Archives for February 2015
మన ‘చిలాన్ బందీ’కి 120 ఏళ్లు
కొన్ని పరిచయాలు చాలా చిత్రంగా మొదలవుతాయి. అవసరగత ప్రాణులం కనుక స్పష్టంగా నాకిది కావాలి అనుకుని వెతుకుతూ ఉంటాం. కావాలనుకున్నది అంత సులభంగా దొరకదు. కానీ మనం కోరుకునేదానికి దగ్గరగా ఉండే మరొకటి తారసపడుతుంది. అది మనకు కావలసినది కాదు కదా అని ముందుకు సాగిపోతాం. కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. మనం కోరుకునే దానికి దగ్గరున్నవి మన అవసరాలు కొంతైనా తీరుస్తాయి కదా.
తెలుగు ‘చిలాన్ బందీ’ని పరిచయం చేయడానికి ఈ ఉపోద్ఘాతం అక్కర్లేదు కానీ అతడు నాకు తారసపడిన వైనాన్ని చెప్పుకోవాలన్న ఉత్సాహాన్ని ఉగ్గబట్టుకోలేకే ఇదంతా.
మాటలకు అపారమైన స్వేచ్ఛాసౌందర్యాలను అద్ది రంగురంగుల పక్షుల్లా ఎగరేసిన ప్రఖ్యాత ఆంగ్ల రొమాంటిసిస్ట్ కవి లార్డ్ బైరన్ 1816లో ‘The Prisoner of Chillon’ ఖండకావ్యం రాశాడు. 392 లైన్ల ఈ పద్యంలో విశ్వజనీనమైన స్వేచ్ఛాభిలాషను ఎలుగెత్తి గానం చేశాడు. ఎగిరే రెక్కలను గొలుసులతో విరిచికట్టి, చీకటి గుయ్యారాల్లో పడదోసి, అడుగు కదపనీయని దుర్మార్గపు ఖైదును శఠించాడు. రాత్రీపవళ్ల, వసంతగ్రీష్మాల తేడా లేకుండా రోజూ ఒకేలా వెళ్లమారిపోయే దిక్కుమాలిన రోజుల లెక్క తెలియని ఆ నిర్బంధంలో చితికిన ఓ స్వేచ్ఛాపిపాసి అంతరంగాన్ని గుండె కరిగి కన్నీరయ్యేలా, కన్నీరైన గుండె.. ఆ బాధాతప్తుడి హృదయ ఘోషను తట్టుకోలేక మళ్లీ గడ్డకట్టిపోయేలా ఆవిష్కరించాడు. ఆ సంవేదన సర్వమానవాళి ఘోష కనుక ఖండాలు, సముద్రాలు దాటింది. నిర్బంధంలో కొట్టుమిట్టాడుతున్న మరో నేలపైన ప్రతిధ్వనించింది. బైరన్(1788-1824) జీవించిన శతాబ్దిలోనే 1894లో తెలుగులో ప్రతిధ్వనించిన ఈ భువన ఘోషే ‘చిలాన్ బందీ’. దానికి ఈస్ట్ ఆఫ్ ది ఇటాలియన్ గొంతుకను వ్రిచ్చిమోసినవాడు శ్రిష్టు జగన్నాథశాస్త్రి.
జగన్నాథం అనుసృజించిన చిలాన్ బందీని తెలుసుకోవడానికి ముందు బైరన్ కావ్యం గురించి కొంత. బైరన్ 1816లో తన మిత్రుడైన కవనపు హల్లీసకాల షెల్లీతో కలసి స్విట్జర్లాండ్ లోని జెనీవా సరస్సులో విహరించాడు. ఆ కొలనులోకి చొచ్చుకెళ్లిన మధ్యయుగాల చిలాన్ కోటను చూశాడు. అక్కడి కారాగారంలోకి అడుగుపెట్టాడు. అది పదహారో శతాబ్ది ప్రొటెస్టెంట్ క్రైస్తవ ఉద్యమకారుడు ఫ్రాంకోయిస్ బోనివార్డ్(1493-1570)ను ఆరేళ్లపాటు ఖైదుచేసిన చెరసాల. సవాయ్ పాలకుడు మూడో చార్లెస్ పాలనకు వ్యతిరేకంగా జెనీవావాసులను తిరగబడమన్నందుకు బోనివార్డ్ ను జైల్లో వేశారు. విడుదలైన తర్వాత కూడా అతడు చార్లెస్ కు వ్యతిరేకంగా పోరాడాడు. బైరన్ ఆ చారిత్రక వ్యక్తి వివరాల్లోకి పూర్తిగా వెళ్లకుండా అతని దుర్భర ఖైదును మాత్రమే తన కావ్యానికి ముడిసరుకుగా తీసుకున్నాడు. అందుకే తనది ‘ఫేబుల్’ అని అన్నాడు.
బైరన్ కవిత అంతా ఆ ఖైదీ స్వగతమే. అతని యవ్వనమంతా బందిఖానాలో ఆవిరైంది. అతని తండ్రిని అతని మతవిశ్వాసాలు నచ్చని పాలకులు(జగన్నాథం అనువాదంలో ‘క్రొత్తసిద్ధాంతములకతికోపఘూర్ణమానమానసులైన దుర్మార్గజనులు) సజీవదహనం చేశారు. అతని రక్తమేకాకుండా ఆశయాలనూ పంచుకున్నఆరుగురు కొడుకులపైనా కత్తిగట్టారు. వాళ్లలో ముగ్గురు ఆ జైలు బయట ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని బతికుండగానే తగలబెట్టారు. ఇద్దరిని యుద్ధంలో చంపేశారు. మిగిలిన ముగ్గురిని చిలాన్ దుర్గంలోని చీకటికొట్టులో పడేసి, విడివిడిగా మూడు పెద్దస్తంభాలకు గొలుసులతో కట్టేశారు, ఒకరికొకరు దూరంగా ఉండేలా. కథ చెబుతున్న ఖైదీ ఆ ముగ్గురిలో పెద్దవాడు. పెద్దవాడు కనుక తమ్ముళ్లకు అభయమివ్వాలి, ఓదార్చాలి. పెద్దతమ్ముడికి స్వేచ్ఛే ప్రాణం. కొండల్లో జింకలను, తోడేళ్లను వేటాడిన ఆ యువకుడికి ఈ బందీ బతుకంటే అసహ్యం పుట్టింది. అన్నపానీయాలు నిరాకరించి ఆయువు తీసుకున్నాడు. అందరికీ ప్రాణమైన ముద్దుల చిన్నతమ్ముడు మనోవ్యథతో కృశించి ‘ఎండు సస్యమై’ ప్రాణం విడిచాడు. ఇక మిగిలింది కథకుడు. అతని ఆశలు ఉడిగాయి. ప్రాణావశిష్టుడైపోయాడు. అయితే ఓ రోజు కిటీకీ చెంత కనిపించిన అద్భుతమైన పక్షి పాడిన పాట విని ప్రాణాలు తేరుకున్నాయి. బతుకుపై ఆశపుట్టింది. తర్వాత ఎన్నేళ్లకో అతన్ని జాలి తలచి విడుదల చేశారు. కానీ ఏళ్ల తరబడి ఖైదు తర్వాత, నా అన్నవాళ్లందరూ గతించిపోయాక, హఠాత్తుగా దక్కిన స్వేచ్ఛను ఏం చేసుకోవాలో అతనికి తెలియకపోయింది. సంకెళ్లే నేస్తాలైపోయిన ఆ దుఃఖితాత్ముని మోముపై ఒక నిట్టూర్పు వెలువడింది.
మనసును మెలిపెట్టే ఈ కథాకావ్యంపై రాజమండ్రి ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ జగన్నాథం మనసు పారేసుకున్నాడు. దీన్ని ‘చిలాన్ బందీ అను భ్రాతృసౌహృదము’ పేరుతో తెలుగు చేశాడు. 1894లో ఏలూరులోని ధర్మరాజు శివరామయ్యకు చెందిన శ్రీత్రిపుర సుందరీ ప్రెస్సులో అచ్చేయించాడు. బైరన్ కృతిని అనువదించడం అంత సులభం కాకపోయినా సొబగు చెడకుండా తెలుగు పాఠకులకు అందించడానికి శాయశక్తులా ప్రయత్నించానని, దీని బాగోగులపై ఎవరు సలహాలిచ్చినా స్వీకరిస్తానని వినయంగా చెప్పుకున్నాడు ముందుమాటలో. మన యథాలాప జీవితాల్లో అంతగా గుర్తుకు రాని స్వేచ్ఛను హృదయంతోపాటు రక్తమజ్జాస్థిగతాలూ పలవరించేలా చేసే ఖైదు అనుభవం కొంత నాకు కూడా ఉండడంతో ‘చిలాన్ బందీ’పై నేనూ మనసు పారేసుకున్నాను.
జగన్నాథం అనువాదంపై ఇదివరకు తెలుగులో ఎవరైనా రాశారో లేదో నాకు తెలియదు. అతని జీవిత విశేషాలూ తెలియవు. తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అన్నీ ఇంటర్నెట్లో దొరకవని తెలిసినా ఆశతో తొలుత అక్కడే వెతికాను. “Cultural Production Under Colonial Rule: A Study of the Development Of Painting in Modern Andhra: 1900 To 1947” పేరుతో బి. సుధారెడ్డి గారు హైదరాబాద్ యూనివర్సిటీకి సమర్పించిన పరిశోధన పత్రం కంటబడింది. అందులో శిష్టు జగన్నాథం రిఫరెన్స్ ఉంది. జగన్నాథం చిలాన్ బందీతోపాటు థామస్ గ్రే రాసిన ప్రఖ్యాత ఎలిజీని కూడా అనువదించారని సుధారెడ్డి రాశారు.
ఈ ఎలిజీ ప్రస్తావన జగన్నాథం చిలాన్ బందీ ముందుమాటలో ఉంది. బైరన్ కృతి.. గ్రే ఎలిజీలాగే ప్రసిద్ధమని జగన్నాథం చెప్పాడే కానీ దాన్ని తాను అనువదించినట్లు అందులో లేదు. విలియం కూపర్ రాసిన ‘On the receipt of my mother’s picture’ను రాజమండ్రికే చెందిన ఆంగ్లోపాధ్యాయుడు వావిలాల వాసుదేవశాస్త్రి.. ‘మాతృస్వరూప స్మృతి ’ పేరుతో, టెన్నిసన్ రాసిన ‘Locksley Hall’, ‘Lotus Eater’ కవితలను మద్రాస్ కు చెందిన దాసు నారాయణరావు ‘కాముక చింతనము’, ‘విస్మృతి వృక్షప్రభావము’లుగా అనువదించినట్లు ఉంది. బైరన్ ఖైదీ తెలుగులోకి రావడానికి ముందు ఇలాంటి అనువాదాల నేపథ్యముందని, వీటికి ఆంగ్లవిద్యాభ్యాసం వంటివి కారణమని తెలుసుకోవడానికే ఈ వివరాలు. ఇంచుమించు ఇవి వెలువడిన కాలంలోనే వెలుగు చూసిన కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్రకు మూలం ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘Vicar of the Wakefiled’ అన్న విషయం అందరికీ తెలిసిందే.
‘చిలాన్ బందీ’పై ఇంకొంత సమాచారాన్ని ‘తెలుగు రచయితలు రచనలు’ సాయంతో కనుక్కున్నాను. ‘చింతామణి’ మాసపత్రికలో చిలాన్ బందీ ప్రస్తావన ఉన్నట్లు ఆ పుస్తకంలో ఉంది. జగన్నాథం ఊరినుంచే వెలువడిన చింతామణి 1894 సెప్టెంబర్ సంచికలో చిలాన్ బందీపై ‘కృతివిమర్శనము’ శీర్షిక కింద చిన్న సమీక్ష వచ్చింది. జగన్నాథం కాళికావిలాసం వంటి గ్రంథాలు రాసినట్లు సమీక్షకుడు ఏ.ఎస్(ఏ.సుందరరామయ్య) చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే.. ‘హూణభాషాకావ్యము నాంధ్రీకరించుట మిక్కిలి కష్టతరమైన పని.. అయినను శాస్త్రులవారు వారి శక్తి సామర్థ్యాదుల ననుసరించి చక్కగానే వ్రాసియున్నారు. శైలి మృదువై సులభగ్రాహ్యమై యున్నది. హూణులకును, ఆంధ్రులకును అభిప్రాయభేదము మెండుగావున హూణకవీంద్రుల యభిప్రాయములను తద్భాషాపరిచితేతరులకు దేటపడునట్లు మార్చుట సులభసాధ్యము కాకపోయినను గ్రంథకర్తగారు చేసిన భాషాంతరీకరణము కొంతవరకు దృప్తికరముగానే యున్నదనుట కెంతమాత్రమును సందియముండకూడదు..’ అంటూ అనువాదంలో తనకు నచ్చిన ఆరు పద్యాలను ఉదహరించారు.
1890ల నాటి సాహిత్య పత్రికలను జల్లెడ పడుతుండగా.. మరో మాసపత్రిక ‘వైజయంతి’ 1894 నవంబర్ సంచికలో చిలాన్ బందీపై ఎన్.రామకృష్ణయ్య రాసిన పరిచయం దొరికింది. ‘పశ్చిమఖండకావ్యముల నాంధ్రీకరించుట కష్టసాధ్యమని యెల్లవారు నెఱింగిన విషయమే. అయినను శాస్త్రిగారు కూడినంతవఱకు శ్రమపడి మొత్తముమీఁదఁ దృప్తికరముగానే తెనిఁగించియున్నారు.. ఇది తిన్నగా సవరింపఁబడకపోవుటచే ముద్రాయంత్రస్ఖాలిత్యముల నేకము లగుపడుచున్నవి. .. గ్రంథకర్తగారి దోషములుగూడ నొకటిరెండు గానవచ్చుచున్నవి. గీ. లేదుకీడు విచారించి చూడఁజూడ. గీ. ముగ్ధతనుదాల్చి నిశ్చలతను వహించి. ఇత్యాది స్థలముల యతి భంగపెట్టిరి.. ముద్రాయంత్ర స్ఖాలిత్యమున నిట్లయ్యెనేమో..’ అంటూ పరిచయకర్త ‘ఛందోదోషాలు’ పట్టుకుని మూడు పద్యాలు పొందుపరిచారు. పోల్చడం అసంగతమైతే కావచ్చు కానీ, నామటుకు నాకు విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’ నారికేళ పద్యాలకంటే, అంతగా కొరుకుడుపడని కొన్ని జాషువా పద్యాలకంటే ‘చిలాన్ బందీ’ పద్యాలు వందలరెట్లు సరళంగానే కాకుండా హృద్యంగానూ అనిపించాయి.
జగన్నాథం అనువాదం ముఖపత్రం, ముందుమాట, తప్పొప్పుల పట్టికలను వదిలేస్తే 24 పేజీల కావ్యం. మక్కికిమక్కి అనువాదంలా కాకుండా మూలంలోని సారాంశాన్ని ప్రాణవాయువులా శ్వాసిస్తూ, సమగ్రంగా సాగుతుంది. జగన్నాథం తొలుత బైరన్ ను ప్రశంసించి, మూలంలోని స్వేచ్ఛావర్ణన అందుకుంటాడు. అనువాదంలో నాకు నచ్చిన భాగాలను, వాటి మాతృకలను అందిస్తూ పరిచయం చేస్తాను. సౌలభ్యం కోసం అనువాదంలోని పదాల మధ్య విరామం ఉంచాను. ఛందస్సు వగైరాల వివరాల జోలికి పోలేదు.
మూలంలోని బైరన్ నాందీప్రస్తావన.
Eternal spirit of the chainless Mind!
Brightest in dungeons, Liberty! thou art:
For there thy habitation is the heart—
The heart which love of thee alone can bind;
And when thy sons to fetters are consigned—
To fetters, and the damp vault’s dayless gloom,
Their country conquers with their martyrdom,
And Freedom’s fame finds wings on every wind.
Chillon! thy prison is a holy place,
And thy sad floor an altar—for ’twas trod,
Until his very steps have left a trace
Worn, as if thy cold pavement were a sod,
By Bonnivard!—May none those marks efface!
For they appeal from tyranny to God.
బంధానీకము గట్టజాలని మనోభ్రాజిష్ఠనిత్యాత్మ! ని
ర్బంధంబేమియులేక క్రాలెడు ‘‘స్వతంత్రేచ్ఛ’’! కారానివే
శాంధబందుఁ బ్రకాశంబందెదవు నీయావాసమచ్చోఁ గనన్!
బంధాతీత హృదంతరంబగుటనిన్బంధంపవీబంధవుల్!
అట్టిదానిని బంధింపనలవియైన
దేమికలదు విచారింపనిలఁ ద్వదీయ
గాఢనిశ్చలబద్ధరాగంబొకండు
దక్క స్వేచ్ఛానుగామి స్వాతంత్ర మహిమ! !
భవదాత్మ ప్రభువుల్ స్వతంత్ర గరిమా! బద్ధాంఘ్రులై యార్దమై
పవలుగానని మిద్దెలో మెలగుచో బందీగృహాంధబునన్
భవదర్థంబగు హింసయే జయముగా భావంబునన్లోక మెం
చవియద్దేశమునింపెరవాయురయ పక్షశ్రేణినీకీర్తితోన్
పావనాలయమనీబందిగంబుచిలాన బలిపీఠమా నీదుపాడునేల
బావివర్డనునొక్క పావనపురుషుండు బహువత్సరములందు బాధఁబడియె
నడుగుల రాపిడినరుగునంఘ్రల చిహ్నమశ్మమయీస్థలినసటఁబోలి
దిగియంటునందాక తిరిగెనాతండట నుసురెల్లనచ్చటనుడిపి కొనుచు! !
అట్టి పదపద్మచిహ్నములణగి చెరగి
పోకనిలుచుండు గాతనే ప్రెద్దునచటఁ
గ్రుద్ధదుష్టాధిపాలక క్రూరకర్మ
నీశునకుఁ జూపియవి మొరలిడుచునుంట! !
.. బైరన్ భావతీవ్రతను జగన్నాథం ఛందోబంధనాల్లోనే ఎంత అలవోకగా పట్టుకున్నాడో చూడండి. Holy placeను పావనాలయమని, sad floorను పాడునేల అని సహజంగా మార్చేశాడు. Libertyని ‘‘స్వతంత్రేచ్ఛ’’ అని చెప్పడమే కాకుండా కోట్స్ లో పెట్టాడు. ఇది అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న భారతావని స్వేచ్ఛాభిలాషకు నిగూఢ నిదర్శనమా?
There are seven pillars of Gothic mould,
In Chillon’s dungeons deep and old,
There are seven columns, massy and grey,
Dim with a dull imprison’d ray,
A sunbeam which hath lost its way,
And through the crevice and the cleft
Of the thick wall is fallen and left;
Creeping o’er the floor so damp,
Like a marsh’s meteor lamp:
ప్రాచీనోన్నతకుడ్యసంవృత గుహాభ్రాంతిప్రభూతాఢ్యమై
యాచిల్లాన్ జెరసాల గ్రాలునటమధ్యన్ గొప్పనై తెల్లనై
తోచున్ స్తంభములేడు కోణములతోఁదోరంబులై చూడ్కికిం
దోచుంభానుకరంబొకండ సదుమైధూమక్రియంబదినాన్
మందమైనట్టికుడ్యంబుమధ్యమందు
బీటువారిన రంధ్రంబువెంటదూరి
మార్గమేదినకరంబు మసకకాంతి
చేతఁగను వెలుగొందెనాచెరగృహంబు
మిగులఁదేమగల్గు మేదినిపై ప్రాకు
లాడు తరణికిరణమచటనమరెం
బర్రభూమిమీదంబైనుండిపడియటఁ
గ్రాలురిక్కవెలుఁగు కరణిందోప
.. అంధకార బంధురమైన ఆ గుయ్యారంలోకి బీటువారిన గోడ రంధ్రంలోంచి ఓ సూర్యకిరణం దారితప్పి వచ్చింది. ఆ మసకకాంతిలోనే చెరగృహం వెలిగిపోయింది.
… Painful to these eyes
Which have not seen the sun so rise
For years—I cannot count them o’er,
I lost their long and heavy score
When my last brother droop’d and died,
And I lay living by his side.
భారంబులయ్యెఁ బ్రొద్దుపొడువన్ బహువత్సరముల్ గనుంగొనన్
దూరములైనపాడుకనుదోయికి నీదినముల్ గణింపగా
నేరను వత్సరంబులవి నేటికినిన్నిగతించెనందు నే
నారసిచెప్ప దీర్ఘగణనావళివిస్మృతి నొందిపోయినన్
లెక్కమరచితి నాతమ్ముండొక్కఁడుండి
కుందిమృతినొంది ధారుణిఁ కూలినపుడు
బ్రతికి జీవచ్ఛవంబనవానిప్రక్క
కదలనేరకపడియున్నకాలమందు
We could not move a single pace,
We could not see each other’s face,
But with that pale and livid light
That made us strangers in our sight:
And thus together—yet apart,
Fetter’d in hand, but join’d in heart,
’Twas still some solace in the dearth
Of the pure elements of earth,
To hearken to each other’s speech,
And each turn comforter to each
With some new hope, or legend old,
Or song heroically bold;
ఒక్కయడుగైనఁ గదలంగనోపలేము
కడగియన్యోన్యవదనముల్ గానలేము
మమ్ముగ్రొత్తఁగఁజూపు నామసకకాంతి
యచటలేకున్న వైవర్ణ్యమందియయిన
ఇట్లు కలిసియు మరియు ప్రత్యేకముగను
హస్తములఁగట్టుపడి హృదయములఁగలసి
యేకమైయటమెలగెడు నేముపుడమిఁ
బంచభూతాప్తికిని బేదపడితిమకట
ఆ దశనైననొండోరుల యార్తనినాదములాలకించి యా
శాదరవాక్కులాడి యితిహాసముఁ జూపి పురాణవీర గా
నోదయముల్ ఘటించి మరియొండొరుచిత్తములుల్లసిల్లఁ గా
నాదరఁమొప్పఁజేతు మదియాత్మవిషాదము కొంతవాపఁగన్
.. అన్నదమ్ములను ఒక్కో స్తంభానికి కట్టేశారు. స్తంభాలకు ఇనుపకడియాలు ఉన్నాయి. కడియాలకు గొలుసులు, వాటికి మనుషులు. అడుగు కదపలేరు. ఒకరిదగ్గరికొకరు వెళ్లి ఆప్యాయంగా చూసుకోలేరు. అయినా హృదయాలు మాత్రం కలసే ఉన్నాయి. ఒకరి ఆర్తనాదాలొకరు విని శాంతధైర్యవచనాలు చెప్పుకుంటున్నారు.
We heard it ripple night and day;
Sounding o’er our heads it knock’d;
And I have felt the winter’s spray
Wash through the bars when winds were high
And wanton in the happy sky;
And then the very rock hath rock’d,
And I have felt it shake, unshock’d,
Because I could have smiled to see
The death that would have set me free.
అనిల వేగోపహతినిర్మలాంబరమున
హిమతుషారంబుల చలివేళనెగసియాడఁ
గలుఁగు గొనగొనరొద రేపవలుచెలంగి
తలలపై మ్రోగనెడలేని యులివు వింటి
మీదఁబడఁగంటిఁ గడ్డీలమించివచ్చి
యపుడు చెరసాల యశ్మమెయల్లలాడె
నూపుదగిలియుఁ జలియింపకుంటిని మదిని
శ్రమవిమోచకమృతి సంతసంబునీదె
.. ఆ చెరసాల గోడలనంటి లెమాన్ అనే రమ్యసరోవరముంది. గోడపక్కనుంచి తరంగాలు బందీఖానాను చోద్యంగా పలకరిస్తుంటాయి. పెనుగాలి వీచినప్పుడు నీటితుంపర్లు జైల్లో విసురుగా పడుతుంటాయి. ఆ తాకిళ్లకు జైల్లోపలి గోడరాళ్లు అల్లాడతాయి. వాటి తాకిడి తగిలినా చలింపడు. వేదనను తీసేసే చావు సంబరమే కదా.
The flat and turfless earth above
The being we so much did love;
His empty chain above it leant,
Such Murder’s fitting monument!
వాని విడఁగొట్టు శృంఖలవ్రాతమరయఁ
బాతిపెట్టిన శవముపైఁ బడియటుండె
నరయనది దానిపై గోరియనఁబరగె
ఘోరహత్యార్హమైనట్టి గురుతనంగ
.. పెద్దతమ్ముడు చనిపోయాడు. అతన్ని బందిఖానాలో కాకుండా సూర్యరశ్మి తగిలే చోట ఖననం చేయాలని కథకుడు ప్రాధేయపడ్డాడు. వాళ్లు పరిహసించారు. తమ్ముడి గోరీపై అతని సంకెల ఆ దారుణానికి గుర్తుగా మిగిలింది. ఇక రెండో తమ్ముడి సంగతి..
With all the while a cheek whose bloom
Was as a mockery of the tomb
Whose tints as gently sunk away
As a departing rainbow’s ray;
An eye of most transparent light,
That almost made the dungeon bright;
And not a word of murmur—not
A groan o’er his untimely lot,—
A little talk of better days,
A little hope my own to raise,
For I was sunk in silence—lost
In this last loss, of all the most;
And then the sighs he would suppress
Of fainting Nature’s feebleness,
More slowly drawn, grew less and less:
I listen’d, but I could not hear;
I call’d, for I was wild with fear;
I knew ’twas hopeless, but my dread
Would not be thus admonishèd;
I call’d, and thought I heard a sound—
I burst my chain with one strong bound,
And rushed to him:—I found him not,
I only stirred in this black spot,
I only lived, I only drew
The accursed breath of dungeon-dew;
ఇట్టి దుర్దశనున్ననెవ్వాని చెక్కిళ్ళకెంజాయ గోరీకిఁ గేలియయ్యె
నిద్దంపు చెక్కిలి నిగనిగల్నిరసించెనింద్రాయుధస్ఫూర్తి యేపు తరిగి
మెల్లమెల్లఁబోవు మెలపునఁదళతళ మించుల కనుకాంతిమించి తొడరి
వెలిగించెఁ జెరసాల విస్మయంబుఁగనట్టి మానిసిసణుగుల మాటయొక్క
టైనబలుకఁడు నిట్టూరుపనైననిడడు
కనియునిట్టియకాలసంఘటన తనకుఁ
గలిగినను నూత్నవిశ్వాసబలముచేత
సహనముననోర్చె నెట్టికష్టములనైన
మంచిదినములుకలవన్నమాట కొంత
యడఁగు నాయాస నిలిపెడునాసకొంత
పలుకునాతఁడు గొణిగెడు పలుకుతోఁడ
మౌనమగ్నుఁడనై నేను మ్రానుపడఁగ
.. నిగనిగల బుగ్గల తమ్ముడు మనోవ్యథతో చిక్కిపోయాడు. అంత్యకాలం. నిట్టూర్పు సన్నమైంది. పిలిచినా పలకలేదు. అయినా భ్రాంతిపాశము వదల్లేదు.
I burst my chain with one strong bound,
And rushed to him:—I found him not,
I only stirred in this black spot,
I only lived, I only drew
The accursed breath of dungeon-dew;
గొప్పలంఘనమున నాదు గొలుసుఁ ద్రెంచి
కొనిరయోద్ధతిఁజనితినాతనిసమీప
మునకునైనను ఫలమేమి మున్నె కాలుఁ
డసవుఁగొనిపోయెనిఁకనటనాతఁడేడి
అక్కటా! వానిఁగనుఁగొననైతినెచట
నేనొకఁడనుంటిఁ జీకటినెలవునందు
నేనొకఁడనఁబ్రతికినేనొకండఁ
బాడుచెరతడిశ్వసనంబుఁ బడయుచుంటి
What next befell me then and there
I know not well—I never knew—
First came the loss of light, and air,
And then of darkness too:
I had no thought, no feeling—none—
Among the stones I stood a stone,
And was, scarce conscious what I wist,
As shrubless crags within the mist;
For all was blank, and bleak, and grey;
It was not night—it was not day;
It was not even the dungeon-light,
So hateful to my heavy sight,
But vacancy absorbing space,
And fixedness—without a place;
There were no stars, no earth, no time,
No check, no change, no good, no crime
But silence, and a stirless breath
Which neither was of life nor death;
A sea of stagnant idleness,
Blind, boundless, mute, and motionless!
చిత్తవృత్తి నశించెను జేష్టదక్కె
నింద్రియజ్ఞానమంతయునిమ్ముదప్పె
శూన్యమయ్యెను సర్వంబుఁజూడనచటి
రాలలోపల నేనొక్క రాయినైతి
మంచుముంచిన పొదలేనిమలలమాడ్కి
జ్ఞానమజ్ఞానమును రెండుగానకుంటి
సర్వమత్తరిశూన్యమై శైత్యమయ్యె
మరి వివర్ణముఁగాఁదోచె మానసమున
కనుఁగొననదినిశ కాదదిపవలును గాదు భారములైన కన్నులకును
భారమైతోచెడు కారాలయములోని కనుమాపుచూపు గాదు చూ
డ! నావరణము మ్రింగునాకాశశూన్యంబు స్థానంబునెరుగని స్థావ
రంబు లేవునక్షత్రముల్ లేదుధారుణితరి లేదువర్ణంబులు లేవులేవు
లేదు పరివర్తనము లేదులేదుమేలు
లేదు కీడు విచారించి చూడఁజూడ
మౌనమును మృతిజీవానుమానకుంభ
కంబునిశ్చల భావంబుఁగలియుండె
గాఢనిశ్చలజాడ్యసాగరమునందు
రూపమడఁగియపారమైనచూపుమాసి
ముగ్దతను దాల్చినిశ్చిలతనువహించి
యున్నట్లయ్యె నేనప్పుడున్నరీతి
.. తోడబుట్టినవాడొకడైనా మిగిలాడులే అన్నఆశతో జీవించాడు. అదీ పోయింది. మనిషి ఉన్నట్లుండి జడమైపోయాడు. చిత్తము చెదరింది. సర్వం శూన్యమైంది. రాత్రీపవళ్లకు తేడా తెలియకపోయింది. మౌనం కమ్ముకుంది.
