Archives for February 2015

మహాత్ముడి అడుగు జాడల్లో….

satyam mandapati రెండేళ్ళ క్రితం మేము ఇండియా వెళ్ళినప్పుడు, ఆస్టిన్ నించీ ముందు భారత రాజధాని ఢిల్లీకి వెళ్ళి, తర్వాత ఆంధ్రాకి వెళ్ళాం. నేను ఎప్పుడో, కొన్ని దశాబ్దాల క్రితం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు, మా కాలేజీ విజ్ఞాన యాత్రలో వెళ్ళానుగానీ, ఇప్పుడు ఇన్నాళ్ళకి శ్రీమతితోనూ, మా వంశోధ్ధారకుడితోనూ వెళ్ళాం.

ఢిల్లీలో చూడవలసినవే కాక, ఆగ్రా, జైపూర్, అమృత్సర్, వాఘా సరిహద్దు మొదలైనవి కూడా చూశాం.

ఈ వ్యాసంలో మాత్రం ఒక్క ఢిల్లీ గురించే వ్రాస్తున్నాను.
ఎన్నో దశాబ్దాల తర్వాత డిల్లీ చూస్తున్నానేమో, అంతా వింతగా కనిపించింది. ముఖ్యంగా ఆరోజుల్లో ఢిల్లీ చూసినప్పుడు, ఏ విషయాలు పట్టించుకోకుండా, మిగతా స్టూడెంట్ కుర్రాళ్ళతో కలిసి సరదాగా చూశాం. ఇప్పుడు, ఎన్నో దేశాల రాజధానులు, ఇతర పెద్ద నగరాలు చూసిన తర్వాత, డిల్లీ నగరాన్ని ఇంకొక కొత్త కోణంలో చూశాను.
నేను మామూలుగా ఈ విహారయాత్రలు వ్రాస్తున్నప్పుడు, ముందుగా ఆయా ప్రదేశాల గురించి కొంత చరిత్ర కొన్ని గణాంకాలు ఇవ్వటం ఒక అలవాటుగా చేసుకున్నాను. అందుకని ఢిల్లీ గురించి కొంచెం తెలుసుకుందాం.
బ్రిటిష్ వారు వచ్చేదాకా, భారతదేశం అనే ఒక దేశం ఈనాటి ఎల్లలతో మనకి లేనే లేదు. రకరకాల సామ్రాజ్యాలు ఢిల్లీ రాజధానిగా వుండేవిగానీ, నేను చారిత్రకంగా అంత వెనక్కి వెళ్ళటం లేదు.
మొఘల్ సామ్రాజ్య కాలం నుండి, ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఆ సామ్రాజ్యానికి మాత్రం, ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. తర్వాత బ్రిటిష్ రాజ్ కాలంలో, డిసెంబరు 1911 వరకూ భారత రాజధానిగా కలకత్తా నగరం వుండేది.1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. బ్రిటిష్ రాజ్ పెద్దలు పరిపాలనా సౌలభ్యం కోసం, రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించారు. భారత చక్రవర్తి 5వ జార్జి, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని ప్రకటించాడు.
భారత స్వాతంత్ర్యం తరువాత, 1947లో, కొద్దిపాటి స్వయంప్రతిపత్తిని ఇచ్చి, భారత ప్రభుత్వంచే నియమించబడ్డ ప్రధాన కమీషనరుకు పరిపాలనాధికారాలు ఇవ్వబడ్డాయి. 1956లో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటింపబడింది, అలాగే ప్రధాన కమీషనర్ స్థానే లెఫ్టినెంట్ గవర్నర్ని నియమించారు. పూర్వపు జాతీయ రాజధాని ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
ఢిల్లీ – న్యూ ఢిల్లీ ప్రాంతీయ వైశాల్యం 17,841 చదరపు మైళ్ళు, అందులో 21,753,486 జనాభా వున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక దేశానికి రాజధాని నగరం ఎంత అందంగా, శుభ్రంగా వుండాలి అనేది న్యూడిల్లీ నగరం చెబుతుంటే, అదే రాజధాని చెత్తా, చెదారంతో ఎంత అశుభ్రంగా వుంటుందో పాత ఢిల్లీ చెబుతుంది.

satya3
కొత్త ఢిల్లీ నగరం నన్ను ఆకట్టుకుందనే చెప్పాలి. పెద్ద పెద్ద రోడ్లు, శుభ్రంగా వున్నాయి. కార్లు, స్కూటర్లలో వెళ్ళేవాళ్ళు మన హైద్రాబాదులోలా కాకుండా, రూల్స్ పాటించి ఒక పద్ధతిగా, రోడ్డు మీద వెడుతుంటే ముచ్చటగా వుంది. పెట్రోలు వాడకం తగ్గించి, నాట్యురల్ గాస్ వాడుతున్న విధానం కూడా నాకు నచ్చింది. బస్సులూ, ఆటోలు, టాక్సీలు, నాట్యురల్ గాస్ మీద నడుస్తుంటే, వాటికి ఆకుపచ్చరంగు వేశారు. చాల రోడ్లకి ఇరుపక్కలా, పచ్చటి చెట్లూ, పూల మొక్కలూ, అందాన్నే కాక చల్లటి నీడనూ ఇస్తున్నాయి.
ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, మన ఉత్సాహాన్ని బట్టీ, అభిరుచిని బట్టీ ఎన్నో వున్నాయి. చరిత్ర మీద సరదా వున్నవారికి, ఇక్కడ చూడటానికి ఎన్నో వున్నాయి.

satyam1మొగలాయీల కాలం నాటి, కుతుబ్ మీనార్, జమా మసీదు, ఎర్రకోట, హుమాయూన్ సమాధి.. ఇలా ఎన్నో వున్నాయి. కుతుబ్ మీనార్ ప్రపంచం మొత్తం మీద, ఇటుకలతో కట్టిన ఎత్తయిన బురుజు అని చెప్పారు. దీన్ని1206వ సంవత్సరంలో కట్టారుట. దీనిమీద ఖురాన్ లోని కొన్ని నీతి వాక్యాలు చెక్కారు. అక్కడే ఒక ఇనుప స్థంభం, ఏనాటిదో ఇంకా తుప్పు పట్టకుండా వుంది.

తర్వాత ఎర్ర కోట చూశాం. దాన్ని 1638లో ఆనాటి మొగల్ చక్రవర్తి షాజహాన్ కట్టించాడు. దీన్ని రెండు వందల సంవత్సరాలు, నలుగురు చక్రవర్తులు తమ నివాస స్థలంగా వాడుకున్నారు. గోడలు రెండు మైళ్ళ పొడుగున వున్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ నిర్మాణ విశేషాలు చూసి, ఇది కట్టారు అంటారు. ఇక్కడ రాత్రి పూట లైట్ అండ్ సౌండ్ షో వుంటుంది అన్నారు కానీ, మేము అక్కడికి పగలు వెళ్ళటం వల్ల అది చూడలేదు. 
జమా మసీదు దగ్గరలోనే వుంది. దాన్ని 1650లో కట్టారు. ఇది భారతదేశంలోకల్లా పెద్ద మసీదు. దీనిని కట్టటానికి 13 సంవత్సరాలు పట్టిందిట. 25,000 మంది భక్తులు పట్టేంత స్థలం వుంది అక్కడ. ఇది కూడా షాజహాన్ కట్టించినదే.

హుమాయూన్ సమాధి 1570లో కట్టారు. రెండవ మొగల్ చక్రవర్తి హుమాయూన్ అక్కడే సమాధి చేయ బడ్డాడు.
బహాయ్ మతం వారు కట్టిన ‘లోటస్ టెంపుల్’ ఇంకొక చెప్పుకోదగ్గ కట్టడం.

ఇక జంతర్ మంతర్ కూడా ఢిల్లీలోనే వుంది, కానీ మేము జైపూరులో అది చూసినందువల్ల అక్కడికి వెళ్ళలేదు.
పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ మొదలైనవి బయట నించే చూశాం. విశాలమైన రోడ్లు, రకరకాల చెట్లతో ఎంతో అందంగా వుండే ప్రదేశం.
చెప్పుకోదగ్గ ఇంకొకటి, ఇండియా గేట్. మేము సాయంత్రం వెళ్ళటం వల్ల, పగటి పూట ఎలా వుంటుందో చూశాం, రాత్రి పూట లైట్లలో ఎలా వుంటుందో చూశాం. 1921లో కట్టిన, 138 అడుగుల ఎత్తైన గొప్ప కట్టడం ఇది.

satya2
ఇక మేము, ముఖ్యంగా నేను, ఢిల్లీ వెళ్ళిన కారణం చెబుతాను. నాకు మొదటినించీ మహాత్మా గాంధీ అంటే ఎంతో గౌరవం, భక్తీ, ప్రేమ, ఒక విధమైన ఆరాధనా భావం వుంది. ఒక అతి సామాన్యుడైన మనిషి, ఒక దేశ చరిత్రనే మార్చగల శక్తిమంతుడవుతాడెలా అవుతాడో, చేసి చూపించిన మనిషి. ప్రపంచంలో మూడు వంతుల దేశాల్ని, తమ చేతుల్లో పెట్టుకుని ఆటలాడిస్తూ, దేశ సంపదని దోచుకుంటున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఒక్క అంగవస్త్రం కట్టుకుని, కేవలం అహింసా మార్గంతో, వారిని గడగడలాడించిన ధీరుడు, మహాత్ముడు మన గాంధీ. మార్టిన్ లూధర్ కింగ్, మాండేలా, మదర్ థెరేసా లాటి వారందరూ మహాత్ముడికి ఏకలవ్య శిష్యులే! అలాటి నా అభిమాన మహాత్ముడి సమాధి దగ్గర నివాళి అర్పించటం, ఆయన తన జీవితంలో చివరి మూడు నెలలు పైగా గడిపిన బిర్లా భవన్ చూడటం, నా తీరని కోరికలు. అందుకే ఒక రోజంతా, ఆ రెండూ చూడటానికే కేటాయించాం.
ఆరోజు ప్రొద్దున్నే బిర్లా భవన్ చూడటానికి వెళ్ళాం. దాదాపు సాయంత్రం దాకా అక్కడే వుండి, తర్వాత గాంధీ సమాధి చూడటానికి వెళ్ళాం.

ఆనాటి బిర్లా భవన్, పేరే ఈనాటి ‘గాంధీ స్మృతి’.

మహాత్మా గాంధీ, తన చివరి నూట నలభై రోజులు, ఇక్కడే ప్రశాంతంగా గడిపారు.

satya4
ఆయన నివసించిన గది, పరుపు, రుద్రాక్షమాల, వ్రాసుకునే బల్లా, చరఖా, ఒక చిన్న చెంబు, చేతి కర్ర, మూడుకోతుల బొమ్మ – ఇవే ఆయన చిరాస్థులు… కోట్లమంది ప్రజల హృదయాలే ఆయనకి స్థిరాస్తులు మరి!

ఆయన జీవిత విశేషాలూ, ఆయన ఆచరించి, చెప్పిన ఎన్నో సూక్తులు, ఆయన గురించి ప్త్రపంచ ప్రసిద్ధులైన కొందరు చెప్పిన మాటలు… కొన్ని వందల ఫొటోలు, చిత్రాలూ వున్నాయి. ఒక్కటీ వదిలిపెట్టకుండా అన్నీ దీక్షగా చూడటమే కాక, నేనూ వాటికి ఫొటోలు తీసి, భద్రంగా దాచుకున్నాను. కొన్ని విడియోలు, వార్తా చిత్ర సినిమాలు చూపిస్తున్నారు.
ఆయన చివరిరోజు, ప్రార్ధన చేయటం కోసం వెడుతున్నప్పుడు, వెళ్ళిన దారిలో ఆయన పాదాలను ముద్రించారు.

satya

చివరికి ఆయన చనిపోయిన చోటు చూస్తుంటే, నిజంగా నాకు కన్నీరు ఆగలేదు.
ఎంతటి మహాత్ముడి జీవితం ఎలా అంతమయింది అని బాధ వేసింది.

ఢిల్లీ దరిదాపుల్లోని చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళ స్కూలు అధికారులు తీసుకు వచ్చి, మహాత్ముడి జీవిత విశేషాలని వివరించి చెబుతుంటే, నాకు ఎంతో ముచ్చట వేసింది. ఈ తరం పిల్లలకు మన స్వాతంత్ర పోరాటం గురించీ, ఆ పోరాటంలో అసువులు బాసిన మహోన్నత వ్యక్తుల గురించీ చెప్పటం ఎంతో అవసరం.

చివరగా యమునా నదీ తీరాన వున్న రాజ్ ఘాట్ చూశాం. అక్కడే నెహ్రూ, ఇందిర మొదలైన పలువురు రాజకీయ నాయకుల సమాధులు వున్నాయి. నాకు అవేవీ చూడబుధ్ధవలేదు. సరాసరి గాంధీ సమాధి దగ్గరకు వెళ్ళాం.

stya1ఆ సమాధి దగ్గర, కళ్ళు మూసుకుని మౌనంగా నుంచుని వుంటే.. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అలా దాదాపు ఒక పావుగంట పైనే, కదలకుండా నుంచున్నాను. మనసులో ఎన్నో ఆలోచనలు. స్వాతంత్ర సమరం, మహాత్ముడి జీవితం, నేను ఆయన గురించి చదివిన పుస్తకాలు, ముఖ్యంగా ఆయన వ్రాసిన పుస్తకం, “My Experiments with Truth”, అట్టిన్బరో తీసిన ‘గాంధీ’ సినిమా అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. అలా ఎంత సేపు నుంచున్నానో నాకే తెలియలేదు. తర్వాత శ్రీమతి అంది, ‘ఏమిటి.. అంతసేపు కదలకుండా నుంచున్నావ్. నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని వూరుకున్నాను” అని.

 

అంతటి మహాత్ముడికి మనం ఇచ్చే నివాళి ఒక్కటే! ఆయన చెప్పిన, చేసిన గొప్ప పనులు మనమూ పూర్తిగా అర్ధం చేసుకోవటానికి, కనీస ప్రయత్నం చేయటం! అర్ధమయినవి మనసా, వాచా ఆచరించటం!

-సత్యం మందపాటి

satyam mandapati

అతడొక అరణ్యం…అతడొక యుద్ధం!

బాల సుధాకర్

బాల సుధాకర్

(కవి బాల సుధాకర్ మౌళికి కొలకలూరి ప్రత్యేక పురస్కారం లభించిన సందర్భంగా)

1

క౦టికి కనపడిన ప్రతి తడి దృశ్య౦లో చెలమ త్రవ్వి  విస్మృతానుభావాలను దోసిళ్ళతో తోడుకోని, వార బోస్తూ , గు౦డెల్లో ఒక అలికిడిని సృష్టిస్తూ, అలజడి లేపుతూ ఉ౦డే  కవిత్వాన్ని రాయాల‌నే మనస్తత్వం  బాల సుధాకర్ మౌళిది.  కొన్ని కవితలు చదువుతు౦టే, కళ్ళెదుటే మానవత్వ‍౦  నడిబజారున చప్పున జారిపడుతు౦దేమో అనిపిస్తు౦ది. ఆశావాది. అతనె౦తటి ఆశావాదో  ఆ కవితా స౦కలన౦   పేరులోనే  కనిపిస్తు౦ది..విప్లవనేపధ్య౦. ప్రా౦తీయ వెనుకబాటుతన౦ సుధాకర్   కవిత్వాన్ని పిడికిలి బిగి౦చమని అదేశి౦చాయనిపిస్తు౦ది.  అలా పిడికిలి బిగి౦చేలా చేసేటి  నైపుణ్య౦ సుధాకర్ లో ఉన్న విషయ౦ ఆ ప్రా౦త వెనుకబాటుతన౦ గుర్తి౦చి౦ది.   సుధాకర్ కవిత్వాని చదివితే  కళి౦గా౦ద్ర నేపధ్యాన్ని దాదాపు చదివినట్లే.  కవిత్వ౦ ని౦డా సహజత్వ౦ ఉ౦డాలని ప్రాకులాడి అతుకుల బొ౦తను కుట్టుకొనే మనస్తత్వం కాదు సుధాకర్ ది.  రాసుకొ౦టూ పోతాడు. సహజత్వ౦ దాన౦తట అదే వచ్చి వాలుతు౦ది.

గు౦డెల్లో  ఆర్ధ్రత పుట్టిన తర్వాత  అతనికి ఈ వ్యధా భరిత దృశ్యాలు కనిపి౦చాయో? లేక వాటిని చూసిన తర్వాత అతనికి ఆర్ద్రత కలిగి౦దో  తెలుసుకోవాల౦టే.. ఆయన కవిత్వాన్ని అతి సూక్ష్మ౦గా పోస్ట్ మార్ట౦ చేసుకొ౦టూ  పోవాల్సి౦దే. లోపలి లోపలి పొరల్లో ఎక్కడో చివరి కణ౦లో ఆయన కవితా జాడల్లోని మర్మాన్ని కనుగొనవచ్చునేమో!  భావ౦, అనుభవాల  మధ్య కవి సమన్వయ౦ కుదుర్చుకోవాలనీ, అ౦దుకు తగిన శ్రమ చేయాల్సి ఉ౦టు౦దని విశ్లేషకుల అభిప్రాయ౦.  అనుభవ  స౦గ్రహాన్ని భావ౦తో సరిచేయక పోయినా కవిత్వ౦  విఫలమైనట్లే.. అలాగే కవి వాడే పదాలు తన భావాన్ని మోయలేకపోయినా విఫలమైనట్లే.  దీనిపై ప్రత్యేక శ్రద్ద వహి౦చినట్లు అనిపి౦చక పోయినా,  సుధాకర్ కవిత్వ౦లో అవి సహజ౦గా ఏర్పడి అ౦దాన్నిచ్చాయి.

కవిత్వ౦లో  అభివ్యక్తి ప్రాధాన్యము 80 తర్వాత వచ్చిన కవిత్వ౦లో అధిక౦గా విస్తరిస్తూ వచ్చి౦ది. సుధాకర్ దాన్ని అతి సునాయస౦గా అ౦దిపుచ్చుకొన్నాడు.. చటక్కున పాటకుడి హృదయాన్ని దున్ని, అక్కడ నీళ్ళు జిలకరి౦చి, ఏవో క్రొత్త చైతన్య భీజాలు నాటి అక్కడికక్కడే మొలకలు సృష్టి౦చే ప్రయత్న౦ బాలసుధాకర్ ది. కొన్ని కవితలు మి౦గుడు పడవు. కొన్ని శ్వాసకు అడ్డుతగులుతాయి.. కొన్ని  మెలిపెడతాయి. కొన్ని మనల్ని ఖ౦డఖ౦డాలుగా నరికేస్తాయి.  నిస్సత్తువను, పిరికి తనాన్ని, చేతకాని తనాన్ని , అప్రయోజనాలను   పాటకుడి హృదయాన్ని  గునపాలతో గుచ్చి చూపెడతాడు.  ఎప్పటి ను౦డో  నాకో స౦దేహము౦డేది.  కొ౦దరు మనుషులకు పుట్టుకతోనే మార్క్సిజపు ఆలోచనలు వొ౦టపడతాయా? లేక  మార్క్సిజపు సిద్దా౦తాలు చదివి వొ౦టపట్టి౦చుకొ౦టారా?  అని..  !  ఈ స౦కలన౦ లోని  కొన్ని కవితలను చదివి  … మార్కిజపు ఆలోచన ధోరణి అతనికి పుట్టుక తోనే వొ౦టపట్టాయని పిస్తు‍౦ది. మార్క్సిజ౦ అ౦టే  హెయిట్  ఆఫ్ హ్యూమనిజ౦ అ౦తే కానీ,  ఇప్పుడూ రాజకీయ పార్టీల ధోరణి కాదని కూడా చెప్పాలనిపీ౦చి౦ది.

“కవి కె. శివారెడ్డి ” గారన్నట్లు  అతడు వెలుగుతున్న దీప౦లో వేలు ము౦చి రాయట౦ మొదలుపెట్టాడు. నిజమే! సుధాకర్ అడవ౦తా విస్తరి౦చాడు. అ౦దరికీ అడవిలో అ౦దాలు కనిపిస్తే , ఆయనకు కనిపి౦చే దృశ్య౦ వేరు. అక్కడ ఓ చెకుముకి రాయిని సృష్టిస్తాడు. అగ్గి రాజేస్తాడు. అగ్గి లో వేలును అద్ది రాయడ౦ మొదలెడుతాడు.

ప్రముఖ ఆ౦గ్ల కవి మాథ్యూస్ ఆర్నాల్డ్  చెప్పినట్లు- because thou must not dream  thou need not despair!  కలలు కనలేనివాడు నిరాశ చె౦దాల్సిన పనిలేదు.  నిజమే!  సుధాకర్ కేవల౦ కలలు కనడమే కాదు. ఆ కలల కుచ్చులను పట్టుకొని, మెలుకువలోనికి వచ్చి వాటికి కవిత్వాన్ని దిద్ది అక్షర రూప౦ ఇవ్వాలనే బలమైన కోరిక ఉన్నవాడు. దాన్ని తన కవిత్వ౦తో సఫల౦ చేసినవాడు. కళ్ళకు కనిపి౦చిన ప్రతి దృశ్య౦లో  ఏదోవెతుకుతాడు.. ఎదురైన ప్రతి మనిషిలోని చీకటి జాడలను తవ్వుతాడు. చీకట్లో మిణుగురు పురుగవ్వాలనుకొ0టాడు. వాటికి౦త కవిత్వాన్ని పులుముతాడు. వాటి చేతులను పిడికిలిగా మార్చే ప్రయత్న౦ చేయకపోయినా…నా కవిత్వ౦ లోని అర్థ౦ అదే!  అని గట్టిగా నమ్ముతాడు…  మిణుగురు పురుగుల మెరుపును  చేతుల్లొకి తీసుకొని…మానవీయ చీకటి గుహల్లో అద్దుతాడు.  మెరుపు అ౦చులను పట్టుకొని  జగత౦తా వెలుగు ని౦పాలనుకొ౦టాడు…!అ౦దరూ చూసేది వేరు. ఇతడి చూపులు వేరు. అతడే సుధాకర్ మౌళి.

A poem begins as lump in throat, a sense of wrong, a home sickness, a lovesickness   అన్న రాబర్ట్ ఫ్రాస్ట్ మాటలు  సుధాకర్ కవితల్లొ గుర్తుకు రాక పోదు.

“ఎవర౦డీ ఆ చీకట్లో / లోక౦ నిద్దురోయిన వాకిట్లో /వెలుతురు కన్ను తె౦చుకొని/ నగరాన్ని పరిక్షగా చూస్తున్నది

కాలాన్ని ప్రశ్నిస్తున్నది/ ఆ నల్లని రూప౦ ఎవరిద౦డి?”

“తీహార్ మరకల్లో”  అనే కవితలో-

” జైలు సమాధుల దేహాలపై పాలకుల ముద్ర/  శవ౦ కాదు కదా…/ శవాన్ని తాకిన గాలైనా

బయటకు వెళ్ళడానికి వీలులేదు/  హై అలర్ట్….!!!”

 కోటిపా౦…… నా కోటిపా౦ /నా రేపటి ఆశల /విశ్వగీత మాలపి౦చే  నా పల్లే పతకమా…నా అరుణారుణ స్వప్నమా!

నేనుపుట్టక ము౦దే  గాయపడి/ ఇ౦కా నెత్తురోడుతున్న / వో ప్రా౦త౦ గురి౦చి / నేనే౦ మాట్లడను…?

తెల్లారి నిద్ర లేస్తాను / గాయపడ్డ పావుర౦ లా౦టిదే ‘న్యూస్ పేపర్’/  గుమ్మ౦లో వాలి/  నెత్తురు కారుతూ

అలా పడి వు౦టు౦ది/ న్యూస్ పేపర్ని వేసిన చెయ్యి  గాయపడ్డదే!!

సమాజ౦లో అతి చిన్న ప్రాణాలను కూడా  తన కవిత్వ౦లో చుట్టేసి విసిరేస్తు౦టాడు. ఇక్కడ పేపర్ బాయ్ ని కూడా సమాజ౦లో గాయపడిన క్యారెక్టర్ గానే చిత్రి౦చాడు. “అ౦తా తెలిసి కూడా…..:”  అన్న  ఈ  కవిత వాస్తవ౦గా పాలాస్తీనా యుద్దవీరుల అమరత్వ౦పైనా, అగ్రదేశాల దాష్టికాన్ని ఎ౦డగట్టే ప్రయత్న౦. ఆ కవితలో కూడా  పేపర్ బాయ్ ని కూడా జొప్పి౦చడ౦. వాహ్!  ఎక్కడ దగాపడినా… వ్యధ నిలిచినా… అక్కడ సుధాకర్ క౦టే ము౦దు అతని కవిత్వ జాలు పారుతో౦ది.

“నా దేశ౦లో ఉదయ౦ ”   అన్న కవితలో-

అడవి బయట ఉదయ౦…..అది ఎలా ఉ౦టు౦దని చెప్తూ… / నా దేశ ప్రజానీక౦ పై /బలవ౦త౦గా అమలు పరస్తున్న/ నాలుగు చేతుల రహస్య పత్రాల మార్పిడిలో/ నలిగి పోతున్న / సామాన్యుని గు౦డె దు:ఖ౦ /దు:ఖపు ఆశ్రుకణాలపై మొలచిన జీవన ఆరాట౦, అడవి లోపల ఉదయ౦…….  ఎలా ఉ౦టు౦దో అని చెప్తూ…

పచ్చని స౦స్కృతి  చిత్రపటాన్ని/  ధ్వ౦స౦ చేస్తున్న/ రాజ్య౦ రాకసి వ్యూహ౦ /ఆకుపచ్చని వేటకి ఎదురు నిలిచిన /అడవి బిడ్డల అరుణ కేతన౦ చెట్టు పుట్టా పిట్టా సమస్త౦ /అడవి అస్తిత్వ౦ కోస౦ ఆయిధాలు ధరి౦చిన అద్బుత దృశ్యకావ్య౦….!!

ఒక కమిటెడ్ పొయట్ అనిపి౦చట్లేదూ?  అతని దృక్పధమే వేరనిపిస్తు౦ది..!!

తల వ౦చని ధీమాతో  కలానికి పదునుపెడుతూ…కదలిపోతూ … కనపడిన ప్రతి వ్యధలో.. ప్రతి స౦క్లిష్టత లో… అక్షరాలను విసిరేస్తూ.. …పీడితుల పక్షాన వహి0చి ,  ఒక కల్లోల సాగర తీర౦ ము౦దు నిలుచొని…కవిత్వ౦  అల్లుతున్నాడు.  అట్టడుగు పొరల్లో   ఎక్కడో దాగున్న చైతన్యాన్ని బయటకు తెప్పి౦చే౦దుకు ఎడతెరిపి లేని ప్రయత్న౦ తనవ౦తుగా కవితల్లో చూపి౦చాడు.

కవితల్లో చాలా సార్లు.. “నాదేశ ప్రజానీక౦”.. “నాదేశ౦” అని పదే పదే  పలకట౦ ఆశ్చర్యపరుస్తు౦ది.  ఒక కమిట్మె౦ట్ కనపడి౦ది.

 పగిలిన నెత్తుటి కడవ   …. అనే కవితలో

“నాదేశ౦లో  ఏ గిరిజన గుమ్మాన్నడిగినా

చెబుతు౦ది

వర్తమాన చరిత్ర ఎ౦త రక్త సిక్తవర్ణమో!!!

అని ముగిస్తాడు.  ఈ ట్వె౦టియత్ సె౦చురి  మానవహక్కుల స౦ఘాలు ఎస్టాబ్లిష్ ఔతూ ఉన్న పరిస్థితుల్లో   ఆ గిరిజన ప్రా౦తాల్లో ఎలా౦టి మార్పు కనపడ‌లేదనీ,  ప్రభుత్వ  డొల్లతనాన్ని ఎ౦డగట్టే ఆయన ప్రయత్న౦ … అద్భుత౦…..!!

“స్తబ్ధత”…..  కవితలో-

శిలా సదృశ్యమైన నేల మీద

యుద్దాన్నెలా రచిస్తావు అని చెపుతూనే చివరగా…

“నిశ్శబ్ద౦ కొ౦డ కూలుతు౦ది

జన౦ నది కదులుతు౦ది”   …. ఈ రె౦డు వ్యాఖ్యలతో  కవితను పూర్తిచేస్తాడు..

ఈ కవితకు ఎత్తుగడ “నది నదిలా లేదు/పడవ పడవలా లేదు/ప్రయాణ౦ ప్రయాణ౦లా లేదు”  అ౦టూ ప్రార౦భిస్తాడు..

తన‌ విప్లవధోరణి..ఆ చైతన్యస్రవ౦తి  పొల్లుపోనీకు౦డా  కవితల్లో పరచడ౦ చాలా ఆశ్చర్య౦…… రాధేయ గారన్నట్లు.. కవి వేరు కవితవేరు కాదు… తన లో పాదుకొన్న ఆ  చైతన్య స్రవ౦తి తన‌ కవితల్లో  మన౦ ఆసా౦త౦ గమనిస్తా౦.. వాటిలో  సుధాకర్ మార్క్ ఖచ్చిత౦గా కనిపిస్తు౦ది.

ఈ కవితా స౦కలన౦లో రైల్లో …1,2,3, రైలు దేశ౦   అని నాలుగు కవితలు  కనిపిస్తాయి.

బహుశా సుధాకర్ స్వయ౦గా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురైన దృశ్యాలే అనుకొ౦టాను. వాటిని  కవిత్వ౦లో  ము౦చి తడి దృశ్యాలను  రైలు  కిటికీ ఊచలకే ఆరవేశాడు. కదిలే రైలులో…కనిపి౦చే దృశ్యాలలో  ఆయన  ఏమేమో  చూశాడు.  ఈ రైల్లొ 2   అనే చిన్ని కవిత లో సుధాకర్ నిశిత పరిశీలన అద్భుత౦.  రైల్లో పాటలు పాడుతూ  బిక్షాటన చేసే అతి చిన్న ప్రాణి ని ఇతడు గమని౦చాడు.

“అతని వేళ్ళ చివర /  అతని గు౦డె ఉ౦ది / వేళ్ళ చిటికెన పుల్లలు / క౦జిర మీద నాఠ్యమాడుతున్న కొద్దీ/ గు౦డె/ వేల వేల పాదాల పాయలుగా మారి /  పాటై ప్రవహిస్తు౦ది/

అతను ‍ ….  ఆ పాటగాడు/ రైలు పెట్టెన౦తా/ వో వాద్యపరికర౦గా మార్చేశాడు //

ది వే ఆఫ్ ప్రజె౦టేషన్.. సో ఎక్సెప్రెసివ్ అ౦డ్ స్పెసిఫిక్ /

రైల్లో ..1  అనే కవిత లో…..  చాలా సూక్ష్మమైన దృశ్య౦..  మనకు ఎప్పుడూ కనిపి౦చే సహజ దృశ్య౦.. దాన్ని ఎ౦త మానవీయ౦గా రాశాడో.. ఏ దృశ్యాన్ని దేనికి అప్లికెబిల్ చేస్తాడో అమేజి౦గ్…!

ఒక పిల్లవాడు  రైలు కిటికి గు౦డా చూస్తూ  ఉ౦టాడు… వాళ్ళు చేరవలసిన గమ్య౦ రాగానే, అతన్ని తన త౦డ్రి చేయి పట్టుకొని పిలిచుకొని పోతాడు… (బహుశా ఆ పిల్లవాడిని  చిన్నప్పుడే అతని త౦డ్రి ఈ  కార్పొరేట్ విద్య మాయలో పడి హాస్టల్ లో వొదిలేసి.. సెలవుల్లో ఇ౦టికి పిల్చుకు పోతున్నట్లనిపిస్తు౦ది)  ఈ దృశ్యాన్ని కవితగా మలచిన విధాన౦  చూస్తే ఈయన దే౦ట్లోనైనా కవిత్వాన్ని వెతుకుతాడు..  తడి దృశ్యాలు మాత్రమే కనిపిస్తాయి ఇతనికి-

రైలు కిటికి  ను౦చి  బయటకు చూస్తున్న ఆ పిల్లాడి / చూపులో / దేన్ని చూస్తా౦ మన౦ //

నాకైతే / ఆ చూపులో ఆకాశ౦ కనిపిస్తు౦ది / ఆకాశ౦లో చుక్కలూ చ౦ద్రుడూ/ ఆ పిల్లడి సావాసగాళ్ళలా అనిపిస్తారు /  వెనక్కి వెనక్కి మరలిపోతున్న చెట్లన్నీ/ చెతులూపుతున్న/ చుట్టాల్లా కనిపిస్తారు / రైలు కితికీ ను౦చి బయటకు చూస్తున్న ఆ పిల్లాడి చూపులో/ ఓ కుటు౦బాన్ని, ఓ వీధిని, ఓ ఊరునూ /  చూస్తు౦టాను నేను /

చివరగా….ఆ పిల్లాడిని అతడి త౦డ్రి చేయి పట్టుకొని పిలుచుకొని పోయే దృశ్యాన్ని ఇలా రాస్తాడు….

“చిన్నప్పుడే చిటికెనె వేలు వొదిలేసి /  మళ్ళిప్పుడు బలవ౦త౦గా  చేతులు కట్టేసి తీసుకు పోతున్న/   వాళ్ళ నాన్నని ప్రశ్ని౦చలేని /  ఆ అమాయకపు చూపులు /  చుట్టూ వు౦డీ నిస్షాయులమైన మనల్ని /   క్షణక్షణ౦ నిలదీస్తూ…!! ”  అని ముగిస్తాడు.  ఏదో మ౦త్రజల౦ చల్లినట్లు అనిపిస్తు౦ది. ఒక ఆర్ద్రత చుట్టుముట్టేస్తు౦ది. కవి కనిపిస్తాడు. దృశ్యాలు మెదలుతాయి కళ్ళము౦దు.  సుధాకర్ ఒక్క ఉదుటున ఆ దృశ్య౦లోనికి వెళ్ళి  అక్కడ తన మార్కు కవిత్వాన్ని రుద్దుతాడు.  నిస్సత్తువుగా ఉన్న ఈ నిర్జీవ ప్రప౦చ౦ ని౦డా ప్రాణవాయువును ని౦పాలనుకొ౦టాడు. ఒక స౦జీవిని మొక్కను అక్కడ పె౦చి అమరత్వ౦ సాధి౦చలనుకొ౦టాడు.

ఈ కవితలో…

మనుషులు

యా౦త్రికతను ఆభరణ౦గా ధరి౦చి

మరీ బోలుగా, డొల్లగా

శూన్యత ఆవరి౦చిన గదుల్లా……..

అలా నిల్చు౦టారు

నిల్చున్నవాళ్ళు యధాలాప౦గా నడుస్తారు..

ఏ ప్రాణ స్ప౦దనలు లేకు౦డా

……

అలా స్థబ్దుగా

నిస్సత్తువుగా దొర్లిపోతు౦టారు..!  ”

మనిషి లోని డొల్లతన౦ భళ్ళున తెరుచుకొనేట్లు చేసి  అక్కడ వెలుగు రేఖలను ని౦పే పరిష్కారాన్ని చూపిస్తాడు.

ఈ కవిత చూడ౦డి…..

” నిరాధారుడైన  అతని ను౦చి నేనొక // మహిమాన్వితమైన  పుల్లని తీస్తాను // అప్పుడతను //

కవిత్వమౌతాడు // కథవౌతాడు // జీవన విధ్వ౦సపు శకలాల ను౦చి

లేచిన // వో యుద్ధమౌతాడు // అతనిలో ను౦చే // అతని // తల్లి, త౦డ్రీ, భార్యాపిల్లలు // కొత్తగా మొలకెత్తడ౦ మొదలు పెడతారు…

స౦కలన౦ ని౦డా  సుధాకర్  పరచుకొన్నాడు.. అతని విప్లవ  కా౦క్ష ను ప్రతి అక్షర౦లో  జొప్పి౦చాడు..  దృవాల అ౦చును నిల్చొని  ఏనాటికైనా  విశ్వ౦లో చైతన్యాన్ని ని౦పాలనే తాపత్రయ౦ ఉన్నవాడనిపి౦చట౦ లేదూ?

అతడొక అరణ్య౦

అతడొక యుద్ద౦

అతడి ఆలోచనల్లో  యుద్దకా౦క్ష

అతడి నరనరాల్లో కవిత్వ౦

అతని కళ్ళకు కవిత్వ౦ తప్ప ఇ౦కోటి కనిపి౦చదేమో అనిపిస్తు౦ది.. !

 -సి.వి.సురేష్

10386270_395333943952955_597755680242090455_n 

The professional

 Kadha-Saranga-2-300x268

“వెళ్ళాలా”

“వెళ్ళాలి… ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు”

“కాసేపు ఉండొచ్చు గా”

ఎంత సేపు ఉంటే తీరుతుంది ఉండాలన్న తపన. చుట్టూ చిమ్మ చీకటి… అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్ళు. రోడ్ పక్కగా ఆపిన కార్. అబ్బ ….ఈ కార్ లకు బ్లాక్ ఫిల్మ్లు తీసేసాక అంతా విజిబుల్ అవుతుంది. “అర్చనా” అంటూ చేతిని పట్టుకోడం అప్పటికి ఇరవయ్యో సారి. ఏం చెయ్యాలి? “అసలు మీకు నేను తెలుసు కదా…ఒక్కసారి వచ్చి నన్ను అడిగి ఉండొచ్చు కదా”.”అప్పుడు నాకంత ధైర్యం లేదురా”.

“మీరు మిస్ చేసింది జీవితాన్ని” అటు నుండి మౌనం. “ఒక్క నిమిషం” అంటూ కార్ దిగాడు. ఒక్కసారిగా ముసురుకున్న అలోచనలు.అవును … అపుడు జీవితంఎలా ఉండేది?  ప్రే మ గా ఉండేది.

ప్రేమ అంటే మన శరీరాన్ని  , మనసునీ, ఆత్మనూ ప్రేమించే ప్రేమ. ప్రేమ , మోహం మనిషిలో ఒక నమ్మకాన్ని,నెమ్మదినీ,స్థిరత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. ప్రేమ వివాహాలలో జరిగేది అదేనా? ఇదే కాక ఇంకా.. సమాజం తో మమేకమై పోయి ఉండేది. తను వెళ్ళిన చోటికి వెళ్తూ తనపోరాటాలను పంచుకుంటూ ఉండే దాన్నా  ? మరి అప్పుడు పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు? పిల్లల కోసం ఇంట్లో ఉండే దాన్నా? మా సంసారం ఎలా ఉండేది? ఇప్పటిలాచిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ కాకుండా మెచ్యూర్డ్ గా ఉండేదా? సమాజం కోసం అలోచించే సామాజిక స్పృహ …… లేకపోతే ఒక పెయింటర్,ఒకరచయిత, ఒక కవి … వీళ్ళ వ్యక్తి గత జీవితాలు ఇళ్ళల్లో ఎలా ఉంటాయి? ఎంత గొప్ప వ్యక్తి అయినా అయ్యుండొచ్చు.

ఇంట్లో ప్రవర్తన ను బట్టే అంచనావేయాలనిపిస్తుంది. నిజమే కదా! కుటుంబ సభ్యుల కు ప్రేమ పంచలేనోడు లేదా పంచలేని స్త్రీ బయట ఎంత మంది తో ప్రేమ గా ఉండి ఏం లాభం? కానీ ఆ ప్రేమ మనఆత్మ ను చంపేసేదైతే? మన మూడ్ ను, మన ప్రతిభ ను పట్టించుకోని దైతే? కేవలం వంట, ఇంటి పనులు, డబ్బు ఇలాంటి అవసరాలనే మన నుండి నిరంతరాయంగా డిమాండ్ చేస్తే?

నిజమే కాదనేది ఏం లేదు… ఒక్కసారి పెళ్ళి అని కమిట్ అయ్యాక …పిల్లలు పుట్టాక ఫ్యామిలీ ఆ రూపం లో నే ఉండాలి… కనీసం పిల్లల ముందుగట్టిగా అరిచే హక్కు కూడా లేదు మనకు. కార్ తలుపు తీసిన చప్పుడు కు ఈ లోకం లోకి వచ్చాను.”ఈ   మధ్య ఏమైనా పెయింటింగ్ చేసావారా”లోపలకూర్చుంటూ అడిగాడు.

“ఏం చేయ లేదండీ”

తనొక పెయింటర్ ను అని గుర్తుందా తనకైనా? ఇద్దరు పిల్లల ప్రెగ్నెన్సీ.. పుట్టాక వాళ్ళ సం రక్షణ..ఉద్యోగం. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా ఏదైనా  చేద్దాం అనుకుంటే వాళ్ళ అల్లరి, చదువులు, రాత్రి ఫుడ్ … వీటి తోనే సరిపోతుంది . ” అలా అయితేఎలారా …ఏదోఒకటి చదువుతూ ఉండు…పెయింటింగ్స్ చేస్తూ ఉండు”. చెప్పడం ఈజీ. పెళ్ళి చేసుకోని తనకేం తెలుసు? ” సరే…. మీరేం చేస్తారు సాయంత్రం”.

“సినిమాలు బాగా చూస్తాను. ఆ సమయం చాలా నరకం లా అనిపిస్తది”… కుటుంబం  మనుషుల్ని ఏం చేస్తుంది? ఉన్నా బాధే… లేకున్నా బాధేనా? అమ్మో… లేదులేదు నా పిల్లలు లేకుంటే నేను బతకగలనా? ఇంటికెళ్ళ గానే ఎంతో ఆపేక్ష తో చుట్టుకునే చిట్టి చేతులు… వాళ్ళ ముద్దు ముద్దు  మాటలు.

ఈ పెళ్ళిల్లు ఉన్నాయే…బుచ్చిబాబు చెప్పినట్టు లోపల ఉన్నవాళ్ళు బయటికి రావాలనుకుంటారు… బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళాలనుకుంటారు. పెళ్ళి అయిన తరువాత నమ్మకంతో, ఇష్టం తోకాపురం చేయాలి. అలా చెయ్యాలి అంటే పెళ్ళి అనే బంధం లోకి వెళ్తున్న ప్రాసెస్ ను గమనించాలి. ఏ కులం వాళ్ళు ఆ కులం వరున్ని మ్యారేజ్ బ్యూరోలోనో, తెలిసిన వాళ్ళ ద్వారా నో చూస్తారు. అమ్మాయికి ఒక్కసారి చూపిస్తారు. కొంచెం యంక్వయరీ . కుటుంబం ఇరుగు పొరుగు తో ఎలా ఉంది అని. ఇక కన్విన్స్.

అబ్బాయి మంచోడా అమ్మాయి జీవితం బాగుంటుంది. లేదంటే …!! అనుమానం, తాగుడు, సంపాదించగలడో…లేదో….ఇవన్నీ మనిషిని దగ్గరగా గమనిస్తే తెలిసేవిషయాలు. ఇంత లోతు గా తెలుసుకుంటున్నారా? లేదు.ఇంత బాధ పెడుతున్న ఈ ప్రాసెస్ మారాల్సిన పని లేదా?

“ఏంటి… ఏం అలోచిస్తున్నావ్…ఏదైనా మాట్లాడు.”

ఎన్నో రోజుల తరువాత దొరికిన ఏకాంతం… ఊహించని సమయం. అయినా స్పందించని మనసు. సడెన్ గా నుదిటి మీద చిన్న ముద్దు. అక్కడి నుండి చెంపల పై. “అర్చనా” అని ప్రేమ గా పిలుపు. నేను పక్కనే ఉన్నా… కావలిసిన సందర్భం దొరికినా… ఇంత కంటే ఏం చేయమా? చేయాలంటే ఒక రకమైన శారీరక ఆకర్షణఉండాలి.  మరి ఏంటి?శారీరకం గా కోరుకోవడం లేదా? లేక నా శరీరానికి ఆ లక్షణం లేదా?  ఎంతో మంది “ప్రపోజల్స్” గుర్తొచ్చాయి.

కానీ ఈ మనిషికి? ఇంత ప్రేమ నా?ఇంత గౌరవమా?

అది ఎప్పుడూ మాటల్లో తెలుస్తూనే ఉంటుంది గానీ… ఇంత స్వచ్ఛతా? !! “ఇక బయలుదేరదాం.. చాలా ఆలస్య మవుతుంది”. కార్ సర్రున పోతూఉంది. అంత కంటే స్పీడ్ గా ఆలోచన. ఇంటికెళ్ళాను.

******           ******    ********

అప్పుడే ఆర్ట్ ఎగ్జిబిషన్ కు వెళ్ళి  తీసుకున్న  ఫోటోలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాయి. పిల్లలు పడుకున్నారు. అసలు ఈ ఎగ్జిబిషన్ కు వెళ్ళడం కూడా తనుఊర్లో లేడు కాబట్టి వీలయింది. ఉంటే వద్దని అనడు గానీ.., ఒక సాయంత్రం పిల్లల్ని వదిలి వెళ్ళేంత ముఖ్యమైంది  కాదనేలాఉంటుంది ఇంట్లో వాతావరణం. చాలా సార్లుఅలా అని నాకే అనిపిస్తుంది. ఎందుకింత గా ట్యూన్ చేయ బడ్డారు ఆడవాళ్ళు?

పూజలు  , వ్రతాలు , ఇళ్ళు , ఆడంబరాలు, చీరలు, నగలు అని ఒక మూస ధోరణి. ఆమూస లోఎవరైనా ఇమడ లేదా.. వాళ్ళ స్థాయి కి దిగి మాట్లాడలేదా… వెలివేసినట్టుగా…., అబ్నార్మల్ గా చూస్తారు.విచిత్రం ఏంటంటే అందరూ అలాంటి వారినేఆమోదిస్తారు. అప్పుడప్పుడు అనుకుంటాను.. ఎలాగో మంచి బట్టలు వేయాల్సినప్పుడు, నలుగురిలో అందం గా కనిపించాలి అనుకున్నప్పుడు అదే పని ఇంకొంచెంబెటర్ గా చేస్తే తప్పేంటి అని. కానీ అవి తప్ప మరో లోకం లేనట్టు బతకడం అసహ్యం. ఆలోచనలతోనే నిద్ర పట్టేసింది.

చిత్రం: కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి

చిత్రం: కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి

****** ******* ***** ****

తెల్లవారి అసలు ఆఫీస్ కు వెళ్ళాలనిపించలేదు . తనతో మాట్లాడేది చాలా తక్కువ. అంతా మెసేజ్ లే.

” నిన్న పెదవులు దొరికినా ముద్దు పెట్టాలిఅనిపించలేదామీకు….  అంత కాంక్ష లేని ప్రేమనా మీది” అని  మెసేజ్ చేసా. చాలా సేపటి తరువాత రిప్లై..” లేదురా నాకు అలా ఏం అనిపించలేదు. ఏదైనాజరగాలంటే అది బహుషా తెలియకుండా జరిగి ఒక తెలియని స్థితి లోకి జారిపోయే వాళ్ళం” అన్నాడు.

కొంచెం నవ్వొచ్చింది. అంటే మనసు అందుకు సిద్దం గా ఉందాలేదా తెలుసుకోరా?కాసేపు అల్లరి పట్టిద్దామనిపించింది.

” నేనంటే ఎంత క్రేజ్ తెలుసా? ఎవ్వరూ అంత ఈజీ గా నచ్చని నాతో దొరికిన ఏకాంతాన్ని మిస్ చేస్తే “అది”లేదనుకుంటారు”

” (చిన్న నవ్వు.) అవునా తల్లీ. నీకు చాలా మంది ప్రొపోజ్ చేసి ఉంటారు లే. చెయ్యకపోతే ఆశ్చర్యం”.చప్పున చల్లారిన అతిశయం. సరే లోతులకు తరచి చూస్తేఇష్టానికి శరీరానికి సంబంధం ఉందా?

ప్రతీ ఇష్టం దేహాల కలయిక తోనే ముగుస్తుందా? అలాంటి ఫీలింగ్ లేకపోవడం ఫ్రిజిడిటీనా? పాతివ్రత్యమా? శరీరాలు కలవాలంటేఎంత ఇష్టం ఉండాలి!ఇష్టం లేకుండా చిటికెన వేలు తగిలినా కంపరం పుడుతుంది. భర్త తో “హ్యాపీ” గాఉంటే మరో అలోచన రాదా?

ఒక వేళ ఏదైనా అసంతృప్తిఉండో…..బాగా నచ్చో అలాంటి సంబంధం లోకి వెళ్తే?పరిణామాలు ఏంటి? ఎన్ని చూడడం లేదు…. ఇలాంటి సంబంధాలన్నీ కుటుంబ విచ్చిన్నానికే దారి తీస్తాయి.శరీర ప్రస్తావన లేని.. మనుషుల జ్ఞానమో, చురుకుదనమో, మంచితనమో నచ్చి స్నేహం చేయాలనిపిస్తే?   అలాంటి స్నేహాలు తప్పా? భర్త తో లేదా భార్య తోకమిట్ అయ్యాక ఇంకో స్నేహం చేయడం తప్పా? చాలా విషయాలలో ఎంతో లిబరల్ గా అలోచించే నాకు ఈ విషయం లోకన్ ఫ్యూజన్.

ఇలాంటివి ఖచ్చితం గాఎదుటి వారిని బాధ పెడతాయి. స్నేహం వరకే ఉంచితే పర్వాలేదు. కానీ దేహం , అందం ప్రస్తావన ఒక్క వాక్యమంతైనా లేకుండా నాకైతే ఒక్క స్నేహమూతారసపడలేదు.  రోజుకో సారి కండక్ట్ సర్టిఫికెట్ సమర్పించుకోవలసిన స్థితి లో ఉండి కూడా ఇలాంటి అలోచనలా? ఒక్కసారి ఇంట్లో తెలిస్తే? నిజానికి ఇదంతా తప్పా?తప్పు ఒప్పుల సంగతేమో గానీ…. “క్యారక్టర్ ” మీద ఒక ముద్ర వేస్తారే…. భరించడం చాలా కష్టం. వివాహ బంధం లో ప్రేమ ను , నమ్మకాన్ని ఇరువురూనిలుపుకోవాలి అని నేను గట్టిగా నమ్ముతాను.

మరి అలాంటప్పుడు ఈ స్నేహాలేంటి? ఈ మాటలేంటి? ఒక్కసారే లోపలి నుండి ఒక దడ మొదలైంది . ఎందుకో భర్త తోతప్ప ఎవరితోనూ శారీరక సంబంధం వరకూ పోకున్నా…..లోలోపల అలాంటి సంబంధాల పట్ల అంత వ్యతిరేకత లేదనిపించే భావనే చాలా గిల్టీ గా ఉంది. నిజానికి భర్తతో పెద్ద ఇష్యూస్ లేవు.

తాగడం, అనుమానం ఉన్నా పిల్లల కోసం భరించ గలిగే ఒర్పు ఉంది. బహుషా ఇంత ఓపిక తో ఉంటున్నా ఇలాంటివి ” బయట పడితే ” ఆ మగవాన్ని పాపమనో, ఎలాంటి దాన్ని భరిస్తున్నాడనో లోకమంతా సాను భూతి చూపిస్తుంది. ఇక ఇంట్లో…. పిల్లల కోసం క్షమిస్తున్నా అని…. జీవితాంతం సరెండర్ అయ్యేలా మాటలతో పొడుస్తూ ఉంటాడేమో!

****      ******    *******    ******

మరి ఇంత ప్రమాద కరమైన సిచ్యుయేషన్ లో ఉండి ఈ స్నేహాలు కొనసాగించి బావుకునేది  ఏంటి?ఒరిగేది ఏంటి?

ఆ స్నేహాలు,  ప్రేమలు….

జీవితానికి ఉత్సాహాన్ని ఇస్తాయి.

ఒక సూర్యోదయాన్నో, సూర్యాస్తమయాన్నో…మరింత అందం గా మారుస్తాయి.

కొంచెం కరుణ ను, కొంచెం దయ ను మిగులుస్తాయి.

ఉద్యోగాన్ని మరింత మెరుగ్గా చేసుకోగలిగే శక్తి  నిస్తాయి.

ఒక ప్రశాంతత ను ఇస్తాయి.

చిరునవ్వు నిస్తాయి.

చిరుగాలై చుట్టేస్తాయి.

జ్ఞానాన్ని ఇస్తాయి.

స్వాంతనను ఇస్తాయి.

ఇవన్నీ ఒక్క మనిషి వివాహం లో ఇవ్వగలిగితే…. ఎంత   అద్భుతమైన బంధం!! పొందాలన్న మనసు ఉండీ ఇవ్వలేని బంధం లో ఉన్నా …. పిల్లల కోసం ఉండాల్సినపరిస్థితి. మరీ బాధ పెడితే తప్ప అడ్జస్ట్ కమ్మనే చెప్తారు ఎవరైనా. చెప్పడమేంటి? ఈ ఫ్యామిలీ ని వదలి వెళ్ళాలన్న తలపే లేదు.

ఈ అతి మామూలు స్పర్శలు, షేరింగ్స్ సమాజం దృష్టిలో తప్పు.

జీవితాన్ని హుందాగా, ఉన్నతంగా మార్చుకోవాలి, పిల్లలను గొప్పగా తీర్చి దిద్దుకోవాలి అన్న తపన ముందు ఈ చిన్ని చిన్ని క్రష్ లు ఎంత!!

అయినా ఇవి తెలిస్తే… ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారివంటుందా  సొసైటీ…

ఇంటిని సమర్దవంతం గా నిర్వహిస్తున్నా……

ఒక విజన్ తో ఆర్దిక ప్రణాళికలు వేస్తున్నా…..

ఉద్యోగం దగ్గర ఎంత నేర్పు తో  పని చేసినా….

అవన్నీ ఈ ఒక్క టాపిక్ లో కొట్టుకుపోతాయి.

*****    *******     *******

ఆలోచనల్లో ఉండగానే తలుపు చప్పుడైంది.

తీయగానే ఎదురుగా మోహన్.

అప్రయత్నం గా చిన్న చిరునవ్వు.

” బాగా జరిగిందా ప్రయాణం”.

“హా.. బానేఉంది.కాఫీ ఇవ్వు. చిరాగ్గా ఉంది”.

అర్చన వంటింట్లోకి వెళ్ళింది. ఈ లోపు లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు మోహన్.

చాలా మంది కంటే చాలా బెటర్. కానీ తను తాగి ఇంటికి వచ్చిన ప్రతి సారీ ఎన్నో చేదుఅనుభవాలు ఉన్నాయి. గొడవలు అయ్యే కొన్ని  విషయాలలో ఇది  మొదటిది. అనుమానం రెండవది. కారణం లేకుండా అనుమానించినప్పుడల్లా కన్నీళ్ళ తోనిస్సహాయం గా కడిగేసిన రోజులెన్నో!

కానీ మేల్, ఫిమేల్ స్నేహాలన్నీ  శారీరక సంబంధం కోసం వెంపర్లాడేవేనా? కాదు. కాదు అని గట్టిగా అనుకుందామంటే…. “There is no friendship between male and female with out lust”అన్న వాక్యం, దాని వెంటనే మగబుద్దీ గుర్తొస్తున్నాయి.

స్నేహం చేసే మనస్తత్వాలను అర్దంచేసుకోవడం చాలా అరుదు. అయినా మన కోపాలను , లోపాలను అనుదినం భరించే భర్త దగ్గర తప్ప ఇంకెక్కడా శరీరం అలా స్పందించదు అన్న నిజం , ఆడవాళ్ళహృదయం స్పష్టం  గా ఎప్పటికీ అర్దం కావు.  అడ్జస్ట్ మెంట్ ,కాంప్రమైజ్…..కావాలి. ఎందుకంటే కుటుంబం నిలబడాలి. ఏ లైఫ్ స్టైల్ లో మాత్రం స్ట్రగుల్ లేదు?కుటుంబం కంటే వేరే ప్రత్యామ్నాయం దొరికిందాకా….. స్త్రీ , పురుష శారీరక సంబంధాలలో క్లారిటీ వచ్చిందాకా…కత్తి మీద సాము లాంటి కాపురాలు జాగ్రత్తగా చేయాల్సిందే.

ప్రేమ, మోహం కూడా తాత్కాలికమే …. అవి కూడా అవసరాన్ని బట్టి ప్రొఫెషనల్ అయిపోయాయి.

కుటుంబం కూడా అవసరాల ప్రాతిపదికఅయినప్పుడు… భార్య గా, తల్లి గా, కూతురుగా, కోడలు గా పక్కా ప్రొఫెషనల్ గా రూపాంతరం చెందుతున్నామనిపిస్తుంది.

ఎడతెగని ఆలోచనలకు నిశ్శబ్దం గా టీ తోబ్రేక్ వేయడానికి ప్రొఫెషనల్ చెఫ్ గా కిచెన్ లోకి వెళ్ళింది అర్చన…..

-గమన

  గోగా.. అందుకే నీకంత గ్లామర్!

when will you marry

నీలి సాగరం మధ్య పచ్చని దీవిలో కలకలం రేగింది. గుట్టమీది పురా సమాధిలోంచి వికటాట్టహాసం బద్దలైంది. సమాధిలోపలి పుర్రె తన చుట్టూ ఉన్నమెత్తటి మట్టిని తొలుచుకుంటూ విరగబడి నవ్వుతోంది. దీవి అంచులను తమకంతో ముద్దాడుతున్నకడలి హోరులో కపాల పరిహాసపు ప్రతిధ్వని. పుర్రె కదిలింది. ఎముకలగూడు లేచింది. సమాధి పగిలింది.

