Archives for November 2014

30 న హైదరాబాద్ లో కథా ఉత్సవం

1535038_903793006297538_2212784229189647637_n

పోయిన జన్మలో…

10811439_4929245406052_1430079235_n

మృత్యుంజయ్

మృత్యుంజయ్

అదనపు విలువపై అధికారం నిర్ధారించే ‘తీర్పు’

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

తీర్పు వొక రాజకీయ కథ. అదొక పాఠం కూడా . శ్రామిక వర్గ దృక్పథం ఆ కథకి ఆయువుపట్టు.

రచయిత తాను నమ్మిన భావజాలాన్ని గానీ, తన ప్రాపంచిక దృక్పథాన్ని గానీ సాహిత్యంలో చెప్పడం వల్ల కళాత్మక విలువలు దెబ్బతింటాయని వొకప్పుడు కేవల అనుభూతి వాదులూ, ఆ తర్వాత శుద్ధ రూపవాదులూ , యిటీవల వామపక్ష ప్రగతిశీల దృక్పథాన్ని వ్యతిరేకించడమే ఫ్యాషన్ గా మార్చుకొన్న కొంతమంది పోస్ట్ మాడర్నిస్టులూ సణిగే సణుగుళ్ళూ  కూసే కూతలూ రాసే కొక్కిరాయి రాతలూ పస లేనివని నిర్ద్వంద్వంగా తిరస్కరించడానికి నిండైన వుదాహరణ 64 లో కాళీపట్నం రామారావు మాష్టారు రాసిన ‘తీర్పు’ కథ . నేనీ మాటలు యింత నిక్కచ్చిగా చెప్పడానికి బలమైన కారణాలే వున్నాయి. ‘తీర్పు’ కథలో కారా ప్రతిపాదించదలచుకొన్న సారం రూపానికి హాని చెయ్యలేదు. వస్తు నిర్వహణకి శిల్పం యెలా దోహదం చేస్తుందో లోతుగా తెలిసిన రచయితగా మాష్టారీ కథలో దర్శనమిస్తారు. వస్తువుకి విధేయమైన శిల్పం మాత్రమే పాఠకుణ్ణి యెటూ మెదలనివ్వక కట్టి పడేస్తుంది. వస్తు ప్రధానమైన యీ కథలో దృష్టి యెంతసేపూ సారం మీదే వుండేలా చేయడానికి కథా నిర్మాణ విషయంలో రచయిత తీసుకొన్న శ్రద్ధ ప్రతి పదంలోనూ  గోచరిస్తుంది.

పెట్టుబడులు – వనరులు – వుత్పత్తి సాధనాలు – శ్రమ – వుత్పత్తి ఫలాల గురించి , వాటి అదుపు గురించి మార్క్సిజం చెప్పిన సూత్రాలను అర్థం చేసుకోడానికి ‘తీర్పు’ కథ వొక పాఠంలా నాకెంతో తోడ్పడింది. తరగతి గదిలో భాషాధ్యాపకుడిగా సామాజిక శాస్త్రాంశాల్ని అన్వయిస్తూ సాహిత్యాన్ని బోధించే స్వేచ్ఛ వుండడం వల్ల ‘ తీర్పు’ కథని యెన్నో సందర్భాల్లో పిల్లలకి చదివి వినిపించాను, చేతిలో కథ లేనప్పుడు మౌఖికంగా చెప్పాను. ప్రతిసారీ కథలోని సారం మీద చర్చలు జరిగేవి. సుందర రామయ్య రెండో కొడుకు ఇచ్చిన తీర్పుకే అంతిమంగా ఆమోదం లభించేది. మాష్టారి తీర్పు కథని తొలిసారి నేనెప్పుడు చదివానో గుర్తులేదు కానీ – కథలోని ‘ రెండోవాడు’ నన్ను జీవితం పొడవునా ఆవహించిన హీరో అయ్యాడు. అతని నిర్ణయాత్మక ధోరణి , తర్కబద్ధమైన వాదనా పటిమ , చూపులో చురుకుదనం , మాటలో నైశిత్యం, ముక్కుసూటిదనం , హేతుదృష్టి , అభిప్రాయ వ్యక్తీకరణలో నిక్కచ్చిదనం, ఆశయసాధన పట్ల సడలని పట్టుదల , ఆధిపత్య నిరసన , తిరుగు బాటు తత్త్వం వంటి అనేకానేక గుణాలు నాకాదర్శమయ్యాయి.

మానవ శ్రమే సమస్త సంపదల సృష్టికి కారణమైనప్పుడు దానిమీద సర్వ హక్కులూ – అనుభవించడం, పరిరక్షించడం, పంచడం యేవైనా కావొచ్చు – అవి శ్రమ చేసినవారికే చెందుతాయన్న మార్క్సిజం మౌలిక సూత్రాన్ని అతి సరళంగా కళాత్మకంగా ఆవిష్కరించిన ‘తీర్పు’ కథ వొక విధంగా అన్యాపదేశ కథ.  అన్యాపదేశ కథల్లో అంతరార్థం తెలిసీ తెలియనట్టుగా దాగుడుమూతలాడుతూ మంచుపొర కింది పువ్వులా గోచరం కావడం వొక టెక్నిక్. అయితే వొక్కోసారి రచయిత చెప్పదల్చుకొన్న అంతరార్థం పాఠకుడికి అందదు. అలా అందక పోయినా రచయిత ప్రతిభ కారణంగా ఆ లోటు కనపడదు. పాత్రలూ సన్నివేశాలూ సంభాషణలూ సంఘటనలూ అన్నీ కలిసి వొక కథగా హాయిగా చదువుకోడానికి యెటువంటి  యిబ్బందీ కల్గదు. అంతరార్థం ద్యోతకం కాపోయినా అది కథగా మనగల్గుతుంది – యిది మరో టెక్నిక్. ‘తీర్పు’ కథలో అర్థం నిగూఢం  కాదు. అలా అని పూర్తిగా బహిరంగం కాదు. చదివిన ప్రతిసారీ పదాలపైనా పాత్రలపైనా  కొత్త కాంతి ప్రసరిస్తుంది. పదాల మధ్య, వాక్యాల మధ్య , నిశ్శబ్దంలోనూ దాగివున్న లోతుని ఆనందించగలం. పాత్రలు ప్రతీకలుగా గాక నమూనాలుగా కళ్ళముందు నిలుస్తాయి. జీవిత సత్యాల్ని బోధపరుస్తాయి. ఒక యింట్లో దేశం, వొక కుటుంబంలో సమాజం , అందులోని భిన్న వ్యవస్థలూ ఆవిష్కారమౌతాయి. ఆ యా సన్నివేశాల్లో పాత్రల మాటలూ చేతలూ ఆలోచనా సరళీ నడవడికా అందుకు దోహదం చేస్తాయి. వాటిని విశ్లేషించుకొనే  ముందు స్థూలంగా వొకసారి కథలోకెళ్దాం :

సుందర రామయ్యకి నలుగురు మగపిల్లలు. కడగొట్టుది ఆడపిల్ల. పెద్దవాళ్ళు ముగ్గురూ హైస్కూలుకు పోతున్నారు. రెండోవాడికి బళ్ళో అట్టలు చేయడం నేర్పేరు. అలాంటివి బళ్ళో చేసి అమ్మేరు. ఒక్కొక్కటి ముప్ఫై నయా పైసలకమ్మేరు. పెద్దవాడు అర్థరూపాయి ఖర్చుతో అరడజను చేయవచ్చని కనిపెట్టేడు. బజారులో ఆ అట్టలే ఒక్కొక్కటి ఆరణాలని చెపితే వాళ్ళ అమ్మ అర్థ రూపాయి యిచ్చింది. ఉన్నవాళ్ళు ఐదుగురే కాబట్టి అయిదు అట్టలే చేసుకుందామన్నారు. మిగిలిన డబ్బు – ఒక అట్టమీద అధికంగా పెడితే అది అందమయిన కాలికో అట్ట అయింది.

తాను పెద్దవాడు కాబట్టి, తనది పెద్ద క్లాసు కాబట్టి, ఆ అందమైన అట్ట తాను తీసుకుంటానన్నాడు పెద్దవాడు. అలా వల్ల కాదు నేను తీసుకుంటానన్నాడు రెండోవాడు – తల్లి మొదట పెద్దవాడికే యిచ్చేయమంది. రెండోవాడు వాదిస్తే వాడికే ఇచ్చేయబోయింది. తగువు తెగకపోవడంవల్ల తండ్రి దగ్గరకు వచ్చింది.

ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. కుటుంబం దానికదే వొక యూనిట్ అయినప్పటికీ  సమాజం లోని అన్ని దృగంశాలూ అక్కడా వుంటాయి. కుటుంబంలో అందరూ సమానమేగానీ కొందరు ఎక్కువ సమానం. దానికి కారణాలు సవాలక్ష. పాతుకుపోయిన భూస్వామ్య విలువలు, అయాచితంగా ప్రవహిస్తూ వచ్చే పితృస్వామ్య భావజాలం, ప్రశ్నించరాని సంప్రదాయాలూ ఆచారాలూ,  జెండర్ వివక్ష, వ్యక్తుల బలాలు – బలహీనతలు, ప్రత్యేక ప్రేమాభిమానాలూ, నిర్వచించలేని వుద్వేగాలూ యిటువంటివన్నీ అక్కడ సంబంధాల్నిశాసిస్తాయి. నిర్ణయాల్ని నిర్దేశిస్తాయి.

కుటుంబ పెద్దగా సర్వాధికారాలూ సొంతం చేసుకొన్న సుందర రామయ్య న్యాయమూర్తి స్థానంలో కూర్చొని సమస్యని తన పెద్దరికంతో సులువుగా పరిష్కరించొచ్చు అనుకొన్నాడు. అయితే అతను ప్రజాస్వామ్య పద్ధతిని యెంచుకొన్నాడు. అసమానతల వ్యవస్థలో ప్రజాస్వామిక సంప్రదాయం యేమేరకు సరైన న్యాయం చేయగల్గుతుందో అతనికి తెలియదు. నిజానికతనికి యీ తగువు అంతగా నచ్చలేదు. అతను వర్తమానంలో యెంతగా జీవించాలనుకొంటాడో అంతగా వెనకటి కాలాన్ని ప్రేమిస్తాడు.

‘తన పిల్లలు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్ర సోదరులను తలపిస్తూ, ఒక్కటిగా ఉండాలని అతని అభిమతం.’

ఎంత ప్రజాస్వామికంగా వుందామనుకొన్నా సుందరరామయ్య రక్తంలో దాగున్న ఫ్యూడల్ విలువల అవశేషాలు అతన్ని యిబ్బంది పెడ్తూ వుంటాయి. పెద్దకొడుకు తన ఔరసుడన్నభావన అతనిలో బలీయంగానే వున్నట్లుంది. వాడికి తన తండ్రి పేరే పెట్టుకొన్నాడు. వాడి పట్ల ప్రత్యేకంగా పక్షపాతం చూపించినట్లు కనపడకూడదని ప్రయత్నపూర్వకంగా ప్రజాస్వామిక కండువాని సర్దుకొంటూ వుంటాడు.

పెద్దవాడు – తెల్లగా నాజూగ్గా స్టయిలుగా వుంటాడు. కళ్ళల్లో కొంత తెలివి కూడా కనపడుతుంది. పెద్దకొడుక్కే వారసత్వపు హక్కులు వుంటాయన్నసంప్రదాయం వాడికి తెలిసినట్టే కనపడుతుంది. అందువల్ల పెద్ద అట్ట తనకే  దక్కాలని వాడి అభిమతం. తమ్ముడి ప్రతిఘటనతో వాడి అభిమానం దెబ్బతింది. దాన్ని దాచుకోడానికి బేలగా ప్రయత్నిస్తూ వున్నాడు. కానీ తండ్రి ప్రేమ తనవైపే మొగ్గుతుందని గట్టి నమ్మకం. తండ్రి తీర్పు తనవైపేనని వాడికి  భరోసా .

రెండోవాడు కాస్త బండగా వుంటాడు. వాడి మూసి వుంచిన పెదవుల్లో పట్టుదలా, తెరచి ఉంచిన కళ్ళల్లో నిబ్బరం కనిపిస్తాయి. చూసేవాళ్ళకి, వాడితో కొంచెం జాగ్రత్తగా వుండడం మంచిదనిపిస్తుంది. వాడి గురించి తండ్రికి ముందే కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి.

‘వాడు ప్రతిదానికీ యిట్టే సీరియస్ అయిపోయే రకమని సుందర రామయ్య అంతకుముందే వాడిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొన్నాడు.’

నిజానికి న్యాయమూర్తికి యిటువంటి పూర్వ నిశ్చయాలు – ప్రిజుడీస్ వుండకూడదు. కానీ వాడిని కన్నతండ్రిగా అలా అభిప్రాయపడే హక్కు కూడా అతనికి సహజంగానే వుంటుంది. ఈ ద్వైధీభావం, సంఘర్షణా కథ పొడవునా అతనిలో కనిపిస్తూనే వుంటాయి. ప్రజాస్వామిక విలువలు వొక వైపు, భూస్వామ్య భావజాలం మరొకవైపు అతను మధ్యలో వేలాడుతూ వుంటాడు. అయితే తనలోని యీ వైరుధ్యాన్ని కనపడనివ్వని గాంభీర్యం కూడా అతను ప్రదర్శిస్తాడు. మార్క్సిస్ట్ పరిభాషలో – జార్గాన్ అనుకోకుంటే – అతణ్ణి సెమీ ఫ్యూడల్ అనొచ్చు.

అందరికీ సమన్యాయం ప్రసాదించిన రాజ్యాంగం వంటిది తల్లి. అర్థ రూపాయి పెట్టుబడి పెట్టిన కారణంగా పరిష్కారాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చుగానీ ఆమె స్వేచ్ఛకీ పరిమితులున్నందువల్ల తగువుని వున్నత న్యాయపీఠానికి తీసుకువచ్చింది.  ఆమె నిర్ణయం చెయ్యలేక పోడానికి ఆడబిడ్డ – సుందరరామయ్య అక్క – కూడా కొంతవరకు కారణం కావొచ్చు.

సుందర రామయ్య అక్క పాత్రని రచయిత రాజ్యాంగేతర శక్తికి నమూనాగా తీర్చిదిద్దారు. అది మత ధార్మిక శక్తి కావొచ్చు;  ఆధునిక న్యాయ గ్రంధాల్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చే కాలం చెల్లిన స్మృతులు కావొచ్చు.  చాలా సందర్భాల్లో యీ శక్తులు న్యాయవ్యవస్థని శాసిస్తాయి. అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్నీ రీతీ రివాజుల్నీ ధర్మం పేర్న న్యాయంగా చెలామణీ చేయించాలని కంకణం కట్టుకొని ప్రయత్నిస్తాయి. అందుకే –

‘చిన్నప్పుడు తమ పుట్టింట్లో వారాలబ్బాయే యివ్వాళ తను హాజరయిన కోర్టులో జడ్జిగా కనిపించినట్టు ఆ అప్పగారు తమ్ముడి వంక ధీమాగా చూస్తోంది.’

విచారణ ప్రారంభమయ్యేసరికి  – దాదాపు అనగనగా కథలా మొదలైన కథ నాటకంగా రూపొందుతుంది. వాదాలూ ప్రతివాదాలూ సంభాషణలూ ఆంగిక సాత్త్వికాల్తో నిండిన పాత్రల హావభావాల్తో పాఠకుడి కళ్ళముందు వొక కోర్టు దృశ్యం సాక్షాత్కారమౌతుంది. ఇది శిల్పానికి సంబంధించిన అంశం. ఈ కథలో శిల్ప చర్చ అంత ప్రధానం కాదు. వస్తు నిర్వహణ ముందు అది గౌణమైపోయింది. వస్తువుకి శిల్పంతో  స్వచ్ఛందంగా వూడిగం చేయించడం కారా కథల్లో విశిష్టత. ‘ఈ తగువులింక నే తీర్చలేను’ అన్న వుత్కంఠభరితమైన వాచికంతో కథ యెత్తుగడ దగ్గరే  ఆ చాకిరీ మొదలైంది.  మళ్ళీ కథలోకెళ్తే …

నాల్గో పిల్లడు – తానందరికంటే చిన్నవాడు కాబట్టి యెంచుకొనే అవకాశం తనకివ్వాలంటాడు. ఇది బలహీన వర్గాల రిజర్వేషన్ విధానంలా వున్నప్పటికీ నిజానికి యింకా చిన్నది ఆడపిల్ల వుంది – రిజర్వేషన్ అమలు కావాలంటే  – అట్ట ఆ పిల్లకు చెందాలి. అయితే ఆ పిల్లకి తన హక్కులు వినియోగించుకొనే / సాధించుకొనే తెలివీ చొరవా యింకా యేర్పడలేదు.

మూడోవాడి దృక్పథం, ఆచరణా యిందుకు భిన్నం. అట్టల తయారీలో వాడి శ్రమ కూడా కొంత వుంది. ‘అవసరం’ దృష్ట్యా పెద్ద అట్ట తనకివ్వమంటాడు. లేదంటే అన్నివిధాలా శ్రమ చేసి అట్టలు సృష్టించినవాడు రెండవవాడే కాబట్టి వాడికివ్వడమే న్యాయమంటాడు. ప్రజాసంఘాల వాళ్ళు న్యాయానికి వత్తాసు పల్కినట్టు రెండోవాడి తరపున వకాల్తా తీసుకొన్నాడు. అట్టల ఐడియా పెద్దవాడిదే అయినప్పటికీ ‘ఒట్టి ఐడియా’లకు అట్టలు పుట్టవన్న భౌతికోత్పత్తి రహస్యాన్ని  వెల్లడించాడు. వనరులూ పెట్టుబడులూ యెవరికైనా సమభావంతోనే రాజ్యం సమకూర్చాలనే రాజ్యాంగ నైతికతని కూడా గుర్తు చేసాడు. రెండోవాడికి యింతకు ముందే తల్లి యిచ్చిన నైతిక బలం వుంది. ఇప్పుడు తమ్ముడి న్యాయబద్ధమైన తోడ్పాటు లభించింది. నిజానికి వాడికి అన్న పెద్ద ప్రతిద్వంద్వి కూడా కాదు. ఇక తన శ్రమఫలం మీద అధికారాన్ని స్థాపించుకోవాలంటే రెండు అడ్డంకుల్ని అధిగమించాలి. ఒకటి న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న తండ్రి – రెండు తండ్రి  నోటినుంచి తీర్పు వచ్చేలోపే దాన్ని ప్రభావితం చేసే మేనత్త.

తండ్రి మొఖానికి తగిలించుకొన్న  ప్రజాస్వామ్యంతోనే అతనిలో దాగివున్న ఫ్యూడల్ విలువలకి గండికొట్టాలి,  మొత్తం న్యాయప్రక్రియ పైనే ధాష్టీకం చేయగల మేనత్త యేకరువు పెట్టే ధర్మపురాండాలని కట్టడి చేయాలి. లేకపొతే తనకు న్యాయం దక్కదని రెండోవాడు గ్రహించాడు. ఇంటికి పెద్దవాడూ తండ్రి తర్వాత తండ్రంతటి వాడూ లేదా తండ్రికి తల కొరివి పెట్టేవాడూ కాబట్టి తీర్పు పెద్దవాడికి అనుకూలంగా మారకుండా జాగ్రత్తపడ్డాడు.

‘ఇంటికి పెద్దవాడు కదా – ఎప్పటికైనా – మీ తరువాత ….’ అన్న అసంపూర్ణ వాక్యంతో తండ్రి ముందు కాళ్ళకి బంధం వేశాడు. పెద్ద కొడుకు వైపు తీర్పునిస్తే అది పక్షపాతంతో కూడినదన్న అపవాదునెదుర్కొవాల్సి వస్తుంది కాబట్టి సుందర రామయ్యకి తన  ‘ధర్మ నిబద్ధత’ని నిరూపించుకోక తప్పని పరిస్థితి కల్పించిందీ వాక్యం. న్యాయ ప్రక్రియపై రెండోవాడి తొలి పట్టు యిది.

ఇప్పటిదాకా సుందర రామయ్య యెదుర్కొన్నది బాహిరమైన సంఘర్షణే. ఇక యిప్పుడు అంతరంగ మథనం ప్రారంభమైంది. అతని హృదంతరాళాల్లో గూడు కట్టుకొని వున్న ఫ్యూడల్ నీతి వొళ్ళు విరుచుకొంది. రెండోవాడికి అందమైన అట్ట దొరకుండా చేయడానికి దారులు వెతుకుతున్నట్టు ప్రవర్తిస్తాడు.

మేనత్త  ‘లోకాచారాలూ, సబవులూ’ మాట్లాడడంతో  – తల్లి మౌనంగా వుండలేకపోయింది. ‘పెద్దవాడి వంతు వాటా వేయడం – చిన్నవాళ్ళు ఎత్తుకోవడం రివాజు’ అని నోరు విప్పింది. మేనత్తకి కౌంటర్ యిచ్చేటప్పుడు రెండోవాడి గొంతులో ధ్వనించిన వెటకారం, కరకుదనం,  న్యాయమూర్తి పట్ల చూపే వొక విధమైన అవిధేయత సుందరరామయ్యకి విసుగు పుట్టించాయి. వాడి ధిక్కారం నెగ్గకూడదని అతను నిర్ణయించుకొన్నట్టు చూపుల్లో మాటల విరుపుల్లో తెలుస్తూ వుంటుంది. వాడి దేహ భాషా, వచో వైఖరీ, ప్రవృత్తీ అతనికి భయం కల్గించాయేమో కూడా. సంభాషణల్లో వినిపించే కాకువూ పాత్రల స్పందనల్లో రచయిత చెక్కిన సున్నితమైన భాషాశిల్పం ఆయా సందర్భాల్లో వ్యక్తుల మనస్తత్వాన్ని కళ్ళకు కట్టడానికి అమోఘంగా వుపయోగపడ్డాయి.

భార్య చెప్పినట్టు  నాలుగో వాడికిద్దామని సుందర రామయ్య  ప్రతిపాదించాడు. ఆడపిల్లకి – అందరికన్నా చిన్నదైనా – యీ పంపకంలో వాటా గురించి అతను ఆలోచించడు.

‘ఆడపిల్ల కదా అని ఆడపిల్లకిచ్చేయడం ఆడదాని వ్యవహారమనిపించింది సుందరరామయ్యకి.’ అతనిలోని ఫ్యూడల్ మనస్తత్వానికి యిక్కడికొచ్చేసరికి దాపరికాలక్కరలేకపోయాయి.

అప్పటికే నాల్గోవాడు సాదా అట్టకి సర్దుకొన్నాడని రెండోవాడు చెప్పినప్పుడు –

‘చదరంగం ఆడే ఆసామి ‘ఆటకట్టు’ ఎత్తువేశాకా చూసే చూపు వాడి కళ్ళల్లో కనిపించింది’  సుందర రామయ్యకి.

ఇది న్యాయాన్ని తనవైపు  తిప్పుకొనే క్రమంలో రెండోవాడి మలి విజయం. తాననుకొన్న తీర్పు యివ్వలేకపోతున్నందుకు న్యాయమూర్తికి ‘క్రమంగా చిరాకు ప్రారంభమైంది.’

సుందర రామయ్యలో వున్న సమస్త వైరుధ్యాలూ మూకుమ్మడిగా అతని మీద దాడిచేశాయి.

పెట్టుబడి తనదే కాబట్టి – సంపదనంతా జాతీయం చేసయినా తన ఆధిపత్యం నిలుపుకోవచ్చన్న వూహ కూడా అతనికి వస్తుంది. ‘అట్టలెవరివీ కావని దాచేస్తే’ అనుకొంటాడు. ‘లాటరీ వేస్తే?’ అతనిలో యెక్కడో మిగిలివున్న బలహీనమైన ప్రజాస్వామ్యవాది ఆలోచన. క్యాలికో అట్ట కన్నా మంచి అట్ట తను స్వయంగా చేసి పెద్దవాడికిస్తే  – అని వుద్వేగంతో నిండిన అతని గుండె చప్పుడు చేస్తుంది. ఒక అట్ట వేరుగా చేసినందుకు కోపం వస్తుంది. రెండోవాడు ‘అన్నీ ఒకలాటివే చేసుకుందామ’ని చెప్పినా పెద్దవాడే ప్రత్యేకమైన అట్ట ప్రతిపాదన తెచ్చాడని విన్నాకా అతనికి సమస్య మరింత జటిలమైంది. మొదట్నుంచీ  రెండోవాడే న్యాయమార్గం లో వున్నాడని తేలడంతో దిక్కు తోచలేదు. అలా అని తీర్పు వాడి వైపు చెప్పడానికి కూడా మనసొప్పలేదు. ‘ఎటుపోయినా ఓటమి ఎదురవడం చిరాకుని పెంచుతుంది’. అతని మౌనంతో కోర్టు హాల్లో ‘ఆర్డర్’ దెబ్బతింది.

ఆ బలహీన క్షణాల్ని ఆసరా చేసుకొని గ్రంథాలయాలమీదా ఆర్ట్ మ్యూజియంల మీదా దాడిచేసే మనువాద సాంస్కృతిక సైన్యంలా మేనత్త రెచ్చిపోయింది. ‘చిన్నంతరం – పెద్దంతరం’ గురించి మాట్లాడింది. ఇవ్వాళ అన్నని కాదన్నవాడు రేపు తండ్రిని కాదంటాడని రెచ్చగొట్టింది. పొరుక్కి ఉపకారమంటే పొయ్యార్పుకునే రకమని శీలహననం చేసింది. పరోపకార గుణం గురించి నీతి సూత్రాలు యేకరువు పెట్టింది. న్యాయం కోరేవాణ్ణి నేరస్తుడిగా తీర్మానించింది. వాడు జన్మలో బాగుపడడనీ పుట్టగతులుండవనీ భయపెట్టింది. పాపం చేస్తే పాపం; పుణ్యం చేస్తే పుణ్యం తప్ప యింకేదీ వెంటరాదని సిద్ధాంతీకరించింది.

ఇప్పుడు రెండోవాడు సమస్త కార్మిక వర్గానికీ ప్రాతినిధ్యం వహిస్తూ తీర్పు యివ్వబోతున్నాడు. మేనత్త వూదరగొడుతోన్న అశాస్త్రీయ భావజాలాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిన సందర్భం వచ్చింది.

‘ – ఒక్క అట్టలు తప్ప’ అని ఆమె మాటలకి ముక్తాయింపు పలికాడు.  యుగాలుగా సంకెళ్ళుగా మారిన విశ్వాసాలను తెంచుకొన్న సవ్వడి ఆ మాటల్లో వొక విలక్షణతతో వినిపిస్తుంది.

తమ హక్కుల్ని స్థిరీకరించుకోవాలన్నా సాధించుకోవాలన్నా తరాలుగా పాతుకుపోయిన అభౌతిక భావజాలాన్ని కూకటివేళ్ళతో పెళ్ళగించాలి – అప్పుడు మాత్రమే కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించుకోగల అంతిమ తీర్పుని యివ్వగలం – అన్న చైతన్యం, వుద్బోధ రెండోవాడు పల్కిన మాటల్లో అక్కడందరితోబాటు పాఠకుల చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి.

న్యాయ పోరాటంలో విజయం సాధించాలంటే పితృస్వామ్యం చుట్టూ పాత బూజుపట్టిన  సంప్రదాయాల చుట్టూ అల్లుకొన్న సమస్త సాంఘిక – సాంస్కృతిక కట్టుబాట్లని తెంచుకోక తప్పదు.  రాజ్యం, దాని పరిరక్షకులూ సరైన న్యాయం చేయలేరని నిర్ధారణ అయ్యాకా లేదా తీర్పు యేకపక్షంగా అధర్మబద్ధంగా వెలువడవచ్చని అనుమానించాకా బాధితులు తమకేం కావాలో తామే నిర్ణయించుకొని దాన్ని అమలు చేసే అధికారాన్ని సొంతం చేసుకోక తప్పదు.

తన శ్రమ ఫలంపై అధికారాన్ని  స్వయంగానే ప్రకటించడానికి సిద్ధమయ్యాడు రెండోవాడు. తానే తీర్పరి అయ్యాడు.

మొత్తం అయిదు అట్టల్లో రెండు సాదా అట్టలు – వొక్కో దానికీ  పావలా లెక్కన ధర కట్టి – పెట్టుబడి పెట్టినందుకు యిచ్చేశాడు. మిగతా మూడు అట్టలూ పెట్టుబడి పోగా – అదనపు విలువ ( కార్మికుడి శ్రమే యీ విలువకి మూలం – అది  లాభం పేరుతో పెట్టుబడిదారుల పెట్టెల్లోకి చేరుతోంది). దాని న్యాయబద్ధమైన పంపిణీని కూడా తానే నిర్ణయించాడు. ఐడియా యిచ్చినందుకు (బౌద్ధిక శ్రమకి) పెద్దవాడికి పావలా అట్ట వాటా , పనిలో సాయం చేసినందుకు మూడోవాడికి మరో పావలా అట్ట వాటా ప్రతిఫలంగా ( అది ఎక్కువేనని చెబుతూనే) యిచ్చేశాడు. క్యాలికో అట్ట తనకిష్టమైంది కాబట్టి తానుంచుకొన్నాడు. ఇది  తిరుగులేని అంతిమ తీర్పు.

కార్మిక వర్గ నియంతృత్వంలో వుండే  సమత్వ భావననీ, ప్రజాస్వామిక లక్షణాన్నీ , వుత్పత్తి సంబంధాల్లో పరిఢవిల్లే మానవీయతనీ , సమ న్యాయాన్నీ, శ్రమఫలం పై దాని సామాజిక పంపకంపై శ్రామికులకు లభించే సాధికారికతనీ రెండోవాడి తిరుగుబాటు ద్వారా ప్రతిపాదిస్తూనే రచయిత కథ ముగింపుని తెరచి వుంచారు.

రెండోవాడి ‘అఘాయిత్యాన్ని’ సుందరరామయ్య యెలా స్వీకరించాడన్నది ప్రశ్న. తరతరాల సంప్రదాయాలు , విలువలు వాటిద్వారా సంక్రమించిన అధికారాలు, సౌకర్యాలు , పెద్దరికం తల్లకిందులయ్యాకా ‘ఎర్రగా చాలా ఎర్రగా జేవురించిన  ముఖం’ యెటువంటి ప్రతిక్రియకి పూనుకొంటుందో కాలం నిర్ణయిస్తుంది. ఈ తీర్పునిచ్చిన రెండోవాడే శ్రీకాకుళం కొండల్లో పుట్టిన నిప్పందుకొని సత్యంవైపు నిలబడి వుంటాడు. వాడి గురించిన సుందర రామయ్య భయాలు ఆ విధంగా నిజమయ్యాయి. ఈ కథ పుట్టిన మరో పుష్కరానికి  42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్యాక్టరీల నిర్వహణలో కార్మికులకి భాగస్వామ్యం కల్పించే చట్టం రూపొందింది. దానిద్వారా నిర్వహణలో కార్మికుడు అభిప్రాయ వ్యక్తీకరణకి పరిమితమై అధికారానికి యెప్పటికీ దూరంగానే వుండిపోయాడు.

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి... చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు  అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి.   కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి… చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి. కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

50 యేళ్ళ తర్వాత యివ్వాళ సుందర రామయ్యలు ప్రజాస్వామ్యపు ముసుగుల్ని సైతం వదిలేశారు. ఫ్యూడల్ విలువలకే సాంస్కృతిక జాతీయవాదం టాగ్ తగిలించి చెలామణి చేస్తున్నారు.  చట్టాలకీ న్యాయాలకీ అతీతంగా యెటువంటి విచారణలకీ తావులేకుండా దేశ విదేశ ధనికస్వాములకు దాస్యం చేస్తూ ప్రకృతి వనరులతో సహా సమస్త సంపదని స్వయంగా స్వాహా చేస్తూ ఆశ్రితులకి అడ్డగోలుగా పందేరం చేస్తూ నిర్లజ్జగా స్వైరవిహారం చేస్తున్నారు. కాదంటే – దుడ్డుకర్రనుపయోగించి రెండోవాడి మూడోవాడి నోళ్ళు మూయిస్తున్నారు. నిజానికి కార్పోరేట్ కల్చర్ లో యివాళ తాను చేస్తున్న  వుత్పత్తి తుది రూపం కూడా రెండోవాడికి తెలీదు. శ్రమ పరాయీకరణ పరాకాష్టకి చేరుకొన్న దశలో శ్రమఫలం పై అధికారం గురించి ఆలోచించే స్థితిలో లేడు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకొన్న హక్కులకి వాడు దూరమయ్యాడు. తల్లి పాపం అమాయిక – ఆమె యెప్పుడూ మౌన ప్రేక్షక స్థానంలోనే వుంది. మేనత్తలు సుందర రామయ్యల తెలివికీ తెంపరితనానికీ మురిసిపోతున్నారు. అందువల్ల ‘తీర్పు’ కథ 64 లో అందించిన  చైతన్యాన్ని యివ్వాళ కొత్త తరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం మరింత యెక్కువగా వుంది.

1948 – 55 మధ్య చేసిన రచనల తర్వాత , దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత 64 లో వెలువడ్డ  తీర్పు దాదాపు అదే కాలంలో రాసిన యజ్ఞానికి కృత్యాద్యవస్థలానో డ్రెస్ రిహార్సల్ లానో డ్రై రన్ లానో వుంటుంది. శ్రీరాములు నాయుడికి సుందరరామయ్య చిన్న మోడల్ లా వుంటాడు. శిల్ప పరంగా తీర్పులో నాటకీయతే యజ్ఞంలో  విశ్వరూపం ధరించి పెద్ద రంగస్థలం మీదికెక్కింది. సుందర రామయ్య యింట్లో వెలసిన కోర్టు హాలే యజ్ఞంలో న్యాయమంటపమైంది. రెండుచోట్లా అది కూలుతున్న దృశ్యమే. అయితే తీర్పు సింగిల్ పాయింట్ కథ. యజ్ఞం బహుముఖీన కథ.

తీర్పు న్యాయబద్ధం కానప్పుడు కుహనా అభివృద్ధిపై ఫ్యూడల్ ఆధిపత్యంపై  నిరసనగా బానిస బతుకు మీద తిరుగుబాటుగా సీతారాముడు కన్న కొడుకుని చంపుకొన్నాడు. సీతారాముణ్ణి అటువంటి వున్మాద స్థాయికి నడిపించిన పరిస్థితుల్ని యజ్ఞం కథలో విస్తృతంగానే వర్ణించినప్పటికీ – దాని బీజాలు తీర్పు కథలోనే వున్నాయి. సమస్య పరిష్కారానికి ‘అట్టలన్నీ చించేస్తే పీడా పోతుంద’ని భార్య అనొచ్చన్న వూహ వొకానొక దశలో సుందర రామయ్యకి కల్గుతుంది. ఆ వూహే సీతారాముడిలో ధ్వంస రచనాత్మకమైన నిరసన రూపం ధరించిందేమో!

సీతారాముడికి తనకేం కావాలో తెల్సు; కానీ సాధించుకొనే దారి లేదు. తన కొడుకు కంబారిగా వుండకూడదంటే తాను తీర్పరి స్థానంలోకి రావాలని సీతారాముడికి తెలుసో లేదో గానీ తీర్పులో సుందర రామయ్య రెండో కొడుక్కి మాత్రం స్పష్టంగా తెలుసు. వాడికి మొదట్నుంచీ తనకేం కావాలో తెల్సు. దాన్ని సాధించుకోడానికి వున్న ఆటంకాలేవో తెల్సు. వాటినెలా అధిగమించాలో వాద ప్రతివాదాల క్రమంలో నేర్చుకొన్నాడు. న్యాయాన్నో చట్టాన్నో తన చేతుల్లోకి తీసుకొంటేగానీ సరైన తీర్పు లభించదనే యెరుక పొందాడు. ఉత్పత్తిలో న్యాయబద్ధమైన భాగస్వామ్యం కోరుకోవడం దగ్గర మొదలైన అతని పోరాటం సమ న్యాయం కోసం మొత్తం వ్యవస్థ పైనే తిరుగుబాటుగా పరిణమించింది. కార్మికవర్గ నియంతృత్వ స్థాపన దిశగా ప్రయాణించింది. అప్పుడు  వుత్పత్తి ఫలాలమీదే కాదు – పెట్టుబడులు, వనరులు, వుత్పత్తి సాధనాలమీద కూడా శ్రామికుడికే సర్వాధికారాలూ దక్కుతాయి. ఇదంతా వొక గతి తార్కిక క్రమం.  విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణ క్రమాన్ని, శుద్ధ సిద్ధాంతాన్నీ కథగా మలచిన కారా మాష్టారి నేర్పు అద్వితీయం. పైకి సరళంగా కనిపించే యీ తీర్పూ నేర్పూ రెండూ నిజానికి యెంతో సంక్లిష్టమైనవి. తన తీర్పుని అమలు పరచడానికి కథ చివర్లో రెండోవాడు పడిన యాతన వంటి యాతనే కేవల సిద్ధాంతాన్ని కళాత్మకంగా జీవితానికి అన్వయించడంలో  రచయిత కూడా అనుభవించి వుండొచ్చు. అయితే కథ పూర్తయ్యేసరికి సంక్లిష్టత విడిపోయి పాఠకుడికి చేరువై రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరింది. ప్రయోజనోద్దిష్టమైన సాహిత్యానికి వొక పాఠంలా కథ రూపొందింది.

కారా 64 తర్వాత రాసిన కథల్లో ప్రతిపాదించిన సామాజిక – ఆర్ధిక – రాజకీయ దృక్పథానికి సైద్ధాంతిక భూమికనేర్పరచిన కథ ‘తీర్పు’. మాష్టారి సృజనాత్మక రచనా మార్గంలో పెద్ద మలుపు. తర్వాతి తరానికి ఆయన అందించిన ముందుచూపు.

 [తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , జాంబ పురాణం , రెండు దశాబ్దాలు కథ , బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది , నోబెల్ కవిత్వం , తొవ్వ ముచ్చట్లు  జూలూరి గౌరి శంకర్ గారి యుద్దవచనం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పుస్తకం ఇటీవలే వచ్చింది. అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జనవిముక్తికి దారి తీయాలని ప్రభాకర్ కోరుకుంటున్నారు.  ]

 

 వచ్చే వారం: అప్రజ్ఞాతం కధ గురించి ముళ్ళపూడి సుబ్బారావు 

 

తీర్పు  కథ:

 

Fusion షాయరీ on స్వప్న భంగమ్!

Pyramid-Skulls-Cezanne-l

painting : Paul Cezanne

1. బచ్ పన్ సే మనో ప్రవాహం లో సప్నో కె కష్టీ ని నడిపిస్తూనే ఉన్నాను. ప్రవాహమోసారి మా ఊరి నాగసముద్రం లా నిమ్మళంగా ఉంటే, ఇంకో సారి Pacific ocean లా గంభీరమై, ఓ సారి Red Sea లా ఎగిసిపడి, మరో సారి Dead Sea గా ఉప్పబారిపోతుంది.

Prior to my బాల్యం, there is a స్వప్నం…. ఔర్ that is the సత్యం !

2. సింధు నది నుండి హిందూ మహా సముద్రం లోకి చొరగిలబడి సట్లెజ్ సావాసంతో Mediterranean లో దూకేసి Adriatic తీరం వెంట రోమన్ Renaissance గోడల వెంట , forgotten empires గుండా forbidden times లోకి ప్రయాణించిన వో షామ్ కుచ్ అజీబ్ థీ…

Paul Cezanne చిత్రాల నిండా, Pyramid of Skulls రంగుల నిండా పరచుకున్నది స్వప్నమే… భగ్న గాయాల రాట్నమే… షోలే కా షబ్నమే!!

3. బ్యాక్ డ్రాప్ ఏదైనా, నీళ్లేవైనా అలలు మాత్రం పడవ పాదాలను ముద్దాడుతూనే ఉంటాయి. Laws of Flotationని, Flaws of Mutationనీ రంగరించాక Manchester బెరడుపై వాలిన సీతాకోక moth లా, Glass of Tearsగా ఒలికిపోయి, Mass of Fearsగా ఉద్విగ్నించి, Clash of Liersగా కొట్టుకుని ఎగబాకి Acancagua శిఖరం నుండి పట్టు తప్పి లోయలోకి జా…. రి…. పో…. తూ …., చరియలలోని ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుని వ్రేళ్ళాడుతూ, ప్రవాహం కాస్తా ప్రమాదమై, కల కాస్తా వికలమై, Dream Boat కాస్తా Scream Note గా, Scapegoat గా……. క్యా హాల్ హై, క్యా దిఖా రహే హో దోస్త్!

ముఖానికి ఏక్ తరఫ్ ఈ ప్రపంచం… దూస్రా తరఫ్ ఉన్నదే స్వప్నం!!

4. స్వప్న భంగమై, గౌరీశంకర శృంగమంతా ఖండిత అంగమై, చుంబిత రంగంలోని పరిప్లవిత విహంగం కాస్తా రసజ్వలిత మృదంగమై, సర్వ హృదంగమై, గర్వ భంగమై, స్వర భంగం లోని మాన భంగం వల్ల జరిగిన మౌన భంగం నుండి వ్రత భంగమై, శ్రుత భంగమై, మృత భంగమైనాక తపోభంగపు ఒడి నుండి ధ్యానభంగపు జడిలోకి యాన భంగమై, ప్రయాణ భంగిమై, విమానయాన భంగమైనాక….

స్వప్నం, భూగోళానికి మరో అంచున కొత్త లోకం… self discovery లో ఆకాశ గోపురం !!!

5.అంగ వంగ కళింగాది రాజ్యాంగం తోడుగా రాజ్యాధికార భంగం నుండి పుట్టిన పదవి భంగం లో, పెదవి భంగం లో, కొసాకి లింగాన్నే వాటేసుకున్న మార్కండేయుని చేతుల మధ్య నలిగిపోయి,పెక్కు భంగులలోని “భంగు”లలో విచ్చుకుని, మెత్తని కత్తులను కుత్తుకలలొ గుచ్చుకుని, నల్లని రక్తాన్నీ, యెర్రని అశ్రువులనీ, పచ్చని ఆకాశాన్నీ, పసుపు గాలినీ త్రుంచి రోకట్లో వేసి దంచి ఓ “ధవళ కల”ని కందాం… వో జానేవాలే హో సకే తో లౌట్ కె ఆనా….

Mind మర్రి చెట్టు బహు గాఢ suppressionల ఊడలకి వ్రేల్లాడుతున్న impression కదా స్వప్నం, ప్రతి రోజూ reality మట్టి లోకి దిగబడాలని తపన పడుతూనే…
ఆ యాతన లోనే…
నిశ్చింతన లోనే…
చింతన లోనే …
తన లోనే…
నా లోనే….. !!

— మామిడి హరికృష్ణ

mamidi harikrishna

ఆరేసిన చేయి

drushya drudshyam

మనకెన్నో పనులు.
నిజానికి చిన్నచిన్న పనులను గమనించం.
బట్టలు ఉతకడం గురించి కూడా ఆలోచించం.
ఇప్పుడు వాషింగ్ మెషీన్ వాడుతున్నాం అనుకుంటాం గానీ, అందునా ఎంతో పని.
ఆరేయడమూ ఒక తప్పనిసరి పనే.

ఉదయం వంటపని అయ్యాక పిల్లాజెల్లా బయటకు వెళ్లాకా మహిళలు చేసే పనులు ఎన్నో చిత్రాలు.
అందులో ఒకటి ఇది. బంగారు అంచుచీర.

కానీ. ఒకటైతే చెప్పాలి ఇక్కడ.
అమ్మ. వదిన, అక్క, భార్య, చెల్లె…బిడ్డ- వాళ్లు ఎవరైనా కానీయండి.
తల్లి వలే పని చేయడం ఒక కలనేత.

ఆఖరికి పనిమనిషి అయినా సరే, ఆమె అమితశ్రద్ధగా పనిచేసే తల్లే.
మనం ధరించే దుస్తులన్నిటా కనిపించని స్వేదం, తడి ఆరిన శ్రమైక గీతికా ఆమే!

ఆమెవి ఉతికి ఆరేసే చేతులే
అవి చలికి వానక ఎండకు వెరవని చేతలు.

చిత్రమేమిటంటే, బట్టలు ఉతకడమూ, వాటిని ఆరేయడమూ మనం చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాము.
కానీ, పెద్దయ్యాక దైనందిన జీవన సమరంలో పడిపోయాక వాటి గురించి ఆలోచించనే చించం.
అందులోని కవిత్వం గురించి గమనించనే గమనించం, జీవన గ్రంథమంతా మనమే అనుకుంటే, దుస్తులను మరచి!

+++

అంగీ గుండీలు దెబ్బతినవు.
లాగు జేబులో ఒక్కోసారి ఐదు రూపాయల కాగితం మడత దొరుకుతుంది.
కానీ, రోజూ దొరకవంటే ఏమిటీ అర్థం?

అమిత శ్రద్ధగా జేబుల్లో చేతులు పెట్టే ఆ తల్లి ఇగురమే అందుకు కారణం.
కానీ అది గమనించం.

బాగా మైల పట్టిన ప్యాంటు ఒక ఉతుకుతో శుభ్రం కాదని తెలుసు.
కానీ, మళ్లీ మళ్లీ నానబెట్టి ఉతకిన విషయమూ గుర్తురాదు.

అన్నిటికన్నా చిత్రం. బట్టలు ఉతకడం, ఉతికిన వాటిని వడివెట్టి పిండటం, అవసరమైతే అటు నువ్వు ఇటు నేనూ నిలబడి వడివెట్టి పిండటం. మళ్లీ మన మానాన మనం.
ఆమె మళ్లీ ఉతుకులో, ఆరేయడంలో నిమగ్నం.

+++

కానీ, తీరుబడి విలువ తెలిసిన వాళ్లకో మాట.
బట్టలు ఉతకడం ఒక జీవకళ.
ఉతికిన బట్టల్ని జాడీయడం..తర్వాత వాటిని దులిపి ఆరేయడమూ చిత్రమే.

అయితే, ఆ దుస్తులను ఆరేయడానికి కూడా కొన్ని చోట్లు ఉంటాయి.
తీగల మీద, దండేలా మీదా ఇంకా చాలాచోట్ల.
అయితే, గాలికి కొట్టుకు పోకుండా క్లిప్పులు పెట్టడం సరే!
కానీ, బంగ్లామీద ఇట్లా ఈ దృశ్యంలో ఆమె చీరను ఆ సందునుంచి వదిలి పైకి తీయడం ఉన్నదే అలా…
ఎండ పొడలో వెచ్చని దృశ్యం ఒకటి గమనించనే గమనించం. కానీ, ప్రతిదీ ఒక చిత్రం.
ఒక తెలివిడి, అమరిక. సుతారమైన శైలి. మహిళల జీవన మాలికా సంపుటిలో దాగిన అనురాగ దొంతర.
మన దృష్టిలో పడని నెమలీక.
దృశ్యాదృశ్యం.

+++

ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టుకోవడం ఒక చిత్రమే.
అయితే, అసలు సంగతి అది కాదు. తల్లి.
అవును. మనం ఒంటిమీద ధరించే దుస్తులన్నీఇక్కడ మీరు కూర్చున్న చోట మీతో ఉన్నాయిగానీ అవన్నీ అక్కడ తడిసాయి. ఆరాయి. బలంగా వడితిప్పబడినాయి. ఒక్క ఉదుటున దులుపబడి తీగల మీద నిశ్చలంగా ఆరవేయబడినాయి. అవి గాలి మాటుకు రెపరెపలు పోయినా పోయాయి. నీడలోనూ అవి సేద తీరే ఉంటాయి.

ఇక ఇంట్లోని మనుషుల్లా లేదా ఒక పుస్తకంలోని కవితల్లా అవన్నీ ఒకదాంతో ఒకటి రహస్యంగా అనుభూతులు పంచుకునే ఉంటాయి. ప్యాంటు, షర్టు, చీర. రవిక…ఏమైనా కావచ్చు

అవన్నీ వయోభేధాల జీవన వలువలు. విలువలు.+++ఒక్కమాటలో కుటుంబ సభ్యులందరికీ చెందిన దుస్తులన్నీఒకరి చేతిలో పిండి వారి చేతిలో ఆరేయబడినవే అని తెలిస్తే, అవే మన ఒంటిపై నిలిచినవీ అని గనుక గమనిస్తే, ఆఫీసుకు వచ్చేముందు దండెం మీదికి చూపు వాలవలసిందే.  వీధుల్లోకి వచ్చాక బంగ్లాపైకి చూడవలసిందే.

తల్లులు కనిపిస్తూనే ఉంటారు.
అపుడు మన ఒంటిపై స్పృహ కలిగి, ‘ఓహో’ అనుకుంటే మన మనసుకు నిజంగా శాంతి.

ముఖ్యంగా ఈ చలికాలంలో ఒకమాట చెప్పాలి. మన దుస్తులన్నీనూ వెచ్చగా ఉన్నయి అనుకుంటే…
బహుశా పైన ఒక సుదీర్ఘ కవితలాగా తల్లి ఆ చీరను ఆరేస్తున్నదే…ఆమె స్వేదంతో మరింత గాఢంగా మారి ఉండటం వల్లని?  ఏమో! అవి ఈ చలికాలాన వెచ్చగా అందుకే మారి ఉన్నాయి కాబోలు అనిపిస్తోంది.
వాటిని చిత్రంలో పటం కట్టలేకే ఈ ‘దృశ్యాదృశ్యం’ అనీ చెప్పబుద్ధవుతున్నది.

~ కందుకూరి రమేష్ బాబు

బతుకు బొంగరంపై ఫోకస్ ‘ప్రపంచాక్షరి’

గరిమెళ్ళ నాగేశ్వరరావు  ప్రపంచాక్షరి కవితా సంపుటి 1997 నుండి 2008 ల మధ్య దశాబ్ద కాలములో వ్రాసిన 51 కవితల సమాహారం. ప్రపంచాక్షరి అన్న పేరుతోనే వినూత్నంగా విశ్వమానవ కళ్యానానికి శ్రీకారం చుట్టిన ఈ కవి దృక్కోణం గురించి పూర్తిగా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే, కవితలకు ముందూ వెనుకా ఉన్న పేజీలలో పొందుపరచిన అవార్డులు స్వీకరిస్తున్న ఫోటోలు, పురస్కారాల వివరాలు ,పెద్దలు వ్రాసిన మాటలు ఇవన్నీ కలిసి ఈ మాస్టారి అప్రతిహత బహుముఖ ప్రజ్ఞ ‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకునే వరకూ’ సాగి ఇంకా అదే వేగం తో పరుగెడుతోందని తెలిసి మరెంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కవి స్వయంగా రూపొందించిన ముఖచిత్రం ఈ కవితా సంపుటి శీర్షికకు తగ్గట్టూ శాంతి (పావురం), వీణ (కళ), బాలిక (స్త్రీ హిత), బిడ్డను పొదవుకున్న మైనర్ తల్లి ( అవాజ్య ప్రేమ)  దీన బాలుడు (అన్నార్తుల వేదన) ప్రతీకలు సృజించి  లోపలి  కవితా వస్తువుల గురించి చెప్పకనే చెబుతుంది .

కవిత్వాన్ని ఒక రైలు బండిలా మార్చుకుని నేల నలుచెరగులా దాన్ని కవి నడిపించడమే కాకుండా, పట్టాలు తప్పే ప్రమాదమున్న సందర్భాలను ముందే అంచనా వేసి తదనుగుణంగా హెచ్చరికలు చేసి, ఆగే ప్రతి స్టేషన్ గురించి కూలంకషంగా చెబుతూ, ఎక్కే దిగే ప్రయాణికుల భద్రతను కాంక్షిస్తూ, వారి గాధలని ఆలపిస్తూ కవి చేసిన చైతన్య ప్రయాణమే ప్రపంచాక్షరి. ముల్లు మొదలు తల వరకూ బొంగరానికి తాడుని పకడ్బందీగా చుట్టి, గచ్చు నేల మీదికి లాఘవంగా విసిరి తాడు లాగి ఆ బొంగరం చేసే గింగిరాల వీరంగాన్ని వీక్షిస్తే ఆ ఫోకస్ (తదేకత) లో ఎంత సంతృప్తి కనబడుతుందో… ప్రతి కవితలో కూడా అంతే చక్కటి ఫోకస్ ని దట్టించి పాఠకుడి మనోఫలకం మీద తిప్పగలగటం గొప్పగా గోచరిస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని ఊసుపోనప్పుడో, నిద్రపోవడానికి ముందో చదవాలనుకునే కన్నా, రోజంతా శ్రమలో మునిగి తేలిన రాత్రి ఎనిమిదిగంటల పాటూ నిద్ర పోయి మర్నాడు ఉదయం లేచిన తరువాత తిరిగి చైతన్యానికి శ్రీకారం చుట్టే సమయాలలో చదివితే చాలా బాగుంటుందనిపిస్తుంది.

Cover Page Prapanchakshari

ప్రారంభం లోనే స్వాగతం పలికే ‘ప్రపంచాక్షరి’శీర్హిక కవిత, కవి అతని కవిత్వం  విస్తృత పరమార్ధాన్ని, విశాల భావజాలాన్ని, వస్తు సందర్శనాన్ని బలీయంగా చెబుతుంది. “బండరాళ్ళ… మొండి శిలల మీద వాక్యాలు జల్లి కన్నీరు చెమర్చడం నేర్పాను.… అక్షర మూర్తిని, నేను కవిని” అని తనను గురించి పరిచయం చేసుకుంటూనే కదన రంగం లో ఆయుధాన్ని పూనిన సైనికుని ఆత్మవిశ్వాసం మాదిరిగా ఉత్సాహం తో కవిత్వాన్ని చెబుతారు.నెల్సన్ మండేలా, రెండు జర్మనీల మధ్య కూలిన అడ్డుగోడ, సోమాలియా ఆకలి, హిరోషిమా బూడిద వగైరా చారిత్రక సందర్భాలను ఆయా వస్తు నేపధ్యాల ప్రయాణంతో కవితను ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. అందులో …

నదీ తీర తవ్వకాలలో బయల్పడిన

నాగరికతల ముఖాల మీద

నవ్విన సంతకాన్ని నేను

 

జైలు గోడల మధ్య సూర్యోదయమయిన

నెల్సన్ మండేలా బిగిపిడికిలి విప్పిన చప్పుడులో

వినిపించిన విజయధ్వానాన్ని

 

కల్పనా చావ్లా రెప్పల వెనుక చేజారిన స్వప్నాన్ని

సునీత కళ్లతో నేలకు చేర్చినప్పుడు

మురిసి పోయిన తారకల్లో మెరిసింది నేనే

 

అంతరిక్షం నుండి పాతాళం వరకూ

… శాంతి కోరి తపిస్తూ జపించే …ప్రపంచాక్షరి ఇది

 

మరొక కవిత ‘సైబర్ కూలీ స్వగతం’ లో డాలర్ల దాహంతో పరాయి దేశానికి అంగలార్చిన సాఫ్ట్ -వేర్ ఇంజనీర్ దైనందిన జీవితం ఎంత యాంత్రికంగా సాగుతుందో వివరంగా చెప్పారు. “ అత్యాధునిక శ్రామికుణ్ణి..కీ బోర్డు దేహాన్ని మీటుతూ కొత్త సృష్టికి ఊపిరి పోసే కృత్రిమ బ్రహ్మని..” అని అతని లోకి పరకాయ ప్రవేశం చేసి స్వగతంగా పూర్తిగా చెప్పాక,దూరాన అతను కోల్పోతున్న దగ్గర వారి గురించి టార్చ్-లైట్ వేసి మరీ చూపించి అతను తిరిగి తనవారి మధ్య కు వచ్చి అదే వృత్తిని కొనసాగించే వీలు ఎంత సాధ్యమో “అవును ప్రపంచం పల్లెటూరయ్యాక పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని  ప్రశ్నిస్తూ చెబుతారు.

డౌన్-లోడ్ చేసిన ఫైల్లో … పెరటి చింతచెట్టు

కొత్తగా చిగురించినట్టు కనిపిస్తోంది

 

ప్రేమ ఫైల్ ఓపెన్ చేసేందుకు

పాస్వర్డ్ ఎక్కడా దొరకడం లేదు

 

అభిమానం ఆచూకీ రీసైకిల్ బిన్ లోనైనా

రీస్టొర్ చేసేందుకు అందదు

 

అని కంప్యూటర్ పదాల పరిభాషలో యాంత్రికత్వాన్ని నిరసించి, ద్వేషించి బాధపడి… పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని తనకి తాను పూర్తిగా సమాధానపడటం ప్రశ్నతో ముగుస్తుంది.

ఈ రెండు కవితలలోనూ కదిలించిన చరిత్ర, కదులుతున్న వర్తమానం అంశాలుగా కవి చేసిన ప్రయాణం అతని తపననీ, జ్ఞానాన్ని మనముందు రంగరించి పోస్తాయి.

అనంత జీవన యానంలో శిధిలమైపోతున్న రంగుల స్వప్నాలని ప్రస్తావించి మానవత్వపు మేడొకటి నిర్మించాలని సూచించిన “ మా విద్వి షాహహై ” అనే కవితా, తడారిపోతోన్న మట్టి పొరలల్లోంచి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టడానికి రూపాయి చూపులను మరోసారి మట్టిదారి పట్టించాలని చెప్పే “ మట్టిదారిలో మరోసారి..” లాంటి ప్రతి కవిత లో సమస్యలను ఎత్తి చూపించడమే కాకుండా పరిష్కార మార్గాలనూ సూచించారు.

‘ ప్రశ్నలు ‘ లో ఇరాక్ మీద అగ్ర రాజ్యం దాడినీ, ‘ గుండెలోతుల్లోంచి ’ లో మన విలాస స్వార్ధాలకు ప్రకృతిలో కోతీ, పామూ, ఆవు, కప్ప, ఉడుత, తూనీగ  లాంటి జీవుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా ఆహుతి చేస్తున్న తీరునీ చదివాక, చుట్టూ పేరుకున్న హింసలో కలిసిపోయి బతికేస్తున్న మనకి గగుర్పాటు కంపరం కలుగుతుంది.

అమ్మ, మాస్టారుకో పద్యం, పండగ, మొదలైన జ్ఞాపకాలలో సౌమ్యంగా ఉన్నత మూర్తులకు చేసిన సన్మానాలను చూడొచ్చును.

ఓటు వజ్రాయుధాన్ని సరిగ్గా ఎక్కు పెట్టమని నిర్దేశం చేసిన ఆ కలం తోనే, పిచ్చుకల లాంటి అంతరించి పోతున్న పక్షుల మీద కాలుష్యపు వజ్రాయుధాల్ని ఎక్కుపెట్టొద్దని చెప్పి కట్టడి చేశారు.

ప్రేమ పేరుతో స్వైర విహారం చేస్తున్న ప్రేమ-చిరుతల పట్ల మిక్కిలి జాగురూకతతో వ్యవహరించాలని ‘లేడీ (ఆడ)’ పిల్లలను కవి హెచ్చరించిన తీరు ‘ప్రేమ-చిరుత’ కవితలో సమగ్రంగా ఉంది. ఇది ఇప్పటి కాలానికి…అందరు ఆడపిల్లలకూ తప్పని సరి పాఠం. ఈ కవితను రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్మీడియట్ లేదా పదవ తరగతి తెలుగు వాచకములలో చేరిస్తే బాగుంటుంది.

‘నగరంలో ఇప్పుడు…

ప్రేమ చిరుతలు తిరుగుతున్నాయి

“లేడీ” పిల్లల్లారా….జాగ్రత్త!’

అని ప్రారంభమవుతుంది ‘ప్రేమ-చిరుత’ కవిత.

‘ ప్రేమంటే వెంబడించిన వాడి వెంట

అడుగేసి గుడ్డిగా నడుస్తూ…

దారి తప్పిపోవడం కాదు కదా?!’

ప్రాణాలు తియ్యడం, తీసుకుంటామని భయపించడం ,యాసిడ్ దాడులు చెయ్యడం, ఇంట్లో వారినీ, బంధు మిత్రులనీ, చుట్టు పక్కల వారినీ భయభ్రాంతులని చేసి మరీ అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయే పైశాచిక ప్రేమల గురించి ఆడపిల్లలు తప్పని సరిగా అలెర్ట్ కావాలి.

మొదట ‘ప్రపంచాక్షరి’ కవిత లో కవిత్వ పరమార్ధాన్ని చెప్పి, అఖరున ‘ కలాన్ని మోసే వాడు ‘ కవితలో ” మిత్రమా కలాన్ని మోయడం కాలాన్ని మోసినంత సులువు కాదు” అనడం చదివాక ఈ రెండు కవితలూ అటూఇటూలుగా  మిగిలిన కవితలతో చక్కగా అల్లిన దండ ప్రపంచాక్షరి కవితా సంకలనమని అవగతమౌతుంది.

చీకటికి ఆనవాలమవుతున్న అనైతికత, నిర్లక్ష్యం, స్వార్ధం, అవకాశ ధోరణులు; వెలుగు దివిటీలు పట్టుకు తిరిగిన నాయకులు, కవులు… ఇంకా వెలుతురు మయం గావించాల్సిన మూల మూలల్లోని విషయాలు; కూలగొట్టవలసిన అడ్డుగోడలు; వేయ వలసిన వంతెనలూ; కట్టాల్సిన ఆనకట్టలూ, నిర్మాణాలు వీటన్నీంటి గురించి ప్రపంచాక్షరి కవితలు అనేక విషయాలను చెప్పకనే చెబుతాయి.

“చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా “ అని కవి గరిమెళ్ళ నాగేశ్వర రావు గారు పిలిచి చూపించిన విషయాలు, వెలుతురు ప్రసరించిన దారులూ, కొనియాడి అధిరోహింప జేసిన ఆదర్శవంతమైన శిఖరాలు బహుదా ప్రశంసనీయం, సర్వదా అభినందనీయం.

కవి తపన, తదేకత, మమేకత ,సంస్కరణాభిలాష,వస్తుగతజ్ఞానము మొదలైన అనేక విషయాలను ఈ కవితా సంపుటి ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుంది. విలువలు ప్రాతిపదికగా కవిత్వాన్ని ఆస్వాదించి అనుభూతించి ఆ మార్గాలను అనుసరించాలనుకునే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండాల్సిన పుస్తకం ఈ‘ ప్రపంచాక్షరి ‘.

ప్రతులకు సంప్రదించండి.

Email: gvsnrao08@gmail.com

 -నారాయణ గరిమెళ్ళ.

Photo Narayana Garimella

అంతర్నేత్రపు తల్లడిల్లిన చూపులు-“జీరోడిగ్రీ”

10653339_716759828412278_2494152736493877358_nకవిత్వాన్ని మామూలుగా చదవటం అర్థమయ్యాక ఎక్కడైనా,ఎప్పుడైనా ఒక వినూత్నమైన వస్తువో,నిర్మాణమో శైలినో కనిపిస్తే మనసు ఆహ్లాద పడుతుంది.ఈ క్రమంలొ సాహిత్యాంశాలగురించి,సాహిత్యేతరాంశాల గురించి రెండిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం మోహన్ రుషి కవిత్వం కలిగిస్తుంది.రుషి నిశ్చయంగా ఒక దు:ఖవాతావరణం లోని సంకోచ వ్యాకోచాలను అనుభవిస్తాడు.ఈ సంఘర్షణ వెనుక ఉండే ఒక గంభీర నిశ్శబ్దాన్ని కవిత్వం చేస్తాడు.అందువల్ల కవిత్వానికి దానివల్ల ఉత్పన్నమైన మానసిక స్థితికి ఒక లంకెను జోడించి “కాలిక స్పృహ”తో మాట్లాడుకోవాల్సిన సమయం.

రెండవది తనకు సరిపోకున్నా ఏదో ఒక నిర్మాణంలోకి ఒదిగిపోకుండా తనగొంతుకకుతగిన పరికరాలను తానుగా తయారు చేసుకుని లేదా ఎన్నుకుని నిలవడం.స్పష్టంగ ఈరెండు అంశాలు రుషిని ప్రతేకంగా చూచేలా చేస్తాయి.ఒక సామాజిక వాతావరణాన్ని,ఒక సాహిత్యవాతావరణాన్ని రెంటినీ గమనించి ఆతాలూకు స్పృహనుంచి తానుగా వ్యక్తమౌతున్నాడు.