A light broke in upon my brain,—
It was the carol of a bird;
It ceased, and then it came again,
The sweetest song ear ever heard,
And mine was thankful till my eyes
Ran over with the glad surprise,
And they that moment could not see
I was the mate of misery;
But then by dull degrees came back
My senses to their wonted track;
కలకలరవములఁబలుకులు
చిలుకుచు వ్యధఁజెందునాదు చిత్తంబునకున్
వెలుఁగిడువిధమునఁ దెలివిడు
పులుగొక్కటి వచ్చె గానములు విలసిల్లన్
గానమప్పుడు విరమించెఁ గ్రాలెమరల
వీనులెన్నడునటువంటి వింతమధుర
గానమాలించి యెరుగవు గానఁగనులు
హర్షవిస్మయములఁగృతజ్ఞాంచితముగ
And song that said a thousand things,
And seemed to say them all for me!
I never saw its like before,
I ne’er shall see its likeness more:
It seem’d like me to want a mate,
But was not half so desolate,
And it was come to love me when
None lived to love me so again,
And cheering from my dungeon’s brink,
Had brought me back to feel and think.
I know not if it late were free,
Or broke its cage to perch on mine,
But knowing well captivity,
Sweet bird! I could not wish for thine!
ఆసంగీతము వీనుదోయికొసగెన్ హర్షంబు వేసుద్దులన్
భాసిల్లంబ్రకటించెనాకొరక చెప్పందల్చెనోయేమొకో
యీసాదృశ్యముగల్గు పక్షినిలమున్వీంక్షింపఁగాలేదికే
వాసంబందునఁగాననంచుమదిలోఁ బల్మారునేఁదల్చితిన్
అదియు నావలె సహవాసినాత్మఁగోరి
వెతకుచున్నట్లుతోచె నామతికిగాని
నేనుబడ్డట్టికష్టార్ధమైనఁగాని
పొందకుండటనిక్కమాపులుగురేడు
ననునిలపైఁబ్రేమించెడు
జనులెవ్వరులేరటన్నసౌహృదభావం
బునను బ్రేమించుటకై
చనుదెంచెంబోలుఁ బక్షిచంద్రంబటకున్..
.. ఆ పిట్ట చెరచివర కూర్చుని పాటలుపాడింది. ఖైదీకి ఉత్సాహమొచ్చింది.
I know not if it late were free,
Or broke its cage to perch on mine,
But knowing well captivity,
Sweet bird! I could not wish for thine!
…. దానిని విడిచిరో తప్పించుకొని పంజరమునుండి నా పంజరమునవ్రాల
వచ్చెనోగాని యెరుగనువాస్తవంబు
చెరవిధంబెల్లబాగుగఁజిత్తమునకుఁ
దెలసియుండుట నీకదివలదటంచు
బుద్ధింగోరెదనించుల పులుగురేడ
Or if it were, in wingèd guise,
A visitant from Paradise;
For—Heaven forgive that thought! the while
Which made me both to weep and smile—
I sometimes deem’d that it might be
My brother’s soul come down to me;
But then at last away it flew,
And then ’twas mortal well I knew,
For he would never thus have flown—
And left me twice so doubly lone,—
Lone as the corse within its shroud,
Lone as a solitary cloud,
A single cloud on a sunny day,
While all the rest of heaven is clear,
A frown upon the atmosphere,
That hath no business to appear
When skies are blue, and earth is gay.
అదిచూడ దివినుండి యాకాశపధమునఁ బక్షివేషముదాల్చివచ్చినట్టి
అలపరామర్శికుఁడని మదిభావింతుఁ గడచన్నమద్భ్రాత గరుణ న
న్నుచూడంగ దిగివచ్చినాడేమొయని కొన్నిమారులు దలచితిని మన
మునందు, దుఃఖంబుహర్షంబుఁ దోచునుఁదోడుగ నామాటమదికె
కిక్కినప్పుడెల్ల! !
దేవ క్షమియింపుమామాట తెలియకంటి
బారిపోయెనుఁదుదకు నాపక్షియప్డు
మర్త్యఖగమని దృఢముఁగ మదికిఁదట్టె,
కాదో విడనాడి చనునెయాకరణి మరల
నన్నురెండవపరియిట్లు ఖిన్నుఁజేసి
మరలనొంటరిగాఁజేసి మరలఁడఁతడు
పాడెపైబెట్టినట్టి శవంబనంగ
నొక్కఁడనయుంటి నక్కడనుక్కుదక్కి..
.. కొన్నాళ్లకు బందీ అవస్థ చెరపాలకుల్లో మార్పుతెచ్చింది. సంకెలను విడగొట్టారు. ఖైదీ అటూ టూ తిరిగాడు..
Returning where my walk begun,
Avoiding only, as I trod,
My brothers’ graves without a sod;
For if I thought with heedless tread
My step profaned their lowly bed,
My breath came gaspingly and thick,
And my crush’d heart felt blind and sick.
మరియుఁదిరుగుచు ననుజసమాధియుగము
మట్టిచెక్కైన లేకుండవట్టిగుంట
దానిపై కాలుబడనీక తడవితడవి
కడగి తప్పించితిరిగితిఁ గతమువినుడు
కడుఁబరాకున నాకాలువడనపూత
మౌనుగద వారి భూశయ్యలనుతలంపు
లపుడు గలిగించునెగరోజునవిళరముగ
నంధమయమయిభ్రమనొందు నాత్మవిరిగి
.. తొట్రుపడుతూ తమ్ముళ్ల సమాధుల వద్దకు వెళ్లాడు. పల్లంగా ఉన్నాయి. పరాకున వాటిపై కాలుపడితే అపవిత్రమవుతాయని జాగ్రత్తగా అడుగులు వేశాడు. దుఃఖంతో ఆత్మ విరిగిపోయింది.
My very chains and I grew friends,
So much a long communion tends
To make us what we are:—even I
Regain’d my freedom with a sigh.
కాళ్ళబిగఁగొట్టినట్టి శృంఖలము నేను
సహచరత్వముంబుఁ గంటిమి సాహచర్య
దైర్ఘ్యముననుంటనిట్టి తాత్పర్యమబ్బె
విడుదలైనను నిట్టూర్పు విడచికొంటి
.. మనోదేహాలు ఛిద్రమైపోయాక దక్కిన స్వేచ్ఛ ఇది. ఇది ఒక్క చిలాన్ బందీ వేదనేకాదు, లోకపుటన్యాయాలను ప్రశ్నించి చెరసాలల పాలైన ప్రతి ఒక్కరిదీ. తళతళమెరిసే తమ కళ్లలోని స్వేచ్ఛాకాంతితో చీకటిజైళ్లను వెలిగించి, జైలుబయట ఉషస్సులను, వసంతాలను నింపిన వాళ్లందరిదీ.
–పి.మోహన్
(చిలాన్ బందీ తెలుగు అనువాదాన్ని ఈ లింకులో చూడొచ్చు. http://archive.org/search.php?query=chilabandi%20anubhraatrxsauhrxdamu)
మిగిలిన సగాన్ని వెతుకుతూ…
తెగని గాలిపటం
2002 ఆగస్టు 15.
సికింద్రాబాద్ స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో కమలిని. ఆ వాన నీళ్ల సవ్వడిలోనూ ఆటో ఆగిన చప్పుడు ఆమె చెవులకు. ఇంట్లోంచి ఒక్క పరుగున బయటకు వొచ్చింది. ఆటోవాలాకు డబ్బులిచ్చి, గేటు తీస్తున్నాడు శేఖర్. తల గిర్రున తిరిగింది. కాళ్లు సత్తువ కోల్పోయాయి.
అతని స్థితి చూసి, ప్రమాదం శంకించి, ఒక్క ఉదుటున అతడి వొద్దకు వొచ్చింది. ఆమె పట్టుకోబోయినట్లయితే కింద పడిపోయేవాడే. అతడి తడి ఒళ్లు కొలిమిలో పెట్టిన కర్రులా సలసలా కాలిపోతోంది. అతడి చేతిని తన భుజం మీద వేసుకొని, నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి – కమలిని.
శేఖర్ నిల్చోలేకపోతున్నాడు. తనను కమలిని పట్టుకోవడం, ఇంట్లోకి తీసుకురావడం తెలుస్తూనే ఉంది. ఆమెకు దూరంగా జరగాలని మనసు కోరుకుంటుంటే, శక్తి చాలడం లేదు దేహానికి. ‘శ్రీనాథ్గాడి కింద నలిగిన ఆమె దేహానికి తన దేహం రాచుకోవడమా?’. తల నరాలు చిట్లినంత నొప్పి. తెలివితప్పిపోయాడు.
దేవుడు ,కర్మ
సాహసి సాదిక్ ప్రయోగం ….కవిత్వం బండి మీ ముంగిట్లో..!
__________________________________
గడప గడపకూ కవిత్వం: సాదిక్
1. సాదిక్, మీకు కవిత్వం మీదనే ఎందుకు ఇంత ప్రేమ?
*
ఆ పిల్లాడు నాకు వేసిన మంత్రం….
కానీ, మళ్లీ చూస్తాం.
చూసి అబ్బురపడతాం.
ఎంత అద్భుతం అని మళ్లీ అవలోకించుకుంటాం, మన జ్ఞానాజ్ఞనాలని, దృశ్యాదృశ్యాలని!విషయం ఒక దివ్య దర్శనం.
అది నగరంలోని రాంనగర్.
ఒక ఎటిఎం సెంటర్ లోంచి బయటకు వస్తూ ఉంటే ఈ పిల్లవాడు.
అది ఆంజనేయ స్వామి దేవాలయం.
ఆ గోడపై చక్కగా చిత్రించిన హనుమాన్ పెయింటింగ్.
అంత దూరంనుంచే ఆ పిల్లవాడు నడుస్తూ నడుస్తూ, చూస్తూ వస్తున్నాడు. చూశాను. కెమెరా తీయనే తీశాను.
వాళ్ల అమ్మ ఎప్పుడో ఆ గుడి దాటింది.
కానీ, ఇతడు ఇక్కడే ఆగిపోయాడు.
నిజం.
ఇతడు ఎంత ఆసక్తితో చూస్తున్నాడో చెప్పాలంటే నాకు భాషా లోపం కలుగుతున్నది.
విస్మయం. విడ్డూరం.
విచిత్రం. సందేహాస్పదం.
వాడిది అది ఆసక్తా? ఆశ్చర్యమా?
లీనమా? సమ్మోహనమా?
ఆ బాలుడు మంత్ర ముగ్ధుడై చూస్తుంటే, గుడిగోడలపై బొమ్మలు ఎందుకు చెక్కుతారో కూడా తెలుస్తోంది నాకు! కానీ, ఆ పిల్లవాడు ఆగి చూస్తుంటే, ఆగి, ఆగి, ఆగి, చూస్తుంటే మొత్తం పది చిత్రాలు చేశాను నేను.ప్రతి చిత్రం ఒక మంత్రముగ్ధం.
ఒకటి దూరంగా ఉన్నప్పుడే చూస్తున్నది. రెండు దగ్గరకు వచ్చి చూస్తున్నది.
మూడు అనుమానంగా చూసేది. తర్వాత అర్థం చేసుకుంటూ చూస్తున్నది.
తర్వాత ఆ పెయింటింగ్ పై చేయించి తడిమి చూసేది. అటు తర్వాత చిర్నవ్వుతో చూసేది.
అనంతరం ఆ పెయింటింగ్ ను వదిలలేక వదిలి వెళుతూ, వెనక్కి చూస్తూ…చూస్తూ వెళ్లేది.
ఇట్లా పది దాకా చేశాను.
చిత్రమేమిటంటే, దూరంగా వాళ్ల అమ్మ ఉన్నది. ఆగి ఉన్నది.
వాడు ఎంత దీర్ఘంగా, మరెంత పరిశీలనగా, ఇంకెంతటి ఆసక్తితో చూసిండో ఆమె చూడలేదు.
కేవలం వాడికోసం వేచి ఉన్నది.
ఆమెనూ చిత్రం చేయాలనుకున్నాను.
కానీ, ఎందుకో నాకు ఈ పెయింటింగ్ ను చూడాలనిపించింది.
నేను మిగిలాను.అదొక అద్భుత దృశ్యాదృశ్యంఇక చూడసాగాను.
ఇదివరకు లేని ఆసక్తి ఏదో కలిగిన సమయం అది.
నన్నెవరైనా చూశారో లేదో తెలియదుగానీ, నిజం.
తొట్ట తొలి సారిగా గోడలపై ఉన్న దేవుడి చిత్రం ఒకటి భక్తితో చూడసాగాను.
చూస్తుంటే, అంతకుముందు నా జ్ఞానంలో పెరిగిన పెయింటర్స్ ఎవరూ లేరు.
అసలు పెయింటర్ అన్నవాడెవడూ లేడు. ఒట్టి హనుమాన్ మిగిలాడు.
ఆ పెయింటింగ్ తాలూకు రంగులూ, చిత్రలేఖనా మహత్యం, విమర్శా దృక్పథం, అది కాదు, అసలు చిత్రం.
కేవల చిత్రం. ఆ చిత్రంలో అందలి వీర హనుమాన్ సంజీవనీ పర్వతాన్ని లాఘవంగా తీసుకెళుతూ ఉండటం, అదే చూశాను.
ఒక సూపర్ మ్యాన్, తన ఫ్లయిట్లో, అలా తోకతో ఉండటం, అద్భుతంగా తోచి తొలిసారి చూశాను.
ఆ అద్భుతాన్ని ఫీలయ్యాను. దివ్యంగా ఫీలయ్యాను.
అంతకుముందు తెలిసిందే. కానీ, కొత్తగా చూడటం.
బహుశా ఆ పిల్లవాడు నాకు వేసిన మంత్రం ‘సంజీవని’ అనిపిస్తోంది.
ఛాయా చిత్రలేఖనంతో ‘చేయడానికి’ బదులు ‘చూడటం’ కూడా ఒకటి ఉంటుందా?
దాన్ని మన సబ్జెక్టే మనకు నేర్పుతాడా?
ఏమో!
నాకైతే నేర్పిన బాలుడు వీడు.
రెక్కలు తెగిన పక్షి చేసిన సాహసం
ఈ సారి 87 వ అకాడమీ (ఆస్కార్ ) అవార్డ్ లలో BIRDMAN (The Unexpected Virtue of Ignorance) ఉత్తమ చిత్రం అవార్డ్ ని కైవసం చేసుకుంది . దానితో పాటుగా ఉత్తమ డైరెక్టర్ , స్క్రీన్ ప్లే , సినిమాటోగ్రఫీ అవార్డ్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది .ఇంతకీ అసలు ఎవరీ బర్డ్ మాన్? ఏమిటితని గొప్పతనం?
అద్భుతం!
ఈ విశ్వమంతా ఒక అంతిమ అద్భుతం.
అసలు మనమంటూ ఎలా వచ్చాం ఇక్కడికి?
మనం మాత్రమే వున్నామా ఇక్కడ?
ఈ ఆకాశం అంతిమ ఆర్ట్ గ్యాలరీ.
నక్షత్ర సమూహాలన్నిటినీ చూస్తున్నామా లేదా?!
ఒక్కో నక్షత్ర సమూహం ఒక కళా ఖండం!
ఈ ఆకాశమే అంతిమ పెయింటింగ్.
ఇది కాన్వాస్ లో వొదగని అనంతం.
నలుపు కన్నా గాఢం.
ఏ రంగులోనూ ఇమడని రహస్యం.
అవును, ఈ అనంతమైన విశ్వంతో నా సంతోషాల యాత్రని చిత్రిస్తాను నేను:
అనేక సార్లు, ఆ నక్షత్రాల నగల పెట్టిలోంచి
కొన్ని వజ్రపు తునకల్ని ఏరుకొస్తాను,
నావైన నక్షత్ర సమూహాల్నీ రచిస్తూ వుంటాను.
నాకేమాత్రం తెలియని
అపరిచిత లోకాల అన్వేషణలో
నక్షత్ర కెరటాల మీద దూసుకు వెళ్తాను.
ఆహా! నా అద్భుతాల ఆకాశం!
వంశీ: మాస్టర్ ఆఫ్ యాంత్రొపాలజీ
మార్మిక ఊహలు రేపే గుహలు, సొరంగాలు
చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ తలుపు, తాళం బాగా తుప్పు పట్టాయి. మా అమ్మే చెప్పిందో, ఇంకెవరైనా చెప్పారో గుర్తులేదు కానీ, అది కాశీకి వెళ్ళే సొరంగమార్గమట! ఒకప్పుడు సాధువులు, సన్యాసులు ఆ మార్గంలో కాశీకి వెళ్ళేవారట! అది ప్రమాదకర మార్గం కావడంతో తర్వాత తాళం వేసేసారట!
పైగా ఆ తుప్పు పట్టిన తలుపు, తాళం చూస్తే అది నిజమేననిపించేది.
ఆశ్చర్యంగా, కుతూహలంగా ఆ సొరంగం వైపే చూస్తూ ఉండిపోయేవాణ్ణి. అందు లోంచి వెడితే ఎంతో దూరంలో ఉన్న కాశీకి చేరుకుంటామన్న ఊహ అంత చిన్నప్పుడే నాకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది. ఆ తర్వాత కూడా కనకదుర్గ గుడికి ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరిగా ఆ సొరంగం దగ్గరకు వెళ్లి దానివైపే చూస్తూ ఉండేవాడిని, అక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్లడాన్ని రకరకాలుగా ఊహించుకునేవాణ్ణి. ఆ సొరంగం ముచ్చట నా మీద ఎంతగా ముద్ర వేసిందంటే, పెద్దైన తర్వాత కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ సొరంగం దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అది అలాగే ఉందా అన్నది నాకు తెలియదు. నేను చివరిసారి వెళ్లి చాలా ఏళ్ళు అయింది.
లోకజ్ఞానం పెరిగిన కొద్దీ, ఆ సొరంగం లోంచి వెడితే కాశీలో తేలతామనడంలో ఆవగింజంత కూడా నిజం లేదని మనకు తెలుస్తూనే ఉంటుంది. కాని, ఇంకోవైపు అది నిజం ఎందుకు కాకూడదని కూడా అనిపిస్తుంది. నిజానికీ కల్పనకీ మధ్య అదో రకమైన డోలాయమాన స్థితి. సంగతేమిటంటే, వాస్తవికతను అంటిపెట్టుకునే నిగూఢతా ఉంటుంది. ఒక కోణంలో చూస్తే, వాస్తవికత ఎంత వాస్తవమో, నిగూఢతా అంతే వాస్తవం. ప్రకృతిలోనూ, మానవప్రకృతిలోనూ ఈ రెండూ అంతర్భాగాలు, బొమ్మా బొరుసూ లాంటివి. నమ్మకానికీ, అపనమ్మకానికీ కూడా ఇదే వర్తిస్తుంది. మనిషి జీవితం ఏదో ఒక రూపంలో ఈ రెంటి మధ్యా పయనిస్తూనే ఉంటుంది.
ఇలా అన్నానని నేనేదో తాత్విక చర్చలోకి వెడుతున్నాననో, తాడూ బొంగరం లేని ఊహల్ని సమర్థిస్తున్నాననో అనుకుంటున్నారేమో, అదేం లేదు. మానవపరిణామచరిత్రలోకి వెడితే ఈ నిగూఢత, రహస్యం, లేదా మిస్టరీ అనేవి మనిషి జీవితంలో ప్రముఖపాత్ర పోషించాయని మనకు తెలుసు. సొరంగాలు, లేదా గుహలు; ఇంతకు ముందు చెప్పుకున్న అమ్మవారి తోపులు వగైరాలు ఆ నిగూఢతను అంటిపెట్టుకుని ఉన్నవే. నిగూఢమైన తంతులలో అవి భాగాలు. వాటిని ఒక మార్మికత ఆవరించి ఉంటుంది.
సొరంగాలు, గుహలు, తోపుల చుట్టూ అల్లుకున్న మార్మికత ఎన్ని వేల సంవత్సరాలుగా మనిషి ఊహల్లో జీర్ణించుకుని ఉందో! కనకదుర్గగుడిలోని ఆ సొరంగాన్ని చూడగానే, అది ఒకప్పుడు కాశీకి రహస్య మార్గం అన్న ఊహ పుట్టడం వెనుక ఇంత చరిత్ర ఉందన్న మాట.
సొరంగాలు, గుహలు చీకటి గుయ్యారాలుగా; లోపల ఏముందో అంతుబట్టనివిగా, ఎంత దూరం వ్యాపించాయో తెలియనివిగా ఉంటాయి. భూమి అడుగున అలాంటి ఒక అజ్ఞాతప్రపంచాన్ని మనిషి ఊహ సృష్టించి, దానికి ఒక పేరు పెట్టింది: అదే, పాతాళం! పాతాళం స్వర్గంలా ఆనందం, ఆహ్లాదం గొలిపే ప్రపంచం కాదు. భయ, బీభత్సాలను కలిగించేది. అక్కడ ఉండేది దేవతలు కాదు; కాలకూట విషాన్ని పుక్కిలించే మహాసర్పాలు. పాతాళం మన భాషల్లో ఒక న్యూనార్థకం, నిందార్థకం. పాతాళానికి సమానార్థకమైన under world కూడా అలాంటిదే. స్మగ్లర్లు, ఇతర నేరాలు చేసేవాళ్ళు ఉండే ప్రపంచం అది. పాతాళానికి తోక్కేయడం అనే నుడికారం మన భాషల్లో కనిపిస్తుంది. వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు.
మన దగ్గరే కాదు, పాతాళం ఇతర పురాణకథల్లోనూ ఇలాంటి న్యూనార్థంలోనే కనిపిస్తుంది. గ్రీకుపురాణకథల్లోని పాతాళ ప్రస్తావనలను ఉదహరించుకునే సందర్భం ముందు రావచ్చు. అదలా ఉంచితే, మార్మికత, మాంత్రికత నిండిన పురా మానవ జీవితంలో గుహలు, పాతాళం ఒక ముఖ్యపాత్ర పోషిస్తూవచ్చాయి. మనదేశంలో అజంతా, ఎల్లోరా గుహల గురించి మనకు తెలుసు. అమరనాథ్ గుహ గురించి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇలాంటివే ఇంకా దేశంలో చాలా ఉన్నాయి. ఇవి కాక కొన్ని ప్రాచీన ఆలయాలలో విడిగా గుహాలయాలు, భూగర్భ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. భూగర్భ ఆలయాలలోని దేవుడి పేరుముందు ‘పాతాళ’ అనే మాట చేర్చి చెబుతుంటారు. ఉదాహరణకు, శ్రీకాళహస్తిలో పాతాళ విఘ్నేశ్వరుని గుడి ఉంది. అందులోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అలాగే, కొండలను గుహలుగా తొలచి ఏర్పాటు చేసిన గుడులు అనేకచోట్ల కనిపిస్తాయి.
అన్నట్టు, కొందరు ఉగ్రదేవతల గుడులు పాతాళంలో ఉంటాయి. ‘పాతాళ భైరవి’ అనే సినిమా పేరులోనే పాతాళం ఉంది. ఆ ఉగ్రదేవతలను ఆరాధించే మాంత్రికుల నివాసం కూడా పాతాళంలోనే ఉంటుంది. అందుకే వారి ఉనికిని గుర్తించడం కష్టమవుతుంది. దాని నుంచే ‘సప్తసముద్రాలు-దానికి ఆవల ఓ మర్రిచెట్టు-దాని తొర్రలో చిలుక- ఆ చిలుకలో మాంత్రికుని ప్రాణం…’వగైరా అద్భుత కల్పనలు, మహిమలు పుట్టాయి.
అలవాటు వల్ల వీటిని యాంత్రికంగా తీసుకుంటాం. ఇందులో కొత్త ఏముందని అనుకుంటాం. కానీ చరిత్ర క్రమంలో వీటిని పెట్టి చూడండి…ఇవి కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తాయి. చరిత్రకోణం నుంచి చూసినప్పుడు ఆసక్తికరం కాని దేదీ ఉండదనిపిస్తుంది.
గుహల విషయానికి వెడితే, ఆదికాలపు గుడులు గుహలే ననీ; గ్రీకు సంప్రదాయమూ, పురావస్తు ఆధారాలు దానినే నిరూపిస్తున్నాయనీ థాంప్సన్ అంటారు. మన సంప్రదాయం కూడా అదే నని పైన చెప్పుకున్న గుహాలయాలు, పాతాళ ఆలయాలు చెబుతూనే ఉన్నాయి. గ్రీకు పురాణాలలోని డిమీటర్, పెరెస్పోన్ అనే అమ్మవార్లకు చెందిన పవిత్రగుహలను మెగరాన్ (megaron) అంటారు. హోమర్ కాలం నాటికి ఆ మాట ఇంటికీ, ప్రాసాదానికీ కూడా పర్యాయపదమైంది. హేడ్స్ అనే పాతాళదేవుడు, పెరెస్పోన్ అనే దేవకన్యను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేస్తాడు. అది జరిగిన చోటే మెగరాన్. థాంప్సన్ ప్రకారం పాతరాతియుగంలో గుహలే ఆలయాలుగానూ, నివాస స్థలాలు గానూ ఉండేవి. కొత్తరాతి యుగానికి వచ్చేసరికి గుహలలో నివసించడం ఆగిపోయింది. వాటిని ఆలయాలుగా, సమాధులుగా, ధాన్యాగారాలుగా ఉపయోగించడం మాత్రం కొనసాగింది.
గ్రీసులోని గుహాలయాలలో అనేకం ప్రాచీన క్రీటు ద్వీపానికి చెందినవి. క్రీటు రాజధాని నోసోస్ కు దగ్గరలోని ప్రముఖ గుహాలయమైన అమ్నిసోస్ ను హోమర్ కావ్యం ఒడిస్సీ కూడా ప్రస్తావించింది. ప్రాచీన గ్రీసుపై మాతృస్వామ్యానికి చెందిన క్రీటు సంస్కృతి ప్రభావం చాలా ఉంది. క్రీటులో నేల తొలిచి, చుట్టూ బండరాళ్ళు పేర్చి కృత్రిమ గుహలను కూడా కల్పించేవారు. అవే క్రమంగా చనిపోయినవారిని పూడ్చిపెట్టే సమాధుల నిర్మాణానికి దారితీసాయి.
అనటోలియా(నేటి టర్కీ)లో ఫ్రిజియన్లు, బహుశా వారికి ముందు హిట్టైట్లు సహజసిద్ధమైన గుట్టలలో గోతులు తవ్వి, ఎండా, చలి తగలకుండా వాటికి కలపతో రక్షణ కల్పించేవారు. ఇలాంటి గోతులనే కపడోసియా(టర్కీ మధ్యప్రాంతం), ఆర్మేనియా, ఇటలీ, జర్మనీ, లిబియా, స్పెయిన్ లలో ధాన్యాగారాలుగా లేదా గాదెలుగా ఉపయోగించేవారు. విశేషమేమిటంటే, ఈ గాదెల్లో తృణధాన్యాలను జాగ్రత్తగా భద్రపరిస్తే అవి ఎంతకాలమైనా చెడకుండా ఉండేవట. ఉదాహరణకు, గోధుమలు యాభై ఏళ్లపాటు; జొన్నలు మొదలైన చిరు ధాన్యాలు నూరేళ్ళకు పైగా నిల్వ ఉండేవట.
రోమ్ లో ఇటువంటి నిర్మాణాలను ‘ముండస్’(mundus) అనేవారు. ఏదైనా నగరనిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు, మధ్యలో ఒక గొయ్యి తవ్వేవారు. అందులో ప్రథమఫలా(first-fruits)న్ని, అంటే కొత్తపంటలో కొంత భాగాన్ని అర్పించేవారు. ఈ ప్రథమఫలం గురించి చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, ఏటా కొత్త పంట రాగానే, ఆగస్టు 24న ప్రథమ ఫలాలను అర్పించే తంతు జరిగేది. తిరిగి నవంబర్ 8న దాని మూత తెరిచి అందులోంచే మరో పంటకు విత్తనాలు తీసుకునేవారు. ఆ మూత తెరవడం మతపరమైన తంతుగా శాస్త్రోక్తంగా జరిగేది. తలుపు తెరచి ప్రేతాత్మలను బయటికి రప్పించే పద్ధతిలో అది ఉండేది. ఎందుకంటే, ఆ ధాన్యాగారం కోశాగారాన్నీ, గిడ్డంగినే కాక సమాధినీ తలపించేలా ఉండేది. అంటే, ప్రేతాత్మలు, విత్తనాలు అందులో సహజీవనం చేసేవన్నమాట.
అలాగే, ఎల్యూసిస్ అనే చోట ఉన్న డిమీటర్ అనే దేవతకు గ్రీకు రాజ్యాలు అనేకం ప్రథమఫలాలను పంపించడం ఆనవాయితీగా ఉండేది. ఆకురాలు కాలం వరకు వాటిని నిల్వ ఉంచి, ఆ తర్వాత రైతులకు విక్రయించేవారు. రైతులు వాటిని మిగతా విత్తనధాన్యంలో కలిపి కొత్తపంటకు ఉపయోగించేవారు. ఇవన్నీ లౌకికమైన చర్యలే కానీ వీటిని మతపరమైన తంతుగా జరపడం తప్పనిసరి. ఆదిమకాలంలో లౌకికమైన చర్యకు, మతపరమైన తంతుకు తేడా ఉండేది కాదని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం.