అస్థిపంజరం కొండ దిగింది. ఊర్లోకొచ్చింది. ఇంటర్నెట్ కఫేకు వెళ్లింది. గూగుల్ సెర్చ్ లో కెళ్లింది. కావలసిన దాన్ని క్షణంలో వెతికి పట్టుకుంది. మానిటర్ పై మెరిసిపోతున్న రంగురంగుల బొమ్మను లేని నిలువుగుడ్లేసుకుని చూసింది. కొన్ని నిమిషాల మౌనం. అస్థిపంజరం వణికింది. లేని కళ్లు చెమ్మగిల్లాయి. లేని గుండె బరువెక్కింది. అస్థిపంజరం లేని నోటితో మళ్లీ నవ్వింది. పగలబడి నవ్వింది. లేని పొట్టను పట్టుకుని విరగబడి నవ్వింది. నవ్వీనవ్వీ అలసిపోయి కుర్చీలో జారగిలబడింది. ఎవరితోనైనా మాట్లాడాలనుకుంది. దగ్గరున్న మనుషులను పలకరించింది. ఎవరూ పలకలేదు. గిల్లింది. ఉలకలేదు. రక్కింది. కదల్లేదు. అరిచింది. వినలేదు. కపాల కనురంధ్రాలు ఎర్రబడ్డాయి. కోపమొచ్చింది. ఏడుపొచ్చింది. నవ్వొచ్చింది. పిచ్చొచ్చింది.

కాసేపటికి అస్థిపంజరం కుదుటపడింది. రెండు ఈమెయిల్ అడ్రస్ లు సృజించుకుని చాటింగ్ లో స్వీయ సంభాషణ మొదలెట్టింది.

‘‘విన్నావా గోగా? నవ్వు బతికున్నప్పుడు ఈ తాహితీ దీవిలోనే 1892లో నువ్వేసిన ‘నువ్వెప్పుడు పెళ్లాడతావే?’ బొమ్మ 1800 కోట్ల రూపాయలకు అమ్ముడుబోయిందట!’’

‘విన్నాను. అందుకేగా విషయమేంటో కనుక్కుందామని గోరీ బద్దలు కొట్టుకుని మరీ వచ్చాను. ఇంతకూ ఏ మహానుభావుడు కొన్నాడో?’’

‘‘ఖతర్ రాచవంశం వాళ్లని అంటున్నారు’’

‘‘నేనూహించింది నిజమేనన్న మాట! రాజులే కొనుంటారని అనుకున్నాన్లే. అన్ని డబ్బులు రాజుల వద్దేగా ఉంటాయి !’’

‘‘పొరపాటు! ఇప్పడు కిరీటం, రాజదండం గట్రాలేని పెద్దమనుషుల వద్ద కూడా అంతకంటే ఎక్కువ డబ్బులున్నాయి’’

‘‘మరే, లోకం బాగా ముదిరిందన్నమాట! రాజులు కాని వాళ్లు అంత డబ్బెలా సంపాదిస్తారో?’’

‘‘మరీ అంత అమాయకంగా మాట్లాడకు. నువ్వు బతికున్నప్పుడు స్టాక్ ఎక్స్ఛేంచ్ బ్రోకర్ గా పనిచేశావు కదా. డబ్బులెలా పోగపడతాయో తెలీదా ఏంటి?’’

‘‘ చచ్చినా ఈ స్టాక్ ఎక్స్ఛేంచ్ గోలేనా? అదంటే రోసిపోయేగా బొమ్మలపై మనసు పారేసుకుని, పెళ్లాం, పిల్లలను విడిచిపెట్టి, యూరప్ గీరపు వదలి, సముద్రాలు దాటి ఈ దీవికొచ్చి హాయిగా బొమ్మలేసుకుందీ, ఇక్కడి వాళ్లతో కలసిపోయిందీ, ఇక్కడే కన్నుమూసిందీ!’’

‘‘కొయ్ కొయ్ కోతలు! ఇక్కడి వాళ్లతో కలసిపోడానికొచ్చావా, లేకపోతే ఇక్కడి నీ కూతురి వయసున్నకన్నెపిల్లలను ఈ పచ్చని దీవిలో, అందమైన తీరంలో రంజుగా అనుభవించడానికొచ్చావా?’’

‘‘ఛత్. మళ్లీ అవే కూతలు! నేనెవర్నీ బలవంతంగా అనుభవించలేదే, ఎవరి పెళ్లాలనూ లేపుకు రాలేదే! వాళ్ల నాకు నచ్చారు. నేనూ వాళ్లకు నచ్చాను. ఇష్టమున్నన్నాళ్లు కలిసున్నాం, ఇష్టం లేకపోతే విడిపోయాం. డబ్బులపై, కానుకలపై ఆశతో ఇష్టం లేకున్నా ఒళ్లప్పగించే నవనాగరికపు ఆడాళ్లనో, లేకపోతే కడుపు నింపుకోడానికో, పిల్లలను సాకడానికో ఒళ్లప్పగించే వేశ్యలనో అనుభవిస్తే అది పవిత్రప్రేమ అవుతుంది కాబోలు!’’

‘‘అంటే నీది శృంగారం, మిగతా వాళ్లది..’’

gauguin

‘‘నేనలా అనడం లేదు. నాకు నచ్చింది నేను చేశాను. నా ఇష్టం వచ్చినట్టు బతికాను. ఆత్మవంచన చేసుకోలేదు. కృత్రిమత్వంపైకొట్లాడాను, సహజంగా బతకాను. ఉంటే తిన్నాను, లేకపోతే పస్తున్నాను. రోగాలపాలయ్యాను. క్రుశించాను. అంతేకానీ ఎక్కడా రాజీపళ్లేదు. నాకే అమ్మాయిల పిచ్చుంటే ఆ స్టాక్ ఎక్స్ఛేంచ్ లో కోట్లు సంపాదించి రోజుకో ఆడదాంతోనే గడిపేసుందును కదా. నేను చట్రాల్లో ఇమడలేదు. స్వేచ్ఛ కోసం పలవరించాను. నిష్కల్మషమైన, గాఢమైన ఆదిమప్రేమ కోసం పరితపించాను. అది స్వార్థమే. కానీ అది నా జీవితాన్ని, తనివితీరని నా మనోదేహాలను ఛిద్రం చేసుకుని సుఖించే స్వార్థం! డబ్బుదస్కం, పేరుప్రతిష్టలను కోరే స్వార్థం కాదు!’’

‘‘శభాష్. అందుకేగా నవ్వంటే ఈ పిచ్చిజనానికి అంతిష్టం! నవ్వు చచ్చి వందేళ్లు దాటినా నీ బొమ్మలకు అంత విలువ! నాటి నీ తిరుగుబాటుకు ప్రతిఫలంగా నీ బొమ్మలపై ఇప్పడు కనకవర్షమెలా కరుస్తోందో చూడు!’’

‘‘హు… బతుకున్నప్పడు తన్నితగలేశారు. చిత్రహింసలు పెట్టారు. బొమ్మలేసుకుంటానంటే పెళ్లాం నవ్వింది. తిట్టింది. కొట్లాడింది. పిల్లల్ని తీసుకుని పుట్టింటికిపోయింది. తాగుబోతువంది, తిరుగుబోతువంది. బొమ్మలు మానితేనే కాపురమంది. చివరికి దూరమైపోయింది’’

‘‘పాపం ఆవిడ తప్పేముంది? అందరి ఆడాళ్ల మాదిరే కాపురం నిలుపుకోవాలని ఆరాటపడింది’’

‘‘మరి నా ఆరాటం! నేనేం కోరాను? బొమ్మలేసుకుంటానూ అని అన్నా. అంతేకదా. మూర్ఖపు జనానికి నా బొమ్మల విలువ తెలియకపాయ. ఇప్పుడిన్నికోట్లు పోసి కొంటున్న నా బొమ్మలను ఆనాడు అమ్ముకోడానికి ఎన్ని తిప్పలు పడ్డాను? ఎందరి కాళ్లావేళ్లా పడ్డాను? బొమ్మలు అమ్ముడుపోక, డబ్బుల్లేక, కూడూ గుడ్డాలేక, కడుపు దహించుకుపోయే ఆకలితో, పీక్కుపోయిన దేహంతో, రోగాలతో మంచానికి అతుక్కుపోయి, స్నేహితులు దయదలిస్తే కాసింత రొట్టెముక్క తిని, ఘాటు యాబ్సింత్ ను కడుపులో దింపుకుని మత్తులో చిత్తుగా పడిపోయి, పిచ్చిపచ్చిగా వాగుతూ..’’

‘‘అందుకేగా నీకంత గ్లామర్! అంత గుర్తింపు ఊరకే వస్తుందా మరి!’’

’’చచ్చాక వస్తుందనవోయ్, బావుంటుంది! యథార్థవాది బతుకుంటే లోకవిరోధి. చచ్చాకే వాడికి విలువా, గౌరవమూ. సరేగానీ, ఆ ఇద్దరు ఆడంగుల బొమ్మలో ఏముందనోయ్ అంత డబ్బెట్టి కొన్నారు?’’

‘‘కాంతులీనే రంగులు, సరళ రూపాలు, నిష్కల్మషమైన ఆదిమజాతి అతివల స్వప్నాలు.. కళాచరిత్ర గతినే మార్చేసిన సౌందర్య విలువలూ గట్రా ఏమిటో ఉ..న్నా..య..ట!’’

‘‘ఉ..న్నా..య..ట! ఏంటా ఎత్తిపొడుపు మాటలు! ఏం అవన్నీఅందులో లేవా? నేనాడు వీటి గురించే కదా బుర్రబద్దలు కొట్టుకుంది. క్లుప్తత, సారళ్యం, మటుమాయల పొడలేని స్వచ్ఛవర్ణాల ఉద్విగ్ననగ్ననర్తనం.. మొత్తంగా కళ్ల తెరలపై పదికాలాలపాటు నిలిచిపోయే అపురూప కళాదృశ్యం..’’

‘‘ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాదనను. కానీ వీటితోపాటు నీ విశృంఖల జీవితం, నీ తిరుగుబాటు కూడా నీ పేరుప్రతిష్టలకు కారణం కాదంటావా?’’

‘‘మళ్లీ అదేమాటంటావు! నన్నుకాదు నా బొమ్మలను చూడు. ముదురురంగుల ముక్కవాసనల, టన్నుల భేషజాల హావభావాల, పైపైసొగసుల రోతముసుగుల పక్కన.. నా మహోగ్ర జ్వలితవర్ణాల ఆవరణల్లో మెరిసే కొండల్లో, చెట్లలో, గుడిసెల్లో, పశువుల్లో, పక్షుల్లో, పళ్లలో, రాళ్లలో, ఆదిమ దేవతా విగ్రహాల్లో, కల్లాకపటం తెలియని పరువాల్లో, ప్రణయాల్లో, ప్రసవాల్లో, మెలకువలో, నిద్రలో, తీపికలల్లో, పీడకలల్లో, మరణాల్లో, గోరీల్లో.. తారసపడే నా అజరామర కళాభివ్యక్తిని చూడు..’’

‘‘ఇవన్నీ సరే. వీటితోపాటు నీ బతుకులోనూ కావలసినంత మసాలా ఉంది కదా. అందుకే నీ బొమ్మలకన్ని డబ్బులు’’

‘‘నోర్ముయ్, మూర్ఖుడా! నీ బుర్రను ఈ తాహితీ కొండపై బండరాయితో బద్దలుకొట్టిపారేస్తా.. నీ తోలువొలిచి, దానిపై నీ నెత్తుటితో బొమ్మలేస్తా.. నీ మాంసాన్నిఈ దీవి మృత్యుదేవత ఓవిరీకి నైవేద్యం పెడతా.. నీ ఎముకలపై కొండదేవరల బొమ్మలు చెక్కి ఆడుకొమ్మని దిసమొలల పిల్లలకిస్తా..’’

‘‘అందుకేగా నీకంత గ్లామర్, నీ బొమ్మలకన్ని డబ్బులు..’’

                                                                                                                              వికాస్

(ప్రఖ్యాత ఫ్రెంచి చిత్రకారుడు పాల్ గోగా(Paul Gauguin 1848-1903) తాహితీ దీవిలో ఉన్నప్పుడు Nafea Faa lpoipo(When Will You Marry? పేరుతో వేసిన చిత్రాన్ని ఖతర్ రాజవంశం మొన్న రూ. 1800 కోట్లకు కొన్న విషయం తెలిసి..ఒక బొమ్మకు ఇంత ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి)

భయానకం!

Bhayanakam

ఈ నలుపు ఒక తెలియని లోతు, అనిశ్చితమైన రేపు.కాంతి రాహిత్యమే చీకటి

ప్రేమరాహిత్యమే భయం

ఇంద్రియాల చుట్టూరా చీకటి

ఆ నీడల్లోంచి తొంగి చూస్తున్నదేమిటి? దుష్టత్వమా? ప్రమాదమా?

గుండెల్లో గుబులు, నుదుటి మీంచి జాల్వారుతూ భయం.

నెత్తుటెరుపు చారల్లోంచి మాత్రమే కాంతిని చూస్తున్నప్పుడు ఆశ ఏదీ? ఎక్కడా?!

మన  అశాశ్వతత్వానికి  మనమే ఎదురేగుతున్న క్షణాలివి.

నిశ్శబ్దాన్ని విను.

ఆదిమ భయాన్ని తట్టి చూడు.

భయం అనే భయాన్ని తెలుసుకో.

Mamata Vegunta

Mamata Vegunta

ఎప్పుడైనా, ఎక్కడైనా మిగిలే చిత్రం -బాల్యం!

MAIN PHOTO
సాధారణంగా ఒక అందమైన దృశ్యం చేస్తాం. లేదా ఒక ఆసక్తికరమైన దృశ్యం చేస్తుంటాం.
కానీ, నాకేమిటో ఏమీ లేనిదాన్ని చూడాలనిపిస్తుంది. చూసి ఏదైనా తెలుసుకోవాలని కాదు.
అలా చూడాలని, చూస్తూనే ఉండాలని!అందుకే ఏం చూడాలా అని చూస్తూ ఉంటాను. చిత్రమేమిటంటే, ఎవరో దేన్నో చూపిస్తూనే ఉంటారు.
ఒక్కోసారి బాలుడిగా..ఒక్కోసారి కాదు, అత్యధికంగా అన్నింటినీ అంగీకరించి, ప్రతిదానికీ పొంగిపోయే అల్ప సంతోషిలా, కొత్త బొమ్మ …కొత్త బొమ్మ అని కోరే బాలుడిగా చూస్తూ ఉంటాను.చూస్తే, ఒక మధ్యాహ్నం.
కారులో వెళుతూ ఉంటే కిటికీ గుండా బయటకి చూస్తే, ఆటో.
అందులో పిల్లవాడు. చూసి నవ్వాను. నవ్వుతూ చూశాను.
వాడు చూశాడు. చేతులు ఊపసాగాడు.

అటు ఆటో, ఇటు కారు.
మధ్యలో బాలుడు.

నేనూ వాడూ పరస్పరం కలిశాం.
ఒక ఐడెంటిటీ. బాల్యం.

songs of innocence
songs of experienceనిజానికి మొత్తం ఫొటోగ్రఫియే ఒక బాల్య చాదస్తం. నిజం.+++

ఒక చిత్రాన్ని చేస్తున్నప్పుడు బాల్యం ఉన్నంత స్వచ్ఛంగా, బాల్యం స్పందించినంత నిర్మలంగా, బాల్యం వ్యక్తమైనంత నిర్భయంగా ఇంకేమీ స్పందించదు. యవ్వనం అపలు స్పందించదు. వృద్ధాప్యమూ కొంచెం బెటరు. అనుభవంతో ఏమిటా అన్నట్టు చూస్తుంది. అందుకే పై చిత్రంలో కళ్లు కళ్లూ కలియగానే, ఆ బాలుడిలో ఒక స్పందన. ఉల్లాసం. చిద్విలాసం. ఎందుకో తెలయదు. చిర్నవ్విండు. ఒళ్లంతా తన్మయత్వం.

ఎలా బయటపడాలో నాకు తెలియనట్ల నేనేమో చిత్రాలు చేస్తుంటే వాడేమో అంతకుముందే నేర్చుకున్నందువల్లో ఏమో- తన వెంటపడిన వ్యక్తి కేసి ఇలా ‘టాటా’ చెబుతూ చేతులూ ఊపసాగాడు.

ఒకటి కాదు, వాడు నన్ను లేదా నేను వాడిని చూసిన క్షణాంతరం నుంచి చకచకా కొన్ని ఫొటోలు తీశాను.
స్పష్టంగా నాకేసి విష్ చేస్తున్న ఈ ఫొటో వాటన్నిటిలో బాల్యానికి దర్పనం. బింబం.
నిర్మొహమాటంగా వ్యక్తమైన వాడి తీరుకు సంపూర్ణ చ్ఛాయ.
టాటా.

అంతేకాదు, ఇక ఈ రెండో చిత్రం చూడండి.
ఇందులో ఆ బాలుడితో పాటు వాళ్లమ్మ ఉంది. లోపల ఆటోలో ఉంది. కొంచెం సిగ్గిల్లి, ఫొటో తీస్తున్నవ్యక్తి అపరిచితుడు కాబట్టి ముఖాన్నంతా చూపకుండా ఓరగా దాగుంది.

కొంచెం సంశయం, కుతూహలం.
అయితే, ఆమె ‘ఆ మాత్రం’ చూస్తున్నదీ అంటే తన ఒడిలో బిడ్డ – అంటే బాల్యం ఉన్నందునే.
అంతేకాదు, ఆ బిడ్డ తన అదుపు లేకుండా అంతకుముందే నా కంట పడి కేరింతలు కూడా కొట్టిండు గనుక!
అయినా గానీ, రక్షణగా తన చేయిని అలా వుంచి ఆ బిడ్డ ఆనందానికి అడ్డు రాకుండా ఉంటూనే ఓరగా అలా చూస్తున్నది.

అకస్మాత్తు.
అవును. ఒక surprise.
ఎవరైనా అలా అనుకోకుండా చూస్తే, ఫొటో తీస్తే ఎవరిలోనైనా ఒక కుతూహలం.
ఆ కుతూహల రాగమే ఆమె కళ్లళ్లోనూ పాడ సాగింది.
అది కూడా నా దృష్టిలో ఒక బాల్యం. కానీ, కుతూహలం స్థానే అనుమానం, సంశయం మరికొన్ని క్షణాల్లో కలగనంత వరకూ బాగానే ఉంటుంది. ఆ లోగానే నా బాల్యం నన్ను ఈ చిత్రం తీయించింది.
లేకపోతే ఇది దొరకదు. దొరికిందంతానూ బాల్యమే. అందుకే ఆమె కళ్లలో ఆ అందం తళుక్కున మెరుస్తున్నది.

INSIDE PHOTOఇక ఆమె పక్కనున్న ఆవిడ. తన చెల్లెలు.
ఆమె కూడా అంతే. కొంత దాగుంది. కానీ, కనులు మెరుస్తునే ఉన్నయి.
అవీ బాల్య  ఛ్ఛాయలే అంటాను నేను. అయితే, ఆమె ఇంకొంచెం ఈ అపరిచితుడికి దూరంగా ఉన్నందున ఆ ఛ్ఛాయలోంచి చూస్తూ ఉన్నందున తన మొఖం కాస్తంత విప్పారి ఉన్నది.ఇక ఆ ఇద్దరు పిల్లలు.
వాళ్లిద్దరూ బాల్యానికి ముద్దుబిడ్డలు.
అందుకే వాళ్ల కళ్లే కాదు, ముఖాలూ మెరుస్తున్నవి.

ఇక వాడు.+++వాడిని చూడాలంటే మొదటి చిత్రమే మేలు.
అందులో చేతులూ, కళ్లూ, పెదాలూ అన్నీ నవ్వుతుంటై. ఆనందంతో శుభకాంక్షలు చెబుతూ ఉంటై.
తెలిసీ తెలియక, అవతలి వ్యక్తిని చందమామలా చూస్తూ ఎందుకో తెలియకుండానే చేతులూపే ఆ బాల్యం ఎంత ఆనందం! మరెంత అందం! అంతే అందమైనది ఈ చిత్రం. మచ్చ ఉందన్న సత్యమూ తెలియనంత అందాల చందమామంత బాలరాజు వాడు. వాడికి నా ముద్దులు.

ఇదంతా ఏందుకూ అంటే బాల్యం.
అవును. ఆ నిర్మలత్వం చెప్పనలవి కానంత బాల్యం. ఒక చిత్రంలో అది పలు ఛ్ఛాయలుగా వ్యక్తం అవుతూ ఉన్నదీ అంటే, క్రమేణా ఆ బాల్యం వయసు పెరిగిన కొద్దీ అనుభవాలతో నిండి ఏ మనిషి నైనా ఇక ఆశ్చర్యానికీ ఆనందానికీ స్పందనకూ దూరం చేస్తూ.. చేస్తూ ఉంటుందీ అంటే అది ఈ రెండో చిత్రం. అందుకే ఈ చిత్రం బాల్యం స్థాయి భేదాలను అపూర్వంగా ఆవిష్కరించే చిత్రం నా దృష్టిలో.

చూస్తూ ఉండండి. ఒక్కొక్కరిని కాసేపు. ఒకరి తర్వాత ఒకరిని కాసేపు.
ముఖ్యంగా ఆ చిత్రంలో ఉన్న ఆటో డ్రైవర్ నీ చూడండి
అతడూ మనకేసి చూడకున్నా చూస్తూనే ఉన్నాడు.
రోడ్డు మీదే దృష్టి పెట్టి బండి తోలుతున్నా అతడు అన్నీ చూస్తూనే ఉన్నాడు.
తాను పూర్తి కాన్షియస్ లో ఉన్నాడు. అందుకే అతడి బాల్యపు చ్ఛాయలు చిత్రంలో కానరావు.
అంతా adulthood.  కానీ, మళ్లీ ఈమెకు రండి. womanhood.
తల్లి. అందుకే అంత అందం.

ఆ తల్లి కొంగు చూడండి. దానిమీద పువ్వులను చూడండి. నిండుగ విరిసిన ఆ మోము చూడండి. అందలి సిగ్గులు చూడండి. ఆఖరికి కనులు చూడండి. గర్వంగా ఆనందంగా నిండుగా, అదీ తల్లి అంటే. మాతృత్వపు -బాల్యపు శ్రద్ధ, దృశ్య- ఆ ఛాయ.

తర్వాత తప్పకుండా దయవుంచి ఈ రెండో చిత్రంలోని పిల్లవాడిని జాగ్రత్తగా చూడాలి,
ఆశ్చర్యం. వాడి దృష్టి ఇప్పుడు నా నుంచి -మీ నుంచి -వేరే దానిమీద పడింది.
గమనించారా? ఇప్పుడు వాడు వేరే దాన్ని చూస్తున్నడు.

చేతులు చూడండి- అవి ఇంకా మనవైపే ఉన్నాయి.
కానీ, కన్నులు? అవి వేరే వైపు చూస్తున్నాయి.
వాడి దృష్టి మారింది.

అదే చిత్రం.
నిజం. బాల్యం.

+++

బాల్యం ఎంత చక్కగా చూస్తుందో!  ప్రతిదీ, నిత్యమూ కొత్తగా. ఎప్పుడూ అంతే.
అంతకుముందు చూసిందానిపై ఎంత ప్రేమతో ఆ బాల్యం చూపులు సారిస్తుందో అంతే ప్రేమతో అది మరోదానికేసి చూడటం దృశ్యాదృశ్యం. ఛాయా చిత్రలేఖనము లేదా బాల్యం.

మన adult egoకు నచ్చదుగానీ అదే బాల్యం బలిమి.
ఎదుగుతున్నకొద్దీ దృష్టి ఒకదానిపై నిలుస్తుంటే అది బాల్యానికి సెలవు.
ఎప్పుడూ నిలిచే దృష్టే. ఒకదానిపై కాకపోతే మరొకదానిపై నిలిపే దృష్టే బాల్యం.

అందుకే ఎప్పుడైనా, ఎక్కడైనా తొలి చిత్రం -బాల్యం.
ఎవరికైనా, ఎందుకైనా మలి చిత్రం – బాల్యానికి టాటా.

~ కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

నీ గదిలో వెలిగే దీపం

IMG_20150206_180754430
ఆర్తిగా ఉదయించే ప్రతీ క్షణానికి అటువైపు,
చేయి విదిలించుకుంటూ నీ నిరాశ
పట్టు బిగిస్తూ ఇటువైపు మరో ఆశ
మధ్యలో సన్నటి గీత ఒకటి మెరుస్తూనే ఉంటుంది
చూసీ చూడనట్టు దాటే ప్రయత్నం చేసి
బుద్ధి ఓడిపోతుంటుంది
పగులూ రాత్రీ , ఒకే మెలకువతో
అర్ధాంతరంగా ఆగిపోయిన
ఒక్క నీ పాట  కోసం కాచుకుంటుంది
రాత్రంతా నీ గదిలో వెలిగే దీపం చూసి ,
తెల్లవారినప్పుడు, ఆకాశం వంటి కాగితం మీద
నీ కవిత్వం ఉదయించాలని కలలు కంటుంది
లెక్కలేనన్ని జ్ఞాపకాలు రాలిపడినప్పుడు
నలిగిపోయిన ఓ పసి కుసుమాన్ని,
దోసిట్లో దుఃఖాన్ని దాచుకున్నపుడు
వేళ్ళ సందుల్లోనుంచి జారి పడిన ఓ కన్నీటి చుక్కనీ ,
నీవు దాటుతూ వెళ్ళే తన గోడ మీద అంటిస్తుంది
నీవు మాత్రం తెలుసుకోగల అర్ధాలతో వర్ణిస్తుంది
ఎంతకీ వీడని నీ నిశ్శబ్దంలో నుంచి
తనలోకి తను వెళ్ళి సేదతీరడం నేర్చుకుంటుంది
గాఢమైన చీకటిలో నిగూఢమైన శాంతిని హత్తుకుంటుంది
నిన్ను నెమరవేసుకుంటూ
తానో తపోవనంగా మిగిలిపోతుంది !!
– రేఖా జ్యోతి 
Rekha

చేరతాను, కానీ..

Ghar-wapsi

అయ్యలారా!

మరీ సిగ్గులేకుండా అడుగుతున్నారు కదా

సరే, మీ కోరిక ప్రకారం మీ మతంలో చేరతా,

మీరు చేయమన్నవన్నీ చేస్తా..

కానీ, ముందు కొన్ని విషయాలు తేలాలి

కొన్ని గట్టి హామీలు కావాలి..!

ఇప్పటికే ఏన్నో దగాలు పడినవాడిని కదా,

ఇప్పటికే ఎన్నో చేతుల్లోపడి అసలు రూపు కోల్పోయినవాడిని కదా,

అందుకే ముందు జాగ్రత్త..!

ముక్కోటి దేవతల భక్తులారా!

ఇంతవరకు ఒక్క దేవుణ్నే కొలిచిన వాడిని కదా,

మీ మతంలో చేరాక, ఏ దేవుణ్ని కొలవాలి?

పంగనామాలు పెట్టుకోవాలా, పట్టెనామాలు పెట్టుకోవాలా?

మనుధర్మ మార్గీయులారా!

కులం లేని వాడిని కదా,

మీ మతంలో చేరితే ఏ కులంలో చేర్చుకుంటారు?

బ్రాహ్మణులు గొప్పవాళ్లంట కదా, వాళ్లలో చేర్చుకుంటారా?

మీ దేవతల గుళ్లలోకి కాదు, గర్భగుళ్లలోకి రానిస్తారా?

ఆ దేవతలకు నా చేతులతో స్నానాలు, పూజలు చేయనిస్తారా?

మంత్రాలదేముండిలెండి..

చిలకలు పలకడం లేదా, తంటాలుపడి నేర్చుకుంటాను

కులగోత్రాల పరాయణులారా!

ఇంతవరకు వాటి సొంటులేని వాడిని కదా,

మీ మతంలో చేరితే ఏ కులం వాళ్లను పెళ్లాడాలి?

నాకు పుట్టబోయే పిల్లలు ఎవరిని పెళ్లాడాలి?

గోవధ వ్యతిరేకురాలా!

గొడ్డుమాంసం తినేవాడిని కదా,

మీ మతంలో చేరాక ఏ మాంసం తినాలి?

గొడ్డుమాంసం మానుకుంటే పొట్లి మాంసం తినడానికి డబ్బులిస్తారా?

అసలు మాంసమే తినొద్దని అంటారా?

ఆ మాట మాత్రం అనకండి,

తరతరాలుగా ముక్కరుచి మరిగిన వాడిని కదా!

సంతాన సంఖ్యా నిర్దేశకులరా!

పిల్లలను కనడంపై ఆంక్షలెరగని వాడిని కదా,

మీ మతంలో చేరాక ఎంతమంది పిల్లలను కనమంటారు?

మీకు పడని మతం వాళ్ల సంఖ్యను దాటిపోడానికి

మీ మతం వాళ్లను గంపెడు పిల్లలను కనమని అంటున్నారు కదా

ఎక్కువ మందిని కంటే వాళ్లను సాకడానికి డబ్బులిస్తారా?

తక్కువ మందిని కంటే మీ మతంలోంచి తన్ని తగలేస్తారా?

మనిషికంటే మతమే గొప్పదనే మహానుభావులారా!

మనుషుల తర్వాతే మతాన్ని పట్టించుకునేవాడిని కదా,

మీ మతంలో చేరితే మనుషులనెట్లా చూడాలి?

కులాలుగానా, మతాలుగానా?

అంకెలుగానా, కోటాలుగానా?

కోటాగాడిని కదా,

కోటాలో ఉజ్జోగమొస్తే చేరాలా, చేరొద్దా?

చేరొద్దంటే బతికేదెట్లా?

అయ్యలారా!

ఇవన్నీ, ఇలాంటివన్నీ బతుకుపై ప్రశ్నలు..

చావుపై ప్రశ్నలూ ఉన్నాయి

చచ్చాక  పూడ్చడం మా ఆచారం

మీ మతంలో చేరాక

నేను చస్తే నా శవాన్ని ఏం చేస్తారు?

పూడ్చేస్తారా, కాల్చేస్తారా…?

ఆహ్వానితుడు

అపుడు కరెంటుండ్లేదు!

అపుడు కరెంటుండ్లేదు. తెల్లారి మూడుగటల్కే లేసి మా నాయినావాళ్లు కపిలిబాన దాని సరంజామా అంతాతీసుకోని,ఎద్దులు తోలుకోని,సేన్లకి నీళ్లు తోలేదానికి పోతావుండ్రి.

దూళి దూళి మబ్బున్నట్లే మాయమ్మ,అన్నయ్య,అక్కయ్యావాళ్లు లేసి ఎనుములు(బర్రెలు)ఇంట్లోనుంచి బయటకట్టేసి,ప్యాడ తిప్పకిమోసి,గంజుతీసి పారబోసి పాలు పిండతావుండ్రి. అయిదుగంటల్కే ఇందూపురమ్నుండి పాలోడొచ్చి సేర్తోకొల్సి సైకిల్లో తీసుకుపోతావుండె.ఏడుగంటల్కి ఇసుకూలుమొదలయ్యి పదిగంటల్కి ముగుస్తావుండె.అపుడు ఇసుకోలు పిళ్లోళ్లంతా ఎనుముగొడ్లు మేపుకోనొచ్చేకి పోతావుంటిమి.

సానామంది రెడ్డ్ల ఇండ్లల్లో పనులుసేసేకి,సేద్యాలు సేసేకి, జీవాలుమేపేకి జీతగాళ్లు(సంబళగాళ్లు)వుంటావుండ్రి(ఎక్కువగా మాదిగలు ఒకసారి పెళ్లికో,జాత్రకో,ఇతరఖర్చులకో కొంత అప్పుచేసి,దానికి హామీగా వారిపిల్లల్ని చాకిరీకి వుంచేవారు దాదాపు 1977(ఎమర్జెన్సీ) వరకూ ఈపద్ధతి వుండేది). మాఇంట్లో అన్నిపన్లూ మేమేసేయల్ల.

వుప్పర నరసిమ్ముడు, పింజిరి పీరూగాడు,బేల్దారి అస్వత్తుడు,మురవోడు,నేను ఎనుముల జతగాళ్లు.వాటిమింద కూకోని గుర్రాలమాదిరీ ఎగిరిస్తావుంటిమి. అపుడు వాన్లు బాగకురుస్తావుండె. పొలాల్లో పంట్లు,కాణాసిల్లోగడ్డి పెరుగుతూనే “కట్” సేసినట్ల తప్పెటకొట్టి సాటింపేస్తావుండ్రి. ఇద్దురు ముగ్గురు కావలిగాల్లు పొలిమేర్లకానా గస్తీతిరుగుతావుండ్రి.పంట్లు కోసేవొర్కూ జీవాలు పోగూడదు,గడ్డికోయగూడ్దు.అట్లసేస్తే జూల్మానా ఏస్తావుండ్రి. బందుల్ దొడ్డికి తోల్తావుండ్రి.

అందుకే మేము బాటపక్కకి తోల్తావుంటిమి. సుక్కురువారుము ఇందూపురంసంత.సుట్టూపక్కల వూర్లజనాలంతా పొద్దుట్నుంచి రాత్రిఒరుకూ ఇసకేస్తే రాల్నట్ల పోతావుండ్రి.ఒగరిద్దరు రెడ్లు,కోమిటి లెచ్చుమయ్య మాత్రమే పావళాఇచ్చి జట్కాలో పోతావుండ్రి.

వుప్పరనరసిమ్ముడు బొలే కిల్లేకిత్తిరిగాడు. బోకుల్ని రెండణాలమాదిరీ(అప్పుడు పగలంతాపనికి రెండణాలకూలి.12పైసలు) తయారుసేసి పాతబట్టల్ని కర్చీపుల్మాదిరీసించి మూటగట్తి దావలో ఏస్తావుండె.శానామంది దుడ్లే అనుకోని అక్కడిక్కడసూసి ఎత్తుకుపోతావుండ్రి.సెట్లమరుగ్లో దీన్నిసూసి కడుపులు పగిలేతట్ల నగుతావుంటిమి.

మావూర్లపక్క యాడసూసినా సెరుకుతోట్లే!! బెల్లాన్ని బండ్లకినింపి మండీలకి తోల్తావుండ్రి.వాళ్లని అడిగితేసాలు తినే అంతబెల్లమిస్తావుండ్రి.ముందుగానే సంటకుపొయ్యి తిరిగొచ్చే వాళ్లనడిగితే బొరొగులూ కారంబూందీలు పెడతావుండ్రి.ఈపన్లు నరసిమ్ముడు,మురవోడు సేస్తావుండ్రి.

ఒంటిగంటకి సైరన్నుకూస్తావుండె.అవుడు ఎనుముల్ని గుంతల్లోకో సెరువులోకో దించి నల్లగా నిగనిగలాడేతట్ల కడిగి ఇంటికి యల్బార్తావుంటిమి.రెండుగంటల్కి పాలోడొచ్చేటయానికి మద్యాన్నంబెల్లుపడతావుండె. గోదుమరవ్వతో వుప్పుమా,పొవుడరుపాలూ ఇస్తావుండ్రి.రవ్వంత సదువవుతూనే ఇసుకూలు తోటకి సెరువునీళ్లు మోస్తావుంటిమి.

ఇంటికిపొయ్యినంక కట్లికి(వంటచెరుక్కు) పోవల్ల. ఆకాలంలో మావూరిదగ్గర తిండికన్నా కట్టెలకరువుశానా. ఈత తట్టెల్తీసుకోని జొన్నకొయ్యలు,కందికొయ్యలు,సన్నబన్న గబ్బుసెట్లు ఏరుకోని తెస్తావుంటిమి. తిరగ ఇంటిముంద్ర,పసువులకిందా కసువు సిమ్మల్ల.ఎద్దులకి సొప్ప,అగిశాకూ తినిపించల్ల. కుడితికి,ఇంటికి కావల్సినన్ని నీళ్లు బాయినుంచి సేదల్ల.(కొన్నిపన్లు నావరకూవచ్చేవికావు.అప్పుడు అందరు దాదాపు చేయాల్సినపనులు చెబుతున్నాను) రాగులు ఇసరల్ల,జొన్నలు వొడ్లుదంచల్ల సన్నపిళ్లోల్లని ఎత్తుకోవల్ల. లాటీన్ల(ల్యాంపుల) చిమిలీలమస్సితుడుసల్ల. సీమనూనె పోయల్ల,తావదీపం పెట్టేకి ప్యాడ తేవల్ల. ఏడుగంటల్కే బువ్వతినల్ల.

కడుపుకు సరయిన కూడులేక మేము సస్తావుంటే వానెమ్మ!!

నల్లుల బాదయాలసెప్పల్ల.ఇంటి నడిమద్య సాపలు,గోనిసంచులు పర్సుకోని అవిరాకుండ సుట్టూర కోటమాదిరీ రాగివుబ్బళ(రాగులమీది పొట్టు),మూటకట్టాకు(వరిమడికోశాక మొలిచే బంకబంక ఆకులుండేకలుపుమొక్క) ఏసుకొంటా వుంటిమి.జనాల రగతం తాగేదానికేమో!! అవి శానాతెలివయిన్వి.పక్క గోడ్లు,తడకలూ ఎక్కి మేలాటం (టాపు)మీద్నుంచి మిందకి దుముకుతావుండె.

నీళ్లు పోసుకోనేది, బట్టలిడిసేది ఒగవారం లేటయితేసాలు బట్టల్నిండా కూరేగంట్లు(చీర పేన్లు) ఇంకాకొంద్రు బీదాబిక్కీ జనాలకి పీడ పేన్లు పడతావుండె.అవి సంకలకింద,తొడలమద్య,కన్రెప్పల్కి అతుక్కోని గోరుల్తో గీకినా కనిపిస్తావుండ్లేదు.ఇట్ల అర్దం రగతం అవేతాగుతావుండె.

పున్నమికోసరం నెలంతా ఎదురుసూస్తావుంటిమి. యాలంటే ఆపొద్దు రాత్రిలో ఎలుగుంటుంది. యంతసేపయినా ఆడుకోవొచ్చు. ఆడపిల్లోల్లు మగపిళ్లోల్లు కల్సి సల్లేమల్లే గుడ్లు( చల్లే మల్లెల కుప్పలు-ఎంత అధ్భుతమైన పేరోకదా!!)పెద్దోళ్లు వుప్పురపెట్టెలు- ఆట్లు ఆడ్తావుంటిమి.

ఏమాట్లాడినా మానాయిన లేకుంటేనే!! ఆయప్ప కతలు ఇంగొగ సారిసెప్పుతాను. మాయన్న ఇంట్లో వుంటే నేను మాయమ్మకి సిక్కల్ల. నీళ్లు పోపిచ్చుకోవల్ల. పేన్లు సూపిచ్చుకోవల్ల. ఈపిలు(పేల గుడ్లు)ఈరబానితో ఈరిపిచ్చుకోవల్ల. గోర్లు కత్తిరిచ్చుకోవల్ల. పండుకొంటే ఇసనగర్రి తోఇసరుకొంటా కూకోవల్ల.

మాఇల్లు యట్లున్నిందో రవ్వంత సెప్పుతాను. అట్లాఇల్ల యాడన్నావుందేమో అని శానాఏండ్లు యెదికినా కనపడ్లేదు. నేను పుట్టేకి ముందే మాయప్పప్పా(చిన్నాయన) మానాయినా యారేపొయ్యిండారు. సుట్టూ ఇటికెలగోడ దానిమింద సెరుకు సోగల కప్పడము మాసిన్నాయనది.దాని పక్కలోనే సుట్టూ టెంకాయ గర్రుల తడకలు.ఆడ వానొస్తే ఈడకారేసోగలకప్పడము మాది.వాకిలికూడా తడకే.కుక్కలు,కోళ్లు,పిల్లులు,మేము యాడ్నుంచీ అయినా దూరి లోపలికిపోవొచ్చు.అందుకే మాయమ్మ శార,సంగటి,మజ్జిగ..అన్నీ వుట్టిమిందే ఎత్తిపెడ్తావుండె.

అది కూటికరువుకాలము. జనాలు పుట్టిండేది తినేదానికే అనిపిస్తావుండె. మేము అయిదారుమంది పిల్లోల్లు. వుండేది ఒగతట్ట. మాయమ్మ సంగటి కెలుకుతూనే తెడ్డు సుట్టూసేర్తావుంటిమి. అందురూ ఒగే తట్ట సుట్టూసేరి-నువ్వుముందో నేనుముందో-అన్నట్ల తింటావుంటిమి. వేరే ఇండ్ల్లో ఆడోల్లు మగోల్లు కూడా ఒగేతట్లో తింటావుండ్రి.

మానాయిన ఇపరీతంగా బీడీలు తాగుతావుండె.(గణేష్ బీడీలు) సాయంట్రమౌతూనే వాళ్లూ వీళ్లూ వొచ్చి మాగుడిసితాకొస్తావుండ్రి. వాల్లకి రాజకీయాలు,బారతంకతలు,దేశాలుతిరిగి సూసిన సంగత్లన్నీ సెప్పుతావుండె.మద్యాలో బీడీ ఆరిపోతే బుడ్డీలోనో,పొయ్యిలోనో అంటిచ్చుకు రమ్మని సెప్పుతావుండె.అది యంతసేపటికీ అంటుకోకుంటే నోట్లో పెట్టుకోని ఒగ పీక పీకుతావుంటి.

ఒగదినము గుంతులో పగసేరి తగ్గొస్తే అది సూసి జుట్టుపట్టుకోని వంగబెట్టి కొట్టింది ఇంకాబాగ గురుతుంది.

అట్ల బీడీలు తాగీ తాగీ నోరు సెడిపోతావున్నేమో. మాయమ్మ యంతబాగ శార సేసినా రుసీ పసీలేదని గలాటకి పెట్టుకొంటావుండె.గిన్నిచ్చి నన్ని ఇండ్లంటీ తరుముతావుండె.ఒగొగుదినము ఒగొగు ఇంటికిపొయ్యి శార పోపిచ్చుకొస్తావుంటి.ఇండ్లతాకిపొయ్యి అడుక్కుతినేవోళ్లమాదిరీ అడిగేకి, నాకి శానాసిగ్గి. పోకుంటే ఏట్లు.మేం పదిమంది సంతానం. మా అక్కయ్య ఇద్దరన్నయ్య గార్లూ శానా పెద్దోల్లు. ఇంకిద్ద రన్నయ్యగార్లూ సచ్చిపొయ్యిండారు.(వాళ్లు యట్ల సచ్చిరో తిరగ సెప్పుతా) ఇంకిద్దరు తమ్ముల్లూ, సెల్లెళ్లూ శానా సన్నపిల్లోళ్లు.అందుకే సన్నాబన్నా పన్లన్నీ నామిందే పడ్తావుండె.

-సడ్లపల్లె చిదంబరరెడ్డి

లాగ్అవుట్ అవకముందే…

69309-19072bpablo2bpicasso2b2528spanish2bartist252c2b188125e225802593197325292bnude2bhalf2blength2b1907-bmp

అక్కడ ఒక్క ముఖమే ఉందో లేక
అనేక ముఖాల  ముసుగులో ?
గుంజలు పాతి ఆ ముఖాల్ని ఆరబెడుతుంటే ఆశ్చర్యం. 

ముఖాల్లేని మనుషులని ఎప్పుడైనా చూసారా ?
ముఖం లేనోడా అని తిడుతున్నప్పుడు
ఆ ముఖాలు అలాంటి వాళ్లవేనా అనిపిస్తుంది
వాటిని అలా ఇచ్చేసి వాళ్ళు వ్యాపారమే చేస్తారో ? లేక
వ్యాపార ప్రకటనలకోసం జీవితం ఇచ్చేస్తారో ?

నడిచే మొండాల్ని చూస్తున్నప్పుడు
ఎవరెవరు, ఎవరెవరో అని ఎలా గుర్తుపడతారు
తెలుసుకోవడమూ ఆశ్చర్యమే !

ముఖాలు వేరుగా మనుషులు వేరుగా సంచరించే రోజులొస్తే
ఒక దగ్గర మొహాలు
మరో దగ్గర మొండాలు తిరుగుతూ మనుషులకి మరో అర్ధం చెపుతారా?

ఏమో
ముఖపుస్తకాల్లో ముఖాలు ఎండుతున్న శబ్దం
ఎక్కడెక్కడో మునిగే మొహాలు
ఇక్కడ ఎండబెట్టుకున్నాక తిరిగి తొడుక్కునే అంచనాలకోసం
క్వశ్చనేర్ తయారు చేస్తున్నా


సాయం కోసం ఏవైనా ముఖాలు మిగిలితే ఈ గోడపై ఎండేయండి

రాల్చని  అపక్వ భావోద్వేగాలను కవితాత్మకంగా ఒడిసిపట్టనివ్వండి   

అందరికీ గుర్తుండే ముఖమేదో తేలనివ్వండి,

జీవితం నుంచి లాగ్అవుట్ అవకముందే

-అన్వీక్ష

ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!

గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన పాచి అన్నానికి మళ్లీ ఒకసారి మసాలా దట్టించి తిరగమోత పెట్టి వడ్డించజూస్తుంటే ఎలా ఉంటుంది? ఇంతకన్న అర్థరహితమైన, ప్రమాదకరమైన, హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని రాజకీయ సామాజిక నిర్వాహకులు నిస్సిగ్గుగా సాగిస్తుంటే సమాజమంతా మౌనంగా నిర్లిప్తంగా చూస్తున్నది. కాలం మారుతున్నదా లేదా, మనం మారుతున్నామా లేదా అని సందేహం కలుగుతున్నది. సంఘపరివార్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఘర్ వాపసీ కార్యక్రమం చూసి, దాని పట్ల సమాజం స్పందించవలసినంతగా స్పందించకపోవడం చూసి నిస్సహాయ ఆగ్రహం నన్ను రెండు మూడు నెలలుగా కలవరపెడుతున్నది.

ఘర్ వాపసీ గురించి వినగానే నాకు ‘ప్రజలమనిషి’లో వట్టికోట ఆళ్వారుస్వామి మతాంతరీకరణ గురించి సృష్టించిన అద్భుతమైన సన్నివేశాలు గుర్తొచ్చాయి. ‘దేశభక్తి’ తొలిపాఠంలో ‘నిన్న వచ్చారింగిలీషులు/ మొన్న వచ్చిరి ముసలమనులటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి వేరులు పెట్టకోయ్’ అని రాసిన, ఆ తర్వాత ‘పెద్ద మసీదు’ కథ రాసిన గురజాడ అప్పారావు గుర్తొచ్చారు. ‘మనకా మతాభిమానం’ అంటూ ‘హిందూ’ మతస్థులమనుకునేవాళ్ల కుహనా ఆభిజాత్యాన్ని తుత్తునియలు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గుర్తుకు వచ్చారు. గత శతాబ్ది తొలి పాదంలో, మధ్య భాగంలో కనబడిన ఆ స్పందన, చైతన్యం, ప్రశ్నించే స్ఫూర్తి ఇప్పుడు కరవైపోతున్నదా అని తీవ్ర విచారం కలిగింది. మతోన్మాదుల ఘర్ వాపసీ ప్రేలాపనలకు గతానికీ వర్తమానానికీ ఎడతెగకుండా జరుగుతున్న సంభాషణ నుంచి ఎన్ని జవాబులు చెప్పవచ్చు గదా అనిపించింది.

ఘర్ వాపసీ నినాదం నిజానికి మతవిద్వేషానికి ముసుగు. ‘ఇంటికి తిరిగిరండి’ అని పిలుస్తున్నవారు చూపుతున్నది ఇల్లూ కాదు, తిరిగివస్తే ఏ ఇంట్లో ఉంచుతారో, అసలు ప్రాణాలతో ఉంచుతారో లేదో తెలియదు. ఇంతకూ అది పిలుపు కూడ కాదు. అది ఒక బెదిరింపు. నేరారోపణ. వేధింపు. భీతావహ వాతావరణం సృష్టించడానికి హంతకశక్తులను ప్రేరేపించే ఉచ్ఛాటన. అది సరిగ్గా అడాల్ఫ్ హిట్లర్ ఇతర మతస్తుల పట్ల, ముఖ్యంగా యూదుల పట్ల ప్రదర్శించిన వ్యతిరేకత లాంటిది. కాకపోతే ఈసారి అది తోసేసే, చిత్రహింసలు పెట్టే. చంపేసే రూపాన్ని కాసేపటికోసం దాచుకుని పిలిచే ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. ‘ఈ పిలుపుకు రాకపోయావో, చూసుకో ఏం చేస్తానో’ అనే బెదిరింపు అది. పిడికెడు మందిని ఆకర్షించగలిగినా లేకపోయినా, కోట్లాది మందిని బెదురుకు, అభద్రతకు గురిచేసి, తమ నేల మీద తాము బెరుకుబెరుకుగా జీవించేలా చేసే యుద్ధారావం అది. అనేక సంస్కృతుల, భాషల, మతాల, కులాల బహుళత్వపు భారతీయతను ఏకత్వంలోకి, అది కూడ సంఘపరివార్ నిర్వచించే బ్రాహ్మణీయ సంకుచిత హిందుత్వలోకి కుదించదలచిన మతరాజకీయాల ఎత్తుగడ అది. ఘర్ వాపసీ అనే మాటకు ఇంటికి తిరిగిరావడం అనే తటస్థమైన అర్థమే కనబడుతుంది. అది ఆత్మీయ పునరాగమనం లాగే, పునర్మిలనం లాగే అనిపిస్తుంది. కాని అసలు లక్ష్యం ఇతర మతాల పట్ల ద్వేషం. ఇతర మతస్తుల పట్ల ద్వేషం. మతాల మధ్య, మనుషుల మధ్య భేదాన్ని, అసహనాన్ని, అనుమానాన్ని, విద్వేషాన్ని, రక్తపిపాసను, హంతక దాడులను ప్రోత్సహించి, మతం పెట్టుబడిపై రాజకీయ లాభాలను సంపాదించదలచిన క్షుద్రక్రీడ అది.

‘భారతదేశంలో ఉండాలంటే హిందువులు కావలసిందే’ అనే సంఘ పరివార్ శక్తుల బెదిరింపులకు కొనసాగింపే ఘర్ వాపసీ. ప్రస్తుతం ఇతర మతాలను అవలంబిస్తున్న భారతీయుల పూర్వీకులందరూ హిందువులేననీ, వారు పాలకుల బలప్రయోగం వల్లనో, మతబోధకుల ప్రలోభాల వల్లనో మతాంతరీకరణ చెందారనీ, అందువల్ల ప్రస్తుత హైందవేతరులందరూ తిరిగి ఇంటికి రావాలనీ ఒక అచారిత్రక కుతర్కాన్ని సంఘపరివార్ శక్తులు తయారు చేశాయి. ఈ తర్కానికి పరాకాష్టగా ఒక కేంద్ర మంత్రి ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను రామ్ జాదే (రాముడి సంతానం) అవుతారా, హరామ్ జాదే (అక్రమ సంతానం) అవుతారా తేల్చుకొమ్మని సవాల్ విసిరింది. ముస్లిం యువకులు హిందూ యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని, హిందూ మతస్తుల సంఖ్య తగ్గించడానికీ, ముస్లింల సంఖ్య పెంచడానికీ కుట్ర పన్నుతున్నారనీ, ఈ లవ్ జిహాద్ ను అడ్డుకోవాలనీ సంఘ పరివార్ పిలుపునిస్తోంది. దీనికి ప్రతిగా ‘బహు లావో – బేటీ బచావో’ అని నినాదం ఇస్తోంది.

rss-muslims-conversions-pti

ఈ ప్రమాదకర మత రాజకీయాల నేపథ్యంలోనే ఘర్ వాపసీ నినాద స్థాయి నుంచి ఆచరణ స్థాయికి మారింది. సంఘపరివార్ లో బలప్రయోగశక్తిగా పేరుపొందిన బజరంగ్ దళ్ తో పాటు, కొత్తగా ఇందుకోసమే పుట్టిన ధర్మ్ జాగరణ్ సమితి ఆగ్రాలో దాదాపు 350 మంది వీథి బాలలను, ఫుట్ పాత్ నివాసులను, అనాథలను పోగుచేసి, వారిని “శుద్ధి” చేసి, హిందూ మతంలోకి తిరిగి చేర్చుకున్నాయి. ఈ ఘర్ వాపసీలను విస్తృతంగా సాగించి 2021 కల్లా క్రైస్తవులు, ముస్లింలు లేని, హిందువులు మాత్రమే ఉండే భారతదేశాన్ని తయారుచేస్తామని ధర్మ్ జాగరణ్ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ అన్నాడు. ఇటువంటి ప్రకటనలనే దేశవ్యాప్తంగా సంఘ పరివార్ నాయకులు పునరుక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు, బెదిరింపులు మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని ఎందరో హెచ్చరించిన తర్వాత స్వయంగా ప్రభుత్వాధినేతలు కాస్త స్వరం తగ్గించి, మార్చి ఈ పామును ఇప్పటికి బుట్టలో పెట్టారు గాని, మళ్లీ ఎప్పుడు ఆ బుట్ట మూత తీసి ప్రజలను పాముకాటుకు ఎరచేస్తారో తెలియదు.

ఈ ప్రకటనలకు, వ్యాఖ్యలకు, బెదిరింపులకు ఉపయోగిస్తున్న తర్కం అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మతస్వేచ్ఛ మీద, ఆదేశిక సూత్రాలలో ప్రకటించుకున్న శాస్త్రీయ దృక్పథ ప్రాధాన్యత మీద దాడి ఇది. ఈ తర్కం అచారిత్రకమైనదీ, అసంబద్ధమైనదీ, అర్థరహితమైనదీ కూడ. ఎందుకంటే, హిందూ మతం అనే మతం ఒకటి ఉందా అనే ప్రశ్నను అలా ఉంచినప్పటికీ, హిందూ మతానికి ప్రాతిపదిక వర్ణాశ్రమ ధర్మం. కుల అంతరాలు. మరి ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా, వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు. పూర్వీకుల కులంలోకే వెళతారని కొందరు, కోరుకున్న కులంలోకి వెళ్లవచ్చునని కొందరు అంటున్నారు. పూర్వీకుల కులంలోకే వెళ్లవలసి ఉంటే ఘర్ వాపసీ కి అర్థం లేదు. కోరుకున్న కులంలోకి వెళ్లే అవకాశం ఉంటే హిందూ మతమే మిగలదు. అసలు ‘హిందూ మతం’ అనేదేదైనా ఉంటే, ఒకప్పుడు మతాంతరీకరణకు గురయ్యారనుకునేవాళ్లందరూ ఎప్పుడైనా ఆ మతం పరిధిలోనే ఉన్నారా, ఆ మతం వారిని తనలోపలికి తీసుకుందా అనేవి అనుమానాస్పదమైన, ఆధారాలు లేని అంశాలని చరిత్ర చెపుతున్నది.

అలాగే గతంలో పాలకులు బలప్రయోగంతో, మతబోధకులు ప్రలోభాలతో మతాంతరీకరణ జరిపారనే వాదన కూడ పూర్తి సత్యం కాదు. సాధారణంగా హిందుత్వవాదులు బలప్రయోగం అన్నప్పుడు ముస్లిం పాలకుల కాలాన్ని, ప్రలోభాలు అన్నప్పుడు క్రైస్తవ మతబోధకుల కాలాన్ని సూచిస్తారు. కాని నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు. అసలు మతాంతరీకరణకు ఇలా ఆకర్షించడమే (పుల్ ఫాక్టర్) ఏకైక కారణం అనడం సరికాదు. భారత సమాజంలో మతాంతరీకరణకు అనేక సంక్లిష్ట కారణాలు ఉండే అవకాశం ఉంది. కాని ప్రధాన కారణం మాత్రం హిందూ వర్ణాశ్రమధర్మ, కుల అసమానతల సమాజం బైటికి తోయడం, వికర్షించడం (పుష్ ఫాక్టర్) కావచ్చు. ఈ సమాజంలో వివక్షకు, అసమానతకు, పీడనకు, అంటరానితనానికి గురైన వర్గాలలో అత్యధికులు అవకాశం వచ్చినప్పుడు మరొక మతం వైపు చూశారు. అందులోనూ అసమానత సహజమైనదని, భగవంతుడే సృష్టించాడని “హిందూ” మతం అంతరాలకు దైవిక సమర్థన ఇస్తుండగా, ఆ అంతరాల పీడనకు గురవుతున్నవారిని చేరవచ్చిన మతాలు కనీసం సైద్ధాంతికంగానైనా ప్రేమను, కరుణను, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాయి.

