Archives for November 2014

కార్టూ”నిజం”

Saaranga cartoon-05-11-14.jpg final

కొమురం భీం – గతమూ వర్తమానమూ

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

 

ఆదివాసుల వర్తమానంలో “నాగరికుల” గతం అక్షరాలా కళ్లకు కడుతుందని సామాజికశాస్త్రాల పరిశోధకులు, ముఖ్యంగా చరిత్రకారులు, మానుష శాస్త్రవేత్తలు ఎందరో అన్నారు. క్షేత్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆదివాసేతర సమూహాలను “నాగరికులు” అనడం సరైనదా కాదా అనే చర్చలోకి ఇక్కడ పోవడంలేదు గాని అసలు ఆదివాసులకు ఒక వర్తమానం ఉందా, వారింకా ఎడతెగని గతంలోనే ఉన్నారా అని చర్చించవలసి ఉంది. కొమురం భీం చరిత్ర ద్వారా ఆదివాసుల వర్తమానాన్నీ, గతాన్నీ చూస్తే వాటి మధ్య అభేదం కనిపిస్తున్నది.

ఆదివాసుల వర్తమానమూ గతమూ ఒక్కటిలాగే ఉండడం, దశాబ్దాలూ శతాబ్దాలూ గడిచినా ఆదివాసి జీవితాలలో, సమస్యలలో, వ్యక్తీకరణలలో, పోరాటాలలో, ఆదివాసులపట్ల మైదానవాసుల, రాజ్యాంగయంత్రాల వైఖరిలో ఏకసూత్రత ఉండడం ఆశ్చర్యాన్నీ విచారాన్నీ కలిగిస్తున్నది. ఆదివాసుల పట్ల మన వైఖరిలో ఒక అంశం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్లనే ఆదివాసుల చరిత్ర చాలవరకు విస్మరణకూ, నమోదైన చోట్ల కూడ అస్పష్టతలకూ పొరపాట్లకూ గురయింది. మామూలుగానే మనకు చరిత్ర స్పృహ, చరిత్రను నమోదు చేయాలనే ఆలోచన చాల తక్కువ. అది అసలు మనకు చరిత్రే లేదని వలసవాదులు అనేందుకు, ఇతరులు నమ్మేందుకు దారితీసిందని మనకు తెలుసు. మన ఆలోచనాపరిధిలోనే లేని ఆదివాసుల చరిత్ర గురించి పట్టించుకోవడానికి మనకు తీరిక, ఓపిక ఉంటాయా?

చరిత్ర అధ్యాపకులు వకుళాభరణం రామకృష్ణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర అని బహు సంపుటాల బృహత్తర గ్రంథం ఒకటి కొన్ని సంవత్సరాలుగా తయారవుతున్నది. ఆ గ్రంథం కోసం ఇరవయో శతాబ్ది చరిత్ర మీద గతంలో కొన్ని అధ్యాయాలు రాసి ఉన్నాను. ఆ నమ్మకంతోనే ఆయన ఇప్పుడు తయారీలో ఉన్న సంపుటానికి ‘హైదరాబాద్ సంస్థానంలో ఆదివాసి తిరుగుబాట్లు’ అనే అంశం మీద ఒక అధ్యాయం రాసి ఇమ్మని అడిగారు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మల నుంచి రాంజీ గోండు మీదుగా కొమురం భీం దాకా తెలంగాణలో ఆదివాసుల తిరుగుబాట్ల గురించి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాను గనుక ఇదెంత పని అనుకుని ఒప్పుకున్నాను. కాని దిగినాక గాని తెలుసుకోవలసినది చాల ఉందని తెలియలేదు. ‘జ్ఞానం అంటే మన అజ్ఞానం గురించి మనకు క్రమానుగతంగా తెలిసిరావడమే’ అని విల్ డ్యురాంట్ అన్నమాట ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద చదువుకుని ఎన్నోసార్లు వాడాను గాని తెలుగు సమాజంలోని ఆదివాసుల చరిత్ర గురించి తెలుగు సమాజ జ్ఞానం ఇంత అజ్ఞానంతో నిండి ఉన్నదని ఈ వ్యాసం రాసే క్రమంలోనే అర్థమయింది. పగిడిద్దరాజు తిరుగుబాటు నుంచి కొమురం భీం తిరుగుబాటు దాకా (అంతకు ముందూ ఆ తర్వాతా జరిగిన తిరుగుబాట్లను పక్కన పెట్టినప్పటికీ) ఏడు శతాబ్దాలలో తప్పకుండా ఎన్నెన్నో తిరుగుబాట్లు జరిగి ఉంటాయి. కాని పద్దెనిమిదో శతాబ్దం దాకా నమోదైనవే లేవు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ లోని ఏజెన్సీ ప్రాంతాలలో రంప తిరుగుబాట్లు, ద్వారబంధాల చంద్రయ్య, అల్లూరి సీతారామరాజు, వీర గున్నమ్మ వంటి నాలుగైదు, హైదరాబాద్ రాజ్యంలో రాంజీ గోండు, కొమురం భీం మినహా చరిత్రకెక్కినవి లేవు. వాటిలోనూ కొన్ని పరిణామాల గురించీ, ఘటనల గురించీ నాలుగైదు వాక్యాలలో తేల్చివేయడమో, పాదసూచికలో చెప్పడమో జరిగింది గాని సవివరమైన నివేదికలు లేవు. కాస్త వివరమైన నివేదికలు ఉండి, విస్తృతమైన ప్రచారం జరిగిన సందర్భాలలో కూడ అస్పష్టతలు, అన్వయం కుదరని సంగతులు, పొరపాట్లు ఎన్నో ఉన్నాయి. కొమురం భీం ఉదంతమే పెద్ద ఉదాహరణ.

**

కొమురం భీం నాయకత్వం వహించిన, వేలాది మంది గోండులూ, కోలాములూ, ఇతర తెగలూ పాల్గొన్న, కనీసం మూడు సంవత్సరాలు నడిచిన పోరాటం 1940లో అణచివేతకు గురైంది. అది అంత ప్రభావశీలమైన తిరుగుబాటు అయినప్పటికీ ఆదివాసుల సామూహిక జ్ఞాపకంలో తప్ప భీం మరెక్కడా లేకుండాపోయాడు. ఈ ప్రాంత సామాజిక చరిత్రలో భాగం కాకుండా పోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భీం విస్మృత గతంగా మారిపోయాడు. ఆ గతాన్ని తవ్వితీసినదీ, వర్తమానంతో సంభాషింప జేసినదీ, భీంను పునరుజ్జీవింపజేసినదీ విప్లవోద్యమం.

జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాలు కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలుగా విస్తరించిన కాలంలో, 1978-79ల్లో విప్లవోద్యమం ఆదిలాబాద్ జిల్లా అడవులలోకి ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం నిర్మాణమై అది 1981 ఏప్రిల్ 20న ఉట్నూరు సమీపంలోని ఇంద్రవెల్లి గ్రామంలో మహాసభ జరపాలని తలపెట్టింది. ఆ సభకోసం చుట్టూ 60 గ్రామాల నుంచి వస్తున్న ఆదివాసులను అడ్డగించి, లాఠీచార్జిలు, అరెస్టులు చేసి, చివరికి తుపాకి కాల్పులు జరిపి ఆదివాసుల చైతన్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇంద్రవెల్లి కాల్పుల్లో కనీసం 60 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షుల, సమకాలిక ఆధారాలు చెపుతుండగా, 13 మంది మాత్రమే చనిపోయారనే అధికారిక “చరిత్ర” ఇప్పటికీ రాజ్యం చేస్తున్నది. ఆ సందర్భంలో అప్పటికే గిరిజన రైతుకూలీ సంఘంలో సమీకృతమవుతున్న ఆదివాసులు కొమురం భీంను తలచుకున్నారు. ఆ తలపోత కాల్పుల తర్వాత మరింత పెరిగింది. ఆదివాసులు వర్తమాన పోరాటాన్ని గత పోరాటంతో కలిపి చూసుకున్నారు. వర్తమాన దమనకాండను గత దమనకాండతో సమానమైనదిగా పోల్చి చూసుకున్నారు. ఈ వర్తమానం వల్ల గతం మళ్లీ ఒకసారి నవనవోన్మేష జ్ఞాపకమయింది.

ఆ సమయానికి ఆ ప్రాంతంలో విప్లవోద్యమ కార్యకర్తగా పనిచేస్తుండిన సాహు, అప్పటి విప్లవోద్యమ నాయకత్వం ఆ మౌఖిక చరిత్ర శకలాలను జాగ్రత్తగా సేకరించి, అల్లం రాజయ్యతో పంచుకున్నారు. ఇద్దరు రచయితలూ ఆ విషయం మీద అభినివేశం ఉన్న అనేకమంది మిత్రులతో కలిసి లోతైన పరిశోధన సాగించారు. కొమురం భీంను చంపి, ఆ పోరాటాన్ని అణచివేసిన తర్వాత నిజాం ప్రభుత్వం ప్రఖ్యాత మానుషశాస్త్రవేత్త క్రిస్టొఫ్ వాన్ ఫ్యూరర్ హేమెండార్ఫ్ తో చేయించిన పరిశోధనా నివేదికతో సహా లభ్యమవుతున్న లిఖిత ఆధారాలను సేకరించుకున్నారు. అలా ఎంతో కాలం శ్రమించి 1983లో కొమురం భీం అనే అద్భుతమైన చారిత్రక నవల రాశారు. ఆ నవలే కొమురం భీంను తెలుగు సమాజంలోకి మళ్లీ సజీవంగా తీసుకొచ్చింది.

ఇవాళ్టికీ అరకొర వనరులే దొరుకుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే, ముప్పై మూడు సంవత్సరాల కింద దొరికిన వనరుల మీద ఆధారపడి, కొంత విశ్వసనీయ కాల్పనికతకు కూడ అవకాశం ఇచ్చి సాహు, అల్లం రాజయ్య చేసిన ఆ కృషి మహాద్భుత ప్రయత్నమనే చెప్పాలి. వారు అప్పటికి సంప్రదించిన పదకొండు అధికారిక పత్రాల జాబితా కూడ ముందుమాటలో ఇచ్చారు. అప్పటికి ఇంకా భీంతో పాటు కలిసి పనిచేసినవారు, పోరాటంలో పాల్గొన్నవారు, భీంను చూసినవారు, భీం కుటుంబసభ్యులు కొందరైనా సజీవంగా ఉన్నారు గనుక రచయితలు వారందరినీ కలిసి మౌఖిక చరిత్ర వివరాలు సేకరించారు. అందువల్ల భీం రూపం గురించి, భావోద్వేగాల గురించి, పరిశీలనా శక్తి గురించి, నాయకత్వ లక్షణాల గురించి, వేలాది గోండులను ఆకర్షించిన సమ్మోహక శక్తి గురించి నవలలో చిత్రించిన విషయాలు చాలవరకు నిజమే అయి ఉండాలి.

అయితే భీం చివరి పోరాటం ఎప్పుడు జరిగిందనే దాని మీద, భీంను నిజాం పోలీసులు కాల్చి చంపిన తేదీ మీద వాళ్లు కొంత పొరపాటు పడ్డట్టున్నారు. “డర్ నా మత్ సత్తార్ సాబ్…. తారీఖ్ భూల్ గయా! ఆజ్ పెహలీ హై… సెప్టెంబర్…. బుధవారం … సంవత్సరం కూడా చెప్పనా 1940” అన్నాడు కెప్టెన్ – అనే సంభాషణ ద్వారా భీంను కాల్చి చంపిన తేదీ 1940 సెప్టెంబర్ 1 అని వాళ్లు రాశారు. భీం ఒరిగిపోయిన చోట స్మారకచిహ్నంగా అప్పుడే గోండులు పాతుకున్న ఒక రాయి మీద 1.9.1940 అని చెక్కి ఉండడం దీనికి కారణం కావచ్చు. అయితే కొమురం భీం నవల మీద సృజనలో వివరమైన సమీక్షా వ్యాసం రాసిన సి వి సుబ్బారావు, 1940 సెప్టెంబర్ 1 నవలలో రాసినట్టుగా బుధవారం కాదనీ, ఆదివారం అనీ సవరించారు. (1983లో వచ్చిన పిబిసి ప్రచురణ, ఆ తర్వాత వచ్చిన విరసం ప్రచురణ – 1993, ఆదివాసి ప్రచురణలు – 2004, 2010 కూడ ఈ బుధవారం అనే మాటను అలాగే కొనసాగించాయి. పర్ స్పెక్టివ్స్ ప్రచురణ 2013లో సంభాషణలోనే బుధవారం బదులు ఆదివారం అని మార్చారు).

సాహు, అల్లం రాజయ్యల నవల తర్వాత కొమురం భీం మీద, గోడుల జీవన పోరాటాల మీద రెండు మూడు నవలలు, కొన్ని కథలు, ఒక సినిమా, అసంఖ్యాక వ్యాసాలు వెలువడి కొమురం భీం గురించి, ఆయన నడిపిన పోరాటం గురించి ఎన్నో వివరాలను ప్రజల దృష్టికి తెచ్చాయి. కొమురం భీం మరణానంతరం నాలుగు దశాబ్దాల తర్వాత ఉజ్వల స్మృతిగా జీవించడం ప్రారంభించాడు.

**

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమక్రమంలోనూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతా కొమురం భీం ఒక విగ్రహంగా, ప్రతీకగా కూడ మారిపోయాడు. ఆయన పేరు తలవని వాళ్లు దాదాపు లేరు. ఆయన భావాలతో, ఆయన పోరాటంతో ఎంతమాత్రమూ సంబంధం లేనివారి నుంచి, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్ల దాకా అందరూ ఆయనను ఏదో ఒక సందర్భంలో తలచుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ వీర యోధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందనే వాదనకు చిహ్నంగా కొమురం భీం ముందుకొచ్చాడు. పాఠ్యపుస్తకాలలో, హుసేన్ సాగర్ టాంక్ బండ్ మీద విగ్రహాలలో కొమురం భీం ఎందుకు లేడనే ప్రశ్న వచ్చింది. పాఠ్యపుస్తకాలలో ఏదో ఒకస్థాయిలో భీం పాఠంగా కూడ మారాడు. విశాలమైన ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలనే ఆకాంక్షకు, తూర్పు జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలనే కోరిక తోడయింది. చివరికి అక్టోబర్ 8న కొమురం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరిపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోడెన్ ఘాట్ వెళ్లి అక్కడ కొమురం భీం స్మారక ఉద్యానవనానికి శంకుస్థాపన చేసివచ్చారు.

కొమురం భీం నవల తవ్వితీసిన సెప్టెంబర్ 1 స్థానంలో ఈ అక్టోబర్ 8 ఎక్కడినుంచి వచ్చినట్టు? వాస్తవంగా కొమురం భీం వర్ధంతి అక్టోబర్ 8 కాదు. బాబేఝరీలో స్మారక శిల మీద 1.9.1940 అని రాసి ఉందని ఇదివరకే చూశాం. ఆ రోజు ఆశ్వయుజ పౌర్ణమి అని భీం సమకాలికుల జ్ఞాపకం ఆధారంగా, జానపద గాథల ఆధారంగా ఆదివాసులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజున భీం వర్ధంతి జరుపుకునేవారు. ఈ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబర్ 8న వచ్చింది గనుక రాష్ట్ర ప్రభుత్వం ఆరోజునే వర్ధంతి జరిపింది.

కాని ఇక్కడ మరొక చిక్కు ఉంది. 1940లో, విక్రమ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి సెప్టెంబర్ 1న కాదు, అక్టోబర్ 16న వచ్చింది. పోనీ ముందరి నెలలో, భాద్రపద పౌర్ణమి అనుకుందామా అంటే అది సెప్టెంబర్ 16న వచ్చింది. అలా ఇప్పటికి ఉన్న రెండు తేదీలు – స్మారకశిల మీద ఉన్న సెప్టెంబర్ 1 అనే ఇంగ్లిష్ తేదీ, గోండుల జ్ఞాపకంలో ఉన్న ఆశ్వయుజ పౌర్ణమి అనే తెలుగు తిథి – ఒకదానికొకటి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో నిజాం పోలీసులతో పోరులో కొమురం భీం ఒరిగిపోయిన తేదీ గురించి సమకాలీన ఆధారాలు దొరుకుతాయా అని గోలకొండ పత్రిక, ఆంధ్రపత్రిక పాత సంచికల అన్వేషణ ప్రారంభించాను. ఆ అన్వేషణలో కొమురం భీంను కాల్చిచంపిన తేదీ సెప్టెంబర్ 10 అని కచ్చితంగా తెలియడంతో పాటు, మరికొన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు కూడ బైటపడ్డాయి.

ఆంధ్రపత్రిక 1940 సెప్టెంబర్ 16 న ‘పోలీసులనెదిరించిన 500 గోడుల మూకపై తుపాకి కాల్పులు’ అనే శీర్షికతో, ‘హైదరాబాదులో 10 చంపబడిరి 13 గాయపడిరి’, ‘నేరస్థుల అరెస్టును నిరోధించినందుకు పర్యవసానము” అనే ఉపశీర్షికలతో ఒక వార్త వచ్చింది. “హైదరాబాదు (దక్కను), సెప్టెంబర్ 15” అనే డేట్ లైన్ తో వచ్చిన ఈ వార్తలో, “ఆసిఫాబాద్ సమీపమున సెప్టెంబర్ 10వ తేదీన బాభ్జారి ప్రాంతమున 500 మంది గోండులమూక తుపాకులు యితర ఆయుధములతో పోలీసులను ఎదిరించినందుకు పోలీసువారా మూకపై తుపాకులు ప్రేల్చవలసి వచ్చెననియు కాల్పులవల్ల 10 మంది గోండులు చంపబడి మరి 13గురు గాయపడిరనియు యిక్కడ అందిన వార్తలు దెలుపుచున్నవి….” అనే మొదటి పేరాతో నాలుగు పేరాల వార్త ప్రకటించింది. “(అ.ప్రె.)” (బహుశా అసోసియేటెడ్ ప్రెస్) అని చివరన ఉన్న ఈ వార్త మూడో పేరాలో కూడ పోలీసులు అడవిలోకి వెళ్లిన తేదీ సెప్టెంబర్ 10 అని మరొకసారి రాశారు.

ఇక గోలకొండ పత్రిక 1940 సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు వరుసగా ప్రతి సంచికలోనూ ప్రచురించిన వార్తలు, వ్యాఖ్యలు చాల ఆసక్తికరమైనవి, వివరంగా చదవవలసినవి. మొదట సెప్టెంబర్ 16న అచ్చువేసిన వార్త శీర్షిక “200 గోండులు అధికారులను ఎదిరించుట”. దాని ప్రకారం “ఆసిఫాబాదులోని బాబ్ ఝరీ అనే గ్రామంలో గుట్టలు కలవు. అచ్చట 200 గోండులు ఆయుధపాణులై 4 ఆబాన్ నాడు పోలీసు మొహతమీమును, తాలూక్దారును, 100 పోలీసు దళాన్ని ఎదిరించినారని జనులు అనుకొనుచున్నారు. కొన్ని దినాలకు ముందు ఈ గ్రామంలో గోండులు అడవిశాఖ నౌకర్లపై పడి కొట్టియుండిరి. పోలీసులు ఆ సందర్భములో కొందరిని పట్టుకొనిరి. కొందరిని జమానతుపై వదలిరి. కాని మరల వారిని పిలిపించగా వచ్చుటలేదని తిరుగబడిరి. 200 గోండులు గుట్టపైకెక్కి పోలీసులనెదిరించిరి. 4 ఆబాన్ నాడు పోలీసు మొహతెమీమున్ను తాలూక్దారున్ను 100 మంది పోలీసు జవానులతో ఆ గ్రామం వెళ్లిరి. వారిని కూడా గోండులు బెదిరించిరి (అ.న్యూ.)”

ఆ తర్వాతి సంచిక (సెప్టెంబర్ 19)లో ‘గోండులపై పోలీసులు కాల్చుట’ అనే శీర్షికతో, ’10 మంది చచ్చిరి, 13 మందికి గాయాలు’ అనే ఉపశీర్షికతో “ఆసిఫాబాదు, ఆబాన్ 11” డేట్ లైన్ తో కాల్పుల వార్త వచ్చింది. దాంట్లో కూడ స్పష్టంగానే “10 సెప్టెంబరు నాడు అవ్వల్ తాలూక్దారు కొందరి పోలీసులను వెంటబెట్టుకొని వారిని (గోండులను) పట్టుకొనబోయెను. కాని 300 గోండులవరకు వారినెదిరించిరి. తాలూక్దారు వారికి చాలావరకు బుద్ధిచెప్పినా వారు వినలేదు. పైగా అందొకడు తుపాకితో కాల్చెనట. అదృష్టవశాత్తు అదెవ్వరికిని తగులలేదట. మరల రెండవమారు గోండులు తుపాకీ కాల్చిరి. దానిమూలాన ఒక పోలీసు జవానుకు దెబ్బతగిలెను. అటుపై పోలీసువారు తమ తుపాకీలను గోండులపై కాల్చిరి. ఆ దెబ్బలతో 10 మంది గోండులు చచ్చిరి. 13 మందికి గాయములు తగిలెను. 31 మంది పట్టుకొనబడిరి. తక్కినవారు పారిపోయిరి” అని ఉంది.

నేను ఈ అన్వేషణ సాగించి నా వ్యాసం పూర్తి చేసిన వారం తర్వాత చరిత్ర పరిశోధకుడు భంగ్యా భూక్యా కూడ అప్పటి అత్యున్నత పోలీసు అధికారి ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రతి సంపాదించి దాని ప్రకారం కాల్పులు జరిగిన తేదీ సెప్టెంబర్ 10 అని తేల్చారని, అది భాద్రపద శుద్ధ నవమి అని కనుక పౌర్ణమిని వర్ధంతిగా గుర్తించడం మానేయాలని అన్నారని పత్రికలలో వచ్చింది.

ఈ కాల్పుల వార్త తెలిసిన వెంటనే ఆంధ్ర మహాసభ, హైదరాబాదు సంస్థాన హిందూ ప్రజామండలి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ల పక్షాన కనీసం మూడు నిజనిర్ధారణ కమిటీలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. బహుశా ఆంధ్ర మహాసభ పక్షాన వెళ్లిన బద్దం ఎల్లారెడ్డి గోలకొండపత్రిక 23.9.1940 సంచికలో ‘బాబెఝరీ గోండులపై కాల్పులు’ అనే పెద్ద వ్యాసం రాశారు (దురదృష్టవశాత్తూ ఇప్పుడు ప్రెస్ అకాడమీ అర్కైవ్ లో లభ్యమవుతున్న గోలకొండ పత్రిక డిజిటైజ్డ్ ప్రతిలో ఈ వ్యాసం అచ్చయిన పేజీ సగానికి చిరిగిపోయి ఉంది). “సర్కారి లెక్క ప్రకారము 10 మంది ఆ స్థలములోనే మరణించినారు. గాయపడ్డ పదముగ్గురు ఆసిఫాబాద దవాఖానాకు కొనితేబడగా వారిలో 4గురు ఇటీవల మరణించినారు. ఝండాగూడ గ్రామములో మరి ఇద్దరు గాయపడినవారు చచ్చినారని 11 ఆబాన్ నాడు పంచునామా చేయబడినది. ఇట్లు మొత్తం 16గురు చచ్చినారని సర్కారువారి లెక్క. ఇక ఇక్కడి ప్రజల అంచనా 100 మందికిపైగా ఆచోటనే చచ్చినారని” అని, ఈ ఘర్షణ పూర్వాపరాలతో సహా ఎల్లారెడ్డి గారు రాశారు. అదే సంచికలో గోలకొండ పత్రిక సంపాదకీయమూ రాసింది, ప్రభుత్వ ప్రకటన పూర్తి పాఠమూ అచ్చువేసింది.

ఆసిఫాబాద్ లో శ్రీనివాసాచారి, లక్ష్మణ్ అనే వకీళ్లుఈ ఘటనను విచారించడానికి కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన వార్త గోలకొండ పత్రిక 26 సెప్టెంబర్ సంచికలో వచ్చింది.

సెప్టెంబర్ 30 సంచికలో ‘గోండుల గోడు – బాబెఝరీ కాల్పుల గురించి కొన్ని సవరణలు’ అంటూ మళ్లీ ఎల్లారెడ్డి గారు అదనపు వివరాలు రాశారు. “ఆ రోజే కాల్పులు జరిగినప్పుడు బాబెఝరీలో 127 మంది చచ్చినారని రూఢిగా ఒక పోలీసు పటేలు వల్ల తెలియుచున్నది. వీరందరిని పోలీసు అక్కడనే దహనం చేసి గురుతు లేకుండా చేసిరని కూడ తెలియుచున్నది. ఆస్పత్రిలో 4గురు మరణించినారు. మండ్రుమాడలో నొక గాయపడినవాడు మరణించినాడు. గోండు ఝండా గూడలో నిద్దరు గాయపడినవారు మరణించినారు. వీరిద్దరి పంచునామా కూడ అయినదని తెలియుచున్నది. గడలపల్లిలో ఇద్దరు గాయపడ్డవారు మరణించినారని పోలీసు పటేలు రిపోర్టు. చిద్రకుంటలో ఇద్దరు మరణించినారని పోలీసుపటేలు రిపోర్టు. మొత్తం ఇప్పటికి 138 మంది చచ్చినారని తెలియుచున్నది” అని రాశారు. (బద్దం ఎల్లారెడ్డి గారి పర్యటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని ‘శతజయంతి సంస్మరణ సంచిక’ లో ప్రచురించిన పోలీసు రికార్డ్స్ తెలియజేస్తాయి.)

అక్టోబర్ 7 సంచిక రెండు నిజనిర్ధారణ సంఘాల గురించి వార్త ప్రకటించింది. అక్టోబర్ 14 సంచిక న్యాయవిచారణ జరిపించమని కోరుతూ ఆంధ్రమహాసభ చేసిన తీర్మానాన్ని ప్రకటించింది.

అక్టోబర్ 17 సంచికలో ‘గోండుల గోడు – క్రొత్తగా తెలిసిన సంగతులు’ శీర్షికతోనూ, అక్టోబర్ 21 సంచికలో ‘గోండుల గోడు’ శీర్షికతోనూ జి ఎస్ గుప్త చాల వివరమైన నివేదికలు రాశారు. ఎన్నో గ్రామాలు, గోండు గూడాలు తిరిగి సేకరించిన సమాచారంతో ఆయన రాసిన ఈ నివేదికలు చాల విలువైనవి, తప్పనిసరిగా చదవవలసినవి.

**

“ఆసిఫాబాదు జిల్లాలో గోండులపై పోలీసువారు తుపాకులను కాల్చినందుకు 10 మంది చచ్చిరని తెలుపబడి యుండెను. అటుపై ప్రభుత్వము వారీ కింది విధముగా ప్రకటించుచున్నారు:

పోలీసు మంత్రియున్ను, పోలీసు నాజమున్ను ఆసిఫాబాదుకు పోయి విచారం చేసి వచ్చుటచే తెలిసినదేమనగా ఇంతవరకు 10గురు గోండులు చనిపోయినారు.