రుషిని అర్థం చేసుకోడానికి అస్తిత్వ వాదం(Existentialism)కొంత ఉపయోగ పడుతుంది. హైడెగర్ (Martin Heidegger)మానవాస్తిత్వం అనేక సంభావ్యతల క్షేత్రం అన్నాడు.సంభావ్యత(Possible)మనిషిలోని నిశ్శబ్దశక్తి.ఏక కాలంలో మనిషిలో అనేకాంశాలుదాగుంటాయి.కటి ఉపయోగంలో ఉన్నప్పుడు మరొకటి నిశ్శబ్దంగా ఉంటుంది.ఈ అంసం నిశ్శబ్దాన్ని భరించలేదు.ఈ నిశ్శబ్దంలో మనిఉషి అర్థమానవుడుగా,పార్శ్వమానవుడుగా ఖండ మానవుడుగా జీవించాల్సి వస్తుంది.రుషి కవిత్వం “జీరోడిగ్రీ”లో “సోమవార మహత్మ్యం(పే.76),8 pm(పే.82)నో అదర్ గో (పే.77)మొదలైఅన కవితలన్నీ ఇలాంటివే.ఒక అంశానికి కట్టుబడి బతికే యాంత్రిక యాంత్రిక జీవన విరక్తి(Aversion of mechanical life)వీటిల్లో కనిపిస్తుంది.

“బతికే ఉన్నందున పాపానికో, పుణ్యానికో/
వెళ్ళే తీరాలి, ఆఫీసులకీ, స్కూళ్ళకీ-/
పెద్దగా చెయ్యడానికేం ఉండకపోవచ్చు కానీ/
ఉండాలి అక్కఢ మెకానికల్ గానో, మెకాలేకు
లాయల్ గానో”- -(సోమవార వ్రత మహత్మ్యం)

పొద్దున ఇటూ సాయంత్రం అటు/ఉరుకుతుండాలి/
ఆలోచనకు అవకాశమివ్వకుండా”-(8pm)
“నీ ప్రపంచంలో నువ్వు ,నా కరాబ్ దిమాక్ లో నేనూ/పొద్దున్నే లేచిన తర్వాతకూడా బతికే ఉన్నాం/ఈ జీవితానికి ఈఅదృష్టం చాలదా ?”-(పొడిచిన పొద్దు-80 పే.)

“ఎవరిగురించి చూస్తున్నావు/
నిన్ను నిన్ను కాకుండా చేసిన ఈ మధ్యాహ్నం పూట ?!”-(నువ్విలా ?-30పే.)

1655904_593020304119565_1297827243_n
జీవితంపై పెంచుకున్న అపేక్షని,దాన్ని అందుకోవడంలో ఉండే ఇబ్బందిని రుషి కవిత్వం చేస్తాడు.జీవితంలో యాంత్రికతకు,ఇష్టానికి మధ్య సంఘర్షణను వ్యక్తం చేస్తున్న ఈ వాక్యాల వెనుక ఒక పెయిన్ ఉంది.రుషి స్వీయ జీవితాన్ని కూడా ఒక దృశ్యం చూసినట్టుగా చూస్తాడు.ఇది ఒక్కోసారి ఆనందాన్ని,విసుగును ఇవ్వొచ్చు.కీర్క్ గార్డ్ చెప్పిన అస్తిత్వ దశల్లోరెండవది బౌద్ధిక సౌందర్యం(Intellectual aesthete)ఇందులో మనిషి జీవితానికి వెలుపల ఉండి గమనిస్తాడు.ఈ వాక్యాలు ఇలాంటివే.ఈ వాక్యాలు అలాంటివే.కొన్ని సార్లు తృప్తిని ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి.
“ఏమికావలె ఇక ఈ సమయానికి జీవితానికి ?/పై గుండీ విప్పి,అంగీ /వెనక్కి లాగితే తగిలే చల్లగాలి “-(పే.56)
“ఆటోకిందా మీదా/అయినప్పుడు “రోడ్డుసల్లగుండ”అంటూ/
కోపంలోనూ నోరుజారని వాళ్ళు”-(నేర్చుకోవాలి.పే.86)
కవిత్వాన్ని చెప్పడానికి ఉపయోగించుకునే పద్ధతిని,పరికరాలను కూడా గమనించాలి.భాష ఆలోచన రెండు వేరుకాదని(Language is implict thought)అస్తిత్వ వాదుల అభిప్రాయం.ఆలోచనకు దాని ఆవేశ స్వభావాలకు వెలుపల రుషి భాష అలంకారాలను తొడుక్కోదు.చూడటానికి శుద్ధవచనం(Plain prose)లా కనిపిస్తుందికాని,సాంద్రమైఅన వాక్య సౌందర్యం ఉంది.మనసులోని స్వభావసారాన్ని కవిత్వం చేయడం వల్ల సౌందర్యమూ ఆమేరకే కనిపిస్తుంది.జ్ఞానం ప్రేరేపించే ప్రయత్న పూర్వక కళావాక్యాల నిర్మాణం లేదు.కొన్ని సార్లు విలోమ వాక్యాలు రాయటం కనిపిస్తుంది.
1″ఏమికావలె ఇక ఈ సమయానికి జీవితానికి ?”-(పే.56)
2.”బతికే ఉన్నందున పాపానికో, పుణ్యానికో/
వెళ్ళే తీరాలి, ఆఫీసులకీ, స్కూళ్ళకీ-/-(పే.76)
సాధారణంగా ఈ వాక్యాలు”ఇక ఈసమయానికి జీవితానికి ఏమికావాలె”/పాపానికో పుణ్యానికో బతికి ఉన్నందున ఆఫీసులకీ,స్కూల్లకీ వెళ్లేతీరాలి”ఈ క్రమంలో ఉంటాయి..వాక్యంలోని పదాలస్థానాలను మార్చిరాసి కవితాత్మకతను అనుభవించడం ఇక్కడ కనిపించేది.వాక్యాలు సంభాషణాత్మకం కావడం వల్ల చిన్న చిన్న వాక్యాలుగా రాయటం,కొన్ని సార్లు పదసమ్మేళనాలని,ప్రశ్నా వాక్యాలనీ ఎత్తుకోవడం కనిపిస్తుంది.ముఖ్యంగా శబ్దంలో ఉండే చమత్కారాన్ని బాగా ఉపయోగించుకుంటారు.
“మెకానికల్ గానో/మెకాలేకి లాయల్ గానో..(పే.76)మరణ జన్మ సంయోగక్రియ(పే.70)నరగ్రహ కూటమి-ఇలాంటివి అనేకంగా కనిపిస్తాయి.ఇదే సందర్భంలో గంభీర సౌందర్యం గల వాక్యాలూ,పదబంధాలూ కనిపిస్తాయి.ఆకాశదారులు(పే.79)జీవితగణితం(పే.16.పే.)స్టీరియో నవ్వులు(పే.13)లాంటి ఆధునిక పదబంధాలూ కుమ్మరిస్తాడు.రుషిలో తనదైన అభివ్యక్తి ముద్ర ఉంది.అభివ్యక్తి,నిర్మాణం,వాక్యసంవిధానాలకు సంబంధించిన చర్చ జరిగితే ఒక అంచనాలో మోహన్ రుషిలాంటివారు ఒక మలుపులో నిలబడతారు

– ఎం.నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

కూలి బతుకు

Kadha-Saranga-2-300x268

సూరీడు సరిగ్గా నడినెత్తి మీదకొచ్చాడు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఎండ ఇరగ్గాస్తుంది. మేనెల్లో ఎండలు ఉండాల్సిన దానికంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. చెమట పట్టడం వలన సిమెంటు పొడి మొహానికి అతుక్కుపోయి రాముడి మొహం జిడ్డుగా ఉంది. తలకు చుట్టుకున్న తువ్వాలు గుడ్డను విప్పి, ఆ తువ్వాలుతో మొహం తుడుచుకున్నాడు. చెమట తుడుచుకున్నాడు గాని జిడ్డుమాత్రం పోలేదు. ఆ జిడ్డు మొహంతోనే అడ్డ పారేసి సిమెంటును ఒక చోటకు లాగాడు. అప్పటికే మూడు సార్లు సిమెంటును కలతిప్పినా ఇంకా అక్కడక్కడ ఇసుక కనిపిస్తూనే ఉంది.

అంతలో ‘రేయ్… బామ్మార్ది… సిమెంటురా… ఈడ సిమెంటు అయిపోయి చాలా సేపయిందిరా మామా… తొందరగా తీసకరా…’ అని లోపలున్న బేల్దారి శీను అరిచాడు. ‘ఆ మామా… తెచ్చాన సామి. సిమెంటు కలిపి, కుంది తీసి నీళ్ళు పోసినా… రెండు నిమిషాలబ్బా…’ అని రాముడు శీనుకు చెప్పాడు. ‘దా…దా… నేను ఇంతలోపల ఒక దమ్ము లాగిస్తా… ’అని చెప్పి చొక్కా జేబులో ఉన్న బీడి తీసి వెలిగిచ్చాడు. ఒక్కసారి గట్టిగా ఆ బీడిని లాగి పొగ ఊదేతలికే ఆ పొగ నీళ్ళలో వేగంగా పాకిన పాములాగా మెలికలు తిరుగుతూ ఒక మూలకు పోయింది. సిమెంటులో నీళ్ళు పోసినాడే గానీ రాముడి మనసంతా గందరగోళంగా ఉంది. ఏమి దిక్కు తోచడం లేదు. పనిలో ఒంగినాల నుంచి రాముడి మనసు అదోలా ఉంది. ఎంత వద్దనుకున్నా నిన్నటి సంఘటనే గుర్తుకొస్తావుంది. ఎంత మరిచిపోదామన్నా ఆ సంఘటనే గుర్తుకు వస్తావుంది. ఆ సంఘటన వలన రాత్రికూడా సరిగా నిద్రపోలేదు.

’ఏం రా… సిమెంటు రెడీనా?’ అని శీను ఒక్కసారి గట్టిగా రాముడిని పిలిచాడు.

’ఆ మామా… రెడీ… కావాలా..’

’తొందరగా తీసకరా… పద్దన్నుంచి ఇప్పటికి సరిగా చదరం పూతకూడా జేయ్ లా… మీ తాత వచ్చినడంటే నీకు నాల్గు, నాకు నాల్గు సింగారాలు ఇచ్చడు.. తొందరగా తీసుకురా…’

’ఇదోబ్బా… కానీ మరి… అన్నానికి ఇంకా అర్ధ గంట టైముంది. ఈ లోపల ఈ గోడ పూర్తైతది. గబగబ కాని మరి. సిమెంటు రెడీ. నేను గబగబ అందిచ్చా… నీదే లేటు మరి’ అనిచెప్పి సిమెంటు గోలం తెచ్చి శీను నిలబడిన సారవ మీద పెట్టాడు రాముడు.

’సరే మరి అందీ… నువ్వు కొంచెం ఉషారుగా ఉంటే ఈ పాటికి సుమారుగా అయి పోయిండేది. నువ్వేమో పద్దన్నుంచి మన్ను తిన్న పాము మాదిరి మెత్తంగుండావ్…’ అని రాముడితో చెప్పి గోలంలోని సిమెంటు తీసుకొని గోడకు లకారిచ్చడం మొదలు పెట్టాడు శీను. పది, పదైదు గోలాల సిమెంటు అందించి గోడకు కాలు ఆనించి నిలబడ్డాడు రాముడు. గోడకు సిమెంటు లకారించడం పూర్తైంది. గజంకట్టె తీసుకొని గోడకు గజం ఈడ్చడం ప్రారంభించాడు శీను. గజం ఈడ్చడం పూర్తైం తరువాత గోడకు ఉన్న హెచ్చుతగ్గులకు మళ్ళీ సిమెంటు లకారించాడు.

’రేయ్ బామార్ది… చక్కతాపి తీసకరా… ’ అని రాముడిని శీను పిలిచాడు.

తలపైకి పెట్టి పైనున్న స్లాబు వైపు చూస్తున్న రాముడు ఒక్క సారిగా శీను వైపు తిరిగి ’ఆ మామా…’ అని అన్నాడు.

’చక్కతాపిరా సామి’ అని మరో సారి గట్టిగా అరిచాడు శీను.

’ఇదిగో..’

’పద్దన్నుంచి ఎదో ఒకమాదిరిగా ఉండావురా… ’ అని చక్కతాపి తీసుకొని గోడకు చక్కపట్టాడు. అక్కడక్కడా నొక్కులు మాదిరిగా ఉండే సరికి మరోసారి తాపితో సిమెంటు తీసుకొని నొక్కులకు సిమెంటు పెట్టి చక్కపట్టాడు. ఇసారి శీను అడక్కముందే స్పాంజిని నీళ్ళల్లో పిండి చేతిలో రెడీగా పట్టుకుని ఉన్నాడు రాముడు. ’ఆ స్పాంజి ..’ అని శీను అడగి అడగక ముందే చేతిలోని స్పాంజిని బేల్దారి చేతికిచ్చాడు రాముడు. అలా నాలుగైదు సార్లు స్పాంజిని నీళ్ళలో పిండి శీనుకు అందించాడు రాముడు. సగం గోడ పూత దాదాపు పూర్తైంది. గట్టున ఉన్న కప్ప నీళ్ళలోకి దూకినట్టు అప్పటి దాకా సారవ మీద ఉన్న శీను ఒక్క ఉదుటున ఇసుకలోకి కిందికి దూకి ’టైం ఎంతైందో చూడు’ అని రాముడిని అడిగాడు. రాముడి దగ్గర కూడా వాచి లేకపోవడంతో ’ఉండు చూసొచ్చా!’ అని చెప్పి పక్కింట్లో ఉన్న అబ్బాయిని ’అన్నా టైమెంతా?’ అని అడిగాడు. అతడు వెంటనే చేతిలో వాచిని చూసి ’పన్నెండు ముక్కాలు’ అని రాముడితో చెప్పాడు. రాముడు శీను దగ్గరికి వచ్చి ’మామా ఇంకా ఒంటి గంటకు పదహైదు నిమిషాలుంది సామి. ఏం చేద్దాం?’ అని బేల్దారిని అడిగాడు. పని దగ్గర అంతా కూడా బేల్దార్లు చెప్పినట్లే వినాలి. ముఖ్యంగా చిన్న కూలోల్లు, పెద్దకూలోల్లు బేల్దార్ల మాటలు తు.చ. తప్పక ఆచరించాలి. పని దగ్గర మేస్త్రి తరువాత బేల్దారి మాటే వేదవాక్కు. వారు ఏం మాట చెబితే ఆ మాట కూలోల్లకు శిలాశాసనం.

’ఇంకా పదైదు నిమిషాలుంది. సరే ఒక పని చేయి… ఇప్పుడు అర మూట దాకా సిమెంటుంది. ఇంకొక మూటకు ఇసుక కొలిచి సిమెంట్ కలుపు. మధ్యాన్నం వస్తానే పని జరుగుతది. సిమెంటు కలిపిన తరువాత అన్నానికి చాలిద్దాం’ అని శీను రాముడితో చెప్పాడు. మాములుగా అయితే అరమూట సిమెంటుతో గంట పని జరుగుతుంది. ఆ పదైదు నిమిషాలు పనిచేయటం ఇష్టం లేక సిమెంటు కలపమని రాముడితో చెప్పాడు. తమకు పని చేయటం ఇష్టం లేనప్పుడు చిన్నకూలోల్లకు, పెద్దకూలోల్లు ఏదో ఒక పని చెప్పి తాము బాతాఖాని చేయడం బేల్దార్లకు మామూలే. ’ఆ…సరే మామా’ అని మూటకు పదైదు గోలాలు ఇసుక కొలిచి కుప్పగా పోసి, దాని మీదకు సిమెంటు మూటను లాక్కొచ్చాడు రాముడు. సిమెంటు మూటను విప్పటానికి పదునైన రాయి కోసం అంతా పరికించి చూశాడు. ఎక్కడా కనిపించకపోయే సరికి ఇంతకు ముందు సిమెంటు మూట విప్పినప్పుడు ఒక సూదైన రాయిని తెచ్చి గూట్లో పెట్టాడు. వెళ్ళి గూట్లో రాయి తీసుకొచ్చి సిమెంటు మూట ఒక కొసన చిన్న దారాన్ని కోశాడు. దానితో మొత్తం దారమంతా సులభంగా ఊడొచ్చింది. తరువాత అదే మాదిరిగా రెండో కుట్టును కూడా విప్పదీశాడు. సిమెంటు సంచిని పైకెత్తి సిమెంటు పొడి మొత్తాన్ని ఇసుక పైకి గుమ్మరించాడు. సిమెంటు మూట ఎండలో ఉండటం వలన ఒక్క సారిగా సిమెంటు పొడి కాళ్ళకు చాలా వేడిగా తాకింది. కాళ్ళతో సిమెంటును అటు ఇటుగా నెరిపెతలికే కాలుతున్న పెనం మీద కాలును పెట్టినట్లనిపించింది రాముడికి. తలపైన భానుడు, కింద సిమెంటు పొడి ప్రతాపం చూపుతుంటే వీరికి సావాసగాడైనట్లు వాయుదేవుడు కూడా చడిచప్పుడు చేయకుండా ఉన్నాడు. అన్నంవేళ కావడంతో ఆకలితో ఉన్నరాముడు వీరందరి బాధితుడైనట్లు నీరసంగా సిమెంటును కలిపి, కుంది కొట్టి, అందులో రెండు బిందెలు నీళ్ళు పోశాడు. అప్పటికే కాళ్ళు మొహం కడుక్కొని శుభ్రంగా తయారైన శీను ’నేను ఇంటికి పోయి అన్నం తిని గబక్కనొచ్చాగానీ, నువు తిని సిమెంటును అంతా కలిపి రెడీ చేసిపెట్టు’ అని సైకిల్ తీసుకొని దావపట్టాడు. రాముడు కూడా డమ్ములో ఉన్న నీళ్ళు తీసుకొని కాళ్ళు మెహం కడుక్కొని, అన్నం తెచ్చుకొని, మూలన ఒక చోట కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఒక కుక్క ’నాకు ఒక ముద్ద పెట్టవా’ అన్నట్లు ఎదురుగా నిలుచుంది. దానికి ఒక ముద్ద పెట్టి, చూస్తున్నాడు. ఆ అన్నం ముద్ద తిని ఇంకా పెట్టమన్నట్లు తిరిగి రాముడివైపు చూసింది. ఇక ఈ కుక్కపోదని తెలిసి, పక్కనున్న గజం కట్టె తీసుకొని ’ఏయ్…పో… పో… ’అని గట్టిగా తరుముకునే లోపల ఆకుక్క అక్కడనుంచి వెళ్ళిపోయింది. అప్పటికే రాముడు ఆకలితో నకనకలాడుతుండడంతో అన్నం దగ్గర పెట్టుకొని తనకిష్టమైన చనిక్కాయల కారాన్ని అన్నానికి దట్టంగా కలిపి తినడం మొదలుపెట్టాడు. ఆకలిమోపున గబగబ అన్నం ముద్దలు నోట్లోకి పోతున్నాయి. అతడు అన్నం తినేవిధానం చూస్తే, ఇదేమిటి? ఇంత ఆత్రంగా తింటున్నాడు? అనేలా తింటున్నాడు. బహుశా ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందేమో! అన్నం తినడం పూర్తైన తరువాత గిన్నెను ఇసుక వేసి ఒకటికి రెండు సార్లు కడిగి, వైరుబుట్టలో పెడుతుంటే, ఆ గిన్నెలో తన మెహం కనిపించింది. మొహానికి నాలుగైదు సార్లు సబ్బును రుద్దీ, రుద్దీ మెహం కడుక్కొని కాలేజికి వెళ్ళేవాడు, ఇప్పుడు పని సాలిచ్చి, కనీసం మొహం మీద నీళ్ళుకూడా పోసుకోకుండానే అన్నం తిన్నాడు. ఆ విషయం గుర్తొచ్చి తనలో తానే ముసిముసిగా నవ్వుకొన్నాడు. నడుముకు కట్టుకున్న తువ్వాలు గుడ్డను ఇసుకలోపరిచి, నడుం వాల్చాడు. మామూలుగా అయితే మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు. రాత్రి సరిగా నిద్రపోకపోవడం వలన కొంచెం అలసినట్టుగా ఉంది. దీనికి తోడు ఈ రోజు ఎవరూ చిన్న కూలోల్లు కూడా రాలేదు. ఒక్కడే కావడం వలన పని ఎక్కువై కొంచెం అలసినట్టుగా ఉంది. పడుకుందామని కళ్ళు మూసుకున్నాడు. కాని నిన్న జరిగిన సంఘటన పదేపదే తనకు తెలియకుండానే గుర్తొస్తుంది.

*****************

Sketch5394246

రాముడు గత నెల రోజులుగా తన దూరపు బంధువుగా చెప్పుకొనే చలమయ్య దగ్గరకు పనికి వస్తున్నాడు. సంవత్సరం పొడుగునా పనికి రావడం రాముడి వృత్తి కాదు. బి.ఎ. రెండవ సంవత్సరం చదువుతున్నాడు. రాముడికి ఇంట్లో ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవల్లో, ఇలా ఎవరో ఒకరి దగ్గరికి పనికి వెళ్ళి పుస్తకాలకు, ఫీజులకు కావలసిన డబ్బును తనే సంపాదించుకుంటున్నాడు. అందరి పిల్లలకు స్కూలు సెలవలు వస్తే ఆనందం. కానీ రాముడి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. సెలవల్లో పనికి పోవాల్సిన పరిస్థితి. తండ్రి మరణించడంతో తల్లి చేసే కూలి డబ్బులు తిండికే సరిపోని పరిస్థితి. ఇక ఫీజులకు, పుస్తకాలకు, బట్టలకు డబ్బంటే కష్టంతో కూడుకున్న పని. అందుకు సెలవు సమయాల్లో పనికి పోవడం చిన్నప్పటినుంచే అలవాటు చేసుకున్నాడు. పనుల దగ్గర ఆడవాళ్ళ ఇబ్బందుల గురించి అప్పటికే పలువురి ద్వారా విని ఉన్నాడు. ముఖ్యంగా బేల్దార్లు అక్కడ పనికి వచ్చే ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారని కొంతమంది మాట్లాడుకోవడం వినివున్నాడు. కానీ ఆడవాళ్ళలో కూడా కొందమంది జాచ్చి ముండలే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారని ఊర్లో ఉన్న బేల్దార్లు అరుగు మీద కూర్చోని మాట్లాడుకోవడం రాముడు విని ఉన్నాడు.

చలమయ్య దూరపు బంధువు కావడంతో వేరే వాళ్ళ ద్వారా తను కూడా పనికి వస్తానని అడిగి రమ్మన్నాడు. చలమయ్య రమ్మనడంతో అతని దగ్గర పని చేస్తున్నాడు. ఈ నెల రోజుల్లో అతని దగ్గర ఉన్న బేల్దార్లతో, పెద్ద కూలోల్లతో, చిన్న కూలోల్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎవరేమిటి? అనే ఒక అవగాహన వచ్చింది. అక్కడకి పనికి వచ్చే వాళ్ళలో పార్వతమ్మ, రాజమ్మ, శీనులపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది రాముడికి. ఆ అభిమానం ఏర్పడటానికి కారణం ఉంది. వారు రాముడు చదువుకునే పిల్లోడని జాలి చూపేవారు. శీను కూడా తను పనిచేసే చోటకు రాముడిని తీసుకు వెళ్ళేవాడు. రాజమ్మ నడివయసు మనిషి. దాదాపు యాభై సంవత్సరాలకు అటు ఇటు ఉంటాయి. ఎత్తైన మనిషి. చామన ఛాయ రంగు. రూపాయి మందంతో ఉండే బొట్టు, వక్కాకు నమలడం వలన ఎరుపు, తెలుపు రంగులో ఉండే పళ్ళు. ఎందుకో తెలీదుకానీ చూడడానికి ఆమె కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. పార్వతమ్మ పేరు కొంచెం పెద్దవారి పేరులా కనిపిస్తున్నా, వయసు పాతిక సంవత్సరాలకు మించదు. కాస్త ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ చాలా చక్కనైన రూపం. చాలా తెల్లటి మనిషి. ఆమె మనసు కూడా పాల మీగడలాగా తెల్లగా ఉంటుందని ఆమె మాటల ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. పెళ్ళై ఆరు సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరు. దాదాపు మూడు నాలుగు నెలల కిందటి నుంచే చలమయ్య దగ్గరకు పనికి వస్తుందని రాజమ్మ ఏదో సందర్భంలో రాముడితో చెప్పింది. రాముడు కూడా అక్కా… అక్కా… అంటూ పార్వతమ్మతో మాట్లాడేవాడు. ఆమె కూడా అభిమానంగా రాముడితో మాట్లాడేది. పని దగ్గర వారు చూపే అభిమానం వలన రాముడు కూడా వారితో పని చేయడం ఆనందంగానే భావించేవాడు.

అయితే వారిలో బేల్దారి గిరి కొంచెం అసూయ మనిషి. పని దగ్గర కొందరితో పనికిమాలిన విధంగా ప్రవర్తించేవాడని వేరే బేల్దార్లు అంటుండేవారు. అతడి గురించి బేల్దార్లు బయట గుసగుసలాడినా పైకి మాత్రం అతనితో బాగానే ఉండేవారు. అతడు పని బాగా తెలిసినవాడని చెబుతారు. అందువలన అతడు చెప్పిన మాట చలమయ్య వింటాడని అందరు అంటారు. గిరి దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా చలమయ్య దగ్గర పని చేస్తున్నాడు. పనికాడ గిరికి కమల అనే ఆమెతో సంబంధం ఉందని అందరికి తెలుసు. అతను పని చేసే దగ్గర చిన్న కూలిగా కమలే ఉంటుంది. సిమెంటు, ఇటుకలు అన్ని కూడా ఆమే గిరికి అందిస్తుంది. గిరి కూడా సులభమైన పనులే కమలకు చెబుతాడు. బరువైన పనులు ఇతరులకు చెబుతాడు. అయితే పార్వతమ్మ చలమయ్య దగ్గర చేరినప్పటి నుంచి గిరి కన్ను ఆమెపై పడింది. చాలా సందర్భాలలో ఆమెతో ద్వంద్వార్థాల మాటలు మాట్లాడేవాడు. ఆమె ఆ విషయాలను పెద్దగా పట్టించుకునేది కాదు. నలుగురైదుగురు బేల్దార్లు ఒకేచోట పని చేయటం వలన అతనికి ఆమెను చెనికే అవకాశం రాలేదు. పైగా ఆమెతో ద్వంద్వార్థాలు మాట్లాడిన ప్రతిసారి కమల గిరిని గుడ్లురిమి చూసేది. ఆమెతో సంబంధం ఉండటం వలన కాబోలు కక్కలేక, మింగలేక గుక్కూరుమని ఉండేవాడు. గత వారం రోజులుగా గిరితో సంబంధం ఉన్న కమల కూడా పనికి రావడం లేదు. చలమయ్యకు రెండు కొత్త పనులు పడటంతో ఒకరిద్దరి బేల్దార్లనే ఒక చోట ఉంచుతున్నాడు. కమల లేకపోవటంతో తన దగ్గర సిమెంటు, ఇటుకలు అందించడానికి పార్వతమ్మని పిలిచాడు గిరి.

ఇద్దరు బేల్దార్లు, ఇద్దరు చిన్న కూలోల్లు, రాముడు మాత్రం ఒక పనికాడ పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో చలమయ్య పని దగ్గరకి వచ్చి ’రేయ్ శీను మధ్యాన్నుంచి పని భాగ్యనగర్ కాలనీలో చెయ్యాలరా. ఈడ ఒక బేల్దారి ఆడమనిషి చాలు. నువ్వు, వాడు రాముడు ఒక ఆడమనిషి ఆడికిపోండి’ అని శీనుతో చెప్పాడు. మొదట శీనుతో ’నేను వస్తానన్నా…. ఆ పనికాడికి’ అని పార్వతమ్మ చెప్పింది. అయితే ఈ పనికాడ తాపలు ఎక్కి సిమెంటు అందించాలి. దానితో పెద్దామైన రాజమ్మకు కష్టం అని గిరి తెలుసు. ఇదే అదునుగా ’పార్వతమ్మ ఈడ పెద్దామ తాపలెక్కి సిమెంటు అందీలేదు. నువ్వు ఈడ ఉండు. పెద్దామ, రాముడు, శీనుగాడు ఆడికి పోతారు’ అని చెప్పాడు. రాజమ్మ కూడా తాపలెక్కలేక ’నువ్వుండు పార్వతమ్మ నేను ఆడికిపోతా…’ అని చెప్పింది. పార్వతమ్మకు గిరి దగ్గర పని చేయడం కంటే మధ్యాహ్నం మానేస్తే బాగుండనిపించింది. కాని ఇప్పుడు పనికాడ ఆడమనిషి కావాలి. ఇప్పుడు పనికిరానంటే రేపు వద్దంటాడేమోనని మనసులో అనుకుంది. ’సరేలేయ్యా… నేను అన్నం తిని ఈడనే పనిజేచ్చాలే’ అని చలమయ్యతో చెప్పింది పార్వతమ్మ. గిరికి మనసులో ఎక్కడో తెలీని ఆనందం కనిపించినప్పటికీ బయటపడకుండా ’నేను అన్నం తినేసి వచ్చాగానీ, రాముడు ఒక అర మూటకు ఇసుకపోసి, ఆ సిమెంటును కూడా దీంట్లో ఏసి మెత్తం ఒకసారి తీరగేయ్’ అని రాముడుతో చెప్పాడు. ’రేయ్ మీరాడికి రాండిరా… నేను ఒక అరగంటకల్లా ఆ పనికాడికొచ్చా…’ అని చెప్పి చలమయ్య సైకిల్ ను ఇంటి దారి పట్టించాడు. అందరు ఇండ్లకు అన్నానికి వెళ్ళారు. రాముడు ఏడుగోలాలు ఇసుకపోసి, సుమారు ముక్కాలుమూట సిమెంటేసి, పాత సిమెంటుని దాంట్లో ఏసి, రెండు సార్లు తిప్పి, కుంది కొట్టాడు. నీళ్ళు పోయటానికి బిందె తీసుకొని సిమెంటులో నీళ్ళు పోసి, అక్కడే కాళ్ళు కడుకున్నాడు. చలమయ్య వేరేపనికాడికి అరగంటకల్లా వస్తానన్నాడు కాబట్టి తాను కూడా అక్కడికి తొందరగా తినేసి వెళ్ళాలనుకున్నాడు. అన్నం తిని పదినిమిషాలు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఇక వారం రోజుల్లో తన కాలేజి తెరుస్తారు. ఈ పని బాధ తప్పుతుందనుకున్నాడు. ఇక బయలు దేరుదామని రాముడు అనుకుంటుండగా ఇంతలో గిరి అక్కడి వచ్చాడు. మామూలుగా అయితే మధ్యాహ్నం రెండు దాటిన తరువాత వచ్చేవాడు. కాని ఈరోజు ఒకటి నలభైకల్లా ఇక్కడుండడం రాముడికి కొంత ఆశ్చర్యమేసింది.

’చిన్నోడా ఇది ఒక సారితిరగైరాదు’ అని రాముడుతో గిరి చెప్పాడు.

’ఆ అన్నా… తిరగేసి ఆ పనికాడికెళ్తా…’

’కానీ…, కానీ… గబగబ కానిచ్చీ ఆడికంట బయలు దేరు’

’సరే అన్నా…’

రాముడు పార తీసుకొని గబగబ రెండు నిమిషాలలో సిమెంటు మొత్తం తిరగేసి కాళ్ళు చేతులు కడుకున్నాడు. గోడకున్న చొక్కా, ప్యాంటు తీసుకొని బట్టలు మార్చుకున్నాడు. అన్నం క్యారీ, లుంగీ, తువ్వాలును సంచిలో పెట్టుకొని సైకిలెక్కి భాగ్యనగర్ కాలనీలోని పని దగ్గరకు వచ్చాడు. అప్పటికే చలమయ్య అక్కడికి వచ్చి ఉన్నాడు.

’రేయ్… ఆ రూముల్లో మట్టెత్తు. వాళ్ళు మోచ్చరు. శీను ఆ పక్క కొయ్యలతో బయట సారవలు కట్టుకుంటాడు. ఆ రూముల్లో పారలు, గోలాలు ఎన్ని ఉండయో చూడు’ అని చలమయ్య రాముడితో చెప్పాడు. లోపలికెళ్ళి గోలాలు, పారలు చూసి ’మూడు పారలు, ఎనిమిది గోలాలున్నాయి తాతా…’ అని చలమయ్యతో చెప్పాడు రాముడు. ఇంతలో రాజమ్మ, శీను మరో ముగ్గురు కొత్త కూలోల్లు అక్కడికి వచ్చారు.

’శీను… నువ్వు సారవలు కట్టుకో. వాడు మట్టి ముంచుతాంటాడు. పెద్దామా… నువ్వు, కొత్తోళ్ళు మట్టి మోయండి. ఈ రోజు మూడురూముల్లో మట్టి అయిపోవాలా… ఎప్పుడన్న అయిపుజేసుకోని పోండి. నేను వేరే పనికాడికి పోతాన…’ అని కూలోల్లతో చెప్పి చలమయ్య వెళ్ళిపోయాడు.

’రాండిమ్మా… గబగబ నాలుగున్నర్రకల్లా ఈ మట్టి ఎత్తి ఇంటికి పోవాల… మీరు కొంచెం హుషారుగా తిరగండి. నేను గబగబ మట్టి ముంచుతా’ అని రాజమ్మతో అన్నాడు రాముడు.

’తాలు నాయనోవ్… యాడ నాలుగున్నర్రకు అయిపోతది. మీ తాత అయిపోజేసుకొని పోండని ఏదో ఒక మాట చెప్పినాడు. అది అయ్యే పని కాదు. చూడ్డానికి రోంతున్నెట్లుంది. అయిపోయేతలికి అయిదున్నర అయితది’ అని రాజమ్మ రాముడితో అనింది.

’సరేమ్మా ఎన్ని గంటలైన పర్వాలేదులే అని చెప్పి’ మట్టి ముంచి ఆడోల్లకిస్తున్నాడు రాముడు. దాదాపు మూడు గంటలకల్ల ఒక రూము మట్టి ఎత్తేది పూర్తైంది. ఇంతలో చలమయ్య పని దగ్గరకొచ్చాడు.

’ఓమ్మా రాజమ్మా… రూంలో టేపేమన్నా ఉందేమో చూడు’ అని రాజమ్మతో చెప్పాడు.

దాదాపు అయిదు నిమిషాల తరువాత ’ఈడ లేదయ్యా. ఆ పనికాడేమన్నా ఉందేమో… ’ అని చెప్పి వెంటనే ’ఆడ్నే ఉందయ్యో… నేను నిన్న చూసినా… సామాన్ల సంచిలో ఉంది.’ అని చలమయ్యతో చెప్పింది.

’రేయ్… ఆడికి పోయి టేపు తీసుకొద్దురా…’అని రాముడితో చెప్పాడు చలమయ్య.

అంతలోనే ’బామ్మార్ది… నువ్వు అటుపోతాండావ్. ఇదో వచ్చేటప్పుడు ఒక కట్ట సంఘం బీడీలు తీసుకొనిరా’ అని చెప్పి పది రూపాయల నోటు రాముడి చేతికిచ్చాడు శీను. ఆ మాటలు విన్నాక, నీళ్ళడమ్ము దగ్గరకు వచ్చి, నెత్తికున్న తువ్వాలు గుడ్డను విప్పి పక్కనపెట్టి, మొహం కడుక్కొన్నాడు రాముడు. చొక్కా వేసుకొని గుండీలు పెట్టుకుంటుండగా ’రేయ్ ఈనించి ఈడికి ఇంత సోకు అవసరమారా… గబక్కన పోయొజ్జురారా మామా నువ్వు’ అని చలమయ్య గట్టిగా అరిచాడు. సరే అని అట్లే ఆ సగం గుండీలు పూర్తిగా పెటుకొని, నెత్తిని చేత్తోనే దువ్వుకొని తన సైకిల్ తీసుకొని పాత పనికాడికి వచ్చాడు.

సైకిల్ ఇంటి ముందర పెట్టి రూము లోపలికెళ్ళి ’అక్కా…’ అని అలాగే నిలబడిపోయాడు రాముడు. ఒక్క సారిగా ఏదో తేడాగా అనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేనట్లు గమ్ముగా లోపల ఉన్న పార్వతమ్మను, గిరిని చూస్తుండి పోయాడు రాముడు. పార్వతమ్మ ఏడుస్తూ ఉంది. ఆమెకు అలా దూరంలో భయంతో ఉన్నట్లుగా నిలబడివున్నాడు గిరి. తనను చూడగానే కళ్ళు తుడుచుకొని అలాగే గమ్ముగా నిలబడింది పార్వతమ్మ. ’ఏం గావాల్రా …ఏం ఇటొచ్చినావే’ అంటూ చాలా హీన స్వరంతో గిరి రాముడ్ని ప్రశ్నించాడు.

’అన్నా… తాతా… టేపు తెమ్మన్నాడన్నా… సామాన్ల సంచిలో ఉందని రాజమ్మక్క చెప్పింది’ అని రాముడు గిరితో చెప్పాడు. గిరి మాటలో శరీరంలో ఏదో భయం కనిపిస్తుంది రాముడికి. పార్వతమ్మ మాత్రం ఏమి మాట్లాడకుండా అలాగే ఉంది. గిరి సామాన్ల సంచిలో చూస్తానే చిన్న టేపు, పెద్ద టేపు కనిపించాయి. ’ఏదిరా… చిన్న టేపా? పెద్దటేపా? కావాల్సింది’ అని రాముడ్ని అడిగాడు.

’అదేం చెప్పలేదన్నా తాత…’ అని చెప్పాడు రాముడు.

’సరే! రెండు టేపులు పట్టకపో. రెండు టేపులు నేనే తెచ్చినా అని చలమయ్యతో చెప్పు. నేను ఇచ్చినాని చెప్పాకు’ అని గిరి రాముడితో చెప్పి రెండు టేపులు చేతికిచ్చాడు. ఆ టేపులను తీసుకోవడం కంటే పార్వతమ్మ కళ్ళలో వచ్చే కన్నీళ్ళనే చూస్తున్నాడు రాముడు. ఇది గమనించిన గిరి ’రేయ్! ఈ టేపులు తీసుకొని పో’ అని తొందరగా రాముడ్ని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు గిరి. రాముడి మనసులో ఎన్నెన్నో సందేహాలు వస్తున్నాయి. ఏమి మాట్లాడటానికి అవకాశం లేక అక్కడే నిలబడ్డాడు. పార్వతమ్మ ’నన్ను ఈడు పట్టుకున్నాడు రాముడు’ అని ఒక్క మాట అంటే చాలు వాడి మీద కలబడి కొట్టాలన్నెంత కోపం రాముడి మనసులో ఉంది. కాని ఆమె మాత్రం రాముడి మొహం వైపు చూసి, కన్నీళ్ళు తుడుచుకుంది. రాముడు కూడా ఏమి మాట్లాడకుండా అక్కడే నిలబడ్డాడు. ఇంతలో గిరి ’రాముడు నువ్వెళ్ళు’ అని చిన్నగా చెప్పాడు. ఏమి మాట్లాడలేక టేపు తీసుకొని పని దగ్గరకు బయల్దేరాడు. దారిలో వస్తున్నప్పటికీ పార్వతమ్మ కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి. ఆ కన్నీళ్ళు గిరి వలన చిందిన అకాల వర్షపు చినుకులుగా కనిపించాయి రాముడికి. ’గిరి ఆమెను ఏదో అన్నాడు’ అనే అభిప్రాయానికొచ్చాడు రాముడు. అర్థంపర్థం లేకుండా ఏవేవో ఆలోచనలు మనసుకు తట్టుతున్నాయి రాముడికి. బహుశా బోయవాని బాణం దాటికి పక్షి కూడా ఇలాగే విలపించింటుందేమోననిపించింది రాముడికి. ’గిరి మీద నాకు మనసులో కోపం వచ్చినప్పుడు ఒకవేళ పార్వతమ్మ నన్ను గిరిని కొట్టమని చెప్పింటే’ అని గబక్కున ఆలోచనలో పడ్డాడు రాముడు. తనకు తెలుసు గిరిని తనుకొట్టలేడని. తనేమో పిల్లోడు. గిరి చూస్తే దున్నపోతుమాదిరి ఉండాడు. ’అయినా సరే కలబడేవాన్ని. నా కొడుకుని ఏది దొరితే అది తీసుకొని ఏసిందును’ అని తన మనసుకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ’ఆమె ఏమి చెప్పంది మనం ఏం చేయలేం. ఆమె ఏమి చెప్పకుండా ఉందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది’ అని తనకు తానే ఏవేవో ఊహించుకొన్నాడు. ఈ ఆలోచనలతోనే భాగ్యనగర్ కాలనీలోని పని దగ్గరకొచ్చాడు. అక్కడ చలమయ్య తన కోసమే ఎదురు చూస్తున్నాడు.

’ ఏరా! టేపు ఉన్నిందా?’ అడిగాడు చలమయ్య.

ఏమి మాట్లాడకుండా రెండు టేపులు చలమయ్య చేతికందించాడు రాముడు.

’పెద్దటేపు ఒకటి చాలు రా సామి. సరేలే… రెండు టేపులు పనికొచ్చయ్’ అని టేపులు తీసుకొన్నాడు.

’మట్టి ఎత్తడం ఎంత వరకు వచ్చిందిమ్మా…’ అని రాజమ్మను అడిగాడు.

’ఇంకో గంటకల్లా అయిపోతదయ్యా. అయిపోయిన తరువాతే ఇంటికి పోతం’ అని రాజమ్మ సమాధానం చెప్పింది.

’శీను నువ్వు రా. ఆ పని కాడ ఒక్కరవ్వ మార్కింగ్ వెయ్యాల’ అని శీనును పిలిచాడు.

’మరి సారవా?’ అని శీను చలమయ్యను అడిగాడు.

’దాని పరిస్థితి రేపు చూద్దాం రా…’ అని చలమయ్య చెప్పడంతో శీను మొహం కడుక్కొని అతనితో పాటు వెళ్ళిపోయాడు. రాముడు మిగిలిన నలుగురు ఆడోళ్ళు మాత్రమే పనికాడ ఉన్నారు. తాను చూసిన విషయాన్ని రాజమ్మతో చెపుదామనుకొన్నాడు రాముడు. కాని ధైర్యం చాల్లేదు. మళ్ళీ ఎందుకొచ్చిన గొడవ అనుకొన్నాడు. ఏ విషయం తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. మనస్సులో ఏవేవో ఆలోచనలు… చివరకు ఏదో ఒక విధంగా మౌనంగానే ఆ పని దగ్గర రూముల్లో మట్టి ఎత్తడం పూర్తిచేశాడు. రాముడు మౌనంగా ఉండటాన్ని పలుసార్లు రాజమ్మ అడిగినప్పటికీ ఏమి మాట్లాడకుండా మట్టిపని పూర్తిచేశాడు రాముడు. ఇంటికి వెళ్ళినప్పటికీ పార్వతమ్మ కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి.

************

’రాముడూ… రాముడూ…’ పిలిచేతలికే ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు రాముడు. తీరాచూస్తే పిలిచింది రాజమ్మ.

’ ఆ… అక్కా… దా…’ అని పిలిచాడు.

’చలమయ్య రాలేదా రాముడు?’ అని అడిగింది.

’మధ్యాహ్నం అన్నానికి వెళ్ళే ముందు వచ్చి వెళ్ళాడక్కా’ అని చెప్పాడు రాముడు.

’ఏం లేదయ్యా. లెక్కిస్తానన్నాడు. అందుకని ఈడికొచ్చినా.’

’ఇప్పుడు మళ్ళీ ఈడికొచ్చి వెళ్తాడక్కా…’

’అందుకోసమే ఈడికొచ్చినా, ఎవరెవరు పని చేస్తానరిక్కడ?’ అని అడిగింది రాజమ్మ.

’నేను, శీను మామ ఇద్దరమే అక్కా’ అని చెప్పాడు రాముడు

’ఏం అక్కా నువ్వు పనికి రాలేదా ఈరోజు?’ అని తిరిగి అడిగాడు రాముడు రాజమ్మను.

’నాకు ఈ రోజు పని పడిందయ్యా. నాకూతురును ఆసుపత్రికి తీసికెళ్ళాల. అందుకనే రాలేదు’ అని చెప్పింది రాజమ్మ.

’మరి పార్వతమ్మక్క కూడా రానట్టుంది కదక్కా’ అని అడిగాడు రాముడు. ఇలా అడగడంలో రెండు రకాల అర్థాలున్నాయి. ఆమె రానందుకు కారణం అడగడమే కాక, నిన్న జరిగిన సంఘటన గురించి ఆమెకేమైన తెలుసేమో తెలుసుకోవాలనే ఆతృత.

’రాముడు. పార్వతమ్మ ఏడుస్తుండేది నువ్వు చూసినావంటగదయ్యా!’ అని నిన్న జరిగిన సంఘటనను ఆమే ప్రస్తావించింది. పార్వతమ్మ నిన్న ఏడ్చిందానికి కారణం ఆమెకు తెలిసివుంటుందని నిర్ణయానికొచ్చాడు రాముడు.

’అక్కా! నిన్నట్నించి ఏదో ఒక విధంగా ఉందక్కా. ఎప్పుడూ సరదాగా మాట్లాడే పార్వతమ్మక్క ఎందుకు ఏడ్చిందక్కా? నేను అడుగుదమన్నాగానీ, గిరన్న పొమ్మన్నట్లు మాట్లాడినాడు. ఏం జరిగిందో పార్వతమ్మక్కను అడగలేక, ఎవరికీ చెప్పలేక మనసంతా ఏదో గందర గోళంగా ఉంది. అసలు ఏం జరిగిందక్కా. బహుశా నీకు తెలిసే ఉంటుంది. చెప్పు.’ అని బతిమాలినట్లు అడిగాడు.

’నువ్వు ఏమేం ఊహించుకున్నింటావో అదే జరిగిందయ్యా. ఆనాకొడుకు ఆయమ్మిని పట్టుకున్నాడంటయ్యా. ఈ పనలకాడ ఇయన్నీ మామూలైపోయాయి. ఆనాకొడుకు మొకమైన చెడిపోయి, మూలబడిన లారికున్నట్లుంది. వాడికి ఆయమ్మి కావాలంట. బలంతం చేశాడంటా. అరుచ్చా, నా మొగుడికి చెబుతా అని చెప్పినా చాలా ఇబ్బంది పెట్టాడంటా. వాడు చూస్తే దున్నపోతు మాదిరుండే. ఈయమ్మి ఏమనగలదు. చివరకు ఏడ్చి, ఇడిపిచ్చుకొని బయటకొచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడు మళ్ళీ వచ్చి, తప్పైపోయింది, కాళ్ళు పట్టుకుంటా… ఎవరికి చెప్పొద్దని బతిమిలాడినాడంట. అపుడే నువ్వు వెళ్ళినావు. చివరికి ఎవరికి చెప్పద్దని ఆయమ్మికి దన్నం పెట్టినాడట. వాని నోట్లో నామెట్టు పెట్ట. ఆనాబట్ట కొడుక్కు పెళ్ళాం ఉంది. ఆ పనికిమాలిన లం… కమల ఉంది. ఇంకా వేరేవాళ్ళు కావాలంట. మరి వాడు ఎంత పోతుమొగోడో మరి’ అని గిరిని నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంది.

’అక్కా! వాడింత జేస్తే పార్వతమ్మక్క వాళ్ళమొగుడికి చెప్పలేదాక్కా?’ అని రాజమ్మను అడిగాడు రాముడు.

’ఆయమ్మి వాళ్ళ మొగుడితో చెప్తే లేనిపోని తలనొప్పి నాయినా. ఆయమ్మి మొగుడు తాగుబోతు, మెంటల్ నాకొడుకు. వానికి తెలిస్తే వాడు ఏమైనా చేస్తాడు. వాడు ఎంతకైనా తెగించే మనిషి. వాళ్ళు మా ఇంటికాడ్నే ఉండేది. నాకు అయిదు సంవత్సరాల్నుంచి తెలుసు. ఒక సారి మా వీధిలో నీళ్ళకాడ ఒకడు ఆయమ్మీతో ఏదో జాంతానమాడినాడని వాడితో గొడవపడి, కట్టెతో వాడి తలపగలగొట్టాడు. అది కేసయ్యి పెద్ద తలనొప్పైంది. ఆయమ్మి పని చెయ్యకపోతే ఇంట్లో జరగని పరిస్థితి.’ అని చెప్పింది.

’మరి నిన్న జరిగిన విషయం నీకెవరు చెప్పారక్కా?’ అని రాముడు అడిగాడు.

’ఆయమ్మే చెప్పిందయ్యా. ఇంకా చాలా ఇబ్బందులు పడిందయ్యా ఆయమ్మి. ఇంతకు ముందు ఆయమ్మి కర్రి నారాయణ దగ్గర పని చేస్తుండేది. ఆడొక బేల్దారి… మాట్లాడితే ఈయమ్మితో జాంతానం ఆడేవాడంట. ఒక రోజు ఆయమ్మి ఆ బేల్దార్ని గదురుకునే సరికే వాడు ఆయమ్మికి బరువు పనులు చెప్పావాడంట. ఆయమ్మికి మూడొ నెలప్పుడు ఇంట్లో కష్టంగా ఉంటే పనికి పోయింది. అప్పుడు కర్రినారాయణ దగ్గర రాతి కట్టుడు పని ఉన్నింది. వాడు కావాలని ఆయమ్మితో పెద్దపెద్ద రాళ్ళు ఎత్తించాడు. ఆయమ్మి ఆబరువులు మోసెతలికే కడుపు పోయింది.’ వాడి పోడు తట్టుకోలేక ఆడపని మానేసింది. నాలుగు రోజులు ఇంటికాడుండి మల్లా ఈ చలమయ్య దగ్గరకొచ్చింది. మీ తాత చలమయ్య ఏం తక్కువోడు కాదయ్యా. ఒట్టి పనికిమాలినోడు. అన్ని తెలుసు. ఏం చెయ్యాల. గతిలేక పనికొచ్చానం.’ అని చెప్పింది రాజమ్మ రాముడికి.

ఇది విన్న రాముడు ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ’నాకు చాలా మంది బేల్దార్లు తెలుసు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇక్కడ కూడా కొంత మందిపైన చాలా గౌరవం ఉంది. కానీ బేల్దారి పని దగ్గర కొందరు బేల్దార్లు ఇంత ఘోరంగా ఉంటారా’ అని మనసులోనే తిట్టుకున్నాడు. ఇంతలో రాజమ్మ ’అయ్యా నీకు ఈ విషయం చెప్పడానికి ఒకే కారణం ఉందయ్యా. నువ్వు ఈ విషయాన్ని ఎవరికకీ చెప్పొద్దయ్యా. పార్వతమ్మ నాతో ఈ మాటే నీతో చెప్పమనిందయ్యా. ఎవరికన్నా తెలిస్తే పరువు పోతుందయ్యా. ముఖ్యంగా ఆయమ్మి మొగిడికి తెలిస్తే లేనిపోని తలనొప్పి. నీకు దండం పెడతా ఎవరితో చెప్పాకు. రేపట్నుంచి నేను పని చేసేకాడికి ఆయమ్మిని వెంట పెట్టకపోతా’ అని రాముడితో విన్నవించుకొన్నట్లు చెప్పింది.

ఈ మాటలు విన్న రాముడి ఏం మాట్లాడాలో తెలీక ’సరే అక్కా నువ్వు చెప్పావు గదా. వారం తరువాత నా కాలేజి తెరుస్తారు. తరువాత నేను ఎలాగు ఈ పనికి రాను. నాకేం పనక్కా చెప్పడానికి. పొరపాటున కూడా ఎవరికి చెప్పను’ అని రాజమ్మతో రాముడు చెప్పాడు. ’సరే చలమయ్య వచ్చేటట్టులేడు. వచ్చే నేను వచ్చిన్నానని చెప్పు’ అని చెప్పి వెళ్ళింది. ఆమె వెళ్తూ ఉంటే ఆమె వంకే చూస్తూ ఉన్నాడు రాముడు. ’కష్టం, ఓర్పు, బాధను దిగమింగి నడుస్తున్న ధరిత్రీలాగా’ కనిపించింది రాజమ్మ రాముడికి. ’ఈ పనిలో ఇంత ఇబ్బందుంటుందా! బేల్దార్లు కూలికే పనికి వస్తున్నారు. ఆడోళ్ళు కూలి కోసమే పనికి వస్తున్నారు. కానీ మరి మగాళ్ళు ఆడవాళ్ళను ఎందుకు ఇంత హింస పెడుతున్నారు. ఎందుకు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు! అని పలువిధాలైన ఆలోచనలు చేస్తుకుచ్చున్నాడు రాముడు. ఒకవేళ తన వాళ్ళు పనికి వచ్చినా ఇలాగే ప్రవర్తిస్తారా? ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది రాముడికి. ఛ! ఇలాంటి ఆలోచనలొస్తున్నాయేమిటి? అనుకొన్నాడు. దీని గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుండి పోయాడు రాముడు. గిరిలాంటి వాళ్ళు పరాయి ఆడమనిషి గురించి చెడుగా తలుచుకుంటేనే వణుకుపుట్టేలా చేయాలి. అదే సరైన పరిష్కారం అని మనసులో అనుకున్నాడు రాముడు.

**************

 

జి. వెంకట రామయ్య

జి. వెంకట రామయ్య

 

మూడు నవలలు, ముగ్గురు స్త్రీల పోరాటం!

మహిళల మనస్తత్వాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎంతో చాకచక్యంగా తన రచనల్లో చిత్రించిన చక్కని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు. ఇటీవల ఆమె మరణించడం ఎంతో విచారకరం. ఆమె రాసిన మూడు రచనలపై నాకు తోచిన అభిప్రాయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

గోమతి (నవల):

అమ్మానాన్నల అపురూపంగా చూసుకునే గారాలపట్టి గోమతి. ఆకుసంపెంగ తోటల్లో, పెరటి జామచెట్టు నీడల్లో ఆడుతూ పాడుతూ పెరిగిన అమ్మాయి తను.

ఊహ తెలిసినప్పటినుండీ పొరుగింటి కుర్రాడు గోవిందుతోనూ, అటుపై బావ గోపాలంతోనూ అల్లరిచిల్లరిగా, నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా గడిచిన చిన్నతనం గోమతి సొంతం.

అటు గోవిందుకి, ఇటు గోపాలానికి ఆరాధన తానై ఎవరి ప్రేమను ఎలా అర్థం చేసుకొవాలో తెలియక ఎంతో మానసిక సంఘర్షణకు గురై చివరకు గోవిందుకి భార్యవుతుంది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. అత్తవారి ఆస్థి మొత్తం కరిగి రోడ్డున పడాల్సి వస్తుంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా భర్తకు అంగవైకల్యం సంప్రాప్తిస్తుంది. అలాంటి నేపథ్యంలో తానే కుటుంబానికి అండగా నిలబడి పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతూ జీవిత సమరం సాగిస్తుంది గోమతి.

అనుకోకుండా ఆమె జీవితంలోకి బావ గోపాలం పునరాగమనం, అతని సాన్నిధ్యంలో ఆమె సాంత్వన పొందడం, తప్పు చేస్తునానన్న అపరాధభావంతో బాధ పడడం, గోపాలంతో భార్య చనువుతో పాటుగా అంగవైకల్యంతో గోవిందులో కలిగే ఆత్మన్యూనత, ఇష్టమైన మరదలికి తన ఇష్టాన్ని తెలియచేయలేని తన అశక్తతతో గోపాలం చెందిన వ్యథ, తిరిగి ఆమె కనిపించినప్పుడు అతను పొందిన ఆనందం… ఒకటా రెండా… అత్యంత సహజంగా ఈ కథలో జరిగే సంఘటనల మధ్యలో కథలోని ఈ పాత్రలు పడిన మానసిక క్షోభను కానీ, శారీరక శ్రమను కానీ అత్యంత సహజంగా, ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత్రి విశాలాక్షి.

ముఖ్యంగా గోమతి పాత్రను విశాలాక్షి గారు మలచిన తీరు అత్యద్భుతం. ఆద్యంతం గోమతి పదే యాతనలను తమ యాతనగా పాఠకులు అనుభూతి చెందుతారు. మనసనేది ఎంత దిటవు కలదో అత్యంత సున్నితమైనది. సంఘటనలను బట్టే ఈ రెండు స్వభావాలూ బయటపడతాయి. గోమతి విషయంలో జరిగే ఈ మానసిక పరిణామాలను అత్యంత సహజంగా చిత్రించారు రచయిత్రి. అంతే కాదు- స్త్రీకి ఉద్యోగమనేది ఎంత ఆవశ్యకమో, ఉద్యోగపర్వంలో ఆమె ఎలాంటి రకరకాల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చాలా బాగా తెలియచేశారు విశాలాక్షి గారు.

గోమతి నవల పూర్తి చేసినా ఆమె మాత్రం మన మనసులను వెంటాడటం మానదు. అదీ ఈ నవల ప్రత్యేకత!

untitled

***

మనస్వి (కథ) :

పరమేశం, కాంతం అల్లారుముద్దుగా చూసుకుంటున్న పాప పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటున్న రోజే రంగస్వామి అనే ఓ వృద్ధుని రూపంలో వారికి ఎదురవుతుందో గండం. ఏడాది క్రితం ఓ తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదానంతరం తనకు దొరికిన పాపను తెచ్చుకున్న పాపను నా మనవరాలేమోనని వెదుక్కుంటూ వచ్చాను అని రంగస్వామి చెప్పినప్పుడు పరమేశం గుండెలో రాయి పడుతుంది.

అంతవరకూ అపురూపంగా చూసుకుంటూ, పిల్లలు లేని తమ ఇంట్లో మహాలక్ష్మి వెలసిల్లిందని ముచ్చటగా తాము పెంచుకుంటున్న ఆ పాప ఎక్కడ దూరమైపోతుందో, రంగస్వామి గుర్తు పట్టి తీసుకుపోతాడేమో అని పరమేశం పడిన మానసిక సంఘర్షణ కానీ రంగస్వామి, పాప ఒకరినొకరు చూసుకున్నప్పుడు జరిగే సన్నివేశాలను కానీ కళ్ళకు కట్టినట్టుగా రచయిత్రి ఈ కథలో చిత్రించిన తీరు నిజంగా అద్భుతంగా ఉంటాయి. తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదం గురించి కూడా ఎంతో బాగా దృశ్యీకరిస్తారు రచయిత్రి.

విశేషం ఏమిటంటే కథల్లో కానీ నవలల్లో కానీ ఇన్ని వైవిధ్యాలు, మానసిక సంఘర్షణలు, వర్ణనలు ఉన్నా అవి పదాడంబరాలతో పాఠకులను శ్రమ పెట్టవు. తేలికైన పదాలతో, చక్కని మాటతీరుతో ప్రతి పదాన్నీ వదలకుండా చదివింపచేసేలా ఆసక్తికరంగా చదువరులను చదివింపచేస్తాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్న స్త్రీ జీవితాలను కానీ, అనేకానేక సామాజిక సమస్యలను కానీ తన కలం ద్వారా యధాతథంగా చిందించి పాఠకులను ఆలోచింపచేస్తాయి. మనసులను రంజింపచేస్తాయి. మంచి రచనల ప్రధానలక్ష్యం అదే కదా!

***

గ్రహణం విడిచింది (నవల) :

ఓ అందమైన అమ్మాయి, తనను చక్కగా చూసుకునే ఆమె భర్త! హాయిగా ఆనందంగా గడిపేందుకు అంతకంటే కావలసినదేముంది?! కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. అనుకోకుండా ఆ అందమైన అమ్మాయి భారతి భర్త మాధవ్ ప్రమాదంలో మరణించడంతో అప్పటివరకూ సుఖమయంగా సాగిన ఆమె జీవనం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనవుతుంది.

భర్త పనిచేసిన సంస్థనుండి రావలసిన పెద్దమొత్తం అతని మరణానంతరం భారతికి అందుతుంది. అంతే! అక్కడినుండి భారతికి ప్రతిచోటా మరో కొత్త లోకం కనిపిస్తూ ఉంటుంది.

ఆత్మీయంగా చూసుకున్న అన్నావదినల్లోనూ, అత్తయ్యా మావయ్యల్లోనూ, ఆప్తుడిగా స్నేహితుడైన జగదీష్ లోనూ, చివరికి వీళ్ళందరినీ కాదనుకుని నమ్మి ఆమె వెళ్ళీన బాబాజీ లోనూ కూడా ఇదివరకు లేని ధనవ్యామోహాన్ని చూస్తుంది భారతి. తన దగ్గర డబ్బు లేనప్పుడు ఉన్న ఆత్మీయత స్థానంలో ఇప్పుడు డబ్బు వలన వచ్చిన తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతలనే వారు ప్రదర్శిస్తున్నట్టుగా ఆమెకు తోస్తుంది. అనుకోకుండా ఆమెకు ఎదురైన సంఘటనలు, వ్యక్తుల ప్రవర్తనలు కూడా ఆమె అభిప్రాయానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.

వ్యక్తిలో జరిగే ఓ మానసిక సంఘర్షణను, నిత్యం ఆమెలో జరిగే ఆలోచనాధోరణులను, మానవ బలహీనతలను సమర్థవంతంగా భారతి పాత్ర ద్వారా తెలియజేస్తారు విశాలాక్షి గారు. అంతే కాదు… దశాబ్దాల క్రితమే భర్తను కోల్ఫోయిన స్త్రీలు మరో వ్యక్తితో కొత్తజీవితాన్ని కోరుకోవడం తప్పేమీ కాదని ఎంతో నేర్పుగా భారతి పాత్ర ద్వారా సమర్థవంతంగా చెప్తారు రచయిత్రి.

డబ్బు అనేది ఎవరికైనా అత్యంత ఆవశ్యకమైన వస్తువే. అది అందుబాటులో ఉన్న మనుషులతో డబ్బు కోసం చుట్టూ ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఆ డబ్బు తమకు కూడా చెందాలని ఎంతగా తాపత్రయపడతారో కూడా అత్యంత సహజంగా ఈ పుస్తకంలో చిత్రిస్తారు రచయిత్రి.

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ భారతి మనసూ మన మనసూ మమేకమైపోతుంది. తనను విడిగా చూడటం మనకు తెలీకుండానే మరచిపోయి అడుగడుగునా ఆమెను సమర్థిస్తూనే ఉంటాం.

ఒక అమ్మాయికి వ్యక్తిగతంగా జరిగిన అనుభవాలను చక్కని కథగా మలిచి, ఆమె జీవితం తిరిగి సంతోషమయం కావాలని పాఠకులు కూడా కోరుకునేలా చేసి “గ్రహణం విడిచింది” అనే శీర్షికను కథకు, కథలో సందర్భానికి అన్వయిస్తూ రచయిత్రి నవలను ముగించిన తీరు హృదయాలను ఆకట్టుకుంటుంది.

గుండెను తడిమేసి దానిని తడి చేసే కథలు రాయగలిగే నేర్పూ విశాలాక్షిగారిదే అని నిరూపిస్తుంది “మనస్వి” కథ!

