచన’ అని ఒక వాక్యం ఉంటుంది. అదే పేరా కూడాను. ఆలోచనకు ఆలోచనకు మధ్యన పెట్టిన చుక్కల్లో మనస్సు చిక్కుబడిపోతుంది. ఆ చుక్కల్లో రచయిత పడే మానసిక ప్రసవ వేదన ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంటుంది.

* ఒకే జానర్ లేదా ఒకే కాన్‌ఫ్లిక్ట్‌ను ముగ్గురు రచయితలు ఎలా రాశారో ‘పోత్తి చోరు’, ‘ఎస్తర్’, ‘సావుకూడు’ కథలను ఉదహరించినపుడు కరూర్ నీలికంఠ పిళ్లైకు, వణ్ణనిలవన్‌కు, బండి నారాయణ స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆ కథలు మనలోకి విసిరికొట్టే కథావస్తువు అలాంటిది.

ఇక ఎంత చెప్పినా తక్కువే అన్న విభాగం ఒకటుంది ఈ పుస్తకంలో. అది ‘ఫుట్ నోట్స్’.

ఎందరో రచయితలు, ఇంకెన్నో కథలు, మరిన్నో ప్రదేశాలు, చాలా జ్ఞాపకాలు, కాలంతో నిలబడిన, ఎదురొడ్డిన సాహిత్యం అన్నింటినీ సమగ్రంగా అధ్యాయం వారీగా ఆ వివరాలను ఫుట్‌నోట్స్‌లో పొందుపరిచిన ఖదీర్‌బాబు ఎలా రుణం తీర్చుకోగలం. ఎంత సాహిత్యం… ఎంతమంది కథకులు… ఎంత అదృష్టం. అంతా ఒకేచోట. ఒకే పుస్తకంలో. కథకుడికైనా, పాఠకుడికైనా ఈ పుస్తకం అదృష్టం. గొప్ప అదృష్టం. ఇది మామూలు విషయం కాదు. చాలా ఓపిక, తను చెప్పాలనుకున్నది చెప్పే తీరాలి అన్న పట్టుదల లేకపోతే అంత సమాచారం అంత పొందిగ్గా పొందుపరచటం దుర్లభం.

karmikulu

పుస్తకం అంతా ఒకటే తపన.

నువ్వు కథకుడివా, పాఠకుడివా నాకనవసరం. నాకు తెల్సిందీ తెలుసుకున్నదీ నీకు చెప్తున్నా… నిజాయితీగా ప్రయత్నిస్తున్నా.. బదులుకు నువ్వొక కథ రాయి, అది నీ కథైనా కావచ్చు. కుదరకపోతే ఒక మంచి ఉత్తరమైనా రాసి ప్రారంభించు.., కథ రాయాలని తాపత్రయపడేవాడికి ఈ పుస్తకమివ్వు… ఓనమాలు దిద్దటం నుంచి కాగితంపై గొలుసుకట్టు రాతను ధారగా రాయటం వరకూ ప్రస్తావించాను… నేర్చుకో… అని ఖదీర్‌బాబు మనల్ని సుతారంగా అభ్యర్థించాడని నాకనిపిస్తూ ఉంది.

‘విమర్శను ఎదుర్కోవటం అంటే ఇంకా మంచి కథ రాయటానికి ప్రయత్నించటమే’ అని చెప్తుందీ పుస్తకం. దానికి  సద్విమర్శను స్వీకరించకపోతే నువ్వూ, నీ కథ సంకనాకి పోతాయి అని కూడా హెచ్చరిస్తుందీ పుస్తకం.

ఇన్ని సంగతులు, జాగ్రత్తలు విపులంగా మనకెవరు చెప్తారు? తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడమని ఎవరు బోధచేస్తారు? ఈ పుస్తకం ఇప్పుడేమవుతుందో తెలీదు. భవిష్యత్ రచయితలకు మాత్రం పాఠ్య గ్రంథంగా పనికొస్తుందని గట్టిగా అనిపిస్తోంది నాకు. చదివితే మీకూ అన్పిస్తుంది. నిజం.

*

శిశిరరేఖ

 

 

– ప్రసాద్  బోలిమేరు

~

ఓ పక్క
రాగాలు
పండుటాకుల్లా రాలి తేలుతుంటే
ప్రతికొమ్మా ఓ వాయులీనమే
వెర్రెక్కిన గాలికుంచెకు నేలనేలంతా
రాగక్షేత్రమే
 
మరోపక్క
వగరెక్కిన మోహం
పాటలపులకింతగా
రెమ్మరెమ్మా ఓ సింగారగానం
 
కాదా?
ఈ రుతువుల స్వరమేళనం
పురాతనగేయపునర్నవీకరణం
పులకరిస్తున్నప్రాణానుకరణం
పురిటినొప్పుల బృందగానం
 
ప్రతి సీతాకోకచిలుకా
నిలకడ లేని ఓ వన్నెల ఆలొచనే
రేపటివిత్తుని మోసుకెళ్తున్న
ఓ పరాగరేణువే
ప్రతి ఫలమూ ఓ పువ్వు ధ్యానమే

ప్రతి ఆరాటం
వీడుకోలు, ఆహ్వానాల సంయోగం
శిశిర పవనాల నీడ
వసంత కవనాల జాడ
చూలాలి బుగ్గ మీది

తీపి ఏడుపు చార.

నిన్నటి విషాదగానం గుర్తులేకుంటే
రేపటి నిషాద గీతాన్నెలా గుర్తుపట్టాలి?

*

మజిలి

 

 

– ఊర్మిళ

~

 

ఓ ముడుచుకున్న

మాగన్ను దావానలమా!

ఓ తిరగబడ్డ కాలమా!!

మరీచికా గగనమా

శూన్యం నిండిన విశ్వాంతరాళమా!

ఖండఖండాలుగా

స్రవించిన రుధిరమా!

వలయ వలయాలుగా

ఘనీభవించిన దేహమా!!

వెయ్యిన్నొక్క అలలుగా

ఎగసిన ఆశల శిఖరమా!

అగాథం అంచులో

వేలాడుతున్న జీవిత చక్రమా!

పిడచకట్టిన కుహరంలో

తిరగాడుతున్న దాహమా!

ఎండిన మొండి మానుపై

తెగిపడిన గాలిపటమా!

శ్మశాన సమాధులపై

లిఖించిన మోహగీతమా!

పేర్చిన చితిమంటలో

ఎగసిన మమతల మకరందమా!

సూర్యాస్తమయాల కౌగిలిలో

నలిగి నర్తించిన కాంతిపుంజమా!

పెనుగాలి తుపానులో

సుడులు తిరగాడిన విహంగమా!

కారుమబ్బుల కారడవిలో

నిటారుగా నిలిచిన తిమింగలమా!

మొగ్గ తొడిగిన మామిడి చెట్టుపై

ఊయలూగుతున్న నిశాచరమా!

ఒగ్గిపట్టిన దోసిలిలో

రాలిపడిన ధూళి లేపనమా!

గరకు తేలిన నేలపై

పరుగుపెడుతున్న పాదరసమా!

పూపుప్పొడిలా

రాలిపడిన నిశి నక్షత్ర సంయోజనమా!

పొద్దు తిరుగుడు పువ్వులో

పారాడిన పసరికమా!

విచ్చుకున్న ఉమ్మెత్త పొదిలో

విరబూసిన పచ్చగన్నేరు లాస్యమా!

 

ఏది నీ మజిలీ!

బాటసారి దారి పొడవునా…

గిరకలేని బావులే కదా..! *

*

 

ఇదే దారి!

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి

పదాలు: మానస చామర్తి

~

 

తెలిమబ్బు తొంగి చూసుకుంటుందని

కావి రంగు నీటి అద్దాన్ని

ఆకులు అదేపనిగా తుడిచే దారి

 

సరిగంగ స్నానాల్లో

కొబ్బరాకులు వణికి వణికీ

ఒళ్ళు విదుల్చుకు నాట్యాలాడే దారి

 

ఎవరో విసిరిన

గచ్చకాయ పచ్చిక మోవిపై

పుట్టుమచ్చలా కవ్వించి

ఆకర్షించే దారి

 

నీలి నీలి పూవులు

గరిక కురుల్లో నవ్వీ నవ్వీ

నీలాకాశపు తునకల్ని నేలకు దించే దారి

 

ఒక పసిపాప కేరింత,

పేరు తెలియని పక్షి కూతా

నీరెండ కిరణాల్లా

ఏ వైపు నుండో తేలి వచ్చి

ఉదయాన్నే హృదయాన్ని వెలిగించే దారి.

*

 

 

జలపిత

 

ఉక్రేనియన్ రచన: ఎమ్మా అందిజెవ్ స్కా

అనువాదం: అనంతు 

~

 

emma“మన’’( జీవిత) కాలంలో్ అసాధ్యమనిపించే కార్యకలాపాల, ఘటనల విలీనతనూ, లేదా కదంబాన్నీ ప్రతిపాదించి ‘వలయకాలం’ అనే నవీన కోణాన్నీ, శైలినీ ఆవిష్కరించిన ఎమ్మా అందిజెవ్ స్కా ఉక్రేనియన్ సర్రియలిస్ట్ రచయిత్రి.

1931, మార్చి 19 న తూర్పు ఉక్రేనియాలో పుట్టి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీకి వెళ్ళి, 1950లో న్యూయార్క్ నగరానికి తరలీ, ప్రస్తుతం మ్యూనిచ్ (జర్మనీ) లో నివాసముంటున్న ఎమ్మా అందిజెవ్ స్కా  అస్తిత్వం గూగుల్ లో అమెరికన్ జాతీయత, స్వంత గడ్డ (ఉక్రేనియా) లో విదేశీ రచయిత.

ఈ మెను తన పిత్రు దేశం ఆమోదించిందీ, అక్కున చేర్చుకున్నదీ, అర్థం చేసుకున్నదీ, గౌరవించిందీ ఎనిమిది దశాబ్దాల తర్వాతే. ఎమ్మా అందిజెవ్ స్కా 80 వ పుట్టిన రోజు పర్వదినాన ఉక్రేనియా 10 సంకలనాల్లో ఆమె సంపూర్ణ రచనలను ప్రచురించి తన చారిత్రక పొరబాటుకు దిద్దుబాటు చేసుకుంది.

ప్రస్తుత రచన ‘జలపిత’ (Djalapita) 1962 లో ప్రచురితం.

ఈ రచనలో వాస్తవికత, అధివాస్తవికత, మంత్రవాస్తవికత, జానపద కథనం, వ్యంగ్య ప్రకటన, నిరసన గొంతు, ధిక్కార స్వరం చెట్టపట్టాలేసుకుని కని, వినిపిస్తాయి.

ఇందులో స్రజనాత్మకత, ఆవిష్కరణాత్మక శైలికి కవలగా హేతుబద్ధ, తర్కబద్ద రుజు వర్తన కాల గమనాన్ని నడ్డి విరిచే తత్వ విచారం పాటించింది.

కాలం రుజు వర్తని అనే ‘మన’ హేతు బద్ధతనీ, తర్క విధేయతనీ అదే పనిగా తుత్తునియలు చేసి భూత, భవిష్యద్ వర్తమానాలను తోబుట్టువులను చేస్తుంది.

దీన్నే తను వలయకాలం(round time)గా ప్రతిపాదించింది.

ఎమ్మా అందిజెవ్ స్కా బౌద్ధాన్నీ, సంస్కృత  వాంగ్మయాన్నీ చదువుకుంది.

ఈ జలపిత పదబంధం, పదచిత్రం (తాత్విక ప్రతిపాదన) ఆ ఎరుకలోంచి జనించి ప్రవహించినదే.

ఇంతకీ ఇది కథా, కవితా, విడి విడి అంకాల మాలికా?

 లేక ఉట్టి పిచ్చి ప్రేలాపనా?

 లేక మన గిరి గీతల ఆవల పారే కొత్త నీటి పాయా?

తేల్చుకునేది ఎప్పుడూ  పాఠకుల, విమర్శకుల రసగ్న విగ్నతే.

రచనలదీ, వాటి రచయితలదీ కాదు.

 

Akkadi-MeghamFeatured-300x146

జలపిత

 

 

 

రచయితఎమ్మా అందిజెవ్ స్కా, ఉక్రేనియా

1962  లో ముద్రితం

ఆంగ్ల అనువాదంరోమన్ ఇవాష్కివ్

తెలుగుఅనంతు చింతలపల్లి

 

*

 

“నన్ను చంపేందుకు కత్తి నీడ చాలు’’ జలపిత అన్నాడు.

“అయినా సరే నా పైకి కత్తినే దూయాలనకుంటున్నావా?’’

*

మేఘాలే జలపిత ఆహారం.

అతని అరికాళ్ళు మేఘాలు. అతని చేతులు కూడా.

అందుకే ప్రతిసారీ జలపిత పేరు మారిపోతూ వుంటుంది.

*

 

జలపిత సర్వత్రం.

ప్రతి జీవీ, ప్రతి వ్యక్తీ అతనే. కానీ అతను ఎవ్వరూ కాదు.

అతనే జలపిత.

*

రెండు వేల సంవత్సరాల క్రితం జలపిత ఆత్మకథ రాసే ప్రయత్నం జరిగింది.

కానీ పదాల్లో జలపిత ఇమడకపోయేసరికి ఆ ప్రయత్నం మానుకున్నారు.

అతను పదం నుంచి పిండి రాలినట్టు రాలాడు. ప్రజలంతా అటు ఇటూ పరుగులు తీసారు.

అతని కోసం ఆకాశం కేసి, నేలకేసీ చూసారు.

 

జలపితను వర్ణించడం అసాధ్యం.

*

ఉద్వేగం బట్టి జలపిత పేరు మారుతుంటుంది. వాతావరణ మార్పుల వల్ల కూడా.

నీటికి అతను ఎంత చేరువలో వున్నాడన్న సంగతి మీద ఆధారపడీ అతని పేరు మారుతూపోతుంటుంది.

*

జలపిత బేబెల్ స్తంభం కొసకు లిఫ్ట్ లో వెళ్ళి ఒకసారి కిందకు తేరిపార చూసాడు.

ఆ పట్నం వీధుల్లో దుమ్మలో ఒక బూరబుగ్గల పిల్లవాడు తన ముక్కు లాక్కుంటూ కనిపించాడు.

“ఈ పిల్లవాడు నా శిష్యుడు అయ్యే అవకాశం వుంది’’ అనుకున్నాడు జలపిత.

“ఎందుకంటే అతనికి జీవన రహస్యం విచ్చుకున్నస్వాతి ముత్యపు చిప్ప.’’

జలపిత తన అదనపు పాదాన్ని ఆ స్తంభం కొనపై నుంచి సరిగ్గా ఆ వీధిలోకి మోపి ఆ పిల్ల వాడి పక్కన కూర్చున్నాడు.

“మీ శిష్యుడినేనా?’’ ముక్కు లాక్కోవడం ఆపి అడిగాడు ఆ పిల్లవాడు.

“కాదు’’, జలపిత ఆలోచించాడు.

ఈ పిల్ల వాడికి స్థిమితం లేదు.

ఇతను నా శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేడు.

*

జలపితను ఆరగించవచ్చు. జలపితపైన నడవచ్చు.

అతనొక మైదానం.

*

జలపిత గుర్రపు పందేలకు వెళ్ళి మొదటి వరసలో కూర్చున్నాడు.

పక్కనే ఒక ముసలి మహిళ. వయసు పైబడి చూపు దూరమవుతోంది.

ఆమె జలపితను గుర్రం అనుకుని భ్రమించి భయంతో అరిచేసింది. ఆమె జలపిత దృష్టిలో పడింది.

ఎందుకంటే ఆమె తన కళ్ళద్దాలు ఇంట్లో మరచి వచ్చింది. అందుకే గుర్రపు పందేలను చూడలేకపోయింది.

ఆమె చూడగలిగిందల్లా ఒక్క జలపితనే.

ఆమె అరుపును కూడా ఎవ్వరూ పట్టించుకునే పరిస్థిలో లేరు. అంతా పందేల్లో తలమునకలైపోయారు.

ఇంతలో ఆమె చూపునుంచి తప్పించుకుని తన ఎడమ చేతి వెనక్కి వెళ్ళిపోయి నక్కి దీర్ఘ ఆలోచనల్లోపడ్డాడు జలపిత.

గుర్రాలు వేరుగా, వేగం వేరుగా పరిగెత్తుతాయన్నది అతని ఆ ఆలోచనల సారం.

*

రాత్రంతా ఎటు పడితే అటు తిరిగి మెల్లిగా ఒక బాయిలర్ గదిలో నిద్రపోయాడు.

నిప్పురాజేసేవాడు భలే సోమరి. వాడికి బొగ్గులు, మొద్దులు వెతికి తెచ్చి వేసే ఓపిక లేక అక్కడే కనిపించిన జలపితను ఆ మండుతున్న భట్టీలోకి వేసి అగ్గి రాజేసాడు.

ఆ ఆకాశ హర్మ్యానికి వెచ్చదనాన్నిచ్చే ఆ భట్టీ గొట్టంలో తన దేహం పయనించడం గమనించిన జలపిత ఆశ్చర్యపోయాడు.

మొదట్లో ఆవిరితో కలిసి పయనించడం ఆహ్లాదంగా తోచింది అతనికి.

కానీ కొద్దిసేపటికే బేజారనిపించి ఆ భట్టీ గొట్టాన్ని పగులగొట్టి బయటపడ్డాడు.

అగ్నిమాపక దళం, భద్రతా సిబ్బందీ ఆ భవనం చుట్టుముట్టి నిచ్చెనలు వేస్తున్నారు హడావిడిగా.

ఈ లోగా భట్టీ గొట్టాలనుంచి తన దేహాన్ని కూడబలుక్కుని జలపిత వాళ్ళతో ఇలా అన్నాడు.

“జలపితతో భవనాలను వెచ్చబరచడం ప్రమాదకరం.’’

*

పదాన్ని విశ్వసించాడు జలపిత. అయితే ఆ పదం అతని ఎముకలన్నిటినీ విరిచి, అతని ఆత్మనంతా నుజ్జునుజ్జు చేసేసింది. అదే పదం జలపితను గానుగలో వేసి సిమెంట్, కంకర, చెదారంతో కలిపేసింది.

పాపం జలపిత ముక్కలుముక్కలై పడి వున్నాడు.

గానుగ చుట్టూ తిరుగుతున్న ఆ అవిశ్వాస పదం ఇలా పాడుతోంది తనలో తానుః

“వెర్రిబాగులోడులే జలపిత.

నమ్మతాడా ఎవడైనా పదాలను.

నమ్ముకుంటాడా ఎపుడైనా పదాలను.’’

*

జలపితతో వాళ్ళు బలవంతంగా నీళ్ళు మోయించారు.

నీటిని ఛిద్రం చేయడం ఇష్టం లేక అతను మొత్తం నదినంతా తన దోసిలిలో పట్టి తెచ్చి బల్ల మీద పెట్టాడు.

నదిని తిరిగి మళ్ళీ తీసుకుపొమ్మని అతణ్ణి ఆదేశించారు.

అత్యంత విధేయతతో జలపిత తీరం పక్కకు నదిని చేర్చాడు.

అతను చాలా సేపు అలా నిశ్చలంగా నిలబడిపోయాడు.

తనతో పాటు ఇతరులూ విస్థాపన చెందినందుకు బాధపడ్డాడు.

జలపిత చాలా మంచోడు.

*

జలపిత ఉద్యానవనానికి వెళ్ళి మొదటి వరుసలోని బల్ల పైన కూర్చున్నాడు.

దాహంలో వున్న జనాలు ఒకే ఒక్క నీటి చుక్క కోసం ఎంత తహతహలాడతారో అచ్చం అదే శైలిలో ఎంతగానో ఏడవాలనుకున్నాడు.

కానీ అలా చేయడం అతనికి చేతకాదు; తెలియదు.

 

తన బాహువులు, అరి పాదాలూ నేలకు ఆనించి చాలా బాధగా, గజిబిజిగా కూర్చున్నాడు.

దాంతో అతని చుట్టూ పిల్లలు మూగారు. ఆ పిల్లలు అతనిపైన ఇసుక చల్లుతున్నారు.

తన పెదాలపైన క్రమంగా మీసాలు ఏర్పడుతుండగా జలపిత ఇలా అనుకున్నాడుః

“కనీసం ఒక్క రోజన్నా చనిపోవడం ఎంతబాగుండునో.’’

అతని పైనంతా పిల్లలు దోగాడుతున్నారు.

పిల్లలు తడి ఇసుక అంటిన తమ చేతుల్తో జలపిత ఆకుపచ్చ కనురెప్పల వెంట్రుకలను పీకారు.

అవి బల్లుల్లా విడివడి గడ్డిలోకి కనుమరుగయ్యాయి.

 

జలపిత తరచూ ఉద్యానవనానికి వెళ్ళేవాడు. అప్పుడల్లా తనే గాలి లోని జాగాలనంతా ఆవరించాలని అనుకునే వాడు. అప్పుడు ఆ జాగాలంతా భారీ పుట్టగొడుగుల్లా ఉద్యానవనమంతా వెలిసేవి.

అటుగా వెళ్ళేవాళ్ళు ఓ గుప్పెడు జలపిత ఆలోచనలను కోసుకుని వెళ్ళే వాళ్ళు.

*

Art: Ananthu

జలపిత ఒక నీటి టెలిగ్రాఫ్ యంత్రాన్ని ఆవిష్కరించాడు.

మనం చేయవలసిందల్లా మన ముఖాన్ని నీటిలో పెట్టి ఆలోచనల్ని విరజిమ్మడమే.

అవి అలా భూగోళం వేరే అంచుకు ప్రసారం అయిపోతాయి.

మీకు టెలిగ్రాం అందాలంటే మీ దగ్గర ఆ నీటిని ఆపే కుళాయి మీట వుండాలంతే.

*

ఆవిరి స్నానం చేసే గదిలోకి వెళ్ళాడు జలపిత. గదిలో వున్న పై అంచు బల్లను చేరుకుననేందుకు దోగాడాడు. జలపితను అమితంగా సంతోషపరచాలన్న తపనతో ఆ ఆవిరి గది మాలి జలపిత కాలికి ఆవిరి పట్టాడు.

దాంతో జలపిత కాలు ఊడి కిం…ద…ప..డిం..ది.

అది అమాంతం ఆవిరి గదిలో తలంటుకుంటున్న ఒక మెథడిస్ట్ పైన పడి హతమార్చింది.

తన నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణి కన్నుమూసిందని చాలా సేపు వేదన చెందాడు జలపిత.

*

emma-1

విషయాల ద్రవ్య స్థితి గురించి ఆలోచిస్తూ తీరం వెంట నడుస్తున్నాడు జలపిత.

అప్పుడే అక్కడికి చేరిన ఒక అమ్మాయి ఒక పదంతో అల్లిన ఒక కళ్ళెం జలపితపై వేసింది.

ఆ పదం జలపిత తలలోని అన్ని ఆలోచనలనూ చెదారంలా మార్చేసేసరికి అతను ఓ కుప్పలా మారిపోతున్నాడు.

తనెంత పని చేసిందో ఆ అమ్మాయికి అస్సలు తెలియదు.

జలపిత తీరంలో పడి వున్నాడు. అలలు అతనిపై కదలాడుతున్నాయి.

“హమ్మా… చాలా కష్టంగా వుంది.’’ జలపిత ఫిర్యాదు చేసాడు.

ఆ ఫిర్యాదు పట్టించుకోని అలలు అటూ ఇటూ తిరుగుతూ అలవోకగా జలపిత దేహంలోని ఒక్కో అంగాన్ని, భాగాన్ని, అవయవాన్ని, చివరకు అతని ఆత్మనూ తుడిచిపెట్టేసాయి.

ఇసుక గతుకుతూ చాలా ఇబ్బంది పడ్డాడు జలపిత.

 

“జలపిత జలపితే ఎందుకు?’’, తనని తాను ప్రశ్నించుకున్నాడు.

జలపిత మరణానికి ఒక నిర్లక్ష్య ఆలోచన చాలు.

*

బాగా అలసిపోయాక నేలపై చేరగిలపడి తన చుట్టూ వున్న మైదానాలను కలగాపులగం చేసాడు జలపిత.

అప్పుడు దృశ్యాలతో సాలిటైర్ అడాడు.

అప్పటికి గాని అతని మనసు కుదుటపడలేదు.

*

జలపిత ఎప్పుడు యాత్రలకు వెళ్ళినా తన జేబులో ఒక మైదానాన్ని అదనంగా ఉంచుకునేవాడు.

*

జలపిత ఒక బంక కనుగొన్నాడు.

అది మధుర క్షణాలను ఏకంగా ఏడాదులుగానూ చేయగలదు.

దుఃఖ గడియలను కుదించనూ గలదు.

శతాబ్దాలను, యుగాలను కూడా చీమకాలంత చిన్నగా, చిటికె అంత సన్నగా, మెరుపంత లిప్తంగా చేసేయగలదు.

*

అలా వీధుల్లో నడుస్తుండగా ఒక ముసలి మహిళ బాగా బరువున్న సూట్ కేస్ మోసుకుంటూ వెళ్ళడం గమనించాడు జలపిత. తను సాయం చేస్తానని అడిగాడు. అంతే అలా అనీ అనగానే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె నీడకూడా ఎక్కడా కనిపంచలేదు. ఆశ్చర్యం వేసింది జలపితకి. ఉత్తర క్షణంలో తనకే తోచింది. మనుషులు తను నడిచినట్లు నడవలేరని. అలా ఆ మహిళ ఒక అడుగు వేసిందో లేదో జలపిత నగర శివారుకు చేరుకున్నాడు.  చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళి తన నుంచి తప్పి పోయిన మహిళను వెతికాడు.  తన లగేజీతో జలపిత ఉడాయించాడని ఆమె గ్రహించేలోపే ఆమెను చేరుకున్నాడు.

*

జలపిత ఒక కచేరీకి వెళ్ళాడు. ఆ సంగీతం అతడి దేహాన్ని చిన్ని ధూళి రజనులుగా మార్చి వేసింది.

ఆ రజను కణకణంగా తిరిగి కూర్చుకునేందుకు అతనికి సుమారు ఏడాది పట్టింది.

*

రెడు ప్రేమ పక్షులు జలపిత సాయం అర్థించాయి.

“మాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసినా కార్లు, ఇళ్ళు, వీధులే.’’

ఆ దంపతుల అభ్యర్థన తిరస్కరించలేకపోయాడు జలపిత. వీధులను కట్టేందుకు వాడే బింగరాళ్ళపై వాలాడు.

అతని శరీరం వ్యాకోచించింది. అది క్రమంగా చెట్లుగా, పొదలుగా అవతరించింది.

ఆ పరిసరాల్లో వున్న కార్లన్నీ కొత్తగా నెలకొన్నఆ ఉద్యానవనం చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చింది.

*

జనాలకు మరీ దగ్గరవడం వల్ల తనలో కలిగిన క్షోభ నుంచి, ప్రేమ నుంచీ స్వాంతన పొందేందుకు వర్షాన్ని అవిష్కరించాడు జలపిత ఒకానొక నిద్ర లేని రాత్రిలో.

*

జనాలు జలపితని వేధించారు.

కానీ తనను తాను రక్షించుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు జలపిత.

అంతటి మంచితనం అతనిది మరి.

*

జలపిత వీధిలో నడుస్తున్నప్పుడు, “ఎందుకు జనాలు చేతులూపుకుంటూ నడుస్తారు’’ అని ఆలోచించాడు.

అతనికి ఈ సమాధానం దొరికిందిః స్థలాన్ని కొలిచేందుకూ, స్థిమితాన్ని కొనసాగించేదుకూ, విశ్వాంతరాళ వాయువులు తమలో ప్రసరింపచేసుకునేందుకూ మనుషులు చేతులూపుతూ నడుస్తారు.

*

మితి మీరిన డొల్లతనం తనను ఆవరించినపుడు జలపిత ఒక వ్యాపారం మొదలు పెట్టాడు.

స్వర్గ తుల్యమైన లోయలనూ, మేఘాల బావులనూ, మడతపెట్టిన ఉరిమే మేఘాలను, ఉరమని వాటినీ అద్దెకివ్వడమే అతని కొత్త వ్యాపారం.

నిరుద్యోగులకు ఎలాంటి అద్దె లేదు.

ఇక ఉన్నవాళ్ళకు వాళ్ళ వాళ్ళ జీతాలను బట్టి అద్దె ఐదుసెంట్ల నుంచి వెయ్యి డాలర్ల వరకూ నిర్ణయించాడు.

జలపిత తన వ్యాపారంలో భాగంగా గ్నాపకాలతో కట్టిన మైదానాలనూ విక్రయించాడు.

*

Art: Ananthu

జలపిత మహాసముద్రం పైన ఒక వంతెన నిర్మించాడు. దానిపైన జనాలు నడుస్తున్నప్పుడు ఆ ఎత్తుకు భయపడి కిందపడిపోకుండా వంతెనకు అటు ఇటూ చెట్లను నాటాడు.

ఆ వంతెన చిత్తడిగా వుండింది.

ఎందుకంటే దాన్ని మహాసముద్రపు నీటితోనే జలపిత నిర్మించాడు.

దాన్ని ముగ్గురు తాగుబోతులు దాటే దుస్సాహసం చేసారు.

వారికివేమీ లెక్కేలేదుగా మరి.

*

కోర్టు అధికారులు జలపిత దగ్గరికి వచ్చి తమతో విబేధించమని ఆహ్వానించారు.

అప్పుడు జలపిత సూర్యుడివైపు చూస్తూ నీటిలో వున్నాడు.

చుట్టుపక్కల చుక్క నీరూ పడకుండా జాగ్రత్తగా తన తడి దేహాన్ని పిండుకుంటుండగా న్యాయాధిపతులు జలపితని ఇలా ప్రశ్నించారుః

“న్యాయం అంటే ఏమిటి?’’

“మిల్లీ మీటర్లలో కొలిచే మంచితనమే న్యాయం.’’

ఇలా జలపిత తన జవాబు చెప్పిచూసేసరికి విచారణ గదిలో ఎవరూ కనిపించకపోవడం గమనించాడు.

తన తడి దేహం పిండగా రాలిన నీటిలో న్యాయాధిపతులు కొట్టుకుపోవడాన్ని జలపిత గమనించనేలేదు.

వాళ్ళంతా ఒక నదిలో తేలారు.

చావు బతుకుల మద్య వున్న వాళ్ళను గట్టుకు తెచ్చింది ఇంగ్లీషు పర్యాటకులున్న ఒక పెద్ద పర్యాటక నౌక.

 

*

అవపాతాన్నీ, తాపమానాన్నీ కొలిచే పరికరంగా కూడా జలపితని వాడడచ్చు.

*

ఒక వ్యక్తి బొద్దింక మెడకు తాడుకట్టుకుని జలపిత దగ్గరకు వచ్చి తమ తగవు తీర్చమని కోరాడు.

“ఇతను నా జీవితం దుర్భరం చేస్తున్నాడు.’’ బొద్దింకని చూపుతూ ఫిర్యాదు చేసాడు ఆ వ్యక్తి.

“మంచిది.’’ అని మనిషి, బొద్దింకల దేహాలను తారుమారు చేసాడు జలపిత.

కొద్ది రోజుల తర్వాత వ్యక్తి మెడకు తాడు కట్టుకుని బొద్దింక వచ్చింది.

అట్లాంటి దయలేని వ్యక్తితో జీవించడం దుర్లభంగా వుందని జలపితతో వాపోయింది బొద్దింక.

అప్పుడు ఎవరి దేహం వారికి తిరిగి ఇప్పించాడు జలపిత.

ఇద్దరూ చెరో దారిలో వెళ్ళిపోయారు.

అయితే చాలా దూరం ఒకరినొకరు వెనక్కి తిరిగి చూసుకుంటూనే నడిచారు.

 

*

లౌకిక వ్యవహారాల నుంచి కాసేపు దూరంగా వుండాలని నిశ్చయించుకున్నాడు జలపిత.

విశ్వపు అట్టడుగు పొరల్లోకి వెల్ళిపోయాడు.

తన కాళ్ళను శూన్యంలో వేలాడేసి, తన తల ఆకాశమంతా వ్యాపించడాన్ని వినడం మొదలుపెట్టాడు.

సరిగ్గా అప్పుడే ఎవరో తన బొజ్జ దగ్గర గిలిగిలి పెట్టారు.

జలపిత కిందకు చూసి నిట్టూర్చాడు.

ఒక వ్యక్తి కుమారుడికి తనే మార్గదర్శిగా వ్యవహరిస్తానని ఎప్పుడో ఇచ్చిన తన మాట గుర్తుకు వచ్చింది జలపితకి. భూమి మీద నిలబడి ఒక పూల రెమ్మతో జలపితకు గిలిగిలిపెట్టింది ఆ తండ్రే.

అతను నామకరణ ఉత్సవాన్ని గుర్తుచేసాడు జలపితకి. ఆ పూలరెమ్మను విరిచిపారేయాలనుకున్నాడు జలపిత.

ఆ వ్యక్తికి ఉన్నదల్లా ఆ పూలరెమ్మ ఒక్కటేనన్న విషయం జలపితకు గర్తుకు వచ్చి జాలిపడి విరమించుకున్నాడు.

 

జలపిత మంచితనం అనంతం.

*

తన తల శకలాల కోసం తడుముకున్నాడు జలపిత.

వాటిని అంతరాళం అంతటా చల్లాడు.

అదంతా తన మామూలు రూపం తీసుకునేంతవరకు నిరీక్షించే వ్యవధిలేకపోవడంతో వాటినంతా గాలితో మిళితం చేసేసాడు.

తన అరికాళ్ళతో తాడించి సతత హరితంగా మార్చేందుకు ప్రయత్నించాడు.

అవి వాటి మార్గంలో పేలిపోయి విచ్చలవిడిగా పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు.

ఆ సాయంత్రం సదరు మార్గదర్శి జలపిత ప్రవర్తన చాలా నిర్లక్ష్యంగా వుందన్న వదంతులు వ్యాపించాయి.

అతను మందు కొట్టాడు. చిందేసాడు. అసభ్యకరమైన జోకులు వేసాడు.

తర్వాతి కాలంలో అవన్నీ కొన్ని ఆఫ్రికా మతాల జడ సిద్ధాంతాలుగా ప్రాచుర్యం పొందాయి.

*

జలపితను బానిసగా అమ్మేసారు. చలువరాతి నేలను శుభ్రం చేయడం అతని రోజువారీ పని.

అతను నేలను ఎంతగా శుభ్రం చేసాడంటే, వచ్చిన అతిధులు కాలుమోపగానే సర్రున కిటికీల్లోంచి, తలుపుల్లోంచీ జారి పడిపోయారు.

 

*

ఎండ విపరీతంగా వెన్న ఒక రోజు తాపం చల్లార్చుకునేందుకు జలపిత ఒక పుచ్చకాయలోకి వెళ్ళిపోయాడు.

ఆ పుచ్చకాయను తీగ నుంచి తెంపి సంతకు తీసుకు వెల్తున్నారన్న విషయం గమనించనేలేదు జలపిత.

తీరా పుచ్చకాయను ఒప్పలు కోస్తుండగా అందులోంచి బయటపడ్డాడు జలపిత.

అప్పటికే అతని అరికాళ్ళు చెక్కివేయబడ్డాయి.

పుచ్చకాయ రసంలోంచి తన బాహువులను కూడబలుక్కుని ఒక్కసారి విదిలించుకున్నాడు.

భయ భ్రాంతులైన అతిథులు తమ కంచాలను గిరాటేసి కుర్చీల్లోంచి తూలిపడ్డారు.

ఎటుపోవాలో తోచక తొక్కిసలాట జరిగింది.

పుచ్చకాలయలు కోసుకునే చాకులతో ఒకరినొకరు పొడిచేసుకున్నారు.

ఆ విపత్తను చూసిన జలపిత అతిథుల దేహహాలలో దిగబడిన చాకులను తీసివేసి వాళ్ళందరినీ యధావిధిగా విందు బల్ల ముందు ఆశీనులను చేసాడు. వారి గాయాలను తడిమి స్వస్థత చేకూర్చి దగ్గరలో వున్న కొలను నుంచి కొంత నీటిని తెచ్చేందుకు వెళ్ళాడు.

ఆ కొలను దగ్గరే పిట్టలు నివాసం వుండేది.

ఆ కొలను దగ్గర ఏవేవో మాటలు ఉచ్చరించాడు.

దాంతో పరిశ్రమల్లో, జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది.

అతను ఉచ్చరించిన మాటల్లో మచ్చుకు ఒకటిః  చాకు లేకుండా కూడా పుచ్చకాయ తినవచ్చు.

*

“నువ్వు లేకుండా నేను బతకలేను.’’ జలపితతో అంది ఓ నీటి చుక్క.

“నువ్వు చాలా గొప్పవాడివని నాకు తెలుసు. నువ్వు జలపితవి. నేను మామూలు నీటి చుక్కని.

అయినా అదంతా నాకు పట్టదు. ఎందుకంటే నేను నువ్వు లేకుండా బతకలేను.’’

జలపిత నిశ్చేష్టుడయ్యాడు.

అంతటి ఆశ్చర్యంలో నిలుచున్న చోటే మూడు రోజులు స్థాణువై వుండిపోయాడు.

నాలుగో రోజు జలపిత ఇలా పలికాడుః

“నేను లేకుండా బతకలేక పోతే, నాతోనే బతుకు.’’

ఇలా అనగానే అతని చెవి వెనుకకు చేరింది నీటిచుక్క.

లోకమంతా పగలబడి నవ్వింది.

నీటి చుక్కతో ఏదో లోపాయకారి ఒప్పదం చేసుకుని దాన్ని జలపిత పటాయించాడని అనుకున్నారంతా.

“నువ్వు ఊహించగలవా ఇది?’’ కిందపడి దొర్లుతూ పగలబడి నవ్వుతూ ఒక కొండముచ్చు ఇంకో ముచ్చుతో పిచ్చాపాటి మాట్లాడుతోందిలా.

“వాళ్ళు పక్కపక్కన నడుస్తుంటే, వాళ్ళంత ఎత్తు వుంది అది. వాళ్ళిద్దరినీ చూసిన ఓ గోమాత నవ్వాపుకోలేక పొరబోయి చనిపోయిందికూడా,’’ అంది నవ్వుతూ ఇంకో కొండ ముచ్చు.

అప్పుడు మనుషులనూ, జంతువులనూ కలిపి జలపిత అడిగాడు.

“ఇందులో అంత పగలబడి నవ్వే సంగతి ఏముంది?’’

“అది చిన్నది. నీకన్నా సిగ్గు వుండొద్దా జలపితా!” అని అడిగారంతా.

 

తన అరచేతిలో వున్న నీటి చుక్కను వారికి చూపుతూ జలపిత అన్నాడు.

“చిన్నదీ, పనికి మాలినదీ అంటూ ఏదీ లేదు.’’

 

ఆ నీటి చుక్కలో తమ ఛిద్రమైన ముఖ బింబాలను చూసుకున్న వాళ్ళంతా భయంతో తలో దిక్కు పారిపోయారు.

ఆ నీటి చుక్క అంతకంతకూ పెరిగి వాళ్ళ ముందు సూర్యుడంత పరిణామంలో వ్యాకోచించింది.

అందరూ దాని ముందు ఇసుక రేణువుల్లా వున్నారు.

ఇదే జలపిత సంకల్పం.

*

Art: Ananthu

వీధిలో నడుస్తున్న రెండు దీపాలు జలపితని నిలదీసాయి.

“నువ్వు ప్రకాశమా?’’

“నేను మిణుకు’’ బదులిచ్చాడు జలపిత.

దాని తర్వాత అందరూ కలసి పబ్ కి వెళ్ళి మందుకొట్టారు.

 

“నీటి నుంచి దుఃఖం జనించింది.’’ అన్నాడు జలపిత

*

ఇసుకలో కూర్చుని తన పిడికిళ్ళతో కళ్ళు నులుముకుంటున్న ఒక పిల్లవాడు జలపితను “పవనం అంటే ఏమిటి?’’ అని అడిగాడు.

“పవనం నైరూప్య జలం.’’ జలపిత జవాబు.

*

“జనాలు ఎందుకు పొగతాగుతారు?’’ అని గందరగోళ పడి, మళ్ళీ తనే చటుక్కున తమాయించుకేని “తమ గౌరవార్ధం ఇంకెవ్వరూ అగరబత్తీలు వెలిగించరు కాబట్టి తమను తామే గౌరవించుకోవాలన్న దిగులుతో జనాలు పొగతాగుతారు.’’ అని నిర్ధారించుకున్నాడు జలపిత.

*

సాంకేతికత పరమావధిపైన తన అభిప్రాయం వెలుబుచ్చాలని జలపితను కోరారు.

“జనాలు తమ వెంట్రుకలతో తమనే పైకి లేపుకునే సత్తా ఇస్తుంది అది.’’ ఇదీ జలపిత సమాధానం.

అయితే అదేదో మెట్ట వేదాంతంలా వుందనిపించి పత్రికా విలేకరులు అతని సమాధానాన్ని నమోదే చేసుకోలేదు.

*

జలపిత నది పక్కన బల్ల మీద నిద్రపోతున్నప్పుడు ఇద్దరు ఆకతాయిలు అతని గుండెలోకి గాలం వేసి చేపల వేట మొదలుపెట్టారు.

ఒక ఆకతాయి జలపిత గుండెలోంచి జల్ల చేపని లాగేసినప్పుడు మెలకువ వచ్చింది.

కానీ నిద్రలేవాలని లేదు జలపితకి.

ఆకతాయిల వైపు చూసి తన మనికాలితో మెల్లగా బల్లను తాకాడు.

ఆ కుదుపుకి ఆకతాయిలు బోర్లాపడి ముక్కులు పచ్చడి చేసుకోకుండా జాగ్రత్తగానే బల్లను తాకాడు జలపిత.

వారి కాలి కింది బల్ల రెండు గా చీలిపోయింది.

ఒక ముక్క జలపితని నేరుగా మహాసముద్రం లోకి తీసుకువెళ్ళింది.

*

ఈతగాళ్ళు జలపిత దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసారు.

“లావుగా వున్న వాళ్ళు మమ్మల్ని ఈత కొట్టనివ్వడం లేదు. వాళ్ళు దిగగానే నదిలోని నీళ్ళన్నీ చెల్లా చెదరై బయటపడిపోతున్నాయి.’’ అన్నారు బక్క ఈతగాళ్ళు.

“బక్కవాళ్ళు మమ్మల్ని ఈత కొట్టకుండా ఆపుతున్నారు. వాళ్ళు ఈతకు దిగితే నీళ్ళు జ్యామితిగా, డొల్లగా తయారవుతున్నాయి. అట్లాంటి నీటిలో ఎవరైనా ఎట్లా ఈత కొడతారు?’’ అని వాదించారు లావున్న ఈతగాళ్ళు.

జలపిత వాళ్ళిద్దరి వంకా చూసాడు. ఇసుక వైపు చూపు సారించాడు.

అక్కడే ఈతగాళ్ళంతా నిలబడేది.

అప్పుడు వాళ్ళ కోసం రెండంస్తుల నీటిని సృష్టించాడు జలపిత.

ఒక అంతస్తులో బక్కవాళ్ళు, మరో అంతస్తులో లావు వాళ్ళు ఈతకొట్ట వచ్చు.

 

*

“లోకాన్ని వగతుగా చేస్తున్నాడు జలపిత.’’ అని అభిప్రాయపడిన బుధ వర్గం జలపితపైన వ్యాకరణం విధించాలని నిశ్చయించుకున్నారు.

జలపిత అసలు జలపితే కాదనేసారు.

అతని మూలాలు అనుమానాస్పదమైనవి అన్నారు.

బహుశా సంస్కృతంలో వున్న “జలి – పితర్ ‘’ అన్న రెండు పదాల అపభ్రంశమే అతను అని తేల్చారు.

జలపితర్ అంటే నీటి తండ్రి. జల చర అంటే నీటి జీవి.

జలపితను తోసిరాజంటే తప్ప లోకంలో ఎక్కడుండాల్సింది అక్కడ వుండదు అని బుధ వర్గం అభిప్రాయపడింది.

పైగా సంస్కృతం ఒక మృత భాష; జలపిత కూడా అంతే – అని తేల్చేసిన బుధవర్గం తమ గ్రంధాలను తెరిచింది.

అయితే బుధవర్గం ఇలా జలపితను తూష్ణీకరించి అతని పేరు మూలాలగురించి మల్లగుల్లాలు పడుతుండగా వ్యాకరణ గ్రంథంలో సరిగ్గా అప్పుడే చేరిన జలపిత పేరు తాజా దవన దళంలా పరిమళించింది.

తమ అసలు సంగతి మరచి పోయి బుధ వర్గం తమ సులోచనాలను తొలగించి నీటి శబ్దానికి నిశ్చేష్టులయ్యారు. జలపితలోపల పాడుతున్న పక్షులతో జత కలిపి చిందేసింది బుధవర్గం.

*

ఇనుముకు తనే సూర్యుడినని వాన ఎలా భరోసా ఇచ్చిందో నీటి గొట్టంలో ఉన్నప్పుడు విన్నాడు జలపిత.

వాన భాషలో అన్నన్నేసి అచ్చులు లేకపోయి వుంటే ఈ విషయం ఇనుముకు చటుక్కున అవగతం అయ్యి వుండేది కదా అనీ అనుకున్నాడు జలపిత.

*

“కొంచెం తప్పుకో’’ చెట్టు కొమ్మల మద్యలో నిద్రిస్తున్న జలపితను ఓ చిట్టి గువ్వ అడిగింది.

జలపిత జరిగాడు.

సగం విశ్వం ధ్వంసం అయ్యింది.

గువ్వ కిచకిచమంది.

అప్పుడు జలపిత అన్నాడుః “స్థూలాన్ని ధ్వంసం చేయగలదు సూక్ష్మం.’’

*

ఒక రోజు ఉదయం తప్పనిసరిగా ఆసనాలు వేయాల్సి వచ్చింది.

నిరాకరించడానికి తటపటాయించాడు జలపిత.

అందుకే సూర్యగ్రహణం తెప్పించాడు.

తమ చాకచక్య లేమికి వేరెవ్వరూ చంకలు గుద్దుకోకుండా అలా చేసాడు.

*

గాలికి అభిముఖంగా తన పాదాన్ని గీకాడు జలపిత.

అలా గాలితో చదరంగం ఆట మొదలైంది.

“ఆటకట్టు, అబ్బాయి.’’ అంది గాలి.

తన తర్వాతి అడుగు గురించి జలపిత తీవ్రంగా ఆలోచిస్తూ వున్నాడు చాలాసేపు.

చివరికి స్పందించి “కట్టుకు పై కట్టు’’ అని చెప్పి ఆట గెలిచాడు.

*

‘జనాలు ఎందుకు నీట మునిగిపోతున్నారు?’ అని ఒక సారి జలపిత సుదీర్ఘంగా ఆలోచించాడు.

ఎందుకంటే అతనికి నీటి గురించి బాగా తెలుసు.

పైగా నీరు సుదీర్ఘమనీ, అందులో మునిగే వీలే లేదనీ అతనికి బాగా తెలుసు.

ఖచ్చితంగా నీటిలో రంధ్రాలేవో వుండి వుండాలి.

వాటిల్లో పడే జనాలు అలితిగా చనిపోతున్నారని నిర్ధారణకు వచ్చాడు జలపిత.

ఈ రంధ్రాలను దిండ్లతో కనుక పూడ్చ గలిగినట్టయితే జనాలు నీట మునగడాన్ని నివారించవచ్చు.

*

ఒక వేసవి కాలంలో గ్రంధాలయం ముందు జలపిత నడుస్తున్నప్పుడు దాని నిశ్శబ్దానికీ, నిర్మలతకీ ముగ్ధుడయ్యాడు.  కిటికీలకున్న దోమ తెరల్లోంచి తన దేహాన్ని లోనికి అనుమతించాడు.

పుస్తకాల అరల మధ్య నిద్ర పోయాడు.

ఎంత ఘాడంగా నిద్రించాడంటే అతని చేతిలో కొంత భాగం, భుజంలో కొంత భాగం పుస్తకాల్లో కూరుకుపోయేంతగా.

లోహ ముఖపత్రాలతో రూపొందించిన ఒక అతి భారీ, అతి పురాతన పుస్తకాన్ని గ్రంధమాలి తన పొత్తిలి లోకి చొప్పిస్తున్నప్పుడు జలపితకు మెలకువ అయ్యింది.

అది జలపిత ఉరఃపంజరానికీ, పొత్తి కడుపుకూ మధ్య ఇమడటం లేదు.

తన ఖాళీ కడుపుపైన ఇలాంటి అనుకోని దాడి ఇబ్బందిగా అనిపించింది జలపితకి.

అయితే ఆ వృద్ధ గ్రంధమాలికి తను తక్షణం కనిపిస్తే గుండె ఆగి చస్తాడని జలపితకి తెలుసు.

పైగా అతను జలపితకు సుపరిచితుడు.

పైగా అతనికి మూఢనమ్మకాలెక్కువ.

పైగా అతని భార్య గయ్యాళి.

అందుకే అయ్యో పాపం అనుకుని జలపిత అతనికి కనిపించడం మానివేసాడు.

ఆ పాత గ్రంధాన్ని తన దేహంలో సర్దుకునేందుకు తన పొత్తి కడుపును మెడవరకు జుర్రుకున్నాడు జలపిత.

ఆ తర్వాత తన పేగుల్లో పడిన ముద్రలను తొలగించుకునేందుకు దాదాపు కొన్ని వారాలు తన పేగులను ఇస్త్రీ చేసుకోవడంలోనే తలమునకలైపోయాడు.

“నా ముఖం చూసిన వారంతా నీటి వంక చూస్తారు.’’ ప్రకటించాడు జలపిత.

*

గణిత శాస్త్ర వేత్తల సమావేశానికి జలపితని ఆహ్వానించారు.

అంతరాళ వంపుల నియమాలను లెక్కించే క్రమంలో పాల్గొనేందుకే అందింది ఆహ్వానం.

ప్రతిపాదిత సిద్ధాంతాలన్నింటినీ ఆలకించాడు జలపిత.

అప్పుడు తన అతి పిన్న వయసు చిటికెన వేలు మూత తీసాడు.

దాని లోపలినుంచి ఒక పుష్ఫాన్ని బయటికి లాగాడు.

ఫలితాన్నిగణిత శాస్త్ర వేత్తలకు వివరించాడు.

ఈ ఆవిష్కరణకు ముగ్ధులైన వాళ్ళందరూ తమ కుర్చీలను గిరాటేసేసి పరిగెత్తారు.

దారిలో వాళ్ళ కళ్ళద్దాలు వదులుకున్నారు.

నేరుగా పచ్చిక మైదానాల్లోకి వెళ్ళి సీతాకోకచిలుకలను వడిసి పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.

 

*

జలపిత మొక్కల్లోపలికి వెళ్ళిపోయాడు.

వాటిల్లోనే రెండు వందల సంవత్సరాలు యానించాడు.

జలపితలో వున్న ఏకైక శాశ్వత గుణంః  మంచితనం.

ఇక తక్కినదంతా మిణుకే.

*

జలపిత రాయబారిగా నియోగించబడినప్పుడు అతనికి ఒక భారీ ఉక్కు కవచాన్నిచ్చారు.

కనీసం అలాగైనా తన నిర్లక్ష్యపు అరికాలితో దాన్ని నిమరడని.

కనీసం దాన్ని ధరించినప్పుడు అలా చేయడనీ.

అయితే జలపిత భావాల భట్వాడాధారుడన్న విషయమే మరచిపోయారు.

అతను ఇంత వరకెన్నడూ భావాలలోని లీలా మాత్ర లేశాన్నీ కనీసం నలపలేదు; కనీసం ఏమార్చనూలేదు.

 

జలపిత లాలిత్యం చెక్కు చెదరనిది.

 

*

జలపిత ఒక చిత్ర కళా ప్రదర్శనకు వెళ్ళాడు.

కళాఖండాలన్నీ సిగ్గుతో తమ చట్రసమేతంగా చడీ చప్పుడూ చెయ్యకుండా గది నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాయి.

 

*

“జనాలు ఎందుకు నీడలు చేస్తారు?’’ అని అడిగారెవరో జలపితని.

“ఎందుకంటే లోపలి కాంతి జనాల్లో పెద్దగా పనిచెయ్యదు కాబట్టి.’’ అని బదులిచ్చాడు.

