Archives for November 2014

సముద్రానికి కోపం వచ్చింది!

 varavara.psd-1

సముద్రానికి కోపం వచ్చింది. నేను చాల ఇష్టపడే సముద్రానికి. నను ప్రేమించిన సముద్రానికి.

సముద్రానికి కోపం వచ్చింది. నీళ్లను ఆక్రమించినవాళ్ల మీద. తీరాన్ని దోచుకున్నవాళ్ల మీద. ఇసుక తోడుతున్నవాళ్ల మీద. చెట్లు కొట్టేసే మనుషుల మీద కోపం వచ్చి చెట్లన్నీ ఊడ్చేసింది. గాలికి తలుపులు మూసుకునే వాళ్ల తలుపులు విరగదన్నింది. మనుషుల్ని పెద్ద మనసుతో క్షమించి ఆస్తుల్ని ధ్వంసం చేసింది.

సముద్రానికి కోపం వచ్చింది. నేను నిష్కారణంగా నవయవ్వనం నుంచి ప్రేమిస్తున్న సముద్రానికి. నేను తనలో ప్రకృతినీ, మనిషినీ పోల్చుకుని ప్రేమించిన సముద్రానికి.

నేనింకా ఎం.ఎ. లో, తాను బి.ఎ. లో ఉండగా నేనూ నా ప్రాణస్నేహితుడు పిచ్చిరెడ్డీ జీవితంలో ముగ్గుర్ని చూడాలనుకున్నాం – చలం, శ్రీశ్రీ, సముద్రం. మా పిచ్చి భరించలేని స్నేహ బృందం మూడూ కలిసొచ్చేలా 1961లో మమ్మల్ని అరుణాచలం పంపించారు. అప్పుడు మొదటిసారి మద్రాసు సముద్రాన్ని చూసాం. శ్రీశ్రీని ఆయన ఇంట్లో చూసాం. చలాన్ని రమణస్థాన్ లో.

సముద్రాన్ని దాని సార్థక అర్థంలో శ్రీశ్రీ అరవై ఏళ్ల సభలో 1970లో విశాఖలో చూసాను. ఇంక అప్పటినుంచీ విశాఖ సముద్రం నన్ను ఆవహించింది. సీసాండ్స్, సిరిపురం క్వార్టర్స్, ఏరాడ కొండ, భీమ్లీ, విజయనగరం, శ్రీకాకుళం దాకా బీచ్ రోడు. హెమింగ్వే ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ ని తలపించే చలసాని ప్రసాద్ నలభై నిమిషాలు ఈదిన లాసన్ బే పాయింట్ భయం గొలిపే సుడిగుండం దరి. విరిగిపడుతున్న కెరటాల మధ్యన రాళ్లపై కూర్చొని ‘సముద్రం’ చదువుతూ దృశ్యీకరించుకోవాలని తీర్చుకున్న కోరిక.

సముద్రం ఒక భావన నుంచి నాలో అక్షరాకృతి దాల్చడం 1981లో ప్రారంభమైంది. కలకత్తా నుంచి వచ్చి విశాఖలో దిగి సీసాండ్స్ లో కృష్టక్కతో చెప్పి ఒక్కణ్నే సముద్రం దగ్గరికి వెళ్లి మధ్యాహ్నం దాకా కూర్చున్నాను.

నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ

నా రక్తం ప్రతిధ్వనిస్తున్న సముద్ర నిశ్వాసాన్నీ

నా ఊపిర్లు ప్రతిస్పందిస్తున్న సముద్ర విశ్వాసాన్నీ విను.

విచిత్రంగా రెండవసారి ఉస్మానియా రీసర్చ్ స్కాలర్స్ హాస్టల్ లో గుడిహాళం రఘునాథం రూంలో సముద్రం నన్ను ఆవహించింది. మా మేనల్లుడు కొండన్న (రామగోపాల్), ఇంకా కొందరు విద్యార్థులు కలిసి అర్ధరాత్రి గడిచాక తార్నాకకు వెళ్లి ఎప్పటివలెనే చాయ్ తాగి వస్తున్నాం. ఎబివిపి వాళ్లు చూపింది నన్నయితే, నా వెనుక బ్యాచ్ లో వస్తున్న రీసర్చ్ స్కాలర్ రామకృష్ణపై కత్తితో దాడి చేసారు దుండగులు. అది మాకు హాస్టల్ కు చేరాకగానీ తెలియలేదు. ఆ రాత్రంతా సంచలనం. హల్ చల్. నేను రఘునాథం రూంలో పడుకున్నాను. పడుకోలేదు.

గదిలో కూర్చొని సముద్రాన్ని రాయబోతే

కాళ్ల కింద నీళ్లు

సముద్రపు మంటలాగ కళ్లల్లో నీళ్లు

ప్రజాసముద్రపు బాధల్లాగ.

‘శ్రీకాకుళాన్ని నెమరేసే కరీంనగర్ లాగ’ అని వాచ్యం అయిపోయావు అన్నాడు ఆ తర్వాత కాలంలో శివసాగర్. అది సముద్రం 2 ‘అగాథ సముద్రం’.

1982 ఆగస్టు నాటికి సముద్రం నన్ను మనిషయి ఆవహించింది.

‘సముద్రం నా వ్యసనమైంది.

సముద్రం నా గాయం, నా అవ్యక్త గేయం’ అయింది.

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో పులి అంజయ్య నాయకత్వంలో రాడికల్స్ కూ ఎబివిపికీ ఘర్షణలు. బయట నర్సంపేట, నల్లబెల్లిల నుంచి హనుమకొండ కుమార్ పెల్లి దాకా జన్ను చిన్నాలు స్ఫూర్తి కేంద్రంగా రాడికల్స్ కూ సిపిఎం వగైరా రాడికల్ వ్యతిరేక శక్తులకూ ఘర్షణల మధ్య నా కాలేజికి రాకపోకలు మాత్రమే కాదు, ఇంట్లో ఉండడం కూడ ఉద్రిక్తంగా మారిన రోజుల్లో రాసిన కవిత ‘సముద్రం నా తీరం.’

‘నేను సముద్రంలోనే ఉన్నాను’ కాని ‘నేనింకా సముద్రాన్ని కాలేకపోతున్నాను.’

భూమిహారులు నన్ను సముద్రంలో పోల్చుకున్నారు

యుద్ధం నేను ఏ పక్షమో తేల్చుకుంది

సముద్రం ఆటుపోట్లలోని

అలను నేను కలను నేను కలతను నేను

గొప్పశాంతి కోసం మహా సంక్షోభంలో

స్వేచ్ఛను కోల్పోయిన సముద్రాన్ని నేను

సముద్రం స్వేచ్ఛలో సత్యమైన స్వేచ్ఛలో

స్వేచ్ఛను వెతుక్కుంటున్న నీటి చుక్కను నేను (సముద్రం -5)

మళ్లీ అటువంటి మానసిక స్థితిలోనే ఇవ్వాళ నన్ను ‘సముద్రం’ ఆవహించింది.

1977లో దివిసీమలో ఉప్పెన వస్తే డాక్టర్ రామనాథం నాయకత్వంలో మేం వెళ్లాం. ఆయనతోపాటు వెళ్లిన మనుషుల, పశువుల డాక్టర్లు నెలరోజులపాటు అక్కడ శిబిరాలు నిర్వహించారు. ఆ వివరమైన రిపోర్ట్ ‘సృజన’ ప్రచురించింది.

అప్పటికి ప్రభుత్వానికి ‘కల్లోలిత ప్రాంతాలు’ ప్రకటించడం, ఎన్ కౌంటర్లు చేయడం, ఎమర్జెన్సీ పెట్టడం తెలిసినంతగా ఉప్పెనకూ తుపానుకూ మధ్య ఉండే తేడా ఏమిటో తెలియదు. అందువల్ల వేలాదిమంది మరణించారు. కాని మత్స్యకారులు సాహసోపేతంగా ఉప్పెనతో పోరాడి వందలాది మందిని బతికించారు. ప్రజలు పోరాడి హక్కులు సాధించుకున్నారు.

ఇప్పటి ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ల నుంచి కోవర్టు హత్యల దాకా తెలివిమీరాయి. అప్రకటిత ఎమర్జెన్సీ అచిరకాలం అమలు చేయడం నేర్చుకున్నాయి. సముద్రంలో తాము సృష్టించిన సంక్షోభానికి ‘హుదూద్’ అని పేరు పెట్టి పక్షిమీదికి తోసేయడం నేర్చుకున్నాయి. మనుషుల్ని అప్రమత్తుల్ని చేసి కాపాడిన పొగడ్తలు తెచ్చుకున్నాయి.

అప్పుడూ ఇప్పుడూ మనుషులు, సామాన్య మానవులు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో పరస్పర స్నేహ సహకారాలతో తమను తాము సంరక్షించుకుంటున్నారు.

ఏమున్నది సముద్రం

నీళ్లూ ఉప్పూ ఉప్పెనా తప్ప

ఏమున్నది జీవితం

చీమూ నెత్తురూ పోరాటం తప్ప.

– వరవరరావు

ఫ్లారెన్స్ టు పీసా!

 image1

నాకు ఎప్పటినించో ఫ్లారెన్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ వున్న చారిత్రాత్మక ప్రదేశాలని చూడాలని కోరికగా వుండేది. ఎందుకంటే, ఆ ప్రదేశం ‘రెనెసాన్’ ఉద్యమం పుట్టిన ప్రదేశం. ‘రెనెసాన్’ కాలంలో వెలిగిపోయిన చిత్రకళా వైభవం, శిల్పకళా సౌందర్యం మనమిక్కడ ఇంకా చూడవచ్చు. రొమ్ నగరంలోలా కాకుండా, ఇక్కడ వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు.

ఫ్లారెన్స్ దగ్గరే వున్న పీసా కూడా చూస్తే, ఒకే దెబ్బకు రెండు పిట్టలనుకుని, రైల్లో ఫ్లారెన్స్ వెళ్ళాం. ముందుగానే అక్కడ ఏమేం చూడాలో తెలుసుకున్నాం కనుక, వెళ్ళగానే ఇక రంగంలోకి దిగాం.

ముందుగా ఫ్లారెన్స్ చరిత్ర కొంచెం తెలుసుకుందాం.

ఫ్లారెన్స్ క్రీస్తు పూర్వం 80వ శతాబ్దంలోనే ఫ్లుయంషియా అనే పేరుతో రోమన్ సామ్రాజ్యంలో ఒక ప్రాంతంగా వుండేది. దరిమిలా అది ఫ్లొరెంషియాగా పేరుపడింది. అదే ఈనాటి ఫ్లారెన్స్.

ఫ్లారెన్స్ 14-16 శతాబ్దాలలో, ఇటాలియన్ రెనసాన్ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది. సాంస్కృతిక పరంగానే కాకుండా, రాజకీయ, ఆర్ధికపరంగా కూడా ఫ్లారెన్స్ ఎంతో ప్రముఖంగా వున్నది. మతపరంగా సరేసరి!

ఆ రోజుల్లోనే ఫ్లారెన్స్ ప్రాంతం, యూరప్లోని ఎన్నో దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం వారి ‘వంద సంవత్సరాల యుద్ధానికి’ కూడా పెట్టుబడి పెట్టింది.

ఈ దేశ చరిత్ర గురించి ఇంకా ఎక్కువగా వ్రాయటం లేదు. శ్రీశ్రీ అన్నట్టు ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, పర పీడన పరాయణత్వం..’ అని. కాకపొతే ముఖ్యమైన కొంత ఉపోద్ఘాతం, తరువాత ఈనాడు అక్కడ మనం చూడగలిగే కళాత్మక విశేషాలు మాత్రం చెబుతాను.

ఫ్లారెన్స్ ఇటలీలోని టస్కనీ ప్రాంతానికి రాజధాని. టస్కనీ ప్రాంతంలో వున్న ఫ్లారెన్స్ రాష్ట్రానికి కూడా ఇదే రాజధాని. 102 కిలోమీటర్ల (40 చదరపు మైళ్ళ) వైశాల్యం. సముద్ర మట్టానికి 50 మీటర్ల (160 అడుగుల) ఎత్తున వుంది. ఇక్కడ జనాభా మూడున్నర లక్షల పైన. ఫ్లారెన్స్ మెట్రో ప్రాంతం కూడా కలుపుకుంటే ఒకటిన్నర మిలియన్లు. అంటే 15 లక్షలు. ప్రపంచం నలుమూలలనించీ ఇక్కడికి సంవత్సారానికి 18 లక్షల నించీ, 20 లక్షల మంది దాకా యాత్రీకులు వస్తారుట. దీన్ని ప్రపంచంలోనే ఎంతో అందమైన నగరాల్లో ఒకటి అని ‘ఫోర్బ్స్’ పత్రిక కీర్తించింది.

ఆ సన్నపాటి సందుల్లో, ఇటూ అటూ ఎత్తుగా వున్న భవనాలూ, వాటిలోనించీ బయటికి రాగానే, పెద్ద పెద్ద రోడ్లూ, ఫౌంటెన్లూ, మధ్యే మధ్యే ఎంతో అందమైన శిల్పాలూ.. చాల శుభ్రంగా వుండే చక్కటి నగరం ఫ్లారెన్స్.

ఇక్కడ చూడదగ్గ విశేషాలలో, మొట్టమొదటిది “ఎకాడమియా”.

మాకు అక్కడవున్న క్యూలో నిలబడి లోపలికి వెళ్ళటానికి రెండు గంటలు పట్టింది. కానీ లోపలికి వెళ్ళాక అంతసేపు వేచి వుండటం మంచిదే అనిపించింది. మైకలాంజెలో చెక్కిన అందమైన శిల్పాలు ఎన్నో వున్నాయి అక్కడ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పం “డేవిడ్” ఇక్కడే వుంది. చేతి వేళ్ళల్లో, కాళ్ళల్లో నరాలు కూడా కనిపిస్తాయి. ఎన్నో చిన్నచిన్న వివరాలని కూడా మైకలాంజెలో ఎంతో కళాత్మకంగా జాగ్రత్తగా చెక్కిన శిల్పం ‘డేవిడ్’.

ఇంకా ఎన్నో చక్కటి శిల్పాలు చూడాలంటే వెళ్లవలసిన ప్రదేశం ‘ది గల్లేరియా డిగ్లి ఉఫ్ఫిజి’. అక్కడ చాల ప్రఖ్యాతిగాంచిన బాటిచెల్లి, డవించి, రాఫయేల్, మైకలాంజెలో మొదలైన వారి శిల్పాలు ఎన్నో వున్నాయి. అన్నీ తెల్లటి పాలరాతిలో చెక్కినవే!

‘పొంటె శాంట ట్రినిట’ బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎంతో పురాతనమైన బ్రిడ్జ్. ‘బార్తలోమియో అమ్మనాటి’ అనే ఆయన కట్టిన అందమైన బ్రిడ్జ్. రెండవ ప్రపంచ యుద్ధంలో పాడయిపోయినా, దాన్ని మళ్ళీ ఏమీ మార్పులు చేయకుండా బాగుచేసారు.

image2

ఫౌంటెన్ ఆఫ్ నెప్ట్యూన్ ఎంతో బాగుంటుంది. 1565వ సంవత్సరంలో ప్రముఖ శిల్పి ‘బార్తలోమియో అమ్మనాటి’ చెక్కిన అందమైన శిల్పాలతో నిర్మించిన నీటి ఫౌంటెన్.

 

image3

ఇంకా ఇక్కడ చూడవలసినవి, నేషనల్ మ్యూసియం ఆఫ్ బార్గెల్లో. లోపలా బయటా కూడా ఇక్కడ ఎంతో అందంగా వుంటుంది, ఆ కట్టడాలు, శిల్పాలు. ఇక్కడే నా కేరికేచర్ బొమ్మ కూడా ఒకటి గీయించుకున్నాను.

తర్వాత ‘మెర్కాటో నోవో’ అంటే కొత్త బజారు. మైకలాంజెలో స్క్వేర్. పియాజా డెల్లా సిగ్నోరియా. ఇది ఎంతో పేరు పొందిన ప్రదేశం. ఎన్నో శిల్పాల మధ్య, చుట్టూ పెద్ద పెద్ద భవనాలతో, షాపులతో, హోటళ్ళతో, ఎంతోమంది యాత్రీకులు సందడి చేసే ప్రదేశం. శాంటా మారియా డెల్ కార్మిన్ చర్చితో సహా ఎన్నో కాథలిక్ చర్చిలు. మీకు ఎంత సమయముంటే అన్ని చర్చిలు వున్నాయిక్కడ!

పీసా అనే వూరు ఇక్కడికి దగ్గరే. రైలులో వెడితే ఒక గంట ప్రయాణం. ఒకరోజు పొద్దున్నే వెళ్లి, సాయంత్రానికి తిరిగి రావచ్చు.

పీసా టస్కనీ ప్రావిన్స్ లోనే, ఆర్నో నది పక్కనే వుంది. 88 వేల మంది జనాభాకి, ఇరవై పైన చర్చిలు వున్నాయిట ఇక్కడ!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ గలీలియో పుట్టి, పెరిగింది ఇక్కడే.

అంతేకాదు. మనందరికీ పరిచయమైన ‘లీనింగ్ టవర్’ కూడా ఇక్కడే వుంది! దాన్ని నా భాషలో ‘వంకర టింకర శిఖరం’ అంటాను.

చాలామంది, కావాలని ఇలా వంకరగా కట్టింది ఈ శిఖరం అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

క్రీస్తు శకం 1173లో మొదలు పెట్టి, 1372లో ఈ టవర్ కట్టటం పూర్తి చేసారు. అంటే దీన్ని కట్టటానికి రెండు వందల ఏళ్లు పట్టిందన్నమాట. ఈ శిఖరం ఎత్తు క్రింది వేపు 55.86 మీటర్లు (183.27 అడుగులు). పై వేపు 56.67 మీటర్లు (185.93 అడుగులు). పదహారు వేల టన్నుల బరువు. ఎనిమిది అంతస్తుల కట్టడం. మొత్తం 296 మెట్లు వున్నాయి. ఇది ఒకప్పుడు 5.5 డిగ్రీలు వంగి వుండేది. కానీ ఇప్పుడు 3.9 డిగ్రీలు వంగి వుంటుంది.

ఈ శిఖరం కట్టేటప్పుడు నిలువుగానే కడదామనుకున్నారుట. కానీ కడుతున్నప్పుడు నేల మరీ మెత్తగా వుండటం వల్ల, పునాది సరిగ్గా లేక, ఒక పక్కకి వంగటం మొదలుపెట్టింది. అలా వంగటం మొదలు పెట్టిన టవర్ పూర్తి ఆయే సమయానికి, కొంచెం ఎక్కువగానే వంగింది. కానీ దాని గురుత్వ కేంద్రం (Center of Gravity), భూమి మీద ఆ టవర్ వ్యాసం పరిధిలోనే (within the base diameter) వుండటంతో, అది కూలిపోకుండా నిలబడింది. అప్పుడు ఇంజనీర్లు, దానికి అలాగే నిలవటానికి ఇంకా బలం ఇచ్చేటట్టు మార్పులు చేసి, దాని కాళ్ళ మీద దాన్ని నిలుపగలిగారు. అలా మొదలైన లీనింగ్ టవర్, ఎన్నో లక్షలమంది యాత్రీకులని ఆకర్షిస్తున్నది. అదీ కథ.

image4

మీకు స్టీవ్ రీవ్స్ నటించిన పాత ‘సూపర్ మాన్’ సినిమా గుర్తుందా? దాంట్లో ఒక చక్కటి హాస్య సన్నివేశం వుంది. పీసా టవర్ పక్కనే ఒకతను చిన్న చిన్న పింగాణీవి, వంగిన టవర్లు అమ్ముతుంటాడు. ఆకాశంలో ఎగురుతూ వెడుతున్న సూపర్ మాన్, వంగిపోయిన టవర్ని చూసి దిగి వస్తాడు. అది పడిపోతున్నదనుకుని, నిఠారుగా నిలబెట్టి వెళ్ళిపోతాడు. అది చూసి షాపు అతను, ఏం చేయాలో తెలియక, షాపులోని పింగాణీ టవర్లు అన్నిటినీ విసిరి పగలగొట్టేస్తాడు. మళ్ళీ నిఠారుగా నిలుచున్న టవర్లు తయారు చేయించి, అమ్మకం మొదలు పెట్టబోతుంటాడు. తన తప్పు గ్రహించిన, సూపర్ మాన్ తిరిగి వచ్చి, టవర్ని ముందు ఎలా వంగి వుందో అలాగే వంచి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. షాపు అతనికి మళ్ళీ ఏం చేయాలో తెలీక, తన పింగాణీ టవర్లని కోపంతో విసిరేసి పగలకొడతాడు. ఎంతో హాస్యభరితంగా చిత్రించిన సంఘటన. అది గుర్తుకి వచ్చింది ఆ టవర్ పక్కనే గడ్డిలో పడుకుని, విశ్రాంతి తీసుకుంటుంటే!

image5

ఆ టవర్ మీదే ఒక బొమ్మ చూస్తే, ఉత్సాహం వచ్చి పై ఫోటో తీశాను. మానవ పరిణామ సిద్దాంతం ప్రకారం (Theory of Evolution), మనం కోతులలోనించీ వచ్చాం. దాన్నే చక్కగా పీసా టవర్ మీద చెక్కారు. ఇద్దరు కోతి మనుష్యులు, పూర్తిగా రూపాంతరం చెందకముందు, తోకలతో కూర్చున్న శిల్పం. అది నాకు బాగా నచ్చింది.

– సత్యం మందపాటి

 

 

తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

  375px-Statue_of_Kannagi

తమిళ పంచకావ్యాలలో మొదటిది శిలప్పదిగారం. మహాకవి ఇళంగో వడిగళ్ ఈ కావ్యాన్ని రచించాడు. చేర రాజకుమారుడైన ఈయన బుద్దుడి లాగానే రాజ్యాన్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఇళంగో వడిగళ్ తన సోదరుడైన చేర రాజ్యపు రాజు చేరన్ సెంగట్టువన్, వారి ఆస్థాన కవి శీతలై శాత్తనార్ లతో కలిసి కొండ ప్రాంతానికి వాహ్యాళికి రాగా ఆ ప్రాంతపు గిరిజనులు ‘ఒక యువతి తన భర్తతో కలిసి విమానంలో ఆకాశమార్గాన వెళ్ళడం చూశామనీ, ఆ వింత వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలగజేసిందనీ, ఆమె ఎవరో మీకు తెలిస్తే చెప్పండనీ’ ఆసక్తిగా అడిగారు.  

మధురానగరంలో కణ్ణగికి జరిగిన అన్యాయాన్ని అప్పటికే చారులు ద్వారా విన్నాడేమో మహాకవి శీతలై శాత్తనార్ ఆ యువతి పేరు కణ్ణగి అనీ, ఆమె భర్త పేరు కోవలుడనీ తెలిపి వారి వృత్తాంతాన్ని అందరికీ వివరంగా చెప్పాడు. అది విన్న ఇళంగో వడిగళ్ కణ్ణగీకోవలుల చరిత్రని శిలప్పదిగారం పేరుతో కావ్యంగా రచించాడు.

ఇళంగో జైనుడు అయినప్పటికీ ఈ కావ్యంలో శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ చేసిన వర్ణనలు ఆళ్వారుల భక్తి గీతాలని పోలి ఉన్నాయనీ, కొన్ని గీతాలలో నిసర్గ భక్తి భావం కనిపిస్తుందనీ అంటారు.   ఈ కావ్యంలో చాలా వరకు జానపద గేయ ధర్మాలు కనిపిస్తాయట. అన్ని మతాలను గౌరవించిన వాడిగా ఈ కావ్యకర్తని గౌరవిస్తారు తమిళులు.

శిలంబు అంటే గజ్జె. (అందియ, మంజీరం). అదిగారం అంటే అధ్యాయం. కాలి అందియ వలననే ప్రాణాలు కోల్పోయిన ఆ భార్యాభర్తల జీవితం గురించిన కథ కనుక ఈ శీర్షిక ఎంతో సముచితమైనదని అందరూ భావిస్తారు. ఈ కావ్యం పుహార్ కాండం, మధురై కాండం, వంజి కాండం అని మూడు కాండాలుగా విభజింపబడి ఉందిట. ఈ కావ్యం క్రీ.శ రెండవ శతాబ్దానికి చెందినది. ఈ కథ చోళ, పాండ్య, చేర రాజ్యాలకి సంబంధించినది. చోళ రాజ్యంలో పుట్టి, పాండ్య రాజ్యంలో తన భర్త ప్రాణాలు కోల్పోగా చేర రాజ్యానికి చేరి అక్కడ తన భౌతిక కాయాన్ని త్యజించిన ఈ కావ్య నాయకి కణ్ణగి చరిత్ర పవిత్రమైనదిగా పేరొందింది.

ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎమ్ ఎ – తెలుగులో ఈ కావ్య చరిత్ర ని పాఠ్యాంశంగా చదువుకున్నప్పటినుండీ ఈ కథని చాలా మందికి చెప్పాను. ఈ కథని వినని సారంగ పాఠకులకు కూడా పరిచయం చేయాలనిపించి ఆ కథని సంగ్రహంగా రాశాను.   ఇప్పటికే చాలా మందికి ఈ కావ్య విశేషం, విశిష్టతల గురించి తెలిసి ఉండవచ్చు. వారు వారి అభిప్రాయాలని పంచుకోవలసిందిగా కోరుకుంటున్నాను.

                                                        కథాసంగ్రహం

1.

చోళ చక్రవర్తులలో గొప్పవాడైన కరికాలచోళుని రాజధాని పుహార్ పట్టణం. ఈ పట్టణంలో నివసించే ప్రముఖ వ్యాపారి కుమార్తె కణ్ణగి. రూపంలో, గుణంలో ఈమెకి ఈమే సాటి. ఆమెకి పెళ్ళీడు రాగానే తల్లిదండ్రులు ఆమెకి తగిన వరుణ్ణి వెతకసాగారు. ఆ నగరంలోనే ఉన్న మరో వ్యాపారి కొడుకైన కోవలుడుని తన కుమార్తెకి తగిన వరుడిగా నిర్ణయించారు. ఓ శుభ ముహుర్తాన కన్నుల పండుగగా కణ్ణగిని కోవలునకిచ్చి వివాహం జరిపించారు. కణ్ణగీకోవలులు అన్యోన్యంగా జీవించసాగారు.

చోళ చక్రవర్తి అయిన కరికాలచోళునికి కళలంటే అత్యంతాసక్తి. ప్రతి ఏడాదీ చేసే ఇంద్రోత్సవాల్లో భాగంగా ఆ ఏడు ఆస్థాన నర్తకి మాధవి అనే అతిలోక సౌందర్యవతి నాట్య ప్రదర్శన ఇచ్చింది.

కరికాలచోళుడు ఆమె నాట్యానికి మెచ్చి ఆకుల హారాన్ని, బంగారు నాణాలని బహుకరించి సత్కరించాడు. ముందు వరుసలో కూర్చుని ఆమె నృత్యాన్ని తిలకిస్తున్న కోవలుడు ఆమె రూపానికి పరవశుడైనాడు. అతని మనసు పూర్తిగా ఆమె సౌందర్యానికి దాసోహమయిపోయింది. అతని మనసులో కణ్ణగిపై ఉన్న ప్రేమానురాగాలు మాయమై మాధవి పట్ల మోహంగా అవతరించాయి.   నాట్య ప్రదర్శనయ్యాక ఇంటికి బయలుదేరిన కోవలునకి ఒక ప్రకటన వినిపించింది.

“చక్రవర్తి గారు మాధవికిచ్చిన హారాన్ని వేలం వేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటారో వారికి మాధవి ప్రియురాలవుతుంది” అన్నదే ఆ ప్రకటన. కామ పరవశత్వంతో ఒళ్ళెరగని కోవలుడు ఆ హారాన్ని కొని మాధవి ఇంటికి వెళతాడు. కణ్ణగిని మర్చిపోయి పూర్తిగా మాధవికి వశుడవుతాడు.

తన భర్త వేశ్య వలలో చిక్కుకున్నాడని తెలిసిన కణ్ణగి శోక మూర్తియై రోదించసాగింది.

imgNdKannagi_01

మాధవిని కోవలుడు, కోవలుడిని మాధవి ఒక్క నిమిషమైనా ఎడబాయకుండా ఉన్నారు. మాధవి వేశ్య అయినా కోవలుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. వారి ప్రేమానురాగాల ఫలితంగా వారికి ఒక అమ్మాయి జన్మించింది. కూతురికి మణిమేఖల అని పేరు పెట్టుకున్నారు. కోవలుడు వ్యాపారాన్ని విస్మరించి మాధవితోనే కాలం గడపడం వలన అతని వ్యాపారం దెబ్బతింది. కుమార్తె పుట్టేనాటికే అతనికి ఉన్నదంతా, ఆఖరికి తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వారిచ్చిన నగలతో సహా ఊడ్చిపెట్టుకుపోయింది.

కోవలుడి సంపదంతా ఎప్పుడైతే కరిగిపోయిందో అప్పుడు మాధవి తల్లి చిత్రావతి కోవలుడిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కూతురికి చెప్పుడు మాటలు చెప్పడం, కోవలుడిని నిందావాక్యాలతో బాధ పెట్టడం పనిగా పెట్టుకుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండటం వలన ఆమె మాటలు పట్టించుకునే వారు కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ ఏడు చోళ రాజ్యంలో జరుపుకునే ఇంద్రోత్సవం పండుగనాడు మాధవీ కోవలులు సముద్రస్నానానికి వెళ్ళారు. స్నానమయ్యాక ఇసుకతిన్నెల మీద సేద తీరుతూ విశ్రమించారు. చల్లని సముద్రపు గాలి వారి మేనులను సృశిస్తోంది. ఆ వెన్నెలలో మాధవి మనోహర రూపం కాంతులీనుతోంది. కోవలునకి ఆమెని ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు. ఆ సమయంలో మాధవి అతన్ని ఓ పాట పాడమని కోరింది.

“ప్రేయసీ! నీ రూపం నన్ను దహించి వేస్తుంది. నువ్వు నన్ను వరించకపోతే నేను ఈ విరహాగ్నికి ఆహుతినై పోవడం నిజం” అనే అర్థం వచ్చేట్లు ఓ విరహగీతాన్ని ఆలపించాడు.

‘అతను ఎవరి కోసం ఈ పాట పాడుతున్నాడు? ఎవరా ప్రేయసి?’ అన్న అనుమానం ఆమెని పట్టి పీడించసాగింది. అయితే ఆమె తన అనుమానాన్ని వ్యక్తపరచలేదు. కొంచెం సేపయాక కోవలుడు మాధవిని పాడమన్నాడు. అనుమానం తద్వారా అసూయాద్వేషం తో మండుతున్న ఆమె మనసుకి అతన్ని రెచ్చగొట్టాలనిపించింది. అతను పాడిన దానికంటే ఎన్నో రెట్లు ప్రేమని కురిపిస్తూ ‘తను పాత ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్లూ, పూర్వం ఈ సైకత శ్రేణుల్లో ప్రియునితో కలిసిన రోజులను గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ ఆ మధురమైన క్షణాలు రావేమోనని దిగులు పడుతున్నట్లూ’ పాడింది.

ఆ పాటని విన్న కోవలుని హృదయం ఒక్కసారిగా బద్దలైనట్లనిపించింది. మాధవి తల్లి చిత్రావతి మాటలకి వేదనాభరితుడై ఉన్న కోవలుడు మాధవి పాడిన పాటతో తల్లడిల్లాడు. ‘ఈమెని నా దేవతగా ఆరాధించాను. ఈమె కోసం నన్నే నమ్ముకున్న నా భార్యని, నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని మరిచాను. వ్యాపారాన్ని నాశనం చేసుకుని బికారినైనాను’ అని అనుకోసాగాడు. ఆలోచించే కొద్దీ అతనిపై అతనికి అసహ్యం కలగసాగింది.

ఒక్క ఉదుటున కూర్చున్న చోటునుండి లేచి మాధవిని చీదరగా చూస్తూ అక్కడ నుండి నిష్క్రమించాడు. అతని కోపాన్ని, ఆవేశాన్ని, అసహ్యాన్ని కనిపెట్టిన మాధవి తను చేసిన పనికి పశ్చాత్తాప పడసాగింది. శోకతప్తహృదయినిగా మారింది.

3.

 

సౌందర్య దేవతగా ఉండే కణ్ణగిని శోకదేవతగా చూసిన కోవలుని హృదయం ద్రవించింది. ఆమెని పట్టుకుని విలపిస్తూ తన దైన్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. మాధవికి ఇవ్వడానికి ఏమీ లేదని విచారిస్తున్నాడనుకున్న కణ్ణగి “దిగులు పడకండి నా దగ్గరున్న ఈ మంజీరాలను తీసుకెళ్ళి ఆమెకివ్వండి” అంటూ తన కాలికున్న విలువైన అందెలను తీసి ఇవ్వబోయింది.

భార్య అన్న ఆ మాటలతో అతను మరింత సిగ్గుతో చితికిపోయాడు. భార్యకి క్షమాపణలు చెప్పుకుని “ధనవంతుడిగా బ్రతికిన ఈ రాజ్యంలో పేదవాడిగా ఉండలేను. మధురానగరానికి వెళ్ళి వ్యాపారం చేసి ధనం సంపాదించి తల్లితండ్రులను, అత్తమామలను కలుసుకుంటాను. పద బయలుదేరు” అన్నాడు. భర్త మాటకు ఏనాడూ జవదాటని కణ్ణగి అతని మాటలకి ఆనందభరితురాలై ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. దారి మధ్యలో సత్రాల దగ్గర, ఆరామాల దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటూ మధురానగరం వైపుకి నడవసాగారు.

ఇక్కడ మాధవి కోవలుని కోసం రేయంబవళ్ళు విలపిస్తోంది.   రోజులు గడుస్తున్నా అతను రాకపోవడంతో తనని క్షమించమని కోరుతూ ఉత్తరం రాసి నమ్మకమైన బ్రాహ్మణునకిచ్చి కోవలునకి అందజేయమని ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు కోవలుడు మధురానగరానికి బయలుదేరాడని తెలుసుకుని వేగంగా ప్రయాణించి మార్గమధ్యంలో కలుసుకుని ఉత్తరాన్ని ఇచ్చాడు. ఉత్తరాన్ని చదువుకున్న కోవలుడు “బ్రాహ్మణోత్తమా! నా అవివేకంతో మాధవిని అనుమానించి బాధపెట్టాను. త్వరలో వస్తానని చెప్పండి. నా తల్లిదండ్రులకి కూడా ఈ విషయాన్ని చెప్పండి” అని ముందుకు సాగాడు.

దారిలో కౌంతి అనే జైన యోగిని ఆశ్రమంలో విశ్రాంతి కోసం ఆగారు. కౌంతి యోగిని వారి గురించి తెలుసుకుంది. వారికి సహాయం చేయాలని ఆమెకెందుకనిపించిందో మరి ‘ముందంతా దుర్గమమైన అరణ్యమనీ, మంచి మార్గం తనకి తెలుసనీ, తాను కూడా మధురానగరానికి తోడుగా వస్తాననీ’ అంది.   అడక్కుండానే ఆమె చేస్తున్న ఆ సహాయానికి కణ్ణగీకోవలులు అనేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ రాత్రికి ఆమె ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు ముగ్గురూ కలిసి ప్రయాణం సాగించారు.

అందమైన ప్రదేశాలను, ఆహ్లాదభరితమైన పక్షుల కిలకిలారావాలను, దారిలో కానవచ్చే పల్లెపడుచుల ఆదరాభిమానాలను, వారు పాడుతున్న పల్లెపదాలను చూస్తూ, వింటూ కౌంతి యోగిని దారి చూపుతుండగా ఆమెని అనుసరించసాగారు కణ్ణగీకోవలులు.

వైఘనదిని దాటుకుని కొన్నాళ్ళకి క్షేమంగా మధుర మీనాక్షి కొలువై ఉన్న మధురానగరానికి చేరుకున్నారు. కౌంతి యోగిని శిష్యురాలైన మాధురి ఇంట్లో బస చేశారు. మాధురి వీళ్ళను ఆదరంగా ఆహ్వానించి భార్యాభర్తలు ఉండటానికి తగిన ఇంటిని, కావలసిన సామగ్రిని ఇచ్చింది.

ఆరోజు చాన్నాళ్ళ తర్వాత తన భర్తకి తన చేతులతో వంట చేసి వడ్డించింది కణ్ణగి. కోవలుడు తృప్తిగా భోంచేశాడు. కోవలుడు మాధవికిచ్చి కాజేయగా మిగిలి ఉన్న కణ్ణగి కాలి అందెల్లో ఒక దాన్ని అమ్ముకుని, వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలని వారిద్దరూ సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయాన్ని తీసుకున్న ఆ రాత్రి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రించారు.

మర్నాడు కౌంతి యోగినికి అనేక వందనాలు సమర్పించుకున్నాడు కోవలుడు. కణ్ణగి ఇచ్చిన మంజీరాన్ని తీసుకుని ఆమెకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.   భార్య దగ్గర సెలవు తీసుకునేప్పుడు ఎందుకో తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహించసాగాయి.   కణ్ణగి కూడా వీడ్కోలు పలుకుతూ దు:ఖానికి లోనయింది.   కోవలుడు తన వేదనని అణచుకుని భార్యని ఓదార్చాడు, ఆమెని వదలలేక వదలలేక వెళ్ళిపోయాడు.

పాపం ఆ రోజు అతను వెళ్ళకుండా ఉన్నట్లయితే అతని ప్రాణాలు నిలిచేవేమో!! కాని విధిని మార్చడం ఎవరి తరం!!?

temple

4.

పాండ్య దేశ రాజు నెడుంజెళియన్ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలమది. పాండ్య రాజులు రాజ్యంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రాజుగారికి విన్నవించుకోవడానికి రాజస్థాన ప్రాంగణంలో ఒక గంటను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ గంటను మ్రోగిస్తే మహారాజే స్వయంగా వారికి జరిగిన అన్యాయాన్ని గురించి విచారించేవారు. దానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించేవారు.

ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ఆ మహారాజు నెడుంజెళియన్ కే ఇప్పుడొక సమస్య వచ్చింది. రాణిగారి అంత:పుర మందిరంలోనే దొంగతనం జరిగింది. రాణి కొప్పెరుందేవి తన నగలని మెరుగు పెట్టించడానికి నగల పెట్టెను కొన్ని మాసాల క్రితం ఆస్థాన స్వర్ణకారుడికి ఇచ్చింది. ఆ స్వర్ణకారుడు నగలకి మెరుగు పెట్టి వెంటనే పెట్టెను తిరిగి ఆమెకి ఇచ్చాడు. ఆమె వాటిని పరిశీలించకుండా అలా ఉంచేసింది. నాలుగు రోజుల క్రితం ఆమె కాళ్ళకి అందెలు ధరించాలని నగల పెట్టె తెరిచి చూడగా ఒక మంజీరం కనిపించలేదు. రాణిగారికి కంసాలి మీదే అనుమానంగా ఉంది. నిజంగానే ఆ మంజీరాన్ని స్వర్ణకారుడు కాజేసి వెంటనే అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు. నెడుంజెళియన్ స్వర్ణకారుడిని పిలిపించి “వారం రోజులలో అందియని దొంగిలించిన దొంగ ఎవరో తెలియాలి లేకపోతే నిన్ను శిక్షించి నిజాన్ని బయటికి రాబట్టక తప్పదు” అంటూ హెచ్చరించాడు.

ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో కోవలుడు మధురానగరంలో స్వర్ణకారులుండే వీధికి వచ్చాడు. విధి వైపరీత్యం చూడండి ఎలా నడుస్తున్నదో!!! అదే సమయంలో ఆ ఆస్థాన స్వర్ణకారుడు తన అనుచరులతో కలిసి నడుస్తూ కోవలుడికి ఎదురు వచ్చాడు.

కోవలుడు ఆ కంసాలికి నమస్కరించి “నేను ఈ దేశానికి కొత్తవాడను. వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఈ నగరానికి వచ్చాను. నా దగ్గరొక విలువైన మంజీరమున్నది. దానికి వెలకట్టగలరా?” అని అడిగాడు. స్వర్ణకారుడు సరేననగానే కోవలుడు తన అంగీలోని మంజీరాన్ని తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే స్వర్ణకారుడి కళ్ళు మెరిసిపోయాయి. తన అదృష్టానికి అతని మనశ్శరీరాలు ఉప్పొంగిపోయాయి – కారణం – ఆ మంజీరం అచ్చంగా రాణి గారి మంజూషం లో నుండి తాను కాజేసిన మంజీరం లాగా ఉండటమే….

కోవలుడిని దోషిగా నిలబెట్టాలని మనసులో నిర్ణయించుకున్న కంసాలి కోవలుడిని తన ఇంట్లో కూర్చుండబెట్టి తన అనుచరులతో వెళ్ళి రాజుని కలుసుకున్నాడు. “ప్రభూ! దొంగ దొరికాడు. అతడు అంత:పురంలో చొరబడి మంజీరాన్ని కాజేశాడు. నాకే అమ్మజూపాడు. వీళ్ళంతా సాక్ష్యం” అన్నాడు అతని అనుచరులను చూపుతూ.

కోపోద్రేకుడైన రాజు సైనికులని పిలిపించి “అతనెవరో… అతని దగ్గరున్న మంజీరం రాణి గారిదేనా అని నిర్థరించుకుని, రాణి గారిదే అయితే ఆ దుర్మార్గుడిని వధించండి” అని ఆజ్ఞాపించాడు. సైనికులు కంసాలి ఇంటి వరండాలో కూర్చుని ఉన్న కోవలుని దగ్గరున్న మంజీరాన్ని తీసుకుని పరీక్షించారు. అది రాణిగారి మంజీరాన్ని పోలి ఉండటంతో అతన్నే దొంగగా నిర్ణయించి ఒక్క వేటుతో అతని తలని నరికారు. రక్తసిక్తమైన అతని శరీరం వీధిలో పడి ఉంది.

ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ జరిగిన విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆలయంలో పూజ చేసుకుని తిరిగి వస్తున్న మాధురికి సంగతి తెలిసింది.   చూసిన జనం వర్ణిస్తున్న దాన్ని బట్టి అతను కోవలుడేమోనన్న అనుమానంతో ఆ స్వర్ణకారులున్న వీధిలోకి వెళ్ళి చూసింది. విగతజీవుడై పడి ఉన్న కోవలుడుని చూడగానే దిగ్భా్రంతి చెంది పరుగు పరుగున ఇంటికి చేరి విషయాన్ని కణ్ణగికి తెలిపింది. “కోవలుడిని వధించారు” అన్న వార్త వినగానే కణ్ణగి స్పృహ కోల్పోయినట్లుగా కూలబడిపోయింది. కనుల నుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. భర్తను తల్చుకుని దు:ఖిస్తున్న ఆమె తన భర్తపై అన్యాయంగా దొంగతనం మోపి వధించారన్న విషయం గుర్తొచ్చి కోపావేశంతో లేచింది. కళ్ళ నుండి అగ్ని కణాలను కురిపిస్తూ ఇంటి లోపలకి వెళ్ళి రెండవ మంజీరాన్ని చేతిలో ఉంచుకుని భూమి కదిలిపోయేట్లుగా నడుస్తూ నగరం వైపుకి సాగింది.   జనం గుంపులు గుంపులుగా ఆమెని అనుసరించసాగారు.

వీధిలో పడి ఉన్న భర్త శవాన్ని కౌగలించుకుని కణ్ణగి హృదయవిదారకంగా ఏడవసాగింది. అక్కడున్న జనం నిజమా, భ్రమా అని విభ్రమంతో చూస్తుండగా నిర్జీవుడై పడి ఉన్న కోవలుడు లేచి కూర్చుని భార్యని ఓదార్చి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. భర్త భౌతికకాయాన్ని అక్కడే విడిచి కణ్ణగి ఆవేశంతో ఊగిపోతూ రాజస్థానానికి బయలుదేరింది. అక్కడ జరిగిన మహిమని గమనించిన జనం ఆమెని వదలకుండా వెంబడించారు.

5.

కణ్ణగి నేరుగా వెళ్ళి సభామంటపం లోని గంటను మో్రగించింది. ఆ గంటను విన్న రాణి కొప్పెరుందేవి భయభ్రాంతురాలై పరుగున రాజు దగ్గరికి వచ్చి “స్వామీ! నిన్న ఆ మంజీరం నా మందిరం చేరినప్పటినుండీ నా మనస్సు కీడు శంకిస్తోంది. మన రాజ్యం నశించిపోయినట్లుగా రాత్రంతా పీడకలలు. ఇప్పుడే నా చెలికత్తెలు వార్తని మోసుకొచ్చారు. ఏం జరగబోతుందోనని నాకు భయంగా ఉంది” అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే సైనికుడొకడు వచ్చి “ప్రభూ! ఎవరో స్త్రీ. చేతిలో కాలి అందెను పట్టుకుని రౌద్ర రూపంతో ఉంది. ఆమె భర్తని అన్యాయంగా హత మార్చారని ఆరోపణ” అన్నాడు. ఆశ్చర్యపోయిన నెడుంజెళియన్ “ఆమెని ప్రవేశపెట్టండి!” అన్నాడు.

కణ్ణగి సభలోకి వచ్చింది. జుట్టు ముడి వీడి శిరోజాలు చిందరవందరగా భుజాల మీద పరుచుకుని ఉన్నాయి. కట్టుకున్న చీర మట్టిగొట్టుకుని ఉంది. ముఖమంతా కన్నీటి చారికలతో తడిసి ఉంది. ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టులా కళ్ళు ఎర్రగా మారి నిప్పుకణాలను వెదజల్లుతున్నాయి. దయార్థ్రహృదయుడైన నెడుంజెళియన్ ఆమెని చూసి ఆవేదన చెందాడు. “తల్లీ! నీవెవరు? నీకు జరిగిన అన్యాయమేమిటి?” అన్నాడు.

“నా పేరు కణ్ణగి. మాది చోళ దేశం లోని పుహార్ పట్టణం. వ్యాపారం చేసుకోవాలని ఈ దేశానికి వచ్చాం. పెట్టుబడికి డబ్బు కోసం నా పెళ్ళిలో నా తల్లిదండ్రులు నాకిచ్చిన మంజీరాలలోనొకదానిని నేను స్వయంగా నా భర్తకిచ్చాను. అన్యాయంగా దొంగ అని నింద వేసి నా భర్తని హత్యగావించిన నువ్వు దోషివి” అంది వేలెత్తి చూపుతూ. “సాక్ష్యాధారాలు దొరికాయి కనుకనే నీ భర్తకి దండన విధించాము” అన్నాడు రాజు.

“కాదు నా భర్త నిర్దోషి. నిరూపించడానికే వచ్చాను. ఇదిగో ఇది నా రెండవ కాలి మంజీరం. ఇప్పుడు చెప్పండి, మీ మంజీరం లోపల ఏమున్నాయి?” అంది కణ్ణగి ఆవేశంగా తన కుడి చేతిలో ఉన్న మంజీరాన్ని ఎత్తి చూపిస్తూ.

“మా మంజీరంలో ముత్యాలున్నాయి” అన్నాడు నెడుంజెళియన్.

“అయితే తెప్పించండి, నా భర్త నుంచి మీరు తీసుకున్న మంజీరాన్ని పరీక్షించండి. నా మంజీరంలో రత్నాలున్నాయి” అంది. రాజు అజ్ఞ మేరకు సేవకుడు మంజీరాన్ని తెచ్చాడు. దాన్ని చూడగానే అది తనదే అని గుర్తించిన కణ్ణగి మంటలా ప్రజ్వరిల్లుతూ “ఓ రాజా! ఇది నా మంజీరం.   కావాలంటే చూడండి, ప్రజలారా చూడండి” అంటూ మంజీరాన్ని లాక్కున్నట్లుగా తీసుకుని నేల మీదకి విసిరి బద్దలు కొట్టింది. మంజీరం పగిలి లోపల ఉన్న రత్నాలు చెల్లాచెదురుగా సభామంటపం అంతా పడ్డాయి. కొన్ని రత్నాలు నెడుంజెళియన్ ముఖాన, సభాసదుల ముఖాన పడ్డాయి.

పాండ్య చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. భీతి శరీరంలో చేరి కడుపును దోసిళ్ళతో దేవినట్లయింది. అతనికి భరించలేని వేదన మూలుగు రూపంలో హృదయం నుండి మెదడుకి ప్రాకి మతి చలించింది. “అయ్యో! పాండ్య వంశానికే కళంకం కలిగింది. అపరాధిని నేనపరాధిని” అని పలవరిస్తూ సింహాసనం మీద నుండి పడి ప్రాణాలు విడిచాడు. కాళికలాగా ఉన్న కణ్ణగి స్వరూపాన్ని చూస్తూ నిశ్శేష్టురాలైన కొప్పెరుందేవి తన భర్త ప్రాణాలు కోల్పోగానే కణ్ణగి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. భర్త శవం పై పడి రోదించి రోదించి కొంత సేపటికి తన ప్రాణాలను కూడా వదిలివేసింది. రాజు, రాణి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలందరూ దు:ఖసాగరంలో మునిగిపోయారు.

కణ్ణగికి మాత్రం తన ఆవేశం చల్లారలేదు. తనను తాను శిక్షించుకోవడానికేమో తన ఎడమరొమ్ముని నరుక్కుని   మీదికి విసిరి “నేను పతివ్రతనే అయితే దుష్టరాజు పరిపాలించిన ఈ మధురానగరం తగులపడిపోవాలి” అని శపించింది.

మరుక్షణం రాజభవనంలో మంటలు వ్యాపించాయి. నగరం తగలపడసాగింది. ప్రజలు భయంతో మీనాక్షి అమ్మవారి ఆలయానికి పరుగులు తీశారు. మధురకి తల్లి అయిన మీనాక్షీదేవి కణ్ణగి ఎదుట ప్రత్యక్షమై “కణ్ణగీ! పాండ్యరాజులు ధర్మస్వరూపులు. నెడుంజెళియన్ ఉత్తముడు. నీ భర్తకి ఈ గతి పట్టడానికి కారణం పూర్వజన్మఫలం. శాంతించు. అగ్నిని ఉపసంహరించుకో. ఇప్పటినుండి సరిగ్గా పదునాలుగు దినాల్లో నువ్వు నీ భర్తని దివ్యలోకాల్లో కలుసుకుంటావు” అని పలికింది. ఆ దేవి ఆజ్ఞ ప్రకారం కణ్ణగి అగ్నిదేవుడిని ప్రార్థంచి అగ్నిని ఉపసంహరించుకోమని కోరింది కాని ఆమెకి మనశ్శాంతి కలగలేదు. ఆవేదన తీరలేదు.

వేశ్యావలలో చిక్కుకున్న భర్త కోసం ఏళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తన దగ్గరకి చేరుకున్న భర్తతో సుఖంగా ఉందామనుకుని ఎంతో ఆశ పడ్డ ఆమె భాధని వర్ణించడం ఎవరి తరం?

6.

ఇక ఆ నగరంలో ఉండలేక వైఘనదీ తీరాన్ని వెంబడిస్తూ పడమరగా ప్రయాణించింది కణ్ణగి. ఆమెకి ఆకలిదప్పులు లేవు. పగలేదో రాత్రేదో తెలియలేదు. అవిశ్రాంతంగా అలా ప్రయాణించిన ఆమె పద్నాలుగో రోజుకి చేర దేశానికి చేరింది.   పర్వతప్రాంతాలలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోనికి వెళ్ళి స్వామికి నమస్కరించింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నేరేడు చెట్టు మొదట్లో కూలబడింది.

ఆ ప్రాంతపు గిరిజనులు పొలం పనులకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆకాశంలో నుండి మిరుమిట్లు గొలుపుతూ దేవ విమానం కిందికి దిగింది. ఆ విమానంలో నుండి సుందరాకారుడైన యువకుడు చేయినందివ్వగా నేరేడు చెట్టు కింద నిలబడిన యువతి అతనే చేయందుకుని విమానమెక్కింది. విమానం గాలిలోకి లేచి మెల్లమెల్లగా అదృశ్యమైపోయింది. అది చూసిన ఆ గిరిజనులు అబ్బురపడ్డారు. ఆ దృశ్యాన్ని వర్ణించి వర్ణించి చెప్పుకోసాగారు. ఆ సమయంలోనే చేర రాజు అక్కడకి రావడంతో గిరిజనులు రాజుని దర్శించుకుని జరిగిన వింతని తెలియపరిచారు. మహాకవి శాత్తనార్ కణ్ణగీకోవలుల చరిత్రని చేర రాజుకి, ఆ గిరిజనులకి చెప్పి, ఇళంగో వడిగళ్ ని ఆ కథని కావ్యంగా రచించమని అడిగాడు.

ఆ పతివ్రతా శిరోమణి కథను విన్న సెంగట్టువన్ ఆమెకి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తనే స్వయంగా హిమాలయాలనుండి శిలను తెచ్చి కణ్ణగి విగ్రహాన్ని తయారు చేయించాడు. వంజి నగరంలో దేవాలయాన్ని నిర్మించి మంత్రి సామంతులు, బంధుమిత్రులతో కూడి పురోహితులు మంత్రోచ్ఛారణ జరుపుతుండగా శాస్త్రోస్తకంగా ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. చోళ, పాండ్య, చేర రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. దివ్యభూషణమనోహరాకారంతో కణ్ణగి అక్కడున్న వారి ముందు సాక్షాత్కరించి అందరినీ దీవించింది.

ఆమెను దర్శించుకున్న వాళ్ళకి, ఆమె కథని విన్న వాళ్ళకి సుఖ సంతోష ఆయరారోగ్యాలు కలుగుతాయని పురోహితులు ఆశీర్వచనాలు పలికారు.

 

-రాధ మండువ

12513_1465986130323886_882400752089238785_n

 

 

 

 

 

Tamil Arts. Silapathikaram – Beautiful sculptures of Poombukar Art Gallery, Tamil Nadu, India. కింద లింక్ లో చూడండి. మొత్తం కథని చదివినట్లే ఉంటుంది.

రవి వర్మ గురించి కొత్తగా…

krishna_helps_draupadi_db47

Art is an evolution. చిత్రాలు వెయ్యటం అనేదే మనిషి తన తోటి వారి కంటే లోతు గా భిన్నం గా ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానికి ప్రతీక. ఇక్కడ ఎవొల్యూషన్ అనేది డార్విన్ సిద్ధాంత పరం గా కాదు. ఒక మనిషి ఎదుగుదల (ఎవొల్యూషన్) అన్నది అతని పైన పడే ప్రభావాల బట్టి ఉంటుంది. ఎంత మందిని కలిశాడు? ఎన్ని దేశాలు తిరిగాడు? ఎంత నేర్చుకోగలిగాడు? ఆ నేర్చుకున్నదాన్ని ఎంత సమర్ధవంతం గా ఇంకొకడికీ నేర్పగలిగాడు. దీని ద్వారా తాను మరొక stage of evolution కి ఎంత తోడ్పడగలిగాడు? ఇదీ ఎవొల్యూషన్ యొక్క స్వరూపం. కనీసం కళ పరం గా. భారతీయ సంప్రదాయ చిత్రకళ ని సమర్ధించే వారికీ, రవి వర్మ అభిమానులకీ క ఒక శతాబ్దం గా నడుస్తున్న వాదాలకీ మళ్లీ “రంగ్ రసియా” తెర తీస్తోంది.