 -రాజేష్ యాళ్ల

rajesh

మరల యవ్వనానికి…

10801844_1547986905415644_141749359838664061_n

painting: Mamatha Vegunta

 

పరవశంతో
నిలువెల్లా విరబూసిన
మునుపటి పడుచుదనపు మహదానందం
ఒక్కసారి నువ్వు నాకు తిరిగి ప్రసాదించు

కాలం
ముంచుకొచ్చిన తుఫానుగాలి
ఆసాంతంగా ఊడ్చుకొనిపోతే పోనీ

కొంజివురుల్నీ పచ్చనాకుల్నీ
అరవిరి మొగ్గల్నీ నవనవ కుసుమాల్నీ
అన్నీ మరల మరల చిగురువేయించు
చేవగల నిండు గుండెలోనుంచి
గుత్తులుగా పుష్పవర్షం కురిపించు

మునిమాపుల్ని లెక్కపెడుతో
అంటిపెట్టుకుని వున్నది
పక్షిరుతాల్లేని ఖాళీగూడు
శిశిరావృత నగ్నదేహాన్ని
ఉత్తిచేతులతో మోయలేదు
ఏటెల్లకాలం చెట్టు

కింద ధరిత్రీమాత
మీద ఆకాశదేవత
ఎవరి తరమూ కాదు మరి పునర్నవం

ఆదివనిత నువ్వు మహిమాన్విత నువ్వు
అత్యనురాగం అంతర్భందనం నువ్వు
ఒక్క నువ్వే
నీ రామచిలుక వన్నె వలువలో
ఇచ్ఛానుసారం ఓ తంతువుని తెంచి
విసురు బహుదూరపు కీకారణ్యం నుంచి
ఇటువేపే
ఈ మోడుమీదికి సరాసరి రివ్వున
నా తనివితీరా చుట్టబెట్టు
ఆ మోసులెత్తే చైత్రపర్వపు ఆచ్ఛాదన

-నామాడి శ్రీధర్‌

namadi sridhar

అక్కడితో బాల్యం అంతమైంది!

 ismayil painting rainbow

[ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా ఆయన నాకు ఆత్మబంధువు. కాని,అంత కంటే ఎక్కువగా ఆయన బంధువు కూడా. ఆయన చివరి రోజుల జీవితాన్ని దగ్గిరగా చూసిన వాణ్ని కావడం వల్ల ఈ వ్యాసం పైపైన రాసినట్టే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ- కాని, ఆయన మరణానికి తక్షణ నివాళి ఇది. నా దగ్గిర లేని ఈ వ్యాసం ప్రతిని పంపిన మిత్రుడు విన్నకోట రవిశంకర్ కి ధన్యవాదాలు]

 

1

ఇస్మాయిల్ గారి ఈ నిశ్శబ్దం ఇక చిట్ట చివరిది.

ఆయన ఇంక అసలే మాట్లాడరు. మనకు ఈ నిశ్శబ్దం అలవాటై, అయిదేళ్ళ పైనే అయింది. మనం ఏదైనా అన్నప్పుడు అయితే చిరునవ్వుతో, కాదంటే వొక పెద్ద నవ్వుతో సమాధానం చెప్తున్నారు కొంత కాలంగా ఆయన- లేదూ, మనం చెప్పింది నచ్చనప్పుడు చిన్న నవ్వుతో చెయ్యి జెండాలా వూపుతున్నారు తప్ప మాట లేదు. ఆయన మాటలన్నీ మనం చూస్తూండగానే ఆయన వుండగానే నిన్నటి జ్ఞాపకాలయ్యాయి. ఆయన మల్లెపూవులాంటి నవ్వునీ, చిరుగాలిలాంటి అందమైన కదలికల్నీ వొక తెల్లవస్త్రం దాచెయ్యడం ఏమిటి?! ఆయనకి చివరిసారి భుజాన్ని అందించలేని దూరంలో నేను వుండడం ఏమిటి?

మాటల్లో ఏమైనా చెప్పడం కష్టం. అందుకే ఆయన మొదటినించీ నాకూ మనకీ నిశ్శబ్దాన్ని అలవాటు చేస్తూ వచ్చారు. ఇంత దూరంలోంచి నిశ్సబ్దంగా నిశ్శరీరంగా భుజాన్నివడంలో ఎన్ని దిగుళ్ళున్నాయి?! ఎన్ని జ్ఞాపకాలున్నాయి?గొంతు దాటని ఎన్ని మాటలున్నాయి? పోయిన నెల ఆయనకి చివరిసారి భుజాన్నిచ్చిన స్నేహితులందరి భుజాల మీదా వొక చిన్ని ముద్దు!

నమ్మలేకపోతున్నాను!

వొక నాటి రోజుల్లో ఎర్రసిరా తారీఖూ ఆకుపచ్చ అక్షరాలూ కనిపించగానే ఎంత ఆనందం! చిన్న చిన్న వాక్యాల మధ్య స్వచ్చమైన కలకల నవ్వు వొక్కోసారీ, పదునైన వ్యంగ్య బాణాల విసురు మరోసారీ – ఇప్పుడేమీ కనిపించవూ వినిపించవు కదా!

ఇస్మాయిల్ గారిని తలచుకోగానే నా మటుకు నాకు తక్షణం గుర్తొచ్చేవి – అవును, ఆ ఆకుపచ్చ అక్షరాలే! అలాంటి ఆకుపచ్చా పచ్చని వుత్తరం మొదటి సారి ఇరవయ్యేళ్ళ కిందట అందుకున్నాను.

2

అప్పటికింకా “రక్త స్పర్శ” అచ్చు కాలేదు. “శిధిల నేత్రాలు” అనే నా కవిత ఆంద్ర ప్రభలో అచ్చులో చూసి వెంటనే ఆయన వుత్తరం రాశారు, “ఇది తెలుగు పద్యంలా లేదు!” అని! ఆయనేమంటున్నారో నాకు అర్థం కాక, వెంటనే నేను మళ్ళీ వుత్తరం రాస్తే, వారం పది రోజుల తరవాత (ఈమెయిల్ లేని కాలంలో ఆ ఎదురుచూపు ఎంత నరకమో!) ఆయన సమాధానం. “తెలుగు పద్యం అంటే ఇప్పుడు మనకి ఒక స్థిరమైన చట్రం వుంది. ఈ చట్రం శబ్దంలోనూ, అర్థంలోనూ గట్టిగా బిగుసుకొని వుంది. మీరు చట్రాన్ని తప్పించుకుంటున్నారు లేదా దాన్ని ముక్కలు చేస్తున్నారు. మీ గొంతు ఈ కాకిగోలలో మునిగిపోవచ్చు. లేదా, మీకు శక్తి వుంటే కాకుల్ని మీరే తరిమేయచ్చు.” అసలు వాక్యం రాయడానికే సిగ్గుతో చితికిపోతున్న కుర్రకవికి ఆ మాటలు కొన్ని రోజుల పాటు నిద్రాభంగమయ్యే పెద్ద సత్కారం.

బహుశా, ఈ బందాల్నీ, చట్రాల్నీ నిరాకరించడమే ఆయన తన కవిత్వంలోనూ, వచనంలోనూ, చివరికి వొక్క క్షణమూ శాంతినివ్వలేని జీవితంలోనూ చేశారేమో! ఇప్పుడనిపిస్తుంది, వొక్క వాక్యంలో ఇస్మాయిల్ గారి గురించి చెప్పాలంటే – అలాంటి చట్రరహితమైన జీవనస్వేచ్చకి ఆయన ప్రతీక. నలభయ్యేళ్ళ పైబడి తెలుగు కవిత్వంలో ఆ ప్రతీకని వొక చెట్టు రూపానికి పరిమితం చేసి మనం మాట్లాడుతూ వచ్చాం. ఆ ప్రతీక మనలోని సాంప్రదాయపు వేళ్ళని పెళ్లగించింది. ఆలోచనల్ని బిగించి పెడుతున్న మూసల్ని చెదరగొట్టింది. పదాల మారుమూలల్ని శుభ్రం చేసింది. మామూలు పదాలకు అమామూలు శక్తినిచ్చింది. జీవితంలోని ముచ్చట ఎక్కడో లేదనీ, మనలోనే మన చుట్టే వుందని మనల్ని మన పరిసరాల్లోకి మళ్ళీ ప్రతిష్టించింది.

ఈ పరిసరాల స్పృహలోంచి ఇస్మాయిల్ రెండు ముఖ్యమైన పనులు చేశారనుకుంటాను. వొకటి: జీవితం చుట్టూ, సాహిత్యం చుట్టూరా పేరుకుపోయిన కాలుష్యాల్ని తుడిచిపెట్టడం; రెండు: సిద్ధాంతం అనేది వొక బ్రహ్మ పదార్ధం లాంటి metanarrative కాదనీ, అది మన కళ్ళ ముందే పరచుకొని వుందనీ అసిద్ధాంతీకరించడం (ఇప్పుడు దీన్ని మనం deconstruction / de-schooling అనుకుందామా?) ఈ రెండూ ఆయన పుస్తక జ్ఞానంలోంచి కాకుండా తన ఆనుభవిక చైతన్యంలోంచి చెప్పడం ఆయనలోని overarching phenomenon.

కవిత్వానికి గొప్ప వస్తువు అంటూ అక్కర్లేదు. నిజమే, కాని, అలా అనుకున్న తరవాత నిజంగా కవిత్వం రాయబోయేసరికి ఆ గొప్పది కాని విషయాన్ని అర్థం చేసుకొని రాయడం అన్నది అంత తేలిక కాదు. అసలు తేలికగా కవిత్వం చెప్పడం అంత తేలిక కాదు. తేలిక మాటల్ని అనుభవాల బరువుతో తూకం వేయడం చిన్న సంగతీ కాదు. పదచిత్రాలూ, ప్రతీకలూ ఇతర అలంకారాలేవీ లేకుండా కేవలం వొక భావమే ప్రాణంగా కవిత్వాన్ని బతికించుకుంటూ పోవడానికి కవికి చాలా శక్తి కావాలి. ఇప్పటిదాకా మనం చేస్తూ వచ్చిన పొరపాటు ఏమిటంటే, కవిత్వం జీవితమంత బరువుగా వుండాలేమో అనుకొని దాని మీద గాడిద బరువు మోపుతున్నాం. ఇస్మాయిల్ గారి కవిత్వంలో గాడిదల ప్రస్తావన చాల చోట్ల వస్తుంది. బహుశా, గాడిదలకి అంత సాహిత్య పాపులారిటీ ఇచ్చిన రచయిత కిషన్ చందర్ తరవాత ఇస్మాయిల్ గారే కావచ్చు. కవులు గాడిదలు కాకూడదన్న సందేశం ఇస్మాయిల్ కవిత్వంలో వుందని వేరే చెప్పక్కర్లేదు కదా!

ఆ గాడిద బరువు లేకుండా కవిత్వం నిరలంకారంగా వుండాలన్న టాగోర్ ని సదా బాలకుడని వో పద్యంలో వర్ణించారు ఇస్మాయిల్. నిజానికి సదాబాల్యం ఇస్మాయిల్ కవిత్వానికి అంతర్వస్తువు (Internalized theme). ఆయన బాల్యం గురించి రాసిన పద్యాల్లో కేవలం బాల్యం గురించే ఆయన చెప్పలేదు. ఆ మాటకొస్తే, బాల్యం ఆయనకొక గతానుభవం కాదు. ఆ నిన్నటి బాల్యంలోంచి ఆయన గుర్తుచేసే/ గుర్తించే వర్తమానం ముఖ్యమైంది. జీవితంలోని స్వచ్చతని పదిలంగా కాపాడే శక్తి బాల్యానికి మాత్రమే సొంతం. ఆ స్వచ్చతని చెప్పడానికే ఆయన పసితనం గురించీ, పసివాళ్ళ గురించీ రాస్తారు.

గుర్రప్పిల్ల కాళ్ళతో

పరిగెత్తుకుంటూ వచ్చాడు

బడి వదిలినట్టున్నారు.

బుర్రనీ, కాళ్ళనీ

బంధించిన సంకెళ్ళు విప్పేయగానే

మధ్యాహ్నపు ఎండ బయళ్ళు

మహోత్సాహంతో ఆహ్వానించాయి

ఎంత స్వేచ్చ! ఎంత హాయి!

అన్న పద్యపాదాల్లోంచి కనిపించేది ఆయన మనవడా? ఇస్మాయిల్ గారా? మనమా? నన్నడిగితే అది వొకే సమయంలో ఒకే దృశ్యంలో ముగ్గుర్ని బంధించే కవిత. ఆ తరవాత ఆ మనవడు చేసే పనుల జాబితాలోని పనుల్ని యింకో కోణంలోంచి చూస్తే, అవి ఇంకో రూపంలో మనకీ స్వేచ్చనిస్తాయి. రోజువారీ బతుకులో పోగొట్టుకుంటూ వస్తున్న మన స్వేచ్చని గుర్తు చేస్తూ- చివరికొచ్చేసరికి మనం పోగొట్టుకున్న ఆ స్వేచ్చని అందంగా అప్పగించడం ఈ కవిత చేసే పని. అలా అందుకోడానికి మనకి కాసింత వెసులుబాటు దొరకాలి అంతే! ఆ కాస్త వెసులుబాటే దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుంది. అలాంటి అర్థాన్ని వెతుక్కునే దారినే ఆయన “ఉత్సవం”గా వర్ణించారు వొక సందర్భంలో-

“చెట్టు నా ఆదర్శం” నించి ఇటీవలి “కప్పల సముద్రం” దాకా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన పోనుపోనూ బాలకుడైపోతున్నాడని అనిపిస్తుంది. అది ఆయన తీసుకునే ఆయన వస్తువులోనూ కనిపిస్తుంది. ఆయన రాసుకునే భాషలోనూ అనిపిస్తుంది. లేకపోతే-

తరుచాపము వీడిపోయి

గురిమరచిన బాణంలా

తిరుగాడును పిట్ట

అంటూ అత్యంత గంభీరంగా రాసిన కవి, పదచిత్రాల మీదా, కొండొకచో అంత్యప్రాసల మీదా ఆధారపడిన కవి నెమ్మదిగా ఆ ఆధారాల్నీ, ఆ అలంకారాల్నీ వొదిలేసి-

నా కోసం పూర్తిగా

నగ్నవైనపుడు మాత్రమే

నా దానివి

అని తనే వొక కవితలో అన్నట్టు తన ‘self’ ని ఆవరిస్తున్న ఆచ్చాదన గుర్తెరిగి రాయడం ఆయన కవిత్వంలోని ఇంకో రహస్యం అనుకుంటాను. ఆ ఆచ్చాదనల్ని చింపేసిన ఉత్సవ సమయంలోనే ఆయన “గోళీకాయలు” “బెల్లంకాయ” లాంటి కవితలు రాశారనుకుంటాను. ఆ సమయంలో చుట్టూ వున్న లోకంలోంచి వొక సంతోషాన్ని, వొక ఆశ్చర్యాన్ని తోడుకునే విషయాలన్నీ ఆయనకు కవిత్వమవుతాయి. ధనియాలతిప్ప అనే స్పష్టమైన స్థలం చూస్తే ఎంత ఆనందమో, అస్పష్టమైన వొక వాన్ గొ చిత్రం చూసినా అదే ఆనందం. పాముల వాణ్ని చూస్తె ఎంత సంభ్రమమో, పికాసో బొమ్మని చూస్తే అంతే సంభ్రమం. చుట్టూ పరచుకొని వున్న చెట్లనీ, నదుల్నీ, మనుషుల్నీ చూస్తే ఎంత సంతోషమో, ఎక్కడో వున్న పారిస్ మహానగరాన్ని చూసినా అంతే సంతోషం. ముఖ్యంగా, వ్యక్తులూ, స్థలాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత సున్నితంగా ప్రేమగా రాసిన ఇంకో కవి ఎవరైనా వున్నారా అంటే లేరనే అనిపిస్తుంది నాకు. చాలా మంది ఆయన కేవలం ప్రకృతి గురించే రాశారని పొరబడతారు కాని, నిజానికి ఆ ప్రకృతిలో లీనమయ్యే కల కంటున్న మనుషుల్ని గురించే ఆయన రాస్తున్నారని నేను అనుకుంటాను.

పిల్లల్ని గురించి, అంత కంటే ఎక్కువగా తన స్నేహితుల్ని గురించి రాయన రాసిన కవితలు నన్ను ఎప్పుడూ విస్మయంలో పడేస్తాయి. సూఫీలు కలకంటున్న వొక ప్రాపంచిక జీవిని ఈ మూడింటి కలయికలోంచి చూపిస్తున్నారా అనుకుంటాను. మా ఇద్దరి సంభాషణల్లో సూఫీ మహాకవి హఫీజ్ ని ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించే వారో లెక్కలేదు. మొదట్లో నేను హఫీజ్ ని చదవడానికి బద్దకిస్తున్నప్పుడు “అయ్యో…హఫీజ్ ని చదవకుండా, ఎట్లా రాస్తారు మీరు అసలు?” అని వొక సారి గట్టిగా మందలించే వారు కూడా- ఈ కాలంలో అలా మనల్ని ఫలానా చదవలేదే అని మందలించే వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది కొన్ని సార్లు! అలాంటి క్షణాల్లో ఆయన మాటలు గుర్తొచ్చి మొదట ఆయన మాటనీ, తరవాత ఆయన్నీ పోగొట్టుకున్నాను కదా మరణం అనే ఈ తెర అడ్డుపడి అనుకుంటూ వుంటాను.

4

కవిత్వం విషయంలో నాకూ మా నాన్నగారికి మొదటి నించీ చుక్కెదురు. మా నాన్నగారు కమ్యూనిస్టు సాహిత్య జీవి. నాకు కవిత్వ ఊహలు అప్పుడప్పుడే అందుతూ వస్తున్న నా డిగ్రీ రోజుల్లో “లేచిపోదామా?” అని చిలిపి హుషారుగా అనే అమ్మాయిలా ఇస్మాయిల్ గారు అనిపించారు నాకు. కవిత్వ పరంగా నేను ఆయనతో లేచిపోయాను, మా నాన్నగారి కమ్యూనిస్టు పంజరం విడిచి-

అయితే, నా మొండితనం మీద గాఢమైన నమ్మకం వుండడం వల్ల నాన్నగారు నన్ను ఇస్మాయిల్ గారి మైదానంలో హాయిగా వదిలేశారు. నాన్నగారు మంచి సాహిత్య వక్త. ఖలీల్ జిబ్రాన్ గురించీ, కొంత మంది పర్షియన్ కవుల గురించి నాన్నగారి రేడియో ప్రసంగాలు విని, ఇస్మాయిల్ గారు “కౌముదీ, మీలోని నిజమైన వ్యక్తీ ఇదిగో ఇక్కడున్నాడు! మీరు ఎందుకలా తప్పించుకు తిరుగుతారు అతన్నించి!” అని వొక సారి కార్డు ముక్క రాశారు. అదే వుత్తరం కింద నా కోసం “అఫ్సర్, నాన్నగారి మార్క్సిస్టు మాటలు మినహాయించుకొని, ఇదిగో హాయిగా ఈ పర్షియన్ కవుల్ని చదువుకో నువ్వు! ఆయన మార్క్సిస్టు కాని వేళల్లో సాహిత్యం గురించి చక్కగా మాట్లాడతారు.” అని రాశారు.

ఇక నించి అలాంటి ఆకుపచ్చ ఉత్తరాలూ, అందమైన వాక్యాలూ రావు కదా!

ఇలా వెళ్లిపోతారని తెలిస్తే, ఇంకాసిని ఎక్కువ మాటలు ముందే మాట్లాడి వుండే వాణ్ని కదా, ఇంకా కొన్ని కాలాలు నాలో దాచుకోడానికి!

(లోగో: సాయి కిరణ్)

 వచ్చే గురువారం: విన్నకోట రవిశంకర్ వ్యాసం “ఆ ఇద్దరూ సదాబాలకులే!”

 

Interstellar: మనిషికీ సైన్సుకీ మధ్య…

imagesODLF8DC7

Interstellar సినిమా రెండో సారి చూశాను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని విషయాలు రెండోసారికైనా అర్థమవుతాయని ఆశతో వెళ్లాను. కొంత నయం. ఇంకో రెండు సార్లు చూస్తే అర్థమయిపోతుంది. చాలా రోజుల తర్వాత నాలో సైన్స్ జిజ్ఞాస మళ్ళీ ఊపిరి పోసుకుంది. ఈ వ్యాసంలో ఆ సినిమాలోని సైన్స్ ని నేను వివరించబోవడంలేదు. కాని కొన్ని ముఖ్యమయిన విషయాలు చర్చించుకోవడానికి ఆ సినిమా గొప్ప ఉదాహరణ.

క్లుప్తంగా Interstellar కథ ఇది:

కొన్ని దశాబ్దాల తర్వాత భూమి ఇక మనిషిని తట్టుకోలేని రోజులవి. మానవ జాతి అంతరించిపోవస్తున్న కాలం అది. ఇసుక తుఫానుల వల్ల, పంటలు పండకపోవడం వల్ల, ఆహార కొరత వల్ల జనాభా క్షీణిoచిపోతూ ఉంటుంది. కూపర్ అనే రైతు (ex-NASA Aircraft Pilot), అతని కూతురు కొన్ని విచిత్ర సంఘటనల ద్వారా, అప్పటికే మూతపడిపోయింది అనుకున్న NASA రీసెర్చ్ సెంటర్ ఒకదాని లోకి వచ్చి పడతారు. అక్కడి ముసలి ప్రొఫెసర్ కూపర్ కి మానవ జాతి అంతరించిపోబోతోంది అని వివరించి, అంతరిక్షంలో సుదూరాన ఉన్న కొన్ని గ్రహాల మీదకి వెళ్లి, వాటిలో ఏది మానవుల మనుగడకి అనువైనదో కనుక్కుని రావడానికి ఒప్పిస్తాడు. కూపర్ ఇంకో ముగ్గురు మనుషులూ, ఒక రోబోట్ తో కలిసి ఈ అన్వేషణ కి బయల్దేరతాడు. మనకి తెలిసిన సైన్స్ కి అవతలి చివర ఉన్న ఎన్నో వింతలూ, సమస్యలూ దారిలో ఎదుర్కొంటూ చివరికి ఎం చేశాడా అన్నదే సినిమా.

ఇదేదో మాములు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకోవద్దు. ఇందులో మానవ సంబంధాలని అత్యద్భుతంగా చిత్రించాడు నోలాన్. Warm Holes, Black Holes, Time Dilation లాంటి ఎన్నో క్లిష్టమైన అంశాలు ఇందులో ఉన్నప్పటికీ హ్యూమన్ ఎలిమెంట్ ని ఎక్కడ వదలకుండా చాలా చక్కగా తీశాడు. అన్నింటికంటే మించి మానవ జాతి భౌతిక శాస్త్రం(Physics) లో ఇప్పటి వరకూ సాధించిన అభివృద్ధికి ఈ సినిమా దృశ్య రూపం. అంతేకాక మనం ఇంకా ఏమేమి తెలుసుకోవాలి అనుకుంటున్నామో అవి కూడా ఊహామాత్రంగా చూపిస్తుంది. శాస్త్ర అభివృద్ధి లో, లేదా ఇంకా విస్తృత స్థాయిలో చెప్పాలంటే, మానవాభివృద్ధి లో కళ పాత్ర ఏమిటి అనే చర్చ మన ముందుకు పెడుతుంది ఈ సినిమా.

మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ప్రతి భౌతిక సంఘటన, ప్రతి భౌతిక వస్తువూ మనిషి మెదడులో ఏదో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ చైతన్యం ఆధారంగానే మనిషి ప్రకృతిని, సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. మనిషి ప్రపంచాన్ని ఆకళింపు చేసుకునే ఈ క్రమంలో అనేక చైతన్య రూపాలు పుడతాయి. వాటిలో కళ ఒకటి. ఉదాహరణకి వేట ఒక శాస్త్రం. ఆదిమ మానవుడు వేటలో ప్రావీణ్యం తెచ్చుకోడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. వేటలోని మెళకువలను, సూత్రాలను అనుభవాల ద్వారానే అతను నేర్చుకున్నాడు. నిజానికి ఏ శాస్త్రానికైనా పునాది మానవానుభావమే. అలాంటి అనుభవాలు, అనుభూతులు, ఆవేశాలు, భావాలు మొదలైనవి గుంపులోని మిగతా సభ్యులతో సంజ్ఞల ద్వారా, భాష ద్వారా, గోడల మీద బొమ్మల వెయ్యటం ద్వారా పంచుకున్నాడు. కాలక్రమేణా ఇవి కొన్ని నిర్దిష్ట రూపాలు తీసుకున్నాయి. అలా పుట్టినవే నేడు మనం చూస్తున్న అనేక కళారూపాలు.

సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల కలిగిన ప్రత్యేకమైన చైతన్యం కూడా కొంత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక చైతన్యాల నుంచే సమాజ చైతన్యం (Social Consciousness) పుడుతుంది. ఇక్కడ సమాజ చైతన్యం అంటే ఆ సమాజం తనని తానూ, తన చుట్టూ ఉన్న ప్రకృతినీ అర్థం చేసుకునే క్రమమే. ఇది ఎప్పుడూ ఆ సమాజంలో చలామణి అవుతున్న భౌతిక పరిస్థితులు, ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలకి లోబడి ఉంటుంది. ఒక తరం తన అనుభవాల ద్వారా పొందిన చైతన్యాన్ని తన తరువాతి తరానికి సమగ్రంగా అందించినప్పుడే రెండవ తరం చైతన్య స్థాయి మొదటి దానికంటే ఉన్నతంగా ఉంటుంది, పురోగతి సాధ్యపడుతుంది. ఈ అవసరాన్ని కళలు చాలా సమర్ధవంతంగా తీరుస్తాయి. సులువుగా చెప్పాలంటే సమాజంలో అంతర్భాగమైన రకరకాల మనుషుల యొక్క ప్రత్యేక చైతన్యాలని తీసుకుని సమాజం మొత్తానికి సమానంగా పంచిపెట్టి, ఒక నిర్దిష్టమైన సమాజ చైతన్యం రూపొందేలా చెయ్యడం కళ పని. మనిషి ప్రపంచాన్ని అవగతం చేసుకోవడానికి కళ ఒక సాధనం.

our-legend-of-cinema-christopher-nolan-1007037965

నిప్పు కనిపెట్టడం ప్రకృతి పై మానవుడు సాధించిన మొదటి విజయం. బండి చక్రమొక విప్లవం. భాషలకి లిపి తయారు చేసుకోవడం ఒక విప్లవం (చిత్ర కళ లిపికి మూలం అయ్యింది). ఇవన్నీ చాలా శాస్త్రీయమైన, సైన్సుతో ముడిపడి ఉన్న విప్లవాలే. భూమి నుంచి ప్రసవ రహస్యాన్ని కనిపెట్టి అడివి మనిషి వ్యవసాయదారుడిగా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కొన్ని వందల తరాలు మారాయి. ఆ చైతన్యం (సైన్స్) ఇన్ని తరాల పాటు, ఇన్ని ప్రాంతాలలో విస్తరిస్తూ రావడంలో కళ పాత్ర అత్యంత కీలకం. అసలు కళ పుట్టుకే ఒక విప్లవం.

నిజానికి కళ, సైన్స్ రెండింటి జన్మస్థానం ఒక్కటే – మానవ జీవితానుభవం.

ఆ రెండింటి లక్ష్యం కూడా ఒక్కటే – సర్వ మానవ శ్రేయస్సు.

కళ, సైన్స్ ఒక దానిని ఒకటి సంపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఆ రెండిటినీ విడగొట్టడం అనేది కుట్ర. కళని సైన్స్ ని దూరం చేసి, ఆ రెండూ రెండు వేరు వేరు రంగాలుగా తయారు చెయ్యడం కుట్ర. సైన్స్ కళ నుండి విడివడినప్పుడు మానవ జాతి పురోగతి మందగిస్తుంది. సమాజ చైతన్యం సమాజం మొత్తానికి చెందకుండా కొంత మందికి మాత్రమే పరిమితమై పోతుంది. శాస్త్రాలు మొత్తం సమాజం అభివృద్ధికి ఉపయోగపడకుండా, “టెక్నాలజీ” అనే పేరుతో కొంత మంది అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడతాయి. ఒక వైపు మనం అంగారకుడిని అందుకుంటుంటే ఇంకోవైపు దొంగ బాబాలు దేశం లో స్వైరవిహారం చేస్తుండటం ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్స్ అంటే స్పేస్ సైన్స్ (Space Science) మాత్రమే కాదు. ఇంకా ఎన్నో శాస్త్రాలు – ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు – మానవులకు తక్షణ అవసరాలుగా ఉన్నాయి. వాటన్నిటి మీదా సినిమాలూ, కథలూ, కవితలూ, నాటకాలూ మొదలైనవి రావాలి. ప్రచారం జరగాలి. సమాజ చైతన్యం పై ప్రతి మానవుడికీ సమానమైన హక్కు ఉంది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ఒక చిన్న విజయాన్ని నమోదు చేసింది అని చెప్పొచ్చు. భౌతిక శాస్త్రాన్ని చాలా చక్కటి కథతో హృద్యంగా చిత్రీకరించారు. అలాగని ఈ చిత్రం లో వ్యాపార కోణం లేదు అని నేను అనడం లేదు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో వ్యాపారం కోసమే ఈ సినిమా తీశారు. అందులో సందేహం లేదు. ఈ చిత్రంలో చూపించినది అంతా శాస్త్రీయమైనది అని కూడా నేను అనడం లేదు. ఏ కళలోనైనా స్వాభావికంగానే వాస్తవికతతో పాటు కొంత ఊహ, కొంత అధివాస్తవికత ఉంటాయి. ఆ ఊహలు భవిష్యత్తులో మానవ జాతి ఛేదించాల్సిన ఎన్నో ప్రశ్నల వైపు, సాధించాల్సిన ఎన్నో విజయాల వైపు నడిచే ఉత్సాహాన్నిస్తాయి.

 -వినోద్ అనంతోజు

vinod anantoju

 

ఏకలవ్యుడి బొటనవేలు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఏకలవ్యుడి గురించి రాద్దామని మొదలు పెట్టబోయేసరికి ఒక ఉదంతం గుర్తొచ్చింది…

అప్పుడప్పుడే నేను కాలేజీ చదువులోకి అడుగుపెట్టాను. మా నాన్నగారు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. ఆ సమయంలోనే కరటూరి సత్యనారాయణగారు వాణిజ్యపన్నుల అధికారిగా ఉండేవారు. సత్యనారాయణగారు కవి కూడా. ఆయన అప్పటికే కొన్ని పద్యకావ్యాలు రాశారు. కొత్తగా ‘కరుణాసౌగతము’ అనే ఖండకావ్యం రచించారు. అది బుద్ధుడికి సంబంధించిన కొన్ని కథలను దండగుచ్చిన కావ్యం. ఆ కావ్య ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు.

వాణిజ్యపన్నుల అధికారికి సంబంధించిన కార్యక్రమం కదా… పట్టణంలోని వర్తకప్రముఖులందరూ రంగంలోకి దిగారు. ఉభయగోదావరి జిల్లాలలోని పలువురు సాహితీ ప్రముఖులను వక్తలుగా ఆహ్వానించారు. అందులో సంప్రదాయ, ఆధునిక అన్న తేడా చూపించలేదు. అలా ఆ సభ, ఓ అరుదైన ఉభయసాహితీ సమ్మేళనం. ఆధునికులలో నాకు బాగా గుర్తున్న పేరు ఆవంత్స సోమసుందర్ గారు. సంప్రదాయపండితులలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు కూడా ఉన్నట్టు జ్ఞాపకం. స్థానిక సాహితీ ప్రముఖులు దిగుమర్తి సీతారామస్వామిగారు సభాధ్యక్షులు. మా నాన్నగారు వక్తలలో ఒకరు.

ఇంటికి వాహనం పంపించారు. మా నాన్నగారితో నేనూ వెళ్ళాను.

సభ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో. మేము వెళ్ళేటప్పటికే కుర్చీలు చాలావరకు నిండిపోయాయి. ఎక్కువమంది వర్తకులే. వారి మెడల్లో ఒంటిపేట బంగారపు గొలుసులు, చేతికి బంగారపు చెయిన్ తో రిస్టువాచీలు, వేళ్ళకు రవ్వల ఉంగరాలు జిగేలుమంటున్నాయి. సాహితీ ప్రముఖుల ఎదురుకోలు సన్నాహాలు, పన్నీటి చిలకరింపులు, స్వాగతాలు వగైరాలు ముగిసిన తర్వాత సభ ప్రారంభమయింది. కనీసం పదిమంది వేదికను అలంకరించినట్టు జ్ఞాపకం.

bhasaram garu

ఆవిష్కరణ ముగిసి ప్రసంగాలు జరుగుతున్నాయి. వివరాలు నాకు గుర్తులేవు కానీ, ‘ఎవరో రసమా. భావమా?” అనే చర్చ లేవదీశారు. చూస్తుండగానే ఆ చర్చ సంప్రదాయ, ఆధునికుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. సభాస్థలి వేడెక్కింది. అసలే కిక్కిరిసిన సభ. ఆపైన వేసవి కాలం. పైన పంకాలు తిరుగుతున్నా ఆ గాలి సరిపోవడం లేదు. వేసవి తాపానికి తోడు సభా తాపం. వర్తకశ్రేష్టులకు వేదిక మీద ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. బిక్కమొహాలు వేసి బెదురుచూపులు చూస్తున్నారు. వారి స్థూలకాయాలు కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతున్నాయి.

వక్తలను నియంత్రించడానికి అధ్యక్షులవారికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఎలాగో ఆవేశ కావేషాలు సద్దుమణిగి ఊపిరి పీల్చుకున్నాక సోమసుందర్ గారిని మాట్లాడమన్నారు. ఆయన ‘కరుణా సౌగతము’ అనే ఆ కావ్యంలోని అంగుళిమాలుని కథను ఎత్తుకుని, దానికి మహాభారతంలోని ఏకలవ్యుని కథ కూడా మేళవించి, ‘గురువులందరూ శిష్యద్రోహులే’ నంటూ కొత్త మంట రాజేశారు. దాంతో మళ్ళీ సంప్రదాయసాహితీవేత్తలనుంచి నిరసన…ఉభయుల మధ్య వాగ్యుద్ధం…

కాసేపటికి మా నాన్నగారి వంతు వచ్చింది… ఆయన ఒక స్వీయపద్యంతో ప్రసంగం ప్రారంభించారు. ఆ పద్యం ఇదీ!

నలువకు నాల్గు నాల్క లట నర్తనమాడెడు నీ తనుప్రభల్

తలకొక దారి వింత గతులన్ మెరయించిన మోసపోయి వా

దులు గొని మచ్చరింతురు బుధుల్ తదుదగ్రరుషాతమమ్ముపై

వెలిగెడు నీదు చిర్నగవు వెన్నెల పండువు మాకు భారతీ!

ఓ సరస్వతీదేవీ! బ్రహ్మదేవుడికి నాలుగు నాల్కలు కదా. ఆ నాలుకల మీద నువ్వు నాట్యం చేస్తూ ఉంటావు. అప్పుడు నీ శరీర కాంతులు పండితులకు ఒక్కొక్క విధంగా వింత గతుల్లో మెరిసిపోతూ కనిపిస్తాయి. దాంతో వారు మోసపోయి వాదులాటకు దిగి మత్సరం పెంచుకుంటారు. ఉగ్రమైన ఆ చీకటి నాలుకలపై వెలిగే నీ చిరునవ్వే మాకు వెన్నెల పండుగ- అని ఈ పద్యానికి అర్థం.

ఆశ్చర్యం! పద్యం ముగిసిందో లేదో, సభ అంతా చప్పట్లు… నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం హఠాత్తుగా మలయమారుతం వీచినట్టుగా వర్తక సభాసదుల ముఖాల్లో ఏదో తెలియని ఉల్లాసం. వారికి ఆ పద్యంలోని భావం అర్థమై కాదు. మా నాన్నగారని అనడం కాదు కానీ, పద్యం బాగా చదువుతారని ఆయనకు పేరు. శ్రావ్యమైన పద్యగానంతో సభ మీద ఆయన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు.

సరే, ఆయన సందర్భోచితంగా పద్యాన్ని ఎత్తుకున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆ వెంటనే పండిత సత్కారం నిర్వహించిన వర్తకముఖ్యుని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య ఈసారి సభలో నవ్వులు పూయించింది…

‘ఈయనెవరో మహానుభావుడు. ఈయనకు సంప్రదాయం తెలుసు. జంట వస్త్రాలతో సత్కరించాడు. నేను చాలా సభల్లో చూస్తూ ఉంటాను. శాలువా కప్పుతూ ఉంటారు. అలా ఏకవస్త్రం ఎవరికీ ఇవ్వకూడదు. పైన శాలువా కప్పుకుని కింద అలా వదిలేయాలనో ఏమిటో వాళ్ళ ఉద్దేశం’ అన్నారాయన. పండితచర్చ ఏమీ అర్థం కాక అంతసేపూ బిక్కచచ్చి ఉన్న వర్తకశ్రోతలకు అర్థమయ్యే మాటలివి. ఆ రిలీఫ్ వాళ్ళలో కనిపించింది.

కావ్యం మీద ఆయన ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు. కానీ గురువులందరూ శిష్యద్రోహులే నన్న సోమసుందర్ గారి వ్యాఖ్యను ప్రస్తావించి, ‘అది ద్రోహం కాదు, శిష్యులపై గురువు చూపిన విశేష అనుగ్రహం’ అనడం మాత్రం గుర్తుంది. ఎంత మా నాన్నగారు అయినా, ఆయన మాట నన్ను ఒప్పించలేకపోయింది.

***

నేను ఒక ప్రత్యేక అవసరం కోసం కరటూరి సత్యనారాయణగారిని బ్రాహ్మణేతరకవిగా చెప్పాల్సివస్తోంది. ఆయన బుద్ధుడి కథలు ఇతివృత్తంగా ఆ కావ్యం రాయడమే చూడండి…బుద్ధుడి కథలతో బ్రాహ్మణకవులు రాసిన కావ్యాలు అంత ఎక్కువగా కనబడవు. తిరుపతి వెంకటకవుల ‘బుద్ధచరిత్రము’, పింగళి-కాటూరి కవుల ‘సౌందరనందము’ వంటివి కొన్ని మినహాయింపులు. బుద్ధుడి పట్ల బ్రాహ్మణేతరకవులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నట్టు కనిపిస్తుంది. కవులనే ఏమిటి, బ్రాహ్మణేతర మేధావులకు కూడా. తెలుగువాళ్లలో బుద్ధుడిపై, బుద్ధుడి తాత్వికతపై ఆసక్తితో ప్రత్యేక అధ్యయనాలు చేస్తూవచ్చిన వారిలో బ్రాహ్మణేతర మేధావులే ఎక్కువగా కనిపిస్తారు. చరిత్రలోకి వెడితే బుద్ధుడి కాలంలో, బహుశా ఇంకా అంతకుముందే వైదిక/సనాతన ధోరణులకు సమాంతరంగా భిన్న తాత్విక ధోరణి ఒక్కోసారి జ్ఞాతంగా, ఒక్కోసారి అజ్ఞాతంగా ప్రవహిస్తూనే ఉందని అర్థమవుతుంది. వెనకటి రాజుల కాలంలో భర్త వైదికమతాన్ని అభిమానిస్తే, భార్య బౌద్ధాన్నో, జైనాన్నో ఆదరించడం, వాటికి చెందిన వ్యవస్థలకు దానాలు చేయడం కనిపిస్తుంది. ఈ విషయంలో స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు ఒక సామ్యం కనిపిస్తుంది. బి.ఎస్.ఎల్. హనుమంతరావుగారు రాసిన ఆంధ్రుల చరిత్రలో ఇందుకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.

ఆశ్చర్యమేమిటంటే, ఏనాడో బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచీ ప్రారంభమైన సమాంతర తాత్వికత అనే పాయ ఒక అంతర్వాహినిగా మారి, కాలం కల్పించిన హద్దులను దాటుకుంటూ తెలుగునేల మీద నేటికీ ప్రవహిస్తూ ఉండడం!

***

సోమసుందర్ గారు ప్రస్తావించిన అంగుళిమాలుడి కథ ఇలా ఉంటుంది…

అంగుళిమాలుడు తక్షశిలలో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. మంచి చురుకు, ప్రతిభ ఉన్నవాడు. దాంతో తోటి విద్యార్థులకు అతనిపై అసూయ కలిగింది. గురువుగారికి అతనిపై ఉన్నవీ, లేనివీ నూరిపోశారు. ఆయన అంగుళిమాలుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు. విద్యాభ్యాసం ముగిసి గురుదక్షిణ చెల్లించే సందర్భం వచ్చింది. ‘వెయ్యిమంది చిటికెన వేలు ఖండించి వాటిని నాకు గురుదక్షిణగా చెల్లించు’ అని అంగుళిమాలుని గురువు ఆదేశించాడు.

గురుదక్షిణ చెల్లించితీరవలసిందే. లేకపోతే గురుద్రోహం అవుతుంది. నేర్చుకున్న విద్య ఒంటబట్టకపోగా శాశ్వతంగా అపకీర్తిని మోయవలసివస్తుంది. కనుక గురువు కోరిన దక్షిణ చెల్లించడానికే అంగుళిమాలుడు సిద్ధపడ్డాడు. ఒక అరణ్యంలో ఉంటూ దారినపోయేవారిని అటకాయించి, చంపి వారి చిటికెన వేలును ఖండించి తీసుకునేవాడు. వాటన్నింటినీ మాలగా గుచ్చి తన మెడలో వేసుకునేవాడు. అందువల్ల అతనికి ‘అంగుళిమాలుడు’ అనే పేరు వచ్చింది. అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేళ్ళు అయ్యాయి. ఇంకొక్క వేలు దొరికితే వెయ్యీ పూర్తవుతాయి.

బుద్ధుడు అంగుళిమాలుడు ఉన్న అడవిమీదుగా ఒంటరిగా సంచారానికి బయలుదేరాడు. అనుయాయులు అంగుళిమాలుడి గురించి చెప్పి, వద్దని వారించారు. బుద్ధుడు వినలేదు. అంగుళిమాలుడు బుద్ధుణ్ణి చూశాడు. ఈరోజుతో వెయ్యి చిటికెన వేళ్లూ పూర్తవుతాయనుకుని సంతోషిస్తూ బుద్ధుణ్ణి అడ్డగించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అందకుండా బుద్ధుడు ముందుకు వెళ్లిపోయాడు. అంగుళిమాలుడు ఆయన వెంటపడ్డాడు. కానీ ఆయనను అందుకోలేకపోయాడు. అలసిపోయి చెమటలు కక్కుతున్న స్థితిలో ‘ఆగు’ అని ఒక్క కేక పెట్టాడు. బుద్ధుడు ఆగాడు. అంగుళిమాలుడు బుద్ధుని సమీపించాడు. అతని చేతిలో కత్తి ఉంది. అయినా బుద్ధుడు ఏమాత్రం తొణక కుండా అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అలాగే నిలబడిపోయాడు. అంగుళిమాలునికి ఆశ్చర్యం కలిగింది. చేతిలో ఉన్న కత్తి జారిపోయింది. బుద్ధుని పాదాల మీద పడ్డాడు. ఆ క్షణంలోనే బుద్ధుని అనుయాయిగా అతను పునర్జన్మ ఎత్తాడు.

***

ఇప్పుడు ఏకలవ్యుని కథకు వద్దాం.

మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసంలో ఇతని కథ ఉంది. దాని ప్రకారం ఏకలవ్యుడు హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కొడుకు. ద్రోణాచార్యుని ప్రసిద్ధిని విని ఆయన దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. వెళ్ళి ద్రోణుని కలిశాడు. అతను నిషాదుడు(బోయ)కనుక అతణ్ణి శిష్యుడిగా చేసుకోడానికి ద్రోణుడు ఒప్పుకోలేదు. దాంతో ఏకలవ్యుడు ఆయన అనుమతి తీసుకుని, మట్టితో ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకుని భక్తితో దానికి మొక్కుతూ విలువిద్యను సాధన చేసి ప్రావీణ్యం సంపాదించాడు.

అలా ఉండగా పాండవులు, కౌరవులు కలసి గురువు ద్రోణాచార్యుని అనుమతి తీసుకుని ఏకలవ్యుడు ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. వేట కుక్కలను తీసుకుని వారి వెంట భటులు కూడా వెళ్లారు. ఆ కుక్కల్లో ఒకటి మిగిలిన కుక్కలనుంచి వేరుపడి ఏకలవ్యుడున్న చోటికి వెళ్ళి అతణ్ణి చూసి మొరగడం ప్రారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు ఎంతో లాఘవంగా ఏడు బాణాలను దాని నోట్లోకి ప్రయోగించి నోరు మూశాడు. అది ఆ బాణాలు అలా ఉండగానే కురుపాండవుల దగ్గరకు పరుగెత్తింది. వారు దానిని చూడగానే ఆశ్చర్యపోయారు. అంత లాఘవంగా బాణాలు ప్రయోగించింది ఎవరా అనుకుంటూ వెతుకుతూ ఏకలవ్యుడున్న చోటికి వచ్చారు. దుమ్ము కొట్టుకున్న బలిష్టమైన దేహంతో, జడలు కట్టిన జుట్టుతో, జింక చర్మం ధరించి, ధనుర్బాణాలు పట్టుకుని ఉన్న ఏకలవ్యుడు వారికి కనిపించాడు. అతనిపై వారికి అసూయ కలిగింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘నువ్వెవరు, ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నా’వని అడిగారు. తను హిరణ్యధన్వుని కొడుకునని, ద్రోణుని శిష్యుడినని అతను చెప్పాడు.

untitled1

హస్తినాపురానికి తిరిగి వచ్చిన కురుపాండవులు ఇదంతా ద్రోణుడికి చెప్పారు. ఆ తర్వాత అర్జునుడు ఒక్కడే ఏకాంతంగా ద్రోణుని కలుసుకున్నాడు. ‘విలువిద్యలో నాకు ఎవరూ సాటిరాని విధంగా విద్య నేర్పుతానని మీరు మాట ఇచ్చారు. విలువిద్యలో నేనే కాదు, ముల్లోకాలలోనూ ఎవరూ ఆ బోయవాడికి సాటి రారు. నాకంటే, మీకంటే, లోకంలో అందరి కంటే ధనుర్విద్యలో అతడు నేర్పరి. పైగా మీ ప్రియశిష్యుడే నట’ అంటూ ఎత్తిపొదుపు మాటలు మాట్లాడాడు.

ద్రోణుడు అదిరిపడ్డాడు. ‘పద, అతణ్ణి చూద్దాం’ అంటూ అప్పటికప్పుడు అర్జునుని వెంటబెట్టుకుని ఏకలవ్యుడు ఉన్నదగ్గరకు వెళ్ళాడు. ఏకలవ్యుడు ఆయనకు ఎదురేగి పాదాభివందనం చేసి, ‘నేను మీ శిష్యుడిని, మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ విలువిద్య నేర్చుకున్నాను’ అన్నాడు. ‘అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. ‘ఇది నా దేహం, ఇది నా సంపద, వీళ్ళు నా పరిజనం. వీటిలో మీకు ఏది ఇష్టమో చెప్పండి, సంతోషంగా ఇస్తాను’ అని ఏకలవ్యుడు అన్నాడు. ‘నీ కుడి చేతి బొటనవేలును ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. వెంటనే ఏకలవ్యుడు బొటనవేలును ఖండించి ద్రోణుడి చేతుల్లో పెట్టాడు. ఆ బొటనవేలుతోనే అతని విలువిద్యా లాఘవమూ పోయింది. అర్జునుడి మనసు చల్లబడింది.

***

సరే, ఏకలవ్యుడిపై అర్జునుడి అసూయ, ద్రోణుడు అతనికి చేసిన అన్యాయం ఈ కథలో ఒక కోణం. చాలా కాలంగా చర్చలో ఉన్న కోణం. సౌదా తన ‘అపూర్వ పురాణకథలు’లో చిత్రించిన బర్బరీకుని పాత్ర కూడా ఇలాంటిదే. ఒక ఆటవిక స్త్రీకి భీముని వల్ల జన్మించిన బర్బరీకుడు కూడా మంచి విలుకాడు. అతను మహాభారత యుద్ధంలో పాల్గొనాలని ఉత్సాహపడతాడు. కానీ కృష్ణుడు అది జరగనివ్వడు. పైగా యుద్ధానికి ముందు అతణ్ణి ‘వీరబలి’ ఇస్తారు. దానికి ఉపశమనంగా అతని శిరస్సుకు యుద్ధాన్ని తిలకించే అవకాశం ఇస్తారు.

నేను ముందుకు తెచ్చే ప్రశ్నలు భిన్నమైనవి. అసలు విలువిద్యలో ఎవరు గురువు, ఎవరు శిష్యుడు అన్నది వాటిలో మొదటిది. ఏకలవ్యుడు అనే బోయకు ద్రోణుని గురువుగా చేసుకుని ఆయన దగ్గర ఉన్న అస్త్రవిద్య అంతా నేర్చుకోవలసిన అవసరం ఏమిటన్నది రెండవది.

మొదటి ప్రశ్నకు వస్తే, అసలు విలువిద్య ప్రప్రథమంగా ఆటవికులది, అంటే ప్రస్తుత సందర్భంలో ఏకలవ్యుడిది. కనుక విలువిద్యలో ఆటవికులే అసలు గురువులు. ఈ దృష్ట్యా ద్రోణుడి లాంటి మైదానప్రాంతవాసులు ఆటవికులకు శిష్యులు కావడమే న్యాయం. కానీ ఇక్కడ తలకిందులవుతోంది. ఆటవికుడైన ఏకలవ్యుడు శిష్యుడు, మైదానవాసి అయిన ద్రోణుడు గురువు అవుతున్నారు. విషాదం ఏమిటంటే, తనదైన విద్యను పరుల నుంచి ఏకలవ్యుడు నేర్చుకోవాలని అనుకోవడం.

ఇక్కడ ఇంకో తేడా కూడా ఉంది. విలువిద్య ఆటవికులలో లేదా ఆదిమ జాతులలో ప్రధానంగా అన్నసంపాదనలో భాగంగా పుట్టిందే తప్ప మనుషుల్ని చంపే మారణాయుధంగా కాదు. విల్లు, బాణాలే కాక; ఇతర ఆయుధాలు కూడా అన్న సాధనాలుగా పుట్టినవే. రాంభట్ల కృష్ణమూర్తిగారి ‘వేదభూమి’ నుంచి ఉటంకించుకుంటే; శావేజీ ద్వితీయదశకు వచ్చేసరికి (మోర్గాన్ ప్రాక్చరిత్రను శావేజీ, బర్బరదశలుగా విభజించాడు. మళ్ళీ ఒక్కొక్క దశనూ మూడు అంతర్దశలుగా విభజించాడు) మనిషి నిప్పులో చేపల్ని కాల్చుకుని తినగలిగే స్థితికి వచ్చాడు. రాతి పనిముట్లతో ముడిగల చెట్టుకొమ్మను గదగా మలచుకున్నాడు. గట్టి కొయ్యతో త్రిశూలాన్ని చేసుకున్నాడు. త్రిశూలం అంటే మూడు కొనలూ పైకి ఉండే ఆయుధం కాదు. ఒక కొన వెనక్కీ, రెండు కొనలు ముందుకీ ఉండేది. అలాంటి అమరికే చేపల్ని పట్టుకోడానికి అనువుగా ఉంటుంది. పాశం కూడా చేపల్ని పట్టుకోడానికి ఉద్దేశించినదే. ఇక మూలమట్టంగా ఉండే కొయ్యను చక్రంగా మలచుకుని జంతువుల మీద ప్రయోగించేవాడు. అది జంతువును పడగొట్టనైనా పడగొడుతుంది, గురి తప్పితే విసిరిన వాడి చేతికే తిరిగి వస్తుంది. దీనిని తెలుగులో ‘వలరి’ అన్నారు. అరవంలో ’వలయత్తడి’ అన్నారు. ఆస్ట్రేలియా ఆదివాసులు ‘బూమరాంగ్’ అన్నారు. గద, త్రిశూలం, పాశం, చక్రం అనే ఆయుధాల పుట్టుక నేపథ్యం ఇదీ.

ధనుర్బాణాల విషయానికి వస్తే, అవి శావేజీ తృతీయదశ ప్రారంభంలో పుట్టాయి. ధనుర్బాణాలు చాలా సంక్లిష్టమైన యంత్రం. వేల సంవత్సరాల అనుభవం రాసిపడిన తర్వాతే ఈ గుణాత్మక నైపుణ్యం అలవడిందని రాంభట్ల అంటారు. అదివరకటి ఆయుధాలు ముఖాముఖీ ప్రయోగించడానికి మాత్రమే వీలైనవి. బాణాలను చాటునుంచి కూడా ప్రయోగించవచ్చు. అందుకే ఈ ఆయుధానికి మహత్యాలు పుట్టాయని ఆయన అంటారు.

ఇక్కడ జరిగింది ఏమిటంటే, అన్న సంపాదనలో భాగంగా ఆటవికులు సృష్టించిన ధనుర్బాణాలు ఆటవికేతరుల చేతికి వచ్చేసరికి మారణాయుధంగా మారిపోయాయి. అంటే, వాటి ప్రయోజనమే మారిపోయింది. ద్రోణుడు విలువిద్యను సాధనచేసి, ప్రావీణ్యం గడించింది, ఒక మారణాయుధంగా మాత్రమే! క్షత్రియులకు మారణాయుధంగానే విలువిద్యతో అవసరం కనుక ద్రోణుడు క్షత్రియ కూటమికి దగ్గరగా ఉన్నాడు. అది ఉభయులకూ లాభదాయకమైన సంబంధం. కనుక తన విద్యను అతను ఇంకొకరికి ఇచ్చే ప్రశ్న లేదు.

విలువిద్యతో ఏకలవ్యుడి అవసరం వేరు. అతనింకా అన్న సంపాదనకోసం విల్లమ్ములపై ఆధారపడే ఆటవిక దశలోనే ఉన్నాడు. అందుకు సరిపోయే విలువిద్య అతనికి అడవిలోనే లభిస్తుంది. ద్రోణుడి దాకా వెళ్ళనవసరమే లేదు. ఏకలవ్యుడు అడవికి కాబోయే రాజు కావచ్చు కానీ, అతనికి రాజ్య విస్తరణ దాహం ఉండే అవకాశం లేదు. శత్రుభయం ఉండే అవకాశమూ తక్కువే. ఒక వేళ ఉందనే అనుకున్నా; కురు-పాండవుల యుద్ధంలో మాదిరిగా భారీ సైనిక, ఆయుధసంపద, సంక్లిష్టమైన వ్యూహప్రతివ్యూహ చాతుర్యం అవసరంలేదు.

ఒక పోలిక చెప్పాలంటే, కత్తులు, కటార్లతో రెండు గుంపుల మధ్య జరిగే ఘర్షణకూ; శతఘ్నులు, ట్యాంకులు, యుద్ధవిమానాలతో రెండుదేశాల మధ్య జరిగే యుద్ధానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో; విలువిద్య అవసరంలో ఏకలవ్యుడికీ, అర్జునుడి లాంటి క్షత్రియుడికీ అంత తేడా ఉంటుంది.

అయినా సరే, ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? అంత విద్యను అతను ఏం చేసుకుంటాడు?! ఈ ప్రశ్నలను ఇంతవరకు ఎవరూ ముందుకు తెచ్చినట్టు లేదు.

తెగిన ఏకలవ్యుడి బొటనవేలు చెబుతున్న కథ కంటె, చెప్పకుండా దాచిన కథ వేరే ఉందా?! మనకు తెలియదు.

మరో అంశంతో వచ్చేవారం…

 

 

పెద్రో పారమొ-11

pedro1-1
కోమల లోయలోని పొలాల మీద వాన పడుతూంది. కుంభవృష్టి కురిసే ఈ ప్రాంతాల్లో అరుదుగా పడే పలచటి వాన. అది ఆదవారం. ఆపంగో నుండి ఇండియన్స్ వాళ్ళ సీమ చేమంతి జపమాలలతోటీ, మరువం, దవనం కట్టలతోటీ దిగబడ్డారు. కలప అంతా తడిగా ఉండడం చేత పైన్, వోక్ కట్టెలు లేకుండానే వచ్చారు.
వాన నిలకడగా పడుతూంది. చిన్న గుంటల్లో నిల్చిన నీటి మీద సొట్టలు పడుతున్నాయి.
నాగటి చాళ్ళనుండి నీరు కాలవలుగా మారి మొలకలెత్తుతున్న లేత మొక్కజొన్న వైపు పారుతున్నాయి. మగాళ్ళెవరూ సంతకి రాలేదు. వాళ్లంతా పొలాల్లో పారే నీటికి గండ్లు కొడుతూ దారి మళ్ళించి లేతపంటను ముంచెత్తకుండా చూస్తున్నారు. వాళ్ళు గుంపులుగా కదులుతూ ఆ వానలో వరదలెత్తిన పొలాల్లో దారి చేసుకుంటూ మెత్తబడ్డ మట్టిని పారలతో తెగకొడుతూ, మొలకలను చేతితో కదతొక్కుతూ అవి బలంగా పెరిగేందుకు దోహదం చేస్తున్నారు.
ఇండియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇది తమకు మంచిరోజు కాదు అనుకున్నారు. అందుకే వాళ్ళు తడిసిన గబానేల, చెత్త టోపీల కింద వణుకుతున్నారు. చలితో కాదు, భయంతో. వాళ్ళు సన్నగా పడుతున్న వాన వంకా, పైన ఇంకా నిండుగా కనిపిస్తున్న మబ్బులవంకా తేరిపార చూస్తున్నారు.
ఎవరూ రావడం లేదు. ఊరంతా నిర్మానుష్యంగా అగపడుతూంది. ఒకావిడ ఒక గుడ్డ పీలికా, పంచదార పొట్లం, ఉంటే జొన్నగంజి వార్చడానికి చిల్లుల గిన్నే కావాలని అడుగుతూంది. సమయం గడుస్తున్న కొద్దీ గబానేలు బరువెక్కుతున్నాయి తడికి. ఇండియన్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, చతుర్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. సీమ చేమంతి ఆకులు వాన తడికి మెరుస్తున్నాయి. “కాస్త కిత్తనార సారా తెచ్చి ఉంటే బాగుండేది కానీ కిత్తనార చెట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి,” అనుకుంటూ ఉన్నారు.జస్టినా డయజ్ గొడుగు వేసుకుని మెదియా లూనా నుండి తిన్నగా ఉన్న దారిలో వేగంగా పారుతున్న నీటి కాలవలను తప్పించుకుంటూ వస్తూంది. చర్చి ప్రధాన ద్వారం దాటుతూ గుండెల మీదుగా చేత్తో శిలువ గుర్తు వేసుకుంది. ఆర్చీల కింది నుంఛి ప్లాజా లోకి వచ్చింది. ఇండియన్స్ అంతా ఆమెను చూడ్డానికి అటువైపు తిరిగారు. అందరి కళ్ళూ తనమీదే ఉన్నట్టూ, అందరూ తనను గుచ్చి గుచ్చి చూస్తున్నట్టూ అనిపించిందామెకి. ఆకులూ అలములూ పరిచిపెట్టుకున్న చోట్లలో మొదటిదాని దగ్గర ఆమె ఆగింది. పది సెంటవోల దవనం కొనుక్కుని వెనుతిరిగింది. ఇండియన్స్ కళ్ళన్నీ ఇంకా ఆమె వెన్నంటే ఉన్నాయి.
“ఈ కాలంలో అన్నీ ప్రియంగానే ఉంటాయి,” అనుకుంది మెదియాలూనా వెళుతూ దారిలో. “ఈ కాస్త దవనం పది సెంటవోలు! వాసన చూడ్డానికి కూడా చాలదు.”
పొద్దుపోతుండగా ఇండియన్స్ వాళ్లు తెచ్చుకున్న దినుసులన్నీ ఎత్తేసుకున్నారు. బరువుగా ఉన్న మూటల్ని భుజాన వేసుకుని వానలో నడిచారు. చర్చి దగ్గర ఆగి కన్య మేరీని ప్రార్థించి, ఒక మరువం కట్ట నైవేద్యంగా పెట్టారు. అపాంగో వైపు తమ ఇంటి దారి పట్టారు. “ఇంకో రోజు,” అనుకున్నారు. చతుర్లాడుకుంటూ నవ్వుతూ దారి వెంట నడిచారు.
జస్టినా డయజ్ సుజానా శాన్ హువాన్ గదిలోకి వెళ్ళి దవనాన్ని చిన్న అలమరలో పెట్టింది. పరదాలు కిటికీని పూర్తిగా మూసేయడంతో చీకట్లో ఆమెకు నీడలు మాత్రమే కనిపించాయి. కనపడని వాటిని ఉరామరిగా ఊహిస్తూంది. సుజానా శాన్ హువాన్ నిద్రపోతున్నట్లుంది అనుకుంది. ఆమె ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటే బాగుండుననుకునేది. ఇప్పుడు నిద్ర పోతుంది కనక జస్టినాకి తృప్తిగా ఉంది. కానీ ఆమెకి ఆ చీకటి గదిలో ఒక దూరపు మూలనుంచి నిట్టూర్పు వినవచ్చింది.
“జస్టినా!” ఎవరో పిలిచారు.
ఆమె చుట్టూ తిరిగి చూసింది. ఎవరూ కనపడలేదు కానీ భుజమ్మీద చేయీ, చెవి దగ్గర ఊపిరీ తగిలాయి. ఒక గొంతు రహస్యం చెపుతున్నట్టు అంది “వెళ్ళి పో జస్టినా, నీ సామానంతా సర్దుకుని పో. ఇక నువ్వు మాకక్కర లేదు.”
“ఆమెకి నా అవసరం ఉంది,” నిటారుగా నిలబడుతూ అంది. “ఆమెకి జబ్బు చేసింది. ఆమెకి నా అవసరం ఉంది.”
“ఇకపై అవసరం లేదు జస్టినా! నేనిక్కడే ఉండి ఆమెను చూసుకుంటాను.”
“నువ్వేనా బార్ట్లోం?” అడిగింది కానీ జవాబుకోసం ఆగలేదు. పొలాలనుంచి తిరిగి వచ్చే ఆడా మగా చెవుల పడేట్టు ఒక్క అరుపు అరిచింది. అది విన్న వాళ్ళు “ఇదేదో అరుపులా ఉంది కానీ మనిషి అరుపులా మాత్రం లేదు,” అనుకున్నారు.
వానకి చప్పుళ్ళనీ సన్నగిల్లుతున్నాయి. మిగతా సందడంతా సన్నగిల్లినప్పడు అది చల్లటి చినుకుల్ని విసిరికొడుతూ, జీవన సూత్రాన్ని నేయడం వినిపిస్తూంది.
“ఏమయింది జస్టినా? ఎందుకంతగా అరిచావు?” సుజాన శాన్ హువాన్ అడిగింది.
“నేనేం అరవలేదు సుజానా! నువు కలగన్నట్టున్నావు.”
“నాకు కలలు రావని చెప్పానుగా! నీకేం పట్టదు. ఒక రవ్వ కన్ను మూతపడింది. పిల్లిని రాత్రి బయట వదిలివేయలేదు. అది నన్ను రాత్రంతా నిద్ర పోనివ్వలేదు.”
“అది నాతో పడుకుంది, నా కాళ్ల మధ్య. అది తడిస్తే చూడలేక నా మంచం మీదే ఉండనిచ్చాను. కానీ అది గొడవేం చేయలేదు.”
“లేదు, గొడవేం చేయలేదు! రాత్రంతా సర్కస్ పిల్లి లాగా నా కాళ్ల నుంచి తలమీదికి దూకుతూ ఉంది ఆకలేసినట్టు మెల్లగా మ్యావ్ మ్యావ్ అంటూ.”
“దానికి తిండి బాగానే పెట్టాను. అది రాత్రంతా నా పక్క వదల్లేదు. మళ్ళీ ఏవో అబద్ధాల కలలు కంటున్నావు సుజానా!”
“అది రాత్రంతా దూకుతూ నన్ను జడిపిస్తూనే ఉందని చెపుతుంటే వినవేం? నీ పిల్లంటే నీకు ముద్దేమో కానీ నేను పడుకున్నప్పుడు నా దగ్గరికి రానీయకు.”
“ఊరికే ఊహించుకుంటున్నావు సుజానా. అంతే. పేద్రో పారమొ వచ్చాక ఇక నీతో నా వల్ల కాదని చెప్పేస్తా. వెళ్ళిపోతానని చెప్తా. పనికి పెట్టుకునే మంచి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అందరూ నీలా తిక్కగా ఉండరు, ఇట్లా ఏడిపించి నవ్వుకోరు. రేపు నేను వెళ్ళిపోతాను. నా పిల్లిని తీసుకుని పోతా, నువ్వు సుఖంగా ఉండు.”
“నువ్వు పోవు పాపిష్ఠి జస్టినా! నువ్వెక్కడికీ పోలేవు. నీకు నాలా ప్రేమించేవారు ఎక్కడా దొరకరు.”
“అవును, నేను పోను సుజానా. నేను పోను. నిన్ను చూసుకుంటానని నీకు తెలుసు. నేను ఏం చేయనని నువు తిట్టినా నేనెప్పుడూ నిన్ను చూసుకుంటాను.”
సుజానా పుట్టిన రోజునుంచీ ఆమే సాకింది. ఆమెను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు నడవడం నేర్పింది. ఎప్పటికీ గుర్తుండి పోయే ఆ మొదటి అడుగు వేయడం. ఆమె పెదవులూ, కళ్ళూ పంచదార చిలకల్లా తీపెక్కడం చూసింది. “పీచు మిటాయి బులుగు, పసుపూ బులుగూ, పచ్చా బులుగూ, అదీ ఇదీ కలుపు,” బొద్దుగా ఉన్న ఆమె కాళ్ళను మునిపళ్లతో కొరికేది. పాలు రాని రొమ్ముని బొమ్మలా ఆమెకందించి ఆనందపరిచేది. “ఆడుకో దీనితో,” సుజానాతో చెప్పేది. “నీ చిన్న బొమ్మతో నువ్వాడుకో,” ఆమె ముక్కలవుతుందా అనేట్టు వాటేసుకునేది.
బయట అరటి ఆకులమీద వాన పడుతూంది. నీరు కింద మడుగుల్లో పడి మరుగుతున్న చప్పుడు వస్తూంది.
పక్క దుప్పట్లు చల్లగా, చెమ్మగా ఉన్నాయి. పగలూ రేయీ, పగలూ రేయీ పనిచేసి అలసిపోయినట్టు తూముల్లో జల జలమంటూ నురగలు తేలుతున్నాయి. ప్రళయ కాల ధ్వనులతో వాన కుంభవృష్టిగా పడుతూనే ఉంది కాలవలు కడుతూ.

