Archives for October 2014

అమెరికా తెలుగు కథ ఎటు పోతోంది?

(ఈ వారం హ్యూస్టన్ లో అమెరికా తెలుగు కథ యాభయ్యేళ్ళ వార్షికోత్సవం సందర్భంగా)

 

నాస్టాల్జియా, నాస్టాల్జియా, ఇంకాస్త నాస్టాల్జియా: వేలూరి

10735719_10152397663077060_729409723_nఅమెరికా తెలుగు కథ అంటే, అమెరికాలో నివసిస్తున్న చాలా మంది తెలుగు వాళ్ళు రాస్తున్న కథలు అని అర్థం చేసుకుంటే, అమెరికా తెలుగు కథ, అటు తూరుపు దిక్కుకేసి, అంటే, అట్లాంటిక్ సముద్రం ఆంజనేయుడిలా లంఘించి, హుటా హుటీన ఆంధ్ర దేశం కేసి పోతూఉన్నది;   అక్కడ అచ్చయితే చాలన్న దుగ్ధతో!

అదేవిధంగా, ఆంధ్ర దేశంలోనే ఉంటూ, అమెరికాలో తెలుగువాళ్ళ జీవనం గురించి కథలు రాస్తున్న చాలా మంది కథకుల కథలు బొంబాయిలో బోయింగు ఎక్కి  సరాసరి అమెరికా లో ఇ-పత్రికలకి చేరుతున్నాయి. కాదు కాదు. పొరపాటు. ఈ మెయిల్‌ ఎక్కి ఈ పత్రికల్లోకి చొరబడుతున్నాయి; ఇక్కడి వాళ్ళని ఉద్ధరిద్దామన్న మోజుతో!

అయితే, అమెరికాలో  చాలాకాలంనుంచీ “ స్థిరపడ్డ” అమెరికా తెలుగు వాళ్ళు – అంటే ఇక్కడే బడికెళ్ళి, ఉద్యోగంకోసం నానాయాతనాపడి నలభై గంటల పని జీవితంతో అలవాటు పడినవాళ్ళల్లో కథలు రాసే వాళ్ళు—కొద్దిమందీ– తమతమ నిజానుభవాలు,  అక్షరరూపంలో పెట్టటం మానుకున్నట్టుగా కనిపిస్తూన్నది. బహుశా అందుకు కారణం:   వాటి ప్రచురణకి ఆంధ్రాలో అవకాశం సున్న; అమెరికాలో  అరసున్న.

ఎందుకంటే, అక్కడ ప్రచురించబడాలంటే — వేడి వేడి సాంఘిక “సమస్య” వెతికి పట్టుకోవాలి. సదరు సమస్యని, ‘అపార్థం,’  లేకండా సాధించాలి; కనీసం సందేశం అన్నా ఇవ్వాలి. సమాకాలీన కథకుడిగా  ఒక ప్రత్యేకమయిన రంగుని ప్రోత్సహించాలి.  కథలకి అంతకన్నా విశిష్టమయిన  రంగు లేబిల్‌ తగిలించాలి. అమెరికాని, అమెరికా జీవనాన్ని, వీలుదొరికినచోటల్లా  అమెరికా “సామ్రాజ్యవాదాన్నీ” చెడా మడా ఖండిస్తూ రాయాలి. అది చేతకాకపోతే, కనీసం హేళన అయినా  చెయ్యాలి. ఇక్కడి జీవనాన్ని నికృష్టంగా చిత్రించగలగాలి. వాస్తవం చెప్పడానికి వెనుకాడని నిజాయితీ ఉన్న కథకులు,  అటువంటి దుస్థితికి దిగజారలేరు అని నా ఉద్దేశం.

పోతే, అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు – వీరిలో చాలమంది ఇంకా అమెరికా లో “సందర్శకులు” గానే ప్రవర్తిస్తారు. ఇక్కడి, కట్టు, ఇక్కడి బట్ట, ఇక్కడి ఆట, ఇక్కడి పాటా – వీటిగురించి ఏమీతెలియదు. తెలుసుకోవాలనే కుతూహలంకూడా లేదనిపిస్తుంది. ఇంకా ఒక కాలు, మూడువంతులు మనసూ, ఆంధ్రాలోనే! చూడటానికి, ఇక్కడ డబ్బుకోసమే గాని, ఇక్కడి వాతావరణంలో ఇముడుదామని వచ్చినట్టు కనపడరు. వీళ్ళు రాసే కథలు, తెలుగు సినిమా కోసం రాస్తున్న కథల్లా వుంటాయి. కొన్ని కథలు, తెలుగు సినిమాలు చూసి రాస్తున్నారా అన్నట్టు ఉంటాయి.

ముంగండలో కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, రెండు గేదెల పాడి, ఒక లేగదూడ, ఎంతో ప్రశాంతమయిన వాతావరణం, పైరగాలి, కాలవగట్టు, పడవల పాటలు – ఏదో పోగొట్టుకున్న బెంగ — నాస్టాల్జియా, నాస్టాల్జియా, ఇంకాస్త నాస్టాల్జియా! ఇవీ, ఇతివృత్తాలు. ఇటువంటి కథలు తెలుగునాట వాస్తవజీవితం  చిత్రించే  తెలుగు కథలు కావు. అమెరికా ఎడ్రెస్‌తో  అమెరికావాడు ఊహించి రాసినంతమాత్రాన , అమెరికా తెలుగు కథలు అసలే కాదు. నిజంచెపితే నిష్టూరం!

అయితే, అడపా తడపా, చెయ్యితిరిగిన కొద్దిమంది కథకులనుంచి చక్కని డయాస్పోరా కథలు, సహారాలో వానచినుకుల్లా అప్పుడప్పుడు అకస్మాత్తుగా వస్తున్నాయి. కానీ అవి నాస్టాల్జియా# noise# లో వినపడటల్లేదు; కనపడటల్లేదు. అదృశ్యమయిపోతున్నాయి.

ఎప్పుడో, ఎక్కడనుంచో, అమెరికా తెలుగు కథకి కూడా ఒక #Edward O’ Brien# లేదా ఒక # Martha Foley#   తప్పకండా  వస్తారని ఆశిద్దాం.

 

అమెరికా  జీవితాన్ని కథలలో ఇమిడ్చి రాయలేదేమో: వేమూరి

imagesXLM15PV1అమెరికా కథ ఎటు పోతోంది? ఈ ప్రశ్నకి నిర్దిష్టంగా “కథ ఈ దిశలో పోతోంది” అని సమాధానం చెప్పడం కష్టం. ఒకటి మాత్రం నిజం. ఏభై ఏళ్ల క్రితం తెలుగులో రాయగలిగేవారే కనిపించేవారు కాదు. రాసేవాళ్లు ఉన్నా వాటిని ప్రచురించడానికి ఇండియాలో తప్ప ఇక్కడ మాధ్యమాలు ఉండేవి కాదు. ఇండియా పంపడంలో ఉన్న ఇబ్బందులు నేను ఇక్కడ వల్లెవేయనక్కర లేదు.

ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వారిలో కథలు రాసేవాల్లు – మంచి కథలు రాసేవాళ్లు – చాలమంది కనిపిస్తున్నారు. అమెరికా కథలని ప్రచురించి ప్రోత్సహించిన వారిలో ప్రథములు వంగూరి సంస్థ, వారి కథా సంకలనాలు, తరువాత కిడాంబి రఘునాథ్ స్థాపించిన తెలుగు జ్యోతి అని చెప్పుకోవాలి. తరువాత కంప్యూటర్లు, అంతర్జాలం వాడుకలోకి వచ్చి కథలు ప్రచురించడానికి కొత్త వెసులుబాట్లు కల్పించేయి.  దీనితో ఇక్కడనుండి కథలు రాసేవారి సంఖ్య పెరిగింది.

అమెరికాలో ప్రస్తుతం కథలు రాస్తూన్నవాళ్లల్లో ఉన్నత స్థాయిలో రాస్తూన్నవాళ్లు కనీసం 5-10 మంది ఉంటారని నా  అంచనా. వీరు రాసే కథలలో అమెరికా జీవితం వల్ల ప్రభావితమైన కథలు కొన్ని ఉన్నాయి. కాని అమెరికా వారికి మనకి మధ్య జరిగే సంకర్షణలని ఎత్తి చూపే కథలు తక్కువనిపిస్తుంది. కిప్లింగ్ బ్రిటిష్ వాడైనా ఆయన రాసిన కథలలో ఆయన కళ్లకి భారతదేశం, భారతీయ సంస్కృతి ఎలా కనిపించేయో అవి రాసేరు. ఇంతమంది అమెరికా వచ్చేము కాని కిప్లింగ్ ఇండియా కథలులా మనం అమెరికా వాతావరణాన్ని, జీవితాన్ని కథలలో ఇమిడ్చి రాయలేదేమో అని అనిపిస్తుంది. ప్రయత్నాలు జరగడం జరిగేయి కాని అవి పతాక స్థాయిని చేరుకోలేదు.

“ఈ వ్యక్తి అమెరికా వేళ్లి అక్కడ నివసింఛి ఉండకపోతే ఈ కథ రాయగలిగి ఉండేవాడు కాదు” అనిపించుకోదగ్గ కథలు ఉన్నాయా? ఏమో. ఉన్నాయేమో. పాఠకులే నిర్ణయించి చెప్పాలి.

 

చాలా దూరం వచ్చాం: కిరణ్ ప్రభ

kiran prabhaఅమెరికా తెలుగు కథ ఎటుపోతోంది? గత రెండు దశాబ్దాలుగా ‘అమెరికా తెలుగు కథ ‘ అనే ప్రత్యేక విభాగాన్ని సృష్టించ గలిగిన అమెరిక తెలుగు రచయితల్ని అభినందించి తీరాలి.అమెరికా తెలుగు రచయితలు కేవలం ఇంటర్నెట్ పత్రికలు, బ్లాగుల్లోనే కాక ఆంధ్రదేశంలోని ప్రింట్ పత్రికల్లోనూ, అక్కడ ప్రచురితమౌతున్న కథా సంకలనాల్లోనూ ప్రముఖంగా కనిపించడం అమెరికా తెలుగు రచయితల సత్తాని తెలియచేస్తుంది. ‘మీరు అమెరికాలో ఉంటూ కూడా ఇంకా ఇక్కడి పరిస్థితుల గురించి ఎందుకు వ్రాస్తారూ, అమెరికా గురించి వ్రాయండీ.. ‘ అనే వ్యాఖ్యలు ఆంధ్రదేశం నుంచి అప్పుడప్పుడూ వినవస్తుంటాయి

కానీ అమెరికా తెలుగు కథా రచయితలు మాతృదేశం గురించి వ్రాయడంలో ఖచ్చితంగా ఔచిత్యం ఉందని అనుకుంటాను. అమెరిక తెలుగు రచయితలూ ఒకప్పుడు తెలుగు నేలమీద నివసించిన వారేకాబట్టి వారి కథల్లో ఇంకా కుటుంబ సంబంధాలు, సొంతవూరి మట్టి వాసనలు కనిపించడంలో తప్పూలేదు, ఆశ్చర్యమూ లేదు. అమెరికాలోని ప్రవాస భారతీయుల సమస్యలు, పెరుగుతున్న పిల్లల సమస్యలు, సాంస్కృతిక వ్యత్యాసాలు, అమెరికన్లతో స్నేహాలు, వారి జీవన శైలులకీ, ప్రవాస భారతీయుల జీవన శైలులకీ గల వ్యత్యాసాలూ కూడా అమెరికన్ తెలుగు కథల్లో బాగానే ప్రతిబింబిస్తున్నాయి.

ప్రపంచాన్ని మౌస్ క్లిక్ దూరంలోకి మార్చిన అంతర్జాలం వల్ల అమెరికన్ తెలుగు రచయితలూ, ఆంధ్రదేశంలోని తెలుగు రచయితలతో భావాలు పంచుకోవడం, కలిసి పనిచేయడం లాంటి సుహృద్భావ వాతావరణం పెంపొందడం కూడా హర్షణీయమైన పరిణామం. ఫేస్ బుక్ లోని కథలకి సంబంధించిన గ్రూపులు ఇందుకు చక్కటి ఉదాహరణ. వ్రాసేవి ఎప్పటికప్పుడు ప్రచురించుకునే సౌకర్యం ఉన్న బ్లాగుల వల్ల కూడా ఔత్సాహిక రచయితల సంఖ్య పెరుగుతోంది. వారికి సలహాలిచ్చేందుకు అనుభవజ్నులు ముందు కి రావడం కూడా మెచ్చుకోదగ్గ విషయం. వాదాలూ, వివాదాలూ, కాపీలూ, ఏది మంచి ఏది చెడు అనే చర్చలూ.. ఇలాంటివి ఎప్పుడూ ఉండేవే. ‘మంచి ‘ కోణంలో చూస్తే అమెరిక్ తెలుగు కథ చాలా దూరం ప్రయాణించింది, ఇంకా ప్రయాణించగలిగే జవసత్త్వాలని పోగుచేసుకుంటోంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ముప్ఫై ఐదేళ్లుగా  చూస్తున్న కథ: సత్యం మందపాటి

satyam mandapati ‘ముప్ఫై ఐదేళ్లుగా నేను చూస్తున్న అమెరికా తెలుగు కథ’ అని మకుటం పెట్టానుగానీ, అంతకు ముందు కూడా, అంటే మేం అమెరికాలో నివాసం ఏర్పరుచుకోక ముందు, అప్పటికే నేను ఎన్నో పత్రికలలో కథలు వ్రాస్తున్నందు వల్ల, అన్ని తెలుగు పత్రికల్లోనూ కథలు విడిచిపెట్టకుండా చదువుతూనే వుండేవాడిని. అమెరికా డయోస్పోరా తెలుగు సాహిత్యం ఏ పత్రికలోనూ చదివినట్టు గుర్తు లేదు. ఇక్కడా, అక్కడా ఒకటి రెండు కథలు వచ్చినా అవి అమెరికాలోని తెలుగువారి జీవిత సరళిని సరిగ్గా చూపించే కథలు కావు. బారిష్టర్ పార్వతీశం లాటి పుస్తకాలు వచ్చినా, అవి కేవలం హాస్యం కోసం తెలుగు రచయితలు తెలుగు దేశంలోనే వుంది వ్రాసిన కాల్పనిక కథలు. ఇంగ్లాండ్, అమెరికాలాటి దేశాల జీవిత అనుభవాలను చూపించినవి కాదు.

నేను అమెరికాకి వచ్చిన తర్వాత, కొంచెం పెద్ద నగరాల్లో చిన్న చిన్న వ్రాత పత్రికలూ, జెరాక్స్ కాపీ పత్రికలూ కనపడ్డాయి. కానీ అవి కూడా ఎక్కువగా సరదాగా వ్రాసే కథలు, కవితలు లేదా పండగలకి వేసుకునే చిన్న నాటికలే కానీ, అమెరికాలో తెలుగు వారి జీవితాల మీద, సమస్యల మీద వ్రాసిన కథలు ఎక్కువగా కనపడలేదు. 1980ల చివరలోనూ, 1990ల మొదట్లోనూ అలాటి కథలు వివిధ పత్రికలలో కనపడటం ప్రారంభించాయి. అప్పుడే నా అమెరికా బేతాళుడి కథలు రచన మాస పత్రికలో సీరియల్ లాగా వచ్చి, పుస్తకరూపం దాల్చింది. ఇదే అమెరికా డయాస్పోరా తెలుగు సాహిత్యం మీద, ఒకే ఒక రచయిత వ్రాసిన మొట్టమొదటి పుస్తకం అని నేను అనుకుంటున్నాను. వంగూరి ఫౌండేషన్ వారి అమెరికా తెలుగు కథానికల సంకలనాలు కూడా అప్పుడే మొదలయాయి. తర్వాత ఎన్నో కథలు, పుస్తకాలు రావటం ప్రారంభించాయి.

ఇక వస్తుపరంగా చూస్తే, నిజంగా సంతోషం వేస్తుంది. ఎంతోమంది అమెరికాలో నివసిస్తున్న తెలుగు రచయతలు ఉత్సాహంగా ముందుకి వచ్చి, అమెరికాలో తెలుగువారి జీవితాలను స్పష్టంగా చూపే చాల కథలు, నవలలు వ్రాస్తున్నారు. ఇండియానించి కొత్తగా వచ్చేవారి అనుభవాలు, ఇండియా వెళ్లి వారం రోజుల్లో పెళ్లి చేసుకున్న వారి కష్టాలూ, సుఖాలూ, సంభాషణా చాతుర్య సమస్యలూ, ఉద్యోగాలు రావటం, పోవటం, పిల్లల పెంపకం, చదువులు, రెండో తరం పిల్లల జీవితాలు, అమెరికాలో పెళ్ళిళ్ళు, ఇలా.. ఎన్నో విషయాల మీద కథలు వ్రాస్తున్నారు. తెలుగు డయోస్పోరా సాహిత్యానికి ఒక నిజమైన అర్ధాన్ని చూపించే కథలు రావటం ముదావహం. ఎన్నో వెబ్ పత్రికలూ, ఏటేటా జరిగే సాంస్కృతిక తిరునాళ్ళ సూవనీర్లు, వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కథల పోటీలు, వారి ప్రచురణలు వీటిని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఇండియాలో వివిధ పత్రికలు కూడా ఎన్నారై కథలు ఎక్కువగా ప్రచురిస్తూ, భారతదేశంలో మన సాహిత్యాన్ని చదివించటం నిజంగా మనం గర్వించదగ్గ గొప్ప విషయం.

ఆనందం, ఆందోళన రెండూ వున్నాయి :నారాయణస్వామి

nasyఅమెరికా తెలుగు కథ ఎటుపోతోంది అని ప్రశ్నించుకుంటే కొన్ని మెచ్చుకోవలసిన పోకడలతో బాటు కొన్ని ఆందోళన కలిగించే పోకడలు కూడా కనిపిస్తున్నాయి నాకైతే.

అమెరికా నించి నడుస్తున్న జాల పత్రికలు అరడజను పైనే ఉన్నాయి. రకరకాల మంచి సాహిత్యానికీ, చర్చలకీ ఇవి నెలవులుగా ఉంటున్నాయి. ఇది సంతోషించవలసిన విషయం. కానీ ఏ ఒక్కటీ కూడా అమెరికా తెలుగు కథకీ, అమెరికా తెలుగు రచనలకీ పెద్ద పీట వేసిన ధోరణి నాకైతే కనబళ్ళేదు. మొత్తంగా దానికే అంకితం కానక్కర్లేదు గానీ కనీసం ఒక సంచిక దీనికి కేటాయించవచ్చు. మన సాహిత్యాన్ని మనమే, మన పత్రికలే పట్టించుకోకపోతే భారత్ నుండి వెలువడే పత్రికలు పట్టించుకుంటాయి అనుకోవడం భ్రమ.

కథా రచయితల్లో ఎన్నో కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. కొందరు రచయితలు చాలాకాలంగా అమెరికాలో ఉంటూ ఉన్నా ఈ మధ్యనే రచనా వ్యాసంగం మొదలు పెట్టిన వారు కాగా, కొందరు యువతీ యువకులు, ఈ మధ్యనే అమెరికాకి వలస వచ్చినవారు ఉత్సాహంగా రచనలు చేస్తున్నారు. ఇది కూడా సంతోషించ వలసిన పరిణామం.తెలుగు వారు ఇక్కడికి వలస వచ్చి, తాము ఎక్కడ సెటిలయితే అక్కడ ఒక మినీ తెలుగు వాతావరణాన్ని (తెలుగు రెస్టారెంట్లు, సినిమాలు, ఇతర వినోదాలు) ఏర్పాటు చేసుకుంటున్నట్టే, ఈ కొత్త రచయితలు ఎక్కువగా భారత్ జీవిత ఇతివృత్తాలనే ఎక్కువగా రాస్తున్నారు. ఇది ఆలోచించవలసిన విషయం. క్రమం తప్పకుండ రాస్తూ ఉన్న కొద్ది మంది సీనియర్ రచయితలు మాత్రం అమెరికా జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు.

పదిహేను ఇరవయ్యేళ్ళ కిందట విరివిగా రాస్తుండిన రచయితల పేర్లు ఈ మధ్యన ఎక్కడా కనబడ్డం లేదు. సోమ సుధేష్ణ, రాధిక నోరి, మాచిరాజు సావిత్రి మొదలైన వారు తొలితరం ఎదుర్కున్న సందిగ్ధ పరిస్థితులను గురించీ, పడిన సంఘర్షణల గురించీ ఆలోచింపచేసే కథలు రాశారు. వీరెవరూ ఇప్పుడు రాస్తున్న దాఖలాలు లేవు. రెండవ, మూడవ తరాలను చూసిన అనుభవాలతో వీరి దృక్పథాలు పండుతున్న స్థాయిలో మరి ఏ కారణంగా రాయటంలేదో తెలియదు. పత్రికలు, ప్రచురణ సంస్థలు వీరిని ప్రోత్సహించి వీరితో మళ్ళీ కొత్త కథలు రాయించాలి. లేకపోతే, పండిన వారి అనుభవాలను, ఒక తరం కథలను మనం పూర్తిగా కోల్పోతాం.

ప్రతీ కథా డయాస్పోరా కాదు:సాయి బ్రహ్మానందం గొర్తి

678_10151452027784197_1581019673_nఅమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ వచ్చిన ఈ ఏభయ్యేళ్ళలో ప్రస్తుతం ఇంతవరకూ సుమారు 200 పైచిలుకు కథలొచ్చాయి. అందులో సింహభాగం 1995 తరువాత వచ్చినవే! మొదట్లో సావనీర్లకే పరిమితమయినా అమెరికా కథ తెలుగు సాహిత్యపు ఏరులో డయాస్పోరా పాయగా నిలదొక్కుకుంది. ఇంటర్నెట్ వచ్చి అచ్చు రేఖల్ని చెరిపేయడంతో తెలుగు కథ కొత్త సరిహద్దులు నిర్వచించుకుంది. కొత్త కథకుల్ని సృష్టించుకుంది. కాకపోతే డయాస్పోరా కథ చెప్పుకో తగ్గ రీతిలో ఎదగలేదు. చాలామంది అమెరికా కథకులకి ఏది డయాస్పోరా కథ, ఏది కాదు అన్న దాంట్లో ఇంకా సందేహాలున్నాయి. దీనిక్కారణం అమెరికా తెలుగు కథమీద సమీక్షలూ, విమర్శలూ తగినంతా లేవు.

అమెరికా నుండి రాసిన ప్రతీ కథా డయాస్పోరా కథే అన్నట్లు చెలామణీ అవుతోంది. డయాస్పోరా కథల్ని సమీక్షించడానికి సరైన నేపథ్యమూ, అర్హతా ఉన్నది ఇక్కడి కథకులకే! ఈ దిశగా అమెరికా తెలుగు కథకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇక్కడి కథల్ని లోతైన అధ్యయం చెయ్యాలి కూడా. అలాగే ఇక్కడి కథకులు కూడా ఇక్కడి జీవితన్నీ లోతుగా పరిశీలించి కథలు రాయాలి. మిగతా డయాస్పోరా కమ్యూనిటీలతో, అంటే చైనీస్, వియత్నమీస్, స్పానిష్ వాళ్ళతో, చూస్తే ఇండియన్ డయాస్పోరా అంతగా అభివృద్ధి చెందలేదు. భారత దేశపు దక్షిణాది భాషలు తీసుకుంటే ఉన్నంతలో తెలుగులోనే అమెరికా నేపథ్యంలో ఎక్కువ కథలొచ్చాయి. అవన్నీ నూటికి నూరు శాతం డయాస్పోరా కథలు కాకపోవచ్చు. అయినా ఇక్కడి జీవితానికీ, సమస్యలకీ, సంఘర్షణకీ ఒక కథారూపం ఇవ్వడం ముదావహం.

అమెరికా కథా సాహిత్యం కేవలం సావనీర్లకే పరిమితం కాకుండా తనకంటూ ఒక వేదిక నిర్మించుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. వంగూరి ఫౌండేషన్ వారు ఏభయ్యేళ్ళ అమెరికా తెలుగు కథ మీద సదస్సు నిర్వహించడం తొలి అడుగు. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. అమెరికా తెలుగు కథకి ప్రస్తుత కథకులు సరికొత్త వన్నెలు తీసుకొస్తారన్న నమ్మకాన్ని నిజం చేస్తారని ఆశిద్దాం.

 

 

The couplet

Kadha-Saranga-2-300x268

“ రా రా స్వామి రా రా..

యదువంశ సుధాంబుధి చంద్ర “

పాట మంద్రంగా వినిపిస్తోంది.  అప్పుడే బయట నుంచి వస్తున్న మాయ కు లోపల ఏం జరుగుతోందో  తెలుసు కాబట్టి నెమ్మదిగా శబ్దం చేయకుండా తలుపు తెరిచి అక్కడే చూస్తూ నిలబడిపోయింది. వైష్ణవి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె తన లో తాను లీనమైపోయి నృత్యం చేస్తోందన్న సంగతి ని అర్థం చేసుకుంది మాయ. చిన్న పాటి అలికిడి కూడా చేయకుండా తాను నిల్చున్న చోటనే ఉండి తదేకంగా వైష్ణవి ని చూడసాగింది.

పదేళ్లుగా క్రమబద్ధంగా నృత్యం సాధన చేయటం వల్ల వైష్ణవి శరీరం చక్కటి అంగ సౌష్టవంతో ఉంది. వైష్ణవి ది ఛామన ఛాయ. ఆమె ధరించిన తెల్లటి సల్వార్ కమీజ్ ఆమె ఒంటికి పట్టిన చెమట తో తడిసి ముద్దైపోయి మరింత శరీరాన్ని అంటిపెట్టుకు పోయింది. ఒక్కో భంగిమ లో ఆమె వక్షోజాలు ఎగిరెగిరి పడుతున్నాయి సముద్రం లోని అలల్లాగా.  వైష్ణవి ఏ పాట కు నృత్యం చేస్తోందో ఆ పాట కు అర్థం ఏమిటో మాయ కు తెలియదు. కానీ వైష్ణవి ముద్రలు, భంగిమలు, కళ్ళతో పలికిస్తున్న భావాలు అన్నీ మాయకు  ఏదో అర్థమవుతున్నట్లే అనిపిస్తోంది. ఆమె హావభావాలు చూస్తున్న కొద్దీ  మాయ లో ఏదో అలజడి.

పాట ఆగిపోగానే వైష్ణవి ఐ పాడ్ దగ్గరకెళ్ళి   మరుసటి పాట ప్లే కాకుండా పాజ్ చేసి మాయ వైపు తిరిగి సన్నగా చిరునవ్వు నవ్వింది. కౌచ్ మీద కూర్చొని  టవల్ తీసుకొని ఒంటి మీదున్న చెమట ను తుడుచుకుంటోంది. నృత్యం ఆపేసినా ఇంకా ఆమెకు ఆ రొప్పు తగ్గలేదు.

‘ హాయ్ బేబీ ‘ అంటూ వైష్ణవి ని పెదాల మీద చిన్న గా ముద్దాడి “ ఏమైనా తాగుతావా?” కిచెన్ లోకి వెళ్ళింది మాయ.

రిఫ్రిజిరేటర్  తెరిచి అందులో నుంచి ఆరెంజ్ జ్యూస్ రెండు గ్లాసుల్లో పోసి ఒకటి  వైష్ణవి చేతికి ఇచ్చి మరొకటి కాఫీ టేబుల్ మీద పెట్టి   వైషు ని మళ్ళీ గట్టిగా దగ్గరకు లాక్కుంది . “ ఎంత బాగా చేస్తావో ఆ డాన్స్. డాన్స్ చేయటానికే పుట్టినట్లు ఉంటావు.”

మాయ పొగడ్త కు నవ్వేసింది వైషు. “ వొళ్ళంతా చెమట. స్నానం చేసి వస్తానే “

“ నా బేబీ కి నేను స్నానం చేయించనా?” మాయ మాటల్లో ఓ కవ్వింపు .

సిగ్గు గా నవ్వుతూ “ రిలాక్స్ అవ్వు. చిటికె లో వచ్చేస్తాను “ వైషు షవర్ లోకి వెళ్ళింది.

***

2.

“ బుక్ ఉమన్” ఒక చిన్న కమ్యునిటీ  ఫెమినిస్ట్ బుక్ స్టోర్. సమ్మర్ రీడింగ్ సిరీస్ లో భాగం గా టెక్సాస్ ఉమన్ రైటర్ ఒకామె తన కొత్త బుక్ గురించి అక్కడ మాట్లాడుతున్న మీటింగ్  లో మొదటి సారి మాయ, వైషు  కలుసుకున్నారు.