ఈ నేపథ్యం లో ఇద్దరు చిత్రకారులు తాము కలిసి తయారు చేసిన వ్యాసం లో ఆయనను కొత్తగా దుయ్యబట్టారు. కానీ గమనించ వలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతం లో ఈ చిత్రాలని వ్యతిరేకించటానికి అప్పటి స్వాతంత్ర్య స్ఫూర్తి ఒక ముఖ్య కారణం. యురోపియన్ ఐన ప్రతి విషయాన్ని వ్యతిరేకించటం లో వచ్చే kick .. adrenaline rush .. ఆ కాలానికి నా వరకు క్షమార్హం. కానీ దాదాపు వంద ఏళ్లు గడిచాక కూడా అప్పటి తమ భావజాలానికి ఒక సార్ధకత ఆపాదించే ప్రయత్నం ఇంకా జరుగుతూ ఉండటమే కొంచెం కలవరపరిచింది. భారతీయ చిత్రకళ లో ముఖ్యమైనవి రేఖలు. రేఖలంటే రెండు ప్రదేశాలని విడగొట్టే ఒక సాధనం. ఆ రేఖలు స్ఫుటం గా కనిపించాలి. తప్పదు. దాన్ని మరీ clear గా చూపించేది ఇండియన్ art. గుహాల్లో కుడ్య చిత్రాలు, చిన్న పిల్లల యానిమేషన్ సినిమాలు ,అన్నిటికీ రేఖలే ఆధారం. ఎందుకంటే, వాటిని perceive చెయ్యటం తేలిక కనుక!

రేఖల్నుంచి కొంత ముందుకి వెళ్తే రంగులొస్తాయి.. ఇంకొంచెం ముందుకు వెళ్తే వెలుగు నీడలు వస్తాయి. వీటిని perceive చెయ్యటం, చెయ్యగలగటం కొన్ని వేల ఏళ్ల తపస్సు ఫలితం గా భావిస్తాను నేను. చిన్న పిల్లవాడు ఆపిల్ ఎర్ర గా ఉంటుంది.. గుండ్రం గా ఉంటుంది అని చెప్పగలడు. ఆర్టిస్ట్లు అవ్వబోని వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. ఆ పిల్లవాడికే ఆ ఎరుపు ఉదయం వెలుతురు లో ఒక లాగా సంధ్య వెలుతురు లో ఒక లాగా వెన్నెల లో ఒక లాగా కనిపిస్తే? ఒకే రంగు కి ఉన్న వేల వేల రూపాల్ని గుర్తు పడుతూ పో గలిగితే? ఆ పండు ఛాయ తెల్లని టేబల్ పైన ఎలా పడుతోంది? గాజు టేబల్ పై ఎలా పడుతోంది? పసుపు రంగు వేసిన గోడ పై ఎలా పడుతోంది? ఇన్ని రకాల ప్రశ్నలు వేసుకుంటూ పోతే… ఒక రోజు ఆ పిల్లవాడు చిత్రకారుడిగా తన మొదటి శ్వాస తీసుకుంటాడు. ప్రశ్నలు వేసుకుంటూ దానికి సమాధానాలు వెదుక్కుంటూ కొన్ని దశాబ్దాల కృషి తర్వాత ఆర్టిస్ట్ అనిపించుకుంటాడు. Perceive చెయ్యగలగటం పై చాలా గౌరవం ఉంది నాకు. ఒక పెద్ద శిల లో శిల్పా న్ని perceive చేయగలిగే శిల్పి ని చాలా గౌరవిస్తాను.

భారతీయమైనా పా శ్చా త్యమైనా సరే. సులువు గా కనిపించిపోయే వాటి కన్నా ఎన్నో రోజుల mental exercise తర్వాత మాత్రమే అబ్బే color perception , light perception అంటే మరీ గౌరవం నాకు. దాన్ని యురోప్ నుంచి రవివర్మ అప్పు తెచ్చుకు న్నంత మాత్రాన ఆది ఆయనది కాకుండా పోదు గా? నిజమే , రంగు చిత్రాలు, వెలుగు నీడలు ఉన్న చిత్రాలు కళ్ళకి ఇంపు గా ఉంటాయి రే ఖా చిత్రాల కన్నా. వాటిని అంత ఇంపు గా చేయటం కోసం పడ్డ శ్రమ ని తృణీకరించటం తప్పు . Mass appeal ఉన్నంతమాత్రాన అది కళ కాకుండా పోతుందా? కోట్ల మంది జనాల్ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్లే సినిమా ఎలాంటి medium మరి? దాన్ని కూడా తప్పు పట్టి తక్కువ స్థాయి గా అనుకోవాల్సిందే నా? ఒక కథ ని తెర పై చూపించటం అనేదే passion గా బ్రతుకుతున్న directors ఎందరో? అలాంటి వారే రవివర్మ కూడాను.

Draupadi_humiliated_RRV

తన ఊహ వందలాది మందికి చేరాలి అనుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. ఆది ఆర్టిస్ట్ లకి ఉండే సహజ లక్షణం. ఏ స్థాయి వారినుంచి మెప్పు కోరుకుంటున్నారు అనేది వారి వారి ఇష్టం. It just does not disqualify them from being great artists. ఇక పోతే కొత్తదనం. రవి వర్మ యురోపియన్ ఇమిటేటర్ అనే విమర్శలు చాలా ఉన్నాయి ఆయన పైన. ఇక్కడ ఆర్ట్ కి క్రాఫ్ట్ కి మధ్య ఉండే ఒక భేదం తెలుసుకోవాలి. Craft can be taught. Its a monotonic pastime of the mind, while art is a limitless expansion of the same capability. Not everyone can be an artist, but everyone can be a crafter with certain amount of practice. A crafter need not dedicate his life to his craft., craft just does not demand you to be so. But art is a fiery monster that artists enjoy being devoured by. తంజావూర్ చిత్రాలని పెయింట్ చెయ్యటం gifted artists కానివాళ్ళు కూడా [ ఇతర చేతి పనుల లాగానే ] నేర్చుకోవటం చూస్తాం. అది వారి జీవితాల్లో ఎక్కువ సమయం తీసుకోదు. ఒక predetermined విధానం లో బొమ్మలు సాగటమే అందుకు కారణం.

Indian art లో so called నూతనత్వం ఎక్కడా ఉండదు. ఆది గురువు నించి శిష్యుడికి వచ్చే ఒక skill అంతే. గురువు వేసినట్టే శిష్యుడు వేస్తాడు. తమ regular జీవితాల్లో కొంత భాగం త్యాగం చెయ్యకుండా యురోపియన్ చిత్రకళ నేర్చుకోవటం సాధ్యమే కాదు. ముఖాల్లో భావాలు, scene setting , composition ఇవన్నీ యురోపియన్ చిత్రకళ పరిధి పెంచుతాయి. దాని లో ఒక కొత్త ఆర్టిస్ట్ తన సొంత మెదడు తో ఆలోచించటం చాలా చాలా అవసరం. రవి వర్మ చిత్రాల్లోనే కొన్ని పురాణ సన్నివేశాల్ని తన మనసు లో వచ్చిన విధం గానే వేశారు. He was indeed a visionary. ఫిల్మ్ డైరెక్టర్ సీన్ ని ఆలోచించుకున్నంత స్పష్టం గా ఎవరి ముఖాల్లోఏమి expression రావాలి అని ఎన్ని రోజులు ఊహించుకుని ఉంటారా అనిపిస్తుంది. దీని పైన పాశ్చాత్య శైలి ప్రభావం ఉంటే ఉండనివ్వండి . అక్కడ ఆయన full bodied emotions తో చిత్రీకరించింది భారతీయ సన్నివేశమే కానీ మరో టి కాదు గా? ఇలాంటి emotions ఇండియన్ ఆర్ట్ లో ఎక్కడ? ద్రౌపది సభ కి వచ్చి తనని కాపాడమని వెడుకునే painting చూస్తే కలిగే రసాను భవం

pacc196_the_unveiling_draupadi

రేఖా చిత్రాల్లో ఎక్కడినుంచి వస్తుంది? కళ్ళ ముందు జరిగినట్టు ఉంటేనేకదా మన empathy పుట్టేది ? ఇలాంటి అనుభవం కలంకారీ చిత్రాలని చూస్తేనో, కాంగ్రా చిత్రాలని చూస్తేనో నిజం గా వస్తుందా? ఒకవేళ వస్తే, వాటి కంటే గొప్ప వాటిని, ( ఇంకా శక్తి మంతం గా convey చెయ్యగలిగే వాటిని) చూశాక కూడా అలాగే వస్తుందా? Here we come back to the question of our evolution. Art has been evolving for several centuries, though not in a unidirectional sense. Realism ని వ్యతిరేకిస్తూ పుట్టిన impressionism , ఆరు బయటి చిత్రాలు ఎక్కువగా వెయ్యాలి అని, brush strokes ప్రస్ఫుటంగా గా తెలియాలి అని, వెలుతురు లోని భిన్నకోణాలు చూడాలని అనుకుంది. అదే సమయం లో పుట్టిన pre raphaelite movement మళ్ళీ roots లోకి వెళుతూ classic భంగిమలని, గ్రీక్ రోమన్ పురాణాల లోని సన్నివేశాలని చిత్రించింది. రెండూ నిలి చాయి.

Monet కి ఎంత పేరుందో John William Waterhouse కి అంతే పేరుంది. కానీ ఇద్దరూ వెలుగు నీడల్ని విస్మరించలేదు. వెలుగు నీడల్ని వదిలేసి మళ్ళీ రేఖ ల్లోకే వెళ్ళాలి అనుకోవటం ఒక obscurantism. Art is a celebration of the heights of human intellect. Artist is limitless. పరిధులు లేని ప్రపంచం లో తన దారి తనే వేసుకుంటూ వెళ్లే బాటసారి చిత్రకారుడంటే. ఇదే కళ, ఇలా ఉంటేనే కళ , ఇంత మందికి మాత్రమే నచ్చటం కళ లక్షణం అనుకోవటం ఆ పరిధుల్లేని ప్రపంచం లో తాము ఒక మూల దాక్కోవటమే ఔతుంది.

రవి వర్మ ఒక perfect artist కాక పోవచ్చు. ఆయన చిత్రాల్లో లోపాలు ఉండొచ్చు. కానీ ఆయన చిత్రాలు నచ్చని వారు కూడా ఒకందుకు ఆయన ని మెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. ఆయన అప్పటి వరకూ ఉన్న path of least resistance ని వదిలేసి మంచి పనిముట్లు అరువు తెచ్చుకుని కొత్త బాట వేసుకున్నారు. ఆది చిన్నది సన్నని దీ అయినప్పటికీ తన వెనకాల చాలా మందిని పిలిచి ఆ బాట ని మరింత మెరుగు పరచమన్నారు. ఆ ధైర్యం ఉన్నవారే ఆ పని ఇప్పటికీ చేస్తున్నారు. మనవి అయినవి అన్నీ అన్నిటికన్న గొప్పవి కావు. గొప్పవాటిని మనవి కావు కనుక కాదనటం తప్పు. ఆ గొప్పతనాన్ని మనది చేసే ప్రయత్నాన్ని తప్పు పట్టటం heartless.

– సాంత్వన చీమలమర్రి

S_148220

వేళ్ళ గులాబీలు

 15-tilak
కొత్తగా ఒక చితి
చేతి వేళ్ళ మీద నుండి తెగిపడుతూ గోర్ల శవాలు భూమి నిండా
నువ్వో నేనో తొక్కుతాం వాటి నీడలనో
పదునుగా కనిపించే తలల తనువులనో
ఇన్నాళ్ళు అందంగా పెరిగి
నీ నుండి ఒక్కసారే అలా విడివడడం కొత్తేమి కాదు వాటికి
ఆకులను పువ్వులను తాకుతూ ఇన్నాళ్ళు నీలో నుండి
తడియారని ఒక పచ్చిక ముఖాలకు పులుముకుంటూ ఉండని రోజులను నదుల్లో గదుల్లో దాచుకోవడం కూడా అలవాటే
చీము నెత్తురుతో సహవాసం చాన్నాళ్ళ కిందదే
స్పర్శ తెలియని అనుభూతి
అలంకారమో
మరోటో
గీసిన గీతలు ఒకచోట మొదలయి ఎక్కడికో తప్పిపోవడం గమనించనేలేదు నువ్వు
వాటి ఆనవాళ్ళను ఇక్కడే ఎక్కడో పారేసుకున్నావు
సరిగ్గా వెతుకు మరోక్షణం
నీ ఆలోచనలను విస్తరింపజెయ్యి
గులాబీ రెమ్మలు కొన్ని
వర్షంలో పూర్తిగా తడిసిపోయాక స్పృశించుకోవడం ఎంత బాగుంటుంది
అవింకా మన మధ్య ఆరని మరీచికలేగా ఎప్పుడూ
అద్దుతూ
ఈదుతున్న పరాన్న జీవులేగా ఇప్పటికీ వేలు వేలు చివరనా.
                                                  -తిలక్ బొమ్మరాజు

బతికిపో

 Kadha-Saranga-2-300x268
భళ్లుమంటా తలుపులు తెర్సుకునేతలికి ఆమైనే ఉలిక్కిపడతా చూశాడు కుమార్సామి. ఎదురుంగా అపర ఈరబద్రుళ్లా కొడవలి పట్టుకు కనిపిచ్చాడు ఓబులు. ఆ ముసలోడి కళ్లు నిప్పుకణికల మాదిరి ఎర్రెర్రగా మండిపోతన్నాయి. వడ్డీ లెక్కలు రాసుకుంటన్న కుమార్సామి కదలక మెదలక కొయ్యమాదిరి అట్టాగే కూకుండిపొయ్యాడు.
“రేయ్. పీనుగుల్ని పీక్కతినే లమ్డీకొడకా. ఇయ్యాళ నా సేతుల్లో నీకు మూడిందిరో” అంటా ఒక్క దూకు దూకాడు, ఇంకో ఏడుపోతే ఎనభై నిండే ఓబులు. ముసలోడే ఐనా ఇంకా బలంతగ్గని చేతిలో టెంకాయల్ని కసక్కన తెగనరికే కొడవలి మాత్రం అప్పుడే సానబెట్టినట్టు తళతళమంటా మెరుత్తా ఉంది. తల విదుల్చుకుంటా తెలివి తెచ్చుకున్నాడు కుమార్సామి.
“ఏయ్ ముసలోడా ఏం.. ఏం.. జేత్తన్నావ్? సేతిలో ఆ.. కొ..డ..వ..లి ఏంది?” అన్నాడు భయంతోటి గడగడా వొణుకుతా. ‘ఓబులుకీ, నాకూ మజ్జ ఏదైనా అడ్డం ఉంటే బావుణ్ణు’ అనుకున్నాడు. కానీ ఆ గెదిలో చిట్టీలెక్కల పుస్తకాలు, ఆ పుస్తకాలు పెట్టి రాస్కునే డెస్కు తప్పితే ఇంకేం లేవు.
“కనిపియ్యడం లేదురా కొజ్జా నాయాలా. నీ నెత్తురు కళ్లజూడందే వొదలన్రా. ఇయ్యాళ్టితో ఈడ జనానికి నీ పీడ వొదిలిపోద్ది. చావరా జనం నెత్తురు తాగే రాచ్చసుడా” అని కొడవలితో ఒక్కేటు యెయ్యబోయాడు ఓబులు.
చప్పున ఓబులు కాళ్లని ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అరచ్చణం ఆలిస్యమైనా కుమార్సామి తలకాయ టెంకాయలా తెగిపడేదే. చూశాడు. దీనంగా చూత్తా కుమార్సామి పెళ్లాం రామలచ్చిమి.
‘నా మొగుణ్ణి చంపి నాకూ, నా బిడ్డలకీ అన్నేయం సెయ్యమాకు’ అంటున్నాయి నీళ్లతో మెరుత్తున్న ఆమె కళ్లు.
“ఏమ్మా. నీ మొగుడు ఊళ్లో ఎంతమెంది ఆడాళ్ల ఉసురు పోసుకుంటన్నాడో తెల్వదా. సోద్దెం చూత్తా ఊరుకుంటివే. నాకు తలకొరివి పెట్టాల్సిన మా పెద్దోడు సాంబుగాణ్ణి పొట్టన బెట్టుకుంది ఈ నీచపు ముండాకొడుకే. ఈ నాయాల్ని నరుకుదామనొత్తే అడ్డం పడ్తన్నావ్. నీ మొగుడి పేణం నీకెట్టానో, ఊళ్లో ఆడాళ్లకి ఆళ్ల మొగుళ్ల పేణాలూ అంతేగా. ఇయ్యాళ నా కొడుకు సావుతో అన్నేయమైపోయిన ఆడి పెళ్లాం పిల్లల గతేంది. దానికి జవాబు సెప్పు తల్లీ. అప్పుడు వొదుల్తాను ఈ పుండాకోరునాయాల్ని” – పళ్లు పటపటా కొరికాడు ఓబులు.
మొగుడి సంగతి తెల్సిందే గాబట్టి ఏం చెప్పాల్నో తెలీక ఓబులు వొంక అట్టాగే దీనంగా చూసిందామె.
“ఏం.. ఏంది బెదిరిత్తన్నావ్. నిజ్జంగా సంపుతావేందీ.. అంత తేలిగ్గా ఉందా, సంపడమంటే. నేనేం జేశాను. బాకీ డబ్బులు టయ్యానికి ఇయ్యకపోడం ఆళ్ల తప్పు. సామ్మూర్తి.. అదే నీ కొడుకూ.. అంతేగా. నోటులో రాసుకున్నట్టు బాకీ కట్టాల్నా, లేదా.. అదేగా నేనడిగిందీ.. నేనేమన్నా సావమన్నానా ఏందీ. తీసుకున్న బాకీ డబ్బులు కట్టడం సేతకాక పిరికోడులా ఉరేస్కుంటే దానికి నాదా బాద్దెత?” – కుమార్సామి, దైర్నం తెచ్చుకుంటా.
“రేయ్.. ఏం కూశావ్‌రా. సాంబుగాడు సచ్చింది బాకీ కట్టలేననే బాత్తో కాదురా. ఈదిలో నువ్‌జేసిన అల్లరికీ, నువ్వన్న ఛండాలపు మాటలకీ రా. పరువుగా, గుట్టుగా ఇంతకాలం సంసారం జేసుకుంటా వొత్తున్న నా కొడుకు అందర్లోనూ అవమానం జెయ్యడాన్ని తట్టుకోలేక మనసులో కుంగిపొయ్యి ఉరేసుకున్నాడ్రా. మాటల్తోటే మనుషుల్ని పీక్కతినే పచ్చి రాచ్చసుడివిరా నువ్వు. నిన్నొక్కణ్ణి యేసేత్తే నేతగాళ్లంతా మనశ్శాంతిగా బతుకుతార్రా” – కొడవలి పైకెత్తాడు ఓబులు.
దాంతోటి కుమార్సామి పైపేణాలు పైనే పొయ్యాయి. వొళ్లంతా సెమట్లు పట్టేశాయి. గుండెకాడ నెప్పి మొదలయ్యింది. ‘చివరికి ఈ ముసలోడి సేతిలో సావు రాసిపెట్టుందా?’ అనుకోంగాల్నే, నాలికి పొడిబారింది. మామూలుగా ఐతే తిరగబడేవోడే. యాభయ్యేళ్ల తనముందు ఎనభయ్యేళ్ల ముసలోడు ఓ లెక్కా. కానీ తను ఉత్త సేతుల్తో ఉన్నాడాయె. పైగా కూకొని ఉన్నాడు. ఓబులు సేతిలో జూత్తే అప్పుడే సానబెట్టిన కొడవలుంది. పైగా నించోనున్నాడు. తను లేచేపాటికి ఒక్కేటుగానీ యేశాడా.. తన తలకాయ పుచ్చకాయలా తెగిపడుద్ది. భయంతో గొంతు పిడచకట్టుకుపొయ్యింది కుమార్సామికి.
*    *    *
ఆ పేట మొత్తమ్మీద కుమార్సామే పెద్ద వొడ్డీ యాపారి. ఓ పక్క చిట్టీపాటలు, ఇంకోపక్క వొడ్డీ యాపారంతో శానా తక్కువ రోజుల్లోనే కోట్లు సంపాదిచ్చాడు. బంగాళాపెంకుల ఇంటిని పడేసి రెండంతస్తుల మేడ బ్రెమ్మాండంగా కట్టాడు. మెట్ట, మాగాణి కలిపి యాభై ఎకరాల పైనే ఉంటుందని పేటలో సెప్పుకుంటా ఉంటారు. ఆటిలో బాకీ కట్టలేనోళ్లు జమచేసిన పొలాలు పదెకరాల దాకా ఉంటాయి. అట్టాగే ఓ పెంకుటిల్లునీ, ఏడు సెంట్ల ఖాళీ స్తలాన్నీ కూడా బలవంతాన లాగేసుకున్నాడు కుమార్సామి. ఆటి యజమానులు ఆయబ్బి కాడ జేసిన బాకీని కట్టాల్సిన టైముకి కట్టకపోడమే దానిక్కారణం. పేటలోని నేతగాళ్లే కాదు, శానామంది షావుకార్లు (మాస్టర్ వీవర్లు) కూడా ఆయబ్బితో ఇబ్బందులు పడతన్నారు. మనసులో ఆయబ్బి మీద ఎంత కోపమున్నా, కసున్నా ఏం జెయ్యలేని పరిస్తితిలో ఉన్నారు. ఎందుకంటే అవసరానికి ఎంతంటే అంత డబ్బు అప్పిచ్చేది ఆయబ్బే కాబట్టి.
ఓబులు కొడుకు సాంబమూర్తి శానా రోజుల్నించే కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తన్నాడు. పౌర్ణం రోజు వొచ్చిందంటే కుమార్సామి ఇల్లు పాటలు కట్టేవోళ్లతోటి కిటకిటలాడిపోద్ది. మామూలుగా పౌర్ణం రోజు నేతగాళ్లందరికీ ఊరట. అంటే సెలవురోజు. మగ్గం చప్పుడు వినిపిచ్చని రోజు. షావుకార్ల కొట్లు నేతగాళ్లతో కళకళలాడే రోజు. ఆ రోజే నేతగాళ్లంతా తాము ఏ షావుకారికి నేత్తున్నారో ఆ షావుకారు కాడికి నేసిన గుడ్డల తానులు తీసకపొయ్యి కొత్త ‘ఎంట్లు’ (పడుగు, పేక నూలు, పాగళ్లు) తెచ్చుకుంటారు. ఆటితో పాటే ఆటి తాలూకా కూలీ డబ్బులు కూడా. అంటే ఉజ్జోగం చేసేవాళ్లకి జీతాలొచ్చే రోజు ఎట్టాగో నేతగాడికి పౌర్ణం రోజు అట్టాగా. ఆ రోజంతా నేతగాళ్ల ఇళ్లల్లో పండగ సందడే. నేతగాళ్ల కాడ డబ్బులాడేది అప్పుడ్నే కాబట్టి కుమార్సామి చిట్టీ పాటలు పెట్టేది అప్పుడ్నే.
పాటలు పాడుకోడానికి వొచ్చినోళ్లతోటీ, బాకీ చెయ్యడానికి వొచ్చినోళ్లతోటీ కుమార్సామికి అయ్యాళ చెణం తీరికుండదు. ఎవరైనా పాట డబ్బులు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా ఆయబ్బి ఊరుకోడు. ఆ తెల్లారే ఆ కట్టనాళ్లింటికాడికి పొయ్యి నానా యాగీచేసి, డబ్బులు వసూలు చేస్కుంటాడు. ఏదైనా అవసరానికి పనికొత్తాయి కదా అని నేతగాళ్లంతా కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తుంటారు.
శానా యేళ్లనుంచీ ఆయబ్బి కాడ పాటలు కడ్తన్నాడు సామ్మూర్తి. ఎప్పుడైనా పౌర్ణం రోజు పాట డబ్బులు కట్లేకపోతే ముందుగాల్నే ఆ సంగజ్జెప్పి, గడువడిగి, ఆ లోపల కట్టేసేవోడు. అట్టాంటి నమ్మకమైన మనిషైన సామ్మూర్తి ఆమజ్జ కుమార్సామి కాడ యాభయ్యేలు అప్పుజేశాడు. పెద్ద కూతురి పెళ్లిని ఎట్టాగో ఎవరికాడా బాకీ పడకుండా జేశాడు కానీ రెండో కూతురి పెళ్లికి అప్పుజెయ్యక తప్పలేదు. అబ్బాయి ఆర్టీసీ కండట్టరుగా గవర్మెంటు ఉజ్జోగం జేత్తుంటం వల్ల, కూతురికి బవిష్యెత్తులో నేతనేసే పని తప్పుతుందనే ఆశతోటీ, వొచ్చిన మంచి సంబంధాన్ని సేతులారా వొదులుకోవడం ఎందుకనే ఉద్దేశంతో సేతిలో డబ్బులు అంతగా లేకపోయినా బాకీచేసి ఆ పెళ్లి జేశాడు.
వొందకి రెండ్రూపాయల వొడ్డీ లెక్కన ఆ అప్పు తీసుకున్నాడు సామ్మూర్తి. మూడేళ్లలో అసలు, వొడ్డీ కలిపి బాకీ మొత్తం తీరుత్తానని ఆయబ్బి చేత నోటు రాయించుకున్నాడు కుమార్సామి. అంటే మూడేళ్లలో వొడ్డీతో కలిపి ఎనభై యేలు కట్టాలన్న మాట. ఒకేళ ముందుగాల్నే కట్టేత్తే వొడ్డీ తగ్గుద్ది. అయితే నేతగాడికి అంత డబ్బు చెల్లిచ్చాలంటే అయ్యే పనేనా?
ఇంట్లో నేతనేసేది సామ్మూర్తి వొక్కడే. షుగరొచ్చి ఆయబ్బి పెళ్లాం జెయమ్మ శానా కాలం నుంచీ పైపనులు మాత్రమే జేత్తంది. కొడుకు కాలేజీలో సదూకుంటన్నాడు. ఓ పక్క కొడుకుని సదివిత్తా, ఇంకోపక్క పెళ్లాం రోగానికి డబ్బులు ఖర్చుపెడతా ఉంటే బాకీ డబ్బు చెల్లిచ్చడం ఎంత కనాకష్టమో సామ్మూర్తికి తెలవంది కాదు. మనసులో బయం రోజురోజుకీ పెరుగుతున్నా, వొంటి గురించి పట్టిచ్చుకోకుండా రేయింబవళ్లూ కష్టపడ్తా వొచ్చాడు. నిద్రలేచాక ఆరింటి కాణ్ణించీ మగ్గం గుంటలోనే సామ్మూర్తి జీవితం. మజ్జలో అన్నాలు తింటానికీ, బయటేమన్నా పన్లుంటే యెళ్లిరావడానికీ తప్పితే రేత్రి తొమ్మిది, పదింటిదాకా గుంటలోనే ఉంటన్నాడు.
“ఇట్టా అదేపనిగా నేత్తే నీ వొళ్లు పాడవుద్దయ్యా” అని దిగులు పడ్తుంటుంది జెయమ్మ.
“నాకేందే.. నాది ఉక్కొళ్లు” అని నవ్వుతా అంటాడే గానీ తనొళ్లు ఇంతకు ముందులా తన మాట వింటంలేదనే యిష్యం ఆయబ్బికి తెలుత్తానే ఉంది. నలబై ఐదేళ్లనుంచీ అదేమైనుగా మగ్గం గుంటని అంటిపెట్టుకొన్న బతుకు ఆయబ్బిది. నిన్న మొన్నటిదాకా పేట మొత్తమ్మీద స్పీడుగానే గాకుండా శానా అందంగా నేసే నేతగాడని అందరూ అనేవోళ్లు. వొయసులో ఉన్నప్పుడు ఓబులు కూడా తన కొడుకులా నేసినోడు కాదు.
కాలం గిర్రున తిరుక్కుంటా పోతంది. సామ్మూర్తి కొడుకు ఇప్పుడు బీయస్సీ మూడో యేడు సదూతున్నాడు. ఆ మజ్జలో రెండో కూతురు పురుడు కోసమని పుట్టింటికొచ్చింది. కాన్పు మామూలుగా అయిపోతందనుకుంటే ఆఖర్లో బిడ్డ అడ్డం తిరిగిందనీ, ఉమ్మ నీరు పోతన్నదనీ జెప్పి పొట్టకోసి బిడ్డను బయటకి తీసింది డాక్టరు. ఆ ఆపరేషన్‌కీ, ఇంకొన్ని ఖర్చులకీ పదేల దాకా ఐపోయాయి. కూతురు కదా తప్పదయ్యే. ఇట్టాంటియ్యే మజ్జమజ్జలో ఎయ్యో ఖర్చులు రావడం, అప్పటిదాకా దాచుకున్న డబ్బు ఖాళీ ఐపోడంతో కుమార్సామి కాడ చేసిన బాకీకి వొడ్డీ తప్పితే అసలు చెల్లిచ్చలేకపొయ్యాడు సామ్మూర్తి. కుమార్సామి సంగతి తెల్సు కాబట్టి మనసులో పీకుతానే ఉంది సామ్మూర్తికి, ఏం గొడవ జేత్తాడోనని. మూడేళ్లైపొయ్యాయి. వొడ్డీ ఇద్దామని యెళ్లిన ఆయబ్బిని నానా కూతలూ కూశాడు కుమార్సామి. వొడ్డీ తీసుకుని అసలు కూడా అప్పటికప్పుడు చెల్లిచ్చాల్సిందేనని పట్టుబట్టాడు.
“ఏంది సామీ. నా సంగతి నీకు తెల్వదా. ఎన్నేళ్లబట్టి నీకు పాటలు కడ్తన్నాను. ఎప్పుడైనా నావొల్ల తేడా వొచ్చిందా? ఇప్పుడంటే రెండో దాని పెళ్లి తర్వాతనే కదా కాత్త ఇబ్బంది పడ్తన్నా. అబ్బాయి సదూకోసమనీ, ఇంటిదాని వైజ్జం కోసమనీ ఖర్చవుతా ఉంది. వొడ్డీ అయితే ఆపకుండా ఇచ్చేత్తన్నా కదా. అబ్బాయి సదువైపోతే ఆడికి ఏదో వొక ఉజ్జోగం రాకపోదు. అప్పుడు నాకింత కష్టం ఉండదు. నీ బాకీ అణాపైసల్తో తీర్చేత్తా. మళ్లా నోటు రాయి” అని బతిమాలాడు సామ్మూర్తి. అప్పు తీసుకున్నోళ్ల బాధల్ని ఇని దయచూపితే ఆయబ్బి కుమార్సామి ఎట్టా అవుతాడు? ఆస్తులు ఎట్టా పోగేసుకుంటాడు?
“నాకీ కతలన్నీ చెప్పమాక సామ్మూర్తీ. టయ్యానికి బాకీ కట్టని పెతోడూ నీ మాదిరి కతలు చెప్పేవోడే. అయ్యన్నీ ఇనుకుంటే నేను యాపారం జేసినట్టే. నువ్వేం తిప్పలు పడ్తావో, ఏ ఇంటికి కన్నం యేత్తావో నాకు తెల్వదు. పది రోజులు టైమిత్తన్నా. నా బాకీ కడితే సరే. లేదంటే బజారుకీడుత్తా” అని కచ్చితంగా చెప్పేశాడు.
ఇదంతా ఓబులికి తెల్సినా కొడుక్కి ఏం సాయం చెయ్యలేని ఇదిలో ఉన్నాడు. కొద్ది రోజులు పెద్దకొడుకు కాడా, కొద్ది రోజులు చిన్నకొడుకు కాడా రోజులు నెట్టకొత్తున్నాడు. పైపనుల్లో సాయం తప్పితే ఆయబ్బి పోగేసుకున్నదేం లేదు.
కుమార్సామి ఎంత గట్టిగా జెప్పినా, ఆయబ్బి యెట్టాంటోడో ఎరిగినా మంచోడిగా, పరువు  మర్యాదలు ఉన్నోడిగా తనకున్న పేరువల్ల కొంత దయ సూపుతాడేమోనని ఆశపడ్డాడు సామ్మూర్తి. పైగా ఎన్నో ఏళ్లబట్టి తను ఆయబ్బి కాడ పాటలు ఆగకుండా కడతా వొత్తున్నాడాయె.
పది రోజులెళ్లిపొయ్యాయి. కుమార్సామి ఇంటిమీదికి వొత్తాడేమోనని మనసులో బితుకుబితుకుమంటన్నా పైకి నిబ్బరంగా ఉంటానికి పెయత్నిత్తున్నాడు సామ్మూర్తి.
ఆ రోజు మజ్జాన్నం మొగుడూ పెళ్లాలు అన్నాల కాడ కూకోబోతన్నారు.
“ఏవయ్యా సామ్మూర్తీ” అన్న కేక, ఇంటి బయట్నించి. అది మామూలు కేక కాదు. అది మామూలు గొంతూ కాదు. బీరకాయ కూరతో అన్నం కలుపుకొని, ముద్ద జేత్తన్నాడు సామ్మూర్తి. ఇంకా ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదు నోట్లో.
Bathiki ....Po (600x435)
“సరిగ్గా టయ్యానికి వొచ్చేశాడే దొంగనాయాలూ” అని, “నేను మాట్టాడొత్తా. నువ్వు తింటుండు” పెళ్లాంతో చెప్పి కంచం కాణ్ణించి లేచాడు.
“ఈ మడిసికి యేళాపాళా ఉండదా. నువ్వు కూకో. కాసేపాగి రమ్మని సెప్పొత్తా” అంటా లేవబోయింది జెయమ్మ.
“ఏం జేత్తన్నావ్ పెద్ద మనిషీ.. లోనా” అంటా పంచాలోకి వొచ్చాడు కుమార్సామి.
“ఇప్పుడే అన్నానికి కూకుంటన్నాం సామీ. వొత్తన్నానుండు” అంటా గబగబా దొడ్లోకి పొయ్యి చేతులు కడక్కొచ్చాడు సామ్మూర్తి.
“ఎట్టా తినబుద్దేత్తందయ్యా కూడు. నాకియ్యాల్సిన బాకీ డబ్బులు ఇయ్యకుండా కూడెట్టా సయిత్తందనీ. నిద్రెట్టా పడతందీ అంటా?” గట్టిగా అరిచాడు కుమార్సామి. ఆయబ్బి కేకలు చుట్టుపక్కలాళ్లకి ఇనిపిత్తన్నాయి. ఇనిపిచ్చాలనే అట్టా అరవడం కుమార్సామికున్న గుడిసేటి గుణం. ఊహ తెలిసినాక ఎప్పుడూ ఎవరికాడా ఇట్టాంటి మాటలు పడని సామ్మూర్తికి ఇది శానా అవుమానంగా అనిపిత్తంది. కుమార్సామి మాటలు బరిసెల మాదిరిగా గుండెల్లో గుచ్చుకున్నాయి.
“సామీ ఎందుకట్టాగా నోరు పారేసుకుంటన్నావ్. నేను బాకీ డబ్బులు కట్టనని సెప్పానా. నా ఇబ్బంది సెప్పుకుని, మళ్లా నోటు రాయిమన్నా కదా. నేనెట్టాంటోణ్ణో నీకు తెల్వదా. ఎంత కాలం నించి నీకు పాటలు కడ్తన్నానో తెల్వదా. వొడ్డీ డబ్బులు ఆపకుండా కడ్తానే వొత్తున్నాగా. ఆమాత్రం ఆగలేవా?” కొంచెం గట్టిగానే మొదలుపెట్టి, చివరికొచ్చేతలికి బతిమిలాడతన్నట్టు అడిగాడు సామ్మూర్తి.
“ఏందోయ్ మాటలు రేగుతున్నాయే. నేను నీకు బాకీ పడ్డానా. నువ్వు నాకు బాకీపడ్డావా? నేను నోరు పారేసుకుంటన్నానా? కడుపుకి కూడు తింటన్నావా, గడ్డి తింటన్నావా? అంత రోషమున్నోడివి టయ్యానికి నా బాకీ డబ్బులు  కట్టెయ్యాలి గదా. ఇత్తే నేను నీ ఇంటిదాకా ఎందుకొత్తాను? నా టైమెందుకు వేస్టు జేసుకుంటాను? వొడ్డీ డబ్బులు కట్టేత్తే అయిపోద్దా. అసలు డబ్బుల సంగతేంది? మీ అయ్యిత్తాడా?” పెద్దగొంతుతో రంకెలేశాడు కుమార్సామి.
సామ్మూర్తికి నోట్టోంచి మాటలు పెగల్లేదు. ఆ యబ్బికి సిగ్గుగా ఉంది. అవమానంగా ఉంది. చుట్టుపక్కల జనాలు ఇళ్లలోంచి బయటకొచ్చి సోద్దెం సూత్తనేతలికి ఆయబ్బికి తల కొట్టేసినట్టుగా ఉంది. తలెత్తి అట్టా ఇట్టా సూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది.
సామ్మూర్తి మౌనంచూసి మరీ రెచ్చిపొయ్యాడు కుమార్సామి. “కూతుళ్ల పెళ్లిచెయ్యగానే సంబడం కాదు. బాకీ కట్టాలన్న ఇంగిత గేనం కూడా ఉండాలి” అన్నాడు. సామ్మూర్తి వంశాన్నంతా తిట్టాడు. మజ్జమజ్జలో బూతులు కూడా. ఆడ జెయమ్మ కూడా ముద్ద నోట్లో పెట్టుకోలేకపొయ్యింది.
“ఆకర్సారి సెబ్తున్నా. వొచ్చే నెల్లోగా బాకీ మొత్తం కట్టేత్తే సరి. లేపోతే నీ ఇంటి కాయితాలు నాకాడ పెట్టుకుంటా” అని గర్జించి యెళ్లిపొయ్యాడు కుమార్సామి.
ఆయబ్బి యెళ్లిపొయ్యినా సామ్మూర్తి తలొంచుకొని కదలకుండా మెదలకుండా కొయ్యలా అట్టాగే నిల్చుండిపొయ్యాడు. తల్లో సుత్తుల్తో కొడతన్నంత బాధ. గుండెల్లో బరిసెలు గుచ్చుతున్నంత నెప్పి. జెయమ్మ వొచ్చి “ఏందయ్యా అట్టా రాయిలా నించున్నావ్” అని కుదిపి కదిపేదాకా అట్టాగే ఉన్నాడు.
పెళ్లాంవొంక జూశాడు సామ్మూర్తి. ఆయబ్బి మొహంలోని ఆలోచనలూ, కళ్లల్లోని నీళ్లూ ఆమెకి తెలిశాయి. మొగుణ్ణెప్పుడూ అట్టా సూడలేదామె.
“ఊరుకోయ్యా. ఆ సామి సంగతి తెలీందా. దా. బువ్వ తిందూగానీ” అంది బుజంమీద సెయ్యేత్తా.
‘ఆకలి సచ్చిపొయ్యిందే’ అందామనుకున్నాడు. ఆమె కూడా బువ్వ తినని సంగతి గేపకమొచ్చింది. మూగోళ్లా యెల్లి కంచంముందు కూకున్నాడు. నాలుగు మెతుకులు గెతికాడు.
ఆ రోజంతా యెట్టానో గడిచింది ఆ ఇద్దరికీ. మొగుడికి దైర్నం సెప్పాలని సూసింది జెయమ్మ. సామ్మూర్తి “ఆ.. ఊ..” అంటన్నాడే గానీ మనసెక్కడ్నో ఉంది. మగ్గాలోకెళ్లి ‘వాటు’ యేత్తన్నాడే గానీ అందులో ఉషారు లేదు. నాడి తగులుకొని పోగులు తెగుతున్నాయి.
“ఈ పూటకి లేచిరాయ్యా. మనసు బావోలేనట్టుంది” అంది జెయమ్మ. లోసొచ్చి నులకమంచం మీద పడుకున్నాడు.
పెద్దకొడుకు ఇంటిమీదికొచ్చి కుమార్సామి గొడవ జేసెళ్లాడని చిన్నకొడుకు కాడున్న ఓబులుకి తెలిసింది. వొచ్చాడు. మజ్జింటో నులకమంచం మీద కళ్లు మూసుకొని పడుకోనున్న కొడుకుని సూశాడు.
కుమార్సామి ఎన్ని మాటలన్నాడో, ఏం కూతలు కూశాడో సెప్పింది కోడలు.
“వొరే సాంబూ. ఆ కుమార్సాంగాడు ఏవేవో అంటంటాడు. ఆడి సంగతి మనకు తెలీందేముంది. నువ్వు దిగులు పెట్టుకోమాక. ఏదో ఓటి సేద్దాంలే” అని దైర్నం సెప్పాలని సూశాడు ఓబులు.
ఏదో గొణిగాడు సామ్మూర్తి. ఓబులుకి అదేందో సరిగా ఇనిపించలేదు. అయినా ఇనిపించినట్టే ఏందని అడగలేదు. ఆ రేత్రి మామూలు రేత్రిలా లేదు. ఆ సంగతి జెయమ్మకి కూడా బాగా తెలుత్తోంది. పక్కన నులకమంచం కిర్రుకిర్రుమంటా సప్పుడు సేత్తంది మాటిమాటికీ. అంటే మొగుడు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాడన్న మాట. ఆమె మనసులో దిగులూ, భయమూ.. రెండూ ముసురుకున్నాయి. ఎందుకో గుండెలో గిలిగా ఉంది. దడగా ఉంది. ఆమెకు ఏ అర్ధరేత్రో నిద్రపట్టింది.
తెల్లారింది. రోజూ తెల్లారినట్లు లేదు ఆ తెల్లారడం. భయంకరంగా తెల్లారింది. భీతిపుట్టేలా తెల్లారింది. ఐదున్నరకి లేచింది జెయమ్మ. పక్కన మొగుడు లేడు. ఐదింటికే లేచి, తలుపు దెగ్గిరగా యేసి, చెంబు తీసుకొని రైలుకట్టకాడికి పోతాడు కాబట్టి అట్టాగే పొయ్యాడనుకుంది.
జుట్టు ముడేసుకుంటా దొడ్డి తలుపు తీసింది. ఆమైనే ఒక్కసారిగా ఒళ్ళు జలదరిచ్చిపొయ్యింది. ఎదురుగా ఏదో నల్లగా ఆకారం, గాల్లో యేళ్లాడతా ఉంది. ఇంకా యెల్తురు పూర్తిగా రాలేదు. జెయమ్మ కళ్లు నులుంకుంటా సూసి గావుకేక పెట్టింది. ఆ కేక ఉంత భయానకంగా ఉందో! యేపసెట్టుకి యేలాడ్తన్న ఆ ఆకారం సామ్మూర్తిది. కంటిగుడ్లు పైకి పొడసకొచ్చి, నాలికి బయటకొచ్చి…
*     *     *
“నిన్నిట్టా ఊరకే వొదిలేత్తే ఇంకెంతమంది పేణాలు తీత్తావో, యెంతమంది ఉసురు పొసుకుంటావో. నువ్వు పోతేగానీ ఈ పేటకి పట్టిన శనీద్రం పోదురా కుక్కా” అంటా కుమార్సామి జుట్టు పట్టుకున్నాడు ఓబులు.
గడగడా వొణికిపొయ్యాడు కుమార్సామి.
‘ఐపోయింది. ఈ ముసలాడి సేతిలో నాకు మూడింది’ అంది ఆయబ్బి మనసు.
“అయ్యా. మా ఆయన్ని ఏం సెయ్యమాకు. ఆయన సెడ్డోడు నిజిమే. ఇకనుంచీ దుర్మార్గం పనులు సెయ్యకుండా నే సూస్కుంటాగా. నన్నూ, నా పిల్లల్నీ అన్నేయం సెయ్యమాకు. నీకు దణ్ణం పెడ్తన్నా. నీ కాళ్లు మొక్కుతన్నా” అని కాళ్లు పట్టేసుకుంది కుమార్సామి పెళ్లాం.
ఆమొంక సూశాడు ఓబులు. తడిగా ఉన్న ఆయమ్మి కళ్లూ.. భయమూ, దిగులూ కలిసిన మొహమూ.. ఆయబ్బిలోని జాలిపేగుని కదిలిచ్చాయి. సప్పున ఓబులు గుండెలో దయ మొలకలెత్తింది.
“రేయ్ సామిగా. నిజ్జింగా నిన్ను నరికి పోగులుపెట్టి మన పేటకి దాపురిచ్చిన పీడని వొదిలిద్దామనే వొచ్చాన్రా. కానీ నీ పెళ్ళాం పిల్లల్ని సూసి వొదిలేత్తన్నా. ఆడదాని వొల్ల బతికిపొయ్యావ్ పోరా కొడకా. రేయ్. ఒక్కటి మాత్రం గేపకం పెట్టుకో. ఈసారి ఎవురింటి మీదకైనా వొచ్చి గోలసేసినట్టు తెల్సిందా.. అక్కడ్నే పాతేత్తా నాయాలా. ఇదుగోమ్మా.. నీక్కూడా సెబ్తున్నా. నువ్ సెప్పిన మాట నిలబెట్టుకోకపొయ్యావో.. ఇంకోసారి.. నీకిట్టా బతిమాలుకొనే అవకాశం కూడా ఇయ్యను. ఛీ.. నీదీ వొక బతుకేనట్రా” అని ఖాండ్రించి కుమార్సామి మొహాన ఉమ్మేశాడు ఓబులు.

-బుద్ధి యజ్ఞమూర్తి

 

కొన్ని అద్భుతాలంతే అలా జరిగిపోతాయి!

 

అదెప్పుడూ నన్ను వీడిపోదు

అమ్మకొంగు పట్టుకొని వేలాడే బాల్యపు చిరునవ్వులా

నా చుట్టే దాని భ్రమణం

 

కాలపు జరిచీర మీద అంచు కదా

దాని జిలుగుకు తరుగులేదు

 

ఏ కాస్త నవ్వు నా ముఖము పై తళుక్కుమన్నా

ఏ కాస్త నవ్వు నా పెదవులపై తారాజువ్వలా ఎగిసినా

ఏ కాస్త ఆనందం నాలోకి మధువులా దిగినా

రూపం సారం దానిదే!

నా రూపు రేఖలన్నీ దానివే!!

 

అలుపు సొలుపు లేకుండా అలా అహరహం

నాలో చలించే శక్తి నాలో జీవమై అలా ప్రవహిస్తూనే వుంటుంది.

 

సూర్యుడెలా నీడకు తోడౌతాడూ?

జలబిందువుల వస్త్రం సముద్రంలా పుడమినెలా అల్లుకుంటుందీ?

నల్లని మానుకు పచ్చనాకులేలా అలంకారాలౌతాయీ?

ముత్యమంత గింజలో మహావృక్షం ఎలా ఒదిగిపోతుంది?

 

కొన్ని అధ్బుతాలంతే అలా జరిగిపోతాయి.

 

తొలకరి జల్లులాంటి తొలిపలుకుల మొదలు

దారప్పోగులై విడిపోయి నా నరనరం రుధిరపు హోరై

కణకణంలో మొగ్గల్నెలా పూయిస్తుందీ?

 

నిశ్శబ్దం శబ్దంలా రూపాంతరం చెందే

దృగ్ప్రంపచపు లయబద్ధత

మాటల తోటలాగా, పదాల పుట్టలాగా, కవనగానంలాగా

నాలో ప్రతిధనిస్తుంది

 

వేలవేల పిట్టల పాటలుగా

పాటలు తీగలై వొంపులు తిరిగే పూలచెట్టు ఆకుల సవ్వడిగా

పదుగురు సంగీతకారుల సామూహిక వయోలీన్ రాగాల రెసొనెన్స్

వీణ తంత్రుల పై నుంచి జారే వేలి కొసల నుదుళ్ళపై రాయబడ్డ మ్యూజికల్ నోట్స్ లాగా

ధ్వనుల నుంచి ధ్వనుల జననం

ధ్వనులక్షరాలౌతాయి

ధ్వనులు పదాలౌతాయి

పదాలు పుస్తకాలౌతాయి

పుస్తకాలు గ్రంధాలౌతాయి

గ్రాంధాలే పూలై వేలాడే మనోగతపు వృక్షం

అంతరంగపు చెట్టుకు పూసె పూల చుట్టూ వలయాలై ఎగిరే పరిమళం

ధ్వని అంటే ప్రపంచం

ప్రపంచం ధ్వనుల బీజాక్షరం

ధ్వనిని పలకరించే అధర వసంతం ధమనుల్లోని సాగరకెరట సంచలనమై

లోకపు గడయారానికి నే వేలాడుతున్న లోలకం

 -మహమూద్

పెద్రో పారమొ-9

pedro1-1

వాళ్ళు అతని ఇంటి తలుపుల మీద బాదారు కానీ బదులు లేదు. ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తడుతూ అందరినీ లేపుతూండడం అతను విన్నాడు. ఫుల్గోర్ – అడుగుల చప్పుడు విని గుర్తుపట్టగలడు – పెద్ద తలుపు వైపు తిరిగి వడిగా నడవబోతూ మళ్ళీ తలుపు తట్టడానికా అన్నట్టు ఆగాడు. కానీ తిరిగి పరుగు తీశాడు.

గొంతులు. నెమ్మదిగా ఈడుస్తున్నట్టు అడుగుల చప్పుడు, బరువైనదేదో మోస్తున్నట్టు.

పోలిక పట్టలేని శబ్దాలు.

తన తండ్రి చావు గుర్తొచ్చిందతనికి. ఇట్లాగే ఒక వేకువజామున. కానీ తలుపు తెరిచి ఉంది. బూడిద రంగు ఆకాశం లోపలికి జొరబడటం కనిపించింది. దుఖాన్ని దిగమింగుకుంటూ ఒక స్త్రీ వాకిలిని ఆనుకుని ఉంది. అతను మర్చిపోయిన, ఎన్నెన్నో సార్లు మర్చిపోయిన తల్లి అతనికి చెపుతూంది ‘నీ తండ్రిని చంపేశారు,’ వెక్కిళ్ళు మాత్రమే ఒకటిగా పట్టుకుని ఉన్న చిట్లిన గొంతు వణుకుతూండగా.

ఆ జ్ఞాపకం తిరిగి గుర్తుచేసుకోవడం అతనికి ఇష్టం ఉండదు. అది ఇంకా చాలా వాటిని వెంట పెట్టుకుని వస్తుంది. నిండా నింపిన బస్తా పిగిలితే గింజలు కారిపోకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్టు. అతన తండ్రి చావుతో పాటు చాలా చావులు తోడయ్యాయి. ప్రతి చావులో ఒక పగిలిన మొహపు బొమ్మ – ఒక కన్ను చితికీ, ఇంకో కన్ను ప్రతీకారేచ్ఛతో చూస్తూ. తర్వాత ఇంకో జ్ఞాపకం, ఆ తర్వాత ఇంకోటీ, జ్ఞాపకాల్లోంచి ఆ చావుని చెరిపేస్తూ. ఇక దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎవరూ లేరు.

“ఇక్కడ పడుకోబెట్టండి. అహఁ అట్లా కాదు. తల అటు తిప్పి పెట్టు. నిన్నే! దేనికోసం చూస్తున్నావు?”

అంతా లోగొంతుకల్లోనే.

“డాన్ పేద్రో ఎక్కడ?”

“నిద్ర పోతున్నాడు. ఆయన్ని లేపకు. సద్దు చేయకండి”

కానీ అతను నిలువెత్తున అక్కడ నిలుచుని ఉన్నాడు. ఒక పెద్ద మూటని గోనెపట్టాల్లో చుట్టి ప్రేతవస్త్రంలా చుట్టూ గడ్డితో కప్పడానికి వాళ్ళు శ్రమపడటాన్ని చూస్తూ.

“ఎవరది?” అడిగాడతను.

ఫుల్గోర్ సెడానో ముందుకొచ్చి చెప్పాడు “అది మిగెల్ డాన్ పేద్రో!”

“వాడిని ఏం చేశారు వాళ్ళు?” అరిచాడు.

‘వాళ్లు అతన్ని చంపారు,’ అని అంటారని ఎదురు చూశాడు. లోపల ఆగ్రహం సుళ్ళు తిరుగుతూ పగగా గడ్డకట్టడం అతనికి తెలుస్తూంది. కానీ ఫుల్గోర్ మెత్తటి గొంతుతో చెప్పాడు. “ఎవరూ అతన్ని ఏమీ చేయలేదు. తనంత తనే చనిపోయాడు.”

నూనె దీపాలు రాత్రిని వెలిగిస్తున్నాయి.

“అతని గుర్రం చంపిందతన్ని!” ఎవరో అడక్కుండానే చెప్పారు.

అతన్ని అతని మంచం మీద పడుకోబెట్టారు పరుపు తిరగేసి. ఇంటికి మోసుకురావడానికి కట్టిన కట్లన్నీ ఊడదీసారు. చేతులు ఛాతీ మీదుగా కట్టి, మొహాన నల్ల గుడ్డ కప్పారు. “ఉన్నదాని కంటే పెద్దగా కనిపిస్తున్నాడు,” తనలో తాను అనుకున్నాడు ఫుల్గోర్.

పేద్రో పారమొ అలాగే నిలబడిపోయాడు. ఎక్కడో ఉండి పోయినట్టు అతని మొహాన ఏ భావమూ లేదు. అతని స్పృహకు అందని దూరంలో ఆలోచనలు వేగంగా పరుగెత్తాయి రూపు దాల్చకుండానే తెగిపడి పోతూ. చివరికి అన్నాడు “బదులు చెల్లించడం మొదలుపెట్టాను. ఎంత తొందరగా మొదలు పెడితే అంత తొందరగా అయిపోతుంది.”

అతనికి విచారమేదీ కలగలేదు.

అందరికీ వినపడేలా ఆడవాళ్ల ఏడుపులకు మించి గొంతెత్తి వరండాలో చేరిన వాళ్లకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడినప్పుడు అతనికి ఊపిరీ మాటలూ కరువు కాలేదు. తర్వాత వినిపించిన ఒకే శబ్దం మిగెల్ కపిల రంగు గుర్రపు పాదాలదే.

ఫుల్గోర్ సెడానోని ఆజ్ఞాపిస్తూ అన్నాడు ” రేపు ఎవరినన్నా పిలిపించి ఆ పశువు పని పూర్తి చేయి. ఆ బాధనుంచి దానికి విముక్తి కలిగించు.”

“అలాగే డాన్ పేద్రో! నేను అర్థం చేసుకోగలను, పాపం అది చాలా బాధపడుతున్నట్టుంది.”

“నేనూ అదే అనుకుంటున్నాను ఫుల్గోర్. నువు వెళ్ళేఫ్ఫుడు ఆ ఆడవాళ్లను ఆ ఏడుపులాపమని చెప్పు. పోగొట్టుకుంది నేనయితే వాళ్లు ఎక్కువ గొడవ చేస్తున్నారు. ఇదే వాళ్ళకు జరిగితే అంత చేటు ఏడవడానికి ముందుకు రారు.”

సంవత్సరాల తర్వాత ఫాదర్ రెంటెరియా తన గట్టి పక్క తనని నిద్రపోనివ్వక బయటికి తరిమిన రాత్రి గుర్తు చేసుకుంటాడు. అది మిగెల్ పారమొ చనిపోయిన రాత్రి.

అతనా రాత్రి కోమలా వొంటరి వీధుల్లో నడిచాడు. అతని అడుగుల చప్పుడుకు చెత్త కుప్పల్లో మూతి పెట్టి వెతుక్కుంటున్న కుక్కలు ఉలిక్కిపడి చూశాయి. నది దాకా నడిచాడు. అక్కడే నిలబడి స్వర్గాలనుంచి తెగిపడి రాలిన నక్షత్రాలు నీళ్ళ నిశ్శబ్దపు సుడుల్లో పరావర్తనం చెందడం చూశాడు. కొన్ని గంటలపాటు నది నల్లటి నీళ్ళలో కలిసిపోతున్న తన ఆలోచనలతో సతమతమయ్యాడు.