జలపిత ఎప్పుడైనా ఆటోరిక్షాలోనో లేదా మరో డొంకదారి రవాణా వాహనమో ఎక్కినప్పుడు తన అదనపు అరికాళ్ళను, కాళ్ళనూ లగేజీ భద్రపరిచే గదుల్లోనే పెట్టేసుకునేవాడు.

 

*

Art: Ananthu

జలపిత బంగారం.

నిజానికి కంసాలులు అతడిని తరచూ వాడుకునేవారు.

ఇంకా చెప్పాలంటే జాతరలకు వెల్ళినప్పుడు నగ లాగా అతడిని ధరించేవారు జనం.

 

*

“వస్త్రాలు దేహానికీ, ఆత్మకీ గిరిగీస్తాయి.’’ అనుకున్నారు జనం.

అందుకే చివరికి జలపితని తొడుక్కున్నారు.

అలాగైనా అతడిని వర్గీకరించి, నిర్వచించాలని అనుకున్నారు.

కనీసం అతని అభిమానులు అలా అభిప్రాయపడ్డారు.

తీరా ఇది ఆచరించబోతే మరో మీమాంస ఎదురైంది.

ధరించిన వస్త్రాలకి ఆవలా జలపిత ఎంతగా వున్నాడంటే, పెద్ద పెద్ద నిపుణలు కూడా ఈ సంశయాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారు.

ఇంతకీ జలపితకి వస్త్రాలున్నాయా?

లేక వస్త్రాల చుట్టూ ఆవరించిన ఆచ్ఛాదనే జలపితా?

ఎందుకంటే అవి రెండూ కూడా జలపితే కదా!

 

 

*

ఒక దంపతులు సినిమాకి వెళ్దామనుకున్నారు.

అయితే అంత తక్కువ వ్యవధిలో తమ మూడు మాసాల పాపను చూసుకునేందుకు ఒక ఆయాను వెతికి పట్టుకోవడంలో విఫలమయ్యారు.

ఆ కారణంగా పాపను చూసుకోమని జలపితని కోరారు.

తన విధిని జలపిత తూచ తప్పకుండా నిర్వహించాడు.

ఎంతగా అంటే, కొన్ని గంటల్లో కన్నవారు సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఆ పిల్లవాడు 20 ఏళ్ళ వాడయ్యడు.

ఆ యవ్వనుడు తనకు వెంటనే పెళ్ళి చేయమనీ, లేకపోతే సన్యాసం తీసుకుని లోక కల్యాణం కోసం పాటు పడతానని బెదిరించాడు.

ఈ యువకుడి కన్న వారి ప్రతిస్పందన చరిత్రలో నమోదు కాలేదు.

*

జలపిత ఒక జల్లెడ కనుగొన్నాడు.

అందులోంచి చెడ్డవాడిని జల్లిస్తే మంచివాడయిపోతాడు.

 

రాజకీయ కారణాల వల్ల ఈ జల్లెడని నిషేధించారు.

*

ఒక పేరు ప్రతిష్టలున్న రాజకీయ వేత్త వివాహ మహోత్సవంలో జలపితని ప్రసంగిచమని కోరారు.

జలపిత తన మాటలు మొదలు పెట్టగానే అందరూ పరారయ్యారు.

కారణంః  అతను ఉపన్యాసం ఇవ్వడానికి బదులు ఒక పిట్టల గుంపును ఆకాశంలోకి వదిలాడు.

పైగా జలపిత తన మాట నిలబెట్టుకోలేదని అతిథులంతా ఫిర్యాదు చేసారు.

ఈ సారి ఆశ్యర్యపోవడం జలపిత వంతయ్యింది.

ఎందుకంటే ఇప్పటివరకు అతను చేసిన ఉపన్యాసాలన్నింటిలోకీ అదే అత్యంత గొప్పదని అతని నమ్మకం.

అందుకే అసలు తననుంచి జనం ఏమి కోరుకుంటున్నారో జలపితకి కొంచెం కూడా బోధపడలేదు.

 

*

జలపితను పుట్టినరోజు వేడుకలకు పిలిచారు.

తొందదరగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యంది.

జలపిత సత్కార్యాలు చేయడంలో పుణ్యకాలం గడచిపోవడమే ఈ ఆలస్యానికి అసలు కారణం.

అందుకే చాలా హడావిడిగా వెళ్తున్నాడు.

హఠాత్తుగా అతనికి ఒక చిన్న నీటి పాయ తన కాళ్ళ ముందే తగిలింది.

తన దారిని అడ్డుకుంటోంది ఆ పాయ.

తన హడావిడిలో జలపిత ఆ పాయను దాటేందుకు అంజె వేయబోతున్నాడు.

అప్పుడే తట్టింది.

కాళ్ళ ముందు పడివున్న వాటిని దాటడం అరిష్టం అని.

అందుకే ఇబ్బందికి లోనయ్యాడు జలపిత.

అందుకే ఆ నీటి పాయ వెంట వెళ్ళి, దాని చుట్టూ తిరిగి వేడుకలకు ఆలస్యం కాకుండా చకచకా వెళ్ళిపోయాడు.

అలా వెళ్తున్నప్పుడు ‘చిన్నా, పెద్దా’ విషయాల గురించి దీర్ఘంగా ఆలోచించాడు.

 

*

ఒక కోళ్ళ ఫారంలో గుడ్లు పొదగవలసి వచ్చింది.

చాలా శ్రద్ధగా గుడ్లను పొదిగాడు జలపిత.

ఎంత శ్రద్ధగా అంటే ఒక విమానయాన కంపెనీ తన కోళ్ళ ఫారంకు వ్యతిరేకంగా కోర్టులో దావా వేసేంత.

దావా సారాంశంః జలపిత సద్దుమణగకపోతే ఇక మా విమాన యాన కంపెనీ మూసుకోవాల్సిందే.

జలపిత కోళ్ళఫారంలో పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి దూర విమాన ప్రయాణాలు చేసే వారంతా విమానాలు ఎక్కడం మానేసి కోళ్ళపైనే ప్రయాణించడానికి మొగ్గుచూపుతున్నారు.

ఆ కోళ్ళు ప్రయాణికులను అంత వేగంగా, అంతే భద్రంగా తీసుకువెళ్తున్నాయి మరి.

 

*

జలపిత ఆవిష్కరణలన్నింటిలోకీ తూర్పు దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో కొన్ని ఇలా వున్నాయిః

తీరిక లేని పొగతాగే కుక్క పిల్లల యజమానుల కోసం జలపిత రూపొందించిన కొత్త కుక్క పిల్లలు.

ఈ కుక్క పిల్లలు తమ యజమానులు వదిలిన సిగరెట్ పొగ రింగులపైన నడిచివెళ్ళగలవు.

దీని వల్ల కుక్కలకు ఎలాంటి అనారోగ్యం కానీ, ఇతర హానీ కానీ వుండదు.

ఇక పొగ తాగని యజమానలకూ ఈ కొత్త కుక్కపిల్లలు మరో వెసులుబాటును కల్పిస్తాయి.

పొగతాగని యజమానుల ఊపిరి వెంట ఈ కుక్క పిల్లలు నడవగలవు.

 

మరో ఆవిష్కరణః ఇది మరో అద్భుతం.

శుభ్రత పట్ల విపరీతమైన శ్రద్ధ వున్న సంపన్నమహిళల సౌలభ్యం కోసం జలపిత చేసిన ఆవిష్కరణ ఇది.

స్వచ్చంధ శౌచ్య రబ్బరు బూట్లు.

ఈ బూట్లు దుమ్మును తమంతట తామే తుడిచిపెట్టుకుంటాయి.

*

“లోకంలో ఆత్మమితి ఆవిష్కరించబడిన తర్వాతే తమకంటూ ఆత్మ ఒకటి వుందన్న విషయం మానవాళికి బోధపడింది.’’ నిర్ధారించాడు జలపిత.

 

సకాలంలో అవతరించడంలో విఫలమైన ఓజోను పొరే జలపిత.

కానీ జలపిత గురించి ఆలోచించిన ఉత్తరక్షణం అతను అప్పటికే తన బాహువులనూ, కాళ్ళనూ గాలి నుంచి లాగేసుకుంటూ వుంటాడు.

*

 

 

 

అనువాదకుడి మాట

 

anantజలపిత కథ(?) నా చేతికి అందినప్పుడు… ఇది తెలుగులో ఇప్పుడు ఎందుకు?

తెలుగుకి ఎందుకు? అని తోచింది.

మొదలు, మధ్య, ఘర్షణ, అవరోధం, సమస్య, ముగింపు, తెగింపు, పరిష్కారం, ఆశావాదం అనే లెక్కల తక్కెడల జల్లెడలో ఎల్లెడలా కొట్టుమిట్టాడే లేదా కొడిగడుతున్న మన కథా templates కి ఆవల కూడా కథాకథన నిర్గమనాలూ, నిమజ్జనాలూ జరిగాయనీ, జరుగుతాయనీ, జరుగుతన్నాయనీ, జరగాలనీ మరోసారి ఆశించేందుకే (నా మటుకు నేను) ఈ జలపితనీ, ఈ ఎమ్మా అందిజెవ్ స్కా నీ అనువదించాలని అనుకున్నాను.

ఎమ్మాని విస్మరించి, తూష్ణీకరించిన ‘ఆధునిక వాస్తవికతా వాద’ సరళినీ, తర్క హేతు రుజు మార్గాన్నీ, దాని కాలిక గమనాన్నీ ఏక కాలంలో, ఏకైక సమయంలో ప్రోది చేసుకుని పొందు పరచి పొదిగి… ఎవరైనా ఆ గుడ్డును పగలేసే ఆ తంతును కనులారా చూడాలని, ఆ పగిలి వచ్చే బిడ్డల రెక్కలను కౌగిలించుకోవాలనీ ఆమెకు ఇప్పుడు పాల్పడ్డాను.

ఇందులోని ‘పదాలు కట్టేయలేని’ ఆలోచనలు తెలుగు కథా, నిర్మాణ, శైలీ, నిపుణత, పాండిత్య ప్రకర్షలకీ ఏ రెండు గింజలయినా సాదరంగా చల్లకపోతాయా అనే బలమైన, బలహీనమైన మూఢనమ్మకంతోనే ఇది అనువదించాను.

ఎమ్మా అందిజెవస్కా పదాన్ని శంకించింది.

భాషేతర వాస్తవికతలో పదం తల వొంచుకుని చేతులు కట్టుకుని చిత్తగించవలసి వుంది ఇంకనూ…

గిరిలోపలి మన పదాలు వినోదమే.

అది మనుగడ కాదు.

గిరిబయట మనకింకా అందని పదాలు నవ్య నిర్వచనాలు.

లేదా నూతన కరచాలనాలు.

ఇటు మన గిరులకీ.

మన నలిగిన/రొడ్డుకొట్టుడు పదాలకీ.

*

కథల పరమార్ధం

 

 

కథల వల్ల ప్రయోజనం ఏమిటి?

 

ఇదొక ఎడతెగని చర్చకి దారి తీసే ప్రశ్న. ‘ఏ ప్రయోజనం లేదు’ నుండి ‘ప్రపంచాన్ని మార్చటం’ దాకా రకరకాల సమాధానాలొస్తాయి. వీటిలో నాకు నచ్చినది: “Entertain and inform” – ఆ క్రమంలో. పాఠకులని వినోదపరుస్తూ వాళ్లకి ఎంతోకొంత ఉపయుక్తమైన సమాచారాన్ని అందించగలిగేదే నా దృష్టిలో ప్రయోజనకరమైన కథ.

అయితే – ఏదేని సమస్య గురించిన సమాచారం తెలియజేయటానికి, దానిపై పాఠకులకి అవగాహన కలిగించటానికి సాహిత్యంతో పనేంటి? అందుకోసం కథలూ, నవలలూ రాయాల్సిన అవసరమేంటి? సదరు సమస్యపై సమాచారాన్ని క్రోడీకరించి, సంఖ్యలూ అవీ జతపరచి శుభ్రంగా ఓ వ్యాసం రాసేయొచ్చుగా. అది మరింత ప్రభావశీలంగా ఉంటుంది కదా.

లేదు. వ్యాసాల ద్వారా సమస్యల గురించిన సాధారణ సమాచారం లభిస్తుంది, స్టాటిస్టిక్స్ తెలుస్తాయి. కానీ ఆ సమస్య బారినపడ్డ మనిషి అనుభవించే వేదన ఈ వ్యాసాల్లో కనబడదు. కష్టసుఖాలకి మనుషులెలా స్పందిస్తారు, వాటినెలా ఎదుర్కొంటారు,  అవి మానవ సంబంధాలని ఎలా ప్రభావితం చేస్తాయి – ఇటువంటి సమాచారాన్ని పాఠకులకి అందించగలిగేది సాహిత్యం మాత్రమే.

ఇక్కడ గమనించాల్సిన విషయమొకటుంది. సాహిత్యం పని సమాచారాన్ని చేరవేయటమే. బోధించటం కాదు. హితబోధలు చేయటం కాదు. ఎందుకంటే, కథలు చదివి మనుషులు మారిపోరు. కథల వల్ల పాఠకుల నైతిక వర్తనం మారదు. కాబట్టి సందేశాలిచ్చే కథలకి బదులు సమాచారాన్నిచ్చే కథలు రాయటం మెరుగు. వీలైనంత కచ్చితమైన సమాచారాన్ని పాఠకులకందిస్తే, ఆసక్తి కలిగినవాళ్లు ఇతర మార్గాల ద్వారా మరింత లోతుగా వివరాలు తెలుసుకుంటారు. చదివినవారికి అందులో ప్రస్తావించిన విషయాల మీద ఆసక్తి, అవగాహన కలిగించగలిగితే ఆ కథ ధన్యమైనట్లే.

మరి వినోదం సంగతేమిటి? నా దృష్టిలో కథ – ఆ మాటకొస్తే ఏ కళకైనా – ప్రధమ పరమార్ధం వినోదం కలిగించటం. మిగతావన్నీ ఆ తర్వాతే. వినోదం పాళ్లు పిసరంతైనా లేకుండా సమాచారాన్ని బదిలీ చేయటమే ఏకైక పనిగా రాయబడ్డ కథల వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఇక్కడ ‘వినోదం’ అంటే నవ్వు తెప్పించటం, సంతోష పరచటం అని పొరబడకండి. ఆంగ్లంలో ‘entertainment’ అనే పదానికి ‘diversion’ అనే అర్ధమూ ఉంది. నేను ఆ అర్ధంలో వాడాను. వినోదాత్మకమైన కథలు చదవటాన్ని “escaping from reality” అంటూ వెక్కిరిస్తారు కొందరు. నేను మాత్రం దీన్ని “escaping into an alternate reality” అంటాను. కథ పని చదువుతున్నంతసేపూ పాఠకుడిని మరో ప్రపంచంలోనికి తీసుకుపోవటం. పాఠకుడికి కనీసం ఒకటైనా కొత్త విషయం చెప్పటం. ఆ మేరకి అతని/ఆమె దృష్టి పరిధి పెంచటం. అది చెయ్యలేని కథ రాయటం అనవసరం.

పైదంతా రచయిత కోణం నుండి కథ ప్రయోజనం ఏమిటో వివరించే ప్రయత్నం. దీన్నే పాఠకుడి కోణం నుండి ఇలా చెప్పొచ్చు:

“కథ పరమార్ధం పాఠకుడితో ఆస్వాదించబడటం”

అంతే.

*

హింసే పరమో ధర్మః

 

                   -బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi ఉదయ భానూ..!

ఉన్నావా..?

కవిత్వంలో మాత్రమే సాధ్యం కదూ.. నిన్ను నీవు పలుకరించు కోవడం.. నిన్ను నీవు పరిచయం చేసుకోవడం.. నిన్ను నువ్వు పరామర్శించు కోవడం.. నీలోకి నువ్వు తొంగి చూసుకోవడం.. నీలోని ప్రపంచాన్నే కాదు, నీ చుట్టూవున్న ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం.. కవిత్వంలో మాత్రమే సాధ్యం కదూ..

కవిత్వం జీవితం కదూ.. జీవితంలో కూడా సాధ్యమే కదూ..

ఏమో.. అందుకేనేమో.. నాకు నేనే వుత్తరం రాసుకోవడం కోవడం చూస్తే భలే చిత్రంగా వుంది! విచిత్రంగానూ వుంది! నిజానికి యెవరికి వుత్తరం రాయాలో తెలీదు! చుట్టూ అందరూ వుండి వొక్కోసారి మనకు మనమే వొంటరి అవుతాం! వొంటరిగ అనిపిస్తాం! రోహిత్ అలాగే వొంటరయ్యాడు! సమూహం నుండి తాత్కాలికంగానైనా వేరవుతాం! వేరు చేయబడతాం! రాజ్యానికా బలం వుంది! బలగం వుంది!

మనసు నిండా రాయాలని వుండి కూడా రాయలేని వేళ్ళు.. నొప్పి పుడుతున్న వేళ్ళు.. కనీసం పెన్ను పట్టలేని వేళ్ళు.. కంప్యూటర్లో బటన్ వొత్తలేని వేళ్ళు.. నా వేళ్లే.. అందమైన అక్షరాలు అనంతంగా రాసిన వేళ్లే.. నా వేళ్లే.. పోలీసుల యినుప బూట్ల కింద నలిగిన వేళ్లే.. నా వేళ్లే.. పోలీసు వేను మెట్ల మీద నలిగిన నల్లని నా వేళ్లే.. నావి కాకుండా.. నా స్వాధీనంలో లేకుండా..

వేళ్లేనా నొప్పి పడుతున్నది.. ఈ దేహంమొత్తం ఈ దేశంమొత్తంలానే నొప్పి పడుతున్నది.. కాళ్ళు యిద్దరు.. చేతులు యిద్దరు.. పట్టుకున్నారు.. వొకడు.. ఆరున్నర అడుగుల దేహమున్న వాడొకడు.. దున్నపోతులా వున్నాడు.. గుండెలమీద.. పొట్ట మీద.. తొడల మీద.. పిచ్చి పట్టినట్టు గెంతుతున్నాడు.. శరీరాన్ని మట్టి ముద్దను చేసి కుమ్ముతున్నాడు.. వాడూ మనిషే.. వాడిలోని మృగమేదో.. రంకేలేస్తోంది.. దుంకులు దుంకుతోంది..

కళ్ళు మూసినా తెరచినా వాడి ముఖమే! ఆ మృగం ముఖమే! వాడి స్వరమే! ‘లంజా కొడకా.. లంజా కొడకా..’ నా చెవుల్లో యిప్పుడు కూడా ప్రతిధ్వనిస్తోంది!

‘అసలేం జరిగింది?’ యెవరికి వారే అడుగుతున్నారు! ఏం జరుగుతుంది? సెలవుమీద వెళ్ళిన వీసీ పొదిలి అప్పారావు యూనివర్సిటీకి మళ్ళీ వచ్చాడు! తన రాకను పండగ చేసుకొమ్మని రహస్యంగా సర్క్యులర్లు పంపాడు! మెయిల్స్ చేసాడు! రహస్యమెప్పుడూ బహిరంగమని ఆయనకు తెలుసు! రహస్యమే రాజ్యమేలుతుందనీ తెలుసు! రహస్యమే అద్భుతంగా ప్రచారం అవుతుందనీ తెలుసు! తెలిసిందే చేశాడు! తెలిసే చేశాడు! వేడుకగా తనని ఆహ్వానించమని టైంటేబుల్ని తనే యిచ్చాడు! తన అనుయాయులకు కార్యక్రమం తనే రాసిచ్చాడు! తనకు యెలా గ్రీటింగ్స్ తెలపాలో కూడా రాసిచ్చాడు! తనడబ్బా తనే కొట్టుకున్నాడు! టైం టు టైం జరిగే ప్రోగ్రాంషీట్ జిరాక్స్ కాపీలను విద్యార్థులలోకి వెళ్ళేలా చూసాడు! రెచ్చగొట్టాడు! మీరు నా వెంట్రుక పీకలేరని పరోక్షంగా అనిపించేలా ప్రత్యక్షంగానే అల్టిమేటం యిచ్చాడు!

విద్యార్థులు తనని అడ్డుకోవడానికి వస్తారని తెలుసు! విద్యార్థుల మిలిటెన్సీ తెలుసు! తను సేఫ్ గా వుండాలంటే యేo చెయ్యాలో కూడా తెలుసు! మీడియాని తిప్పుకోవడం తెలుసు! కొందరయినా తిరగరని తెలుసు! అందుకే తన అనుయాయులైన సంఘం విద్యార్ధులతో ఫర్నిచర్, అద్దాలు, టీవీలు ధ్వంసం చేయించాడు! కోపంతో వున్న విద్యార్ధులు వొచ్చి జత కలిసారు! అసలు పని చేసిన వాళ్ళు పక్కకు తప్పుకున్నారు! స్క్రీన్ మీదకొచ్చి వీడియోలకూ ఫోటోలకూ చిక్క వలసిన వాళ్ళే చిక్కారు! స్క్రిప్ట్ ప్రకారమే షూట్! దిగవలసిన సమయానికే పోలీసులు దిగారు! పోలీసులంటే క్యాంపస్ పోలీసులు కారు.. తెలంగాణ పోలీసులే!

పోలీసులు మొదట నెమ్మదిగా వొక్కొక్కర్నీ లాక్కు వెళ్ళారు! తరువాత వేగం పెంచారు! వందలమంది పోలీసులు! ఈడ్చి పడేశారు! రాకుండా లొంగకుండా పెనుగులాడుతూ వున్న వాళ్ళని డొక్కలోతన్నారు! విద్యార్ధులు మెలితిరుగుతూనే నినాదాలిచ్చారు! అంతే అమ్మాయిలని చూడకుండా చెంపలు చెల్లుమనిపించారు! బూతులు తిట్టారు! ‘రేప్ అయిపోతారే లంజముండల్లారా’ అని హెచ్చరించారు! అబ్బాయిలకయితే రెండుకాళ్ళ మధ్య యెక్కడ తంతే గింజుకుంటామో అక్కడ తన్నారు! తరిమి కొట్టారు! దొరికిన వాళ్ళని దొరికినట్టు చితక్కొట్టారు! విద్యార్థులు ఆవేశం పట్టలేక రాళ్ళు రువ్వారు! పోలీసులూ రాళ్ళు రువ్వారు! చెట్టుకొకర్నీ పుట్టకొకర్నీ చేశారు! చీమలపుట్టని కదిపినట్టు కదిపారు! ఒక్కొక్కర్నీ చేసి కొట్టారు! వందలమందిని యెత్తుకెళ్ళారు! ఎక్కడకు తీసుకు వెళుతున్నారో తెలీదు! ఏం చేస్తున్నారో తెలీదు! అప్పటికి నేను హ్యుమానిటీస్ బిల్డింగ్ దగ్గర వున్నాను! నీళ్ళు తాగి వచ్చాను! పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టాను! తప్పించుకున్నాను!

ఇరవై ఆరుగురు విద్యార్థులు అరెస్టు! ఇద్దరు ఫేకల్టీలు అరెస్టు! మొత్తం యిరవై యెనిమిది మంది అరెస్టు! చర్లపల్లి జైల్లో పెట్టారు! ఇరవై యిద్దరు అబస్కాండు.. అని చూపించారు!

వీసీ వొస్తున్నాడనగా నెట్ బంద్! వొచ్చాక ఆవాళ మధ్యాన్నం నుండే మెస్సులు బంద్! మంచినీళ్ళు బంద్! కరెంటు బంద్! నాన్ టీచింగ్ స్టాఫ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకొన్నాడు! తను తెర వెనక వున్నాడు! తెర ముందు లొల్లి విద్యార్థులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కూ! అదే అదునుగా ప్రచారం చేశాడు! చివరకు షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల్ని సయితం మూయించాడు! పోనీ యూనివర్సిటీ బయటి నుండి ఫుడ్ లోపలకు తెచ్చుకుందామంటే లేదు! సరే యూనివర్సిటీ బయటకు పోదామంటే లేదు! గేట్లు మూయించేశాడు! పిల్లిని తలుపుమూసి కొట్టినట్టుగా పిల్లల్ని కొట్టించాడు! పిల్లి తిరగబడదా? పిల్లలు తిరగబడరా? తిరగబడితే తప్పవుతుంది! నేరమవుతుంది! నేరం చేసి వాళ్ళకో అవకాశం యివ్వకూడదు అని అనుకున్నాం!

అప్పుడు కూడా ఆ సమయంలో కూడా తెలంగాణ వుద్యమమే మాకు ప్రేరణ! వంటా వార్పుకు దిగాం! మూడు రాళ్ళు తెచ్చి పొయ్యి పెట్టాం! రాళ్ళ మధ్యన వంటేమిటి? క్యాంపస్ రోడ్లమీద అనుకున్నాం! అలా అయితే మా ఆకలి లోకానికి తెలుస్తుందని అనుకున్నాం! అన్నం దొరికే మార్గం అదొక్కటే అనుకున్నాం! రోడ్డు మీద మూడు రాళ్ళ పొయ్యి.. కర్రా కంపా యేరి తెచ్చుకున్నాం! వంట చేసుకుంటున్నాం! నా తోటి వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు! యిది చరిత్రలో వొక రోజు అనుకున్నాం! ఎందుకంటే తెలంగాణ ప్రేరణగా వంటా వార్పే కాదు, తెలంగాణ వుద్యమం నా యంఫీల్! తెలంగాణ వుద్యమ కవిత్వం మీద నా పీహెచ్డీ! ఏడేళ్ళుగా తెలంగాణ వుద్యమంలో వున్నాను! విరసంలో వున్నాను! ‘జంగ్’ తెలంగాణ వుద్యమ కవిత్వం ప్రచురించాను! ప్రత్యేక తెలంగాణని నాకళ్ళతో చూసాను! నా ఆలోచనల్లో పప్పు వుడికింది! తాళింపుకు పచ్చిమిరపకాయలూ వుల్లిపాయలు కోసి పెట్టుకున్నాం! రుచిగా తిందాం అనుకున్నాం! ఆకలికి యెలా వండినా రుచిగా వుంటుందని నవ్వుకున్నాం!

తెలంగాణ వుద్యమంలో వంటా వార్పూ పబ్లిక్ రోడ్లమీద చేసి నెగ్గినం గాని.. మా ఆకలి తీరడానికి, అదికూడా పబ్లిక్కు సంబంధం లేని రద్దీలేని క్యాంపస్ రోడ్లో చేయడం నేరమయింది! పోలీసులు వచ్చారు! రోడ్లమీద ఆటలేమిటి అన్నారు! ఆటలు కాదు, ఆకలి అన్నాం! ‘మీకు బాగా కొవ్వు పట్టింది.. తియ్యండి.. వంటా వార్పూ లేదు.. లంజ కొడుకుల్లారా..’ లాఠీలతో అందర్నీ వొక వైపుకి తరిమి నన్ను మరో వైపుకి తరిమారు.. షాపింగ్ కాంప్లెక్స్ యెదురుగా వున్న కచ్చా రోడ్డు మీదికి మెడకింద చెయ్యిపెట్టి.. లాక్కెలుతూ వాడే.. మృగంలాంటి ఆ మనిషే.. లాల్ మథర్ గచ్చిబౌలి క్రైమ్ బ్రాంచి ఇన్స్పెక్టర్.. బలంగా వేన్లోకి తోసాడు! వేన్లో పడ్డానో లేదో.. వేన్ విండోస్ మూసేశారు! వేన్ డోర్స్ కూడా! నా గుండెలమీద తొడలమీద తొక్కుతూనే వున్నాడు! సహకరిస్తూ లోపల పోలీసులు! బయట వేన్ చుట్టూ గుంపుగా పోలీసులు! అమాయకంగా యేమీ జరగనట్టు పోలీసులు!

నా మీద వోరల్ చార్జిషీట్.. రోహిత్ పోస్టుమార్టం అప్పుడు వున్నడు వీడే.. డెడ్ బాడీని గుంటూరు వెళ్ళనివ్వకుండా ఆపింది వీడే.. యూనివర్సిటీల అణచివేతలని కుల వివక్షతలని కొట్లాటలల్ల వున్నది వీడే..

మధ్యలో మా యూనివర్సిటీ సేక్యూరిటీ ఆఫీసర్ టీవీ రావ్ వచ్చాడు, విండో తెరిపించి చూసి ‘ఈ లంజ కొడుక్కి బాగా బలుపు సార్.. తొక్కండి సార్ కొడుకును..’ అన్నాడు. మళ్ళీ ఒళ్ళు నెత్తురు యింకిన మట్టి ముద్దయింది!

వాళ్ళ మాటల నుడుమ కుమ్ముతూనే వున్నారు.. ఎడమ చేత్తో జుత్తు పట్టుకు యెత్తి కుడి చేత్తో దవడల మీద గుద్దు మీద గుద్దు గుద్దుతూనే వున్నారు! నన్ను లేపి కూర్చోబెట్టి నా తల స్టడీగా వొకడు పట్టుకుంటే మరొకడు చేతికి మెత్తటి గుడ్డ చుట్టి పిడిగుద్దులు కురిపిస్తూనే వున్నారు.. కనపడని పోలీసు దెబ్బలంటే తెలిసింది.. అంతలోనే మళ్ళీ కింద పడేసి తొక్కాడు.. వొక క్షణం అయితే ఊపిరి ఆగిపోతుందనిపించింది.. చిన్న పిల్లల కాలో చెయ్యో తగిలితేనే గింజుకు పోతామే.. అలాంటి టెస్టికల్స్ మీద బలంగా తన్నాడు! నా ప్రాణం నన్ను వీడి పోయిందా.. తెలీదు.. తలచుకుంటే యిప్పుడు కూడా వొళ్ళు జలదరిస్తోంది..!

‘ప్లీజ్ సార్.. వద్దు సార్.. ఆపరేషనయ్యింది..’ కళ్ళలో నెత్తురు తిరుగుతుంటే అడిగా. ఎక్కడన్నాడు. అబద్దం ఆడుతున్నానని అనుకుంటాడని చూపించా. పోలీసు అని మరిచిపోయా. నిజాయితీగా చెప్పా. వదిలేస్తాడని ఆశ పడ్డా. ఫాంటు విప్పి చూపించా. మల ద్వారం దగ్గర కుట్లు.. సాక్ష్యంగా వేళ్ళాడుతున్న దారాలు.. సరిగ్గా అక్కడే.. గురి తప్పకుండా తన్నాడు! ప్రాణం తెగింది.. విలవిలలాడాను.. పులులకు దొరికిపోయిన లేడి పిల్లనయాను.. నాది గట్టి ప్రాణమే! వున్నాను.. పుండు.. పచ్చి పుండయిపోయాను.. నెత్తురు చుక్క నేల రాలలేదు.. ప్రాణం పొతే యెలావుంటుందో టెస్టికల్స్ మీద తన్నినప్పుడు తెలిసింది! ప్రాణంతో వున్న గుడ్డు పగిలినట్టయింది! ప్రాణం పోయినా బాగున్నని వొక్క క్షణం అనిపించింది!

నా పొట్టలో పేగులు చిరిగే వుండాలి.. పక్కటెముకలు పగిలే వుండాలి.. ఎడమ చెవిలో కర్ణభేరి చిట్లే వుండాలి.. ఎడమ కంటి రెటీనా చిరిగే వుండాలి.. పొత్తికడుపు పొరలు తెగేవుండాలి..

‘చాలు వదిలేయండి’ అన్నాడు ఓ అధికారి. ఇంకో అధికారిణి చెవి దగ్గరకు వచ్చి ‘నిన్ను చంపేస్తాం..’ అని చెప్పింది. ఎందుకో నేను వినడమే తప్ప చూడని జార్జిరెడ్డి ఆ సమయంలో గుర్తుకు వచ్చాడు!

అక్కడికి యెంతోసేపు తెలివి లేదు, తెలివి వొచ్చేసరికి ఆసుపత్రిలో వున్నాను.. ఎవరెవరో వస్తున్నారు.. పోతున్నారు.. సెల్లో రికార్డు చేస్తున్నారు..

మూడ్రోజులకి అన్నిరకాలుగా ఆరోగ్యంగా వున్నానని డిశ్చార్జ్ చేసారు! రిపోర్టులలో నాకు ఆపరేషన్ అయినట్టే లేదు!? యూనివర్సిటీకి వస్తే యెందుకో యేదో నమ్మకమూ తెగువా వచ్చి వంట్లో చేరింది! సత్తువ వొచ్చింది!

ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రెస్ మీట్ పెడితే.. వెళ్ళా, అందరూ కూర్చోమన్న వాళ్ళే.. కూర్చోలేనే! నొప్పి! ‘లెఫ్ట్ చీక్ మీద చిన్న దెబ్బ తప్ప ఉదయ భానుకి దెబ్బలేమీ తగల్లేదు..’ అని పోలీస్ కమీషనర్ చెప్పాడని ఢిల్లీ నుండి వచ్చిన హక్కుల సంఘం ఆమె చెప్పి నవ్వింది!

కళ్ళముందు సాక్ష్యంగా శవంలా తిరుగుతూ నేను..

మూడురోజులుగా భోజనం లేదు! తింటే వాంతి అయిపోతోంది! నీరసంతో ఎన్నాళ్ళు? అడుగుతున్నారు.. తెలీదు.. రోహిత్ గుర్తుకొస్తున్నాడు.. ఓడిపోవడమంటే యేమిటో తెలుస్తోంది.. తెలిసే కొద్దీ రోహిత్ అర్థమవుతున్నాడు! సూసైడ్ చేసుకున్నాడనే రోహిత్ మీద మునుపు వున్న కంప్లైంట్ యిప్పుడు లేదు..

కేసీఆర్ వివక్ష గురించి అసెంబ్లీల మాట్లాడితే నవ్వొచ్చింది! పోలీసుల మీద జాలి చూపించడం చూస్తే.. అరిటాకుతో పోల్చడం చూస్తే జాలేసింది! వీసీని కొట్టి చంపేస్తే.. సియ్యమ్ము పడ్డ బాధ చూస్తే అతని బాదేందో స్పష్టంగానే అర్థమయ్యింది! ‘వీసీని రీకాల్ చేయిస్తా..’ సభకు హామీ యిచ్చి -‘ఎక్సెస్ ఫ్రం ది పోలీస్ వుంటే ఇమ్మీడియట్ ఎంక్వయిరీ చేయిస్తా’నంటున్నాడు. ‘సోషల్ వెబ్ సైట్లలో కావలసినన్ని సాక్షాధారాలు వున్నాయి..’ కళ్ళున్నా చూపులేదు అని మిత్రులు మాట్లాడుకుంటున్నారు!

‘అమ్మ బాధపడిందా..?’ చూడ్డానికి వచ్చిన ఫ్రెండ్ అడిగాడు. అమ్మ గుర్తొచ్చింది! అమ్మ మాటా గుర్తుకు వచ్చింది! ‘కనీసం మీ సెక్యూరిటీ ఆఫీసర్నన్నా కొట్టి రారా యింటికి..’ అమ్మ ఆగ్రహానికి నవ్వుకున్నాను! అమ్మలోని ఆగ్రహం చాలా మంది మాటల్లో చూసాను! రోహిత్ కోసం అందరూ వున్నట్టే.. నాకోసం యెందరో వున్నారు! ఒకరి కోసం వొకరున్నారు! సమూహంలోంచి నన్ను వేరు చేసినా నేను వొంటరి కాననిపిస్తోంది!

నీకు భయం లేదురా భానూ..

నువ్వేరా నేను!

నీ

ఉదయ భాను

 

 

 

ఖమ్మం సాహిత్య చరిత్ర రచనకి ఇది శ్రీకారం!

 

kaifiyath

సాంస్కృతిక  పునర్వికాసానికి ఖమ్మం జిల్లా తోడ్పాటు చిరస్మరణీయమైనది. ఆధునిక కాలంలో తెలంగాణాలో  సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది హైదరాబాద్‌లో 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో పడింది.. ఈ భాషానిలయం స్థాపనంలో తెంగాణలోని ప్రముఖమైన సంస్థానాధీశులు వారికి తోడుగా కొమర్రాజు క్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, మైలవరపు నరసింహారావు, ఆదిపూడి సోమనాథరావు తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఈ ప్రముఖ సంస్థానాధీశుల్లో నేటి ఖమ్మం జిల్లాకు చెందిన పాల్వంచ సంస్థానాధీశులు రాజా పార్థసారథి అప్పారావు ఆర్థికంగా ఆదుకోవడమే గాకుండా లైబ్రరీ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు కూడా. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానియానికి జీవితాంతం రాజపోషకునిగా ఉన్నారు. ఈయనకు ‘సాహిత్య విశారద’ అనే బిరుదు కూడా ఉంది. పాల్వంచలో ‘ఆంధ్రవాఙ్మయ సేవాసమితి’ని స్థాపించి దాని తరపున ప్రత్యేక సాహిత్య సంచికను ‘కిన్నెర’ పేరిట ప్రచురించారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వ్యాసభారతాన్ని యథాతథంగా అనువదించి అచ్చేసేందుకు అనేకమంది పోషకుల్ని ఆర్థిక సహాయం అర్థించాడు. అందరూ నిరాకరించారు. చివరికి పార్థసారథి అప్పారావు చేసిన సహాయముతో దాన్ని ఆయన ముద్రించాడు. అంతేగాదు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం స్థాపన కాంలో 11 ఏళ్ళ బాలుడిగా సమావేశానికి వచ్చిన వారందరికీ తాంబూలాలు అందించి అనంతర కాలంలో తెలుగుజాతి గర్వించే పరిశోధనలను, రచనలు చేసిన ఆదిరాజు వీరభద్రరావు కూడా ఖమ్మం జిల్లా (మధిర తాూకా, దెందుకూరు) వాడే! అంటే తెంగాణ పునర్వికాసానికి ఖమ్మం తోడ్పాటు ఏమిటో అర్థమౌతుంది. చందాల కేశవదాసు, మాడపాటి తిరుమలరావు, మాడపాటి రామచంద్రరావు, జమలాపురం వెంకటేశ్వరరావు, సోమరాజు రామానుజరావు, సోమరాజు ఇందుమతీ దేవి, జమలాపురం కేశవరావు, పండిట్‌ రుద్రదేవ్‌, హీరాలాల్‌ మోరియా, సర్వదేవభట్ల నరసింహమూర్తి, సర్వదేవభట్ల రామనాథం, ఊటుకూరి రంగారావు, కౌముది, సుగ్గు అక్షయలింగం గుప్త, ఎ. పూర్ణానంద గుప్త, గెల్లా కేశవరావు, ఉత్ప సత్యనారాయణాచార్య, ఇటికాల నీలకంఠరావు, దాశరథి సోదరులు, కోదాటి నారాయణరావు, బొమ్మకంటి సత్యనారాయణ, చేకూరి కాశయ్య, శీలం సిద్ధారెడ్డి, జలగం వెంగళరావు, డి.రామలింగం, బెల్లంకొండ రంగాచార్యులు, బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, బెల్లంకొండ లక్ష్మణసూరి, పబ్బరాజు గోపాలరావు, పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు, పాలడుగు వెంకటేశ్వరరావు, జాతశ్రీ, విశిష్ట పరిశోధకులు దూపాటి వేంకటరమణాచార్యుల మిత్రులు అన్నపరెడ్డి పల్లికి చెందిన జమీందారు కాళ్లూరి వెంకటరామారావు ఇలా ఎందరో మహానుభావు తెంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో తమదైన ప్రత్యేకమైన ముద్రను వేసిండ్రు.

సాయుధ పోరాట కాలంలో పర్చా దుర్గాప్రసాదరావు, పి.వెంకటేశ్వరరావు, వట్టికొండ రామకోటయ్య, అడ్లూరి అయోధ్యరామకవి(?), తాళ్ళూరి రామానుజస్వామి, కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా, డి.రామలింగం, విరివిగా రచనలు చేసిండ్రు. ఇందులో కమ్యూనిస్టులున్నారు. కాంగ్రెస్‌ సానుభూతి పరులూ ఉన్నారు. తమ భావాజాలాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి కృషి చేసిండ్రు.

మరుగున పడ్డ ఎన్నో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక, చారిత్రక అంశాలను మలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించిన పరిశోధకులు శేషాద్రి రమణకవులు. ఇంకా వెలుగులోకి రావాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ పరిశోధనంతా చేసింది రమణకవులు పేరిట దూపాటి వేంకట రమణాచార్యులు. ఖమ్మం జిల్లాకు ఈయనకు విడదీయరాని బంధం ఉంది. దూపాటి రెండో సోదరి భద్రాచలం దగ్గరలోని అన్నపరెడ్డిపల్లిలో నివాసం ఉండేది. అందువల్ల తరచూ అక్కడికి వస్తూ ఉండేవాడు. ఈయన మొట్టమొదట తెంగాణాలో పరిశోధన మొదలు బెట్టింది ఖమ్మం జిల్లా నుంచే! ఎర్రుపాలెం కరణం, భాషాప్రియులైన జమలాపురం వెంకటకిషన్‌రావు ఇంట్లో ఆయన తోడ్పాటుతో పరిశోధక ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో కొన్ని వందల అముద్రిత తాళపత్రాలను సేకరించారు. ఇదే గ్రామానికి చెందిన అడ్వకేటు మాడపాటి తిరుమలరావు కూడా అండగా నిలిచాడు. అలా తెలంగాణ పరిశోధనకు చేయూత లభించింది. అంతకముందు 1922లో ఆదిరాజు వీరభద్రరావు హైదరాబాద్‌లో ఆంధ్ర పరిశోధక మండలిని ఏర్పాటు చేసిండు.

ఈ పరిశోధక మండలి 1923లో కొమర్రాజు క్ష్మణరావు చనిపోవడంతో అది ‘కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర పరిశోధక మండలి’గా మారింది. ఈ మండలి తరపున ‘తెంగాణ శాసనాలు’ ప్రచురించడంలోనూ, ఆ తర్వాత ఆధునిక తెంగాణ ఆత్మగౌరవాన్ని సాహిత్య రంగంలో సగౌరవంగా నిబెట్టిన ‘గోలకొండ కవుల సంచిక’ మలువడడంలోనూ ఆదిరాజు వీరభద్రరావు విశేషమైన కృషి చేసిండు. ఇది ఖమ్మం జిల్లాకే గౌరవ కారణం. ఈ గోలకొండ కవు సంచికలో ఖమ్మం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది కవున్నారు. ఇందులో జ్ఞానమాంబ, సోమరాజు ఇందుమతీదేవి రచనలు కూడా చోటు చేసుకున్నాయి. వీరిద్దరు కూడా కవిత్వ పుస్తకాలను అచ్చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ముందే అర్వపల్లి సత్యవతీదేవి, పబ్బరాజు ఇందిరాదేవి లాంటి కథకులు ఈ ప్రాంతం నుంచి రాసిండ్రు. సోమరాజు ఇందుమతీదేవి సోదరుడు సోమరాజు రామానుజరావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిలో నిలిచిపోయే రంగూన్‌ రౌడీ, స్వరాజ్య రథం లాంటి నాటకాలు రాసిండు. అనేక నవలలు  వెలువరించిండు. ఇందులో స్వరాజ్య రథం నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇందుమతీదేవి ఖండిక సంపుటి విజయవాడ నుంచి వెలువడింది. సరిహద్దు ప్రాంతం కావడంతోటి ఆంధ్రప్రాంతంతో ఇక్కడి రచయితలకు సన్నిహిత సంబంధాలుండేవి. వేలూరి శివరామ శాస్త్రితో పాటు అనేకమంది ఆంధ్రప్రాంత కవి పండితులు ఈ జిల్లాతో మొదటి నుంచి పెనవేసుకుపోయిండ్రు. తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఈ జిల్లా రచయితలను ప్రభావితం చేసింది. గ్రంథాలయోద్యమంలో ఇక్కడి విజ్ఞాన నికేతనం, కుకునూరు, పాల్వంచ, ఎఱ్ఱుపాలెం, రేమిడిచర్ల, మధిర తదితర గ్రంథాయాలు కీలక పాత్ర పోషించాయి. తెంగాణలోనే మొట్టమొదటి సారిగా సింగరేణిలో అఖిలాంధ్ర గ్రంథాలయ సభలు జరిగాయి. ఈ సభకు హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డితో పాటు చాలామంది హాజరయ్యారు. ఇది స్థానికుల్లో చాలా చైతన్యాన్ని నింపింది.

khammam kathalu

ఖమ్మం జిల్లా రచయిత మీద ఉర్దూ, ఇంగ్లీషుతో బాటుగా పక్కనున్న ఆంధ్రప్రాంతం వారి ప్రభావం కూడా ఉండింది. హీరాలాల్‌ మోరియా, కవిరాజమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)పై ప్రేమ్‌చంద్‌, కిషన్‌చందర్‌ లాంటి ఉర్దూ కవుల, కథకుల ప్రభావం ఎక్కువగా ఉండింది. ఖమ్మం జిల్లా నుంచి మొదట ఆధునికత రీతిలో కథలు రాసింది మాడపాటి రామచంద్రరావు. ‘తిమిర ఝంజుమ్’ అనే కవితా సంకలనాన్ని ప్రచురించిన ‘మంజు’దావూద్‌ అలీ కాశ్మీరీ భాషలో కూడా రచను చేసిండు. ఉర్దూ కవి సికిందర్‌ మొహసిన్‌ గురజాడ ‘దేశమును ప్రేమించుమన్న’ గేయాన్ని ఉర్దూ పాఠకుకులకు అందించిండు. మోరియా, కవిరాజ మూర్తి ఇద్దరూ ఉర్దూలో కవిత్వం, కథలు, నవలలు రాసిండ్రు. వీరు ఉర్దూలో రాసినవి ఊటుకూరు రంగారావు, ఇటికాల నీకంఠరావు, కొలిపాక మదుసూదనరావు, గిడుతూరి సూర్యం లాంటి వాండ్లు తెలుగులోకి తర్జుమా చేసిండ్రు. అలాగే డి.రామలింగం లాంటి వారు తెలుగుసాహిత్యాన్ని ‘ఇండియన్‌ లిటరేచర్‌’ సంచిక ద్వారా 60వ దశకం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిండ్రు. ఇప్పటికీ ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ఈయన రాసిన వ్యాసాలే ప్రధాన ఆధారం. ఖమ్మం కథకుల్లో ఎక్కువ మంది, ఆనాటి మాడపాటి రామచంద్రుడు మొదలు షంషాద్‌ బేగం వరకూ  తాము పుట్టినూరు నుంచి వివిధ ప్రాంతాలకు, దేశాలకు ‘వలస’ లేదా జీవనోపాధి కోసం ప్రయాణం చేసినవారే కావడం విశేషం. మొబిలిటీ (చలనశీలత) కథకుడికి కొత్త కోణాల్ని అందిస్తుంది. కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వాతావరణం అన్నీ కగలిపి తాము అనుభవిస్తున్న, అనుభవించిన జీవితాలను పోల్చి చూసుకొని కథలుగా రికార్డు చేసిండ్రు. మెరుగైన సమాజం కోసం చేసిన సాహితీ కృషి ఇది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ తెలుగులో రాసే ముస్లిం రచయితలు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా ఖమ్మమే అని చెప్పొచ్చు. షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ.రెహమాన్‌, దిలావర్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, షంషాద్‌ ఇట్లా అనేకమంది కవులు, రచయితలు తెలుగులో రాసిండ్రు. ఇంకా రాస్తున్నరు. అయితే వీళ్ళందరూ స్వాతంత్య్రానంతర తరం(?) కావడం, అప్పటికి ఉర్దూ మాధ్యమంలో బోధించే స్కూల్స్  ఖమ్మం ప్రాంతంలో లేకపోవడం, చుట్టూ తెలుగు వాతావరణమే ఉండడంతో అనివార్యంగా వీళ్ళు తెలుగులో రాయాల్సి వచ్చింది. దాని వల్ల ఉర్దూ సాహిత్యం నిఖార్సయిన తెలంగాణ జీవితాన్ని రికార్డు చేసే అవకాశం కోల్పోయింది.         ఈ ద్వివిదీ భావం చరిత్రలో కూడా కనబడుతుంది. దాశరథీ శతకముతో పాటు తన కీర్తనతో ‘ఎవడబ్బా సొమ్మాని కుకుతు వున్నావ్‌’ అని రాముడినే ప్రశ్నించిన కంచర్ల గోపన్న (రామదాసు) తానీషా కాంలో ఖైదు అనుభవిస్తాడు. అలాగే భద్రాచం ప్రాంతం వాడైన భల్లా పేరయకవి తన ‘భద్రగిరి శతకము’లో ముస్లిం రాజుల్ని నిందిస్తాడు.

‘‘అచ్ఛిద్ర కర్ణుయాజ్ఞ నుండగలేక

తురకల కెదురుగా పరుగ లేక

చేరి ఖానులకు తాజీములీయగ లేక

మును నమాజు ధ్వనుల్‌ వినుగలేక

‘‘కాడు చేసిరి కదా కళ్యాణ మండపా

గార వాహన గృహాంగనమలెల్ల

‘‘సంస్క తాంధ్రోక్తుల సారంఋడివోయె

నపసవ్య భాషల నమరె జగము

సత్రశాలంగణల్‌ చలువ పందిరులు

బబ్బరట ఖానుల చప్పరముయ్యె

‘‘పారిపోవగ నైన పట్టెలె నాకక

విడుతరే వైష్ణవ వితతి నెల్ల’’ అని రాసిండు.

jwalitha

జ్వలిత

అయితే ఇదే జిల్లాలో ఆరో నిజామ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ చనిపోయిన తర్వాత ఆయన పేరిట 1911 జూలై 16వ తేదీనాడు ఎఱ్ఱుపాలెంలో జమలాపురం రామారావు, వెంకటకిషన్‌రావు, మాడపాటి తిరుమలరావు తదితయి పూనుకొని ‘మహబూబియా గ్రంథాలయా’న్ని ఏర్పాటు చేసిండ్రు. అలాగే మధిరలో మిరియాల నారాయణగుప్త గారు ‘ఉస్మానియా ఆంధ్ర భాషానియం’ పేరిట గ్రంథాయాన్ని ఏర్పాటు చేసిండు. ఇవి రెండు చాలా కాలం పాటు ప్రజలకు ఉచిత పుస్తక, పత్రికా పఠన సౌలభ్యాన్ని కలిగించాయి. ముస్లిం రాజు పేరిట కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసిన ఈ గ్రంథాయాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి. విదేశాల్లో కొన్ని వందల యేండ్ల క్రింతం స్థాపించబడ్డ లైబ్రరీలు ఆధునిక కాంలో కూడా నిరంతరంగా నడుస్తూ ఉన్నాయి. మన దగ్గర మాత్రం లుప్తమై పోతున్నాయి. రాజుని రాజుగా కాకుండా హిందూత్వ దృక్కోణం నుంచి చూసినప్పుడే సమస్య లెదురవుతున్నాయి. ఇప్పుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ అంటే దుర్మార్గుడు, రాక్షసుడు, నిరంకుశుడు పేరిట ‘కమ్యూనిస్టు, బీజేపీ వాళ్ళు’ ఒకే రీతిగా పిలుస్తున్నారు. కమ్యూనిస్టులు మొదటి నుంచీ ఈ జిల్లాలో బలంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా సాయుధ పోరాట ఉద్యమం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి. పోరాట వారసత్వాన్ని కాపడుకోవడం పేరిట నిజాంను నిందించడం ఎంత వరకు సమంజసమో కూడా ఆలోచించాలి.

