Archives for September 2016

రాలిన ఆకులకు లెక్కలేవీ?

krishnudu

మధ్యలో ఆగిపోయింది కాలమ్ అని చాలా మంది అనుకుంటారు కాని నాకు అనిపిస్తుంది అది కాలమేనని. ఎందుకు ఉన్నట్లుండి కాలం ఆగిపోతుందో, సమయం స్తంభించిపోయినట్లు అనిపిస్తుందో కాని అది ఆగిపోవడమా? లేక నండూరి రాసినట్లు గుండె గొంతుకలో కొట్లాడడమా?

పరిణామక్రమంలో ఏదీ ఆగిపోదేమో, ఏదీ స్తంభించిపోదేమో కాని ఎందుకు ఏదీ మారిపోలేదేమోఅని అనిపిస్తుంది? అవే ప్రశ్నలు, అవే జవాబులు. అవే భావోద్వేగాలు.

తరుచూ నేను మట్టిపై కూర్చుంటాను. ఎందుకంటే నా తాహతు నాకు బాగా అనిపిస్తుంది.. నా శైలి నా ప్రత్యర్థులకు నచ్చదు ఎందుకంటే ఎప్పటినుంచో నేను ప్రేమించడాన్ని మార్చుకోలేదు. స్నేహాన్నీ మార్చుకోలేదు.. అని హరివంశరాయ్ బచ్చన్ ఏనాడు రాశాడో కాని కవిత్వం రాయడానికీ, కవిత్వం గురించి రాయడానికీ పూనుకున్నప్పుడల్లా నిన్ను గురించి నీవు తెలుసుకోవడమే అవుతుంది. మట్టి పరిమళం వీడనట్లనిపిస్తోంది.

ఈ రకంగా నీవు నా జీవితంలో చేరిపోయావు.. ఎక్కడికెళ్లినా నీవు పరివ్యాప్తమయ్యావు. అని నిదాఫాజిలీ రాసిందీ కవిత్వం గురించే అనిపిస్తుంది.

జీవితం సగ కాలం గడిపోయింది అనుకుంటాం. సగం రాత్రి గడిచిపోయింది. సగం పగలూ వెళ్లిపోయింది. కాని నిజంగా అది సగం జీవితమా? రెప్పలు తెరుచుకున్నంత సేపూ మూసుకుంటున్నాయి. దోసిలి లోంచి ఇసుకు జారిపోతోంది. దాహం తీరకముందే నీరు ఇంకిపోతోంది..

ఎప్పుడో కందీళ్ల ముందు తడిమిన అక్షరాలేవీ ఇప్పుడు? చెప్పుల్లేని కాళ్లతో ముళ్లడొంకల్లో సాగిన బుడిబుడి నడకలేవీ? గుడి ముందు లైనులో నిలబడింది భక్తికోసమా? ప్రసాదం కోసమా?

కడుపులో రేగిన బడబానలానికి ఎవరు అర్థం చెప్పారు? రాలిన ఆకులకు లెక్కలేవీ? ఏం చేయాలనుకున్నావు? ఏం చేశావన్నది ప్రశ్న కాదు.

ఏం చేశావు ఇంతకాలం? కలతలు రేపిన కళ్లలోకి చూశావా? పులకింపచేసిన నవ్వుల్లో ఉండిపోయావా? పూలవానసల్లోకి తొంగిచూసే తీరికెక్కడిది? స్పర్శకు ముందే ఆవిరైన ప్రేమ ఏదీ?

నినాదం నిరంతరం ప్రతిధ్వనిస్తుండడమేనా? విముక్తి ఎండమావి కోసం పయనమేనా? వెలుగు చూపాలనుకున్న కాగడాలెక్కడ? రెండడుగుల మధ్య దూరమే జీవితమా?

అవే కౌగిలింతలు. అవే కలహాలు, సంఘర్షణలు.. జేబుల్లో కాగితాలే జీవన సంగీతాలా?

ఈ ప్రయాణానికి ఎక్కడుంది మలుపు? మరిచిపోయిన అధ్యాయాల్ని తెరిచి చూసి చదువుకుంటే జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ అదే కదా..

ఎక్కడున్నాయి సగం వసంతాలు? పక్షులై ఎగిరిపోయాయేమో..

చేతివ్రేళ్లు తగలని పుస్తకంలా కొట్టుకుంటోంది జీవితం. ఇన్నేళ్లు గడిచినా ఒక చిరునవ్వుకోసం, ఒక పలకరింపుకోసం మనసు తన్లాడుతోంది. కాని కరచాలనానికి చేయిజాపే లోపు మనిషే మాయం? ఎక్కడ వాడు?

సమీపంలో ఉన్నదేదీ సన్నిహితం కాదా? ఎదురుగా ఉన్నవాడిని పోల్చుకోవడం ఎంత కష్టం? పక్షులు ఆకాశం కోల్పోయాయా? ఆకాశం పక్షుల్ని కోల్పోయిందా?

అయినా వద్దకున్నా వ్రేళ్లు ఆగవు. అవి నాకు తెలీకుండా చలిస్తూనే ఉంటాయి. రాస్తాను.. అఫ్సర్ కోసమైనా రాస్తాను.. రాయకుండా ఉండలేను.

ఇప్పుడు..

అర్థనిమీలిత నేత్రాల మధ్య ఆకాశం దాచుకున్న రహస్యాల వెనుక తెగిపడుతున్న పక్షుల చప్పుడు వినిపిస్తాను.

కనుగ్రుడ్ల భూగోళాల మధ్య, నేల పొరల్లో దాగిన చరిత్ర పుటల వెనుక నిక్షిప్తమైన అస్తిపంజరాల సంభాషణ వినిపిస్తాను.

కనురెప్పల దొంతరల మధ్య ఎగిసిపడుతున్న కెరటాలు చెప్పలేని అల్లకల్లోల దృశ్యాల పదధ్వనులను వినిపిస్తాను.

కనుబొమల అర్థ చంద్రాకారాల మధ్య భ్రుకుటిలో దాగిన ఆత్మ కన్ను వెనుక రగిలిపడుతున్న జ్వాలామాలికల చిటపటలు వినిపిస్తాను.

నిశ్చలమైన దృక్కుల వెనుక ఆలోచనల్లో దాగిన సాంద్ర నీహారికల్లో తొణికిసలాడుతున్న అశ్రుగీతికలు ఆలపిస్తాను.

ఎందుకంటే అకాల మరణం చెందిన ప్రతి శవమూ నాదే. ఆ రోదనా నాదే. ఆ చితి మంటలూ నావే. ఆ చితా భస్మమూ నాదే. ప్రతి హంతక శరీరం వెనుక నడుస్తున్న నీడా నాదే.

*

కొత్త కథా ప్రతినిధులు వస్తున్నారు!

pratinidhya

 

మిరకిల్స్ జరుగుతయ్ భాయ్, నేన్ నమ్ముత: వంశీ

కడగొట్టువాళ్ళ కన్నీళ్లు: కృష్ణ జ్యోతి

????????????????????????????????????

‘నేను తోలు మల్లయ్య కొడుకుని’ అని చెప్పుకున్న మారయ్య కథ నిజానికి నేను కావాలని రాసింది కాదు.   దానికి ఇంత గుర్తింపు వస్తుందని కూడా ఊహించలేదు.  It just happened!  ఇంట్లో పనులు త్వర త్వరగా ముగించుకుని, బడి సమయానికి గంట ముందు బడికి వెళ్లి, ఖాళీ తరగతి గదిలో కిటికీ పక్కన వేపచెట్టు గాలీ ఆస్వాదిస్తూ,  లోపల వున్న ఆలోచనలను ఊరికే అలా కాగితం మీద పెడితే… మారయ్య,   షబానా, ఎలిజిబెత్, కొండయ్య, జగ్గయ్య పంతులూ వీళ్ళంతా జ్ఞాపకం వచ్చారు.

మారయ్య సామాజిక చలనానికీ, విచలనానికీ ‘సర్వధీ సాక్షీభూతం’.  షబానా ‘పెళ్లి’అనే సామాన్యమైన  భౌతిక, మానసిక, శారీరిక అవసరానికి కూడా నోచుకోని అనేక మంది నిర్భాగ్య స్త్రీలకు ప్రతినిధి.  ఎలిజెబెత్, పెళ్ళిలో హింసను నిత్యమూ అనుభవిస్తూ, దాన్నుండీ బైట పడే పరిస్థితి లేని అనేకమంది  వివాహిత స్త్రీలకు ప్రతి రూపం.  కడగొట్టువాళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!  ఇది నిజం.  బజార్లో నిలబడి, వర్గ పరంగా తనతో వేరైనా వారిపై ఆవేశంగా విరుచుకు పడిపోతూ,  సర్వ జన  సమానత్వం అంటూ ఉపన్యాసాలు దంచి, ఇంటికెళ్ళి ఇల్లాలిని కాలితో తన్ని మరీ అదుపులో ఉంచుకునే ‘పోరాట యోధుల్ని’నేను కళ్ళతో చూశాను!   ఇక జగ్గయ్య పంతులు, స్థాయి పరంగా మెరుగైన స్థానంలో వున్నట్టు కనబడతాడు.  కానీ నిజానికి లోపల వున్న దరిద్రాన్ని లోకం కళ్ళని పడకుండా నీలం గళ్ళ చొక్కా లోపల దాచేసి గుట్టుగా బతికేసే కోట్లాది మధ్య తరగతి ప్రజల్లో అతను ఒకడు.  వర్గ పరంగా చెడ్డ మనుషులుండరు.  మంచి మనుషులూ వుండరు.  వ్యవస్థలో వున్న లోపాలు మనుషుల్ని వేరు వేరు అవధుల మధ్య కట్టి పడేసి పీడిస్తాయి.  అంతే.  మరి ఈ వేదనకు అంతం ఎలా?!  బహుశా ఆర్ధిక అంతరాలను తొలగిస్తే మిగిలిన సమస్యలు చాలా వరకూ సర్దుకుంటాయేమో?!  చెప్పినంత సులువు కాదు అమలు.  కానీ ఒక ఆలోచన చేయడమైతే తప్పు కాదు కదా!

కన్నదే  విన్నదే  ఈ  కథ:  శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

‘నిప్పులనడకలోంచి కళ్యాణి ‘ కథ నిజానికి కథ కాదు యదార్ధ జీవన దృశ్యం. వికృతమైన మనుషుల మధ్యలోంచి బయటపడిన ఓ బాలిక జీవితం.   బంగారు భవిష్యత్ కోసం కలలు కనే ఆ బాలిక చెప్పిన విషయాలు నన్నెంతో కదిలించాయి. నా హృదయంలో తిష్టవేసి యాతనపెట్టాయి. విన్న నాకే ఇలా ఉంటే అనుభవించిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో .. ?! ఆ నీలినీడలనుండి బయటపడడం ఎంత కష్టమో కదా .. ఇలాంటి
వ్యధ మరే చిన్నారికీ ఎదురుకాకూడదు అనిపించేది.  కన్నతల్లి కూడా ఇలా ప్రవర్తించగలదా అన్న అనుమానం వేసేది . కన్నతల్లి కాదనుకున్న బిడ్డ జీవితం, కన్నతల్లే కాసులకోసమో .. మరెందుకోసమో కసాయిలకు అమ్మేసిన వైనం మనసులో మెలిపెడుతూనే ఉండేది.  కాలం గడుస్తున్నా అది మరుపుకు రావడం లేదు.

అమ్మాయిల అమ్మకం లేదా వేరే ప్రాంతానికి తరలించడం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు.  కానీ , అలా ట్రాఫికింగ్ కి గురయిన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో అనుభవమే.  అలాంటిది కన్నతల్లి  బిడ్డని నరకకూపాల్లాంటి చోటుల్లో అమ్మేసేంతటి పరిస్థితులు ఏముంటాయో.. అనేకానేక ప్రశ్నలు వెంటాడుతుండేవి. అప్పటికే పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లలకి ఎలా ఎరవేసి తరలిస్తారో తెలుసు. ట్రాఫికింగ్ కి బలైన  వారి గాథలు కొన్ని  ప్రత్యక్షంగా విని వున్నాను. అప్పుడెప్పుడూ  లేని కదలిక ఓ పదిపదకొండేళ్ల బాలిక చెప్పిన విషయాలు విన్న తర్వాత నాలో కలిగింది. భరించలేని  యాతన నుండి బయటపడడం కోసం అక్షరీకరించడం జరిగింది. అదే నిప్పుల నడకలోంచి కల్యాణిగా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
నా ఈ కథలో ముఖ్యపాత్రధారి “కళ్యాణి” ఒక పాత్ర కాదు.  ఒకమ్మాయి జీవితమని ముందే చెప్పాను కదా ..నాలో కలిగిన భావ సంఘర్షణ నుండి నేను బయట పడతాను కానీ ఆమెను వెంటాడి వేటాడే గతాన్ని గుర్తుచేయడం నాకిష్టం లేదు. ఆమె జీవితానుభవాలు ఒక కథగా వచ్చాయని  తెలిస్తే ఎలా ఫీలవుతుందో తెలియదు. కానీ ఆమె భవిష్యత్తు దృష్ట్యా చెప్పడం సముచితం కాదని నేనయితే ఆమెకీ విషయం చెప్పదలుచుకోలేదు.

ఇది నేను రాసిన కథ అయినా  చదువుతుంటే నా కళ్ళు చెమరుస్తూ తనరూపం కళ్ళముందు నిలుస్తుంది.  ఈ కథ కళ్యాణి జీవితంలాంటి జీవితంలోంచి, దుర్భర పరిస్థితుల్లోంచి నేర్పరితనంతో బయటపడి భవిష్యత్ కి బాటలు వేసుకుంటున్న కళ్యాణి లకి ఈ కథ అంకితం.

ఈ కథ … 80% పచ్చి నిజం: వనజ తాతినేని

vanajaప్రాతినిధ్య కోసం నా కథ ఎంపిక కావడం ఇది రెండొసారి . ఆ స్థాయికి తగ్గ కథ వ్రాసినందుకు సంతోషంగా ఉంది.ప్రాతినిధ్య వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను .  ఇక ఈ “మర్మమేమి” కథా నేపధ్యం ఏమిటంటే ..

  కొన్ని గంటల్లో వ్రాసిన ఆ కథకి నేపధ్యం చాలా ఉంది.  చిన్నప్పటి నుండి నేను మా చుట్టూ ప్రక్కల ఉన్న  ముస్లిం కుటుంబాల వారితో సన్నిహితంగా ఉండేదాన్ని,  వారిలో అభిమానం ఆప్యాయతలు మెండు. సమీపంగా చూడటం వల్ల వారి సంప్రదాయం తెలుసు.  నాలుగు గోడలమధ్య బందీగా ఉంటూ చిటికెడు స్వేచ్ఛ కరువై కన్నీరు మున్నీరుగా విలపించడం  తెలుసు.  స్త్రీలు  పేదరికం వల్ల చిరిగిన చీరలని కట్టుకుని పైకి మాత్రం ఘనంగా బురఖా వేసుకుని వెళ్లడం తెలుసు .  సంప్రదాయాన్ని  ఇష్టంగా  పాటించేవారు కొందరైతే , అయిష్టంతో దానిని విసర్జించాలి అనుకునేవాళ్లు కొందరు. నా నెచ్చెలుల  పెదాలపై నవ్వుల  పై పూతలే తెలుసు. హృదయపూర్వకంగా నవ్వడం కూడా నిషిద్ధం. తల్లులు పిల్లల మనసులో కోరికలు తెలిసి కూడా పురుషులకి భయపడి పిల్లల కోరికలని నిర్దాక్షిణ్యంగా నలిపేసేవారు. సంప్రదాయానికి మనసుకి మధ్య నలిగిన ఆడపిల్లల కథలు తెలుసు . వాళ్ళ కంటి చూరుని పట్టుకుని వ్రేలాడిన కన్నీటి చుక్కల ఆంతర్యం తెలుసు. షహనాజ్ పాత్ర అలా పుట్టిందే !
గుంటూరు లో అభ్యుదయ రచయితల సంఘం  కథానిక పాఠశాల నిర్వహించినప్పుడు .. విద్యార్థిగా  మారి మూడు రోజులపాటు  గుంటూరు విజయవాడల మధ్య ఒంటరిగా బస్ లో ప్రయాణించినప్పుడు .. నేను చూసిన దృశ్యాల సమాహారం ఈ  కథ. బస్ లలో  యువతీ యువకుల అసభ్య ప్రవర్తన చూసి అసహ్యం కల్గింది, ఆవేశం ముంచుకొచ్చింది . సంప్రాదాయం కోసం ముస్లిం స్త్రీలు ఇష్టమైనా కాకపోయినా   బురఖా ధరిస్తుంటే  ఆ మతానికి చెందని వారు  తప్పుడు పనులకోసం  బురఖా ధరించడం, బాయ్ ఫ్రెండ్ తో కలసి  తిరగడం కోసం స్కార్ఫ్ కట్టుకోవడం చూసి నివ్వెరపోయాను .  ఎవరిని మభ్య పెట్టుకోవడం కోసం ఈ ముసుగులు ? అన్న ఆవేదన కల్గింది.  ఒక యువతి భర్తని మోసం చేస్తుంటే వాస్తవేమిటో తెలియకపోయినా సరే  ఆ అమ్మాయికి సహకరించానే అన్న ఆపరాధభావం  తొలిచేసి .. ఆ కథ వ్రాయించింది. నేను వ్రాసిన ఈ కథ … 80% పచ్చి నిజం . దానికి  20% నా ఊహా శక్తిని జోడించి ముగింపునిచ్చాను . కథ కచ్చితంగా  అలానే  వ్రాయాలని నేను అనుకోలేదు ..  అలా వ్రాసుకుంటూ పోయాను. కొన్ని గంటల సమయంలో ఆ కథ పూర్తయింది. వెంటనే ఆంద్ర జ్యోతికి పంపించాను . మూడు వారాల్లో కథని అచ్చులో చూసుకోవడంతో  అమితానందం . అశేష పాఠకుల స్పందన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.  స్పందించిన వారిలో  ఎక్కువ మంది అమ్మాయిలూ లేరన్న బాధ కూడా మిగిలింది అయినప్పటికీ  తాత్కాలికంగా గొప్ప సంతృప్తిని ఇచ్చిన కథ ఇది .
 pratinidhya2

ఒక ఔట్లెట్ దొరికింది: పింగళి చైతన్య

chaitanyaఇది ప్రచురణ పొందిన నా మొదటి కథ. 2015, ఆగస్ట్ నెలలో  సారంగ పత్రికలో అచ్చు అయింది. ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ రాసిన తర్వాత మూడేళ్ళ వరకు నేనేం రాయలేదు. తెల్సిన వాళ్ళు ‘ఈ మధ్య ఏం రాసావ్?’ అని అడిగేవారు. నెత్తికి నూనె రాయటమే బద్ధకం, నేనేం రాస్తాను అని చెప్పలేక ఊరుకునేదాన్ని. వి. ఎం. ఆర్. జి. సురేష్ అనే జర్నలిస్ట్ మిత్రుడు, ఎప్పుడు కల్సినా సరే, ‘కథలు రాయి చైతన్యా’ అని సలహా ఇచ్చేవారు.  పైగా ‘కథలు రాయటం తేలిక’ అని కూడా చెప్పారు! ‘ఎంకరేజ్ చేయటానికి వంద చెప్తామ్’ అని అతను ఇప్పుడు నవ్వేస్తారు. కానీ నేను అప్పటికి తెలియక, నమ్మాను. అలా.. ‘కథ రాయటం’ అనే పురుగు బుర్రలోకి వచ్చింది. అదే టైమ్ లో కుప్పిలి పద్మ గారి కథ ఒకటి నచ్చి, ఆమెకి ఫేస్బుక్ లో మెసేజ్ ఇస్తే, ‘మీరెప్పుడు రాస్తారు’ అని అడిగారు. అసలే ఇష్టమైన రైటర్. మాటవరసకి అడిగారు కావొచ్చు కానీ.. నేను మాత్రం… అప్పుడే కూర్చొని ఒక కథ రాసేశాను.

నాకు మొదట మెదిలింది మా అమ్మ. ఆమె విడో. సింగల్ ఉమెన్ పట్ల మన సమాజం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అమ్మ వల్ల సింగల్ ఉమెన్ సమస్యలు బాగా అర్ధం అయ్యాయ్. అయితే, విడో పట్ల సమాజం కొంత దయ చూపిస్తుందేమో కానీ.. విడాకులు తీసుకున్నా, పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నా  సరే… ఆ స్త్రీలని వాళ్ళ ఇష్టానికి వదిలేసేపాటి జాలి చూపించదు మన సమాజం. ‘పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని అడిగేవాళ్ళని, పెళ్లి ఎందుకు చేసుకున్నావ్? అని అడిగితే ఎలా ఉంటదా?’ అని ఎప్పటి నుండో నా మనసులో అనిపించేది.  దాన్నే పాయింట్ గా తీస్కోని, కథ రాశాను.

స్వాతి వడ్లమూడి అనే ఫేస్బుక్ ఫ్రెండ్ కి కథ పంపా. ఆమె బుర్ర నేను,  నా బుర్ర ఆమె తిన్నాక.. ఫేస్బుక్ లో చాలా సార్లు కనిపించిన ‘సారంగ’ పత్రిక ఓపెన్ చేసి..  మెయిల్ ఐ.డి తీస్కోని, అప్పటికప్పుడే పంపించేశాను. అక్షరదోషాలు సరి చేస్కోటానికి వెనక్కి తిరిగి చదవాలన్నా సరే, డిలీట్ చేస్తా అని భయం వేసింది. పంపేశాను. తెల్లారికే నాకు, అఫ్సర్ గారి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ‘అను లో కాదు, యూనీకోడ్ లో పంపండి, మీ గురించి కూడా రాసి  పంపండి’ అన్నారు. నాకు ఒక్కటే తెల్సు.  ఆ ముక్కే చెప్పాను. అప్పటికి ఈ కథ పేరు ‘తనదే ఆ ఆకాశం’ కాదు.  ఏదో పాత,  ముతక పేరు. ఇప్పుడు ఆ పేరు చెప్పి, నా పరువు నేనే తీస్కోటం  ఇష్టం లేక.. చెప్పట్లేదు. ఆ పేరు తీసేసి,  అఫ్సర్ గారే  ‘తనదే ఆ ఆకాశం’ అని పెట్టి,  యూనికోడ్ లో టైప్ చేయించి ప్రింట్ చేశారు. ‘సారీ సర్, మీకు ఇబ్బంది పెడుతున్నా ’ అని మెయిల్ చేస్తే, ‘కొత్త రచయిత ని చూసినప్పుడల్లా ఒక ఉత్సాహం వస్తుంది; ఇబ్బంది,  కష్టం తెలీవ్’ అని కూడా అన్నారు. ఈ కథ ప్రింట్ అయిన ఉత్సాహం లో కొన్ని కథలు రాశాను.

ఏం చేయలేక, ఏం చేయాలో తెలీక, పరిష్కారం అర్ధం కాక.. బాధ పెట్టే  విషయాలని, కథలుగా రాస్తున్నా. సాహిత్యం లో వాటి విలువ, స్థానం  నాకు తెలీదు. కానీ, ‘కథ’ల ద్వారా నాకో ఔట్లెట్ దొరికింది. అది చాలు.

ఇప్పుడు ‘ప్రాతినిధ్య’ సంకలనం లో ఈ కథ వస్తోంది. ఆ పేరే ప్రేత్యేకం. రకరకాల గొంతులకి, వాదన లకి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. నా కథ కూడా రావటం.. సంతోషంగా ఉంది. వి.ఎం.ఆర్. జి. సురేష్ గారిలాగా.. నన్ను ఎంకరేజ్ చేయటానికే వేసారేమో అని అనుమానం ఉన్నా సరే,  ‘కల్పన’ లాంటి గొప్ప కథ రాసిన సామాన్యకి ఈ కథ నచ్చటం.. కంట్రోల్ చేస్కోలేని సంతోషాన్ని ఇస్తోంది. మొదట అచ్చు వేసిన పత్రికలో.. నా మొదటి కథ..  సంకలనంలో అచ్చు అయిన మొదటి కథ గురించి రాస్తుంటే.. చాలా ఉత్సహం గా ఉంది. ‘ఇక చాల్లే, ఇప్పటీకే జనాలకి బోర్ కొట్టించి ఉంటావ్’ అనిపిస్తోంది కాబట్టి, ఇక్కడితో ఆపుతున్నాను.

 

pratinidhya1

మొదటి నాన్ పొలిటికల్ స్టొరీనేమో:వోల్గా

volgaవృద్ధాప్యాన్ని గురించి దయనీయమైన కథలు,పిల్లలు క్రూరంగా ప్రవర్తించే కథలు చదివి చదివి విసుగెత్తి భిన్నంగా ఏదయినా  రాయాలని రాసాను .తల్లీ  కూతుళ్ళ అనుబంధాన్ని ఆనందంగా రాసాను.అలా జీవించిన ,జీవిస్తున్న వాళ్ళు నాకు తెలుసు .జీవించలేక బాధ పడుతున్న వాళ్ళూ తెలుసు.వయస్సు పైబడిన తర్వాత రెండొవ బాల్యానికి కూడా పలు కోణాలు ఉంటాయి.ఈ కథలో తల్లిలా తన బాధ్యతను తీసుకోవాలని కూతురుని అడిగి ఒక హక్కుగా పొందిన గట్టి తల్లులూ ,దానిని గుర్తించి తల్లిదండ్రుల బాల్యాన్ని తాము ఆనందించే పిల్లలూ ఉంటె బాగుంటుందనే ఆలోచనే ఈ కథ.ఈఈ సమాజం లో అదంతా తేలిక కాదు .ఎందరికో ఎన్నో పరిమితులు .అయినా పరిమితుల్లోనో పరిధుల్లోనో అనుబంధాలు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి.బహుశా ఇది నేను రాసిన మొదటి నాన్ పొలిటికల్ స్టొరీనేమో .
(మిగతా  కథకుల ప్రతిస్పందనల  కోసం  ఎదురు చూస్తున్నాం! )

డాక్యుమెంటరీ సినిమాగా “కొయ్యగుర్రం”

ప్రతి వాక్యం ప్రతిఘటనే!

mouli

 

“…for a brave and kindly-natured comrade is as dear to a man as his own brother.” (Odyssey, Book IX, 585-86).

1

మౌళీ నాకు ఫోన్ చేసి ‘ నా కవితాసంపుటి ‘ ఆకు కదలని చోట ‘ ఈ 21 న ఆవిష్కరణ వుంది. దాని మీద నీ అభిప్రాయం రాస్తే బాగుంటుంది” అన్నాడు. మొదట్లో నేను తటపటాయించాను. నేనెప్పుడు తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని అంత క్షుణ్ణంగా అనుసరించలేదు. ” నా కంటే  బాగా రాసే వాళ్ళు, అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు ” కదా అన్నట్టు అన్నాను. ” లేదు. నువ్వే రాస్తే బాగుంటుందని…” అన్నాడు మౌళి. నేను అభ్యంతరంగానే ఒప్పుకున్నాను- మౌళీ కవిత్వానికి నేను న్యాయం చేయలేనేమోనన్న భయంతో!

ఫోను ముగించగానే పుస్తకం పేరు మరొకసారి గుర్తు తెచ్చుకున్నాను. ‘ఆకు కదలని చోట ‘ – వెంటనే ఫిలిప్పైన్ కమ్యునిస్టు పార్టీ స్థాపించిన విప్లవకారుడు, కవి హోస్ మారియా సిసోన్ రాసిన ‘గెరిల్లా యోధుడు కూడా ఓ కవే ‘ అన్న కవితలోని మొదటి వాక్యాలు గుర్తొచ్చాయి.

“ఆకు కదలికకు,

చితికిన రెమ్మకు,

నది అలజడికి,

నిప్పు వాసనకు,

వెనుదిరిగినపుడు రాలే బూడిదకూ

ప్రతీ అలికిడికీ అప్రమత్తం అయ్యే

గెరిల్లా యోధుడుకూడా ఓ కవే”

ఇక్కడ సిసోన్ ఒక విషయం చెప్పకనే చెప్పాడు – సున్నితత్వం (sensitivity) లో గెరిల్లా యోధునికీ, కవికీ తేడా లేదని.

చేగువేరా తన పిల్లలకు రాసిన వీడుకోలు లేఖలో విప్లవకారుడి సున్నితత్వం గురించి “ప్రపంచం నలుమూలలలో ఎక్కడ అన్యాయం జరిగినా అంతరాంతరాల్లో నుండి ప్రతిస్పందించగలగాలి” అని రాస్తాడు. బహుశా అలాంటి సున్నితత్వం వలనే మౌళీ బస్తర్ నుండి సిరియా వరకూ, తెలంగాణా ఉద్యమం నుండి టర్కీ శరణార్థుల వరకు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆ పరిస్థితిలో తనను తాను మమేకం చేసుకొని  (identify)  సంఘీభావం (solidarity) తెలుపుతూ కవితలు రాసాడు.

2

మౌళికి నటించటం రాదు. తానేం చూస్తాడో అదే రాస్తాడు. తన చుట్టూ పరిసరాలను, మారుతున్న ప్రపంచాన్నీ, దోపిడీని, అణిచివేతనీ, ప్రకృతిని, రాజుకుంటున్న విప్లవాన్ని- నిజాయితీగా ‘witness’ చేస్తాడు.  ఇలాంటి కవిత్వాన్ని అమెరికన్ కవియిత్రి, మానవహక్కుల ఉద్యమకారిణీ అయిన కెరోలిన్ ఫోర్ష్ ‘Poetry of Witness’ అంటుంది. ఈ రకమైన కవిత్వన్నే రాసే Yannis Ritsos అనే గ్రీకు మహాకవి, మౌళీ కి ఇష్టమైన కవి కావటంలో ఆశ్చర్యం లేదు. Ritsos ఎంత ప్రమాదకరమైన కవి అంటే అతని కవిత్వ జ్వాలకు ఎదురుగా నిలబడలేక 1936 లో గ్రీకు దేశపు ఫాసిస్టు ప్రభుత్వం అతని కవిత్వాన్ని కాల్చి దగ్ధం చేసింది. Ritsos ని  మౌళీని ఇద్దరినీ కలిపే ఓ మౌలిక స్వభావం- నిజాయితీ. తమ అక్షరాల పట్ల నిజాయితీ. తమ జీవితాలలో నిజాయితీ. తమ ఉద్యమాలకూ, భావజాలలకూ నిజాయితీ. తమ చుట్టూ ప్రపంచంతో నిజాయితీ.

ఈ నిజాయితీనే మౌళీ కవిత్వానికి అస్తిత్వం, ప్రాణం.

ఓ నైరూప్య వినియోగదారుడికోసం నిజాన్ని కూడా  న్యూస్ అన్న పేరుతో కమోడిటీ చేసి కృత్రిమంగా మార్కెట్లో అమ్ముతున్న తరుణంలో మౌళీ రాస్తున్నటువంటి కవిత్వం, సాహిత్యం ఓ ప్రత్యామ్నాయ చరిత్రనే  సృష్టించగలదు.

3

స్పానిష్ మహా కవి నెరుడా తన నోబెల్ ప్రసంగంలో కవి గురించీ ఇలా అంటాడు.

“ప్రజలందరిలాగ తాను కూడా ఉత్పత్తి సంబంధాల్లో పాల్గొంటూ, మిగిలిన మనుషుల పట్ల వారి పనుల పట్ల సున్నితత్వంతో వ్యవహరిస్తూ, రోజువారి సామాన్య జీవితపోరాటాలలో పాలుపంచుకుంటూ, చెమటలు కక్కుతూ ఆహారాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా మానవత్వం సమూహంగా కనే ఓ మహోన్నత కలలో తాను కూడా భాగస్వామయినప్పుడు.. ఆ కవి కవిత్వం చారిత్రాత్మకమవుతుంది”

మౌళీ కూడా అలాంటి కవే. ప్రజలలో, పోరాటాలలో మమేకమైన కవి. కవిత్వం సామాన్య ప్రజలకోసమని అనుకునే కవి. అందుకే తాను పాఠాలు చెప్పే తరగతిలోని విద్యార్థులకు కవిత్వం కూడా చెప్తూ, కవిత్వం చదవటాన్ని, రాయటాన్ని  ప్రోత్సహిస్తూ, వారు రాసిన కవిత్వాన్ని పత్రికలకు పంపిస్తూ ఉంటాడు.

ఎందుకంటే మౌళి దృష్టిలో కవిత్వం ప్రజాస్వామికమైనది.

4

మౌళీ కవిత్వంలో మరొక ముఖ్యమైన అంశం జ్ఞాపకం. ఓ వ్యక్తి వ్యవస్థను  ఎదిరించి నిలబడటం లాంటిదే జ్ఞాపకం మరుపును నిలువరించటం కూడా అంటాడు జెకొస్లెవేకియన్ రచయిత మిలన్ కుందేరా.

ప్రపంచం మనిషి ఇచ్ఛతో సంబంధం లేకుండా, నిర్విరామంగా మారుతున్న సమయం ఇది. ఇలాంటి పరిస్థితులలో జ్ఞాపకానికి ఓ విప్లవాత్మకమైన బాధ్యత ఉంటుంది.

మౌళీ కవిత్వం రాయటం ద్వారా జ్ఞాపకాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుంటాడు. జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాల తాలుకు జ్ఞాపకం, తను పుట్టిపెరిగిన పల్లెటూరు, అక్కడ చుట్టూ మారుతున్న పరిస్థితుల తాలుకు జ్ఞాపకం రెంటినీ తన కవిత్వం ద్వారా ఒక చోటికి తెచ్చి shortcircuit చేస్తూ ఆ జ్ఞాపకంతో పాఠకున్ని shock కి గురిచేస్తాడు.

5

ఎప్పుడూ ఏకాంతాన్నీ, ఏకాంతంలోని రసాన్ని పెంచి పోషించే mainstream సాహిత్యం నుండి వేరుపడతాడు మౌళి.

మౌళి కవిత్వం ఏకంతాన్ని ప్రతిఘటిస్తుంది. పెట్టుబడీదారివ్యవస్థ ప్రజలందరినీ తమతమ ఏకాంతాలలో బంధించి individualisation అనే పేరుతో  సమాజాన్ని విడగొట్టి ఉద్యమాలను విచ్చిన్నం చేస్తున్న తరుణంలో మౌళీ కవిత్వం deindividualise అవ్వమని, గుంపులు గుంపులుగా రోడ్డుపైకొచ్చి ప్రశ్నల వర్షం కురిపించమని పిలుపునిస్తుంది.

మరి మౌళీకి ఏకాంతం లేదా?

ఉండకనేం!

ఏ కవికైనా తన అంతరాంతరాల్లో కూరుకుపోయిన భావోద్వేగాలు, భావాలు, తన జ్ఞానం, తన అస్తిత్వం అన్ని కలగలిసిన  ఏకాంతంలో నుండే కవిత పుట్టుకొస్తుంది. కానీ ఎప్పుడైతే సమాజంలోని చలనాలను, మార్పులను, దోపిడీని, అణచివేతనూ ప్రత్యక్షంగా ఎదుర్కుంటాడో అప్పుడు కవి ఏకాంతం కూడా political అవుతుంది.

సమాజంలోని మార్పులతో, అదృశ్య అణచివేతలతో ,  కుల వర్గ దోపిడీలతో ఎంతో మమేకమవ్వటం చేతనే మౌళీ ఏకాంతం కూడా ఓ political రూపం దాల్చింది అనుకుంటాను. తన ఏకాంతానికి కూడా proletariate అస్థిత్వం సంతరించింది. అందుకే మౌళీ ఏకాంతం ఆధిపత్య బూర్జువా భావజాలాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.

6

శివారెడ్డి గారు 1990 లో ‘అజేయం’ అనే కవితా సంకలనంలో ‘కవులేంజేస్తారు!’ అనే కవితలో ఇలా అంటారు-

“కవులేం జేస్తారు

ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

తెల్ల కాయితానికి అనంతశక్తినిస్తారు

కవులేం జేస్తారు

చేతుల్లో కింత మట్టి తీసుకొని శపిస్తారు

మణికట్టు దాకా నరికినా

మొండిచేతుల్తో గోడల మీద పద్యాలు రాస్తారు,

..

కవులేం జేస్తారు

చట్టాన్ని ధిక్కరిస్తారు,

ఎడారి మీద పద్యాలు రాస్తారు

ఎడారి క్రమక్రమంగా

సజీవ దేశంగా రూపొందుతుంది

కవులేం జేస్తారు

గోడలకు నోరిస్తారు

చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

ప్రజల చేతుల్లో

అనంతశక్తి సంపన్నమయిన పద్యాన్ని పెడతారు.”

తెలుగులో ఈ మధ్య రాస్తున్న మిగిలిన కవుల గురించి నాకు తెలియదు కాని- మౌళీ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కవే!

*

mouli1

బొజ్జ తారకం ఎవరు?!

tarakam1
బొజ్జా తారకంగారితో నాకు గల పరిచయాన్ని మీతో పంచుకోవాలనిపిస్తోంది.
2004 డిసెంబర్ లో నేను జపాన్ నుంచి భారత దేశానికి తిరిగివచ్చినప్పుడు కొద్దికాలం హైదరాబాద్ లో టూరిజం డైరెక్టర్ గా ఉన్నాను. ఆ సమయంలో కొన్ని దళిత సమావేశాలలో బొజ్జ తారకంగారిని కలిసేవాడిని.  ఆయన సంపాదకీయంలో వెలువడే ‘నీలి జెండా’ పత్రికను తెప్పించుని  దళితుల సమస్యలమీద రాస్తున్న వ్యాసాలను చదివి అర్దం చేసుకునేవాణ్ణి.  గనుముల జ్ఞానేశ్వర్ గారు కనబడినప్పుడు బొజ్జ తారకంగారి గురించిన వార్తలు చెప్పేవారు. అప్పుడు నేను కొత్తగా దళిత కవిత్వం రాయడం మొదలు పెట్టాను. కవితలు ఆంధ్ర జ్యోతిలో ప్రచురింపబడ్డప్పుడు తారకంగారు తప్పకుండా ఏదో విధంగా చదివేవారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కనబడినప్పుడు నా కవిత్వం గురించి  ప్రస్తావించి మరిన్ని దళిత సమస్యలమీద రాయాలని ఉద్భోధించేవారు. ‘పోరాడాలి. లేకపోతే  అన్యాయం జయిస్తుంది ‘ అని తరుచుగా అనేవారు.
ఏ విషయాల మీద రాయాలి, ఏ విషయాల మీద పోరాటం చెయ్యాలి అని మార్గదర్శకత్వం చేసేవారు. “బొజ్జ తారకం గారిని ఎలా చూడాలి”  అనే సందేహం నన్ను వెంఠాడేది. ఒక కవిగా, రచయితగానే కాదు, సామాజిక, దళిత న్యాయవాదిగా, పౌరహక్కుల కార్యకర్తగా అన్ని రూపాల్లో నాకు కనబడేవారు. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఎన్ని పాత్రలు నిర్వహించాలో అన్ని పాత్రలనూ ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.  అందుకేనేమో ఈరోజు అన్ని వర్గాలవారు తారకంగారిని తమవాడిగా చెప్పుకుంటున్నారు. పౌరహక్కులకోసం ఇంతగా పోరాడిన నాయకుడు నాకు ఇంతవరకూ తారసపదలేదు. దళిత కులం నుంచి వచ్చిన తారకంగారు పౌరహక్కుల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. అనేక  బూటకపు పోలీసు ఎన్కౌంటర్లలో పాల్గొన్న అధికారులకు వ్యతిరేకంగా తారకంగారు సుప్రీం కోర్ట్ లో కేసు దాఖలు చేసి కేసు గెలిచారు . 2004లో  డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు  ముస్లింలకు  రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేసును తారకంగారు వాదించారు.  కారంచేడు దళితులపై జరిగిన హింసకు  నిరసనగా  తారకంగారు  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక ప్రాసిక్యూటర్ పదవికి  1984 లో రాజీనామా చేశారు.
టోలీ చౌక్ లో ఉన్న ఆయన ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను. అంబేద్కర్ గారు రాసిన రాసిన పుస్తకాలను తెలుగులోకి  ఆనువదించిన ఆయన సతీమణి విజయభారతిగారు కాఫీ ఇచ్చి కుశల ప్రశ్నలు వేసేవారు. 2007 లో నా మొదటి కవితా సంకలనం ‘దళిత వ్యాకరణం ‘ ఆవిష్కరణకు మొత్తం కార్యక్రమాన్ని తన బుజాలమీదకు ఎత్తుకున్న కవి శిఖామణిగారు  బొజ్జ తారకంగారిని  నా తరపున ఆహ్వానించారు. నా కవిత్వం చదివి మురిసిపోయి నన్ను తుల్లిమల్లి కాదు, ‘తుళ్ళీతుళ్ళిపడే విల్సన్ సుధాకర్’ అని తారకంగారు చమత్కరించారు. గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ బుక్ఫెస్టివల్ కు సామాన్యగారి పుస్తకం ఆవిష్కరణకు బొజ్జ తారకంగారిని ఆమె ఆహ్వానించారు.  ఆమె తరపున నేను తారకంగారింటికి వెళ్ళీ ఆయనను, విజయభారతిగారిని కారులో ఎగ్జిబిషన్కు తీసుకువచ్చాను. ఆ సందర్భంగా ఆయనతో దళిత సోదరులమంతా ఫోటోలు దిగాము.
 tarakam2
దళిత వాణిగా పేరొందిన బొజ్జా తారకం గారి మరణ వార్త విని ‘ పౌర హక్కులకు  ఆసరాగా నిలబడ్డ చివరి బురుజు కూలిపోయింది ‘ అన్నారు ఆంధ్ర జ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ గారు.  ‘బొజ్జ తారకం ఎవరు’ అనే ప్రశ్న నేటి తరానికి  కలగొచ్చు.  ఒక్క మాటలో తారకం గారిని నిర్వచించలేము.  దళిత, పౌరహక్కుల, సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా,  ఆంధ్రలో రిపబ్లికన్ పార్టీ , దళిత మహాసభ సంస్థాపకుడిగా తారకంగారు ఎంతో సేవ చేశారు.  దళితుల మీద అగ్ర వర్ణాలు జరుఫుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆయన నిరంతర పోరాటం చేసారు.  సెంట్రల్ ఊనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యోదంతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి దేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించగలిగారు. మేజిస్ట్రేట్, హైకోర్ట్ , సుప్రీం కోర్ట్లలో దళితులు, మైనారిటీలు, కొండజాతులవారికి న్యాయ సహాయం అందించారు. అనారోగ్యం పాలయినా సరే  RPI ద్వారా అంబేద్కర్ ఆశయాలను యువతలో ప్రచార చేసేలాచివరివరకూ క్రుషి చేశారు.  జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశేష అధికారాలతో పోలీసు యంత్రాంగం చెలరేగిపోయి నక్సలైట్ ముద్రలు వేసి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు ‘ పోలీసులు  అరెస్ట్ చేస్తే’ అనే పుస్తకాన్ని రచించి పౌరహక్కుల కోసం క్రుషి చేశారు. ఈ పుస్తకం Jane Maxwell రచించిన Where There Is No Doctor అనే పుస్తకం పొందినంత ప్రచారం పొందింది.
1992 లో చుండూర్ లో దళితులపై అగ్రవర్ణాలు జరిపిన మారణ కాండపై తారకం గారు జరిపిన న్యాయపోరాటం ఎంతో ప్రసిద్ధమయ్యింది. మా ఇద్దరి మధ్య కొన్నిసార్లు చుండూరు కేసు ప్రస్థావనకు వచ్చేది. ఏకపక్షంగా కొందరు న్యాయమూర్తులు ఎలా వ్యవహరిస్తున్నదీ, చివరకు వారి మనసులో ఏమున్నదీ తారకం గారు నాకు చెప్పేవారు. ఒకానొక దశలో తారకంగారిమీద కోర్టు ధిక్కార నేరాన్నిమోపుతానని ఒక న్యాయమూర్తి బెదిరించారనీ, మీరు ఏమిచేసుకుంటారో చేసుకోండని  అన్నాననీ తారకం గారు చెప్పి వారి పక్షపాత ధోరణి పట్ల విచారం వ్యక్తం చేసేవారు.
చుండూరు ఊచకోత కేసులో  తారకంగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. దళిత కెమెరా తో ఒక ముఖాముఖిలో మాట్లాదుతూ ” చుండూరు కేసులో ఇచ్చిన తీర్పు తర్కవిరుద్ధమయినది, పక్షపాతంతో కూడినది  అని  చీత్కరించారు. హైకోర్టు చేసిన వాదన నేర న్యాయశాస్త్రం మీమాంసకు, రుజువులున్న సాక్ష్యాలకు, అన్ని నియమాలకు విరుద్ధంగా ఉంది.  తొలి తీర్పు ఇచ్చిన  ట్రయల్ కోర్టు మొత్తం సాక్ష్యాల్నిచర్చించించి తిరుగులేని ఒక నిర్ధారణకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు  అన్ని నిబంధనలను గాలికి వదిలి, నేర న్యాయ శాస్త్ర మీమాంసను తెలియక,  అశాస్త్రీయతార్కికంతో  అన్ని ఆరోపణలున్న దోషులను నిర్దోషులుగా విడుదల చేసింది” అని అభిప్రాయపడ్డారు.
tarakam3
హైకోర్టు  వాదన ప్రకారం- కారణాలలో ఒకటి ఏమిటంటే  ” ప్రాసిక్యూషన్ ‘సంఘటన సమయాలను రుజువుచెయ్యడంలో విఫలమైంది, ఏ సమయంలో బాధితులకు  గాయాలు ఏ తగిలాయో చెప్పలేదు.”  కేవలం భౌతికమైన వైరుధ్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మేము న్యాయమూర్తులకు చెప్పామని” తారకంగారు అన్నారు. కానీ నేరపూరిత న్యాయ మీమాంసకు, విధానాలకు సంబంధం లేకుండా, చట్టం, సాక్ష్యం ప్రసక్తి లేకుండా హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఎటువంటి వాదనలకోసం ఎదురు చూడకుండా దోషులను వదిలివెయ్యాలని హైకోర్ట్ నిర్ణయించిందని మాకు అర్దమయ్యింది అని తారకం గారు నాడు వ్యాఖ్యానించారు. చివరకు వారు కొరినట్లే జరిగింది అని ఆయన అన్నారు.
తారకంగారు తెలుగు రాష్ట్రాలలోని  అట్టడుగు వర్గాలకు  ఆయన ఒక గొప్ప వాగ్దానం. దళితులు మీద దుర్మార్గపు చర్యలపై నిత్రంతరం పోరాటం జరిపిన వ్యక్తి. ఒక గొప్ప నాయకుడు, కవి, వక్త , కార్యకర్త. ఒక గొప్ప రచయిత విజయ భారతి జీవిత భాగస్వామి. తమ మీద అత్యాచారాలు జరిపిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలని కోరిన ఏకైక వ్యక్తి. ఆయన మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.
*

అన్నదాత మరణమృదంగ వాయుధ్వని!

1973-2 మనలో ఎంతమందిమి అన్నం తినేటప్పుడు రైతు గురించి ఆలోచిస్తాం? అసలీ వ్యవసాయక దేశంలో ఇంతవరకు ఏ రైతుకూ ఎందుకని భారతరత్న అవార్డు రాలేదు?” ఇవి నటరాజ్ మహర్షి వేసిన ప్రశ్నలు, తనకు తానే వేసుకున్న ప్రశ్నలు. అతనికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. బహుశ వాటికి జవాబులు దొరక్కపోవచ్చు. కానీ రైతుకి తన రుణం మాత్రం తీర్చుకోవాలనుకున్నాడాయన. ఫలితమే “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” అనే లఘు చిత్రాన్ని నిర్మించారు.

నిజానికి నటరాజ్ కి ఇది మొదటి సినిమా కాదు. ఈ సినిమా కి ముందుగా ఓ ఫిలిం మేకర్ గా ఆయన చేసిన ప్రయాణం వుంది. “న్యూయార్క్ ఫిలిం అకాడెమీ” అనుబంధంతో కాలికట్ లో జరిగిన వర్క్ షాప్ లో శిక్షణ పొందిన నటరాజ్ అక్కడ మెథడ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత నవ్య యుగపు నవీన భావాల దర్శకులందర్నీ కలుసుకున్నానని చెప్పారు. ఆ తరువాత ముంబైలో సెటిల్ ఐన నటరాజ్ 2014 లో “డ్రాయింగ్ బ్లడ్” అనే ఇంగ్లీష్ సినిమా తీసారు. అది ఒక పెయింటర్ కథ. ఆ తరువాత కెరీర్లో ఎదగటం కోసం తనని తాను కోల్పోయిన ఒక గజల్ గాయని మీద “మేరా ఆలాప్” అనే హిందీ లఘు చిత్రం 2015లో తీసారు. తన అన్ని సినిమాలకీ తనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, తనే స్క్రిప్ట్ రైటర్, తనే దర్శకుడు. ప్రతి షాట్ ని ఎంతో శ్రద్ధగా చిత్రిస్తారు ఆయన. లైటింగ్, కెమెరా యాంగిల్స్ వంటి అన్ని విషయాల్లో మంచి క్రాఫ్ట్స్ మెన్ షిప్ కనబరుస్తారు. ప్రేక్షకుడి మూడ్ ని ఎలవేట్ చేసే నేపధ్య సంగీతం గురించి, ఎడిటింగ్ గురించి శ్రద్ధ తీసుకుంటారు. నేను ఆయనతో మాట్లాడిన మేరకు ఆయనలో ప్యూరిటానిక్ కళాకారుడు ఉన్నాడు. ఇది ఆయన మొదటి ఫీచర్ సినిమా “డ్రాయింగ్ బ్లడ్” లో కనిపిస్తుంది. జీవిత పరమార్ధం ఆధ్యాత్మిక దృక్పధంలో దొరుకుతుందనే ఆలోచన ఆయనలో వుంది. ఇది ఆయన షార్ట్ ఫిలిం “మేరా ఆలాప్” లొ స్పష్ఠంగా కనబడుతుంది. ఆయన ప్రస్తుతం “ద స్కల్ప్టర్” అనే డాక్యుమెంటరీ నిర్మాణంలో వున్నారు. ఇది కాకుండా “అనోనా” అనే ఫీచర్ ఫిలిం కూడా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ తీసినా దాని ముందు, తరువాత చాలా పని చేస్తానంటారు నటరాజ్.

“1973” సినిమాలో నటరాజ్ ఏ చెప్పారు? వర్తమాన రైతు సమస్యల మీద, రైతుల ఆత్మహత్యల మీద తీసిన సినిమా కాదిది. తనకేమైన కష్టం వస్తే ఎవరికీ పట్టని రైతు ఒంటరితనం గురించి, నిస్సహాయత గురించి, ఎవరికీ వినిపించని రైతు ఆర్తనాదం గురించి, దుఖం గురించి, అభద్రత గురించి, నిన్నటి దాకా పంటకి నీరు పెట్టిన రైతు హఠత్తుగా కనిపించక పోతే పట్టించుకోని సమాజ నిర్లక్ష్యం గురించి నటరాజ్ చెప్పారు. నీరందని పంటలాగా ఎండిపోతున్న రైతు గురించి చెప్పారు. రైతు భూమిలో వనరుల మీద కన్నేసి అతని భూమిని దక్కించుకోవాలన్న పొలిటీషియన్ స్వార్ధం గురించి, క్రూరత్వం గురించి చెప్పారు. ఎవరూ చెప్పని ఓ రైతు గురించి చెప్పారు. నిస్సహాయంగా గాలిలో కలిసిన అతని ఆక్రందనని మనకు వినిపించారు. అసలు భవిష్యత్తులో రైతనే వాడుండని హెచ్చరించారు.