అర్ధరాత్రయింది. బయట వాన చప్పుడు అన్ని శబ్దాలనూ మింగేస్తూంది.
సుజానా శాన్ హువాన్ పెందలకడనే నిద్ర లేచింది. నెమ్మదిగా లేచి కూచుని మంచం దిగింది. మళ్ళీ ఆమెకు కాళ్ళు బరువెక్కినట్టనిపించింది. ఒళ్ళంతా కూడా బరువుగా ఉన్నట్టూ, అది తలకెక్కుతున్నట్టూ అనిపించింది.
“ఎవరది? నువ్వేనా బార్ట్లోం?”
ఎవరో వస్తున్నట్టో, పోతున్నట్టో తలుపు కిర్రుమనడం విన్నాననుకుంది. మళ్ళీ చల్లటి వాన, ఆగాగి ఆరటి మొక్క్ల మీదినుంచి జారిపడుతూ, దాని పొంగులోనే మరుగుతూ.
ఆమె మళ్ళీ పడుకుని పొద్దున ఎండ చెమ్మనీటితో పూసలు కట్టిన ఎర్రటి ఇటుకల మీదపడిందాకా లేవలేదు.
“జస్టినా!” ఆమె పిలిచింది.
భుజాల మీద శాలువా కప్పుకుంటూ ఆమె ప్రత్యక్షమయింది తలుపు పక్కనే ఉన్నట్టు.
“ఏం కావాలి సుజానా!”
“పిల్లి. పిల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చింది.”
“అయ్యో నా సుజానా!”
సుజానా రొమ్ముల మీద తల ఆనించి కౌగిలించుకుంది. సుజానా తలపైకెత్తి అడిగింది “ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు నన్నెంత బాగా చూసుకుంటున్నావో పేద్రో పారమొకి చెప్తాను. నీ పిల్లి నన్నెట్లా జడిపిస్తుందో అతనికి చెప్పనులే! ఏడవకు జస్టినా!”
“మీ నాన్న చనిపోయాడమ్మా! మొన్న రాత్రే చనిపోయాడు. మనం చేయవలసింది ఏమీ లేదని ఇవాళే వచ్చి చెప్పారు. అక్కడే పూడ్చేశారట. ఇక్కడి దాకా తీసుకురావడం దూరాభారమని. నువ్వొంటరిదానవయ్యావమ్మా, సుజానా!”
“అయితే అది నాన్న అన్నమాట.” సుజానా నవ్వింది. “నాకు సెలవని చెప్పటానికి వచ్చాడు,” ఆమె మళ్ళీ నవ్వింది.
చాలా ఏళ్ళ క్రితం ఆమె చిన్న పాపగా ఉన్నప్పుడు అతను ఒకరోజు ఆమెతో అన్నాడు “కిందికి దిగు సుజానా! వచ్చి నీకేం కనిపించిందో చెప్పు!”
ఆమె నడుముకు కట్టుకున్న తాడు నొక్కుకుపోతున్నా వేలాడుతూంది. చేతులు దూసుకుపోతున్నా వదిలి పెట్టడం లేదు. బయటి ప్రపంచాన్నీ ఆమెనీ కలిపి ఉంచే బంధం ఒక్క ఆ తాడే.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“సరిగా చూడు సుజానా! ఏమన్నా కనిపిస్తుందేమో చూడు,” లాంతరు వెలుగు ఆమె మీద పడేట్టు చేశాడు.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“ఇంకొంచెం కిందికి దింపుతాను. నేల తగలగానే చెప్పు.”
ఏవో చెక్కల మధ్య సన్నటి సందు నుండి లోపలికి పోయింది. బంకమట్టితో కప్పబడి, పుచ్చి పాడయిన చెక్కల మీద నడిచింది.
“నెమ్మదిగా పో సుజానా. నీకు నేను చెప్పింది కనిపిస్తుంది.”
ఆమె చీకట్లో అటూ ఇటూ ఊగుతూ, దేనికో కొట్టుకుంటూ కిందికి, ఇంకా కిందకి వెళ్ళింది కాళ్ళు గాల్లో తేలుతుంటే.
“కిందికి సుజానా. ఇంకొంచెం కిందికి. ఏమన్నా కనిపిస్తుందేమో చూసి చెప్పు.”
కాళ్ల కింద నేల తగిలినప్పుడు ఆమె భయంతో అక్కడే నిలబడిపోయింది. దీపపు కాంతి ఆమె మీదే తిరిగి ఆమె పక్కనే కేంద్రీకృతం అయింది. పైనుంచి అరుపు విని వణికింది.
“అది నాకివ్వు సుజానా!”
ఆ పుర్రెను చేతుల్లోకి తీసుకుంది కానీ వెలుతురు పూర్తిగా దాని మీద పడేసరికి వదిలేసింది.
“ఇది చచ్చిపోయన వాడి పుర్రె,” అంది.
“దాని పక్కనే ఇంకేదో ఉంటుంది చూడు. ఏం కనిపించినా నాకివ్వు.”
అస్తిపంజరం ఎముకలుగా విడివడి ఉంది. దవడ ఎముక పంచదారలాగా పక్కకి పడిపోయింది. బొటనవేలు దాకా ఒక్కో ముక్కా కీలు తర్వాత కీలుగా అతనికి అందించింది. అన్నిటి కంటే ముందు ఆమె చేతుల్లోనే పొడయిన గుండ్రటి పుర్రె.
“బాగా చూడు సుజానా! డబ్బు కోసం. గుండ్రటి బంగారు నాణేలు. అంతా చూడు సుజానా!”
తరవాత ఆమెకి ఏమీ గుర్తు లేదు కొన్ని రోజుల తర్వాత మంచుగడ్డలోకి అడుగుపెట్టిందాకా. ఆమె తండ్రి చూపుల్లోని మంచుగడ్డ.
అందుకే ఆమె నవ్వుతూందిప్పుడు.
“అది నువ్వేనని నాకు తెలుసు బార్ట్లోం!”
ఆమె రొమ్ముల మీద తలపెట్టి ఏడుస్తున్న జస్టినా పైకి లేచి చూసింది ఆమె ఎందుకు నవ్వుతుందా అనీ, ఆ నవ్వు అట్టహాసంగా ఎందుకు మారిందా అనీ.
బయట ఇంకా వాన పడుతూంది. ఇండియన్స్ వెళ్ళిపోయారు. అది సోమవారం. కోమల లోయ వానలో మునుగుతూ ఉంది.

రోజు తర్వాత రోజు గాలులు విసిరి కొడుతున్నాయి. వానలు తీసుకు వచ్చిన గాలులు. వాన పోయినా గాలి ఉండిపోయింది. పొలాల్లో లేత ఆకులు ఇప్పుడు ఎండిపోయి చాళ్ళలో పరిచినట్టు పడి ఉన్నాయి గాలికి ఎగిరిపోకుండా. పగటిపూట గాలులు ఐవీ తీగలను కదిలిస్తూ, కప్పుపై పెంకుల్ని దడదడమనిపిస్తూ కొంత భరించగలిగేలా ఉన్నా రాత్రయ్యేప్పటికి ఆగకుండా ఒకటే రొద పెడుతూన్నాయి. ఆకాశంలో పందిరిలా కమ్ముకున్న మబ్బులు నిశ్శబ్దంగా కదిలిపోతున్నాయి నేలను రాసుకుపోయేంత కిందగా.
సుజానా శాన్ హువాన్ మూసి ఉన్న కిటికీని గాలి విసిరి కొట్టడం వింటూంది. చేతులు తలకింద పట్టుకుని ఆలోచిస్తూ పడుకుని రాత్రి చప్పుళ్ళు వింది. గాలి అసహనంగా ఉండుండి రాత్రిని వేధిస్తూంది. అకస్మాత్తుగా ఆగిపోతుంది.
ఎవరో తలుపు తెరిచారు. గాలి విసురుకి దీపం ఆరిపోయింది. ఆమె చీకటినే చూస్తూంది ఆలోచించడం ఆపేసి. మరుక్షణం అడ్డదిడ్డంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వినపడింది. మూసిన కనురెప్పలమీద దీపపు కాంతి పడడం తెలుస్తూంది.
ఆమె కళ్ళు తెరవలేదు. వెంట్రుకలు మొహం మీద చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఆమె పై పెదవి మీద చెమట చుక్కల్ని దీపం వేడెక్కిస్తూంది.
ఆమె అడిగింది “నువ్వేనా ఫాదర్!”
“అవునమ్మా, నేను నీ తండ్రిని.”
సగం తెరిచిన కళ్ళతో చూసింది. పైకప్పు మీద నీడలాంటి ఆకారం ఆమె మొహం మీద పడుతున్నట్టూ, దాన్ని ఆమె జుట్టు మూసేస్తున్నట్టూ ఉంది. దాని తల ఆమె మొహం మీదికి వచ్చినట్టుంది. కనురెప్పల వెంట్రుకల్లోంచి బూజరగా ఉన్న ఒక ఆకారం రూపుదాల్చింది. దాని గుండె స్థానంలో ఒక దీపం వెలుగుతూంది. చిన్న గుండె దీపంలా రెపరెపమంటూ కొట్టుకుంటూంది. “నీగుండె నొప్పితో చనిపోతూ ఉంది,” ఆమె అనుకుంది. “నాకు తెలుసు నువ్వు ఫ్లోరెన్సియో చనిపోయాడని చెప్పడానికి వచ్చావని. కానీ నాకు ఆ విషయం ముందే తెలుసు. ఇక దేని గురించీ విచారించకు. నాగురించి ఆందోళన పడకు. నా దిగులు భద్రంగా దాచి ఉంచాను. నీ గుండె జారిపోనీకు.”
మంచం దిగి ఫాదర్ రెంటెరియా వైపుకు ఈడ్చుకుంటూ వచ్చింది.
“నన్ను ఓదార్చనీ.” అన్నాడు కొవ్వొత్తి వెలుగుని తన చేతితో కాపాడుతూ. “నా తీరని దుఖం తో నిన్ను ఓదార్చనీ!”
ఆమె అతని వద్దకు వచ్చి కొవ్వొత్తి జ్వాల చుట్టూ తన చేతుల్ని అడ్డుపెట్టి, దానివైపు తన ముఖం వంచడం ఫాదర్ రెంటెరియా చూస్తూ ఉండిపోయాడు. కాలుతున్న మాంసం వాసన రావడం తో కొవ్వొత్తిని ఒక్క ఊపున పక్కకి లాగి ఆర్పేశాడు.
చీకట్లో సుజానా మళ్ళీ పరుగెత్తింది తన దుప్పటి కింద దాక్కోవడానికి.
“నిన్ను ఓదార్చడానికి వచ్చానమ్మా!”
“అయితే నువ్వెళ్ళవచ్చు ఫాదర్!” ఆమె చెప్పింది. “మళ్ళీ రావద్దు. నాకు నీ అవసరం లేదు.”
వెనుతిరిగిపోతున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఎప్పటిలా చలినీ, భయాన్నీ కలగజేస్తూ.
“చచ్చిపోయినవాడివి, నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు?’
ఫాథర్ రెంటెరియా తలుపు మూసి రాత్రి గాలిలోకి అడుగు పెట్టాడు.
గాలి వీస్తూనే ఉంది.

టర్తముడో అని అందరూ పిలిచే అతను మెదియా లూనా వచ్చి పేద్రో పారమొ గురించి అడిగాడు.
“అతన్నెందుకు కలవాలనుకుంటున్నావు?”
“మ..మాట్లాడదామని..”
“ఇక్కడ లేడు.”
“వ..వచ్చాక చెప్పు ఆయనకి. డ..డాన్ ఫుల్గోర్ గురించి.”
“నేను వెళ్ళి చూస్తాను. కాసేపు ఆగాల్సి ఉంటుంది.”
“అ..అర్జెంటని చెప్పు.”
“చెప్తాలే!”
టర్తముడో గుర్రం దిగకుండానే ఎదురుచూశాడు. కొద్దిసేపయ్యాక అతనెప్పుడూ చూడని పేద్రో పారమొ వచ్చి అడిగాడు “ఏం పని నీకు?”
“నే.నేను అయ్యతోటే మాట్లాడాలి.”
“నేనే అయ్యను. నీకేం కావాలి?”
“ఏ..ఏమిటంటే డాన్ ఫుల్గోర్ సెడానో ని చ..చంపేశారు. నె..నేను అతనితోనే ఉన్నాను. ని..నీళ్ళు రావడం లేదేమిటా అని చు..చూడ్డానికి కాలవ పైకి వెళ్ళాము. వె..వెళుతుంటే కొంతమంది గుర్రాల మీద మాకెదురుగా వచ్చారు. వ..వాళ్లల్లో ఒకడు ‘వాడు నాకు తెలుసు, మె..మెదియా లూనాలో మేస్త్రీ’ అని అరిచాడు. వ..వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. డ..డాన్ ఫుల్గోర్ ని గుర్రం ది..దిగమని చెప్పారు. వ..వాళ్ళు తిరుగుబాటుదారులమని చెప్పుకున్నారు. వ..వాళ్లకి మీ భూములు కావాలంట. ‘పొ..పో!’ అని డాన్ ఫుల్గోర్ని అన్నారు ‘పో, పోయి మీ అయ్యగారితో చెప్పు మె..మేం వస్తున్నామని.’ బ్..భయపడిపోయి బయలుదేరాడు. ల..లావు కదా, మరీ వేగంగా కాదు కానీ పరుగెత్తాడు. అ..అతను పరుగెడుతుంటే వాళ్ళు కాల్చారు. ఒ..ఒక కాలు గాల్లో, ఒక కాలు నేలమీద ఉండగానే చ..చచ్చిపోయాడు.
“నె..నేను ఒక్క అడుగు కూడా క..కదల్లేదు. ర..రాత్రంతా అక్కడే ఉండి ఏం జరిగిందో చె..చెప్పడానికి వచ్చాను.”
“మరి ఇంకా దేనికోసం ఆగావు? నీ దారిన పో. వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వచ్చి కలవాలన్నా ఇక్కడే ఉంటానని వాళ్ళకు చెప్పు. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. ముందు కొసగ్రేషన్ రాంచ్ మీదుగా వెళ్ళు. నీకు టిల్కేట్ తెలుసా? అక్కడ అతనుంటాడు. అతన్నొచ్చి నన్ను కలవమని చెప్పు. తర్వాత వాళ్ళకు చెప్పు ఎంత తొందరగా వస్తారా అని ఎదురు చూస్తున్నానని. ఏ రకం తిరుగిబాటుదారులు వాళ్ళు?”
“న..నాకు తెలియదు. ఆ పేరే చెప్పుకున్నారు.”
“ఆ టిల్కేట్ ని ఇక్కడ ఉన్నట్టు రమ్మను.”
“ఆ..అట్లాగే అయ్యా!”
పేద్రో పారమొ తన ఆఫీసు గది తలుపులు మూశాడు. తను ముసలివాడయినట్టూ, అలసిపోయినట్టూ అనిపించిందతనికి. ఫుల్గోర్ గురించి ఎక్కువ దిగులుపడలేదు. “అతనీ లోకం కంటే పై లోకానికే చెందినవాడు.” ఫుల్గోర్ చేయగలిగిందల్లా చేశాడు. ఇంకెవరికంటేనూ ఎక్కువగా కాకపోయినా ఉపయోగపడ్డాడు. “కానీ ఆ దొంగలంజకొడుకులకి కొండచిలువలాంటి టిల్కేట్ వంటి వాళ్ళు ఎదురుపడి ఉండరు,” అనుకున్నాడు.
అతని ఆలోచనలు ఎప్పుడూ తన గదిలో నిద్రపోతూనో, నిద్ర నటిస్తూనో ఉండే సుజానా శాన్ హువాన్ వైపు మళ్ళాయి. అతను ముందు రాత్రంతా అమె గదిలో గోడ కానుకుని నిలుచుని పల్చటి కొవ్వొత్తి కాంతిలో ఆమెనే గమనిస్తూ గడిపాడు. చెమటతో తడిసిన మొహం, దుప్పటిని అటూ ఇటూ కదిలిస్తూ, దిండు పీలికలయ్యేట్టు పీకుతూన్న చేతులూ.
ఆమెను తనతో కాపురానికి తీసుకువచ్చినప్పటినుంచీ ప్రతి రాత్రీ అంతే. రాత్రంతా ఆమె అంతు లేని కలతతో బాధపడుతూ ఉండడం చూస్తూ గడపడమే. ఇట్లా ఎన్నాళ్ళు సాగుతుందని తనను తనే ప్రశ్నించుకున్నాడు.
చాలా రోజులు ఇట్లా ఉండదని ఆశించాడు. ఏదీ ఎల్లకాలమూ ఉండబోదు. ఏ జ్ఞాపకమూ ఎంత గాఢమైనదయినా మాసిపోకుండా ఉండదు.
ఆమెను అంతగా లోలోపల చీలుస్తూ వేధించేదేమిటో, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లేట్టు చేస్తున్నదేమిటో తనకు తెలిస్తే బాగుండును.
ఆమె తనకు తెలుసుననుకున్నాడు. తెలియదని తెలిసినప్పటికీ, తను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తి అని తెలియడం చాలదా? ఇంకా – ఇది అన్నిటికంటే ముఖ్యమైనది – ఆమె వలన మిగతా జ్ఞాపకాలన్నీ చెరిపేసుకుని వెలిగే రూపుతో ఈ భూమిని వదిలిపోతాడు.
కానీ సుజానా శాన్ హువాన్ ఏ లోకంలో బతుకుతూంది? పేద్రో పారమొకి ఎప్పటికీ తెలియని విషయాల్లో అది ఒకటి.

“వెచ్చటి ఇసుక వొంటికి తగులుతూ హాయిగా ఉంది. నా కళ్ళు మూతపడీ, చేతులు బార్లా సాచీ, కాళ్ళు ఎడంగా సముద్రపుగాలికి తెరుచుకునీ ఉన్నాయి. నా ముందు దిగంతాలదాకా వ్యాపించిన సముద్రముంది కెరటాలతో నా పాదాలని కడిగి వాటిపై నురగలు వదులుతూ..”
“ఇప్పుడు మాట్లాడుతూంది ఆమే, హువాన్ ప్రెసియాడో. ఆమె ఏమంటూ ఉందో నాకు చెప్పడం మర్చిపోకు.”
“.. అది పొద్దున్నే. సముద్రం లేస్తూ పడుతూ ఉంది. దాని నురగ నుండి జారుకుని పచ్చటి నిశ్శబ్ద కెరటాలుగా పరుగెడుతూంది.
“’నేనెప్పుడూ నగ్నంగానే సముద్రంలో ఈదుతాను,’ అని అతనితో చెప్పాను. అతను కూడా ఆ మొదటి రోజు నాతో పాటు నగ్నంగానే దిగాడు. వెనక్కి తిరిగి నడిచి వస్తూ మెరుస్తూన్నాడు. సముద్రపు కాకులెక్కడా కనపడలేదు. ‘కత్తి ముక్కు ‘ పిట్టలని అందరూ పిలిచే పిట్టలు మాత్రం గురక పెడుతున్నట్టు గుర్రుగుర్రు మంటున్నాయి. అవి కూడా పొద్దెక్కేపాటికి మాయమయ్యాయి. నేను తోడు ఉన్నప్పటికీ అతనికి వొంటరిగా ఉన్నట్టనిపించింది.
“’నువు ఆ పిట్టల్లో ఒకదానివయితే ఎంతో అంతే,’ రాత్రి అతను అన్నాడు. ‘రాత్రి పూట మనమిద్దరమూ ఒక దుప్పటికింద ఒకే దిండు వేసుకుని పడుకున్నప్పుడే నిన్ను బాగా ఇష్టపడతాను.’
“అతను వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడూ తిరిగి వెళుతుండేదాన్ని. సముద్రం నా చీలమండల్ని కడిగి వెనక్కి పోతుంది, నా మోకాళ్ళను కడుగుతుంది, నా తొడలను కూడా. తన మెత్తటి చేయిని నా నడుం చుట్టూ వేసి, నా రొమ్ముల చుట్టూ తిరిగి, నా గొంతును పెనవేసుకుని, భుజాల్ని అదుముతుంది. నేను అప్పుడు దాంట్లోకి మునిగి పోయాను, నా పూర్తి శరీరంతో. దాని తాడన బలానికి నన్ను నేను అర్పించుకుని, ఏమీ దాచుకోకుండా దాని హస్తగతమౌతాను.”
“’నాకు సముద్రంలో ఈదడం ఇష్టం,’ అతనికి చెప్పాను.
“కానీ అతనికి అర్థం కాలేదు.
“ఆ మరుసటి రోజు నేను మళ్ళీ సముద్రంలో ఉన్నాను నన్ను నేను శుద్ధి చేసుకుంటూ. నన్ను ఆ కెరటాలకు అర్పించుకుంటూ.”

నీలిపూల రహస్యం

MythiliScaled

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి జంతువుల చర్మాలతో దుస్తులు కుట్టేది. అవి అందంగానూ మెత్తగానూ ఉండేవి. అమ్మాయి చిన్నపాపగా ఉన్నప్పుడు పొద్దున్నే పాలుపట్టి వాళ్ళ అమ్మ చెట్టుకొమ్మకి వేసిన ఉయ్యాలలో వెచ్చగా కప్పి పడుకోబెట్టేది. పాప నిద్రపోయేది. లేచేసరికి ఉయ్యాల చుట్టూ చిట్టి చిట్టి ఉడతలు మూగి ఆడుతూ ఉండేవి. ఆకుల్లో పాకే సాలీళ్ళని పాప ఆసక్తిగా గమనించేది.అవి పట్టుదారాలు అల్లి గూళ్ళు కట్టుకోవటం ఎంత సేపు చూసినా బావుండేది. వాళ్ళ నాన్న నిపుణుడైన వేటగాడు. అవసరం కొద్దీ  వేటాడే నేర్పుతోబాటు పట్టుబడిన మూగజీవులని దయగా కాపాడటం కూడా అతను పిల్లలకి అలవరచాడు. అలా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పులిపిల్లలూ తోడేలు పిల్లలూ అడవి పిల్లిపిల్లలూ పెరుగుతుండేవి. వాటి పోషణ అంతా పాప పెద్దదయాక తనే చూసేది, వాటితో ఆడుకునేది. అవి  క్రూరజంతువులు కనుక ఎదిగేకొద్దీ చెల్లెలికి ఏమైనా హాని చేస్తాయేమోనని అన్నలు ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అయితే ఆమె కి ఆ భయమే లేకపోయేది- అవీ ఎంతో స్నేహంగా మసలుకునేవి, ఆమె కళ్ళెర్రజేస్తే భయపడిపోయేవి కూడా.

చక్కటి  ముఖం, దృఢమైన శరీరం- వీటికితోడు తల్లి తయారు చేసే సొగసైన గౌన్ లు- ఆమె ఒక రాజకుమారిలాగా కనిపించేది. వేసవికి తేలికగా రంగు రంగుల ఈకలతో ఆ దుస్తులు ఉండేవి. జుట్టులో సువాసన వేసే  అడవిపూలు  పెట్టుకునేది. చలికాలానికి కోట్ లూ, టోపీలూ చేతితొడుగులూ – ఇవన్నీ తెల్లని చర్మాలతోనే తల్లి కుట్టేది. మెరిసే నల్లని కళ్ళూ గులాబిరంగు బుగ్గలూ తప్పించి ఆమె మంచులోం చే  పుట్టినట్లు ఉండేది. ఉత్తరపుదిక్కున ఉల్ రుం భూమిలో ఉండే  మంచు దేవుడి కూతురే అలా వచ్చిందని అనుకునేవారు. ఆమె పేరు డ్రి-ఫా [ అంటే మంచులాగా తెల్లనిది అని ].

1aba3658d6313642da4d32068e1a43a1

ఆ ప్రాంతాలలో ఎవరికీ లేని అందం, సంపద ఉన్నా ఎందుకో ఆమెకి తృప్తిగా ఉండేది కాదు. చాలా మంది యువకులు పెళ్ళి చేసుకుంటామని అడిగినా ఎవరినీ ఒప్పుకోలేదు. కొంతమంది తాము వేటాడి సంపాదించిన ఉన్ని చర్మాలను, చాలా మేలైనవాటిని – బహుమతిగా ఇవ్వబోయేవారు. ఇంకొందరు తమ బలాన్నీ చాకచక్యాన్నీ ప్రదర్శించేవారు. ఫెయిరీ ల తో స్నేహం చే సీ , కబౌటర్ [ డచ్ దేశం లో పొట్టిపిశాచాల వంటివి ] లను మెప్పించీ తెచ్చిన వజ్రాలనూ  విలువగల లోహాలనూ ,మరికొందరు,  డ్రి-ఫా ప్రేమను పొందేందుకు చూపించేవారు. దూరసముద్రతీరాల లో దొరికిన సాంబ్రాణినీ రత్నాలనూ తీసుకొచ్చిన వారూ ఉన్నారు. ఒకరైతే ఏకంగా పెద్ద ముత్యాలహారాన్నే కానుక చేయబోయారు. ఆ శీతల అరణ్యాలలో ముత్యాలు చూడటమే ఒక అద్భుతం. కాని ఏదీ డ్రి-ఫా ని సంతోషపెట్టనేలేదు. వచ్చినవారంతా అదే దారిని తిరిగి వెళ్ళిపోయేవారు.

 

అందరి కంటే చివరన సాలీడులాగా కనిపించే వింతమనిషి వచ్చాడు. తన పేరు స్పిన్ హెడ్ అని చెప్పాడు. మణిమాణిక్యాలకన్న, బంగారం కన్న, ఉన్ని కన్న విలువైన రహస్యం తనదగ్గర ఉందని చెప్పాడు. డ్రి-ఫా తల్లికి అతన్ని చూస్తే చిరాకు వేసి పంపించేసింది.

 

కొన్నేళ్ళు గడిచాయి. ఇక డ్రి- ఫా కి పెళ్ళి కాదేమోనని తల్లిదండ్రులు దిగులుపడేవారు. ఒకరోజు ఆమె అడవిలో తను చిన్నప్పుడు ఉయ్యాల ఊగిన ఓక్ చెట్టుకింద పచార్లు చేస్తోంది . అప్పటికి వాళ్ళ ఇల్లు అక్కడికి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు.

చెట్టుకొమ్మలలోంచి ఒక సాలీడు వచ్చి  పక్కనే కూర్చుంది. అది మాట్లాడింది కూడా.

ఇలా –   ‘’ డ్రి-ఫా ! నిన్ను ప్రేమిస్తున్నాను , ఆ సంగతే చెప్పేందుకు వచ్చాను. నువ్వేమీ ఇప్పుడే నన్ను పెళ్ళాడనక్కర్లేదు. నీ గది లో నన్నొక గూడు అల్లుకోనీ. అక్కడే నీ కనుచూపుమేరలో ఉంటాను. నీకు చాలా మంచి జరుగుతుంది, కాదనకు ” ఆశ్చర్యపోయి, తనకొక గది ఎక్కడుందా అని ఆలోచిస్తూ, డ్రి- ఫా సరేనంది.

వెంటనే పెద్ద గాలిదుమారం వచ్చి ఓక్ చెట్టు కూలిపోయింది. అక్కడ పెద్ద భవంతి వెలిసింది. పక్కనే విశాలమైన తోట. డ్రి-ఫా అందులో అడుగు పెడుతూనే  ఆమె పాదాల దగ్గర ఒక నీలి పూల చెట్టు మొలిచింది. సాలీడు అంది ” ఈ ఇంట్లో నీకు బాగా నచ్చిన గదిని ఎంచుకో. నూరు రోజులపాటు  నన్ను బాగా చూసుకుంటే ఈ నీలిపూవు రహస్యం నీకు చెబుతాను ”

బాగా సూర్యకాంతి పడే గదిని డ్రి-ఫా ఎంచుకుంది. ఆ గది కిటికీ పైనుంచి కప్పు వరకూ సాలీడుకి కేటాయించింది.

వెంటనే అది తళతళమనే దారాల అల్లిక మొదలుపెట్టింది. చీకటిపడేదాకా దాకా అల్లుతూనే ఉంది. డ్రి-ఫా తనకి కూడా ఆ నాజూకైన అల్లిక చేతనయితే బావుండుననుకుంది. ఏదో రహస్యం అంది కదా సాలీడు, అది దీనికి సంబధించినదేమోననే అనుమానమూ ఆమెకి వచ్చింది. రాత్రయింది. ఇంటికి వెళ్ళటం కష్టం. కాని అక్కడే తన గదిలో నిద్రపోయేందుకు పరుపులూ దుప్పట్లూ  ఏమీ లేవు.

Bronx_Zoo_Spider_Web

” నీకు మంచి పక్క వేస్తాను చూడు ” అంది సాలీడు. ఆ గొంతు ఒక యువకుడిది లాగా ఉంది ఇప్పుడు. డ్రి-ఫా విస్తుపోయిందికానీ ఏమీ అనలేదు. చూస్తుండగానే అతి మెత్తటి, వెచ్చటి పక్క దానంట అదే వచ్చింది. ఇంట్లో కంటే కూడా సుఖంగా , సౌకర్యంగా  ఆమె నిద్రపోయింది.

ఆమెకొక కల వచ్చింది. అప్పటివరకూ ఎవరూ చూసిఉండని తెల్లని వింత  వస్త్రాన్ని ధరించి ఉంది ఆ కలలో. జంతువు చర్మం లాగా దట్టంగా లేదు అది, చాలా పల్చగా, తేలికగా ఉంది . పొద్దుటి వెలుతురులో పచ్చిక మీద సాలెగూడు మెరిసినట్లు మెరుస్తోంది, గడ్డిపరకల మీది మంచుబిందువులలాగా కూడా.

 

నూరు రోజులు గడిచాయి. డ్రి-ఫా ఆ ఇంట్లో ఉదయం నుంచి రాత్రివరకూ ఉండేది. . ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. సాలీడు దారాలు అల్లుతూనే ఉండేది. డ్రి-ఫా ఆ రహస్యం ఎప్పుడు తెలుస్తుందా అని ఎదురు చూసేది. ఏమైనా సరే, తొందరపడి అడిగేయకూడదని , సాలీడు చెప్పెదాకా ఆగాలని ఆమె నిశ్చయించుకుంది.

 

నూరు రోజులు పూర్తవబోతున్నాయి. శిశిరఋతువు వచ్చింది. డ్రి-ఫా తోటలో తిరుగుతోంది. చలిగాలులు వీస్తున్నాయి, పండిపోయిన ఆకులు రాలుతున్నాయి. ఆ నీలిపూవు కూడా ఎప్పుడో రాలిపోయింది. నల్లటి గట్టి కాడ మాత్రమే మిగిలింది. ” ఏముంటుంది ఇక  ఇందులో అద్భుతం ?” అనిపించింది డ్రి-ఫా కి. ఉన్నట్లుండి చాలా బెంగ వచ్చింది . ఉన్నట్లుండి హోరుమని ఈదురుగా లి – అన్ని ఆకులూ రాలి నేలని పసుపచ్చగా కప్పేశాయి. కొన్ని చెట్లు కూడా పడిపోయాయి. అంతలోనే అంతా నిశ్శబ్దంగా అయింది. డ్రి- ఫా పక్కన ఒక యువకుడు ఉన్నాడు. తన అన్నలకంటే, తనను పెళ్ళాడమని అడిగినవారందరి కంటే- తను చూసిన ఎవరికంటే కూడా అందంగా ఉన్నాడు. సొగసైన తెల్లని దుస్తులు వేసుకున్నాడు. ఆ బట్ట మెత్తగా తను కలలో చూసినదానిలాగే ఉంది. అతని చేతిలో ఆ నీలిపూవు కాడ ఉంది.

” నేనే స్పిన్ హెడ్ ని. నూరు రోజులూ అయిపోయాయి, నా శాపం తీరింది. ఇదిగో నా కానుక నీకు ” అని ఆ పూవుకాడని చూపించాడు. సాలీడు అతనుగా మారినందుకు ఎంతో ఆనందించింది డ్రి-ఫా. అయితే ఆ ఎండిపోయిన కాడ , గొప్ప కానుక ఎలా అవుతుందో ఆమెకి తెలియలేదు. ‘ దాన్ని చీల్చి చూడు ” యువకుడు చెప్పాడు. అలాగే చేసింది ఆమె. లోపల సన్నటి పొడుగాటి నాజూకైన పోగులు, సా లెపురుగు గూటివి లాగా. ఉత్సాహంగా బయటికి లాగింది.

” ఈ విత్తనం నాటితే లక్షల పూలు పూస్తాయి. ఆ కాడల్లోంచి తీసినదారాలతో- ఇదిగో, దీన్ని తయారు చేయచ్చు ” అని చక చకా తెల్లటి బట్టని నేశాడు .అదే లినెన్.

డ్రి-ఫా సంతోషంగా చప్పట్లు కొట్టింది.

1251810-bigthumbnail

” నీ పెళ్ళి గౌన్ కోసం ఇది- పెళ్ళి చేసుకుంటావా నన్ను ? ”

ఆమె సిగ్గుపడింది, అయినా ” ఓ, అలాగే ” అంది.

” నీకు మేలిముసుగుని తయారు చేస్తాను ఉండు ”

మళ్ళీ అతని వేళ్ళు అద్భుతంగా కదిలాయి. ఇంకా సున్నితమైన వస్త్రాన్ని , గజాల కొద్దీ నేశాడు. దాన్ని గాలిలో ఎగరేశాడు, పక్షిలాగా తేలింది అది. అప్పుడు ఆమె మీదికి జార్చాడు. ఆమె ముఖాన్ని కప్పి వీపు మీదినుంచి జీరాడింది. అది  లేస్.

వాళ్ళు పెళ్ళి చేసుకుని  నీలిపూవులు పూయించారు. అవి ఆ నేలకి కొత్త ఆకాశంగా మారాయి. మనుషులు కష్టపడి పని చేశారు.   నగరాలు కళకళలాడాయి. లినెన్ నుంచి బెల్జిక్ ప్రాంతాలకి [ ఇప్పటి నెదర్ లాండ్స్, బెల్జియం, లక్సెం బర్గ్ ] ఐశ్వర్యం వచ్చింది.

linen_history_img_1_blue_flowering_flax

  • డచ్ జానపదకథ
  • అనువాదం: మైథిలి అబ్బరాజు
  • mythili

 

 

 

సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగు స్థానమే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎనిమిది వ్యాసాల క్రితం విడిచిపెట్టిన ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంలోకి తిరిగి వెడదాం…

అభినయంతో కూడిన మాంత్రిక వాస్తవికతకు మహాభారతంలోని సర్పయాగం, ధృష్టద్యుమ్న ద్రౌపదుల జన్మ వృత్తాంతం అద్దం పడుతున్నాయని చెప్పుకున్నాం. సంస్కృత భారతంలో కనిపించే ఆ చిత్రణ నన్నయ అనువాదంలో లోపించిందని కూడా చెప్పుకున్నాం. అయితే, సర్పయాగ ఉదంతంలో కొంత పరోక్షంగానూ, ధృష్టద్యుమ్న, ద్రౌపదుల వృత్తాంతంలో ప్రత్యక్షంగానూ ఇంకో విశేషం కూడా ఉంది. అది, మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ‘మహాభారతతత్త్వ కథనము’లో చెప్పిన ప్రకారం సంస్కృత భారత కథనం ఇలా ఉంటుంది…

ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. అప్పుడు యాజుడు,

“త్వరగా నీ భార్యను యజ్ఞవేదిక దగ్గరికి రప్పించు. ఆమె హవిస్సును స్వీకరించాలి. ఆమెకు కొడుకు, కూతురూ కూడా కలగబోతున్నారు” అంటూ ద్రుపదుని తొందరపెట్టాడు. యాజుడికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉంది.

ద్రుపదుని భార్యకు కబురు వెళ్లింది. కానీ ఆమె రాలేదు.

“నేను రజస్వలనయ్యాను. ఇలాంటి అస్పృశ్యస్థితిలో వెంటనే యజ్ఞస్థలికి రాలేను. స్నానం చేసి వస్తాను. అంతవరకూ ఆగండి” అని కబురు చేసింది.

అప్పుడు యాజుడు-

“ఇది యాజుడు(అంతటివాడు) సిద్ధం చేయగా, ఉపయాజుడు(అంతటివాడు) అభిమంత్రించిన హవిస్సు. నువ్వు ఎలా ఉన్నాసరే, ఈ ప్రయోగంలో ఆలస్యం జరగడానికి వీల్లేదు. (నువ్వు రా, రాకపో) మేము శుక్లశోణిత సంబంధం లేకుండానే స్త్రీపురుషుల జంటను పుట్టించగలం” అన్నాడు.

వెంటనే హవిస్సును హోమం చేశాడు. అప్పుడు కిరీట, కవచాలతో; ఖడ్గ, ధనుర్బాణాలతో జ్వాలావర్ణంలో ఉన్న ఒక పురుషుడు గర్జిస్తూ అగ్నిగుండం నుంచి అవతరించాడు. అదే సమయంలో ఒక అసమాన సుందరి యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమయింది. ఆమె శరీర సుగంధం దూరదూరాలకు వ్యాపిస్తోంది. స్వర్గలక్ష్మే మనిషి రూపం ధరించిందా అన్నట్టుగా ఉంది.

“ఈమె క్షత్రియ వినాశనం అనే ఒక దేవకార్యాన్ని నిర్వహిస్తుంది. ఈమె వల్ల కౌరవుల్లో భయోత్పాతం పుడుతుంది” అని ఆకాశం నుంచి ఒక అదృశ్యవాణి వినిపించింది.

వారే ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది.

***

హవిస్సును స్వీకరించడానికి ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం…నేను వెంటనే రాలేననీ, కొంతసేపు ఆగమనీ ఆమె కబురు చేయడం…ఆమె వచ్చినా రాకపోయినా శుక్ల, శోణిత సంబంధం లేకుండానే మేము స్త్రీ, పురుష జంటను సృష్టించగలమంటూ యాజుడు హవిస్సును అగ్నికి అర్పించడం…తక్షణమే అగ్నిగుండం నుంచి ధృష్టద్యుమ్నుడూ, యజ్ఞవేదిక మీద ద్రౌపదీ ప్రత్యక్షమవడం…ఈ సన్నివేశాల క్రమాన్ని ఒకసారి ఊహించుకోండి.

ఇందులో ఒక తొందర, ఒక టెన్షన్; సంభాషణ, అభినయంతో కూడిన ఒక నాటకీయత; అవన్నీ కలసి ఒక పతాకసన్నివేశానికి దారితీస్తుండడం స్పష్టంగా కనిపిస్తాయి. అంతిమంగా ఆ పతాకఘట్టం అప్పటికప్పుడు ఇరువురు స్త్రీ, పురుషుల అవతరణ అనే అద్భుతాన్ని ఆవిష్కరించింది!

ఇందులో అనుసరించిన నమూనా మనం ఇంతకుముందు చెప్పుకున్నదే. అది, సామూహిక నృత్యం, గీతం, అభినయం; లేదా మరో సామూహిక చర్య రూపంలో ఆదిమసమాజాలు అన్నీ అనుసరిస్తూ వచ్చిన మాంత్రిక ప్రక్రియే. భౌతిక వాస్తవికతపై భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా కోరుకున్న భౌతిక ఫలితాలను సాధించగలమన్న ఊహే దీనికి ప్రాతిపదిక. న్యూజీలాండ్ లోని మావోరీ తెగకు చెందిన యువతులు పొలానికి వెళ్ళి ఆలుగడ్డల పంట వృద్ధిని నృత్య, గీతాల ద్వారా ఎలా అభినయిస్తారో గతంలో చెప్పుకున్నాం.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ ఘట్టంలోనూ, సర్పయాగ ఘట్టంలోనూ కూడా యాగమే ఈ మాంత్రిక అభినయానికి సందర్భం అవుతోంది. నిజానికి ధృష్టద్యుమ్న, ద్రౌపదుల ఉదంతంలో రెండు అద్భుతాలు జరిగాయి. మొదటిది, వారు ప్రత్యక్షమైన తీరు అయితే, రెండవది శుక్ల, శోణిత సంబంధం లేకుండానే; అంటే పురుషుడు-స్త్రీ కలయిక లేకుండానే వారు జన్మించడం. యోని సంబంధం లేదు కనుక వారు ‘అయోనిజు’లు. ‘అయోనిజ’గా మనకు పరిచయమైన మరో పాత్ర, సీత. ప్రస్తుత సందర్భంలో ధృష్టద్యుమ్న ద్రౌపదులే కాక; స్వయంగా ద్రుపదుడు, ద్రోణుడు మొదలైనవారు కూడా యోని సంబంధం నుంచి పుట్టినవారు కాదు కనుక ‘అయోనిజు’ల కిందికే వస్తారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. కానీ సీత, ద్రౌపదుల విషయంలో చెప్పినట్టుగా మిగిలినవారి విషయంలో అయోనిజ కోణాన్ని సంప్రదాయం నొక్కి చెప్పడం లేదని కూడా అనుకున్నాం.

అలాగే ధృష్టద్యుమ్న, ద్రౌపదుల అవతరణ వెనుక ద్రుపదుని అసలు లక్ష్యం రాజకీయ సంబంధి. తనను అవమానించిన ద్రోణుడిపై పగ తీర్చుకునే కొడుకును పొందడమే అతని ప్రధాన లక్ష్యం. కిరీట, కవచాలతో, ఖడ్గ, ధనుర్బాణాలతో గర్జిస్తూ ధృష్టద్యుమ్నుడు జన్మించడం ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉంది. అది శత్రువుకు ఇవ్వవలసిన సందేశమూ ఇస్తూనే ఉంది. లౌకికంగా చెబితే, తనను ఓడించగల ఒక వీరుని ద్రుపదుడు సిద్ధం చేశాడన్న కబురు ద్రోణుడికి అందుతుంది. ఆ వీరుని ద్రుపదుడు దత్తు చేసుకుని ఉండవచ్చు. యాజ, ఉపయాజుల సాయంతో జరిపిన తంతు దత్తతకు సంబంధించిన తంతే కావచ్చు. అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న మాంత్రిక రూపాన్ని ఒక రాజకీయ అవసరానికి వాడుకుని ఉండచ్చు.

ద్రుపదుడి యజ్ఞానికి పూర్వరంగంలో జరిగింది గుర్తుచేసుకున్నా రాజకీయ అవసరానికే మాంత్రిక రూపాన్ని వాడుకున్నారన్న సంగతి అర్థమవుతుంది. అన్న యాజుడికంటే తపశ్శాలి అయిన ఉపయాజుడు స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి ఒప్పుకోలేదు. ఏడాదిపాటు ద్రుపదుని తన చుట్టూ తిప్పుకున్న తర్వాత, ధనం అవసరమైన తన అన్నను అడగమని చెప్పాడు. అన్నకు సహాయకుడిగా మాత్రమే తను యజ్ఞంలో పాల్గొన్నాడు. ఈ వివరాలు ఈ యజ్ఞం వెనుక ఏదో మాయ ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. విచిత్రం ఏమిటంటే, సర్పయాగం కూడా అటువంటి అనుమానాలనే కలిగిస్తుంది.

ఇంకొకటి కూడా చూడండి. ద్రుపదుడు కొడుకునే కోరుకున్నాడు తప్ప యజ్ఞవేదిక మీద కూతురు కూడా ప్రత్యక్షమవుతుందని మొదట అనుకోలేదని పై వివరాలు సూచిస్తున్నాయి. యాజుడు హోమం పూర్తి కావస్తున్న దశలోనే కొడుకూ, కూతురూ కూడా కలగబోతున్నారని చెబుతాడు. అతనికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉందని ఆ సందర్భంలో కథకుడు అంటున్నాడు. పైగా ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అవతరించిన తీరు ఒక్కలానే లేదు. ధృష్టద్యుమ్నుడు అగ్నిగుండంలోంచి ఉద్భవిస్తే, ద్రౌపది యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమైంది. అనంతర కథాక్రమాన్ని చూసినప్పుడు, సాక్షాత్తు అగ్నిగుండం నుంచి అవతరించిన ధృష్టద్యుమ్నుని కంటే యజ్ఞవేదిక మీద అవతరించిన ద్రౌపదే మహాభారతంలో కీలకపాత్ర అయింది.

ఇంకా విచిత్రం ఏమిటంటే, ద్రోణుని వధించడమే లక్ష్యంగా ద్రుపదుడు పొందిన కొడుకు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయాడు. ద్రోణుడు అస్త్రసన్యాసం చేసిన తర్వాతే, అంతా వద్దు వద్దంటున్నా వినకుండా ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శిరస్సును ఛేదించాడు. ఒక లక్ష్యంతో అగ్నిగుండం నుంచి పుట్టించినవాడు అలా చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ద్రౌపది అవతరించినప్పుడు అదృశ్యవాణి ఆమె గురించి చెప్పినట్టుగా ధృష్టద్యుమ్నుని గురించి చెప్పలేదు. కనుక అదృశ్యవాణి అనేది, జరిగిపోయిన కథను జరుగుతున్నట్టు చెప్పడంలో కథకుడు చేసిన ఆపాదనగా అర్థమవుతూనే ఉంది. అలా చూసినప్పుడు అసలు యజ్ఞమే ఒక ఆపాదన కావచ్చు. ద్రౌపదే అగ్నిగుండం నుంచి ఉద్భవించిందనీ, ధృష్టద్యుమ్నుడే యజ్ఞవేదిక మీద ప్రత్యేక్షమయ్యాడనీ చెప్పి ఉంటే అది భవిష్యత్తులో వారు నిర్వహించబోయే పాత్రలకు తగినట్టు ఉండేది. అయితే, ద్రుపదుడి కోణం నుంచి చూసినప్పుడు, కూతుర్ని పొందడం కన్నా కొడుకును పొందడమే అతని తక్షణావసరం కనుక, కొడుకు అగ్నిగుండం నుంచి పుట్టడమే అర్థవంతం కావచ్చు.

ద్రుపదుని భార్య సరళి ఇందులో మరో ఆశ్చర్యం. దత్తత స్వీకారమైనా, యజ్ఞమైనా ధర్మపత్నీ సమేతంగా చేయవలసిందే. సంప్రదాయం ప్రకారం, ధర్మపత్ని పక్కన లేనిదే భర్త ఎలాంటి శుభకార్యాలూ చేయకూడదు. కానీ ఇక్కడ ద్రుపదుని భార్య దగ్గరలేకుండానే యజ్ఞం జరిగిపోతోంది. అందులోనూ అది పుత్రునికోసం జరుగుతున్న యజ్ఞం. కబురు పంపినప్పుడు, నేను రజస్వలస్థితిలో అస్పృశ్యంగా ఉన్నాననీ, స్నానం చేసి వచ్చేవరకూ ఆగండనీ ఆమె చెప్పి పంపింది. ఈ వివరాల రీత్యా చూసినా అది ఎలాంటి యజ్ఞం అన్న అనుమానం కలుగుతుంది.

లేక, దత్తత స్వీకారం లేదా యజ్ఞం అనే తంతు కన్నా ముఖ్యమని భావించిన ఒక అంశాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు ఈ చిత్రణను ఉపయోగించుకుంటూ ఉండచ్చు. అది మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

పైన చెప్పిన మొత్తం ఉదంతాన్ని ఓసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి…ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదుని భార్యను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రుపదుడు, ద్రోణుడు పుట్టిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, సంతానోత్పత్తికి స్త్రీ సంబంధం అవసరం లేదని మరోసారి నొక్కి చెప్పడానికి కథకుడు ఈ ఘట్టాన్ని వాడుకున్నాడా అనిపిస్తుంది. ద్రుపదుని భార్య యజ్ఞవేదిక దగ్గరకు రానీ, రాకపోనీ; తను సిద్ధం చేసి, ఉపయాజుడు అభిమంత్రించిన హవిస్సే స్త్రీ, పురుషులను పుట్టిస్తుందని యాజుడు చెబుతున్నాడు. ఆవిధంగా సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను నిరాకరిస్తున్నాడు. నిజానికి ఇక్కడ ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదునికీ, ద్రుపదుని భార్యకూ కూడా భౌతికంగా ఎలాంటి పాత్రా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, ఇద్దరూ ఉద్భవించేనాటికి యవ్వన, లేదా కౌమారదశలో ఉన్నట్టు వారిని వర్ణించిన తీరు చెబుతోంది. కనుక, హవిస్సును స్వీకరించడానికి వెంటనే ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం, నేను అశుచిగా ఉన్నానని ఆమె వర్తమానం పంపడం, ఆమె రాకపోయినా సరే, శుక్ల, శోణిత సంబంధం లేకుండా మా మంత్రశక్తే పని జరిపిస్తుందని యాజుడు అనడంలో అర్థం లేదు. అయినా సరే, ద్రుపదుని భార్యను ముగ్గులోకి లాగి మరీ ఆమె అవసరాన్ని తోసిపుచ్చడం; సంతానోత్పత్తికి స్త్రీ అవసరం లేదని ఇంకోసారి నొక్కి చెప్పడానికే అనిపిస్తుంది. ఈ విధంగా ఇది మాతృస్వామ్య-పితృస్వామ్యాల ఘర్షణలో ఒక పార్శ్వాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***

ravi_varma-draupadi_carrying_milk_honey1

ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంపై పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగార్ల మధ్య జరిగిన వాదోపవాదాల గురించి తెలుసుకోవడం ఈ సందర్భంలో ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా పెండ్యాలవారి వాదం ఎలా ఉందో చూద్దాం:

ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది దత్తులు కావచ్చునని నిరూపించడానికి పెండ్యాలవారు ప్రయత్నించారు. ఆయన ఇలా అంటారు:

“ఇతడు(ధృష్టద్యుమ్నుడు) అగ్నిగుండమున జన్మించెనని మహాభారతములో నున్నది. కానీ ద్రోణ సంహారమే ప్రయోజనముగా నగ్నియం దయోనిజుడై జన్మించిన ధృష్టద్యుమ్నుడు యుద్ధములో ద్రోణుని జయించి వధించి యుండవలెను. అట్లు గా కితడు అస్త్రసన్యాసము గావించి యోగశక్తిచే ప్రాణములు విడిచిన ద్రోణశవకంఠమును మాత్రమే ఖండించియున్నాడు. ద్రోణవధ కితడు నిమిత్తమాత్రుడై యున్నాడు గాని, యితనివలన నైన దేమియు లేదు. ఇంతమాత్రమున నిత డగ్ని యంద యోనిజుడై యేల జన్మించెనో తెలియకున్నది.”

“కావున నితడు ద్రోణవధార్థము దత్తతగా స్వీకరింపబడినవాడనియు, నితని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను.”

“ద్రౌపది ద్రుపదునకు ధృష్టద్యుమ్నునితోబాటు దత్తపుత్రిక యని నా యభిప్రాయము. పుత్రేష్టిని బట్టియు, పంచేంద్రోపాఖ్యానమును బట్టియు విచారించి చూడగా ఋషికన్యయైన యామెను ద్రుపదుడు దత్తపుత్రికగా స్వీకరించె ననియే తోచుచున్నది.”

ఇక్కడ పెండ్యాలవారు “ఇతని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను” అని అనడం ప్రత్యేకించి ఆకర్షించే అంశం. ‘గ్రంథస్వభావం’ అనడం ద్వారా ఆయన ఎనభై, తొంభై యేళ్ళ క్రితమే సాహిత్యచర్చలోకి రూపా (form) న్ని తీసుకొస్తున్నారు. సంప్రదాయసాహిత్యంలో దివ్యత్వ లేదా అద్భుతత్వ ఆరోపాల కింద దృశ్యాదృశ్యంగా ఉన్న వాస్తవికతను, చరిత్రను గుర్తించడానికి ఈ రూప సంబంధమైన అవగాహన కీలకమైన తాళంచెవి.

అదలా ఉంచితే, వారణాసివారు సంప్రదాయ పాఠాన్ని ఉన్నది ఉన్నట్టు సమర్థిస్తూ పెండ్యాలవారి వాదాన్ని ఖండిస్తారు. సంప్రదాయపాఠం గురించి ఆయన అభిప్రాయం ఇదీ:

“ఈ ద్రౌపదీధృష్టద్యుమ్నాద్యుత్పత్తులు దివ్యకృత్యములు. ఆ దివ్యకృత్యములను బోధించుచున్న భాష దివ్యభాష. అట్టి మహాభారతమును తలక్రిందు చేసినవారు విమర్శకులు.”

“ఇంతమాత్రమున కిత డగ్ని యందేల జన్మించెనో?” అన్న పెండ్యాలవారి వ్యాఖ్యకు వారణాసివారి సమాధానం ఇలా ఉంటుంది:

“ఇదేమి శంక? ఇంత పని చేయగలవాడైనపుడే అగ్నియందు జన్మించునని యున్నదా యేమి? మంత్రసంస్కృతమైన హవిస్సునందు ద్రోణాంతకుడగు పుత్రుని జన్మింపజేయు అమోఘశక్తి యేర్పడినది. అట్టి హవిస్సు అగ్ని యందుంచబడినది. అందుచే నగ్ని నుండియే జన్మించెను. దీనికి శంక యేమున్నది?”

అయితే, ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శవ కంఠాన్ని మాత్రమే ఖండించాడన్న పెండ్యాలవారి వాదాన్ని తోసిపుచ్చుతూ, ద్రోణుడు ప్రాణాలతో ఉండగానే ధృష్టద్యుమ్నుడు అతని కంఠాన్ని నరికాడని వారణాసివారు నిరూపించిన తీరు సమంజసంగా అనిపిస్తుంది.

ఇంతకు మించి ఆసక్తి గొలిపేది శుక్ర(శుక్ల), శోణితాలపై ఈ ఇరువురి మధ్య జరిగిన చర్చ. పెండ్యాలవారు ఇలా అంటారు:

“స్త్రీపురుషుల శుక్రశోణిత సమ్మేళనము లేకుండగ జన్మ మొక్క శుక్లముచేతనే కలుగునని పూర్వపాశ్చాత్యశాస్త్రము లేవియు నంగీకరింపవు. ద్రోణజన్మకథ జూడగ ఘృతాచి యను నప్సరస భరద్వాజునకు ద్రోణుని గని యా బాలుని ద్రోణ కలశములో బెట్టగ భరద్వాజుడే పెంచి పెద్దవానిని జేసి యాతనికి ద్రోణుడని పేరు బెట్టి యుండె నని తోచును.”

శుక్ర, శోణిత సంబంధం లేకుండానే మనుషులతో సహా ప్రాణులు అనేకం పుట్టడం సాధ్యమే నని వారణాసి వారు అంటూ ఇందుకు సమర్థనగా వైశేషిక, వేదాంత దర్శనాల నుంచి; ఛాందోగ్యోపనిషత్తు నుంచి కొన్ని వాక్యాలను ఉదహరిస్తారు. ఛాందోగ్యోపనిషత్తు ప్రకారం, సంతానోత్పత్తిలో పురుషుడిది నాలుగవ స్థానమైతే, స్త్రీది అయిదవ స్థానం మాత్రమే. వారి వాదం ఇలా ఉంటుంది:

“(వైశేషిక దర్శనంలో) యోనిజము, అయోనిజము అని శరీరము ద్వివిధమనియు, శుక్రశోణిత సంబంధము లేకయే ధర్మవిశేషముచే కలుగునట్టి దయోనిజమనియు, నట్టిది దేవతల యొక్కయు, ఋషుల యొక్కయు శరీరమనియు, నట్టి అయోనిజు లుండిరనియు చెప్పబడినది.”

శుక్ర, శోణిత సంబంధంలేకుండానే క్రిమి కీటకాలు, చెట్లు మొదలైనవి పుట్టడం లేదా అని ఆయన ప్రశ్నిస్తూ, మనుషుల్లోనూ అది ఎలా సాధ్యమో ఛాందోగ్యోపనిషత్తును ఉటంకిస్తారు. దాని ప్రకారం, ఈ లోకంలో జన్మించడానికి అయిదు మార్గాలు ఉన్నాయి. 1. ద్యులోకం, అంటే ఆకాశం 2. పర్జన్యం, అంటే మేఘం. 3. భూమి. 4. పురుషుడు. 5. స్త్రీ. వారి వారి అర్హతలను బట్టి అవరోహణ క్రమంలో ఈ మార్గాలలో జన్మిస్తారు. 4(పురుషుడు), 5(స్త్రీ) స్థానాల కలయిక వల్ల సంతానం కలుగుతుందని చెప్పారే కానీ, మిగిలిన స్థానాలలో కలగదని చెప్పలేదు. కనుక ద్రోణుడు మొదలైనవారు అయిదవ స్థానమైన స్త్రీతో నిమిత్తం లేకుండానే, నాలుగవ స్థానమైన పురుషునిద్వారానే పుట్టారు. ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మొదలైనవారు 4,5 స్థానాలతో; అంటే పురుష-స్త్రీ సంబంధంతో నిమిత్తం లేకుండానే పుట్టారు.

ఇదీ వారణాసి వారు వినిపించిన వాదం.

సంతానోత్పత్తిలో స్త్రీ స్థానం అట్టడుగుకి జారిపోవడం, పురుషుడిని స్త్రీ కంటే పైన ఉంచడం ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయాలు. మాతృస్వామ్యంపై విజయం సాధించే ప్రయత్నంలో పురుషుడు సృష్టినే తలకించులు చేస్తున్నాడన్నమాట!

కొత్త అంశంతో వచ్చే వారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

రెండు పాదాల కవిత

   

వొచ్చీరానీ అక్షరాలను కూడబలుక్కొని

ఆ రెండు పాదాలూ నువ్వు రాస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చొని ఉన్నాను

అప్పుడు చుట్టూ రాబందుల రెక్కల చప్పుడు

 

ఆ రెండు పాదాలే పుంఖానుపుంఖమై రోజుల నిర్దాక్షణ్యతను తొలుచుకుని బారులు సాగుతునప్పుడు-

“కవిత్వమా అది”- అనే కదా నేనడుగుతాను

 

అప్పుడు జల్లెడలా తూట్లు పడి దేహమంతా తడిసి ముద్దయి బహుశా నొప్పితోనే కాబోలు

వణుకుతున్న చేతితో జేబులో నుండి తడిసిన ఆ కాగితాన్ని ఒక చిన్ని మిణుగురులా బయటకు తీసి

ఒక్కసారి చూసుకొని తిరిగి జేబులో దాచుకుంటున్నావు

 

చావును బతుకును కలుపుతూ వంతెనలా నువ్వు

వెలుగుకు చీకటికి నడుమ పలుచని వెలుతురులా నీ జేబులోని వొచ్చీ రానీ ಆకవిత్వమూ

 

ఆ వెలుతురులో ఆ వంతెన మీదుగా అటునుండీ ఇటూ ఇటునుండీ అటూ పిచ్చి పట్టినట్టూ తిరుగుతున్నప్పుడు

చేయి పట్టుక పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు నువ్వే ఇలా అంటున్నావు

 

బహుశా ఒక అమరగీతం రాసే ఉంటావు నువ్వు, తుంటరి దొంగ సుమా వీడు –

దొరికినదంతా దోచుక పోగలడు

తాగి తాగి వొదురుతూ రాసిన మీ అక్షరాల మీద ఒంటేలు పోసి పళ్ళికలించగలడు

 

ఒక మనిషి ఎప్పుడు ఎలా పరిణమించగలడోనని మీరు ఆసక్తిగా చూస్తుంటారు

కానీ అటూ ఇటూ చెదరని నిశ్చితాల మీదనే మీ గురి-

 

కొత్త బట్టలేసుక రోడ్డు మీద తిరుగుతున్నందుకు గుడ్డలిప్పదీయించిన పెద్దమనిషి

తుపాకీ ముందర చేతులుకట్టుకొని “అనా, అనా” అని వొరపోతున్నప్పుడు లోపల ఎట్టా కుతకుతమంటదో మీరూహించగలరు గానీ

 

పక్కన ఎప్పుడూ ఊహించనంత డబ్బు

ఎటు పక్కనించీ ఏ పోలీసొస్తాడోనన్న భయం

భుజాలనొరుసుకుంటూ మావో నిలిపిన ఆదర్శం-

 

రోట్లో వేసి కలిపి దంచినట్టూ మనసు ఎన్ని పరిపరి విధాలుగా పోగలదో మీరూహించలేరు

చోరజాలని ఇరుకిరుకు సందులలో మురికి పెంటల మీదగా జీవితం ప్రవహించడం మీరు చూడలేరు –

 

తలెత్తిన ఆకాశంలో మేఘాల పరిభ్రమణంలా గిర్రున తిరుగుతూ తన లోతులలోనికి చేయి పుచ్చుకొని ఈడ్చుక పోతున్నపుడు

తనను ముట్టుకొని అలా వెళ్ళిన వాడివి మరలా ఎందుకిలా తిరిగి వచ్చావు అని అడగాలనుకున్నాను

 

తిరిగి తను అర్థాంతరంగా వదిలేసిన పాదాలే –

 

ఒకటి మరొక దానిని కలుపుతూ ఒక దృశ్యాన్ని విడదీస్తుంటుంది

మొదటిది రెండవ దాని నుండి విడిపోతూ ఒక భావాన్ని నెలకొలుపుతుంది.

-అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆత్మ ఘోష, ఋతు ఘోష కలిసి…ప్రవాస కవిత్వం

imagesX3953B67

ఇండియాలో కవిమిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వారిలో కొందరు తరచుగా ఒక కంప్లయింటు చేస్తుంటారు – నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా రాసావో, ఇప్పుడూ అలాగే రాస్తున్నావని. అదివిన్నప్పుడు, నాలో నేను అనుకుంటాను – అలా రాయగలిగితే మంచిదే కదా అని. అక్కడొక సాహిత్య వాతావరణం ఉంటుంది. మిత్రులతో వాద ప్రతివాదాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా, నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో వైవిధ్యం, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల్ని గమనించటం వంటివి జరుగుతాయి. రాసేది అంతర్ముఖీనమైన కవిత్వమే అయినా, ఇవన్నీ సాహితీ సృజనకి దోహదం చేస్తాయి. నానృషిః కురుతే కావ్యం అంటారుగాని, ఒకవిధంగా చూస్తే మానవ సంపర్కం లేని స్థితప్రజ్ఞుడైన మనిషి కంటే, తక్షణ సంఘటనలకు స్పందించి, తేలిగ్గా చలించిపోయే non ఋషులే కవిత్వం రాయటానికి ఉత్సాహం చూపిస్తారేమో అనిపిస్తుంది. మాతృదేశానికి, మాతృభాషకు దూరంగా ఉంటూ, చిన్నచిన్న సాంస్కృతిక ద్వీపాలలో నివసిస్తూ కూడా, కవిత్వ దీపంలో చమురు ఇంకిపోకుండా అదే స్థాయిలో రచన చెయ్యటం సాధించగలిగితే, ప్రవాస కవులలో అది ప్రశంసించ వలసిన గుణంగానే చెప్పుకోవాలి.