ఇదంతా ఆ పేద్రో పారమొ అనే నీచుడు తనంత తాను పైకి రావడంతోటే మొదలయ్యిందనుకున్నాడు. పిచ్చిగడ్డి లాగా పాకి పెరిగిపోయాడు. అన్నిట్లోకీ విషాదమేమిటంటే తను అందుకు తోడ్పడటం. “నేను పాపం చేశాను ఫాదర్! నిన్న పేద్రో పారమొతో పడుకున్నాను.” “పాపం చేశాను ఫాదర్! పేద్రో పారమొ బిడ్డను మోస్తున్నాను.” “నా కూతుర్ని పేద్రో పారమొకి అప్పచెప్పాను ఫాదర్!” ఎప్పుడన్నా వొచ్చి కొన్ని పాపాలనయినా కన్ ఫెస్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉండిపోయాడు కానీ అతనెప్పుడూ రాలేదు. తన దౌష్ట్యాన్ని కొడుకు ద్వారా ఇంకా విస్తరింపజేశాడు. తను గుర్తించింది.. ఎందుకో ఆ దేవుడికే తెలియాలి. తనకు తెల్సిందల్లా ఆ సాధనాన్ని అతని చేతుల్లోనే పెట్టడం.

అతనికి స్పష్టంగా గుర్తుంది కొన్ని గంటల బిడ్డని తనే పేద్రో పారమొ దగ్గరికి తీసుకు వెళ్ళడం.

“డాన్ పేద్రో! ఈ బిడ్డకి జన్మనిచ్చి తల్లి చనిపోయింది. ఈ బిడ్డ నీకొడుకే అని చెప్పింది. ఇడుగో!”

పేద్రో పారమొ కన్నార్పలేదు. మామూలుగా చెప్పాడు ” మీరే ఉంచుకోకపోయారా? ప్రీస్ట్ ని చేయండి.”

“ఈ బిడ్డ వొంట్లో పారే నెత్తురెవరిదో తెలిసీ ఆ బాధ్యత నేను స్వీకరించలేను.”

“వాడిది చెడ్డ నెత్తురేనని నిజంగా అనుకుంటున్నారా? ”

“నిజంగానే అనుకుంటున్నాను డాన్ పేద్రో!”

“నువు తప్పని నిరూపిస్తాను. వాణ్ణి నా దగ్గరే వదిలేయి. వాడిని చూసుకోవడానికి ఎవరో ఒకరిని చూస్తాను.”

“నా మనసులో ఉన్నదీ అదే. ఇక్కడుంటే కనీసం వీడికి తినడానికయినా ఉంటుంది.”

చిన్నగా ఉన్నా ఆ పసివాడు రక్తపింజేరిలా కదులుతూ ఉన్నాడు.

“డమియానా! నువ్వు చూసుకోవలసినదొకటుంది చూడు ఇక్కడ. వీడు నాకొడుకు.”

తర్వాత ఒక సీసా బిరడా తీశాడు.

“ఇది చనిపోయిన తల్లికీ, నీకూ!”

“బిడ్డకి కూడానా?”

“వాడికి కూడా, ఏం?”

అతను ఇంకో గ్లాసు నింపాడు. ఇద్దరూ బిడ్డ భవిష్యత్తుకోసం తాగారు.

అది అట్లా అయింది.

బళ్ళు మెదియా లూనా వైపు శబ్దాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఫాదర్ రెంటెరియా వంగి నది వొడ్డున ఉన్నరెల్లు పొదల వెనక నక్కాడు.

“దేన్నుంచి దాక్కుంటున్నావు?” తనను తనే అడుక్కున్నాడు.

“సెలవు ఫాదర్!” అతనికి వినిపించింది.

పైకి లేచి బదులిచ్చాడు. “సెలవు. దేవుడు నిన్ను దయచూచుగాక!”

ఊళ్ళోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా ఆరిపోయాయి. నది కాంతివంతమైన రంగులతో వెలుగుతూంది.

“ఏంజెలస్ గంట (ఒక ప్రార్థనా సమయాన్ని సూచించేది) మోగిందా ఫాదర్?” బళ్ళు నడిపేవాళ్ళలో ఒకరడిగారు.

“ఆ సమయం దాటి చాలా సేపయింది,” అని బదులిచ్చాడు. తిరిగి వాళ్లకు ఎదురు దిక్కులో నడవసాగాడు ఆపినా ఆగకూడదని నిర్ణయించుకుని.

“ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు ఫాదర్?”

“ఎవరింట్లో చనిపోయారు ఫాదర్?”

“కోంట్లాలో ఎవరన్నా చనిపోయారా ఫాదర్?”

“నేనే. ఆ చనిపోయింది ఎవరో కాదు నేనే,” అని బదులిద్దామనుకున్నాడు. కానీ నవ్వి ఊరుకున్నాడు.

చివరి ఇళ్ళూ వెనకపడగానే వేగంగా నడిచాడు.

అతను తిరిగొచ్చేసరికి బాగా పొద్దెక్కింది.

“ఎక్కడికెళ్ళావు బాబాయ్?” ఆనా అడిగింది. చాలామంది ఆడవాళ్ళు నీకోసం చూస్తూ ఉన్నారు. వాళ్లు కన్ ఫెస్ చేయాలనుకుంటున్నారు. రేపు మొదటి శుక్రవారం కదా!”

“వాళ్ళను తిరిగి సాయంత్రం రమ్మని చెప్పు.”

హాల్ లో బల్ల మీద ఒక క్షణం నిశ్శబ్దంగా కూచున్నాడు అలసట బరువుకు.

“ఈ గాలి ఎంత చల్లగా ఉంది ఆనా!”

“చాలా వేడిగా ఉంది బాబాయ్!”

“నాకనిపించడం లేదు.”

అతను అసలు ఆలోచించకూడదనుకున్నది తను కోంట్లాకు వెళ్ళి అక్కడ తోటి ప్రీస్ట్ తో కన్ ఫెస్ చేసిన సంగతి. ఎంత బతిమలాడినా ప్రక్షాళన మాత్రం తిరస్కరించాడు అతడు.

“నువు పేరెత్తడానికి కూడా ఇష్టపడని మనిషి నీ చర్చిని నాశనం చేశాడు. నువు చూస్తూ కూచున్నావు. ఇప్పుడు నీనుంచి ఏం ఆశించగలను ఫాదర్? దేవుడి శక్తిని ఎలా వాడుకున్నావు? నువు మంచి మనిషివనే అనుకుంటాను, అందుకు నిన్ను గౌరవిస్తాను కూడా. కానీ మంచితనమే సరిపోదు. పాపం మంచిది కాదు. పాపనాశనం కోసం గట్టిగా నిర్దాక్షిణ్యంగా నిలబడగలగాలి. మీ చర్చికి వచ్చేవాళ్ళంతా విశ్వాసులే అనుకుంటాను. కానీ వాళ్ల నమ్మకాన్ని నువే నిలబెట్టుకోలేకపోయావు. వాళ్లు భయంతోటో, మౌఢ్యంతోటో నమ్ముతారు. నీ కటిక దరిద్రం సంగతి నాకు తెలుసు. గంటలకొద్దీ నీ విధుల్ని నువు నిర్వర్తించడమూ నాకు బాగా తెలుసు. బహిష్కార శిక్ష విధించినట్టు మనల్ని ఈ పాడుబడ్డ ఊళ్ళకి పంపారు. ఇక్కడ మన పని ఎంత కష్టమో నాకూ వ్యక్తిగతంగా తెలుసు. కానీ అదే నీకు ఈ విషయం చెప్పే హక్కునూ ఇస్తూంది. మన ఆత్మలకి బదులుగా బెత్తెమిచ్చే ఏ కొద్దిమందికోసమో కాదు మనం సేవ చేయవలసింది. నీ ఆత్మ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు నీకంటే మెరుగ్గా ఉన్నవాళ్లకంటే మెరుగ్గా అయే అవకాశమెక్కడుంది? లేదు ఫాదర్! నిన్ను ప్రక్షాళన చేయడానికి నా చేతులంత పరిశుభ్రంగా లేవు. నువు ఇంకెక్కడికన్నా వెళ్లాలి దాని కోసం.”

“నువ్వనేదేమిటి? కన్ ఫెస్ చేయడానికి ఇంకెక్కడికన్నా వెళ్లమంటావా?”

“అవును. వెళ్లాలి. నువ్వే పాపంలో కూరుకు పోయినప్పుడు ఇతరులను శుద్ధి చేయడమెలా కొనసాగిస్తావు?”

“వాళ్ళు నన్ను మినిస్ట్రీ నుంచి తొలగిస్తేనో?”

“అదే నీకు తగినదేమో! ఆ తీర్పు వాళ్ళే చేస్తారు.”

“కొంచెం.. తాత్కాలికంగానయినా.. అంటే.. నేను అంత్యక్రియలు చేయవలసి ఉంది, ప్రార్థన సమ్మవేశాలు నిర్వహించాలి. మా వూళ్ళో ఎంత మంది చనిపోతున్నారో ఫాదర్!”

“నేస్తం, ఆ దేవుణ్ణే చనిపోయినవాళ్లపై తీర్పులు చెప్పనీ!”

“అయితే ప్రక్షాళితం చేయవన్నమాట!”

కోంట్లా ఫాదర్ లేదని చెప్పాడు.

తర్వాత వాళ్ళిద్దరూ చర్చి వరండాలో అజాలియా నీడల్లోని జపమందిరం గుండా నడిచారు. ద్రాక్షపళ్ళు పండుతూ ఉన్న ఆర్బర్ కింద కూచున్నారు.

“అన్నీ చేదే ఫాదర్!” ఫాదర్ రెంటెరియా ఏం అడగబోతున్నాడో ఊహించాడు. “దేవుడి దయ వల్ల అన్నీ పండే నేల మీదే బతుకుతున్నాము. కానీ పెరిగే ప్రతిదీ చేదే. అదే మన శాపం.”

“నువ్వు చెప్పేది నిజమే ఫాదర్! కోమలాలో ద్రాక్ష పెంచుదామని చూశాను. పిందె నిలవలేదు. జామ పళ్ళూ, నారింజలే. అవీ చేదు జామలూ, చేదు నారింజలూ. తియ్యటి పండు రుచే మర్చిపోయాను. సెమినరీలో మనం తిన్న చైనా జామ పళ్ళు గుర్తున్నాయా? ఆ పీచ్ పళ్ళు? తాకగానే తోలు ఊడొచ్చే ఆ కమలా పళ్ళు? విత్తనాలు ఇక్కడికి తీసుకు వచ్చాను. కాసినే, చిన్న సంచిలో. తర్వాత అక్కడే వదిలేసి ఉంటే బాగుండేదోమోననిపించింది. ఇక్కడికి తీసుకువచ్చింది చంపడానికేగా!’

“నిజమే ఫాదర్! ఈ కోమలా నేల మంచిదనే అంటారు వాళ్ళూ. కానీ ఆ నేలంతా ఒక్కడి చేతిలోనే ఉండటం అన్యాయం. ఇంకా పేద్రో పారమోయే కద వాటి యజమాని?”

“అది దైవేఛ్ఛ.”

“దానికీ దైవేఛ్ఛకీ ఏమన్నా సంబంధం ఉందంటే నమ్మలేను. నువ్వూ నమ్మవు కదా ఫాదర్? నమ్ముతావా?”

“కొన్ని సార్లు అనుమానం వచ్చింది, కానీ కోమలాలో అందరూ అదే నమ్ముతారు.”

“వాళ్లలో నువ్వూ ఒకడివా?”

“నేను వినమ్రంగా తలదించుకోవడానికి సిద్ధపడిన మనిషిని. ఇంకా అలాగే ఉండాలని అనిపిస్తుంది.”

తర్వాత వాళ్లిద్దరూ సెలవు తీసుకుంటున్నప్పుడు ఫాదర్ రెంటెరియా ప్రీస్ట్ చేతుల్ని పట్టుకుని ముద్దాడాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక, వాస్తవంలోకి తిరిగి వచ్చాక కోంట్లాలో ఆ ఉదయం గురింఛి అతనికి తలుచుకోబుద్ధి కావడం లేదు.

అతను బల్ల మీది నుంచి లేచి వాకిలి వేపు నడిచాడు.

“ఎక్కడికి వెళుతున్నావు బాబాయ్?”

అతని కూతురు ఆనా, బతుకునుంచిరక్షణ కోసం అతని నీడ కావాలన్నట్టు ఎప్పుడూ అతని పక్కనే.

“కాసేపు నడిచొద్దామని బయటికి వెళుతున్నా. కాస్త తిక్కగా ఉన్నట్టుంది”

“వొంట్లో బాలేదా?”

“బాలేకపోవడం కాదమ్మా! చెడ్డగా. అవును, నేను చెడ్డ వాణ్ణి.”

అతను మెదియా లూనా దాకా నడిచివెళ్ళి డాన్ పేద్రోకి ఓదార్పు మాటలు చెప్పాడు. మళ్ళీ తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలను తిప్పి కొడుతూ చెప్పిన సాకులను విన్నాడు. బదులుగా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం? భోజనానికి లేవమన్నప్పుడు మాత్రం కుదరదన్నాడు.

“నాకు వీలు కాదు డాన్ పేద్రో. తొందరగా చర్చికి వెళ్ళాలి. కన్ ఫెషన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.”

అతను ఇంటికి నడిచి వచ్చి తర్వాత సాయంత్రమయేటప్పటికి సరాసరి చర్చికి వెళ్ళాడు. అట్లాగే ఆ మురికీ, దైన్యమూ కమ్ముకున్న దేహంతోటే. కన్ ఫెషన్స్ వినడానికి కూర్చున్నాడు.

లైనులో మొదట ఉన్నది చర్చి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూసే పాత డొరోతియా.

ఆల్కహాల్ వాసన వేసిందతనికి.

“ఏమిటిది? ఇప్పుడు తాగడం కూడా మొదలుపెట్టావా? ఎన్నాళ్ళనుంచి?”

“మిగెల్ దినానికి కి వెళ్ళాను ఫాదర్. కొంచెం ఎక్కువయినట్టుంది. తాగడానికి బోలెడంత ఇచ్చేసరికి చివరికి నేను బఫూన్ నయ్యాను.”

“నువు ఎప్పుడూ చేసేదదేగా డొరోతియా!”

“కానీ ఇప్పుడు నేను నా మోయలేని పాపాలతో వచ్చాను.”

చాలా సందర్భాలలో ఆమెకి చెప్పాడు. ” కన్ ఫెస్ చేయాలనుకోకు డొరోతియా. నా సమయం వ్యర్థం చేస్తావు. నువు కావాలనుకున్నా పాపం చేయలేవు. అది మిగతా వాళ్లకు వదిలేయి.”

“ఇప్పుడు పాపం చేశాను ఫాదర్! నిజంగా!”

“చెప్పు.”

“ఇప్పుడిక అతనికి కలిగే కీడు ఏమీ లేదు కనుక చెపుతున్నాను. ఆ చనిపోయినవాడికి అమ్మాయిలని తార్చింది నేనే. మిగెల్ పారమోకి.”

ఆలొచించడానికి వ్యవధి కావాలన్నట్టు స్తబ్ధుడయాడు. పొగమంచులోంచి బయట పడుతున్నట్టు అలవాటు చొప్పున అడిగాడు “ఎన్నాళ్ల నుంచి?”.

“చిన్నప్పట్నుంచీ. అతనికి మీజిల్స్ వచ్చినప్పటి నుంచీ.”

“ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు డొరోతియా.”

“మిగెల్ కి అమ్మాయిలని ఏర్పాటు చేసింది నేనే.”

“నువు తీసుకు వెళ్ళేదానివా అతని దగ్గరకు?”

“కొన్నిసార్లు నేను తీసు వెళ్ళేదాన్ని. కొన్ని సార్లు ఏర్పాట్లు మాత్రం చేసేదాన్ని. కొంతమందితో మాత్రం అతనికి సరైన దారి చూపించి ఊరుకునేదాన్ని. అదే, వాళ్ళెప్పుడు వొంటరిగా ఉండేదీ, అదాటున వాళ్ళనెప్పుడు పట్టుకోవచ్చో..”

“చాల మందినా?”

అడగాలనుకోలేదు కానీ అలవాటు చొప్పున వచ్చేసిందా ప్రశ్న.

“లెక్కలేనంత మంది. చాలా చాలా మంది.”

“నిన్నేం చేయమంటావో చెప్పు డొరోతియా! నువ్వే తీర్పు చెప్పు. నిన్ను నువు క్షమించుకోగలవా?”

“క్షమించుకోలేను ఫాదర్! అందుకే ఇక్కడికి వచ్చింది.”

“చనిపోయాక స్వర్గానికి పంపమని నన్నెన్ని సార్లు అడిగావు? నీకు నీకొడుకు అక్కడ కనపడతాడని ఆశ ఉండేది, కదా డొరోతియా? ఇప్పుడు నువు స్వర్గానికి వెళ్ళలేవు. ఆ దేవుడు నిన్ను క్షమించు గాక!”

“ధన్యవాదాలు ఫాదర్!”

“సరే, ఆ దైవం పేరిట నిన్ను క్షమిస్తున్నాను. ఇక వెళ్ళు.”

“నాకు ప్రాయశ్చిత్తం ఏదీ ఇవ్వవా?”

“నీకు ఆ అవసరం లేదు డొరోతియా!”

“ధన్యవాదాలు ఫాదర్!”

“దేవుడు తోడుగా వెళ్ళు!”

ఆ గది కిటికీ మీద చప్పుడు చేశాడు తర్వాత ఆమెని రమ్మన్న సూచనగా. “నేను పాపం చేశాను,” మాటలు వింటుండగా అతని తల ఇక నిలబడలేనట్టు ముందుకు వాలింది. తర్వాత తలతిప్పుడు, గందరగోళం, జిడ్డు నీళ్ళలో ఉన్నట్టు జారిపోవడం, తిరుగుతూ ఉన్న దీపాలూ. బద్దలయి ముక్కలుగా చెదిరిపోయి ముగుస్తున్న దినకాంతీ. నాలుకపైన నెత్తుటి రుచీ. “నేను పాపం చేశాను,” బిగ్గరగా, మళ్ళీ మళ్ళీ వినవస్తూంది. “ఇప్పటికీ, ఎప్పటికీ”,”ఇప్పటికీ, ఎప్పటికీ” “ఇప్పటికీ..”

“ఊరుకో అమ్మా,” అన్నాడు. “చివరిసారిగా ఎప్పుడు కన్ ఫెస్ చేశావు?”

“రెండురోజుల క్రితం ఫాదర్!”

ఇంతలోనే మళ్ళీ వచ్చింది. దురదృష్టం అతన్ని చుట్టుముట్టినట్టనిపించింది. ఏం చేస్తున్నావిక్కడ, తనని తనే అడుక్కున్నాడు. విశ్రాంతి తీసుకో. పో. నువు బాగా అలసిపోయావు.

కన్ ఫెషన్ గది నుంచి బయటికి వచ్చి సరాసరి పాత సామాన్ల గదివైపు వెళ్ళాడు. ఎదురుచూస్తున్నవాళ్ల వంక కూడా చూడకుండా చెప్పాడు “మీలో పాపం చేయలేదనుకున్న వాళ్ళంతా రేపు పవిత్ర ప్రార్థన సమావేశానికి రండి.”

అతను వెళుతుంటే వెనక నుంచి గుసగుసలు వినిపించాయి.

కథ గొంతుకని పత్రికలు నొక్కేస్తున్నాయి

 

దోస్తు పలమనేరు బాలాజి, అతని మిత్రులు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ కథకులను చాలామందిని పిలుస్తూనే, కొత్త కథకులు కూడా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేలా కొన్ని ప్రశ్నలను అందిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ విషయంలో వారిని అభినందించి తీరాల్సిందే.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకునే ఒక స్పేస్‌ను కల్పించినందుకు వారికి షుక్రియా కూడా..
చర్చకోసం వారు వేసిన ప్రశ్నల్లోంచి కొన్నింటికి నా స్పందన ఇది.
పత్రికలు కథా స్వరూపాన్నే కాక, భాషను, సబ్జెక్టును కూడా నిర్దేషిస్తున్నాయి.
1. భాష: నేను ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. మా గల్లీల్లో మాట్లాడేది తెలంగాణ తెలుగు. చదివింది మాత్రం కోస్తాంధ్ర ‘ప్రామాణిక’ భాష. నేను ఏ భాషలో కథ రాయాలి? తెలంగాణలోని తెలుగు-ఉర్దూ కలగలిసిన మా కమ్మని భాషలో కథలు రాస్తుంటే కొందరు ‘కంగాళీ’ భాష అని ఆడిపోసుకుంటున్నారు. మా మీద బలవంతంగా రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోని వాక్య నిర్మాణాలు, పదాలు ఎంత వదిలించుకున్నా వదిలిపోని జిడ్డులాగా మమ్మల్ని హింస పెడుతున్నాయి. అది చూసి కంగాళీ కామెంట్లు చేస్తున్న వారు ప్రత్యక్షంగా కొందరే గాని, పరోక్షంగా ఎందరో.. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఇచ్చిన ఎరుకలోంచి మేం గట్టిగా ప్రతిఘటించగలుగుతున్నాం కాని ఇన్నాళ్లు మా ప్రాంతపు ఎందరో రచయితల్ని కోస్తాంధ్ర భాషాగ్రేసరులు నంజుకుతిన్నారు. అంతేగాక భాష విషయంలో పత్రికలు కథా రచయితల్ని నానా హింస పెడుతున్నాయి. ‘మాండలిక’ పేరుతో కొన్ని ప్రాంతాల కథల్ని పత్రికలు నిరాకరిస్తున్నాయి. దాంతో ఎంతోమంది కథకులు కేవలం కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోనే కథలు రాయలేక ఊరకుండిపోతున్నారు. నిజానికి తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ కథకులకు ఆత్మాభిమానం ఎక్కువ.
అందుకే కోస్తాంధ్ర మీడియా నిర్దేశిస్తే వారు గంగిరెద్దుల్లా తలలూపే స్వభావం ఏమాత్రం లేనివారు. దాంతో అలాంటివారు పత్రికలకు కథలే పంపని వాతావరణం మనం చూస్తున్నాం. ఈ విషయంలో కోస్తాంధ్రకు చెందిన అగ్రకులాల రచయితలు మాత్రం హాయిగా రాసుకుని, ఏ ఆటంకం లేకుండా అచ్చేయించుకోగలుగుతున్నారు. అట్లా కడుపు నిండిన కథలు ఎన్నో వస్తున్నాయి. కడుపు మండిన కథలకు మాత్రం తావు లేకుండా పోయింది.
రాసుకుని పుస్తకాలుగా మాత్రమే తీసుకొచ్చే శక్తి ఎంతమందికి ఉంటుంది? అలా చేయలేనివారు రాయడమే మానుకోవడం చూస్తున్నాం.
మా లాంటి వారము ఆ పత్రికలకు కథలు పంపాలంటే మా భాషలో రాసుకున్నది మళ్లీ వారి భాషలోకి అనువదించి పంపాల్సిన దుస్థితి పట్టింది. ఏ కొన్ని పదాలు, వాక్యాలు మావి పడ్డా అవేవో పంటికింద రాళ్లుగా వారు చూసే వాతావరణం గోస పెడుతున్నది. తెలంగాణలో వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు లాంటివారు దళిత కులాల వ్యావహారిక భాషలో రాస్తున్నారు. ఈ మధ్యే జూపాక సుభద్ర, గోగు శ్యామల లాంటివారు తమ మాదిగ స్త్రీల కథల్ని సంపుటాలుగా తీసుకువచ్చారు. వారి కథలేవీ ఈ పత్రికలు ముర్క గూడ చూసే పరిస్థితి లేదు. నేను, పసునూరి రవీందర్‌ లాంటివాళ్లం మా ప్రత్యేక భాషల్లో కథలు రాసుకున్నాక నమస్తే తెలంగాణ పత్రికకైతే అలాగే పంపడం, ఆంధ్రా పత్రికలకు పంపాలనుకుంటే మాత్రం వారి భాషలోకి తిరిగి అనువదించి పంపుతున్నాం. రచయితలు తమ భాషల్లో రాసుకున్న కథల్ని ఉన్నది ఉన్నట్లు వేసే పత్రికలు చాలా అవసరం అని మేం భావిస్తున్నాం.
2. సబ్జెక్టు: పత్రికలు రచయితలు రాయాల్సిన సబ్జెక్టును కూడా నియంత్రిస్తున్నాయి. కుల ప్రస్తావన ఉన్న కథలను చాలా వరకు పత్రికలు అచ్చుకు స్వీకరించడం లేదు. మత ప్రస్తావన ఉన్న ఎన్నో కథలు నిరాకరించబడుతున్నాయి. ముఖ్యంగా యాజమాన్యాల కులం, ప్రాంతం కథల సబ్జెక్టును చెప్పకనే నియంత్రించడం బహిరంగ రహస్యమే. మాదిగ, మాల కథలు, పాకి పని చేసేవారి కథలు, మత ఛాందసం మీద వచ్చే కథలు, హిందూత్వ మీద వచ్చే కథలు అచ్చుకు నిరాకరించబడుతున్నాయి.
3. నిడివి: నిడివి అనేది మరీ సమస్యగా మారింది. పత్రికల్లో రెండు పేజీల కథలు కొన్ని పత్రికలు, మూడు పేజీల కథలు కొన్ని పత్రికలు వేస్తున్నాయి. అచ్చులో చూసుకోవాలంటే ఆ నిడివిలోకి కుదించి రాయాల్సిన అగత్యం రచయితలకు పట్టింది. దాంతో కథకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కథలు ఎన్నో కత్తిరింపులకు గురయ్యే పరిస్థితి ఉంది. గతంలో రచయితలు రాసిన కథల్ని కళ్లకు అద్దుకుని అచ్చేసుకున్న పరిస్థితి. ఇవాళ కత్తిరింపులతో రచయితల మనసులు చిన్నాభిన్నం చేస్తున్న దుస్థితి.
‘సారంగ’ లాంటి రెండు మూడు వెబ్‌ పత్రికలు మాత్రమే కథల్ని ఉన్నది ఉన్నట్లు అచ్చేస్తూ కొంతవరకు ఈ ఖాళీని పూరిస్తున్నాయి.
వెరసి ఏ హద్దులు గీయకుండా కథల్ని అచ్చేసేందుకు, కథా చర్చలకు ఏ అడ్డూ చెప్పని ఒక పత్రిక అవసరం ఎంతైనా ఉంది. రచయితలే అందుకు ఒక ట్రస్ట్‌గా ఏర్పడి ప్రయత్నిస్తే మంచిదేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పత్రికలు గానీ, ఇక ముందు వచ్చే పత్రికలు గానీ యాజమాన్యాల ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చే వాతావరణం బలపడిపోయింది.
– స్కైబాబ

దృశ్యాదృశ్యాలు

Sreekanth

 

 

 

 

 

ఆకాశంలో తారల వైపు చూసి
ఆశువుగా కవిత్వం చెప్పమన్నాడో మిత్రుడు

ఆకాశనికుంజంలో
అందంగా విరిసిన జాజిమల్లి జాబిలైతే
విరిసీ విరియని మొగ్గలే తారలు
వాలిపోయే తుమ్మెదలే కరిమబ్బులు

కలువరేకుల నా చెలికన్నుల్లో
కొలువుదీరాయి నిండుపున్నిమలు
ఆకాశమా అసూయపడకు
అమావాస్యనిశి నాకిక లేదు !

వెన్నెలవాగులో
వ్యాహ్యాళికెళ్దాం సఖీ !
నెలవంక నావనెక్కి
నక్షత్ర సుమాలు ఏరుకొంటూ..

ఈ చీకటి నీటిగుంతలో
ఏ చిన్నారి విడిచిన కాగితపు పడవలో ఈ తారలు
కాలం కెరటాలపై స్నిగ్ధంగా సోలిపోతూ
కూతురి బాల్యచేష్టల్ని కళ్ళెదుటే నిలుపుతున్నాయ్

కొట్టుకుపోయిన కొత్త తార్రోడ్డుపై
కకావికలైన గులకరాళ్ళ మధ్య
మూతబడని మ్యాన్‌హోల్‌లా మూగగా చంద్రుడు
దశాబ్దాల నీ ప్రగతికి దేశమా !
దారుణ ప్రతీకలివే !!

కుంభకోణాల కమురుతెట్టులో
వేగిపోతున్న వ్యంజన పదార్థాలు
మినుకుబిక్కుమంటూన్న ఈ మామూలు మనుషులు
నవ్వీ నంజుకునే నేతల పీతలే అన్ని వేపులా !

సమస్య ఉప్పెనలో సర్వం కోల్పోయి
కెరటాల మబ్బులకు కృంగీ ఎదురీదీ
శరణార్థియై తరలిపోతున్నాడు శుష్కచంద్రుడు
నక్షత్రసంతతిని నడిపించుకుంటూ

విసిరేసిన పులి విస్తట్లో
విరిగిపోయిన చుక్కల పుల్లల మధ్య
వెలిసిపోయిన జాబిలిముద్దను చూసి
పెదవి తడుపుకున్నాడో పరమనిర్భాగ్యుడు

కాముకుడి కర్కశత్వానికి
కుమిలిపోతున్న కన్నెపిల్లలా
వొళ్ళంతా మరకలతో
వికృతంగా రోదిస్తున్నది ఒంటరి రాత్రి !

చీకటి ఉరికొయ్యల క్రింద చివరి శ్వాస పీల్చి
చిరాయువులై వెల్గుతున్నారెందరో పుణ్యమూర్తులు
క్రాంతిరేఖల వారి మార్గమే
శాంతిపుంజాల భావి ఉషస్సులకు నాంది

విబేధాలు విస్మరించి
విషాదాలు పెల్లగించి
సౌహార్ద్రత పరిఢవిల్లి
సర్వజనాళి ఏకమైతే
వాస్తవం కాదా వసుధైక కుటుంబం !
వాకిట్లో వెలిగించిన ప్రేమామృతదీపాలు కావా
వినువీధిలో తారాతోరణం !!

భావావేశం అందరిలో ఉంది
బ్రతుకులో తారతమ్యాలే
భావనలో ప్రతిఫలిస్తాయి
స్పందించే మనసుంటే
సాక్షత్కరించే దృశ్యాలెన్నెన్నో

-బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్.

The Old Man and the Sea

drushya drushyam

అనుకుంటాం గానీ కొన్నిసార్లు అవతలి వాళ్ల దుస్థితి చూసి బాధపడతాం.
వాళ్ల కష్టాలకు అవేదన చెందుతాం. జాలి పడతాం. సానుభూతి చూపుతాం. ఓదార్చుతాం కూడా.
కొన్నిసార్లు ఆ కష్టాల్ని తొలగించడానికి వీలైతే మన వంతు సాయమూ చేస్తాం.

కానీ, అవతలి వ్యక్తి కష్టం మనకు తెలిసే విధానాలు పరిపరి విధాలు.
చాలాసార్లు విని తెలుసుకుంటాం. ఫీలయి బాధపడతాం.
అర్థం చేసుకుని స్పందిస్తాం.
కానీ, కొన్నిసార్లు స్వయంగా చూసి తెలుసుకుంటాం.
ఇంకా కొన్ని సార్లుంటాయి. అవి అసంకల్పితం.

అసంకల్పిత ప్రతీకార చర్య అనడం బాగోదు గానీ ప్రతిచర్యే.
అవును. ఈ చిత్రమే చూడండి.

ఉదయపు నీరెండలో ఒక పెద్ద మనిషి నడుస్తున్న దృశ్యం.
అంతే. కానీ, ఈ చిత్రం చూడండి అనడంలో ఇక్కడ ‘చూసి’ అన్న పదం ప్రత్యేకం.

నిజం.
ఆ రోజు, ఉదయం చిత్రణ ఇది.

నల్లకుంట బస్టాఫ్ లో ఒక్కరు కాదు, పదులు.
పదులు కూడా కాదు, పాతిక మంది దాకా ఉన్నారు.

ఒక పెద్ద మనిషి అతి కష్టంగా నడుచుకుంటూ పోతుంటే వారంతా చూస్తున్నారు.
అతడి బాధ సరే. వారూ అతడితోసహా ఫీలవుతున్నారు. అదీ చిత్రం.

ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే అతడిని చూస్తూ, తమ ముందు ఆయనొక్కరే అత్యంత ప్రయాసతో అడుగు తీసి అడుగు వేస్తుంటే…
నిజానికి అడుగు వేయలేక ఆగి నిలబడి మళ్లీ అడుగు వేసే ప్రయత్నంలో ఉండగా వారు చూస్తున్నారు.

నడుస్తున్నాడంటే నడుస్తున్నాడు.
అక్కడిదాకా వచ్చాడంటే నడిచాడనే కదా అర్థం.
కానీ, వారు చూస్తున్నారు. అదీ దృశ్యం. కాలు తీసి కాలు వేయడానికి…ఒక అడుగు తీసి మరో అడుగు వేయడానికి
ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తున్న వాళ్లెవరూ చూస్తున్నట్టు లేరు.
తామూ ఆయనతోపాటు నడవ ప్రయత్నిస్తున్నట్టే ఉంది.

ఆ ముసలాయన అమిత కష్టంగా తన నవనాడులూ స్వాధీనంలోకి తీసుకుని నడవ ప్రయత్నిస్తుంటే
వారూ ఆయన అడుగులో అడుగవడం గమనించాను.

అదే దృశ్యాదృశ్యం.
చూపు. చూపుతో ఫీలవడం.

నిజానికి వారంతా ఒక రకంగా తనతోపాటు వేల వేల యోజనాలు నడుస్తున్నట్టే అనిపించి ఆశ్చర్యం.
అప్పుడనిపించింది, మనుషులు చూస్తారని!
ఎప్పుడంటే అప్పుడు కాదు. అవతలి వ్యక్తి సాఫీగా నడుస్తున్నప్పుడు కానే కాదు. వారి నడక సాగనప్పుడు చూస్తారని!

ఏదీ సులువుగా లేనప్పుడు చాలామంది చూస్తారు.
ఇది అదే అనిపించింది.ఈ వయోవృద్ధుడు చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నప్పటికీ, ఆయనలొ శక్తి వుడిగిపోయింది. కానీ. ఒక పాదం తీసి మరొక పాదం వేయడానికి పడుతున్న ఆ ప్రయాస…అందరిలోనూ తామే అతడై శక్తిని కూడదీసుకునేలా చేస్తూ ఉన్నది.

ఇంతలో బస్సు వచ్చింది.
చిన్నగా కలకలం. ఆయన పూర్తిగా ఆగిపోయాడు.
ఇప్పుడు ఎవరికి వారు ‘దృశ్యం’ నుంచి తప్పుకుని చకచకా ఎక్కేసి సీట్లో కూచుండ ప్రయత్నించడం మరో దృశ్యం.
తర్వాత ఒక చిన్న జెర్క్ తో బస్సు కదలడం ఇంకో దృశ్యం.
అటు తర్వాత ఆయనే మిగిలారు మళ్లీ.

చిన్నగా దుమ్ము లేచినట్టుంది.

ఆయన ఒక్క క్షణం నడక ఆపి మళ్లీ ప్రారంభించారు.walker అప్పటిదాకా నాకు కనిపించలేదు.
ఎవరి సహాయం అవసరం లేకుండా ఆయన తనను తాను కూడగట్టుకుని నడవ ప్రయత్నిస్తున్నారు.

~ కందుకూరి రమేష్ బాబు

“సింహా”వలోకనం చేస్కో…

mruthyu

మృత్యుంజయ్

మృత్యుంజయ్

 

ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

pasunuru cover 2
రవి కథలు ఊరూ-వాడ వాతావరణంలోంచి నడిచి.. పట్టణ శివారులోంచి పయనించి మహానగరం లోని మైలను కూడా పట్టి చూపిస్తున్నాయి. ఊర్లలోని అంటరానితనం నగరంలో పది తలలు వేయడాన్ని ఈ కథల్లో చూడొచ్చు. కొత్తదారుల్లో నడిచిన ఈ కథలు రవిని ఆధునిక దళిత కథకుడిగా నిలబెడుతున్నాయి.
రవి కవి హృదయుడు. మంచి కథకుడు. గట్టి విమర్శ కుడు. వాగ్గేయకారుడు. యాక్టివిస్టు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఎందుకు రూపుదిద్దుకుంటై?! సామాజిక అవసరం అలా మూవ్‌ చేయిస్తుంది. ఒత్తిడి చేస్తుంది. సొంత సామాజిక వర్గం అణచివేతల అట్టడుగున తొక్కబడి విలవిల్లాడు తుంటే ఒక క్రియేటివ్‌ పర్సన్‌ ఎంతగా తల్లడిల్లిపోతుం టాడు.. ఎంతగా కాలునిలువని స్థితిని అనుభవిస్తుం టాడు! అలాంటి స్థితే మాలాంటివారిని అన్ని ప్రక్రియల్లో రచనలు చేయిస్తుంది. ఒక్కోసారి ఆ రచనలు వాటి సోకాల్డు ప్రామాణికతల్లో ఒదగవు. ఆ ఒదగనితనమే వాటికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఆ ఒదగని తనమే మూస సరిహద్దుల్ని చెరిపేసి, హద్దులు గీస్తున్న వారి చెంప ఛెళ్లు మనిపిస్తుంది. అలా ఏ చట్రాల్లోనూ ఒదగని వీరుడు రవి. సానపట్టుకున్నా కొద్దీ మరింతగా మెరిసే పదును రవి సొంతం.
ఈ కథల వెనుక దాగిన తాత్వికపునాది గురించి కొంత చర్చించాలి. ఆ కోణంలో లోతుల్లోకి దిగితే` ముగిసిపోయిందనుకున్నదేది ముగిసిపోవడం లేదు.. మళ్ళీ మళ్ళీ బిగుసు కుంటున్నది. ఈ బిగింపు మళ్ళీ మొదటికొస్తున్నది. పోరాటం చేస్తున్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తున్నది. దాటి వచ్చినామనుకుంటున్న చైతన్యాన్ని అనుభవిస్తున్నది పై వర్గాలవాళ్ళే ` బ్రాహ్మణీయవాదులే. లేదంటే వాళ్ల కనుసన్నల్లో మెలిగే, వాళ్ల మార్గంలో పయనిస్తున్న ఇతర వర్గాలు మాత్రమే. ఈ దౌర్భాగ్యస్థితికి ఎంతగా కుంగదీసే బల ముంటుందో అనుభవిస్తున్న వాళ్లకు ఎరుక. ఎప్పటికప్పుడు అలాంటి స్థితిని జయిస్తూ వస్తున్న వాళ్లల్లోంచి ఒకడు మా రవి.
మార్గదర్శులు వేసుకొస్తున్న ప్రతి కొత్త దారి కొన్నాళ్లకే పాతబడిపోతుండటం, కొత్త సిద్ధాంతాలు కొద్ది కాలంలోనే గానుగలుగా మారిపోతుండడం.. చుట్టూ వలయాలు వలయాలుగా సరికొత్త చట్రాలు బిగుసు కుంటుండడం.. ఒక్క కష్టం కాదు ` ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ రచనలు కొనసాగించడం ఆధిపత్య వర్గాలకున్నంత సులువు కాదు. వాళ్లు రాస్తే ఆహా ఓహో అనడానికి అండదండలెన్నో ఉన్నాయి. రవిలాంటివాళ్లు రాస్తే అంత ఈజీగా ప్రచారం లభించదు. దళితవాదం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. అప్పుడున్న మద్దతుదారులూ ఇప్పుడు లేరు. ఎప్పటికప్పుడు మళ్లీ మద్దతుదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి అట్టడుగువర్గాలది. బ్రాహ్మణుల నుంచి అప్పర్‌ శూద్ర వరకు వచ్చిన సామాజిక ఎదుగుదల బీసీ, ఎస్సీ, మైనారిటీల వరకు రావాలంటే ఇంకా చాలాకాలం పట్టేలా ఉంది. ఈ లోపు సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తల పోరాటం ఎడతెరిపి లేకుండా నడుస్తూ ఉండాల్సిందే. అలాంటి పోరాటం చేయగల శక్తి పుష్కలంగా ఉన్నవాడు రవి.
హిందూత్వ, బ్రాహ్మణీయ భావజాలం పర్సెంటేజీల తేడాలతో ఎటూ చాలా మందిలో ఉంటుంది. దాంతో మనకు సీరియస్‌ అనిపించేవి, వారికి క్యాజువల్‌గా కనిపిస్తుంటాయి. మనకు గాయాలుగా తగిలేవి, వారిని తాకనైనా తాకవు. వారు ప్రోగ్రెసివ్‌ మొఖంతోనే లోలోన మనకు ఎంతో హానికరమైన పనులు చాలా అలవోకగా చేసేస్తుంటారు. మరి మొత్తంగా బ్రాహ్మణిజపు ప్రభావంలో ఉన్న వారికన్నా వీరు తక్కువా ఎక్కువా అంటే తేల్చుకోవడం కష్టమే. ఎందుకంటే ఎక్కువ మొత్తంగా సమాజం బ్రాహ్మణిజపు ప్రభావంలోనే ఉన్నప్పుడు ఆ కాస్త వెసులుబాటుతో మనల్ని దరిచేరనిచ్చే ఆ కొందరు ఏ మేరకు బహుజనులకు ఉపయోగపడుతుంటారో అంచనా వేసుపౖగా ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య ఉంది.

ఒక్కో కులం, ఒక్కో మత సమూహానికి కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. ఒక సమూహం సమాజం పట్ల, రాజ్యంపట్ల తీసుకునే స్టాండ్‌ మరొక సమూహం తీసుకోలేకపోవచ్చు. ఒక సమూహానికి ఉండే దీర్ఘకాలిక లక్ష్యం మరో సమూహానికి ఆ సమయానికి అడ్డంకిగా మారొచ్చు. పైగా పోరాట పంథాలు వేరు కావొచ్చు. ఒకరికి అసలైన శత్రువు మరొకరికి ఇమిడి యేట్‌ శత్రువు కాకపోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఉద్యమ కార్యాచరణలో పట్టూ విడుపు లుండాలి. అంతిమ లక్ష్యంపట్ల అందరికీ స్పష్టత ఉండాలి. లక్ష్యం సుదూరంగా  ఉన్నప్పుడు తక్షణ ఫలితాల మెట్లనూ ఎక్కుతూ పోవాలి. అలా కాదని కొండపైనే దృష్టి నిలిపి పరుగెడుతుంటే లోయలూ అగాధాలు మనల్ని కబళించవచ్చు.
ఒక మెజారిటీ భావజాలం మనల్ని లోబరుచుకుంటుంది. బాధితస్పృహ ఉన్నవాడికి కనిపించిన గాయం, మెజారిటీ భావజాలానికి లోనవుతున్న అణగారిన జాతివాడికి ` బహుజనుడికి లేకపోవచ్చు. స్పృహ కలిగినవాడు ప్రశ్నించే దాకా వీడు ఆ స్పృహలోకి రాడు. ఒక రకంగా స్పర్శాజ్ఞానం కోల్పోవడంలాంటి ప్రక్రియ అది. అట్లా మన చుట్టూ ఉన్న దళితులు, బీసీలు, ఆదివాసీలూ, ముస్లింలు, మహిళలూ ఇతర మైనారిటీల నుంచి ఎదిగొచ్చినవారు కూడా మెజారిటీ భావజాలానికి లోనై శత్రు శిబిరంలో చేరిపోతున్నారు. వాళ్లను ముల్లుగర్రతో అదిలించి మలుపుకోవడం పెద్ద శ్రమైపోయింది బహుజన చైతున్యులకు. అది నిరంతరం జరగాల్సిందే. పెద్ద ఎత్తున జరగాల్సిందే.
ఇవేకాక మన మీద మావోయిస్టు, మార్క్సిస్టు ప్రభావాలు ఆవరించి ఉన్నాయి. ఈ ప్రభావాలు ఒక్కోసారి అస్తిత్వ ఉద్యమకారులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఒక్కో విజయాన్ని అందుకొని ముందుకెళ్లడానికి ఏ మాత్రం అంగీకరించని ఆ ప్రభావాలు మొత్తంగా మన లక్ష్యాన్ని మరింత దూరంగా నెట్టేస్తున్నాయి. నిజానికి ఆ ప్రభావితుల్లోని క్రమశిక్షణ, నిబద్ధత, అధ్యయనశీలత, త్యాగం లాంటి మంచి లక్షణాలను స్వీకరిస్తూనే, వారిలోని వ్యక్తి ఆరాధన, మతంగా మారేతత్వం, మూస ధోరణి, వదలని కుల జాఢ్యంలాంటి చెడును విసర్జించాల్సిన అవసరముంది. ఇలా జరగకుండా అణగారినతనంలోంచి వచ్చే కసి, ఆకలి, పైసాను ` హోదాను చూడనితనం కొందరు అస్తిత్వ ఉద్యమకారులను చాలా తొందరగా లంగదీసు కుంటున్నాయి. వాటికి ఏ కాస్త లంగినట్టు కనిపించినా మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాలు దాడి చేస్తున్నాయి. దాంతో అతలాకుతలమైన అస్తిత్వ భావజాలకుల చరిష్మా మసకబారిపోతున్నది. ఇలా లేకుండా నిక్కచ్చిగా కనిపించే కొంతమంది అస్తిత్వవాదులు మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాల ప్రభావంవల్ల రిజిడ్‌గా బిగదీసుకుపోతున్నారు. తాము చేయలేకపోతున్న పనులు చేస్తున్న వాళ్ల మీద రాళ్లేస్తున్నారు. ప్రతీ పనిలో తప్పులు మాత్రమే వెతికే వీర విప్లవవాదుల్లాగే వీర దళితవాదులు, వీర బహుజనవాదులు తయారవుతున్నారు. వీటన్నింటి గ్రహింపుతో ఈ జాఢ్యాలన్నింటినీ వదులుకొని ముందుకెళ్లినప్పుడే అస్తిత్వ వాదుల చైతన్యం లక్ష్యాన్ని చేరుకునే అవకాశముంది. రవిలో ఈ వెసులుబాటు కనిపిస్తున్నది. ఆ దిశగా రవి తన రచనలో, కార్యాచరణలో కేంద్రబిందువయ్యే అవకాశముందని ఆశపడుతున్నాను.

ఆధిపత్య భావజాలాలే కాక ముఖ్యంగా మీడియా రచయితల్ని నియంత్రిస్తూ వస్తోంది. యాజమాన్యాల కులం, ప్రాంతం కొత్త రచయితల్ని చెప్పకనే నియం త్రిస్తున్నాయి. రవి, నేను రాస్తున్నది తెలంగాణ మధ్యతరగతి భాషే అయినప్పటికీ ఆంధ్రా పత్రికలవారికి అది తెలంగాణ మాండలికంలా కనిపిస్తోంది. ఆ విషయంలో మాకే ఆవేశం ఆగదు. మరి తెలంగాణ మాదిగ భాషలో రచనలు చేస్తున్న వేముల ఎల్లయ్య లాంటి వారు ఎలా తమ ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ వస్తున్నారో తెలియదు. ఈ మధ్య జూపాక సుభద్ర, గోగు శ్యామల కథల సంపుటాలు వచ్చాయి. ఆ కథల్ని వేసుకునే మనసు, ఉద్దేశం ఆంధ్ర పత్రికలకు లేదు. అలాంటి పత్రికలు తెలంగాణ వారికి ఏ మేరకు అవసరం? తెలంగాణ పత్రికలు మరికొన్ని రావలసిన అవసరం  ఉంది. అందులోనూ అట్టడుగు జాతుల నుంచి మీడియా ఎదిగొచ్చిన రోజునే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది.
ఇప్పటిదాకా రవి, నేను చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నాం. ఆంధ్రా పత్రికకు కథ ఇవ్వాలంటే ఒక భాషలో, నమస్తే తెలంగాణ పత్రికకు ఇవ్వాలంటే ఒక భాషలో కథలు రాస్తున్నాం. ఇదొక యాతన. కథ రాయడమే చాలా ఓపికతో కూడుకున్న పని. అలాంటిది మళ్లీ అందులో ఇట్లాంటి ప్రయోగాలు, ప్రయాసలు మరెంతగా మమ్మల్ని పరేశాన్‌ చేస్తున్నాయో చూడండ్రి.
ఇన్నాళ్లు మా మీద రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక (కో.ప్రా) భాష మమ్మల్ని నరక యాతన పెట్టింది. కథా సమయంలో ఉన్నప్పుడు విషయం, భావం, ఫ్లో ఎక్కడ పోతాయోనని స్పీడ్‌గా రాసేస్తుంటాం. అలా రాస్తున్నప్పుడు మాదైన తెలంగాణ భాష రాకుండా కో.ప్రా భాష వచ్చేస్తుంటుంది. ఏదో ఒకటి అని ముందు రాసేసి తర్వాత మళ్లీ మళ్లీ మా భాషలోకి అనువాదం చేసుకోవడం పెద్ద ప్రయాసై పోయింది. నిజానికి మా భాషలోనే ముందుగా రాసుకుంటే వచ్చే వాక్యనిర్మాణం, కో.ప్రా. భాషలో రాసేసినంక రావడం కష్టమే. ఆ ఎరుకతోనూ మా అనువాదాలు కొనసాగుతున్నై. జరిగే నష్టమేమిటంటే, ఒక్కోసారి కో.ప్రా.భాషలోని వాక్యనిర్మాణంలోనే తెలంగాణ భాష వాడడం జరిగిపోతుంటుంది. ఆ ఎరుకలోంచి మా భాషలోనే ముందుగా రాసి అవసరమైనప్పుడు మాత్రమే కో.ప్రా. భాషలోకి మార్చి ఇవ్వడమే సరైందనినిర్ణయించుకున్నాం. ఇలా భాష విషయంలో రవికి, నాకు చాలానే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ ప్రామాణిక భాష అవసరం గురించి అందులోనూ బహుజనులకు ఆ భాష విషయంలో వచ్చే ఇబ్బందుల గురించి చర్చ జరగవలసే     ఉంది.
రవి కథా సంపుటి వేసుకోవాలనుకున్నంక మా ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో మొత్తంగా కథలను తన భాషలోకి మార్చుకోవాల్సిందేనని నిర్ణయించాం. ఆ పనిలో ఇంకా ఎక్కువ కష్టం పడాల్సివచ్చింది రవి. మరెంతో సమయం వెచ్చించాల్సి వచ్చింది. కథ అచ్చయింది అచ్చయినట్టే వెయ్యాలి కాని మళ్లీ మార్చుకోవడమేమిటి అని కొందరు దోస్తులు అన్నప్పటికీ మా కొత్తతరం క్రియేటివ్‌ రైటర్స్‌ జెన్యూనిటీ మీకు అర్థం కాదులే అని మేమనుకున్నాం.
మా యీ సంఘర్షణల్లోంచి ‘తెలంగాణ బహుజన కథకుల కచ్చీరు’ అని రెండు రోజుల సదస్సు పెట్టుకొని అనేక చర్చలు, గొడవలు పడ్డాం. కొమురం భీం నేలకొరిగిన జోడేఘాట్‌లో రెండో సమావేశం నిర్వహించుకొని తాలూ, గట్టీ, అగ్రవర్ణ ప్రామాణికతల ఆధిపత్యాలను చర్చించుకున్నాం. అలా బహుజన కొత్త తొవ్వలు వెతుక్కున్నాం. ఇంకా ఆ దారిలోనే మరింత గట్టి పడటానికి తాలును బహుజన చాటలతో చెరుగుతున్నాం. అగ్రవర్ణ విమర్శకులు మా కథలను శైలీ, శిల్పాల కళ్లద్దాల లోంచి మాత్రమే చూసే ప్రయత్నం చేయబోతే అవన్నీ కుదరవని చెప్పకనే చెబుతూ వస్తున్నాం. మా ప్రత్యేక రాతలే మాకు శైలీ,శిల్పాలను ఏర్పరచగలవనే ఆత్మవిశ్వాసం మాకుంది.
ఆ మధ్య ‘ఇప్పపూలు’ ‘గిరిజన సంచార తెగల కథలు’ పేర ఒక సంకలనం వచ్చింది. అందులో ఓ నలుగురు తప్ప మిగితా వారంతా గిరిజనేతరులే. ‘వతన్‌’ముస్లిం కథా సంకలనం లాగా, ‘నల్లపొద్దు’ దళిత రచయిత్రుల సంకలనం లాగా అచ్చంగా ఆ జాతుల రచనల తొలి సంకలనాలు రావాలి. కాని ఇతర రచయితలతో తొలి సంకనాలు వేయడం వల్ల వారి మూసలో విషయం, జీవితం, ప్రతీకలు రికార్డు చేయబడతాయి. వారి మూసలోకే ఆయా సమూహాల కొత్త రచయితల్ని డ్రైవ్‌ చేసినట్లవుతుంది. వారి వారి ప్రత్యేక శైలిలో వ్యక్తీకరణలో వారి జీవితంలోని ప్రతీకలతో, ద్ణుఖంతో, పరిష్కార మార్గాలతో రచనలు రావాలి. కాని ఆధిపత్య వర్గాల, భావజాలాల వారు నడిపిస్తే నడిచే రచనలు తీవ్ర నష్టం చేస్తాయి. ఈ జ్ఞానం బహుజన రచయితలకు అత్యంత అవసరం. ఇతర రచయితలు వేసేవి సంఫీుభావ సంకలనాలు అవుతాయి. వాటి అవసరమూ చాలా ఉంది. అయితే ఈ స్పష్టత మాత్రం ఉండాల్సిందే.
విమర్శకులంటే అధ్యయనశీలురై మాత్రమే ఉండాలనే ఒక గుడ్డి నమ్మిక మన మధ్య సంచరిస్తున్నది. తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్నవారే గట్టి విమర్శకులని భావించే వాతావరణమున్నది. వీరు కొన్ని తప్పుడు సూత్రీకరణలు చేస్తూ అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని అవమానపరుస్తున్నారు. ఇది సరైంది కాదు. కాళ్లకింది నేలను వదిలి పరాయి నేల నుంచి అరువు తెచ్చుకున్న చైతన్యం మా మీద రుద్దాలనే విమర్శకుల ధోరణి మా రచనలకు ఆటంకంగా తయారయింది. ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపులే టెక్నిక్‌ అనే గొడవ. చెత్త విషయాన్నైనా కొత్త టెక్నిక్‌తో చెబితే చాలు, ఆహా ఓహో అంటున్నారు సంకలనకర్తలు, అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల విమర్శకులు. వెనుకబడేయబడ్డ జీవితంలోంచి కళ్ళు ధారలు కట్టి రచనలు వచ్చినా వీరి కరడుగట్టిన మనసులు కరగవు. అలాగని టెక్నిక్‌ని పూర్తిగా పక్కన పెట్టమని అనడం లేదు. అంతస్సూత్రాన్ని పట్టుకునే విమర్శకుల్ని లెక్కచేయని వాతావరణం ఇంకా మన మధ్య ఉంది. అందుకే బహుజనులు తమ బతుకుల్లోని కొత్త టెక్నిక్స్‌ని పట్టి ఇవ్వాలి. వాటికోసం తమ జీవనాన్ని జల్లెడ పట్టాలి.
నిజానికి కేవలం అధ్యయనంలోంచి కాక జీవితంలోంచి వచ్చే రచనలు స్వచ్ఛంగా సహజంగా ఉంటున్నాయి. మనసు మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. ఒక అంతర్‌ జ్వలనాన్ని రేపుతున్నాయి. వీటిలో ఎన్నో ప్రత్యేకతలు, సోకాల్డు నాగరిక సమాజానికి ఆశ్చర్యం కలిగించే వ్యక్తీకరణలు ఉంటున్నాయి. బహుజన కథకుల్ని ఆవరించి ఉన్న సోకాల్డు ప్రామాణిక వాతావరణం కొందరిని అసలు రచనలే చేయకుండా చేస్తున్నది. చేసిన రచనలను సోకాల్డ్‌ సంకలనకర్తలు పట్టించుకోనట్లు నటించడంతో ఎందరో రచయితలుగా హత్య చేయబడ్డారు. భాష విషయంలో, వ్యక్తీకరణ విషయంలో, కథా వస్తువు విషయంలో ఆధిపత్య భావజాల విమర్శకులు, సంకలనకర్తల ప్రభావాల్ని ఛేదించుకొని రాయాలంటే పురిటినొప్పులు పడాల్సి వస్తున్నది. వారు ఎప్పటికప్పుడు బహుజన రచయితల్ని కంట్రోల్‌ చేస్తున్నారు. వారి మెప్పుకోసం తంటాలు పడడంలో బహుజనతనం మాయమవుతున్నది. ఆ ఎరుక ఉన్న రచయితలుగా మేమిప్పుడు ఆ ప్రభావాలు మా మీద పడకుండా, మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ ప్రయత్నంలో మా మధ్య ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సందిగ్ధాలో…ఎన్నెన్ని చర్చలో.
ఈ కోణాలన్నింటిలోంచి ఆలోచించినప్పుడు రవి కథల్లో ఈ కొత్త పార్శ్వాలు చూడొచ్చు. రవి ముందు ముందు మరిన్ని మంచి కథల్ని, నవలల్ని అందిస్తాడన్న నమ్మకంతో.. అందుకు ఇంకా ఇంకా శ్రమిస్తాడన్న భరోసాతో… రవికి అలాయి బలాయి. గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి.