నిజానికి నటరాజ్ ఏమీ చెప్పలేదు. కేవలం చూపారు. చాలా చూపించారు. దేశం మీద ప్రేమతో జెండా కింద సేద్యం చేసిన రైతు నిబద్ధత గురించి చూపించారు. ఆ రైతు వెక్కిళ్ళు మన దోసిలిలో పోసి చూపించారు. “దాహం వేస్తుంది. నీ భూమిని ఇస్తావా?” అనే రాజకీయ నాయకుడి స్వార్ధం చూపించారు. పెద్దగా డైలాగులు లేని ఓ ఇరవై నిమిషాల లఘు చిత్రంలో ప్రేక్షకుడి మనసుని కదిలించే విధంగా ఆయన ఇవన్నీ చూపించారు. జెండాని సంక్షేమ రాజ్యానికి చిహ్నంగా చూపించి బలవంతుడి దౌష్ట్యం ముందు రాజ్యాంగం పూచీపడే సంక్షేమం ఎంత బలహీనమో చూపించారు. రైతుని కొట్టడానికి జెండా కర్రని వాడుకున్న మంత్రి చివర్లో జెండా విశిష్ఠతని గురించి రేడియోలో ఉపన్యసిస్తాడు. ప్రతీకలు కలిగించే మిధ్యావేశంలో మనం బతికేస్తుంటాం కదా!

1973-3

1973లో ఖమ్మం జిల్లాలో ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టిన నటరాజ్ కి ఆయన తండ్రి అదే సంవత్సరంలో తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతుకి జరిగిన అన్యాయాన్ని వివరించి చెప్పారు. ఎవరికీ తెలియకుండా చరిత్ర కాలగర్భం లో కలిసిపోయిన ఆ రైతు కథ ఇప్పుడు నటరాజ్ చేతిలో ఓ సినిమాగా ప్రాణం పోసుకుంది.

“వాయుధ్వని ప్రొడక్షన్స్” సమర్పణలో నటరాజ్ మహర్షి తానే స్వయంగా రాసి, తీసిన “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” ఇప్పటికి 5 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎంపికైంది. ఆల్ లైట్స్, బెంగళూరు, రుమేనియా, మన్ హట్టన్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ లో ఈ సినిమా ఎంపికైంది. ఇది ఓ తెలంగాణ యువకుడు సాధించిన ఘనత.

ఈ సెప్టెంబర్ 24 నుండి 27 వరకు రామోజీ ఫిలిం సిటిలో జరగబోయే “ఆల్ లైట్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్”లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. “షార్ట్ ఫిలిం కార్నర్”లో తెలుగు నుండి అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన రెండు సినిమాల్లో ఇదొకటి. కెవీఅర్ మహేంద్ర తీసిన “నిశీధి”మరొకటి. ఇది తెలంగాణ చిన్న సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ విజయం. మొన్నీమధ్యనే 1973 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని విడుదల చేసారు. ఈ సినిమా చూసి నగ్నముని గారు స్పందించిన వీడియో కూడా యూట్యూబ్ లో లభ్యమౌతుంది.

స్లాప్ స్టిక్ కామెడీ తోనో, చీప్ డైలాగులతోనో నాసిరకపు సాంకేతిక, సంగీత నాణ్యతా విలువలతో కనబడతాయి తెలుగులో షార్ట్ ఫిలింస్ యూ ట్యూబులో. వాటికి భిన్నంగా మంచి అభిరుచితో, బాధ్యతతో సినిమాలు తీసే వృత్తిరీత్యా ఫాషన్ ఫోటోగ్రాఫర్ ఐన నటరాజ్ మహర్షి వంటి ఫిలిం మేకర్స్ ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీదుంది. మనం ప్రోత్సహించాలే కానీ ఆయన దగ్గర చాలా మెటీరియల్ వుంది. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్!
Official Trailer – 1973 An Untold Story (2016) Short Film

 

అదే కథ ఇక్కడా!!

photo: satya sufi

photo: satya sufi

 

శరీరాలు సముద్రాలు దాటినా మనో కాలుష్యం మనల్ని దాటిపోదు. నరనరాన జీర్ణించుకున్న స్ర్తీ వ్యతిరేకత, హిప్పోక్రసీ ఏ కొత్త విషయాన్ని ఏ ప్రోగ్రెసివ్‌ విషయాన్ని మనలో ఇంకనివ్వవు.

ల్యాండ్ ఆఫ్‌ ఆపర్చునుటీస్‌ అనుకుని అమెరికాకు పయనమైన వారిలో కొంతమంది(కొంతమందేమిటిలే,  చాలామందే) ఇక్కడ ప్రదర్శించే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కిందటి కాలంలో ముట్టు మడీ ఆచారాలతో ఆఫీసుల్లోనూ అదరగొట్టే వాళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ సారి పిల్లలు-పెంపకాల్లో వారి ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం. ఎన్‌ ఆర్‌ ఐలందరూ ఇలా ఉన్నారని చెప్పబోవడం లేదు. నేను పదిహేన్నేళ్ల పైగా ఇక్కడే ఉంటున్న ఎన్ఆర్ఐనే. కాకపోతే  తెలుగే అధికారభాషేమో అన్నంతగా అడుగడుగునా మన స్వరం వినిపించే కాలిఫోర్నియాలో ఉండడం వల్ల అనుభవాలు అనేకం తారసపడుతుంటాయి. అద్దాల భవంతి లాంటి అమెరికా జీవితం వెనుక ఉన్న చీకటి కోణాల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను.

అమెరికా గడ్డమీద అడుగుపెట్టగానే చాలామంది తొందరపడే విషయాలు రెండు. మొదటిది అర్జెంటుగా గ్రీన్‌ కార్డు తెచ్చేసుకోవాలి. రెండు యమార్జంటుగా పిల్లల్ని కనేసి సిటిజెన్‌ షిప్‌ తెచ్చేసుకోవాలి.

మనం ఎంత తొందరపడినా మొదటిది మన చేతుల్లో ఉండే విషయం కాదు. దాని టైం అది తీసుకుంటుంది. రెండోది కూడా పాక్షికంగా మాత్రమే మన చేతుల్లో ఉన్నది. ఒక శుభముహూర్తాన ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అవుతుంది. అక్కడినుంచి హడావుడి మొదలు. మరీ పాత సినిమాల్లో మాదిరి ఎత్తుకుని గిరగిరా తిప్పకపోవచ్చేమో కానీ ఇక్కడ భారత్‌లో కంటే ఎక్కువ హడావుడి అయితే ఉంటుంది. పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అనేది మొదటిది. భారత్‌లో ఐనా అబ్బాయికి అమ్మాయికి మధ్య మధ్యతరగతి వ్యత్యాసం చూపించడం తగ్గిపోతున్నదని అక్కడి మిత్రులు చెపుతున్నారు.

కానీ ఇక్కడ ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. ఇక్కడ లింగనిర్ధారణ పరీక్షలు నిషేధమేమీ కాదు కాబట్టి తెలుసుకున్నప్పటి నుంచి ఒకటే రంథి. మొగబిడ్డే బిడ్డ. ఆడపిల్ల అయితే మూతి ముడుపులు కనిపిస్తూనే ఉంటాయి. వర్జీనియాలో ఉన్నపుడు ఒక కాబోయే తల్లి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి హిస్టీరియా వచ్చినట్టు గుండెలు బాదుకుంటూ ఏడవడం చూసి నవ్వాలో ఏడవాలో తెలీక చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖంలో కోపం కనిపించకుండా ఉండడానికి బూతులు తిట్టకుండా నిగ్రహించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇండియాలో సైంటిస్ట్‌గా పనిచేసిన పెద్దాయన తన కూతురు కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి కళ్లమ్మట నీళ్లు పెట్టుకోవడం చూసినపుడైతే అరేయ్‌ నీకు సైన్స్‌ డిగ్రీ ఇచ్చిన గాడిద కొడుకెవర్రా అని అడగాలనిపించేంత కోపమొచ్చేసింది. కొంతమంది ఆడవాళ్లు అయితే ఇంకో రకమైన భయాలు చెప్పేస్తారు కూడా భోళాగా. అమ్మాయి ఇక్కడ ఏ తెల్లోణ్ణో డేటింగ్‌ చేస్తే ఎలా! ఇనుపకచ్చడాలు తయారుచేయవే తల్లీ అని కచ్చగా అనాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం! అబ్బాయి అయితే ఏం చేసినా ఎలా తిరిగినా పర్లే అన్నమాట!

ఇంతకంటే దారుణమైన అసహ్యకరమైన ప్రక్రియ ఉంది. మనం అసహ్యం అంటున్నాం కానీ దాన్ని వాళ్లు విశ్వాసం అనే అనుకోవచ్చు. ముహూర్తాలు పెట్టుకుని పిల్లల్ని కనడం. ఈ విషయంలో కొంత మంది మరీ పట్టుదలగా ప్రాణాలు పోయినా పర్లేదు అన్నంత నిబద్ధంగా ఉంటారు.

బిటెక్‌ కంప్యూటర్స్ చేసి ఇక్కడికొచ్చిన ఒక అమ్మాయి కథ వింటే మీకే తెలుస్తుంది వారి నిబద్దత విలువ. ఆ అమ్మాయికి నొప్పులొస్తే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ లోపు అమ్మలక్కల ద్వారా ముహూర్తాలు వగైరా తెలుసుకున్నారు. ఇంకా టైముంది ఇపుడే కనకూడదు అని ఆ అమ్మాయి కఠినాతికఠినంగా భీష్మ ప్రతిజ్ఞ చేసేసుకుంది. అంత నొప్పిలోనూ కాళ్లు దగ్గరపెట్టి  బిడ్డ బయటకు రాకుండా కొన్ని నిమిషాల పాటు ఆపడానికి విశ్వప్రయత్నం చేసింది. నమ్మశక్యం కానీ విషయమే. కానీ ఇది స్వయంగా ఆ అమ్మాయి గర్వంగా వినిపించిన కథ.

బిడ్డ సరైన సమయంలో భూమి మీదకు వస్తే ఆతని భవిష్యత్తు బంగారంలా ఉంటుందని భావించి ఒక తల్లి పడ్డ వేదన అన్నమాట! ఓహ్‌! అమాయక డాక్టర్లకు మొదట ఏమవుతుందో అర్థం కాక చివరకు ఏదో అర్థమై నానా తిట్టూ తిట్టి ఏదో రకంగా ఆలస్యంగానైనా బిడ్డను బయటకు తీశారనుకోండి. ఈ ఆలస్యం ఫలితం ఏమిటనుకున్నారు. బిడ్డను అలా బలవంతంగా కాసేపైనా ఆపితే ఏమవుతుంది?  బిడ్డకు ఆక్సిజన్ అందాల్సినంత అందక ఎదుగుదల లోపాలు ఏర్పడ్డాయి. ఇంకేవో సైంటిఫిక్‌ పరిభాషలో ఉండే సంక్లిష్ట సమస్యలు. వాడు అందరిలా పిలిస్తే పలకడు. అందరితో కలిసి ఆడుకోడు. నాలుగేళ్లు దాటినా మాటలు రాలేదు. ఆ తల్లి త్యాగం ఆ బిడ్డకు అంత బంగారు భవిష్యత్తునిచ్చింది మరి! ఇక్కడ కథలో ఇంకో ట్విస్టు ఉంది. ఇంత జరిగినా ఆ తల్లిలో మార్పేమీ లేదు. వాడికేం మగపిల్లాడు, మాటలదేముంది కాస్త ఆలస్యంగా వస్తాయి, డాక్టర్లు చెపుతున్నారుగా కాస్త ఆలస్యంగానైనా వస్తాయని పర్లే, మగపిల్లాడేకదా అని మగజపం ఒకటికి వందమార్లు చేసేది.

అసలు విషయానికి వస్తే అదే తల్లి రెండో సారి గర్భవతి అయ్యింది. ఈ సారి రివర్స్‌. డెలివరీ డేట్‌ అమావాస్య అయ్యేట్టు ఉందని తెలిసి నొప్పులు రాకపోయినా ముందుగానే ముహూర్తం పెట్టుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి నొప్పులు నటించడం వాళ్లు ఇవి లేబర్‌ పెయిన్స్‌ కాదమ్మా అని చెప్పి పంపించడం, ఎలాగోలా ఇపుడు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీయండి డాక్టర్ అని వాళ్లతో అంటే ఈమెకేమిటి పిచ్చా అని వారు తిట్టి పంపించడం ఇదో ప్రహసనం.

ఇంకో అంకం ఉంది. పిల్లలు పుట్టాక తమ తల్లిదండ్రుల మీద అమాంతం ప్రేమ పెరిగిపోతుంది. అంతకుముందు స్కైప్‌లో మాత్రమే చూసి మాట్లాడి తరించే తల్లిదండ్రులను ముఖ్యంగా తల్లిని(తండ్రి అంత ముఖ్యం కాదు) దగ్గరగా చూడాలనిపిస్తుంది. అమెరికా చూపించాలనిపిస్తుంది. అమెరికాలో బేబీ సిట్టర్స్‌ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఖర్చు ఎక్కువ. మనం ప్రతినెలా జీతంలో ఎక్కువభాగం మిగుల్చుకోవాలి. అక్కడ మన గడ్డమీద నేల కొనేయాలి కదా! తల్లికి  సమన్లు పంపిస్తాం అత్యంత ప్రేమగా.  వాళ్లకు వేరే ఆప్షన్‌ ఏముంది కనుక. అదే పదివేలు అనుకుని వచ్చేస్తారు. మనుమడో మనుమరాలో అంటే చూడాలని ఉంటుంది కదా!

ఆ రకంగా బేబీ సిట్టర్ని ఫ్రీగా ఏర్పాటు చేసుకుంటాం. వాళ్లు ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేకపోతే ఏకంగా బిడ్డల్ని వాళ్లతో పంపించేస్తాం. రోజూ స్కైప్‌లో పాలు తాగాడా, విరోచనాలయ్యాయా, జలుబు చేసిందా, అని ఇక్కడినుంచి అడుగుతూ ఉంటాం. ఎవరైనా బేబీ సంగతేంటి అని అడిగితే చాలు రెండు కళ్లల్లోంచి జలపాతాలే. పిల్లల్ని ఎంత మిస్ అవుతున్నారో వైనవైనాలుగా వర్ణించి చెప్పడమే. ఎవరుంచుకోవద్దన్నారు.ఎవరి ఆశ. ఎవరి అత్యాశ? మిమ్మల్ని కూడా అలాగే మీ తల్లిదండ్రులు మిస్ అవుతుంటారు కదా, బేబీ సిట్టింగ్‌ కోసం కాకుండా మామూలుగా కూడా పిలవొచ్చు కదా, వెళ్లి చూసి రావచ్చు కదా!

ఇలాంటి అనుభవాలు అనేకం చూసి చూసి ఇండియాలో సాధారణమైన టీచర్‌ ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఫ్రెండ్ని అడిగాను. నీకు ఒకతే ఆడపిల్ల కదా, మగపిల్లాడు లేడని చిన్నతనంగా ఫీల్‌ అవుతున్నావా అని? నువ్వు ఇంత చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఇంత వెనుకబాటు తనం ఏమిటి అని మర ఫిరంగి లాగా మండిపడింది.

ఇక్కడ కబుర్లు చెపితే భారత్‌ మధ్యతరగతి ఈ మధ్య బాగానే ఎదుగుతోందని ఇంత అన్యాయమైన వ్యవహారాలు తక్కువే చూస్తున్నామని చెప్పింది. ఇండియానుంచి వచ్చేపుడు ప్రియా పచ్చళ్లతో పాటు మెదడులో ఇంత ఇక్కడి మట్టి పెట్టుకుని పోయినట్టున్నారు. దాన్ని ఎరువేసి పెంచుకుంటున్నారు. ఇక్కడ మట్టి తగ్గిపోతోంది కానీ అక్కడ పెరిగిపోతున్నట్టుందే, మరీ ఇంత ఘోరమైన విషయాలు ఇపుడు ఇక్కడ వినిపించడం లేదు అనేసింది. అదన్నమాట!

ఏవో పరీక్షలు అవీ రాస్తే మంచి జీతం రావచ్చు. కావాలనుకున్న దేశంలో ఉద్యోగమూ రావచ్చు. కానీ ఆరోగ్యకరమైన మంచి జీవితం గడపడానికి పరీక్షలు లేవు. ఎవరు నేర్పిస్తారు? ఆధునికత అంటే చేతికి బ్రాస్‌లెట్లు, చేతిలో లేటెస్ట్‌ ఐఫోన్లు కాదుకదా!

 

*

 

 

ట్విస్ట్

Kadha-Saranga-2-300x268

 

“హలో ఛామూ, ఒక సారి అర్జెంటు గా ఇంటికి రా” అంజలి టెన్షన్ గా అంది.

అది పట్టించుకోకుండా “ఏంటి మెంటలా, ఇప్పుడే గా మీ ఇంటి నుండి బయలుదేరాను. ఇంకా నా రూమ్ కి  దారిలోనే ఉన్నాను” ఛాము విసుగ్గా అంది. ఛాము అంటే ఛాముండేశ్వరి.

“అయితే మరీ బెటర్. తొందరగా రా” అని ఫోన్ కాల్ కట్ చేసి చాలా ఖంగారు పడుతూ గోళ్లు కొరుక్కుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తోంది అంజలి.

అరగంట గడిచాక ఛాము అంజలి వాళ్ళ ఇంటికి చేరింది. పొద్దున్న పదిన్నర అయింది.

“ఏంటి మాటర్?” అని పూర్తిగా అనకుండానే అంజలి ఒక సెల్ ఫోన్ ని ఛాము వైపుకి తోసింది.

“ఎవరిది ఇది?” ముఖం చిట్లిస్తూ అడిగింది ఛాము.

“రవి”

“…. ” నాకెందుకు ఇచ్చావు అన్నట్టు అంజలి వైపు చూసింది ఛాము.

“చదువు”

ఇంగ్లీష్ లో ఉన్న చాట్ ని పైకి చదివింది ఛాము.

 

రమ :హాయ్ రవి , మా ఊరు వచ్చావు ట?”

రవి:హే. అబ్బా పెద్ద కొత్త గా అడుగుతావు ఏంటి? ఎప్పుడూ వస్తూనే ఉంటాగా?”

రమ :హహహ అది కరెక్ట్ ఏ అనుకో. సో ఎప్పుడు మీటింగ్?”

రవి:నువ్వెప్పుడు అంటే అప్పుడు. నేను ఈ వీకెండ్ మొత్తం ఫ్రీ

రమ:అయితే ఫ్రైడే నైట్ ఇంటికి వచ్చేయి. వి కన్ హావ్ టోటల్ ఫన్” (కన్ను కొట్టే ఎమోజి)

రవి:షూర్” (కన్ను కొట్టే ఎమోజి)

రమ:ఓకే సీ యూ రవి

రవి: ఓకే రా బాయ్

 

“ఓహ్ మై గాడ్” ఛాము షాక్ లో అంది.

“కదా” అంజలి కనుబొమ్మలెగరేస్తూ అంది.

“ఎప్పటి నుండి సాగుతోంది ఈ అఫైర్?”

“ఏమో. నేను ఇవాళే చూసాను. రవి ఫోన్ మర్చిపోయాడు ఇంట్లో. ఎదో కాంటాక్ట్ కావాలి, అర్జెంటు గా అని నాకు తన ఫోన్ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేయమన్నాడు. సరే ఆ నెంబర్ ఎదో ఇచ్చాక ఊరికే తన వాట్సాప్ ఓపెన్ చేసాను. ఇదే పైన ఉంది. లాస్ట్ వీక్ డాలస్ వెళ్ళాడు చూడు అప్పుడు కాన్వర్సేషన్ ఇది. పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు..” అంటూ ఏడుపు మొదలు పెట్టింది అంజలి.

“హే కంట్రోల్. ఇలా పిరికిగా ఏడవటం కాదు. రవి రాగానే కడిగేసేయ్ అసలు” ఛాము ధైర్యాన్ని ఇస్తోంది.

ఛాము ఆ చాట్ కాన్వర్సేషన్ ని ఒకటికి పది సార్లు చదివింది.

“అంజూ, చాలా కాలంగా పరిచయం ఉన్నట్టుండే. ఆ అమ్మాయిని ఏకంగా ‘రా’ అని ప్రేమగా పిలిచాడు. నీకసలు ఈ అమ్మాయి గురించి ఎప్పుడు చెప్పలేదా ? ఎన్నాళ్ళ కి ఇలా ట్రిప్స్ కెళ్తూ ఉంటాడు?” షెర్లాక్ లాగ ఎదో కనిపెడ్తున్నట్టు అడిగింది ఛాము.

“ప్రతి నెలా వెళ్లొస్తూ ఉంటాడు. వాళ్ళ వెర్ హౌస్ అక్కడే ఉంది, సో ఇన్స్పెక్షన్ చేయటానికి తన టీం రవి నే పంపుతుంది. కానీ ఇప్పుడు అర్ధమవుతోంది, దాని కోసం కాదు ఆ అమ్మాయి కోసం వెళ్తున్నాడు అని” చేతిలో మొహం పెట్టుకొని మరీ ఏడుస్తోంది అంజలి.

ఛాము లేచి, మంచి నీళ్లు తెచ్చి అంజలి కి ఇస్తూ, భుజం తట్టి “ఇలాంటి సమయాల్లోనే గుండెని రాయి చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అసలు ఆ అమ్మాయి ఎవరు? రవి ఫేసుబూక్ ప్రొఫైల్ ఓపెన్ చెయ్యి ముందు” ఛాము ఏదో ఆలోచిస్తూ చెప్పింది.

అంజలి రవి ఫోన్ లోనే ఫేసుబూక్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ లిస్ట్ వెతకడం మొదలుపెట్టింది. అయిదు వందల మందిలో ఇద్దరీ రమ అనే అమ్మాయిలు ఉన్నారు. ఒకరేమో ఇండియా, ఇంకొకరు కెనడా లో. డాలస్ లో మాత్రం లేరు. పైగా వాట్సాప్ లో ఉన్న డిస్ప్లే పిక్చర్ తో మాచ్ కూడా అవలేదు. ఈ దారి మూసుకుపోయింది అని ఇద్దరూ ఫీల్ అయ్యారు.

“హే రవి ఆఫీస్ లో నీ మలయాళీ ఫ్రెండ్ పేరేంటి?” ఛాము అడిగింది.

“శిల్ప. శిల్ప థామస్. ఫ్రెండ్ కాదు ఎదో జస్ట్ క్లాసుమేట్ అంతే. ఎందుకు?” అర్ధంకానట్టు అడిగింది అంజలి.

“ఆమె కి కాల్ చెయ్యి. నీ ఫోన్ నుండి. చేసి రవి లాస్ట్ వీక్ వెళ్ళింది ఆఫీస్ పని మీదో కాదో తెలుసుకో ”

గట్టిగా నిట్టూర్చి “సరే” అంది.

“హే శిల్పా, అంజలి హియర్. ఎలా ఉన్నారు?”

“హే అంజలి. గుడ్. హౌ అర్ యూ?”

ఇంకా ఏవో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.

“లాస్ట్ వీక్ రవి డాలస్ వేర్ హౌస్ కి వెళ్ళాడు…”

“….”

“…..”

“ఏమైనా మర్చిపోయాడు? ఏం చెప్పలేదు నాకు రవి” తనకొచ్చిన తెలుగులో మాట్లాడుతోంది శిల్ప.

“యా, నన్ను అడగమన్నాడు. ఎలా రికవర్ చేసుకోవాలి అని..”

“ఓహ్ థాట్స్ ఈజీ. డాలస్ కార్పొరేట్ ఆఫీస్ కి కాల్ చేసి నేను మాట్లాడతాను. రవి రెగ్యులర్ కదా అక్కడ సో ప్రాబ్లెమ్ ఏం లేదు. ఆ ఆఫీస్ లో అందరికి రవి బాగా ఇష్టం. రవి చాలా ప్రొఫెషనల్ గా, మర్యాదగా ఉంటాడు అని. రవి వర్క్స్ హార్డ్ కూడా” అని ఇంకేదో చెప్తోంది, అంజలి కి ఈ దారి కూడా మూసుకు పోయినట్లు కనిపించింది. ఛాము వైపు నిస్పృహతో చూసింది.

అంతలోనే ఎదో తట్టినట్లు మళ్ళీ, “శిల్పా పోనీ రవి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డాలస్ లో చెప్పు. కొత్తవాళ్ళని ఎందుకు ట్రబుల్ చేయడం” చీకట్లో బాణం విసిరింది అంజలి.

“ఓహ్ కరెక్ట్. లెట్ మి చెక్”

“రమ…” క్లూ ఇచ్చింది అంజలి.

“ఓహ్ రామ గారు మంచి వారు. నేను అడుగుతాను. ఐ విల్ కాల్ యూ బాక్ ఒకే. బాయ్” అని కట్ చేసింది శిల్ప.

డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా ఆలా సడన్ గ కాల్ ఎండ్ అవడంతో అంజలి కి దారులు అన్నీ  మూసుకుపోయినట్లు, ఇంక తన జీవితం ఆగిపోయినట్లు ఏవేవో పిచ్చి ఆలోచనలతో అంజలి తల బద్దలవుతోంది.

ఆలా తలపెట్టుకొని కూర్చున్న అంజలి ని చూస్తూ ఛాము “అందుకే చెప్పాను. లవ్ మ్యారేజ్ చేసుకోమని. వినలేదు నువ్వు. పది రోజులో మనిషిని చూసేసి, పెళ్లి చేసేస్కోని, ఉన్న ఉద్యోగం మానేసి ఇక్కడికొచ్చేసావ్. ఏం జరిగిందో చూడు. ఏ మగాళ్లంతా ఇంతే. అమ్మాయిలంటే యూస్ అండ్ త్రో లాగ వాళ్ళకి. నా మాట విను. ఒక లాయర్ ని రెడీ గ ఉంచుకో. ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి ఈ మజ్జన. పైగా మనకి సపోర్ట్ గా చాలా వుమన్ గ్రూప్స్ ఉన్నాయి” అంటూ ఉచిత సలహాలు ఇస్తోంది ఛాము.

అంజలి మాత్రం కొన్ని మాటలే వింటోంది. అసలు ఎందుకు రవి తన దగ్గర ఈ విషయం దాచాడో అని ఆలోచిస్తోందే కానీ విడిపోయేంత వరకు ఆలోచన రాలేదు. అంజలి రవిలది పెద్దలు కుదిర్చిన  పెళ్లి. పది వారాలు అయింది. కానీ మంచి బంధం ఏర్పడింది ఇద్దరి మధ్య. రవి చాలా మంచివాడు. ఎలాంటి పట్టింపులు లేవు. అంజలి ని అంజలి కిష్టం వచ్చినట్లు ఉండమన్నాడు. వంట కూడా తానే చేస్తాడు. రవి అన్నీ ఓపెన్  గా చెప్పేసాడు, తన పాత జీవితం గురించి. అంజలి ని మాత్రం చెప్పమని అడగలేదు. అవసరం లేదు అన్నాడు. అంజలి గతం తనకి అక్కర్లేదు అని, అంజలితో భవిష్యత్తు మాత్రమే తనకి కావాలని మరో మాటకి తావు లేకుండా చెప్పేసాడు. తను చాలా లక్కీ అని రోజుకి పది సార్లు అనుకుంటుంది అంజలి. ఆలా ఆలా క్రమంగా రవి పైన ప్రేమాభిమానాలు పెంచుకుంటున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకుంటుంది అని అనుకోలేదు. రవి తనకి అబధం చెప్పాడంటే నమ్మలేక పోతోంది. రవి తనని మోసం చేసాడు అన్న ఆలోచన చాలా బాధగా ఉంది. సాయంత్రం ఆరున్నర దాటింది. ప్రొద్దున నుండి తిండి తిప్పలు లేకుండా ఉన్నారు ఇద్దరు.

తన ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనలనుండి తేరుకొని “హలో” అని అంది అంజలి.

“అంజలి, రవి ఏం మర్చిపోలేదు అంట. రామ గారు ఇప్పుడే చెప్పారు” ఆ తెలుగు వినటానికి కొంచం వెరైటీ గా ఉన్నా, మలయాళీ అమ్మాయి అయినా తెలుగు చక్కగా మాట్లాడగలదు.

“అవునా, సరే థాంక్స్ శిల్పా. నేను రవి కి చెప్తాలే” అని కాల్ కట్ చేసింది అంజలి. ఈ సారి శిల్ప మాట్లాడిన ఒక్కో మాట చాలా స్పష్టంగా అంజలి వినింది.

ఎదో తట్టినట్లు రవి ఫోన్ ఓపెన్ చేసి, ఫేస్ బుక్ లో ఇందాక వెతికినట్లే మళ్ళీ ఆర్, ఏ, ఎం, ఏ అనే నాలుగు అక్షరాలు సెర్చ్ చేసింది. వాట్సాప్ పిక్చర్ తో ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది. ఆ ప్రొఫైల్ చూసాక మంచం మీద పడిపోయి మరీ నవ్వటం మొదలు పెట్టింది. ఎంత నవ్విందంటే , ఛాము భయపడేంత.

కడుపు నొప్పొచ్చేలా నవ్వేసాక సడన్ గా సీరియస్ మొహంతో “ఛాము , నువ్వింటికెళ్ళిపో. కొన్నాళ్ళు నాకు కనపడకు” అని అంది.

“ఏమైందే నీకు?” కన్ఫ్యూషన్ లో అడిగింది ఛాము.

“నువ్విప్పుడు నేను చెప్పినట్లు వినలేదు అనుకో, నేనే నిన్ను బయటకి తోస్తాను. వెళ్ళు. గెట్ లాస్ట్” అని హిస్టెరిక్ గా అంజలి అరిచింది.

ఛాము మారు మాట్లాడకుండా తన బాగ్ తీస్కొని బయటకి నడిచింది.

అంజలి కూడా ఛాము వెనకాలే వెళ్లి, “దయచేసి ఇంకెవరికీ ఎప్పుడూ చచ్చు సలహాలు ఇవ్వకు” అనేసి తలుపు ధడేల్ మని వేసింది.

 

****

“హ హ హ హ, రామ గాడు నా కాలేజ్ ఫ్రెండ్. రామ కృష్ణ వాడి పేరు. డాలస్ లో మా కంపెనీ లోనే జాబ్. నేను వెళ్ళినప్పుడల్లా వాడితో కలిసి మందు పార్టీ ఒక ఆనవాయితీ అన్నమాట”

పొద్దున్న నుండి జరిగిన విషయాలన్నీ చెప్పిన అంజలి తో రవి మాట్లాడుతూ, “అయినా వాడి వాట్సాప్ లో ఉన్న ఫోటో ఎవరిదో కూడా తెలియదా నీకు? అందుకే ఎప్పుడూ తెలుగు సినిమాలు కాదు అప్పుడపుడు మలయాళం కూడా చూడాలి అనేది. ఆ ఫోటో మలయాళీ లో కొత్తగా హిట్ అయిన సినిమాలో హీరోయిన్ ది. శిల్ప మా ఇద్దరికీ అప్పుడపుడు మంచి మళయాళీ, తమిళ్ సినిమాలు చెప్తూ ఉంటుంది. వాడు అలాంటిది ఒకటి చూసి ఆ హీరోయిన్ కి ఫ్లాట్ అయ్యాడు. వాడి ఫేస్ బుక్ ప్రొఫైల్ నిండా కూడా ఆమెతో నిండిపోయింది చూసావుగా. సిల్లీ గర్ల్ నువ్వు హ హ హ” తెగ నవ్వుతున్నాడు రవి.

ఒక అబ్బాయిని అమ్మాయి అనుకోని, రవి ఏదో ఎఫైర్ నడుపుతున్నాడు అని తొందరపాటుతో అనేసుకొని ఎంత ఫులీష్ గా బిహేవ్ చేసిందో అంజలి అర్ధం చేసుకుంది.

తను కూడా నవ్వింది.

“ఇలాగ ఎంత మంది నిజానిజాలు తెలుసుకోకుండా వెర్రి వాళ్ళలాగా అనుమానపక్షులు అయిపోయారో కదా?” అంజలి అంది.

“అవును అంజూ. మన తరం వాళ్లలో ఓర్పు, సహనం చాలా తక్కువ అయిపోయాయి. టెక్నాలజీ పెరిగింది కానీ, దానితో పాటు ఇంపేషన్సు కూడా పెరిగిపోయింది. అన్నీ ఫాస్ట్ అయిపోయాయి. నిర్ణయాలు కూడా. తొందరగా పని చేయటం వేరు, తొందరపాటుగా చేయడం వేరు. నువ్వు కొంచం రేషనల్ గ ఆలోచించే రకం కాబట్టి నేను బ్రతికిపోయాను. లేదంటే నువ్వు ఏ పిచ్చి నిర్ణయమో తీసుకొని ఉంటే ఆమ్మో ఆలోచించటానికే కష్టం గా ఉంది” అని అన్నాడు రవి.

“అసలు నేను నీ ఫోన్ చెక్ చేయటమే పెద్ద పొరపాటు. పోనీ చేసానే అనుకో, నాకు ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా ఛాము నన్ను తొందర పెట్టింది. తనని కూడా బ్లేమ్ చేయలేను లే. అది నా ఫ్రెండ్ కాబట్టి ఆలా నా తరఫున ఆలోచించిందే తప్ప అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. నేను కూడా అంతే కదా. చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. హౌ టు బ్రేక్ అప్ ఆలోచిస్తున్నారు కానీ హౌ టు మేక్ అప్ కాదు. అందుకే ఎంత తొందరగా పెళ్లిళ్లు అవుతున్నాయో, అంత తొందరగా విడిపోతున్నారు కూడా. ఎనీ వే, నేను ఇవాళ లెసన్ నేర్చుకున్నాను, రవిని ఊరికే అనుమానించకూడదు అని ” అంజలి సంతృప్తిగా చెప్పింది

“నువ్వొకటే లెసన్ ఏమో అంజూ, నేను రెండు నేర్చుకున్నాను” అంజలి వేళ్ళు విరుస్తూ అన్నాడు రవి.

“ఏంటవి?” ఆశ్చర్యంగా అడిగింది అంజలి.

“ఫస్ట్ ఏమో నా మగ ఫ్రెండ్స్ పేర్లు కాంటాక్ట్స్ లో పూర్తిగా పెట్టాలని. రెండోది నీకు చచ్చు సలహాలిచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు సో కొంచం జాగ్రత్త గా ఉండాలి అని”

“ఓయ్” అని చిరుకోపంతో రవి వీపు మీద కొట్టింది అంజలి.

“ఇవాళ జరిగిన దానికి మళ్ళీ సారీ. ఓకే సరే ఒక ప్రామిస్ చేయి” అంజలి సీరియస్ గా అడిగింది.

“ఏంటది?”

“ఎపుడైనా నీకు ఎఫైర్ ఉంటే నాకు చెప్పేసేయ్. నేనేమీ అనుకోనులే” అంజలి నవ్వుతూ అంది.

“బాబోయ్. ఒకళ్ళతోనే కష్టంగా ఉంది. ఈ జన్మకి నువ్వు చాలమ్మా” అని దణ్ణం పెట్టేసాడు. ఇద్దరూ గట్టిగా నవ్వేశారు.

***

రంగుల్ని కోల్పోయిన దిగులు!

vazda

వాజ్దా ఖాన్  సిధ్ధార్థ నగర్, వుత్తర్ ప్రదేశ్ లో జన్మించిన యీ ప్రసిధ్ధ చిత్రకారిణీ వో మంచి కవయిత్రి కూడా. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి చిత్రకళలో యెం.యె.,డి.ఫిల్. పట్టాను పొందారు.యీమె ‘జిస్ తరహ్ ఘుల్తీ హై కాయా’ (దేహం కరుగుతున్నట్టు) అనే కావ్య సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు. హేమంత్ స్మృతి సమ్మాన్ పురస్కారాన్ని పొందారు.  చిత్రకళాకారిణిగా అనేక యేక, సామూహిక చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. యీమె కవితలు భారతీయ భాషల్లో అనువదింపబడ్డాయి.

వాజ్దా ఖాన్ కవితల్లో రంగులను శిల్పించే శిల్పి సంవేదన వుంది.యింకా ప్రపంచపు రాగతత్వంతో పాటు వర్ణహీన జీవితపు స్థితుల్లోని సుఖ దుఖాలను వేరుగా చూడడం కష్టంగానే వుంటుంది. యీమె కవితల్లోని చైతన్యపు కరుణామయ పిలుపు అస్థిత్వపు దార్శినికత వైపు తీసుకెళుతుంది. భాషా శిల్పాల జుగల్బందిలో వాజ్దా ఖాన్ కవితల్లోని అంతరంగిక లయ కారణంగా పాఠకుణ్ణి ప్రత్యేకంగా పలకరిస్తుంటాయి.

మట్టి, గాలి, నేనూ
————————

స్వప్నాలూ
మీకు యేం అవసరం వుందని
శతాబ్దాల తరబడి నా చుట్టే తిరుగున్నారు
నా సారాన్ని రహదారుపై వెతుకుతుంటే
మీరు నన్ను వెంటనే నన్ను కప్పేస్తుంటారు

మీరిలా అంటుండే వారు కదూ –
నాలో  సూక్ష్మ రూపంలో వున్నావని
నా ప్రతి చింతనలో
నా ప్రతి శ్వాసలో
వాటిని దించుకునే దానిని నేను
మనసు రెప్పల పై నుంచి
ఆకాశపు రెప్పలపైకి
నా వుత్తమ విధానాన్ని రచించేందుకు
నీలో వెతుకున్నాను
నా సారం – భూమి, ఆకాశం,సముద్రం
మట్టి,గాలి,నేను
అన్నీ నీలో విలీనం అయ్యాయి
రెప్పల తడి శివమౌతోంది
యీ ఆలోచనను కూడా నీవే నిర్మించావు
సాధనా శివంగా మారే దిశ నిర్మింపబడింది
కల్పన రూపాన్ని గ్రహించడం ఆరంభమైంది
యుగపు శాశ్వత సత్యం నీవు
నీ దేహం నుంచి తన అమూర్తత వరకు…

*

 యానాంలో ఒక వేమన…

memory

రోహిణి కార్తె.

ఎండ పేట్రేగి పోతుంది.

పెద్ద గోళెంలో బెల్లం తయారయేటపుడు ఉడుకుతూ పొంగుతున్నట్లు..అలల గతులు!
చెరకు రసం కోకోకోలా ఉత్తుత్తినే గొంతులు తడుపుతున్నాయి. క్షణ తర్వాత మామూలే. తలలు చురుక్కుమంటున్నాయి.
చెమటతో శరీరం తడిసి ముద్దవుతోంది. ఆహా …ఏమి ఎండరా బాబూ…మలమలా మాడ్చేస్తోంది.

అట్లాంటి సమయంలో తీరని దాహంతో ….అలమటిస్తున్న కవులేం చేస్తారు. ? సేద తీరే మార్గాలు వెతుక్కుంటారు. చల్లబడే దిక్కుల కోసం కలియ దిరుగుతారు. నీడల చుట్టూ అల్లుకుపోతారు. కవి సందర్భాలకోసం వెంపర్లాడతారు. ఊహాలోకంలో సేదతీరుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. అక్షర జ్ఞానులు….రాబోవు తరం దూతలు. ఇరవై ఏళ్లనాటి జ్ఞాపకాన్ని దృశ్యమానం చేయడం ఇది. వారంతా పదిమంది కవులు శివారెడ్డితో కలిపి. లుంగీ తలపాగాగా చుట్టి…బండి వాడిని పక్కన కూచోబెట్టుకుని. అదొక పసందైన ముచ్చట. కవుల బండి గోదావరి కేసి పరుగులు తీసింది.

మిట్టమధ్యాహ్నం….యానాం ఫెర్రీ రోడ్డు. సందడి లేదు. నిర్మానుష్యం. చిటపటలాడుతున్న ఎండ. వేళకాని వేళ. ఈ సమయంలో జలవిహారం కోరిక కడువిడ్డూరం. అల్లదివో గ్రీష్మ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పడవ సిద్ధం. వొక్కొక్కరూ ఎక్కారు. గోదావరి మధ్యగా ఇసుకమేటల లంక. చుట్టూ నీరు. గమ్మత్తైన అనుభవం కోసం ఎదురుచూపు. చండ్ర నిప్పులు చెరుగుతూ ఆకాశంలో వొంటరి సూర్యుడు. నీటి మేఘాల్ని చొచ్చుకుంటూ…పడవ కదిలింది. కవులేం చేస్తారు. ? సమయాసమయాలు లేకుండా పరవశంగా కవిత్వంలో మునిగిపోతారు. సుమధుర రాగాలాపన చేస్తారు. రసస్వాదనకు గంగవెర్రులెత్తుతారు. వీళ్లదే అదే బాపతు. వేడి నీళ్లతో ముఖాన కళ్లాపిచల్లినట్లు…ఆవిరి సెగలు ఎగజిమ్మినట్లు వేడిగాడ్పు…సూర్యకిరణాల ఏటవాలు తనం కోల్పోయి నిట్టనిలువుగా ప్రసరిస్తున్నాయి. వొళ్లంతా చెమటలు. రెప్పలు మూస్తూ తెరుస్తూ.. చెయ్యి అడ్డం పెట్టుకుని చూసే సన్నని చూపులు.
ఉక్కిరి బిక్కిరి అవుతూ కవులేం చేస్తారు. అసహనంగా గెంతులు వేస్తారు. ఆశువుగా నిరసన పాటలు కడతారు. ఉద్రేకంతో గొంతు చించుకుంటారు. కొత్త అనుభవం కోసం ఉర్రూతలూగుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. చరిత్ర గర్భాన రేపటి గుర్తు సంభాషణలు ముగింపు పలకకుండానే…లంక వచ్చేసింది. దిగారు. సరంజామా వొక చోటకు చేర్చారు. హాయిగా ఆనందించే వెన్నెల సమయమా ఇది…?
మబ్బు తెరలు అడ్డు రాకుండా సూర్యుడు చూస్తున్నాడు. ఇసుకనేల కూర్చోవడానికి గోనె సంచులు కింద పరిచారు.  ఆతృతగా గొంతులోకి జారుతున్న ద్రవం. దేహాన్ని చల్లబరిచే పని మొదలు పెట్టింది. కాసింత స్థిమిత పడ్డారు. ఉపశమనం. సరిగ్గా ఇప్పుడే…  సృజనకారులు తెరచిన పుస్తకాలవుతారు. నచ్చిన లేదా నచ్చని విషయాలు జంకు గొంకు లేని మాటలుగా నాభిలోంచి తన్నుకు వస్తాయి. ఎవరినైనా ఏమైనా అనగలధైర్యం సాహసాలు ఛాతీ కొట్టుకుంటూ వస్తాయి. ఇప్పటి పరిస్థితి వేరే. రసవత్తర సంఘటన పురులు పోసుకునే సంధి సమయం.

అధ్యయన శోభతో ఇంకించుకున్న కవిత్వ పోహళింపులని విప్పుకున్నారు. యువకవులు ఆస్వాదిస్తున్నారు. కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. కవిత్వ శిక్షణలో కొత్తదారి. అంత ఎండలోనూ శాలువా కప్పుకుకున్న శివారెడ్డి రైలు బండి పాట అందుకున్నారు. అందరూ చప్పట్లు. మద్దూరి నగేశ్ బాబు చిత్రమైన గొంతు జీరతో పల్లెవాటు పదాలతో పాడిన పాట మనసుల్ని మరింత చల్లబరిచింది. వాతావరణం నిశబ్దంగా మారిపోయింది. లయబద్దంగా ప్రశంసల జల్లులు. కలకలిగిన వారంతా గొంతు విప్పారు. ఎండ వేిడ చల్లని వెన్నెలయ్యింది.
గుంపులో కవికాని వాడు వొకడున్నాడు.

అతను లేకపోతే ఈ కథే లేదు.

అతను మౌనంగా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు.
గూడ పంచె..చిరిగిన బనీను. పెరిగిన గడ్డం. ముంజేతికి తెల్లబారిన కాశీ తాడు. తెల్లని దువ్వని చింపిరి జుట్టు. చేతులు కట్టుకుని మూలగా మాజేటి సుబ్రమణ్యం . వాడి చూపులతో గోదావరిని చూస్తున్నాడు. కవి గుంపులోకి ఎలా చొరబడ్డాడో తెలీదు. శీవారెడ్డి దృష్టి అతని మీద పడింది. అంతే. కందిరీగ తుట్టె రేగింది.
”ఏం  పెద్దాయన. గమ్మునుండిపోయావ్. నువ్వ పాడొచ్చు. మాట్లాడొచ్చు. అంతా మనవాళ్లే. మనుషులే”. శివారెడ్డి పలకరించారు. ఆయనకే చెల్లిన దోర నవ్వుతో.
”మనుషుల్లో పెద్ద మనుషులు బాబు మీరు. నానేం మాట్లాడగలను. బాబయ్యా. ? పొట్ట చింపితే కలికంలోకి కూడా అచ్చరాలు ఆనవు. చిత్తం బాబు.”
”మీకేమైనా పద్యాలొచ్చా..? విని వొంటబట్టించుకున్నయి ఏమన్నా ఉంటే చెప్పండి.” ఆతరంలో చదువుకోకపోయినా పద్యాలు రాని వారు ఎవరూ లేరు.
”వచ్చు గానండీ…తమ బోంట్లు వింటే కిసుక్కున నవ్వేస్తారు. ఏమన పద్యాలు , బ్రహ్మం గారి తత్వాలు బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఏదో కాలక్షేపం కోసం.”
”చెప్పు తాతా..?” అంటూ ముచ్చట పడ్డారు కుర్ర కవులు.
సుబ్రమణ్యం ఎత్తుకున్నాడు ముందుగా వేమన పద్యాలు.

” తేనె పంచదార తీయ మామిడిపండు
తిన్నగాని తీపి తెలియరాదు.
కన్న నింపు బుట్టు  కామిని అధరంబు
విశ్వదాభి రామ వినుర వేమ. ”
అంటూ పద్యాలు మొదలెట్టాడు.

చెవులు రిక్కించి విన్నారు. వొక్కో పద్యం విని అదిరిపోయారు. ”అద్భుతం…”అంటూ సంబరపడ్డారు. శివారెడ్డి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వారెవ్వా అంటున్నారు.
గోపి గారికి అందని పద్యాలులా ఉన్నాయి.” ఏదీ మళ్లీ చెప్పండి.” బీరు కేసుల అట్టపెట్టి…కాగితం చింపి దాని మీద రాయడానికి ఉపక్రమిస్తూ సీతారాం చిన్నపిల్లాడై జాగ్రత్తగా నాలుగైదు పద్యాలు రాసుకున్నాడు.
”మా వోడే మా బంధువే. ….. ”మెరుపు కళ్లతో శిఖామణి అన్నాడు.
”మీరు కాసిన్ని ఈ చుక్కలతో గొంతు తడుపుకుని మరికొన్ని పద్యాలు లాగిస్తే తరిస్తాం. ఇన్నాళ్లూ ఎక్కడ దాగి ఉన్నావయ్యా మహానుభావా…?”చేతులు జోడించి చిరునవ్వు  అందించాడు యాకూబ్.
”అబ్బాయిలూ….ఏమనుకోకండి. మనకిది ఎక్కదండీ. వొళ్లు తమాయించుకోలేదండి. కిక్కు సరిపోదండీ. సరిపోక పోత అదోరకం బాధండి.”సున్నితంగా తిరస్కరించాడు సుబ్రమణ్యం. ఎంత బతిమాలినా సీసా తాక లేదు.
సుబ్రమణ్యం కేసి సంబరంగా చూస్తున్నాడు అఫ్సర్. మౌనంగా మనసులో రేగుతున్న భావ శకలాల్ని పోగు చేసుకుంటూ  బహుశా యానాం ఏమన ఏమనే… కైత కట్టుకుంటున్నాడేమో.
”వీర బ్రహ్మంగారి తత్వాలు కూడా అందుకోండి. సుబ్రమణ్యం గారూ….”నిషా ముసుగులేకుండా ఎండ భరిస్తున్న ఏకైక వ్యక్తి దర్భశయనం అడిగాడు. సుబ్రమణ్యం ఇక బతిమాలించుకోలేదు.
” ఏ కులమబ్బీ… నీదే కులమబ్బీ….అని అడిగితే ఏమని చెప్పుదు లోకులకు. పలు గాకులకు.
చెప్పలేదంటనక పోయేరు. నరులారా గురుని చేరి మొక్కితే బతక నేర్చేరు.”