స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ అంతటా ఎక్కువ భాగం ఉర్దూ మాధ్యమంగానే ఉన్నత విద్య బోధన జరిగేది. అట్లా చదువుకున్న వారిలో సర్వదేవభట్ల నరసింహమూర్తి ఒకరు. ఈయన సాయుధ పోరాట కాంలో ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని చివరికి అనివార్య కారణాల వల్ల  హైదరాబాద్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే ‘మై గరీబ్‌ హూ(’, లాహూ కీ ఖీర్‌ లాంటి ఉర్దూ నమ రాసిండు. ఇవి తరువాత తెలుగులోకి తర్జుమా అయ్యాయి. తెలుగు మాతృభాషగా ఉండి ఎక్కువ భాగం ఉర్దూలో రాసిన రచయిత కవిరాజమూర్తి. ఈయన స్వాతంత్య్రానంతరం ‘ఉత్తర’, ‘దక్షిణ’ అన్న మారు పేర్లతో పటంచెరువు (ఇక్రిసాట్‌, మెదక్‌ జిల్లా) వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగం చేస్తూ అనేక వ్యాసాలు వెలువరించాడు. అలాగే హీరాలాల్‌ మోరియా కూడా ఉర్దూలో అనేక కథలు, నవలలు  రాసిండు. వాటన్నింటినీ ఖమ్మం మిత్రులే తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించేవారు. ఊటుకూరు రంగారావు స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూలోకి కథలు తర్జుమా చేసిండు. శరధార అనే అద్భుతమైన కవితా సంపుటిని మెవరించిండు. ఇలా అటు ఉర్దూ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి ఏక కాంలో అనేక రచనలు అందజేసిన వీరి గురించి, వీరి రచనల గురించీ ఎక్కువగా తెలియడం లేదు. వీరి సమగ్ర రచన సంపుటి వెలువడ్డట్లయితే తెలుగు సమాజం ఉర్దూ సాహిత్యంలో ఎట్లా రికార్డయ్యిందో వివరంగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఈ ప్రాంతానికున్న చరిత్ర కూడా పూర్తిగా ఇంకా వెలుగులోకి రాలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన మూలాల్ని మనం వెతికి పట్టుకునే పని ప్రారంభమయింది. అలాంటి పునాది పని ఈ ‘ఖమ్మం కథలు’ద్వారా జ్వలిత గారు చేస్తున్నారు. ఇక్కడి చరిత్రను కూడా తవ్వితీయడానికి ఇదొక సందర్భం కూడా. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్రుంది. అది అరకొరగా కొంత రికార్డయింది. రామాయణంలోని సీత నివసించిన పర్ణశాల భద్రాచలం ప్రాంతంలోనే ఉందని ప్రముఖ పరిశోధకుడు కొమర్రాజు క్ష్మణరావు మహారాష్ట్ర పండితుల వాదనను ఖండిస్తూ నిరూపించిండు. రావణుడు ఇదే పర్ణశాల నుంచి సీతను ఎత్తుకెళ్తూ ఉంటే జఠాయువు పోరాటం చేసి నేలకొరిగిండని  ఆ ప్రాంతంలో1870ల్లో నివసించిన జాన్‌ కెయిన్‌ అనే ఆంగ్లేయుడు పత్రికల్లో పరిశోధక వ్యాసాలు మెవరించిండు. జఠాయువు`రావణాసురుడి పోరులో ఆ ప్రాంతమంతా దుమ్మురేగడంతో దానికి దుమ్ముగూడెం అని, రావణుడి రథం తాక్కుంటూ వెళ్ళిన గోదావరి ఆవలివైపు గుట్టను రథపు గుట్ట అని, జఠాయువు పాక ఉన్న ప్రాంతాన్ని జటపాక అని అదే ఏటిపాక అనీ ఆయన రాసిండు.

గ్రంథాలయోద్యమం, విద్యాలయాల స్థాపన, పరిశోధన, పత్రిక నిర్వహణ, ఆంధ్రమహాసభ, వర్తక సంఘాలు, పుస్తకప్రచురణ, రైతు ఉద్యమాలు, కమ్యూనిస్టుల కార్యకలాపాలు అన్నీ కగలిసి ఇక్కడి ప్రజల్లో చైతన్యానికి దోహదం చేశాయి. ఖమ్మంలో 1936లో స్థాపించబడ్డ విజ్ఞాన నికేతనం గ్రంథాలయ వారోత్సవాల్లో ఆంధ్రప్రాంతానికి చెందిన విశ్వనాథ సత్యనారాయణ, అంబటిపూడి వెంకటరత్నం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మ్లంపల్లి సోమశేఖరశర్మ, మారేపల్లి రామచంద్రశాస్త్రి, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వీటి కొనసాగింపుగా 1944లో సింగరేణి కారీస్‌లో 25వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ జరిగింది. ‘విశాలాంధ్ర’కు ఇక్కడే బీజాలు పడ్డాయి. అంతకుముందు కరువు పీడిత ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాయసీమ నుంచి పుష్కంగా నీళ్లున్న ‘బనిగండ్ల పాడు’లాంటి ప్రాంతానికి వలసవచ్చిన వారు ఇక్కడి చైతన్య, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దాదాపు వందేండ్లకు ముందు ఇక్కడికి వలస వచ్చినవారు స్కూల్స్, వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవడంలో ముందున్నారు.

1930ల్లోనే ఇక్కడి దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. వివిధ సంస్థల కార్యకలాపాల వల్ల  ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యంతోటే 1934లో ఖమ్మం జిల్లా పెదమండువ గ్రామంలో దళితు కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిండ్రు. ఈ పాఠశాలలో సుండ్రు రంగయ్య అనే అతను ఉపాధ్యాయుడిగా ఉండేవారు. ఆయన కూడా దళితుడే! తర్వాతి కాంలో నిజాం రాష్ట్ర హరిజన సేవక సంఘం వాళ్ళు ఈ పాఠశాలను ఆర్థికంగా ఆదుకున్నరు. పుస్తకాలు, పలకలు ఉచితంగా ఇవ్వడమే గాకుండా భవన నిర్మాణానికి కూడా ఈ సంస్థ సాయం చేసింది. దాదాపు ఇదే కాంలో ఖమ్మం తాూకాలోని ముష్టిగుంట్ల గ్రామంలో పోలీసు ఉన్నతాధికారి మౌల్వీ మహమ్మద్‌ తబియుద్దిన్‌ పూనిక మేరకు అస్పృశ్యత నివారణకు, స్త్రీ సమానత్వం కోసం సభలు జరిగాయి. ఇందులో చాలా మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. విశేషమేమిటంటే దళితులను కూడా సభా వేదికపై కూర్చుండబెట్టి సమావేశాలు నిర్వహించడం. ఈ సమావేశంలో ఖమ్మంకు చెందిన సనాతనధర్మదారణ సభ వారు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు జరగలేదని గోలకొండ పత్రికలో పేర్కొన్నారు. అలాగే మధిర తాలూకా గుండిపూడికి చెందిన నియోగి బ్రాహ్మణు జమీందార్‌ అయిన కాళ్ళూరు వెంకటరావు పినపాకలో చనిపోయారు. ఆయన స్మృత్యర్థం వారి కుమారులు రామకిషన్‌రావు, ఉమామహేశ్వరరావు ఖమ్మం పట్టణంలో హరిజన హాస్టల్‌ని      1941లో నిర్మించిండ్రు. నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్‌ ఆవలి ప్రదేశంలో దళితు అభ్యున్నతికి ఎక్కువ కృషి జరిగింది ఖమ్మం జిల్లాలోనే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ జిల్లా విశిష్టమైనది.

 

మొత్తం తెంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాది ఒక ప్రత్యేకమైన స్థితి. భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్యం బలవంతంగా విలీనమైనప్పుడు ఖమ్మం జిల్లా ఉనికిలోనే లేదు. నిజానికి 1905వరకు వరంగల్‌, ఖమ్మం రెండు జిల్లాల్ని కలిపి ఖమ్మం జిల్లాగానే పిలిచేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం 1905లో జిల్లా కేంద్రాన్ని వరంగల్‌కు మార్చి ‘వరంగల్‌’ జిల్లాగా మార్చారు. భౌగోళికంగా మిగతా తెంగాణ జిల్లాతో పోల్చి చూస్తే పూర్తిగా భిన్నమైంది. గోదావరి, శబరి, కిన్నెరసాని, మున్నేరు లాంటి నదులతో, బయ్యారం ఉక్కుగనులతో, బొగ్గుగనులతో, పాలేరు నీటి వసతితో కొంత మెరుగైన పరిస్థితి ఉండింది. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏర్పడ్డ మొట్ట మొదటి ఇంకా చెప్పాంటే ఏకైక జిల్లా ఇది. హైదరాబాద్‌ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతిభద్రతలు కాపాడేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం వరంగల్‌ జిల్లాను విభజించి 1953 అక్టోబర్‌ ఒకటిన ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడమైంది. జిల్లా ఆవిర్భావ కాలంలో ఖమ్మం, ఇల్లందు, మధిర, బూర్గుంపాడు, పాల్వంచ తాలూకాలు మాత్రమే భాగంగా ఉండేవి. ఖమ్మం తాలూకాలోని కామేపల్లి, సిరివోలు గ్రామాలను ఖమ్మం తాలూకా నుంచి తొలగించి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ తాలూకాలో కలిపారు. ఇవ్వాళ ఆంధ్రలో కలిపిన గ్రామా ప్రజల గోడు వింటూంటే వాళ్ళ గొంతు ఎట్లా నొక్కబడుతుందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు ఆంధ్రా ‘మేధావులు’ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలంని కూడా ఆంధ్రాలో కలపాలని డిమాండ్‌ చేసిండ్రు. భద్రాచలం ప్రాంతమనేతమ ది వారి వాదన. అయితే చారిత్రకంగా చూసినట్లయితే అది అసంబద్ధ వాదన.

 

1854లో ఆర్థర్‌ కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట కట్టే సమయంలో  పరిపానా సౌలభ్యం కోసం సూగూరు, భద్రాచం తాలూకాను బ్రిటీష్‌ వారికి ఇవ్వాల్సిందిగా నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పురస్కరించుకొని వాటిని బ్రిటీష్‌ ప్రభుత్వానికి బదలాయించారు. భద్రాచం, రేకపల్లి తాలూకాలు 1860 వరకూ నిజాం ఆధీనంలోనే ఉండేవి. 1860లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వీటి అజమాయిషీని బదలాయించారు. ఆ తర్వాత ఈ తాలూకాని 1874లో సెంట్రల్‌ ప్రావిన్స్‌ నుంచి మద్రాసు ప్రావిన్స్‌కు బదలాయించిండ్రు. 1953లోనూ, 1959లోనూ భద్రాచలం ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి. వీటిని నదికి ఆవలితీరంలో చాలా దూరంలో ఉన్న జిల్లా కేంద్రం నుంచి పాలించడం కష్టసాధ్యమయ్యేది. దాంతో ప్రజల ఇబ్బందులను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాను ఖమ్మం జిల్లాలో కలిపారు. ఈ ఉత్తర్వు 1959 నవంబర్‌ 30 నుంచి అమల్లోకి వచ్చింది. భద్రాచలం ప్రాంత ప్రజలది మొదటి నుంచీ దయనీయమైన స్థితి. 1959లో తెంగాణలో కలపడంతో ముల్కీ రూల్స్‌ వారికి వెంటనే అమలు కాకపోవడంతో స్థానికంగా కళాశాలల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలు రెండూ దక్కలేదు. దానిపై వాణీ రమణారావు లాంటి గిరిజన ఎమ్మెల్యేలు పోరాటం చేయడంతో వారిని ముల్కీలుగా గుర్తించేందుకు జలగం వెంగళరావు చొరవ తీసుకొని చట్టంలో మార్పు తీసుకొచ్చారు. అయితే ఈ మార్పుల్ని ఆసరాగా ఎక్కడెక్కడి వారో తాము కూడా తెంగాణ వారమే అని ఉద్యోగాకు పోటీపడ్డారు. నిజానికి  ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి పునాది కూడా ఖమ్మం జిల్లా నుంచే పడిందంటే అతిశయోక్తి కాదు. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులను 1969 జనవరి పది తారీఖులోగా తొలగించి  తెంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ‘కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌’ సంఘం కార్యదర్శి వి.వై.గిరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది ఆచరణకు రాకపోవడంతో విద్యార్థి రవీంద్రనాథ్‌ అమరణ నిరాహార దీక్ష చేపట్టిండు. ఇది విస్తరించి తెంగాణ అంతటా ఉద్యమానికి దారితీసింది.

 

నిజానికి 1961లో తెంగాణ కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ నిధుల నుంచి ఈ ‘కొత్తగూడెం పవర్‌ థర్మల్‌ స్టేషన్‌’ ప్రారంభ మయింది. ఇందుకోసం రైతులు 1300 ఎకరాల భూమిని ధారదత్తం చేయాల్సి వచ్చింది. ఒక వైపు భూములు పోయాయి. మరోవైపు కరువు పరిస్థితులు, తమ కండ్ల ముందట రోజువారీ ఉద్యోగాలకు కూడా ఉన్నతస్థాయి ఆంధ్ర అధికారులు తమ ప్రాంతంవారిని పిలిపించి ఉద్యోగాలిచ్చారు. ముల్కీ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘించి స్థానికంగా భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా ఆంధ్ర ప్రాంతం వారికే కట్టబెట్టారు. మొదట ఎం.ఎన్‌.ఆర్‌ అని తాత్కాలిక ఉద్యోగాల పేరిట వారిని పనిలోకి తీసుకొని, తర్వాతికాంలో ‘అనుభవం’ ఉన్నవారు అని సాకు జెప్పి వారికే ఉద్యోగాలిచ్చిండ్రు. మొత్తం 1200 ఉద్యోగాల్లో తెంగాణ వారు కేవం 200 మంది కూడా లేరు. తెంగాణలో అప్పటికే 30వేల మంది ఇంజనీరింగ్‌, డిప్లొమా, డి.టి.ఐ, హెచ్‌.ఎస్‌.సి, డిగ్రీలు పాసయినవారున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న అటు ప్రభుత్వం గానీ, ఇటు ఎపిఎస్‌ఇబీ గానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. నిజానికి తెలంగాణకు ఉన్న రక్షణల్ని ఆంధ్రాధికారులు ఉ్లంఘించిండ్రు. ఈ సేఫ్‌గార్డ్స్‌ 1958 నుంచీ అమల్లో ఉన్నాయి. కండ్ల ముందట అన్యాయం జరుగుతున్నా అడ్డుకోలేని అశక్తత ఆగ్రహానికి దారి తీసింది. అలా ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి పునాది పడింది. రెండో సారి 2009లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనప్పుడు రోశయ్య ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి ఖమ్మంకు తరలించింది. ఖమ్మంలో తెంగాణ ఉద్యమం బాలహీనంగా ఉండడంతో అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత రాదు అనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. అయితే ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మం ఒక్కటిగా తరలి వచ్చి పోరాటానికి బాసటగా నిలిచింది. లాఠీలకు వెరవకుండా ఉద్యమకారులు చూపిన తెగువ మిగతా తెంగాణ బిడ్డకు స్ఫూర్తిగా నిలిచింది.

ఈ పోరాట స్ఫూర్తితో జ్వలిత గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 104 కథలతో ఈ సంకలనాన్ని వెలువరించారు.  ఈ సంకలనం మిగతా జిల్లాల వారికి స్ఫూర్తి కావాలని స్ఫూర్తి కొరుకుంటూ …

(“ఖమ్మం కథల”కు రాసిన ముందుమాటలో కొంత భాగం)

 

ఇలా రువ్వుదామా రంగులు?

holi

-విజయ్ కోగంటి 

 

 

***

 

రంగులు మారడమే

లక్ష్యమైన దానికన్నా

యీ రంగులు పూసుకోడం

తప్పేమీ కాదు.

 

ఒక వెలుగవు దామనుకున్న దీపాన్ని

తొలగించేందుకు పులుముకున్న

చీకటి నవ్వుల తెల్లబరిచేందుకు,

గుండె సాక్షిగా జారే

కన్నీటికి ఆసరాగా

తోడై నిలవగలిగేందుకు

రువ్వుదామా రంగులు?

 

దుర్మార్గపు గుండెలవిసేలా

అజ్ఞానపు రంగు

వెలిసి రూపు మారిందాకా

రువ్వు దామా రంగులు?

 

కనిపించని తెరలు నిలిపి

పరాభవాల వలలు పన్నే

కుహనాల తలలు తిరిగేలా

రువ్వుదామా రంగులు?

 

జలపాతమంత వడిగా

లోని చీకట్లు తొలగిపోయేంతగా,

భేదమెరుగని మనసులు

ఆనందాన తుళ్ళి,తేలి

తడిసి ముద్దయేట్లుగా,

చూపులో,మాటలో,నవ్వులో

రువ్వుదామా, మనుషులమై

ప్రతి ఘడియా,

కల్తీలేని సంతోషపు రంగులు ?

 

– విజయ్, కోగంటి

 అగమెమ్నన్ ముఖం తొడుగు దొరికింది!

MaskOfAgamemnon

స్లీమన్ కథ-26

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఈసారి స్లీమన్ కు అన్నింటికన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగించినవి, అసంఖ్యాకంగా ఉన్నబంగారు బిళ్ళలు. ఈ ఒక్క సమాధిగదిలోనే అవి ఏడువందలకు పైగా లెక్కకొచ్చాయి.  ఆకులు, సీతాకోకచిలుకలు, ఆక్టోపస్ లు, నక్షత్రాలు, పొద్దుతిరుగుడు పువ్వులు…ఇలా అవి వివిధ ఆకృతులలో ఉన్నాయి. కొన్ని పూర్తిగా రేఖాగణితనమూనాలలో ఉన్నాయి. ఇవి యోధుల చేతిలోని డాలును సూచించే సంక్షిప్త రూపాలని స్లీమన్ అనుకున్నాడు. కానీ మరణానంతర జీవితంలో వెంట ఉండే  సామగ్రిని సూచించే ప్రతీకలు కావచ్చు.

స్వర్ణముద్రలతోపాటు పెద్ద సంఖ్యలో స్వర్ణఫలకాలు ఉన్నాయి. వీటిలో అంగుళం మించి వెడల్పు ఉన్న ఫలకాలు చాలా తక్కువ. పర్షియాలో జరిపిన తవ్వకాలలో దొరికిన సైరస్, గ్జెరెక్సెస్ ల కాలం నాటి సంక్షిప్త స్వర్ణ ఫలకాలకు ఇవి భిన్నంగా ఉన్నాయి.  కళాకారుడు బంగారు రేకులను తీసుకుని సింహాలు, రాబందులు, చేపలు, జింకలు, గద్దలు, హంసలుగా మలిచాడు. వాటిలో జీవం ఉట్టిపడుతోంది. ఇవి బహుశా మృతుల దుస్తులకు కుట్టిన అలంకారాలు అయుంటాయి.

మూడో సమాధిలో మూడు అస్థిపంజరాలు కనిపించాయి. ఎముకలు, దంతాల పరిమాణాన్ని బట్టి అవి స్త్రీలకు చెందినవని స్లీమన్ అనుకున్నాడు. కానీ కవచాలు ధరించిన రాజు, ఇద్దరు రాకుమారులకు చెందినవి కావచ్చు. ఎముకల మధ్య ఒక బాకు, బంగారు తాపడంతో వెండితో చేసిన రెండు రాజదండాలు ఉన్నాయి.

మూడో సమాధి తెరచుకోవడంతో, మిగిలిన ఆగొరా మొత్తంలో తవ్వకాలకు స్లీమన్ సిద్ధమయ్యాడు. ఎక్కడనుంచి ప్రారంభించాలో మొదట అర్థం కాలేదు. అంతలో, ఆగొరాలోని మిగిలిన చోట్లకు భిన్నంగా మూడో సమాధికి పశ్చిమదిశలో మట్టి నల్లగా ఉన్నసంగతిని అతను గమనించాడు. అక్కడ 15 అడుగుల లోతున తవ్వించాడు. కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. మరో 9 అడుగుల  లోతున తవ్వేసరికి నాలుగు అడుగుల ఎత్తైన ఒక గుండ్రని వేదిక లాంటిది కనిపించింది. అది నూతి వరలా తెరచుకుని ఉంది.  మృతవీరులను సమాధి చేసి, వారి గౌరవార్థం దానిని నిర్మించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. బహుశా  మృతవీరులను ఉద్దేశించి అందులోకి కానుకలు జారవిడిచి ఉంటారని కూడా ఊహించాడు. సుమేరియాకు చెందిన రాచసమాధుల దగ్గర కూడా ఇలాగే మట్టి గొట్టాలు లేదా బిలాల లాంటివి కనిపించాయి. వాటిలోంచి మృతులకు బలులు, కానుకలు అర్పించేవారు. అయితే, స్లీమన్ కాలానికి అక్కడ తవ్వకాలు జరగలేదు. కనుక స్లీమన్ సొంత ఊహ మీదే ఆధారపడ్డాడు. ఆ ఊహే నిజమన్న నిర్ధారణకు ఆ తర్వాతి నిపుణులు కూడా వచ్చారు.

ఆ గుండ్రని నిర్మాణం అడుగున మరో మూడు అడుగులు తవ్వించాడు. స్వర్ణనిక్షేపాలతో నిండిన మరో సమాధి కనిపించింది. బంగారమూ, నగలూ కప్పిన మరో అయిదు కళేబరాలు కనిపించాయి. వాటిలో మూడు బంగారు ముసుగులు(ముఖాచ్ఛాదనలు) ధరించి ఉన్నాయి.  నాలుగవ కళేబరం శిరసు దగ్గర వంగిన మరో బంగారు ముసుగు కనిపించింది. అది సింహశిరస్సు ఆకారంలో ఉంది. అది శిరస్త్రాణం కావచ్చని స్లీమన్ అనుకున్నాడు.

ఈ నాలుగు ముసుగుల్లోనూ ఒకటి, మనిషి కవళికలను గుర్తించలేనంతగా శిథిలమైంది. కొన్ని నిమిషాలపాటు దానిని తదేకంగా చూస్తూ;  ఎత్తైన నుదురు, పొడవాటి గ్రీకు నాసిక, పలచని పెదవులతో చిన్న నోరు ఉన్న ఒక యువకుడి ముఖాన్ని అందులో పోల్చుకోడానికి  స్లీమన్ ప్రయత్నించాడు. ఈ ముసుగుకు స్పష్టమైన రూపురేఖలు లేకపోయినా, రెండు ముసుగులు మాత్రం ఆ నాలుగవ సమాధి వైభవానికి అద్దం పడుతున్నాయి. వాటిలోంచి ఓ అధికారమూ, ఆధిపత్యంతో పాటు దారుణమైన అందం తొంగి చూస్తోంది. వాటిపై మృత్యుచ్చాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. భయానకమైన కవళికలే తప్ప ప్రశాంతత కనిపించడం లేదు. ఈజిప్టు ఫారోల శవపేటికలపై ఉన్న ముసుగులకు ఇవి భిన్నంగా ఉన్నాయి. దారువుపై చిత్రించిన ఈజిప్టు ఫారోల ముసుగులలో పవిత్రత, ప్రశాంతత ఉట్టిపడుతూ ఉంటాయి. మైసీనియా ముసుగుల సరళి వెనుక మరేదో ప్రయోజనాన్ని ఉద్దేశించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. కళాకారుడు వాటిని ఆ వ్యక్తులు జీవించి ఉన్నప్పటి ముఖాలుగా తయారు చేయలేదు. వాటిపై మృత్యుచ్చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వేర్వేరు వ్యక్తులకు చెందిన  చిత్తరువులు కావచ్చునని కూడా స్లీమన్ అనుకున్నాడు. మృత్యుచ్చాయలు కనిపిస్తున్నా; నిస్సందేహంగా ప్రతి మూసుగూ వేర్వేరు వ్యక్తుల ముఖాన్నే సూచిస్తోందనీ, అలా కాని పక్షంలో అన్ని ముసుగులూ ఒకే మూసలో ఉండేవనీ రాసుకున్నాడు.

అవి వేర్వేరు వ్యక్తుల చిత్తరువులనే అనుకున్నప్పటికీ, జీవించి ఉన్నప్పుడు వారిని గుర్తుపట్టడానికి వీలైన దాదాపు అన్ని కవళికలూ చెరిగిపోయేంతగా కళాకారుడు వాటిని సరళీకరించి దాదాపు అమూర్తస్థాయికి కుదించాడు. ఒక ముసుగుపై కళ్ళు గోళాల్లానూ, ముఖంలోంచి పొడుచుకు వచ్చేలానూ ఉండి మృత్యువు రూపుగట్టే శూన్యతను సంకేతిస్తున్నాయి. ఇంకో ముసుగుపై నుదురు ఎత్తుగా ఉంది.  పెదవులు బిగుసుకుని అతుక్కునిపోయినట్టు ఉండి మరణబాధను సూచిస్తున్నాయి. పెరూలో కనిపించిన అచ్చం ఇలాంటి బంగారు ముఖాచ్ఛాదనల్లానే ఇవి కూడా చనిపోయిన ఆయా వ్యక్తుల చిత్తరవులను మించి, మృత్యుచిత్రాలులా కనిపిస్తున్నాయి.  వాటిలో ఒక అభౌతికమైన అందం ప్రకాశిస్తోంది. మరణించిన కొన్ని గంటల తర్వాత రాజులు, రాకుమారుల ముఖాలు ఎలా ఉన్నాయో అలాగే మలచడానికి కళాకారుడు ప్రయత్నించాడు తప్ప; ఎక్కువ వివరాలు చూపాలని అనుకోలేదు. అన్ని ముఖాలూ దాదాపు దేవతాముఖాలను తలపిస్తున్నాయి. మరణించిన పాలకులలో దివ్యాంశను సూచిస్తూ, తాము జీవించి ఉండగా చలాయించిన దివ్యాధికారాన్నే; మరణించిన తర్వాత కూడా వెంట నిలుపుకున్నారని చెప్పడం కళాకారుడి ఉద్దేశంలా కనిపిస్తుంది.

ఈ ముసుగులు వీక్షకులను భయసంభ్రమాలకు గురిచేస్తాయి. పాశ్చాత్య చరిత్ర పొడవునా చిత్రకారులు అనేకులు మృత్యువు రూపురేఖలు పట్టుకుని చిత్రించడానికి  ప్రయత్నించారు. కానీ ఈ అజ్ఞాత మైసీనియా చిత్రకారులంతగా సఫలులైనవాళ్లు చాలా అరుదు. మన నాగరికత తొలి నాళ్లకు చెందిన ఈ ముసుగు చిత్రాలు  మృత్యువును ఎంతో నిర్భయంగానూ, శక్తిమంతంగానూ, సరళంగానూ చిత్రించిన తీరు అసాధారణమనిపిస్తుంది.

అయితే, ఈ ముసుగుల వాస్తవిక ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలియదు. హోమర్ కానీ, మరో గ్రీకు పండితుడు కానీ ఇలాంటి మృత్యు ముఖాచ్ఛాదనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వాటిని మృతుల ముఖాలకు చుట్టి, వాటి సూత్రాలను చెవులకు చేసిన రంధ్రాలలో దూర్చి కట్టారు. దురదృష్టవశాత్తూ, ఆ అయిదుగురు మృతుల కపాలాలూ, భద్రపరచడానికి వీలులేనంతగా శిథిలమయ్యాయి. అవి బయటపడినప్పుడు వాస్తవంగా ఏ భంగిమలో ఉన్నాయో తెలియదు. బంగారు ముసుగులూ; కళేబరాల దగ్గర చెల్లా చెదరుగా పడున్న స్వర్ణాభరణాలూ మన కళ్ళముందు కనిపిస్తున్నాయి కానీ; ఆ రాతి సమాధుల్లో మృతదేహాలను ఎలా ఉంచేవారో, ఎలాంటి తంతు జరిపేవారో- ఆ మొత్తం సన్నివేశాన్ని ఇప్పుడు ఊహించుకోగలిగినంతగా మనకు ప్రాచీన గ్రీసు గురించిన పరిజ్ఞానం లేదు.

చదునుగానూ, విరిగీ ఉన్న సింహపు శిరస్సును మొదటిసారి చూసినప్పుడు శిరస్త్రాణం కాబోలని స్లీమన్ అనుకున్నాడు.  అందులో ఉండాల్సిన చిన్న చిన్న ముక్కలు మాయమయ్యాయనిపించింది. దానిని మరోసారి చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించాడు.  అందులో సింహపు కళ్ళను, చెవులను, ముట్టెను పోల్చుకుంటూ, అది కచ్చితంగా ముఖం మీద ధరించే ముసుగు అయుంటుందనుకున్నాడు. అయితే, అనంతరకాలంలో, ముట్టె నుదుటిమీద ఆనేలా రాజులు సింహశిరస్సును శిరస్త్రాణాలుగా ధరించడం కనిపిస్తుంది.  అలెగ్జాండర్ నాణేల మీద అలాంటి శిరస్త్రాణమే ఉంటుంది. కనుక స్లీమన్ మొదట అనుకున్నదే నిజం కావచ్చు.

నాలుగవ సమాధిలో కనిపించిన స్వర్ణసంపద స్లీమన్ ను సైతం విచలితుణ్ణి చేసింది. బంగారు ముసుగులు అందులో స్వల్పభాగం మాత్రమే. రెండు కళేబరాల మీద స్వర్ణ వక్షస్త్రాణాలు(breast plates)ఉన్నాయి. ఇంకో కళేబరం మీద చంచలించే ఆకులున్న కిరీటం ఉంది. పదకొండు గుండ్రని భారీ స్వర్ణపాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకదాని చేతులపై రెండు పావురాలు ఎంతో సున్నితంగా చెక్కి ఉన్నాయి. ఆ పాత్ర అచ్చంగా ఇలియడ్ లో వర్ణించిన నెస్తార్ కు చెందిన మద్యపాత్రలా ఉంది [నెస్తార్: మైసీనియాలోని ఒక పట్టణమైన పీలోస్ ను పాలించిన రాజనీతిజ్ఞుడైన రాజు. ఇలియడ్ ప్రకారం, ట్రోజన్ యుద్ధంలో గ్రీకుల పక్షాన పోరాడాడు. మహాభారతంలోని భీష్ముడిలా మూడు తరాలను చూసిన వీరుడు, మంచి సలహాదారు] “బంగారు సూచికలు (పిన్నులు) పొదిగి, రెండు పావురాలతో అలంకృతమైన” పాత్రగా దానిని ఇలియడ్ వర్ణించింది. ఆపైన బంగారు వడ్డాణాలు, జడకట్లు(రిబ్బన్లు), మోకాలి దగ్గర కట్టుకునే ఒక బంగారు పట్టీ, ఒక బంగారు కవచం, బంగారు పతకాలు, పిన్నులు; ఒక అంగుళం కంటే చిన్నవిగా ఉన్న రెండు తలల బంగారు గొడ్డళ్ళు, బంగారు రేకులు ఆచ్ఛాదించిన 12 భారీ బొత్తాలు, నాణేలను తలపిస్తున్న 400 కు పైగా స్వర్ణముద్రలు,  150 బంగారు బిళ్ళలు, ఒక బంగారు చేప, కత్తి పిడులుగా  మలచి ఉపయోగించినట్టు అనిపిస్తున్న 10 బంగారు రేకులు, రాగి కాగులు, కంచుతో చేసిన మొనదేలిన కత్తులు, బంగారు కొమ్ములతో ఉన్న ఒక వెండి గోవు శిరస్సు కనిపించాయి. ఈ సమాధిలో కనిపించిన అనేక వస్తువుల్లానే గోశిరస్సు కూడా పవిత్రతను చాటే తెగ(tribe)చిహ్నం అయుంటుంది. కళ్ళకు మిరుమిట్లు గొలిపే ఈ స్వర్ణరాశి మధ్యనే ఆశ్చర్యకరంగా లెక్కలేనన్ని ఆల్చిప్పలు కనిపించాయి. వీటిలో కొన్నింటిని అసలు తెరవనేలేదు.

తను ట్రాయ్ లో కనుగొన్న నిక్షేపాల కన్నా ఎక్కువ నిక్షేపాలు ఈ ఒక్క నాలుగవ సమాధిలోనే స్లీమన్ కు కనిపించాయి. ఈసారి దానికి నేరుగా ఉత్తరం వైపున తవ్వకాలు ప్రారంభించాడు. క్రమంగా అయిదవదీ, చివరిదీ అయిన సమాధి బయటపడింది. అందులో దోపిడీ జరిగిన ఆనవాళ్ళు కనిపించాయి. ఒక్క కళేబరం మాత్రమే ఉంది. అది కూడా పూర్తిగా శిథిలమై పొడి పొడిగా రాలిపోయేలా ఉంది. పక్కనే ఒక స్వర్ణకిరీటం, ఒక బంగారు పానపాత్ర, ఒక ఆకుపచ్చని కలశం, స్వల్ప సంఖ్యలో మట్టి బొమ్మల శకలాలు కనిపించాయి.

ఇంతకుముందు మొదటి సమాధి దగ్గర తవ్వకాలు ప్రారంభించినప్పుడు అది బురదతో నిండిపోవడం వల్ల పని ఆగిపోయింది. కొన్ని వారాలపాటు బాగా ఎండ కాయడంతో ఆ బురద ఎండిపోయి తిరిగి అక్కడ పని ప్రారంభించే అవకాశం కలిగింది. మొదట్లో అది ఖాళీగా ఉన్నట్టు అతనికి అనిపించింది. కానీ మరింత లోతుగా తవ్వేసరికి మూడు కళేబరాలు కనిపించాయి. వాటి పక్కనే కొద్దిపాటి నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో రెండు బంగారు ముసుగులున్నాయి.  ఒకదాని కపాలానికి ఇప్పటికీ కొంచెం చర్మం అతుక్కుని ఉంది. పైన పడిన శిథిలాల బరువువల్ల ఆ కళేబరం అణిగి సాపుగా మారిపోయింది. ముక్కు లేదు. అయినా ముఖంలో గుర్తించగలిగిన కవళికలు కనిపిస్తున్నాయి. స్లీమన్ దానిని చూస్తూనే ఉత్తేజం పట్టలేకపోయాడు. ఆ ముఖంలో అతనికి అగమెమ్నన్ పోలికలు కనిపించాయి!

అది గుండ్రంగా ఉండి, ముప్పై అయిదేళ్ళ పురుషుడి ముఖంలా కనిపించింది. అన్ని దంతాలూ పటిష్టంగా ఉన్నాయి. ఒక పెద్ద స్వర్ణ వక్షస్త్రాణాన్ని ధరించి ఉన్నాడు. అతని నుదుటి మీదా, వక్షస్థలం మీదా, తొడల మీదా బంగారు ఆకులు పరచి ఉన్నాయి. అతని ముఖానికి పక్కనే పడున్న బంగారు ముసుగు సాపుగా అయిపోయింది. స్లీమన్ దానిని చేతుల్లోకి తీసుకుని పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఎథెన్స్ లోని మంత్రికి తంతి పంపించాడు. ఈ చివరి సమాధిలో కనుగొన్న మూడు కళేబరాలలో ఒకదాని ముఖంలో తను ఎంతో కాలంగా ఊహించుకుంటున్న అగమెమ్నన్ పోలికలు కనిపిస్తున్నాయనీ, ఆ ముఖ కవళికలను భద్రపరచడానికి చిత్రకారుని పంపవలసిందిగా నాప్లియోకు తంతి పంపాననీ అందులో తెలియజేశాడు.

ఆ పురాతన వీరుని కళేబరాన్నీ, దాదాపు భద్రస్థితిలో ఉన్న అతని ముఖాన్నీ చూడడానికి ఆర్గోస్ మైదాన ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దాని బొమ్మ గీయడానికి నాప్లియోనుంచి ఒక చిత్రకారుని రప్పించారు. శాస్త్రీయపద్ధతుల్లో భద్రపరిచే లోపల అది ఎక్కడ పొడి పొడి అయిపోతుందో నని భయపడుతూ  స్లీమన్ రెండురోజులపాటు ఆ పనులను పర్యవేక్షించాడు. ఆర్గోస్ నుంచి ఒక నిపుణుడు వచ్చి దాని మీద ఒక ద్రావణాన్ని పోసాడు. దాంతో అది గట్టిపడిన వెంటనే దానిని విజయవంతంగా ఎథెన్స్ కు తరలించారు.

నాలుగవ సమాధిలో దొరికిన విస్తారమైన స్వర్ణరాశులతో పోల్చితే,  దోపిడీ ఆనవాళ్ళు కనిపిస్తున్న మొదటి సమాధిలో దొరికినవి నామమాత్రమే కానీ; వాటిలో కూడా స్వర్ణపాత్రలు, స్వర్ణ వక్షస్త్రాణాలు, 12 బంగారు పలకలు ఉన్నాయి. ఆ పలకల్లో కొన్నింటిపై జింకలను సింహాలు వేటాడుతున్న చిత్రాలు ఉన్నాయి. ఆపైన బంగారు పిడులు ఉన్న 80 కంచు ఖడ్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా పదునుగా ఉన్నాయి. ఇంకా, ఒక కరవాలం తాలూకు బంగారు కుచ్చు, ఒక వీరుడి కళేబరం మీద పొడవాటి బంగారు పట్టీలు ఉన్నాయి. అన్నింటిలోనూ విశేషంగా చెప్పదగినది ఇక్కడ దొరికిన బంగారు ముసుగు. అది మిగిలిన ముసుగులన్నిటికన్నా చాలా అందంగా ఉంది.

మైసీనియాలో స్లీమన్ కనుగొన్నవాటిలో ఈ ముసుగే చివరిది. మిగిలిన వాటిలో లేని ఒక పరిపూర్ణత దీనిలో ఉంది. మిగిలినవి మృత్యువును శక్తిమంతంగా సూచిస్తున్నాయి కానీ, వాటిలో మర్త్యత్వం ఉంది. కానీ ఈ ముసుగులో శక్తిమంతతే కాక; ఒక పవిత్రత, నైర్మల్యం, ఉదాత్తత ఉట్టిపడుతున్నాయి. ఇతర ముసుగులు ఆయా వీరుల అంతిమక్షణాలలోని మృత్యుచ్ఛాయలను సూచిస్తూ ఉంటే, ఈ ముసుగు వాటికి భిన్నంగా ఒక వీరుడు దేవుడిగా మారిన క్షణాలను సూచిస్తోంది. అందులో మర్త్యత్వపు ఆనవాళ్ళు కాకుండా, కేవలం ప్రసన్నత తొంగి చూస్తోంది. విశాలమైన నేత్రాలు మూసుకుని ఉన్నాయి. కనురెప్పలు స్పష్టంగా గుర్తించబడి ఉన్నాయి. పలచని పెదవులు ఒక మార్మికమైన చిరునవ్వును వెలార్చుతూ మూసుకుని ఉన్నాయి. గెడ్డం ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కనుబొమలు దట్టంగా చెక్కి ఉన్నాయి. మొత్తంగా ఆ కనుబొమలు, మీసాలు, పెదవులపై ఆ చిరునవ్వు ముఖానికి ఒక విచిత్రమైన లోతును సంతరిస్తున్నాయి. క్రీస్ట్ ఆఫ్ డఫ్నె[అలబామా, అమెరికాలో ఉన్న ప్రసిద్ధ కేథలిక్ చర్చి], చేఫాలు[ఇటలీలో, సిసిలీ ఉత్తరతీరంలో, పలేమో రాష్ట్రంలో ఉన్న నగరం], పలేమో [ఇటలీ దీవి అయిన సిసిలీ రాజధాని. 12వ శతాబ్దికి చెందిన ఇక్కడి కెథెడ్రల్ ప్రసిద్ధమైనది. ఇక్కడ రాచ సమాధులు ఉన్నాయి]వంటి అద్భుతనిర్మాణాలతో పోల్చదగిన ఆ ముఖం, ప్రాచీన చిత్రకళ సాధించిన ఉన్నతికి అద్దంపడుతోంది.

ట్రాయ్ లో దొరికిన స్వర్ణహారకిరీటాలు, మైసీనియాలో దొరికిన స్వర్ణకిరీటాలు, విస్తారమైన మిగతా స్వర్ణరాశులు అప్పటి జనం ఇంకా మోటుగానూ, అనాగరికదశలోనూ ఉన్నట్టు సూచిస్తున్నాయి. సైనికులను చిత్రించిన కలశం నాటి యోధులు యుద్ధానికి ఎలా వెళ్ళేవారో చెబుతోంది. సమాధులలో దొరికిన బంగారు నగలు ఉత్సవ సందర్భాలలో వాళ్ళు ఎలా అలంకరించుకునేవారో వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్క ముఖాచ్ఛాదన మాత్రం దేవతలపట్ల వారు ఎంత ప్రగాఢమైన భక్తిగౌరవాలను చాటేవారో సూచిస్తోంది.

మైసీనియాలో స్లీమన్ తవ్వకాలు ముగిశాయి.

(సశేషం)

 

 

 

 

 

తెంగ్లిష్ భూతం.. వేపమండల వైద్యం…

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

“భాషంటే ఓ అంటురోగం. అంతకు మించేం లే..”  ధాటిగా చెప్పేడు మా చెడ్డీల్నాటి నేస్తం సీనుగోడు.

“సగంనిజాల్ని గెట్టిగా చెప్పీసీవాళ్ళలో ముందువరస నీదే.  భాషంటే ఇంకా చాలావుందని చెప్పిన శాస్తుర్లంతా మొత్తుకోరూ? దానికెంత పెద్ద శాస్త్రముందిరా!” కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాను వాడి పళ్ళెంలో మరో దిబ్బరొట్టి ముక్క వేస్తూ.

“సుబ్బలచ్చిమి కవుర్లు సెప్పకే… అదంతే..” అని అల్లంపచ్చడీ రొట్టిముక్కపెచ్చుతో పాటు మాటల్ని కూడా నొక్కి నవిలీసేడు వాడు.

“నిరూపించరా అప్పారావ్..” అని నేనూ తగ్గకుండా నిలేశా.

“ఇవాళ దిబ్బరొట్టి వేస్తున్నాతల్లీ”. “ఇంకో రొట్టిముక్క వేసుకోరా” అని  వెన్నపూసిన దిబ్బరొట్టి జపం మీ అమ్మ వందలసార్లు చేసేకేకదా, దీనిపేరు ‘దిబ్బరొట్టి’ అని మన బుర్రల్లో నాటుకుంది! ఇంత కష్టపడి రెండు మూడు తరాలుగా మాటలు నాటి పెంచుతూ ఉంటేనే కదా భాష తేనెలో ముంచిన రొట్టెలా రుచులూరేది!”

“అంటురోగం అని చెప్తూ భాష నాటుడు కార్యక్రమంలోకి పోయావ్.  తిండెక్కువైనప్పుడల్లా పీతలా నడిచే నీ మెదడు లక్షణం ఏ మాత్రం మారలేదురా.” అని పొగిడేను.

“తిండెక్కువ పెట్టి గెరిల్లాయుద్ధం చేసే నీ బుద్ధీ అలాగే ఉందిగా”.. వాడూ పొగిడేడు నన్ను.

“బాసింపట్టు వేసుకున్నావుగా దిగరా ఇంక వాదంలోకి!”

“సుబ్బరంగా ‘మఠఁవేసుకుని’ కూచున్నానే.  విజయవాడెళ్ళి మన ‘మఠా’న్ని ‘బాసింపట్టు’ చేసీసేవు. ఇదీ అంటురోగమంటే. ఒక్కటే దెబ్బకి నిరూపించి పారేసినానా నేదా సుబ్బలచ్చిమీ”

“మఠం వెయ్యడాన్ని ఒక్కో వూళ్ళో ఒక్కోలా అంటార్లేరా బంకుశీనూ. నాలాంటి పండితుల్ని విడిచిపెట్టి సాధారణీకరించవోయ్.”

“రెండూర్లు తిరిగి నాలుగు ముక్కలు ముక్కునట్టుకున్న నీలాటోల్లంతా శాత్రం మాటాడీసీవోలే.  గట్టిగా పదివాక్యాలు గుంటూరుభాషలో మాట్లాడు నీ సంగతి తేలుస్తా.”

“అల్లంపచ్చడి ఘాటు తలకెక్కేక నీమాట నువ్వే వినవురా మహేశ్ బాబూ. నామాటలేం వింటావు?”

“ఇదీ నీ గెరిల్లా యుద్ధతంత్రం. కాలికేస్తే మెడకీ మెడకేస్తే కాలికీ.. నీ మొగుడు ఎప్పుడూ లాగిపెట్టి తన్నలే?” ఉక్రోషం వొచ్చీసింది శీనయ్యకి.

“నువ్వు తన్నగలిగేవనా అతను తన్నడానికి?”  ప్రకాశ్ రాజ్ లాంటి శీనుగాడి ఆకారాన్ని చూస్తూ కొంచెం భయంగా  అన్నాను.

“నీతో ఇలా లాభం లేదు.  నేను పూర్తిగా చెప్పేకే నీకు మాటాడ్డానికి అనుమతి ఉంది.”  అంటూ నా మాట చొరనివ్వకుండా కన్హయ్యా కుమార్ లా రంగఁవెక్కి కదం తొక్కేడు మావాడు.  వాడి ‘ఆగ్న’ దాటలేక బ్రాకెట్లలో నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాన్నేను. దాని విధానమిది …

“దిబ్బరొట్టె పేరుతో తరాలుగా మన తలకెక్కిన ఈ అద్భుత పదార్థాన్ని మనచేత ఎవరైనా ‘పాన్ కేక్’ అనిపిస్తే అది   అంతర్జాతీయ కుట్ర. రసాయనాయుధాలకంటే బలమైనది అన్యభాషాప్రసారం.  ఇది గమనించకుండా అన్యమత ప్రచారం అంటూ ఊగిపోతున్న ఆంధ్రదేశపు హిందూవాదులు తెంగ్లిష్ ప్రచారాన్ని ఎందుకు ఖండించరని అడుగుతున్నా.  అడుగుతున్నా నేనడుగుతున్నా.. మొబైల్ ఫోన్ని “చరవాణి” అని వాడుకలోకి తెస్తూ తరవాణిని   గుర్తుకు తెప్పిస్తున్న పత్రికాధిపతిని! (అబ్బ. పొద్దున్నే వాము కలిపిన తరవాణిలో ఆవకాయో మిరపకాయో కొరుక్కుని బొజ్జనిండా తిని, బళ్ళో మత్తుగా ఊగిన రోజుల్ని ఏమన్నా తిరగదోడేవా ప్రియనేస్తం!)  ఏమనీ? తెలుగు వార్తాపత్రికలూ టీవీచానెళ్ళ మధ్య నలుగుతున్న తెలుగోళ్ళని ఒక్కసారంటే ఒక్కసారి… రక్తాశ్రువులొలుకుతున్న తెలుగుతల్లి కళ్ళలోంచీ  పరిశీలించమని… ఓపక్క పత్రికల్లో తెలుగుని ఉద్ధరిస్తూ  మరోపక్క కొత్త కొత్త దూరదర్శన పాయల్ని (టీవీ చానెల్స్)  మూర్ఖానందపు పెట్టె (టీవీ) లోకి పంపిస్తూ వాటిద్వారా తెలుగుభాషా కల్పవృక్షాన్ని నాశనం చెయ్యటం కోసం పరదేశీ వేరుపురుగుల్నీ, కాండంతొలిచే పురుగుల్నీ అగ్గితెలుగునీ, అదే.. అగ్గితెగుల్నీ వ్యాపింపజేస్తున్న తీరుని ప్రశ్నిస్తున్నా. దీనివల్ల జనం, చదూతున్న పత్రికలభాషనీ చూస్తున్న టీవీ తెంగ్లిష్ నీ  వింటున్న ఎఫ్ఫెమ్ రగడనీ (బాగా చెప్పేవ్. తెంగ్లిష్ నగిషీల్లో ఆర్జేల పనితనం తనిష్క్ ని మించినదే)  కలిపి గిలకొట్టి,  కొత్తరకం కంగారుభాష మాటాడుకుంటూ గెంతుకుంటూ పోతున్నారని నేను సోదాహరణంగా వివరించగలను మీడియా మహారాజులారా!  చిత్తశుద్ధి లేని మీ శివపూజల్ని నేన్నిరసిస్తున్నా”. (ఉపన్యాసం బాగుంది గానీ ‘లక్స్ సినిమాతారల సౌందర్య సబ్బు’ నాటి రోజుల్నుండీ ఈనాటిదాకా టీవీ యాడ్ లు కూడా తెలుగుని మరీ దుంపనాశనం చేసిపెడుతున్నాయిరా నాయినా).

ఊపిరి పీల్చుకోడానికి ఆగేడు శీనుగాడు.

“ఈ మధ్య మనకీ కొత్త కొత్త వంటల చానెళ్ళు వొచ్చీసేయి పిల్లా చూసేవా నువ్వు?  నీలాటి బక్కప్రాణికి అన్నిరకాల  వంటల పేర్లు వింటేనే నీరసం వొచ్చిస్తుంది. మీ అమ్మ వంటలు మర్చిపోతావ్.  మ్మ్.. అలా కాదులే.  మీ అమ్మా అమ్మమ్మల వంటలని కూడా ఎలా చెయ్యాలో వీడియో తీసి ఆ చానెల్ కి పంపిస్తే కాస్త పేరూ డబ్బూ కూడా వస్తుందనుకుంటా చూసుకో.  ఒకటి మర్చిపోకు సుమా.  ఆ వంటెలా చెయ్యాలో పూర్తిగా తెలుగులోనే చెప్పాలని వాళ్లకి షరతు పెట్టు. (‘షరతు’ అనే మాట ఎక్కణ్ణుంచి వచ్చిందో తెల్సుకోవా శీనూ)  ఆ చానెల్ చూసి తీరాల్లే. చక్కగా బొద్దుగా ఉండే అమ్మాయిలే అంతానూ.  (అంతా నీలాగే గుండ్రంగా ఉంటే ఎంతానందంరా నీకూ!)  అరె…  అలా అనుమానంగా చూసి శీలశంక చెయ్యకు. (అదేంట్రా మూలశంకలా?)  స్త్రీవాదమే మాటాడుతున్నాలే. సున్నాకొలత వొదిలి మనుషులంతా ఎవరి కొలతల్ని వారు ప్రేమించుకోవాలని నా ఆశయం. (అలా నీ పొట్ట చుట్టుకొలతని ప్రేమించుకుంటూ ఉండు. గుండెపోటొచ్చీగల్దు.)

ఇంతకీ నువ్వు మాటాడకుండా ఉంటే ఎటో వెళ్తున్నాన్నేను. (మీ మగాళ్ళంతా అంతేగా. దార్లో పెట్టడానికే మేమున్నాం.)  అసలు విషయం ఏమిటంటే అమ్మలూ.. చిన్న అనుకరణ చేసి చూపిస్తా చూడు ఓ కార్యక్రమాన్ని!” –  శీనులోని నటుడు ఆవలిస్తూ నిద్రలేచాడు.

***

పాలకోవా వ్యాపారి  శంకర్రావు గారి దగ్గరకు వంటల చానెల్ అమ్మాయి వచ్చింది.

అమ్మాయి :  “అసలు మీ పాలకోవాకున్న ఇంత టేస్ట్, ఇంత స్పెషాలిటీ ఏంటో అర్జంట్ గా తెల్సుకోవాలని వచ్చేసానండీ.”

శంకర్రావు :  “తప్పకుండా.. రండి… ఊక పొయ్యి మీదే కోవా వండుతామండి. ధాన్యం మిల్లు నుండి తీసుకొస్తామండి ఊక..  రైస్ మిల్లులో రైస్ సెపరేట్ అయ్యేక వొచ్చే పొట్టుని ఊక అంటారండి.

అమ్మాయి :  “జెనరేషన్ ఇంత ఫాస్ట్ గా వెల్తోంది కదా..  గాస్.. గాస్ స్టవ్స్, ఇంకా అప్డేటెడ్ చాలా వచ్చాయి కదా. మీరెందుకింకా ‘ఊక’ వాడ్తున్నారు? (ఊక అనే మాటనే అంత బెరుగ్గా అంటావెందుకు తెలుగుపిల్లా?)  మీ సీక్రెట్స్ లో వన్ అఫ్ ది సీక్రెట్స్ ఊకపొయ్యి అన్నమాట…  సరే. కోవా రెడీ అవడానికి ఎంత టైం పడుతుందండీ?”

శంకర్రావు:  “పదిలీటర్లు పాలు కోవాగా తయారవటానికి గంట, గంటన్నర పడుతుందండి”.

అమ్మాయి :  “ఓకే ఓకే. ఆ పాలు టెన్ లీటర్సాండీ ?

శంకర్రావు:  “అవి ఫార్టీ లీటర్స్అండీ. ఇవి టెన్ లీటర్స్ అండీ.”  (ఒప్పేసుకున్నా శీనూ. భాష వొట్టి అంటురోగమే. పాపం ఆయనకీ అంటించేసిందీ పిల్ల. అసలే అన్యభాషా వ్యాధినిరోధకశక్తి లేనివాళ్ళం).  … కోవాకి పాలు బాగా మరిగి చిక్కబడాలి”.

అమ్మాయి :  “అంటే బాగా రెడ్డిష్ రావాలాండీ?”

శంకర్రావు:  “ఔనండీ రెడ్డిష్ రావాలి”. (ఇదేంబాధ శంకర్రావుగారూ మీకు? మధ్యలో మా కళ్ళు రెడ్డిష్..  ఛ ఛా .. ఎర్రబడిపోతున్నాయ్ ఆర్. నారాయణమూర్తిలా).

అమ్మాయి :  “పెద్దలు నడిచిన ‘మాట’లో (బాట అనే మాట తెలీదీ పిల్లకి) మనమూ నడిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పొందుతామనటంలో మీరు ట్రూ ఇన్స్పిరేషనండీ. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండీ?