రెండో విషయం ఏమిటంటే, కవిత్వం సార్వజనీనమైన, సర్వకాలాలకూ వర్తించే సత్యాల గురించి అన్వేషిస్తుంది. బయటి ప్రపంచం చూడటం వల్ల, ఇటువంటి సత్యాలు మరింతగా మనకు అనుభవంలోకి వస్తాయి. “అవే ఆత్మలు ధరించిన రంగురంగుల శరీరాలు” అన్నట్టు, ఎక్కడికి వెళ్ళినా మనుషుల స్వభావం, వారి ఆశలు, నిరాశలు, ఆలోచనలు, విజయాలు, వైఫల్యాలు వంటివాటిలో పెద్దగా భేదం ఉండదని అర్థమవుతుంది. అందువల్ల, మానవ సంబంధాల గురించి, జీవితంలో అనివార్యంగా ఎదురయ్యే అనుభవాలు – జననం, మృత్యువు, వయస్సుతో వచ్చే మార్పులు, ఆశ, నిరాశ, ఎడబాటు – వంటివాటి ఆధారంగా రాసే కవిత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. అయితే, కవి తన దృక్పథం ద్వారా వాటిని తనదైన ప్రత్యేకతతో చిత్రిస్తాడు. ప్రాంతం మారినంత మాత్రాన అటువంటి దృక్పథం సరికొత్తగా ఏర్పడటమో, పూర్తిగా మారిపోవటమో జరగదు. కాకపొతే, ఒకచోట పరిస్థితుల గురించి విన్నప్పటికంటే, అక్కడ ఉన్నప్పుడు, ఆ జీవితంలో భాగంగా నివసించి నప్పుడు, మన దృష్టిలో స్పష్టత ఏర్పడుతుంది. అంతకు ముందు అపోహలేమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. చాలామంది తెలుగు కవుల్లాగా అక్కడున్నప్పుడు అమెరికా వ్యతిరేక కవిత్వం రాసివుంటే, బహుశా ఇక్కడకు వచ్చి నివసించాక, సగటు ఆమెరికన్లో ఉండే స్నేహభావం, హాస్యప్రియత్వం, సహాయంచేసే గుణం వంటివి చూసాక, అటువంటి తీవ్రమైన కవిత్వం ఇక్కడ రాయకపోవచ్చు. ఒకవేళ అటువంటిది జరగకపోయినా, ఇక్కడి బ్రహ్మాండమైన ప్రకృతి శోభకి పరవశం కలిగి, దేశమంటే మనుషులేకాదు, మట్టి కూడా అనే అవగాహన కలగవచ్చు.

మరొక విషయం ఏమిటంటే, కవిత్వం కవి ఊహాశక్తి మీద, అతని లోచూపు మీద ఆధారపడి ఉంటుంది. అతని సృష్టి అతని సొంతం. కథకుడిలాగా, తన ఊహలకి రక్తమాంసాలు ఇవ్వవలసిన అవసరం కవికిలేదు. అంటే, కవిత్వానికి వాస్తవంతో పనిలేదని కాదు నా ఉద్దేశం. వాస్తవాన్ని కవి చూసే దృష్టి, దానిని ఆవిష్కరించే పధ్ధతి ప్రత్యేకంగా ఉంటాయి. కథలో ఒక వాతావరణం ఉంటుంది కాబట్టి, ఇక్కడి ఊరి పేర్లు వాడటం, పాత్రలకు ఇక్కడి పేర్లు పెట్టటం వంటివాటి ద్వారా, అమెరికన్ కథ అనే భావన కలిగించవచ్చు. కవిత్వానికి అటువంటి వాతావరణ కల్పన ప్రధానం కాదు కాబట్టి, ఎక్కడ రాసిన కవిత్వమైనా ఒకలాగే అనిపించవచ్చు.

ఈ ప్రశ్న అడిగేవారి ఉద్దేశం మరొకటి కూడా కావచ్చు. వారనుకొనే కొన్ని స్టీరియోటైపు అంశాల గురించి రాయాలని వారు ఆశించవచ్చు. వారి జీవన విధానం ఎలా ఉన్నా సరే, అమెరికా తెలుగు కవులు అక్కడి నల్లవారి గురించో, పేదరికం గురించో, గ్లోబలైజేషన్ గురించో, లేదా యుద్ధ వ్యతిరేకత గురించో రాయాలన్నది వారి అభిప్రాయం కావచ్చు. ఇవేవీ కనపడని కవిత్వం వైవిధ్యంలేని, అప్రధానమైన కవిత్వమని వారు భావించవచ్చు. నియోగి అనేకమంది సాహితీ వేత్తలతో చేసిన ఇంటర్వ్యూలు ఇటీవల చదివాను. అందులో ఒక ఇంటర్వ్యూలో నగ్నముని కవిత్వాన్ని నాలుగు రకాలుగా విభజించారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్య కవిత్వమని ఆయన చెప్పే రాజకీయ కవిత్వం ప్రథమ శ్రేణికి, సామాజిక కవిత్వం ద్వితీయ శ్రేణికి, ఇజాల గురించి రాసే కవిత్వం తృతీయ శ్రేణికి చెందుతాయి. ఇకపోతే ప్రకృతి గురించి, ‘చెట్లు పుట్టల’ గురించి, మానవ సంబంధాల గురించి రాసేది సాధారణ కవిత్వమని (అంటే బహుశా అన్నిటికంటే తక్కువ స్థాయి అని ఆయన ఉద్దేశంగా నాకనిపించింది) ప్రమాద రహితం కాబట్టి ఎక్కువమంది అలా రాస్తారని తీర్మానించారు. మనం మహాకవులనుకొనేవారి ఆలోచనా పరిధే ఇంత తక్కువగా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రవాస కవిత్వంలో ప్రత్యేకతలు లేవా అంటే , తప్పక ఉంటాయి. ఇక్కడికి మాత్రమే చెందిన అనుభవాల గురించి రాసిన సందర్భాలు, ట్రాన్స్ ప్లాంట్ కావటంవల్ల మూలం నుంచి వేరయిన వేదనను ఆవిష్కరించే కవితలు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

“నేనొక చెట్టునిట

నన్ను నేనే పెళ్లగించుకొని

ఖండాంతరవాసి నైతిని

మొలకెత్తి తలయెత్తి చిగురించి పుష్పించుటకై

సారమిచ్చిన భారత భూమిక

పరభూమి నా కనవరతం

….. తల్లక్రిందులయిన నాకు

ఊర్థ్వమూల మథశ్శాఖః”

అని పెమ్మరాజు వేణుగోపాలరావు గారు రాసారు. అనేక సంవత్సరాల తరువాత నారాయణస్వామి, తన ఊరి నుంచి గుర్తుగా తెచ్చుకున్న మొక్కను గురించి చెబుతూ, అటువంటి పోలికనే వాడి ఆ విషయాన్ని ఆవిష్కరించాడు :

“మా ఊరి మొక్కను

ఎక్కడ నాటాలో తెలియక

నాలోనే

తలకిందులుగా

నాటుకున్నా

తలలోంచి బయటకు పెరిగిన

వేళ్ళు

భూమినీ ఆకాశాన్నీ

వొక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నయి.”

ఇక్కడికి వచ్చే తరాలు మారినా, తల్లక్రిందులయిన భావన మాత్రం మారలేదని వీటివల్ల తెలుస్తుంది. ఇదే విషాద భావాన్ని వైదేహీ శశిధర్ ఇటీవలి పుస్తకంలోని “మల్లె అంటు” అన్న కవితలో చాలా సున్నితంగా చెప్పారు. అందులో మొదట మల్లె అంటు సొగసుని వర్ణించిన తరువాత, చివర –

“తెగిన తల్లివేరు స్పర్స చల్లగా తగినట్లు తోచిందేమో

ఎంతో దూరాన తాను వదిలేసిన తన వెచ్చని కుదురును

పచ్చని బాల్యాన్ని తలచుకుని చిన్నబోయిన మల్లె అంటు

చెమ్మగిల్లిన పూరేకులను దిగులుగా రాలుస్తుంది”

ఈ వియోగ భావం ఒకొక్కసారి అపరాధ భావంగా కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అఫ్సర్ కవిత “డెజావూ” లో

“ఏ అన్నాలవేళో

మిమ్మల్నందరినీ విడిచేసి వచ్చాను

అది మధ్యాహ్నమో, రాత్రో గుర్తులేదిప్పుడు

….. ఏ అన్నాలవేళోమరి

పొలిమేరలు దాటి, సముద్రాలు దాటి

అనేక జనావాసాల తడిపొడి నేలలు దాటి వచ్చాను

గుర్తున్నానా?”

అన్నప్పుడు ఈ అపరాధ భావమే వినిపిస్తుంది. కొన్ని కవితలలో ఈ వియోగ బాధ ఎంతవరకు వెళుతుందంటే, మరణానంతరం కూడా అది తీరదేమో అన్నంతగా వ్యక్తమవుతుంది. మొత్తం మీద, మాతృదేశ ప్రభావం ప్రవాస కవిత్వం మీద పడిన అతి పొడవైన నీడగా మనం చెప్పుకోవచ్చు.

దీనికి భిన్నంగా ఇక్కడి నేలను, ప్రకృతి వైభవాన్ని, పరిసరాల్ని ప్రేమించి, స్తుతించిన కవిత్వం ఆహ్లాదకరమైన పదచిత్రాల వెలుగులు నిండి ఆనందం కలిగిస్తుంది. ఇక్కడి ప్రదేశాలనే కాదు, అంతకంటే ఎంతో సుందరమైన ఋతువుల్ని, ఋతుసంధ్యలని దాదాపు అందరు ప్రవాస కవులు పొగిడారు. వీటిలో కూడా, ఇండియాలో మనకంతగా అనుభవంలోకి రాని ఫాల్, మంచుతో కూడిన వింటర్ – ఇవి రెండూ కవుల్ని ఎక్కువగా ఆకర్షించాయి. మంచు కురిసిన రాత్రిలో చంద్ర – కురుస్తున్న మంచు, గాలి పాపలు ఊదుకొంటూ పోతున్న పక్షి రెక్కల్లా ఉందని చెప్పినా, నా కవితలో ఒకచోట – ఉదయానికి మిగిలిపోయిన మంచు రాత్రి మరచి వెళ్ళిన వెన్నెలలా ఉందని చెప్పినా, ఫ్రోజన్ లేక్ కింద లేత కొబ్బరి నీరులా తేటగా నిలిచే హృదయ సౌకుమార్యం గురించి వైదేహి చెప్పినా, యదుకుల భూషణ్ శిశిర చిత్రాల్లో రాలిన ఆకులు రోడ్డు మీద చిన్న పిల్లల్లా పరుగిడతాయని చెప్పినా – అన్ని చోట్లా ఋతు సౌందర్యంపట్ల స్వచ్చమైన ప్రతిస్పందనే మనకు కనిపిస్తుంది. నిజానికి ఇక్కడి వివిధ కవులు ఋతువుల గురించి రాసిన పద్యాలన్నీ కలిపి ఒక సంకలనంగా రూపొందిస్తే చాలా బాగుంటుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక్కడి కవుల ఘోష రెండు రకాలు – ఒకటి ఆత్మ ఘోష మరొకటి ఋతు ఘోష.

ఇంతకు ముందు చెప్పినలాంటి సామాజిక అంశాలతో కూడిన కవితలు అఫ్సర్ “ఊరి చివర” సంకలనంలో దొరుకుతాయి. “మెట్రోబస్ వెనకాల ఒక కితకితల నల్ల సముద్రమేదో అలలలలుగా తుళ్ళిపడుతుంది” అంటూ ఒక నల్ల అమ్మాయిని గురిచి రాసిన కవిత, యుద్ధ వ్యతిరేక కవితలు రాసిన ఇద్దరు మిత్రుల నుద్దేశించి రాసిన యుద్ధ వ్యతిరేక కవిత, హార్వర్డు యూనివర్సిటీలో ఒక ఆఫ్రికన్ ప్రొఫెసర్ మీద జరిగిన దాడికి నిరసనగా రాసిన కవిత వంటివి అనేకం ఇందులో ఉన్నాయి. నాకు బాగా నచ్చిన కవిత ఒక విద్యార్థితో అతని ఊరికి వెళ్ళిన అనుభవాన్ని వర్ణించే Take Me Home, Country Roads అనే కవిత. ఈ కవితల్లో ఇక్కడి నది పేరు, వీధుల పేర్లు, మనుషుల పేర్లు వంటివి వాడటం వలన వీటికొక స్థానికత ఏర్పడుతుంది. అప్సర్ కధకుడు కూడా కావటం వల్ల బహుశా ఇలా చెయ్యగాలిగాడనుకుంటాను. ఆ మధ్య నారాయణస్వామి కూడా క్షవరం చేసే నల్ల అమ్మాయి గురించి ఒక కవిత రాసాడు. ఆ అమ్మాయి లోతైన తడిమెరిసే కళ్ళను బట్టి ఆమెకున్న కష్టాల్ని ఊహించటం ఈ కవితలో ప్రదానాంశం.

రేస్ అన్నది అమెరికన్ సమాజంలో ఎప్పటికీ ముగిసిపోని సబ్జక్టు. మనలో ఎవరైనా ఎదుర్కొన్న వివక్ష గురించో, పైన చెప్పిన పద్యాలలో లాగా ఇక్కడి మైనారిటీల మీద కవికి కలిగిన సానుభూతి గురించో కాకుండా, మనవాళ్ళే కనబరిచే వివక్ష గురించి రాసిన పద్యాలు కొంత ప్రత్యేకమైనవి. మాచిరాజు సావిత్రి కవిత “నలుపు – తెలుపు” ఆటువంటి ఒక ఉదాహరణ. ఈ కవిత నల్లవారి పట్ల మనవాళ్ళుకున్న వివక్షను వివరిస్తూ, నల్లనయ్యని కొలిచేవాళ్ళే క్రమక్రమంగా ఆ దేవుణ్ణి నీలంగా మార్చిటం గురించి, మనం తెల్లవాళ్ళ మీద పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నా తెల్లదనం మీద మనకు తగ్గని మోజు గురించి, మనని మనం తెల్లవాళ్ళకి దగ్గరగా ఊహిచుకొనే బలహీనత గురించి ప్రశ్నిస్తుంది. నేను రాసిన ఈ క్రింది కవిత ఇదే భావాన్ని వ్యగ్యంగా చిత్రిస్తుంది.

చల్లని మధ్యాహ్నం వేళ

down town లో నడక

అంతగా జనసంచారం లేని వీధి.

ఎదురుగా నడుచుకొంటూ ఒక నల్లవాడు

కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాడు

తల దించుకుని వడివడిగా అడుగులు వేసాను.

కొంచెం దూరం పోయి కుదుటపడ్డాక

అటువేపు నుంచే ఒక తెల్లవాడు

కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాను

తల తిప్పుకొని వడివడిగా అడుగులు వేసాడు.

చాలా మంది ప్రవాస కవుల కవిత్వంలో బాల్యం, చిన్నప్పటి ఊరు మొదలైన వాటి గురించిన జ్ఞాపకాలే ఎక్కువగా కనిపిస్తాయి. మనసుని మనం స్వేచ్చాజీవిగా భావిస్తాము గాని, అది బాల్య యౌవనాలనే గొలుసుకి కట్టబడి, ఆ గొలుసు అనుమతించిన పరిమితికి లోబడి మాత్రమే సంచరిస్తుందని నాకనిపిస్తుంది. చాలామంది కవుల ఫార్మటివ్ ఇయర్సు అక్కడే గడిచాయి కాబట్టి అప్పటి జీవితం వారి కవిత్వంలో ప్రతి బింబించటంలో తప్పు లేదు. కాని, ఇప్పుడు సమాచార విప్లవం ప్రభావం వల్ల ప్రస్తుతాన్ని కూడా మానసికంగా అక్కడే గడిపే అవకాశం కలుగుతోంది. ఉండే నేల అమెరికాదే అయినా, ఆకాశం మాత్రం ఆంద్ర దేశంలో ఎక్కడో ఉంటుంది. ఒకచోట నివసించేవారి సాధక బాధకాలు చుట్టపు చూపుగా వెళ్లేవారికి అర్థం కావు. మీడియా ద్వారా లభించే దృశ్యం ఎప్పుడూ పాక్షికమే. అందువల్ల, అక్కడి హెడ్ లైన్లు చూసి, ఇక్కడి నుంచి కవిత్వం రాయటం అర్థంలేని పనిగా తోస్తుంది. అక్కడివాళ్లు విజిటర్లుగా వచ్చో, వినికిడి ద్వారా తెలుసుకొనో అమెరికన్ జీవితం గురించి కవిత్వం రాస్తే ఎంత అసంపూర్ణంగా ఉంటుందో, ఇది కూడా అంతే అసంపూర్ణంగా ఉంటుంది.

సావనీర్ల కోసమో, సంకలనాల కోసమో సరదాగా కవిత్వం రాసేవాళ్ళ రచనల్లో ఇక్కడి తెలుగువాళ్ళ జీవితాన్ని, లేదా మొత్తంగా అమెరికన్ జీవన విధానాన్ని విమర్శించే కవితలే ఎక్కువగా ఉంటాయి. పాలన రాసిన క్రింది పాటలాంటిది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది వంగూరి ఫౌండేషన్ వాళ్ళు ప్రచురించిన అమెరికా తెలుగు కవిత మొదటి సంకలనంలో చేర్చబడింది :

“చికాకెత్తి పోయినాదే ఈ చికాగో బతుకూ

చికాకుల మెల్తానే సెల్లీ సిల్లచ్చీ ….

దుంపల ఏయింపులూ, కొంపల సూపింపులూ,

తలుపుల తెరిపింపులూ దుకానాల్ల మురిపింపులూ,

పగటేసాల పెయింటింగులూ, పిజ్జాల యీటింగులూ

అనుబవించేసినానే!

రుచి చూసేసినానే సెల్లీ సిల్లచ్చీ ….”

అయితే, విమర్శగానో, వెక్కిరింతగానో కాకుండా, ఈ నేల మీద మమకారంతో, ఏ విలువల ఆధారంగా ఈ దేశం నిర్మించబడిందో ఆ విలువల మీద గౌరవంతో, నిజమైన అమెరికన్ డ్రీమ్ కోసం జీవించటానికి మరొక తరం పడుతుంది. ఆ తరం వారు దీనినే మాతృదేశంగా భావిస్తారు కాబట్టి వారికది సాధ్యమవుతుంది. వారిలో కొద్దిమందిలోనైనా కవిత్వ కాంక్ష మిగిలి, ఎవరైనా కవిత్వం రాస్తే, అది ఇంగ్లీషైనా, మన అదృష్టవశాత్తు తెలుగైనా, అందులో విభిన్నమైన ప్రవాస కవిత్వం చూడగాలుగుతామేమో!

చివరిగా నేను చెప్పే విషయం ఏమిటంటే, కవి తన ప్రత్యేక దృష్టిని, కవిత్వం మీద తనకున్న నిజాయితీని, కవిత్వం ద్వారా తను చెయ్యాలనుకున్న సత్యాన్వేషణని వదులుకోనంత కాలం, ఆ కవి ఎక్కడున్నా మంచి కవిత్వం రాయగలుగుతాడు. ఆ అవకాశం ప్రవాస కవులకి తగినంతగా ఉంది. ప్రవాసం వల్ల ఏర్పడిన వియోగభారం బాధిస్తుంది గాని, అదే సమయంలో దానివల్ల కొన్ని వత్తిడులు, ప్రభావాలు దరిచేరకుండా కవిత్వం రాసుకో గలిగే వెసులుబాటు కూడా కలుగుతుంది. దీనిని సద్వినియోగ పరుచుకొని, ప్రవాస కవులు తమ ప్రత్యేకతను కాపాడుకొంటారని, విలువైన, సాంద్రమైన కవిత్వాన్ని పెంపొందదించటంలో తమ వంతు పాత్రను పోషిస్తారని ఆశిస్తాను.

 -విన్నకోట రవిశంకర్

64681_101182536614807_2154683_n

 

 

 

 

 

 

పోస్టు చెయ్యలేని ప్రేమలేఖ!

నీ కోసం కాదు గానీ నీ గురించే రాస్తున్నాను

నువ్వు కథనుకునైనా చదువుతావో లేదో తెలీదు . ఇది కథ కాదు మన జీవితమని నేను చెప్పినా , ఇందులో నీ పాత్రని నువ్వు పోల్చుకోగలవా .. మనసు గర్భ గుడి లో ప్రతిష్ఠించుకుని  కొన్ని వసంతాలుగా నేను పూజిస్తున్న నీ రూపాన్ని నువ్వు గుర్తుపట్ట గలవా .. ఒకవేళ గుర్తుపట్టినా వరాలిచ్చే శక్తి నీకు ఉండి ఉండదు ఇప్పుడు .

మరి ఎందుకిదంతా రాయడమని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా హృదయాంతరాల్లోంచి వచ్చిన జవాబు ఒక్కటే . ఒకప్పుడు నీ కరుణా కటాక్ష వీక్షణాల్ని వరమడిగి ఓడిపోయిన నేను ఒట్టి పుష్పమై వడిలి పోలేదనీ , వట వృక్షమంత ప్రేమని నాలో నేను నాటుకున్నాననీ  ప్రపంచానికి తెలియజెప్పి మోడువారిన హృదయాల్లో ప్రేమ పైన నమ్మకాన్ని చిరుగింప చేయాలనే ఈ ప్రయత్నం .
మెటీరియలిస్ట్ లకి ఇదంతా పిచ్చిలా అనిపిస్తుందేమో మరి. నా ఈ భావాలకి సరిపోయే పదం పిచ్చి అయితే ప్రేమ పేరుని పిచ్చిగా మార్చేస్తే సరి .
ఈ ఇరవై ఏళ్ళూ  ఇరవై నాలుగ్గంటలూ  నీ గురించిన  ఆలోచనల సుడిగుండం లో పడి  సుళ్ళు తిరుగుతూ కదలనైనా కదలకుండా  తీరం కోసం వెతుకుతున్నానని చెప్పను .  ఎందుకంటే  ఈ క్షణంలో తినకపోతే చచ్చి పోతావని  బెదిరించి భయపెట్టే ఆకలి కూడా పట్టించుకునే వాళ్ళు లేకపోతే  కాస్సేపు నోరు మూసుకున్నట్టు, నీరసించి నిన్ను మరిచిన క్షణాలు కొన్నున్నాయ్.  ఆ తేలికపాటి  ఒంటరితనం కంటే నీ తలపులతో బరువెక్కే ఏకాంతమే బాగుంటుంది నాకు.
అవునూ …కథ లో ఇంత కవిత్వాన్ని గుమ్మరిస్తున్నానని  చిరాకు పడకు .  ఇన్నేళ్ళ నా మనస్సంఘర్షణ మామూలు మాటల్లో చెప్పడమెలాగో  నాకు తెలీడం లేదు  . సరేలే …. కనురెప్పల గడప దాటి కలల ప్రపంచం లోంచి కాంతి లోకం లోకి వచ్చి పడిన కంటిపాప లా ఈ పిచ్చి ఊహల మాటల్లోంచి  అసలు కథ లోకి వస్తాను .
నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా మీ ఇంటి అరుగు మీద కూర్చుని రెండు జడలు చేతుల్తో పట్టుకుని చెరో పక్కకీ లాగుతూ ఆ చిట్టి ముఖాన్ని ఉయ్యాలలూపుతున్నావు.  ఆ మాయలో పడిన నా మనసు మాత్రం ఇప్పటికీ ఊగుతూనే ఉంది  ఆగకుండా…. భూమి చుట్టూ తిరిగే చందమామ లా నిన్ను చూడాలని ఎన్ని సార్లు మీ వీధి లో చక్కర్లు కొట్టానో సైకిల్ మీద .
చిత్రరచన: శివాజీ

చిత్రరచన: శివాజీ

బ్రహ్మ ముహూర్త సమయం అని ఇంట్లో సాకులు చెప్పి  పూర్తిగా తెల్లవారకుండానే టైప్ ఇన్స్టిట్యుట్ కి బయలుదేరేవాడిని నువ్వొస్తావని తెలిసి . ఎనిమిది నిమిషాల్లోనే పద్నాలుగు కోట్ల కిలోమీటర్లు వడివడిగా ప్రయాణించి  పుడమి చెక్కిళ్ళ ని ముద్దాడాలని తపన పడే  ఉషా కిరణాల కన్నా నా తలపులకే  ఎక్కువ తొందరగా  ఉండేది.
టైప్ మాస్టార్ని బ్రతిమాలి నీ పక్కనే ఉన్న మిషన్ నాకివ్వడానికి ఒప్పించి నీ పక్కన కూర్చున్న క్షణం నాకింకేమీ అక్కర్లేదనిపించింది. మాటి మాటికీ నిన్ను చేరిపోతున్న నా చూపుల్ని మిషన్ మీటల మీదికి మళ్ళించడానికి ఎంత కష్ట పడేవాడినో !.  ఎలాగోలా కళ్ళకి నచ్చ చెప్పినా మనసెక్కడ మాట వింటుంది ! చేతి వేళ్ళకి అదేశాలివ్వకుండా అలిగి కూర్చునేది . తప్పనిసరై దాని పని దాన్ని చేసుకోమని వదిలేసేవాడిని .
అప్పటికే ఎందరో స్త్రీ మూర్తుల సౌందర్యాన్ని మరెందరో మహానుభావుల భావుకత్వపు అక్షరాల కళ్ళద్దాల్లోంచి  చూసి అచ్చెరువొందాను.  కానీ ఇంతటి నిర్మలమైన అందాన్ని ఇలా కళ్ళెదురు గా చూడటం ఎంతటి సరి కొత్త అనుభవమో నాకు
ఎన్నేళ్లుంటాయి నీకప్పుడు , పట్టుమని పదహారైనా ఉంటాయా ? ఎంతటి ముగ్ధత్వం!!!
పోత పోసినట్టు పసితనం, ఆ పసితనపు పరదాలతో దోబూచులాడుతున్న చిలిపి పరువం …. సాయం సంధ్య సమయాన సూర్య చంద్రులు ఒకేసారి కనిపించి నీలాకాశానికి అంతులేని ఆకర్షణ అందించినట్టు !!!!
అత్తపత్తి ఆకుని సైతం మించిపోయి, ముట్టుకోకుండానే ముడుచుకుపోయే నీ సౌకుమార్యపు సోయగం వర్ణించడం ఎవరి తరం !! అతి చిన్న శబ్దానికి కూడా అదిరి బెదిరి పరుగులు తీసే చిన్ని చిన్ని లేడి పిల్లల్లా చంచలంగా ఉండే నల్లని నీ కనుపాపలు నన్నసలు  తల తిప్పుకోనిచ్చేవా!
పరికిణీ వోణీ లో నిన్ను చూసినప్పుడు నాలో చెలరేగే భావ సంఘర్షణ అతి పురాతన ప్రకృతి రహస్యం !! తొలి ప్రేమ లోని గాఢత , తొలి వలపు అందించే తన్మయత్వం తొలి తొలి సారిగా తొలకరి చినుకు లా నన్ను తాకిన వేళ, పులకరించిన మనసులో విరబూసిన  ఆనందపు కుసుమాలెన్నో !! వాటి తో పాటు పుట్టి , విరహమై వేదనై తియ్యని గాయాలు సృష్టించిన ఎదురు చూపుల ముళ్ళెన్నో!!
నా ఆరాధనాపుష్పాలు  నీ నయనచరణాల ని తాకేసరికి ఒక ఋతువు కాల గర్భంలో కలిసిపోలేదూ ?  ఎందుకు చదవలేక పోయావు నీ కోసం తెరిచి పెట్టి పట్టుకున్న నా మనసు పుస్తకాన్ని ? చిన్నతనం  వల్లనా ? అవును  అందుకేనేమో, నిండుగా పరవళ్ళు తొక్కే  నా ప్రేమ ప్రవాహాన్ని , వయసు ప్రభావాన పరుగులు పెట్టే వర్షాకాలపు పిల్ల కాలువ పొంగులా భావించి పక్కకి నెట్టావు
ఎంత గా నీ చెంతకి చేరాలని నేను తపన పడితే అంతగా నాకు అందకుండా దూరంగా తప్పుకుపోయావు . కళ్ళతో పలకరించినా , పెదవులతో పలుకులు చిందినా భయంతో  చిగురుటాకులా వణికిపోయావు. నీకు రక్షణగా , జీవితాంతం తోడుగా నీడగా నిలవాలని తపన పడుతున్న నాకు నీ భయం ఎంతటి తీవ్రమైన వేదనని కలిగించేదో తెలుసా , ఎలా నీకు చెప్పాలి…  నేను కాటేసే కాలనాగుని కాదని, కలకాలం నిన్ను కనురెప్పలా కాచుకునే అవకాశం కోసం అనుక్షణం నిరీక్షిస్తున్నానని !!
అందుకే పెళ్లి చేసుకుంటానని స్నేహితుడితో రాయబారం పంపాను. సనాతన సాంప్రదాయపు కోటలో యువరాణి లా పెరిగిన నీకు అలా చెబితేనే అర్ధమవుతుందనే నా అంచనాని తప్పుదోవ పట్టిస్తూ నీకెప్పుడో పెళ్లి కుదిరిపోయిందని నువ్వు పంపిన సమాధానంలో నీ  అపరిపక్వమైన గడుసుదనం నాకు భలే నవ్వు తెప్పించింది .
ముందుకు వచ్చే కొద్దీ  వేగంగా వెనక్కి పరిగెడుతున్న నిన్ను మరింత కష్ట పెట్టడం ఇష్టం లేక, నువ్వు నువ్వు గా నన్నిష్టపడే రోజు కోసం సహనం గా ఎదురు చూస్తున్న నన్ను విధి తన బలీయమైన హస్తాలతో ఒక్క చరుపు చరిచింది .
మీ నాన్నగారికి ట్రాన్స్ ఫరై నువ్వు మరో ఊరు వెళ్ళిపోతున్నావన్న విషయం తెలిసిన రోజు నాకు దుఃఖం అంటే ఏమిటో తొలిసారి అనుభవం లోకి వచ్చింది . గుండెల్ని మెలిపెడుతూ , గొంతు లో సెగలు పుట్టిస్తూ , కంటిపాపల్ని కన్నీటి లో ముంచేస్తూ , కాళ్ళలో సన్నని వణుకు పుట్టిస్తూ … అసలేమిటి ఈ లక్షణాలు  … విఫల ప్రేమ కి ముందస్తు సూచనలా … నా జీవితంలో అంతమైపోతున్న ప్రమోదాన్ని హెచ్చరించే  ప్రమాద ఘంటికలా … నువ్వు కనిపించని లోకాన్ని అసలు ఎలా ఊహించుకోను
తెగించి అడిగే తెగువ లేక  నిస్సహాయం గా  కొమ్మల మధ్య చిక్కుకుపోయిన గాలి పటమై, చిరుగాలిలా వెళ్ళిపోతున్న నిన్ను చూస్తుండి పోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయాను .
నువ్వు నాతో ఉన్న రోజుల్ని తలుచున్నంత అందంగా నువ్వు లేని రోజుల్ని వర్ణించలేను . అప్పటి ఆవేదన … అప్పటిదేమిటిలే ఇప్పటికీ ఉన్నదే….
పైపై ఉధృతి తగ్గి లోపల్లోపలికి విస్తరించుకు పోయింది అంతే . ఆ వేదనంతా  పదాల్లో పలికించాలనుకుంటే   కొండంత సముద్రాన్ని కుండలో నింపి చూపించినట్టే
 నీతో పాటుగా నన్నొదిలిపోయిన  సంతోషాన్ని తిరిగి సంపాదించుకోవాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు . నువ్వేం చెప్పావో మరి నీ స్నేహితురాళ్ళకి …. నన్ను చూస్తేనే కొండచిలువ ని చూసిన కుందేళ్ళ లా బెదిరి పారిపోయేవారు. ఇక నీ ఎడ్రెస్సేం అడగాలి!! వేరే దారి లేక నువ్వెళ్ళిన  ఊరికి  నీ కొత్త కాలేజీ అడ్రెస్ కి  నేను వ్రాసిన ఉత్తరం గుర్తుండే ఉంటుంది నీకు . ఎందుకంటే నేను వ్రాసింది పెన్ను తో కాదు నా హృదయం తో … .  తప్పక అది నిన్ను అంతో ఇంతో కదిలించే ఉంటుంది. నేను అల్లర చిల్లర అబ్బాయిని కాదని నీకు తెలియజెప్పే ఉంటుంది .
నువ్వు పక్కనుంటే, నిలబడటానికి నాలుగడుగుల స్థలం చాలని రవీంద్రుడి కవిత్వం కాగితం మీద పరిచాను . నీ మీద కూడా ఓ కవిత రాసాను కదూ!  నీకు నచ్చిందో లేదో మరి…..  లేకపోతే నవ్వుకున్నావో…..   నీలం రంగు వోణీ లో నిన్ను చూసినప్పుడు నా మనసు మనసులోఉండదన్న నిజం కూడా చెప్పేసాను . చాలా కోప్పడి పోయి ఉంటావు . నీ అందం కంటే అమాయకత్వమే నాకెక్కువ నచ్చిందనీ అనేసాను . నువ్వు నవ్వినా చందమామ నవ్వినా ఒకటే  అన్నాను … వెన్నెలకేసి ఎంత సేపు చూసినా విసుగు రాదనీ , మరి పగలే కాసే వెన్నెల మరింత బాగుంటుందనీ చెప్పి మళ్ళీ కోపం తెప్పించానో , ఎంతో కొంత ఆనందపరిచానో తెలీదు  . ఎన్ని పేజీలు  రాసినా ఇంకా ఏదో చెప్పలేదనే అనిపించింది నాకప్పుడు . నీ అంతట నువ్వు సమాధానం ఇవ్వడానికి మొహమాట పడతావేమో అని రిటర్న్ కవర్ కూడా జత చేసాను .
నా బంగారు కలలన్నీ భద్రం గా మూట గట్టి దానికి పదాల రెక్కలు తొడిగి నీ పాదాల చెంత వాలమని పంపించాను . నువ్వేం చేసావు ….  అవే పదాల్ని అక్షరాలు గా సంధించి నీ తిరస్కార బాణాల్ని ఎంత సూటిగా నా గుండెల్లో దింపావో ….. నేను నిన్ను తప్పు పట్టను.
మనకి నచ్చిన వాళ్లకి మనమూ నచ్చాలని నియమం ఏమీ లేదు గా . కానీ ఏమన్నావు ? నా వల్ల నువ్వు భయం తో చచ్చి పోతున్నానన్నావు . ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ పరువు పోతుందన్నావు .
 నన్ను కాదన్నావన్న వేదన కంటే నిన్ను ఇబ్బంది పెట్టానన్న బాధే మొదట్లో ఎక్కువ గా ఉండేది . తర్వాత్తర్వాత నువ్వు నాకెప్పటికీ దక్కవన్న నిజం నెమ్మదిగా తెలిసొచ్చింది . నాకిక నేను కూడా మిగలలేదని అర్ధమయింది . జీవితం అంధకార బంధురమైపోయింది  .
అప్పుడప్పుడు చందమామ  చిందించే వెన్నెల దరహాసం  , చిన్న గాలిపాటు తో పలకరించే పువ్వుల పరిమళం , ఎప్పుడైనా  కోయిల తీసే తియ్యని కూనిరాగం…  నా పక్కన నువ్వున్న అనుభూతినిస్తాయి . వాటితో పాటు ఎన్నెన్నో జ్ఞాపకాలు నాతో పాటే , నాలోనే నిక్షిప్తమై ఎప్పటికీ ఉంటాయనుకో .
నీ ఆలోచనల్లో నిలువెల్లా మునిగి ఉన్ననన్ను నాకు చూపించలేక ఈ ప్రపంచమనే అద్దం తెగ తికమక పడిపోతుంది . పాపం దానికేం తెలుసు తన తప్పు ఏమీ లేదని … ఈ కథలాంటి, memoir లాంటి  ఉత్తరం రాయడానికి అదొక్కటే కారణం కాదు సుమా …. నా గుండెకి పడిన చిల్లు లోంచి లోపలికి చేరే  వేదనని కొంత ఇలా తోడి పోస్తేనే కదా .. మళ్ళీ మరి కొన్ని జ్ఞాపకాలు లోపలికి చేరేది!  అందుకే ఈ చిన్న ప్రయత్నం ఇలా…….
                     -నువ్విది చూడాలనో చూడకూడదనో … నాలోపల నాకేమనిపిస్తోందో నాకే తెలియని నేను
-సాయికిరణ్

జైలు

 Kadha-Saranga-2-300x268

అనగనగా ఒక నేను…

ఆ నేను ఒకప్పుడు బ్రతికుంటుండే.. అంటే అప్పట్ల నాకు “పానం” ఉండేదన్నట్టు.. ఉన్నప్పుడు దాని విలువ తెల్వలే.. ఇప్పుడు తెల్శినా తిరిగి తెచ్చుకునుడెట్లనో సమజ్ కాదాయే.. అయినా, అసలది ఎట్లుంటదో ఏర్పాటైతెనే కదా తిరిగి తెచ్చుకునుడు ముచ్చట!

చిన్నప్పుడెన్లనో చదువుకున్నా- “భూమ్మిద ఏదైన మూడంటే మూడు స్థితుల్లోనే ఉండును- ఘన, ద్రవ, వాయు స్థితులు.. ఈ మూడు తప్ప ‘దేనికైనా’ ఇంకో స్థితనేది ఉండనే ఉండదు” అని..

అయితే “పానం” ఈ మూడు స్థితుల్ల దేన్ల ఉంటదో మాత్రం నాకస్సల్ సమజైతలేదు…

గట్టిగనా, మెత్తగనా, గాలిలెక్కనా!! అసల్ పానం ఎట్లుంటదో ఎవలనడిగినా మాకెర్కలేదనే అంటున్నరు..

స్వర్గంల ఉంటున్నోడు పోయిన పానం గురించి ఇంతగనం చర్చపెట్టడు కాబట్టి ఇప్పుడు నేనున్నది నరకంల అని చానమంది ఈపాటికే అనుకుంటానట్టున్నరు… మీరనుకునేది దాదాపుగా నిజమే, కాపోతే.. దీన్ని మొత్తానికి మొత్తం నరకం అన్లేంగని “త్రిశంకు స్వర్గం” అంటె బాగ నప్పుతది..

నా పెయ్యిప్పుడు కట్టెసర్సుకపోయి ఇగో ఈ చీకటి కొట్టంలో ఓ మూలకు. ముడుచుకోని పడున్నది.. కొట్టానికి అవుతల ఏవేవో చప్పుళ్లూ, మనుషుల గొంతులూ వినపడుతున్నయి..

ఈ చీకటికొట్టాన్నే కొందరు “సెల్” అంటరు. సెల్ అంటే పుస్తకంల ‘కణం’ అని రాశుంటది. నేనున్న ఈ కణం చుట్టూత అన్ని దిక్కుల్ల అచ్చం ఇసొంటియే కొన్నివందల కణాలు ఉన్నయి. అందరి సెల్లులనీ కలిపి ఉంచేటియీ/ విడగొట్టేటియీ ఈ గోడలే. తేనె తుట్టను చూశుంటరు కదా. అగో అట్ల. ఒక్కో కణంల ఒక్కో మనిషి.. ఈ కణాల ‘కుప్ప’ను పుస్తకంభాషల కణజాలం అంటారుగానీ మామూలు భాషల మాత్రం “జైలు” అంటరు.. ఇంత పెద్ద జైలు మొత్తానికి సరిగ్గా మధ్యల నా సెల్లున్నది….

ఇప్పుడంటే నేనీ కొట్టంల బందీనై పీనుగు వేరం పడున్నకనీ.. బతికున్న రోజుల్ల నా కథే వేరు..

మునుపు నా జిందగే అలగుంటుండే. చిన్నప్పుడు పొద్దుగాల లేశుడుతోనే తెల్లని లేగదూడల ఎగురుడు దుంకుడు సూశి వాటితోనీ పోటీ పడుడు.. ఎర్రటెండల కప్ప గాలాలు పట్టుకుని చాపలకు పోవుడు.. పచ్చటి పొలాల గెట్లమీదనో, చల్లటి చెట్ల నీడలనో నెరివడేదాకా ఆడుకునుడు.. ఆయిటిపూని మొదటి వాన కొట్టినప్పుడు వచ్చే మట్టివాసన పీలుస్తూ ఆరుద్ర పురుగుల జాడకోసం వెతుకుడు.

ఉడుకపోసే ఎండాకాలం రాత్రుల్ల వాకిట్ల గడంచెల పండుకోని చల్లటి గాలికి చుక్కల్నిచూస్తూ కథలు అల్లడం..

వరదగూడు కానొస్తే వాన రాక చెప్పడం.. చుక్కతెగిపడితే ఠక్కుమని దేవునికి మొక్కుకోవడం..

 

తెల్లార్తే మళ్ల దోస్తులతోటి తిరగడం…

పొద్దుగూకినంకే ఇంటికి చేరడం..

అవ్వనాయినలు తిడుతే అలగడం..

అటేంక బతిమాలుతే కరగడం…

కన్నీళ్లుగా కారడం….

కాసేపటికే కడుపారా నవ్వడం...

ఒకటా రెండా… కొన్ని వందల యాదులు నా కండ్ల ముంగటనే మెదులుతున్నయి.. కానీ అదంతా గతం..

అటు పెద్దా ఇటు చిన్నాకాని ఈడుల, ఎవలేది చెప్పినా నిజమని నమ్మే కాలంల… ఎవడో చెప్పిన చెడుపుమాటలు విన్నందుకు ఫలితంగా ఇయ్యాల.. ఇప్పుడు.. ఇక్కడ.. ఈ చీకటి కొట్టంల.. నాలుగు గోడల మధ్యన ముక్కుత మూలుగుత ఓ మూలకు ఒరగాల్సచ్చింది.. ఈడ..

గాలి ఉన్నదికానీ నాకు మొస మర్రదు..

ఆకలి ఉన్నది.. కానీ అన్నం సైపదు….

రోజులూ ఉన్నాయి.. కానీ పొద్దుమాపుల తేడానే లేదు..

నిద్ర ఉన్నది.. కాని నేనున్నది కలలోనా, మెలుకువలోనా అన్నదే సమజుకాదు..

‘చెయ్యని తప్పుకు బలైన’ అని ఎరుకే కనీ, ఇంకొకర్ని వేలెత్తి చూపేటందుకు వీలులేని విచిత్ర పరిస్థితి నాది… ఈ జైలు కథే అంత.. అవుతల ఉండేటోళ్లకు జైలు లోపట ఇట్లుంటది, అట్లుంటది అని ఎంత చెప్పినా సమజవుడు జర కష్టమే.

ఈడ నా మొదటిరోజు నాకింకా మతికున్నది..ఆరోజు..నేనిక్కడికి వచ్చిపడుటానికి ఎవలైతే కారకులో వాళ్ళంతా ఈన్నే ఉన్నరు.. బిక్కుబిక్కుమనుకుంట లోపటికి అడుగుపెట్టిన నాతోని.. వాళ్ళంత అన్నది ఒకే ఒక్క మాట..

“ఏంది నువ్వుకూడా వచ్చినవా??” అని…

…అందరు అడిగింది అదొక్కటే ప్రశ్నగని అడిగిన తరీకనే వేరు.. ఒకడు ఆశ్చర్యంతోటి అడుగుతె, ఒకడు సంబురంగ అడిగిండు, ఓడు జాలి పడుకుంట అడిగితే, ఇంకోడు తిడ్తానట్టు అడిగిండు.. “ఏంది నువ్వుకూడా వచ్చినవా??” అని..

వాళ్ళ “తరీక” ఏదన్నాగానీ… నాది మాత్రం సాఫ్ సీదా ఒకటే జవాబు.. “ఆ.. నేను కూడా వచ్చిన..” నాకింకేదో చెప్దామని మా ఉండేగనీ, నాకు తెల్వని కొత్తోళ్లు చానామంది నా మొఖంల మొఖం పెట్టి నన్నే చూస్తుండేసరికి అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేకపేన…

నేను నా సెల్లులకు ఇట్లా అడుగుపెట్టుడుతోటే నా యెనుక తలుపులు మూతవడ్డయ్.. మొత్తం చిమ్మ చీకటి.. కండ్లు పొడుసుకున్నా వెలుతురు కానరానంత చీకటి…

******

మొదట్ల నా సెల్లుల నేను ఖాళీగా కూసునుడు, లేకుంటె మనసు గుంజిన దిక్కు పోవుడు తప్పుతె ఎవరితోటి పెద్దగ ముచ్చటపెట్టింది లేదు.. పక్క సెల్లులల్ల ఉండేటోళ్లు మాట్లాడుకునేటియి వక్కల్ ముక్కల్  వినపడుతున్నా నేనా ముచ్చట్లు పెద్దగా పట్టించుకోకపోతుండే..

ఎప్పుడన్నోసారి నాకు తెల్సినోళ్లో, నేనిక్కడ పడుటానికి కారణమైనోళ్లో మతికుంచుకుని మందలిస్తే మాత్రం, “నమస్తే” అనో “అంత మంచే” అనో జవాబిచ్చి ఊకునేటోన్ని..

ఏo పనీ లేనందుకో, ఒక్కణ్నే ఉన్నందుకోగానీ నాకు జైలంటే జెప్పన్నే విసుగుపుట్టింది..

అయితే.. రాను రాను ఆ చీకటి అలవాటయ్యేకొద్ది ఆ మాటలు ముచ్చట్లు ఇంకింత సొచ్చంగ వినిపించడం షురూ అయింది.. ఇగ అప్పటికేంచి, దొంగసాటుగా ఈ మూలకు నక్కికూసోని వాళ్ల ముచ్చట్లన్ని “రహస్యంగ”’ వినుడు అలవాటైంది…

ముక్కూమొహం తెలువనోళ్ల “సొంత విషయాలు” వినుట్ల గింత మజా ఉంటదనుకోలే..!! వింటున్నా కొద్దీ వినబుద్ధైతాంది.. ఇప్పుడు ఒక్క పూట ఆ మాటలు వినకున్నా నిద్రపడ్తలేదంటే నమ్ముండ్రి..    అబ్బబ్బబ్బా.. ఏం మాటలు ఏం మాటలు!! ఒక్కతీరు మాటముచ్చట్లా అయ్యి??

ఒకడు రావిగింజ గురించి చెప్తాంటె, ఇంకోడు రాజకీయాల గురించి మాట్లాడ్తడు.. ఒకలు సినిమా అంటే, ఇంకోలు

క్రికిటూ అంటరు.. ఓ కాడ కులం మతం గురించి కొట్లాడుకుంటాంటే, ఇంకోకాడ దేవుడు దయ్యమని వాదిచ్చుకుంటాంటరు.. ఓదానికోదానికి సంబంధం లేకుంట, ఒక్కొక్కనిది ఒక్కో మాట…

నదులన్నిపొయ్యి సముద్రంల కల్శినట్టూ, ఆ తీరొక్క ముచ్చట్లన్ని ఆఖిరుకు నా చెవులల్ల పడి.. మెదట్లకి ఇంకుతున్నయి..

చుట్టూ చీకటి, ఈణ్నుంచి తప్పించుకోలేని ఇసొంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకు చాతనయ్యేది రెండే రెండు పనులు.. అయితేనా నేనే మాట్లాడుడు, లేకుంటె వాళ్లు మాట్లాడుతుంటే వినుడు… నేనీ రెండో పనినే నా మొదటి పనిలెక్క పెట్టుకున్న… ఈమధ్య ఉన్నోన్ని ఉండనియ్యకుంట నన్నుకూడా ఏదన్నొటి చెప్పమని అడుగుడు కొత్తగ షురూచేశిన్లు..

నాకు వద్దనున్నా, వాళ్లు మాత్రం ఇడ్శిపెట్టకుండా ఊకె నా గోడపై కొట్టో, తట్టో నన్ను పిలుస్తనే ఉన్నరు… తప్పుతదా మరి.. చేసేదేoలేక వాళ్లు మాట్లాడుకునే వాటికి “ఊ..” “ఊ..” అని ఊ కొట్టుడు అలవాటు చేసుకున్న…

పోను పోను ఒకదానితర్వాత ఒకటి ఇట్లనే కొత్తకొత్త అలవాట్లు అనేకం అంటుకున్నాయి.. మొదట్ల అయన్ని కొత్త కాబట్టి పెద్దగా ఏమనిపించలే..కనీ.. నాకు పుట్టుకతోటి వచ్చిన పాత అలవాట్లన్నీ మెల్లమెల్లగా గాయబైపోయాయి.. అగో అక్కడే మొదలైంది నా పతనం… కొన్నిరోజులకే ఈ కొత్త అలవాట్లకు పూర్తిగా బానిసనై వాటిని దురలవాట్లుగా నా అంతట నీనే మార్చుకున్న..

పక్కోని జీవితం గురించి తెలుసుకోవాలనే కుతుహలం నాలోపట కొండపెరిగినట్టు పెరిగిoది… వానిగురించి తప్పుతే నా గురించి పట్టించుకోవాలన్న సంగతే మతికిలేనంతగా మారిపోయాను.. అసల్ నేన్ తింటాన్నో ఉపాసముంటాన్నో తెలుస్తలేదు.. నా నాలికె మంచిగ రుచుల్ని చూసి నిజంగా ఎన్ని దినాలైన్దో!! ఏది తిన్నా ఒకే రుచి… ఏది చూసిన ఒకే వాసన… సప్పటి బతుకు.. ఏమి తిన్నట్టే అనిపిస్తలేదు కనీ పెయ్యి మాత్రం బరువెక్కుతాంది.. బరువెక్కుతాంది అనే కంటే నాకు నేను భారమైతున్న అంటె కరెక్టు.. ఇగ నిద్ర ముచ్చట ఆ దేవునికే తెల్వాలె.. ఎప్పుడు పంటాన్నో, ఎప్పుడులేత్తాన్నో ఏం సమజ్ గాని అయోమయం… ఆగమాగం…

చిత్రం: కార్టూనిస్టు రాజు

చిత్రం: రాజు

******

ఈడున్నోళ్ళు సరిపోనట్టు ఈ మధ్య పెద్దపెద్దోళ్ళు సుత ఈడికే బందీలుగా వచ్చి చేరుతున్నరు… కాదెవరు తప్పులు చేయటానికనర్హం అన్నతీరంగ.. రాజకీయాలోళ్లు, సినిమావోళ్లు, ఆటలాడేటోళ్లు, పాటలు పాడేటోళ్లు.. అందరిటే వరుసకట్టిన్లు.. టివీలనో పేపర్లోనో చూశే ఉంటరు మీరు.. మీకు ఎరుకయ్యే ఉంటదికదా?

గొప్పగొప్పోళ్లు కూడా ఈడికచ్చుడు.. వాళ్ళుసుత మాతోటే, మావేరంగనే ఇట్ల చీకటికొట్టాల్ల బందీ అయిపోవుడు జర ముక్కుమీద వేలేస్కోవాల్సిన ముచ్చట్నే అయినా, ఇప్పుడు వాళ్లూ-నేనూ అందరం సరిసమానంగ ఉన్నమని యాదొచ్చినపుడు సంబురంతో ఒళ్లు పులకరించి పోతాంది.. ఈ సంబరం నేను “వాళ్ళంత” అయినందుక్కాదు, వాళ్ళు నా అంత అయినందుకు…

బయట జిందగీల వాళ్లను కలుసుడు, మాట్లాడుడు అనేది కలల కూడా ఊహించలేని నేను, ఈడ మాత్రం వాళ్లతోటి ముచ్చటపెట్టేతందుకు ఏ చిన్న సందు దొరికినా ఇడిశిపెట్టద్దని నిర్ణయం జేస్కున్న.. ఇంకేందిగ, ఈ చీకట్లె ఎప్పుడన్న వాళ్లల్ల ఎవరి గొంతన్న వినపడ్డదంటే ఖతమే.. ఠక్కున నేనుసూత వాళ్లతోని చేరి వదురుడు షురూ జేశిన…

వాళ్లు “ఆc..” అని ఆవులిస్తే….. నేను “వాహ్..” అని తాళం కొడుతాన…

వాళ్లు “క్యా” అంటే….. నేను “క్యా బాత్ హై” అంటున్నా..

జైలంటే వాళ్ళకేడ విరక్తి పుట్టి వెళ్లిపోతరో ఏందోనని, నాకు అక్కెరున్నా లేకపోయినా ఎప్పుడూ ఏదో ఒకటి వాగుడూ.. వాళ్ళు దగ్గినా తుమ్మినా పొగుడుడు చేస్తనే ఉన్న.. అమాసకో పున్నానికో వాళ్ళు నన్ను మతికుంచుకోని మందలిస్తే ఇంక నాకా పూట దసరా దావతే..

అంతంత పెద్దోళ్లు పరిచయమైనందుకు నిజంగా నాకు మస్తు గొప్పగ అనిపిస్తాంది.. పైకెళ్లి ఇప్పుడు నేనుసూత గొప్పోణ్ని కాబట్టి, నాకూ నాలుగు పెద్ద పరిచయాలున్నయి కాబట్టి, చుట్టూత ఉన్న ఇంకో నలుగురితోటి కలవడం, కలుపుకుపోవడం నా అసంటోనికి తప్పదనిపించింది.. అనిపించుడే ఆలిశం.. చీకట్ల కనీసం వాళ్ళ మొఖాలుకూడ చూడకుండా బొచ్చెడుమందితో మాట్లాడుడు షురూ చేశిన…

ఒకప్పుడు ఓ మూలకు సప్పుడు జెయ్యకుండ కూసునే నేను ఇప్పుడు అందర్తోని ముచ్చట పెడ్తూ నా కొట్టంలో మూల మూలకు కలెతిరుగుతున్నా.. పొద్దుమాపు తేడాలేకుండా ఎవడు పడితె వానితో ఏది పడితే అది ఒర్రుడే ఒర్రుడు.. అసలు, “ముచ్చటుంటెనే” కడుపునిండుతానట్టు అనిపిస్తాంది… వందల మందితో పరిచయమయ్యేసరికి అసలు నా అంత మొగోడు లేడనిపిస్తాంది.. ఆ తర్వాత్తర్వాత.. వాళ్లతో మాట్లాడే ‘తరీక’ దానిచ్చ అదే మారింది.. “వాళ్లు” అన్న పదం మనోళ్లు, వేరేటోళ్లుగా ముక్కలైంది..

మొదట్ల..                వాళ్ళు- “రాజకీయాలు చెత్తా” అంటే…

నేను – “ఔ.. ఏ చీపూరుకట్టకూ ఊడువ రానంత చెత్త” అనేటోన్ని…

తర్వాత కొన్నిరోజులకు… వాళ్ళు – “రాజకీయాలు చెత్తా” అనంగనే

నేను – “వాటిల ఉన్న మావోళ్లు తప్ప.. మిగిలినోళ్లు చెత్త” అనేటోన్ని

ఆ తర్వాత ఇంకొన్నిరోజులకు… వాళ్ళు- “రాజకీయాలు చెత్త” అనంగనే

నేను – “మీరు ఉత్త చేత కాని దద్దమ్మలు.. అందుకె మీకు రాజకీయాలు చెత్తగా కనవడ్తున్నయీ”

ప్రస్తుతం..              వాళ్ళు- “రాజకీయలు చెత్త” అంటే..

నాకు ఓపిక తగ్గో, మరి గడ్డ బలిశోగని – “మీరే చెత్త… మీ అయ్య చెత్త.. మీ తాత చెత్త… మీ కులం.. మీ ఖాందాన్ మొత్తం చెత్త చెత్తా” అని తిట్టేదాక పోయింది..

“మాటల” దగ్గర మొదలైన ఈ యవ్వారం…

మాటలు చాడీలుగా.. చాడీలు వాదనలుగా.. వాదనలు లొల్లులుగా.. లొల్లులు పదాన్ని మించిన బండ బూతులుగా… ఇట్ల క్రమక్రమంగా మారుకుంట వచ్చి ఓ కొత్త “పరిణామ క్రమమే” పుట్టిందీ చీకట్లో..  

అందరి సంగతేందోకని నేనింతగనం రెచ్చిపోడానికి కారణం మాత్రం “మావోళ్లు” నా పక్కసెల్లుల్లొ చేరిన్లనే.. అయితే, నాకెంత మావోళ్ల అండదండ ఉన్నా, చానాసార్లు వేరేటోళ్లు నన్నుకూడ పచ్చిబూతులు తిడ్తనే ఉన్నరు.

చేతుల్తోని కొట్టిన దెబ్బలు జెప్పన్నే మగ్గుతయి కావచ్చుగని, మాటల్తోటి కొట్టిన దెబ్బలు పచ్చిపుండ్లై ఎప్పుడు సలుపుతనే ఉంటయ్..

అవతలున్న రోజుల్ల.. పిడుగులు పడ్డా తెలివిపడనంత సోయిలేకుండ నిద్రపొయ్యేనేను.. ఇప్పుడు మాత్రం చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడిలేచి కూచునుడైతాంది… ఏ నిమిషంల ఎవలు మీదపడుతరో అని భయం.. వెన్నుల నుంచి వణుకు.. నన్నెవరో తిడుతానట్టూ, నా గోడల్ని బండలతోటి కొడుతనట్టు… గోడలు కూలి నామీదే పడుతానట్టూ పిచ్చిపిచ్చికలలు వచ్చి గజ్జుమని ముడుచుక్కూచుంటాన.. అసలు మనసు మనసుల ఉంటలేదు..

ఇసంటప్పుడే నాకు ధైర్నం మాటలు చెప్పి పక్కకుండాల్సిన మావోళ్ళు, చిత్రంగా నాతోనే మాట్లాడుడు బంజేషి, నా వెనక గుసగుసలు మొదలుపెట్టిన్లు…

“వీడిమధ్య ఉట్టుట్టిగనే గరమైతాండు” అని ఒకడంటే..

“గరం కాదు… గర్ర పెరిగింది వానికి” అని ఇంకోడు…

“గరంలేదు, గర్రలేదు.. పిస్స లేశింది వానికి, అందుకే అట్ల పిస్స పిస్స ఒర్రుతాండు” …

“నాకు మొదాల్నుంచే వాని మోర అంత ఎరికే గనీ.. మీరే నెత్తిల వెట్టుకోని ఊరేగుతాన్లని సప్పుడు జేకుంట ఉన్న..” అని ఇంకొకడెవరో అంటాండంగనే నాకు తిక్క రేగింది…

“ల.. ల్లారా.. మీరెవలుబే నా గురించి అనుటానికి.. ల.. ల్లారా.. మావోళ్ళుగదాని మీ సోపతికస్తే నా నోట్లెనే… ల.. ల్లారా.. అసలు మిమ్ముల మావోళ్లనుకోడం నాదే తప్పు.. ల… మళ్ల నా గురించిగిన ఇంకొక్క మాటిడిశిన్లో..” అని ఇర్గమర్గ దులుపుడు దులిపి జరసేపటికి దమ్మచ్చి ఆగిన…

నా నోరైతె ఆగిందిగని.. మనసు మాత్రం ఆగలే.. ఓదిక్కు మొస ఆడుతలేదు.. గుండె గబగబ కొట్టుకుంటాంది.. కోపంతోటి గోడని గట్టిగ గుద్దిన.. ఏం లాభం, మళ్ల నాకే దెబ్బతాకి నొప్పి లేశే…

పిచ్చి పిచ్చిగా అనిపిస్తోంది.. బొండిగ నరాలు తెగుతయా అన్నంతగా ఒర్రీ ఒర్రీ ఇగో.. ఈ మూలకు కూలవడ్డ… నిశ్శబ్దంగా.. నిస్సహాయంగా..

అగో సరిగ్గ అప్పుడచ్చింది.. ఏడికెళ్లి వచ్చిందో ఎర్కలే గనీ సర్రున వచ్చి నా చెవులల్లకు సూటిగా సొర్రింది..

“నమస్తే భయ్ సాబ్… నేనూ.. డాక్టర్ ని…”

అయితే?

“నేను చాన రోజులసంది నీ మీద నజర్ పెట్టిన…”

ఏమిటికి??

“ఉట్టిగనే.. నువ్వేమనుకోనంటే నీతోటొక ముచ్చట చెప్పాలె భయ్.. ”

నాకెవ్వరు ఏం జెప్పుడద్దు.. చల్..

“నా గురించి కాదు.. నీ గురించే చెప్పాలె”

నా గురించి చెప్పేతందుకు నువ్వెవరయా.. ఔసరంలే.. నా మానాన నన్నిడ్శిపెట్టిపో.. నడూ.. చల్..

నేను వద్దంటున్నా వాడి ఇడ్శిపెట్టేటట్టులేడు… “చెప్పాల్నా.. చెప్పాల్నా..” అని అడుక్కుంటనే ఉన్న ముచ్చట బయటవెట్టిండు –

“నీకు మెల్లమెల్లగ ‘షిజోప్రీనియా’ వస్తాందని నాకు చిన్న అనుమానం కొడ్తాంది భాయ్ సాబ్ ”

ఏందీ???? షీ…. జో.. ప్రీనియానా??? అంటేందీ??

“అంటే.. భయ్యా.. అదీ…. అదీ… నీకు సైకో అంటె ఎర్కే కదా?? అగో.. అట్ల తయారవుడన్నట్టు..”

వాడామాటనంగనే నాకు మళ్ల సర్రుమని పొడుసుకచ్చింది..

“అరె.. భయ్యా.. నా ఉద్దేశంనువ్వు సైకో అనిగాదు.. కాపోతె ఇట్లనే పట్టించుకోపోతే….” అని ఇంకేందో చెప్తాండంగనే వానిమీదికి ఒంటికాలుమీద లేచిన..

సువ్వర్ కే.. నువ్వేరా సైకోగానివి.. మీ అందరికే రోగం ముదిరి, నన్ను అంటాన్లు.. లమిడికొడకా.. పో బే.. పో.. సైకో అట సైకో.. నువ్వే పెద్ద సైకో గానివి.. అసల్ నిన్నీడికి ఎవడ్రమ్మన్నడ్రా??

ఏమనుకున్నడో ఏందోగని సప్పుడుచెయ్యకుండ ఎట్లచ్చినోడు అట్ల ఎళ్ళిపేండు.. వాడు సప్పుడుచెయ్యకుంటేంది, వాడన్న “సైకో” అనే మాటలు ఇంకా నా చెవుల్లో వినపడ్తున్నాయి…

నిజంగ నేను సైకోలెక్క చేస్తున్ననా?? నేన్ శాడిష్టుగాన్నా??

అసలు ఏందిదంతా?? దేనికోసం ఇదంతా?? వాడెవడో అచ్చి నాకు చెప్పుడేంది??

వాడు నన్ను చానరోజులసంది గమనిస్తానా అన్నడు.. అంటే అప్పటికీ ఇప్పటికి నేన్ మారిన్నా??

ఆలోచిస్తే అవుననే అనిపిస్తాంది..

అవుతల ఉన్నప్పుడు నవ్వుకుంట నలుగురిల కలిశే నేను.. ఇయ్యాల ప్రతీ ఒక్కణ్ని విమర్శించుడు, తిట్టుడు.. మాట్లాడ్తె లొల్లి.. కనిపిస్తె కొట్లాట.. మునుపు నేనెట్లుంటి, ఇప్పుడు ఎట్లయినా??

******

అసలు నేను చచ్చిపోయి చాన దినాలైనట్టుంది.. నా పానం పొయ్యిందన్న ముచ్చటే నాకిప్పటిదాకా సమజ్ కాలే చుషిన్లా!!

మస్తు బాధైతుంది.. ఒక్కణ్ణే కూసోని ఏడవాలని ఉంది.. కాదు కాదు నాకు మళ్ల బతకాల్నని ఉంది… బయటికి పోతే బతుకుత కావచ్చు… కానీ ఎట్లపోవాలె? అసలు బయటికి పొయ్యే తొవ్వేది………….!!!!