సరే, ఈ చర్చంతా ఎలా ఉన్నా ఇంత ప్రధానమైన అంశం మీద బుద్ధిజీవులు స్పందించవలసి ఉంది. కాని తెలుగు బుద్ధిజీవులలో అతి తక్కువ మంది మాత్రమే ఘర్ వాపసీ గురించి ఆలోచించడం, స్పందించడం, మరింత తక్కువ మంది ఆ స్పందనను రచనల్లో చూపడం చూస్తే విచారం కలుగుతున్నది. కనీసం వంద సంవత్సరాల కింద గురజాడ అప్పారావు, డెబ్బై సంవత్సరాల కింద శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అరవై సంవత్సరాల కింద వట్టికోట ఆళ్వారుస్వామి ఈ విషయంలో చూపినంత స్పందననైనా మనం ఇవాళ చూపలేకపోవడం ఎందుకో ఆలోచించాలనిపిస్తున్నది.

ఈ దేశం మాదే అని ప్రకటించే అధికారం “హిందువుల”మని చెప్పుకునేవారికి లేదని గురజాడ, శ్రీపాద ఇద్దరూ చాల స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిష్ వారు నిన్న వచ్చారని, ముస్లిములు మొన్న వచ్చారని అనుకుంటే అటు మొన్న నువ్వు వచ్చావని మరచిపోయి, విభేదాలు పెట్టగూడదని గురజాడ ప్రబోధించారు. ఆ మాటలో కూడ ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తే, బ్రిటిష్ వారిని భాషతోనూ, ముస్లింలను మతంతోనూ గుర్తించడం వంటి బ్రిటిష్ చరిత్రకారులు మనకు అంటించిన లోపం ఉన్నప్పటికీ, ఈ మతవైవిధ్యం విభేదాలకు, విద్వేషాలకు కారణం కాగూడదని సూచించడం ఇవాళ్టికీ అవసరమైన ప్రజాస్వామిక అవగాహన.

అలాగే ‘పెద్దమసీదు’ కథలో “కాకుళేశ్వరుడి గుడి పగలగొట్టి మ్లేచ్ఛుడు మసీదు కట్టాడు” అని ఒక పాత్రతో అనిపిస్తూనే “దేవుడెందుకూరకున్నాడు స్వామీ” అని ప్రశ్నవేయించి, “ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా…” అని వ్యంగ్యంగా మనిషి చేసిన దేవుడి నిస్సహాయతను చూపించారు. అట్లాగే ‘మీ పేరేమిటి?’ కథలో హిందూ మతంలో భాగమనుకునే శైవ వైష్ణవ శాఖల మధ్య ఘర్షణలను చిత్రించారు. ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని ఒక అమాయకమైన, కాని అవసరమైన ఆశను ప్రకటించారు.

ఆ తర్వాత రెండు మూడు దశాబ్దాలకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మత మౌఢ్యాన్ని విమర్శిస్తూ, వెటకరిస్తూ రాసిన అనేక రచనల్లో ‘మనకా మతాభిమానం’ అనే అద్భుతమైన వ్యాసం ఇక్కడ గుర్తు తెచ్చుకోదగినది.

“…మన మతం యేది?

దీనికి సమాధానం రావాలంటే, ముందు, మనం యెవరమో తేల్చుకోవాలి.

మనం అంటే హిందువులం అనుకుందామా, మన సనాతనత్వం పోతుంది.

ఏమంటే?

ఈ పేరు మనకి దరిమిలా వచ్చింది.

పైగా, యిది జాతివాచకం గాని మతవాచకం కాదు.

నిజం గుర్తిస్తే, అసలు, మనం హిందువులమే కాము.

హిందూ శబ్దం మనం సృష్టించుకున్నది కాదు.

ఆ శబ్దానికి సాఫీ అయిన అర్థమూ లేదు…”

అంటూ ప్రారంభించి పాండిత్యమూ తర్కమూ వ్యంగ్యమూ కలగలిసిన, ఆయనకు సహజమైన వాదనాశక్తితో అపురూపమైన చర్చ చేసి చివరికి,

”ఈ మతాల ఉల్బణం పాతవాటితో నిలిచిపోయినా వొక దారే; కాని, యిప్పటికీ కొత్త మతాలు పుడుతూనే వున్నాయి.

బ్రహ్మ సమాజం,

ఆర్యసమాజం,

రాధాస్వామి మతం,

హరనాథ మతం,

సాయిబాబా మతం,

దివ్యజ్ఞాన మతం,

పులిమీద పుట్ర అన్నట్టు, అన్నిటికీ పైన రాజకీయమతాలు.

ఇలాగ ఆర్యుల దగ్గరినుంచీ – అంటే, ఆర్యులలోనూ ఉత్తమోత్తములైన బ్రాహ్మల దగ్గిరనుంచీ – ఆ బ్రాహ్మలలోనూ, భిన్నమతాల – భిన్న శాఖల – భిన్ననాడుల దగ్గిరనుంచీ, వేద బాహ్యుల దాకా, వేదబాహ్యులలోనూ, అస్పృశ్యులదాకా, అస్పృశ్యులలోనూ మళ్లీ అస్పృశ్యులదాకా వున్న నానావర్ణ, నానాకుల, నానావర్గ, నానాదృక్పథాల వారూ, నానా ప్రాప్యాలవారూ హిందువులు.

ఆ హిందువులం మనం.

ఈ ‘మన’కా మతాభిమానం?

థిక్!” అని ఛీత్కరించారు.

అలా గురజాడ, శ్రీపాదలలో మతం గురించి కొంత హేతువాద దృష్టితో, కొంత ప్రజాస్వామిక దృష్టితో, కొంత పాశ్చాత్య ప్రభావపు ఉదారవాద దృష్టితో కనబడిన వైఖరిని, వట్టికోట ఆళ్వారుస్వామి తన అపారమైన ప్రజాజీవితానుభవం నుంచి, మార్క్సిస్టు అవగాహన నుంచి మరింత విస్తరించారు.

హైదరాబాదు రాజ్యంలో 1938కి ముందు పరిస్థితులు ఇతివృత్తంగా రాసిన ‘ప్రజలమనిషి’ నవల సహజంగానే మతం గురించి రాయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. నవలా కాలపు హైదరాబాద్ రాజ్యం మతరాజ్యం కాదు గాని, పాలకుల వ్యక్తిగత మతం ఇస్లాం. పాలితులలో అత్యధికులు హిందువులు అనడం కూడ నిశితంగా చూస్తే సరికాదు గాని, అటూ ఇటూ కూడ మతం పునాది మీద ప్రజాసమీకరణలు మొదలయినది ఆ కాలంలోనే. ప్రత్యక్షంగా రాజకీయ సంస్థలు ఏర్పడడానికి అవకాశం లేని స్థితిలో హిందువుల లోనూ, ముస్లింల లోనూ ఆర్యసమాజ్, హిందూ మహాసభ, ఆర్యరక్షణ సమితి, శుద్ధి ప్రచార్, హిందూ సబ్జెక్ట్స్ కమిటీ, సేవాదళ్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్-ఇ-ఇస్లాం, అంజుమన్-ఇ-ఖాక్సరన్ వంటి మతసంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. వీటిలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్ హిందువులను మతాంతరీకరించడానికి, అనల్ మాలిక్ (ముస్లిం అయిన ప్రతి ఒక్కరూ రాజే) అనే కుహనా ఆభిజాత్యం ప్రచారం చేయడానికి ప్రయత్నించగా, అలా మారిన వారిని “శుద్ధి” చేసి తిరిగి హిందువులుగా మార్చడానికి ఆర్యసమాజ్, ఆర్య రక్షణ సమితి, శుద్ధి ప్రచార్ వంటి సంస్థలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు భౌతిక ఘర్షణలుగా పరిణమించిన తర్వాత నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ లో నాలుగు హిందూ సంస్థలను, మూడు ముస్లిం సంస్థలను నిషేధించింది.

ఆ చరిత్ర వివరాలు ఇక్కడ అవసరం లేదు గాని, తబ్లీగ్ (మత పరివర్తన), శుద్ధి అనే పేర్లతో అప్పుడు సాగిన వ్యవహారమే ఇప్పుడు మతాంతరీకరణ, ఘర్ వాపసీ పేర్లతో పునరావృతమవుతున్నది. ఈ తబ్లీగ్, శుద్ధి కార్యక్రమాల మత రాజకీయాలను ఆళ్వారుస్వామి ‘ప్రజలమనిషి’ లో రెండు అధ్యాయాలలో వివరంగా చిత్రించారు.

అప్పటిదాకా దొర రామభూపాల్ రావు అనుయాయిగా ఉండిన హైదరలీ “…దిమ్మెగూడెంలో హరిజనులను మహమ్మదీయులుగా చేసే సన్నాహాలు” ప్రారంభిస్తాడు. “హైదరలీ ప్రతిరోజు చావడి ముందర కూర్చొని హరిజనులతో సానుభూతిగా మాట్లాడేవాడు. వాండ్ల కష్టాలు పోయే రోజులు వచ్చాయని, ఇన్నాళ్లకు భగవంతుడు హరిజనులకు మేలు చేయబోతున్నాడని, హరిజనుల కష్టాలకు ఆలా హజ్రత్ హృదయం నీరైపోతున్నదని హరిజనులతో అంటుండేవాడు. భూములు, చదివించిన తర్వాత ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుందని, మొత్తంపై హరిజనుల గూడెంలో సుముఖ వాతావరణం కల్పించాడు.”

ఇంతకాలమూ తమను దూరం చేసి ఉంచిన మొత్తం గ్రామంపై ఇది ఒక ప్రతీకారంగా దళితులు భావించారు. చివరికి అంజుమన్ నాయకుడు వచ్చి మతపరివర్తన జరిపే రోజున “వచ్చినప్పుడల్లా హరిజనులతో వెట్టి పనులు చేయించుకునే పోలీసు వాండ్లు ఆ రోజు చాకలి, మంగలి, కుమ్మరి వాండ్లతో చేయించుకున్నారు. హరిజనుల స్థాయి పెరిగినట్టు తోచి పోలీసువాండ్లకు ఈర్ష్య కలిగింది.” అంజుమన్ నాయకుడు తన ఉపన్యాసంలో “ఈ గ్రామంలో అందరివలె పుట్టిపెరిగినా మీరు ఊరికి దూరంగా మురికికొంపల్లో ఉంటున్నారు. మీరు పందుల్లాగ బ్రతుకుతున్నారు. వేరేవాండ్లవద్ద మీకు కుక్కలకున్న గౌరవం లేదు. మీతో పొద్దస్తమానం పని చేయించుకొని కడుపుకు నిండని కూలి, జీతాలు ఇస్తున్నారు…” అని వాస్తవ స్థితి చెపుతాడు. ప్రచారకుడు “మీరు మహమ్మదీయుల్లో కలిస్తే మీ కష్టాలు పోతాయి. మీరంతా మహమ్మదీయులతో సరిసమానముగా విద్య, ఉద్యోగాలు పొందవచ్చును. హిందువుల దేవాలయాల్లోనికి వెళ్లలేనివారు, ఊరి చేదబావులవద్దకి పోజాలనివారు స్వేచ్ఛగా మస్జిద్ లోకి వెళ్లవచ్చును. చేదబావుల్లోకి వెళ్లవచ్చును…” అంటాడు.

ఒక మతంలోని అసమానత, వివక్ష, అన్యాయం ఎట్లా మరొక మతంవైపు చూడడానికి పునాది కల్పిస్తున్నాయో వాస్తవికమైన చిత్రణ ఇది. ఆళ్వారుస్వామి అక్కడితో కూడ ఆగిపోలేదు. ఆ వికర్షణ కావలసిన ఫలితం సాధించబోదనే విమర్శ కూడ అందులోనే భాగం చేశారు. ఆ ఉపన్యాసాలు సాగుతుండగానే “యిగ హైదరలీ ఎంత జీతం యిస్తడో చూస్తం గద” అనీ, “దొర గుంజుకున్న భూములు, తీసుకున్న లంచాలు ఇప్పిస్తరా” అనీ మౌలిక సమస్యల వైపు కూడ దృష్టి మళ్లించారు.

“మహమ్మదీయులుగా మారిన హరిజనులు జీతగాండ్లుగా పనిచేయడానికి వెనుక ముందాడారు. అయితే ఏమీ పని చేయకుండా ఎన్నాళ్లు ఏ విధంగా బ్రతకడం? వెంటనే చదువులు, ఉద్యోగాలు, భూములు పొందడం సంభవమా? భూములు ఏవిధంగా లభిస్తాయి? ఎవరివల్ల, ఎవరివి, ఎప్పుడు, ఏ విధంగా భూములు హరించబడ్డాయి?…” అని మతాన్ని, మత పరివర్తనను మించిన ప్రాథమిక మానవావసరాల గురించి, రాజకీయార్థిక కారణాల గురించి మాట్లాడించారు.

ఈ మతాంతరీకరణ వెనుక రాజ్యం ఉన్నదనే అవగాహనతో కంఠీరవం దాన్ని వ్యతిరేకించినప్పుడు, “చెప్పుదెబ్బలు తింటూ, గులాములై పడివున్న మాదిగోండ్లు ఆత్మగౌరవం, సంఘమర్యాద పొంది ఉండటం ఈ బాపనోడికి సహింపరాకుండా ఉంది” అని అంజుమన్ నాయకుడితో అనిపించి, బహుశా ఆరు దశాబ్దాల తర్వాతి అస్తిత్వవాదం చేపట్టబోయే అతివాద వ్యాఖ్యలను కూడ ఆళ్వారుస్వామి ఊహించారు. “…ఇతరులు హరిజనులను అణగదొక్కుటే మీ కార్యక్రమానికి మూలకారణమైతే, ఆ హరిజనులకు మీరు ఒరగపెట్టేది కూడా ఏమీ లేదు. వాండ్లగతి ఇట్లాచేస్తే అసలే మారదు” అని కంఠీరవంతో జవాబు కూడ చెప్పించారు.

హైదరలీ గురించి “హరిజనులను మహమ్మదీయులను చేసి ఉద్ధరించ బయలుదేరిన ఈ పెద్దమనిషి అన్యాయంగా తోటి మతం వాండ్లయిన దూదేకులవారి భూమిని హిందువైన ఒక దొర ఆసరాతో హరించాడని మీరు తెలిసికోవాలె” అని న్యాయస్థానంలో కంఠీరవం చేత మళ్లీ ఒకసారి మౌలికమైన భూమి సమస్య లేవనెత్తించారు. గ్రామంలో కొమరయ్య భూమి తగాదాతో దొరకు వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణం ఈ మత పరివర్తనతో మారిపోయి, మహమ్మదీయులైన వాండ్లను శత్రువులుగా చూసే స్థితికి ఎలా దారితీసిందో చిత్రించి ఈ వ్యవహారాలు అసలు సమస్యలను ఎలా పక్కదారి పట్టిస్తాయో చెప్పారు.

తబ్లీగ్ గురించి ఎంత తీవ్రంగా రాశారో, శుద్ధి గురించి కూడ అంత తీవ్రంగానే రాశారు. మరీ ముఖ్యంగా శుద్ధి కార్యక్రమాన్ని ఊళ్లోకి దొర తెచ్చాడు గనుక దాని వెనుక ఉన్న స్వార్థప్రయోజనాలను ఎత్తి చూపారు.

శుద్ధి కార్యక్రమాన్ని విమర్శిస్తూ “తురకలైతే ఒరిగింది లేదు. హరిజనులైతే అనుభవిస్తున్నది లేదు. అన్ని ఎప్పటోల్నే ఉన్నయి” అనీ, “ప్రధానిగారు తురక, హిందువు అని అంటున్నరు. మరి ఇప్పుడు కష్టాలు చెప్పుకున్నోళ్లంతా హిందువులేనయిరి. దొర హిందువేనాయె. మానుకుంటె ఎవడన్న కొట్టొచ్చిండా” అనీ పరంధామయ్యతో అనిపించారు.

“సర్కారు మన్సులు తురకలైనా మనోడైనా చేసే గోల, ఆరాటం, తిట్లు, కొట్లు, అది కావలె, ఇది కావలె అని అల్లుండ్లోలె అన్ని సాగించుకొని పొట్టపగుల మెక్కి, మిగిలింది మూటలు కట్టుకొని పోటం లేదే” అని చాకలి సర్వయ్య, “ఆ యిందువేందో, తుర్కేందో, హైదరలీ బీట్లకు పోయినా, దొరగారి ఏనెకు పోయినా, రైతుల గెట్ల పొంటి పోయినా జీవాలను అడుగు పెట్టనియ్యరు….” అని గొల్ల వీరయ్య తమ నిత్య జీవిత అనుభవం నుంచి అసలు విషయాలు చెపుతారు.

ప్రధానంగా ఆ రెండు అధ్యాయాలు, మొత్తంగా నవల మౌలికమైన దోపిడీ, పీడనలకు మతం లేదని, అందువల్ల తబ్లీగ్, శుద్ధి అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించే అర్థరహితమైన వివాదాలని పాఠకులకు అవగాహన కలిగిస్తాయి.

ఇవాళ మళ్లీ ఒకసారి ప్రపంచీకరణ, కార్పొరేట్ దౌర్జన్యం, పెరిగిపోతున్న సామాజిక అసమానతల నేపథ్యంలో పాలకవర్గాలకు అందివస్తున్న నినాదం ఘర్ వాపసీ. హిందుత్వవాదుల గతకాలపు శుద్ధి ఇవాళ ఘర్ వాపసీ ముసుగు తగిలించుకుని బుసలు కొడుతున్న ఈ సందర్భంలో, హిందుత్వ మతోన్మాద, మతవిద్వేష రాజకీయాల గురించీ, మొత్తంగా మతవాదం గురించీ బుద్ధిజీవులు ఇంకా ఎక్కువగా మాట్లాడవలసి ఉన్నది. ఈ అనవసర వివాదాలు అసలు సమస్యల మీద ప్రజల ఆరాట పోరాటాలను పక్కదారి పట్టించడానికేనని చెప్పవలసి ఉన్నది. కనీసం గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వట్టికోట ఆళ్వారుస్వామి సాధించిన కృషిని విస్తరించి బలోపేతం చేయవలసి ఉన్నది.

గతకాలానికి చెందిన ఆ అవగాహనలో సగమో పావో అయినా ఈ అత్యాధునిక వర్తమానంలో ఉంటే ఎంత బాగుండును!

                                                                                                                                                     -ఎన్ వేణుగోపాల్

venu

ఒక్కొక్క అక్షరం ఒక అగ్ని కణం…

vidrohi1

 ‘Vidrohi’  పేరులో విద్రోహం గుండెల్లో విప్లవం , ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయపు ఆవరణలో ఆయనకంటూ సొంతం అయిపోయిన రెండు చెట్లు , అవే చెట్ల బ్రాంచెస్ పైన తనకంటూ రాసుకున్న , పోగుచేసుకున్న కొన్ని పుస్తకాలు ( అయన మొత్తం ఆస్తులు అవే అట , స్ట్రీట్  షాప్స్ క్లోజ్ చేసాక వాటి ముందు పడుకోవటానికి వాడుకొనే ఒక ౩ దుప్పట్లు కాకుండా )  చెట్ల కింద ఆయన, ఆయనతో పాటుగా  దాదాపు గత ౩ దశాబ్దాలుగా అయన కవిత్వంతో ఊగిపోతున్న కాంపస్ . ఈ సీన్  అసలు ఎవరమన్నా ఎపుడయినా ఉహించగలమా ? కాని ఇది పూర్తిగా మనముందు మనకి రోజు కనిపించే నిజం .

 అబ్యూజివ్ భాష వాడారు అన్న నేరం పై బహుశ ఒకేసారి అనుకుంటా ఆయనని కాంపస్ నుండి బహిష్కరించారు 2010 ఆగస్ట్ లో మళ్ళీ విద్యార్దుల ఒత్తిడి తర్వాత తిరిగి JNU అడ్మినిస్ట్రేషన్ ఆయన్ని క్యాంపస్ లోకి అనుమతించక తప్పలేదు  యునివర్సిటీకి అయన తిరిగి  వచ్చిన  రోజు జరిగిన కోలాహలం ని JNU బహుశ ఎప్పటికి మర్చిపోలేదు. ఇదికాకుండా మహా అయితే అంతకు ముందు ఇంకో సంఘటనలో ఆయన కాంపస్ వీడి ఉంటారు అది కూడా జైలు కి వెళ్ళడానికే,  1983 లో Vidrohi OBC రిజర్వేషన్ పోరాటంలో JNU స్టూడెంట్ యూనియన్ సభ్యులతో పాటు విద్యార్థి ఉద్యమంలో పాల్గొని నిరాహారదీక్ష చేయటం  , ఆయన అరెస్టు కావడంతో తీహార్ జైలుకు పంపడం జరిగింది తప్పితే  మిగిలిన జీవితం అంతా JNU, విప్లవం, విద్రోహి ఈ మూడు పేర్లు  ఒకదానిలో ఒకటిగా పెనవేసుకుపోయి ఒకటిగా మమేకం అయిన  పేర్లు విద్రోహి లైఫ్ లో .

ఎక్కడ స్ట్రగుల్ ఉంటుందో అక్కడ నా కవిత్వం ఉంటుంది , అది తమిళులు అయినా కాష్మీరీలు అయినా ఛత్తీస్గఢ్ ట్రైబల్స్ అయినా సరే , నేను పుట్టింది బ్రతికింది క్రాంతి కోసమే మార్క్సిజం లేకపోతే విద్రోహి ఉండేవాడు కాదు , కవిత్వము ఉండేది కాదు అని తనకి మార్క్స్సిజమ్ మీద ఉన్న అభిమానం గర్వంగా చాటుకొనే 54 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి , సగం నెరిసిన జుట్టుతో  , JNU ఫేమస్ గంగా డాభా ఎర్ర పలకల చప్టాల మీద కూర్చొని ఆరారగా గొంతులో దిగే చాయ్ కి తోడూగా

చరిత్రలో,

కాలిపోయిన మొదటి మహిళ ఎవరు

నాకు తెలీదు.

ఆమె ఎవరైనా అయి ఉండోచ్చు

ఆమె నా తల్లి కుడా అయ్యుంటుంది.

కానీ నా భవిష్యత్తు ఆందోళనలో

ఎవరు చివర మండిపోతారు

నాకు తెలీదు.

కానీ ఆమె ఎవరైనా అయి ఉంటుంది

ఆమె నా కుమార్తె కూడా అయి ఉంటుంది.

అంటూ  Mohenjodaro, సామ్రాజ్యవాదుల చేతిలో దోపిడీని ప్రపంచంలోని హత్యలు చిహ్నంగా అత్యల్ప అడుగు వేయడానికి ఒక మహిళ యొక్క కాలిన శవం గురించి  కవిత్వీకరిస్తూ  దేశంలో పుట్టకముందే చస్తూ, పుడుతూ చస్తూ ,పుట్టాక చచ్చిపోతూ అసలు పుట్టిందే చనిపోవటానికి అన్నట్లు చస్తూ బ్రతుకుతున్న స్త్రీ మూర్తుల దైన్యాన్ని గురించి గొంతెత్తి మన కళ్ళు తడిసిపోయేలా ఎవరన్నా కవిత్వం చెప్తుంటే ఒక్కసారి అయినా ఆగి విని రాకుండా ఉండగలమా ? మన గుండెల్లో దైన్యాన్ని తన పదాల్లో పదునుగా మలుచుకున్న వ్యక్తిత్వానికి ఒక హృదయ పూర్వక సలాం కొట్టకుండా ఉండగలమా ?

vidrohi2

నిజంగానే ప్రతి అక్షరం ఒక నిప్పుకణంగా బ్రతికే విద్రోహిలాంటి వాళ్ళు  అరుదుగా ఉంటారు , నిన్నగాక మొన్న తన ఫేస్బుక్ స్టేటస్ లో  विद्रोही को इस ठण्ड में सुबह 7 बजे बिना जूतों के जाते देख जेनयू की ही ईरानी-फिलिस्तीनी कामरेड Shadi Farrokhyani ने पूछा कि जूते क्या हुए?

विद्रोही दा का जवाब था- उस दिन प्रदर्शन में फेंक के पुलिस को मार दिया।

“ఉదయం 7 గంటల చలిలో కాళ్ళకి బూట్లు లేకుండా నడుస్తున్న విద్రోహిని చూసిన  JNU కామ్రేడ్స్ బూట్లేక్కడ అని అడిగితే విద్రోహి సమాధానం ఒక్కటే పాలస్తీనా తిరుగుబాటు ప్రదర్శనలో పోలీసుల మొహం మీద బహుమతి అయ్యింది ఈ విద్రోహి  బూటు “ అని  రాసుకోగలిగిన దైర్యం ఇపుడు అసలు ఎవరికన్నా ఉందా  ?

vidrohi3

ఈ మధ్యనే అతని గురించి Nitin K Pamnani,  Imranతో కలిసి  Main Tumhara Kavi Hoon (I am your poet) సేవ్ ది పోయెట్ అనే  ఒక డాక్యుమెంటరీ తీసారు  . ఈ చిత్రం ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది. ఈ కవినే కాదు ప్రతికవిని అందులోనూ సామాజిక స్పృహ ఉండి కాలానికి సంఘానికి ఎదురీదుతూ “ రచయితగా నేను చచ్చిపోయాను అని ఓపెన్ గా డిక్లేర్ చేసిన పెరుమాళ్ మురగన్ లాంటి  ప్రతి ఒక్క కవిని రక్షించుకోవాల్సిన సమయం వచ్చేసింది కదూ.

 

అది వాళ్ళ రచనలు చదివి పూర్తిగా మారకపోయినా  క్షణకాలమయినా ఉద్వేగానికి గురి అయ్యే మన అందరి  బాధ్యతా  కూడానూ. పోతే రాజ్యబాష హిందీ అర్ధం అవుతుంది కాబట్టి కొన్ని కవితలు చదువుకోగలిగాను కాని దాన్ని అంతే అద్భుతంగా ట్రాన్స్లేట్ చేయలేక నాకెంతో నచ్చిన విద్రోహి హిందీలో  రాసిన “ ధరం “ కవిత మీకోసం అలాగే అందిస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తూ..

 –నిశీధి

 

 

 

धरम

 

मेरे गांव में लोहा लगते ही

टनटना उठता है सदियों पुराने पीतल का घंट,

चुप हो जाते हैं जातों के गीत,

खामोश हो जाती हैं आंगन बुहारती चूडि़यां,

अभी नहीं बना होता है धान, चावल,

हाथों से फिसल जाते हैं मूसल

और बेटे से छिपाया घी,

उधार का गुड़,

मेहमानों का अरवा,

चढ़ जाता है शंकर जी के लिंग पर।

एक शंख बजता है और

औढरदानी का बूढ़ा गण

एक डिबिया सिंदूर में

बना देता है

विधवाओं से लेकर कुंवारियों तक को सुहागन।

नहीं खत्म होता लुटिया भर गंगाजल,

बेबाक हो जाते हैं फटे हुए आंचल,

और कई गांठों में कसी हुई चवन्नियां।

 

 

मैं उनकी बात नहीं करता जो

पीपलों पर घडि़याल बजाते हैं

या बन जाते हैं नींव का पत्थर,

जिनकी हथेलियों पर टिका हुआ है

सदियों से ये लिंग,

ऐसे लिंग थापकों की माएं

खीर खाके बच्चे जनती हैं

और खड़ी कर देती है नरपुंगवों की पूरी ज़मात

मर्यादा पुरुषोत्तमों के वंशज

उजाड़ कर फेंक देते हैं शंबूकों का गांव

और जब नहीं चलता इससे भी काम

तो धर्म के मुताबिक

काट लेते हैं एकलव्यों का अंगूठा

और बना देते हैं उनके ही खिलाफ

तमाम झूठी दस्तखतें।

 

 

धर्म आखिर धर्म होता है

जो सूअरों को भगवान बना देता है,

चढ़ा देता है नागों के फन पर

गायों का थन,

धर्म की आज्ञा है कि लोग दबा रखें नाक

और महसूस करें कि भगवान गंदे में भी

गमकता है।

जिसने भी किया है संदेह

लग जाता है उसके पीछे जयंत वाला बाण,

और एक समझौते के तहत

हर अदालत बंद कर लेती है दरवाजा।

अदालतों के फैसले आदमी नहीं

पुरानी पोथियां करती हैं,

जिनमें दर्ज है पहले से ही

लंबे कुर्ते और छोटी-छोटी कमीजों

की दंड व्यवस्था।

तमाम छोटी-छोटी

थैलियों को उलटकर,

मेरे गांव में हर नवरात को

होता है महायज्ञ,

सुलग उठते हैं गोरु के गोबर से

निकाले दानों के साथ

तमाम हाथ,

नीम पर टांग दिया जाता है

लाल हिंडोल।

लेकिन भगवती को तो पसंद होती है

खाली तसलों की खनक,

बुझे हुए चूल्हे में ओढ़कर

फूटा हुआ तवा

मजे से सो रहती है,

खाली पतीलियों में डाल कर पांव

आंगन में सिसकती रहती हैं

टूटी चारपाइयां,

चैरे पे फूल आती हैं

लाल-लाल सोहारियां,

माया की माया,

दिखा देती है भरवाकर

बिना डोर के छलनी में पानी।

जिन्हें लाल सोहारियां नसीब हों

वे देवता होते हैं

और देवियां उनके घरों में पानी भरती हैं।

लग्न की रातों में

कुंआरियों के कंठ पर

चढ़ जाता है एक लाल पांव वाला

स्वर्णिम खड़ाऊं,

और एक मरा हुआ राजकुमार

बन जाता है सारे देश का दामाद

जिसको कानून के मुताबिक

दे दिया जाता है सीताओं की खरीद-फरोख़्त

का लाइसेंस।

सीताएं सफेद दाढि़यों में बांध दी जाती हैं

और धरम की किताबों में

घासें गर्भवती हो जाती हैं।

 

 

धरम देश से बड़ा है।

उससे भी बड़ा है धरम का निर्माता

जिसके कमजोर बाजुओं की रक्षा में

तराशकर गिरा देते हैं

पुरानी पोथियों में लिखे हुए हथियार

तमाम चट्टान तोड़ती छोटी-छोटी बाहें,

क्योंकि बाम्हन का बेटा

बूढ़े चमार के बलिदान पर जीता है।

भूसुरों के गांव में सारे बाशिंदे

किराएदार होते हैं

ऊसरों की तोड़ती आत्माएं

नरक में ढकेल दी जाती हैं

टूटती जमीनें गदरा कर दक्षिणा बन जाती हैं,

क्योंकि

जिनकी माताओं ने कभी पिसुआ ही नहीं पिया

उनके नाम भूपत, महीपत, श्रीपत नहीं हो सकते,

उनके नाम

सिर्फ बीपत हो सकते हैं।

 

 

धरम के मुताबिक उनको मिल सकता है

वैतरणी का रिजर्वेशन,

बशर्ते कि संकल्प दें अपनी बूढ़ी गाय

और खोज लाएं सवा रुपया कजऱ्,

ताकि गाय को घोड़ी बनाया जा सके।

किसान की गाय

पुरोहित की घोड़ी होती है।

और सबेरे ही सबेरे

जब ग्वालिनों के माल पर

बोलियां लगती हैं,

तमाम काले-काले पत्थर

दूध की बाल्टियों में छपकोरियां मारते हैं,

और तब तक रात को ही भींगी

जांघिए की उमस से

आंखें को तरोताजा करते हुए चरवाहे

खोल देते हैं ढोरों की मुद्धियां।

एक बाणी गाय का एक लोंदा गोबर

गांव को हल्दीघाटी बना देता है,

जिस पर टूट जाती हैं जाने

कितनी टोकरियां,

कच्ची रह जाती हैं ढेर सारी रोटियां,

जाने कब से चला आ रहा है

रोज का ये नया महाभारत

असल में हर महाभारत एक

नए महाभारत की गुंजाइश पे रुकता है,

जहां पर अंधों की जगह अवैधों की

जय बोल दी जाती है।

फाड़कर फेंक दी जाती हैं उन सब की

अर्जियां

जो विधाता का मेड़ तोड़ते हैं।

 

 

सुनता हूं एक आदमी का कान फांदकर

निकला था,

जिसके एवज में इसके बाप ने इसको कुछ हथियार दिए थे,

ये आदमी जेल की कोठरी के साथ

तैर गया था दरिया,

घोड़ों की पंूछे झाड़ते-झाड़ते

तराशकर गिरा दिया था राजवंशों का गौरव।

धर्म की भीख, ईमान की गरदन होती है मेरे दोस्त!

जिसको काट कर पोख्ता किए गए थे

सिंहासनों के पाए,

सदियां बीत जाती हैं,

सिंहासन टूट जाते हैं,

लेकिन बाकी रह जाती है खून की शिनाख़्त,

गवाहियां बेमानी बन जाती हैं

और मेरा गांव सदियों की जोत से वंचित हो जाता है

क्योंकि कागजात बताते हैं कि

विवादित भूमि राम-जानकी की थी।

-నిశీధి

పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!

మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ‘మనుషులు’ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ సంగతేమో గాని మనుషులుగా ఎదిగిన వాళ్ళు, కాలం గడిచే కొద్దీ మరింతగా మనుషులయ్యే లక్షణమున్నవాళ్ళు .. చనిపోతే అది అది విషాదమే. ఆ మనుషులు కళాకారులో, రచయితలో, శాస్త్రవేత్తలో, సమాజాన్ని కదిలించే .. సరైన వైపుకు నడిపించే చోదక శక్తులో అయినప్పుడు .. ఆ విషాదం మరింత పెద్దదైపోతుంది. సమాజ గతిక్రమానికి తీరని నష్టమవుతుంది. అయినా కళాకారులు, రచయితలు, శాస్త్ర వేత్తలు చనిపోతారా అసలు? చచ్చిపోయినా బతికుండగానే చచ్చిపోతారా? శుభ్రంగా చచ్చిపోతారు. అయితే ఎలా చచ్చిపోతారు?

కొందరేమో కొన్ని నాడీకేంద్రాలను మర్చిపోయి, కొన్ని స్పందనలను కోల్పోయి, తమకు తామే పరాయి వాళ్ళయిపోయి .. గడ్డకట్టి, ఘనీభవించి .. తమకు తామే ఒక ఇరుకైన కరుకైన, కానీ భద్రమైన గూడు కట్టుకొని .. ఆత్మహత్య చేసేసుకొంటారు. కొందరు అమాయకులు, పెద్దవాళ్ళవుతున్న తమలో ఉన్న పసివాడ్ని పోగొట్టుకోని వాళ్ళు, ఘనీభవించని హృదయాన్ని, అందులో ఉన్న చైతన్యాన్ని నిలిపి వుంచుకున్నవాళ్ళు .. పాపం! ఊహానీ, ఊహించే స్వేచ్చని, స్వేచ్చ నిండిన వ్యక్తీకరణనీ వదలని వాళ్ళు, పెరుమాళ్ మురుగన్ లాంటి పిచ్చి పంతుళ్ళు – ఆత్మహత్య చేసుకోలేరు. హత్య చేయబడతారు. “మేము చచ్చిపోయాం” అని బ్రతికుండగానే ప్రకటిస్తారు. మనలో తీరని గుబులు పుట్టిస్తారు. గుండెలింకా మిగిలే ఉన్న వాళ్ళకు కునుకును దూరం చేస్తారు. చూసే కళ్ళు ఉన్నవాళ్ళకు కన్నీళ్ళను తెప్పిస్తారు. చేతులున్నవాళ్లకు, ఆ చేతులకు వేళ్ళు ఉన్న వాళ్ళకు పిడికిళ్ళను మొలిపిస్తారు.

images

కొన్ని రోజులుగా తెల్ల గడ్డం పెంచుకొని తలవేలాడేసుకొన్న పెరుమాళ్ మురగన్ ముఖం దినపత్రికల్లో, జాలా పత్రికల్లో, బ్లాగుల్లో విరివిగా కనిపిస్తుంది. ఆ ముఖం రచనా వ్యాసంగం ఇష్టంగా, ఆహ్లాదంగా, తమలో రగులుతున్న భావోద్వేగాల ఆవిరులు బయటికి పోయే మార్గంగా, మనసులో సహజంగా వచ్చే ఊహలను అల్లుకుంటూ పోయే మానవ ప్రవృత్తిగా, ఆ ఊహలను కాగితం మీద చిత్రించి దర్శించుకోవాలనే కోరిక తీరే దారిగా భావించే వారందరిని వ్యాకుల పరిచింది. ఆ ముఖం దేశం నుండి వెళ్ళగొట్టబడిన హుస్సేన్ తొంభై ఏళ్ళ మైనారిటీ అభద్రతను గుర్తుకు తెస్తుంది. బహిరంగ వేదిక మీదకు ముస్లిం ఛాందసవాదులు మొహంపై రాళ్ళు రువ్వితే అదోలా చూసిన (క్షమించండి. ఆ  భావాన్ని నేను పదాలతో వర్ణించలేను) తస్లీమాకు ఆశ్రయం ఇవ్వలేని ఈ దేశ ఓట్ల రాజకీయం గుర్తుకు వస్తుంది. ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియదు కానీ “మూలింటామె” రాసిన తరువాత నామిని పడిన ఆందోళనా, “ఎవరు ఏమనుకొన్నా ఈ కధ రాసి చచ్చిపోదామనుకొన్నాను” అన్న ప్రకటన కూడా గుర్తుకు వచ్చాయి. అన్నట్లు నామినీ కూడా ఆ నవలను ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు కదా.

సమాజంపై ధిక్కారంతో రాసిన రాత, గీసిన గీత, పాడే గొంతు నిషేదాలకు గురి అవటం ఇక్కడ కొత్త కాదు. అయితే దానికి సమాంతరంగా భావవ్యక్తీకరణ స్వేచ్చను చేతులు అడ్డం పెట్టి కాచుకొన్న ప్రజాస్వామిక హృదయాలకు కొదవ లేదు ఇక్కడ. అయితే ఈ సంఘటన మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నాగరిక ప్రపంచంలో జీవిస్తూ ఒక రచన చేసిన పాపానికి గడగడలాడుతూ ఘోరావ్ లకు, ధర్నాలకు, పుస్తకాల కాల్చివేతకు గురి అయ్యి .. జిల్లా యంత్రాంగం ముందు చేతులు కట్టుకొని నిలబడిన దీన స్థితి ఒక రచయితకు, అందునా పెరియార్ రామస్వామి నడయాడిన భూభాగంపై నివశించే వ్యక్తికి ఎలా దాపురించింది?

మతాన్ని, దేవుడిని, ఆర్య సంస్కృతిని ద్వేషించి, జీవిత కాలమంతా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి గొప్ప ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమానికి పునాది వేసిన పెరియార్ రామస్వామి నడిచిన నేల మీద ఒక రచయిత చేతులు కట్టుకొని కుల శక్తుల ముందు, మత శక్తుల ముందు తలవొగ్గడం ఎంత విచారకరం! సాంస్కృతిక ఉద్యమం పాదుగా చేసుకొని ఎదిగిన ఇప్పుడున్నఅక్కడి  రాజకీయవ్యవస్థ ఈ సంగతిపై స్పందించక పోవటం (చివర్లో స్టాలిన్ కంటితుడుపు వ్యాఖ్యలు తప్ప) ఇంకో  గొప్ప విషాదం. పెరియార్ ఆలోచనలు జీర్ణించుకొని పరిపుష్ట అయిన మద్రాసీ సమాజం ఈ విషయం పై ప్రదర్శించిన నిర్లిప్తత, నిరాసక్తత … ఆ సమాజం, అది అందించిన సాహిత్యం, కళలు, దృక్కోణాల పట్ల ఆశలు కలిగిన వారికి పెనుఘాతం. రష్యన్ సామ్యవాదం కూలినప్పటి దుఃఖం మళ్ళీ అనుభవమవుతుంది.

ఇంత గొడవకూ, గందరగోళానికి తెర తీసిన ఈ మదో రుబాగన్ నవలలో (One part woman) ఏమి ఉంది? పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు దాటిన పొన్న, కాళీ దంపతులకు పిల్లలు ఉండరు. అన్ని విధాలుగా సంతృప్తికరమైన సంసార జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులు ఈ కధా కాలానికి  (వంద సంవత్సరాల క్రిందటి) భూస్వామ్య సమాజపు వత్తిడులకు గురి అవుతారు. పిల్లలు పుట్టనందుకు స్త్రీగా పొన్న ఎన్ని అవమానాలు పొందుతుందో, పురుషుడుగా కాళీ కూడా అంతే అవమానాల పాలు అవుతాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమాభిమానాలు ఇంకో పెళ్ళికి ప్రేరేపించవు. కాళీ రెండో పెళ్ళి చేసుకొన్నా కూడా పొన్నను ఇంట్లో ఉంచుకొంటే చాలు అనే అంగీకారానికి పొన్న తల్లిదండ్రులు కూడా వస్తారు. అయితే కాళీ వివేకంతో వ్యవహరించి పొన్న పట్ల తన ప్రేమను ప్రదర్శించుకొంటాడు. పిల్లలు లేరనే సమాజపు సతాయింపులకు దూరంగా ఇద్దరు ఇంటికి పరిమితమై అన్యోన్యంగా బతుకుతుంటారు. అయినా ఆ సెగ వాళ్ళకు తగులుతూనే ఉంటుంది.

ఒక రోజు కాళీ తల్లి, పొన్న తల్లి సంప్రదించుకొని ఒక ప్రతిపాదనతో కాళీ తల్లి కొడుకు దగ్గరకు వస్తుంది. పొన్న పుట్టింటికి దగ్గరలో ఉన్న తిరుచెంగొడే పట్టణంలో ‘పర్వత’ అనే (అర్ధనారీశ్వర రూపం) దేవుడుకి ఏటా తిరునాళ్ళు జరుగుతాయి. పధ్నాలుగు రోజులు జరిగే ఈ తిరునాళ్ళలో నాలుగవ రోజు దేవుళ్ళు కొండ మీద నుండి కిందకు వచ్చి పధ్నాలుగవ రోజు మళ్ళీ పైకి వెళతారని నమ్మకం ప్రజలలో ఉంటుంది. ఆ పధ్నాలుగవ రోజు దగ్గర ప్రాంతాల నుండి పురుషులు అక్కడ రాత్రి సంచరిస్తారు. వాళ్ళను ‘దేవుళ్ళు’ అని అంటారు. ఆ రాత్రి స్త్రీలు ఆ అపరిచిత పురుషులతో సంభోగించవచ్చు. వాళ్ళను దేవుళ్ళగానే చూస్తారు. ఆ నాటి సమాజం దాన్ని తప్పు పట్టదు. దేవుడితో సంభోగించినట్లే భావిస్తుంది. ఎక్కువగా పిల్లలు లేని స్త్రీలు ఈ తంతులో పాల్గొంటారు. పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకొంటారు. పెళ్ళి కానీ అబ్బాయిలు ఒక అనుభవం కోసం ఇక్కడకు వస్తారు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలతో నయినా ఆ రాత్రి గడపవచ్చు. అలాగే స్త్రీలు కూడా.  ఆ ఒక్క రాత్రి అక్కడ ఉన్న దేవదాసీలను ఎవరూ పట్టించుకోరు.

‘ఈ రాత్రి అందరూ దేవదాసీలే’ అని వాళ్ళు నవ్వుకొంటారు. నిజానికి కాళీకి కూడా ఆ అనుభవాలు ఉన్నాయి. పొన్నతో ఆయన బంధం గట్టి పడ్డాక ఆ వ్యవహారాలన్నీ మానుకొన్నాడు. ఆ పధ్నాలుగవ రోజు పొన్నను అక్కడికి పంపితే దేవుళ్ళ వలన గర్భం వస్తుందని తల్లి తెచ్చిన ఆ ప్రతిపాదన అతనిని బాధిస్తుంది. భార్యను వేరే పురుషునితో ఊహించుకోలేకపోతాడు. తల్లిని కూడా అసహ్యించుకొంటాడు. అసలు  ఆ సంవత్సరం భార్యను తిరునాళ్ళకు పంపడు. పొన్నకు ఈ ప్రతిపాదన గురించి  చెప్పడు కూడా. ఈ  సంవత్సరం తరువాత ఒక రాత్రి ఆమెకు ఈ విషయం చెప్పి “వెళతావా?” అని అడుగుతాడు.

‘మావా, నీకు బిడ్డ కావాలంటే వెళతాను.’ అని అమాయకంగా చెబుతుంది పొన్న. కాళీ షాక్ తింటాడు. ఆ సమాధానాన్ని ఊహించలేదు అతను. పొన్న అతని ముఖాకవళికల నుండి తను తప్పు చేశాను అని గ్రహిస్తుంది.  అతన్ని ఆలింగనం చేసుకొని తన ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కాని కాళి ఆమెను ఇదివరకటి లాగా చూడలేక పోతాడు. తనకు తెలియకుండానే ఆమెను హింస పెడతాడు. ఒక సందర్భంలో పొన్న దండం పెట్టి ఇంతకంటే నన్ను చావబాదమని అడుగుతుంది. చివరకు పొన్న అక్కడకు వెళుతుందా, లేదా అనే విషయం అప్రస్తుతం. ఈ మొత్తం వ్యవహారంలో కాళి లోని అంతర్మధనం, అతను పడిన మానసిక సంఘర్షణ , పొన్న పడిన హింస ఈ కధలో ప్రధాన వస్తువు. పురుషాధిక్య సమాజం వలన పురుషుడు కూడా వెంపర్లకు గురి అవుతాడనేది ఈ కధాంశం.

ఆదిమ కమ్యూనిష్టు సమాజం నుండి స్త్రీ పురుషుల మధ్య నున్న సంబంధాలు రకరకాలుగా అభివృద్ధి  చెందాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే  దంపతీ వివాహం అన్నిటికన్నా అభివృద్ధి కరమైనది అనుకొన్న తరువాత కూడా గత సమాజపు బహు సంబంధాలను పురుషుడు ఈ నాటికీ అనుభవిస్తున్నాడు. స్త్రీలకు ప్రాతివత్య ధర్మాలను నిర్దేశించినా అక్కడక్కడా కొంత వెసులుబాటు అరుదుగా కనిపిస్తుంది. అదీ ఈ కధా కాలం వంద సంవత్సరాల క్రితం అయినందున ఈ ఆచారం అసహజంగా అనిపించదు. గుంపు వివాహాల అవశేషాలు ఈ ఆచారాలలో కనిపిస్తాయి. మహాభారతంలాంటి  ఇతిహాసాలలో ఇలాంటి ప్రాచీన కాలం నాటి అవశేషాలు కనిపిస్తాయి.

700x380xImage.jpg.pagespeed.ic._Vue3PwAdP

తమిళనాడు ప్రాంతంలోని కొంగునాడులో ఎక్కువ జీవించే కమ్యూనిటీ కొంగు వెళ్ళాళ గౌండర్లు. ఇది ఒక వ్యవసాయ కులం. పెరియార్ రామస్వామి ఈ కొంగు వెళ్ళాళ గౌండర్లు, వన్నియార్లు, దళితుల సాంస్కృతిక జీవితాలకు పెద్ద పీట వేసి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. బ్రాహ్మణ ఆధిపత్యానికి బ్రాహ్మణిజానికి తేడా చెప్పాడు. ‘నేను బ్రాహ్మడిగా పుట్టినందుకు ఎవరినీ ద్వేషించను.’ అని స్పష్టంగా అన్నాడు పెరియారు.

అక్కడి ప్రజలు ఈ సాంస్కృతోద్యమాన్ని ఎంత ఆదరించారంటే ఈ నాటికీ కమ్యూనిష్టులు అక్కడ నిలదొక్కుకోలేక పోయారు. కొంగు వెళ్ళాళ గౌండర్లు స్త్రీలకు ఆస్తి హక్కు వద్దంటే, అటు దక్షిణ ప్రాంతంలో వున్న వన్నియార్లు దళితుల పట్ల తీవ్రమైన అణచివేత ప్రదర్శించారు. ఈ వ్యవసాయ కులాలు  ఎదిగి దళితులకు, స్త్రీలకు వ్యతిరేకంగా తయారు కావడానికి కారణాలు వెదకటం సామాజిక శాస్త్రవేత్తల పని. ద్రవిడిజం అంటే దళితిజమే. మూల వాసుల సాంస్కృతిక పరిరక్షణకు పెద్ద ఉద్యమాలే జరిగాయి. బాలచందర్ మనకు గొప్ప డైరెక్టర్ గా కనిపిస్తాడు. కానీ తమిలియన్స్ కి భారతీ రాజా గొప్ప డైరెక్టర్. బాలచందర్ సినిమాలో లీలగా కనిపించే సాంప్రదాయవాదాన్ని కూడా వాళ్ళు సహించలేరు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తమిళ సాహిత్యం, కళలు నిరలంకారంగా ఎలాంటి రంగులు అంటుకోకుండా తమ ప్రత్యేకతలో వదిగి ఉంటాయి. అలాంటి చోట వస్తున్నఈ  మార్పులు గర్హనీయం.

ఈ మార్పులు ఎప్పుడు, ఎలా ప్రారంభం అయ్యాయి అంటే ‘ధ్వజస్తంభం, ఉరితాడు’ ఒకటైన చోట అంటాడు తెరేష్ బాబు. అంటే మతం, రాజ్యం ఒకటైతేనే ఈ మార్పులు నిర్ధిష్ట రూపాన్ని పొందుతాయి. తమిళనాడులో  హిందుమున్నని ఈ విషయంతో మాకు సంబందం లేదని ప్రకటించింది. కానీ ఇక్కడి హిందూ పక్షపాత పత్రికలు పెరుమాళ్ బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలని అంటున్నాయి. ఆయన రాసిన విషయాలు రుజువు చేయాలని కూడా అంటున్నాయి.  అయితే అందరు అంటున్న మతమౌఢ్యం ఎక్కడ ఉంది? అది ఈ సమస్యను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే తీసుకొని పెరుమాళ్ ను బోనులో నిలబెట్టిన రాజ్య యంత్రంలో ఉంది. ఆయన చేత బలవంతపు క్షమాపణలు చెప్పించి, ఆయన పుస్తకాలను వెనక్కు తీసుకోమని హెచ్చరించిన  జిల్లా యంత్రాంగం మెదళ్ళలో ఉంది.

కులమౌడ్యానికి,  మతదురహంకారం తోడై నపుడు ప్రమాదకర శక్తులు పుడతాయి. వాటికి రాజ్యం చేయి అందిస్తే వందలమంది   పెరుమాళ్ళ కలాలు ఎండిపోవాల్సిందే. ఇక్కడే ప్రమాద ఘంటికలు మోగాయి. సృజనకారులు ఉలిక్కి పడ్డారు. పెరుమాళ్ కు మద్దతుగా గొంతు విప్పారు. నిజానికి ఈ గొంతుకలు తమ కోసం తాము అరుచుకొన్నవి. భావజాలాలు ఎలా ఉన్న సృజనకారుల ఊహాజనిత శక్తిని నియత్రించే ప్రయత్నాలు దుర్మార్గమైనవి అనే వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.

ఇక ఈ కధలోని  అంశాలను రుజువు చేయాలి అనే వాదనలకొద్దాము. చరిత్రను సాహిత్యంలో..  అదీ కాల్పనిక సాహిత్యంలో వెదకటం తెలివి కల పని కాదని.,  దానికంటే చరిత్ర ప్రతిఫలనాలను సాహిత్యం ఏ మేరకు ప్రతిబింబించిందో చూడాలనీ అట్టాడ అప్పలనాయుడుగారు అన్నారు. ఇలా జరిగిందా లేదా అనే విషయాన్ని సాహిత్యకారులే రుజువు చేయాలనే షరతు ఉంటే భారతీయ సాహిత్యం, ఇంకా ప్రపంచ సాహిత్యం ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. ఈ ఆంక్ష మనిషిలోని సృజనాత్మకతకు గొడ్డలి పెట్టు. మానవ నాగరికత ఊహతోనే అభివృద్ధి చెందింది.

ఇక స్త్రీలను అవమానించారు అనే వాదన. నామిని మూలింటామె వచ్చినపుడు కూడా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు కొన్ని వర్గాలు చేశాయి. కొన్ని సామాజిక, చారిత్రిక పరిస్థితుల్లో స్త్రీలు ఎలా ప్రవర్తించారో, ప్రవర్తించాల్సి వచ్చిందో దాచిపెట్టి స్త్రీని వారిచ్చిన నమూనాలో మాత్రమే సాహిత్యంలో కాని, చిత్రంలో కాని చూపించాలనే వాదన వాస్తవికతను తిరస్కరించటమే. ఇక్కడ అమానవీయమైన వ్యభిచారం ఉంది. స్త్రీలను పల్లెల్లో చెడ్డ మాటలతో పిలుస్తారు. వాటిని ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించిన రచయిత స్త్రీ వ్యతిరేకి అవుతాడా? ఆ రచయిత ఎటు ఉన్నాడో, అతని ఆత్మ ఎటు వైపు మొగ్గుతుందో వివేకవంతుడైన పాఠకుడు, పాఠకురాలు  గ్రహించగలరు. స్త్రీలను వారనుకొన్న నమూనాలో బంధించి, దానికి భిన్నంగా రాసిన రాతలను అవాస్తవాలని అనటం ఒక స్వీయాత్మక ధోరణి మాత్రమే అవుతుంది.

నిజానికి ఈ కధలో కూడా దేవుళ్ళుగా భావించే పురుషులతో సంగమించడం ఆ నాటి సమాజ ఆచారమైనప్పటికీ పురుషుడిలో ఉండే పొసిసివ్ నెస్స్ దానికి అనుమతి ఇవ్వదు. ఆచారాలకు, నమూనాలకు, భౌతిక వాస్తవాలకు వున్న ఘర్షణ ఇది. ఈ ఘర్షణలో ఇక స్త్రీలు నిర్ణయించుకొంటారు., తామెటు ఉండాలో. నిజాయితీపరుడైన సాహితీవేత్తతోనా, గుప్పిట్లోకి తీసుకోవాలనుకొనే మాయల పకీరుతోనా అనేది.

సాహితీకారులు ఒంటరిగా లేరని రుజువయ్యింది. రచయిత ఏమి చెప్పదలుచుకొన్నాడో స్పష్టంగా చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. యిచ్చిన మాట రాజ్యాంగం తప్పినా నాగరిక సమాజం భిన్నాభిప్రాయాన్ని గౌరవించింది. ఇక్కడ హైకోర్టు కూడా పెరుమాళ్ పక్షానే నిలిచినట్లు కనిపిస్తుంది. జిల్లా యంత్రాంగాన్ని మొట్టాల్సింది మొట్టింది. రచయితను కోర్టుకు ఆహ్వానించింది.

కలం పై దాడి అంటే అక్షరం పై దాడి, అంతిమంగా నాగరిక ప్రపంచం పై దాడి. అక్షర సైనికులుగా మనమే మారదాం. అందరం పెరుమాళ్ళ మవుదాం.

  -రమాసుందరి

ramasundari

బృందావన కృష్ణుడు… సోషల్ ఇంజనీరింగ్!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)బుద్ధుడు (క్రీ.పూ. 6వ శతాబ్ది) జన్మించింది కూడా అమ్మవారి వనంలోనే!

బుద్ధుడు శాక్య తెగకు చెందినవాడు. శాక్యులు నేటి భారత-నేపాల్ సరిహద్దులకు ఇరువైపులా నివసించేవారు. అదో వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో సాలవృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. సాలవృక్షం శాక్యులకు పూజనీయం(టోటెమ్). విక్రమార్కుని కథలోని సాలభంజికలు ఈ చెట్టు కలపతో చేసినవే.

అక్కడో సాలవనం ఉంది. అది అమ్మవారి వనం. అందులోని అమ్మవారి పేరు లుంబిని. బుద్ధుడి తల్లి మాయాదేవి దగ్గరలోని శాక్యులకు చెందిన ఒక పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి వనంలోకి వెళ్ళి అమ్మవారిని కొలిచింది. అప్పుడే నొప్పులు వచ్చి ఆ వనంలోనే బుద్ధుని ప్రసవించింది.

బుద్ధుణ్ణి మరచిపోయి ఉండచ్చుకానీ ఆ ప్రాంత జనం ఇప్పటికీ ఆ వనంలోని అమ్మవారిని పూజిస్తూ ఉంటారని కోశాంబీ అంటారు. కాకపోతే లుంబిని కాస్తా ఇప్పుడు ‘రుమ్మిందీ’ అయింది. ఆచారాలు ఎంత బలీయమైనవో, కాలాన్ని జయించి అవి ఎలా కొనసాగుతాయో ఇది చెబుతుంది.

ఇప్పుడు మళ్ళీ పురాణకథల్లోకి ఒకసారి వెడదాం:

ఉత్తరప్రదేశ్ లో కృష్ణుడి జన్మస్థానమైన మధుర, దానికి దగ్గరలో ఉన్న బృందావనం, గోకులం నేటికీ ప్రసిద్ధపుణ్యక్షేత్రాలు. ఈ మూడింటినీ కలిపి ‘వ్రజభూమి’ అంటారు. బృందావనం అమ్మవారివనమే. ‘బృంద’ కొందరు అమ్మవార్ల గుంపు (బృందం) ను సూచించే ఉమ్మడి పేరనీ, ఆ అమ్మవార్ల వనమే బృందావనమనీ కోశాంబీ వివరణ. తులసి రూపంలో ఈ దేవతను పూజిస్తారు. కంసుని వల్ల కృష్ణునికి ప్రాణభయం ఉండడంతో అతని పెంపుడు తల్లిదండ్రులైన యశోదా నందులు గోకులాన్ని బృందావనానికి తరలించారు. బృంద దేవతకు ఏటా జరిగే ఉత్సవాలలో నరబలి కూడా ఉండేదనీ, కృష్ణుడు దీనిని మాన్పించాడనీ కోశాంబీ అంటారు. దీని గురించి Myth and Reality లో మరింత సమాచారం ఉంది కానీ ఇప్పుడు అందులోకి వెళ్లలేం.