వైష్ణవి కూచిపూడి నృత్యానికి, ప్రపంచం లోని ఇతర నృత్య రీతులకు వున్న పోలికలు, వైరుధ్యాల గురించి రీసెర్చ్ చేయాలనే ఉద్దేశ్యం తో అండర్ గ్రాడ్యుయేషన్ లో అందుకు సంబంధించిన కోర్సులు చేస్తోంది. వైష్ణవి కి 13 ఏళ్లప్పుడు గ్రీన్ కార్డ్ మీద వైష్ణవి కుటుంబం అమెరికా కు వలస వచ్చింది. వైష్ణవి కి చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ప్రాణం. ఎంత ఇష్టం అంటే నిద్ర పోతున్నపుడు కూడా నృత్యం చేస్తున్నట్లు కాళ్ళు కదుపుతూ ఉండేది. దాన్ని చూసే ఆమె తల్లితండ్రులు ఆమె కు నృత్యం నేర్పించారు. అమెరికా వచ్చేసినా సరే, వైష్ణవి నృత్య సాధన కొనసాగించింది. డా. వెంపటి చినసత్యం గారి శిష్యురాలు రాధికా రెడ్డి దగ్గర వైష్ణవి ప్రైవేట్ గా నృత్యాన్ని అభ్యసిస్తోంది. డార్మ్స్ లో ఉంటే నృత్య సాధనకు వీలు కాదని వైష్ణవి తల్లితండ్రులు కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే విడిగా ఇల్లు తీసుకోమన్నారు. చిన్నప్పటి నుంచి అనేక ఆంక్షల మధ్య పెరిగిన వైష్ణవి హైస్కూల్లోకి వచ్చేసరికి ధైర్యం గా తానేది అనుకుంటే అదే చెయ్యటం మొదలుపెట్టింది. ఇండియన్ కమ్యూనిటీ లో నిత్యం టీనేజీ పిల్లల గురించి రకరకాల కథలు విని వైష్ణవి ని మరింత కట్టడి చేయాలని తల్లితండ్రులు ప్రయత్నించి , వైష్ణవి తీవ్రం గా ఎదురు తిరగటం తో ఏం చేయాలో తెలియక ఇక కొన్ని విషయాల్లో వైష్ణవి నిర్ణయాలను అంగీకరించారు. తల్లితండ్రులు డాలస్ లో ఉండటం తో , ఆస్టిన్ లో ఇల్లు తీసుకున్నాక వైష్ణవి కి జీవితం లో మొదటి సారి స్వేచ్ఛ, అందులోని ఆనందం తెలిసింది .

 

మాయ మెక్సికన్ అమెరికన్ అమ్మాయి. అమెరికా లో పుట్టి పెరిగిన మాయ చిన్నప్పటి నుంచి చదువులోనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా బాగా చురుకుగా ఉండేది. మాయ తల్లి తండ్రులిద్దరూ చిత్రకారులు. ఇద్దరూ ఆర్టిస్ట్ లు కావటం తో మాయ ని స్వేచ్ఛ గా తనదైన వ్యక్తిత్వం తో ఉండేలా పెంచారు . మాయ కు మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల కొంత అవగాహన ఉంది. మగపిల్లల కంటే ఆడపిల్లలంటేనే ఇష్టంగా ఉండేది కానీ ఆ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. హైస్కూల్లో కి వచ్చాక ఫుట్ బాల్ టీం లో ఉన్న అబ్బాయిలతో డేటింగ్ చేసింది కానీ ఏనాడూ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. “Woman’s Body-Feminism-Sculpture” ప్రధానాంశంగా శిల్ప కళ మీద పరిశోధన చేయాలని మాయ ఆకాంక్ష. శిల్పాలు చెక్కటానికి అనువైన వాతావరణం, విశాలమైన స్థలం, ఓ ప్రశాంత ఏకాగ్రత ఉండాలంటే డార్మ్ లో కంటే విడిగా ఇంట్లో ఉండటమే మంచిదనుకుంది మాయ.

షార్ట్ హెయిర్ కట్ , టీ షర్ట్ , షార్ట్స్ తో ‘ టాంబాయి’ లుక్ తో ఉన్న  మాయ మొదటి పరిచయంలోనే వైష్ణవి కి ఆసక్తికరంగా అనిపించింది. ముక్కు సూటి గా మాట్లాడే మాయ తత్త్వం నచ్చింది. మాయ మాట్లాడుతున్న విషయాలు , ఒంటి మీద పచ్చబొట్లు చూసి ఫెమినిస్ట్ అని ఊహించింది . మాయ కూడా యూటీ లో అండర్ గ్రాడ్ లో చేరుతోందని , విడి గా ఇల్లు తీసుకోవాలనుకుంటోందని తెలిసి ఆసక్తి కనబరిచింది .

జీన్స్, ఇండియన్ టాప్ , లాంగ్ హెయిర్ తో ఉన్న వైష్ణవి ఇండియన్ డాన్సర్ అని తెలియగానే బోలెడు ఎక్సైట్ మెంట్ ని  చూపించింది  మాయ. మీటింగ్ కాగానే ఇద్దరూ పక్కనే ఉన్న థాయ్ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ ఇద్దరూ కూడా రూమ్ మేట్స్ కోసం వెతుకుతున్నట్లు  తెలుసుకున్నారు.

బొట్టు పెడితే అచ్చు నువ్వు ఇండియన్ లాగానే ఉంటావు అన్నది వైష్ణవి .

నువ్వు షార్ట్స్ వేసుకున్నప్పుడు పొడవు జుట్టు ని ఇలా వదిలెయ్యకుండా వేరే హెయిర్ స్టెయిల్ చేసుకో, ఇంకా బావుంటుందని సూచించింది  మాయ.

మ్యూజిక్, ఆర్ట్, బుక్స్, సినిమాలు, హెయిర్ కట్ లు,మేకప్ లు, ట్రెండీ డ్రెస్సుల గురించి మాట్లాడుకున్నారు. బాయ్ ఫ్రెండ్ ల ప్రవర్తన గురించి ఇద్దరూ జోకులు వేసుకున్నారు. ఇద్దరికీ అవతలి వాళ్ళతో ఇల్లు షేర్ చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం కనిపించకపోవటం తో కలిసి ఇళ్ళు వెతుక్కున్నారు. చుట్టూ పీకాన్ చెట్లు , విశాలమైన హాలు , ఇంటి ముందు, వెనుక బోలెడంత స్థలం ఉన్న ఆ ఇల్లు కాంపస్ కి దగ్గరగా ఉండటంతో ఇద్దరికీ బాగా నచ్చింది. ఇంట్లో వాళ్లకు ఒక మాట చెప్పి వైష్ణవి లీజ్ పేపర్ల మీద సంతకం చేసింది. ఆడపిల్ల తోనే కాబట్టి కలిసి ఉండేది పెద్దగా భయపడాల్సింది లేదనుకున్నారు వైషు తల్లితండ్రులు. అటు మాయ పేరెంట్స్, ఇటు వైష్ణవి పేరెంట్స్ ఇద్దరూ కూడా వచ్చి ఆ ఇంటి ని చూసి మంచి సెలెక్షన్ అని మెచ్చుకున్నారు.

***

 

ఆకాశం అంచు మీద కారుమబ్బులు అటూ ఇటూ నడుస్తున్నాయి. వైషు, మాయ ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు కాసేపు అలా సాయంత్రం పూట వాకింగ్ చేయటానికి.

తలెత్తి ఆకాశం వంక చూసి “ అబ్బ, ఎంత బాగుందో వెదర్. రోజూ ఇలా ఉంటే బావుంటుంది కదా”

“ రోజూ ఇలా ఉంటే ఈ ఎక్సైట్మెంట్ ఉండదు కానీ “ కాక్టస్ కెఫే ” కి వెళ్దామా ? “ మాయ అడిగిన దానికి

“ మళ్ళీ క్యాంపస్ కా? రోజంతా అక్కడుండి మళ్ళీ అక్కడికే వెళ్ళాలంటే బోర్ కానీ, మొజార్ట్స్” కి వెళ్దాం. నాకు చచ్చేంత క్లాస్ రీడింగ్ ఉంది ” వైష్ణవి చెప్పినదానికి ఒప్పుకుంది మాయ.

ఇద్దరూ కాసేపు వాకింగ్ చేసి ‘ లేక్ ఆస్టిన్’ మీదున్న మొజార్ట్స్ కాఫీ షాప్ లోకి వెళ్ళారు.

డెక్ మీదున్న ఆ కాఫీ షాపు వాళ్ళకిష్టమైన ప్లేసుల్లో ఒకటి .

వాళ్ళిద్దరూ అక్కడకు వెళ్లేసరికి ఆకాశం ఇంకా మబ్బుల ప్రేయసి ని ముద్దాడుతూనే ఉంది.

వైషు “ పంప్కిన్ స్పైసీ కాఫీ లాటే” ఆర్డర్ చేసింది. అప్పుడు టైం చూస్తె సాయంత్రం ఆరున్నర దాటింది, “ సారీ, చెప్పటం మర్చిపోయాను. ఓన్లీ డీ కాఫ్ ప్లీజ్” అంది బారిస్తా తో .

“ నీకు రాత్రి నిద్ర పట్టకపోవటమే మంచిది. అయినా నిన్ను ఎలా నిద్ర పుచ్చాలో, ఎలా మేల్కొలపాలో నాకు తెలుసుగా ” కొంటె గా నవ్వుతూ వైషు ను దగ్గరకు లాక్కుంది మాయ.

ఒక్కసారిగా మాయ ను పక్కకు తోసేసింది. తమను ఎవరైనా చూసారేమో, ఆ మాటలు పక్కనెవరైనా విన్నారేమోనని అటూ ఇటూ ఆందోళన గా చూసింది వైషు.

వైషు తనను తోసెయ్యటం, ఆ మొహం లో ఆందోళన, కంగారు చూసేసరికి మాయ మొహం పాలిపోయింది.. “ నాతో బయటకు రావటం ఇష్టం లేకపోతె ఆ విషయం నేరుగా చెప్పు” విసురు గా డెక్ మీదకు వెళ్లి ఖాళీ గా ఉన్న టేబుల్ ముందు కూర్చొంది మాయ. సాయం సంధ్య లోకి జారిపోతున్న సూర్యుడి కిరణాల వెలుగు లో లేక్ మరింత అందంతో మెరిసిపోతోంది. కానీ మాయ కళ్ళు ఆ అందాన్ని చూసే స్థితి లో లేవు. లోపల నుంచి బాధ తన్నుకు వస్తుంటే కింది పెదవిని దానికి అడ్డం వేసి ఆపుతున్నట్లు కొరుకుతూ కూర్చుంది మాయ. ఊపిరందక గిలగిలలాడిపోతున్న ఫీలింగ్. గుండెల మీద బరువు గా ఏదో పెద్ద బండ రాయి. లోపల అనేక ఆలోచనలు, బాధ, దుఃఖం అన్నీ కలగలిసి మాయ ను లోపల నుంచి సన్నటి రంపం తో కోసేస్తున్నాయి. వైషు ని ప్రేమించి తప్పు చేసానా? ఈ రిలేషన్షిప్ పట్ల అసలు వైషు కు గౌరవం లేదు, కొద్దిపాటి ధైర్యం కూడా చేయటం లేదు అనుకోగానే మాయ కు కోపం తో పాటు బాధ కలిగింది. వైషు పట్ల ఇష్టాన్ని, ప్రేమ ను కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే చూపిస్తూ బయట తానెవరో పరాయి వ్యక్తి లాగా దూరం దూరం గా తిరగటం తన వల్ల కావటం లేదు. కానీ వైషుకి తన బాధ, తన ప్రేమ ఎందుకర్థం కావటం లేదు? వైషు మొదట్లో భయపడితే ధైర్యం చెప్పింది. ఆలోచించుకుంటాను, టైం కావాలంటే ఎదురుచూస్తానని ఒప్పుకుంది. కానీ రోజులు గడుస్తున్నా అరంగుళం కూడా ముందుకు నడవటానికి ఇష్టపడకపోతే ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? వైషు మీద కోపం మొత్తం జాతి మీదకు మళ్ళింది . స్టుపిడ్ ఇండియన్స్ కసిగా తిట్టుకుంది లోపల.

ఇంతలో ఒక చేత్తో కాఫీ ని, మరో చేత్తో మాయ కు ఇష్టమైన హైబిస్కస్ హెర్బల్ టీ ని తీసుకొని వచ్చి ఎదురుగుండా కూర్చొంది వైషు.

“ ఐ యాం సారీ. ఇక్కడంతా మన యూటీ స్టూడెంట్సేగా ఉండేది . ఎవరైనా మనల్ని అలా ఇంటిమేట్ గా చూస్తే   బావుండదనుకున్నాను . అంతే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు ” మాయ చేతి మీద చెయ్యి వేసింది వైషు, చేసిన తప్పు కు పశ్చాత్తాపం అన్నట్లు గా…

“ నీతో వచ్చేటప్పుడు మాస్క్ వేసుకొని రావాలని తెలుసు. కానీ ఒక్కోసారి ఆ విషయం మర్చిపోతుంటాను “. మాయ మాటలు సూటి గా చురకత్తుల్లా ఉన్నాయి. ఆ మాటల్లో వ్యంగం, బాధ, కోపం.

“ పబ్లిక్ లో మనమెలా ఉండాలి అన్న విషయం మొదట్లోనే మాట్లాడుకున్నాం. ఒక ఒప్పందం కూడా చేసుకున్నాము. అదంతా మర్చిపోయావా?” అన్నీ ఒప్పుకొని మళ్ళీ తప్పు తనదే అయినట్లు మాయ మాట్లాడటం చూసి వైషు కి కూడా చిరాకొచ్చింది.

“ అవును ఒప్పందం చేసుకున్నాము . అంతమాత్రానా మనిద్దరి మధ్య ఉన్నది కేవలం కాంట్రాక్టా? నేనొక మాములు మనిషి ని. నీ మీద ప్రేమ ను పెంచుకోవటమే తప్ప దాచుకోవటం నాకు తెలియటం లేదు . ఇంట్లో ఒక లా, పబ్లిక్ లో మరోలా ఉండటం నాకు రావట్లేదు . నీతో బయటకు వస్తోంది నేనేనంటావా? నా మొహం మీదున్న మాస్క్ నాకు తెలుస్తోంది. నీకు తెలియటం లేదా? Don’t you feel it baby? ఇంట్లో నీతో ఎలా ఉంటాను? ఇక్కడెలా ఉండమంటున్నావు? “ ఒక్కో మాట మాయ గొంతు లోంచి వస్తుంటే ఆమె శరీరం మొత్తం ఒక జలదరింపు కు గురైనట్లు వణికిపోతోంది . ఆమె తెల్లటి మొహం మరింత ఎర్రగా కందిపోయింది. కళ్ళల్లోంచి నీళ్ళు. మనసు బాధ శరీరానిదై పోయింది.

మాయ అంత ఎమోషనల్ అవటం ఎప్పుడూ చూడలేదు వైషు. అది కాదు రా అంటూ మాయ చేతుల మీద చెయ్యి వేసి ఏదో చెప్పబోయింది కానీ వైషు ని మాట్లాడనివ్వలేదు. ఆ చేతిని విసురుగా తోసేసింది .

“ నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తే ఇంటికెళ్లే వరకు ఆగాలి. అది కాంపస్ కాకూడదు. పబ్ కాకూడదు. పక్కన మన ఫ్రెండ్సో, క్లాస్ మేట్సో ఎవరూ ఉండకూడదు. క్యాంపస్ లో మనిద్దరం రూమ్ మేట్స్ గా మాత్రమే తెలియాలి. ఇలా ఎక్కడికక్కడ నన్ను నేను కట్ చేసుకుంటూ నీకు తగ్గట్లు గా, నీకనుకూలం గా ఉండాలి. ఇదంతా నాకెంత సఫోకేటింగ్ గా ఉందో నీకర్థమవుతోందా? నువ్వెప్పుడైనా నా వైపు ఆలోచించావా? నా ఎదురుచూపులు నీకు నా చేతకానితనం గా కనిపిస్తోంది కదూ . ” లోపలి ఏడుపు మొత్తం ధారధారలు గా కొంచెం కళ్ళ నుంచి, కొంచెం గొంతు లోంచి బయటకు వస్తోంది. తెల్లటి శరీరం మీద పైకి ఉబికి వచ్చిన నరాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి.

వైషు కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాయ కు ఎలా సర్ది చెప్పాలో తెలియలేదు. నడి రోడ్డు మీద ఎవరో తనను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్న ఫీలింగ్. మాయ విసురుతున్న మాటలు ఒకొక్కటి గా దూసుకొని వచ్చి వైషు మనసు ని ఛిద్రం చేసేస్తున్నాయి. మొదట్లో తన సంకోచాలు చెప్పినప్పుడు దగ్గరకు తీసుకొని ఓదార్చిన మాయ , ఇప్పుడు అన్నీ తప్పులు తనవే అయినట్లు నిందిస్తుంటే, అవేమీ తనను కాదన్నట్లు, తనకంటూ మాట్లాడటానికి ఇంకేమీ లేదన్నట్లు అలా శిలావిగ్రహం లా నిలబడి ఆ నిందలు మోయటం కష్టమనిపించింది. అసలు తప్పు మాయ దే , నన్ను రెచ్చగొట్టి లోబర్చుకుందనిపించింది.

మాయ నిందిస్తుంటే, వైషు మాయ ను తప్పు పడుతోంది. ఒకరినొకరు మాటలతో బాధ పెట్టుకుంటున్నారు. కలిసి ప్రేమ ను పంచుకున్న ఇద్దరూ ఒక అనిర్వచనీయమైన అనుభూతి ని కత్తులతో సమూలంగా రెండు వైపుల నుంచి నరికేసుకుంటున్నారు.

మాయ మాటలకు బాధ , తర్వాత చిరాకు, కోపం, అసహనం అన్నీఒక దానివెంట ఒకటి కలగలిసి వస్తుంటే , “ నాకు ఇంకొంచెం టైం కావాలి, మన విషయం ఇంట్లో కానీ, బయట కానీ తెలియటానికని నిన్ను రిక్వెస్ట్ చేసాను. నువ్వు దానికి ఒప్పుకున్నావు. నా కోసం వెయిట్ చేస్తానన్నావు. మళ్ళీ ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తావెందుకు?” ఏడుస్తూ , తనకు తెలియకుండానే పెద్ద గొంతు తో అరిచేసింది.

తన బాధ ను , ప్రేమ ను , ఎదురుచూపులను అర్థం చేసుకోకుండా తిరిగి తననే తప్పు పడుతున్న వైషు మీద మాయ కు మరింత కోపం వచ్చింది.

“ ఇప్పటికి ఏడాదికి పైగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో, ఒకే మంచం మీద పడుకుంటున్నాము. ఇంకెంత టైం కావాలో చెప్పు. అండర్ గ్రాడ్ అంతా అయ్యాక చెప్దామా? అప్పుడు మాత్రం ఎందుకులే, ఇలాగే గ్రాడ్ స్కూల్ కూడా పూర్తి చేసేద్దాం. ఆ తర్వాత కూడా “ స్ట్రైట్ “ గా పెళ్ళిళ్ళు చేసుకొందాము. పిల్లలను కందాము. అప్పుడు తీరిక గా కూర్చొని ఆలోచిద్దాము. సరేనా ? “ మాయ మాటల్లో వ్యంగానికి వైషు కు కోపం కన్నా చిరాకు అనిపించింది. అయినా సరే కంట్రోల్ చేసుకుంటూ “ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు” అంది.

“ అవును. నేనెక్కువ కలలు కంటున్నాను. మనం పెళ్లి చేసుకుంటామని, కలిసి పిల్లలను పెంచుతామని ఇలా అనేక రకాలు గా ఊహిస్తున్నాను. నేనే పిచ్చిదాని గా నీ ప్రేమ కోసం, నీకు అనువైన టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఒక్కటి చెప్పు, నేను అబ్బాయి అయితే , నువ్వింత ఆలోచించే దానివా? నిన్ను పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటే తోసేసేదానివా? ఆలోచించి చూడు. నేనేం మాట్లాడుతున్నానో, నేనెందుకు హర్ట్ అవుతున్నానో నీకు తెలుస్తుంది.”

మాయ అడిగిన దానికి వైషు కు వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు.

“ నీకు నాతో రహస్యంగా సెక్స్ కావాలి కానీ నేనక్కర లేదు. నా ప్రేమ అక్కరలేదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే పర్వాలేదు. కానీ నన్ను కూడా మోసగిస్తున్నావు నువ్వు , నా దగ్గర నటిస్తున్నావు. ఇంట్లో గర్ల్ ఫ్రెండ్, బయట బాయ ఫ్రెండ్. నీలా నటించటం నాకు చేత కావటం కాదు. ” లోపలి అగ్నిపర్వతాలు మొత్తం ఒక్కసారి విస్ఫోటనం చెందినట్లు లోలోపలి నుంచి ఎప్పటి నుంచో తనకే తెలియకుండా తన లోపల దాగి ఉన్న అనేక ఆలోచనల్ని, అనుమానాల్ని మొత్తం బయటకు వెళ్ళగక్కింది మాయ .

మోసం, నటన లాంటి మాటలు వినేసరికి వైషు కు కోపం తారాస్థాయి కి వెళ్ళింది. అప్పటి వరకూ మాయ ఎన్ని మాటలు అన్నా కొంతైనా సహించ కలిగింది కానీ తనను అనుమానించటాన్ని, రాహుల్ కి , తనకు మధ్య ఏదో ఉందని అనటాన్ని మాత్రం సహించలేక పోయింది. మాయ తనను అనుమానించటం తన జీవితం లో జరిగిన పెద్ద అవమానం గా తోచింది వైష్ణవి కి.

“ నేను చేస్తోంది నటనా? నాకు బాయ్ ఫ్రెండా? రాహుల్ గురించా నువ్వు మాట్లాడుతోంది? అతను నా క్లాస్మేట్ , మంచి ఫ్రెండ్. నాలుగైదు సార్లు బయటకు వెళితే అతను నాకు బాయ్ ఫ్రెండ్ అయిపోతాడా? నీ స్థాయి ఇదన్న మాట. అయినా అసలు నీకెందుకింత వివరణ ఇవ్వాలి? నాకు ఇష్టమైతే నీతో పడుకుంటాను. లేకపోతే లేదు. నువ్వెవరు నన్ను క్వెశ్చన్ చేయటానికి…

అసలు నీతో ఇన్ని మాటలు అనవసరం. వుయ్ ఆర్ డన్ . ఐయాం ఔట్. ఔట్ ఆఫ్ దిస్ రిలేషన్ షిప్” బ్రేకప్ ప్రకటించేసింది వైషు. కోపం తో ముక్కుపుటాలు అదురుతున్నాయి. మాటలు, ఏడుపు అన్నీ కలిసిపోయాయి హటాత్తుగా వైషు నోటి నుంచి వచ్చిన ఆ నిర్ణయం లో.

“ ఫ*…యు…ఐ డోంట్ వాంట్ యు ….ఐయాం మూవింగ్ ఔట్.” విసవిసా అక్కడనుంచి వెళ్ళిపోయింది మాయ.

coup1 (2)

                   చిత్రం: మాహీ బెజవాడ

ఉన్నట్లుండి మారిపోయిన పరిస్థితి ని షాక్ తిన్నట్లు అలా చూస్తూ ఉండిపోయింది వైషు. దెబ్బతిన్న పక్షిలా ఆమె మనస్సు గిలగిలా కొట్టుకొంటోంది. అవమానం తో, బాధ తో వైషు మొహం పాలిపోయింది. ఇన్నాళ్ళు మాయ తన మీద చూపించిన ప్రేమ అంతా ఒక్క సారిగా దూదిపింజే లా ఎక్కడికో ఎగిరిపోయినట్లనిపెంచింది. కళ్ళమ్మట నీళ్ళు .

మాయ అన్న మాటలు ఒకొక్కటి గా అప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాయి, మరింత అర్థం అయ్యేటట్లు గా.. తానన్న మాటలు కూడా తనకే మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. టేబుల్ మీద కాఫీ, టీ రెండూ ఎవరూ తాకకుండా అలా ఒక దాని పక్కన ఒకటి పెట్టి ఉన్నాయి. కోపం తో వెళ్ళిపోయిన మాయ తిరిగి వస్తుందేమో అన్నట్లు మాయ వెళ్ళిన వైపే చూస్తోంది వైషు.

ప్రవహించి ప్రవహించి అలసిపోయిన లేక్ నెమ్మదిగా పారుతోంది . దూరం నుంచి వస్తున్న బోట్ లో అమ్మాయి, అబ్బాయి ముద్దాడుకుంటూ కనిపిస్తున్నారు. కొంచెం దూరం గా ఉన్న మరో టేబుల్ మీద ఎవరో ఇండియన్ జంట కూర్చొని కాఫీ తాగుతున్నారు. వాళ్ళు తమ వంకే చూస్తున్నట్లనిపించి మరో వైపు కు తల తిప్పేసింది. వాళ్ళు ఇందాకటి నుంచి ఉన్నారా? ఇప్పుడే వచ్చారా? మాయ, తానూ పోట్లాడుకున్నది వాళ్ళు చూసారా? అసలు మాయ అలా ఎలా అనగలుగుతుంది ఇలాంటి మాటలు ? తన భయాలు, తన ఫామిలీ బాక్ గ్రౌండ్ అన్నీ చెప్పింది. కొంచెం టైం కావాలి అని అడిగింది. అన్నింటికి సరే అన్నది. ఇప్పుడు పబ్లిక్ గా ఇలా సీన్ చేసి తనను వదిలేసి ఎలా వెళ్ళిపోగలిగింది? మొదటి నుంచి తామిద్దరి మధ్య జరిగిన విషయాలు,అన్నీ ఒకొక్కటి గా గుర్తుకు వస్తున్నాయి . తుడుచుకున్న కొద్దీ బయటకు వస్తున్నాయి కన్నీళ్లు లోపలి ఆలోచనల్లాగా…

***

4.

ఒక శుక్రవారం సాయంత్రం. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. శుక్రవారం సాయంత్రాలు ఆ కాంపస్ చుట్టుపక్కలంతా, ముఖ్యం గా ఆ నైబర్ హుడ్ అంతా కోలాహలం గా ఉంటుంది. అదంతా స్టూడెంట్ లోకాలిటీ . పార్టీ ల హడావిడి తో వీధి అంతా కళకళ లాడుతోంది. వచ్చే పోయే స్నేహితులు, కార్లు, బైకులు అంతా ఓ ఉత్సాహకరమైన వాతావరణం నిండి ఉంది . వేగం గా వెళ్తున్న కార్ల లో నుంచి రకరకాల సంగీతం పెద్ద గా వినిపిస్తోంది. ఇల్లంతా ఇండియన్ స్పైసెస్ వాసన ఘుప్పు మంటోంది. కాంపస్ నుంచి వచ్చిన మాయకు , వైష్ణవి కిచెన్ లో అప్పటి దాకా ఏవో స్పెషల్స్ చేసిందని అర్థమై వైష్ణవి కోసం వెతికింది. వైష్ణవి షవర్ లో ఉన్నట్లు అర్థమై , ఇంటి ముందున్న పెకాన్ చెట్టు కింద వికర్ కుర్చీ వేసుకొని బీర్ తాగుతూ అటూ ఇటూ వచ్చే పోయే వాళ్ళను చూస్తూ రిలాక్స్ అవుతోంది .

అటూ వెళ్ళే వాళ్ళు, ఇటు వచ్చే వాళ్ళు బయట కూర్చున్న మాయ కు హాయ్ చెప్తున్నారు, చేతులూపుతున్నారు. పెద్ద పెద్ద ఉడతలు వచ్చి కింద పడిన పెకాన్ కాయలను తీసుకెళ్తున్నాయి. మాయ చెట్టు కిందనే కూర్చోవటం తో రావాలా, వద్దా అని కాసేపు అవి తటపటాయించి మాయ ను చూసి మన ఫ్రెండే అనే నమ్మకంతో గబుక్కున వచ్చి ఒక్కో కాయ ను తీసుకుపోతున్నాయి. ఉడతల కిచకిచలకు, అటూ ఇటూ దొంగ చూపులు చూస్తూ కింద రాలిపడిన ఆకుల మీద పరుగెడుతూ చేసే శబ్దానికి మాయ వాటినే గమనించసాగింది. కాసేపయ్యాక లేచి లోపలకు వెళ్ళింది.

వైష్ణవి హాల్లో లేదు. కిచెన్ లోకి వెళ్లి చూసిన మాయ ఒక్క క్షణం చిత్తురువు లా ఉండిపోయింది.

లేతాకుపచ్చ జార్జేట్ చీర కట్టుకొని కిచెన్ లో అల్యూమినియం ట్రే ల్లోకి ఫుడ్ ని సర్దుతోంది వైష్ణవి . తల స్నానం చేసిన కురులను స్త్రైటేన్ చేసి పైనొక చిన్న క్లిప్ పైన పెట్టి వదిలేసింది. వెనుక నుంచి చూస్తె లేయర్స్ తో ఉన్న ఆ పెద్ద జుట్టు అంచెలంచెలుగా దూకే జలపాతం లాగా ఉంది. ఆ నల్లటి జలపాతం నుంచి వైషు శరీరాన్ని అంటిపెట్టుకున్న డిజైనర్ జాకెట్టు కి పైన, కింద అర్థనగ్నపు వీపు కనిపిస్తోంది. ఎడమ వైపు నడుము వొంపు , తనమీద ఎవరైనా ఒక్క సారి చెయ్యి వేస్తె బాగుండన్నట్లు ఎదురుచూస్తోంది. అటూ ఇటూ తిరిగినప్పుడల్లా వైష్ణవి కాలి మువ్వలు సన్నటి శబ్దాన్ని చేస్తున్నాయి. చెవులకు వేలాడే జుంకీలు, వాటికి చెంప స్వరాలూ వైష్ణవి తల తిప్పినప్పుడల్లా అటూ ఇటూ ఊగుతున్నాయి.

“ హే, స్టన్నింగ్ బ్యూటీ ! ఏంటీ స్పెషల్? ఎంత సెక్సీ గా ఉన్నావో తెలుసా ఈ డ్రెస్ లో?” దగ్గరగా వచ్చి వైష్ణవి చీరకట్టు వంక ఆశ్చర్యం గా చూస్తోంది మాయ.