శంకర్రావు :  పందొమ్మిది వందల యాభైలో నాన్నగారు స్టార్ట్ చేశారండీ.. (మీకూ ‘స్టార్ట్’ అయిందండీ అంటువ్యాధి.)

అమ్మాయి :  శివరావు గారంటే మీ ఫాదర్ గారాండీ? మీది పుట్టుకతోనే ‘సంపున్న’ కుటుంబమా?” (నీ సంపుడేంది తల్లీ ?)

***

“ఇప్పుడేమంటావ్? ఈ అమ్మాయిని వేషం మార్చి శంకర్రావుగారింట్లో రెండ్రోజులుంచి వాళ్ళంతా మాటాడుకునే భాషలో ముంచి తీస్తే తప్ప ఈ పిల్ల తన వొచ్చీరాని వింగిలీష్ని ఆయనకీ అంటించడం ఆపదు.  నువ్వూ నేనూ, తెలుగులో కథలూ కబుర్లూ రాసే అల్పసంఖ్యాక వర్గాలవాళ్ళూ, తెలుగు భాషాశాస్త్రవేత్తలూ (ఈ జాతి ఇంకా మిగిలుందంటావా?)  పిల్లలకి బడుల్లో తెలుగు నేర్పించే అభాగ్యులూ మనభాష గురించి ఆలోచిస్తే చాలదు తల్లీ.  టీవీకి తెంగ్లిష్ చీడ వదిలిన్నాడే  తెలుగుజాతి మొత్తం బాగుపడేది. అదెలగంటావా? మొదటగా తెలుగు టీవీ చానెల్ యజమానులందర్నీ కూచోబెట్టి,  దేశభక్తికంటే గెట్టిగా తెలుగుభక్తిని ఒళ్లంతా నలుగుపిండిలా రుద్ది తలంటు పొయ్యాలి.  (తెంగ్లిష్ మదగజాన్ని అణచగలిగే అంకుశాలున్న అసలైన మావటీలెవరో బానే కనిపెట్టేవుగానీ వాళ్ళని లాక్కొచ్చి ఆ ఉద్యోగంలో పెట్టే శక్తి ఎవరికుందో చెప్పలేవు శీనూ నువ్వు.).  తెలుగుమాటల మధ్యలో అతిగా ఇంగ్లీష్ ముక్కలు వేస్తూ దీన్నో వ్యాధిలా అందరికీ అంటించడాన్ని దేశద్రోహనేరమంత..  అదేలే.. భాషాద్రోహనేరమంత  హీనంగా చూస్తూ వేళాకోళం చెయ్యాలి.  ఎవరైనా “సండే.. థర్టీయత్ నైట్.. టూ లాక్స్ తీస్కుని స్టార్ట్ అవుతున్నా”… అంటుంటే  “టీవీ, కంప్యూటర్, కామెరా లాంటివాటికి సరేగానీ  ‘ఆదివారం.. ముప్పయ్యో తేదీ రాత్రి… రెండులక్షలు తీస్కుని బయల్దేరుతున్నా’ అని చెప్పడానికి ఇంగ్లీషుముక్కలెందుకు బంగారూ?” అని నెత్తిమీద సోలడు నూనింకిపోయీలా కొట్టీయాలి. తెలుగుమాటలు అందిస్తూ అంటిస్తూ పోవాలి.  (ముక్యమంత్రిగోరే  తెంగ్లిష్ ని నాలికమీదున్న సరస్వతీదేవిలా మొక్కీసోట  ఇయన్నీ చేసీదెవులో చెప్పకుండా నీ గోలేందిరా?)  ఇంతకు ముందు ఇరుగు పొరుగుల్తో సుబ్బరంగా తెలుగులో మాటాడుకునే ఇల్లాళ్ళభాషని కూడా చెడగొట్టి తెంగ్లిష్ ని నాటుకుంటూపోతున్న టీవీ చానెళ్ళని ఏం చేసినా పాపం అంటదు.  తెలుగు మాటా పాటా మర్చిపోయి,  బుల్లితెరల మీద సినిమాపాటలు పాడి ఎగురుతూ,  టీవీ పీతబుర్రలు కనిపెట్టిన వెర్రాటలాడుతూ, ‘ఆరెంజ్ కలర్ టాప్ మీద జరీ వర్క్ చేసిన హాండ్స్ తో గ్రీన్ కలర్ బాటమ్, కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ చున్నీ ఉన్న డ్రెస్ నో, పింక్ కలర్ బాడీమీద రెడ్ కలర్ ప్రింట్స్ వేసిన రిచ్ సిల్క్ సారీనో బ్యూటిఫుల్ గిఫ్ట్స్ గా కొడుతూ’ కాలం దొర్లించేస్తున్నారు కొంతమంది ఇల్లాళ్ళు.

అసలూ,  తెలుగురాని వింతజీవాల్ని ఏంకర్స్ అనే పేరుతో మనమీదికి వొదుల్తున్న టీవీ చానెల్ యజమానులు ఇంగ్లీష్ ముక్కలతోనే జ్ఞానం వొచ్చీసిందనుకునే జడ్డితనాన్ని పక్కనపెట్టి,  ఓ చిన్నపని చెయ్యొచ్చుగా!  ఒక్క రెండునెల్లంటే రెండునెల్లు.. టీవీ వ్యాఖ్యాతలుగా ఉద్యోగమిచ్చి తీసుకున్న వాళ్ళనందర్నీ ఓచోట కూచోబెట్టి తెలుగులో శిక్షణ ఇప్పిస్తే వాళ్ళకున్న కోట్లు కరిగిపోతాయా? నడ్డివంచి తెలుగుని వడ్డిస్తే, ఇప్పుడు మాట్లాడుతున్న పిచ్చిభాష మళ్ళీ మాటాడే ధైర్యం చెయ్యగలరా ఈ వ్యాఖ్యాతలు?  చైనావాళ్ళంతటి వాళ్ళే మనవాళ్ళతో ‘మీ పేరేమిటి?’ అనడగటానికి ఎంతోకష్టపడి ఇంగ్లీష్ లో మర్యాదగా ‘వ్హాటార్యూ?’ అంటూ పాపం తప్పోతడకో ఏదోటి మాటాడేసి వ్యాపారవృద్ధి  చేసుకుంటూపోతుంటే,  ఉద్యోగం నిలబెట్టుకోవడంకోసం మనవాళ్ళు మనభాషని ఆపాటి నేర్చుకోలేరా?”

“ఒక కీలకం ఉంది సుబ్బూ.. ‘అన్యాయాలో, అక్రమాలో, హిందూమతపు జడలదెయ్యాలో, వర్గపోరాటాలో, ఆలో పొలో’మంటూ ఆయాసపడేవాళ్ళ  పూలు పుయ్యని ముళ్ళగులాబీపొదలాంటి భాషని టక్కున కత్తిరించి పడేసి సరికొత్త జాతీయాన్ని అందుకుని శైలీ ప్రకటన (స్టైల్ స్టేట్మెంట్ ని ఇలా తెలుగు చేశారా గురూగారూ ?) చేసీసేడు చూడూ.. ఆ కుర్రాడిలా దారి తియ్యాలి.  భావాల ఎత్తూ ఆదర్శాల లోతూ ఇవాళ ఎవరికీ అక్కర్లేదమ్మీ!  దేనిగురించైనా ప్రచారం ఎంత తెలివిగా చేసేవాఁ అన్నదే కిటుకు. తెంగ్లిష్ మీద విరుచుకుపడి, ‘చక్కగా తెలుగు మాట్లాడ్డమే, తెలుగుతో ప్రయోగాలు చెయ్యడమే నాగరికత’ అనుకునేంతగా తెలుగువారందరిలోనూ స్వాభిమానం గంతులు వేసేలా శైలీప్రకటన చెయ్యగల ధీరులు వొచ్చేవరకూ ఇంతే సంగతులు” రొప్పుకుంటూ ఆగింది బండి.

అవకాశం దొరికింది కదాని ముందుకి దూకి,

“ఓకే బాస్. ఏదో పెరిఫెరల్గా మాట్లాడుతూ, ఇంగ్లీష్ వైరస్ ఇంతగా గ్రో అవడానికీ మన రెసిస్టన్స్ లేమికీ గల కారణాలజోలికి వెళ్ళకుండానే ప్రాబ్లెమ్ ని మీరు డీప్ ఫ్రై చేసారనీ,  సాల్వ్ చేసే వర్క్ కి పూనుకున్నారనీ అర్థం అవుతోంది. ఏదెలావున్నా మీరు చెప్పినట్టు తెలుగువంటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చెయ్యడం ముఖ్యం.  మొదటిగా తెలుగులాంగ్వేజ్  మిల్క్ ని విలేజెస్ నుంచి ముందురోజు నైట్ కలెక్ట్ చేస్కుని, దాన్లోవున్న కొద్దిపాటి ఇంగ్లీష్ నలకల్ని ఫిల్టర్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీనికి భాషాభిమానం అనే సుగర్ ని ఏడ్ చేసి, పరభాషాద్వేషం అనే చిటికెడు ఇలాచీ పొడిని మిక్స్ చెయ్యాలి.  ఇది ఎక్కువేస్తే పాకం స్పాయిల్ ఔతుంది సుమా.. తరువాత  డయలెక్ట్ అనే ఊక స్టవ్ మీద నేటివిటీ అనే ఇత్తడి కడాయిపెట్టి ఈ మిక్స్ ని డైరెక్ట్ గా వేసి కంటిన్యువస్ గా ఇడియమ్ అనే తెడ్డుతో తిప్పితే ఒకటి రెండు డికేడ్స్ అయ్యాక చక్కటి తెలుగుకోవా స్మూద్ గా టేస్టీగా వస్తుంది. ఈ పని కలెక్టివ్ గా తెలంగాణా ఉద్యమం రోజుల్లో రోడ్లమీద చేసిన వంటలంత ఇంటెన్సివ్ గా చెయ్యాలి.  నీ ప్రభావంతో నేను కూడా ఈజీ సొల్యూషన్స్ చెప్పేస్తున్నా చూసేవా శీనూ!  పోనీ కుంభకర్ణుణ్ణి బుల్లి రాక్షసులు నీడిల్స్ తో పొడిచినట్టు ఆన్లైన్ పిటిషన్స్ పెట్టి మీడియాని పొడుద్దామా?  సరే.  అదలా వుంచి, మన తెలుగు పాలకోవాలోకి వచ్చేద్దాం. డిఫెరెంట్ రుచున్న ఈ స్పెషల్ తెలుగు డిష్ వెరైటీని కొత్త జెనరేషన్ పిల్లలు ఎంజాయ్ చెయ్యటం స్టార్ట్  చేసారంటే తెలుగుమమ్మీ శ్రమ ఫలించినట్టే.  ఎక్సెలెంట్ టేస్ట్ తో ఉన్నఈ కొత్త తెలుగుభాష కాన్సెప్ట్ సినిమాల్లోకి ‘వర్కౌట్’ ఔతుంది. తెలుగు ఫిక్షన్లోకి కూడా ఇంపోర్ట్ ఔతుంది”  అని  చెప్పుకుపోతూ అంతలో తెలివి తెచ్చుకుని,  “అయ్యో, ఏంటో శీనూ, ఒక్కరగంట ఏ తెలుగు టీవీచానెల్ చూసినా, వాటిలో మూడోతరం తెలుగు సినిమా హీరోలూ ముంబై హీరోయిన్ల ముచ్చట్లు విన్నా నాకిలాంటి మాటలే ఒచ్చిస్తున్నాయ్.  వీళ్ళ మధ్య ఝాన్సీ లాంటి మేలిమి బంగారు  వ్యాఖ్యాతలక్కూడా కిలుం పట్టిపోతోంది.” అని గింజుకున్నాను.

“ఇంగ్లీష్, తెలుగు అనే రెండు అందమైన భాషలు పెళ్ళాడి బుజ్జి తెంగ్లిష్ ని ఎప్పుడు పుట్టించేయో మనకి సరిగ్గా అర్థం కాకముందే అది వామనావతారంలా ఎదిగి మననెత్తిన కాలు పెట్టేసింది. ఈ బిడ్డకి ఊబవొళ్ళు వొచ్చేసిందని  అనుకునేవాళ్ళు తక్కువమంది. ఆ కాలు కిందే ఇంకెన్ని తరాల తెలుగువాళ్ళు బతుకుతారో తెలీటం లేదు. ఇప్పటికే సగం చచ్చిన తెలుగు ఇంకే అవతారం ఎత్తుతుందో అంతకన్నా తెలీదు.  ఏంచేస్తాం? ఇప్పుడు నెమ్మదిగా మన చిన్నప్పటి తెలుగుపాఠానికి రా.  చెంపకు చెయ్యి పరంబగునపుడు కంటికి నీరాదేశంబగును. తెంగ్లిష్ నీకు ఎక్కినపుడల్లా చిన్నప్పటి ఈ సంధిసూత్రం గుర్తు తెచ్చుకుంటూ లెంపకాయ్ వేసుకో.  బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా అన్నాడు వేమన. తెలుగుటీవీ ఏంకర్లనే గ్రహాంతరవాసుల్లోంచి ఉద్భవించి, సమాజానికంతటికీ పట్టిన తెంగ్లిష్ భూతాన్ని పచ్చపచ్చని తెలుగువేపమండల్తో తన్ని మరీ వదిలిస్తే తప్ప మనజాతి బాగుపడదు. జాతి మొత్తం గొడవ మనకెందుగ్గానీ నీపాటికి నువ్వు ఎప్పుడైనా టీవీ చూస్తే తెలుగు వేపమండల వైద్యం చేసుకుంటూ ఉండు” అంటూ ప్రకాశ్ రాజ్ లా నవ్వేడు మా శీనుగాడు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కథ అంటే ఒక ఆవాహన..

 

 

రాయడమంటే ఏమనుకుంటున్నావు…?

 నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే….రాయడమంటే నీలోపలి అగ్ని గుండాన్ని బద్దలు కొట్టుకోవడం….

 నీకు జరిగింది కథ కాదు– నీలో జరిగింది కథ.

ఈ మూడు ముక్కలు చాలు. కథను, కథా రచనను వెంకట్ సిద్ధారెడ్డి ఎలా భావిస్తున్నారో చెప్పడానికి. మొదటి కథ సోల్ సర్కస్ తోనే ప్రతిభ చాటుకున్నారు సిద్దారెడ్డి.  సోల్ సర్కస్, కాక్ అండ్ బుల్ స్టోరీ, టైం ఇన్ టూ స్పీడ్  ..ఇప్పటి వరకూ రాసింది మూడు కథలైనా ప్రతీ కథా దేనికదే  ప్రత్యేకమైనది.  తనదైన శైలితో, భిన్నమైన గొంతుకతో కథారచన సాగిస్తున్న వెంకట్ సిద్ధారెడ్డితో చందు తులసి  మాటా మంతీ.

 

మొదటి కథ సోల్ సర్కస్ తోనే ఆకట్టుకున్నారు. ఆ కథ వెనక నేపథ్యం ఏమిటి..?

ఎప్పటినుంచో ఓ మంచి కథ రాయాలని అనుకుంటున్నాను. ఏదో రాయాలి అని ఆలోచించడం. ఏం రాయాలో మాత్ర స్పష్టత లేదు. అలా చాలాకాలం పాటూ ఆలోచించగావచ్చిన కథ సోల్ సర్కస్. ఈ కథే కాదు. మిగిలిన కథలు కూడా అంతే. కథ రాయాలనుకున్నపుడు ఓ ఆలోచన….మెరుస్తూ ఉంటుంది కానీ…కచ్చితంగా ఇదీ అన్న స్పష్టత ఉండదు. ఏదో కొంత రాయడం, దిద్దడం, మళ్లీ రాయడం, దిద్దడం….ఇలా అనేక సార్లు జరుగుతుంది. ఓ వారానికో, సంవత్సరానికో కథ మీద పట్టు దొరుకుతుంది.  ఇక ఆ తర్వాత కథ మనం రాయాల్సిన అవసరం ఉండదు. కథే నాతో రాయిస్తుంది.  ఉదాహరణకు సోల్ సర్కస్ కథలో చిత్వాన్ పాత్ర చనిపోతుందని మొదట కథ రాసేటపుడు నాకు కూడా తెలీదు. అలా రాస్తూ పోతుంటే కథ నన్ను ఆవహిస్తుంది. ఆ తర్వాత వెనక్కు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దానంతట అదే సాగిపోతుంది.
సాధారణంగా మనం చాలా కథలు చదువుతుంటాం. కానీ కథతో  పాటూ గుర్తుపెట్టుకునే పాత్రలు అరుదుగా వుంటాయి. అలాంటిదే చిత్వాన్ పాత్ర.  చిత్వాన్ పాత్రకు మీ జీవితంలో ఎవరైనా ప్రేరణ ఉన్నారా..?
కచ్చితంగా ఫలానా వ్యక్తి ప్రేరణ అని చెప్పలేను కానీ….నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో చదివేటపుడు నాకో ఫ్రెండ్ ఉండేవాడు. అతను నన్ను బాగా ఇన్ స్పైర్ చేసినాడు. సాహిత్యం అంటే ఏమిటి..? అసలు ఏ సాహిత్యం చదవాలి. అని నాకు చాలా సలహాలిచ్చేవాడు. దేశ, విదేశాల్లోని మంచి సాహిత్యం గురించి పరిచయం చేశాడు. అలా ఆ సాహిత్యం చదువుతూ అతనితో గంటలు గంటలు చర్చించే వాడిని. ఇక సాహిత్యాభిలాష పక్కకు పెట్టి చూస్తే…వ్యక్తిగతంగా ప్రవర్తన, ఆలోచన అన్ని రకాలుగా ఓ ప్రత్యేకతతో ఉండేవాడు. అలా  అతని గురించి ఓ కథ రాద్దామనకున్నాను. అతనికో భిన్నమైన నేపథ్యం ఉండాలని భావించాను. అప్పుడే ఆలూరి బైరాగి గారి దరబాను కథ చదివి ఉండడం వల్ల అయ్యుండొచ్చేమో – చిత్వాన్ కి నేపాలీ బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుంది అనుకున్నాను.  అలా నేపాల్ గురించి వివరాలు సేకరిస్తుండగా…నేపాల్ లోని ఓ అడవి చిత్వాన్ అని తెలిసింది. అలా చిత్వాన్ పేరు పరిచయమైంది.  అలా ఆ పాత్రకు చిత్వాన్ అని పేరు పెట్టాను.

kathana

ఇప్పటికే సినిమా అనే మరో మాధ్యమంలో ఉన్న మీరు…. ఇలా కథల వైపు ఎందుకు దృష్టి సారించారు. .?
నన్ను అపార్థం చేసుకోనంటే….నన్ను నేను సంతోష పరుచుకోవాడానికి కథలు రాస్తున్నాను. అంటే ఇపుడొస్తున్న కథలేవీ నాకు పూర్తిగా నచ్చడం లేదు. అలాగని ఇపుడొస్తున్న కథలు బాగా లేవని కాదు. మంచి కథలు చాలా వస్తున్నాయి. కానీ ఆ మంచి కథలు కూడా వ్యక్తిగతంగా నన్ను సంతృప్తి పరచడం లేదు. నాకేవో వేరే కథలు కావాలి. అవి ఇలా ఉండాలని చెప్పలేను కానీ, గతంలో అలాంటి కథలు బైరాగి, త్రిపుర, ఆర్.యస్ సుదర్శనం, ఆడెపు లక్ష్మీపతి లాంటి వారు రాయగా చదివాను. వేరే భాషల్లో చాలానే చదివాను. అలాంటి కథలు ఇప్పుడు చాలా కొద్ది మంది రాస్తున్నారు. మెహర్, వంశీధర్, మహి ఇలా కొత్త వాళ్ళు కొత్త టెక్నిక్ తో కథలు రాస్తున్నారు. కానీ ఇప్పుడు రాస్తున్న వాళ్లు రాయగలిగి కూడా విరివిగా రాయడం లేదు. ఆ అసంతృప్తిలోంచి, నాకు నచ్చే కథలు నన్ను నేను సంతృప్తి పరుచుకునేందుకు రాస్తున్నాను. మంచి కథలు రావడం లేదని కాదు…కానీ నాకు నచ్చే కథలు రావడం లేదన్న అసంతృప్తిలోంచి మొదటి కథ సోల్ సర్కస్ రాశాను.

అది రాయడం వెనుక దాదాపు పదేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇది నేను మొదటి కథ అంటున్నాను కానీ, నేను 8th క్లాస్ లో ఉండగా నా కథ ఒకటి చతురలో వచ్చింది. ఒక ఇంగ్లీష్ కథ కి అనుకరణ అది. ఆ తర్వాత 2005 లో నాలుగైదు కథలు నవ్యలో వచ్చాయి. తర్వాత బ్లాగుల్లో కూడా రెండో మూడో కథలు రాశాను. కాబట్టి సోల్ సర్కస్ మొదటి కథ కాదు కానీ, నాకు నచ్చినట్టు రాసిన మొదటి కథ అది.

2005 లో కథలు రాసిన తర్వాత, ఉద్యోగం, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక కథలు రాస్తానని అనుకోలేదు. కానీ రాస్తే బావుంటుందని మాత్రం ఎక్కడో ఉండేది. కానీ రాస్తే అంతకు ముందు రాసిన స్టైల్ లో మాత్రం రాయకూడదని అనుకునే వాడిని. మరి నేను రాయాలనుకునే కథ స్టైల్ ఏంటి? అనే ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది.

ఒక రోజు ఢిల్లీలో ఉండగా ఫుట్ పాత్ మీద మురకామీ అండ్ ది మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్ అనే బుక్ దొరికింది. అప్పటికే నాకు మురకామీ అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకంలో మురకామీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక విషయం నన్ను బాగా ఆకట్టు కుంది.

 

I suspect that there are many of you in the audience who think it strange that I have talked all this time without once mentioning another Japanese writer as an influence on me. It’s true: all the names I’ve mentioned have been either American or British. Many Japanese critics have taken me to task for this aspect of my writing. So have many students and professors of Japanese literature in this country.

The simple fact remains, however, that before I tried writing myself, I used to love to read people like Richard Brautigan and Kurt Vonnegut. And among Latin Americans I enjoyed Manuel Puig and Gabriel Garcia Marquez. When John Irving and Raymond Carver and Tim O’Brien started publishing their works, I found them enjoyable too. Each of their styles fascinated me, and their stories had something magic about them. To be quite honest, I could not feel that kind of fascination from the contemporary Japanese fiction I also read at that time. I found this puzzling. Why was it not possible to create that magic and that fascination in the Japanese language?

So then I went on to create my own style.

ఇది చదివాక నాకు బల్బ్ వెలిగింది. అప్పట్నుంచే మళ్లీ కథలు రాయాలనిపించింది.

 

తెలుగులో మీకు నచ్చిన కథా రచయిత..? కథ…?
అలా చెప్పాలంటే చాలా మంది ఉన్నారండీ.  ముఖ్యంగా శ్రీపాద, మల్లాది లాంటి రచయితలు చాలా ఇష్టం.  త్రిపుర, బైరాగి రచనలు కూడా చాలా ఇష్టంగా చదువుతాను. అలాగే  కంఠమనేని రాధాకృష్ణ మూర్తి గారి కథలు బాగా ఇష్టం. నా దృష్టిలో  తెలుగు కథా రచయితల్లో  ఆయన చాలా గొప్ప రచయిత. ఆ తరహా కథలు తెలుగులో ఇంకెవరూ రాసినట్టు లేరు. ఆయన కథలని ఫలానా వర్గానికి చెందుతాయనో, లేదా ఓ విభాగానికి చెందుతాయనో చెప్పలేని ఏ జాన్రా లోనికి ఇమడని కథలు రాసారాయన.  తెలుగులో  ఉత్తమ కథల్లో ఆయన రాసినవీ తప్పకుండా ఉంటాయి.

మీ కథల్లో ఓ లోతైన తాత్వికత, అన్వేషణ కనిపిస్తుంది…?
బహుశా అది నా వ్యక్తిగత జీవితం, ప్రస్తుతం నా జీవితంలోని పరిస్థితుల వల్ల ఆ తరహా ఆలోచన కనిపిస్తుండవచ్చుననుకుంటా.  హెచ్. సీ.యూలో చదువు పూర్తై ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలో ….లక్షల రూపాయల వేతనం తీసుకుంటూ ఏ సమస్యా లేకుండా జీవితం గడిపిన నేను…ఆ తర్వాత అది జీవితం కాదని తెలుసుకున్నాను. ఓ గమ్యం కోసం, లక్ష్యం కోసం  ఉద్యోగం వదిలేసి ఇండియాకొచ్చాను.  నా గమ్యాన్ని చేరుకునే క్రమంలో ప్రతీక్షణం ఇప్పుడు నేను సంఘర్షణ అనుభవిస్తున్నాను.  రేపు ఎలా గడుస్తుందో తెలీని పరిస్థితి…అభద్రత. బహుశా ఇలాంటి వన్నీ నా ఆలోచనను ప్రభివితం చేస్తుండవచ్చు.  నా బాధను ప్రపంచానికి  చెప్పాలనన్న తపన, ఆరాటం …ఇవన్నీ కూడా నాకు తెలియకుండానే నా కథల్లో ప్రతిఫలించి ఉండవచ్చు.
కవికి గానీ, కథకుడికి గానీ…పోనీ ఏ సృజనకారుడికైనా సామాజిక బాధ్యత ఉండాలని మీరు నమ్ముతారా. ?
ఇలాంటి వాటి మీద నాకు స్పష్టంగా ఓ అభిప్రాయమంటూ లేదు కానీ….ఏదైనా కవితో, కథో రాసేముందు మన భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తాం. అంతే కానీ సామాజిక బాధ్యత, స్పృహ ఇలాంటి వాటి గురించి ఆలోచించం. ఐతే మన రాతల వల్ల సమాజానికి చెడు చేయకుంటే చాలు అనుకుంటాను.

 

venkat4కానీ మీ కాక్ అండ్ బుల్ స్టోరీ… ఓ సామాజిక అంశాన్ని చర్చించింది.
అక్కడికే వస్తున్నాను. ఆ కథ వచ్చిన సందర్భంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల మీద…. మా నెల్లూరు యాసలో ఓ కథ రాయాలనుకున్నాను. అలా కాక్ అండ్ బుల్  కథ వచ్చింది. వాస్తవానికి ఆ కథ మా ఊరిలో జరిగిన ఓ చిన్న  సంఘటన స్ఫూర్తితో రాసినది.

 

మనం రాసిన కథ సమాజం పైన ప్రభావం చూపుతుందా. ?
చూపుతుందనే అనుకుంటాను. కానీ ఆ ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. కథ చదివిన పాఠకుడికి మనసులో ఎక్కడో ఆ కథ దాగి వుంటుంది. ఏదో ఓ దగ్గర, ఎప్పుడో అప్పుడు కథలోని ఇతివృత్తం, సందేశం పాఠకుడిని తప్పక ప్రభావితం చేస్తుంది. కాబట్టి కథ గానీ మరోటి గానీ …ప్రభావం చేస్తాయనే అనుకోవాలి.  ఉదాహరణకు ఈ మధ్య అల్లం వంశీ రాసిన మిరకిల్ కథ చదివాను. నాకు చాలా నచ్చింది. అదే విషయం చాలా మందికి చెప్పాను. దాన్ని మిత్రుడు కత్తి మహేశ్ షార్ట్ ఫిలింగా కూడా తీస్తున్నారు. రిజర్వేషన్ సమస్య గురించి సున్నితంగా లోతుగా చర్చించిన కథ అది.  దళితులు మాల పల్లె లోనుంచో, మాదిగ గూడెంలో నుంచో మన మధ్యకి వచ్చే దాకా రిజర్వేషన్ సమస్య కొనసాగుతుంది. కాబట్టి సామాజిక సమస్యల మీద వచ్చే కథలు మన మీద ఎంతో కొంత ప్రభావం చూపుతాయి.

 

సాధారణంగా కథలు, నవలలు రాసి సినిమారంగం వైపు వెళతారు. మీరు రివర్స్ లో సినిమాల నుంచి కథల వైపు వచ్చారు.
సినిమా కానీ, కథ కానీ ఏదైనా ప్రాథమికంగా సృజన, అనుభూతి ప్రధానమైనవే కదా. సినిమాలకు స్క్రీన్ ప్లే రాస్తున్నపుడే…ఓ దృశ్యాన్ని ఎలా విజువల్ గా చూపించాలో ప్రయత్నిస్తాము. అలాగే నా కథల్లో కూడా విషయాన్ని   సాధ్యమైనంత ఎక్కువగా విజువలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే నా కథలు చదివిన వాళ్లు..ఆ అనుభూతి ఫీలయ్యామని చెపుతుంటారు.
మీ కథల్లో చీకటిని ఎక్కువగా నేపథ్యంగా తీసుకుంటున్నారు….ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా…?
నా జీవితం..అంటే నేను వర్క్ చేసేది పగలు కన్నా రాత్రి ఎక్కువగా ఉంటుంది. నాదంతా చీకటి జీవితం..( నవ్వులు) అందుకే చీకటిని ఎక్కువగా ఇష్టపడుతుంటాను. స్నేహితులతో మాట్లాడుతున్నపుడో, రాత్రి నేను ఆలోచించేటపుడో నా కథలు చీకటిలోనే పుడుతుంటాయి.  చీకటిని ఎక్కువగా రాయడం విజువలైజ్ చేయడంలో భాగంగానే.  సోల్ సర్కస్ కానీ, మిగిలిన కథల్లో కానీ చీకటి ప్రధానంగా వుంటుంది.

 

ఈ మధ్య కొత్తగా కథలు రాస్తున్న తరంలో మూడు కథలతోనే వొక భిన్నమైన శైలిని చూపిస్తున్నారు. కథను చెప్పడంలోనూ ప్రత్యేకత కనబరుస్తున్నారు.

 

అది కావాలనే ఎంచుకున్నదే .  ఫలానా కథలు బాగుంటాయి, ఫలానా కథలు బాగుండవని కాదు కానీ….నేను ఎక్కువగా ఇలాంటి కథలనే  ఇష్టపడుతుంటాను.  చాలా మంది నా కథలు త్రిపుర గారి కథల్లాగా వుంటాయని… త్రిపుర గారి ప్రభావం వుందని అన్నారు. ప్రధానంగా సోల్ సర్కస్ కథకొచ్చిన స్పందన.  జపాన్ రచయిత హరుకీ మురకామీని నేను ఎక్కువగా ఇష్టపడతాను.  కేవలం ఓ చిన్న వాక్యంలో ఎంతో పెద్ద అర్థాన్నిచ్చేలా అద్భుతంగా రాయగల రచయిత ఆయన. అసలు అలా రాయొచ్చని మనకు ఊహకు కూడా తట్టని విషయాన్ని ఎంతో నేర్పుగా చెబుతారాయన.  ఉదాహరణకు మీరు సోల్ సర్కస్ కథలో చూడొచ్చు. ఓ అమ్మాయి  కాఫీ కలుపుతుంటే అక్కడ అనేక భావాలు కనిపిస్తాయి. అది మురకామీ లాగా రాయాలని ప్రయత్నించి రాసిందే.  అలా రాయడం నాకు చాలా ఇష్టం.

 

కథా రచయితగా మీకంటూ ఎలాంటి గుర్తింపును కోరుకురుంటున్నారు. ?
నాకలాంటి ఉద్దేశం లేదు. భవిష్యత్ లో  నేను ఇంకో కథ రాస్తానో లేదో కూడా తెలియదు.  రాయాలనైతే ఉంది కానీ ఎప్పుడు రాస్తానో నాకే తెలీదు. రాయకపోవచ్చు కూడా. కథ రాయాలంటే నేనందులో జీవించాలి. దానికి చాలా సమయం పడుతుంది.  ప్రస్తుతానికి నాకంత సమయం లేదు. రాయాలనిపించినప్పుడు రాస్తాను అంతే.

 

ఇపుడు ….మీతో పాటూ రాస్తున్న కొత్త తరం  రచయితల కథలు ఎలా వుంటున్నాయి…?
ఇపుడు గతంలో కన్నా చాలా అవకాశాలు పెరిగాయి. చాలా మంది రాస్తున్నారు. ముఖ్యంగా వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత ఫలానా విధంగా రాయాలనే  కండిషన్స్ పోయాయి. గతంలో కొన్ని ఆంక్షలు వుండేవి. ఇప్పుడు అవి లేవు కదా. కొత్త ప్రయోగాలకు అవకాశం పెరిగింది.  ముఖ్యంగా ఇన్ని పేజీలే వుండాలనే నిడివి సమస్య  పోయిన తర్వాత మంచి కథలు రావడానికి అవకాశం వచ్చింది. నా కథలదీ అదే పరిస్థితి. ఇన్ని పేజీల్లోనే రాయాలంటే నా కథలు వెలుగు చూసేవి కాదు. అంతర్జాల పత్రికల వల్ల కథలకు, రచయితలకు మేలు జరిగింది. ఇది మంచి పరిణామం. కాబట్టి భవిష్యత్ లో కూడా మరిన్ని మంచి కథలు రావడానికి అవకాశం వుంది.

 

మీ నేపథ్యం గురించి చెబుతారా..?
మాది నెల్లూరు జిల్లా.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో చదివిన తర్వాత టీసీఎస్ లో పనిచేసాను. యూకేలో ఐదేళ్పు పనిచేసాను. సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేశాక ఇక చాలనిపించింది. అప్పటికే పెళ్లయింది.  ఇద్దరమూ ఉద్యోగాలు వదిలేశాము.  తను కర్నాటక సంగీతంలో సాధన చేస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.  నేను సినిమా రంగంలో పనిచేస్తున్నాను. సినిమాకోసం ప్రయత్నం చేస్తున్నాను.  నేను కథ రాసేటపుడు పాఠకులు మెచ్చుకోవాలనుకునో, ప్రశంసలకోసమో రాయను. మొదట… పాఠకుడిగా నేను సంతృప్తి చెందాలి. అలాగే నేను రాసిన చాలా కథల వెనుక రంజని తో జరిగిన డిస్కషన్స్ కారణం. నేను రాసిన తర్వాత మొదట తనే చదువుతుంది. తనకి నచ్చితే నాకు చాలనిపిస్తుంది. నేను రాసిన  మొదటి కథను మా అమ్మకు చూపించాను. మా అమ్మ బాగా చదువుతుంది. మా అమ్మకు నా కథ నచ్చింది. ఆ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను.

venkat7
నేను సాహిత్యం చదవడానికి, రాయడానికి ప్రధానమైన కారణం మా అమ్మే. మా అమ్మ నాతో చాలా సాహిత్యం చదివించింది. ఐదు, ఆరు క్లాసుల్లో ఉండగానే యండమూరి లాంటి రచయితల పుస్తకాలన్నీ చదివేశాను. మా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను  మా అమ్మ మేం చదివిన వాటి గురించి చర్చించుకునే వాళ్లం. అలా సాహిత్యం పైన ఆసక్తి కలగడానికి కారణం అమ్మే. మా నాన్న కూడా చదువుతారు గానీ ఏమీ మాట్లాడరు.

సినిమా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి…?
నా మొదటి కథ లాగే ఇప్పటికీ  సినిమా విషయంలో స్పష్టత లేదు. సినిమా తీయాలని అనుకుంటున్నాను కానీ ఎలాంటి సినిమా తీయాలనేది ఇప్పటికీ తెలీదు.  నేను ఏదైతో ఆలోచిస్తానో దాన్ని క్లియర్ గా చెప్పగలగాలి. సోల్ సర్కస్ కథ కోసం …పదేళ్లు ఆలోచించాను. సంఘర్షణ పడ్డాను.  అలాగే సినిమా కోసం కూడా ఎంత కాలమైనా ఎదురు చూస్తాను.

 

(మిత్రుడు మహి బెజవాడకు కృతజ్ఞతలతో…)

 

చారిత్రక కాల్పనిక నవల “శ్రీకృష్ణ దేవరాయలు”

 

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఒకనాటి పాలకుల, చరిత్రలో పేరుగాంచిన వ్యక్తుల జీవితాలకు కాల్పనికత జోడించి సృజనాత్మక రచనగా వెలువరించడం చాలా కష్టమైన పని. ఆ యా పాత్రలపై అతి ప్రేమ లేదా అతి ద్వేషం చూపితే వాస్తవాలు మరుగునపడే ప్రమాదం ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితంనాటి పాలకులపై రచన చేస్తున్నప్పుడు – అప్పటి ఆ యా పాలకుల పరిపాలనని లేదా పరాక్రమాన్ని తెగ పొగడడం లేదా ఆ రాజ్యంలో పాలితు లెదుర్కున్న కడగండ్లు, కష్టాలను మాత్రమే ప్రస్తావించడం – సమంజసం కాదు. అప్పటి పరిస్థితులు వేరు, వర్తమాన స్థితిగతులు వేరని గుర్తుంచుకుని; రచనలో ఏ మాత్రం అతిశయోక్తులు, లేదా వ్యక్తిత్వ హననాలు జొప్పించకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే సమాజంలో అనవసరమైన కలతలు రేగుతాయనే అంశాన్ని రచయితలు మనసులో ఉంచుకోవాలి.

ఈ విధంగా, చరిత్రలో సుప్రసిద్ధుడైన ఓ మహారాజుని, అతని పాలనని వివరిస్తూ, అతని వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు కస్తూరి మురళీకృష్ణ. ఆ మహారాజు వేరెవరో కాదు, భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి సుపరిచితుడైన శ్రీకృష్ణ దేవరాయలు.

నవల ప్రారంభంలో – నిరంతరం శత్రుదాడులతో భారతదేశం బలహీనపడడం గురించి ప్రస్తావిస్తారు రచయిత. భారతీయ సమాజం దిశారహితమై దిక్కుతోచకుండా బిక్కుబిక్కుమంటున్న కాలమని పేర్కొంటు శ్రీకృష్ణ దేవరాయలు పాలనా పగ్గాలు చేపట్టే ముందరి పరిస్థితులని కళ్ళకు కట్టినట్టు వివరించారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో మహామంత్రి తిమ్మరుసు, ఇతర ముఖ్యులు కలసి రాజ్యాధికారాన్ని శ్రీకృష్ణ దేవరాయలకు అప్పగిస్తారు. రాజ్యం పరిస్థితి ఏమీ బాగాలేదని విన్నవిస్తాడు తిమ్మరుసు.

పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం అత్యంత ఆవశ్యకం.. ఏం చేస్తే పరిస్థితులు బాగవుతాయో సూచనలు కావాలి నాకు. సమస్యలను ఎత్తి చూపించి సమయం వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు. సమస్య స్వరూపాన్ని వివరించి, పరిష్కారాలు సూచించండి.” అంటాడు కృష్ణదేవరాయలు.

రాయలు సింహాసనమెక్కి వారమైనా కాకముందే తురుష్కులు విజయనగర సరిహద్దులను దాటి చొచ్చుకువస్తున్నారని తెలుస్తుంది. రాయలకింకా రాజ్యవ్యవహారాలపై అవగాహన పూర్తిగా రాలేదనీ; అప్పుడే యుద్ధానికి వెళ్ళడం అంత క్షేమకరం కాదని తిమ్మరుసు భావించాడు.

అయితే ఓటమి అనే పదాన్ని సైతం ఇష్టపడని కృష్ణదేవరాయలు తన సైన్యాన్ని ఉత్తేజితులను చేసి యుద్ధరంగం వైపు నడుపుతాడు, ఓడిస్తాడు. అదే ఊపులో మరికొన్ని రాజ్యాలను గెలవాలని ఆలోచిస్తాడు. కాని తిమ్మరుసు వద్దంటాడు. రాయలు మౌనంగా వచ్చి గుడారం బయట నిలుచుంటాడు. ఎదురుగా పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణానది. రాయల దృష్టి, నది నడుమన నిలిచిన బండరాయిపై పడింది. అతి వేగంగా ప్రవహిస్తున్న నీరు బండరాయిని బలంగా తాకుతోంది. దాన్ని కూడా తనతో పాటు ప్రవహింపజేయాలన్న దూకుడు చూపిస్తోంది. కాని రాయి నిశ్చలంగా ఉంది. దాంతో ఓ వైపు రాయిని కోసే ప్రయత్నం చేస్తూనే పక్కకి తిరిగి, రాయి పక్క నుంచి ప్రవహిస్తోంది. అది చూసిన రాయల ముఖంపై చిరునవ్వు వెలసింది. ఆ క్షణంలో ప్రకృతి అతనికి ఓ చక్కని పాఠం నేర్పింది.

ఓ సందర్భంలో, పాలకులకు ఉండాల్సిన లక్షణం గురించి రాయలు ఇలా అంటారు:

ముందుగా మనం మన ప్రజలకు కలలు కనడం నేర్పాలి. జీవితాన్ని అనుభవించడం నేర్పాలి. రకరకాల భయాలతో, బాధలతో, మనవారు జీవించడం మరచిపోయారు, బ్రతుకులోని ఆనందాలను అనుభవించడం మరచిపోయారు. ఎంత సేపూ గతాన్ని తలచుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. ముందుగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్నివ్వాలి, వారికి భద్రతనివ్వాలి”.  ఈనాటి నేతలకి సైతం వర్తించే సూచనలివి అనడంలో సందేహం ఏ మాత్రం  లేదు.

తర్వాత రెండేళ్ళపాటు రాజ్యంలో అభివృద్ధి పనులు చేపడుతూ, సైన్యాన్ని బలోపేతం చేశాడు. వివాహం చేసుకున్నాడు. రాచరిక, వైయక్తిక ధర్మాలను నెరవేర్చాడు. ఒక్కో శత్రువునీ జయిస్తూ, సామ బేధ దాన దండోపాయాలతో దక్షిణాపథాన్నంతా ఏకఛత్రం క్రిందకి తెచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నో సంస్కరణలు చేపట్టి జనరంజకంగా పాలించాడు, విశిష్ట కట్టడాలని నిర్మించాడు.

పరిపాలనాదక్షుడుగా, వీరుడిగా, సాహితీప్రియుడిగా, కవిగా, గొప్ప కట్టాడాలను కట్టించిన రాజుగా మనకి తెలిసిన శ్రీకృష్ణ దేవరాయల లోని ఆధ్యాత్మికతను, ధర్మదీక్షని పరిచయం చేసారు రచయిత ఈ నవలలో. విజయనగర రాజ్యాధికారం లభించడమంటే ధర్మరక్షణ చేసే అవకాశం లభించడమేనని శ్రీకృష్ణ దేవరాయలు భావించాడని, దైవం తనకి నిర్దేశించిన కర్తవ్యం అదేనని ఆయన నమ్మాడని రచయిత చెబుతారు. తన సామ్రాజ్యంలో ఎన్నో దేవాలయాలకు నిధులిచ్చి, వాటిని పునరుద్ధరించి, నిత్యపూజలు జరిగేలా చూసాడు. ఆలయాలు జనసామాన్యంలో ధార్మికత నెలకొల్పగలిగే కేంద్రాలని రాయలు విశ్వసించాడు.

శ్రీకృష్ణ దేవరాయలు వేంకటేశ్వరుని భక్తుడు. వీలైనన్ని సార్లు తిరుపతి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకునేవాడట. “ఏడుకొండలు ఎక్కలేము, ఇంకోసారి రాలేము” అనుకునే వారందరూ కూడా మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి ఎందుకు వస్తారో రచయిత చక్కగా వివరించారు. “ఏడుకొండలపై తిష్టవేసుకున్న కోనేటి రాయుడి దర్శనం కోసం ఏడు కొండలు నడిచి వెళ్ళాలి. ఒక్కో అడుగు వేస్తూ.. కొండలెక్కుతుంటే, మానవ ప్రపంచానికి దూరమవుతూ, దైవ ప్రపంచంలో అడుగుపెడుతున్న భావన కలుగుతుంది. ఇంత కష్టపడి ఏడు కొండలు అధిరోహించి, దైవమందిరంలో అడుగిడితే, ఆ చీకటిలో, దీపాల వెలుతురులో ధగధగా మెరిసే వజ్రాభరణాల వెలుగులో, నల్లటి రాతివిగ్రహం నుండి మనల్ని చూస్తున్న ఆ స్వామి విరాట్స్వరూపాన్ని ఎంత చూస్తే తనివితీరుతుంది?” అంటాడు రాయలు.

ఆలయ దర్శనం పూర్తయ్యాక, ఉదయగిరి కోటపై దాడి చేసి గెలుచుకుంటాడు. మరల తన దేవేరులతో కలసి తిరుమల వేంచేస్తాడు. ఎప్పుడూ స్వామి వారి సన్నిధిలోనే ఉండిపోవాలని అభిలషిస్తుంది చిన్నాదేవి. రాయలకి కూడా అదే కోరిక ఉన్నా పాలనా బాధ్యతల దృష్ట్యా సాధ్యం కాని పని. తిమ్మరుసు చేసిన ఓ ఆలోచన వల్ల – నిరంతరం స్వామి దగ్గరే ఉండాలన్న రాయల కోరికను పరోక్షంగా, ప్రతీకాత్మకంగా నెరవేరింది. ఫలితమే – తిరుమల గుడిలో శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరి భార్యలతో ఉన్న విగ్రహాల ఏర్పాటు!

రాచకార్యాలు, యుద్ధవ్యూహాల నడుమ సాహిత్య సమాలోచనలు, సాంసృతిక ఉత్సవాలను నిర్వహించేవాడు రాయలు. శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు ఆలయంలో దైవదర్శనం చేసుకున్నాకా, రాయల హృదయంలో ప్రేరణ కలిగి ఆముక్తమాల్యద రచనకి బీజం పడుతుంది. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణ దేవరాయల నోటి నుంచి “దేశభాషలందు తెలుగు లెస్స” అనే పద్యం వెలువడింది.

ఆముక్తమాల్యద రచన ప్రారంభించినప్పటినుంచి రాయల ప్రవర్తనలోనూ, మానసిక స్థితిలోనూ మార్పు రావడం గమనిస్తాడు తిమ్మరుసు. తన తదనంతరం, విజయనగర సామ్రాజ్యం ఏమై పోతుందో అని చింతిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు మానసిక స్థితిని వర్ణిస్తూ – “తన జీవితంలో ఒక దశకి చేరిన తరువాత ఇతరుల పొగడ్తలు వింటున్న వ్యక్తి మనసులో అహంకారం జనిస్తుంది, దాని వెంటే సంశయం కలుగుతుంది. ఈ పొగడ్తలకు అర్హుడినా అనే అనుమానం కలుగుతుంది, మరో వైపు ‘నేనింత సాధించాను’ అన్న అహంభావం పెరుగుతుంది. ఈ రెండిటి నడుమ జరిగే ఘర్షణలోంచి, ‘ఇది పోతేఅన్న భయం జనిస్తుంది. ఆ భయాన్ని వ్యక్తి ఎలా ఎదుర్కుంటాడన్నది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది” అని అంటారు రచయిత.

ఈ స్థితిలో రాయలికి ధైర్యం చెబుతాడు తిమ్మరుసు. “మనిషి మనసు ఎల్లప్పుడూ భవిష్యత్తుని తలచుకుని భయపడడానికే ఇష్టపడుతుంది. ఆ భయాన్ని మనం నిర్మాణాత్మకంగా వాడుకోవాలి. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఊహిస్తూ, ఇప్పటి నుంచే బాధపడుతుంటే, భవిష్యత్తు అటుంచి, వర్తమానం చేజారిపోతుంది.” అంటూ మృదువుగా హెచ్చరిస్తాడు.

సామ్రాజ్యం విస్తరిస్తుంది, బలపడుతుంది. కాలచక్రం గిర్రున తిరిగి, పుత్రుడికి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమవుతుంది. రాయలు తన పుత్రుని భవిష్యత్తు గురించి బెంగపడుతున్న సమయంలో యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, రాయల అప్పటి మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు రచయిత. “మనిషికి ఆత్మస్థైర్యం ఇవ్వవలసిన మానవ సంబంధాలే మనిషిని బలహీనం చేయడం సృష్టిలో చమత్కారం” అంటారు.

ఆముక్తమాల్యద రచన పూర్తి కాగానే శ్రీకృష్ణ దేవరాయలు తృప్తిగా కన్నుమూయడంతో నవల పూర్తవుతుంది.

ఉత్కంఠగా చదివించే ఈ నవల తొలుత ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది. నవలగా మొదటిసారి “కస్తూరి ప్రచురణలు” వారు ప్రచురించారు. 124 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- ప్రచురణకర్తల వద్ద ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

~ కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్తల చిరునామా:

Kasturi Prachuranalu

Plot No. 32, Dammaiguda,

Raghuram Nagar Colony,

Nagaram Post Office,

Hyderabad – 83,

Cell : 98496 17392.

 

సంభాషణలు

-అవ్వారి నాగరాజు
~
ఎవరమైనా ఎలా చెప్పగలం
తాత్విక ప్రశ్నల సుడుల నడుమ గింగిరాలు కొడుతూ
మూగిన పంథాల చిక్కుముడులలో ఉక్కిరిబిక్కిరిగా
కాలాకాలాల నడుమ గీతలు గీస్తూ చుట్టుకొలతలు తీస్తూ
అప్పుడప్పుడూ ఒక నిట్టూర్పునో మరింకో దాన్నో
జరగండహో జరగండని దారి చేసుకుంటూ
మనమూ ఉన్నామని చెప్పుకోవడానికి ఆదుర్దాపడుతూ
మన పనిలో మనం నిత్యం నిమగ్నమై ఉంటాం కదా
దేహాలని పగల చీల్చుకుంటూ
సందర్భాసందర్భాల నడుమ తమను తాము పేని
ఊపిరి కదలికలకు చలించే వో సంకేతంలాగా  కాకుంటే ఇంకేదో స్ఫురించని సుదూరపు ఊహలాగా
ఏదో వొక క్షణంలో
ఎవరొస్తారో తెలియదు కానీ
ఇదుగో ఇట్టాగే చప్పున చొచ్చుకొని వొచ్చేస్తారు
అలా వొచ్చేదాకా
చావు మన అర చేతుల మీద ఇగరని నెత్తుటిమరకలను అద్ది పోయేదాకా
వొక తెర చాటున నక్కిన మాయోపాయి వేసే
ఆట్టే తెలియని సహస్ర శిరచ్చేధ చింతామణి ప్రశ్నలలాంటివేవో ముఖాల మీద పెఠిల్లున చిట్లేదాకా
ముసిరిన సంభాషణలకు
అటూ ఇటూ తిప్పి చూసుకొనే దిగ్భ్రాంతీ దుఃఖమూ తప్ప
ఇదమిత్తంగా ఇదని చెప్పలేము కదా

వాడు ఆకలిని జయించాడు    

 

 

ఆ రోజు సాయంకాలం క్లాసులో వెనుక కూర్చున్న పెద్దపిల్లల దగ్గర ఏదో హడావుడి కనిపిస్తోంది. ముందు కూర్చున్న పిల్లల హోమ్ వర్క్ చూస్తున్నాను.

చేతిలో పని ముగించి వెనుక వైపు వరసల్లో ఉన్నసునీల్ని, వాడి చుట్టూ చేరిన గుంపుని విషయం ఏమిటని అడిగేను. జాన్బాబు వెంటనే చెప్పేడు,

‘ టీచర్, సునీల్ సెల్ ఫోన్ పట్టుకొచ్చేడు. అందులో బోలెడన్ని పాటలున్నాయి’. నా అనుమానం నిజమే. ఇందాకటినుండి ఎక్కడో సన్నగా విన్పిస్తున్న సినిమా పాటలు ఇక్కణ్ణుంచే అన్నమాట.

‘సునీల్, ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు’

‘ ఆపేసేనులే టీచర్. ఇంక పాటలు వెయ్యను’ అన్నాడు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ని జేబులోకి తోస్తూ.

‘ నీకు సెల్ ఫోనెక్కడిది?’

‘ నేనే కొనుక్కున్నాను టీచర్’. అర్థం కానట్లు చూసేను.

‘టీచర్, వాడు పొద్దున్నే లేచి తాడిగడప సెంటర్లో కాఫీ హోటల్లో మూడు గంటలు పనిచేసి స్కూలుకి వస్తాడు. వాడి డబ్బులతోనే కొన్నాడు’ జాన్ నా సంశయం తీర్చేడు.

పన్నెండేళ్ల పసివాడు పనికి వెళ్లి సంపాదించటాన్ని ఊహించేందుకే కష్టంగా తోచింది.

‘ నిజమే టీచర్, మా పిన్ని పనిలో పెట్టింది. నాకు డబ్బు విలువ తెలియాలని, సంపాదించడం ఇప్పటినుండే నేర్చుకోవాలని చెప్పింది టీచర్.’ వాడి మాటల్లో ఒక నిర్లక్ష్యం!