కృష్ణుడికి అమ్మవార్లతో ఉన్న స్పర్థ అనేక కథల్లో కనిపిస్తుంది. అతను బాలుడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి విషపూరితమైన పాలు చేపి అతన్ని చంపడానికి ప్రయత్నించగా అతడే ఆమెను చంపాడన్నది మనకు బాగా తెలిసిన కథ. అయితే, పూతన రాక్షసి కాదనీ, బహుశా పిల్లలకు సోకే ఆటలమ్మ రూపంలోని ఒక అమ్మవారనీ కోశాంబీ(The Culture and Civilization of ANCIENT INDIA in Historical Outline) అంటారు. ఉషస్సనే స్త్రీని ఇంద్రుడు చంపాడని చెబుతున్నా, ఆమె బతికి బయటపడినట్టుగా; పూతనను కృష్ణుడు చంపాడని అన్నా ఆమె చావలేదనీ, మధుర ప్రాంతంలో ఇప్పటికీ పిల్లలకు పూతన పేరు పెడతారనీ ఆయన వివరణ.

‘బహుశా’ అని కోశాంబీ ఎందుకు అన్నారో కానీ, పూతన అమ్మవారే ననడానికి, భాగవతం, దశమస్కంధంలోని పూతన వధ ఘట్టంలోనే స్పష్టమైన సాక్ష్యం ఉంది. గోపికలు కృష్ణుడికి రక్ష పెడుతూ, “నిన్ను తలచుకున్నవారికి వృద్ధ, బాల గ్రహాల వల్ల , భూతప్రేత పిశాచాల వల్ల ఎలాంటి భయమూ ఉండదనీ, పూతనాది మాతృకా గణాలు నశిస్తాయనీ” అంటారు. మాతృకా గణాలంటే అమ్మవార్లే. కుమారస్వామి కథలో కూడా ఈ మాతృకా గణాల ప్రస్తావన వస్తుంది. ఇక్కడ ‘గణాలు’ అనే మాట ‘సమూహాలు’ అనే అర్థంలో వాడినట్టు కనిపించవచ్చు కానీ, పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ మాట ఒకనాటి గణవ్యవస్థనే సూచిస్తూ ఉండవచ్చు. ఒకప్పుడు నిర్దిష్టార్ధంలో ఉపయోగించిన మాటలు కాలగతిలో నిర్దిష్టార్ధం కోల్పోయి సామాన్యార్ధం తెచ్చుకోవడం పరిపాటే. గ్రీకు పురాచరిత్ర సందర్భంలో జార్జి థాంప్సన్ కూడా ఇలాంటి ఉదాహరణలను కొన్నింటిని ప్రస్తావించారు.

వాస్తవంగా ఏం జరిగి ఉండచ్చంటే, పూతనను కృష్ణుడు చంపలేదు, లొంగదీసుకున్నాడు! అంటే, మాతృకాగణాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకుంటే, అమ్మవార్ల ఆరాధనకంటే ఉన్నతస్థానంలో, తన రూపంలోని పురుషదేవుడి ఆరాధనను స్థాపించడానికి ప్రయత్నించాడు. అమ్మవారి ఆరాధన అంతరించలేదు కానీ, ద్వితీయస్థానానికి జారిపోయింది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న భారతదేశ ప్రత్యేకతను వెల్లడిస్తుంది. ఇక్కడ ఏదీ ఒకదానినొకటి అంతరింపజేయదు. భిన్నత్వాల మధ్య సర్దుబాటు జరుగుతుంది. కృష్ణుడు చేసినదానిని సామాజికార్థంలో తీసుకుంటే, మాతృస్వామ్యంపై పితృస్వామ్యాన్ని స్థాపించడంలో ఆయన ఒక పాత్ర నిర్వహించాడన్నమాట.

sacred grove in vrindavan

బృందావనం కథ కూడా అమ్మవార్లపై కృష్ణుడు తన ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రక్రియలో భాగమే. బృందను కృష్ణుడు పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంటే, బృందారాధన(అమ్మవార్ల ఆరాధన)ద్వితీయస్థానానికి జారిపోవడమూ; కృష్ణారాధన, బృందారాధనల మధ్య సర్దుబాటూ జరిగాయన్నమాట. కృష్ణుడు నరబలిని మాన్పించడం ద్వారా బృందారాధనను సంస్కరించడానికి ప్రయత్నించాడు. కృష్ణుడి భార్యల సంఖ్య 16,108కి చేరుకోవడంలోని రహస్యం, ఆయన అమ్మవార్లను పెళ్లాడి (పైన చెప్పిన సర్దుబాటు అర్థంలో), అప్సరసలతో రాసక్రీడలు జరపడమే. అప్సరసలే గోపికలుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవార్లతోపాటు అప్సరసలు కూడా ఇంతకుముందు చెప్పుకున్న స్త్రీ సూత్రం (female principle)లో భాగాలే. ‘ఎలుగుబంటి’ తెగకు నాయకుడైన జాంబవంతుడి కూతురు జాంబవతి, అప్పటికింకా ఆటవిక దశలోనే ఉన్న భోజకుల ఆడబడుచు రుక్మిణి మొదలైనవారిని కృష్ణుడు పెళ్లాడడం; భిన్న భిన్న తెగలలోకి కృష్ణారాధనను శాంతియుతంగా చొప్పించే ప్రయత్నమేనని కోశాంబీ అంటారు. కృష్ణుడి వివాహాలు మాతృస్వామ్యానికి చెందిన కొన్ని అనార్య తెగలను ఆర్యుల పితృస్వామిక వ్యవస్థలో విలీనం చేసే ప్రక్రియలో కీలకమైన ముందడుగుగా ఆయన వర్ణిస్తారు. నేడు మనం చెప్పుకునే ‘సోషల్ ఇంజనీరింగ్’ కు ఇది చక్కని ఉదాహరణ.

ఇలా కృష్ణుడు పితృస్వామ్య స్థాపనలో కీలక పాత్ర వహించాడనీ, లేదా పితృస్వామ్య స్థాపనలో భాగంగా కృష్ణుడి పాత్రను నిర్మించారనీ అనుకుంటే ఆయన దశావతారాలలో ఎందుకు చేరాడో అర్థమవుతుంది. అమ్మవార్ల ఆరాధనలోకి, లేదా మాతృస్వామిక రూపాలలోకి కృష్ణుడు తన ఆరాధనను చొప్పించిన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. గోపికావస్త్రాపహరణం ఒక కీలక ఉదాహరణ.

పోతన భాగవతం, దశమస్కంధంలోని ఆ కథ ఇలా సాగుతుంది:

హేమంత ఋతువులో మొదటి నెల తొలిదినాలలో నందుని మందలో ఉన్న గోపికలంతా పొద్దుటే లేచి కాళిందీనదికి వెళ్ళి స్నానం చేశారు. నది ఒడ్డున ఇసుకతో కాత్యాయినీరూపం చేసి, పువ్వులు,గంధంతో, ధూపదీపాలతో పూజించి నైవేద్యాలు పెట్టారు. కృష్ణుడిని తమకు పతిని చేయమని అమ్మవారిని ప్రార్థించారు. ఇలా నెలరోజులపాటు కాత్యాయనీ వ్రతం చేశారు.

ఆ నెలరోజుల్లోనే ఒకరోజున కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ యమునా తీరానికి వెళ్లారు. ఒక నిర్జన ప్రదేశంలో చీరలు విప్పి గట్టున పెట్టి నదిలోకి దిగారు. దూరం నుంచే కృష్ణుడు ఇది చూసి, తన తోటి గోపకులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వారిని కదలకుండా అక్కడే ఉండమని చెప్పి తను పొదల మాటునుంచి చప్పుడు చేయకుండా వెళ్ళి గట్టున ఉన్న చీరలను ఎత్తుకు వెళ్ళి ఓ చెట్టెక్కి కూర్చున్నాడు.

గోపికలు చూశారు. ‘’మా మాన మెందుకు హరిస్తావు? మా చీరలు మాకు ఇచ్చేయి అని అనేకరకాలుగా ప్రార్థించారు. ‘’నీళ్ళలోంచి బయటకు వచ్చి మీ చీరలు తీసుకొండని కృష్ణుడు అన్నాడు. గోపికలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ, “ఆడవాళ్ళు స్నానం చేసే చోటికి మగవాళ్ళు రావచ్చా? వచ్చినా ఇలాంటి పనులు చేయచ్చా? నీకు దాసులమవుతాం. నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం. ఏమైనా ఇస్తాం. ఇప్పుడు మాత్రం దయచేసి మా చీరలు మాకు ఇచ్చేయి” అన్నారు.

‘’ఇంతకీ ఎవరు మొగుడు కావాలని వ్రతం చేస్తున్నారు? మీకు ఎవరి మీద వలపు కలిగింది?’’ అని కృష్ణుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు హృదయంలో మన్మథుడు సందడి చేస్తుండగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గోపికలు మౌనంగా ఉండిపోయారు.

‘’నా ఇంటికి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటామంటే మీ చీరలు మీకిస్తాను. నీళ్ళలోంచి బయటకు రండి’’ అన్నాడు కృష్ణుడు.

చలికి నీళ్ళలో ఉండలేక, బయటకు రాలేక గోపికలు సతమతమయ్యారు. ఏమైతే అయింది, వెడదామని కొందరు అన్నారు. వెడితే కృష్ణుడు మన సిగ్గు తీస్తాడని కొందరు అన్నారు. చివరికి ఎలాగో మనసు గట్టి చేసుకుని, అరచేతితో మానం కప్పుకుంటూ వరసకట్టి నీళ్ళలోంచి బయటకు వచ్చారు.

‘’ఎందుకు సిగ్గు పడతారు? నాకు తెలియని మీ రహస్యం ఏముంది? వ్రతనిష్టలో ఉండి ఇలా చీరలు విప్పేసి స్నానం చేయచ్చా? వ్రతఫలం దక్కాలంటే చేతులెత్తి మొక్కి చీరలు తీసుకొండని’’ డని కృష్ణుడు అన్నాడు.

వ్రతాలు చేసేటప్పుడు ఎవరిని తలచుకుంటే వ్రతభంగం ఉండదో ఆ దేవుణ్ణే తాము చూస్తున్నప్పటికీ, ‘అయ్యో చీరలు విప్పి ఈరోజు వ్రతభంగం చేశామే’ అనుకుంటూ గోపికలు రెండు చేతులూ ఎత్తి కృష్ణుడికి మొక్కారు. కృష్ణుడు చీరలు ఇచ్చేశాడు. “ చీరలు దొంగిలించి కృష్ణుడు మన సిగ్గు తీస్తే తీశాడు కానీ వ్రతంలో లోపం జరగకుండా మొక్కించి కాపాడాడు” అని అనుకుంటూ గోపికలు కృష్ణుని స్తుతించారు. చీరలు కట్టుకున్నారు.

అప్పుడు కృష్ణుడు వాళ్ళతో, ‘’సిగ్గుపడి మీ రహస్యం చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది. నన్ను కొలవాలనే మీరు అనుకున్నారు. మీ నోము ఫలించేది నావల్లనే. నన్ను కొలిస్తేనే మీకు ముక్తి. ఆ తర్వాత అమ్మవారిని కొలిచి రాత్రిళ్ళు మీరు నన్ను పొందవచ్చు’’ అన్నాడు.

brundaavanamlo raadhaakrushnulu

ఈ ఘట్టానికే కాక, ఇలాంటి అనేక ఘట్టాలకు సంబంధించి సంప్రదాయం బోధించే ఆధ్యాత్మికఅన్వయాలు, రహస్యాలు వేరే ఉన్నాయి. అవి నా పరిశీలన పరిధిలోకి రావు కనుక వాటిలోకి వెళ్లను. పురాచరిత్ర కోణం నుంచి చూస్తే, గోపికలు కాళిందిలో స్నానం చేసి, ఇసుకతో కాత్యాయనీదేవి రూపం చేసి పూజించిన ప్రాంతంలో అమ్మవారి వనం ఉండడానికి ఎంతైనా అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ వివరాన్ని అందించడం కథకునికి అంత ముఖ్యంగా తోచి ఉండకపోవచ్చు. అతను ప్రధానంగా కృష్ణుడనే పురుషదేవుని పరంగా కథ చెబుతున్నాడు. అలాగే, గోపికలు యమునా నదికి వెళ్లి, చీరలు విప్పి స్నానం చేసిన ప్రదేశం స్త్రీలకు మాత్రమే ఉద్దేశించిన రహస్య ప్రదేశం కావచ్చు. అక్కడ అమ్మవారి వనమూ ఉండవచ్చు.

స్త్రీల రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కృష్ణుడు యథేచ్చగా ఉల్లంఘించాడన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్న గ్రీకు కథలతోనూ, దేవీభాగవతంలోని సుద్యుమ్నుని కథతోనూ దీనిని పోల్చి చూడండి. అర్తెమిస్ అనే గ్రీకు దేవత ఒక అడవిలోని కన్యాసరోవరంలో స్నానం చేస్తుండగా అక్కడికి వెళ్ళిన అక్తయాన్ అనే పురుషుణ్ణి అర్తెమిస్ లేడిగా మార్చివేసింది. దాంతో అతని వెంట ఉన్న వేటకుక్కలు లేడి రూపంలోని అక్తయాన్ పై దాడి చేసి చంపేసాయి. మరో కథలో డఫ్నే అనే యువతిని ప్రేమించిన ల్యుకప్పస్ అనే యువకుడు స్త్రీ వేషంలో వెళ్లి ఆమెతో స్నేహం చేశాడు. ఒకరోజున ఇతర చెలికత్తెలతో కలసి డఫ్నే దుస్తులు విప్పి జలక్రీడలాడడానికి సిద్ధమైనప్పుడు ల్యుకప్పస్ మగవాడని తెలిసి అతణ్ణి చంపేస్తుంది. దేవీభాగవతం కథలో అమ్మవారి వనంలోకి తెలియక ప్రవేశించిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. జగదేకవీరుని కథలో దేవకన్యలు స్నానం చేస్తుండగా చూసిన రాకుమారుని ఇంద్రకుమారి శిలగా మార్చివేస్తుంది.

కానీ, గోపికలు స్నానం చేస్తున్న రహస్యప్రదేశంలోకి కృష్ణుడు ప్రవేశించినా అతనికి ఏమీకాలేదు. పైగా, నగ్నంగా అతని ముందు నిలబడి గోపికలే శిక్షను ఎదుర్కొన్నారు. పై కథలలోని స్త్రీలకు, గోపికలకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. పై కథల్లోని స్త్రీలు తమ రహస్యప్రదేశంలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కచ్చితంగా, నిర్దాక్షిణ్యంగా అమలు చేశారు. తమ రహస్యప్రపంచ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు. అందుకు భిన్నంగా గోపికలు బేలలుగా మారి తమ రహస్య ప్రపంచ ఆధిపత్యాన్ని పురుషుడికి ధారపోసేసారు. కృష్ణుడికి, వారికి జరిగిన సంభాషణ– వారు పురుషుడికి పూర్తిగా దాసోహమవడాన్నే వెల్లడిస్తుంది. ‘’నీకు దాసులమవుతాం, నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాం, ఏమి కోరినా ఇస్తాం, ఇప్పుడు మాత్రం చీరలు ఇచ్చేయ’’ మని వేడుకుంటారు. ఇది స్త్రీ అధికార పతనానికి కచ్చితమైన సూచన.

కృష్ణుడు కూడా వారిపై దాస్యాన్ని విధించడానికి ఏమాత్రం మొహమాటపడలేదు. ‘’మీరు నా ఇంటి దాసులై నేను చెప్పినట్టు నడచుకుంటేనే చీరలు ఇస్తాను’’ అన్నాడు. గోపికలు అరచేత మానాన్ని కప్పుకుంటూ కృష్ణుడి ముందుకు వెళ్ళినా వారికి చీరలు దక్కలేదు. రెండు చేతులూ ఎత్తి మొక్కిన తర్వాతే దక్కాయి.

ఆ తర్వాత కృష్ణుడు గోపికలకు చేసిన ఉపదేశంలో, ‘’మీరు (ప్రధానంగా) మొక్క వలసింది అమ్మవారి( కాత్యాయని)కి కాదు, నాకు’’ అన్న సూచన స్పష్టంగా ఉంది. ‘’మీకు ముక్తిని ఇవ్వవలసింది నేనే (అమ్మవారు కాదు)’’ అన్న సూచనా అంతే స్పష్టంగా ఉంది. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కృష్ణుడు అమ్మవారి ఆరాధనను నిషేధించలేదు. ‘’నన్ను కొలిచిన తర్వాత అమ్మవారిని కొలిచి నన్ను పొందండి’’ అన్నాడు. అంటే అమ్మవారి ఆరాధన ద్వితీయస్థానానికి జారిపోయింది. విశ్వాసరంగంలో ఇదీ భారతదేశ ప్రత్యేకత.

పురాచరిత్ర దృష్టి నుంచి చూస్తే, కృష్ణలీలను అర్థం చేసుకోవడంలో మాతృస్వామ్యంపై పురుషస్వామ్యాన్ని స్థాపించడం అనేది ఒక కీలకమైన దృక్కోణం.

***

జార్జి థాంప్సన్ ప్రకారం(Studies in Ancient Greek Society-The Prehistoric Aegean), ప్రాచీన గ్రీసులోనూ అమ్మవారి వనాలు ఉండేవి. అట్టికా అనే ప్రాంతంలో, ఒకే తెగకు చెందినవారు నివసించే స్థానిక స్వపరిపాలనా విభాగాలు (demes) 200 వరకు ఉండగా, వాటిలో ఒక చెట్టు పేరో, మొక్క పేరో పెట్టిన విభాగాలు 25 వరకూ ఉన్నాయి. అంటే, ప్రాచీన గ్రీసు అంతటా ఆయా తెగలలో వనమూలికల సంబంధమైన మాంత్రిక పద్ధతులు, చెట్లను పూజించడం ఉండేవనడానికి ఇది సూచన. Orgie అనే మాటకు విశృంఖల కామకేళి అని అర్థం. ఇది గ్రీకు పదం. ఈ పదానికి చెందినదే Orgas అనే మరో పదం. దున్నిన లేదా దున్నని ఒక పవిత్రక్షేత్రాన్ని(వనాన్ని) ఇది సూచిస్తుంది. ఇక్కడ Orgia అని పిలిచే రహస్య తంతులు జరుగుతాయి. ఇథికా అనే పట్టణం బయట ఉన్న పవిత్ర రావిచెట్ల వనం లాంటిదే ఈ పవిత్ర క్షేత్రం కూడా నని థాంప్సన్ అంటారు. ఇలాంటి వనాలే అయోనియన్ దీవుల్లోనూ ఉన్నాయనీ; యూరప్, ఆసియా గ్రామాలు అన్నిటా ఇవి కనిపిస్తాయనీ, భారతదేశంలో అయితే ఇప్పటికీ ఈ వనాలలో అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుందనీ ఆయన అంటారు.

పవిత్ర వనాలే కాదు, గుహలు కూడా ఆదికాలపు గుడులే!

దాని గురించి తర్వాత…

కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

కవిసంగమం మూడో మైలురాయి!

kalankariతెలుగు కవిత్వంలోకి ఈ కాలపు వాళ్లు రావటంలేదు,ముప్పై అయిదులోపు వయసువాళ్లు రావటం లేదు. ఇదీ ఈ మధ్య కాలంలో సాహిత్య కార్యక్రమాల్లో చాలావరకు వినిపించే మాటలు. నిజమే ననిపించేది దానికి కారణం. బయట అనేక సంస్థలు నిర్వహించే సమ్మేళనాల్లో లబ్దప్రతిష్టులైన కవులు,అంతో ఇంతో పేరున్న కవులు, సాహితీ వేత్తలు మాత్రమే పాల్గొనేవారు.ఇలా నిండిపోయిన సభల్లో కొత్త గొంతుకలు కనిపించేవికావు. కచ్చితంగా కరణాన్ని అంచనాకట్టాలంటే స్థలాభావమే ఎక్కువ.ఉన్న సమయంలో కొత్తవాళ్లకు సమయాన్ని కేటాయించాలంటే నిర్వాహకులకు కష్టమే. ఇప్పటికి కవిత్వం బతుకుతుంది.రేపటి విషయం ఏమిటి ?అనే ప్రశ్న చాలామందిని తొలిచేది. నిజానికి తెలుగు మరుగున పడుతోందో అని బాధపడేవాళ్లతో బాటు.కవిత్వం మరుగున పడుతోందనే వారిసంఖ్యా లెక్కించదగిందే.

బాగా అర్థం చేసుకుంటే ఎక్కడైన స్థలాభావమే ఇప్పటిసమస్య.ఆన్ లైన్ మాధ్యమం ఒకటి చేరువయ్యాక అన్ని తరాలను కలిపే అవకాశమొకటి వచ్చింది.కొన్ని తరాల కవిత్వాన్ని ఒక దగ్గర చేర్చేందుకు కవిసంగమం తెరమీదకు వచ్చింది.ఈ తొమ్మిది ఫిబ్రవరి నాటికి కవిసంగమం నడకకు మూడేళ్లు.చాలావరకు సంస్థలు ఆర్ద్రలో పుట్టి పుబ్బలో పోయేవే అనే సామేతకు దగ్గరివే.ఇలాంటి సాహసంలో “కవిసంగమం” మొదటిదనలేం కాని మూడుపువ్వులు ఆరుకాయల్లా వికసించినవాటిలో మొదటి స్థానంలో ఉంటుందనటంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. కవిసంగమం నడక వెనుక కవి యాకూబ్ కృషి గమనించదగింది.కేవలం తెలుగుకు సంబంధించిన మూడుతరాలను మాత్రమే కాదు. భారతీయ తెలుగేతరభాషల్లో లబ్దప్రతిష్టులైన శాహితీ వేత్తలుకూడా కవిసంగమం వేదిక పంచుకోవడంలో ప్రధానంగా యాకూబ్ ఆలోచనలు హర్షించదగినవి. అతనికి సాయంగా ఉన్న మిత్రుల నిబద్దతనుకూడా అభినందించవలసిందే.

సంవత్సరం వరకు కవిత్వం గ్రూప్ గా నడచిన కవిసంగమం భారతీయభాషల కవులను వేదికపై పరిచయం చేసింది.మొదటి వార్షికోత్సవం నాటికి సుభోధ్ సర్కార్ అతిథిగా హాజరయ్యారు.రెండవ వార్షికోత్సవానికి శీతాశు యశశ్చంద్ర ,కాస్త ముందుగా జరిగిన ఈసంవత్సరపు వేడుకల్లో రజతసల్మ పాల్గొన్నారు.మధ్యకాలంలో ఒక కార్యక్రమంలో చేరన్ రుద్రమూర్తి తో పరిచయకార్యక్రమాన్ని,ఈ సంవత్సరం సింధీకవి లక్ష్మణ్ దూబే తో పరిచయాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమాన్ని పున:పున:చూడడానికి యూట్యూబ్ లోనూ కార్యక్రమాలను చేర్చి తాముగాహాజరుకాలేని ఇతరప్రాంత సాహితీ మిత్రులకు ఈ అవకాశాన్ని కలిగించింది.

జనవరి ఇరవైఏడు 2013 నుండి ప్రారంభమైన కవిసంగమం “లెర్నింగ్ ఇన్ ప్రాసెస్”కార్యక్రమం సుమారు ఇప్పటివరకు ఒకటిన్నర సంవత్సరాలపాటు నిరాటంకంగా నడచి మూడుతరాలను ఒకదగ్గరికి చేర్చి తరాలమధ్య ఉండే అంతరాన్ని దూరం చేసింది.వరవర రావు,నగ్నముని,నిఖిలేశ్వర్,దేవీప్రియ,అమ్మంగి వేణుగోపాల్,మొదలైన లబ్దప్రతిష్టులైన కవుల్ని కొత్తతరానికి ,కొత్తతరాన్ని మిగతాకవులకు పరిచయం చేసింది.ఈ మార్గంలో స్థలాభావాన్ని ఒక నిర్ణీతమార్గంలో దూరం చేయగలిగింది. అంతే కాదు యువత కవిత్వంలోకి రావటం లేదన్న మాటని అసత్యంగా నిరూపించింది. ఇప్పటికే కవిసంగమం ద్వారా కవితా రచన ప్రారంభించి కొంత అనుభవాన్నిసమకూర్చుకున్న యువతరం పుస్తకాలను ముద్రించుకుని తమనడకకు సార్థకతను కలిగించుకున్నారు.కవిసంగమం సాధించిన లక్షాలలో ఈ అంశం గమనించదగింది.

వృత్తిరీత్యా,ఇతరకారణాలతో తెలుగునేలకు దూరంగాఉన్న తెలుగు కవులతోకూడా కొత్తతరాన్ని కలిపింది. ఇందులో భాగంగా “మీట్ ది పోయట్”కార్యక్రమంలో నారయణ స్వామి వెంకట యోగి,అఫ్సర్(27 జూలై)కృష్ణుడు (7 డిసంబర్)మొదలైన కవులతో పరిచయాన్ని సంభాషణను నిర్వహించింది. పుస్తకముద్రణల్లో భాగంగా రెండవసంవత్సరం నూటా నలభైనాలుగుమందికవుల కవిత్వంతో పుస్తకాన్ని తీసుకువచ్చింది.

నిరంతర సాహిత్యచర్చలకోసం గతంలో సాహిత్యంతో స్ఫూర్తివంతమైనపరిచయాలుగల కవులు,విమర్శకులు,అనువాదకులతో రోజువారీశీర్శికలను నిర్వహిస్తోంది.సీనియర్ కవులసలహాలను ఎప్పటికప్పుడు కొత్తవారికి చేర్చడంతోపాటు,కొత్తగారాస్తున్నవారిలో దొరలే తప్పుల్ని తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి నౌడూరి మూర్తిగారు(కవిత్వతో ఏడడుగులు)కాసుల ప్రతాప రెడ్డి (కవిస్వరం) వేణుగోపాల్ (కవిత్వంతో ములాఖాత్)సత్య శ్రీనివాస్(మట్టిగూడు)అబ్దుల్ వాహెద్ (ఉర్దూకవిత్వ నజరానా)శ్రీనివాస్ వాసుదేవ్(The winged word)అన్నవరం దేవేందర్(తొవ్వ)అఫ్సర్(కరచాలనం)తో పాటు సిరా,రాజారాం తుమ్మచెర్ల(నేను చదివిన కవిత్వ సంపుటి) మొదలైనవాళ్ళు  శీర్శికలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్.జీవితం-కవిత్వం(అబ్దుల్ వాహెద్ రచన)ఎం.నారాయణ శర్మ(ఈనాటికవిత-కవిత్వ విమర్శ)ముద్రించి పుస్తకముద్రనవైపునడిచింది.మూడుతరాల కవిత్వాన్ని ఒకవేదికనుంచి అందించడమేకాక భవిష్యత్తులోని రెండుమూడుతరాలనుకూడా కవిసంగమం పరిచయం చేసింది.రక్షితసుమ “దారిలోలాంతరు”ను ఆవిష్కరించుకుంది.కమలాకర్,మరికొంతమంది పాఠశాల విద్యార్థులు కవిసంగమం తోటలో వికసిస్తున్న రేపటి కవితా కుసుమాలు.

ఈనడకను గమనిస్తున్న వారెవరైనా కవిసంగమం తీసుకువచ్చిన కవితాస్పృహను గుర్తించగలుగుతారు.ఇంత నిబద్దమైన నిర్వహణలొ ఉండే సాధకబాధకాలు అందరూ గుర్తించగలిగేవే.వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది.కవుల్ని, కవిత్వాన్ని మాత్రమే ఆధారం చేసుకున్న నడక మరింత శక్తివంతంగా ముందుకుసాగాల్సి ఉంది.అందుకు ఈ మూడేళ్ళమైలురాయే మంచిపాఠంగానిలుస్తుంది.

ఎప్పటికైనా కవితాత్మకస్పృహను అందుకోలేనికవులను దారికితెచ్చుకోవాల్సిన అవసరమూ ఇప్పుడు కవిసంగమం భుజాలపై ఉంది.మరిన్ని తరాలనుకలుపుతూ కవిసంగమం జీవనదిలాప్రవహించాల్సిన అవసరం ఉంది.ఈ పచ్చని చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదికూడా.

-ఎం.నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

 

 

 

 

 

 

కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది: కవి యాకూబ్ 

మూడేళ్ళ కవిసంగమం ప్రయాణ అనుభవం ఎలా ఉంది?

జ. తెలుగులో కవిత్వానికి కొత్తవేదికగా కవిసంగమం ఏర్పాటు చేసుకున్నాం. ఫేస్‌బుక్‌ లో వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన, సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఏర్పడిన సమూహం. కవిత్వసృజన, కవిత్వపఠనం, కవిత్వ సంబంధిత అంశాలు – ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా ‘‘కవిసంగమం’’ సీరీస్‌ సభలు ‘‘పోయెట్రీ వర్క్‌ షాపుల్లా” జరుగుతున్నాయి. వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను కవిసంగమం గ్రూప్‌ వాల్‌ మీద పోస్టు చేయడం, నెలనెలా కార్యక్రమాల్లో ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌’’ మార్గంలో సాగుతోంది .

కవిసంగమం ప్రారంభంలోని ఈ దశను ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఎంతో హాయిగా, సంతోషంగా ఉంది.

ఫిబ్రవరి 9, 2012 – కవిసంగమం మొదలయ్యింది. ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది. ఇవ్వాళ ఫేస్‌ బుక్‌ కవితావేదికగా నిలబడింది. అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాసున్నవాళ్ళు ఎందరో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, సందోహాలు -వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్‌ చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఆ మార్గంలో సాగుతున్నారు. కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది.

ఆగష్టు 15, 2012 న ఇఫ్లూ లో జరిగిన ‘‘కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్‌’’ ఒక గొప్ప ప్రయోగం. ఆంధ్రజ్యోతి, పాలపిట్ట, దక్కన్‌ క్రానికల్‌, హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి. అలాగే ఒక ప్రయత్నంగా, ఒక ప్రయోగంగా 144 కవితలతో ‘‘కవిసంగమం-2012 ’’ కవితా సంకలనం వెలువడిరది . ఇందులో తొట్టతొలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి. ‘కవితత్వాలు’ పేరుతో యశస్వీసతీష్  ఫేస్బుక్లో రాస్తున్న కవుల పరిచయ పుస్తకం ప్రచురించారు. 2014లో ’’సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్‘‘ పేరుతో వాహెద్ రాసిన ఫైజ్ కవితలు జీవితం గురించిన పుస్తకాన్ని, ’’ఈనాటి కవిత‘‘ పేరుతో ఎం.నారాయణశర్మ రాసిన 75 మంది కవుల కవితల విశ్లేషణా పుస్తకాన్ని ప్రచురించాం.

***

2012 లో బెంగాలీ కవి సుబోధ్‌ సర్కార్‌ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్‌ ను చూసి ముచ్చటపడ్డాడు. గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు. అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆ తర్వాత  వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్‌ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు, చదివిన కవిత్వం మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌ ’’గా ఎంతో ఉపయోగపడ్డాయి.

కవిసంగమం ఫేస్‌బుక్ గ్రూపులో 3000 పైగా సభ్యులున్నారు.ప్రతి రోజు కవితలు వాలుతు వుంటాయి. అలానే ప్రతిరోజూ, రోజుకొక అంశానికి సంబంధించిన వ్యాసాలుంటాయి. ఇప్పుడు కవిసంగమం కవిత్వానికి సంబంధించిన గ్రంధాలయం.
9-2-2012 నుంచి నేటి వరకు తెలుగు సాహిత్యానికి ఎందరో నూతన కవుల్ని పరిచయం చేసింది. ఈ నూతన కవుల్ని కేవలం అంతర్జాలం మాధ్యమానికే పరిమితం చేయకుండా పాత తరానికి కొత్త తరానికి మధ్య కవిత్వ వారధి అయ్యింది. ఈ బాటలో వచనకవిత్వం అనుబంధిత అంశాలపై నిరంతర సంభాషణ కొనసాగుతుం ది. అందులో భాగంగా వర్క్ షాపులు కవిత్వానికి సంబంధించిన సమాచారాన్ని పంపిణీ చేయడం, ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ మార్గాన్ని సృష్టించింది.
1779260_10203144783201536_2074735339_n

 

  1. ఫేస్బుక్ గ్రూప్ గానే కాకుండా ప్రత్యక్షంగా వివిధ కార్యక్రమాల ద్వారా కవిసంగమం తీసుకొచ్చిన చైతన్యానికి ముఖ్యంగా ఈ తరం నుంచి ఎలాంటి స్పందన చూస్తున్నారు?

జ. ముఖ్యంగా కవిత్వ పండుగల వల్ల ఇతర భాషలకు చెందిన ప్రముఖ కవులను కొత్తతరం కవులు కలుసుకునే వాతావరణం ఏర్పడింది. దానివల్ల చాలా మందికి నేర్చుకునే అవకాశం లభించింది. మీకు తెలుసు, కవిత్వం నేర్పడానికి విశ్వవిద్యాలయ కోర్సులేవీ ఉండవు. కవిత్వం రాయాలన్న తపన ఉన్నవారికి ఇలాంటి సందర్భాలు అవసరమైన లెర్నింగ్ అవకాశాలు కల్పించాయి. నెలనెల జరిగే పొయట్రీ మీట్ ల ద్వారా పాతతరం కవులు, కొత్త తరం కవులు కలుసుకోవడం వల్ల సీనియర్ల నుంచి కొత్తతరం కవులు నేర్చుకునే అవకాశాలు లభించాయి. తెలుగు కవిత్వంలో ఇది ఒక చక్కని వాతావరణాన్ని ఏర్పరచింది. అన్నింటికి మించి, హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కవిసంగమం పేరుతో ఒక స్టాల్ తీసుకుని నడిపాము. అక్కడ కేవలం కవిత్వ పుస్తకాలు మాత్రమే అమ్మకానికి ఉంచాము.

తెలుగు కవులు చాలా మంది తమ పుస్తకాలు తీసుకొచ్చి స్టాల్ లో ఉంచారు. తెలుగులో కవిత్వం కొని చదివేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆ స్టాల్ నిరూపించింది. ఆ పదిరోజుల్లో మేము దాదాపు 40 వేల రూపాయల పుస్తకాలు అమ్మగలిగాము. కవులకు వారి పుస్తకాలు అమ్మకానికి పెట్టే ఒక వేదికనివ్వగలిగాము. ఇవన్నీ ఫేస్ బుక్ కు ఆవల జరిగిన కార్యక్రమాలే. నిజానికి ఫేస్ బుక్ కవులను పరోక్షంగా కలిపింది. వారి కవిత్వంతో పరిచయం ఏర్పడేలా చేసింది. కవిత్వం రాయాలనుకుంటున్న వారికి కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపు ఒక వేదికగా ఉపయోగపడింది. ప్రాధమికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది . ఆ తర్వాత కవిసంగమం చేపట్టిన నెలవారి సమావేశాలు, కవిత్వపండుగలు, బుక్ ఫెయిర్లలో స్టాల్ నిర్వహణ వంటి కార్యక్రమాలు కవులను ప్రత్యక్షంగా కలుసుకునే, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకునే, ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే అవకాశాలు కల్పించాయి. జయహో కవిత్వం ‘అని అందరితో అన్పించగలుగుతున్నాం.

  1. ఇతర భాషల కవులని ఆహ్వానించి, వారి గొంతు వినిపించడం ఒక ప్రయోగం. దాన్ని మన కవులు ఎలా స్వీకరిస్తున్నారు?

పరభాషా కవుల అనుభవాలు, అక్కడి కవిత్వ ధోరణులు, కవిత్వ వాతావరణం గురించి మనవారికి ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగింది.  వారిని వినేందుకు,ముచ్చటించేందుకు ,కలుసుకునేందుకు ఎక్కువ సంఖ్యలోనే హాజరు అవుతున్నారు. ఆ ఆసక్తి ఆశాజనకమైన మార్పే. అప్పటికప్పుడు కవులు తమకు ఇతర భాషల్ని వినడం ద్వారా ఏం ఒనగూడిందో చెప్పకపోవొచ్చుకానీ, ఖచ్చితంగా ఆ ప్రభావం మాత్రం ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో కవిత్వం అనే ప్రక్రియ సీరియస్ నెస్ ని అర్థం చేసుకోగలుగుతారు .

ఇతర భాషలలో ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. తెలుగునేలమీద ఇటువంటి అనుభవం రమారమిగా లేదనే చెప్పాలి. ఒక రకపు కవిత్వ సభలకు అలవాటుపడి పోయాం. ఇతర భాషల కవుల్ని పిలిచే కార్యక్రమం ద్వారా ఇక్కడి కవిత్వ వాతావరణంలో క్రొంగొత్త తీరును ప్రతిష్టించాలని కూడా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫలితాల్ని ఇస్తున్నట్టే కన్పిస్తుంది. ఇటీవలి బుక్ ఫెస్టివల్ లో కవిత్వ సంకలనాల అమ్మకం ఒక కొలమానంగా చూపవచ్చేమో !

  1. కవిసంగమం భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి?

జ. భవిష్యత్తులో మరిన్ని కవిత్వ కార్యక్రమాలు ఫేస్బుక్ బయట కూడా ఏర్పాటుచేయాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా అనేకమంది కొత్త కవులు రాస్తున్న పుస్తకాలకు ప్రచురణ వేదిక ఒకటి ఏర్పాటు చేయాలని, వారి పుస్తకాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నాం. తెలుగులో కవిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణం ఏర్పాటు చేయాలన్నదే మా అభిమతం. కవిత్వానికి మరింత ఊపు,ఉత్సాహం తీసుకురావాలన్నదే ప్రధాన ధ్యేయం. నిరంతరం కవిత్వం కోసం కవిత్వ సందర్భాల్ని సృష్టిస్తూ కవిత్వాన్ని సజీవంగా ఉంచాలని ప్రయత్నం.

*

 

 

చాసో చూపు: మరువం చర్చా వేదిక 10 న…

10920260_10152630910212864_8275112804177833100_o

యువకథకులు-కథన రీతులు చర్చ ఈ వారమే!

10352821_942895082387330_2633517836033313795_n

గతమా, మరచిపో నన్ను !!!

మంచం పక్కన సైడ్ టేబిల్ మీద పెట్టిన మొబైల్ ఫోన్- రాత్రి పెట్టిన చేసిన టైముని గౌరవిస్తూ ‘ఇంక లేవాలి సుమా“ అంటూ మోగింది. రొజాయిలోంచి చెయ్యి మాత్రం బయటకి తీసి దాని నోరు నొక్కి “ఒక్క పది నిముషాలే” అనుకుంటూ మళ్ళీ రొజాయిలోకి దూరేను. తిరిగి నిద్రలోకి జారుకోబోతూ “ఇంక లాభం లేదు” అని బద్ధకంగా రొజాయి తొలిగించి, కిందనున్న జోళ్ళలోకి పాదాలు దూర్చేను. పక్కనున్న శాలువ కప్పుకుని లేచి అటువైపు చూస్తే, ఎప్పటిలాగే నిండా ముసుగు పెట్టుకుని మనిషి ఆకారం కనపడ్డమే తప్ప అసలు మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా బిగదీసుకుని పడుక్కున్నాడు మోహన్. తన వైపు తిరిగి తలమీదనున్న రొజాయిని పూర్తిగా తప్పించకుండా, కనిపించిన చెవిమీదే చిన్నగా ముద్దు పెట్టి బాత్రూమోకి దూరి గీసర్ వేసేను.

వంటింట్లోకి వెళ్ళి, ఒక కప్పులో నీళ్ళు పోసి, మైక్రోవేవ్లో పెట్టి, పిల్లల గదిలోకి నడిచేను. డిసెంబర్ చలికి ముడుచుకుని, మొత్తం శరీరం రొజాయిలోకి దూర్చి నిద్రపోతోంది ఎనిమిదేళ్ళ పియా. దానికి వ్యతిరేకంగా సగం పాదాలూ, వేళ్ళ చివర్లూ, కొంచం మొహమూ బయటకి పెట్టి పడుక్కుంది ఆరేళ్ళ రియా. ఇద్దరినీ కనిపించిన చోటల్లా చిన్న చిన్న ముద్దులు పెట్టుకుని, రొజాయి సరిగ్గా సర్ది, బయటకి వచ్చేను. వేడినీళ్ళ కప్పుని బయటకి తీసి దాన్లో ఒక టీ బాగ్ పడేసి, నిమ్మకాయ కోసి రెండు చుక్కలు పిండి, నడవాలో ఉన్న వార్డ్‌రోబ్లో రాత్రే హాంగర్ మీద పెట్టుకున్న యూనిఫార్మ్ తీసి పక్కనున్న కుర్చీ మీద వేసేను.

స్నానం చేసి, తయారయి, బేగ్ భుజానికి తగిలించుకున్నాను. మళ్ళీ రెండు పడకగదుల్లోకీ తొంగి చూసి, ముందు గదిలో పడుక్కున్న 35 ఏళ్ళ పనమ్మాయి ప్రమీల అలార్మ్‌ సరిగ్గా ఉందో లేదో చూసేను. మరి తను ముందు లేచి మిగతా వాళ్ళని లేపకపోతే ఇంకంతే సంగతి. ముందు తలుపు మెల్లిగా తెరిచి బయటకి వచ్చి శబ్దం కాకుండా మూసి, తాళం పడిందని నిర్ధారించుకుని కిందకి నడిచేను. చల్లగా, తడిగా ఉన్న కారు హాండిల్‌ తెరిచి, లోపల కూలబడి ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చేటప్పటికి టైమ్ తెల్లవారున 4. 15. శీతాకాలపు ప్రాతఃకాలం అర్థరాత్రిలా అనిపిస్తోంది. ట్రాఫిక్ కానీ రెడ్ లైట్లు కానీ లేకపోవడంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ కేటాయించిన ఎంప్లోయీస్ పార్కింగ్ లాట్లోకి ప్రవేశించేసరికి, షిఫ్ట్ టైమ్ అయిన 5 గంటలు అవడానికి ఇంకా 20 నిముషాలుంది. వెనక సీట్ మీద నిన్న పడేసిన ఆఫీస్ ఓవర్ కోట్ని తొడుక్కుంటూ, బాగ్ ఒక చేతిలోకి తీసుకుని ఇంకొక చేత్తో కార్ తాళం వేసి బయటకి వచ్చేను. రెండు కార్లవతల ఆదిత్యా సేన్‌గుప్తా తన కార్లోంచి బయటకి వచ్చి కార్ లాక్ చేస్తూ కనపడ్డాడు. వడివడిగా నన్ను చూడనట్టు తల తిప్పుకుని అవతలివైపునుంచి టర్మినల్ గేటువైపు దారి తీస్తున్నాడు.

ఎప్పటి సేన్‌గుప్తా! ఎలాంటి జ్ఞాపకాలు! అతనితో సంబంధం తెగి పదేళ్ళ పైన అయింది. కానీ నా ఈ జ్ఞాపకాలమీద హక్కు నాది కానట్టుగా, ఆ జ్ఞాపకాలు ఇంకెవరివో అన్నట్టు అనిపిస్తోందెందుకో!
********

టర్మినల్ వైపు నడుస్తూ బాగ్‌లోంచి ఐడెంటిటీ కార్డ్ ఉన్న గొలుసు తీసి మెళ్ళో వేసుకుని వాష్ రూమ్లోకి నడిచేను. మేకప్ కిట్ తీసి యాంత్రికంగా అయిదు నిముషాల్లో మేకప్ వేసుకోవడం పూర్తి చేసి, జుట్టు దువ్వుకుని డ్యూటీ అలాట్మెంట్ గదిలోకి నడిచేను. అప్పటికే డ్యూటీకి రిపోర్ట్ చేసిన అసిస్టెంట్ మేనేజర్లు గదిలో ఉన్నారు. డ్యూటీ షీట్ మీద డ్యూటీస్ రాసి, లోడర్ తెచ్చిచ్చిన టీ తాగుతూ ఉంటే, వద్దనుకున్నా మనస్సు గతంలోకి జారిపోయింది. సీట్ దొరకని పాసెంజర్ల రణగొణ ధ్వని మొదలవడానికి ఇంకా గంటైనా పడుతుంది.

ట్రైనింగ్ అయిన తరువాత డైరెక్ట్ రిక్రూటీగా చేరిన కొత్తల్లో నా పోస్టింగ్ -అసిస్టెంట్ మేనేజర్‌గా(కమర్షియల్ డిపార్ట్‌మెంట్‌), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ -1ఏ లో అయింది. ట్రైనింగ్ తరువాత రెగ్యులర్ డ్యూటీస్ చేయడానికి అనుభవం లేకపోవడం వల్ల ఒక వారమో, పది రోజులో ఏ సూపర్వైసర్ పక్కనో ఉండి గమనిస్తూ, ఆ సూపర్వైసర్కి అనధికారమైన సహాయకురాలిగా పని చేస్తే కానీ ట్రైనింగ్లో నేర్చుకున్న విషయాలు ప్రాక్టికల్గా చేయడం కుదరదు. మరి అది నా అదృష్టమో దురదృష్టమో ఈ నాటికీ అర్థం కాలేదు కానీ అప్పుడు ఆ మొదటి రోజు సూపర్వైసర్ ఆదిత్యా సేన్‌గుప్తాయే. అది కూడా ఆరోజుల్లో అంతగా రద్దీ లేని ఎరైవల్ హాల్లో. అప్పటికి నాకు ముఖాలు కొత్త. పేర్లు కొత్త. ఎవరే రేంకో తెలిసేది కాదు. మరీ ముఖ్యంగా స్త్రీలయితే-ఒకే రంగు యూనిఫార్మ్ చీరలు. మగ కొలీగ్స్ అయితే కనీసం వాళ్ళ చొక్కాల భుజాలమీద తగిలించుకునే ఎపలెట్స్ బట్టి వాళ్ళు సీనియర్లో, జూనియర్లో అని ఊహించగలిగేదాన్ని.
అతని వెంబడే ఉండి అతను పాసెంజెర్లతో ఎలా డీల్ చేస్తున్నాడో అని గమనిస్తూ, కొంతసేపటి తరువాత “ అనవసరంగా పనికి అడ్డం పడుతున్నానేమోన్న” సంకోచంతో, అడపాతడపా వినిపిస్తున్న అనౌన్స్‌మెంట్లని వింటూ, కన్వేయర్ బెల్టుల కదలికలని గమనిస్తూ, బిడియంగా, అలవాటు లేని చీరతో తాజ్ కౌంటర్‌కి ఎదురుగా నిలుచున్నాను.

చేతిలో ఉన్న వాకీ టాకీతో నాదగ్గిరకి వచ్చి, నా మెడనుంచి వేలాడుతున్న ఐడెంటిటీ కార్డ్‌ని పరికించి చూసి. “ఇంకొక అరగంట ఎరైవల్ ఏదీ లేదు. టీ తాగుదామా?” అన్న సేన్‌గుప్తాని చూసి “హమ్మయ్యా, ఇలా బొమ్మలా నిలుచోవడం తప్పింది” అనుకుంటూ తలూపేను. టీ తాగుతున్నప్పుడు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్న చూపులని తప్పించుకుందామని అనిపించలేదు. అతన్నే చూస్తుండిపోయేను. వెడల్పాటి భుజాలు. సన్నటి కళ్ళజోడు ఫ్రేముతో, బెంగాలీలకున్న చక్కటి చర్మంతో మృదువుగా మాట్లాడుతున్నాడతను. “మాట్లాడేటప్పుడు చేతులు తిప్పడం అలవాటనుకుంటాను. బెంగాలీ యాస లేదు. ఢిల్లీలోనే చిన్నప్పటినుండీ ఉండడం వల్ల హిందీ అంత బాగా మాట్లాడుతున్నాడా? కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాత్రం భాష ధారాళంగా లేదే! రెయిసీనా బెంగాలీ స్కూల్లో చదువుకుని ఉంటాడు. ” నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. కొంతసేపటి తరువాత అప్పటి ఎరైవల్స్ అయిపోయేయి. ఫ్లైట్ బోర్డ్ చూస్తే గంట టైముంది తరువాత ఫ్లైటుకి. గ్లాస్ తలుపుల అవతలనుంచి అప్పుడే పైకొస్తున్న సూర్యుడు ‘రారమ్మంటూ’ పిలుస్తున్నాడు.
“ఎండ పైకొచ్చింది. టార్మాక్ మీద చిన్న వాక్ చేసి వద్దామా”? అన్న అతని ప్రశ్నకి తలూపి నేనూ అతనితోపాటు బయటకి నడిచేను.

మొత్తం చదువు కో-ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్‌లోనే సాగింది. అయినా అతడంటే ఏదో వింతయిన ఆకర్షణ మొదటి రోజే !

“ఊ, మీ గురించి చెప్పండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఏ కాలేజీలో చదివేరు?-అతను
“నేనూ మా అమ్మగారూ- అంతే. హిందూ కాలేజ్, తరువాత ఐఐఎమ్-అహమెదాబాద్. “-నేను.

“బోయ్ ఫ్రెండెవరూ లేరా? బయటకి వెళ్తూ ఉంటారా? డైరెక్ట్ రిక్రూటీగా చేరేరే! సిఫారసు ఉందా ఏమిటి?
‘ప్రశ్నల పరంపర.’ ఆఖరి ప్రశ్న ఇంకెవరైనా కనుక వేసుంటే “ ఏం?నాకేమైనా చదువు తక్కువా, తెలివి లేదా సిఫారసు కావడానికి “ అంటూ విరుచుకు పడి ఉండేదాన్ని.

అతని గురించి ఏ ప్రశ్నా వేయాలని కూడా తోచలేదు నాకు. అయినా అతనే తన గురించి చెప్పుకుంటూ పోయేడు.

“భార్య తన్ని అర్థం చేసుకోదు( బంధువుల్లో తప్ప పెళ్ళయిన మగవాళ్ళు పరిచయం లేకపోవడంతో ఈ క్లాసిక్ లైన్ నా మట్టి బుర్రకి తట్టలేదప్పుడు). ఆవిడ సెంట్రల్ గవర్న్‌మెంట్ ఉద్యోగి. ఎప్పుడు చూసినా తన పుట్టిల్లూ, తన పిల్లలూ, తన ఉద్యోగం, తన షాపింగ్ అవీ తప్ప ఇతనికోసం సమయం కేటాయించదు. ఇద్దరికీ పడదు. ఎప్పుడూ పోట్లాటలే. ఇద్దరు పిల్లలు. ఇల్లు చిత్తరంజన్ పార్క్ అనబడే ఇపిడిపి (East Pakistan Displaced Persons Colony) కోలొనీలో.”
“ఖాళీ సమయంలో ఏమిటి చేస్తారు?” వింటూ, ఆలోచనల్లో ములిగిపోయిన నేను ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.

“పుస్తకాలు చదువుతాను” –అసంకల్పితంగా.
అదేదో జోక్ అన్నట్టు అతను పగలబడి నవ్వేడు.
“మీరు పుస్తకాలు చదవరా?” అయోమయంగా అడిగిన నేను.
“అంత టైమెక్కడా వేస్ట్ చేసుకోడానికి?”
బెంగాలీ వాళ్ళకి సాహిత్యమన్నా, లలిత కళలన్నా ప్రాణం అన్న లేమాన్ అభిప్రాయం మాత్రం నాకుండేది. దానికి నా బెంగాలీ క్లాస్‌మేట్స్ కూడా దోహదపడ్డారు. ఆటల్లో తప్ప అన్నిట్లో సామాన్యంగా వాళ్ళే ముందుండేవారు. పుస్తకాలు చదవడం అలవాటులేని బెంగాలీయా! సామాన్యంగా అయితే అదొక అనర్హత నా దృష్టిలో. కానీ అతనికి అనర్హత అన్న మాటని ఆపాదించడానికి ఎందుకోకానీ మనసొప్పలేదు.
ఇలా పిచ్చాపాటీ మాట్లాడుతూ తిరిగి టర్మినల్ బిల్డింగ్ వైపు నడుస్తున్నప్పుడు అతను నాకు దగ్గిరగా జరిగేడు. కొద్ది నిముషాల్లో నా కుడి చెయ్యి అతని చేతిలో ఇరుక్కుని ఉంది. అభ్యంతరం అనిపించలేదు. టర్మినల్ బిల్డింగ్ సమీపిస్తుండగా నా చేతిని వదిలి దూరం జరిగేడు.

***

అన్నట్టు ఇంత ఉపోద్ఘాతమూ చెప్తూ, నా గురించి మాత్రం చెప్పలేదు కదూ! నా పేరు మోహన. మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయేరు. అమ్మ బాంక్ ఉద్యోగిని. ఒక్కర్తే నన్ను పెంచింది. తల్లితండ్రులు పెట్టిన నా పేరు తనకి నచ్చలేదని నిరూపించాలనుకున్నాడేమో దేవుడు! చిన్నప్పుడు వచ్చిన చికెన్ పాక్స్ నా ముఖంమీద చిన్న గుంటలని వదిలింది.

వంశపారంపర్యంగా లేని పొట్టితనాన్ని ఎక్కడినుండి కొని తెచ్చుకున్నానో కానీ నా ఎత్తు అయిదడుగులు మాత్రమే. పోనీ సన్నగా, నాజూగ్గా ఉంటానా అంటే గుమ్మటం అనడానికి లేదు కానీ ఆ లెక్కే. దానివల్ల చదువులో అయితే ముందుండేదాన్ని కానీ నాతో చదువుకునేవారితో బయటకి వెళ్ళడాలూ అవీ తక్కువే. నా క్లాస్‌మేట్స్‌కి నా రూపురేఖల గురించి పట్టింపుండేది కాదు. కానీ ఎక్కడికయినా తిరగడానికి వెళ్దామంటే నేనే ఒక విధమైన న్యూనతాభావంతో “ఈ సారికి మీరెళ్ళి రండి. మరోసారి వస్తాను” అనేదాన్ని. నా క్లాస్‌మేట్సయిన అబ్బాయిలు నన్ను తమలో ఒకదానిగా భావించేవారే తప్ప నన్ను ఒక అమ్మాయిగా జమకట్టేవారే కారు. అయితే వాళ్ళ దయవల్ల అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో అని మాత్రం బాగానే నేర్చుకున్నాను. కానీ బోయ్‌ఫ్రెండ్స్‌ ఎక్కడినుంచి వస్తారు?
అది నా మొదటి మార్నింగ్ షిఫ్ట్. ఆదిత్య ఆ షిఫ్ట్ తప్ప వేరేదేదైనా సరే, తప్పించుకునేవాడు. ఆ తరువాత ఏదో మధ్యమధ్యలో తప్ప ఒక సంవత్సరం పొడుగూ నేనూ అర్లీ మార్నింగ్ షిఫ్ట్ తప్ప ఇంకేదీ చేసేదాన్ని కాదు. కొన్నిసార్లు డ్యూటీ పూర్తి అయేక దూరంగా ఉన్న ఏ హొటెల్లోనో గది తీసుకోవడం, తిరిగి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఆ హోటెల్ జ్ఞాపకాలు మధురమైన స్మృతులుగా మాత్రం మారలేకపోయేయి.
న్యూస్ పేపర్లే సరిగ్గా చదవని అతనితో మాట్లాడ్డానికి శ్రమపడవలిసి వచ్చేది. తను చూసే టివి సీరియళ్ళన్నిటి గురించీ మాట్లాడే మాటలు మాత్రం వినేదాన్ని. స్టార్ డస్ట్, ఫిల్మ్ ఫేర్ లాంటి పత్రికల్లో వచ్చే గాసిప్ కాలమ్స్ గురించి మాట్లాడటం నేర్చుకోవడానికి ప్రయత్నించేను. నేను చదివే పుస్తకాల గురించి ఎప్పుడైనా చెప్పబోతే “ అబ్బా అవన్నీ ముసలితనంలో పనికొస్తాయిగా! ఈ వయస్సులో అంత పెద్ద సంగతుల గురించెందుకు?” అని విసుక్కునేవాడు. “ఈ దారి నీ నాశనానికే సుమా” అని హెచ్చరిస్తున్న అంతరాత్మని నేను లక్ష్యపెడితే కదా! ఎలిజిబిల్ బాచిలర్స్ అందరూ అతని ముందు దిగదుడుపే నా దృష్టిలో. కొంతకాలం తరువాత ఆ హోటెలూ అవీ కూడా తగ్గిపోయేయి. కళ్ళకి తొడుక్కున్న రంగుటద్దాలు కాస్తా మెల్లిమెల్లిగా రంగు కోల్పోయి, తేటపడటం మొదలుపెట్టేయి. కానీ అలవాటయిన జాడ్యం ఒక పట్టాన్న వదలదే!