మంద్ర స్థాయిలో మొదలెట్టి ధారాళంగా పాటలు, తత్వాలు అందుకున్నాడు. మనిషి జీవితంలోని దశల్ని, పుట్టుకనుంచి మరణం దాకా చెప్పేవన్నీ ఆలపించాడు. కొన్ని తత్వాలు సుఖ దుఃఖాల అనివార్యతను తెలియ జేశాయి. కొన్నేమో జీవన తాత్వికతలను బోధిస్తూ..వైరాగ్య భావనలోకి తీసుకెళ్లాయి.
కవి మిత్రులు సంతృప్తి పడలేదు. సుబ్రమణ్యాన్ని వదలలేదు. బతిమాలి, బతిమాలి పాడించుకున్నారు.” మరిన్ని పాడండి. మీకొచ్చినవన్నీ వినిపించండి సుబ్రమణ్యం గారూ. ….. ” తనివి తీరనట్లుగా అడిగారు.
”నన్ను అండీ…గిండీ అంటూ మన్నన చేయకండి బాబూ. నాక్కోపం వస్తుంది. నేను అంటరానోన్ని. మీరు చదువుకున్న మారాజులు. వొరేయ్, గిరేయ్ అంటేనే బాగుంటుందండీ. అలవాటైన ప్రాణానికి. ”
”అలాంటి తేడాలు లేవు. అందరూ వొకటే…ఇక చదువంటారా. మేం పుస్తకాలు పట్టుకున్నాం.మీరు లోకాన్ని చదివారు. మీ జ్ఞానం తక్కువేమీ కాదు. మా దగ్గరలేని వేమన పద్యాలు…మీ నోటి నుంచి విన్నాము. మీకు మాకూ తేడా లేదు. మనమంతా వొకేలాంటి మనుష్యులం. ”వొంటి మీద శాలువా తీసి పక్కన పెట్టి అన్నారు శివారెడ్డి.
”సరే వొక మాట. మొత్తం ఈ గోదావరి మీద మత్స్యకారులొక్కరేనా బతికేది. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు వేరెవ్వరూ లేరా. ? ” గుంపులోంచి వేరెవరో అడిగారు. ఎవరడిగారు చెప్మా. ..!
” మా వాళ్లలోనూ ….రకరకాలుగా గోదావరి మీద బతుకుల్ని లాగించేవాళ్లున్నారు. పడవల్లోకి ధాన్యం బస్తాలు, కొబ్బరి కాయలు ఎగుమతి చేయడం, అర్థరాత్రి ఇసుక దేవుకుని పడవల్ని నింపడం సేత్తారండీ. ఇక చేపలంటారా…? పట్టుకునే వారు తక్కువే కానీ మా వూళ్లో ముత్యాలని వొక ఆడది ఉందండీ. దానిది మాకులమే. అది ఆడది కాదండీ బాబు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీపు వెనకాల పల్లె గంప మోచేతిమీద వల చుట్టుకుని …గంపెడు చేపల్ని ఇట్టే పట్టుకుంటుందండి. బతుకు తెరువు అలవాటు చేసుకోవాలిగానీ ఏ పనైనా ఎవరికైనా లొంగుతుంది. అంతే కదండీ.” సుబ్రమణ్యం బదులిచ్చాడు.
మద్దూరి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సుబ్రమణ్యం కోసి తీక్షణంగా చూస్తున్నాడు. ఆ చూపులు తగిలినట్లున్నాయి. సుబ్రమణ్యం అసహనంగా కదిలాడు. మద్దూరి మాత్రం ఇంకా అతను ఏం చెబుతాడో అని ఎదురుచూస్తూ దోసిలిలోకి ఇసుక తీసుకుని ఎగరేస్తున్నాడు. గవ్వల్ని దూరంగా విసిరేస్తున్నాడు.
సుబ్రమణ్యం ఆకాశం చేసి చూశాడు. చుట్టూ ఉన్న గోదావరిని చూశాడు. ఉస్సూరని నిట్టూర్చాడు. కాసేపు బీరు సేవనంలో మనిగిపోయారు. అక్కడి వారందరి మనసుల్లో సుబ్రమణ్యం….. సుబ్రమణ్యం.
” ఏమయ్యా సుబ్రమణ్యం. నిన్నీపళంగా ఇక్కడ వదిలేసి చక్కగా పడవెక్కి ఉడాయిస్తే….ఏం చేస్తావోయ్…”గమ్మత్తుగా శివారెడ్డి అడిగాడు.
”నాకేటి భయం. నాకేటి భయం. నీటిమీద నడుచుకుంటూ వచ్చేత్తా.”
” విన్నారా ..? అంతకంటే కవిత్వం ఏమిటి..? నిర్మలంగా మైదానంలా గోదావరి ఉందని చెప్పక చెపుతున్నాడు.  తలచుకుంటే మార్గం దొరుకుతుందని అంటున్నాడు.
శభాష్ సుబ్రమణ్యం. అన్నాడు శివారెడ్డి. కోపగించుకోకండీ మరండీ..మరండీ… నన్నేమైనా అనేయమంటారా..? నాకు తోచింది మాట్లాడేయమంటారా..? ” ముందుగా అనుమతి కోరాడు.
”శుభ్రంగా అనవయ్యా… ఈ వేళ నీకేం అడ్డు లేదు. ”
మాటలు కూడదీసుకోవడానికి అన్నట్టు కాసేపు ఆగాడు సుబ్రమణ్యం.” అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అందరూ అమ్మానాన్నల సంతోషంలోంచే..రెండుకాళ్ల మధ్య గుండానే కెవ్వుమని ఏడ్చుకుంటూ పుట్టాం గందా. ఇన్నాళ్లూ రాత్తుండారు. మా కట్టాలు కన్నీళ్లు మీకు ఆపడ్డాయా..అయ్యలారా. వొకే దారి గుండా వచ్చాం సరే. మరి మా ఆకు (విస్తరి) ఎందుకు ఎడం. (దూరం. ) అయింది బాబయ్యా..?” అన్నాడు.
కవుల జేబుల్లోని కలాలూ  దడదడలాడాయి. నిశ్చేష్టులయి తమ అనుభవాల్ని తవ్వుకుంటున్నారు. తాము అధ్యయనం చేసిన అంశాలు గుర్తుకొచ్చాయి.
కవులేం చేస్తారు..? కవులేం చేస్తారు.
దిక్కులు పిక్కటిల్లేట్టు గుండె బద్ధలై..వెలువడిన ప్రశ్నకు సమాధానం ఏది..?
ఈ ప్రశ్నను సజీవ సాహిత్యంగా మలచాలి.

*

హ్యూస్టన్ లో అడుగు పెట్టిన వేళా విశేషం…!

 

గత సెప్టెంబర్ 2-3-4, 2016 తేదీలలో మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాలు దిగ్విజయంగా జరిగాయి. కేవలం $350,000 బడ్జెట్ తో మిలియన్లు ఖర్చుపెట్టి జాతీయ సంఘాలు ప్రతీ ఏడూ జరిపే జాతర్ల స్థాయిలో ఈ సంబరాలు జరిగాయి. అంటే సినిమా తారలు, రాజకీయ నాయకులూ, (అప) హాస్య గాళ్లూ, తదితర దిగుమతి చేసుకున్న వారికి పెద్ద పీట వేసినా, స్థానికులకి కూడా చోటు దొరికింది. ఆ  నలభై ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా టీసీయే పుట్టిన క్షణం నుంచీ ఈ నాటి వరకూ టీసీయే తో నాకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆ తొలి దశకంలో నా జ్ఞాపకాలు కొన్ని పంచుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.  ఇందులో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చును. కొందరు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం మర్చిపోయి ఉండ వచ్చును. ప్రస్తావించిన వారి అందరి కృషీ తగిన స్థాయిలో నేను వ్రాసి ఉండక పోవచ్చును. ఆ నాడు అందరూ సమానులే కానీ ఎవ్వరూ ఎక్కువ సమానులు కాదు. అన్ని తప్పోప్పులకీ నేనే పాపాల భైరవుడిని కాబట్టీ, ఏదీ బుద్ది పూర్వకంగా చేసిన పొరపాటు కాదు కాబట్టీ పెద్ద మనసు తో ఈ చిన్న వాడిని మన్నించమని ముందే మనవి చేసుకుంటున్నాను. అలాగే నా ‘సొంత డబ్బా’ ఎక్కువగా వినపడితే కాస్త వాల్యూమ్ తగ్గించుకోండి.

నా హ్యూస్టన్ ‘‘రంగ ప్రవేశం”

van1అప్పుడు హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. మా తమ్ముడు చికాగోలో ఉండే వాడు కాబట్టి నేను అప్పటికి మూడు నెలల ముందు ఇండియా నుంచి ఆ ఊళ్ళో అడుగుపెట్టాను – జేబులో బొంబాయి లో యు.ఎస్. కాన్సలేట్ వారు నన్ను మెచ్చి ఇచ్చిన గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్, భారత ప్రభుత్వం వారు దయతో మంజూరు చేసిన అక్షరాలా ఎనిమిది డాలర్లు, ఐదారు చొక్కాలు, చెడ్డీలు, పంట్లాలు, నా ఐఐటి డాక్టరేట్ పట్టా తో అన్నీ సద్దుకున్న రేకు పెట్టె…అదీ నా మొత్తం ఆస్తి. చికాగోలో ఆ రెండు నెలలలోనూ ఆర్ధిక మాంద్యంలో ఇరుక్కున్న ఆ ప్రాంతాలలో ఉద్యోగ సద్యోగాలు మనకి దొరకవు అని అర్థం అయిపోయింది. అప్పటికి చికాగోలో నాకు మంచి మిత్రుడు ప్లంజేరి శంకర్ “టెక్సస్ బాగా బూమింగ్ గా ఉంది. అక్కడికి వెళ్లి ట్రై చెయ్యి “ అని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో అమెరికా చలి ప్రాంతాలు ఆర్ధిక మాంద్యంలో ఉంటే టెక్సస్ లాంటి ఆయిల్ ఎకానమీ రాష్ట్రాల ఎకానమీ పుంజుకునేది. అంచేత నా లాగా నిరుద్యోగులుగా ఉన్న తణుకు తాలూకు ఈమని శాస్త్రి, అతని తమ్ముడు రఘురాం, (వీళ్ళిద్దరూ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో బాగా జూనియర్లే కానీ అక్కడ తెలియదు.) బసంత్ పట్నాయక్ అనే ఒరియా స్నేహితుడు ఆ రోజు సాయంత్రమే ఓ చిన్న కారులో మాకున్న ఆస్తులన్నీ “డిక్కీలో పడుకోబెట్టేసి” ఎక్కడా ఆగకుండా 24 గంటలలో హ్యూస్టన్ వచ్చేశాం. మాలో ఎవరికీ హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. అది 1975 మార్చ్ నెలలో ఓ రోజు -41 సంవత్సరాల క్రితం.

ఆ రాత్రి హిల్ క్రాఫ్ట్ అనే రోడ్డు  -ఇప్పుడు ఆ ప్రాంతం లిటిల్ ఇండియా – మీద ఓ రెండు రోజులు కారులోనే పడుకుని, ఇక లాభం లేదు గురూ అనుకుని ఎవరైనా ఇండియన్ కుర్రాళ్ళు ఉండక పోతారా అని రైస్ యూనివర్సిటీకి వెళ్లి వాకబు చేశాం. అనుకున్నట్టుగానే అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు కనపడగానే పరిచయం చేసేసుకున్నాం. వాళ్ళలో మా దగ్గర బంధువు – కేంపస్ లో ఒకే ఒక్క తెలుగు విద్యార్థి కూడా ఉండడం కేవలం యాదృచ్చికం.

ఆ తరువాత నా వ్యక్తిగత జీవితం ఎన్ని ఒడుదుడుకులని ఎదుర్కొన్నా, అప్పుడు జరిగిన అతి ముఖ్యమైన విషయం తలచుకుంటే ఇప్పటికీ మహానందం వేస్తుంది.  ఓ రోజు సొంతంగా వండుకునే వంట తిన లేక విసుగొచ్చి రైస్ యూనివర్సిటీ లో డాక్టరేట్ చేస్తూ మిత్రులు అయిపోయిన మా బంధువు కుంటముక్కుల మూర్తి, గౌరంగ్ వ్యాస్, పట్నాయక్ కి మిత్రుడు , తోటి భువనేశ్వర్ వాడు అయిన మహంతీ “ఇక్కడే ఉన్న మహారాజా అనే ఇండియన్ రెస్టారెంట్ కి వెడదామా?” అనుకుని…ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క వేసుకుని మొత్తం పదిహేను డాలర్లు జమ అవగానే “పరవా లేదు. అక్కడ ఇడ్లీకి, కాఫీకీ సరిపోతాయ్ అందరికీ” అని యూనివర్సేటీ దగ్గరే టైమ్స్ బులావార్డ్ మీద ఉన్న మహారాజా రెస్టారెంట్ కి వెళ్ళాం. లోపలకి అడుగుపెట్టగానే ఒకాయన “వెల్ కం” అని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతూ అతని మొహం చూసి ఆశ్చర్య పోయాను…ఎక్కడో చూశానే..ఎక్కడ చెప్మా అని బుర్ర గోక్కుని “మీ పేరు ఏమిటి సార్” అని ఇంగ్లీషులో అడిగేశాను. “అనిల్ కుమార్” అని వెంటనే అతను కూడా నాకేసి అనుమానంగా చూశాడు. ఇంచు మించు ఇద్దరం ఒకే సారి “గురూ, నువ్వా” అంటే “హారినీ, నువ్వా ఇక్కడేమిటీ ?  అనేసి కావలించుకుని ఒకరినొకరు గుర్తు పట్టేసుకున్నాం.  విషయం ఏమిటంటే ఈ అనిల్ కుమార్ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఏడాది సీనియర్. కాలేజ్ ప్రోగ్రాములలో నిహార్ అనే కాశ్మీరీ కుర్రాడు ఎకార్దియన్ వాయిస్తూ ఉంటే ఇతను డ్రమ్స్, బేంగోస్ లాంటివి వాయించే వాడు. అప్పుడప్పుడు అరుపులూ, పెడ బొబ్బలతో “మోసేసే వాళ్ళం”. ఆ రోజుల్లో ఎక్కువ పరిచయం లేదు కానీ ముఖ పరిచయం బాగానే ఉంది. అందుకే పదేళ్ళయినా ఇప్పుడు ఒకరినొకరు గుర్తు పట్ట్టగలిగాం. ఆ రోజుల్లో యావత్ టెక్సస్ రాష్ట్రం అంతటికీ ఈ మహారాజా ఒక్కటే ఇండియన్ రెస్టారెంట్ అంటే ఈ రోజుల్లో నమ్మ బుద్ది కాదు. అనిల్ తో పాటు దువ్వూరి సూరి, శేష్ బాల, వెంకట్ కలిసి సరదాగా ఈ రెస్టారెంట్ మొదలుపెట్టి ఎవరికీ వ్యాపారానుభావం లేక కొన్నాళ్ళకి మానేశారు. ఇప్పుడు సరిగ్గా అదే చోట “శివ” అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది.

ఆ విధంగా నాకు హ్యూస్టన్ లో పరిచయం అయిన మొదటి తెలుగు వక్తి అనిల్ కుమార్. అప్పటి నుంచీ గత ఏడాది పరమపదించేదాకా అనిల్ కుమారే నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు.

హ్యూస్టన్ లో తొలి తెలుగు వారు

van2

టెక్సస్ అనగానే గుర్రాలూ, తుపాకులూ , పేద్ద పది గేలన్ల టోపీలూ అనుకుని, ఇవన్నీ మనకెందుకులే అనుకుని భారతీయులు, అందునా తెలుగు వారు అమెరికాలో ఇతర రాష్టాలకి మాత్రమే వలస వరస కట్టిన రోజులలో, విశాఖపట్నానికి చెందిన (స్వర్గీయ) దువ్వూరి అచ్యుత అనంత సత్య నారాయణ రావు గారు , కుటుంబ సమేతంగా , ఆస్ట్రేలియా, కెనడాలలో చదువు తరవాత  హ్యూస్టన్ లోని టెక్సస్ సదర్న్ యూనివర్శిటీలో ఫిజిక్స్ విభాగం ప్రారంభించడానికి 1957 లో హ్యూస్టన్ వచ్చారు. ఆయనే టెక్సస్ కి, అమెరికా లోని ఇతర దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి తెలుగు వారు.

ఆ తరువాత పదేళ్ళలో 1970 నాటికి పట్టిసపు రామజోగి గంగాధరం గారు, పోతు నరసింహారావు గారు మొదలైన కుటుంబీకులూ, అనిల్ కుమార్, మణ్యం మూర్తి, గుంటూరు సీతాపతి రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావు, చింతపల్లి అశోక్ కుమార్ లాంటి బ్రహ్మచారులూ వెరసి ఇంచుమించు 20  మంది తెలుగు వారు హ్యూస్టన్ లో నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పుడు అందరూ ముందు భారతీయులూ, తరవాతే తెలుగు వారు. భారతీయులందరూ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో కలుసుకుని హిందీ సినిమాలు వేసుకునీ, పిక్నిక్స్ జరుపుకునే వారు. తెలుగు పండుగలకీ, తెలుగులో మాట్లాడుకోవడానికీ నారాయణ రావు గారు, నరసింహా రావు గారూ, గంగాధరం గారి ఇళ్ళలో అందరూ కలుసుకునే వారు. వారందరి “లివింగ్ రూము” లే ఆ నాటి తెలుగు సాంస్కృతిక వేదికలు. ఆ నాటి తొలి తెలుగు వారిలో చాలా మంది ఇప్పటికీ హ్యూస్టన్ లోనే ఉండడం, అందులో కొంత మంది ఇంకా ఈ నాటి మన తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పుకోదగ్గ విశేషమే!

1975 ప్రాంతాలకి హ్యూస్టన్ లో ఇంచుమించు యాభై మంది తెలుగు వారు సమకూడారు. వారిలో నాటకాలూ, శాస్త్రీయ సంగీతమూ, కూచిపూడి నృత్యమూ మొదలైన కళలలో అతున్నతమైన మంచి ప్రావీణ్యం ఉన్న ఐదారుగురు కళాకారులు కూడా ఉండడంతో, అందరూ మామూలుగా కలుసుకోవడం, పండగలు చేసుకోవడమే కాకుండా, ఏదో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండేవి. అవన్నీ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, టెక్సస్ సదరన్ యూనివర్శిటీ లేదా మెడికల్ సెంటర్ ఉన్న హాళ్ళలో జరిగేవి. అప్పటికే అమెరికా ఇతర పెద్ద నగరాలలో తెలుగు సంఘాలు, వాటితో చిన్న, చిన్న రాజకీయాలు మొదలయ్యాయి. నాకూ బొంబాయి లో ఉన్న అనుభవంతో మనకి ఇక్కడ కూడా ఒక తెలుగు సమితి ఉంటే బావుంటుంది అనే ఆలోచన లేవనెత్తాను. అంతకు ముందు కూడా ఆ ఆలోచనలు వచ్చాయి కానీ, ఒక తెలుగు సంఘం నిజంగా అవసరమా, ఒక వేళ తెలుగు సంఘం పెట్టుకుంటే, రాజకీయాలకి అతీతంగా దాన్ని ఎలా తీర్చిదిద్దాలనీ అని ఒక ఏడాది పాటు రకరకాల చర్చలు జరిగాయి. మొత్తానికి 1976 లో  తెలుగు సాంస్కృతిక సమితి అనే పేరుతో హ్యూస్టన్ లో లాభాపేక్ష లేని సంస్థగా వెలిసింది. ఆ సమితి ఆశయాలనికీ, నిర్మాణ నిబంధనావళి రచించడానికీ దువ్వూరి నారాయణ రావు, పోతు నరసింహా రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావులతో ఒక కమిటీ చెయ్యబడింది. వారు అందరితో చర్చలు జరిపి, అప్పటికే దేశంలో ఉన్నమూడు, నాలుగు తెలుగు సంస్థల తీరుతెన్నులూ, సమస్యలూ పరిశీలించి తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి “రాజ్యాంగం”…అంటే “ప్రారంభ నిబంధనలు, సూత్రాలు” ..అంటే Constituition ప్రచురించారు. వంగూరి చిట్టెన్ రాజు తెలుగులో  అక్షరరూపం కలిగించి, హ్యూస్టన్ లో ఉన్న తెలుగు వారందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ  క్రింది తొలి పత్రంలో తెలుగు సాంస్కృతిక సమితి ఆశయాలు:

“తెలుగు భాష మీద తెలుగు సంస్కృతి మీద అభిమానము, అభిరుచి గల వ్యక్తుల సమన్వయమీ తెలుగు సాంస్కృతిక సమితి. లాభాపేక్ష, రాజకీయ విషయములలో జోక్యము చేసుకునే ఆసక్తి లేనిదిది. సభ్యులు తరచు కలుసుకొనుటకు, తెలుగు సంస్కృతికి సంబంధించిన కార్యకలాపములలో పాల్గొనుటకు అవకాశాములను కల్పించుటే ఈ సమితి ప్రధానాశయము. ఈ ప్రాంతములోని తెలుగు వారి సమైక్యతను పెంపొందించి, వారి సంస్కృతికి సంబంధించిన అవసరములు తీర్చుటయే కాక ఆ సంస్కృతిని తెలుసుకోవాలనే ఆపేక్షగల హ్యూస్టన్ మహానగర నివాసుల వాంఛాసాఫల్యమునకు కూడా ఈ సమితి తోడ్పడుతుందని ఆశించవచ్చును”

ఈ కమిటీ వారు మన సాంస్కృతిక సమితికి “అధ్యక్షులు” అనే పదవి అధికారకాంక్షను పెంచే విధంగా ఉండి, రాజకీయాలకు దారి తీస్తుందని భావించి, సమితి  సభ్యులందరూ కలసి ఏడుగురు వ్యక్తులను  నిర్వాహక వర్గం  సభ్యులుగా ఎన్నుకోవాలనీ, ఆ ఏడుగురూ తమలో తామే ఒకరిని “సమన్వయ కర్త” గానూ, మరొకరిని “సహ సమన్వయ కర్త” గానూ నిర్దేశించుకుని, సమితి కార్యకలాపాలన్నింటినీ సమిష్టిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం, 1977 జనవరిలో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి కార్యనిర్వాహక వర్గానికి  కోనేరు తాతయ్య సమన్వయ కర్త గానూ, వంగూరి చిట్టెన్ రాజు (నేను) సహ సమన్వయ కర్త గానూ, పుచ్చా వసంత లక్ష్మి, పోతు రాజేశ్వరి, తుమ్మల కుటుంబ రావు, పట్టిసపు గంగాధరం, కొడాలి సుబ్బారావు, తమ్మారెడ్డి చంద్ర శేఖర రావు  గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మొదటి ఉగాది: -1977

”కాళయుక్త” నామ సంవత్సర ఉగాది (1977) మన మొట్టమొదటి అధికారిక కార్యక్రమం. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, స్ట్యూడెంట్ సెంటర్ మూడవ అంతస్తులో ఉన్న హ్యూస్టన్ రూమ్ లో జరిగిన ఆ నాటి తొలి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులలో కొందరు పొలాని జానకి రామయ్య & శారద, బిలకంటి గంగాధర్, రవి తమిరిశ, కిరణ్ తమిరిశ, పుచ్చా వసంత లక్ష్మి & మల్లిక్, రత్నపాప & అనిల్ కుమార్, వంగూరి చిట్టెన్ రాజు, కామేశ్వరీ గంగాధరం, రూపా కోనేరు, రఘు చక్రవర్తి, చావలి రామసోమయాజులు & బాల, చేగు లలిత,  విజయ మరియు రాధ దేవరకొండ, దువ్వూరి సూరి & హీరా, గొల్లపూడి మణి, రేణుకా రెడ్డి, తోట రాణి & సూర్యారావు, సూర్యకుమారి & మహాబలి రాజా, జానీ బేగమ్ & మస్తాన్ వాలీ, తుమ్మల కుటుంబ రావు & కుసుమ  మొదలైన వారు. ఆ తొలి రోజులలో నాకు జ్ఞాపకం ఉన్న అప్పటి తెలుగు వారు కొడాలి సుబ్బా రావు, అనంతనేని ప్రకాశ రావు, కేశవరావు, గోగినేని రమేష్, కొడాలి సూర్యం, ఏలూరు గోపాల కృష్ణ, రేణుకా రెడ్డి, అడవల్లి జనార్ధన రెడ్డి, గోగినేని సుబ్బారాయుడు మొదలైన వారు. ఎవరి పేర్లు అయినా మర్చిపోతే నన్ను మన్నించాలి. ఆ రోజుల్లో పదేళ్ళ లోపు చిన్న పిల్లలు రాధ తమిరిశ, గిరీష్ పుచ్చా, కల్యాణి పొలాని, హరి రాజా, మాధవి చావలి మొదలైన ఐదారుగురు మాత్రమే.

van3

ఈ కార్యక్రమంలో యావత్ అమెరికాలోనే మొట్ట మొదటి తెలుగు సాంఘిక నాటకం వేశాం. ఆ హాస్య నాటిక  “బామ్మాయణం అను సీతా కల్యాణం “ నేనే అంతకు నాలుగేళ్ల ముందు బొంబాయిలో ఉన్నప్పుడు వ్రాశాను. ఇక్కడ వేసినప్పుడు నేను బామ్మ వేషం, అనిల్ కుమార్, మోహన రావు బ్రహ్మచారులు, దువ్వూరి నారాయణ రావు గారు పరంధామయ్య పాత్ర వేశారు.

ఆ తరువాత మే 28-29, 1977 లో న్యూయార్క్ లో “ప్రప్రధమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం” జరిగింది. దానికి మన సమితి తరఫున రత్న పాప, అనిల్, సూరి, నేనూ వెళ్లాం. ఇక్కడ ఒక తమాషా విషయం చెప్పాలి. అప్పుడే మొదలయిన మన సమితికే కాదు, ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు కాబట్టి ఓ పాట్ లక్ డిన్నర్ పెట్టి, అందరినీ పిలిచి, ప్లేటుకి పాతిక రూపాయలు విరాళం పెడితే  ఓ అరవై మంది వస్తారు కదా…వారి విరాళాలతో అప్పుడు అందరినీ టీసీయే స్పాన్సర్ చెయ్యవచ్చును అనే ఆలోచన వచ్చింది. ఓ క్లబ్ హౌస్ లో ఏర్పాట్లు చేసి అందరినీ పేరు, పేరునా పిలిచాం. దానికి సూర్య కుమారి, దేవరకొండ సుబ్బలక్ష్మి, వసంత, బాల, హీరా, మరో ఇద్దరు ముగ్గురు మొత్తం వంట అంతా చేసి పట్టుకొచ్చారు. తీరా చూస్తే ఆ వంట చేసి పట్టుకొచ్చిన కుటుంబాలు, నా బోటి బ్రహ్మచారులం నలుగురమూ తప్ప పట్టుమని పది మంది కూడా రాలేదు. చచ్చినట్టు మేమే ప్లేటుకి వంద డాలర్ల చొప్పున కొనుక్కుని, ఏడవ లేక జోకులేసుకుంటూ మా టిక్కెట్లు మేమే కొనుక్కున్నాం!

ఆ న్యూయార్క్ సభలలో సూరి, అనిల్, నేనూ బొబ్బిలి యుద్దం బుర్ర వేశాం. నేనే వ్రాశాను. అమెరికాలో ఆ మొట్ట మొదటి బుర్ర కథ. అందులో మా ఒరిజినల్ హాస్యం గురించి అప్పటి వారు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ ఫోటోలు ఇక్కడ జతపరిచాను. న్యూయార్క్ లో మరో విశేషం ఇండియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన సీత-అనసూయ పాడుతుండగా వాళ్ళమ్మాయి, మన రత్న పాప “మొక్క జొన్న తోటలో” జానపద నృత్యం అత్యద్భుతంగా చెయ్యడం. మరో విశేషం ఆ సభల లోనే అమెరికా మొత్తానికి ఒక “అంబ్రెల్లా’ సంస్థ ఉండాలని అందరం అందుకుని, దానికి రూప కల్పన చెయ్యడానికి ఏడుగురు సభ్యులతో ఒక గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎన్నుకోవడం. వారిలో నేను ఒకడిని. దాని ఫలితమే తానా సంస్థ ఆవిర్భావం.

తెలుగు డైరెక్టరీ

1979లో అనుకుంటాను. ఇక్కడ తెలుగు వారందరికీ ఉత్తరాలు పంపించి సమాచారం అందించడానికి ఒక డైరెక్టరీ తయారు చేసుకోవలసిన అవసరం వచ్చింది. నేనూ, మల్లిక్, కొడాలి సుబ్బారావూ ఆనాటి టెలిఫోన్ డైరెక్టరీ లో ఒక్కొక్కళ్లూ  సుమారు వంద  పేజీలు చొప్పున  పంచుకుని, వాటిల్లో ఎక్కడైనా రావు, రెడ్డి, శాస్త్రి మొదలైనవే కాక ఏ మాత్రం తెలుగు ఇంటి పేరులా కనపడిన వారందరినీ పిలిచి, అయిన వాళ్లకి తెలుగు సమితిని పరిచయం చేసి, తెలుగేతరుల చేత చివాట్లు తిని, మొత్తానికి ఆరు నెలలలో ఒక సమగ్రమైన డైరెక్టరీ తయారు చేశాం. దాన్ని అశోక్ కుమార్ భార్య మేరీ ఎగ్నెస్ టైప్ చేసి పెటింది. మొత్తం 154 పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలతో సహా. ‘మాకు ఇలాంటివి అక్కరలేదు’ అన్న తెలుగు బుద్ధి  వాళ్ళు ఆ రోజుల్లో పదుల సంఖ్యలో ఉంటే ఈ నాడు వేల సంఖ్య లోఉన్నారు.

అప్పట్లో ఇంకా అంత ప్రాముఖ్యం లేని షుగర్ లాండ్ , కేటీ, సైప్రస్, క్లియర్ లేక సిటీలలో తెలుగు వారు లేరు. అందరూ మెడికల్ సెంటర్ చుట్టు పక్కలా, సౌత్ వెస్ట్ లోనూ ఉండేవారు.

మధురవాణి ప్రారంభం:

అప్పట్లో, ఇప్పటిలా తెలుగు సంస్కృతికి సినిమా పర్యాయపదం కాదు. సంస్కృతి అనగానే భాష, సాహిత్మం, నృత్యం, సంగీతం అనే అర్థాలు ఉండేవి. శాస్త్రీయ నృత్యాలకి ..అందునా కూచిపూడి ప్రాభవానికి రత్నపాప 1975 లోనే స్థాపించిన అంజలి సెంటర్ ఫర్ పెఫార్మింగ్ ఆర్ట్స్ ఎలాంటి డాన్స్ లకైనా సరే…కేంద్ర బిందువు. ఆ తరువాత కోసూరి ఉమా భారతి మరింత విస్తరింప చేశారు. సంగీతానికీ, జానపద సంగీతానికీ, మంచి సినిమా పాటలకీ –కెవ్వు కేక బాపతు కానే కాదు- హీరా & సూరి, వసంత, చావలి బాల, సుసర్ల కుమారి, పొలాని జానకి రామయ్య, శారద, బిలగంటి గంగాధర్, తుమ్మల కుటుంబ రావూ, అప్పుడప్పుడు నేనూ పాడేవాళ్ళం. అన్ని కార్యక్రమాలకీ రవి తమిరిశ, రఘు చక్రవర్తి తబలా, మృదంగం వాయించే వారు. 1978 లో సీత -అనసూయ హ్యూస్టన్ వచ్చినప్పుడు వాళ్ళ చేత స్టూడియో లో రికార్డింగ్ చేయించి ఒక 78 RPM గ్రామఫోన్ రికార్డు విడుదల చేశాం. అదే అమెరికాలో మొదటి తెలుగు ఆల్బం. 1980 లలో చంద్ర కాంత డేవిడ్ ల రాక పాటకి పట్టం కట్టింది. మరి కొన్నేళ్ళ తరువాత అనుకుంటాను ఉమా మంత్రవాది, మణి శాస్త్రి మన సమితి సంగీత స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు.

ఇక భాషా సాహిత్యాలకి ఏం చెయ్యాలా అనుకున్నప్పుడు నాకు తట్టిన ఆలోచన ఒక పత్రిక ప్రారంభించడం, వెను వెంటనే ఆ ఆలోచన అందరికీ నచ్చడం, కేవలం సంస్థాగత సమాచారాన్ని అందించే వార్తా పత్రికల కాకుండా దాని సాహిత్య పత్రికగా తీర్చిదిద్డాలి అని “మధుర వాణి” అని నామకరణం చేసి మొదటి సంచిక 1978 ఉగాది ప్రత్యేక సంచికగా వెలువరించాం. సుమారు యాభై పేజీలు  అంతా నా చేతి వ్రాతలోనే.  ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ క్సీరాక్స్ యంత్రాలు ఉండేవి కాదు. ఉన్నా పేజీకి రెండు డాలర్లు ఖరీదు. అంచేత నేను శని, ఆదివారాలు అప్పుడు నేను పనిచేసే పెద్ద కంపెనీ ఆఫీసుకి వెళ్లి పోయి దొంగతనంగా వాళ్ళ పెద్ద క్సీరాక్స్ మీద యాభై కాపీలు తీసేశాను. ఇంచు మించు 1980 దాకా అదే తతంగం. ఆ మొదటి సంచిక నుంచి సుమారు పదేళ్ళు నేనే మధుర వాణి ప్రధాన సంపాదకుడిని. వసంత, హీరా, కలపటపు వేణుగోపాల్, చావలి రామం, శౌరి నందగిరి మొదలైన వారు సంపాదకులు. ముత్యాల సీత ముఖ చిత్రాలు వేసేవారు. ఆనాటి మధురవాణి తొలి సంచికల   ముఖ చిత్రాలు కొన్ని, లోపలి పేజీల నుంచి కొన్నీ ఇందుతో జతపరుస్తున్నాను. 1984 లో వావిలాల కృష్ణ శాస్త్రి మధుర వాణి ని ఇండియాలో టైప్ చేయించి ముద్రించారు. తరువాత, మరో ఐదేళ్లకి చిక్కి శల్యమై, మరో పదేళ్ళకి ఇంటర్నెట్ ప్రభావంలో మదుర వాణి అంతరించింది. కానీ ఇటీవలే హ్యూస్టన్ లో కొందరు ఔత్సాహికులు అదే పేరిట అంతర్జాల సాహిత్య పత్రికని ప్రారంభించి, మళ్ళీ ప్రాణం పొయ్యడం మళ్ళీ పుట్టినంత  సంతోషంగా ఉంది అని వేరే చెప్పక్కర లేదు కదా!

ఆ నాటి తెలుగు నాటకాలు

పైన పేర్కొనట్టు 1977 లో మొదటి తెలుగు నాటకం వేశాక, మరో పది, పదిహేనేళ్ళు ఏడాదికి కనీసం ఒక్కటైనా ఒక మంచి నాటకం ఉగాదికో, దసరా, దీపావళికో వేసే వాళ్ళం. అవి నేను వ్రాసినా, ఎవరు వ్రాసినా, అన్నింటిలోనూ నా పాత్ర ఉండి తీరవలసినదే! 90 శాతం అనిల్ డైరెక్ట్ చేసే వాడు. మా ఇద్దరిదీ నూటికి నూరు పాళ్ళు ఒకే పంథా. రిహార్సల్స్ లో రెచ్చి పోయి ఆనంద పడేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో మేము కొనుక్కోగలిగే అత్యంత చవక రకం ద్రావకం – బక్ హార్న్ అనే బీర్. అది 99 సెంట్ల కి 12 డబ్బాలు. రుచి వర్షం నీళ్ళలో వేప రసం పిండినట్టు ఉండేది. మేము ఎన్ని కౌనుక్కుని తంటాలు పడినా ఆ కంపెనీ దివాళా తియ్యడానికి ఎక్కువ కాలం పట్ట లేదు.

van5

1975-85 కాలంలో అన్నీ జ్ఞాపకం లేవు కానీ మేము వేసిన నాటకాలలో కొన్ని కుక్క పిల్ల దొరికింది (రావు కొండల రావు), వాంటెడ్ ఫాదర్స్ (ఆదివిష్ణు), ఇల్లు అమ్మ బడును (డి.వి. నరసరాజు), గుండెలు మార్చ బడును (జంధ్యాల). నేను వ్రాసినవి “మగ పాత్ర లేని నాటిక”, ఆఠీన్ రాణి”, “యమ సభ” మొదలైనవి. నాటకం వెయ్యని కార్యక్రమంలో నేను ఏదో ఒక ఏక పాత్రాభినయనం చేసే వాడిని. అందులో జ్ఞాపకం ఉన్నవి “గిరీశం”, “ఎస్ట్రోనాట్ ఆర్ముగం”, “ఈ నాటి దుర్యోధనుడు”, “పోలీస్ వెంకట స్వామి”, “నాదెళ్ళ భాస్కర రావు”,  “యమ సభ” మొదలైనవి. వీటన్నిటిలోనూ నటీ నటులు నేనే కాక, అనిల్, వసంత, ముత్యాల సీత, సత్య ప్రభ రెడ్డి, స్వరూప్ రెడ్డి, రఘు చక్రవర్తి, చార్వాక, అశోక్ కుమార్, కోనేరు ఆంజనేయులు, ఎ.వి,ఎన్. రెడ్డి, జగన్నాథ శాస్త్రి, మణి, వెంకట్ ముక్కు, మోహన్ రావు, చివుకుల కృష్ణ, నారాయణ రావు గారు, కంచెర్ల సుభాష్, బాబ్జీ రావు, కనకం బాబు, పొలాని కల్యాణి, హరి రాజా, దేవరకొండ రమేష్, బళ్లారి పావని మొదలైన వారు. ఇవి కాక సుమారు పదేళ్ళ పాటు ప్రతీ ఉగాది కార్యక్రమం నా హాస్య పంచాంగ శ్రవణం తోటే ప్రారంభం అయ్యేది. ఆ మాట కొస్తే మా నాటకాలు, ఏకపాత్రాభినయనాలూ, అన్నీ హాస్య ప్రధానమే! మధ్య మధ్యలో తెలుగు సామెతలకి చిన్న చిన్న నాటికలు రాసుకుని ప్రేక్షకులని ఆ సామెత ఏమిటో చెప్పమని పోటీ పెట్టె వాళ్ళం.

van4

van6

తెలుగు బడి, తెలుగు గ్రంధాలయం

1980 ల నాటికి పిల్లలకి తెలుగు నేర్పాలి అనే తపన మొదలయింది. దాని ఫలితంగా ముత్యాల సీత, చావలి రామ సోమయాజులు, కలపటపు వేణుగోపాల రావు ల ఆధ్వర్యంలో తెలుగు బడి నిర్వహణ మొదలయింది. రెండు ప్రాంతాలలో జరిగేది అని జ్ఞాపకం. ఇండియా నుంచి తెలుగు వాచికాలు తెప్పించుకుని ఇక్క గరాజ్ లలో ప్రతీ వారాంతం లోనూ ఈ తరగతులు నిర్వహించే వారు. భాష నేర్పడంతో బాటు పిల్లలకి నీతి పద్యాలూ, పాటలూ నేర్పేవారు.

అలాగే తెలుగు పుస్తకాలు చదవదల్చున్న వారికి నవలలు, కథ పుస్తకాలూ సేకరించి కలపటపు వేణుగోపాల్ కారులో పెట్టుకుని ప్రతీ కార్యక్రమానికీ తీసు కొచ్చి ఒక సంచలన గ్రంధాలయం నిర్వహించే వారు. ఐదారేళ్ళ తరువాత కాలంలో కమిటీలలో ఈ ఆసక్తి కనపడ లేదు.

ప్రముఖుల సందర్శనం

 

నాకు తెలిసీ 1973 ప్రాంతాలలోనే వాణిశ్రీ,  గుమ్మడి, రాజ్ బాబు మొదలైన వారు హ్యూస్టన్ రావడమే ప్రముఖుల రాకకి తొలి మెట్టు. ఇక్కడ నాకు అశోక్ కుమార్ చెప్పిన జోక్ ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఇక్కడికి రాగానే వాణిశ్రీ “అసలు డేటింగ్ అంటే ఏమిటీ, ఎలా ఉంటుందీ?: అని అడిగిందిట అమాయకంగా. అప్పుడు అశోక్ కుమార్ బేచలర్ కాబట్టి అతను వాణిశ్రీ ఒక్క దాన్నీ రెస్టారెంట్ కి డేటింగ్ కి తీసుకెళ్లాడుట. వెనక్కి వచ్చాక “ఓస్ ఇంతేనా డేటింగ్ అంటేనూ? ఇంకా ఏమిటో అనుకున్నాను“ అందిట. ఈ జోక్ కి ఇప్పటికీ నవ్వుకుంటాం మా తరం వాళ్ళం!

 

1975-85 దశకంలో హ్యూస్టన్ వచ్చి, మన ఆతిధ్యం స్వీకరించిన ప్రముఖుల వివరాలు TCA History At a Glance లో చూడ వచ్చును. ప్రత్యేకంగా గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా, ఎంత మంది వచ్చినా అందరికీ ఆతిధ్యం మా ఇళ్ళ లోనే.  వంటలు మావే! హోటళ్ళు, కేట రింగు లాంటి మాటలు ఎప్పుడూ విన లేదు. అందుకే నా బోటి వారికీ వారందరూ వ్యక్తిగతంగా మిత్రులయ్యారు.

వ్యాస విస్తరణ భయం చేత వారి వెనకాల కథలు వ్రాయడం లేదు. వీలుంటే 50వ వార్షికోత్సవ సంచికలో వ్రాస్తాను…

van7

 

ఆ నాటి తెలుగు సినిమా ప్రదర్శనలు

ఆ రోజుల్లో తెలుగు మాట వినడానికి ఎవరో ఒకరికి ఫోన్ చెయ్యడం ఒకే ఒక్క మార్గం. టీవీలలో, రేడియోలలో, సినిమాలలో, పేపర్లలో, బయట నూటికి నూరు పాళ్ళు అమెరికా ఇంగ్లీషు వాతావరణమే. ఆ పరిస్థితులలో ఎలాగైనా, ఎంత చెట్టది అయినా సరే…ఒక్క సారి తెలుగు సినిమా చూడగలిగితే ఎంత బావుంటుందో అని ఆ తరం వారు పడిన తపన, దానికి పడిన కష్టాలు స్మార్ట్ ఫోన్ లో సినిమాలు చూసి స్టెప్పులు వేసే వారు అధిక సంఖ్యాకులలో ఉన్న ఈ తరం వారికి అర్థం కాదు. అప్పుడప్పుడు అమెరికాలో ఎక్కడో అక్కడ తెలుగు సినిమా వేశారూ అంటే ఆ వార్త దావానలంలా వ్యాపించి పోయేది అన్ని ఊళ్లకీ. అది 35 mm సినిమా అయితే ఎంత ఇష్టమో వెయ్యడం అంత కష్టం…ఎందు కంటే ఒకే ఒక్క షో వెయ్యడానికి సినిమా హాలు వాళ్ళు నిరాకరించే వారు. ఇక రెండో మార్గం 16 mm సినిమాలు. ఈ ఫిల్మ్ సైజు లో సినిమాలు ఆ నిర్మాత ప్రత్యేకం విదేశాలకోసం తయ్యారు చేస్తే కానీ దొరకవు. బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు , సినిమా ఇండస్ట్రీ తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికా నుంచి ఇండియా వెళ్లి దొరికిన ప్రింట్స్ వారి స్తోమతకి తగ్గవి కొనుక్కొచ్చి అన్ని నగరాలకీ పంపిణీ చేసేవారు. ఆ ప్రింట్ ఖరీదు ఐదారు వేల డాలర్లు ఉండేది కాబట్టి ఆ పెట్టుబడి వెనక్కి రాబట్టు కోడానికి అవస్త పడే వారు.

కానీ తెలుగు సినిమా మీద అభిమానం కొద్దీ, లాభాలు ఆశించకుండా మాయా బజార్, మిస్సమ్మ లాంటి సినిమాల 16 mm ప్రింట్స్ కొనుక్కొచ్చి న వారిలో గర్వించదగ్గ వ్యక్తి మన హ్యూస్టన్ నివాసి డా. రవి తమిరిశ గారే! ఆ సినిమాలు వెయ్యడానికి కావలసిన 16 mm ప్రొజెక్టర్ మా ఆఫీసు లో ఉండేది. స్పెషల్ పెర్మిషన్ తీసుకుని అది పట్టుకెళ్లే వాడిని. ఏదో ఒక హాలులో గోడ మీద తెల్ల దుప్పటీ కట్టి  అనిల్, నేనూ దాన్ని ఆపరేట్ చేసీ వాళ్ళం. ప్రింట్ క్వాలిటీ ని బట్టి ఆ సినిమా రసపట్టులో ఉండగా..అంటే హీరో, హీరోయిన్లు ఘంటసాల -సుశీల పాట రొమాంటిక్ గా అభినయుస్తూ ఉండగా ఆ ఫిల్మ్ ఠకీ మని తెగిపోయేది. చచ్చినట్టు దాన్ని స్కాచ్ టేపు తో అతికించి మళ్ళీ వేసేటప్పటికి సగం డ్యూయెట్ కట్ అయిపోయేది. ఆ తరువాత రవి గారే ఒక ప్రొజెక్టర్ కొన్నట్టు జ్ఞాపకం.  అంత కన్నా ముఖ్యంగా తెలుగు సాంస్కృతిక సమితి తరఫున చందాలు పోగేసి వెయ్యి డాలర్లు పైగా ఉండే ప్రొజెక్టర్ కొనుక్కున్నాం. అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో?

van8

నాకు గుర్తున్నంత వరకూ హ్యూస్టన్ లో వేసిన మొదటి సినిమా “సుడి గుండాలు”. అది దువ్వూరి నారాయణ రావు గారు టెక్సస్ సదరన్ యూనివర్సిటీ లో ఫిజిక్స్ పాఠాలు చెప్పే గదిలో బ్లాక్ బోర్డ్ మీద తెల్ల దుప్పటీ కట్టి, అందరం క్లాసు బెంచీల మీద కూచుని చూశాం. ఆ తరువాత విశ్వశాంతి నిర్మాత యు. విశ్వేశ్వర రావు గారు తన “తీర్పు: అనే సినిమా ప్రింట్ పట్టుకొచ్చారు. ఆయన సమక్షంలో ఆ సినిమా కూడా  లాగే చూశాం.

అప్పటినుంచి (1976) ఇప్పటి దాకా, అన్ని ఒడుదుడుకులనీ తట్టుకుని, అన్ని సమస్యలనీ సామరస్యంగా పరిష్కరించుకుని, ఉత్తర అమెరికా మొత్తంలో ఒకే తాటిపై నడుస్తున్న ఏకైక అమెరికా తెలుగు సంస్థ అని ప్రపంచవ్యాపంగా అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన తెలుగు సాంస్కృతిక సమితి ఇక ముందు కూడా అదే బాటలో పయనించి, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకి మరింత సేవలు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

*

 

రొట్టె లాంటి మనిషి

vazida

Art: Wazda Khan

రొట్టె అతణ్ణి కలవర పరుస్తుంది
రొట్టె అతణ్ణి కలవళ పెడ్తుంది
తను ఎరిగిన రొట్టే
తనకు చిర పరిచితమైన రొట్టే
ఎందుకో ఈ రోజు తనని తాను
కొత్తగా పరిచయం చేసుకుంటోంది.
మిత్ర సమూహం మధ్య కూచొని
సంభాషిస్తుంటాడా
మేఘాల్లో తేలియాడుతూ
చందమామ వచ్చినట్టు
రొట్టె అతని ఊహల్లో విహరిస్తుంటుంది.
క్రిక్కిరిసిన
జనసముహాన్నివుద్దేశించి
ఉద్వేగంతో
మహోద్రేకంతో
అతను ఉపన్యసిస్తుంటాడా
ఎదురుగా కూచున్న వారి మొహాల్లో
లీలగా రొట్టె కనబడుతూవుంటుంది.
కమ్ముకొస్తున్న కవిత్వం లాంటి
ఉదయపు పొగమంచులో
చూపుడు వేలితో
గాలిలో సున్నాలు చుడుతూ
నడుచుకుంటూ వెళ్తుంటాడా
వెనక దూరంనుండి
తెలిసిన మిత్రుడెవరో
పేరుపెట్టి పిలిచినట్టు
రొట్టె అతణ్ణి పిలుస్తుంది.
పగలు సూర్యబింబం
రాత్రి చంద్రబింబం
చివరికి కాళ్లకింది బల్లపరుపు భూమీ
ప్రతీదీ అతనికి రొట్టె కిందే తోస్తుంది.
అంతెందుకు
కవిత్వం రాద్దామని
కాగితాన్ని ముట్టుకున్నా రొట్టైకూచుంటుంది.
బయటి ప్రపంచపు
సమస్త లౌకిక పనులూ పూర్తిచేసుకుని
దండెం మీది తువ్వాలును దులిపినట్టు
ఒకసారి తనను తాను దులుపుకుని
దేహమాళిగనుండి
మనోవల్మీకంలోకి దారిచేసుకుంటూ
ఇంటి ముఖం పడతాడు.
ద్వారబంధాల్ని
రెండు చేతులుగా చేసుకుని
పైకెత్తి ఎత్తుకోమంటున్న మనవడూ
పూర్తిచెయ్యని అబ్ స్ట్రాక్ట్ తైలవర్ణ చిత్రంలా
ఇంతకీ అర్ధం అయీ అవ్వని జవ్వనపు కొడుకూ
కాళ్లు కడుపులో దాచుకుని
ముడుచుకు పడుకున్న
పెంపుడు కుక్కలాంటి అలిగిన కోడలూ
మంచంలో కూచుని
అసహనంగా అటూ ఇటూ కదులుతూ
ఇన్సులిన్ ఎదురుచూపుల భార్యా
అందరూ అతని వెనకే
అడుగుల సవ్వడి వినబడనంత
మెత్తగా నడుస్తుంటారు.
అలా ఇంట్లోకి
అడుగు పెట్టాడో లేదో
కామరూప విద్య ఏదో తెలిసినవాడిలా
అతను
మనిషినుండి రొట్టెగా
రూపు మార్చుకుంటాడు.
మూడు వేళ్లకే
మృదువుగా చిదుముపడే
రొట్టెలాంటి అతణ్ణి
ఇంటిల్లిపాదీ
తలాఒక తుంపు తుంచుకుంటారు.
*

బహు పరాక్

art: Rafi Haque

art: Rafi Haque

~
వరమో శాపమో
బలేగా మళ్ళీ తయారయారు
నిద్ర లేవలేనిబేతాళుణ్ని
మాచేత మోయిస్తూ
నిరంతరం నిద్ర లేపే ప్రయత్నమూ చేస్తున్నారు.
నవ నిర్మాతలూ బహుపరాక్
మీ నుదుటి కుంకుమ చూసి
పూజా దురంధరులనుకున్నామే కానీ
మీ అవిశ్రాంత నరమేధపు వెచ్చటి నెత్తుటి ఆనవాలనుకోలేదు.
భక్త శిఖామణులూ బహుపరాక్
మీ సహస్ర భాషల్లో
‘ముందుకు పోతావున్నా’మన్న మాట విన్నపుడల్లా
వుత్తమ పురుషుడి బహువచనమనుకున్నాము కానీ
వుత్త పురుషుడి ఏకవచనమనుకోలేదు
వయ్యాకరణులూ బహుపరాక్
మీరు తిరుగని పుణ్యదేశం లేదు
మా గుండె లోతుల్ని తప్ప
మీరు మునుగని గంగ లేదు
మా కంటి ధారల్ని తప్ప
మీరు మొక్కని హోమజ్వాల లేదు
మా ఆకలి మంటలు తప్ప
మీ పబ్బానికో యేరు దొరికింది
మీ మాటల పండగలకు హారతులూ దొరికాయి
మీ డప్పు డవాలు దారులూ
వంతపాటకు దొరికారు
తిరుక్షవరానికి
*అరుకాళుడి నోటి దగ్గర
పట్టు కుచ్చు టోపీలతో
అమాయిక భక్త జనమూ దొరికారు
మేమిలా వింటూనే
కలలు కంటూనే వుంటాం
అపర మయసభా నిర్మాతలూ బహుపరాక్
‘మహేంద్ర నగరి’ హుం
‘సీనా సింహ’ కవచం భం
‘ఋణౌ’షట్
‘వసుధానిధి ధనం’ స్వాహా
అమాయక జనం ఫట్
మహా మాయాజాలంతో
యేదో జరిపిస్తున్నామన్న భ్రమలో
మమ్మల్ని మరిపింపజేసే
మహా నేపాళ మాంత్రికులూ
మళ్ళీ మళ్ళీ బహుపరాక్!
*అరుకాళుడు: పాముపటంలో పెద్ద పాము పేరు
*

ఒక్కోసారంతే

Art: Rajasekhar chandram

Art: Rajasekhar chandram

 

ఒక్కో సారంతే
గుండెలమీద గుసగుసగా తగలాల్సిన శ్వాస

ఉన్నట్టుండి బుసకొడుతుంది
కన్రెప్పలకు కత్తులు మొలుచుకొస్తాయి
నాలుక నాగుపాము అవుతుంది
మాట ఇపుడు
మనస్సరస్సు లోంచి ఎగిరే చేపపిల్ల కాదు
కల్లోల కడలిలోంచి ఎగిసి దుమికే తిమింగళం
ఒక్కోసారంతే
విషపు పెదవులను ముద్దాడినట్టుగా
రేగు పొదతో సమాగమంలా
అబద్ధం అంత అసహ్యంగా
అబద్ధాన్ని నిజం చేయడమంత నీచంగా
ఒక్కోసారంతే
ఎవరో విసిరిన పాచికతో
పరాయి ఆటలో పావులవుతాం
హఠాత్తుగా మొలుచుకొచ్చిన గోడల మధ్య
ఆత్మలు నలిగిపోతూ ఉంటే
కచ్చగా పౌల్‌ ఫౌల్‌ అని అరుస్తూ ఉంటాం
అరుపుకు ఆర్తనాదానికి మధ్య అభేదమై విలవిల్లాడుతూ ఉంటాం
ఒక్కోసారంతే

*

 

 

 

పితృ, దేవ హత్య అనివార్యం!