ఈడ నా చావు నేను చస్తుంటే.. ఎక్కడ్నో ఓ మూలకు ఒకడు వాడు ప్రేమించిన పిల్లను యాదిచేసుకుని కలవరిస్తున్నడు.. ఇంకోచోట ఒకడు సినిమా పాటలు పాడుకుంట పిల్లకూతలు కూస్తాండు.. ఒకడు, బైటికిపేనంక మీ ఓటు మావోనికే గుద్దాల్నని బతిమాల్తాంటె, ఇంకొకడు అదేపనిజెయ్యమని ఎవన్నో బెదిరిస్తాండు.. ఓ దిక్కు కడుప్పలిగేటట్టు కొందరు నవ్వుకుంటాంటే, ఇoకోదిక్కు కష్టాల్ల ఉన్నం కాపాడున్లని కొందరు శోకాలు పెడ్తాన్లు..

ఒక్కో మూలకు ఒక్కోనాత్మ.. ఒక్కో ఆత్మకు ఒక్కో కథ.. ఆశలు, ఆశయాలు… బాధలు, బంధాలు.. కోపం, ప్రేమ.. క్రూరత్వం, కరుణ.. జాలీ, ఆకలీ.. నవ్వులూ, ఏడుపులూ.. చిలిపిసర్సాలు, చిరాకుపడటాలు.. కలలు, కళలూ.. అనుభవాలు, అభిప్రాయాలు… ఆవేశాలు, ఆలోచనలూ.. కొట్లాటలు, కౌగిలింతలు.. ఒకటారెండా దేన్నీ విడిచిపెట్టకుండా ఎవనికి వాడు ఏదనిపిస్తే అది చెప్తనే ఉన్నరు.. ఇయన్నీ నా చెవుల్ల దూరి మనసుల తుఫాను లేపుతున్నయి..      ఈ తుఫాను పేరు అశాంతి..

అందర్ని దొరికిచ్చుకోని కొట్టాల్ననుంది.. దొరికినోన్ని దొరికినట్టు కొరుకబుద్ధైతాంది.. గోర్లతోని గీరి, మీదపడి గిబ్బ గిబ్బ గుద్దబుద్దైతాంది.. నన్ను నేను ఆపుకోవశమైతలేదు కానీ కొడ్దామంటే చేతికందరాయె..

అందుకే నా గొడల్ని నేనే గుద్దుడు మొదలువెట్టిన… చేతులిరిగినయ్.. అయితేంది కాళ్ళున్నయ్ కదా… ఎగిరెగిరి తంతాన… కాళ్ళిరిగి కూలవడ్డ.. అయితేంది నోరున్నదికదా.. కొరుకుడు షురూ చేష్న… పండ్లిరిగి నోరంత నెత్తురు ముద్దైంది… అయితేంది తలకాయున్నదికదా.. నెత్తిని గోడకేశి కొట్టుకున్నా.. పుర్రెకు పొక్కవడి నెత్తురు ధారలు కట్టింది…. ఒళ్ళంత మాంసం ముద్దయింది.. అయినా నా కోపం సల్లార్తలేదు.. పిస్సలేత్తాంది.. ఇక్కడ ఒక్క నిమిషంసుత ఉండబుద్ధైతలేదు… పోవాలె నేనేడికన్న పోవాలె…

*****************

అంతే.. జైలు నుండి పారిపోయి అవుతలికచ్చేశ్న….

ఇక్కడంతా వెలుగే.. చాన రోజులు ఆ చీకట్లో మగ్గినందుకో ఏందోగనీ ఇంత వెలుతుర్ని అస్సల్ చూడ వశమేఐతలేదు..  జరసేపు ఓపికవడ్తె నా కండ్లకు అలవాటయ్యి అంతా మాములుగా ఐపోతదనుకున్నగని అట్లా అయితలేదు..

“నీళ్ళల్ల నుంచి ఒడ్డుకు దూకిన చాప పిల్ల లెక్క ఉంది నా యవ్వారం..”

నా కనురెప్పలు కాలిపోతయన్నంత వెలుతురు..

ఎంత కష్టమైనా తప్పదు కాబట్టి అరచేతుల్ని కండ్లకు అడ్డంపెట్టుకోని మళ్ళీ బ్రతకాడానికి నా తిప్పలేవో నేను పడుడు అలవాటు చేసుకున్న……

కనీ… కనీ.. ఈడ.. కూచున్నా, నిలుచున్నా, పనిలో ఉన్న, పడుకోనున్నా.. ఏ చోటున్నా, ఏం పని చేస్తున్నా.. ఆ జైలూ.. అక్కడి మనుషులే యాదికొస్తున్లు.. ఆ జైల్ల ఊకె ఎప్పుడు ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడ్తుండేది.. కాని ఇక్కడ నేను మందలించినా మాట్లాడేమనిషే కరువైండు…

ఇయన్నీ కానట్టు, నేను జైల్ నుంచి పారిపోయొచ్చానని తెలిసినోళ్లు చానమంది నన్ను మళ్ళి అక్కడికే పొమ్మని.. లొంగిపొమ్మని చెప్తున్నరు..

“భయపడుకుంట బతికేదానికంటే” అదే మంచిదని సలహా ఇస్తున్నరు..

ఇదేమాట ఆ జైలు చీకట్ల ఎవలన్న అనుంటే ఈపాటికి సర్రసర్ర నాలుగు మాటలిడ్సిపెట్టి వాళ్లకు మాట రాకుంట చేశెటోన్ని.. కానీ ఇక్కడ ఈ వెలుతురుల అసల్ నాకు “కూతే” ఎల్తలేదు.. దానిక్కారణం నా అవతారం, నా ఆకారం, నా ఒంటి రంగు, నా చిల్లి కీస.. చీకట్ల ఉన్నప్పుడు వీటినెవడు చూడలేడు కాబట్టి అప్పుడు నాకు మస్తు ధైర్నం ఉండే… కానీ ఈ వెలుతుర్ల నా బతుకు మొత్తం బజార్లో బరివాత కనిపించవట్టె!! ఇంత “చిన్నోన్నని” ఎదురుంగ కనవడ్తనే ఉంటే, ఇంక నన్నెవరన్న కానుతరా ఈడ..!!

అసల్ ఆ చీకట్లనే మంచిగ బతికినట్టున్నకదా??

ఏదన్న పోయినంకనే దాని విలువ ఎర్కైతదంటరు.. నిజమే.. నాకిప్పుడు ఆ చీకటే మంచిగనిపిస్తాంది..

ఆ చీకట్లనే నాకు నచ్చినట్టు నేను బతకచ్చు.. మంచిగ.. గొప్పగా..

“గొప్పగా” అంటె మతికచ్చింది.. నాకున్న గొప్ప పరిచయాలన్నీ ఆన్నే ఉన్నయ్..

అసల్ వాటిని కొసెల్లదియ్యకుంట మధ్యల్నే ఇడ్శిపెట్టొచ్చి మస్తు పెద్ద తప్పు చేశ్న!!! అరెరే.. ఎంత పెద్ద పొరపాటయిపాయె..! ఈ ఆలోచన పుట్టుడే ఆలిశం గబగబ బయలెల్లి మళ్ల ఈ చీకటి జైలుకు లొంగిపోయిన..

ఈసారి మాత్రం మొదాలచ్చినప్పుడు ఉన్నన్ని అనుమానాలు, భయాలూ లేవు… ఎంత జైలైనాగాని బాగా అలవాటైన జాగ కదా!! నా సెల్లులకు అడుగెయ్యంగనే “ఇంట్లకు” వచ్చినట్టే ఉంది….

మస్తు ఖుషీల అందర్ని ఓసారి మందలిద్దామని – “ఏమాయ్..అంత మంచేనా.. నీను మళ్లచ్చిన గాదుల్లా..” అని అందరికి వినపడేతట్టు గాట్టిగ కీకేశిన..

కని ఎవ్వలు జవాబియ్యలే…

అరే!! ఇనిపియ్యలేదా ఏందని.. “నేను మళ్లచ్చిన్నే..” అని ఈసారింకింత గట్టిగ కీకేశిన..

మళ్ల గంతే…. జవాబులేదు..

అసల్ ఈడ మొత్తం అందరు నాకోసం చూస్కుంట కూసోనుంటరు, నేన్ అచ్చుడుతోటే-

“ఎమాయెనే, ఎట్లున్నవ్, ఏడికిబోతివి, అంత మంచేనా, నువ్వు లేకపోతె అస్సల్ పొద్దుగడవలే, దినాము నువ్వే మతికచ్చినవ్” అనిచెప్పుకుంట నాకు మొసమర్రకుంట జేత్తరనుకున్నగనీ.. ఈడ సూత్తె అసలు ఒక్కడుసుత నా రాకను, కీకను పట్టించుకోకుండ మళ్ల గదే ఎవని ముచ్చట్ల వాడున్నడు..

“ఇదేంది ఇట్లైందను”కుంటున్నంతల ఎవరో ఒకలు-

” యేడికి పేనవని మళ్లచ్చినా అంటున్నవ్??” అని పుర్సతుగ అడిగిండు..

ఇదేంది!! గిట్లంటుండు?? అసల్ ఇన్నిరోజులు నీనిక్కడ లేనన్న సంగతే వీళ్లకు ఏర్పాటుపడలేదా!! అంటే నేన్ సచ్చిన్నా బతికిన్నా కూడా వీళ్ళకు పెద్ద ఫరఖు పడేదేం లేదన్నట్టేగదా అర్థం!! ఈ గాడిదికొడుకుల కోసమనే నేన్ వెనుకకు మర్రచ్చింది??

ఇంక లాభం లేదు.. ఏదన్నొకటి చేసి మళ్ళ అందరు నన్ను పట్టించుకునేటట్టు చేస్కోవాలె.. అందరు నేనంటే పడి సచ్చిపోవాలె…. నన్ను జబ్బలమీదికెత్తుకోని జై కొట్టాలె.. ఏం జెయ్యాలె.. దానికోసం నేనేంజెయ్యాలె..

ఠక్కున ఒక ఉపాయం తట్టింది.. ” పెద్దోళ్ళ”తోటి నాకున్న పాత పరిచయాలను మళ్ల పెద్దగ చెయ్యాలె.. గంతే.. గా ఒక్క పని చేస్తె చాలు… చేత్తెసాలు.. కిస్సా ఖతమైనట్టే.. పెద్దోళ్ల పరిచయాలు మనల్నిసుత పెద్దోళ్లలెక్కనే సూపెడ్తయిఅన్నదే ఇండ్ల సూత్రం..

ఒక్క నిమిషం ఆలిశం చెయ్యకుండా పెద్దోళ్లందరినీ వరుసబెట్టి -“నమస్తే అన్నా.. ఎట్లున్నవే.. చాన రోజులైంది మాట్లాడి.. పురాగ సప్పుడుజేత్తలెవ్వేందన్నా.. ఈ మద్య అసల్ నాతోని మాట్లాడ్తనే లెవ్వు.. అంతేలే అన్నా మేమెందుకు యాదికుంటం..?? అదన్నా.. ఇదన్నా…” అనుకుంట దొర్కిన ప్రతీ ఒక్కన్ని పేరుపేరున పలకరించిన…

కనీ ఈడ సుత నన్నొక్కడూ గుర్తుపట్టలే..

వాళ్లతోని ఇంకింత చనువుగ మాట్లాడ్తెనన్న మతికొస్త కావచ్చునని ఆ ప్రయత్నమూ చేశినకనీ ఈసారి బూతులు తిట్టించుకునేదాకా వచ్చిందీ.. ఏం చేసినా వాళ్లు నన్ను అస్సల్ గుర్తే పడ్తలేరు..

పుండుమీద కారం చల్లినట్టు, పాత దోస్తులు కొందరు నా ఈ చిల్లర చాష్టలన్ని గమనిస్తూ చాటుగా నవ్వుకునుడు వినపడ్తాంది.. పెద్దపరిచాయాలు నన్నుసుత పెద్దగ చేస్తయనుకున్నగనీ, ఇట్ల చిన్నబుచ్చుకునేటట్టు చేస్తరనుకోలే… వాళ్లు చూసే చిన్నచూపుకు నాది నాకు మళ్ల చిన్నగా అవుపిస్తున్న.. ఇంత విశాలమైన విశ్వంల నేనో గడ్డిపొరకను.. ఈడ నేనున్నా లేకున్నా ఎవ్వనికివట్టదు..

అసల్ ఏ తప్పు చెయ్యని నన్నీడ బందీగ పెట్టుడే కాకుంట, మళ్ల నాకు కొత్త కొత్త అలవాట్లు నేర్పించి వాటికి బానిసను చేస్తిరి.. వెలుగుల పుట్టి పెరిగిన నన్ను ఆ వెలుతురంటేనే బెదురుకసచ్చేటట్టు మారిస్తిరి… నన్నెటుకాకుండ చేశి “త్రిశంకు స్వర్గంల” కూసోబెట్టిన మీరె మళ్ల నన్ను దూరంగొట్టి పగోని లెక్క సూడవడ్తిరి.. గింత అన్నాలముంటదా ఏణ్నన్న??? మనిషులన్నంక కొద్దిగన్న నియ్యత్ ఉండద్దా..

ఇయన్ని మతికచ్చి గుండె చెరువైతాంది, కండ్లు బరువయితానయ్..

ఊకోమ్మన్ని ఓదార్చటానికి పక్కకు ఓ భుజం లేదు.. అయ్యో పాపం అన్న నోరే కానొస్తలేదు..

ఏడవాల్నని ఉన్నా ఏడుపురాకుంటే.. ఆ నొప్పంతా మనస్సులనే పెట్టుకోని, బాధను పంటికింద ఒత్తిపట్టి, కన్నీళ్ళను కండ్లల్లనే బలిమీటికి దాచిపెడ్తే అప్పుడు మన కoడ్లుగుంజినట్టయ్యి ఒక భయంకరమైన బాధ ఐతది చూడు…. అగో, అచ్చం గసొంటి బాధే ఇప్పుడు నా పెయ్యి చుట్టుత కమ్మింది..

పెయ్యంత బాధే.. దీన్ని ఓర్చుకునుడు నాతోని కాదు.. అబ్బా… వశపడనంత నొప్పి…

“వావ్వో.. ఎవలన్న రాండ్లి.. బాంచెన్… కాపాడున్లి.. మీకు పున్నెముంటది.. జెప్పనరాండ్లి బాంచెన్… కాపాడున్లి.. కాపాడున్లి..” అని కలవరిస్తాంటే.. చప్పున తెలివివడ్డది.. ఉలిక్కిపడి లేసి కూసున్నా.. చుట్టూత గదే చీకటి..

అంటే నేను జైలునుంచి పారిపోకట, మళ్ళ రాకట ఇదంత కలల్నా!!!

*****************

ఇప్పుడా డాక్టర్ తోని ఒక్కపారి మాట్లాడ్తె మంచిగుండనినిపిస్తాంది.. “కానీ ఏ మొఖం పెట్టుకోని మాట్లాడ్త! ఆయినెను సుత తిట్టినగదా..” నేనింట్ల అనుకుంటానంతట్లనే మళ్ల అదే గొంతు సర్రున నా చెవుల్లకు సొర్రింది…..

“నాతోటి మాట్లాడుటానికి గంత సోచాయించవడ్తివేందే?” అని నవ్వుకుంట అన్నడు…

అగ్గో!! అసల్ నేన్ నిన్నే యాది జేస్కుoటాన అని నీకెట్ల ఎర్కయిందయ్యా??

“నాకన్ని ఎర్కైతయ్.. నువ్వు నాతోని ముచ్చట పెడ్తా అనుకున్నవ్గదా.. అందుకే అచ్చిన..”

ముచ్చటంటె ముచ్చట కాదుగనీ.. నేను గుణుగుడు పెట్టిన..

“”అవుతలికిపోవుడు” మీద మనసుగొట్టుకుంటందా??”

అంటే.. అదీ.. బయటికి పోదామని మా ఉన్నదిగనీ… పోతె ఆడ బతుకలేనని భయం సొచ్చిందే…

“ఇప్పుడు నువ్వు బతికే ఉన్నా అనుకుంటున్నవా ఏంది?? సచ్చే ఉంటివిగదా.. ఇంక మళ్ల సస్తా అన్న భయమేమిటికి?? బేఫిఖర్ బయటికిపో..”

ఈనెకు నా బాధ అర్థంకాలేదని.. నాకచ్చిన కల మొత్తం చెప్పిన….. ఆయినె కల మొత్తం విని….

“అచ్చా ఒక్కటి చెప్పు.. కలలో బయటికిపెయ్యచ్చినవ్ కదా..”

ఆ..

“నువ్వు వెనక్కు మర్రచ్చింది ఆ వెలుతురు తట్టుకోలేకనా?? ఈ జైలు యాదిమర్చిపోలేకనా???

నేను ఆలోచనలవడి ఖామోష్ అయిన.. ఆయినె మళ్ళడిగిండు-

“నువ్వు వెనక్కు మర్రచ్చింది ఆ వెలుతురు తట్టుకోలేకనా?? ఈ జైలు యాదిమర్చిపోలేకనా???

రెండూ.. నేనన్న…

“లేద్ లేదు.. దేంది దానికే ఉంటదిగని రెండెట్లైతయి.. ఐతే చిత్తు?? లేకుంటె బొత్తు?? ఏదన్నొక్కటె ఉంటది… చిత్తా, బొత్తా అన్నది నీకే తెల్వాలె..”

ఆయినె తర్కానికి ఈసారి బేహోషైనంత పనైంది.. నేన్ ఆలోచన్లవడ్డ!!

ఇంతల మళ్ళ ఆయినే-

“సరే.. నీ జవాబు చిత్తేగానియ్, బొత్తేగానియ్.. ఆటల గెల్వాల్సింది మాత్రం నువ్వే అని యాదికిపెట్టుకో సాలు..”

బయటికి పోతె గెలుస్తా అని మాగనిపిస్తాందికని బయటోళ్ళు నన్ను దేకనుకూడ దేకరనే నా బాధ.. అని నాకున్న అసలు సమస్య చెప్పేశ్న….

అప్పుడు ఆయినె చిరునవ్వు నవ్వుకుంట-

“అందుకే గాంధి తాత ఓ మాట చెప్పిండు – Be the Change that You Wish To See in the World అని”…

అంటే??

వాళ్ళు ఎట్లుండాల్నని నువ్వు ఆశపడ్తానవో.. నువ్వే అట్ల మారుమని..

వాళ్లు నిన్ను నిన్నుగా మెచ్చుడనేది నీ చేతుల్ల లేకపోవచ్చు కనీ… వాళ్లను వాళ్లుగా ప్రేమించడనేది నీ చేతుల్లనే ఉందికదా… వాళ్ళు నిన్ను కలుపుకోకపోతె ఏంది, నువ్వే పొయ్యి వాళ్లతోని కలువు..

చీకటిపోగొట్టేతందుకు సూర్యుడినే పట్టుకరావల్సినపనిలేదు.. చిన్న దీపం ముట్టించినా సాలు…”

ఈ మాటలిన్న మరుక్షణం..

నాకున్న ప్రశ్నలన్నీటికి ఇన్నాళ్లకు జవాబు దొరికిందనిపించింది.. అందుకే ఒక్కసారిగ ‘అశాంతి’ తుఫాను విచ్చుకపొయ్యి మనసంత ప్రశాంతంగయ్యింది.. మనసింత నిమ్మలంగుండి ఎన్ని రోజులైందసలు!!

ఒక్క ముక్కల జిందగి మొత్తం సముజాయించిండు డాక్టర్ సాబ్.. ఆయిన్ను గట్టిగ కౌగిలించుకోని “షుక్రియా భాయ్ సాబ్” అనాల్నని ఉన్నదికని ఆయినె లేడు.. ఎళ్లిపేండు….

పొయ్యేటోడు ఉట్టిగ పోకుంట… నా కోపం, దుఃఖం, బాధలు, భయాలు, గుబులు, దిగులు మొత్తం అన్నీట్నీ తనతోటే కొంటవోయిండు.. పోంగ పోంగ ఒక్కటి మాత్రం నాకోసం ఇడిశిపెట్టి పోయిండు.. అది మిణుగురుపురుగు లెక్క మిణుకు మిణుకు మంటాంది. దాని వెలుగు కొద్ది కొద్దిగ పెద్దగ అవుతూ నా దగ్గరికి.. నా లోపటికే వస్తాంది..

సొచ్చమైన మా అవ్వ ప్రేమలాగా..

నాయిన్ను చూస్తే కలిగే కొండంత ధైర్నంలాగా..

నాకో భుజాన్నిచ్చి ఎంబడుండే మా అన్న తోడులాగా…

నన్ను నన్నుగా చూశే నా దోస్తుల సోపతిలాగా…. అచ్చంగ నాకోసమే వచ్చిందా వెలుగు…..

అప్పుడే విచ్చుకున్న పువ్వులాగా.. పసి పాప బోసినవ్వులాగా ఎంత అందంగున్నదా వెలుతురు.!

తృప్తిగ కండ్లుమూసుకుంటే నా లోపట కూడ అదే వెలుగు వెలుగుతాంది..

“పానం” ఎట్లుంటదనే నా అనుమానం ఇప్పుడు తీరింది..

“వెలుగే పానం”..

ఆ వెలుగుల, నా కొట్టానికోకొసకున్న జైలు తలుపులు.. బయటికి నడిచే తొవ్వ కనిపిస్తున్నయి..

మెల్లగా అటుదిక్కు నడిచి తలుపులు తెరిచి, అవుతలికి అడుగుపెట్టాను……

                                                  

“Your Facebook Account Has Been Deactivated….. Successfully…..”

 

నేనిప్పుడు మళ్లీ పుట్టిన.. నాకిప్పుడు ఓ బతుకుంది……….

 

-అల్లం కృష్ణ వంశీ

కార్తీక పక్షం

మా ఊరి మంచినీటి చెరువులో
విష్ణుమూర్తి శయనిస్తాడని
బంగారు పట్టీలు వెల వెల బోయిన
రేవులో నీ పాదాలు చూసే క్షణం వరకూ తెలీదు
పాల కడలిలో ముంచి తీసినట్టున్న నీ పాదాలు
దాటి నా కనులు ఒక్క అంగుళం పైకి లేవలేదు
అమ్మలక్కలు ఎవరో ఈ అబ్బాయి సిగ్గరి అన్నారు

అడుగులతోపాటూ మోగిన మువ్వలన్నీ దగ్గరయ్యాక చూస్తే
ఆదీ అంతం తెలీని నల్లని గుప్పిట పట్టని
మడాలకి అంటీ ముట్టని వాలుజెడ
నాకు బిగిసీ బిగియని ఉరితాడు

మర్నాడు ఎవరో పిలుస్తున్నట్టు
ఈపూట నారాత ఏ రాలపాలో ఎంకిపాట
ఆ ఇంటి పెరటి తలుపు తోయగానే
సూర్య చంద్రులని ఏకకాలంలో ధరించిన వదనం
ఎందుకొచ్చారు అనగానే
మూగబోయి మాయమైన వేళ
రాజుగారబ్బయి మజ్జిగకి వచ్చాడని
నోరు పండించుకొంది రంగి

ఒక కథని ఎన్ని కాశీమజలీ కథలుగా చెప్పుకుందో ఊరు
మాది మరో లోకం
తలవెంట్రుకల చివర ముడేసిన వుసిరికాయలు
తింటూ తన వళ్ళో విన్న కథలు
ఇంట్లో మాయం చేసిన గోరింటాకు
అరికాలిలో పెడుతుంటే తను తిరిగిన మెలికలు
రాతి రాత్రి కరగడానికి రాసుకున్న ప్రేమలేఖలు
ఏశీత కన్నుపడిందో అరుగులమీద గాలి ఊరంతా పాకింది

తెల్లవార్లూ పగలూ రాత్రులూ తెరిపి లేకుండా
కోడై మమ్మలని ఊరు కూసిన తరువాయి
ఆమె పెరట్లో నరికిన అరటి చెట్టయ్యాక
ముంగిట్లో పందిరికి నన్ను వేలాడదీసాకా,
మా అమ్మ వీడిని నమ్ముకొని లాభం లేదని పనికిరాడని కొబ్బరిమొక్క నాటింది

అమ్మలక్కలు మాటలు మానేసి తప్పుకు తిరుగుతున్నారు
మీసాలూ గడ్డం కొబ్బరి చెట్టుతో పాటూ కాపుకొచ్చాయి
ఆరు రుతువులూ ఆరు కాలాలు దాటినా
ఆ రేవుకి కార్తీక మాసం రావటం మానలేదు

అతడు ఆ రేవుకు రావడం మానలేదు
ఇప్పుడతను కాళ్ళనుకాక మొఖాలు వెతుకుతున్నాడు
ఆరాత్రి చందమామ రాలేదు
చెరువు నిండా ప్రతిబింబాలతో
పోటీ పడుతున్న దీపాలు కళ్ల నిండా నింపుకొని
రెండుకాళ్ళూ ముంచి ఆఖరి మెట్టుపై కూర్చొని అతడు

అద్బుతం ఏమీ జరగలేదు
తెల్లవారుజాము మంచులో దీపాలన్నీ ఒకేసారి కొండెక్కాయి.

-వర్మ కలిదిండి

మర్చిపోయిన చరిత్రలో చిందిన ఎర్ర చుక్కల కేకలు నావే!

untitled

బ్రిటిష్ సాహిత్యం తో ఎక్కువ స్నేహం చేసిన అన్ని భారతీయ భాషల లానే తెలుగు సాహిత్యంలో కూడా బైరాన్, బ్రౌనింగ్ , కీట్స్ , వర్డ్స్ వర్త్ లాంటి కొన్ని పాపులర్ పేర్లు (వాళ్ళు సాహిత్యానికి చేసిన సేవ యే రకంగాను తక్కువ చేయటం కాదు ఇక్కడ ) ఇంకా కొంచం ముందుకెళ్ళి సోవియట్ యూనియన్ దోస్తీ తో రష్యన్ సాహిత్యం అలవాటు అయ్యాక లియో టాలిస్టాయ్ , మాక్షిమ్ గోర్కీ లాంటి హేమాహేమిల పేర్లు విన్నా కూడా , అటు అమెరికన్ సాహిత్యం , ఇటు ఆఫ్రికన్ అమెరికన్ లేదా ప్యూర్ ఆఫ్రికన్ లిటరేచర్ తో మనకున్న పరిచయము తక్కువే అని చెప్పుకోవాలి . అందులోనూ పోయెట్రీ విషయం లో ఇంకా కొన్ని వందల వేల పోయెట్స్ గురించిన కనీస జ్ఞానం కూడా మనకి ఇంకా దూరంగానే ఉంది .

ఇంటర్నెట్ విస్తృతంగా వాడకంలోకి వచ్చాక అక్కడక్కడ  మాయ అంజేలో  లాంటి ఉద్వేగ రచయితలు పరిచయం అయినా , ఇంకా తెలుసుకోవాల్సిన కవులు , చదువుకోవాల్సిన కవిత్వం హిమాలయాలంత మిగిలే ఉంది . ఈ ప్రయత్నం లో ఎవరెస్ట్ ఎక్కలేకపోయినా ( మొత్తంగా అందరి గురించి తెలుసుకోలేకపోయినా ) కనీసం ఉన్నంతలో దగ్గరలో ఉన్న గుట్ట కొండ ఎక్కి కొంత తెలుసుకున్నాం అన్న తృప్తి కోసం ఈ సారి మనం పరిచయం చేసుకుంటున్న కవి అబ్రహం లింకన్ ని పులిట్జర్ ప్రైజులని తన జీవితం లో భాగం గా మార్చుకున్న కార్ల్ సాండ్బర్గ్ .

కార్ల్ సాండ్బర్గ్ , స్పానిష్ అమెరికన్ వార్ దగ్గరుండి చూసిన ఈ రచయిత పెద్దల యుద్ధపు తమాషాలో బలయిపోతున్న పేదల గుండెల చప్పుళ్ళ గురించే ఎక్కువ రాసారు అంటే వింత ఏమి లేదు కాని మూడు సార్లు తన సాహిత్య సేవలకి గాను పులిట్జర్ ప్రైజులు అందుకున్న గొప్ప రచయిత గ్రామర్ పరిక్షలలో ఫెయిల్ అవ్వటం మాత్రం విచిత్రంగా అనిపిస్తుంది . ముప్పైల కాలం లో అమెరికా జీవితాన్ని చూపడమే కాదు , ఇప్పటికీ చాలా దేశాల దుస్తితి కి కూడా వర్తించేలా ఉండే గ్రేట్ డిప్రెషన్ పీక్ స్టేజి లో ఉన్న సమయం లో సామన్య ప్రజల భాషలో రాసుకున్న ఈ కవిత చదవటం అదే సామాన్యుల హృదయం చదివినట్లే ఉంటుంది .

ఒక పూర్తీ పుస్తకం కి సరిపోయే దాదాపు ౩౦౦ పేజీల “ The people ,yes “   లో మొత్తం పాదాలు చదువుకోలేకపోయినా అందులో ప్రజలను మోసగించిన ప్రజాప్రభువులకి ప్రజాగ్రహం గురించి హెచ్చరిక చేసిన కొన్ని పాపులర్ పంక్తులు ఇలా ఉంటాయి .

 

“ నేను ప్రజలు _ఆకతాయిమూక_ గుంపు _ మాస్

ప్రపంచంలోని అన్ని గొప్ప పనులు నాద్వారే జరుగుతాయి తెలుసా

నేనే సృష్టికర్త , నేనే పనివాడు

ప్రపంచంలో అన్నం బట్టల తయారీ అంతా నేనే

 

చరిత్ర ని చూస్తున్న ప్రేక్షకుడిని నేనే , సాక్షము నేనే

లింకన్లు నేపోలియన్లు నా నుండే వస్తారు , చస్తారు ,

అలాంటి ఇంకెందరినో తయారు చేసేది నేనే

నేనే విత్తు భూమి నేనే నాగలి

….

…..

….

మర్చిపోయిన చరిత్రలో చిందిన   ఎర్ర చుక్కల కేకలు నావే

….

ప్రజలనబడే నేను

నిన్నటి పాఠాలు గుర్తుంచుకొని ఎపుడయితే

నిరుడు సంవత్సరాల వరకు జరిగిన దోపిడీని

నన్ను అవివేకి ని చేసి ఆడుకున్నదేవరో

మర్చిపోకపోతే

ఎగతాళి కి కూడా

ఇహ “ప్రజలు “ అనే వారే ఉండరు

అపుడు మిగిలేది

ఆకతాయిమూక_ గుంపు _ మాస్ మాత్రమే …..

అంటూ ప్రజలని మోసగించిన ప్రజాప్రభువులకో హెచ్చరిక చేస్తూ “

 

ఒరిజినల్ పోయెమ్ అవే పంక్తులు

 

“I am the people—the mob—the crowd—the mass.

Do you know that all the great work of the world is done through me?

I am the workingman, the inventor, the maker of the world’s food and clothes.

I am the audience that witnesses history. The Napoleons come from me and the Lincolns. They die. And then I send forth more Napoleons and Lincolns.

I am the seed ground. I am a prairie that will stand for much plowing. Terrible storms pass over me. I forget. The best of me is sucked out and wasted. I forget. Everything but Death comes to me and makes me work and give up what I have. And I forget.

Sometimes I growl, shake myself and spatter a few red drops for history to remember. Then—I forget.

When I, the People, learn to remember, when I, the People, use the lessons of yesterday and no longer forget who robbed me last year, who played me for a fool—then there will be no speaker in all the world say the name: “The People,” with any fleck of a sneer in his voice or any far-off smile of derision.

The mob—the crowd—the mass—will arrive then.”

వీలయితే మరో సారి మరో కవి , మరో ఉద్వేగభురితమయిన కవిత తో …

 -నిశీధి

పెద్రో పారమొ-10

pedro1-1

చాలాకాలం క్రిందట మా అమ్మ చనిపోయిన మంచం మీదే పడుకున్నాను. అదే పరుపు పైన, మమ్మల్ని నిద్రపుచ్చేముందు మాపై కప్పే ఉన్ని దుప్పటి కింద. ఆమె పక్కనే పడుకుని ఉన్నాను, ఆమె బుజ్జాయిని. తన చేతుల మధ్య నాకోసం ఏర్పరచిన ప్రత్యేకమైన చోటులో.

ఆమె నెమ్మదిగా ఊపిరి తీసే లయ నాకు తెలుస్తూందనుకుంటాను. ఆ అదురుపాటూ, నిట్టూర్పులూ నన్ను నిద్రపుచ్చుతూ.. ఆమె చావు బాధ నాకు తెలుస్తుందనుకుంటాను… కానీ అది నిజం కాదు.

ఆ రోజుల్ని తల్చుకుని నా వొంటరితనాన్ని మర్చిపోవాలనుకుంటూ నేనిక్కడ వెల్లికిలా పడుకుని ఉన్నాను. నేనిక్కడ కొద్ది కాలమే కాదు కదా ఉండేది! నేను మా అమ్మ పక్కలో కూడా కాదు ఉంది, చనిపోయినవాళ్లను ఖననం చేసే నల్లపెట్టె లాంటి పెట్టెలో. నేను చనిపోయాను కనుక.

నేనెక్కడున్నదీ తెలుస్తూంది. కానీ నేనింకా ఆలోచించగలను.

పండుతున్న నిమ్మకాయలని తలుచుకున్నాను. నిర్లక్ష్యానికి గురయి ఎండిపోకముందే ఫెర్న్ మొక్కల కాడల్ని విరగ్గొట్టే ఫిబ్రవరి గాలి తలపుకు వచ్చింది. వరండాని తమ పరిమళంతో నింపిన పండు నిమ్మకాయలు.

ఫిబ్రవరి ఉదయాల్లో కొండల మీద నుంఛి గాలి కిందికి వీస్తుంది. లోయలోకి తోసే వేడి గాలి కోసం ఎదురుచూస్తూ మబ్బులు అక్కడ గుమికూడాయి. ఆకాశం నీలంగా ఉంది. నేల మీదుగా ఊడ్చుకుంటూ దుమ్ము రేపుతూ నారింజ కొమ్మల్ని విసిరి కొడుతూన్న సుడిగాలులపై కాంతి ఆటలాడుతూంది.

పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. గాలికి కొట్టుకు వచ్చిన ఆకులను పొడిచి మళ్లీ కిచకిచమంటున్నాయి. ముళ్ళకంపల్లో ఈకలను జార విడుచుకుని సీతాకోకచిలకల్ని తరిమి మళ్ళీ కిచకిచమంటూన్నాయి. అది ఆ రుతువు.

గాలితో, పిచ్చుకలతో, నీలి కాంతితో నిండిన ఫిబ్రవరి. నాకు గుర్తుంది. అప్పుడే మా అమ్మ చనిపోయింది.

నేను ఏడ్చి ఉండాలి. నేను నెత్తురోడేట్టు నాచేతులు పిండుకుని ఉండాలి. అట్లాగే చేయాలని నువ్వనుకుని ఉంటావు. కానీ నిజానికి అది ఆహ్లాదకరమైన ఉదయం కాదా? తెరిచిన తలుపులోంచి పిల్లగాలి వీస్తుంది ఐవీ నులి తీగలను విదిలిస్తూ. నా కాళ్ల మధ్య వెంట్రుకలు పెరగడం మొదలెట్టాయి, నా రొమ్ముల్ని తాకిన నా చేతులు వేడిగా వణికాయి. పిచ్చుకలు అడుకుంటున్నాయి. కొండవాలున గోధుమ పంట గాలికి ఊగుతూంది. మల్లెల మధ్య ఆడుకునే గాలిని ఆమె ఎప్పటికీ చూడలేదనీ, ఉజ్వలమైన సూర్యకాంతిని చూడకుండా ఆమె కళ్ళు మూసుకున్నాయనీ నాకు దిగులు. కానీ నేనెందుకు ఏడవడం?

నీకు గుర్తుందా జస్టినా? చూడటానికి వచ్చిన వాళ్ళు వాళ్ల వంతు వచ్చేవరకూ కూచోవడానికి నడవాలో వరసగా కుర్చీలు వేశావు. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. కొవ్వొత్తుల మధ్య మా అమ్మ వొంటరిగా పడుకుని ఉంది. పాలిపోయిన మొహం, మృత్యు శీతలానికి గడ్డకట్టిన ఊదా పెదవుల మధ్యనుంచి కనీకనపడకుండా తెల్లని దంతాలు. కనురెప్పల వెంట్రుకలు నిశ్చలంగా ఉన్నాయి. ఆమె గుండె నిశ్చలంగా ఉంది. నువ్వూ నేనూ ఆమె వినని ప్రార్థనలు ఎడతెగకుండా చేస్తున్నాము. ఆ రాత్రి గాలి రొదలో అవి నీకూ నాకూ కూడా వినపడలేదు. అమ్మ నల్లటి డ్రస్ ను నువు ఇస్త్రీ చేశావు. రొమ్ముల మీద అడ్డంగా ఉంచినప్పుడు తన చేతులు వయసులో ఉన్నట్టుగా కనిపించాలని కాలర్ కీ, చేతుల పట్టెలకీ బాగా గంజి పెట్టావు. అవే రొమ్ములు, నాకు పాలిచ్చినవీ, నా ఊయలయినవీ, నన్ను లాలిస్తూ నిద్ర పుచ్చినప్పడు కొట్టుకులాడినవీ.

ఆమెను చూడటానికి ఎవరూ రాలేదు. నువు వాకిలి దాకా వెళ్ళావు.

“నువు వెళ్లు,” నేను చెప్పాను. “నాకు మనుషులు పొగమంచులోంచి కనిపిస్తున్నారు. వాళ్ళను పొమ్మని చెప్పు. వాళ్ళు గ్రెగోరియన్ ప్రార్థనల కోసం డబ్బుల కోసం వచ్చారా? ఆమె డబ్బులేమీ వదిలిపెట్టి పోలేదు. ఆ సంగతి వాళ్ళకు చెప్పు జస్టినా? వాళ్ళు ఆ ప్రార్థనలు చేయకపోతే అమ్మ పాప విమోచన లోకం లోనే ఉండి పోతుందా? తీర్పు చెప్పటానికి వాళ్ళెవరు జస్టినా? నాకు పిచ్చనుకుంటున్నావా? అనుకో..”

మనం అమ్మను ఖననం చేయడానికి వెళ్ళినదాకా నువు వేసిన కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. తమకు తెలియని శవాన్ని మోస్తూ చెమటలు కక్కుతూ మన బాధ తెలియని కూలి వాళ్ళు వెంట వచ్చారు. తడి ఇసుకను సమాధిలోకి ఎత్తివేసి , తమ పనికి తగిన వోపికతో శవపేటికను నెమ్మదిగా లోపలికి దించారు. అంత శ్రమ తరవాత పిల్లగాలి సేదతీరుస్తూంది. వాళ్ల కళ్ళు ఉదాసీనంగా, ఏమీ పట్టనట్టు ఉన్నాయి. “ఇంత అవుతుంది,” అని చెప్పారు. బజార్లో ఏదో కొంటున్నట్టు నువు వాళ్ళకు డబ్బు ఇచ్చావు. కన్నీటితో తడిసి మెలికలు తిప్పీ తిప్పీ ఉన్న జేబురుమాలు ఒక కొస ఊడదీసి అందులోచి తీసి.

వాళ్ళు వెళ్ళిపోయాక, అమ్మ తలవైపు మోకాళ్ళ మీద కూచుని నేలను ముద్దాడావు. “పద జస్టినా. ఆమె ఇక్కడ లేదు. ఇక్కడ శవం తప్ప మరేదీ లేదు,” అని ఉండక పోతే నువు ఆమె వైపుకు తవ్వుతూ పోయేదానివే.

 

నువ్వేనా మాట్లాడుతూంది డొరోతియా?”

“నేనా? కాసేపు నిద్రపోయాను. ఇంకా భయపడుతున్నావా?”

“ఎవరో మాట్లాడడం వినిపించింది. ఆడ గొంతు. నువ్వేననుకున్నాను.”

“ఆడ గొంతా? నేననుకున్నావా? తనలోతాను మాట్లాడుకునే ఆమె అయి ఉంటుంది. ఆ పెద్ద సమాధిలో ఉండే ఆమె. డోన సుసానీత. మనకు దగ్గరలోనే పూడ్చారు. చెమ్మ తగిలినట్టుంది, నిద్రలో కదులుతూంది.”

“ఎవరామె?”

“పేద్రో పారమొ చివరి భార్య. ఆమె పిచ్చిదని కొందరంటారు. కాదని కొందరంటారు. నిజమేమిటంటే ఆమె బతికి ఉన్నప్పుడు కూడా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది.”

“చనిపోయి చాలారోజులయి ఉండాలి.”

“అవును. చాలా రోజులయింది. ఏమిటి, ఆమె అంటూన్నదేమిటి?”

“ఏదో వాళ్ళ అమ్మ గురించి.”

“వాళ్ల అమ్మ లేదే!”

“ఏమో, వాళ్ల అమ్మ గురించే మాట్లాడుతూంది.”

“హుఁ. .. ఆమె వచ్చినప్పుడు మాత్రం తనతో వాళ్ల అమ్మ లేదు. ఆగాగు. గుర్తొచ్చింది. వాళ్ల అమ్మ ఇక్కడే పుట్టింది, పెరిగేప్పుడు మాయమయిపోయారు. అవును. అంతే. వాళ్ల అమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. ఆమె వో వింత మనిషి. ఎప్పుడూ జబ్బుతో ఉండేది. ఎవరింటికీ వెళ్ళేది కాదు.”

“అదే ఆమె చెపుతుంది. వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు చూడటానికి ఎవరూ రాలేదని.”

“ఏమిటి ఆమె ఉద్దేశం? ఆమె గడపలోకి ఎవరూఅడుగు పెట్టలేదంటే ఆశ్చర్యం లేదు. ఆమె జబ్బు తమకెక్కడ అంటుకుంటుందో అని భయం. ఆ ఇండియన్ ఆమెకేమన్నా తెలుసేమో!”

“దాని గురించీ మాట్లాడుతుందామె.”

“ఈసారి మాటలు వినిపించినప్పుడు నాకు చెప్పు. ఆమె ఏమి చెపుతుందో నాకూ వినాలని ఉంది.”

“వింటున్నావా? ఏదో చెప్పబోతున్నట్టుంది. గుసగుసలు వినిపిస్తున్నాయి.”

“ఉహు, అది ఆమె కాదు. అది ఇంకా దూరంగా, వేరే దిక్కులో. ఆ గొంతు మగది కూడా. చాలా రోజులుగా శవాలుగా ఉన్న వాళ్ళేం చేస్తారంటే కాస్త చెమ్మ చేరేసరికి కదలడం మొదలెడతారు. లేస్తారు.”

“స్వర్గం ఉదారమైనది. దేవుడు నాతో ఉన్నాడా రాత్రి. లేకపోతే ఏమయి ఉండేదో ఎవరికి తెలుసు? ఎందుకంటే నేనొచ్చేసరికే రాత్రయి పోయింది..”

“నీకిప్పుడు బాగా వినిపిస్తుందా?”

“ఊఁ”

“..నా వొంటి నిండా నెత్తురు. లేవడానికి ప్రయత్నించినపుడు నా చేతులు రాళ్ల మధ్య నెత్తుటి చిదపల్లో జారిపోతున్నాయి. అది నా నెత్తురే. బకెట్ల కొద్దీ నెత్తురు. కానీ నేను చనిపోలేదు. ఆ సంగతి నాకు తెలుసు. పేద్రో నన్ను చంపాలనుకోలేదన్నది నాకు తెలుసు. కాస్త భయపెట్టాలనుకున్నాడు. రెండేళ్ల క్రితం ఆ రోజు నేను విల్మాయో లో ఉన్నానేమో కనుక్కుందామనుకున్నాడు. శాన్ క్రిస్తోబాల్ రోజు. పెళ్ళి దగ్గర. ఏ పెళ్ళి? ఏ శాన్ క్రిస్తోబాల్? నా నెత్తుటిలో నేను జారిపడుతూ అతన్ని అదే అడిగాను: ‘ఏ పెళ్ళి డాన్ పేద్రో? లేదు, లేదు డాన్ పేద్రో! నేనక్కడ లేను. ఆ చుట్టుపక్కల ఉన్నానేమో, అదీ కాకతాళీయంగా…’ అతను నిజంగా నన్ను చంపాలనుకోలేదు. నన్ను కుంటివాడిగా వదిలేశాడు – నీకు కనిపిస్తూనే ఉందిగా – బాధపడవలసినదేమిటంటే నా చేయి కూడా పనికిరాకుండా పోయింది. కానీ అతను నన్ను చంపలేదు. అప్పటి నుంచి అంతా నాకు వెర్రి చూపు పడిందంటున్నారు. ఆ భయానికి. కానీ అది నన్ను మగాణ్ణి చేసింది. స్వర్గం ఉదారమయింది. ఆ విషయంలో అనుమానపడకు.”

“ఎవరతను?”

“నాకేం తెలుసు? డజన్ల మందిలో ఒకడు. తన తండ్రిని ఎవరో చంపాక పేద్రో పారమొ ఎంతో మందిని ఊచకోత కోశాడు. దాదాపుగా ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్లనందరినీ చంపేశాడు. డాన్ లూకాస్ కన్యాదానం చేయవలసి ఉంది. నిజానికి అతను ప్రమాదవశాత్తూ చనిపోయాడు. అసలు ఆ పెళ్ళికొడుకు మీద ఎవరికో పగ ఉంది. డాన్ లూకాస్ కి తగిలిన బులెట్ ఎవరు కాల్చిందో తెలియలేదు కనక పేద్రో పారమొ అందరినీ తుడిచిపెట్టేశాడు. అది విల్మయో కొండమీద జరిగింది. అప్పుడేవో ఇళ్ళుండేవి గానీ ఇప్పుడు వాటి ఆనవాలు కూడా దొరకదు… విను, ఇప్పుడు ఆమెలా ఉంది మాట్లాడేది. నీవి పడుచు చెవులు. నువు విను. విని నాకు చెప్పు ఏమంటుందో.”

“నాకేం అర్థం కావడం లేదు. ఆమె మాట్లాడుతున్నట్టు లేదు, మూలుగుతూంది.”

“ఏమని మూలుగుతుంది?”

“నాకేం తెలుసు?”

” దేనిగురించో అయి ఉంటుంది. సరిగా విను. ఊరికే మూలగడానికే ఎవరూ మూలగరు.”

“ఆమె మూలుగుతూ ఉంది. ఊరికే మూలుగుతుంది. పేద్రో పారమొ ఏమన్నా కష్టపెట్టాడేమో ఆమెని!”

“ఆ మాట నమ్మకు. అతడామెని ప్రేమించాడు. ఆమెని ప్రేమించినట్టు అతనింకెవరినీ ప్రేమించలేదని నేను చెప్పగలను. ఆమెను అతని దగ్గరికి తీసుకు వచ్చేసరికే ఆమె బాధలో ఉంది – పిచ్చేనేమో! ఆమెను ఎంతగా ప్రేమించాడంటే ఆమె పోయాక రోజుల తరబడి కుర్చీలో కూలబడి ఆమెను స్మశానానికి తీసుకువెళ్ళిన దారి వైపే చూస్తూ ఉండే వాడు. దేనిపట్లా ఆసక్తి చూపేవాడు కాదు. పొలాలు బీడుపెట్టాడు. పొలం పనిముట్లన్నీ నాశనం చేయించాడు. అతను ఇట్లా చేస్తున్నది డస్సిపోవడం వల్ల అని కొంతమందీ, నిస్పృహ వల్ల అని కొంతమందీ అన్నారు. పనివాళ్లనంతా తరిమేసి ఆ దారి వంకే చూస్తూ కూచునేవాడన్నది మాత్రం నిజం.

“ఆ రోజునుంచీ పొలాలను పట్టించుకున్న నాధుడు లేడు. వదిలేశాడు. ఆ నేలని అట్లా చూస్తుంటే బాధగా ఉండేది. అట్లా వదిలేయగానే మహమ్మారి చుట్టుముట్టింది. చుట్టుపక్కల మైళ్ళకొద్దీ జనాలకి కష్టకాలం దాపురించింది. మగవాళ్ళు అన్నీ సర్దుకుని పనుల కోసం బతుకుతెరువు వెతుక్కుంటూ పోయారు. ఆరోజుల్లో కోమలాలో సెలవు తీసుకుంటూ చెప్పే మాటలు తప్ప మరేవీ వినిపించేవి కావన్న సంగతి నాకు గుర్తుంది. ఒక్కొక్కరినీ వాళ్ల దారివెంట పంపుతున్నప్పుడల్లా ఒక పండగలాగా ఉండేది. వాళ్లంతా మళ్ళీ తిరిగి వద్దామనే ఉద్దేశంతోటే పోయారు. వాళ్ళ సామాన్లమీదా, కుటుంబాలమీదా ఒక కన్నేసి ఉంచమని చెప్పేవారు. తర్వాత కొంతమంది సామాన్లు వదిలేసి కుటుంబాలను మాత్రం పిలిపించుకున్నారు. ఆపైన మా గురించీ, ఊరి గురించీ, వాళ్ల సామాన్ల గురించి కూడా మర్చిపోయారు. వెళ్లడానికి ఏ చోటూ లేక నేను ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది పేద్రో పారమొ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. తను పోయాక తన పొలమూ, ఆస్తులూ వాళ్లకు వదిలేస్తానని మాట ఇచ్చాడు. ఆ ఆశతోటి వాళ్ళు బతుకుతున్నారు. ఏళ్ళు గడిచాయి కానీ అతను బతికే ఉన్నాడు, మెదియా లూనా పొలాల మీదకి చూస్తూ ఉన్న దిష్టిబొమ్మ లాగా.

“అతను చనిపోబోయే కొదిరోజుల ముందే క్రిస్టెరోస్ యుద్ధం వచ్చింది. అతని దగ్గర ఉన్న కొద్ది మంది పనివాళ్లూ సైన్యంలో చేరారు. అప్పుడే నేనూ నిజంగా ఆకలితో నకనకలాడటం మొదలయింది. ఏదీ మునుపటిలా ఇక ఉండలేదు.

“అంతా డాన్ పేద్రో చేసుకున్నదే, తన ఆత్మక్షోభ వలన. కేవలం తన భార్య సుసానీత చనిపోవడం వల్ల. ఇప్పుడు చెప్పు అతను ఆమేని ప్రేమించాడో లేదో?”

 

ఫుల్గోర్ సెడనో చెప్పాడతనికి.

“దొరా! ఊళ్ళోకి తిరిగి ఎవరొచ్చారో తెలుసా?”

“ఎవరు?”

“బార్ట్లోం శాన్ హువాన్!”

“ఎందుకు?”

“నాకూ అదే అనిపించింది. తిరిగి ఎందుకొచ్చాడో?”

“కనుక్కోలేదా?”

“లేదు, ముందు మీకు చెప్పాలనుకున్నాను. ఇంటి గురించేమీ వాకబు చేయలేదు. శరాసరి మీ పాత ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లేదో మీరతనికి అద్దెకిచ్చినట్టు గుర్రం దిగి సూట్ కేసులు లోపలికి మోసుకుపోయాడు. ముందువెనకలాడుతున్నట్టు కనబడ లేదు. ”

“దాని గురించి నువ్వేం చేస్తునావు ఫుల్గోర్? ఏమవుతుందో ఎందుకు కనుక్కోలేదు? అందుకు కాదా నీకు జీతమిస్తుంది?”

“ఈ విషయం తెలిసేసరికి నాకు బుర్ర తిరిగిపోయింది. కనుక్కోవాలంటే రేపు ఎలాగోలా కనుక్కుంటాను.”

“రేపటి సంగతి మర్చిపో! ఆ శాన్ హువాన్ సంగతి నేను చూస్తాను. ఇద్దరూ వచ్చారా?”

“అవును, అతనూ, అతని భార్యా. నీకెట్లా తెలుసు?”

“అతని కూతురు కాదా?”

“ఆమెతో ఉన్న తీరును చూస్తే భార్యలాగే ఉంది.”

“ఇంటికి పోయి పడుకో ఫుల్గోర్!”

“తమ దయ!”

 

నువు తిరిగివస్తావని ముప్పయ్యేళ్ళు ఎదురుచూశాను సుజానా. నాకన్నీ కావాలనుకున్నాను. ఏ ఒక్క భాగమో కాదు, పొందడానికి ఏదయితే ఉందో అదంతా. ఇక కోరుకోవడానికి ఏమీ మిగలనట్టుగా. నాకు తన అవసరం ఉందనీ, వచ్చి మనతో ఉండమనీ మీ నాన్నతో ఎన్నోసార్లు చెప్పాను. మాయ కూడా చేశాను.

నా పనులు చూస్తూ ఉండమన్నాను. అదికాకపోతే ఇంకా ఏదయినా, నిన్ను మళ్ళీ చూసేందుకు వీలుగా. అంతా విని ఏమన్నాడు? “బదుల్లేదు.” నేను పంపిన రాయబారి ఎప్పుడూ చెప్పే మాటే అది. “డాన్ బార్ట్లోం మీ ఉత్తరాలన్నీ చేతికి ఇవ్వగానే చింపేస్తాడు.” కానీ ఆ కుర్రాడి ద్వారా నీకు పెళ్ళయిన సంగతి తెలుసుకున్నాను. కొద్దికాలంలోనే నువు విధవవయ్యావనీ, తిరిగి మీ నాన్నతో ఉండటానికి వెళ్ళిపోయావనీ తెలిసింది.

తర్వాత నిశ్శబ్దం.

ఆ రాయబారి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ప్రతిసారీ అదే చెప్పేవాడు ” నాకు వాళ్ళెక్కడా కనపడలేదు డాన్ పేద్రో! మస్కోట వదిలిపెట్టి పోయారనుకుంటున్నారంతా. కొంతమంది ఒకవేపు వెళ్ళారంటే, ఇంకొంతమంది వేరేవైపు వెళ్లారంటున్నారు.”

వాడికి చెప్పాను “ఖర్చులకు వెనుకాడకు. వాళ్ళెక్కడున్నారో కనుక్కో. నేల ఏమీ మింగేయలేదుగా వాళ్ళను!”

ఒక రోజు వచ్చి చెప్పాడు.

“డాన్ బార్ట్లోం శాన్ హువాన్ ఎక్కడ దాక్కునే చోట్లున్నాయో ఆ కొండలన్నీ వెదికాను. చివరికి ఎక్కడో చాలా దూరంగా ఆ ఆండ్రోమెదా గనుల దగ్గర ఒక చెక్క ఇంట్లో దాక్కుని ఉన్నట్టు కనిపెట్టాను.”

వింతగాలులు వీస్తున్నాయప్పుడు. సాయుధ తిరుగుబాటు వార్తలు వినవస్తున్నాయి. పుకార్లు వింటున్నాము. నీ తండ్రినే వెనక్కి ఇక్కడికి తరిమి కొట్టే గాలులవి. తనకోసం కాదనీ, నీ క్షేమంకోసమేననీ ఉత్తరం రాశాడు. నిన్ను తిరిగి నాగరికతలోకి తీసుకు రావాలనుకున్నాడు.

స్వర్గం విడివడి దారి ఇస్తుందనిపించింది. పరుగెత్తుకువచ్చి నిన్ను కలవాలనుకున్నాను. నిన్ను సంతోషంలో ముంచెత్తాలని. ఆ ఆనందం పట్టలేక ఏడ్చేయాలని. ఏడ్చాను సుజానా, ఎట్టకేలకి నువు తిరిగి వచ్చావని తెలిసి.

 

కొన్ని ఊళ్ళకు దురదృష్టపు వాసన ఉంటుంది. అన్నిటిలా పాతగా ఉండే ఆ నిలవ ఉండి మగ్గిపోయిన పలచటి గాలిని ఒక్కసారి పీల్చినా నీకు తెలిసిపోతుంది. అలాంటి ఊళ్ళలో ఇది ఒకటి సుజానా!

“మేము ఇంతకుముందు ఉన్నచోట కనీసం పుట్టడం చూసి ఆనందించేవాళ్లం – ఆ మబ్బులూ, పిట్టలూ, నాచూ. నీకు గుర్తుందా? ఇక్కడ నేలనుంచి పైకి ఉబుకుతున్నట్టుండే ఆ పులిసిపోయిన పసుప్పచ్చ వాసన తప్ప ఇంకేమీ లేదు. ఈ ఊరు శాపగ్రస్త. దురదృష్టంలో మునిగి ఊపిరాడనిదీ ఊరు.

“మనం తిరిగి రావాలన్నది అతని కోరిక. మనకీ ఇల్లు ఇచ్చాడు. మనకు కావలసిందంతా సమకూర్చాడు. కానీ అతనికి మనమేం కృతజ్ఞులంగా ఉండక్కర్లేదు. ఇది మనకు వరమేమీ కాదు. మనకు ఇక్కడ మోక్షమేమీ దొరకదు. నాకు తెలుస్తూంది.

“పేద్రో పారమొకేం కావాలో నీకు తెలుసా? ఇదంతా మనకు ఊరికే ఇస్తున్నాడని నేనేం అనుకోవడం లేదు. ఈ బాకీ తీర్చాలి కనక అతనికోసం చెమటోడ్చి పని చేయడానికి సిద్ధమే. ఆండ్రోమెడాఅ గనుల గురించి వివరాలన్నీ ఇచ్చి దానిమీద సరిగా పనిచేస్తే లాభం కళ్ల చూడవచ్చని వొప్పించాను. అతనేమన్నాడో తెలుసా? ‘నీ గని మీద నాకేం ఆసక్తి లేదు బార్ట్లోం శాన్ హువాన్! నీనుంచి నాకు కావలసింది ఒక్క నీ కూతురే! నువు సాధించినవాటిలో అత్యున్నతమైనది ఆమే!’

“అతనికి నువ్వంటే ప్రేమ సుజానా! మీరిద్దరూ చిన్నప్పుడు ఆడుకునేవారని చెప్పాడు. అతనికి నువ్వు తెలుసట. వయసులో ఉన్నప్పుడు మీరు నదిలో కలిసి ఈతలు కొట్టేవారట. నాకు తెలియదా సంగతి. నాకు తెలిస్తే అప్పుడే నిన్ను చితకబాదే వాడిని.”

“తప్పకుండా తన్ని ఉండే వాడివే!”

“సరిగానే విన్నానా? ‘తప్పకుండా తన్ని ఉండే వాడివే,’ అనా?”

“సరిగ్గానే విన్నావు.”

“అయితే వాడి పక్కలో పడుకోటానికి సిద్ధమేననా!”

“అవును బార్ట్లోం.”

“వాడికి పెళ్ళయిందనీ, లెక్కలేనంత మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయనీ తెలియదా?”

“తెలుసు బార్ట్లోం.”

“ముందు ఆ బార్ట్లోం అనడం ఆపు. నేను నీ కన్న తండ్రిని.”

బార్ట్లోం శాన్ హువాన్ ఒక చనిపోయిన గని పనివాడు. సుజానా శన్ హువాన్ ఆండ్రొమెదా గనుల్లో చనిపోయిన ఒక గని పనివాడి కూతురు. అతనికి స్పష్టంగా కనిపించింది. “చావడానికి అక్కడికి వెళ్ళాలి,” అనుకున్నాడు. తర్వాత చెప్పాడు-

“నువ్వు విధవవే అయినా ఇంకా నీ భర్తతోటే బతుకుతున్నావని చెప్పానతనికి. కనీసం అట్లా ప్రవర్తిస్తున్నావని. అతన్ని ఎట్లా అన్నా నిరుత్సాహపర్చాలని చూశాను కానీ నేను అట్లా మాట్లాడినప్పుడల్లా అతని చూపు పదునెక్కేది. నీ పేరు చెప్పగానే కళ్ళు మూసుకునేవాడు. అతను ఒక నిఖార్సయిన నికృష్టుడన్న విషయంలో నాకే సందేహమూ లేదు. పేద్రో పారమొ అంటే అంతే.”

“మరి నేనెవరిని?”

“నా కూతురువి. నాదానివి. బార్ట్లోం శాన్ హువాన్ కూతురివి. ”

సుజానా శాన్ హువాన్ మనసులో ఏవో ఊహలు రూపు కట్టుకోసాగాయి. ముందు నెమ్మదిగా, మళ్ళీ వెనక్కి తగ్గి, తర్వాత ఒక్కసారిగా దూకేసరికి ఆమె “అది నిజం కాదు. అది నిజం కాదు,” అని మాత్రమే అనగలిగింది.

“ఈ లోకం మనల్ని అన్నివైపులనుంచీ వొత్తిడి పెడుతుంది. మన బూడిదని నేలంతా చిమ్ముతుంది. మన నెత్తుటితో నేలను తడపాలని చూస్తుంది. మనమేం చేశాము! మన ఆత్మలెందుకిలా కుళ్ళిపోయాయి? మనకు కనీసం దైవకటాక్షమయినా దక్కుతుందని మీ అమ్మ ఎప్పుడూ అనేది. కానీ నువు కాదంటున్నావు సుజానా. నేను తండ్రిని కాదని ఎందుకంటున్నావు? నీకేమయినా పిచ్చా?”

“నీకు తెలియదా?”

“నీకు పిచ్చా?”

“నాకు పిచ్చే బార్ట్లోం! నీకు తెలియదా?”

 

నీకు తెలుసుగా ఫుల్గోర్! ఈ భూమి మీద అందరికంటే అందగత్తె ఆమే. ఆమెను ఎప్పటికీ పోగొట్టుకున్నాననే నమ్మాను. మళ్ళీ ఆమెను పోగొట్టుకోలేను. అర్థమవుతుందా ఫుల్గోర్? వాళ్ళ నాన్నను పోయి ఆ గనుల్లోనే వెతుక్కోమని చెప్పు. అక్కడ… ఎవరూ అడుగుపెట్టని ఆ ప్రాంతంలో ఒక ముసలాడు మాయం కావడం పెద్ద కష్టం కాదనే అనుకుంటున్నాను. నువ్వేమంటావు ఫుల్గోర్?”

“కావచ్చు.”

“అట్లా కావడం మనకవసరం. ఆమెకు కుటుంబమేమీ మిగలకూడదు. అవసరంలో ఉన్న వాళ్ళ బాగోగులను చూడడం మన పని. నువ్వు దానికి వొప్పుకోవా ఫుల్గోర్?”

“అదంత కష్టంగా ఏమీ కనిపించడం లేదు.”

“మరి ఆలస్యమెందుకు ఫుల్గోర్? ఆ పని మీద ఉండు.”

“ఆమెకి తెలిస్తే?”

“ఎవరు చెపుతారు? చెప్పు. ఇది తెలిసింది నీకూ నాకూ. మనిద్దరిలో ఆమెకి ఎవరు చెప్తారు?”

“ఎవరూ చెప్పరనుకుంటున్నా.”

“ఈ అనుకోవడాలు వదిలేయి. అది మర్చిపో, అంతా సరిగ్గా జరుగుతుంది. ఆండ్రొమెదా దగ్గర ఎంత పని చేయాలో గుర్తు చేసుకో. ఆ ముసలాడిని ఆపని మీద పంపు. తన ఇష్టం వచ్చినట్టు పోయి రమ్మను. కానీ తన కూతుర్ని అక్కడికి తీసుకు వెళ్ళే ఆలోచన రానీయకు. ఆమె సంగతి మనం చూసుకుందాం. అతని పని గనిలో. కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది. ఆ సంగతి చెప్పు అతనికి.”

“మీరు పనులు చేసే పద్ధతి చూసే ముచ్చటేస్తుందని మళ్ళీ చెప్పాలనిపిస్తూంది దొరా! మీలో వెనకటి హుషారు తిరిగి వచ్చినట్టుంది.”

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాట్లాడటానికి తడబడతాడు. ఎందుకంటే అది తనకు అసహజమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా సహజంగా మాట్లాడగలిగేవాళ్లే ఉపన్యాసకులుగా రాణిస్తారు.

కానీ నేను మాత్రం అలా మాట్లాడలేను. మాట్లాడటానికి ఉపక్రమించగానే నా చేతులు వణుకుతాయి, లోపలి నరాలు ఊగుతాయి. దీన్నే చాలామంది స్టేజ్ ఫియర్ అంటారు. అందుకే ఎక్కడైనా నాకు ఆవేశం తన్నుకొచ్చినప్పుడు కూడా మాట్లాడటానికి జంకుతాను. అలా మాట్లాడాలనిపించీ, ఎందుకొచ్చిందిలే అని వదిలేసిందాన్ని ఇక్కడ రాయడం కోసమే ఇదంతా చెప్పడం!