-స్కైబాబ

(ఈ ఆదివారం విడుదల కానున్న డా.పసునూరి రవీందర్‌ కథా సంపుటి ‘‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’’కు రాసిన ముందుమాట)

మిస్టరీల హిస్టరీ – దేవగిరి

1(1)

 

పెద్ద పెద్ద కోటల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు కలిగే అనుభూతులే వేరు. తక్కువ జనాభా ఉన్న ఆ రోజుల్లో అంత భారీయెత్తు కట్టడాల నిర్మాణానికి అంతమంది మనుషులు ఎక్కడనుండి దొరికారా అనిపిస్తుంది. ఒక రాజు కాస్త స్థిరపడి ఓ కోట కట్టించడం మొదలుపెట్టాడూ అంటే, మనం ఈ రోజుల్లో కట్టే భవంతుల్లా ఇట్టే అయే పని కాదు కదా! రాతిని పగలగొట్టడంనుంచీ ప్రతీదీ చేతులతో చేసుకుపోవాల్సిందే. అందుకే మహా కట్టడాలూ కోటలూ పూర్తిగా రూపు తీసుకునేటప్పటికి చాలా ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. ఈ లోపున రాజులు కొట్టుకు చావడాలూ, పాత రాజుగారి తల కోటగుమ్మానికి వేలాడటం వంటివి జరిగిపోతూ ఉంటాయి. కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ఇంటికి మనక్కావలసిన అందాలు దిద్దినట్టు, జయించిన కోటలో నచ్చనివి పగలగొట్టి కొత్త మెరుగులు దిద్దించడానికి పూనుకుంటారు కొత్త రాజుగారు. ఇలా మార్పులు చెందుతూ చివరకు ప్రజాస్వామ్యపు కాలానికొచ్చేసరికి కోట శిథిలావస్థకొచ్చినా ముసలి మంత్రగత్తెలా ఆకర్షిస్తుంది. “మీలాటి అల్పప్రాణాలని ఎన్నిటిని చూశానో” అంటూ మన ఉనికిని తేలిక చేస్తుంది.

దౌలతాబాద్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేర్లకి అవినాభావ సంబంధం. అక్కడ ఏం చూసి ఆయన దాన్ని దేశ రాజధాని చేసి, ఢిల్లీ జనాన్ని సైతం అక్కడికి తరలించే పని పెట్టుకున్నాడా అని ఆ కోటగురించి ఒక ప్రత్యేక ఆసక్తి నాకు. ఈ మధ్య ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరాలు చూడటానికి వెళ్ళినప్పుడు దౌలతాబాద్ కోట కూడా చూశాం. దురాశ, అధికారదాహంతో తమలోతాము యుద్ధాలు చేసుకుంటూనే మధ్య ప్రాచ్యం నుంచీ దేశాన్ని కొల్లగొట్టేందుకు వచ్చినవారితో మరోపక్క తలపడుతూ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించిన మధ్యయుగపు రాజుల నాటి చరిత్రకు మౌనసాక్షి ఈ కోట. ఎనిమిది వందల యేళ్లలో ఎనిమిది రాజవంశాలు పెరిగి విరగడాన్ని చూసిన ఘనమైన కోట ఇది.

2(1)

యాదవ వంశానికి చెందిన ఐదవ భిల్లమరాజు నిధులు దొరకడంతో నిక్షేపరాయుడై, దేవగిరి అనే పేరుతో ఈ కోట కట్టించి రాజ్యం ఏలాడట. మామూలు మనుషుల బతుకులు గాల్లో దీపాల్లా అయిపోయిన ఆ కాలంలోనే సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్, గోరా కుంభార్ వంటివారు మహారాష్ట్ర అంతటా భక్తిని వెల్లువెత్తించారు. జ్ఞానేశ్వర్ ఈ కోటను దర్శించాడు. తరువాత ఇక్కడికొచ్చిన విదేశీ యాత్రీకులు ఇబ్న్ బటూటా, ఫరిష్తా. సిరిసంపదలతో ఠీవిగా తలెత్తి నిలుచున్న ఇలాంటి కోటమీద ఢిల్లీసుల్తాను కన్ను పడకుండా ఉంటుందా! అల్లాఉద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫుర్ ఈ ప్రాంతపు యాదవులతో యుద్ధాలకు దిగి కొంత వరకూ వారిని లొంగదీసుకున్నారు. పెద్ద పెద్ద కోటలను వశం చేసుకోవటం ఒకేసారిగా కుదరదు కదా! మాలిక్ కాఫుర్ కొన్నాళ్ళు యాదవులను సామంతులుగా చేసుకున్నాడు. ఓడిన యాదవ రాజునే ఢిల్లీకి ప్రతినిధిగా నియమించి భారీ ఎత్తున కప్పం లాక్కుని వెళ్ళాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు రాజు హరపాలదేవ యాదవుడు స్వాతంత్యం ప్రకటించుకున్నాడు. దానితో ఆగ్రహించిన కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఈ కోటమీద యుద్ధానికి దిగాడు. అతడు 1318 లో దీన్ని జయించాడు. తిరుగుబాటు చేసిన హరపాలదేవను బతికుండగానే చర్మం వొలిపించి, అతని శరీరాన్ని కోటగుమ్మానికి వేలాడదీయించాడని గాథ. నూట ముప్పై యేళ్ళు పాలించి, అందులో పాతికేళ్ళపాటు ఢిల్లీసుల్తానును ప్రతిఘటించిన యాదవ వంశం అలా విషాదంగా అంతరించింది. తరువాత వరుసగా తుగ్లక్, బహమనీ, నిజాంషాహి, మొఘల్, అసఫ్జాహి, పేష్వాల దర్జాలను ధరించి భరించింది దౌలతాబాద్ (సంపదల నిలయం)గా మారిన దేవగిరి. దేవగిరికి దౌలతాబాద్ గా పేరు మార్చింది తుగ్లక్.

***

అక్టోబర్ నెల దక్కను అంతటా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిచింది. దేవగిరి దగ్గర హైదరాబాద్ వాసనే వీస్తోంది. ఈ వాతావరణంలోనే గమ్మత్తు ఉంది. అతిగా చలిలేకుండా, అలాగని ఎండ బాధ కూడా ఎక్కువగా లేని ఈ సమతుల్యత తుగ్లక్ ను ఆకర్షించి ఉంటుందేమో! పైగా దేశం మధ్యలో మంచి కట్టుదిట్టంగా ఉండటంతో ఈ కోటతో ప్రేమలో పడిపోయి, చిన్న చిన్న రాజులందరి మీదా అజమాయిషీ సరిగ్గా చేయొచ్చనుకుని ఇక్కడికొచ్చి ఉంటాడు.

మూడు ప్రాకారాల కోట ఇది. మొదటి ప్రాకారం అంబర్ కోట్. దీనికీ, మహాకోట్ అనే రెండో ప్రాకారానికి మధ్య సామాన్యజనం ఉండేవారట. ఈ ప్రాంతమే ఇప్పటి దౌలతాబాద్ ఊరు. అంబర్ కోట్ దాదాపు శిథిలమయింది. కోటలో ప్రవేశించటానికి మహాకోట్ ప్రాకారపు ద్వారం దాటాలి. దాని చెక్క తలుపునిండా పొడుచుకొచ్చే ఇనుప ములుకులు ఉన్నాయి. అంటే ఏనుగుల తలలతో ఢీకొట్టించి తలుపును ధ్వంసం చేసే టెక్నిక్ ఇక్కడ పనికి రాదన్నమాట. వంచనతోనే తలుపు తెరిపించాలి. ములుకుల రక్షణ ఉన్న ఈ తలుపుల్ని కాలమూ యుద్ధాలూ ఏమీ చెయ్యలేకపోయాయి.

మహాకోట్ రెండోద్వారం ముందు కోటలకు అలంకారంగా కనబడే చిన్న ఫిరంగులు ఇనపబళ్ల మీద కనిపించాయి. వాటి మీద చిన్నపిల్లలు ఎక్కి ఆడుకుంటుంటే తల్లిదండ్రులు ఫోటోలు తీసుకుంటూ మురుస్తున్నారు. అవి దాటి రాళ్ళూ రప్పలమధ్య నుండి ముందుకి నడుస్తూ పోయాం. ఈ దారమ్మటే ఎన్ని ఏనుగులూ, గుర్రాలూ, ఎంతమంది రాజులూ, సామాన్యులూ, వాస్తు శిల్పులూ, కవులూ, జ్ఞానులూ నడిచివుంటారో…

‘బావ్డీ’ అని దక్కనులో పిలిచే బావులను సామాన్య జనం కోసమూ ప్రాసాదంలో ఉండే రాజుల కోసమూ కట్టించారు అప్పటి రాజులు. హాథీ హౌద్ అనే పెద్ద ట్యాంక్ కూడా కనిపించింది. ఇప్పుడు అందులో ఏ నీళ్ళూ లేవనుకోండి. తుగ్లక్ హడావుడిగా రాజధాని మార్చేశాడు గానీ ఆ జనాభాకు తగిన నీటి సదుపాయం సరిగ్గా చూడలేకపోయాడు. కారణాలేమైతేనేం రెండేళ్ళ తరువాత ఢిల్లీకి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన నిజాంషాహి గారి వజీరు ‘మాలిక్ అంబర్’ దగ్గరలో ఉండే కొండల్లో చిన్న ఆనకట్టలు కట్టి, అక్కడినుండి పైపుల ద్వారా నీటిని ఈ బావుల్లోకి, ట్యాంక్ ల్లోకి, కందకాల్లోకీ ఎప్పుడూ వచ్చేలా ఏర్పాటు చేశాడట. దక్కను పీఠభూమిలో నీటి కోసం చెరువులు ఏర్పాటు చేసుకుని వాటిని నిర్వహించుకోవటం ముఖ్యమని నిజాం కాలంలో గ్రహించారు. ఇప్పుడు మనకి ఆ జ్ఞానం పోయింది. చెరువులమీద ఇళ్ళు కట్టుకునే మూర్ఖత్వానికి దిగి, నీటికోసం భూమి గుండెల్లో ‘బోరు’ గునపాలతో లోతుగా గాయాలు చేసే నాగరీకం లోకి వచ్చేశాం. నీళ్ళు సరిగ్గా దొరకని చోటినుంచి అన్వేషణ మొదలుపెట్టి సాధించుకున్న టెక్నాలజీ నీళ్ళను సమృద్ధిగా సంపాదించిపెట్టింది. ఇప్పుడు కళ్ళు మూసుకుని పాలు తాగే పందిపిల్లల్లా వాటిని మొత్తం వాడేసుకునే దశలో ఉన్నాం. భూమితల్లి గుండెల్లో నీరెండిపోతోంది. దొరకనితనం లోకి మళ్ళీ వెళ్తున్నాం కాబట్టి ఎంత కొత్త టెక్నాలజీ కనిపెట్టినా వాటితో పాత నిర్వహణ పద్ధతుల వైపు చూడాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో చరిత్ర మనకు పాఠాలు చెప్తూనే ఉంటుంది. అల్లరిపిల్లల్లా మనం విన్నా వినకపోయినా.

ఔరంగాబాద్ లో సూఫీ వేదాంతి బాబా షా ముసాఫిర్ దర్గా “పంచక్కి” అనే చోట ఉంది. ఈయన బుఖారా (రష్యా) నుంచీ వచ్చి ఇక్కడ ఉండిపోయాడు. ఈ దర్గాలో పంచక్కి (పానీ చక్కీ) అనే యంత్ర విశేషం చూడొచ్చు. 17 వ శతాబ్దంలో కట్టిన ఈ పిండిమరతో ఆ దర్గాను ఆశ్రయించుకుని ఉన్న ఎంతోమంది జనాభాకీ, ఇంకా సైనికులకీ కూడా కావలసినంత పిండిని తయారుచేసుకునేవారుట. కొండల్లో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలధారను మంచి ఉధృతితో భూమి అడుగునుండి మట్టి గొట్టాలద్వారా ప్రవహింపజేసి, ఇక్కడో బుల్లి జలపాతం సృష్టించి అక్కడనుంచి వచ్చిన యాంత్రికశక్తితో చక్కీని నడిపిస్తారు. ఇప్పుడిది ఒక అందమైన టూరిస్ట్ స్పాట్. ప్రకృతిని మనిషి అవసరాలకోసం ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లోంచి టెక్నాలజీని సృష్టించుకున్న కాలం అది. అక్కడితో ఆగటం చేతకాక, మరిన్ని సుఖాలవేటలో టెక్నాలజీని పెంచుకునే కాలంలో ఉన్నమనం ఇలాంటి ప్రదేశాలు చూడ్డం ఒక మానసిక అవసరం. ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తున్నామో బోధపడుతుంది.

3(1)

 

 

కోటలోకి మళ్ళీ వస్తే, హాథీ హౌద్ దాటాక విరిగి పడివున్న శిల్పవిశేషాలు ఏవో కనిపించాయి. అవేమిటో మొదట అర్ధం కాలేదు. ఆ పైన భారతమాత గుడి ఉంటుంది వెళ్ళమని చెప్పారు. గుమ్మటపు ప్రాకారం లోపల అతి విశాలంగా పరుచుకున్న ప్రాంగణం. నీడలు పొడవుగా సాగుతున్న సమయంలో అక్కడకి చేరాం. ఎన్ని ఆధిపత్యపు నీడలు ఇక్కడ ప్రసరించాయో! అసలుకి అదొక జైన మందిరం… యాదవులు కట్టించుకున్న ఈ మందిరాన్ని పడగొట్టించి మసీదుగా మార్పించాడట ముబారక్ ఖిల్జీ. ఆ శిథిలశిల్పాలు జైన మందిరానివే. నిజాంరాజ్యం భారతదేశంలో విలీనమైన వెంటనే అక్కడ భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారట.

4(1)

మహాకోట్ తరువాత వచ్చేది కాలాకోట్ ప్రాకారం. ఈ రెండిటికీ మధ్య ‘చాంద్ మినార్’ అనే పెద్ద ఇటుకరంగు కట్టడం ఉంది. బహమనీ సుల్తాను తన విజయసూచకంగా దీన్ని కట్టించాడట. కాలాకోట్ వైపు వెళ్తున్నకొద్దీ ఒక నిగూఢత్వం లోకి నడుస్తున్న అనుభూతి. సాయంకాలపు నీరెండా, పచ్చని చెట్లమధ్య విస్తరిస్తూ మాయమౌతున్న రాతి ప్రాకారపు ఎత్తూ… ఇవి చాలు intrigue ని సాలెగూడులా బుర్రలో అల్లడానికి.

కాలాకోట్ లోపల చీనీ మహల్ కనిపిస్తుంది. చైనామట్టి పలకలతో అలంకరించారు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇప్పుడది శిథిలావస్థలో ఉంది. ఇక్కడ రాజవంశీకులను బందీలుగా ఉంచేవారట. గోల్కొండ తానాషా, బిజాపూర్ ఆదిల్షా, కాకతీయ గణపతిదేవుడు ఇక్కడ బందీలుగా ఉన్నారంటే, ఎంత జీవ వేదనను ఇముడ్చుకున్న కోట యిది! నిజాంషాహీలు కట్టించుకున్న మహల్ కూడా జీర్ణావస్థలో ఉంది. ఈ రెండిటి మధ్యా ఒక ఎత్తయిన వేదిక మీద ‘మెంధా తోప్’ అనే పేరుతో ఒక పెద్ద ఫిరంగి ఉంది. దాని వెనుకభాగం పొట్టేలుతల ఆకారంలో ఉంది. దాని మొదటిభాగంలో అందంగా అరబిక్ లిపిలో ఔరంగజేబ్ రాయించిన కురాన్ శాసనం ఉంటుంది. దీనినీ, ఇంకా పైనున్నఫిరంగుల్నీ పైకి చేర్చడానికి ఎంతమంది శ్రమపడి వుంటారో! ఆ ప్రయత్నంలో కొంతమంది వీటి కింద నలిగిపోయివుంటారేమోనని కూడా అనిపించింది. నిప్పులు కురిపించి ఎంతమంది ప్రాణాలు తీసిందో కానీ, ఈ ఫిరంగి గుండ్రంగా తిరగటానికి వీలుగా ఒక ఇరుసు కూడా ఉందక్కడ.

5(1)

 

ఈ మహళ్ళు దాటి వెళ్ళాక ఒక కందకం, దాన్ని దాటడానికి ఓ ఇనప వంతెనా కనిపిస్తాయి. వీటితో ఆ నిగూఢ వాతావరణం మరింత చిక్కబడింది. ఇక్కడ కోటలోకి శత్రుప్రవేశం ఇంచుమించు అసాధ్యం. లోతైన కందకంగోడలని నున్నగా చేసేశారు. దానితో అవి ఎక్కడానికీ పాకడానికీ వీల్లేకుండా ఉన్నాయి. కందకంలో నీళ్ళతో పాటు మొసళ్ళు కూడా ఉండేవట … ఇప్పుడున్న ఇనప వంతెన స్థానంలో తోలువంతెన ఉండేదట. అవసరాన్నిబట్టి, మడతపెట్టి దాచేసుకునేలాగన్నమాట… దాని కింద ఉండే రెండో వంతెనని అవసరమైతే నీటి స్థాయిని పెంచుతూ నీళ్ళలో ముంచి, శత్రువుకు అది కనపడకుండా వుండేలా జాగ్రత్త పడేవారట. ఇంత పెద్ద ప్రణాళికకు తగ్గ నీటిసరఫరా ఉండేదంటే, ఎంత గొప్ప ఇంజనీరింగ్ టెక్నిక్కో కదా! ఆ వంతెన మీద నిలబడి గొప్పగొప్ప కుట్రల ఊహల పద్మవ్యూహాల్లో కాసేపు విహరించాను. విశ్వనాథ ‘పులిముగ్గు’ లోని intrigue లాటిది కాసేపు నన్ను ఆవహించింది.

వంతెన దాటి లోపలికి వెళ్తే, మరిన్ని రహస్యాల గుసగుసలు. ‘అంధారీ’ అనే మార్గం, బైటకు విశాలంగా కనిపిస్తూ రమ్మని పిలుస్తుంది. తీరా లోపలికి వెళ్తే, కటిక చీకటి నెమ్మదిగా కమ్ముకుంటుంది. కొంతదూరం వెళ్లి, టార్చ్ సాయంతో ఆ చీకటిని జయించలేక వెనక్కు వచ్చేశాం. గబ్బిలాల సామ్రాజ్యం అది. అంతా చిక్కటి కాటుక చీకటి. దారి మెలికలుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినవాడు, దాహార్తుడు నీళ్ళకోసం తపించినట్టుగా వెలుగుకోసం తపిస్తాడు. అంతలో ఒక చిన్న కిటికీ కనిపిస్తుంది. వెలుగుకోసం అక్కడికి వెళ్తే, చక్కగా కందకంలోకి తోసిపడేసేవారట. ఆ పైన మొసళ్ళ బాధ. చచ్చి తీరాల్సిందే. చీకట్లో ఎక్కడైనా నిలబడిపోతే, రాళ్ళవర్షం కురిపించి చంపేవారట. ఇవన్నీదాటి దారి చివరకు చేరుకుంటే, పైనున్న పెద్ద పెద్ద మూకుళ్ళలోంచి ఉడుకుతున్ననూనె వచ్చి మీదపడుతుంది. శత్రువుకు దొరక్కుండా ఉండటం కోసం ఇన్ని హింసామార్గాలు కనిపెట్టి, నిశ్చింతగా ప్రాసాదంలో నిద్ర పోదామంటే ఆ రాజులకు వీలవలేదు. వందలాది సైనికుల శారీరకబలం కంటే శత్రువు పన్నే ఒకే ఒక్క కుతంత్రం చాలు… చీకటి కుట్రలు ఆ సొరంగపు చిమ్మచీకటి కంటే నల్లటివీ భయానకమైనవీ…

అంధారీ పక్కనున్న వేరే మెట్ల దారి మీదుగా పైకి చేరుకున్నాం. నిట్ట నిలువు మెట్లు. అదేమి ఇంజినీరింగో, సేవకులూ, సైనికులూ మోకాళ్ళ నొప్పులతో మూలపడే మాదిరిగా. లేక శత్రు సైనికులు పైకెక్కలేక ఆయాసపడుతుంటే వాళ్ళ పని పట్టేందుకు అంతంత నిలువుగా కట్టేరేమో!  పైన పేష్వాలు కట్టిన గణపతి గుడి, షాజహాన్ కట్టించిన బారాదరీ, మరో పెద్ద ఫిరంగి … మొఘల్ వాస్తు పనితనంతో ఉన్న బారాదరీ చెక్కుచెదరలేదు. అక్కడినుండి చూస్తే సందె వెలుగులో, చిరుగాలుల్లో ఔరా అనిపించే ఔరంగాబాద్ పరిసరాలు… మెట్లెక్కిన ఆయాసం తీర్చుకుంటూ అందరూ కూర్చుంటున్నారు. అంతలోనే కోట మూసేసే సమయం అయిందంటూ కిందనుండి గార్డుల విజిల్స్.

దేవగిరి కోట చెప్పే రహస్యాలను వింటూ… మనుషుల తెలివినీ, సృజనాత్మకతనూ, కాయకష్టాన్నీ, దోపిడినీ, రక్తదాహాన్నీ… అన్నిటినీ చూస్తూ లక్షలసార్లు ఆ కోటవెనుక అస్తమించిన సర్వసాక్షి ఆ రోజూ నారింజ రంగు విరజిమ్ముతూ అస్తమించాడు. చిరు చీకట్లలో చరిత్రను భారంగా మోస్తున్న ఆ కోటను వదిలి ఔరంగాబాద్ చేరుకున్నాం.

 

 

                                                                                      lalitha parnandi    ల.లి.త.

మధ్యతరగతి స్త్రీల మనోలోకంలో ద్వివేదుల విశాలాక్షి

untitled

సాహితీ ప్రపంచానికి మణిపూస శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిగారు, ఎన్నో నవలలు,కదలు,వ్యాసాలు వ్రాసారు. పాత తరం,కొత్త తరం ఎవరైనా కాని ఆమె రాసినవన్నీ అందరికీ మార్గదర్శకాలే. ఆమె రచనలు పాఠకులను చేయిపట్టి తమతో పాటే తీసుకోని వెళతాయి. రాజలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎంతోమంది విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.

ఇక వారు రాసిన నవలలో ముఖ్యంగా స్త్రీ పాత్రల కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కొవ్వొత్తి లోని లలిత, మారిన విలువలలో జానకి, గ్రహణం విడిచింది లోని భారతి, గోమతి లో గోమతి, రేపటి వెలుగు లో శారద ,ఎక్కవలసిన రైలు లో మాధవి, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పాత్రలు. వారి రచనలలోని గొప్పదనం ,ఆ పాత్రలు ,ప్రదేశాలు కూడా మనకు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఉదాహరణకి కొవ్వొత్తి లో నాయకుడు ప్రకాశం ఇల్లుని ఈ విధంగా వర్ణిస్తారు “అది ఒక పాత లోగిలి,చిన్న,చిన్న వాటాలు”. ఈ వర్ణన ఇంచుమించుగా అన్ని నవలలో ఉంటుంది. అంటే అప్పటి మధ్యతరగతి జీవితాన్నిదర్పణం పట్టి చూపించారు. నలభైయేళ్ల క్రితం వాళ్ళకి ఇలాంటి ఇళ్ళు గుర్తు ఉండే ఉంటాయి. ముఖ్యంగా ఆవిడ రచనలలో ఎన్నడూ శ్రీమంతుల దర్పం కనిపించదు. మధ్యతరగతి జీవన విధాన గురుంచి ఎక్కువ రాసేవారు ఇప్పుడు మనం down-to-earth అంటాం కదా! అలాంటి పాత్రలనే సృష్టించారు.

వారు రాసిన నవలల నుండి కొన్ని మచ్చుతునకలు.

నాకు బాగా నచ్చిన పాత్రలు   గోమతి, రేపటి వెలుగు(శారద), కొవ్వొత్తి(లలిత) ఎక్కవలసిన రైలు లోని(మాధవి) పాత్రలను వాటి స్వభావాలను గనక పరిశీలిస్తే,

గోమతి: చిన్ననాటి స్నేహం ముగ్గురి మధ్య ముప్పేటలా పెనవేసుకొన్న బంధం. ఇది ఒక triangular love story . నవలలోకి వెళితే   ”అట్లతద్దోయి ఆరట్లోయి” అన్న చిన్న పిల్లల కేకలతో నవల మొదలవుతుంది. కధానాయిక గోమతి కి అది చూసి మనసు గతం లోకి పరగులు తీస్తుంది. చిన్నప్పటి నుంచి. మేనత్త కొడుకు గోపాలం, స్నేహితుడు గోవిందు. ముగ్గురూ ఒక జట్టు. ఊరి చివరనున్న ఆఫీస్ బంగ్లా గేటు ఎక్కి జామ కాయలు కోయడం, అక్కడే ఉన్న ఆకు సంపెంగ పూలు కోసు కోవడం,స్కూల్ లో మాస్టారు చేత దెబ్బలు తినడం ఇవన్నీ ఇంట్లో తెలిసి పెద్దవాళ్లు తిట్టడం జరుగుతూ ఉంటాయి.

పెద్ద అయ్యాక అభిమానాలూ పెరుగుతాయి, బావ మరదళ్ల మధ్య కానీ గోమతి తల్లి వల్ల తెలియని దూరం పెరుగుతుంది . “చిలకలా తిరుగుతోంది పిల్ల,వదినా! మా గోవిందు కి మీ గోమతిని చేసుంటాను” అని తల్లితో నేస్తం,పక్క్టింటి అబ్బాయి గోవిందు వాళ్ళ అమ్మ అడిగిన వెంటనే గోమతి తల్లి తండ్రులు గడపలోకి వచ్చిన సంబంధం,ఎరిగున్న వాళ్ళు,కాదనడానికి తగ్గ కారణం ఏమి లేదని పెళ్లి చేస్తారు. బోటా బొటి సంపాదన, పట్నం లో కాపురం. పైగా అదే సమయం లో గోవిందు కాలు విరగడం,ఉద్యోగంపోవడం ఒకటే సారి జరుగుతాయి. ఈ క్రమం లో గోమతి, సంసారభారాన్ని మోసేందుకు ఉద్యోగం లో చేరుతుంది. అక్కడ ఆమె పై ఆఫీసర్ బావ గోపాలమే. ఆడపడచు మీద ఉన్న చులకన భావం తో మేనల్లుడు గోపాలాన్ని చిన్న చూపు చూస్తుంది గోమతి తల్లి.

అది తెలిసి గోమతి మీద ప్రేమను బయట పెట్టలేకపోతాడు. కానీ స్నేహితుడు గోవిందు ఇది ముందే పసిగట్టి గోమతి తనకే దక్కాలన్న స్వార్ధంతో గోపాలం కంటే ముందు వెళ్లి తన ప్రేమని చెప్పేస్తాడు. వాళ్ళు ఎప్పుడు కలుసుకునే మందార చెట్టు దగ్గర. వెంటనే గోమతి సరే అంటుంది. అది విని భంగపాటు తో గోపాలం ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోతాడు. కొంతకాలానికి తన ఆఫీస్ లోనే ఉద్యోగానికి వచ్చిన గోమతి తో పూర్వంలా చనువుగా ఉండటం సహించలేని గోవిందు గోమతిని సూటి పోటి మాటలు అంటాడు. కొన్ని రోజులు ఘర్షణల మధ్యే జీవితం గడుపుతారు. చివరకి గోవిందు గోమతి జీవితం నుంచి తొలగి పోవడానికి నిశ్చయించుకొని ఉత్తరం రాసి రైలు ఎక్కుతాడు. ఎక్కిన రైలు కొంచెము దూరం వెళ్లి ఆగుతుంది. ఎవరో అంటారు రైలు కిందబడి ఒక ఆడకూతురు ఆత్మహత్య చేసుకుందని అది విన్న గోవిందు మటుకు, గోమతి కి ఆ గతి పట్టదు.చక్కగా గోపాలం తో హాయిగా ఉంటుందిలే అని సమాధానపడతాడు. కానీ అతనికి  తెలియని నిజం  గోమతి  కి తన మీద ప్రేమ ఏమాత్రము తగ్గ లేదని .తన కోసమే రైలు ఎక్కబోయి పది పోయి చని పోయిందని .

  ఈ నవలలో నాయిక  ధైర్య వంతురాలైన  చివరకి  విధి వశాత్తు రైలు కింద పడి  మరణిస్తుంది.

 

రేపటి వెలుగు: ఈ నవలలో కూడా మధ్యతరగతి కుటుంబీకులు శారద తల్లితండ్రులు. ముందు పుట్టిన ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అవుతాయి. అప్పులు, బాధ్యతలతో తల మునగలు గా ఉంటాడు తండ్రి.ఇక రేపో మాపో రిటైర్ అవుతాడు, గుండెల మిద కుంపటి లా పెళ్లికేదిగిన మూడో కూతురు.అని ఆలోచించిన తల్లి కూతురి తో అంటుంది, “చదివిన చదువు చాల్లే ఏదో మా శక్తి కొద్ది గంత కు తగ్గ బొంతను చూసి పెళ్లి చేస్తాను”.

కాని స్వతంత్ర భావాలూ గల శారద అందుకు ఒప్పుకోదు స్వశక్తి మిద నిలబడాలని అనుకుంటుంది. అదృష్టం ఆమెకు అనుకోని విధంగా వేలువిడిచిన మేనమామరూపం లో వస్తుంది. అతనితో వాళ్లింటికి పట్నం వెళుతుంది. అక్కడ తన ఈడుదైన అరవింద తో పరిచయం. ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ క్రమం లో అనిల్ తో పరిచయం ఆమెకి చక్కటి మధురభావనలను కలిగిస్తుంది. అరవింద కి ఒక పంజాబీ తో పెళ్లి అవుతుంది. అతని స్నేహితుడే అనిల్ బెనర్జీ, బెంగాలీ వాడు . శారదను చూసి ఆమె మృదువైన స్వభావం చూసి , ఇష్టపడతాడు. కాని ఆమె ఎటూ నిర్ణయించుకోలేక పోతుంది. ఇంతలో తల్లి “జాగ్రత్తగా ఉండు, ఎక్కడో ఉన్నావు మాకు తలియకుండా కొంపలుముంచకు అంటుంది”.

తల్లి మాటలకూ శారద బాధ పడుతుంది.అప్పుడే అనిల్ దగ్గర్నుంచి ఉత్తరం వస్తుంది “నువ్వు ఇతరుల ఒత్తిడికి,అధికారానికి తల ఒగ్గేదానివి కావన్న సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకింత గౌరవం, ఇష్టం, ఆరాధన” అన్న అనిల్ మాటల తో ఆమె హృదయం ఉప్పొంగుతుంది. అందులోనే నిన్ను కలవడానికి మా అక్క సిద్దేశ్వరి వస్తోంది. రేపు నువ్వు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళు అని ఆమెకి రాస్తాడు.ఆ ఉత్తరం చదువుకున్న శారద ఆ రాత్రి కమ్మని కలలతో తేలిపోతూ ,అందమైన రేపు గురుంచి ఎదురుచూచ్తుంది. ఆ రేపు లో ఎన్నో కొత్త ఆశలు, కోటి కోరికల వెలుగులు విరజిమ్ముతూ అందంగా, మనోహరంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వెలుగుల కాంతులు ఆమె మనసు నిండా పరచు కొన్నాయి.

రేపటి వెలుగు నాయిక శారద మృదుస్వభావి, కార్యసాధకరాలు                                  

కొవ్వొత్తి: ఇందులో కథానాయిక లలిత, …చిన్నప్పటి నుంచి,తన కోసంకాక, ఇతరులకోసమే బ్రతకడం నేర్చుకున్న లలిత. తల్లి కావాలన్న అతి సహజమైన కోరికను తీర్చుకోలేని దురదృష్టవంతురాలు లలిత. కొవ్వొత్తిలా తను కరిగి పోతూ ఇతరులకు వెలుగు నిచ్చే కొవ్వొత్తికి తన చుట్టురా చీకటే మిగుల్తుంది.ఆ నాటి సాంఘిక పరిస్థితుల కి అద్దం పట్టిన నవల ఇది. రచయిత్రి ఒక్క మాట అంటారు చివరిలో “ప్రకాశించే శక్తి ఉన్నంతవరకు వెలుగును ఇస్తూనే ఉండాలని”

లలిత ఒక నాటి మధ్య తరగతి మహిళల కి ప్రతి రూపం

ఎక్కవలసిన రైలు: మాధవి ,పోట్ట్టపోసుకోవడం కోసం ఉద్యోగానికి పట్నం వస్తుంది. ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి చాల మంచి వాడు. ఇంట్లో పిల్లలా చూసుకుంటాడు. వారి బంధువు సుందరమూర్తి, ఒకర్నొకరు ఇష్టపడతారు. జీవితాన్ని ఏంటో సుందరం గ ఊహించుకుంటూ బంగారు కలలుకంటున్న మాధవి ఒక్క సారిగా వాస్తవ ప్రపంచం లోకి వస్తుంది. తనకు సుందరమూర్తి కి గల అంతరం తెలుసుకొని రెండో పెళ్ళివాడైన వాసుదేవమూర్తి ని చేసుకుంటుంది. మాధవి ని పెళ్లి చేసుకోలేక పోయిన సుందరమూర్తి ఎక్కవలసిన రైలు అతడు ఎక్కకుండానే వెళ్ళిపోతున్న రైలు వెనుక ఎర్రదీపాలు అతన్ని చూసి వెక్కిరిస్తున్నాయి, అతని మనసు ,కాలం విలువ తెలుసుకొని బుద్దిహినుడా,జీవితం లో నీకిది గుణపాఠం అంటూ హెచ్చరించింది. అని ముగిస్తారు.

ఇందులో మాధవి పాత్ర ఒక సజీవమైన పాత్ర. కోరింది దొరకక పోయినా,దొరికిన దానితో ఆత్మ వంచన చేసుకోకుండా,తృప్తి పడే పాత్ర.

విశాలాక్షి గారి రచనలలో ఒక గమ్మతైన విషయం కనిపిస్తుంది. ఆమె రాసిన తల్లి పాత్రల కొంచెము,కోపం,దురుసుస్వభావంగా ఉండేవి అయితే, అత్తగారి పాత్రలు మాత్రం ఎప్పుడూ కూడా కోడలని ప్రేమతో చూసుకుంటూ, అభిమానంగా ,సపోర్ట్ ఇచ్చే విధంగా ,ఉంటాయి.

ఇలా మన కళ్ళ ముందు సజీవంగా తిరగాడే పాత్రలు ఎన్నో ఎన్నోన్నో సృష్టంచిన ఘనత శ్రీమతి ద్వివేదులవిశాలాక్షి గారిది. ఆ మహా రచయిత్రికి సారంగ సాహిత్య వార పత్రిక తరపున సాహితీ నివాళులు సమర్పిస్తూ……………

-మణి వడ్లమాని

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అప్పయ్యా!చిదంబర్రెడ్డీ నీ పలక తీసుకురాప్పా!

రాయలసీమ బతుకు – అందునా అనంతపురం బతుకు కరువుతో కన్నీళ్ళతో సహజీవనం. ఆకలిదప్పుల నిత్య మరణం. అలాంటి బతుకులోంచి వచ్చి అక్షరదీపం పట్టుకొని ముందుకు నడిచిన రచయిత సడ్లపల్లె చిదంబర రెడ్డి.  ఆయనలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, ఒక మంచి రచయితా అంతకంటే ఎక్కువగా ఒక హృదయ జీవీ కనిపిస్తారు. ఆయన బతుకు పుస్తకం ఈ రచన.

-ఎడిటర్

My First Picture with Hair(scan0002)ఆ పొద్దు తేదీ1.1.1959.

పొద్దున్నే కుడిపక్కలో లేసి,దేవుని పటాలకి మొక్కుకోని,ముకమూ కాళ్లూ కడుక్కొంటి.అట్టవ(అటక) మింద పొదుగుడు కోడి పిల్లలు సేసి నట్లుంటే మా అన్నయ్య,అక్కయ్యా వాళ్లు తట్టిదించి సూస్తావుండ్రి.రెండు మూడు మురుగుడ్లు పడిండివి.మిగిల్న వన్నీ పిల్లలయిండివి.సెయ్యి వాసి మంచిదని మాయమ్మ, మాలోల్ల ముసలమ్మతో మూడు గుడిసెల్లో ఎండుసోగ తెప్పిచ్చి పొదిగి పిచ్చిండె.సన్న పిల్లులు సూసేకి ముద్దుగావుంటే నేను సేతికి తేసుకోని రవ్వన్ని బీము నూకులు తినిపిస్తి.మా యమ్మిచ్చిన గొర్రిపాల కాపీ తాగితి.

     మాయింట్లో పాలు పిండే ఎనుములు వుండే గానీ పాల టోరోల్లకి అమ్ముతావుండ్రి.కొలతలకి తక్కువొచ్చి అన్నీ అయిపోతే కాపీకి మిగల్లేదని– మా అన్నయ్య రప్పాల్లో గొర్రిపాలు పిండుకోనొస్తావుండె.(రప్పం=రాయీరప్పా పదబంధంలోని మాట. గొర్రెల కొట్టం) మా ఇంటికి సుట్టూపక్కా ఇండ్లు శానాతక్కువ.అందుకే జతగాళ్లతో ఆడుకొనేదానికి రప్పాలతాకి యల్లబార్తావుంటి.అవి మాఇంటికి దచ్చినంపక్క వుండివి.ఏడెనిమిది రప్పాల్లో వేలాంతర గొర్రిలు.పొద్దస్త మానమూ క్యార్ బ్యార్ అని అరుస్తావుండె.బారెడు పొద్దెక్కుతూనే సంగటి తిని,సిక్కాల్లో సద్దిగట్టుకోని,సొర్ర బుర్రలో నీళ్లు మోసుకోని,కావిలి కుక్కల్ని యంటబెట్టుకోని గొర్రలు కాసే వోల్లు– మందల్నంతా దిన్న(మెట్ట)కి,పెన్నేటి గట్లోని కానగ సెట్లవనానికి తోలుకు పోతా వుండ్రి.
     మేము ఇద్దరుముగ్గురు పిల్లోల్లు లోపలి రప్పాల్లో వుండే గొర్రి,మేకపిల్లల్తో ఆడ్కొంటావుంటిమి. సన్న పిల్లలకి అగిశాకు,ఆమిదాకు,పుండాకు,బెండాకు,యాపాకు..రకరకాలవి కోసుకొచ్చి నులకల్తో కుచ్చులుకట్టి,రప్పంలో సూర్లకి యాలాడగట్తావుండ్రి.బుడుగు(చిన్న)పిల్లలకి ఆకు అందకుంటే కుచ్చలిప్పి నోటికందిస్తావుంటిమి. రాతి కుడితిలో నీళ్లు తాగిస్తావుంటిమి.(అప్పుడు సినెంటు,గార కుడితెలు వాడుకచాలా తక్కువ.పెద్ద రాతి దిమ్మెలను వులితో తొలిచి తయారు చేసేవారు.ఇప్పుడు వూరంతా గాలించినా కేవలం ఒకటి మాత్రమే కనిపించింది.దాని ఫోటో చూడగలరు) కొత్తగా ఈనిండే గొర్రెల్ని రప్పాల్లోనే ఇడుస్తావుండ్రి.పిల్లులొగ పక్కా మేమొగపక్కా పొదులో పాలు తాగుతావింటిమి.
     ఇంగుగు ఇసిత్రమేమంటే!! ఆకాలంలో వానల కార్తులు ముగుస్తూనే శానామందికి కండ్లకలక రోగమొస్తావుండె.మా ఇంట్లో ఎవిరికి రాకపోయినా నాకొచ్చేది.పొద్దున్నే లేసే టయానికి కన్నురెప్పలు జాలిబంక(తుమ్మబంక) పూసి దారముతో కుట్టేసినట్ల మెత్తుకు పోతావుండె. నేను దుప్పటిగూడా తీయకుండా గుడ్డోనిమాద్రీ ఏడుస్తావుంటి. అపుడు మా అన్నయ్య రప్పాల్లోకి ఎత్తుకుపొయ్యి,గొర్రొకింద పండుకోబెట్టి పొదుగులోనుంచి పాలు సర్ సర్ న పిండుతావుండె.కారం పూసినట్ల మండతావుండే కండ్లమిందకి యచ్చగా పాలు కారితే హా  హా ఆ ఆనందము యా మటల్లో సెప్పల్ల?? సాయంత్రము గొర్రిలు తిరిగొచ్చేకిముందే పిల్లలు మేసి మిగిల్నరమ్మలన్నీ వామికి మోస్తావుంటి. ఎండినంక అవే పొయ్యిలోకి కట్టెలు.
     మా యన్న(నాన్న), మా యమ్మకి ఏమి సెప్పిండాడోకానీ,గుడిసెలోనుంచి పరిగెత్తి పోతావుండే నన్ను”ఒరే! పప్పులు పెడతాను రారా,తినిపోదువు” అని పిడికిలి సూపిచ్చె.దగ్గిరికొచ్చి సూస్తే అది వుత్తది.యనక్కి తిరిగి దౌడుతీసేకి మొదలుపెడ్తి.మా యమ్మ లటుక్కున నా జుట్టుపట్కోని బచ్చల్లోకి ఈడ్సుకుపాయ.బచ్చలంటే అది తడకల్తోనో,గోడల్తోనో కట్టింది కాదు.మా పాకకి యనక తూరుప్పక్క పెద్ద కనకాంబర సెట్టు.పడమరకి దాసవాళం(మందారం)సెట్టు.దచ్చినానికి కంపలు పాతిండే రప్పాల కల్ల(కంచె).ఆసెట్ల సందేమాబచ్చిలి. ఆడ ఒగ రాతిపలకమీద మగోళ్లు పుట్టగోసీలు పెట్టుకోని,వారానికొగసారి నాలుగుసెంబులు దిగబోసుకొంటారు.ఆడోళ్లయితే సీర అడ్డామేసి కుక్కిరికాళ్లతో కూకోని దొంగలమాదిరీ బిరబిర్న అటుకుడు(మట్టిపాత్రడు)నీళ్లు కుమ్మరిచ్చుకొంటారు.
     ఇడిస్తే పరిగెత్తి పోతానేమో అని జుట్టని యడమ సేత్తో పట్కోని,కుడిసేత్తో బుడుంగ్ బుడుంగున నా నెత్తిమీద నీళ్లు కుమ్మరించె.టెంకాయ సిప్పలోని మాసీకాయని ముట్టుకోలేదు.అక్కడిక్కడసూసి మా యవ్వ మర్సిపొయ్యిండే దాన్నే రవంత తీసి నాతలకి రుద్దె.ఇది సూస్తావున్న నాకండ్లు సీకాయిపడి మండిపాయ.గట్టిగా ఏడిస్తి.అంతసేపటికి మా యవ్వ సంజీవమ్మ వూతకట్టి పట్టుకోని కుంటుకొంటా ఒచ్చె.అంతే!! “నోరుముయ్య్! దొంగబడవా” అని మాయమ్మ నా వుత్తపయ్యిమింద నాలుగంటిచ్చె.ఇంకా గట్టిగా ఏడిస్తి.
“ఊరుకో బాశాలీ! పొడ్డూన్నే యాళకి పిల్లోన్ని యాల అట్ల్త పసరమ్మాద్రీ కొడతావుండావు” అని నన్ని ఎనకేసుకొచ్చె.మరిగి(మట్టి గిన్నె)లో మాయమైన సీకాయ మర్సిపాయ.
     నీళ్లు పోసేదయితూనే సీర కొంగుతోనే నా తలకాయ తుడిసి,యడ్లో ఆరబెట్టి, సెక్క దువ్వానితో దువ్వె.ఒంటిజడేసి సెండుమల్లి పూలు ముడిసి అదికిండే అంగీతొడిగె.అంతసేపటికి మాయన్న లోపల్నుండి ఒగ నల్ల బళపమూ,అణాపెట్టి కొనిండే(6పైసాలు)సన్న బోకి పలకా తచ్చి ఇసుకూలుకు ఈడ్సుకుపాయ.
     అపుడు ఇసుకోల్లో ముగ్గురయవార్లు.సింగప్పయివారు,సీనివాసరావు,కొత్తాయప్ప కిస్టునారెడ్డి.పెద్దయివారు సింగప్ప సారుతావ పెద్దబుక్కులో పేరు రాపిచ్చి,నన్ను మా నాయన కిస్టప్పయివారుతాకి పిల్సుకుపాయ.నన్ను సూస్తూనే నాజతగాళ్లు “ఒరే సిదంబరగా” అని పిల్సిరి.అది ఇన్న మా నాయిన అగ్గయిపాయ.”లే!ఎవుడ్రా ఆనాకొడుకు మావోన్ని అట్ల పిలిసింది?ఆ కూత ఇంగొగసారి ఇనిపిస్తే సెప్పు ఇరిగేతట్ల కొడతాను.చిదంబర రెడ్డి అనే పిల్సల్ల.ఇదిగో అయివారూ గురుతుపెట్తుకో” అనీసుకూలు పెంకులు ఎగిరిపోయేతట్ల అరిశ.ఆశబ్దానికి పిల్లోల్లు,అయివారూ అందురూ అదిరిపాయిరి.కరెంటు పోయిన సినిమా మాదితీ అయిపాయ ఇసుకూలు.
అ ఆలు దిద్దించిన కృష్ణా రెడ్డి గారికి చిన్న సత్కారం

అ ఆలు దిద్దించిన కృష్ణా రెడ్డి గారికి చిన్న సత్కారం

     మా నాయిన అట్ల పోతూనే అయివారు”అప్పయ్యా!చిదంబర్రెడ్డీ నీ పలక తీసుకురాప్పా” అనె.అ ,ఆ లు రాసిచ్చె.నేర్సు కొంటి.అయివారు బొలేమెచ్చుకోనె.
   ఆపొద్దు మద్యాన్నం ఇంగరెండచ్చరాలు నేర్సుకొంటూనే ఒంటికిడిసిరి.అవుడు పెద్దపిల్లోల్లంతా పలకమింద కూకొంటావుండ్రి. అవన్నీ గోడకానిచ్చిరి.కొండరు ఒడికిండే పత్తి దారం తీస్కోని సేవామందిరానికి పొయ్యిరి.మిగిల్నొళ్లు సెడుగుడు,కరీప్పాట,మేకాపులాట,దొంగాట,బుర్రాట..ఆడ్రి.లోపలికి బెల్లు కొడుతూనే అందరూ ఒగేతావ కూకొన్రి.ప్రభవ విభవ,చైత్రము,జనవరి,అశ్విని భరణి,ఆని ఆవడి..పద్యాలు,ఒక్కట్లు(ఎక్కాలు)నోటికి నేర్సిన పెద్దపిల్లోళ్లు వర్సగా సెప్పిచ్చిరి.వాల్లలో మాదిగి అస్వత్తప్ప ఒగుడే నాకి తెల్సినోడు.యాలంటే వాళ్ల నాయన నారయణప్ప జతలో మా ఇంటికి ఒస్తావుండె.సిలావరి గలాసు తెచ్చుకోని మాయమ్మ పోసిన కాపీతాగుతావుండె.
     ఈడ ఈళ్ల నాయిన మాదిగ నారాయణప్ప కత రవ్వంత సెప్పల్ల.
    మా ఇంట్లో సన్న సీమనూని బుడ్డీ మాత్రమే వున్నంట.బ్యాటరీలు కొనేకిదుడ్లు,కరెంటుగాని లేని కాలము.ఒగదినము పొయ్యితావ కట్టెలమిందికి బుడ్డీపొర్లుకోని పెద్దమంట లేస్తావున్నంట.అంతపొద్దుకి నారాయణప్ప ఏమిటిదో పనిమింద మాయింటి తాకి వొచ్చిన్నంట.మానాయిన నీళ్లుపోసి అగ్గి అరిపేది సూసినంట.”అమ్మయ్యా!మాది పుడుగోసెలుపు గిడిసె.సన్న గుడ్డిదీపమున్నా సరిపోతుంది.మీది పెద్ద కుటింబుము.వుంచుకొండమ్మ”కొత్తది లాటీని(కిరోసిన్ లాంతర్)తెచ్చిచ్చినంట.అందుకే ఆయప్ప యపుడొచ్చినా మాయమ్మ కాపీ పోస్తావుండె.(మా అమ్మ ఆ లాంతర్ గురించి ఎన్నిసార్లు చెప్పేదో!!దానిమీద మేడిన్ ఇంగ్లాండ్ అని వుండేది.మేము రెండు మూడు వూర్లకు వలసలుపోయి తిరిగి సడ్లపల్లెకు వచ్చి 1975 ప్రాంతంలో ఇంటికి కరెంటు తీసుకొనేదాకా అలాగే వుండేది.సినిమాలో కానీ,బొమ్మల్లోకానీ చేతి ల్యాంపు కనిపిస్తే నాకు మాదిగ నారాయణప్పే గుర్తుకు వస్తాడు.)
    ఇంటికిడుస్తూనే అస్వత్తప్ప నాదగ్గరికొచ్చి అన్నో ఈపొద్దుటినుంచి మనం జతగాళ్లు.నువ్వు బాగ సదువుకో లెక్కలు బాగ నేరిపిస్తాను”అని మా ఇంటిదంకా విచ్చి ఇడిసిపాయ.
-సడ్లపల్లె చిదంబర రెడ్డి

చరిత్రలో ఒక అద్భుతం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎప్పుడో క్రీస్తు పూర్వ కాలంలో యూదుమతం, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవం మనిషిలోని బుద్ధిని లేదా ఇంగితజ్ఞానాన్ని తృప్తి పరచడానికి ప్రయత్నించాయని, క్రైస్తవం విద్యావ్యాప్తికి కృషి చేసిందనీ హెచ్. జి. వెల్స్ అన్న మాటే చూడండి…

ఈ మాట వెలుగులో మనల్ని పరిశీలించుకుంటే ఏమనిపిస్తుంది?!

ఇప్పటికీ మనదగ్గర బుద్ధి అనే పాత్రను ఖాళీగా ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తున్నామనిపిస్తుంది. పైగా దానిని ఇంత అయోమయపు మట్టితో నింపుతున్నాం కూడా. మన దేశం ఇంకా క్రీస్తుశకంలోకి రాలేదనడానికి ఇది కూడా ఒక నిదర్శనం.

ఈ సందర్భంలో నాకొకటి గుర్తొస్తోంది. ఓ రోజు పొద్దుటే టీవీలో ఒక ప్రసిద్ధ పౌరాణికుని ప్రవచనం వింటున్నాను. ఆయన భారతదేశం ఎంత గొప్పదో వివరిస్తున్నారు. ఇతర దేశాలకు భిన్నంగా ఇది కర్మభూమి అనీ, యజ్ఞభూమి అనీ, మిగతా భూములు పవిత్రమైనవి కావనీ అంటున్నారు. అలా కాసేపు ఆత్మస్తుతి, పరనింద చేసి, చివరగా భారతదేశం మొత్తమే ఒక దేవాలయం అని తేల్చారు.

విచిత్రం ఏమిటంటే, ఆయన సరిగ్గా ఆ మాటలు అంటున్నప్పుడే కింద వార్తలు స్క్రోల్ అవుతున్నాయి. వాటిలో ఒక టీచర్ అయిదేళ్ళ పసిపిల్లపై అత్యాచారం జరిపిన వార్త కూడా ఉంది!

ఆయన మాటలకూ, కింద స్క్రోల్ అవుతున్న ఆ వార్తకూ మధ్య ఎంత అంతరం, ఎంత అవాస్తవికత వ్యాపించి ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తాను. అంతకు మించి భయపెట్టేది అందులోని ఆత్మవంచన. ఆపైన ఆయన ఇంకో ఉద్ఘాటన కూడా చేశారు. అగ్ని ఆరాధన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదన్నదే ఆ ఉద్ఘాటన. నాకు ఆశ్చర్యమూ, బాధా కూడా కలిగాయి. ఆయనకు కొంచెం చరిత్ర తెలిస్తే ఎంత బాగుండుననిపించింది. నిజానికి అగ్ని ఆరాధన ప్రపంచమంతటా ఉంది. ఆ సంగతి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కూడా.

పురాతన మతాలకు భిన్నంగా యూదుల జుడాయిజం, క్రైస్తవం అనే రెండు పుస్తక మతాలు వ్యక్తుల బుద్ధికి పదును పెట్టే ప్రయత్నం చేస్తే; వ్యక్తులలోని ఇంగితజ్ఞానాన్ని చిన్నబుచ్చి, బుద్ధిని మొద్దుబారేలా చేసే ప్రయత్నం నేటికీ మనదేశంలో జరుగుతూనే ఉందన్న మాట!

దీనిని విమర్శగా కాక, ఆత్మవిమర్శగా తీసుకోవాలని కోరుతూ విషయంలోకి వెడతాను.

***

ప్రపంచంలో యూదుల ప్రాముఖ్యానికి కారణం, వారు లిఖిత సాహిత్యాన్ని అందించడమే నని వెల్స్ అంటారు. అంతేకాదు, ప్రపంచ చరిత్రను, శాసనాల సంపుటిని, ఉపదేశ గ్రంథాలను, కవిత్వాన్ని, కల్పిత సాహిత్యాన్ని, రాజకీయభావజాలాన్ని లిఖిత రూపంలో ప్రపంచానికి మొట్టమొదటగా అందించినది యూదులే. వీటిని పొందుపరచుకుంటూ క్రీ.పూ. 4-5 శతాబ్దాలలో రూపొందినదే హిబ్రూ బైబిల్. అదే క్రైస్తవంలో ‘ఓల్డ్ టెస్ట్ మెంట్’గా వ్యవహారంలోకి వచ్చింది.

యూదులు ప్రపంచం మొత్తంలోనే ఒక విలక్షణమైన జాతి. తటస్థంగా చెప్పుకుంటే, వారిలా విపరీతమైన వేధింపులకు, ఊచకోతకు గురైనవారు; వారిలా కొన్ని వందల ఏళ్లపాటు ప్రవాసదుఃఖాన్ని అనుభవించినవారు ఇంకొకరు కనిపించరు. చరిత్రపూర్వకాలం నుంచి, ఆధునిక కాలం వరకు వారి ఆరాట,పోరాటాలకు ఒక అవిచ్ఛిన్నచరిత్ర ఉండడం మరింత ఆశ్చర్యం గొలుపుతుంది. చరిత్రపూర్వకాలంలో ఈజిప్షియన్లు, చాల్దియన్లు తదితరులతో మొదలుపెట్టి ఆధునిక కాలంలో హిట్లర్ కత్తికి మెడవంచడం వరకు వారు పడిన హింసలోనూ ఒక క్రమం కనిపిస్తుంది.