Art: Rafi Haque

Art: Rafi Haque

‘తండ్రీలేనీ, దేవుడు లేనీ అనాథ లోకం’ ఒక అన్‌ఫిలసాఫికల్‌ మెటాఫిజికల్‌ కాక్‌టేయిల్‌ ఎక్స్‌ప్రెషన్‌. గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించిన నేపథ్యం విస్మరించి రాణిశివశంకర శర్మ తండ్రీ, దేవుడీ అవసరాన్ని వక్కాణించటం ఆలోచించాలి.
సోక్రటీసు ఆస్తిక‌త్వాన్నీ, దేవుడు ఉనికినీ ప్ర‌శ్నించింది  మొదలు హెగెల్‌ వరకు ఫిలాసఫీలో దేవుడు, మతానిదే కేంద్రస్థానం. మెటాఫిజికల్‌ ఫిలాసఫీని భౌతికవాదం వైపు మార్క్స్‌ నడిపించడానికి కాంట్‌, హెగెల్ త‌త్వం ఉపయోగపడ్డది నిజమే. కానీ, గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించటానికి మాత్రం కాంట్‌, హెగెల్‌ తాత్విక అన్వేషణ కారణం కాదు. నీష్చేను ఆ మాట అనేలా మనుస్మృతి ప్రేరేపించింది. బ్రాహ్మణిజం చాకచాక్యంగా దేవుణ్ణి తప్పించి బ్రాహ్మణున్ని కేంద్ర స్థానంలో నిలిపింది. బ్రాహ్మణుడే దేవుడని మనుధర్మం ప్రకటించింది. మ‌మ దేవః, అహం బ్ర‌హ్మ‌స్మి అన్న‌ది అందుకే. అతడి సంక్షేమమే రాజ్య సంక్షేమ‌మం, అదే రాజ్యం యొక్క బాధ్యతనీ, అతడిని రక్షించటమే రాజధర్మమని మనుధర్మం ప్రకటించింది. ఈ ప్రపంచాధిపతి విప్రుడని అది చేసిన ప్రకటన నీష్చేని అబ్బురపర్చింది.
మనుస్మృతిలోని అధిమానవుడు (సూపర్‌ హూమన్‌ బీయింగ్‌) తనకు ఆదర్శమని అతడు భావించేలా ప్రేరణిచిందది. అందుకే దేవుడు మరణించాడనీ, ఇక ఈ లోకాన్ని అధిమానవుడైన ఆర్యుడే ఏలి రక్షిస్తాడని పారవశ్యంతో ఏడ్చే ఒక సంభ్రమాశ్చర్య దుఃఖస్థితికి అతడు చేరుకున్నాడు. ఇంచుమించు వివేకానందుడిదీ అదే మనోస్థితి. అతడి చేష్టలు, వ్యాఖ్య‌లు,  భ్రాంతిపూరిత ప్రకటనలూ ఆ అధిమానవుడిని తండ్రిగా అంగీకరించిన ఫలిత‌మే! కాబట్టే నీష్చే, వివేకానందుల‌ మధ్య వుండే డిస్కర్సివ్‌ సిమిలారిటీస్‌ను డా. అంబేద్కర్‌ వివరించాడు. నీష్చే తాత్వీకరించిన ఆ అధిమానువుడు ఆర్యుడు. నీష్చే ప్ర‌వ‌చించిన రేసిస్టు ఫిలాసఫీ హిట్లర్‌ (శర్మగారు చెప్పిన ‘తండ్రి’) నాజీయిజానికి, తద్వారా రెండు కోట్లమంది మానవ హననానికీ కారణమైంది.
నీష్చే ఈ లోకానికి అధిమానవున్ని తండ్రిగా ఇవ్వానుకొని దేవుడనే భావనకు ఫిలాసఫీలో ప్రాధాన్యత తగ్గించాడు. అయితే, మనువు చెప్పిన అధిమానవుడే ప్రపంచానికి తండ్రిగా, దేవుడు (భూసురుడు)గా  ఎంత విధ్వంసం సృష్టించాడో చరిత్ర సాక్ష్యం చెప్తూనే వుంది. తండ్రి తన పిల్ల‌ల‌ను తప్ప ఇతరుల పిల్ల‌ల‌ పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడన్న హామీ ఏమీ లేదు. హిట్లర్‌ అనే తండ్రి యూదుల‌ను శత్రువుగా భావించాడు కాబట్టే కాన్‌సెంట్రేషన్‌ క్యాంపుల్లో పెట్టి దారుణమైన జాతి హననానికి ఒడిగట్టాడు. ఒక చెడ్డ తండ్రి వల్ల‌ సంభవించిన క్రైం అగనెస్ట్‌ హుమానిటీని శిక్షించే పేరుతో రిలేటివ్‌లీ మంచి తండ్రి అయిన స్టాలిన్‌ పుట్టుకొచ్చాడు. ఈ సాపేక్ష సద్గుణ తండ్రి చేతిలో రష్యాలోని తన సొంతబిడ్డలు ఎంత హింసను అనుభవించారో తెలిసిందే. ఈ తండ్రి చేతిలోనే రోజా ల‌గ్జంబ‌ర్గ్ హ‌త‌మైంది. ఇందిరాగాంధీ నియంతృత్వంలోని క్రూరత్వాన్ని చవిచూసిన వాళ్లే ఆమేలోని దైవ‌త్వాన్ని ఎరుగుదురు. నియంతల‌ నిజాయితీ ఆధారంగా పితృ, పుత్ర సంబంధాల‌ను అంచనా వేయటం నయా మనువాదం.
మిషేల్‌ ఫుకో, డెరిడా, రార్టీ వంటి ఉత్తరాధునికవాదులు, ప్రాగ్మాటిస్టులు అన్ని రకాల‌ ఆధిపత్య కేంద్రాల‌ను తిరస్కరించారు. తండ్రి, కొడుకు అనే  ద్వైధీకృత సంబంధంలోని ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు డెరిడా. తండ్రికి లోబడి కొడుకు లేదా కూతురు వుండాల‌న్నది ఆధిపత్య సంబంధమే తప్ప సమానత్వాన్ని స్థాపించే ప్రజాస్వామిక సంబంధం కాదని ఆయన అభిప్రాయం. దీన్నే వాచకానికి వర్తింప చేసి ముందుమాటను వాచకం అప్రధానం చేయటమో లేదా ముందుమాటే తనను తాను ప్రధాన వాచకానికి లోబడి, కుదించుకుపోవటమో చేస్తుందని వివరిస్తాడు. అందుకే పితృహత్యకు డెరిడా పిలుపునిస్తాడు. తండ్రి పాత్ర పూర్తిగా ఆధిపత్యానికీ, పితృస్వామ్య ఆధిపత్యానికి నెల‌వని సైమన్‌ డిబోవా అభిప్రాయం.
కౌటుంబిక వ్యవస్థలో తండ్రి పోషించే బాధ్యతాయుతమైన పాత్రను వర్ణ, కుల‌ సమాజం గ్లోరిఫై చేస్తుందేమో గానీ, యూరపు సమాజాలు మాత్రం తిరస్కరిస్తాయి. వర్ణ, కుల‌ వ్యవస్థలోని ఆధిపత్యం వల్ల‌ అనేక ప్రయోజనాలు పొందుతున్న సవర్ణ పితృస్వామ్యవాదులు సమర్ధిస్తారేమో గానీ ఆధిపత్య వ్యవస్థను తిరస్కరిస్తున్న ప్రజాస్వామికవాదులు లేదా ఎగాలిటేరియన్‌, యాంటీ ఫాసిస్టు శక్తులు సుతారమూ అంగీకరించవు. ఎంతో పాతబడినదీ, తిరస్కరించబడినదీ, వ్యతిరేకించబడినదీ, అస్తిత్వవాదుల‌ చేతా, ప్రగతిశీవాదుల‌ చేతా, అంబేద్కర్‌వాదుల‌ చేతా ఖండించబడీ, తిరస్కరించబడిన పితృవాదం, దైవవాదాల‌ను తిరిగి బాధితుల‌ శిరస్సు మీద రుద్దడం అనంగీకారం. పితృ/దైవ కేంద్ర సిద్ధాంతమే గొప్పదనీ, అవసరమైనదనీ ఒప్పుకొంటే, శర్మ తర్కం వల్ల‌ ఉత్ఫన్నమయ్యే ఫలితాల‌ను భరించాలి. తండ్రి పాత్ర పోషించాడని చెప్పిన రాముడి చేతిలో ఈ దేశ మూల‌వాసుల‌ శిరస్సు ఖండితమై, జ్ఞానార్జనా క్షేత్రాల‌కు దూరంగా కుళ్లిన కళేబరాలై చితికిపోవాలి. రాముడి ధర్మం ప్రాసంగికత ఎంత అసందర్భమైనదైనా సరే,  ఆ రాముడి ధర్మాన్నే తండ్రిబాధ్యతగా, దైవకార్యంగా ఈ దేశ రాజ్యం యొక్క సారభూతతత్వం (ఆంటలాజికల్‌ ఫిలాసఫీ) గా స్థాపించాల‌ని హిందూ జాతీయవాదం తపిస్తున్నది.
నిజానికీ, తండ్రి లేదా ధర్మకర్త పాత్ర పోషించాల‌ని చెప్పిన గాంధీ హితవాదాన్ని డా. అంబేద్కర్‌ తిరస్కరించి, రాజ్యాన్ని రక్షకుడి స్థానంలో నిబెట్టడం వల్లే బాధిత సమూహాల‌కు ‘అనాథ’ స్థితినించి ‘పౌర’ హోదా దక్కింది.  రాజ్యాంగంలో నిర్వచించుకొన్నట్టుగా పౌరుల‌ను రాజ్యమే రక్షించుకోవాలి తప్ప ఏ దేవుడూ లేదా ఏ అధిమానవుడూ రక్షించరాదు. శిక్షించరాదు కూడా. కానీ, పితృస్థానంలో వున్న రాజ్యాంగాన్ని తోసిరాజని తండ్రి పేరుతో బ్రాహ్మణున్నీ, దేవుడి పేరుతో బ్రాహ్మణ్యాన్నీ రాజ్యంగా ప్రతిష్టాపించే కృషిని నెహ్రూ మొదలుకొని నరేంద్ర మోడీ వరకు కొనసాగిస్తూనే వున్నారు.
శర్మ వగస్తున్నట్టు ఈ దేశానికీ లేదా ఈ లోకానికీ తండ్రి, దేవుడు లేడని ఎవరైనా భ్రమిస్తే అది వాళ్ల జువైనలిజమే అవుతుంది. రాజ్యాంగ విరుద్ధంగా మ‌నువు ఆకృతినిచ్చిన తండ్రినీ, దేముడినీ ఈ స‌మాజంలో బ‌లంగా నిల‌బెడుతూనే వున్నారు. వాటిక‌న్ సిటీ దేవుడూ, అమెరికా తండ్రి క‌లిసి త‌యారు చేసిన హింస‌కు ప్ర‌తిహింస‌గా బ‌య‌ల్దేరిన తీవ్ర‌వాదం నెత్తుటి వాన‌ను కురిపిస్తూనే వున్న‌ది. దేవుడే లేని వెలివాడ‌ల్లోకి తండ్రి అయిన యేసును ప‌ర‌లోక ప్ర‌వేశానికి క‌చ్చిత‌మైన హామీ ఇస్తూ ప్ర‌వేశ‌పెట్టి చాలాకాల‌మైంది. ప‌ర‌లోకం త‌ప్ప ఇహ‌లోకం ప‌ట్ట‌ని ఒక ఉన్మ‌త్త స్థితికి తీసుకెళ్తున్న‌ది ప‌చ్చి నిజం. ఏది అస‌లైన ఇస్లామో చెప్ప‌లేనంత‌గా మారిపోయిన కాలంలో త‌బ్లిక్‌లాంటి జ‌మాతులు ముస్లిం స‌మాజాన్ని తిరోగ‌మింప చేస్తున్నదీ నిజ‌మే. తండ్రుల మ‌ధ్య‌, దేవుళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న స‌మ‌రంలో సామాన్యుడు బంధీగా మారుతున్నాడ‌ని ఒక‌వైపు వేద‌న‌ప‌డుతుంటే శ‌ర్మ మ‌ళ్లీ పాత‌పాటే పాడ‌టం ఏ సాంస్కృతిక చాణ‌క్య నీతి?
 మనది జాతి రాజ్యం కాదన్న నిజాన్ని మేధాల‌వుంతా ఎందుకు గుర్తించ నిరాకరిస్తున్నారో అర్థం కాదు. యూరపులోని జాతి రాజ్యాల‌ లాంటిది కాదు మన రాజ్యం. జాతి భావనే లేని సమాజం మనది. కులం తప్ప జాతికి పుట్టగతుల్లేని అవ్యవస్థ ఇది. జాతి అనే అమూర్త భావనను నిజం చేయలేమని గ్రహించిన రాజ్యాంగ నిర్మాత గణతంత్ర రాజ్యంగా నిర్ధారించాడు. గణతంత్ర విధానంలోనే వివిధ జాతుల‌, కులాల‌, తెగల‌, మత బృందాల‌, భాషా సమూహాల‌, లింగ సమాజాల‌కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ల‌భిస్తుంది. జాతి రాజ్యాల్లో ఇది అసంభవం. పాలిత జాతికి చెందని సమూహాల‌కు, బృందాల‌కు, గణాల‌కు, తెగల‌కు, జాతుల‌కు రాజ్యం కల్పించే హక్కులు, రక్షణలు, ప్రాతినిధ్యం తప్పనిసరిగా దక్కే అవకాశం లేదు. అవి జాతి రాజ్యం యొక్క దయాదాక్షిణ్యాల‌ మీద ఆధారపడి జీవించాలి. కానీ, మనది గణతంత్ర రాజ్యం కావటం వల్ల‌ అలాంటి నిరంకుశ జాతి దురహంకారానికి బాధితులుగా మిగల‌కపోగా, స్టేక్‌ హ్డోర్లు కాగలిగారు. శర్మ మన రాజ్యాన్ని జాతి రాజ్యాల‌ సరసన నిబెట్టి బోనెక్కించటం సమర్ధనీయం కాదు.
కౌటుంబికవాదం మరో కాల్ప‌నికవాదం. అది తండ్రినీ, పిల్ల‌ల వికాసాన్నీ, తండ్రి పడే కష్టాల‌నూ రొమాంటిసైజ్‌ చేస్తుంది. పిల్ల‌ల‌ ఎదుగుదల‌కు తండ్రి, తల్లి మధ్య సామరస్య సంబంధాలు దోహదం చేస్తాయనీ, పిల్ల‌ల‌ను పెంచే బాధ్యతను తండ్రి భుజామీద మోపి, తల్లిని వారిని సాకే యంత్రంగా మార్చేస్తుందనీ ఈ కాల్ప‌నిక‌వాదం గుర్తించనీదు. తండ్రిని ఒక కులానికీ, ఒక వర్గానికీ బంధీని చేసిన దేవుడు ఆ పిల్ల‌ల‌ శారీరక, మానసిక ప్రగతికి తండ్రి యొక్క ఆర్థిక స్థితినీ లేదా ఆర్థికబలాన్ని పొందే ప్రతిభా సామర్ధ్యాల‌ను హేతువుగా చూపి తప్పించుకుంటున్నాడు. ఈ కుల‌ సమాజంలోని న‌ల‌భై కోట్ల పీడితులు రోజుకు ఒక్క పూట తిండి మాత్రమే తింటున్నారంటే, ఎనభైశాతంకు పైగా బడీడు పిల్ల‌లు స్కూలు డ్రాపవుటవుతున్నారంటే, తల్లిదండ్రుల‌ అజ్ఞానం, పేదరికం, అసమర్ధత వ‌ల్ల‌ నిత్యం కౌటుంబిక హింసకు గురై బాల్యాన్ని పోగొట్టుకుంటున్నారంటే తండ్రి కేంద్ర వ్యవస్థే కారణం. కానీ, యూరపులోని అనేక దేశాలు గర్భస్థ శిశువు నుండి టీనేజీ వరకు పోషణ, విద్యాబుద్ధులు, బాల్యాన్ని అనుభవించే హక్కును గ్యారంటీ చేయటమే కాదు, మన కుల‌ సమాజం ఇచ్చిన పెత్తనపు హక్కు స్వభావంతో కన్నపిల్ల‌ల‌ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేసి ఖైదు చేసిన సంఘటనలున్నాయి. తండ్రి వున్నంత మాత్రానే బిడ్డకూ, త‌ల్లుల‌కూ స్వేచ్ఛ వుంటుందనుకోవటం పెద్ద దగా. నిజానికీ, స్వేచ్ఛకు తండ్రీ, దేవుడు పెద్ద అడ్డంకని ఎన్ని సామాజిక పరిణామ దశలు చూపించాయో మర్చిపోతే ఎట్లా?
శర్మ ఆర్థికవాదాన్ని నిరసించినంతనే తన వాదన‌ ఆమోదనీయమైనదని నిరూపించలేరు. స్వేచ్ఛా మార్కెట్ వ‌ల్ల‌ దళితుల‌ జీవితాల్లో పెద్ద మార్పులొస్తాయని ఎవరూ ఆశించలేదు. కానీ, కుల‌ సంబంధాల్లో స్వ‌ల్ప‌మైన మార్పులైనా వొస్తాయనీ, ముఖ్యంగా జైలుగదిగా మారిన గ్రామరాజ్యం విచ్ఛినమై, సుదీర్ఘకాలం కట్టుబానిసలుగా బంధితులైన దళితుల‌కు సాపేక్షమైన స్వేచ్ఛనిచ్చే సోషల్‌ మొబిలిటీ దొరుకుతుందని మాత్రమే ఆకాంక్షించారు. అన్ని దశల్లో అమలైన ఆర్థికఒప్పందాల వ‌ల్ల‌, వేగంగా విస్తరించిన టచ్‌స్క్రీన్‌ టెక్నోయిజం వల్లా, ఎక్ట్రో కమ్యూనికేషన్‌ ప్రగతివల్ల‌ బ్రాహ్మణ, వైశ్య మార్కెట్‌ లాభపడ్డది. కాస్టిస్ట్‌ మార్కెట్‌ స్వభావం, ప్రవర్తన పీడిత సమూహాల‌ను కనీసం వినియోగదారునిగా కూడా పరిగణించదనీ, అది అనేక మాయాజాల‌ పద్ధతుల‌తో జేబుదొంగకన్న హీనంగా ప్రవర్తిస్తుందన్న ఎరుక అంబేద్కరైట్‌ మేధావుల‌కు వుంది.
సవర్ణ సరుకుల‌ సంతను విస్తరింప చేయటానికీ, దేశ సహజ వనరుల‌ను సవర్ణ సంపన్నుల‌కు కట్టబెట్టడం ద్వారా ప్రపంచ కుబేరుల‌ను చేసి, ప్రపంచ మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవటం ద్వారా వైష్ణవ, వైదిక, సనాతన ధర్మపరంపరాగతమైన హిందూత్వ జాతీయవాదాన్ని ఆర్యజాతి ఐక్యత పేరుతో ప్రపంచమంతా వ్యవస్థాపితం చేయాల‌ని తపిస్తున్న సత్యం కనిపిస్తూనే వున్నది. సంఫ్‌పరివార్‌ సంస్థలు మొదలుకొని హరేక్రిష్ణ మిషన్‌, రామక్రిష్ణ మిషన్‌ వరకు ఎన్నో సంస్థలు ఆ దిశగా పనిచేస్తూనే వున్నాయి. ఆ ల‌క్ష్యం కోసమే పేద (హిందూపేదల‌) పితరగా ప్రకటించుకొన్న నరేంద్ర మోఢీ నిద్రాహారాలుమాని పనిచేస్తున్నాడు. ఆ ల‌క్ష్యం కోసమే ముస్లింల‌ను, దళితుల‌ను సామూహిక హనన కేంద్రాకు స్వ‌యంగా తరలిపోయి క్యూలో నిల‌బడే బలిమేకలుగా త‌యారు చేసే మానసిక ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు. ఆ సామూహిక హననక్రియకు అవసరమైన తలారుల‌ను శూద్ర, శూద్రఅగ్రకులాల‌ నుంచి తయారు చేసి శిక్షణిస్తున్నాడు.
ఇందుమూలంగా నిర్ధారించనైనది ఏమనగా, ఈ లోకాన్నీ, పీడిత సమూహాల‌ను సర్వనాశనం చేసిన, చేస్తున్న, భవిష్యత్తులో చేయబోయే తండ్రి ` అతడు ఎంతటి ఉదాత్తుడు, శీల‌వంతుడు, సద్గుణుడు, నిర్గుణుడు అయినప్పటికీ  తాత్వికంగా గానీ, కనీస ఇంగితజ్ఞానంతో గానీ అంగీకరించేది లేదని ప్రకటిస్తున్నాం. వేల‌ యేళ్లుగా ఈ ప్రపంచాన్నీ, ఈ దేశాన్నీ సర్వనాశనం చేసిన దేవుడు ఎంతటి దయామయుడైనా, ఎంతటి బల‌మైన దేహదారుఢ్యమూ, ఆయుధసంపత్తిని చేబూనివాడైననూ, ఎంతటి ధర్మనిరపేక్షమైనవాడైననూ, ఎంతటి కరుణామృత హృదయుడైననూ, అతడెంత నిర్గుణుడైనా, సద్గుణుడైనా, నిరాకారుడైనా, సాకారుడైనా సరే, తాత్వికంగాగానీ, సాధారణ బుద్ధితోగానీ, అసాధారణ బుద్ధిహీనతతో గానీ అంగీకరించేది లేదని ప్రకటించనైనది.
*

చీకటిదే మతం?

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

ఉదయమే ఇంటర్వ్యూ  కి వెళ్ళాలి. వెళ్ళగలనా ? ఈ  చీకటి , ఈ నిద్రలేని  రాత్రులు ఇలా  అలవాటైపోయాక అనుకున్న సమయానికి  నిద్రలేవగలనా ? మళ్ళీ నన్ను వెతుక్కునే పనిలో పడాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అహ అస్సలు చూడకూడదు.

ఎంత  బాగుంటుంది  చీకటి. ప్రశాంతంగా. పొగలూదుతూ కాఫీ తాగే చంద్రున్ని వేల ప్రశ్నలు అడుగుతూ నేను ఓ కాఫీ కలుపుని నాలుగో అంతస్తులో ఉంటున్న మా  ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఆకాశంకేసి చూస్తూ తాగడం. ఇవన్నీ ఇవన్నీ నేను బ్రతికున్నాను, బ్రతుకుతున్నాను అన్న సూచనలే.

ఏదో  ఆలోచిస్తుంటాను. ఏదో రాద్దాం అనుకుంటాను. ఎవరెవరి జీవితాలో కళ్ళముందుకి వచ్చి అసంపూర్ణ కథలు చెప్పి వెళుతుంటే వాళ్ళ వంక దీనంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాను. ఎవరు వీళ్ళంతా . వీళ్ళ మానసిక వేదనలేంటి.

ఏమో ఇవ్వాలెందుకో ఆ పిల్ల బాగా గుర్తొస్తుంది. అందరికన్నా ముందే బైబిల్ పట్టుకుని చక చక చర్చికి వచ్చే పిల్ల. అందరికన్నా ముందే నన్ను సండేస్కూల్ లో పలకరించడానికి వచ్చే పిల్ల. కంఠతా పట్టేసిన ఆ రోజుటి వాక్యాన్ని గబగబా అప్పగించే పిల్ల. బాగా గుర్తొస్తుంది.

పోయినేడే కదూ ఆ అమ్మాయి క్రిస్మస్ కి చర్చ లో స్పెషల్ సాంగ్ పాడింది. అందరూ మెచ్చుకున్నారు. వాళ్ళమ్మ నాన్నలకైతే ఎంత సంతోషమేసేదో ఆ రమ్య  పాడుతూ , బైబుల్ వాక్యం చదువుతుంటే.

చిన్నప్పుడు వాళ్ళను చూస్తే నాకు సందేహం కలిగేది. తెలిసో తెలియకో మా నాన్నను ఒక రోజు అడిగేసా. మన ముక్కుల్లా వాళ్ళ ముక్కులెందుకు లేవు అని. ఏం చెప్పాలి ఈ పిల్లకి అనుకున్నాడో ఏమో  మా నాన్న కొంచెం సేపు తటపటాయించి చెప్పాడు. ఆ అంకుల్ వాళ్ళది ఇక్కడ కాదు వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు. అని అప్పటి వరకు నాకు అందరి ముక్కులూ ఒక్కలా వుండవు అన్న విషయమే తెలియదు. కాని రమ్యకి ఆ ముక్కుతో ఏ సంభంధం లేదు. ఎంత చక్కగా వుండేది. తెల్లగా , బుగ్గలేసుకొని. “స “ మామూలుగా పలకడానికి రాక. పై పల్లకి నాలుక ఆనించి స అన్నప్పుడు సండేస్కూల్ లో పిల్లలు కుళ్ళుతో ఏడ్పించే వాళ్ళు కాని అందరికీ  తెలుసు. బైబుల్ మెమరీ వర్సస్ చెప్పాలంటే అందరూ రమ్య తరవాతే అని . చదువులో కూడా అంతే ఫస్ట్ కదా. అందుకే బాసర ట్రిపుల్ ఐటీ  లో సీట్ సంపాదించింది.

ఇప్పటి వరకూ ఇంటర్వ్యూ గురించి ఎంత ప్రిపేర్ అవ్వాలో అయ్యాను. గూగుల్ ఉంది కాబట్టి సరిపోయింది. ఏ ప్రశ్నైనా అడుగు టపీ మని సమాధానం చెప్పేయదు. రాత్రి ఒంటిగంట అవుతుంది ఇప్పుడు . రాసుకునే అన్ని రాసుకుని, నేర్చుకునే అంత నేర్చుకుని రేపటి కోసం చూస్తున్నా .

నాకే నిద్దర ఎందుకు రాదో అర్ధం కాదు. ఈ రాత్రి పూట బయటకొచ్చి ఖాళీగా ఉన్న ఇంటి ముందు నడుస్తూ రేలింగ్ దగ్గర నిల్చుని చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతున్న ఇళ్ళ మధ్య గుండా ఎన్నో కలలు వీధుల్లో లేసర్ షో వేస్తున్నట్టు కనిపిస్తుంటాయి నాకు. నిద్దర పట్టకపోతే కీబోర్డ్ మీద వేళ్ళు ఊరుకోవు. బుర్రలో ఆలోచనలు ఊరుకోవు. ఎవరెవరో గుర్తొస్తూ ఆలోచనల్లోకి బలవంతంగా ప్రవేశిస్తారు.

ఆ రమ్య సంగతేంటి చెప్పమంటార. ఏముంది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నట్టుంది కదా ఆ పిల్ల రమ్య ఇల్లొదిలి పారిపోయి. అవును ఎనిమిదో తొమ్మిదో నెలలు అవుతుంది. ఆ పిల్ల ఇల్లొదిలి వెళ్ళినప్పుడు చర్చిలోని సంఘస్తులంతా ఒకటే చెవులు కొరుక్కున్నారు. బాగయ్యింది అని. ఎందుకో మరి వాళ్లకు ఆ సంభరం. తను  వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మా నాయన్ని ఎవరెవరు ఎలా మాట్లాడారో తెలుసో లేదో ఆ పిల్లకి . ఎలా తెలుస్తుంది. ఆ పిల్లుండే స్థలానికి వీళ్ళు వెళ్ళలేరు. వెళ్లి చూడడానికేమో వీళ్ళకు ఇష్టం కలగడం లేదు.

ఇంతకు ఎవరైనా మత విశ్వాసాలను అంత తొందరగా ఎలా మార్చుకుంటారు. ఏ నమ్మకాన్నైనా వెంటనే ఎవరం మార్చుకోలెం కదా. ఆ మార్పు వెనక ఎప్పటినుంచో వెంటాడే సమయం వుంటుంది. అది ఒక నెలో , మూడు, నాలుగు, ఆరు నెలలో, లేదా సంవత్సరమో  రెండు సంవత్సరాలో.

రమ్య తన విశ్వాసాన్ని మార్చుకోడానికి ఎన్ని రోజులు పట్టిందో. అందరూ ఆ పిల్ల అమ్మా నాన్నలను పొడవడమే. ఎవడినో ప్రేమించి వుంటుంది. లేకపోతే అలా ఎలా మతం మార్చుకుని , చెప్పా పెట్ట కుండా ఇంట్లోంచి వెళుతుంది అని. ఆ పిల్ల మతం మార్చుకోవడం కన్నా ఎవడినో ప్రేమించే మార్చుకుంది అన్న మాటలు వాళ్ళను ఇంకా బాధించి వుంటాయి.

వాళ్ళు మూడు నెలల వరకు చర్చికి రావడమే మానేశారు. జనాలకు మాట్లాడుకోడానికి ఆ మసాల దొరికింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ రకంగా కుదిరితే అలా కథలు అల్లుకోవడం మొదలు పెట్టారు. నా వరకూ వచ్చాయి. వినే ఓపిక లేదనిపించింది. ఎందుకో నేను సరిగ్గా నా మత విశ్వాసాన్ని ఆ అమ్మాయి వరకు చేరవేయడం లో విఫలమైయ్యానేమో. లేక ఆ అమ్మాయికి నేను అవలంభిస్తున్న మతం, సిద్ధాంతాలకన్నా తాను మారిన మతంలో ఏ విషయం గొప్పదనిపించిందో. ఆ అమ్మాయి తనకు నచ్చిన  విశ్వాసాన్ని స్వీకరించి అనుసరించే హక్కు ఆ పిల్లకి వుంటుంది కదా. వద్దు అంటే ఆ అమ్మాయి వింటుందా ? బలవంతం చేసి మతాన్ని మోయించగలమా?. ఇల్లు వదిలి వెళ్ళేంత నమ్మకం పెంచుకుంది అంటే అంత గొప్పగా తనకి ఏమనిపించిందో.

ఈ విషయం అయ్యాక కొన్ని రోజులు ఇదే ఆలోచించాను. అవును ఆయనెవరో ఫేస్ బుక్ లో మతం మారకండి అని అరిచి రాసేప్పుడు జాలి వేసేది. మా నాన్న మేనత్తలందరూ  హిందువులను పెళ్లి చేసుకుని హిందువులైయ్యారు. మా తాత RCM సిద్ధాంతాలతో ఉన్నప్పుడు మా నాన్నమ్మ ప్రొటెస్ట్ టెంట్ గా వుండి అందరిని అటువైపు తీసుకెళ్ళింది. మేము ఆ విశ్వాసంలో బలపడ్డాo. అయినా బంధుత్వాలేవి పోలేదు.

నిజమే మత విశ్వాసాల జోలికి వెళ్ళకుండా మనుషులు మనుషులుగా స్వీకరిస్తే ఏ గొడవా వుండదు కదా. ఏంటో ఓల్డ్ సిటీలో ఎదో మదరస్సాలో ఇస్లాం స్టడీస్ చేస్తుందంట ఆ పిల్ల. ప్రేమ గీమ లాంటి జోలికి కాకుండా కేవలం మతపరమైన చదువులకోసం వచ్చాను ఇప్పుడు నా పేరు అఫ్రీన్ అని వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళినప్పుడు ఆమె తరపున లాయర్ తో చెప్పించిందట. మా పాస్టర్ గారు నన్నోసారి రమ్మన్నారు.  నువ్వు మాట్లాడుదువు గాని రా అమ్మా అని. నేనేం మాట్లాడతాను. నా దేవుడు తప్పు కాదు అంటే ఆ అమ్మాయి కూడా నేను అనుసరించే దేవుడు తప్పు కాదు అంటుంది. ఆ అమ్మాయికి  ప్రశ్నలు ఉత్పన్నం అయినప్పుడే ఎవరినైనా అడిగి తెలుస్కోవాల్సింది. కాని అలా జరగలేదు. ఇప్పుడు అంతా అయిపోయాక నేను వెళ్లి మాట్లాడినా మార్పు వస్తుందా. రాదు . కాని కాలం అన్నిటికీ పరిష్కారం చూపగలదు. నేను అదే అనుకున్నా. వీలున్నపుడు ఎపుడైనా కుదిరితే ఆ మదరస్సా ఎక్కడో కనుక్కొని వెళ్ళాలని మాత్రం అనిపించింది.

సమయం ఒకటిన్నర అవుతుంది . రేపు ఉదయాన్నే ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఉద్యోగంతో తిరిగి రావాలనే అనుకుంటున్నా. వస్తా కదా.

*

ఆ పాప నవ్వో, ఏడుపో!

chandra-kaanthaalu

 

ఇప్పుడిప్పుడే పుట్టిన ఓ పాప

అప్పుడప్పుడూ నిద్దురలో నవ్వుతూ ఉంటుంది

 

కనుకొలికిల్లోంచి జారిపడే కన్నీటిచుక్క లా నవ్వడం

ఒక్క పాపకి మాత్రమే వస్తుంది

 

మనఃగర్భాల్ని దాచిపెట్టే ఉపరితలపు నీటిముఖాలన్నిటినీ

తెరలు తెరలుగా తొలగించిపెడుతూ గులకరాయిలా నవ్వుతుంది

 

గొంతెండిపోతున్నా గుక్కెడు నీళ్ళెవరినీ అడగలేని

మహావృక్షపు అహంకారదాహాన్ని వానధారలా తీర్చే నవ్వును నవ్వుతుంది

 

వెచ్చగా వెలుగుని కప్పుకుని విశ్రమిస్తున్న ఆకాశమ్మీదకి

గుప్పిళ్ళకొద్దీ అంతఃజ్ఞానాన్ని విసిరికొట్టే చిక్కని చీకటిలానూ నవ్వుతుంది

 

పంజరాలే తమ ప్రాణమనుకునే పంచవన్నెల చిలకల్ని చూసి

తెరిచిపెట్టిన తలుపుల సాక్షిగా విశాలంగా నవ్వుతుంది

 

మండు వేసంగిలో పూసే మల్లెపువ్వులా

అరుదుగానైనా ఆ పాప, అతికమ్మగా నవ్వుతుంది

 

ఆ పాపే ఎప్పుడూ ఏడుస్తుంటుంది కూడా

సుందర స్వప్నమయ లోకాలనొదిలి మెలకువలోకి నిదురించడాన్ని సాధన చేస్తూనో ఏమో!!

 

***********************

 

ఒక మామూలు అమ్మాయి అమామూలు కథ!

 

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

 

నవలా రచయిత్రి గా దశాబ్దాల తరబడి నిలిచి ఉండటం ఎంతటి గొప్ప విజయం? అభిమానులు పాఠకుల్లోంచి ప్రేక్షకుల్లోకి కూడా చేరడం, ఎప్పుడు ఆమె నవల సినిమాగా వస్తుందా అని ఎదురు చూడ్డం, తీస్తే సినిమాగా ఆమె నవలే  తీయాలని టాప్ నిర్మాతలు తహ తహ లాడటం, ఈ విజయాలన్నీ ఆరెకపూడి కౌసల్యా దేవి కీ, యద్దనపూడి సులోచనా రాణి కే సొంతం!  సినిమాగా తీసిన ఒక్కొక్క నవలా సూపర్ హిట్టే తప్ప మరో మాట లేదు. అలాటి నవలల్లో నవల గానూ సినిమాగానూ సూపర్ హిట్ అయింది “మీనా”

మీనా పట్నంలో పెరిగిన ఒక సహృదయ! డబ్బులో పుట్టి పెరిగినా , డబ్బు గర్వం అంటని మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అప్పట్లో మీనా లాంటి అమ్మాయిలు చాలా మంది. మీనాలో తమని చూసుకున్న ఎంతో మంది స్త్రీలు మీనా ని ఇంట్లో కూడా చూసుకోవాలనుకున్నారు ! మీనా నవల సీరియల్ గా వస్తున్నపుడు తెలుగిళ్ళలో పుట్టిన ఆడపిల్లల్లో చాలా మంది మీనాలున్నారు!! అలాటి ముద్ర వేసింది మీనా.

నిజానికి ఈ నవల గురించి, సినిమా గురించి కలిపి రాద్దామని నవల చదువుతున్నపుడు (నిజంగా నేను మీనా నవల ఇంతకు ముందు చదవలేదు నేను.  తెలుగు సాహిత్యం నాకు డైరెక్ట్ గా కుటుంబరావు , చలం, రంగనాయకమ్మ , చాసో లతో పరిచయం కావడం తో నేను యద్దనపూడి నవలలు ఆసక్తి గా ఎప్పుడూ చదవలేదు. చదివిన నవలల సంఖ్య కూడా స్వల్పమే! )మీనా గురించి వినడమే తప్ప చదవలేదు కాబట్టి అంత హిట్ ఎందుకయిందో తెలుసుకోవాలని, దాని గురించి రాయాలని చదివాను. రాద్దాం అని మొదలు పెట్టబోతుండగా త్రివిక్రం సినిమా విడుదల!

అ ఆ !

మీనా మీనా మీనా అని ప్రేక్షక లోకమంతా గగ్గోలెత్తి పోయింది. యూ ట్యూబ్ లో మీనా సినిమాని వెదికి చూసిన వాళ్ల సంఖ్య రెండు వారాల్లోనే లక్ష దాటిందట.

meena-1

ఈ హడావుడి అంతా తగ్గాక, ఫ్రెష్ గా ఇంకో సారి నవలనీ సినిమానీ తల్చుకోడం బావుంటుందని వాయిదా వేస్తే ఇన్నాళ్లకు కుదిరింది.

రచయిత్రిగా యద్దనపూడి పాఠకుల నాడి ఎలా పట్టుకున్నారో, దర్శకురాలిగా విజయనిర్మల కూడా సగటు ప్రేక్షకుల నాడి అలాగే పట్టుకున్నారనిపిస్తుంది చాలా సినిమాల విషయంలో! మీనా,కవిత వంటివి అలాటి సినిమాలే!

మీనా కథ కాంప్లెక్స్ కాదు. డబ్బు తేడాలతో, తద్వారా పుట్టిన అపార్థాలతో విడి పోయిన రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నించే అమ్మాయి కథ! మీనా అందం సంగతి కూడా పెద్దగా వర్ణన ఉండదు నవల్లో! చదువు లో అంతంత మాత్రమే అని, కళలూ గిళలకు అంటని సగటు తెలుగమ్మాయని నవల్లోనే చెప్పేస్తారు రచయిత్రి.   మీనా తండ్రి ఏకంగా “మంచి గృహిణి కావడం తప్ప మీనా పారేందుకూ పనికి రాదు ” అని ప్రకటిస్తాడు కూడా ! డబ్బున్నా, దాని తాలూకు హంగులకు అంటని అమ్మాయిగా మీనాని రచయిత్రి ఎంతో సింపుల్ గా చూపిస్తారు. తల్లి అతిశయం అంతక పోవడం అటుంచి , మీనాకు పిరికితనం, టెన్స్ కాగానే గోళ్లు కొరకడం , సర్కిల్ ఉన్నా , సోషల్ గా మూవీ అవలేక పోవడం ఇలాటి లక్షణాలు అదనం ! మీనా రాసి దశాబ్దాలు గడిచి పోయాయి కాబట్టి , ఆనాటికి ఇవన్నీ పెద్దగా చెప్పుకోదగ్గ అవలక్షణాలు కాదు! నిజానికి ఇలాటి లక్షణాలు గల అమ్మాయిలకు కాల మాన పరిస్థితులతో సమబంధం లేదు. సున్నితమైన మనస్తత్వం గల అమ్మాయిలకు ఏ కాలం లో అయినా కొదవేముంది?

ప్రారంభం లో మీనా తల్లి డబ్బు గర్వం గురిచి ముందు కొంత వర్ణన, అందుకు తగ్గ వాతావరణం నవలలో కనిపిస్తుంది. కానీ సినిమా నవలకు కీలక ఘట్టమైన ప్రయాణం తో మొదలవుతుంది. మీనా తల్లి డార్జిలింగ్ ప్రయాణం కావడం! ఆ సమయంలోనే తమ ఇంటికి రాబోతున్న సారథిని తప్పించుకునేందుకు మీనా మేనత్త వూరుకు ప్రయాణం కావడం తో కథ మొదలు!

meena-2

అక్కడి పల్లె వాతావరణం తోనూ, ఆ మనుషుల మనసులతోనూ మీనా ప్రేమలో పడటం , వాళ్లని చూశాక తన ఇంటి వాతావరణం మరింత దుర్భరంగా తోచడం, వాళ్లమ్మ తెచ్చిన సారధిని ఇష్టపడలేక పోవడం, మేనత్త కొడుకును ఇష్ట పడటం, అతనికి కొన్ని కమిట్మెంట్స్ తో అంతకు ముందే వేరే పిల్లతో పెళ్ళి నిశ్చయం కావడం, అనుకోకుండా మీనా వల్ల ఇటు రాజీ పెళ్ళి, అటు కృష్ణ పెళ్ళి కూడా కాన్సిల్ కావడం, రాజీని మీనా ఇంటికి తీసుకు రావడం, సారధికి పల్లెటూరి రాజీ నచ్చడం, మధ్యలో అనేక మలుపులు, తల్లికి చెప్పకుండా మీనా ఇంట్లోంచి వెళ్ళి పోయి కృష్ణను గుళ్ళో పెళ్ళి చేసుకోవడం, అహంకారపు తల్లిని పల్లె బంధువులు ప్రేమతో గెలవడం.. !

మీనా నవల గా వచ్చాక ఎన్ని ముద్రణలు పడిందో రచయిత్రి కే గుర్తు లేదట, ముందు మాట లో చెప్తారు.మీనా 1968 జులై నెల నుంచి యువ మంత్లీ లో సీరియల్ గా మొదలై 1971 అక్టోబర్ లో ముగిసింది.అంటే మూడేళ్ళ మూడు నెలలు! కథంతా  సంఘటనల సమాహారంగా సాగుతూ పోయినా, అప్పటి ట్రెండ్ ప్రకారం అది ఓకే కాబట్టీ, నెలకోసారి వచ్చే సీరియల్ కాబట్టీ పాఠకులు మీనా ని విపరీతంగా ఆదరించారు. నెల నెలా యువ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారట అప్పట్లో! మీనాతో చాలా మంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అయిపోయారన్నమాట అప్పుడు! తన నవల మీద తన అభిప్రాయాలని తెలిపే ఒక కాలం లో యద్దనపూడి మీనా గురించి తానే ఆశ్చర్యపోతూ రాశారు. “మీనాని ప్రత్యేక లక్షణాలున్న ఒక అమ్మాయిగా సృష్టించాను అనుకున్నాను కానీ, యువలో సీరియల్ గా వస్తున్నపుడు అమ్మల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వాళ్లు మీనాలో తమను చూసుకున్నారు.” అని చెప్తారు. మీనా నవల సమయంలో మీనా వయసులో ఉండి, తల్లి లో కృష్ణ వేణమ్మని చూస్తూ , తల్లిని విసుక్కున్న ఒకమ్మాయి, ఇన్నాళ్ల తర్వాత తాను కూడ ఇప్పుడు తన కూతురి పట్ల అతి జాగ్రత్త తో కృష్ణ వేణమ్మ లాగే ప్రవర్తిస్తున్నానని తనతో చెప్పుకున్న సంగతిని కూడా సులోచనా రాణి ప్రస్తావిస్తారు.

meena3

ఈ నవల్లో కథ పక్కన పెట్టి, మీనా ని యద్దన పూడి చాలా ప్రత్యేకంగా సృష్టించారనే చెప్పాలి.  మిగతా నవలల్లో హీరోయిన్ల మల్లే మీనా అద్భుత సౌందర్యం, అంతులేని ఆత్మ విశ్వాసం, అహంకారం ఇలాటి లక్షణాలేవీ లేని మామూలు అమ్మాయి. బోల్డు డబ్బున్నా,  సోషల్ సర్కిల్ ఉన్నా స్నేహితులుండరు, ఏ యాక్టివిటీ మీద పెద్దగా ఆసక్తి చూపించదు.  సారథి లాంటి హై ప్రొఫైల్ వ్యక్తి ముందు తను తేలి పోతానని , తనకంత తెలివి తేటలు లేవని భయపడుతూ, టెన్షన్ రాగానే గోళ్ళు కొరుకుతూ, తల్లికి  విపరీతంగా భయపడుతూ  పిరికి గా ఉండే మీనా చివర్లో సంబంధాలు నిలబెట్టుకోవడం కోసం, ప్రేమ కోసం , తల్లికి చెప్పకుండా గుళ్ళో పెళ్ళి చేసుకునే నిర్ణయం వరకూ ఎదుగుతుంది. మార్పు చెందుతుంది. ఈ పరిణామ క్రమం అంతా జరగడానికి సమయం పట్టినా మీనా , తనకు ఎదురైన కష్టాల్ని సమర్థంగా ఎదుర్కొని, అన్నీ ఒక కొలిక్కి తెస్తుంది.

నవల 71 లో ముగియగానే సినిమా మొదలై 1973 లో విడుదల. ఆ తర్వాత మీనా ఎన్ని ఎడిషన్లు పడినా మీనా అంటే విజయనిర్మల తప్ప మరొక విధంగా ఊహించుకునే అవకాశమే లేకుండా పోయింది పాఠకులకి. అంత గా ఆ పాత్రలో అమరి పోయింది విజయనిర్మల.

సీరియల్ ముగిసిన వెంటనే కొందరు పాఠకులు “ఇది తప్పకుండా ఎవరో ఒక్ నిర్మాత తీసుకుని సినిమా గా తీసేస్తా” రనే భరోసాతో యువ కి ఉత్తరాలు కూడా రాశారు.  చాలా మంది విచార పడి పోయారు సీరియల్ ముగిసి పోయిందని.

meena-4

ముందు మాటలో సులోచనారాణి ఇలా అంటారు “నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఒకటే! విలువలు నశించాయి, మార్పులు వచ్చేశాయి అని అందరూ తల్లడిల్లుతున్న ఈ కాలంలో కూడా నాలుగున్నర దశాబ్దాల కాలం నాటి మన కుటుంబాలు పట్టుదలలు, కోపాలు, త్యాగాలు ప్రతిబింబించే మీనా నవలను ఇప్పటికీ పాఠకులు అభిమానిస్తున్నారంటే ఆ విలువల్ని ఆ విలువల్ని ప్రేమించేవాళ్ళు ఇంకా మనలో ఉన్నారన్నమాటే” అని!

నిజానికి ఆ విలువల్ని ప్రేమించే వారు ఏ తరంలోనూ పూర్తిగా లేకుండా పోరు. ఎందుకంటే అవన్నీ మానవ ప్రవృత్తి లో ఓక భాగం! ప్రదేశాలు, బాక్ డ్రాప్ లు మారతాయి తప్పించి, కోపతాపాలు, త్యాగాలు , అభిమానాలు ఇవనీ ఎప్పుడూ సమాజంలో, మానవ జీవితంలో అవిభాజ్యాలే!

అందుకే అ ఆ సినిమా , మీనాకి రీ మేక్ అన్న టాక్ రాగానే మీనా నవల కావాలని పుస్తకాల షాపుల్లో పాఠకులు అడిగారని ఈ మధ్య తెలిసింది. నా దగ్గర పి డి ఎఫ్ వెర్షన్ ఉందా అని కూడా కొంతమంది వాకబు చేశారు. ఆ అభిమానాలు త్యాగాలు ఈనాటి త్రివిక్రం ఎలా కమర్షియలైజ్ చేసి చూపాడో చూశాక, ఈ తరం ప్రేక్షకులు సైతం ఆ నాటి విజయ నిర్మల వీటన్నిటినీ ఎలా చిత్రించిందో, (అదీ దర్శకురాలిగా ఆమె మొదటి సినిమాలో) చూడాలనే ఉత్సుకతతో యూ ట్యూబ్ లో చూశారు. కొత్త సినిమాలు తప్ప పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల జోలికి పోని 18+ ప్రేక్షుకుల్ని కొందరిని (అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దర్నీ) మీనా ఎలా ఉందని అడిగితే ” చాలా సింపుల్ గా, అనవసరమైన హడావుడి లేకుండా ఉందనీ, మనుషులు ఎంత్ సింపుల్ గా బతకొచ్చో, బతికేవారో ఆ సినిమా చూస్తుంటే అర్థమైందనీ అన్నారు. ముఖ్యంగా, మీనా పాటలు వాళ్ళకి భలే నచ్చాయి. శ్రీరామ నామాలు, మల్లె తీగ వంటిది మగువ జీవితం,పెళ్ళంటే నూరేళ్ళ పంట పాటలు! “పెళ్ళంటే నూరేళ్ళ పంట , సడన్ గా మొదలయ్యే ఆ సీక్వెన్స్ చాలా టచింగ్ గా ఉంది” అని అమ్మాయిలు ఆ సీక్వెన్స్ ని అభిమానించారు.

meena5

నిజానికి నవల సినిమాగా మారినపుడు , నవల లో ఉండే డెప్త్ కొంత పలచబడటం ఖాయం. ఈ విషయం గురించి కొందరు రచయిత్రులు రాసిన అభిప్రాయాల వ్యాసం ఒకటి (విజయచిత్ర లోది) చదివాను(ఎవరికైనా కావాలంటే షేర్ చేస్తాను). అందులో ఆరెకపూడి కౌసల్యా దేవి తన నవలలు సినిమాగా తీసినపుడు కొన్ని సార్లు పాత్రల స్వభావాలే పూర్తిగా మారి పోయాయని బాధ పడ్డారు. మీనా సినిమా గురించి యద్దన పూడి సులోచనా రాణి తన అభిప్రాయాన్ని చెప్పలేదు గానీ, మాదిరెడ్డి సులోచన మాత్రం మీనా ని నవల చెడకుండా తీశారని, హిందీలో పరిణీత, గబన్ సినిమాలు ఎంత ఎఫెక్టివ్ గా తీశారో, అంత ఎఫెక్టివ్ గానూ మీనా సినిమా రూపు దిద్దుకుందని అన్నారు. నిజానికి నవల లో సాగదీసినట్టుండే సంభాషణలు, మనోభావాల విశ్లేషణా ఇవన్నీ ఏ నవల సినిమాగా మారినా ఎగిరి పోయి సినిమా నిడివి కి తగ్గట్టు దృశ్య రూపం లోకి మారి క్లుప్తతను  సంతరించుకుంటాయి. ఆ పని ని విజయనిర్మల చాలా చక్కగా చేసింది! నిజానికి మీనా నవల్లో ఈ తరానికి బోరింగ్ గా అనిపించే సీక్వెన్స్ లు చాలా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవాటిని ఏరుకుని, స్క్రీన్ ప్లే ని రూపొందించడం ఆమెకు సులభంగానే తోచి ఉండాలి.

మొత్తం మీద, మీనా ని అసాధారణమైన లక్షణాలున్న సాధారణమైన అమ్మాయిగా చెప్పుకుంటే చక్కగా సరి పోతుంది.

*

 

 

 

 

 

 

 

వెలుతురు వైపు

 

‘హాలో చిన్నోడా! ఎలా ఉన్నావు?’ స్కైప్‌లో వాళ్ళమ్మాయిని అడుగుతున్నాడు అర్జున్‌.

‘నేను బాగానే ఉన్నా డాడీ! మీరెలా ఉన్నారు? అమ్మ కొంచెం డల్‌గా అనిపిస్తోంది ఏమిటీ హెల్త్‌ బాగోలేదా?’ అడిగింది అర్జున్‌, అపూర్వ ముద్దుల కూతురు మనీషా.

‘ఏం లేదురా! ఈ వారం కొంచెం ఆఫీసులో వర్క్‌ ఎక్కువగా ఉంది అంతే.. నువ్వు లంచ్‌ చేశావా?’ అడిగింది అపూర్వ.