మొదట్లో ఆలయాలుగా, నివాసాలుగా ఉపయోగపడిన గుహలు, పాతాళగృహాలు క్రమంగా సమాధులు, ధాన్యాగారాల నిర్మాణానికి నమూనాను అందించినట్టు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒకరకంగా ఆయా నిర్మాణాల తాలూకు పరిణామక్రమాన్ని, చరిత్రనే చెబుతుంది. ఇలా చూసినప్పుడు, అలవాటు పడిపోవడం వల్ల అంత విశేషంగా తీసుకోని గుహాలయాలు, పాతాళమందిరాలు పురాచారిత్రకు సాక్ష్యాలుగా సరికొత్త రూపంలో కనిపించి ఆసక్తిని రేపుతాయి.
అందులోనూ మన రామాయణం, మహాభారతం లాంటి ప్రాచీన సాహిత్యంలో పురామానవ చరిత్ర తాలూకు ఆనవాళ్ళను పట్టుకోవడం మరింత ఆసక్తికరం. గుహలు అనేటప్పటికి నాకు రామాయణం, కిష్కింధకాండలోని ఒక ఘట్టం చటుక్కున గుర్తుకొచ్చింది. అది ఇలా సాగుతుంది:
సుగ్రీవుడి ఆజ్ఞపై సీతను వెతకడానికి దక్షిణదిశకు వెళ్ళిన వానర వీరులలో హనుమంతుడు, అంగదుడు మొదలైనవారు ఉన్నారు. వారు సీతను వెతుకుతూ వింధ్యపర్వతం దాకా వెళ్ళారు. మొదట పర్వతం లోతట్టున ఉన్నగుహలను, అడవులను గాలించారు. గుట్టలు, గుబురులు శోధించారు. తర్వాత వింధ్యపర్వతం పై భాగం మీదికి వెళ్ళారు. అక్కడ ఇంకా పెద్ద గుహలు కనిపించాయి. వాటిలో అన్నింటికంటే పెద్దదైన ఒక బిలం వాళ్లను ఆకర్షించింది. దానిపేరు ఋక్షబిలం. అంటే, ఎలుగుబంట్ల బిలం. చెట్లూ, వాటికి దట్టంగా తీగలు అల్లుకోవడంతో దాని ముఖద్వారం సరిగా కనిపించడం లేదు. అంతలో లోపలి నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురుపక్షులు ఎగురుతూ వచ్చాయి. అవి నీటిలో తడిసి ఉన్నాయి. దప్పికతో ఉన్న వానరులు లోపల నీటి జాడ ఉన్నట్టు తెలిసి సంతోషించారు. అతికష్టం మీద లోపలికి ప్రవేశించారు. లోపల చాలాదూరం చిమ్మ చీకటి వ్యాపించి ఉంది. క్రమంగా వెలుగు కనబడింది. సింహాలు, ఇతర మృగాలు తిరుగుతూ కనిపించాయి.
కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంత వనం కనిపించింది. అందులో రకరకాల పూలమొక్కలు ఉన్నాయి. బంగారాన్ని, వెండిని తాపడం చేసిన భవనాలు ఉన్నాయి. ఆ వనంలో ముందుకు వెళ్ళిన తర్వాత జింకచర్మాన్ని వస్త్రంగా ధరించిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె గొప్ప తేజస్సుతో దివ్యస్త్రీలా కనిపిస్తోంది. పరస్పరం పరిచయం చేసుకున్నారు. తన పేరు స్వయంప్రభ అనీ, తను మేరుసావర్ణి కూతురినని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ బిలం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చింది:
ఈ బిలంలోని భవంతులను, వనాలను మయుడనే దానవుడు సృష్టించాడు. అతడు హేమ అనే అప్సరసను మోహించాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మండిపడ్డాడు. అతణ్ణి చంపేసాడు. అప్పుడు బ్రహ్మ ఆ బిలంలోని వనాన్ని, బంగారు గృహాలను హేమకే కానుకగా ఇచ్చేసాడు. తన ప్రియసఖి అయిన హేమ ఈ వనాన్ని, భవనాలను సంరక్షించే బాధ్యతను తనకు అప్పగించింది.
ఇంతా చెప్పిన తర్వాత, “ఈ బిలంలోకి ప్రవేశించినవారు ప్రాణాలతో బయటపడడం కష్టమే. మీరు ఎలా బయటకు వెడతా’రని వానరులను అడిగింది. నువ్వే మిమ్మల్ని బయటపడేయాలని వారు ఆమెను ప్రార్థించారు. చివరికి ఆమె సాయంతో అందులోంచి బయటపడ్డారు.
ఒక నిర్జన పర్వత ప్రాంతంలో, ఎవరికీ అంత తేలికగా చొరడానికి వీలు కాని ఒక మహాబిలంలో, సింహాల వంటి క్రూర జంతువుల మధ్య, మగతోడు లేకుండా స్వయంప్రభ అనే స్త్రీ ఒంటరిగా నివసిస్తుండడమే చూడండి…ఇది లీలగా ఒకనాటి మాతృస్వామ్యాన్ని సూచిస్తోందా? పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని మరోలా అన్వయించుకోవడం కష్టమే. అలాగే, ఇది చదువుతున్నప్పుడే, ఓడిసస్ కథలో చెప్పుకున్న గ్రీకు అప్సరస సిర్సే గుర్తుకొచ్చి ఉండాలి. సిర్సే కూడా ఒక దీవిలోని అడవిలో నునుపు రాళ్ళతో కట్టిన ఒక భవనంలో ఒంటరిగానే ఉంటూ ఓడిసస్ సహచరులకు కనిపించింది. స్వయంప్రభ ఉన్న బిలంలో వానరులకు సింహాలు, ఇతర మృగాలు కనిపించినట్టే; సిర్సే భవంతికి అన్నివైపులా సింహాలు, తోడేళ్ళు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి మందు పెట్టడం వల్ల అవి సాధుజంతువులుగా మారిపోయాయని కథకుడు చెబుతున్నాడు.
సిర్సే లానే ఋక్షబిలం యజమానురాలు హేమ కూడా అప్సరసే. ఆమెను మోహించిన నేరానికి ఇంద్రుడు మయుని చంపాడు సరే, మయునికి చెందిన వనాన్ని, బంగారు గృహాలను హేమకు బ్రహ్మ కానుకగా ఇవ్వడమేమిటి? ఇందులో ఎలాంటి అర్థమూ కనిపించదు. అలాకాక, హేమకు, మయునికి ఏదో ఒక సంబంధం ఉందనుకుంటేనే అతని సంపద ఆమెకు లభించడంలో అర్థం ఉంటుంది. ఆ సంబంధం సిర్సేకు, ఓడిసస్ కు ఉన్న సంబంధం లాంటిదా?
సిర్సే తన భవంతి దగ్గరకు వచ్చిన ఓడిసస్ సహచరులను లోపలికి ఆహ్వానించి వారిని పందులుగా మార్చివేసింది. ఇది తెలిసి ఓడిసస్ ఆమెపై ప్రతీకారానికి బయలుదేరినప్పుడు హెర్మన్ అనే దేవుడు ఎదురై, ఆమెను లొంగదీసుకునే ఉపాయం చెప్పాడు. ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. దాంతో ఆమె లొంగిపోయింది. అలా జరిగి ఉండకపోతే తన సహచరులకు పట్టిన గతే అతనికీ పట్టి ఉండేది.
ఇదే కథను మయునికి, హేమకు అన్వయించి చూస్తే, సిర్సే వల్ల ఎదురయ్యే ప్రమాదం నుంచి ఓడిసస్ బయటపడగా; మయుడు బయటపడలేకపోయాడనుకోవాలి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, హోమర్ ఓడిసస్ కథకు, వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టానికీ ఉన్న పోలిక!
ఇంకో స్పష్టమైన పోలిక చూడండి…’ఈ బిలంలోకి ప్రవేశించినవారు ఎవరైనా ప్రాణాలతో బయటపడడం కష్టం. మీరెలా బయటపడతా’రని వానరులను స్వయంప్రభ అడుగుతుంది. సిర్సే భవంతిలో ఓడిసస్ సహచరులకు, ఓడిసస్ కు ఎదురైన పరిస్థితి దాదాపు అదే.
ఇంతకీ రామాయణంలోని ఈ ఋక్షబిలం ఉదంతం, పురాకాలంలో గుహలే మానవ ఆవాసాలన్న చారిత్రక వివరాన్ని నమోదు చేస్తోందా?! అవుననే అనిపిస్తోంది. రామాయణంలో పురా చారిత్రక సమాచారం లభించడం ఎంత అపురూపం, ఎంత అద్భుతం!!
మరికొన్ని విశేషాలు తర్వాత…
-కల్లూరి భాస్కరం
ధ్వని
ముందుగా ఒక ప్రతిధ్వని :
గొప్ప ” కథ ” … చదివిన క్షణాల్లో ఉద్విగ్నత నీ.. చదివేసాక ఒక నిశ్శబ్దాన్ని .. తర్వాత తలచుకున్నప్పుడల్లా, కొన్ని క్షణాల పాటు , చదివి అర్ధం చేసుకొనే శక్తి ఉన్నందుకు కించిత్ గర్వాన్నీ కలగచేస్తుంది …” కథల మీద ఎప్పుడో రాసుకున్న ఈ వాక్యం గుర్తొచ్చింది “ధ్వని “ కథ చదవగానే-
ధ్వని గురించి రాయాలన్నా కూడా అదే రకమైన ఉద్విగ్నత, ప్లస్ కొంచం భయం కూడా వేసింది.. రాయగలనా అని !
డిస్క్లైమర్ : నేను రాసినవేవీ , నాకలాంటి భావాన్ని కలిగించలేదు .. ఎంత నేర్చుకోవాలో తెలుసుకున్నప్పుడు భలే హాయిగా ఉంది .. జీవితంలో ఇంకా వొంపుకోవాల్సిన విషయాలు గుర్తొచ్చి..!
ధ్వని వివిన మూర్తి గారి కథ .. ఒక అంధత్వం ఉన్న ముస్లిం లాయర్ కథ , అతని సహాయకురాలిగా పరిచయం అయి, స్నేహితురాలిగా మారి, సన్నిహితంగా మారటానికి తటపటాయించే ఒకమ్మాయి సత్య కధ ..!
అంధత్వాన్ని, ఇస్లాం నా నేను’ లలో ముఖ్యమైనవి అని కథ మొదలెడతారు ఆయన ..! ధ్వని ఎంత అవసరం ? ఒక మనిషిని అంచనా వేయటానికి, కేవలం ధ్వనే ఆధారంగా బ్రతకటానికి అనే … కథలో మాటల్లో చెప్పాలంటే –“ చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్. “ అనే ఈ Quintessential ప్రశ్న తో, ఈ కథ మొదలవుతుంది. చూపుల, కొలతల బేరసారాల్లో జీవితం కోల్పోయిన అమ్మాయి, ఆమె గొంతులో మెత్తదనాన్ని ఆస్వాదిస్తూనే, అనలైజ్ చేసి, శల్య పరీక్ష చేస్తున్న .. ఒకబ్బాయి ..!! నా కళ్ళ ముందు చాలా జీవితాలు కదిలాయి.
“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”- అనుకొనే తండ్రి ఉన్నప్పటికీ, తండ్రి చెప్పాడని , లాయర్ జీవితంలోకి , వస్తుంది .. సత్య, ఆమె గొంతు అంత మెత్తగా .. కానీ, నిశ్శబ్దంగా , నోరు తెరచి చెప్పనప్పటికీ తనదైన నిశ్చితాభిప్రాయాలతో.. సత్య మాట్లాడక పోవటానికీ, లాయర్ కేవలం ధ్వని మాత్రమే వినటానికీ .. తనలోని లోపాన్ని కప్పి పెట్టేంత మాట్లాడటానికీ, తెలివితేటలు కలిగి ఉండటానికీ .. ఓహ్.. ఎన్ని పొరలు ఒకే మనిషిలో ..!
ఇదే కథలో ఎన్నో కాంప్లెక్సిటీలు కలబోసి పెట్టారు వివిన మూర్తి గారు – ఉదాహరణ కి మంచు లాంటి మౌనం కరిగిన సత్య మాట్లాడుతూ – “మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి.” – తన అభిప్రాయాల్ని ఇంత తెలివిగా పాత్ర ద్వారా చెప్పటం ..నాకొక లెర్నింగ్.
అదే సమయంలో , ఇంత తెలివైన అమ్మాయికి , ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించటం , కష్టం తమకొస్తే, బేలగా తయారవటం.. వేరేవాళ్ళ విషయంలో , అనలైజ్ చేసే , సాధారణ మనస్తత్వాన్ని .. సూచిస్తుంది.
సరిగ్గా అలాగే, వివాహానికి ప్రతిపాదించిన లాయర్ .. ఆమె కాదు అన్నట్టు సూచించగానే – తాను గుడ్డివాడు కాబట్టే ఆమె కాదంటోంది అన్నట్టు తొందర పడటం కూడా – సింపుల్ గా కనిపించే కాంప్లెక్స్ మెంటాలిటీ.
తమకి నచ్చింది తీసుకొని, ఆ ప్రకారం జడ్జ్ చేసే లాయర్ మనస్తత్వానికి శర్మ తో స్నేహం తాలూకా ఉదంతం వొక ఉదాహరణ .
ఈ కథ నాకు కొంత అసూయని కలగజేసింది ..ఇంత బాగా రాయలేక పోయినందుకు. కానీ అదే సమయంలో , ఒక యార్డ్ స్టిక్ లా కూడా పనికొస్తుంది అనిపించింది. కథ నిండా ఉన్న సూక్తులు , కొంత ఇబ్బందిని కలుగజేసాయి.. అవసరం కానీ, కొన్ని కథలో బ్లెండ్ కాలేదు అనిపించింది.
వోల్గా రచనల ద్వారా వివాహ ప్రతిపాదన నాకు అంతగా అర్ధం కాలేదు .. కానీ, సత్య జవాబు మాత్రం చాలా నచ్చింది – “వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. దానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”
వివాహమే కాదు, ఏ బంధమైనా .. వాచ్యార్ధం కన్నా ధ్వని మీద ఆధారపడితే, బోలుతనమే మిగులుతుంది అన్నదానికి ఇంతకంటే, గొప్ప వాక్యాలు రాయబడలేదు అని నాకు అనిపించింది.
ఇంత రాసి, లాయర్ పాత్రకి వొక పేరు పెట్టకపోవటం నాకు నిరాశని కలిగించింది .. కానీ , వికలాంగులకి అనేకాల్లో .. పేరు లేకపోవటం కూడా సమాజం సహజంగా తీసుకొనే విషయం.. కుంటి, గుడ్డి , మూగోడు .. ఇలా .. హ్మ్మ్ !!
చాలా వొంటరితనాలకి .. కేవలం వోటి గిన్నెల శబ్దం లా ద్వనించటమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు .. చాలా ఇజాలకి కూడా ..!
ధ్వని’ – చాలా తెలుగు కథల బోలుతనాన్ని , మెతకతనాన్ని , సున్నితంగా ప్రశ్నించే కధ ..!
-సాయి పద్మ
ధ్వని
-వివిన మూర్తి
నేను అనేకం. అందులో రెండు ముఖ్యం. నా అంధత్వం. నా ఇస్లాం.
ఈ రెంటిలో ఏది తెలిస్తే ఆమె నోరు మూత పడుతుంది.. ? ఏదితెలిస్తే మరింత పెద్దదవుతుంది.. ? ఆకాశంలో సగమైన మొగవాళ్లు మిగిలిన సగాన్ని తాకటంలో మలిన వాంఛలు తప్ప మరే అనివార్యతలూ ఉండవన్న ఆమె నమ్మకం వమ్మవుతుంది.. ? నన్ను తిడుతున్నావిడ పూలు నా ముక్కుకి తగిలాయి.. నాలాగే పొడుగు అయుంటుంది. నా పొడుగుని, నా వెడల్పాటి రొమ్ముని చూసి అమ్మీజాన్ లో ఆనందం వినిపించేది.. తతిమ్మా వారిలో ఖుదా కీ మర్జీ వినిపించేది. అసంకల్పితంగా ఆ పూల పరీమళాన్ని నా శ్వాస పీల్చుకుంది. ఆ శ్వాసే కాకుండా నా శరీరంలో ఏదైనా భాగం ఆమెకు తగిలి ఉండవచ్చు. అదీ నా అపరాధం.
ఆలోచనలు వేగంగా ఒకదాని మీద నుంచి ఒకటి దొర్లుతున్నాయి..
నేను ప్రతిస్పందించకముందే ఆమె బస్సులోని జనాన్ని, బహుశా మగ జనాన్ని నా దుశ్చర్యకు వెంటనే ప్రతిస్పందించమని వేడుకుంటోంది. అటునున్న జనానికి నా నల్ల కళ్లజోడు సందేహం కలిగిస్తోందనుకుంటాను. చేతిలో ఓ చప్పుడు కర్ర ఉండి ఉంటే వాళ్లకి ఆ సందేహం లేకుండా పోయేది.
ఆమె తిట్లకూ, జనం సందేహాలకూ, నా ఆలోచనలకూ ముగింపునిస్తూ… ఓ మెత్తని చెయ్యి, అంతకన్న మెత్తని స్వరం, ఆ వ్యక్తిత్వం నిండుకూ నింపిన గులాబి అత్తరులోంచి అప్పుడే బయటపడ్డట్టు… నాకు అల్లా ప్రసాదించిన నాలుగు జ్ఞానేంద్రియాలలో మూడింటిని ఒకేమారు ఉత్తేజితం చేస్తున్నట్లు… ఇక్కడ కూర్చోండి.. అని కూర్చోబెట్టింది.
“మంచిపని చేసావు కన్నా.. కూర్చోండి లాయరు గారూ..”.
2.
ఆ మెత్తదనం పేరు సత్య. ఆ సత్యను లోకంలోకి తీసుకు రావటమే కాకుండా, నా జ్ఞాపకాలలోనే నిక్షిప్తమై పోకుండా నా జీవితంలో కొనసాగే వీలు కల్పించినవాడు సూర్యచంద్రవర్మ.
గుడ్డి లాయరుని. ఎవ్వరైనా గుర్తుంచుకుంటారు. వర్మ నన్ను నా కారుతో సహా గుర్తుంచుకున్నాడు. మీరీ రోజున కారులో రాలేదేం- అదీ తొలి ప్రశ్న. కారులో వస్తుంటాను. రాగలను. రాగలపాటి అతి కొద్దిమంది భారతీయ ముస్లింలలో నేనూ ఉన్నాను. కాని నాకు బస్సు ఇష్టం. ధ్వనులు. చప్పుళ్లు. వాసనలు. స్పర్శలు. నవ్వులు. కబుర్లు. లోకం నాచుట్టూ వెచ్చటి దుప్పటి కప్పుతున్నట్లుంటుంది. అమ్మీజాన్ ఇచ్చిన ఆలోచనల చేతివేళ్లతో లోకాన్ని తాకుతున్నట్టుంటుంది.
కానీ- ఒక్కటే ముల్లులా పొడుస్తుంటుంది. అది లోకం తాలూకు జాలి.
కోర్టుకి వెళ్లి తొలి వకాలతు అందిస్తున్నపుడు జడ్జి –అయ్యో పాపం- అనుకునే ఉంటాడు. ఆ –అయ్యో పాపం- తనపై –అయ్యో పాపం-గా మారుతుందని నాకు కేసు అప్పగించిన వాడు నిశ్చితంగా అనుకున్నాడు. నాకందిన ధ్వని వాస్తవమై పోయింది.
నే దిగవలసిన చోటు వచ్చింది. నా సెల్ లోని జీపియస్ హెచ్చరిస్తోంది.
అందాకా కబుర్లు చెపుతున్న వర్మ నేనూ, సత్యా ఇక్కడే దిగాలి అని ప్రకటించి నా వెనకే దిగాడు. ఆ మెత్తటి చెయ్యి నాకు సాయంగా నా చేతిని పట్టుకుంది. ఆ చేతిని విదిలించెయ్యాలని…. మర్యాద నా చర్యను విదిలించి వెయ్యాలని..
కిందకు దిగాక-
“నేను పట్టుకోటం మీకు నచ్చలేదు.”
“మీరు పొడుగా?”
“ఏం- ఎందుకూ”- మెత్తదనం నశిస్తున్న గొంతు.
అదెందుకు నశిస్తున్నదో ఆ తర్వాత అర్ధమయింది. మన సంభాషణలో మనని మనం చెప్పుకోటానికి వెచ్చించే సమయం ఎదుటివాళ్లని మాటలని గ్రహించటానికి వెచ్చించంట. ఈ మాట నాకు అర్ధమయ్యేటట్టు ఆ తర్వాత కాలంలో సత్యే చెప్పింది.
“తెల్లవాళ్లకి నల్ల వాళ్లని చూస్తే లోకువ. పొడుగు వాళ్లకి పొట్టి వాళ్లని చూస్తే లోకువ. కాకపోతే జాలి.”
పద నాన్నా పోదాం.. ఆమె వెళ్లి పోతున్నట్టుంది మెత్తదనాన్ని వదిలేసినా వెంటబడుతున్న గొంతుతో.
ఉండమ్మా ఉండు.. అంటూ వర్మ కూతురుని వెంబడించాడు.
నాకా క్షణంలో కలిగినది ఆమె అనాగరిక ప్రవర్తనపై కోపం. నేను చెప్పినది కేవలం స్వానుభవం నుంచి ఏర్పరచుకున్న ఓ అభిప్రాయం. నేనలా నా అభిప్రాయాన్ని చెప్పటం నాగరికమేనని ఆ క్షణాన నా నిశ్చితాభిప్రాయం.
అంతటితో ముగిసిపోయే కథని వర్మ ఆరోజు మధ్యాహ్నం నన్ను కలిసి పొడిగించాడు.
3
సత్య జీవితంలో ఆమె ఎత్తు చాలా కష్టాలు తెచ్చిపెట్టింది. కోర్టు గడపను ఎక్కించింది. ఇంటర్నెట్ ద్వారా కుదిరిన సంబంధం. వధువు వివరాల్లో ఐదు అడుగులు అని రాసాడు వర్మ. ఫొటో చూసాడు. నచ్చింది. ఇంటికొచ్చి చూసుకున్నాడు. నచ్చింది. కులం గోత్రం డబ్బూ దస్కం అన్నీ సరిపోయాయి. అందరికీ అన్నీ నచ్చాక అడ్డేముంది.. పెళ్లై పోయింది. మూడు నెలల కాపురం వెలగ బెట్టాక అనుమానం వచ్చింది. కొలిచాడు. నాలుగడుగుల పదంగుళాలే ఉంది. దగా చేసారని కోర్టుకెక్కాడు. వివాహం చెల్లదని రద్దు చెయ్యాలనీ వాదన.
“నిజంగా..”
“ఈరోజు వాయిదా..”
“పిచ్చాడులాగున్నాడే..”
“నేను మాత్రం? ఉన్నదున్నట్టు వెయ్యొచ్చు గదా..”
“విడాకులకి ఆ కారణం చెల్లదు..”
“అతను విడాకులు అడగటం లేదు. 1955 హిందూ వివాహ చట్టం కింద ఫిర్యాదిని ప్రాడ్ చేసి వివాహంకి ఒప్పిస్తే అది చెల్లదని వాళ్ల లాయర్ వాదన.”
“-కోర్టు స్వీకరించిందా..”
“ఆయన గట్టివాడు. మా అల్లుడి దగ్గర మస్తుగా ఉంది డబ్బూ, పట్టుదలా..”
వర్మ చాలా వషయాలు చెప్పాడు.
మీడియా ఈ కేసుకి బాగా ప్రాధాన్యత ఇచ్చింది. చర్చ జరిపింది.
రెండు అంగుళాలు ఎక్కువ అని బొంకటం ఆడపిల్ల తండ్రికి శుక్ర నీతి వంటిదే అన్నారు కొందరు. పెళ్లి కోసం ఆడిన బొంకుకి పాపం ఉండదట. పేద్దపేద్ద అబద్దాల మధ్య బ్రతుకుతున్నాం- సముద్రంలో కాకిరెట్ట ఈ చిన్ని అబద్దం- అన్నారు సాధు నైతిక దృష్టితో కొందరు.
చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అబద్ధమే. తప్పు తప్పే. చట్టపరంగా ఇది నేరంగా తేలినా మానినా తప్పే. కొన్ని తప్పులకు ఇహలోకంలోనే అనుభవిస్తాం. ఇక్కడ తప్పినా అక్కడ తప్పదు- అన్నారు కఠిన నైతిక దృష్టితో కొందరు.
ఎత్తు అతగానికి అంత ముఖ్యమైతే పెళ్లికి ముందు ఎందుకు కొలుచు కోలేదు. ఒక వస్తువును కొనుక్కునే ముందే దాని నాణ్యతనూ కొలతలనూ చూసుకోవటం వినియోగదారుడి బాధ్యత కదా – అని కొందరి ప్రశ్న.
ఒక వస్తువు తయారీ లోపముంటే దానిని వాడిన తర్వాత నిరాకరించటం వినియోగదారుడి హక్కు- అన్నారు కొందరు సమాధానంగా.
ఆడది వస్తువా- వస్తు నాణ్యతా పరిశీలన స్త్రీకి యుగయుగాలుగా అమలు జరుగుతూనే ఉంది – అన్నారు లింగ వివక్షతను లేవనెత్తుతూ కొందరు. అసలు కొనుగోలు అన్నది జరిగితే సొమ్మిచ్చి కొనుక్కునేది ఆడదే- అని కూడా చేర్చారు.
అందుకేగదా ఈనాడు చట్టాలన్నింటికీ స్త్రీ పరమైన వివక్ష, ప్రత్యేక రక్షణ.. ఈ కేసులో కూడా చట్టం మగవానికి న్యాయం చెయ్యదు- అన్నారు కొందరు.
దృశ్య, అక్షర మాధ్యమాలు రెండూ కొంత కాలం చర్చించి పాల్గొన్నవారికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాయి.
వర్మ చెప్పిన దానికి నా వివేచన జోడించి విన్నాను.
“మీరేమంటారు-” అన్నాడు వర్మ.
“నేను ముస్లింని. నాది ఇస్లాం”.- అన్నాను.
ఆయనను కంగు తినిపించాలని నేను అనలేదు. కాని ఆయన గట్టిగా ఆశ్చర్య పోయాడని – అంటే!?- అన్న ప్రశ్న వంటి స్వరం వినగానే గ్రహించాను.
“నాపేరుని బట్టి మీకు నా మతం తెలుసు. ఇస్లాం తెలుసా..”
“చెప్పండి..” అన్నాడు.
“విశ్వంలోని ప్రాణులూ, పదార్ధాలూ ముస్లింలే. అల్లా – ఆ విశ్వ ప్రభువు – ఆజ్ఞాపాలనకి లోబడి ఉంటాయి. ఆ దైవానికి స్వయంసమర్పణే ఇస్లాం… లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అన్న కలిమాను విశ్వసిస్తే ఇదంతా మరోలా అర్ధమవుతుంది..”
“ఇలాంటి విశ్వాసాలు హిందువులకీ ఉంటాయి. అన్ని మతాలకీ ఉంటాయి..” అన్నాడు మధ్యలోనే.
“మీరు హిందువులు కారా..”
“- నేను నాస్తికుడిని. అయినా నావిశ్వాస అవిశ్వాసాలకి దీనితో సంబంధం లేదు. మీరు అనేదానికీ నా కూతురు పరిస్థితి మీద మీ అబిప్రాయానికీ సంబంధం నాకు పూర్తిగా బోధ పడటంలేదు…”
“కొంత బోధ పడిందిగా.. అదేంటి..” అన్నాను
“లాయర్లు వాళ్ల మాటలు ఎదుటి వాళ్ల నోళ్లలో కుక్కి అదే కక్కేట్టు చేస్తారుట.. ఏముంది., అంతా కర్మ అనుకుని అనుభవించాలి.. అంతేగదా ఏ మతమైనా చెప్పేది.” అంటూ నవ్వి లేచాడు. వెళ్లేముందు నా చిరునామా పత్రం ఇచ్చాను. కాని అది అతను ఉంచుకుంటాడనీ ఉపయోగిస్తాడనీ అనుకోలేదు.
నాకు చాలా చికాకు కలిగింది. నేను అందరినీ అర్ధం చేసుకోవాలి. నన్ను అర్ధం చేసుకునీ ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చెయ్యరు. కావాలంటే జాలి పడగలరు.. ముస్లిం షరీఅత్ ఇలాంటి కేసు ఎదుర్కుంటుందా.. వివాహం ఒక ఒప్పందంగా భావించే సమాజానికీ, అది ఒక దైవనిర్ణయంగా భావించే సమాజానికీ – స్త్రీ ఎదుర్కొనే రక్షణ సమస్యలో ఉన్న తేడాపాడాల గురించి మాటలాడాలని నా ఆలోచన. ఒక నాస్తికుడికి హిందూ ఆస్తికుడి మీద ఉండేపాటి సహనం కూడా ముస్లిం ఆస్తికుడి మీద ఉండదు.
కాని ఆ గొంతు మెత్తదనం నన్ను వెన్నాడుతూనే ఉంది.
అమ్మీజాన్ విని ఫొటో లోంచి అంది.. చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్.