అలాగే, రోమన్ల కంటే ముందు బహురూప ఆస్తికతను తుడిచిపెట్టి ఏకరూప ఆస్తికతను స్థాపించిడానికి ప్రయత్నించినవారు యూదులే. అది క్రీస్తుపూర్వ కాలంలో! అప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం క్రీస్తుశకంలో క్రైస్తవంతో ఒక కొలిక్కి వచ్చింది.

 

యూదులు లేదా హిబ్రూలు సెమెటిక్ జాతి. మొదట్లో వారికంత ప్రాముఖ్యమూ, గుర్తింపూ లేవు. క్రీ.పూ. 1000కి ముందే వారు జుడియాలో స్థిరపడ్డారు. ఆధునిక చరిత్రకారులనే ప్రమాణంగా తీసుకుంటే అది, మన మహాభారత కాలం కంటే కూడా ముందు. ఆ తర్వాత జెరూసలెం వారి రాజధాని అయింది. వారికి దక్షిణంగా ఈజిప్టు; ఉత్తరంగా సిరియా, అసీరియా, బాబిలోన్ ఉన్నాయి. అప్పట్లో చక్రం తిప్పుతూ వచ్చిన ఈ సామ్రాజ్యాల మధ్య ఒక రహదారిగా జుడియా ఉండేది. ఆ విధంగా యూదుల అస్తిత్వం మంచికైనా, చెడుకైనా ఈ సామ్రాజ్యాలతో పెనవేసుకోవలసివచ్చింది.

ప్రారంభంలో యూదులు అంత నాగరికులూ కారు, ఐకమత్యంగానూ లేరు. వారిలో చదవడం, రాయడం తెలిసినవారు కూడా చాలా కొద్దిమంది. మన కశ్యపప్రజాపతి, దక్షప్రజాపతిలా వారికి కూడా ఒక ప్రజాపతి(పేట్రియార్క్) ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయన బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి(క్రీ.పూ. 1750)కాలం వాడని అంచనా. అబ్రహాం నాయకత్వంలో యూదులు సంచారజాతిగా ఉండేవారు. బైబిల్ కథనం ప్రకారం, అబ్రహాం కనాన్ అనే ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ పాడి పంటలతో తులతూగే ఈ ప్రాంతాన్ని మీకు నివాసంగా చేస్తున్నానని చెప్పాడు.

అబ్రహాం కొడుకు మోజెస్. అతని కాలంలో యూదులు ఈజిప్టుకు బందీలయ్యారు. చాలాకాలం పాటు అక్కడ ప్రవాస జీవితం గడిపారు. ఆ తర్వాత నలభై ఏళ్లపాటు దేశదిమ్మరులుగా గడిపారు. అప్పటికి పన్నెండు తెగలుగా విస్తరించారు. అయితే, అబ్రహాం తమకు వాగ్దానం చేసిన కనాన్ తీరప్రాంతాన్ని ఏజీయన్లు అయిన ఫిలిస్తీన్లు అప్పటికే ఆక్రమించుకుని ఉన్నారు. ఆర్యులు తరిమేస్తే ఫిలిస్తీన్లు అక్కడికి వలస వచ్చారని ఇంతకుముందు చెప్పుకున్నాం. అబ్రహాం వారసులు కనాన్ ఆక్రమణకు ప్రయత్నించారు. ఏవో కొన్ని కొండ ప్రాంతాలు మాత్రమే వారి చేజిక్కాయి. కొన్ని తరాలపాటు అబ్రహాం వారసులు ఆ కొండప్రాంతాలలో అనామక జీవితం గడిపారు. మధ్య మధ్య వారికీ, ఫిలిస్తీన్లకు, అక్కడున్న చిన్న చిన్న ఇతర తెగలవారికి ఘర్షణలు జరుగుతూనే ఉండేవి. బైబిల్ లోని బుక్ ఆఫ్ జడ్జెస్ లో వాటి వివరాలు ఉన్నాయి.

జడ్జీలు అంటే ఇక్కడ యూదుల పూజారులు. వారే యూదులను పాలించేవారు. కానీ, యుద్ధాలకు నాయకత్వం వహించే వ్యక్తి అవసరమని భావించి క్రీ.పూ.1000 ప్రాంతంలో పూజారుల స్థానంలో యూదులు సౌల్ అనే అతన్ని రాజుగా చేసుకున్నారు. ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో సౌల్ మరణించాడు. ఫిలిస్తీన్లు అతని మృతదేహానికి మేకులు కొట్టి ఒక గోడకు వేలాడదీశారు.

సౌల్ కొడుకే డేవిడ్! ‘డేవిడ్ అండ్ గోలియెత్’ కథలో హీరో. యూదుల చరిత్రలో ఎంతోకొంత స్వర్ణయుగంగా చెప్పుకోదగింది అతని కాలమే. అందుకు కారణం, ఫొనీషియన్ల నగరమైన టైర్ తో వారికి ఏర్పడిన స్నేహసంబంధాలు.

untitled

ఆ నగరాన్ని హీరామ్ అనే రాజు పాలించేవాడు. అతను మంచి మేధావి, ఉత్సాహవంతుడు. ఫొనీషియన్లు నౌకావర్తకంలో ఆరితేరినవారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. సాధారణంగా వారి వర్తక నౌకలు ఈజిప్టు మీదుగా ఎర్ర సముద్రానికి చేరుకునేవి. అయితే, ఈజిప్టు అప్పుడు అల్లకల్లోలంగా ఉంది. ఆ మార్గంలో మరికొన్ని ఇతర ఆటంకాలూ ఎదురయ్యాయి. దాంతో హీరామ్ ఎర్రసముద్రం చేరుకోడానికి వేరే మార్గాన్ని వెతుక్కోవలసివచ్చింది. యూదుల కొండ ప్రాంతం నుంచి వెళ్ళే మార్గం అనుకూలంగా కనిపించింది. హీరామ్ డేవిడ్ తోనూ, ఆ తర్వాత అతని కొడుకు సోల్మన్ తోనూ స్నేహం చేశాడు. అతని సాయంతోనే జెరూసలెంలోని ఆలయం, గోడలు, రాజప్రాసాదం నిర్మాణమయ్యాయి. దానికి ప్రత్యుపకారంగా తమ ప్రాంతం మీదుగా ఎర్ర సముద్రానికి వెళ్ళే మార్గాన్ని హీరామ్ ఉపయోగించుకోడానికి, తమ భూభాగం మీద నౌకలను నిర్మించుకోడానికి యూదులు అనుమతించారు. అప్పటినుంచి జెరూసలెం మీదుగా ఫొనీషియన్లు అటు ఉత్తరంవైపు, ఇటు దక్షిణంవైపు పెద్ద ఎత్తున వర్తకం సాగిస్తూవచ్చారు. ఈ క్రమంలో యూదుల రాజు సోల్మన్ కూడా అంతకుముందు ఎన్నడూ ఎరగని సంపదను, వైభవాన్ని గడించాడు. చివరికి ఈజిప్టు ఫారో కూడా తన కూతురిని అతనికిచ్చి పెళ్లి చేశాడు.

అయితే యూదుల వైభవం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. సోల్మన్ మరణించిన తర్వాత ఈజిప్టు ఫారో షిషాక్(శశాంక్?) జెరూసలెంపై దాడి చేసి మూలమట్టంగా దోచుకున్నాడు. యూదుల రాజ్యంలోని ఉత్తరప్రాంతం జెరూసలెం నుంచి వేరుపడి, ఇజ్రాయిల్ పేరుతొ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. జెరూసలెం, జుడా రాజధానిగా ఉండిపోయింది.

పులి మీద పుట్రలా హీరామ్ కూడా మరణించాడు. దాంతో టైర్ నగరం నుంచి యూదులకు అందే సాయం ఆగిపోయింది. ఈజిప్టు మరోసారి బలం పుంజుకుంది. ఇజ్రాయిల్, జుడా రాజ్యాలు రెండూ అటు ఉత్తరరాన సిరియా, అసీరియా, బాబిలన్; ఇటు దక్షిణాన ఈజిప్టుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోవడం ప్రారంభించాయి. క్రి. పూ. 721లో ఆసీరియా ఇజ్రాయిల్ ను కబళించి అక్కడి యూదులను బందీలను చేసింది. దాంతో ఇజ్రాయిల్ చరిత్రలోనే అదృశ్యమైపోయింది. క్రీ.పూ. 608 వరకు ఎలాగో అస్తిత్వాన్ని కాపాడుకున్న జుడాకూ చివరికి ఇజ్రాయిల్ కు పట్టిన గతే పట్టింది. మీదులు, పర్షియన్లు, చాల్దియన్లతో యుద్ధాలలో అసీరియా తలమునక లవుతున్న సమయంలో ఈజిప్టు ఫారో నెకో-2 అసీరియాపై దాడి చేసి జుడా మీద పడ్డాడు. అతనితో జరిగిన యుద్ధంలో జుడా రాజు జోసయ్య ఓడిపోయి, హతుడయ్యాడు. జుడా ఈజిప్టుకు సామంత రాజ్యం అయింది. అసీరియన్లతో జరిగిన యుద్ధంలో గెలిచి, బాబిలోన్ ను ఆక్రమించుకున్న చాల్దియన్ రాజు నెబుచాద్ నెజ్జర్ ఈజిప్టు ఫారో నెకో-2ను వెళ్ళగొట్టి జుడాను ఆక్రమించుకున్నాడు. జెరూసలెంలో తన కీలుబొమ్మను రాజుగా ఉంచి బాబిలోన్ నుంచే దానిని పాలించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. జనం తిరుగుబాటు చేసి బాబిలోన్ అధికారులను ఊచకొత కోశారు. దాంతో నెబుచాద్ నెజ్జర్ జుడా రాజ్యం మొత్తాన్నే తుడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. జెరూసలెం మీదపడి దోచుకుని నగరాన్ని తగలబెట్టాడు. జనాన్ని బందీలుగా బాబిలోన్ కు పట్టుకుపోయాడు.

క్రీ.పూ. 538లో పర్షియన్ రాజు సైరస్ బాబిలోన్ ను ఆక్రమించుకునేవరకు వారు అక్కడే ఉన్నారు., ఆర్యుడైన సైరస్ వాళ్ళందరినీ ఒకచోట చేర్చి తిరిగి స్వదేశానికి పంపేశాడు. జెరూసలెంలోని ఆలయాన్ని, గోడలను పునర్నిర్మింపజేశాడు.

పాలకోసం రాయి మోసినట్టుగా, రెండు వివరాల కోసం ఈ చరిత్ర అంతా తడమాల్సి వచ్చింది. మొదటిది, ఋగ్వేదం ‘పణు’లుగా పేర్కొన్న ఫొనీషియన్లతో యూదుల మైత్రి గురించి చెప్పుకోవడం. రెండవది, బాబిలోన్ జీవితం వారిలో తెచ్చిన మార్పు.

బాబిలోన్ వారిని నాగరికులుగా మార్చడమే కాదు, సంఘటితం చేసింది. అంతకంటె ముఖ్యంగా వారిని రాజకీయ ప్రజగా మార్చింది. హిబ్రూ బైబిల్ ను, తమవైన సంప్రదాయాలను వారు రూపొందించుకున్నది బాబిలోన్ లో ఉండగానే. బందీలుగా బాబిలోన్ కు వెళ్ళిన వారికి, స్వేచ్చ పొంది తిరిగి స్వదేశానికి చేరుకున్న వారికి మధ్య ఎలాంటి పోలికా లేదు. ప్రపంచంలో అప్పటికి ఎవరికీ లేని ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకున్నారు. అందులో ప్రముఖ పాత్ర వహించింది, సరికొత్త రకానికి చెందిన వ్యక్తులు. వారే, ప్రవక్తలు!

ఈ ప్రవక్తలు రక రకాల మూలాల నుంచి వచ్చినవారు. ఉదాహరణకు ఎజేకిల్ అనే ప్రవక్త పూజారుల కులానికి చెందినవాడు. అమోస్ అనే ప్రవక్త గొర్రెల కాపరులలా గొర్రె చర్మం ధరించేవాడు. వీరికి ఒకరి అనుమతి కానీ, పదవిలో ఒకరు ప్రతిష్టించడం కానీ ఉండవు. వీరు ఒక్క ధర్మదేవతకు తప్ప మరెవరికీ విధేయత ప్రకటించరు. వారు నేరుగా జనంతో మాట్లాడతారు. ‘దేవుడు నాతొ ఇలా పలికిస్తున్నా’ డని చెబుతారు. వీరు అణువణువునా రాజకీయాన్ని రంగరించుకుని ఉండేవారు. ఈజిప్టు, అసీరియా, బాబిలోన్ ల మీద తిరగబడమని జనాన్ని ఉద్బోధించేవారు. సోమరితనం నిండిన పూజారి వ్యవస్థను, రాజుల దుర్మార్గాలను ఖండించేవారు. వీరిలో కొందరు సంఘ సంస్కరణకు కూడా పూనుకున్నారు.

ఈ ప్రవక్తల ఉద్బోధలకు అక్షర రూపమిచ్చి భద్రపరిచేవారు. యూదులు ఎక్కడికి వెళ్ళినా వాటిని తమ వెంట తీసుకువెళ్ళారు. ఈ సరికొత్త మత స్ఫూర్తిని వెళ్ళిన ప్రతిచోటా వెదజల్లారు. సామాన్య ప్రజానీకాన్ని పూజారుల నుంచి, ఆలయాల నుంచి, రాజుల నుంచి తప్పించి ధర్మదేవతకు అభిముఖంగా నిలబెట్టారు. మానవాళి చరిత్రలో ఇదే వారికి అత్యంత ప్రాముఖ్యాన్ని కల్పించింది. వ్యక్తిగత నైతికతను నొక్కి చెప్పడం రూపంలో యూదులు ప్రపంచానికి ఒక కొత్త శక్తిని అందించారు.

వెనకటి నగర రాజ్యాలలోని దేవుణ్ణి మనుషులు తమ చేతులతో తయారుచేసి దేవాలయంలో ప్రతిష్టించేవారు. ఆ దేవాలయాన్ని శత్రువులు కూలగొడితే దానితోపాటు దేవుడు కూడా కుప్పకూలేవాడు. కానీ యూదుల దేవుడు ఒక కొత్త ఆలోచన. ఆయన అదృశ్యంగా ఉంటాడు. ఏదో ఒక నగరానికి, ప్రాంతానికీ పరిమితం కాడు. పూజారులకు, బలులకు అతీతంగా అయన స్వర్గంలో ఉంటాడు. దేవాలయం కేంద్రంగా ఉన్న నాటి నగర రాజ్యాలు, వాటిపై జరిగే దాడులు, బలులు మొదలైనవి యూదుల దేవుడి అవతరణకు చారిత్రక నేపథ్యం అన్న సంగతి అర్థమవుతూనే ఉంది.

ముందే చెప్పినట్టు యూదులది పుస్తక మతం. బైబిల్ వాళ్ళకు సర్వస్వం. అదే వారిని సంఘటితంగా ఉంచింది. అంతే కాదు, జెరూసలెం వారికి నామమాత్రపు రాజధాని మాత్రమే; వారి నిజమైన రాజధాని బైబిలే. ‘యూదులు పూర్తిగా ఒక సరికొత్త ప్రజారూపం. వారికి ఒక రాజు లేడు, ఒక ఆలయం లేదు, కేవలం లిఖిత అక్షరమే వారిని కలిపి ఉంచింది’ అంటారు వెల్స్.

***

ఇక ఇప్పుడు బయలుదేరిన చోటికి మళ్ళీ వెడదాం. ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. అప్పటికి ప్రపంచ వర్తకం అంతా సెమిటిక్కులైన ఫొనీషియన్ల చేతుల్లోనే ఉండేదని, వారి వర్తక నౌకలు బ్రిటన్, అట్లాంటిక్ ల వరకు; ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు, బహుశా భారత దేశానికీ వెళ్ళేవని వెల్స్ అంటారు. అలా వెళ్ళిన సందర్భంలోనే పణులు లేదా ఫొనీషియన్లు ఋగ్వేదంలోకి ప్రవేశించి ఉంటారు. తాము వర్తకం జరిపే దేశాలలో వారు కాలనీలు ఏర్పాటుచేసుకునే వారు. మిగతా చోట్లలో సెమెటిక్కులకు, ఆర్యులకు ఘర్షణలు జరుగుతున్నట్టే ఇక్కడా జరగడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఘర్షణలే ఋగ్వేదానికి ఎక్కి ఉండవచ్చు.

మన దగ్గర చరిత్ర స్పృహ ఉండి ఉంటే, ఫొనీషియన్లు, యూదుల గురించిన ఎంతో కొంత చరిత్ర మనం కూడా నమోదు చేసి ఉండేవారమేమో! యూదుల పుస్తకమతం గురించిన ప్రస్తావన మన పురాణ, ఇతిహాసాలలో కూడా కనిపించేదేమో! మనకూ, పురాతన నాగరికతలకూ మధ్య ఒక చారిత్రక వారధి రూపుకట్టి ఉండేది. మనకు మనం ఆపాదించుకునే విశిష్టతలు, ప్రత్యేకతల గురించిన ఊహలకు అంతగా అవకాశం ఉండేది కాదు.

అదలా ఉంచితే, ఆర్యుల రాకతో ఫొనీషియన్లతో సహా సెమెటిక్కుల ప్రాభవం ప్రతిచోటా ఎలా అదృశ్యమైపోయిందో వెల్స్ రాస్తారు. క్రీ.పూ. 17వ శతాబ్ది నాటికి మొత్తం నాగరిక ప్రపంచాన్ని సెమెటిక్కులే ఏలుతూ ఉండేవారు. అయితే, క్రీ.పూ. 3వ శతాబ్ది నాటికి ప్రపంచమంతటా సెమెటిక్ ప్రాబల్యాన్ని ఆర్యులు తుడిచిపెడతారనీ, సెమిటిక్కులు ఆర్యుల కింద అణగిమణగి జీవించవలసి వస్తుందనీ, తలోవైపుకీ చెదిరిపోవలసివస్తుందనీ ఎవరూ ఊహించి ఉండరు. ఒక్క అరేబియాలోని సంచార జాతులైన బెడోవిన్లు ఆర్యుల దాడినుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకోగలిగారు. మరోవైపు యూదులు అనే చిన్న సమూహం ఇంత సంక్షోభంలో కూడా జెరూసలెంలో తమ పురాతన సంప్రదాయాలను అంటిపెట్టుకుని సంఘటితంగా ఉండిపోయారు. వారిని అలా సంఘటితంగా ఉంచినది, వారి బైబిలు!

చరిత్రలో ఇంకో అద్భుతం కూడా జరిగింది. ఆర్యుల కత్తికి తలవంచి గతవైభవాన్ని కోల్పోయిన బాబిలోనియన్లు, సిరియన్లు, ఫొనీషియన్లతో సహా అనేకులు క్రమంగా యూదు మతంలోకి ఆకర్షితులై బైబిల్ భాషే మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు, టైర్, సిడాన్, కార్తేజ్, స్పెయిన్ లోని ఇతర ఫొనీషియన్ నగరాలతోపాటు ఫొనీషియన్లూ హఠాత్తుగా చరిత్రనుంచి అదృశ్యమైపోయారు. ఒక్క జెరూసలెం లోనే కాక, అంతకుముందు ఫొనీషియన్లు అడుగుపెట్టిన స్పెయిన్, ఈజిప్టు, అరేబియా, తూర్పు దేశాలతో సహా ప్రతిచోటా అంతే హఠాత్తుగా యూదులు ప్రత్యక్షమయ్యారు.

మిగతా విశేషాలు తర్వాత…

మూడవ దారే శరణ్యమా?

karalogo

నిర్వహణ: రమా సుందరి బత్తుల

కథాకాలానికి డెభై అయిదేళ్ళున్న సుభద్రమ్మకి ఆమె భర్త రామభద్రయ్యతో అరవై ఏళ్ళ సాహచర్యం. పథ్నాలుగేళ్ళ ప్రాయంలో అతనింట్లో మెట్టి అతని కోపపు కేకలకు తడబడి గుమ్మాలకు కొట్టుకుని పడబోయి అత్తగారి ఆదరణతో నిలదొక్కుకుని, ఆవిడ ప్రేమలోనూ భర్త కనుసన్నలలోనూ మెలిగి వాళ్ళ అభిప్రాయాలే తనవిగా చేసుకుని ఏడుగురు బిడ్డల్ని కని పెంచింది. ఆ అరవై ఏళ్ళలోనూ ఎవరింట్లో నైనా చుట్టపు చూపుగానో పని గడుపుగోడానికో కొద్ది రోజులు మాత్రమే వుండేది కానీ, శాశ్వత నివాసం ఆ పల్లెలోనే. తను మెట్టిన ఇంట్లోనే. అటువంటి సుభద్రమ్మకు ఆమె భర్త పోయిన పదిహేను రోజులకే తను ఎక్కడుండాలనే ప్రశ్న ఎదురైంది. ఎక్కడుంటే ఆమెకు సౌకర్యం, ఎక్కడుంటే ఆమెకు కాస్త ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ అని కాక ఆమె ఎక్కడుండడం ధర్మం అనే చర్చ వచ్చింది. ఎక్కడుండడం అని కూడా కాక ఎవరి దగ్గర వుండడం అని.

“ఇన్నాళ్ళూ నాన్నగారి బాధ్యత నీ మీదుంది. ఆయన ఇల్లు విడిచి రానన్నారు. ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు నాదగ్గరుండడం ధర్మం” అన్నాడు పెద్దకొడుకు. “తమ్ముడిని కూడా అడగాలి కదా!” అందావిడ అప్పుడు. ఆడపిల్లలు పెళ్ళి చేసుకుని అత్తవారిళ్ళకు పోగా, తక్కిన కొడుకులు ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళలో ఉండగా మూడో కొడుకు మాత్రం వున్న వూళ్ళోనే పొలం చూసుకుంటూ వుండిపోయాడు. వుంటే తనిప్పుడు మూడో కొడుకు దగ్గర వుండాలి. లేదా పెద్ద కొడుకుతో వుండాలి. ఒక చోటు ఎంచుకుని వెళ్ళి తరువాత ఇంకోచోటుకి వెడితే బాగుంటుందా? గౌరవంగా వుంటుందా?

ఆమె భర్త రామభద్రయ్యకు కాశీ యాత్ర చెయ్యాలనే సంకల్పం ఆయన జీవితంలో నెరవేరలేదు. మూడుసార్లు బయలుదేరి ఏదో ఒక అడ్డంకితో ఆగిపోయాడు. నాలుగోసారి ఆవిడే అడ్డం కొట్టింది. ఎందుకంటే తాము కాశీ వెళ్ళడం భగవంతుడికి ఇష్టం లేదనీ ఈసారి కూడా ఏదో అడ్దంకి వస్తుంది కనుక అసలు బయలుదేరవద్దనీ… ఆపైన వయసు మీదపడిన రామభద్రయ్య తనంతట తనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆయన పోయాక ఆయన అస్థికలనైనా గంగలో నిమజ్జనం చెయ్యాలని ఆయన పిల్లలు నిర్ణయించారు. ఆమె కూడా వెళ్ళాలని అర్థించారు. ఆయన పక్కన లేకుండా ఈ విధంగా వెళ్లవలసి రావడం ఆమెకి కష్టంగానే వున్నది. కాశీవచ్చాక కూడా ఆమె మనసు స్థిమితంగా లేదు. అనంతమైన రైలు ప్రయాణం చేసి వచ్చిందిక్కడికి. తను తిరిగి ఇంటికి వెడుతుందా? భగవంతుడి సంకల్పం ఎట్లా వుందో?

ఈ ఆలోచన ఆమెకి ఇప్పుడు వచ్చింది కాదు. రామభద్రయ్య మంచాన పడ్డప్పుడు పిల్లల ప్రవర్తనల్లో ఆమె కనిపెట్టిన మార్పు ఇటువంటి ఆలోచనకు బీజం వేసింది. ఆయనను వాళ్ళు గౌరవించాల్సినంతగా గౌరవించడం లేదనిపించింది. చెయ్యీ కాలూ సరిగా వున్నంతవరకూ వుండే గౌరవం తరువాత వుండదు. అందుకే ఆయన పోయాక ఇంక తను బ్రతకవద్దు అనుకుంది. ఊళ్ళో ఎన్ని నూతులు లేవు కనుక అనుకుంది. కానీ ఆయన పోయాక ఆ పన్నెండు రోజుల్లో పిల్లలు ఆమె మీద చూపించిన ప్రేమాదరాలు మళ్ళీ ఆమెని ఆ ఆలోచనను కాస్త దూరం పెట్టేలా చేశాయి కానీ కాశీ లో అట్లా కాదు. మళ్ళీ అవే ఆలోచనలొస్తున్నాయి. అచ్చమైన సంప్రదాయ మధ్య తరగతి గ్రామీణ కుటుంబంలో పుట్టి, ప్రేమా గౌరవమూ అంటే భయభక్తులేననే నమ్మకంతో జీవించిన సుభద్రమ్మకి, తను తన అత్తగారి పట్ల చూపించిన భయభక్తులు తన కోడళ్ళు తనపట్ల చూపడం లేదని దుగ్ధ. వాళ్ల పద్ధతులు ఆమెకి నచ్చవు. తనకీ తన అత్తగారికీ మధ్య వున్న సామీప్యం తన కోడళ్ళకు తనతో లేదని అసంతృప్తి. రామభద్రయ్య జీవించి వుండగా అతనిపట్ల అందరూ గౌరవం చూపించాలని ఆరాటపడి అట్లా అందరి వెంట పడేది ఆవిడ. ఆయన మంచాన పడ్దాక చూపేవారు చూపేవాళ్ళు. లేనివాళ్ళు లేదు. అంతవరకూ తండ్రి కనుసన్నలలో నడిచిన మూడవ కొడుకు కూడా ఆయన్ని అడక్కుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదంతా గమనించింది ఆవిడ.

కాశీలో పెద్దకొడుకు ఆమెతో అనేక విషయాలు మాట్లాడాడు. తన కుటుంబం సంగతి, తన కొడుకూ కోడళ్ల సంగతి. తన భార్య సంగతి. ఒక కుటుంబంలో భిన్నాభిప్రాయాలుంటాయని వినడం సుభద్రమ్మకి ఇదే మొదలు. తన కొడుక్కీ కోడలికీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఏమిటో ఆమెకి అర్థంకాదు. ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లు ఆమె గుండెలు దడదడలాడాయి.

కొడుకు చాలా చెప్పాడు. కొడుకు గొంతుతో రచయిత చెప్పిన మాటలు ఇవి.

ఇటువంటి ఘర్షణలు ….. నాయకత్వం యాజమాన్యం, పెద్దరికం వంటివి ఏర్పరుచుకున్నాక .. తరం మారి కొత్త తరం తలెత్తినప్పుడల్లా – వస్తూనేవున్నాయి. పెద్దరికం కోసం, నాయకత్వం కోసం పడుచుదనం పెద్దతరాన్ని సవాలు చేస్తూనే వుంది……. అనాదిగా జరుగుతున్న ఈ తరాల సంఘర్షణ గురించి, అందులో మనిషి పడే హింస గురించీ సుదర్శనం (పెద్ద కొడుకు) ముందే కొంత విన్నాడు. తన చుట్టూ సాగుతున్న ఘర్షణని గుర్తించడానికి, దాని పోకడ అర్థం చేసుకోడానికీ. ఆ వినికిడి కొంత ఉపయోగించింది….పోకడ అర్థం అయింది కానీ నివారణోపాయమే అర్థం కాలేదు. అట్టే ఆలోచిస్తే ఇది తప్పనిసరే కాదు, అనవసరమేమో కూడా! అధికారాలకీ అదిచ్చే సౌకర్యాలకీ అలవాటుపడ్ద ముందు తరం తనకు తానుగా వాటిని వొదులుకోలేదు. ఆ తరంలో లుప్తమైపోతున్న ఉత్సాహం, సామర్థ్యం తమలో ఉరకలు వేస్తుంటే కళ్ళాలు తమ చేతిలోకి తీసుకోడానికి కొత్త తరం ఉద్రేక పడక తప్పదు. ఈ విధంగా ప్రగతి కోసం ఘర్షణ అనివార్యం. ఇవ్వన్నీ తల్లికీ, భార్యకీ అర్థమయేలా చెప్పాడతను. అందుచేత రెండేళ్ళల్లో రిటైరవబోయే అతను తల్లితో పల్లెటూరిలో ఉండడానికి నిర్ణయం   తీసుకున్నాడు. డబ్బు ఖర్చుపెట్టడం విషయంలోనూ, సంపాదించడం విషయంలోనూ తరానికీ తరానికీ భిన్నమైన అభిప్రాయాలుంటాయి. ఆ విషయాన్ని పూర్తిగా ఆమోదించలేని అతని భార్య శకుంతల, డబ్బు దూబరా చేసే కోడలికి సంసారం అప్పజెప్పి అతనితో రాలేనంటుంది. అందుగురించి ఇద్దరూ వాదించుకుంటారు. కొడుకు చెప్పింది అర్థంచేసుకోడానికి ప్రయత్నించింది సుభద్రమ్మ. పదే పదే ఆమె ముందు రామభద్రయ్య మూర్తి ప్రత్యక్షం అవుతోంది. తనముందు మూడు దారులున్నాయి. ఒకటి పెద్దకొడుకుతో వెళ్ళి వుండడం. అక్కడ వాళ్ళింట్లో ఎవర్నీ పూర్తిగా ఎరగదు. వాళ్లల్లో వాళ్లకే అభిప్రాయ భేదాలున్నాయి. రెండవది మూడో కొడుకు దగ్గరుండడం. మొదట్నించీ తను ఆ కుటుంబంలో భాగం, ఆ ఊళ్ళోనూ భాగం. కానీ ఎవరిని కాదని ఎవరితో వుంటే ముందుముందు ఏ చిక్కుల్లో పడుతుందో తెలియదు. ఒకసారి మూసుకున్న తలుపులు మరొకసారి తడితే తెరుచుకుంటాయా? ఎటూ తేల్చుకోలేకపోయింది. ఆమెకి అన్నిటికీ పరిష్కారంగా మూడో దారివుంది. కానీ అది గౌరవంగా బ్రతుకుతున్న పిల్లల్నిఏ చిక్కుల్లో పడేస్తుందో అనే భయం ఎటూ తోచని స్థితి. ఇక అంతా సర్వేశ్వరుడిదే భారం అనుకుంది.

అస్థి నిమజ్జనం సమయంలో ఆమెకి మళ్ళీ రామభద్రయ్య మూర్తి కనిపించింది. నడివయస్సులో వుండే రామభద్రయ్య మూర్తి. చెంగులు ముడి వేసుకుని చెయ్యవలసిన సరిగంగ స్నానం ఇలా అస్థికలతో చెయ్యవలసి వచ్చింది అనుకుంది. అస్థి నిమజ్జనం తరువాత మూడు సార్లు గంగలో మునగమన్నారు. ఆమె సూర్యభగవానునికి నమస్కారం చేసి చివరిగా మరో మునక వేసింది. ఆ మునక తరువాత పెద్దగా అలలు లేచాయి. మునిగిన ఆమె లేవలేదు. మనుషులొచ్చి బయటికి తీశారు. ఎక్కువ నీళ్ళు తాగలేదు కనుక బ్రతికింది. మూడోదారి మూసుకుపోయినట్లే. మరి సుభద్రమ్మ ఇప్పుడెక్కడెక్కడుండాలి? అరవై ఏళ్ళు అలవాటుపడిన ఇల్లు ఆమె స్వంతం కాదా? కొడుకు తప్ప కోడలూ ఆమె పిల్లలతో ఏ మాత్రం సామీప్యం లేని ఇంట్లోనా? నేనిక్కడే వుంటాను ఎక్కడికీ రాను అని రామభద్రయ్యలా ఆమె అనలేక పోతోంది, ఎందుకు? స్త్రీ కావడం వల్లనా? ఇట్లా ఎన్నో ఆలోచనలు వస్తాయి పాఠకులకు.

ఆర్జనాశక్తీ ఉత్సాహం తగ్గిపోయాక హుందాగా పెత్తనాన్ని బదలాయించే బాధ్యత ఎరిగిన సుదర్శనం కథా? మొదటినించీ భయభక్తులతో మెలిగి చివరికి ఎక్కడుండాలో తేల్చుకోలేని సుభద్రమ్మ కథా? అధికారం కోసం రాజకీయాలలో జరిగే రక్తపాతం లాగే కుటుంబాలలో కొనసాగే మౌన హింస కథా? అన్నిటినీ స్పృశించిన ఈ కథ చాలా పెద్దది. తరాల అంతరాలు, గ్రామీణ జీవనం, స్త్రీల అధీనత. అందులోనే తోటి స్త్రీలపై ఆధిక్యం కోసం ఆరాటం. సంప్రదాయ క్రతువుల వర్ణనా అన్నీ కలిసి ఒక గ్రామీణ అగ్రకుల మధ్యతరగతి జీవితాన్నీ, అందులో స్త్రీల నిస్సహాయతనూ బాగా పట్టుకుని వ్రాసిన కథ. చాలాకాలం విరామం తరువాత మేస్టారు వ్రాసిన పెద్ద కథ.

-పి. సత్యవతి

image

పి. సత్యవతిగారు సాహిత్య లోకానికి నలభై ఏళ్ళనుండి చిరపరిచితులు. సత్యవతి కధలు, ఇల్లలుకగానే, మంత్ర నగరి, మెలుకువ అనే నాలుగు కధల పుస్తకాలను ప్రచురించారు. మొదటి, రెండవ తరాల ఫెమినిష్టుల గురించి రాసిన  ‘రాగం – భూపాలం’ అనే వ్యాస సంపుటి సత్యవతిగారి కలం నుండే వచ్చింది. ‘మా నాన్న బాలయ్య’, ‘ఇస్మత్ చుగ్తాయ్ కధలు’ ‘ఒక హిజ్రా ఆత్మ కధ’ లాంటి మంచి పుస్తకాలను ఆంగ్లం నుండి అనువాదం చేసి తెలుగు పాఠకులకు అందించారు. సమకాలీన సాహిత్యాన్ని నిత్యం చదువుతూ తన ఆలోచనలను, రాతలను సజీవంగా నిలుపుకొంటున్న సత్యవతిగారు నేటి యువ సాహితీకారులకు ఎందరికో ఇష్టులు.

వెంకటకృష్ణ  “వీరుడూ – మహా వీరుడు” కధను గురించిన  పరిచయం

 

 

‘సంకల్పం” కథ ఇక్కడ:

నో థాంక్స్…

DSC_5570ఒకరోజు చూస్తే మరొకరోజు చూస్తాం.
ఒకసారి కనిపిస్తే మరోసారి కనిపిస్తూనే ఉంటుంది.

జీవితం దృశ్యమే.
దృశ్యాదృశ్యాల సంకలనమే.

చూపులతో అంచనాలకు రావడమే.

రోడ్డుకు ఇరువైపులా కాలిబాటలు.
అక్కడ ఎవరో ఒకరు ఏదోలా కానవస్తూనే ఉంటారు.

చూస్తూ ఉండగా పరిచితులు అవుతారు. వాళ్లు కాగితాలతో ఉంటారు. చింపిరి మూటలతో ఉంటారు. మట్టితో ఆడుకుంటారు.ఒకరు వయోలిన్ వాయిస్తుంటారు. కానీ మనకు తెలియదు. ఒకరు విత్తనం నాటేస్తూ ఉంటారు. మనకస్సలు అందదు. వాళ్లది సేద్యం అని తట్టనే తట్టదు.

తెలిసే అవకాశం లేకపోయినా కొన్ని తెలుస్తాయి.
కనీసం కొన్నయినా, వాళ్ల దైనందిన జీవితంలో కొన్ని పార్శ్వాలైనా సన్నిహితం అవుతూనే ఉంటై.

అయితే. కొత్తగా వచ్చిచేరే వారూ ఉంటరు. వెళ్లే వారూ ఉంటారు.
కానైతే, నిరంతర జీవన ప్రవాహంలో ఓడలు బండ్లూ కావడమే అధికం.
అయినా తట్టుకుంటారు.

అయితే రోడ్డుకన్నాకాలిబాట మహత్తరమైంది.
అది ఏ గోడలు లేని ఇల్లు. చాలామందికి.

ఒక కానుగచెట్టు నీడ. ఎంతోమంది తల్లీబిడ్డలకు.

వెళ్లేవారు వెళుతూనే ఉంటారు- అది రోడ్డు.
వచ్చేవారిని చేరదీస్తూనే ఉంటుంది- అది కాలిబాట.

అందుకే కాలిబాట ఒక పలక. అదొక పలుకుబడి,
అందలి గుణింతం ఒక దృశ్యాదృశ్యం. ఇదీ అందులో ఒకానొక రచన.

+++

పదకొండైంది. ఒక రోజు. మింట్ కాంపాండ్ వద్ద, హైదరాబాద్ లో ఒక తల్లీబిడ్డ.
రోడ్డుకు ఒక పక్క ఒక చెట్టు నీడన, చప్టా మాదిరి పిల్లగోడ వంటిదానిపై చలిలో ఒకరి కింద ఒకరు…
ఆ సన్నని ఇరుకు పిట్టగోడ వంటిదానిపై ఒకరు తర్వాత ఒకరు…

ఒకరోజు కాదు, రెండు రోజులు…మూడు రోజులు…
భయం. ఉండిపోతారనే భయం.

అలవోకగా అలవాటుగా ఇలా చిత్రించి వెళుతుండగా ఒక అనుమానం.
ఆ రంగులు, రూపాలు, ఆ చిన్న స్థలంలో వారు విశ్రమించే విధానం సరే.
ఉంటారా? వెళతారా?

భయాభయం.
ఒక రోజు మాట పెగిలింది.
“ఏమైనా  ఇబ్బందా? ‘……..

“నిన్నా మొన్నాకూడా చూశాను.
ఏమైనా ఇబ్బందా?”

ఆ ప్రశ్నకు చప్టాపై కూచున్న తల్లి మందుల చీటి చదవడం ఆపి చూసింది.
బిడ్డేమో తల్లి కొంగుచాటున దాక్కొని చూస్తోంది.

ఆశ్చర్యం.
“ఏమైనా ఇబ్బందా?” అన్నట్టు చూశారు నా వంక.

ఆశ్చర్యం.
కానీ కాసేపే.

అర్థమైంది.
ఇబ్బంది అన్నది ఇద్దరికీ అన్న సంగతి అర్థమవడం ఒక దృశ్యాదృశ్యం.

+++

ఇంతలో ఆమె కళ్లలోకి సూటిగా చూసి, “ఇబ్బందేమీ లేదు. మీ ఔదార్యానికి థాంక్స్’ అంది.
ఇంగ్లీషు పదం విన్నాక ఒంట్లో చిన్నకలవరం. ఆనందం.

వెళతారు..వెళతారు అనిపించిన ఆనందం.
చదువుకున్న కుటుంబం అన్న అభిమానం.0

కానీ, భయం.
చదువుకున్న వాళ్లకు వీధిలో చాలా కష్టాలు.
కాలిబాట మీద ఇమడటం మహా కష్టం.

భయపడి పోతారా ఇంటికి అన్న భయం.
ఇల్లే నయం అనికుని వెనుదిరుగుతారా అన్నదృశ్యాదృశ్యం.

అంతలో ఆలోచనలు కట్టిపడేసి చూశాను.

చూస్తే, చూసింది లేదా చూశారు.
ముందు తల్లి.
“నో థాంక్స్’.అంది. “ఇక వెళతారా?’ అన్నట్టు చూసింది.బిడ్డ. “చెప్పింది కదా మమ్మీ” అన్నట్టు చూసింది.

ఒక దృశ్యం. రెండు దృశ్యాలు.
తల్లీబిడ్డల చూపులు. ఎప్పటికీ జ్ఞాపకం వుండే చిత్రణలు.

+++

వెళ్లిపోయాను. మరునాడు వాళ్లు అదృశ్యం అయ్యారు.
కానీ, ఒక సరికొత్త ఉనికి మనసులోకి వచ్చింది.

“నో థాంక్స్.’

ఒక అభిమానం, ఆత్మగౌరవం.
ఒక ఇల్లు. ఒక కాలిబాట.

దృశ్యాదృశ్యం అంటే ఇదే.

+++

తర్వాత వాళ్లు కనిపించలేదు.
బహుశా వాళ్లు ఇంట్లో ఉంటూ ఉంటారు.

+++

వాళ్లు ఎలాగైనా ఉండనీయండి.
కానీ, ఒక మాట.

ప్రతి ఒక్కరికీ ఒక సందర్భం ఉంటుంది.
ఇల్లు విడిచి, వీధుల్లోకి వచ్చి, పిచ్చిపట్టినట్టు తిరిగే స్థితి లేదా తిరగాల్సిన స్థితి.
అప్పుడు ఎవరైనా ఒక చిత్రం తీసినా తీయకపోయినా ఒక దృశ్యం మాత్రం ఉంటుంది.

చూస్తున్నారు కదా. నా వలే ఒకరు చిత్రించవచ్చు. చిత్రించి పలకరించనూ వచ్చు.
లేదా చూడనూ వచ్చు. చూసి మనసులోనే పరిపరివిధాలా ప్రశ్నించుకోవచ్చు.

దృశ్యాదృశ్యం అంటే ఇదే.

+++\

జీవితం దృశ్యం వల్లా చాలామాట్లాడుతుంది.
మాట్లాడింప జేస్తుంది.

సమాధానం కాదు మఖ్యం.
పలకరింపు. వాకబు చేయడం. ఏందీ? అని అడగడం. ఏమైనా ఇబ్బందా? అని అర్సుకోవడం.

“చెప్పింది చాలు, నో థాంక్స్” అనవచ్చు మీరు.

మీ ఇష్టం. మీ జీవితం. సరే, అని తప్పుకుంటాను నేను.ఇది నా జీవితం. నా దృశ్యం.
థాంక్స్.

-కందుకూరి రమేష్ బాబు

జీవితమే సఫలము…కథాసుధాభరితము

This slideshow requires JavaScript.

మాస్టారి కథలకు ఆయువుపట్టు కథనం

సాహిత్యాన్ని తానెందుకు రాస్తున్నారో, ఎవరికోసం రాస్తున్నారో అనే విషయంలో కథారచయితగా కాళీపట్నం రామారావుకు చాలా స్పష్టత వుంది. ఈయన కథలు గ్రామీణ జీవితంలోని మానవ సంబంధాలను మార్క్సిస్టు తాత్విక దృక్పథంలో నుండి చూసాడు. అయితే తన కథల్లో ఎక్కడా ఆ పరిభాషను వాడలేదు. ఆ పరిభాషను వాడకుండానే కథా జీవితమంతా పరుచుకున్న మార్క్సిస్టు దృక్పథాన్ని పాఠక అనుభవంలోకి తీసుకు రావడంలో కాళీపట్నం రామారావు సఫలీకృతులయ్యారు.ఇదంత సామాన్యమైన విషయంకాదు. కథనం విషయంలో మంచి పట్టు వుంటే తప్ప ఇలాంటి నేత (craft) సాధ్యంకాదు. అందుకే ఆయన పాఠకులలో మార్క్సిస్టులు, మార్క్సిస్టు తాత్వికతను అభిమానించేవాళ్ళెంతమందున్నారో మార్క్సిస్టు భావజాలంతో సంబంధంలేని వాళ్ళు కూడా అంతమందున్నారు. దీనికి కారణం జీవితంపట్ల మనుషులపట్ల ఆయనకు గల నిశిత పరిశీలన వల్లనే పాఠక విస్తృతి సాధ్యమయ్యింది. పాత్రల విషయంలోగానీ, సన్నివేశం విషయంలోగానీ, మరే విషయంలోగానీ ఎప్పుడూ, గందరగోళ పడిన దాఖలా ఒక్క కథలో కూడా కనిపించదు. ఈ స్టేట్‍మెంట్ రాయకుండా ఉండలేని లౌల్యం నాకు మరోరకంగా రాయటంలో కనపడలేదు. మార్మికత పేరుతోనూ మాజిక్ రియలిజం పేరుతో తాము చెప్పదలచుకున్న అంశాన్ని ఏమాత్రం అర్థం కాకుండా కథ మొత్తాన్ని నిర్వహించే మేథో / గొప్ప కథకులకు నేర్పించే పాఠాలు కాళీపట్నం మాష్టారు కథలే. తానెంచుకున్న పాఠకులకు తన సాహిత్యం ద్వారా చేరువ కావడానికి, విషయాన్ని అవగతం చేయించడానికి, ఎంత విడమరచైనా, వాస్తవ సామాజిక స్థితిగతుల్ని ఎదిరించి పోరాడే శక్తిని, అవగాహనను అందించేందుకు తన జీవిత అనుభవాన్నంతా రంగరించి, ఎంతో ఓపికగా బుద్ధి తెలియని పిల్లలకు అనునయించి చెప్పే పాఠంలా ఆయన కథన శైలి సాగుతుంది. రచయితగానే కాదు ఆయన నివసిస్తున్న సమాజంలోని ప్రతి మనిషికి అందుబాటులో వుండే కథన శైలి ఆయనది. తన పాఠకుల్ని – గురువులను అనుసరించి నడిచే బడిపిల్లల్లాగా తన వెంట తిప్పుకుంటారు. తన కథలో సృజించిన ఒక సమస్య. ఆ సమస్యను అతి సమర్థవంతంగా ఒక్కొక్క స్టెప్‍ను సాధించిన రూపం. ఆతర్వాత మరో స్టెప్. వృత్తిరీత్యా లెక్కల మాష్టారవటం వల్ల ఒకొక్క లెక్కను సాధించి సమాధానాన్ని రాబట్టుకునే శైలి ఆయన కథల్లో కనిపిస్తుంది. సువిశాల కథా ప్రపంచంలో ఎవరిలోనూ ఎక్కడా కనిపించని ప్రత్యేకమైన శైలి. వర్తమాన కథకులు ముఖ్యంగా గ్రామీణ బడుగు వర్గాల కోసం రచన చేసే కథకులు ఆలోచించి, అలవరుచుకోవలసిన శైలీ శిల్పం కాళీపట్నం కథలది. . ( ఒక్క పి. సత్యవతి కథనంలో మాత్రం ఇలాంటి టెక్నిక్ చూడగలం. )

ధర్మం పేరిట, న్యాయంపేరిట కొనసాగుతున్న అన్యాయాలకు అక్రమాలకు గల ముసుగును తొలగించి పాఠకుల చైతన్యాన్ని ఆచరణలోకి తేవటం రామారావు కథల్లో కనిపిస్తుంది. ఏపాత్రకూడా స్థాయీ బేధం లేకుండా పాత్రలన్నీ ఒకానొక నీతికి కట్టుబడి ప్రవర్తిస్తాయి. అయితే నీతి అవినీతి మధ్యగల మర్మ రహస్యాన్ని తన తాత్విక భావజాలంతో బద్ధలు చేసి సమాజం కప్పిన ముసుగును క్రమక్రమంగా బట్టబయలు చేయడంలో ఆయన తాత్విక దృక్పథం నిర్వర్తించిన బాధ్యత ఈయన కథల్లో బహిర్గతమవుతుంది. ఆ తాత్వికత వల్లనే మనుషుల్ని కొట్టు, తరుము, నరుకు, పోరాడు, పొలికేక వేయించు లాంటి ఉద్వేగాలతో కాకుండా నింపాదిగా తత్వబోధ చేస్తాయి. వాటిని అందిపుచ్చుకున్న పాఠకులే కథాంశంలోని సారాన్ని గ్రహించగలుగుతారు.

సమస్యకు రచయిత పరిష్కారం చెప్పాలా వద్దా? అన్నది రచయిత చైతన్యానికి సంబంధించిన అంశం. ఏ పరిష్కారం చెప్పాలి అన్నది రచయిత భావజాలానికి సంబంధించిన అంశం. పరిష్కారాన్ని ఏ పద్ధతిలో చెప్పాలి అన్నది రచయిత శిల్ప పరిజ్ఞానానికి సంబంధించిన అంశం. శిల్పం ముసుగులో ఏది చెప్పకుండా ఏదో చెప్పినా, ఏమి చెప్పారో తెలియకుండా అస్పష్టంగా వదిలిపెట్టడం మంచిది కాదనేది కాళీపట్నం రామారావుగారి కథల్లో ఆవిష్కృతమయ్యే వాస్తవం. అందుకు అనుగుణంగానే ఆయన కథలలోని పరిష్కారాలుంటాయి. ఇది అవునా కాదా అన్న మీమాంసకు పాఠకుడు ఎక్కడా గురి కాడు. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు

కథనం విషయంలో కనిపించే సుదీర్ఘత, సంభాషణల్లో కనిపించదు. సంభాషణల్లో రచయిత చాలా జాగ్రత్తగా, పొదుపుగా, గాఢమైన ముద్రను అందించేవిగా పాత్రల స్వభావాన్ని తీర్చిదిద్దుతారు. ఉద్యమాలు జీవితానుభవంలోంచి రావాలి తప్ప, పుస్తకాలలోంచి కాదు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధంలేని జీవితాలలో కూడా ఆర్థికసూత్రం ప్రధాన ప్రాత నిర్వహిస్తున్న తీరును కాళీపట్నం చాలా కథల్లో కనబడుతుంది. సమస్యా పరిష్కారాలలో జీవితాన్ని నడిపే గతితార్కిక సూత్రాలను తన కథలకు అంతస్సూత్రంగా చేసి ఆవిష్కరించటమే రచయితగా కాళీపట్నం రామారావు కథా రచనలోని ఉద్దేశిత లక్ష్యం.

మాజికల్ రియలిజమ్ పేరుతో పాఠకులకు అర్థంకాని ప్రయోగాలతో గందరగోళ పరిచే రచయితలు గొప్ప రచయితలుగా, మేథో రచయితలుగా గుర్తించబడటమే లక్ష్యంగా వున్న రచయితలు . ఒక కాఫ్కానో, డెరిడానో, మరో పుకోవ్ ,మార్క్వెజ్ లను చదివితేనే అర్థమయ్యే కథా రచయితలందరు కాళీపట్నం రామారావు కథల్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. సాహిత్య రచన ద్వారా సామాజిక బాధ్యతా నిర్వహణలో చురుకైన, సజీవమైన పాత్ర నిర్వహించాలి. సాహిత్యాన్ని ప్రజలకు అత్యంత సమీపానికి తీసుకు పోవాలి. అంటే సమస్యలని ఆవిష్కరించటానికే పరిమితం కాకుండా పరిష్కారాల వైపుకు కూడా పోవాలనే సూచనను తన కథాసాహిత్యం ద్వారా గుర్తుచేయడమే కథల గురువు కాళీపట్నం రామారావు కథా దృక్పథం.

sreedevi k–కిన్నెర శ్రీదేవి

 

 

 

 

ఊపేసిన కారా కధలు

 

నేను సీరియస్ కధలు చదవడానికి ముందు నుంచే కధల పుస్తకాలు సేకరించి పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. అలా సేకరించి పెట్టిన పుస్తకాల్లో “యజ్ఞంతో తొమ్మిది” పుస్తకం కూడా ఒకటి. పేపర్లలో, వీక్లీల్లో జరిగే చర్చను బట్టీ, బాగా వొచ్చిన సమీక్షల్ని బట్టీ పుస్తకాలు సేకరించేవాడిని. ఆ రోజుల్లో బాగా చర్చ జరిగిన పుస్తకాలలో ఇదీ ఒకటి కావడంతో నా దగ్గరకు చేరిందా పుస్తకం.

ఏదైనా మంచి పుస్తకం అని తెలిసి కొన్న వెంటనే చదవడానికి ప్రయత్నం చేసేవాడిని. మొదటిసారి అర్ధమయీ కానట్టుండేది. తరువాత్తరువాత మళ్ళీ పట్టుపట్టి చదివినపుడు కొంత కొంత అర్ధమయ్యేది. అర్ధమయ్యేకొద్దీ పాత్రలు నా చుట్టూ ఉన్నట్టనిపించేవి. జీవితం సంక్లిష్టంగా ఉన్నదశలో, పేదరికం మనుషుల్ని కసాయి వాళ్ళుగా చేసే రోజుల్లో, వివక్ష రాక్షసంగా రాజ్యమేలుతున్నపుడు ఈ కధల్ని చదివి ఊగిపోయాను.

కధల్లో పాత్రలు ఎంతో సజీవంగా ఉండేవి. నా చుట్టూ జరుగుతున్న జీవితం కధల రూపంలోకి వచ్చినట్లనిపించేది. పాత్రల మధ్య ఘర్షణ మనసును పిండేసేది. నా చుట్టూ జనాలకి జరుగుతున్నది, నాకు జరుగుతున్నది కధల రూపంలోకి వొచ్చినట్లనిపించేది. ప్రతి కధా చదివిన తరువాత గాఢమైన అనుభూతి కలిగేది. అర్ధంగాని విషయాలేవో అర్ధమవుతున్నట్టుగా అనిపించేది.

‘యజ్ఞం’ కధ మీద చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. కాబట్టి ఆ కధని ప్రత్యేకంగా చదివేవాడిని. చాలా పెద్ద కధ అయినా పట్టు బట్టి చదివేవాడిని. అయితే అప్పుడు ఆ కధలో అంత తాత్వికత ఉందని కానీ, ఒక్కో పాత్ర ఒక జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించిన వైనాన్నిగానీ, కధ నిండా అంతర్గతంగా రాజకీయాలు చిత్రితమైనవని గానీ తెలియలేదు. కధ ముగింపు మాత్రం సంచలనాత్మకం కావడంతో ఎక్కువగా ఆకర్షించింది. ఈ కధని ఆ రోజుల్లోనే రెండు మూడు సార్లు చదివాను. మొత్తమ్మీద ఈ కధలు చదివినప్పుడు కధలిలా రాయాలి అనేది అర్ధం అయ్యింది. భాషను ఈ విధంగా ఉపయోగించవచ్చు అని తెలిసింది. అక్కడక్కడ ఒకటీ అరా కధలు చదివిన దానికంటే కూడా ‘యజ్ఞంతో తొమ్మిది కధలు’ చాలా దగ్గరగా అనిపించిన కధలు. ఈ కధల ప్రభావం నా మీద ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది.

మొదట కధలు రాసేటప్పుడు పేరున్న కధల్ని అనుకరించడం సహజంగా జరిగేదే. అలాగా నేను యజ్ఞం కధని అనుకరించి కధ రాయడానికి ప్రయత్నించాను. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒకమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అయితే పేదరికమొక శాపమైతే ఆ అమ్మాయికి అందం కూడా మరొక శాపమౌతుంది. అందువల్ల ఎంతో క్షోభ అనుభవిస్తుంది. ఎంతోమంది చేత హింసింపబడుతుంది. బలాత్కరించబడుతుంది. కట్టుకున్న భర్త అసహ్యించుకుంటాడు. ఆమె కూడా చనిపోవాలనే అనుకుంటుంది కానీ తనకొక కూతురు పుట్టడం వల్ల ఆ పిల్ల గురించి ఆలోచిస్తుంది. తరువాత తన కూతుర్ని గురించి ఆలోచిస్తే తాననుభవించిన హింస తన కూతురు కూడా అనుభవిస్తుంది కదా! అచ్చం తన పోలికలతోనే పుట్టిన ఆ పిల్ల పెరిగి పెద్దయి తనలాగే కష్టాలు అనుభవించగూడదని ఆ పిల్ల గొంతులో వడ్లగింజ వేసి చంపేస్తుంది. ఇలా యజ్ఞం కధని అనుకరించి కధ రాశాను. ఆ కధ ముగింపులాంటి ముగింపు ఇవ్వడానికొక కధ రాశానంటే ఆ కధ ప్రభావం నా మీద ఎంత ఉందో అర్ధమవుతుంది. హింస, నో రూమ్, ఆర్తి కధలు కూడా బాగా గుర్తుండిపోయిన కధలు. ఎందుకంటే పల్లెటూరి జీవితం, పేదరికం, అమాయకత్వం, దోపిడీ, కుటుంబ హింస, నిరక్షరాస్యత, అజ్ఞానం ఎంత దుర్భరంగా ఉండేవో చూసేవాడిని. కాబట్టి ఆ జీవితమే కధల్లో చదవడం వల్ల అర్ధమయీ కానట్టుండే జీవితం మరింత అర్ధం కాసాగింది.