‘అప్పూ డియర్‌! ఈరోజు చికెన్‌ బిర్యానీ. రూమ్‌లోనే చేసుకున్నాం. ఫుల్‌గా కుమ్మేసాం!’ అంది మనీషా.

‘ఓహో!’ అని అపూర్వ అంటుండగానే చికెన్‌ బిర్యానీ ప్రాసెస్‌ ఫొటోలన్నీ పోస్ట్‌ చేసింది.

అవన్నీ చూసి అర్జున్‌ ‘నా కూతురే నయం. ఎంత బ్రహ్మాండంగా చేసిందో. మీ అమ్మ పెళ్ళయ్యాక ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇలా చేయలేదురా!’ అన్నాడు.

‘భార్య చేసినవన్నీ మెక్కేసి, మర్చిపోవడం భర్త లక్షణం.. అయినా అమ్మకన్నా నువ్వు బాగా చేస్తావుగా డాడ్‌..!’ అంది మనీషా నాటకీయంగా.

‘ఏమైనా అమ్మ పార్టీనే నువ్వు. అయినా నీతో మాట్లాడ లేనురా..!’ అన్నాడు అర్జున్‌. అపూర్వ, మనీషా పకపకా నవ్వారు.

‘అదేం లేదు డాడీ! న్యాయం ఎటుంటే అటే! నా టైప్‌ అంతేగా?’ అంది మనీషా.

‘మీ తండ్రీకూతుళ్లు ఇలా ఎంతసేపైనా మాట్లాడతారుగానీ, చిన్నీకి అసలు విషయం చెప్పండి!’ అని అర్జున్‌ను మోచేత్తో పొడుస్తూ అంది అపూర్వ.

‘ఏంటి డాడీ! అమ్మేంటో చెప్పమంటోంది?’ అని విషయం పసిగట్టేసిన మనీషా అడిగింది.

‘ఏం లేదురా! అభిరాం అంకుల్‌ లాస్ట్‌వీక్‌ కాల్‌ చేశారు. వాళ్ళబ్బాయి మనోహర్‌కి నిన్ను చేసుకుందామని అడిగాడు. నేను మనీషాదే నిర్ణయం అని చెప్పా. నా కూతురు ఎవర్ని తీసుకొచ్చి పెళ్ళి చేయమంటే వాళ్ళతో చేస్తాను. ఒకవేళ చేసుకుని వచ్చినా ఓకే!’ అని చెప్పా.

‘యూ ఆర్‌ రైట్‌ డాడ్‌! కానీ ఈ మధ్య నేనూ ఆలోచిస్తున్నా. ఎండి పూర్తయ్యాక పెళ్ళి చేసుకుందామా, ఈ లోపే చేసుకుందామా అని కానీ నీలాంటి వ్యక్తే నాకు భర్తగా కావాలి డాడీ! అలాంటి వ్యక్తిని నేను సెలెక్ట్‌ చేసుకోగలనా అని ఒక్కోసారి డౌట్‌ వస్తోంది. నేనే ఈ విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నా’ అంది మనీషా.

‘మీ డాడీలాంటి వాడంటే నువ్వు చెప్పినట్టు వింటాడనా?’ నవ్వుతూ అన్నాడు అర్జున్‌.

‘హా.. హ్హా…! యస్‌ డాడ్‌!’ అంది మనీషా.

‘నువ్వు చెప్పినట్లు వినడమే కాదు. నీది మంచి మనస్సు డాడ్!.. అఫ్‌కోర్స్‌ అప్పుడప్పుడు నీలో మగోడనే ఇగో బయటకు వస్తుందనుకో! అమ్మ అంత బాగా మానేజ్‌ చేయలేకపోతోందిగానీ, ఆ విషయంలో నేను బాగా మానేజ్‌ చేస్తా. ఎందుకంటే నేను నీ కూతుర్ని కదా! ఇంతకీ అమ్మా! నీ అభిప్రాయం ఏమిటీ? నువ్వు ఏం మాట్లాడవే?’ అంది.

‘నీదీ నాదీ ఒకటేరా! ఎండి పూర్తయ్యేలోపే ప్రయత్నిస్తే ఎప్పుడు ఓకే అయితే అప్పుడు పెళ్ళి చేసేసుకుందువుగానీ’ అంది అపూర్వ.

‘అభిరాం అంకుల్‌ వాళ్ళబ్బాయి స్కైప్‌ అడ్రస్‌ నాకు పంపు డాడీ, నా అడ్రస్‌ అతనికి ఇవ్వు. మేమిద్దరం మాట్లాడుకున్నాక నీతో మాట్లాడతా’ అంది మనీషా.

‘ఓకే!’ అంటూ మనోహర్‌ అడ్రస్‌ మెసేజ్‌లో టైప్‌ చేశాడు అర్జున్‌.

‘ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంది వీలైతే రాత్రికి కుస్తాను. మరి బై’ అంటూ.. ‘మమ్మీ బై!’ అంది మనీషా.

‘బై తల్లీ! టేక్‌ కేర్‌!’ అంది అపూర్వ. ‘ఐ లవ్యూ మా…! అంటూ అపూర్వకు కిస్‌ స్టిక్కర్‌ పోస్టు చేసింది’ మనీషా.

అపూర్వ కూడా కూతురికి రెండు కిస్‌ స్టిక్కర్స్‌ పోస్టు చేసింది.

000

‘చిన్నీ! ఆ అబ్బాయిని ఇష్టపడుతుందంటావా అర్జున్‌?’ అర్జున్‌ పక్కనే కూర్చుని అతని చేయికి తన చేతులు పెనవేసి, అతని భుజంపై తలవాల్చి అడిగింది అపూర్వ.

‘నువ్వు వూరికే కంగారుపడకు. అది మన కూతురు. మనం దాన్ని అందరిలా పెంచలేదు. అది స్వంతగా నిర్ణయం తీసుకోగలదు. మంచీ, చెడూ బేరీజు వేసుకోగలదు’ అపూర్వకు ధైర్యం చెప్తూ తన కుడిచేతిని ఆమె తలపై వేసి, నిమిరాడు అర్జున్‌.

‘నిజమేనండీ! అది ముందు డౌట్‌ అంటూనే మళ్ళీ మాట్లాడతానంటూ అడ్రస్‌ ఇమ్మంది’ అంది అపూర్వ.

‘ఆ అబ్బాయితో కొంచెం సున్నితంగా మాట్లాడమని చెప్పాలి! మనతో మాట్లాడినట్టే సూటిగా అనేస్తే, అతను చిన్నబుచ్చుకోవచ్చు’ అంది అపూర్వే మళ్ళీ.

‘అలా ఏం మాట్లాడుదులే. మనతో దానికున్న సాన్నిహిత్యంతో ఓపెన్‌గా మాట్లాడుతుంది. అందరితో అలా ఏమీ మాట్లాడదు. అదేమీ ఇంకా చిన్ని పాపాయి కాదు’ అన్నాడు అర్జున్‌.

‘అవును అది మనం చూస్తూ ఉండగానే ఎంతగా ఎదిగిపోయింది అర్జున్‌..! నేను నిన్ను మానేజ్‌ చేసుకోలేకపోతున్నానంటా..?!’ అంది అపూర్వ కొంచెం ముఖం ముడుచుకుంటూ.

Kadha-Saranga-2-300x268

‘అదేంలేదులే! చిన్న మాటకి కూడా తట్టుకోలేవు’ ఆటపట్టిస్తూ అన్నాడు అర్జున్‌.

‘అదేంకాదు. నేను మానేజ్‌ చేసుకొస్తున్నా కాబట్టే మన బంధం ఇంత దృఢంగా ఉంది’ అంది చివాలున లేస్తూ కొంచెం కోపంగా అపూర్వ.

‘అబ్బో దేవిగారికి కోపం ముంచుకొచ్చేస్తున్నట్లుందే..!’ అంటూ అర్జున్‌ అనగానే… అపూర్వ కొంచెంసేపు కినుక వహించింది.. ఆమె మూడ్‌ కనిపెట్టిన అర్జున్‌ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చి, సుగర్‌లెస్‌ ఇది అంటూ ఆ కప్పు అపూర్వకు ఇచ్చాడు. అపూర్వ మామూలుగా అయిపోయి, ‘థాంక్యూ డియర్‌!’ అంటూ కప్పు అందుకుంది.

000

మనీషా తండ్రి చెప్పిన అడ్రస్‌ స్కైప్‌లో టైప్‌ చేసింది. మనోహర్‌ మనీషాకు ఆన్‌లైన్‌లోకి వచ్చాడు.

‘హలో మనోహర్‌జీ! నమస్తే, నా పేరు మనీషా!’ అంటూ పరిచయం చేసుకుంది.

‘ఓ… హాయ్‌! మీరేనా..? డాడీ చెప్పారు’ అన్నాడు మనోహర్‌.

‘మీ చదువు డీటెయిల్స్‌ అన్నీ డాడీ చెప్పేశారు. నా గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. అందుకని అవి మినహా మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే మనకు టైమ్‌ సేవ్‌ అవుతుందనుకుంటా..!’ అంటూ ‘మీరు యుఎస్‌లోనే సెటిల్‌ అవుతారా? ఇండియా రారా?’ అడిగింది మనీషా.

‘యా.. యా..! ఏం, మీకు యుఎస్‌లో ఉండడం ఇష్టం లేదా?’ అడిగాడు మనోహర్‌.

‘నేను యుఎస్‌లో స్టడీ పూర్తయ్యాక ఇండియాకే వెళ్ళిపోదామనుకుంటున్నా. మన చదువు మన దేశానికి ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. ఓకే.. మీ హాబీస్‌ ఏమిటి?’ అంది మనీషా.

‘ఓ.. సో గుడ్‌..! నా హాబీస్‌ వచ్చేసరికి మ్యూజిక్‌ వింటాను. గిటార్‌ వాయిస్తాను’ అన్నాడు మనోహర్‌.

‘వావ్‌.. గిటార్‌! నాక్కూడా వచ్చు. ఐ లైక్‌ సోమచ్‌. మ్యూజిక్‌ వినడమే కాదు. కొంచెం పాడతాను కూడా’ చిన్నగా నవ్వుతూ అంటూ ‘కవిత్వం రాయడం ఇంటర్‌ నుండే అలవాటైంది. మంచి మంచి కొటేషన్స్‌ సేకరిస్తూ ఉంటాను. పాలిటిక్స్‌ను, ఈ సొసైటీనీ పరిశీలిస్తూ ఉంటా. వీటికి అమ్మానాన్నే ఇన్సిపిరేషన్‌. అన్నీ నేనే మాట్లాడేస్తున్నా.. మీ గురించి చెప్పండి..!’ అంది మనీషా కొంచెం షై ఫీలవుతూ.

‘మీరు మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది. మీకన్నీ మంచి అభిరుచులే ఉన్నాయి. నాక్కూడా నాన్న నుండి కొంచెం పుస్తకాలు చదవడం అలవాటైంది’ అన్నాడు మనోహర్‌.

‘సో గుడ్‌..! ఇంకా మీ లైఫ్‌ పార్టనర్‌ ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను అంతా సూటిగా, కచ్ఛితంగా మాట్లాడే టైపు. మరి మీకెలా ఉండాలో..? నేను మాత్రం అవతలి వాళ్ళ కోసం మంచి అయితే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాగానీ, ఫాలోకానిది అయితే కట్‌.. కట్‌.. అంతే’ అంది మనీషా.

మనోహర్‌ ఏమీ మాట్లాడకుండా ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు.

‘హాలో..!’ అంటూ చిటికె వేసింది మనీషా.

‘ఓ సారీ..! ఇలా ఉండాలి.. అలా ఉంటే బాగుంటుంది.. అని పాయింట్స్‌ ఏమీ రాసి పెట్టుకోలేదు. సో యూ ఆర్‌ నైస్‌ గర్ల్‌!’ అన్నాడు మనోహర్‌.

‘మీకు డ్రింక్‌, స్మోకింగ్‌ ఎక్స్‌ట్రా హాబిట్స్‌ ఏమైనా ఉన్నాయా?’ అడిగింది మనీషా.

‘రెగ్యులర్‌ కాదు. స్మోక్‌ అస్సలు ఇష్టం ఉండదు. డ్రింక్‌ మాత్రం ఫ్రెండ్స్‌, పార్టీ అలా కలిసినప్పుడు కొంచెం సిప్‌ చేస్తా.. ఇక్కడ ఇదంతా నార్మలే కదా!..’ అన్నాడు మనోహర్‌.

‘ఇట్స్‌ ఓకే..’ అంది మనీషా.

‘కట్నాలు.. వంటివి..’ అడిగాడు మనోహర్‌.

‘అబ్బే ఈ టైపాఫ్‌ థింగ్స్‌ మా ఫ్యామిలీలో మొదటి నుంచీ లేవు. నాకు నచ్చవు కూడా’ అంది మనీషా.

‘అమ్మాయిల సంఖ్య తగ్గిపోయాక అబ్బాయిలకు పెళ్ళి పెద్ద ప్రాబ్లమ్‌గానే ఉంది’ అన్నాడు మనోహర్‌.

‘యస్‌.. అది మనవాళ్ళు చేతులారా చేసిందే కదా! అబ్బాయి కోసం, ఇంకా చెప్పాలంటే.. మనీ థింగ్స్‌..మెనీ ప్రాబ్లమ్స్!’ అంది మనీషా భుజాలు ఎగరేస్తూ.

మనోహర్‌ ఏమీ మాట్లాడలేదు. ‘ఏంటి దీనిపై మీరేం రెస్పాండ్‌ కావడం లేదు? ఎనీథింగ్‌ ఎల్స్‌’ అంది మనీషా.

‘నో… నో… ఏంలేదు..’ అన్నాడు మనోహర్‌.

‘ఓకే.. మళ్ళీ కలుద్దాం.. బై..బై.. హాస్పటల్‌కి వెళ్ళాలి, టైమ్‌ అవుతుంది..!’ అంది మనీషా.

‘యా.. యా.. ఓకే. .నేనూ వెళ్ళాలి హాస్పటల్‌కి.. బై..బై..!’ అన్నాడు మనోహర్‌.

‘గుడ్‌ గాయ్‌లానే ఉన్నాడు. డాడీతో ఓకే చెప్పేయొచ్చేమో… అయినా కొన్నిరోజులు మాట్లాడదాం..! ఇద్దరం అమెరికాలోనే ఉన్నా కలవడం కష్టమే. ఇద్దరం ఉండే స్టేట్స్‌ వెరీ లాంగ్‌ డిస్టెంట్స్‌. అయినా తన రెస్పాన్స్‌ ఏమిటో చూద్దాం.. వెయిట్‌ మనీషా.. వెయిట్‌..!!’ అని మనస్సుకు నచ్చజెప్పుకుంటూ రోజూకన్నా ఉత్సాహంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ మంచి హుషారైన సాంగ్‌ ఆన్‌ చేసింది మనీషా.

000

‘హాయ్‌ అమ్మా! హాయ్‌ డాడీ!’ అంటూ ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన అర్జున్‌, అపూర్వను రెండు చేతులతో కౌగలించుకుంది మనీషా.

అందరూ కలిసి పార్కింగ్‌లో ఉన్న కారు దగ్గరకు వెళ్ళారు.

అపూర్వే డ్రైవింగ్‌ సీట్లో కూర్చుంది.

‘వావ్‌ మమ్మీ! సో గుడ్‌..’ ‘డాడీ! అమ్మ డ్రైవింగ్‌తో ప్రాబ్లమ్‌ ఏమీ లేదుగా..?’ అంది పెద్దగా నవ్వుతూ..

కూతురు నవ్వుతో శృతి కలుపుతూ…‘ఏమో.. మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సుమా!’ అంటూ భుజాలెగరేస్తూ డోర్‌ తీసి, వెనుక సీటులో కూర్చున్నాడు అర్జున్‌.

మనీషా తల్లి పక్కనే కూర్చొని ‘అమ్మా! చాలా బాగా డ్రైవ్‌ చేస్తున్నావ్‌.. సో నైస్‌…!’ అంటూ ఆమె నడుం చుట్టూ చేతులేసింది.

‘డోంట్‌ బీ సిల్లీ చిన్నీ..!’ అంటున్న అపూర్వ దృష్టంతా రోడ్డు మీదే ఉంది.

‘షీ ఈజ్‌ సీరియస్‌..!’ అంటూ తండ్రీ, కూతురు ఇద్దరూ ఒకేసారి భుజాలు ఎగరేశారు.

‘మనోహర్‌ నేనూ ఓకే అనుకున్నామని మీతో చెప్పానుగా డాడ్‌! అభిరాం అంకుల్‌ ఏమైనా మాట్లాడారా?’ అంది మనీషా.

‘అవన్నీ ప్రశాంతంగా ఇంటికి వెళ్లాక మాట్లాడుకోవచ్చులే! వేరే విషయాలేమైనా ఉంటే మాట్లాడు’ అన్నాడు అర్జున్‌.

‘ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటి దగ్గర నేను వచ్చానని చుట్టాలూ, ఫ్రెండ్స్‌.. అందరూ వస్తారు.

మనం ఫ్రీగా మాట్లాడుకునే తీరిక ఉండదు. నాకైతే హీ ఈజ్‌ ఎవిరీథింగ్‌ ఓకే డాడ్‌..!’ అంది మనీషా.

‘ఓకే అయితే రేపు సండే అభిరాం అంకుల్‌ వాళ్ళకి వస్తున్నామని చెప్దాం’ అంది ఓ చెవి ఇటేసి ఉంచిన అపూర్వ.

‘అమ్మా, కూతురు చాలా స్పీడ్‌గా ఉన్నారు’ అన్నాడు అర్జున్‌.

‘ఇందులో స్పీడ్‌ ఏముంది డాడ్‌.. ఓకే అనుకున్నాక వెయిట్‌ చేయడం ఎందుకు?

అయితే, ఒక విషయం.. మ్యారేజ్‌ అయినా, నా ఎండి పూర్తికావాలి. తనూ, నేనూ ఇండియాకి తిరిగి వచ్చేయాలి. దీనికి మేమిద్దరం ఓకే. మరి అభిరాం అంకుల్‌ వాళ్ళు ఏమంటున్నారో?’ అంది మనీషా.

‘అదేరా! ఇండియాకి వచ్చే విషయంలోనే వాళ్ళు సంశయిస్తున్నట్లు అన్పిస్తోంది. ఇందులో అభిరాం అంకుల్‌, మనోహర్‌ ఓకే. వసంతా ఆంటీతోనే ప్రాబ్లమ్‌. ఆమెకు అమెరికాలో ఉంటేనే హైఫైగా ఉన్నట్లు’ అన్నాడు అర్జున్‌.

‘అమెరికాలో ఉంటేనే హైఫైనా..? ఇండియాలో ఉంటే బేకార్‌గా ఉన్నట్లా.. షిట్‌..!’ అంటూ

‘సరేలే. అవన్నీ మనోహర్‌ మేనేజ్‌ చేసుకోవాల్సినవి డాడ్‌.. ప్రతిదీ మనం కలుగజేసుకోవద్దు. నా అభిప్రాయం చెప్పాను. తనవల్ల కాదని అనడం లేదుగా.. డోంట్‌ వర్రీ!’ అంది మనీషా.

మనీషా టాకిల్‌ చేసే విధానానికి అపూర్వ, అర్జున్‌ ఆశ్చర్యపోయారు. ఆనందించారు కూడా.

కారు ఇంటికి వచ్చేయడంతో ఆ విషయం అంతటితో ఆగిపోయింది.

000

రెండురోజుల తర్వాత  అభిరాంకు ఫోన్‌ చేసి, మనీషాతో వస్తున్నట్లు చెప్పాడు అర్జున్‌.

మనోహర్‌ వచ్చి అప్పటికే రెండు వారాలు అయిపోయింది. అర్జున్‌ వాళ్ళు అభిరాం ఇంటికి వెళ్ళాక బ్రేక్‌ఫాస్ట్‌ అవగానే ‘అందరూ కలిసి అలా పార్క్‌కి వెళ్దాం అంది’ మనీషా.

ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో అందరూ పార్క్‌కు దారి తీశారు. పార్క్‌లో కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక, పెళ్ళి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

‘మనోహర్‌ చెప్పాక నాకు కూడా వీళ్లిద్దరూ ఇండియాలో ఉంటేనే బెటర్‌ అనిపించింది. మనీషా చాలా తెలివైన అమ్మాయి. ఐ లైక్‌ సోమచ్‌. ఆమె నా కోడలు కాదు కూతురు..’ అంది వసంత.

ఆశ్చర్యపోవడం అపూర్వ, అర్జున్‌ వంతైంది.

మనీషా చాలా సంతోషంగా వసంతను హగ్ చేసుకుని ‘ఐ టూ లైక్‌ యూ సోమచ్ ఆంటీ!’ అంది.

అసలు అడ్డంకి తీరిపోవడంతో వీళ్లు వెళ్ళేలోపే పెళ్ళి చేసేయ్యాలని అనుకున్నారు. ఇద్దరూ రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేయాలనుకోవడంతో వసంత కొంచెం డిజ్‌పాయింట్‌ అయింది. కొంచెం సేపటికి మనీషా మాటతో నార్మల్‌ అయిపోయింది. ‘నిజమే ఇన్నేసి డబ్బు ఇలా ఖర్చు పెట్టడం వృథానే’ అంది వసంత.

మరో నెలరోజులే వీళ్ళిద్దరూ ఇండియాలో ఉండేది. మళ్ళీ ఏడాది తర్వాతగానీ తిరిగిరారు. అప్పటివరకూ ఎవరి దారిన వాళ్లు ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అప్పుడే ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ ఆఫీసుకు మనోహర్‌, మనీషా తామిద్దరి వివరాలు అప్‌లోడ్‌ చేశారు.

తర్వాతి వారం ఫ్రెండ్స్‌ను, బంధువుల్ని పిలిచి గెట్‌ టూ గెదర్‌ ఏర్పాటు చేసి, అందరికీ వీళ్లిద్దర్నీ పరిచయం చేశారు. టీ, స్నాక్స్‌ అయిపోయాక వచ్చిన వారందరికీ ‘ఈ మధ్యే నేను ’మార్క్స్‌జెన్నీ’ ప్రేమకు సంబంధించిన ఇ`బుక్‌ చదివాను. అసలు ప్రేమంటే ఏమిటో అందరూ తెలుసుకోవాలి’ అంటూ మార్క్స్‌, జెన్నీ ప్రేమపై తను తయారుచేసిన డాక్యుమెంటరీని  పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి చూపించింది మనీషా.

అందరూ ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ మనీషా, మనోహర్‌ని అభినందించారు. పెళ్ళయ్యాక మనోహర్‌, మనీషా రెండువైపులా చుట్టాలందరి ఇళ్ళూ ఒక రౌండ్‌ వేసేశారు. ఇద్దరి తిరుగు ప్రయాణానికి ఇంకా వారం మాత్రమే సమయం ఉంది.

ఈ మూడువారాల్లోనే ఇద్దరూ ఎంతో దగ్గరయ్యారు. ఏడాది దూరంగా ఉండటం ఇద్దరికీ చాలా బాధగా ఉంది. కానీ తప్పదు. చివరి వారం మాత్రం ఎవరి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉండాలనుకున్నారు. వెళ్ళేటప్పుడు ఇద్దరూ కలిసే బయల్దేరారు. అది ఇద్దరికీ ఇష్టంగా అనిపించింది.

000

ఏడాది గడిచిపోయింది.

మనీషా, మనోహర్‌ ఇండియా తిరిగి వచ్చేశారు.

వైద్య సౌకర్యం అందని ప్రాంతంలో డిస్పెన్సరీ ఓపెన్‌ చేయాలనేది మనీషా ప్లాన్‌. తామిద్దరిదీ ఒకే వృత్తి, ఒకేచోట ఉండటం కాబట్టి మనోహర్‌ కూడా ఓకే అన్నాడు. ఇద్దరూ కొండాయిపల్లి అనే కుగ్రామాన్ని సెలెక్ట్‌ చేసుకున్నారు.

‘ఇండియా రావడానికి ఒప్పుకుందే ఇద్దరూ మన కళ్ళ ముందు ఉంటారని. మళ్ళీ వీళ్ళేదో పల్లెటూళ్ళు పట్టుకుని వేళ్లాడితే ఎలా? అందులో ఆ కొండలు గుట్టల్లో ఉండాలంటే హారిబుల్‌.. నో’ అనేసింది వసంత.

ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

‘ఒకరోజు అనుకోకుండా మాటల సందర్భంలో ‘మనీషా! నాకు ఆడపిల్లనే కనివ్వాలి. లేకపోతే మా అబ్బాయికి ఇంకో పెళ్ళి చేసేస్తా!’ అంది వసంత.

ఆ మాటలకు మనీషా ఎలా రియాక్ట్‌ అవుతుందోనని మనోహర్‌కి కొంచెం భయమేసింది. ‘అమ్మేమో అత్తగారు అన్న స్టేటస్‌లో మాట్లాడుతుంది. ఏమవుతుందో ఏమో..!’ అని మనస్సులో అనుకుంటూ మనీషా వైపు చూశాడు మనోహర్‌. ‘మీకు తెలియంది ఏముంది అత్తయ్యా! అమ్మాయి కావాలన్నా, అబ్బాయి కావాలన్నా అంతా అబ్బాయిల వల్లే. ఒకవేళ అమ్మాయి పుట్టకపోతే మీ అబ్బాయిని వదిలేయాల్సింది నేనే మరి!’ అంది.

అంతే వసంత షాక్‌ అయిపోయింది.

‘అమ్మో మనీషాతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా సూటిగా మాట్లాడే అమ్మాయి. అప్పటికీ వాడు చెప్తునూ ఉన్నాడు. నేనే తొందరపడి అనేశాను’ అని మనస్సులో అనుకుంటూ ‘అబ్బే ఏదో జోక్‌గా అన్నాను. ఎవరు కావాలంటే వాళ్ళు పుడతారా ఏంటి? ఆడపిల్లకైతే ఇప్పుడు కట్నం బాగా ఇస్తున్నారు కదా! మా ఫ్రెండ్స్‌ అందరికీ మనవరాళ్ళే!! వాళ్ళంతా ‘‘మాకు గ్రాండ్‌ డాటర్‌’’ అని గొప్పగా చెప్పుకుంటున్నారు’ అంది మళ్ళీ మనస్సులోని కోరికను ఆపుకోలేక.

‘అత్తయ్యా! గతంలో ఇలాగే ఆడపిల్లల్ని వద్దంటూ వాళ్ళను భూతద్దంలో వెతికినా కనపడని పరిస్థితికి మన దేశాన్ని తీసుకొచ్చాం. చూస్తుంటే ఇప్పుడు అమ్మాయిలే కావాలంటూ అబ్బాయిల్ని లేకుండా చేసేస్తారనిపిస్తోంది. ప్రస్తుతం అమ్మాయిలు కావాల్సిన ఆవశ్యకత ఉన్నా, ఫలానా వాళ్ళే కావాలనే మనీ మ్యాటర్‌ థింగ్స్‌ నాకస్సలు నచ్చవ్‌. ’ఐ హేట్‌ దిజ్‌ టైప్‌ ఆఫ్‌ థింగ్స్‌!‘ సహజంగా పుట్టనిస్తేనే మనకూ సమాజానికీ ఆరోగ్యం’ అంటూ అక్కడ నుండి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది మనీషా.

‘నువ్వు మాత్రం మారవు. అమ్మాయిని అనవసరంగా బాధపెట్టావు’ అన్నాడు అభిరాం.

‘అమ్మ తన పద్ధతి మార్చుకోవడం వెంటనే జరగదులే డాడీ. తన చుట్టూ ఉన్న వాతావరణం అలాంటిది. అది మనీషాకీ తెలుసు. తనే అమ్మకు అర్థమయ్యేలా చెప్పగలదు’ అంటూ మనోహర్‌ మనీషా ఉన్న గదిలోకి వెళ్ళాడు.

మనీషా ఏదో బుక్‌ సీరియస్‌గా చదువుకుంటోంది. తను ఊహించినట్లు ఏడుస్తూ పడుకోకుండా, అక్కడ దృశ్యం భిన్నంగా ఉండేసరికి ‘ఏంటి మేడమ్‌జీ ఏదో చదువుతున్నారు?’ అన్నాడు కొంచెం నాటకీయంగా మనోహర్‌.

‘మీ అమ్మగారిని!’ అంది ఠక్కున మనీషా.

‘అమ్మను నువ్వే చదవాలి. నువ్వే మార్చాలి’ అన్నాడు చాలా సిన్సియర్‌గా చేతులు కట్టుకుని, మనోహర్‌.

‘ఇదే నాకు నచ్చదు. మార్పుకు అందరం కలిసి కృషి చేయాలి. అదేదో ఆడవాళ్ళ విషయం ఆడవాళ్ళకే. అందులో మగవాళ్ళ ప్రమేయం లేదనుకోవడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి ఆలోచనల్లో మార్పు రావాలి మనోహర్‌. అది మనందరి బాధ్యత. నాకు తెలిసిన లక్ష్మీరాజ్యం ఆంటీ అని మా అమ్మ స్నేహితురాలు ఉన్నారు. ఆమెను పిలిపించి, మన ఇంట్లో వచ్చే ఆదివారం జరిగే కిట్టీ పార్టీలో ఇదే సబ్జెక్ట్‌పై చిన్న డిస్కషన్‌ పెడ్దామనుకుంటున్నా’ అంది మనీషా.

మనీషా ఆలోచనకు మనోహర్‌ ‘హేట్సాఫ్‌’ అంటూ ‘థాంక్యూ డియర్‌! నా మీద అమ్మ ప్రభావం కొంచెం ఎక్కువే. నేనూ చాలా మారాలి మనీషా!’ అని సిన్సియర్‌గా అంటూ ‘ఇద్దరం కలిసి ఆ ఏర్పాట్లు చూద్దాం!’ అన్నాడు మనోహర్‌.

000

ఇంట్లో కిట్టీ పార్టీ అయ్యాక వసంతకు స్నేహితులంతా ఏదో రకంగా కోడలిపై వ్యతిరేకతను తమ శక్తి మేరకు పెంచుతూనే ఉన్నారు. తమ కోడళ్ళని ఆడపిల్లని కనకపోతే ఎలా పుట్టింటికి పంపేస్తున్నదీ ఎస్‌ఎంఎస్లు, ఎఫ్‌బి ఛాటింగ్స్‌లో వసంతకు లైవ్‌ షో చూపిస్తున్నారు. ఆ ఆలోచనతోనే వసంత బుర్ర ఫుల్‌ అయిపోయింది.

మనీషా, మనోహర్‌ మొదట అనుకున్నట్లే కొండాయిపల్లెలో డిస్పెన్సరీ ఓపెన్‌ చేసి, అక్కడే ఉంటున్నారు. నెలకోసారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిపోతున్నారు. ఒకవారం అపూర్వ, అర్జున్‌ వెళుతుంటే, రెండు వారాలతర్వాత అభిరాం, వసంత వస్తున్నారు.

ఆ ఏడాది చివరిలో మనీషా కన్సీవ్‌ అయినట్లు తెలిసింది. ఆ విషయం వసంత తన స్నేహితులకి ఫోనుల్లో ఎస్‌ఎంఎస్‌ పెట్టేసింది. ఎఫ్‌బిలో పోస్టు చేసింది. అందరూ లైక్స్‌ కొట్టి, కంగ్రాట్స్‌ చెప్పారు.

వసంతకి బాగా దగ్గరి స్నేహితురాలు మంజు, ఉమా అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ మాత్రం ‘మీ కోడలు చాలా ఫాస్ట్‌లా ఉంది. నువ్వూ, మీ ఆయన, నీ కొడుకు ఆమె చెప్పినట్టలా వింటూ గంగిరెద్దుల్లా తలుపుతూ ఉంటే ఎలా? అందరూ నీ మాట వినేలా చూసుకో. లేకపోతే నీ పని ఔట్‌!’ అంటూ కామెంట్‌ పెట్టారు.

‘ఆడపిల్లను కనకపోతే పంపేస్తానని గట్టిగా చెప్పేయ్‌. మేము అలా అంటేనే ఉమా కోడలు మూడు అబార్షన్ల తర్వాత కూతుర్ని కంటే, నా కోడలు నాలుగు అబార్షన్ల తర్వాత కూతుర్ని కంది’ అంటూ మంజూ కామెంట్‌ పెట్టింది.

మనీషా దగ్గరకు ఆ వారం వసంత ఒక్కతే వెళ్ళింది. ‘మనీషా! స్కానింగ్‌ చేయించుకున్నావా? టెక్నాలజీ చాలా డెవలప్‌ అయింది. అందులోనూ మీరిద్దరూ డాక్టర్లు. మీకింకా ఎక్కువ తెలుసు. కన్సీవ్‌ అవగానే మేలో, ఫీమేలో తెలిసిపోతుందిగా! మళ్ళీ మూడో నెల వరకూ ఆగడం దేనికీ..?’ అని కాస్త వత్తి పలికింది వసంత.

ఆమె ధోరణి అర్థంచేసుకున్న మనీషా ‘ఈమె బుర్రలో పురుగు ఇంకా తొలుస్తూనే ఉంది’ అని మనస్సులో అనుకుంటూ ఏమీ సమాధానం చెప్పకుండా తనపని తాను చేసుకుంటూ, లోపలికి వెళ్ళి ఏదో బుక్‌ తీసి చదువుకుంటోంది. కాసేపటికి మనోహర్‌, మనీషా ఇద్దరూ హాస్పటల్‌కి వెళ్ళిపోయారు.

వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో వసంతం కొంచెం డిజప్పాయింట్‌ అయింది.

సాయంత్రం మనీషాకి మల్లెపూలంటే ఇష్టమని పల్లెలో ఓ అమ్మాయి తెచ్చి ఇచ్చింది. వసంతకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అందుకే ఆ పూల్లో మరువం వేసి మరీ చక్కగా మాల అల్లింది. గేదె ఈనిందంటూ పల్లెలో కోటయ్య జున్ను పాలు బాటిల్‌ ఇచ్చాడు. మరింత ఆనందంగా జున్ను కూడా రెడీ చేసింది.

మనీషా, మనోహర్‌  వచ్చి, ఫ్రెష్‌ అయ్యాక ఇద్దరికీ జున్ను ప్లేట్స్‌లో రెండు రెండు పీసెస్ పెట్టి ఇచ్చింది.

మనీషాకు జున్ను అంటే చాలా ఇష్టం. ‘అత్తయ్యా! నేను భోజనం చేయను. మరో రెండు పీసెస్ పెట్టండి. కోటయ్య తాత తెచ్చాడా, ఏంటి? మొన్న హాస్పటల్‌కి వచ్చినప్పుడు గేదె ఈనుతుందని చెప్పాడులే’ అంది మనీషా.

‘అవును’ అంటూ మరో రెండు పీసెస్ వేస్తూ అంది వసంత. మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చి ‘మనీషా! నేను ఉదయం చెప్పింది ఏం ఆలోచించావు?’ అంటూ మల్లెపూల మాల మనీషా తలలో తురుముతూ అంది వసంత.

మనీషా ఏమీ మాట్లాడలేదు. ‘ఏరా నువ్వు కూడా మాట్లాడవే? ఏమనుకుంటున్నారు? నామటుకు నేను మాట్లాడుతూనే ఉన్నా. మీకేం పట్టదా?’ అంది కొంచెం కోపంగా. అతనూ తినేసి లోపలికి వెళ్ళిపోయాడు.

ఇద్దరూ సమాధానం ఇవ్వకపోవడంతో తెల్లారే వసంత కోపంగా వెళ్ళిపోయింది. మనీషా, మనోహర్‌లో ఎవ్వరూ ఆమెను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ మనోహరే తల్లి అలా వెళ్ళిపోవడంతో కొంచెం గిల్టీగా ఫీలయ్యాడు.

ఆ రాత్రి కొడుక్కి తనకు స్నేహితులు పెట్టిన ఎస్‌ఎంఎస్‌లన్నీ ఫార్వార్డ్‌ చేసింది. తల్లి అంతలా చెప్తుంటే ఆమె కోసం ఒక్కసారి మనీషాతో మాట్లాడాలనుకున్నాడు మనోహర్‌. కానీ మనీషాకు ఇలాంటివి ఇష్టం ఉండదని మళ్లీ ఊరుకున్నాడు.

మనీషాకి ఆరు నిండి ఏడో నెల వచ్చింది. పుట్టేది ఎవరో తెలుసుకోలేకపోయారని ఓ పక్క బాధ, మరోపక్క కోపంగా ఉంది వసంతకు.

‘ఇప్పటికైనా మించిపోయింది లేదు మనోహర్‌! మొన్న ఉమా ఆంటీ చెప్తున్నారు. ఆడపిల్ల కాదని తెలిస్తే నార్మల్‌ డెలివరీలా చేసి, బిడ్డను తీసేయొచ్చంట! నువ్వు డాక్టర్‌ అయి కూడా ఇంత వెర్రిబాగులోడిలా ఉన్నావేంట్రా?’ అంది వసంత.

దాంతో మనోహర్‌కి పౌరషం పొంగుకొచ్చింది. ఆ రోజు రాత్రి ‘మనీషా! అమ్మ అంతలా అడుగుతుంది కదా! ఒకసారి ఆమె మాట వింటే పోలా?’ అన్నాడు. మనీషా ఏమీ విననట్లే మౌనంగా ఉండిపోయింది. దీంతో మనోహర్‌ ‘అమ్మాయి పుడితేనే, మనిద్దరం కలిసి ఉండేది. అబ్బాయి పుడితే నీదారి నీది నా దారి నాది.. ముందే జాగ్రత్తపడమని అమ్మ చెప్తుంది కదా! మనిద్దరం డాక్టర్లమై, ఇంత టెక్నాజీ తెలిసి.. షిట్‌..!’ అన్నాడు ఎడమచేతిలో కుడిచేయి పిడికిలితో కొడుతూ.

మనీషాకి మనోహర్‌ పరిస్థితి అర్థమైంది. అతనిలో నిగూఢంగా ఉన్న ఇగో బయటకొచ్చిందని. ‘ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం ఏమిటో చెప్తున్నా విను మనోహర్‌! అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా నీ వల్లే.. ఆ సైన్స్‌సెన్స్‌ నీకు ఉందనుకుంటున్నా. నేను ఆరోజే చెప్పా. ఇది సహజంగా జరగాల్సింది అని. నువ్వూ అత్తయ్యకు వంత పాడటం ఆశ్చర్యంగా ఉంది. అసు మీ ధోరణి కరెక్ట్‌ అనుకుంటే, అసలు అమ్మాయి పుట్టకపోవడానికి కారణం నువ్వే కాబట్టి, నేనే, నిన్ను మీ ఇంటికి పంపేయాలి. మైండ్‌ ఇట్‌!! నాకు ఇలా డిపెండెంట్‌గా ఆలోచను చేసేవాళ్ళంటే అసలు నచ్చదు’ అంటూ తన రూమ్‌లోకి వెళ్ళి డోర్‌ పెట్టేసుకుంది.

అమ్మా కొడుకూ ఏమీ మాట్లాడలేదు.

000

మనీషాకి నెలలు నిండాయి. ఒకరోజు మనీషాకి నొప్పులు వస్తుంటే ఆసుపత్రికి తీసికెళ్ళారు. ఆ రాత్రే మనీషా నార్మల్‌ డెలివరీ అయ్యింది. వెంటనే మనోహర్‌ ‘అమ్మాయేనా?’ అని అప్పుడే బయటికి వచ్చిన సిస్టర్‌ని ఆతృతగా అడిగాడు.

‘కాదు’ అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది సిస్టర్‌.

అపూర్వ, అర్జున్‌, అభిరాం ఒకటే టెన్షన్‌ పడుతున్నారు ‘మనీషా ఎలా ఉందో?’ అని ఓ పక్క, పుట్టిన పసిబిడ్డని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మరోపక్క ఆతృతగా చూస్తున్నారు.

డాక్టర్‌ జెన్నీ బయటకు వచ్చి ’కవలలు’ అని వసంత, మనోహర్‌ వైపు చూస్తూ చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక్కసారే గతుక్కుమన్నారు. ఇద్దరూ అబ్బాయిలే’ అని ఎంతో కూల్‌గా చెప్పి, మదర్‌ అండ్‌ సన్స్‌ సో హెల్దీ.. వెళ్ళి చూడొచ్చు’ అని డాక్టర్‌ జెన్నీ వెళ్లిపోయారు.

మనోహర్‌ లోపలికి వెళ్లడానికి తటపటాయిస్తుంటే అపూర్వ ‘ఏంటి బాబూ! మనీషా మనస్సు నీకు తెలుసు కదా! అయినా ఇప్పటికీ మన మైండ్‌సెట్స్‌ మార్చుకోకపోతే ఎలా?’ అంటూ అల్లుడి చేయి పట్టుకుని లోపలికి తీసికెళ్ళింది.

మనీషా! నేనే విన్‌ అన్నట్లు రెండు వేళ్లతో ‘విక్టరీ సింబల్‌’ చూపిస్తూ, మనోహర్‌కి కన్నుకొట్టింది. మనీషా కోపంగా లేనందుకు మనోహర్‌కు కొంచెం రిలీఫ్‌గా ఉంది. కానీ కొంచెం అనీజీగానే ఉన్నాడు.

వసంత మాత్రం ఓ పక్కకు నిబడింది. ‘పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా భలే బాగున్నారు’ అని అర్జున్‌, అభిరాం పిల్లల దగ్గరకు వెళ్ళిపోయారు. అపూర్వ ముందు మనీషా దగ్గరకు వెళ్ళి ‘ఎలా ఉందిరా?’ అని తలపై చేయివేసి నిమురుతూ అడిగింది.

‘ఇట్స్‌ ఓకే అమ్మా!’ అని పిల్లలవైపు చూపించింది. అపూర్వ అటువైపు వెళ్ళింది.

‘ఏంటి మనోహర్‌ ఆలోచిస్తున్నావ్‌? అంటూ మనోహర్‌ని దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేసింది మనీషా. అతను బెడ్‌ దగ్గరకు రాగానే మనోహర్‌ చేతిని పట్టుకుని గట్టిగా నొక్కుతూ. ‘అమ్మాయి పుట్టకపోతే నా దారి నాది.. నీ దారి నీదే అన్నావ్‌గా’ అంది.

‘అబ్బే ఏం లేదు.. నేనేనా ఇంత ఫూలిష్‌గా మాట్లాడింది అని బాధపడుతున్నా’ అంటూ మనోహర్‌ ఆగిపోయాడు. అతని కళ్ళల్లోంచి మనీషా చేతిపై కన్నీళ్ళు చుక్కలు టప టపా రాలిపడ్డాయి.

‘ఏయ్‌! ఏమిటీ చిన్నపిల్లాడిలా..! నువ్వూ అత్తయ్యా అమ్మాయే కావాలనుకున్నారు. నేను ఎవరైనా ఫర్వాలేదనుకున్నా. కానీ మనకు పాప, బాబూ ఇద్దరూ పుట్టారు. మనం ఊహించనది జరిగితేనే థ్రిల్‌. ట్విన్స్‌ అని నాకు ముందే తెలుసు. వాళ్లనలా గర్భంలోనే చిదిమేయడం ఎవ్వరూ చేయకూడదు. మనలాంటి సైన్స్‌సెన్స్‌ ఉన్నవాళ్ళు అందరిలో అవేర్నెస్ చేయాలిగానీ, ఇలా సిల్లీగా ఆలోచించడమే సరికాదు’ అంది మనీషా.

వసంత పిల్లలున్న ఉయ్యాలవైపు అడుగు వేసింది.

అది గమనిస్తూనే ‘లేదు నాకు ఇద్దరూ అబ్బాయిలే కావాలి’ అన్నాడు పిచ్చిగా మనోహర్‌.

‘అబ్బా ఛ…! అప్పుడే అంత గుడ్‌బాయ్‌వి అయిపోయావే.. ఎస్‌.. మై బోయ్‌..! మన జనరేషన్‌ అయినా, కాస్త మెచ్యూరిటీగా ఆలోచించాలి!’ అంటూ అతని చేతిని తన పెదాల దగ్గరకు తీసుకుంది మనీషా.

*

బేషరం కవులు!

saif
1
రిహార్సల్స్ ఉండవు బేషరం
ధైర్యం చేసి అమ్మల కడుపుల్లోంచి దూకెయ్యడమే 5 <3
2
మనం అలవాటు పడిపోయాం బేషరం
ఈ సూర్యుని వెలుగుకి ఆ చీకటి రాత్రులకు 5 <3
3
అదేమిటో జైలు గదికి కూడా నాలుగు గోడలుంటాయి
బేషరం ఈ దునియాకు నాలుగు దిక్కుల్లా
4
కవులకు కాలాలతో ప్రాంతాలతో సంబంధం ఉండదు
బేషరం కవులు ప్రజల హృదయాల్లో ఉంటారు 5 <3
 5
కొంతమంది బంగారం మురిక్కాలవలో వెతుక్కుంటారు బేషరం
కొంతమంది అత్తగారు పెడుతారు అని నిరీక్షిస్తుంటారు 5 <3
6
తొలికవిత రాసినప్పుడు సైజులు వేరు. బేషరం
ఇప్పుడు కవితలకు ప్రేరణల సైజులు వేరు
7
రోడ్డుపక్కన అన్ని అమ్ముతున్నారు బేషరం
కొన్ని అద్దాలు కూడా పెట్టి ఉన్నాయి 5 <3
8
ఏ భేషజాలు లేకుండా మాట్లాడుకుంటున్నారు
బేషరం కట్న కానుకలు వగైరా వగైరా 5 <3
9
అందరికి గ్రూపు మెసెజ్లు వచ్చేస్తున్నాయి బేషరం
ఆ సూర్యుని నుండి ఆ జాబిల్లి నుండి అద్భుతంగా  5 <3
10
తమ హక్కుల సాధన కోసం ధర్నాలు దీక్షలు  చేస్తుంటారు
బేషరం పడగ్గదుల్లో జరిగే వాటిని ఏ మంత్రి వచ్చి ఏం చెయ్యలేడు  5 <3
*

  మోనోలాగ్!

 

damayanti

 

నాకతని గురించేమీ తెలీనప్పుడు అతను చాలా మావూలు మనిషి అయివుండొచ్చు.

కానీ, నిన్న ఇతని గురించి చదివాక, విన్నాక,  ఇతన్ని విభేదిస్తున్న  వారినందరనీ చూసాక, – అనిపించింది. కాదు. చాలా బలమైన ఆలోచన కలిగింది. నేనెలాగైనా సరే   వెళ్ళి  అతన్ని వ్యక్తిగతం గా  కలవాలని.  ఎందుకంటే, ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడని ఆ పాత్ర  నాతో మాత్రం మాట్లాడతాడు అని కాదు. నే మాట్లాడేది అతను వింటే చాలని. అంతే.

– నెరవేరుతుందా లేదా అన్నది సందేహమే. ఎందుకంటే –  అది చిన్న ఆశ కాదు కాబట్టి.

ఎలా అయితేనేం, చిరునామా పట్టుకోగలిగాను. వెంటనే బయల్దేరి వెళ్ళాను.

సిటీకి దూరం గా వున్న కాలనీ అది. అక్కడ అధిక శాతం నివసించేది ముస్లిం ప్రజలే.  నే వెతుకుతున్న వీధి దొరికింది. నా నోట్లో నానుతున్న క్వార్టర్  నెంబర్నొకసారి సరి చూసుకున్నాను. . ‘ఆ! ఇదే ఇల్లు.’  అనుకుని ఆగాను, ఆ ఇంటి ముందు.

తలుపుకి  తాళం వేసి బయటకెళ్తున్న ఆ ఇల్లాలిని కంగారుగా  అడిగాను నాకొచ్చిన కొద్దిపాటి హిందీలో.. “ ఇక్కడ ఫైజు అని జర్నలిస్ట్..”నేనడగడం ఇంకా పూర్తి కాకుండానే, కనుబొమలు ముడిచి, చూపుడు వేలితో పైకి చూపించింది.  మేడ మీదకెళ్ళమన్నట్టు. ‘మూగదానిలా.. సైగలేమిటో!’ అనుకుంటూ వెంటనే  మెట్లెక్కుతూ నవ్వుకున్నా. ఫైజు ఎక్కువగా మాట్లాడే మనిషి కాడు. అతడొక నడిచే ఆలోచన.  తలవంచుకుని వెళ్ళిపోతుంటాడు. కారెక్టర్ అలాంటిది. అందుకనే కాబోలు  ఈవిడ ఇలా సైగ చేసి చెప్పింది. ఒకవేళ ఫైజు సంగీత కళాకారుడైతే, ఆరునొక్క రాగం తీసి వినిపించేదా? నే వేసుకున్న జోక్ కి నాకే నవ్వొచ్చింది. కానీ, పైకి బిగ్గరగా నవ్వలేదు, బావుండదనీ!

మెట్లు ఆగిపోయాయి. ఆఖరి పై మెట్టుకి  ఎదురుగా –  తలుపులు తెరిచి వున్న గది కనిపించింది. లోపల కి  తొంగి చూసాను. అదొక ఒంటరి గది. పుస్తకాలూ, కొన్ని పెయింటింగ్స్ ,కొంత సంగీతం… ‘మనుషులు తప్ప అన్నీ ఉన్న లోకం’ అతనిదని తెలుసు.

టేబుల్ ముందు కుర్చీ లో కుర్చుని, ముఖాన్ని – పుస్తకం లో ముంచి, కాదు కాదు, సగం శరీరాన్ని దూర్చేసుకుని,  పఠనం లో  లీనమై కనిపించాడు. అతనితో పూర్వ పరిచయం లేకపోయినా, అతన్ని  వెనక నించే చూస్తున్నా..అతనే ఫైజు అని గుర్తుపట్టేసాను. కాడన్న డౌటే లేదు. ఎందుకంటే.. అతను ఫైజే తప్ప మరో శాల్తీ అయ్యే అవ కాశం లేదు గాక లేదన్నపరమ సత్యం – నాకు మాత్రమే కాదు, అతన్ని చదివినవారందరకీ  తెలుసు

గది నలువైపులా చూపు సారించి చూశాను.

మంచం. కుర్చీ, టేబుల్, అల్మారాలు, గోడ క్కొట్టిన చెక్క అటకలు, నాలుగు వైపులా సజాలు..అవి కాదు నేను చూస్తున్నది. వాట్లన్నిటిమీదా పుట్టలు పుట్టలు గా పేరుకునున్న పుస్తకాలు తప్ప నాకిక  ఏ సామానూ కనిపించలేదు. ఇందులో సగం పుస్తకాలు  అన్వర్ ఇచ్చినవే!   అలా అక్షరాల ను మేసి, మేసీ, నెమరు వేసీ వేసీ, చివరకు ఎలా అయిపోతున్నాడంటే – తన చుట్టూ వున్న తన వారికి అన్యాయం జరుగుతున్నా చలించని వాడిలా.. కాదు కాదు చలించకుండా జాగ్రత్త పడే  పెద్ద పలాయన చిత్తుడని  చెబుతాడు అన్వర్. కాదు,  నింద లు మోపుతాడు. ‘  పాపం!ఫైజ్’ అనిపించింది.

చిత్రమేమిటంటే   – అన్వర్ అన్న మాటలు   నిజమే అని ఇతను మధనపడుతుంటాడు.  అక్కడ నాకీ కారెక్టర్ నచ్చక నిలదీద్దామనే వచ్చాను. ఈయన ఫ్రెండ్ (?) అన్వర్ చెప్పినట్టు..ఇతను ఎస్కేపిజాన్ని ఎంచుకున్నమాట వాస్తవమే అయినా, ‘ పరిస్థితి అలాంటిది కదా ‘ అనే ఒక సానుభూతి ఇతనిపై మెజారిటీ జనానికి వుందనేది ఒక సమాచారం.