“ దీన్ని చీర అంటారు. ప్రపంచం మొత్తం లో అతి సెక్సియస్ట్ డ్రెస్ ఇదే తెలుసా?” ఆ మాటల్లో ఒక ఇండియన్ ప్రైడ్. ఒక చేతిని పక్కకు వొంచి పమిట ను దాని మీద జార్చి ఓ భంగిమ లో నిలబడింది. ఆ అందము చీరదో, అలా నిలబడ్డ వైష్ణవి దో తెలియనంత గా మాయ మనసు అక్కడ చిక్కుకుపోయింది.

క్యాంపస్ లో చాలా మంది ఇండియన్స్ గాగ్రా చోళీలు, అనార్కలీ డ్రెస్ లు వేసుకోవటం చూసింది కానీ ఈ చీర కట్టు ని ఇంత దగ్గరగా ఎప్పుడూ చూసి ఉండక పోవటం తో అదొక అద్భుతం గా చీర పల్లు ని చేత్తో ముట్టుకొని చూస్తూ అది శరీరం లో ఎటు వైపు మొదలై ఎటు వైపు కు వంపులు తిరిగి ఎక్కడకు వచ్చిందో పరీక్షిస్తోంది మాయ. వైష్ణవి చుట్టూ తిరిగింది .మాయ తనకు అంత దగ్గరగా నిలబడి తనను అన్నీ వైపులా నుంచి అలా ఒక శిల్పాన్ని చూస్తున్నట్లు చూస్తుంటే వైష్ణవి కి అదోలా అనిపించింది. మాయ తనని చేత్తో తాకకపోయినా తాకినట్లే అనిపిస్తోంది.

“ కమాన్ మాయ” వద్దు అన్నట్లు చేత్తో వారిస్తూ .

“ నేను కూడా దీన్ని కట్టుకోవచ్చా? ఎలా కట్టుకోవాలో నేర్పిస్తావా? ప్లీజ్, ప్లీజ్ “ వైషు గడ్డం పుచ్చుకొని బతిమిలాడటం మొదలుపెట్టింది.

“సరే, సరే, నా దగ్గర ఇంకో చీర ఉంది. అది కడతాను.”

ఆ మాట వినగానే గట్టిగా అరుస్తూ ఎగిరి గెంతేసింది మాయ.

“ఇంతకూ ఏంటీ స్పెషల్ ? ఈ చీర, ఈ వంటలు .. “

” క్యాంపస్ లో ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు ‘ ఉగాది తెలుగు న్యూ యియర్ ఫెస్టివల్ ‘ చేస్తున్నారు. నువ్వు కూడా వస్తావా నాతో? ఇద్దరం ఇలా చీరల్లో వెళ్దాము. నీకు ఎలా మేకప్ చేస్తానో చూడు. నువ్వు ఇండియన్ వి కాదంటే ఎవరూ నమ్మలేరు “ .

మాయ కూడా చీర కట్టుకొని తన తో పాటు వస్తుందని తెలిసే సరికి వైష్ణవి కి ఉత్సాహం ఆగటం లేదు. మాయ కు ఎలా మేకప్ చేస్తుందో గబగబా చెప్పేస్తోంది కానీ కానీ అవేమీ మాయ కు అర్థం కావటం లేదు. మాయ మనసు లో వేరే ఘర్షణ . లోపల నుంచి ఒక కాంక్ష మాయ ను నిలువునా ముంచెత్తుతోంది. ఎదురుగుండా సెక్సీ గా నిలబడి, నవ్వుతూ మాట్లాడుతున్న వైషు ని చూస్తుంటే మాయ కు తనని తాను ఇక ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియటం లేదు.

పక్కకు తిరిగి కార్నింగ్ వేర్ లోంచి పసుపు పచ్చ రంగు తో కవ్విస్తూఉన్న చిత్రాన్నాన్ని తీసి కొంచెం నోట్లో వేసుకొంది. స్పైసీ గా ఉండటం తో మాయ కు పొలమారింది.

 

“ సారీ, సారీ నీకు స్పైసీ గా ఉందా?” కంగారు గా గ్లాసు తో నీళ్ళు తీసుకొని మాయ కు దగ్గరగా జరిగి తల మీద చిన్న గా కొడుతూ తాగటానికి నీళ్ళిచ్చింది .

“ నీకన్నా స్పైసీ గా ఏమీ లేదులే ” చిలిపి గా నవ్వుతూ , తనకు దగ్గరగా వచ్చిన వైషు నడుం మీద చెయ్యి వేసి తన వైపు కు తిప్పుకుంది మాయ. పెదాల మీద సుతారం గా ముద్దు పెట్టుకొంది, చెట్టు మీద పండు ను అందుకున్నట్లు వైషు పెదాలను అందుకొంది. అంతా ఒక్క క్షణం లో జరిగిపోయింది. తడి తడిగా ఉన్న మాయ పెదాలను మరింత తమకంతో అందుకుంది వైష్ణవి. ఆ మోహపు ముద్దు వాళ్ళిద్దరినీ మరింత దగ్గర చేసింది.

ఆ ఇద్దరి మధ్య చీర నిమిత్తమాత్రం గా మిగిలింది.

మాయ ఆర్తి గా ముద్దు పెట్టు కొంటుంటే వైషు మరింత గట్టిగా అల్లుకు పోయింది. కళ్ళు మూసుకున్న వైషు మీదకు వొంగి నెమ్మదిగా చెవి లో “ నువ్వు కాసేపు అలాగే కళ్ళు మూసుకొని ఉండు. ఆ కనురెప్పల కి రెక్కలు తొడిగి కలల లోకం లో ప్రవేశించు. అక్కడ అనేక సరస్సులు, వాటిల్లో కలువ పూలు, తామర పూలు, చుట్టూ బోలెడన్ని పూల మొక్కలు, పూల పుప్పొడిని ముద్దాడుతున్న రంగురంగుల సీతాకోక చిలుకలు. మరో పక్క గున్నమామిడి చెట్టు. ఆ చెట్టు కింద మనిద్దరం ఒక బిగి కౌగిలింత లో. లేత మావిచిగురు ని తినిపిస్తుంటే నువ్వు నా వేలి కొస ను నీ నాలిక తో సుతారం గా తాకుతున్నావు. నేను నీ చెవి తమ్మె ను ముద్దాడుతున్నాను. ఆ లోకం లో ఉన్నది మనిద్దరమే. లేదు, లేదు ఒక్కరమే. “ మాటల మంత్రజాలపు యవనిక ను జార్చింది . మరో లోకం లో ఆ దృశ్యాన్ని వైషు అంతఃచక్షువులతో అనుభవిస్తోంది. మాయ పెదాలు వైషు దేహాన్ని మొత్తం చుట్టి వస్తున్నాయి . మూసుకున్న కనురెప్పలను ముద్దాడింది. వైషు పెదాలు సన్నగా వణుకుతున్నాయి. ఆ వణికే పెదాలను ,వాటి చాటున తమకాన్ని అర సెకండ్ విభ్రమ గా చూసింది మాయ. మాయ చేతులలో వైషు శిల్ప శరీరం అనేకానేక వొంపులు తిరుగుతోంది.

మాయ ఊపిరి వెచ్చగా తాకుతుంటే నెమ్మదిగా కనురెప్పలు తెరిచి రెండు చేతులతో మాయ ను దగ్గరకు లాక్కొని “ నీ చేతుల్లో ఏదో మంత్రదండం ఉంది. నీ చూపుల్లో ఇంకేదో శక్తిపాతం . వద్దు వద్దు అనుకుంటూనే నీ దగ్గర పసి పాపనై పోతాను ” వైషు మంద్రస్వరపు మత్తు తో మాట్లాడుతుంటే చూపుడు వేలితో వైషు పెదాల మీద సుతారం గా రాసింది మాయ.

అలా ఆ రెండు దేహ తంత్రులు ఒకదాని నొకటి కొనగోటి తో మీటుకున్నాయి. కాంక్షలు అల్లరిగా ఆడుకున్నాయి. కాసేపటి కి అలసిపోయి ఆడుతున్న ఆట ను ఆపి ఒకరిపక్కన మరొకరు అలా చేతులు పట్టుకొని పడుకుండిపోయారు. పెనవేసుకొన్న రెండు చేతుల స్పర్శ తో ఒకరికి ఊరట, సాంత్వన ,మరొకరికి ధైర్యం, నిశ్చింత.

***

5.

కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చేసిన మాయ కారు తీసి  ఎటు వెళ్ళాలో ఏమీ ఆలోచించుకోకుండా   డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆలోచనల్లోంచి బయటపడి చూస్తె ఎదురుగుండా బుక్ ఉమన్ స్టోర్ బోర్డ్ కనిపిస్తోంది. .

లోపలకు వెళ్ళగానే “ హాయ్ మాయా! వైషు రాలేదా?” బాగా పరిచయమున్న స్టోర్ మేనేజర్ క్యాతీ  అడుగుతుంటే నో అంటూ సంభాషణ పొడిగించ కుండా ముందుకెళ్ళి బుక్స్ చూడటం మొదలుపెట్టింది.

పుస్తకాలు చూస్తోంది కానీ మనసంతా జరిగన విషయాల చుట్టే తిరుగుతున్నాయి. ఏ పుస్తకం తెరిచి చూసినా కొంచెం అమాయకంగా, మరి కొంత సిగ్గుగా నవ్వే వైషు మొహమే గుర్తుకు వస్తోంది. బెడ్ రూమ్ లో ఇంకా తన దగ్గర కొంత బెరుకుతనమే చూపించే వైషు గుర్తుకు రాగానే మాయ మనసు కరిగిపోయింది.

పాపం పిచ్చి పిల్ల! అనవసరంగా తన మనసు నొప్పించాను. నేనే తొందరపడ్డానేమో. తను ఇంకా రెడీ గా లేదని తెలిసి కూడా నేను పుష్ చేసాననుకొని ఒక్క క్షణం బాధ పడింది. ఫోన్ చేసి సారీ చెప్పేస్తాను అనుకుంటూ ఫోన్ తీసింది. వైషు నుంచి తప్పనిసరిగా తన కోసం మిస్స్డ్ కాలో, టెక్స్ట్ మెసేజో ఉంటుందని ఊహిస్తూ ఫోన్ బయటకు తీసిన మాయ కు అలాంటిదేమీ లేకపోయేసరికి మళ్ళీ కోపం వచ్చేసింది. అయినా బ్రేకప్ అంది కదా వైషు. ఇప్పుడు నేను ఫోన్ చేసి సారీ చెపితే నన్నింకా చులకన గా చూస్తుందనుకుంటూ మళ్ళీ ఫోన్ లోపల పెట్టేసింది. కానీ ఆలోచనలు మాత్రం ఆగటం లేదు.

నేను ఊహించిందే కరెక్ట్. ఆ రాహుల్ పరిచయమయ్యే సరికి నేను నచ్చటం లేదు కాబోలు. అందుకనే బ్రేకప్ చెప్పింది. కనీసం ఫోన్ కూడా చేయలేదనుకునే సరికి మాయ బిగుసుకుపోయింది .  చేతిలో ఉన్న పుస్తకాన్ని  అక్కడ పడేసి బయటకు వచ్చి నిలబడింది.  అసలే కోపం, ఆ పైన ఆకలి. వెంటనే  థాయ్ రెస్టారెంట్ లోకి వెళ్లి ఆర్డర్ ఇచ్చి కూర్చొంది.

అసలు వైషు గురించి ఆలోచించకూడదనుకుంటూ బలవంతం గా ఆలోచనలు మరల్చే ప్రయత్నం చేసింది కానీ విఫలమవుతోంది మాయ. ఆర్డర్ చేసిన ఫుడ్ టేబుల్ మీదకు వచ్చింది. కోకోనట్ సాస్ తో చేసిన రెడ్ కర్రీ, రైస్ చూడగానే మళ్ళీ వైషు నే గుర్తుకు వచ్చింది. వైషు కోసమే గా వెజిటేరియన్ ఫుడ్ అలవాటు చేసుకుందనుకుంటూ పంతం గా దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ స్టూవర్ట్ ని పిలిచి మీ దగ్గర బీఫ్ దొరుకుతుందా? అని అడిగింది.

***

6.

నెమ్మదిగా చీకటి తెరలు వచ్చి లేక్ ముంగిట వాలుతున్నాయి ఎదురుగుండా ఉన్న కాఫీ చల్లారిపోయింది ఒక్క సిప్ కూడా చేయకుండానే. చుట్టూ ఉన్న టేబుల్స్ నిండిపోయాయి చూస్తూ ఉండగానే. చాలా టేబుల్స్ మీద స్టూడెంట్స్ కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. జంటలు గా వచ్చిన వాళ్ళు, పిల్లలు, కుక్కలతో డెక్ అంతా గొడవ గొడవగా ఉంది. కానీ అవేమీ వైష్ణవి మనసు ని తాకటం లేదు. వైష్ణవి ఉన్న చోటు నుంచి పక్కకు కూడా కదలలేదు.

మాయా, తానూ ఇద్దరు అలా పబ్లిక్ లో గొడవ పడటం , ఏడవటం, మాయ తనను అలా వొంటరి గా వదిలేసి వెళ్లిపోవటం అవన్నీ కూడా తలకొట్టేసినట్లు అనిపించింది వైషు కు. అవమాన భారం తో తలెత్తి చుట్టూ ఎవరి వంకా చూడలేక తల దించుకొని కంప్యూటర్ వంక, పుస్తకాల వంక చూస్తూ ఉండిపోయింది.

ఎదురుగుండా “ డివైన్ కామెడీ” బుక్ కవర్ మీద నుంచి డాంటే సూటి గా తన వంకే చూస్తున్నట్లు అనిపించింది వైషు కి.

“ నేనెవరు? “

స్ట్రైట్? లెస్బియన్? బై సెక్సువల్?

మాయ ని ఇష్టపడటమంటే నేను లెస్బియన్ అని పది మంది ముందు ఒప్పుకోవాల్సి ఉంటుంది . రాహులో , ఇంకెవరినో కావాలనుకుంటే “ స్ట్రైట్” అనే లేబుల్ వేసుకోవాలి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుంది? అసలు ఈ విషయం చెప్పటానికి తల ఎత్తి ధైర్యం గా నాన్న ఎదురుగా నిలబడగలనా? అమ్మ కళ్ళల్లోకి చూస్తూ ఏం జరిగిందో, తన మనసు, తన శరీరం ఏం కోరుకుంటున్నాయో అర్థమయ్యేలా చెప్పగలనా? అసలు ఈ విషయం తెలిస్తే తమ్ముడేమనుకుంటాడు? ఫ్రెండ్స్ మధ్య తన ఇమేజి ఏమవుతుంది ? వీళ్ళందరూ నాతో అసలు మాట్లాడతారా? నన్ను వదిలేస్తారా?

సెక్సువాలిటీ అనేది పర్సనల్ బెడ్ రూమ్ వ్యవహారం గా ఎందుకు మిగలలేదో ?

మనసంతా ఒక్కసారిగా తేనెతుట్టె కదిలినట్లయింది . స్మృత్యంతర ప్రవాహం లో కొట్టుకుపోతోంది వైషు.

మాయ తో మొదటి పరిచయం , తోలిసారి మాయ నడుము కింద భాగం లో “ఇంద్రధనుస్సు” పచ్చబొట్టుని ముద్దు పెట్టుకున్న అనుభూతి , ఇంకా అనేక అందమైన అనుభవపు అనుభూతుల సుగంధం మనసుని తాకింది . మాయ తో ఒక్కో అందమైన అనుభవం గుర్తుకు వచ్చినప్పుడల్లా, ఒక విషాద చారిక నిషాదం లా గుండె లో గుచ్చుకుంటోంది .   ప్రతి సారీ మాయామోహపు మంత్రజాలం నుండి బయటకు వచ్చాక తనలో వచ్చే అపరాధ భావన గుర్తుకు వచ్చి మరింత గిలగిల లాడిపోయింది.

ఏది ఎక్కడ మొదలై ఎలా ముగిసిందో ఏం అర్థం కావటం లేదు .

కోర్స్ వర్క్, డాన్స్ ప్రాక్టీస్, పార్ట్ టైం జాబ్, వీకెండ్ పార్టీలు, హేంగోవర్ లు…వీటన్నింటి మధ్య ఇది కావాలని కానీ, ఇది వద్దని కానీ అనుకున్నానా? ఏది చేతికందితే అది తీసుకున్నాను. మాయ కూడా అలాగే ప్రవహించింది ఈ దేహం లోకి.   తన వొంటి ని తనే తాకి చూసుకుంది. ఈ ఒంటి మీద ప్రతి చోటా మాయ స్పర్శ. మాయ కు తెలియని చోటు అంటూ ఈ దేహం మీద ఎక్కడా లేదు. కానీ మాయ కు తన మనసు తెలియలేదు. తన భయాలు తెలియలేదు. తన ఘర్షణ అసలు తెలియలేదు అనుకోగానే గుండెలో ముళ్ళు గుచ్చుకున్న బాధ.

 

స్కూల్లో హోమో సెక్సువల్ రిలేషన్ షిప్ ల గురించి ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు వొళ్ళు జలదరించేది. అంత అసహజంగా ఎలా ఉంటారో అనిపించేది. కానీ మాయ తనను ముద్దు పెట్టుకున్నపుడు అబ్బాయిలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయిందో అలాగే లేదా అంతకంటే ఎక్కువ ఫీల్ అయింది. తనలో ఇలాంటి లెస్బియన్ ఫీలింగ్స్ ఉన్నాయని తనకు కలలో కూడా తెలియలేదు. కానీ మాయ తో అనుభవం ఎంత సహజం గా ఉంది, ఎంత ఇష్టం గా అనిపించింది. మనసు కి ఏ తొడుగు లేకుండా ఎంత స్వేచ్ఛ గా ఉంది ఆ సమయం లో !

క్యాంపస్ క్లాసు లు , పార్ట్ టైం ఉద్యోగం తో అలిసిపోయి ఇంటికొస్తే మాయ తో అనుభవం ఒక రిలాక్సింగ్ గా అనిపించేది. బయట అందరికీ తెలిసేలా గర్ల్ ఫ్రెండ్స్ లా ఉందామని మాయ ఇలా పట్టుబడుతుందని అసలెప్పుడూ ఆలోచించలేదు.

 

కంప్యూటర్ స్క్రీన్ మీద పాస్వర్డ్ తో లాక్ చేసిన ప్రైవేట్ ఫోల్దర్ ఓపెన్ చేసి మాయ, తానూ కలిసి తీయించుకున్న ఫోటోలు చూస్తున్న కొద్దీ వైషు లో దుఃఖం ఎక్కువవుతోంది.

ఒక పక్క తన సెక్సువాలిటీ ఏమిటి, తనకేం కావాలి, తన మనఃశరీరాలు ఏం కోరుకుంటున్నాయో ఆలోచిస్తోంది. మరో వైపు అసలు ఈ లేబుల్స్ ఎందుకు? ప్రపంచమంతా కొన్ని లక్షల మంది ఇలాంటి రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు కూడా సమాజం లో ఇంత వివక్ష ఎందుకు చూపిస్తోందని ఆలోచిస్తోంది.

నా సెక్సువల్ ఫీలింగ్స్ మొత్తం నా వ్యక్తిత్వాన్ని, నా కుటుంబాన్ని శాసిస్తాయా? అదేం న్యాయం? అమ్మావాళ్ళు నన్ను వేలెస్తారా? ఎవరివి ఆ చూపులు? ఇంట్లో వాళ్లవా? స్నేహితులవా? ఎవరు వాళ్ళంతా? ఎందుకలా చూస్తున్నారు తన వంక అసహ్యంగా?ప్రశ్నార్థకం గా? మృతదేహాలని మార్చురీలో పెట్టినట్లు నేను కూడా ఈ దేహాగ్ని ని ఐస్ గడ్డల మధ్య చల్లార్చుకోనా ?

ఏమన్నది మాయ? ఇది “ స్ట్రైట్ లవ్” అయితే ఇలా ఉండేదానివా అని కదా అడిగింది. నిజమే. మాయ ప్లేస్ లో రాహులో , ఇంకెవరో ఉంటే ఏం చేసేది? ఆలోచిస్తున్న కొద్దీ ఒకొక్క పొర నెమ్మదిగా తొలగిపోతోంది. మాయకున్నంత తీవ్ర ప్రేమ తనకెందుకు లేదో అర్థం కాలేదు. కానీ మాయ ప్రేమ లోని గాఢత మనసు కు తెలిసింది . అందులోని నిజాయితీ అర్థమయింది . ఈ మొత్తం లో తానెక్కడ నిలబడి ఉందో తెలిసినట్లనిపించింది వైషు కు. తాను రాహుల్ తో ఫ్రెండ్లీ గా ఉంటే మాయ జెలసీ ఫీల్ అయిందని అర్థమయ్యాక గర్వం గా అనిపించింది వైషు కు.

 

కానీ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఏం కావాలో తెలిసినట్లే ఉంది. భవిష్యత్తు గురించి తలచుకున్నప్పుడు మాత్రం భయంగా అనిపిస్తోంది. ఒక్కో ఆలోచన మెదడు లోని ఒక్కో పొర ను చీల్చుకొని బయటకు వస్తోంది. ఒక్కో చీలిక లోంచి రక్తం బయటకు చిమ్ముకొస్తున్న భావన.

తలంతా విపరీతమైన పోట్లు. లక్షలాది సూదులతో పొడుస్తున్న బాధ. గుండెంతా బరువుగా…

చుట్టూ చీకటి గానే ఉంది. కానీ కళ్ళకు మాత్రం అది భరించలేని వెల్తురు లాగా అనిపిస్తోంది. కళ్ళు ఆ వెలుగు ని తట్టుకోలేక పోతున్నాయి. కళ్ళు విప్పార్చి చూడలేకపోతోంది. మైగ్రైన్ అటాక్ మొదలవుతోందని అర్థమయింది ఇక ఆ నొప్పి ఎంత ఎక్కువవుతుందో, ఏ భాగం నుంచి ఏ భాగం వైపు కు మరలుతుందో తెలుసు కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా క్యాబ్ కి కాల్ చేసింది.

అన్నీ వైపుల నుంచి ఆలోచనలు, నొప్పి శరీరాన్ని నలిపేస్తున్నాయి . టేబుల్ మీద తల వాల్చుకొని పడుకుండిపోయింది. ఎందుకు ఏడుపొస్తోందో తెలియటం లేదు. కానీ అలా కళ్ళు కన్నీళ్లు పెట్టుకోవటం మనసు కి, శరీరానికి తేలికగా ఉంది. క్షణం లో ఇంటికెళ్ళి పోవాలని ఉంది. కానీ క్యాబ్ ఇంకా రావటం లేదు…

మాయ ఇంట్లో ఉందా?

– కల్పనా రెంటాల

Kalpana profile2

 

తెలంగాణ కత కోసం

 

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

 

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో ఉన్నాం. ఇన్నాళ్లు ఆధిపత్య భావజాలం గల ఆంధ్రప్రాంత రచయితలతో పోటీలో అనేక అవమానాలు, వివక్ష, విస్మరణ, అణచివేత ఎదుర్కొంటూ వచ్చాం. ఇవాళ మన రాష్ట్రం వేరు, మన కథ వేరు. ఈ శుభ సందర్బంలో మన జీవితాలు, మన సంస్క ృతి, మన సమస్యలు, మన జీవద్భాషలో రాసుకున్న కథల్ని కళ్ళకద్దుకుంటూ సంకలనాలుగా తీసుకురావాల్సిన సమయమిది. అందుకు ప్రతి ఏటా కథవార్షిక వెలువరించాలని నిర్ణయించాం.

ఇందుకోసం ఏ యేడుకి ఆ యేడు పత్రికల్లో అచ్చయిన కథలతో పాటు అచ్చుకు నిరాకరించిన కథలను సైతం పరిశీలించి ప్రచురించాలనేది లక్ష్యం. ప్రతి ఏడాది జనవరి పది లోపు మాకు ఈ కథలు అందాల్సి ఉంటుంది. ఈ సారి తెలంగాణ కత -2013కి గాను అక్టోబర్‌ 31 లోగ కతలు పంపగలరు. ఈ సంకలనాలకు సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ సంపాదకులుగా వ్యవహరిస్తారు.

క్రమం తప్పకుండా ఈ సంకలనాలను ప్రచురించడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను సమకూర్చేందుకు మిత్రులు అల్లం కృష్ణచైతన్య ముందుకొచ్చారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.

 

కతలు పంపాల్సిన చిరునామా:

స్కైబాబ,

402, ఝాన్సీ రెసిడెన్సీ, ప్లాట్‌ నెం. 30 హెచ్‌.ఐ.జి. హుడా కాలనీ,

తానాషా నగర్‌, మణికొండ గ్రామం, హైదరాబాద్‌ `89, తెలంగాణ.

లేదా

ఈ మెయిల్‌ : sangishettysrinivas@gmail.com

సిరికింజెప్పకుండా…

10578330_4804212320303_104074472_n

మృత్యుంజయ్

మృత్యుంజయ్

“రేడియో అక్కయ్య” ఇక లేదు!

” రారండోయ్ …రారండోయ్    బాలబాలికలు రారండోయ్ బాల వినోదం కనరండోయ్ ”

అరవై ,దెబ్భయ్  దశకాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఆకాశవాణి  శీర్శికా గీతం.ఆదివారం మధ్యాహ్నం రేడియో చుట్టూ మూగి ,ప్రసారమయిన మాటలు పాటలు ,నాటికలు, అన్నయ్య అక్కయ్య ల సంభాషణలు అన్నీ  “చాలిక మాటలు చాలిక పాటలు …చెంగున పోదాము ..చెంగుచెంగునా పోదాము ” అనేదాకా విని అదో లోకం లోకి  వెళ్లి పోయిన రోజులు ఒక్క సారిగా కళ్ల ముందు డేరాలు వేసుకున్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కటొక్కటే గుర్తుకు రావటానికి కారణం రేడియో అక్కయ్య ఇకలేరు అన్న ఎఫ్బీ పోస్టింగ్  చూసి.

నాకు ముందు తురగా జానకీ రాణిగా తెలిసిన తరువాతే ఆ తరువాత ఆకాశవాణి  బాలానందం కార్యక్రమం  నిర్వహించే అక్కయ్యగారు ఈవిడేనని తెలిసింది. నా త్రిపదుల సంకలనం “మువ్వలు”  త్యాగరాయ గాన సభలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత  డా. సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఆ సభలో సీనియర్ జర్నలిస్టు  శ్రీ పెండ్యాల వామన రావు గారు (న్యూ స్వతంత్ర టైమ్స్  ఎడిటరు, మా నాన్నకు మేనత్త కుమారుడు , మాకు గాడ్ ఫాదర్ )ఉన్నారు. వారికి అందజేసిన పుస్తకాన్ని  తమ పత్రికలో బుక్ రివ్యూకై తురగా జానకీ రాణి కిస్తే  రివ్యూ రాసారు. మామయ్య పంపిన పుస్తకం చూసి  అందులో నా రివ్యూ రాసిన జానకీ రాణి గారికి  ఫోను చేశాను. అప్పుడు (2007లో ) నేను ఆదిలాబాదు జిల్లా కాగజునగరులో  ఉండేవాణ్ని. నా పరిచయం చేసుకుని మాటలు మొదలు పెట్టగానే ఎంతో ఆత్మీయంగా స్పందించి  చాలా సేపు మాట్లాడిన  సందర్భం  కనుల ముందు తారట్లాడింది. చివరగా ‘మీ మామయ్యా వాళ్లింటివద్దనే మా ఇల్లు ఈసారి వచ్చినప్పుడు తప్పక రమ్మని  ‘ఆహ్వానించడం  నేను పోలేక పోవడం  గుర్తుకు వచ్చి  నిన్నంతా  ఒకటే ఆవేదన. వామన్ రావు మామయ్యంటే ఆమెకు ఎనలేని గౌరవం అభిమానం అని మాటల వల్ల తెలిసింది. ఆ  తరువాత మా పైడిమర్రి రామక్రిష్ణ ద్వారా తెలిసింది ఆమే రేడియో అక్కయ్య అని. ఓసారి ఏదో పుస్తకావిష్కరణ సభ త్యాగరాయ గాన సభలో జరిగితే వచ్చారు. దగ్గిరగా వెళ్లి పలకరిస్తే ఎంతో ప్రేమ పూర్వకంగా మాట్లాడారు.

1936 లో 31 ఆగస్టున రాజ్యలక్ష్మి వెంకటరత్నంలకు మచిలీ పట్నంలో  జన్మించిన జానకీ రాణి ఎం.ఏ  ఎకనామిక్స్ చేసి పిహెచ్.డి మధ్యలో వదలి వేశారు. జానకి రాణి గారికి నృత్యం అంటే చాలా ఇష్టం. నాట్యం నేర్చుకోవడమే కాదు  ‘నాట్య కళా భూషణ ‘అనే బిరుదు పొందినా,కొన్ని అనుకోని పరిస్తితులవల్ల జానకీ రాణి గారు 1974  లో ఆకాశవాణి లో  చేరాల్సి వచ్చింది  జీవిక కోసం పిల్లల భవిష్యత్తు కోసం .భర్త తురగా కృష్ణ మోహన్ రావు గారు ఆకాశవాణి లో జర్నలిస్టుగా  పని చేస్తూ ప్రమాదంలో ఆకస్మిక  మరణం పాలు కావటం  తురగా జానకీ రాణి  గారి జీవితం లో ఒక పెద్ద విషాదం.