4
నా మొబైల్ నాకు వచ్చిన ఈ-మైల్స్ చదివి వినిపిస్తోంది. ఆ సమయంలో వచ్చాడు వర్మ.
సత్య ఆత్మహత్యా ప్రయత్నం చేసింది… వర్మ చెపుతుంటే ఆయన గొంతు వణుకు తెలుస్తోంది.
మరణం ఎవరిదవనీ.. ఆ వార్త బాధ కలిగిస్తుంది. ఆ వ్యక్తులతో మనకున్న దగ్గరతనాన్ని బట్టి ఆ బాధ తీవ్రత ఉంటుంది. నాకు సత్యతో ఉన్నది స్వల్ప పరిచయమే. చెపుతున్నది కన్నతండ్రి కనక మరికొంత కదలిక. కాని నాలో అంతకన్న ఎక్కువ కదలికకి కారణం? ప్రతి ఒక వ్యక్తికీ మనకీ చెందిన బృందం ఒకటుంటుంది. దానికో పేరూ ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతం, రాష్రం, దేశం .. ఇలా ఎన్నో. ఒక్కోమారు ఈ బృందాలన్నింటికీ అతీతంగా కూడా కదులుతాం. అప్పుడు మనని కదిపేది ఏది.. కలిపేది ఏది.. అన్న ప్రశ్న వస్తుంది.
ఈ ప్రశ్నలూ, ఆలోచనలూ ఆ క్షణంలో లేవు ఒక ఉద్విగ్నత తప్ప.
ఆయన వెంట వెళ్లి పోలీసులతో, వైద్యులతో మాట్లాడాను.
ఆత్మహత్య పాపమైతే దానికి తీర్పు దినాన మాత్రమే జవాబు చెప్పుకోవలసి వస్తే సమస్య లేదు. అది నేరం అంటుంది చట్టం. బతికి బయటపడ్డ వారిని నేరస్తులు అంటుంది. బతకటంలో విఫలమై చావబోయి, చావులో విఫలమై నేరగాడు అయిపోతాడు పౌరుడు.
సత్య ఆస్పత్రి నుంచి, చట్టం నుంచీ బయట పడటంలో చెయ్యగలిగినది చేసాను.
ఆ తర్వాత ఒకరోజు వర్మ నాకు మా ఇంటివద్దకి వచ్చి మరో ఆభ్యర్ధన చేసాడు.
“తప్పు నాది.. శిక్ష తనకి..” అన్నాడు ఆరంభంలో.
“నేరం నిర్ధరించటం.. తీర్పు ఇవ్వటం అంతా మీరేనా.. ” నవ్వాను.
నవ్వితే బాగుంటానుట. నా బుగ్గ మీద సొట్ట పడుతుందిట. అదీ పడవలసిన చోట పడుతుందిట. ఆ సమయంలో కళ్లజోడుతో ఉన్నాను. తెల్లటి కుర్తా పైజామాల్లో ఉన్నాను. విశాలమైన గదిలో ఉన్నాను. ఆగది విశాలమైన బంగ్లాలో ఉంది. ఆ బంగ్లా విశాలమైన జాగాలో అందంగా పెంచుతున్న తోటలో ఉంది. అది అలాంటి తోటలు జాగాలూ కలిగిన భవనాల వరసలో ఉంది. కనక నేను బాగా ఉన్నాననిపించే నేపథ్యంలో ఉన్నాను.
“మీరనేది.. ” అంటూ ఆగాడు.
“రెండంగుళాలు ఎక్కువ చెప్పటం అనే నేరం మీరు చేసారు. కోర్టుకేసు.. వివాహ భగ్నం.. ఆత్మహత్య.. ఆమెకు శిక్షలు.. అదీ మీరన్నది.” అన్నాను.
కొంతసేపు మాటలాడలేదు. మళ్లీ అడిగితే అన్నాడు..
“మీరు కళ్లతో చూడలేక పోయినా మీకు అంతర్నేత్రాలు ఉన్నాయి. నా కన్న ఎక్కువ చూడగలరు. ”
“మరీ గాలి కొట్టకండి. పేలిపోగలను. ”
నవ్వులు. నవ్వులు.
“సత్యకి మీ స్నేహం ధృఢత్వం ఇస్తుంది. ”
ఆయన అంటున్నది ఆ క్షణంలో హాయిగా అనిపించింది. ఆమె మెత్తని గొంతు ఆ క్షణంలో మరింత మెత్తగా జ్ఞాపకాలను తాకింది.
అతను వెళ్లిపోయాక అది మరీ అంత మెత్తనా అనిపించింది.
ఆలోచిద్దామంటే నాకు రాని సత్య మెయిల్ చదివి చెప్పే శక్తి నా మొబైల్ కే కాదు నాకూ లేదు.
5
వర్మ తరచు ఫోన్ చేస్తున్నాడు. కలుస్తున్నాడు. ఒకటి రెండు మార్లు సత్యనీ తీసుకు వచ్చాడు. ఒకటి రెండు మాటలు తప్ప సత్య దాదాపు మౌనంగానే ఉంది. ఆ గొంతు మెత్తదనం మనసుని స్పృశిస్తూనే ఉంది. మనసు సత్యలో ఏదో విశేషం ఉందని నమ్మించజూస్తోంది.
దైవం మీదా, విధి మీదా కించిత్తు కూడా విశ్వాసం లేదుట. తన విశ్వాస రాహిత్యంతో భార్యని బాధించాడట. కుటుంబం లేకుండా చేసాడుట. కూతురికి దిక్కు లేకుండా చేసాడుట. లోకవిరుద్ధంగా ఆలోచించే వాళ్లు లోక విరుధ్ధంగా జీవించ గలగాలిట. లోపలి ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, బైట ప్రపంచం ముందు అదృశ్య శృంఖలాలతో జీవించేవాళ్ల కన్న నిస్సహాయులు లేరట. – వర్మ వస్తువు విశ్వాస రాహిత్యం కాదు. దానివల్ల ఏర్పడే పరిస్థితి.
“ ఇప్పుడు విశ్వాసం కలిగించుకోవచ్చు గదా వర్మ గారూ”
“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”
“అవిశ్వాసులు ఎందరో విశ్వాసులు అయినట్టు విన్నాను. ”
“కాదు. నాస్తి అన్న విశ్వాసం నుంచి అస్తి అన్న విశ్వాసానికి మారారు. అది సాధ్యం. ఆలోచనా ప్రవృత్తితో సత్యం ఏదని వెతికేవారికి ఏ విశ్వాసమూ ఉండదు. ”
“నాకు అర్ధం కాలేదు. నేను ఒప్పుకోను. ”
“మీరు ఎలా భావించినా ఫరవాలేదు. నా జీవితం గడిచి పోయింది. సత్యకింకా చాలా బ్రతుకుంది. నా ఆలోచనల ప్రభావం తన మీద ఉండుంటే ఈ పని చేసుండేది కాదు. .. ” ఆయన గొంతు రుద్ధమైంది. “ పైగా నిరాధారం చేసింది. మీరు ఆమెలో విశ్వాసం కలిగించాలి. ” ఆ గొంతులో ఓటమి, ధృఢత్వం, ఆశ మూడూ జమిలిగా వినిపించాయి.
నా మాటలను ఆయన కొనసాగనివ్వలేదు.
ఆ మెత్తని గొంతు స్పర్శను ధ్వనించబోతోందా…
6
సత్య అసత్యపు భ్రాంతిలోంచి నా జీవితంలోకి చాలా నెమ్మదిగా ప్రవేశించింది. నేను మాటలాడేవన్నీ వినేది. ప్రశ్నలు లేవు. వ్యాఖ్యానాలు లేవు. ఆమె ఏమనుకుంటున్నదీ ముఖంచూసి తెలుసుకునీ అవకాశం నాకు లేదు. స్వరం విని తెలుసుకునీ అవకాశం సత్య ఇచ్చేది కాదు. ఒక మార్మికమైన మౌనం ఒకటి రెండు మాటలై గుండెలను తాకి ఏదో బలిష్టమైన ఉచ్చులో నన్ను బంధించేది. ఆమె తండ్రి ప్రోత్సాహం తోనే నన్ను కలుస్తోంది. నా మనసే నన్ను ప్రోత్సహిస్తోంది. చెప్పిన కారణం ఆమెకి జీవించే ఉత్సాహమివ్వటం, దైవంమీద విశ్వాసం కలిగించటం. ధ్వనించే కారణం జీవితమివ్వటం. నాస్తికుడికి మతం అడ్డయే అవకాశం లేదు. మెజారిటీ మతస్తుడికి తన అభ్యుదయ ప్రదర్శనకి ఒక అవకాశం కూడా.
ఒక గుడ్డికీ, ఒక మూగకీ ఏర్పడని సంపర్కం అన్నంత బాధ.. నిరాశ.. కలిగేది అప్పుడప్పుడు..
“మీరు జవాబివ్వటం లేదు. ” అన్నాను నిరాశ కప్పి పుచ్చుకుంటూ కొన్నాళ్లయాక ఒకరోజు.
“ప్రశ్నలుంటే జవాబులుంటాయి సార్.. ” ఆ స్వరం మరింత మెత్తగా.. కొద్దిగా జీవం నింపుకుని.. తొలిసారి.
“నేనన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నానంటారు.. ”
“నోరులేని లాయరు ముందు ఛాన్సు దొరికిందిగదా అని రెచ్చిపోయే పబ్లిక్ ప్రాసిక్యూటర్లా.. ”
నవ్వులతో మంచు కరిగింది..
మరికొన్ని మాటలయాక..
“ముందుగా మీకు నా కృతజ్ఞతలు. ”
“దేనికి?”
“మా నాన్న నా ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం ఫలానా అని చెప్పాడు. మళ్లీ అలా జరక్కుండా ఉంచే విరుగుడు మీ వద్ద ఉందని తను నమ్మాడు. మిమ్మల్ని నమ్మించాడు. మీరు చాలా శ్రద్ధగా మీరు తీసుకున్న బాధ్యత నిర్వహిస్తున్నారు. అవునా? ”
“మీరు చెప్పేది చెప్పండి. ”
“మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి. ఆయన ఇటీవల మాటలనూ, ప్రవర్తననూ గమనించితే నా చర్య ఆయనను ఎంత షాటర్ చేసినదీ నాకు అర్ధమవుతోంది. పోతే.. ”
“చెప్పండి.. ”
“మీతో కలిసిన ఈ నాలుగైదు పరిచయాలలో మీమీద మా నాన్న ఇంప్రెషన్ తప్పు కాదనే అనిపించింది. నిజంగానే మీరు మంచివారు. మనుషులు. నాకు మీరో సాయం చెయ్యగలరా?”
“చెయ్యగలిగినదైతే తప్పక చేస్తాను. ”
“మా నాన్నతో చెప్పండి. నేనిక అలాంటి ప్రయత్నం చెయ్యనని. అవసరమైతే ఆయనకి నమ్మకం కలగటానికి .. అంటూ ఆగి.. నాకు దైవం మీద విశ్వాసం కలిగిందనో – కావాలంటే – కలిగించాననో చెప్పండి. నన్ను కౌన్సిలింగ్ చేసే బరువు మీకూ తగ్గుతుంది. ”
“నన్ను అబద్ధం ఆడమంటారు. ”
“అహఁ .. అబద్ధమని కాదూ.. ”
“మీరు అంటున్నది అదే .. నేను అసత్యం ఆడను. మీరు ఆడండి ప్లీజ్ బడుద్దాయి గారూ .. అని. ”
సత్య మాటలాడలేదు.
“మీ నాన్నగారు నా ఊహ ప్రకారం భిన్నంగా జీవించారు. వివాహం చేసుకున్నారు. మిమ్మలని పెంచారు. మీరు అందరి కన్న భిన్నంగా ఉండాలని బహుశా ఆశించారు. వివాహం విషయంలో మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని అలాంటి మనిషికి అనిపించే ఉంటుంది. చివరికి”..
అంటూ ‘నాబోటి గుడ్డిపోచ మీద ఆధారపడటం కూడా ఆయన భిన్న ప్రవర్తనకి సంకేతం’ అంటూ నోటి చివరి వరకూ వచ్చిన మాటను తుంచేసి కొనసాగించాను.
“ఆ మాట తండ్రిగా ఆయన చెప్పటం సరే ధ్వనించటానికి కూడా సాహసించలేక పోయుంటారు. తనే పెళ్లి ప్రయత్నాలు చేసారు. ఫలితం ఇలా జరిగింది. అవతల వాడు ఏదో వంక పెట్టి మిమ్మలని కాదన్నపుడు మీరు ఈ నీచుడు లేకపోతే నేను బ్రతకలేనా నాన్నా విడాకులు ఇచ్చేద్దాం అనుండాలి. అదీ మీరు చెయ్యలేదు. కోర్టు.. కేసు.. ఎక్కడ ఎందుకు మీ స్థైర్యం దెబ్బతిందో.. చివరకు ఇలాంటి ప్రయత్నం చేసి ఆయన నడుం విరగ్గొట్టారు. నాబోటి అపరిచితుడితో మీరన్నారే ఆ కౌన్సిలింగ్ .. దానికి కూడా మీరు ఒప్పేసుకున్నారు. మీ అంతట మీరు అబద్దం ఆడరు. నిజం.. మీలో అదొకటి ఉంటే.. చెప్పరు. ఆయనా, చివరకి ఏ సంబంధం లేని నేనూ అబద్ధం చెప్పాలి.. ”
నేను చెప్పవలసింది అయిపోయింది.
చాలాసేపు మౌనం.
“నేను వెళ్తాను సార్”
“కోపం వచ్చిందా? ”
“నాకు నేనే తేల్చుకోవలసిన విషయం స్పష్టం చేసారు.. నాకు సమయం కావాలి.. ”
బయలుదేరుతోంది సత్య.
“ ఒక్క నిమషం.. ” అంటూ బిల్లు చెల్లించి కాఫీడే నించి బయటకు వచ్చి కారువైపు నడుస్తున్నాను. ఆగి “నాతో వస్తారా మీకు కావలసిన చోట దింపుతాను.. ” అన్నాను.
“నాకు వేరే పనుంది.” అంది.
“అనుకున్నాను.. ” అన్నాను నవ్వటానికి ప్రయత్నిస్తూ.
సత్య తొలిసారి స్పర్శించింది.
“మీరీ రోజున నాకో విషయం చెప్పి గురువు అయారు. ‘ధ్వనించ కూడదూ చెప్పాలీ’ అన్నారు. నేనీ దేశపు ఆడదాన్నిగదా- ధ్వనించటమే మా బ్రతుకు. మీరూ అది పాటించాలి. నేనేమన్నానో అదే మీరూ తీసుకోవాలి. ”అంది మెత్తటి నవ్వుతో.
ఆ నవ్వూ, గొంతూ, స్పర్శా నన్ను వెన్నాడుతున్నాయి.
నా సారధి నన్నొకడినే తీసుకుని బయలుదేరాడు.
7
నెల పైగా గడిచింది.
ఈ మధ్యలో చాలా జరిగిపోయాయి. సత్య పరస్పర అంగీకారం మీద విడాకులకి ఒప్పుకుంది. ఆమె ఎత్తు మీద మీడియాలో దాని చర్చతో రచ్చకెక్కిన సత్య పరిస్థితిని వాడుకుని వేధించటానికి ప్రయత్నించి ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి కారకుడైన సహోపాధ్యాయుని మీద యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వాళ్లు వెంటనే చర్య తీసుకోకపోతే తోటి ఉపాధ్యాయులను, స్త్రీ సంఘాలనూ కూడగట్టుకుని అతని మీద చర్య తీసుకునేట్టు చేసింది. నిర్భయంగా స్కూలుకి వెళ్లడం మొదలెట్టింది.
నా మాటలు తన కూతురి మీద చాలా ప్రభావం చూపించాయని వర్మ అన్నాడు.
నిజానికి నేను కూడా సత్యలో అంతటి మార్పుని ఊహించలేదు. దానికి కారణం నేనే అని కూడా నాకు అనిపించలేదు. అల్లా దయామయుడు అనుకున్నాను.
నన్ను తాకే ఆ మెత్తదనం కేవలం ఆమె గొంతులోనే కాదు ఆమె నిండుకూ ఉంది.
మీరు తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నారు. అందొకమారు.
“చిన్న సవరణ. చదువుకోలేదు. విన్నాను. మా నాన్నగారు సంస్కృత పండితులు. ఎందరో తెలుగు రచయితలను వినిపించారు. శాస్త్రి నా ప్రాణస్నేహితుడు. నా అమ్మీజాన్ బాబాజాన్ నేనీ స్థితికి రాటానికీ, నేనిలా నించోటానికీ ఎంత కారకులో అంత కారకుడు. వాడు నాకూ సాహిత్యానికీ నా చదువుకీ ఒక ఆధారం. ”
శాస్త్రి గురించి కబుర్లు. అమ్మీజాన్ బాబాజాన్ ఏక్సిడెంటు. పిఠాపురం నుంచి హైదరాబాదు మకాం మార్పు. “నా ఈ అంధత్వానికి కారణం నా తలిదండ్రులు అన్నదమ్ముల బిడ్డలు కావటం – అన్నాడోమారు శాస్త్రి. దానికి అమ్మీజాన్ జవాబివ్వమంది. ఇచ్చాను. మీ తలిదండ్రులు అక్కాతమ్ముళ్ల పిల్లలు కదా నీకెందుకు రాలేదు- వాడా వెంటనే నిజమే గదా- అన్నాడు. అదీ మా శాస్త్రి. ” అన్నాను. నవ్వింది సత్య. వినిపించింది. మనసంతా కంపించింది.
“ఎందుకో అంత నవ్వు-” అని అడిగాను. మళ్లీ నవ్వింది. మరింత సత్యంగా.. స్వచ్ఛంగా..
“ధ్వనించకూడదు. చెప్పాలి. ”. అన్నాను. నా గొంతులో నాకే వశంకాని మాదకత.
“సరే.. చెప్తా. నా నవ్వు మీరు ఎంజాయ్ చేసారు. ఐనా ప్రశ్న వదలలేదు. అదీ రెండో నవ్వు కారకం. మీ తర్కాన్ని ఒప్పేసుకునీ వాళ్లుంటే మీకు దగ్గరవుతారు.. మీ శాస్త్రిగారిలా. ”.
నవ్వులు..
సత్యని కలిసినపుడల్లా రెండు ఉత్తుంగ తరంగాలు నాలో ఎగసి పడేవి. ఆమెతో జీవితం నా బ్రతుకును పూరిస్తుందన్నదొక భావ తరంగం. ఆమె నాకు దక్కదన్నది మరో తరంగం. ఒకదాని వెంట మరొకటి. దక్కినా కారణం నా స్థితీ కావచ్చు, ఆమె స్థితీ కావచ్చు. అప్పుడామె దక్కినట్టా దక్కనట్టా- అమ్మీజాన్ అనేది- నమ్మి మోసపో కాని నమ్మక కోలుపోకు. అమ్మ మాట ఈమాన్. కాని నమ్మకం- అందులోనూ తోటి మానవుల మీద- అందులోనూ నా స్థితిలో మరింత కష్టం. అపనమ్మకాన్ని రక్షణ కవచం చేసుకుంటుంది ఆశ.
శాస్త్రితో ఫోనులో మాటలాడాను. ప్రయత్నించు. తప్పులేదు. అనొచ్చు. నేనొస్తాను. మాటాడతాను. అనొచ్చు. రెండూ అనలేదు. ఆశ పెట్టుకోకు. నువ్వు భగ్నమైతే నేను భరించలేను. అన్నాడు. అంటే వాడుకూడా హిందువులా మాటలాడాడు. అమ్మీజాన్ ఉంటే వాడి మాటలను మరో కోణంలో చూపించగలిగేదేమో..
చివరికి నేను నన్ను పట్టుకోలేక పోయాను.
8
అప్పటికి ఏడాదికి పైగా గడిచి పోయింది.
ఓరోజు కావాలనే ఓల్గా సాహిత్యం మీదకి మరలించాను సంభాషణను. ఆపేరు వింటే సత్యలో ఉత్తేజం అనేకమార్లు గమనించాను. సంభాషణ వివాహం మీదకు తప్పనిసరిగా మరలుతుందని నా ఆశ.
-నవలలో ప్రతిపాదితమైన స్వేచ్ఛ, ఓల్గా ఆశించే స్వేచ్ఛ, స్త్రీలకవసరమైన స్వేచ్ఛ వేరంటారు మా నాన్న. ఆయన నవలగురించీ, రచయిత గురించీ, సమాజం గురించీ విడి విడిగా మాటలాడతారు. ఓల్గా అంటే ఆయనకు ప్రాణం. స్త్రీల సమస్యకి పరిష్కారం కేవలం ఆర్దిక స్వావలంబన మీద లేదన్న భావన ఓల్గాని చదివినపుడు తనకు కలిగిందిట… సత్య ఉత్సాహంగా చెపుతోంది.
నాకు చేదుమాత్ర మింగినట్టుంది.
నాదృష్టిలో ఓల్గా నేటి చదువుకున్నఆడపిల్లల వివాహ ఆశలకు ఒక ప్రేరణ. ఆవిడ ప్రశక్తి వస్తే ఎటువంటి ఆడదైనా వివాహిత అయితే తన జీవితం గురించి, అవివాహిత ఆయితే తన వివాహం గురించి తన అబిప్రాయాలను ఎంతోకొంతైనా బయట పడేస్తుందని నా నమ్మకం. ఆమె సాహిత్యంగురించి తన అభిప్రాయాలను తండ్రి ఆలోచనలను కలగాపులగం చేసేసి మాటలాడేస్తోంది సత్య.
నా సహనం తెగిపోయింది. నేను దానిని తెగ్గొట్టాల్సినంతటి ఉద్రేకం వచ్చేసింది.
“జ్ఞానోదయాన్ని నిర్వచిస్తూ కాంట్ దానికి కావలసిన ప్రధాన అవసరం స్వేచ్ఛ మాత్రమే అంటాడు. అత్యున్నత మానవ సమాజం ప్రజలకు దానిని కల్పించగలదంటాడు. ఓల్గా గారు చెప్పే స్త్రీస్వేచ్చ సరైన సమాజంతోనూ, పురుషుల స్వేచ్ఛతోనూ సంబంధం లేకుండా ఊహించటం సాధ్యంకాదు.”– అన్నాను.
ఆ తర్వాత జరిగిన సంభాషణలో సత్య మాటలాడినవేవీ నాకు అర్ధం కాలేదు. విషయం పట్ల ఉత్సుకతతో నేనందులోకి దిగలేదు గదా. అది కేవలం నెపం. ఇప్పుడు పునరాలోచిస్తే నేను సత్య మధనను అర్ధం చేసుకునీ అవకాశాన్నిమరోమారు పోగొట్టుకున్నాను. ఆమెను ఒక వస్తువుగా పొందటానికి చేసిన ప్రయత్నంలో సహస్రాంశమైనా ఒక వ్యక్తిగా సామీప్యతని సాధించటానికి చెయ్యలేదు.
ఆ విషయం నేను ధ్వనులను విడిచి పెట్టి నేరుగా వివాహం ప్రస్తావించి నపుడు కూడా నాకు అర్ధం కాలేదు.
9
“సత్యా.. నీ జీవితానికి కొత్త వెలుగు నివ్వాలనీ, నా బ్రతుకుకి నువ్వు ఆధారం కావాలని నా కోరిక. ”
నేనెంతకాలమో ఆలోచించి తయారు చేసుకున్న ఈ వాక్యం ఎంత కృతకంగా ఉందో నాకే తెలిసిపోతోంది. వాక్యం ఎంత శక్తిహీనమయిందో ఆ క్షణాన నాకు అర్ధమయింది.
“తప్పకుండా”.. అంది వెంటనే.
ఆ అంగీకారం నాకు చెప్పరాని ఆనందాన్నీ కలిగించింది. అంతులేని అనుమానాన్నీ కలిగించింది. ఆ క్షణంలో ఆ కళ్లను చూడగలిగే కళ్లు నాకుంటే అందులో ఏదో ఒకటి మాత్రమే కలిగేది.
“మీ నాన్నగారితో వెంటనే మాటలాడతాను. ” అన్నాను.
“దేని గురించి.. ”
“పెళ్లి గురించి.. ఎప్పుడూ.. ఎలా.. ”
“ఆగాగు.. దేనిగురించీ.. ” అంది.
“మన పెళ్లిగురించీ .. ” అన్నాను అయోమయంగా.
చాలాసేపు సత్యనుంచి మాటలు లేవు.
నేనూ ఆ మౌనాన్ని కొనసాగించాను. ఆ కాస్త మౌనంలోనూ నేనామెకు ఇచ్చే ఆధారం ఏమీ లేదనిపించింది. ఆ మాట అనటం ద్వారా నేనామెను కోల్పోతానా అనిపించింది. మరుక్షణంలో ఆమె విలువ పెరిగి పోయింది. ఆమె తప్పకుండా అన్నది దేనిగురించి ?
“సత్యా” – అన్నాను చాలా సేపటికి.
“ఊఁ-” అంది. ఆ గొంతులో నే వెదుకుతున్న మృదుత్వం అలాగే ఉంది. అంత అలజడిలోనూ అది నాకు కలిగించే అనుభూతి అలాగే ఉంది.
“నేను పెళ్లాడతానని ఎలా అనుకున్నావు.. నేనెక్కడ ఎప్పుడు నీకు అలాంటి అవకాశమిచ్చానా అని గుర్తు చేసుకుంటున్నాను. ” అంది. ఆమె మాట పూర్తి కాలేదు. నేనేదో అనబోతున్నాను.. కనులున్నాయిగదా.. ఉపయోగించుకుంది.. నాచేయి పట్టుకుంది.. నా చెయ్యి ఆమెతో ఏమందో తెలీదు..
“మనకి వివాహమాడే అర్హత లేదు.. వివాహం మనమున్న పరిస్థితిలో మనకున్న సత్సంబంధాలకి ముగింపు. ప్లీజ్ అర్ధం చేసుకో.. ” అంది.
“అవును.. నిజమే.. ఒక అంధుడితో పెళ్లా.. ఒక ముస్లింతో అందులోనూ. ”. నేను నా వశం తప్పాను..
“ఏంటదీ.. నువ్వు.. ఎలా ఇలా .. మాటలాడగలుగుతున్నావ్.. ” సత్యచేతిలో నా చేయి అలాగే ఉంది. దాన్ని విదిలించుకునే నా ఉద్రేకం సత్యకి అర్దమవుతూనే ఉంది..
“నీ మాటలకి ఇంకే అర్దముంది.. ” అన్నాను.
చెప్పింది.. సమాజం గురించి.. వివాహ వ్యవస్థ గురించి.. తన అనుభవం నుంచి చేసుకున్న నిర్ణయాన్ని గురించి.. వివాహం వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాలను ఛిద్రం చేయటం గురించి.. ఆమె మనసు వివాహాన్ని అంగీకరించటం లేదట. నా మనసు దేనినీ స్వీకరించటం లేదు.. ఆమెది నిరాకరణ అన్న భావన నుంచి బయట పడటం లేదు.. ఆమె ఏ వాక్యాలను ఎంత సరళంగా చెప్పినా అందులో నిరాకరణ తప్ప మరేమీ ధ్వనించటం లేదు..
చెప్పి.. చెప్పి.. నన్ను వినివిని.. చూసి చూసి అంది.. సత్య.
“కళ్లు లేకపోవటం లోపం కాదు. మరేదో ఇంద్రియాన్నో, ఇంకేదో సాంకేతిక పరికరాన్నో ఉపయోగించుకుని దాన్ని అధిగమించవచ్చు. కాని, .. నువ్వు మరింత గాయపడతావేమో.. ”
“చెప్పు.. ఇంతకన్న నన్నేం గాయపరచగలవు.. ”
“కళ్లు మూసుకోటం ఎవరూ సరిచెయ్యలేని లోపం. దయచేసి ఆలోచించు. వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. చానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”
“సత్యా. ”. నా మనసు నాకు తెలియకుండానే నా స్వరంలో నిండింది.
“ఎక్కువ సంఖ్యవాళ్లలో అధిక శాతం తక్కువ సంఖ్యవాళ్లను తక్కువ చేసి చూస్తారనేది తక్కువ సంఖ్యవాళ్లను వెన్నాడుతుంటుంది.. దానిని ఉపయోగించుకునే ప్రపంచంలో అనేక అవాంఛనీయ కృత్యాలు జరిపిస్తున్నారు కొద్దిమంది. వాళ్లు అధికసంఖ్యకీ చెందవచ్చు. అల్పసంఖ్యకీ చెందవచ్చు. వాళ్ల లక్ష్యాలు వేరుగా ప్రకటించుకోవచ్చు. కాని ఆకొద్దిమంది లక్ష్యమూ ఒక్కటే. మనిషిని మనిషితో కలిపే సమస్త మార్గాలనూ మూసివేయటం. నిజమైన ఆ కొద్దిమందీ మొత్తం మానవజాతిని మానసికంగా శాసించగలుగుతున్నారు. దానినుంచి వ్యక్తులుగా ముందు మనం బయటపడాలి.. మనం చర్చను నేర్చుకోవాలి. అభిప్రాయాలను మార్చే ప్రయత్నం ప్రేమతో.. ఓరిమితో చెయ్యాలి. మనలను శాసించే భావాలలో మనవేవో.. మనం కొనితెచ్చుకున్నవేవో.. గింజ ఏదో పొల్లు ఏదో వేరుచేసుకోగలగాలి. అందులో మనం తోడూనీడా కాగలగాలి. స్నేహితుడా ధ్వనిని అలంకారప్రాయం చేసుకుని ఎవరైనా దేనినైనా నేరుగా మాటలాడగలిగే ప్రపంచం కలగందాం రా. నా మనవి ఒక్కటే.. సాధ్యమైనంత వరకూ మనం మాటల మీద వాటి వాచ్యర్ధం మీద ఆధారపడటం ద్వారానే మనం ఏకమయీ అవకాశం ఎంతో కొంత ఏర్పడుతుంది.. ప్లీజ్ నేరుగా అర్ధం చేసుకో.. ”
(2010 ఆగస్టు రచన సంచిక)
కవిత్వమే ఫిలాసఫీ..