‘ నువ్వు మీ అమ్మానాన్నల దగ్గర వుండవా?’

‘ వాడికి అమ్మ చిన్నప్పుడే చనిపోయింది టీచర్.  వాళ్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడుగా.  ఆవిణ్నిఅమ్మ అనకుండా పిన్నిఅంటాడు వీడు’ జాన్ చెబుతున్నాడు.

ఊహించని పరిస్థితి! నాకు బాధగా ఉంది ఇలాటి ప్రశ్న వేసినందుకు.

‘కష్టపడి సంపాదించి, ఇలాటి అనవసరమైన ఖర్చులు పెడుతున్నావా సునీల్? ఇంట్లో తెలిస్తే కోప్పడరూ?’

‘ఏం అనరు టీచర్. నేను సంపాదించే దానిలో కొంత డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటాను. అలా అయితేనే పనిలోకి వెళ్తానని మా పిన్నికి చెప్పేను.’ అంత ఖచ్చితంగా వాడు ఇంట్లో చెప్పడాన్ని ఆశ్చర్యంగా విన్నాను.

‘ నీ ఖర్చులు అంటే ఇలా సెల్ ఫోన్ కొనుక్కోవటమేనా? ‘

‘టీచర్, ఫోన్ అంటే నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. మా బాబాయ్ ఎప్పుడూ కొత్తకొత్త ఫోన్లు వాడుతుంటాడు. అందుకే డబ్బులు పోగేసుకుని కొనుక్కున్నాను. అయినా ఇది కొత్త ఫోన్ కాదు టిచర్. నా ఫ్రెండు నాగు కొత్త ఫోన్  కొనుక్కుని వాడి పాత ఫోన్ నాకు మూడొందలకి అమ్మేడు. టీచర్, ఈ మూడొందలు పోగుచేసుకుందుకు నేను నెల రోజులుగా సాయంకాలం టిఫిన్ తినడం మానేసేను.’ గర్వంగా చెబుతున్నాడు.

ఉలిక్కిపడ్డాను. వాడి ముఖం వాడిపోయి ఉంది.

కొన్నాళ్ల క్రితం ఒకసారి సాయంకాలం క్లాసులో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

కార్తీక్ ఆరోజు కూడా క్లాసుకి ఆలస్యంగా రావడంతో నేను కోప్పడ్డాను. ‘ టీచరుగారూ, మా అమ్మ పనిలోంచి ఇప్పుడే వచ్చింది. అన్నం తిని వచ్చేసరికి ఇంత సేపయ్యింది.’ అన్నాడు కార్తీక్.

‘ మిగిలిన పిల్లలు అందరూ సమయానికి వస్తున్నారు, నువ్వు వారానికి నాలుగు రోజులు ఆలస్యంగా వస్తావు. సునీల్ చూడు. ఒక్కసారి కూడా ఆలస్యం చెయ్యడు. అందరికంటే ముందుగా వస్తాడు.’

‘ సాయంకాలంపూట వాడు అన్నం తిని రాడు టీచర్. అందుకే అందరికంటే తొందరగా వచ్చేస్తాడు.’

కార్తీక మాటలకి పౌరుషంగా చెప్పాడు సునీల్,

‘నేను స్కూలు నుండి వచ్చేప్పుడే సెంటర్లో టిఫిన్ తినేసి వస్తాను.’

‘మీ పిన్ని నీకు సరిగా అన్నం పెట్టదంట కదా, అందుకే నువ్వు బయట టిఫిన్ తింటావు. మా అమ్మ చెప్పింది’ కార్తీక్ మాటలకి పెద్ద గొడవే జరిగింది ఆరోజు.

సునీల్ కార్తీక్ మీద కలియబడబోతే వాళ్లిద్దర్నీ నేను విడదీయవలసి వచ్చింది.

‘ నాకు ఎవరూ పెట్టక్కర్లేదురా. నేనే సంపాదించి అందరికీ పెడతాను’ కోపంగా చెబుతున్నసునీల్ ముఖం ఎఱ్ర బడింది. ఆ గొడవతో సడన్ గా లేచి, ‘వెళ్లిపోతాను టీచర్’ అని చెప్పి ఆరోజు క్లాసులోంచి వెళ్లిపోయేడు.

సునీల్ ఫోన్ కొనుక్కుందుకు సాయంకాలాలు ఆకలితో గడుపుకున్నాడని వింటే గుండె పట్టేసినట్లైంది.

‘సునీల్, ఫోన్ కొనుక్కోవటం కోసం టిఫిన్ మానేసి, ఆకలితో క్లాసుకొస్తే నువ్వు చదువుకోగలిగావా? ముందు బాగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు‘

నా మాటలు పూర్తి కాకుండానే వాడు చెబుతున్నాడు,

‘చదువుకుంటాలెండి టీచర్. ముందు డబ్బు సంపాదించాలి. మా పిన్నికి నా సత్తా ఏమిటో చూబించాలి ’ వాడి మనసులో గాయం నాకు అర్థం అవుతోంది.

దేవుడు మాస్టారు వాకింగ్ ముగించి మా క్లాసు మీదుగా ఇంటికెళ్తున్నారు. ఆయన అక్కడ జరుగుతున్న విషయం గమనించినట్లున్నారు. క్షణం ఆగి అన్నారు,

‘ టీచరమ్మా, నువ్వేదో వీళ్లందర్నీ బాగు చేద్దామని అనుకుంటున్నావు కాబోలు. నీ తరం కాదు. వీడి సంగతి సరే, వీడిలాటి వాళ్లు సంపాదించిన దాంట్లో కొంత ఇంట్లో ఇస్తారు. ఏ కోడి కూరో చెయ్యమని పురమాయిస్తారు. అక్కడికి తామూ ఇంట్లో సంపాదించే మగాళ్లయ్యేరని అనుకుంటారు. ఇంటిల్లిపాదీ వీళ్లని అందలం ఎక్కిస్తారు. అంతేకాని తమ బ్రతుకులో పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదని, వాళ్లని చదివించుకోవాలని ఎప్పుడూ అనుకోరు. దశాబ్దాలుగా చూస్తున్నా వీళ్లని. నాకు చేతనైనంత చెప్పి చూసేను. ఉహు, వీళ్లు మారరు.’

ఆయన మాటలు నాకు కష్టంగా తోచేయి. ’అలా అనకండి మాస్టారూ, మనం వీళ్లని మార్చే ప్రయత్నం చేద్దాం. చదువుకుంటే భవిష్యత్తు బావుంటుందని అర్థం అయ్యేలా చెబితే………’

నామాటలు పూర్తి కాకుండానే, ‘నీ ఓపిక తల్లీ, ఏం చేస్తానంటావో చేసుకో. నాకు మాత్రం ఓపిక లేదు’ చేతులెత్తి దండం పెట్టి మెల్లిగా ఇంటి వైపు వెళ్ళిపోయేరాయన.

అంత అనుభవం ఉన్న మాస్టారు అంత నిస్పృహగా ఎందుకు మాట్లాడేరు? ఈ పిల్లలకి నిజంగా ఎవరం ఏమీ చెయ్యలేమా?

మరునాడు కాస్త ముందుగా బయలుదేరి సునీల్ ఇంటికి వెళ్లేను. ఇంటి ముందు బియ్యం బాగు చేస్తున్న ఆమె బహుశా సునీల్ పిన్ని అయివుంటుంది. ఆమె తలెత్తి ఏమిటన్నట్టు చూసింది.

‘అమ్మా, మీరు పిల్లవాణ్ణి ఇప్పటినుండి పనిలోకి పంపుతున్నారు. చదువుకునే వయసు కదా. తెలివైన పిల్లవాడు. శ్రద్ధగా చదువుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. మీ ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. కొన్నాళ్లు మీరు వాడి చదువు బాధ్యత పూర్తిగా తీసుకోవాలి’ ఆమె ముఖం అప్రసన్నంగా మారింది.

అక్కడే ఉన్న నులక మంచం మీద చుట్ట కాల్చుకుంటూ కూర్చున్న వృద్ధుడు మాత్రం సమాధానంగా మాట్లాడాడు.

‘ నా అల్లుడేమైనా ఆఫీసరుద్యోగం చేస్తున్నాడా టీచరమ్మా? పిల్లోడూ ఓ చెయ్యి సాయం చేస్తేనే సంసారం నడిచేది. నాకూతురు సవితి కొడుకని ఆణ్ణి పనిలోకి పంపట్లేదు. ఇంట్లో కూర ఆకుకి వస్తాయని పంపుతోంది.’ మనవడి సంపాదనలోనే తన చుట్టల ఖర్చునడుస్తోందన్న విషయాన్ని మాత్రం అతను చెప్పలేదు.

‘ అలా కాదండీ. చదువుతో పాటు పనిచేసే శక్తి, సమయం పిల్లలకుండదు. వాళ్లు చదువుమీద పూర్తిగా ధ్యాస పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అయినా చిన్నపిల్లల్ని పనిలోకి పంపటం నేరం అవుతుంది, మీకు తెలుసా?’

‘అంటే ఏంటి, మామీద కేసెడతారా? ‘ అసహనంగా అడిగిందామె. ఇంతలో సునీల్ రానే వచ్చాడు.

‘ ఏరా, పని ఎగేసేందుకు టీచరుగార్ని మామీదకి ఉసిగొల్పుతున్నావా?’ వాడిమీద చెయ్యెత్తిందామె. వాడు దెబ్బ తప్పించుకుంటూ లోపలికి పరుగెత్తాడు. తెల్లబోయాను. ఏం చెప్పాలని వచ్చాను, ఏం జరుగుతోంది?!

‘ టీచరమ్మా, మా ఇంటి విషయాల్లో, పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకు. చదువు చెప్పడానికొచ్చేవు. అంతవరకే’ విసురుగా బియ్యం చేటతో సహా లోపలికి వెళ్లిపోయిందామె.

 

ఆ రహస్యం…?

drusyam

ఫోటో: ప్రవీణ కొల్లి 

పదాలు:కోడూరి  విజయ కుమార్ 

~

దయగా ఇంత చల్ల గాలిని పంచే పచ్చని చెట్లు

భయం లేదు లెమ్మని భరోసానిచ్చే నీలి కొండలు

పశు పక్షాదులతో పాటు తలదాచుకోను

చిన్ని తాటాకుల గుడిసె ఒకటి

ఈ సరళ సుందర లోకానికి నేను

కేవల యాత్రికుడిగా ఎప్పుడు మారిపోయానో

నా లోలోపలి లోపలి పురా మానవుడా

ఆ రహస్యం నీవైనా విప్పగలవా ?

*

గన్నుతో కాదు….గుడ్లురిమి చిదిమేస్తా!

 

 

‘ఇక్కడ కాదు. బయటికి నడు నీ పని  చెప్తా ’ అంది ఫ్లెమింగో, గుడ్ల గూబ ని చూసి!

‘నువ్వే దయచెయ్. మరో క్షణం నాదగ్గరుంటే కళ్ళార్పకుండా  చంపేస్తా. నువ్వు వీగిపోయినప్పుడు ఓదార్పనేది లేకుండా కడిగేస్తా…ఇహిహి ”  ఉరిమినట్టుండే గుడ్లను మరింత ఉరిమింపజేసి  చూసింది గుడ్ల గూబ!

‘ఏంటలా గుడ్లురిమి చూస్తావ్? అలా చూస్తే మేం భయపడి ఎగిరి పోవాలా? గూబ గుయ్ మంటది జార్త!’ అంది ఫ్లెమింగో!

‘ఏం మాడుతున్నావ్ ఫ్లెమీ? మా గుడ్ల గూబ కళ్ళెప్పుడూ అలానే ఉంటాయ్! అది కోపం తో కాదు. నీతో నవ్వుతూనే చెబుతున్నా ‘దయచేయ్’ అని“

“నకరాలు చేయకు. నా చేతులో ఇత్తడై పొతావ్”

“ఇత్తడంటే …లోహం. అంటే ‘లోహ విహంగం’ అవుతానన్నమాట! అహ్హహా.ఒహ్హోహో..! ఒకప్పుడు మా దగ్గరున్న ‘లోహ పాదం’ ఏనాడో నీ దగ్గర అడుగు పెట్టిందిగా. అలాటి పాదాలని జతచేసుకుని  నువ్వు పార్టీని ఈదాలంటే  చాలాకష్టమే మరి. అహ్హాహా…ఒహ్హోహో  ”

“నువ్వు నవ్వుతున్నాననుకుంటున్నావేమో. నాకు తెల్సు. అది నవ్వు కాదు. అవహేళన అని తెలుస్తూనే ఉంది ”

“నా కనుగుడ్లు ఎల్లప్పుడూ  విచ్చుకోవడమే ఉంటుంది. ప్రత్యేకించి  ఉరమడం అనేది ఉండదు. ఇంత నవ్వుతున్నా ఉరిమానంటావేం? నా గుడ్ల మాన్యుఫాక్క్చరింగే అంత అనుకోవచ్చుగా. అహ్హహ్హ  !”

“మరి అలా ఆ చూపుడు వేలు ఎందుకు గుచ్చినట్టు  చూపిస్తున్నావ్?”

“మళ్ళీ అహ్హ హ్హ….నేను రెక్క ఎత్తిచూపిస్తున్నా, అది నీకు వేలు ఎత్తి చూపిస్తున్నట్టుందేం? నేనిక్కడ కూల్ గా  నిన్ను చూస్తున్నా కూడా నీకు ఉరిమినట్టుంటుంది. సరే …ఇహ నేను నవ్వను గాక నవ్వను. సీరియస్ మోహమేసుకునే  ఉంటా!సరేనా.”

“నీ ఫేసుకలాంటి ఫ్రస్ట్రేటెడ్  స్టాంపే బెటర్! అర్థం కాలేదా? అంటే నీ వదనానికి ఆ మథన ముద్రే బాగుంతుందంటున్నా! అయినా నీ సంగతిలా  కాదు. పక్షుల ప్రత్యేక  సమావేశంలో నీ ప్రసంగాన్ని దుయ్యబట్టి ఏ ఈకకి ఆ ఈక  పీకి పారేస్తా!”

“హలో! ఏమ్మాడుతున్నావ్? ప్రస్తుత  ప్రసంగంలో ఏం పీకావని కొత్తగా  వేరే పీకుతావ్? సందర్భం లేకుండానే విర్రవీగిన నీ ‘అవిశ్వాసమే’ వీగిపోయింది “

“అదిగో మళ్ళీ గుడ్లలా ఉరమకన్నానా? నీ గుడ్లంటే నాకో ‘ఫోబియా’. తోటి పక్షిని కాబట్టి అలా ‘పీకడం’ లాంటి అన్ పార్లమెంటరీ పదాలు నాపై వాడుతున్నావ్ గానీ, మనుష్య భాషలో అదో పెద్ద బూతు. నీకా విషయం తెల్సా?”

“ఈకలంటూ ఉన్నాక  పీకించుకోకుండా ఉంటామా?లేదా పీకకుండా ఉంటామా? అందులో అన్ పార్లమెంటరీ ఏముంది? అర్ధం లేని ఏడుపు నీది.”

“ఏడిశావ్……ఇప్పుడు నువ్వన్న  ‘ఏడుపు’  అనేదే అసలైన  అన్ పార్లమెంటరీ. దాన్ని రికార్డులోంచి పీకించాలి.”

“ఏడుపు అన్ పార్లమెంటరీ కాదు….నువ్వంటోన్న ‘ఏడిశావ్’ అనేది అన్ పార్లమెంటరీ. అయినా నేను ఏడిశానంటావ్…మీ అయ్య పనీ పాటా లేకుండానే తెగ ‘నవ్వుతూ’ ఉండేవాడు….గుర్తుందా? పనికిమాలిన నవ్వుకన్నా పనికొచ్చే ఏడుపు మిన్న కదా!  అదలా ఉంచి నీ వద్ద నున్న పక్షులన్నీ  నా వద్దకు వలస వచ్చేశాయి …ఇంకొన్ని వచ్చేస్తున్నాయి ”

“ఆ …. మావన్నీ మీవద్దకు వస్తే  వలసలు అంటారు…..అదే పొరుగు ఊళ్ళో మీకిదే జరిగితే –  మమ్మల్ని ‘గద్ద’ తన్నుకెళ్ళింది   అంటూ ‘ముక్కు’ సూటిగా అనేస్తావు.  ….అంతేగా? అక్కడ ముక్కుకు లొంగిపోతావ్ ….ఇక్కడ ముక్కుకు తాడు వేస్తానంటావ్. నువ్వేంటో ఒక్క ముక్కా అర్థం కావురా బాబూ ”

“ఫ్లెమీ బ్రదర్….ఏమ్మాడుతున్నారు? రెండు కళ్ళకీ అంతటి దేదీప్యమానమైన  ప్రాధాన్యాన్ని ఇచ్చాను గాబట్టే … ఇవ్వాళ నీకు నా గుడ్లు ఉరిమినట్టు కనిపిస్తుంది. నిజానికి జరిగిందేమేటంటే ఇరుపక్షులకీ … సారీ … ఇరు పక్షాలకీ సమన్యాయం చేయాలన్నదే నా ‘ఉభయ గుడ్ల’ తత్వం. అయినా నన్నంటావేమిటి? నేను పక్షినైతే నువ్వు ప్రతిపక్షివి!  నేను ప్రతిపక్షినైతే నువ్వు పక్షివి!  మీ అయ్య ఊరకే పిచ్చ పిచ్చగా నవ్వుతుండేవాడు ఊరపిచ్చుక లా! అప్పట్లో  నేను ప్రతి పక్షినిగదా…అంచేత దానికి విరుద్ధముగా కడు సీరియస్ గా ఉండేవాణ్ణి. మాట్లాడుతుంటే అడుగడుగునా  కళ్ళు ‘మూసుకు’నేవాడు. నేను ప్రతి పక్షిని గావున తద్విరుద్ధముగా  కళ్ళు  ‘బార్లా తెరిచి’ చూచెడివాడిని. ఇటుల … అటువైపునుంచి  ఈ వైకల్యం ఏ…నా…డో  నాకంటుకొనగా … నేడేదో పిల్ల పక్షి నాయొవద్దకు వచ్చి గుడ్లురిమెదవేమీ గుడ్లురిమెదవేమీ యనుచు వ్యర్ధ ప్రేలాపముసేయుటెందులకు?” అంది గుడ్ల గూబ, గుయ్ మనేలా.

“ఇదిగో …నన్నేమయినా అను. ఊరుకుంటా. ఏలోకాలకో రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోయిన ఓ పెద్ద పక్షిని పట్టుకుని, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడకు. మెదడు పాక్షికంగా దెబ్బతింటుంది. ఇంగో నా శాపం! ” అంటూ  శాపం పెట్టింది ఫ్లెమింగో!

“ఛీ! జైలు పక్షిలా ఎంత అసయ్యంగా మాడుతున్నావ్? పడమట అస్తమించడానికి సిద్ధంగా ఉన్న  నీతో నోరు కలపడం నాదే తప్పు. అయినా నేను అర్జంటుగా అప్పుతెచ్చుకోడానికి  ఉత్తరానికి వెళ్లాల్సిన పనుంది. నిన్ను రేపటి ప్రత్యేక సమావేశంలో తూర్పార బడతాను. అప్పటివరకూ నువ్వు తక్షణమే  దక్షిణ దిశగా పో!” అంది గుడ్లగూబ అక్కడినుంచి ఎగరబోతూ!

“వామ్మో. నేనుకూడా తొందరగా వెళ్లకపోతే కొంప కొల్లేరు సరస్సయ్యేట్టుంది. పిల్ల పక్షులంతా సరిగ్గా తిని తొంగున్నారో లేక ఇంకేవైనా హడావిడి చేస్తున్నారో చూసొస్తా. అసలే ఎవరు స్వపక్షమో ఎవరు అక్కుపక్షమో తెలిసిచావడం లేదు. అది తెలుసుకుందామనుకున్న నా  అవిశ్వాసానికి విశ్వసనీయత లేకుండా వీగి పోయింది ” అంటూ ఉన్నపళంగా గాల్లోకి లేచింది ఫ్లెమింగో!

పెద్ద బంగాళా లాంటి చెట్టు గూటికి చేరి చూసుకునేసరికి అనుకున్నట్టే పిల్ల పక్షుల కిలకిలలు పెద్దెత్తున వినిపించాయి. అన్నీ కలిసి గానా బజానా చేసుకుంటున్నట్టుగా ఉంది. అంతే కాదు. అవిపాడుకునే పాట వినేసరికి తన ప్రతి రెక్కలోని ప్రతి ఈకా భయంతో నిక్కబొడుచుకుంది. మోడు బారబోతున్న చెట్టు సాక్షిగా గానాభజానాల  పాట జోరుగా సాగుతోంది.

“ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…… ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…”

$$$

 

 

 

 

 

 

ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో…

Kasepu

-అరణ్య కృష్ణ

~

 

“కాసేపు” అంటూ ఒక 22 సంవత్సరాల క్రితం  తీరైన కవిత్వం చెప్పి మళ్ళీ కనిపించకుండా పోయాడు వాసు.  అంత మంచి కవులు ఏదో కాసేపు – అంటే ఒక ఐదారేళ్ళ పాటు కవిత్వం చెప్పి మళ్ళీ కలం పట్టుకోక పోతే ఎలా?  అలాంటీ వాసుని పరిచయం చేయటం ఈ వ్యాసం ఉద్దేశ్యం.  1987 నుండి 1994 వరకు సుమారు 7 సంవత్సరాల కాలంలో కేవలం ఒక 15 కవితలు మాత్రమే రాసిన వాసు కవితల్లో అధిక భాగం “ఆంధ్రజ్యోతి” వారపత్రికలోనే ప్రింటయ్యాయంటే కవిగా అతని సత్తా ఏమిటో తెలుస్తుంది.  ఆయన తన కవితల సంకలనం “కాసేపు” 1994లో ముద్రించారు.  ఈ సంకలనం నగ్నమునికి అంకితమిచ్చారు.

అతి సరళమైన వ్యక్తీకరణలో భావోద్వేగాల జుగల్బందీ వినిపించటం వాసు ప్రత్యేకత.  ఈయన కవితలు పల్లెలోనూ, సంస్కృతిలోనూ లోతైన పునాదులు కలిగివుండి బతుకుతెరువుకి నగరానికి వచ్చిన అనంతరం  కోల్పోయింది పొందలేక, ఉన్నదాన్ని స్వంతం చేసుకోలేని ఒక అస్తిమిత మానసిక స్థితిని తెలియచెబుతాయి.  వాసు చెప్పినట్లు “కాలం ముందుకే పోతుంది/మనసు వెనక్కి కూడా పోగలదు”.  ముందుకురుకుతున్న కాలంకి వ్యతిరిక్తంగా బాల్యంలోకి, బాల్యంలో మాత్రమే ఆస్వాదించగల మానవ సంబంధాల పరిమళాల్లోకి కవి జారుకుంటాడు.  అలా జారుకున్నప్పుడే “సంప్రదాయానికి నమస్కారం” అన్న కవిత వస్తుంది.  ఈ కవిత శీర్షికలో లేని కవిత్వమంతా కవితలో వుంది.

“అది ఎగరటానికి రెక్కలక్కర్లేని వయసు

అనుక్షణం ఆనందం ఒక్కటే మనకి నేస్తం

నేస్తం కట్టడమే పసిపిల్లల చాదస్తం”

 

“తుపాకీ పేలిస్తే పువ్వులు రాలేవి

కన్నీళ్ళు పోస్తే నక్షత్రాలు మొలిచేవి”

 

ఇంతకంటే సరళంగా బాల్యాన్ని నిర్వచించటం ఎవరికైనా సాధ్యమా?  గడిచిపోయిన కాలాల్లోకి దూకి బతికిన క్షణాల్ని నెమరేసుంటాడు కవి అలా.  ఎందుకంటే “బాల్యానికి కాలం పట్టదు / బాల్య స్మృతులకు కాలదోషం పట్టదు”

“నాకూ చెట్టుకూ పెద్ద తేడా ఏముంది?

పండిన ఆకుల ముడతలతో

పువ్వుల కవళికలతో

చెట్టు నాకు అద్దం పడుతుంది

నడుస్తూ నేను చెట్టుకు కదలికనవుతాను

వేళ్ళు భూమిలో పాతుకుపోయి

కదలలేని శక్తిహీన ఈ చెట్టు

కాళ్ళు కదపగలిగీ శక్తిహీనుణ్ణి నేను”

 

“చెట్టుతో సంభాషణ అనవసరం

చెట్టు దగ్గర దాపరికం అసాధ్యం”

 

“ఎవరో చెట్టుకున్నవన్నీ వొలిచేసి

మోకాళ్ళ మీద కూచోబెట్టారు”

 

“చెట్టూ చిగురిస్తుంది

చెట్టులా నిలిచిపోవటానికి

చెట్టంత ప్రయత్నం చేస్తూ” (ఎర్రగన్నేరు)

వాసులోని అనుభూతి కవితాధోరణికి అద్దం పట్టే కవిత ఇది.  మానవజీవితంలోని రకరకాల అనుభూతులన్నింటినీ చెట్టులో చూడగలిగిన కవి తన కవితా వస్తువుతో ఎంతగా తాదాత్మ్యీకరణం చెందగలడో ఈ కవిత నిరూపిస్తుంది.  పాఠకుడి మనసులో ముసురు పట్టించగల కవిత ఇది.

“ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో

రాత్రి ఒక్కణ్నీ మేల్కొని కూర్చుంటాను” అంటూ మొదలయ్యే “జననం” కవిత ఏకాంతాల చుట్టూ ఏర్పడే ప్రాకారాల్ని, తొలి కదలిక కోసం చేసే నిరీక్షణని వివరిస్తూ

“అసహనం చీకట్లో అనంతంగా పెరిగిపోయి

జిరాఫీ మెడలో కొండ చిలువ వొళ్ళు విరుచుకున్నప్పుడు

రాత్రిని ఉషస్సు జయిస్తుంది

టేబుల్ మీద మహా ప్రస్థానం

నన్ను కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పిస్తుంది” అంటూ ముగుస్తుంది.  జిరాఫీ దేహం మీద ప్రాకృతిక డిజైన్ని అసహనంతో వొళ్ళు విరుచుకుంటున్న కొండ చిలువ తో పోల్చటం కవి నిర్నిబంధ ఊహాశక్తికి అద్దం పడుతుంది.  టబుల్ మీద మహా ప్రస్థానం తనని కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పించటమే కవితా జననం.

పరాయి నగరంలో ఏదో ఒక రూంలో ఒంటరిగా బతికే బ్రహ్మచారి జీవితమో సంక్లిష్ట దశ.  కొంత విచిత్రంగానూ ఉంటుంది. పుస్తకాలు చదువుతూ, సిగరెట్లు ఊదిపడేస్తూ, బద్ధకంగా బతికేస్తూ….గొప్ప విచిత్రంగా ఉంటుంది.  రూం తాళం తీసుకుంటూ లోపలికెళ్ళిన ప్రతిసారి బహుళత్వాన్ని తలుపు బైటనే వదిలేసి లోపలికి  మళ్ళీ బైటకి వొచ్చేవరకు ఏకాత్మతో ఒక గొప్ప ఏకాంకిక నడుస్తుందిలే! అది అనుభవించినవాడికే తెలుస్తుంది (“అనుభవించిన వాడికే” అని ఎందుకన్నానంటే ఆడపిల్లలంత బుద్ధిగా మగపిల్లలుండరుగా రూముల్లో).  రూంలోని ఏకాంతంలోనే కవి తన సజీవతని, నిర్జీవితనీ కనుగొన్నాడు. మళ్ళీ రూంనుండి బైటకొచ్చినప్పుడెలా వుంటుంది మరి?

“నేను రూం బైట నిలబడి

తాళం వేస్తూ గడప మీద నించుంటే

ఆ దృశ్యం ఉబ్బిన పుట్టుమచ్చలోంచి

వెంట్రుక బైటపడుతున్నట్లుంటుంది”

మనసులోని సంక్లిష్టతని వివరించటానికి “ఉబ్బిన పుట్టుమచ్చలోంచి వెంట్రుక బైటపడటం”ని మించిన ప్రభావవంతమైన ప్రతీక ఏమన్నా వుంటుందా ప్రియ పాఠకులారా?

వాసు రాసిన మరో కవిత “కూల్ డ్రింక్ పార్లర్లో…..” పొద్దుట్నుండి రాత్రివరకు కూల్ డ్రింక్ పార్లర్లో పని చేసే బాల కార్మికుడి జీవన వ్యధార్తి దృశ్యం ఈ కవిత వస్తువు.  1988లో రాసిన ఈ కవిత ఇటువంటి వృత్తిగతమైన విచలిత దృశ్యాల్ని ఆవిష్కరించే కవితలకి నాంది అని నౌదూరి మూర్తిగారు అభిప్రాయపడ్డారు.  తల్లెత్తకుండా రబ్బరు సంచీలో ఐసుముక్కలేసి కర్ర సుత్తితో ముక్కలు చేసుకుంటూ పోయి ఎండిపోయిన ఐస్ కుర్రాడి కళ్ళల్లో స్వప్నసీమల కోసం కవి అన్వేషిస్తాడు.

“వాడలా వున్నప్పుడు

వాడలా వుండి పోవాలనుకున్నప్పుడు

రెండు ఐస్ తునకలు కంట్లో పడి

కళ్ళల్లో ఐస్ మేఘాలు కరిగి

వాడి చెంపల మీదుగా హిమవాహినీ చారికల్ని గీసి

కింద పడిపోతాయి”

“వాడి జీవితం చాలనంత మంచు

వాడి భవిష్యత్తులో వుంది”

ఎవరికైనా నోస్టాల్జియాలో జ్వరం రావటం ఖచ్చితంగా ఉంటుంది.  జ్వరం ఒక తియ్యని బాధ.  జ్వరం వచ్చినప్పుడు మీరు చాలా ప్రత్యేకం.  రోజూ మీతో పోట్లాడే వారికి మీ మీద అనురాగం చూపించే ఒక గొప్ప అవకాశం.  ఆ జ్వర తీవ్రతని కవి ఎలా వివరిస్తాడో చూడండి-

“దేహం పక్క మీదకి వాలగానే

నెత్తుర్లో మంచు ముక్కలు తేల్తాయి

ఉడుకు తగ్గిన నెత్తురు

చేతులోంచి వేళ్ళలోకి ప్రవహిస్తుంది

దట్టమైన అరణ్యంలో కొమ్మల్ని చీలుస్తూ

పాయలై తెగిన వెన్నెల్లాగ”

కానీ కవి అన్నట్లే “జ్వరమూ తరుచుగా రాదు”. అయ్యో కదా!

“లెక్క తెగట్లేదు” వాసు అత్యుత్తమ కవితల్లో ఒకటి.  తనకి లెక్కలు బాగా వివరించి చెప్పే మిత్రుడు నాయుణ్ని ఉద్దేశిస్తూ చెప్పిన కవిత ఇది.

“అప్పుడు నువ్వేం చెప్పే వాడివో!

నీ వెనుక నడుస్తూ నేనేం వినేవాడ్నో!

ఒక సముద్ర శాఖ దూసుకొచ్చి

ఒడ్డుని చీపురు కట్టలా ఊడ్చేసి

అఖండ భూభాగం చీలిపోవడం చెప్పేవాడివి

బతుకుతెరువు తోడలై

సరళ జీవన కాంక్షా కురంగాన్ని పట్టుకోవడానికి

పూలమొక్కల వెనక పొంచున్న సంగతి చెప్పేవాడివి”

తనకింత చెప్పిన నాయుడితో కవి చివర్లో ఏమంటున్నాడో వినండి.

“ఇవాళ నేను ఆ పాటలే వింటూ అవే లెక్కలు చేస్తున్నా!

లెక్క తెగట్లేదు నాయుడూ”

 

జీవితం ఎప్పుడూ తెగని లెక్కే. నిజానికి లెక్క తెగితే మాత్రం జీవితంలో మజా ఏముంటుంది?  మృత్యువు లోని అనూహ్యతే కదా జీవితం మీద ఆసక్తిని పెంచేది.  జీవితం లెక్క శాశ్వతంగా తెగేది మృత్యువుతోనే మరి.  అందుకే లెక్క తెగకపోవటమే ఆసక్తికరం.

మరికొన్ని మంచి కవితలతో పాటు ఇంకొన్ని అనువాద కవితలు కూడా “కాసేపు”లో కనిపిస్తాయి.  కాసేపట్లోనే చదవటం పూర్తయ్యే ఈ సంకలనం చాలాకాలం మీ మనసులో వుంటుంది. చదవండి. నిజానికి వాసు కవిత్వం చదువుకుపోవాల్సిన కవిత్వం.  ఈ పరిచయం కేవలం నామమాత్రమే. అదికూడా ఎందుకంటే వాసు కవిత్వాన్ని ఈ తరానికి పరిచయం చేయటంతో పాటుగా వాసుకూడా తానొకప్పుడు కవినేనన్న విషయం గుర్తు చేయటం కోసం, మళ్ళీ కవిత్వం వైపు పురికొల్పటం కోసం!

*

మగవాడు – ఆడది

 

ఉర్దు మూలం: ‘మర్ద్ ఔర్ ఔరత్’  డాక్టర్ రషీద్ జహాన్ (1905-52)

ఆంగ్ల సేత : రక్షందా జలీల్

తెలుగు సేత : జగద్ధాత్రి

~

ఆడది: అరె నువ్వు మళ్ళీ వచ్చావా?

మగవాడు : అవును

ఆ: కానీ నిన్న నీ పెళ్లి కదా?

మ: అవును

ఆ: అయితే?

మ: అయితే ఏంటి ?

ఆ: అంటే పెళ్లికూతురు ఏదీ అని?

మ: నా జీవితం నాశనమవ్వాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా.

ఆ: నేనలాంటి మాట ఎప్పుడు అన్నాను?

మ: అయితే నన్ను ఇంత కష్టపెట్టడం లో నీ ఉద్దేశం ఏమిటి?

ఆ: అంటే అర్ధం ?

మ: ఎందుకలా నటిస్తావు? నేనంటున్నదాని అర్ధం నీకు ఖచ్చితంగా తెలుసు

ఆ: అలాగా. కానీ నేను ఏడాది క్రితం నుండే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాదంటున్నది నువ్వే.

మ: ఓహ్! అంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నవన్నమాట? అయితే మరి నీ ఉద్యోగం సంగతి?

ఆ: అదీ ఉంటుంది

మ: కానీ నా భార్య మరొకరి దగ్గర పని చేయడం నేను సహించలేను. ఇల్లు , పిల్లలు చూసుకోకుండా పొద్దున్నే ఇల్లొదిలి వెళ్ళడం నాకు నచ్చదు.

ఆ: నువ్వు మాత్రం పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లవా? నేను మాత్రం ఇంట్లో కూర్చుని ఈగలు తోలాలా?

మ: ఇంట్లో చేయడానికి చాలా పనులుంటాయి, ఇల్లు చక్కపెట్టుకోవడం లాంటివి ఇంకా కూడా.

ఆ: సరే …. అయితే నువ్వు ఆఫీసుకి వెళ్ళిన సమయమంతా నేను ఇంటి మూలలన్నీ చూస్తూ ఉండాలన్నమాట.

మ: నేను అలా అనలేదు. కానీ ఇంట్లో చేయడానికి చాలా పని ఉంటుంది అన్నాను.

ఆ: అంటే ఎలాంటిది?

మ: ఇదిగో చూడు , ఇల్లు చక్కపెట్టుకోవడం … ఐనా మన అమ్మలందరూ చేసిందే కదా , ఏం చేయలేదా చెప్పు?

ఆ: ఓ అంటే నువ్వానేదాని అర్ధం ఇంట్లో పొయ్యి అరకూడదని అంతేనా?

మ: నేను ఆ మాట అనలేదు.

ఆ: అయితే మరి ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అర్ధం ఏమిటి ?

మ:ఇదిగో చూడు , నాకు తెలీదు. నిన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి  నా మీద విసురువెయ్యడం నీకు బాగా అలవాటైపోయింది.

ఆ: సరే , నీకు నా గొంతు వినడం ఇష్టం లేకపోతే , నేను మౌనంగానే ఉంటాను… చెప్పు ఇంతకీ , నువ్వు నిజoగానే పెళ్లి చేసుకుంటున్నావా లేక నన్ను మెప్పించడానికి అంటున్నావా ?

మ: ఏదో ఒక రోజు పెళ్లి తప్పక చేసుకుని తీరతాను; అక్కడికి నువ్వొక్కర్తెవే ఈ ప్రపంచం లో ఆడదానివి కావు. ఐనా చెప్పు , నా గురించి నీకెందుకంత బాధ?

ఆ: ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను గనుక.

మ: భలే బాగా చెప్పావ్! నువ్వేగనుక నన్ను నిజంగా ప్రేమించి ఉంటే ఇంత మొండి పట్టుదలతో వాదించి ఉండేదానివా? …’నేను ఉద్యోగం వదలను’…. ఆఫ్టర్ ఆల్ ఏముంది ఆ ఉద్యోగం లో గొప్పతనం? అదేదో వెయ్యి రూపాయలు సంపాదిస్తోన్నట్టు .. ఇంతా జేసి సంపాయించేది వంద రూపాయలు అంతకంటే లేదు.

ఆ: అయితే అవ్వచ్చు , కానీ ఆ కొద్ది సంపాదనే నా స్వేచ్చకి తాళం చెవి లాంటివి.

మ: అంటే నీ అర్ధం నీ స్వేచ్చ అంతా ఒక వంద రూపాయల్లో ఉందనా ?

ఆ: వందా, రెండొందలా… అది కాదు ఇక్కడ విషయం. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగల శక్తి కలిగి ఉండటమే నీ స్వాతంత్ర్యానికి నిదర్శనం.

మ: నీకస్సలు నా మీద ఏమాత్రం నమ్మకం లేనట్టుందే. నీకు నేను డబ్బులు ఇవ్వనని అనుకుంటున్నావా?

ఆ: అది కానే కాదు , కానీ అది నా కష్టార్జితం అవ్వదుగా.

మ: ఎవరు సంపాదిస్తే ఏముంది… మగవాడో ఆడదో

ఆ: ఓహ్! అందులో  తప్పకుండా చాలా పెద్ద తేడా ఉంది. నువ్వు ఆ పాత పల్లెపదం వినే వుంటావుగా : మగపిచ్చుక ఒక బియ్యం గింజ తెచ్చింది, ఆడ పిచ్చుక ఒక పప్పు గింజ తెచ్చింది , రెండు కలిపి ఖిచిడి (పులగం) వండుకున్నారు అని.

Akkadi-MeghamFeatured-300x146

మ: నాకు నీ పప్పు బద్ద అక్కర్లేదు.

ఆ: నేను ఒట్టి అన్నం తినలేను.

మ: నిజమే నీకు పచ్చడి, అప్పడం, ఊరగాయాలూ కావాలి.

ఆ: నిజమే నాకు కావాలి

మ : ఎప్పుడు నిన్ను చూసినా నీ చుట్టూ నీ ఆరాధకులు మందలా చుట్టి ముట్టి ఉంటారు – దీపం చుట్టూ రెక్క పురుగుల్లాగా.

ఆ: నిజమే మరి , నువ్వు వాళ్ళని ఇంట్లోకి రానివ్వవుగా

మ: అస్సలు రానివ్వను

మ: కానీ వాళ్ళంతా నా స్నేహితులని నీకు తెలుసు

మ: అవును , మరే , చాలా దగ్గర స్నేహితులు

ఆ: అంటే దానర్ధం , వాళ్ళు వచ్చి నన్ను కలుసుకోవడానికి వీలు లేదనేగా?

మ: నాకు వాళ్ళంటే అసహ్యం

ఆ: ఎందుకో అడగవచ్చా?

మ: ప్రతి వారికి ఎవరి స్వభావం వారికి ఉంటుంది

ఆ: అయితే మరి నన్ను పర్దాలో కూర్చునేలా ఎందుకు చెయ్యవు?

మ: అలా చేయాలనే ఉంది నాకు , కానీ నువ్వు ఒప్పుకుంటావా?

ఆ: అంతేకాదు ఇంకా చాలా విషయాలున్నాయ్ నేను నీతో అంగీకరించనివి.

మ: ఏమైనా .. మిగిలినవి నువ్వు అంగీకరించినా అంగీకరించక పోయినా సరే , కానీ నీ మిత్ర మందని మాత్రం నేను భరించలేను.

ఆ: అయితే మరెవరు మన  ఇంటికి రావడానికి ఒప్పుకుంటావు?

మ: కేవలం మనిద్దరికి చెందిన మిత్రులు మాత్రమే.

ఆ: హ్మ్మ. మిస్టర్ అండ్ మిసెస్ సేథీ, మిస్టర్ సఫ్దర్.

మ: ఎందుకు? వాళ్లెందుకు రాకూడదు?

ఆ: కానీ నేను వాళ్ళని భరించలేనే

మ: కానీ ఎందుకని? ఎందుకు నీకు వాళ్ళంటే అయిష్టం?

ఆ: అదంతే.

మ: ఏదో కారణం ఉండాలి కదా

ఆ: ప్రతి ఒక్కరికీ వారివారి ఇష్టాలుంటాయి మరి

మ: మరీ చిన్న పిల్లలా మాటాడుతున్నావ్

ఆ: మరి నువ్వో?

మ: నేనెప్పుడూ సరయిన పద్ధతిలోనే సహేతుకంగానే మాటాడుతాను.

ఆ: అవును , నిజమే నువ్వాలాగే చేస్తావు. నీ వాదన ప్రకారం , నీకు నా స్నేహితులంటే ద్వేషం కాబట్టి వాళ్ళు మనింటికి రాకూడదు, కానీ నేను నీ స్నేహితుల్ని అసహ్యించుకుంటే …. ఏమి బాలేదిది! వాళ్ళు నిరభ్యంతరంగా వస్తో వెళ్తుండవచ్చును.

మ: సరే సరే బీబీ సహేబా, ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి అలసి పోయి నేను ఇంటికి వస్తే , ఏదో ఒక క్షణం భార్య తో  ఆనందంగా గడపాలనుకుంటే , ఆవిడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికి వస్తుంది. అయితే ఇదన్న మాట నీ మనసులో ఉన్న ఆలోచన  వైవాహిక జీవితమంటే?

ఆ: నీ మనసులో పెళ్ళైన తర్వాత జీవితం గురించి ఏమి ఆలోచన ఉందో నేను తెలుసుకోవచ్చా ? ఉదయాన్నే నువ్వు ఉద్యోగానికి వెళుతుంటే , భార్య మిమ్మల్ని చక్కగా ముస్తాబు చేసి పంపాలి …బొమ్మలా! ఆ తర్వాత తమరు వెళ్ళిన తర్వాత , ఇంట్లోనే ఉండి జపమాల తిప్పుకుంటూ తమరి జపమే చేస్తూ ఇంటి పనంతా చేసుకోవాలి. ఈ రకమైన బలవంతపు ఖైదుని ‘ఇల్లు చక్కదిద్దుకోవడం’ అంటారు. మీరు ఆఫీసునుండి అలసి సొలసి , చిరాకుతో రాగానే , మీ భార్య మిమ్మల్ని అలరించాలి , ఆ తర్వాత సఫ్దర్ సాహిబ్ కి , మిసెస్ సేథీకి కూడా మర్యాద చేయాలి.

మ: నేనలా ఏమీ అనలేదు

ఆ: అయితే ఏమిటి నువ్వన్నది?

మ: నేనన్నది అందరి ఆడవారి లాగే నువ్వు ఇంట్లో ఉంది ఇల్లు చూసుకోవాలి ……

ఆ: మళ్ళీ అదే మాట ‘ఇల్లు చూసుకోవడం’?

మ: అవును ఇల్లు కనిపెట్టుకుని ఉండటం

ఆ: నా ఉద్యోగాన్ని వదిలి నా స్వాతంత్ర్యాన్ని నేను అమ్ముకోలేను.

మ: నీ స్వాతంత్ర్యమా ?

ఆ: అవును , నా స్వేచ్ఛే

మ: అలా అయితే ! నువ్వు నీ స్వేచ్చని హాయిగా పెద్ద గుటకలు వేస్తూ అనుభవిస్తోంటే , నీ పిల్లల బాధ పడతారు.

ఆ: పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టెయ్యరు కదా

మ: ఏదో  ఒక రోజు పుడతారు కదా , దానికీ నీ అభ్యంతరం లేకపోతేనేగా

ఆ: లేదు నాకే అభ్యంతరం లేదు

మ: పోనీ పిల్లలు పుట్టాక ఐనా నీ ఉద్యోగాన్ని వదులుతావా?

ఆ: లేదు, అప్పుడు కూడా వదలను

మ: అయితే మరి ఒక్క విషయం అడగనా , పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?

ఆ: నువ్వు , నేను కలిసి

మ: ఒక ఆడదాని మొదటి బాధ్యత పిల్లల్ని పెంచడం

ఆ: ఒక మగాడి మొదటి బాధ్యత పిల్లల్ని కనడానికి అర్హత కలిగి ఉండడం

మ: ఏమంటున్నావ్ నువ్వు ?

ఆ: నేననేది ఎప్పుడు ఆడదే పిల్లల్ని ఎందుకు పెంచాలని ఆజ్ఞాపిస్తారు , ఇంతకీ పిల్లలు ఎవరికి చెందుతారు ?

మ: తండ్రికి

ఆ: అయితే మరి నేను ఎందుకు పెంచాలి? ఎవరికి వాళ్ళు స్వంతమో వాళ్ళే పెంచాలి

మ: మరీ విడ్డూరమైన మాటలు చెప్తావు నువ్వు !

ఆ: ఇందులో విడ్డూరం ఏముంది ?

మ: ఇందులో వింత ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు పిల్లల్ని కూడా పెంచడానికి ఒప్పుకోవడం లేదు కదా

ఆ: నేను ఒప్పుకుంటానో ఒప్పుకోనో , కానీ నువ్వు మాత్రం ఒప్పుకోలేదుకదా

మ: నా పని పిల్లల్ని పెంచడం కాదు , డబ్బు సంపాదించడం

ఆ: నేనూ డబ్బు గడిస్తాను

మ: హ్మ్మ… ఒక్క వంద రూపాయలకేనా ఇంత మిడిసిపాటు! ఇంకొంచం ఎక్కువ సంపాదిస్తే ఇక ఎంత గోల చేసి ఉందువో  ఆ భగవంతుడికే తెలియాలి

ఆ: ఆల్రైట్ , పోనీ వాదన కోసమైనా ఒక సారి ఊహించు , నీ జీతం వంద రూపాయలయి, నా జీతం ఎనిమిది వందలుంటే, ఎవరు ఉద్యోగం వదిలేయలి, నువ్వా నేనా?

మ: నువ్వు

ఆ: ఎందుకని?

మ: ఎందుకంటే నేను మగాడిని కనుక

ఆ: అంటే ఏ సందర్భం లోనైనా నిన్ను నువ్వే అధికుడిని అనుకుంటావన్న మాట ?

మ: నేనొక్కడినే అలా అనుకోవడం లేదు ; ఈ విశ్వమే నన్ను అధికుడిగా సృష్టించింది

ఆ: నువ్వు నాకంటే ఏమీ గొప్ప అని నేను అనుకోవడం లేదు. నిన్ను రేయింబవళ్లూ పూజించే ఆడదాన్ని కట్టుకోవాలి నువ్వు

మ: అవును అలాగే చేసుకుంటాను. ప్రపంచం లోఉన్న ఆడదానివి నువ్వొక్కత్తెవే కాదు కదా

ఆ: అయితే వెళ్ళు , నీ దారిన నీవెళ్లు. రోజూ నా దగ్గరికి వచ్చి నన్నెందుకు విసిగిస్తావు?

మ: ( ఒక క్షణం మౌనం తర్వాత) ప్రేమంటే నువ్విచ్చే విలువ ఇదేనన్నమాట

ఆ: నువ్వూ అంతేగా

మ: (మరొక్క క్షణం మౌనం తర్వాత) అయితే చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను?

ఆ: నువ్వెప్పుడంటే అప్పుడే , కానీ నా ఉద్యోగం మాత్రం వదులుకోను.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కథలో మాండలికం ఎంత వరకూ?!

 

-టి. చంద్రశేఖర రెడ్డి

~

ఈ వ్యాసం-విభిన్న మాండలికాల్లో తెలుగు కథలు రాయటం గురించి.

ఒకప్పుడు కథలు గ్రాంథిక వచనంలో రాయబడేవి. తర్వాత అవి వ్యావహారిక భాషలో రావటం మొదలైంది. అడపాదడపా ఆ దశలోనే కథలు మాండలికంలో రావటం కూడా ఆరంభమైంది. ఈ ధోరణి ఊపందుకని ఇప్పుడు చాలా కథలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భిన్నప్రాంతాల మాండలికాల్లో వస్తున్నాయి. తెలంగాణా, రాయలసీమ, కోస్తా జిల్లాల మాండలికంలో; దాంతో పాటు ఇంతకు ముందు ఉపయోగించిన వ్యావహారిక భాషలో; ఆయా ప్రాంతపు రచయితల కలాలనుంచి కథలు జాలువారుతున్నాయి. ఈ ధోరణిలో స్పష్టంగా కనపడే విషయం-ఒక ప్రాంతపు రచయితలు, వాళ్ల కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలోనే రాయకుండా, ఒకప్పుడు విస్తృతంగా ఉపయోగంలో ఉన్న వ్యావహారికభాషలో సైతం రాయటం.

కథ రెండు భాగాలుగా చెప్పబడుతుంది. కథకి సంబంధించిన నేపథ్యం, ప్రస్తుత పరిస్థితులూ, పరిసరాలూ మొదలైనవి ఒక భాగం. రెండో భాగం పాత్రల మధ్య సంభాషణ.

కొంతమంది రచయితలు, కథలో రెండు భాగాలనీ అంటే మొత్తం కథని; వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాస్తున్నారు. ఉదాహరణకు కె. ఎన్. మల్లీశ్వరి గారి కథ “టెంకిజెల్ల”(ఆదివారం వార్త, 2 అక్టోబర్ 2011; కథ 2011 కథా సంకలనం), కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె  సుక్క’ (బతుకమ్మ,3 ఆగస్ట్ 2014, ప్రాతినిధ్య 2014 కథా సంకలనం), స. వెం. రమేశ్ గారి కథ ‘పాంచాలమ్మ పాట’ (విశాలాక్షి అక్టోబర్ 2014-ప్రాతినిధ్య 2014 కథా సంకలనం).

కొంతమంది రచయితలు పాత్రల సంభాషణని మాత్రమే వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాసి, మిగిలిన కథని; పైన చెప్పిన వ్యావహారికభాషలో రాస్తున్నారు. ఉదాహరణ-బెజ్జారపు రవీందర్ గారు రాసిన ‘మూడు తొవ్వలు’ కథ (ఆదివారం ఆంధ్ర జ్యోతి 23 అక్టోబర్ 2011, కథ 2011 కథా సంకలనం).

కొన్ని మాండలికాల్లో,  ఒక ప్రాంతపు వాళ్లకి తెలిసిన పదాలు, కొంచెం మార్పుతో మిగిలిన ప్రాంతాల్లో సైతం వాడబడతాయి. అలాంటి పదాల్ని ఏ మాండలికంలో రాసినా, ఆ మాండలికంతో పరిచయం లేని  పాఠకులు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. దీనికి కారణం, ప్రాథమికంగా వాళ్లకు పరిచయమున్న పదమే, ఉచ్ఛారణ పరంగా కొంత మార్పుకు లోనయి కథలో కనబడటం.

ఉదాహరణకు-చెప్పాడు అనే పదం. ఇది- చెప్పిండు, చెప్పినాడు గా మిగిలిన ప్రాంతాల్లో వాడబడుతోంది. దీని వలన చెప్పాడు అనే పదంతో పరిచయం ఉన్న  పాఠకుడు; చెప్పిండు, చెప్పినాడు పదాల విషయంలో చదవటానికి కానీ, అర్థం చేసుకోవటానికి కానీ ఎలాంటి అసౌకర్యానికీ గురి కాడు.   కాని, కొన్ని పదాలు పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితం. పాంచాలమ్మ పాట కథలో ఉపయోగించబడ్డ- బడిమి, ఇడవలి, అడిమ లాంటివి.