భాష కూడా బాగా ఆకర్షించింది. ఉత్తరాంధ్ర మాండలికమైనప్పటికీ కారా మాష్టారు ఆ రోజుల్లోనే భాషను సరళం చేశారనిపిస్తుంది. ఎందుకంటే అస్తిత్వం పేరుతో, అర్ధంకాని మాండలికంతో రాసిన తెలంగాణా కధలెన్నో చదవలేక, చదివినా అర్ధం కాక ప్రక్క పెట్టేవాడిని. సంక్లిష్టం కాని మాండలీకం కావడం వల్ల కధలు చదవడానికి, అర్ధం చేసుకోవడానికి సులువయ్యేది. కధల శైలి, అతికిపోయినట్టుండే శిల్పం, జీవితాన్ని యధాతధంగా చిత్రించిన తీరూ ఖచ్చితంగా నేను కధలు రాయడానికి ఎంతో దోహదం చేశాయి. ప్రకాశం జిల్లా మాండలికం ఉపయోగించి కధలు రాయడానికి ‘యజ్ఞం’ కధ నాకు ప్రేరణ అయ్యింది.

DVR_7884–మంచికంటి వెంకటేశ్వర రెడ్డి

జీవితానుభవాలే కథలు

కథలు ఎలా రాయాలి అనే ప్రశ్నకు కారా గారి కథల నుండి సమాధానం

 

ఒజ్జ పంక్తి

photo(2)జీవితానుభవం నుండి జాలువారే సృజనానుభవం కథగా రూపుదిద్దుకుంటుంది. కవి కూడా ఋషిలాగా క్రాంతదర్శనం చేసి, సమాజంలో రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించి, వాటిని కథలలో పొందుపరుస్తాడు. మార్పు వలన కలిగే కష్టనష్టాలపై ముందుగానే హెచ్చరించే  ‘సాహితీ పోలీస్’  రచయిత . ఈ లక్షణాలన్నీ కారా మాస్టారి కథలకు వర్తిస్తుంది. తెలుగు కథకు మారుపేరైన ‘యజ్ఞం’  కథ నుండి ఆయన కలం నుండి రూపుదిద్దుకున్న ప్రతి కథలోనూ, సమాజంలోని భిన్న పార్శ్వాలను ‘మల్టీవిటమిన్ టాబ్లెట్’ లాగా పఠితలకు అందించారు. రంగురాయిలా కనబడే కథావస్తువును ‘కారా’ తన శిల్పనైపుణ్యంతో పాలిష్ చేసిన రత్నంలాగా మలచి కథాత్మకంగా తయారుచేశారు .

చిన్నతనంలో గుంట ఓనమాలు దిద్దుతూ అక్షరాలను నేర్చుకుంటాము. అలాగే కథలు రాయాలనుకునే వారికి ‘కారా మాస్టారి’ కథలు గుంట ఓనమాలుగా  ఉపయోగపడతాయి. కమండలంలో  సాగరాన్ని బంధించినట్లుగా పెద్ద నవలలు చేయలేని పనిని ‘ సామాజికస్పృహ’  కలిగిన కారా కథలు/ కథానికలు  చేశాయి. పదాడంబరం లేని శైలితో , దిగువ , మధ్య తరగతి సమస్యల నేపధ్యంగా రాసిన కారా కథలు సమాజంపై బులెట్ల  లాగా పేలాయి. రచయితలను, పఠితలను ఆలోచింప చేశాయి. అనుసరించేటట్లు చేశాయి. వర్థమాన రచయితలకు నిఘంటువుగా నిలిచాయి. రాస్తే కథానికలే రాయాలి అన్నంత స్ఫూర్తిని నింపాయి.

స్వచ్ఛత, స్వేచ్ఛ, నిరాడంబరత, భవిష్యత్ దర్శనం అనేవి కారా కథల ప్రత్యేకత. ఈనాటి సమాజ స్వరూపాన్ని 50 సంవత్సరాల ముందే  ‘టైం మిషన్’ లో చూపినట్లుగా ఆయన కథలలో మనకి చూపించారు.  కాళీపట్నం రామారావు మాస్టారు ఒక ప్రాంతానికి, వర్గానికి, భావజాలానికి ప్రతినిధి అయ్యి కూడా కలంలో బలం, నిబద్ధత, నిమగ్నతలతో ఆయన చేసిన సాహితీసేవ ‘కేంద్ర సాహితీ అకాడమీ  పురస్కారాన్ని’  పొందేట్లు చేసింది. సమాజం పట్ల రచయితలకు గల గురుతర బాధ్యతలను తెలుసుకొని ,  ‘కారా‘  కథలను ఒజ్జ పంక్తిగా  చేసుకొని కలం పట్టే రచయితలు స్వాతి ముత్యం లాంటి అచ్చ తెలుగు కథా సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకోగలుగుతారు.

డా. నీరజ అమరవాది .

 

 

కారా కధల్లో మానవ సంబంధాల జీవధార

KaRa-Bangalore

కథాసాహితి ప్రచురించిన కథా -94 ఆవిష్కరణ సభావేదిక (బెంగుళూరు ) పై వాసిరెడ్డి నవీన్, కాళీపట్నం రామారావు, ఎన్.వేణుగోపాల్, పాపినేని శివసంకర్, ఓల్గా, కె.శివారెడ్డి ( ఈ ఫోటో ఆంధ్రప్రభ లో అచ్చయింది)

 భాష ఎంత పురాతనమయిందో కధా ప్రక్రియ కూడా అంత పురాతనమయినదయి ఉంటుందని చేకూరి రామారావు ఊహించారు. భాషలోనే కధన ప్రక్రియను సాధ్యం చేసే నిర్మాణాంశాలు ఉండటం ఇందుకు కారణమని ఆయన అన్నారు. (కధా యజ్ఞం, 1982, పే.1)

భాషకూ కధకూ ఉన్న ఉమ్మడి పునాదిని మానవ సంబంధాల వైపు నుంచి కూడా చెప్పవచ్చును. మానవ సమాజం మనుగడకు అత్యవసరమైనది సామాజిక ఉత్పత్తి క్రమం. దీని కోసం మనుషులు కలుసుకోవలసి వస్తుంది. ఉమ్మడి కార్యాచరణలో పాల్గొనవలసి వస్తుంది. ఈ అవసరం వల్ల మనుషుల మధ్య ఏర్పడే సంబంధాలను మౌలికంగా ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఈ ఉత్పత్తి సంబంధాలు సామాజిక పరిణామ క్రమంలో అనేక రకాల మానవ సంబంధాలుగా ప్రతిఫలనం పొందుతాయి. ఆధునిక సమాజంలో భౌతిక వస్తూత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేనట్టు కనబడే మనుషులు ఉండవచ్చు గాని వాళ్ళ మధ్య సంబంధాలకు కూడా సమాజంలోని ఉత్పత్తి సంబంధాలే మూలంగా ఉంటాయి.

ఇటువంటి వివిధ రకాల మానవ సంబంధాలకు భాష ఒక అవసరం, ప్రాతిపాదిక కూడా. ఈ మానవ సంబంధాలను, ఉత్పత్తి క్రమంలో సహజంగా ఏర్పడిన మానవ సంబంధాలను వర్గ సమాజంలోని అనేక అంశాలు వక్రీకరించాయి. వాటి చుట్టూ అనేక మాయలు అల్లాయి. అందువల్ల ఇవాళ మానవ సంబంధాలు సహజంగా, స్వచ్ఛంగా, మానవుల మధ్య సంబంధాలుగా లేవు. రక్తాల మధ్య, వంశాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, డబ్బు మధ్య, సరుకుల మధ్య సంబంధాలుగా మానవ సంబంధాలు కనబడుతున్నాయి.

ఇలా అనేక రూపాలలో, అనేక ఆచ్ఛాదనలతో వ్యక్తమవుతున్న మానవ సంబంధాలను మనుషులు తప్పనిసరిగా తమ చైతన్యంలో ప్రతిఫలిస్తుంటారు. అదే సృజనాత్మక రూపాలలోకి వస్తుంది. కధ ఈ పనినే అద్భుతంగా నిర్వహిస్తుంది. తద్వారా అది ఉనికిలో ఉన్న మానవ సంబంధాల నివేదికగా, విశ్లేషణగా, రానున్న మానవ సంబంధాల వైతాళికురాలుగా నిలుస్తుంది. ఈ అర్ధంలో కధన ప్రక్రియను మానవ సంబంధాల ప్రతిఫలనంగానూ , అవసరంగానూ గుర్తించవచ్చును.

ఐతే మానవ సంబంధాలే వికృతంగా ఉన్నప్పుడూ కధ చిత్రించ వలసిందేమిటి?ఇక్కడనే ప్రక్రియగా కధ నిర్వహించే పాత్ర కన్నా, వ్యాఖ్యాతగా కధకుడు నిర్వహించే పాత్ర ముఖ్యమయినదవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం పరిశీలనా శక్తి ఉన్న కధకుడయినా సమాజంలో ఉన్న కుళ్ళును గుర్తించగలడు, దాన్ని కధలో చిత్రించగలడు. ఇవాళ తెలుగులో వస్తున్న క్షుద్ర సాహిత్యం కూడా తెలుగు సమాజంలోని విలువల పతనానికి ఒకానొక చిత్రణే. ఇక్కడ కధకుడి సామాజిక బాధ్యత రంగం మీదికి వస్తుంది. కధకునిలో పరిశీలనాశక్తి తో పాటే సమాజానికి అర్ధమూ, లక్ష్యమూ తెలిసి ఉంటే ఈ విలువల పఠనం ఎందుకు ఉన్నదో చెప్పగలడు. దాన్నే చిత్రించినా దాని పట్ల అసహ్యం కలిగేలా, దాన్ని కూలదోసే ఆచరణకు పూనుకునేలా చిత్రించగలడు.

కధకుడి పాత్ర ఇంకా ప్రస్ఫుటంగా కనబడే అంశం మానవ సంబంధాల పరిశీలనలో సమగ్రత. ఏ కధకుడయినా మానవ సంబంధాలనే చిత్రించక తప్పదు. మామూలు కధకులయితే ఏదో ఒక కోణాన్ని మాత్రం అర్ధం చేసుకుని ఆ కోణాన్ని పూర్తిగానో, సగమో చిత్రిస్తారు. ఐతే కధా ప్రక్రియ కేవలం మానవ సంబంధాన్నీ ప్రతిబింబించేది మాత్రమే కాదు. అది మానవ సంబంధాలపై గాఢమైన ప్రభావం వేయగలదు కూడా.

ఈ అంశం గుర్తించాలంటే రచయిత సమాజ సారాంశాన్ని, మానవ సంబంధాల చరిత్రను అర్ధం చేసుకొని ఉండాలి. మానవ సంబంధాల గతాన్నీ, వర్తమానాన్నీ, అవగాహన చేసుకుని భవిష్యత్తును వాస్తవికంగా ఊహించగలగాలి. అంటే మానవ సంబంధాల ఏ ఒక్క కోణాన్నో కాక సమస్తాన్ని అవగాహన చేసుకుని చారిత్రక దృక్పధంతో సాన పెట్టుకోవాలి. సామాజిక పరిణామంలోని గతితర్కం మానవ సంబంధాల అభివృద్ధిలో ఎట్లా ప్రతిబింబిస్తుందో గుర్తించగలగాలి.

కాళీపట్నం రామారావు కధలన్నీ ఒకే వరుసలో చదివినప్పుడు మానవ సంబంధాల పట్ల ఆయనకు గల సమగ్ర దృష్టీ, అది పరిణమిస్తూ, పరిణితి చెందుతూ వచ్చిన క్రమమూ, ఆశ్చర్యాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తాయి. (మాష్టారిని స్వయంగా ఎరిగిన వాళ్ళు ఆయనకు అంత మార్క్సిజం తెలియదని చెప్పబోతారు గనుక ఒక వివరణ ఇవ్వాలి. సామాజిక జీవితాన్ని సమగ్రంగా, నిశితంగా పరిశీలించి కనిపెట్టిన సారమే మార్క్సిజం. మౌలికంగా మార్క్సిష్టు పరిజ్ఞానం ఉండిగానీ, కనీసం మార్క్సిష్టు పద్దతి ఉండి కానీ సమాజాన్ని నిశితంగా పరిశీలించ గలవాళ్ళు ఎంత సమగ్రత తో పరిశీలిస్తే అంత ఎక్కువగా సిద్ధాంతానికి దగ్గర కాగలరు. మాష్టారు తన కధల్ని “మార్క్సిస్టు వాసనలు పరోక్షంగా కూడా లేకుండా” రాశారని ఎవరయినా చెప్పబోయినా అది మాష్టారి పరిశీలనా శక్తికీ, మార్క్సిజపు వాస్తవికతకూ తిరుగు లేని నిదర్శనమే అవుతుంది. కానీ “జీవితానికి మార్క్సిజం అవసరం లేద”నే వాదనకు పునాది కాదు)

కారా కధలన్నీ కూడా మానవ సంబంధాల చిత్రణలే. కధా ప్రక్రియ కోసం ఒక్కొక్క కధలో ఒక్కొక్క సంబంధాన్నో, ఒక్కొక్క క్రమాన్నో చిత్రించవచ్చుగాని అక్కడ ఆయనకు ఆయా సంబంధాల గురించి, క్రమాల గురించి సమగ్రమైన అవగాహన ఉన్నదని స్పష్టంగా తెలిసిపోతుంది. అట్లాగే, చాలా సార్లు అమాయకంగా కనబడే ఆ చిత్రణ చాలా పటిష్టంగా పాఠకుణ్ణి ఒక ఉన్నత మానవ సంబంధం వేపు నడిపించే నిర్మాణాత్మక ప్రయత్నంగా ఉంటుంది.

ఇప్పుడు సంకలనంగా వచ్చిన ఆయన కధలు మొత్తం 25, ఈ కధలను వేరువేరు ప్రాతిపదికల మీద గతంలో విమర్శకులు మూడు భాగాలుగానో, రెండు భాగాలుగానో విభజించారు. కానీ ఈ కధలన్నీ మానవ సంబంధాల చిత్రణలనే ప్రాతిపదిక మీద చూసినప్పుడు వాటన్నిటిలోనూ ప్రవహించే అవిచ్ఛిన్న జీవధార కనబడుతుంది. ఐతే మానవ సంబంధాలకు సంబంధించిన ఉద్వేగాల కోణాల్ని చిత్రించడానికి తొలి కధలు పరిమితమైతే, మానవ సంబంధాల పునాదిని, కొంతవరకు ప్రత్యక్షంగా ఉత్పత్తి సంబంధాల్ని తర్వాతి కధలు చిత్రించాయి. బహుశా ఈ కారణం వల్లనే తొలి కధలు ఉన్నత వర్గాల వాతావరణంలో మాత్రమే సాగగా, తర్వాతి కధల వాతావరణం విస్తృతమయింది.

మానవ సంబంధాల వ్యక్తీకరణలో కారా మొట్ట మొదట ఎక్కువగా చిత్రించినది కుటుంబాలలో కొనసాగుతున్న అప్రజాస్వామికత, ముఖ్యంగా ఆయన తన దృష్టిని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద కేంద్రీకరించారు.

కుటుంబం అనే సామాజిక, ఆర్ధిక యూనిట్టు ఎట్లా ఉనికిలోకి వచ్చిందీ, దాని భవిష్యత్తు ఏమిటి అనే చర్చ అలా ఉంచి ఇవాళ కనబడుతున్న కుటుంబ రూపాల్ని పరిశీలించడమే కారా కధలు చేసిన పని. కుటుంబం ప్రధానంగా అంతరాల వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ఈ అంతరాలు కరుడు గట్టిపోయి ఉంటాయి. ప్రాధమిక యూనిట్ నుంచే అంతరాల వ్యవస్థ నెలకొనడం తనకు అవసరం గనుకు రాజ్యం ఈ అంతరాల వ్యవస్థను పెంచి పోషిస్తుంది. ఈ కఠినమైన అంతరాల వ్యవస్థలో ధిక్కారస్వరానికి అవకాశం లేదు. సాంప్రదాయంలో ఇమడని ఆలోచనకు, ఆచరణకు స్థానం లేదు. ఒక అంశం పరిష్కరించవలసి వచ్చినప్పుడు కూలంకషమైన పరిశీలన, చర్చ వేరువేరు అవకాశాల ప్రతిపాదనలు, సమగ్రమైన అవగాహనతో పరిష్కారం అనేది సరైన పద్ధతి. కానీ అంతరాల వ్యవస్థలో ఈ క్రమానికి బదులు కుటుంబ ‘యజమాని’ శాసనమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ పరిష్కారం మంచిదైనా, చెడుదైనా అసలు దాని క్రమం చాలా నిరంకుశమైనది.

ఈ అంతరాల వ్యవస్థ ఎంత నిరంకుశమైనదయినా, బాధాకరమయినదయినా వర్గసమాజం కొనసాగినంత కాలం అది కొనసాగుతుంది. భూస్వామ్యంలో బలమైన కుటుంబ వ్యవస్థతో అది కలగలిసి ఉంటుంది. ఒక తాతో, పెదనాన్నో, మామో కుటుంబానికంతటికీ శాసనకర్తగా ఉంటాడు. ఆయనే నిర్వాహకుడూ, తీర్పరీ కూడా. ఆధునిక రాజ్యాలు విడగొట్టిన మూడు అధికారాలు ఇంటికి సంబంధించి నంతవరకు ఆయన తన గుప్పిట్లోనే పెట్టుకుంటాడు. దుస్సహమైన ఈ స్థితి దుర్మార్గమైనది. ఈ స్థితి అనుభవించవలసి వచ్చిన వాళ్ళు తీవ్రమైన వేదనకు లోనవుతారు. ఈ స్థితిలో సమస్యలు పరిష్కారాలు అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా జరుగుతాయి. ఈ స్థితికి గల వేరువేరు ముఖాలను ‘పెంపకపు మమకారం’ ‘రాగమయి’ ‘అభిమానాలు’ ‘అశిక్ష- అవిద్య’ ‘తీర్పు’ ‘ఇల్లు’ కధల్లో కారా చిత్రించారు.

ఉమ్మడి కుటుంబంలో మమకారం కూడా ఎట్లా సూటిగాకాక వక్రరూపాల్లో ప్రకటితమవుతుందో ‘పెంపకపు మమకారం’ లో చిత్రణ పొందింది. అందువల్లనే చర్చ ద్వారా పరిష్కరించదగిన అతి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారిపోతుంది. ఐతే ఆ సమస్య జటిలం అవుతున్న కొద్దీ కుటుంబంలోని అప్రజాస్వామికత వల్ల పరిష్కారం అప్రజాస్వామికంగానే జరుగుతుంది. నిజానికి అప్పుడు పరిష్కారపు మంచి, చెడులుగాక అది అమలయిన తీరు గురించి ఆలోచించవలసి వస్తుంది. వచ్చిన సమస్యను చర్చ ద్వారా, వస్యంగా ప్రజాస్వామికంగా పరిష్కరించి ఉంటే ఆ స్థితిని అనుభవించిన వ్యక్తులందరి వేదనా సమసిపోయేది.

మధ్య తరగతిలో అంతరాల వ్యవస్థతో ఒక కుహనా ప్రతిష్ట కూడ కొనసాగుతుంది. సామాజిక స్థితికీ, ఈ కుహనా పటిష్ఠకూ ఉన్న విభేధంవల్ల ఆ కుటుంబమంతా తీవ్రమైన ఘర్షణలకు లోను కావలసి వస్తుంది. ఈ ఘర్షణలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోగల వాతావరణం లేనప్పుడు నిష్టూరాలు, నిందలూ, అకారణ కోపాలు, అనవసరమైన ఆదేశాలు రంగం మీదికి వస్తాయి. ఈ స్థితిని చిత్రించింది ‘రాగమయి’. గ్రామీణ వ్యవస్థలోని మంచితనం, పరోపకారత వంటి విలువలు ఉన్నప్పటికీ ఈ స్థితి ఇట్లా కొనసాగఊక తప్పదని ‘రాగమయి’ చూపుతుంది.

ఒక వైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూలి పోతూ, ప్రజాస్వామిక మానవ సమాజ యూనిట్ ఏర్పడని సంది దిశలో వచ్చే విలువల పతనాన్ని ‘అబిమానాలు’ పట్టుకుంటుంది. కొత్త, పాత విలువల మధ్య ఘర్షణ వల్ల, సమన్వయం కుదరక పోవడం వల్ల కుటుంబ వాతావరణంలో అనవసర వైరుధ్యాలే ఎంత ప్రధానంగా కనబడి, ఎంత వేదనకు కారణమవుతాయో ‘అభిమానాలు’ వివరిస్తుంది.

2013-06-16-158

‘అభిమానాలు’ నుండి ఇంకా ముందుకు వెళ్ళి కారా ‘అశిక్ష – ఆవిద్య’, ‘తీర్పు’, ‘ఇల్లు’ రాశారు. ఇవి మూడూ నిజానికి కాల వ్యవధిలో దూరపు కధలైనా ఒకే వరసలో ఉన్న కధలు.

ఉమ్మడి కుటుంబంలో సమస్యా పరిష్కారాలు జటిలంగా ఉండక తప్పదని వివరించాక, ‘అశిక్ష – ఆవిద్య’ కధ, కారా పరిశీలనా శక్తి అనివార్యమైన ములుపుకు చేరిందని చెబుతూ ముగుస్తుంది.

“లోకగతిలో ఇట్లాంటి సంఘటనలనీ ఒక పెద్ద లెక్కలోకి వచ్చే విషయాలు కాక పోయినా వ్యక్తులను వ్యష్టిగా తీసుకొని చూస్తే కొందరి జీవితాలకు ఎంతో అస్తవ్యస్థములుగా మార్చగలిగే ఇంతటి పెద్ద సంఘటనలు కొన్ని కొన్ని కుటుంబాలలో అప్పుడప్పుడూ జరుగుతుండటానికి అసలు మూల కారణాలు – వాటి కుదుళ్ళు – ఏమిటి? ఎక్కడ ఉన్నవి?

“ఈ రెండే అతడు ఎన్నడూ పరిశీలించని విషయాలు – లేక పరిశీలించాలనే స్ఫురణకు గురికాని విషయాలు!” అంటూ ‘అశిక్ష – ఆవిద్య’ ముగుస్తుంది. మనుషుల మధ్య సంబంధాలలో తీవ్రమైన మార్పులు కలిగిస్తున్న మూల కారణాలను- వాటి కుదుళ్ళను – కనిపెట్టాలనే స్ఫురణే లేకుండా చేసింది కుటుంబ వ్యవస్థ. ఆ మత్తు నుంచి తేరుకుని ఆ పరిశీలనకు పూనుకుంటే అద్భుతాలు జరుగుతాయి, సమాజ సారాంశం అవగాహనలోకి వస్తుంది. ఈ కధ తర్వాత తొమ్మిది సంవత్సరాలు పాటు కారా కధలు రాయటం మానేశారు. ఈ రెండు ప్రశ్నలకు ఆయన జవాబులు కనిపెట్టారని తర్వాతి కధలు రుజువు చేస్తాయి. ఐతే ఆయన అంతకుముందు కూడ నిశితమైన, సమగ్రమైన పరిశీలనతో కధలు రాశారు గనుక ధార తెగిపోలేదు. మరీ ముఖ్యంగా సరాసరిగా మూలాలలోకి వెళ్ళేముందు కుటుంబ సంబంధాలలోని మరో రెండు అంశాల్ని ఆయన వివరించవలసి ఉంది. అట్లా వచ్చినవే ‘తీర్పు’, ‘ఇల్లు’.

తీర్పు కధలో సుంద రామయ్య పిల్లల మధ్య వచ్చిన సమస్యను తనకు తోచిన రీతిలో ప్రజాస్వామికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కాని తీర్పు సాధ్యం కాదు. ఎందువల్లనంటే ప్రజాస్వామిక తీర్పు ఒకానొక వ్యక్తిగత, మానసిక చర్య కాదు. అది ఒక ప్రత్యేక సామాజిక, చారిత్రిక నేపధ్యంలో తప్ప కుదరదు. ఇంట్లో అసమానతల చట్రాన్ని యధాతధంగా ఉంచాక ప్రజాస్వామిక తీర్పు సాధ్యం కాదు. అందుకే చాల రకాల తీర్పులు ఏకకాలంలో న్యాయంగానూ, అన్యాయంగానూ కూడా కనబడతాయి. అంతే అంతరాల వ్యవస్థ ఉన్నంత కాలం న్యాయాన్యాయాల నిర్వచనాలు వేరువేరుగానే ఉంటాయి. ప్రజాస్వామిక తీర్పు ఎప్పుడు సాధ్యమవుతుందో గుర్తించకపోతే, ఎంత చిత్త శుద్ధితో చేసినా ఆ తీర్పు నిష్పలమే అవుతుంది.

మధ్య తరగతి కుటుంబాల గురించి, ఆ కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సంబంధాల గురించి పరిశీలనలో గుర్తించవలసిన అంశం భరోసా కోసం వెతుకులాట. కూలి పోతున్న కుటుంబ వ్యవస్థలో ఈ భరోసా కోసం వెతుకులాట ప్రస్ఫుటమవుతుంది. “నేను ఎప్పుడేది చేసినా వాడి మేలుకోరి ఏదీ చేయలేదు. వాడికి చెప్పే నీతులు వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాక నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెప్పేను. వాడికి చెప్పించిన చదువంతా నా కోసమే చెప్పించుకున్నాను …..” అని పావనరామయ్య బహిరంగంగా చెప్పిన విషయం, అనేక తరాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదే. ఐతే ఇప్పుడు, కుటుంబం కూలిపోతున్న దశలో భరోసా నిలిచేది పిల్లలా ఆస్తియా,(ఇల్లా) అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్ననే ‘ఇల్లు’ ప్రతిబింబించింది.

మానవ సంబంధాలు ఇన్ని వేల ఏళ్ళ తర్వాత కొని ఉదాత్తభావనల్ని ఏర్పరచుకున్నాయి. సమాజం వాటిని సాధించవలసిన ఆదర్శాలుగా, ఆహ్లాదకరమైన అంశాలుగా గుర్తిస్తోంది. న్యాయం, మానవతాస్పర్శ, ప్రేమ, స్నేహం, ఆనందం, శాంతి వంటి విలువలు ఇవి. అట్లాగే సమాజం ఈ విలులను నిలబెట్టే క్రమంలో హింసను అధికారాన్ని, భయాన్ని, కుట్రను, శతృత్వాన్ని తోసివేయదలచుకున్నది.

ఇవన్నీ మానవసంబంధాల వ్యక్తీకరణలే. ఇవి వర్గ సమాజంలో ఏ అర్ధాల్ని సంతరించుకుంటాయో, ఎవరెవరు వీటికి ఏ ఏ నిర్వచనాలు ఇచ్చి తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారో ‘వీరుడు – మహా వీరుడు’ నుంచి ‘కుట్ర’ వరకు కధలు వివరిస్తాయి.

ఈ కధలలో ప్రధానంగా చర్చించవసినవి ‘హింస’, ‘నో రూమ్’, ‘స్నేహం’ . మిగిలిన కధలన్నిటినీ కూడా అర్ధం చేసుకోవడానికి తగిన విశ్లేషణా సాధనాలను ఈ కధల నుంచి కనిపెట్టవచ్చును. అందుకే ఇక్కడ వీటిని మాత్రమే చర్చించడం జరుగుతున్నది. ఈ మూడు కధలకు కూడ శీర్షికలే వివరమైన ఆలోచనలను ప్రేరేపించగలవి.

‘హింస’ కధలో ముఖ్యమైన పాత్రలు రెండు – దారుణమైన జీవితానుభవాలు పొందిన పైడమ్మ, ఆ దారుణాలన్నీ ఒకే ఒక్క రోజు స్ఫురణకు వచ్చిన సంగి, పైడమ్మ చెల్లెలు. పైడమ్మ పెళ్ళయి కష్టాల కాపురానికి వెళ్ళింది. అత్తవారింట్లో కూలికి వెళ్ళి అక్కడ ఆ భ్రమలకో, ఏ బలవంతాలాకో లొంగిపోయింది. ఆమె “రంకు” ఒక్కటే బయట పడి చావు దెబ్బలు తింది. అక్కడ్నించి పారిపోయి ఒంటరి స్త్రీ అనుభవించే బాధలనీ అనుభవించి చివరికి విశాఖపట్నంలో సబ్బారపు సంజీవమ్మ కంపెనీకి చేరింది. ఒక్క రోజు కోసం తల్లిని చూడడానికొచ్చి అవహేళనలను ఎదుర్కొంది. తల్లి దగ్గర ఆశ్రయం దొరకదని తెలుసుకుంది. ఈ అవహేళనలూ, అవమాణాలూ మరింత సూటిగా సంగి చెవిన పడ్డాయి. కుటుంబాన్ని ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆనందమూ, ఆప్యాయతా లేకుండానే పైడమ్మ వెళ్ళి పోయింది. ఆ దుఃఖంలో చిట్టడివికి వెళ్ళిన సంగి నక్కలు పొట్టన పెట్టుకున్న మేకపిల్లను చూసింది. ఆ అమ్మాయికి నక్కల పని చెప్పాలన్నంత ఆవేశం రగిలింది.

ఇవాళ సమాజంలో భౌతిక హింసను మాత్రమే హింసగా గుర్తిస్తున్నాం. రక్తం కారడమే, గాయంకావడమే, నక్కలు మేకను చంపివేయడమే హింసగా గుర్తిస్తున్నాం. నిజానికి సంగి అనుభవించిన వేళాకోళంలోనే హింస ఉంది. జగ్గమ్మ, పైడమ్మ, సంగిల ఆశలు, వాళ్ళ మధ్య ఆప్యాయతలు బలవంతాన తుంచివేయడంలో హింస ఉంది. ప్రేమ చంపుకోవలసి రావడంలో హింస ఉంది. ఒక తల్లికీ తన బిడ్డను తన ఒడిలోకి తీసుకునే వీలు లేక పోవడంలో హింస ఉంది. కన్నీళ్ళలో హింస ఉంది. గుండె గాయంలో హింస ఉంది. పేదరికంలో హింస ఉంది. అసలు వర్గ సమాజం కొనసాగుతుండడమే ఒక హింస. వర్గ సమాజంలో ఒక అంతర్గత హింస. భౌతిక హింసను మించిన స్థాయిలో , విస్తృతిలో వేరు వేరు రూపాలలో జరుగుతూ ఉంటుంది. ఐతే వర్గ సమాజం ఉద్దేశ్యపూర్వకంగానే ఆ అన్ని హింసరూపాలకూ అందమైన, మోసగించే పేర్లు పెడుతుంది. ఆ పేర్లతో అవి ఎదురయినపుడు మన, వాటిని హింసగానూ గుర్తించలేం. వాటిని రద్దు చేయడానికి అవసరమైన ప్రతిస్పందననూ పొందలేం.

ఈ అంతర్గత హింసను ‘హింస’ కధ ప్రతిభావంతంగా చిత్రిస్తుంది. జీవితక్రమం మొత్తంలోనూ హింస వ్యాపించి ఉన్నదని ఈ కధ మన దృష్టికి తెస్తుంది. విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్న హింసకు మనుషులు మామూలు ప్రతిస్పందనలు ఎట్లా ఉంటున్నాయో కూడా కధ వివరిస్తుంది. దాసు, అతని బృందం చేసిన హింస సంగికి హింసగా కనబడలేదు. గనుక వాళ్ళతో ఆ అమ్మాయి మర్యాదగానే వ్యవహరించింది. “కంసాలోడిననడవెందుకూ…. మన బంగారం మంచిదైతే ఆడేం సెయ్యగలడూ…. “ అంటాడు చిన్నాయన తప్పు హింసకు గురయిన వాళ్ళదేనన్నట్లు. “యెనకా గోయ్యే, ముందూ గోయ్యే…. ఇది పరిక్కంప మీద పట్టుకోక అప్పా! తీసినా దక్కదు తియ్యకున్నా దక్కదు” అని నిస్సహాయతను ప్రకటిస్తుంది పెద్దమ్మ. అంతర్గత హింసకు మనం స్పందించే పద్దతులలో ఇవి కొన్ని. ఈ హింస వాళ్ళకు అర్ధం కాలేదు. ఎక్కడో ఒక చోట అది హింస అని అర్ధమయినా దాన్ని కూల్చే మార్ధమేమిటో తెలియదు. ఈ సంగతులేమీ స్పష్టంగా అర్ధాంకాని సంగికి మాత్రం తల్లి ఆశను కోసేసుకోవడానికి చాలా బాధపడుతోందని తెలిసింది. ఇట్లా నిరాయుధ హింస గురించి ఏ కొంచెమో అర్ధమైన సంగి చెలకలో దౌర్జన్యాన్ని, భౌతిక హింసనూ చూసింది. అక్కడ ఆమె వెంటనే నక్కల మీదికి కొడవలెత్తింది. సంగి ఆలోచనల్లోనూ, ఆచరణలోను ఇది గుణాత్మక మార్పు. కానీ చాలా మంది కధకులలోలాగా ఇక్కడ దానికి నాటకీయత లేదు. అది చాలా సహజంగా, అనివార్యంగా సంభవించింది.

ఈ గుణాత్మక మార్పే సమాజమంతా వచ్చే క్రమం మొదలయితే సమాజంలో మానవతా స్పర్శ, ప్రేమ, స్నేహం, స్వచ్చమైన ఆనందం నెలకొనే కృషి ప్రారంభమవుతుంది. అప్పటిదాకా వాటికి ఈ సమాజంలో “ నో రూమ్’.

దుర్మార్గం, అనుమానం, దారిద్ర్యం, నిండిన ఈ సమాజంలో మానవతా స్పర్శకు, ప్రేమకు, స్నేహానికి, స్వచ్చమైన ఆనందానికి స్థానం లేదని లాడ్జి గుమస్తా నుంచి, గాంధీ, నెహ్రూలను దేవుళ్ళుగా కొలిచే నూకరాజు వరకు ప్రతిఒక్కరూ మనకు తమ చేతలతో చూపుతారు. అంతంత మాత్రం శుభ్రమైన లాడ్జింగ్ లోనైనా అమ్మడుతో ఒక్క రాత్రి ఏకాంతంగా గడపాలని నూకరాజు కోరిక. నగర సంస్కృతి వాళ్ళకా అవకాశం లేదంటుంది. ఇదివరకెప్పుడో ఇటువంటి ఆనందం కోసమే తపించి నిరాశ చెందిన దేవుడు కొంతసేపయినాకా, ‘ఆ కుర్రదీ కుర్రోడూ ఏమైనారో’ అని ఆలోచిస్తాడు. తాను అప్పాయమ్మ కోరిక తీర్చలేకపోవడం గుర్తొచ్చి ఈ జంటకు సాయ పడదామనుకుంటాడు. ఎక్కడా గది దొరకక విసిగిపోయి ఉన్న నూక రాజుకి, అమ్మడికి ఎదురుపడి ఆప్యాయంగా పలకరించబోతాడు. ఆ పలకరింపునూ, ఆర్ధ్రతను అనుమానించిన నూకరాజు దేవుణ్ణి చితక తంతాడు.

దేవుడు – అప్పాయమ్మ, నూకరాజు –అమ్మడు కోరుకున్నది ఏకాంతం., ఇష్టాపూర్వకమయిన, స్వచ్చమైన ఆనందం. ఒక్క రోజాయినా మరే ఆలోచనా, మరే భయమూ, మరే ఆందోళనా లేకుండా అనుభవించగల ప్రేమ. వాటికి ఈ వ్యవస్థలో స్థానం లేదు. కోర్కె తీరకుండానే చనిపోయిన అప్పాయమ్మను తలచుకుని పేదతనమంత క్రూరమైంది లేదనుకుంటాడు. ఆ క్రౌర్యానికి గురైన జంటను ఆర్ధ్రంగా పలకరిద్దామనుకుంటాడు. స్నేహం చూపుదామనుకుంటాడు. కానీ ఈ వ్యవస్థ ఎటువంటిదంటే ఇక్కడ స్నేహానికీ స్థానం లేదు. స్నేహ హస్తాలు అనుమానించబడతాయి. ఆర్ధ్రమైన పలకరింతకూ, లాభ నష్టాల లెక్కలలోకి ఇమడని స్నేహానికీ ఇక్కడ గౌరవం లేదు. లోకంలో హింస ఎంత విస్తృతమయిందంటే, ఆప్యాయత ఎంత కరవై పోయిందంటే, గాంధీ భక్తుడైన నూకరాజు కూడా తన పట్ల ఆప్యాయత ప్రదర్శించే వాళ్ళు ఉండగలరని ఊహించలేదు. స్నేహానికి హింసతో జవాబు చెప్పకుండా ఉండలేడు.

మరి లోకంలో ఈ ఉదాత్తభావాలు కరవై పోయి ఉన్న స్థితిలో స్నేహామంతా లాభనష్టాల లెక్కలలోకి ఇమడవలసిందేనా? స్నేహామంటే ఏమిటి? అది ఇవాళ ఉన్న రూపం ఏమిటి? ఈ రూపం ఎందువల్ల వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబుల అన్వేషణలో పుట్టిన కధ ‘స్నేహం’.

కొడుకు ఉద్యోగ ప్రయత్నం కోసం, ఎన్నో ఏళ్ళ కింద తెగిపోయిన స్నేహాన్ని, మళ్ళీ గుర్తు చేసుకుంటూ గోపాలరావు దగ్గరికొస్తాడు శివరామయ్య. అప్పటికప్పుడు డబ్బు అవసరం గనుక శివరామయ్యతో స్నేహం నటిస్తాడు రాజారావు. ఉన్నత వర్గంలో కలిసిపోవాలనే తపనతో గోపాలరావుతో స్నేహం చేస్తుంటాడు రాజారావు. గోపాలారావు కూడా శివరామయ్య స్నేహాన్ని తన అవసరం తీరే మార్గంగా వాడుకుంటాడు. పైగా “ఈ లోకంలో ఒకరికొకరు ఏదో అవుతారన్నది ఒట్టి కల్ల…. మనిషి మనిషితో కలిసి తిరుగుతాడంటే … ఎందుకు కలిసి తిరుగుతాడంటే – అవసరం! ఆ అవసరాన్ని బట్టే అన్నితిరుగుళ్ళూ! ఇన్ని తిరుగుళ్ళూ… స్నేహామంటే ఇంతే. అది బాల్యస్నేహమవ్వచ్చు. పడుచు స్నేహమవ్వచ్చు – ఆ స్నేహం, ఈ స్నేహం… ఏ స్నేహమన్నా కానీ – ఏదయినా పేరు తేడాయేగాని సరుకొక్కటే ….” అని సిద్ధాంతం చెబుతాడు.

“మూడు రూపాయల కోసం మూడు పీకలు కోయగల మనుషులున్నారు ఈ లోకంలో. వాళ్ళకీ ఏవో ధీరీలు ఉండే ఉంటాయి. అలాంటప్పుడు మూడు వందల కోసం డాక్టరు ఓ ముండమోపి థియరీ తీసేడంటే వింత కాదనుకొంది మీనాక్షీదేవి.

లోకంలో స్నేహమే లేదంటే ఆమె భావనాలోకంలో బ్రతుక్కి అర్ధమే లేకుండా పోతుంది మరి!

“అవును అదీ ఓ థీరీయే” అంటూ ఈ కధ ముగుస్తుంది.

ఇక్కడ స్నేహాన్ని ఎవరెవరు ఎట్లా చూస్తున్నారు? వర్గ సమాజంలో స్నేహం ఏ ఏ రూపాలలో వ్యక్తమవుతుంది ? లోకంలో స్నేహమనేది ఉందా? ఉన్నదనుకుంటే మరి ఇవాళ అవసరం మాత్రమే పునాదిగా ఉన్నట్లు కనబడుతున్న స్నేహం సంగతేమిటి? లేదనుకుంటే మరి మనిషికీ మనిషికీ మధ్య సంబంధానికి ప్రాతిపదిక ఏమిటి? అవసరమే ప్రాతిపదిక అనేట్టయితే అవసరాలు తీరిపోయిన మనిషికి స్నేహాలు ఉండవా? మనుషుల అవసరాలు తీరిపోయే వర్గరహిత సమాజంలో స్నేహాలుండవా? – ఈ ప్రశ్నలన్నిటికీ వీలు కల్పించి, స్నేహం పట్ల భావనలు ఎంత గందరగోళంగా ఉన్నాయో ఈ కధ మన దృష్టికి తెస్తుంది.

ఈ గందరగోళాన్ని సృష్టించింది వర్గ సమాజమే. వర్గ వైరుధ్యాన్ని చైతన్యంతో గుర్తించి దాన్ని రద్దు చేసే పోరాట                       క్రమంలో ముందుకు సాగుతున్న కొద్దీ ఈ గందరగోళం తగ్గిపోతుంది. రచయిత ఉద్దేశ్యం ఈ గందరగోళాన్ని మాత్రమే ప్రదర్శించి, కొనసాగుతున్న తప్పుడు భావనలకు బలం కలిగించడం కాదు. స్నేహానికి ఇవాళ కనబడుతున్న అర్ధాల, అసందర్భాన్నీ ఆయన వివరిస్తారు. మీనాక్షీదేవికి స్నేహం అవసరం మీద మాత్రమే ఆధారపడనవసరం లేదన్న స్పృహ ఉంది. ఆమె భావనాలోకంలో స్నేహామంటే బతుక్కి అర్ధం. స్నేహాన్ని అవసరంతో సమానం చెయ్యడం ముండమోపి ధియారీగా భావించిన మీనాక్షీదేవి స్నేహాన్ని మరో కొసకు తీసుకుపోయి, వాస్తవాలతో సంబంధం లేకుండా ఊహాలోకపు ఉద్వేగంగా గుర్తిస్తుంది. దీంట్లో మొదటిది స్నేహం పట్ల మామూలు, యాంత్రిక అవగాహన కాగా, రెండోది కాల్పనిక, స్వీయమానసిక అవగాహన.

“మనిషిని మనిషిగానూ ప్రపంచంతో ఆతని సంబంధాన్ని మానవీయమైనదిగానూ భావించండి. అప్పుడు ప్రేమకు ప్రేమ ద్వారా మాత్రమే బదులు తీర్చుకోగలరు. నమ్మకానికి నమ్మకంద్వారా మాత్రమే జవాబివ్వగలరు… మనిషితోనూ, ప్రకృతి తోనూ మీకు గల ప్రతి ఒక్క సంబంధమూ మీ ఆశయ లక్ష్యానికీ, మీ వాస్తవ వ్యక్తిగజీవితానికీ సంబంధించిన విశిష్ట వ్యక్తీకరణగా ఉంటుంది.” అంటాడు మార్క్స్. (ఎకనమిక్ అండ్ ఫిలాసాఫికల్ మాన్యూ స్క్రిప్ట్స్ఆఫ్ 1844)

వర్గరహిత సమాజంలో మనుషుల మధ్య స్నేహం ఒక సహజత్వం, ఒక అనివార్యత, ఒక చారిత్రక, సామాజిక అవసరం. సంఘజీవులుగా మనుషుల్లో ఈ స్నేహాకాంక్ష ఎల్ల వేళలా ఉంటుంది. మానవుల సంఘ జీవితం ఎన్నెన్ని చీలికలకు దారి తీసిందో అన్నీ అడ్డుగోడలు ఈ స్నేహాకాంక్ష మీద పరుచుకున్నాయి. ఈ గోడలన్నీ పగులగొట్టి స్నేహ స్వరూపాన్ని గుర్తించడం, ఆచరించడం శ్రామికవర్గ దృక్పధానికి మాత్రమే సాధ్య పడుతుంది. కధా కాలంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ రాజారావు, శివరామయ్య, గోపాలరావు, మీనాక్షీ దేవి ఒకే తానులో ముక్కలు గనుకనే వాళ్ళకు స్నేహారూపం అర్ధం కావటం అసాధ్యం. అందువల్లనే వాళ్ళు స్నేహపు వికృత రూపాన్నే దర్శించగలరు. ప్రర్శింపగలరు. (స్నేహ స్వరూపాన్ని గుర్తించిన శ్రామిక వర్గ దృక్పధం గలవాళ్ళు కూడా సమగ్రంగా దాన్ని ఆచరించడం ప్రస్తుత సమాజంలో కష్ట సాధ్యం, అసాధ్యం కూడా.)

ఇక్కడి దాకా, 1969 ఏప్రిల్ లో రాసిన ‘స్నేహం’ దాకా ప్రధానంగా మానవసంబంధాలలోని అప్రజాస్వామికత గురించి రాస్తూ వచ్చిన కారా, ఆ తర్వాత రావలసిన ప్రజాస్వామికత గురించి, అంతకన్న ముఖ్యంగా ప్రజాస్వామికత సాధించే ఆలోచనల, ఆచరణల గురించి కధలు రాయటం మొదలు పెట్టారు. పైననే చెప్పినట్టు ఈ ప్రజాస్వామికతను సాధించే మార్గం శ్రామిక వర్గ దృక్పద్ధమే. ఆ దృక్పధాన్ని ఆయన 1951 నవంబర్ లో రాసిన “అప్రజ్ఞాతం” లో చిత్రించే ఉన్నారు. ఐతే తెలుగు సీమలో 1951 నవంబర్ నాటికి కధా నాయకుడు సుదర్శనానికి మాత్రమే గాక, కమ్యూనిష్టు పార్టీకే ఆ ధృక్పథపు మార్గం అప్రజ్ఞాతం కావడం మొదలయింది.

ఆ అప్రజ్ఞాతాన్ని జ్ఞాతం చేయాలనే ‘ఆర్తి’ 1969 తర్వాతనే మొదలయింది. ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, కుట్ర కధల్లో కారా సమాజంలోని అప్రజాస్వామికను చూపడంతో పాటే, ప్రజాస్వామికతను సాధించే వివిధ మార్గాల గురించి ఆలోచనను రేకెత్తించడానికి ప్రయత్నించారు.

మోచేతి కూడు తినదలుచుకోని పైడయ్య (ఆర్తి), తన ఊరిని కొత్తగా కనిపెట్టిన గురవడు (భయం), వర్గ సమాజ ఆవిర్భావం నుంచీ “తేలకుండా చిక్కుపడిపోయిన విషయాన్ని” “ఇహ కుదరదు, ఆ రోజు వెళ్ళిపోయింది, ఆ సంగతి గ్రహించాలి” అని యజమానికీ, ప్రభుత్వానికీ సీరియస్ గా హెచ్చరిక జేసిన విశ్వనాధం (శాంతి), “ అది రావాల. బూమ్మీద యీ వొనాశవంత సూసినప్పుడు నాకదే అనిపిస్తాది. పెళయం తప్ప ఈ బూమ్మీది మురికిని మరేది కడగలేదు. పోతే అన్నీ పోతాయి. మనుషులవూ పోతావు. పోయినా సరే.” అనే కన్నయ్య (చావు), కసురుకున్నా, విసుక్కున్నా, కుక్కల్నీ, పోలీసుల్నీ చూపి భయపెట్టినా కలవారినిబ్బంది పెట్టక వల్లకాదని గుర్తించి, ఇద్దరు ముగ్గురై, ముగ్గురు పదిమందిలో చేరీ రెండంతస్తుల భవనాల సింహద్వారాల వద్ద చేరి “కడ వరకూ” గేటు వదలని ఆడవాళ్ళు (జీవధార), “నువ్వాలాగా, మరీ అంతకంతల్లేని గదిలో కాపరవెట్టి, ఉన్న ఒక్క గుమ్మానికీ మంచం అడ్డేసేస్తే ఆ కాపరం సక్కబెట్ట దలచినోడికి రెండే రెండు దార్లు. నిశిరాత్రి నీ పీక పిసికీడం మొదటిది. లేదా గోడలు బద్దలు గొట్టేయాల. మూడో దారి లేదు” అన్న ‘కుట్ర’ వ్యాఖ్యాత మానవసంబంధాల దుస్థితినే వాఖ్యానిస్తున్నారు. అవి మంచి వైపు మారాలనే ఆర్తినీ, అందుకు తమకు తోచిన మార్గాలనూ ప్రకటిస్తున్నారు. కారా కధల మౌలికాంశం మానవ సంబంధాల విశ్లేషణే. వర్తమానం గురించిన ఈ విశ్లేషణ, వర్తమాన అవ్యవస్థను చిత్రించే మాట నిజమే కాని, దాని సందేశం నిరాశ కాదు. ఆ వ్యవస్థను కూల్చేయవలసిన అవసరం, భవిష్యత్తు పట్ల ఆశ. ఈ అర్ధంలో కారా నిశిత సామాజిక వ్యాఖ్యాత, సామాజిక మనస్తత్వవేత్త.

[ఈ పరిధిలోకి వచ్చినా ఇంకా విస్తృతంగా చర్చించవలసి ఉన్న మరికొన్ని కధల్ని స్థలా భావం దృష్ట్యా వదిలేయడం జరిగింది.]

ఎన్. వేణుగోపాల్

“Modata Arunatara January – March 1987 sanchikalo prachuritamaina ee vyaasam aa tarvaata N Venugopal vyaasa samputam Kathaasandarbham (2000) lo kooda achchayindi”

(  మొదట అరుణతార జనవరి -మార్చి 1987 సంచిక లో ప్రచురితమైన ఈ వ్యాసం ఆ తరువాత ఎన్. వేణుగోపాల్ వ్యాస సంపుటి కథాసందర్భం 2000) లో కూడా అచ్చయింది. )

ఎనిమిదో కధ

dasari1‘యజ్ఞం’ కధ రాసి ఏభై ఏళ్ళయింది. అచ్చు పడి నలభై ఎనిమిది. అచ్చు పడ్డప్పట్నించీ ఈ కధ మీద చర్చ జరుగుతూనే ఉంది. వందలాది పుటలు నిండాయి. ఇంకా నిండుతున్నాయి. అందులో కొన్ని పుస్తకరూపంలోనూ వచ్చాయి. వ్యాసాలే కాకుండా ‘యజ్ఞం తర్వాత ..” అంటూ కధలు వచ్చాయి. అడపాదడపా ఆయా వ్యాసాలు చదివాను. చర్చలు విన్నాను. ఆ కధ గురించి తాత్విక స్థాయిలో చేసిన విశ్లేషణాలూ కొన్ని చదివాను. కొన్నికొన్ని వ్యాసాలు ఆ కధ చెప్పని ‘గొప్ప తాత్విక విషయాలు’ కూడా ఎత్తిచూపాయి. ఆయా వ్యాసాలు కూడా చదివాను.

… యజ్ఞం గురించి రాయాలనుకొన్నపుడు ఆయా వ్యాసాలూ, ఆ పుస్తకం, ఓ సారి చదువుదామనిపించింది. కానీ నా స్పందనలు చెప్పడానికి అవి చదవడం అవరోధమవుతుందేమోననిపించింది. విరమించాను.

నిజానికి ఇది విమర్శా వ్యాసం కాదు. విశ్లేషణ కూడా గాదు. గత నలభై ఏళ్ళుగా ఎన్నెన్నో సార్లు ఆ కధను చదివి ఇష్టపడిన నేపధ్యంలో దానిని అందరికీ – ముఖ్యంగా ఈ తరం పాఠకులూ రచయితలకు – నా దృక్కోణంలోంచి పరిచయం చెయ్యాలనిపించింది. అప్పటి వారికి మరోసారి కధను గుర్తు చేస్తే బాగుంటుందనిపించింది.

……

శ్రీకాకుళానికి చేరువలో, సముద్రానికి దగ్గరలో ఉన్న ఊరు ‘సుందర’ పాలెం. తాటి తోపులు, కొబ్బరి చెట్లు, పచ్చని చేలు, నిండు చెరువులు – సుందరమైన ఊరే అది. హైస్కూలు, కరెంటాఫీసు, పోస్టాఫీసు, ఆసుపత్రి, పక్కారోడ్డు, ప్రపంచజ్ఞానం ఉన్న ఊరి వాళ్ళూ- వీటన్నిటితో ‘ఆ కోస్తా ప్రాంతంలో పలువురు అనాధల మధ్య సనాధలా వెలుగుతున్న’నాలుగు వందల ఇళ్ళున్న గ్రామమది. కధా కాలం 1963 నాటికి అన్ని ఇతర గ్రామాలూ అనాధలుగా ఉండి పోతే ఈ ఒక్కటీ సనాధగా ఎలా రూపొందిందీ? దేవుడేవన్నా దిగి వచ్చి మంత్రం వేశాడా?

దేవుడక్కర్లేదు. ఒఖ్ఖ మనిషి చాలు. ఆ మనిషి శ్రీరాములు నాయుడు. కొట్టొచ్చే రూపు, చెరుగని చిరునవ్వు, పట్నం చదువు, సమాజ సేవ కోసం మధ్యలో వదిలి పెట్టటం … ఎం.పీ, ఎమ్మెల్యే అవగలిగి ఉండీ గ్రామ శ్రేయస్సు కోసం ఆ పదవుల కోసం వెంటాడనితనం. అటు శ్రీరామ చెంద్రుని ‘న్యాయ నిరతి’నీ, ఇటు గాంధీ మహాత్ముని ‘నాయకత్వ శైలి’ నీ పుణికి పుచ్చుకున్న మనిషి శ్రీరాములు నాయుడు.

..దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలోనే ఊళ్ళోకి అడుగు పెట్టాడు నాయుడు. నిస్తేజంగా అనైక్యంగా ఉన్న ఊళ్ళో కదలిక తెచ్చాడు. ముందు అవమానాలకూ హేళనకు గురయ్యాడు. మెల్లిగా అందరి విశ్వాసం పొంద గలిగాడు. ముందుగా హైస్కూల్, ఆ తర్వాత చకచకా అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలు – పదిహేను సంవత్సరాలలో ఊరు సనాధగా ఎదిగింది. ప్రభుత్వ వర్గాల ముద్దు బిడ్డ అయింది. ఊరి తగవులు గుడి మంటపం దాటి వెళ్ళారాదన్న కట్టుబాటుకు ఏకతాటిన ఊరిని నిలిపిన ‘న్యాయకోవిదుడు’ శ్రీరాములు నాయుడు.

…..

ఇంతకూ ఈ యజ్ఞం కధ ఏమిటీ?

మామూలే. ఓ చిన్న అప్పుల తగవు. తీసుకోడం, తీర్చలేక పోవడం, తగాదా, అది ఏళ్ళ తరబడి నలగడం, పంచాయితీ, ఆ తగవు తీర్చే పని శ్రీరాములు నాయుడి మీద పడటం…

అప్పు పడ్డ అప్పల్రావుడు ఊరి మాలల్లో పెద్ద. బంధు బలగం ఉన్నవాడు. పంచాయితీ హరిజన మెంబరు. “మాటకు నిలబడే మనిషి” అన్న ఖ్యాతి ఉన్న వాడు. అప్పు ఇచ్చిన గోపన్న ఓ చితికిపోయిన షావుకారు. సాత్వికుడు. చిన్నకారు వ్యాపారిగా మొదలెట్టి, పంటల వ్యాపారిగా ఎదిగి, వ్యాపారంలో నష్టాలు సొంతవాళ్ళ దగా వల్ల చితికిన మనిషి.

బాకీ మొత్తం రెండు వేలు – వడ్డితో రెండువేల అయిదు వందలు. అసలు మూడేళ్ళ క్రితమే పంచాయితీకి ఎక్కవలసిన కేసు. శ్రీరాములునాయుడు మధ్యస్థంతో సరి పెట్టాడు. తనకున్న పొలమంతా అమ్మితేగానీ బాకీ తీరదు గాబట్టి మరో మూడేళ్ళు గడువు అడిగాడు అప్పల్రావుడు. ఇతర పెద్దల్నీ, గోపన్ననూ ఒప్పించి ఆ గడువు ఇప్పించాడు శ్రీరాములు నాయుడు. అది రేపటితో ముగుస్తుంది.