ఒక కవితలో కవిత్వం గురించి చెప్పినపుడు సాహిత్య విమర్శనా భాషలో అక్కడ కవిత్వం అంటే – ప్రజలు వారు అనుభవించే అయోమయం నుండి ఒక అర్ధాన్ని ఏ విధంగా నిర్మించుకొంటున్నారనీ; ప్రజలు తాము ప్రేమించే వాటిని ఎలా ఎంచుకొంటున్నారనీ; జీవితంలో లాభనష్టాలని ఏ విధంగా సమన్వయపరచుకొంటున్నారనీ; అనుభవాల్ని కోర్కెలతో కలలతో ఎలా మార్చు కొంటున్నారనీ; చెల్లా చెదురైన ఏకత్వాన్ని ఏవిధంగా దర్శించి ఎలా ఒక చోటికి కూడదీసుకొంటున్నారనీ అర్ధం చెప్పుకోవాలి. …Helen Vendler
ప్రతికవికీ కవిత్వం పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. వాటిని తన కవిత్వంలో ఎక్కడో ఒకచోట బయటపెట్టు కొంటాడు. మరోలా చెప్పాలంటే తన కవిత్వ మానిఫెస్టోని ఏదో కవితలో ప్రతీ కవి ప్రకటించుకొంటాడు. అలాంటి కవిత ద్వారా ఆ కవి కవిత్వసారాన్ని అంచనా వేయవచ్చు. శ్రీశ్రీ “కవితా ఓ కవితా”, తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, నెరుడా “కవిత్వం నన్ను వెతుక్కొంటూవచ్చింది” లాంటి కవితలు కొన్ని ఉదాహరణలు. ఇవి ఆయా కవుల సొంత అభిప్రాయాలుగా కొట్టిపడేయలేం. Helen Vendler అన్నట్లు ఇవి ఆ కవిత వ్రాసినప్పటి ప్రజల అభిప్రాయాలకు విష్పష్ట రూపాలు. తన దృష్టిలో ఉన్న సమూహానికి కవి ఒక ఉమ్మడి గొంతుక నిచ్చి ఆయా కవితలుగా వినిపిస్తున్నాడని బావించాలి.
రెండున్నర దశాబ్దాలుగా కవిత్వరచన చేస్తూ ఒక స్వంతగొంతును, పరిపక్వ శైలిని ఏర్పరచుకొన్న రాధేయకు మంచి కవిగా పేరుంది. జీవన వాస్తవాలను, సామాజిక వాస్తవాలను తన కవితలలో ప్రతిబింబింస్తూ అనేక రచనలు రాధేయ చేసారు. వాటిలో కవిత్వాన్ని వస్తువుగా చేసుకొన్న కవితలు కూడా ఉన్నాయి. కవిత్వం గురించి మాట్లాడటం, స్వప్నించటం, కవిత్వం తనకేమిటో చెప్పటం కూడా ఒక సామాజిక వాస్తవాన్ని చిత్రించటమే.
“కవిత్వం నా ఫిలాసఫర్” అనే కవిత రాధేయ “అవిశ్రాంతం” అనే సంకలనం లోనిది. ఈ కవితలో కవి తన జీవితంతో కవిత్వం ఎంతెలా పెనవేసుకుందీ వర్ణిస్తాడు.
ఇందులో ఒకచోట ప్రేమించటం రానివాడు ప్రేమికుడు కానట్లే దుఃఖించటం రానివాడు కవెలా అవుతాడూ అని ప్రశ్నిస్తాడు. కవిత్వాన్ని దుఃఖానికి పర్యాయపదం చేస్తాడు కవి. ఇక్కడ దుఃఖం అంటే సొంత గొడవ కాదు, “ప్రపంచపు బాధ”. ఈ కవికి దుఃఖపు సందర్భాల్ని కవిత్వ సమయాలుగా మార్చుకోవటం తెలుసు. కవిత్వం అంటే మనిషి ఇంకా జీవించే ఉన్నాడని చెప్పే ఒక సాక్ష్యం అని తెలుసు. అందుకే, ఈ లోకపు దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకోకుండా, ఎవరినీ పట్టించుకోక స్వార్ధంతో మెలిగే వాడిని చనిపోయినవాడిగా పరిగణిస్తున్నాడు కవి.
అక్షరసైన్యం నా వెంట నడిస్తే చాలు/సర్వం కోల్పోయినా లెక్కచేయను/ కవిత్వమై మిగిలిపోతాను అనటం చెల్లా చెదురైన ఏకత్వాన్ని ఒకచోటకు కవిత్వం రూపంలో కూడదీసుకోవటమే.
స్పష్టమైన అభివ్యక్తి, సూటైన ప్రతీకలు, ఈ కవితకు సాఫీగా సాగే గమనాన్ని, పట్టుని ఇచ్చాయి. కవిత్వాన్ని జ్వరంగా, కలగా, దుఃఖంగా, జ్ఞాపకంగా, ఎదురుదాడిగా, ఫిలాసఫర్ గా, గైడ్ గా స్పృశించిన విధానం రాధేయను గొప్ప కవిగా నిరూపిస్తాయి. ఈ కవిత చదివినపుడు లోతైన భావోద్వేగం, హృదయాన్ని కదిలిస్తుంది.
-బొల్లోజు బాబా
కవిత్వం నా ఫిలాసఫర్ — రాధేయ
కవిత్వం నాకు కన్ను మూతపడని జ్వరం
కవిత్వం నా కన్రెప్పల మీద వాలిన నమ్మకమైన కల
ఒక్క కవితా వాక్యం
ఈ గుండె లోతుల్లోంచీ
పెల్లుబికి రావాలంటే
ఎన్ని రాత్రుల నిద్రని తాకట్టు పెట్టాలో
వేదనలోంచి పుట్టిన ఈ కవిత్వాన్నే అడుగు
అక్షరసైన్యం నా వెంట నడిస్తేచాలు
నా సర్వస్వం కోల్పోయినా
లెక్కచెయ్యను
కవిత్వమై మిగిలిపోతాను
ఈ గుండె చప్పుడు ఆగిపోయి
ఈ తెప్ప ఏ రేవులోకి చేరవేసినా
అక్కడ పచ్చని మొక్కై
మళ్ళీ ప్రాణం పోసుకుంటాను
భాష్పీకృత జీవద్భాష కవిత్వం
నరాలపై తంత్రీ ప్రకంపనం కవిత్వం
సారవంతమైన స్మృతిలో
పారదర్శకమైన జ్ఞాపకం కవిత్వం
ఏకాంత దుఃఖమా!
నీ పేరు కవిత్వమే కదూ!
నువ్వు పొగిలిపొగిలి ఏడుస్తున్నావంటే
కవిత్వమై రగిలిపోతున్నట్లే లెక్క
దుఃఖించనివాడూ
దుఃఖమంటే ఎరుగనివాడూ
కవి ఎలా అవుతాడు?
ప్రేమించని వాడూ
ప్రేమంటే తెలియనివాడూ
ప్రేమికుడెలా అవుతాడు
ఎవర్నీ పట్టించుకోనివాడూ
బతికున్నా మరణించినట్లే లెక్క
కన్నీళ్ళు బహిష్కరించేవాడికి
బతుకుపుస్తకం నిండా
అన్నీ అచ్చుతప్పులే!
జీవించే హక్కును
కాలరాచే చట్టాలతో
జానెడు పొట్టకోసం
పిడికెడు దుఃఖంగా
మిగిలేవాడు మనిషి
ఈ మనిషి బలహీనతలమీద
వ్యామోహాలమీద
ఎదురుదాడి చెయ్యగలవాడే కవి!
రోజు రోజుకూ దట్టమౌతున్న
ఈ మానవారణ్యంలో
చిక్కనవుతున్న వ్యాపారకాంక్షల్లో
ఓ మృధువైన మాటకోసం
ఓ ఆర్ధ్రమైన లాలనకోసం
ఓ వెచ్చటి ఓదార్పుకోసం
కాలం మైలు రాయిమీద
తలవాల్చి ఎదురుచూస్తున్నా
కవిత్వం నా ఫిలాసఫర్
కవిత్వం నా గైడ్!!
-రాధేయ
వెన్నెల వైపుగా
వెర్రిగా ఊగిపోతూ
ఒళ్ళంతా గుచ్చుతూ
అడుగడుగునా
చీకటి ఊడలు
గుర్తుచేస్తాయి
ఒంటరి ప్రయాణాన్ని
దిక్కుతోచక దడదడలాడుతుంది
గుబులెక్కి గుండె
ఇక కరిగిపోదామనే అనుకుంటుంది
గుప్పున పొంగుతున్న పొగల్లో
విశ్వాంతరాలనుంచి రాలిపడిన
ఒకే ఒక్క తెల్లని బిందువు
నన్ను అందుకుంటుందప్పుడే చల్లగా
నేనిక నీడల పల్లకిలో సాగిపోతాను
వెన్నెల వైపు
-మమత. కె.
బీభత్సం
పైన అంతా గందరగోళం, పధ్ధతిలేనితనం.
కిందన ద్వేషమూ, అసహ్యమూ వాటి గరుకుదనం.
ఏ ఇంటికి రమ్మంటావు?
ఇంటికి తిరిగి రమ్మని
పెదాల మీద అతికించుకున్న చిరునవ్వు పిలుపు
అరమూసిన కోరలపై మెరుస్తున్న నెత్తుటిబొట్టు
పిలిచే నోరు వెక్కిరించే నొసలు
దేన్ని నమ్మమంటావు?
ఒక క్షణం నెత్తుటికోరను మరచిపోతాను
నీ పిలుపే ఆత్మీయ ఆహ్వానం అనుకుంటాను
కానీ స్వామీ
ఏ ఇంటికి రమ్మంటావు?
మన ఇల్లు అనేదేదీ లేదు
నా ఒంటి నిట్టాడి గుడిసె ఎప్పుడో నేలమట్టమయింది
సర్కారు వారు నాకు దోచిపెట్టారని నువు గగ్గోలు పెట్టే
రేకుల ఇల్లు పాములకూ తేళ్లకూ నిలయమయింది
మురికి కాలువ పక్కన ప్లాస్టిక్ సంచుల మహాభవనమే నా ఇల్లు
ఆ నా పాత ఇంట్లోకి ఎట్లారాను బాబయ్యా?
నేను తొంగి చూడడానికైనా వీలులేని
నీ చతుశ్శాల భవంతి ఆకాశహర్మ్యమైంది
ఏడు కోటల పాత రాజప్రాసాదాల లాగ
దాటలేని ప్రాకారాల మధ్య నీ స్వగృహం
అడుగడుగునా విద్యుత్ తంత్రుల త్రిశూలాల సర్పవలయం
త్రిశూలాల కొసన కడుపు చీల్చిన రక్తపు చుక్కలు
నీ సరికొత్త ఇంట్లోకి ఎట్లా రాను తండ్రీ?
మనదనుకునే ఇల్లు ఎట్లాగూ లేదు
‘అసుంట’ ‘అసుంట’ అని నన్ను విదిలించి ఛీత్కరించి విసిరికొట్టి
నా కాలి ధూళిని మైల అని కడిగి కడిగి పారేసి
దర్వాజా అవతల నా దైన్యాన్ని వేలాడదీసిన
నీ ఊరి ఇంటికి రమ్మంటావా?
ఊరి చివర నీ పాదాల చిటికెనవేలు కూడ తగలని
నా వాడ ఇంటికి రమ్మంటావా?
నా గాలి సోకడానికి వీలులేని ఇంటికేనా ప్రభూ రమ్మనేది?
నన్ను ఖండఖండాలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి
విసిరిపారేసిన కాలువ పక్కన నీ రాజప్రాసాదం లోకేనా?
నా అక్కచెల్లెళ్లనూ అన్నదమ్ములనూ బలగాన్నంతా
తోసి నిప్పుపెట్టి బైటికి పారిపోతున్న వాళ్లని
పట్టుకుని మంటల్లోకి విసిరేసిన గుడిసెలోకేనా?
నా చెమటలో తడిసిన
నా నెత్తుటిలో పండిన
ఈ దేశమంతా నా ఇల్లే
మరి ఏ ఇంటికి రమ్మంటావు?
అసలు నువ్వెవడివని రమ్మంటావు?
తరిమి తరిమి కొట్టిన
అట్టడుగుకు తోసేసిన
ఈ దేశంలో ఒక్క అంగుళమూ నాది కాదు
మరి ఏ ఇంటికి రమ్మంటావు?
-వి.తమస్విని
మనసుపటం
1
మొక్కలకి నీళ్ళు పోశాను
కుక్కపిల్లకు అన్నం పెట్టాను
పిట్టలకు నీళ్ళు పోసుంచాను
తల పగిలి పోతోంది; మళ్ళీ పడుకుంటాను
గంట తర్వాత లేపుతావా?
తలకి యెర్రటి స్కార్ఫ్ కట్టుకుని
అమృతాంజనం వాసనతో
బందిపోటురాణి అవతారంలో అడిగింది భార్య.
2
నా కూనలు నీళ్ళు అడుగుతున్నాయి
దాహంతో అల్లల్లాడుతున్నాయి
నిద్దట్లో గొణుక్కుంటున్నట్టుగా అందామె
నిద్దట్లోనే నడుస్తూ వెళ్ళింది
పిట్టగోడ దగ్గరికి
చూద్దును కద
పిట్టగోడ మీద మట్టి పాత్ర
సగం నీళ్ళూ సగం గాలి
నీటిపై అనంతాకాసపు నీడ
చుట్టూ రంగురంగుల రెక్కలు కట్టుకు
వచ్చి వాలిన పిట్టలు
దాహార్తిని తీర్చుకుంటూ…..
మురిపెంగా చూస్తూనే వున్నా
పంచ భూతాల చిత్రాన్నీ
నింగీ-నేల యేకం చెసిన చిత్రకారిణినీ….
– పరేశ్ ఎన్ దోశి
(painting: Rafi Haque)
పూల రాణి కూతురు
అనగా అనగా ఒక రాజకుమారుడు. ఒక రోజు ఉదయాన ఉల్లాసంగా గుర్రం మీద షికారు వెళ్ళాడు. పోగా పోగా పెద్ద మైదానం వచ్చింది. దాని మధ్యనొక బావి. అందులోంచి ఎవరో ఏడుస్తూ పిలుస్తున్నట్లు వినబడింది. చూస్తే లోపల ఒక ముసలావిడ పడిపోయి ఉంది. రాజకుమారుడు గబ గబా ఆమెని పైకి లాగాడు. ఆమె ఎక్కడిదో ఏమిటో అడిగాడు.
” నాయనా, నీ దయ వల్ల బతికాను. లేదంటే ఇక్కడే చచ్చిపోయిఉండేదాన్ని . మా ఊరు ఇక్కడికి దూరం. ఈ పక్కన పట్టణం లో పొద్దున్నే సంత జరుగుతుంది. అందులో గుడ్లు అమ్ముకునేందుకని చీకటితో బయల్దేరి చూపు ఆనక ఇలా పడిపోయాను, ఇంక వెళ్ళొస్తాను ” – ఆమె చెప్పింది.
రాజకుమారుడు – ” అవ్వా, నువ్వు నడిచే పరిస్థితిలో ఎక్కడున్నావు, ఉండు, నిన్ను దిగబెడతాను ” అని ఆమెని ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టుకుని బయల్దేరాడు. అడవి అంచున ఉన్న ఆమె గుడిసెకి ఇద్దరూ వెళ్ళారు. దిగి లోపలికి వెళ్ళబోతూ ముసలావిడ ” ఒక్క నిమిషం ఆగు, నీకొకటి ఇస్తాను ” అని , ఒక చిన్న గంటను తీసుకొచ్చి ఇచ్చింది అతనికి. ” బాబూ, నువ్వు వీరుడివి, అంతకు మించి ఎంతో దయగలవాడివి. పూలరాణి కూతురు అందం లోనూ, మంచితనం లోనూ నీకు తగిన భార్య. ఆమె నాగేంద్రుడి కోటలో బందీగా ఉంది. విడిపించి పెళ్ళి చేసుకో. ఈ గంట ని ఒకసారి మోగిస్తే గండ భేరుండాల రాజు వచ్చి నీకు సాయం చేస్తాడు. రెండు సార్లు మోగిస్తే నక్కల రాజూ, మూడు సార్లు మోగిస్తే చేపల రాజూ వచ్చి నీ కష్టం తీరుస్తారు. వెళ్ళిరా, నీకు శుభం జరుగుతుంది ” అని మాయమైంది, గుడిసె తో సహా.
అప్పటికి రాజకుమారుడికి ఆమె ఎవరో దేవకన్య అని అర్థమైంది. గంటని భద్రంగా దుస్తులలో దాచుకుని కోటకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి అంతా చెప్పి పూలరాణి కుమార్తెని వెతికేందుకు మరుసటి రోజున ప్రయాణమయాడు. ఏడాది పొడుగునా తెలిసిన ఊళ్ళూ తెలియనివీ గాలించాడు. పూలరాణి కూతురు ఆచూకీ ఎక్కడా తెలిసిందే కాదు. బాగా అలిసిపోయాడు. చివరికి ఒక రోజు ఒక చిన్న ఇంటి ముందర చాలా ముసలిగా కనిపించే ఒకతన్ని చూసి అడిగాడు – ” తాతా, నాగేంద్రుడు ఎత్తుకుపోయిన పూల రాణి కూతురు ఎక్కడుంది ? ”
” నాకైతే తెలీదుగాని, ఈ దారమ్మటే, అటూ, ఇటూ చూడకుండా ఒక సంవత్సరం వెళ్ళావా, ఇటువంటి ఇల్లే ఇంకొకటి వస్తుంది. అది మా నాన్నది. ఆయనకి తెలిసి ఉండచ్చు, బహుశా ” ముసలివాడు జవాబు చెప్పాడు. రాజకుమారుడు అలాగే వెళ్ళాడు . ముసలివాడి తండ్రి , ఇంకా ముసలివాడు – కనిపించాడు. కాని అతనికీ సమాచారం తెలీదు. అతని సలహా ప్రకారం ఇంకొక ఏడు అదే దారి వెంట ప్రయాణించి అతని తండ్రి ఇంటికి చేరాడు రాజకుమారుడు. ఈ ముసలితాత మాత్రం చెప్పాడు – ” అవును, ఆ నాగేంద్రుడి కోట ఆ కనబడే కొండ మీదేగా ఉంది ! ఇవాళే ఆయన నిద్ర మొదలెడతాడు, ఈ ఏడంతా నిద్ర పోయి వచ్చే ఏడంతా మేలుకుంటాడు. అయితే, ఆ పక్కన కొండ మీద నాగేంద్రుడి తల్లి ఉంటోంది. రోజూ రాత్రి విందు చేస్తుంది ఆవిడ, పూలరాణి కూతురు ప్రతి రాత్రీ అక్కడికి వెళుతుంది ” .
రాజకుమారుడు తాతకి కృతజ్ఞతలు చెప్పుకుని రెండో కొండ ఎక్కి నాగేంద్రుడి తల్లి కోటకి వెళ్ళాడు. అది బంగారపు కోట, కిటికీ లకి వజ్రవైఢూర్యాలు తాపడం చేసి ఉన్నాయి. తలుపు తెరిచి లోపలికి వెళ్ళేలోపు ఏడు సర్పాలు వచ్చి అతన్ని అడ్డగించాయి. రాజకుమారుడు యుక్తిగా జవాబు చెప్పాడు – ” నాగ రాణి ఎంతో అందమైనదనీ పెద్ద మనుసున్నదనీ విన్నాను. ఆవిడ దగ్గర కొలువు చేసేందుకని వచ్చాను ” . సర్పాలు ఆ మాటలకి సంతోషించాయి, రాజకుమారుడిని వెంటబెట్టుకుని నాగరాణి దగ్గరికి తీసుకు వెళ్ళాయి.
రత్నాలు చెక్కిన సిం హాసనం మీద నాగరాణి కూర్చుని ఉంది. ఆమె నిజంగానే చాలా అందంగా, కాని భయం పుట్టించేట్లుగా ఉంది… ” ఎందుకొచ్చావు ? ” రాజకుమారుడిని అడిగింది. అతను తడబడకుండా మళ్ళీ చెప్పాడు – ” మీ సౌందర్యం గురించీ గొప్పతనం గురించీ, కథలు కథలుగా విని, మీ దగ్గర పని చేసేందుకు వచ్చాను ”
నాగరాణి – ” సరే, చూద్దాం. ఇదుగో, నా గుర్రాన్ని ఆ కనిపించే మైదానం లో కి వరసగా మూడు రోజులు మేతకి తీసుకుపోయి భద్రంగా వెనక్కి తేగలిగితే, అప్పుడు పనిలో చేరచ్చు. లేదంటే నా నౌకర్లు నిన్ను చంపి తినేస్తారు ” అంది.
రాజకుమారుడు ఒప్పుకుని నాగరాణి గుర్రాన్ని మేతకి తీసుకువెళ్ళాడు. కానీ ఆ మైదానం లో అడుగు పెట్టగానే గుర్రం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకనేలేదు. రాజకుమారుడు దిగాలుగా అక్కడొక బండరాయి మీద కూర్చుండి పోయాడు. పైకి చూస్తే ఆకాశం లో పెద్ద గద్ద ఎగురుతోంది. అతనికి వెంటనే దేవకన్య ఇచ్చిన గంట సంగతి గుర్తొచ్చింది. అప్పటివరకూ దాని సాయాన్ని ఉపయోగించుకోవాలని అతనికి అనిపించనేలేదు. జేబు లోంచి తీసి మోగించాడు. మరుక్షణం లో రెపరెపమని రెక్కల శబ్దం. గండ భేరుండాల రాజు ప్రత్యక్షమై రాజకుమారుడికి మోకరిల్లాడు. ” నీకేం కావాలో నాకు తెలుసు. తప్పిపోయిన గుర్రాన్ని నా అనుచరులని పంపి తెప్పిస్తాను, అది మబ్బుల్లో దాక్కుని ఉంటుంది ” అని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు అక్కడే, అలాగే ఉండి పోయాడు. సాయంత్రమవుతూండగా గుంపులు గుంపులుగా పెద్ద గద్దలు ఎగిరి వచ్చాయి, వాటి ముక్కులతో పట్టుకుని గుర్రాన్ని తీసుకొచ్చాయి. రాజకుమారుడు దాన్ని నాగరాణికి అప్పగించాడు. ఆమె ఆశ్చర్యపోయింది.
” ఈ రోజు నువ్వు ఈ పని పూర్తిచేసినందుకు నిన్ను బహూకరిస్తాను ” అని ఒక రాగి కవచాన్ని అతనికి ఇచ్చి తొడుక్కోమంది. విందుజరుగుతున్న సభకి రాజకుమారుడిని తీసుకువెళ్ళింది. నాగ కన్యలూ నాగ కుమారులూ జంటలు జంటలుగా అక్కడ నృత్యం చేస్తున్నారు. వాళ్ళ ఆకారాలూ దుస్తులూ అతి పల్చగా, వింత వింత రంగులలో కదులుతున్నాయి. వాళ్ళలో నాగరాణి కూతురు కూడా ఉంది. తల్లిలాగే ఆమె కూడా అందంగా ఉంది, క్రూరంగానూ ఉంది. రాజకుమారుడిని చూసి బావున్నాడని అనుకుంది గాని అతను ఆమె వైపు చూడనేలేదు. అందరికన్నా వేరుగా పూల రాణి కూతురు కనబడింది. మల్లెపూవులూ గులాబీలూ కలిపినట్లు సుకుమారంగా వెలిగిపోతోంది . ఆమె దుస్తులు అరుదైన పూల రేకులతో అల్లినవి. ఆమె నర్తిస్తుంటే పూల వనాలు పరిమళిస్తున్నట్లుంది. ఆమెతో నర్తించే అవకాశం, కాసేపటికి రాజకుమారుడికి వచ్చింది . రహస్యంగా ఆమె చెవిలో – ” నిన్ను రక్షించేందుకు వచ్చాను ” అని చెప్పాడు. ఆమె అతి మెల్లగా అంది – ” మూడో రోజున నువ్వు గుర్రాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ గుర్రపు పిల్లని బహుమతిగా నాగరాణిని అడుగు ”
వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూనే ఇష్టపడ్డారు. విందు అర్థరాత్రి దాటే దాకా సాగి, ముగిసింది.
తెల్లవారాక మళ్ళీ గుర్రాన్ని మైదానం లోకి తీసుకు వెళితే అది ఎప్పటిలాగే మాయమైంది. ఈ సారి గంట మోగిస్తే నక్కల రాజు వచ్చి అడవిలో దాక్కున్న గుర్రాన్ని తెచ్చిపెట్టాడు. ఆ రాత్రి నాగరాణి వెండికవచం ఇచ్చి అతను తొడుక్కున్నాక విందుకు తీసుకు వెళ్ళింది. నాట్యం జరుగుతుండగా పూలరాణి కూతురు ” రేపు కూడా నువ్వు గెలిస్తే , గుర్రపు పిల్లతో మైదానం లోనే వేచి ఉండు. విందు పూర్త యేలోపున ఇద్దరం ఎగిరి వెళ్ళిపోదాం ” అంది.
మూడో రోజునా గుర్రం అదృశ్యమైంది. గంట మోగితే చేపలరాజు వచ్చి నదిలో దాక్కున్న గుర్రాన్ని పట్టుకొచ్చి ఇ చ్చా డు. నాగరాణి రాజకుమారుడిని మెచ్చుకుని, తన అంగరక్షకుడుగా నియమించుకుంటాననీ , ముందుగా ఏదైనా కోరుకుంటే ఇస్తాననీ చెప్పింది. రాజకుమారుడు ఆ గుర్రం పిల్లను ఇమ్మని అడిగాడు. నాగరాణి ఇచ్చింది. ఆ రాత్రి బంగారు కవచం తొడిగించి విందుకి తీసుకు వెళ్ళింది. నాగరాణి తన కూతురితో రాజకుమారుడికి పెళ్ళి చేసి దగ్గర ఉంచుకుందామని , విందు ముగిసిన తర్వాత ఇద్దరికీ పెళ్ళి చేసే ప్రకటన చేద్దామని, అనుకుంది. అతను ఆవిడ కి అంతగా నచ్చేశాడు. అతను ఒప్పుకుంటాడో లేదోనన్న అనుమానం కూడా నాగరాణికి రాలేదు. అయితే విందు పూర్తయేదాకా రాజకుమారుడు ఆగలేదు. ఎవరూ చూడకుండా తప్పించుకుని గుర్రపుసాలలో పిల్లగుర్రాన్ని ఎక్కి మైదానం లో వేచి ఉన్నాడు. అది పేరుకే పిల్లగానీ బలంగా భారీగా ఉంది . త్వరలోనే పూలరాణి కూతురు వచ్చేసింది. ఇద్దరూ కలిసి గాలి కన్న వేగంగా పూల రాణి కోట వైపుకి ఎగిరి వెళ్ళారు.
ఈ లోపల నాగేంద్రుడి సేవకులు వీళ్ళు వెళ్ళిపోవటం చూసి నాగేంద్రుడిని నిద్ర లేపారు. అతను చాలా కోపంగా, ఆవేశంగా ఆమెను మళ్ళీ ఎత్తుకువచ్చేందుకు వెళ్ళాడు. ఇప్పుడు ఏ దివ్య శక్తులూ తనదగ్గర లేకపోయినా రాజకుమారుడు అతన్నిధైర్యంగా ఎదుర్కొన్నాడు. పూలరాణి తన తుమ్మెదల సైన్యాన్ని నాగేంద్రుడి మీదికి పంపింది . యుద్ధంలో నాగేంద్రుడు ఓడిపోయి వెళ్ళి పోవలసి వచ్చింది.
పూలరాణి తన కూతురి ఇష్టం తెలుసుకుని రాజకుమారుడితో – ” మీ ఇద్దరికీ అలాగే పెళ్ళి చేస్తాను. కాని నా కూతురిని ఇంతకాలమూ వదిలి ఉన్నాను కదా…పూర్తిగా నీకే ఇచ్చేయలేను. ప్రతి ఏడూ చలికాలం లో, మంచు కప్పిన రోజులు మొత్తం ఆమె నా దగ్గర ఉండాలి. మళ్ళీ వసంతం రాగానే నీ దగ్గరికి వస్తుంది ” అని షరతు పెట్టింది. రాజకుమారుడు పూలరాణి కోరికలో న్యాయం ఉందని అనుకుని సరేనన్నాడు. ఇద్దరికీ మాలతి పూల పందిళ్ళ కింద పెళ్ళి అయింది. రకరకాల పూల తేనె లతో విందులు జరిగాయి. అవి వసంతపు రోజులే కనుక భార్యను తీసుకుని రాజకుమారుడు తన రాజ్యానికి వెళ్ళాడు. అతని జీవితం ఆనందం తో నిండింది.
పూల రాణి కూతురు అక్కడ కాలు పెడుతూనే ప్రజలందరికీ మనసులు తేలికగా హాయిగా అయిపోయాయి. అక్కడ పూసిన పూలు వాడేవే కావు. శీతాకాలం ఆమె లేనప్పుడు మాత్రం జనం దిగులు పడేవారు, ఆమె తిరిగి రాగానే తెప్పరిల్లేవారు.