5 ఏండ్ల క్రిందట ఒక గోండు ఈ రాష్ట్రములోనికి వచ్చి ఆసిఫాబాదుకు 12 మైళ్ల దూరములో ఒక అడవిలో పీఠము వేసినాడు. అచ్చట వాడు దొంగతనంగా వ్యవసాయం సాగించినాడు. క్రమంగా 300 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు. కొందరు శిష్యులు కూడ జతకూడినారు. అడవిశాఖవారు ఆ వ్యవసాయాన్ని ఆపివేయ ప్రయత్నించినారు. కాని వాడు వినలేదు. 2 నెలల క్రిందట కొందరు అడవిశాఖవారు వానిని నిరోధించుటకు వెళ్లగా అందులో ఇద్దరికి దెబ్బలు తగిలెను. ఈ మనిషిని పట్టేది కష్టమని మొహతమీమ్ స్వయంగా వెళ్లి వానినిన్నీ మరివాని వద్దనుండే ఆరు మందిని పట్టుకుని వారు పట్టుకున్న ఆయుధాలను క్రింద పెట్టించి జమానతుపై అచటనే విడిచివేసెను. ఇక్కడికంతా తృప్తికరముగా పరిష్కారమయినదని జిల్లా అధికారులు నివేదించుకొనిరి. విచారణ దినమునాడు కోర్టుకు గోండులు రాకపోయిరి. అందుపై వారంటు పంపబడెను. దానిని వారిపై ప్రయోగించుట కష్టసాధ్యమయ్యెను. ప్రయోగింపుచో జవానులను చంపుదుమన్నారు. ఈ గోండు మరీ బిర్రబిగిసి తాను గోండు రాజాననిన్నీ తనకు 5 జాగీరులిచ్చి అడవి సుంకాలన్నీ వదులుకోవలెననిన్నీ తాలూక్దారుకు పోలీసు అధికారికి చిట్టీలు వ్రాసినాడు. తనవారిపై ప్రభావంజేసినాడు. తనకు మంత్రశక్తి కలదన్నాడు. తుపాకి గుండ్లు తమపై పారవన్నాడు. ఆ మార్గంగా పోవు విమానాన్ని చేయి విసిరి క్రింద పడగొడ్తాను చూడుమన్నాడు. ఇట్టి ముచ్చట్ల చేత వాని అనుయాయి వర్గం 1000 మంది వరకు పెరిగిందని వదంతి. ఇక శ్రుతి మించనీయగూడదని తాలూక్దారు 100 పోలీసులను తుపాకులతో లాఠీలతో తీసుకుని వెళ్లినాడు. జిల్లా పోలీసు అధికారిని, జిల్లా అటవీశాఖ అధికారిని జిల్లా డాక్టరును వెంటబెట్టుకున్నాడు. గాయాలకు చికిత్స చేసే మందు డబ్బాలను కూడ పట్టించుకున్నాడు. ఇంకా ఇద్దరు రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకున్నాడు. గోండులుండే గుట్ట వద్దకు 4 ఆబాన్ నాడు వెళ్లి డేరా వేసినాడు. ఆ గ్రామం పటేలుద్వారా గోండులకు రాయబారాలంపినారు. కాని గోండులు పటేలును మళ్లీ వస్తే చంపివేస్తామని చెప్పంపినారు. మరునాడు గోండులు నగారాలు మోగించినారు. 6 ఆబాన్ నాడు పోలీసువారు 800 అడుగులయెత్తు గుట్టను భద్రముగా ఎక్కినారు. అచట 500 గోండులు ఆయుధాలతోనుండినారు. 4 గంటల కాలం తాలూక్దారు వారికి బుద్ధిరావలెనని చాలా ప్రయత్నం చేసినాడు. కాని లాభము లేకపోయింది. వారు ఆయుధాలను విసర్జించమన్నారు. పైగా మీరు వెళ్లుతారా లేక అందరినీ నరికి వేస్తుమా అని బెదిరించినారు. తుదకు మాటల కాలము పోయినది, వారు కూతలు పెట్టుచూ 80 గజాలు వెనుకకు తగ్గినారు. అనేక గోండులు ఆవేశముతో ఊగుటకు మొదలుపెట్టినారు. ఇక ప్రమాదమే అని తాలూక్దారు గాలిలో రెండుమారులు బెదిరించేదానికి కాల్పించినాడు. దానివల్ల లాభం లేకపోయినప్పుడు గుండ్లను కాల్పించినాడు. గోండు నాయకుడు పోలీసు వారికి 10 గజాల దూరంలో చచ్చి కిందపడినాడు. వాని పక్కనే వాని చుట్టమొకడు చచ్చిపడినాడు. మరి 8 మంది అప్పుడే చచ్చిపడినారు. 13 మందికి గుండుదెబ్బలు తగిలెను. మిగతావారు అడవులలోనికి పారిపోయినారు. గ్రామములోని కొందరు గోండులు తుపాకులతోనుండగా అరెస్టు చేయబడినారు. డాక్టరు గాయాలు పొందినవారికి వెంటనే కట్లు కట్టినాడు. మరునాడు తాలూక్దారుగారున్నూ వారి సిబ్బందియున్నూ పరివారమునూ ఆసిఫాబాదుకు గాయాలు పొందినవారిని, పట్టుకున్న గోండువారిని తీసుకొనివెళ్లిరి. విచారణలు జరుగుచున్నవి.”

ఇది బాబేఝరీ కాల్పుల తర్వాత నిజాం ప్రభుత్వ పోలీసు శాఖ విడుదల చేసిన పత్రికాప్రకటన పూర్తిపాఠం. ప్రజా ఆకాంక్షల గురించి, ఉద్యమాల గురించి, ప్రజానాయకుల గురించి, పోలీసులకూ ప్రజలకూ మధ్య ఘర్షణల గురించి ఏడు దశాబ్దాల తర్వాత కూడ ఇదే పద్ధతి, ఇదే రకమైన వివరణ ఉంటాయి. ఈ ప్రకటన చదివితే అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదని తేలుతుంది. రాజ్యం, రాజ్యపు అంగాలు, ముఖ్యంగా పోలీసులు మాట్లాడే భాష ఒకటే అని తేలుతుంది. గతవర్తమానాల కలనేత మరీ ఇంత చిక్కగా, గాఢంగా ఉండడం, వర్తమానం మీద గతం నీడ వదలకపోవడం, గతమేదో వర్తమానమేదో పోల్చుకోలేని స్థితి ఉండడం మన సామాజిక అవ్యవస్థకు, స్తబ్దతకు, ప్రతిష్టంభనకు, నిశ్చలతకు చిహ్నం కాదా?

  • ఎన్ వేణుగోపాల్
  • venugopalraon@yahoo.com

‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

egire-pavuramaa-19

(గూడు చేరిన పావురం..)

 

శ్రావణ శుక్రవారం తొమ్మిదికి ముందే నేను, ఉమమ్మ ఒకేసారి కోవెలకి వచ్చాము. అల్లంత దూరాన్నుంచే, నన్ను చూసి చేయి ఊపి గుడిలోకి వెళ్ళిందామె.

పుస్తకాలయంలో గల్లాపెట్టె సర్డుతున్న నేను, “గాయత్రీ,” అన్న ఉమమ్మ పిలుపుకి తలెత్తి చూశాను. “సోమవారం ఇక్కడ శెలవు చెప్పు. నీకు జరగవలసిన వైద్య పరీక్షలకి మల్లిక్ గారు వాళ్ళ ఆసుపత్రిలో సమయం కేటాయించారు,” అంది ఉమమ్మ.

 

అలాగేనని తలాడించాను. ‘ఇప్పటికీ నామీద అదే శ్రద్ధ, అదే ఆపేక్ష ఆమెకి. కాలం గడిచినా, చెక్కు చెదరని ఆమె అంకితభావం నమ్మలేకపోయాను. ఆమె నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది’ అనుకున్నాను.

 

‘ఎప్పుడు వచ్చినా ఓ మంచి వార్తో, మంచి తలంపో వెంట తెస్తుంది ఉమమ్మ. ఆమె కలిసిన ప్రతిసారి నా మెరుగు కోసమే తాపత్రయ పడుతుంది. ఆమె ఋణం తీర్చుకోలేనిదే’ అనుకుంటూ పని మొదలెట్టాను.

**

గుంటూరులోని మల్లిక్ గారి కొత్త హాస్పిటల్లోనే నా వైద్య పరీక్షలు జరిగాయి. నాలుగేళ్ళ క్రితం వంశీ సంస్థ వారు జరిపిన పరీక్షల ఆధారంగా – మరిన్ని పరిశోధాత్మక విధానాలు జరిపించారు అక్కడి నిపుణులు.

 

కాళ్ళల్లో కదలిక విషయంగా – మరింత వైజ్ఞానిక పరిశీలన జరిపించారు.

మాట విషయంగా – నాదతంత్రులుండే స్వరపేటిక పరీక్ష’ నిర్వహించారు.

‘ఇంద్రియ సమన్వయ పరిశీలనా పరీక్షలు’ కూడా జరిపారు.

**

మళ్ళీ వారం, నాకు జరిపిన ఆ సూక్ష్మమైన పరీక్షల వివరణ పత్రం ఇచ్చారు…

 

పసితనంలో కలిగిన తీవ్ర అఘాతము వల్లనే నాకీ అంగవైకల్యం ఏర్పడి ఉండవచ్చని భావించారు.

నడక, మాట కూడా చికిత్సతో తిరిగి వచ్చే అవకాశముందని చెప్పారు ఆ నిపుణులు.

కదలిక విషయంగా – కాళ్ళకి కనీసం నాలుగు ఆపరేషన్లు తప్పవన్నారు. ఆ తరువాత వ్యాయామం, కాయకల్ప చికిత్స కూడా కొంతకాలం జరిపిస్తే క్రమేపీ నడక వస్తుందన్నారు. కమలమ్మ పెట్టించిన కుత్రిమ కుడి కాలు మాత్రం అలాగే ఉంటుందన్నారు.

వాక్చిత్సలో భాగంగా వాక్‌ శిక్షణ, వాక్ పునరుద్ధరణతో పాటు ఆధార-సలహా సమావేశాలు నిర్వహిస్తే మాట సమర్థత ఏర్పడే అవకాశం ఉందని, తద్వారా తప్పక నా అవిటితనాన్ని అధిగమించగల అవకాశం మెండుగా ఉందని అభిప్రాయ పడ్డారు.

 

ఆ వివరణ విని, తాత అనుకున్నట్టుగానే నేను అందరిలా నడిచి మాట్లాడగలిగే అవకాశం ఉందన్నారు అందరూ.

నాకు వైద్యం త్వరలో మొదలవ్వాలని పట్టుదలగా ఉంది ఉమమ్మ.

**

శ్రీ గాయత్రి పుస్తకాలయం’ జమాఖర్చులుతో పాటు కోవెల జమా-ఖర్చులు కూడా నా బాధ్యతగా చూసుకొమ్మన్నారు పూజారయ్య. పుస్తకాలయంలో, అప్పుడే ఆరునెల్లగా నా విధులని సవ్యంగా, శ్రద్దగా నిర్వహిస్తున్నాను.

అప్పుడప్పుడు ఓ క్షణం కమలమ్మ గుర్తొచ్చి వెన్నులోంచి దడ పుడుతుంది.   ఎప్పుడూ తటస్థంగా ఉండే గోవిందు, ఊహించని విధంగా, సమయానికి   నాకు సాయం చేయబట్టే, నా జీవనం నేనాశించిన గమ్యం చేరింది.

మా జీవితాలని మూడేళ్ళ పాటు తన గుప్పిట్లో పెట్టుకున్న జేమ్స్ కూడా గుర్తొస్తాడు.

తండ్రి వయస్సున్న జేమ్స్, నా సంగతంతా తెలుసుకున్నాకయినా, నా పట్ల ఒకింత సానుభూతితో, మానవతతో, నేను తాత వద్దకు చేరడానికి   సహాయ పడుంటే, మరోలా ఉండేది కదా అనిపిస్తది.

**

మరో వారం రోజుల్లో, ఆదివారం నాడు ఉమ్మమ్మ వాళ్ళ ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ వారి కార్యక్రమం జరగబోతుందని ఊళ్ళో సందడి మొదలయ్యింది. ఉచిత వైద్యశిబిరం గురించి అందరికీ తెలియజేసి, ఊరంతా నమోదు పత్రాలు పంచారు.

**

“నీతో ఓ ముఖ్యమైన పనే ఉంది,” అంటూ ఉమమ్మ పుస్తకాలయంకి   వచ్చి, నా ఎదురుగా చెక్క కుర్చీ మీద కూచుంది. వెంట రాములు కూడా ఉంది.

జరగబోయే సమావేశం గురించి మాకు అర్ధమయ్యేలా చెప్పింది ఉమమ్మ.

“స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించి ఈ సమావేశం జరుగుతుంది.

భ్రూణ హత్యలు, శిశు హత్యలు, ఆడపిల్లల్ని నిర్దాక్షణ్యంగా త్యజించడాలు – మానవజాతికి ముప్పుగా మారుతున్నాయన్న విషయం ప్రస్తావిస్తారు. ప్రసంగించేవారిలో రాజకీయ నాయకుడు, టివి నటి, సంఘకర్తలు ఉండవచ్చు,” అంటూ నా వంక చూసింది ఉమమ్మ.

 

“గాయత్రీ, ఈ సందర్భంగా – నీ సంగతి – అంటే – పసిగుడ్డువైన నిన్ను నీ కన్నతల్లి త్యజించిన వైనం, దాని పర్యవసానం, తాత నిన్నాదుకున్నప్పటి నీ పరిస్థితి గురించి మీటింగులో నేను మాట్లాడవచ్చా?” అని అడిగింది.

 

తదేకంగా ఆమెనే చూస్తూ ఆమె చెప్పేది వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. నన్నే గమనిస్తున్న ఉమమ్మ వైపు తలెత్తి చూశాను.

కూర్చున్న స్థానం నుంచి లేచి ఆమె చేయందుకున్నాను.   నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టు తల ఊపి హామీ ఇచ్చాను. పక్కనే ఉన్న నోటుపుస్తకం అందుకొని,

‘నేను మీ మనిషిని ఉమమ్మా, మీరు నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. మీకు ఈ కార్యంలో నేను ఏ విధంగా పనికి రాగలిగినా నాకు సంతోషమే’.

అని రాసి అమెకందించాను.

 

“అంతేకాదు గాయత్రీ. నీకు చెప్పాల్సింది మరో విషయం ఉంది,” అంటూ లేచి దగ్గరగా వచ్చి, నన్ను నా స్టూలు మీద కూచోబెట్టింది. నా చేయి తన చేతిలోకి తీసుకుంది.

 

“మన సంక్షేమ సంస్థ సహకారంతో, నీ గతం గురించిన కొని వివరాలు కూడా సేకరించగలిగాము,” అన్న ఉమమ్మ మాటకి మళ్ళీ ఉలిక్కిపడి ఆమె వంక చూసాను.

 

“పందొమ్మిదేళ్ళ క్రితం, జూన్ లో ఓ మూడురోజుల పాటు ఇక్కడ ఉధృతమైన వాతావరణం నెలకొన్నుందంట. ఆ సమయంలో మన ఊళ్ళో జన్మించిన ఆరుగురు పసివాళ్ళలో,   ఐదుగురి ఆచూకి ఉంది.   ఒరిస్సా నుండి పక్క ఊరికి వచ్చున్న మరో స్త్రీ కూడా, ఇక్కడ ఆడపిల్లని కన్నట్టు నమోదైన సమాచారం తప్ప, ఆచూకి లేదు.

కన్న మూడోరోజున పసిబిడ్డని తీసుకొని, ఆ ఉద్రిక్త వాతావరణంలోనే ఆ బాలింత వెళ్ళిపోయిందని మన చిన్నాసుపత్రి సమాచారం. ఆమే పసిబిడ్డని త్యజించి ఊరెళ్ళిపోయుంటుందని అంచనా,” ఆగింది ఉమమ్మ.

 

“ఆ బిడ్డవి నువ్వేనని ఆధారాలున్నాయని తెలిసింది. నీ ఇష్టం. నీకు కావాలంటే   ఆ వివరాలు, ఆధారాలు అడిగి తీసుకోవచ్చు,” అందామె భుజం మీద చేయి వేస్తూ.

మౌనంగా ఉండిపోయాను…

“బాధ పడకు… అలోచించు.. వివరాల వల్ల మనకి ఉపయోగమే లేదు… పైగా అసలావిడ ఈ చుట్టుపక్కల్లో   ఉండే మనిషి కాదు కూడా.     ఆమెకి పక్క ఊళ్ళో ఉన్న బంధువు ఆమె అమ్మమ్మట. ఆ అమ్మమ్మ చనిపోయి కూడా చాలా కాలం అయిందట. …

నీకెందుకు మళ్ళీ జీవితంలో ఓ అయోమయం, అన్వేషణ? సమయం వృధా చేయకుండా, చదువుకొని నీవు ఎదగాలి గాయత్రీ,” అంటూ సముదాయించింది…

**

అలజడి, ఆవేశం, దుఃఖం, అసహనం నన్ను చుట్టేసాయి.

రాత్రంతా కంటి మీద కునుకులేకుండా గడిపాను.

తెల్లారే సమయానికి మనసు కుదుటపడింది.   ‘అయితే ఏమిటి? అది గతం. ఎన్నడూ నాకు అమ్మగా నిలవని ఆమె కోసం పాకులాడే ప్రశక్తే లేదు. అలాగని ద్వేషించి సాధించేదేమీ లేదు’. ‘నాకు తెలియని ‘అమ్మ’ – ఆ స్త్రీ గురించి, నిన్న నేను విన్నది, తెలుసుకున్నదీ నాకు అనవసరం. అదంతా మరిచిపోవడమే నాకు శ్రేయస్కరం,’ అనుకొని పక్క మీద నుండి లేచాను…

**

egire-pavuramaa18-banner

ఆదివారం సమావేశానికి అనుకున్న దానికంటే ఎక్కువమందే హాజరయ్యారు. మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, పత్రికా విలేఖరులు వచ్చారు. నటి మంజరి వచ్చింది. వారందరి ఉపన్యాసాల వల్ల కొన్ని విషయాలు తెలిశాయి.

వారిలో ఓ సంఘకర్త మాట్లాడుతూ, ఓ పత్రిక నుండి సమాచారం చదివి వినిపించారు…..

‘ఆడశిశువు పుడితే పీక పిసికి చెత్తకుండిలోనో, పొదల్లోనో, డ్రైనేజీలోనో పడేయడం పరిపాటైపోయింది. ఈ క్రియ చదువుకున్నవాళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ చేస్తున్నారు. తల్లిదండ్రులకు కొడుకే తలకొరివి పెట్టాలన్న మూఢాచారంతో మగ పిల్లాడిని వారసునిగా ఎంపిక చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో స్త్రీ గర్భం దాల్చాక స్కానింగ్ ఇతరత్రా పరీక్షలద్వారా లింగ నిర్ధారణ చేసుకుని ‘ఆడపిల్ల’ అని తేలితే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన అమానవీయత, మూఢాచారాలవల్ల ‘స్త్రీ’ భ్రూణహత్యల పరంపర కేవలం తెలుగు నాట 2005 నుండి 2013 కి ఎనభై లక్షలని కొత్తగా వెలువడిన ప్రభుత్వ సర్వే తెలియజేసింది.

అంటూ ఆమె ప్రసంగం ద్వారా తెలిపారు.

మరో యువ రాజకీయ నాయకుడు, దానికి కొనసాగింపుగా ..

“ఈ మధ్యన తేలిన విషయం – తల్లిగా స్త్రీని గౌరవించుకునే విషయంలో – భారత దేశం 39 వ స్థానంలో, అదీ పాకిస్తాన్ కంటే ఐదు స్థానాలు దిగువలోనే ఉందని తేలడం విచారకరం. ఏదైనా ‘స్త్రీ-శిశు సంక్షేమం’ అనేది ఓ నిర్విరామ బృహత్తర కార్యక్రమం. ఉమాదేవి చుట్టుప్రక్కల ఎన్నో తాలూకాల్లో ఈ విషయంగా ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రభుత్వం వారు ఆమెకి మరింత సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాము,”

అని ముగించాడు ఆయన.

 

ఉమమ్మ వంతు వచ్చింది. ఆమెదే ముగింపు ఉపన్యాసం. నేనూ అందరితో పాటు శ్రద్ధగా వింటున్నాను.

 

“తన జీవితానికి అడ్డమ్మొచ్చిందనో, తన కష్టం తీరుతుందనో, కన్నబిడ్డని త్యజించే ముందు – ఆ చర్య వల్ల బిడ్డ భవిష్యత్తు శాపగ్రస్తమౌనేమోనని ఆలోచించవలసిన బాధ్యత ఆ ‘అమ్మ’ కే ఉంది.

ఒక్కోసారి ఆడశిశువు పట్ల వివక్షతో కన్నతల్లే కసాయిలా మారి, ఆ బిడ్డని త్యజించో, విక్రయించో, గొంతు నులిమో వదిలించుకుంటే?

రంగుల హరివిల్లులా అనిపించే ఊసరవెల్లి సమాజంలో, అమ్మ ఆదరణ లేని అడశిశివు యొక్క మనుగడ ఏ రంగు పులుముకుంటుందో? అన్న ఆలోచన చేయవలసిన బాధ్యత ఆ తల్లిదే కాదా?.

మీ అందరిని ఆశ్చర్యపరిచే ఓ సంఘటన చెబుతాను.

‘గాయత్రి’ అని ఓ ఆడబిడ్డ మా కోవెల్లోనే పెరిగింది. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ పడతి. ఆమె తల్లి ఆమెని రోజుల పిల్లప్పుడే నిర్దయగా వదిలేసింది. కేవలం ఆ తల్లి నిర్లక్ష్య, అనాలోచిత చర్య వల్ల ఆ పసిదానికి అవిటితనం ఏర్పడింది. ఓ దయగల పెద్దాయన, ఆ బిడ్డని తెచ్చుకుని, పెంచి పెద్ద చేసాడు. అయినా తల్లి చర్య వల్ల, తల్లి ఆదరణ లేని లోటు వల్ల ఆమె ఇంత చిన్న వయసులోనే జీవితకాలం పాటి కష్టనష్టాలని అనుభవించింది.

మా ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ ప్రయత్నం వల్ల గాయత్రి కన్నతల్లి విషయంగా కొంత సమాచారం సేకరించాం. మొగపిల్లవాడు – వారసుడు కావాలనుకునే ఆమె భర్త, అతని పరివారం నుండి తిరస్కారానికి భయపడి, ఆమె బిడ్డని వదిలివేసుంటుందని అంచనా. అప్పటికే   ఇద్దరాడపిల్లల తల్లి అయిన ఆమె, బరంపురం తిరిగివెళ్ళి బిడ్డ పురిట్లోనే పోయిందని చెప్పినట్టు సమాచారం.

ఎంతో వొత్తిడికి లోనయి ఆ తల్లి అలా చేసుండవచ్చని అనుకున్నా, బాధ్యతా రహితమైన చర్య అని భావించక తప్పదు. ఏమయినా, త్యజించబడిన ఆ నాటి ఆడశిశువే మన ఈ గాయత్రి అని నిర్ధారణకొచ్చాము.  

ఈమెకి మాత్రం – ప్రేమ గల పెద్దాయన ప్రాపకం, శ్రేయోభిలాషుల ఆశ్రయం దొరకడం గొప్ప అదృష్టం.  

అయితే ఇటువంటి అదృష్ట, అవకాశాలు త్యజించబడ్డ మరో బిడ్డకి దొరక్కపోవచ్చు. మరి ఆ బిడ్డల జీవితాలు ఎలా ఉండగలవో ఆలోచించండి,” అని క్షణమాగింది ఉమమ్మ.

అమ్మతనం అద్భుత వరమే! బాధ్యతల వలయం కూడా. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, కన్న బిడ్డకి కనీసం రక్షణ కల్పించవలసిన బాధ్యత మాత్రం ఆ తల్లికే ఉంది. బిడ్డ బాధ్యత చేపట్టలేని ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఎదురైతే, బిడ్డ క్షేమం కోరి కనీసం సమాజంలో ఉన్న సహాయ, అవకాశాలని ఆమె అంది పుచ్చుకోవాలి.

నేటి పురోగామిక సమాజంలో ఆ అవకాశం మెండుగా ఉంటుందామ్మకు…

ప్రభుత్వ సంస్థల చేయూత సైతం సులువుగా లభ్యమవుతుంది కూడా,” అంటూ,…..

 

”పోతే గాయత్రి ఎవరో కాదు, వాకిట్లో మిమ్మల్ని సాదరంగా నవ్వుతూ లోనికి ఆహ్వానించి, మీ నుండి సంతకం తీసుకుని, మీకు కార్యక్రమ పత్రాలు అందజేసిన ఆ చురుకైన అమ్మాయే,”

అంటూ ఉపన్యాసం ముగించింది ఉమమ్మ.

ఆమె కొత్తగా నా గురించి, నాకు జన్మనిచ్చి వదిలేసిన ఆ తల్లి గురించి చెప్పిన విషయం విన్నాను. నాలో పెద్దగా ఎటువంటి స్పందనా కలగలేదు. ఉదాసీనతే తోచింది.

జరుగుతున్న మిగతా కార్యక్రమం చూడసాగాను.

 

….సంఘం లోని కుళ్ళుని కడిగేయాలంటే ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యవచ్చు? అన్న విషయం మొదలుకొని, ప్రభుత్వం నుండి సహాయం ఎలా పొందాలో తెలియజేసే మిగతా వారి ప్రసంగాలతో విజయవంతంగా ముగిసింది ఆ నాటి కార్యక్రమం……

ఆఖరున ప్రభుత్వ సహాయకారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

**

నా జీవితం, గురించి ప్రస్తావన ఈ విధంగా ఉమమ్మ చేస్తున్న మంచి పనికి సహాయ పడితే నా జన్మ ధన్యమైనట్టేనని భావించాను. నాకు నిజంగా మాట్లాడగల స్థితి వస్తే ఉమమ్మకి నావంతు సహకారాన్ని మాటల ద్వారా కూడా అందించాలని నిర్ణయించుకున్నాను.

అవకాశం అంది పుచ్చుకొని ఉమమ్మలా ‘ప్రత్యేక విద్యా విధానం’ లో పై చదువులు సాగించాలని కూడా ఆశ కలిగింది నా మనస్సులో.

**

కోవెల పైమెట్టు మీదనే నాకలవాటైన నా స్థలం, పురాతన రావిచెట్టు నీడన నేను కూర్చునే నాకిష్టమైన నా స్థానం. శ్రీ గాయత్రి పుస్తకాలయంలోని కొలువునే గౌరవంగా నిలుపుకుంటాను.

తాత ఏర్పరిచిన నా జీవితం నాకు ఒక స్వర్గమే అని భావిస్తాను.