ఆకాశవాణి లో చేరిన తరువాత బాలల కార్యక్రమాల్ని రూపొందించడంలో తనకు ఇష్టమయిన నృత్యాన్ని పక్కనబెట్టి  బాల రచయిత్రిగా తమ శక్తి యుక్తుల్ని వినియోగించి అచిర కాలం లోనే  తగిన గుర్తింపు పొందారు. చేపట్టిన పనిని తపస్సులా భావించే జానకీ రాణి పిల్లకోసం అనేక నాటికలు రాశారు.ఆకాశవాణిలో బాలానందం, బాలవినోదం, బాలవిహారం వంటి కార్యక్రమాల్లో అక్కయ్య కృషి  అంతా ఇంతా కాదని సన్నిహితులు చెప్తారు.

unnamed

గమ్మత్తయిన విషయ మేమిటంటే జానకీ రాణి గారు  ఆకాశవాణి ఉద్యోగం లో చేరక మునుపు    రేడియో ఆర్టిస్టు  గా పని చేశారట. సాయంత్రం  7 నుండి 7.50 వరకు  కథానికా పఠనం చేసే వారు.     ఆకాశవాణిలో  ఆమె అనేక కొత్త ప్రయోగాలు చేశారు.చొప్పదంటు ప్రశ్నలు,బాలవాణి వంటి  కార్యక్రమాలు, కంగారు మామయ్య,కొంటె కృష్ణయ్య,వెర్రి వెంగళప్ప  వంటి పాత్రలు ప్రవేశపెట్టి చిట్టి పొట్టి చిన్నారి శ్రోతలకు దగ్గరయ్యారు.పలు పత్రికల్లో వీరు రచించిన కథలు ప్రచురించబడి  వీరికి బాల సాహిత్య నిర్మాతల్లో ఒకరిగా స్థానం లభించింది. సన్మానం,మంచిమనస్సు,ఉపాయం,వాదన,ఆడపిల్ల వంటి కథలతో వీరి ‘మిఠాయి పొట్లం ‘కథల సంపుటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘పబ్లికేషన్స్ డివిజన్’ ప్రచురించింది.పిల్లలు పూర్తిగా చదివి  ఆనందించాలంటే సరదా,హాస్యం తప్పని సరిగా ఉండాలనే నిత్యసత్యాన్ని దృష్టిలో ఉంచుకుని  వీరు కథలు రాశారు.వీరి  బి. నందం గారి ఆసుపత్రి అనే హాస్య నాటిక  సున్నితమైన హాస్య ధోరణి తో పిల్లలని మార్చవచ్చని సూచిస్తుంది. బాలానందాన్నే  బి. నందం డాక్టరుగా  సృష్టించారు. ఐ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ వారు ప్రచురించారు. వీరి మరో కథల సంపుటి ‘బంగారు పిలక ‘ని నేషనల్ బుక్  ట్రస్టు  వారు ప్రచురించారు.రెడ్ క్రాస్ కథను అనువదించారు.ఇవే కాక ఐ దేశం ఒక హిమాలయం,చేతకాని నటి  వంటి  రచనలు చేశారు.

రేడియో కార్యక్రమానికి మానవ కంఠ ధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనే వారు ఎక్సపర్ట్స్ కానవసరం లేదు. ఏక్స్‌పీరియన్స్ ముఖ్యం. చెప్పదలచిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ విలువలుంటాయి. “రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి “అని గోదావరిఖని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం….ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేశారు.ఆ విధంగా  సాధారణ ప్రజలని కూడా ఇందు భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసాము.

“ఇది నా సమస్య” అని స్త్రీల కార్యక్రమం   ప్రసారం చేసి స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటి పరిష్కారాలు నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచేచెప్పే కార్యక్రమాలకు  మంచి స్పందన వుండేది. వృద్ధుల కోసం తమ జీవితానుభవాలు తెలిపే “స్రవంతి” అనే కార్యక్రమం కూడా  అలాంటిదే. వీటి వెనుక జానకీ రాణి గారు ఉన్నారు . ప్లానింగ్ ,ప్రొడక్షన్,ప్రెజంటేషన్  పకడ్బందీగా ఉంటే కార్యక్రమాలు ఫలవంతంగా ఉంటాయనే తురగా జానకీ  రాణి గారు ఆ విషయంలో ఎల్లప్పుడూ  శ్రద్ధ వహించేవారు. వీరి ఉద్యోగ నిర్వహణలో భాగంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి ,స్థానం నరసింహారావు,గోపీచంద్ ,వేలూరి శివరాం,అక్కినేని, ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, జె.వి.సోమయాజులు , మంజుభార్గవి వంటి అనేకమంది ప్రముఖులతో కలిసి పని చేశారు.

దృశ్యశ్రవణ విధానంతో విజ్ఞానం అందించవచ్చని  అమ్మ-పాప,చిలుక పలుకులు, ఉదయబాల, అమ్మా నేను బడికి పోతా,బంగారు పాప వంటి  పలు సిడిలను  రూపొందించారు జానకీరాణి. సేవలకు గుర్తింపుగా ‘సనాతన ధర్మ ‘,బాలసాహిత్య పరిషత్ ‘ వంటి పలు సంస్థలు వీరిని సత్కరించాయి. వీరికి 1991,1992లో వరుసగా రెండు సార్లు  నేషనల్ బెస్ట్  బ్రాడ్ క్యాస్టరుగా అవార్డు పొందారు. జీవితంలోని ఒడి దుడుకులను ఎదుర్కొంటూ  ప్రతీ విషయాన్ని ఒక  ఛాలెంజ్  గా తీసుకున్న విదుషీమణి శ్రీమతి తురగా జానకీ రాణి ఎనభై సంవత్సరాల వయస్సులో కొంతకాలంగా అస్వస్థులుగా ఉండి  కన్ను మూయటం  ఇటు సాహితీ లోకానికీ ,అటు ఆకాశవాణి ,దృశ్య మాధ్యమ రంగానికి  తీరని లోటు.

                                                                                                                – వాధూలస  

మన వర్తమానాన్ని గుర్తు తెచ్చే రోమన్ గతం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

విషయం ఎక్కడినుంచి ఎక్కడిదాకా వెళ్ళిందో చూడండి….

దృష్టద్యుమ్న, ద్రౌపదల జన్మవృత్తాంతం చెప్పుకుంటూ, మాంత్రిక వాస్తవికతలోకి వెళ్ళి, అక్కడినుంచి, ఋగ్వేదంలో చెప్పిన పణులు ఫొనీషియన్లే కావచ్చునన్న కోశాంబీ ఊహను పట్టుకుని, వారితోపాటు యూదుల గురించి చెప్పుకోబోయి, అంతలో బహురూప, ఏకరూప ఆస్తికతల చర్చలోకి వెళ్ళి, రోమన్ల దగ్గరికి వచ్చాం!!!

ఓసారి వెనక్కి వెళ్ళి తొలి అడుగు ఎక్కడ వేశామో గుర్తుచేసుకోవాల్సినంతగా విషయం ఇన్ని దారులుగా చీలిపోవడం ఇదే మొదటిసారేమో! అయినా తప్పదు. నిండా మునిగాక చలేమిటి!?

ఆర్యులుగా చెప్పుకునే నోర్డిక్ జాతులవారు తరిమేస్తే, ఆసియా మైనర్(నేటి టర్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతం)కు పశ్చిమంగా ఉన్న ఏజియన్లు తలోవైపుకీ చెదిరిపోయారనీ, వారిలో ఒకరైన ఎట్రూస్కన్లు ఇటలీ మధ్యభాగంలోని అడవుల్లోకి వచ్చి స్థిరపడ్డారనీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆర్య తెగలు అక్కడికి కూడా చొచ్చుకువచ్చే నాటికి ఎట్రూస్కన్లు బలపడి రాజ్యాన్ని స్థాపించుకున్నారు.

అలా ఇటలీలోకి చొచ్చుకు వెళ్ళిన ఆర్య తెగల్లో రోమన్లు ఒకరు. వారు లాటిన్ మాట్లాడేవారు. ఎట్రూస్కన్లు ఆర్య తెగలను చాలాకాలంపాటు అణచి ఉంచారు. పురాతన కాలనిర్ణయం ప్రకారం రోమ్ నగరం క్రీ.పూ. 753లో అవతరించింది. చరిత్రకు తెలిసే నాటికి అది ఒక చిన్న వర్తక నగరం. అప్పటికి యాభై ఏళ్ల క్రితమే ఫొనీషియన్లు ఉత్తర ఆఫ్రికాలో కార్తేజ్ అనే నగరాన్ని నిర్మించుకున్నారు. పది లక్షల మంది జనాభాతో కార్తేజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద నగరం. భవిష్యత్తులో రోమ్ కూ, కార్తేజ్ కూ మధ్య ‘ప్యూనిక్ యుద్ధా’ల పేరుతో మూడు యుద్ధాలు జరిగి కార్తేజ్ రేఖాపటం మీద అదృశ్యం కాబోతోంది.

క్రీ.పూ 6వ శతాబ్ది నాటికి రోమన్లు పుంజుకుని ఎట్రూస్కన్ల రాజ్యాన్ని కూల్చేసి రోమ్ ను కులీనుల ఆధిపత్యంలో రిపబ్లిక్ గా మార్చారు. కులీన కుటుంబాలను ‘పేట్రీసియన్ల’నీ, సామాన్య ప్రజానీకాన్ని ‘ప్లెబియన్ల’నీ అనేవారు. ఇక్కడ కొంచెం ఆగి క్రీ.పూ. 6వ శతాబ్ది గురించి కొంత చెప్పుకోవాలి.

క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్యమైన శతాబ్దం. ఈ శతాబ్ది గురించి హెచ్. జి. వెల్స్ ఇలా రాస్తారు:

క్రీ.పూ. 6వ శతాబ్దితో ప్రారంభించి తదుపరి శతాబ్దాలలో ప్రతిచోటా పురాతన సంప్రదాయాలు కుప్పకూలిపోయాయి. నైతికత, మేధో విచారణ(intellectual inquiry) సంబంధమైన సరికొత్త స్ఫూర్తి జనంలో అంకురించింది. ఆ స్ఫూర్తి ఆ తదుపరి కాలంలోనూ మానవాళి పురోగమనం అంతటా అంటిపెట్టుకునే ఉంది. చదవడం, రాయడం అనేవి అంతవరకు పురోహితుల గుప్తసంపదగా ఉంటూ వచ్చాయి. కానీ ఇప్పుడవి ఇతరులకూ అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే, గుప్పెడు మంది పాలక తరగతికి, సంపన్నులకే పరిమితమయ్యాయి. గుర్రం ప్రయాణసాధనంగా వినియోగంలోకి రావడం, రోడ్ల నిర్మాణం జరగడంతో రాకపోకలు పెరిగాయి. వర్తక లావాదేవీలను మరింత సులభతరం, సరళం చేస్తూ నాణేల రూపంలో డబ్బు వినిమయం అడుగుపెట్టింది.

ఈ నేపథ్యంలో బలపడిన రోమ్, మానవాళి చరిత్రలోనే మహత్తరమైన ఈ పరిణామ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.

ఇక్కడే రేఖామాత్రంగా ఒక అంశాన్ని స్పృశించి ముందుకు వెడతాను. పురాతన నాగరికతల అంతటా ప్రసరించినట్టే క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రభావం మనదేశం మీదా ప్రసరించింది. బౌద్ధ, జైనాలు అప్పుడే పుట్టాయి. అయితే, పాశ్చాత్య సమాజంలో ఆ ప్రభావం ఒక క్రమగతిలో అభివృద్ధి చెందుతూ తార్కికాంతానికి చేరుకుంటున్నట్టు కనిపిస్తే, మన దేశంలో మాత్రం అది స్తంభించడమే కాకుండా తిరోగమనం పట్టినట్టు అనిపిస్తుంది. ఆ స్తంభన నేటి 21వ శతాబ్ది నాటికి కూడా అలాగే ఉందనిపిస్తుంది. కనీసం మత, తాత్విక రంగాలకు పరిమితమై చెప్పుకున్నా భారత్ ఇంకా క్రీస్తుశకంలోకి రాలేదన్న నా సూత్రీకరణకు ఇది కూడా ఒక దోహదాంశం కావచ్చు. ప్రస్తుతానికి మరీ లోతులోకి వెళ్లకుండా ఈ ప్రస్తావనను ఇక్కడితో వదిలేస్తాను.

రోమ్ అనేక కొత్త పోకడలకు ప్రారంభాన్ని ఇచ్చింది. అనేక విషయాలలో చరిత్రను తిరగరాసింది. మత,తాత్విక రంగాలలో అవి ఎలాంటివో చెప్పుకునే ముందు లౌకిక రంగంలో ఏం చేసిందో చెప్పుకుందాం:

రోమ్ కు ముందు పురాతన నాగరికతలలో పరిపాలనా రూపం భిన్నంగా ఉండేది. ఒక వీరుడు లేదా విజేత ఒక నగరరాజ్యాన్ని పాలించేవాడు. ఆ నగరం ఒక గుడి కేంద్రంగా అభివృద్ధి చెందినదయ్యుండేది. ఆ గుళ్ళో ఒక వ్యవసాయదేవత కొలువై యుండేది. ఇందుకు భిన్నంగా రోమన్లది మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌర కేంద్రిత పాలన. ఆర్యులు అప్పటికింకా గణతంత్ర(రిపబ్లిక్) వ్యవస్థలోనే ఉన్నారు. ఆవిధంగా చరిత్రలోనే మొదటిసారిగా ఆర్యుల గణతంత్ర విధానంలో విశాలప్రాంతాన్ని ఏలినవారు రోమన్లు!

గణతంత్రం అన్నప్పుడు మోర్గాన్ ను కూడా కలిపి చెప్పుకుంటే తప్ప రోమన్ల గురించి పూర్తిగా చెప్పుకున్నట్టు కాదు. ఆధునిక చరిత్ర శిక్షణకు చెందిన హెచ్. జి. వెల్స్ లాంటి చరిత్రకారులు సాధారణంగా ఆ కోణంలోకి వెళ్లరు. అసలు విషయానికి మరింత దూరమైపోతాం కనుక మనమూ ఇప్పుడు అందులోకి వెళ్లలేం. అదలా ఉంచితే, చరిత్రకారులు రోమన్ విస్తరణను నాలుగు దశలుగా వర్గీకరించారు. మొదటిది, క్రీ.పూ. 390తో రోమ్ ను గాల్స్ ఆక్రమించుకోవడంతో మొదలై, క్రీ.పూ. 240లో తొలి ప్యూనిక్ యుద్ధంతో ముగుస్తుంది. ఆ దశను ‘ఏకీకరణ గణతంత్రం (Assimilative Republic) అన్నారు. అంతకుముందు చాలా కాలంనుంచీ కులీనులకు, సామాన్యులకూ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఈ దశకు చేరే నాటికి తగ్గుముఖం పట్టి ఒక రాజీ ఏర్పడింది. ఈ దశలో మరీ సంపన్నులూ లేరు, మరీ పేదలూ లేరు. ఇది స్వేచ్చా స్వాతంత్ర్యాలు కలిగిన రైతుల గణతంత్రం. ఈ రైతులు వ్యవసాయం చేస్తూనే అవసరమైనప్పుడు సైనిక విధులు నిర్వర్తించేవారు. ఈ దశలో రోమ్ కేవలం ఇరవై చదరపు మైళ్ళ విస్తీరణం కలిగిన చిన్న నగరం. అదే పరిపాలనా కేంద్రం. రోమన్లు జయించిన నగరాలలోని పౌరులకు కూడా వోటు హక్కు ఉండేది. వాటిలో కొన్నింటికి స్వయంపాలన స్వేచ్చ ఉండేది. అలాగే వర్తక స్వేచ్చ, రోమన్లతో వివాహసంబంధం కల్పించుకునే స్వేచ్ఛ ఉండేవి. రోమన్లు కీలక ప్రాంతాలలోనూ, వలసలలోనూ పౌరస్థావరాలను ఏర్పాటు చేసేవారు. ఈ విధానాల ఫలితంగా ఓడిపోయిన నగరాలలోని పౌరులు కూడా క్రమంగా రోమన్లుగా మారిపోయారు. పెద్ద యెత్తున రోడ్ల నిర్మాణం జరిగింది. మొత్తం ఇటలీ అంతటా లాటినీకరణ జరిగింది. క్రీ.పూ. 89 నాటికి ఇటలీలోని స్వతంత్రపౌరులు అందరూ రోమ్ నగరపౌరులుగా గుర్తింపు పొందుతున్నారు. విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు… వాళ్ళు అక్కడికి వెళ్లగలిగి ఉండాలి!

ఇది రాస్తున్నప్పుడు, మన దేశంలో కూడా, అప్పటికి గణతంత్రదశలో ఉన్న ఆర్యుల విస్తరణ సరిగ్గా ఇలాగే జరిగిందా అని నాకు అనిపిస్తోంది. కొన్ని పోలికలూ గుర్తుకొస్తున్నాయి. మరో సందర్భానికి దానిని వాయిదా వేద్దాం.

రోమన్లు తమ ఏలుబడిలో ఉన్న అన్ని నగరాలకు, ప్రాంతాలకు పైన చెప్పిన విధంగా పౌరసత్వాన్ని విస్తరింపజేయడం; రాజ్య విస్తరణలో అంతవరకూ ఎరగని ఒక విశేష ప్రక్రియ. వెనకటి పాలకులు అనుసరిస్తూ వచ్చిన ప్రక్రియను రోమన్లు పూర్తిగా తల కిందులు చేశారు. ఎలాగంటే, వెనకటి పాలకులు ఏ ప్రాంతాన్ని అయినా జయించినప్పుడు వాళ్ళే ఓడిపోయిన జనంలోనూ, వాళ్ళ సంస్కృతిలోనూ, ఆరాధనా పద్ధతులలోనూ కలసిపోయేవారు. ఇందుకు భిన్నంగా రోమన్లు ఓడిపోయిన జనాన్నే తమలోకి, తమ పద్ధతులలోకి కలుపుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య వివరం. దీనితో కూడా మన దేశ అనుభవానికి పోలిక ఉంది.

ఇక, మొదటి ప్యూనిక్ యుద్ధం ముగిశాక రోమన్లు తమ విస్తరణలో రెండవ దశలోకి అడుగుపెట్టారు. సీసిలీని జయించడం దీనికి ప్రారంభం. సిసిలీ మంచి సారవంతమైన నేల. అక్కడి జనం చెమటోడ్చి పనిచేసేవారు. దాంతో ఆ ప్రాంతం రోమ్ ను మరింత సంపన్నం చేయగల అవకాశం కనిపించింది. దాంతో, దానిని రోమన్ ప్రజల ‘ఎస్టేట్’ గా ప్రకటించారు. కులీనులలో, సామాన్యులలో కూడా మంచి పలుకుబడి, స్థోమత ఉన్నవారు సిసిలీ అందించే సంపదలో పెద్ద వాటా కొల్లగొట్టారు. ఈ అనుభవం మనకు ఈనాడు బాగా తెలిసిన వలసవాదాన్ని గుర్తుచేస్తుంది. ఇదే సమయంలో యుద్ధాలు పెద్ద సంఖ్యలో బానిసలనూ అందించాయి. బానిసల ప్రవేశంతో వ్యవసాయోత్పత్తి బాగా పెరిగింది. ఎస్టేట్లు, బానిసవ్యవస్థ గణతంత్ర స్వభావాన్ని మార్చాయి. ఈ పరిణామక్రమంలో చితికిపోయింది సామాన్యులు. వారు వ్యవసాయం చేస్తూనే సైనికవిధులు నిర్వర్తించేవారని చెప్పుకున్నాం. వారు యుద్ధాలనుంచి తిరిగి వచ్చేసరికి వ్యవసాయం మూలపడి ఉండేది. వ్యవసాయోత్పత్తిలో వాళ్ళు బానిసలతో పోటీ పడాల్సివచ్చేది. ఆ క్రమంలో వారు రుణగ్రస్తులయ్యేవారు. సిసిలీ రోమ్ చేతుల్లోకి వెళ్ళినట్టే సామాన్య రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లారు. అంతకు ముందు ఈ సైనిక రైతులు ప్రభుత్వంలో వాటా కోసం రెండువందల ఏళ్ళు పోరాడారు. ఆ తర్వాత వందేళ్లపాటు ప్రభుత్వంలో వాటాతోపాటు అన్ని హక్కులూ అనుభవించారు. మొదటి ప్యూనిక్ యుద్ధం వాటన్నింటినీ హరించివేసి పరిస్థితిని మొదటికి తెచ్చింది. దీనిని సాహసిక సంపన్నుల గణతంత్రం (Republic of Adventurous Rich Men) అన్నారు.

ఇక్కడ కూడా పురాకాలం నుంచి చరిత్రకాలం వరకూ మన దేశం పొందిన అనుభవాలతో పోలికలు నాకు గుర్తుకొస్తున్నాయి…

ఇక్కడొకసారి రోమన్ గణతంత్ర సభల గురించి చూద్దాం. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నట్టే అప్పుడు కూడా రెండు సభల వ్యవస్థ ఉండేది. మొదటిదీ, ముఖ్యమైనదీ సెనేట్. ఇందులో కులీనులు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు. ఇది స్వభావంలో నేటి అమెరికన్ సెనేట్ కు కన్నా బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు దగ్గరగా ఉంటుంది. ప్యూనిక్ యుద్ధాలనుంచీ మూడువందల సంవత్సరాలపాటు సెనేటే రోమన్ల రాజకీయ చింతనకు, క్రియాశీలతకు కేంద్రంగా ఉండేది. ఇక రెండవ సభ అసెంబ్లీ. సూత్రరీత్యా రోమ్ లోని పౌరులందరూ ఇందులో సభ్యులే. రోమ్ కేవలం ఇరవై చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉన్న తొలి రోజుల్లో ఈ సభ సమావేశాలు తగిన హాజరుతో అర్థవంతంగా జరిగేవేమో. కానీ, రోమ్ ఇటలీ సరిహద్దులను కూడా దాటిపోయి విస్తరించిన తర్వాత ఈ సభ దాదాపు తంతుగానూ, అలంకారప్రాయంగానూ మారిపోయింది. కొమ్ము బూరాలు ఊది ఈ సభ సమావేశమవుతున్నట్టు ప్రకటించేవారు. పని పాటలు లేనివాళ్లతోనూ, అల్లరిచిల్లరి వాళ్లతోనూ సభ నిండిపోయేది. అదే క్రీ.పూ. నాలుగవ శతాబ్దిలో అయితే సెనేట్ మీద అసెంబ్లీ తగుమేరకు అంకుశంలా పనిచేసేది. సామాన్య ప్రజానీకం తమ హక్కులను ఉద్ఘాటించుకోడానికి అందులో తగినంత ప్రాతినిద్యం ఉండేది. ప్యూనిక్ యుద్ధాలు ముగిసే నాటికి ఈ సభపై ప్రజల నియంత్రణ అదృశ్యమైపోయింది. దాంతో గుప్పెడుమంది ప్రముఖులది ఇష్టారాజ్యమైంది.

రెండో ప్యూనిక్ యుద్ధం ముగిసేనాటికి సామాన్యుడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఒక్కోసారి ఉన్న వ్యవసాయభూమినీ కోల్పోయి మరింత పేదరికంలోకి జారిపోయాడు. రాజకీయ అధికారం, ప్రాతినిధ్యం లోపించడంతో సమ్మె, తిరుగుబాటు రూపంలో వారు తమ నిరసనను చాటుకోవలసి వచ్చింది. ఎస్టేట్లను రద్దుచేయాలనీ, తమ భూముల్ని తిరిగి తమకు ఇవ్వాలనీ రుణాలను పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ మాఫీ చేయాలని కోరుతూ చేసిన ఈ సమ్మెలూ, తిరుగుబాట్లూ ఫలించకపోగా అణచివేతను మరింత తీవ్రం చేశాయి. మరోవైపు, క్రీ.పూ. 73లో స్పార్టకస్ నాయకత్వంలో బానిసలు తిరగబడ్డారు. వాళ్ళలో కొందరు గ్లాడియేటర్లుగా పోరాటశిక్షణ పొందినవారు కనుక ఈ తిరుగుబాటు కొంత ప్రభావం చూపినా రెండేళ్లలో దానిని అత్యంత క్రూరంగా అణచివేశారు. స్పార్టకస్ ను ఓడించడంలో క్రాసస్ అనే సేనాని ప్రముఖ పాత్ర పోషించాడు. రోమ్ కు దక్షిణంగా ఉన్న అప్పియన్ వే అనే రహదారి పొడవునా ఆరువేలమంది స్పార్టకస్ అనుయాయులను కొరతవేసి చంపారు.

images0OYXY65E

పైన చెప్పిన రైతుల సంక్షోభంలో కూడా వర్తమాన భారతీయ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడచ్చు….’ఎస్టేట్లు’, రైతులు భూముల్ని కోల్పోవడం నేటి ‘సెజ్’ లనూ, భూసేకరణ రూపంలో నేటి భారతీయ రైతులు కోల్పోతున్న భూముల్ని గుర్తుచేయచ్చు. అలాగే వ్యవసాయంలో పోటీని ఎదుర్కోలేక చితికిపోతున్న నేటి రైతులూ, వాళ్ళ రుణ మాఫీ డిమాండ్లూ, ఆమేరకు ప్రభుత్వాల హామీలూ వగైరాలు కూడా.

ఇప్పటినుంచీ రోమ్ విస్తరణలో మూడవ దశ మొదలైంది. దానిని సైనిక నాయకుల గణతంత్రం(Republic of the Military Commanders) అన్నారు. ఇదెలా జరిగిందంటే, రెండో ప్యూనిక్ యుద్ధానికి ముందువరకు రైతులే సైనిక విధులు నిర్వర్తించేవారు. తమ స్తోమతను బట్టి ఆశ్వికదళంలోనో, పదాతి దళంలోనో చేరి యుద్ధం చేసేవారు. సమీపంలో జరిగే యుద్ధాలకు ఈ ఏర్పాటు సరిపోయేది. కానీ రోమ్ విస్తరిస్తూ దూర దూర ప్రాంతాలలో యుద్ధాలు చేయవలసివచ్చినప్పుడు ఈ సేన సరిపోలేదు. దానికితోడు, బానిసల సంఖ్య, ఎస్టేట్లు పెరిగిపోయి తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడంతో రోమ్ కోసం యుద్ధం చేయాలన్న ఉత్సాహం కూడా రైతుల్లో క్షీణించింది. దాంతో, కిరాయి సేనను సమకూర్చుకోవలసిన అవసరం తలెత్తింది. సామాన్యప్రజల్లోంచి వచ్చిన మారియెస్ అనే సేనాని ఆ దిశగా మొట్టమొదటి అడుగువేశాడు.

ఉత్తర ఆఫ్రికాలోని పరిస్థితులు అందుకు కారణమయ్యాయి. రోమన్లు కార్తేజ్ ను కుప్పకూల్చాక జుగర్తా అనే అతను అక్కడ ఒక అర్థఆటవిక రాజ్యాన్ని నెలకొల్పి రోమ్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. అతన్ని అణగదొక్కే బాధ్యతను రోమన్ సెనేట్ మారియెస్ కు అప్పగించింది. ఆ ప్రయత్నంలో మారియెస్ కిరాయి సేనను సమకూర్చుకుని, శిక్షణ ఇచ్చి జుగార్తాపై విజయం సాధించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. తన కిరాయి సేన అండతో మారియెస్ ఏకు మేకయ్యాడు. సెనేట్ తో సహా రోమ్ లోని ఏ శక్తీ అతన్ని దారికి తేలేకపోయాయి. కులీన వర్గానికి చెంది, జుగర్తాపై యుద్ధంలో మారియెస్ కింద పనిచేసిన శుల్లా అనే సేనానికి మారియెస్ ను అణిచే బాధ్యతను అప్పగించారు. వాళ్ళిద్దరికీ జరిగిన యుద్ధాలలో రెండువైపులా అనేకమంది రాజకీయప్రత్యర్థులను ఊచకోత కోశారు. వేలాదిమందికి మరణశిక్ష అమలు చేశారు. ఎస్టేట్లను అమ్మేశారు. ఒక పక్క వీరిద్దరి అంతర్యుద్ధం, మరోపక్క స్పార్టకస్ తిరుగుబాటు రోమ్ ను సైనిక గణతంత్రం వైపు బలమైన అడుగులు వేయించాయి. లుకల్లస్, పాంపే ‘ది గ్రేట్’, క్రాసస్, జూలియెస్ సీజర్ మొదలైన మహా సేనానుల పేర్లు తెరమీదికి వచ్చాయి. లుకల్లస్ ఆసియా మైనర్ ను జయించి, ఆర్మేనియాలోకి కూడా చొచ్చుకు వెళ్ళి, అంతులేని ప్రైవేట్ సంపదతో విశ్రాంతజీవితం గడిపాడు. స్పార్టకస్ తిరుగుబాటును అణిచేసిన క్రాసస్ పర్షియా మీద దాడి చేసి అక్కడి పార్థియన్ల చేతిలో ఓడిపోయి హతుడయ్యాడు. ఆ తర్వాత పాంపే, సీజర్ల మధ్య శత్రుత్వానికి తెరలేచింది. కాస్పియన్ సముద్రం వరకూ విస్తరించిన రోమన్ అధికారాన్ని పటిష్టం చేయడంలో పాంపే ప్రధాన పాత్ర పోషించాడు. గాల్ (ఇప్పుడు ఫ్రాన్స్, బెల్జియెం లు ఉన్న ప్రాంతం) మీద జెర్మన్ల దాడిని తిప్పికొట్టి, దానిని రోమన్ అధికారం కిందికి తెచ్చిన సేనానిగా సీజర్ ప్రసిద్ధిలోకి వచ్చాడు. అతను బ్రిటన్ లోకి కూడా రెండుసార్లు చొచ్చుకు వెళ్ళాడు కానీ దాని స్వాధీనానికి ప్రయత్నించలేదు.