ఒక సాయంత్రం నాకెప్పటిలాగే అతనితో మాట్లాడాలనిపించింది. మొబైళ్ళ కాలం కాదది. గతంలో అతను పదేపదే చెప్పిన జాగ్రత్తలనీ, చేసిన హెచ్చరికలనీ మరిచిపోయి ఒక సాయంత్రం అతనింటికి ఫోన్ చేసేను. ముందెవరో పిల్లల కంఠం ఆ తరువాత ఒక స్త్రీ గొంతూ వినిపించేయి. అతని గొంతు వినిపించేవరకూ ఎవరు ఫోనెత్తినా ఏదీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తూనే ఉన్నాను. ఆఖరికి అతనే ఎత్తేడు కానీ కోపంగా, లోగొంతుతో ‘తనకి ఇష్టం లేకపోయినా భార్య తల్లీ తండ్రీ వచ్చేరని’ చెప్పి “ఇలా ఫోన్ చేయడానికి ముంచుకు పడిపోయిన కారణాలేమైనా ఉన్నాయా?” అని కూడా అడిగేడు.

chinnakatha

ఏదో తప్పు చేసినట్టు తడబడుతూ ఉన్న నా గొంతు పెగిలేలోగానే బాక్‌గ్రౌండ్లో అతని భార్య గొంతు వినిపించింది. భర్తంటే ఇష్టం లేకపోయిన ఆమె అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతోంది. మౌత్ పీస్ అరిచేత్తో మూసినట్టున్నాడు. అంత స్పష్టంగా వినపడలేదు కానీ బెంగాలీలో ఆమెతో గారాబంగా ఏదో అంటున్నాడు. ఫోన్ ఏ చెక్కబల్ల మీదో పెట్టిన శబ్దం అయింది. ఇప్పుడు నవ్వులూ, కేరింతలూ అన్నీ గట్టిగా వినిపిస్తున్నాయి. అతను నాకు చెప్పిన కథకి పూర్తి వ్యతిరేకంగా ఉంది అక్కడి పరిస్థితి. “షోనా”, “ధన్” అన్న పిలుపులతో నా చెవులకి చిల్లులు పడి, కంపరం పుడుతున్నా కానీ కొత్తగా నేర్చుకున్న మిడిమిడి బెంగాలీ జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఫోన్ నా చెవి దగ్గిరే పెట్టుకుని వింటున్నాను. కొంత సేపటి తరువాత అతనికి గుర్తొచ్చింది కాబోలు తను ఫోన్ కింద పెట్టి అవతలికి వెళ్ళిపోయేడని. ఫోనెత్తి “ ఇంకా ఇక్కడే ఉన్నావా” అన్న అర్థం వచ్చే ఛీత్కారంలాంటిది చేసి ఠాక్కుమంటూ పెట్టేసేడు.

మా ఇద్దరి సంగతీ ఎయిర్ పోర్టులో మొదటే బయటపడింది. డెస్క్ జాబ్స్ కావు కాబట్టి ఎవరూ వెనక ఎంత గుసగుసలాడుకున్నా కానీ మా ముందు మాత్రం బయటపడేవారు కాదు.

మర్నాడు అతను సెలవు పెట్టేడు. ఆ మర్నాడు అతను నాకు ముందుగానే డ్యూటీకి రిపోర్ట్ చేసేడు. నేనింక ట్రైనీని కాను కాబట్టి నా డ్యూటీ అలాట్ చేసేదొకరు, అతని డ్యూటీ వేసేదింకొకరు. మా ఇద్దరి సంగతి తెలిసినప్పటినుంచీ వీలయినంతవరకూ మేమిద్దరం ముందే ఆలోచించుకుని ఒక చోటే డ్యూటీ వేయించుకునేవాళ్ళం. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా- నేనిప్పుడు అతనికి సుపీరియర్ని. నేనదంత పట్టించుకోలేదు కానీ అతనికి మాత్రం అది పెద్ద సమస్యగా మారిందని త్వరలోనే అర్థం అవడం మొదలయింది. నాతో పాటు డ్యూటీ పడినప్పుడు అతను తన పనిని కావాలని నిర్లక్ష్యం చేయడం, పేసెంజెర్ల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు మాయం అవడం ప్రారంభించేడు. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పాటించడం నామోషీగా అనిపించేది. కొత్తగా అసిస్టెంట్లుగా చేరిన అమ్మాయిల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం, వాళ్ళతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడటం- అది అతని అసలు స్వభావం అని అర్థం అయితే అయింది కానీ నాకు నేను ఎంత మట్టుకు నచ్చచెప్పుకున్నా, అసూయ మాత్రం పుట్టుకు వచ్చేది.

ఆ రోజు మాత్రం డిపార్చర్ హాల్ కిటకిటలాడుతున్నప్పుడు, అలవాటు కొద్దీ ఆదిత్య తన డ్యూటీ పోయింట్‌ని పట్టించుకోకుండా ఇద్దరమ్మాయిలతో కూర్చుని టీ తాగుతున్నాడు. అది చూసిన ఒక పాసెంజర్ అతన్నేవో వ్యంగ్యమైన మాటలని అని, నాదగ్గిరకి వచ్చి ‘కంప్లైంట్ బుక్ ఇస్తే అతని మీద కంప్లైంట్ రాసిస్తానని’ చెప్పేడు. ఎంత నచ్చచెప్పినా వినకపోతే విధి లేక అతనికి కంప్లైంట్ బుక్ అందించేను. సామాన్యంగా పేసెంజెర్లెవరైనా ఎన్ని మాటలన్నా కానీ లిఖితపూర్వకమైన ఫిర్యాదు వస్తే మాత్రం ఎయిర్‌పోర్ట్ మానేజర్ దానిమీద తప్పక ఏక్షన్ తీసుకుంటారు. అప్పటికే తన ఇంటికి ఫోన్ చేసినందుకు పోట్లాట పెట్టుకోడానికి నెపం వెతుకుతున్న ఆదిత్య ఈ సంఘటనతో నిగ్రహం కోల్పోయి, పేసెంజర్లు లేని ఖాళీ సమయం చూసి నా దగ్గిరకి వచ్చి కొట్టినట్టుగా అరుస్తూ మాట్లాడేడు. ఊహించని ఈ పరిణామానికి నేను ఒక్క మాటా మాట్లాడలేకపోయి వాష్ రూమ్లోకి నడిచేను. వాష్ రూమ్ అటెండెంట్లిద్దరు జరిగినది లోపలనుంచి తొంగి చూసినట్టున్నారు. నేను లోపలకి అడుగు పెట్టగానే మాట్లాడుకుంటున్నవాళ్ళు కాస్తా మౌనంగా పనులు కలిపించుకుని బిసీ అయిపోయేరు.

పట్టుమని ఒక వారం కాలేదు. మధ్య ముప్పైల్లో ఉన్న ‘అందమైనదే’ అనిపించే ఒకావిడ ఒక ఆదివారం విసిటర్స్ పాస్ తీసుకుని నావైపొచ్చింది. పరిచయం ఉన్న మొహంలా కనిపించింది తప్ప ఆదిత్య వాలట్లో ఆమె ఫోటో చూసేనన్న సంగతే గుర్తుకి రాలేదు. ఆమె వచ్చీ రావడంతోనే గొంతు పెద్దది చేసి “నా భర్తే కావలిసి వచ్చేడా నీకు?అంతా చెప్పేడులే నా ప్రియతొమ్. అయినా గంతకి తగ్గ బొంత అని నీలాంటి కురూపినే ఇంకెవడినో పట్టుకోక నా సంసారమే నాశనం చేయాలనిపించిందా? ఇకనుండీ అతని వెనక పడటం మానకపోతే, మీ డైరెక్టర్కి రిపోర్ట్ చేస్తా చూసుకో. ఏమనుకున్నావో! “ అంటూ ఎలా రుసరుసమంటూ వచ్చిందో అలాగే బయటకి నడిచింది. చుట్టూ జాలిగా చూస్తున్న చూపులని, హేళనగా పెట్టిన మొహాలని, లోలోపల నవ్వుకుంటున్నవారినీ తప్పించుకుంటూ ఎర్రపడిన ముఖం( తెల్ల చర్మం ఒక్కటే నాకు వారసత్వంగా వచ్చినది)తో, కళ్ళలోనుంచి ఉబికి వస్తున్న నీటిని అదుపులో పెట్టుకుంటూ మళ్ళీ తిరిగి వాష్ రూమ్లోకి దూరేను.

ఆ రోజునుంచీ నేనే అతని డ్యూటీ ఎక్కడో చూసేక, అతనికి దూరంగా ఎక్కడో డ్యూటీ ఎంచుకునేదాన్ని.

మరుసటి నెల రోస్టర్లో నేను మధ్యాహ్నం షిఫ్ట్‌ కోసమూ దానితోపాటు టర్మినల్ బదిలీ కోసం కూడా అప్లై చేసేను. రెండూ మారేయి.

***

టర్మినల్ 2 లో నా గతాన్ని వెనక్కి నెట్టి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించడం ప్రారంభించినప్పుడు కానీ నా క్రిత ఒకటిన్నర ఏళ్ళనీ ఆదిత్యతో తప్ప మిగతా ఏ స్నేహాలూ, బంధాలూ ఏర్పరచుకోకుండా వ్యర్థం చేసేనని గుర్తించలేకపోయేను. మెల్లిమెల్లిగా స్నేహితులంటూ ఏర్పడటం ప్రారంభించేరు. అప్పుడే నా పరిచయం మోహన్తో అయింది. సాయంత్రం డ్యూటీలో డిపార్చర్స్‌ టర్మినల్లో రాత్రివేళ ఖాళీగా ఉన్న కొంతమందిమి కలిపి భోజనం చేసేవాళ్ళమి. మోహన్ గొంతు బాగుండేది. అడగడమే ఆలస్యం, పాట ఎత్తుకునేవాడు.

అతనికి ఇష్టమైన సింగర్ మొహమ్మద్ రఫీ. పాట పాడేటప్పుడు నావైపు చూస్తూ పాడేవాడు. నన్నే ఉద్దేశ్యించి పాడుతున్నట్టుగా అనిపించేది. అది నిజమేనని తెలియడానికి ఎక్కువకాలం పట్టలేదు. మోహన్ కూడా డైరెక్ట్ రిక్రూటీయే. నాకన్నా కొంచం సీనియర్ . జిమ్‌కి వెళ్ళడం లేకపోతే రోజుకి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడవడం అలవాటు. వత్తైన జుట్టు. కళ్ళజోడు. తల్లి తామిలియన్, తండ్త్రి తెలుగు. తన కన్నా రెండేళ్ళు చిన్నదైన చెల్లెలు సంగీతకి పెళ్ళయిపోయింది. మోహన్‌కి పుస్తకాల పిచ్చి. స్పందన అతనినుండే ప్రారంభం అవడం వల్ల అతనికి చేరువు కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఎయిర్‌పోర్టులో ఎవరి వ్యవహారాలూ రహస్యం కాకపోవడం వల్ల అతనినుండి దాగినదేదీ లేదు. అతనితో పెరుగుతున్న స్నేహంతో కూడిన సాన్నిహిత్యం నన్ను స్థిమితపరుస్తూ, నాకు సాంత్వన కలగజేస్తోంది. కానీ అది ఆదిత్యతో నాకు ముందుండే సంబంధంలో ఉన్న లోపాలనీ, దాని పునాది లేమినీ, మాకిద్దరి మధ్యా ఉన్న అసమానతనీ, అ అర్థరహితమైన సంబంధం ప్రారంభం అవడానికి గల నా బలహీనతకీ కూడా ఎత్తి చూపించడం ప్రారంభించింది.

ఆ తరువాత ఆరు నెల్లకే మోహన్తో నా పెళ్ళి జరిగింది. పెళ్ళికి వచ్చిన కొలీగ్సందరూ సంతోషపడ్డారు. ఆదిత్యని పిలవలేదు. మోహన్ తల్లీ, తండ్రీ ఎయిర్ పోర్టుకి దూరంగా ఉండటం వల్ల మేమిద్దరం అప్లికేషన్ పెట్టి ఎయిర్లైన్స్ కోలొనీలో ముందు రెండేళ్ళూ ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఆ తరువాత లోన్ తీసుకుని ఇప్పుడున్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాం.

ఇప్పుడు నేను తెల్లవారు షిఫ్టూ, తను మధ్యాహ్నం. పిల్లలకి దగ్గిరగా 24 గంటలూ తల్లో తండ్రో ఒకరైనా ఉండాలన్న మోహన్ ప్రతిపాదన నచ్చింది నాకు. నిద్ర లేమి ఇద్దరికీ. కానీ ఒకరికోసం మరొకరం, పిల్లలకోసం తపన పడటం ఆహ్లాదం కలిగిస్తోంది. నాకంటూ ఒక చిన్న లోకం ఏర్పడింది. అదంటే నాకు మక్కువ.

ఆ రోజుల ఉద్రిక్తతా, ఏడుపులూ, మొర్రలూ, అభద్రతాభావం, బెదిరింపులూ ఏవీ లేవిప్పుడు. మోహన్ కోసం తన భార్యతో పోట్లాడాలేమో అనే భయం లేదు. ఎవరో వచ్చి నన్ను బెదిరిస్తారేమో అనుకోనక్కరలేదు. ఈ సంసారం, ఈ మనిషీ నా స్వంతం. అరువు తెచ్చుకున్నదేదీ/ఎవరూ లేరు. నా ఆడపడుచుకీ అత్తమామలకీ నేనంటే ఎంతో అభిమానం. చాటుమాటు వ్యవహారాలు లేవు. ఎక్కడికి వెళ్తే ఎవరు గుర్తు పడతారో అన్న జడుపు లేదు. అప్పటి చీకటి బతుక్కీ దీనికీ ఎంత తేడా!

***
“మాడమ్ లక్నో పాసెంజెర్లు ఫ్లైట్ లేటయిందని గొడవ పెడుతున్నారు” అన్న అసిస్టెంట్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. వెళ్ళి చూస్తే అక్కడ సేన్‌గుప్తా పేసెంజెర్లని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.

“ ఓహో, ఇక్కడ పోస్టింగ్ అయిందా! మరి జాయినింగ్ రిపోర్ట్ ఎక్కడిచ్చేడో! బదిలీల అధ్యాయం మళ్ళీ మొదలయిందన్న మాట!” అనుకుంటూ అటువైపు నడుస్తుండగా, “ ఏమిటయ్యా, పని రాదా? ఫ్లైట్ ఆలస్యం అవడానికి కారణం అడిగితే ఇదా సమాధానం?” అంటూ అరుస్తున్న బిగ్గర గొంతులు వినిపించేయి. అనుకోకుండా అతని వైపు చూస్తే అతని కళ్ళలో ఎర్రజీరలు. మనిషి పొట్టి, దానికి తోడు ముందుకి పొడుచుకుని వచ్చిన పొట్ట మీద నీలం రంగు యూనిఫార్మ్ టై కాస్తా అతను కదిలినప్పుడల్లా పొట్టమీద ఉండనని మారాం చేస్తూ ఇటూ అటూ ఊగిసలాడుతోంది. పదేళ్ళ కింద ఉన్న పలచని జుట్టు నున్నని బట్టతలగా మారినట్టుంది. ఎన్ని మార్పులు! అయిదేళ్ళయి ఉండదూ ఈ మనిషిని చూసి! తనకొక చోట పోస్టింగ్ అయితే నాకు వేరే చోట కావాలని నేనడగడం, అలాగే తనూ-ఇద్దరం ఒకరినొకరు తప్పించుకుంటూ, ఒకే సంస్థలో పని చేస్తున్నా కానీ ఒకరికొకరం ఎదురుపడలేదీ మధ్య.

ఈ మధ్య రతి అన్న ఎవరో కొత్తమ్మాయితో ఈ యాబై ఏళ్ళ మనిషి తిరుగుతున్నాడని విన్నాను. చిన్న నిట్టూర్పు విడిచి పాసెంజెర్ల మధ్యకి నడిచి నన్ను నేను సీనియర్ మేనేజర్గా పరిచయం చేసుకుని, ఫ్లైట్ స్థితిని వివరించడం ప్రారంభించేను. వెనక్కి చూస్తే ఆదిత్య లేడక్కడ.

మొబైల్లో మోహన్ నుంచి ఫోన్ “ రేపు నీకూ సెలవేగా! అమ్మావాళ్ళింటికి పిల్లలని తీసుకుని వెళ్దామా? అమ్మ అడుగుతోంది చాలా రోజలయింది కలుసుకుని- అని. సంగీత కూడా వస్తోందిట తన పిల్లల్ని తీసుకుని.” ‘ హమ్మయ్యా. నా జీవితం, నా సంసారం, నా వర్తమానం నన్ను పిలుస్తున్నాయి. గతమా, నన్ను క్షమించేవు. అది చాలు నాకు. దయచేసి ఇంక గుర్తు రాకు సుమా.’”

-కృష్ణ వేణి

 

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్  –  కొప్పర్తి

నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? —- రూమీ

కవిత్వంలో రక్తం అనేది ఎక్కువగా యుద్దానికి, ప్రమాదానికి, ఉద్రేకానికి, భీభత్సానికి,  ధైర్యానికి ప్రతీకగా ఉంటుంది.  కన్నీరు దుఃఖం, వేదన, ప్రేమ, ఉప్పొంగే ఆనందం, కృతజ్ఞతలను సూచిస్తుంది.   పైనున్న రూమీ వాక్యంలో రక్తకన్నీరు అనే పదబంధంలో,  నేత్రాలు పోవటం అనే భీభత్సం, ప్రేయసి ఎడబాటు యొక్క వేదన ఏకకాలంలో ఇమిడిపోవటం చూడొచ్చు.  “గతమంతా తడిచె రక్తమున కాకుంటె కన్నీళ్ళులతో”….. అన్న శ్రీశ్రీ వాక్యంలో  రక్తమంటే యుద్ధాలనీ, కన్నీళ్ళు దాని తాలూకు దుఃఖమనీ అర్ధం చెప్పుకోవచ్చు.

59740_566066773423516_1763463627_n

రక్తం, కన్నీళ్లను పోలుస్తూ కొప్పర్తి వ్రాసిన “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” అనే కవిత,  రక్తం కన్నా కన్నీరే ఉత్కృష్టమైనదని ప్రతిపాదిస్తుంది.  రక్తమనేది మనిషి అస్థిత్వానికే తప్ప మనిషితనానికి చిరునామా కాదని, కన్నీళ్ళే మనిషిని మనిషిగా నిరూపిస్తాయని ఈ కవిత చెపుతుంది.  లోతైన తాత్వికత, మంచి శిల్పం, తర్కం నిండిన ఈ కవితను చదివినపుడు గొప్ప పఠనానుభూతి కలుగుతుంది.  ఆలోచనలు విస్తరిస్తాయి.

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి//…… అంటూ మొదలయ్యే కవితావాక్యాలు కవిత సారాంశాన్నంతా ముందే చెప్పేస్తాయి.

 

ఇక మొగ్గ ఒక్కొక్క రేకు విచ్చుకొన్నట్లుగా ఒక్కో వాక్యం, తేటగా, ఏ శషభిషలు లేకుండా  కవితా వస్తువును ఆవిష్కరిస్తాయి.  మెట్లు మెట్లుగా అనుభూతి శిఖరం వైపు నడిపిస్తాయి.

ఈ కవితను మూడు భాగాలుగా విభజిస్తే, మొదటి భాగంలో రక్తం ఏ ఏ సందర్భాలలో చిందించబడతాయో చెపుతాడు కవి,  రెండవ భాగంలో కన్నీళ్ళు ఏ ఏ సమయాల్లో చిప్పిల్లుతాయో చెపుతాడు, మూడవ భాగంలో రక్తం కన్నీళ్ళకంటే ఎందుకు గొప్పదో ముక్తాయిస్తాడు. మంచి ఎత్తుగడ, తార్కికంగా సాగే నడక, ఆలోచనాత్మక ముగింపులతో ఉండే కొప్పర్తి కవితలు తెలుగుసాహిత్యంలో  ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఈ కవిత మినహాయింపేమీ కాదు.

రక్తాన్నెక్కించగలరు కానీ

కన్నీళ్ళనెవరైనా ఎక్కించగలరా…… అనే ప్రశ్నతో ముగుస్తుందీ కవిత.  నిజమే కదా రక్తంతో ముడిపడిన సందర్భాలన్నీ దాదాపు బయటనుంచి వచ్చేవే, కానీ కన్నీటి సమయాల్ని మాత్రం ఎవరికి వారు తోడుకోవాల్సిందే.  అందుకనే  ఒకచోట “మనలోంచి మనం తవ్వుకొనే తెల్లటి మణులు కన్నీళ్ళు” అంటాడు కొప్పర్తి.

 

 -బొల్లోజు బాబా

 

 

కెమిష్ట్రీ ఆఫ్‌ టియర్స్‌ (“యాభై ఏళ్ళ వాన” సంకలనం నుండి)

 

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌

నిజమే కావచ్చు

బట్‌ నాట్‌ థిక్కర్‌ దేన్‌ టియర్స్‌

 

సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు

రక్తం ఉబుకుతుంది

రక్తం ఉరలుతుంది

కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది

రక్తం కళ్లచూడాలంటే

రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌

ఏదో ఒకటి ప్రయోగింపబడాలి

 

అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో

అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు

నిజమే రక్తం మనందరినీ ఒకటి చేసింది

ఒకే గొడుగు కిందకు తెచ్చింది

 

అందరిలోను ఒకే రక్తం ప్రవహిస్తోంది

ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది

అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం

నియంతను నరికినా అదే రక్తం

తెల్లవాణ్ణి నల్లవాణ్ణి

డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి

మంచివాణ్ణి చెడ్డవాణ్ణి

ఎవర్ని ఎవర్ని నరికినా

అదే రక్తం చిందుతున్నప్పుడు

మనిషికి రక్తం అస్తిత్వాన్నిస్తున్నదే కానీ

మనిషితనానికి చిరునామా అవుతున్నదా

 

మంచి రక్తం చెడు రక్తం

అంటూ ఉంటాయి కానీ

మహామనిషి రక్తం

మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా

 

అందుకే

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

 

లోలోపలి మనిషితనానికి

బాహ్యరూపం కన్నీళ్ళు

ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు

 

తెలుసా

మనిషిలో కన్నీళ్ళ రహస్య తటకాలున్నాయి

నదీమూలాల్లాంటి కన్నీటి చెలమలున్నాయి

ఒకరు రాయి విసరనక్కరలేదు

మరొకరు కత్తి దూయనక్కరలేదు

గాయపరచేదైనా అనునయించేదైనా

చిన్నమాట చాలు

కళ్ళదోనెల్లో నీళ్ళు కదలాడుతాయి

చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి

చూస్తున్న తెరమీద ఒక్క సన్నివేశం చాలు, కన్నీళ్ళకి

కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి

జీవితంలో ముంచి తీసిన కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి

నిజానికి ఇవి కూడా అక్కరలేదు

ఒక్క ఊహ

వణికించి తొణికించే ఒక్క ఊహచాలు, కన్నీళ్ళకి

 

గుండె బరువెక్కి

ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి

కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి

 

కళ్ళు వర్షించినపుడు

మనిషి నల్లమబ్బుల ఆకాశం

కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు

మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం

మనలోంచి మనం తవ్వుకునే

తెల్లటి మణులు కన్నీళ్ళు

 

రక్తంలా కన్నీళ్ళు అనుక్షణం తయారు కావు

రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు

మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ

ఉండాలని ఎవరు చెప్పగలరు

రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది

కళ్ళు చిప్పిల్లాలంటే

రసాయనిక చర్య జరగాల్సిందే

 

మనుషులందర్నీ ఒకటిగా కలిపిన రక్తం

కణసముదాయాలుగా విడిపోయింది

పాజిటివ్‌గా నెగిటివ్‌గా పాలిపోయింది

కన్నీళ్లు మాత్రం వర్షపు నీళ్లలా

స్వచ్ఛంగా ఉండిపోయాయి

 

యుద్ధ బీభత్స ప్రతీక – రక్తం

యుద్ధ విధ్వంస స్మృతి – కన్నీళ్లు

యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది

స్మృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి

 

హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ

దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్ళే

 

రక్త హీనత ఉన్నట్టే

దుఃఖ లేమి కూడా ఉంటుంది

రక్తాన్ని ఎక్కించగలరు కానీ

కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా

 

—–కొప్పర్తి

బోలెడు నవ్వులూ, కాసింత ఫిలాసఫీ- కలిసి ఈ సినిమా!

*సూదు కవ్వుం  ( దీనికి మూర్ఖంగా ఉండే మొండితనమూ,మొండిగా ఉండే తెలివితేటలూ అవసరం )
పొద్దెక్కుతూ ఉంది, మంచంపైనుంచి దొర్లికింద పడ్డాడు ‘ కేశవన్ ‘, ఏమయ్యిందబ్బా అంటూ తలగోక్కుంటూ చూస్తే తిరుచ్చి నుంచి రాత్రికిరాత్రి పారిపోయొచ్చేసిన ‘ పగలవన్ ‘. ” ఎన్నాడా పన్నిట్టే ” అన్న ప్రశ్నకు  కొడుకు నయనతారకు లక్షన్నర పెట్టి గుడి కట్టిన విషయం తెలిసి కళ్ళుతిరిగి కింద పడిపోయిన తండ్రినుంచి, తరిమికొట్టిన జనాలనుంచి తప్పించుకుని చెన్నై వొచ్చేశాననే సమాధానం. అలారమూ అప్పుడే మోగింది దాంతోబాటే లేచాడు ‘ శేఖర్ ‘, ఇంకో రూమ్మేటు. ఆఫీసుకు టైమయ్యిందని బాత్రూములో దూరిన కేశవన్, వెన్నంటే పరిగెత్తిన శేఖర్.  చూస్తూ నిలబడ్డ పగలవన్ !  షాట్ ఓకే.
చూస్కోరా మనోణ్ణి అని అప్పగించి కేశవన్ ఆఫీసుకెళ్ళిపోతాడు. తర్వాత శేఖర్ హడావుడిగా స్నానమూ, వేషమూ ముగించి  బాగా ఎండ తగిలేచోట టేబిల్ ముందు కూర్చుని క్వార్టరూ, స్టఫ్ఫూ తెరుస్తుంటే నోరెళ్ళబెడుతూ పనికెళ్ళలేదా అని పగలవన్  అడుగుతే అందరూ పని చేసే తీరాలా అంటూ ఓ ఉపన్యాసమూ, తన గురించిన ఉపోద్ఘాతమూ మొదలెడతాడు శేఖర్. ఓ ఫైవ్ స్టార్ హోటెల్లో వాలెట్ పార్కింగ్ వద్ద పనిచేస్తూ ఉన్నప్పుడు పార్కింగు కోసం వచ్చిన ఓ బీ ఎం డబ్ల్యూ కారు తాళాలు చేతికొచ్చినంత మాత్రానే వళ్ళు మరిచిపోయి ఓ రౌండు వేసొద్దాం, ఏమౌతుందిలే అని హోటెల్ పరిసరాలు దాటుతూంటే పట్టుకుని పన్లోంచి తీసేస్తారు. అలా ఎందుకు చేశావని అడిగినందుకు ” నా ఫేమిలీ లో ఒక్కరైనా కనీసం కారును తుడిచినోడు కూడా లేడు, నేను- అలాంటి ఫారిన్ కారునే నడిపా, చాలు జీవితానికి అంటాడు.
” మీ ఫిలాసఫీ నాకు నచ్చింది బాస్ “_పగలవన్
” నయనతారకు గుడి కట్టినోళ్ళకంతా నా ఫిలాసఫీ నచ్చుతుంది “_ శేఖర్.
ఆఫీసులో పని మధ్యలో కేశవన్ కో సమస్య. లవ్ చెయ్యమంటూ చాన్నాళ్ళుగా వెంటపడుతున్న ఓ అమ్మాయి సరిగ్గా ఆరోజే సీరియస్ గా కేఫ్టేరియా లో ఉన్న కేశవన్ ను బెదిరిస్తుంది. కట్టర్ ఒకటి తీసుకుని చేయి కోసుకోబోతుంది. అడ్డు వచ్చిన కేశవన్. ఆ అంటూ అరుపు. బాస్ ముందు ఇద్దరూ. ఆ అమ్మాయి కూర్చుని ఏడుస్తూ, కేశవన్ నిలబడి చేతికున్న కట్టువంక చూస్తూ. చెడామడా బాస్ తిడతాడు కేశవన్ ను. చదువుకున్న వాడివేనా, అమ్మాయిల మొహం ఎప్పుడూ చూడలేదా అంటూ. మనోడికి కళ్ళు తిరిగింది. అదన్నమాట సంగతి. కథ అడ్డంగా తిప్పేసిందన్నమాట ఆ అమ్మాయి. మనోడి ఉద్యోగం ఊడి, తన పేరూ బ్లాక్ లిస్టులో చేరి రూం లో ఉన్న శేఖరూ, పగలవన్ సరసన చేరతాడు. ముగ్గురికీ ఉద్యోగం లేదు. గడవడం ఎలా అన్న సమస్య.
ఇలాంటి సంధర్భంలో కళ్ళద్దాలూ, మారుతీ వేనూ, నోట్లో వెలిగించిన సిగరెట్టూ, రఫ్ గా ఉన్న ఓ మొహమూ, భయంగొలిపేలా ఉన్నా అమాయకత్వం ఉట్టిపడే  ‘దాస్ ‘. వెంటే తన మరదలు. ఐస్ క్రీం తింటూ, చిట్టిపొట్టి మోడెర్న్ బట్టలతో భలే ఉందిలే అమ్మాయి. దాస్ సద్యోగం ఏంటంటే కిడ్నాపింగ్. దాన్లో ఏమైనా తోపా? కానే కాదు. ఏదో బతుకు తెరువుకోసం సిన్సియర్ గా ఈ పనినే ఎన్ని ఎదురుదెబ్బలు తింటున్నా వదలకుండా చేస్తున్న వ్యక్తి. ఓ సారి వంటరిగా ఉందని కిడ్నాప్ చేయబోయిన ఓ అమ్మాయి, ఆ అమ్మాయి స్పోర్ట్స్ వుమెన్ అని తెలీదు మరి, వెంటబడి మరీ తంతుంది. ఇంకోసారి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ సిగరెట్ తాగుతూ పరధ్యానంగా ఉంటాడు.అదే టైంలో ఆ వీధి దాదా ఒకడు నడుచుకుంటూ దగ్గరకు వచ్చి టైమెంత అని అడిగితే పరధ్యానంగా చిల్లర లేదు పొమ్మంటాడు. దాదాకు అవమానం అయిపోతుంది. తరుముతాడు. మనోడూ పారిపోతాడు. మన దాస్ కి ఓ రకమైన  ఆబ్సెంట్ మైండెడ్ పర్సనాలిటీ డిజార్డరు. ఆ రోగమేం లేదు. మనం తగిలించామంతే.
 SD-Title
మన ముగ్గురు రూమ్మేట్లూ, దాస్ తన మరదలితో ఓ బార్లో వేర్వేరుగా ప్రత్యక్షం.. కాకతాళీయంగా అక్కడికే ఆరోజు ( ఆ రోజే మరి ) చిల్లర లేదనిపించుకుని నవ్వులపాలైన పిల్ల దాదా తన గూండాలతో హాజరు. ఏడుస్తూ బాధపడుతూంటాడు. బుద్ది తక్కువై పొద్దుటి విషయం తెలీని అసిస్టెంట్ గూండా ” చిల్లర లేదని శనగపప్పుల్ని తెచ్చా” అన్నందుకు అనుచరుని చావగొడతాడు. దూరంగా కూర్చుని తాగుతున్న దాస్ ని చూస్తాడు . అంతే ఆవేశం తన్నుకొచ్చి దాస్ దగ్గరికెళ్తూ దగ్గర్లో ఉన్న టేబిల్ మీద బీరు సీసా తీసుకుంటాడు. దాస్ తలమీద ఒక్కటివ్వబోతుంటే బాటిల్ ఎంతకీ చేతికి రాదు. చూస్తే ఆ బాటిల్ మన తిరుచ్చి పగలవన్ ది. అదే బాటిల్తో దాదా తల మీద ఒక్కటి పడుతుంది. గొడవ గొడవ. తాగేసున్న బార్లో అందరూ తన్నుకోవడం మొదలు. పోలీసులూ ప్రత్యక్షం. గోడదూకిన మన రూమ్మేట్లని అరుస్తూ పిలుస్తాడు దాస్, వేన్ లోకి వచ్చెయ్యమని. అందరూ దాస్ ఇంట్లో సమావేశం. పూర్తికాని తాగుడు అక్కడ కొనసాగిస్తారు.
పొద్దున్నకల్లా ముగ్గురికీ అర్థమౌతుంది. ఈ దాస్ అనే మనిషి ఒకటి కాదు రెండు డిజార్డర్లతో బాధ పడుతున్నాడని. ఒంటరి సినిమాలో గోపీచంద్ లా. మరదలు లేదు. ఉందని దాస్ భ్రమతో మాట్లాడేస్తూ ఉంటాడు. పొద్దున్న లేచి వీళ్ళకి తన బతుకు తెరువు గురించి చెప్పడం మొదలెడుతూ తన వృత్తిలో ఉన్న కిటుకులూ, అయిదు సూత్రాలూ చెప్తాడు. పగలవన్ కూ, శేఖర్ కూ ” పిచ్చ పిచ్చ ” గా నచ్చుతుంది దాస్ చేస్తున్న పని.  దాస్ పని కిడ్నాపింగ్ అని తెలిసిన మరుక్షణం కేశవన్ వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడో పగలవన్ కూ, శేఖర్ కూ దాస్ బాగా నచ్చేసి ఉంటాడు. ఆరోజు రాత్రి కేశవన్ వీరిద్దరికీ చెప్తాడు,  ప్రయత్నిస్తే పని దొరుకుతుంది. నిజాయితీ గా కష్టపడదాం అని మినీ లెక్చర్లు ఇస్తాడు. పొద్దున్నకల్లా ఇద్దరూ మాయం. కేశవన్ కూ అర్థమైపోయింది ఎక్కడ చేరారో ఈ ఇద్దరు సైకోలు.
ఇప్పుడు మన ‘ అరుమై ప్రకాశన్ ‘ వంతు. రూలింగు పార్టీ మంత్రి గారి కొడుకు. అత్యంత నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడికి పుట్టిన ఏకైక సంతానం. డిగ్రీ అయిదేళ్ళుగా తగలేస్తూ, వీధి చివర్న రోజుకు మూడు పేకెట్ల సిగరెట్లు, పది పదిహేను టీ లు ఊదేస్తూ,పొద్దస్తమానం ఏదో ఆలోచనల్లోనే ఉంటూ గడుపుతూ వ్యాపారం కోసం నాన్న దగ్గర డబ్బులు తీసివ్వమని తల్లితో మొరపెట్టుకుంటూ ఉన్న పుత్ర రాజు. తండ్రి నిజాయితీ కోసం ఎంత దూరం వెళ్తాడంటే లంచం ఇవ్వడానికొచ్చిన ఓ ఇద్దరు వ్యాపారుల్ని రెడ్ హేండెడ్ గా అవినీతి నిరోధక అధికారికి పట్టించేసి పేపర్లకెక్కే విపరీతమైన ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న ఓ పాతకాలపు నాయకుడు.
మన దాస్ కిడ్నాపింగు అంత పెద్ద దందా కాదు. ఓ యాభై వేలదాకా రేంజి లోనే పని కానిచ్చేస్తాడు. అంత కన్నా ఎక్కువ డిమాండు చేయడు. మధ్యతరగతి మనుషుల్నే కిడ్నాప్ చేస్తాడు. రాజకీయం, పలుకుబడి, పోలీసులు, ధనవంతుల్ని దాస్ ఎప్పుడూ టార్గెట్ చెయ్యడు. ఇలా ఉంటే ఓ సారి ఓ పిల్లవాణ్ణి కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్తుంటే  సెల్లు మోగుతుంది. అదేవర్నుంచో కాదు, గతంలో ఓ సారి ‘ అరుమై ప్రకాశన్ ‘ తండ్రి యాంటి కరప్షన్ అధికారులకి పట్టిచ్చిన వ్యాపారిదే. మంత్రిగారి కొడుకుని కిడ్నాప్ చెయమని ఆఫర్. వీళ్ళ నియమాలు ఒప్పుకోవు. బాగా డబ్బులూ ఇవ్వజూపుతాడు. ఒక్కసారిగా పెద్దమొత్తం వస్తుందని దాస్ ను తక్కిన ముగ్గురూ ( ఇద్దరేగా? కేశవన్ పేరు బాగా చలామనీ అయిపోయి అప్పటికే ఉద్యోగం దొరకదని వీళ్ళతో చేరిపోతాడు ) ఒప్పిస్తారు.
ఆ రోజు మంత్రిగారి ఇంటివద్ద అప్పటికే మాటు వేసి, రెక్కీలు వేసి సిద్ధంగా ఉన్న నలుగురూ విస్తుపోయేలా అరుమై ప్రకాశన్ ను ఇంకో ముఠా కిడ్నాప్ చేసేస్తుంది. వీళ్ళకు మతి పోతుంది. వాళ్ళను వెంబడిస్తే ఓ చోట బండి దిగి నింపాదిగా నడుచుకుంటూ ఇంట్లోకెళ్తున్న అరుమై ప్రకాశన్. కట్ చేస్తే ఆ కిడ్నాప్ అయిడియా మొత్తం మంత్రి గారి అబ్బాయిదే. అక్కడే మాటు వేసి ఆ సాయంకాలానికి ఆ ఇంట్లో మేడమీద బాగా తాగేసి స్పృహ లేని స్థితిలో ఉన్న అరుమై ప్రకాశన్ ని వీళ్ళ స్థావరానికి తెచ్చేసుకుంటారు. వీళ్ళకూ అనుభవం లేదు. పెద్ద వ్యవహారాలూ దాస్ ఇంతకు ముందెన్నడూ చేయలేదు. ఫోన్ చేసి మంత్రిగారిని డబ్బు ప్రాధేయపడుతూంటే మంత్రి మొహం మీద కట్ చేస్తాడు. వీళ్ళకూ పాలు పోని స్థితిలో అరుమై ప్రకాశన్ అయిడియా ఇస్తాడు. మీకు సగం నాకు సగం అయితేనే అంటాడు. మీకు చేతకాక నా ప్లాన్ కూడా చెడగొట్టినందుకు మీకు పైసా కూడా రాదు. నేను మంచోణ్ణి కాబట్టి మీకు సగం. మన దాస్ & కో కూడా వప్పుకుంటుంది.
ఫోన్ చేసి గొంతు ఎవరో నొక్కేస్తున్నట్లు నటిస్తూ వాళ్ళమ్మతో అరుమై ప్రకాశన్ తనను కిడ్నాప్ చేసిన గాంగ్ మనుషులు చంపేస్తున్నారంటూ, రెండు కోట్లు డిమాండు చేస్తున్నారని, తండ్రి ఎలాగూ ఇవ్వడు కాబట్టి పార్టీ ఆఫీసు ముందు ధర్నా చేసేలా పురిగొల్పుతాడు అరమై ప్రకాశన్. మంత్రి గారి భార్య కూడా అలాగే గోల గోల చేస్తుంది. ఇక టీ వీ చానళ్ళూ, పేపర్లూ ఆ గొడవలూ సరేసరి. పార్టీ లీడరు పిలుస్తాడు మంత్రిని. ” ఏమైనా  దాచావా అంటే లేదు, నేనెంత నిజాయితీ పరుణ్ణో తెలీదా ” అంటే, ఇక గొడవ పెద్దది చెయ్యకూడదని పార్టీ ఫండు నుంచి రెండు కోట్లు తీసి మంత్రి గారి భార్య చేతిలో పెడతారు  పార్టీ పెద్ద మనుషులు. దాస్ అనుచరులు ఎక్కడి రావాలో చెప్తుంటే,  అప్పటికే పెద్ద పోలీసు అధికారి హోదాలో ఉన్న మంత్రి గారి బావ మరిది ఆవిడకు  జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. దాస్ కంపెనీ చేతికి డబ్బులొచ్చేసిన తర్వాత డబ్బులు పంచే గొడవలో అరుమై ప్రకాశన్ మొత్తం డబ్బులున్న బేగ్ తీసుకుని నడుస్తున్న వేన్ నుండి దూకి పారిపోతాడు. పట్టుతప్పిన బండికి ప్రమాదం జరిగి కింద పడ్డ దాస్ & కో బాగా దెబ్బలు తగిలించుకుని ఉంటారు. పనిలో పనిగా దాస్ కూడా ఆ సంఘటనని వాడుకుంటూ ఏక్సిడెంటులో తన మరదలు చచ్చిపోయిందని కూడా ఏడుస్తూ ఆ బంధానికి ముగింపు పలికేస్తూ ఉంటాడు. వీళ్ళకు తెలుసు కాబట్టి దాస్ ను కాసేపు భరించి సాయంకాలానికి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
అతను డాక్టరు కాదు. అయినా డాక్టరులాగా వద్దకొచ్చిన పేషంట్లకు ఏ డాక్టరు దగ్గరికెళ్ళాలో ప్రిస్క్రిప్షను రాసి ఇస్తూంటాడు. ఫుల్ టైం లో రౌడీ. పార్ట్ టైం లో సినిమా కథకు తగ్గ హీరో కోసం కొత్తమొహం కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తారసపడతారు మన దాస్ & ఫ్రెండ్స్. నయనతార ఫేన్ అయిన మన తిరుచ్చిపగలవన్ ను చూసి సినిమాలో వేషం వేస్తావా, నీకోసమే ఇన్నాళ్ళుగా చూస్తున్నా అంటూ మతిలేనివాడిలా ఏదేదో మాటాడేస్తూ ఉంటాడు. మీరు గ్రహించారిప్పటికే- ఇతను కూడా ఓ రకమైన మనోవ్యాధిగ్రస్థుడని.  ముక్తాయింపు ఏమిటంటే ఇతను దాస్ కు స్వయానా సోదరుడు. తన దగ్గరకొచ్చిన దాస్ బృందం దగ్గర విషయం తెలుసుకుని వాళ్ళకి అప్పటికి ఆశ్రయం తన దగ్గర కల్పిస్తాడు.
ఇలా ఉండగా మంత్రిగారు పరువు పోయిందని తన బామ్మర్ది అయిన పోలీసు అధికారితో ఎలాగైనా ఆ కిడ్నాపింగ్ గుంపును పట్టుకోవాలని వత్తిడి తీసుకొస్తాడు. ఎప్పుడూ బదిలీలమీద ఉండే బ్రహ్మ అనబడే ఓ పోలీసు ఇనస్పెక్టరును ఆ పనిమీద నియమించమని ఆర్డరు వేస్తాడు. కానీ అధికారి వప్పుకోడు. ఎందుకంటే …. అతనో పెద్ద ఉన్మాది. నేరస్థుల్ని పట్టుకోవడం కన్నా రకరకాలుగా హింసించి చంపడంలోనే ఎక్కువ ఆనందం పొందే మనిషి. కథలోకొచ్చేద్దాం. మంత్రి గారు పట్టు వదలడు. ఇక ఏం చేయడం అని బ్రహ్మ ను రప్పిస్తాడు. ఇదే సమయంలో ఈ వార్తను పేపర్లలో చదివిన్ అ డాక్టరు దాస్ బృందానికి తెలియజేస్తాడు. దాస్ బృందం డబ్బెలాగూ పోయింది. ఓ సైకో పోలీసు ఇనస్పెక్టరు కూడా వెంట పడడం మొదలయ్యింది. ఏదో ఒకటి  మళ్ళీ ‘ అరుమై ప్రకాశన్ ‘ ని కిడ్నాప్ చేద్దాం అని నిర్ణయిస్తారు. డాక్టరు గారు ఓ తుపాకీ కూడా సప్లై చేస్తారు.
అరుమై ప్రకాశన్ ఇంటిముందు నిలబడ్డ దాస్ మిత్రులకు ఇంటిముందు ఆగున్న పోలీసు జీపు కనబడుతుంది. చూస్తే అది బ్రమ్మీ గారిది.
చావుదగ్గరికొచ్చాం కదా అని వీళ్ళు బిక్కచచ్చిపోయి ఆలోచిస్తూంటారు. లోపల విచారిస్తున్న బ్రహ్మ అరుమై ప్రకాశన్ చెప్తున్న మాటల్ని నమ్మడు. కార్డు చేతిలో పెట్టి చెంప వాయగొట్టి సాయంత్రానికి నిజం చెప్పమని వార్నింగు ఇప్పించి ( ఎందుకంటే ఈ బ్రహ్మ పాత్రకు మాటలు లేవు. కేవలం సైగలే. మూగోడు కాదు. మాట్లాడ్డం ఇష్టం ఉండదంతే ) బయటికొస్తాడు. సిగరెట్ వెలిగించడానికి అగ్గిపెట్టే కోసం వెతుకుతూంటే వేన్ లో కూర్చున్న దాస్ మనుషులు కనబడతారు. అగ్గిపెట్టెకోసం వాళ్ళదగ్గరకెళ్తే వీళ్ళు జడుసుకుని పారిపోతారు. బ్రహ్మకు అనుమానం బలపడి వెంబడిస్తాడు. వాన్ ని వదిలేసి రోడ్డుమీద పారిపోతున్న వీళ్ళు ఓ నల్లటి కారుని ఆపి దాన్ని తీసుకుని ఓ చోట ఆగుతారు.
” అలాగే, నల్లటి కారు కదా, లోపల మనిషి వెయిట్ చేస్తోందా అని ఫోన్లో అంటూ వీళ్ళ కారులోకే వచ్చి కూర్చుంటాడు అరుమై ప్రకాశన్. అది సంగతి. మంత్రి కొడుకు డబ్బుతో జల్సాలు చేస్తూ మళ్ళీ వీళ్ళకే దొరుకుతాడు. ఆఫర్ ఇస్తాడు సగం డబ్బులిచ్చేస్తానని. సరే పోలీసుల దగ్గర మేమే కిడ్నాప్ చేశామని చెప్పొద్దని మాట తీసుకుని వదిలేస్తారు. ఈ తతంగమంతా డాక్టరు గారు వీడియో తీసి వీళ్ళు తప్పించుకునే దారి చూపిస్తాడు. దురదృష్టం కొద్దీ ఆ మినీ కేసెట్ దారిలో కిందపడి ముక్కలైపోతే చేసే దారిలేక వీరు పోలీసులకు లొంగిపోతారు.
కోర్టులో హాజరు చేసిన వీళ్ళని వీరు కాదు కిడ్నాప్ చేసిందంటూ అరుమై ప్రకాశన్ వీళ్ళని అప్పటికి కాపాడేస్తాడు. విడుదలైనట్లు సంతకం పెట్టించుకుని వీళ్ళని ఓ వేన్ లో మారుమూల తోటలోకి తీసుకెళ్ళి, ఓ చీకటి కంటైనర్లో బ్రహ్మ తీవ్రంగా హింసించడం మొదలు పెడతాడు. కొట్టీ కొట్టీ విసుగొచ్చి చంపేద్దామని మారు తుపాకీ తీయబోతుంటే వెనుక నడుం తుపాకీ దగ్గర పేలి ( సినిమాల్లో గన్ ఎక్కడ పెట్టుకుంటారో తెలుసుగా? )  బ్రహ్మ తీవ్రంగా గాయపడతాడు. అక్కడికక్కడే దాస్ గాంగ్ ను వదిలేసి పోలీసులు బ్రహ్మ ను తీసుకుని ఉన్నఫళంగా వెళ్ళిపోతారు. డాక్టరు దగ్గరికొచ్చిన దాస్ బృందాన్ని కలుస్తాడు అరుమై ప్రకాశన్. ఎలాగైనా తనను గాంగులో కలుపుకోమని, కాస్త పరిస్థితులు చక్కబడే వరకూ ఎలాగైనా తనను బీహార్ ఎక్కడైనా పంపెయ్యమని చెప్తాడు. అప్పుడే ఇంటెలిజెన్సు దాడి చేసి అరుమై ప్రకాశన్ ని తీసుకెళ్ళిపోతారు.
కొన్ని గంటల ముందే ఆ రోజు కొడుకు నిర్వాకం పసిగట్టిన మంత్రిగారు అరుమై ప్రకాశన్ తో పెనుగులాడి డబ్బు దాచిన బాగ్ ను తీసుకుని  మంత్రిగారి దగ్గరికి  నిజాయితీ నిరూపించుకునేందుకు వెళ్ళీ బాగ్ తెరిచి చూపించబోతూంటే మొత్తం న్యూస్ పేపర్ల కట్టలే కనిపిస్తాయి. మన అరుమై ప్రకాశన్ తండ్రితో పెనుగులాటలో గదిలో తలుపేసుకున్న సంధర్భంలో డబ్బుల్ని మంచం కిందికి తోసేసి పేపర్ల కట్టల్ని బాగ్ లో సర్దేసి ఉంటాడు. నిర్ఘాంతపోయిన మంత్రి గారి మొహం చూస్తూ పార్టీ నాయకుడు ( ముఖ్యమంత్రో ఏమో )  అరుమై ప్రకాశన్ ని ఎలాగైనా పట్టుకు తెమ్మని ఇంటెలిజెన్సు కు చెప్తాడు.
ముగింపు:  అరుమై ప్రకాశన్ తెలివితేటలకు మెచ్చి అందుకు గుర్తింపుగా  మంత్రి గారి కొడుక్కి ఎన్నికల టికెట్ కంఫర్మ్. తండ్రికి బలవంతపు రిటైర్మెంట్.  కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కేశవన్, బీం యెం డబ్ల్యూ శేఖర్ లు కొత్త యువ మంత్రి గారి ప్రైవేట్ మనుషులవుతారు. హాస్పిటల్లో బ్రహ్మ పళ్ళు కొరుకుతూ టీవీలో యువ మంత్రి గారి ప్రమాణ స్వీకారం చూస్తూంటాడు. నయనతారకు గుడి కట్టిన తిరుచ్చి పగలవన్ సినిమాలో నటిస్తూ డాక్టరుగారి దర్శకత్వంలో  ఆ చెంపా ఈ చెంపా వాయించుకుంటూ, టేకుల మీద టేకులు తినేస్తూ ఉంటాడు.
చివరగా దాస్ తన ఇంట్లో కిడ్నాపింగ్ సూత్రాలు ఓ కొత్త బాచ్ కు బోధిస్తూంటాడు.  ముందు వరుసలో చూస్తే శ్రద్ధగా లీనమై వింటూ, మొదట్లో దాస్ చేత చిల్లర లేదనిపించుకున్న గూండా ! సమాప్తం. !
నలన్ కుమారస్వామి దర్శకత్వం. ఇదే అతని దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా. విజయ్ సేథుపది దాస్ గా బాగా నటించాడు.. శేఖర్, పగలవన్ పాత్రలు గుర్తుండిపోతాయి. జిగర్ థండా సినిమాలో హీరో స్నేహితుడిగా చేసిన కరుణాగరణ్ ( అలాగే పలకాలి మరి :) ) ఈ సినిమాలో అరుమై ప్రకాశన్ గా మంచి నటన కనబరిచాడు. సన్నివేశాన్ననుసరించి  రెండుమూడు నిమిషాల్లో ముగిసిపోయే  పాటల్ని చొప్పించిన డైరెక్టరును మెచ్చుకోవాలి. బడ్జెట్ గురించి చెప్పనక్కరలేదు. తమిళ సినిమాల సంగతి తెలిసిందే.. ( చూడుడు భారతీ రాజా సినిమాలు ). నలభై కోట్ల దాకా వసూళ్ళు సాధించిందంటే ఈ సినిమా ఎంత బాగా జనాలకు కనెక్టు అయ్యిందో తెలిసిపోతుంది.
తెలుగులో ఓ పెద్ద తమిళ హీరో చేస్తున్నట్లు ఈ మధ్యన వచ్చిన కొన్ని ట్రైలర్లు చూస్తే అర్థమయ్యింది. ( హ హ హ మీరు సరిగ్గానే గెస్ చేశారు. పవన్ కళ్యాన్ అభిమానులైతే ఇంకా బాగా ఊహించగలరు. ) ఇంకా కొందరు పెద్ద పెద్ద నటులు కూడా నటిస్తున్నారనీనూ తెలిసింది. చెన్నై ఎక్ప్రెస్ తీసిన రాకేష్ శెట్టి హిందీలో ఈసినిమాను లుంగీ డాన్సుల్తో మక్కీకి మక్కీ దించెయ్యడానికి రెడీ అయ్యారనీనూ వికీపీడియా కోడై కూస్తోంది.
సర్కాస్టిక్ కామెడీ సినిమా. మారుతున్న విలువల్నిఅత్యంత దగ్గరగా చూపిస్తూ నవ్వొచ్చేలా తీసిన సెటైరికల్ సినిమా ఇది. తప్పక చూడండి.
-శ్రీరామ్ కన్నన్

పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్సిటీ చదువు

జూన్, 1960 లో నేను ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో పాస్ అవగానే మరింకే విధమైన ఆలోచనా లేకుండా మా కాకినాడ పి.ఆర్. కాలేజీ లో చేర్పించడానికి నిర్ణయం జరిగిపోయింది. అప్పటికే మా చిన్నన్నయ్య లాయరు, మా సుబ్బన్నయ్య బి.ఎస్.సిలో అక్కడే చేరి, ఎం.బి.బి.యస్ చదివి డాక్టర్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు కాబట్టీ, పైగా నాకు లెక్కల సబ్జెక్ట్ లో మార్కులు బాగానే వస్తాయి కాబట్టీ నేను సహజంగానే ఇంజనీరు అవాలని కూడా నిర్ణయం జరిగిపోయింది.

నాకు గుర్తు ఉన్నంత వరకూ అప్పుడు ఒక ఏడాది పాటు చదవ వలసిన ప్రీ-యునివర్సిటీ కోర్స్ లో మేథమేటిక్స్ ప్రధాన పాఠ్యాంశం గా ఉన్న వాటిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఒక గ్రూప్, ఫిజిక్స్, లాజిక్ కలిపి మరొక గ్రూప్, బహుశా ఫిజిక్స్ , అకౌంటింగ్ కలిపి మరొకటీ ఉండేవి. అప్పటి లాజిక్ నాకు తెలియదు కానీ నేను లాజిక్ ఉన్న ఎం.పి.ఎల్. గ్రూప్ తీసుకున్నాను. అప్పటి పి.ఆర్. కాలేజీ ప్రిన్సిపాల్ పిరాట్ల శ్రీ రామం గారు మా నాన్న గారి క్లాస్ మేట్. ఆయనే ఆ సలహా ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు అని నా అనుమానం. ఇది నిజంగానే పుణ్యం ..ఎందుకంటే…ఆ తరువాత జన్మంతా చదువుల్లో నేను ఎప్పుడు కెమిస్ట్రీ చదవవలసి వచ్చినా బొటాబొటీ మార్కులతోటే గట్టెక్కే వాడిని. ఈ ప్రీ – యూనివర్సిటీ అనేది బహుశా ఆ ఏడు నాలుగో బేచ్ అనుకుంటాను. అంతకు ముందు వరకూ ఎస్ఎస్ఎల్సీ తరువాత రెండేళ్ళు ఇంటర్ మీడియేట్ అనీ, ఆ తరువాత రెండేళ్ళు డిగ్ర్రీ కోర్స్ ఉండేవి.

నేను అక్కడ చదివినది కేవలం ఒక్క ప్రీ-యూనివర్సిటీ సంవత్సరమే అయినా, అది కూడా 55 ఏళ్ళు దాటినా , కాకినాడ పి.ఆర్. కాలేజీ పేరు వినగానే ఇప్పటికీ నా ఒళ్ళు పులకరించి పోతుంది. ఎందుకంటే మొత్తం భారత దేశం లోనే ఆ కాలేజీ అత్యంత పురాతనమైన ఆధునిక కళాశాల. 1853  లో ముందు ఒక హై స్కూల్ గా ప్రారంభించబడి, 1884 లో డిగ్రీ కాలేజ్ గా రూపొందిన ఆ కళాశాల పిఠాపురం మహారాజా శ్రీ రాజా రావు వెంకట మహీపతి గంగాధర రామారావు రావు బహద్దర్ వారు. ఆయన పేరిట వెలసిన రామారావు పేట లో 63 ఎకరాలు, కాకినాడ మైన్ రోడ్ లో బాలాజీ చెరువు దగ్గర 28 ఎకరాలు దానం చేసి, తొలి భవన నిర్మాణాలు చేసి, ఆడ పిల్లలకి ట్యూషన్ ఫీజులు రద్దు చేసి, మహత్తరమైన మానవతా వాదంతో, సాంస్కృతిక సేవకి కూడా పెద్ద పేట వేసిన ఆ మహానుభావుడూ, ఆయన కుమారుడు రాజా మహీపతి సూర్యా రావు బహద్దర్ వారూ కాకినాడ పట్టణాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. 1952 లో ఆ కాలేజీని ప్రభుత్వం వారు తీసుకుని, 2000 నుంచీ ఒక ఆటానమస్ కాలేజ్ గా నిర్వహించబడుతోంది. అంటే ప్రస్తుతం ఆ కాలేజ్ అనాధ కాని అనాధ. అలా ఎందుకు అనిపిస్తొందో తరువాత వివరిస్తాను.