    సమాప్తం

   ***************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విధి కన్న బలమైనది

The-prince-of-egypt 1

ఒకానొకప్పుడుఈజిప్ట్ లో ఒక రాజుకి లేక లేక కొడుకు పుట్టాడు. రాజకుమారుడి జాతకం చూసిన జ్యో తిష్కులు మొసలి వల్లనో, కుక్క వల్లనో పాము వల్లనో అతనికి ప్రాణగండం ఉంటుందని చెప్పారు . అలా జరగకుండా ముందుగాఏమీ చేయలేమని కూడాతేల్చారు .   రాజూ రాణీ చాలా దిగులుపడిపోయారు. తమ బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు. బాగా ఎత్తైన కొండ మీద కోట కట్టి చుట్టూ సైనికులని కాపలా పెట్టి అందులో రాజకుమారుడిని ఉంచారు. బొమ్మలు, పుస్తకాలు, ఆటవస్తువులు – కావలసినవన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడూ వెళ్ళి చూసివస్తూ ఉండేవారు.

 

ఒక రోజు రాజకుమారుడు కోట పైకెక్కి ఆడుకుంటూ కింద వెళుతున్న చిన్న కుక్కపిల్లని చూశాడు. అది అతనికి ముద్దొచ్చింది. తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కుక్కలే లేకుండా కట్టుదిట్టం చేసి ఉంచారు , అది ఎలా వచ్చిందో సేవకులకి అర్థం కాలేదు. గాభరా పడుతూ వెళ్ళి రాజుకి విషయం చెప్పారు. రాజకుమారుడి కోరిక ఏదీ అప్పటివరకూ వాళ్ళ అమ్మా నాన్నా కాదనలేదు. ఇప్పుడు కుక్కపిల్ల వద్దని నచ్చజెప్పాలని చూశారు. అతను వినలేదు. చేసేది లేక వాళ్ళు ఒప్పుకున్నారు. తొందర్లోనే రాజకుమారుడికి కుక్కపిల్ల బాగా మచ్చిక అయింది. దానికి మంచి తర్ఫీదు ఇచ్చి అతన్ని రక్షిస్తూ ఉండేలాగా తయారు చేశారు.

రాజకుమారుడికి ఇరవై ఏళ్ళు వచ్చాయి. ఆ నోటా ఆ నోటా తన జాతకం గురించి అతనికి తెలిసింది. అస్తమానం కోట లోనే గడపటం అతనికి విసుగు పుట్టించింది. తండ్రి దగ్గరికి వెళ్ళి ” నేను ప్రపంచం తిరిగి చూడాలనుకుంటున్నాను. నా క్షేమం గురించి ఆదుర్దా పడకండి, నా కుక్కపిల్ల నన్ను కాపాడుతుంది ” అన్నాడు. ఇదివరకులాగే తండ్రి వద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. కొడుకు పట్టుదల వదల్లేదు. అయేదేదో అవుతుందని గుండె రాయి చేసుకుని సరేనన్నాడు . ఓడ లో అతన్నీ కుక్కపిల్లనీ నైల్ నది దాటించారు. అక్కడ సిద్ధంగా ఉంచిన మంచి గుర్రాన్ని ఎక్కి రాజకుమారుడు బయలుదేరాడు. బయటి ప్రపంచాన్ని చూడటం అతనికి చాలా సరదాగా సంతోషంగా ఉంది.

అలా  ప్రయాణిస్తూ ఒక గొప్ప రాజ్యం చేరాడు. అక్కడి రాజు అతనికి ఆతిథ్యం ఇచ్చి తన కూతురిని పరిచయం చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ” నాకు నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఉంది. కానీ నా విధి ప్రకారం కుక్క కారణంగానో , మొసలి వల్లో పాము వల్లోనాకు ప్రమాదాలు వస్తాయట. బతుకుతానో లేదో తెలియదు ” అని ఆమెకి చెప్పేశాడు.

‘’ అయితే ఆ కుక్క ఎందుకు నీతో ? వదిలేయరాదా ? ” అని ఆమె అడిగింది.

” ఇంకా నయం ” అన్నాడు అతను.

ఆమె ” సరేలే . ఏమీ పర్వాలేదు. మనం విధిని ఎదిరిద్దాం. నిజమైన ప్రేమ దేన్నయినా గెలుస్తుంది ” అని ధైర్యం చెప్పింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

కొన్నాళ్ళ తర్వాత తండ్రికి జబ్బుగా ఉందని రాజకుమారుడికి వార్త అందింది. భార్యతో కలిసి ప్రయాణమయాడు. మధ్యలో ఒక నది ఒడ్డున బస చేశారు. ఒక రాత్రి వేళ రాజకుమారి లేచి చూస్తే వాళ్ళ గుడారం లో ఒక మూల చాలా పెద్ద పాము కనిపించింది. వెంటనే భర్త ప్రమాదాల గురించి గుర్తొచ్చింది. మెల్లిగా వెళ్ళి పెద్ద గిన్నె నిండా పాలు తీసుకొచ్చి పెట్టింది. అవన్నీ తాగేసి పాము మత్తుగా పడుకున్నప్పుడు సేవకులని పిలిచి దాన్ని దూరంగా పారేయించింది. జ్యోతిష్కు లను అడిగితే రాజకుమారుడికి పాము వల్ల రాగల  గండం తప్పిందని అన్నారు .

The-prince-of-egypt 2

వీళ్ళు వెనక్కి వెళ్ళిన కాసేపటికే రాజు మరణించాడు. రాజకుమారుడికి పట్టాభిషేకం చేశారు. ఒక రోజు కుక్క తో కలిసి అతను అడవిలో వేటకి వెళ్ళాడు. కాలికేదో తగిలి తట్టుకుని కిందపడ్డాడు. చూస్తే అదొక మొసలి. చిత్రంగా ఎక్కడినుంచో మాటలు వినిపించాయి- ” ఈ మొసలి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వెక్కడున్నా పట్టుకోగలదు. ఇసక లో పెద్ద గొయ్యి తవ్వి నీళ్ళు నింపి ఒక రోజంతా అందులో దాక్కుంటే మటుకే నీకు క్షేమం. రేపటివరకే గడువు ” .

అప్పటికెందుకో ఏమీ చేయకుండా మొసలి వెళ్ళిపోయింది.

ఇసక గోతిలో నీళ్ళు నింపటం ఎలా ? పీల్చేసుకుంటుంది కదా. రాజకుమారి ఆలోచించింది. దూరంగా ఉన్న ఎడారిలో నాలుగే ఆకులున్న మొక్క ఒకటి ఉందనీ అది నీళ్ళు ఇసకలో ఇంకిపోకుండా ఉంచగలదనీ ఆమె వినిఉంది. వెంటనే అక్కడికి తన తెల్లటి గాడిదను ఎక్కి బయలుదేరింది. ప్రయాణం చాలా శ్రమగా ఉండింది. ఇసక తుఫాను లు, వేడి, దాహం.ఆమె   గాడిదను జాగ్రత్తగా చూసుకుంటూ దానితో ప్రేమగా మాట్లాడుతూ చివరికి ఒక కొండ దగ్గరికి చేరింది. దాని నీడన చల్లగా ఉంది. నాలుగాకుల మొక్క కొండ శిఖరం మీద పెరుగుతోంది. కాని కొండ చుట్టూ లోతైన , వెడల్పైన అగడ్త , దాని నిండా నీళ్ళు. తనతో తెచ్చుకున్న తాడు ని ముడి వేసి రాజకుమారి బలంగా కొండ మీదికి విసిరింది. అదృష్టవశాత్తూ అది ఉచ్చుగా ఒక చెట్టుకొమ్మకి తగులుకుంది. దాని ఆధారంతో ఆమె పైకి పాకటం మొదలుపెట్టింది. అది అంత సులువైన పనేమీ కాదు. అయినా పట్టువదలకుండా నిబ్బరంగా చివరికంటా వెళ్ళి మొక్కని సంపాదించింది. హుటాహుటిన ఆమె తిరిగి వచ్చేసరికి రాజకుమారుడు ఇసకలో తవ్వించిన పెద్ద గోతిలో నిలుచుని ఉన్నాడు. కొద్ది దూరం లోనే మొసలి పళ్ళు బయట పెట్టి చూస్తూ ఉంది. ” నీళ్ళు నింపండి ” అని కేక పెట్టింది ఆమె. ఆ గోతిలోకి మొక్కని విసిరీంది. నీళ్ళు ఇంకిపోలేదు, నిలిచి ఉన్నాయి. ఆ రోజంతా అతనికి ధైర్యం చెబుతూ, ఆహారం ఇస్తూ రాజకుమారి భర్త పక్కనే ఉంది. ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. మొసలి చూసి చూసి కోపంగా నిరాశగా నదిలోకి వెళ్ళిపోయింది. జ్యోతిష్కులు ఈ గండం కూడా గడిచిందని చెప్పారు. రాజకుమారుడికి భార్యను పొగిడేందుకు ఎన్ని మాటలూ సరిపోలేదు. ఆమె దొరకటం తన పుణ్యమని అనుకున్నాడు.

prince of egypt 3

ఇంకొన్ని రోజులు గడిచాక కుక్కతో ఇద్దరూ ఆ నది ఒడ్డునే షికారుకి వెళ్ళారు. అడవి బాతునొకదాన్ని వెంటాడుతూ కుక్క అతని కాళ్ళ మధ్యలోంచి పరుగెత్తబోయింది. కాలు జారి   అతను కుక్కతో సహా అక్కడి ఊబిలోకి పడిపోయాడు. వేగంగా కూరుకుపోతున్నాడు. రాజకుమారి చప్పున అక్కడికి వచ్చి తన మీద వేసుకున్న బట్టను అందించింది. అతనూ కుక్కా బయటపడ్డారు.

ఇలా కుక్క వల్ల రాగల మూడో గండమూ గడిచింది.

అతను అన్నాడు ” నా విధి కన్న నీ ప్రేమ గొప్పది ” అని.

ఆమె ఆనందంగా అవునంది.

ఇద్దరూ చాలా కాలం పాటు సుఖంగా ఉన్నారు.

  • ఈజిప్షియన్ జానపద కథ

[   ఈ కథను కొంత మార్చి ‘ మూడుగండాలు ‘ పేరుతో 1971 లో కొడవటిగంటి కుటుంబ రావు గారు చందమామలో భేతాళకథగా వేశారు. వడ్డాది పాపయ్య గారు బొమ్మలు గీసిన కొద్ది కథలలో (ఆయన ముఖచిత్రాలు, ప్రత్యేక రచనలకు బొమ్మలు వేసేవారు ) ఇది ఒకటి. చందమామ లో ( కొన్నిసార్లు చెప్పి, కొన్నిసార్లు చెప్పకుండా ) ప్రపంచ జానపద సాహిత్యం లోని చాలా కథలు కొత్త రూపం తో వచ్చాయి. వాటిని తిరగరాసినదీ లోట్లు దిద్దినదీ కుటుంబరావు గారే. ఇంటర్ నెట్, గ్లోబలైజేషన్ లేని రోజులలో మద్రాస్ నగరం లోని ఏ లైబ్రరీలలో ఆ కథలన్నీ దొరికాయో ! ఏ మెప్పు కోసమూ ఎదురు చూడకుండా ఆ మహానుభావుడు బాల సాహిత్యానికి ఎంత చేశారు !!! ]

–మైథిలీ అబ్బరాజు

 

పెదాల తీరం మీద ఒక ముద్దు

 images92AXZ2FU

-రవీంద్రనాథ్ ఠాగూర్

రెండు జతల పెదవులు

ఒకదాని చెవిలో మరొకటి

గుసగుసలాడుతున్నట్టు

ఒకదాని హృదయాన్ని

మరొకటి జుర్రుకుంటున్నట్టు

స్వస్థలాల్ని వదిలి

తెలియని ఏ లోకాలకో

పయనం ప్రారంభించిన

రెండు ప్రేమలు

పెదాల కూడలిలో కలుసుకున్నట్టు

అనుబంధపు ఉధృతిలో

ఎగసిన రెండు కెరటాలు విరిగి పడి

పెదాల తీరం మీద కలుసుకున్నట్టు

ఆకలిగొన్న రెండు మోహాలు చిట్టచివరికి

దేహపు అంచున కలుసుకున్నట్టు

చిత్రలిపిలో లలిత శబ్దాలతో

పెదాల ముద్దుల పొరల మీద

ప్రేమ గీతం రచిస్తున్నట్టు

ఇంటికి తీసుకువెళ్లి దండ గుచ్చడానికి

ఆ రెండు జతల పెదాల నుంచి

ప్రేమ పుష్పాలను ఏరుకుంటున్నట్టు

వర్ణవిలాసాల శయ్య మీద

ఎంత మధురమీ కలయిక

 

ప్రస్తుతం ముద్దు మీద జరుగుతున్న చర్చనూ రచ్చనూ నిర్బంధాన్నీ సంప్రదాయం పేరుమీద మొరటుదనాన్నీ చూస్తుంటే నూటముప్పై సంవత్సరాల కింది ఈ కవితను పరిచయం చేయాలనిపించింది. 1886లో అచ్చయిన ఠాగోర్ కవితాసంకలనం కోరి ఒ కోమల్ లోని చుంబన్ అనే ఈ కవితకు కనీసం మూడు ఇంగ్లిష్ అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఒకటి బహుశా ఠాగూర్ స్వయంగా చేసుకున్నది కాగా, మిగిలినవి కుముద్ బిశ్వాస్, ఫక్రుల్ ఆలమ్ చేసినవి. ఈ అనుసృజనకు ఆధారం ఆ మూడు అనువాదాలు, అనుసృజనలు.

– ఎన్. వేణుగోపాల్

జీవ దృశ్యాలు … !

 

perugu ramakrishna

 

 

 

 

 

 

నాగరికతతెల్సినవాణ్నికనుక

నడిచే వెళ్తుంటాను …

ద్వేషంమీదనిర్మలత్వపుజెండానాటి

మనిషినిప్రేమించేదేవుడికినమస్కరించికదులుతుంటాను

విశ్వమానవనైతికబలాన్నివమనిప్రార్దిస్తూవుంటాను

సామ్రాజ్యవాదరాక్షసత్వానికిరాజకీయంతోముడిపడ్డాక

ఆధిపత్యపుయుద్దాలకోసంమనుష్యదేశాలన్నీకలసి

ఇనుపపాదాలకిందదరిద్రనారాయణుల్ని

నలియాలనేవ్యూహంతోవున్నపుడు

శవ సమూహాల మధ్య పడుతూ లేస్తూ నడుస్తుంటాను ..

కలతనిద్ర నుంచికన్నునుపెగలించి

కడగడానికిపరిశుద్దజలంకోసంవెతుక్కుంటూవుంటాను

గాయపడినబతుకులు

దగాపడిపోయినజీవితాలుఎదురైనప్పుడు

మట్టిమనుషులచరిత్రకుండలుపగిలిపోయాక

మనిషిస్వేదంతోనిండినవోయాస్సిసులముందునిల్చుని

వెన్నెముకవిరిగినవీరుడినై

ఈదుర్మార్గవ్యవస్థచుట్టూకాస్తంతప్రేమవిత్తనాలుచల్లుతాను

యోధులకుమరణంలేదని

రాజకీయప్రపంచపుగోడమీదనినాదమై

శిధిలాలనుంచేపునర్నిర్మానాన్నికలగంటాను

నాగరికతతెల్సినవాణ్ణికనుకనే

తరతరాలమానసికసంఘర్షణల్నిఅక్షరంచేసుకుని

నామానవజాతినిరక్షించమని

మరోకొత్తప్రవక్తనుఆహ్వానించడానికి

మానవ సుగంధపు వృక్షాన్ని కన్నీళ్ళతో బతికించు కుంటాను ..

పాడైపోయినప్రపంచాన్ని

ఇకనడిచిమార్చలేననితెలిసాక

ఈ ఆకృత్య ,అరాచక, అమానవీయ రాజకీయమే లేని నేలని

రహస్యంగా అన్వేషిస్తుంటాను ..

నాకుకలంపట్టడం

పిడికిలిబిగించడంతప్ప

పేదలపొట్టకొట్టడంనేర్పనేలేదుమాఅమ్మ

మనిషికోసంపిడికిలిబిగించి

బతికినంతకాలంఈవ్యవస్థమీదపోరాడుతూనేవుంటాను

నాగరికతతెల్సినవాణ్నికనుకనే

నటించడం చేతకాక ..

చైతన్యపుజెండానికాలంచేతికిచ్చి

మనిషినినిర్భయంగానడవమంటాను

పోరాడమంటాను …

దారితప్పినఈదౌర్భాగ్యపువ్యవస్థమీద

గెలుపుతీరంచేరేదాకా

వరుస బాణాలు వదులుతూనే వుంటాను …!!

            -పెరుగు రామకృష్ణ

పెద్రో పారమొ-8

( గత వారం తరువాయి )

వేడికి కాబోలు అర్థరాత్రికి కొంచెం ముందుగా మెలకువ వచ్చింది. ఆపైన చెమట ఒకటి. ఆమె శరీరమంతా మట్టితో చేసినట్టు, పొరలు పొరలుగా పొడవుతూ, బురదగా కరిగిపోతూ. ఆమె దేహాన్నుండి కాలవలు కడుతున్న చెమటలో ఈదుతున్నట్లు అనిపించింది. చాలినంత ఊపిరి అందడం లేదు. మంచం మీదినుంచి దిగాను. ఆమె నిద్రిస్తూంది. ఆమె నోటినుంచి చావు గిలక చపుడు బుడబుడమంటూ వస్తూంది.

గాలికోసం బయటికి వెళ్ళినప్పటికీ ఎటు వెళ్ళినా వెంటాడుతున్నట్టున్న వేడినుంచి తప్పించుకోలేకపోయాను.

గాలి ఆడటం లేదు. గడ్డకట్టిన రాత్రి చిత్తకార్తె రోజుల్లో మండిపోతూ.

ఒక్క శ్వాస లేదు.వదిలిన గాలినే పీల్చాలి అది తప్పించుకునేలోగా చేతులు కప్పులాగా చేసి అడ్డం పెట్టుకుని. లోపలికీ, బయటికీ. గాలి క్రమంగా తగ్గుతూండడం తెలుస్తూంది…పల్చబడి చివరికి నావేళ్ళమధ్యనుండి పూర్తిగా తప్పించుకుని పోయింది.

ఎప్పటికీ.

నాతలపై నురగల మబ్బుల్లాంటివి సుళ్ళు తిరుగుతూన్నట్టూ, నురుగులు నన్ను కడిగాక చిక్కటి మబ్బుల్లోకి కూరుకుపోతున్నట్టూ గుర్తుంది. అదీ చివరికి కనిపించింది.

నువ్వు నీళ్లల్లో మునిగిపోయినట్టు నన్ను నమ్మించాలని చూస్తున్నావా హువాన్ ప్రెసియాడో? పెద్ద బజారులో డోనిస్ ఇంటికి దూరంగా చూశాను నిన్ను. అతను కూడా నాతో ఉన్నాడు నువ్వు చనిపోయినట్టు నటిస్తున్నావని చెపుతూ. మేమిద్దరమూ నిన్ను ఆర్చీల నీడలోకి లాక్కెళ్ళాము. నువ్వప్పటికే భయంతో బిక్కచచ్చిన వాడిలా కట్టెలా బిర్రబిగిసి ఉన్నావు. నువ్వు చెప్తున్నట్టు ఆరాత్రి ఊపిరి పీల్చడానికి గాలి కూడా లేనట్లయితే నిన్ను పూడ్చిపెట్టడానికి కాదు, మోసుకుపోవడానికే శక్తి చాలేది కాదు మాకు. మరి చూశావుగా, పూడ్చిపెట్టామా లేదా?”

“నువ్వనేది నిజమే డొరోతియో! నీపేరు డొరోతియో అనేనా చెప్పావు?”

“తేడా ఏం పడదులే! నాపేరు డొరోతియా కానీ, తేడా ఏమీ పడదు.”

“నిజమే డొరోతియా! ఆ గొణుగుడికి చచ్చిపోయాననుకో!”

అక్కడ లోకంలో నేనన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన చోటు కనిపిస్తుంది. కలలు కనీ కనీ నేను చిక్కిపోయిన చోటు. మైదానాన్నుండి పైకి లేస్తూ నా ఊరు. జ్ఞాపకాల్తో నిండిన పిగ్గీ బేంక్ లాగా చెట్ల, ఆకుల నీడలు. అక్కడ ఒక మనిషి ఎందుకు కలకాలమూ జీవించాలనుకుంటాడో నీకే తెలుస్తుంది. ప్రత్యూషమూ, ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రీ: గాలిలో మార్పులు తప్పించి అలాగే ఉంటాయి ఎప్పుడూ. అక్కడ గాలిలో తేడా అన్నిటి రంగులూ మారుస్తుంది. జీవితం ఒక కాకలీధ్వనిలా మెత్తగా జారిపోతుందిజీవితపు స్వఛ్ఛమైన కాకలీధ్వని.

“అవును డొరోతియా, ఆ గొణుగుడుకి చచ్చిపోయాననుకో! నాభయాన్ని అదుపులో పెట్టుకోవాలనే చూశాను. కానీ లోపల్లోపల అది పెరిగిపోతూనే ఉంది. ఇక బిగపట్టుకోలేకపోయాను. ఆ గొణుగుడికి ఎదురు నిలిచేసరికి ఇక ఆనకట్ట బద్దలయింది.”

“నేను పెద్ద బజారుకు పోయాను. నువ్వు చెప్పింది నిజమే. జనాల సద్దు విని పోయాను. అక్కడ నిజంగానే జనాలు ఉన్నారనుకున్నాను. అప్పటికి నా బుద్ధి సరిగా పని చేయనట్లుంది. గోడల్ని తడుముకుంటూ చేతులతో నడుస్తున్నట్టు అక్కడికి చేరుకోవడం గుర్తుంది. ఆ గోడలు పగుళ్ళలోంచీ,చితికిపోతున్న సిమెంట్ లోంచీ గొంతుల్ని పీల్చుకున్నట్టు ఉన్నాయి. నేను విన్నాను. మనుషుల గొంతులు. చెవుల్లో రొద పెడుతున్నట్టు రహస్యపు గొంతులు ఏవో గుసగుసలాడుతున్నట్టు. గోడలనించి దూరంగా జరిగి వీధి మధ్యలో నడవసాగాను. అయినా ఇంకా వినిపించాయి. అవి నాతోటే వస్తున్నట్టు, నాముందో, కొద్దిగా వెనకో. నీకు చెప్పినట్టు అప్పుడింక వేడిగా లేదు. చల్లగా ఉంది. తన మంచం వాడుకోనిచ్చిన ఆమె ఇంటి దగ్గరనుంచి – నీకు చెప్పానే, ఆమె చెమటలో కరిగిపోయినట్టు – అప్పటినుంచీ నేను చల్లగా అయిపోయాను. దూరం వెళుతున్న కొద్దీ చలి పెరిగసాగింది. వొళ్ళంతా పులకలు. నాకు తిరిగి వెళ్ళాలనిపించింది. వెళితే నేను వదిలేసిన వేడి దొరుకుతుందనిపించింది. కానీ కొద్దిదూరం వెళ్ళాక అర్థమయిందేమిటంటే ఆ చలి నా వొంట్లోంచి, నా రక్తంలోంచే వస్తుందని. అప్పుడు తెలిసింది నేను భయపడుతున్నానని. పెద్దబజార్లో జనాల సవ్వడి విని అక్కడ జనమున్నారనీ భయాన్నుంచి తప్పించుకోవచ్చనీ అనుకున్నాను. అట్లా నీకు నేను పెద్దబజారులో కనిపించాను, అయితే డోనిస్ తిరిగి వచ్చాడా? అతను తిరిగి రాడని ఆమెకి గట్టి నమ్మకం.”

“నువ్వు కనపడేసరికి తెల్లవారింది. అతను ఎక్కడినుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను అడగలేదు.”

“సరే, పెద్దబజారు చేరుకున్నాను. ఆర్కేడ్ స్తంభానికి ఆనుకుని నిలుచున్నాను. అక్కడ ఎవరూ కనపడలేదు కానీ సంతనాడు జనాలు చేరితే వినిపించే రణగొణధ్వని వినిపిస్తూంది. ఆగకుండా మాటల్లేని చప్పుళ్ళు, చెట్టు కొమ్మల్లోంచి రాత్రిపూట గాలి వీచినట్టు. చెట్టూ కనపడదు, కొమ్మలూ కనపడవు కానీ గుసగుసలు వినిపిస్తాయే అట్లా. ఇంకో అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఆ గుసగుసలు దగ్గరికి వచ్చినట్టూ, తేనెటీగల రొద మల్లే నా చుట్టూ తిరుగుతున్నట్టూ అనిపించింది. చివరికి నాకు చప్పుడు లేని మాటలు వినిపించాయి “మా కోసం ప్రార్థించు!” అవే మాటలు నాకు వాళ్ళు చెపుతున్నవీ, నేను విన్నవీ. ఆక్షణంలో నా ఆత్మ గడ్డకట్టుకుపోయింది.అందుకే నీకు కనిపించినపుడు నేను చనిపోయి ఉన్నది.”

“ఇంటి దగ్గరే ఉంటే బాగుండేది కదా! ఇక్కడికెందుకు వచ్చావు?”

“నేను మొట్టమొదటే చెప్పాను. అందరూ మా నాన్న అని చెప్పే పేద్రో పారమొ ని వెతకడానికి వచ్చాను.ఆశే నన్ను లాక్కొచ్చింది ఇక్కడికి.”

“ఆశా? దానికి చాలా మూల్యం చెల్లించాలి నువ్వు. నా భ్రమలు నేను బతకవలసిన దానికంటే ఎక్కువకాలం బతికించాయి. నా కొడుకు కోసం నేను చెల్లించిన మూల్యం అదీ.అసలు ఒకరకంగా వాడు కూడా ఇంకో భ్రమ. ఎందుకంటే నాకు కొడుకనేవాడే లేడు. ఇప్పుడు చనిపోయాను కనక ఆలోచించడానికీ, అర్థం చేసుకోవడానికీ సమయం చిక్కింది. ఆ దేవుడు నాకు చిన్నగూడు కూడా ఇవ్వలేదు నా బిడ్డకి నీడనివ్వడానికి. కాళ్ళు ఈడ్చుకుంటూ దిక్కు తోచకుండా గడప గడపకీ తిరిగే అంతులేని జీవితమిచ్చాడు. వాళ్ళు దాచారా, వీళ్ళో.. వీళ్లు దాచారా నాబిడ్డను నాకు కాకుండా అని అనుమానంగా, ఏడుపు కళ్ళతో పక్క చూపులతో, ఎప్పుడూ మనుషుల్ని దాటి చూసుకుంటూ బతికాను. అసలిదంతా ఒక పాడు కల. తప్పు. రెండున్నాయి నాకు: అందులో ఒకదాన్ని మంచి కల అనీ రెండోది పాడు కల అనీ చెప్పుకుంటాను. మొదటిది నాకసలు కొడుకు ఉన్నట్టు కల కనేట్టు చేసింది. ఇక బతికి ఉన్నన్నాళ్ళూ అదే నిజమని నమ్ముతూ గడిపాను. నా వరాల తండ్రి బుల్లి నోటితో, కళ్లతో,చిట్టి చిట్టి చేతులతో నా చేతుల్లో ఉన్నట్టే అనిపించేది. చాలా చాలా కాలం దాకా వాడి కనురెప్పలూ, కొట్టుకునే గుండెకాయా నా చేతి వేళ్ళ చివరే ఉన్నట్టు అనిపించేది. అది నిజమని నేనెందుకనుకోను? నా పైశాలువాలోనే చుట్టుకుని నేనెక్కడికి వెళ్ళినా తీసుకు వెళ్ళేదాన్ని. ఒకరోజు వాణ్ణి పోగొట్టుకున్నాను. స్వర్గంలో వాళ్ళు పొరపాటు వాళ్ల వల్లే జరిగిందని చెప్పారు. నాకు గుండె తల్లిది ఇచ్చి కడుపు లంజది ఇచ్చారట. అది నా ఇంకో కల. నేను స్వర్గానికి వెళ్ళి అక్కడ దేవదూతల్లో నాకొడుకెవడో గుర్తుపట్టగలనేమోనని తొంగి చూశాను. లేదు. ఆ మొహాలన్నీ ఒకే మచ్చు లోంచి తీసినట్టు ఒకలాగే ఉన్నాయి. అప్పుడు నేను అడిగాను. ఆ సాధువుల్లో ఒకరు నావద్దకు వచ్చి మైనపు ముద్దలో దూర్చినట్టు నా కడుపులోకి చేయి పెట్టాడు. చేయి బయటికి తీసినప్పుడు కాయపై పెంకు లాంటిదేదో నాకు చూపించాడు. ‘నేను నీకు ప్రదర్శిస్తున్నదానికి ఇదే ఋజువు.’