ఇదంతా జరుగుతున్న క్రీ.పూ. మొదటి శతాబ్ది మధ్యనాటికి కూడా రోమన్ సెనేట్ నామమాత్రంగా నైనా అధికార కేంద్రంగా కొనసాగుతూనే ఉంది. ఆయా పదవుల్లో నియామకాలు దాని ద్వారానే జరుగుతున్నాయి. అందులోని సభ్యులు గణతంత్ర సంప్రదాయాలను, చట్టాలను పరిరక్షించడానికి పంటిబిగువు పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్లలో ప్రసిద్ధమైన పేరు-సిసిరో. అయితే, రైతులు చితికిపోవడంతో పౌరసత్వస్ఫూర్తి అంతరించి పోయింది. క్రాసస్ జీవించి ఉన్నప్పుడు అతనూ, పాంపే, సీజర్ ‘త్రిమూర్తులు’గా అవతరించి, సెనేట్ ను నామ మాత్రం చేసి, రోమ్ సామ్రాజ్యాన్ని మూడు ముక్కలుగా పంచుకుని శాసిస్తూ వచ్చారు. క్రాసస్ మరణించిన తర్వాత పాంపే, సీజర్ రంగం మీద మిగిలారు. వారిద్దరి ఘర్షణలో పాంపే సెనేట్ పక్షం వహించి, చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న ఆరోపణతో సీజర్ ను విచారణకు రప్పించేలా ఉత్తర్వులు జారీ చేయించాడు.

నాటి నిబంధనల ప్రకారం, ఏ సేనానీ తన అధికార పరిధిలోని ప్రాంతాన్ని దాటి ముందుకు రావడానికి వీల్లేదు. సీజర్ అధికార ప్రాంతానికీ, ఇటలీకీ మధ్య సరిహద్దు రుబికాన్ అనే ప్రదేశం. ‘విజయమో వీర స్వర్గమో’ అన్న నినాదంతో సీజర్ ఆ హద్దును దాటి పాంపే మీదికి, రోమ్ మీదికి యుద్ధానికి (క్రీ.పూ. 45లో) వెళ్ళాడు. ఆ యుద్ధంలో విజయం సాధించాడు. సైనిక సంక్షోభ సమయాల్లో ‘నియంత’ను ఎన్నుకుని అతనికి అపరిమిత అధికారాలిచ్చే సంప్రదాయం అప్పటికే రోమ్ లో ఉండేది. దానిని అనుసరించి పదేళ్ళ కాలపరిమితికి సీజర్ ను నియంతగా ఎన్నుకున్నారు. అయితే ఆ తర్వాత సీజర్ దానిని శాశ్వత నియామకంగా మార్పించుకున్నాడు. రోమన్లు ఎంతో అసహ్యించుకునే ‘రాజు’ అనే మాట కూడా ఆ సందర్భంలో వినిపించింది. రాజు కావడానికి సీజర్ ఒప్పుకోకపోయినా, సింహాసనాన్నీ, రాజదండాన్నీ మాత్రం స్వీకరించాడు. ఆ తర్వాత అతను ఈజిప్టు వెళ్ళి గ్రీకు టోలెమీ వంశానికి చెందిన ఆఖరి ఏలిక అయిన క్లియోపాత్రా ప్రేమలో పడ్డాడు. ఈజిప్టులో రాజును, లేదా రాణిని అక్షరాలా దైవంగానే కొలుస్తారు కనుక సీజర్ ఆ భావనను రోమ్ కు వెంటబెట్టుకుని వచ్చాడు. ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో సీజర్ విగ్రహాన్ని ప్రతిష్టించి ‘అజేయుడైన దేవుడు’ అని రాయించిన ఒక శిలాఫలకాన్ని అక్కడ ఉంచారు. ఆరిపోతున్న దీపం లాంటి రోమ్ గణతంత్రస్ఫూర్తి ఒక్కసారిగా నిరసన రూపంలో భగ్గుమంది. సెనేట్ లో సరిగ్గా పాంపే విగ్రహం పాదాల దగ్గరే సీజర్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. సీజర్ తోనే రోమ్ తన విస్తరణలో నాలుగవ దశ అయిన ‘సామ్రాజ్య’దశ (Empire) వైపు తొలి అడుగులు వేసింది.

ఆ తర్వాత పదమూడేళ్లకు సీజర్ దగ్గరి బంధువు ఆక్టేవియన్ సీజర్, మార్క్ ఆంటోనీ అనే ప్రత్యర్థిపై విజయం సాధించి రోమ్ పై ఆధిపత్యాన్ని సాధించాడు. అయితే అతను దేవుడిగా, రాజుగా ఉండడానికే కాదు సరికదా, నియంతగా ఉండడానికి కూడా ఒప్పుకోలేదు. సెనేట్ ప్రతిపత్తిని, ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాలను అతను పునరుద్ధరించాడు. అందుకు కృతజ్ఞతగా సెనేట్ అతనిని రాజు అనకపోయినా దానికి సమానమైన ‘ప్రిన్సెపెస్’, ‘అగస్టస్’ అనే బిరుదులతో గౌరవించింది. అగస్టస్ సీజర్ తొలి రోమన్ చక్రవర్తి అయ్యాడు.

అగస్టస్ వల్ల సెనేట్ తిరిగి ఊపిరి పోసుకున్నట్టు కనిపించినా అది తాత్కాలికమే అయింది. క్రమంగా రోమన్ చరిత్రలోంచి సెనేట్ అదృశ్యమైపోయింది. దాని స్థానాన్ని చక్రవర్తి, అతని అధికారులూ భర్తీ చేశారు. క్రమంగా రోమ్ విస్తరణా ఆగిపోయింది.

***

రోమ్ సైనిక నియంతృత్వానికి మళ్లిన తీరులో బహుశా పాకిస్తాన్ అనుభవం గుర్తుకువస్తూ ఉండచ్చు…

అదలా ఉంచితే, ‘ఈ రోమ్ చరిత్ర అంతా మాకు చెప్పాలా, మేము పుస్తకాలలో చదువుకోలేమా’ అని పాఠకులలో కొందరైనా అనుకుంటూ ఉంటారన్న శంక ఇది రాస్తున్నంతసేపూ నన్ను వేధిస్తూనే ఉంది. అయితే, ఒక ఊరటా లేకపోలేదు. అదేమిటంటే, రోమ్ పరిణామాల అద్దంలో భారతదేశ ప్రతిఫలనం గురించి మధ్య మధ్య సూచిస్తూ రావడం! అలాగే ఒకనాటి గణతంత్రం విచ్ఛిన్నమై ఏకవ్యక్తి పాలనకు దారి ఇచ్చిన క్రమాన్నీ ఇందులో స్పష్టంగా చూడచ్చు. ఇవి నా భవిష్య వ్యాసాలలో ఉపయోగించుకోదగిన ముఖ్యమైన మార్కింగులూ కావచ్చు.

 

 

 

 

 

 

 

 

ఆశ – దురాశ

MythiliScaled

అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు. హాన్స్ పెద్దవాడు, క్లాస్ చిన్నవాడు. హాన్స్ అదృష్టం బాగుండి ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. క్లాస్ ఏం చేసినా కలిసిరాలేదు. రాను రాను క్లాస్ కి తిండి దొరకటమే కష్టమయిపోయింది. అన్న దగ్గరికి వెళ్ళి , సంగతి చెప్పి, కొంచెం డబ్బు- అప్పుగానైనా సరే, ఇమ్మని అడిగాడు. హాన్స్ ససేమిరా వీల్లేదన్నాడు.

 

” నేనేమీ రాసులు పోసుకు కూర్చోలేదు ఊరికే ఇవ్వటానికి. నీకు అప్పు ఇస్తే వెనక్కి వస్తుందా ! ఎక్కడో  కాసులు బఠాణీ గింజల్లాగా దొర్లుతున్నాయట, వెళ్ళి వెతుక్కో ”

సరేననుకుని  క్లాస్ బయలుదేరాడు. వెళ్ళే ముందర దగ్గర్లో ఉన్న అడవిలో ఒక హేజెల్ చెట్టు కొమ్మని విరిచి చేతికర్రగా తయారు చేసుకున్నాడు. ఆ చెట్టు నిజానికి మంత్రపు చెట్టు. ఆ కర్ర ఎక్కడెక్కడ నిధులూ నిక్షేపాలూ ఉన్నాయో చూపించగలదు. అదేమీ క్లాస్ కి తెలియనే తెలియదు.

అతను ఏ కష్టమూ లేనట్లే కులాసాగా ఈలవేసుకుంటూ ప్రయాణించి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడి సంతలో పని కావలసినవాళ్ళంతా బార్లు తీరి ఉన్నారు. వాళ్ళతోబాటు తను కూడా నాలుగు ఎండు గడ్డి పోచలు నములుతూ నిలుచున్నాడు. అలా గడ్డి నోట్లో పెట్టుకుని ఉంటే పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అక్కడి అర్థం.

అంతలో అక్కడికి ఒక వంగిపోయిన ముసలివాడు వచ్చాడు. పైకి అలా కనిపించడు కానీ చాలా విషయాలు తెలుసు అతనికి, ముఖ్యంగా మంత్రాలూ తంత్రాలూ. క్లాస్ చేతి కర్రకి మహిమ ఉందని చూసీ చూడగానే కనిపెట్టాడు. కాసేపు అటూ ఇటూ తచ్చాడి క్లాస్ దగ్గరికి వచ్చాడు .

” అయితే, పనిలో చేరాలనుకుంటున్నావా ? ” అడిగాడు.

క్లాస్ ” మరే. లేకపోతే ఇలా గడ్డి నములుతూ ఎందుకుంటానూ ?”

మాటలు మొదలయ్యాయి. అటూ ఇటూ బేరాలు సాగి సాగి చివరికి వారానికి ఏడు పెన్నీల జీతానికి క్లాస్ ముసలివాడి దగ్గర పనిచేసేందుకు ఖరారైంది. క్లాస్ ని వెంటబెట్టుకుని కొంత దూరం నడిచాక ముసలివాడు ఆ కర్ర ఎక్కడనుంచి తెచ్చుకున్నావని అడిగాడు.

” ఎక్కడోలెండి ” అన్నాడు క్లాస్.

pepper-and-salt

 

” ఎక్కడో గుర్తు చేసుకోగలవా ?” ముసలివాడు అడిగాడు.

 

” అబ్బే, కష్టం ” క్లాస్ పెదవి విరిచాడు.

 

” ఇదిగో, ఒక వెండినాణెం. ఇప్పుడు ?”

 

” ఊ..సరేలెండి. గుర్తొస్తున్నట్టే ఉంది ”

 

ముసలివాడు పసుపచ్చని నీళ్ళు ఉన్న ఒక సీసాని తెచ్చి క్లాస్ తో అన్నాడు ” ఆ  కొమ్మ ఎక్కడ విరిచావో  ఆ మొదట్లో ఇదిగో, దీన్ని  ఒంపెయ్యి. అక్కడినుంచి ఏడు ఆకుపచ్చటి పాములు వస్తాయి. నిన్ను ఏమీ చేయవు, వాటిదారిన వాటిని పోనీ. ఆ తర్వాత ఆ విరిగిన  కొమ్మ నుంచి కొత్త ఆకులు మొలుస్తాయి. ఒక్కటీ వదలకుండా అన్నీ కోసి ఈ సీసాలో వేసుకురా. అప్పుడు నీకు ఇంకో వెండినాణెం ఇస్తాను ”

అదేమంత బరువుపనిగా తోచలేదు క్లాస్ కి. ఇంత అన్నం పెడితే తినేసి బయల్దేరిపోయాడు.

ఆ హేజెల్ చెట్టు పెద్ద శ్రమ లేకుండానే దొరికింది. ముసలివాడు చెప్పినట్లే చేశాడు. అలాగే ఆకుపచ్చపాములు వచ్చి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మొలుచుకొచ్చిన ఆకులు మటుకు   విడ్డూరంగా ఉన్నాయి. అంచుల్లో వెండిలాగా మెరుస్తున్న అటువంటి ఆకులని అదివరకు  ఏ చెట్టు మీదా అలాంటివాటిని క్లాస్ చూసిఉండలేదు

 

అవి మంత్రపు ఆకులు. వాటిని నిళ్ళలో మరిగించి ఆ కషాయం తాగితే పక్షులూ జంతువులు అన్నిటి మాటలూ అర్థమవుతాయి. అన్నీ కోసి సీసాలో వేసుకుని ముసలివాడి దగ్గరికి తెచ్చాడు. అతను చెప్పినట్లు చితుకులు పోగు చేసి పొయ్యి వెలిగించాడు. బాగా పెద్ద మంట వచ్చాక దానిమీద కుండ లో నీళ్ళు పెట్టి అవి తెర్లుతూ ఉన్నప్పుడు ఆకులన్నీ ఒకేసారి వేశాడు. ఈ లోపు ముసలివాడికోసం ఎవరో వచ్చారు. కుండలోంచి చాలా మంచి వాసనలు వచ్చాయి. క్లాస్ కి నోరూరి ఒక చెంచా అందులో ముంచి నోట్లో వేసుకున్నాడు. గొప్ప రుచిగా ఉంది కషాయం.   కషాయం లో మహిమ అంతా  క్లాస్ ముంచిన చెంచా కి అంటుకుని క్లాస్ నోట్లోకి వెళ్ళిపోయింది. ముసలివాడికి గదిలోకి వస్తూనే ఆ విషయం తెలిసిపోయింది. క్లాస్ ని తెగతిట్టాడు. క్లాస్ కి ఏమీ అర్థం కాలేదు. పొరబాటున ఆ కాస్తా రుచి చూశాననీ క్షమించమనీ  వేడుకున్నాడు. ముసలివాడి కోపం అంతకంతకూ ఎక్కువైపోయింది.

 

” అది తాగావుగా. ఇదీ తీసుకో ” అని క్లాస్  మీదికి వేడి కషాయాన్ని విసిరికొట్టాడు. క్లాస్ చటుక్కున వెనక్కి తప్పుకుని మొహం కాలిపోకుండా కాపాడుకోగలిగాడు. ఇక అక్కడుంటే ముసలివాడు ఏం చేస్తాడోనని భయపడి వీధిలోకి పారిపోయాడు. అక్కడ ఒక కోడిపెట్టా కోడిపుంజూ కబుర్లు చెప్పుకుంటున్నాయి. క్లాస్ కి అవన్నీ తెలిసిపోతున్నాయి. అతను రావటం చూసి

కోడి పెట్ట ” ఇడుగో, కొత్త నౌకరు వెళ్ళిపోతున్నాడు ”

కోడి పుంజు ” వెళ్తే వెళ్ళాడు గానీ అసలైనదాన్ని వెనకాలే వదిలేశాడే ”

 

” దేన్ని ?”

” ఆ హేజెల్ కర్రని. ”

 

” అవునవును. రత్నాలని రాళ్ళనుకుని పారేసుకుంటూ ఉంటారు ”

 

క్లాస్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా ముసలివాడి ఇంట్లో దూరి  ఆ కర్ర ని తెచ్చేసుకున్నాడు. అది ఎందుకు పనికొస్తుందో తెలియకపోయినా భద్రంగా పట్టు కున్నాడు. ఒక చెట్టుకింద  నిద్రపోయేముందర చొక్కాలో దూర్చుకుని పడుకున్నాడు.

 

నిద్ర పట్టబోతుండగా చెట్టు మీదినుంచి రెండు గుడ్లగూబలు మాట్లాడు మాట్లాడుకుంటున్నాయి.

 

” ఆ హేజెల్ కొమ్మ తో ఏం చేయచ్చో క్లాస్ కి తెలీదు కదా పాపం ”

 

” ఏం చేయచ్చు ?”

” వాళ్ళ ఊళ్ళో హార్ ఆక్సెల్ అనే అతని ఇల్లు ఉంది కదా , ఆ వెనక కొండమీద  మూడు నిలువుల ఎత్తున పెద్ద బండ రాయి ఉంది. ఆ కర్ర తో దాని మీద కొడితే బోలెడంత వెండీ బంగారమూ దొరుకుతా యి ”

 

” ఓహో ” అనుకుని క్లాస్ అప్పటికప్పుడు ఇంటిదారి పట్టాడు.

 

హాన్స్ చూశాడు. ” మళ్ళీ వచ్చావేం ? డబ్బు గడించావా ?” అని వెటకారం చేశాడు. క్లాస్ పట్టించుకోలేదు.

కాస్త చీకటి పడనిచ్చి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. గుడ్లగూబలు చెప్పినట్లే ఆ కొండ మీద మూడు నిలువుల ఎత్తు  బండరాయి ఉంది. కర్రతో దానిమీద కొట్టేసరికి అది తలుపులాగా తెరుచుకుంది. మెట్లుదిగితే కింద పెద్ద చావడి [ హాల్ ]ఉంది. దాని గోడలకి పేర్చి ధాన్యం  బస్తాల లాగా  చాలా ఉన్నాయి. . దగ్గరికి వెళ్ళి చూస్తే నిండా వెండి బంగారాలు.

 

ఆ చావడి చివరన  రాతి అరుగు మీద హుక్కా తాగుతూ  ఒక మరుగుజ్జు మనిషి కూర్చుని ఉన్నాడు. అతని గడ్డం పొడుగ్గా నేల మీద జీరాడుతూ ఉంది.

” ఎలా వచ్చావు క్లాస్ ఇక్కడికి ” అని అతన్ని పేరుపెట్టి పిలిచి ఏం కావాలని అడిగాడు.

క్లాస్ బెరుగ్గా, వినయంగా ” కొంచెం డబ్బు తీసుకోవచ్చా అండీ ? ” అని అడిగాడు.

‘ నీకు కావలసినంత తీసుకో.అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అన్నాడు మరుగుజ్జు మనిషి.

క్లాస్ జేబుల నిండుగా వెండీ బంగారు నాణాలు నింపుకుని మరుగుజ్జు మనిషికి కృతజ్ఞతలు చెప్పుకుని మూసిన తలుపు మీద కర్రతో కొడితే అది తెరుచుకుంది. ఇవతలికి వచ్చేశాడు.కర్రని జాగ్రత్తగా తెచ్చేసుకున్నాడు. బండరాయి ఎప్పటిలా మూసుకుపోయింది.

 

ఆ తర్వాత  అప్పుడప్పుడూ కొండ దగ్గరికి వెళ్ళి జేబుల్లో నాణాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. సంచి పట్టుకెళ్ళి నింపుకోవచ్చునని అతనికి తట్టలేదు. క్లాస్ పెద్దగా పనేమీ చేయకపోయినా అతనికి బాగా జరిగిపోతూ ఉండటం హాన్స్ కి ఆశ్చర్యం కలిగించింది .

 

ఒక రోజు తమ్ముడి దగ్గరికి వెళ్ళి గుచ్చి గుచ్చి అడిగాడు. ముందు ఏమీ చెప్పదలచుకోకపోయినా అన్నకి సాయం చేద్దామని క్లాస్ కి అనిపించింది. అంతా వివరంగా చెప్పాడు. తనకున్నది ఇద్దరమూ పంచుకుందామని అన్నాడు. అయితే హాన్స్ అలా తృప్తి పడే రకం కాదు. మోయగలిగినన్ని సంచులూ హేజెల్ కర్రా తీసుకుని బయల్దేరాడు.

 

మరుగుజ్జు మనిషి ఏం కావాలని అడిగితే ఆ సంచుల నిండుగా బంగారం కావాలన్నాడు.

 

” సరే, నీ ఇష్టం. అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అని హెచ్చరించాడు.

 

ఆత్రంగా సంచులన్నీ నింపి ఒక్కొక్కటే తలుపు దగ్గరికి చేరవేశాడు. హేజెల్ కర్రని అక్కడే వదిలేశాడు. ఎంత నెట్టినా  తలుపు తెరుచుకోకపోతే అప్పుడు హాన్స్ కి కర్ర సంగతి గుర్తొచ్చింది. మరుగుజ్జు అప్పటికి దాన్ని తీసేసుకున్నాడు.

 

” నువ్వు ఎంత అడిగినా దీన్ని ఇవ్వను. నువ్వూ ఇక్కడే పడిఉండాల్సిందే ” అన్నాడు మరుగుజ్జు. అక్కడ తిండీ నీళ్ళూ ఉండవని కూడా చెప్పాడు.

 

హాన్స్ భయపడిపోయి పదే పదే  బ్రతిమాలాక అతను మాత్రం బయటికి వెళ్ళేందుకు మరుగుజ్జు తలుపు తెరిచాడు. బంగారునాణాల సంచులు ఒక్కటి కూడా తీసుకెళ్ళటానికి మరుగుజ్జు ఒప్పుకోలేదు. ప్రాణం దక్కిందే చాలనుకుని హాన్స్ బయటపడ్డాడు.

 

తమ్ముడి దగ్గరికి వెళ్ళి కర్రని పోగొట్టినందుకు క్షమించమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. క్లాస్ ముందు కొంచెం బాధపడినా కావలసినంత సంపద ఉంది కనుక అన్నని ఓదార్చాడు. క్లాస్ తన దగ్గరి డబ్బులో సగం ఇస్తానని అన్నా హాన్స్ కి సిగ్గనిపించి  తీసుకోలేదు. తనకున్నది చాలన్నాడు.

ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ బ్రతికినంతకాలం అన్యోన్యంగా జీవించారు.

 

[ Howard Pyle సేకరించి,తిరగరాసి, బొమ్మలు గీసి ప్రచురించిన fairy tales  సంకలనం Pepper and Salt నుంచి                   స్వేచ్ఛానువాదం: మైథిలి అబ్బరాజు  ]

mythili

 

 

 

 

.

మొయిలు నొగులు

savem3

అదంటే నాకు మక్కువ. పడి చచ్చిపోతాను దానికోసం. దానిమేను ఒక్కొక్కసారి కాటుక పసనుతో మెరిసిపోతుంటాది. ఇంకొక్కొక్కసారి సామనలుపుతో మినుకు తుంటాది. అప్పుడప్పుడూ తెల్లటి పొట్లపూవయి విరగబడతుంటాది. అది రానిదే దాని తోడు లేనిదే కునుకు పట్టదు నాకు. పగలంతా ఎక్కడికి పోతాదో తెలియదు, ఉమ్మడికాపురపు కొత్తపెళ్లికూతురిలాగా పగలంతా ఊరించి ఊరించి పొద్దుగూకినాక ఎంతో పొద్దుకు నా దగ్గరకు వస్తాది. అది వస్తానే ఆబగా అబ్బిళించుకొంటాను దానిని. అది చిన్నంగా నవ్వతా నన్ను విడిపించుకొంటాది. అన్నెనక నా తలను గీరతా ఏదో ఒక కతను ఎత్తుకొంటాది. నేను ఊఁ కొడతా ఊఁ కొడతా మరొక లోకానికి పొయ్యేస్తాను.

ఆపొద్దు ఎందుకో రవంత అలసటగా ఉన్నట్టు కనిపించింది. అలతో కలతో తెలియదు కానీ నాకు మటుకు కతను చెప్పలేదు, నోరే విప్పలేదు అది. బతిమాలగా బామాలగా
‘‘ఈపొద్దు నాకేమీ బాగలేదు బా, నువ్వే ఏదయినా కతను చెప్పు నేను వింటాను’’ అనింది.
‘‘నేనా? నాకేం వచ్చు!’’ అన్నాను అచ్చెరపోతా.
‘‘ఏదో ఒకటి చెప్పు. ఉల్లమేమీ మంచిగా లేదు’’ అనింది మళ్లా.
సుంతసేపు తలపోసినాను. గురుతుకొచ్చింది. ‘‘మా చిన్నారవ్వ కతను చెప్పేదా’’ అన్నాను.
‘‘చిన్నారవ్వా, ఎప్పుడూ ఈ పేరునైనా నాతో అన్లేదే నువ్వు. ఎవురబ్బా ఈయవ్వ’’ ఉవ్వాయిగా అడిగిందది.
‘‘మా అమ్మమ్మల్లో ఒకామె లే. ఊరికే చెప్పడం కాదు, పద బయిదేలు, నిన్ను మా చిన్నారవ్వ వాళ్ల ఊరికి తొడకొని పోతాను’’ అంటా రెక్క పట్టుకొని లేపినాను
దానిని.
‘‘ఇప్పుడా ఇంతపొద్దులోనా?’’ అనింది కోక కుచ్చిళ్లను సరుదుకొంటా అది.
‘‘అవును ఇప్పుడే, మళ్లా తెల్లారినాక కనపడవు నువ్వు’’ అని తొందరపెట్టినాను.
‘‘సరే పద’’ అంటా తొడరింది నన్ను.
‘‘చిన్నారవ్వ వాళ్ల ఊరిపేరు ఆదరం. చుట్టూ కొండల నడుమ, గుడ్లమీద గువ్వ మాదిరిగా ముడుక్కొని ఉంటాదా ఊరు. ఆ ఊరికి అల్లంత దవ్వున్నే సుగిలి సెల
కొండలమీద నుంచి దెమదెమ దూకతా ఉంటాది. ఆ సెలే పెద్దదయి కాళంగి ఏరు అవతాది.
పచ్చాపచ్చని అడువుల్ని అబ్బిళించుకొన్న పాలపిట్టంటి ఊరది’’ నేను చెప్తా ఉంటే నా మాటకన్నా ముందు దాని అడుగులు పడినాయి ఆదరం తట్టుకు.
మేము ఆదరానికి పొయ్యేతరికి చిన్నారవ్వోళ్ల ఇంటిముందర మంది గుమిగూడి ఉండారు. ఏవో ఏడుపులు వినిపిస్తా ఉండాయి. గబగబ ఇంటితట్టుకు అడుగులు
వేసినాము.
‘కొడుకా కనలేక కనలేక కంటినే కొడుకా
రొండు పొగుళ్లు రొండు రేత్రిళ్లు నెప్పులుపడి కంటినే కొడుకా
కలిపోసి కడిపెట్టి కడపమాను ఎత్తుకు సాకితినే కొడుకా
ఆ కూలిపొయిన ఎలుంగొడ్డు నిన్ను మట్టగించేసెనే కొడుకా
నిన్ను బొదులు అది నన్ను సంపుండకుడదా కొడుకా…’
గుండెలు బాదుకొని బాదుకొని ఏడస్తుండాది చిన్నారవ్వ. అవ్వ ఒళ్లో సోములు
మామ తల, ఎవురో చితక్కొట్టినట్టు ముక్కూమొకమూ బజ్జిబజ్జి అయిపొయుండాయి.
మామకు ఇంకొకతట్టు కూచోని నోరు కొట్టుకొంటా ఉండాది కిష్టవేణత్త. సోములుమామ మా చిన్నారవ్వ కొడుకు, ఆయనకు ఆలయి వచ్చినామే కిష్టవేణత్త.
మామ పీనిగ చూసేదానికి ఒగ్గాళంగా ఉండాది. ఒళ్లంతా నెత్తుటి గాయాలు, మొకమంతా చితికిపొయుండాది. గుడ్డలన్నీ పేలికలు పేలికలయి పొయుండాయి.
‘‘ఏంది బా ఇదీ, ఈ ఒగ్గాళాన్ని చూడలేకపోతుండాను. ఆయమ్మేనా మీ చిన్నారవ్వ.
అయ్యో ఈ ఈడులో ఆయమ్మకు ఎంత ఇక్కట్టు వచ్చింది’’ వలవల ఏడస్తా నాతో అనిందది. అది ఏడస్తుంటే నా చెంపలు తడిసిపొయినాయి.
‘‘మా సోములుమామ చనిపొయినప్పటి కతలేవే అది. పొరపాటున ఇక్కడ్నించి మొదులు పెట్టేసినాను. ఇంకొంచెం వెనక్కిపోదాం పద’’ అని దానికళ్లను తుడిచి ఎడంగా
తొడకొని పొయినాను.
బోదకప్పిన రెండుదూలాలపట్టు ఇల్లు చిన్నారవ్వ వాళ్లది. ఊరికి ఎడంగా నిలిచి, ఈడిచికొట్టే ఎండతరిలో చల్లంగా, ఎముకలు కొరికే మంచునాళ్లలో
వెచ్చంగా మనల్ని పొదుక్కొనే మట్టిగోడల గుడిసె అది. అందులోనే పరంటిల్లు, నట్టిల్లు అని రెండు అరలు, వంటకోసం బయట ఒక చుట్టుగుడిసె.
మేమిద్దరమూ తలాకిటిని దాటుకొని నట్టింట్లోకి పొయ్యేతరికి, నిట్టాడి పక్కన కూచుని అరిటినారతో మల్లెమొగ్గల్ని కడతా మనవడితో అరుట్లు కొడతా ఉండాది
చిన్నారవ్వ. మొగ్గల్ని జతలు జతలుగా పెట్టి అవ్వచేతికి అందిస్తా ఏదో అడగతా ఉండాడు ఆ మనవడు.
‘అవా అవా, మనూరికి ఆదరం అనే పేరంట ఎట్టొచ్చింది వా?’ అడిగినాడు మనవడు.
‘అంత అరగలి ఎవురికొచ్చి, నిన్నడిగినారు బంగారా?’ మల్లెమొగ్గలను ముడేస్తా నవ్వతా అనింది అవ్వ.
‘ఎవురో ఒకరు అడిగినార్లే, చెప్పువా’ చిరచిరమంటానే బతిమాలినాడు.
‘సరే చెప్తాను రా’ అంటా కట్టిన మల్లెమాలను పక్కనపెట్టి, మనవడిని ఒళ్లోకి లాక్కొంటా మొదులుపెట్టింది అవ్వ.
‘మనూరికి పరంటపక్కన ఉండాదే కొండ, ఆ కొండమీద జరిగే కత ఇది. ఏడాదేడాది వానతరి మొదులవతానే ఏడేడి మొయిళ్లన్నీ వచ్చి ఆ కొండమీద కూచుంటాయి.
మంచిచెబ్బరల్ని మాట్లాడుకొంటాయి. ఏ మొబ్బు ఏ పక్కకు పోవాల, ఏ మొయిలు ఏ దిక్కున కురవాల, ఏ మోడము ఏ చెరువును నింపాల అని తీరుమానానికి వచ్చేది ఆ
కొండమీదనే. మీసరలో వచ్చిన మొయిళ్లు మూలదాకా తరితరికీ ఒకతూరి కమ్ముకొంటాయి మనకొండను. అప్పుడు మనకొండ, వచ్చిన మొయిళ్లకంతా ఉడుకుడుగ్గా కూడొండి
పొరువు చేస్తాది. అందుకే వానతరిలో ఆ కొండ, పొయ్యిగడ్డమీది కూటికుండ మాదిరిగా పొగలు కక్కతా ఉంటాది. అట్ట వచ్చిన మొయిళ్లకంతా వండివార్చి
ఆదరంగా కడుపునింపే కొండ కాబట్టి మనకొండకు ఆదరం కొండ అని పేరు. ఆ కొండకింద ఉండాది కాబట్టే మనూరికి ఆదరం అని పేరొచ్చింది’
అవ్వ చెప్పిన ఊరికతను మనవడితోపాటు అది కూడా వినింది కదా. వినీ ‘‘అబ్బ, పులుగు మాటలయినా ఎంత అందంగా చెప్పిందబ్బా మీ చిన్నారవ్వ. అవునూ ఆ వింటా
ఉండే మనవడివి నువ్వే కదా’’ అని అడిగింది నన్ను.