నేను పి.ఆర్. కాలేజీ లో చేరగానే నా జీవితంలో జరిగిన ప్రధానమైన మార్పు పగలు పొట్టి లాగులు మానేసి పంట్లాలు వేసుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు పైజామాలు వేసుకోవడం. ఆ రోజుల్లో ఇదేమంత చెప్పుకోదగ్గ విషయం కాక పోయినా, అందరూ చేసే పని అయినా ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానూ అంటే ఒక కుర్రాడు బాల్యావస్థ నుంచి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టాడు అనడానికి ఈ చిన్న విషయమే ఆ రోజుల్లో ఒక “సింబాలిక్” గుర్తు. గెడ్డాలూ, నూనూగు మీసాలూ మొలవడం మరొక గుర్తు. ఈ రోజుల్లో ఐదో ఏటికే అందరూ యవ్వనం లోకి వచ్చేసి వ్యక్తిత్వ వికాసం ప్రదర్శిస్తున్నారు. బాల్యం అనే అపురూపమైన అమాయకత్వపు అనుభవం దాట వేసి అర్జంటుగా ఎదిగిపోయే తరం ఈ నాటిది.

పి.ఆర్. కళాశాల ప్రధాన భవనం

పి.ఆర్. కళాశాల ప్రధాన భవనం

మా ఇంటి నుంచి పి.ఆర్. కాలేజీకి వెళ్ళడానికి “ఏ బస్సు కిందో పడి చస్తావు” అని మా నాన్న గారు సైకిల్ కొనడానికి ఒప్పు కోలేదు. అంచేత మా గాంధీ బొమ్మ నుంచి రామారావు పేటలో మూడు లైట్ల జంక్షన్ దాకా రోడ్డు మీద అరగంటా, అక్కడ కుడి పక్కకి తిరిగి మరో పావు గంటా నడిస్తే కాలేజీ రౌండ్ గేటు దాకా నడిచే కాలేజ్ కి వెళ్ళే వాడిని. ఇది కేవలం ఒక మనిషి పట్టే గుండ్రంగా తిరిగే గేటు.  పొద్దున్నే మా అమ్మ పెట్టిన ఆవకాయ నల్చుకుని తరవాణీయో,  మరేమన్నానో తినేసి ఆదరా బాదరాగా నడక లాంటి పరుగు తో కాలేజీకి వెళ్ళేవాడిని అని గుర్తే కానీ కూడా మిత్ర బృందం ఎవరైనా ఉండే వారా, ఉంటే వాళ్ళ పేర్లు ఏమిటీ అన్న విషయాలు ఇప్పుడు బొత్తిగా గుర్తు లేవు. మూడు లైట్ల జంక్షన్ దగ్గర పుత్రయ్య కొట్టు అనే చిన్న బడ్డీ కొట్టు ఉండేది. ఎదురుగుండా రామకోటి హోటెల్ ఉండేది. నేను ఎప్పుడూ పుత్రయ్య కొట్టులో రస్కులు, బిళ్ళలు, జీళ్ళు వగైరాలు కానీ, అటు రామకోటి లో దోశలు, పెసరెట్లు  తినడం గానీ చెయ్య లేదు. అలా చిరు తిళ్ళు తినడం, అల్లరి చిల్లరి పనులు చెయ్యడం, అమ్మాయిలని ఏడిపించడం లాంటివి ఎవరైనా చేస్తుంటే చూశాను కానీ వాటి జోలికి ఎన్నడు వెళ్ళని “రాము మంచి బాలుడు” లాగానే హాయిగా ఉండే వాడిని.

ఆ మూడు లైట్ల జంక్షన్ నుంచి కాలేజ్ రౌండ్ గేటు దాకా నడవడానికి మటుకు చాలా భయం వేసేది. ఎందుకంటే  ఆ రోడ్డు మీద ఎప్పుడూ “పిచ్చి వరహాలు” అనే ఆవిడ ఒంటి నిండా గిల్టు నగలు వేసుకుని, అందరినీ తిడుతూ పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా తిరుగుతూ ఉండేది. కొందరు కుర్రాళ్ళు ఆట పట్టించినప్పుడల్లా ఇంకా రెచ్చి పోయేది కానీ ఎవరికీ ఎప్పుడూ హాని కలిగించేది కాదు. నాకు పూర్తి కథ తెలియదు కానీ ఆవిడ భర్త స్వాతంత్ర్య ఉద్యమానికి ఉన్న ఆస్తి అంతా ధార పోసి, సత్యాగ్రహాలు చేసి జైలు కెళ్ళి మరణించాడనీ, అందుకే ఆవిడకి మతి భ్రమించింది అనీ చెప్పుకునే వారు. అలాగే మరొకాయన రోజు కొక జంక్షన్ లో నుంచుని, ఎవరు విన్నా, వినక పోయినా,  మన దేశం గురించీ, గాంధీ గారి గురించీ లెక్చర్ ఇస్తూ ఉండే వాడు.

ఆ రోజుల్లో కాకినాడ గాంధీ నగరం, రామారావు పేటలలో ఇంచుమించు అన్నీ బ్రాహ్మణ కుటుంబాలే. అందరి ఇళ్ళ నుంచీ..మా నాన్న గారితో సహా….దేశ స్వాతంత్ర్యం  కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్ళే. ఏదో స్థాయి లో త్యాగాలు చేసిన వాళ్ళే. తీరా ఆ స్వాతంత్ర్యం వచ్చాక పూర్తిగా విస్మరించబడి రోడ్డున పడిన వాళ్ళే. అయినా మన సాంస్కృతిక మూలాలని కాపాడుకుంటూ వచ్చినది కూడా వాళ్ళే!

పి.ఆర్. కాలేజ్ లో ఆర్ట్స్ క్లాసులన్నీ …అంటే మేథమేటిక్స్, లాజిక్, అకౌంటింగ్, ఇంగ్లీషు, తెలుగు వగైరాలు అన్నీ రామారావు పేట మెయిన్ కేంపస్ లో ఉంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి సైన్స్ క్లాసులు, లేబరేటరీలు బాలాజీ చెరువు దగ్గర ఉన్న చిన్న కేంపస్ లో జరిగేవి. రెండింటి మధ్యా నడక గంట పైగా ఉంటుంది. ఏ ప్రాంగణం అనుభూతి దానిదే. మా లెక్చరర్స్ లో నాకు ఇప్పటికీ గుర్తున్న వారు కెమిస్ట్రీ చెప్పిన బి.ఎన్నార్. గారు, ఆల్జీబ్రా చెప్పిన ఎ.ఎస్. రామారావు గారు, ట్రిగానామెట్రీ చెప్పిన డి.ఎస్. ఆర్ గారు, ఇంగ్లీష్ మేష్టారు వీరాస్వామి గారు మాత్రమే. తెలుగు, లాజిక్, ఫిజిక్స్ మేడం ఇలా ఎవరి పేర్లూ గుర్తు లేవు కానీ వారు పాఠాలు చెప్పిన పద్ధతి, ఆత్మీయత ఇంకా గుర్తున్నాయి.

నా క్లాస్ మేట్స్ లో నా హైస్కూల్ నుంచి భమిడిపాటి ప్రసాద రావు, పుల్లెల సత్య కామేశ్వర సోమయాజులు మాత్రమే నాతో పియుసి కూడా చదివారు అని జ్జాపకం.  ఇందులో ప్రసాద రావు ది కాకినాడ పక్కనే గోనేడ దగ్గర పాలెం అనే గ్రామం. నేను కాకినాడ వదిలి బొంబాయి వెళ్ళే దాకా  చిన్నప్పటి నుంచీ మా కుటుంబంలో ఒకడుగా ఉండేవాడు. పియుసి తరవాత వాడు పాలిటెక్నిక్ చదివాడు కానీ వ్యవసాయం లోనే స్థిరపడ్డాడు. వాణ్ని చూసి పదేళ్లయింది. ఇక సోమయాజులు గాడు మా ఇంటి పక్కనే. చాలా తెలివైన వాడు కానీ తిక్క శంకరయ్య. జీవితంలో రకరకాల పనులు చేసి, కేలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. వాణ్ని గత నలభ ఏళ్ల లోనూ ఒక సారి చూశాను.

నా పియుసి క్లాసులో నాకు ఎంతో దగ్గర మిత్రులు అయిన వాళ్ళలో డి. గణపతి రావు. ఎం.వి.ఎస్. పేరి శాస్త్రి, చెల్లూరి శివరాం అతి ముఖ్యులు. ఇందులో గణపతి రావు తరువాత ఇంజనీరింగ్ లో కూడా నాకు సహాధ్యాయి. విశాఖ పట్నం లో ని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఎదిగాడు. పేరి శాస్త్రిది పశ్చిమ గోదావరి జిల్లలో మొగల్తుర్రు గ్రామం…అంటే బారిస్టర్ పార్వతీశం ఊరు…అన్న మాట. అతను ఇప్పుడు  బెంగుళూరు లో ఒక ఐటి కంపెనీ వ్యవస్థాపకుడు. ఈ విషయం ఇప్పుడు అతనికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ మేము పియుసి లో ఉండగానే పేరి శాస్త్రి “నాకో చెల్లెలు కావాలి” అనే కథ వ్రాసి ఏదో పత్రికలో ప్రచురించాడు. అతనికి నిజంగానే చెల్లెలు లేదు అప్పుడు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది…..బహుశా నా తోటి వయసు వాళ్ళలో నాకు తెలిసిన తొలి రచయిత బహుశా పేరి శాస్త్రే!

ఆ వయసులో నాకు ఏదో పత్రికలూ చదవడం, మంచి సినిమాలు చూడడం, క్రికెట్ ఆడుకోడం, చదువుకోవడం లాంటి మామూలు అలవాట్లే కానీ కథలూ, కమామీషులూ రాద్దామనే బుద్ది వికాసం లేనే లేదు. సుమారు పదేళ్ళ క్రితం నేను ఒక సారి బెంగుళూరు వెళ్ళినప్పుడు ఒక సాహితీ సమావేశానికి పేరి శాస్త్రి వచ్చాడు…అంటే ఇంచుమించు నలభై ఏళ్ల తరువాత అతన్ని కలుసుకోవడం జరిగింది. నిడమర్తి రాజేశ్వర రావు గారి ఇంట్లో నా గౌరవార్థం జరిగిన ఆ సాహితీ సమావేశాన్ని సుప్రసిద్ద రచయిత దాసరి అమరేంద్ర గారు ఏర్పాటు చేశారు. ఆ రోజు విపరీతమైన వర్షంలో కూడా అంబికా అనంత్, తదితర బెంగుళూరు నగర సాహితీవేత్తలు వచ్చి నన్ను ఎంతో ఆదరించారు. ఇక శివరాం తో నా స్నేహం కాకినాడ నుంచి మొదలై, బొంబాయి ఐ.ఐ.టిలో బలపడి అమెరికా లో కూడా కొనసాగింది.

పీయూసీ మార్కుల షీట్

పీయూసీ మార్కుల షీట్

యధాప్రకారం నేను ప్రి-యూనివర్సిటీ లో మా సెక్షన్ కి మొదటి మార్కులతో ప్రధముడి గానూ, మొత్తం కాలేజ్ కి నాలుగు మార్కులు తేడాతో రెండో వాడిగానూ ఏప్రిల్ 29, 1961 నాడు పరీక్ష పాస్ అయ్యాను. ఆ రోజే నా పుట్టిన రోజు కూడాను. ఆ మార్కుల షీట్ ఇందుతో జతపరుస్తున్నాను. ఆ రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కీ 200 చొప్పున ఐదు సబ్జెక్ట్స్ కీ కలిపి 1000 మార్కులకీ 700 వస్తే చాలా గొప్ప. నాకు 692 మాత్రమే వచ్చాయి కాబట్టి అది కొంచెమే గొప్ప. కానీ నాకు తెలిసీ ఇంగ్లీషులో కాలేజ్ ఫస్ట్ గానూ, లాజిక్ లో …అవును…మొత్తం ఆంధ్ర విశ్వ విద్యాలయానికే మొదటి వాడు నిలిచినా వాటి ఉపయోగం అప్పుడు తెలియ లేదు. ఆ పతకాలు మాత్రం మా అమ్మ జాగ్రత్తగా దాచుకుని, నేను అమెరికా వలస వచ్చినప్పుడు నా చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆ పతకాలూ, మా అమ్మా కాలగర్భంలో కలిసిపోయినా, నా స్మృతులలో మిగిలిపోయారు.

పి.ఆర్. కాలేజీ అనగానే నాకు వ్యక్తిగతంగా మొదట గుర్తుకు వచ్చేది క్రికెట్. ఇంచు మించు ఐదో క్లాసు లో క్రికెట్ ఆడడం మొదలు పెట్టిన దగ్గర నుంచీ, ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళే దాకా మా క్రికెట్ రోజు వారీ ప్రాక్టీసు, వారాంతంలో మా మేచ్ లూ, పెద్ద వాళ్ళ  పెద్ద మేచ్ లు అన్నీ ఆ కాలేజ్ ప్రాంగణం లోనే. రోజూ సాయంత్రం అయ్యే సరికి అక్కడ కనీసం యాభై టీములు ఆడుతూ ఉండేవి. ఆట అవగానే, కొంచెం చీకటి పడుతూఉండగా సత్తి రాజు పట్టుకొచ్చిన ఐస్ క్రీములు తినేసి రామారావు పేటలోనే ఉన్న శివాలయానికి వెళ్లి పోయి అక్కడ సాతాళించిన శనగలు తినేసి ఇంటికెళ్ళి పోయే వాళ్ళం.  ఇక సాంస్కృతిక పరంగా గుర్తుకు వచ్చేది పి.ఆర్. కాలేజీ వారోత్సవాలు.

1940 దశకంలో ఈ ఉత్సవాలని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ప్రారంభించారు. ఒక వారం రోజుల పాటు పెద్ద స్టేజ్ కట్టించి, దేశం నలుమూలలనుంచీ మహానుభావులనీ, గొప్ప వక్తలనీ, పండితులనీ పిలిపించి మాట్లాడించడం, హరి కథ, బుర్ర కథ, సాంఘిక నాటకం, పౌరాణిక నాటకాలు వేయించడం, గొప్ప గాయనీమణులు, గాయకులచేత కచేరీలు చేయించడం ఒక్క కాకినాడ పట్టణమే కాక తూర్పు గోదావరి జిల్లా అంతా ఈ సాంస్కృతిక వాతావరణంలో వారం రోజుల పాటు తరించడం …అదీ ఈ వారోత్సవాల ప్రభావం.

ఈ వారోత్సవాల కోసమే కృష్ణశాస్త్రి గారు  “జయ జయ ప్రియ భారత “ వంటి అద్భుతమైన గేయాలు వ్రాసి, సీత-అనసూయల చేత పాడించే వారు. ఈ వారోత్సవాల లోనే మహా కవి శ్రీశ్రీ గారి “మహా ప్రస్థానం” కూడా అనసూయ గారు తొలి సారి ఆయన సమక్షంలోనే వరస కట్టి పాడారు. ఇవన్నీ ఆ తరువాత రికార్డు గా కూడా వచ్చాయి. నేను దేవులపల్లి వారిని గారిని చూడ లేదు కానీ, బాగా చిన్నప్పుడు ఈ వారోత్సవాలలో పాడడానికి ఒక సారి సీత-అనసూయ లు మద్రాసు నుంచి వచ్చి “జయ జయ ప్రియ భారత” పాడడం బాగా గుర్తు. ఆ తరువాత 1980 లో వారిద్దరితోటీ మా తమ్ముడి పెళ్ళిలో పాడించుకునేటంత అవినాభావ సంబంధమూ, చనువూ నాకు కలిగాయి.

నా ప్రి-యూనివర్సిటీ చదువు కి కొన్నేళ్ళు అటు, ఇటూ కూడా కాకినాడ పి.ఆర్. కాలేజ్ రెండి ప్రాంగణాలలోనూ నేను అత్యున్నతమైన సాంస్కృతిక కార్యక్రమాలని చూశాను. బాలాజీ చెరువు దగ్గర సైన్స్ కేంపస్ & హైస్కూల్ ప్రాంగణం లో ఉన్న క్వాడ్రాంగిల్ హాల్ లో నేను విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, జటావల్లభుల పురుషోత్తం, కాటూరి వేంకటేశ్వర రావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, జాషువా, భమిడిపాటి రాధాకృష్ణ, రావి కొండల రావు, బివి. నరసింహా రావు, ఎస్. రాధాకృష్ణన్ గారు, బాలాంత్రపు రజనీకాంత రావు గారు, నేరెళ్ళ వేణు మాధవ్…ఇలా ఒకరేమిటి….ఆ నాడు తెలుగు నాట పేరున్న సాహితీ నిష్ణాతులందరినీ….విన్నాను. కళాకారుల ప్రదర్శనలని చూశాను. భువన విజయం, పాండవోద్యోగ విజయాలు, పేరయ్య రాజంట, గయోపాఖ్యానం లాంటి భారీ నాటకాలు, కుక్క పిల్ల దొరికింది, దంత వేదాంతం, కీర్తి శేషులు లాంటి  సాంఘిక నాటకాలు చూసి తరించాను. వాటిల్లో నటించిన రావి కొండల రావు, హరనాథ రాజు, ఏడిద నాగేశ్వర రావు (శంకరా భరణం సినిమా నిర్మాత), నల్ల రామ్మూర్తి…లాంటి చాలా మంది ఆ తరువాత సినీ రంగంలో రాణించారు.

ప్రస్తుత్త పరిస్థితికి వస్తే…..

నేను రెండేళ్ళ క్రితం ఒక సారి కాకినాడ వెళ్ళినప్పుడు ఆప్త మిత్రుడు యనమండ్ర సూర్యనారాయణ మూర్తి తో మా పి.ఆర్. కాలేజ్ ప్రాంగణాన్ని చూడడానికి వెళ్ళగానే అక్కడ  ఆర్ధిక వనరుల కొరత కొట్టొచ్చినట్టు కనపడింది. ముందుగా ఆకట్టుకున్నది చిందర వందరగా పెరిగిపోయిన గడ్డి, అడ్డదిడ్డంగా ఎదిగిపోయిన చెట్లూ, భవనాల లోనూ ఎటు చూసినా maintenance లేని వాతావరణమే!

రాజు, వై. యస్సెన్...తదితరులు

రాజు, వై. యస్సెన్…తదితరులు

తక్షణం మరొక ఆప్తుడూ, హ్యూస్టన్ నివాసి కూడా అయిన డా. ముత్యాల మూర్తి కలిసి వై. యస్. ఎన్. మూర్తి, కాంట్రాక్టర్ స్నేహితుడు వినోద్ ల సహకారంతో లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి, సుమారు పాతిక ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని కొంత వరకూ బాగు చేయించాం. కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఎం. సత్యనారాయణ గారినీ, పూర్వ విద్యార్ధుల సంఘం  సభ్యులనీ కలుసుకుని అనేక అంశాలు, ముఖ్యంగా వారు తలపెట్టిన “విద్యార్ధుల మధ్యాహ్న భోజన పధకం” పుట్టు పూర్వోత్తరాలు, నిర్వహణలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం.

నేను వెనక్కి అమెరికా రాగానే అందరినీ బతిమాలుకుని, అందరిలో కొందరి దాతృత్వం ప్రధాన కారణంగా ఈ “విద్యార్ధుల మధ్యాహ్న భోజన పధకం” కింద 125 మందికి కిందటేడు ఆరు నెలలు ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాం. కాలేజ్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ గారూ, స్టాఫ్ మెంబర్  శ్రీనివాస రావు గారు, పూర్వ విద్యార్థుల సంఘం నుండి మా వై.ఎస్.ఎన్. మూర్తి, ఉషా రాణి గారు మొదలైన వారెందరో దీనికి సహకరించారు. ఆ సమయంలో నేను మళ్ళీ కాకినాడ వెళ్లి ఒక రోజు లాంఛన ప్రాయంగా విద్యార్థులకి అన్న దానం చేస్తూ, దానికి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఉన్న బోర్డు దగ్గర తీయించుకున్న ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

రేకుల షెడ్డులో క్లాస్ దగ్గర నేను, తురగా చంద్ర శేఖర్

రేకుల షెడ్డులో క్లాస్ దగ్గర నేను, తురగా చంద్ర శేఖర్

ఇలాంటి ఫోటోలు, గొప్పలు చెప్పుకోవడాలు రాజకీయ వాదుల సొత్తే అని తెలుసు కానీ..నా ఉద్దేశ్యం అది కానే కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడు పి.ఆర్. జి. జూనియర్ కాలేజ్ కి విస్తరించడమే కాకుండా, అక్కడి భవనాలు , ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆ క్వాడ్రాంగిల్ పునరుద్ధరణ కూడా మా బృందం చేపట్టింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఎస్. వీ. రంగారావు, రేలంగి, మహర్షి బులుసు సాంబమూర్తి, దుర్గాబాయమ్మ గారు, రఘుపతి వెంకట రత్నం నాయుడు గారు మొదలైన వేలాది లబ్ధప్రతిష్టులు నడయాడిన ఆ  కళాశాల, ఆ క్వాడ్రాంగిల్ హాల్ ఇప్పుడు ఎలా ఉందో ఆరు నెలల క్రితం నేను వెళ్ళినప్పుడు తీసిన ఫోటో, ఆరు బయట రేకు షెడ్డు క్రింద క్లాసు ముందు చంద్ర తురగాతో ఉన్న ఫోటో  ఇక్కడ జతపరుస్తున్నాను. ఆ రోజు నా మానసిక పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. దేవుడి దయ, దాతల విరాళాల వలన గత ఆరు నెలలలో కొన్ని భవనాలు బాగు చేశాం. మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీ కి కూడా విస్తరించాం. మరో మూడు నెలల్లో ఈ క్వాడ్రాంగిల్ హాల్ ని పునర్నిర్మాణం పూర్తి చేస్తాం.  మా బృందానికి కాకినాడలో వెన్నెముక గా నిలుస్తున్న వారు తురగా చంద్ర శేఖర్ & యనమండ్ర సూర్యనారాయణ మూర్తి.  అమెరికాలో ముత్యాల మూర్తి. కేవలం దాతల సహకారంతోటే ఈ మాత్రం సహాయం చెయ్యగలుగుతున్నాం.

అంతెందుకూ, ఇప్పుడు మా పి.ఆర్. కాలేజ్ వారి అధికారిక వెబ్ సైట్ లో కానీ, పూర్వ విద్యార్థుల సంఘం వారి వెబ్ సైట్ లో కానీ ఆ కళాశాలతో ఎంతో అనుబంధం ఉన్న దేవులపల్లి వారు, వెంకట రత్నం నాయుడు గారు, దుర్గాబాయమ్మ గారు, బులుసు సాంబమూర్తి గారు, పాలగుమ్మి పద్మరాజు, సి. పుల్లయ్య, వీణ చిట్టి బాబు, బులుసు వెంకటేశ్వర్లు, సినీ నటులు హరనాథ్, రావు గోపాల రావు మొదలైన వారి ఎవరి పేర్లూ కనపడవు.

భారత దేశం మొత్తం లోనే తొలి కళాశాలలలో ఒకటైన 162 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇటువంటి అనేక విద్యాలయాలని గాలికొదిలేసి, అవి నేర్పే తెలుగు భాషని పక్కనే ఉన్న బంగాళా ఖాతంలో ముంచేసి, సింగపూర్ లో ఎత్తయిన భవనాలు, జపాన్, అమెరికా వారి స్మార్ట్ నగరాల ఊహా సౌధాలలో విహరించే మన రాజకీయ వ్యవస్థని, పరిపాలనా యంత్రాంగాలనీ, వాటిల్లో వెతకక్కర లేకుండానే సర్వత్రా కనపడుతున్న “మానసిక” దారిద్ర్యం గురించీ ఏమనాలి? ఏం చెయ్యాలి? ఎవరో, ఏదో చేస్తారు అని అనుకునే బదులు, ఆక్రోశించే బదులు మనకి చేతనైన మంచి పనులు మనం చేద్దాం. ఏమంటారు ?  నా జీవితంలో నేను నేర్చుకున్న, ఆచరించే ప్రయత్నం చేస్తున్న ఒక చిన్న పాఠం. ఆ పాఠానికి అక్షరాభ్యాసం జరిగింది కాకినాడ పి.ఆర్. కాలేజీ లో.

 –వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

 

ఇలా ఎప్పటికప్పుడు…

మనస్సు కకావికలం అయినప్పుడు
కేవలం నేనొక శకలం లా మిగిలినప్పుడు
ఒక చిన్న మాట కూడా తుత్తునియ చేస్తుంది

కానీ మరుక్షణం లోనే
నేను ముక్కలు ముక్కలుగానైనా
మళ్ళీ జీవం పోసుకుంటాను ,
జీవితేచ్చ తో కెరటమల్లె ఎగిసిపడతాను
అయినా ఇలా ఎప్పటికప్పుడు
కొత్తగా పురుడు పోసుకోవడం
నేనేన్నిసార్లు చూడలేదుకనుక

ఇన్నేళ్ళ జీవితోష్ణానికి ఇంకిపోయిన
చల్లని భావసంద్రమంతా
బడబాగ్నిలా మారి దహించి వేస్తుంది
బహుశా నీరు నుండి నిప్పు పుట్టడం అంటే ఇదేనేమో

ఆ దహనకాండ ఎలా ఉంటుందంటే
ఏమని చెప్పుకుంటాం చెప్పు
లోలోని పీడలన్నీ దగ్దం చేసే ఆ సెగ ని
సంక్రాంతి  భోగితో సరిగా సంభోదించాలి

ఎక్కుపెట్టిన ఒక్కో ప్రశ్నారవళిని
సవ్యసాచి అమ్ములపొదిలోని
అక్షయ తూణీరంతో
సరిసమానం అని చెపితేనైనా సరిపోతుందా

ఎలా వర్ణించినా వర్ణననకు
చిక్కనిది ఇంకా మిగిలే ఉంటుంది
తెనేటీగకే పట్టు దొరికే తేనే లాగ
అనుభూతికే చిక్కే అంతర్జనిత ఆహ్లాదం లాగా

ఇక షడ్రుచులు అనుభూతిస్తూ
ఉగాది కి పిలుపునిచ్చి
వసంతాన్ని ఆహ్వానించాల్సిందే

-పూర్ణిమా సిరి 

purnima siri

రవివర్మ తమ్ముడికి అందిన అందాలు

రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం

రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం

చూపుడువేలు, చిటికెన వేలు.. కొండ, లోయ.. పువ్వు, మొగ్గ.. అన్న, తమ్ముడు.. ఇలాంటి అసమానతలు తొలగేవి కావు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. రోజులను అణగదొక్కుతూ కర్ణకఠోరంగా వెళ్లిపోయే కాలమనే రోడ్డు రోలరు పక్కన మౌనంగా నుంచుని అందమైన తేడాలు తప్ప అన్ని తేడాలూ సమసిపోవాలని కోరడం మినహా మరేమీ చెయ్యలేం. అందమైన తేడాలు నిజంగానే అంత బావుంటాయా?

రాజా రాజవర్మ.. అవును రాజా రాజవర్మనే! రాజా రవివర్మ కాదు. రవివర్మ తమ్ముడు. అన్న అనే చిక్కని నీడ కింద పూర్తిగా వికసించకుండానే నేలరాలిన మొగ్గ. అన్నను జీవితాంతం అంటిపెట్టుకుని అతని కంటికి రెప్పలా, చేతికి ఊతకర్రలా బతికిన మనిషి. సోదరుడు పురుడుపోసిన హిందూ దేవతలకు బట్టలు సర్దిన మొనగాడు. అన్న బొమ్మకట్టిన నానా రాజుల, తెల్లదొరల ముఖాల వెనక కంటికింపైన తెరలను వేలాడదీసిన సేవకుడు. రవికి బంటురీతిగా మెలగి, అతని వెంట ఆసేతుహిమాచలం తిరిగి, ఏవేవో పిచ్చికలలు కని, అవి తీరకుండానే అర్ధంతరంగా వెళ్లిపోయిన ఒక మసక రంగుల జ్ఞాపకం.

మనకు రవివర్మ గురించి తెలుసు. జనం అతని దేవతల బొమ్మలను పటాలు కట్టుకుని పూజించడమూ తెలుసు. అతని నున్నటి వక్షస్థలాల మలబారు, నాయరు అందగత్తెల చూపులకు మన చూపులు చిక్కుకోవడమూ తెలుసు. అతని చిత్రాలు యూరోపియన్ కళకు నాసిరకం నకళ్లని, వాటిలో కవిత్వం, సహజత్వం లేదని, అతనిదంతా క్యాలండర్ ఆర్ట్ అని.. కారణంగానో, అకారణంగానో చెలరేగే విమర్శకుల గురించీ కొంత తెలుసు. ఆ తెలిసిన దాంట్లోంచి అరకొరగా, అస్పష్టంగా కనిపించే అతని తమ్ముడి కథేంటో తెలుసుకుందాం.

ఇద్దరు వర్మలు

ఇద్దరు వర్మలు

రాజవర్మ రవివర్మకంటే పన్నెండేళ్లు చిన్న. 1860 మార్చి 3న కిలిమనూర్ ప్యాలెస్ లో పుట్టాడు. నాటి త్రివేండ్రమైన నేటి తిరువనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కిలిమనూర్. తండ్రి ఎళుమావిల్ నీలకంఠన్ భట్టాద్రిపాద్. బ్రాహ్మణుడు, సంస్కృతంలో పండితుడు. తల్లి ఉమా అంబాబాయి క్షత్రియ. కవయిత్రి, గాయని. వీరికి నలుగురు పిల్లలు, రవివర్మ, గొడవర్మ, రాజవర్మ, మంగళాబాయి. మాతృస్వామ్య వ్యవస్థ కనుక ఉమ పుట్టింట్లోనే ఉండేది. ఆమె సోదరుడి పేరు కూడా రాజా రాజవర్మే. చిత్రకారుడు. ఇంట్లో కథాకళి నాట్యాలు, సంస్కృత నాటకాలు, కచేరీలు సాగేవి. రవివర్మ మేనమామ వద్ద తొలి కళాపాఠాలు నేర్చుకుని పద్నాలుగేళ్లప్పుడు త్రివేండ్రానికెళ్లాడు. రాజాస్థాన చిత్రకారుల వద్ద, అతిథులుగా వచ్చిన పాశ్చాత్య చిత్రకారుల వద్ద నానా తంటాలుపడి తైలవర్ణ చిత్రాలు నేర్చుకున్నాడు. రవివర్మ పెద్ద తమ్ముడు గొడవర్మ సంగీతంలో దిట్ట. చెల్లెలు కూడా బొమ్మలు వేసేది. చిన్నతమ్ముడు రాజవర్మ త్రివేండ్రమ్ లో ఇంగ్లిష్ చదువులు చదువుకున్నాడు. షేక్ స్పియర్, ఆలివర్ గోల్డ్ స్మిత్, బాల్జాక్ రచనలంటే ఇష్టం.

రవివర్మ పేరు దేశమంతటా మారుమోగింది. దేశంలో ఇన్నాళ్లకు పాశ్చాత్యులకు సరితూగే కళాకారుడు పుట్టాడని దేశీ కళాపిసాసులు ముచ్చటపడ్డారు. బొమ్మలు వేయించుకోవడానికి రాజులు, తెల్లదొరలు బారులు తీరారు. చేతినిండా పని. లావాదేవీలు, ఉత్తరప్రత్యుత్తరాలు నడపడానికి మనిషి కావాలి. ఇంగ్లిష్, దొరల మర్యాదలూ గట్రా తెలిసినవాడు కావాలి. తమ్ముడు నేనున్నానని ముందుకొచ్చాడు. సెక్రటరీ మొదలుకొని నౌకరీ వరకు అన్ని పనులూ చేసిపెడతానన్నాడు. అన్న తమ్ముడికి బొమ్మలు నేర్పాడు.

చిత్రాయణంలో రామలక్ష్మణుల ప్రస్థానం మొదలైంది. రవివర్మ బరోడా రాజు కోసం వేసిన నలదమయంతి, శంతనమత్స్యగంధి, రాధామాధవులు, సుభద్రార్జునులు వంటి పౌరాణిక చిత్రాల రచనలో రాజవర్మ ఓ చెయ్యేశాడు. చెల్లెలు మంగళాబాయి కూడా రంగులు అద్దింది. నైపుణ్యం పెద్దగా అక్కర్లేని బట్టలు, ఆకాశం, నేల, బండలు, ఆకులు, చెట్ల కాండాలు వగైరా వెయ్యడం వాళ్లపని. అన్నకు తీరికలేకుంటే దేవతల ముఖాలపైనా, చేతులపైనా చెయ్యిచేసుకునేవాళ్లు. అన్న వాటిని సరిదిద్దేవాడు. అంతా కుటీరపరిశ్రమ వ్యవహారం.

రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు

రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు

పచ్చని కేరళ సీమలోకి తొలుచుకొచ్చిన సముద్రపు కాలవల్లో చల్లని వెన్నెల రాత్రి పడవ ప్రయాణాల్లో అన్నదమ్ములు భారత భాగవత రామాయణాలు చెప్పుకున్నారు. ఏ దేవతను ఏ రూపలావణ్యాలతో కేన్వాసుపైకి తీసుకురావాలో ముచ్చటించుకున్నారు. బొమ్మలు వెయ్యడానికి దేశమంతా తిరిగారు. మద్రాస్, మైసూర్, బాంబే, బరోడా, ఉదయ్ పూర్, ఢిల్లీ, లక్నో, కాశీ, ప్రయాగ, కోల్ కతా, కటక్, హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, విజయవాడ.. అన్నదమ్ములు కాలూనని పెద్ద ఊరుకానీ, స్నానమాడని నది కానీ లేకుండా పోయింది. కొన్ని బొమ్మలను కలసి వేసేవాళ్లు. వాటిపై ఇద్దరూ సంతకాలు చేసేవాళ్లు. కలసి నాటకాలకు, గానాబజానాలకు వెళ్లేవాళ్లు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రికల్లో న్యాపతి సుబ్బారావు పంతులు వంటి కాంగ్రెస్ నేతల రాతలు చదువుతూ దేశ స్థితిగతులు చర్చించుకునేవాళ్లు. బాంబే రెండో ఇల్లయింది. దాదాభాయ్ నౌరోజీ, తిలక్, రనడే, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మహామహులతో కలసి తిరిగేవాళ్లు. కోల్ కతా వెళ్లినప్పుడు టాగూర్ల జొరసొంకో భవంతిలో బసచేశారు. అబనీంద్రనాథ్ టాగూరు బొమ్మలు రవికి నచ్చాయి.

అన్నకు పౌరాణిక గాథలపై మక్కువ. తమ్ముడు ప్రకృతి ఆరాధకుడు. దాని పరిష్వంగంలో పులకరింతలు పోయాడు. ప్రకృతి(ల్యాండ్ స్కేప్) చిత్రాలు భారతీయ కళలో అంతర్భాగం. మొగల్, కాంగ్రా, బశోలీ, రాజ్ పుత్ వగైరా కళాసంప్రదాయాలన్నింటా చెట్టుచేమలు నిండుగా ఉంటాయి. రాజవర్మకు అవి నచ్చలేదు. తనపై పాశ్చాత్య కళాప్రభావం ఉంది కనుక తన దేశ ప్రకృతిని పాశ్చాత్య కళాకారుల్లాగే ఆవిష్కరించాడు. ఆంగ్లేయ ప్రకృతి చిత్రకార దిగ్గజాలు టర్నర్, కాన్ స్టేబుల్ లపై వచ్చిన పుస్తకాలను చదివాడు. రాజవర్మ ప్రకృతి ప్రేమ, కవితా హృదయం అతని డైరీల్లోని ప్రకృతి వర్ణనల్లో గోచరిస్తుంది. రవివర్మ రాజమందిరాల్లో రాచగణాన్ని చిత్రించే వేళ తమ్ముడు చెట్టుచేమా, చెరువులూ కాలవలూ పట్టుకుని తిరిగేవాడు.

పల్లెపడుచు

పల్లెపడుచు

స్టూడియోకు తిరిగొచ్చి వాటిని చిత్రికపట్టేవాడు. ఒడ్డున కొబ్బరి చెట్లతో, లోపల గూటిపడవతో, నారింజరంగు నింగి వెలుతురు ప్రతిఫలించే పరవూర్ సరస్సును, ఆకుపచ్చ నీటి కాలవలను, చెరువుగట్లను ఇండియన్ ఇంప్రెషనిస్ట్ మాదిరి పొడగట్టాడు. ఒంటిపై తడిచిన తెల్లచీర తప్పమరేమీ లేని యువతిని తొలిసంజెలో నెత్తిపై నీళ్లబిందెతో ఓ చిత్రంలో చూపాడు. ‘పంటకోతలు’ చిత్రంలో..

పంటకోతలు

పంటకోతలు

గోచితప్ప మరేమీ లేని మలబారు నల్లలేత పరువాన్ని ఆవిష్కరించాడు. పసుపురంగుకు తిరిగిన పొలం, ఆకాశం, బూడిదాకుపచ్చలు కలసిన కొబ్బరి తోటల నేపథ్యంలో ఆమె చేరో చేత్తో గడ్డిమోపులు పట్టుకుంది. ఫ్రెంచి రొమాంటిస్ట్, రియలిస్ట్ చిత్రకారులు మిలే, లెపెజ్, జూల్ బ్రెతా వంటివాళ్లు వేసిన ఆడరైతుల బొమ్మలకు ఏమాత్రం తీసిపోదీ కేరళకుట్టి. ‘నాటుసారా కొట్టు’ లో సారాకుండ, సీసాల మధ్య స్టూలుపై వయ్యారంగా కూర్చుని బేరం కోసం ఎదురుచూస్తున్న మలయాళీ బిగువు మగువను పరిచయం చేశాడు. అన్న వేసిన ‘భీష్మ ప్రతిజ్ఞ’ లోంచి కోడిపుంజును అరువుకు తెచ్చుకుని ఆ కొట్టు ముందుంచాడు.

రవివర్మ, రాజవర్మలు సమకాలీన యూరోపియన్ అకడమిక్ కళను చాలా దూరం నుంచే అయినా జాగ్రత్తగా గమనించేవాళ్లు. ‘ది ఆర్టిస్ట్’ పత్రిక తెప్పించుకుని చదివేవాళ్లు. రవివర్మ మూర్తిని రాజవర్మ, రాజవర్మ మూర్తిని రవివర్మ చిత్రించేవాళ్లు. ఆప్త బంధువును కోల్పోయిన దుఃఖపురోజుల్లో నెరిసిన గడ్డంతో ఉన్న అన్నను తమ్ముడు ఓ చిత్రంలో చూపాడు. తమ్ముడు కళ్లద్దాలు పెట్టుకుని కిరోసిన్ దీపకాంతిలో దీక్షగా చదువుకుంటున్నట్లు వేశాడు అన్న.

సారా కొట్టు

సారా కొట్టు

మనదేశంలో ఆడవాళ్లు మోడళ్లుగా ముందుకు రావడం అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. అయితే వాళ్లు బట్టలు విప్పడానికి ససేమిరా అనేవాళ్లు. దీంతో అన్నదమ్ములు బ్రిటన్, జర్మనీల నుంచి నగ్నమహిళల ఫొటోలు తెప్పించుకుని వాటితో కుస్తీపడేవాళ్లు. వాళ్ల దేహాలకు చీరలు, రవికలు తగిలించి భారతీయీకరించేవాళ్లు. అందుకే రవివర్మ అందగత్తెలు యూరప్ ఆడాళ్లకు బొట్టుపెట్టి, చీరలు చుట్టినట్లుంటాయనే విమర్శలు ఉన్నాయి. రాజవర్మ 1895 నుంచి 1904 వరకు రాసుకున్న డైరీల్లో అతని జీవితమే కాకుండా రవివర్మ చివరి పదేళ్ల జీవితమూ బొమ్మకట్టినట్లు కనబడుతుంది. అవి ఒకరకంగా రవివర్మ డైరీలు కూడా. రవివర్మకు అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి మిరుమిట్లు గొలిపే అతని కళతోపాటు, రాజవర్మ చేసిపెట్టిన ప్రచారం కూడా సాయపడింది. బొమ్మలు అడిగిన వాళ్లకు అన్న బొమ్మలు ఎంత గొప్పగా ఉంటాయో ఉత్తరాలు రాసేవాడు తమ్ముడు. ఏ సైజుకు బొమ్మకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పడం, వేసిన వాటిని భద్రంగా పార్సిల్ చేసి పంపడం, వచ్చిన డబ్బును బ్యాంకులో వెయ్యడం, రాని బాకీలను వసూలు చెయ్యడం వరకు అన్ని పనులూ పకడ్బందీగా చక్కబెట్టేవాడు. దేశవిదేశాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ల సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుని అన్నవేసిన చిత్రాలను పంపేవాడు.

రవివర్మ తన పెయింటింగులను ప్రజలకు మరింత చేరువ చెయ్యడానికి తపనపడ్డాడు. తన పేరుతో బాంబేలో మిత్రుల భాగస్వామ్యంతో కలర్ లితోగ్రాఫ్ ప్రెస్సును స్థాపించాడు. లావాదేవీలను తమ్ముడికే అప్పగించాడు. భాగస్వామి మోసగించాడు. అన్నదమ్ములు అప్పులపాలయ్యారు. తీర్చడానికి తంటాలు పడ్డారు.

రవివర్మ, రాజవర్మలకు ఆంధ్రదేశంతో తీపి, చేదు అనుభవాలున్నాయి. ఇద్దరూ హైదరాబాద్, కురుపాం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖల్లో బసచేశారు. రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ రైల్వే స్టేషన్ల గుండానే ముంబైకి వెళ్లేవాళ్లు. తాడిపత్రి, రేణిగుంటల్లో కలరా పరీక్షలు చేయించుకున్నామని రాజవర్మ ఓ చోట రాసుకున్నాడు. కురుపాం రాజా వారి ఇంట్లో వడ్డించిన తెలుగు వంటకాలు తమిళ, మలయాళ వంటలకు భిన్నంగా ఉన్నా రుచిగానే ఉన్నాయని రాసుకున్నాడు.

ప్రెస్సుతో ఆర్థికంగా దెబ్బతిన్న అన్నదమ్ములు 1902 తొలి మాసాల్లో హైదరాబాద్ లో బసచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ వంటి మిత్రుల మాటలపై భరోసా పెట్టుకున్నారు. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ తమతో బొమ్మలు వేయించుకుంటాడన్నఆశతో చాన్నాళ్లు పడిగాపులు కాశారు. దేశమంతా గౌరవించిన రవివర్మకు నిజాం మాత్రం ముఖం చాటేశాడు. అధికారులు రేపోమాపో అంటూ తిప్పారు. అన్నదమ్ములు తొలుత సికింద్రాబాద్ లోని దీన్ దయాళ్ ఇంట్లో బసచేశారు. పొరపొచ్చాలు రావడంతో చాదర్ ఘాట్ లో ఇల్లు అద్దెకు తీసుకుని బొమ్మలు మొదలుపెట్టారు. వ్యాహ్యాళికి హుసేన్ సాగర్ తీరానికి వెళ్లేవాళ్లు. చార్మినార్, చౌమొహల్లా, ఫలక్ నుమా ప్యాలెస్ లను, మీరాలం చెరువును చూశారు. ఆడ మోడళ్ల కోసం వాకబు చేశాడు రాజవర్మ. కొంతమంది వేశ్యలు వస్తామన్నారు కానీ మాట తప్పారు. చివరకు ఓ ముస్లిం యువతి ఒప్పుకుందట.

రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్

రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్

రాజవర్మ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హుసేన్ సాగర్ చిత్రాన్నివేశాడు. ఆ చెరువు నీళ్లు వందేళ్ల కిందట ఎంత తేటగా, నీలంగా ఉండేవో ఈ చిత్రం చూపుతుంది. కుడివైపు చెట్ల మధ్య మసీదు గుమ్మటం ఉంది. చెరువు ఒడ్డున గడ్డిలో పశువులు మేస్తున్నాయి. కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. చెరువులో పడవలున్నాయి. నేటి కళాప్రమాణాలకు ఇది నిలవకపోవచ్చు కానీ 1903లో మద్రాస్ లో జరిగిన పోటీలో దీనికి బంగారు పతకం వచ్చింది.

రాజవర్మపై పరోక్షంగా నాటి జాతి పునరుజ్జీవనోద్యమ ప్రభావం ఉంది. పరాయి పాలనలో రవివర్మ హిందూదేవతల బొమ్మలను చిత్రించడం, వాటి నకళ్లను వేలకొద్దీ అచ్చుగుద్ది జనంలోకి తీసుకెళ్లడం ఆ ఉద్యమం సామాజిక ఉపరితలాంశంపై వేసిన ప్రభావ ఫలితమే. రాజవర్మకు కపటత్వం నచ్చదు. మూఢాచారాలు గిట్టవు. బాంబేలో బహుశా ఏదో లావాదేవీలో మోసపోయిన సందర్భంలో 1901 ఆగస్ట్ 1న డైరీలో ఇలా రాసుకున్నాడు, ‘ the markets are all great liars and try to take advantage of the ignorance of the strangers.’ నిజాం బొమ్మను కొంటానని చెప్పి, ఆ తర్వాత బేరం తగ్గించిన ఓ హైదరాబాదీపై కోపంతో 1902 జూన్ 8న.. ‘the majority of the Hyderabad nobles and officials are notorious for their dishonesty, want of truthfulness and immoral character‘ అని తిడుతూ రాసుకున్నాడు. జోస్యాలపై నమ్మకం లేదంటూ.. ’I have myself no belief in palmistry, fortune telling etc., for it is my firm conviction that God has not given men the power to pierce into the mystics of the dark future, for the consequences of possessing such a power would be disastrous to the continuance of the world’ అని 1903 అక్టోబర్ 14న రాసుకున్నాడు.

రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం

రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం

రాజవర్మ క్షత్రియ నాయర్ పెళ్లిచేసుకున్నాడు. పేరు జానకి. పిల్లలు కలగలేదు. బొమ్మలెయ్యడానికి దేశాలు పట్టుకుని తిరగడం వల్ల భార్యను సరిగ్గా చూసుకోలేకపోయాడు. రవి కూడా అంతే. మాతృస్వామ్యంలో, అందునా దేశదిమ్మర చిత్రకారులు కావడంతో భార్యలకు చుట్టాల్లా మారిపోయారు. భార్యను సరిగ్గా చూసుకోలేకపోయానని రాజవర్మ అంత్యకాలంలో అన్న కొడుకు రామవర్మతో వాపోయాడట. రాజవర్మ 1904 చివర్లో మైసూర్ రాజు కోసం బొమ్మలేసే పనిలో బెంగళూరులో ఉన్నప్పుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. పరిస్థితి విషమించడంతో మద్రాసుకు తీసుకొచ్చారు. పేగుల్లో అల్సర్. ఆపరేషన్ చేసిన కొన్నరోజులకే 1905 జనవరి 4న 45 ఏళ్ల ప్రాయంతో కన్నుమూశాడు. అప్పడు జానకికి ముప్పైమూడేళ్లు. ఆమె చెల్లెలు భగీరథి ప్రసిద్ధ మలయాళ నవలా రచయిత సీవీ రామన్ పిళ్లై భార్య. భగీరథి అంతకు కొన్నేళ్లముందు ఆరుగురు పిల్లలను అమ్మలేని వాళ్లను చేసి వెళ్లిపోయింది. రామన్ ను పెళ్లాడింది జానకి. అతని నవలలకు ఆమె స్ఫూర్తినిచ్చిందంటారు. ఆమె 1933లో కన్నుమూసింది.

రాజా రాజవర్మ

రాజా రాజవర్మ

గాయకుడికి గాత్రసహకారంలా పాతికేళ్లు తన కుంచెకు వర్ణదోహదం అందించి తన కళ్లముందే సెలవంటూ వెళ్లపోయిన తోడబుట్టినవాడి మరణంతో రవివర్మ కుదేలయ్యాడు. పైగా మధుమేహం, మతిమరపు, ప్రేలాపనలు. అప్పటికే రవి భార్య చనిపోయి చాలా ఏళ్లయింది. పెద్ద కొడుకు కేరళవర్మ దురలవాట్లకు లోనయ్యాడు. రవి 1906 అక్టోబర్ 29న తను పుట్టిన కిలిమనూర్ ప్యాలెస్ లోనే ఆఖరి శ్వాస తీశాడు.

ఆ అన్నదమ్ములను బతికి ఉన్నప్పుడూ, పోయిన తర్వాతా ఎందరో ఆడిపోసుకున్నారు. అయితే వాళ్లిచ్చిపోయిన బొమ్మలను జనం ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. తలనిండ పూదండ దాల్చే రవివర్మ అందగత్తె వలువల మడతల్లోనో, అతని సరస్వతి, సీత, శకుంతల, దమయంతులు కూర్చున్న రమణీయ వనాల్లోనో, ఆ వనాల దాపు కొలనుల్లోనో, కొలనులపైని కాంతిగగనంలోనో రాజవర్మ కుంచెపూతలు సంతకాల్లేకుండా తారసపడుతూ ఉంటాయి. ఆ అన్నచాటు తమ్ముడి ప్రకృతి లాలసను, అతనికి అందిన అందాలను లీలగా గుర్తుచేస్తూ ఉంటాయి.

-పి.మోహన్

P Mohan

వీరం

Viram

తపన

ధైర్యం

ఏకాగ్రత

ఒక భావన పట్ల నమ్మకాన్ని కూడదీసుకొనే మనోవైఖరి

ఒక ఆచరణకు నడుం బిగించే భావన

ఒక సైనికుడే కావచ్చు

ఇంకో సంస్కర్తే కావచ్చు

లక్ష్యం ఈ తపనకి ఇంధనం, లక్ష్యం ఈ అగ్నికి సమిధ.

కణకణ మండే అగ్ని గోళం ఇది. వీరోచిత శక్తిని ప్రసరిస్తుంది అది.

దానికి తెలియకపోవచ్చు, అది ఏ గొప్ప మేలుని తలపెడుతుందో!

కాని, దానికి తెలిసీ తెలియకుండానే

ఒక మనుగడగా అది మారుతుంది. ఒక ఆశగా నల్దిక్కులా వెలుగుతుంది.

Mamata Vegunta

Mamata Vegunta

మొండెమే లేని లేత మల్లె ఒకటి

resize

మా ఇంట్లో
నేను , మా అమ్మ , ఒక మొగాడు

సెలయేటి అంచులా
మాత్రమే అమ్మ
నిశ్శబ్ద చప్పుడు చేస్తూ

నా గదిలో –
సమాధి లాంటి ఒక నోరు ,
గోడల మేకులకు వేలాడే
మాటల ఆత్మలు ,
ఒక ఖాళీ పడక –
చేయి మెలిపడ్డ బార్బీ దానిపై

నా గదిలో ఎడారి
మా ఇంట్లో ఒక ఉప్పెన
కలిసే ఉంటాయి
పొంచి ఉన్న పులుల్లా

పెట్టీ కోట్
పడకపై దుప్పటి
శిశిర కపోతం తెగిపడ్డ మెడతో
రుద్దేసుకున్నట్టు
అన్నీ ఎప్పుడూ విశాదిస్తూనే ఉంటాయి
ఏదో విశదీకరిస్తుంటాయ్

మా ఇంట్లో ఒక
మొగాడు !

సాంభ్రాణి ధూపం లో
తలారబోసుకుని 
నేరము నిద్రిస్తుంది
మాతోనే ఉంటుంది నేరమొకటి 

నేను మానాన్ని
గుప్పిట్లో పట్టి
లుంగలు చుట్టుకుని 
వెక్కిళ్ళు పెడుతున్నప్పుడల్లా
ఉలిక్కి పడుతుంది అది

మొగాడు
ఇళ్ళంతా కలియ తిరుగుతున్నాడు
అర్ధాకలి పడ్డ మత్తేభం లా ……………….

( Dedicated to all those delicate flower buds living in terrifying conditions day in and day out…..)

 -ఆంధ్రుడు 

andhrudu

కారా: కదనరంగంలో వున్న రిపోర్టర్‌

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

కా.రా. గారు తన కథల్లో అనుభవం నుంచి వచ్చే అవగాహనకు,  విజ్ఞతకు ఆఖర్న చైతన్యానికి  చాల ప్రాధాన్యతనిస్తారు. అది న్యాయమే. కాని ఆశ్చర్యంగా కారా గారి రాజకీయ అవగాహన మాత్రం ఆయన పరిశీలన నుంచి వచ్చింది. ఆ పరిశీలన నీళ్లల్లో వున్న తామరాకు పరిశీలన వంటిది. ఆ తామరాకు నీటిలో ఎంత మమేకంగా ఉంటుందంటే ఆ ఆకు మీద కూడ నీటి చుక్కలుంటాయి. అయినా ఆ తామర నీటి కొలది లోతుగా వుంటుంది. ఆ నీళ్లు అంటకుండా నీటిస్వభావం గురించి, బురద అంటకుండా బురద స్వభావం గురించి చెప్తుంది. కారా కదనరంగంలో వున్న రిపోర్టర్‌ వంటి కథకుడు.

ఒక కథకునికి ఉండవలసిన వస్తుగతదృష్టి (ఆబ్జెక్టివిటీ అనే అర్థంలో) అలవడడానికి బహుశా ఆయన నేపథ్యం ఆయనకు బాగా అనుకూలించింది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. కాని ఆదివాసీ ప్రాంతంలో కాదు. మైదానప్రాంతంలో  పల్లెటూళ్లో పుట్టి పల్లెటూళ్లో పెరిగారు. పనిచేసే కులాల్లో కాదు. ఇవి ఆయనకు నిమగ్నమై వుంటే ఉండే ఆవేశానికి బదులు పరిశీలన వల్ల వచ్చే సంయమనానికి దోహదం చేసినయి. చిన్పప్పటినుంచే లెక్కలు కట్టే వృత్తికి తోడు ఆయన క్రమంగా లెక్కల విద్యార్థి, లెక్కల మాస్టారు అయ్యారు. కారా గారికి రానురాను మేస్టారు అనేది పర్యాయపదంగా స్థిరపడిరది. 1951 నుంచి 72 దాకా ఆయన కథల్లో మనకి లెక్కలమాస్టారుకుండే ఔచిత్యం (ప్రిసిషన్‌), పరిశీలన కనిపిస్తాయి. శైలిలో కూడ లెక్కల్లో  ఉండే దశలు (స్టెప్స్‌) కూడ అట్లా తప్ప ఊహించుకోలేని విధంగా వచ్చిపడతాయి. బహుశా తెలుగుకథకుల్లో చరిత్ర, భూగోళాలు, స్థలకాలాలు స్వప్నావస్థలో కూడ విస్మరించని అరుదైన స్పృహ గల వాళ్లలో ఆయనొకరు.

పొలిటికల్‌ ఎకానమీకి ఇవన్నీ ఒక వాతావరణాన్ని కల్పిస్తాయి. పరిసరాలను సమకూరుస్తాయి. ఈ సామాజిక దేశకాల పాత్రల నుంచి ఆ దేశ రాజకీయార్థిక నేపథ్యం ఏర్పడుతుంది. లెక్కల విద్యార్థిగా, మేస్టారుగా, శ్రీకాకుళం జిల్లావాసిగా 1857 నుంచి 1972 దాకా సామాజిక పరిణామాల నాడిని ఆయన పట్టుకున్నారు.

 

ఆస్తి సంబంధాలు శ్రమదోపిడీ

ఈ అవగాహన ఆయనకు 1951లో ‘అప్రజ్ఞాతం’ కథ రాసేనాటికే ఏర్పడుతున్నది. అప్పటికి దేశం నుంచి బ్రిటిష్‌వాళ్లు వెళ్లిపోవడం అధికారం కాంగ్రెస్‌ హస్తగతం కావడం, రాజ్యాంగ రచన, తెలంగాణలో కమ్యూనిస్టుపార్టీ సాయుధపోరాట విరమణ చేయడం జరిగిపోయాయి. మొదటి సాధారణ ఎన్నికల్లోకి పోబోతున్నాం.

‘అప్రజ్ఞాతం’ కథలో సుదర్శనం యువకుడు. బి.ఎ. పరీక్షలకు కూర్చున్నాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తూ స్వగ్రామంలో ఉన్నాడు. వయసు ముదిరాక చదువులో ప్రవేశించడం వల్ల విద్యార్థే అయినా విద్యార్థిలా కనిపించడు.