“అక్కడ వాళ్ళెంత వింతగా మాట్లాడతారో తెలుసా? కానీ వాళ్ళు చెప్పేది నీకు అర్థమవుతుంది. అది నా కడుపేననీ, తినడానికి ఏమీ లేక ఆకలికి ఎండిపోయిందనీ వాళ్ళకు చెప్దామనుకున్నాను కానీ ఇంకో సాధువు వచ్చి నా భుజాలు పట్టుకుని వాకిలి వైపు నెట్టాడు. ‘వెళ్ళి భూమ్మీద కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో బిడ్డా! సన్మార్గంలో బతికితే ప్రాయశ్చిత్త స్థలంలో గడిపే సమయం తగ్గుతుంది.’

“అది నా ‘పీడ కల ’. నాకసలు కొడుకే లేడని తెలిసిన కల. అది నాకు బాగా ఆలస్యంగా తెలిసింది, నా వొళ్ళంతా ముడుచుకు పోయి నా వెన్నెముక పైకి పొడుచుకు వచ్చి నేనిక నడవలేనప్పుడు. ఆపైన అందరూ ఊరు వదిలి వేరే ఎక్కడికో వెళుతున్నారు. చావు కోసం ఎదురు చూస్తూ నేను కూచున్నాను. నువు కనిపించాక ఇక నా అస్థులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాయి. ‘నన్నెవరూ పట్టించుకోరు,’ అనుకున్నాను. ‘నేనెవర్నీ ఇబ్బంది పెట్టను.’ చూడూ, నేను ఈ నేల మీద ఇంత చోటు కూడా దొంగిలించలేదు. నన్ను నీతో పాటు సమాధి చేశారు, నేను నీ చేతుల మధ్య ఖాళీలో ఇమిడిపోయాను. ఇప్పుడు నేను ఈ కొద్ది చోటులో ఉన్నాను. ఒకటే విషయం ఏమిటంటే నా చేతులు నీ చుట్టూ వేసి ఉండవలసింది. వింటున్నావా? పైన వాన పడుతూంది. వాన దరువు వినపడటం లేదా?”

“ఎవరో నడుస్తున్నట్టుగావినిపిస్తుంది నాకు.”

“నువు బెదిరిపోవలసిన పని లేదు. ఇప్పుడు నిన్నెవరూ భయపెట్టలేరు. మంచి ఆలోచనలు రానివ్వు, మనం ఈ నేలలో చాలా కాలం ఉండబోతున్నాం.”

pedro_paramo1

తెల్లవారేసరికి భారీ వర్షం పడుతోంది నేల మీద. చాలులో మెత్తటి మట్టి పైన పడి మందంగా చప్పుడవుతూంది. వనభూషణ పక్షి పొలం మీద కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పిల్లవాడి మొరననుకరిస్తూ ఏడ్చింది, కొంత దూరం పోయాక అలుపుతో వెక్కి వెక్కి ఏడ్చినట్టు పాడింది, ఇంకా దూరంగా తెరిపి పడుతున్న దిగంతాలలో వెక్కిళ్ళు పెట్టి, మళ్ళీ నవ్వి, ఇంకోసారి ఏడ్చింది.

తాజా నేల పరిమళాన్ని పీల్చుకుని ఫుల్గర్ సెడనొ బయటికి చూశాడు వాన చాళ్ళను ఎంతవరకు తడుపుతుందోనని. అతని కళ్ళు సంతోషంగా మెరిశాయి. అతను మూడు గుక్కలు లోతుగా పీల్చాడు ఆ వాసనను ఆస్వాదిస్తూ. పళ్ళు బయటికి కనపడేట్టు నవ్వాడు.

“ఓహో! ఈ ఏడూ బాగా పండేట్టు ఉంది.” ఆగి మళ్ళీ అన్నాడు “పడవే వానా బాగా పడు. ఇంక కురవలేనంతగా కురువు. అప్పుడు వెళ్ళిపో. గుర్తు పెట్టుకో, ఈ నేలంతా నీ ఆనందం కోసమే దున్ని ఉంచాం.”

 

పైకే పెద్దగా నవ్వాడు.

పొలాలన్నీ సర్వే చేసి వచ్చిన వనభూషణ పక్షి అతని మీదుగా ఎగిరిపోయింది గుండెలవిసిపోయేలా రోదిస్తూ.

వాన ఎక్కువయింది. దూరంగా వెలుతురు వచ్చిన చోట తిరిగి మబ్బులు కమ్ముకున్నాయి. పోతున్నదనుకున్న చీకటి తిరిగి వస్తున్నట్టుంది.

మెదియా లూనా పెద్ద తలుపు కీచుమంటూ తెరుచుకుంది తేమ గాలికి తడిసి. ముందు ఇద్దరు, తర్వాత ఇద్దరు, ఆ వెనక మరో ఇద్దరు, అట్లా రెండువందలమంది గుర్రాల మీద స్వారీ చేస్తూ వానకి తడిసిన పొలాల మీద చెల్లాచెదరయ్యారు.

“మనం ఎన్మెడియో మందని ఎస్తగువా ఉండే చోటు దాటి తోలాలి. ఎస్తగువా పశువుల్నేమో విల్మయో కొండల్లోకి తరమాలి.” ఫుల్గోర్ సెడానో ఆజ్ఞాపించాడు ఒక్కొక్కళ్ళూ దాటి పోతూ ఉంటే. “కదలండి, వాన దంచి కొట్టేటట్టుంది.”

అతను ఎన్నిసార్లు చెప్పాడంటే చివర వెళ్ళే వాళ్ళకు “ఇక్కడినుండి అక్కడికి, అక్కడి నుండి ఇంకా పైకి,” అని మాత్రమే వినిపించింది.

వాళ్లలో ప్రతి ఒకడూ తనటోపీ అంచు తాకాడు అర్థమయిందని సూచిస్తూ.

చివరివాడు వెళ్ళాడో లేదో మిగెల్ పారమొ గుర్రం మీద వేగంగా వచ్చి కళ్ళెం బిగించి నిలపకుండానే దాదాపు ఫుల్గోర్ మొహమ్మీదికి దూకేశాడు. గుర్రం జీనుతో సహా కొట్టానికి పోయింది.

“ఈ వేళప్పుడు ఎక్కడికి పోయావబ్బాయ్!”

“కొంచెం పాలు పితుకుతున్నా.”

“ఎవరివి?”

“నీకు తెలియదా?”

“ఆ డొరోతియా క్వర్రకా అయి ఉండాలి. పిల్లలంటే ఆమెకే అంత ఇష్టం ఈ చుట్టుపక్కల.”

“నువ్వు వెధవ్వి ఫుల్గోర్. అయినా అది నీ తప్పు కాదులే!”

గుర్రపుసవారీ చేస్తున్నప్పుడు కాళ్లకు కట్టుకునే ముళ్ళచక్రాల్ని తీయకుండానే మిగెల్ తనకు నాస్తా పెట్టడానికి ఎవరయినా కనపడతారేమోనని చూస్తూ పోయాడు.

వంటగదిలో డామియానా సిస్నెరోస్ అదే ప్రశ్న అడిగింది అతనిని.

“ఎక్కడికెళ్ళావు మిగెల్?”

“ఆఁ ఇక్కడనే. చుట్టుపక్కల తల్లుల్ని పలకరించి..”

“నీకు చిరాకు పుట్టించాలని కాదు మిగెల్! గుడ్లు ఎట్లా కావాలి?”

“పక్కన ఏదన్నా స్పెషల్ తో వడ్డిస్తావా?”

“నేను సీరియస్ గా చెపుతున్నాను మిగెల్!”

” నాకు తెలుసు డామియనా. కంగారు పడకు. అది సరే కానీ నీకు డొరోతియా అనే ఆమె తెలుసా? అందరూ క్వర్రకా అని పిలుస్తారు.”

“తెలుసు. నీకు ఆమెని చూడాలనిపిస్తే ఇక్కడే ఆ బయటే కనపడుతుంది. రోజూ పొద్దున్నే లేచి నాస్తా కోసం ఇక్కడికే వస్తుంది. ఒక మూటని శాలువాలో కప్పుకుని పిల్లాడని చెప్పుకుంటూ పాటలు పాడేది ఆమే. ఏదో ఘోరం జరిగి ఉండాలి ఎప్పుడో. ఆమె ఎప్పుడూ మాట్లాడదు కనక ఎవరికీ తెలియదు అదేమిటో. ఎవరన్నా దయదల్చి ఇచ్చిన వాటి మీద బతుకుతుంది.”

“ఆ ఫుల్గోర్ గాడు.. దిమ్మతిరిగేట్టు బాదుతా!”

అతను కూర్చుని కాసేపు ఆలోచించాడు ఆమె తనకెలా ఉపయోగపడుతుందో. తర్వాత అణుమాత్రమైనా సంశయించకుండా వంటగది వెనక తలుపు దగ్గరకు వెళ్ళి డొరోతియాని పిలిచాడు.

“ఒకసారి ఇటురా. నీతో ఒక మాట చెప్పాలి.”

ఆమెకేం చెప్పి ఏం బేరం కుదుర్చుకున్నాడో ఎవరికీ తెలియదు. అతను లోపలికి వచ్చినప్పుడు మాత్రం చేతులు రుద్దుకుంటూ ఉన్నాడు.

“ఆ గుడ్లు తీసుకురా!” డామియానాకి కేకేసి చెప్పాడు. “ఇకనుంచీ ఆమెకి నాకు పెట్టే తిండే పెట్టు. నీకు పని ఎక్కువయితే అయింది. అది నాకనవసరం.”

ఈలోగా ఫుల్గోర్ సెడానో గాదెల్లో ఇంకా ఎంత ధాన్యం మిగిలిందో చూడటానికి పోయాడు. కోతలకింకా చాలా కాలం ఉంది కాబట్టి తగ్గిపోతున్న నిలవల గురించి ఆందోళన చెందాడు. అసలు పంటలు పూర్తిగా వేయనే లేదింకా. “ఎట్లా సర్దుకు పోవాలో చూడాలి.” మళ్ళీ పైకే అన్నాడు. “ఏం పిల్లాడు? అచ్చం వాళ్ళ నాన్నే. కానీ అప్పుడే మొదలుపెడుతున్నాడు. ఈ లెక్కన చూస్తే ఎన్నాళ్ళో నిలిచేట్టు లేడు. ఈయనికి చెప్పడం మరిచేపోయాను నిన్నొకడు వచ్చి ఇతనెవరినో చంపాడన్న విషయం చెప్పినట్టు. ఈ లెక్కన ..”

నిట్టూర్చి, ఈ పాటికి జీతగాళ్ళు ఎక్కడి దాకా పోయుంటారో ఊహించడానికి ప్రయత్నించాడు. కానీ చిక్కంతో దడిని రాస్తూ ఉన్న మిగెల్ గుర్రం అతని ఆలోచనల్ని భగ్నం చేసింది. “దాని జీనుని కూడా తీయలేదు.” అనుకున్నాడు. “తీయాలన్న ధ్యాసే లేదు. డాన్ పేద్రో ఇంకా నయం. ఆయన కాస్త స్థిమితంగా ఉండే సమయాలన్నా ఉంటాయి. కానీ మిగెల్ ఆటలన్నీ సాగనిస్తాడు. కొడుకేం చేశాడో నిన్న చెప్పినప్పుడు అతను ” అది నేను చేసినట్టే అనుకో ఫుల్గోర్! వాడు అట్లాంటి పని చేసి ఉండడు. ఒక మనిషిని చంపేంత దమ్ము లేదు వాడికి. దానికి ఇంత గుండె కావాలి.” అని ఒక పెద్ద గుమ్మడికాయను చూపిస్తున్నట్టు చేతులు ఎడంగా సాచాడు. “వాడేం చేసినా నాదీ పూచీ.”

“మిగెల్ నీకు తలనెప్పులు తెచ్చిపెడతాడు డాన్ పేద్రో. గొడవలకు ఎప్పుడూ ముందుంటాడు”

“కాస్త వదిలెయ్! ఇంకా పిల్లాడు. ఎన్నేళ్ళున్నాయి వాడికి. పదిహేడేగా వచ్చింది ఫుల్గోర్?”

“అంతే! నిన్న కాక మొన్నే తనని తీసుకు వచ్చినట్టుంది. నాకు గుర్తే. కానీ పట్టపగ్గాలు లేకుండా తిరుగుతున్నాడు. కాలంతో పందెం పెట్టుకున్నంత దూకుడుగా బతుకుతున్నాడు. ఎప్పుడో ఓడిపోక తప్పదు. చూస్తావుగా!”

“ఇంకా పసివాడే ఫుల్గోర్!”

“నువ్వు చెప్తే సరే డాన్ పేద్రో! కానీ తన భర్తని నీ కొడుకే చంపాడని నిన్న ఏడుస్తూ వచ్చిన ఆమెని ఆపలేకపోయాము. బాధను అంచనా వేయడం నాకు తెలుసు డాన్ పేద్రో, ఆమెది మామూలు దుఃఖం కాదు. ఈ విషయాన్ని వదిలెయ్యమని నూటా యాభై బస్తాల మొక్కజొన్నలు ఇస్తానని చెప్పినా ఒప్పుకోలేదు. ఎలాగో ఒకలా విషయాన్ని సరి చేస్తానని మాట ఇచ్చాను. అయినా తృప్తి చెందలేదు.”

“ఏమిటంట సంగతి?”

“ఏమో, అందులో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు.”

“అంత ఆందోళన చెందవలసిందేమీ లేదు ఫుల్గోర్! వీళ్లని లెక్క చేయాల్సిన పని లేదు.”

ఫుల్గోర్ గాదెల దగ్గరకు వెళ్ళాడు. మొక్కజొన్నల వేడి తెలుస్తూంది. గుప్పిట నిండా తీసుకుని పురుగేమన్నా పట్టిందేమోనని పరీక్షగా చూశాడు. ఎంత ఎత్తువరకు గింజలున్నాయో కొలిచాడు. “సరిపోతాయిలే. కొంచెం గడ్డి మొలకలేస్తే పశువులకి గింజలు తినిపించక్కర్లేదు. కాస్త ఎక్కువగానే ఉన్నట్టు లెక్క.”

వెనక్కి వెళుతున్నప్పుడు పైన మబ్బులు పట్టిన ఆకాశం వంక చూశాడు. “వాన చాలాసేపే పడేట్టుంది.” ఇక మిగతావన్నీ మరిచి పోయాడు.

పైన వాతావరణం మారుతున్నట్టుంది. వాన పడగానే కాంతీ, మొలకెత్తుతున్నవాటినుంచి పచ్చటి వాసనా అంతటా నిండుతాయని మా అమ్మ చెపుతుండేది. మబ్బులు అలలుగా ఎట్లా తేలుతూ వస్తాయో, ఎట్లా తమను తాము నేలమీదికి ఖాళీ చేసుకుని, దానికి రంగులన్నీ అద్ది మార్చేశాయో చెప్పేది. మా అమ్మ తన బాల్యమూ, యౌవన ప్రారంభకాలమూ ఈ ఊర్లోనే గడిపింది. కానీ తిరిగి చనిపోవడానికి కూడా రాలేకపోయింది. అందుకే తన స్థానంలో నన్ను పంపింది. వింతగా ఉంది డొరోతియా, నేను ఆకాశాన్నే చూడలేదు. కనీసం అది ఆమె ఎరిగిన ఆకాశం అయ్యుండేది”

“నాకు తెలియదు హువాన్ ప్రెసియాడో! తల ఎత్తకుండా ఇన్నేళ్ళు గడిపాక నేను ఆకాశం గురించే మరిచిపోయాను. పైకి చూసినా వొరిగేదేముంది? ఆకాశమేమో అంత ఎత్తున ఉంది. నాకళ్ళు మసకలు కమ్మాయి. నేల ఎక్కడుందో తెలిస్తే అదే సంతోషం. అదీ కాక ఫాదర్ రెంటెరియా నాకు దైవకృప అందదని చెప్పినప్పుడే ఆసక్తి చచ్చిపోయింది. కనీసం దూరాన్నుంచి చూడటానికయినా.. అంతా నా పాపాల వల్లనే. కానీ అది నాకు ఆయన చెప్పాలా? బతుకులో ఉన్న కష్టాలు చాలకనా? చచ్చాక ఈ కట్టె నుంచి పైకి తీసుకువెళతారన్న ఆశే ముందుకు నడవడానికి ఆధారం. కానీ వాళ్ళు నీకు ఒక తలుపు మూశాక తెరిచి ఉన్న ఒకే ఒక్క తలుపూ నరకానికే అని తెలిస్తే అసలు జన్మ ఎత్తకపోవడమే మంచిదనిపించదా? మా మటుకు మాకు ఇదే, ఇక్కడే స్వర్గం హువాన్ ప్రెసియాడో!”

“మరి నీ ఆత్మ? అదెక్కడికి పోయి ఉంటుందంటావు?”

“మిగతా వాటిలాగే తిరుగుతూ ఉందేమో తన కోసం ప్రార్థిస్తారని బతికినవాళ్ల కోసం వెతుక్కుంటూ. సరిగ్గా చూసుకోనందుకు నా మీద అసహ్యమేమో! కానీ దాని గురించి నేనిప్పిప్పుడు పట్టించుకోను. పశ్చాత్తాపం గురించి దాని రోదన నేను విననక్కరలేదు. దాని వల్ల తిన్నది కాస్తా నోట్లోనే చేదయ్యేది. పాపిష్టి వాళ్ళ పీడ తలపులతో రాత్రిళ్ళు వెంటాడేది. చద్దామని కూచుంటే లేచి ఎట్లాగో బతుకునీడ్చమని మొరపెట్టేది.అక్కడికి ఏదో మహత్యం జరిగి నా పాపాలన్నీ పరిశుభ్రమవుతాయేమోనని ఆశేమో దానికి. నేనసలు ప్రయత్నించను కూడా లేదు. ‘ఇక ముందుకు దారి లేదు,’ నేను దానికి చెప్పాను. ‘ఇంకా ముందుకు వెళ్ళేందుకు చాలినంత శక్తి నా వద్ద లేదు.’ అది పారిపోవడానికి నా నోరు తెరిచాను. అది వెళ్ళిపోయింది. దాన్ని నాగుండెకు బంధించిన నెత్తుటి పోగు నాచేతుల్లో పడ్డప్పుడే నాకు తెలిసిపోయింది.”

(సశేషం)

సూర్యుని పండుగే క్రిస్టమస్!

bull sacrifice of Mitras

శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది…

ఆయన ఓ సినిమా పాటలో ‘బతుకు బరువు’ అని కాబోలు, రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు చూసేవారికి తెలిసిన పేరే. బతుకు బరువు అనే మాట వినగానే ఆయన భారంగా నిట్టూర్చి, ‘బతుకు మా సెడ్డ బరువు’ అంటే ఇంకా బాగుంటుం దన్నారట. ఆ మాట శ్రీశ్రీకి నచ్చి అలాగే ఉపయోగించారు. దీనికి ఓ బరువైన ముగింపు కూడా ఉంది. ఆ మరునాడే చదలవాడ కన్నుమూశారు!

పాపం, ఆ సవరణ సూచించిన సమయంలో చదలవాడ గుండెల్లో ఎంత బతుకు భారం మోస్తున్నారో! మరునాడే ఆయన మరణానికీ, ఆ సవరణకూ ఎలాంటి ముడి ఉందో తెలియదు. తెలిసే అవకాశంలేదు.

నిజమే, బతుకు మా సెడ్డ బరువే. ఇంతకీ మనిషి చరిత్రలో బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పుడు మారిందని అడిగితే, కచ్చితంగా చెప్పడం కష్టమే. లేక, మొదటినుంచీ అంతేనా?! ప్రకృతిశక్తులతో పోరాడుతున్న సమయంలోనూ బతుకు మా సెడ్డ బరువుగా అనిపించే ఉంటుంది. అయితే, అప్పుడు మనిషి ప్రకృతిశక్తులతో సంఘటితంగా పోరాడి ఉంటాడు. మనిషికి మనిషి తోడన్న భరోసా బతుకు భారాన్ని ఎంతో కొంత తగ్గించి ఉంటుంది. కానీ మనిషి మనిషితోనే పోరాడవలసిన దశ వచ్చేసరికి ఆ భరోసా పలచబారి బతుకు మా సెడ్డ భారంగా మారిపోయిందా?!

మొత్తానికి ఇహలోకం నరకమై, బతుకు భారమైపోయింది. కనుక కాసింత సుఖ సంతోషాలనిచ్చే స్వర్గం కోసం పాకులాడక తప్పదు. అంతవరకు ప్రకృతిశక్తులపై దేవతారోపణ చేసి ప్రసన్నత కోసం ప్రార్థించి ఉండచ్చు. కానీ తోటి మనిషే క్రౌర్యం మూర్తీభవించి కాలయముడు అయినప్పుడు ఒక చల్లని దేవినో, కరుణామయుడైన ఓ దేవుణ్ణో మానవరూపమిచ్చి సృష్టించుకోవడం అనివార్యమవుతుంది.

అసలు ఈ బతుకనే మా సెడ్డ బరువే లేకపోతే ఎలా ఉంటుంది?! అప్పుడు కావలసింది జన్మరాహిత్యం, లేదా మోక్షం. పోనీలే, ఈ జన్మలో సుఖం లేకపోతే వచ్చే జన్మలోనైనా ఉండకపోతుందా? దాంతో పునర్జన్మ మీద ఆశ…

ఇది చదివి నేనేదో ఆస్తిక-నాస్తిక చర్చలోకి వెడుతున్నానని దయచేసి అనుకోవద్దు. చరిత్రలోకి వెడితే, బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పటినుంచీ అయిందో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని నా తాపత్రయం.

   ***

ఈ బతుకు బరువవడం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో విధంగా అయుండచ్చు. మనం రోమన్ సామ్రాజ్యం గురించి చెప్పుకుంటున్నాం కనుక అప్పుడు ఏం జరిగిందో చూద్దాం.

క్రీస్తుశకం మొదటి రెండు శతాబ్దాలకు వచ్చేసరికి రోమన్ సామ్రాజ్యంలో మనిషి ఆత్మ సంక్షుభితం అయిపోయిందనీ, అంతులేని బాధా, నిస్పృహలలోకి జారిపోయిందనీ హెచ్.జి. వెల్స్ అంటారు. నిర్బంధమూ, క్రౌర్యమూ స్వైరవిహారం చేస్తూవచ్చాయి. గర్వించడానికీ, వైభవప్రదర్శనకూ లోటు లేదు. కానీ గౌరవప్రదమైన జీవితం, ప్రశాంతత, నిలకడైన సుఖసంతోషాలు లోపించాయి. పేదలు తిరస్కృతికి, అవమానానికి, దుర్భరమైన పీడనకు గురయ్యేవారు. అలాగని సంపన్నులు సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. నిరంతర అభద్రతలోనూ, ఎంతకూ తీరని కోరికల దాహంతోనూ అలమటించేవారు. రోమ్ నగరాలలో అర్థచంద్రాకారంలో రంగస్థలాలు ఉండేవి. అవే పౌరజీవితానికి కేంద్రంగానూ, కీలకంగానూ ఉండేవి. అక్కడ మనుషులకు, పశువులకు ప్రాణాంతకమైన పోరు జరుగుతూ ఉండేది. ఆ పోరులో వారు/అవి పడే చిత్రహింసలోనూ, అప్పుడు మడుగులు కట్టే ఎర్రని రక్తంలోనూ, పోరాడి పోరాడి నేల కొరిగే ఆ దురదృష్ట జీవుల్లోనూ వికృతానందాన్ని వెతుక్కునేవారు. కానీ అంతరాంతరాలలో అందరిలోనూ ఒక అశాంతి గూడుకట్టుకుని ఉండేది. అది మతరూపంలో వ్యక్తమవుతూ ఉండేది.

ప్రతి మతంలోనూ క్రమంగా ఆత్మ గురించిన భావన ఏర్పడుతూ వచ్చింది. మరోపక్క తర్కానికి అందని, చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో బహుదేవతారాధన సాగుతూనే ఉంది. మతంలో ఓదార్పును వెతుక్కునే ప్రయత్నంలో ఈజిప్షియన్లలో అమరత్వంపై కోరిక బలంగా వ్యక్త మవడం ప్రారంభించింది. అంతవరకు ఏ మతంలోనూ లేని అమరత్వ భావనను ప్రపంచానికి పరిచయం చేసింది ఈజిప్షియన్ మతమేనని వెల్స్ అంటారు. ఈజిప్టు విదేశీ దురాక్రమణలకు గురవుతూ, ఈజిప్టు దేవతలు రాజకీయ ప్రాముఖ్యాన్ని కోల్పోతున్న కొద్దీ, అమరత్వంలో ఓదార్పును వెతుక్కోవడం ఈజిప్షియన్లలో బలీయమవుతూ వచ్చిందని ఆయన అంటారు.