‘‘అవును నేనే. చిన్నప్పటి నేనే ఆ మనవడిని’’ మారాడినాను. మారాడి ఊరుకోలేదు, మళ్లా మాటాడినాను దానితో ‘‘అవ్వ చెప్పింది పులుగు మాటలు కాదు,
నాకు తెలుసు. వానతరి పెట్టినాక ఏదో ఒకనాడు, ఊరంతా పడకలు పరుచుకొన్నాక, నడిరెయ్యిలో సడీసప్పుడు లేకుండా మెల్లంగా కొండమీదకు ఒరగతాది తెల్లమబ్బు
ఒకటి. దాని వెనకనే రెండు పిల్లమొయిళ్లు దిగతాయి. వాటి వెనకనే నాలుగు నల్లమోడాలు వాలతాయి. తెల్లారి ఊరు లేచేపొద్దుకి కొండ పొగలుకక్కతా ఉంటాది.
ఎన్నితూర్లు చూసుంటాను నేను. నా మాటమీద నమ్మకం లేకపోతే పోతన్నను అడుగుదువు పద’’
‘‘పోతన్న ఎవురు?’’ అది అడగతా ఉండంగానే మందిళ్ల తెరువులోనుంచి పోతన్న గొంతు వినపడిరది. ‘మొయిలా మొయిలా సల్లని మొయిలా/ ఒక్క పొయిలు కురవ
నొస్తివా, నల్ల మొయిలా…’ అంటా మొయిలు పదాన్ని ఎత్తుకొని ఉండాడు పోతన్న.
మేము బిరబిర మందిళ్ల తెరువుకు పొయినాము. పోతన్న పాడతానే ఉండాడు.
‘ఓ మామా, పదం మళ్లా పాడుదువు, ఈపొద్దు మేకల్ని ఏ తట్టుకు తోలతుండావో చెప్పు’ చిన్న మందిడి, దొడ్లోని పింటికల్ని తట్టకెత్తుకొని పొయి దిబ్బలో
పోస్తా అరిచి నాడు.
‘పోతాను పోతాను అల్లుడో, నసిగుండు దాటుకోని… కుసిబండ దాటుకోని…
కందిచేను పల్లాలకు పోతాను పోతాను అల్లుడో…’ పాటతోనే మారు పలికినాడు పోతన్న.
‘‘మా పోతన్నకు పదాలపోతన్న అని మారుపేరు. పొద్దు పుట్టేటప్పుడు పాటను సంకన యేసుకొన్నాడంటే, పొద్దు మునిగినాకనే దానిని దించేది’’ ఇచ్చుకొంటా దానితో
అన్నాను నేను.
‘‘అది సరే కానీ, ఇంతపొద్దులో పాటలేంది?’’ అడిగింది అది.
‘‘పిచ్చిపిల్లా, ఇంకా తెలియలేదా, వాళ్లకు పొద్దుపుట్టేసింది. వెలుగయింది
వాళ్లకు, మనకు కాదు. పొద్దుపుట్టినాక నువ్వు నాకంట పడవని ఎరగనా ఏంది.
అందుకే వాళ్లకు మట్టుకే పొద్దుపుట్టేటట్టు మోడి చేసినాను’’ చెప్పినాను దానితో.
‘‘నేనంటే నీకెంత అనుగురా అబ్బా’’ అంటా నన్ను అబ్బిళించుకొనింది అది. నేను మెల్లింగా విడిపించుకొని ‘‘సరే సరే, చిన్నమందిడి ఏందో చెప్తా ఉండాడు
విను’’ అన్నాను. అది కూడా నాతోపాటు చెవుల్ని నిగిడిచ్చింది.
‘ఓహోహో… ఈపొద్దు మామ బలే కుశాలగా ఉండాడు ఏందో కత’ నవ్వతా అన్నాడు చిన్నమందిడి.
‘అత్త ఊరికి పొయ్యుంటాది. మాపుకూడు సుగిలి చెంగమ్మ ఇంట్లోనేమో’ చిన్న మందిడి నవ్వును అందుకొంటా అన్నాడు గున్నాదుడు.
‘ఎవుర్రా ఆనా బట్టలు. మేమంటే అంత సులకాగా అయిపొయినామా. పొరకెత్తుకొని వచ్చినానంటే ఉంటాది కత’ ఇంట్లోనించే పోతన్న పెళ్లాము అరిచింది. ఆ అరుపును
విని నవ్వుకొంటానే దెబగుబ అక్కడ్నించి కదిలిపొయినారు వాళ్లు.
‘ఒసే బయిటికొచ్చి సూడే. కొండమీద మొయిళ్లు దిగి అరుట్లు పెట్టుకోని కూసోనుండాయి. ఈ ఏడాది మనూరి చెరువును నింపే మొయిలేదో కలిసి సూద్దాం
బయిటికి రా’ అన్నాడు పోతన్న, పెళ్లాంతో.
‘నువ్వు కానీ, నంగినారయ్యవు. మొయిళ్లు అరుట్లు పెట్టుకోనుండాయా లేదా అని నీతో అరుట్లు పెట్టుకొనేదానికి నాకేమీ పంగలేదా. ఇంకొంచెం సేపుటికి
ఆవురావురుమంటా వస్తావే, తట్టలోకి ముద్దెట్ట వస్తాది. బిన్నా పేడకళ్లు ఎత్తేసి కడుక్కోని రా. తినేసి గొడ్లను విప్పుకోని పోవాల కదా’ గయ్యిమనింది
ఇంట్లోనించే పోతన్న పెళ్లాం.
మేమిద్దరం కూడా నవ్వుకొంటా చిన్నారవ్వ దగ్గరకు పొయినాము.
‘అవా అవా, నేనుకూడా గొర్రెల్ని మేపేకి పోతాను వా’ అవ్వను గోజారతా ఉండాడు మనవడు.
‘నువ్వు దేనికి లేరా. మారుగోడు తోలుకొని పోతాడులే. పొగులు పొద్దుగూకులూ బీళ్లల్లో తిరిగితిరిగి పొద్దుపొయినాక ఇళ్లకు తిరుక్కొంటాయి గొర్రెలు.
వాటి వెనకాల పొయి దేనికి అగసాట్లు పడతావు’ అనింది చిన్నారవ్వ.
‘ఊఁ హూఁ, నేను పోతాను…’ అంటా కాళ్లను నేలకు కొడతా సినిగినాడు మనవడు.
‘పొయి రానీలే అత్తా. నాలుగుపనులూ నేర్చుకొంటేనే మంచిది. తోడుకు మారుగోడు ఉండాడు కదా’ అని అవ్వని సరిదింది కిష్టవేణత్త.
అత్త ఒత్తాసుతో అవ్వ దగ్గర మాట నెగ్గించుకొని, ఇచ్చుకొంటా గొర్రెలదొడ్డిలోకి దూరి, ‘మారన్నా, నేను కూడా వస్తుండా’ అన్నాడు
మారయ్యతో.
‘పద పద అబ్బోడా, పుల్లింగినాయనకుంట కాడ పరికిపొండ్లు బలిసిపొయి ఉండాయి. పెరికిస్తాను తిందువు పా’ అంటా దొడ్డి తడికను తీసి గొర్రెల్ని
బయటకి తోలినాడు మారయ్య.
అదే పొద్దుకు ఇలావంతుడి గొర్రెలు కూడా తెరువులోకి వచ్చినాయి. ఆ పక్కనించి చెంగన్న గొర్రెలూ దొడ్డిని దాటినాయి.
‘ఓ ఇలావంతు బావా, ఏ తట్టుకు తోలుకొని పోతుండావా?’ గొంతెత్తినాడు మారయ్య.
‘నేను చిప్పట్లదడికల్లా పోతుండాను, నువ్వెట్ట పోతుండావురా?’ ఎదురుగొంతును వినిపించినాడు బావ.
‘నేను కందిచేనుపల్లాల కాడ ఉండే మడిగుడ్ల దొనతట్టుకు పోతుండాను బావా, అబ్బోడు కూడా వస్తుండాడు నాతో’ మారయ్య గొంతు ఉలివింది.
ఎవురు ఏతట్టుకన్నా పోండి కానీ, పొరకలకుంట తట్టుకు మటుకు పోవద్దు. కుంట పక్కనుండే సీకిరాళ్ల గవిలో ఎలుంగొడ్డు చేరుండాదంట’ చెంగన్న అరిచి చెప్పి,
తన గొర్రెల్ని తెక్కణానికి మలేసుకొని పొయినాడు.
‘ఏడాదేడాదీ ఈ ఎలుంగొడ్లది పెద్ద రంపు అయిపోతా ఉండాదే’ గొణిగినాడు మారయ్య.
పోతన్న అప్పటికే గొడ్లను గమిడి దాటించినట్టు ఉండాడు. ఊరికి పరంటతట్టు నించి లేచింది పోతన్నపాట.
‘పోలుగా పోలుగా నల్లరెక్కల పోలుగా/ మలెయిరా నా ఎనుమునీ, మడినించి/
మలెయిరా నా ఎనుమునీ…’ పాటను వింటా ఆ తట్టుకు మల్లినాయి గొర్రెలు.
‘ఇస్సో… ఉయ్యో…’ అంటా గొర్రెల వెనకనే పరుగులు తీసిన మారయ్యా అబ్బోడూ, కందిచేను పల్లాలకాడకి పొయి నిలిచినారు. గొడ్లూ గొర్రెలూ ఆ పల్లాల్లో
మొలిచుండే పచ్చికసువును పరపరమని మేస్తా ఉంటే, పోతన్నా మారయ్యా అబ్బోడూ ముగ్గురూ ఒక గుంపెనమాను నీడలో కూచున్నారు. మేమిద్దరం కూడా వాళ్లకు
అందినంత దవ్వునే కూచున్నాము. పోతన్న మళ్లా పదాన్ని ఎత్తుకొన్నాడు.
‘పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
ఊరుకుండేదొకటిరా ఊంగులాడేదొకటిరా
కాళ్ల సందుకు తీసుకొంటే కమ్ముకుండేదొకటిరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
ఊరుకుండేదావురా ఊంగులాడేది దూడరా
కాళ్ల సందుకు తీసుకొంటే కమ్ముకుండేది దుత్తరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
పెట్టుకుండేదొకటిరా పట్టుకుండేదొకటిరా
బట్టపైకెత్తుకొని కొట్టుకుండేదొకటిరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
పెట్టుకుండేది కొలిమిరా పట్టుకుండేది కారురా
బట్టపైకెత్తుకొని కొట్టుకుండేది సమిటిరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా…’
‘‘చ, ఏందిబా ఆయనట్ట బూతుపాటలు పాడతుండాడా’’ సింగిలించుకొంటా అనిందది నాతో.
‘‘అవున్లేవే, మనవి సోకయిన పేట పుటకలు కదా, పల్లెసింగారం మనకు బూతు మాదిరిగానే వినబడతాదిలే’’ తిరిగి సింగిలించినాను నేను.
మా సింగిలింపుల్ని నెట్టుకొంటా ఇలావంతుడు వచ్చినాడు మేముండే మాను నీడకు.
‘ఏం బావో, చిప్పట్లదడికల్లా పోతానని చెప్పి, ఇట్ట తిరుక్కొన్నావేంది’ మారయ్య అడిగినాడు.
‘అట్నే పోదామని గంగినాయినికుంట దాకా పొయినా, అక్కడ ఎలుంగొడ్డు అడుగుజాడలు కనపడినాయి. ఎందుకులే ఇక్కట్టు అనుకొని ఇట్ట మలేసుకొని వచ్చినా’
చెప్పినాడు.
‘కొండమీదకి మొయిళ్లు దిగితే సాలు, పైనుండే ఎలుంగొడ్లన్నీ ఊరంచుకు చేరతా ఉండాయి. రొండుమూడేళ్లుగా ఇదొక పీడయిపొయింది మనకు’ పోతన్న గొణిగినాడు.
‘పైన మబ్బులకు జడిసి, కిందుండే గవుల్లో ముడుక్కోను వస్తుంటాయి. వస్తే వస్తాయి, మనకేమీ ఇక్కట్టు లేదు. మన తిండ్లు అవి తినేది లే, వాటి మేపులు
మనం మేసేది లే. వానలు కురిసే నాలుగునాళ్లూ ఉండేసి ఆనేక వాటి దోవన అయి పోతా ఉండినాయి. నిరుడు మొరుడునించే కదా ఉబద్దరవ వచ్చి పడిరది’ గాలిని
పొడుగ్గా వదలతా అన్నాడు ఇలావంతుడు.
‘అయినా బెమ్మంగారు చెప్పినట్టు కలిగ్గం కడాకు వచ్చినట్టు ఉండాది. లేకపోతే ఎలుంగొడ్లు ఏంది, ఆడోళ్లను పట్టుకొనిపొయి చెరిచి చంపేసేదేంది!’ అన్నాడు
ఇలావంతుడి మాటలకు వంతగా మారయ్య.
‘అన్ని ఎలుంగొడ్లూ అట్టెందుకు చేస్తాయి. అదేదో ఒకటి మటుకు మరిగుండాది. దాన్నిగాన మట్టగించేస్తే, ఇంక ఈ ఇక్కట్టే ఉండదు. పాపం ఆ మాలోళ్ల
బొసకమ్మి, ఎంత వయినమయిన బిడ్డ. కట్టెలకని అడివిలోకి పొయి ఆ ఎలుంగొడ్డు పాలయి పొయింది’ వెతపడతా అన్నాడు పోతన్న.
‘ఆ బోనుపల్లి నాయుళ్లపిల్ల మటుకూ, సక్కనిసుక్క కదా. అవ్వోళ్ల ఇంటికి సుట్టమయి వచ్చి, ఆ ఎలుంగొడ్డు ఎదాన పడిరదే’ అంగలార్చినాడు ఇలావంతుడు.
‘‘ఏందిబా వాళ్లు మాట్లాడుకొనేదీ. ఎలుంగొడ్డు ఆడోళ్లను ఎత్తుకొని పోతుండాదా?’’ అచ్చెరపోతా అడిగిందది.
‘‘ఊరికే ఎత్తుకొని పొయ్యేది కాదు, అడివిలోకి కట్టెకో కంపకో ఈతపండ్లకో మరటాకులకో పొయిన ఆడోళ్లను పట్టుకొని చెరిచి చంపేస్తుండాదంట. ఇప్పటికి
ముగ్గురు ఆడోళ్లు చచ్చిపొయినారు. అడివిని కాపుకాసేవాళ్లు కూడా ఏమీ చెయిలేక చేతులెత్తేసినారు’’ చెప్పినాను.
మేము మాట్లాడుకొంటా ఉండగానే, అబ్బోడు చడ్డీలో దోపుకొని వచ్చిన పిల్లగోయిని బయిటికి తీసి కూ కూ అని ఊదినాడు. పిల్లగోయి కూతకు అందరి
మాటలూ ఆగిపొయినాయి. గంగినాయినకుంట తావునుండే వెదురుపొదలో పుట్టిన పిల్లగోయి అది. పుట్టినప్పుడు అది ఉత్త వెదురుగోయి అంతే. పోతన్న చేత పడి
పిల్లగోయి అయి, అబ్బోడి పెదాలను తాకి పల్లాయిలు పలకతా ఉండాది.
‘అట్నేనా రా, పిల్లగోయిని ఊదేది?’ అంటా అబ్బోడి చేతిలోని పిల్లగోయిని అందుకొని తాను ఊదినాడు ఇలావంతు బావ. అది పిల్లగోయి పాడినట్టు లేదు.
గూట్లోని బెళవాయి కువకువమన్నట్టు ఉండాది. కట్టుకొచ్చిన పిక్కిలిగువ్వ పోతుగువ్వను పిలిచినట్టు ఉండాది. పచ్చముడ్డి కందిరీగ చెండుమల్లికి
జోలపాడినట్టు ఉండాది. ముంతమావిడి పండుకోసం మునెక్క కూతురు ముదిగారంగా ఏడిచినట్టు ఉండాది. గుబ్బలమానుమీద జోడు జీరంకులు గీపెట్టినట్టు ఉండాది.
పిల్లగోయిపాట సాగతా ఉండంగానే మడిగుడ్ల దొనకు వెనకతట్టు నించి వినిపించింది ఒక ఆడదాని బీతరపు అరుపు. ఇలావంతుడు పిల్లగోయిని నిలిపి దొనతట్టుకు
పరుగులు తీసినాడు. అతడి వెనకాల్నే పోతన్నా మారయ్యా అబ్బోడూ కూడా పరుగులు పెట్టినారు. మేమిద్దరం కూడా వాళ్లవెంట పడినాము.
మడిగుడ్లదొనను దాటుకొని పులికొట్టిన మద్దిమానుకు వెనకుండే అమడగుండ్ల కాడకి పొయి బెప్పరపొయి నిలిచిపొయినారు ఇలావంతుడూ పోతన్నా.
‘మారయ్యా నిలువు నిలువు, అబ్బోడిని తొడకోని రాబాక, దడుసుకొంటాడు’
ఇలావంతుడి గొంతు ఎగిసింది. ఆ మాటతో అబ్బోడిని లాక్కొని ఇవతలకు వచ్చేసినా మారయ్య. మేమిద్దరమూ వాళ్లను నెట్టుకొని ముందుకు పొయినాము. అమడగుండ్లకు నడాన ఒక ఆడామె పడుండాది. ఆమెకు ఒళ్లంతా గాట్లే, మొకం కవుసుముద్ద అయుండాది.
ఒంటిమీది కోక పీలికలు పీలికలుగా చీలిపొయుండాది. దూబలోనించి నెత్తురు కారతా ఉండాది. మా కళ్లెదురుగానే తనకలాడి తనకలాడి చచ్చిపొయింది ఆయమ్మ.
‘ఇలావంతా, మన పిడూరు చిన్రెడ్డి రొండో కోడలు రా. ఎలుంగొడ్డు పొట్టన పెట్టుకొనేసింది రా. బిన్నా ఊర్లోకి పొయి నలగర్నీ పిలుచుకొని రారా’ పోతన్న ఎలుగెత్తి ఏడిచినాడు.
‘‘ఏంబా, మీ చిన్నారవ్వ కతను చెప్తానని చెప్పి తొడకోనొచ్చి, ఇట్టాంటి ఒగ్గాళపు చావుల్ని చూపిస్తా ఉండావే. ఇదేనా మీ అవ్వకత. నావల్ల కాదు, పోదాం
పద బా’’ బోరుమనింది నా ఎదకు తలను ఆనిస్తా అది. నేను దానిని అట్నే పొదువుకొని వెనక్కి తిప్పుకొని వచ్చినాను. గుంపెనమాను కింద కూచోబెట్టి,
వీపు నిమిరి సమాళించినాను. కొంచెంసేపటికి తెప్పరిల్లింది అది.
‘‘ఇంత మెత్తనయితే ఎట్ట బతకతావే. సరే పద, ఇంకొంచెం, కొంచెమే కొంచెం, ఒక్క రెండేళ్లు వెనక్కి పొయి చిన్నారవ్వను పలకరించేసి పోదాము పా’’ అంటా
లేపినాను దానిని.
మేము చిన్నారవ్వవాళ్ల ఇంటికి పొయ్యేతరికి రెయ్యి సంగటిపొద్దు దాటిపొయుండాది. గొర్రెల కాడనించి మేము రెండేళ్లు వెనక్కి వచ్చేసుండాము. అబ్బోడికి
రెండు పిడచలు చేతిలో పెట్టి, ఆ అత్తాకోడళ్లు చెరొక పిడచను నోట్లో వేసుకొని, నట్టింట్లో కూచోనుండారు. అబ్బోడు అవ్వ ఒళ్లో కూచుని తూగితూగి
అక్కడ్నే పడి కునకతా ఉండాడు. మేమిద్దరం కూడా నట్టింట్లోకి పొయి,దడిపాలు కింద నిట్టాడికి ఆనుకొని కూచున్నాము.
‘అత్తా, ఈ పొద్దు మనూరి కొండమీదకి మొయిళ్లు దిగినాయి. నాకేందో బిత్తరగా ఉండాదత్తా’ అనింది కిష్టవేణమ్మ చిన్నారవ్వతో.
‘నేను కూడా అదే అనకొంటా ఉండానమ్మే. ఎప్పుడూ లేనిది వాడు ఇట్ట మారిపొయినాడు ఏందా అని. దేనికయినా మంచిది, నువ్వు పరంటింట్లోకి పొయి తలుపు
చిలుకేసుకో. వాడొస్తే నేను కూడేస్తాను లే’ అనింది చిన్నారవ్వ.
‘ఇప్పటికి రెండుతూర్లు అయిందత్తా. పడకగుట్టు పరంటిల్లు దాటకూడదు అంటారని మొదటితూరి నీతో చెప్పలేదు నేను. ఒళ్లంతా కొరికి, రక్కి, పచ్చిపుండు
చేసేస్తా ఉండాడు. మొయిళ్లు దిగినప్పుడే ఇట్ట చేస్తుండాడు. మొన్న పదినాళ్లప్పుడయితే నేను చచ్చిపొయినాను అనే అనుకొన్నా. ఇంతకుముందు ఇట్టంతా
చేసేది లేదు, ఇన్నెనక ఇన్నెనకనే ఇట్టయినాడు’ కళ్లనీళ్లు పెట్టుకొంటా అనింది కిష్టవేణమ్మ.
‘వీడి అబ్బకు కూడా పెళ్లయిన పదేళ్లకు ` ఇట్టాంటిదే కాదు కానీ, ఏదో ఎరగని నొగులు తగులుకొనింది. అప్పుడు వీడికి ఏడేళ్లో ఎనిమిదేళ్లో ఉంటాయి.
కొండమీదకు మొయిళ్లు దిగితే చాలు, ఆ పొద్దంతా ఉలుకూ పలుకూ లేకుండా కూడూనీళ్లూ మొగించేసి మింటికల్లా చూస్తా ఉండేవాడు. కూటికి పిలిస్తే కూడా
కొట్టడానికి వచ్చేవాడు. అట్ట నాలుగేళ్లు ఏగినా ఆయనతో. అన్నెనక ఒకనాడు మోడాలు ఉరిమేటప్పుడు ఒంటిగా చీకలబయలుకు పొయి మర్రిమాను కింద కూచున్నాడు.
మన మారుగోడి చిన్నాయన అంకయ్య, గొర్రెల్ని మలేసుకొని వస్తా ఆయన్ని చూసి ఇంటికిపోదాం రమ్మంటే కొట్టేదానికి పైపైకి వచ్చినాడంట. అంకయ్య తనపాటికి
తాను తిరుక్కొన్నాడు. ఆ మర్రిమానుమీదనే పిడుగుపడి మానూ మీ మామా ఉరువులేకుండా మాడిపోయె. మీసకట్టు కూడా మొలవని కొడుకుని నా ఎదాన తోసి ఆయన
దోవ ఆయన చూసు కొన్నాడు. ఇప్పుడు వీడికి కూడా అట్టాంటి మొయిలు నొగులే ఏదో తగులుకోనుండాది. వీడి అబ్బే మేలు. మొయిళ్లు దిగినప్పుడు
కిక్కిరిమిక్కిరిమనకుండా ఉండేవాడు. వీడేంది ఇట్ట కొరికి పెడతుండాడే.
మొన్న పదినాళ్లప్పుడు నీ ఒంటిని చూసి నాకే బిత్తర పుట్టిందమ్మే.
కాపుగుట్టు కడప దాటకూడదు అంటారు, వీడిని ఏ ఊరికి తొడకొనిపొయి ఏ వైదిగుడికి చూపించాలనో. అట్ట తొడకొని పొయేదానికి వీడు పసిబిడ్డ కాదే’
నిట్టూరస్తా పాత పురండమంతా కోడలిముందు విప్పింది చిన్నారవ్వ.
వాళ్లిద్దురూ మాట్లాడుకొంటా ఉండంగానే తలాకిటి తలుపును మెల్లింగా తోసుకొని లోపలికొచ్చినాడు సోములు మామ. అంత గబాన వస్తాడు అనుకోని ఆ అత్తా
కోడళ్లు బెప్పరపొయినారు. సోములు కళ్లు చింతనిప్పుల మాదిరిగా ఎర్రంగా మెరస్తా ఉండాయి. అదొకమాదిరిగా ఏదో లోకాన ఉన్నెట్టు,
ఇక్కడెవరు ఉండారో పట్టనట్టు ఉండాడు.
చిన్నారవ్వ కలమేలుకొని, కోడలిని పరంటింట్లోకి పొమ్మని సైగ చేస్తా ‘రేయ్‌ కూడు తిందువురా, చల్లారిపోతుండాది’ అని పిలిచింది. మాట్లాడకుండా వచ్చి
పీటమీద కూచున్నాడు. ఒళ్లో కునకతుండే మనవడిని పక్కన పండబెట్టి, తట్టను తెచ్చి కొడుకు ముందు పెట్టింది చిన్నారవ్వ.
‘ఏమి నువ్వేస్తుండావా, అదేడకి పొయిందా’ ఉరిమినట్టు అడిగినాడు. అప్పటికే కిష్టవేణమ్మ పరంటింట్లోకి పొయి తలుపుచిలుకు పెట్టుకొనేసుండాది.
‘ఆయమ్మికి తలకాయ నొప్పిగా ఉండాదంట. పొయి పణుకొనేసింది. నేను పెడతాను, తినేసి ఈడ్నే పణుకో’ అంటా తట్టలో కూడుపెట్టింది చిన్నారవ్వ.
తట్టను విసిరికొడతా లేచినాడు సోములు. అంతెత్తుకు ఎగిరి కిందపడిన కంచుతట్ట లబలబలబ నోరుకొట్టుకొనింది. ఆ ఉలివుకు ఉలిక్కిపడి లేచినాడు అబ్బోడు. ఏం
జరగతుండాదో తెలవక వెలవరపొయి కూచోనుండాడు. కూటితట్టను కొట్టిన సోములు విరవిర పరంటింటి తట్టుకు పొయి దెబదెబ తలుపును బాదినాడు. అడ్డంపొయిన
చిన్నారవ్వను ఒక్క తోపు తోసినాడు. విసురుకొని పొయి నిట్టాడి మీద పడిరది ఆయమ్మ. నుదుటికి నిట్టాడి కొట్టుకొని బొటబొట నెత్తురు కారతా ఉండాది.
‘‘ఏంబా చూస్తా కూచోనుండావా. పొయి ఆయమ్మని లేపి, మీ సోములు మామని ఇవతలికి లాగు పోబా’’ చివక్కన పైకి లేస్తా అనిందది.
నేను విసవతా ‘‘కూచోవే, ఎప్పుడో నడిచిపొయిన కత అది. నేను లేచి అవ్వ దగ్గరకు పోతా ఉండాను చూడు’’ అన్నాను దానితో.
అబ్బోడు బిత్తరపొయి ‘అవా…’ అంటా పరిగెత్తినాడు చిన్నారవ్వతట్టుకు. అవ్వ పైకిలేచి కారతుండే నెత్తురుని అరచేత్తో తుడుచుకొని, అబ్బోడి తట్టు
చూస్తా ‘అబ్బోడా మీమామకు దెయ్యం పట్టింది. నువ్వు చుట్టింట్లోకి పో, నేను దెయ్యాన్ని వదలగొట్టి వస్తా’ అనింది యెరకల్ని యేలుముడి వేసుకొంటా.
అబ్బోడు చుట్టింట్లోకి పోకుండా నట్టింట్లోనే బిక్కుబిక్కుమంటా ఒక మూలన నక్కినాడు.
‘మేయ్‌ చిలుకు తీస్తావా, తలుపును యిరగ్గొట్టమంటావా’ అంటా తలుపును బాదతుండాడు సోములు. అవ్వ చివక్కన పొయి మూలనుండే గొడ్డలిని ఎత్తుకొని
సివంగిమాదిరిగా కొడుకుమీదకి దూకింది.
‘రేయ్‌, గుట్టుగా బయిటికి పో, లేదంటే కొడుకువని కూడా చూడను. ఒకే యేటుకి నీ తలకాయని ఎగరగొట్టేస్తా. తుమ్మమాకుల్ని నరికిన చేతులియ్యి’ అని అరి
చింది. ఆ మాటతో రవంతసేపు కలుబారి నిలబడిపొయినాడు సోములు. ఆనేక తేరుకొని చివక్కన తిరుక్కొని బయటకి పొయ్యేసినాడు.
‘‘ఇంక మనగ్గూడా ఇక్కడ పనేమీ లేదు పదవే’’ అంటా లేచినాను నేను.
‘‘ఏందిబా, మీ సోములుమామ ఎట్ట పొయినాడో. మీ చిన్నారవ్వా కిష్టవేణత్తల నిలవరం ఏందో, ఆ అబ్బోడికి ` అదే నీకు ` అన్నెనక ఏమయిందో ఏమీ తెలుసు
కోకుండానే పోదామంటా ఉండావే’’ నా వెనకనే అడుగులు వేస్తా అనిందది.
‘‘అయ్యేది ఏముండాదివే. అబ్బోడికి బెదురువేకి తగిలి నాలుగునాళ్లు కాచి చల్లారింది. చీకట్లోకి వెలిబారిపొయిన సోములుమామ మన్నాడు మాపటేళకు ఇల్లు
చేరినాడు. అంతరికే కొండ వండిపెట్టిన కూటిని తినేసి మొయిళ్లు ఎగిరిపొయినాయి. సోములుమామ కుదురుగా ఇంటికి వచ్చిననాటి తెల్లవారి అంబళ్ల
పొద్దుకు, అడివిలో మాలోళ్ల బొసకమ్మిని ఎలుంగొడ్డు చెరిచి చంపేసింది.
అన్నెనక ఇంకొక ఏడాది లోపల మొయిళ్లతరిలో ఇంకొక రెండు ఆడ ఊపిర్లు ఎలుంగొడ్డుకు గావు అయిపొయి నాయి’’ చెప్పినాను.
‘‘అంటే ఏందిబా నువ్వు చెప్పేది, మీ సోములు మామేనా ఆ ఎలుంగొడ్డూ?’’ అడిగిందది.
‘‘ఎరగం వే. నాక్కూడా తెలియదు. నువ్వే విందువు పద’’ అంటా కొన్నాళ్లు ముందుకు నడిపించినాను దానిని.
మింట చిందిన జొన్నబొరుగుల్ని పిల్లలకి తినిపిస్తా ఉండాది పిల్లలకోడి.
ఆకలికో అలమటకో గుడ్లగూబ ఒకటి కొండంచు గుబురుల్లో మూలగతా ఉండాది. మందిళ్ల తెరువులోని ముసిలికుక్కకు ఏమి కనపడిరదో ఓ… అని ఏడుపు ఊళలు తీస్తా
ఉండాది.
ఇంట్లో చిన్నారవ్వా సోములుమామా ఇద్దరే ఉండారు. కిష్టవేణత్త పుట్టినింటికి పొయ్యేసింది. అమ్మ ఒళ్లో పణుకోనుండాడు కొడుకు. చెట్టంత కొడుకు కారస్తుండే
కడవల కన్నీళ్లకు అమ్మ ఒడి తడిసి ముద్దవతా ఉండాది.
‘నన్ను ఏం చెయ్యమంటావు మా. మొయిళ్లు కొండమీదకు దిగితే చాలు, ఏదో ఉమాదం వచ్చి నన్ను చుట్టుకొంటా ఉండాది. అప్పుడు నేనేమి చేస్తా ఉండాననేది నాకు
తెలవకుండానే జరిగిపోతా ఉండాది. అట్టని బొత్తిగా తెలవకుండానే ఉండాదా అంటే తెలస్తానే ఉండాది. తప్పని తెలస్తా కూడా నిలుపుకోలేక
పోతుండా. అప్పుటికీ తిరపతి రొయ్యాసుపత్రిలో చూపించుకొన్నా. పట్నానికి పొయి జెల్లాసుపత్రిలో పదినాళ్లు ఉండివచ్చినా. కసుమూరు దర్గాలో మూడు
నిదర్లు చేసినా. కనపడిన సామికంతా మొక్కినా. ఇంకేమి చేసేది మా’ ఎక్కిళ్లు పెడతా అమ్మను అడగుతుండాడు సోములుమామ.
కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు చిన్నారవ్వ. అన్నెనక గట్టిగా ఊపిరొదిలి నోరిప్పింది. ‘చచ్చిపో కొడుకా. ఏంది అమ్మ ఇట్ట అంటుండాదే అనుకోబాక.
నువ్వు ఏ పుటకలో చేసుకొన్న పాపమో ఇట్ట తగులుకొనింది నిన్ను. ఎట్టన్నా దూరం పొయి బతుకు నాయినా అందామనుకొంటే, మందిలేని చోటు ఏది చెప్పు. నీ కింద
ఇంక నాలుగు ఆడ ఉసుర్లు నలిగిపొయేదానికంటే నువ్వు చచ్చిపొయ్యేదే మేలు కొడుకా. రొండు పొగుళ్లూ రొండు రేత్రిళ్లూ నెప్పులు పడి కన్నాను నిన్ను. ఆ
కడుపుకోత కంటే ఈ గుండెకోతే పెద్దదిగా ఉండాది. నాకంట పడకుండా ఎడంగా పొయి చచ్చిపో కొడుకా..’ అమ్మాకొడుకులు ఇద్దరూ ఆ రెయ్యి ఎంతసేపు అట్ట
ఏడ్చుకొన్నారో తెలియదు. అదికూడా గుండెలు కరిగేటట్టు ఎక్కిళ్లు పెట్టి ఏడిచింది. దాని ఏడుపును
నేను చూడలేకపొయినాను. ‘‘వినిన కత చాల్లేవే, పద మనింటికి మనం పోదాం’’ అన్నాను అలమటగా. ఆ మాటతో అది కళ్లు తుడుచుకొనింది. ఏడుపును నిలిపింది.
‘‘అన్నెనక ఏమయింది బా, మీ సోములుమామ ఎట్ట చచ్చిపొయినాడు?’’ అడిగింది అది.
‘‘ఇంకా నీకు ఈ కతను వినాలనుందా వే. సరే కానీ విను. ఆ రెయ్యి అమ్మా కొడుకులు ఏడుచుకొన్నాక ఇరవయినాళ్లు గడిచినాయి. పుట్టినింటికి పొయుండిన
కిష్టవేణమ్మ తిరిగి వచ్చుండాది. అబ్బోడు కూడా ఎండతరి సెలవలకు ఆయవ్వవాళ్ల ఊరూ ఈయవ్వవాళ్ల ఊరూ తిరుక్కొని కడాన ఆదరానికి వచ్చుండాడు. ఎప్పుడూ మీసర
కడానో ఆదర మొదటనో వచ్చే మొయిళ్లు ఆ ఏడాది మీసర పెట్టీపెట్టకముందే వచ్చేసినాయి. ఆపొద్దు రెయ్యి నడిజాము దాటినాక, కోళ్లను పట్టడానికి వచ్చే
జంగుబిల్లి మాదిరిగా సడీసప్పుడూ లేకుండా సల్లంగా కొండమీదకు దిగినాయి మోడాలు. అదే పొద్దుకు సోములుమామ లేచి ఊరిని వదిలి కొండపక్కకు
వెలిబారిపొయినాడు. పొద్దన్నే అవ్వని బతిమాలుకొని మారయ్యతో కలిసి గొర్రెల వెనకాలనే కందిచేను పల్లాల కాడకి పొయినాడు అబ్బోడు’’
‘‘ఇందాక మనం అక్కడినించే కదబా వచ్చిందీ?’’ అనిందది.
‘‘అవును, మళ్లా అక్కడికే పోవాల పద’’ అంటా పల్లాల తట్టుకు దోవతీసినాను.
‘ఇలావంతా, మన పిడూరు చిన్రెడ్డి రొండో కోడలు రా. ఎలుంగొడ్డు పొట్టన పెట్టుకొనేసిందిరా. బిన్నా ఊర్లోకి పొయి నలగర్నీ పిలుచుకొని రారా’ పోతన్న
ఎలుగెత్తి ఏడిచినాడు.
మరికొంచెం సేపటికి ఊరు ఊరంతా అమడగుండ్లకాడ గుమిగూడిరది. పీనిగయి పడుండే కోడల్ని చూసి, చిన్రెడ్డి ఇంట్లోవాళ్లు గుండెలు బాదుకొంటా ఉండారు.
‘ఇంకెందుర్ని గావు తీసుకొంటాదో అది. మనూరికి పీడయి దాపరించిందే’ ఏడుపుగొంతుతో అన్నాడు పోతన్న.
‘ఏదో ఒకటి చేసి దాన్ని మట్టగించకపోతే ఎట్ట, ఊరు వల్లకాడయి పోదా’ అన్నాడు మారయ్య.
‘మనమేమి చెయ్యగలము, గుంటికోవుల్ని చేతపట్టుకోనుండే కావిలోళ్లే ఏమీ చెయిలేక పోతుంటే’ అంగలారస్తా అన్నాడు ఇలావంతు బావ. ఇట్ట తలా ఒక మాట
మాట్లాడతా ఉండారు.
‘అట్టని గమ్మన్నే ఉండిపోదామా. అడివిలోకి పొయి గాలించయినా సరే దానిని చంపి తీరాల. ఈపొద్దు అదో నేనో తేలిపోవాల’ అంటా అప్పుడే గుంపులోకి వచ్చినాడు
సోములుమామ.
ఆ మాటతో ఊర్లోని మగోళ్లు పదిమందీ బరిసలూ కత్తవలూ ఎత్తుకొని జతలు జతలుగా చీలి, అడివిలోకి దూరినారు ఎలుంగొడ్డును వెతుక్కొంటా. సోములుమామా మారయ్యా
కలిసి ఒక తట్టుకు పొయినారు. మేమిద్దరమూ వాళ్ల వెనకాలనే పొయినాము. వాళ్లు కొండపైకి ఎక్కతా ఉండారు. నడికొండమీదకు పొయినాక, ఒక దగ్గర నేలను చూస్తా
ఆగినాడు మారయ్య.
‘‘సోములయ్యా, ఇయిగో ఎలుంగొడ్డు అడుగుజాడలు. ఇదే దోవన ఇంతకుముందే పొయినట్టు ఉండాది’ అన్నాడు జాడలను చూపిస్తా మారయ్య. అవునన్నట్టు తలూపి
నాడు సోములుమామ. ఇద్దరూ ఆ జాడల్ని గమనిస్తా పదిబారలు ముందుకు పొయి నిలిచినారు. అక్కడ జవురురాళ్లు ఉడ్డపోసినట్టు ఉండాయి. ఆ రాళ్లమీద జాడలు
కనబడవు. దోవ కూడా కుడిఎడమలుగా చీలి ఉండాది అక్కడ.
‘మారా, ఇక్కడ్నించీ నువ్వు జవురురాళ్ల దోవన్నే పొయి అట్ట తిరుక్కొనిరా. నేను పెద్దజర్తి దోవన ఈతట్టునుంచి వస్తాను. ఈ నడుములోనే దొరికిపోవాల
మనకు. కనబడిరదంటే జంకకుండా ఒకే పోటు పొడువు’ అంటా మారయ్యను కుడిదోవన పంపించి, ఎడమపక్కకు తిరిగినాడు మామ.
‘‘పెద్దజర్తి దోవలో బలే మెలపుగా నడవాల. కాలు జారిందంటే ఎముక కూడా మిగలదు. బజ్జయిపోతాము. చూసి నడువు’’ దానితో అంటా, మామ పొయిన దోవలోనే అడుగులు
పెట్టినాను. నన్నంటుకొని నాతోకలాగా నడస్తా ఉండాది అది. సోములుమామ ఆ దోవన ఒడుపుగా నడిచి విరవిరా పోతుండాడు. మేము పలకల పేటుకాడకి
పొయేతరికే ఆయన కరక్కాయ నెత్తిని దాటి మలుపు తిరగతా ఉండాడు. ఆయనకీ మాకు ఇన్నూరు మున్నూరు బారల ఎడం పెరిగింది. మేము కరక్కాయ నెత్తిని దాటి మలుపు తిరిగి నిలబడినాము. సోములు మామ కనబడలేదు మాకు. ఎట్ట పొయినాడా అనుకొంటా అక్కడ్నే నిలిచి చూస్తా ఉండాము.
కొలిగమాను గవిలో నించి సోములుమామ చావు అరుపు బయటకొచ్చింది. బీతరపు కేకలు పెడతానే ఉండాడు. నేను గబగబ గవితట్టుకు కదలబొయినాను. బిత్తరతో నన్ను
అబ్బిళించుకొని వదల్లేదు అది. దానిని వదిలించుకొనే లోపల, సోములు మామ అరస్తా గవి బయటకి పరిగెత్తుకొచ్చినాడు. ఆయన గుడ్డలన్నీ పీలికలు పీలికలు
అయిపొయుండాయి. మొకమంతా కవుసుముద్దయి ఉండాది. ఒళ్లంతా నెత్తురు మండలంగా ఉండాది. పరిగెత్తుకొచ్చిన ఆయన కాలు జర్తిమీద పడి జారింది. అంతే, లోయలోకి
జారిపొయినాడు. ‘సస్తినిరా మారా’ అనే ఒగ్గాళపు కేక లోయలోనుంచి పైకొచ్చి కొండను తాకి నిలిచింది.
‘‘అబా ఏంది బా ఈ గోరమా’’ నోరు కొట్టుకొంటా అనిందది. నేను దానిని అబ్బిళించి పొదువుకొన్నాను. మేము కలుబారిపొయి అట్నే ఉండిపొయినాము
చానాసేపు. నేనే ముందుగా తెపరాయించుకొని దానిని నడిపించుకొంటా కొండదిగి వచ్చినాను.
‘‘ఏంబా సోములుమామని చంపేసింది ఎవురు బా’’ వెక్కతా అడిగిందది.
‘‘ఎరగం వే, నేనూ నీ మాదిర గవికి బయట్నే ఉండిపొయినాను కదా. ఎలుంగొడ్లలో
మదంపట్టిన మగవే కాదు, కడుపు రగిలిన ఆడవి కూడా ఉంటాయివే’’ మారాడినాను.
నేనూ ఆ చీకటిపిల్లా ఆదరం గమిడిని దాటి, తిరుక్కొని పోతా ఉంటే, వెనకాల నించి చిన్నారవ్వ ఏడుపు పాట వినిపించింది.
‘కొడుకా కనలేక కనలేక కంటినే కొడుకా
రొండు పొగుళ్లూ రొండు రేత్రిళ్లూ నెప్పులుపడి కంటినే కొడుకా
కలిపోసి కడిపెట్టి కడపమాను ఎత్తుకు సాకితినే కొడుకా
ఆ కూలిపొయిన ఎలుంగొడ్డు నిన్ను మట్టగించేసెనే కొడుకా
నిన్ను బొదులు అది నన్ను సంపుండకుడదా కొడుకా..
అక్టోబరు 2014