- Bukovinan fairy tale కి స్వేచ్ఛానువాదం. సేకరణ- Dr Heinrich von Wlislocki , Andrew Lang
మొక్కాలి, కనబడాలంటే…
వేములవాడలోని రాజన్న సన్నిధిలో తల్లీబిడ్డలు.ఒక సాన్నిధ్యం.
భగవంతుడూ… తల్లీ…బాలుడూ…
ఒక్కమాటలో మొక్కు.
అదే ఈ దృశ్యాదృశ్యం.
గుర్తుకొస్తున్నాయి. ఏవేవో.
తరతరాలు.
చిన్నప్పటి కాలువలు. బంగారు పురుగులు. చీమచింతకాయలు.
గోడను పట్టుకుని నాన్న కాళ్లు తొక్కడం.
రెండు జడల జె.పద్మ. లెక్కలు చెప్పే నారాయణ రెడ్డి సార్.
హైపో. ఇంకా చాలా.
నిజానికి అవన్నీ కాదు, తరతరాలు.
నాకు ‘పసకలు’ అయ్యాయి. అయ్యాకేమో, ఒక వర్షపు రాత్రి మా తాతమ్మ నన్ను తీసుకుని ఊర్లోని ఒక చోటుకు, ఎక్కడికో తీసుకెళ్లినట్టు గుర్తు. చాలా రోజులు నడిచినట్టనిపించే జ్ఞాపకం.
నడుస్తున్నంత సేపూ హోరున వర్షం. నిజానికి వర్షం అంటే గుర్తున్నది కూడా అదే తొలి అనుభవం.
అట్లా ఆ వర్షపు రోజు ఒక సుదీర్ఘ ప్రయాణం. చేతుల్లో చేయించుకుని!
అనంతరం ఎవరితోనో ఏమో, అది ఎటువంటి వైద్యమో ఏమో – ఇప్పించనైతే ఇప్పించింది మా తాతమ్మ.
వివరం తెలియదుగానీ అదొక సుదీర్ఘ ప్రయాణ ప్రాణ దృశ్యం. దృశ్యాదృశ్యం.
లీలగా గుర్తున్నది.
చిత్రమేమిటంటే చిన్నప్పుడు తిరిగిన ఇండ్లు, వీధులు, కూడళ్లు, ఆ పరిసరాలు అప్పటి వైశాల్యంతో ఉంటాయి.
పెరిగాక వాటిని చూస్తే అవి చిన్నబోతై.
అప్పుడు అంత దూరం నడవడం నిజంగా దూరం.
కానీ, తర్వాత అంత దూరం లేదు. దగ్గరే.
కానీ ఆ బుడిబుడి నడకలు, నా నడక కోసం తాతమ్మ ఆగి ఆగి వేసిన అడుగులూ…అన్నీనూ సుదీర్ఘమైనవి.
అట్లా ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని.జ్ఞాపకాలు చిన్నతనంలో పెద్దబడిలా ఉండనే ఉంటాయి.
అవన్నీ ఆయా స్థలకాలాల్లో ఫ్రీజ్ అయ్యే లీలలు.
చిత్రం. ఇల్లు చిన్నగా అనిపిస్తుంది. విశాలమైన బడి ఆవరణ కూడానూ అంత విశాలం కాదని తెలుస్తుంది.
అప్పుడు ఇరుకిరుగ్గా అనిపించిన గల్లీలు మరీ అంత ఇరుకేమీ కాదనీ ఇప్పుడు ఆశ్చర్యపోతాం.
అంతేకాదు, పవిత్రంగా ఆలయాలుంటాయి. ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. అది అంత ఎత్తుకాదని తెలిసి ఒక దివ్యానుభవం ఏదో మిస్ అవుతాం కూడా.
కానీ, తప్పదు. చాలా నిజాలు అబద్ధం అని తెలిసి విస్తుపోతూ ఉంటాం, ఇప్పుడు!
ధ్వజ స్తంభమే కాదు, గుడి గంట కూడానూ అప్పుడు ఎంతో ఎత్తు!
కానీ తర్వాత విజిట్ చేస్తే, నాయినమ్మ చనిపోయినప్పుడు ఆ దేవాలయంలోనే ఒక రాత్రి నిద్ర చేస్తే, అప్పుడు బాల్యపు వర్షం తాతమ్మతో సుదీర్ఘ నడకా అంతానూ కల లాగా తలంపుకొచ్చి ‘ఏదీ ఎత్తు కాదు, బాల్యమే సమున్నతం’ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చూసిన దృశ్యమే తొలి తలుపు అనిపిస్తుంది.
నవ్వూ వస్తుంది.
గర్భగుడిలోకి వెళ్లాలంటే తల వంచుకుని వెళ్లే ఎత్తు ఏమీ బాగుండదు. విచారం కలుగుతుంది.
చిన్నప్పుడే బాల్యంతో ఈజీగా దేన్నయినా ముట్టుకోగలం. పెద్దయ్యాక ప్రతి దానికీ బహుముఖ దృశ్యం.
అంటూ ఉంటుంది. ముట్టూ ఉంటుంది. దూరం పెరుగుతూ ఉంటుంది.
ఈ చిత్రంలో ఉన్నది అటువంటిదే. దగ్గరితనం.
మూపు. చూపు. ఒక ఎక్స్ పోజ్. దృశ్యాదృశ్యం.
ఆమె కళ్లు మూసుకుని చూస్తోంది, చూడాల్సినది.
ఆ బాలుడు తెరుచుకుని చూస్తున్నాడు, కొత్తగా తెరుచుకుంటున్న లోకాలకేసి!
వారిద్దర్నీ కలిపిన చూపు, ఆ చేతులు. అవి చూడాలి.
చిత్రంలో అదే చిత్రం.
బిడ్డ చేయి.
అదీ ఒక చూపు.చూపించు దృశ్యాదృశ్యం.నిజానికి ఆ తల్లి దర్శిస్తున్నది వేరు. ఆ కుమారుడు వీక్షిస్తున్నదీ వేరు.
అది తల్లికి అది దివ్య దర్శనం అయివుంటుంది. కొడుక్కి మాత్రం ఒక అనుభవం. ఒక కుతూహలంతో కూడిన వీక్షణం. లేదా బిత్తరి చూపూ అయివుండవచ్చు.
కానీ, అవతల తల్లి అంతటి ఏకాగ్రతతో, లీనమై చూస్తున్నదేదో బాలుడికి తెలియదు.
వాణీ, విను. అసలు ఎటు చూడాలో కూడా తెలియని బాల్యం వాడిది.
అయినా తల్లి వెంట బాల్యం ఎన్నో చూస్తుంది.
అది తల్లే కానక్కర్లేదు, తండ్రీ కావచ్చు, నానమ్మా, తాతమ్మా కావచ్చు.
మా రమణమ్మ నన్ను ఎట్లయితే మా ఊర్లో చివరాఖరికి, దుబ్బ దాటాక…ఇంకా ఇంకా నడిస్తే వారంతపు అంగడి ఎక్కడైతే జరుగుతుందో అక్కడిదాకా…ఎలా నన్ను నడిపించుకు వెళ్లిందో అలా పిల్లల్ని ఎవరో ఒకరు ఎందుకో ఒకందుకు తీసుకెళుతూ ఉంటారు. అప్పుడు తెలియదు. ఎప్పుడో తెలుస్తుంది.
మొట్టమొదట వర్షాన్నిచూసిన రోజు అదే అని నాకెలా తెలిసిందో మీకెలా తెలుస్తుంది.
బహుశా అప్పుడు తాతమ్మకు తెలియదేమో! వీడు ఏం గుర్తించున్నాడో అన్న ఆలోచనా తనకు రాలేదేమో!
కానీ, ఒక్కటి మాత్రం అనుకుంటుంది. ఎట్లయినా ‘పస్కలు’ తగ్గాలని అనుకుని ఉంటుంది!
కానీ నాకు వేరే దృశ్యం ఉంటుంది.
ఈ ఈ చిత్రంలో మల్లే.
ఇందులో ఈ అమ్మా ఆ భగవానుడిని ధ్యానిస్తూ ఏదో అనుకుంటూనే ఉంటుంది.
వాడి గురించి కూడానూ ఏదో కోరుకునే ఉంటుంది. కానీ, వాడికేమీ తెలియకపోవచ్చు.
ఆ రోజో -మరో రోజో- ఇంకో రోజో వాడు కొత్తగా ఒకటి చూస్తాడు.
తర్వాత అది ఎప్పుడు చూశాడో కూడా గుర్తు రాదు.
కానీ, మీరు చూడండి.
మీ దృశ్యావరణంలోకి వర్షమూ, వెన్నెలా ఎప్పుడు వచ్చిందో!
లేక పక్షీ, పామూ ఎలా వచ్చిందో గమనించండి.
లేదంటే పుస్తకమూ, డిగ్రీ సర్టిఫికెట్టూ, ఒక ప్రశంసా పత్ర.
ఇంకా దేవుడూ, దయ్యమూ. ఇంకేవో!
లేదా కొన్ని ప్రియరాగాలు.
‘లవ్యూ రా’ అన్న పదం!
అది తొలిసారిగా వినికిడిగా వచ్చిందా లేక దృశ్యంగా హత్తుకున్నదా చూడండి.
ఏమీ లేకపోతే గుడిగంటలా మీలోపల మీరు రీ సౌండ్ కండి.
దృశ్యాలు రీళ్లు కడతాయి.
కాకపోతే తొలి అనుభూతి కోసం మీరు ఈ చిత్రంలోని తల్లిలా మొక్కు కోవాలి.
నిశ్శబ్దం కావాలి. దేవుడి సన్నిధిలా మీరూ మీ సన్నిధిలోకి వెళ్లాలంటే ఏకాంతంగా, పక్కన ఉన్నది బాల్యం అన్నంత ప్రేమతో ఎవరి డిస్టర్బెన్సూ లేకుండా వెళ్లండి. తెరుచుకున్న వాడి కన్నుల కేసి చూస్తూ మీ జీవితంలో దృశ్యాదృశ్యం కండి.
ఆరోగ్యం అందరి హక్కూ …. “Sicko”
యువరాజ్ సింగ్, లీసా రే, మనీషా కోయిరాలా లాంటి కేన్సర్ బాధితులు కేన్సర్ తో పోరాడాలని సందేశాలిస్తూ అందరినీ యుద్ధ సన్నద్ధులను చేస్తుంటారు. కేన్సర్ రాగానే యువీ లాగానో, మనీషా లాగానో పోరాడి, ఏదోలా బతుకు జీవుడా అనుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? తేడా అల్లా డబ్బున్నవాడికి యుద్ధం చెయ్యటానికి ఏకే ఫార్టీ సెవెన్ల లాంటి స్టార్ ఆస్పత్రులుంటే లేనివాడి చేతుల్లో చిన్న కట్టెపుల్ల లాటి ధర్మాసుపత్రి కూడా సరిగ్గా ఉండదు. గట్టి జబ్బులొస్తే బతుకు గాల్లో దీపమై రెపరెపలాడుతుంది. ప్రాణ దీపాలు ఆరిపోతే పట్టించుకునేవాళ్ళూ లేరు.
అమెరికాలో ఒక పెద్దమనిషికి ప్రమాదంలో మధ్యవేలు, ఉంగరంవేళ్ళ తలకాయలు రెండూ తెగిపోయాయి. వాటిని తిరిగి అంటించి నిలబెట్టడానికి ఉంగరం వేలికైతే 12 వేలు, మధ్యవేలికైతే 60 వేలు అడిగారట ఆస్పత్రిలో. ఆయనకు పాపం ఆరోగ్య బీమా లేదు. డబ్బూ లేదు. రెండువేళ్ళనీ దక్కించుకునే మార్గం లేక 12 వేలిచ్చుకుని ఉంగరం వేలిని రక్షించుకుని మధ్యవేలి తలని చెత్త కుప్పలో వదిలేశాడట. ఆరోగ్య బీమా లేని ఇంకో నిర్భాగ్యుడు మోకాలికి దెబ్బ తగిలితే స్వయంగా తనే కుట్లు వేసుకుంటూ కనిపిస్తాడు. వీరిద్దరితో “Sicko” సినిమాను మొదలు పెడతాడు మైకల్ మూర్. కానీ “Sicko” సినిమా ఆరోగ్య బీమా లేని 50 మిలియన్ల అమెరికన్ల గురించి కాదు. బీమా రక్షణ ఉన్న 250 మిలియన్ల మంది గురించే చర్చిస్తుంది.
మైకల్ మూర్ అమెరికన్. మంచి పేరున్న డాక్యుమెంటరీ దర్శకుడు. “ఫారన్ హీట్ 9/11” సినిమాతో ప్రపంచాన్ని కుదిపేశాడు. “Sicko” 2007 లో తీశాడు. ఈ సినిమా, లోపలంతా పురుగు పట్టిన ‘అమెరికన్ హెల్త్ కేర్’ మేడి పండును చాలా నాటకీయంగా, ఆసక్తికరంగా విప్పిచూపిస్తుంది.
అమెరికాలో ఆరోగ్య బీమా లేనివాళ్ళకు ఒకటే చింత. బీమా ఉన్నవాళ్ళకు మాత్రం వంద బాధలు. బీమా కంపెనీ ఏ జబ్బు కుదుర్చుకోవటానికి డబ్బులిస్తుందో, ఏ జబ్బుకు వీలు కాదంటుందో అంతా ఆ కంపెనీ ఇష్టమే. ఏ మనిషికైనా వచ్చిన జబ్బుకి అంకురం బీమా కట్టటానికి ముందే పడిందని నిర్ణయించి, ఆ జబ్బుకి వైద్యం తమ బీమా పరిధిలోకి రాదని నిర్ణయించటానికి కంపెనీలు అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాయని చెప్తున్నారు బాధితులు. బీమా బాధితుల వివరాల కోసం మైకల్ మూర్ అడిగిందే తడవుగా వారంలోపునే 25,000 మంది అతనికి ఈ మెయిల్ లో తమ కథలు వినిపించారట. బీమా ఉన్నప్పటికీ అది తమ మందుల ఖర్చుకు సరిపోక, ఒక 79 ఏళ్ల పెద్దాయన మందుల కంపెనీలో వాష్ రూములు కడగటం దగ్గర్నుంచీ అడ్డమైన పనులూ చేస్తున్నాడు. దీర్ఘ రోగులైన తనకీ, భార్యకీ అక్కడ మందులు దొరుకుతాయని, అందుకని చచ్చేవరకూ ఆ పని చేస్తాననీ చెప్తున్నాడు. ఒక్కోటీ 200 డాలర్ల ఖరీదున్న పెయిన్ కిల్లర్ కొనుక్కోలేక ఆ మందు కంటే ఓ పెగ్ బ్రాందీ తనకి తనకి చాలంటోంది వాళ్ళావిడ. మధ్యతరగతి భార్యా భర్తలు లారీ, డోనా స్మిత్ లు. బీమారక్షణ ఉన్నప్పటికీ లారీ కి మూడు సార్లు వచ్చిన గుండె పోటు, డోనాకు వచ్చిన కేన్సర్ వైద్యాల దెబ్బతో వాళ్ళిద్దరూ ఇల్లు అమ్ముకుని కూతురింట్లో స్టోర్ రూమ్ లో ఇరుక్కుని బతకాల్సి వస్తుంది.
అమెరికన్ ఆరోగ్య బీమా కంపెనీలు విపరీతమైన లాభాల్లో ఉంటాయి. లాభం తగ్గకుండా ఉండేందుకు, వచ్చిన కేసుల్లో 10 శాతం కేసుల్ని బీమా పరిధిలోకి రావని డాక్టర్లు నిర్ణయించాలి. ఇది ఆస్పత్రులకూ, బీమా కంపెనీలకూ డాక్టర్లకూ మధ్య ఉండే ఒప్పందం. ఇలా ఎన్ని దరఖాస్తులను తిరగ్గొడితే డాక్టర్లకు అంత బోనస్ ఇస్తారని ఒక వైద్యురాలు చెప్తుంది. బీమా కేసులు మరీ ఎక్కువైతే వాటిని ఏదో వంకపెట్టి తిరగ్గొట్టటానికి అన్నిచోట్లా ఉన్నట్టే ఇక్కడా హిట్ మన్ ఉంటారు. లీ ఐనర్ అనే హిట్ మన్ తను చేసిన పాపాలు చెప్పేసి, ఇప్పుడు తను ఆ పని చెయ్యటం మానుకున్నానంటాడు. హ్యుమానా అనే హాస్పిటల్, తన భర్త ట్రేసీ కొచ్చిన బ్రెయిన్ కాన్సర్ కు వైద్యం నిరాకరించి, అతన్ని చావుకు ఎలా దగ్గర చేసిందో అతని భార్య చెప్తుంటే ఆ అమానవత్వం గడ్డ కట్టిన చావులా మనను తాకుతుంది.
హ్యుమానా లో పని చేసిన మెడికల్ రెవ్యూయర్ డాక్టర్ లిండా పీనో, ఆపరేషన్ అవసరమైన వ్యక్తి కేసును తిరగ్గొట్టి అతని చావుకు తను కారణమైనానని, కంపెనీకి తను చేసిన పనివల్ల ఓ అర మిలియన్ డాలర్లు మిగిలాయి కాబట్టి తన మీద ఏ కేసూ రాలేదని, తనూ డబ్బు సంపాదించుకుందని యు.ఎస్. కాంగ్రెస్ ముందు అందర్లోనూ చెప్పి పశ్చాత్తాపం ప్రకటిస్తుంది. తను తిరగ్గొట్టిన కేసుల కాగితాలన్నీ కళ్ళ ముందుకొచ్చి తనను నిలదీస్తున్నాయని బాధ పడుతుంది.
అసలీ రాక్షసత్వానికి బీజాలు 1971లో నిక్సన్ కూ, ఎడ్గార్ కైసర్ కంపెనీకీ జరిగిన ఒప్పందంతోనే పడ్డాయని చెప్తున్నాడు మైకల్ మూర్. ఆరోగ్య రక్షణ తక్కువగా ఇచ్చి ఎక్కువ లాభాలు సంపాదించే కంపెనీల వల్ల ప్రభుత్వం, పార్టీలు లాభపడతాయి కాబట్టి ఇదేదో బాగా ఉందని కైసర్ చేతిలో అమెరికన్ల ఆరోగ్యాన్ని పెట్టేశాడు నిక్సన్. దానితో పేదలకు దారుణమైన జబ్బులకు వైద్యం అసలు అందకుండా పోయింది. హిల్లరీ క్లింటన్ రాజకీయాల్లోకి వచ్చాక అందరికీ సరైన హెల్త్ కేర్ ఇవ్వాలని, దానికి తగిన విధానాన్ని ప్రభుత్వంచేత చేయించాలని చాలా పట్టుబట్టింది కానీ కంపెనీలు, కాంగ్రెస్ సభ్యులూ కలిసి ఆమె నోరు మూయించారు.
అమెరికాలో సోషలిజం వచ్చేస్తోందంటూ గోల చేశారు. ముఖ్యంగా డాక్టర్లకు మరీ భయం. గవర్నమెంట్ ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చెయ్యాల్సి వస్తుందనే ఊహే వాళ్ళు భరించలేరు. అంతగా ముదిరిపోయిన వ్యక్తివాదం. డాక్టర్లు దేశమంతా తమ చుట్టుపక్కల ఉండే అందర్నీ పోగు చేసి, ‘అందరికీ వైద్యం’ అనే విషయం ఎంత చెడ్డదో వివరించే ఒక రికార్డును వినిపించారు. రోనాల్డ్ రీగన్ గారి ఈ రికార్డు “Sicko” లో మంచి కామెడీ ట్రాక్. మొత్తానికి బీమా కంపెనీలు ఒక వంద మిలియన్ డాలర్ల దాకా ఖర్చు చేసి, హిల్లరీ తీసుకు రావాలనుకున్న హెల్త్ కేర్ పాలసీని ఓడించేశాయి. జార్జ్ బుష్ వచ్చాక మరిన్ని కొత్త పాలసీలతో మందుల కంపెనీలు కూడా బలిశాయి.
అమెరికాలో హెల్త్ కేర్ ఇలా ఏడుస్తుంటే, మైకల్ మూర్ పక్క దేశాల హెల్త్ కేర్ ఏమిటో చూద్దామని కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ తిరిగాడు. ఈ దేశాల్లో రోగులకు దొరుకుతున్న రాజభోగాలు చూసి కళ్ళు తిరిగి బోర్లా పడ్డాడు. ఎవరూ వైద్యంకోసం చేతిలోంచి పైసా ఖర్చు పెట్టక్కర లేదు. అతి తక్కువ డబ్బుకి మందులు దొరుకుతున్నాయి. కెనడాలో చేతి వేళ్ళన్నీ తెగిపోయిన మనిషికి 24 గంటల పాటు ఆపరేషన్ చేసి అన్ని వేళ్ళూ ఉచితంగా కుట్టేసి పంపించారు. మనకి వెంటనే అమెరికాలో మధ్యవేలా ఉంగరంవేలా అని వేలాడిన మనిషి గుర్తొస్తాడు. బ్రిటన్ ఆసుపత్రిలో వైద్యం పూర్తి అయిన రోగి తిరిగి ఇంటికి వెళ్ళటానికి డబ్బు లేకపోతే ఆస్పత్రి వాళ్ళే దారిఖర్చు ఇచ్చి ఇంటికి పంపటం చూశాడు మూర్. డాక్టరు సంతృప్తిగా ఎగువ మధ్యతరగతి జీవితం గడపటాన్ని చూశాడు. రోగుల చేత చెడు అలవాట్లు మాన్పించి ఆరోగ్యం బాగయేలా చేసే డాక్టర్లకు బోనస్ కూడా దొరుకుతుంది. అమెరికా కథని తిరగేసి రాసినట్టు ఉంటుంది లండన్ లో. డాక్టర్లు రాత్రీ పగలూ లేకుండా అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఇళ్ళకు వచ్చి వైద్యాన్ని అందించటాన్ని రికార్డు చేశాడు మూర్. ఫ్రాన్స్ లో రోగం పూర్తిగా తగ్గేదాకా పూర్తి జీతంతో రోగికి విశ్రాంతినిచ్చే పధ్ధతి చూసి ఆశ్చర్యపోయాడు. కొత్తగా తల్లులైన ఆడవాళ్ళకు సాయం చెయ్యటానికి ప్రభుత్వం వారానికి రెండు సార్లు ప్రభుత్వోద్యోగులైన నానీలను ఆ తల్లుల ఇళ్ళకు పంపటం చూశాడు.
“ఇది ప్రజలకు చేస్తున్న ఉద్ధరింపు ఏమీ కాదు. ప్రజలనుంచి పన్నులు ప్రభుత్వం వసూలు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు రోగాలొస్తే వైద్యం అందించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం ఎలా తప్పించుకోగలదు? రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ లో మేం ఆరోగ్యరక్షణ కోసం మంచి చట్టాలు చేసుకున్నాం. వీటిని మార్చే ధైర్యం ఎవరూ చెయ్యలేరు” అంటాడు ఒకాయన.
“Sicko” లో మైకల్ మూర్ కొంతమంది రోగుల్ని వెంటేసుకుని పక్కనున్న క్యూబాకు మూడు పడవల్లో వెళ్లి, వాళ్ళందరికీ అక్కడి ఆస్పత్రిలో వైద్యం చేయించి అతి తక్కువ ఖర్చులో దొరికే మందులు ఇప్పించే సేవా కార్యక్రమం కూడా చేశాడు. వీళ్ళలో ఎక్కువమంది అగ్నిమాపక దళంలో పనిచేస్తూ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడిలో నేల కూలినప్పుడు గ్రౌండ్ జీరోలో అతిగా పని చేసి, ఆ పొగల్లో నుసిలో రోగగ్రస్తులైనవాళ్ళు. వీళ్ళ అనారోగ్యాన్ని అమెరికా మామూలుగానే ఏమాత్రం పట్టించుకోలేదు. క్యూబాలో ఉచిత వైద్యం, అక్కడి అగ్నిమాపక దళం దగ్గర ఆదరణ పొంది, వీళ్ళంతా అమెరికాకు తిరిగి రావటంతో ఈ డాక్యుమెంటరీ పూర్తవుతుంది.
“ఎక్కడైనా మంచి కార్ తయారౌతే మనం దాన్ని డ్రైవ్ చేస్తాం. ఎక్కడో తయారైన వైన్ ని మనం ఆస్వాదిస్తాం. వాళ్ళు రోగుల్ని ఆదరించే మంచి పద్ధతిని, పిల్లలకు చక్కగా బోధించే పద్ధతిని, పిల్లల్ని చక్కగా చూసుకునే పద్ధతిని, ఒకరితో ఒకరు ఆదరణగా మెలిగే పద్ధతిని కనిపెట్టినపుడు మనం వాటిని మాత్రం ఎందుకు గ్రహించం?
వాళ్ళు “మేము” అనే ప్రపంచంలో బతుకుతున్నారు. మనలా “నేను” అనే ప్రపంచంలో కాదు. మనల్ని “నేను” లు గానే ఉంచటానికి ప్రయత్నించే శక్తులు అమెరికా ఎప్పటికీ ఉచిత వైద్యం ఇవ్వని దేశంగానే మిగలాలని కోరుకుంటాయి. వైద్యం ఖర్చులు, కాలేజీ ఖర్చులు, పిల్లల డే కేర్ ఖర్చులు ఇవన్నీ లేని అమెరికా ఎప్పటికైనా వస్తుంది. అది తప్పదు.” అంటూ ఆశగా ముగింపు వాక్యాలు చెప్తాడు మైకల్ మూర్. జనం విపరీతంగా చూసిన ఇలాటి సినిమాలు కూడా పాలసీలను అంతో కొంతో కుదుపుతాయి.
ఒబామా చొరవతో అమెరికన్ హెల్త్ కేర్ ఇప్పుడు ఒబామాకేర్ గా కొన్ని సంస్కరణలకు గురైంది. అందులో అతి ముఖ్యమైనది, ఈ సినిమాలో చర్చించిన “pre-medical condition” అనేదాన్ని బీమానుంచీ తొలగించటం. రోగులకు వైద్యం ఇవ్వకుండా చెయ్యటానికి ఈ pre medical condition ని వాడుకునే అవకాశం ఇప్పుడు కంపెనీలకు లేదు. రెండోది, అందర్నీ నిర్బంధంగా బీమా పరిధిలోకి తేవటం. వీటి ఫలితాలు రాబోయే కాలంలో తెలుస్తాయి.
*****
“Sicko” ఇప్పుడు మన దేశంలో అందరూ చూడాల్సిన సినిమా. మన ఆరోగ్య వ్యవస్థ ఇంకా తప్పటడుగుల్లో ఉండగానే కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పోలియో నివారణ, కుటుంబనియంత్రణ ఆపరేషన్స్, జ్వరాలు, టీకాలు … వీటికి మించి ప్రభుత్వం మనకొచ్చే ఏ జబ్బులకూ బాధ్యత లేకుండా చేతులు దులిపేసుకుని కూర్చుంది. 80ల్లో అమెరికా నుంచీ దిగుమతైన మన గొప్ప డాక్టర్లు అపోలో ప్రతాప్ రెడ్డి, మేదాంత నరేష్ త్రెహన్ లాంటివాళ్ళు అమెరికా హెల్త్ కేర్ పద్ధతిని మనకూ అంటించారు. నగరాల మధ్యలో ఇంచుమించు ఉచితంగా భూమి కొట్టేసి, నీళ్ళు, కరెంటు చౌకగా లాగేసి, గొప్ప గొప్ప భవంతుల్లో ఆస్పత్రులు కట్టి, ఎంత డబ్బు వెదజల్లగల్గిన వాళ్లకు అంత గొప్ప స్టార్ వైద్యాలు అందిస్తున్నారు. పేరుకి వీటిలో పేదవారికి కొంత వైద్యం చెయ్యాలని నియమాలు ఉంటాయిగానీ వాటిని వీళ్ళు ఏమీ పట్టించుకోరు. అసలు స్టార్ హోటళ్ళ లాటి ఆ ఆస్పత్రుల్లో తాము అడుగు పెట్టవచ్చనే ఊహ మధ్యతరగతి వాళ్ళకే రాదు. ప్రైవేటు ఆస్పత్రుల వైభవాలు ఇలా వెలిగిపోతుంటే మరోపక్క ఛత్తీస్గఢ్ లాంటి చోట ఎలకమందుల మధ్య ఆడవాళ్ళకు ఆపరేషన్లు చేసి తిరిగిరాని లోకాలకు పంపించే సమర్థత మన ప్రభుత్వ డాక్టర్లదీ ప్రభుత్వాసుపత్రులదీ.
ముందుతరం పారిశ్రామికవేత్తల్లాంటి వారు కాదు ఇప్పటి చురకత్తుల్లాంటి కార్పొరేట్లు. నిర్దాక్షిణ్యంగా పెద్దలనుండి పేదలను కోసి అవతలపెడతారు వీళ్ళు. ముంబై టాటా మెమోరియల్ లాంటి ఆస్పత్రులను ఇప్పటి కార్పొరేట్ల నుంచీ కలలోనైనా ఆశించగలమా?