ఏ కథలో అయినా తెలిసిన పదాలని చదవడం, అవి చదవగానే అర్థం అవుతుంటే ముందుకు సాగడం సులభం. కారణం, ఉచ్ఛారణపరంగానైనా, అవగాహనపరంగా అయినా ఆ పదాలు తెలిసిన వాళ్లకి కథని అవగాహన చేసుకోవడంలో అవరోధాలు అనిపించవు కనక. నిజం చెప్పాలంటే ‘టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’,  ‘పాంచాలమ్మ పాట’ కథలతో పోల్చుకుంటే ‘మూడు తొవ్వలు’ కథ నేను నాకున్న పరిమిత తెలుగు భాషా జ్ఞానంతో ఎక్కువ సౌకర్యవంతంగా చదవగలిగాను. కారణం-అందులో కథనం నాకు తెలిసిన భాషలో ఉండి, సంభాషణల వరకు మాత్రమే, సంబంధించిన పాత్రలు వాటి మాండలికంలో మాట్లాడుకున్నట్లు రచయిత రాయటం.

కథ చదవటం వేరు, కథని అర్థం చేసుకోవటం వేరు, కథని అనుభవించటం వేరు. టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’, ‘పాంచాలమ్మ పాట’ కథలు, పూర్తిగా ఆయా ప్రాంతపు మాండలికాల్లో రాయటం వల్ల, వాటిల్లో ఎంత చదివించే గుణం ఉన్నా; చాలా పదాలకి అర్థం తెలియక పోవటం వలన నేను పట్టిపట్టి చదవాల్సి వచ్చింది. దీని వల్ల నేను ఆ కథలని చదవటం వరకే పరిమితమయ్యానని అనిపించింది. అర్థం చేసుకోవటం, అనుభూతిని పొందటం విషయంలో నన్ను నేను పూర్తిగా సంతృప్తి పరుచుకోలేక పోయినట్లుగా కనిపించింది.

బహుశా ఈ అనివార్య పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను-కొన్ని కథల చివర, ఆ కథలో ఉపయోగించబడ్డ ఏ పదాలైతే మిగిలిన ప్రాంతాల పాఠకులకి తెలియటానికి అవకాశం లేనివని అనిపిస్తున్నాయో వాటి పట్టిక, అర్థాలతో  ఇస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ పట్టిక, కొన్ని కారణాల వల్ల ఇవ్వబడిన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలమవుతోంది. ఎలాగంటే-

పాంచాలమ్మ పాట కథలో నాకు తెలియని పదాలు 97.   ప్రాతినిధ్య 2014 కథా సంకలనంలో ఈ కథ క్రింద, ఆ కథలో వాడబడిన మాండలిక పదాల పట్టిక వాటి అర్థాలతో ఇవ్వలేదు. అప్పటికీ ‘శబ్దార్థ చంద్రిక’ ని సంప్రదించి దడము, అలమట, కయ్య అనే పదాల అర్థం తెలుసుకుని ఆ పదాలను వాడిన సందర్భాలను అవగాహన చేసుకోగలిగాను. కాని. నిఘంటువులొ సైతం లేని అడిమ లాంటి పదాల విషయంలో ఏమీ చెయ్యలేకపోయాను. ఆ పదం నిఘంటువులో  చేర్చబడక పోవటానికి కారణం-నిఘంటువులో ఉన్న విధంగా రచయిత ఆ పదాన్ని రాయకపోవటమా? రాసినా అది ముద్రారాక్షసచర్యలకి గురి కావటమా? తెలుసుకోలేక పోయాను. వెలుతురు ప్రసరించాల్సిన సందర్భంలో ఇలా కొన్ని పదాలు, వాటి పెదాలు విప్పకపోవటం వలన అవగాహనారాహిత్యపు అంధకారంలో  చిక్కుకుపోయాను.

టెంకి జెల్ల కథలో నాకు తెలియని పదాలు 41 ఉన్నాయి.  అందులో 20 పదాలకు మాత్రమే, కథ 2011 సంకలనంలో కథ చివర అర్థం ఇవ్వబడింది. అందులో ఒకే అర్థం వచ్చే పదాలు 12 ఉన్నాయి.  మిగిలిన తొమ్మిది పదాల అర్థం తెలుసుకోవటానికి శ్రమించాల్సి వచ్చింది.  ఇది కాక, ఈ కథ విషయంలో నాకు ఇంకొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కథకి పేరుగా పెట్టబడిన ‘టెంకి జెల్ల’ పదానికే అర్థం తెలియలేదు. జెల్లకాయ అంటే చెంప దెబ్బ అని, నిఘంటువు చెపుతోంది. టెంకిజెల్లకి అర్థం కనపడలేదు. కథ చివర అర్థం ఇవ్వబడిన మాండలికాల్లో; జాకర్లు, కమ్మగట్టడం అనే పదాలు ఉన్నాయి. కానీ, ఆ పదాలు కథలో ఎక్కడా కనపడలేదు. నబవరులు అనే పదం కూడా ఇచ్చారు. కానీ కథలో సబవరులు అనే పదం మాత్రమే ఉంది. రెండిట్లో ఏది ముద్రణా దోషమో తెలియ లేదు.  గత్తర-అంటే ‘చెత్త’ అని అర్థం ఇచ్చారు. నాకు తెలిసి ఆ పదం అర్థం ‘ఉపద్రవం’. తెలుగు నిఘంటువు కూడా అర్థం అదే చెపుతోంది. పట్టికలో ఇచ్చిన ‘చెత్త’ అనే అర్థం, కథలో ఆ పదం వాడబడిన సందర్భంలో సరిగా ఇమడలేదు.

దీన్ని బట్టి అనిపించిందేమిటంటే- ఆ కథలో మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియనివనుకుని  పదాల పట్టిక తయారు చేసినవాళ్లు, అన్ని ప్రాంతాల పాఠకుల భాషాజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ పట్టికని తయారించలేదని.

నేను ఆ కథ చదివిన సంకలనంలో కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె సుక్క’ చివర కూడా; పాఠకుడికి తెలియని పదాలూ, వాటి అర్థాలూ ఇవ్వబడలేదు. అయినా, కథలో వాడిన భాష; ఉద్యోగరీత్యా నేను కొన్ని సంవత్సరాలు నివసించిన ‘మహబూబ్ నగర్’ జిల్లాది కావటం వలన కథలో నాకు తెలియని పదాలు తక్కువగా ఉన్నాయి.  మిగిలిన తెలియని పదాల అర్థాలు కూడా, రచయితకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. కాని, ఒక ప్రాంతపు మాండలికాన్ని అర్థం చేసుకోవటానికి, అలా ఆ ప్రాంతంలో నివసించి ఉండటం అనే అవకాశం అందరికీ దొరకనిది.

నేననుకోవటం-‘పాఠకుడికి తెలియని పదాలు’ అన్నది ఒక అయోమయానికి గురి చేసే పదసమూహమని.   ఎందుకంటే, ఆ పదాలని, కథ రాసిన రచయిత గుర్తిస్తే, ఆ పట్టిక అసంపూర్ణంగా ఉండే అవకాశం ఎక్కువ.  టెంకి జెల్ల-కథ చివర్లో ఇచ్చిన పట్టిక, దీనికి దృష్టాంతం. వాస్తవానికి, ఒక ప్రాంతంలో వాడే పదాల్లో, మిగిలిన ప్రాంతానికి తెలియని పదాలు; ఆ మిగిలిన ప్రాంతాల వాళ్లే నూటికి నూరు శాతం గుర్తించగలరు. అలా గుర్తించబడిన పదాలకు, అసలు కథా రచయిత ద్వారా అర్థాలు చెప్పిస్తే ఆ పట్టిక తనకు నిర్దేశించిన పనిని నిర్దిష్టంగా చేయగలదు. అలా కాకుండా, ఏ కథ చివర ఏ కథారచయితయినా తానే తయారు చేసి ఒక పట్టిక ఇస్తే, అది ‘కంటి తుడుపే’ కాగలదు.

కథని చదవడం పాఠకుడిగా నాకు నేనై నా భుజాల మీద ఎత్తుకున్న బాధ్యత కనక, అది ఏ రూపంలో ఉన్నా చదవడం నాకు అవసరం. ఏ  కథలో పాత్రలు ఐనా ఒక ప్రాంతపు జీవితాల్లోంచి తీసుకోబడినపుడు, ఆ పాత్రలు ఆ ప్రాంతపు భాషలో మాట్లాడటం సహజం. కథకుడు, ఆ పాత్రల సంభాషణని ఆ ప్రాంతపు భాషలో వ్రాయటం కూడా సముచితం. కాని, సంభాషణలు కాక మిగిలిన కథంతా అదే భాషలో ఉండటం అవసరమా?

అవసరమే అని అలాంటి కథా రచయితలు విశ్వసిస్తే, ఒక ప్రాంతపు జీవితాల్ని  మిగిలిన ప్రాంతాల వాళ్లకి ఆ రచయితలు సంపూర్తిగా పరిచయం చేయాలనుకుంటే, ఆ ప్రాంతపు భాషలో మిగిలిన ప్రాంతాల వాళ్లకి తెలియటానికి అవకాశం లేని పదాలన్నిటినీ ఆ కథతో పాటు విధిగా పరిచయం చెయ్యాలి. అప్పుడే రకరకాల ప్రాంతాల మాండలికాల్లో రాసిన కథలని; తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల పాఠకులు అర్థం చేసుకోగలరు. సరైన అనుభూతి పొందగలరు. అది సమగ్రంగా జరగనంతవరకూ, కొన్ని కథలు నాలాంటివాళ్లకి అసమగ్రంగానే అర్థమవుతాయి. అసంతృప్తిని మిగులుస్తాయి.

నా దృష్టిలో ఈ సమస్యకి పరిష్కారం: కథ అర్థం కాని, చేసుకోలేని పాఠకుల చేతుల్లో లేదు. కొంత కథారచయితల చేతుల్లో, మిగిలింది ఆ కథలు ప్రచురిస్తున్న మాధ్యమాల చేతుల్లో ఉంది.

ఈ పరిశీలన చేస్తున్న సమయంలో నేను చదవడం తటస్థించిన ఓ ప్రాంతపు మాండలికంలో రాయబడ్డ-ఒక కథ విషయంలో, కొంత స్వేచ్ఛ తీసుకుని నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకున్నాను. ఆ కథ చదివిన అనుభూతి నాలో ఇంకా పచ్చిగానే ఉండగనే, ఆ కథని మొత్తం నాకు తెలిసిన వ్యావహారిక భాషలో రాసుకున్నాను. అసలు కథ పేరుకి సమానార్థం ఉన్న, నేను మాట్లాడే మాండలికంలో ఉన్న పదాన్ని, కథకి పేరుగా పెట్టుకున్నాను. అసలు కథ చదివిన అనుభూతిలోనుంచి పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత, ఆ కథ నా స్మృతిపథంలోంచి చాలా వరకూ మరుగయేదాకా, మానసిక విరామం ఇచ్చి; నేను తిరగ రాసుకున్న కథని మరోసారి చదివాను. కథ ముగింపు ముందే తెలిసి ఉండటంవలన నాలోంచి తొలిగిపోయిన ఉత్కంఠతని మినహాయించి; అసలు కథ అందించిన అనుభూతికీ, నేను రాసుకున్న  కథ చదివి పొందిన అనుభూతికీ చెప్పుకోదగినంత తేడా చవిచూడలేక పోయాను.

ఈ అధ్యయనం వల్ల, మానవజీవితాలకు సంబంధించిన కొన్ని అనుభూతులకు, ప్రాంతాల ప్రమేయం ఉండదని నా వరకు నాకు తోచింది. ఇక పోతే, భాష అవరోధమా కాదా అనేది ఒక కథలో వాడిన మాండలికంతో అసలు పరిచయం లేని ఇంకో పాఠకుడెవరైనా ఆ కథని చదివి చెప్పవలసిన విషయం అని అనిపించింది.

అయితే, కథనం మాత్రం ఒక ప్రాంతపు మాండలికంలో ఉండి; సంభాషణలు అందరికీ పరిచయం ఉండటానికి అవకాశం ఉన్న భాషలో రాయబడ్డ కథలు ఇంతవరకూ నేను చదవటం తటస్థించలేదు. రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయేమో?

ఈ లోపులో కోరుకోవాల్సిన విషయం మరోటుంది. ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి; ఆ ప్రాంతపు భాషతో విస్తృత పరిచయం ఉన్న రచయితలు; తమకు పరిచయం లేని మాండలికంలో కథలు పూర్తిగానో, సంభాషణల వరకో రాసి ఆ కథలని బలహీనపర్చే ప్రయత్నం చేయకుండా ఉంటే చాలని. ఈ ధోరణి ఈ మధ్య ఒక కథలో కనపడింది. అందుకనే ఈ మాట కూడా చెప్పాల్సి వచ్చింది.

***

మన వాదమూ.. మనువాదమూ..

 

 

   -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi అన్నా.. కేసీఆరన్నా..

యేమి సెప్పినావే.. దిమాక్ కరాబయిపోయిందనుకో! అసెంబ్లీల నీ మాటలు యిన్నం! చాన మంచిగున్నాయ్! మర్సిపోలేకుంటున్నం! సుద్దులూ సామెతలూ ముద్దు ముద్దు మాటలూ మంచిగ ముచ్చట్లూ మస్తుగ సెప్పి నవ్వించెటోనివి! నువ్వు యెంత సీరియస్సుగ సెప్పినావే?! నువ్వు గింత సీరియస్సుగ సెప్పినావంటే.. డవుట్లేదు.. గిది.. గిది సత్యప్రమానకంగా సీరియస్సు  యిషయమే!

నువ్వు వుస్మానియా యూనివర్సిటీల ఎమ్మే తెలుగు సాహిత్యం సదివొచ్చినోనివి! నువ్వు సామాన్యునివా? యెనభై వేల పుస్తకాలు చదివినోనివి! దేశమెట్టుందో యూనివర్సిటీలు యెట్టున్నాయో నీకు గాకపోతే యెవరికి తెలుస్తుంది? నువ్వు గాపోతే యూనివర్సిటీ పోరగాల్లకి యెవలు సెప్పాలే? సెప్పి సెడ్డయిందేమి లేదు! నువ్వు వున్న మాటే సెప్పినావ్!

ఉన్నమాట సెప్తే వూరినాయుడికి కోపమని సెప్పడం మానేస్తామా? మన సంస్కృతేంది? మన సాంప్రదాయమేంది? కతేంది? కార్ఖానా యేoది? గాచారం కాకపోతే యూనివర్సిటీలల్ల యీ లొల్లేంది? హెచ్సియ్యూ జేయెన్యూ వొకటేమిటి.. దేశంలో యూనివర్సిటీలల్ల యీ అగ్గి రాజుకొనుడేంది?

ఈ సమయంల నీ మాటలే యాదికొస్తున్నాయన్నా..

“రోహిత్ వేముల గురించి మాక్కూడా సానుభూతి వుందధ్యక్షా.. కాని ఇష్యూ చెయ్యదలచుకోలేదు మేము.. దాన్నో పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చెయ్యదలచుకోలేదు.. కారణాలు తెలుసుకున్నాం.. తగిన స్టెప్స్ తీసుకున్నాం.. దాన్ని ఖండించినాం.. అటువంటివి జరక్కూడదు.. అటువంటివి యెందుకు జరుగుతున్నాయధ్యక్షా.. దురదృష్టకర సంఘటనలు? ఢిల్లీల జేయెన్యూలో జరిగినా.. ఈడ మన దగ్గిర యిక్కడ సెంట్రల్ యూనివర్సిటీల జరిగినా దురదృష్టకరం.. ఐ హేవ్ కండెమ్ముడిట్.. యిటువంటి వాటికి ఆలవాలంగా మారుతున్నాయ్.. ఫిలాసఫీలూ సిద్ధాంతాలూ గుంచకపోయి యూనివర్సిటీలల్ల పెట్టి లేని జగడాలు పుట్టించి.. బీఫ్ ఫెస్టివల్.. కిస్ ఫెస్టివల్ అట అధ్యక్షా..  భారత దేశంల కిస్ ఫెస్టివల్ని వొప్పుకుంటారా అధ్యక్షా.. వొకడు కిస్ ఫెస్టివల్ అంటాడు.. యెన్నో రకాలు పెట్టి యేందేదో చేసి.. వాటన్నిటిని వొక చిత్ర విచిత్ర సంస్థలుగా తయారు చేసినారు.. ఆ పరిస్థితి పోవాలి.. పోవాల్నంటే దాన్ని పరిపాలన చేసేవాళ్ళు.. దానికి వైస్ ఛాన్సులర్ గా వుండే వాళ్ళు.. పటిష్టమైనటువంటి వాళ్ళు రావాలి.. దానికోసం మేము డిలే చేసినాము అధ్యక్షా.. ఐ థింక్ షార్ట్లీ- సెర్చ్ కమిటీవాళ్ళు రిపోర్ట్ యిస్తే అద్భుతంగా..” అని మీరెంత అద్భుతంగా మాట్లాడిన్రు!?

కవితక్క స్థాపించిన తెలంగాణ జాగృతి తరుపున వొకట్రెండు రోజులు కార్యకర్తలు దత్తాత్రేయ యింటిముందు గొడవకు దిగి సప్పుడు సెయ్యకుండా సక్కగున్నరు! మన యంపీ విశ్వేశ్వరరెడ్డి సారయితే రోహిత్ దళితుడే కాదని, ఆ అబ్బాయి చనిపోవడానికి వేరే కారణాలున్నాయని సెప్పాల్సింది సెప్పి సప్పుడు సెయ్యకుండున్నడు! పార్లమెంటుల మరొక యంపీ జితేంద్ర రెడ్డిసారు “దత్తాత్రేయ గురించి కేర్ తీసుకున్నాము, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు యిస్తే మేము వ్యతిరేకించాము” అని మన సపోర్టు ఫుల్లుగ సూపించారు! హెచ్సియ్యూకు అన్ని రాజకీయ పక్షాలు వొచ్చినా  బీజేపీ తోటి మీరు కూడా యెవరూ వెళ్ళకుండా సక్కగ వున్నరు! అలా కేంద్రంతో అందరూ యెంతో మంచిగున్నరు! కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటివి చానా ముఖ్యం! అందరూ కలిసి కేంద్ర రాష్ట్ర సంబంధాల్ని బలోపేతం చేసిండ్రు! రాష్ట్రానికి కావలసినవన్నీ తెచ్చుకోవాలె! అడుక్కు తెచ్చుకోవాలె! మద్దతు యిస్తున్నట్టే వుండాలె! ప్రజల మద్దతు ఆలకి పోకూడదు! ఆంధ్రోళ్ళ చంద్రబాబుతో కేంద్రానికి యెంత కవరు చేసినాగాని చెడింది.. మనం కేంద్రాన్ని మంచిగ మచ్చిక చేసుకోవాలె!

మీరు యిన్నిన్ని పాట్లు పడతాంటే యూనివర్సిటీ పోరాగాండ్లకు తలకి యెక్కుత లేదు! ఎకసెక్కం చేస్తాండ్రు! ‘మీ కేసీఆర్ చెండీ యాగం చేసినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! యాదాద్రికి అన్నన్ని నిధులు యిచ్చినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! మిమ్మల్ని మనువాదులని ముద్రవేస్తాండ్రు! ఆమాటకొస్తే దేశంల నాయకులందరూ మనువాదులేనట! వాళ్ళ ప్రతినిధులేనట! హిందూ మతమే అధికార మతంగా ప్రభుత్వాల అభిమతంగా- రాష్ట్రాల దేశాల మంత్రులందరూ ప్రజా ప్రతినిధులందరూ శంకుస్థాపనలకడ ప్రారంభోత్సవాలకడ వొకటేవిటి అన్నీట్లకడ- వేద మంత్రాలతో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టడం లేదా..?’ అని నిలదీస్తుండ్రు! ‘ఎవరి విశ్వాసాలు ఆలకి వుండవా?’ అని అడిగితే- “మల్ల.. మావిశ్వాసాలు మాకుండవా..?” అని వుల్టా అడుగుతాండ్రు! ‘ఎన్నో విశ్వాసాలకి – భిన్న విశ్వాసాలకి వేదికలు యూనివర్సిటీలు..’ అని మనకి తిరిగి పాఠాలు చెపుతాండ్రు! చెడిపోయిండ్రన్నా.. చదువుకున్న పోరగాండ్లు పూర్తిగా చెడిపోయిండ్రు!

తెలంగాణ పోరాటంల ముందుండి నడిసినారు బాగుంది! ఉద్యమాలు చేసినారు బాగుంది! ప్రాణ త్యాగాలు చేసినారు బాగుంది! ప్రత్రేక రాష్ట్రం సాధించినారు అదీ బాగుంది! అక్కడితో ఆగాలి గదే.. రాష్ట్రం సిద్దించింది రాజకీయాలు వొదిలి చదువుకోవాలి గదా.. మళ్ళీ యీ పోరాటాలు యేoదన్నా? ఇలాగుంటే బంగారు తెలంగాణ అస్తదా?

అన్నా.. కుర్రాళ్ళు ముదిరిన్రు అన్నా! మీరు బ్రాహ్మణ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. క్రిస్టియన్ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. భూమిలేని దళితులకు మూడెకరాల పొలం యిస్తామన్నట్టు.. బీసీలకు పెద్ద పీట వేస్తామన్నట్టు.. ఆదివాసీలకు కొమరంభీం బిల్డింగ్ నిర్మించి ఆదుకుంటామన్నట్టు.. ఆంధ్రా సెట్లర్లకు మేమున్నాం అని భరోసా యిచ్చినట్టు.. అన్ని వర్గాల ప్రజలని యెలా మీరు ప్రతినిధులుగా కలుస్తున్నారో- అచ్చంగ అలాగ మేమూ అన్ని వర్గాల ప్రజల ఆలోచనలకు ఆశయాలకు భావజాలాలకు ప్రతినిధులుగా వుంటారట.. మాట్లాడతారట..!

సమాజంలో వున్నన్ని వర్గాలు – యూనివర్సిటీలల్ల కూడా వుంటాయని – మీ ఫిలాసఫీ సిద్ధాంతమూ మీకున్నట్టే మా ఫిలాసఫీ సిద్ధాంతమూ మాకుంటుందని తెగేసి అంటున్నారన్నా.. ఏమైనా స్టూడెంట్లతో ప్రాబ్లం అన్నా.. ప్రత్యేక తెలంగాణ వరకే విద్యార్థులకు రాజకీయాలతో సంబంధం వుండాలిగాని.. యిదేటన్నా యిది..?

మనం కొద్దిగ జాగర్త పడాలన్నా! బీఫ్ తిన్నారని చంపేస్తే- ఫ్రిజ్ ల బీఫ్ వున్నాదని అనుమానించి చంపేస్తే- తినే తిండి మీద మీ పెత్తనమేంటని అడిగిన్రు! మా తిండి మేం తింటాం అని బీఫ్ ఫెస్టివల్ పెట్టిన్రు! అలజడి సృష్టించిన్రు! కాలికట్ ‘డౌన్ టౌన్’ రెస్టారెంట్ల వొక ప్రేమికుల జంట ముద్దులు పెట్టుకుంటే- రెస్టారెంటు మీద దాడి చేసిన్రని మోరల్ పోలీసింగ్ చేసిన్రని.. మీడియాల మాట్లాడుతూ పోరగాల్లు ముద్దులు పెట్టుకొని గిది మా పోరాటం అన్నరు! దేశంల యూనివర్సిటీలల్ల కిస్సు ఫెస్టివల్ జరిపిన్రు! రచయితల్ని ముగ్గుర్ని వరసగ సంపితే అవార్డులను అందరూ వెనక్కిచ్చినట్టు – పదిమంది పోరగాల్లు యూనివర్సిటీల వుసురు తీసుకుంటే వంద వెయ్యీ కాదు లక్షలమంది కదిలిన్రు! మీకివన్నీ తెలియవని కాదు, జర మనం సైలెంటుగ వుంటే అరిచి ఆల్లే నాలుగు రోజులకి కాకపోయినా నాలుగు నెలలకి అలిసిపోయి బతుకాగంల బడిపోతరు! కాంట్రాక్టు వుద్యోగుల్ని రెగ్యులరైజు చేస్తామంటే మరి మా కొలువులో అని నిన్నే కాదన్నరు. ఛలో అసెంబ్లీ అన్నరు. నువ్వు సేయిన్చాల్సింది సేసినావా లేదా? ఆంధ్ర పోలీసులలెక్క భగ్నం చేయించినవ లేదా? ఇయ్యాల యూనివర్సిటీలోకి కన్నయ్య రాక కన్నా ముందు వీసీ పోదిలి అప్పారావుని మళ్ళా దించితే – నీవంతు పోలీసు ఫోర్సు అందించినవ లేదా? పోలీసుల్ని దింపి అద్బుతంగా లాఠీఛార్జీలూ అరెస్టులూ సేయించి అదుపులోకి తెచ్చినవ లేదా? నువ్వు యేదయినా సెయ్యగలవే అన్నా.. నా ఆవుసు పోసుకొని నువ్వు సల్లగ వుండాల.. మరి నాలుగు కాలాలు మమ్ము పాలించాల..

అన్న.. ఆఖరుగ  వొక్క మాటే! రెడ్డిగార్లు అదికారంల వున్నప్పుడు అందరూ రెడ్డిగార్లదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! కమ్మగ చౌదరీలు అదికారంల వున్నప్పుడు అందరూ కమ్మలదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! మరి మన దొరల రాజ్యం వొచ్చింది! దొరాలకి న్యాయం చెయ్యవానే? మళ్ళీ సియ్యమ్ము సీటు దళితులకే అని యెనకటికి అన్నట్టు అనబాకు! ప్రతిపక్షమే లేకండ అందరొచ్చి మనపార్టీల చేరిండ్రు! ప్రతొక్కనికీ పంచాల గదా? పీటెయ్యాల గదా? అలగని మనోళ్ళకు అన్యాయం చెయ్యకు! మన వర్గమోల్లకు! వర్గమంటే కులమే గదనే! అన్నీ తెలిసినోనివి.. నీకేం సెప్పేది? ప్రేమతోటే సెప్పేది! తప్పులుంటే మన్నించు..!

జిందాబాద్.. జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్..!

అన్నా దండమే!

యిట్లు

మీ

వీరాభిమాని!

 

 

 

 

అట్టడుగు ముస్లిం రచయిత ‘అలీ’

-స్కైబాబ
~
ముస్లింవాద సాహిత్యంలో అట్టడుగు ముస్లింలలోంచి కవిగా రచయితగా తన గొంతుక బలంగా వినిపించినవాడు అలీ. తొలుత ‘పాన్‌మరక’ అలీగా, తరువాత ‘హరేక్‌మాల్‌’ అలీగా పేరుబడ్డ అలీ ‘పాన్‌మరక’ ‘జఖమ్‌’ ‘తమన్నా’ ‘గర్జన’ కవితా సంపుటులు, ‘జఖమ్‌’ కరపత్ర కవిత్వం, ‘హరేక్‌మాల్‌’ కథల సందూఖ్‌ వేశాడు. ఇంకా తన రచనలు వెలువరించే ప్రయత్నంలోనే ఉన్నాడు. అలాంటి అలీ సెల్‌ఫోన్‌ నుంచి మార్చి 6 అర్ధరాత్రి తను చనిపోయినట్లు కాల్‌ వస్తే ఎంతకూ నమ్మబుద్ధి కాలేదు. ‘అయ్యో! ఇంకా అతని జీవితంలోంచి మరిన్ని ముఖ్యమైన రచనలు రావలసి ఉండె కదా అని, ఈ మధ్యనే బిడ్డ షాదీ చేశాడు కదా, ఇంకా పెళ్లి కాని పిల్లలున్నారు కదా అని మనసు పిండేసినంత బాధయ్యింది.
మూడేళ్ల క్రితం హార్ట్‌ ప్రాబ్లమ్‌తో దవాఖానాలో చేరాడు అలీ. గుండె ఆపరేషన్‌ చేయడానికి అతని శరీర స్థితి సహకరించదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఎలాగో అలా నెట్టుకొస్తున్నాడు. మార్చి 6న నల్లగొండలో ఒక ముషాయిరాలో పాల్గొనడానికి పేరు ఇచ్చాడు. రాత్రి ఎనిమిదింటికి కవిత రాస్తూ కూర్చున్నాడు. 9 ప్రాంతంలో శ్వాస తీసుకోవడం కష్టమవడంతో దవాఖానాకు తీసుకెళ్లారు. ముషాయిరా నిర్వాహకులు అలీ పేరు పిలవడానికి అతను కనిపించకపోవడంతో అతని సెల్‌కు ఫోన్‌ చేశారు. హార్ట్‌ ఎాక్‌తో అతను చనిపోయాడని విని విస్తుపోయారు!
నల్లగొండ పట్టణంలో పాన్‌డబ్బా నడుపుకుంటున్న అలీని 1986 చివరలో పరిచయం చేసుకుని ఆయన పాన్‌డబ్బా జీవితంపై కవిత కావాలని అడిగాను. పేజీలకు పేజీలు కవిత రాశాడు అలీ. దాన్ని మూడు పేజీలకు కుదించి ‘జల్‌జలా’లో మొదటి కవితగా చేర్చాను. 1998లో వెలువడిన ‘జల్‌జలా’ కవిగా అలీ పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ‘పాన్‌మరక’ పేరుతోనే అతను కవితా సంపుటి వేశాడు. ముస్లింల జీవితంలోని ఒక పాత్రే సాహిత్యకారుడుగా తెలుగు సాహిత్యంలో ఇన్నాళ్లు సంచరిస్తూ రావడం విశేషం. మన దేశంలోని, ముఖ్యంగా తెలంగాణలోని ముస్లిం జీవితాలకు సజీవ సాక్షిగా అలీ జీవితం గడిచింది. తన జీవితమంతా గరీబీనే తోడుగా నడిచిన కవి అలీ. సచార్‌ కమిటీ, మిశ్రా కమీషన్‌ రిపోర్టుల నేపథ్యంలో చూస్తే అలీ భారతీయ ముస్లింల ముఖచిత్రం.
అతని కవితా పాదాల్ని తడిమితే-
‘ప్రతిరోజు ఎంతోమంది నోళ్లు పండిస్తుాంను/ కాని నా బతుకే పండట్లేదు /నేనమ్మిన కింగ్‌సైజ్‌ సిగరెట్టే/ నా గరీబీ బీడీ వైపు చీదరింపుగా చూస్తుంది’ అప్పట్లోనే డిగ్రీ చేసిన అలీ ‘ఫ్రేంలో బంధించబడ్డ నా పట్టా/ బూజు పట్టిన గోడకు/ పాత క్యాలెండర్‌లా వేలాడుతుంది’ అంటూ ‘ఇంటర్వ్యూలకైతే పిలుస్తారు/ తీరా నా పేరు ‘అలీ’ అని తెల్సుకొని చిత్తు కాగితంలా విసిరేస్తే/ ఎండుటాకులా మిగిలిపోయాను’ ‘అలీ గల్లీకొచ్చి చూడు/ సోరుప్పు రాలే గోడలు/ సిమెంటు అతికిన ఉప్పుదేరిన కుండలు/ పగిలిన కవేలీ కప్పులు/ ఇమ్మిచ్చిన అర్రలు/ దిల్‌కే ఉప్పర్‌ థర్మామీటర్‌ రక్కే దేఖో/ ఓ కిత్‌నా దర్ద్‌ బతాయేగా!’ లాంటి ఎన్నో తాత్వికమైన కవితా పాదాలు ‘పాన్‌మరక’ కవితలో చూస్తాం. ఆ కవితను ముగిస్తూ ‘ఈ దేశపు గోడ మీద/ ఉమ్మేసిన పాన్‌ మరకలా/ నేనిలా ……….’ అంటూ ఈ దేశ ముస్లింల దయనీయమైన స్థితిని ప్రతిబింబిస్తాడు.
aliఅచ్చమైన తెలంగాణ కవి
– – – – – – – – – – – –
తెలంగాణ ఉద్యమానికి ఎన్నో కవితలను అలీ అందించాడు. ‘మత్తడి’, ‘పొక్కిలి’ ‘మునుం’ లాంటి కవితా సంకలనాల్లో అతని కవితలున్నాయి. ‘గర్జన’ పేరుతో తెలంగాణ ముస్లింవాద కవితా సంపుటి వెలువరించాడు. ‘మత్తడి’లో, తెలంగాణ ఉర్దూ, తెలుగు ముస్లిం కవితా సంకలనం ‘రజ్మియా’లోని అతని కవిత ‘అస్తర్‌’లో-
‘ఆటోవాలా చల్తే/ క్యా బేటా.. కైసే హై?’/ నా ‘జబాన్‌’ని అనకొండలేయో మింగినయ్‌/ నా పేర్లు మార్చి/ నా ఖాన్‌దాన్‌ మూసీల కలిపినయ్‌’ -అంటూ తెలంగాణలోని ఉర్దూ భాషను ఆంధ్రావారు ఎలా నాశనం చేశారో చెబుతాడు అలీ. రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు చేస్తున్న ముస్లింల దీనస్థితిని చెబుతూ ‘పైజామా లాల్చీల కెల్లి/ తొంగి చూస్తున్న/ బొక్కల బొయ్యారం’ను వర్ణిస్తూ ‘హమారా జీనా/ జూతేకే నీచే/ అస్తర్‌ బన్‌గయా’ అంటాడు. ఇతర కవితల్లో- ‘ఈ గులాంగిరీ బతుకులు ఇంకెన్నాళ్లు’ అని నిలదీస్తాడు. ‘కుడిపక్క కృష్ణా కాల్వ ప్రవాహమున్నా/ మాకు ఫ్లోరిన్‌ నీళ్ల భూమి పొరలే దిక్కు’ అంటూ బాధపడుతూ ‘నైజామోడి పైజమా ఏనాడో ఊడింది/ ఇక ఆంధ్రోడి పంచె ఊడగొడదాం రాండ్రి’ అంటాడు. ‘తెలంగాణ సెంటిమెంటు కాదురా/ నా ఆత్మబలం.. నా ఆత్మగౌరవం.. నా జన్మహక్కు’ అని నినదించాడు.
గుజరాత్‌ ముస్లింల ఊచకోతపై కదిలిపోయిన అలీ ‘జఖమ్‌’ పేరుతో నాలుగు కవితలతో కరపత్రం వెలువరించాడు. అందులోని ఒక కవితలో ‘హమ్‌ మర్కే భీ జగాతే హైఁ/ సోయీ హుయీ దునియాఁ కో’ అనడం మొత్తం భారత సమాజాన్నే మేల్కొల్పే తత్వంగా చూడొచ్చు. ఇంకా ‘గుజరాత్రుల్లో నన్ను ఊచకోత కోసి/ అమ్మీజాన్‌ చిత్రపటాన్ని నగ్నంగా నిలిపావు’ అంటాడు.
అతని కవిత్వంలో ‘చెదలు పట్టిన గిర్కల బావి కలలు’ ‘నా కాలివేళ్ల సందుల్లో/ ఇరుక్కున్న మట్టి వాసనల నడుగు/ నేను దళిత వారసున్నేనని మద్దెల మోగిస్తాయ్‌’ ‘దువా ఒక్కటే దవా కాదు’ ‘ధర్నాకైనా హిమ్మత్‌లేని లాల్చి పైజామాలు/ రూమిటోపీలకు బిగించిన హద్దుల సంకెళ్లు/ నా నోట్లోని నాలుకకు కుట్లేస్తున్నాయి’ ‘నీ అంటరాని ఆత్మలకు అత్తరు పూస్తా’ లాంటి ఎన్నో వెంటాడే కవితా పాదాలు చూస్తాం.
Ali_4
ముస్లింవాద కథకుడు.. ‘హరేక్‌మాల్‌’ రచయితగా అలీ
– – – – – – – – – –  – – – – – – – – – – – – – – – – – –
‘వతన్‌’ ముస్లిం కథా సంకలనం వేసే పనిలో 2000 ప్రాంతం నుంచి మళ్లీ అలీ వెంటపడ్డాను. అప్పటికీ అలీ పాన్‌డబ్బా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తీసేస్తే నల్లగొండ పట్టణం రోడ్ల మీద నాలుగు పయ్యల బండి మీద ‘హరేక్‌మాల్‌’ అమ్ముకుంటున్నాడు. ఏ అడ్డా మీద ఉన్నాడో తెలుసుకోవడం, వెళ్లి ఆయనతో బండి పక్కన నిలబడి మాట్లాడ్డం చేసేవాణ్ణి. హృదయ విదారకంగా ఉండేది, అలీ హరేక్‌మాల్‌ దందా! నల్లగొండ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో వారంలో ఒక్కోరోజు ఒక్కో పట్టణంలో అంగడి ఉంటుంది. ఆ అంగళ్లకు అలీ, అతని మిత్రులు హరేక్‌మాల్‌ మూటలు ఎత్తుకొని బస్సుల్లో పడి పొద్దున్నే వెళ్లడం, పొద్దుగూకిందాకా ‘దస్‌ కే చార్‌! దస్‌ కే చార్‌!’ అని అరిచీ అరిచీ మళ్ల మిగిలిన వస్తువులన్నీ మూటకట్టుకొని లాస్ట్‌ బస్‌కి నల్గొండ చేరడం.. ఆ బస్‌లో ఒక్కో ఊరిలో ఒక్కొక్కరు దిగిపోతుంటే ఒంటరిగా తమ గరీబీ గురించి ఆలోచించుకుంటూ రావడం.. అట్లా ఆ కథంతా రాశాడు అలీ.
దారిద్య్రరేఖకి ఇంకా కింద బతుకుతున్న ముస్లింల జీవితాలను పట్టించిన కథ ఈ హరేక్‌మాల్‌. డిగ్రీ చదివి రోజు కూలికి పోలేక హరేక్‌ మాల్‌ అమ్ముకుంటూ తన జీవితాన్ని చర్వణం చేసుకునే ఒక పేద ముస్లిం బతుకును సమగ్రంగా అన్ని కోణాలనుంచి చూపించిన కథ. అన్ని దారులు మూసుకు పోగా బతకలేక చావలేక బతుకుతున్న అనేక మంది ముస్లిం కుటుంబాలకు ప్రతీకగా కనిపిస్తాడు కథానాయకుడు. ముస్లింల చుట్టూ పరుచుకున్న పేదరికపు విషవలయం ఎప్పటికీ నశించేది కాదని, వెతలు ఎప్పటికీ తీరేవి కావని చెప్తూ భూమి గుండ్రంగా సైకిలు చక్రాల్లా ఉన్నదని చెప్తూ తమ జీవితాల్లో ఎప్పటికీ వెలుగులుండవని కథను ముగిస్తాడు రచయిత. ‘వతన్‌’ సంకలనంలో ఆ కథ ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.
2006లో ‘హరేక్‌మాల్‌’ కతల సందూఖ్‌ పేరుతో సంపుటి వేశాడు అలీ. కథల సందూక్‌ అనడంలోనే మంచి ప్రయోగం కనపడుతుంది. కథల పెట్టె అని అర్ధం. ‘హరేక్‌మాల్‌’ కథతోపాటు మరో తొమ్మిది కథలు ముస్లింలలోని నిరుపేదల జీవితాలను రికార్డు చేశాయి.
ఆ సంపుటిలోని మిగతా కథల్లో ‘ముసీబత్‌’ కథ ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక (2004)లో అచ్చయింది. ఈ కథ తెలుగు సాహిత్యంలో మరో భిన్నమైన పార్శ్వం. ఇందులో- సౌదీకి వలస వెళ్ళే పేద ముస్లింల లాగే అలీ బావ ఫయాజ్‌ సౌదీ వెళ్తాడు. అక్కడ కొన్నాళ్లకు హార్ట్‌ ఎటాకొచ్చి చనిపోతాడు! దోస్తులు ఇక్కడికి ఫోన్‌ చేసి ఫయాజ్‌ భౌతిక కాయాన్ని పంపాలంటే అతని దగ్గర ఉన్న పైసలు పంపలేము! పైసలు పంపించాలంటే బాడీని పంపలేము! అంటారు. ఏం చేయాలో ఎవరికీ ఏం తోచలేదు. అంతా ఫయాజ్‌ భార్య అభిప్రాయం అడిగారు. ఆమె ఏం చెప్పగలదు! ముగ్గురు ఆడపిల్లలు! పైసలేం మిగుల్చుకోలేదు. ఇల్లు గడవడం.. పెళ్లిళ్లు.. వగైరా ఎలా జరుగుతాయి?! గింజుకుని, నలిగీ, యాతనపడీ చివరికి పైసలు పంపించమనే- అందరి అభిప్రాయంగా చెబుతారు! -ఇంతటి గరీబీని చిత్రించాడు అలీ తన కథల్లో..!
అయితే ఇదే ‘ముసీబత్‌’ కథలో మరో ముఖ్యమైన విషయం రికార్డు చేశాడు అలీ.
ముస్లింల ఆచార వ్యవహారాలు ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా ఉన్నాయి. దేశదేశాలకు ఇస్లాం వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆయా దేశాల సంస్కృతుల్ని తనలోకి ఇముడ్చుకోవడం, ఇస్లామిక్‌ (అరేబియన్‌) సంస్కృతిని ఆయా దేశాలకు వ్యాప్తి చేయడం జరిగింది. జరుగుతున్నది. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా ముస్లింల సంస్కృతి ఒకే రకంగా ఉండదని అర్థమవుతుంది. ఆ దిశలోనే మన దేశంలోని మన రాష్ట్రంలోని ముస్లింల సంస్కృతిని చర్చకు తెస్తూ షాజహానా, స్కైబాబ తమ సంపాదకత్వంలో ‘అలావా’ ముస్లిం  సంస్కృతి కవితా సంకలనం వేశారు. అందులోని సంపాదకత్వంలో స్కైబాబ అలీ ‘ముసీబత్‌’ కథను ఉటంకిస్తూ చెప్పిన విషయాన్ని ఇక్కడ చూడొచ్చు-
‘మూడో రోజు జ్యారత్‌. సమాధి దగ్గరికి వెళ్లి పూల చాదర్‌ కప్పి ఫాతెహా లివ్వాలి. ఇక్కడ సమాధి లేదు. చిత్రమైన స్థితి. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. చివరికి ఫయాజ్‌ దోస్తులకు ఫోన్‌ చేసి జర సమాధి దగ్గరికి వెళ్లి పూల దుప్పి కప్పి ఫాతెహా లిచ్చి రమ్మని అభ్యర్ధిస్తారు. ‘ఇక్కడ అవన్నీ ఉండవు. సమాధి చేసి వచ్చారంటే తిరిగి అటు వెళ్లడం ఉండదు!’ అంటారు ఫయాజ్‌ దోస్తులు. పరేశాన్‌!’
ఇట్లా అలీ 2004లోనే దేశీ ముస్లిం సంస్కృతిని చర్చకు పెడుతూ కథ రాయడం గమనార్హం. ఈ  సంస్కృతి గురించి ఇవాళ తీవ్ర సంఘర్షణ జరుగుతుండడం విశేషం.
సహజంగా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే మోసాలను, ప్రపంచంలో పెరిగిపోతున్న మత విద్వేషాలను పట్టి చూపిన కథ ‘కోడిపిల్లలు మూడు’. మూడు కోడిపిల్లలు కొని పెంచబోయిన తన కొడుకు కథ అది. ఒక పిల్లను పిల్లి ఎత్తుకుపోగా, అది చూసి భయపడ్డ మరో కోడిపిల్లకు పక్షవాతమొస్తుంది. దాన్ని పడేయమని తల్లి చెబుతున్నా వినక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లవాడు. దాని గురించే బెంగ పెట్టుకుంటాడు. చివరికది చనిపోతుంది. దాన్ని పెంటదిబ్బ మీద పడేయమని చెప్పినా వినకుండా ఇంటి ఆవరణలో ఒక మూల దానిని సమాధి చేస్తాడు. మోసాలు ద్వేషాలు లేని ప్రపంచం ఒకటుందని, అది పిల్లల ప్రపంచమని చెప్తూ తన పిల్లలకు అంతటి జాలి దయ ఉండాన్ని చూసి సంతోషపడతాడు కథానాయకుడు. నేడు సమాజంలో ముస్లింల మీద జరుగుతున్న విష ప్రచారానికి పూర్తిగా భిన్నమైన కోణంలో మనల్ని వెంటాడుతుంది ఈ కథ.
సమాజంలో ఏ ఉపద్రవం జరిగినా చివరికి అది పేదవాళ్ళ కడుపు కొట్టడానికేనని అలీ ‘పాన్‌డబ్బావాలా’ కథలో వివరిస్తాడు. అసలే వ్యాపారం నడవక అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, డిగ్రీ పట్టాలు బ్యాంకుల్లో పెట్టి లోన్లు తీసుకుని పాన్‌ డబ్బా నడుపుకుంటున్న చిన్న జీవితాల వ్యధలను చిత్రించిన కథ పాన్‌డబ్బావాలా. పోలీస్‌ వాళ్ళకి లంచాలిచ్చి, అడిగిన వాళ్ళకల్లా అప్పులు పెట్టి జీవితం గడవక నానా బాధలు పడి డబ్బాను నడిపిస్తుంటే ఆఖరికి రోడ్ల వెడల్పు కార్యక్రమంతో ఆ జీవనాధారాన్ని కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో తెలీని నిరుద్యోగుల, బడుగు జీవుల కథ పాన్‌డబ్బావాలా.
ఏ జాతి  ఉన్నత విద్యకు దూరమైపోతుందో, ఆ జాతి అభివృద్ధిపథం వైపు పయనించడం చాలా కష్టమైన విషయమని చెప్పిన కథ ‘నయా ఖదమ్‌ నయీ సోంచ్‌’. ముఖ్యంగా ముస్లిం అమ్మాయిలకు చదువు ఎంతో ముఖ్యమని, బాల్యంలోనే వివాహాలు చేయడం మూలాన ముస్లింలు వెనుకబడుతున్నారని కథలో కొత్త ఆలోచనలను రంజాన్‌ పండుగ దినాన పాత్రల ద్వారా వివరిస్తాడు రచయిత. రాజకీయాలలో మతాలు ముఖ్యపాత్ర వహించడాన్ని కూడా విమర్శిస్తాడు. క్రిష్టియన్‌ సంస్థలు విద్యా వ్యాప్తికి పూనుకోవడాన్ని ఉదహరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ వివిధ దేశాలలో ఉన్న ముస్లింల గురించి ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తాడు.
ఇలా హరేక్‌మాల్‌ కథా సంపుటి నేటి ముస్లింల ఆర్ధిక రాజకీయ సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది. నల్లగొండలో మాట్లాడే తెలంగాణ ఉర్దూ కలగలిసిన మిశ్రమ యాసతో కూడిన భాష ఈ సంపుటిలో కనిపిస్తుంది. కొన్ని కొత్త పదబంధాలు, కొత్త సామెతలు కనిపిస్తాయి. ఇలాంటి వైరుధ్యభరితమైన కథలు అందించిన అలీ ఒక నవల, తన ఆత్మకథ రాసిపెట్టాడని తెలుస్తున్నది. వాటిని అచ్చు వేయవలసిన బాధ్యతను తలకెత్తుకోవలసి ఉంది.

*

మతి పోగొట్టిన మైసీనియా స్వర్ణ సంపద

 

స్లీమన్ కథ-25

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఆ కలశం మీద చిత్రితులైన సైనికులు కొమ్ము శిరస్త్రాణాలు ధరించి ఉన్నారు. వాటి మీద తురాయిలు రెప రెప లాడుతున్నాయి. ఈజిప్టుసేనలకూ, ‘సాగర భూములనుంచి వచ్చిన’ వారికీ మధ్య జరిగిన యుద్ధాల తాలూకు చిత్రాలలోని సైనికులు కూడా ఇలాగే కొమ్ము శిరస్త్రాణాలు ధరించి కనిపిస్తారు. మైసీనియా కలశం మీద చిత్రించిన సైనికుల చేతుల్లో పొడవైన బల్లేలు, అర్థచంద్రాకారపు భారీ డాళ్ళు ఉన్నాయి. బల్లేలకు మద్యం సీసాలు తగిలించి ఉన్నాయి. సైనికుల కవచాల మీద చిన్న చిన్న వక్షస్త్రాణాలు ఉన్నాయి. వాటిని బహుశా ఒక లోహపు పట్టీతో బిగించుకున్నారు. కవచాలు వాళ్ళ తొడల దాకా ఉన్నాయి. వాటికి కుచ్చులు వేలాడుతున్నాయి. కాళ్ళకు మేజోళ్ళు ఉన్నాయి. స్లీమన్ అవి వస్త్రంతో చేసినవని అనుకున్నాడు కానీ, బహుశా కవచం లాంటివే అయుంటాయి. శిరస్త్రాణాలపై తెల్లని చుక్కలు ఉన్నాయి. చిత్రకారుడు ఆ చుక్కల ద్వారా  కంచులోహపు మెరుపును సూచిస్తున్నాడని స్లీమన్ అనుకున్నాడు. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకే అతనికి దొరికిన ఇంకో కలశం తాలూకు శకలం మీద ఉన్న చిత్రాన్ని చూస్తే; సైనికులు ధరించినవి తోలు శిరస్త్రాణాలనీ, వాటి మీద కనిపించే తెల్లని చుక్కలు లోహపు చీలలనీ అనిపిస్తుంది.

స్లీమన్ కు ఎక్కువగా విస్తుగొలిపినవి, శిరస్త్రాణాలకు ఉన్న కొమ్ములు. “వాటి ఉపయోగం ఏమిటో నాకు ఏమాత్రం బోధపడలేదు. హోమర్ కాలం నాటి శిరస్త్రాణాలపై అలాంటివి ఉండేవని అనుకుందామంటే హోమర్ వాటి గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు ” అని రాసుకున్నాడు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం స్లీమన్ పరాకు చిత్తగించాడు. ఎందుకంటే, ఇలియడ్ మూడో అధ్యాయంలో , మెనెలాస్, పారిస్ ల ద్వంద్వ యుద్ధం సందర్భంలో హోమర్ కొమ్ము శిరస్త్రాణాలను ప్రస్తావించాడు: “మెనెలాస్ వెండి తాపడం చేసిన తన ఖడ్గాన్ని ఒక్క ఊపుతో పైకెత్తి శత్రు శిరస్త్రాణం కొమ్ముమీద మోదాడు. అప్పుడా ఖడ్గం ముక్క ముక్కలైపోయి అతని చేతిలోంచి జారిపోయింది” అని రాశాడు. ఖడ్గ ప్రహారాన్ని కాచుకోవడం కోసమే ఆ కొమ్ము. దాంతోపాటు;  కొమ్ములు దృష్టి దోషాన్ని నివారిస్తాయనీ, యోధుడి పుంస్త్వాన్ని నొక్కి చెబుతాయనీ, తనకు అదనంగా మరో కన్ను ఉందన్న భావనను అతడిలో కలిగిస్తాయనీ భావించారు. శిరస్త్రాణాలలో రెండు కొమ్ములు ఉన్నవీ, నాలుగు కొమ్ములు ఉన్నవీ కూడా కనిపిస్తాయి. శిరస్త్రాణాలపై కొమ్ములు ఒక్కోసారి మేక కొమ్ముల్లా మెలితిరిగి ఉంటాయి.

సైనికులు కవాతు చేస్తూ సాగుతూ ఉంటే వారి మార్గానికి ఎడమ వైపున యువతులు నిలబడి చేతులు ఊపుతున్నారు.  ఆవిధంగా,  వారి శిరస్త్రాణాలపై ఉన్న కొమ్ములు మరో ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నాయి.* శిరస్త్రాణాలపై అలంకరించిన తురాయిలు ఈకల్లా కనిపిస్తున్నాయి తప్ప, గుర్రపు వెంట్రుకల్లా కాదు. సైనికులు పొత్తికడుపు దగ్గర వెడల్పాటి దళసరి లోహపు పట్టీని ధరించి ఉన్నారు. అది హోమర్ వర్ణించిన మిత్రే(mitre)ని తలపిస్తోంది. సైనికులు ధరించిన కాలితొడుగు(leggings)లకు అడుగున వెండిపట్టాల లాంటివి ఉన్నాయి. హోమర్ చిత్రించిన కాలితొడుగులకు కూడా ఒక్కోసారి వెండి పట్టాలు ఉంటాయి. సైనికుల ముక్కులు పొడవుగానూ, కళ్ళు వెడల్పుగానూ, గడ్డం తీరుగా కత్తిరించబడీ కనిపిస్తున్నాయి. అనంతరకాలంలో, వందల ఏళ్ల తర్వాత పర్షియన్ సేనలతో పోరాడిన గ్రీకు సైనికులు కూడా అచ్చం ఇలాగే కనిపిస్తారు. వారు కూడా నృత్యభంగిమలో కవాతు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా చిత్రాలలో కనిపిస్తారు. ఈవిధంగా ఈ పగిలిన కలశం అసాధారణరీతిలో గ్రీసు పురాచరిత్రను చెబుతోంది.**

***

OLYMPUS DIGITAL CAMERA

నెలలు గడుస్తున్నాయి. ఆగొరా(agora)లో దొరికిన నాలుగు సమాధిరాళ్ళ శకలాలు, సైనికుల చిత్రం ఉన్న కలశం తప్ప చెప్పుకోదగినవేవీ దొరకలేదు. మండుటెండలో, పొద్దుటి నుంచి సాయంత్రంవరకూ 125 మందితో స్లీమన్ తవ్వకాలు జరిపిస్తున్నాడు. మైసీనియా మొత్తాన్ని వేడి వేడి ధూళి మేఘాలు కమ్మేస్తున్నాయి. అతని కళ్ళు మండిపోతున్నాయి. ఎండతోపాటే అతని చిటపటలు పెరిగిపోతున్నాయి. ఇంకోపక్క అధికారులతో ఘర్షణ విడుపు లేకుండా సాగుతూనే ఉంది.