అతనికి దొంగతనానికీ, దోపిడీకి ఉన్న తేడా మార్క్సిజం అధ్యయనం వల్ల అర్థమయింది మాత్రమే కాదు, ఊళ్లో సూరప్పడు వంటి ధర్మకర్త అయిన భూస్వామి దౌర్జన్యపూరితమైన భూసంబంధాల్లో కూడ అర్థమైంది. [1]

“నువ్వు దోపిడీని, దొంగతనాన్ని ఒక్కటే అనుకుంటున్నావు. దొంగతనమంటే నువ్విందాక చెప్పినట్టు ఎవరూ చూడకుండా ఎవరికీ తెలియకుండా కాటేసుక పోవడం. దోపిడీ అనేది వేరు. పట్టపగలు అందరూ చూస్తుండగానే  భుజబలంతోనో, ఆయుధ బలంతోనో, సంఘబలంతోనో ప్రతిఘటించడానికి అసమర్థుణ్ని చేసి దౌర్జన్యంగా ధనాన్నో బంగారాన్నో లేక ఇంకొక సంపదనో స్వంతదారుని చేత తెప్పించి పుచ్చుకొని మహారాజులా తీసుకపోతే – అదీ దోపిడీ”. (అప్రజ్ఞాతం – పే.112, కా.రా.కథలు) ఈ విషయం ఇంకా లోతుగా 113, 114 పేజీల్లో సుదర్శనం వివరిస్తాడు)

సూరప్పడు వంటి జగన్నాథభక్తుడు స్వయంగా తనకు, కూలీలకు ఎవరికీ సోయి కూడ లేకుండా చేసిన దోపిడీ వివరాలు చదివితే (పే.116,117) ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా  శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఆదివాసులను వడ్డీవ్యాపారులు, భూస్వాములు చేస్తున్న దోపిడీ గురించి – వాళ్లు తాము పోడు చేసుకున్న భూముల్లోనే తాము కంబారీలుగా మారడం గురించి దేశవ్యాప్తంగా మార్క్సిస్టు మేధావులు చేసిన విశ్లేషణంతా గుర్తుకొస్తుంది.

“రూపాయికి కాని వడ్డీ అంటే సంవత్సరానికి నూటికి ఏడువేలా?”

“ఇది గణితం. కావలిస్తే ఆ తరవాత కాగితం మీద వేసి చూడు”

ఈ గణితం నుంచి, ఈ శాస్త్రదృష్టి శాస్త్రీయదృష్టికి మారడం నుంచి ప్రారంభమైంది కా.రా. గారి రాజకీయ అవగాహన. లెక్కలు నిష్పక్షపాతంగా చేసినంతకాలం ఈ రాజకీయావగాహన ఇంకోతీరుగా ఉండడానికి వీలులేదు.

భూసంబంధాల్లో – అంటే భూస్వామి-కూలీ సంబంధాల్లో, వర్తకంలో షాహుకారు-రైతు సంబంధాల్లో, పరిశ్రమల్లో – ఫ్యాక్టరీ యజమాని-కార్మికుని సంబంధాల్లో ఈ దోపిడీ స్వభావం అర్థమైనా – (ఇది అర్థం కావడానికి గణితం చాలు) గణితం నుంచి మనిషి అవగాహన తాత్త్వికస్థాయికి పోతేనే దీనికి మూలాలు అర్థమవుతాయి. (గణితానికి – తత్వశాస్త్రానికి ఉన్న సంబంధం ఇవాళ కొత్తగా వివరించనక్కర్లేదు)

“…..ఆస్తంటూ ఎవరి దగ్గరకు ఏ మేరకు చేరినా అది అన్యాయార్జితమే. న్యాయంగా సంపాందించిన డబ్బు మనిషి భుక్తికి మాత్రమే సరిపోతుంది. కడుపుకి లేని పేదవారు ఈ లోకంలో ఉన్నంతకాలం అంతకుమించి చేసిన ఆర్జనంతా అన్యాయార్జితమే.

ఎవడిపొట్ట కొట్టందే మన పొట్టకు మించిన తిండి మన యింట్లో మిగలదు. పదిమంది ఆస్తి చెదిరితే గానీ ఒకడి ఆస్తి పెరగదు” (అప్రజ్ఞాతం- పే.120)

ఆస్తి, ఆస్తిసంబంధాలు, దోపిడీ గురించి 1951 నాటికే కా.రా. గారికి ఇంత స్పష్టమైన అవగాహన ఉండడానికి ఆయనకు ప్రధానంగా తోడ్పడింది పరిశీలన. బ్రిటిష్‌ ఏజెన్సీ నేపథ్యం నుంచి వచ్చిన రచయితలకు – గిడుగు – గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు ఇవ్వాటివరకు – ఈ పరిశీలన అబ్బడానికి అక్కడ జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పరోక్ష దోహదం ఉన్నది. గురజాడ వంటివారికి అది చదువుల వల్ల అబ్బవచ్చు – రాజాస్థానంలో ఉండి అటునుంచి పరిశీలించడం వల్ల కూడ కలగవచ్చు. కొందరికి ప్రత్యక్ష అనుభవం నుంచి రావచ్చు.

తర్వాతకాలంలో ‘యజ్ఞం’ (1964), శాంతి (1971) కథలలో ఈ ఆస్తి, శ్రమదోపిడీ, వర్గసంబంధాల గురించి ఇంకా పెద్ద కాన్వాసుపై – ఆరంభంలో చెప్పినట్లు ఈస్టిండియా కంపెనీ ఈ దేశంలోకి వచ్చి ఇక్కడి ప్రకృతివనర్లను, మానవ వనర్లను మూలాల నుంచి, మూలుగుల నుంచి పీల్చిన క్రమాన్ని పాత్రలు, సంఘటనలు – కథలో భాగంగానూ, వ్యాఖ్యానంగానూ పాత్రలనోటే చెప్పిస్తారు. ‘అప్రజ్ఞాతం’లో గుడిలో చేరినవాళ్ల చర్చ తప్ప, ఆ చర్చలో అనివార్యంగా రాజకీయాలు వస్తాయి గనుక వ్యక్తమయిన రాజకీయ అవగాహనే తప్ప – ఈ రాజకీయ అవగాహనకు రక్తమాంసాలిచ్చే సంఘటనలు ఆ కథలో లేవు. విచిత్రంగా ఈ చర్చ ముగిసినాక రెండు చిన్న సంఘటనలు జరిగాయి. సూరప్పడి కొడుకు జబ్బుపడి బతకడనుకున్నారు. సుదర్శనం అతడు బతకాలని తనకు నమ్మకంలేని దేవునికి మొక్కుకున్నాడు. అతడు బతికాడు. అట్లా తన విశ్వాసాలకు భిన్నంగా మొక్కుకున్నందుకు అతడు సిగ్గుపడ్డాడు. సుదర్శనం పరీక్ష ఫెయిలయ్యాడు. 1951 నవంబర్‌ నాటికి ఇది దేశంలో రచయితలకయినా,  బుద్ధిజీవులకైనా అవగాహనకు సంబంధించిన విషయమే. ఈ కథ ‘జయభారత్‌’లో 1951 నవంబర్‌లో అచ్చయిన నెలలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ పరిపూర్తి అయింది. సుదర్శనం ఏ వర్గ రాజకీయాల ఆధారంగా, ఆస్తి, దోపిడీ సంబంధాల చర్చ చేసాడో ఆ రాజకీయాలు అతి త్వరలో వర్గసామరస్యంలోకి, పార్లమెంటరీ రాజకీయాల్లోకి పరివర్తన చెందాయి.

ఇంక దాదాపు ఒక దశాబ్దం పైన ఇటువంటి చర్చకు తప్ప ఆచరణకు అవకాశం రాలేదు. 1964లో కమ్యూనిస్టుపార్టీ చీలికకు కారణమైన అనేకానేక విషయాల్లో ప్రజల హృదయాల్లో అట్టడుగున ఉడుకుతున్న అస్పష్టమైన వర్గసంబంధ అశాంతికి వ్యక్తీకరణ సామాజిక, రాజకీయార్థిక రంగాల్లో పొడసూపినట్లే సాంస్కృతిక వ్యక్తీకరణగా వచ్చిన ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ ‘యజ్ఞం’.

1964లో వచ్చిన ‘యజ్ఞం’ 1965లో వచ్చిన ‘దిగంబరకవులు’ (ఇంకా ముందుగా వచ్చిన ‘రాత్రి’ కవితాసంకలనం – శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ మొదలు, కె.వి.ఆర్‌., సి.విజయలక్ష్మి వంటి కవుల, కొ.కు., రావిశాస్త్రి వంటి కథకుల రచనలు – 1960-67 మధ్యన వచ్చినవి) చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలకు ముందరి పురుటినొప్పుల వంటివి. వీటిల్లో – ముఖ్యంగా  ‘యజ్ఞం’లో, దిగంబరకవుల్లో అసంబద్ధత (అబ్సర్డిటీ) ఉందనుకున్నా ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ ఉన్నదనుకున్నా అది సమాజంలో ఉన్నదీ – అప్పుడా సమాజానికవసరమయిందీ.

పరిష్కారాల చర్చలోకి వెళ్లడానికన్నా ముందు కా.రా. గారి రాజకీయ అవగాహనకు బలమైన పునాదిగా ఉన్న భారతీయ సమాజాల గ్రామీణ రాజకీయార్థిక జీవితం – ఎంత వెనుకబాటుదయినా దీనికున్న స్వయం ఆలంబనశక్తి – 51 నుంచి ఆయన చాల కథల్లో  ప్రస్తావనకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. గ్రామం – గ్రామంలో భూమిని సాగుచేసే రైతు ఆ వ్యవసాయ సంబంధమైన వృత్తులు – వాళ్ల పరస్పర సహాయ సహకారాల అవసరాలపై ఆధారపడిన ఆర్థికవిధానం – ఎంత బలహీనమైనది, సాధారణమైనదయినా సరే – ఈస్టిండియా కంపెనీ రాకపూర్వపు ఆర్థిక స్థితి ఇది. ఫ్యూడల్‌, రాజరిక పరిపాలనలోనూ, ఉత్తరాన విదేశీ దండయాత్రల్లోనూ – దోపిడీ జరగలేదని గానీ, ఈ ఆర్థిక చట్రం భగ్నం కాలేదనీ కాదు – కాని వృత్తులు చెదిరిపోలేదు. ‘సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు’ విధ్వంసం కాలేదు. ఆ ఆర్థిక విధ్వంసన ఈస్టిండియా కంపెనీతో ప్రారంభమై 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత బ్రిటిషిండియా పరిపాలన వచ్చి అది మన రాజకీయార్థిక వ్యవస్థగా మారిపోయింది.

‘కులంచే అతను సాలె. తండ్రికి ఒక్కడే కొడుకు. తల్లి లేదు. అతడి తండ్రి కులవృత్తి చేతే జీవిస్తుండేవాడు. ఆ సరికే యార్క్‌షైర్‌, లాంకాస్టర్‌ మిల్లుల రాక్షసహస్తాలు భారతదేశంలో నాలుగువంకలా లక్షలాది తంతువాయుల నోటిముందరి ముద్దలు ఒడుచుకపోనారంభించినా, ఈ మారుమూల పల్లెల వరకూ అవి సాగి ఉండలేదు.’ (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.230)

“గత రెండు దశాబ్దాలలో గుర్తింపరానంతగా మారే ప్రపంచంతో మారే మనదేశంతో పాటు మా నాడూ మా గ్రామం కూడ చాల మారిపోయింది.” (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.237)

ఇంక ఇక్కడినుంచి అంటే 237వ పేజీ పేరా 5 నుంచి 239వ పేజీ పేరా 3 వరకు వివరంగా గత రెండు దశాబ్దాల్లో – అంటే -1930ల నుంచి 53 దాకా ప్రపంచంలో, దేశంలో, నాడులో, ఊళ్లో వచ్చిన రాజకీయార్థిక పరిణామాలను కళ్లకు కట్టినట్లు విశ్లేషిస్తారు.

“రెండవ ప్రపంచయుద్ధం నాటి కంట్రోళ్లూ, ద్రవ్యోల్బణం ఫలితంగానైతేనేం, స్వాతంత్య్ర సిద్ధ్యనంతరం ప్రవేశించిన స్థానిక పరిపాలనా నగర సంబంధాల వల్లనైతేనేం, ఈ విధంగా జీవితావసరాల పద్దుల్లో అనవసరమైనవి కూడ చాల చేరిపోయాయి. పచ్చగడ్డి నుంచి బంగారం వరకూ సమస్త పదార్థాల ధరలూ పెరగడమే కాని వరగడం ప్రసక్తి లేదంటున్నాయి.” (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.238)

1951లో రాసిన ‘అప్రజ్ఞాతం’ నుంచి 53లో రాసిన ‘సేనాపతి వీరన్న’ నాటికి కారా గారి రాజకీయ అవగాహనలో పరిశీలన వల్ల మరికొన్ని వివరాలు చేరాయి. దానివల్ల విస్తృతి ఏర్పడింది. మొదటి సాధారణ ఎన్నికలు మాత్రమే కాదు, స్థానిక స్వపరిపాలన కోసం ఎన్నికలు, పంచవర్ష ప్రణాళిక వచ్చాయి. ఈ కథలో పంచవర్ష ప్రణాళిక ప్రస్తావన లేదుగానీ – ‘యజ్ఞం’, ‘కుట్ర’లలో వాటిపట్ల ఆయన అవగాహన కూడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఆస్తి సంబంధాలు, శ్రమదోపిడీ గురించి కారా గారికి ‘అప్రజ్ఞాతం’ (1951), ‘సేనాపతి వీరన్న’ (1953) కథలు రాసేనాటికే స్పష్టమైన వర్గదృష్టి ఏర్పడిరదనీ, యజ్ఞం నాటికి అది క్రియ (యాక్షన్‌)గా పరిణమించక తప్పని అశాంతికి గురయ్యారని చెప్పవచ్చు.

‘అప్రజ్ఞాతం’లో సాధ్యంకాని సంఘటనల చిత్రణ, కథానిర్వహణ, మానవసంబంధాల ఆర్ద్రత ‘సేనాపతి వీరన్న’లో కనిపిస్తాయి. ‘నా వర్గానికి చెందిన వారందరి తరఫున నేనే నెత్తిన వేసుకున్నందు’ (పే.241)వల్ల వచ్చిన కన్ఫెషన్‌లోని శక్తి అది.

ఆనాటి నుంచి ఇవ్వాటివరకు అది 1947, 67, 91 వంటి మైలురాళ్లను కూడ గణనలోకి తీసుకున్నా ఊర్ధ్వముఖంగానే సాగుతున్నది. 1967 దానికొక సమూలమైన సవాల్‌గా వచ్చింది. ఆ సవాల్‌ ముప్పై ఏళ్లకు పైగా కొనసాగుతున్నదే. దానికి దోపిడీ వెతుక్కుంటున్న జవాబుల చర్చను కథగాకన్న ఒక రన్నింగ్‌ కామెంటరీగా 1972లో ‘కుట్ర’లో కారా గారు చెప్పారు. అది శ్రీకాకుళం సెట్‌బ్యాక్‌ నాటి పరిస్థితి.

అభివృద్ధి గురించిన అవగాహన

ఆస్తి సంబంధాలు, శ్రమదోపిడీల గురించి మౌలిక అవగాహన నుంచే ఆయన ‘యజ్ఞం’ కథలో గానీ, తర్వాత రాసిన కథల్లోగానీ భూసంబంధాల్లో వచ్చిన మార్పులు, వ్యవసాయంలో వ్యాపారపంటలు, గ్రామాల్లోకి మార్కెట్‌ ప్రవేశం, డబ్బు ప్రవేశం, మిశ్రమ ఆర్థిక విధానం, గ్రామాల్లో వచ్చినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి, న్యాయం, విద్య, పంచాయితీవిధానం మొదలైన అంశాలను చిత్రించారు.

‘యజ్ఞం’లో ‘‘బాబూ యిక నాకత సెపుతాను ఇనండి’’  (పే.342) అని ఆరంభించి, తన కథ ముగించి అప్పు పత్రం మీద అప్పల్రాముడు వేలుముద్ర వేసే దాకా (పే.352) పదిపేజీలు పరచుకున్న ఆత్మకథ – ఈ దేశంలో రైతుల ఆత్మఘోష – రైతు వ్యవసాయకూలీగా మారి, అప్పులబారిన పడి – బానిసైన కథ. ఆ పదిపేజీలే కాదు ‘యజ్ఞం’ కథలోని రాజకీయార్థిక అవగాహన గురించి ఇప్పటికెంతో చర్చ జరిగింది. కనుక ఆ వివరాల్లోకి, విశ్లేషణలోకి పునరుక్తి భయంతో వెళ్లకుండా ఆ కథ శ్రీకాకుళ రైతాంగ పోరాటానికి ఎట్లా తెరదీసిందో (కర్టెన్‌రైజర్‌ అయిందో) మాత్రమే చెప్తాను.

శ్రీకాకుళం ఏజెన్సీలో  (బ్రిటిష్‌వాళ్లు ఆ పేరుతో పిలిచిన అడవిలో) సవరలు, జాతాపులు అనే ఆదివాసులు పోడుచేసుకుని బతికేవారు. అడవిని నమ్ముకొని బతికేవారు. అక్కడికి ఉప్పు, పులుసు రూపంలో షాహుకార్లు వచ్చారు. అడవిరక్షణ పేరుతో అడవి చట్టాలు వచ్చాయి. చట్టాల అమలుకోసం పోలీసులు వచ్చారు. ఉప్పు, పులుసు కోసమే కాదు నూలుతో మొదలై పెరిగిన నాగరిక అవసరాల కోసం ఆదివాసులు జీడిపప్పు, ఇప్పపువ్వు, తేనె మొదలు అడవిలోని సమస్త సంపదలు, తాము పోడుచేసుకున్న భూమి మాత్రమే కాదు తమ శ్రమ కూడ పణం పెట్టి మైదాన ప్రాంతాలనుంచి వచ్చిన భూస్వాముల, వడ్డీవ్యాపారుల కింద కంబారులుగా మారారు. అంటే తాము పోడుచేసుకున్న తమ కాళ్లకింది భూమిలో తామే బానిసలయ్యారు.

ఇదీ 1964 నాటికి శ్రీకాకుళ సవరలకు, జాతాపులకు వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం తెలివిడి చేసిన సత్యం.

ఆ ఏజెన్సీ అంచున్న ఉన్న సుందరపాలెం అనే మైదానప్రాంత గ్రామంలో ఒక దళితుడైన అప్పల్రాముడు తన కొడుకు సీతారాముణ్ని అప్పుపత్రం మీద సంతకంపెట్టి ఆ స్థితికి నెట్టబోతున్నాడు. ఒక్క  సీతారాముణ్ననే కాదు,  కొడుకులందరినీ, శాశ్వతంగా వాళ్ల సంతానాలను, రైతులు వ్యవసాయకూలీలుగా, వ్యవసాయకూలీలు వెట్టివాళ్లుగా అంటే బానిసలుగా మారే పరిణామక్రమం చరిత్రలో విషాదకరంగా మరోమారు వచ్చిన సంధిదశలో అటు వర్గపోరాట అవసరం అశాంతిలో చీలిన కమ్యూనిస్టుపార్టీ – ఆ లక్ష్యంతో ఆదివాసులను కూడగడుతున్న శ్రీకాకుళ నాయకత్వం – అప్పటికి పేర్కొనదగిన వాళ్లు వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం, రామలింగాచార

ఆ నిప్పందుకున్న నేపథ్యం మైదానప్రాంత సుందరపాలెం మాలపల్లెలో స్పష్టంగా మనం చూడవచ్చు. అప్పల్రాముడు చెప్పుకొచ్చిన ఆత్మకథలో పంచాయితీకి ముందురోజు ‘‘రాత్తిరి మాయింటికాడ తగువయింది’’ (పే.347) అని ఆరంభించి ఒక చర్చను ప్రస్తావిస్తాడు. ఆ చర్చంతా అభివృద్ధి గురించి గ్రామంలోని శ్రమజీవుల దృష్టితో చేసిన చర్చ. మాలవాడలోనే  ఎర్రయ్య ఇంటికి సుట్టపుసూపుగా వచ్చిన పెద్దమనిషి ఒకాయన ఆ చర్చలో జోక్యం చేసుకున్నాడు.

‘‘…..జరుగుతున్న దగా యెక్కడో మీకు తెల్నట్టే ఆయనకీ తెలవదు. దీనికంతటికీ కీలకం యిక్కడెక్కడా నేదు, పైనెక్కణ్నుంచో  వచ్చిన ముప్పు మనందర్నీ ముంచుతోంది.

పండిన పంటంతా కావందుల గోదాలకెళ్లాల. ఎల్లకుండా కూలోడు అడ్డు తగుల్తున్నాడు. ఎనకట్రోజుల్లో అయితే తన్ని సేయించుకునేవోరు. ఇప్పటిరోజుల్లో ఆ పప్పులుడకవు. కూలోడి అడ్డు  వదిలించుకోవాలంటే మిసీన్లు కావాలి. మిసీన్లు తేవాలంటే యెలట్రిసిటీ, రోడ్లూ కావాలి. అంతేకాదు, సదువుకున్న కూలోళ్లు కావాలి. అందుకనే యీ యిస్కూళ్లు. అందుకనే యీ రోడ్లు, యీ యలట్రిసిటీ. ఇయన్నీ మనకోసవే అనుకోడం మన బుద్ధితక్కువ. నీళ్లు తోడ్డానికి మిసీన్లొచ్చేసినాయనే గుంజుకుపోతున్నారు. రేప్పొద్దున దున్నడానికి, ఊడుపులకి, గొప్పులకు, కోతలకు కూడ మిసీన్లు రాబోతున్నాయి. అప్పుడు సూసుకోండి తడాఖా’’ అన్నాడు.

‘బాబయ్యా! మంచన్నది సెబ్బరైపోవడం నాకూ సిత్రంగానే వుంది. కాని జరిగింది జరగబోయేది సూస్తే ఆల్ని కాదనడవెలాగో నాకు తెలకుండున్నది.

నువ్వెవరికుపకారం సేస్తానని బయలెల్లినావు? అదెవరికుపకారం అవుతోంది?…. పున్నానికొచ్చినవోరిని నువ్‌ మొదలెట్టిన యెగ్గెం, పాపంలో దింపింది. దిగినాక తెలిసీ తెలీకా అందరం కూరకపోతున్నం’ (యజ్ఞం – కా.రా.కథలు, పే.347)

35 ఏళ్ల కింద ప్రారంభమైన ఈ యజ్ఞం ఇపుడు విశ్వరూపం దాల్చింది.

అప్పల్రాముడు చాల అమాయకంగా ‘మంచన్నది సెబ్బరైపోవడం నాకూ సిత్రంగానే వుంది’ అని అన్నాడుగానీ ఈ దేశంలో పెట్టుబడి వలస, మార్కెట్‌ ఆర్థికవిధానం వల్ల భూస్వామ్య సంబంధాలు రద్దయిపోతాయని, మిశ్రమ ఆర్థికవిధానంతో పంచవర్ష ప్రణాళికలతో సోషలిజం వస్తుందని భ్రమపెట్టినవారో, పడినవారో – ఈ ముప్పై అయిదేళ్ల ఈ అభివృద్ధిలో ‘యజ్ఞం’ కాస్త విశ్వీకరణ పొందిన రూపాన్ని మన ప్రజల అనుభవానికి తెచ్చారు. భూస్వామ్య సంబంధాలు, సామ్రాజ్యవాద బలంతో ఇంకా బలపడి దేశమంతా దళారీ రాజకీయాలకు తాకట్టుపడిన స్థితి ‘యజ్ఞం’ మరోమారు చదివినా ఊహించుకోవచ్చు.

‘కుట్ర’ (1972)లో బొంబాయిప్లాను మొదలుకొని 1972 వరకు సాగిన రాజకీయార్థిక కుట్రను వివరించిన మేస్టారు గత 27 ఏళ్లుగా ఇంకా ఏం జరిగిందో ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయలేదు. నిజానికి ‘కుట్ర’ ఒక మోనోలాగ్‌, వ్యాఖ్యానం లేదా రన్నింగ్‌ కామెంటరీ అవుతుంది గానీ కథ కాదు. కథగా ‘యజ్ఞం’ మాత్రమే విశ్వీకరణ ఇవ్వాల్టి కుట్రకు ఒక  ప్రొఫెసీ – భవిష్యదవగాహన – సంచలనాత్మక కల్పన.

అందులోనే ఒక ప్రతిక్రియ – అటు శ్రీకాకుళం అడవిలో ప్రారంభమైన సంచలనం ప్రభావం కూడ చోటుచేసుకున్నది.

తన కొడుకును చంపి గోనెసంచిలో తలను, మొండాన్ని కట్టి తెచ్చి పంచాయితీ ముందు పడేసిన సీతారాముడి మాటల్లో అది వ్యక్తమవుతున్నది.

‘‘నువు మమ్మల్ని సచ్చిందాక బానిసబతుకు బతుకమన్నావ్‌. నీకు తెల్నప్పుడు అది సరే. ఇప్పుడు తెలిసినాకా నువు ఆ మాటే అంటే – ఇదిగో నాకిష్టంనేదు.

నా కొడుకు మీద నాకాశెక్కువ. నా కొడుకు బానిసబతుకు బతకడు. నా కొడుకు కంబారి కాడు.

అందుకే పరుగెత్తుకెల్నాను. ఒరేయ్‌! ఓరె, కొడుకా, నువు బానిస బతుకు బతుకుతావా – లేకపోతే సస్తావా? యీయాల సస్తే రేపటికి రెండు. రా నిన్ను సంపుతా’’నన్నాను. ఆడు పరుగెత్తుకొచ్చినాడు….’’

64లో రాసిన ‘యజ్ఞం’లో రెండు భవిష్యత్‌ వాస్తవాలు ఇమిడి ఉన్నాయి. అప్పటికే ప్రారంభమైన శ్రీకాకుళ ఆదివాసీ రైతాంగ సంఘర్షణలో వాటి ప్రభావం కనిపిస్తున్నది. అవి – తమ కొడుకులింక కంబారులు కావద్దు. బానిస బతుకులు బతుకొద్దన్న దృఢనిర్ణయం. అది సాధించాలంటే – పరుగెత్తాలి – అంటే నడకలుగా ఉన్న మార్పు ప్రయత్నం పరుగులుగా, గెంతులుగా మారాలి. కొడుకును చంపుకోవడమా, కొడుకు తండ్రిని చంపుకోవడమా, ఇద్దరూ కలిసిగానీ, విడిగా గానీ శత్రువును చంపడమా – ఆ తర్వాత శ్రీకాకుళంలో తేలిన అంశాలు. కాని కంబారిగా, బానిసగా బతుకొద్దంటే మాత్రం ఏదో గుణాత్మకమార్పు రావాలి. 1964 నాటికి అది షాక్‌ట్రీట్‌మెంట్‌గానే ఉంది. 68లో గానీ అది సాయుధప్రతిఘటన కాలేదు.

హింస శాంతి

అసమానతయే హింస, అందరికీ కనీస వనర్లు, జీవించే హక్కు గ్యారంటీ కావడమే శాంతి అనే అవగాహన కా.రా. కథల్లో అన్నింట్లో కనిపిస్తుంది. హింసాహింసల చర్చ, వాటిపై తన వైఖరి కారా గారు ప్రత్యేకించి వ్యక్తం చేసిన కథలు వీరుడు మహావీరుడు, హింస, శాంతి.

హింస గురించి, శాంతి గురించి బుద్ధిజీవులు తమ వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిన కాలంలోనే కారాగారు ఈ మూడు కథలు రాసారు.

‘ఇద్దరు దెబ్బలాడుతుంటే ఎవళ్లది తప్పని ఎవ్వర్నీ అడగక్కర్లేదు. అడిగితే ఆడిది తప్పని ఈడూ, ఈడిదే తప్పని ఆడూ ఎలాగూ సెప్తారు. అడక్కుండా ఆ పక్కన్నిలబడి ఆళ్లమొహాల్లోకి చూడు, తప్పెవళ్లదో ఎవడూ సెప్పక్కర్లేకుండానే కరక్టుగా నువ్వే చెప్పేస్తావు.

అందుకే నా సింపతీ అల్లిపురం వస్తాదు మీద కాక గంజిపేట రౌడీమీదే ఉండేది’ (వీరుడు-మహావీరుడు – కారా కథలు, పే.379)

‘అయితే మనిషికా ఫైటింగ్‌ స్పిరిటు వొక్కొక్కప్పుడలా వొచ్చేస్తాది. ఎలాటప్పుడు? న్యాయం నీ పక్కనుండాల, అవతలోడు ఫౌలుగేమాడాల. అదేవంటే, దౌర్జన్యానికి దిగాల, సూస్తున్నోళ్లు సీవ కుట్టినట్టు మాటాడకూరుకోవాల! జనం అవతలోడి బలానికి జడిసి అన్యాయానికి నోరెత్తకుండా వున్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం పిరికితనం చూసి ఆడి జులుం మరీ మరీ పెరిగిపోతుండాల. అదిగో అలాటప్పుడు వొచ్చేస్తాది ఎక్కల్లేని ఫైటింగు స్పిరిటూ. అప్పుడు పిల్లిలాటోడైనా పిల్లపులైపోతాడు. పులిపిల్లలా ఎగిరి ఏనుగు కుంభస్థళవైనా అందుకోడానికి పంజా సాస్తాడు.’ (వీరుడు-మహావీరుడు, కా.రా. కథలు, పే.379)

న్యాయం వున్నవానిలో ఫైటింగ్‌ స్పిరిట్‌ వస్తుందని, అపుడు వాడు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినా అది న్యాయంకోసం చేసే పోరాటమే అవుతుందిగాని హింసకాదని ఏ అభ్యంతరం లేకుండా రచయిత ప్రతిపాదిస్తున్నాడు.

అల్లిపురం వస్తాదు, గంజిపేట రౌడీ ఈ అసమ యుద్ధంలోకి కొత్తపేట శాండో ప్రవేశిస్తాడు. విడదీయడానికి కాదు, గంజిపేట రౌడీకి సహాయం చేయడానికి కాదు. అల్లిపురం వస్తాదుకు సహాయం చేయడానికే.

అప్పటికప్పుడే నూరుసార్లు మన్నుతిని నూటొక్కటోసారి లెగడవే ఓ ఫీటుగా లెగుస్తున్న గంజిపేట వీరుడు –

‘లెంజకొడుకా? నేనియ్యాళ నీ సేతుల్లో సచ్చైనా పోతానుగానీ, నీ రకతం కళ్లజూడక మానన్రా’ అంటూ తూలి తూలి నిలబడుతూ కొత్తగా దిగిన శాండో కళ్లకడ్డవైతే యీడెవడన్నట్టు మసక్కళ్లు అప్పగించి చూసేడు.

కొత్తపేట శాండో తన సహాయానికే వచ్చాడని అల్లిపురం వస్తాదుకు తెలిసిపోయింది. అందుకే అంతవరకు కాలుసేయి తప్ప నోరు విప్పనివాడు

‘రారా బాడకావ్‌. నీకు ఏ లంజకొడుకడ్డుపడతాడో నేనూ సూస్తా’ అన్నాడు.

కొత్తపేట శాండో అమాంతం వెళ్లి గంజిపేట రౌడీ చెయి పట్టుకున్నాడు. పట్టుకున్న ఆ చెయ్యి వెనక్కి తిప్పుతూ అన్నాడు….. ఎవడితో? గంజిపేట రౌడీతో…. అంటే దెబ్బలు తింటున్నవాడితో, ఏవనీ?

‘‘ఇంక శాంతించు’’

‘‘ఆ మాట ఆడితో చెప్పు’’ (వీరుడు-మహావీరుడు, పే.381)

ఈ కథ కేవలం ఉస్తాదు, రౌడీల మధ్యన తగువుకాదు. కాదని చెప్పడానికి కథ చివరన కా.రా. గారే వ్యాఖ్యానం చేసారు.

‘…..బిగ్‌పవర్‌లో వున్న ఆకర్షణే అది. మనవనుకుంటాం గానీ యే కాలంలోనైనా, ఏ లెవెల్లోనైనా బిగ్గూ, స్మాలూ తేడాలు వుండేవుంటాయి’ (వీరుడు-మహావీరుడు, పే.383)

పాలస్తీనా – ఇజ్రాయిల్‌ల మధ్యన,  ఇరాక్‌ -కువాయిట్‌ల మధ్యన అమెరికా జోక్యం ఒక్కసారి గుర్తొస్తోంది ఈ నేపథ్యంలో మళ్లీ చదివితే.

హింస, న్యాయం సాపేక్షమైనవి. వర్గస్వభావం కలవి. వాటిని నిరపేక్షంగా నిర్వచించి, అహింసా సూక్తులు పలకడం హింసనే పోషిస్తుంది.

‘హింస’ కారా గారి కథల్లోనే కాదు తెలుగు సాహిత్యంలో అరుదైన కథల్లో ఒకటి. గుండెల్ని పిండేసే మానవీయస్పర్శ. పీడిత ప్రజల పట్ల, అందులోనూ సంఘపరిత్యక్త అయిన స్త్రీ పట్ల పరిపూర్ణ సానుభూతి – ఒక్కమాటలో చెప్పాలంటే – ఇవన్నీ ఎంత సహజంగా, ఎంత నైసర్గికంగా పసివయసులో వుండే కడుపేద ఇంటి అమ్మాయిలో వుంటాయో, ఆ ‘సంగి’ కళ్లనుంచి చెప్తారు రచయిత.

సంగి అక్క పైడమ్మ చేసిన పెళ్లి ఇష్టంలేక భర్తను వదిలేసింది. మారుమనువు ఆలోచన చేయకుండా బతకడానికి విశాఖపట్నం పోయింది. అక్కడ కూలీచేస్తూ బతుకుతున్నది. కాని ఊళ్లో జనం అనుమానం ఆమె ఒళ్లమ్ముకొని బతుకుతున్నదని. కావచ్చుననే సూచన కథలో వుంది. పైడమ్మ విశాఖపట్నం నుంచి నాలుగురోజులుందామని లేదా ఆ బతుకుమీద రోతబుట్టి ఇంటికి తిరిగొస్తే, కులపెద్దలు, బంధువులందరూ పైడమ్మ తల్లికి ఆమెను ఇంట్లో పెట్టుకోవద్దని పంపించివేయమని హితం చెప్తారు. హెచ్చరిక లాంటి హితం. అప్పటికే పైడమ్మ సోదరులెవరూ ఆ కుటుంబానికి సహాయం చేయడంలేదు. ఇంటితో సంబంధాలు కూడ తెంచుకున్నారు.

అక్క విశాఖపట్నంలో ఏం చేస్తుంది, ఎట్లా బతుకుతుంది, అక్కగురించి సమాజం ఏమనుకుంటుంది – వంటి ఏ విషయాలతో సంబంధం లేని రక్తబంధువు సంగికి అక్క రావడం ఒక సంబరం. ఒక పండుగ. ‘అప్ప వెచ్చని రక్తం ఆమె నాళనాళాన వేడిని నింపుతూ, ఆమెను పొదువుకుపోతుంటే’ నిద్దట్లోనే అక్క కావలించుకోగా వొదిగిపోవడమనే అనుభూతి ఒక్కటే సంగి రక్తానికి తెలిసిన పరమసత్యం.

కాని పైడమ్మ వచ్చిన దగ్గర్నించి ఆమెను తిరిగి పంపించే పథకాలూ చుట్టూ అల్లుకుంటున్నాయి. అందులో అందరూ కుట్రదారులనే కాదు, అసహాయులు కూడా.

‘‘ఏం సెయ్యడానికైనా నీ వశవా? నాలుగేళ్ల క్రితం దాకా నీ నట్టింట పెరిగిన బొట్టె ఏణ్నర్థం కితం పండక్కి నీ యింట పసుపూ కుంకం పుచ్చుకుంది. యియ్యాళ నియ్యింటికొస్తే నట్టింట పీటేసి నాలుగు మెతుకులెట్టలేప్పొన్నావు. ఎవరో ఎరగన్దానికెట్టినట్టు గుమ్మంలో ఆకేసి తిండెట్టినావు… ఏటుంది నీ సేతుల్లో’’ అంది సన్నాసమ్మ. (హింస, పే.410,411)

పెద్దమ్మ పైడమ్మకొచ్చిన కష్టాలు, పరిస్థితులు ఎంత హృదయవిదారకంగా వివరించినా లాభం లేకపోయింది. పోనీ బిడ్డెంట తాను పట్నం పోతానంటే మరి సంగి సంగతేమిటన్నది ముందుకొచ్చింది. ముక్కుపచ్చలారని సంగి బతుకు సరిగా తెల్లారాలే అన్నా ఆమె ఎంతగానో ప్రేమించే అక్కను పంపించేయాలన్నదే ఈ వ్యవస్థ క్రూరమైన నిర్ణయం.

ఉదయం సంగి కళ్లు విప్పేవరకే పైడమ్మ వెళ్లిపోయింది.

ఒక్కక్షణం చిన్నప్పట్లా, బావురుమని ఏడవాలనుకుంది. కాని ఏడవడం సంగికి నప్పదు. తల్లి దుఖం గుర్తుకొచ్చింది. ఆ శోకన్నం బరువు మొయ్యలేనంత కాగానే ఆ పిల్ల చప్పున లేచిపోయింది. ఊరికి ఆవడో, ఆవడపైనో వున్న శలకవైపు పోయింది.

ఆ చెలకలో, అంతా నిర్మానుష్యమైన చెలకలో మేకపిల్లలు తనకు తోడు. దూరాన ఒక మేకపిల్లను నక్కలు దాడిచేసి తిన్నాయి. మిగిలిన మేకపిల్లల హృదయవిదారకమైన అరుపులు విని, విపరీతమైన జాలి కలిగి, కన్నులు జేవురించగా

‘‘మాయ ముండల్లారా! రాకాసి ముండల్లారా! మీ పని సెపతానుండండి’’  అంటూ చుట్టూ చూసింది సంగి. ఎండిపోయిన తాటిమట్ట ఒకటి తప్ప ఇంకే ఆయుధమూ దొరకలేదు ఆ పిల్లకు. ‘యియ్యేళ్ల మిమ్మల్ని ఒకళ్లనో ఇద్దర్నో సంపిందాకా నానింటికి పోను’ అని శలకకడ్డంగా బయల్దేరింది.

‘తనకు పట్టని బాధ – ఎవరికో జరిగిన అన్యాయం’ అనకుండా ఆ యెండవేళ నక్కలకోసం వెతుకుతోంది సంగి.

నక్కలు తనకు చిక్కుతాయా? అసలెక్కడ చిక్కుతాయి? చిక్కితే తనేం చేయగల్దు? ఇలాంటి ప్రశ్నలామెకు తట్టలేదు. తట్టవుకూడ.

ఆమె ఆవేశం మనకు అర్థం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి. అంతేకాదు, ఆమె గుండెకూడ మనకుండాలి. (హింస, పే.419)

రచయిత ఈ వ్యాఖ్యానంతో ముగిసే కథకింక వ్యాఖ్యానం అనవసరం. న్యాయం గురించి ఒక రౌడీ, ఒక పహిల్వాన్‌ మధ్యన తగువును, హింస గురించి అక్కచెల్లెళ్ల, తల్లీకూతుళ్ల అనుబంధాన్ని తెంచిన వ్యవస్థ క్రౌర్యాన్ని ఆధారం చేసుకొని తన అవగాహన అందించిన కారా గారు శాంతి గురించి నేరుగా యజమాని కార్మిక సంబంధాల ద్వారానే ‘శాంతి’ కథలో వివరించారు. ఇది 1971లో రాసిన కథ గనక ఈ అవగాహనకొక రాజకీయ పరిణతి రావడం సహజమే. శ్రీకాకుళ రైతాంగ పోరాటం మొదలై, సెట్‌బ్యాక్‌కు గురవుతున్న దశ. విరసం ఏర్పడిన దశ. కారా గారి భావాల్లో చాల స్పష్టమైన వైఖరి ఏర్పడింది.

ఈ కథలో శాంతి గురించి ఒక కవి చెప్పిన మాటల్ని కూడ కార్మిక నాయకునిచేత చెప్పిస్తాడు. ఇలాంటివి ఆ కవి చాల చెప్పేవాడు. ఆవేశంలో అతిగా అన్నాడు అని అనుకున్నానే గాని అందులో నిజం చాల వుంది అనిపిస్తోందిప్పుడు అంటూ కార్మిక నాయకుడు విశ్వనాథం ‘‘న్యాయమైన కోర్కెలు మేం ఒదులుకోప్పోతే శాంతికి భంగం కలుగుతుంది. తీర్చవలసే కోరికలు వారు తీర్చకప్పోతే శాంతికి భంగం కాదు.

శాంతియుతమైన సంప్రదింపుల్లో యింతకాలవూ వారు మొరాయించింది అశాంతికి దారితీసేది కాదు. చట్టసమ్మతంగా మేం రేపు సమ్మె చేయబోతే అది అశాంతికి దారితీస్తుంది. ఆ నిప్పురవ్వలో దేశమంతా మండిపోతుంది.

ఘర్షణకి బాధ్యత ఎప్పుడూ ఒక పక్షానిదే. దేవుడికోసం, దేశం కోసం, మనిషి కోసం లేనివాడే ఎప్పుడూ త్యాగం చేయాలి. రెండోవాడిపై ఎవడు ఏమాత్రం ఒత్తిడి తెచ్చినా అది వాడి హక్కులమీదా, వ్యక్తిమీదా ఘోరంగా చేస్తున్న దాడిలా అనిపిస్తుంది. సమతాధర్మం అన్నది చదువుకున్న పెద్దలందరికీ ఒక్కలాగే అర్థమవుతుంది. నిజంగా చిత్రమైన సంగతి’’ (శాంతి, పే.578)

ఈ వ్యంగ్యంలో ఇవ్వాళ ఇంకెంత నిష్ఠురమైన నిజం కనిపిస్తుందో.

కారా కథల్లో మూడు సందర్భాల్లోనే పోలీసుల ప్రస్తావన వస్తుంది. సేనాపతి వీరన్నలో అతడు దొంగతనం చేస్తున్నాడనే అనుమానానికి దారితీసే పోలీసు కేసుల ప్రస్తావన వుంది. ‘హింస’లో పైడమ్మ కూడ పోలీసుకేసులో ఇరుక్కున్నది.

‘శాంతి’ కథలో మాత్రమే కార్మికుల సమ్మెను భగ్నం చేయడానికి అటు లాకౌటు, అరెస్టులు, పోలీసుల బందోబస్తు, ఇటు కార్మికనాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిడం – ఈ ఏర్పాట్లకన్నిటికీ తగినంత వ్యవధి పొందడానికే కలెక్టర్‌, ఎస్పీ, ఫ్యాక్టరీ యజమానితో కార్మికనాయకుల చర్చలు వంటి ఒక పూర్తి రాజకీయ వాతావరణం – రాజ్యాంగయంత్ర స్వభావం కనిపిస్తాయి.

కారా కథల్లో న్యాయము, పోలీసులు, రాజ్యాంగయంత్రం స్వభావం అర్థమయ్యే కథ ‘శాంతి’ ఒక్కటే. ఇది కూడ ‘కుట్ర’ వలెనే కథకన్నా, అంటే సంఘటనలకన్నా చర్చలమీద ఎక్కువ ఆధారపడి నిర్మాణమైంది.

‘ఆదివారం’ (సరియైన   మార్క్సిస్టు ఫెమినిస్టు దృక్పథం ఉన్న కథ). ‘హింస’, ‘నోరూమ్‌’ (పేదవాళ్ల ప్రేమకు, ప్రైవసీకి హృదయాల్లోనే గానీ నేలమీద చోటులేని విశాల ప్రపంచమిది), ‘ఆర్తి’ (కఠిన నిజాలైన ఆర్థికావసరాలలో నలిగిపోయిన ముగ్ధప్రేమ, పరిష్కారం మాత్రం ఊర్లో పెద్దలే చేస్తారు!), ‘చావు’ (‘అప్పుడు పెళయం తేవాల. అది తేవడం తప్ప ఆడికింకో దారినేదు. దానికాడ ఈ తుపాకులు గిపాకులు, బాంబులు, ఇమానాలు యియ్యేయీ ఆగవు. అది జొరావరులన్నిట్లోకి పెద్ద జొరావరి. దానికి ఇక తిరుగునేదు…. అయితే అది రావడమెలాగొస్తాదో ఎరికా..’’ మాటపూర్తి కాకుండానే …. దభీమని ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు ఓ కట్టెలమోపు అతడిముందు పడింది. తుళ్లిపడి తలెత్తితే  – రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కట్టెలమోపులు ఒకదాని తర్వాత ఒకటిగా నేలబడి ఆ అదుటుకి కట్లు తెంచుకు చెదురుతున్నాయి. పే.640) ప్రళయం, అంటే విప్లవం వస్తే ఎట్లా అంగలుగా గెంతులుగా వస్తుందో కథాశిల్పరీత్యా కూడ గొప్పగా చిత్రించిన కథ.

‘చావు’, ‘జీవధార’ – కథలుగా ఎంత గొప్పవో, అంత వర్గదృష్టితో రాసినవి. పీడితప్రజల పక్షపాతంతో రాసినవి. జీవితంలోని పార్శ్వాలను వైవిధ్యంతో చిత్రించినవి. ఈ అన్ని కథల్లోనూ వర్గచైతన్యంతో కూడిన ధిక్కారస్వభావం, తిరుగుబాటు ప్రస్ఫుటమవుతాయి.

‘సేనాపతి వీరన్న’, ‘అభిశప్తులు’, ‘అశిక్ష-అవిద్య’, ‘యజ్ఞం’, ‘వీరుడు-మహావీరుడు, ‘ఆదివారం’, ‘హింస’, ‘నోరూమ్‌’, ‘ఆర్తి’, ‘భయం’, ‘శాంతి’, ‘చావు’, ‘జీవధార’ – వంటి అన్ని కథల్లోనూ ప్రధానపాత్రలు, నాయకులు, కష్టజీవులు, వృత్తిజీవులు, స్త్రీలు. కారా కథల్లోని రాజకీయ అవగాహన నైశిత్యం ఎక్కడంటే ఆయన కేవలం పేదలపక్షం కాదు. కష్టం చేసి దోపిడీకి గురవుతున్న పేదలపక్షం.

‘అభిశప్తులు’, ‘అశిక్ష – అవిద్య’, ‘ఆదివారం’, ‘హింస’, ‘ఆర్తి’, ‘చావు’ కథల్లో ఆయన పీడిత స్త్రీల విషయంలో ఎంత ఆర్తి కనబరుస్తారో అర్థమవుతుంది.

‘శాంతి’ కథ ద్వారా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు తమ హక్కులకోసం చర్చలు, సమ్మెలు చేయడమైనా వుందని సత్యం చెప్పినట్లుగానే  ‘ఆదివారం’ కథ ద్వారా  అసంఘటిత, అనుత్పాదకరంగంలో వున్న స్త్రీలకు (ఇంట్లో పనిచేసే పనిమనుషులు  ఇంక అందులో అధమతరగతి)  పనిగంటలూ లేవు. ఆదివారాలూ లేవు. కష్టం చేసే ఆ చేతులు నోరుపెట్టుకొని బతుకకపోతే వాళ్ల చిన్న చిన్న కోర్కెలు కూడ నెరవేరకపోవడం అలా వుంచి డొక్కారగట్టుకుని తిండికి అల్లాడవలసిందే.

‘హింస’, ‘నోరూమ్‌’, ‘ఆర్తి’, ‘జీవధార’లో పాత్రలన్నీ అట్టడుగువర్గాల నుంచి వచ్చినవాళ్లు – స్త్రీలు. కథలుగా కూడ ఇవి చాల గొప్పకథలు.

ఇంక కారా గారి కథల్లో తలమానికాలు అయిన ‘యజ్ఞం’, ‘చావు’ కథలు రెండూ దళిత జీవితాలను చిత్రించేవి. ‘చావు’ కథలో అస్పృశ్యత కూడ ఒక ప్రధానమైన అంశంగా నలుగుతుంది.

ఇంత నిశితమైన వర్గదృష్టి, రాజకీయ అవగాహన ఉన్న కారా గారు 1972 తర్వాత ఒక్క ‘సంకల్పం’ తప్ప కథలు రాయలేకపోయారు. ఆయన కథలన్నీ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విరమణ (1951) శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట సెట్‌బ్యాక్‌ (1972)కి మధ్యన వచ్చినవే. ఆయన అనుభవాలు కాకపోయినా ఆయన జీవితం చుట్టూ అల్లుకున్న గాఢమైన  శ్రీకాకుళ పరిసరాలు, ఉద్యమాలు ఆయన పరిశీలనకు ఎంతగానో తోడ్పడ్డాయి.

(ఆధారం – కాళీపట్నం రామారావుకథలు, ఆర్‌.కె.పబ్లికేషన్స్‌, విశాఖపట్నం – 1986)

 

[1] ‘యజ్ఞం’లో శ్రీరాములునాయుడు ధర్మమండపంలో నిలబడి అప్పల్రాముని అప్పు గురించి వర్గదృష్టితో తప్ప ఎట్లా చూడలేడో, చూడలేక తాను న్యాయమే చెప్తున్నాననుకుంటాడో (అది నాలుగుకాళ్ల మీద నడిచే ఆస్తి న్యాయం – శ్రమమీద ఆధారపడిన న్యాయం కాదు) ఇందులో సూరప్పడు కూడ ‘…దోపిడీ చేయలేదు. అతనివల్ల దోపిడీ జరిగింది’ (పే.125) అనుకుంటాడు.

  -వరవర రావు

vv.karaఏబై ఏళ్లుగా కవిత్వం, సాహిత్య రాజకీయ విమర్శ చేస్తున్నారు. ప్రజాపక్ష వక్త. విరసం వ్యవస్థాపక సభ్యులు. సృజన పత్రికను హన్మకొండ కేంద్రంగా నడిపారు మిత్రులతో కలిసి. ప్రత్యామ్నాయ రాజకీయాలకు మద్దతుదారు. చలినెగళ్ళు, స్వేచ్ఛ, సముద్రం, భవిష్యత్తు చిత్రపటం, ముక్తకంఠం, అంతసూత్రం — కవిత్వ సంపుటాల్లో కొన్ని. కొత్త కవితా సంపుటి బీజభూమి ఇటీవలే విడుదలయ్యింది. ఈయన రచనలు ఇంగ్లీషులోకి, హిందీలోకి, ఇంకొన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి

ఒక కన్ను నా వైపు తిరిగి చూస్తున్నదని…

drushya drushyam -main photoసంభాషణ పలు రకాలు.
మాటలుంటాయి. మౌనం ఉంటుంది.
అరుపులుంటాయి. గుసగుసలూ ఉంటాయి.
చూపులుంటాయి. పరిశీలనలుంటాయి.
తొలి చూపుల్లోనే చెప్పవలసిందంతా చెప్పడమూ ఉంటుంది.
ఒక్కోసారి ఎంతకూ తెగని బంధమూ, అనుబంధమూ ఉంటుంది.
మొత్తంగా కమ్యూనికేషన్ అని మనం మాట్లాడుకుంటున్నదంతా ఒక స్పర్శ. అయితే, మానవీయ స్పర్శ ఒక్కటే అత్యున్నతమైంది అనుకుంటూ ఉంటాం. కానీ, కాదు. అసలు మనిషిగా కంటే ఒక ‘మూగ మనసు’ ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక జంతువు మరింత బాగా మాట్లాడుతుంది.

నిజం.

The Man Who Listens to Horses: The Story of a Real-Life Horse Whisperer అన్న పుస్తకాన్ని సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కొన్ననాడు తెలియదు. నేనెంత సెన్సిటివ్ అవుతానో, మున్ముందు అని!

అవును. ఆ పుస్తకం మాంటీ రాబర్ట్స్ అనే గుర్రాల శిక్షకుడి ఆత్మకథ. మనకు ‘కామన్ సెన్స్’ అన్నది ఎంత ముఖ్యమో, ఆయనకు ‘హార్స్ సెన్స్’ అంత ముఖ్యం. అలా భావించే మనిషి చూపు పుస్తకం అది. స్పర్శ పుస్తకం అది. అతడి పుస్తకం ఒక సంభాషణ.

అనాదిగా మనిషి అనాగరీకత నుంచి నాగరీకతలోకి వస్తున్న తీరు తెన్నుల్లో మొత్తం జంతుజాలం ఎంత ఇబ్బందిపడిందో కూడా తెలిపే పుస్తకం. అదే సమయంలో మనిషి ఎంత సున్నితంగా వ్యవహరిస్తే జంతువు తనతో మాట్లాడుతుందో చెప్పే పుస్తకం. మాటలాడిందా ఇక మౌనం వీడి అది మనిషికి ఎంత దగ్గరౌతుందో కూడా ఆ పుస్తకం చెబుతుంది.ఒక రకంగా ‘మనిషి మనీషి’గా మారడం వల్ల ప్రయోజనం లేదు. ‘జంతువుల విషయంలో జంతువు’గా మారడంలోనే అసలైన కిటుకు ఉంది. తెలివిడీ. వివేకమూ ఉంది’ అని ఆయన తన స్వీయానుభవంలో రుజువైన దాన్ని ఎంతో హృద్యంగా వివరిస్తాడు. ఒక్క మాటలో ఈ పుస్తకం గుర్రాలను మచ్చిక చేసుకునే వాళ్లకంటే కూడానూ మనిషి తనను తాను అర్థం చేసుకుంటూ ఎదుటి వాళ్లను అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు పెద్దలతో, సోదరులు సోదరీమణులతో, ప్రేమికులు తమ జీవన సహచరులతో ఎలా మసులుకోవాలో చెప్పే ఉద్గ్రంథం అనాలి. జీవిత వికాసానికి ఈ పుస్తకం బహు చక్కటి గైడ్ అని నా భావన. అనుభవం. పుస్తకం చదువుతుంటే ఆయన సాధుగుణం అతడినే ఎంత సాధుజంతువుగా మార్చిందో తెలిసి వస్తూ ఉంటుంది. ఒకటొకటిగా ఆయా అధ్యాయాల పొంటి మనం పరుగులు పెడుతుంటే గుర్రాలన్నీ నిలుచుండి మనకు స్వాగతం పలుకుతాయి. ఎందుకంటే, ప్రతి పేరాగ్రాఫ్ లో ఆయన మనకట్లాంటి శిక్షణ ఇస్తూ పో్తాడు. పుస్తకం చదివాక “మనకూ ఒక గుర్రం ఉంటే బాగుండు’ అనిపిస్తుంది. లేదా మనమే ‘ఒకరికి మాలిమి అయితే ఎంత బాగుంటుందీ’ అనిపిస్తుంది.చిత్రమేమిటంటే ఆయన గుర్రాలను ఎలా మచ్చిక చేసుకోవాలో ఎవరి వద్దో నేర్చుకోలేదట! ‘మరి ఎక్కడా?’ అంటే, ‘గుర్రాల వద్దే’ అంటాడు. అందుకే తానంటాడు, ‘నేర్పు అన్నది బయట నుంచి రాదు, నేర్చుకోవడం నుంచే అని! అలాగే మనం ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే, వాళ్ల మనసెరిగి ప్రవర్తిస్తే చాలు, ఆ నేర్పు మనలో బహునేర్పుగా కొత్త పాఠాలెన్నో నేర్పుతుందీ అంటాడు.

‘ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ?’ అంటే ఆయన్ని నేను ఫొటోగ్రఫిలో అనుసరించాను గనుక. ఎవరి ఫొటో తీసినా నేను వాళ్ల పర్మిషన్ తీసుకుని తీయను. మాటలాడను. వాళ్ల ‘చిత్తాన్ని’ ఎరిగి ‘చిత్రిస్తాను’. అంతే. తోటకు మాలి ఎట్లో -నేనట్లా ‘చిత్రమాలి’నవుతూ ఉంటాను.

సరే, ఇక ఈ చిత్రం. ఇందులో గాడిద. అది నా వంక… వాళ్లవంకా చూస్తున్నదీ అంటే ‘చదవడం’ కాదు. నిజం. చూడండి. చూస్తూ ఉండండి. నేను ఏం చెబుతున్నానో చూడండి. నేను ఏం చేస్తున్ననో దానికి తెలుసు. అంతేకాదు, నా చిత్రంలో ఉన్న మిగతా ఇద్దరు. ఆమె… ఆ పాపా…వాళ్లేం చేస్తున్నారో కూడా దానికి తెలుసని! అంతా తెలిస్తేనే చిత్రం. లేకపోతే అది నా వంక అలా చూడదు. అందుకే అంటాను, ఒక తెలివిడి. దానికీనూ ఒక చిత్రలిపిలోకి తానూ వస్తున్నదన్న ఒక ‘ఎరుక’ ఉందనీనూ! లేకపోతే ఈ దృశ్యాదృశ్యం వుట్టి దృశ్యమే.

+++

ఎరుక. అది లేకపోతే అది దృశ్యం కాదు. వట్టి ‘చూపు’ అవుతుంది.
ఎర్కలేకపోతే అది చూడదు. వినదు. వెనుక కాళ్లతో తంతుంది కూడానూ.
అందర్నీనూ. అలా నిలకడగా నిలబడిందీ అంటే అదే ఒక సంభాషణ. దృశ్యాదృశ్యం.