నేలా, నీళ్ళూ, కరెంటూ కారుచౌకగా ప్రైవేటు ఆస్పత్రులకిచ్చేసి, పైగా అక్కడ పేదవారికి వైద్యం చేసినందుకు ప్రభుత్వం ఆ ఆస్పత్రులకు డబ్బులు కట్టటం ఇంత జనాభా ఉన్న దేశంలో సరైన పనేనా? శుభ్రంగా, కనీసావసరాలతో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులూ, వాటిలోకి చక్కటి ఆధునికమైన వైద్య పరికరాలూ, డాక్టర్లకు మంచి జీతాలూ ఇచ్చి, ప్రభుత్వ వైద్య కళాశాలలు మరిన్ని కట్టినా, కార్పొరేట్ల కిచ్చే దొంగ సబ్సిడీల కంటే ఎక్కువవుతుందా? ఎవరైనా లెక్కలు కడితే బాగుండును.
లెక్కలు సరి చూసుకునే ఓపిక ప్రభుత్వాలకు లేదు. ఎవరు సంపాదించిన డబ్బు వాళ్ళు లెక్కపెట్టుకోవటంతోనే సరిపోతోంది. స్టార్ ఆస్పత్రులు మరింత జోరుగా డబ్బులు లెక్కెట్టుకుంటున్నాయి. లక్షల ఖర్చుతో కొన్న ఒక ఆధునిక వైద్య పరికరం కోసం పెట్టిన డబ్బు కొన్ని నెలల్లోనే తిరిగొస్తుంది వాళ్లకు. ఆ పైన, కోట్లకొద్దీ లాభం. ఇవన్నీ కాక, ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా చేయించాలనుకునే వైద్యాలకు వీళ్ళ లాభం వాటా 15 శాతం దాకా కలిపి ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఈ ప్రైవేటు డాక్టర్లు మన ప్రభుత్వ పాలసీలను అంతా అమెరికన్ పద్ధతిలోనే తమకు కావలసినట్టు మారుస్తున్నారు. వాళ్ళ డాలర్ కలల్ని నిజం చేసుకుంటున్నారు.
“Sicko” సినిమాలో చూపించిన Cigna అనే ఆరోగ్య బీమా కంపెనీ దేశీయ TTK తో కలిసి మన దేశంలో రంగంలోకి దిగిందని ఒక టీవీ వ్యాపార ప్రకటనలో చూశాను. ఇప్పుడు మధ్యతరగతి కూడా ఈ బీమా కంపెనీల వైపు చూడక తప్పటం లేదు. మన మధ్యతరగతి కూడా ఈ సినిమాలో చూపించిన “pre-medical condition”, “denial” లాంటి పరిభాషలో గిరగిరా తిరిగే రోజులు ఎక్కువ దూరంలో లేవు. కార్పొరేట్ ఆస్పత్రులూ, మందుల కంపెనీలు, డాక్టర్లూ, బీమా సంస్థలూ మధ్యతరగతి రోగులతో ఆటాడుకునే బరిలోకి మనమూ వచ్చేస్తున్నాం. ఇంకా కింది పొరల్లో ఉన్నవాళ్ళు ఇప్పటికే నిండా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ వైద్యం ఇవ్వాలంటే ప్రభుత్వం స్టార్ డాక్టర్లకి ఆకాశంనుంచి ఎన్నెన్ని నక్షత్రాలు తెంచి ఇవ్వాలి? ప్రభుత్వం మెదడు మోకాల్లో ఉంది కాబట్టి ఈ ఆలోచనలేవీ అంటకుండా కళ్ళు మూసుకుని జాతి మొత్తాన్నే ఉద్ధరిస్తున్నామంటూ పెద్ద పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల కోసం హెల్త్ పాలసీ తయారు చేస్తోంది.
అందరికీ ఉచిత వైద్యం గురించి మాట్లాడే ఒకే గొంతు ఇప్పుడు వినిపిస్తున్నది లెఫ్ట్ పార్టీలనుంచి కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచీ. ఆ గొంతును యువత అందుకుని ప్రభుత్వాలకూ కార్పొరేట్ వైద్యాలకూ ఉన్న ఫెవికాల్ బంధాన్ని తెంచి, వైద్యాన్ని అమెరికన్ మోడల్ లోకి వెళ్ళిపోకుండా, మైకల్ మూర్ చెప్పినట్టు “మేము” అని అందరూ మాట్లాడుకునే మోడల్ లోకి మళ్లిస్తే! ఎంత బాగుంటుందో! చర్చ మొదలైంది. కొనసాగించటం అందరి పనీ…
-ల.లి.త.
“Sicko” — http://www.youtube.com/watch?v=9CDLoyXarXY
Private Operator — http://www.caravanmagazine.in/reportage/naresh-trehan-medanta-private-practice
కథ ఒక instant మాత్ర!
కథకుల అంతరంగం గురించి కొత్త శీర్షిక
~
చిన్నప్పుడు చదివే అక్షరాల్లో…కథలైతే వాక్యాల వెంట కళ్ళు పరుగుతీయడమూ, వ్యాసాలైతే నత్తనడక సాగి కళ్ళు మూతపడడమూ- ఇదీ వరస! కథ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలూ సంభాషణలూ నా మనసులో ఒక మూవీలా పదేపదే కదలడం, కొన్నిసార్లు ఆ పాత్రలు తమ కథాపరిధులుదాటి ఇంకా నా ఆలోచలనలో కథ ఇంకొంత కొనసాగి ఇంకో ముగింపు ఇవ్వడం, కొన్నిసార్లు ఆ పాత్రలు నా కలల్లో రావడం…. ఇలా జరుగుతూ ఉండేది. అందుకేనేమో కథలు మనసులో ఆలోచనలు రేగడానికి ఒక బలమైన సాధనం- అనే భావాన్ని బలపరిచాయి. ఉదాహరణకు రంగనాయకమ్మ ‘కాపిటల్’ కన్నా ‘జానకివిముక్తి’ ద్వారా అర్ధం చేసుకున్న వర్గపోరాటమే ఎక్కువ. నా ప్రాపంచిక జ్ఞానాన్ని పక్కన పెడితే సోషల్ వర్క్ చదువు, ఆ తర్వాత ఎన్. జీ. వో ల్లో నేను చేసిన ఉద్యోగాలూ, గాక, కథలు కూడా నన్ను ప్రభావితం చేసాయి. కథలవల్ల నా ఆలోచనలు హద్దులుదాటి ఎగిరాయి.
మరి నవల కాదా అంటే? అది కూడా. కానీ కథే నవల కన్నా బలమైనది. కథ ఒక instant మాత్రలాంటిది. కాంటెంపరరీ జీవితాన్ని అంత బ్రిస్క్ గా సాహిత్యం లో అద్దం పట్టే సాధనాలు కథలూ, కవితలూ. చదివడానికి తేలిక అనే కాదు. లౌకికంగా ఇప్పటి జీవన విధానంలో రచయితకూ పాఠకుడికీ చాలా వెసులుబాటిచ్చేది కథలే. రచనను త్వరగా పూర్తిచేసే వెసులుబాటు రచయితకు ఉంటే, అంతే త్వరగా చదివి విశ్లేషించగలిగే వీలు పాఠకుడికి ఉంటుంది. అయితే, నాలుగు నుంచి పది పేజీల్లో కొన్ని పాత్రల సృష్టించి, వాటికో వ్యక్తిత్వాన్నద్ది, కాస్త ఎమోషనల్ సర్కస్ పకడ్బందీగా చేయించి మన పరిమిత ఆలోచనలలో చెక్ పెట్టడం చిన్న విషయమేమీ కాదు.
నాకు సాహిత్యపు బాటలో కథ ఒక కంపల్సివ్ మార్గంగానే తోచింది తప్ప ఎంచుకున్న మాధ్యమం కాదు. ఇంకోరకంగా వ్యక్తీకరించడం చేతగాకపోవడంవలన కూడాగావొచ్చు! సరే, రాయగలిగే సామర్ధ్యం, జీన్స్ ఉన్నాయని పదేపదే రెచ్చగొట్టారు సాహితీ శ్రేయోభిలాషులు. ఇక నేనూ కాస్త రాసాను. పొగడ్తకు పొంగిపోయి, ఉత్సాహం చల్లారాక దానికి ఆవల ఏంటో ఆలోచిస్తున్నాను. ఈ కథ అవసరం ఎంతుంది, ఎవరికి ఉపయోగం వగైరా…
రాస్తున్న కొద్దీ అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికీ నిజంగా ప్రచురితమైనవి నాలుగు కథలే. కానీ ప్రతీసారీ అనిపిస్తుంది. ఇంకా చాలా పార్శ్వాలు కదలాలి. బోల్డన్ని పొరలు తొలచాలి. ఖలీల్ జిబ్రన్ అన్నట్టు దుఃఖ్హమూ, సంతోషమూ, ఆనందమూ, విషాదమూ, దయా, క్రూరత్వమూ, ఉన్నతమూ, నీచమూ ఇవన్నీ మనిషి ఆలోచనా స్రవంతిలో భాగాలే. ఇవి ప్రతిపాత్రలో కదలాలి. మానవత్వమనే మాట మనిషి తనకు తాను ఇచ్చుకుంటున్న మంచిపేరనీ, కాని మానవ మనుగడ అవసరం మీదే, ఇంకా చెప్పాలంటే సర్వైవల్ మీదే ఆధారపడి ఉంటుందనే నిజాన్ని చాటి చెప్పగలగాలి.
స్వాతి కుమారి ఒక కథలో చెప్పినట్టు, ఇప్పటి సమాజపు నైతిక, అనైతిక నియమాలకావలగా చూడగలిగి రాయగలిగితే సృజనకు ఒక అర్థం ఉంటుంది. ఈ విషయం అర్ధమవుతున్న కొద్దీ ఇదివరకు కన్నా ఎక్కువగా మనుషులను గమనించడం పెరిగింది. ఆ గమనింపులో నేను నాలోని మనిషిని గమనిస్తున్న సంగతి క్రమంగా అర్ధమైంది. సాధారణకథలూ, నీతికథలూ, పాత్రలుబుద్ధి తెచ్చుకున్న కథలూ- ఇలాంటి కథలు నెమ్మదిగా బోరు కొడుతున్నాయి. looking and thinking beyond- ఇప్పటి నినాదం నాకు. ప్రణయాలూ, వ్యక్తిత్వాలూ, వాదాలూ….దీనికి మించింది ఏది? జీవితం నిజంగా ఒక linear పద్ధతిలో సాగుతోందా? కథలో పాత్రలు ఒక కాన్షియస్ లాజిక్ తో ప్రవర్తించడం నిజజీవితంలో ప్రతీసారీ జరుగుతుందా?
కథలు జీవితానికి అద్దంపడతాయంటారు. కాని కథలో ప్రస్తావించే సమస్య మాత్రమె జీవితం కాదుగా..! మరలాంటి విషయాలు చెప్పగలిగే intertwined కథ రాయాలనుందిప్పుడు. ప్రతీ సమస్యా రెండు రకాలుగానే ప్రవేశిస్తుంది జీవితంలో. ఒకటి వ్యక్తీ నుంచి, ఇంకొకటి సమాజం నుంచి. ఇది అర్ధంయ్యాక వేరే సమర్ధనలేమీ దృష్టినాకర్షించడం లేదు.
అంతూ పొంతూ లేని ఆలోచనా స్రవంతిని ఇలా మీ ముందు పెడుతున్నా. అసలు ప్రశ్నకొస్తే కథల ద్వారా నా వ్యక్తీకరణ మారిందా అంటే నేను రాసిన నాలుగు కథల మధ్య సామ్యభేదాలే మార్పు. నిజజీవితంలో వ్యక్తీకరణ మార్పులు అంటే స్నేహితులూ, ఆత్మీయులే చెప్పాలి. కాని కథ రాద్దామన్న ఆలోచనలో, నా చుట్టూ ఉన్న భారపు విలువల గోడల్ని కూల్చేసాను. అందువల ప్రతీ ఘటనలోనూ ఏ విధమైన వాదాన్ని బుజాన్నేసుకునే బాధ్యతను వదిలించుకుని కేవలం ఒక విషయం గానే వ్యక్తపరచగలుతున్నా. ప్రస్తుతపు భావఝారిలో లోకం లో ఏ మనిషి ఏ పని చేసినా నాకు వాటి కారణాలు అర్ధం చేసుకుందామనే అనిపిస్తుంది. దాదాపు Frictionలో ఉన్న ప్రతీ మనిషిలోను ఒక helplessness, ఒక dependence కనిపిస్తుంది. ఆ Friction ను దాటుకుని వచ్చి నెమ్మదిగా తమకు తామే నిలబడగలిగే వాళ్ళను చూస్తే అద్భుతంగా ఉంటుంది. తమాషాగా అది నాలో రచయితను ధైర్యస్తురాలిని చేస్తుంది.
-అపర్ణ తోట
ఒక రైతులా, ఒక యానాదిలా…కేశవ రెడ్డి!
రెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు రోజు కుంతల జలపాతం ప్రయాణం. బుల్లి బస్సులో గలగలా ఉన్నారు మనుషులంతా. పచ్చని చిక్కని అడివిలో ప్రయాణం హాయిగా సాగింది. దారిలో నిర్మల్ లో బొమ్మల కోసం దిగాం. డాక్టర్ కేశవరెడ్డి నిజామాబాద్ లోనే కదా ఉండేది, ఇంత దూరం వచ్చి కలవకుండా ఎలా?
అలసిపోయిన చాలా మంది బోధన్ వెళ్ళిపోయారు. నేనూ, నరేంద్ర, సడ్లపల్లి చిదంబరరెడ్డి, నంద్యాల శ్రీనివాసులురెడ్డి, బత్తుల ప్రసాద్, గొరుసు జగదీశ్వరరెడ్డి, శిరంశెట్టి కాంతారావు నిజామాబాద్ వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాం. విష్ణు తనూ వస్తానంది. బస్సులోంచి మేం మాత్రం ఒక కారులోకి మారాం. ఫోన్ లో అడ్రస్ కనుక్కుని వెతుక్కుంటూ వెళ్ళాం . చదవడమే తప్ప నేను అప్పటిదాకా కేశవరెడ్డిని చూడనేలేదు. ఉద్వేగభరితంగా పేజీల వెంట పరుగులు తీయించే అరుదైన తెలుగు రచయితని కలుసుకోబోతున్న ఉత్సాహం. ఏం మాట్లాడాలి?
మాలో చాలా మందికి ఆయనతో పరిచయం బానే ఉంది. మాటలు అవే దొర్లుతాయి. కరెంటు స్తంభం పక్కన కారు ఆగింది. పాత అపార్ట్ మెంట్..పాత ఇల్లు..కొంత దుమ్ముబారినట్టున్న అరలు..లోపల పాతబడిన పుస్తకాలు.. కుర్చీలో కేశవరెడ్డి. గళ్ళ లుంగీ, అరచొక్కా. పలచగా తెల్లని పోచల్లా తల మీద మిగిలిన వెంట్రుకలు.. ఎందుకో చూడగానే కొంచం దిగులుగా అనిపించింది. పొడి నవ్వుతో పలకరించారు. కొంచం మొహమాటంగా కనిపించారు. భార్యను పరిచయం చేశారు. ఇదంతా ఆయన స్వభావం.
అక్షరాల్లోనూ ఆయనేం ఆడంబరంగా ఉండరు. ఆయన రచనల్లోని ఒక పాత్ర లాగే కనిపించారు కేశవరెడ్డి నాకు. ఒక రైతు, ఒక యానాది, మనేదతో తనతో తనే మాట్లాడుకునే ఒక స్త్రీ. వీళ్ళంతా కేశవరెడ్డేనా?! బహుశా వీళ్ళలో చాలా పాళ్ళు ఆయనే కావచ్చు.
కేశవరెడ్డి పాత్రలు వెంటాడుతూ ఉండేది అందుకే. కథకీ, నవలకీ మధ్య ఎక్కడో ఒక గీత గీసుకుని రాసుకుంటూ పోయాడు ఆయన. చిత్తూరు జిల్లా తలపులపల్లె లో పుట్టి, ఈ పరిసరాల్లోనే పెరిగి, పాండిచ్చేరిలో చదువుకుని డాక్టరై, డిచ్ పల్లిలో వైద్యం చేసిన ఈయన మాటల్లో, వాక్యంలో ఈ ప్రయాణం ప్రభావం ఉంటుంది. ఇష్టంగా చదువుకున్న ఆంగ్ల రచనలు ఆయనను అంటిపెట్టుకునే ఉన్నాయి. పాత్రలు చిత్తూరు జిల్లా పల్లెలోనే ఉన్నా, కథా ఇక్కడే నడిచినా, నడకలో తేడా అందుకే అనిపిస్తుంది. కేశవరెడ్డి పుస్తకం తెరిస్తే, ఇంటర్ లో మధుబాబునో, ఇంకా ముందు జానపద కథలనో, ఇంకా కొంచం ముందు చందమామనో పట్టుకున్నట్టే.
ఎన్నడూ చూడకపోయినా ఆయన నన్ను గుర్తుపట్టారు. బిస్కెట్లు, టీలు, అందరికీ చాలినన్ని కుర్చీల కోసం వెతుక్కోవడం, దుమ్ము దులిపి, కడిగి కప్పుల్లో టీ అందించడం…ఎందుకో ఇష్టంగా అనిపించింది. నలుగురు వస్తే, ఒక స్టూలునో, కుర్చీనో, మంచాన్నో లాక్కుని సర్దుకుని కూర్చునే ఊళ్ళోని మా ఇల్లే ఇది. పరిసరాలు సహా ఆయనా, ఆమె కూడా పరిచయం లేనివాళ్ళలా కనిపించలేదు.
మాటలు నడిచేకొద్దీ ఆయన ఇంకా దగ్గరవుతున్నట్టనిపించింది. పొడి మాటలే గానీ, చతురమైన వాడే! వైద్యం వల్ల తల ఇట్లా తయారైందని చెప్పారు. ఆ మాటల్లో ఎక్కడో ఒక నిర్వేదపు గీర. ఇంతలో డాక్టర్ నక్కా విజయరామిరెడ్డి వచ్చారు. కేశవరెడ్డి మీద ఎంతో శ్రద్ధ. కొడుకంత బాధ్యతగా కనిపించాడాయన. ఒక గంట గడిపి బోధన్ కి బయలు దేరాం గానీ, దిగులు దిగనేలేదు. పుస్తకాల సభకి ఆయన రానేలేదు.
ఫిబ్రవరి 13న ఉదయం నరేంద్ర ఫోన్.. మునిసుందరం గారు చనిపోయారని. కోటకొమ్మల లేఅవుట్ ఇరుకు సందులోని ఆయన ఇంట్లోనే గాజుపెట్టెలో ఆయన. కాసేపు అక్కడే తచ్చాడి, ఆఫీసుకి రాగానే, మళ్ళీ నరేంద్ర ఫోన్..ఇంకో బ్యాడ్ న్యూస్ అంటూ.
ఒకే రోజు చిత్తూరు జిల్లా రచయితలు ఇద్దరూ వెళ్ళిపోయారు. ఒకరు ఇక్కడ. ఇంకొకరు నిజామాబాద్ లో, జ్ఞాపకాలుగా మారిపోయి.
-ఆర్. యం.ఉమా మహేశ్వర రావు
ఆ అడివిలో వెన్నెలా వుంది!
అప్పుడప్పుడు వాక్యం తడబడుతుంది. గడబిడిగా నడుస్తుంది. వదులుగా వేలాడుతుంది – కాని వాక్యం యెప్పుడూ తడబడకుండా గడబిడిగా నడవకుండా వదులుగా వేలాడకుండా వుంటుందో ఆ వాక్యమే కేశవరెడ్డి గారిది. యెండలో తడిసిన రానెస్, వర్షంలో ఆడిన ఫ్రెష్ నెస్, మంచులో మునిగిన తేమ నిండిన అతని వాక్యం మనలని చుట్టుకుంటుంది. వాక్యాలు వాక్యాలుగా చుట్టుకుపోతుంది. అతని వాక్యాలని మనం వదిలించుకోలేం. పెనవేసుకోనూలేం. వుక్కిరిబిక్కిరవుతాం. మళ్ళిమళ్ళి కావాలనిపించే సొగసుకాఠిన్యం పెనవేసుకున్న ఆ వుక్కిరిబిక్కిరి రాతగాడు మనలని అడవులని జయించమంటారు.
కనిపించినవాటినల్లా పిప్పరమెంట్స్ లా చదివే అలవాటున్న నాకు వొక రోజు మా యింటి లైబ్రెరిలో అనుకోకుండా వో రోజున వో పుస్తకం చేతుల్లోకి తీసుకొన్నాను. ఆంధ్ర పత్రిక లో సీరియల్ గా వచ్చినప్పటి కాగితాలని చక్కగా కుట్టి మామిడిపండు రంగు అట్ట వేసుంది. పుస్తకం పైన ‘అతడు అడివిని జయించాడు’ అని పైన నీలి సిరాతో గుండ్రని చేతిరాత. పుస్తకం తిరగేస్తుంటే బొమ్మలు ఆకర్షించాయ్. చాల యిష్టాన్ని పుట్టించాయి. ఆ బొమ్మలు కేతినీడి భాస్కర్ గారివి. వాటిని అలానే వెయ్యాలని ప్రయత్నిస్తూ వో రెండు రోజులు గడిపాను. చదవటం వదిలేసి- అసలు యింత అందమైన బొమ్మలున్న యీ కథ యేమిటో చూడాలన్న కుతూహలం కలిగింది. చదివాను. మళ్ళి చదివాను. యిప్పటిలానే నన్ను అడివి వెన్నెల పట్టుకున్నాయి.
చలం గారి మైదానం మొదటిసారి చదివినప్పుడు అందులోని చింత చెట్టు అల్లిక నుంచి జల్లులు జల్లులుగా కురిసే మధ్యాన్నపు యెండ మైమరపించినట్టుగా యిప్పుడు ఆ అడివిలో వెన్నెల్లోని నడకలు భలే హత్తుకున్నాయి. ఆ తరువాత చాలా కాలానికి కేశవరెడ్డి గారు పరిచయం అవ్వగానే ‘ ఆ వెన్నెల అడివి భలే రాసారు’ అని చెప్పాను. అప్పుడు ఆయన నవ్వారు. మళ్ళి నవ్వారు. నవ్వటం ఆపి ‘ యింత అందంగా, కొత్తగా ఆ పుస్తకం గురించి నాకు యెవ్వరు చెప్పలేదు. యిప్పటి వరకు అంతా చాల గాంభీర్య మైన ఫీడ్ బ్యాక్ చెప్పారు. కుప్పిలి పద్మ అంటేనే అడివి, వెన్నెల, మంచు పువ్వులు, వాన ‘అని నవ్వారు. నేను నవ్వాను. అది మొదటిసారి కలిసినప్పటి సంభాషణ.
కేశవరెడ్డి గారి యే నవల్లోనైన యితివృతం యీ సమాజం పెద్దగా పట్టించుకోని మనుష్యులు, వర్గాలు, ప్రాంతాలు, వృత్తులు. మనకి అసలు పరిచయం లేని సమాజపు వ్యక్తులు కావొచ్చు లేదా కొద్దిపాటిగా తెలిసిన జీవితాలు కావొచ్చు. కాని మనం ఆయన రచనలు చదివితే ఆ మనష్యులు మన మనుష్యులైపోతారు. ఆ అనుభవాలన్నీ మనవైపోతాయి. నవలలు, కొన్ని కథలు అని లెక్కలు తీయవచ్చు కాని ఆయన వొక నవలనో కథనో రాయరు. రాయలేదు. జీవితాలని ఆవిష్కరించారు . కులం మతం వర్గం వృత్తి, ప్రాంతాల నడుమ మనుష్యుల జీవితానుభవాల వైవిధ్యాల నీడల్ని ఛాయల్ని మన చూపులకి వినమ్రంగా సమర్పిస్తారు. ఆ యా జీవితాల్లోని అంతర్గత సంఘర్షణలు బహు పార్శ్వాలుగా మన మనో రెక్కలపై వాల్తాయి. అవి మనలని సమీపించగానే మనం మనంగా వుండం. వుండలేం. యిలాంటి సమర్పణ అందరు చెయ్యలేరు.
అనేకంగా కనిపించే యింత పెద్దప్రపంచంపు జీవనసారపు అంతస్సారం వొక్కటే అనే అపారమైన అర్ధవంతమైన మానవీయమైన తాత్వికత వుంటేనే అలా సమర్పించగలరేమో… మనకి ఆ పాత్రల ఆలోచనలు, ఆశలు, కోరికలు సమస్త భావోద్వేగాలు వాటి స్వభావస్వరూపాలు అన్ని అర్ధమైపోతున్నట్టే వుంటాయి. అంతలోనే అర్ధం కానట్టనిపించి అసలు ఫలానా పాత్ర యేమంటుంది… యిలా అనలేదా అనిపిస్తుంది. మళ్ళి మరోలా అనిపిస్తుంది. ‘రాముడుండాడు రాజ్జి వుండాది’ చివరి గుడిసె ‘ మూగవాని పిల్లన గ్రోవి, ‘మునెమ్మ’ యే నవలైనా సరే చదువరి యిమేజినేషన్ కి బోలెడంత స్పేస్ యిచ్చిన రచయత కేశవరెడ్డి గారు. అలానే విషయం ఏమైనా కావొచ్చు ఆయన యెప్పుడు ఆ అంశాలకి సంబంధించిన యీస్థటిక్స్ ని అలవోకగా గుమ్మరించారు. తను తీసుకున్న జీవితాల పట్ల తను నమ్మిన సారవంతమైన సమాజం పట్ల వొక నిబద్ధత వుండటం వల్లే ఆయన రచనలు జీవితాలకి దగ్గరగా వుంటాయి. కొన్ని సందర్భాలల్లో రస్టిక్ బ్యూటీతో మనలని మెస్మరైజ్ చేస్తుంటాయి.
యిలా యెన్నెన్నో విషయాలు కేశవరెడ్డి గారి రచనల్లో నల్లని నీళ్ళ ప్రవాహంలా జరజరా పారుతుంటాయి.
యివన్ని వొక ఎత్తు అయితే, కేశవరెడ్డి గారికి సినిమాల పై బోలెడంత యిష్టం, ఆసక్తి వున్నాయి. అప్పుడప్పుడు ఆ విషయాలని మాట్లాడుకొనేవాళ్ళం. ‘చిక్కని స్క్రీన్ ప్లే రైటర్ మీరు’అన్నానోసారి. అప్పుడు మాత్రం కేశవరెడ్డి గారు సినిమాలు సినిమా కథలు స్క్రీన్ ప్లే యిలాంటి విషయాలపై ఆగకుండా మాటాడేవారు. సంభాషణ చక్కగా సాగేది. ఆయన రెండు నవలలూ త్వరలో సినిమాలుగా రూపొందుతాయని ఆశ. తన రచనల గురించి కానీ తన ఫలానా నవల చదివేరా అని కానీ ఆయన అడగటం నేనైతే వినలేదు. మనకి అనిపించినవి చెపితే శ్రద్ధగా వింటారు. అవసరమైతే తప్పా తన రచనల గురించి మాటాడరు. అసలు మనం వో విశిష్ట మైన సుసంపన్న మైన రచయతతో మాట్లాడుతున్నామనే భావన కలగదు. ఆయనెప్పుడూ యెదుటివాళ్ళ మీదకి తనలోని రచయితకి సంబంధించిన బలం, బరువు అనే వలలని విసిరేయడం నేను చూడలేదు. వినలేదు.
నేను కొత్తగా రాస్తున్నప్పుడు తను చదివినప్పుడు కేశవరెడ్డి గారికి నచ్చితే ఆ విషయం చెప్పేవారు. అంత పెద్దాయన చెపితే యెంత సంతోషంగానో అనిపించేది. ‘మైదానం’ కాలమ్ బాగుంది, కొత్తగా అన్నారు. ఆయనెప్పుడూ కొత్తగా express చెయ్యాలనే వారు. కొత్త గా చెప్పేవి ఆయనకి చాలా నచ్చుతాయి. అలా యిప్పటికి ఆయన కొత్త రచయితలవి చదివినప్పుడు నచ్చితే ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తారు. ఆ మధ్య సామాన్య ‘మహిత’ గురించి చెప్పారు. సంతోషాన్ని, బలాన్ని యిచ్చే మంచిని వొకరి నుంచి మరొకరికి మృదువైన మంచి నీటి ప్రవాహంలా ప్రవహించాలని నమ్మే నేను ఆ విషయం ఆమెకి చెప్పాను.
కేశవరెడ్డి గారు నన్ను అప్పుడప్పుడు ఆశ్చర్యఆనందాలకి లోనుచేసేవారు.’ యే అడివి వెన్నెలా మీరు రాసింది’ అని అడిగాను వొకసారి. ‘మీరు చూసిన అడివి వెన్నెల చెప్పండి’ అన్నారు కేశవరెడ్డి గారు. నన్ను మేస్మరైజ్ చేసిన వో అడివిలో వెన్నెలని ఆయన ముందు మాటలతో కుప్పపోసేను. ఆయన తనెప్పుడు అడివిలో వుండి వెన్నెలని చూడలేదన్నారు. ‘నిజమా’ అంటే చిన్నగా నవ్వేరు.