అంతిమ నిర్ణయం వెలువరించవలసిన సమయం వచ్చేసింది.

*****

గుడి మంటపంలో పంచాయితీ. ఊరు ఊరంతా పోగు పడింది.

“నేను చితికి పోయాను. మీరు ఎంత ఇప్పిస్తే అదే మహా ప్రసాదమనుకొంటాను”. అంటాడు గోపన్న . అప్పల్రావుడు ఉలకడు. పలకడు.. అందరి సహనాలు అడుగంటే వేళ నోరు విప్పుతాడు. “మాకున్నమడిసెక్క అమ్మించేసయినా అప్పు తీరుమానం సేయాలని సబవోరికి ఉన్నట్టుంది. అదే నాయవయితే సెప్పండి. నెత్తి నెట్టుకొంటాను.” అంటాడు. “అయితే ఇది అప్పుగాదంటావా? తీర్చమనడం న్యాయంగాదంటావా” అని పెద్దలు రెట్టిస్తే – “అవునో గాదో మీరే ఆలోసించి సెప్పాల” అంటాడు!!

శ్రీరాములు నాయుడు కాసేపు ఆలోచించి “పెద్ద మనసుతో “ “రావుడూ, తగవు తీరుస్తున్నాను. ఈ నాటి నుండి నువ్వు గోపన్నగారికి నయాపైసా బాకీ లేవు. గోపన్నగారూ – ఎల్లుండి రండి. చెల్లు బెడతాను” అంటాడు.

ఇంకేం … తగవు తీరినట్టేగదా… శ్రీరామచంద్రుడంత ఉదాత్తంగానూ, గాంధీ మహాత్ముడంత న్యాయంగానూ నాయుడుగారు తీర్పు చెప్పారు గదా. కధ సుఖాంతమే గదా.

.. మరి విషయం ఇంకా ముందుకు నడిచి ఒక హింసతోనూ హత్య తోనూ, ఒక కట్టుబాటు చెల్లా చెదరవడంతోనూ, ఒక వ్యవస్థ బీటలు వారడంతోనూ ఎందుకు ముగిసినట్టూ!!

……

అసలు కధ అప్పుడే మొదలయింది గాబట్టి.

కధను శ్రీరాములు నాయుడు భుజాల మీంచి దించి అప్పల్రావుడు నడిపించాడు గాబట్టి. చివరికి అది అప్పల్రావుడి కొడుకు చేతుల్లో కత్తిగా మారి ‘ఒక తల – ఒక చిన్న దేహం’ గా మిగిలింది గాబట్టి.

శ్రీరాములు నాయుడు తీర్పు వెనుక అలకా ఆగ్రహం ఉన్నాయని ఎత్తి చూపి అందుకు కారణం చెప్పమని నిలదీస్తాడు అప్పల్రావుడు. అంతే గాకుండా నువ్వు కవుకు దెబ్బలు కొడుతున్నావంటాడు. చాప కింద నీరులా ముంచే మనిషివంటాడు. నా వేలితో నా కన్నే పొడుస్తున్నావంటాడు. “నువ్వు చెప్పిన తీరుపు నాయవయినదేనా? అసలు నాది అప్పేనా?” అని నిలదీస్తాడు.

అప్పటిదాకా శ్రీరాములు నాయుడిని అంత మాటలు అన్నవారు లేరు!

అరుదైన ఉద్రేకానికి గురి అయిన శ్రీరాములు నాయుడు “ఇది అప్పే! అప్పే!!అప్పే!!” అని ముమ్మారు ప్రకటిస్తాడు. “అసలు ఇది అప్పుగాదని ఎవరైనా ఎలా అంటారో నాకు బోధ పడటం లేదు” అంటాడు.

అప్పల్రావుడి మడి సెక్క అమ్మి అప్పు తీర్చడానికి రంగం సిద్ధమవుతుంది.

“శ్రీరావులు బాబూ నిజం నీకూ తెలిసుండదు. ఇది నాయవైన అప్పుగాదని ఎందుకన్నానో ఆ కధంతా తవరికి సెప్పి అమ్మకం కాయితాల మీద ఏలి ముద్ర పెడతాను” అంటాడు అప్పల్రావుడు.

ఏభై ఏళ్ళ నాడు తను ఆరు ఎకరాలకూ సిన్న కొంపకూ వారసుడవడం, ఊళ్ళో అందరికీ అంతో ఇంతో సెక్క ముక్కా, సరిపడా తిండి గింజలూ కట్టుకోడానికి గోచి ముక్కా ఉండటం, వాళ్ళ పిచ్చి కుంచాల వర్తక ధర్మాలకు మోసపోయినా రైతులు షావుకార్లకు మదుపు పెట్టే స్థితిలో ఉండటం…

మెల్లిగా పొగాకూ వేరుశెనగలాంటి వ్యాపారప్పంటలు రావటం, మగ్గాలు మూత పెట్టిన సాలెవాళ్ళు పంటల వ్యాపారంలో దిగి షావుకార్లవడం, వాళ్ళు కింద నుంచి పైకి లేవగా రైతులు కిందకి దిగజారడం..

వ్యాపారప్పంటల్లో కలిసి వేలు పెట్టిన తానూ గోపన్న అయిదేళ్ళ పాటు కలసికట్టుగా పైకి లేవడం.. తర్వాత గోపన్న పైకీ తాను కిందకీ చేరడం, తొమ్మిది ఎకరాలయిన తన ఆరెకరాల పొలం చివరికి రెండుంచిల్లరకు తగ్గి పోవడం, మాలలూ గొల్లలేగాకుండా కొందరు కొందరు కాపులూ ఈ సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరవడం …

.. అప్పులమాయ తెలిసీ రైతులు చేజేతులా అందులో చిక్కుకోవడం, చివరికి అప్పునిచ్చిన షావుకార్లూ మునిగిపోవడం, ఊళ్ళో వర్తకుల్ని బయట వర్తకులూ, వాళ్ళను ఇంకా పెద్ద వర్తకులూ ముంచేయడం, ఇదంతా “నరుడు తెచ్చిన ముప్పా; నారాయుడు బెడుతున్న సిక్కా” అన్న మీమాంస.

ఇవన్నీ చెప్పాక పదిహేనేళ్ళనాడు శ్రీరాములు నాయుడు ఊళ్ళోకి అడుగు పెట్టినపుడు తామంతా సంబరపడటం, హైస్కూలూ రోడ్డూ లాంటివి పేదోళ్ళకు కొంత కాలం పనులు కల్పించినా కొత్త పనులు లేక చతికిల పడటం, రోడ్డు వల్ల బళ్ళ వాళ్ళూ , కరెంటు వల్ల ఏతాల వాళ్ళు , మిల్లుల వల్ల దంపుడు వాళ్ళూ జీవనోపాధి కోల్పోవడం, ఊరు బాగుకోసం విరాళాలూ, భూవులూ ఇచ్చిన కామందులు బాగు పడగా – శ్రమ దానం చేసిన బీదా బిక్కి మరింత చిక్కి పోవడం చెబుతాడు. శ్రీరాములు నాయుడు పుణ్యమా అని ఒకప్పుడు దివాల తీసిన షావుకార్ల బిడ్డలంతా ఇపుడు ఎలా పుంజుకొంటున్నారో చెబుతాడు. శ్రీరాములు నాయుడు మొదలెట్టిన యజ్ఞం అందర్నీ ఎలా పాపంలోకి దింపిందో చెబుతాడు. గతరాత్రి తన కొడుకు సీతారావుడు “బూవి అమ్మితే నిన్ను నరికి నన్ను నేను నరుక్కు సస్తాను” అనడం గురించి చెబుతాడు. ఇంటెల్లపాది రెయ్యింబవళ్ళు కష్టపడినా తమకు గంజి మెతుకులు దొరక్క పోగా రుణాల ఊబిలో దిగబడటమూ – అటు ఏవీ లేనోళ్ళు ఏడాది తిరిగే లోగా కావందులవడమూ చెప్పి “ఎవరి సొమ్ము ఎవరు పడేసుకోడం వల్ల గొప్పోళ్లయిపోతున్నారో, ఎవరికెందువల్ల కూడు బుట్టకుండా పోతుందో ఆ ఇవరం మీరే చెప్పండి” అని అడుగుతాడు.

..అడిగి, శ్రీరాములుకేసి చూసి, క్షణ కాలం ఆశపడతాడు. తనది అడియాస అని తేలగా వేలిముద్ర వేస్తాడు. సీతారావుడు పరుగు పరుగున పేటకేసి వెళతాడు. అక్కడేదో జరగబోతుందని శ్రీరాములు నాయుడు గ్రహిస్తాడు. చిరునవ్వు స్థానంలో చీకట్లు కమ్ము కొంటాయి. గజగజ గజగజ వణుకు. ఆ ధీరోదాత్తుడిలో ఈ మార్పుచూసి జనంలో భయం…

.. తిరిగొచ్చిన సీతారావుడి భుజాన ఉన్న గోనె సంచిలో ఓ తల – చిన్న దేహం.. సీతారావుడి కొడుకుది. నోరు విప్పిన సీతారావుడు జనం మెప్పు కోరే అప్పల్రావుడ్నీ, తనను ఏలే దొరలు మునసబు కరణాలని గ్రహించలేని ‘ఎర్రిపీరు’ శ్రీరాములునాయుడినీ ఎండగట్టి – మునసబుకో సవాలు విసురుతాడు: మంటపం తెరిచిన రోజున ఊళ్ళో తగాదా ఊర్లోనే తీరుమానం గావాలని నువ్వు అన్నావట … ఇపుడు చెప్పు అచ్చురిపోర్టు కోస్తావా, నా కూనీ మాఫ్ చేస్తావా…

ఈ ప్రశ్నకూ ఇలాంటి లక్షలాది ప్రశ్నలకూ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వ్యవస్థ సమాధానం చెప్పదు. చెప్పలేదు.

“ధర్మ పన్నాలెంతవరకూ? … అంతా నువ్ చెప్పినట్టు వినే వరకూ …. “ అన్నవ్యాఖ్యతో “యజ్ఞం” ముగుస్తుంది.

…..

సూటిగా సాగిన కధ. ఏ మాత్రమూ క్లిష్టత లేని భాష. ‘మన ఊర్లోనే జరిగినట్లు ఉందే’ అనిపించే సహజమైన కధా మండప వేదిక . రక్తమాంసాలున్న పాత్రలు.

.. వస్తువు? భగవంతుడికి కూడా ఒక పట్టాన అర్ధం కానంత అతి క్లిష్టమయినది!!

చదివేవాళ్ళను ఉద్దేశ్య పూర్వకంగా ‘తప్పుదారి’ పట్టించి, రామరాజ్యపు సౌరభాలను చవి చూపించి, మాహాత్ముడు కలలుగన్న మరో ప్రపంచపు పొలిమేరలకు చేర్చి, ఓ తాడూ బొంగరం లేని ఊరు ఒకే ఒక్క వ్యక్తి పూనికలో ఆదర్శ గ్రామంగా ఎలా ఎదగగలదో చూపించి .. నిరూపించి…

..ఊహల ఉయ్యాలల్లో ఒళ్ళు మరచిపోతున్న పాఠకులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి, వారి గుండెల మీద వేల సమ్మెట పోట్లు పెట్టి, రెండు తరాలు గడిచి పోయినా ఆ పోట్లు ఇంకా సలుపుతూ ఉండేలా చెయ్యడం ఎవరికన్నసాధ్యమా?

సాధ్యమేనని చెపుతుంది “యజ్ఞం”.

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి, పరిణామాల్ని పరిశీలించి, విపరీత లక్షణాలను గ్రహించి; ఆ గ్రహింపు ఏదో చైతన్యాన్ని మేలుకొలిపినపుడు, ఒక సంవేదనకు మూలమయిన ఒక ఆవేదనకు ప్రేరణ అయినపుడు, తన పరిశీలనకు సామాజిక ఆర్ధిక అవగాహన జోడించినపుడు, సమస్యల మూలాలను రాగద్వేష రహితంగా శోధించినపుడు, ఆయా పరిశీలనలనూ శోధనలనూ వాస్తవానికి దగ్గరగా నిజ జీవిత సంఘటనల సాయంతో అక్షర రూపంలో అరుదైన సృజనతో చిత్రించినపుడు ‘యజ్ఞం’ లాంటి కధలు పుడతాయి. సమాజపు చేతన మీద సమ్మెట పోట్లవుతాయి.

ఈ అప్రయత్న ప్రయత్నం ఆరు సారా కధల్లో కనిపిస్తుంది. ‘స్మైల్’ రాసిన ఖాళీ సీసాల్లో కనిపిస్తుంది. మరో రకంగా పద్మరాజుగారి ‘గాలివాన’, బుచ్చిబాబు ‘నన్ను గురించి కధ రాయావూ’ ల్లో కనిపిస్తుంది. కానీ ‘యజ్ఞం’కు ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

“ఒకప్పుడు తెలుగు కధ వ్యక్తుల అంతరంగ జీవనాన్ని కేంద్రంగా చేసుకొని సాగింది. ఇపుడు వ్యవస్థాగత జీవన చిత్రణ ముఖ్య పాత్ర వహిస్తోంది. వ్యక్తి – సమాజం – వ్యవస్థల మధ్య ఉన్న పరస్పర సంబంధాల చిత్రణ జరుగుతోంది. బహుశ యజ్ఞం కధ అందుకు నాంది పలికిందనుకొంటాను. అందుకే ఆ కధకు ఒక ఉనికి వచ్చింది. దోపిడీ నిజరూపాన్ని బలంగా సాహిత్యపు ఎజండాలోకి తీసుకు వచ్చిన కధ యజ్ఞం” అన్నారు కాళీపట్నం 1997 నాటి ఒక ఇంటర్వ్యూలో. నిజానికి తెలుగు కధా చరిత్రను యజ్ఞంకు ముందు, యజ్ఞం తరవాత అని వర్గీకరించుకోవచ్చు.

…..

ఏభై ఏళ్ళు దాటినా ఒక రచన ఇంకా ఎంతో రెలవెంట్ గా ఉందంటే అది సంతోషించ దగిన విషయమా – ఆందోళన పడవలసిన విషయమా?

కొడవటిగంటి గారితో నేను పరిపూర్ణంగా అంగీకరిస్తాను. అది ఆందోళనదాయకం.

కానీ ఏభై ఏమిటి వందల సంవత్సరాలు గడిచినా వేమనలు ఇంకా మనకు దిశానిర్దేశకులే! అంచేత ఆందోళన కాస్తంత పక్కన పెట్టి యజ్ఞం ఎత్తి చూపిన అనేకానేక విషయాలను పరిశీలించి, అధ్యయనం చేసి, చర్చించి మనం కాస్త ముందుకు వెళ్ళవలసిన అవసరమూ అవకాశమూ లేవూ?

పుష్కలంగా ఉన్నాయి.

ఏది అభివృద్ధి? ఏది సమాజ సౌభాగ్యం? ఏది సమర్ధ నాయకత్వం? ఏది గుడిబండలాంటి మన గతం? ఏది బహుజన హితం? ఏది న్యాయసమ్మతమైనా నైతికంగా దివాళాకోరుతనం? ఏయే ప్రమాదాలను మనం దాటుకొని వచ్చాం? ఏయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ఎవరు తమకే తెలియని మేకవన్నెపులులు? ఎవరు తమకే తెలియని అమాయక బలిపశువులు ….

ఇలాంటి ప్రశ్నలు – మనం సుందరపాలెంలో ఉన్నా, రాబోయే రాజధానిలో ఉన్నా – గ్రహించగల అడగగల శక్తి మనకు కావాలి. ఈ విషయంలో ఇప్పటికీ దిశానిర్దేశం చెయ్యగల దార్శనికత ఉన్న రచన యజ్ఞం. విరుచుకు పడబోతున్న ప్రపంచీకరణ గురించి 1964లోనే ‘యజ్ఞం’ ప్రమాద ఘంటికలు మోగించినా ఇంకా మనం ఆ విషయంలో ఏనుగును వర్ణించే నలుగురు అంధుల్లా లేమూ?! రావి శాస్త్రి నుంచి, కాళీ పట్నం నుంచీ మనం గ్రహించి చర్చించవలసిన విషయాలు ఎన్నో లేవూ?

……

ఈ సంధర్భంగా ‘యజ్ఞం’ కధ గురించి ఒకటి రెండు విషయాలు చెప్పుకోవాలి. కధలో వ్యవస్థ చేసే పన్నాగాలనూ, దుర్మార్గాలనూ అప్పల్రావుడితో ఎంతో స్పష్టంగా సూటిగా చెప్పిస్తారు రచయిత. ఆ తర్వాత సీతారావుడితో ఆ వ్యవస్థను తిరుగులేని విధంగా సవాలు చేయిస్తారు.

కొమ్ములుదిరిగిన ఆర్ధికవేత్తలకూ, సామాజిక సంవేదన ఉన్నఅభ్యుదయాన్ని మనసారా కాంక్షించే మేధావులకూ అంతుచిక్కని వ్యవస్థాగత పద్మవ్యూహ దుర్మార్గాలు కధలో అప్పల్రావుడూ, సీతారావుడూ అరటిపండు వలచి చేతిలో పెట్టినంత సులభంగా, సమర్ధంగా ఎలా విప్పి చెప్పగలిగారు?! నిజమే ఒక జీవితకాలం ఆలోచనాశీలతతో గడిపిన కొంతమందిలో సహజ పరిజ్ఞానం – నేటివ్ విజ్డమ్ – పుష్కలంగా ఉండే మాట నిజమే. కానీ ఆ పరిజ్ఞానం సునిశిత పరిశీలన వరకూ పనికొస్తుందే గానీ సూక్ష్మ అవగాహనకూ విషయ నిర్ధారణా సీమకూ చేరుకోలేదు. మరి అంత క్లిష్టమయిన వ్యవస్థాగత విషయాలు రాత్రికి రాత్రి అప్పల్రావుడు ఎలా గ్రహించగలిగాడూ?! (నా మట్టుకు నాకు నిజం నిన్న రేత్తిరి దాకా తెలియలేదు…) అతని ఆ అవగాహనకు దోహదం చేసిన సీతారావుడికి, చుట్టం ఎర్రయ్యకూ మాత్రం అంత విచక్షణ ఎలా సమకూరిందీ? ఈ వ్యాసం కోసం కధను పదే పదే చదివినపుడు ఈ సందేహం నాకు పదేపదే కలిగింది. మళ్ళీ నిదానంగా ఆలోచిస్తే ఈ కధాపరిధిలో, ఈ కధా నేపధ్యంలో విషయాన్ని అలా అప్పల్రావుడితో చెప్పించడం కన్నా మరో మార్గం లేదనీ నాకు అనిపించింది.

అలాగే కధ చిట్టచివర సీతారాముడు – దాదాపు హఠాత్తుగా – శ్రీరాములు నాయుడిని ‘ఏలేది’ కరణమూ, మునసుబూ అన్న సంగతి స్ఫుటంగా ఎత్తి చూపుతాడు. వాళ్ళను ప్రభుత్వానికీ, రాజ్యానికీ, వ్యవస్థకూ ప్రతీకలుగా తీసుకొని రచయిత ఆ మాట చెప్పించాడన్న మాట నిజమే కానీ.. కధలో వాళ్ళిద్దరూ ‘ఏలే’ ప్రక్రియను సూచనా మాత్రంగానైనా చిత్రించకుండా ఒక్కసారిగా ఆ మాట చెప్పించడం వెలితిగా అనిపిస్తుంది. ఆ కరణం మునసబుల పాత్రలు దాదాపు మౌన పాత్రలు… ఇంకొంచం శ్రద్ధగా వాళ్ళ పాత్రలనూ, ఆ నిర్ధారణనూ చిత్రించి ప్రతిపాదించి ఉండవలసింది.

సుందరపాలెం ‘ అభివృద్ధి’ చెందిన క్రమాన్ని కధలో చెప్పినపుడూ, ఆయా అభివృద్ధి కార్యక్రమాల విష పరిణామాలను ఎత్తి చూపినపుడూ – అసలు ఈ కధ యావత్తూ అభివృద్ధిని నిరసిస్తోందా- అన్న అనుమానం కలిగింది నాకు. ( రోడ్లు వచ్చి బళ్ళ వాళ్ళు, కరెంట్ వచ్చి ….) . నిజమే – సమాజంలో ఒక్కో మార్పు సంభవించినపుడు ఒక బృందం, ఒక్కోసారి ఒక తరం యావత్తు తమ జీవనోపాధినే గాకుండా జీవన విధానాన్ని సైతం (వే ఆఫ్ లైఫ్) కోల్పోయి ఒడ్డున పడ్డ చేపలవడం ఒక చారిత్రక వాస్తవమే. కానీ అలాగే రైళ్ళూ రోడ్లూ కార్లూ విమానాలు కరెంటూ రైసుమిల్లులూ – చారిత్రక అవసరాలు. సామాజిక వాస్తవాలు. ఆ మార్పుల వల్ల అనేక మంది నిరాధారులుగా మిగిలే ప్రమాదాన్ని ముందే గ్రహించి వాళ్ళ వాళ్ళ జీవితాలను వీలయినంత సరళంగా, బాధారహితంగా చేయగల ముందస్తు ప్రణాళికలను రూపొందించి అమలు పరచడం దార్శనికత ఉన్న ప్రభుత్వాలు చేయవలసిన పని. కానీ చాలా సార్లు ప్రభుత్వాలు ఈ పని చెయ్యవు. అంత మాత్రం చేత యావత్తు అభ్యుదయాన్నే శంకించడం నిరసించడం సమంజసమా?!

……

సీతారావుడు తన కొడుకును తెగ నరకడం విషయంలో ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. జరుగుతోంది. అందులోకి నేను వెళ్ళను. నాకు అంత శక్తి లేదు. కానీ ఒక్క మాట – ఆ సంఘటనను చిత్రించడంలో రచయిత ప్రాధమిక ఉద్దేశ్యం ఏమయినా అది వ్యవస్థ కాలరు దొరక బుచ్చుకొని నిలదీయడానికి బలంగా ఉపయోగపడింది. (రిపోర్టా – మాఫీనా?) జవాబు ఇవ్వలేని సవాలును సంధించడానికి గొప్పగా ఉపయోగపడింది. అదే ప్రశ్నను మనకు మనమూ వేసుకొని సమాధానం చెప్పవలసిన నిరంతర అవసరాన్ని కల్పించింది.

శ్రీరాములునాయుడూ, అప్పల్రాయుడూ, సీతారావుడూ, గోపన్న, మునసబు, కరణం, గుడిమంటపం, హైస్కూల్, రోడ్డు – ఇవి అసలు స్థలాలూ పాత్రలూ కావు, ప్రతీకలు – అన్నఆలోచన ఒకటి ఉంది. ఆయా ప్రతీకలను గుర్తించి వివరించి కధలోని తాత్వికతను, గోప్యతను విశదీకరించి యజ్ఞాన్ని ఇంకా ఉన్నతీకరించవచ్చు. నేను ఆ హనుమంతుడ్ని గజం బద్దతో కొలిచే పని పెట్టుకోను. నిజానికి మనం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదని నేను అనుకొంటాను. కధను ఉన్నది ఉన్నట్టుగా మన ఆలోచనల్లో, అనుభవాల్లో, సంస్కారంలో, విజ్ఞానంలో ఒక భాగం చేసుకోగలిగితే మనల్ని మనం ఎంతో ఉన్నతీకరించుకో గలుగుతాం!

……

చట్టం, న్యాయం, ధర్మం, నీతి అన్న అంశాల మూలాలలోకి వెళ్ళి ప్రశ్నించిన రచన ‘యజ్ఞం’. ఎంతో సంక్లిష్టమయిన వ్యవస్థ స్వరూపాన్ని సామాన్య పాఠకులకు కూడా అర్ధమయ్యేలా విప్పి చెప్పిన కధ ఇది. ఆ చెప్పటం కూడా ‘వేదిక’ మీది భాషణ ధోరణిలో గాకుండా ‘ మనకు తెలిసిన దానిని పది మందితో పంచుకోవడం’ అన్న ధోరణి లో సాగడం వల్ల విషయం పాఠకుల మేధస్సులకే గాకుండా మనస్సులకు సైతం సూటిగా చేరగల సౌలభ్యం సాధించింది ఈ కధ.

ప్రపంచంలో ఏడే ఏడు కధలున్నాయనీ, మిగిలిన ఏడు మిలియన్ల కధలూ – రామాయణ మహాభారతాలూ, ఇవియడ్ ఒడెస్సీలతో సహా – ఆ ఏడు కధల ప్రతిరూపాలేనని ఒక సర్వజన ఆమోదముద్ర ఉన్న సాహితీ భావన బాగా ప్రచారంలో ఉంది. అది నిజమే అయిన పక్షంలో ఆ ఏడింటికీ తప్పక జోడించవలసిన ఎనిమిదో కధ – యజ్ఞం.

                                                                                                        దాసరి అమరేంద్ర

మాష్టారి కథ – అదొక యజ్ఞం, ఒక జీవధార, ఒక ఆశీర్వచనం

With Kara mastaru

2006 సంవత్సరం.

రాయకుండా ఉండలేనంతగా ఏదైనా ఇతివృత్తం మనసుని ఆక్రమించి ఉంటే తప్ప, సాహితీ వ్యాసంగం పట్ల అంతగా శ్రద్ధ పెట్టని రోజులవి. ఒకరోజు కారా మాస్టారి నించి వచ్చిన ఫోన్ నాలో ఎంతో మార్పు తెచ్చింది. అప్పటికే  ఒక గేయ సంపుటీ ‘ఆలంబన’ కథాసంపుటి వెలువరించి ఉన్నా, నాలో రచన పట్ల అనురక్తి అంతగా ఉండేది కాదు. కౌముది  జాల పత్రికలో బహుమతి పొంది, రచనలో ప్రచురితమైన నా కథ ‘ఆసరా'(http://www.siliconandhra.org/monthly/2005/oct05/index.html) చదివి మాష్టారు చేసిన ఫోన్ అది. అప్పటికి కారా మాష్టారి కథలు కూడా  నేను చదివి ఉండలేదు.

ఫోనెత్తి హలో అనగానే, “నా పేరు కాళీపట్నం రామారావు అంటారమ్మా, నేను శ్రీకాకుళం లో ఉంటాను” అంటూ పరిచయం చేసుకున్నారు మాష్టారు!

ఒక సంచిక మొత్తం ఆయనకే అంకితం చేస్తూ, రచన పత్రిక వెలువరించిన వ్యాస పరంపరని ఆ నెలలోనే, అంతకు ముందే చదివి ఉండడంతో “నమస్కారం మాష్టారు” అన్నాను సంభ్రమంగా.

ఎంతో  వాత్సల్యంగా పలకరించి,  ‘ఆసరా’  కథని మెచ్చుకుని, నా కుటుంబం గురించీ, నేపధ్యం గురించీ అడుగుతూ చాలాసేపు మాట్లాడారు. అంతటితో ఆగిపోకుండా మళ్ళీ మర్నాడు ఫోన్ చేసి ” అమ్మా! నీ కథ నన్ను వెంటాడుతోందమ్మా” అని, ఒక మంచి రచయిత్రి నిలదొక్కుకోవాలంటే  అవసరమయ్యే  సహకారం గురించి నా భర్తతో మాట్లాడాలని ఉందని చెప్పినపుడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా  ఇంతా కాదు. అన్నట్లుగానే  ఒక రచయితకి ఎదురయ్యే సవాళ్ళ గురించీ, సహచరుల నించి అందవలసిన సహకారం గురించీ నా భర్తతో ఆయన చెబుతుంటే వింతగా విభ్రాంతిగా అనిపించింది.

ఆ తర్వాత ఆయన రచనల  సంగ్రహం కొని చదివాను. యజ్ఞం, మహదాశీర్వచనం, జీవధార ఒకటేమిటి మాష్టారు రాసిన ఏ కథ చదివినా, అందులో ఒక జీవధార తోణికిస లాడుతూ  కనిపించింది, తెలుగు కథ కొక ఆశీర్వచనం వినిపించింది, కథా రచననొక యజ్ఞంగా భావించిన మాష్టారి నిబద్ధత గోచరించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి ఆయన హైదరాబాద్ రావడం, నాతో  మాట్లాడడం కోసం మా ఇంటికి రావడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అప్పుడు  నన్నుగేయ రచన, చిత్రలేఖనం వదిలిపెట్టి, కథ మీద శ్రద్ధ పెట్టమని సూచించారు. ఆ సంఘటన గురించి నేను రాసిన వ్యాసం, న్యూజెర్సీ లోని తెలుగు జ్యోతి వారి సావెనీర్ లో ‘కథ కోసం కారా మాష్టారు’ పేర ప్రచురితమైంది (http://www.tfas.net/prema/web/kathakosam_varanasi.pdf). ఆ వ్యాసంలో రాసిన విషయాలే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం సరికాదు కనుక అవి వదిలేస్తున్నాను. తర్వాత ఆయన నించి రెండు మూడు లేఖలు అందాయి. కొన్నిసార్లు ఫోన్లో కూడా మాట్లాడేవారు. నన్నే కాక ఇంకా ఎందరో కొత్త కథకులని  మాష్టారిలా ప్రోత్సహించారని విన్నాను.

 

ఆయన సృష్టించిన సాహిత్యం, ఆయనలో నాకు కనిపించిన వ్యక్తిత్వం .. దేనివల్ల నేనెక్కువ ప్రభావితమయ్యానో చెప్పడం కష్టం. తన జీవితాన్ని ఈ ఉద్యమానికి అంకితం చేసిన మాష్టారి మాటలు, తెలుగు కథ సర్వతోముఖంగా వికసించడం కోసం ఆయన పడుతున్న ప్రయాస, నా మీద చూపిన ప్రభావం లోతైనది. ఆయన కలగన్న లాంటి సాహిత్యాన్ని సృష్టించడంలో నేను సఫలం కాలేకపోవచ్చుగాని ఆయన తాపత్రయం నన్నెంతగానో  కదిలించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి భాగ్యనగరంలో, త్యాగరాయ గాన సభలో, వంగూరి చిట్టెన్ రాజు గారి అధ్వర్యంలో తెలుగు మహాసభలు మూడు రోజులపాటు జరిగాయి, ఒక పెళ్ళిలాగా, పండగ లాగా.  ఎందరో రచయితలూ, కళాకారులూ అందులో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో, అంటే మాష్టారు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత,  కొన్ని కవితలూ, పాటలూ రాశాను గాని చెప్పుకోదగ్గ కథలేమీ రాయలేదు  నేను.

 

సభ మొదలవబోతుండగా హాలులో కూర్చుని ఉన్న నా దగ్గరకి ఎవరో ఒక అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరికొద్దిసేపటికి కారా మాష్టారు అటుగా వచ్చారు. నేను ఉత్సాహంగా ఆయన దగ్గరకి వెళ్లేసరికి చాలామంది ఆయన చుట్టూ మూగి ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఒక పుస్తకంలో తన సంతకం చేస్తూ, అదే పేజీలో పైనున్న ఆటోగ్రాఫ్ చూసి, ” ఈ పిల్ల నీ కెక్కడ దొరికింది? కథల మీద దృష్టి పెట్టవమ్మా అంటే వినకుండా అన్నిట్లోనూ వేలు పెడుతుంది ? ” అని విసుక్కుంటున్నారు. ఆ మాటలు ఎవరి నుద్దేశించి అన్నారా అని చూస్తే, ఆ పుస్తకం అంతకు ముందు నా ఆటోగ్రాఫ్ తీసుకున్నావిడది.

 

” మాష్టారూ ఇక్కడే ఉన్నా” అన్నా. “ఏమిటమ్మానువ్వు? ఒక ప్రక్రియలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దానిమీదే దృష్టి పెట్టాలి. మిగిలినవన్నీ వదిలి కథ మీద శ్రద్ధ పెట్టమని చెప్పాను కదా” అన్నారు. ఆయనలో ఒక ఉద్యమకారుడి తాపత్రయం, లక్ష్య శుద్ధి కనిపించి చకితురాలినయ్యాను. నేరం చేసినట్టు ఒక గిల్ట్ ఫీలింగ్ నన్నావహించింది.

 

ఆ తర్వాత నాలో కథ పట్ల కొంత శ్రద్ధ పెరిగింది. కౌముది, ఆంధ్రభూమి కథల పోటీలలో రెండు కథలకి  ప్రధమ బహుమతి లభించింది . మాష్టారు గుర్తొచ్చారు కానీ ఫోన్ చేయలేదు. ” నీ రచనలొ శైలి ఉంది , వేగం ఉంది , సామాజిక స్పృహ ఉంది , ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కనక నువ్వు బాగా రాయాలి , రాసిలో కాదు వాసిలో. ఇలా అన్నానని నువ్వేది రాసినా నాకు పంపి ‘మాష్టారూ నా కథ ఎలా ఉంది’ అని అడగకు. అది మంచి కథ అయితే నా దగ్గరకి అదే వస్తుంది ” అన్న ఆయన మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండి పోయాను.

 

మళ్ళీ కొన్నాళ్ళకి త్యాగరాయ గాన సభలో ఒక కార్యక్రమానికి ఆయన వచ్చారు. పొత్తూరి విజయలక్ష్మి నన్నెవరికో పరిచయం చేస్తూ ‘కారా మాష్టారు మెచ్చిన రచయిత్రి’ అంటుంటే ఆ పక్కనే మాష్టారు ఉండడంతో నేను మొహమాట పడిపోయి , ‘కారా మాష్టారు మెచ్చిన ఒక కథ రాసిన రచయిత్రి’అని సరి చేశాను. ఆయన మనసారా నవ్వుతూ ‘నేను కూడా ఒక్క యజ్ఞమే రాశాను తల్లీ’ అన్నారు.

 

కిందటి సంవత్సరం నవ్యలో నా కథ  ‘పుష్య విలాసం’ (http://vanalakshmi.blogspot.in/search?updated-min=2013-01-01T00:00:00%2B05:30&updated-max=2014-01-01T00:00:00%2B05:30&max-results=13)  వచ్చిన వెంటనే మాష్టారి నించి ఫోన్ వచ్చింది  “కథ బాగుందమ్మా కానీ ..” అంటూ. బాగుందన్న మాటకి ఆనందిస్తూ  ‘కానీ..’ విషయంలో ఆత్రుతగా చెవి ఒగ్గితే, ” పేరు misleading గా ఉందమ్మా. వైద్య లక్ష్మి  అని పెట్టి ఉంటే బావుండేది” అన్నారు. ” కథ మొదలవుతూనె మొదటి మూడు నాలుగు వాక్యాలలో పాఠకుడు  కథ లోకి లాగబడాలి. ఈ కథలో ఎత్తుగడ వాక్యాలలో ఉన్న పుష్యమాస వర్ణన వల్ల అలా జరగకుండా పోయింది” అన్నారు. తన రచనా సంగ్రహం లో ఉన్న కథా రచన గురించిన వ్యాసావళిని, ప్రత్యేకించి కథలో వర్ణనలకి సంబంధించిన వ్యాసాన్ని చదవమని చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి విచారిస్తే ఒక కన్ను మాత్రమే పని చేస్తోందనీ, అయినా రోజుకి కనీసం ఎనిమిది గంటలైనా సాహిత్యం చదవకుండా ఉండలేననీ చెప్పారు. హుద్ హుద్ తుఫాను తర్వాత ఫోన్ చేసి  కుశలం అడిగితే, ప్రస్తుతం శ్రీకాకుళం వచ్చేశాననీ, తుఫాను ప్రభావం విశాఖపట్నంలో ఉన్నంతగా ఇక్కడ లేదనీ చెప్పారు.

 

కారా మాష్టారు విలక్షణమైన వ్యక్తి. ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్ళకైనా ఆయన గొప్ప కథకులు గానే కాక, అపూర్వమైన కథా ప్రేమికునిగా గోచరిస్తారు. ఒక మంచికథ ప్రచురితమయిందంటే చాలు ఆ రచయిత గురించి తెలుసుకుని, వీలయితే స్వయంగా కలుసుకునో , లేదా ఫోను ద్వారానో ఆకథలోని మంచినంతా హృదయపూర్వకంగా మెచ్చుకుని, ఇంకా ఎన్నో మంచి మంచి రచనలు రాసేవిధంగా ఆ రచయితని ప్రోత్సహిస్తారు. ఆయన ఎంత మృదుభాషణులో అంతే నిక్కచ్చిమనిషీ, నిగర్వీ కూడా. ఎంతసేపూ ఇంకా ఇంకా మంచి కథలు రావాలనీ, అవన్నీ ఇతర భాషల్లోకి అనువదించబడాలనీ, ఇంకా కొత్త కొత్త కథకులు పుట్టాలనీ, వాళ్ళ రచనలు ఇంకా ఇంకా మెరుగులు దిద్దుకోవాలనీ ఆయన ఆశ. తన సమస్తమూ కథానిలయానికే సమర్పించి, తెలుగులో వచ్చిన ప్రతి కథా అందులో పదిలమవాలని ఆకాంక్షించే మాష్టారికి  కథ పట్ల ఎంత మమకారమో ! తొంభయ్యవ పడిలో కూడా తన ఫోన్ లో, ఏ రచయితదైనా  మిస్డ్ కాల్ కనిపిస్తే,  చిన్నా పెద్దా అని చూడకుండా, తిరిగి ఫోను చేసి మాట్లాడే మాష్టారి సంస్కారం గురించి వేరే చెప్పేదేముంది ?

 

కారా మాష్టారి తొంభయ్యవ పుట్టినరోజు సందర్భంగా సారంగ జాల పత్రిక వారు ఆయన మీద ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నారనీ, మాష్టారి తో నాకున్న స్వల్ప పరిచయాన్ని పురస్కరించుకుని ఒకటి  రెండు పేజీల వ్యాసాన్ని అందించమనీ  రమాసుందరి గారు అడిగినపుడు ఇంత చక్కని ఆలోచన చేసిన సారంగ పత్రికకి మనసులో జోహార్లు చెప్పుకున్నా. మామూలుగా అయితే బతికి ఉన్న వ్యక్తుల విలువ మనకి సరిగా అర్ధం కాదు. ఎంత మహానుభావుడైనా సరే మనం గుర్తించం. అందులో ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులమీద వ్యామోహం లేకపోతే, తనంత తానుగా అందుకోసం ప్రయత్నించే లక్షణం లేకపోతే ఇంకెవరికీ ఆ సంగతి పట్టదు.

 

కారా మాష్టారు మనకిచ్చినదంతా తెలుగు వారికే సొంతమైన వారసత్వ సంపద. ఆ సంపదని  పరిరక్షించే మహత్కార్యంలొ ‘నేను సైతం’ అంటూ ముందుకొచ్చిన సారంగకి అనేక అభినందనలు.

పుట్టినరోజు పండగే అందరికీ. తను పుట్టింది ఎందుకో తెలిసిన కొందరిలొ ఒకరైన మాష్టారికి పూర్ణాయుష్షు, ఆరోగ్యం లభించాలని కోరుతూ శుభాకాంక్షలు  తెలియజేసుకుంటున్నాను.

 

  • vnl 1వారణాసి నాగలక్ష్మి

 

కారా మాస్టారు – కొన్ని జ్ఞాపకాలు

T Krishna Bai

తెల్ల మల్లు కట్టు పంచె, అర చేతుల చొక్కాతో సైకిల్ మీద సాయంకాలాలు పిల్లలకి పాఠాలు చెప్పేందుకు వెళ్ళే కారా మాస్టారిని 1960లలో విశాఖ ఎల్లమ్మతోటలో ఎరుగని వారుండరు. సెయింట్ ఆంథోని హైస్కూల్లో లెక్కల పాఠాలు చెప్పి, సాయంత్రాలు ప్రైవేట్లు చెప్పేవారు. జీవిక కోసం రేయింబవళ్ళు అంత కష్ట పడుతూ కుటుంబ భారాన్ని మోస్తూ కూడా సాహిత్యానికి అంత సమయం ఎలా కేటాయించేవారో ఆశ్చర్యం!

 

శ్రీకాకుళం జిల్లా మురపాకలో పుట్టిన కాళీపట్నం రామారావు గారు భీమిలిలో టీచర్ ట్రైనింగ్ తీసుకుని, విశాఖలో లెక్కల మాస్టారుగా పనిచేశారు. క్రమంగా విశాఖ రచయితల సంఘం సభ్యుడిగా, రచయితగా ప్రసిద్ధి పొందారు. అప్పట్లో ‘చిత్ర గుప్త’లో ‘కార్డు కథలు’ పేరుతో చిన్న కథలు రాసేవారు. తోటి టీచర్ మసూనా ఆయనకి సాహిత్యరీత్యా కూడా మిత్రుడే.

రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కారాని చాలా గౌరవించేవారు. ఆయన, ఐ. వి. సాంబశివరావు, ఎన్నెస్ ప్రకాశరావులు మాస్టారికి మార్క్సిజాన్ని పరిచయం చేశారు. కారా కిళ్ళీ ప్రియుడైన మాస్టారి గురించి ఎన్నెస్ లాంటి మిత్రులు చాలా ఛలోక్తులు విసిరేవారు. “ఆయన్ని ఏదయినా సందేహం అడిగితే వీధి చివరికి వెళ్లి నోట్లోని ఊట ఊసి తిరిగొచ్చి జవాబు చెప్తారు. ఈలోగా ఆయనకి ఆలోచించుకునే వ్యవధి వుంటుంది “, అంటూ ఎగతాళి పట్టించేవారు. విప్లవం రేపే వస్తుందంటే ప్రముఖులు ఎలా స్పందిస్తారనే ఊహల్లో కూడా, మాస్టారయితే, “ఆగండి , మరో నాలుగు ట్యూషన్లు చెప్పుకొచ్చేస్తాను” అంటారని విసుర్లు!

 

రామారావుగారి అర్ధాంగి సీతమ్మగారు చాలా సౌమ్యురాలు, ఓర్పుమంతురాలు. మాస్టారు చిరాకుపడితే కూడా ఆమె తొణికేవారు కాదు. ఆమె పిల్లల్ని కసురుకోవడం ఎన్నడూ చూడలేదు. ఆమె పోయాక పిల్లలు మాస్టారికి చేదోడువాదోడుగా వుంటూ ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. ముఖ్యంగా సుబ్బారావు రచయితగా, ప్రసాద్ లెక్కల మాస్టారుగా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు.

 

కారా కథలని 1970కి ముందు, వెనకలుగా విభజించ వచ్చు. ఎందుకంటే, అప్పట్లో దేశాన్ని కుదిపేస్తున్న నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట ప్రభావానికి లోనుగాని మేధావులు, పీడిత ప్రజల పక్షపాతులు ’70 లలో లేరనే చెప్పాలి. మాస్టారు కూడా ఆ ప్రభావానికి అతీతులు కారు. అందుకే ఆయన ’70 తరువాత రాసిన కథల్లో వర్గ విశ్లేషణ పూసల్లో దారంలా కనిపిస్తూనే వుంటుంది.

 

యాభై , అరవై దశకాల్లో అయన రాసిన కథల్లో లోతయిన జీవితాన్ని పరిచయం చేశారు. ఆయన పెరిగిన వాతావరణానికి, ఆ కథల వాతావరణానికి పోలిక లేదనిపిస్తుంది. అట్టడుగు వర్గాల జీవితాన్ని అంత సునిశితంగా ఎలా పరిశిలించారా అని అబ్బురమనిపిస్తుంది. ఆ జీవిత విశ్లేషణకి మార్క్సిజం తోడయ్యాక ఆయన దృష్టి కోణం విస్తరించింది. అప్పుడు వెలువడిన కథలు ఉన్నత శిఖరాలని చేరుకున్నాయి.

 

అగ్రవర్ణంలో పుట్టినా దళిత జీవిత మూలాన్ని కారా అంత చక్కగా ఎలా చిత్రించగలిగారా అని ఆశ్చర్యం వేస్తుంది. ‘రాగమయి’ లాంటి కథల్లో  అచ్చం మధ్యతరగతిని చూపిస్తే, ‘చావు’ కథలో దళిత జీవితాల్లోని దైన్యాన్ని చూపించారు. ముసలమ్మ దహనానికి కట్టెలు లేని పరిస్థితిని వివరిస్తూనే, ఆ కట్టెలు నిలవున్న చోటినించి వాటిని తెచ్చుకునే సాహసాన్ని కూడా ప్రదర్శింపచేశారు.

 

1964 లో రాసిన ‘యజ్ఞం ‘ కథ అర్ధం కావాలంటే తన ‘అప్రజ్ఞాతం ‘ చదవాలంటారు కారా. దాదాపు నలభై సంవత్సరాల కాలగమనం లో, స్వాతంత్ర్యానికి ముందు వెనుక, గ్రామాల్లో వచ్చిన మార్పుల్ని  ఎంతో గాడంగా  విశ్లేషించారు. కానీ ముగింపు మాత్రం  కార్మికవర్గ దృష్టి నించి కాక మధ్యతరగతి దృక్పధం నించి రాశారని మార్క్సిస్టులు విమర్శించారు.

ఆర్ధిక శాస్త్రం మూల వస్తువుగా ‘తీర్పు’ కథ వుంటుంది. ‘కుట్ర’ కథ నిజానికి ఒక డాక్యుమెంట్. కుట్ర అనదగ్గదేదైనా జరిగితే రాజ్యాంగం రాసిన కాడే జరిగుండాల. పంచవర్ష ప్రణాళికలు ఏసిన్నాడు డెఫినెట్ గా జరిగింది”, అంటూ చాలా వివరంగా కుట్రని బయట పెట్టారు మాస్టారు. ఈ కథ 1972 విరసం ప్రత్యేక సంచిక ‘నిజం’లో వచ్చింది. ఆయన కథలు అర్థం చేసుకోవాలంటే అలవోకగా చదవడం కాదు. ఒకటికి నాలుగు సార్లు చదవాలి. అంత నిగూఢంగా, గాఢంగా రాస్తారాయన. ‘కుట్ర’ అయితే పదిసార్లు చదవాలి తాపీగా – రాజకీయపరంగా , సైద్ధాంతికంగా అద్భుతంగా చిత్రించారు పరిస్థితుల్ని.

 

చిన్న కథ నించి పెద్ద కథ వరకు సునాయాసంగా రాయగల కారా, ఆయన చెప్పదలుచు కున్న విషయం కోసం, వివరించవలసిన జీవితం కోసం, విశ్లేషించవలసిన ప్రపంచం కోసం  పెద్ద కథనే ఎంచుకున్నారు. కానీ ఏ ప్రక్రియకైనా దాని ప్రత్యేకతలు ఉంటాయని ఆయన నమ్ముతారు.

‘బారెడు పొద్దెక్కింది’ అని రాయాలంటే, ఆ వేళకి ఎండ ఎక్కడి దాకా వస్తుందో అడుగులు వేసుకుని కొలిచే మాస్టారి పద ప్రయోగాలు కూడా అబ్బుర పరుస్తాయి.

“పువ్వప్పుడే మిడిసిపడితే పిందప్పుడే రాలిపోతాదని సామెత ”

“పొద్దల్లా అమ్మేది ముత్తువైతే , పొద్దోయి అమ్మేది పొందుం ”

“ఒళ్లెరబెట్టి ఆణ్ణి తెచ్చుకోడమయితే నా సేత కాదు”

“వరి కంప మీద పట్టు కోక తీసినా దక్కదు, తియ్యకున్నా దక్కదు” వంటి పదాల్లో   పల్లెల సువాసన గుబాళిస్తుంది.

 

‘హింస’ కథ చిన్నదే కానీ చిత్రణ అమోఘం. అక్క స్నానం చేస్తుంటే చూసిన చెల్లి, “అప్ప వీపు, భుజాలు కూడా తెల్లగా వున్నాయి. కోవటి బామ్మర్లలా రైకలేస్తాది కావాల!” అనుకుంది. ఉత్తరాంధ్ర శ్రామిక స్త్రీలు రైకలేసుకోరు. ఆ చెల్లి కథ చివరలో చూపించే ఆవేశం మనకి అర్ధం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి, ఆమె గుండె మనకుండాలి అంటారు మాస్టారు.

 

 

మాండలికం మీద వాదోపవాదాలు జరుగుతున్న కాలంలో మాస్టారు ఎన్నో విలువైన ప్రతిపాదనలు చేశారు. ఆయనకి భాష మీద వున్న పట్టు గొప్పది. కొత్త రచయితలకి ఆ కిటుకులు నేర్పేవారు. ‘బండోడు’ అనే మాటని రాసి పలకమనేవారు ‘బండివాడు’, ‘బండవాడు’ అనే రెండు అర్థాలు మౌఖికంగా మాత్రమే ఎలా స్ఫురిస్తాయో వివరించేవారు. అలానే సమకాలీన ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి వస్తువు, శిల్ప వైవిధ్యాలను చూడమనేవారు. దాని కొనసాగింపుగానే ‘నేటి కథ’ పేరుతో కొత్త కథకులని ప్రోత్సహించారు.

 

ఒకసారి మాస్టారు సంక్రాంతి మిత్రుల సమావేశానికి కృష్ణా జిల్లా వచ్చి దివి తాలూకా పర్యటించారు. దళితుల జీవితాలు అన్నిచోట్లా ఒకేలా, ఊరి బయట నికృష్టంగా ఉన్నాయని వాపోయారు.

ఆయనకి జీవితం పట్ల ప్రేమ , ఆశ, ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా జీవించగలననే ధీమా, పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకోగాలననే తపన. అందుకే – “బజ్జీలు అమ్ముకునయినా బతికేస్తాను” అనేవారు.

 

ప్రజలు, ప్రజా పోరాటాల పట్ల ఆయన నిబద్ధత ఆయన కార్యాచరణలో తెలుస్తుంది. విశాఖ రచయితల సంఘం నించి విప్లవ రచయితల సంఘం వరకు ఆయన చేసిన ప్రయాణంలో కూడా ఆయన ఎదుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత కారణాల వల్ల  1975లో విరసానికి రాజీనామా చేసినా, సంస్థ అంగీకరించక పోవడం వల్ల ’80 ల దాకా ఆయన విరసం సభ్యులే ! ఆ తరువాత కూడా కారా గారు, రావి శాస్త్రి గారూ కూడా విరసం నిర్మాణంలో లేక పోయినా, విరసం తోనే ఉన్నామని బహిరంగంగా ప్రకటించారు. ప్రజల పక్షానే నిలిచారు.

 

తెలుగు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కారాగారి వైపు, ‘కథా నిలయం’ వైపు చూడాల్సిందే.  కొత్త తరాలకి ఊపిర్లు పోసి ప్రోత్సహించే మాస్టారు ఇంకా ఎంతోమంది కథకులకి బాసటగా నిలిచి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి చేయాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

 

—  కృష్ణా బాయి 

    25-10-2014

 

 

 

 

కధలకో ఇల్లు

16

మనకు గ్రంధాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంధాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంధపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంధ సేకరణ, భద్రతలకు ప్రయత్నించాయి. స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టాయి. దాతలు విరాళాలు అందించారు. ఈ గ్రంధాలయాలు ఆరంభ లక్ష్యాలను చాలావరకు సాధించగలిగాయి. వినోదంకోసం చదివేవారికి ఇతర వినోదసాధనాలు అందుబాటులోకి రావటం, ఆసక్తిగా, ఆబగా చదవగలిగిన వయసులో పిల్లలకు పాఠ్యపుస్తకాలకు వెచ్చించాల్సిన సమయం అపరిమితంగా పెరిగిపోవటం వంటి పరిణామాలతో గ్రంధాలయాల వినియోగం తగ్గింది. ఒకప్పుడు జీవికనిచ్చిన అణా లైబ్రరీలూ, సర్క్యులేషన్ లైబ్రరీలూ అవి ఆధారపడిన పుస్తకాలు ఏ కోవకి చెందినవైనా కనుమరుగవసాగాయి. భద్రపరచటానికి అవసరమైన స్థలం, సంకల్పబలం, సాధనాలు కొరవడటంతో అనేక పత్రికలు పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోసాగాయి. కనీసం అంగబలం, అర్ధబలం కల పత్రికలు సైతం తమ పత్రికలనైనా భద్రపరచటానికి గట్టిగా పూనుకోలేదు.

ఈ స్థితిలో-
శ్రీ కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలో రూపంలో తెస్తే, తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.
అలా పుట్టింది 1996లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావు గారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తి గారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రధమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలుగాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.

2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను( దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపధ్యాన్నీ సమాజ నేపధ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఆయా కథలు వెలువడిన వెంబడే వచ్చిన స్పందనలు, ఆ మీదట విమర్శకుల తూనికలు వగైరా సమాచారమంతా పోగుచేయటానికి కృషి జరుగుతోంది. దీనికి తోడుగా రచయితల గొంతులను , ఛాయాచిత్రాలను, జీవిత వివరాలను కూడా సేకరించి భద్రపరచాలని ఆలోచన ఉంది. ఈ పనులు కూడా మొదలయాయి.

ఈ సమాచారానికి వినియోగం ఉండాలి. అందుకోసం-
ఇదంతా క్రోడీకరణ జరగింది. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్సైట్ ఏర్పడింది.

పోతే-
ఈ కృషిని ఇంతవరకూ ఉపయోగించుకున్నవారెవరు?
విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్ధులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు. ఈ వెబ్సైట్ వారందరికీ మరింత సేవలు అందిస్తుంది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “ కథాకోశం” తీసుకు వచ్చింది. అనేకమంది రచయితలు తమ సంపుటాలను ప్రచురించారు.

కాళీపట్నం రామారావు గారు తమ సాహిత్య ఆర్జన అంతటినీ వినియోగించి 1997లో కథానిలయం పేరిట ఈ యజ్ఞం ఆరంభించిన తరవాత తనకి లభించిన పురస్కారాల సొమ్ము కథానిలయానికే ఖర్చుపెట్టారు. ఎందరెందరో చేతులు వేసి కథానిలయాన్ని ఇప్పుడున్న స్థితికి చేర్చారు. 15 వేల మంది రచయితల పేర్లతో వెలువడిన, 900 పత్రికలలో ప్రచురించబడిన, 2600 కథా సంపుటాలలో, 400 కథా సంకలనాలలో చేర్చబడిన   86వేల కథల వివరాలు కథానిలయం వెబ్ సైట్ లో లభిస్తున్నాయి. కథానిలయం గ్రంధాలయం కథానిలయం ట్రస్టు నిర్వహణలో నడుస్తోంది.

కథానిలయం వెబ్ సైట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు మనసు ఫౌండేషన్, బెంగళూరు స్వీకరించింది.

ఈ రెంటితోనూ సంబంధం లేకుండా తన స్వంత ధనంతో కాళీపట్నం రామారావు గారు ఆరంభిస్తున్న మూడవ పూనిక ఈ కారాయజ్ఞం అనే పుస్తక ప్రచురణ సంస్థ. దీని బాధ్యత కాళీపట్నం సుబ్బారావు, కాళీపట్నం వెంకట సత్యప్రసాద్, వివిన మూర్తిలకు అప్పగించారు. దీని లక్ష్యం కాళీపట్నం రామారావు గారికి నచ్చిన పుస్తకాలను ప్రచురించటం, వాటిని పాఠకులకు లాభాపేక్ష లేకుండా చవక ధరలకు అందించటం. ఈ ముగ్గురూ కారా సాహితీ అభిరుచుల మేరకు ఈ ప్రచురణలను కొనసాగించుతారు. తొలి ప్రయత్నంగా కారా మాస్టారికి 90 ఏళ్లు నిండుతున్న సందర్భంగా మూడు పుస్తకాల ప్రచురణ జరుగుతోంది.