మొన్న మే 31, జూన్ 1 (2014) తేదీల్లో కర్నూలు ‘కథాసమయం’ మిత్రులు ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అందులో విడతలుగా చర్చకు పెట్టిన కొన్ని అంశాలు ఉన్నాయిగానీ దానికంటే ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు జరిగిన చివరి సమావేశం కావడం దాని ప్రత్యేకత! దానికి అన్ని ప్రాంతాలవాళ్లూ వచ్చారు. కొందరు కొత్తగా పరిచయమయ్యారు; మరికొందరు పేర్లుగా మాత్రమే తెలిసినవాళ్లు ముఖాలుగా పరిచయమయ్యారు. ఈ పర్యటనలో నావరకూ ముఖ్యాంశం: కర్నూలు నగరాన్ని మొదటిసారి చూడటం! కొండారెడ్డి బురుజును ఎక్కకుండా తిరిగిరాకూడదనుకున్నాను, ఎక్కాను. టీజీ వెంకటేశ్ కోటలాంటి ఇంటిగోడలు చూడకుండా సంపద స్వరూపం అర్థం కాదన్నారు, కాబట్టి వెళ్లాను. మద్రాసు నుంచి విడిపోయాక ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి రాజధాని కర్నూలు కాబట్టి, అప్పుడు తాత్కాలికంగా గుడారాలు వేసి పనులు నడిపించిన స్థలాన్ని చూసుకుంటూ వెళ్లాను. పూర్వస్థితిలోలాగా కర్నూలును రాజధాని చేయమని పట్టుబట్టడానికి కావాల్సినంత చారిత్రక హేతువుండగా, సీమవాళ్లు ఎవరూ దాని ఊసు ఎందుకు ఎత్తడంలేదన్న ప్రశ్న సమావేశాల్లోనే వచ్చింది. ‘కానీ ప్రశ్నించగలిగేవాళ్లేరి?’ అన్న నిరాశే జవాబుగా ఎదురైంది. చివరగా, సాయంత్రం పూట- నక్షత్రాకార సాయిబాబాలయం పక్కన పారుతున్న తుంగభద్ర నీటిపాయలో కరిగిపోయిన సూర్యుడినీ చూశాను. థాంక్స్ టు విజయసారథి! బహుశా, ఇకముందునుంచీ కర్నూలు అంటే నాకు గుర్తుండబోయే ఇమేజ్ ఇదే!

*

నిజానికి భావనలు చాలా బలహీనమైనవి. అయినాకూడా ఒక నిర్దేశిత సమయంలో అవి చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మళ్లీ బలమైనవి కూడా! రెండు వేడి వేడి దోసెలు తిని, ఉడుకుడుకు చాయ్ తాగాక- మా పొద్దుటి సమావేశంలో ఒక విడత మొదలైంది. ‘రాయలసీమ కథ అస్తిత్వం: వైవిధ్యాలు, వైరుధ్యాలు’ మీద వెంకటకృష్ణ మాట్లాడారు. అక్కడి కథ అందుకోవలసిందీ చెప్పారు; సీమ కథ అనగానే కరువు తప్ప మరొకటి గుర్తుకురానివ్వకుండా చేసిన ‘తామందరినీ’ నిందించుకున్నారు. అలాగే సాఫల్యతను ప్రస్తుతించారు. చాలా ఉటంకింపులతో ఆవేశంగా సాగిన ఆ మాటలు ఎక్కడ ఆగాయంటే… సీమరచయితలకు తగిన గుర్తింపు లేదని!

వెంకటకృష్ణ మాటలకు స్పందనగా నేను కొన్ని పాయింట్స్ ఏవో చెబుదామనుకున్నాను. ‘ఎందుకొచ్చిందిలే’ అని వదిలేశాను. సభాభయం ఒకటి ఉందిగా! పైగా నేనేమీ అకడెమిక్ కోణంలో చెప్పలేను. దీనికి అంత ప్రాధాన్యత ఉండదులే, అని కూడా నేను ఆగిపోవడానికి మరో కారణం. అయితే, తర్వాతి విడత చర్చలో, (ఈసారి కోడికూర, గోంగూర భోజనం తర్వాత- మనుషులు మాంసాహారులుగా, శాకాహారులుగా వేరుపడటం ఏంటబ్బా అనుకున్నాం… నేనూ, నా పక్కనే కూర్చున్న దగ్గుమాటి పద్మాకరూ!) సుభాషిణి మాటల్లో కూడా ఇలాంటి భావనే వ్యక్తమైంది. తమ సీమకథకూ, సీమభాషకూ మన్నన లేదని!

 

వాళ్లు లేవనెత్తినట్టుగా ఈ రాయలసీమ కథకుల్ని ఎవరు గుర్తించాలి? బహుశా, తెలంగాణవాళ్లు సీమవాళ్లను కలుపుకొనే పోతారనుకుంటాను. మరి వీళ్లను గుర్తించ నిరాకరిస్తున్నది ఎవరు?

అలాగే, తెలంగాణవాళ్లు కూడా ఇన్నేళ్లుగా మాట్లాడుతున్నది తమను ప్రధాన స్రవంతి సాహిత్యంలో చేర్చుకోరనే. రాయలసీమ వాళ్లు చెబుతున్న భాష సమస్యే తెలంగాణకూ ఉంది. రెండు ప్రాంతాలూ ఒకే బాధను ఎదుర్కొంటున్నాయి. మరి వీళ్లను గుర్తించాల్సింది ఎవరు? అది ఒక ప్రత్యేక సమూహమా?

(ఉత్తరాంధ్ర తరఫున ఎవరూ ఆ సమావేశంలో మాట్లాడలేదుగానీ వాళ్లకూ ఈ బాధే ఉందేమో! )

ఇక విషయాన్ని నేననుకున్నట్టుగా కోస్తావారివైపే డ్రైవ్ చేస్తున్నాను. ఇండ్లదిండ్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారికి కొన్ని మినహాయింపులున్నాయి. సీమతో వారికున్న సరిహద్దులవల్ల కావొచ్చు.

వీటిని తీసేస్తే మిగిలినవి ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణా. అంటే, ఈ నాలుగు జిల్లాల గుర్తింపే అందరికీ కావాలా? సమావేశానంతరం, నలుగురం- అజయ్‌ప్రసాద్, జీఎస్ రామ్మోహన్…- సేదతీరుతున్నప్పుడు, గోదావరి వాడైన ఒమ్మి రమేశ్‌బాబుతో ఇదే విషయం నవ్వుతూ అన్నాను: ‘మాకందరికీ దండలు వేయాల్సిన చాలా పెద్ద బాధ్యత మీమీద ఉంది’.

మొదటే చెప్పాల్సిన డిస్‌క్లెయిమర్ ఇప్పుడు చెబుతున్నాను. నాది చాలా పరిమితమైన భాష, ప్రాంత జ్ఞానం. పైగా ఇదేమీ థియరీ కాదు. నా మానసిక అలజడిని తగ్గించుకోవడానికి నేను పూసుకుంటున్న లేపనం మాత్రమే.

10409245_10103692712795837_3125675474451956223_n

ఒకరు మనల్ని గుర్తించాలి, అనుకోవడంలోనే ఒక న్యూనత ఏదో ఉంది. ఇది భాషతో ముడిపడిన వ్యవహారంగా బయటికి కనబడుతోందంతే! ఎవరితో గుర్తింపబడాలనుకుంటామో వాళ్లు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో బలవంతులై ఉంటారు. భాష అనేది ఆధిపత్యానికి ఒక రూపం మాత్రమే! అయితే, ఇదంతా చెప్పుకున్నంత కాంక్రీటుగా ఉండే విషయమేనా!

సమావేశాల్లోనే ఒక రాత్రి- విశాలమైన గార్డెన్‌లో అందరమూ గుండ్రంగా కూర్చునివున్నాం… ఇనాయతుల్లా మంచి నటుడు! ఏకపాత్రాభినయాలతో నవ్వించారు. దుర్యోధనుడికైతే చప్పట్లే చప్పట్లు!! ఆయన అనుకరించిన పల్లీయుల గొంతుల్లో ‘వచ్చాండా’, ‘పోతాండా’ లాంటి ఎన్నో మాటలు దొర్లిపోయాయి. అలాగే, కర్నూలు జిల్లాలోనివే అయిన నంద్యాల, ఆదోని యాసలు ఎలా వేరుగా ఉంటాయో మాట్లాడి వినిపించారు. అయితే, ‘రాయలసీమ యాస’ అని దేన్నయితే అనుకుంటామో, అక్కడి రచయితలెవరూ మాట్లాడలేదు. అందరూ ప్రామాణికభాష అని నిందిస్తున్నదాన్నే మాట్లాడారు. అంటే ఏ యాస అయితే ఇనాయతుల్లా నోట్లోంచి రావడం వల్ల నవ్వు పుట్టిందో, ఆ దశను వీళ్లందరూ దాటేశారు. అందులో అసహజం ఏమీ లేదనే అనుకుంటాను.

*

నేను ఆరో తరగతి చదవడానికి మా ఊరినుంచి మేడ్చల్‌కు వచ్చాను. బడి ప్రారంభం కావడానికి ముందే, మామయ్య వాళ్లు వేసవి సెలవుల్లో మా ఊరికి వచ్చినప్పుడు నన్ను తోలుకొచ్చారు. మళ్లీ నేను మా ఊరెళ్లింది దసరా సెలవులకే. ఆ ఆరేడు నెలల కొత్త వాతావరణం నన్నెలా మార్చిందంటే, ‘రాజిరెడ్డి బాగ శానికచ్చిండు; మన మాటే మాట్లాడుతలేడు,’ అన్నారు మా వదినలు. ‘అత్తన్నా’కు బదులుగా ‘వస్తున్నా’ అని బదులిచ్చివుంటాను. అదే వాళ్లు ప్రేమగా నిందించిన నా శానితనం!

ఇప్పుడు తెలంగాణ రచయితలు కూడా నిజజీవిత వ్యవహారంలో ‘అచ్చిన’ అనరు; ‘వచ్చిన’ అనే అంటారు. ఇందులో ఏది మరింత తెలంగాణ? పాతకాలపువాళ్లు, ఇప్పటి యువకులు; చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు; ఆ కులంవాళ్లు, ఈ కులంవాళ్లు; ఆ జిల్లావాళ్లు, ఈ జిల్లావాళ్లు; హైదరాబాద్‌తో సంపర్కం ఉన్నవాళ్లు, లేనివాళ్లు; ఇలా తెలంగాణ భాష ఎన్నో రకాలుగా విభజించబడివుంది. అన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి ఉంటూనే, మళ్లీ వేరుగా ఉండటం! ఇదే భాషలోని వైవిధ్యం.

నా వరకు నేను కనీసం నాలుగైదు రకాలుగా మాట్లాడుతాను. అంటే మా ఊరికి వెళ్లినప్పుడు మా తాత, పెద్దనాన్న వరస వారితో ఒకలాగా మాట్లాడతా. కొంచెం చదువుకున్న వాళ్లతో ఒకలాగా, నాకు పరిచయమున్న తోటి తెలంగాణ ఉద్యోగులతో ఒకలాగా, ఇతర మిత్రులతో ఒకలాగా. కార్టూనిస్టు శంకర్‌తో ‘ఏమన్నా ఏడున్నవే,’ అంటాను. జూకంటి జగన్నాథంతోనూ, దేశపతి శ్రీనివాస్‌తోనూ మొదటిసారి మాట్లాడినప్పుడు కూడా నేను సార్ అనలేదు; ‘నమస్తేనే’ అని పలకరించాను. అదే, వాళ్లిద్దరికంటే ఎంతో ఎక్కువ పరిచయమున్న సురేంద్రరాజును ఇన్నేళ్లయినా ‘ఏమే, ఏందే’ అనలేదు. ఏ కొంత చనువు తీసుకోదలిచినా నేను ఏత్వం ఉపయోగిస్తాను. ఏత్వం ఉపయోగించడం, నా దృష్టిలో దగ్గరితనమూ, అదేసమయంలో కొంతమేరకైనా తెలంగాణీయత!

అయితే, తుమ్మేటి రఘోత్తమ్ సార్‌ను ఏకవచనంలో సంబోధించలేను. ఆయన కూడా ‘రాజిరెడ్డి గారు’ అనే పిలుస్తారు, రాజిరెడ్డి అంటే సరిపోతుందని చెప్పినా! అలాగే, తెలంగాణలో జన్మించని అన్వర్‌ను వయసుతో నిమిత్తం లేకుండా ‘ఏం సార్, ఎక్కడున్నారు?’ అని పలకరిస్తాను. వయసులో పెద్దవాళ్లయినప్పటికీ తెలంగాణలో పుట్టని మాధవ్ శింగరాజుతోగానీ, నరేష్ నున్నాతోగానీ, అనంతుతోగానీ వాళ్లు నాకు పరిచయమైన తొలిరోజునుంచీ ఏకవచనంలోనే మాట్లాడుతున్నాను. వాళ్లతో ఈ చనువు తీసుకోవడానికి కారణమైందేమిటో నాకు అంతుపట్టదు. అదే చినవీరభద్రుడితోనో, వి.చంద్రశేఖరరావుతోనో మాట్లాడినప్పుడు, నా గొంతు మరింత మర్యాదను అరువు తెచ్చుకుంటుందనుకుంటాను!

అవతలివారిని బట్టి, నా నాలుక ‘వచ్చిండ్రా’ అనేది ‘వచ్చారా’ అనేస్తుంది. ఈమాత్రమేనా యాసల గొడవ అనిపిస్తుంది. గొడవ స్థానంలో లొల్లి రాయలేకపోవడం కూడా ఒక గొడవ! అంతోటి కాళోజీ కూడా ‘నా గొడ’వే అన్నాడుగానీ ‘నా లొల్లి’ అనలేదు.

నా భార్య మొన్నోసారి మావాణ్ని ‘పోయిండు’ బదులుగా ‘వెళ్లాను’ అనిపిస్తోంది. ‘ఏందే?’ అంటే, పార్కులో ఒకామెకు అలా అంటే అర్థం కాలేదట! ఆమెకు అర్థంకాకపోతే రెండ్రోజుల్లో అలవాటవుతుందిలేగానీ అంత నాలుకను మలుచుకోవాల్సిన పనిలేదని చెప్పాను. మరి ఈ తెలంగాణ-ఆంధ్ర స్పృహ లేనప్పుడు, నాకున్న ఆంధ్ర రూమ్మేట్స్ సాయితోగానీ, సుధాకర్‌తోగానీ నేనెలా మాట్లాడానో, అసలు వాళ్లు నాతో ఎలా సంభాషించారో నాకు గుర్తులేదు. ఈ స్పృహ జొరబడ్డాక, నా నాలుకను ఎక్కడ స్థిరం చేసుకోవాలో తెలియక కొంత తికమకపడ్డాను. అందుకే ఒక్కోసారి నా నాలుక మాటల్ని కాక్‌టెయిల్ చేస్తుంది. డబుల్ యాక్షన్ చేస్తుంది.

నిజానికి ఒక మనిషికి నాలుగు నాలుకలు ఉండటం… తన భాష తాను మాట్లాడలేకపోవడం కూడా న్యూనతే! కానీ ఏది నా ఒరిజినల్ భాష? అది ఎక్కడుంది? ఇప్పుడు నేను రాస్తున్నది కూడా ఏ భాష? మాట్లాడినట్టుగా రాయాల్సివచ్చిన ‘పాత్రోచిత సందర్భం’ అయితే తప్ప… లేదంటే ఈ ఆర్టికల్‌లో మీరు చదువుతున్నట్టుగానే రాస్తున్నాను. ఆ పాత్రోచితం అనుకునేదాన్ని కూడా నేను తెలంగాణ యాస అనడానికి సాహసించను. అది మా నర్సింగాపురం యాస మాత్రమే!

*

మావాణ్ని స్కూల్లో వేస్తున్నప్పుడు, పర్మనెంట్ అడ్రస్ రాయాల్సివచ్చింది. డిస్ట్రిక్ట్: కరీంనగర్ అని రాసింతర్వాత, స్టేట్: ‘ఎ’ అని రాయబోయి, ‘టి’తో ప్రారంభించాను. కొత్త సంవత్సరపు తొలివారంలో అలవాటుగా పాత ఏడాదే వేస్తుంటాంకదా, అలాగ!

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ‘అండి’, ‘గారు’ పోవాలని నేను కోరుకోవడం లేదు. అది రిఫైన్డ్ లాంగ్వేజ్. నా వయసువాళ్లు ఎవరైనా మా బాపును ‘రాంరెడ్డీ’ అని పిలిస్తే నా ప్రాణం చివుక్కుమంటుంది. ఏకవచనాన్ని ఏకవచనంలా కాకుండా పలికించడం చాలామందికి తెలియదు. ‘ఓ పెద్దబాపు ఎటువోయినవే?’, ‘ఓ బావా కనవడుతలేవేంది?’, ‘మామా ఎట్లున్నవే’… అన్నీ ఏకవచనమే. కానీ పిలుపులో ఆత్మీయత ఉంది. అయితే, మనకు వరుస తెలియనివారితో కూడా వ్యవహారం చేసే జీవనశైలిలోకి ప్రవేశించాం కాబట్టి, మర్యాదను ప్రకటించడానికి నిర్దిష్టమైన రూపం కావాలి. ఆహారమూ, వ్యవహారమే కదా మన నాగరికతను తెలియజేసేవి!

ఆహారం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. మా ఇంట్లో(ఊళ్లో) పప్పుచారు తప్ప నాకు సాంబారు తెలీదు. హైదరాబాద్ వచ్చేదాకా నేను ఇడ్లీ, దోశ చూడలేదు. ఇప్పటికైనా ఈ రెండూ నా పిల్లలమ్మ చేస్తుందేగానీ మా అమ్మ చేయదు. అమ్మ చేసేవల్లా సర్వపిండి, ఉప్పుడువిండి, వరిరొట్టె, అట్లు. ఇవన్నీ నాకిష్టమే. అయినంతమాత్రాన ఇడ్లీ తినడానికి నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి?

నేను చిన్నప్పుడు అంగూర్లు తినేవాణ్ని. మా అత్తమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు కేలాపళ్లు తెచ్చేది. ఇక నాకు డబల్‌రొట్టె అయితే దానికోసం జ్వరాన్ని కోరుకునేంత ఇష్టం. ఇప్పుడా పదాలు వాడే మా అత్తమ్మల తరం పోతోంది. అందుకే, నేను నా పిల్లలకు అంగూర్లకు బదులుగా ద్రాక్షల్ని తినిపిద్దామనుకునేలోపే, వాళ్లు గ్రేప్స్ కోసం మారాం చేస్తున్నారు. హిందూ పేపర్ మాస్టర్‌హెడ్ మీది బొమ్మను చూసి బడికి వేయని చిన్నోడు ఏనుగనీ, స్కూలుకు వెళ్తున్న పెద్దోడు ఎలిఫెంటనీ కొట్లాడుతున్నారు. తెలుగు భాషే మునిగిపోతున్న స్థితిలోవుంటే, ఏ నిర్దిష్ట రూపమూ లేని తెలంగాణ భాష ఇంకెలా మనగలుగుతుంది?

నాకు కొంతకాలం ‘ఆనిగెపుకా’యే అనాలన్న పట్టింపుండేది. సొరకాయ అనకుండా ఉండటానికి ప్రయత్నించేవాణ్ని. కానీ ఇప్పుడది చాలా మామూలుగా నోట్లోకి వచ్చేస్తోంది. ఇది రుద్దడమే అనుకుందాం. అసలు ప్రతిదీ రుద్దడమే. మన భాష, మన మతం, మన ఆహారపుటలవాట్లు, ప్రాంతపు స్పృహ, సంప్రదాయాలు, దేశభక్తి, అంతెందుకు, చివరికి మన పేరు కూడా! అలవాటయ్యేకొద్దీ ఏదైనా మనదవుతుంది. కనీసం ఒక తరంలో రుద్దింది, తర్వాత తరానికి ‘వాళ్ల’దయిపోతుంది.

ఉర్దూ రాజ్యమేలితే చచ్చినట్టు ఉర్దూ నేర్చుకుంటాం. ఇంగ్లీషు ఏలుతోంది కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నాం. ఒక కృష్ణా జిల్లా అమ్మాయి, రాయలసీమకు చెందిన మా భారతి మేడమ్ మాటల్ని అనుకరించడం నేను విన్నాను. అందుకే కోస్తాధిపత్యాన్ని అబద్ధం అనాలనే ఉంది నాకు. ఎందుకంటే కోస్తావారిలో కూడా అందరి భాషా ఒకటే అయే అవకాశమే లేదుకదా! అది కూడా పేదలుగా, ధనికులుగా, పల్లీయులుగా, నగరవాసులుగా, కులాలుగా, జిల్లాలుగా విభజించబడే ఉంటుంది కదా! అసలు ప్రమాణం అనుకునేదే ఒక ప్రమాణంలోకి ఒదిగేది కాదు. దీన్ని ఇలాగే అంగీకరిస్తే, ఇక ఈ ఐటెమ్ చెప్పవలసిందేదో చెప్పకుండానే ముగిసిపోతుంది.

 

మరి వెంకటకృష్ణ పెయిన్ అబద్ధమా? తెలంగాణ మిత్రుల వాదన నిజం కాదా? అంతెందుకు, నాకు నేను నాలుగు నాలుకలుగా చీలిపోయిందంతా ఊరికే జరిగిపోయిందా?

నేననుకోవడం- ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ వాల్యూతో ముడిపడివుంటుంది. ఆ విలువే మన జీవితాన్నీ, ప్రపంచాన్నీ నడుపుతుంది. మాకు ఆతిథ్యమిచ్చిన ‘ఇండస్ పబ్లిక్ స్కూల్’ ముందుభాగంలో ‘జీపీఏ 10/10’ సాధించిన పదో తరగతి విద్యార్థిని ముకుంద ప్రియ పేరు, ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వేలాడదీసివుంది. బహుముఖీనంగా ఉండే ప్రాక్టికల్ వాల్యూకు ఇదొక రూపం. ఏ తల్లో ఆ పాపలాగే తన కూతురినీ చదివించాలనుకుంటుంది. ‘సమాజం’ ఏయే కారణాలవల్ల ఏయే విలువల్ని పోషిస్తుందో, అవే కారణాలవల్ల మిగిలినవాళ్లందరూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తెలుగువారందరికీ బహుశా ఆ ప్రాక్టికల్ వాల్యూ కోస్తా దగ్గర ఉందేమో! ఇదే ప్రపంచం మొత్తానికైతే ఆ వాల్యూ అమెరికా దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రపంచదేశాలు అమెరికాను అనుసరించినట్టుగానే, మిగిలిన తెలుగు ప్రాంతాలు కోస్తాను అనుకరించక తప్పదేమో! ఇందులో మంచీ లేదూ చెడూ లేదు. అనివార్యం! రేపెప్పుడైనా ఇదంతా మారిపోయి, ఇంకో విలువ పైకితేలితే లోకం దాన్నే అనుసరిస్తుంది. ఆ విలువ ఎలా, ఎందుకు, ఎవరివల్ల పైకి లేస్తుందన్నది నమోదుకాబోయే చరిత్ర!

(జూన్ 2014లో రాసిన ఆర్టికల్)

-పూడూరి రాజిరెడ్డి

rajireddi-1

‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని!

our-legend-of-cinema-christopher-nolan-1007037965

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న ‘‘ఇంటర్ స్టెల్లార్’’ సినిమాని బాగా అర్ధం చేసుకోవాలన్నా మరో కీ కావాలనిపిస్తోంది. శాస్త్రీయ నారికేళ పాకం చెట్టుదింపుకుని కాయకొట్టుకుని కొబ్బరిముక్క జాగ్రత్తగా తీసుకుని తింటే కానీ రుచితెలియని విధంగా. సినిమాని అర్ధం చేసుకోవడానికి నామట్టుకు నాకయితే మరికొంత రిపరెన్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మిత్రులతో ఆ తాళం చెవిని పంచుకుందాం అనుకుంటున్నాను.

భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంటే ఏం చేయాలి. తినడానికి తిండి పండించుకోలేని స్థితి, వుండటానికి అనువుగా లేని వాతావరణం ఏర్పడుతుంటే ఏం చేయాలి. ప్లాన్ ఏ, లేదంటే ప్లాన్ బి పనిచేస్తాయేమో ననే ప్రయత్నం ‘‘ ఇంటర్ స్టెల్లార్’’ భూమిలాగానే నివాసానికి అనుకూలంగా వుండే ఇతర గ్రహాలను అన్వేషించడం అక్కడ మళ్ళి మానవ జీవితాన్ని ప్రారంభించడం కోసం చేసే ప్రయాణం తాలూకు కథనం ఇది. ఇక ఈ చిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడు క్రిస్టొఫర్ నోలాన్ గురించి చెప్పాలంటే దీనికిముందు తీసింది పట్టుమని పదిసినిమాలే అయినా వందల సంవత్సరాలు గుర్తుంచుకోవలసిన అంశాలని వాటిలో చర్చించాడాయన. నగరాన్ని దాని ఆస్తులనూ నేరస్తుల పాల బడకుండా అడ్డుకునే సూపర్ హీరో బ్యాట్ మెన్ ఆయన సృష్టే, ట్రయాలజీలు తీసినా వెయ్యికోట్ల బిజినెస్ చేయగలగటం అంటే ఫిక్షన్ తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నా ప్రేక్షకుల నాడివదలడు అనడానికి నిదర్శనం.

సినిమాలో కీలకంగా వచ్చే కొన్ని పదాలు తెలిస్తే సినిమాలోకి ప్రవేశించడం మరీ సులభం అవుతుంది.

టైటిల్ గా వున్న ఇంటర్ స్టెల్లార్ అంటే తారాతీరం (occurring or situated between stars) అనే అర్ధంలో డిక్షనరీలు ఇచ్చాయి కానీ విశ్వంలోని నక్షత్రాల మధ్య వున్న ఖాళీని కాకుండా రెండు విశ్వాల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. అవును ప్రపంచంలో ఒక్కటే విశ్వం కాదు అనేక విశ్వాలు వున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు ఒకవిశ్వానికీ మరో విశ్వానికీ మధ్యనున్న ఖాళీ ప్రదేశాన్నే ఇంటర్ స్టెల్లార్ అని పిలుస్తున్నారు.

AI

ఐదు డైమెన్షన్ల(5D) ప్రపంచం : మనం మనుగడ సాగిస్తున్న ప్రపంచానికి పొడవు, వెడల్పు, లోతు అనే మూడు డైమెన్షన్లతోనే(3D) గమనిస్తున్నాం. కానీ కాలం (time), ప్రదేశం/స్థలం (space) అనే మరో రెండు డైమెన్షన్లు కూడా విశ్వానికి వున్నాయి. కాంతి వేగంతో ప్రయాణించేప్పుడూ, వేర్వేరు గురుత్వాకర్షణలలలో వున్నప్పుడూ మనం లెక్కించుకునే కాలంలోనూ, ప్రదేశం లోనూ మార్పులు వస్తాయి. ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అత్యధిక ద్రవ్యరాశుల వద్ద కాలం నెమ్మదిస్తుంది. ప్రదేశం సాగుతుంది. అందుకే హీరో కూపర్ వెళ్తూ వెళ్తూ తన పదేళ్ళ కూతురికి తను వచ్చే సరికి తనవయస్సు కూతురు వయస్సు ఒకటిగానే వుంటాయని చెపుతారు.

 

బ్లాక్ హోల్ (కాల రంధ్రంకాలబిలం, కృష్ణ బిలం, కర్రి గుండం) : విశ్వంలోని ప్రతి ద్రవ్యరాశికీ ఆకర్షించే గుణం వుంటుంది దాన్నే గురుత్వాకర్షణ అంటున్నాం. దాన్నుంచి ఏదైనా విడిపోవాలంటే కొంత వేగంతో దూరంగా వెళ్ళాలి దాన్ని పలాయన వేగం అంటున్నాం. భూమిమీదనుంచి బయటకు పంపే రాకెట్లకు ఈ వేగాన్ని అందిస్తేనే అవి భూమి ఆకర్షణనుంచి బయటకు వెళ్తున్నాయి. కానీ బ్లాక్ హోల్ అనే ప్రాంతంలో కాంతికూడా ఆకర్షణనుంచి విడివడలేదు. అంటే కాంతివేగంతో ప్రయాణించగలవస్తువైనా ఈ కృష్ణబిలం నుంచి బయటకు రాలేదు. అందుకే బ్లాక్ హోల్ అంటే నిర్వచనంగా పలాయన గమన వేగము కాంతి యొక్క వేగం కన్నా ఎక్కువ ఉంటుందో దానినే కాల రంధ్రం లేదా కాలబిలం అంటున్నారు. కాంతి కూడా బయటకు రాదు కాబట్టే అది చీకటి గుహ అయ్యింది. విశ్వంలో గుర్తించిన విశాలమైన ఖాళీలు దానివైపు ఆకర్షింపబడుతున్న దూరపు నక్షత్రాల ఆదారంగా దీన్ని పరోక్షంగా గుర్తించడమే.

కాలబిలం లోపలనే అనేక పిల్ల విశ్వాలున్నాయనీ భూమ్మీద నివసిస్తున్నామనుకుంటున్న మనం కూడా ఒకానొక కాలబిలంలో బంధీలమేననేది ఒక సిద్ధాంతం. అయితే ఒక కాలబిలంలోపటి విశ్వలోకి ప్రవేశించిన మనుషులు మరోకాలబిలంలోని మనుషులతో కొంతమేరకు గమనించడం, వారితో సంభాషించేందుకు కొంత అవకాశం వుంటుంది అనేదాని బేస్ మీదనే సినిమా మొదట్లో ప్రయోగశాల ప్రదేశం తాలూకు అక్షాంశ రేఖాంశాలను మోర్స్ కోడ్ పద్దతిలో కనుక్కోవడం దగ్గరనుంచి, చివర్లో హీరో మన ప్రపంచంలోకి చేరుకోవడం వరకూ వుంటుంది. కాల బిలంలో ప్రవేశించిన వారు చనిపోవడం అంటే కాలబిలాలలోని ఈవెంట్ హారిజన్ (నిర్ణీత సరిహద్దు) ప్రవేశమార్గాలను దాటేసి పై భాగంలోని వెనక్కి వెళ్లలేని చోటు (పాయింట్ ఆఫ్ నో రిటర్న్) కు చేరుకోవడమే అని దానికిలోకి పడిపోయే లోగానే ఈ ప్రపంచంలోకి లాక్కోబడటంతో అతను మళ్ళీ భూమ్మీద జీవించేలా దేహంతో చేరతాడు. అయినా ఈవెంట్ హారిజన్‌కు ఆవల మరో లోకముందని దాన్ని క్యాచీ హారిజన్ (Cauchy horizon) అంటారట, ఈ ప్రదేశంలో కాలం, రోదసి రెండూ సుస్థిర దశల్లోకి చేరిపోయి, నిలకడగా ఉంటాయి. ఈ క్యాచీ సరిహద్దు లోపలే ఆధునాతన నాగరికతా ప్రపంచాలు మనుగడలో ఉండి ఉంటాయని ప్రొఫెసర్ డొకుచోవ్ బలంగా వాదిస్తున్నప్పటికీ బిగ్ బ్యాంగ్ సిధ్దాంత కారులు దీన్ని కొట్టిపారేస్తున్నారు.

warmhole

వామ్ హోల్ : విశ్వాంతరాళంలో కాంతిసంవత్సరాలదూరాన్ని దాటుకుంటూ ప్రయాణించేందుకు కనుక్కున్న ఒకానొక షార్ట్ కట్ రూట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని ఐన్ స్టీన్ రోసెన్ వంతెన అని పిలుస్తారు. రెండు చివరల మధ్య నున్న ఒక టన్నెల్ లాంటి వంతెన ఇది. బ్లాక్ హోలో లో ప్రవేశించిన ఏ పదార్ధాన్నీ బయటకి వదలని స్థితి వుంటే దీనిలోకి వచ్చిన పదార్ధాన్ని కాంతివేగంతో మరో చివరకు నెట్టేస్తుంది. దీనినే సినిమాలో ప్రయాణానికి కీలక సూత్రంగా వాడారు. ప్రయాణానికి కావలసిన ఇంధనాన్నీ, కాలాన్నీ మన పరిమితుల రీత్యా సరఫరా చేయడం అసంభవం అందుకే వార్మ్ హోల్ కున్న ఈ శక్తిని వాడుకోవడం ద్వారా కావాలసిన తీరానికి సులభంగా చేరవచ్చనే ఊహాత్మక లెక్కలతో వీరి ప్రయాణం ప్రారంభం అవుతుంది. నిజానికి ప్రయాణం ప్రారంభం అయ్యేప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఎటువంటి సక్రమమైన దారీ వీరికి తెలియదు.

మోర్స్ కోడ్ : ఈ మధ్యే టెలిగ్రాఫుల ద్వారా సందేశాలను పంపుకునే శకం ముగిసింది కానీ టెలిగ్రాఫుకు కారణం అయిన మోర్స్ కోడ్ ఉపయోగం మాత్రం ముగిసి పోలేదు. కేవలం ఆన్ ఆఫ్ ద్వారా బైనరీ విధానాన్ని (ద్విసంఖ్యామానాన్ని) కంప్యూటర్లలో వాడుకున్నట్లు బిప్ అండ్ గ్యాప్ ద్వారా డాట్ (చుక్క) మరియు డాష్(గీత) అను మాత్రం వాడుతూ సందేశాలను పంపేందుకు ఈ మోర్స్ కోడింగ్ విధానం ఉపయోగపడుతుంది. అందుకే అంతరిక్షంలోకి పంపే అనేక సందేశాలను కోడింగ్ విధానంలోనే తయారు చేసారు. సినిమా మొదట్లో పరిశోధన శాల అడ్రస్ ను ఇదే పద్దతిలో మరో కాలబిలంలో నివసించే వారెవరో అక్షంశరేఖాంశాల (longitude and latitude) కో ఆర్డినేషన్ ను అందించటం ద్వారా గైడ్ చేస్తారు. చివర్లో హీరో కూడా వాచ్ లో సెకన్ల ముల్లులో సహాయంతో తన బిడ్డకు ఈ మోర్స్ సందేశాన్నే పంపించి తన ఉనికిని తెలియజేస్తాడు.

కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) : కేవలం మనిషి తలలో వుండేదే మేధస్సా అస్సలు శరీరంతోనే పనిలేకుండా తెలివితేటలు తమంతట తామే పనిచేస్తే ఎలావుంటుంది. పరిస్థితులను అర్ధం చేసుకోవడం, స్పందించడం, నిర్ణయాలు తీసుకోవడం, లాంటివన్నీ మనిషికి ఆవల జరిగే పద్దతి కృత్రిమ మేధస్సు. ఈ మధ్య అగ్రరాజ్యం అమెరికానుంచి మానవ మెదడును మ్యాప్‌ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించిన కార్యక్రమం కింద భారత నాడీ శాస్త్రవేత్త పార్థా మిత్రాకు గ్రాంట్‌ లభించింది కూడా. ఇలా శరీరమో దేహమో ఆకారమో లేకుండా కేవలం ఎఐ తీసుకునే నిర్ణయాలు వగైరా ఈ సినిమాలో కనిపిస్తాయి.

కథనం : నాసాలో పైలెట్ ఇంజనీర్ గా పనిచేసిన కూపర్ (మాథ్యూ) మానవాళికి తిండిగింజల అవసరం గుర్తించి వ్యవసాయం చేస్తుంటాడు. అతనితో పాటు పదేళ్ళ కూతురు మర్ఫి (మెంకజీ ఫాయ్) , కొడుకు మరియు మామగార్లతో కలిసి వుంటాడు. పదేళ్ళ పాప ఘోస్టుగా పిలుచుకునే ఒకానొక మేధాశక్తి ఆమెను కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలోనే ఒకనాటి ఇసుకతుఫాను గాలివల్ల గదిలో ఏర్పడిన గీతలను మోర్సు పద్దతిలో అర్ధం చేసుకుని అవి సూచించే అక్షాంశరేఖాంశాలున్నప్రాంతానికి చేరతారు తండ్రీ కూతుళ్ళు.

ఆ ప్రదేశం ప్రొఫెసర్ బ్రాండ్ ( మైఖెల్ ఖైనే) ఆద్వర్యంలో నిర్వహింపబడుతున్న నాసా వారి రహస్య ప్రయోగశాల. వీరు మానవాళిని రక్షించేందుకు ప్లాన్-A, ప్లాన్ –B అంటూ రెండు పద్దతులు తయారుచేసుకుని వాటిని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తుంటారు. దానిలో కూపర్ ని కూడా ఒక నిపుణుడైన పైలెట్ గా సహాయం చేయమని అడుగుతారు. దీనిలో ప్రధానాంశం జీవనానికి అనువుగా వుండే గ్రహాలపైకి మానవాళిని పంపించడం. అందుకు పిండదశలో జీవాన్ని నిల్వచేసి అక్కడికి పంపి మళ్ళీ జీవం ప్రారంభం అయ్యేలా చూడటం. దీనిలో ప్రొఫెసర్ బ్రాండ్ కూతురు స్వయంగా బయాలజిస్టు అయిన అమెలియా ( అన్నే హాత్ వే), ఫిజిస్టు రొమిల్లీ ( డేవిడ్ గాసీ) జియో గ్రాఫర్ డోయల్ ( వెస్ బెన్ ట్లీ) లతో పాటు మరో రెండు కృత్రిమ మేధస్సుకలిగిన రోబోట్లు TARS మరియు CASE కూడా పనిచేస్తుంటాయి. అతి సుధీర్ఘ ప్రయాణాన్ని సులభతరం చేసుకునేందుకు వార్మ్ హోల్ సహాయం తీసుకోవాలనేది ఈ ప్రయత్నంలో ముఖ్యమైన అంశం. దానివల్ల కాలంతో పాటు ఇంధనం కూడా కలిసి రావడంతో అసాధ్యం అనుకున్న ఈ గ్రహాంతరాలను మించిన విశ్వాంతర ప్రయాణం సాధ్యం అవుతుంది అని ప్రొఫెసర్ బ్రాండ్ వివరిస్తాడు.

తన తండ్రి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడానికి పదేళ్ళ మర్ఫీ ససేమిరా అంటుంది. కానీ తను తరిగి వస్తానని తను వచ్చేటప్పటికి ఆ అమ్మాయి వయసు, తనవయసూ ఒకేలా వుంటుందని నచ్చజెప్పి, కూపర్ బయలుదేరతాడు. అనుకున్నట్లుగానే ప్రయాణంలో వార్మ్ హోల్స్ సహాయం ఉపయోగపడుతుంది. అచ్చం నీళ్ళతోనూ, పూర్తిగా మంచుతోనూ వున్న వివిధ గ్రహాలను గమనించుకుంటూ వీరి ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలోనే భూమినుంచి పంపే విడియో ఫుటేజిలను గమనిస్తూ తమ వారు ఎలావున్నారో కూపర్ తదితరులు గమనిస్తుంటారు. కూపర్ మామగారు చనిపోతాడు. కొడుకు బిడ్డ పెద్దవాళ్ళవుతారు. మర్ఫీ కూడా ప్రొఫెసర్ బ్రాండ్ కు సహాయంగా వుంటూ తన తండ్రి ప్రయాణ సమాచారాన్ని తెలుసుకుంటూ వుంటుంది. ప్రొఫెసర్ బ్రాండ్ తన తుదిగడియల్లో చెప్పిన నిజం అసలు తిరుగు ప్రయాణంపై తన సమీకరణాల్లో సరైన ఆధారాలేవీ లేవనే విషయం ఆమెను హతాసు రాలిగా చేస్తుంది. అయినా తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం తిరిగొస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తూ బ్రాండ్ అసంపూర్తిగా వదిలేసిన ఆ సమీకరణాన్ని తను పూర్తి చేసేందుకు శాయశక్తులా తన ప్రయత్నాలు చేస్తూ గడుపుతుంది. 40 సంవత్సరాల వయస్సుకూడా దాటుకుని ముసలి తనానికి కూడా వచ్చేస్తుంది.

 

అక్కడ ప్రయాణంలో ఇంధనం అయిపోవస్తుంది. మరొక్క గ్రహాన్ని మాత్రమే చూడగల స్థితికి వస్తారు. అయినా సరే అవకాశం వున్న గ్రహాలను వెదికేందుకు చేతనైనంత ప్రయత్నం చేయడంతోపాటు. స్వంతంగా ఆలోచించగల రెండు రోబోట్లనూ ఆ సమాచార సేకరణ కోసం అంతరిక్షంలో వదిలుతారు. సింగ్యులారిటీ పై సమాచారాన్ని గ్రహించే సందర్భంలో కూపర్ అదనపు డైమెన్షన్ లోకి పడిపోతాడు. అక్కడినుంచి పాక్షిక పద్దతిలోనే ప్రపంచాన్ని గమనించే స్థితిలోకి మారతాడు. కూపర్ కి అప్పుడే అర్ధం అవుతుంది. ఈ అదనపు డైమెన్షన్ లో నివసించగలిగే వారే భవిష్యత్తు మానవులు అని, అక్కడి నుంచి తన బిడ్డతో పూర్వపు ఘోస్ట్ లాగా కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు.

Morse Code

గురుత్వ తరంగాలను ప్రయోగించటం ద్వారా ఒక వాచ్ లోకి మోర్స్ కోడ్ పద్దతిలో సమీకరణాన్ని సాధించే పద్దతిని తెలియజేస్తాడు. ఆ సమీకరణం ఆధారంగా ఆమె తండ్రిని భౌతిక ప్రపంచంలోకి తీసుకు వస్తుంది. పూర్తిగా ప్రపంచంలోకి వచ్చిన కూపర్ కి తన కూతురు ముసలి వయస్సులో మంచపట్టిన స్థితిలో కనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులకైనా చూడలేని స్థితి తమ బిడ్డలు మరణం అంచున వున్నారని తెలియటం అందుకే నువ్వు నాకోసం ఆలోచించకు దానికి నా బిడ్డలున్నారు అంటుంది మర్ఫీ. అతని తర్వాతి కర్తవ్యంగా వదిలేసిన ఎడ్మండ్ గ్రహాన్నీ, అమెలియానీ అన్వేషించడం ప్లాన్ బిలో భాగంగా జీవ పిండాలను ఆ గ్రహంపై పెంచేందుకు తగిన పద్దతులను అన్వేషించడం ప్రారంభించమంటుంది. ఇతని ప్రయాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది. అడ్మండ్ పై అప్పటికే అమెలిన్ తన ప్రధమిక ప్రయత్నాలలో వుందన్న విషయం చూపటంతో సినిమా ముగుస్తుంది.

కేవలం శాస్త్రీయతే కాకుండా మానవీయకోణంలో నడిచే సంభాషణలు కూడా ఈ సినిమాలో కట్టిపడేస్తాయి. మచ్చుకు స్థల కాలాలను అధిగమించగలిగేది ప్రేమ ఒక్కటే అంటూ ప్రొఫెసర్ బ్రాండ్ చెప్పటం. మానవజాతి భూమ్మీద పుట్టిందంటే దానర్ధం భూమ్మీదే అంతరించి పోవాలని కాదు లాంటి డైలాగులు బావున్నాయి. ఇంత సంక్లిష్టమైన ‘సైన్స్‌ ఫిక్షన్‌’ చిత్రాన్ని తండ్రీ కూతుళ్ళ మధ్య వున్న అనుబంధం చుట్టూ అల్లి, ఏమాత్రం సైన్సు పరిజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యే టంతగా తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.

నోలన్ ‘సిజిఐ'(కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) తక్కువగా వాడి సహజత్వానికి దగ్గరగా వుండాలని కెమెరాతో తీసిన దృశ్యాలనే ఎక్కువగా వినియోగిస్తాడు. అందుకే తారాతీరాలలోనూ, విచిత్ర వాతావరణలోని గ్రహాలలోనూ సంచరించడాన్ని కళ్ళకు కట్టినట్లే చూపడం వల్ల కావచ్చు బిగ్ స్క్రీన్ టిక్కెట్లకు అంత రష్ ఏర్పడింది. మొత్తానికి ఒక మంచి సైన్సు పిక్షన్ చూడాలని కోరుకునే వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈ ఇంటర్ స్టెల్లార్.

 -కట్టా శ్రీనివాస్

 

మధ్యతరగతి మనస్తత్వాల మీద కోల్డ్ కిక్ “వీరుడు మహావీరడు”

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

లోకం పోకడ మీద అధిక్షేపణ ఈ కధ. సగటు మనుషులకున్న నిష్క్రియాపరత్వం మీద, ఆ నిష్క్రియాపరత్వం కూడా బలవంతులకు అనుకూలంగా వుండేలా, బలహీనులకు క్రియారహితంగా వుండేలా, వుండటంలో అసమంజసం మీద వ్యంగ్యం. అందుకే యీ కధ చెప్పే కధకుడు (ఇతను సమాజపు సగటు ఆలోచనలకు ప్రతినిధి యీ కధలో) అంటాడూ “బిగ్ పవర్ లో వున్న ఆకర్షణే అది. మనం అనుకుంటాం గానీ యే కాలం లోనైనా ఏ లెవల్లోనైనా బిగ్గూ స్మాలూ తేడాలు వుండనే వుంటాయి…”

లోకమెప్పుడూ బిగ్ వైపే నిలబడాల, బలహీనుడి వైపు న్యాయమున్నా, బలహీనుడు బలవంతుడితో కొట్లాడేటప్పుడు న్యాయం వైపు వున్నాడు కదాని బలహీనుడి వైపు నిలబడకూడదు, బలవంతుడి వెనకాల యింకొందరు బలవంతులుంటారు కాబట్టి వీలైతే బలవంతుడి వైపే వుండి బలహీనుని మీద ఒక దెబ్బ వేయాల. అది కూడా వాడి మంచికేనంటాడు కధకుడు. “అవును గురూ! అలాంటోళ్ళు (వీరులు) ఏటనుకుంటారంటే జనం జూస్తూ అన్నేయాలు జరగనిస్తారా? అనుకుంటారు. అనుకుని-న్యాయం ధర్మం-అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకళ్ళకి తెద్దునా అందరికీ తెద్దునా అని క్రైసీసులు సృష్టిస్తారు. ఒక్క సారి జనం సంగతేటో తెలిస్తే మరింకెప్పుడూ అలాంటి ఎర్రికుట్టి ఏషాలెయ్యడు. అందికే ఆడి మంచికోరే నేను ఆడి మీద ఓ చెయ్యేసీసేను” అంటాడు కధ ముగిస్తూ.

కారా మాస్టార్ గారి ‘వీరుడు మహా వీరడు’ కధ 05-04-1968న ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో అచ్చయింది. మధ్య తరగతి సగటు మనిషి స్వభావాన్నీ, చంచలత్వాన్ని, జారుడుతనాన్నిఅద్భుతంగా పట్టుకుందీ కధ. కధ చెప్పే కధకుడు ఒక నగరవాసి. శ్రీరామ నవమి సంబరాలు జరిగే దినాలలో ఒక రాత్రి జేమ్స్ బాండ్ సినిమా చూద్దామని సెకెండ్ షోకి వెళ్ళి, టికెట్ దొరక్క, వుత్సవాలు జరుగుతున్న పందిళ్ళను చూస్తూ యింటికి వెనుదిరిగే క్రమంలో, ఒక పోట్లాటను చూస్తున్న గుంపులో ఆగి పోతాడు. ఆ పోట్లాట జరుగుతున్నది గంజి పేట రౌడీకీ, అల్లిపురం వస్తాదుకీ. కధకుడు అక్కడక్కడా గంజి పేట రౌడీని ‘వీరుడు’ అని చెప్తూ ఉంటాడు. ఇక మహావీరుడు ఎవడు అనేది పాఠకులు నిర్ణయించుకోవాల్సిందే. నిజానికి గంజి పేట రౌడి యింకొకడితో కొట్లాడుతుంటే, అల్లిపురం వస్తాదు మధ్యవర్తిగా వచ్చి కొట్లాట విడిపించినట్లే విడిపిస్తూ గంజిపేట రౌడీనీ పట్టేసి యింకొకడి చేత తన్నిపించాడనీ, తనకు జరిపిన అన్యాయం పట్ల కసితో గంజిపేట వీరుడు అల్లిపురం వస్తాదుకు సరిసాటి కాకున్నా ఎదిరిస్తూ తన్నులు తింటున్నాడనీ కధకుడికి తెలుస్తుంది. కధకుడికి గంజిపేట రౌడీలోని ఫైటింగ్ స్పిరిట్ నచ్చుతుంది.

“అయితే మనిషికా ఫైటింగ్ స్పిరిట్ వొక్కొక్కప్పుడలా వొచ్చేస్తాది. అలాటప్పుడు న్యాయం నీ పక్క నుండాల. అవతలోడు ఫాలు గేమాడాల. అదేవంటే, దౌర్జన్యానికి దిగాల. సూస్తున్నోళ్ళు సీమ కుట్టినట్టు మాటాడకూరుకోవాల! జనం అవతలోడి బలానికి జడిసి అన్యాయానికి నోరెత్తకుండా వున్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం, పిరికితనం చూసి ఆడి జులుం మరీ మరీ పెరిగి పోతుండాల. అదిగో ఆలాటప్పుడు వొచ్చెస్తాది ఎక్కళ్ళేని ఫైటింగ్ స్పిరిటూ. అప్పుడు పిల్లి లాంటోడైన పిల్ల పులైపోతాడు. పులి పిల్లలా ఎగిరి ఏనుగు కుంభస్థళవైనా అందుకోడానికి పంజా చాస్తాడు.” అంటాడు కధకుడు. అట్లాంటి కొట్లాటను వింతగా జూస్తున్న జనం మీద కోపం వస్తుంది కధకుడికి. ఎందుకింత అన్యాయాన్ని జరగనిస్తున్నారని. జనం బలహీనుడైన గంజిపేట వీరుని వైపు నిలబడితే, అల్లిపురం వస్తాదు ఎంత బలవంతుడైనా భూమిలోకి దిగిపోడా అనుకుంటాడు. అయితే అల్లిపురం వస్తాదు ఏనుగంతవాడు. గంజిపేట వస్తాదు వీరుడు, యువకుడైనా వాడి ముందు ఎలుకంత వున్నాడు. కధకుడికి గంజిపేట రౌడీ మీద సానుభూతి వుంది, అతను అన్యాయాన్ని ఎదిరిస్తున్నాడనీ, ఎదురుగా వున్న బలవంతుడికి సమవుజ్జీ కాకున్నా ఎదురిస్తున్నతనికి జనం ఎందుకు సాయపడ్డం లేదనీ అనుకుంటూ తను కూడా గంజిపేట వీరుడితో కలసి వస్తాదుతో కలబడాలనుకుంటాడు. అయితే తను వేసుకొన్న టెర్లిన్ బట్టలు చిరిగిపోతాయని వెళ్లలేక పోతాడు. తను ఎప్పుడూ దెబ్బలాడక పోవడమూ, కసరత్ చేయక పోవడం గురించి చెడ్డ చిరాకు పడతాడు.

సరిగ్గా అట్టాంటి సమయంలో కొత్త పేట శాండో రంగ ప్రవేశం చేస్తాడు. దాంతో కధకుడికి గొప్ప యుద్ధం జరగబోతుందనే భయమూ, గంజిపేట వీరుడికి దన్నుగా నిలుస్తాడనే భరోసా కల్గుతాయి గానీ, కొత్త పేట శాండో గంజిపేట వీరున్నే శాంతించమంటాడు. నన్ను కాదు శాంతించమనాల్సింది, నీక్కలేజా ఉంటే అల్లిపురం వస్తాదుతో దెబ్బలాడమంటాడు గంజిపేట వీరుడు. శాంతించక తననే నిందిస్తున్న గంజిపేట వీరుడ్ని ఆదుకొంటే పెద్ద గొడవైపోతుందని ఎరిగిన కొత్త పేట శాండో, గంజిపేట రౌడీని అల్లిపురం వస్తాదు చేతుల్లోకి తోసేసి తన దారి తను వెళ్తాడు. ఆ నిష్క్రమణలో ఉన్న లాజిక్ తో మన కధకుడికి జ్ఞానోదయం అవుతుంది. బలహీనుణ్ణి సమర్ధించి బలవంతుడితో తంటా తెచ్చుకోవడమెందుకన్నదే ఆ లాజిక్. ఆ తర్వాత అంతవరకూ గంజిపేట వీరుడ్ని సమర్ధించిన వాడు విమర్శించడం ప్రారంభిస్తాడు. గంజిపేట వీరుడికి బలవంతుడితో పెట్టుకోకూడదు అనేది తోచనైనా తోచాల లేదా ఒకరు (కొత్తపేట శాండో లాంటి వాడు) చెప్పినప్పుడు విననన్నావినాల. అట్లా కాకుండా తనవైపు న్యాయముందనీ, జనమంతా తన వైపు రావాలనీ అనుకోవడం .. అనుకొని న్యాయం, ధర్మం అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడ్డం .. పడి ఒకరికి తెద్దునా అందరికీ తెద్దునా అనుకోవడం తప్పు అంటాడు కధకుడు. అందుకే యిక ముందెప్పుడూ జనాన్ని నమ్ముకొని ఎర్రివేషాలెయ్యకుండా జనంతో కలిసి తనూ వాడి మీద ఒక దెబ్బ వేస్తాడు.

మధ్యతరగతి మనస్తత్వాల మీద ‘కోల్డ్ కిక్’ యీ కధ. ఈ జనం ఎలాంటివారంటే .. న్యాయం, అన్యాయం మీద బలవంతుడు బలహీనుడి మీద పోట్లాడుతుంటే ప్రేక్షకుల్లా చూసి ఆనందించమంటే ఆనందిస్తారు. బలహీనుడి పక్షం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తమ బట్టలు నలుగుతాయనుకొంటారు లేదా క్షణాల మీద తమ అభిప్రాయం మార్చుకొని తనకే మాత్రం అసౌకర్యం కలగకుండా బలవంతుడి వైపైనా నిలబడతారు. ఏ కాలంలోనైనా, ఏ స్థాయిలోనైనా బలవంతులపైనా ఉండే ఆకర్షణ అదేనంటాడు కధకుడు.

ఈ కధతో పాటు, కారా మాష్టర్ గారికి పేరు తెచ్చిన కధలన్నీ (యజ్ఞం, హింస, భయం, శాంతి, చావు, జీవధార, కుట్ర, సంకల్పం) కూడా రచయితకు ఎదురైన దైనందిన అనుభవాల మీద రాసిన కధలు కావు. తను కధ రాసిన కాలంలో నెలకొని వున్న సోషియల్ రియాలిటి చెప్పటానికి, తన కాలపు సోషియో – పొలిటికల్ – ఎకనామిక్ దృగ్విషయాల మీద (కాన్ సెప్ట్స్) లోతైన అవగాహనతో చిత్రించిన యితి వృత్తాలు. ఒక్కొక్క కధా ఒక్కో కాన్సెప్ట్ మీద రాసిందే.

బూర్జువా వర్గపు స్వభావాన్ని చిత్రించడానికి కారా మాస్టర్ వీరుడు మహావీరడు కధ రాశాడని తెలుస్తుంది. మధ్య తరగతి చైతన్యం మీద విమర్శనాత్మక వ్యాఖ్యానంగా యీ కధ నిలుస్తుంది. 1968 కాలానికి తెలుగు నేల మీద, జాతీయ అంతర్జాతీయ వేదిక మీద సామ్రాజ్యవాదపు ప్రభావం – బూర్జువా వర్గపు విస్తరణ, అవి కమ్యూనిష్టు వుద్యమాల మీద చూపుతున్న ప్రభావాల ప్రతిఫలనమే యీ కధ. ఆ కాలపు మధ్య తరగతి స్వభావం ప్రగతిదాయకంగా లేదన్నది రచయిత విమర్శ. అతి సంక్లిష్టమైన విషయాన్ని పాఠకుల ముందు నడిబొడ్డున నిలబెట్టి వీధి రౌడీల యుద్ధంగా చూపిస్తూ మధ్య తరగతి జనాల చైతన్యాన్ని చిత్రించే దృగ్విషయంగా మలచటంలో కారాగారి పరిణత శిల్పవిన్యాసం కన్పిస్తుంది.

చిన్న కధలో పెద్ద సత్యాలు ఆవిష్కరించడం గొప్ప కధా లక్షణం. ఏ సమాజంలోనైనా నిష్క్రియాపరత్వం, అన్యాయాల పట్ల స్పందన లేనితనం .. సమాజాన్ని బలవంతుల రాజ్యంగా మార్చుతుందనీ, ప్రగతిశీల శక్తుల వైపు ఎంత న్యాయమున్నా ఎంత ఫైటింగ్ స్పిరిట్ వున్నా అది వృధా అవుతుందనీ యీ కధ చెప్తున్న సత్యం. తెలుగు నేల మీద అణగారిపోయిన వుద్యమ శక్తికీ, వుద్యమ ఫైటింగ్ స్పిరిట్ కూ మధ్యతరగతిలోని నిష్క్రియా పరత్వమే కారణమైందనీ, యీ కధ 1968 లోనే చెప్తే, అది యీ రోజు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ మితవాదుల్నీ/మతవాదుల్నీ సమర్ధించే స్థితికి తెలుగు సమాజం చేరుకుందని అర్ధమవుతుంది.

కొన్ని దశాబ్ధాలుగా తెలుగు సమాజంలో జరుగుతున్నసకల అన్యాయాల మీద అణచివేతల మీదా వుద్యమశక్తులు ఎంతో పోరాట స్పూర్తితో పోరాడుతున్నాయి. మైదానాల్లోనూ అడవుల్లోనూ వెలుగులు నింపడానికి ప్రతిఘటిస్తున్నాయి. సమాజం వీళ్ళను వీరులూ/ శూరులూ త్యాగధనులూ అంటూ పొగుడుతుంది. వాళ్ళు ఓటు కోసం వస్తే ఒక్క సీటూ రాల్చదు, వాళ్ళు ఎన్ కౌంటర్ అయితే పెదవి విప్పదు. నిజమైన తీర్పు ఇవ్వాల్సి వచ్చినపుడు నిష్క్రియగా స్పందన లేకుండా వుండిపోవడం, వీలైతే రాజ్యం వైపు నిలబడ్డం, వీరుల్ని చూసి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం మధ్య తరగతికే చెల్లుతుంది. ఈ వైఖరి మీద ఆగ్రహ ప్రకటనే “వీరుడు మహావీరడు” కధ.

 -జి.వెంకట కృష్ణ 

DSCN0059కర్నూలుకు చెందిన జి. వెంకట కృష్ణవి “గరుడ స్తంభం”, “చిలకలు వాలిన చెట్టు” కధల పుస్తకాలు వచ్చాయి. “లోగొంతుక”, “దున్నే కొద్దీ దుఃఖం”, “కొన్ని రంగులు, ఒక పద్యం” అనే కవితా సంపుటాలూ .. ఇంకా “ఒక నదీ – వరదా – మనిషి” అనే దీర్ఘ కవితా పుస్తకాలుగా వచ్చాయి. వెంకట కృష్ణ రచనలు ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో, అరుణతారలో ప్రచురింపబడ్డాయి. తన సాహిత్య జీవితం మీద ఒకే ఊరివాడైన బండి నారాయణ స్వామి ప్రభావం ఉందంటారు. తొమ్మిది చదువుతుండగానే రంగనాయకమ్మ నవలలు, తిలక్ కవితలు చదివి వారి మీద అభిమానం పెంచుకొన్నానంటున్నారు. నేటి తరం రచయితలలో ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావు  అంటే ఇష్టం.

వచ్చే వారం :’తీర్పు’ కధ గురించి ఎ.కె ప్రభాకర్

వీరుడు మహావీరడు కథ ఇక్కడ:

 

ప్రేమతో…

MythiliScaled
చాలా కాలం కిందట ఒక పెద్ద మైదానం.. మధ్యలో చిన్న గుడిసె. అందులో ఒక ముసలమ్మా ఒక పడుచు అమ్మాయీ ఉంటుండేవారు. ముసలమ్మ కి మాటలు రావు , పైగా చాలా కోపిష్టిది. అమ్మాయి విచ్చుకునే రోజా మొగ్గ అంత ముద్దుగా ఉండేది. అడవిలో జలజలమనే వాగు గుసగుసల అంత తియ్యగా ఉండేది ఆమె గొంతుక.

ఆ గుడిసె పెద్దపెద్ద చెట్టుకొమ్మలతో అల్లిన తేనెతుట్టెలాగా ఉండేది. అందులో ఎప్పుడూ ఆరిపోని నెగడు ఉండేది. దాన్ని ఎవరూ వెలిగించకుండానే, పుల్లలు వేయకుండానే అది అలాగ మండుతూ ఉండేది. చలికాలం లో వెచ్చగా వేసవిలో చల్లగా ఉండేది దాని వెలుతురు. నెగడు కీ గోడకీ మధ్యని రెండు మంచాలు. ఒకటి సాదా కొయ్యతో చేసినది, దాని మీద ముసలమ్మ పడుకునేది. రెండోది మాత్రం మంచి ఓక్ కొయ్యతో చేసినది. మొహం కనిపించేంత నున్నగా చిత్రిక పట్టారు దాన్ని. దాని మీద లతలూ పూవులూ పక్షులూ చెక్కారు కూడా. ఒక రాజకుమారి మంచం లాగా ఉండేది, దాని మీద అమ్మాయి పడుకునేది. తన పేరు ఫినోలా- నిజానికి తనొక రాజకుమారే, ఆ సంగతి ఆమెకే గుర్తు లేదు.
గుడిసె బయట ఎటు చూసినా చెట్టూ చేమా లేని బీడు . మరొక మనిషి పొడైనా- చివరికి ఒక పిట్టైనా పురుగైనా, లేదు – ఏ అలికిడీ వినబడేది కాదు. తూర్పు వైపున పెద్ద కొండ. పగటిపూట నీలంగానూ , పొద్దు కుంకేవేళ వంద వింత రంగులతోనూ కనబడేది. దాన్ని చూస్తుండటం తప్పించి ఫినోలా కి ఏ ఉల్లాసమూ లేదు. కొండ అవతలినుంచి వీచే తుఫాను గాలి కూడా ఈ మైదానం లోకి వచ్చేసరికి నిశ్శబ్దంగా అయిపోయేది. తనతో తనే మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఫినోలా కాలం గడిపేది.
నెలకి ఒక్కసారి మాత్రం ఒక మరుగుజ్జు మనిషి కుంటి గుర్రం మీద ఎక్కి వచ్చేవాడు. ముసలమ్మకీ ఫినోలాకీ నెలకి సరిపడా గోధుమలు బస్తాలో తెచ్చి ఇచ్చేవాడు. అదేమిటోకానీ అతనికీ మాటలు రావు. కాని ఫినోలా అంటే అతనికి ఎంతో ఇష్టంగా ఉండేది, ఆమె కోసం ఏమైనా చేయగలననీ చేయాలనీ అతనికి అనిపించేది. ఫినోలాకీ అతను రాగానే ప్రాణం లేచొచ్చినట్లుండేది. తనే ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ని అతని కోసం దాచి ఉంచేది.
ఒకరోజు అతను వచ్చినప్పుడు ఫినోలా ఎప్పటిలాగా ఎదురు రాలేదు. ముసలమ్మని సైగ లతో అడిగాడు ఏమైందని. ఉత్తిపుణ్యానికే ముసలమ్మకి కోపం వచ్చి కర్ర పుచ్చుకు కొట్టబోయింది. ఆమెని తప్పించుకుని గుర్రం ఎక్కుతున్న అతనికి గుడిసె వెనకవైపున కూర్చుని ఏడుస్తున్న ఫినోలా కనబడింది. ఎందుకో తనకి ఆవేళ పెద్ద దిగులు వచ్చేసింది. అది చూసి మరుగుజ్జుకి చాలా బాధేసింది. ఆమె గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా కొండ అవతలి అడవిలోంచి వెళుతున్నాడు. అంతలో ఎక్కడినుంచో మాటలు వినిపించాయి
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” అని.
మరుగుజ్జు ఎదురుగా కొండవాలులో అతనిలో సగం ఎత్తున్న మనిషి కనిపించాడు. ఇత్తడి గుండీలు ఉన్న ఆకుపచ్చని అంగరఖా తొడుక్కుని ఎర్రటి టోపీ పెట్టుకుని ఉన్నాడు. అతనొక గంధర్వుడు.
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” గంధర్వుడు మళ్ళీ అన్నాడు. ” నీకు స్వాగతం. గుర్రం దిగి నాతో రా. నీ పెదవులకి మంత్రదండం తాకించి నీకు మాటలు రప్పిస్తాను. మనం మాట్లాడుకోవలసింది చాలా ఉంది ”
అలాగే మరుగుజ్జు అతని వెంట వెళ్ళాడు. కొండ అడుగున చిన్న బిలం లోంచి ఇద్దరూ లోపలికి దిగారు. ఆ దారి మరుగుజ్జుకే చాలా ఇరుకుగా అనిపించింది. కొన్ని మెట్లు దిగి పెద్ద చావడిలోకి ప్రవేశించారు. అక్కడ బంగారు స్తంభాల మీద వెండి రేకుల కప్పుతో ఒక మంటపం. కప్పు మీదా స్తంభాలమీదా మిలమిల మెరిసే వజ్రాలు పొదిగి ఉన్నాయి. వేరే దీపాలు అక్కర్లేనంత కాంతి వాటిలోంచే వస్తోంది. చావడి మధ్యగా ఒక బల్ల వేసిఉంది. దాని పైన మళ్ళీ బంగారు పళ్ళాలూ వెండి చెం చాలు. అటూ ఇటూ రెండు చిన్న కుర్చీలు, వాటిలో నీలిరంగు పట్టుదిండ్లు. ఆ పక్కనే పెద్ద కంచుగంట.