మనుషుల్ని చంపేస్తారు, మరి భూమిని?!

varavara.psd-1

అజంతా చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసాడు.

తాత్వికార్థంలో ప్రాణికోటి ప్రాణవాయుహరణమే చూసినట్లు. మనుషులు కూలుతున్న దృశ్యాన్నీ చూసినట్లే.

తెలుగు సమాజం, ముఖ్యంగా తెలంగాణ, వ్యవస్థాపరంగానూ రాజ్యపరంగానూ పోరాడుతున్న ప్రజలను, వాళ్లకు అండగా పోరాడుతున్న ప్రజాసేవకులను పందొమ్మిది వందల నలభైల కాలం నుంచే ఎంతమందిని కోల్పోయిందో. నా బాల్యంలో అటువంటి విషాదాలనూ చూసాను. మూడు వైపులా వాగులతో పరివృతమైన మా ఊళ్లో బరసనగడ్డ రోడ్డు మీద దిరిసెన పూలు, బొడ్డుమల్లె పూలు రాలిన అందమైన దృశ్యాలూ చూసాను.

ఇంక నక్సల్బరీ కాలం నుంచి చైతన్యం వలన కూలుతున్న మనుషులందరూ ఎక్కడో నా రెక్కల్లో డొక్కల్లో మసలుకున్న వాళ్లేననే మానసికతయే నన్ను ఆవరించింది. ఎనభైల ఆరంభం అమరుల జ్ఞాపకాలను కూడ నిర్దాక్షిణ్యంగా తుడిచే వ్యవస్థ క్రూరత్వంతో మొదలైంది.

కరీంనగర్ జిల్లా హుజూరాబాదు తాలూకా గూడూరు అనే గ్రామంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్మించిన ఒక నవయువకుడు గోపగాని రవి చేతిలో బాంబు పేలి మరణించాడు. గ్రామస్తులు ఆయన కోసం ఆ ఊళ్లో కట్టుకున్న స్థూపాన్ని పోలీసులు కూల్చిన పద్ధతి నన్ను కలచివేసింది. స్థూపానికి అవసరమైన మట్టి, ఇటుకలు, రాళ్లు, సున్నం ఎవరు సమకూరిస్తే వాళ్లనే అవి తొలగించమని, ఎవరెవరు ఆ నిర్మాణంలో పాల్గొన్నారో వాళ్లనే అది కూల్చమని పోలీసులు ప్రజల్ని కూడేసి నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారు. ఇంక అప్పటినుంచీ అదొక నిర్బంధ పద్ధతి అయిపోయింది. అమరులైన విప్లవకారుల కోసం స్థూపాలు నిర్మించుకోవడం ప్రజల రాజకీయ, సాంస్కృతిక, నైతిక, సంఘటిత శక్తికి ఎట్లా ఒక సంకేతమైందో, ఆ స్థూపాలను కూల్చివేయడం రాజ్యానికట్లా ఆ అమరుల జ్ఞాపకాలను తుడిచేసే హింసా విధానమైంది.

1999 డిసెంబర్ 1న ఇది పరాకాష్ఠకు చేరుకున్నది. ఆరోజు నల్లా ఆదిరెడ్డి (శ్యాం), ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి (మహేశ్), శీలం నరేశ్ (మురళి) లను బెంగళూరులో అరెస్టు చేసి, కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవులకు తీసుకవచ్చి, లక్ష్మీరాజం అనే పశులకాపరితో కలిపి డిసెంబర్ 2న చంపేసి, ‘ఎన్ కౌంటర్’ అని ప్రకటించారు. ముగ్గురి మృతదేహాలను పెద్దపెల్లి ఆసుపత్రిలో పెట్టి రాష్ట్రవ్యాప్తంగా జనం తరలివస్తుంటే క్షణాల మీద పోలీసు వ్యాన్ లోనే శీలం నరేశ్ మృతదేహాన్ని జగిత్యాలకు తరలించి, జగిత్యాలను పోలీసు చక్రబంధంలో పెట్టి, తండ్రిని బెదరించి దహనక్రియలు చేయించారు. సంతోష్ రెడ్డి తల్లి అనసూయమ్మ హైకోర్టులో సవాల్ చేయడం వల్ల ఆయన మృతదేహాన్ని రీ పోస్ట్ మార్టమ్ కొరకు రామగుండం సింగరేణి కాలరీస్ ఆసుపత్రికి తరలించారు. నల్లా ఆదిరెడ్డి మృతదేహాన్ని మాత్రం అతని సోదరుడు కరీంనగర్ జిల్లా కొత్తగట్టుకు తెచ్చుకోగలిగాడు.

అక్కడికి వెళ్లకుండా ఎం ఎల్ పార్టీల నాయకులందరినీ, విరసం విమలను, నన్ను జమ్మికుంట పోలీసు స్టేషన్ లో నిర్బంధించారు. కొత్తగట్టు ఊరిని, ఆ ఊరికి హనుమకొండ, కరీంనగర్ ల నుంచి ఉండే మార్గాలను గ్రేహౌండ్స్ తో నింపేసారు. అయినా జనం పలు మార్గాలనుంచి చీమల దండువలె కదలి రాసాగింది. మమ్మల్ని కొత్తగట్టుకు వెళ్లగూడదనే ఉద్దేశంతో నలగొండ జిల్లా సరిహద్దుల్లో వదిలేస్తే ఆలేరులో బండ్రు నరసింహులు ఇంట్లో తలదాచుకున్నాం. ఆ అమ్మ నర్సమ్మ మా అందరికీ అర్ధరాత్రి వండి పెట్టింది. మర్నాడు ఉదయమే రాజమార్గం తప్పించి నన్ను, నా సహచరి హేమలతను కొత్తగట్టుకు తీసుకవెళ్లిన నా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ క్లాస్ మేట్ సి రాజిరెడ్డిని తలచుకోవాలి. అలా శ్యాం అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఆ కక్షనంతా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో 1990 వరకు జిల్లాలో అమరులైన 93 మంది విప్లవకారుల స్మృతిలో నిర్మించుకున్న 93 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నేలమట్టం చేసి తీర్చుకున్నారు పోలీసులు. ఇప్పటికీ అక్కడ నేల మీద గడ్డిలో ఆ ఎత్తైన స్థూపం మీంచి నేలమీద కూలిన సుత్తీకొడవలి లోహ చిహ్నం పడి ఉంది.

1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చిన సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీ వా థియాంగో ప్రత్యేకించి హుస్నాబాదుకు వెళ్లి ఈ స్థూపాన్ని చూసాడు. అందుకే ఆయనకీ విషయం రాసాను. అప్పుడాయన నాకు ఎంతో ఆశ్వాసాన్నిచ్చే మాటలు రాసాడు – మనుషుల్ని కూల్చేసినా, వాళ్ల స్మృతిలో నిర్మించిన స్థూపాలను కూల్చేసినా, మీకు మళ్లీ మనుషులు పోరాటంలోకి వస్తున్నారు. అమరులవుతున్న వాళ్ల చేతుల్లోంచి పోరాట జెండా అందుకుంటున్నారు. మీరు పోరాటంలోనే వాళ్ల స్మృతులను నిలుపుకుంటున్నారు. కాని మాకు 1952-62 మౌమౌ విప్లవోద్యమం ఒక స్మృతి – నాస్టాల్జియా మాత్రమే, అన్నాడు.

‘భూమికి భయపడి’ కవిత గిరాయిపల్లి విద్యార్థి అమరులు, జన్ను చిన్నాలు స్థూపాలు వరంగల్ జిల్లా పైడిపల్లిలో కూల్చేసిన వార్త, ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చేసిన వార్త జైల్లో విన్నపుడు రాసింది. ఆ కవిత కిందనే ఆ వివరణ ఉంది.

మనుషుల్ని కూల్చేస్తారు. స్మృతుల్ని చెరిపేస్తారు. స్మృతిలో వెలిగించిన దీపాల్ని మలిపేస్తారు. కాని మనుషులకి, వాళ్ల పోరాటాలకి, జ్ఞాపకాలకి భూమిక అయిన ఈ భూమిని ఏం చేయగలరు – అన్నదే వ్యవస్థను, రాజ్యాన్ని మనుషులు నిలదేసే సవాల్.

ఈ కవితను హిందీలోకి అనువదించినపుడు ‘వాళ్లు కలాలకు భయపడ్డారు’ అని నేను రాసిన చరణాన్ని ఇంకా పదను పెడుతూ సుప్రసిద్ధ హిందీ సాహిత్య విమర్శకుడు మేనేజర్ పాండే ‘వహ్ కలమ్ కె నూర్ సె (కలం మొనతో) డర్ గయా’ అని మార్చాడు. ఇదే శీర్షికతో హిందీలో ఈ కవితపై ఒక వ్యాసం రాసాడు.

‘సంకెల సవ్వడి’ పాటకు శ్రుతి కావడం గురించి మొదట ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసాడు. సికిందరాబాద్ కుట్రకేసులో జైలు నుంచి మమ్మల్ని కోర్టుకు తీసుకవెళ్లేప్పుడు చెరబండరాజు పాటలకు మా సంకెలలు వాద్యసాధనాలు కావడం ఇది రాస్తున్నప్పుడు నేను వినగలుగుతున్నాను. ఆ దృశ్యాలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు చూడగలుగుతున్నాను.

-వరవరరావు

కాలాన్ని సిరాగా మార్చిన కవి

gournayudu

గంటేడ గౌరునాయుడి మాస్టారిని సాహిత్య లోకానికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటికే తన కథలతో కవితలతో మనందరికీ సుపరిచితులే. ఇటీవల ఆగస్టు 8న తన అరవై వసంతాలు నిండిన సందర్బాన్ని పురస్కరించుకొని ’ఎగిరిపోతున్న పిట్టలకోసం’ అనే కొత్త కవితా సంకలనాన్ని తీసుకువచ్చారు.

 

ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్రగా పిలువబడే ఈ ప్రాంతంలో గత నాలుగు దశాబ్ధాలుగా జరుగుతున్న విధ్వంసం అది సామాజికంగా ఒక్కో పొరను కప్పేస్తూ కమ్మేస్తున్న వైనాన్ని అలాగే వ్యక్తిగతంగా మనిషితనానికి దూరమవుతు రక రకాల ప్రభావాలకు ప్రలోభాలకు లోనవుతు తమ ఉనికినే కోల్పోతున్న సంక్షుభిత సందర్భాన్ని తన కథలలోను కవితలలోను ఆవిష్కరిస్తారు మాస్టారు. ఈ కవితా సంకలనంలోని కవితలు 2011 నుండి మొన్నటి వరకు వున్న కాలానికి వేలాడుతున్న చినిగిన చొక్కాలాంటి బతుకు వెతలు. మాస్టారి శైలి జీవితంలోని అన్ని పార్శ్వాలను తన నుడికారంతో స్థానిక మాండలికానికి దగ్గరగా సామెతలతో కలగలిపి చెబుతూ ఒక ధిక్కార స్వరాన్ని ఎలుగెత్తి మనముందు ఆవిష్కరిస్తుంది.

 

చాలా మంది ఇటీవల వామపక్షానికి దగ్గరగా వున్న మేధావులు రచయితలు కూడా అభివృద్ధి అంటే విధ్వంసం కాకుండా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నిస్తూ చెరబండరాజు అన్నట్టు నీ ఖాకి నిక్కరు మార్చినారురో ఓ పోలీసన్న, నీ బతుకు మారలేదురో ఓ పోలీసన్న అన్నట్టుగా పొట్ట చేతబట్టుకొని నాలుగు గిన్నెలు ముంతలు ఓ సిమెంటు బస్తాలో మూటగట్టి మా వూరినుండి వెళ్ళే బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కి చైన్నైకి, విజయవాడ పాసెంజరెక్కి ఆ చుట్టుపక్కలకి, నాగావళీ ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ కి పల్లెలనుండి వలస పోతున్న వారిని చూసి ఆహా రైతు కూలీ జనం కార్మిక వర్గంగా రూపాంతరం చెంది వీళ్ళంతా కార్మిక వర్గ విప్లవాన్ని తీసుకు వచ్చేస్తారు, పెట్టుబడి పల్లెలన్నింటిని కబలిస్తూ పట్టణాలలో కలిపి మెట్రో పాలిటన్ సిటీలుగా స్మార్ట్ సిటీలుగా మారిపోతున్నాయి యింక వ్యవసాయం చేయాల్సినది పెట్టుబడిదారులే అని చెప్పకనే చెప్తున్నారు. ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లలో కాంప్లెక్సులలో ఉద్యోగాలు కావాలా? అన్న ప్రకటనలతో ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి జనం వలస బాట పడ్తున్నారు అని ప్రకటిస్తున్నారు. ఇది ఒక పార్శ్వం మాత్రమె.

కానీ ఈ జీవన విధ్వంసం వెనక ఈ ప్రాంతంలో అమలు జరుగుతున్న విద్వంసకర అభివృద్ధి నమూనాలు కారణంగా ఇక్కడి జనం తమ విరిగిన రెక్కలతో నెత్తురోడుతున్న భుజాలతో ఎక్కడెక్కడికో ఎగురుకుంటూ కాంక్రీట్ స్లేబుల కింద నలిగిపోతున్న తమ జీవితాలను, అనారోగ్యకర పరిస్థితులలో బతుకుతు ఆ వచ్చిన అరకొర కూలీని దాచుకొని పండగలకు పబ్బాలకు పల్లెలకు వస్తూ తామంత సంతోషంగ వున్నామని మురిపిస్తూ తిరిగి తిరిగి మరల మురికి కూపాలకు పునరంకితమవుతున్నారు. ఈ జీవన నరకయాతనను, చిధ్రమవుతున్న మానవ సంబంధాలను మాస్టారు ఈ కవితలలో మనకు చూపిస్తారు. ఈ బలవంతపు వలసలు, ఇగిరిపోతున్న పచ్చదనం, సెల్ ఫోన్ రింగులతో మూగబోతున్న పల్లె పాటలు, ఏ ఆసరా లేక కునారిల్లుతున్న ముసలి బతుకులు, మేపుకు దూరమై కబేళా బాట పట్టిన పశుసంపద ఈ చిద్రమైన తీరును మాస్టారు చెబుతారు. ఇది కొంతమందికి అభివృద్ధికి వ్యతిరేకంగా అవసరంలేని వలపోతగా కనబడడం విషాదం. కవికి కాలాన్ని సిరాగా మార్చడమే కర్తవ్యం కదా? అది మాస్టారిలో మనం పరికించవచ్చు.