విదేశీ దురాక్రమణలు మన దేశం మీదా జరిగాయి కనుక, ఒకవైపు బహుదేవతారాధన, ఇంకోవైపు ఆత్మ, అమరత్వం గురించిన ఆలోచనలతో ఈజిప్షియన్ అనుభవం మన దగ్గరా ప్రతిబింబించి ఉండచ్చు. ఈ సందర్భంలో వెల్స్ మన దేశం గురించి ప్రస్తావిస్తూ, బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచే ఈ దేశంలోని ఆడా, మగా జీవితానందాలను త్యాగం చేసేవారనీ, వివాహబంధాన్ని, సంపదను నిరసించేవారనీ, ఇహ లోకపు ఒత్తిడులు, సమస్యలనుంచి తప్పించుకుంటూ ఆధ్యాత్మిక శక్తుల కోసం పాకులాడేవారనీ, ఆ ప్రయత్నంలో శరీరాన్ని హింసించుకునే వారనీ, ఏకాంత జీవితానికి మొగ్గు చూపేవారనీ ఆయన అంటారు. గ్రీకులలో కూడా ఇలాంటి ఆత్మహింసా పద్ధతులనే అనుసరించే పంథాలు ఉండేవి. ఆ పంథాలవారు శరీర అవయవాలను నరుక్కునే వరకూ వెళ్ళేవారు. మన దగ్గర కూడా మధ్యయుగాలలో వీరశైవం మొదలైన పంథాలలో ఇటువంటి పద్ధతులు ప్రబలంగా ఉండేవి. జుడియా, అలెగ్జాండ్రియాలలోని యూదు తెగల్లో కూడా ఇహలోక జీవితం మీద తీవ్ర వైముఖ్యం ఉండేది. క్రీస్తు శకం తొలి రెండు శతాబ్దాలలో ఈ ధోరణి ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రతి ఒకరూ మోక్షం గురించిన అన్వేషణలో తలమునకలయ్యేవారు. ఆ కాలపు పరిస్థితుల వల్ల కలిగిన నిరాశా, నిస్పృహలే అందుకు కారణమని వెల్స్ అంటారు. అంతకు ముందు దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన ఒక సమష్టి మతవ్యవస్థ ఉండేది. దేవాలయం పట్ల, పూజారి పట్ల జనంలో అచంచలమైన భక్తివిశ్వాసాలు ఉండేవి. నియమనిబంధనలపై, మతపరమైన తంతుపై పట్టింపు ఉండేది. ఈ కాలానికి వచ్చేసరికి అవి అంతరించాయి. దుర్భరమైన బానిసత్వం. క్రౌర్యం, భయాందోళనలు, ఆత్మన్యూనత, స్వార్థం, అట్టహాసం పడగవిప్పిన నాటి వాతావరణంలో ప్రతి ఒకరూ విరక్తికీ, అభద్రతకూ లోనయ్యేవారు. జీవితం పట్ల నిరాసక్తత, నిస్పృహలలోనే శాంతిని వెతుక్కునే వారు.

ఈజిప్టులో టొలెమీ చక్రవర్తి నిర్మింపజేసిన సెరాపియమ్ లో పీడితులు, తాడితుల కన్నీళ్లు వరదలు కట్టేవి…

   ***

రోమ్ సామ్రాజ్యం విస్తరించిన కొద్దీ ఈ సెరాపిస్-ఐసిస్ ఆరాధనా రూపం పశ్చిమ యూరప్ కు కూడా వ్యాపించింది. సెరాపిస్-ఐసిస్ ఆలయాలు, పూజారి వ్యవస్థ, అమరత్వం గురించిన ఆకాంక్షలు స్కాట్లాండ్, హాలండ్ ల దాకా వెళ్ళాయి. అయితే దీనితో పోటీపడే మతాలూ చాలానే ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది మిత్రాయిజం. ఇది పర్షియన్ల మతం. సంస్కృతంలో మిత్రు డంటే సూర్యుడని చెప్పుకున్నాం. బ్రాహ్మణులలో సంధ్యావందనం సూర్యుని ఉద్దేశించినదే. సంధ్యావందన మంత్రాలలో మిత్ర శబ్దం వస్తుంది. బ్రాహ్మణులలో, బహుశా క్షత్రియులలో కూడా మిత్రావరుణులు ఋషులుగా ఉన్న గోత్రాలవారు ఉన్నారు. క్షత్రియులలో సూర్యవంశ క్షత్రియులున్న సంగతి తెలిసినదే. పురాచరిత్ర కాలంలో సిరియాను మితానీ అనే తెగవారు పరిపాలించారు. వీరు మిత్ర సంబంధీకులే. ఒకనాటి అమెరికాతో సహా ప్రపంచమంతటా సుర్యారాధన ఉండేది. ఇంకా విశేషమేమిటంటే, డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్టమస్ కు, సుర్యారాధనకు సంబంధం ఉంది. అసలు డిసెంబర్ 25 సూర్యుడికి సంబంధించిన రోజు. సుర్యారాధకులను, అంటే మిత్రమతం వారిని క్రైస్తవులుగా మార్చే ప్రయత్నంలో వారికి ముఖ్యమైన రోజునే క్రిస్టమస్ గా మార్చారు. అంటే క్రైస్తవ మతంలో కూడా తనకు ముందున్న వివిధ ఆరాధనా పద్ధతులను తనలో కలుపుకునే థియోక్రేసియా జరిగిందన్నమాట. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశంలోకి ఇప్పుడు వెళ్ళలేం.

మిత్రమతం సెరాపిస్-ఐసిస్ ఆరాధనలా సంక్లిష్టమైన, అధునాతనమైన (అప్పటికి) ఆరాధనా విధానం కాదు. ఇది జంతుబలుల కాలానికి చెందిన మతం. ఈ మతం వారు ఒక మంచె మీద ఎద్దును ఉంచి డానిని బలి ఇచ్చేవారు. భక్తులు ఆ మంచె కింద నిలబడి ఆ ఎద్దు నుంచి ప్రవహించే రక్తంలో తడిసేవారు. ఈ రక్తం నుంచి కొత్త జీవితం పుట్టుకొస్తుందని నమ్మేవారు.

పై రెండే కాక మరెన్నో ఆరాధనా పంథాలు ఉండేవి. మన దేశంలో ఇప్పటికీ వివిధ కులాలవారికి, లేదా వేర్వేరు సామాజిక స్థాయులకు చెందినవారికి తమవైన ఆరాధనాపద్ధతులు, దేవీదేవతామూర్తులు ఉన్నట్టే, బానిసలతో సహా రోమన్ సామ్రాజ్యంలోని జనాలకూ ఉండేవి. రోమన్ నగరాలు అన్నింటిలోనూ అందరు దేవతలకు లెక్కకు మించిన ఆలయాలు ఉండేవి. అవిగాక రోమన్ల ప్రధానదైవమైన జూపిటర్ ఆలయం తప్పనిసరిగా ఉండేది. మరోవైపు రాజకీయ విధేయతను చాటుకోడానికి మొక్కుబడిగానైనా సీజర్ అలయానికీ వెళ్ళేవారు. అయితే, తమను ఈతిబాధలనుంచి కాపాడగలిగిన దయగల తల్లిగా ఐసిస్ నే నమ్ముకునేవారు.

ఆపైన మరెందరో స్థానిక దేవతలు ఉండేవారు. కొందరు దేవతల రూపాలు చిత్రవిచిత్రంగానూ ఉండేవి. ఉదాహరణకు సెవిల్లే అనే దేవత. ఫొనీషియన్లు కార్తేజ్ నగరంలో చాలాకాలంగా పూజిస్తూ వచ్చిన వీనస్ కు, ఈ దేవతకు సంబంధం ఉంది. మరోవైపు ఒక గుహలోనో, భూగర్భ ఆలయంలోనో మిత్రుని ఆరాధన జరుగుతూనే ఉండేది. ఇందులో సైనికులు, బానిసలు పాల్గొంటూ ఉండేవారు. మరోచోట యూదులు తమ ప్రార్థనామందిరంలో బైబిల్ చదువుకునే వారు. యూదుల దేవుడు అదృశ్యంగా ఉంటాడు. వారు విగ్రహారాధనకు విముఖులు. బహుశా వారు సీజర్ ఆలయానికి వెళ్ళి మొక్కడానికి, అక్కడ జరిగే పూజా తంతులో పాల్గొనడానికి వ్యతిరేకించి ఉంటారు. అలాగే, రోమన్ పాలకులు ఆదరించే ఇతర దేవుళ్ళను కూడా! అది వారికి రాజకీయంగా చిక్కులు తెచ్చిపెట్టే ఉంటుంది.

ఇంతకీ ఈ వివరాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టే బహురూప ఆస్తికత క్రీస్తుశకానికి ముందూ, ఆ తర్వాత మరికొంతకాలమూ రోమన్ సామ్రాజ్యంలోనూ ఉండేదని చెప్పడానికే. రోమన్ సామ్రాజ్యంలోనే కాదు, దాదాపు ప్రపంచమంతటా ఉండేది. ఈ సందర్భంలోనే మతరంగంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పునూ గుర్తుచేసుకోవాలి. అదేమిటంటే, పైన చెప్పుకున్న వాటిలో అనేకం ఇష్టదేవతారాధనలు. వ్యక్తిగత ముక్తిని లేదా బాధలనుంచి విముక్తిని కోరే ప్రైవేట్ ఆరాధనలు. అంతకు ముందున్న మతరూపం ఇలాంటిది కాదు. అది వ్యక్తిగతం కాక, సామూహికం, సాంఘికం. అది పారలౌకికం-లౌకికం, లేదా మతం- ప్రభుత్వం అన్న విభజన లేని దశ. ఉదాహరణకు నగర దేవతారాధన ప్రధానంగా రాజ్యానికి సంబంధించిన తంతు. ఆ తర్వాతే వ్యక్తిగతమైన తంతు. అప్పట్లో బలులు, పూజలు సామూహిక, బహిరంగ చర్యలే కానీ ప్రైవేట్ చర్యలు కావు. పైగా అవి సమష్టి భౌతిక అవసరాల కోసం జరిపే చర్యలు.

ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేసుకోవాలి. మతమూ, రాజకీయమూ ఇలా గాఢంగా పెనవేసుకున్న స్థితిలో రెండింటినీ విడదీయడానికి; అంటే రాజకీయం నుంచి మతాన్ని తప్పించడానికి మొదట ప్రయత్నించింది గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు. విశేషమేమిటంటే, రెండువేల సంవత్సరాల క్రితమే మతాన్నీ, రాజకీయాన్నీ విడదీయాలన్న ఆలోచన జరిగినా, ఇప్పటికీ దాని సాధ్యాసాధ్యాల గురించీ, దాని అవసరం గురించీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం! కనీసం మనదేశానికి పరిమితమై చూసినా ఈ విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత ఏర్పడలేదు. ఇంకోటి గమనించాలి. గ్రీకులు గానీ, రోమన్లు గానీ మతాన్నీ, రాజకీయాన్ని విడదీయాలని అనుకోడానికి కారణం- నాటి బహురూప ఆస్తిక ధోరణులే. ఈ పరిస్థితిలో ప్రభుత్వం, లేదా రాజ్యం ఏదో ఒక మతం వైపు అతిగా మొగ్గడం కందిరీగల తుట్టను కదపడమే నని వారు గ్రహించి ఉంటారు.

మొత్తానికి మతరంగంలో ఎన్ని మార్పులు జరిగినా అవన్నీ బహురూప ఆస్తికత అన్న చట్రంలోనే! ఆ చట్రం చెక్కు చెదరలేదు. కానీ ముందు ముందు ఆ చట్రం మీదే దెబ్బ పడబోతోంది. రాజకీయం నుంచి మతాన్ని వేరు చేయడానికి చూసిన రోమన్ పాలకులే క్రమంగా ఒకే ఒక అధికారికమతం వైపు అడుగు వేయబోతున్నారు. క్రౌర్యం, దౌర్జన్యం, పీడన, కన్నీళ్లు నిండిన నాటి పరిస్థితులలో; ఇంత శాంతి కోసం, కారుణ్యం కోసం సామాన్యజనం పరితపించడంలో ఆశ్చర్యంలేదు. పరోక్షంగా పాలకులను కూడా ఆ వాతావరణం ప్రభావితం చేయడంలోనూ ఆశ్చర్యంలేదు. దానికితోడు, అప్పటికి ఎంతో కాలంగానే ధర్మం, నీతి, కరుణ నిండిన ఒకే దేవుడి గురించిన భావనను యూదులు ప్రచారం చేస్తున్నారు. చివరికి అలాంటి దేవుడిలో శాంతిని వెతుక్కోడానికి నాటి పరిస్థితులు రోమ్ ప్రజానీకాన్ని మానసికంగా సిద్ధం చేశాయి.

మనం ఇప్పుడిక జీసస్ దగ్గరికి వస్తున్నాం!

     ***

తొలి రోమన్ చక్రవర్తి ఆగస్టస్ సీజర్ కాలంలో జీసస్ జుడియాలో జన్మించాడు. ఆయన గురించిన మొత్తం చరిత్రలోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు. కాకపోతే క్రైస్తవ సిద్ధాంతానికి ఒక రూపమిచ్చిన సెయింట్ పాల్ గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన అసలు పేరు సౌల్. ఆయన ఎన్నడూ జీసస్ ను చూడలేదు. పైగా మొదట్లో జీసస్ బోధలను వ్యతిరేకించాడు. జీసస్ ను శిలువ వేసిన తర్వాత స్వల్ప సంఖ్యలో ఉన్న ఆయన అనుచరబృందాన్ని హింసించడంలో ప్రముఖపాత్ర వహించాడు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా క్రైస్తవంలోకి మారి, తన పేరును పాల్ గా మార్చుకున్నాడు. ఆయన మంచి జిజ్ఞాసి అనీ, మేధావి అనీ, తన కాలం నాటి మతధోరణులను ఎంతో ఆసక్తిగా, లోతుగా ఆకళించుకున్నవాడనీ చెబుతారు. యూదుమతాన్ని, మిత్రమతాన్ని, అలెగ్జాండ్రియాలోని నాటి ఇతర మతాలను బాగా అధ్యయనం చేశాడు. వాటిలోని అనేక అంశాలను క్రైస్తవంలోకి తీసుకొచ్చాడు. ఉదాహరణకు, ఈజిప్టు దేవుడు ఓసిరిస్. ఈయన చావు-పుట్టుకల చక్రానికి ప్రతీక అని చెప్పుకున్నాం. సెయింట్ పాల్ జీసస్ కు ఓసిరిస్ తో సామ్యం చూపించి ఓసిరిస్ అనుయాయులను క్రైస్తవం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. జీసస్ కు కూడా పునరుత్థానాన్ని, అంటే చావు-పుట్టుకల చక్రాన్ని ఆపాదించాడు. అలాగే సూర్యారాధకులను క్రైస్తవం వైపు ఎలా ఆకర్షించారో పైన చెప్పుకున్నాం.

రోమన్ పాలకులు అనేకులు మొదట్లో క్రైస్తవాన్ని అంగీకరించలేదు. అణచివేయడానికి ప్రయత్నించారు. క్రీ. శ. 303 లో, డయోక్లెటియన్ చక్రవర్తి కాలంలో చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బైబిల్ రాతప్రతులను జప్తు చేసి ధ్వంసం చేశారు. క్రైస్తవులకు చట్ట రక్షణను తొలగించారు అనేకమందిని చంపేశారు. పుస్తకాలను ధ్వంసం చేయడం ఇక్కడ ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవలసిన విషయమని హెచ్. జి, వెల్స్ అంటారు. అక్షరానికి ఉన్న శక్తి ఆ కొత్త మతాన్ని సంఘటితంగా ఉంచుతోందని నాటి పాలకులు గ్రహించారు. క్రైస్తవం, జుడాయిజం అనే ఈ ‘పుస్తక మతాలు’ జనాన్ని విద్యావంతుల్ని చేసిన మతాలని కూడా వెల్స్ అంటారు. చదివి, అర్థం చేసుకోగలిగినవారివల్లే ఇవి అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. ఇక్కడే వెల్స్ ఇంకో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. పురాతన మతాలు ఏవీ ఈ రెండు మతాల్లా మనిషి బుద్ధికీ, మేధకు పని కల్పించే ప్రయత్నం చేయలేదు. అంటే పురాతన మతాల దగ్గరికి వచ్చేసరికి మనం బుద్ధిని, మేధను పక్కన పెట్టేయాలి.

క్రైస్తవాన్ని తుడిచిపెట్టడానికి డయోక్లెటియన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనేక ప్రాంతాలలో సాధారణ ప్రజలే కాక, అధికారులు కూడా క్రైస్తవంలోకి మారిపోయారు. క్రీ.శ. 317లో, అప్పటి గలేరియస్ చక్రవర్తి క్రైస్తవం పట్ల సహనం పాటించాలని ఉత్తర్వు జారీ చేశాడు. క్రీ.శ. 324లో కాన్ స్టాన్ టైన్ చక్రవర్తి మరణశయ్య మీద ఉండి బాప్టిజమ్ తీసుకుని క్రైస్తవంలోకి మారాడు. తన సైనిక ఫలకాల మీదా, జెండాల మీదా క్రైస్తవ చిహ్నాలు ఉండేలా ఆదేశించాడు.

ఆ తర్వాతే కొన్నేళ్లకే క్రైస్తవం రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతం అయిపోయింది. అంతవరకూ దానితో పోటీ పడిన పురాతన మతాలు అన్నీ అదృశ్యమైపోయాయి. లేదా క్రైస్తవంలో కలిసిపోయాయి. క్రీ.శ. 390లో థియోడోసియస్ చక్రవర్తి అలెగ్జాండ్రియాలోని బ్రహ్మాండమైన జూపిటర్ సెరాపిస్ విగ్రహాన్ని నేలమట్టం చేయించాడు. 5వ శతాబ్దినుంచి రోమన్ సామ్రాజ్యంలో అంతటా క్రైస్తవ ప్రార్థనా మందిరాలూ, క్రైస్తవ పూజారులే!

చక్రవర్తి నేలమట్టం చేయించిన జూపిటర్ సెరాపిస్ విగ్రహం, నిజానికి నేలమట్టమైన బహురూప ఆస్తికతకు ప్రతీక మాత్రమే. ఇలా ఏకరూప ఆస్తికతలోకి అడుగుపెట్టిన రోమ్, ఈ విషయంలో ప్రపంచానికే అతి పెద్ద వరవడి అయింది. అప్పటికీ బహురూప ఆస్తిక పంథాలను అనుసరిస్తూనే ఉన్నవారిని వెతికి వెతికి మరీ పట్టుకుని వారిపై మంత్రగాళ్ళు లేదా మంత్రగత్తెలన్న ముద్ర వేసి చంపుతూ వచ్చారు. అది నిఘంటువుకు witch-hunt అనే మాటను అందించింది.

మిగతా విశేషాలు తర్వాత….

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)–కల్లూరి భాస్కరం

 

 

 

 

విలువల గురించిన సంవాదం – కారా ‘స్నేహం’ కత

karalogo

నిర్వహణ : రమాసుందరి బత్తుల

కారా మాస్టారి ‘స్నేహం’ కత చదవగానే మనుషుల మధ్య ఉండే సంబంధాలు, మ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన ఆలోచనలు నన్ను అలుముకున్నాయి. ఒక
మనిషి తనను నమ్మి సహాయార్ధిగా వచ్చినపుడు ఎవరైనా అతని పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారు?  తమ మధ్య అప్పటికే ఉన్న స్నేహాన్ని ఎలా వ్యాఖ్యానించుకుంటారు? వీటన్నింటి వెనుక ఉన్న విలువల చట్రం మనుషులను ఎలాంటి అనుభూతులకూ, అనుభవాలకూ గురి చేస్తుందీ అన్న ఆలోచనలు నన్ను నిలువనీయలేదు. ఈ ఆలోచనల వలయం నన్ను భావజాలానికి సంబంధించిన విషయాలలోనికి పడదోసింది.

భావజాలం ఎలా ఉనికిలోనికి వస్తుంది? దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది? మానవ సంబంధాలను అది ఎలా ప్రభావితం చేస్తుందీ అన్నవి ఆసక్తికరమైనప్రశ్నలు. పరస్పర వైరధ్యాలు, విభిన్నత కలిగిన సమాజాలలో అనేక భావజాలాలు ఒకే సమయంలో ఉనికిలో ఉండడమే కాకుండా పరస్పరం పోటీ పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. భావజాలం ఉనికిలోకి రావడానికీ, అది మిగిలిన వాటి కన్నా  ప్రబలంగా  మారడానికీ మనిషి అవసరాలే ప్రాతిపదిక.  తన అవసరాలకు ఆటంకంగా మారిన పాత    ఆలోచనలను, విధానాలను అడ్డు తొలగించుకోవడానికి మనిషి సంకోచించడు. నిరంతరమూ  మారుతూ ఉండే మనిషి అవసరాల మాదిరిగానే భావజాల ఉనికి, వాటి ప్రభావాలూ  సాపేక్షికాలు. సమాజంలోని వివిధ వర్గాల, అస్తిత్వాల ప్రయోజనాలు పరస్పరం సంఘర్షిస్తూ ఉన్నప్పుడు, వాటి ఘర్షణ భావజాలాల నడుమ ఘర్షణగా వ్యక్తమవుతూ  ఉంటుంది. వీటిని మనం విలువలు, విశ్వాసాలు, సంబంధాలు, విధానాల తాలూకు  ప్రశ్నలుగా, సంవాదాలుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక సంవాదమే కారా ‘స్నేహం’.

అరవై తొమ్మిదుల్లో రాసిన ఈ కత, విషయరీత్యా చాలా చిన్నదే అయినప్పటికీ, ఈ  కాలపు తన ఇతర కతల్లాగానే అనేక అంశాలను పాఠకుల ముందుకు తెస్తుంది. ఈ కతను
పై నుంచి చూసినపుడు, నమ్మి వచ్చిన స్నేహితుడిని మోసం చేసిన కతగా  కనపడుతుంది. స్నేహానికి ఉన్న పాత అర్థాన్ని చెరిపేసి, ఒక కొత్త అర్థాన్ని  ప్రతిపాదిస్తున్న కతగా కనిపిస్తుంది. అయితే ఇది వీటికి మాత్రమే పరిమితమైన  కత కాదు. వీటిని కేంద్రంగా చేసుకొని మరింత లోతుల్లోకి తరచి చూసిన కత.

స్నేహానికి విలువనియ్యాలనీ, ఆపన్నుడై వచ్చిన సహాయార్ధికి తప్పనిసరిగా,  శ్రమకోర్చి అయినా సహాయం చేసి పెట్టాలనే విలువకు, జీవితం వైకుంఠపాళీ  కాబట్టీ – తన విలాసాలకు, తన అవసరాలకూ, తను మరింత ‘పైకెగబాకడా’నికీ వచ్చిన  అవకాశాన్ని ఏమాత్రమూ వెనకాడకూడదూ  అనే విలువకూ నడుమ జరిగే ఘర్షణను దాని  రక్త మాంసాలతో సహా అనుభవంలోకి తెచ్చే కత . ఈ ఘర్షణలో మనుషులలో ఏర్పడే  సంవేదనలను సెస్మోగ్రాఫుపై లెక్కించి చూపిన కత. కొత్త విలువలూ, కొత్త  విశ్వాసాలూ- పాత విలువలనీ, పాత విశ్వాసాలనూ ధ్వంసించి, ఆసాంతమూ  ముప్పిరిగొని తమ ఉనికికి మనుషుల చేతననే పతాకగా ఎగరేస్తూ తమను తాము  వ్యక్తం చేసుకొనే కత .

ఈ కతను చదవడం మొదలు పెట్టగానే పాఠకుడికి అర్థం అయ్యే  అంశాలు డాక్టరు  వేణుగోపాలరావు ఆతృత, అవసరం. రాజారావుతో అతనికి గల స్నేహం. వీటికి గల నేపథ్యం, ప్రాతిపదిక అతని చిన్ననాటి  స్నేహితుడు శివయ్య వచ్చాక గానీ  పాఠకుడి అవగాహనలోకి రావు. వేణుగోపాలరావు ఎదిగి వచ్చిన సమాజం ఎలాంటిది?

ఇప్పడు తను ఉన్న పరిస్థితులకూ, గతానికీ ఉన్న తేడా ఏమిటీ? తనను చదివించి, పిల్లనిచ్చిన మామతో, కట్టుకున్న భార్యతో అతని సంబంధాలు ఎలాంటివన్న విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళ సంభాషణలో బయటికి వస్తాయి. శివయ్యకూ, వేణూగోపాలరావుకూ ఉన్న స్నేహం గురించి కూడా అప్పుడే తెలుస్తుంది. అయితే వీటన్నింటికీ రచయిత ఉద్దేశించిన అర్థం, కత చివరలో వేణుగోపాలరావు  స్నేహానికీ, మానవ సంబంధాలకూ ఇచ్చిన వ్యాఖ్యానం ద్వారా గానీ  మన  అనుభవంలోకి రావు. ఆసాంతం చివరకు వచ్చాక రచయిత ఏం చెపుతున్నాడో మన మనసులో ఒక్కొక్కటిగా స్ఫురిస్తున్నపుడు, వాటిని రూఢీ చేసుకునేందుకు తిరిగి మళ్ళీ కథనంలో దొర్లిన అనేక సంగతులలోకీ, వివరాలలోకీ మనం ప్రయాణిస్తాం. ఇలాంటి శిల్పసంవిధానంతో  వేణుగోపాలరావునూ, శివయ్యనూ, రాజారాంనూ  అర్థం  చేసుకుంటాం.

వేణుగోపాలరావును మోసగాడని, స్నేహధర్మం పాటించని వ్యక్తని చెప్పడానికి  నిజానికి కతలో ఇన్ని విషయాలను చొప్పించనవసరం లేదు. అసలు రాజారావు పాత్రే  అవసరం లేదు. మరి రాజారావు పాత్రకున్న ప్రాముఖ్యత ఏమిటి?

వేణుగోపాలరావు గతానికి శివయ్య ఎలానో అతని వర్తమానానికి రాజారావు సంకేతం. మారిన తన అభిరుచులకూ, స్నేహాలకూ, సంబంధాలకూ అతను కొండ గుర్తు. అతను దళారీ
మాత్రమే కాదు. వేణుగోపాలరావులో ఇంకా మిగిలి ఉన్న గతకాలపు వాసనలకూ,  ఎగబాకడమొక్కటే పరమావధిగా ఉన్న వర్తమాన ఆకాంక్షలకూ మధ్య జరిగే  బలహీనమైన
ఊగిసలాటకు అతను వేదిక. శివయ్య తన కొడుకు ఉద్యోగం సిఫారసు కోసం  వేణుగోపాలరావును ప్రాదేయపడినప్పుడు ఒక దశలో డబ్బు ప్రసక్తి లేకుండానే పని  చేయిద్దామా అన్నట్టూ ఊగిసలాడతాడు గానీ,  రాజారావు అతనిని తొందరగానే  వాస్తవంలోకి తేలగొడతాడు. ఇలాంటి ఊగిసలాటను పాఠకుడు సరిగ్గా అంచనా వేసుకోవడానికి రాజారావు సున్నితపు త్రాసులా పనికొస్తాడు. గతానికి   సంబంధించిన పనికి రాని ‘చెత్త’ నుండి బయటపడడానికి ఉత్ప్రేరకంగా కూడా పని  చేస్తాడు. రాజారావు ‘స్నేహం’ లేకుండా వేణుగోపాలరావు, వేణుగోపాలరావు కాడు.  అలాగని  రాజారావుకు పూర్తిగా డబ్బు మీదనే నమ్మకమా? డబ్బు లేకుండా పని  జరగకూడదని అంటాడా?  అంటే అలా  ఎన్నటికీ అతడు అనడు. అప్పుడప్పుడూ కాస్త  నిజం కలిపితే గానీ అబద్దానికి విలువుండదు అన్నట్టుగా, అప్పుడప్పుడూ కాస్త  మెరిట్‍కు కూడా చోటు దొరుకుతే గానీ మిగిలిన వాటికి ఢోకా ఉండదు అని నమ్మే  మనిషి తను. వ్యవస్థ ఆయువుపట్టు తెలిసిన వాడు కనుకనే మెరిట్‌కూ స్థానం  దొరకక పోదని ఆయన మనకు భరోసా ఇస్తాడు.