కేశవరెడ్డి గారు అప్పుడప్పుడు ‘మా వూరిలో వెన్నెల వచ్చింది.’- ‘ మీరు మీ వూరి వెన్నెలతోనే వున్నారా’ అనో ‘వెన్నెల్లాంటి మీ అక్షరాలని చదివాననో ‘ యిలా పలకరించేవారు. పోయినసారి కేశవరెడ్డి గారు ‘ వూరు వూరంతా వెన్నేలేనండి. మీరు వెన్నెల్లో వున్నారా?’ అని పలకరించారు. ఆ రోజు వాసంతోత్సవం. నేను ఫాం హౌస్ లో వున్నాను. అవునండి యిక్కడ తెల్లగులాబీల నిండుగా వెన్నేలేనండి ‘ అని చెప్పాను. ‘చూడండి ‘ నేను రాసిన అడివిలో వెన్నెలకంటే బాగుంది కదా… నిజానికి మీరు రాసే వెన్నెలా ,వాన నాకు నచ్చుతాయి’ అన్నారు కేశవరెడ్డి గారు. వో అద్భుతమైన తన రచనలో అడివిలో వెన్నెల బాగుంది అని అమాయకంగా చెప్పటం ఆ విశిష్ట మైన రచయిత యెప్పుడు మరచిపోలేదు. తన రచనల నిండుగా యెవ్వరు పట్టించుకోని సమాజం వైపు స్థిరంగా నిలబడిన కేశవరెడ్డి గారు మనుష్యుల పట్ల మృదువుగా, ప్రేమగా వుంటూ ఆత్మీయంగా పలకరిస్తూ యెందరో అభిమానుల హృదయాలని జయించారు వెన్నెలంత తేటగా.
నమస్సులు కేశవరెడ్డి గారు.
-కుప్పిలి పద్మ
వంగూరి ఫౌండేషన్ 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 1, 2015)
గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2015) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ
ఏ వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $58
“మొట్ట మొదటి రచనా విభాగం” -6 వ సారి పోటీ నిర్వహణ
కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
“నా మొట్ట మొదటి కథ”: (ఉత్తమ కథ): $116
“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): $58
యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ
ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $58
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
• ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
• తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
• రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
• బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
• విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
• విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is: March 1, 2015
Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)
sairacha2012@gmail.com & vangurifoundation@gmail.com
భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్ & హైదరాబాద్
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
www.vangurifoundation.blogspot.com
ఓ రైతు ప్రార్థన
అనగనగా ఒక రోజు రెండు రాష్ట్రాల సరిహద్దు దగ్గర అనగనగా ఒక రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు. బతికున్న రైతు కంటె చనిపోయిన రైతే రెండు రాష్ట్రాలనూ వణికించే వార్తగా మారిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. తెల్లారక ముందే ఈ వార్త సరిహద్దుకు ఒకవైపు పాలకపక్ష నాయకుడి చెవిలో పడింది. చాలా తర్జనభర్జనలే జరిగాయి. శవం ఒంటి మీద బట్టల్నిబట్టి.. రెప్పలు తెరిచే వున్న శవం కంటి కొసన వేలాడుతున్న దీనత్వాన్ని బట్టి.. వోవరాల్ గా శవం నుండి కొడుతున్న మట్టివాసన బట్టి అది తప్పనిసరిగా ఒక రైతు శవమే అని తేల్చుకున్నారు.
కొంపదీసి ఏ గాలికో రైతు శవం మనవైపు కొట్టుకువస్తే చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ అనుకుని, వెంటనే సదరు నాయకులవారు తన ఏలుబడిలో ఇలాంటివి జరగితే ఇంకేమైనా వుందా చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ అని గొణుక్కుంటూ పలుకుబడినంతా ఉపయోగించి పక్కా ప్లాన్ వేశాడు. ఆ శవాన్ని సరిహద్దుకి అవతల వైపు పడేసే ఏర్పాటు చేశాడు. క్షణాల్లో రైతు శవం సరిహద్దు మార్చుకుంది. అటువైపు కూడా అధికార పక్షం నాయకుడొకరికి ఈ వార్త చెవిని సోకింది. ఆ చెవి నుంచి ఇంకో చెవికి అది ప్రయాణం చేసేంత టైమ్ కూడా ఇవ్వకుండా ఆ లీడర్ సారు ఆర్డర్ పాస్ చేశారు. మళ్ళీ రైతు శవం సరిహద్దు మారింది. అందరినీ వణికించే చలిరాత్రి ఈసారి మాత్రం తానే గజగజలాడిపోతూ నెత్తీనోరూ బాదుకుంటూ సరిహద్దు రేఖకి ఆవలా ఈవలా వలవలా ఏడ్చింది. సరే తెల్లారింది కూడా.
ఎవరెవరో జనం వస్తున్నారు. వాళ్లు పార్టీలు వారీగా చీలిపోయి వున్నారు. అటూ ఇటూ అందరికీ అది రైతు శవమేనన్నది కర్ణాకర్ఱిగా రూఢి అయిపోయింది. కొందరు రైతు ఆనవాళ్ళకోసం వెదికారు. కొందరు రైతు కులం కోసం చూశారు. కొందరు రైతు మతం ఏంటో ఆరా తీశారు. కొందరు రైతు అక్కడివాడా ఇక్కడివాడా అన్న మీమాంసలో మీసాలు పీక్కున్నారు. సరిహద్దుకి అవతలా ఇవతలా జనం పోగయ్యారు. మీ వాడంటే మీ వాడని శవాన్ని బంతిలా అటూ ఇటూ చాలా సేపు విసురుకున్నారు. అలసిపోయాక శవాన్ని సరిగ్గా ఇరువైపులా గొడవ లేకుండా సరిహద్దులో వుంచారు.
ఇదంతా చూసిన రైతు ఆత్మకు చాలా చికాకు మొదలైంది. జనం మీద జాలికూడా కలిగింది. ఎప్పుడూ ఎవరి మీదా కోపం రాని రైతుకు అప్పుడు కూడా ఆ జనం మీద కోపం రాకపోవడం విశేషమేం కాదు. కాని జనాన్ని తనివితీరా తిట్టాలని రైతు ఆత్మ విశ్వప్రయత్నమే చేసింది. వీలు కాలేదు. అక్కడి నుంచి గాల్లో ఎటైనా ఎగిరిపోవాలనుకుంది. అంతలోనే ఒక సందేహం దేహం లేని ఆత్మను చుట్టుముట్టింది. వీళ్ళంతా కలిసి తనను ఏ రాష్ట్రానికి చెందిన వాడిగా ముద్ర వేస్తారో కదా అన్నదే ఆ సందేహం. అయితే వీళ్ళ గొడవ తేలే లోగా ఏం చేయాలబ్బా అని తల గోక్కుంది. వచ్చింది..వచ్చేసిందో ఐడియా. తను చూడాల్సిన కొన్ని ప్రదేశాలు..తను పలకరించాల్సిన కొందరు మనుషులు..తను వినాల్సిన కొందరి మాటలు..తను అర్థం చేసుకోవాల్సిన కొన్ని స్పందనలు వున్నాయి. ఈ లోగా ఆ పని ముగించుకువద్దామని రైతు అనుకున్నాడు. అదేనండి రైతు ఆత్మ అనుకుంది.
ముందుగా ఒక వైపు రాష్ట్రం అసెంబ్లీలోకి ప్రవేశించింది. అక్కడ వాడివాడిగా తన మీదే చర్చ జరుగుతోంది.
“ అధ్యక్షా ఇది మన పొరుగు రాష్ట్రం వారి కుట్ర. అక్కడ రైతు శవాన్ని కావాలనే మన రాష్ట్రంలో పడేయడానికి అన్ని పన్నాగాలు పన్నారు అధ్యక్షా! ఈ విషయంలో మాకు పక్కా సమాచారం వుంది. అయినా సరే రైతు పూర్వాపరాలు తేల్చడానికి ఒక నిజనిర్ధారణ కమిటీని ర్పాటు చేశాము అధ్యక్షా!”
ఈ మాటలు విన్న వెంటనే ప్రతిపక్షాలు తటాలున లేచాయి. “ఇది తమ బాధ్యత నుంచి తప్పించుకోడానికి పాలకపక్షం పన్నుతున్న కుట్రే గాని మరొకటి కాదు అధ్యక్షా”అని వివపక్షాలు గగ్గోలు పెట్టాయి.
అధికార పక్షం మాత్రం తక్కువ తిందా. కౌంటర్ హంటర్లు ఝళిపించింది.
“అధ్యక్షా రైతు ఇక్కడే చనిపోయాడని అనుకుందాం. కాని అప్పుల బాధతో కదా ఆత్మహత్యకు పాల్పడేది? కొత్త ప్రభుత్వానికి పాత అప్పులతో సంబంధం ఏంటో గౌరవ ప్రతిపక్ష సభ్యులు తేల్చి చెప్పాలి. ఇదంతా పాత ప్రభుత్వాల పాపఫలితమే కదా అధ్యక్షా!”
“అవును! అవును!”అని సర్కారీ పక్షం నుంచి బల్లల మోత మోగింది.
“అబద్ధం! అబద్ధం!” అని విపక్షం నుంచి ఇంకా మోత.
“అధ్యక్షా వేరే రాష్ట్రాల్లో ఇంత కంటె ఎక్కువ మంది చనిపోతున్నారు. గౌరవ సభ్యులు గణాంకాలు తెలుసుకోవాలి. మీకు ఓపిక లేకపోతే మా మంత్రివర్యులు సదరు వివరాలు అందిస్తారు విని తరించండి” అని పాలకపక్ష ప్రతినిధి సెలవిచ్చారు. మంత్రి గారు లేచి నిలబడి వివరాల చిట్టా తీశారు. విపక్షం రణగొణ ధ్వని మధ్య ఆయనలా చదువుతూనే వున్నారు. ఏ రాష్ట్రంలో ఎందరు రైతులు చనిపోయారు, గతంలో ఏ సంవత్సరంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, తమ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన మరణాలెన్ని? అసలు ఆత్మహత్యలెన్ని సహజమరణాలెన్ని, ఎన్ని సహజమరణాలను ఆత్మహత్యలుగా విపక్షాలు చిత్రీకరించాయి.. ఇలా సాగిన మంత్రిగారి గణాంకాల చిట్టా ఆంజనేయుడి తోకలా చుట్టుకుంటూ సభా భవనం మిద్దెను గుద్దుకుంది.
రైతు ఆత్మ అదిరిపడి ఇక్కడిక లాభం లేదని పొరుగు సోదర రాష్ట్రంలో అసెంబ్లీని సందర్శిద్దామని బయల్దేరింది. వెళుతూ వెళుతూ ఒక్కసారి అసెంబ్లీనంతా కలయజూసింది. ఆకాశంలో నక్షత్రమేదో కుప్పకూలినప్పుడు మనకు కనిపించే వెలగుతో పోలిన సన్నటి పొరలాంటి వస్త్రం సభ్యుల మొహాలను రాసుకుంటూ పోయింది. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని, అధికార పక్షం విపక్షాలను ఏదో కుట్ర జరిగిందన్నట్టు పరస్పరం అనుమానంగా చూసుకుని అంతలోనే సర్దుకుని రొటీన్ చర్చకు రెడీ అయ్యాయి.
పొరుగు రాష్ట్రంలోకి వెళుతూ వెళుతూ తనకి అప్పులు పెట్టిన షావుకారుగారు ఎలా వున్నారో చూసిపోదామని అనుకుంది. షావుకారు హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ కాగితాల కట్టల గుట్టలున్నాయి. రోజంతా మనం రెక్కలు ముక్కలు చేసుకుని పొలం పనుల్లో మునిగిపోతాం. మనలాంటివాళ్ళను ఆదుకోడానికి ఆయన ఇంకెంత కష్టపడుతున్నాడో కదా అని రైతు ఆత్మకు జాలేసింది. తనకు అప్పుపెట్టడమే కాదు..తాను అదిగో ఇదిగో అని అప్పు కట్టకుండా గడిపేస్తుంటే ఎందుకూ కొరగాని తన పొలాన్ని ఆయన పేర రాయించుకోడానికి ఎంత బాధపడ్డాడో కదా షావుకారు అని రైతు ఆత్మ కన్నీళ్ళు.
అంతెందుకు పెళ్ళాం పుస్తెల తాడు తెచ్చినప్పుడు అది తీసుకోడానికి ఆయన చేతులెంత తడబడ్డాయో ఇంకా రైతుకు గుర్తే వుంది మరి. కొంతైనా వడ్డీ డబ్బులు చెల్లించడానికి మిగిలిన కాడెద్దుల్ని అమ్మేయాలని సంతకు తీసుకు వెళుతంటే షావుకారు వూరి కొసదాకా వచ్చి సాగనంపి జేబులో కొన్ని డబ్బులు కుక్కి ఆకలేస్తే కాఫీ తాగరా అని కండువాతో షావుకారు కన్నీరు తుడుచుకున్న దృశ్యం రైతు ఆత్మ తలచుకుని తలచుకుని కుమిలిపోయింది.
పడుకున్న రైతు చుట్టూ కాసేపు ప్రదక్షిణలు చేసింది. కమ్మర కొలిమి దగ్గర గాలి తిత్తు పైకీ కిందికీ కదులుతున్నట్టు వూగుతున్న షావుకారు పొట్ట మీద కాసేపు కూర్చుంది రైతు ఆత్మ. ఈయన రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించి ఆలోచించి పుణ్యాత్ముడు తనలాంటి వాళ్లకి ఎందరికో ఇలాగే ఆయన అప్పులు పెట్టి ఆదుకోవాలని..అంతటి ధర్మాత్ముణ్ణి దేవుడా నువ్వే కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్థించింది. వెళుతూ వెళుతూ షావుకారు ఇంట్లో ఒక మూలన పడివున్న ఎరువులను, మందులనూ చూసింది. పంటకు పట్టిన పురుగుల్ని చంపలేని మందు కనీసం తననైనా చంపి రుణం తీర్చుకుందని ఒక ఎండ్రిన్ డబ్బాను చేతుల్లోకి తీసుకుని వాసన చూసి ఆహా బతుకు వాసన ఎలా వుంటుందో ఇన్నాళ్ళకి తెలిసింది కదా అనుకుని అక్కడి నుండి కదిలింది.
సమయం మించిపోతోందని అక్కణ్ణించి తటాలున ఎగిరి పొరుగురాష్ట్రం అసెంబ్లీలో వాలింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీటవుతోంది. తన మీదే చర్చ జరుగుతోందని తెలుసుకుని రైతు ఆత్మ కొంచెం సంబరపడింది. కాని రాష్ట్రాలు వేరైనా డైలాగులు.. కొట్లాటలు..వాదోపవాదాలు..ఎత్తు
వెంటనే తన మృతదేహం పడివున్న చోటుకు బయల్దేరింది. ఇరు రాష్ట్రాల ప్రజలు తన గురించి గొడవ పడకుండా లెక్కలు తేల్చుకున్నారో లేదో ఒకసారి చూసొద్దామని అటు ప్రయాణం కట్టింది. వెళుతూ వెళుతూ ఎండిన తన పొలాన్ని పలకరిద్దామని అక్కడ కాసేపు వాలింది. బీటలు వారిన పొలంలో కూర్చుని, తన కోసం శూన్యంగా చూస్తున్న తన భార్య కూడా కనిపించింది. ఒంటికి అంటిన మట్టిని స్నానం చేసి వదిలించుకోవచ్చు. జీవితం చుట్టూ గుండె చుట్టూ అంటిన మట్టి బంధాన్ని ఎలా వదిలించుకోవాలి? అదేమో కాని ఒక్క వేలిముద్రతో పొలం జంజాటం వదిలించుకున్నాడు. కాని ఒక్క పసుపుతాడుతో ఒంట్లోని నరాలనన్నీ తన చుట్టూ చుట్టేసుకున్న పెళ్ళాన్ని ఎలా వదిలి పోవాలో రైతుకు అర్థం కాక ఎంత సతమతమయ్యాడో. అయినా తప్పలేదు. తననే నమ్ముకున్న భార్యను ఒంటరిగానే వదిలేసి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్యను పొలంలో ఒంటరిగా చూస్తే రైతు ఆత్మకు బోరున ఏడవాలనిపించింది. భార్య ఖాళీ ఖాళీ కళ్ళలోకి..అక్కడి నుండి ఆమె గుండెల్లోకి..అక్కడి నుండి ఆమె శరీరం లోపలా బయటా అంతటా ఓసారి రైతు ఆత్మ కలతిరిగింది. ఎక్కడా ఏమీ తగల్లేదు. ఒకటే శూన్యం. వచ్చే జన్మలోనైనా ఒక గొప్ప ధనవంతుడైన రైతుని ఆమెకు భర్తగా ప్రసాదించమని రైతు భగవంతుణ్ణి వేడుకున్నాడు.
తిరుగు ప్రయాణం కడుతూ ఒక సారి కలయజూసింది. ఎండిన బోరు కనిపించింది. అందులోకి చొరబడి బోరులో అడుగుకంటా వెళ్ళింది. అడుగున నీళ్ళు వుండే వుంటాయని, తనకే నీళ్ళందలేదని రైతు నమ్మకం. కనీసం ఆ నీళ్ళను కళ్ళ చూద్దామని రైతు ఆశ. ఆత్మ లోపల్లోపలకి..ఇంకా లోపలికి వెళుతూనే వుంది. భూమి అడుగు పొరల్లో కూడా ఎండమావులుంటాయా అని రైతుఆత్మ ఆశ్చర్యపోయింది. నీళ్ళు కనపడుతూనే వున్నాయి కాని తనకి తడి తగలటం లేదు. అయినా తనిప్పుడు చనిపోయింది కదా..బహుశా నీళ్ళ తడి తనను తాకదేమో అనుకుని పైకి వచ్చేసింది. అటూ ఇటూ దిక్కులు చూస్తే కరెంటు స్తంభం, దాన్నుంచి ఒక వైరు పొడవుగా సాగి పొలం దగ్గరున్న చిన్న కరెంటు మీటర్ దాకా వచ్చింది. మీటర్ దగ్గరకు వెళ్ళింది. మీటరు జోరుగా తిరుగుతోంది. ఆశ్చర్యంగా వుంది. కరెంటు కళ్ళజూడ్డమే గగనమైన రోజులు తాను గడిపాడు.
తాను పోయిన తర్వాతైనా కరెంటుకు తన మీద జాలికలిగిందన్న మాట అనుకుని నీళ్ళకోసం ఏర్పాటు చేసిన మోటరు స్విచ్చి నొక్కింది. కాని పంపునుండి ఒక్క బొట్టు కూడా పడలేదు. ఏందబ్బా అనుకుని కరెంటు తీగ పట్టుకుని వేళ్ళాడింది. అయినా తనకేమీ షాక్ కొట్టలేదు. ఏమో తనిప్పుడు చనిపోయిన వ్యక్తికదా తనకంతా ఇలాగే వుంటుందేమో అనుకుని అక్కడి నుండి రైతు ఆత్మ సర్రున బయల్దేరి గాల్లో ఎగురుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. భార్య కళ్ళలో ఇప్పుడు సుళ్ళు తిరిగిన నీళ్ళు కనిపించి నిట్టూర్చింది. యథాప్రకారం తన మృతదేహం దగ్గరకు వెళ్ళి అందులోకి దూరి జనం మాటలు వింటోంది. అక్కడ విషయం ఒక కొలిక్కి రాలేదు. సరిహద్దుకి ఆవలా ఈవలా రాష్ట్రస్థాయి నాయకులు, స్థానిక నాయకులు శవం మాది కాదంటే మాది కాదని కొట్టుకుంటూనే వున్నారు. రైతు ఆత్మ వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నవ్వుకుంటూనే వుంది.
జర్నలిస్టుల హడావుడి ఇక అంతా ఇంతా కాదు. శవం ఎటు పక్కదో తెలిస్తే గబగబా వార్తలు అందించ వచ్చని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. శవం అటుదని తేలితే ఒక వార్త..ఇటుదని తేలితే ఒక వార్త ముందే రాసి వుంచుకున్నారు. ప్రస్తుతానికి శవం మూలాలు ఇంకా తెలియటం లేదన్న బ్రేకింగ్ న్యూస్ మాత్రం అప్ డేట్ చేసి పంపిస్తున్నారు. కొన్ని ఛానళ్ళయితే స్టూడియోల్లో వైద్య నిపుణుల్ని..డి.ఎన్.ఏ. పరీక్షల నిపుణుల్ని కూర్చోబెట్టి చర్చోపచర్చలు కొనసాగిస్తున్నాయి. మనిషి శవాన్ని బట్టి అతను ఏ ప్రాంతం వాడో తెలియజేసే డి.ఎన్.ఏ. పరీక్షలు ఇంకా అందుబాటులోకి రాలేదని నిపుణులు వాపోతున్నారు.
ఉత్కంఠను అలాగే కొనసాగించడానికి యాంకర్లు అష్టవంకర్లు తిరుగుతూ నానా యాతనా పడుతున్నారు. హృదయ స్పందనకు కూడా ఒక ప్రాంతం అంటూ వుంటుందా అన్నది పాపం అమాయక రైతు ఆత్మకు అర్థం కాలేదు. చనిపోయిన రైతు అంటే వార్తాహరులకు ఇంత మమకారమా అని రైతు ఆత్మ ఎంతగానో మురిసిపోయింది. ఒక రైతు గురించి ఇంతగా తపనపడుతున్న వీరందరినీ చల్లగా చూడమని దేవుణ్ణి ప్రార్థించింది.
ఇంతలో రైతు ఆత్మకు ఒక చెట్టు పక్కన ఒక మనిషి కన్నీరు మున్నీరై ఏడుస్తున్నట్టు కనిపించి అయ్యో తన కోసం ఇంతగా రోదిస్తున్న అమాయకుడు ఎవరా అని పరిశీలించింది. వినగా వినగా అర్థమైంది ఏమంటే అతనో గాయకుడు. ప్రజల ఈతిబాధలే తన పాటలుగా మలిచే ప్రజాకవి. శవం అటు పక్కదని తేలితే ఎంతో గొప్పగా రాయొచ్చని, కాని ఖర్మకాలి ఇటుపక్కదని తేలితే ఏమీ రాయలేం కదా అని, అటా ఇటా తన పాట ఎటని తేల్చుకోలేక తెగని ఉత్కంఠను తట్టుకోలేక బోరుమని విలపిస్తున్నాడు.
గడ్డి పువ్వు గాలికి కందినా గాయపడే హృదయం గలవాడు. ఈయనకెందుకింత కష్టం వచ్చిందిరా భగవంతుడా అని రైతు ఆత్మ దీనంగా మూలిగింది. అలాగే రైతుల మీద కథలు రాసేవారు..రైతు మీద బొమ్మలు గీసే వారు..రైతు మీద వ్యాసాలు రాసేవారు..అక్కడే పక్కపక్కన కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ కలాలను..కాగితాలను పట్టుకుని పనిలోకి ఎప్పుడుదిగుదామా అని రైతు శవం దిశగా చూస్తూనే వున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ కళాకారుడికీ ఇంతటి సంకటం రాకుండా చూడమని దేవదేవుడికి నివేదించుకుంది రైతు ఆత్మ.
ఇంకా అక్కడే వుంటే తన శవాన్ని ముక్కముక్కలుగా చేసి మూలాలు వెదికే పనిలో వీళ్ళంతా పడతారని అది తన కళ్ళరా చూసి తట్టుకోలేనని రైతు ఆత్మ భావించి ముందుకు ఎగిరింది. ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు.. ఎటో చటుక్కున ఎగిరిపోయింది.
రైతు ఆత్మ విమానాశ్రయంలో వాలింది. అక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కొలువుదీరినట్టు కూర్చున్నారు. ఎవరి వందిమాగదులు వారి చెంత నిలబడ్డారు. వాళ్ళిద్దరూ అక్కడకు రాకముందే రెండుమూడు గంటలపాటు వాస్తునిపుణుల రాకతో పెద్ద కోలాహలమే జరిగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఏ ప్రదేశంలో కూర్చోవాలి..ఎటు తిరిగి కూర్చోవాలి..వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాలు ఏ దిశగా ల్యాండవ్వాలి.. అన్నీ కూలంకషంగా వాస్తు నిపుణుల బృందాలు పరిశీలించాయి. ఆ తర్వాతే అక్కడకు ముఖ్యమంత్రుల రాక జరిగింది. వాళ్ళిద్దరూ ఎయిర్ పోర్టులోకి ప్రవేశించేటప్పుడు ఒకరికొకరు ఎదురు పడకుండా..కూర్చొనేటప్పుడు ఒకరికొకరు కనిపించే అవకాశం లేకుండా అన్నీ వాస్తు ప్రకారమే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ చెరో వైపూ నిండుగా కూర్చున్నారు. ఒకరు సింగపూర్ విమానం కోసం, మరొకరు జపాన్ విమానం కోసం వేచి వున్నారు. వారికి పక్కనే కొందరు మంత్రులు..కొందరు అధికారులు ఏవో కాగితాల కట్టలు పట్టుకుని నిలబడ్డారు.
వున్నట్టుండి వారు ముఖ్యమంత్రుల చెవుల్లో ఏదో చిలుకుతున్నారు. విషయం చాలా సీరియస్సే మరి. సింగపూర్ లోనూ జపాన్ లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా? చేసుకుంటే ఏ విధానాలు అవలంబిస్తారు? వారి సమస్యను ఆ ప్రభుత్వాలు ఎలా డీల్ చేస్తాయి ? అని పరిశీలించడానికి అత్యున్నత శాసనసభాపక్ష కమితో పాటు ముఖ్యమంత్రులు హుటావుటిన బయల్దేరారు. ఉదయం సభలో గందరగోళం చూసి వెంటవెంటనే నిర్ణయాలు చేసి సాయంత్రం ఫ్లయిట్ కే బయలెల్లారు.
రైతు ఆత్మ విమానాశ్రయంలోకి ఎంటరయ్యిందో లేదో ఒక గొప్ప మెరుపు మెరిసినట్టు..వెంటనే చీకటి అలముకున్నట్టు..ఆ వెంటనే వాన కురిసినట్టు..వెనువెంటనే భూమి కంపించినట్టు..ఆ వెంటనే మంటల మాదిరి ఎండలు కాచినట్టు అక్కడున్న వారందరికీ అనిపించింది. ఎవరికీ అర్థంకాక ఎవరినీ ఏమీ అడగడానికి రాక అలా వుండి పోయారు. అంతలో విమానాలు రెండూ ఒకేసారి రన్ వే మీద చప్పుడు చేసుకుంటూ దిగినట్టు అనిపించి అంతా కాస్త శాంతించారు. రెండు టీముల వారూ రెండు విమానాల్లో ఆసీనులయ్యారు. రైతు ఆత్మ రెండు విమానాల్లోనూ ఒకేసారి ప్రవేశించింది. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒకసారి చుట్టూ పరికించారు గర్వంగా.
ఉన్నట్టుండి సీట్లన్నీ ఖాళీగా కనిపించి ఉలిక్కిపడ్డారు. తదేకంగా చూశారు. ఖాళీ సీట్లలో ఏదో వెలుగుతో కూడిన నీడలాంటిది మెదలడం కనిపించి చేబుల్లోంచి రుమాళ్లు తీసి చెమటలు పట్టిన ముఖాలు తుడుచుకున్నారు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ డ్రైవర్ సీటువైపు నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పసాగింది. ముఖ్యమంత్రులు చెవులు రిక్కించి విన్నారు. ఎంత విన్నా రైతులు..వారి మరణాలు..ఆత్మహత్యలు..జాగ్రత్తలు ఇవే వినపడుతున్నాయి.
అంతలోనే ఎయిర్ హోస్టెస్ కూడా తెల్లని నీడలా మారిపోయింది. ఇద్దరూ భయపడ్డారు. గట్టిగా అరుద్దామనుకున్నారు. కాని నోళ్ళు పెగల్లేదు. రైతు ఆత్మ ఇక వెళదామని నిర్ణయించుకుంది. తన కోసం విదేశాల ప్రయాణం కట్టినవారినందరినీ పేరుపేరునా ఆశీర్వదించింది. ఒక రైతు కోసం ఇంతగా కష్టపడే ఇలాంటి ప్రభువులనే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేట్టు చూడమని దైవానికి మొక్కుకుంది. అప్పుడు విచిత్రంగా రైతు కళ్ళు చెమర్చాయి. విమానాలు, వాటిలో ఆసీనులైన ఏలినవారు ఒకేసారి ఊపిరి పీల్చుకున్నారు.
ప్రేమోత్సవం
సాంధ్య రాగం పిలిచే వరకూ
సూర్యుడి ప్రేమని నిండా కప్పుకుని నిదురిస్తుంది చీకటి
ఆకాశాన్ని ప్రేమిస్తూ
తన ఆరాధనంతా పూవుల్లోనో, పళ్ళలోనో
ఏదీ లేకుంటే తన దేహంలోనో నింపుకుని
ప్రేమకి నిర్వచనమవుతుంది చెట్టు
రాళ్ళని అలంకరించే సెలయేట్లోనూ
విశ్వమోహన రహస్యాల్ని గుండెల్లో దాచుకున్న లోయల్లోనూ
మట్టి పొత్తిళ్ళలో గుర్తింపుకి నోచుకోని చిట్టి రాళ్ళలోనూ
అన్నిట్లోనూ ప్రేముంది.
కారణాల్లేకుండానే ప్రేమ పంచగల దమ్ముంది.
మనిషికి మాత్రం
కాలమంతా ప్రేమమయం కావాలనేమీ లేదుగానీ
నియంత్రిత నైసర్గిక ప్రపంచాన్ని దాటి
శిఖరాగ్రం మీద కాసేపు
తన గుండె చప్పుడు తాను వినడానికీ
నక్షత్రాల వెలుగు లిపిలో మనసు వ్రాసుకోవడానికీ
అరణ్య పుష్ప సుగంధాల్లో స్నానించి
స్వప్న గ్రంధాల్ని ఆవిష్కరించుకోడానికీ
ఓ కారణం తప్పకుండా కావాలి.
-ప్రసూన రవీంద్రన్
(painting: Mamata Vegunta)
తాజా కామెంట్లు