నేనొచ్చినట్టు అతను గుర్తించడం కోసం..గొంతు సవరించుకుంటూ చిన్న గా దగ్గాను. వెనక్కి తిరిగి చూస్తాడేమో నని.

ఊహు. చూడలేదు. చెప్పాను కదా, ఆ కారెక్టర్ కి ఏవీ వినిపించవని. మరో ప్రయత్నం గా తలుపు మీద గట్టిగానే చప్పుడు చేసాను.

ఉలిక్కిపడి చూసాడు. కనుబొమలు ముడుచుకుని, ఇంత లావు కళ్ళద్దాల్లోంచి అనేకానేక  సందేహప్పోగులన్నీ కలేసిన  చిక్కటి అనుమానంతో పరిశీలనగాచూసాడు.

అవేం పట్టించుకోని దాన్లా, నేనే లోపలకెళ్ళి మంచం మీద పుస్తకాల్ని కొన్ని పక్కకి జరిపి,  ఆ కాస్త జాగాలో కుర్చుండిపోయా.

అతనికిదంతా అయోమయం గా వున్నట్టుంది. కంగారు పడనీకుండా.. నేనే మాట్లాడ సాగాను.

“నా పేరు చెప్పి, పరిచయం చేసుకుని, నేనెందుకు వచ్చిందీ, ఎలా వచ్చిందీ, అతనికి తెలీని నేను – నాకు అతనెంత బాగా తెలుసన్న సంగతినీ అంతా వివరిస్తూ, అతని ముఖ కవళికలను చదువుతూ చెప్పాను.   “మీ ఫాదర్, మీ స్నేహితురాలు సహన, మీ మేడం అందరూ అనుకున్నట్టు మీరేమంత అమాయకులు కాదని నా అభిప్రాయం. ముఖ్యం గా  అన్వర్..” అంటూ  ఆగాను.

ఆ పేరు వినంగానే ఒక వెలుగుతో అతని ముఖం వికసించింది.. అంతలోనే విప్పారిన వెలుగు  చప్పున మాయమై, చీకటీ పరుచుకుంది.   నా వాక్యాన్ని పూర్తి చేస్తూ అన్నాను. “  మీ చుట్టూ వున్న  సమస్యల గురించి మీకేమీ తెలీదని నేననుకోను. మీకు రేపు ఏమౌతుందన్న ఆలోచనల్లోంచి తప్పి పోవడం మాత్రమే ఇష్టం.  నిజానికి మీరు నిజంలోకి తొంగి చూసినా, కొన్ని దుష్ట శక్తులను ఎదిరించడానికి మీ బలం  చాలక..మిన్నకుండిపోయారేమో అని అనిపించింది. ‘మన వర్గం, దాని బలం ఎంత పెద్దదైనా, పొరాటం లో- వ్యక్తి ఎప్పుడూ ఒంటరి వాడే.’ అనే సత్యం మీకు పుస్తకాలు చదవడం వల్ల తెలిసి వుంటుంది అని నా విశ్వాసం.

“…..”

“ఏం చదివినా అది మీలో ఇంకడంలేదని, ఉత్తుత్తి పదాలే తప్ప ఒక వాక్యం లా బ్రతకడం రాని జర్నలిస్ట్ అని  మీ గురించి అన్వర్ ఎద్దేవా చేయడం నాకు నచ్చలేదు.”

అతనొక్క సారి నా వైపు చూసాడు.  అతని మీద నే చూపుతున్న ఫేవరిజం కంటేనూ,  అన్వర్ ని వ్యతిరేకించడం రుచించడం లేదన్న భావం స్పష్టం గా కనిపించి ఆ  ఆ చూపులో.

సహన అన్నట్టు “ఇతనికి ఒక ఫ్రేం లో ఒదిగి వుంటం రాదు.”  నాకు తెలిసి, అతనికి పరిచయమున్న స్త్రీలు చాలా తక్కువ. వాళ్లతో అతను మాట్లాడే మాటలు ఇంకా తక్కువ.  సహన అంటే ఇతనికొక ప్రతేకమైన ఇష్టముంది. ఎందుకంటే, ఇతని మౌనాన్ని, నిశ్శబ్దాన్ని అన్వర్ లా ప్రశ్నించదు. ఆమెకొక ప్రశ్న గా మరిన అతన్ని అర్ధం చేసుకుని మసులుతుందనుకుంటా! అందుకే ఆమె గదిలోకొస్తే ఒక ఆశ కిరణం ప్రవేశించినట్టుంటుందతని, వెళ్లిపోయాక చీకటి అలుముకుంటుందని ప్రకటించుకున్నాడు.

కాబోయే భార్య మంచిదై వుండాలని అందరు మగాళ్ళు కోరుకొంటారు. కానీ తనని పూర్తిగా అర్ధం చేసుకుని వుండాలని కోరుకునే వారిలో జర్నలిస్ట్ లు, రచయితలు  ఎక్కువగా వుంటారు. ఎందుకంటే వాళ్ళు పైకి ఎంత ధైర్యం గా కనిపిస్తారో అంత సున్నిత మనస్కులయి వుండటం వల్ల.

“నేననుకుంటాను. మీరూ అన్వర్ వేరు కాదు, ఒకటే అని.  అర్ధమయ్యేలా మీ మాటల్లోనే చెప్పాలంటే – మీలాగే అతనూ ఆబ్ స్ట్రాక్ట్  చిత్రమే. “కాకుంటే వాడు కొంచెం వ్యక్తమైన ఆబ్ స్త్రాక్ట్” అని అన్నారు గుర్తుందా? ఎవరితోనూ కాదు. మీతో మీరు సంభాషించుకుంటూ మోనోలాగ్.. నేను కూడా అప్పుడప్పుడు ఇలానే, మీలానే మాట్లాడేసుకుంటుంటాను. నాలో నేను. నాతో నేను. ఎడ తెగని సంభాషణలో! బదులివ్వని మనిషితో..అఫ్కోర్స్! ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అనుకోండి..” అంటూ సీరియస్ గా చూసాను అతని వైపు.

చేతిలో తెరిచున్న పుస్తకాన్ని, ఆ పళాన ముఖానికి సగానికి పైగా కప్పేసుకున్నాడు. కళ్ళు మాత్రమే నవ్వుతూ కనిపిస్తున్నాయి నాకు.

కొంచెం ధైర్యం రావడం తో, నా సంభాషణని కొనసాగించాను. “ఇంకా చెప్పాలీ అంటే మీలోని అన్ని ‘వక్రరేఖలూ సందిగ్ధ రేఖలూ’ కలిపి ఒకే బొమ్మ గీస్తే అది అన్వర్. కాబట్టి అతనెప్పుడూ మీకు, మీ వ్యక్తిత్వానికి డూప్ కాడు. అని నా నమ్మకం. ఎందుకంటే మీరెంచుకుని బ్రతుకుతున్న జీవన రేఖ సూటి అయినదే కాబట్టి. మీరు అతనిలా బ్రతకలేకపోతున్నందుకు ఎక్కడా పశ్చాత్తాపం చెందే  అవకాశం లేదంటాను.

“……..” ఏం జవాబు లేదు. కనీసం తలూపనూ లేదు.

“నాకొక డౌటండీ! మీరు అన్వర్ లా ఆలోచించకపోతున్నందుకు, చలించి, జ్వలించలేకపోతున్నందుకు చింతిస్తూ వచ్చారు కదా, మరి ఒక సందర్భంలో అన్వర్ గురించి   “బహుశా, వాడు ఫైజ్ కాకపోవడం వాడి అదృష్టం” అని చెబుతూ అభిప్రాయ పడతా రెందుకనీ?-  “అన్వర్ని ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే!ఆ మాటకొస్తే, రేపటి గురించి మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా భయం.”  అని చెహ్ప్పుకొచ్చారు. మీకనే కాదు, నాకూ, ఇంకా – సామాన్యులందరకీ భయమే వేస్తుంది.

మీ అన్వర్ ని మీరెంత బాగా గుర్తుపెట్టుకున్నారంటే..అతను తను చదివే పుస్తకాలని ఒక లిస్ట్ గా చేసుకోవడం దగ్గర్నించీ, అతనెంతో ప్రేమించే పుస్తకాలను ఒకానొక అసహాయ స్థితిలో తీసుకెళ్ళిపోమన్న క్షణం దాకా మీకు గుర్తుంది. కదూ?

అంతలా ప్రేమించడం గుర్తుంచుకోవడం, చూడాలని వున్నా వెళ్ళలేకపోవడం, ఎస్కేపవడం..మళ్ళీ ఎవరూ చూడకుండా   – ‘‘టేబుల్ మీద మత్తు ఇవ్వబడిన రోగిష్టిలా ..”  అబ్బ! ఎలియట్ మా అందరకీ బాగా గుర్తుండిపోయేలా ఎంత బాగా చెప్పారు!

అతని కళ్ళు మెరవడం గుర్తించాను.

“సాహిత్యం లో అందాన్ని మాత్రమే చూసే మీరు, జర్నలిస్ట్ అవడానికి స్ఫూర్తి అన్వర్ ‘బోధన ఒక పునాది రాయి’ అని చెప్పుకోవడం దగ్గర ఆగిపోయాను. ఎందుకంటే, మీ అభిరుచికి తగిన పేజ్ మీకు పత్రిక వారు కేటాయించలేదెందుకా అని!”

అవునన్నట్టు తలాడించాడు ఫైజు.

మీరొక సందర్భం లో- ఆ సాయంత్రం మీ మిత్ర బృందం నించి  వీడ్కోలు చెప్పుకుంటూ, మీ ఇద్దరూ  ఇంటి ముఖం పడుతూ.. మీ ఇళ్ళ ‘ దూరం’ గురించి ప్రస్తావించారు గుర్తుందాండీ?..అప్పట్లో  ఇళ్ళు దూరం జరిగి వున్న మాట వాస్తవం. ఇప్పుడైతే ఆ దూరాలు తరగి, దగ్గరకి జరగలేదంటారా? ఆ మార్పు మీరూ గమనించే వుంటారు కనక ఈ పాయింట్ మీరు డైరీలో నోట్ చేసుకోవాలని ఒక విన్నపం..

నా మాటల్ని ఫైజ్ శ్రధ్ధ గా ఆలకిస్తున్నాడని గ్రహించాక నాకు మరింత ఉత్సాహం  వచ్చింది. ఎదుటివారు చెప్పేది చెవులారా ఆలకించడం ఉత్తమ జర్నలిస్ట్ లక్షణం.

“జీవితమైనా చదువైనా ఒట్టి ఇంప్రెషన్ కాదు, ఉద్వేగమూ కాదు.” అని చెప్పే  మీ మేడం కాత్యాయిని మాటలు  నచ్చయి. అంతే కాదు  “ఇప్పటిదాకా నేను మాట్లాడే ఇంప్రెషనిష్టు భాష అదే. అది ఇంకా మారలేదు.” అని   మీలో మీరు చుప్పుకుంటూ,  అలా  నిజాన్ని ఒప్పేసుకోనే  సింప్లిసిటీ మీ కారెక్టర్ కి ఓ పెద్ద ప్లస్ పాయింట్ !

అయితే అన్వర్ తో చేతులు కలపలేకపోయినందుకు చింతించడం అనే పాయింట్ దగ్గరే మీతో విభేదించక తప్పట్లేదు.

“………………..”

“నాకు తెలుసు. మీరేం మాట్లాడరని. గోడ మీద రాతలు చూసి..రగిలిపోయిన అతను ఒక రహస్యోద్యమం గా మారడాన్ని పూర్తి గా చూడాలని మీరు గట్టిగా అనుకునుంటే చూసి వుండేవారు కాదా? కానీ మీరు ఉద్యోగ వేట లో వున్నారు.

నేనిప్పటికీ అనుకుంటూ వుంటాను. ‘ ఎవరు ఏ దారి ఎంచుకుంటే,  ఏ  ఫలితాలు దొరకాలో – అవే దొరుకుతాయి. అది ఉద్యమమైనా కావొచ్చు. ఉద్యోగమైనా కావొచ్చు.’ అని.

మీలోని ఆంతర్యమే కదా అన్వర్?   అతనికొక బలమైన  ఊతమౌదామని మీకు ఎందుకు అనిపించలేదో తెలుసా?    ఉద్యమాలు రహస్యమైనవై వున్నాయంటేనే..అవి మేలైనవి కాదని అర్ధం. యుధ్ధం లో గాయపడిన క్షతగాత్రులకి ఔషధాలు అవసరం కానీ, తిరిగి యుధ్ధం చేసే విధానపు చిట్టాలు అక్కరకు రావుగా!

ఫైజ్ తలొంచుకున్నాడు. నాకేమీ అర్ధం కాలేదన్న నిరాశ కావొచ్చు. అయినా నా వాక్ప్రవాహం ఆగుతుందా?, ఒక పట్టాన?

“అన్వర్ వెళ్ళిపోవడం ఎన్నాళ్ళకి తెలిసిందన్నది కూడా డౌటే..మీకు గుర్తు లేదన్నారు. అంత లా మరచిపోవడమెలా సాధ్యమౌతుంది అనే సందేహం నాకు అయితే కలగలేదు. ఎలా అంటే – అతను మీరైతేనో, మీరు అతనైతేనో కదా!.. గడిచిన కాలానికి, భవిష్యత్తుకి మధ్యన నలిగే మరణయాతన లాంటిది విప్లవం అంటే..’అని అంటాడు ఒక రచయిత. అన్వర్ కి ఒక విముక్తి దొరికిందని భావించవచ్చేమో!?

“…..”గట్టిగా నిట్టూర్చాడు ఫైజ్!

“మీలో అప్పుడప్పుడు ఏదో ఒక మెలకువ, కానీ ఎప్పుడూ ఒక వెంటాడే వ్యధ. – అలా కనిపిస్తారు. సహన చెప్పినట్టు మీరొక ఫ్రేం లో ఒదిగి వుండాల్సిన క్షణాలు వేగం గా వచ్చేసాయి అనిపిస్తోంది.

అన్వర్ ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి  ముందు  – కనీసం చివరిచూపుకైనా వెళ్ళలేదన్న తీవ్రమైన బాధ తొలిచేయడం సహజమే. కానీ అంతకుముదు అతనొక దాడికి గురి అయినప్పుడు చూసేందుకు వెళ్ళారు కదా?  అప్పుడు మాత్రం అతని కోసమేం చేయగలిగారు?  తలొంచుకుని తిరిగి రావడం తప్ప? –

యుధ్ధం లోపాల్గొన్న వాళ్ళందరూ విజయమొందుతారా? విప్లవంలో మరణించే వారి పేర్లు మిగిలివుండవా?”

శ్రధ్ధగా వింటున్నట్టే అనిపించింది. అది నా అపోహా కాకపోవొచ్చు.

“మీకు తెలీదేమో కానీ, మిమ్మల్ని మీరు సరైన దారిలోనే  ట్రాన్స్ ఫాం చేసుకుని వుంటారని నా నమ్మకం నాది.

‘ కాదు, అది ఎస్కేపిజం’ అని  అన్వర్  మిమ్మల్ని   క న్ ఫ్యూజ్ చేసాడనేది నా అనాలసిస్ లో తేలిన నిర్ధారణాంశం.

“…..” మొట్ట మొదటి సారిగా నా వైపు సూటిగా చూసాడు ఫైజ్.

‘ఏ మనిషీ   తనకు జరుగుతున్న  జరుగుతున్న ఘోర అన్యాయలకు కంటే.. సాటి మనిషి న్యాయం మాట్లాడనందుకు, ఓదార్పు గా భుజం తట్టనందుకు మనిషి రోదిస్తాడు. లో లోన కుమిలి కుమిలీ కదిలి కదిలీ ఏడుస్తాడు.  అలాంటి భయంకర పరిస్తితుల్లో.. ఒక పెద్ద సందేహం కలుగుతుంది. వెన్ను వొణికించే ప్రశ్న ఉద్భవిస్తుంది. ‘చుట్టూ వున్న వాళ్ళు మనుషులేనా? తను బ్రతుకుతున్నది మనుషుల మధ్యేనా ‘అని..   సరిగ్గా మీకూ ఇలాటి సందేహమే కలగడం నాకెంత ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలగచేసిందంటే ఇదిగో ఇలా ప్రత్యక్షం గా వచ్చి కలిసి మాట్లాడేంత! ‘ పత్రికా ఉద్యోగంలో పక్కనున్న వాళ్ళు మనుషులో కాదో ఎప్పుడూ అనుమానమే. మాటల చుట్టూ కంచెలు.’ అన్నరు చూసారూ, నిజంగా మీ మాటలు నన్ను కదిలించాయి. ఆ చెడ్డ కాలమంతా కళ్ల  ముందొక్కసారి గిర్రున తిరిగింది..అప్పట్లఓ సరిగ్గా మీలానే  నేనూ   అనుకున్నాను. కానీ, ఈ పదాలలో కాదు కానీ సరిగ్గా ఇలాటి భావంతోనే…

“……………”

“గోడ మీద రాతలకి కారణం – మీకు మతం గా కనిపిస్తోంది కానీ నా అనుభవం లో నేనెదుర్కొన్న అవమాన పర్వం లో నా చుట్టూ వున్నవాళ్ళందరూ  మా మతం వారే. ఇంకా చెప్పాలంటే వారిలో  ‘మా కులపోళ్ళూ’ వున్నారు.

ఎందుకు చెబుతున్నానంటే  , ‘మనిషిని మనిషి హింసించడానికి, అవమానపరచి, హీనపరచి, అణగదొక్కడానికీ  –  మతం ఒక్కటే మూలకారణం కాదు.  కేవలం అదొక భాగం మాత్రమే సమాజంలో జరిగే దుర దృష్ట సంఘటనలకి ‘అని చెప్పాలని నా ప్రయత్నం ఇదంతా!

‘……’ కావొచ్చు అన్నట్టు తలూపాడు ఫైజ్.

“అణచివేత- అన్ని విప్లవాలకి మూల బీజం. భరించరానిఅవమానం, అన్ని యుధ్ధాలకి బలమైన కారణం.

కాదనం.  అయితే – మన ముందు తరాలవారికి మనం  ఇదే సందేశం గా మిగిలిపోవాలా? –ఈ ప్రశ్నని మీ అన్వర్ ని కలిసినప్పుడు అడుగాలంకుంటున్నా!

ఒక రెప్పపాటు ఉలిక్కిపడి  చూసాడు. ‘ఇంకెక్కడ అన్వర్?’ అన్నట్టు అనుమానం తో బాటు, ఇంకా మిగిలి వున్నాడంటారా? అనే ఆశా  ద్యోతకమౌతోంది ఆ చూపుల్లో!

“అవును. మరణించలేదు.  అతని గాయాలకు మరణమేమిటీ? మీలోని అతని జ్ఞాపకాలు సజీవమై వున్నంతవరకూ..అన్వర్ కనిపిస్తూనే వుంటాడు. మాట్లాడలేని అతని దేహం ఇంకా మూలుగుతూనే వుంటుంది. .

మీ రాక కోసం –  మూసిన ఆ కళ్ల వెనక అతని ఆశ ఏదో తచ్చాడుతూనే వుంటుంది. అని నా నమ్మకం.  .

అయినా, మీరూ వెళ్ళి చూసి రావొచ్చు కదా, ఒకసారి!.. ఇలా తలుపు వెనక ఎన్నాళ్ళనీ?

ఇప్పుడు, ఏదీ రహస్యం కాదీ  ప్రపంచ మండువాలో! అన్ని ద్వారల నించి అందరూ నడుస్తూనే వున్నారు.” అంటూ ఆగి గది గోడల మీద కనిపించటంలేదేమిటా అని చూపులతో వెదుకుతున్నా.

“???..” అతను దేనికోసమన్నట్టు ఆందోళన గా చూసాడు.

“గోడ మీద ఒక మూడు కాలాల  గడియారం వుండాలి..ఎక్కడా అని చూస్తున్నా..” అన్నాను అతని వైపు చూడకుండా!..వచ్చిన పని అయిపోయిందాన్లా లేచి నిలబడి, బాగ్ భుజాన తగిలించుకుని గుమ్మం దాటి బయటకొచ్చేస్తుంటే..వెనక నించి వినిపించింది..

‘ఎట్లా మాట్లాడాలీ ఈ వేల మరణాల గురించి?

ఎవరు వింటారు నా లోపలి గాయాల మూలుగుల్ని?

బలహీనమైన ఈ దేహంలో ఒక్క నెత్తుటి చుక్కా లేదుమిగిలిన అరకొర నెత్తుటి చుక్క.. ఒక్క వెలుగూ కాదు, కాసింత ద్రవమూ కాదు.

ఇది నిప్పు రాజేయనూ లేదు, దప్పిక తీర్చనూ లేదు!’

-మహాకవి ఫైజ్ స్వరం వినిపిస్తోంది..

***

ఫైజ్, అన్వర్ గురించి ఇంకా  ఆసక్తి కరమైన సంగతులు తెలుసుకోవాలనుకునే వారు ఈ లింక్ మీద క్లిక్ చేయగలరని మనవి.

అందరకీ నా ధన్యవాదాలు.

http://lit.andhrajyothy.com/stories/oka-talupu-venaka-5935

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తండ్రి లేని దేవుడు లేని అనాథ లోకం!

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

నీషే చెప్పినట్లు దేవుడు మాత్రమే కాదు, అసలు తండ్రి అనే వాడే అంతరించి పోవడమే ఆధునిక కల్లోలానికి మూలం. ఇంతకీ దేవుడు పరమ పిత కదా, పురుషోత్తముడే కదా! అంటే ఆదర్శవంతమైన తండ్రి. అసలు తండ్రి అనే భావనకే కాలం చెల్లిపోతున్న సూచనలు కనపడుతున్నాయి. దాంతోపాటూ అతన్ని కేంద్రంగా చేసుకొని తిరిగిన కుటుంబ వ్యవస్థ కరిగిపోతోంది. వొకప్పుడు తండ్రి పాత్ర పోషించిన రాజు, తర్వాత ఆధునిక రాజ్యం, జాతీయత యొక్క జనగణమన అధినాయకత్వమూ తండ్రి అనదగ్గ చిహ్నాలన్నీ క్రమేపీ కనుమరుగవుతున్నాయి. దాంతో కుటుంబ సంక్షేమం, రాజ్యం యొక్క సంక్షేమ భావం మొత్తంగా సంక్షేమ భావం నిలువనీడలేనిదిగా మారిపోతోంది.
పితృస్వామ్యంలో తండ్రి ఆధిపత్యస్థానాన్ని వహించడం నిజమే కానీ అతని కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఉంది. మనం సూర్యకుటుంబం అంటూ కాస్మిక్ చింతనలో కూడా కుటుంబ భావనని ప్రవేశపెట్టి , సూర్యుడికి తండ్రి స్థానాన్నీ,  యితర గ్రహాలకి అతనిపై ఆధారపడి  పరిభ్రమించే స్థితినీ కల్పించాం. ఇదొక అత్యాధునిక విఫల యత్నం. ఎందుకంటే నిజానికి ఆధునిక కాలంలో తండ్రిపాత్ర  క్షీణించింది. మానవుడే కనుమరుగయ్యాడు.  అయినప్పటికీ సూర్యకుటుంబం అనడం ఒక  భ్రమాత్మక కొనసాగింపు. ఇలాంటి కొనసాగింపు అన్ని రంగాల్లోనూ సాగింది. దీన్ని నేను తర్వాత వివరిస్తాను.
నిజానికి భూకేంద్రక సిద్ధాంతం అంతరించి విశ్వం నక్షత్రగుచ్చాలుగా ఉందనే వైఙ్ఞానిక దృక్పథం బలపడాక మనిషి యొక్క కేంద్ర స్థితే పూర్తిగా దెబ్బ తింది. దిక్కులు దిక్కులేనివయ్యాయి. కిందా మీదులనేవి లేకుండా పోయాయి. విశ్వం అనంతంగా అంతరించి మనిషి చిన్నబిందువుగా మారిపోయాడు. మనిషి కనుమరుగైపోయాడు. అంతరించాడు. అతనితో పాటుగా దేవుడు అంతరించాడు. దేవుడు మరణించాడని నీషే గగ్గోలు పెట్టాడు.
ఆధునిక యుగం చనిపోయిన దేవున్ని, అతని ప్రతిరూపమైన మనిషిని లేక మనిషికి ప్రతిరూపమైన దేవున్ని పునరుద్ధరించడానికి చాలా ప్రయత్నం చేసింది. మానవునిపై తీవ్రమైన మూఢ విశ్వాసంతో మానవ చరిత్ర పురోగమనం అనే స్వర్గ కాంక్షతో ప్రొటెస్టెంటిజం నుంచీ కమ్యునిజం దాకా అనేక ప్రయత్నాలు సాగాయి. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం, మనిషి మరణిస్తాడు కానీ మనుషులు మిగులుతారంటూ శ్రీశ్రీ చేసిన ఆశావాదపూరిత ప్రకటన దైవ పునరుద్ధరణ లేక మానవ పునరుద్ధరణ కోసం యూరప్ వేసిన పొలికేకకి ప్రతిధ్వని మాత్రమే.
జీవ శాస్త్రంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ జరిగిన పరిశోధనలు మానవుడి ప్రత్యేకతనే సవాలు చేసాయి. మనిషి జంతువు నుంచీ వచ్చాడనే కాదు, అసలు నిర్జీవ పదార్ధం నుంచే సజీవ పదార్ధం ప్రమాదవశాత్తూ ఆవిర్భవించిందన్న ప్రతిపాదన మనిషికి ప్రత్యేకత లేకుండా చేసింది. అతని పుట్టుక వెనుక దైవసంకల్పం మాట దేవుడెరుగు, అతని పుట్టుక వెనుక అసలు డిజైను అనేదే లేదని చెప్పి, అతని పుట్టుకని వొక యాక్సిడెంట్ స్థాయికి పడదోసింది. ఖగోళ శాస్త్రం, సాపేక్షవాదం విశ్వంలో మనిషి ఉనికిని అనిశ్చితం చేసేసాయి. దీంతో పాటు యాంత్రిక నాగరికత మనిషికి గ్రామాల్లో ఉన్న స్థిరమైన ఐడెంటిటీని ముక్కలు చేసింది.
మనిషి ఈ శూన్యాన్ని భరించలేడు. అతనికి వొక కేంద్రం కావాలి. దేవుడు కావాలి. రాజు కావాలి. తండ్రి కావాలి. నిజానికి ఈ మూడూ వొకటే. అది పితృ భావన. పితృహననాన్ని మనిషి జీర్ణించుకోలేకపోయాడు. పరమపిత శిక్షించడం మాత్రమే కాదు. రక్షణ కూడా చూసాడు. యూదులకు ఒక స్థిర నివాసాన్ని వాగ్ధానం చేసాడు. దైవధిక్కారం వల్ల యూదులు కష్టాలు అనుభవించారు. తండ్రినీ, తండ్రి ఆఙ్ఞనీ ధిక్కరిస్తే అవ్యవస్థే, అనిశ్చితే. భారతదేశం పరిస్థితి వేరు. ఇక్కడ రాజుకి సరిహద్ధులు ముఖ్యం కాదు. వర్ణ వ్యవస్థ ముఖ్యం. ఎవరి వృత్తులు వారు నిర్వహించాలి. దాన్ని ధిక్కరిస్తే మరణ దండనే. శ్రీరాముడు శంబూకున్ని చంపింది అందుకే. యిక్కడ కులవృత్తులు ముఖ్యం. దాని మీదే వ్యవస్థ ఆధారపడి ఉంది. రాముడు అడవులకు వెళ్ళిపోతుంటే ప్రజలు చాలా దూరం అనుసరిస్తారు. మధ్యలో వొక నదీ తీరంలో అందరూ నిద్రపోతున్న రాత్రి వేళ రాముడు నిష్క్రమిస్తాడు.
వొక ఆదర్శప్రాయుడైన తండ్రి అవసరం, రామాయణంలోని ఆదర్శాలు యీనాడు మనకు పూర్తిగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ వొక నాయకుడూ, తండ్రీ అవసరం అని అందరూ భావించారు. దీనిలో ఎరిక్ ఫ్రాం చెప్పినట్లు స్వేచ్చ నుంచీ పలాయనం చిత్తగించే మానవ ప్రవృత్తి దాగి ఉంది. తన నిర్ణయాల్ని భరించే వొక పిత,  పరమ పిత, నాయకుడు, వొక నిర్ణయం తీసుకోవడంలోనూ, వొక చాయస్ ఎంచుకోవడంలోనూ గల కష్టనష్టాలనుంచీ, మంచీ చెడూ ఫలితాలనుంచీ రక్షిస్తాడు.  ( అందుకే దేవుడికి సర్వసమర్పణ భావన మొదలైంది) అందుకే “తండ్రి” భావన. మరణ వేదన పడ్తున్న సమయంలో తండ్రి కావాలి, తండ్రి కావాలి అని గగ్గోలు పెట్టాడు. కానీ ఎగ్జెన్షియలిజం మనిషి సారాన్ని తిరస్కరించి, బాధ్యతనంతా మనిషి మీదే మోపేసింది. మనిషి స్వేచ్చాశాపగ్రస్తుడని ప్రకటించింది. కానీ యీ ఙ్ఞానం మనిషికి వూరటనివ్వలేదు. కనీసం వొక పిశాచంగా, వొక భ్రమగానైనా తండ్రికావాలి. తన భారాన్ని మోసే నాయకుడూ, దేవుడు కావాలి.
శ్రీరాముడేమన్నాడు. ” ఆరాధనాయ లోకస్య మంచతో నాస్తి మే వ్యధా” ( ఉత్తర రామచరితం- భవభూతి) ప్రజలనీ లోకాన్నీ మెప్పించడం కోసం భార్యని కూడా విడిచి పెట్టడానికి కూడా సిద్ధమే. దానిలో యిసుమంత బాధకూడా లేదన్నాడు. స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రాజ్యాన్నీ ప్రజలనీ కాపాడడం కోసం తన కొడుకు ని బలి పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఎర్ర సైన్యం చేతిలో బంధీలుగా ఉన్న నాజీలని విడచిపెట్టడానికి స్టాలిన్ తిరస్కరించాడు. దాంటో అతని కొడుకుని శత్రువులు చంపేసారు. ( దైవ కుమారుడు క్రీస్తు పాపుల కోసం శిలువ నెక్కిన సంగతి తెలిసిందే) మన నిర్ణయాల్నీ, మన మంచి చెడ్దల్నీ మోసే నాయకుడూ, తండ్రీ కావాలనే కోరిక మానవ సహజమైనది. అది స్వీయ బాధ్యతల నుంచీ పలాయనం కూడా.
కానీ మనిషి తండ్రిని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ద్వేషిస్తాడు కూడా. ఎందుకంటే తండ్రి స్వేచ్చకు పెద్ద అడ్డంకి. మనిషిలో స్వేచ్చాపిపాస ఉంది. అదే సమయంలో “పోదాం పద పారిపోదాం పద”( భైరాగి) అనే పలాయన వాదం ఉంది. ఈ రెండూ పరస్పర ఆశ్రితాలు. ఎందుకంటే స్వేచ్చలో అంతులేని బాధ్యత ఉంది. దాని వల్ల వచ్చే పెయిన్ ఉంది. నిర్ణయాన్ని తీసుకోలేకపోవడంలో, నిర్ణయాన్ని  యితరులపై మోపెయ్యడంలో శిశు సహజమైన భద్రతవుంది.
కానీ ఇలా తండ్రి మీదో నాయకుడి మీదో ఆధారపడి అతని చేతులకు బాధ్యతనప్పగించి బతికేయడం వల్ల ఆ తండ్రి, ఆ నాయకుడు స్వేచ్చని హరించే సైతానుగా మారిపోయే ప్రమాదం ఉంది. యీ ప్రమాదమే కాఫ్కా లాంటి రచయితల్ని వూపిరాడకుండా చేసి పితృ ద్వేషులుగా చేసింది. జర్మన్ రచయిత కాఫ్కా, లెటర్ టూ హిజ్ ఫాదర్, మెటామార్ఫాసిస్ – ఈ రెండూ స్వేచ్చని హరించే తండ్రి పైశాచిక రూపాన్ని బహిర్గతం చేస్తాయి. కుటుంబమూ, దానిపై ఆధిపత్యము వహించే తండ్రీ,  కథానాయకుడు- గ్రిగరీని వొక కీటకంగా మార్చేస్తారు. అతడు తన అస్తిత్వాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం సోఫా కింద నక్కుతుంటాడు. గదినుంచీ బయటకు వచ్చాడన్న కోపంతో తండ్రి విసిరిన ఆపిల్ గ్రిగరీ దేహంలో యిరుక్కపోయి తీవ్ర వేదనని మిగల్చడాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. ( మెటామార్ఫాసిస్) ఎప్పటికీ ప్రారంభం కాని, నిరీక్షణంలోనే జీవితం ముగిసిపోయే న్యాయ విచారణ లాంటి విషయాల ద్వారా కాఫ్కా ఆధునిక మానవుడి జీవన అనిశ్చితినీ, క్రూరమైన రాజ్యాన్నీ కళ్ళముందు కడతాడు. నిజానికి రాజ్యమనే తండ్రి, వ్యవస్థ అనే తండ్రి యెలా మానవ స్వేచ్చని హరిస్తారో కాఫ్కా తన కథల్లో స్పష్టం చేసాడు. ( చలం కూడా తండ్రినీ, అతని నియంతృత్వాన్నీ ద్వేషిస్తాడు. బిడ్డల శిక్షణ పుస్తకంలో పిల్లల స్వేచ్చని బోధిస్తాడు)
కాఫ్కా చనిపోయిన కొంత కాలానికి అతని కుటుంబం మొత్తం నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో కడతేరడం అతని కథల్లోని బీభత్సాన్నీ, జుగుప్సనీ నేల మీదకు దించింది.
            ఈ బీభత్సానికి కారణం ఆధునిక జాతిరాజ్యాన్ని ఫాసిజంగా నిర్వచించిన ఆధునిక  పిత హిట్లరే కారణం. ఇంతకు ముందు చెప్పినట్లు విఙ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల ద్వారా పారిశ్రామిక నాగరికత ద్వారా పాత వ్యవస్తల్నీ, పాత ఆలోచనల్నీ కుదిపేసిన ఆధునిక యుగం మళ్ళీ తండ్రి కోసం పరమపిత కోసం (దేవుడి కోసం) అన్వేషణ మొదలెట్టింది. దానివల్ల యిద్దరు ఆధునిక  ఆదర్శాలతో  నిండిన తండ్రులూ, దేవుళ్ళూ ,నాయకులూ లభించారు.  ౧) హిట్లర్ ౨) స్టాలిన్. హిట్లర్ జాతీయ వాద ఆదర్శాన్నీ, స్టాలిన్ కమ్యునిస్ట్ ఆదర్శాల్నీ ప్రాతిపదికగా చేసుకొని నాయకులుగా మారారు. నియంతలుగా మారారు. దేవుళ్ళుగా మారారు. వారి పేర విగ్రహారాధన మొదలైంది. కానీ వారిద్దరూ విఙ్ఞాన శాస్త్ర ఆరాధకులే. కానీ స్టాలిన్ మరణిస్తే అతని శవాన్ని కూడా భద్రపరిచి శాశ్వత ప్రాతిపదికన ప్రదర్శనకు పెట్టారు. యింతటి గౌరవం, భక్తి భావం బుద్ధభగవానునికి దక్కలేదు. దీనిలో వైరుధ్యం లేదా? విఙ్ఞాన శాస్త్రాన్నీ, హేతువాదాన్నీ ప్రమాణంగా భావించే వ్యక్తులే దేవుని స్థానాన్ని ఎలా ఆక్రమించారు?
కాలంలో వెనక్కి వెళ్ళి బుద్ధుడు బుద్ధభగవానుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నించుకుందాం. బుద్ధుడు తనని దేవుడ్ని చేయవద్దన్నాడు. సొంత బుద్ధితో అన్వేషణ చెయ్యమన్నాడు. నిజమే, ఆ మాట స్టాలిన్ కూడా అంటాడు. కానీ బుద్ధుడు విహారాలని స్థాపించాడు. అక్కడ అతడే తండ్రి పాత్రని పోషించాడు. కఠోరమైన సన్యాసాశ్రమ వ్యవస్థని పోషించాడు. సెక్సుని అణచి వేయడానికి తీవ్ర ప్రయత్నం చేసాడు. ఎవరైనా ఆ నియమాన్ని అతిక్రమిస్తే తీవ్రంగా నిందించాడు. అలాగే వొక సన్యాసి శిష్యున్ని, తన మాజీ భార్యతో సంగమించినందుకు నిందిస్తాడు. ” అంగాన్ని నిప్పుల్లో కాల్చుకోలేక పోయావా కోరిక తీరకపోతే”- అని దుమ్మెత్తి పోసాడు. (బుద్ధ చరియ- రాహుల్ సాంకృత్యాయన్)
పారిపోయివచ్చిన సైనికుల్నీ, బానిసల్నీ విహారంలో ప్రవేశించడానికి నిరాకరించి రాజుకు సహకరించాడు. స్త్రీల ప్రవేశాన్ని కూడా నిరాకరించినా, శిష్యుడు ఆనందుని మాట విని తర్వాత వొప్పుకున్నాడు. కానీ స్త్రీల వల్ల వొక వెయ్యి సంవత్సరాల్లో బౌద్ధం క్షీణిస్తుందన్నాడు. బుద్ధుడు కుటుంబ స్థానంలో సన్యాసాన్ని స్థాపించి దానికి నాయకత్వాన్నీ, తండ్రి పాత్రనీ పోషించాడు. బుద్ధుడు మంచి తండ్రిలా కనపడవచ్చు కానీ తండ్రే. ఆ పాత్రలో నియంతృత్వధోరణి తప్పదు. మిగిలిన వాళ్ళ కంటే వొక అతీత స్థితీ, ఉన్నత స్థితీ తప్పదు. అదే బుద్ధున్ని దేవునిగా మార్చింది. అంటే బౌద్ధ విహారాల్లోనూ , వారి సన్యాస దీక్షలోనూ కూడా పితృస్వామిక లక్షణాలు బలంగానే ఉన్నాయి.
కానీ సన్యాసం అనేది కొత్త మార్పే. ముఖ్యంగా కుటుంబంలాగే అదొక వ్యవస్థగా మారడం. బుద్ధుడు వ్యవసాయక సమాజం ఏర్పడ్తున్న దశకు సంబంధించిన వాడుగా నిర్ధారిస్తాడు డి. డి. కోశాంబి. వ్యవసాయం విస్తరిస్తూ ఉండడం సొంత ఆస్తి ఆవిర్భావానికి కారణం. సంపద మిగులుకు కారణం. దీనివల్ల పనిలోకి పోకుండా బౌద్ధిక చింతన చేసే వర్గం ఆవిర్భవించింది. వాళ్ళే బౌద్ధ బిక్షువులు. రిచ్యువల్నీ, యఙ్ఞయాగాదుల్నీ, కర్మకాండనీ పరమమైనదిగా  భావించే బ్రాహ్మణులు సన్యాసాశ్రమాన్ని చాలాకాలం వ్యతిరేకించారు. కుటుంబ వ్యవస్థనే బలపరిచారు. అందుకే ఎనిమిదవ శతాబ్ధానికి చెందిన శంకారాచార్యుల్ని సన్యాసం తీసుకున్నందుకు మండన మిశ్రుడిలాంటి బ్రాహ్మణపండితులు మొదట తీవ్రంగా నిందించారు. స్త్రీ సంపర్కాన్ని నీచమైనదిగా భావించడాన్ని వ్యతిరేకించారు. కానీ తర్వాత పీఠాలు వెలిసాయి. పీఠాధిపతులు వెలిసారు. వాళ్ళు రాజులుగా, తండ్రులుగా గౌరవాన్ని పొందారు.
అంటే మానవ సమాజం కుటుంబ వ్యవస్థని, సెక్సుతో సహా తిరస్కర్తించినప్పటికీ తండ్రి పాత్రని ఆరాధించడం విడిచిపెట్టలేదు. దేవుడికి మూలాలు యిక్కడే ఉన్నాయి. దేవుడ్ని తార్కికంగా హేతుబద్ధంగా తిరస్కరించినా  కొత్త దేవుళ్ళు వెలుస్తూనే ఉంటారు. కారణం దేవుడు పితృస్వామిక వ్యవస్థ యొక్క ఆదర్శ రూపం.
బ్రాహమణ ఫిలాసఫీ అయిన పూర్వ మీమాంస దేవుడి ఉనికినే హేతుబద్ధంగా తిరస్కరించింది. కుమారిలభట్టు యిటువంటి తర్కాన్ని అభివృద్ధిపరిచాడు. కానీ జాతి వ్యవస్థనీ, బ్రాహ్మణ అధిపత్యాన్నీ బలపరిచాడు. మనువు ఏమంటాడూ? అగ్రవర్ణాల్ని అనుసరిస్తూ , తమ నడవడికని తీర్చిదిద్దుకోవాలంటాడు. అంటే వర్ణ వ్యవస్థలో భూసురుడే దేవుడు. అతడే పరమ పిత. వేరే ఆకాశ దేవుళ్ళు అవసరం లేదు.
అందువల్ల పితృస్వామ్య మూలాల్లోనే దేవుడున్నాడు. యీ దేవుడు వొక్కొక్క సారి నిర్గుణుడు, మరొకసారి సగుణుడు, మరొక సారి మానవ ఆకారం ధరించిన వాడు, శ్రీరాముడూ లేక స్టాలినూ, హిట్లరు.
అదేమిటండి నాస్తికత్వానికీ, దేవుడికీ ఎలా పడుతుంది? యెలా సంధి కుదుర్తుంది అని మీరడగవచ్చు. ప్రాచీనకాలంలో బౌద్ధం వల్ల, ఆధునిక కాలంలో కమ్యునిజం వల్ల విగ్రహారాధన పెరగలేదా? అంటే మనం పితృస్వామ్యాన్ని తిరస్కరించడంలేదు. రంగనాయకమ్మగారు రామాయణనీతిని తిరస్కరించడం లేదు. ఆదర్శవంతమైన ఆధునిక హేతుబద్ధతతో కూడిన రామాయణ నీతి మోనోగమీ కావాలంటున్నారు.
కానీ రంగనాయకమ్మ గారికీ, రామాయణ నీతికీ ముప్పు ఏర్పడింది. వొకప్పుడు ఓల్గాలాంటి రచయితలు కుటుంబ వ్యవస్థతో సంబంధం లేని సెక్సు, స్వేచ్చ గురించి మాట్లాడారు. దానికి విరుద్ధంగా రంగనాయకమ్మగారు విరుచుకపడి ఆదర్శవంతమైన మోనోగమీని సమర్ధించారు. కానీ కుటుంబమనేదే పితృస్వామికం.
బ్రాహ్మణులే కాదు, ఆదిమవాసులు కూడా పితృదేవతల్ని నమ్ముతారు. కొన్ని సంవత్సారాల క్రితం వొక వార్త చదివాను. అమెజాన్ అడవుల్ని కొట్టేసి, అమెరికన్లు సోయాబీన్ పండిస్తున్నారు. అక్కడ గిరిజనుల గోడు ఏమిటంటే – ఇది పితృ దేవతల నిలయం.  యీ అడవులు వీటిని చేధించవద్దని వారి ప్రార్థన. బహుశా యీ పితృ దేవుడు చాలా ప్రాచీనుడు. పితృ దేవుడి నుంచే, పితరుల ఆత్మ నుంచే దేవుడు పుట్టాడు. కొడుకు వల్ల పున్నామ నరకం తప్పుతుంది. అలాగే తండ్రీ తాతలకి కర్మ ద్వారా పితృ ఋణం తీరుతుంది. యిదొక చక్రభ్రమణం, పితృ భ్రమణం.
ఆధునిక కాలంలో కమ్యునిష్టులు దీన్ని చేధించాలని చూసారు. కానీ కొత్త రూపంలో కొనసాగించారు. అంటే తండ్రి స్థానంలో సంస్కారవంతుడైన మంచి తండ్రినీ, మంచి నాయకుడ్నీ, హేతుబద్ధమైన దేవుడ్నీ స్థాపించాలని చూసారు. హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పితృ కర్మలని తిరస్కరించాడు. తాను చనిపోయినా కర్మ జరపవద్దని వీలునామా రాసాడు. ఆయన దృష్టిలో హిందూ జాతీయవాదమే పరమపిత. హిందూ జాతీయవాదం హిట్లర్ జాతీయవాదం యొక్క శిశువు. ప్రపంచానికి యిద్దరు పరమ పితలు. ౧) హిట్లర్ ౨) స్టాలిన్.
ఆధునిక రాజ్యం తండ్రిగా కొన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించింది. కొన్ని సంక్షేమ లక్షణాలని పుణికిపుచ్చుకుంది. ఎంత దుర్మార్గాలకీ, క్రూర చర్యలకీ పాల్పడ్డా ప్రజల పురోగతే తన లక్ష్యమని ప్రకటించుకుంది. టీచర్ పిల్లల్ని దండించడం వారి అభివృద్ధి కోసమేనని చాటుకున్నట్లు రాజ్యం తన హింసాత్మక చర్యల వెనుక కూడా ప్రజా సంక్షేమమే దాగి ఉందని చాటుకొంది. కానీ “సంక్షేమం” అనే మాటని విడిచి పెట్టలేదు. హిట్లరు కూడా నిరుద్యోగాన్ని రూపుమాపే చర్యల్ని చేపట్టాడు. సంక్షేమ రాజ్యం అనే పదబంధం కూడా పుట్టుకొచ్చింది. ఈ సంక్షేమ భావనే స్టాలిన్, ఇందిరాగాంధీల నియంతృత్వ పోకడలకి సమ్మతిని చేకూర్చింది. ప్రాచీన కాలంలో రాజు సామదానభేద దండోపాయాల్ని అవలంభించాలని రాజనీతి. ఆధునిక యుగంలో కూడా అదే కొనసాగింది.
కానీ అత్యాధునిక మార్పులూ, ప్రపంచీకరణ క్రమేపీ పితృస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాంతో తండ్రి, నాయకుడు, దేవుడు నిజంగానే మరణ శయ్యపై చేరుతున్నారు. దాంతో పితృస్వామ్యం వహిస్తూ వచ్చిన సంక్షేమ భావన కొండెక్కింది. మంచికైనా చెడుకైనా ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ తండ్రే లేకుండాపోయాడు. రావిశాస్త్రి వొకసారి అంటారు. “దేవుడు ఉన్నాడనే నేను భావిస్తాను. ఎందుకంటే తీవ్ర దుర్మార్గాలని చూసినపుడు నిదించడానికీ, నిలదీయడానికీ దేవుడు పనికొస్తాడు”. వొకప్పుడు రాజ్యం అపనిందల్ని భరించేది. తిరుగుబాట్లని ఎదుర్కొనేది. అణచివేయాలని చూసి, చివరికి రాజీకొచ్చేది. కొన్ని సంస్కరణలనైనా చేపట్టేది. గిరిజనులకి ఇలాగే కొన్ని హక్కులు లభించాయి.
యిప్పుడూ సంస్కరణ అన్న పదమే మారిపోయింది. రాజ్యం అన్ని సంక్షేమ బాధ్యతలనీ తప్పుకోవడమే సంస్కరణగా పిలవబడ్తోంది ( అంటే తండ్రి బాధ్యత నుంచీ తప్పుకోవడం).వొకప్పుడు రాజ్యం యొక్కపితృస్వామిక సహకారంతోనే అగ్ర వర్ణాలు పెట్టుబడిదారులుగా , మధ్యతరగతిగా బలపడ్డారు. దళితులూ, గిరిజనులూ, ముస్లీములూ కడగొట్టు బిడ్దలుగా తక్కువ పలితాన్ని పొందారు.రాజ్యం సంక్షేమ భావనని విడిచిపెట్టడంతో,  తండ్రి బాధ్యతని త్యజించడంతో వీరిపరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
కొంతమంది దళిత మేధావులు ప్రపంచీకరణ వల్ల దళితులకి మేలు జరుగుతుందని, కుల వివక్ష తగ్గిపోతుందనీ వాదించారు. చంద్రభాను ప్రసాద్ అలాగే వాదించారు. నిజానికి రాజ్యం పితృస్వామ్య బాధ్యతని విడనాడి, మార్కెట్‍కు అంతా వదిలేయడంతో వొక అరాచక పరిస్థితి ఏర్పడింది. ఆధునిక రాజ్యం ఏర్పడక ముందునుంచీ ప్రశ్నిస్తూ, పోరాడుతూ వొచ్చిన నిమ్నకులాలు యిప్పుడు ఎవరితో పోరాడాలో తెలియక, యెవరిని నిలదీయాలో తెలియక దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల తిరుగుబాట్లు మాయమయ్యాయి. ఆత్మహత్యలు మొదలయ్యాయి. రైతాంగ తిరుగుబాట్లు, విద్యార్థి పోరాటాలూ లేవు. ఆ స్థానాన్ని రైతుల ఆత్మహత్యలూ, విద్యార్ధుల ఆత్మహత్యలూ భర్తీ చేస్తున్నాయి. ప్రభుత్వ విద్య, ఉద్యోగాలూ అంతరించి దళిత మధ్యతరగతి పెరుగుదల నిలిచిపోయింది.
యూరప్‍ని అనుకరిస్తూ  జాతి రాజ్యం(నేషనాలిటీ) ని ఏర్పరుచుకున్నప్పుడు, కొన్ని సంక్షేమ ఆదర్శాల్ని మనం ఆశించాం. కానీ స్వదేశీ, స్వజాతి అభిమానం వంటివి కనుమరుగవుతున్నాయి. దాని స్థానంలో కుహనా జాతీయవాదం మొదలైంది. విచిత్రంగా యీ కుహనా జాతీయవాదాన్ని ఎన్నారైలు భర్తీ చేస్తున్నారు.
రాజీవ్ మల్హోత్రా యిటువంటి కుహనా జాతీయవాదే. ఆయన బ్రేకింగ్ యిండియా అనే పుస్తకం రాసారు. ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలూ, ప్రగతి శీల చరిత్రకారులూ, మావోయిష్టులూ … వీళ్లందరూ జాతీయతకి ముప్పుగా పరిణమించారంటారు. బ్రిటీష్ పాశ్చాత్య వలసవాద సంస్కృతి ఆధిపత్యం గురించి తెలివిగా మాట్లాడ్తారు. కానీ దేశాన్ని బహుళ జాతికంపెనీలకి బార్లా తెరవడంలో, పాశ్చాత్య దేశాల్లో కూడా నిషేధించిన అణూకర్మాగారాల్ని ఎటువంటి నిబంఢనలూ విధించకుండా విచ్చలవిడిగా అనుమతించడంలో , విదేశీ విశ్వవిద్యాలయాలు, రక్షణ రంగంలో విదేశి పెట్టుబడులూ… యివేవీ ఆయనకు జాతీయతకు  ముప్పుగా  ఆయనకు కనపడలేదు. పైగా వీటిని ప్రోత్సహించే హిందూ జాతీయ వాదుల్లో “స్వదేశీ” కనపడ్తుంది. సామ్రాజ్యవాదం వూసెత్తరాయన.
నిజానికి మరణ శయ్యపై చేరిన తండ్రి- జాతీయవాదం యింకా మరణించలేదనే భ్రమని యీ మేధావులు కలగజేస్తారు. పైగా జాతీయతకి ముప్పుగా పరిగణించిన విదేశి భక్తులలోనే దేశభక్తినీ, దేశ సంస్కృతినీ చూపుతారు. తద్వారా పరోక్షంగా స్థానిక సంస్కృతుల్ని పాతర వేసి పాశ్చాత్య అమెరికన్ సామ్రాజ్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. పశ్చాత్తాపం లేని దళారులు వీళ్ళు.
నిజానికి తండ్రి మరణించాడు. కుటుంబ వ్యవస్థ రూపు మాసిపోయే స్థితిలో ఉంది. సంతానాన్ని భాగ్యంగా వరంగా భావించే స్థితి పోయి, కొన్ని దేశాలు సంతానాన్ని కంటే రాయితీలు యిస్తానంటున్నాయి. యిదే సమయంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తి పెంచడం కోసం, ప్రసవాన్ని వాయిదా వెయ్యమని, పిండాల్ని భద్రపరిచే సౌకర్యం కల్పిస్తామని అంటున్నాయి. అద్దె గర్భాలు లభిస్తున్నాయి. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. యివన్నీ పితృస్వామ్యం అంతరించిపోతుందనడానికి , అదే సమయంలో వ్యాపిస్తున్న శూన్యానికీ చిహ్నాలు. ( సాంకేతిక అభివృద్ధి గల మనిషి స్థల కాలాల్ని పోగొట్టుకుంటున్నాడు. దాంతో బంధాలు, అనుబంధాలు కోల్పోయాడు).
యింక రాజ్యం దగ్గరికి వస్తే వొకప్పుడు తండ్రి పాత్ర పోషించిన హిట్లర్, స్టాలిన్, ఇందిరాగాంధీ వంటి నియంతలలో కనపడే నిజాయితీ నేటి పాలక వర్గంలో కనపడదు.
హిట్లర్ తన ఆత్మకథ(మెయిన్ కుంఫ్)లో యూదు వ్యతిరేకతని బహిరంగంగానే చాటుకుంటూ , దానికి మేధావుల తాత్విక మద్ధతుని ప్రకటించుకున్నాడు. స్టాలిన్ కూడా తన దృక్పథాన్ని కప్పిపుచ్చుకోలేదు. ఇందిరా గాంధీ  ఎమర్జన్సీ విధించడానికి కూడా వెనుకాడలేదు.
కానీ నేడు హిందూ ఆధిపత్య వర్గానికి ఆ నిజాయితీ లేదు. కొందరు దాడులు చేస్తారు. కానీ మా ఫిలాసఫీ ఫాసిజమేనని ప్రకటించే తండ్రి స్థానంలోని నాయకుడు ఉండడు. అంతా అరాచకం. స్థలకాలాలు అంతరించిపోయిన శాటిలైట్ ప్రసారాల కాలంలో మనం ఉన్నాం. మన ప్రత్యేకతని మనం కోల్పోయాం.
దీనికి కారణం మనని మనం పాలించుకోవడం లేదు. మనకి నాయకుడు లేడూ. తండ్రి లేడూ. తండ్రి మరణించాడు. మార్కెట్ అరాచకం రాజ్యం చేస్తోంది. యిటువంటి అసంబద్ధపు ప్రపంచపు లోగుట్టుని బయట పెట్టబోయిన వికీలీక్స్- అసాంజే వొక దేశపు రాయబార కార్యాలయంలో స్వయం బంధీ  అయ్యాడు. అతడి తరుపున వాదించే అమెరికన్ లాయర్ అనుమానపు స్థితిలో చనిపోయాడు. అంటే అత్యాధునిక ప్రసార సాధనాలు సత్యాన్ని కప్పిపుచ్చే ముసుగులు మాత్రమే.
తండ్రి లేని, నాయకుడు లేని, దేవుడు లేని సత్యం లేని అనాథల ప్రపంచం మనది.
*

పేదవాళ్ళ పిల్లలు!