వేణుగోపాలరావులో కలిగిన  ఊగిసలాట శివయ్యకు అర్థం అవుతుంది కానీ,  దానిలోని ప్రయోజకత్వం పట్ల ఆయనకు నమ్మకం ఏర్పడదు. ఇంకా, డబ్బులు లేకుండా  నడిపే వ్యవహారంలో అసలుకే మోసం వస్తుందేమోననే భయం కూడా కలుగుతుంది. దీనికి  వ్యతిరేక దిశలో రాజారావు పట్ల అతనిలో నమ్మకం స్థిరపడుతుంది. ఇది క్షణ కాలం పాటు మనలో విస్మయం కలిగిస్తుంది. కానీ, కాసులు రాలకుండా ఉద్యోగం  రాదన్న సంగతి సమాజంలో స్థిరపడిపోయిన విశ్వాసంగా మనలో స్ఫురించినపుడు  దీనికున్న ప్రాసంగికత మనకు ఎరుకలోనికి వస్తుంది.

చివరకు, ఈ మొత్తం సంబంధాలనూ మీనాక్షీదేవి సమక్షంలో సైద్ధాంతీకరిస్తూ,  శివయ్య అవసరం కొద్దీ వచ్చిన మనిషనీ, కాబట్టి అతని నుంచీ ఇంకా డబ్బు వసూలు  చేయొచ్చుఅని వేణుగోపాలరావు అన్నప్పుడు వెంటనే  అతనిపై మనకు ధర్మాగ్రహం  కలుగుతుంది. కానీ లోకంలో స్నేహమే లేదంటే విస్మయపడే ఆమె ముందర అతని  ప్రసంగం వొట్టి వాచాలతేననీ మనం త్వరలోనే పసిగడతాం. పదే పదే దేనినైనా  సమర్ధించాల్సి రావడం .. అది బలంగా నాటుకోకపోవడం వల్లనే అన్న అవగాహనతో  వేణుగోపాలరావు ఇంకా రాజారావులా రాటుదేలలేదని రూఢీ చేసుకుంటాం. ఇంకా తరచి  చూసినపుడు వేణుగోపాలరావు ఎంత అసందర్భ ప్రలాపో కూడా మనకు ఇట్టే  బోధపడుతుంది. మీనాక్షీదేవి గారి సమక్షంలో ‘విష్ణుమూర్తిలాగా పవళించి’,  లోకంలో స్నేహమనేదే లేదని ఉవాచించడం, ప్రతీదీ అవసరాల కోసం చేసుకున్న  ఏర్పాటే అనడం వల్ల ఆ మాట మీనాక్షీ దేవికి కూడా తగులుతుందని, అది ఆమెను  నొప్పించి తీరుతుందన్న జ్ఞానం అతనిలో లేకపోయింది. అదే ఉన్నట్లయితే అతను  బహు నమ్మకంగా రాజారావు శివయ్యను లోబరుచుకున్నట్టుగా మాటాడి ఉండేవాడు.
ఇక్కడ కూడా వేణుగోపాలరావు తన అనుభవరాహిత్యాన్నే బయటపెట్టుకున్నాడు.  అయితే ఈ మాటలకు మీనాక్షీదేవిలో కలిగిన ప్రతిస్పందన కతాగమనాన్ని పూర్తిగా  మార్చి, కతను ఇంకొక తలంలోనికి ప్రవేశపెడుతుంది. అప్పటి వరకూ మధ్యతరగతిలో  ఉండే నమ్మకాలూ, విశ్వాసాలూ, పైకెగబాకాలనుకునే వెంపర్లాటలూ, వాళ్ళలోని  ఊగిసలాటలూ చెబుతూవచ్చిన కత, మీనాక్షీదేవి ప్రతిస్పందనతో తిరిగి  విశ్వాసాలకూ, స్నేహాలకూ లోకంలో విలువ ఉండితీరుతుందన్న మరో తలంలోనికి  ప్రవేశిస్తుంది. ఇది ఇప్పటి వరకూ కత నడచిన తలానికి, పూర్తి వ్యతిరేక  దిశలోని మరో తలం. విలువల గురించిన సంవాదంలో మానవీయమయిన ‘థీరీ’.  అందువల్లనే, మూడు రూపాయల కోసం గొంతులు కోయగల వాళ్ళున్న లోకంలో, మూడు వందల  కోసం  డాక్టరుగారు ఇట్టాంటి ‘థీరీ’ లేవదీసుంటారు లెమ్మని ఆమె చప్పున  గ్రహించగలుగుతుంది.

సామాజిక గమనంలో వ్యక్తులు ఒక దశ నుండీ ఇంకో దశకు మారుతున్నప్పుడు, పాత  స్నేహాల స్థానంలో కొత్త స్నేహాలు చోటు చేసుకుంటున్నప్పుడు, పాత సంబంధాలను  వదులుకొని కొత్త సంబంధాలను స్థిరపరుచుకుంటున్నప్పుడు వాటి సవ్యతను  సమర్దించుకోవడానికి, వ్యాఖ్యానిచడానికీ ఒక కొత్త భావజాలం అవసరం. ఇట్టాంటి  అవసరాన్ని సందర్భసహితంగా, మానవ సంవేదనలతో సహా పట్టుకున్న కత ‘స్నేహం’.  ఇది విలువల గురించిన సంవాదాన్ని ముందుకు తెస్తున్నది.

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

–అవ్వారి నాగరాజు

(ఎ.నాగరాజుగారు ప్రకాశం జిల్లాలో టీచరుగా పనిచేస్తున్నారు. ఈయన రాసిన కవితలు, వ్యాసాలు అరుణతారలోనూ, ఒకటీ అరా ఆంధ్రజ్యోతిలోనూ వచ్చాయి. తొలినాటి రచయితలలో శ్రీపాద అంటే ఇష్టపడతారు. మానవ భావోద్వేగాలను,  అందులోని ఘర్షణను ప్రతిభావంతంగా చిత్రీకరించిన అల్లం రాజయ్య, రఘోత్తం  రచనలు అంటే చాలా ఇష్టమట. దళితవాదంతో సహా, అన్ని అస్తిత్వ వాదాలూ  పరిమితులకు లోనయ్యాయని నాగరాజుగారు అభిప్రాయపడుతున్నారు. స్త్రీవాద  రచనలను చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పి.సత్యవతిగారి కథలను  మెచ్చుకున్నారు. నాగరాజుగారి బ్లాగ్ minnalpoetry.blogspot.com)

 

 

( వచ్చే వారం  ” సంకల్పం” కథ గురించి  పి. సత్యవతి గారు పరిచయం చేస్తారు)

రవి గాంచినది

Kadha-Saranga-2-300x268

 నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ కేఫ్‌టేరియాలో కూర్చున్నాము నేను, విజయ్, లంచ్ చేస్తూ. మామూలుగా వుండే విజయ్ లాంటి వుద్యోగులతో బాటు కాన్ఫరెన్స్ కొచ్చిన నాలాంటి వాళ్ళ వల్ల కేఫ్‌టేరియా రద్దీగావుంది. చేతుల్లో ట్రేలతో మేము కూడా టేబుల్ కోసం రెండు మూడు నిముషాలు నిలబడాల్సి రావడం వల్ల “మే ఐ జాయిన్ యు వీజే” అంటూ ఎవరో రావడం అంత పెద్ద ఆశ్చర్యం కలిగించ లేదు. ఇండియాలో రద్దీగా వుండే హోటళ్ళలో జరిగేదిదేగా! అయితే, ఈ వీజే ఎవరు?

“ష్యూర్ క్రిస్టీనా” అని విజయ్ అంటే గానీ తెలిసిరాలా వాడెవడో. “క్రిస్టీనా, మీట్ మై అంకుల్ రవి” అన్నాడు విజయ్.

“నైస్ టు మీట్ యు” అంది క్రిస్టీనా. మనిషి శ్వేతజాతీయురాలు. వయసు యాభై, అరవై మధ్యలో వుంటుంది. తెల్ల జుట్టు. నెరవడమో లేక సహజమైన రంగో తెలియలేదు. మనిషి అయిదున్నర అడుగుల కన్నా ఎత్తు కాకపోయినా భారీకాయమనే చెప్పచ్చు.

“డు యు లివ్ హియర్?” నన్నడిగింది క్రిస్టీనా టేబుల్ వద్ద మూడో కుర్చీలో కూర్చున్న తరువాత.

“నో. ఐ కేం ఫర్ ది కాన్ఫరెన్స్” అన్నాను.

“ఫ్రం ఇండియా. హి వర్క్స్ ఫర్ ది ఇండియన్ స్పేస్ ఏజన్సీ.”

“సారీ ఫర్ ఇన్‌ట్రూడింగ్ లైక్ దిస్. వేరే టేబుల్ చూసుకుని కూర్చునేదాన్నే. కానీ, టేబుల్స్ ఏవీ ఖాళీగా లేవు.” అంది క్రిస్టీనా అపాలజెటిక్‌గా.

“నో. నో. నాటె ప్రాబ్లం. నువ్వున్నావని కూడా చూడకుండా మా భాషలో మాట్లాడుకుంటాం,” అన్నాడు వాడు.

“గో ఎహెడ్,” అని కాసేపు కష్టపడి గుర్తు తెచ్చుకుని, “టెల్గూ – ఈజ్ఇంట్ ఇట్?” అంది.

“యస్. దట్స్ కరెక్ట్,” అని పిజ్జా నవుల్తూ మధ్యలో – “థాంక్స్‌గివింగ్ వస్తోంది కదా, బిజీగా వుండుంటావ్ పాన్‌ట్రీ వర్క్‌తో” అన్నాడు.

ఇదేమిటో అర్థం కాలా. నేను కూడా పిజ్జా నవుల్తూ శ్రధ్ధగా వింటున్నాను. కావాలంటే ఇంటి కెళ్ళేటప్పుడు వాణ్ణి అడగవచ్చులే అనుకుంటూ.

“ఈసారి వుద్యోగాలు పోయిన వాళ్ళు చాలా మంది హోంలెస్ వాళ్ళకు తోడయ్యారు. పాన్‌ట్రీని తిండి పదార్థాలతో, వంట పదార్థాలతో నింపుతాం ఎప్పటిలాగానే. అయితే తీసుకోమన్నదానికంటే ఎక్కువగా లాగేసుకుంటారని భయంగా వుంది. ” అంది క్రిస్టీనా.

“క్రిస్టీనా బీదవాళ్ళకోసం, ఇళ్ళులేనివాళ్ళకోసం చర్చ్ పాన్‌ట్రీని ఆపరేట్ చేస్తుంది. కొన్ని కంపెనీలు తిండి పదార్థాలని వీళ్ళకి ఉచితంగా ఇస్తే వీళ్ళు వాటిని అవసరమైన వాళ్ళకు పంచుతారు.” అన్నాడు విజయ్.

“హేయ్ వీజే” అంటూ వచ్చి పర్మిషన్ అడక్కుండానే మా టేబుల్ దగ్గర మిగిలిన ఒకే ఒక కుర్చీలో కూర్చున్నాడొకాయన. వయస్సు డెభ్భై దాటిందని విజయ్ చెప్పాడు తర్వాత.

“హాయ్ గేరీ. దిసీజ్ మై అంకుల్ రవి,” అన్నాడు విజయ్.

“హి కేం ఫ్రం ఇండియా!” అంది క్రిస్టీనా.

“కొరియానించీ వచ్చారని నువ్వు చెబితే నమ్మే వాణ్ణనుకున్నావేమిటి?” అన్నాడు గేరీ. “హి ఈజ్ ఎ బాడ్ ఇన్‌ఫ్లుయెన్స్” అన్నాడు నాతో, విజయ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ.

“ఐ హాడ్ మై ట్రైనింగ్ ఫ్రం ది మాస్టర్” అన్నాడు విజయ్ అతన్నే చూస్తూ, కొంటెగా నవ్వుతూ.

“యు ఆర్ రైట్ అబవుట్ దట్” అన్నాడు గేరీ పెద్దగా నవ్వుతూ.

“ఈ వీకెండ్‌లోనేమో అన్ని పదార్థాలూ షెల్ఫుల్లో సర్దాలి.  వచ్చే వారం బుధవారం అంతా వంట చెయ్యడంతోనే సరిపోతుంది. గురువారం అంతా వడ్డించడానికి రెడీ అయ్యి, నాలుగ్గంటలకల్లా సర్వ్ చెయ్యాలి. అంతా అయి ఇంటికి చేరేసరికి గురువారం అర్థరాత్రి అవుతుంది. సోమవారం నాడు వర్కుకి రావాలంటే శుక్రవారం నించీ ఆదివారం దాకా ఎక్కడికీ కదలకుండా ఇంట్లో పడుకోవాలి.” అన్నది క్రిస్టీనా ఇందాక తను చెబుతున్నది కంటిన్యూ చేస్తూ.

సంవత్సరానికోసారి అమెరికాలో నవంబర్లో ఒక గురువారం నాడు దేశం అంతా సెలవు తీసుకుని పండగ చేసుకుంటుందని తెలుసు కానీ, కొన్ని సంఘసేవక సంస్థలకి సెలబ్రేషన్స్ అంటే ఏమీ లేనివాళ్ళకోసం పాటుబడడమని అప్పుడు తెలిసింది. క్రిస్టీనా ఇలా చెయ్యడానికి మత ప్రోద్బలం కారణం కాదని అప్పుడనిపించింది. అదే కారణమయితే, దీపావళి నాడు దేశంలో అసలు బీదా, బిక్కీ వున్నారన్న విషయానికి మనసు మారుమూలల్లో గోరీ కట్టిన హిందువులనందరినీ వెంఠనే క్రిస్టియన్లుగా మార్చెయ్యాలి.

“ఇండియన్స్ కూడా వున్నారని అన్నట్టున్నావ్ కదా?” నేను వినాలనే అడిగాడా?

“ఇండియన్స్, చైనీస్, బ్లాక్స్, వైట్స్. ఇండియన్సూ, చైనీసూ వాళ్ళని తీసుకోమన్న దానికంటే ఎక్కువ తీసుకుంటారు. నేను వాళ్ళతో చాలా స్ట్రిక్టుగా వుంటాను. ఒక చైనీసు ఆవిడ వుంది. ‘నాక్కావాలి ‘ అని గట్టిగా అంటుంది. ఆవిడతో గట్టిగా చెప్పాను – నీ వెనక వాళ్ళకి కూడా కావాలి, నా మాట వినకపోతే మళ్ళీ ఇక్కడకి రానివ్వను – అని.” కరువు కాటకాలున్న చోట్ల, వరద బాధితులకూ ఆహార పదార్థాలు పంచుతున్నప్పుడు వాళ్ళు కొట్టుకోవడం టీవీలో ఎన్ని సార్లు చూడలేదు? అది అమెరికాలో కూడానా?

“కమాన్ క్రిస్టీనా. వాటీజ్ వన్ మోర్ లోఫ్ ఆఫ్ బ్రెడ్?” అన్నాడు గేరీ. టీజ్ చేస్తున్నాడని అతని గొంతు చెప్పింది.

“ఐ యాం సీరియస్. ఎంతమంది ఈ మధ్యన వస్తున్నారో తెలుసా? ఎకానమీ ప్రాబ్లంస్ వల్ల ఇటు పక్కేమో, వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. అటు పక్కేమో, ఆహార పదార్థాలని దానమిచ్చే కంపెనీలు ఇంతకు ముందు ఇచ్చినంత ఇప్పుడు ఇవ్వట్లేదు. మధ్యలో ఫ్రస్ట్రేషన్స్ మాత్రం మాకు.” కొద్దిగా కోపంగానే అన్నది.

అమెరికాలో హోంలెస్ పీపుల్. తిండికి కూడా కరువే? కొత్తగా వుంది. అమెరికాకి బయలుదేరే ముందర విశాలాంధ్రకెళ్లి టైటిల్ ఇంటరెస్టింగ్‌గా వుందని ‘ఆటా జని కాంచె’ అన్న పుస్తకాన్ని కొనుక్కొచ్చాను విమాన ప్రయాణంలో చదవడానికి. ఇంతకుముందు రెండుసార్లు అమెరికాకి వచ్చినాకూడా నేను చూడనిది ఈయన ఏంచూశాడు అన్న కుతూహలం దానికి కారణం. అమెరికాలోని శ్వేతజాతి స్త్రీల స్తన సంపదగూర్చీ, ఘన నితంబాల గూర్చీ రాసిన వివరాల తరువాత ఇంక చదవలేకపోయాను. అప్పటికే విపులలో వచ్చిన ఒక కథ నా మదిలో బలంగా నాటుకుపోయింది. అందులో, పక్కా దేశీవాళీ స్టైల్‌లో ఒక అమ్మాయిని మోసం చేసి, “అమెరికాలో ఇవన్నీ మామూలే లేవే” అని జార్జ్ అని పేరు పెట్టుకున్న శేషాద్రి చేత పలికించడమే కాక ఆ కథకి “చెన్నైలోని మేన్‌హాట్టన్” అని పేరు కూడా పెట్టారొక తమిళ రచయిత్రి. వీటి వల్ల ఆంధ్రా నుంచీ బయట అడుగు పెట్టని వాళ్ళకి నిజంగా అమెరికా సంస్కృతేదో తెలిసే అవకాశముందా? క్రిస్టీనా అందజేస్తున్న సమాచారంమీద నాకు ఆసక్తి ఎక్కువయింది.

“ఇనఫ్ ఆఫ్ డిప్రెసింగ్ న్యూస్. లిజెన్. నా మనవరాలు కెన్నెడీ సెంటర్లో ఒక మ్యూజికల్‌లో పాడబోతోంది – చెప్పానా?” అన్నాడు గేరీ. అనవసరంగా మాట మార్చాడని ముందు లోపల్లోపల చిరాకుపడ్డానుగానీ అతనివద్దనుంచీగూడా ఆసక్తికరమయిన విషయాలని తెలుసుకున్నాను.

“నో” అన్నాడు విజయ్.

“చెప్పావు అని చెప్పినా నువ్వు ఆగుతావేమిటి?” ఈసారి టీజ్ చెయ్యడం క్రిస్టీనా వంతయ్యింది.

“మై సెకండ్ డాటర్ – షి ఈజ్ ఎ బ్రిలియంట్ లాయర్. షి అండ్ హర్ హజ్బెండ్ ఓన్ దిస్ మిలియన్ డాలర్ హవుస్. వాళ్ళ మూడో అమ్మాయి – పదేళ్ళు – అంతే. పాడుతుందని వాళ్ళమ్మ చెప్పింది. కానీ నా ముందు ఎప్పుడూ పాడేది కాదు. ఒక రోజు నేను డ్రైవ్ చేస్తూ దాన్ని తీసుకుని వెడుతున్నాను. కేథీ నాపక్కనా అది వెనుక సీట్లోనూ కూర్చున్నారు. పాడవే అన్నాను. ఏ మూడ్‌లో వుందో, పాడడం మొదలు పెట్టింది. ఎంత గొప్పగా పాడిందో తెలుసా? నా మనవరాలని చెప్పడం కాదు. చర్చిలో పాడేవాణ్ణి గనుక నాకు సంగీతంగూర్చి తెలుసు. వింటుంటే నా కళ్ళ వెంట ధారా పాతంగా నీళ్ళు రావడం మొదలు పెట్టాయి. కేథీ నన్ను చూసి మందలించింది – ‘ గేరీ, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, జాగ్రత్త!’ అని.” ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో అంతులేని ఆనందం, పలుచని నీటిపొరా కనిపించాయి. అట్లాంటి ఎమోషన్‌కి అతని భార్య కేథీ ఎందుకు గురికాలేదా అన్న నా అనుమానాన్ని విజయ్ తర్వాత తీర్చాడు – ఆ పిల్ల గేరీ మొదటి భార్య మనవరాలని.

“రాగ్‌టైం గూర్చి విన్నావా?” సమాధానం కోసం ఎదురు చూడకుండా గేరీ కంటిన్యూ చేశాడు. “ఇట్స్ ఎ గ్రేట్ షో. ఎ మ్యూజికల్. దానిని కెనెడీ సెంటర్లో (వాషింగ్టన్, డి.సి.,లో, చాలా గొప్ప థియేటర్ అని విజయ్ తర్వాత చెప్పాడు) ప్రదర్శించబోతున్నారు ఓ నాలుగు నెలల్లో. అందులో పాడగల పదేళ్ళ అమ్మాయికి ఒక రోల్ వుంది. నా మనవరాలు ఆ రోల్‌కి ఆడిషన్‌కి వెళ్ళింది. న్యూయార్క్‌నించీ డైరెక్టరూ, మ్యూజిక్ డైరెక్టరూ వేర్వేరుగా వచ్చి ఆడిషన్ చేసి మరీ దాన్ని ఆ రోల్‌కి సెలక్ట్ చేశారు. ఐ యాం వెరీ ఎక్సైటెడ్!” అతని మొహంలో గర్వాన్ని మర్చిపోవడం కష్టమే.

“ఆ టాలెంట్ నీ దగ్గర నుంచీ మాత్రం రాలేదు” క్రిస్టీనా టీజ్ చేసింది. వాళ్ళిద్దరిదీ బహుకాల పరిచయం అని తేలికగానే చెప్పొచ్చు.

“దట్స్ ట్రూ. ఇట్ కేం ఫ్రం హర్ మాం.” అమెరికాలో డైవోర్సులు అసాధారణం కాదని తెలిసినా, అతను మొదటి భార్య గూర్చి మంచిగానే మాట్లాడ్డం చూసి ఆవిడ పోవడం వల్ల రెండో పెళ్లి చేసుకున్నాడేమోననుకున్నాను. ఆవిడ బతికే వుందని విజయ్ తరువాత చెప్పాడు. “బట్, షి గాట్ ది గుడ్ లుక్స్ ఫ్రం మి.”

“ది జ్యూరీ ఈజ్ స్టిల్ అవుట్ ఆన్ దట్” అన్నాడు విజయ్.

“హి ఈజె స్మార్ట్ మేన్” అన్నాడు గేరీ నావైపు తిరిగి.

“యు డోన్ట్ వాన్ట్ టు నో వాట్ హి సేస్ బిహైన్డ్ మై బాక్” అన్నాడు విజయ్ నవ్వుతూ.

“నా అంత వాడయ్యే అవకాశముందని చెబుతాను” అన్నాడు కన్నుగీటుతూ.

కాసేపటికి గేరీ, క్రిస్టీనా వెళ్ళిపోయారు – “హావ్ ఎ గుడ్ టైం” అని చెప్పి. మళ్ళీ అర్జెంట్‌గా కాన్ఫరెన్స్‌లోకి వెళ్ళాల్సినంత గొప్ప టాపిక్స్ ఏవీ ఎజెండాలో లేవు. అందుకని అక్కడే కూర్చున్నాం వాడూ, నేనూను.

 

వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగాను. “క్రిస్టీనా లాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది వుంటారంటావ్?”

“ఎంత మందో చెప్పలేను గానీ, కనీసం కొంత మంది నాకు తెలుసు. ఈ దేశంలో హాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అని ఒక ఆర్గనైజేషన్ వుంది. దాన్లో అమెరికా మాజీ ప్రెసిడేంట్ జిమ్మీ కార్టర్, ఆయన భార్య మెంబర్లు. ఈ ఆర్గనైజేషన్ మెంబర్లు డబ్బులు పోగు చేసి కావలసిన వస్తువులని మాత్రం ఆ డబ్బుతో కొని, వాళ్ళ శ్రమ దానంతో ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తూంటారు – అమెరికాలోనే కాక ఇండియాలోనూ, శ్రీలంకలోనూ, బ్రెజిల్‌లోనూ, ఇంకా చాలా దేశాల్లో. నేను పని చేసిన మొదటి కంపెనీలోని వైస్ ప్రెసిడెంట్ రిటరయిన తర్వాత తన ఇంటిని అమ్మేసి, భార్యతో సహా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడ పని చెయ్యమంటే అక్కడికి వెడుతున్నాడని మొన్నా మధ్య పాత కొలీగ్ చెప్పాడు.  అంతెందుకు, మొన్నా మధ్య మేము పని చేస్తున్న కంపెనీలో కొలీగ్స్ కొందరు క్రిస్మస్ ఇన్ ఏప్రిల్ అన్న ఒక ఆర్గనైజేషన్ తరఫున ఒక వీకెండ్‌లో ఒక బీద వాళ్ళ ఇంటిని పూర్తిగా మరమ్మత్తు చేసి, పెయింట్ చేశారు.”

“అటు చూడు” అన్నాను హఠాత్తుగా.

“ఎక్కడ?” అన్నాడు విజయ్ అర్థం కాక.

కళ్ళతో చెప్పినా పట్టుకోలేక పోయాడు. నేను వాడికి చూపిస్తోంది, ఒక అసాధారణమైన దృశ్యాన్ని. ఒక గుడ్డి వాడు, ఒక్ కేన్ పుచ్చుకుని, ఎవరి ఆధారమూ లేకుండా పేర్చివున్న ట్రేలల్లో ఒక దాన్ని తీసుకున్నాడు. ఫుడ్ బార్ దగ్గరకెళ్ళి, తనకి కావలసిన వాటిని ప్లేట్లల్లో అమర్చుకుని, ట్రేలో పెట్టుకున్నాడు. అట్లాగే కేషియర్ దగ్గరకెళ్ళి డబ్బులు పే చేశాడు. మధ్య మధ్యలో అక్కడ పనిచేసే వాళ్ళు అతనితో మాట్లాడడం, అతను జవాబు చెప్పడం కనిపిస్తూనే వుంది. అతన్ని ఎప్పుడూ అక్కడ చూస్తాట్ట కనక అది విజయ్‌కి కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆ గుడ్డి అతను నాసాలో వుద్యోగం చేస్తాడని విజయ్ చెప్పినప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది.

ఆ సాయంత్రం విజయ్ కార్లో కూర్చొని నాసా గాడర్డ్ మెయిన్ గేట్ బయట ట్రాఫిక్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ గుడ్డి అతనే రోడ్డు దాటుతూ కనిపించాడు. అతన్ని నేను చూస్తున్నానని తెలిసి, రోడ్డు పక్కన వున్న ఒక సైన్ బోర్డుని చూపించాడు విజయ్. డైమండ్ ఆకారంలో పసుపుపచ్చని బోర్డుమీద “బ్లైండ్ పెడెస్ట్రియన్” అన్న నల్ల అక్షరాలు కనిపించాయి. అంత బిజీ ఇంటర్‌సెక్షన్‌లో అతను అలా ఒంటరిగా కేన్ సహాయంతో మాత్రమే రోడ్డు దాటుతున్నప్పుడు చుట్టుపక్కల ఆగివున్న కార్లని చూస్తే, ఒక చీమ కోసం ఏనుగుల మందని ఆపినట్లనిపించింది.