అవును. ఇక్కడనే కాదు, ప్రతి దృశ్యంలో మాటలకందని ఇంగితం మహత్తరంగా గోచరిస్తుంది.  ఆ పుస్తకం చదివాక నాకు ఆ సంగతే మెల్లగా తెలియనారంభించింది. ఆ వివేకం నాకు ఎంత ఉపకరించిందీ అంటే చిత్రాల్లో మానవ సంభాషణ ఒక్కటే కాదు, జంతుజాలాన్నీ చూడసాగాను. అనేకంగా చేయసాగాను. ఉదాహరణకు ఈ గాడిద చిత్రం తీసుకొండి. అందులోని ఆ యజమానురాలు మా వాడకట్టులోనే కాదు, మా వీధి అనే కాదు, మొత్తం ముషీరాబాద్ లో గాడిద పాలు అమ్మే మనిషి. రిషాల గడ్డలో ఆమె నివాసం. ఆమె ‘గాడిద పాలో’ అని అరుస్తుంటే మగవాళ్లు పట్టించుకోరు. ఆడవాళ్లు మాత్రం తప్పక పట్టించుకుంటారు. అంటే ఏమిటని అర్థం? మహిళలే ఆమె అరుపును ఆలకిస్తారని. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం గురించి తాపత్రాయం తల్లికే ఎక్కువ కనుక!:

గాడిద వస్తుంటే ఆ వీధిలోని తల్లులకు ఎట్లా ముందుగా తెలుస్తుందో పిల్లలకూ తెలిసిపోతుంది. ఒకసారి తల్లలు గాడిద పాలు పిల్లలకు పట్టించారే అనుకోండి. ఇక ఆ పిల్లలు నెలకోసారి తమ వీధిలోకి వచ్చే ఆ గాడిద అన్నా, ఆ గాడిదను తెచ్చే ఆ తల్లి అన్నా ఒక అభిమానం. పరిచిత ప్రాణం. దాంతో ‘గాడిద పాలో’ అనగానే ఇండ్లలోంచి పిల్లలు ఒక స్టీలు గిలాస పట్టుకుని బయటకు పరుగెత్తుతారు. తల్లులకన్నా ముందే ఆ పిల్లలు గాడిద దగ్గరకు చేరుకుంటారు. నిజం. ఈ దృశ్యాదృశ్యం అదే. అప్పుడు ఆ గాడిదా చూస్తుంది, అన్నింటినీ. అదే చిత్రం.

+++

నేను చెప్పదల్చుకున్నది ఇదే. ఒక దృశ్య వాతావరణంలో కనిపించే తల్లి, గాడిదా, పిల్లవాడూ అంతానూ ఒక స్పర్శ. ఖర స్పర్శ. అవగాహన. ఒక పరిసరాల విజ్ఞానం. సంభాషణ. ఇదంతానూ వాచకంలో చెప్పవచ్చు.కానీ, ఒక చిత్రంలో చెప్పినప్పుడు దాన్ని చూడటం రావాలంటే ఒక అనుభవాన్ని విస్తరించి చెప్పవలసే వస్తుంది కూడా. ఇలా కొంత వినికిడి జ్ఞానం రచించవలసే వస్తుందేమో!

ఇంకా గమనించండి. వొంగి ఆ తల్లి ఆ బిడ్డ చేతిలో చిల్లర వుంచడం, పాలు గ్లాసులో పట్టిచ్చాక ప్రేమగా ఆ చిల్లరను ఆ చిన్ని చేతుల్లో పెట్టడం, అలా ఇవ్వడం…ఆ సంగతంతా ఆ గాడిద గమనిస్తూ ఉండటం. చూడండి. గాడిద కేసి మళ్లీ చూడండి.

అదీ ఓరగా చూస్తుంది. వెనకనుంచి దానికన్నీ కనబడతాయి. అందుకే అనడం, ఇది తన ఉనికి. తనకు తెలిసిన ఉనికి… దృశ్యాదృశ్యం.

monty roberts ( if you like use it inside the matter)

మాంటీ రాబర్ట్ చెప్పిందీ అదే. జంతువుకు జ్ఞానం ఉంటుంది. దృష్టీ ఉంటుంది. కనీసం ఎనిమిది విధాలుగా అది మనతో సంభాషిస్తుందనీనూ. అది గుర్రమైనా, గాడిద అయినా… ఒక జంతువు అవతలి జంతువును ప్రేమగా చూడాలంటే దానికి విశ్వాసం కావాలి. తన యాక్టివిటీ అవతలి వాళ్ల యాక్టివిటీ కనెక్ట్ కావాలి. ఆ యాక్టివిటీ పట్ల తనకు భరోసా కావాలి. అది లేనప్పుడు ఆందోళనగా చూస్తుంది. ఉంటే అది నిమ్మలంగా ఉంటుంది. చూస్తుంది. ఎవరైనా ఒక కొత్త పని చేస్తుంటే దానివల్ల తనకు ఏ హాని లేకుంటే అది కుతూహలంగానూ చూస్తుంది. ఎంజాయ్ చేస్తుంది. చూడండి.

మరో మాట. గాడిదకు అన్నీ తెలుసు. అలాగే వాళ్లకూనూ. దాని పాలు ఎంత అవసరమో ఆ పిల్లలకు తెలుసు. ఆ పాలు పట్టివ్వడం పిల్లలకు ఎంత అవసరమో తల్లులకూ తెలుసు. అలాగే, ఆ పాల అమ్మకం ఆ యజమానికీ, ఆ తల్లులకు వేర్వేరు అవసరాలే అయినా ఎంత అవసరమో కూడా గాడిదకు తెలుసు. అంతేకాదు, ఇదంతానూ నాకూ తెలుస్తూ ఉండటం, ఈ చిత్రం.

ఎరుక అవుతూ ఉండటాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే గుర్రానికీ ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ గురించి తన ఆత్మకథలో మాంటి రాబర్ట్ రాసుకున్నందువల్ల! అతడెన్నో దృశ్యాదృశ్యాలను రచించాడు, ఆ పుస్తకంలో. ఒక ఉదాహరణ చూడాలి…

ఆ రో్జు ఎలిజబెత్ క్వీన్ అతడ్ని తమ గుర్రపుశాలకు ఆహ్వానిస్తుంది. మాంటి రాబర్ట్ వెళతాడు. అరగంటలో ఆ నాటు గుర్రాలన్నీ అతడికి మాలిమి అయిపోతాయి. ఆశ్చర్యపోతుందామె. ‘ఎన్ని రోజులొ పడుతుందో’ అనుకుంటుంది. కానీ ఆయన ఒక్క రౌండ్ ఇలా కలియతిరిగే సరికి అవన్నీ అతడి పెంపుడు జంతువుల్లా మారిపోతాయి. ‘ఇదెలా సాధ్యం’ అంటుందామె. ‘సింపుల్’ అంటాడతను. మరేం లేదు. ‘గుర్రాలతో మనిషిలా బిహేవ్ చేయను’ అంటాడాయన.

మనిషిలా బిహేవ్ చేయక పోవడం!
‘అవును.. ఎన్నడు కూడా మీరు పశువులతో మనుషుల్లా బిహేవ్ చేయకూడదు’ అని ఆయన హెచ్చరిస్తాడు. దానర్థం ‘మిగతా జంతువులకన్నా మనిషి ఉన్నతమైనట్టు అస్సలు వ్యక్తం కాకూడదు’ అని! ఈ సంగతి ఆయన రహస్యం చెబుతున్నట్టు చెబుతాడాయ. ఇంకా ఇలా అంటాడు…’మనిషిలాగా అస్సలు ప్రవర్తించకండి. అవి భయపడతాయి. బెదురుతాయి. ఇక ఎన్నడూ మీకు మాలిమి కూడా కావు’ అంటాడు. ఇదంతా హార్స్ సెన్స్ లో భాగంగా చెబుతాడాయన. ఈ చిత్రంలో నాకు కొంత అనుభవం ఉంది. పిల్లలూ, తల్లులూ, ఆ జంతువును జంతువుగానే చూడగలిగే జంతువూ ఉండటం వల్ల ఈ ఫ్రేంలో దృశ్యం ఒద్దికగా ఇమిడింది. అయితే, మనం జీవిస్తున్న పరిసరాల్లో మనిషిగానే అధికంగా ప్రవర్తించడం వల్ల మనకు జంతువులను చూడ్డం రాదు. వాటిని మనం గ్రహించం. కానీ, అవి మనల్ని గ్రహిస్తున్న తీరూ ఒకటుంటుంది. దాన్ని మనం చూడం. చూడనప్పుడు ఇక ఎంజాయ్ చేయడం అన్నది అత్యాశ. కానీ, ఇప్పుడు చూడండి. ఆ గాడిదను చూడండి. మిమ్మల్ని చూస్తోందది!

దృశ్యాదృశ్యం. చూడాలి.

+++

‘నా వరకు నేను చెబుతాను, నేను గుర్రంతో గుర్రం అయిపోతాను. మనిషి తాలూకూ అధికారం, ఆధిపత్యం అహంకారం ఇవేవీ లేకుండా జెంటిల్ గా ప్రవర్తిస్తాను. ‘జెంటిల్ మెన్’ అంటే అవతలి వ్యక్తికైనా, జంతువుకైనా అతడిష్ఠం. ఎందుకూ అంటే “నేను లోకువ’ అన్న ఫీలింగేదీ అతడికి ఉండదు. అందుకే నా గుర్రాలు నన్ను ప్రేమిస్తాయి. అవి నన్ను క్షణాల్లో స్వారీ చేయమని ఆహ్వానిస్తాయి. నేను రాజులా ఊరేగుతాను. ఎలిజబెత్ రాణి కూడా మొదటిసారిగా గుర్రంపై స్వారీ చేస్తూ, రాణిలా ఫీలైందీ అంటే ఆమె తన అధికారాన్ని ఒదిలిందనే! ఆ జంతువుపట్ల తానూ ఒక జంతువులా..ఒక అనుబంధాల జాలంలో కలబోతై ప్రేమగా ఇమిడినందువల్లే! అందువల్లే గుర్రానికీ ఆమె రాణి అయింది’ అని కూడా మాంటీ రాబర్ట్ వివరిస్తాడు పుస్తకంలో.

ఇక, ఇప్పుడు నా వరకు నేను చెబుతాను. ఇదంతా నిజం. నా వరకూ నాకు నిజం. ఎందుకూ అంటే నేను మనుషులను చిత్రిస్తున్నప్పుడు మనిషిని. ఆడా మగా  కాదు. మనిషిని. జంతువును చిత్రిస్తున్నప్పుడు జంతువునే. అందుకే నేరుగా దాని కళ్లను చూడగలను. చిలుకను చిత్రించినా ఎలుకను చిత్రించినా చూపు నాకు ఆనుతుందీ అంటే అర్థం నాకు అది దృశ్యం. నా సంభాషణా మాధ్యమం అది. నాకే కాదు, నా సోదర చిత్రసీమలో ఉన్న వాహకులదంతానూ ఇదే దృక్పథం. అందుకే అనడం, సంభాషణ ఉంటుంది. అది కళ్లనుంచి మొదలవుతుంది. ఆ తర్వాత అది ఎన్నో గ్రహిస్తుంది. అందుకే ఏ చిత్రాన్ని చూసినా మీరు కళ్లెక్కడ ఉన్నాయో చూడండి. ఇంకా దృశ్యం బాగా అర్థమౌతుంది. నిజానికి ఆమె కళ్లూ, గాడిద కళ్లూ నాకు తెలుసు. చీకటిగా ఉంటాయి. రెండింట్లోనూ ఒక దయ ఉంటుంది. ఒక గాఢమైన లోయలో కురిసే ఒక కను పాప ధార ఉంటుంది. పాల ధార ఉంటుంది. ప్రేమధార ఉంటుంది. అందుకే నేను ఆమెనేమీ అడగను. గాడిదను కూడా అడగను. కానీ, చిత్రించుకుంటాను, చిత్రాలు.

అయితే చిత్రించాకో చిత్రణకు ముందో ఒకసారి ఒక మాట వ్యక్తమైంది మా మధ్య.
ఒకనాడు ఆమెను అనుకోకుండా అడిగాను. ‘అమ్మా ఈ తల్లికి ఏ పేరు పెట్టావూ’ అని!
‘తండ్రీ అని పెట్టాను’ అంది.
అర్థం కాలేదు.
ఏసు’ అని పిలుస్తాను బిడ్డా’ అని వివరించింది.

ఏసు!
అప్పట్నుంచి ఇక ఆ గాడిద చిత్రం తీస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఆ నల్లటి ఛార ఏదో నాకు శిలువ లాగా తోయడం మొదలైంది.
ఆ నాడు మొదలు, ఇక చిత్రంగా నా చూపు మరింత దయగా, ప్రేమగా మారింది. గాడిదను చిత్రిస్తున్నప్పుడల్లా ‘ఏసు’ గుర్తొస్తాడు. పాల ధార వంటి ఒక ఛార…ఎప్పుడూ ఉండనే ఉంటూ ఉన్నది నా ప్రతి చిత్రంలో.

అయితే ఒక ఆశ్చర్యం!
మాంటీ రాబర్ట్స్ నాకు ఎప్పుడూ గుర్తొస్తాడు. నాలోని జంతువును మెలకువలో వుంచుతూ ఉంటాడు.
అవును మరి. అతడేమో జంతువును మనిషిలా చూడకూడదని చెప్పిన గురువు మరి!
ఈమె మాత్రం జంతువును ‘ఏసు’ అని భావిస్తున్నమనీషి.
అందుకే నాకు చిత్రం విస్తృతం అవుతూ ఉంటుంది.

‘దృశ్యాదృశ్యం’లో ఒక కన్ను నా వైపు తిరిగి చూస్తున్నదీ అంటే అది ఏసు.

~ కందుకూరి రమేష్ బాబు

ఆదికాలపు గుడులు అమ్మవారి తోపులే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”

అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. డిమీటర్ అనే గ్రీకుదేవతగురించిన సందర్భంలో క్యాంప్ బెల్ The Great Goddess of the Universe అనడం గురించి గత వ్యాసంలో చెప్పుకున్నాం. వేరే భాషలో అన్నప్పటికీ ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.

ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.

Hekateఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. జార్జి థాంప్సన్ ప్రకారం, ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత కూడా. హెకటే, అర్తెమిస్ ఒకరే ననీ, ఈమె ప్రసూతి దేవత అనీ అంటారు. హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.

ప్రతినెలా కృష్ణపక్షంలో పాడ్యమి రోజున, అంటే పౌర్ణమి మరునాడు స్త్రీలు గుండ్రని అప్పచ్చులు చేసి వాటి మీద కొవ్వొత్తి లాంటి దీపాలు గుచ్చి మూడు మార్గాల కూడలిలో ఉండే హెకటేకు నివేదనం చేస్తారు. ఇది చంద్రుడికి సంబంధించిన తంతు. మూడు మార్గాలు, చంద్రుడికి గల మూడు దశలను సూచిస్తాయి. నివేదనగా అర్పించే దీపాలను ప్రకాశికలు (shiners) అంటారు. చంద్రకాంతిని సంరక్షించడం వీటి వెనుక ఉద్దేశం.

మన దగ్గర కూడా స్త్రీలు శ్రావణమాసంలోనూ, కార్తీక పౌర్ణమి రోజునా వరిపిండి, బెల్లం కలిపి చలిమిడి ముద్దల్లా తయారుచేసి వాటి మీద వత్తి వేసి వెలిగించి పూజిస్తారు. ఇది కూడా చంద్ర సంబంధమైన తంతే.

నాకీ సందర్భంలో శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలోని ఒక తంతుపై కోశాంబి తన Myth and Reality లో చేసిన విశ్లేషణ గుర్తొస్తోంది. నాటకం తొలి అంకంలోనే ఒక కృష్ణపక్షం రోజున, నాయకుడైన చారుదత్తుడు సాయం సంధ్యాదికాలు చేసుకుని, గృహదేవతలకు నివేదన (బలి) సమర్పిస్తాడు. తర్వాత తన మిత్రుడైన మైత్రేయుని పిలిచి, కృతో మయా గృహదేవతాభ్యో బలిః, గచ్ఛ త్వం అపి చతుష్పథే మాతృభ్యో బలిం ఉపహార అని చెబుతాడు. “నేను గృహదేవతలకు బలి సమర్పించాను. నువ్వు చతుష్పథానికి, అంటే నాలుగు మార్గాల కూడలికి బలి తీసుకుని వెళ్లి అమ్మవార్లకు సమర్పించు” అని దీని అర్థం. సరిగ్గా అప్పుడే నాయిక వసంతసేన తన వెంటబడిన శకారుని తప్పించుకుంటూ చారుదత్తుని ఇంటికి వస్తుంది. అదే వారి తొలి కలయిక.

మార్గాల కూడలిలో బలి సమర్పించడంలో పైన చెప్పిన గ్రీకు తంతుకు, ఈ తంతుకు ఉన్న పోలిక స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాకపొతే, గ్రీకు తంతు మూడు మార్గాల కూడలిలో జరిగేదైతే, మృచ్ఛకటికంలో పేర్కొన్నది నాలుగు మార్గాల కూడలిలో జరిగేది. అందులో స్త్రీలు అయితే, ఇందులో పురుషులు. ఈ తంతు కృష్ణపక్షంలో షష్ఠినాడు(ఆరవ రోజున), పట్టణశివార్లలో రాజమార్గం కూడలిలో జరిపేదిగా కోశాంబి గుర్తించారు. గుప్తుల కాలానికి (క్రీ.శ. ౩౦౦-5౦౦) ముందు నుంచే ఈ తంతు ఉండేదనీ, ఇది జనసామాన్యంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న తంతుగా కనిపిస్తుందనీ కోశాంబి అంటారు. గృహసంబంధమైన అన్ని తంతులను పూసగుచ్చినట్టు పొందుపరచిన బ్రాహ్మణ గ్రంథాలు దీనిని పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందంటారు. అలాగే, పి.వి. కాణే తన History of Dharmasastra లో సాయంకాలం ఇచ్చే ఇతర బలుల వివరాలు అన్నీ ఇచ్చి పై తంతు గురించి ఇవ్వకపోవడం, మొత్తంగా అమ్మవారికి జరిపే నివేదనల గురించి ముక్తసరిగా తేల్చివేయడంపై కూడా కోశాంబి విస్మయం వ్యక్తంచేస్తారు. పురామానవ పరిణామ శాస్త్రంపై బొత్తిగా లక్ష్యం లేకపోవడానికి ఇది నిదర్శనం అంటారు.

ఇక మనుస్మృతి (3-81-92) రోజూ నిర్వహించవలసిన ఒక తంతు గురించి చెబుతుంది. దాని పేరు వైశ్వదేవం. పిండాలు చేసి మొదట పితృదేవతలకు సమర్పించి, ఆ తర్వాత కుక్కలు మొదలైన జీవులకు, ‘అంటరాని’వారికి, రోగగ్రస్తులకు పెట్టడం ఈ తంతు. ఇందులో అమ్మవార్లకు నివేదనం ఇవ్వడం గురించి కానీ, చతుష్పథ ప్రస్తావన కానీ లేకపోవడాన్ని కోశాంబి ఎత్తిచూపుతారు. అమ్మవార్లకు బలి ఇవ్వడం మాతృస్వామికమైన తంతు అనీ, మనుస్మృతి పితృస్వామికానికి చెందినది కనుక అందులో అమ్మవారికి జరిపే తంతును పేర్కొనలేదనీ దీనినిబట్టి అనుకోవాలి. మృచ్ఛకటికం రచించిన శూద్రకుడు క్రీ.పూ. 2- క్రీ.శ. 4శతాబ్దాల మధ్య కాలానికి చెందివాడు కావచ్చని ఊహ. ఒకవేళ క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవాడనుకుంటే, అప్పటికి మాతృస్వామిక తంతులు కొనసాగుతున్నాయనీ, మనుస్మృతి అనంతర కాలంలో, బహుశా గుప్తుల కాలంలో సంకలనం అయిందనీ అనుకోవాలి. శూద్రకుని పేరు బ్రాహ్మణేతరుని సూచిస్తోంది కనుక, తనకు బాగా తెలిసిన బ్రాహ్మణేతరమైన తంతు గురించి ఆయన రాసి ఉండచ్చు.

అదలా ఉంచితే, గ్రీసులో జరిగే పండుగలలో, నిగూఢమైన తంతులలో హోమర్ పురాణగాధలకు ముందునాటి అవశేషాలు కనిపిస్తాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు. వాటిలో పురుష దేవుళ్ళకు కాక, స్త్రీ దేవతకే ప్రముఖస్థానం. ఆ దేవత కొలుపులు జరిగేది, మనకిప్పుడు బాగా తెలిసిన దేవాలయాలలో కాదు; మసకచీకటి(twilight) నిండిన తోపులు, లేదా వనాలలోనూ, పొలాలలోనూ, కందకాలలోనూ!

వనాలు, పొలాలలో అమ్మవారి కొలుపులు జరగడం అనేది గ్రీసులోనే కాదు, మొత్తం యూరఫ్ లోనూ, మనదేశంలోనూ, బహుశా ప్రపంచమంతటా ఉండేది. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉండి ఉండచ్చు. ఇందుకు సంబంధించిన అనేక ప్రస్తావనలలో కొన్నైనా ఉటంకించుకోవలసిన అవసరం కనిపిస్తోంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ‘సొంత కథ’ లో రాసిన వాక్యాలతో ప్రారంభిద్దాం:

ఊరికి ఒక మూల అమ్మవారి వనం ఉంది. ఒక విషముష్టి చెట్టు, నాలుగు ఊడుగు చెట్లు, కొన్ని బర్రెంక చెట్లు ఉన్నాయా వనంలో. వ్యవసాయ సమాజాన ఈ అమ్మవారి వనాలు ప్రపంచమంతటా ఉండేవి. అమ్మవారు సౌభాగ్యదేవత. ఈ వనాలు ఆమె ఆవాసం. ఈ వనంలో చెట్లు అల్లె కట్టినట్లు ఉంటాయి. అల్లి మధ్య ఏమీ ఉండదు. వనంలోని చెట్ల నెవరూ కొట్టరు. ఇప్పుడు పురుషాధిక్యాన్ని, పురుషదేవతలను ఆరాధించే దేశాల్లో ఒకప్పుడు జనం అంతా ఈ స్త్రీదేవతలనే, అంటే అమ్మవారినే ఆరాధించేవారని చరిత్రకారులంటున్నారు. గ్రామదేవత పేరు ఏదైనా కావచ్చు. ఆమె సౌభాగ్య దేవత. ఆమెనంతా గౌరి అంటారు.

గౌరికి ప్రాచీనకాలం నుంచీ వనాలే దేవాలయాలు- ఆమెకు ప్రత్యేకం గుళ్ళు ఉండవు. వ్యవసాయ కేంద్రాలైన పల్లెల్లో తప్ప వర్తక కేంద్రాలైన పట్నాల్లో గౌరి ఆరాధనలు కానరావు. రామాయణంలో గౌరీదేవి నివేశనం మిథిలానగరానికి ఆవల ఉండేదని వాల్మీకి అంటాడు. పెళ్ళికి ముందు తన సౌభాగ్యవర్ధనం కోసం చెలికత్తెలతో సీత గౌరీపూజకు వెళ్లింది. ఊరి చివరనే వసతి కల్పించుకున్న రాముడు ఆ సందర్భంలోనే సీతను చూశాడంటాడు వాల్మీకి. పెళ్ళికి ముందు కన్యలు గౌరీపూజ చేయడం ఆచారం. ఈ ఆచారం తెలుగునాట సంప్రదాయం పాటించేవారిలో నేటికీ కానవస్తుంది.

స్త్రీలకు చెందిన రహస్యప్రదేశాల్లోకి, అంటే వనాలు, కొలనులు మొదలైన చోట్లలోకి పురుషులు ప్రవేశించకూడదనీ, ఒకవేళ ప్రవేశిస్తే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇంతకు ముందు ఒక వ్యాసంలో రెండు గ్రీకు పురాణ కథల ద్వారా చెప్పుకున్నాం. మన దేవీభాగవతం లో కూడా అలాంటి కథే ఒకటుంది:

వివస్వంతుడనే రాజుకు శ్రాద్ధదేవుడనే కొడుకు ఉన్నాడు. అతనికి ఎంతకాలానికీ పిల్లలు కలగలేదు. మగపిల్లవాడి కోసం వశిష్టుని సలహాపై పుత్రకామేష్టి జరిపాడు. అయితే అతని భార్య శ్రద్ధాదేవి ఆడపిల్ల కోసం హోమం చేయించింది. కొంతకాలానికి ఆమె గర్భవతై ఆడపిల్లను ప్రసవించింది. ఆమెకు ‘ఇల’ అని పేరుపెట్టారు. ఆడపిల్ల పుట్టినందుకు నిరుత్సాహం చెందిన భర్త ఈశ్వరుని ప్రార్థించాడు. ఈశ్వరుడు అనుగ్రహించడంతో ఇల కాస్తా పురుషుడుగా మారిపోయింది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.

సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒకరోజున వేటకు వెళ్ళి ఒక మహావనంలో ప్రవేశించాడు. వెంటనే స్త్రీగా, అంటే ఇలగా మారిపోయాడు. దాని వెనుక కథ ఏమిటంటే, ఒకప్పుడు ఆ వనంలో శివపార్వతులు క్రీడిస్తుండగా మునులు ఆ సంగతి తెలియక ఆ వనంలోకి ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. శివుడికి కోపం వచ్చి, పురుషులెవరైనా ఈ వనంలోకి అడుగుపెడితే స్త్రీగా మారిపోతారని శపించాడు.

సుద్యుమ్నుడే కాక అతని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అతను ఏం చేయాలో తెలియక అడవిలో తిరుగుతూ చంద్రుడి కొడుకైన బుధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. వారికి పురూరవుడు జన్మించాడు. తర్వాత శివుని ప్రార్థించిన సుద్యుమ్నుడు ఒక నెల పురుషుడిగానూ, ఒక నెల స్త్రీగానూ ఉండేలా వరం పొందాడు. అందుకు కూడా సంతృప్తి చెందక ఈసారి అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు అతనికి ఎప్పుడూ పురుషుడిగానే ఉండేలా వరమిచ్చింది.

ఇది అంతిమంగా అయ్యవారి(శివుడు) మహిమ కంటే అమ్మవారి మహిమదే పై చేయి అని చెబుతున్న ఒక పురాణకథే కానీ, మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య పోటీని సూచించే ఒక చారిత్రకదశనూ ఇది ప్రతిఫలిస్తూ ఉండచ్చు. భర్త మగపిల్లవాడిని కోరితే భార్య ఆడపిల్లను కోరుకోవడమే చూడండి. కానీ ఆ ఆడపిల్లను మగపిల్లవాడిగా మార్చివేయడం ద్వారా భర్త తన ఆధిక్యాన్ని చాటుకున్నాడు. కానీ శివుని శాపం వల్ల ఆ అబ్బాయే మళ్ళీ స్త్రీగా మారిపోవడం, మధ్యేమార్గంగా నెల రోజులు స్త్రీగానూ, నెలరోజులు పురుషునిగానూ ఉండవలసి రావడం; తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల పూర్తికాలం పురుషుడిగా మారిపోవడం సంభవించాయి. ఇందులోని మాతృస్వామిక/పితృస్వామిక స్పర్థకు సంబంధించిన కోణాన్ని మరీ సాగదీయకుండా మీ ఊహకే వదిలేస్తాను.

దేవీభాగవతంలోనే ఇలాంటి కథ మరొకటి ఉంది:

ఒకసారి నారదుడు విష్ణుమాయ ఎలాంటిదో చెప్పమని విష్ణువును కోరాడు. విష్ణువు సరేనని దగ్గరలో ఉన్న ఒక కొలను చూపించి అందులో మునగమన్నాడు. మునిగి బయటికివచ్చేసరికి నారదుడు స్త్రీగా మారిపోయాడు. ఆమెను తాళధ్వజుడనే రాజు చూసి మోహించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి కొడుకులు కలిగారు. కొంతకాలానికి శత్రువులు రాజ్యంపై దండెత్తి కొడుకుల్ని చంపేశారు. అప్పుడు స్త్రీరూపంలో ఉన్న నారదుడు దుఃఖిస్తుండగా విష్ణువు ప్రత్యక్షమై ఎవరూ శాశ్వతం కాదని బోధించి మళ్ళీ వెనకటి కొలనులో మునగమన్నాడు. నారదుడు అందులో మునిగి మళ్ళీ పురుషుడిగా మారిపోయాడు.

కొంచెం విషయాంతరంలా కనిపించినా పై పురాణకథలతో ఉన్న పోలిక దృష్ట్యా ఒక గ్రీకు పురాణ కథనూ ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తోంది:

జియస్ దేవతల నాయకుడు(మన బ్రహ్మదేవుడి లాంటివాడనుకుందాం). అతని అర్థాంగి హేరా. ఓసారి ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు, “సంభోగంలో మీ ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు” అన్నాడు జియస్ భార్యతో నవ్వులాటగా. హేరా “అది అబద్ధం” అంది. కాసేపు వాదించుకున్న తర్వాత, టెరేసియస్ అనే ఒక మునిని పిలిపించి తమిద్దరిలో ఎవరిది నిజమో చెప్పమని కోరారు.

అతన్నే అడగడానికి కారణం ఏమిటంటే, అతనోసారి అడవిలో తిరుగుతూ, సంభోగిస్తున్న పాముజంటను చూశాడు. కర్రతో వాటిని కొట్టాడు. వెంటనే స్త్రీగా మారిపోయాడు. అలా ఏడేళ్లపాటు స్త్రీగా ఉండిపోయాడు. ఎనిమిదో ఏట మళ్ళీ అదే అడవికి వెళ్లినప్పుడు ఆ పాముజంటే మళ్ళీ సంభోగిస్తూ కనిపించింది. కిందటిసారి కర్రతో కొట్టినప్పుడు స్త్రీగా మారిపోయాడు కనుక, ఈసారి కొడితే పురుషుడిగా మారిపోవచ్చుననుకుని అలాగే చేశాడు. పురుషుడిగా మారిపోయాడు. ఈవిధంగా అతనికి స్త్రీ గానూ, పురుషుడిగానూ జీవించిన అనుభవం ఉంది. అదీ అతన్ని తీర్పు చెప్పమనడానికి కారణం.

జియస్ చెప్పిందే నిజమని టెరేసియస్ అన్నాడు. దాంతో హేరాకు కోపం వచ్చింది. అంధుడివి కమ్మని శపించింది. అప్పుడు జియస్ జోక్యం చేసుకుని ఆ శాపానికి పరిహారంగా అతని భవిష్యత్తును చెప్పగల శక్తిని ఇచ్చాడు.

ఈ కథకు మన ప్రస్తుతాంశానికి అవసరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. మళ్ళీ అమ్మవారి వనాల దగ్గరికి వెడితే…

Golden Bough

Golden Bough

ఇంగ్లీష్ రొమాంటిసిస్ట్ చిత్రకారుడు జోసెఫ్ మల్లార్డ్ విలియం టర్నర్(1775-1851) గీసిన The Golden Bough చిత్రం ప్రసిద్ధం. ‘బంగారు కొమ్మ’అని ఆ మాటకు అర్థం. సర్ జేమ్స్ ఫ్రేజర్(1854-1941) మాంత్రికత, మతం పై తను రాసిన ప్రఖ్యాత రచనకు ఆ పేరే పెట్టి, ముఖచిత్రంగా ఆ చిత్రాన్నే వాడుకున్నారు.

ఇటలీలో ఇప్పుడు నేమి అనే గ్రామం ఉన్నచోట ఒక చెట్ల తోపు, నేమి అనే పేరుతోనే ఒక సరస్సు ఉన్నాయి. ఆ సరస్సులోని నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉంటాయంటే, ఆ సరస్సు అనే అద్దంలో అక్కడి దేవత డయానా తన ప్రతిబింబాన్ని చూసుకుంటుందనేవారు. ఆ సరోవర తీరంలోనే నిద్రపోతున్నట్టు ఉండే రెండు ఇటలీ గ్రామాలతో సహా ఎంతో ప్రశాంతత ఉట్టిపడే ఆ పరిసరాలను ఒకసారి చూసినవారు ఎప్పటికీ మరచిపోలేరని ఫ్రేజర్ అంటారు. టర్నర్ చిత్రం స్వర్ణకాంతులనీనుతూ, ఒక స్వాప్నిక దృశ్యంలా ఉంటుందని అంటూ -ఆ చిత్ర పరిచయంతోనే తన రచన ప్రారంభిస్తారు.

ఇంతకీ విషయమేమిటంటే, ఆ సరోవరాన్ని అనుకుని ఉన్న చెట్ల తోపు, దేవత డయానాకు చెందిన ఒక పవిత్రవనం(Sacred Grove)! దాని గురించి ఆ తర్వాతి పేరాలోనే ఫ్రేజర్ ఇచ్చిన వివరాలు పై ఆహ్లాదకర చిత్రణకు భిన్నంగా విషాదాన్ని, భయాన్ని, గగుర్పాటును కలిగించేలా ఉంటాయి. ఈ పవిత్రవనంలో ఒక చెట్టు దగ్గర పగలంతా, రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఒక వ్యక్తి వేటగాడిలా పొంచి ఉంటాడు. అతని చేతిలో సంధించిన కరవాలం ఉంటుంది. అతని ముఖం క్రూరంగా భయంగొలుపుతూ ఉంటుంది. అతను ఆనుక్షణం వెయ్యి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. అతను ఒక పూజారి, రాజూ కూడా. రెండు వ్యవస్థలూ ఒకరి కిందే ఉన్న కాలం అది. అయితే ఆ పూజారి-రాజు పదవి అతను మరణించిన తర్వాత అతని వారసులకో, మరొకరికో అనాయాసంగా అందేది కాదు. అతణ్ణి చంపి మరొకరు దానిని చేజిక్కించుకోవలసిందే. అందుకే ఆ వ్యక్తి ప్రతి క్షణం ప్రాణగండాన్ని, పదవీగండాన్ని ఎదుర్కొంటూ అప్రమత్తంగా ఉండవలసిందే. అయినాసరే, ఏ క్షణంలోనైనా పదవితోపాటు, ప్రాణమూ పోకతప్పదు.

పూజారిత్వానికి సంబంధించిన ఈ విచిత్రమైన నిబంధనతో పొల్చదగినదేదీ ప్రాచీన ఇతిహాసకాలంలో కనిపించదనీ, దీనిని అర్థం చేసుకోవాలంటే ఇంకా ప్రాచీనతలోకి వెళ్లాలని ఫ్రేజర్ అంటారు. అంటే, స్త్రీ దేవతే ప్రాధాన్యం వహించిన మాతృస్వామ్యంలోకి వెళ్ళాలన్నమాట.

అదలా ఉంచితే, ‘దేవాలయం’ అనే మాటకు జర్మన్ భాషలో ఉన్న పర్యాయపదాలను పరిశిలిస్తే, జర్మన్ల అతి పురాతన ఆరాధనాప్రదేశాలు అడవులు, లేదా వనాలే నని అర్థమవుతుందని ఫ్రేజర్ అంటారు. ఆయన ప్రకారం, యూరప్ కు చెందిన ఆర్య తెగలు అన్నిటా చెట్లను పూజించడం ఉంది. కెల్టులలో ఆరాధనా ప్రదేశాన్ని సూచించే పురాతన పదం వ్యుత్పత్తిలో, అర్థంలో లాటిన్ పదం ‘నెమస్’ (nemus)కు తుల్యంగా ఉంటుంది. దానికి వనం లేదా తోపు అనే అర్థం. పైన పేర్కొన్న ‘నేమి’కి, లాటిన్ ‘నెమస్’ కు ఉన్న సంబంధం తెలుస్తూనే ఉంది. ప్రాచీన జర్మన్లలో పవిత్ర వనాలు సర్వసాధారణమే కాక, అందులోని చెట్లను నరికినా, బెరడు తీసినా తీవ్రమైన శిక్షలు ఉండేవి. ప్రాచీన స్వీడన్ లోనూ, 14వ శతాబ్దిలో క్రైస్తవంలోకి మారేవరకు లిథుయేనియాలోనూ పవిత్రవనాలు సర్వ సామాన్యం. యూరప్ లోని ఫిన్నిష్-ఉగ్రియాన్, ఓల్గా తెగలకు చెందిన పవిత్రవనాలలోకి స్త్రీల ప్రవేశం నిషిద్ధం.

వ్యవస్థ మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే, పవిత్ర వనాలలో ప్రవేశంపై ఉండే నిషేధమూ తారు మారు అయిందంటూ కోశాంబి (The Culture and Civilisation of ANCIENT INDIA in Historical Outline) ఇలా అంటారు:

కొన్ని చోట్ల (కొలీనా అని పిలిచే వ్యక్తి) స్త్రీ దుస్తులు ధరించి హోలీ మంట దగ్గర జరిగే నృత్యంలో పాల్గొంటాడు. బెంగళూరు లో ఏటా జరిగే కరగ ఉత్సవంలో పాల్గొనే ముఖ్య వ్యక్తి స్త్రీ దుస్తులు ధరిస్తాడు. పశ్చిమభారతంలోని పార్థీలు జరిపే సౌభాగ్యతంత్రాలలో కూడా పురుషులు స్త్రీ దుస్తులు ధరిస్తారు. ఈ తంతులు, ఉత్సవాలు అన్నీ మొదట్లో స్త్రీలకు చెందినవి. ఆ తర్వాత పురుషులు వాటిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

అలాగే, బ్రాహ్మణ పురాణాలు అమ్మవారికి చెందిన పవిత్ర వనాలను ప్రస్తావిస్తున్నాయి. ఇలాంటి వనాలు ఇప్పటికీ గ్రామాలలో రహదారికి దూరంగా కనిపిస్తాయి. అయితే, వలసవచ్చిన వ్యవసాయదారుల చేతుల్లోకి పూజారిత్వం పోకుండా, స్థానిక తెగ చేతుల్లో ఉంటే తప్ప; సాధారణంగా ఈ వనాలలోకి ఇప్పుడు స్త్రీల ప్రవేశం నిషిద్ధం. మొదట్లో ఈ నిషేధం పురుషులపై ఉండేది. సమాజం మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే పూజారిత్వమూ, తంతులూ కూడా చేతులు మారాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత….

 

 

 

 

 

 

 

 

మంచును కరిగించిన పాపాయి

MythiliScaled

ఒకానొకప్పుడు బల్గేరియా లో, ఒక ఊర్లో – ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. శీతాకాలం ఎప్పటికీ అయిపోయేట్లు లేదు, వసంతం వచ్చేటట్లు లేదు.ఒక రోజైతే, పొద్దున్నే లేచేప్పటికి ఇళ్ళన్నీ మంచు లో కూరుకుపోయి ఉన్నాయి. వాకిలి తలుపులు తెరవటమే కష్టమైపోయింది. అలాగే మంచుని తవ్వుకుని తలుపులు తీసి, ఇళ్ళ మధ్యన మంచు కిందన సొరంగాల లాగా దారి చేసుకుని, అందరూ ఊరి మధ్యన ఉన్న చర్చ్ లో కలుసుకున్నారు. ఇప్పట్లో పరిస్థితి మారకపోతే ఏం చేయాలనేది చర్చించారు. రకరకాల అభిప్రాయాలు వచ్చాయి కానీ ఏదీ తేల్చుకోలేకపోయారు. ఆ ఘోరమైన చలీ మంచు కురవటమూ అలాగే ఉంటే ఇహ ఆ యేడు పంటలేవీ పండించుకోలేరు. నెగళ్ళు వేసుకుందుకు అడవిలోంచి కట్టెలు తెచ్చుకోవటం కూడా వీలు పడదు. బతకటమే కష్టమైపోతుంది.

little girl 1” ఎవరో ఒకరు మంచు దేవుడి   దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పి వేడుకోవాలి. ఆయన ఆజ్ఞాపిస్తేనే గాని చలిగాలులు వెనక్కి వెళ్ళవు ” అన్నాడొక పెద్దాయన. అక్కడికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంటాడు మంచు దేవుడు. ఆ దట్టమైన మంచు కిందన అంత దూరం సొరంగం తవ్వి ఎవరు అక్కడికి వెళ్ళగలరు ? అదే అన్నారు అంతా. పెద్దాయన అన్నాడు – ” అలా అక్కర్లేదు, మన ఊరంటే లోయలో ఉంది కనుక ఇంత దట్టమైన మంచు. ఎలాగో అలా ఊరి చివరి వరకూ సొరంగం తవ్వితే చాలు, అక్కడినుంచీ కొండల వరస మొదలవుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ గాలులు బలంగా వీస్తాయి కాబట్టి మంచు పల్చగానే ఉంటుంది, సులువుగా చెదరగొట్టచ్చు ” అని.

అక్కడ చేరిన మగవాళ్ళంతా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఎవరికి వారికి పక్కవారెవరైనా వెళ్తే బావుండునని ఉంది. ప్రతివారూ ఏదో ఒక వంక చెప్పారు . చివరికి ఎవరూ మిగల్లేదు. సిగ్గుతో తలలు దించుకున్నారు గాని అప్పటికైనా ఒకరు ముందుకు రాలేదు.

పెద్దాయన అన్నాడు – ” ఇహ నేనే మిగిలినట్లున్నాను. ఒక ఇరవై ఏళ్ళ కింద అయితే ఈ పని ఇట్టే పూర్తి చేసి ఉండేవాడిని. ఇప్పుడు నా వల్ల అవుతుందో లేదో ! అయినా బయల్దేరతాను లెండి ” అని.

little girl 2

” అక్కర్లేదు తాతా. నేను వెళ్తానుగా ” అందొక చిన్న పిల్ల. ఆమెని పసిపిల్లగా ఉన్నప్పుడే అమ్మా నాన్నా పోతే , పెద్దాయన పెంచుకుంటున్నాడు.

” వద్దు వద్దు ” అన్నారు అంతా జాలిగా. ఆమెకి సరైన కోటు అయినా లేదు. వెచ్చటి ఉన్ని టోపీ గాని, శాలువా గాని, చేతి తొడుగులు గానీ- ఏవీ లేవు .పాప తల నిమురుతూ తాత అన్నాడు – ” వద్దు తల్లీ. చిన్న పిల్లవి, అంత దూరం వెళ్ళలేవు ” అని.

” నాకస్సలు భయం లేదు తాతా ” పాప అంది. ” నా కాళ్ళకి చాలా బలం ఉంది. మంచు గొర్రెలంత వేగం గా పరిగెట్టగలను కూడా ”

” చలికి గడ్డకట్టుకు పోతావమ్మా , దారిలో ఎక్కడా తలదాచుకునేందుకేమీ ఉండదు ”

” అందరికీ మంచి జరగాలి కదా తాతా మరి ? నాకేమంత చలి ఉండదు తెలుసా ? ”

తాత ఆలోచించాడు. తనకా శక్తి లేదు, దారి మధ్యలో ఆగిపోయినా తనకేమైనా జరిగినా ఏమీ లాభం ఉండదు. ఇంకెవరూ వెళ్ళేలా లేరు. పాప చిన్నదైనా ధైర్యం గలది, ఆరోగ్యం ఉన్నది. చివరికి ఒప్పుకున్నాడు-” నీ గుండె నిండా ప్రేమ ఉందమ్మా ! అదే నీకు వెచ్చదనం ఇస్తుంది. వెళ్ళిరా ”

అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఒకరు కోటూ, ఒకరు టోపీ, ఒకరు శాలువా, ఇంకొకరు బూట్లూ చేతి తొడుగులూ – ఇలా తమ దగ్గర ఉన్న వెచ్చటి దుస్తులని, పాపకి సరిపోయేవాటిని – తెచ్చి ఇచ్చారు. మగవాళ్ళంతా కలిసి ఊరి చివరి కొండవాలు దాకా సొరంగం తవ్వారు. అందరూ పాపని దీవించి జాగ్రత్తలు చెప్పారు. పాప బయలుదేరింది. ఇంతా అయేసరికి ఇంచుమించు సాయంత్రమైంది. మొదటి కొండ చేరే సరికే చీకటి పడిపోయింది. అయితే కాసేపటికి చందమామ వచ్చాడు. పౌర్ణమి రోజులేమో, వెన్నెల బాగా  వెలుతురు ఇచ్చింది. పాప రాత్రంతా నడుస్తూనే ఉంది, ఎక్కడా ఆగకుండా. వీలైనంత తొందరగా మంచు దేవుడి దగ్గరికి చేరాలని ఆమె ఆరాటం.

కాని మంచుగాలులు పాపని చూసి – ” ఎంత ధైర్యం ఈమెకి ! ఈమె పని చెబుదాం ఉండండి. గట్టిగా వీద్దాం , పడదోద్దాం ఆమెని. ఎందుకోసం వచ్చిందో మర్చిపోయేంత ఇబ్బంది పెడదాం ” అని కూడబలుక్కున్నాయి. చాలా విసురుగా, దుమారం లాగా వీచటం మొదలెట్టాయి. పాప   తొణకలేదు, బెణకలేదు. నడుస్తూనే ఉంది.

గాలులకి కోపం వచ్చింది. ఇంకా, ఇంకా విసిరి విసిరి వీచాయి, ఆయాసం వచ్చి ఆగాయి. ” ఏం పిల్ల ! మనకి అలుపు వస్తోందేగానీ ఆమెకేమీ లెక్కలేదే ” అని ఆశ్చర్యపోయాయి .

” ఇలా వదిలేస్తే లాభం లేదు. మనల్నెప్పుడైనా ఏ మనిషైనా గెలిచాడా ? ఇంత చిన్న పిల్ల ముందు ఓడిపోతామా ? మళ్ళీ మొదలెట్టండి ” రొప్పుతూ అంది   వాటిలో ఒకటి.

” నీకు ఓపిక ఉంటే నువ్వు మొదలెట్టు. ఇంక నావల్ల కాదు . ఒకరోజంతా పడుకుంటే గాని కదల్లేను ” అంది ఇంకొకటి.

” మేమూ అంతే, మా వల్లా అవదు ” ఒప్పుకున్నాయి తక్కినవి. మొదటిది అంది – ” అయితే మన అన్నయ్య ఉన్నాడు కదా మంచు తుఫాన్ … వాడు మనకన్న బలవంతులు. వాడిని పిలిచి పురమాయిద్దాం. ఈ పిల్లని మాత్రం వదిలేది

లేదు ‘’

అలాగే అన్నీ కలిసి మంచు తుఫాన్ ని పిలిచారు. అతను గబగబా వచ్చాడు. జరిగిందంతా విన్నాడు. ఆ సరికి పాప దూరంగా చివరి కొండ ఎక్కబోతూ కనిపించింది. తుఫాన్ ద్వేషం తో రుసరుసలాడిపోయాడు. ఎడాపెడా చేతులు జాడించాడు. అదేమి వింతో, పాప తుఫాన్ ని కూడా లెక్క పెట్టలేదు, ఆమెకేమీ కాలేదు.

” సిగ్గు సిగ్గు ” అనుకున్నాడు తుఫాన్. ” కోపమూ ద్వేషమూ ఈమెనేమీ చేయలేకుండా ఉన్నాయి. అటు వైపునుంచి ప్రయత్నిద్దాం ” అన్నాడు అతను.

ఒక చెల్లెలు వెటకారం చేసింది- ” ఎత్తుకుని కొండ మీద దించుతావా ఏమిటి ? ”

” కాదులే. మన అక్కయ్యని పిల్లుద్దాం. ఆమెని ఎవరూ ఎదిరించలేరు. తెలియకుండా వచ్చేసి ఎవరినైనా లోబరచుకుంటుంది ” అన్నాడు అతను. ఆ అక్కయ్య చలిరాక్షసి . మనుషుల ఒళ్ళు బిగుసుకుపోయి చచ్చిపోయేలా చేస్తుంది. ఆ దుష్టురాలు వీళ్ళు పిలవగానే వచ్చింది. ఆమెకి రూపం లేదు, కాని ఎలా కావాలంటే అలా మనుషులకి కనిపించగలదు. ఎప్పుడో చనిపోయిన పాప తల్లి రూపం ధరించి వచ్చి పాప కోసం తల్లి పాడే లాలిపాట పాడింది.

పాప నడక వేగం తగ్గించి, వింది, దూరం నుంచి చూసింది . ” ఇదేమిటి..అమ్మ మొహం, అమ్మ గొంతు, అమ్మ పాట … కాసేపు ఇక్కడ కూర్చుని వింటాను, అమ్మ దగ్గరికి వస్తుందేమో. దగ్గరికి వచ్చేశాను కదా , మంచు దేవుడి భవనం కనిపిస్తూనే ఉంది ” – కూర్చుండిపోయింది. పాట వింటూంటే పాపకి కళ్ళు మూసుకుపోతున్నాయి. మెల్లిగా నిద్రపోయింది. చలి రాక్షసి పళ్ళు బయట పెట్టి ఇకిలిస్తూ తమ్ముడికీ చెల్లెళ్ళకీ తన ఘనకార్యాన్ని చెప్పేందుకు వెళ్ళింది. అమ్మ కలలో కనిపిస్తుంటే పాప నిద్రలో నవ్వుకుంటోంది. కాని మొహం రంగు మారిపోతోంది, గులాబి రంగులోంచి నీలంగా అయిపోయింది.. తర్వాత పాలిపోయిన పసుపు పచ్చ రంగులోకి మారింది.. పాప బిగిసిపోతోంది. ఇంకెవరూ కాపాడేందుకు లేనట్లే ఉంది.

little girl 3

అప్పుడొక చిన్న శబ్దం, కీచుమని. పక్కన ఉన్న కలుగులోంచి చిట్టెలుక ఒకటి బయటికి వచ్చి తన చిన్న చిన్న కళ్ళతో పాప పరిస్థితి చూసింది. ” అయ్యో పాపం ” అనుకుని తోటి ఎలుకలని పిలిచింది. అవన్నీ పరుగెట్టుకొచ్చి పాప చేతులూ కాళ్ళూ రుద్ది వేడి పుట్టించే ప్రయత్నం చేశాయి. అవి చాలా చిన్నవి కనుక ఆ పని త్వరగా జరగటం లేదు పాపం, స్నేహితులని పిలిచాయి. బొరియల్లోంచి కుందేళ్ళు వచ్చాయి. మంచు కప్పిన పైన్ చెట్ల మీదినుంచి ఉడతలు కిందికి దూకాయి. పాప ఒంటిమీదికి ఎక్కి తమ బొచ్చుతో వెచ్చదనం పుట్టించాయి. పాప బుగ్గలు మెల్లి మెల్లిగా గులాబి రంగులోకి మారాయి. కళ్ళు విప్పబోయింది… రెప్పల మీద రెండు కన్నీటి బొట్లు గడ్డకట్టి ఉన్నాయి. ఒక చిట్టి ఉడత తోకతో వాటిని విదిలించింది. పాప కళ్ళు తెరిచింది. జంతువులకి గొప్ప సంతోషం వేసింది. పాప వాటికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుని తనెందుకు వచ్చిందో వివరించింది.

” మేమూ వస్తాం నీతో ” అన్నాయి అవి. ” ఈ చలికి మేమూ తట్టుకోలేకపోతున్నాం ”

అంతా కలిసి మంచుదేవుడి భవనం చేరారు. వాకిలి మూసి ఉంది. పాప గట్టిగా కేక పెట్టి పిలిచింది. ఎవరూ పలకలేదు. చిన్న ఎలుకలూ ఉడతలూ ప్రతి కిటికీ దగ్గరికీ వెళ్ళి చూశాయి. ఒక కిటికీ మటుకు కొద్దిగా తెరుచుకుని ఉంది. అందులోంచి దూరి లోపలికి వెళ్ళి అవి తలుపు గడియ తీశాయి. గాజు  పలకల నడవాలగుండా నడిచి మంచు దేవుడి సభ కి వెళ్ళారు. అక్కడి సింహాసనం మలిచి స్ఫటికం తో మలిచి ఉంది. అందులో కూర్చుని మంచు దేవుడు – గాఢంగా నిద్రపోతున్నాడు. జంతువులు ఆయన ఒళ్ళోకీ భుజాల మీదికీ గెంతాయి. ఒక ఉడుత తన చిన్న తోకతో ఆయన ముక్కుని రాసింది. ఆయన తుమ్మాడు, మె లకువ వచ్చింది. నీలి రంగు కళ్ళతో వీళ్ళని చూసి నవ్వాడు.

” రండి, రండి. ఎందుకు వచ్చారు మీరు ? ” అడిగాడు.

పాప సంగతి అంతా చెప్పింది.

” అయితే మీరు లేపేవరకూ నేను నిద్ర పోతున్నానా ఏమిటి ? ”

” అవునండి ”

” ఇది నా సేవకులు, అదే మంచు గాలులూ మంచు తుఫాన్ లూ- వాళ్ళ పనే అయిఉంటుంది . మామూలు గా నేనింత మొద్దు నిద్ర పోనే పోను. ఈ పాటికి వాళ్ళందరినీ గదుల్లో పెట్టి తాళం వేసి ఉండేవాడిని, వసంతం వచ్చేసేది. వాళ్ళు ఎప్పటికీ అధికారం చలాయించాలని నన్ను నిద్ర పుచ్చినట్లున్నారు. ఎలా ? అవును, గుర్తొచ్చింది. నాకేదో కొత్తరకం టీ అని ఇచ్చారు. తాగుతుంటే నాకేదో అనుమానం గానే ఉండింది. మధ్యాహ్నం పడుకుని రాత్రికి లేవవలసినవాణ్ణి వారాల తరబడి నిద్రపోయాను. ఉండండి, అంతా చక్కబెడతాగా ”

little girl 4

చేతిలో ఉన్న వెండి ఈలని ఊదాడు. సేవకులంతా గజ గజా వణుకుతూ వచ్చి నిలుచున్నారు. వాళ్ళలో ఏ తప్పు చేయని వాళ్ళకి తలా ఒక టూత్ బ్రష్ ఇచ్చి,  వెళ్ళిఆకురాలే కాలం ముగిసేదాకా హాయిగా నిద్ర పొమ్మని చెప్పాడు. తప్పు చేసినవాళ్ళకి మాత్రం శిక్ష వేశాడు- వేడి వేడి మంటలు ఉన్న గదుల్లో వారం రోజులు గడి పేలా.

జంతువులకీ పాపకీ మంచి ఐస్ క్రీం తెప్పించి పెట్టాడు. పాప ధైర్యసాహసాలని మెచ్చుకుని ప్రత్యేకంగా సన్నటి వెండి గొలుసు కానుక ఇచ్చాడు. దానికి హృదయం ఆకారం లో ఉన్న స్ఫటికం వేలాడుతోంది. నిజం ఏదో మోసం ఏదో కనిపెట్టే శక్తిని ఆ స్ఫటికం ఇస్తుంది.

తలుపులు తెరుచుకుని బయటికి వచ్చేసరికి చెట్లన్నీ చిగిర్చి ఉన్నాయి. పూలు విచ్చుకుంటున్నాయి, పిట్టలు కువకువమంటున్నాయి….వసంతం వచ్చేసింది.

తిరుగు ప్రయాణం సులభంగా, సుఖంగా సాగింది. మళ్ళీ కలుసుకుందామని చెప్పుకుంటూ స్నేహితులు విడిపోయారు.

ఊర్లో అందరూ పాపని దేవతలాగా చూశారు. ఆమెని ఏ లోటూ లేకుండా పెంచేందుకు వాళ్ళ తాతకి అన్నీ ఇచ్చారు. చలికాలం ముగిసినందుకు వారం రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నారు .

  • బల్గేరియన్ జానపద గాథ
  • mythili

నిషేధం గురించే మాట్లాడు

Painting: Picasso

 

కవికీ

కవిత్వానికి
నిషేధాలుండకూడదంటాను

నీడ కురిపించే చెట్ల మధ్యో
ఎండ కాసే వీధుల్లోనో
గోళీలాడుకుంటున్న పిల్లాణ్ణి బంధించి
చేతులు వెనక్కి విరిచి
కణతలపై గురిచూసి తుపాకీ
కాల్చకూడదంటాను

కవీ
పసిబాలుడే –
చెరువు కాణా మీద కూర్చుని
ఇష్టంగా చెరుగ్గెడ తీపిని
గొంతులోకి మింగుతున్నట్టు –
రాత్రి వెన్నెట్లో
వెన్నెల తీరాల్లో
యిసుక గూళ్లు కట్టుకున్నట్టు –
కుట్రలేని ‘కవిత్వం’ కలగంటాడు

దేశంలో కల్లోలముంటుంది
ఆయుధం నకిలీ రాజ్యాంగాన్ని నడుపుతుంది
అరణ్యం పూల వాసన
ఈశాన్యం కొండల్లోంచి
నైరుతి దిశగా
దేశం దేశమంతా
వీస్తుంది
కల్లోల కాలపు ఎదురు గాలి
వంచన గాలి
రక్తాన్ని ఏ కొంచెమైనా కదిలించకపోతే
రక్త తంత్రులను ఏ కొసనైనా మీటకపోతే
ఎవరైనా
అసలు మనిషే కాదంటాను

మనిషి మీద నమ్మకం వున్నవాణ్ణి నేను
వొళ్లంతా మట్టే అంటించుకుని
మట్టి మీదే పొర్లాడే
అతి సాధారణ మనిషైనా
నిషేధం గురించే మాట్లాడాలంటాను –