225px-robert_w-_service

ఈ దేశంలో పేదవాడికి పిల్లలు మాత్రమే పుడతారు , రిచీ రిచ్లకి మాత్రం వారసులు పుడతారు  అంటుంది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సీ గ్రేడ్ మూవీగా రేట్  చేయబడిన ఈ మధ్య కాలపు బాలివుడ్  సినిమాలో ఒక క్యారెక్టర్ . నిజానికి అంత ప్రాక్టికల్ డైలాగ్ ఉన్న ఆ సినిమాకి చప్పట్లతో కూడిన గుర్తింపు రావాలి కాని మన దేశపు వాసనలలో అంత తెలివి ఊహించడం కష్టం. సరిగ్గా మనం అంతా ఈ సినిమా ప్రోమోలు కూడా చూడటానికి ఇష్టపడని సమయంలోనే బిగ్ బీ అద్బుతంగా తనదయిన వారసత్వపు షాయరీలకి భిన్నంగా బోలెడంత ఆత్మీయత కుప్పించిన ఉత్తరం సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం పొందుతుంది .

మోడరన్ థింకింగ్ అంటే పట్టుచీరలు గోరింటాకులు బదులు డిజైనర్  వేర్ డ్రెస్లు ,మెహందీలు వాడి పెళ్లిళ్ళు సంభరాలు చేసుకోవడం అనుకొనే ఆడపిల్లలకి , అభ్యుదయ వాదం అంటే మంగళ సూత్రాల నుండి పూసల గొలుసులకి ఎదగడం అనుకొనే స్త్రీ మూర్తులకి , వీళ్ళ ఇద్దరి నడుమ ఇంకో రకం ఉంది ,వాళ్ళేలా అంటే  “జియో రిలయన్స్ వాళ్ళ కష్ట ఫలం నీకంతగా నచ్చకపోతే  వాడుకోకు అంతే తప్ప అన్నిటిని విమర్శిస్తే  అసలు సమాజంలో ఉండటానికి నీకే అర్హత లేదనే ” అన్ అఫీషియల్ ఖాప్ చట్టాలు నిర్ణయించే మూకలుగా తయారయి ఆలోచన అంటూ ఉన్నవాడి బుర్ర చచ్చేదాకా చితకకోడతాం అంటూ భర్తలు ఎన్ని వేషాలు  వేసినా వాడు రాసిచ్చే భవంతుల కోసమో, అందించే వడ్డాణాల కోసమో భరించేస్తూ పైగా ఇదంతా పిల్లల  కోసం అన్న సెంటిమెంట్ అడ్డం పెట్టుకొనే న్యూ ఏజ్  మితవాద మతస్తు స్త్రీలు , వీళ్ళకి బుర్రలో కాస్త గుజ్జు ఉన్నవారెవరు ఈ జీవితాన రిలయెన్స్ లాంటి కొన్ని సంస్థల దగ్గర మాత్రమే అంతగా డబ్బు ఎందుకు కూడబడింది అన్న ప్రశ్నకి ,ఆ రాత్రికి రాత్రి పెరిగిన పెట్రోలు ధరలు కామన్ మ్యాన్ నడ్డి డైరెక్ట్గా విరచడం కాకుండా పెరిగిన ద్రవ్యోల్బణం తద్వారా పెరిగే ట్రాన్స్పోర్ట్  రేట్స్ , తడిచి మోపెడయ్యే సరుకుల ధరలు , పెరిగిపోయే ప్రతి ధర వెనక మర్మం వగైరా  ప్రశ్నలకి సమాధానాలు అడిగి తెలుసుకోలేరు, కనీసం తెలిసినా వాళ్లకి వివరించలేరు  .సో పైన రెండు రకాల ఆడవాళ్ళతో పాటు ఈ స్త్రీలు మాత్రమే కాకుండా వీళ్ళందరి వెనక పనిచేసే మనువాద మగ బుర్రలు అందరూ కలిసి అమితాబ్ బచ్చన్ ఇద్దరి  మనవరాళ్ళ పేరిట  రాసిన ఉత్తరానికి ఉబ్బి తబ్బిబ్బయి ఇదీ మన దేశ సంస్కృతీ ,సాంప్రదాయం అని జబ్బలు చరుచుకొని  ఉంటారు .

నిజానికి 21 వ శతాబ్దంలో సైతం వంశాలు, రక్తాలు అని తన  మొదటి లైన్లోనే నంద వంశం , బచ్చన్ వంశం గురించి అతి గొప్పగా రాసుకున్న ఒక వ్యక్తి ఈ దేశానికి ,  ఈ దేశపు సాధారణ ఆలోచనకి  బ్రాండ్  అంబాసిడర్ అంటే దేశం మొత్తం సిగ్గుపడాల్సిన సమయం కదా ఇది . అందునా మళ్ళీ ఈ వంశాలు పితృస్వామ్య వ్యవస్థ మళ్ళీ మళ్ళీ పునాదులతో సహా గట్టి పరుస్తూ తండ్రి తరపునవి మాత్రమే అయి ఉండాలి .ఆ వంశాలలో నుండి వచ్చారు కాబట్టి ఆ పిల్లలలిద్దరు జీవిత కాలం పాటు స్వీయ  నిర్ణయాలు తీసుకొండమ్మా అంటూనే మరోపక్క  పాపం పడక్కుర్చీ తాతగారు ముందు కళ్ళెం గా వేసిన (రాసిన ) వంశ గౌరవం ,లెగసీ అన్న మాటలు నిద్రలో సైతం మర్చిపోకుండా తమ లేత  భుజాల మీద జీవితాంతం మోస్తూనే ఉండాలి . పైగా ఇదంతా ఆడపిల్లలు కాబట్టి పెళ్ళయ్యే  వరకే , మళ్ళీ ఆ తరువాత ఇంకెవడో వంశం చరిత్రలు తవ్వి చదువుకొని అవెంత గొప్పవో , వాటి రక్తంతో కలిపి తామెంత  గొప్ప  వారసులని ఈ దేశానికి కొత్త వారసులుగా అందించగలరో ఇవ్వగలరో అన్న భావన  మొయ్యడంతో పాటు ఆ బ్రతుకే బ్రతకాలి  కూడా . రేపొద్దున వాళ్ళలో ఏ ఒకరికయినా ఏ కార్ డ్రైవర్ మీదో , పేవ్మెంట్ మీద బూరలమ్ముకొనే వ్యక్తితోనే వివాహం అన్న ఊహే రానివ్వని అద్బుతమయిన ప్రయోగం . మీ నిర్ణయాలు  మీరే తీసుకోవాలి అంటూనే ముందరికాళ్ళకి బంధం  వేయడం అన్న సామెతని హిందీ లో బిగ్ బీ గారు బాగా వంట పట్టించుకున్నారులా ఉంది . ఇక్కడ ఇంకో విషయం  హరివంశ్ రాయ్  బచ్చన్  పేరు  రెఫెరెన్స్ తో లిఖించినా ఆ ఉత్తరం వెనక బచ్చన్ లెగసీకి  కారణం ,ఇండస్ట్రీ కథలు కాకరకాయలు క్రియేట్  చేయడానికి, అవి అమ్ముకోవడానికి ఒక యాంగ్రీ యంగ్ మాన్ అవసరంతో పాటు మొత్తం మార్కెట్కి సబ్బులు బ్లేజర్స్ అమ్ముకోవడానికి రాజేష్ ఖన్నా తర్వాత ఒక లెజెండ్ని  సృష్టించాల్సిన  అవసరం ఉన్న కాలం ఒక్కటే కాదు , తన మీద తన వాచ్యం మీద, నటన వెనక  అమిత్ శ్రమ కూడా కాదనలేం . ఆ మాటకొస్తే  నటన విషయంలో అమితాబ్ బచ్చన్కి ఎదురులేదని  షారుక్ కాలపు మాబోటి మూవీ బఫ్స్ సైతం ముక్తకంఠంతో చెప్పగలం. అయినా నిజానికి అమితాబ్కి స్టార్ డం  రావడం వలన హరివంశ్ రాయ్ బచ్చన్ గొప్ప కవిగా మారిపోయారు అన్నవిషయం ,తన సమకాలికులలో తన కంటే అద్బుతంగా రాసిన పేరు రాక, జనం చదవక ఆ బెంగలోనే మరణించిన నిప్పులాంటి  కవి హృదయాలు ఎన్నో ఆ సమయంలో అని ఇక్కడ మనం  మర్చిపోకూడదు .

అసలయినా విషయం ఇదంతా కాదు . అసలు అంతలేసి  లెగసీలు లెజెండ్రీ  వంశాలు మెయిన్ టెయిన్  చేసే ఇంత గొప్ప రక్తాలు  మరి  తమ పిల్లలతో పాటు సమానంగా  మన ఊర్లలో  ఒక దళితవాడ  బిడ్డని  తీసుకెళ్ళి  పెంచి , పోషించి ఆ ఇంటి పేర్లతో సహా సమాజపు గౌరవాన్ని  రాసివొచ్చుగా ? వాళ్ళు చేస్తున్న  చారిటీలు వాళ్ళు సమాజం నుండి సంపాదించిన రూపాయిలో ౦.౦౦౦౦౦1 శాతం  తిరిగి పబ్లిసిటి స్టంట్స్ గా  అక్కడ ఇక్కడ బీద విదార్దులకి పెన్నులు కొని పెట్టి పండగ రోజు  అన్నదానం కింద బువ్వ పెట్టి నటించే నటనల  గురించి  ఇక్కడ  మనం  చర్చించడం  లేదు . అది పూర్తిగా ఇంకో సబ్జెక్ట్ . ఈ విషయం గురించి ఒక బచ్చన్లు ,  అంబానీలు , పాటిళ్ళు , ఇంకా ఇలాంటి ఎందరో సహా గాంధీలు గరికపాటిలు అని గర్వంగా చెప్పుకొనే అందరు లెగసీలనీ అడిగే ఏకైక ప్రశ్న ఏమిటంటే , ఒక్క బిడ్డని  ఒక్కరంటే  ఒక్క దళిత  బిడ్డని లేదా ఒక మైనారిటీ బిడ్డని ( వైస్ వర్సా )  మీ పిల్లలతో సహా  మీ ఇంటి పేరు ఇచ్చి పెంచుకోగలిగే  మానవత్వం  ఉన్నదా మీకు? అనువంశికంగా వచ్చే తెలివితేటలు పక్కన పెడితే వీళ్ళందరి బిడ్డలకి కలిపించే సదుపాయాలు అభిమానాలు ఒక అతి మామూలు  పేవ్మెంట్  పై బిడ్డకి  కలిపిస్తే , ఆ బిడ్డడు ఇంకో రోజున మరో అంభానీ మరో బచ్చన్  లేదా గాంధీ  కాలేడా ?  ఎందుకంటే  అనువంశికంగా వచ్చినా తలలు తీసే లక్షణాలు  సామ్రాజ్యాలని ఏలే శక్తి తర్వాత చాలా మంది వారసులలో హుళక్కి అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కదా .ఆ లెక్కన కొందరియినా ప్రస్తుత సమాజపు లెక్కల ప్రకారం సామాజిక గౌరవం పొందే స్థితికి చేరలేరా అని .

ఇది మాత్రమే  కాదు ఈ మొత్తం విషయంలో ఇంకో అతి పెద్ద విషాదం ఏమిటి అంటే , అన్ని రకాల ఉద్యమాలలో  ఉన్నవారు సైతం ఎక్కువ శాతం తమ సొంత  రక్తమే  కావాలనుకోవడం భయంకరమయిన నిజం కదా ( కులాలు  మతాలూ ఎలాగు మన దేశంలో ఉద్యమాలని  నిను వీడని నీడలే అన్న విషయం  మనం ఎవరం మర్చిపోలేని  సత్యం ) అన్నిటి కంటే  దళిత కుటుంబాలలో మొదటి తరంలో లేదా రెండో తరంలో ఉద్యోగస్తులయిన వాళ్ళు , ఇప్పటికే కాస్తో  కూస్తో  స్తిరపడిన వాళ్ళు ఒక బిడ్డ తర్వాత అయినా మరో బిడ్డ విషయం ఆలోచించేప్పుడు తమ కులంలో తమ సెక్ట్ లోనో, తమ  సబ్ సెక్ట్ లో పిల్లలనయినా  అడాప్ట్ చేసుకోవడం ఎంత అవసరమో ఎందుకు గుర్తించడం లేదు ? ఎవరో ఎదో చేయడం లేదు అనో  లేక గేటెడ్  కమ్యునిటీస్ లో సెటిల్  అయ్యి  గ్రామాల్లో దళిత బిడ్డలు  మైనార్టీ  కష్టాలు  అంటూ హృదయపూర్వకంగానే అయినా బాధపడే కొందరయినా ఇలాంటి అడాప్షన్లకి  ముందుకు  రావడం  ఇప్పుడు తక్షణావసరం కదా? జరిగే నష్టాలని ఏకపక్షంగా ఆపే  శక్తిలేని  ఉద్యమకారులు మనసున్నవారు సమాజానికి మెరుగయిన  హ్యుమానిటీ అందించడానికి ఇలాంటివి ఒక ఆప్షన్గా ఆలోచించొచ్చు .

robertwservice201755

అదే సమయంలో ,తొందరలో జనాభా విస్పోటనానికి చైనా కష్టాలు మించిపోయే దేశంగా  మారిపోతున్న మనదేశానికి , (చైనా వస్తువులు  మనం చీప్ గా కొనుక్కుంటున్నప్పుడే  మనకి అర్ధం కావాలి కదా , అంత తక్కువ డబ్బు విలువ  చేసే  వస్తువులు తయారు చేసే   కార్మికులకి ఇంకెంత తక్కువ జీతాలు ఉంటాయో బ్రతుకులు ఎంతెంత  భారంగా ఉంటాయో)  మత యుద్ధాల కోసం మాట యుద్ధాలు చెలరేగే  కాలాలలో చావడానికి కనిష్టస్థాయి బంట్లుగా పెరిగే సంతానాల కోసం రెచ్చగొట్టే భగవత్లు ముల్లాలు కాకుండా ఒక ఇంటికి ఒక బిడ్డ మాత్రమే , మరో బిడ్డ కావాలంటే అడాప్టెడ్ మాత్రమే అన్న సామాజికాంశం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది . ఇందులో మళ్ళీ పిల్లలు కలగక  లేదా పిల్లలని కనడం ఇష్టం లేక అడాప్ట్ చేసుకోవడం అనే ఆప్షన్కి వెళ్ళే  జంటలు , అడాప్షన్ అని చెప్పి ఇంట్లో పనిపిల్లలుగా వాడుకోవడం ,ఇవన్నీ కాదంటే అడాప్షన్  పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్ పెంచే అసహ్యాల వలన ఇప్పటికే బలవుతున్న తండాల  పసిబిడ్డలు లేదా  అనాధశ్రమాల బిడ్డల రైట్స్ గురించి జాగ్రత్త  తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది .

ఇలా ,ఒక మంచి ఆలోచనకి విత్తనం అయినందుకు  అమితాబ్ గారి ఉత్తరానికో థాంక్స్ చెప్పుకుంటూనే , మరి మీ ఇష్టం వచ్చిన  దుస్తులు  వేసుకోండి , మీ  చాయిస్లు మీరు  తీసుకోండి  అని వాళ్ళ ఆరాధ్య దైవం  చెప్పిన మాటలకి మరి మన దేశపు నయా  సతీ సావిత్రులు వారిని తమ బానిస రోబోలుగా మార్చుకున్న సంస్కృతీవాదులు అదే సినిమా  ఫీల్డ్  లో రాఖీ  సావంత్, సన్నీ లియోనీ మొదలైన  వారి విషయంలో అభిప్రాయాలు మార్చుకుంటారా అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ ప్రశ్న!

చివరగా ,చట్ట పరమయిన  అంశాలే కాకుండా సామజికాంశాలు మానసిక వైరుధ్యాలు కలగలిపిన దత్తతలు అంత సులువేం కాదు కాని , చాల మంది మనసున్న వారు రాసిన హృద్యమయిన ఇలాంటి కవితలు ముఖ్యంగా “ A promise made is a debt unpaid “ అని తేల్చేసిన రాబర్ట్  విలియం  రాసినAdoption మాత్రం కుప్పపోసిన మానవత్వాలుగా మనం బ్రతకొచ్చు అనే ఒక నిదర్శనం .

ఈ కవితకి మనకోసం తెలుగులో నాదయిన అనుసృజన

 

Adoption –  Robert William Service

~

తక్కువ స్నేహాలున్న

ఒంటరి మహిళగా

తల్లిదండ్రులెవరో తెలియని

రెండు చిన్న ప్రాణాలని

రాత్రిపూట అవాంఛిత కౌగిలింతలేవో

కాన్వెంట్ తలుపుల దగ్గర వదిలినట్లు

యాచిస్తున్న ఆ చిన్ని చేతుల దురవస్థని

నా సొంతం  చేసుకున్నాను.

 

ఈ పని వారికి నా పేరు ఇచ్చింది

వారే పాడు మురికివాడల నుండి వచ్చారో

ఇహేప్పటికి వారికి తెలియదు

నా సొంతవారిలానే చూడడం

వాంఛ శ్రమల ఇద్దరు అనాధలని

నా ప్రేమ , రక్షణ కాపాడింది

ఇప్పుడిక నా కొడుకు జాన్

తెల్లగా నిండయిన పొడవుతో ,

జోన్ కృష్ణవర్ణంలో మెరుస్తూ .

 

అబ్బాయి బార్ కౌన్సిల్ సభ్యుడు

అమ్మాయి నిర్మలమయిన నర్సు

ఇప్పుడెలా ఉన్నారు , ఎలా ఉండుండేవారు అన్న తలపుకే

క్షణపాటు చెడు విషమేదో మింగినట్లు నరకంగా ఉలిక్కిపడతాను

.

.

బహుశ జాన్ ఒక నేరస్తుడిగా

జోన్ వేశ్యగా స్తిరపడేవారేమో

*

 

 

 

వొక జ్ఞాపకం తరువాత…

artwork: satya sufi

artwork: satya sufi

 

~

మాటలను నోట్లోకెత్తుకుని
జీవించడం చాలాకాలమే అయింది
లిప్తకాలంలో
సముద్రపు భాషా సాయంత్రాలు
అల్పపీడన గాలుల్లో
నిన్ను నువ్వు చూసుకుని సంవత్సరాలు గడించింది
యిసుకను వేళ్ళ మధ్యన నుండి రాల్చడం
మర్చిపోయి యేళ్ళు దాటింది
తుషారబిందువుల్లో
ప్రతిబింబాలను పోల్చుకోవాలి రోజుల పిల్లికూనలల్లే
వాటి నుదురు పైన
నీ తడిపెదవుల స్పర్శ వొకటి మళ్ళా యివ్వు
వో జ్ఞాపకం
వో చిరునవ్వూ
జీవితానికి సరిపడా కవిత్వమూ
కిటికీల్లో నుంచి కోల్పోయిన వెన్నెల బాల్యమూ
అందుకే నువ్వంటే నీకో తృష్ణ
మట్టిగూళ్ళను సర్ది చెప్పు మళ్లీ నీలో నువ్వింకా వున్నావనీ
నీ చూపుల్లో
ఆ నీటిపుష్పాలు
యింకా స్పృశిస్తున్నాయనీ
*

“చివరకు మిగిలేది” దేనికోసం?!

buchibabu‘‘చివరకు మిగిలేది’’ నవలకూ, ఆ నవలా రచయిత బుచ్చిబాబుకు, తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రముఖ స్థానం ఉంది. అప్పటికి తెలుగు నవలలలో విశాలమైన ప్రాతిపదికపై ‘‘మానవ జీవితం’’ పట్ల తాత్విక దృక్పథాన్ని ప్రతిపాదించే ప్రయత్నాలు జరిగాయి. అయితే వైయక్తిక జీవితానికి, ఆయా తాత్విక దృక్పథాలకు గల పరస్పరత (interaction) ‘‘చివరకు మిగిలేది’’ నవల. ఆధునిక జీవితానికి తప్పనిసరి అయిన పాశ్చాత్య తాత్విక దర్శనాలను బాగా పరిశీలించిన మేధావి బుచ్చిబాబు.

ఈ నవల కుండే చారిత్రక ప్రాధాన్యతను ఆర్‌.ఎస్‌.సుదర్శనం ఇలా చెప్పారు. ‘‘తెలుగులో మనో వైజ్ఞానిక నవల అవతరించడంతో ‘‘కాల్పనికత’’ బద్దలైంది. ఈ విధంగా చూస్తే ‘‘చివరకు మిగిలేది’’ తెలుగు సాహితీ పురోగతిలో ఒక మైలురాయి. భావనాత్మక ప్రేమ, ఆదర్శాలూ, జీవిత సత్యం, ముందు, దివ్వటీలు సూర్యుడి ముందు కాంతి విహీనమైనట్లు నిరుపయోగం కావటాన్ని చిత్రిస్తుందీ నవల’’. భావనాత్మక దృక్పథాన్ని నిజజీవితం ముందు పరీక్షకు పెట్టడం ఈ నవల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఈ నవలలో వ్యక్తి దయానిధి. అతని మానసిక పరిణామం ఈ నవల. అతని జీవితంలో కదలిక కంటే వలయాల వలననే ప్రాముఖ్యం కలుగుతుంది. ఆ ఆలోచనా వలయాల గుణాన్ని, విలువలను బట్టే సంఘటనలు ఎన్నుకోబడతాయన్నా ఆశ్చర్యం లేదు. అయితే అది కృతకంగా గాక సహజంగా ఉండడం వలన నవల విజయవంతం అయి జీవితంపై ఒక దృక్పథాన్ని కలిగించాలనే రచయిత ప్రయోజనం నెరవేరింది.

2

డాస్టోవిస్కీ నవల సాధారణతలను కాకుండా ప్రత్యేకత (peculiarities) లను చర్చించాలని అన్నాడు. ఇందులో ఉద్దేశ్యం సామాన్య జీవిత దృక్పథాలను వైయక్తిక జీవితాలకు అంటే ప్రత్యేక వ్యక్తి జీవితాలకు అన్వయించడం కావచ్చు.

‘‘చివరకు మిగిలేది’’ నవలలో దయానిధి ప్రత్యేకయిన వ్యక్తిత్వం కలవాడు. అతను అనుభూతిపరంగానూ, ఉద్వేగ స్థాయిలోనూ కాల్పనికమైన ఆలోచనలు కలవాడు. దయానిధి కాల్పనికత సాంప్రదాయక కాల్పనికత కంటే భిన్నంగా ఉండదు. అంటే స్ర్తీ పురుష సంబంధాలకు చెందిన కాల్పనిక ధోరణి జీవితంలో ప్రధానాంశం కావడం. అయితే దయానిధిలో ఈ కాల్పనికత కాల్పనికమైన వాదులాటకు సెంటిమెంటల్‌ కాన్‌ఫ్లిక్ట్‌కు దారితీయదు. కాల్పనికతకూ, నిజజీవిత గమనానికి మధ్య ఏర్పడే ఘర్షణ రచనా లక్ష్యం అనడంతో ఈ నవల ‘‘మైలురాయి’’ అయింది.

ఈ కాల్పనికత కారణంగానూ, మిగిలిన అంశాల వల్ల దయానిధిలో స్ర్తీల పట్ల అమితమైన కుతూహలం జనిస్తుంది. స్ర్తీలందరూ కేవలం తాము స్ర్తీలయినంత మాత్రాన్నే అతన్ని మానసికంగా స్పృశించి అతన్లో ఆలోచనలు లేపుతారు (కాత్యాయిని, రోజీ ఇందుకు మినహాయింపు) అయితే స్త్రీల పట్ల అతని దృక్పథం వాళ్ళ ‘‘అమ్మ’’ వల్ల ప్రభావితం అవుతుంది. ఇది మౌలికంగా సాంప్రదాయిక కాల్పనికత కంటే భిన్నంగా పరిణమిస్తుంది.

దయానిధి కాల్పనికతలో సంఘ నియమాల పట్ల మౌలికమైన పట్టింపు లేదు. నిజానికి సంఘం, దాని నియమాలు, పరిమితలకు అతని మానసిక పరిధిలో మొదట మొదట స్థానమే లేదు. అయితే తర్వాత తర్వాత ‘‘అమ్మ’’, తన ఊహలో ఎంతో ఉన్నతమైన ‘‘అమ్మ’’ను సంఘం తిరస్కారభావంతో చూడడం గుర్తించిన దగ్గిర్నుంచీ అతనికి సంఘంతో ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ ఘర్షణ అంతస్సంఘర్షణగా రూపొందడంతో సమస్య జటిలమవుతుంది. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అతనికి సంఘ నియమాల పట్ల మౌలికంగా పట్టింపు లేదు. అతనికి సంఘంతో నిమిత్తం ఉంది.

‘‘ఇతరులతో సంపర్కం వదలుకొని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధానపరచుకోవడం, సంఘంతో నిమిత్తం ఉన్న మనిషికి చేతకాదు కాబోలు’’

అతని రచయితే నవల మొదటి పేరాలోనే చెప్తాడు. అంతేకాదు. దయానిధికి సంఘంతో ఘర్షణ నిజానికి ‘‘అమ్మ’’ ద్వారానే మొదలవుతుంది.

దయానిధికీ అమ్మకూ ఉండే అనుబంధం మామూలు మాతృప్రేమకంటే విశిష్టమైనది. అతని ప్రకారం ఆమె ఒక్కతే అతన్ని అర్థం చేసుకున్నది. దయానిధి మరో సందర్భంలో చెప్పేట్లుగా ప్రతి మనిషి కొందరి దగ్గిర దాపరికం లేకుండా తనను తాను చెప్పుకోవలసిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా ‘‘అమ్మ’’ దయానిధికి ఆప్తురాలు.

‘‘ఇంతవరకు అతనికి వేరేవునికి లేదు – ప్రతి చిన్న విషయానికీ తల్లి మీద ఆధారపడ్డారు. ఈ సంఘం ఒక సమ్రుదమయితే, అతను నిలబడేటందుకు అమ్మ ఒక లంగరు. ఇప్పుడు ఆ లంగరు లేదు; ఏదో శక్తి అతన్ని వదలిపోయింది; అతన్ని ప్రపంచానికి బంధించిన గొలుసులో గొళ్ళెం వూడింది.’’

అద్దంలో ‘‘అతన్ని చూస్తే అతనికే నవ్వొచ్చింది. అకస్మాత్తుగా అమ్మను చూసినట్లనిపించింది. తనలోంచి తల్లి తొంగి చూస్తున్నట్లు – తనలో ఎవరో వుండి అతన్ని జీవింప చేస్తున్నట్లు. నిజంగా తల్లి చావలేదు. అతనిలో ఉండిపోయింది.’’

అతన్ని జీవితాంతం వెంటాడిన విషయం ‘‘తల్లి తనలోంచి తొంగి చూడ్డం.’’ ఏ సంఘానికీ తనకూ లంగరుగా తల్లిని భావించాడో తర్వాత ఆ ‘‘అమ్మే’’ పరోక్షంగా సంఘానికీ తనకూ మధ్య ఘర్షణకు కారణం అవుతుంది. సంఘానికీ, తనకూ మధ్య నిలిచన అద్దం తల్లి. ఆ అద్దంలోంచీ తప్ప సంఘాన్ని చూడలేకపోవడం వల్లనే దయానిధి తర్వాత అంతగా సంఘానికి దూరంగా జరుగుతూ వచ్చాడు. సంఘం కూడా ఈ అంశాన్ని reciprocate  చేస్తుంది. దయానిధిని వాళ్ళ ‘అమ్మ’ అద్దంలోంచీ తప్ప చూడలేదు. అయితే ‘‘అమ్మ’’ ప్రభావం దయానిధి దృక్పథంపై పరోక్షంగా ఉంటుంది. సంఘం వైపు నుంచీ అది తప్ప మరో ప్రభావం లేనంత ప్రత్యక్షంగా ఉంటుంది.

అందుకే దయానిధి మిగిలిన జీవితాంశాలలో సంఘానికి స్థానం చాలా తక్కువ ఉంటుంది. అతని మానసిక ఆవరణోకి అతని వృత్తి చాలా కొద్దిగా ప్రవేశిస్తుంది. శ్యామలతో అతనికి పరిచయం వృత్తిపరంగానే కలిగినా, ఆ సంపర్కం ఆమె ప్రత్యేకతలకే పరిమితమవుతుంది. అనుశీలనలో మానసిక విశ్లేషణ (దయానిధికి చాలా ఇష్టమైన పని) ప్రధానం అవడం వలన, ఆ అనుశీలన మరి కొంచెం సాగి ఉంటే దయానిధికి తన వృత్తిలో సార్థక్యం కనిపించి అతని జీవితం మరో మార్గం పట్టేదేమో! వృత్తిపరంగా అతనికి పరిచయమయే మరో వ్యఇక్త కృష్ణమూర్తి. కృష్ణమూర్తి వ్యక్తిత్వం కానీ, అతని పరిచయం కానీ దయానిధిలో ‘‘మెడిసిన్‌’’ పట్ల ఆసక్తి కలిగించేవి కావు.

అయితే దయానిధి ప్రయత్నం చెయ్యలేదని చెప్పలేం. అతని జీవితంలో చాలా సుఖంగా గడిచిన రాయలసీమ అనుభవాలకు మూలం అతని వృత్తి. అయితే ఆ అనుభవాల్లో అతనికి దొరికిన వజ్రం అతన్ని మళ్ళీ సంఘంతో ఘర్షణకు ప్రోద్బల కారకమవుతుంది. అతను వ్యక్తిగా సంఘం దృష్టిని ఆకర్షించడానికి తోడ్పడుతుంది. అప్పటివరకూ సంఘం పట్టించుకోని అతని వైయక్తిక జీవితం పట్ల సంఘానికి ఆసక్తి కలుగుతుంది. (ఈ వజ్రం దొరకడాన్ని అదృష్టవశాత్తూ అనడం నాకు నచ్చదు. ఎందుకంటే అతని జీవితంలో ప్రశాంతమయిన భాగం వజ్రంతో నాశనమవుతుంది).

అలాగే ఆనాటి సాంఘిక సమస్యలు – స్వాతంత్యోద్యమం, విశాలాంధ్ర ఉద్యమం – దయానిధిని పెద్దగా ప్రభావితం చెయ్యవు. అయితే సాంఘిక పరిస్థితులు వైయక్తిక జీవితాలపై ప్రధానం చూపడం తప్పనిసరి. అదే దయానిధి విషయంలో జరిగినా ఆయా ఉద్యమాలు వాటి స్వీయ ఆకృతిలో Issues గా అతని మానసిక పరిధిలోకి పెద్దగా ప్రవేశించవు.

అలాగే మతం కూడా అతన్ని ప్రభావితం చెయ్యదు. తాత్విక దృష్టికి సంబంధించి అతనికి కొన్ని అభిప్రాయాలు ఉన్నా అవి ‘‘మతం’’తో సంబంధంలేనివి. ‘‘అమ్మ’’ మరణశయ్య మీద ఉన్నప్పుడు తప్ప అతనిలో దేవుడి ప్రసక్తి రాదు. ఆ ప్రార్థన కూడా ఎక్కువ భాగం ఫంక్షనల్‌ తప్ప అతనిలో మరో కోణం కాదు. అలాగే జీవితాలపై ఆర్థిక స్థితిగతుల ప్రభావం కూడా అతని సమస్యలో భాగం కాదు. అయితే బద్ధికంగా అతను ఆర్థిక ప్రాతిపదికను అంగీకరించాడు. ఈ విషయం గని త్రవ్వకపు పనివాళ్ళ గురించి అతను అనంతాచారితో చర్చించేపుడు తప్ప ఇంకెక్కడా తెలియదు కూడా. మరీ దర్రిదంలోకి దిగజారినప్పుడు తప్ప ఆ విషయం అతని జీవితంలో భాగం కాలేదు.

chivaraku_migiledi-300x450

అందువలన దయానిధి ప్రధానమైన సమస్య అతని కాల్పనికతకూ, అందులో ఔన్నత్యానికి చిహ్నమైన ‘‘అమ్మ’’కూ, అమ్మ పట్ల సంఘం దృష్టికీ, అతని సంఘ నిమిత్తానికి మధ్య ఘర్షణకు పరిమితమైంది.

నిజానికి దయానిధి ద్వారా తప్ప మనకు అతని తల్లి గురించి ఎక్కువగా తెలియదు. ఆమె ‘‘ప్రవర్తన’’లో సంఘ నియమాలకు సరిపోని అంశం ఉన్న సంగతి తెలుస్తుంది. అది నిజమో, పుకారో మనకు తెలియదు. (దయానిధికి ఎందరో స్త్రీలతో  ‘‘సంబంధం’’ ఉన్నట్లు సంఘం చిత్రిస్తుంది. దాని నిజానిజాలు మనకు తెలుస్తాయి. అలాగే అతని తల్లి కూడా కావచ్చు.)

అయితే ఈ విషయంలో దయానిధికి మాత్రం అనుమానం లేదు. తల్లి సంఘ నియమాలకు వ్యతిరేకంగా నడిచి ‘‘అపచారం’’ వంటిదేదో చేసిందని అతను విశ్వసిస్తాడు. అందుకే అతను ఎప్పుడు ‘‘క్షమించడం’’గా తప్ప ‘‘అంగీకరించడం’’గా ఆలోచించడు. ఆ విశ్వాసం అతనికి అమ్మ పట్ల ఉండే ప్రేమాస్పదమయిన ఆకృతిలో ఇమడదు. ఈ రెంటి మధ్య ఘర్షణ అతని జీవితంలో ప్రశ్న అవుతుంది. అందుకే హామ్లెట్‌తో పోలిక. హామ్లెట్‌లానే అతను కూడా మొదట్లో తల్లి  ప్రవర్తనను గర్హించకపోయినా తల్లి సాంఘిక నియమాలకు లోబడి ఉండగలిగితే బావుంటుందని అనుకుంటాడు.

‘‘ఇంట్లో గొడవలన్నీ తను (అమ్మ) తెచ్చిపెట్టుకున్నవే. వయస్సు మళ్ళింది – హాయిగా పేచీ లేకుండా సంసారం చక్కబెట్టుకోరాదూ? త్రండి సంపాదిస్తున్నాడు. పెద్దకోడలు కాపురానికి వచ్చింది – ఇప్పుడైనా తన జీవితాన్ని ఒక మార్గంలో పడేసుకుని వొడిదుడుకులు లేకుండా నడుపుకోరాదూ?’’ – అని సాధారణ సంఘంలోని వ్యక్తిగా ఆలోచిస్తాడు. (ఇక్కడ ఏసుల కాపరి కుర్రాడు పాడేపాట ‘‘స్థిరమైన నడవడి’’ కావడం గమనార్హం) అంటే దయానిధి సంఘాన్ని ఎక్కువ గౌరవిస్తాడని కాదుకానీ అతనికి సంఘం పట్ల అట్టే పట్టింపులేదు అప్పటికి. అయితే పై ఆలోచనే అమ్మను దూషించే గోవిందరావు ప్రసక్తి వచ్చేసరికి ఇట్టే మారిపోతుంది. సంఘ వ్యతిరిక్తత మొదలవుతుంది. అలాగ ప్రతిసారీ అతనికి సంఘర్షణ ‘‘అమ్మ’’ గురించే. ఆ ఘర్షణ అతన్లో అంత స్సంఘర్షణగా పెనుభూతమవుతుంది. ఆ ఘర్షణలో అతను సంఘ నియమాలను అయిష్టంగా ఎదిరించే రెచెతగా తయారవుతాడు. అయితే అతని రెబెలియన్‌ బాహాటంగా ఉండదు. ఎప్పటికప్పుడు సంఘాన్ని ఓడించాలని కాకుండా సంఘంతో Detached సహజీవనం కోరుకుంటాడు.

అందుకే తన సమస్యను హామ్లెట్‌కు అన్వయించి, హామ్లెట్‌కే కాదు, షేక్స్పియర్‌కు కూడా అన్వయిస్తూ రాసుకున్న వ్యాసంలో

‘‘తల్లితండ్రుల పాపాలు పిల్లల్ని వెంటాడినప్పుడు వారేం చెయ్యాలి అన్న దానికి షేక్స్పియర్‌ సమాధానం ఇవ్వలేకపోయాడు. వారిని క్షమించి, ప్రేమించనున్నాడా? నీతి లేదనడం లేదు. ప్రాచీనశక్తులు, మానవత్వం – వీటికి నీతితో నిమిత్తం లేదు. ఈ గోళంపై మానవుడి బతుకు క్షణికం, అశాశ్వతం. నీతి పేరిట, కఠిన శిక్ష, కన్నీరు, జుట్టు పీక్కోడం ఎందుకో?’’ అని రాస్తాడు.

హామ్లెట్‌ సమస్యను పోల్చుకోవడం ద్వారా దయానిధి సమస్య ఇంకొంచెం విశదం చేసుకోవచ్చు. హామ్లెట్‌కు అతని తల్లి ‘‘అపచారం’’పై సానుభూతి లేకపోగా అతను ఆ అపచారాన్ని గర్హిస్తాడు. పైగా త్రండి హత్య, ఆ హత్యలో తల్లి పాత్ర సమస్యను మరింత జటిలం చేస్తుంది. అయితే అతని క్రియ ఆలస్యం కావడానికి కారణాలుగా అమ్మ పట్ల ప్రేమ, ఆ ‘‘అపచారం’’ అమ్మదనడంతో ఆ విషయాన్ని సాధ్యమయినంత వరకూ నమ్మకపోవడానికి ప్రయత్నించటం కారణాలు కావచ్చునని కొందరు విమర్శకుల అభిప్రాయం. అక్కడ సంఘం అమ్మను దూషించే ప్రసక్తి లేదు. పైగా చాలా భాగం ఆవిడ వైపు ఉంటుంది, కొంత నిజం తెలియక, కొంత సాంఘిక నియమావళిలో బేధం వలన, ఆమె సాంఘిక స్థాయి వలన. ఆ సమస్య పూర్తిగా హామ్లెట్‌లోని రెండు భాగాల మధ్య ఘర్షణ.

దయానిధికి అలాకాదు. అతనికి తల్లి ప్రవర్తన ‘‘అపచారమా’’ కాదా అని ఆలోచించేంత పట్టింపులేదు. కానీ సంఘంతో ఘర్షణ అయిష్టం కాబట్టి ఆ ‘‘అపచారం’’ అమ్మ చేయకపోతే బావుండును అనుకుంటాడు. ఇందుకు ఉదాహరణగా చివరిలో అంటే వజ్రం దొరికి, ఆ సంపదతో ఇల్లు కట్టుకుని ఒక రకంగా ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు- ‘‘దయానిధి మండువాలో కూర్చున్నాడు ‘అమ్మ’ వ్రిగహం కేసి చేస్తూ. స్ర్తీ జాతిపై అతని నమ్మకం పోయినందుకు ‘అమ్మ’ కారణం అనుకున్నాడు. క్షణం ‘‘అపచారం’’ చేస్తే వారి సంతతి ఇల్లాగైపోతుందని తెలుసుకోగలిగితే, ఏ స్ర్తీయేనా అపచారం చేస్తుందా? ‘‘అమ్మ’’ స్ర్తీత్వానికొక చిహ్నం – ఆ చిహ్నం వొక నల్లటి తెరగా తన దృష్టిని మరుగు పరుస్తుంది. ఆ తెర ఎక్స్‌రే లాంటిది. బైట రక్తం, మాంసం, మెదడు, ఊహ, ఆదర్శం, జ్ఞానం గల స్ర్తీలున్నా, లోపల్నించీ ఇతనికి కనబడేది అస్థిపంజరమే. అతనిక అనుభవాలను ఆత్మవంచన లేకుండా తరచి చూచుకుంటే, స్ర్తీలను ఆదర్శ వ్యక్తులుగా పరిగణించేటందుకు తగిన ఆధారాలు లేవు. ఏది యదార్థం? తన ఎక్స్‌రే దృష్టా? బైట మాంసం, రక్తం, మనుషులా?’’- అన్న ఆలోచన.

అమ్మను దూషించే సంఘాన్ని అంగీకరించలేడు. అలా అని సంఘంతో నిమిత్తం వదలుకోలేడు. అమ్మ ఔన్నత్యాన్ని తగ్గించుకోలేడు. ఇందుకు కారణం సంఘ నియమాలపట్ల అతనికి పెద్దగా నమ్మకం, అపనమ్మకం రెండూ లేవు. రెండూ వున్నాయి. ఈ విషయం ఆధునిక జీవితానికి దగ్గిర విషయమే. అయితే అప్పటికి సంఘం గొంతు చించుకోవడం మానదు. అందుకే కొంచెం సేపు ‘‘అమ్మ’’ ‘‘సరిగా’’ వుండి వుంటే బాగుండుననీ, మరింకోసారి సంఘానికెందుకింత గోల అని ఆలోచిస్తాడు. ఈ పరిస్థితి, ఏమీ చెయ్యలేని పరిస్థితి. అతన్ని మామూలుగా ఉండనివ్వదు. దీన్ని ప్రేమరాహిత్యంగా భావించడం జరిగింది. దయానిధిని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు – అమృతం, జగన్నాధం, కోమలి, నారయ్య, అనంతాచారి మొదలైనవాళ్ళు. వీళ్ళలో అమృతంతో మ్రాతమే అతను తన మానసికాందోళనలను కొంత పరిధి వరకూ పంచుకోగలడు. అయితే ‘‘అమ్మ’’ విషయంలో అమృతానికి అతనికీ వ్యతిరేక అభిప్రాయాలు లేవు. సంఘం గురించి మనకెందుకులే బావా అంటుందేమో అమృతం. అమృతం ఈ విషయాన్ని కదల్చినా అతనికి జవాబిచ్చే మనస్తత్వం లేదు. ఈ పరిస్థితి అతన్ని మామూలుగా ఉండనివ్వదు. అసలే Introvert అయిన అతనిచేత విచ్రితంగా ప్రవర్తింప చేస్తుంది.  తనలోకి తను ముడుచుకు పోయేట్లు చేస్తుంది. అతని సంపద కానీ, వృత్తికానీ, ఈ విషయంలో Solace ఇవ్వలేవు. పూర్తిగా సంబంధం లేని వాళ్ళు కూడా అతన్ని దూషిస్తూంటే వాళ్ళను అడగడు. పైపెచ్చు తన అంతఃక్రోధంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి సంఘానికి మరింత దూరమవుతాడు. ఇందుకు ‘‘అమ్మ’’ అపచారం అతనిలో సెక్స్‌ పట్ల కలిగించిన Inhibitions ఏ స్త్రీతోనూ అతనికి శారీరిక సంబంధం లేకుండా చేస్తుంది. సంఘాన్ని అంగీకరించలేక వదలుకోలేకపోతాడు. ఈ ప్రవర్తనను శ్రీ ఆర్‌.ఎస్‌.సుదర్శనం గారు ‘‘న్యూరాసిస్‌’’గా పేర్కొన్నారు. ఇందులో భాగమే సంఘంతో పరోక్షంగా పోట్లాట. అయితే ఈ పోట్లాటకు కారణం ఉద్వేగం,Inhibitions అనడంతో అది Submissive గా ఉంటుంది. ఉల్లంఘిస్తున్న నియమాలతో మేలికంగా వ్యతిరిక్తత లేకపోవడం వల్ల మరో ప్రత్యామ్నాయ జీవన విధానం కోసం ప్రయత్నం, నమ్మకం ఉండవు.

ఈ ఘర్షణలో ఇంకోరిసాయం, స్నేహం ఉండవు, సాయం కోరినా దొరకదని అతని అభిప్రాయం కావచ్చు. పైగా అతను Introvert అవడం కూడా కారణం.

ఈ అంశంతో సంబంధంలేని సంఘం రాయలసీమలో కనపడుతుంది. అమృతంతో సంఘటనతో సెక్స్‌పట్ల మరింత చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఆ సంఘంలో అనంతాచారితో సుఖమైన స్నేహం ఏర్పడుతుంది. సంఘం పట్ల, ఇతరుల పట్ల ఏహ్యత ఏర్పడుతుంది. చివరికి అక్కడ కూడా మిగిలిన సాంఘిక అంశాలకు ఏర్పడే ప్రాముఖ్యత వల్ల అతని పట్ల జనం విముఖతనేర్పరచుకొంటారు. వాళ్ళలో ‘‘అమ్మ’’ అతని ‘‘ప్రవర్తన’’ చర్చనీయాంశాలు అవుతాయి. దాన్తో సంఘాన్ని నేరుగా ఎదుర్కొనక తప్పనిసరి అవుతుంది.

అప్పటికి అతను జీవితంలో చాలా అనుభవం గడించాడు. ఎందర్నో చూసి ఉన్నాడు. అతనికి జరిగిన వివాహం వల్ల దాంపత్యం, సహ జీవనం ఏమీ లేకుండా భార్య నికృష్టంగా చనిపోతుంది. అతని ‘‘శత్రువులు’’ చాలా మంది పోతారు. కొత్త శత్రువులు చేరతారు. ‘‘మిత్రులు’’ దూరమేతారు. ఆ స్థితిలో అతను మొదటసారిగా ‘‘సంఘం’’తో మాట్లాడతాడు. అంటే తనతో సంబంధం అట్టే లేని వ్యక్తులు తన గురించి, ‘‘అమ్మ’’ గురించి ప్రస్తావించడం విని వాళ్ళను Confront చేస్తాడు. అక్కడ కూడా అతని మనస్తత్వానికి తగినట్లే కోపం కంటే నిస్సహాయత, Submission కనిపిస్తాయి.

అన్ని  విషయాలు వాళ్ళకు కావల్సినట్లుగా చేస్తానని చివర్లో ‘‘ఎవరో మా అమ్మ విషయం ఎత్తారు మీలో. నేనేం చెయ్యను? – మా అమ్మ చచ్చిపోయింది – చచ్చినవాళ్ళను నేనేం చెయ్యను’ ఒక్కసారి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. కంఠం పగిలిపోయింది. ఆపుగోలేక, నిధి బిగ్గరగా ఏడుస్తూ’’ చచ్చిపోయింది’’ అనుకుంటూ పిచ్చివాడిలా నడిచివొచ్చేశాడు. దూరంగా ఎవరో ముక్కు చీదుకుని నిట్టూర్చారు.

ఆచారి గారింట్లో దీపం మసగ్గా కనపడుతోంది. అంతా చీకటి. ఇంక అతనికి ఏడుపు రావడం లేదు. కన్నీరంతా ఎండిపోయింది. స్మశానంలో భూతాలతో ప్రసంగం చేసివచ్చిన తర్వాత, యింక గుండెల మీద భయం తాండవించలేదు- బరువుని సముద్రం మింగేసి, తుంపరల్ని మొహాన కొట్టింది – ఆ బరువు, సముద్రంలోని ఉప్పునంతా పీల్చేసింది- కన్నీరింక వుప్పగా ఉండదు’’.

అంతటితో అతనికి సమాధానం దొరికింది. సంఘంతో సంభాషణతో సంఘం పట్ల భయం పోయింది. అతని హృదయంలో Self pity స్థానంలో ఔదార్యం చోటు చేసుకుంది.

3

‘‘చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికి అర్థమేమై వుంటుంది? మానవుడు ఈ ప్రశ్నని వేసే అవసరం రావడమే జీవితానికేదో అర్థం వుందనుకోవడానికి తార్కాణం. అర్థం లేదని ఇతరులు ఋజువు చేకుంటే, సృష్టి అంత భయంకరంగా ఉండకపోవచ్చు. సృష్టికి ఇతరులు కల్గించిన అర్థాలను మనం అంగీకరించలేము; మనం కనుక్కుని, ఎముకలలో జీర్ణించుకున్న అర్థాలని ఇతరులకి చెప్పలేం. ఇతరులతో సంపర్కం వదలుకొని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధాన పరచుకోవడం, సంఘంతో నిమిత్తం ఉన్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీనపునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరికి మిగిలేదేమిటి? అన్న వాక్యాలతో మొదలయ్యే ఈ నవల

‘‘కావల గట్టున ఇప్పటిలా ఏకాంతంగా గడ్డిలో పడుకుని, అతను వేసుకున్న ప్రశ్న ‘జీవితానికి అర్థం ఏమిటి?’ ఈనాడూ అదే ప్రశ్న చివరికి మిగిలింది, – దాని సమాధానం కాదు; సమాధానం తెల్సుకునేందుకు తను చేసినయత్నాల – జ్ఞాపకాలు – తనతో తాను సమాధానపడడం – అది మిగిలింది.’’ అని ముగుస్తుంది.