అప్పుడు గుర్తొచ్చింది కాన్ఫరెన్స్‌లో స్పీకర్ పక్కన సౌంజ్ఞలు చేస్తున్న ఒకావిడ. ఆవిడ గూర్చి అడిగితే విజయ్ చెప్పాడు – వినికిడి శక్తి లోపించిన వాళ్ళుగానీ లేక అసలు లేని వాళ్ళు గానీ ముందుగా కోరితే, అలాంటి వాళ్ళకోసం సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్‌ని అరేంజ్ చేస్తారని, బిల్ క్లింటన్ ప్రెసిడెంట్‌గా వున్నప్పుడు పాస్ చేసిన చట్టప్రకారం అలా చెయ్యాలనీని. అలాగే, ప్రతీ బిల్డింగ్‌లోకీ మెట్లతో బాటుగా వీల్ చెయిర్ ఆక్సెస్‌కోసం రాంప్ వుండాలట. ప్రభుత్వ కార్యాలయాల్లో బాత్‌రూములు వీల్ ఛెయిర్లో తిరిగేవాళ్లు ఉపయోగించగలిగేలా వుండాలట. లిఫ్టుల్లో అయితే, వెళ్ళవలసిన అంతస్తులని సూచించే బటన్ల మీద, నంబర్లతో బాటుగా, గుడ్డివాళ్ళ కోసం, అవే నంబర్లని బ్రెయిల్ లిపిలో కూడా రాయాలట. ప్రజానీకంలో కొందరు ముందర గొణిగినా ఇప్పుడు అన్ని బిల్డింగులూ ఆ నిబంధనలని పాటించే కడతారట. లంచాలని ఇచ్చి అవ్వి లేకుండా చెయ్యరా అని అడగాలని నోటి దాకా వచ్చింది. కానీ, హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో మా ఎపార్ట్‌మెంట్ బిల్డింగులో లిఫ్ట్ పనిచెయ్యకపోవడంవల్ల మెట్లెక్కవలసివచ్చినప్పుడు పట్టుకోవడానికి హాండ్ రెయిల్ లేక మా అమ్మ కష్టపడడం గుర్తొచ్చి ఆగిపోయాను.

* * *

విజయ్ ముందరే చెప్పాడు – నువ్వు మాకు బిజీ టైంలో వస్తున్నావు, నిన్ను ఎక్కడికీ తీసుకెళ్ళడం కుదరకపోవచ్చని. వాడుండేది వాషింగ్టన్, డి.సి., కి దగ్గరగా కావడంవల్ల కాన్ఫరెన్స్ వారంలో మూడు రోజులు తీసుకోగా మిగిలిన గురు, శుక్ర వారాల్లో మాత్రం పొద్దున్నే ఆఫీస్ కెళ్ళే ముందు నన్ను మెట్రో స్టేషన్‌దగ్గర దిగబెట్టాడు. నేను ట్రైన్ ఎక్కి సిటీలోకి వెళ్ళి మ్యూజియంస్‌లో తిరుగుతూ కాలం గడిపాను – వాడి భార్య సంధ్య పాక్ చేసి ఇచ్చిన లంచ్ తీసుకుని. అంత ప్రశాంతతని ఈ మధ్యలో ఎప్పుడూ అనుభవించలే దనిపించింది.

శనివారం పొద్దున్నే సంధ్యకీ, వాడికీ తర్జన భర్జన లయ్యాయి – పిల్లలని ఎవరిని ఎవరు ఎప్పుడు ఎక్కడకి తీసుకు వెళ్ళాలనే విషయం గూర్చి. ఓ మ్యూజిక్ క్లాసూ, ఓ డాన్సు క్లాసూ మాత్రమే కాకుండా ఆ వారాంతపు స్కెడ్యూల్లో ఇంకేవో కూడా ఇమడాలి.

“ఓ.ఎం.కి నువ్వు దాన్ని తీసుకు వెళ్ళకపోతే ఎట్లా కుదురుతుంది?” అన్నది సంధ్య. “అది” అంటే వాళ్ళమ్మాయి శ్రావణి.

“నేను బాస్కెట్ బాల్‌కి రిక్కీని తీసుకు వెళ్ళాలి గదా? వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి ఎలా వస్తాను? ఎన్ని ట్రిప్పులని వేస్తాను?” అన్నాడు విజయ్. కొడుకు పేరు రాకేష్ కాస్తా రిక్కీ అయింది.

“చూస్తాను మేరీ తీసుకెళ్ళగలదేమో. లేకపోతే కష్టమే”నంది సంధ్య. అదృష్టవశాత్తూ ఆవిడెవరో శ్రావణిని పికప్ చేసుకోవడానికి ఒప్పుకుంది.

ఓ.ఎం. అంటే ఏమిటని అడిగాను. ఆడిస్సీ ఆఫ్ ది మైండ్‌కి అది షార్ట్ అని చెప్పాడు. అంటే – మెదడు చేసే యాత్ర అని దానికి ప్రతిపదార్థం. పిల్లలకి – ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకే గాక హైస్కూల్ పిల్లలకి గూడా – తరగతిని బట్టి ఛాలెంజ్ నిస్తారట. ఆసక్తి వున్న పిల్లలు గ్రూపులుగా ఏర్పడి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారట. చివరకి ఓ రోజున ఆ టీంస్ అన్నిటికీ పోటీ వుంటుంది. అంతా పిల్లలే చెయ్యాలని చెప్పాడు వాడు.

ఇందులో పెద్దలు వేలు దూర్చరని నమ్మకమేమిటని అడిగాను. “నేను జడ్జీగా చేశాను గనక చెబుతున్నాను. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అది ఇట్టే తెలిసిపోతుంది. అంతే గాక ఎనిమిదిమంది దాకా వున్న ఒక గ్రూప్ పిల్లల్లో అది టీం ఎఫర్టా లేక ఎవరో ఒకరో ఇద్దరో చేసినదా అనేది కూడ ఇట్టే పట్టుకోవచ్చు చిన్న చిన్న ప్రశ్నలు వేసి” అన్నాడు.

ఒక నాలుగు నెలలు ఎంతో కష్టపడ్డ తర్వాత ఒక జిల్లాలోని అన్ని టీముల మధ్య పోటీ ఏదో ఒక స్కూల్లో జరుగుతుందట. సమస్యలంటే అన్నీ టెక్నాలజీకి సంబంధించినవే అయివుంటయ్యనుకున్నాను. అది ఒక భాగం మాత్రమే అన్నాడు వాడు. పిల్లలు వాళ్ళే రాసి, కంపోజ్ చేసి పాడిన పాటలూ, వేసే స్కిట్సూ కూడా అందులో వుంటయ్యన్నాడు.

విజయ్, రిక్కీలతో బాటు నేను కూడా బాస్కెట్ బాల్ గేంకి వెళ్ళాను. అదొక ఇన్‌డోర్ ఫెసిలిటీ. కనీసం ఆరు కోర్టులు వున్నయ్. ఒక కోర్టులో హైస్కూలు అమ్మాయిలో లేక కాలేజీ అమ్మాయిలో వాలీ బాల్ ఆడుతున్నారు. ఒక కోర్టులో ఇరవైకి పైగా వయసున్న అబ్బాయిలు బాస్కెట్ బాలాడుతున్నారు. మిగిలిన నాలుగు కోర్టులలోనూ పదినించీ ఇరవై ఏళ్ళ మధ్యలో వున్న అబ్బాయిలూ, అమ్మాయిలూ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు.

రిక్కీ టీంలో వీడే కొద్దిగా బక్కపలచగా, పొట్టిగా వున్నాడు. మిగిలిన వాళ్ళందరూ అరవై కిలోలకు పైగానే బరువుండి, దాదాపు ఆరడగుల ఎత్తున్నారు.   పదిహేనేళ్ళకే ఎలాంటి పర్సనాలిటీలు వీళ్ళవి అని ఆశ్చర్యమేసింది. వీళ్ళ టీంకి కోచ్ తెల్లవాడైతే, అప్పొనెంట్ టీంకి కోచ్ ఒక ఇండియన్. పేరు సింగ్‌ట. అంతే కాక ఆటీంలో కనీసం నలుగురు ఇండియన్ పిల్లలున్నారు. కావాలనే అతను ఇండియన్లని తీసుకున్నాడా అని అనిపించింది.

అంతకంటే ఆశ్చర్యమైన విషయం, గేంకి వున్న ఇద్దరు రిఫరీలల్లో ఒకళ్ళు స్త్రీ – అది కూడా చైనా అమ్మాయి అని స్పష్టంగా కనిపించింది.

మూడు క్వార్టర్ల దాకా ఆట మంచి రసపట్టులో వుంది. మొదటి క్వార్టర్లో ఎనిమిది నిముషాలూ ఆడిన రిక్కీ మళ్ళీ చివరి క్వార్టర్లో ఆడడానికి వచ్చాడు. ఇదేమిటి, బాగా ఆడుతున్న వాణ్ణి తీసేసి వీణ్ణి పెట్టాడు కోచ్ అనుకున్నాను. ఇట్లా అయితే వీడి టీం ఇక గెలిచినట్టే అనిపించింది. అంటే రిక్కీ సరిగ్గా ఆడలేదని కాదు; ఆ తీసేసిన వాడయితే ఇంకా బాగా ఆడతాడు కదా అని.

రిక్కీ బాగానే ఆడాడు. కీలకమైన సమయంలో ఒక మూడు పాయింట్ల షాట్ కూడా వేశాడు. ఏమైతేనేం, మొత్తానికి వీడి టీం ఒక్క పాయింట్ తేడాతో గెలిచింది.

“బాగా ఆడుతున్న వాడిని లాస్ట్ క్వార్టర్లో తీసేశాడెందుకు వీడి కోచ్?” విజయ్‌ని అడిగాను.

“టీంలో ఎంత మంది వున్నా అందరూ దాదాపు ఈక్వల్ టైం కోర్టులో వుండాలి.   అది లీగ్ రూలు.” అన్నాడు రిక్కీ. “లేకపోతే ప్రతీ టీంలోనూ ఒక్క స్ట్రాంగ్ ప్లేయర్స్‌నే ఆడనిస్తారు తప్ప మిగతా వాళ్ళకి అవకాశమివ్వరు.”

“ఈ కోచ్‌లని స్కూల్ వాళ్ళు అప్పాయింట్ చేస్తారా?”

“దీనికి స్కూల్తో సంబంధం లేదు. ఒక యూత్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఈ యాక్టివిటీస్‌ని కండక్ట్ చేస్తుంది. బాస్కెట్ బాల్తో బాటు ఫుట్‌బాల్,   వాలీబాల్, టెన్నిస్. వేరే చోట్ల స్విమ్మింగ్ కూడా. వీటన్నిటికీ కోచ్‌లు నాలాంటి తండ్రులే. అక్కడక్కడా తల్లులు కూడా వుంటారు. నాసాలో నా కొలీగ్ ఒకావిడ ఫుట్‌బాల్ కోచ్ చేసింది. సాధారణంగా వాళ్ళు కోచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లో, లేక పిల్లాడో ఆ టీంలో వుంటారనుకో. కానీ ఈ కోచ్‌లు అందరూ నాలాగే బయట వుద్యోగాలు చేసేవాళ్ళే. కోచ్ చేసినందుకు పెన్నీ ముట్టదు.”

హైదరాబాద్‌లో చదువు మాత్రమే “యాక్టివిటీ”గా పెట్టబడిన హైస్కూళ్లల్లోనూ కాలేజీల్లోనూ చదివి వుద్యోగాలు చేస్తున్న నా పిల్లలు గుర్తొచ్చారు. వాళ్ళ “యాక్టివిటీ”కి కోచ్‌గా వుండకుండా వాళ్ళని కోచింగ్ సెంటర్లకి తోలిందీ, నా సమయాన్ని శనీ, ఆది వారాల్లో కూడా ఆఫీసులో కుర్చీకి కట్టేసిందీ, నా పిల్లలతో కాలాన్ని గడపకుండా చేసిందీ వుద్యోగంలో పైమెట్లు ఎక్కుతూనే వుండాలన్న నా ఆశయంవల్లనా లేక స్వార్థంవల్లనా? కారణ మేదైనా అది నా కుటుంబానికి మేలు చెయ్యలేదా? ఆఫీసులో కుర్చీకి కట్టి వెయ్యబడని తండ్రులలో మాత్రం? ఎంతమంది ఆదివారం నాడు స్నేహితులతో గాక పిల్లలతో గడుపుతున్నారు? నేనేదో పెద్దపొజిషన్లో వుండడం దీనికి కారణం అనుకుంటే మరి నాకింద పనిచేసే శంకరన్, అతని కింద పనిచేసే కృష్ణప్ప – మరి వాళ్ళూ నాలాగే కుర్చీకి అతుక్కు పోయిన వాళ్ళేగా!

“ఇంతకుముందు ట్రిప్పుల్లో చికాగోకీ, హూస్టన్‌కీ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టునించీ హోటల్‌కీ అక్కణ్ణించీ మళ్లీ వెనక్కీ షటిల్ కొట్టడం మాత్రం జరిగేది. ఈసారి మాత్రం నీతోబాటు వుంటూ ఈ సమాజంలోని దైనందిక జీవితాలని చూడ్డానికి వీలవుతోంది,” అన్నాను వాడితో.

* * *

శ్రావణిని ఓ.ఎం.నించీ పికప్ చేసుకోవడానికి మేరీ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు విజయ్ అన్నాడు. “నికోల్ శ్రావణి క్లాస్‌మేట్. నికోల్ వాళ్ళన్నయ్య మైకేల్. నేను లెగో లీగ్ కోచ్ చేసినప్పుడు దాని మీద అస్సలు ఆసక్తిని చూపించకపోవడమే కాక మిగిలిన వాళ్ళను కూడా డిస్టర్బ్ చేసేవాడు. చెప్పి, చెప్పి విసిగిపోయాను. ఈ తెల్ల పిల్లలు ఇంతే, అందుకే చైనీస్, ఇండియన్స్ ఇక్కడ ఎక్కువ రాణిస్తున్నారు అనుకున్నాను. అయితే, వీడు ఒక ఓ.ఎం. టీంని లీడ్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌కి కూడా తీసుకు వెళ్ళాట్ట. అది తెలిసిన తర్వాత పిల్లల గూర్చి సులువుగా అంచనా వెయ్యగూడదని నిర్ణయించుకున్నాను.” అన్నాడు.

“లెగో లీగేమిటి?” అడిగాను.

“లెగో బ్లాక్స్ అని ఇప్పుడే గాదు – చాలా ఏళ్ళ నించీ హైదరాబాద్‌లో కూడా అమ్ముతున్నారుగా! మీ యింట్లో నా చిన్నప్పుడే చూసిన గుర్తు. ఈ బ్లాక్స్‌తో రకరకాల బొమ్మలని, వెహికిల్స్‌నీ తయారు చేయచ్చు. అయితే, బహుశా అంత తేలిగ్గా అక్కడ దొరకనివి ఏమిటంటే, వాటికి సంబంధించిన మోటార్లు, సెన్సర్లు, ఎలెక్ట్రానిక్స్. ఓ.ఎం.కు లాగానే ఫస్ట్ లెగో లీగ్ అని ప్రతీ సంవత్సరమూ నవంబర్లో ఒక పోటీ పెడతారు. ఒక నాలుగడుగులు వెడల్పూ, ఎనిమిదడుగులు పొడవూ వున్న బల్ల మీద రకరకాల అడ్డాలు పెట్టి, ఈ మోటార్లనీ, సెన్సర్లనీ, రకరకాల బ్లాకులనీ, చక్రాలనీ వుపయోగించి రోబోటిక్ వెహికిల్ని తయారు చేసి, దానిని ప్రోగ్రాం చేసి, దానితో ఆ టేబుల్ మీద ఛాలెంజెస్‌ని అధిగమించి పాయింట్లని తెచ్చుకోవాలి. ఎవరెక్కువ పాయింట్లు తెచ్చుకుంటే వాళ్ళదే గెలుపన్నమాట. ఈ పిల్లలు చేసే ప్రోగ్రాములు చూస్తే నాకు మళ్ళీ పిల్లాడినై పోవాలనిపిస్తుంది.”

“నువ్వెందుకు కోచ్ చేశావ్?”

“ఇది స్కూల్లోనే జరిగినా, ఆఫ్టర్ స్కూల్ ఆక్టివిటీ కనక, ఓ.ఎం.లాగానే ఇట్లాంటివి చెయ్యాలంటే తల్లిదండ్రుల సహాయం కావాలి. పైగా రిక్కీ వున్నాడు గనక దాన్ని కోచ్ చెయ్యడం నాకు ఇన్సెంటివ్ కూడాను.”

“వుయ్ వన్ ట్రోఫీస్ ఫర్ టీం వర్క్” అన్నాడు రిక్కీ. వ్యక్తిత్వానికే ప్రాధాన్యత నిస్తుందనుకుంటున్న అమెరికాలో టీం వర్క్‌లో పిల్లలకు బహుమతులా?

శనివారం గేంలో గెలవడం వల్ల రిక్కీ టీం ఆదివారం మళ్ళీ ఆడవలసివచ్చింది.  గేంని చూడ్డానికి కొంతమంది పిల్లల తల్లిదండ్రులేగాక వాళ్ళ తాతలూ, బామ్మలూ/అమ్మమ్మలూ కూడా వచ్చారు. ఈ ఫైనల్ గేంలో రిక్కీ వాళ్ళు గెలిస్తే బావుండేది అనిపించింది.

ఇంటికి వస్తున్నప్పుడు హఠాత్తుగా విజయ్ “అరెరే! మర్చిపోయాను” అంటూ కార్లో రేడియో ఆన్ చేశాడు.

“నాట్ టుడే డాడీ,” అని ముందు నసిగి, తరువాత నాతో, “ఆదివారం సాయంత్రం 6-7 గంటల మధ్యలో రేడియోలో ఈ ప్రోగ్రాం వినడం డాడీకి ఇష్టం” అన్నాడు రిక్కీ. ఈ ప్రోగ్రాంలో దేశంలో బాగా టాలెంట్ వున్న పిల్లలు పెర్ఫార్మెన్స్ ఇస్తూంటారు అన్నాడు విజయ్.

రేడియోలో ఎవరో పియానో చాలా బాగా వాయిస్తున్నారు. అయిన తర్వాత హోరున చప్పట్లు. పన్నెండేళ్ళ మిషెల్ యంగ్. రేడియో హోస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ పిల్ల తల్లి మిషెల్‌ని ప్రతీ శుక్రవారం వాషింగ్టన్ నించీ న్యూయార్క్‌లో పేరుగన్న జూలియార్డ్ స్కూల్‌కి డ్రైవ్ చేసి తీసుకెడుతుందట. వాళ్ళున్న అపార్ట్‌మెంట్‌కి పైనా, కిందా వున్న వాళ్ళు ఈ పిల్ల అదే పనిగా పియానో వాయించడం గూర్చి కంప్లైంట్ చేసి, ఖాళీ చెయ్యమంటే ఎవరికో అది తెలిసి వీళ్ళని వాళ్ళ ఇంట్లో బేస్‌మెంట్లో వుండమన్నారట.

“పిల్లలకి టాలెంట్ వుంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళుకూడా అమ్మేసి పిల్లలకి మంచి కోచింగులిప్పిస్తూ జీవిస్తారు. మైకేల్ ఫెల్ప్స్ గూర్చి తెలుసు గదా! ఒలింపిక్స్‌లో అన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించే అమెరికన్ల కథలన్నీ ఇలానే వుంటాయి.” అన్నాడు విజయ్.

* * *

మతం వల్లనైతేనేం కాకపోతేనేం, బీద జనాలకి, వుండడానికి ఇళ్ళు కూడా లేని వాళ్ళ కోసం నిస్వార్థంగా సేవ చేసే క్రిస్టీనా; శ్రమదానంతో ఇళ్ళు కట్టించే అమెరికా మాజీ ప్రెసిడెంటూ, ఒక కంపెనీ వైస్ ప్రెసిడెంటూ, ఇంకా అలాంటి చాలా మందీ –

మనవరాలి పాట ప్రాభవాన్ని గర్వంగా చాటి చెప్పే శ్వేతజాతీయ తాత –

ప్రజల అంగ వైకల్యాలు దైనందిన జీవితానికి ప్రతిబంధకాలు కాకుండా వుండేటందుకు అమెరికాలో బధ్ధీకరణ చెయ్యబడ్డ సామాజికమైన మార్పులు –

పిల్లలని ఆట పాటల్లో ప్రోత్సహించడమేకాక సమయాన్నికూడా వాళ్ళతో గడిపే తల్లిదండ్రులూ; పిల్లల టాలెంటును గుర్తించి, వుద్యోగాలు కూడా మానేసి ఆ టాలెంట్ అభివృధ్ధినే ధ్యేయంగాపెట్టుకునే తల్లిదండ్రులూ –

వీళ్ళనిగూర్చి నాకిప్పటిదాకా తెలియకపోవడానికి కారణమేమిటి?

“తెలుగు రచయితలు తానాలకనీ ఆటాలకనీ ఇక్కడికి వచ్చారు గదా, వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత చేసిన రచనలలోనూ వ్రాసిన పుస్తకాలల్లోనూ ఇట్లాంటి అమెరికన్ల గూర్చి ఎందుకు లేదురా?” విజయ్‌ని అడిగాను ఇండియా తిరుగు ప్రయాణానికి విమానం ఎక్కబోయే ముందర.

“ఈ సమాజాన్ని చూసే అవకాశం వాళ్ళకి ఎక్కడుంది? ఇక్కడ వున్న తెలుగు వాళ్ల జీవన విధానాలని మాత్రమే వాళ్లు చూసింది. రెండువారాలకనో రెణ్ణెల్లకనో వస్తారు. తెలుగు వాళ్ల ఇళ్లల్లోనే వుంటారు. వాళ్లు తీసుకు వెళ్లిన చోట్లకే వెడతారు. వాళ్లతోనే చర్చలలో పాల్గొంటారు. ఇక్కడ చూడవలసిన వేమిటో లిస్టు రాసుకుని వస్తారు గనుక అవి మాత్రం చూసి వెడతారు.”

“భారత దేశం గూర్చి మొదటగా బయట తెలిసింది యువాన్ చువాంగ్ వ్రాతల వల్ల అంటారు. అతడూ ఇట్లాగే వ్రాసి వుంటాడంటావా?”

“రాయలేదనుకుంటా. ఎందుకంటే అతను కాలినడకన చైనానుంచీ వచ్చి, దాదాపు పదహారేళ్లు గడిపాడు ఇండియాలో. ఆ పదహారేళ్లలోనూ అటు తక్షశిలనుంచీ ఇటు అమరావతిదాకా ప్రయాణంకూడా చేశాడు. అయితే, అతను ఇండియా వచ్చినప్పుడు అతణ్ణి రిసీవ్ చేసుకోవడానికీ, చుట్టుపక్కల తిప్పడానికీ తక్షశిలలో ఎవరూ చైనీస్ లేరనే అనుకుంటున్నాను. అందుకని అతడు ముందు భాషని నేర్చుకొని, బౌధ్ధాన్ని స్వయంగా పాటించి తెలుసుకో గలిగాడు.”

“బారిష్టర్ పార్వతీశం గుర్తున్నాడా?”

“ఎందుకు లేడూ? హైస్కూల్లో వున్నప్పుడు ఆ పుస్తకాలు చదివి పడీ పడీ నవ్వడం ఇంకా గుర్తుంది.”

“అతడికి గూడా వారాల పాటు పట్టింది నౌకా ప్రయాణం చెయ్యడానికి.”

“నౌకలో ప్రయాణించేటప్పుడే కాక ఇంగ్లండులో వున్నప్పుడు కూడా ఒక ఎపార్ట్‌మెంట్‌లో అద్దెకు వుంటూ ఇంటావిడతో పడ్డ పాట్లు కూడా రాశాడు. అవ్వి అతని స్వీయ అనుభవాలు. అందుకనే వాటికి అంత సహజత్వం. ఆ జీవితానికి టూర్ గైడ్‌లు ఎవరూ లేరు.”

నా ప్రశ్నకి సమాధానం దొరికింది. కారణం టెక్నాలజీ. తప్పు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకు వెళ్ళగలిగే విమానంది; ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలోని అన్ని మూలలకీ ఆ వార్తని క్షణాలమీద చేరుస్తున్న ప్రసార మాధ్యమాలది.

ఆకాశ హర్మ్యాలని దర్శించడానికీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృధ్ధి చేసుకోవడానికీ మాత్రమే కాక ఈ ట్రిప్పులో అమెరికా జీవన విధానాలని అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది.

* * *

ఇండియాకి తిరిగి వచ్చిన రెండువారాల తరువాత ఈ కథని వినయ్‌కి ఈమెయిల్ చేశాను.

“నా పేరులో ఒక్క అక్షరాన్ని మాత్రమే మార్చావ్!” అన్నాడు వాడు ఫోన్లో. తరువాత, అమెరికాగూర్చి అంతా మంచే రాశావ్. ‘అక్కడ అసలు చెడే లేదా? కథలో బాలెన్స్ లేదు,’ అని విమర్శ వస్తుంది.” అన్నాడు.

“పోనీ, నువ్వు చూసిన చెడేమిటో చెప్పు. దాన్ని కథలో వాడుకుంటాను,” అన్నాను.

కొంచెంసేపు ఆలోచించాడు. “చెడు అని అనలేనుగానీ, పిల్లలు హైస్కూల్లో ఎటువంటి చెడలవాట్లకి లోనవుతారోనని భయం. ముఖ్యంగా డ్రగ్స్‌కి.”

“ఎవరి పిల్లలని వాళ్లే నాలుగు కళ్లతో కాపాడుకోక తప్పుతుందా? నువ్వనుకునే భయాలు తెల్లవాళ్లకిగానీ, నల్లవాళ్లకిగానీ వాళ్ల పిల్లలగూర్చి వున్నయ్యేమో వాళ్లనెప్పుడయినా కనుక్కున్నావా? అక్కడ సమాజమంతా డ్రగ్స్‌కి లోనవలేదుగదా! అయినా, హైస్కూళ్లల్లో ‘డ్రగ్స్ మంచివికావు, వాటికి బానిసవకండి,’ అని బోధిస్తారని చెప్పావుగదా! ఇంకేంటి భయం? ఇక్కడి హైస్కూళ్లల్లో అలాంటి విషయాలనే చర్చించరు. కాలేజీలల్లో అయితే, అది అసలు వాళ్ల సమస్యే కాదంటారు. ఇక్కడయితే, అలాంటి సమస్యలు డబ్బున్నవాళ్ల పిల్లలకిలే,” అన్నాను.

“అదీ నిజమే. నేను కాలేజీలో వున్నప్పుడు మా హాస్టల్లోనే డ్రగ్స్ వాడేవాళ్లుండేవాళ్లు. వాళ్ల తల్లిదండ్రులు సింగపూర్లోనో, మలేషియాలోనో వుండేవాళ్లు గనుక, వీళ్లేం చేస్తున్నారో తెలిసేదిగాదు. నాకసలు డబ్బేదీ వాటివైపు మొహం చూపించడానికయినా?”

“నీ మొహం. నీ సంగతి నాకు తెలియదా? డెవిల్స్ అడ్వకేట్‌గా మాట్లాడావుగానీ దాన్లో ఫెయిలయ్యావ్. ఇంకో విధంగా ఆలోచించు. ఇండియానుంచీ అమెరికా వచ్చిన వాళ్లల్లో ఎంతమంది డ్రగ్స్‌కి అలవాటుపడిన వాళ్లయుంటారంటావ్?”