సందర్శకులు వస్తున్నారు. కుండ పెంకులు, పూసలు, మృణ్మయమూర్తులు మినహా వాళ్ళలో ఆసక్తిని నింపే గొప్ప విశేషాలేవీ అక్కడ లేవు. బ్రెజిల్ చక్రవర్తి దియోడెమ్ పేద్రో-2 తవ్వకాలను చూడడానికి కోరింత్ నుంచి వచ్చాడు. ఈ విశిష్ట సందర్శకుని రాకకు స్లీమన్ పొంగిపోయాడు. ఏట్రియస్ కోశాగారంగా పిలిచే ఓ భూగర్భ సమాధివద్ద అతనికి గొప్ప విందు ఇచ్చాడు. అది చాలా కాలంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రదేశం కనుక, విలువైనవేవీ దొరకకపోవచ్చునన్న ఉద్దేశంతో అక్కడ తవ్వకాలు చేపట్టలేదు. తను ట్రాయ్ లో కనుగొన్నట్టే ఇక్కడ కూడా నిధినిక్షేపాలను కనుగొంటానని చక్రవర్తితో స్లీమన్ అన్నాడు. చక్రవర్తి చిరునవ్వు నవ్వాడు. స్లీమన్ చెప్పుకునే గొప్పల గురించి గ్రీకు అధికారులు అతన్ని ముందే హెచ్చరించారు. సమాధులపై అతను ఆసక్తిని చూపించాడు. మనిషి గుంభనంగానూ, సామాన్యంగానూ కనిపించినా అందంగా ఉన్నాడు. మాటలో, నడకలో మర్యాద ఉట్టిపడుతోంది. అతని పురావస్తు పరిజ్ఞానం స్లీమన్ ను ఆశ్చర్యచకితం చేసింది. అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. “పురాతన నాగరికతలపట్ల అవగాహన పెంపొందడానికి మీరు అమూల్యమైన దోహదం అందిస్తున్నా”రంటూ చక్రవర్తి కూడా స్లీమన్ పై ప్రశంసలు కురిపించాడు.

ఉబ్బు తబ్బిబ్బు అయిపోయిన స్లీమన్ అతనికి చిత్రిత మృణ్మయ పాత్రల తాలూకు శకలాలను కొన్నింటిని బహూకరించాడు.  అయితే, చక్రవర్తి వచ్చి వెళ్ళిన కొన్ని రోజులకు ఒక విషయం తెలిసి ఒకింత ఆశ్చర్యపోయాడు. లియోనీదస్ లియొనార్దో అనే పోలీస్ కెప్టెన్ చక్రవర్తి భద్రతకు బాధ్యుడిగా అతని వెంటే ఉన్నాడు. పోలీస్ సిబ్బంది అంతా పంచుకోండంటూ చక్రవర్తి ముష్టి విదిల్చినట్టు అతనికి నలభై ఫ్రాంకులు ఇచ్చాడు.  లియొనార్దోకు చక్రవర్తి వెయ్యి ఫ్రాంకులు బహూకరించాడనీ, నలభై ఫ్రాంకులే ఇచ్చినట్టు అతను అబద్ధం చెబుతున్నాడనీ మిగతా పోలీస్ సిబ్బంది అనుకున్నారు. దానిపై విచారణ జరిగి లియొనార్దోను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆ పోలీస్ కెప్టెన్ స్లీమన్ కు బాగా తెలిసినవాడు. అతనిపై తీసుకున్న చర్యకు స్లీమన్ మండిపడ్డాడు. అతను ఎలాంటి తప్పూ చేసి ఉండడంటూ ఎథెన్స్ లోని ప్రధానమంత్రికి తంతి పంపాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో, బ్రెజిల్ చక్రవర్తి కైరోలో ఉన్నట్టు తెలిసి నేరుగా అతనికే తంతి పంపాడు:

ఏలినవారు నాప్లియో నుంచి వెళ్ళేటప్పుడు, పోలీసులందరికీ పంచమని కోరుతూ కెప్టెన్ లియోనీదస్ లియొనార్దోకు నలభై ఫ్రాంకులు ఇచ్చారు. కానీ, ఏలినవారినుంచి వెయ్యి ఫ్రాంకులు తీసుకున్నాడంటూ, ఎంతో ఉత్తముడైన ఆ వ్యక్తి మీద నాప్లియో మేయర్ నింద మోపాడు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతను జైలు పాలు కాకుండా చూడడం కోసం నేను విశ్వప్రయత్నం చేస్తున్నాను. అతను నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఎంతో నిజాయితీపరుడు. కనుక  ఏలినవారు అతనికి వాస్తవంగా ఎంత మొత్తం ఇచ్చారో తెలుపుతూ తంతి పంపవలసిందని, పవిత్ర సత్యమూ, మానవత్వాల పేరిట ప్రార్థిస్తున్నాను.

పోలీస్ కెప్టెన్ కు తను నలభై ఫ్రాంకులే ఇచ్చినట్టు తెలుపుతూ చక్రవర్తి వెంటనే తంతి ఇచ్చాడు. దాంతో లియొనార్దోను తిరిగి ఉద్యోగంలో నియమించారు.

వేసవి గడిచింది. వర్షాలు ముంచెత్తుతుండడంతో తవ్వకాలు జరుగుతున్న ఆగొరా దగ్గర అంతా బురద బురద అయిపోయింది. అయినా పని కొనసాగింది. అక్టోబర్ మధ్యలో ఆగొరాలో లోతుగా తవ్వకాలు జరుపుతుండగా ఒక పెద్ద రాతి వాలుమీద, 20 అడుగుల పొడవూ, 10 అడుగుల వెడల్పుతో మలచిన ఒక సమాధి బయటపడింది. దొంగలు దోచుకున్నారనడానికి గుర్తుగా చెల్లా చెదురుగా పడున్న కొన్ని బంగారు బొత్తాలు, రాతి పలకలు, దంతపు కొమ్ములు కనిపించాయి. అవి సమాధి గది తాలూకు అలంకారసామగ్రి కాబోలని స్లీమన్ అనుకున్నాడు. మరింత దక్షిణంగా, ఆ వలయ కేంద్రానికి దగ్గరగా తవ్వకాలు కొనసాగించారు. 15 అడుగుల లోతున ఒక గులకరాయి పొర తగిలింది. ఆ పొర అడుగున మూడు కళేబరాలు కనిపించాయి. వాటిని మట్టి, చితాభస్మంలా కనిపిస్తున్న బూడిద దట్టంగా కప్పేసాయి.  వాటిలోంచి బంగారపు మెరుపులు తొంగి చూస్తున్నాయి.

చేతికి అందేటంత దూరంలో స్వర్ణనిక్షేపాలు ఉన్న సంగతి స్లీమన్ కు అర్థమైంది. ఇంకోవైపు ప్రభుత్వ అధికారులు నీడలా తనను వెన్నంటి ఉన్న సంగతీ తెలుసు. ట్రాయ్ లో నిక్షేపాలను కనిపెట్టిన క్షణాలలోలానే ఒక్కసారిగా విపరీతమైన ఆందోళనతో, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అప్పటిలానే సహాయం కోసం సోఫియావైపు చూశాడు. అతనెంత ఉద్రిక్తతకు, ఉత్తేజానికీ లోనయ్యాడంటే; ఆ అస్థిపంజరాలను కప్పిన మట్టిని తొలగించడానికి కూడా అతనికి చేతులు ఆడలేదు. చటుక్కున సోఫియాయే వాటి పక్కన ఉన్న ఖాళీ జాగాలోకి దూరి వెళ్ళి జేబుకత్తితో మట్టిని తొలగించింది.

ఒక్కో కళేబరం దగ్గరా అయిదేసి స్వర్ణకిరీటాలు ఉన్నాయి.  రెండు కళేబరాల దగ్గర అయిదేసి బంగారు శిలువ ఆకృతులూ, ఇంకో కళేబరం దగ్గర అలాంటివే నాలుగూ ఉన్నాయి.  వాటి చేతులను పొన్న ఆకుల రూపంలో మలచారు.  ట్రాయ్ లో దొరికిన స్వర్ణహార కిరీటాలు విస్తారమైన నగిషీపనులతో అట్టహాసంగా ఉంటే; పలచని బంగారు రేకుల మీద వలయాలు, గుబ్బల వంటి అలంకారాలను చెక్కిన మైసీనియా స్వర్ణకిరీటాలు సీదా సాదాగా ఉన్నాయి.

వాటి దగ్గరే చిన్న చిన్న లావా కత్తులు, తొడుగులు  చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక వెండి పాత్ర ఉంది. అక్కడ అగ్నికి సంబంధించిన ఆధారాలను చూసిన స్లీమన్, మృతదేహాలను దహనం చేశారా, లేక కాల్చారా అన్న సందేహానికి లోనయ్యాడు. సమాధికి అడుగున ఉన్న గులకరాళ్ళు చితికి గాలి, వెలుతురు ప్రసరించడం కోసమే ననుకున్నాడు.  మృతదేహాన్ని దహనం చేయడం కాక; కాల్చి ఎముకలనుంచి మాంసాన్ని వేరు చేయడం మైసీనియన్ల ఆచారంగా నిర్ణయానికి వచ్చాడు.  ఆ తర్వాత మరో పురావస్తునిపుణుడు విల్హెమ్ డార్ఫెల్డ్ (1853-1940) కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. స్లీమన్ చూసే నాటికి ఆ మూడు కళేబరాల తాలూకు అస్థిపంజరాల ఆకృతులు స్పష్టంగా గుర్తించేలా ఉన్నా, తేమ వల్ల దెబ్బతిని త్వరలోనే వాటి రూపు చెడింది. మైసీనియా నిక్షేపాలు ప్రస్తుతానికి పదిహేను స్వర్ణకిరీటాలుగా, పద్నాలుగు బంగారు శిలువలుగా లెక్క తేలాయి.

OLYMPUS DIGITAL CAMERA

ఈసారి స్లీమన్ సింహద్వారా(Lion Gate)నికి మరింత దూరంగా, సమాధి కేంద్రానికి పక్కనే తవ్వకాలు జరపాలని నిర్ణయించాడు. 9 అడుగుల లోతున మరికొన్ని అస్థిపంజరాలు, వాటి దగ్గరే లావా కత్తులు కనిపించాయి కానీ; నిక్షేపాలేవీ కనిపించలేదు. ఒకింత విస్తుపోతూనే తవ్వకాలను కొనసాగించాడు. మొదటి సమాధి దగ్గర ఏమీ దొరకకపోయినా, రెండో సమాధి దగ్గర కొద్దిపాటి నిక్షేపాలు కనిపించాయి. అయితే, మూడో సమాధి దగ్గర కొంచెం తవ్వేసరికే అస్థిపంజరాల అడుగున అనూహ్యమైన స్వర్ణసంపద కళ్లను జిగేలుమనిపించింది.  మొత్తం గది అంతా ఎర్రటి కాంతులు విరజిమ్మే స్వర్ణాభరణాలతో కిక్కిరిసిపోయింది.

అప్పటికి పనివాళ్లను చాలామందిని పంపేశారు. నాటి కోశాగారాలుగా భావించిన తావుల వద్ద సైనికులు కాపలా కాస్తున్నారు. మరోసారి సోఫియా ఆ అస్థిపంజరాల మధ్యకి, స్వర్ణ సంపద మధ్యకి దూరి వెళ్లి, ఆ రాచ సమాధులను కప్పిన మట్టిని తొలగించింది. పలచని బంగారు రేకుల మీద సున్నితంగా మలచిన ఆకృతులు ఎక్కడ తింటాయోనన్న భయంతో ఎంతో జాగ్రత్తగా, ఓపికగా, నెమ్మదిగా ఆ పని చేసింది. రెండో సమాధిలో ఉన్నట్టే ఇందులోనూ మూడు కళేబరాలు ఉన్నాయి. అందులో ఒకటి స్వర్ణకిరీటాన్ని ధరించి ఉంది. ముప్పైకి పైగా బంగారపు ఆకులు దానికి వేళ్ళాడుతున్నాయి. రాజు ఆ కిరీటాన్ని ధరించినప్పుడు ఈ బంగారపు ఆకులు చంచలిస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది గాక మరో ఎనిమిది స్వర్ణకిరీటాలు, ఆరు బంగారు శిలువలూ(వీటిలో కొన్ని విపరీత అలంకారం కలిగిన రెండుపేటల శిలువలు), వెండి కాడకు అమర్చిన బంగారు పువ్వు కనిపించాయి. ఆపైన కొన్ని స్వర్ణ హారాలు, గుండ్రని పాత్రలు, కలశాలు, మద్యం జారీలు కనిపించాయి. వీటిలో కొన్నిటికి చక్కని బంగారు తీగలు తాపడం చేసిన బంగారు మూతలు ఉన్నాయి. అలాగే, ప్రకాశించే రాతి స్ఫటికగోళాలు కొన్ని కనిపించాయి. బహుశా రాజుల కరవాలాలకు పిడులుగా వాటిని ఉపయోగించి ఉండవచ్చు.

                                                                                                               (సశేషం)

*ఇది THE GOLD OF TROY  రాసిన ROBERT PAYNE చేసిన వ్యాఖ్య. కొమ్ము పురుషుడి శృంగార సామర్థ్యానికి, అంటే పుంస్త్వానికి కూడా చిహ్నమన్న పరోక్షసూచన ఇందులో ఉంది. ఇదే శీర్షిక కింద నేను రాసిన ‘గణపతి కొమ్ము కిరీటం చెప్పే ‘శృంగార’గాథ’(సారంగ/21-05-2015) చూడగలరు. ‘శృంగం’ (కొమ్ము) అనే మాట నుంచే ‘శృంగారం’ అనే మాట పుట్టిందని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు.

** పైన వివరించిన సైనికుల చిత్రం గ్రీసు పురాచరిత్రను చెప్పడంతోపాటు, పురాతన భారతదేశంలో, ఉదాహరణకు కురుక్షేత్రయుద్ధంలో సైనికులు ఎలాంటి ఆహార్యం ధరించేవారన్న ఆసక్తికర ప్రశ్నను ముందుకు తెస్తోంది. కవిత్రయభారతంలో కానీ, సంస్కృతభారతంలో కానీ సైనికుల ఆహార్యం గురించిన చిత్రణ ఉందేమో  పరిశీలించాలి. చరిత్రకారుల అంచనా ప్రకారం ట్రోజన్ యుద్ధం(జరిగి ఉంటే) క్రీ.పూ. 1334-1184ల మధ్య జరిగింది. కురుక్షేత్రయుద్ధం(జరిగి ఉంటే) క్రీ.పూ. 15-10 శతాబ్దుల మధ్య జరిగింది.  ఈ అంచనాలే నిజమైతే రెండు యుద్ధాలూ అటూ ,ఇటూ ఒకటి రెండు వందల ఏళ్ల తేడాతో జరిగి ఉండాలి. సైనికుల ఆహార్యమూ, ఆయుధాల విషయంలో రెంటి మధ్యా పోలికలు ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే, ఇది ప్రస్తుతానికి ఊహ మాత్రమే.

 

 

 

నేను త్యాగరాయల్ని కాను!

 

 

 

“కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి గదుల్లో బంధించుకున్నారు. మూర్ఛలు తెచ్చుకున్నారు. పిచ్చాసపత్రుల్లో చేరారు. _రచయితలు ఇంత త్యాగం చేసి ప్రాణాలు తోడేసుకుంటుంటే ….”

పైవి, కథా ఖధీరుడి తాజా పుస్తకంలోనివిగా చెప్పబడుతున్న వాక్యాలు. ఆ పుస్తకం నేనింకా చదవలేదు. గొప్పగా ఉంటుందనుకుంటున్నాను. అది నా చేతికంది, చదివాక దానిగురించి వివరంగా ముచ్చటించుకుందాం. ప్రస్తుతానికి పై వాక్యాలు నాలో కలిగించిన స్పందన మాత్రం రాస్తాను.

ఖదీర్ వ్యాఖ్యల్లో నిజమెంత? వృత్తిపరంగా ఉచ్ఛస్థాయికెదిగి వ్యక్తిగత జీవితంలో మాత్రం భ్రష్టుపట్టిపోయినవారు సాహిత్యంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ కనిపిస్తారు. దానికి కారణాలేంటనేది వేరే చర్చ. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదని సమాధానమొస్తుంది. రచయితల్లోనే తీసుకున్నా ఖదీర్ ప్రస్తావించిన స్థాయిలో చిత్రహింసలు అనుభవించేవాళ్ల శాతం తక్కువ. బహుశా తను చెప్పదలచుకున్న విషయాన్ని ఎంఫసైజ్ చేయటానికి ఖదీర్ బాబు కావాలనే అతిశయీకరించినట్లు నాకనిపిస్తుంది. ఆ అతిశయాన్ని అవతలబెడితే, ఖదీర్ వాక్యాల్లో చివరిది నన్ను అమితంగా ఆశ్చర్యపరచింది.

రచయితలు ఇంత త్యాగం చేసి ప్రాణాలు తోడేసుకుంటుంటే ….”

రచన చేయటం పెద్ద త్యాగమా! అయితే ఆ త్యాగం ఎవరికోసం చేస్తున్నట్లు? ఎందుకోసం చేస్తున్నట్లు?

ఇతరుల సంగతేమో కానీ నా మట్టుకు నేను కథలు రాయటం కోసం చేసిన త్యాగాలు ఏమీ లేవని ఘంటాపధంగా చెప్పగలను.

నా కథాకోడి కూయకపోతే లోకానికి తెల్లారదా? లేదు. నా కథలు చదవకపోతే నిద్రపట్టని పాఠకులున్నారా? లేరు. నన్నెవరన్నా కథలు రాయమని బలవంతపెట్టారా? లేనే లేదు.

మరి నేను కథలెందుకు రాస్తున్నాను? జనాలకి సందేశాలీయటానికా? పాఠాలు నేర్పటానికా? దానికి ఇతర మార్గాలు బోలెడుండగా కథలే ఎందుకు రాయాలి?

ఎందుకంటే కథ రాయాలన్నది నా కోరిక కాబట్టి. కథ రాయటమంటే నాకు ఇష్టం కాబట్టి. కథలు రాయటం ఆషామాషీ వ్యవహారం కాదు. నిజమే. ఆలోచనల్ని మధించాలి. అందులోంచి అమృతం తీయాలి. ఆ క్రమంలో అష్టకష్టాలు పడాలి. అయితే అవన్నీ ఎందుకోసం? ఎవరికోసం? నాకు ఇష్టమైన పని చేసి, నా కోరిక తీర్చుకోవటం కోసం. ఇది నాకోసం నేను చేస్తున్న పని. ఇందులో త్యాగానికి తావెక్కడ?

కథలు రాయటం ద్వారా నేను కొన్ని విలువైన స్నేహాలు, మరిన్ని పరిచయాలు సంపాదించాను. పోగొట్టుకుంది మాత్రం ఏదీ లేదు. ఈ సంపాదించటాలూ, పోగొట్టుకోవటాలూ పక్కనపెడితే – కథ రాసే క్రమంలో నేను పడే కష్టం నాకు అమితమైన సంతృప్తినిస్తుంది. “ప్రయాణమే ప్రతిఫలం” అనే అర్ధమొచ్చే ప్రాచీన చైనీస్ నానుడొకటుంది. ఓ కథ రాస్తున్నప్పుడు నేను నేర్చుకున్న కొత్త విషయాలు, పొందిన అనుభూతులు, నాకు లభించే మెంటల్ ఎక్సర్‌సైజ్ – ఇవే ఆ కథ నాకిచ్చే బహుమతులు. తక్కినవన్నీ బోనస్. ఆ కొసరు గురించి ఆలోచించకుండా కథా ప్రయాణమిచ్చే అసలైన ప్రతిఫలాన్ని ఆస్వాదించగలిగిన కథకుడిని పొగడ్తలు, పిచ్చికూతలు, ఉక్రోషాలు, ఉన్మాదాలు … ఇవేవీ తాకలేవని నేను నమ్ముతాను. చప్పట్లు, అవార్డులు, రివార్డుల మాయలో పడ్డ కథకుడు తనకోసం తాను కాకుండా ఇతరులని మెప్పించటం కోసం రాస్తాడు. అది అతనికి మంచిది కాదు. అతని కథకి అంతకన్నా మంచిది కాదు. (కమర్షియల్ రచయితలకి ఇక్కడ మినహాయింపు. వాళ్ల లెక్కలు, కొలతలు వేరే. వారి గురించి వేరెప్పుడన్నా మాట్లాడుకుందాం) ఇతరుల మెప్పు, గుర్తింపు కోసం రాయటం ప్రధానమైపోతే ఎక్కడలేని సమస్యలూ చుట్టుముడతాయి. తన ‘సాహితీ సేవ’ ఎవరూ గుర్తించటం లేదన్న బాధ, పక్కోడిని పొగిడి తనని పట్టించుకోలేదన్న ఏడుపు … ఒకటా రెండా!

ఇతరుల కోసం రాయటంలో ఇన్ని తలకాయ నొప్పులున్నాయి కాబట్టి, మన కోసం మనం రాసుకోవటం ఉత్తమం. మిగతా కథకుల సంగతేమో కానీ నేను మాత్రం కథలు మొదటగా నాకోసమే రాసుకుంటాను. ఆ తర్వాతే ఇతరుల కోసం రాస్తాను. ఇందులో కొన్ని సౌలభ్యాలున్నాయి. నా కోసం రాసుకోవటం వల్ల నేను నాలాగే రాయగలుగుతాను. మరెవరిలానో రాయను. ఫలానావారికన్నా గొప్పగా రాయాలి, ఇంకెవరికన్నానో తీసిపోకుండా రాయాలి వంటి పోలికల్లేకుండా రాయగలుగుతాను. అది నా ఒరిజినాలిటీని నిలుపుతుంది.

రెండో సౌలభ్యం: నాకోసం నేను రాసుకోవటం వల్ల నా సొంత సమస్యలపైనే కథలు రాస్తాను. ఇక్కడ సమస్యలంటే ఉద్యోగం ఊడిపోవటం, భార్యామణితో గొడవలు, వగైరా మాత్రమే కాకపోవచ్చు. నాకు అమితమైన ఆసక్తి కలిగిన, లోతైన అవగాహన కలిగిన విషయాలు అని అర్ధం చేసుకోండి. ఇతరులకి ఆసక్తిగొలిపే విషయాలు, లేదా ప్రస్తుతం సేలబిలిటీ ఉన్న అంశాల్లోకి పక్కదోవ పట్టకుండా బాగా తెలిసిన విషయాలపైనే కేంద్రీకరించటం వల్ల మనం రాసేదానికి విశ్వసనీయత పెరుగుతుంది.

మూడో సౌలభ్యం: ఇతరుల కోసం రాస్తే – ఏ ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉండవు కాబట్టి ఓ కథతో అందరినీ మెప్పించటం ఎన్ని సాముగరిడీలు చేసినా అసాధ్యం. దీనికి బదులు ఒవరో ఒకరినే మెప్పించటం కోసం ఎందుకు రాయకూడదు? ఆ ఒక్కరూ నేనే ఎందుక్కాకూడదు? నా ఇష్టాయిష్టాలు నాకు బాగా తెలుసు కాబట్టి నాకోసం నేను రాసుకోవటం తేలిక.

అందువల్ల, నేను ప్రధానంగా నాకోసమే కథ రాసుకుంటాను. నా మొదటి కథ రాసినప్పుడు వేరే దారెటూ లేదు. అప్పట్లో నాకీ కథాలోకం గురించి ఏమీ తెలీదు. ఇప్పుడున్న పరిచయాలు, స్నేహాలు లేవు. కథని ఎలా అచ్చుకు పంపాలో, ఎవరికి పంపాలో తెలీదు. ఒకవేళ పంపినా దాన్నెవరన్నా స్వీకరిస్తారో లేదో తెలీదు. అదృష్టవశాత్తూ అచ్చైనా దాన్ని పాఠకులు ఎలా ఆదరిస్తారనే అంచనా అసలుకే లేదు. కాబట్టి అచ్చు గురించిన ఆలోచనా బాదరబందీలూ, అంచనాల బంధనాలూ లేకుండా స్వేఛ్చగా కేవలం నన్ను నేను మెప్పించుకోటానికి రాసుకున్న కథ అది.

ఒకవేళ నా తొలికథ (ఆనాటికింకా) అఖండాంధ్ర ఆంధ్ర పాఠకదేవుళ్లని ఆకట్టుకోవాలన్న కృతనిశ్చయంతో రాసి ఉన్నట్లైతే?

అది కచ్చితంగా ఎడిటర్‌గారి చెత్తబుట్టలోకి చేరుండేది.

ఆ కథని నాకోసం రాసుకోవటం ఓ కథకుడిగా నాకు నేను చేసుకున్న గొప్ప ఉపకారం. ఆ తర్వాతి కథలకీ అదే పద్ధతి పాటించటం అలవాటుగా మారింది.

ఇదంతా చదివాక – మీరూ నాలాంటివారైతే – వెంటనే ఓ ప్రశ్నేస్తారు. “నీ కోసం నువ్వు రాసుకుంటే దాన్నలాగే దాచుకోక అచ్చోసి మా ముఖాన కొట్టటమెందుకు?”

మీరో కథ చదివారు. లేదా ఒక సినిమా చూశారు. అది మీకు బాగా నచ్చింది. ఆ కథ/సినిమా మీక్కలిగించిన అనిర్వచనీయానుభూతిని లోలోనే దాచుకుంటే మీ శరీరం విస్ఫోటిస్తుందేమోననే సందేహంతో సతమతమౌతారు. మరో పదిమందితో ఆ కథ చదివించటం/సినిమా చూపించటం చేసేదాకా మీరు ఊరుకోలేరు. అవునా? మనోల్లాసం  కలిగించే విషయాలు, మనసుకి నచ్చిన సంగతులు ఇతరులతో పంచుకోవటం మానవనైజం. కళాకారులు తమ సృజనని బహిరంగపరచటమూ అందుకేనని నేననుకుంటాను. (చప్పట్ల కోసమూ కావచ్చు. అందులో తప్పేమీ లేదు. అవే ప్రధానమైనప్పుడే తేడాలొస్తాయి). నా కోసం నేను రాసుకున్న కథని నలుగురి కోసం అచ్చు వేయటానికి అంతకన్నా పెద్ద కారణం లేదు.

అయితే – నా కోసం నేను రాసుకునే దశలో కథ అచ్చమైన స్వచ్ఛమైన కళా రూపం. ఎప్పుడైతే దాన్ని ఇతరులకోసం బహిరంగపరచాలనుకున్నానో అప్పుడా కథ కళా పరిధి దాటి క్రాఫ్ట్ ఇలాకాలోకి అడుగు పెడుతుంది. వేరేవాళ్ల కోసం అనేసరికి కథని కాస్త ముస్తాబు చేయాల్సొస్తుంది. మెరుగులు దిద్దాల్సొస్తుంది. ఇంట్లో మనమే ఉన్నప్పుడు దాన్నెలా పెట్టుకున్నా, అతిధుల్ని పిలిచినప్పుడు ఇల్లు కాస్త పొందిగ్గా సర్దుతాం చూడండి. అలాగే కథకి పబ్లిక్ అప్పీల్ పెంచటం కోసం దానిక్కాస్త క్రాఫ్టింగ్ తప్పనిసరి. హీరోగారికి క్రాఫింగ్‌లా కథకి క్రాఫ్టింగ్ అన్న మాట! (ప్రాస కుదిరిందని వాడేశా. ఈ పోలిక గురించి మరీ ఇదైపోకండి). క్రాఫ్టింగ్ అనేది ఇతరుల కోసం తిరగ రాసే దశ. లక్ష్యిత పాఠకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే దశ. ఈ దశ దాటకుండా కథని అచ్చుకి పంపటం నేనైతే చేయను. “మొదటగా నాకోసమే రాసుకుంటాను. ఆ తర్వాతే ఇతరుల కోసం రాస్తాను” అనటం వెనక అర్ధం ఇదే.

అదండీ సంగతి. త్యాగం దగ్గర మొదలెట్టి ఎక్కడెక్కడో తిరిగొచ్చాం. చెప్పొచ్చేదేమంటే, కథలు రాయటం నన్నేమీ త్యాగమయుడిగా మార్చదు. ఎందుకంటే అది నాకోసం నేను ఇష్టంగా చేస్తున్న పని. ఇష్టమైన పని కాబట్టి అది కష్టంగానూ అనిపించదు.

ఇది చదువుతున్న వారిలో వర్ధమాన రచయితలుంటే, వాళ్లు స్వీకరించదలిస్తే, నా కొద్దిపాటి అనుభవంలోని ఇచ్చే చిన్న సలహా. మీకోసం మీరు కథలు రాసుకోండి. అది మీ దేహానికి, మనసుకి, అన్నిటికీ మించి మీ కథకి చాలా మేలు చేస్తుంది.

*

నిర్ముక్తం

 

 

– రాధ మండువ

చిత్రం: నివాస్ 

~

radhaనేను రమణమహర్షి ఆశ్రమంలో లైబ్రరీలో సేవ చేస్తుంటాను. ఆశ్రమానికి దగ్గర్లోనే ఇల్లు కొనుక్కుని తిరువణ్ణామలైలో సెటిలైపోయి పదేళ్ళు కావస్తోంది.

ఆరోజు రమణుడికి మెడిటేషన్ హాల్లో నమస్కరించుకుని మాతృభూతేశ్వరాలయంలో నవగ్రహాల దగ్గర ఊదొత్తులు వెలిగించాలని వెళ్ళాను. వెళుతుండగా ఆలయం ముందున్న హాలులో కిటికీకి దగ్గరగా ఒక విదేశీ జంట ఒకర్నొకరు హత్తుకుని నిలబడి ఉండటం కనిపించింది. ఆమె ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. పొడవుగా సన్నగా ఉన్న అతను ఆమె వీపుని తన అర చేతులతో తడుముతూ ఓదారుస్తున్నాడు. ‘నలుగురూ తిరిగే ప్రదేశాలలో, అందునా గుడిలో ఏమిటీ చర్యలూ, మరీ ఈ మధ్య చీదర పుట్టేట్లు ప్రవర్తిస్తున్నారు’ అని నేను మొదట చూడగానే అనుకున్న మాట వాస్తవం. అయితే వెంటనే అనిపించింది పాపం వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు వెళుతూ దు:ఖిస్తున్నారేమో అని.

నేను ప్రక్కనే ఉన్న రమణుడి విగ్రహానికి నమస్కరించి మళ్ళీ వాళ్ళని చూశాను. ఆమె అతన్నించి విడివడి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆమె చాలా పెద్దావిడ! అరె, అతను జాన్ కదూ! అతను దాదాపు సంవత్సరమున్నర నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఆవిడ వాళ్ళ అమ్మగారేమో!?

అతడు వెళుతున్న ఆమెకి చెయ్యి ఊపుతూ “బై మమ్” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండా కన్నీళ్ళని తన చేతిలో ఉన్న చిన్న టవల్ తో తుడుచుకుంటూ ఆఫీసులోకి వెళ్ళిపోయింది. అతను కిటికీ చువ్వలను పట్టుకుని ఆమెనే చూస్తున్నాడు. ఏడుస్తున్నాడా? తెలియట్లేదు. అతని వెనుకగా నాలుగడుగుల దూరంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు మాత్రం కన్నీళ్ళు తిరిగాయి.

ఏమయిందో తెలుసుకోవాలని నేను ఆఫీసు దగ్గరకి వెళ్ళాను. ఆమె ఆఫీసులో వాళ్ళకి చెప్పి బయటకి రాగానే ఆమె నాకు పరిచయమే అన్నట్లుగా “హలో హౌ ఆర్ యు?” అన్నాను.

“ఓకే – మీరూ….” అంది.

“నా పేరు జానకి. ఆశ్రమం లైబ్రరీలో ఇంకా ఇక్కడ అఫారెస్టే్రషన్ సర్వీస్ ఎన్ జి వో సంస్థ లో వాలంటీర్ గా పని చేస్తుంటాను” అన్నాను.

“హలో, హాయ్, నా పేరు మేరీ” అంది మెహమాటంగా.

“ఇప్పుడే చూశాను మిమ్మల్ని. జాన్ మీ అబ్బాయే కదా!?” అన్నాను.

“ఔను” అంది – దు:ఖపు జీర ఆమె గొంతులో.

“మిమ్మల్ని చూస్తూ నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఆ మధ్య చదివిన ఓ జానపద కథ గుర్తొచ్చింది నాకు” అన్నాను.

“ఫోక్ స్టోరీ!? ఏమిటది? మీకేమీ అభ్యంతరం లేకపోతే చెప్తారా?” అంది.

 

ఇంగ్లీషులో జరుగుతున్న మా సంభాషణ అర్థం అవుతుందో లేదో కాని వరండాలో కూర్చుని ఉన్న ఐదారుగురు భక్తులు మమ్మల్నే చూస్తున్నారు. “ఇక్కడ కూర్చుందాం రండి” అంటూ బుక్ స్టోర్ కి పక్కగా ఉన్న సన్నని వరండా లోకి తీసుకెళ్ళాను. ఇద్దరం గోడకి ఆనుకుని కూర్చున్నాక “కథ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కథ విన్నాక మీ పట్ల నేను ఊహించింది కరెక్ట్ కాకపోతే మీరేమీ అనుకోవద్దు సుమా! అయినా ప్రయాణమైనట్లున్నారు, సమయముందా” అన్నాను.

ఆమె నవ్వుతూ “చాలా సమయముంది. ఏమీ అనుకోను చెప్పండి, వినాలని ఆసక్తిగా ఉంది” అంది.

Kadha-Saranga-2-300x268

“మాగ్దానా అనే రాణి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. కుమారుడి మీదే ఆశలన్నీ పెట్టుకుని పెంచి పెద్ద చేసుకుంది. కాని ఆమె కొడుకు యుక్తవయస్కుడయ్యాక అమరత్వాన్ని సాధించాలని తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. కాలదేవత దగ్గర కాలమనేదే తెలియకుండా కొన్ని వందల సంవత్సరాలు జీవించాక తల్లిని చూడాలనిపించి వాళ్ళ రాజ్యానికి వస్తాడు. వచ్చాక తెలిసింది – తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిన కొడుకుగా అతని పేరు చరిత్ర పుటల్లో లిఖించబడిందని. ‘నేను సాధించింది ఇదా?’ అని ఖిన్నుడయిపోతాడు”

కథని వింటున్న ఆమె నిట్టూరుస్తూ “సో శాడ్” అంది.

“మీ అబ్బాయి కూడా మిమ్మల్ని వదిలేసి ఆశ్రమానికి వచ్చాడా అనిపించింది మీరు అతన్ని హత్తుకుని దు:ఖిస్తుంటే” అన్నాను.

“మీరు మా గురించి ఊహించింది కరెక్టే – అయితే నేనే స్వయంగా నా చేతులతో నా బిడ్డ జాన్ ను మహర్షి దగ్గరకి పంపాను. అతనిక్కడకి వచ్చి సంవత్సరం దాటింది. కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉన్నాడా? లేడా? అనేది అర్థం కావడం లేదు” అంది.

“నాకర్థం కాలేదు. మీ అబ్బాయి ఆవేశపరుడా? అది తగ్గించుకోమని చెప్పి పంపారా ఇక్కడకి?”

“చాలా ఆవేశం, తన గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయినంత పని చేశాడు”

“ఏమిటీ? గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయాడా? ఎందుకు? ఆమె ఇతన్ని మోసం చేసిందా?”

“మోసం – ఈ మాటకి అర్థం ఏమిటి జానకీ – మీ పేరు జానకీయే కదా?” అని నేను తలూపాక “నీకు మోసమైంది నాకు న్యాయం అవొచ్చు కదా? మా దేశంలో నచ్చితే కలిసి ఉంటారు నచ్చకపోతే ‘నువ్వు నాకు నచ్చలేదు’ అని చెప్పేసే విడిపోతారు. ఆమె వీడిని వదిలి వేరే అతనితో వెళ్ళిపోయిందని కోపం” అంది.

“మరి ఆ అమ్మాయి ‘నేను నీతో కలిసి ఉండలేన’ని మీ అబ్బాయితో చెప్పింది కదా!?” అన్నాను.

“చెప్పింది. ఏం జరిగిందో చెప్తాను మీకు – నేను కమ్యూనిటీ కాలేజ్ లో లెక్చరర్ ని. మాగ్దానా రాణికి లాగే నా భర్త కూడా జాన్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆయన బ్రతికున్నప్పుడు జాన్ ని బాగా చదివించాలని నాతో అనేవాడు. వాడి కాలేజ్ చదువు కోసం బాగా సేవ్ చేసేదాన్ని. మీకు తెలుసు కదా మాకు యూనివర్సిటీ చదువు అంటే చాలా ఖర్చు అవుతుంది. జాన్ యూనివర్సిటీలో చేరాక అతని పుస్తకాలకైనా డబ్బులు వస్తాయని సాయంత్రం ఓ నాలుగు గంటలు బర్గర్ కింగ్ లో పని చేయమని చెప్పాను. అదీ నేను చేసిన తప్పు. పనికి చేర్చకుండా ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో! అక్కడ జాన్ తో పాటు అదే షిఫ్ట్ లో పని చేసే టీనాని ఇష్టపడ్డాడు. రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా రాయకుండా ఆమెతో తిరుగుతున్నాడని తెలిసి మందలించాను. దానికే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.

అపార్ట్ మెంట్ తీసుకుని ఆమెతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. ‘వేరేగా ఉంటే ఉన్నావు, చదువు మాత్రం మానొద్ద’ని నచ్చ చెప్పాను. టీనా చేత కూడా చెప్పించాను. వినలేదు.

ఏడెనిమిది నెలల తర్వాత హఠాత్తుగా ఒకరోజు రాత్రి పది గంటలప్పుడు ఇంటికొచ్చాడు. తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వస్తూనే ‘మమ్, ఈరోజు టీనాని చంపేస్తాను, నిన్నొకసారి చూసి నీతో చెప్పి పోదామని వచ్చాను’ అంటూ తన గదిలోకి వెళ్ళాడు.

నిశ్చేష్టురాలినైన నా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు కాని నా మెదడు మాత్రం చురుగ్గా పని చేసింది. జాన్ గది తలుపులు మూసేసి బయట గడి పెట్టేశాను. తలుపులు బాదుతూ ‘మమ్, తలుపులు తియ్’ అని అరవసాగాడు. ‘జాన్ కూర్చో, అక్కడే కూర్చో, తలుపులు తీస్తాను. ముందు నాతో మాట్లాడు. పెద్దగా అరిస్తే అందరికీ వినపడుతుంది. ఇక్కడేదో జరుగుతుందని పక్కింటి వాళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తారు, కామ్ డవున్’ అన్నాను. లోపల నుండి ఏమీ సమాధానం లేదు.

నా సెల్ తో జాన్ సెల్ కి ఫోన్ చేశాను. లోపల ఫోన్ ఎత్తి ‘హలో మమ్, తలుపు తియ్’ అన్నాడు.

‘తీస్తాను బిడ్డా, ఏం జరిగిందో నేను వినాలి కదా! వేరొకరిని చంపేస్తాను – అనే బిడ్డకి నేను జన్మనిచ్చానా!? అని సిగ్గుపడుతున్నాను’ అని భోరున ఏడ్చాను. వాడూ ఏడ్చాడు. ‘పడుకో జాన్, రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం’ అని ఫోన్ పెట్టేశాను.

ఆవేశంతో జాన్ తనని తాను శిక్షించుకుంటాడేమోనన్న భయంతో మెయిన్ డోర్ లాక్ చేసి బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళాను. రాత్రంతా అతని గది కిటికీ లోంచి అతన్నే చూస్తూ వాకింగ్ చేశాను. తలుపు దగ్గరే కార్పెట్ మీద పడి నిద్రపోయాడు జాన్. అప్పటికప్పుడే నా ఫ్రెండ్ శైలజాకి ఫోన్ చేశాను”

“శైలజ!?” అన్నాను.

“అవును మా కాలేజీలో నా తోటి లెక్చరర్, ఇండియనే. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఉదయం ఆరుకంతా మా ఇంటికి వచ్చింది. రాగానే గబగబా బ్లాక్ టీ చేసింది. ఇద్దరం టీ తాగుతూ హాలులో కూర్చుని ఉన్నాం. ఎనిమిదవుతుండగా జాన్ లేచి “మమ్!” అని పిలిచాడు తలుపు తడుతూ…

తలుపు తీసి ‘దా జాన్, శైలజ వచ్చింది’ అన్నాను. ఫ్రెషప్ అయి హాల్లోకి వచ్చాడు. శైలజని చూసి చిన్నగా నవ్వాడు. ఆ మాత్రానికే నేను చాలా సంతోషపడ్డాను. భయం పోయింది. మెల్లగా వచ్చి సోఫాలో నన్ను ఆనుకుని కూర్చున్నాడు. శైలజ లేచి జాన్ కి టీ తెచ్చి ఇచ్చింది. అతను టీ తాగిన ఐదు నిమిషాల పాటు శైలజ తన బ్యాగ్ లో నుండి మహర్షి ఫోటో తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయింది.

 

జాన్ టీ తాగి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని శైలజనే చూడసాగాడు. నేను కూడా శైలజనే చూస్తూ జాన్ తల నిమురుతూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. కాసేపాగాక శైలజ కళ్ళు తెరిచి జాన్ నే నిశితంగా చూస్తూ నిదానంగా ‘జాన్, ఏం జరిగింది?’ అంది.

శైలజ వేసిన ప్రశ్నకి జాన్ చేతులు ఆవేశంతో వణకడం గమనించాను. శైలజ కూడా గమనించి లేచి తన కుర్చీని మా సోఫాకి దగ్గరగా లాక్కుని జాన్ చేతిని పట్టుకుంది. ఆమె కళ్ళు….” అంటూ మేరీ చెప్పడం ఆపి నా కళ్ళల్లోకి చూసింది. “మీ కళ్ళలాగే శైలజ కళ్ళు కూడా దయని కురిపిస్తుంటాయి” అంది.

నేను మెల్లగా నవ్వి ఆమె తడి కళ్ళల్లోకి చూస్తూ ముందుకు వంగి ఆమె చేతిని పట్టుకున్నాను. దు:ఖాన్ని దిగమింగుకుంటున్నట్లుగా ఆమె గుటకలు మింగింది.

“శైలజగారికి సమాధానం చెప్పాడా?” అన్నాను.

మేరీ చెప్పాడన్నట్లుగా తల ఊపి ‘ఆ బిచ్ నన్ను మోసం చేసింది శైలజా, ఇప్పుడు టీనా బర్గర్ కింగ్ లో పని చేయడం లేదు. రెండు నెలల క్రితం విలేజ్ పాయింట్ అపార్ట్ మెంట్స్ రెంటల్ ఆఫీసులో చేరింది. అక్కడ వాళ్ళ ఆఫీసులోని తన కొలీగ్ తో రిలేషన్ షిప్ పెట్టుకుంది’ అన్నాడు జాన్. అతని గొంతు నిండా కోపం. ఆ కోపం వల్ల మాట తడబడింది.

‘నీకు చెప్పి నిన్ను వద్దన్నాకే అతనితో కలిసి ఉంటోంది కదా, అది మోసం ఎలా అవుతుంది?’ అంది శైలజ.

శైలజకి ఎలా తెలుసా? అన్నట్లుగా గభాల్న లేచి కూర్చుని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.

‘రాత్రి మీ అమ్మ నాకు ఫోన్ చేసి నీ పరిస్థితి చెప్పాక నేను టీనాకి ఫోన్ చేసి అన్ని విషయాలూ కనుక్కున్నాను. ఆమె తప్పేమీ లేదు, నీతో రిలేషన్ షిప్ కుదరదని చెప్పే అతని అపార్ట్ మెంట్ కి వెళ్ళిపోయింది కదా!? వెళ్ళి కూడా పది రోజులవుతోంది. ఇప్పుడేంటి నీకింత ఆవేశం – అదీ మర్డర్ చేయాలనేంతగా!? అయినా నీ వయసు ఎంతని? నీ వయసుకి తగ్గ పనులు చేస్తున్నావా నువ్వు? ఆలోచించు’ అంది.

జాన్ ఏమీ మాట్లాడలేదు. చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే శైలజని ఏమీ అనలేక ‘సారీ’ అని గొణిగాడు.

radha (1)ఇక ఆమె జాన్ ని రొక్కించకుండా అసలేమీ జరగనట్లూ, అంతా మామూలుగానే ఉందన్నట్లూ ‘గెట్ రెడీ మేరీ, కాలేజ్ కి టైమవుతుంది’ అని వంటింట్లోకి వెళ్ళి గబగబా ప్యాన్ కేక్స్ తయారు చేసింది. నేను ఫ్రెషప్ అయి వచ్చేలోపు కొత్తగా రిలీజైన సినిమాల గురించి మాట్లాడుతూ జాన్ కి ప్యాన్ కేక్స్ పెట్టింది. మేమిద్దరం కూడా తినేసి కాలేజీకి వెళ్ళిపోయాము. సాయంత్రం ఆఫీస్ అయ్యాక కౌన్సిలర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడాలని, కౌన్సిలర్ దగ్గరకి జాన్ ని తీసుకెళితే మంచిదని అనుకున్నాం.

మధ్యాహ్నం రెండవుతుండగా టీనా నుండి ఫోన్ వచ్చింది.

జాన్ టీనా ఆఫీస్ కి వెళ్ళి ఆమెని కత్తితో పొడవబోయాడట. ఆమె బాయ్ ఫ్రెండ్, జాన్ ని పట్టుకుని లోపల గదిలో కూర్చోపెట్టి కదలకుండా కాపలా కాస్తున్నాడట. అతను పోలీసులకి ఫోన్ చేస్తానంటే టీనా వద్దని ఆపి నాకు ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది. నేను, శైలజ ఇద్దరం హడావుడిగా అక్కడికెళ్ళాం. అదృష్టవశాత్తూ జాన్ టీనా మీదికి దూకినప్పుడు ఆమె, ఆమె బాయ్ ఫ్రెండ్ తప్ప ఆఫీసులో ఎవ్వరూ లేరు. నేను అక్కడికి వెళ్ళగానే టీనాని హత్తుకుని ఏడ్చాను. అనేక కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

శైలజ జాన్ ఉన్న లోపలి గదిలోకి వెళ్ళి అతని చేయి పట్టుకుని బయటకి తీసుకు వచ్చింది. జాన్ వంచిన తల పైకెత్త లేదు. నేను ఏడుస్తూ జాన్ ని వాటేసుకుని బయటకి నడిపించాను. శైలజ వెనుకనుండి మా ఇద్దరి భుజాల మీద చేతులు వేసి మాతో పాటు నడుస్తూ వెనక్కి తిరిగి ‘టీనా, నువ్వు ఈరోజు చేసిన సహాయానికి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. కృతజ్ఞతలు’ అని ‘మీ పేరేమిటో నాకు తెలియదు టీనా మాట విని పోలీసులకి ఫోన్ చేయకుండా ఆగినందుకు మీకు కూడా వందనాలు’ అంది. టీనా కొత్త బాయ్ ఫ్రెండ్ తో శైలజ ఆ మాటలు అంటున్నదని నాకర్థం అయింది. మమ్మల్నిద్దరినీ తన కారులోకి ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది.

ఆ తర్వాత రోజు నుండి నెల రోజులు లాంగ్ లీవ్ తీసుకుని జాన్ కి కౌని్సలింగ్ ఇప్పించాను. ఆ రోజుల్లో శైలజ మాకు చాలా సహాయం చేసింది. రమణ మహర్షి గురించి ఇంగ్లీషులో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలూ శైలజ నాకు తెచ్చి పెడితే, నేను జాన్ కి చదివి వినిపించాను.

ఆరోజు…. శైలజే అడిగింది జాన్ ని – ‘జాన్ రమణాశ్రమానికి ఇండియాకి వెళతావా?’ అని.

వెళతాను అన్నట్లుగా జాన్ తల ఊపాడు. నేను, శైలజా ఇద్దరం చాలా సంతోషపడ్డాం. శైలజ అప్పటికప్పుడే తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి అన్ని ఏర్పాట్లూ చేసింది. జాన్ కి ఆశ్రమంలో భోజన సదుపాయం మాత్రమే ఇచ్చారు. అదే చాలు అని ఆశ్రమానికి దగ్గర్లో అద్దె ఇంట్లో జాన్ ఉండేట్లు ఏర్పాట్లు చేసింది.

జాన్ ఇక్కడకి వచ్చి కూడా రెండేళ్ళవుతోంది జానకీ! నేను పోయిన సంవత్సరం వచ్చాను. ఇది రెండో విజిట్. అతనిలో మాత్రం ఏమీ మార్పు లేదు. ఆ ఆవేశం తగ్గించుకుని నా దగ్గరకి వచ్చి మళ్ళీ యూనివర్సిటీలో చేరి చదువు పూర్తి చేసుకోవాలనీ, ఉద్యోగంలో చేరి పెళ్ళి చేసుకుని హాయిగా జీవిస్తే చాలుననీ ఉంది. మహర్షి…. ఆయన బ్లెస్సింగ్స్ నా బిడ్డకి ఎప్పుడిస్తాడో!?” అంది. ఆ మాటలంటున్నప్పుడు కన్నీళ్ళు ఆమె బుగ్గల మీదుగా జారిపోయాయి.

నేను జాన్ తో మాట్లాడుతుంటాననీ, అతని క్షేమ సమాచారాలు వివరంగా మెయిల్ రాస్తానని చెప్పాను. నా మాటలకి ముఖం విప్పార్చుకుని అప్పటికప్పుడే బ్యాగ్ లోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చింది మేరీ.

 

***

 

ఆ తర్వాత సంవత్సరం పాటు జాన్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజూ జాన్ తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జాన్ క్షేమ సమాచారాలని మేరీకి తెలియచేస్తున్నాను. శైలజగారు కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు.

జాన్ లో ఆధ్యాత్మికంగా ఏ మాత్రమూ ఎదుగుదల కనపడటం లేదు. ఉదయం 6.30 కి లేచి ఏడు గంటల బ్రేక్ ఫాస్ట్ కి వస్తాడు. తిన్నాక నేరుగా గదికి వెళ్ళి కాసేపు పడుకుంటాడు. అపార్ట్ మెంట్ సర్వీస్ బాయ్ శీనా వచ్చినప్పుడు లేస్తాడు. ఆ అబ్బాయి రూమ్ ఊడ్చి, బట్టలుతికి వెళ్ళాక స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి సమాధి హాల్లో కూర్చుని పూజా కార్యక్రమం చూస్తాడు. 11.30 కి భోజనం చేసి వెళ్ళి మూడు వరకూ నిద్రపోతాడు. మూడుకి లేచి చిన్నగా ఆశ్రమానికి చేరి నాలుగు గంటలకి టీ తాగి బయట కూర్చుని కోతులని, నెమళ్ళని చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఎవరైనా పలకరిస్తే కబుర్లు చెప్తాడు లేకపోతే లేదు. మళ్ళీ హాల్లో కూర్చుని పారాయణం చేస్తుంటే విని ఏడున్నరకి డిన్నర్ చేసి గదికి వెళ్ళిపోతాడు. ఎనిమిది గంటలకి పడుకున్న అతను మళ్ళీ ఉదయం ఆరూ, ఆరున్నరకే లేచేది – ఇదే రోజూ అతని కార్యక్రమం.

ఎప్పుడైనా సాయంకాలం రమణాశ్రమం ఎదురుగ్గా ఉన్న షాపులో టీ తాగుతాడు. కావలసిన వస్తువులు సబ్బులు, పేస్ట్ లాంటివి కొనుక్కుంటాడు – అంతే. ఒక పుస్తకం చదవడమో, ధ్యానం చేసుకోవడమో ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే అతనెందుకు ఇక్కడ ఇలా సమయాన్ని వృథాగా గడుపుతున్నాడో అర్థం కాక బాధ కలుగుతోంది. ఈ విషయాన్ని మేరీకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు.