ఈ సమాధాన పడడం ఎలాంటిది? దయానిధికి తన జీవితంలో ఏం అర్థం కనిపించింది? ఆ అర్థాన్ని సరళంగా చెప్పుకోవచ్చా?

రచయిత ఆ ముఖంలో జీవితం పట్ల ఒక దృక్పథం కల్పించడం ఈ నవల ధ్యేయంగా పేర్కొన్నాడు. ఆ దృక్పథం ఎలాంటిది?

చివర్లో దయానిధి ఆలోచనలలో ఈ ప్రశ్నలకు సమాధానం కనపడుతుంది.

‘‘కోమలీ నాకు మనుషులన్నా, సంఘం అన్నా ఇంతవరకూ భయంగా ఉండేది. ఇవాళతో ఆ భయం పోయింది!

… ఏం జరిగిందేమిటి?

– నేను వెలుగుని చూశాను- శ్మశానంలో.

– అవేం మాట్లండీ – నాకు భయం పుడతావుంది.

నమ్ముతావా! – మానవ హృదయంలో ద్వేషం ఎందుకుంటుందో కనుక్కున్నాను.

… ఎందుకో చెప్పండి?

… తనకేం కావాలో తెలీనప్పుడు, మానవుడు ద్వేషిస్తాడు.

అంటే?

ఏం కావాలో తెలిస్తే; ఆ వొస్తువుని ప్రేమించి, దాన్ని పొందటం కోసం యత్నిస్తాడు. అది తెలీనప్పుడు హృదయంలో మిగిలేది ద్వేషం.

… కొందరికి ఏమీ అక్కర్లేదనుకోండి, వారి మాటేమిటి?

అక్కర్లేదని తెలుసుకున్నా ద్వేషం ఉండదు.

 

‘‘రెండు కొండల మధ్య నడచి నడచి అవతలకు చేరుకున్నారు – అవతలంటూలేని అవతల నడిచి నడిచి, నడిచినడిచి నడిచి నడిచి – మళ్ళా అక్కడికే చేరుకోవడమా? అంతేనా విశాల ప్రపంచం! అదేనా అనంత జగత్తు! ఇదా ఎడతెగని జీవిత రహస్యం!’’

‘‘సంఘాన్ని మార్చలేడు; మనుషుల్ని మార్చలేడు, మారిస్తే బాధ, పగ, యుద్ధం. తనతో తను సమాధానపడాలి, అది యీనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రతమైన మహత్తర ఆనందం అతనిలో వుద్భవించింది…. పిచ్చి ప్రపంచాన్ని దూరంగా వుంచే ఔదార్యం. మతాన్ని, దైవాన్ని, మనుషుల్ని తోసేసి సంతృప్తి చెందే, ఆథ్యాత్మిక దృష్టి తనలో కడసారి యదార్థం.

‘‘తనున తాను పరిపూర్ణంగా చూశాడు. ఎంత చిత్రం! ఎంత దగా? ఎంత భ్రమ? తనలో తాను సమాధానపడి, తన్ను తాను స్వీకరించి, కౌగలించుకుని ఏకమయ్యాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అంగీకరించొచ్చు.’’

‘‘ఈ జీవితానికర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం; బాధలేవు, కొత్త బలం, వికాసం, ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం వుంటాయి.’’

‘‘మానవుడికి కావల్సింది మతాలు, దేవుళ్ళూ మ్రొక్కుబళ్ళు, రాజకీయాలూ కావు; మానవుడికి కావల్సింది, దయ – కొంచెం ఐనా చాలు.’’

వీటన్నిటితో పాటు గుర్తించుకోవలసింది డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారి చిన్న కథ అందులో సారాంశం ‘‘కన్నీరు కార్చిన వారికే వజ్రాలు.’’

ఈ మాటల్లోంచి ఎవరు తీసుకొనే అర్థమయినా చాలా పరిమితంగా వుంటుంది. అంతేకాదు. ఆ అర్థం వ్యక్తిగతంగా మారుతా వుంటుంది. అందుకు మన దృక్పథాలు, ఆలోచనలు కారణాలవుతాయి. అంటే మనం మళ్ళీ మొదటికే రావచ్చు.

 

కానీ, కొన్ని సామాన్యంగా అంగీకరించవలసినవిగా ఈ ముగింపులో తోచినవి చెప్పడమే క్రింది ప్రయత్నం.

జీవితం గడపడమే జీవితాన్ని సమన్వయ పరచుకోవడం (చివరకు మిగిలింది సమాధానం కాదు. సమాధానం తెల్సుకునేందుకు తను చేసిన యత్నాలు – జ్ఞాపకాలు) సంఘాన్ని మనం అంగీకరించడం అనేది మన స్వేచ్ఛకు భంగకరం కానవసరం లేదు. వ్యక్తి జీవితంపైన వ్యక్తి అభిప్రాయం, సంఘం అభిప్రాయం ఒక్కటి కానంత మాత్రం చేత వ్యక్తికి సంఘంతో ఘర్షణ అవసరం లేదు. అయితే ఈ రెండు అభిప్రాయాలూ పరస్పర విరుద్ధం అన్న భ్రమ మనలను బంధించే నిజమైన అంశం. ఈ బంధం వల్ల సంఘాన్ని జయించడానికో లేదా సంఘానికి పూర్తిగా లొంగిపోవడానికో మనం ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో మనం అభాసుపాలవుతాం. నిజంగా విరుదమైన భావాలు మనవే. వాటిలో ఒకదానికి మనం దగ్గిరగా ఉన్నాం అని గుర్తించడంతో సంఘం శత్రువు కాకుండాపోతుంది. అందువల్ల సంఘాన్ని సహించడం కుదురుతుంది. అప్పుడు జీవిత గమనానికి స్వేచ్ఛ. (తనను తాను పరిపూర్ణంగా చూశాడు! ఎంత చిత్రం! ఎంత దగా? ఎంత భ్రమ? తనతో తాను సమాధానపడి, తన్ను తాను స్వీకరించి, కౌగలించుకుని ఏకమయ్యాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అంగీకరించవచ్చు.) అవసరమయితే పట్టించుకోకపోవడం కూడా సహించడమే. (పిచ్చి ప్రపంచాన్ని దూరంగా ఉంటే ఔదార్యం…. ‘మానవుడికి (తనకు కాదు) కావల్సింది మతాలు, దేవుళ్ళు మ్రొక్కుబళ్ళు, రాజకీయాలూ కావు. (ఇవన్నీ బాహ్యమైన సంఘం. శత్రు సంఘం తనలోదే. అది మన గురించిన ద్వైదీభావం) మానవుడికి కావల్సింది, దయ – కొంచెం ఐనా చాలు)

దయ, ఔదార్యం, సహనం ఇవి లభించవలసినవి కావు. మనం ఇవ్వవలసినవి. ఇది మనకు జీవితంలో ఒకే సారాంశాన్ని, ఒక చెప్పుకో గలిగిన విజయాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆ విజయం గుప్తమైనది. నిజమైనది (Real). దానికి బాహ్యమైన చిహ్నం మన జీవితమే. మనం ‘‘జీవించా’’ మన స్పృహ నిజమైన స్వేచ్ఛ. (ఈ జీవితానికి అర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం, బాధలేవు. కొత్త బలం, వికాసం, ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం ఉంటాయి.)

అదీ ఈ నవల జీవితంపై కలిగించే దృక్పథంగా నాకనిపిస్తుంది.

 

4

‘‘దయానిధి’’ కథానాయకుడిగా అల్లబడిన నవల ఇది. కథానాయకుడి ప్రాముఖ్యత ‘‘చింతామణి’’ పత్రిక పెట్టిన ‘వచన ప్రబంధ’ పోటీ నియమావళిలో ఒకటి, అయినంత పాతదే అయినా ఈ నవలలో ఆ ప్రాముఖ్యత ‘గుణం’ మారింది.

అయితే మిగిలిన పాత్రలు కేవలం ‘‘సృష్టింప’’ బడినవి కావు. ఆయా పాత్రల వ్యక్తిత్వం, ప్రత్యేకత వాటికుంది. ముఖ్యమైన భాగాలకు అవసరమైనట్లుగా మాత్రమే చిత్రించబడినా ప్రతీకలు మాత్రమే అయినా వాటిలో జీవం వుంది.

దయానిధి ‘అమ్మ’లోని ‘చెడుగు’కు కోమలి ప్రతీక అవుతుంది. అందుకే దయానిధి కోమలి గురించి చేసే ఊహలన్నీ అత్యధిక కాల్పనికతతో నిండి ఉంటాయి. ఆ ‘చెడుగు’ పట్ల దయానిధి కుండే అయిష్టతనూ, ఆ అయిష్టతను జయించడానికి అతను తనలో చేసుకునే ఊహాగానాల కల్పనికతనూ కోమలితో అతని సంబంధాలలో చూడవచ్చు. నిజానికి కోమలి కూడా సంఘ బాహ్యమయిన వ్యక్తియే. అయితే దయానిధిలా ఆమెలో ద్వైదీభావం లేదు. తన జీవితాన్ని గురించి చక్కని అవగాహన ఏర్పరచుకుంటుంది. సెక్స్‌ లేని జీవితాన్ని ‘‘బైరాగి’’ జీవితంగా చూడ్డమే కాదు. ‘సెక్స్‌’ను అత్యున్నతమైన ప్రేమకు ప్రకటనగా కూడా భావించగలుగుతుంది (లేకుంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో ఎలా తెలుస్తుంది?’) మొదట్లో ఆమె సహజమైన సంకోచాన్ని (Inhibition) ‘‘ఫ్రిజిడిటీ’’ అని బాధపడ్డ దయానిధి చివర్లో ఆమె రెచ్చగొట్టినా శాంతంగా, ఉద్రేకం లేకుండా సమాధానపరచడం అతని పరిణితికి నిదర్శనం. చివర్లో ఆమె దయానిధికి విడదీయరాని సన్నిహతురాలు కావడం దయానిధి సాధించిన సమన్వయానికి ప్రతీక. ఆమె నిజంగా అతన్ని ప్రేమించింది. అయితే ఆమె పట్ల అతనికి ఉన్న భావం ఆ ప్రేమ పూర్తి ఫలాన్ని అతనికి అందనివ్వలేదు.

దయానిధి అమ్మలోని సమర్థనీయమైన ‘‘మాతృ’’ భావనకు ప్రతీక అమృతం. ఆమెతో దయానిధి ఏర్పరచుకొనే చనవు అతనికి ‘‘అమ్మ’’లోని ‘‘మంచి’’ పట్ల పాక్షికతను తెలుపుతుంది. ఆమె తనకేం కావాలో తెలుసుకున్న పరిపూర్ణ వ్యక్తిత్వం కలది. జీవితంలో సమన్వయం సాధించిన వ్యక్తి దయానిధికి ఒకేసారి సెక్స్‌ అనుభవం ఆమె ప్రోద్బలంతో ఆమెతోనే కలగడం గమనార్హం. ఇది ఫ్రాయిడియన్‌ ఈడిపస్‌ కాంప్లెక్స్‌ ప్రభావితం కావచ్చు. ఆమెకు దయానిధిపై నిర్వచించలేని ప్రేమ, ఆప్యాయత, దయ. దయానిధికి చివర్లో కలిగే స్పృహ (మానవుడికి కావల్సింది, దయ, కొంచెమైనా చాలు) ఆమె వ్యక్తిత్వంలో భాగంగా కనిపిస్తుంది. ఆమె పట్ల కూడా దయానిధి కల్పించుకున్న ‘‘కాల్పనికమైన ఊహ’’కు ఆమె నుంచి ప్రోత్సాహం లభించదు, ఆమె Down to Earth, ప్రవర్తన వలన. అందువల్ల ఆమె ప్రేమను పూర్తిగా పొందలేకపోయాడు దయానిధి.

అమృతం, కోమలి కాక మిగిలిన పాత్రల్లో జీవితాన్ని నాశనం చేసుకునే సుశీల, కృష్ణమూర్తిల దగ్గిర నుంచీ స్నేహంతో జీవితాన్ని నింపుకోగల అనంతాచారి, రాజమ్మల వరకూ ఉన్నారు. ఒక్కొక్కరి మనస్తత్వ అనుశీలన నిజంగా గొప్ప అనుభవం. అయితే తెలిసిన కారణాల వల్ల ఆయా పాత్రలలోని ముఖ్యాంశాలుగా నాకు తోచినవి మాత్రం పేర్కొంటాను.

దయానిధికి ఎదురయ్యే స్త్రీ పాత్రలన్నిటికీ స్ర్తీలలోని ఒక ప్రత్యేక లక్షణం ప్రధానంగా ఆపాదించబడుతుంది. ఇందిర వివాహం ద్వారా ఏర్పడ్డ సంకెల అయితే చప్పుడు చెయ్యని సంకెల. సుశీల స్ర్తీ సహజమైన ఆహానికి ప్రతీక. అయితే సుశీలకెదురైన దయనీయమైన ముగింపు ఆలోచన కలిగిస్తుంది. నాగుమణి స్ర్తీలోని కేవలం శృంగార స్ర్తీత్వం అయితే శ్యామల ప్రస్తుత సమాజంలో స్త్రీని ఆవరించే లేదా స్త్రీలో వృద్ధి చెందడానికి అవకాశం ఉండే సౌందర్య రాహిత్యానికి ప్రతిరూపం. శ్యామల పంజరాన్ని తనతో తీసుకెళ్ళడం గమనార్హం. ఇందిర మరణం దయానిధికిచ్చిన Releif,నాగుమణితో బండిలో అనుభవాలు దయానిధి జీవితంలో వారికి గల ప్రాతలను తెలుపుతాయి. స్త్రీ కనపడగానే అన్నిటితో కూడిన స్త్రీత్వాన్ని తప్ప చూడలేకపోయిన దయానిధి కాత్యాయనిని చూడడంలో ప్రత్యేకత కనపరుస్తాడు. ఇది అతని పరిణితికి సూచన. ఇందిరను కూడా కాల్పనికంగా ఊహించే ప్రయత్నం (ఉంగరం ఇచ్చేప్పుడు) జరిగినా అది వివహానికి అత్యవసరమైన సెక్స్‌పట్ల దయానిధికి ఉండే సంకోచం ((Inhibition)తో దెబ్బతింటుంది.

దయానిధి జీవితంలో స్త్రీ  ప్రాతలకున్న ప్రభావం సంఘ ప్రతినిధులుగా తప్ప పురుష ప్రాతల కుండదు. సంఘంతో దయానిధి Interactionను పురుష ప్రాతలు చెప్తాయి. తనకు ప్రాప్తించిన వాటికి నవ్వుకొని ఇతరులకు ప్రాప్తించిన వాటికి బాధపడే నారయ్య నవ్వే శక్తిని అంటే జీవించే శక్తిని కోల్పోడు. జీవితం పట్ల గర్హనీయమైన ప్రాక్టికాలిటీ గలవాడు ‘‘రాజభూషణం’’. అయితే జీవితాన్ని మంచకి ప్రయోజనకరంగా మలచుకోగల స్నేహశీలి అనంతాచారి. ఇల్లు కాలిపోతే దయానిధి తనను కారణంగా చెప్పుకుంటున్నప్పుడు ‘‘ఆయన లేకపోవడం వల్ల ఇలా జరిగింది’’ అనే రాజమ్మ ప్రత్యేకత స్ర్తీత్వంలోని స్నేహం. సెక్స్‌ను అమిత తేలిగ్గా తీసుకుని జీవితాన్ని నిర్వీర్యం చేసుకునే వాడు కృష్ణమూర్తి. స్ర్తీలను సాధికారంగా మాత్రమే అభిమానించగల ప్రకాశరావు ప్రతి దానికీ బాహ్యమైన అర్థాలను చెప్పుకుని సంతృప్తి పడే కూర్మయ్య బృందం. వీళ్ళందరికీ విభిన్నంగా సంపూర్ణమైన జీవంతో ‘‘నేను నేనుగా ఉండే అవసరం పుస్తకాల్లో మనుషులకి తప్ప మామూలు లైఫ్‌లో మనుషులకి రాదు. వొస్తే వాళ్ళు ఛస్తారు.’’ అందుకే హృదయద్వారం బుల్‌ మూసి చిల్లు పడ్డవోడవలె’’ కాదు. ‘‘తల్లిపాలు తాగిన పాపవలె’’ బ్రతికే జగన్నాధం నిలుస్తారు.

ఈ వ్యాసాన్ని దయానిధి గురించి జగన్నాధం మాటలతో ముగిస్తాను.

“The wealth of kindness, Dayanidhi;

He, the boatman, made a childishness,

of loving humanity, with kindness killed

with having passion, chilled-

ఎంత గొప్పగా చెప్పాడో.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఖాళీ…

Art: Rafi Haque

Art: Rafi Haque

మాయా నది

 

పరిగెత్తుకు వెలుతున్న.. పడిపోతానేమొ అని భయమేసినా, పట్టుకొని లేపేవారు లేరని తెల్సినా, పరిగెత్తుకు వెలుతున్న.

చలం సార్ చెప్పిన మాటలు ఇంకా చెవిలోనే గింగురుమంటున్నయ్

మల్లన్న వాగుల మూడు సార్లు మునిగి లేస్తె మస్తు మార్కులు వస్తయంట!

నేను నమ్మలె…  నమ్మేలా అనిపించలె.

ఎన్ని సార్లు చదివినా గుర్తు పెట్టుకోని నా బుర్రనే నేను నమ్మను, ఇంక వాగుని, ఈ సార్ ని ఎం నమ్ముత ?

కాని ఇవాల కళ్ల ముందు కనిపిస్తుంటే నమ్మాల్సొచ్చింది

 

నాతొపాటు ప్రతిరోజు గొడ కుర్చి వెసే చింటు గాడు ఈరోజు వేయలె,

మోకాలి నొప్పితొ మూలుగుతూ వెల్లి మొదటి బెంచిలొ కూర్చున్న చింటు గాడిని అడిగా ఎరా ఇవాళ నీ హ్యాప్పి బర్త్ డే నా అని ?

కాదు రా నేను అన్ని సబ్జెక్ట్ లు  పాస్ ఐన అన్నడు

ఆ ఏంది ???

అవును రా చూడు అని ప్రొగ్రెస్  కార్డ్ చూపించిండు, నాకు ఒక్క నిమిషం ఎం అర్ధం కాలె

గొంతులొ ఎదొ నొప్పి

స్కూల్ మొత్తం లో నేను ఒక్కడినె మొద్దునేమో అనిపించింది

నా కళ్ళలొ నీల్లు, బెల్లు సౌండ్ ఒకేసరి వచ్చినయి

ఎంత చదివినా గుర్తుండట్లే అంటవ్ కదరా నాలెక్కనే

ఇప్పుడేం మాయరోగం వచ్చింది  అని అడిగితె మెల్లగ మల్లన్న వాగు ముచ్చట చెప్పిండు

ఆరోజు చలం సార్ మనిద్దరికి కలిపి ఒకేసారి చెప్పిండు కదరా  నువు పొలెదా వాగుకాడికి అన్నడు

నేను నమ్మలేదురా అన్న… నేను నమ్మాను రా అని వాడన్నడు…

 

అందరు సార్ లు ఎవేవొ చెప్పి చూసిండ్రు, కొంతమంది కొట్టి మరీ ట్రై చేసిండ్రు

కాని నా బుర్రకి ఎం గుర్తు ఉండదు సార్ నన్ను ఎం చెయమంటరు అని అడిగేటోన్ని

 

మల్లన్న వాగుల కాదు మానస సరొవరం ల మునిగినా నీ మట్టి బుర్రకి చదువు ఎక్కదు నువ్వు పాస్ అవ్వవు అంటున్న నా లోపలి గొంతు నాకు క్లియర్ గా నాకు వినిపిస్తుంటే క్లాస్ రూం బయట ఉన్న ఉసిరి చెట్టు దగ్గర నిలబడ్డ

ఎడుపు ఆపుదాం అని ట్రై చేస్తున్న నన్ను చూసి చలం సారు దగ్గరికి వచ్చిండు

సార్ రాగానె చింటు గాడు ఒక్క నిమిషం కూడ ఆగలె

సార్ వీడు వాగుకాడికి పోలేదంట సార్

అందుకే ఇంకా వీడికి చదివింది గుర్తుండట్లె

మళ్ళీ ఫెయిల్ అయ్యిండు

వాడు నా మీద ప్రేమతొ చెఫ్తుండొ, చాడీలు చెఫ్తుండొ అర్ధం కావట్లె

చలం సార్ నా కళ్ళు తుడిచి

నిన్ను నువ్వు నమ్మాలంటె ముందు నన్ను నమ్మరా అని మొక్కలకి నీల్లు పొయడానికి వెల్లిపోయిండు

 

పరిగెత్తుకు వెలుతున్న, పడిపోతానని భయం లేదు పట్టుకొని లేపాల్సిన అవసరం లేదు

మల్లన్న వాగులొ మునిగిన మళ్ళీ ఓడిపోనని నమ్మిన.

 

అక్కడ వంగిపోతున్న మొక్కలకి కర్రలు ఊతం కడుతున్న సార్ ని చప్రాసి రామయ్య అడిగిండు

సార్ మీరిచ్చిన సపోర్ట్ మీద ఈ మొక్కలు ఎన్ని రోజులు ఆధారపడుతయి?

వాటి సొంత బలం వాటికి తెలిసేవరకు

ఓహో!

మరి వాటికి ఎవరు చెప్తారు సార్

ఏమని ?

మీకు ఏ సపోర్ట్ అవసరం లేదు, మీలో ఉన్న శక్తి మీకు చాలు అని

చలం సార్ పెద్దగా నవ్విండు…….

వాన సంవాదం!

tushar

42 యేళ్ళ తుషార్ ధవళ్ సింహ్ డిల్లీ స్కూల్ ఆప్ యెకనామిక్స్ లో పట్టభద్రులై యిండియన్ రెవెన్యూ సర్వీస్ లో కమీషనర్ ఆప్ ఇన్కంటాక్స్ గా పని చేస్తున్నారు. పైంటింగ్,ఫోటోగ్రఫి, నాటకాలు కూడ అంతే యిష్టంగా వేస్తుంటారు.యిప్పటివరకు రెండు కవితా సంకలనాలు ప్రచురించారు.

యితని కవిత్వం యాంత్రిక జటిలతను ప్రశ్నిస్తూ ..వుత్తర పెట్టుబడి వాదంతో భారత దేశ సంస్కరణల వలన యేర్పడ్డ విషమ పరిస్థితులను యితని కవిత్వం గొంతెత్తుతుంది.రంగుల్లేని మధ్యతరగతి జీవనపు దుఖాలను దుఖమై కరుగును.యీ సంవేదనలన్నీ తన కవిత్వంలో తిరిగి మానవత్వాన్ని పొందాలనే ప్రయత్నంలో భాగమే. దృశ్యాత్మక బింబాల్లో యదార్థాలను ప్రకటించడమే తన శిల్పపు ప్రత్యేకత.

యీ యాత్రలో
——————-

చాల దూరం వరకు విస్తరించిన దట్టమైన అడవిలో
నాకు వో నది కనిపిపిస్తుంది
నువ్వు చూడలేక పోవచ్చు

తేమతో వేగంగా వీచే గాలి
వాన సంవాదంతో
వర్షాన్ని తీసుకురాదు
నిగిడిన వో తియ్యదనం వుంటుంది

యింతవరకు నడిచినదంతా
నా లోపలే నడిచిచాను
మైళ్ళ బొబ్బలు నా అరికాళ్లు
నా నాలుక పైనా వున్నాయి

నా గాయాల లెక్కింపు
నీ లెక్కించలేని
జయగాథల్లో జతకావచ్చు
యీ యాత్రలో
నా కోసం
యివి చిత్రాలు

యీ బెరడులపై
అక్కడి నుంచే బయలు దేరుతున్నాను
ఆ గుహల వరకు

నా పరిశోధన గురుతులు వున్నాయి
నీ యాత్రలలో దుమ్ము వుంది
వీటిల్లో సుఖపు రోజుల్లోని
విధ్వంసపు కథలున్నాయి

అన్నీ పడదోసి చేరుకున్నప్పుడు
నాకు నేను తిరిగివచ్చినట్టు
అనుకొంటాను

తిరిగి రావడమంటే
యేదో చెట్టు తన గింజలోకి ప్రవేశించడం
సాధారణ సంఘటన కాదు
యిది వొక అజేయ సాహసం
పతనానికి వ్యతిరేకంగా …

*

ఓల్గా కథల ఇంగ్లీషు అనువాదం

olga

జర్నీలో తోడు సంగీతం: రంజని

chaya1

 

ఛాయ (సాంస్కృతిక సంస్థ) నిర్వహిస్తున్న తమ పదమూడవ కార్యక్రమం – ఛాయ తరంగిణి (సెప్టెంబర్ 4- 6PM) కార్యక్రమంలో రంజని శివకుమార్ పాల్గొంటున్న సందర్భంగా తనతో ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ చేసిన సంభాషణ.

—-*—

నెలవంక పసివెలుగులా దినదినమూ ప్రవర్ధమానమై పూర్ణచందమామ వెన్నెల్లా  మనోలోయలని సంపూర్ణంగా నవరాగ సంమ్మిళితంలో మంత్రముగ్ధులని చేసే రాగరంజని  ఆమె.

దైనందిన జీవితపు ప్రతిమలుపులో మనపై చిలకరించే ఆ స్వరపరాగపు అంతరంగమంతా సంగీతమే.

ఆ సుస్వరాల ప్రవాహపు గమనాన్ని వినటం వొక అందమైన అనుభవం.

మీ అందరితో పంచుకోవటం చాల సంతోషం.

యిక విందామా?

 

రంజని, చిన్నప్పుడు మీరు విన్నపాటల్లో యే పాట మీకు బాగా గుర్తుంది?

రంజని : మా బామ్మ గారు వాళ్ళంతా కృష్ణ భక్తులు. యింట్లో నామావాళి పాడుతుండే వాళ్ళు. చిన్న చిన్నవి. అవి యెలా అంటే బృందగానం లాగ. భజన సాంప్రదాయం. యెలా వుంటుందంటే ‘ఆనందకందా గోపాలా గోవిందా – జే జే నందా యశోదా చందా…’ అలా చాల ఫోక్సీగా వుంటుంది ట్యూన్. యింట్లో జస్ట్ అవి పాడతారు. అవి నాకు కాస్త కాస్త జ్ఞానం తెలిసినప్పటి నుంచి బాగ జ్ఞాపకం వున్న పాటలు.

అంతే కాకుండా అప్పా ఫ్లూట్ వాయిస్తారు. నిజానికి మా అమ్మ అప్పా సంగీతం వల్లే ప్రేమలో పడ్డారు. మా అమ్మ అప్పాకి కాంభోజివర్ణం, సరసిజనాభ నేర్పించే వారు.

మా యింట్లో యెప్పుడు సంగీతం గురించిన మాటలు మాటాడుతుంటారు. అమ్మ పాడతారు. నిజానికి వాటిని మాటలు, సంభాషణ అనడానికీ లేదు. జస్ట్ ప్లే మ్యూజిక్… యింటి వాతావరణం అంతా నిత్యం సంగీతంతో నిండివుండేది. సంగీతోత్సవంలా వుండేదనుకో యిల్లు. రిచువలిస్టిక్ కాదుకానీ పండగలతో మ్యూజిక్ ముడిపడి వుండేది.

మార్గశిర మాసం వస్తే యం యల్ వి అమ్మ పాడిన ఆండాళ్ తిరువప్పై మా యింట్లో వుదయం వేళ కాసేట్ ప్లే అవుతుండేది. అనుకోకుండా అది చెవ్వుల్లో పడిపడి చాల యెంజాయ్ చేసేవాళ్ళం. వినీవినీ మాకు యం యల్ వి అమ్మ పై యిష్టం వచ్చేసింది. అలా ఆ కేసెట్ తో మేమూ కలసి పాడుకునే వాళ్ళం. అలానే భద్రాచల రామదాస్ కృతీస్ బై బాలమురళి కృష్ణ సర్ వి ప్లే అవుతుండేవి. ‘తక్కువేమి మనకూ రాముడొక్కడుండు వరకు’ అని వస్తుంటే మధ్యలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాసేజ్ వచ్చేది. అవి కూడా బట్టీ అయిపోయేవి. అమ్మ కర్నాటిక్ పాడేవారు. అప్పా ఫ్లూట్ వాయించేవారు. తమ్మూ మృదంగం వాయించేవారు. అలా యెప్పుడు మా యిల్లు సంగీతంతో నిండి వుండేది. అంతే కాని కూర్చోని విను, విను… పాడుపాడు… నేర్చుకో నేర్చుకో… అలా అసలు వుండేది కాదు. సంగీతమంటే సరదాగా వుండేది. యిష్టంగా వుండేది.

అమ్మ అప్పా యిండియన్ బ్యాంక్ లో పనిచేసే వారు. వాళ్ళు వాళ్ళ కెరీర్లో బిజీ. అయినా యెప్పుడూ యింట్లో మ్యూజిక్కే వుండేది.

రంజని, మనం చిన్నప్పుడు పెరిగిన యిల్లు మనల్నిచాల influence చేస్తుంది కదామీకు మీ యిల్లు యెలా వుండేది?

రంజని: చెన్నైలోని ఐనవరంలో మాది చిన్ని యిండిపెండెంట్ యిల్లు. నా పర్సనాలిటి రూపు దిద్దుకోవటంలో ఆ యిల్లు పెద్ద పాత్రే పోషించింది. యింట్లో వొక్కొక్కరికి వేరువేరుగా గదులు వుండేవి కావు. అందరం వొకే గదిలోనో, హల్లోనో పడుకునే వాళ్ళం. కాని మా యింటి చుట్టూ చాల పెద్ద తోట వుండేది.

తోటాయేయే చెట్లు పూల మొక్కలు వుండేవి?

రంజని: సపోటా రెండు రకాల మామిడి, పారిజాతం, గొయ్య , పనస, సామంది కొబ్బరి చెట్లు టిపికల్ హౌస్ హోల్డ్… అడివి మాదిరి వుండేది. మైంటైన్ చెయ్యటం పెద్ద పని.

డాబా యిల్లా

రంజని: డాబా యిల్లే. ఆ డాబా మీద కొట్టాయి (ఆస్బెస్టస్ షెడ్డు) వుండేది. యెక్కడ నుంచి వచ్చారో యెవరికి తెలీదు కాని నేను పుట్టేటప్పటికే అందులో వరదరాజన్ గారు వుండేవారు. 50 యేళ్ళు వుండేవి. అతని దగ్గరకి వీణ, వయిలన్, వోకల్ నేర్చుకోడానికి చాల మంది వచ్చేవారు. అమ్మ యింట్లో యేది వండితే అది అతనికి పెట్టేది. అతని దగ్గర వొక్క కిరోసిన్ స్టవ్ మాత్రమే వుండేది. అతను టీ మాత్రం చేసుకునేవారు.

photo: Meena

photo: Meena

యింట్రస్టింగ్యెలా వుండేవారు చూడటానికి… .

రంజని: బీడీ తాగేవారు. పొడవుగా వుండేవారు. యెప్పుడు తెల్లని పంచె, లాల్చితో వుండేవారు. బీడీ తాగటం వలన sunken cheeks వుండేవి. Nonviolent person. ఆ జమానాలో చాల మందిలానే చాల సింపుల్ లివింగ్. హ్యాపీ పర్సన్.. వరదరాజన్ గారి దగ్గర చాల ఫ్లూట్స్ వుండేవి. అతనికి అన్ని రకాల యింస్ట్రుమెంట్స్ రిపేర్ చెయ్యటం వచ్చు. అతని స్నేహితులు మృదంగాన్ని బాగు చేసేవారు. నాకు మొట్ట మొదట సరిగమ పదనిసలు… వరదరాజన్ సర్ నేర్పించారు. వొక రోజు ఆయన కనిపించకుండా వెళ్ళిపోయే వరకు అంటే ఆరేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వరకు వరదరాజన్ గారి దగ్గరే సంగీతంలో బేసిక్స్ నేర్చుకున్నాను. యెక్కడి నుండి వచ్చారో తెలియనట్టే యెక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. యెస్… వెరీ వెరీ యింట్రస్టింగ్ పర్సన్. అతనికి మ్యూజిక్ యింస్ట్రీమెంట్స్ గురించి యిన్ అండ్ అవుట్ తెలుసు.

 

రియల్లీ యింట్రస్టింగ్ పర్సన్ఆ తరువాత సంగీతం యెక్కడ నేర్చుకున్నారు…?

రంజని : ఆ తరువాత, తమిళియన్నే కాని జంషడెపూర్ లో సెటిల్ అయిన సీతనారాయణన్ చెన్నై కి తిరిగి వచ్చారు. ఐనవరంలోనే మా యింటికి దగ్గరలో వుండేవారు. కర్నాటిక్ సంగీతం నేర్పించటమే కాదు సీతా అమ్మకి భజన్స్, హిందుస్తానీ సంగీతంలో కూడా ట్రైనింగ్ వుంది. కర్నాటిక్ మ్యూజిక్ తో పాటు భజన్స్ కూడా సీతా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.అప్పుట్లో పిల్లల్లా వున్నప్పుడు మనకి వీడియో గేమ్స్ అలా యేమి వుండేవి కాదు కదా. స్కూల్ నుంచి మూడు లేదా మాక్సిమమ్ మాడున్నరకి వచ్చేసే వాళ్ళం. బయట ఆడుకోవటం, మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళటం, భారత నాట్యం క్లాస్ కి వెళ్ళటం, సమ్మర్ హాలిడేస్ వస్తే వాలీబాల్ కోచింగ్, స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళటం యిలా అప్పట్లో టైం అంతా యాక్టివిటీస్ తో నిండిపోయి వుండేది.

యిల్లు లానే మనపై స్కూల్ ప్రభావం కూడా వుంటుంది కదా. మీ స్కూల్ గురించి

రంజని: Its an amazing school Padma. భావన్స్ రాజాజీ విద్యాశ్రమంలో. చదువుకున్నాను. కిల్ పాక్ లో వుండేది. చాల మంచి టీచర్స్ వుండేవారు. అక్కడ చదువొక్కటే కాదు. యెక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి చాల యింపార్టేన్స్ వుండేది. వైవిధ్యభరితంగా ఆలోచించేవారుండే వారు. వొక్కోసారి మంజుల మేడం యింగ్లీష్ క్లాస్ లని చెట్ల కింద చెప్పేవారు. చిత్ర సంపత్ మేడం డాన్స్ నేర్పించేవారు. మీరా మిస్ సంస్కృతం, శాంతా మిస్ తమిళం నేర్పించేవారు.స్కూల్ ల్లో ఉదయాళూర్ కళ్యాణ్ రామన్ సర్ మ్యూజిక్ టీచర్. భజన సంప్రదాయం లో సుప్రసిద్దులు. స్కూల్ ల్లో యానివాల్ డే కి అందరూ యేదో వొక యాక్టివిటీలో పాల్గునేవారు. టీచర్స్ అంతా చాల నాలెడ్జబుల్. అలాంటి టీచర్స్ వుండటం నిజంగా లక్కీ. యీ ప్రపంచంలో వివిధ రకాల కెరీర్ ఆప్షన్స్ వున్నాయని అవన్నీ యెక్స్ ప్లోర్ చెయ్య వచ్చనేట్టు యెంకరేజ్ చేసేవారు. యిప్పుడు మా క్లాస్ మేట్స్ ని చూడు పద్మా, స్పోర్ట్స్ మెడిసన్, యోగా, యానిమేషన్ యిలా వొక్కో ఫీల్డ్ లో వున్నారు.

నైస్యింట్లో కెరీర్ గురించి చెప్పేవారాయింజినీరింగ్ చదవాలన్నది యెవరి ఛాయిస్

రంజని: యింట్లో యెప్పుడూ యిదే చెయ్యాలని చెప్పేవారు కాదు. చదువు ,మ్యూజిక్, ఆటలు యెందులోను బలవంతం చేసేవారు కాదు. అన్నీ పూర్తిగా నా ఛాయస్. అప్పాకి నేను B A మ్యూజిక్ ఆ తరువాత M A మ్యూజిక్ చెయ్యాలని వుండేది. కాని

యింజినీరింగ్ చదవాలన్నది నా ఛాయిస్. వేలూరు యింజనీరింగ్ కాలేజీలో చేరడానికి వొక కారణం హాస్టల్ జీవితాన్ని చూడాలనిపించింది. ఐనవరానికి బయట వున్న ప్రపంచం యెలా వుంటుందో చూడాలనే కుతూహలంతో యింజినీరింగ్ కాలేజ్ లో చేరాను.

యిప్పుడు ఆ కాలేజీ ని VIT యింజనీరింగ్ కాలేజీ అంటున్నారు. యింజినీరింగ్ సెకండ్ యియర్ లో వున్నప్పుడు డ్రామా చెయ్యాలనిపించింది. అప్పాకి డ్రామా అంటే చాల యిష్టం సరే చెయ్యి… చెయ్యి అని NSD కి వెళ్ళమన్నారు. నేనే వెళ్ళలేదు. కాని అంతలా మా ఛాయిస్ లని యిష్టంగా వొప్పుకునేవారు.

యిల్లు, స్కూల్ మీ విషయంలో వొక దానిని మరొకటి కాప్లిమెంట్ చేసేట్టు వున్నాయి. కానీ బయట అప్పుడు వేగంగా వచ్చే రకరకాల మార్పులని యెలా చూసేవారు మీరు.

రంజని: చదువుకునేప్పుడు కెరియర్ డే డ్రీమ్స్ చాలానే వుండేవి. I had all career choices in my life. యేయిర్ హోస్టెస్ అవ్వాలనిపించాగానే ‘ లెట్స్ అప్లై అనుకునే వాళ్ళం. యెలక్త్రనిక్స్ చెయ్యాలని, కాపీ రైటింగ్ బాగుంది అందులోకి వెళ్లాలని, యానిమేషన్ స్కెచెస్ గీయాలని, వావ్… MTV విజేస్ అంట అవి ట్రై చేద్దామాని, జింగిల్స్ పాడాలని యిలా అందరికి ఆ యేజ్ లో యేలాగయితే రకరకాల కలలు, ఆలోచనలు వుంటాయో నాకు వుండేవి. అంతా మాలో మేమే నలుగురైదుగురు ఫ్రెండ్స్ మి అనుకునే వాళ్ళం. టీవీ యెక్కువ చూసే వాళ్ళం కాదు కానీ టీవిలో చూసేవి మాత్రం వెరీ ఫైన్ ప్రోగ్రామ్స్. మీఠా విసిట్, దీప్తి నావల్ , షబానా ఆజ్మీ లాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడటం వలన అదీ మన పెర్సనాలిటీకి యాడ్ అవుతుంది కదా… అలానే లిటరేచర్ కూడా సత్య జిత్ రేస్ Feluda, యిలా చాల ఫైన్ గా వుండేవాటికి యెక్స్పోస్ అవ్వటం వల్ల యే ప్రభావం  నుంచి యెప్పుడు బయటకి వచ్చేయ్యాలో తెలిసేది. యిలా అవన్నీ వున్నా సంగీతం నా జర్నీ లో భాగంగా యెప్పుడు వెన్నంటే వుండేది. మ్యూజిక్ మాత్రం పార్ట్ అఫ్ మై లైఫ్.

 

ఫైన్జాబ్ చేసేవారు కదా మరి మీరెప్పుడు సంగీతానికి పూర్తి టైం యివ్వలనుకున్నారు

రంజని: యింజినీరింగ్ తరువాత T C S లో పోస్టింగ్ హైదరాబాద్ లో వచ్చింది. హైదరాబాద్ లో నేను ఫ్లూటిస్ట్ యన్ యెస్ శ్రీనివాసన్ సర్ ని కలిసాను. ఆయన శారదా శ్రీనివాసన్ గారి  హస్బెండ్. హైలీ యింటలేక్చువల్ పర్సన్స్. హెచ్ డి వెల్స్ నుంచి కోట్ చేస్తూ నాకు మ్యూజిక్ ని వివరించే వారు. కాన్సెప్ట్ అఫ్ టైం, కాన్సెప్ట్ అఫ్ సైలెన్స్ ని చెప్పేవారు. మ్యూజిక్ విషయంలో డీప్ థాట్ వున్న వ్యక్తి.

అలా మ్యూజిక్ పట్ల పూర్తి అవగాహన, విజ్ఞానం వున్న యన్ యెస్ సర్ ‘వుద్యోగాలు చెయ్యడానికి చాల మందే వున్నారు. కానీ మ్యూజిక్ అందరికి రాదు. నువ్వెందుకు మ్యూజిక్ పైనే పూర్తి గా కాంసెంట్రేట్ చెయ్యవు. నీ టైం అంతా మ్యూజిక్ పైనే పెట్టు’ అని చెప్పారు.

నాపై యన్ యెస్ మామ ప్రభావం చాలా చాల వుంది. నేను నా కార్పరేట్ వుద్యోగం మానేసి నా సమయమంతా మ్యూజిక్ కే పూర్తిగా యివ్వడానికి యన్ యెస్ మామే కారణం. నేనెప్పుడు అంత బ్రిలియంట్ పర్సన్ని చూడలేదు.

యెప్పటి నుంచి కాన్సర్ట్స్ యిచ్చే వారు రంజని.

రంజని: నేను చైల్డ్ గా వున్నప్పటి నుంచే సీతామామీ చెన్నై లో కాశీవిశ్వనాథ్ టెంపుల్ ల్లో నవరాత్రి వుత్సవాలకు, పరుశువాకం లో త్యాగరాజ ఆరాధనై కాన్సర్ట్స్ కి తీసుకు వెళ్ళేవారు. అలా చిన్నతనం నుంచే టెంపుల్ కాన్సర్ట్స్ లో పాల్గునేదాన్ని.

 

చిన్న పిల్లలాగా మనం వున్నప్పుడు పిల్లల్లో టాలెంట్ ని అంతా చాల మెచ్చుకోవటం చాల కామన్ కదా. చిన్న పాపగా వున్నప్పుడు యీ కాన్సర్ట్స్ లో మీరు పాడినప్పుడు చాలమంది చాల మెచ్చుకొంటుంటే ఆ ప్రశంసల నుండి డిస్టెన్స్ మైంటైన్ చేసేవారాచేస్తే యెలా చెయ్యగలిగే వారు.

రంజని: మనలని యెవరు యెంత మెచ్చుకున్నా మనకి మనం యెక్కడ వున్నామో తెలుస్తుంటుంది. మనం ఆ పొగడ్త  కాదని తోసైయ్యం. కాని ఆ పొగడ్తలు యిచ్చే సంతోషం క్షణికం. అంతే. తిరిగి మనల్ని మనం చెక్ చేసుకుంటాం. మనకి మనమే అసలైన చెక్. ప్రతి కాన్సర్ట్ లో మనం యెలా పాడేం, యెక్కడ యే పదం బాగ పలక లేదు, యే సంగతి మరింత బాగా మనం యేఫ్ఫోర్ట్ పెట్టాల్సింది, యిప్పటి కంటే అంతకు ముందు యింట్లో పాడిందే బాగున్నట్టు అనిపించవచ్చు. విలువైన వ్యక్తులు మన చుట్టూ వున్నప్పుడు మనల్ని మనం యెప్పుడు త్వరగా గ్రేట్ అనుకోలేం. మనం మన ఫీల్డ్ లో మనకి వున్న నాలెడ్జ్ యెంతో మనకి తెలుస్తుంటుంది. యింకా యెంతో తెలుసుకోవలసింది వుందని మనకి తెలుస్తునే వుంటుంది. యెంతో సాధన చెయ్యాలని తెలుస్తుంటుంది. ఆ రియాలిటీ చెక్ యెప్పుడూ వుంటుంది నాకు.

ranjani1చెన్నై లో చాల కంపిటేటివ్ సర్క్యూట్ వుంటుంది. చిన్నప్పటి నుంచి అక్కడ పార్టిస్స్పేట్ చేసేదానిని. అప్పా చెపుతుంటారు, చిన్నప్పుడు అలా పాడటానికి వెళ్ళినప్పుడు నా పాట పాడటం అయిపోగానే నేను ఆ ప్రాంగణం నుంచి రాకుండా అక్కడ శ్రోతల్లో కూర్చుని మిగిలిన వారు పాడుతుంటే వింటాననే దాన్నంటా. మిగిలిన వాళ్ళు యెలా పాడుతున్నారో చూడటం నాకు చాల ఆసక్తి. వాళ్ళు వాయిస్ ని యెలా వాడుతున్నారు, కృతి యే స్టైల్ ల్లో వుంది, యే కృతి ప్రెజెంట్ చేస్తున్నారు, హై రేంజ్ స్ ని యెలా ప్రెసెంట్ చేస్తున్నారు యిలా మిగిలిన తోటి వాళ్ళని పూర్తిగా గమనిస్తాను. దాంతో నాకు నేను యెక్కడ వున్నానో తెలిసేది. నేను యెక్కడ సరి అవ్వాలో కూడా తెలిసేది.

అదీ కాకుండా మా పేరెంట్స్ నేను కాన్సర్ట్ స్ యిచ్చినప్పుడు చాల త్వరగా గా నేను చేసిన పొరపాట్లని చెపుతారు. గుడ్ క్రిటిక్స్. వొకసారి యేమయిందంటే తాన్పూరాని చాల సేపు వాయించాను. అలా యెలా వాయిస్తావ్… శ్రోతల్ని అలా బోర్ కొట్టించటం కరెక్ట్ కాదు కదా అన్నారు. యీ మధ్య అయోధ్యా మండపం లో నేను కాన్సర్ట్ యిచ్చాను. చాల బాగ పాడేనని నాకు నేను గాల్లో తెల్తున్తున్నాను. యెప్పుడో కాని నాకు అటువంటి సంతోషం కలగదు. మామూలుగా యెలా వుంటుందంటే, అక్కడ సంగతి మరింత ఫీల్ తో పాడాల్సిందనో, లిరిక్ లో యేదో మర్చిపోయాననో యిలా యేదో వొక కొరత వుంటుంది మనసులో పాడిన ప్రతి సారి. ఆ రోజు అలా యేమి లేకుండా చాల సంతోషం గా వున్నప్పుడు మా పేరెంట్స్’ నువ్వు అలా అన్ ప్రోఫ్ఫెషనల్ గా యెలా ప్రవర్తిస్తావ్ అన్నారు. నేనేం చేసాను అని అడిగాను. మా పేరెంట్స్ చెప్పారు ‘మృదంగం వాయించే వారికి తనియావర్తనం ప్లే చేసే సమయం యివ్వకుండా మొత్తం నువ్వే పాడేసావు. స్టేజి మీద యెవరి లైం లైట్ వారికి యివ్వాలి కదా. అలా అన్ ప్రోఫ్ఫేషనల్ గా వుంటే యెలా… ధర్మా అనేది వొకటుం టుంది’ అన్నారు. అతనికి వెళ్ళి సారీ చెప్పాను. అతను నాకు సీనియర్ కూడా. పర్వాలేదు నువ్వు చాల యిన్న్వాల్వ్ అయి పాడేరు అన్నారు. అది గంటన్నర కాన్సర్ట్ . సో.. స్టేజ్ మీద టైం చాల ముఖ్యం.

అలానే రేడియోలో పాడినప్పుడు అరగంట లో లైవ్ యిచ్చేటప్పుడు టైం ఛాలెంజ్ గా వుంటుంది. యెలా వుంటుందంటే వర్డ్ లిమిట్ వున్నప్పుడు రాయటంలా పద్మా. టైం ని సెట్ చేసుకోడానికి NS మామ నాకు టైమర్ యిచ్చారు.

 

పాడేటప్పుడు స్టేజి మీద మిమ్మల్ని మీరు యెప్పుడైనా మైమర్చిపోతారా

రంజని: మర్చిపోతా ఐ లూస్ మై సెల్ఫ్. బాగుంటుంది అలా మర్చిపోవటం.

తిరిగి మళ్ళీ యిక్కడ మా పేరెంట్స్ చెప్పిన విషయాలు గుర్తు వస్తున్నాయి. వొక సారి లిరిక్ మరచి పోయా. you can’t afford to forget a lyric అని చెప్పారు. అలానే నిన్ను నువ్వు పాడుతూ అలా స్టేజి మీద మర్చిపోవటం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నీ డ్యూటీ ని మర్చిపోకూడదు’ అని చెప్పారు. అలా మర్చిపోవటం శ్రోతల ముందు ఆ క్షణాలని వాళ్ళ కి ప్రెసెంట్ చెయ్యటం వొక రకంగా బాగానే వుంటుంది. కానీ మా పేరెంట్స్ చెప్పినట్టు నేను నా డ్యూటీ నీ పేరఫోం చెయ్యటం మీద యెక్కువ దృష్టి పెట్టటం కూడా నేర్చుకుంటున్నాను.

 

మీరు చాల చోట్ల పాడేరు కదామీకు ఫలానా చోట తప్పకుండా పాడాలని వుండేదా

రంజని: కళాక్షేత్రా లో పాడటం చాల యిష్టం. ఆ యామ్బియన్స్ అందంగా వుంటుంది. అక్కడ పాడటానికి అవకాశం వచ్చినప్పుడు చాల సంతోషపడ్డాను.

యెక్కడెక్కడ పాడేరు రంజని?

రంజని: సేలం, కోయింబత్తుర్, మధురై, చెన్నయి లో యిలా దాదాపు చాల వూర్లలో పాడేను. విశాఖపట్నం, కాకినాడ, తెనాలి , బెర్హంపూర్, భద్రాచలం యిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కచేరీలు యిచ్చాను. అలానే బెంగళూరు, యూ యస్ లో, యూకే లో పాడేను.

యింకా మ్యూజిక్ నేర్చు కొంటున్నారా…?

రంజని: కర్నాటిక్ సంగీతంలో అంతా వచ్చేసింది అని యెప్పుడూ వుండదు. ప్రతి వొక్కరికీ యే స్టేజ్ లో అయినా వొక గురువు అవసరం. నేను యుకే నుంచి తిరిగి వచ్చాక చెన్నై మ్యూజిక్ సీజన్ లో పంతుల రమ గారి పాటలు విని మైమరచిపోయాను. అదృష్టవశాత్తూ యిప్పుడు ఆమే నా గురువు. మ్యామ్ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ లో ఫైనర్ యాస్పెక్ట్స్ నేర్చుకొంటున్నాను.

నాకు ఆమె గురువుకంటే కూడా వొక అక్క లాంటిది. నన్ను యెంతో ప్రేమగా చూసుకుంటుంది. తన సంగీతమన్నా, తనన్నా నాకు చాలా యిష్టం.

యిప్పుడు ఛాయాలో ఛాయా తరంగిణిని హైదరాబాద్ లో తెలుగు యూనివెర్సిటీలో పాడబోతున్నారు. మీ పాటని యెప్పుడెప్పుడు విందామాని యెదురు చూస్తూన్నాను.

రంజనినేను కూడా హైదరాబాద్ లో పాడి కొన్ని నెలలయింది. నేను కూడా మీలాగే యెదురుచూస్తున్నాను.

*