“ఒకవేళ అలాంటివాళ్లున్నాగానీ ఇక్కడ మనగలిగే అవకాశం వుండదు. ఫ్రతీ ఉద్యోగంలోనూ చేరే ముందర డ్రగ్ టెస్ట్ చేయించుకుని శరీరంలో అవి లేవని నిరూపించడం తప్పనిసరి. లేశమాత్రం అవి కనిపించినాగానీ వాళ్లు ఆ ఉద్యోగపు ఆఫర్‌ని విత్‌డ్రా చేస్తారు.”

“మరి, నువ్వింకేం చెడుని చూశావో చెప్పు,” రెట్టించాను.

“నువ్వడిగేది సమంజసంగా లేదు. నేనిక్కడ పాతికేళ్లుగా వుంటున్నాను. నాకు నచ్చనివి ఏవయినా వున్నాగానీ వాటిని చెడు అని ఎలా అనమంటావ్? అంత చెడు వుంటే నేనిక్కడ ఇన్నాళ్లెందుకుంటాను?” అన్నాడు.

“కోప్పడకు నాయనా. చెడుగూర్చి రాయమన్నది నువ్వేగా,” అన్నాను.

ఈ సంభాషణ జరిగి నాలుగేళ్లయిందండీ. వాడు ఇంకా ఆలోచిస్తూనేవున్నాడు. ఇంక నాకు వేచివుండే ఓపికలేదు. ఇదుగో, దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను.

— 0 —

 (ఈ కథలోని కొన్ని సంఘటనలు మాత్రమే కల్పితాలు; పాత్రల పేర్లు మారెయ్ గానీ, వ్యక్తులు సజీవులే.)

 -తాడికొండ కె. శివకుమార శర్మ

అమెరికా తెలుగు కథ తొలి అడుగు వివాహ బంధాలు

imagesX3953B67

కథ అన్నాక దానికి ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుకి ఓ నేపథ్యం ఉంటుంది. అమెరికా తెలుగు కథకి యాభయ్యేళ్ళు నిండాయని వంగూరి ఫౌడేషన్ వారు జరుపుతున్న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ అమెరికా తెలుగు కథల్లో ఏ విషయాల మీద రాశారు అని పరిశీలిస్తే తరచూ కనబడిన సబ్జక్టు వివాహ బంధం. అమెరికా నేల మీద రాయబడిన మొదటి కథ (“పుట్టిల్లు” – చెరుకూరి రమాదేవి గారి రచన) కూడా వివాహ బంధం ఇతివృత్తంతోనే ఉండడం యాదృఛ్ఛికం కాదు. భారతీయులకి, అందునా తెలుగువారికి పెళ్ళీ, తద్వారా ఏర్పడే కుటుంబమూ జీవితంలో, మనుగడలో అతి ముఖ్యమైన అంశాలు. దానికి తోడు తొలి రోజుల్లో ఎక్కువగా కథలు రాసినది స్త్రీలు. అందుచేత ఈ కథల్లో వివాహ బంధాల చిత్రణ ముఖ్య వస్తువుగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.

తొలి తరం కథల్లో ఎక్కువగా ఈ మహిళా రచయితలు తమ అనుభవాలనే కథలుగా మలిచారు అనిపిస్తుంది. ఒక మధ్య తరగతి తెలుగమ్మాయి పెళ్ళి చేసుకుని భర్త వెనకాల అమెరికా రావడం. ఆమె పెద్ద చదువులు చదివి ఉండక పోవచ్చు, ఒక వేళ చదివి ఉన్నా ఈ అమెరికా పరిజ్ఞానం అంతగా ఉండక పోవచ్చును. అంచేత వచ్చిన కొత్తల్లో కొంచెం బిక్కుబిక్కుమంటూ ఉన్నా నెమ్మది మీద ఏదో ఒక విద్య నేర్వడం, సంపాదన పరులు కావడం, పిల్లల పెంపకం, దానిలో ఉండే పరీక్షలు, మాతృదేశంలో తమవారిని మిస్సవడం – ఇలాంటివన్నీ దినుసులుగా వీళ్ళు కథలు రాశారు. ఈ కథల్లో భర్త ఒక్కో సారి అస్సలు ఇంటి విషయాల్ని పట్టించుకోని బుద్ధావతారం లాగానూ, అప్పుడప్పుడూ భార్య కష్టాలని ఇబ్బందుల్ని పట్టించుకుని, కొంచెం ఇంటి పనిలో సాయం చేస్తూ భార్యని ప్రోత్సహించే స్నేహితుడిలానూ కనిపిస్తుంటాడు, కానీ ఈ కథలు ప్రధానంగా స్త్రీ పాత్రల ఆత్మకథనాలు, వారి ఆశయాలకూ భయాలకూ ప్రతిబింబాలు. అమెరికా ఇల్లాలు (కమల చిమ్మట), అమెరికా ఇల్లాలి ముచ్చట్లు (శ్యామల దశిక) వీటికి మంచి ఉదాహరణలు.

కొన్నేళ్ళు గడిచాక మన కథల ఫోకస్ పిల్లల పెళ్ళిళ్ల మీదికి తిరిగింది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడం అంటే ముచ్చటగా మూడు ప్రత్యామ్నాయాలు కనబడుతున్నాయి. 1) తమలాగా ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగువారో భారతీయ సంతతివారో, 2) మాతృదేశం నుండి వెదికి పెళ్ళి చెయ్యడం, 3) భారతీయేతరులు. చివరి రెండిటిలో దేనిని ఎంచుకున్నా దానిలో మేలూ కీడూ రెండూ ఉన్నాయని మనవారు గుర్తించారు. ఈ బాగోగుల తులనాత్మక పరిశీలన, చర్చ మనకి చాలా కథల్లో కనిపిస్తాయి. ఈ కథలు శిల్పపరంగా గొప్ప ఆసక్తికరం కాక పోవచ్చునుగానీ ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న సామాజిక ధోరణులకు ఇవి అద్దం పడుతున్నాయి. తద్వారా ఒక సోషల్ డాక్యుమెంటరీగా ఈ కథలు ముఖ్యమైనవి.

మేడ్ ఇన్ అమెరికా (సత్యం మందపాటి), పెళ్ళి చేసుకుంటే చూడు (శేషుశర్మ పూడిపెద్ది), అబ్బాయి పెళ్ళి (రాధిక నోరి), ఇ – అ పెళ్ళి (సాయిలక్ష్మి కాళ్ళకూరి) కథలలో పెళ్ళి చేసుకోవలసిన పాత్రల ప్రమేయం నేరుగా లేకుండా, తలిదండ్రుల తరంలో జరుగుతున్న చర్చలాగా ఈ పెళ్ళి సమస్యయొక్క వివిధ రూపాలని ఆవిష్కరించారు. బయటి వారిని (తమ కుల, భాష, ప్రాంత, జాతికి చెందని వారిని) పెళ్ళి చేసుకోవడం అనుకోగానే, తల్లిదండ్రుల తరంలో – నా సాంప్రదాయమో, నా భాషో, నా సంస్కృతో .. అనే ఆక్రోశం పెద్దగా వినిపిస్తుంది. ఒక చోట పెళ్ళి కావలసిన అబ్బాయి తల్లితో అంటాడు – నువ్వు మాత్రం నీ భాషా సంస్కృతులని ఏ మాత్రం పాటిస్తున్నావని వాటిని నా మీద రుద్దటానికి చూస్తున్నావు – అని! ఇది ఆలోచించవలసిన ఆరోపణే!

ఈ వరుసలో కాగల కార్యం (రాధిక నోరి) కథ భలే ఆసక్తికరంగా ఉన్నది. ఇందులో పెళ్ళి కొడుకు ఒక తెల్లమ్మాయిని ఇష్టపడి, ఆమెకి తన కుటుంబం పరిచయం కావాలని ఒక వారం రోజుల పాటు ఆమెతో సహా తలిదండ్రుల ఇంట్లో ఉంటాడు. ఆ వారం రోజుల్లో ఆ తెల్లమ్మాయి ఈ పెళ్ళి తనకు అచ్చిరాదని గ్రహించి (మృదువుగానే) తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కథ ముగిసే సమయానికి అబ్బాయికి వేరే హీరోయిను ఎవరూ దొరకదు గానీ తల్లిదండ్రులు మాత్రం కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకున్నట్టే చిత్రించారు. ఈ కథలో తెల్లమ్మాయి లారా పాత్రని నిర్వచించిన తీరు ఆసక్తి కరంగా ఉన్నది. పెళ్ళికాని టీనేజ్ తల్లికి పుట్టిన లారా, తల్లిదండ్రుల ప్రేమ లేక అమ్మమ్మ దగ్గర పెరిగింది. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొంత చదువుకుని ఒక మాదిరి ఉద్యోగం చేస్తోంది. ఆ పిల్లకు తన క్రిస్టియన్ మతం పైనా పెద్దగా శ్రద్ధ లేదు. ఉద్యోగం పట్ల కానీ కెరీర్ పట్ల కానీ ఒక ఉత్సాహం, ఏంబిషన్ లేవు. హీరో పట్ల కూడా ఏదో కొంత ఆకర్షణ తప్ప గాఢమైన ప్రేమ లేదు – అని హీరో తల్లి గమనిస్తుంది. మొత్తానికి ఆ పిల్ల – ఈ పెళ్ళి చేసుకుంటే సుఖం సంగతి పక్కన పెట్టి, ఈ అత్తారి కుటుంబంలో ఇమడ్డం లేని కష్టాన్ని తెచ్చుకోవడం అవుతుందన్న ఆలోచనతో – హీరోతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కేవలమూ వ్యక్తిగత స్థాయిలో చూస్తే ఆ తల్లిదండ్రుల స్థానంలో నేను ఉంటే నేనూ బహుశా వాళ్ళు ప్రవర్తించినట్టే, వాళ్ళు ఆలోచించినట్టే చేసి ఉండేవాణ్ణి. అభ్యుదయ ప్రగతి శీల ఆలోచనలను గురించి కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, తనదాకా వస్తే కానీ తెలియదు కదా!

అంచేత, పాఠకులకి హీరో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా రీజనబుల్ గా ఉన్నట్టే తోస్తుంది. ఒక వేళ లారా ఈ కథలో చిత్రించినట్లు కాకుండా, స్థిరమైన ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రుల సంతానమై ఉండుంటే, తన కెరీర్ పట్ల ఏంబిషన్తో ఉండుంటే అప్పుడీ కథ ఎలా ఉండేదో అని ఒక ఆసక్తికరమైన ఆలోచన. హీరో తన ఆశయాలకు తగినట్టు పెద్ద చదువులు చదవలేదనీ, డాక్టరు కాలేదనీ హీరో తండ్రి బాధ పడతాడు. దానికి తగినట్టు చివరికి హీరో ఇక ప్రేమా దోమా అన్నీ మరిచిపోయి లా కాలేజీలకి అప్లై చేస్తానని ప్రకటించడంతో కథ సుఖాంత మవుతుంది. వివాహానికి సంబంధించిన విషయాలతోబాటు సక్సెస్ అంటే ఫలాని చదువులు చదవాలి అనే ఉద్దేశం మనకి కనిపిస్తున్నది. కథలో పాత్రల ప్రవర్తన ఆయా పాత్రలకి వ్యక్తిగతం అనుకోవడం బాగానే ఉంటుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో – ముఖ్యంగా స్వ-పర భేదాల్ని చిత్రించే కథల్లో – ఈ పాత్రలు నిజజీవితాలకి, ఆశయాలకి, ఆలోచనలకి ప్రతీకలు అవుతుంటాయి.

భారత్ నించి అమ్మాయినో అబ్బాయినో వెతికి తెచ్చి పెళ్ళి చెయ్యడం ఇంకో ప్రత్యామ్నాయం. ఈ విషయం మీద కూడా కొన్ని కథలు వచ్చాయి. వీటిల్లో అబ్బాయి పెళ్ళికీ అమ్మాయి పెళ్ళికీ ఉన్న తేడా ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వధువు అమెరికా అమ్మాయి ఐతే, ఇండియానించి తెచ్చిన వరుడితో సర్దుబాటు అవడం కష్టం – ఆమె అలవరుచుకున్న స్వతంత్ర భావాలకీ, అతని పురుషాధిపత్య భావాలకీ పొసగదు అనేది ఇక్కడ సాధారణంగా చిత్రించబడిన ఆరోపణ – అంచేత ఇలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువగా పెటాకులే అవుతున్నాయి. అమెరికా వరుడికి ఇండియానించి వధువుని తెచ్చుకుంటే మాత్రం పరవాలేదు – ఎందుకంటే, ఆ వచ్చే అమ్మాయి అమెరికా జీవితం కోసం తప్పకుండా సర్దుకుపోతుంది – ఈ ఆలోచనా ధోరణి కథల్లోనే కాదు, నేను నిజజీవితంలో చూసిన అనేక సందర్భాల్లోనూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. పరిస్థితి ఏదయినా అమ్మాయే సర్దుకు పోవాలి అనేది ఇందులో అంతర్లీనంగా, అవాచ్యంగా మనకి అందే సందేశం. దేశాన్ని విడిచి వచ్చామే కానీ మనం వదులుకోవాలనుకున్నా కొన్నికొన్ని భావాలు మనలని అంత తేలిగ్గా వొదిలిపెట్టవేమో!

అమెరికాలోనే సంబంధాలు వెతుక్కోవడంలో – భారతీయులు, శ్వేతజాతీయులు కాకుండా ఇతర జాతులనుండి భాగస్వామిని వెతుక్కోవడం ఉంది. కానీ భారతీయులు ఈ దిశగా దృష్టి సారించినట్టు లేదు. మన కథల్లో కూడా ఇటువంటి ప్రస్తావన ఎక్కడా కనబడలేదు కానీ ఆరి సీతారామయ్యగారు దూరపు కొండలు అని ఒక మంచి కథ రాశారు. అందులో అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ సంతతి పిల్, అందులోనూ ఆలయపూజారి గారి అమ్మాయి, కెన్యా నుండి వలసవచ్చిన పిల్లాణ్ణి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ కథలో కూడా అసలు వధూవరులు మనకి కనబడరు – కథ మొత్తం అటు కెన్యా తల్లిదండ్రుల దృక్కోణం నించీ, ఇటు తెలుగు తల్లిదండ్రుల కోణం నించీ చెబుతూ – ఆ వూరికి ఈ వూరెంత దూరమో, ఈ వూరికి ఆ వూరూ అంతే దూరం అనే సత్యాన్ని సమర్ధవంతంగా ఆవిష్కరించారు. ఈ ఒక్క కథే కాదు, మారుతున్న సామాజిక నేఫథ్యంలో, అమెరికా ప్రవాసంలో వైవాహిక జీవితంలో అతి సాధారణంగా తలెత్తే అసమానతలని తన కథల్లో ప్రతిభావంతంగా చిత్రించారు సీతారామయ్యగారు.

వివాహం విఛ్ఛిన్నం కావటం కూడా మన కథల్లో తరచు కనిపిస్తున్న కథాంశం. భర్తకు వేరే స్త్రీ (సాధారణంగా వయసులో చిన్నదైన శ్వేత జాతి వనిత) పట్ల ఏర్పడిన మోజు విడాకులకు దారి తీసినట్లుగా చాలా కథలలో చిత్రించబడింది. ఉద్యోగంలో పై అంతస్తులకు చేరడం, లేదా స్వంత వ్యాపారంలో అపారంగా గడించడం ఆ మగవారికి ఈ ధైర్యాన్ని ఇచ్చినట్లుగా కూడా చిత్రించబడింది. ఐతే, ఈ సబ్జక్టుని డీల్ చేసిన కథల్లోనూ కొన్ని విలక్షణమైన కథలున్నాయి. నిడదవోలు మాలతి గారి నిజానికీ ఫెమినిజానికీ మధ్య అనే కథలో భర్త అభ్యుదయ భావాలు కలిగినవాడిగా తనను తాను భావించుకుంటూ ఉంటాడు. ఆదర్శాల ముసుగులో ఇతర స్త్రీలతో ప్రేమకలాపాలు సాగిస్తూ, భార్యను మోసం చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నాడనే నిజం భార్య అతన్ని నిలదీసేదాకా గ్రహింపుకు రాదు. కాపురం చక్కబెట్టుకోవాలనే తాపత్రయం వేరు, ఒక స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం వేరు. ఆ తేడా స్పష్టంగా చూపించారు మాలతిగారు ఈ కథలో. మరొక కథలో (రచయిత, కథ పేరు రిఫరెన్సు అందుబాటులో లేదు) ఇరవయ్యేళ్ళుగా అమెరికాలో ప్రవాసం ఉండిపోయిన భార్య భారత్ లో జరుగుతున్న ఎన్నో పెళ్ళిళ్ళు మిస్సై పోతున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాను, విడాకులివ్వు అనడిగిన భర్తతో – ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన ఊరి గుళ్ళోనే పెళ్ళి చేసుకోండి. కనీసం ఓ పెళ్ళి చూసిన ఆనందమైనా నాకు దక్కుతుంది – అంటుందామె. ఇది కూడా తనకి చేతనైన విధంగా ఆమె తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడమే!

ప్రమీల సూర్యదేవర రాసిన తోడునీడా అనే కథలో విడాకులు, తదనంతరం ఆ మహిళ సమాజంలో ఎదుర్కొనే వివక్ష, ఇంకా మళ్ళి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎదురయ్యే సమస్యలను చిత్రించే ప్రయత్నం చేశారు. ఈ కథలో వర్ణించిన సన్నివేశాలు ఎంతో సహజంగా ఉన్నా, కథా నిర్మాణంలో రచయిత్రి తగిన శ్రద్ధ చూపక కొంత అయోమయంగా తాయారయింది. సోమసుధేష్ణ రాసిన చైతన్యం అనే కథ కూడా విలక్షణమైనది. ఈ కథని నేను పది పన్నెండేళ్ల క్రితం మొదటి సారి చదివాను. శ్వేతవనిత మోజులో భర్త విడాకులు తీసుకుని వెళ్ళిపోతే ఆ స్త్రీ నిలదొక్కుకుని, అవసరమైన చదువు నేర్చుకుని మంచి ఉద్యోగమూ, ఇల్లూ సమకూర్చుకుని హాయిగా బతుకుతున్న సమయంలో ఒంటరి అయిన ఆ మాజీ భర్త మళ్ళీ ఆమెకి దగ్గరవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. పెద్దవారైన కూతుళ్ళిద్దరూ కూడా ఆయనకి సాయం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. స్త్రీ పురుష సంబంధంలా వొద్దుకానీ ఒక స్నేహితుడిగా నీతో స్నేహం చెయ్యడానికి నాకు అభ్యంతరం లేదు – అని ఆ స్త్రీ అన్నట్లు చిత్రించిన ఈ కథని మొదటి సారి పది పన్నెండేళ్ళ కిందట చదివినప్పుడు నాకు ఆ స్త్రీ పాత్ర మీద పిచ్చి కోపం వచ్చింది. కథ చివర్లో ఆమె అలా అనడం ఒక బలహీనతగా నాకు అప్పట్లో అనిపించింది. కానీ రచయిత్రి ఆ స్త్రీమూర్తిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో, మానసిక స్థైర్యంతో తీర్చి దిద్దారని తోచింది ఇప్పుడు మళ్ళీ చదివితే. మొత్తానికి విడాకుల అనంతర జీవితంలోని సంక్లిష్టతని పలుచన చెయ్యకుండా రాసిన ఒక మంచి కథ ఇది.

యువతీయువకులు తమంత తాము జీవితభాగస్వాములను వెతుక్కునే ప్రయత్నాలను గురించి రెండు తమాషా కథలు నా దృష్టిలో పడ్డాయి. విప్లవ్ రాసిన ఎంగేజిమెంట్ అనే కథలో అమెరికాలో పుట్టిపెరిగిన జంట తొలిచూపులో నచ్చారులే అనుకుని, ప్రధానం జరుపుకుని, దూరాభారపు సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కొంత ప్రయత్నం చేసి ఇహ లాభం లేదని చేతులెత్తేయడం కనిపిస్తుంది. దీనికి జవాబుగా రాశారేమో అన్నట్టు నోరి రాధిక రాసిన తోడు అనే కథలో భారత్ నించి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న జంట, ముందు స్నేహితులుగా ఉండి, పెళ్ళి గురించి రకరకాల అపోహలతో భయపడుతూనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనే నిశ్చయానికి వచ్చి పెళ్ళి చేసుకోవడం చూపారు. రెండు కథలలోనూ పాత్ర చిత్రణ సహజంగా ఉన్నా, అమెరికా జంట పైపై విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టు చిత్రించడం ఒక ప్రతీకయేమో అనే అనుమానం రాకమానదు, అందులోనూ ఈ రెండు కథలనూ పక్కపక్కన పెట్టి చూస్తే.

అలాగని అన్నీ సమస్యలూ బాధలే కాదు, చక్కని వైవాహిక జీవితాలను చిత్రించిన కథలు కూడా చాలా ఉన్నాయి. చంద్ర కన్నెగంటి రాసిన సత్యం అనే కథలోనూ, లలిత జొన్నాళ్ రాసిన అభ్యాగతుడు కథలోనూ అన్యోన్యమైన దాంపత్యం కనిపిస్తుంది. వివాహం కాక ఇంకేవో విషయాల గురించి రాసిన కథల్లో నేపథ్యంగా హృద్యమైన దాంపత్య జీవన చిత్రణలు మనకు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లాగా కీచులాడుకోవడం, అలకలు, బతిమాలడాలు, సర్దుకుపోవటాలు, ఒకరినొకరు అర్ధం చేసుకుని, అవతలి వాళ్ళకి ఏదైనా సమస్య మీద పడినప్పుడు ఆసరాగా ఓదార్పుగా ఉండడం – ఈ వెరైటీలన్నీ మనకి ఈ కథల్లో కనిపిస్తున్నాయి, నిజజీవితంలో లాగే.

చివరిగా అసలు వివాహ వ్యవస్థనే ప్రశ్నించిన ధీర వనిత నందిని కథని గురించి చెప్పుకోవాలి. భారత్ లో సాంప్రదాయక కుటుంబంలో పుట్టి పెరిగినా, చిన్నప్పటినించీ చదువే ధ్యేయంగా, అటుపైన తన పనే ఆరాధ్య దైవంగా పెరిగిన నందిని ఎప్పుడూ ప్రేమ గురించీ పెళ్ళి గురించీ పట్టించుకోలేదు. ఉద్యోగం కోసం అమెరికావచ్చి స్థిర పడటం ఆమెకి అంతకు మునుపులేని ఒక స్వేఛ్ఛని ఇచ్చింది. ఆమె వ్యక్తిత్వం స్థిరపడిన కొద్దీ ఆమెకు పెళ్ళి పట్ల విముఖత దృఢమవుతుంది. అలాగని ఆమె ఫెమినిస్టు సిద్ధాంతాలను గుప్పించదు. అన్ని విషయాల్లోనూ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. కథ ముగింపు అంత కన్విన్సింగ్ గా అనిపించదు గానీ, ఒక మధ్య తరగతి ఆధునిక యువతి పెళ్ళిని గురించి ఎదుర్కునే సందిగ్ధాల సంక్లిష్టతని నందిని పాత్ర ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాడు మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు.

అమెరికా జీవితం వల్ల వివాహ బంధం మీద విచిత్రమైన వత్తిళ్ళు వస్తున్నాయన్నది నిజం. ఈ వత్తిళ్ళ ప్రభావాలను అమెరికా తెలుగు కథకులు బాగానే పట్టుకున్నారు. ఐతే ఈ సమస్యలను అర్ధం చేసుకుని విశ్లేషించే ప్రయత్నంలోనే కొన్ని సంచిత భావజాల ప్రభావాలు మనలను వదిలి పెట్టడం లేదు. పక్కనున్న సమాజాన్ని గురించి లోతైన అవగాహన కంటే స్టీరియోటైప్ లతో కూడిన అపోహలే మన కథనాలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అలాగే కథలు రాసేది సాధారణంగా తొలితరం వలసవారు కాబట్టి మలితరం పాత్రల చిత్రణ కూడా అపోహల నీడలో మసకబారుతున్నాయి. జీవితంలోని సహజ సంక్లిష్టతలను పలుచన చెయ్యకుండా కొన్ని మంచి కథలు వచ్చాయి. ఏదేమైనా ఈ కథలు ఒక రెండు తరాల వలస ప్రజల ఆశలను ఆశయాలనూ అక్షరబద్ధం చేసిన సోషల్ డాక్యుమెంటరీలు.

 -ఎస్. నారాయణస్వామి

 nasy

On an autumn night

autumn

Painting : Aruna

నీలోపలి వణుకు చూసే
గదినిండా చలి
నీ చేతుల్ని వెలిగించింది
చీకటి
**
నీ పిలుపువిని
నదుల్లోపలి ప్రతిధ్వనిలో
హృదయాన్ని దాచుకుని-
నీ సరిహద్దులు తెలీక
దిగంతరేఖని చెరిపివచ్చాను.
**
నీ పరిమళం భూమినిండాలని
గాలి తనని తాను చీల్చుకుపోయింది.
నంద కిషోర్

నందకిశోర్

 

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

painting: Mamatha Vegunta

painting: Mamata Vegunta

 

సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి..

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు

లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.

ఒడిసిపట్టుకున్న నీరెండల్ని తోసేసుకుంటూ
కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

మర్చిపోయాననుకున్న నవ్వుల్నీ
మామూలైపోయానుకున్న బెంగల్నీ
ఇష్టమైన పాటలోని నచ్చిన పదాల్లాగా
మళ్ళీ మళ్ళీ వినిపించకపోతేనేం!?

నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి
వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?

వద్దు వద్దు ఈవేళప్పుడొద్దని మొత్తుకుంటున్నా
మొదలయ్యే వాన..
మాటల లెక్కలూ, పంతాల బేరీజులూ
లోపలంతా ఒకటే వాన
తడిచి తడిచి చిత్తడి అయినా
మట్టిపాత్ర దాహాన్ని తీర్చనూలేక.. ఒడుపుగా మూయనూలేకా
ఎందుకొస్తాయో కొన్ని రాత్రిళ్ళు!

ఏదో లేనితనమా లేక ఏమీ మారనితనమా?

సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని
చీకట్లోకి చాచీ చాచీ ఉంచిన చేతుల్ని
ఖాళీగా వెనక్కి తీసుకునేంతలో…

ఆకుల మధ్యలో గాలీ
గూళ్ళల్లో పక్షులూ
విత్తనం చిట్లిన చప్పుడూ
అన్నీ సద్దుమణుగుతాయి

లీలగా మెదిలే పేదరాసి పెద్దమ్మ కధ
మగత మబ్బులో మెల్లగా చుడుతుండగానే
ఉన్నట్టుండి అమ్మ గుర్తొస్తుంది
అమ్మ కొచ్చిన జొరమూ గుర్తొస్తుంది!

ఒక్కసారిగా వణికించిన దిగులుకైనా తెలుసో లేదో

కొన్ని రాత్రుళ్ళు ఎందుకొస్తాయో?
వచ్చి వలయాలై ఎందుకు తిరుగుతాయో!?

                                            -నిషిగంధ