అతన్ని అతని దేశానికి ఎలా పంపాలా అని ఆలోచిస్తున్న నాకు రమణుడే దారి చూపించాడు. ఇలా నేను అనుకున్న తర్వాత రోజు నుంచే కుంభవర్షం. మా ఆర్గనైజేషన్ వాళ్ళు పనిలోకి దిగారు. జాన్ ని వెంటబెట్టుకుని వెళ్ళాను నేను కూడా కొండ మీదికి. పైనుంచి ఎవరో నీళ్ళని బిందెలతో పోస్తున్నట్లుగా వర్షం. ఆ వర్షంలో తడుస్తూనే చెట్లకి పాదులు తీస్తూ, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా కాలువలను మళ్ళిస్తూ పనులు చేస్తున్న వాళ్ళని జాన్ ఆశ్చర్యంగా చూడసాగాడు.

తర్వాత రోజు కొంతమంది కొండ మీద పని చేస్తారనీ, మరి కొంతమంది ఊళ్ళో లోతట్టు ప్రాంతంలో ఉన్న దినసరి కూలీలకి, వృద్ధులకి భోజన పొట్లాలను పంచడానికి వెళుతున్నారని తెలిసి, జాన్ ని తీసుకుని కావాలనే ఊళ్ళోకి వెళ్ళాను. పొట్లాలను పంచుతున్న జాన్ తో అన్నాను – “చూశావా జాన్ ఎంతో చక్కగా చదువుకునీ, ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ, కడుపు నిండిన వీళ్ళు ఒక వర్గం – తాము ప్రశాంతంగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నారు – సంతోషం.

ఇక ఈ అభాగ్యులని చూడు. ప్రతి రోజూ కూలి చేస్తే గాని పొట్ట నిండదు వీళ్ళకి పాపం. వీళ్ళొక వర్గం – వాళ్ళూ పని చేసుకుని వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఇంకో వర్గం కూడా ఉంది పనీ పాటా లేకుండా పెద్దవాళ్ళు సంపాదిస్తుంటే తిని కూర్చునే వాళ్ళు. వాళ్ళ వల్ల సమాజానికి కీడేగాని ఉపయోగం ఏముంది?” అన్నాను.

జాన్ ఔనన్నట్లుగా తల ఊపుతూ ‘యస్ జానకీ’ అన్నాడు.

వారం రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. అందరం పనులు చేస్తూనే ఉన్నాం. జాన్ లో కూడా హుషారు కనిపించింది. ఎనిమిదో రోజు జాన్ నా గదికి పరిగెత్తుకుంటూ వచ్చి “జానకీ, అమ్మ వస్తోంది ఎల్లుండి” అన్నాడు.

“తెలుసు జాన్, నాక్కూడా ఫోన్ చేసింది” అన్నాను.

 

***

మేరీ వచ్చింది. ఆశ్రమం ఆఫీసు ఎదురుగ్గా పందిరి క్రింద నన్ను హత్తుకుని బోలెడు కృతజ్ఞతలు చెప్పింది. జాన్ మా ప్రక్కనే నిలబడి మమ్మల్నే చూస్తున్నాడు. మేరీ నుండి విడివడి “జాన్, అమ్మని తీసుకుని సాయంత్రం అన్నామలై స్వామి మందిరానికి సాయంత్రం ఐదు గంటలకి రాగలవా? మీతో మాట్లాడాలి” అన్నాను.

“అన్నామలై స్వామి మందిరమా! అదెక్కడ?” అన్నాడు.

“దాదాపు రెండున్నరేళ్ళు అవుతుంది కదా నువ్వు ఇక్కడకి వచ్చి? ఆశ్రమం క్యాంపస్ లోనే ఉన్న ఆ మందిరం ఎక్కడుందో నువ్వే కనుక్కొని, వీలైతే అన్నామలైస్వామి గురించిన పుస్తకం కొనుక్కుని చదువుకుని రా” అన్నాను నవ్వుతూ. నా పెదవులు నవ్వుతున్నాయి కాని నా కళ్ళల్లోని తీక్షణతని గమనించినట్లున్నాడు – అతని ముఖం అప్రసన్నంగా మారింది. నేను పట్టించుకోకుండా మేరీకి పని ఉందని చెప్పి ఆఫీసులోకి వెళ్ళిపోయాను.

 

***

radha (1)సాయంత్రం ఐదయింది. నేను వెళ్ళేప్పటికి జాన్, మేరీ అన్నామలైస్వామి మందిరం ముందున్న వరండాలో కూర్చుని ఉన్నారు. నేను అన్నామలైస్వామి మందిరం తలుపు తీస్తూ “నిత్యకృషీవలుడు అన్నామలైస్వామి రమణుడిని సేవించి రమణుడంతటి వాడయ్యాడు మేరీ” అన్నాను. మేరీ ఆయన ఫోటోను చూస్తూ నమస్కరించింది. ఆయన సమాధి మీదున్న శివలింగానికి కూడా నమస్కరించుకున్నాక డాబా మీదకి తీసుకు వెళ్ళాను. అక్కడకి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్న కొండని చూపిస్తూ “చూశారా మేరీ, పనే దైవం అని నమ్ముకున్న అన్నామలై స్వామిని రమణుడే కాదు సాక్షాత్తూ ఆ శివుడే దగ్గరగా వచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా లేదూ!?” అన్నాను.

మేరీ అవునన్నట్లుగా తల ఊపుతూ ఆ కొండని నిశ్శబ్దంగా చూడసాగింది.

నేను జాన్ వైపుకి తిరిగి “జాన్, అన్నామలైస్వామి గురించి చదివావా?” అన్నాను.

లేదన్నట్లు తలూపాడు. అతని ముఖంలో ఏమిటీవిడ టీచర్ లాగా ప్రశ్నలు అనుకుంటున్నట్లు అనిపించింది.

నేనదేమీ గమనించనట్లుగా “జాన్, నువ్వేమీ అనుకోనంటే నేను నీకు నీ గురించి చెప్పాలనుకుంటున్నాను” అన్నాను. నా నుండి ఊహించని ఆ సంభాషణకి విస్తుపోయినట్లుగా చూశాడు. మేరీ కూడా నా వైపు ఆశ్చర్యంగా చూసింది.

“నేను నిన్ను పరిశీలించి తెలుసుకున్నదే కాకుండా నీ గురించి ఇక్కడి వాళ్ళు – ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకుని చెప్తున్నాను. అలా అని ఇతరులు చెప్పేదే కరెక్ట్ అని కాదు” అన్నాను.

 

“చెప్పండి” అన్నాడు. ఆసక్తి కనిపించింది అతని గొంతులో.

“నేను చెప్పడం ఎందుకులే జాన్, నాలుగు రోజుల క్రితం నువ్వు అభాగ్యులకి అన్నం పొట్లాలను పంచుతున్నప్పుడు నేను చెప్పిన మూడు వర్గాలలో నువ్వు ఏ వర్గానికి చెందిన వాడివో నువ్వే తెలుసుకోలేదా?” అన్నాను.

అతను గభాల్న నా వైపు చూసి వెంటనే తల వంచుకున్నాడు. మేరీ ఏదో మాట్లాడబోయింది కాని నా కనుసైగతో ఆపేసింది.

“నువ్వు ఒట్టి సోమరివి” అని అతని రెస్పాన్స్ కోసం ఆగాను.

జాన్ వంచిన తల ఎత్తలేదు. మేరీ ఆందోళనగా నన్నే చూస్తోంది. నేను అదేమీ పట్టించుకోకుండా “కాబట్టే మీ అమ్మ చదువుకోమని బ్రతిమలాడుతున్నా చదువుకోకుండా ఏదో చిన్న పనిలో ఇరుక్కున్నావు. నీలో ఏ మాత్రమూ ఎదుగుదల ఉండదని గమనించింది కనుకనే టీనా నిన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంటావనీ, మరిన్ని పుస్తకాలు చదువుకుని ‘నిన్ను నీవు’ తెలుసుకుని మీ దేశానికి తిరిగి వెళ్తావని శైలజ గారు నిన్ను ఇక్కడకి పంపారు. కాని నువ్వు ఇక్కడ మరింత సోమరివిగా మారుతున్నావు” అన్నాను.

అతనేమీ మాట్లాడలేదు. అలాగే పిట్టగోడకి ఆనుకుని కూర్చున్నాడు. మేరీ కూడా గబగబా వెళ్ళి అతన్ని ఆనుకుని పక్కనే కూర్చుంది.

“వెళ్ళిపో జాన్, ఇక్కడ నుండి మీ దేశానికి వెళ్ళిపో. మీ అమ్మని ఇంకా బాధపెట్టకు. యూనివర్సిటీలో చేరి చదువుకుని ఉద్యోగం సంపాదించి నీ మొదటి జీతంలో కొంత భాగం మహర్షికి ఇవ్వడానికి ఇక్కడకి రా, సరేనా?” అన్నాను.

కళ్ళెత్తి నన్ను చూస్తున్న అతని కళ్ళు చెమ్మగిల్లడం చూశాను.

అతనికి దగ్గరగా నడిచి “జాన్, ఇలా ఏమీ మొహమాటం లేకుండా ఈ కష్టజీవి అన్నామలై స్వామి మందిరంలో మాత్రమే నీకు చెప్పగలననిపించింది. అందుకే ఇక్కడకి రమ్మన్నాను. చెప్పగలిగాను. ఏమీ అనుకోలేదు కదా!?” అన్నాను.

అతను ఏమీ అనుకోలేదు అన్నట్లుగా తల ఊపాడు.

నేను మేరీ వైపు చూసి “మేరీ, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉంటారు? మీ బాధ మీ బిడ్డకి కాక మాలాంటి వాళ్ళకి చెప్పుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి?” అన్నాను.

మేరీ కూడా నిజమేనన్నట్లు తల ఊపింది. కాసేపు అందరం నిశ్శబ్దంగా ఉన్నాక నేనిక అక్కడ ఉండనవసరం లేదనిపించి “బై మేరీ, తర్వాత కలుద్దాం” అంటూ వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మెట్లు దిగి వచ్చేశాను.

 

***

 

 

ఆరోజు మేరీ, జాన్ లు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేరోజు. మాతృభూతేశ్వరాలయంలో కిటికీకి దగ్గరగా మొదటిసారి జాన్ మేరీని హత్తుకుంటుండగా నేను చూసిన ప్రదేశంలో కూర్చుని ఉన్నాను.

సాయంత్రం నాలుగవుతోంది. సమాధి హాలులో వేదపఠనం కోసం సన్నాహాలు చేస్తున్నారు. చల్లని గాలి పైన తిరుగుతున్న ఫాన్ గాలితో చేరి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఎదురుగ్గా నిలువెత్తు గోడ మీద రమణుడు పులి చర్మం పైన ఆశీనుడై దయామృతం కురిపిస్తున్నాడు. వాకిలికి కుడి వైపు కొంతమంది భక్తులు – అక్కడే ఆశ్రమంలో ఉండేవారు కూర్చుని కుంకుమ, విభూతి పొట్లాలు కడుతున్నారు.

జాన్, మేరీ నన్ను వెతుక్కుంటూ అక్కడకి వచ్చారు. లేచి నిలబడ్డాను. జాన్ “బై జానకీ” అంటూ నాకు షేక్ హాండిచ్చాడు. అతని కళ్ళల్లో సంతోషం తొణికిసలాడుతోంది. లోలోపలి అతని ఉత్సాహపు మెరుపు అతని చేతి ద్వారా నన్ను తాకి అతను ఆనందామృత హృదయుడై ఉన్నాడని కనుగొనగలిగాను.

మేరీ నన్ను ఆప్యాయంగా హత్తుకుంది. కృతజ్ఞతతో ఆమె ఏడుస్తోంది. అప్పుడు జాన్ ఆమెని ఓదార్చినట్లుగా నేను ఆమె వీపుని నిమురుతూనే ఉన్నాను – టాక్సీ డ్రైవర్ వచ్చి “మేడమ్, టైమవుతోంది వెళ్ళాలి” అన్నాడు.

మేరీ విడివడి నాకు నమస్కరించి జాన్ చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఇద్దరినీ కిటికీ చువ్వలు పట్టుకుని చూస్తూ నిలబడ్డాను. గేట్ దగ్గరకి వెళ్ళిన జాన్ టాక్సీ స్టాండ్ వైపుకి మలుపు తిరుగుతూ వెనక్కి తిరిగి నవ్వుతూ చెయ్యి ఊపాడు.

నా పెదవులు ఆనందంతో విచ్చుకోగా నేను కూడా చెయ్యి ఊపాను.

 

 

******

 

ఇది ఆర్ట్ ఆఫ్ డయింగ్!

 

 

-కల్లూరి భాస్కరం

~

 

కల్లూరి భాస్కరం

భారతదేశంలో ఈరోజున జరుగుతున్నది అక్షరాలా యుద్ధం…భావజాలాల మధ్య యుద్ధం. అందులో నాకైతే ఎలాంటి సందేహం లేదు. భావజాలఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడది  యుద్ధ రూపం ధరించి, నానాటికీ తీవ్రమవుతోంది. యుద్ధంలోని ఒక పక్షం వారికి అదనంగా అధికారబలం ఉంది కనుక అది క్రమంగా భౌతికయుద్ధంగా కూడా మారుతోంది. అది దాని సహజపరిణామం. దేశద్రోహి మొదలైన ముద్రలు వేయడం…అరెస్టులు చేయడం…దాడులు చేయడం…న్యాయస్థానాలు సైతం భౌతికయుద్ధ క్షేత్రాలు కావడం…ఇదీ దాని క్రమం.

ఇప్పుడు జరిగే ఏ పరిణామాన్ని చర్చించడానికి పూనుకున్నా ఇది యుద్ధం అన్న స్పృహతోనే పూనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు జరిగే ఏ పరిణామం గురించిన చర్చకైనా ‘యుద్ధం’ అన్నదే విశాల శీర్షిక. ‘రోహిత్ ఆత్మహత్య ఒక సరికొత్త/పాత సందర్భం’(సారంగ/జనవరి 23, 2016)అన్న నా వ్యాసాన్ని జరుగుతున్నది యుద్ధం అన్న ఉద్ఘాటనతోనే ముగించాను. ఇప్పుడు ఏది రాసినా దానికి కొనసాగింపే.

యుద్ధం అన్నప్పుడు సాధారణ నీతి నియమాలు, తర్క వితర్కాలు, హేతు నిర్హేతుకలు పక్కకు తప్పుకుంటాయి. యుద్ధం తనదైన నీతి నియమాలను, తర్కవితర్కాలను, హేతు నిర్హేతుకలను అనుసరిస్తుంది. యుద్ధమనే అసాధారణమైన ఒత్తిడిలో అందులో పాల్గొనే అన్ని పక్షాలలోనూ అదే జరుగుతుంది. ఏ మహాయుద్ధాన్ని తీసుకున్నా ఇందుకు సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనకు బాగా తెలిసిన మహాభారతయుద్ధాన్నే తీసుకుంటే ఎంతో సత్యసంధుడు, ధర్మాత్ముడు అనుకునే ధర్మరాజు కూడా అబద్ధమాడతాడు. విరథుడు, నిరాయుధుడు అయిన సాటివీరుని అర్జునుడివంటి మహావీరుడు కూడా చంపుతాడు. అస్త్రసన్యాసం చేసిన గురువు శిరస్సును శిష్యుడే తెగనరకుతాడు.

యుద్ధమనే ఒత్తిడిలో శత్రువును చంపడమే కాదు, ఒక్కొక్కసారి ఆత్మహత్యలూ జరుగుతూ ఉంటాయి.

అయిదేళ్ళ కోసారి ‘ప్రజాస్వామికంగా’ మనదేశంలో జరిగే ఎన్నికల యుద్ధాలలో మనకు ఇలాంటి యుద్ధ పరిస్థితితో అనుభవం ఉంది. కాకపోతే ఈ యుద్ధపరిస్థితిని ఇప్పుడు అయిదేళ్లపాటూ చూడబోతున్నాం.

యుద్ధ సమయంలో నీతిబద్ధమైన, హేతుబద్ధమైన చర్చకు గల జాగా నానాటికీ తరిగిపోతూ ఉంటుంది. అక్షరక్షేత్రం కూడా సంకుల సమరవేదికగా మారి వాక్యం అర్థాన్ని, అన్వయాన్ని కోల్పోతూ రచన రణగొణ ధ్వనిగా పరిణమిస్తుంది. అక్షరక్షేత్రాన్ని కూడా బండ బలం, కండబలం ఉన్న శక్తులు ఆక్రమించుకుంటాయి. అర్థవంతంగా మాట్లాడాలని కోరుకునే శక్తులు క్రమంగా అస్త్రసన్యాసం చేయవలసివస్తుంది.

నేడు దేశం క్రమంగా ఇలాంటి సన్నివేశం వైపే సాగుతోంది. అర్థవంతమైన, హేతుబద్ధమైన చర్చకు జాగాను ఎంతవరకు కాపాడుకోగలమన్నది ఇప్పుడు మనముందు వేలాడుతున్న ప్రశ్న. అంతే కాదు, సవాలు.

***

అన్నీ ఆశ్చర్యాలే జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన వాదాలే వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానంలోనే, న్యాయమూర్తుల కళ్ళముందే నిందితుడి మీద న్యాయవాదులే దాడి చేసి కొట్టడం ఇటీవలి కాలంలో ఎప్పుడైనా చూసామా? ఒకసారి కాదు రెండుసార్లు! టీవీ తెరమీదికి వచ్చి ఇదే పని మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం చూసామా? ఒకసారి కాదు; పదే పదే! ఇష్రత్ జెహాన్ అనే అమ్మాయి నిజంగా టెర్రరిస్టే అనుకుందాం. యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్లను తారుమారు చేయడం ఘోరమనే అనుకుందాం. అందులోని న్యాయబద్ధతపై చర్చ జరగవలసిందే. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిందే. కానీ అది జరుగుతున్నట్టుగా, అందులోని ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ కోణం చర్చలోకి రావలసినంతగా రావడంలేదు. దాని గురించి ప్రశ్నిస్తే, మీ హయాంలో ఎన్ని చోట్ల ఎన్ కౌంటర్లు జరగలేదు, వాటి గురించి మాట్లాడరేమని ప్రభుత్వంలోని వాళ్ళూ ప్రభుత్వపక్షంవాళ్ళూ ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలను యుద్ధక్షేత్రాలుగా మార్చడం; ఇతర ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ లను అడ్డు పెట్టుకుని ఇంకో ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ ను సమర్థించుకోవడం! ప్రభుత్వ, ప్రభుత్వపక్షాలే స్వయంగా ఆ పని చేయడం! అది చట్టానికీ, రాజ్యాంగానికి పాతర.

***

యుద్ధం అన్నప్పుడు దాని ప్రభావం సమాజం తాలూకు అన్ని అంగాలమీదా పడుతుంది. నీతి న్యాయం ధర్మమే కాదు; సమాజం, సాహిత్యం, మతం, సంస్కృతిసహా అన్నీ వక్రీకరణ చెంది వికృతికి లోనవుతాయి. తరతరాల అనుభవాల మీదా, అవగాహన మీదా, విశ్వాసాల మీదా గొడ్డలి పోట్లు పడతాయి.

యుద్ధం అన్నప్పుడు ‘మహావీరులు’ స్వయంభువులుగా హఠాత్తుగా విశ్వరూపంలో పుట్టుకొచ్చి యుద్ధ వేదికను ఆక్రమించుకుంటారు. గత కొన్ని రోజులలో అలా పుట్టుకొచ్చిన ఒక వ్యక్తి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్!

నేటి దేశవ్యాప్త యుద్ధ ప్రకంపనలకు ఎపి సెంటర్ అయిన ఢిల్లీలో, యమునా తీరంలో కొన్ని వేల ఎకరాల స్థలంలో ఎత్తైన వేదిక మీద, ఈ దేశ ప్రధాని తన పక్కనే నిలబడి ఉండగా, రొమ్ము విరుచుకుని తనను ప్రపంచస్థాయి వ్యక్తిగా ప్రకటించుకుంటూ వసుధైవకుటుంబకం అనే సూక్తిని వినిపిస్తుంటే చూసి అవాక్కయ్యాను. నా దేశంలో నేనే అపరిచితుడినైపోయినట్లు, నా తరతరాల అస్తిత్వాన్ని రూపు మాపే ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టు అనిపించింది. నిన్నటివరకు అనేకమంది అమాంబాపతు సాధు, సన్యాసులలో ఒకరని అనుకుంటున్న ఒక ఆధునిక సన్యాసి కాస్తా; నా ఇష్టాయిష్టాలతో పనిలేకుండా నా ప్రమేయంలేకుండా  ఒక్కసారిగా ఢిల్లీని ఆక్రమించుకుని యావద్దేశ ఆధ్యాత్మిక పురుషుడిగా ఆవిర్భవించినట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆయన పక్కనే నిలబడి ఉన్న ప్రధాని స్వయంగా ఆయనను ఆధ్యాత్మిక చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారనిపించింది. ఇంతవరకు మార్జిన్స్ లో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా కేంద్రస్థానానికి వచ్చి ఆక్రమించుకున్నట్టు అనిపించింది.

శ్రీ శ్రీ రవిశంకర్ మీదా, ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీదా నాకు ఇంతవరకు ప్రత్యేకమైన వ్యతిరేకతను ప్రకటించుకోవాల్సిన అవసరం కనిపించలేదు. ఈ దేశంలో అనేక రకాలకు, అనేక పంథాలకు, అనేక శ్రేణులకు చెందిన ఆధ్యాత్మిక లేదా ఆధ్యాత్మిక ఆభాస కలిగిన వ్యక్తులున్నారు. ఎవరికి వారికి అనుచరులు ఉన్నారు. అనేక రంగాలలోలానే ఈ రంగంలో కూడా ఈ వైవిధ్యం ముందునుంచీ ఉన్నదే. సొంత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈ వైవిధ్యాన్ని ప్రజాస్వామికంగా అర్థం చేసుకుంటున్నాం. శాంతిభద్రతలకు, ప్రజల విజ్ఞాన వివేకాలకు భంగం కలిగే వైపరీత్యాలు సంభవిస్తుంటే ఎత్తి చూపి ఖండిస్తున్నాం. అయితే, ఒకటి మాత్రం ఇంతవరకూ లేదు. వివిధ పంథాలలో ఎవరికి వారు మార్జిన్స్ లోనే ఉన్నారు తప్ప ఒక్కరే వచ్చి కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోలేదు. ఎంతో వివాదాస్పదమైన, ప్రభుత్వ, సైనిక అండదండలున్న విశాల వేదికపై, ప్రధాని సాక్షిగా, వివిధ దేశాలకు చెందిన లక్షలాది జనం సమక్షంలో రవిశంకర్ అనే వ్యక్తి కేంద్రస్థానంలోకి వచ్చినట్టు మొదటిసారి కనిపించారు. సారం సంగతి ఎలా ఉన్నా సాంకేతికంగా చూసినప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది.

అదే నన్ను నా దేశంలో అపరిచితునిగా మార్చి దారుణంగా కుంగదీసిన పరిణామం.

అనేక కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్న ఈ వైవిధ్యవంతమైన సమాజంలో సహజంగానే నేను కూడా ఒక కులానికి, మతానికి, సంస్కృతికి చెందినవాడిని. నాలానే ఇంకా కోట్లాదిమంది. నాకు ఈ దేశానికి సంబంధించిన వేల సంవత్సరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విశ్వాస, జీవన సరళికి చెందిన వారసత్వం ఉంది. స్ఫూర్తిదాయకులైన ఆధ్యాత్మికపురుషుల వారసత్వం ఉంది. నాకు అవసరమనిపిస్తే ఆ వారసత్వాన్ని నేను ఉపయోగించుకుంటాను. ముఖ్యంగా జీవించే కళను నేను ఇప్పుడు కొత్తగా ఎవరి నుంచీ నేర్చుకోవలసిన అవసరంలేదు. నా వారసత్వంలోనే, నా కుటుంబంలోనే అందుకు సంబంధించిన మెళకువలు అందుతాయి. ఇంకా కావాలంటే నాకు భగవద్గీత ఉంది. రామాయణభారతభాగవతాలు ఉన్నాయి.

నేనంటే నేను ఒక్కడినే కాదు. నా సామాజిక నేపథ్యంలాంటి నేపథ్యం ఉన్న అనేకమంది. అలాగే నాకు భిన్నమైన సామాజిక నేపథ్యం ఉన్నవారికీ నాకు ఉన్నట్టే తమవైన వారసత్వాలు, స్ఫూర్తిదాయకాలు ఉన్నాయి. ఈ స్థితిలో నాకే కాదు; తమవైన వారసత్వ సంపద ఉన్న నాలాంటి చాలామందికి రవిశంకర్ అనే వ్యక్తితో కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో కానీ ఎలాంటి సంబంధమూ, అవసరమూ ఉండదు. ఆయన కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఉమ్మడిగా ఈ దేశంలోని అందరికీ అవసరమైనవీ, స్ఫూర్తినింపేవీ కానవసరంలేదు. మరి ఆయనతో, ఆయన చెప్పేవాటితో ఎవరు కనెక్టు అవుతారనే ప్రశ్న వస్తుంది. ఆధునికవిద్యవల్ల, ఆధునికతవల్లా సాంప్రదాయిక వారసత్వానికి దూరమైనవారికి ఆయనా, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆకర్షించవచ్చు. అలాగే విదేశీయులకు ఆకర్షించవచ్చు. దానిని వ్యతిరేకించాల్సిన అవసరమూ లేదు. ఎవరి అభిరుచి వారిది.

ఒకవేళ రవిశంకర్ ను కూడా ఈ దేశపు ఆధ్యాత్మికవారసత్వానికి ప్రతినిధిగానూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను ఆ వారసత్వ సారంగానూ ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ వ్యక్తి గానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ మహారాజ పోషణలో కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోవడమే ఇక్కడ సమస్య.  వైవిధ్యవంతమైన ఈ దేశపు స్వభావమూ, అస్తిత్వమూ అందుకు అవకాశమివ్వవు. అలా చేయడం ఈ దేశపు మౌలికతనే చెరచడం.

****

ఆశ్చర్యాలకు అంతేలేదు.

యమునా తీరంలో రవిశంకర్ వేదికను ముస్తాబు చేయడానికి సైన్యాన్ని బరిలోకి దింపడమే చూడండి. వివిధ ప్రభుత్వవిభాగాలు నిధులు సమకూర్చడమే చూడండి. పర్యావరణ సంబంధమైన అభ్యంతరాలు తలెత్తడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రవిశంకర్ కు 5కోట్ల జరిమానా విధించడం, తను జైలుకైనా వెడతాడు కానీ జరిమానా కట్టనని ఆయన ప్రకటించి ఒక తిరుగుబాటువీరుడిగా క్షణాలలో తన మూర్తిమత్వాన్ని పెంచుకోవడం, గ్రీన్ ట్రిబ్యునల్ తోకముడిచి ఆయన కార్యక్రమం నిరాఘాటంగా జరగడానికి అవకాశమివ్వడం… వరసగా చూడండి. ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. యమునా తీరంలో గత కొద్దిరోజులలో తలెత్తినవి పర్యావరణవిధ్వంసం తాలూకు భయాలే  కాదు; నియమ నిబంధనలు, విలువలు, ఔచిత్యాలకు చెందిన విధ్వంసాన్ని చూశాం;  ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఒక వ్యక్తిముందు దాసోహమనడం చూశాం; వివాద నేపథ్యంలో ఈ దేశప్రథమపౌరుడైన  రాష్ట్రపతి ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా, ప్రధాని హాజరవడం అనే వింతను చూశాం.

రవిశంకర్ అనే వ్యక్తికి చెందిన కార్యక్రమంలో సైన్యాన్ని వినియోగించడాన్ని సమర్థించుకున్న తీరు ఇంకా దారుణం. కుంభమేళాలతో, ప్రకృతి వైపరీత్యాలతో, ఆసియన్ గేమ్స్ నిర్వహణతో పోలిక తెచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు జాతీయవిపత్తులు. ఆసియన్ గేమ్స్ నిర్వహణ జాతీయ కార్యక్రమం. కుంభమేళాలు సాంప్రదాయికంగా వందల సంవత్సరాలుగా జరుగుతున్న సామూహిక కార్యక్రమాలు. రవిశంకర్ అనే వ్యక్తి కన్నా సహస్రాంశాల చరిత్ర ఉన్న ఘటనలు అవి. రవిశంకర్ కార్యక్రమం ఎంత పెద్దదైనా కుంభమేళాతో పోల్చదగినది కాదు. అలా పోల్చడం అన్నివిధాలా బరితెగించడం. ఈ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడం. ఇంకా అవాచ్యం, ప్రధాని నరేంద్ర మోడీ రవిశంకర్ కార్యక్రమాన్ని సాంస్కృతిక కుంభమేళా అనడం. రవిశంకర్ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం హిందుత్వ వతిరేక ప్రతిపక్షాల కుట్రగా చిత్రించే ప్రయత్నంలో విచక్షణా వివేకాలను అజ్ఞానం పూర్తిగా హరించివేసిన ఫలితం ఇది. చివరికి ఆర్.ఎస్.ఎస్. వంటి హిందుత్వ పక్షాలు కూడా ఆధ్యాత్మిక చక్రవర్తిగా రవిశంకర్ పట్టాభిషేకాన్ని హర్షించి ఉంటాయని భావించలేం. కానీ రాజకీయప్రతిపక్షానికి గురిపెట్టే తహతహలో అవి కూడా మౌనం వహించి ఈ అజ్ఞాన వికట తాండవానికి నిశ్శబ్ద తాళం అందించాయి.

యుద్ధం కలిగించే ఒత్తిడిలో శత్రుహననాలే కాదు, ఆత్మహత్యలు కూడా ఉంటాయన్నది అందుకే. శ్రీ శ్రీ రవిశంకర్ అనే అత్యాధునిక సన్యాసి జరిపిన ఢిల్లీ ముట్టడికి, హిందుత్వ మౌన అంగీకారాన్ని తెలిపి ఆత్మహననానికి పాల్పడింది.

****

ఆర్ట్ ఆఫ్ లివింగ్ పట్ల ఇన్నేళ్లలోనూ నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దేశపు అన్ని రకాల వైవిధ్యాలను, మత సాంస్కృతిక బహుళత్వాన్ని, ప్రభుత్వం తాలూకు నియమ నిబంధనలను, చివరకు ప్రభుత్వ అస్తిత్వాన్నీ, పర్యావరణస్పృహతో సహా అన్నింటినీ మృత్యుముఖంలోకి నడిపించగల ఆర్ట్ ఆఫ్ డయింగ్ గానే అది ఇప్పుడు రూపుగడుతోంది.

-భాస్కరం కల్లూరి

 

 

 

 

 

మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు…

 

జుట్టు.
గిరజాల జుట్టు.
రింగు రింగుల జుట్టు.
అందమైన జుట్టు.
ఎంతో అందమైన జుట్టు.
అబ్బబ్బా జుట్టు.
అమ్మమ్మా జుట్టు.
మదిని దోచేసే జుట్టు.
మనసుని గిరజాలుగా తిప్పే జుట్టు.
కళ్ళను రింగుచక్రాల్లా చుట్టేసే జుట్టు.
హృదయాన్ని గిరగిరా తిప్పి గిరవాటు వేసే జుట్టు.
అంత రసికుడు గిరీశానికే వన్నెతెచ్చిన జుట్టు.

గిరజాలు లేపోతే వాడి మొహం మధురవాణి చూసేదీ ?
చస్తే చూసేది కాదు. తన్ని తగలేసేది.
నున్న మొహం, సన్న కళ్ళజోడు, తెల్ల లాల్చీ, గిరజాల జుట్టు.
బండ మొహం, బండ కళ్ళజోడు, పంచె, గిరజాల జుట్టు.
ఇలా ఏ మొహాలతో పని లేకుండా అందాన్ని ఇనుమడింపచేసేది గిరజాలు.
జుట్టున్నవాడి అందం వేరు.
జుట్టులేనివాడి అందం వేరు.
గిరజాల జుట్టున్నవాడి అందం మరీను.
గిరజాలు చూసి చటుక్కున పడిపోని ఆడవాళ్ళు ఉండరని ఎవరిదో ఉవాచ.

ఆ గిరజాలు ఆడవారికుంటే ఆ అందమే వేరు.
కొప్పున్నమ్మ ఏ తిప్పు తిప్పినా అందమే అని ఒక నానుండి.

గిరజాల జుట్టువారికా బాధ లేదు.
ఏ తిప్పు తిప్పినా ఒకే రకంగా రింగులుగా ఉంటుంది.
అదీ సౌలభ్యం.
దువ్వెనతో పనిలేదు.
దువ్వెనతో పని ఉన్నా పనిలేనట్టే. దువ్వినా దువ్వకున్నా ఒకటే
తలంటి పోసుకుంటే ఆరబెట్టినా ఆరబెట్టకున్నా ఒకటే
రింగుల్లో పడి నీళ్ళు తళతళ మెరుస్తుంటే నెత్తి మీద నీళ్ళుంటే ఏమి ? జలుబొస్తే ఏమి ?
ఆ అందం చూట్టానికి కళ్ళు చాలవ్.
ఆమధ్య గిరజాలున్న ప్రతివారు భావకవులైపోయినారు.
భావకవులవాలనుకున్నవారు గిరజాలు తిప్పుకున్నారు.

అలాటి భావకవుల్లో ఒకరు , ప్రముఖులు , దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఆయన ఎంత భావకవి అయినా బోలెడంత హాస్యప్రియత్వం ఉన్నది
భావకవుల అతిని చూచి విసుగుపుట్టిందేమో మరి – గిరజాలు ఇరికించిన ఈ ప్యారడీ వచ్చింది

మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవిలేవు
కవితయందుతప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ….
మరి ఒక్క భావకవి గారి గురించే మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది.
ఒకసారి జ్ఞానపీఠం గురించి కూడా మాటాడుకుందాం
వారు తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
అదేనండి విశ్వనాథ వారి గురించి-
మరి విశ్వనాథ వారు వారి ఆత్మకథలో ఇలాగంటున్నారు.
నా రెండవ ఫారములో రాగం సత్యనారాయణ యని యొక డుండెడివాడు. అతని తండ్రి ఫారెస్టు ఆఫీసరు. ధనవంతులు వారు. కాపు లనుకొందును. అతడు కొంచెము బొద్దుగా నుండెడి వాడు. జుట్టు మాత్రము- హిందీలో గొప్పకవి సుమిత్రానందన్ పంత్, తెలుగులో నొక గొప్పకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి- వీరి జుట్టువలె నుండెడిది. వీరిద్దఱిని నేను పెద్దనైన తరువాత నెఱుగుదును. ఆ జుట్టు మాత్రము చిన్నప్పుడు యెఱుగుదును. అప్పటి నా వేషము చెప్పినచో మీకిప్పుడు నవ్వు వచ్చు ననుకొందును. ఒక లాగు, ఒక చొక్కా, చేతులకు మురుగులు, కాళ్ళకు కడియాలు, నెత్తిమీద జుట్టు, ముందు వసారా గొఱిగింపు, జుట్టుముడి వెనుక గిరజాలు, ముందు సన్నని గిరజాలు- ఇది నా వేషము. ఆ రాగం సత్యనారాయణ జుట్టు నా కబ్బురము గొల్పెడిది. నా వేషము సహజ మన్నమాట!”

మనకు తెలిసిన విశ్వనాథ వారికి వాస్తవంగా గిరజాల జుట్టు ఉండెడిది అన్న సంగతి తెలియట్లా? రాజకీయ నాయకులవరకు వస్తే చిలకమర్తి వారు టంగుటూరి వారి గురించి చేసిన వర్ణనలో ఆ అందగాడి గిరజాలను ఇలా వర్ణించారు.
వలె వాటు కండువా వైచినాడు
చెవుల సందున గిరజాలు చిందులాడ
మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త
టంగుటూరి ప్రకాశము రంగు మెరయ
ధవళగిరి తీర్ధము నకును తరలివచ్చె
ఇక జగమెరిగిన చిత్రకారుడు వడ్దాది పాపయ్య గారి చిత్రాల్లోని పురుషులను చూడండి
ఆడవారి అందాన్ని అత్యద్భుతంగా చిత్రించే ఆయన కలం మగవాళ్లను ఎంతో సుకుమారులను చేసి కొసతేలిన ముక్కుతో చక్కగా గిరజాల జుట్టుతో చిత్రించి మనకు వదిలిపెట్టింది
సినిమాల్లో హీరోలకు కూడా గిరజాల జుట్టంటే ఎంత ఇష్టమో.
కృష్ణగారిని, శోభనుబాబుగారిని చూడండి.
మొత్తం గిరజాలున్నా లేకున్నా, ఫాలభాగంలో మటుకు ఒక వంకీ తిరిగి వుంటుంది.
మొత్తంగా లేదే అన్నబాధను అలా ఒకటి తిప్పి ముందుకు పడవేసి కోరిక తీర్చుకున్నారు.
ఇహ కొబ్బరినూనె రాసి నున్నగా దువ్వితే హరోం హరహర.
చేతిలో ఇంత నూనె వేసుకొని గిరజాలకు మర్దన చేస్తూ ఉంటే మాడులో కూసాలు కదిలి జ్ఞానం పదింతలవ్వదూ ?
నూనె రాయకుండా వదిలేస్తే గోధుమరంగులోకి తిరిగి కపీశ్వర దర్శనమవ్వదూ ?
ఎలాగైనా గిరజం గిరజమే! దాని అందం దానిదే! ఆ అందం ఇంకోదానికొస్తుందీ ? దిష్టి కొట్టే పనీ లేదు. పొడుగు జుట్టున్నవారి మీద అనవసరంగా దుర్మార్గపు కళ్ళు పెట్టి నాశనం చేస్తారు కానీ గిరజాలను చెయ్యమనండి చూద్దాం?
జేజమ్మ దిగిరావాలి, గిరజాలకి దిష్టి తగలాలంటే!
అసలు చెప్పాలంటే, గిరజాలు మన పుట్టుకతో ముడిపడి వున్నవి
బిడ్డ పుట్టినప్పుడు చూడండి.
జుట్టు చుట్టలు చుట్టలుగా ఉంటుంది.
దాన్ని సాపు చేసి మంత్రసానో, డాక్టరమ్మో, నర్సమ్మో మనకిస్తుంది.
అలా జననంలోనే గిరజాల ప్రాముఖ్యత ఉన్నది.
దేవుళ్ళకి కూడా గిరజాల జుట్టంటే చాలా ఇష్టం
మన కోరికలు తీర్చి బదులుగా మన జుట్టు పుచ్చుకుంటారు
కొంతమంది పుట్టువెంట్రుకలు తీయించాలని అట్టిపెడతారు.
అప్పుడు చూడండి ఎంత చక్కగా రింగులు రింగులు తిరిగిపోయుంటుందో.
అలా మొక్కుల్లో కూడా గిరజాల ప్రాముఖ్యత ఉన్నది.
ఇక రింగుల గిరజాలు వదలి, ఒకసారి గిరజాల మీద చలామణిలో ఉన్న వాక్ ప్రయోగాలు చూద్దాం
“ఆయన పెద్ద గిరజా పెట్టించినాడులేబ్బా!”
“వాడిది గిరజాలు జుట్టులేయ్యా, తలంటిపొయ్యాలంటే చచ్చేచావు”
“ఇంత పొడుగు జుట్టు ఆరబెట్టుకోలేక చస్తున్నామమ్మా, దాన్ని చూడు కురచగా ఒక్క నిముషంలో ఆరిపోతుంది”
ఇక ఇంకో పక్కకు వస్తే, గుళ్ళో వైష్ణవ సాములు పెట్టించేది గిరజా!
ముందు భాగంలో కాస్త గొరిగేసి ఉంటుందే అదీ గిరజా!
అలా గొరిగిన తరవాత నామం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఫాలభాగం ఎక్కువైపోయి ముఖంలోని తేజస్సు చండప్రచండంగా ఉంటుంది.
అదీ లెక్క అన్నమాట.
క్రీడాభిరామంలో వల్లభరాయుడు ఇలా చెప్పిస్తాడు.

కర్పూర బూచాయ కరమొప్ప నీర్కావి
మడుగుదోవతి పింజె విడిచి కట్టి
గొజ్జంగి పూనీరు గులికి మేదించిన
గంగమట్టి లలాటకమున దీర్చి
వలచేత బంగారు జల పోసనముతోడ
ప్రన్నని పట్టు తోరము ధరించి
జరిగొన్న వెలి పట్టు జన్నిదంబుల లుంగ
యంటులు వాయంగ నరుత వైచి
తళుకు చెంగావి కోకయు వలుదశిఖయు
చిగురు బొమ్మంచు పెదవులు చిన్నినగవు
నంద మొందంగ వచ్చె గోవిందశర్మ
మాధవునిపట్టి యొసపరి మన్మథుండు

వలుదశిఖ అంటే లావుపాటి శిఖ అని అర్థం.
అంతలావు శిఖ కావాలంటే జుట్టు బ్రహ్మాండంగా పెంచాలె, ఆ తర్వాత చటుక్కున గిరజా పెట్టించాలె.
అప్పుడు ఎంతందంగా ఉంటుందీ ?
అందుకు కాదు తన పద్యంలో మన్మథుడిని చేశాడు వల్లభరాయుడు?
అదండీ సంగతి.
ఇక ఇతిహాసాలకు వెళ్లిపోతే బోల్డు చెప్పుకోవచ్చు.
అన్నిటికన్న ప్రముఖమైనవి ఒకటి రెండు మాత్రం చెప్పుకుందాం ఇప్పుడు.
మొదటిది ద్రౌపదికి గిరజాల జుట్టు ఉంటే వాడు, ఆ దుర్మార్గుడు ఆ జుట్టు, అంత కుఱచ వేణి పట్టగలిగేవాడా?
అది లేకపోబట్టి, ఆయమ్మకు ఇంతలావు జడ ఉండబట్టి కాదూ, వాడు జుట్టుపట్టి లాక్కురావటం జరిగింది ?
అందుకు కాదూ మహాభారత యుద్ధం జరిగిందీ ?
అలా గిరజాలు లేకపోబట్టి అంత హననం జరిగింది.
దీన్నే ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. గిరజాలు లేకపోబట్టి మహాభారతం మనకు మిగిలింది.

ఆ గిరజాల మహత్యం పరమాత్మకు తెలిసే తనకు గిరజాలు అట్టిపెట్టుకుని మిగిలినవారికి లేకుండా చేశాడు.
పరమాత్మ గిరజాల జుట్టు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండవది
పోతన తన భాగవతంలో యుద్ధ సమయంలో నల్లనయ్య జుట్టుని వర్ణిస్తాడు.
ఎలా ? ఇలా – ఒక చక్కని పద్యంతో
“హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
……
“సూక్ష్మంగా దీని అర్థమేమమనగా అర్జునిడి రథానికి సారథి అయినా పరమాత్మ నుదిటి మీద పట్టిన చెమటకు, ఆ నుదుటి మీద ముంగురులు గుండ్రంగా రింగులు తిరిగిపోయి గిరజాలు గిరజాలుగా అతుక్కుని పోయి ఆ నుదురు చెప్పలేనంత అందంగా ఉందిట. గుర్రాల డెక్కల వల్ల రేగిన దుమ్ము బూడిదవర్ణపు రంగుతో మరింత అందంగా ఉన్నాడట పరమాత్మ. మరి అంత అందగాడిని వర్ణించడం పోతన గారికి తప్ప ఎవరికి సాధ్యం?
సరే, అది అలా పక్కనబెడితే గిరజాల జుట్టుకు ప్రత్యేకంగా ఒక జీన్ ఉన్నది.
గుర్రపు జీను, తొడుక్కునే జీను కాదండి, మానవ జీను.
దాన్ని ట్రైకోహ్యాలిన్ జీన్ అని అంటారు.
ఈ జీన్ ఉన్నవాళ్ళ సంతానం ఆ జీను నుంచి తప్పించుకోలేరుట.
అంత శక్తివంతమైంది ఆ గిరజ జీను.
తెల్లవారిలో గిరజాలు తక్కువ.
నల్లవారిలో గిరజాలు ఎక్కువ.
క్రౌంచద్వీపంలో సలూనుల నిండా గిరజాలు తిప్పే యంత్రాలే.
గిరజాలను సరిచేసే యంత్రాలే.
అదో పెద్ద బిజినెస్సు కూడాను.
ఎన్ని కుటుంబాలు బతుకుతున్నయ్యో ఆ గిరజాల ఆదాయమ్మీద.
అయ్యా, ఇలా బోల్డు చెప్పుకుంటో పోవచ్చు, ఆ గిరజాల జుట్టు మీద. ఇహ ఇక్కడికాపి వచ్చే జన్మలోనైనా గిరజాల జుట్టు కావాలని, ఆ గిరజాలతో ఏ దేశానికి లేని అందం మన దేశానికి సొంతం కావాలని అందరూ ఆ పరమాత్మను కోరుకోవాలని నే కోరుకుంటూ
శలవు

* * *

పేరడీ

 

చిట్టిగారె – ఆనందభైరవి – రూపకం

పల్లవి:

వలలా యీ అన్న – మేలరా ఈ వేళ నాకు తనువేల తరుణులేల – ధనమేల ధామమేల ॥వలలా॥

చరణం:

ఆకులేల పోకలేల – కూరలేల పప్పులేల

చిట్టిగారె రాకయుండి – ఆశలుడిగి యున్నవేళ ॥వలలా॥

సొగసేల సొమ్ములేల – అగరేల గంధమేల

చిట్టిగారె దయలేక మేను – సగమై యున్నట్టివేళ ॥వలలా॥

అరిటాకు వడ్డనలేల – వంటలేల వార్పులేల

చిట్టిగారె కోర్కె బాసి – ఆశలుడిగి యున్నవేళ ॥వలలా॥

 

*

జంటకవిత్వం – కుదరని జంట

జంటకవిత్వం, జంటకవులు మనకు కొత్తకాదు. అలాటి జంటల్లో ఒక జంట అవుదామని, జంటకవిత్వం రాద్దామని దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుఱ్ఱం జాషువా కలిసి అనుకున్నారట. తిరుపతి వేంకట కవుల్లాగా ఒక మంచి పేరు పెట్టుకుందామనుకున్నారు కూడాను. అలా పేరు కోసం ఆలోచిస్తే వచ్చినవి ఇవిట. “దీపాల జాషువా, గుఱ్ఱం పిచ్చయ్య, పిచ్చయ్య జాషువా, గుఱ్ఱం దీపాల, గుఱ్ఱం శాస్త్రి” . ఇలా నానా రకాలుగా చూస్తే సరైన పేరే కుదరలేదు కనక మనకు జంటకవిత్వం ఎందుకులే అనుకొని మానేశారుట!

2

అపురూప చిత్ర సౌజన్యం :

సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి. ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో “ధర్మసందేహాలు” శీర్షిక ఆరంభించినప్పుడు శ్రీ ఆమంచర్ల గోపాలరావు, నండూరి, సి.రామమోహనరావు. ఆమంచర్ల గోపాలరావుగారు పరమపదించాక ఉషశ్రీ, ఏ.బి.ఆనంద్ నిర్వహించారు

జ్ఞానవృక్ష ఫలాలను కోసుకుందాం రండి!

 

 

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

~

 

ప్రకృతినీ-వినీలాకాశాన్నీ-వింత వింత నక్షత్రాల్నీ

వీక్షించిన బుద్ధి కుశలత ‘హోమో సేపియన్స్’ దే కదా!

విరోధాభాసమంతా  స్వర్గమూనరకాల భ్రమల తర్వాతే !

 

జ్ఞాన వృక్షపు నిషిద్ధ ఫలాల్ని తిన్నతర్వాత

లాటిన్మృతభాషలో పారడైజ్ పిట్టకథలు  తెలిసినట్లు

న్యూటన్గతి సిద్ధాంతపు కక్ష్య యంత్రగతిని జాగ్రత్తగా లెక్కించిన చోటే

ఆధునిక రోదసీ పథనిర్దేశానికి ఇస్రో తిరుపతి కొండలెక్కుతుంది…

 

శాస్త్రీయతను ధ్వనించే  శబ్దాలతో సైంటిస్టులే

సత్తాలేని సరుకుల లేబుళ్ళకు  సైన్స్ నామాలు పెడుతున్న దేశంలో

వేలెడంతలేని  ‘నోబెల్’ రామకృష్ణన్

ఏనుగంత  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను వింత సర్కస్ అనేశాక

ఆవిరైపోయిన తర్కం గురించి ఎవరితో మాట్లాడతాం !

 

‘కఫాలా’ కు ఆధునిక బానిసత్వం పేరుపెట్టి

భాషరాని శ్రామికులను-మనసు భాషరాని ఇసుక కోతుల మధ్యకు  తరిమినట్లు

భావ దాస్య ముష్కరంగా మార్చిన పుష్కరంలో

జ్ఞానస్నానం పొందాల్సిన తెలుగు జీవితాలు  ఉత్తపుణ్యాన నీటిపాలు..

బౌద్ధభూముల అమరావతిలో భూసూక్తం చదివిన చందాన

అశాస్త్రీయ పద్దతిలోమాయని లాగితే చిట్లిన గర్భకోశంపై ఏం మాట్లాడగలం!

 

‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ లా ఫోజులు కొడుతూ

సిలికాన్ మురిక్కాలువలా ప్రవహించే  కొత్త రాష్ట్రంలో

ప్రాంతీయ సామంత రాజొకడి  పిలుపుమేరకు

నాలుగు దశాబ్దాల బహుజన మూలవాసీ అవిశ్రాంత  పోరాటం

బ్రాహ్మణీయ భావజాలపు ప్రతీఘాత నిరర్ధక విప్లవం  పాలు..

ఆల్ ఈజ్ వెల్ ! ఆగ్నేయంలో మాత్రం అగ్ని ప్రమాదం..

 

‘అసహనం చెంప దెబ్బకు లక్ష నజరానా’  పొందినంత ఆనందంగా

తెలంగాణ జర్నలిస్టుల జాతరకెళ్ళిన  ప్రెస్ క్లబ్ స్కీటర్లు

సరళాదేశ సంధి జరిగి  ‘సరళమే ఆదేశంగా’ నిష్క్రమించడం విచిత్రం..

సత్యాన్ని ప్రశ్నించని శతాబ్దాల మహాయానంలో

అసత్యం పై ఇండియన్  ఫోరంల మీద  ఏంజెళ్ళలా నటించే

డక్కన్  మేధావుల  వ్యూహాత్మక మౌనం మరీ విచిత్రం..

 

రొట్టెనడిగితే రాయి నిచ్చిన తర్వాత

కట్టని గుళ్ళూమసీదులకు నజరానాల గానా బజానా తర్వాత

నిరసన సమూహాలకు ప్రకటించనున్నది భారీ అసహాయం..

నైరుతి రుతుపవనాల్నీ ఎల్ నినో ‘చేపమందు’లా వేసుకుందని తెలిసి

విత్తిన నేలే  తక్కువని సర్కారే  నట్టూవాంగం వాయించాక

విత్తినవాడి గుండె  పఠాన్ చెరువు కాకుండా ఉంటుందా!

బతికి బట్టకట్టిన రైతుకోసం ఖరీఫ్ పంట కత్తి దూసే ఉండదా!

ఖాళీ కడుపులతో  ఏం ఫిలాసఫీ మాట్లాడతాం !

 

దేశమనే కంద పద్యంలో

దోషమే కనబడని ఆషా వర్కర్లు  నిషిద్ధ గణం

దిశ తెలియని ఆధిపత్యం దిమ్మతిరిగే యాగాలకు ప్రాపకం!

ఆకలి ఆత్మల బుజ్జగింపుకు ఖుర్బానీలుగా- తాయెత్తులు కాశీ తాళ్ళుగా

మారే పేదల సంతలపై ఏ నిషేధాల లాజిక్కులు మాట్లాడతాం!

సంధి కుదరనప్పుడు తప్పదులా వుంది విసంధి  దోషం !

రాష్ట్ర ప్రాయోజిత చీకటిలో ఇప్పుడు తెలుగు జనం !!

 

( హేతువాద ఉద్యమంకోసం తీవ్రంగా కృషి చేసిన దళితనేత  కత్తి పద్మారావుగారికి)

-తుల్లిమల్లి  విల్సన్ సుధాకర్

09538053030