మహమ్మద్ ఖాసింఖాన్ గారు 1944లో ప్రచురించిన కథానిక రచన మొదటిది.

రెండవది కోర్టుమార్షల్ అనే హిందీ నాటకానికి దాసరి అమరేంద్ర గారి తెలుగు అనువాదం.

1950 లవరకూ కథల మీదా, కథకుల మీదా, కథా వ్యాకరణం మీదా పత్రికలలో వచ్చిన వ్యాసాలు అన్నింటినీ సేకరించిన వ్యాస సంకలనం మూడవది. ఇది కథానిలయం 2015 వార్షికోత్సవం సమయానికి వెలువడుతుంది.

ఇటువంటి ప్రయత్నం కొనసాగాలంటే జనం సహకారం, ఆదరణ ముఖ్యం. ఉత్తమ సాహిత్యం ఉత్తమ సమాజానికి దోవ చూపిస్తుందన్న నమ్మకంతో లాభాపేక్ష లేకుండా కారా మాస్టారు ఆరంభిస్తున్న మూడవ పూనిక ఈ కారాయజ్ఞం ప్రచురణలని బ్రతికించుకునే బాధ్యత జనందేనని విశ్వసిస్తున్నాం.

vivinamurthy

vivinamurthy

-వివిన మూర్తి

ఇక కథా నిలయం తెలుగు ప్రజల బాధ్యత : కారా మాస్టారు

IMG_0011

 

ఒక వీసెడు బరువున్న పదార్ధమేదో సుందరరామయ్య ఒడిలో పడింది … (తీర్పు కధ మార్చి 1964)

టక్ దబ్ మన్న శబ్దంతో ఒక తలా, చిన్న దేహమూ … పంచాయితీ మండపం ముందు గోనెసంచీలోంచి రాలేయి. (యజ్ఞం కధ రచనాకాలం 1964 జనవరి – ఏప్రిల్ ప్రచురణ 01-01-1966)

బహుశా, ఇటువంటి బరువైన పదార్ధం, ఇటువంటి శబ్దం, అంతకు ముందర తెలుగు కధాసాహిత్యం యెరిగుండదు. ఆనాటి నుండీ, తెలుగు కధా సాహిత్యావరణాన్ని తొలినాట పెను శబ్దంతోనూ, యిపుడు పెను మౌనంతోనూ ప్రభావితం చేస్తున్న యేకైక వ్యక్తీ .. శక్తీ శ్రీ కాళీపట్నం రామారావు. యజ్ఞం రాసినందుకు కధా సోమయాజి అనంటుంటారు. (సోమయాజి యజ్ఞం వేరూ, కారా యజ్ఞం వేరూ అయినా సరే, మరో పోలిక లేకేనేమో?) ఒక సడలని దీక్ష, అంకిత భావం, విరామమాశించని శ్రమతత్వం … కలగలసిన వ్యక్తిత్వం కాళీపట్నం! కధ పట్ల గల వల్లమాలిన ప్రేమకీ, సమాజమ్మీద యెనలేని గౌరవానికీ (సాహిత్య సమాజం), సమాజం నుంచి పొందినదేదయినా ఋణమనీ, దాన్ని తిరిగి తీర్చాలన్న ఆదర్శానికీ … నిలువెత్తు రూపం కాళీపట్నం రామారావు నిర్మించిన, శ్రీకాకుళంలోని కధానిలయం!

వృత్తిరీత్యా మాస్టారయిన కాళీపట్నం ప్రవృత్తి రీత్యా గూడా కధ మాస్టారైనారు. ఎందరెందరో సవ్యసాచులూ, ఏకలవ్యులూ (గురుదక్షిణ చెల్లించకుండానే!) వున్నారతని శిష్యబృందంలో! కధల మాస్టారు, కాళీపట్నం రామారావు మాస్టారు తొంబయి ఒకటవ జన్మదిన శుభ సందర్భాన, సారంగ పత్రిక మాస్టారి రచనలను మళ్ళీ పరిచయం కాదు .. పరిశీలించడం చేస్తుండడమేగాక, మాస్టారిని ఇంటర్వ్యూ చేయదలచి, నన్ను సంప్రదించడం, మాస్టారి అనుమతి తీసుకోవడం (సహజంగా ఆయన ఇంటర్వ్యూలకు సాధ్యమయినంత యెడంగా ఉంటారు, అందులోనా యిపుడు వయోభారం) జరిగింది. మాస్టారితో ఇంటర్వ్యూకి నేను యేవో కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకొని వెళ్ళి, ఆరంభించినా, యెక్కువగా కబుర్ల రూపంలో సాగింది. ఆ కబుర్లలో, నా ప్రశ్నలకేగాక, అదనంగా, వీటివలన ఆయనకు గుర్తుకొచ్చిన యెన్నెన్నో భోగట్టాలు చెప్పారు (సాహిత్యపరమైనవే). ఆ భోగట్టాలల్లో ఆయన తన వ్యక్తిత్వాన్ని, సాహితీ వ్యక్తిత్వాన్నీ యెలా నిర్మించుకొచ్చారో, యేమేమి నేర్చుకున్నారో, (ఇప్పటికీ నేర్చుకుంటుంటానంటూ – ఒక వివినమూర్తి, రాయుడు గారు, రజనీకాంత్ వగైరా కొన్ని పేర్లు చెపుతూ) తెలియజేశారు.

యేదయినా కొత్త విషయాన్ని వినడానికి సంశయించకూడదనీ, వినీ దానిని మనదైన పరిశీలనతో మంచి, చెడ్డల విశ్లేషణ చేసుకొని నిర్ధారణకు రావాలనీ … అపుడే మార్పులపట్ల సాంప్రదాయక ఆలోచనాధోరణిని తొలగించుకోవడం సాధ్యమవుతుందనీ (ఇది మార్క్సిస్టులకూ, నాన్ మార్క్సిస్టులకూ యిరువురికీ వర్తించుతుంది) చెప్పారు.

IMG_0006

చాలా సందర్భాల్లో యెన్నో విషయాలు (నేను గ్రహించాననుకున్నవి) –

జీవితాన్ని చిత్రించడం, విశ్లేషించడం, అవగాహన పెంచడం, పాఠకుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడం కధ లక్ష్యం…

జీవితంలో దుఃఖముంది. కానీ దానికి కారణం సమాజంలో వుంది. సమాజంలోని వర్గమూలాల్లో వుంది….

లోకంలో జరుగు అతి చిన్న దోషాల నుండి మహాదోషాల వరకు వాటి మూలాలను చూసి కారణాలను వెదికి పట్టుకొని చిత్రించితే రచన నిజాయితీగా, ఆదర్శంగా వుంటుంది….

మనం అనుభవించే సౌకర్యాలుగానీ, మనం తీర్చుకునే రోజువారీ జీవనావసరాలుగానీ, కేవలం మన శ్రమతో మాత్రమే లభించడంలేదు గదా, అనేకుల శ్రమ వలన లభిస్తున్నవి గదా, గనుక అనేకుల పట్ల మనకు బాధ్యత వుంది. అనేకులే సమాజం –

యిలా కొన్ని చెప్పాననీ … ఇంటర్వ్యూలిచ్చాననీ, నేనెందుకు రాసేనూ, నేనూ నా జీవనదృక్పధం వంటి శీర్షికల పేర్లు చెప్పారు. అలాగే యజ్ఞం, కుట్ర, తీర్పు వంటి కధల మీదా, వాటి నేపధ్యం (ఇటీవల జీవధార నేపధ్యం, కధా నేపధ్యం-1) గురించీ చెపుతూ, తాను ఆదిలో రాసిన కధల దారి నుంచి మళ్ళడం వెనక మారిన తన దృష్టికోణం, దృక్పధాల గురించీ గూడా చెప్పాననీ, అవన్నీ మనసు ఫౌండేషన్ కాళీపట్నం రామారావు రచనలు పుస్తకంలో వుండొచ్చనుకుంటానన్నారు (ఉన్నవి గూడా).

దీంతో అటువంటి పాత ప్రశ్నలు వేయకు సుమా అని మాస్టారు చెప్పక చెప్పారనిపించింది. మాస్టారు తన సృజనాత్మక రచనల్లో చెప్పక చెప్పడమనే మార్మిక శైలి ఉండదు … కుండలు బద్దలు గొడతారు. సృజనాత్మకేతర రచనల్లోనే యీ గుప్తతా, మర్మం. అది అతని వ్యక్తిత్వ శిల్పం. దీన్ని ఆతని రచనాశిల్పమని కొందరు విమర్శకులు సూత్రీకరించేరు, గాని ఆ సూత్రీకరణ కరెక్టు కాదు.

‘చావు వంటి కధలో మాస్టారు, పాఠకునికేమి యెరుక చేయాలనుకున్నారో, కధాంతాన (మొత్తం కధలో వ్యక్తమైనా సరే) .. “ముసిల్ది నిన్న పోతే యీ వేళ్టికి రెండు. కాని, సంధికాలంలో తెలివేసి వున్నవాళ్ళకలా అన్పించదు. నిన్నానేడూ అంతా ఒక్క లాగే వుంటుంది.” అని చెప్పారు. ఇది మాస్టారి మరికొన్ని కధల్లో గూడా చూడవచ్చు.

అలాగే, చెప్పక చెప్పడం, గుప్తం, మర్మం వంటి వాక్యాలు వ్యాసాల్లోనా, అభిప్రాయాల ప్రకటనల్లోనా, లేఖల్లోనా చూడగలం. ఇందుకొక ఉదాహరణ … చావు కధ మీద ఒక సంపాదకుడి అభిప్రాయానికి జవాబుగా రాసిన సంజాయిషీ! (మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘కాళీపట్నం రామారావు రచనలు’, పుట.344) ఇది చదివితే మాస్టారు, తనదైన అభిప్రాయాన్ని, ఆలోచననీ, తన ధోరణినీ చెప్పక చెప్పారనిపిస్తుంది. నిజానికది సంజాయిషీ శీర్షికతో వున్నదిగానీ, అది సంజాయిషీ కాదు, తన రచనా దృష్టి కోణాన్నీ, శైలినీ సమర్ధించే వాదన. వాదన మాత్రమే కాదు అవతలివారికి బోధన (వెల్చేరు నారాయణరావుగారు పోల్చుకున్నారు!) ఈ విషయాన్ని ఔనంటారా, కాదంటారా మాస్టారూ అనడిగితే నవ్వుతూ ఔనన్నారు.

అప్పుడే – మాస్టారొకచోట, తనమీద తన మిత్రుడు (టీచర్ ట్రైనింగ్ కాలంలో ) రాసిన పద్యాన్ని తన పుస్తకంలో రాసుకోగా చూశాను … “వచన కవిత్వం వైఖరుల వ్రాయసకాడు…” అని ఆరంభమయి “… రామారావు మొగమాటమొకింతయు లేనివాడా, రామారావు మాస్టారని!’ ఆ ముక్కే అడిగేను.

IMG_0007

మాస్టారెంతటి మొగమాటో అని లోకమనుకుంటోంది. ఏది నిజం మాస్టారూ..?

అప్పుడూ, యిప్పుడూ, యెప్పుడూ భావజాలం దగ్గరా, దృష్టికోణం దగ్గరా నిర్మొహమాటినే. కాకపోతే, ఆ సంజాయిషీలా వుంటుందిప్పటి శైలి – అని బదులిచ్చేరు! “బాబయ్యా! నువ్వెంతకైనా సాహసివి …” (యజ్ఞం కధలో అప్పల్రాముడు, శ్రీరాములు నాయుడితో) అనుకున్నాను మనసులో.

దేశీయత, కధా నిర్మాణం, వ్యక్తీకరణ మొదలైన వాటిలో నేర్పు వల్ల శిల్ప సౌందర్యమేర్పడుతుంది… అని మాస్టారు అంతకుముందర చెప్పిన విషయమేగానీ శైలి విషయం చర్చకు రావడంతో మళ్ళీ వివరించేరు. దాంతో – శిల్పం కోసం సాహిత్యాన్నీ, వస్తువు కోసం జీవితాన్నీ అధ్యయనం చేయాలని కొ.కు. అన్నారు గదా… మీ అనుభవంలోంచి దీని సాధికారత చెప్తారా? అంటే, నాకిక్కడ కొ.కు.తో విభేదమేమీ లేదు గానీ, వస్తువే రూపాన్ని(శిల్పాన్ని) యెంచుకుంటాదంటారు …. ఈ మాటకీ పై మాటకీ తేడా వున్నట్టుంది కదా? పైగా శిల్పానికి ప్రాధాన్యతనిచ్చినట్టుగా మీ కధలుండవు, కొ.కు. కధలు గూడా! శిల్పమనే అంశమ్మీద చర్చించే యెక్కువమందికి శిల్పం మీదగల భావనను దృష్టిలో పెట్టుకుని యీ సంశయం నాకు … మీరేమంటారు, అని ప్రశ్నించేను.

మాస్టారు కాసేపు మౌనంగా తలవాల్చి , తర్వాత కిల్లీ కోసం కళ్ళతో వెదకబోయేరు. నాకర్ధమైంది. యే సందర్భాల్లో కిల్లీ యెందుకు వేయబోతారో, యెరిగున్న వాణ్ణి గనక మాస్టార్నీ ఈ ప్రశ్న నుంచి మళ్ళించదలచి – ఆదివారం వంటి మంచి కధను గూడా మీరు నాలుగేళ్ళు అచ్చుకివ్వకుండా దాచిపెట్టానన్నారుగదా, యెందుకలా? ఏ అసంతృప్తి వలన? మాకేమో యివ్వాళ గూడా అందులో అసంతృప్తేమీ కనబడలేదు, చెప్పరా అనడిగేను.

అప్పటికాయన సర్దుకున్నట్టుంది – వుండుండు… శిల్పం గురించి గదా, అడిగేవు” అనంటూ – నా వరకు శిల్ప సౌందర్యమంటే ప్రయోజనమే! ఇంతకుముందీ విషయమ్మీద యెవరెవరో ప్రశ్నిస్తే చెప్పాను గూడా … మైసుర్ దగ్గర డామ్, తాజ్ మహల్ అనేదో అన్నాను. ఇపుడూ, శ్రీపాద వారి ‘వడ్లగింజలు’, రావిశాస్త్రిగారి ‘తప్పు, పిపీలికం, వేతనశర్మ’ వంటి కధలున్నాయా? అవి, ప్రయోజనాన్ని సాధించడంతోపాటు అవి అందంగా తయారవడానికి శిల్ప సౌందర్యం కారణం… అని ఆగిపోయేరు. ఇంక మరి దీని మీద మాటాడరు, మనమే యిప్పుడు మాటాడినదాన్ని బట్టీ, గతంలో చెప్పినదానిని బట్టీ, దీని గురించి ఆతని అభిప్రాయానికి రావాలంతే! రావచ్చు గూడా!

కాసేపటి తర్వాత, ‘ఆదివారం’ కధ గురించి – “ఆ కధ బాగానే ఒచ్చింది. అయితే, అందులో శ్రమ ఉత్పత్తి శ్రమ కాదు. సేవకశ్రమ, ఉత్పత్తి శ్రమ వేరు, సేవాశ్రమ వేరు. గడుసుదా పిల్ల. అటువంటి పాత్రను సృష్టించేను. నాకేమిటంటే ఆ అత్తగారికీ పోటీ పెడితే తెలివైనదనుకున్న కోడల్నిగూడా యీ పిల్ల జయించడం…. దీని కోసం కధ రాసేను. అది తక్కిన వాటి లాంటి సబ్జెక్టు కాదు. అంచేత వుంచేశాననుకుంటాను…. అని చెప్పారు.

కొంతసేపు ఆ కధ గురించే ఆలోచించారో, యేమోకాని….. అన్నింటికి డిపెండెంట్లుగా మనుషులు తయారైనారు. కొన్నింటికి మనుషుల మీద, కొన్నింటికి యంత్రాల మీద. ఇదెక్కువయ్యిందిపుడు. సేవలు కావాలి. సేవల్ని మార్కెట్ సొమ్ము జేసుకోవడం చూస్తున్నాం కదా? ఇదీ… అని దీర్ఘం తీస్తూ ఆగిపోయేరు, యిక మనం తర్వాతది ఆలోచించుకుంటే బోధపడుతుంది.

మార్కెట్ గురించి వచ్చింది గనక వ్యాపార సాహిత్యమనీ, వ్యాపార పత్రికలనీ వేటినయితే మీ కాలంలో (అపుడవి మీకెంతో స్థానాన్నిచ్చినాయి కూడా) అనేవారో (పెట్టుబడికీ కట్టుకధకీ పుట్టిన పత్రికలనీ శ్రీ శ్రీ అన్నారు గదా) అవే యీ నాడు అందరికీ ఆధారభూతమైనాయి. అందులోనే అందరూ కధలు రాయాల్సొస్తోంది, ఏటేటా కధా సిరీస్ లోకి కధలను యీ పత్రికల నుంచే యెక్కువగా తీసుకుంటున్నారు…. కధల పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారొకవేపు. పత్రికల ఆలోచనల్లో మార్పు రావాలని అపుడే గొప్పకధలూ, మంచి కధలూ వస్తాయని కొందరంటున్నారు. దీని గురించి చెప్తారా- అని పెద్ద ప్రశ్నయే అడగ్గా…

సమాజంలో అన్ని విషయాల్లో నిన్నటికీ, నేటికీ మార్పులు వచ్చినట్లే పత్రికల విషయంలోనా వచ్చింది. వ్యాపారమన్నాక, దృష్టి లాభాల మీద వుంటుంది. పత్రికల వలన మాత్రమే మంచి కధలు రావు… అని చెప్తూ ఆగిపోయేరు.

ఆ ఆగిన సంభాషణ, తొలి ప్రశ్నకు అనుబంధంగా – మీరు కధలు రాయడమారంభించిన నాటి కాలంలోని పత్రికారంగ పరిస్థితులకీ, నేటికీ చాలా మార్పు వచ్చింది గదా, ఈ మార్పు సాహిత్యానికి మీ కాలంలోలాగా దోహదపరిచేదిగా వుందంటారా– అన్న మలి ప్రశ్నతో కొనసాగింది.

ఆ కాలపు పత్రికల వ్యవస్థాపకులు సంఘ సంస్కరణకీ, జాతీయ దృక్పధానికీ, సేవాభావానికీ కట్టుబడి వుండేవారు. ప్రసిద్ధ సాహితీపరుల సంపాదకత్వంలో పత్రికలు నడిచేవి. 1950ల్లో పెట్టుబడి ప్రవేశించింది. అంతకుముందూ పెట్టుబడే గానీ, 50ల తర్వాతి పెట్టుబడివంటిది గాదు. అదీ గాక యింకొవేపు భారీ యంత్రాలు వచ్చేయి. పనిగంటలు మిగిలేవి, ఫలితంగా గొలుసు పత్రికలు రావటం, వాటి నిర్వహణ… దానితో విలేకరులు, సంపాదకులు, విస్తరణా, పోటీ … దాంతో గతకాలపు వారి స్థాయికి తక్కువవారి ప్రవేశం జరిగింది. పెట్టుబడి లబ్ది కోసం విలువల రాహిత్యం, పిల్లలు, ఆడవారు, యువత –వార్ని ఆకర్షించడం లక్ష్యం… వార్తలకూ, జీవితమ్మీద విశ్లేషణకూ బదులు సరుకుల ప్రచారం కోసం … నేటి పత్రికలు ప్రాధాన్యమిస్తున్నాయనిపిస్తోంది. ఈ మార్పు సాహిత్యానికి దోహదపడుతుందని యెవరయినా అనగలరని అనుకోనన్నారు….

వస్తువు, భాష, శైలీ వంటి విషయాల పట్ల , యిప్పటి పత్రికలు అప్రకటితంగా తమ విధానాన్ని అమలుచేస్తున్నాయి. మాండలికాలపట్ల, గ్రామీణ జీవిత చిత్రణపట్ల, రాజకీయార్ధిక సంబంధ అంశాల కధల పట్ల పెదవి విరుపుడు, నాన్పుడూ, తిరస్కారమూ కనిపిస్తోంది… అని యెక్కువమంది రచయితలంటున్నారు. మీరు రాయకపోయినా నిత్యం సాహిత్యపఠనంలోనూ, సాహిత్యావరణం లోనూ వుంటున్నారు కదా, మీకేమన్పిస్తోందన్న ప్రశ్నకు –

ఇది నిజమే కావచ్చు. ఇప్పటిలానే, యింతకుముందరా యీ ధోరణి వుంది. ఒక నాడు స్త్రీల రచనలకు, యింకో నాడు సస్పెన్స్, ధ్రిల్లర్ వగైరాలకూ స్థానమిచ్చి, మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేసేవారు. రావిశాస్త్రిగారి రచనలనే పైన పేర్కొన్న రచనల గేప్ లల్లో ప్రచురించేవారు… పెట్టుబడి యిబ్బడిముబ్బడిగా ప్రవేశించాక జరిగిన పరిణామమిదనుకుంటాను … అని ఆగిపోయేరు.

కధల్లో అంతరంగ విశ్లేషణ కనబడే కధలు గొప్ప శిల్పనిపుణతకు ఉదాహరణలంటారు గానీ, మీ కధల్లో అంతరంగ విశ్లేషణ (సంకల్పం, అన్నెమ్మ నాయురాలు, అంతకుముందరి తొలినాటి కధలు తప్పా) తక్కువని నేనంటాను. కానీ గొప్ప దృశ్యీకరణ, నాటకీయత, సహజసిద్ధత, వస్తువులోంచి యెరుకపరిచే కధాంశం… యివీ మీ కధల గొప్పతనాలని నాకన్పిస్తోంది. అపుడు అంతరంగ విశ్లేషణ మాత్రమే గొప్ప శిల్పమనే భావన తప్పు గదా?

నీ విశ్లేషణ సరయినదే… వారి వారి అభిరుచులను బట్టి శిల్పం పట్ల అభిప్రాయాలుంటాయి. ప్రతివ్యక్తికీ అంతరంగం వుంటుంది. ఆ అంతరంగమ్మీద లేదా ఆ వ్యక్తి మీద బాహ్యప్రభావాలుంటాయి. కుటుంబ, సమాజ ప్రభావాలుంటాయి… వీటికి మళ్ళీ ఆ వ్యక్తి ప్రభావం లేదా ప్రమేయం వుటుంది. ఈ పరస్పర ప్రభావాల పట్ల అవగాహన ముఖ్యం…

మీ తొంబయ్యేళ్ళ జీవితమ్మీద మీ వ్యాఖ్య?

ఫలవంతమైనదని అనుకోవచ్చేమో

మీ సాహిత్యమ్మీద మీ వ్యాఖ్య?

రాయవలసినవి కొన్ని రాయలేకపోయా, కానీ రాసినవరకూ దాదాపు తృప్తినిచ్చాయి. కొన్ని అసంతృప్తి కలిగించేవి గుర్తించేను, వాటిని తర్వాత తెలుపుతా…

ఈ ముక్క ఆయనన్న తర్వాత అసంతృప్తి గురించి వివరాలడగాలనిపించింది గానీ, ఆయన యింకేవో కబుర్లలోకి వెళ్ళారు. అవి వింటుండగా, వారి పాత కధలు గుర్తురాగా, ఒక ప్రశ్న వేయాలన్పించింది. అదేమిటంటే- మాస్టారు, తొలి కధల్లో స్త్రీ జీవన అస్తిత్వానికీ, ఆత్మ గౌరవానికీ, పురుషాధిపత్య వ్యతిరేకతకీ (‘పురుషపులి జాతి స్వభావానికి యెలా అప్పగించనూ?’ అని కధా నాయక అంతరంగంలో తర్కించుకుంటుంది. – ‘అవివాహితగానే ఉండిపోతా’ కధ, 1946) ఆలోచనలు రేకెత్తించే (రేవతి, నవచైతన్యం, అవివాహితగానే ఉండిపోతా .. వగైరా) కధలు రాసిన మాస్టారు, ఆ తర్వాత అటువంటి కధలను రాయలేదు. ఇటీవల అస్తిత్వవాదాల సాహిత్యం (స్త్రీ వాద) పై మాస్టారి అభిప్రాయమేమిటి?

మాస్టారు నవ్వేసి, ఆదిలో రాసిన మాట నిజమే. అప్పటికది ఆదర్శవాద దృష్టి కోణం. ఆ కోణానికీ ఈ నాటి స్త్రీవాదానికీ సరిపోల్చగూడదు. అది సానుభూతివాద ఆదర్శం. నేటి స్త్రీ వాదులు తమ అస్తిత్వ చైతన్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇది అనివార్యం. నేనెందుకు రాయలేదంటే, నా దృష్టి కోణం మారిన దశలో యెక్కువగా వర్గ వైరుధ్యాల గురించే పట్టించుకున్నాను. అదీగాక నేను రాయడమే చాలా తక్కువ సంఖ్యలో…. అంచేతనుకుంటానని ముగించారు.

కధా నిలయం గురించి మాటాడకుండా ముగిస్తే మీరొప్పుకోరు. ఆవు వ్యాసంలా యెటూ నుంచి తిప్పినా కధా నిలయంకే వస్తారని మీ గురించంటారు. చెప్పండి, కధా నిలయం నేటి స్థితీ, భవిష్యత్ స్థితి పట్ల మీ ఆలోచనలు…

నేను ఊహించిన దానికంటే బాగుంది. కానీ ఆశ్చర్యపోయేట్టుగా, ఆధునిక టెక్నాలజీ వలన యింకా అభివృద్ధి కావాలి. వివినమూర్తి ఆ దిశలో కృషి చేస్తున్నాడు. ఆదిలో యగళ్ళ రామకృష్ణ, రామారావునాయుడూ, నువ్వూ, మరికొంతమందీ… యిపుడు, వివినమూర్తి, సుబ్బారావు, దాసరి రామచంద్రరావు ప్రత్యక్షంగానూ, యెంతోమంది పరోక్షంగానూ కధా నిలయానికి సేవలందిస్తున్నారు. ట్రస్ట్ సభ్యులూ, కధానిలయం అభిమానులూ … కధా నిలయం భవిష్యత్ పట్ల దిగులు పడాల్సిన అవసరం లేదన్న నమ్మకాన్ని కలిగించారు. ఇంకా తెలుగు ప్రజలు కధా నిలయాన్ని తమ పరం చేసుకోవాలి, యిదీ నా కోరిక…

దాదాపు మాస్టార్ని ప్రశ్నించదలచినవన్నీ అయిపోయేయి. నిజానికి మాస్టారు, నా ప్రశ్నల కంటే యెక్కువ కబుర్లను కలబోసుకున్నారు. యజ్ఞంకధ మీద కొండపల్లి సీతారామయ్య, (సీతారాముడు తన కొడుకుని చంపుకోడం అన్యాయం అంటూ అజ్ఞాత పత్రికలో రాసేరట…) రంగనాయకమ్మ నుంచి యిటీవల విమర్శ రాసిన విద్యాసాగర్ దాకా ప్రస్తావించేరు. వీరెవరికీ సమాధానం రాయలేదనీ, ఆదిలో రంగనాయకమ్మగారి విమర్శకు ఆగ్రహమొచ్చి సమాధానం రాస్తే, చూసిన రావిశాస్త్రి గారు ఆపి వేశారనీ… కధను రాసేసి బయటకు వొదిలేక, యిక దాని గురించి లోకం యేమయినా అనుకుంటుందనీ, దాని గురించి మనం పట్టించుకోకూడదనీ, కన్నకూతురి గురించి తల్లడిల్లే కన్నతండ్రిలా కధ గురించి తల్లడిల్ల రాదనీ… యిలా యేవో రావిశాస్త్రిగారు చెప్పారు. నేనూ ఆలోచనలో పడ్డాను. ఆనాటి నుంచీ, నేను నా కధల మీద వచ్చే యే విమర్శకూ సమాధానం రాయలేదంటూ.. ఆఫ్ ది రికార్డుగా, ముఖ్యమైన, పైన పేర్కొన్న అన్ని విమర్శలకూ తన సమాధానం చెప్పారు.

కాసేపు తర్వాత, మళ్ళీ యజ్ఞం కధ రాయడం గురించి చెప్తూ – ఈ కధలో నేనొక టెక్నిక్ పెట్టుకున్నాను మానసికంగా. ఇందులో ఒక్కొకరినీ, యింకొకళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. శ్రీరాములు నాయుడి గురించి చాలా మంచి అభిప్రాయం మొట్టమొదట్లో వుంటుంది. గమనించేరు గదా, ఆ తర్వాత శ్రీరాములునాయుడేమిటో, యెలాంటి వాడో, అతని నిజస్వరూపమేమిటో అప్పల్రాముడు తన కధనంలో బహిర్గతం చేస్తాడు. ఆ అప్పల్రాముడేమిటో, యెలాంటివాడో, వాడి గురించి సీతారాముడు ఎక్స్పోజ్ చేస్తాడు … యిలా మనసులో అనుకొని ఆ టెక్నిక్ ని ఉపయోగించి రాసేను. కధా వస్తువు సరే …

కధావస్తువు దగ్గర ఆగిన సంభాషణతో – మీ తొలినాటి కధలేమో గాని, యజ్ఞం, తీర్పు వంటి కధల తర్వాత ప్రతికధకూ మీరు లోతుల్లోకి వెళ్ళి, ఆ కధా వస్తువులోంచి, యెరుకగావాల్సిన కధాంశాన్ని చిత్రించడానికి చాలా శ్రమ పడినట్టనిపిస్తుంది. ఏ కధనూ పై పైకి చూసి రాయలేదు. జీవధార గానీ, నో రూమ్ గానీ చివరికి సంకల్పం గానీ! ఒక కధావస్తువు నుంచి పూర్తిగా గ్రహించాల్సిన అంశాల్ని గమనంలోకి తీసుకొని … పాత్రలూ, సంఘటనలూ చిత్రిస్తారు. ఇక వస్తువు నుంచి చెప్పడానికి యేమీ మిగలనంత దాకా వెదుకుతారు. అంచేత, మీ కధలు వైవిధ్యంతో వుంటాయి. చాలా మంది రచయితలు ఒకే వస్తువుని (గతంలో గొప్ప రచయితలు గూడా) మళ్ళీ మళ్ళీ రాసేరు, రాస్తున్నారు. నిజం కాదంటారా? మీ అనుభవాన్ని చెప్పండని ప్రశ్నించగా …

ఇతర రచయితల సంగతేమో గానీ, తొలినాళ్ళల్లో, నేను రచనలారంభించిన కొత్తలోనే అచ్చుకాని నా తొలి రచనల్లో ఒకదానిని చదివిన మా నాన్న – కధలూ, నవలలూ ఏదో చెప్పడానికి రాస్తారు. అవి రాయదలిస్తే ఇతరులకేమైనా చెప్పగల తాహతుండాలి – యిలా యేవో చెప్పారు, ఆ తర్వాత మలినాళ్ళల్లో కొ.కు., రావిశాస్త్రి గార్లను చదువుకోగా, మరికొందరు మిత్రుల సాంగత్యంతో నాలో యేర్పడ్డ దృష్టికోణం కారణంగానూ – రచన యే మంచికి హానీ, యే చెడ్డకు మేలు చేస్తుందో చూసుకోవాలన్న రావిశాస్త్రిగారి మాట కారణంగానూ, నేను నా రచనను అన్ని విధాలా ఆలోచించుకుని తృప్తి కలిగితేనే ప్రచురణకు పంపుతాను. ఇదిగాక, నేనెప్పుడూ నన్ను ప్రేరేపించిన సంఘటననే కధగా రాయను. ఆ సంఘటన పూర్వపరాల వివేచన చేసి, దాని క్రమాన్ని గ్రహించి రాస్తాను. అంచేత మీరన్నట్టుండొచ్చు నా కధలు … అని నవ్వేరు. ఆ నవ్వు వెనక నా మిగిలిన ప్రశ్నకు జవాబున్నది.

మాస్టారు, యెలాగూ తొలినాళ్ళలో అన్నారు గనక, యించుమించు, ఆనాటి కధ అయిన – అప్రజ్ఞాతం రాయడానికి మీకేదో ప్రేరణ వుండి వుంటాదనిపిస్తోంది. అందులో కుర్రాడు, మీరేనేమో అన్పిస్తాది .. ఒక్కోసారి ఆ కబుర్లలోకి వెళ్దామా, అని అడగగా…. నిజమేననీ, ఆ కధలో కుర్రాడు తనేననీ, కాకపోతే ఆ షావుకారికొడుకు జబ్బు పడడం, కుర్రాడు పరీక్ష పోవడం మాత్రం కల్పితమనీ చెప్పారు. దీనికి అనుబంధంగా –

మాస్టారూ, అప్రజ్ఞాతం కధా వస్తువే మీ అవగాహన, రచనా శక్తీ పెరిగాక ‘యజ్ఞం’ అయ్యింది కదా అనంటే, ఔననీ .. అదనంగా యజ్ఞం కధలో కమ్యూనిష్టు పార్టీ ఆలోచనావిధానం పై విమర్శ వుందేమో అనన్నారు.

మీ పక్కనే రావిచెట్టులా అమోఘమైన ప్రతీకలతో వర్ణనలతో రావిశాస్త్రి రచనలు చేస్తుండగా, మీరెలా మీదయిన శైలిని విజయవంతంగా నిలుపుకోగలిగేరు? వస్తుబలం వల్ల మాత్రమే అననకండి. ఇక, మీరు గూడా ఒకటి రెండు కధలు శాంతి, స్నేహం వంటి కధల్లో చిన్నగా రావిశాస్త్రి శైలి జాడల్లాగా కొన్ని దృశ్యాలు, వాక్యాలు రాసేరు. నిజమేనంటారా, కాదా – అన్న ప్రశ్నలకు కాసేపు మౌనం వహించి – శాంతి, స్నేహం కధల్లో శాస్త్రిగారి జాడలు ఉండొచ్చేమో, వస్తువులు పట్నానికి చెందడం వలన అలా వచ్చేయేమో … అనంటూ … యిక నాదయిన శైలి గురించంటావా – అది బహుశా నువ్వొద్దన్నా వస్తువే కారణమేమోననక తప్పదు. కొడవటిగంటి కుటుంబరావుగారు మధ్యతరగతి జీవితాలను రాసేశారు. శాస్త్రిగారేమో అధోజగత్ సహోదరుల జీవితాలను రాసేరు (పట్నపు). ఇక నాకు మిగిలినది గ్రామీణ జీవితం … దాన్ని రాస్తున్న క్రమంలో, ఆ జీవితమే వీరికి భిన్నమైన శైలినిచ్చిందనుకుంటాను… ఆ తర్వాత చాలాసేపు యింకేమీ మాటాడలేదు. నాగ్గూడా యింకే ప్రశ్నా తోచలేదు. మౌనంగా కాసేపు కూచున్నాం. ఈ లోగా దాసరి రామచంద్రరావుగారొచ్చారు .. గత రెండు రోజులుగా రామచంద్రరావుగారు కూడా , యిలా మా కబుర్ల మధ్య లోనో, చివర్లోనో వస్తున్నారు. ఏవో కబుర్లను కదుపుతున్నారు. ఈ సారి ప్రపంచీకరణ గురించి కదిలింది. మాస్టారేమో – ప్రపంచీకరణ ఫలితాలు మాత్రమే కధలలో రాస్తున్నారనీ, దాని వెనుక ఉన్నది రాయలేకున్నారనీ, ప్రపంచ రాజకీయాలనర్ధం చేసుకుంటే తప్పా ప్రపంచీకరణ గురించి సరయిన అవగాహన రాదంటారు. మతమూ, ఆర్ధికమూ, భాషా, సంస్కృతీ వగైరా విషయాల మీద యే శక్తులకు పట్టు వున్నదీ, దాని బలమేమిటీ, వాటి ఐక్యత యెలా జరుగుతున్నదీ, ప్రపంచీకరణనెదిరించే శక్తులేమిటి, వాటి బలహీనతలూ, అనైక్యతలూ వీటి గురించిన పరిశీలనుండాలనన్నారు. ఆశ్చర్యమేసింది … మాస్టారీనాటికీ ప్రపంచాన్నాడించే శక్తుల పట్ల యెంత జాగరూకతనాలోచిస్తారో అన్పించింది. ఈ సారి రామచంద్రరావేదో కదపబోతే … మర్లేదు, మరేం కబుర్లు లేవు. అన్నట్లు .. నవంబర్ తొమ్మిది తర్వాత నేనింకేమి మాటాడను … కష్ట సుఖాలూ, మామూలు పలకరింపులు తప్పా, అని ప్రకటించేరు. మాస్టారు ప్రకటించేరంటే యిక మరి తిరుగు లేదు .. ఎందుకో దిగులు కలిగింది. తెలుగు కధకులందరి దిగులది … మాస్టారి మౌనం పట్ల!

బహుశా, గురజాడ తెలుగు కధను గతంలో నుంచి వర్తమానంలోకి, గ్రాంధికం నుంచి వాడుక భాషలోకి, బ్రాహ్మణ మండువాల్లోకి (దేవుళ్ళారా మీ పేరేమిటి కధ మినహాయింపు) నడిపిస్తే, రావిశాస్త్రి గారు వీధుల్లోకీ , బజారులోకీ నడిపించారు. ఆ కధను పల్లెల్లోకీ , పంటభూముల్లోకీ, పంచాయితీల్లోకీ నడిపించినారు కాళీపట్నం రామారావు మాస్టారు. కధంటే జీవితాల్ని విశ్లేషించడమనీ, సామాజిక చలన మూలాలను యెరుకపరచడమనీ, సాహితీకారులకదో యజ్ఞమనీ … కారా మాస్టారి సాహితీ వ్యక్తిత్వం భోదిస్తుంది. లోకంలో పొందే సకల సదుపాయాలూ… సామాజిక శ్రమ ఫలితాలనీ, (సాహిత్యం గూడాననీ …) సామాజిక సాహిత్య ఋణాలనుతిరిగి తీర్చడాన్ని బోధిస్తుంది … కారా ‘కధానిలయం’! కాళీపట్నానికి పాదాభివందనాలు. రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

(మాస్టారితో నాలుగురోజులుగా, రోజుకు నాలుగు గంటలు కబుర్లు. చాలా చాలా కబుర్లు దొర్లేయి. అవన్నీ ఒక క్రమంలో పెట్టడంలో, సారంగకందించాల్సిన కాల వ్యవధి తక్కువ కావడాన, యింటర్వ్యూ యింకొంత బాగా చేయెచ్చేమోగాని సాధ్యం కాలేదు. ఈ నాలుగు రోజులు మాస్టారినుంచి విలువైనవెన్నో తెలుసుకున్నానని నేనంటే.. మాస్టారు, నా వలన చాలా తెలుసుకున్నాననీ, ఆ విషయం యిందులో రాయమనీ అన్నారు. ఈ మాట నాకెంతో ఆనందాన్నీ, నా పట్ల ఆయనకు గల నమ్మకానికి భయాన్నీ కల్గించేయి. ఈ సందర్భంగా రమాసుందరి గారికీ, సారంగ పత్రికకూ కృతజ్ఞతలు!)

– అట్టాడ అప్పల్నాయుడు

 

నేను కూడ ఒక ‘నాటు’ మనిషినే!

AmericaAnubhavalu

మనం ఎవ్వరూ కని, విని, ఎరగని కైలాస్ సత్యార్థి కి నోబెల్ శాంతి బహుమానం వచ్చిందని తెలియగానే “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అన్న గీతా ప్రబోధం గుర్తుకి వచ్చింది.

నిష్కామ కర్మ గొప్పతనం అది. ఏ ఫలితం ఆశించకుండా ఎవరి పని వారు చేసుకుని పోతూ ఉండడం. కాయ పండగానే అదే రాలుతుంది.

వంగూరి సంస్థ వారు గత నాలుగు దశాబ్దాలబట్టీ చేస్తూన్న పని కూడ ఇలాంటిదే. వారు చెయ్యాలనుకున్న పనిని, విధాయకంగా, చేసుకుపోతున్నారు. దీని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఇంకా కనిపిస్తుంది.

. విత్తు నాటిన వారు పండు తినే అవకాశం తక్కువ – అయినా కొందరు నాటుకు పోతూ ఉంటారు. వీళ్లని “నాటు మనుష్యులు” అందాం.

నేను కూడ ఒక నాటు మనిషినే! ఒక ఫలితాన్ని కాని, ఒక పురస్కారాన్ని కాని ఆశించి రాయడం మొదలెట్టలేదు. ఈ పురస్కారం నాకు చెయ్యాలని నేను ఎవ్వరినీ అడగలేదు. అయినా సరే ఈ పురస్కారానికి నన్ను కూడా ఎన్నుకున్నందుకు వంగూరి సంస్థ అధినేతలకు నా కృతజ్ఞతలు.

నేను ఇండియాలో చదువుకునే రోజులలో “కథ కాని కథ” అనే శీర్షిక ఆంధ్రపత్రిక నడిపింది. నా మొట్టమొదటి కథ, పోస్టు కార్డు మీద రాసి, పంపేను. వారు 5 రూపాయలు బహుమానం ఇచ్చేరు. తరువాత దీక్షతో రచనా వ్యాసంగం మొదలు పెట్టినది అమెరికా వచ్చేకనే – నిక్కచ్చిగా చెప్పాలంటే 1967 లో. అప్పటి నుండి ఇప్పటి వరకు, తరచుగా ఏదో ఒకటి అలా ప్రచురిస్తూనే ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 10 పుస్తకాలు అచ్చయాయి, మరో 6 పుస్తకాలు  నా కంప్యూటరులో ఉన్నాయి – ప్రకాశకుల కోసం ఎదురు చూస్తూ. లెక్కపెట్టలేదు కాని కథలు కనీసం 50 ఉండి ఉండొచ్చు. వ్యాసాలు మరొక 50 ఉంటాయి. టూకీగా ఇదీ నేను చేసిన పని.

ఎందుకు రాస్తున్నాను? ఏ విషయాల మీద రాస్తున్నాను? ఈ విషయాలమీదే ఎందుకు రాస్తున్నాను? ఈ పని వెనక అంతర్లీనంగా ఏదైనా ఒక సూత్రం ఉందా? – అని పలువురు అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానాలు వెతుకుదాం.

 

  1. తెలుగులో ఎందుకు రాస్తున్నానా?

 

సైన్సుని తెలుగులో – నలుగురుకీ అందుబాటులో ఉండేలా – చెప్పాలనే కోరిక నాలో చిన్నప్పటినుండీ ఉంది. నేను ఇంగ్లీషు అర్థం అవుతుంది . ఇంగ్లీషులో రాయగలను కూడా. కానీ, తెలుగులో చదివినా, రాసినా ఆనందంగా ఉంటుంది. సైన్సుని తెలుగులో ఆస్వాదించి ఆనందించేవారు ఎవరైనా ఉంటే, వారి కోసం రాస్తున్నాను. అలాంటివారు ఎవ్వరూ లేకపోతే నా ఆనందం కోసం రాసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే చదవకండి – కాని, నన్ను రాయొద్దని అడగకండి.

 

“సైన్సుని తెలుగులో ఎలా రాస్తారండీ? మనకి వొకేబ్యులరీ లేదండీ,” – ఒకరు.

 

“సైన్సుని తెలుగులో బోధించడం మొదలుపెడితే ఇప్పటికే వెనకబడి ఉన్న మనం ఇంకా వెనకపడి పోతాం అండీ!” – మరొకరు

 

తెలుగులో “వొకేబ్యులరీ” లేకేమి? కావలసినంత ఉంది. ఆర్వీయస్ సుందరం గారు ఒక సారి లెక్క వేసేరు. షేక్స్‌పియర్ నాటకాలలో వాడిన ఏకైక ఇంగ్లీషు మాటల కంటె తిక్కన తెలుగు భారతంలో వాడిన ఏకైక తెలుగు మాటలు ఎక్కువట!

 

సైన్సుని తెలుగులో బోధించాలని అనటం లేదు. ఇంగ్లీషుని తరిమికొట్టాలనీ అనటం లేదు. తెలుగులో కూడ రాయమంటున్నాను. రాసినవి చదవమంటున్నాను. తెలుగులో మాట్లాడమంటున్నాను. ఇది తప్పయితే క్షమించండి.

 

వాడుక లేక తెలుగు మాటలు వాడితనం పోయి వాడిపోతున్నాయి. తుప్పు పట్టి మూల పడిపోతున్నాయి. అవసరం అయినప్పుడు కొత్త మాటలు సృష్టించుకునే ధైర్యం మనలో చచ్చిపోయింది. నా గమ్యం ఒక్కటే. “సైన్సు ని తెలుగులో రాయకలం” అని రాసి చూపించడం. అందుకని తెలుగులో రాయడం మొదలు పెట్టేను.

 

  1. తెలుగులో ఏమిటి రాస్తున్నానా?

 

మొదట్లో, సైన్సు విషయాలని నలుగురికీ అర్థం అయే రీతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నమే అమెరికాలో నా మొట్టమొదటి తెలుగు రచన. దాని పేరు “కంప్యూటర్లు.” దానిని 1967 లో రాసేను. నా అదృష్టం బాగుండి శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఆ రోజులలోనే తెలుగు భాషా పత్రిక స్థాపించేరు. అందులో నా పుస్తకం ధారావాహికగా మూడేళ్ల పాటు ప్రచురించేరు. దానికి అనూహ్యంగా స్పందన వచ్చింది. అప్పుడు తెలుగులో ఇంకా రాయాలనే కోరిక ఇనుమడించింది.

 

ఇలా వచ్చిన స్పూర్తితో నాలుగైదు “సైన్సు” కథలు, వ్యాసాలు కూడ ప్రచురించేను – తెలుగు భాషా పత్రికలోనూ, ఆంధ్ర పత్రికలోను, భారతిలోనూ. నా “బ్రహ్మాండం బద్దలయింది” కథకి  తెలుగు భాషా పత్రిక వారు ప్రోత్సాహక బహుమతి కూడ ఇచ్చేరు. ఇదే కథని సాహిత్య అకాడమీ వారు 2013 లో ప్రచురించిన “తెలుగులో సైన్సు ఫిక్షన్” అనే కథల సంపుటంలో వేసుకున్నారు. నాకు 1500 రూపాయలు పారితోషికం కూడ ఇచ్చేరు. నలభయ్ ఏళ్ల పాటు పాట్లు పడ్డ తరువాత “తెలుగులో సైన్సు ఫిక్షన్” అనే ప్రక్రియకి గుర్తింపు వచ్చింది కదా అని సంతోషించేను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.

 

తరువాత – 1970-80 దశకంలో జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టుకొచ్చిందో వివరిస్తూ “జీవరహశ్యం” అనే పుస్తకం, ఇంటింటా, వంటింటా కనబడే పదార్థాల వెనక ఉండే రసాయన శాస్త్రం చెబుతూ “రసగంధాయరసాయనం” అనే పుస్తకం ప్రచురించేను – నా సొంత ఖర్చులతో! ఈ రెండూ డాక్టర్ గవరసాన సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగేయి.

 

ఆ దశకపు చివరి రోజులలోనే తానా ప్రారంభం అయింది. అప్పుటి నుండి వారు  సభ జరిపినప్పుడల్లా  కథో, వ్యాసమో కావాలని అడిగేవారు. ఆ రోజుల్లో రాయగలిగే వాళ్లు తక్కువ. అందుకని నాకు తప్పకుండా ఆహ్వానం వచ్చేది. అప్పుడు ఎక్కువగా వ్యాసాలు రాసేను. ఈ వ్యాసాలు తెలుగు భాషని, లిపినీ సైన్సు రచనకి అనుకూలంగా ఎలా  మలచాలి అన్న అంశం మీద ఉండేవి. అప్పుడప్పుడు తెలుగు సంస్కృతికి సంబంధించినవి కూడ రాసేవాడిని.

 

నేను రాసినంత జోరుగా అమెరికాలో ప్రచురణకి అవకాశాలు దొరికేవి కావు. నా రాతలు ఇండియా పంపిస్తే ఆ పత్రికల వారు వేసుకున్నారో, నిరాకరించేరో చెప్పరు కదా. పైపెచ్చు తట్టెడు తపాలా ఖర్చులు. కనుక ఏమిటి రాయాలో, ఎక్కడికి పంపాలో తెలియని అంధకార యుగంలో పడ్డాను. శ్రీ కిడాంబి రఘునాథ్ గారి తెలుగు జ్యోతిలో అవకాశం దొరికినప్పుడల్లా ఇరికేవాడిని.

 

ఈ పరిస్థితులలో, 1987లో అనుకుంటా, శ్రీ చందూరి మురళి రచన అని ఒక పత్రిక స్థాపించి, జీవిత చందా కట్టమని అడిగేరు. “కడతాను కాని సైన్సుకి ఒకటో, రెండో పేజీలు కేటాయిస్తారా?” అని అడిగేను. “మీరు సైన్సుని “సైన్సు”లా  రాస్తే ఎవ్వరూ చదవరు. కథ రూపంలో రాయండి, వేసుకుంటాను” అన్నారు. అప్పుడు సైన్సు ప్రాతిపదిక మీద చాల కథలు రాసేను. కల్పనలు కాదు. పక్కా సిద్ధాంత పరంగా పటిష్ఠమైన సైన్సు. ఎక్కువగా వైద్యానికి సంబంధించిన కథలు. ఈ కథలు చదివి నేను వైద్యుడననే భ్రమతో పాఠకులు  ఉత్తరాలు రాసేరని రచన శాయి గారు చెప్పేరు. తెలుగు కథల ద్వారా సైన్సు ప్రచారం చేసినందుకు మా యూనివర్శిటీ వారు నాకు “పబ్లిక్ సర్విస్ ఎవార్డ్”తో పాటు 250 డాలర్లు బహుమానం కూడ ఇచ్చేరు.

 

మరొక పక్కనుండి, 1980 దశకంలో, అంతర్జాలం అందుబాటులోకి రావడంతో  కంప్యూటర్ తెర మీద తెలుగు అక్షరాల కోసం తాపత్రయం మొదలైంది. ఈ కొత్త మాధ్యమంలో  చెయ్యి నలగాలంటే ఏదో ఒకటి రాస్తూ ఉండాలి కదా. రాయడానికి వెంటనే వస్తువు దొరకొద్దూ? అందుకని కొత్తగా వస్తూన్న ఖతులతో (ఫాంట్లతో) అనుభవం సంపాదిద్దామని నా జీవిత చరిత్ర రాసుకోవడం మొదలు పెట్టేను. అదొక పుస్తకం అంత పొడుగు అయింది. ఆ పుస్తకానికి “అమెరికా అనుభవాలు” అని పేరు పెట్టి, ఎమెస్కో వారి ద్వారా ప్రచురించేను. బాగా ఆదరణ పొందింది.

 

కంప్యూటరు మాధ్యమంతో తెలుగు రాయడానికి వెసులుబాటు దొరికిన తరువాత నా కథా రచన కొంత ఊపు అందుకొందనే చెప్పాలి. కంప్యూటర్ మీద కథలు రాసేటప్పుడు రకరకాల వాక్య నిర్మాణాలతో ప్రయోగాలు చేసి చూసుకోవడం తేలిక అయింది. అదే విధంగా అనువాకాల క్రమాన్ని అమర్చడం కూడ తేలిక అయింది. ఈ తరుణంలో రాసిన  కథలు కొన్నింటిని “కించిత్ భోగో భవిష్యతి” అన్న పేరుతో వంగూరి సంస్థ వారు ప్రచురించేరు. తరువాత కొన్ని కథలని “మహాయానం” అన్న పేరుతో “ఇ-పుస్తకం” గా కినిగె సంస్థ వారు వెలువరించేరు. ఈ రెండవ సంకలనంలో ఉన్న “మరోలోకం” అన్న కథకి వంగూరి సంస్థ వారు $116/ బహుమానం ఇచ్చేరు.

 

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను రాసేవాటిని మెచ్చుకునేవారు తక్కువే.

 

“వేమూరి రాసే కథలలో సైన్సు మన సంపాదకులకి, విమర్శకులకి, సమీక్షకులకి అర్థం కాదు. అందుకని వేమూరికి దక్కవలసిన గుర్తింపు దక్కడం లేదు,” అని కవన శర్మ ఒక చోట రాసేరు.

 

“ఈ మధ్య మీ కథ చదివేను. విలక్షణంగా ఉంది. సైన్సు అర్థం కాలేదు” అని మధురాంతకం రాజారాం అన్నారు.

 

నా “కించిత్‌భోగో భవిష్యతి” కి అట్ట మీద బొమ్మ వేసిన బాపు నాకు స్వహస్తంతో ఉత్తరం రాస్తూ: “పంటికింద పోకచెక్క”  కథలో మీరు వర్ణించిన ఇల్లు మా ఇంటిని గుర్తుకి తెచ్చింది,” అని రాసేరు. కథ బాగుందో బాగులేదో చెప్పలేదు.

 

“ఆడవారి పాత్రలు ఉన్న కథలు కూడా రాయండి,” అని పెమ్మరాజు గారు అన్నారు.

 

“సైన్సు లేని కథలు రాయండి” అని మరికొందరు అన్నారు.

 

“అమెరికా జీవితాన్ని ప్రతిబింబించే కథలు రాయరాదూ?” అన్నవాళ్లూ ఉన్నారు.

 

ఈ రకం ఆక్షేపణలని ఎదుర్కోవాలని కొన్ని కథలు రాసేను: పెళ్లికూతురు మనస్సుకి క్షోభ కలిగించేరంటూ మగ పెళ్ళివారిని కోర్టుకి ఈడ్చిన వయినం “లోలకం” లో కథా వస్తువు. రచన శాయి గారు ఈ కథని “కథా పీఠం” లో వేసుకుని వెయ్యినూటపదహార్లు ఇచ్చేరు.

 

డిట్రాయిట్ లో నేను చదువుకునే రోజుల నేపథ్యంలో, “ఎమిలీ” అనే కథ రాసేను. ఇందులో ముఖ్యమైన పాత్రలు స్త్రీలే. ఈ కథ చదివి వసంత లక్ష్మి గారు “ఓ. హెన్రీ కథలా ఉంది” అని కితాబు ఇచ్చి వారి పత్రికలో వేసుకున్నారు.

 

“అభయారణ్యంలో ఏంబర్” మా యూనివర్సిటీ నేపథ్యంలో రాసిన కథ. ఇందులో ఒక భారతీయుడు ఒక అమెరికన్ అమ్మాయితో అమెజాన్ అరణ్యాలలో తిరగడానికని వెళ్లి తప్పడిపోతారు. అయిదు రోజులు నిద్రాహారాలు లేకుండా ఇద్దరూ ఒకరికొకరు ఆసరాగా బతికి బయటపడతారు. ఈ అయిదురోజుల పరిచయం అనురాగంగా మారుతుంది. “ఈ కథని చాలా సంయమనంతో నడిపేరు” అని ఈమాట సంపాదకుడు కె. వి. యస్ రామారావు కితాబు ఇచ్చి వారి పత్రికలో వేసుకున్నారు.

 

నేను రాసిన “భయం” కథ చదిన వారందరు, వంగూరి చిట్టెన్‌రాజు తో సహా, “అయ్యా, మీరు నిజంగా అలాస్కా వెళ్లేరా?” అని అడిగేరు.

 

ఎంత బాగా వంట చెయ్యడం వచ్చినవారైనా ఎప్పుడూ బాగా వండలేకపోవచ్చు. తినేవాళ్లకి కూడ ఒక రోజు రుచించిన వంటకం మరొక రోజు రుచించకపోవచ్చు. కథల విషయం కూడ అంతే. రాసిన కథలు అన్నీ బాగా రావు. ఒకనాడు నచ్చని కథ మరొకనాడు నచ్చవచ్చు. ఒకరికి నచ్చిన కథ మరొకరికి నచ్చదు. కనుక ఒకరి మెప్పు పొందాలని కాకుండా నాకు నచ్చిన కథలు నేను రాసుకుంటాను. కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన!

 

vemuriratease-వేమూరి వేంకటేశ్వరరావు