 

story1
” ఇలా కూర్చో ” అని తనొక కుర్చీలో కూర్చుని మరొక కుర్చీ చూపాడు గంధర్వుడు- ” ముందు నీకు మాటలు రావాలి కదూ ” – కంచుగంట ని మోగించాడు. ఇంకొక మనిషి, మరుగుజ్జు చూపుడువేలంత అంత ఉన్నవాడు , వచ్చాడు.
” మాటలొచ్చే మంత్రదండం తీసుకురా ” అజ్ఞాపించాడు . వేలెడంత వాడు వినయం

గా వంగి వెనక్కి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చాడు. అదొక నల్లటి కర్ర. దాని చివరన ఎర్రగా మెరిసే కెంపు ఉంది. మరుగుజ్జు మొహం ముందు మూడుసార్లు దాన్ని ఆడించి, ఆ భుజమూ ఈ భుజమూ తట్టి- కెంపుని అతని పెదవులకి తాకించాడు గంధర్వుడు.
తర్వాత
” మాట్లాడు ” అన్నాడు. మరుగుజ్జుకి గొంతు పెగలింది. తన గొంతు ని తాను విని ఆనందం తో గంతులు వేశాడు.
” నువ్వు ఎవరో చెప్పు ?” అడిగాడు గంధర్వుడు.
” నువ్వెవరో చెప్పు ముందు ” మరుగుజ్జు అన్నాడు – ” మాటలు తర్వాత, బాగా ఆకలేస్తోంది ”

story2

సరే, ఇద్దరూ పళ్ళాల ముందు కూర్చున్నారు. గంధర్వుడు మళ్ళీ కంచుగంట మోగించాడు. వేలెడంతవాడు వచ్చి మూడు నాలుగు సార్లుగా రుచి గల రొట్టెలూ కూరలూ తీపి పదార్ధాలూ తెచ్చిపెట్టాడు. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. తర్వాత పళ్ళరసాలు తాగారు.
అప్పుడు మరుగుజ్జు చెప్పాడు ” మంచి విందు చేశావు, చాలా సంతోషం. నన్ను అడిగావు కదా నేనెవరని- ఇంతకీ నేనెవరో నాకు తెలియదు ! ”
” అసలు నీ గురించి నీకేమి తెలుసో చెప్పు ” అడిగాడు గంధర్వుడు.
” ఒక రోజున లిఫే నగరం లో రాజు గారి భవనం ముందు ఉన్నాను. అక్కడెవరో గారడీ చేస్తుంటే చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఆట అయాక రాజు నన్ను పిలిచి నా పేరేమిటో ఎక్కడనుంచి వచ్చానో అడిగాడు. జవాబు చెప్పటానికి నాకు మాటలు రాలేదు సరిగదా, అంతకుముందరి సంగతులన్నీ మర్చిపోయాను. రాజు నన్ను కొలువులో చేర్చుకుని పని అప్పగించాడు. నెలకొకసారి మైదానం మధ్యని గుడిసెకి గోధుమలు తీసుకుపోవటం , అంతే ” అని మరుగుజ్జు సమాధానం చెప్పాడు.
” అయితే అక్కడి అమ్మాయితో ప్రేమలో పడ్డావు కదూ ? ” గంధర్వుడు అడిగాడు.
మరుగుజ్జు ఒప్పుకుందుకు మొహమాటపడ్డాడు.
” మరేం పర్వాలేదు, నాకు తెలుసులే . ఆ అమ్మాయి ఒక రాజకుమారి. తనకొక శాపం ఉంది. దాన్ని పోగొట్టేందుకు ఏమైనా చేయగలవా మరి ? ”
” నా ప్రాణమైనా ఇస్తాను ”
” సరే అయితే, విను. ఈ రాజ్యం వాళ్ళదే అసలు. నువ్వు పనిచేస్తున్నావే ఒక రాజు కింద, అతను ఈ అమ్మాయి తండ్రిని ఓడించి చపేశాడు. రాజకుమారిని మాత్రం చంపకూడదనీ అలా చేస్తే తనూ చచ్చిపోతాడనీ జ్యోతిష్కులు చెప్పారట. రాజుకి ఒక మంత్రగత్తె తెలుసు. ఆమె నిద్రపోయే రాజకుమారిని మంచం తో సహా అక్కడికి చేర్చింది. ఒక మూగ ముసలమ్మని కాపలా పెట్టింది, మైదానాన్నంతా మంత్రించి నిశ్శబ్దం చేసింది. ఆమె ఉనికి ఎవరికీ తెలియకూడదని ఆ జాగ్రత్త అంతా. రాజకుమారి గతం మర్చిపోయేటట్లు, మైదానం దాటి వెళ్ళలేనట్లు కూడా చేసింది మంత్రగత్తె. ఇంక వాళ్ళకి ఆహారం ఇచ్చేందుకు రాజకుమారి విషయమే తెలియనివారు కావాలి, చూసినది ఎవరికీ చెప్పలేకుండా ఉండాలి. నిన్ను మూగవాడిని చేసి అందుకోసం నియమించారు ” – వివరించాడు గంధర్వుడు.
మరుగుజ్జు అడిగాడు – ” నీకింత తెలుసు కదా, నేనెవరో ఏమిటో చెప్పలేవా ?”
” నెమ్మదిమీద నీకే తెలుస్తుంది. నీకు మాటలైతే రప్పించగలిగాను, తర్వాతి సంగతి నువే చూసుకోగలవు. ఇంతకూ రాజకుమారి శాపం విడిపించే పని మొదలుపెడతావా ? ”
” ఓ ! తప్పకుండా !!! ”
” అందుకోసం దేన్నైనా సరే వదులుకోగలవా ?”
” చెప్పాను కదా, ప్రాణమైనా ఇస్తానని , అసలేం చేయాలో చెప్పు ”
” నువ్వు సరైన ఆయుధాలు సంపాదించుకోవాలి ”
” ఏమిటవి ? ఎక్కడ దొరుకుతాయి ?”

story3 (2)
” ఒక కంచు డాలు , రాగి కత్తి, ఇనప బల్లెం- ఈ మూడూ కావాలి. ఏవి పడితే అవి పనిచేయవు. పశ్చిమసముద్రం లో ఒక దీవి ఉంది. అందులో రహస్య సరస్సు ఉంటుంది. దాని అవతలి ఒడ్డున మాత్రమే ఇవి దొరుకుతాయి. సాహసం గలవారు మటుకే వాటిని సంపాదించగలరు. మైదానం లోకి తెచ్చి ఆ డాలు మీద కత్తితో మూడుసార్లూ బల్లెంతో మూడుసార్లూ కొట్టావా, అక్కడి నిశ్శబ్దం విచ్చిపోతుంది. శాపం తీరి రాజకుమారికి స్వేచ్ఛ వస్తుంది ”
” ఇప్పుడే బయల్దేరుతాను ” దిగ్గున లేచాడు మరుగుజ్జు.
” మళ్ళీ అడుగుతున్నాను, దేన్నైనా సరే త్యాగం చేయగలవు కదా ?”
” నిస్సందేహంగా ! ”
”ఇదిగో, నీ గుర్రం చెవిలో దారి చెబుతున్నాను . అది ఎలా తీసుకువెళితే అలా వెళ్ళు. సరాసరి పశ్చిమసముద్రపు తీరానికి చేరతావు. గుర్రం మీదే నువ్వు సముద్రం దాటి దీవికి చేరుకోవాలి. ఆ సముద్రం లో భయంకరమైన నీటి గుర్రాలు ఉంటాయి. అవి నిన్ను ఆపుతాయి. అవి అడిగినది ఇస్తేగానీ నిన్ను వెళ్ళనివ్వవు. పొరబాటున వాటిని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవాలనుకోకు, నిన్ను చీల్చి చెండాడతాయి. దీవి లో కాలుపెట్టిన తర్వాత రహస్య సరస్సు లో నీళ్ళు ఎర్రగా మారేదాకా వేచిఉండాలి. ఇక్కడ క్రూరమైన నీటి పక్షులు ఉంటాయి. అవి అడిగినది ఇచ్చాకే అవతలి ఒడ్డుకి వెళ్ళనిస్తాయి. వాటిని తప్పించుకు పోవాలని చూసినా చాలా ప్రమాదం. అంతా సవ్యంగా చేయగలిగితే ఆ ఒడ్డున ఉన్న డాలూ కత్తీ బల్లెం – నీకు దొరుకుతాయి ”

గంధర్వుడికి కి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని మరుగుజ్జు బయల్దేరాడు. కోనలు దాటీ లోయలు దాటీ కనుమలలోంచి వెళ్ళీ వెళ్ళీ పశ్చిమసముద్రతీరం చేరేసరికి పొద్దు వాలుతోంది. చూస్తుండగానే కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి అలముకుంది. అలసటగా గుర్రమూ తనూ అక్కడే నిద్రపోయారు.
తెల్లారి లేచి చూస్తే సముద్రం లో ఎక్కడా నీటిగుర్రాలు లేవు. వేరే ఇంకొక చోటి కి వచ్చానా అని మరుగుజ్జు ఆదుర్దా పడ్డాడు. అంతలో సముద్రపు అలలు విసురుగా విరిగి పడటం మొదలైంది. భీబత్సంగా సకిలిస్తూ చాలా నీటిగుర్రాలు అక్కడికి ఈదుకుంటూ వచ్చాయి. వాటి ముఖాలు భీకరంగా ఉన్నాయి. మింగేస్తాయా అనిపించి మరుగుజ్జు వణికిపోయాడు. తిరిగివెళ్ళిపోదామనుకున్నాడు. అప్పుడు ఎక్కడినుంచో శ్రావ్యమైన హార్ప్ ధ్వని వినిపించింది. కొండ దిగువన గంధర్వుడు అక్కడ ప్రత్యక్షమ యా డు. అతని చేతిలోనే హార్ప్ ఉంది. వింటూనే మరుగుజ్జుకి ధైర్యం వచ్చింది.
” త్యాగం చేస్తావా ? ” మూడుసార్లు అడిగాడు అతను.
అన్నిసార్లూ సరేనన్నాడు మరుగుజ్జు.
” వెనక్కి మరలండి ” నీటిగుర్రాలకి ఆజ్ఞ ఇచ్చాడు గంధర్వుడు. అవి అలాగే చేశాయి.
” ఏమి వదలాలి ?”
” నీ కుడి కంటిని ”
మరుగుజ్జుకి భయం వేసింది. కాని ఫినోలాని తలచుకుని ఆమె కోసం ఒప్పుకున్నాడు. వెంటనే కుడి కంటిలో భరించలేనంత నొప్పి పెట్టింది. చూపు పోయింది. గంధర్వుడు కొత్త పాట హార్ప్ మీద వాయించాడు. వినగా వినగా మరుగుజ్జుకి నొప్పి తగ్గింది. నీటిగుర్రాలు మాయమైనాయి.
” ఇప్పుడు దాటు ” చెప్పాడు గంధర్వుడు.
గుర్రం తో సహా సముద్రం దాటి దీవిలోకి వెళ్ళాడు మరుగుజ్జు. పచ్చటి చెట్లతో సువాసనలు చిమ్మే పూలతో దీవి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మెలికలు తిరిగే సన్నటి బాటలవెంట దౌడు తీసి , గుర్రం ఒక సరస్సు ఒడ్డుకి చేరి ఆగిపోయింది. అదే రహస్య సరస్సు. ఏ కదలికా లేకుండా , సూర్యకాంతిలో అద్దంలాగా ప్రకాశిస్తోంది సరస్సు. మరుగుజ్జు గుండె ఎందుకనో వేగంగా కొట్టుకుంది. చాలాసేపటి తర్వాత గుర్రం దిగి ఒడ్డు న ఉన్న పచ్చికలో నడుము వాల్చాడు . ఎంత సేపు చూసినా నీళ్ళు ఎర్రబడనే లేదు.

మధ్యాహ్నం అవుతుండగా ఆకాశం లో పెద్ద నల్లటి మేఘం సరస్సు మీదికి వాలుతున్నట్లు కనిపించింది. పరీక్షగా చూస్తే అది బ్రహ్మాండమైన పక్షుల గుంపు. ఒక్కొక్క పక్షీ గుర్రానికి రెండు రెట్లు పెద్దగా ఉంది. పక్షుల న్నీ ముక్కు ల తో గుమ్మడికాయలంత పళ్ళు తెచ్చాయి. వాటిని తిని గింజలను సరస్సులోకి వదిలాయి. ఒక్కొక్క గింజా పడుతూనే నీళ్ళు ఎర్రగా మారటం మొదలైంది. కాసేపటికి అంతా ఎర్రటి నీళ్ళే. తర్వాత అన్ని పక్షులూ వచ్చిన దారినే వెళ్ళిపోయాయి. మరుగుజ్జు సరస్సు దాటాలని అడుగు ముందుకువేశాడు. మూడు పక్షులు ఎక్కడినుంచో వికృతంగా అరుస్తూ అడ్డు పడ్డాయి. అవి అడిగినది ఇవ్వకుండా సరస్సుని దాటటం కుదరదని గంధర్వుడు చెప్పినమాట గుర్తొచ్చి ఆగాడు. ఏం అడుగుతాయోనని భయం వేసి , వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు. మళ్ళీ హార్ప్ ధ్వని చెవుల్లో అమృతం పోస్తూ వినిపించింది.
గంధర్వుడు ప్రత్యక్షమై ఫినోలా పేరు పలికాడు. ఎలాగైనా ఆమె శాపాన్ని పోగొట్టాలని మరుగుజ్జుకి బలంగా అనిపించింది. ముందుకి కదిలాడు.
” ఏమి ఇవ్వాలి ? ”
” నీ ఎడమ కంటిని ”
గుండె చిక్కబట్టుకుని ఒప్పుకున్నాడు. చూపు మొత్తమూ పోయి నొప్పితో మూర్చపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చింది.
గంధర్వుడు చెప్పాడు ” గుర్రం మెడ గట్టిగా పట్టుకో. దాన్ని నేను నీటిలోకి నడిపిస్తాను. ఏమీ భయపడకుండా సరస్సులో మునుగు. నన్ను నమ్ము, నీకు మంచి జరుగుతుంది ”
తెగించి మరుగుజ్జు గుర్రం తో సహా మునిగాడు. కాళ్ళు తేలిపోతున్నాయి. ఊపిరి ఆడలేదు. మెల్లిగా నీటి అడుగున వెలుతురు. పైకి తేలి వస్తూనే చూపు తిరిగివచ్చిందని తెలుసుకున్నాడు. విపరీతమైన సంతోషం వేసింది. అవతలి ఒడ్డుకి వెళ్ళాక గుర్రంలో మార్పు వచ్చింది. కుంటితనం పోయి గొప్ప జాతిదానిలాగా బలంగా అందంగా అయింది. తన చేతులూ కాళ్ళలో ఏదో కదలిక తెలిసింది అతనికి. ఊహించని శక్తి వచ్చింది. తనని తాను చూసుకున్నాడు- ఇప్పుడు మరుగుజ్జుగా లేడు, పొడుగ్గా దృఢంగా తయారయాడు. కంచుడాలూ బల్లెమూ కత్తీ కనిపించాయి. గబగబా వెళ్ళి మెరుస్తున్న డాలులో మొహం చూసుకున్నాడు. చాలా చక్కగా ఉన్నానని అర్థమైంది. మెల్లిగా అంతా జ్ఞాపకం వచ్చింది.

తనొక పెద్ద రాజ్యానికి యువరాజు. దేశాటన చేస్తూ వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజు మాయలో పడ్డాడు. ఫినోలా మీద ప్రేమతో ఈ సాహసం చేయకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడో ఏమో. మూడు వస్తువులూ తీసుకుని తేలికైన మనసుతో వెనక్కి బయల్దేరాడు. ఈ తిరుగు ప్రయాణం లో ఏ అడ్డంకీ రాలేదు. క్రూరమైన పక్షులూ నీటి గుర్రాలకి బదులు సొగసైన హం సలు శాంతంగా ఈదుతున్నాయి.
త్వరలోనే మైదానం మధ్యని గుడిసెకి చేరాడు. కంచుడాలు ని మూడుసార్లు రాగికత్తితో, మూడుసార్లు ఇనపబల్లెం తో కొట్టాడు. గుడిసె మాయమైంది. ఫినోలా నవ్వుతూ అతని ఎదురుగా నిలుచుంది. బీడులో పచ్చిక మొలిచింది, చెట్లు పెరిగాయి, పూవులు పూశాయి, పిట్టలు పాడాయి. ఫినోలాని గుర్రం మీద ఎక్కించుకుని అతను ఉత్తరంగా ఉన్న తన రాజ్యం వైపు ప్రయాణం సాగించాడు.

ఐరిష్ జానపద కథ , సేకరణ – Edmund Leamy .

పొద్దుటి పూట పిల్లలు

పొద్దున్నే
తల్లి వొడిలోంచి పిల్లలు మొలకెత్తుతారు
చీకటి
వెలుతురు చాలు పోస్తున్నట్టు
నాలుక నూగాయలోంచి
మాటల విత్తనాలు రాలుతాయి
తెల్లారుజాము, తల్లి వొడి
పసివాళ్లకు
ఆకాశమంత మాటలను నేర్పుతాయి
మాటలు
నదీపాయల మీద మంచుతుంపరలు రాలుతున్నట్టు
తెల్లని పావురాల్లాంటివవి –
ఎక్కడో కొండల్లో
గుప్పుమని కొండపూలు వికసించినట్టు
రెక్కలు విప్పుకున్న
తాజా మాటల పూలు అవి –
వెలుతురు గర్భకుటీరంలాంటి
తెల్లారిజామునే
పిల్లలు
మంత్రమేసినట్టు
మాటలుగా మారిపోతారు
తల్లి వెచ్చని పొత్తిళ్లకు అంటుకుని
నిద్రించి..
మళ్లీ కొత్తగా సరికొత్తగా ఉదయం ఉదయించినట్టు –
అంతా మాటలే
మాటల వనమే –

మాటలను,
స్వచ్ఛమైన తేనెలాంటి మాటలను
ఏరుకోవాలంటే

ఉదయాల్లోకి
పిల్లలున్న యిల్లల్లోకి వెళ్లాలి
పిల్లలున్న యిల్లు
మాటలు ప్రవహించే జీవనది

పొద్దున్నల్లంట –
పిల్లలే కాదు
తల్లులూ మొలకెత్తుతారు
క్షణక్షణానికీ
జీవించడాన్ని మరచిపోతున్న
పెద్దోళ్లంతా పలవలు పలవలగా
మొలకెత్తుతారు
నిన్నటి జీవనవిషాదాన్నంతా కడిగేసే
మాటల అమృతాన్ని
దోసిలి నిండుగా తీసుకుని
హృదయం నిండుగా
నింపుకుంటారు

-బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

ఈ కవిత్వం ఒక ఆర్ట్ గ్యాలరీ..వెంటాడే పూల సంబరం!

 

 “కవిత నా మతం – మతం లేనివాడి మతంనా భాషే నా ముల్లు

నెత్తురు చిమ్మే నా స్పర్శలో

నేలకి తెలియచేస్తున్నాను

నేనిక్కడ ఉన్నానని నేలకు తెలియదు

ఒకప్పుడు ఈ ముళ్లన్నీ పూలేనని

పచ్చికల దాపుల్లోమరో సౌందర్యం సృష్టిస్తున్నాను

వెన్నెలకి అతీతంగా కలలకి అతీతంగా

పదునైన సమాంతర భాష”.

-సచ్చిదానందన్ (ప్రసిధ్ద మలయాళీ కవి)

 

 

పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్ గ్యాలరీ’ లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్య సౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం సాధారణంగా అలవాటుపడ్డ  verbal expression కవి ప్రసాదమూర్తి  ‘heightened emotions’ ని అందుకోవడానికి, అభివ్యక్తం చెయ్యడానికి చాలా సీమితమైన మార్గంగా అగుపిస్తుంది. అతని కళాత్మక అనుభూతి పూల తోటల్లోకి సీతాకోక చిలుకలై ఎగిరిపోవాల్సిందే.

సుప్రసిద్ద సాహితీవేత్త సోమసుందర్ గారు ప్రసాదమూర్తి కవిత్వం లో ప్రసాద గుణం స్పష్టంగా కనిపిస్తుంది అని, విశిష్టకవి అని అభినందించారు. ప్రసాదమూర్తి సహజంగానే సౌజన్యమూర్తి, భావుకుడు,  సౌందర్యోపాసకుడు, ప్రకృతి ఆరాధకుడు, సాత్వికుడు, సదా సంచారి, సత్యాన్వేషి, సంఘమిత్రుడు, ఉలిపట్టని కవిశిల్పి.

నేను ‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని ‘చిత్ర చిత్రాలు’గా రంగురంగులుగా , నది పాయలు పాయలుగా చదువుతూ, అనుభూతిచెందుతూ ఉంటున్నప్పుడు ఒక  అనిర్వచనీయమైన తాదాత్మ్యంలోకి వెళ్లాను. చైనా దేశపు తాత్త్విక పరిభాషలో ‘తావోయిజం’ పదజాలంలో అక్షరీకరించాలంటే అదొక ‘ Transcendental consciousness’.

‘పూలండోయ్ పూలు’ కవిత ఇటీవల తెలుగు కవిత్వంలో వచ్చిన  ‘ the most melodious, magical, mesmerising and enchanting poem గా సహృదయుల్ని సమ్మోహ పరిచింది. తన్ను తాను గానం చేసుకుంటూ, సరసుల హృదయ సరస్సుల్లోనే, హంసలా భావతరంగ మాలికలపై డోలలూగుతున్నది.

ఈ కవితలో ఈ చరణాలు.. ప్రసాదమూర్తి విలక్షణమైన ఊహాశక్తికి అద్దం పడుతున్నాయి.

“మనుషులంతా పూవ్వులైపోయినట్టు..

పువ్వులు మనుషుల్ని మూటలు గట్టి

మంచికీ, మానవత్వానికీ మధ్య

ఆదాన ప్రదానాలు చేస్తున్నట్టు..

——-   —–   ——

బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట

ఈ పరిమళాల బజారులోనే

నాకు బతుకుపరమార్ధం  దొరికింది.”.

పై చరణాల్లోంచి ఒక సారాంశాన్ని పిండుకోవడానికి వీలుంది. కవిత్వ కళ ఆత్మకళగా, హృదయకళగా విమర్శ పరిభాషలో ప్రస్తావించబడుతూ వుంటుంది. అది మనిషిని తన అంతస్సీమలలో గూడు కట్టుకున్న చీకటి నుంచి తేజస్సు దిశగా ప్రస్థానం సాగింపచేసే కళాత్మక సాధనం. మనిషిలోని  negative impulses,  క్రూరత్వం, ద్వేషం, అసూయల్ని సమూలంగా  ‘ప్రక్షాళన’ చేసి, వాటి స్థానంలో నిష్కళంక ప్రేమ, అవ్యాజమైన కరుణ, మైత్రి వంటి positive emotions  ని ప్రతిష్టించే సంస్కారోన్నత ప్రక్రియ. దీనినే (catharisis ( purgation) )  కెథారిసిస్ అని ప్రసిద్ధ గ్రీకు సాహిత్య తత్వ్తవేత్త అరిస్టాటిల్ విశ్లేషించాడు.

1904041_740635095949533_1999613464_n

ప్రసాదమూర్తి పై కవితలోనే  ‘పరమార్ధం’ అనే మాటలో టాల్ స్టాయ్ భావన  ‘poetic justice ’ ద్వారా నీతి బద్దత, ధర్మాచరణ, మానవతా దీప్తి స్పూర్తిని ప్రతిష్టించగలడు అన్న భావన అంతర్గతంగా ప్రవహిస్తున్నది.

ఈ కవితలో మరొక విలక్షణత కనిపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మనిషి తనకు సంబంధించి  కేవల పదార్ధంగా కాకుండా దాన్ని తనలో పెనవేసుకున్న మానవీయ సంబంధాల్లోంచే చూస్తాడు. కనుక సాహిత్యం ఎప్పుడైనా మానవ సంబంధాలకు అతీతంగా బాహ్య ప్రపంచాన్ని దర్శించలేదు. తత్త్వానేషణకు ప్రయత్నించదు. సాహిత్యంలో హృదయపరమైన, నిర్మలమైన, నిసర్గమైన ఊహలకు ఉన్నతమైన స్థానం కలదు. అదే కళాత్మక స్థానం. ఈ ప్రక్రియలోనే బాహ్య ప్రకృతి మానవీకరణ చెందింది. ప్రాచీన సాహిత్యంలో నదులు జవనాశ్వాలుగా, పరుగెత్తే గోవులుగా పోల్చబడ్డాయి. కవుల సృజనల్లో నదులు, సముద్రాలు మానవీకరణ చెందాయి.

ఇక్కడ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కవితలో విలక్షణంగా, మనుషులంతా పువ్వులైనట్లుగా భావించాడు. మానవులు వాళ్ల కంటే ఉదాత్తమైన, ప్రేమపాత్రమైన సుమనోహరమైన, సుకుమారమైన  పువ్వులుగా  రూపాంతరం చెందారు. అంటే మనుషులు పుష్పీకరణ చెందారు అనువచ్చునేమో. ప్రసాదమూర్తి భావన ప్రకారం మానవత్వం కన్నా పూలతనం (పుష్పతనం) (Flowerliness) మరింత ఉదాత్తమైనది. మానవ సహజం తనకు తాను ఒంటరితనంతో కుంచించుకుపోకుండా  సామూహికత్వాన్ని పొందాలి. త్వారా మానవ సంబంధాలు బలపడతాయి. అదే మానవ ప్రగతి. మనిషిని మరొక మనిషికి మరింత సమీపానువర్తిగా చేయటంలో దోహదపడటమే సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం. మానవ జీవితాన్ని మరింత సంస్కారవంతం చేసి, ఉత్తమంగా ఉన్నతీకరించడం సాహిత్యం యొక్క ఉదాత్తమైన బాధ్యత. ఈ సామాజిక సత్యం తెలిసిన వాడు సాహిత్య సూత్రం కమ్యూనిజం, హ్యూమనిజం ద్వారా అధ్యయనం  చేసినవాడు కనుకే ప్రసాదమూర్తి

“పూలు లారీల కెక్కించే  చోట

పనిచేసుకున్నా సరిపోయేది

సువాసనల సూదీ దారాలతో

మనుషుల్ని కుట్టి పారేసేవాడిని” అంటూ ఉదాత్తమైన పూలపాదాలు అల్లగలిగారు.

ప్రసాదమూర్తి పూలండోయ్ పూలు కావ్యం పారాయణం చేస్తూ, పుష్ప పరిమళయోగ ముద్రలో ఉన్న సమయంలోనే మరొక మార్మికం, మధుర, మాదక ద్రవ్యం  లాంటి సుప్రసిద్ధ జపాన్ దేశ కవి మత్సువొబషో కవిత్వాన్ని ధ్యానస్థితిలో ఆస్వాదిస్తూ వుండటం కాకతాళీయంగా జరిగింది. ప్రసాదమూర్తి గారి అద్భుతమైన  పుష్పసృష్టి కవిత్వ వృష్టికి హృదయం మార్దవమైపోతున్న సందర్భంలోనే, ఏమిటి ఈ పూల మహిమ, ఈ పూలను ఇంత ప్రత్యేకించి కవితా వస్తువుగా తన ప్రతిభతో సుగందభరితం  చెయ్యడం ఏమిటి? పూల పరిమళం ఒక మాదక ద్రవ్యనదిగా తెలుగు కవిత్వపు మాగాణిలో ప్రవహించడమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు కొన్ని ఆశ్చర్యంగా  బషో రచనల్లో లభించాయి. బషో  తన  యాత్రా వర్ణనలో కవిత్వ తృష్ణ, సౌందర్య లాలసను గురించి, ప్రకృతితో తాదాత్మ్యం గురించి తన భావాలను చాలా కవితాత్మకంగా, తాత్వికంగా  విశ్లేషించాడు. కొంత మేరకు పూలండోయ్ పూలు కావ్య వస్తువుకి దగ్గరగా చూసుకోవడానికి సామ్యతను, సారూప్యతను కలిగి ఉంటుంది. కవిలోను, చిత్రకారునిలోను,  కవిత్వాసాద్వకునిలోను,  ప్రకృతిని ఆరాధించడం అనే సహృదయత, పరిపూర్ణ తాదాత్మ్యం చెందగల మనోధర్మం ఉంటుంది. అది కళా సౌందర్య సంబంధిగా ఉంటుంది.  అటువంటి హృదయ ధర్మం కలిగిన వ్యక్తి ఏది చూస్తే అది ఒక పువ్వై కనిపిస్తుంది. అతడేది స్వప్నించినా అది చంద్రుడై  సాక్షాత్కరిస్తుంది. పువ్వుకన్నా అన్యమైన దాన్ని చూడగలిగేది అసంస్కృత హృదయం మాత్రమే. ఏ కళాకారుడికైనా అటువంటి అసంస్కృతినీ,  అటువంటి చిత్తవృత్తిని ఎలా అధిగమించాలి, ప్రకృతితో ఎట్లా మమేకం చెందాలన్నదే అంటూ వివరిస్తాడు.

ప్రపంచంలో ఎక్కడైనా, మానవ సంస్కారం, సహృదయత, సౌందర్యదృష్టి ఒకేలా వుంటాయి. ఆ స్పందనల్లో, భావనల్లో ఒక అందమైన సారూప్యత ఉంటుంది అనడానికి ఇదొక దృష్టాంతం కావచ్చు, భావసౌందర్యం కావచ్చు. లేదా ప్రపచంలోనే కవుల హృదయ స్పందన ఒకే తీగపై సాగుతాయని ఊహించవచ్చు. ఆ తీగకు పూచిన పూలు మానవతా పరిమళాలే వెదజల్లుతాయని భావించవచ్చు.

ప్రసాదమూర్తి పూలండోయ్ పూలు, పచ్చ పూల చెట్టు (పురాప్రియురాలు) చదువుతూంటే జపాన్ కవి బషో కవితలు పక్కపక్కనే మనసు చెట్టు కొమ్మలపై వాలుతున్నాయి. అందుకే ప్రసాదమూర్తి కవితలు తెలుగులో చిత్రించినా, కవితా రసాస్వాదకులకు పున:పున: ‘జపనీయ’ కవిత్వమే.

దేశాలు వేరైనా భాషలు వేరైనా ప్రపంచంలో ‘కవిత్వ భాష ’ అనేది ఒక్కటే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ  “THE VINTAGE BOOK OF CONTEMPORARY WORLD POETRY” సంకలనంలో జె.డి క్లాచ్ అంటాడిలా  “poetry knows no borders, it has no capitals and no provinces. Languages are many but poetry is one.  Every culture’s poetry is a local wine and tends to lose its unique savor the aroma of wine yard and weather, harvest and history- when sipped abroad.”

హెగెల్ అభిప్రాయం ప్రకారం ” The true medium of poetry is not words but poetic ideas”.

ఈ సంకలనంలో ప్రసాదమూర్తి కవిత్వ భావనలు ప్రతికవితలో సునిశితమైన ఊహాశాలిత్వంతో, సుందరమైన  అభివ్యక్తితో కళకళలాడుతూ ఉంటాయి. ప్రగాఢమైన మానవీయ స్పందనలతో సమ్మిళితమై ఉంటాయి. “కత్తుల భాష మాత్రమే తెలిసిన మనుషులకు / ఆ చెట్టుతో పూలగుత్తుల సంభాషణ నేర్పించాలి / నలుగురి ఆనందం కోసం / సర్వం రాల్చేసుకోవడం / ఎలాగో ఒక ఈ చెట్టు నీడలోనే తెలుసుకోవాలి”.

వస్తువుతో పాటు, శిల్పం, ప్రసాదమూర్తి కవిత్వంలో సంయమనంతో సాగటమే కాక, సమతౌల్య స్థితిని కలిగి ఉంటాయి. ప్రయోగించే భాష సార్ధకంగా వుండటమే కాక భావఫల సిద్దికి ప్రచోదక శక్తిగా ఉపయోగించడం ఈ కవికి అబ్బిన అరుదైన కళ. వర్తమానతా లక్షణం తో పాటు సమస్త సాహిత్యానికీ కేంద్రబిందువైన ‘ మనిషి’  మానవ సంబంధాలు, మనిషి బ్రతుకును ఉన్నతీకరించడంపై కవికి శ్రద్ధ, స్పృహ ఎక్కువ. అందుచేతనే పూలతోనో, చెట్టుతోనో మనిషికి హితబోధ చేయిస్తాడు.

‘దయామయి’  కవితలో అనాధ బిచ్చగత్తెను portray చేస్తూ కవి ప్రసాదమూర్తి మానవీయ సంస్కారంతో పలుకుతాడు. ఈ కవిత కరుణ భావనతో మలచబడి మానవ సేవా సౌందర్యంతో కవి బుద్ధుడి శిల్పం దర్శనమిస్తుంది.

“ధేహాన్ని ఒక బొచ్చెగా విసిరి / మెట్టులో మెట్టుగా ఒదిగిపోతుంది / మెట్లన్నీ నాకు /కనికరం లేని లోకాన్ని కాపాడమని / దేవున్ని వేడుకుంటున్న / అనాధ బిచ్చగత్తెల్లానే కనిపిస్తున్నాయి”.

తన కళ్లెదుటి భౌతిక జగత్తులో కాసింత జాలి కోసం, మానవ స్పందన కోసం దీనంగా ఎదురుచూసే తోటి మనుషుల కళ్లలోకి సానుభూతితో తొంగిచూస్తూ.. చలిస్తూ, ద్రవిస్తూ, ఆర్ధ్రతతో నిర్జీవ వస్తువుల్లో కూడా కదలాడే ప్రాణ స్పందనలో గుండెతో చూడగల సౌజన్యం, సున్నితత్వం కవి ప్రసాదమూర్తి తత్వం. కవిత్వపరంగా ఇదొక వినూత్న శిల్పం. ప్రసాదమూర్తి కవితాభివ్యక్తిలో మరొక వైవిధ్యమేమిటంటే సమాజం ఏ దీనుల కోసం, ఆర్తుల కోసం దయామయులుగా స్పందించి సహాయ హస్తాలనందించాలో.. వాళ్లే కరుణామయులుగా కనిపించటం. చూడండి ..”మాయదారి మనుషులే / ఆ మెట్టుదాకా వచ్చాక దేహాలనీ కళ్లనీ /చటుక్కున అటు తిప్పేసుకుని విసురుగా పారిపోతారు / ఆమె మాత్రం దయ నిండిన నేత్రాలతో ఆశీర్వదిస్తూనే ఉంటుంది”.  ‘దయామయి’ పేరు సార్థకమైంది. ఈ కవితలో బౌద్ధతత్వంలోని మూల భావనలు ద్యోతకమవుతాయి. సమ్యక్ కరుణ, సమ్యక్ జ్ఞానం మొదలైనవి. ఆమె పేరుకే బిచ్చగత్తె. కానీ లోకానికి దయాబిక్షం పెట్టే ప్రేమగల తల్లి. ఇక్కడ నేను ప్రస్తావించదలచిన మరొక ప్రధాన అంశం ఏమిటంటే, కవి సమాజం పట్ల దయామయుడు కావడం, స్పందించడం, నిస్వార్ధ చింతనతో నిబద్ధుడు కావడం – నిర్మల చిత్తంతో సేవా బుద్ధుడు కావడం. ఇది ప్రసాద కవి గుణంలో మరొక సాత్విక భావాంశంగా భావిస్తున్నాను. మనుషుల్లోనే కాదు, పూలలో, చెట్టులో, రాళ్లలో, కరుణాంతరంగాన్ని, దయా గంగోత్రిని ఈ కవి చూడగలడు. కవి ప్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్దతుల్లో ఇదొక విలక్షణత, వైవిధ్యం.

మరొక కవిత ‘గుండె కొల్లేరు’ పఠితల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. మెస్మరైజ్ చేసేస్తుంది. ‘గుండె కొల్లేరు’  కవి ప్రసాదమూర్తి  ‘ పురిటి వేరు ‘ గా భావించవచ్చు. తాను బాల్యంలో దేనితో మమేకమై జీవించాడో, దాని ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకం కావటం కవిని వేదనకు గురి చేసింది. తన జీవనానుభూతిని కవిత్వీకరించిన పద్దతి చాలా విలక్షణంగా ఉంటుంది. పఠితల్ని ఆ కవితావస్తువైన కొల్లేటితో మమేకం చేయిస్తుంది. మునకలు వేయిస్తుంది. ఈ కవితలో ప్రయోగించిన పదజాలం అచ్చమైన ప్రాంతీయతను, మట్టి వాసనల మాండలికాన్ని పుణికిపుచ్చుకొని ఉంటాయి. కవి ప్రసాదమూర్తి సహృదయుల్ని తన భావోద్వేగాలలో, పాత జ్ఞాపకాల వెతుకులాటలో, మూగ సంవేదనలో, మూగవాని పిల్లనగోవి పాటలో, దిసమొల ఆత్మలో పూర్తిగా సంలీనం చేసుకుంటాడు. ఒక తల్లిని పోగొట్టుకున్న పిల్లాడిలా.  ‘గుండె కొల్లేరు’ కవిత అచ్చంగా ప్రసాదమూర్తి  ‘ అమ్మ పాత ఫోటో ‘, పాత హిందీ సినిమాలో సైగల్ విరహగీతం, మెరాదీహసన్ గజల్.

ఎంత అద్భుతమైన పదచిత్రాల్ని సృష్టించాడో ఈ కవి అనబడే  ‘ రంగుల గీత కార్మికుడు ‘ చూడండి.    అచ్చెరువుతో  అచ్చెరువులో మునిగిపోతారు.  “ఆకాశం ఈ సరస్సులోనే   /  తన ముఖం చూసుకుంటూ  /  సూర్యుణ్ణి బొట్టు బిళ్లగా  /  సర్దుకునే దృశ్యం తలపుకొచ్చింది.”. ఈ చెదరిన నీటిగూడు ఎలా అల్లబడిందో , ఏ సామాగ్రి వాడాడో చూడండి. కొంగలు, నీటికాకి, తుమ్మచెట్టు, గట్లు, తాటి దోనె, నాచుబట్ట, చద్దన్నం, ఉలస పక్షులు, చిలకబాతులు, పరజ పిట్టలు, గిన్నికోళ్లు, నత్తకొట్టు పక్షులు. ఇవన్నీ కొల్లేరుతో విడదీయరాని అనుబంధమున్న సదాబాలకుడు కవి ప్రసాదమూర్తికి పుట్టిన నేల అందించిన పద సౌందర్య సంపద. మూల్యం అమూల్యం.

ఈ కవిత  మృగ్యమైన బాల్యంలోని కొల్లేటి సరస్సు ఆత్మను పలవరిస్తూ, స్మరిస్తూన్న ఒక  ‘ఎలిజీ  ఛాయ లాంటిది. ప్రసిద్ధ మలయాళీ కవి కె. సచ్చిదానందన్  ‘వడ్లగింజ’ కవిత ఇలాంటి పోగొట్టుకున్న ఇల్లు, పొలాన్ని గురించే. ఆయన భావాల్లోనే ఈ కొల్లేటిని కవి ప్రసాదమూర్తి   అనుభూతిని ఇలా కోట్ చెయ్యొచ్చు.  ‘ నా కవితలో నేను మండుతూనే ఉన్నాను  /  నా చితిలోని కట్టెలా  /  నాకవితలో నేను  /  కవిత్వాన్ని అనువదించడం  /  ఒక గూడు వదిలి మరో గూడు చేరటమే  /  నీటిలో మునిగి ఈదే చేపలా  / మనసులోనే మునిగి ఈదుతున్నాడు, అనువాదకుడు  / నాకు వచ్చిందో కల  /  ఓ రోజు నా కవితని నేనే  /  నా భాషలోకి అనువదిస్తున్నట్లు  /  మనం మన కవితలని  /  మన భాషలోకి అనువదిస్తున్నాం’.

కె. సచ్చిదానందన్  “కవిత్వ మంటే పరిపూర్ణ వ్యక్తీకరణ ”  అని చెప్పిన నిర్వచనానికి అర్ధం ఇదే. ప్రసాదమూర్తి  ‘ గుండె కొల్లేరు ‘ కవిత్వ నిర్మాణం ఇలా పరిపూర్ణ వ్యక్తీకరణతో  రూపుదిద్దుకున్నదే అని స్పష్టమవుతున్నది. ఏది ఏమైనా గుండె కొల్లేరు కవిత పరిపూర్ణమైన  ‘సరస్సౌందర్య శాస్త్రం ‘  (LAKE AESTHETICS)  గా తెలుగు కవిత్వంలో పచ్చగా పదిలంగా ఉంటుంది.

ఆధునిక కవిత్వంలో, కవిత్వీకరణ వ్యూహాలతో ప్రధానమైనది రూపకం. ప్రసాదమూర్తి కవిత్వంలో రూపకాలంకార ప్రయోగ నైపుణ్యం చాలా అందంగా ఆకర్షిస్తుంది.

మచ్చుకు కొన్ని :  జ్ఞాపకాల జాజులు  / మమకారాల మందారాలు  / మమతల మల్లెలు  /  కలల కనకాంబరాలు  / ఊహలగులాబీలు  / ముద్దు చూపుల ముద్దబంతులు  / పాటల పారిజాతాలు  / పరిమళాల బజారు  / ఎర్రని ఎండపిట్ట   / మబ్బుల బురఖాలు  / చెట్టు దేహం.

కవి  ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు ‘ కావ్యంలో ఇంకా ఎన్నో కవితలు, అమ్మ పుట్టిన రోజు, వాన, వాన, వాన, చిలకల రైలుడబ్బా , చెల్లి అమెరికా యాత్ర, పురా ప్రియురాలు మొ.. అన్నీ  ఈ కవిచిత్రకారుని  కవిత్వచిత్రశాల ( పొయెట్రీ ఆర్ట్ గ్యాలరీ ) లో కళాఖండాలు.  మాలాంటి కరువు సీమలో వజ్రకరూరు వజ్రాల్లాంటి వడ్లగింజలు, సన్నబియ్యపు గింజలలాంటి వానచినుకులు. కవిచిత్రకారుడు ( Poet Painter )  ప్రసాదమూర్తి గారి ‘Rare collection of poetry  paintings ‘.

ప్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్దతి ఒక చిత్రకారుడు దృశ్యాన్ని కళ్లద్వారా మనసులోకి ఒంపుకునే ధ్యానమార్గం. శిల్పి శిల్పాన్ని మలిచే ముందు సంభావించిన శిల్పానికి అనుగుణమైన శిలను ఉలితో హస్తస్పర్శతో పరిశీలించే నిపుణత్వం. నైశిత్యం.

అందుకే చివరగా  ప్రసిధ్ద చిత్రకారుడు పి. మోహన్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు  డావిన్సీ ,  మొనాలిసా చిత్రరచనను చేసే రసాత్మక సౌందర్య సమయ వర్ణన ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

“డావిన్సీ నవ్వుతూ కుంచెను, రంగుల పలకను అందుకున్నాడు.ఈజిల్ పై అప్పటికే కొంత ఆవిష్కృతమైన మోనాలిసా వర్ణచిత్రాన్ని నిశితంగా చూశాడు. కుంచెను లేత గోధుమ, రోజా రంగులను కొద్దిగా అద్దుకుని పలకపైనే వాటిని కలిపాడు. మోనాలిసి ముఖంపై ఆవరించిన వెంటాడే నవ్వును, వెలుగు నీడలను కళ్లలోకి ఆవాహన చేసుకున్నాడు. తూలికాచాలనం మొదలైంది. అందులోంచి సౌందర్యోపాసనానాదం  మంద్రంగా విస్తరిస్తోంది. మోనాలిసా మనోదేహాలు అతని కుం,చెలో రంగుల స్నానం చేసి తడితడిగా చిత్రంలోకి ఒదిగిపోతున్నాయి”.

ఈ వర్ణనతో పొయెట్ పెయింటర్, అన్వేషి, సంచార జీవి  ప్రసాదమూర్తి గారిని నిండుగుండెతో అభినందిస్తూ, మనసున మల్లెల మాలలూగుతూ ఉండగా, అతని కవిత్వపు కర్పూర వెన్నెలలో కరిగిపోతూ..

మల్లెల  నరసింహమూర్తి

(  కవి ప్రసాదమూర్తి నవంబర్ 18న ప్రతిష్ఠాత్మక సోమసుందర్ సాహితీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)

 

సాహిత్య చరిత్రలో కాళోజి దారి…

kaifiyath

కాళోజి – తెలంగాణ రచయితల సంఘం1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి పునాది పడింది.  హైదరాబాద్‌లో ఈ నిలయ స్థాపనలో రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజనాయని వెంకటరంగారావులు కీలక భూమిక పోషించారు. వీరు కేవలం దాన్ని ఒక సంస్థగా కాకుండా ఒక సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. గ్రంథాలయానికి అనుబంధంగా విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాలను ఏర్పాటు చేసి శాస్త్ర, చరిత్ర, సాహిత్య పుస్తకాలను వెలువరించారు. ఒక్క గురజాడను(?) మినహాయిస్తే ఆధునిక కాలంలోని తెలుగుసాహితీ ఉద్ధండులందరూ ఇక్కడ సన్మానం పొందినవారే. తమ సాహితీ ప్రతిభను ప్రదర్శించినవారే! తర్వాతి కాలంలో అణా, దేశోద్ధారకతో సహా అనేక గ్రంథమాలలు, నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం, వర్తక సంఘాలు, ఆంధ్రమహాసభ, నిజాంరాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్‌ ఇలా ఎన్నో సంస్థలు భాషానిలయం స్ఫూర్తితో ఏర్పాటయ్యాయి. అందుకే ఈ గ్రంథాలయం తెలంగాణ పునర్వికాసానికి పునాదిలా ఉండిరది అని చెప్పడం. నిజాం పాలనలో తెలుగువారి అస్తిత్వం, ప్రతిభకు పట్టం కట్టడానికి కొమర్రాజు, నాయని వెంకటరంగారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం, బూర్గుల తదితరులు కృషి చేసిండ్రు. వీరి కృషికి కొనసాగింపుగా హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అరుణశ్రీ గ్రంథమాల, రాజశ్రీ సాహిత్య కళాపీఠమ్‌, నవ్య కళాసమితి, ఆంద్రచంద్రిక, విజ్ఞానచంద్రికా గ్రంథమాల, సుజాత, భాగ్యనగర్‌, శోభ లాంటి పత్రికలు స్థాపితమయ్యాయి. సాయుధ పోరాటం విరమించడం వల్ల కూడా సాహితీవేత్తలకూ పూర్తిస్థాయిలో రచయితల సంఘానికి సమయం వెచ్చించడం సాధ్యమైంది.
హైదరాబాద్‌పై పోలీసుచర్య అనంతరం తెలంగాణలో తెలుగువారి అస్తిత్వాన్ని నిలబెట్టడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి, విస్మృత సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి, వైతాళికుల స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశ్యంతో 1951 సెప్టెంబర్‌ ఆరున తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిరది. తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాహిత్యాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. సంఘం తొలి అధ్యక్షుడు దాశరథి. కార్యదర్శి సి.నారాయణరెడ్డి. ఈ సంఘంలో మొదటి నుండి కీలక పాత్ర పోషించింది బిరుదురాజు రామరాజు, పి.మాణిక్యరెడ్డి, యశోదారెడ్డి, కాళోజి నారాయణరావు తదితరులు. తర్వాతి కాలంలో ఆళ్వారుస్వామి కూడా ఇందులో పాలుపంచుకున్నాడు. తెలంగాణ సాహిత్య సమాజం తరపున ప్రభుత్వంతో వివిధ విషయాలపై మాట్లాడేందుకు ఈ సంఘం ఒక వేదికలా పనిచేసింది. అప్పటి వరకూ ప్రజా ఉద్యమంలో ముందుండిన దాశరథి, కాళోజీలు సంఘ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించారు.
ఉద్యమ కవిగానే అందరికి పరిచయమున్న కాళోజి మంచి కార్యకర్త, కార్య నిర్వాహకుడు కూడా! 1934లో హైదరాబాద్‌లో మిత్రులు వెల్దుర్తి మాణిక్యరావు, వెంకటరాజన్న అవధానిలతో కలిసి ‘వైతాళిక సమితి’ నిర్వహించాడు. ఈ సమితి ద్వారా ప్రజల్ని చైతన్య పరిచే సభలు, సమావేశాలు, పత్రికా రచనలు చేసేవారు. హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు వచ్చిన తర్వాత వివిధ ప్రజా సంఘాలతో కలిసి పనిచేశాడు. ఇందులో వరంగల్‌లో ఆంధ్రసారస్వత పరిషత్‌ సభల నిర్వహణ ఆయన కార్యాచరణకు నిదర్శనం. కాళోజి కార్యచరణ గిట్టనివాళ్లు సభను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం నుంచి సభ నిర్వహణకు అనుమతి లభించలేదు. అంతేగాదు అర్ధరాత్రి సభ కోసం ఏర్పాటు చేసిన వేదికను దుండగులు తగలబెట్టారు. అయినప్పటికీ వీటన్నింటిని అధిగమించి వరంగల్‌లో ‘ఆంధ్రసారస్వత సభ’ని నిర్వహించారు. ఇది 1947(?)నాటి ముచ్చట. కాళోజి పట్టుదలకు ఇది నిదర్శనం.
kaloji
తెలంగాణ రచయితల సంఘం సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, కథకుల సమావేశాలు, తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించి ఆయా ప్రాంతాల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించింది. ఖమ్మంలో ఊటుకూరు రంగారావు, డోకిపర్తి రామలింగం, హీరాలాల్‌ మోరియాలు మొదలు సిరిసిల్లలో గూడూరి సీతారామ్‌, జనగామలో గఱ్ఱేపల్లి సత్యనారాయణ రాజు వరకు ఎందరో ఈ సంఘం నిర్వహణలో పాలుపంచుకున్నారు.
1953లో ఆలంపురంలో గడియారం రామకృష్ణశర్మ సాహిత్య సభలు నిర్వహించారు. ఈ సభలకు ఆంధ్రప్రాంతం నుండి శ్రీశ్రీ, శ్రీపాదతో సహా అనేక మంది కవి పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత పత్రిక ప్రత్యేక సంచికను వెలువరించింది. దీంట్లో ఆంధ్ర ప్రాంతం వారి రచనలు కూడా విరివిగా చోటు చేసుకున్నాయి. నాయనికృష్ణకుమారి, పాలగుమ్మి పద్మరాజు లాంటి వారి రచనలు ఇందులో ఉన్నాయి. ఈ సభల్లోనే వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల తరపున కాళోజి రాసిన ‘నా గొడవ’ను మొదటి సారిగా ప్రచురించాడు. దీన్ని ఆలంపురం సభల్లో అర్ధరాత్రి పూట శ్రీశ్రీ ఆవిష్కరించాడు. (పగటి పూట సభల్లో ఈ పుస్తకావిష్కరణకు సమయం కేటాయించలేదు) బహుశా ఈ సభలే ‘ఆంధ్రప్రదేశ్‌’ అవతరణకు సాహిత్య రంగంలో సానుకూలతను తీసుకొచ్చాయి. ఇదే కాలంలో హైదరాబాద్‌లో అఖిల భారత గ్రంథాలయ మహసభలు జరిగాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయాంధ్ర స్వర్ణోత్సవాలు కూడా ఈ సంవత్సరమే జరిగాయి. స్వర్ణోత్సవాలకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగానే కాకుండా అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నారు. అప్పుడే ముల్కీ ఉద్యమం ఉధృతంగా ఉండడంతో విద్యార్థులు ఆయన రాకను నిరసించారు కూడా. ఈ ఉత్సవాలను బిరుదురాజు రామరాజు కార్యదర్శిగా ఉండి నిర్వహించారు. బిరుదురాజుతో పాటు, కాళోజి, దాశరథి, సి.నారాయణరెడ్డి తదితర తెలంగాణ రచయితల సంఘం వారంతా చురుగ్గా పాల్గొని సభల్ని విజయవంతంగా నిర్వహించారు.
తెలంగాణ రచయితల సంఘం తొలి మహాసభలు 1953లో రెడ్డి హాస్టల్‌ ఆవరణలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు ఖాయమైన తర్వాత 1956 సెప్టెంబర్‌లో ‘తెలంగాణ రచయితల సంఘం’ ద్వితీయ మహాసభలు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మూడ్రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సభలకే గాకుండా సంఘానికి కూడా కాళోజి నారాయణరావు అధ్యక్షుడయ్యాడు. సెప్టెంబర్‌ 17వ తేదీనాడు సభ ముగింపు సమావేశంలో కాళోజి చేసిన ప్రసంగం సాహితీ రంగంలో విశిష్టమైనది.
భాష విషయంలో కాళోజికి కచ్చితమైన అభిప్రాయముండేది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల వారి భాషను సాహిత్యంలో ప్రతిఫలించాలి అని భావించేవాడు. పత్రికలు, పుస్తకాల్లో వచ్చిన భాషే ప్రామాణికమని నిర్ధారించడం పొరపాటు అని కూడా చెప్పాడు. తెలుగు వారి కోసం తెలుగులోనే తెలుగులోనే రాయాలి. సంస్కృతం, ఇంగ్లీషు పదాల్ని అనవసరంగా వాడటం ద్వారా  అవి అందరికీ అర్థం కాకపోవొచ్చు. తాము రాసినం కాబట్టి అందరూ అదే చదువుకోవాలనడం తప్పని చెప్పాడు. సమాజంలో సహజంగా వృద్ధిలోకి వస్తున్న లేదా రూపొందుతున్న భాషే సరైనదిగా భావించాలనేది కాళోజి అభిప్రాయం. ఇదే విషయాన్ని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా చేసిన ఉపన్యాసంలో పేర్కొన్నాడు.
‘‘నేటి తెలుగు సాహిత్యం, దాని నిర్మాణానికి ఉపయోగపడుతున్న భాష విషయమై, ఎన్నో తర్జన భర్జనలు జరుగుతున్నవి. భాషలోని శబ్దాలకు, తత్సమమని, తద్భవమని, దేశ్యమని, గ్రామ్యమని కులాలు అంటగట్టి, భావ ప్రకటనకు (అంటే సాహిత్య నిర్మాణానికి) ఫలాన తెగకు చెందిన మాటలే పనికివస్తాయి, ఫలాని తెగకు చెందిన మాటలు పలకటానికి పనికిరావు, వ్రాతకు అసలే తగవు అని సిద్ధాంతీకరించడమే ఈ తగాదాకు మూల కారణం. సంస్కరణ పేరిట వర్ణాంతర వివాహాలను సమ్మతించే మహాశయులు, భాషా ఛాందసంలో మిశ్రమ సమాసాన్ని ఒప్పుకోరు. అన్ని కులాల వారు కలిసి భోజనం చేయడం ఒప్పుకుంటారు. కాని పైన చెప్పిన నాలుగు విధాల మాటల కూర్పుకు ఒప్పుకోరు. భార్య ఒళ్లు, తాతగారి రంగూ, మేనమామ కోపం, చిన్నాయన బుద్ధి ఉన్నవని చెప్పుకొని మురిసిపోయ్యే, పండిత ప్రకాండులు మునిమనమనిలో, ఎటూ పోల్చుకోలేని రూపు చూచి ‘‘ఛీ, ఛీ’’ అన్న మాత్రాన వాడు మునిమనుమడు కాకుండా పోతాడా? రూపంలో ముత్తాత పోలీకులు లేనంత మాత్రాన వాడు మానవుడు కాదంటే అన్యాయం కాదా? తర తరాలలో సంతానం యొక్క రూపం కూడా మారుతూ వుంటుంది. రచనలో వాడిన మాటల రూపు రేఖలెట్లావున్నా ఇబ్బంది లేదు. ముఖ్యమైనది సాహిత్య నిర్మాణశక్తి. అది ప్రకటితం కావడానికి, మాటలేవైనా సాహిత్యం యొక్క విలువ తగ్గదు.’’ (విశాలాంధ్ర, సెప్టెంబర్‌, 1956)
తాను ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఆంధ్ర`తెలంగాణల్లోని భాషలు భిన్నమైనవి ఆ ‘పలుకుబడుల’ భాష అలాగే కొనసాగాలని కాళోజి ఆశించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు తెరవెనుక ఉండి కపిల కాశీపతి లాంటి వారు దాశరథి లాంటి వారిపై ప్రభావం చూపించి రచయితలుగా, రచయితల సంఘంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని సృష్టించారు.
‘‘ఆంధ్రావని ఏకమై మహాంధ్ర స్వరూపం ఏర్పడి ఆంధ్రప్రదేశం అవతరించు శుభముహూర్తం సమీపించుచున్నది. ఏ జాతి ఉన్నతికి గాని పురోగమనమునకు గాని ఆ జాతి సాహిత్యం మార్గదర్శకము. అట్టి సాహితీ సంపత్తిలో తెలుగుదేశం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. పూర్వ, మధ్య, ఆధునిక యుగాలలో వాగానుశాసనుడు మొదలు వర్తమాన కాలం వారు తెలుగు రచనా వ్యాసాగం నవ్య రీతులలో నడుసూతనే ఉన్నది. ఆంధ్రులు సామ్రాజ్యములు ఏలిన కాలంలో ఆంధ్రభాషామతల్లిని మహారాజులు పోషించినారు. ఒకనాడు తెనుగుతేట కర్నాట కస్తూరీతో కలిసి దేశభాషలందు తెలుగు లెస్స అన్న బిరుదాన్ని పొందినంది.
ఆ రోజులు మారినవి. ఆరాజులు ఈనాడు లేరు. ప్రజలే భాషాపోషకులు. ఇన్నాళ్లుగా మూడు చెరగులైన ముక్కోటి తెలుగుల సమిష్టి సాహిత్య కృషికి పొలిమేర లాటంకమైనవి. ఈనాడు తెలుగుదేశం ఒక మేరjైునది. ఇట్టి తరుణంలో తెలుగదు సాహిత్య సంపద ఇంటనే గాక బైట కూడా ప్రచారం చేయవలసనిన అవసరమేర్పడినది. అట్టి అవసరాన్ని గర్తించియే ఆంధ్ర సాహిత్యాభిమానులు కొందరు అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థాపన చేయ ప్రయత్నాన్ని ప్రారంభించానరు. అలా(ం)టి ప్రయత్నాన్ని ప్రజాభిప్రాయ మాశీర్వదించింది. పత్రికలు బలపరచినవి. తెలంగాణ రచయితల సంఘ వేదికపై ఈ రెండు మూడు దినాలు ఆ ప్రయత్నానికి మరి కొంత బలం చిక్కింది. ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రులు ఆ ప్రయత్నాన్ని కొనసాగించవలెనని ఉద్ఘాటించారు. తెలంగాణ రచయితల సంఘం కార్యవర్గం ఈ వరకే ఈ ఆశయాన్ని ఆహ్వానించింది. అట్టి సంస్థను రూపొందించిడంలో వివిధ సాహితీ సంస్థల, ప్రసిద్ధ రచయితల, ప్రాంతీయ ప్రభుత్వముల, విశ్వవిద్యాలయముల ప్రాతినిధ్యం ఉండవలెనని ఈ సర్వ సభ్యసమావేశం అభిప్రాయపడుతున్నది. ఈ విషయంలో తగు ప్రయత్నాలు చేయడానికి సంఘాధ్యక్షులకు (కాళోజి నారాయణరావుకు) సర్వాధికారాలు ఇస్తున్నది’’ అంటూ తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షులు దాశరథి కృష్ణమాచార్య తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. (ఆంధ్రప్రభ, సెప్టెంబర్‌, 23, 1856).
కాళోజి నారాయణరావు ఒక సంధి కాలంలో తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తెలుగు సాహితీలోకంలో మెజారిటి కవి పండితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆహ్వానించారు. స్వయంగా తాను కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అందుకు అనుగుణంగా తన మిత్రుడు వట్టికోట ఆళ్వారుస్వామి సంపాదకత్వంలో ‘ఉదయఘంటలు’ కవిత్వాన్ని ప్రచురించారు. ఇందులో ఇరు ప్రాంతాలకు చెందిన కవులకు స్థానం కల్పించారు. తెలుగువారి ఐక్యతకు సూచీగా ఈ సంకలనం వెలువడిరది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడంతో 1969నాటికి ప్రభుత్వాన్ని నిలదీసిన, నిరసించిన వారిలో కాళోజి ముందుభాగంలో ఉన్నాడు. సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్‌ అవతరణను సంఘం తరపున ఆహ్వానించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాళోజి ఒక్కడే సంఘానికి మించి పనిచేసిండు. కాసు బ్రహ్మానందరెడ్డిని మొదలు ఇందిరాగాంధీ వరకు ఎవరినీ వదలకుండా అందరినీ ఎండగట్టిండు.
తొలిదశలో దాశరథి, నారాయణరెడ్డిలతో పాటుగా ఆంుధప్రదేశ్‌ అవతరణను ఆహ్వానించిన కాళోజి నారాయణరావు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరీ ముఖ్యంగా తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అప్పటి వరకున్న భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. అందుకే 1959 నాటికే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు సమకూరడం లేదని శాసనసభలోనే చెప్పిండు.
తెలంగాణ రచయితల సంఘం తరపున తొలి దశలో దాశరథి, నారాయణరెడ్డిల రచనలు వెలువడ్డాయి. ఆ తర్వాత పల్లా దుర్గయ్యతో పాటుగా ఆంుధప్రాంతానికి చెందిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల రచనలు కూడా సంఘం తరపున ప్రచురితమయ్యాయి. తెలంగాణ రచయితల సంఘం వారు అతి తక్కువ కాలంలో నాగార్జున సాగరం, మహాంధ్రోదయం, పాలవెల్లి, గంగిరెద్దు, ఉపహారం, తెలుగుతీరులు, చిరుగజ్జెలు, జానపద గేయములు, ఉదయఘంటలు తదితర రచనలు వెలువరించారు. ఇవి ఆనాటి యువ సాహితీలోకాన్ని స్ఫూర్తిగా నిలిచాయి. సంఘం తరపున మొదట ‘మంజీర’ పత్రిక కొన్ని సంచికలు వెలువడ్డాయి. ఆ తర్వాత జిల్లాల్లో కూడా కొంత ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆంధ్ప్రదేశ్‌ అవతరణ తర్వాత సంఘం ఆంధ్ర రచయితల సంఘంగా మార్పు చెందడమే గాకుండా ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటి వారి చేతికి సంఘం బాధ్యతలు చేపట్టారు. దీంతో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తెలంగాణ సాహిత్యానికి, ప్రతిభకు అడ్డుకట్ట పడ్డట్టయ్యింది.
తెలంగాణ రచయితల సంఘంకు ఒక రకంగా పాక్షిక కొనసాగింపుగా వరంగల్లులో ‘మిత్రమండలి’ 1959లో ఏర్పాటయ్యింది. మండలి తరపున వివిధ పండితుల సాహీతీ గోష్టులను నిర్వహించారు.
– సంగిశెట్టి శ్రీనివాస్‌
(కాళోజి వర్దంతి సందర్భంగా)