 

ఇంక మాస్టారి కవిత్వంలో ప్రతీకల వెల్లువ వుంటుంది. ఉదాహరణకు

 

ప్రతి ఉదయపు నడకా ఒక మధుర గీతమే కవితలో

 

అదృశ్య హస్తాలేవో దోసిళ్ళతో ఆకాశంలోంచి

వొంపుతున్న పుప్పొడి ధూళిని తమ చిట్టి రెక్కలతో పిట్టలు

కొమ్మల మీదా రెమ్మల మీదా ఆకుపచ్చ మెరకల మీదా

గరిక పరకల మీదా వెదజల్లుతున్నప్పుడు,

 

చీకటిని అడిగి బొగ్గును

వేకువను అడిగి సుద్దను తెచ్చి ఉషస్సు

తన నలుపు తెలుపుల బొమ్మ గీస్తున్నప్పుడు

హృదయలయకి శ్రుతి కలుపుతూ ఆలపిస్తాను

నా చరణయుగళ గమన గీతం… అంటారు

 

మాట్లాడుకోవాలిప్పుడు కవితలో

 

చీలికల సంగతి మరచి

చేతులు కలుపుకోవాలి,

ఏటిదారానికి కూర్చిన పూసలు కదా మన ఊళ్ళు

పూసా పూసా చెప్పుకునే ఊసులు కదా

మన ఇల్లూ వాకిళ్ళు

కరిగిపోతుంది తీరం

తెగిపోతుంది దారం

ఇప్పుడే.. యీ క్షణమే

మాట్లాడుకోవాలి..

 

ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల దుఖాన్ని ఇలా చెప్తారు

 

అనుకున్నదే, ఏదో ఒకనాటికి యీ తల్లకిందులు తప్పదని

నోరూ వాయీ లేనోళ్ళం

తీరూ తెన్నూ తెలీనోళ్ళం

ఎవలకేటి కాదనీసినాం? ఎవలి మాట కొట్టేసాం?

ఏలినవోరిదయ, మీరేతంతే మామదే అన్నాం

పేగులు తెగిపోతంటే పెదివిప్ప్పి ఒకమాటన్లేదు

బతుకు బుగ్గైపోతుంటే బితుకు బితుకుమని కూకున్నాం

మా నేల మాది కాదనీసినా మూగోల్నాగ మూల జేరిపోనాం…

 

అయ్యలారా!

అన్నం పొట్లాలు అందించిందాక ఆయువుండాలగదా

ఎలీకాప్టరొచ్చిందాక హంసెగిరిపోకుంట ఆగాల గదా

మరపడవలు తెప్పించేవరకి గురుకు జారిపోకుండ వుంతే గదా? అంటూ

 

కట్టండి నాయనా కట్టండి

మాము కప్పులడిపోయిన ఇసక దిబ్బల మీద

కట్టండి ప్రాజెక్టులు… అంటారు.

 

పెట్టుబడిదారీ మనస్తత్వాన్ని యిలా చెప్తారు మాస్టారు

 

యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది

మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తుంటాడు,

ఒక మారణ హోమం రగులుతూనే వుంటుంది

మరో మృత్యు యాగానికి ముహూర్తం నిర్ణయిస్తాడు.

 

మరణ మృదంగ నాదాలను మధుర సంగీతంగా

వినిపించగల మహా విధ్వాంసుడు వాడు

విద్యుద్ఘాతాలను బహుమతులుగా పంచగల

విద్వత్తు వాడిది……. అంటారు

 

అలాగే తెలంగాణా ఆకాంక్షను సమర్థిస్తూ

 

దుర్భరమే కావొచ్చు గాక ఎడబాటు

అదొక భవిష్యత్ పునస్సమాగమ సంతోష గీతిక,

వేదనా భరితమే కావొచ్చుగాక వేర్పాటు

అదొక మానవ మహోద్గమన సూచిక… అంటారు.

 

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగాక ఇంక రైతు చేసుకునే ఉగాది పండగ ఏముంటుంది అంటూ

 

గాదులు

ఇళ్ళముందునుంచి ఎగిరిపోయాక

ఉగాదులు ఒట్టి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి,

నాగలి

పురావస్తు ప్రదర్శనశాలలోకి పయనమైపోయాక

నాగేటి చాలొక చెదిరిన స్వప్నమైపోయింది….

లోహమహిషం ముందు నేను మోకరిల్లినపుడే

కొత్తామసకి కాలం చెల్లిపోయిందంటారు…

 

ఈ సంకలనంలో సద్దాం హుస్సేన్ ఉరిని టీవీలో చూస్తూ చలించి రాసిన ఈ కవిత

 

ఆకాశమంత నోటితో భూగోళం

నిరసన గీతం ఆలపిస్తుంటే

ఆత్మగౌరవ నినాదానికి అమావాస్య ముసుగువేసి

అహం నిస్సిగ్గుగా నవ్వింది.

ఆచ్చాదన లేని స్వేచ్చా విహంగం

ఉరితాడును ముచ్చటగా ముద్దాడింది

 

డాలర్ ఎగరేస్తున్న తుపాకీ మొనగాడి దగ్గర

భూగోళాన్ని వేలాడదీసే ఉరితాడు ఉందంటారా… అని ప్రశ్నిస్తారు.

 

గోర్కీ స్మృతిలో, భగత్ సింగ్ స్మృతిలో రాసిన కవితలతో పాటుగా తమ ఇంట్లో వొంగిన ఇంద్రధనస్సు మనవరాలిపైనా రాసిన కవితలతో పాటుగా ఉద్యమంలో అసువులు బాసిన వారిపట్ల సానుభూతితో రాసిన కవితలు ఇలా మనల్ని కదిలించి ఆలోచింప చేసే పద చిత్రాలతో నిండైన కవిత్వాన్ని మనకందించారు గౌర్నాయుడు మాస్టారు. తప్పక చదివి కదలాల్సిన కవిత్వం. ఇది స్నేహకళా సాహితి, పార్వతీపురం వారి ప్రచురణ. ప్రతులకు

 

గంటేడ కిరణ్ కుమార్

S.N.P. Colony,

Near Ramalayam, Belagam,

Parvathipuram – 535 501.

 

వెల: రూ.70/- లు.

  – కేక్యూబ్ వర్మ

 varma

 

 

Sri Sri “The Glory Bold”

images

The Glory Bold

I too
offered a sacrificial fuel
to the world’s fire!

I too
poured a tear of tribute
into the world’s torrent!

I too
yelled with a mad throat
with the earth’s roar!

# # #

When summer scorched
did I not swelter like a bat!

As the blustery drizzle
fell all around
did I not drench at the fathom’s height?
When the winter’s cutting cold froze me numb
I even howled with cries of hunger!

When I alone remain standing-
Fiery winds, rainclouds, snow drizzles
will break, striking the earth!

The many splendored stars
peering down from the sky
will fall exploding, vomiting blood!

Days breaking
Nights withering
The Great Deluge
will engulf this whole world!

# # #

The epoch will be upon us
When I alone will fill the whole earth
the very sighs of my moaning cries
soaking the world in a hailstorm!

# # #

I too
will sprout
as the white petal
of the lotus of the universe!

I too
will swoon
as the string
on the lute of the universe!

I too
will rise up
as the flag
on the palace of the earth!

[English rendering, by Raj Karamchedu, of Telugu poem “Jayabheri” (02 June 1933) by Sri Sri] [Original Telugu version below]

 

జయభేరి

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!

నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!

# # #

ఎండాకాలం మండినప్పుడు
గబ్బిలవలె
క్రాగిపోలేదా!

వానాకాలం ముసిరిరాగా
నిలివు నిలువున
నీరు కాలేదా?
శీతాకాలం కోతపెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!

నే నొక్కణ్ణే
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భగ్నమౌతాయి!

నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

# # #

నే నొకణ్ణీ ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తా లాగమిస్తాయి!

# # #

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!

నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

కష్టజీవి ఆత్మాభిమానం… ‘ఆదివారం’!

 

karalogo
నిర్వహణ: రమా సుందరి బత్తుల

పని చేసేవారికి కాకుండా ఆ పనిని చేయించేవారికీ, చేయించుకునేవారికి గౌరవాలు దొరికే సమాజం మనది. అందుకే శ్రామికులకు పనిచేసే అవకాశం కల్పించి వారిని పోషిస్తున్నామని ధనికులు భావిస్తుంటారు. వారి జీవితాలు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడివున్నాయనే అభిప్రాయంతో ఉంటారు.

కానీ నిజానికి ఎవరు ఎవరిపై ఆధారపడివున్నారు?

పని మనిషి పొద్దున్నే వచ్చి ఇల్లు ఊడ్చి, అంట్ల గిన్నెలు తోమకపోతే గృహ వాతావరణం గందరగోళంగా తయారై, ఇంటిల్లపాది సుఖశాంతులకూ ముప్పు వచ్చే సందర్భాలు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్ళలో సాధారణం. కానీ అంత చాకిరీ చేసేవారికి ప్రతిఫలంగా కొద్ది మొత్తం ఇవ్వటానికే కొందరు బాధపడిపోతుంటారు.

ఆ శ్రామికులపై సానుభూతి చూపటం అటుంచి … వాళ్ళ ఆశపోతుతనం, షోకులూ, ఫ్యాషన్ల గురించి వ్యంగ్యంగా విసుర్లూ, జోకులూ, కార్టూన్లూ చలామణిలోకి వచ్చాయి. ఈ ధోరణి చివరకు సాహిత్యంలో కూడా ప్రవేశించింది. ‘జీతం పెంచాలా? ఇంకా నయం- ఆస్తి రాసివ్వమని అడగలేదు’ అని ఆశ్చర్యాలుపడుతూ పనిమనుషుల దాష్టీకాలకు గురయ్యే మధ్యతరగతి గృహిణుల కష్టాలపై జాలి కురిపిస్తూ కథలు కూడా వచ్చేశాయి. వీటిని రాసినవారు శ్రామికులపై సానుభూతి లేనివారని తెలుస్తూనేవుంటుంది.

కానీ వీటికి భిన్నంగా… యాబై సంవత్సరాల క్రితమే కాళీపట్నం రామారావు రాసిన ‘ఆదివారం’కథ ఓ కష్టజీవి ఆత్మాభిమానాన్నీ, స్థైర్యాన్నీ కళాత్మకంగా చిత్రీకరించింది. శ్రామిక పక్షపాతంతో రాసి పాఠకులను ఒప్పించేలా కథను తీర్చిదిద్దారు రచయిత.

డబ్బున్న ఓ ఇంటి కోడలి కోణంలో ఈ కథ నడుస్తుంది. ‘మా యింట్లో పనిమనిషి లేనిదే పూట గడవదని ఏనాడో తేలిపోయింది’ అంటుందామె. (ఇది ఇప్పుడు మనం చాలా ఇళ్ళలో గమనిస్తున్న నిత్యసత్యం.) ఆమె అత్త లౌక్యురాలైన అరవై ఏళ్ల వయసున్న పెద్దావిడ.

ఆ ఇంట్లో పని మనిషి అంకాలు. ఈమె భయపెడితే జడుసుకోదు. కలియపడదామంటే తిరగబడుతుంది. డబ్బాశకూ లొంగిరాదు. మనసులో విషయం దాచి మసిపూసి మారేడుకాయ చెయ్యడంలో తమకన్నా రెండాకులు ఎక్కువ చదివిందనీ, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగలదనీ కోడలి అభిప్రాయం.

ఈ కొరకరాని కొయ్య అంకాలు వారానికో రోజు సెలవు కావాలని అడిగితే అత్త పేచీ పెట్టుకుంటుంది. వేరే పనిమనిషిని పెట్టుకోవాలని మూడు రోజులు ఎన్నిపాట్లు పడినా ఫలితం ఉండదు. గర్వభంగమై బింకం సడలిపోతుంది. కానీ ఏదోరకంగా తన పైచేయి ఉండాలని ఆదివారం కాకుండా మరే రోజునైనా సెలవు తీసుకొమ్మని అంకాలును ప్రాధేయపడుతుంది.

బలిష్ఠమైన మనిషి నిస్సహాయంగా బక్క వ్యక్తిని ఒప్పించటానికి ప్రయత్నిస్తుంటే ఆ అరుదైన దృశ్యం ఎవరికైనా సంతోషం కలగజేస్తుంది. ఇక్కడ అత్త మనస్ఫూర్తిగా కాకుండా ఎత్తుగడతోనే పని మనిషిని బతిమిలాడినా ఆ ఆక్రోశం వీనులవిందుగానే ఉంటుంది.

‘అంట్లు తోముతూ కూర్చుంటే నాకు నగుబాట్లుగా ఉంటుంది. ఆదివారం నాడు మాత్రం నా చుట్టాలు పక్కాలు మధ్య నా పరువు నిలబెట్టు.’ అని ప్రాధేయపడినప్పుడు- ‘దాసీ ముండన్నేనట- యీ యమ్మ పరువు నిలబెట్టాలట!’ అని ఆ పరువు డొల్లతనాన్ని అంకాలు బట్టబయలు చేస్తుంది.

అత్త తన పంతం నెగ్గించుకున్నానని తృప్తిపడటంతో కథ ముగుస్తుంది.

* * *

అంకాలు పాత్ర చిత్రణ గొప్పగా ఉంటుంది.   తనకు డబ్బు ఎక్కువ వస్తుందనేది కూడా పట్టించుకోకుండా తోటి పనిమనిషి సూరమ్మకు జరిగిన అన్యాయం గురించి ఆమె నిలదీస్తుంది.

‘నిజంగా కాయకష్టం చేసుకునే వాళ్ళ కష్టాలు యీ గవన్నెంటు కెప్పుడు పట్టాయి; మాకు వాళ్ళూ వీళ్ళూ రూలు పెట్టేదేవిటి; మేవే పడతాం రూల్సు’అనే ధీమా!

‘అదేటి కలకటేరా గవినేరా- నాలాగే పన్జేసుకునే కూలిముండ. దాన్తో సెప్పుకుంటే ఏటౌతాది?’ అంటూ వ్యంగ్యం!

‘అందరి పన్లూ ఆ ఒక్క గంటలోనే సేసీడానికి మాకేం పచ్చేతులూ, పది కాళ్ళూ ఉంటాయేటమ్మా? ఉన్నా అందరిళ్ళల్లోనూ ఒక్కపాలే పన్జేసీడానికి మావేం దేవతవా?’అంటూ ఎత్తిపొడుపు!

‘నిన్నూ నిన్నూ అడుక్కోడానికీ, నీ కాళ్ళూ నీ కాళ్ళూ పట్టుకు పిసకరించడానికీ నాకేం పట్టిందమ్మా. నానేం అవిటిదాన్నా, సెవిటిదాన్నా? … కష్టపడతాను.’ అని తిరుగులేని ఆత్మాభిమానం! .

కష్టజీవులకు ఇలాంటి ఆత్మాభిమానం అవసరమనీ; మోసపోయే అమాయకత్వం కాకుండా దీటుగా ఎదుర్కొనే తెలివితేటలు ఉండాలనీ రచయిత ఈ కథ ద్వారా సూచించినట్టు అర్థం చేసుకోవచ్చు.

* * *

kaaraa

కాళీపట్నం రామారావు రచనల గురించి చర్చించుకునేటపుడు పెద్దగా ప్రస్తావనకు రాని కథ ‘ఆదివారం’. మిగిలిన కథలకు అమితంగా ప్రాచుర్యం వచ్చేయటం ఇందుకో కారణం కావొచ్చు. ఇది 1968 జూన్ 7న మొదటిసారి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది

ఈ కథ వెనకున్న ఓ విశేషం ఏమిటంటే… కా.రా. తాను రాసిన నాలుగు సంవత్సరాలకు గానీ దీన్ని పత్రికకు పంపలేదు. అంటే ‘యజ్ఞం’ కంటే ముందే ఈ కథ రాశారన్నమాట!

 

‘తీర్పు (1.3.1964) రాసి నాకు కథ రాయడం వచ్చిందనుకున్నాను. ఇల్లు (1.4. 1964) రాసి పాత వాసనలు వదలేదని బాధపడ్డాను. ఆదివారం సరిగానే వచ్చినా పత్రికకు పంపకుండా నాలుగేళ్ళు దాచిపెట్టేను. యజ్ఞం (1.1. 1966 ) రాసేక నామీద నాకు నమ్మకం కుదిరింది. ’ అని కా.రా. 1986లో ‘నేను నా రచన’ అనే వ్యాసంలో రాశారు.

సహజసిద్ధమైన సంభాషణలు ‘ఆదివారం’ కథను ఆసక్తికరంగా మలిచాయి. ముఖ్యంగా మాండలిక, నుడికార ప్రయోగాలతో కథ పరిపూర్ణంగా, విశ్వసనీయంగా తయారైన భావన కలుగుతుంది..

– ‘అశిరమ్మంత గొంతు పెట్టుకొని ఆకాశమంత ఎత్తు లేచిపోయింది.’

– ‘అద్దముంది, ముఖముంది. అంతకు మించి నేనొక్కపొల్లు మాటన్లేదు.’

– ‘మౌన ముద్ర వహిస్తే కుదరదు. అనువులనో మినువులనో అనాలి.’

– ‘వీళ్ళ కట్టులో సగం కట్టుంటే మనం ఏనాడో బాగుపడుదుం’

అంకాలు, అత్తల పాత్రలను నిర్వహించిన తీరు, వారి మాట తీరులో రచయిత చూపిన వైవిధ్యం ఆకట్టుకుంటాయి.

శీర్షిక పేరు ‘ఆదివారం’ బాగా సరిపోయింది. సంఘర్షణ మొదలవటం- కొనసాగటం, రాజీ పడటం; పంతం నెగ్గించుకోవటం- ఇవన్నీ ఈ రోజు గురించే! ఈ కథలో అన్నీ స్త్రీ పాత్రలే ఉండటం ఒక విశేషం!

 – వేణు

 

ch venu

 

 

వేణుగారు పాతికేళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్ర లేఖనం ఈయన అభిమాన విషయాలు. ‘వేణువు’ పేరుతో వీరి బ్లాగ్ నెటిజన్స్ లో చాలా మందికి సుపరిచితమే. ఈనాడు, తెలుగువెలుగు, వాకిలి, పుస్తకం.నెట్ లలో వేణుగారి సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు వచ్చాయి. సాహిత్యాభిమాని అయిన వేణుగారికి రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు అభిమాన రచయితలు.

 వచ్చే వారం “జీవధార” కధ గురించి వై. కరుణాకర్ పరిచయం 

కథ లింక్:

https://www.scribd.com/doc/242719892/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%95%E0%B0%A7

పరమపదసోపాన పటం అను ఉత్తమ కథ

bhuvanachandra (5)

‘పెళ్ళి అయి ఆరునెలలేగా అయిందీ? అప్పుడే విడాకులా?” ఆశ్చర్యంగా అడిగారు సత్యంగారు. సత్యం గారు ‘ఆ’ కాలపు ఎడిటర్. ఉన్నదాంట్లో తృప్తిగా జీవించే మనిషి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

“విడాకులకి అప్లై చేశారండీ. ఆ కేసు చూస్తున్నది లాయరు శ్యామలగారే. మరి ఎప్పుడు సరోజగారికి తలనెప్పి తప్పుతుందో!” నిట్టుర్చి అన్నాడు లోగనాధం. కరెక్టు పేరు లోకనాధమే.. తమిళ వాళ్ళు క బదులు ‘గ’ పలుకుతారు. గుమ్మడిపూడి వాడు గనక తెలుగువాడి కిందే లెక్క.

లోకనాధం డ్రైవరు. బాగా సీనియర్. అతను మద్రాసు వచ్చిన రోజునించీ సత్యంగారితోనే వున్నాడు. ఇప్పటికీ. సత్యంగారు తన పని తను చూసుకునే మనిషి. లోకనాధానికి అన్నీ కావాలి. ఇండ్రస్ట్రీలో మనుషుల గురించీ, మనసుల గురించీ, గిల్లి కజ్జాల దగ్గర్నించి రూమర్ల దాకా ఏ ఇన్‌ఫర్ మేషన్ కావాలన్నా లోకనాధాన్ని అడిగితే చాలు. ఠక్కున చెప్పేస్తాడు.. పూర్వాపరాలతో సహా.

“అసలు తగువెందుకొచ్చిందీ?” అడిగారు సుబ్బారావుగారు. ఆయన ఒకప్పుడు నంబర్ వన్ ప్రొడక్షన్ మేనేజరు.

“ఏముందండీ.. కొందరు ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేరండి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి తీర్పులిస్తారండి. వాడికి తెలిసిందే జ్ఞానం అయినట్టూ, మిగతావాళ్ళది అజ్ఞానం అన్నట్టూ మాట్లాడేవాళ్ళకి లొకంలో కొదవేముందండి. అలాంటోళ్ళల్లో నంబరువన్ ఎదవ అసిరయ్యండి!.” రసవత్తరంగా మొదలెట్టాడు లోకనాధం.

“అసిరయ్యా.. ఆ పేరు వినలేదే నేను!” ఆశ్చర్యంగా అన్నాడు కోటగిరి ప్రసాదు. ఆర్టు డైరెక్టరాయన.

“అసలు పేరు అసిరయ్యండి.. సిన్మాల్లో కొచ్చాక అవినాష్ కుమార్ సిద్దూ అని పెట్టుకున్నాడండి” నవ్వాడు లోకనాధం.

“ఏమిటీ? అవినాషా? కొన్ని సినిమాలకి.. “ఆగారు సత్యంగారు.

“అవునండీ. కొన్నిట్లో వేషాలేశాడండి. కానీ పైకి రాలేదండి. కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా ట్రై చేసినా ఆడి ఎదవ బుద్ధివల్ల మధ్యలోనే పీకేశారండి. ఆ తరవాత కొంత కాలం ప్రొడక్షన్ అసిస్టెంటుగా, ఆ మధ్య కధారచయితగా కూడా అవతారాలెత్తాడండి.” వివరించాడు లోకనాధం. అవినాష్ గురించి ఫీల్డులో తెలీని వాడు లేడు. నాస్టీ మెంటాలిటీ. భయంకరమైన అసూయే కాక తానే చాలా గొప్ప వాడిననే అహంకారం. అర్జంటుగా ఏమాత్రం శ్రమలేకుండ, పేరూ డబ్బు సంపాయించెయ్యాలన్న అశవల్ల ఎక్కడా కుదురుకోలేకపోయాడు.

“‘ఆశ'” ఉండాలి. ఎదగాలనే కాంక్ష ఉండి తీరాలి. కానీ ఎదిగే వాళ్ళని చూసి యీర్ష్యపడకూడదు. వాళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడి బురద జల్లకూడదు” నిట్టూర్చాడు కోటగిరి ప్రసాదు.

“అవినాష్‌కీ సరోజకీ ఏం సంబంధం? సరోజ పెళ్ళాడింది ‘ఉత్తమ్’ నిగదా?” అడిగారు నందకుమార్. ఆయనో గొప్ప ప్రొడ్యూసర్. నేటి పరిస్థితుల్ని భరించలేక చిత్ర నిర్మాణం మానేశారు. పిల్లలతో ఆయన కూడా వెరీ వెల్ సెటిల్డ్.

వీళ్ళందరూ కూర్చున్నది ఆంధ్రాక్లబ్ అని పిలవబడే ఆస్కాలో. మిగతా వాళ్ళందరూ నీటుగా వున్న కుర్చీలో కూర్చుంటే, లోకనాధం కొంచెం విడిగా, అయినా దగ్గరగా ఓ చిన్న స్టూల్ వేసుకుని కూర్చున్నాడు. రోజూ ఓ గంట వీళ్ళంతా అదే టేబుల్ దగ్గర గుడుపుతారు. ఎవరి పుట్టినరోజైనా వస్తే మాత్రం మరో ‘రౌండ్’ కోసం ఇంకో గంట ఎక్కువగా గడుపుతారు.

“ఉత్తంగారు మంచాయనేనండీ.. కానీ ఆయనకి వురెక్కించడానికి అసిరయ్యగాడున్నాడు గదండీ…?” నవ్వాడు లోకనాధం. సస్పెన్సు మేయింటైన్ చెయ్యడం లోకనాధానికి అలవాటు.

“ఇదిగో లోకనాధం.. సస్పెన్సులో పెట్టక అసలు జరిగిందేమిటో చెప్పు…” నందకుమార్ అన్నాడు. సస్పెన్సుని భరించడం ఆయన వల్లకాదు.

“అయ్యగారూ.. సినిమా టైటిల్సు పడేటప్పుడే క్లైమాక్సు చెప్పెస్తే ఇహ చూడటానికి ఏవుంటాదండీ? అందుకే.. కాస్త స్క్రీన్‌ప్లే నండీ…! జరిగిందేమిటీ అని చెప్పే కంటే మీకు ఇంతవరకూ తెలియనిది ఎమంటే – సరోజగారు మావూరు విజయవాడ అని చెబుతారు గానీ, ఆవిడ అసలు వూరు దమ్ముపాలెం అండి. ఓ చిన్న పల్లెటూరు ఆది. అసిరయ్యదీ ఆ వూరు పక్కనున్న చుక్క పల్లండి. సరోజగారు చదువుకుంది మాత్రం విజయవాడలోనేనండి. అసిరయ్య ఆవిడ కంటే కాలేజీలో రెండేళ్ళు సీనియరండి. ఠికానా లేనోడు అసిరయ్య అయితే సరోజగారిది కలిగిన కుటుంబమే నండి. అసిరయ్య సినిమాల్లో కొచ్చి హీరో అయిపోదామని కలలుగనే వాడటండీ. అందుకే నాటకాలు రాసీ, ఏసీ స్టూడెంట్స్‌లో కాస్త పేరు తెచ్చుకున్నాడండి. కాలేజీలో ఓసారి ఆయన రాసి డైరెక్టు చేసిన నాటకంలోనే సరోజగారు వేషం కట్టిందిటండీ…” ఆగాడు లోకనాధం.

“చెప్పవయ్యా భాబూ…” ఓ గుక్క గభాల్న బిగించి అన్నాడు నందకుమార్.

“వస్తాన్నాండీ .. మరి … మీరు సినిమాలు తీసినోళ్ళే గదండీ.. కొందరికేమో సావిత్రిగారిలా నటన పుట్టుకతోనే వస్తాదండీ.. కొందరేమో ఫిలిం ఇన్‌స్ట్రిట్యూట్లో గట్రా అంత నేర్చుకున్నా అంతంత మాత్రమేనండీ.. అదేమోగానీ సరోజగారు మొదటిసారే అందరిచేత ‘సహజనటి, సూపర్ హీరోయిన్’ అనిపించుకున్నారటండీ…!” మళ్ళీ ఆగాడు లోకనాధం.

“మధ్యలో అడ్డొస్తున్నాగానీ.. లోకనాధం నీది గుమ్మడిపూడిగదా. అంటే మద్రాసు పక్కనే గదా… నీకు ఉంటే గింటే తమిళ యాస వుండొచ్చు. కానీ కాసేపు కృష్ణా.. కాసేపు తూర్పుగోదావరీ ఇలా ఇన్ని యాసలు ఎలా పట్టావు?” ముక్కుపోడుం పీల్చి అన్నాడు సుబ్బారావు.

“మా ఆవిడది తూర్పుగోదావరండి. మా అమ్మది విజయవాడండి. ఇక్కడికి రాకముందు లారీ క్లీనరుగా ఆంధ్రా మొత్తం తిరిగానండి. మరో విషయం అంటే మీకు తెలీని విషయం ఏమంటే, అవినాషు గారి పెద్దన్నయ్యా, నేనూ చిన్నప్పుడు దోస్తులం అండీ. మా అమ్మది సరోజగారిదీ ఒకటే వూరండి. నవ్వాడు లోకనాధం. “ఓర్నీ..! ఎప్పుడూ చెప్పలేదే?” ఆశ్చర్యంగా అడిగారు సత్యంగారు.

“ఏది చెప్పాలన్నా ఏది చెయ్యాలన్న సమయం రావాలిగదండీ. అసిరయ్యకీ వాళ్ళన్నయ్యకీ పదమూడేళ్ళ తేడానండి… వయసులో సరేనండి.. సరోజగారు ఫేమస్ అయ్యాక మనోడు ఆవిడగారికే నచ్చేటట్టు నాటకాలు రాసి, కాలేజీలో వేయించే వాడండి. అప్పుడు ఇద్దరూ ఫేమస్సయ్యారండి. సీనియర్ గనక సరోజగారి కన్నా రెండేళ్ళకి ముందే అవినాషు మద్రాసొచ్చారండి. మీకోవిషయం తెలుసాండీ.. సరోజగారి నటన చూసి ‘సినిమానటిగా చాలా పేరు తెచ్చుకుంటావమ్మా’అని దీవించింది VSR స్వామిగారండీ..!”

“నిజమా…?ఓహ్..స్వామిగారంతటి వారు ఆ మాటంటే తిరుగేమి వుంటుందీ!” తలవూపి అన్నాడు కోటగిరి ప్రసాదు.

“అవునండి.. అక్కడవుండగానే సరోజగారి తండ్రి పోయారండి. ఆ తరువాత ‘మనకోసం-మనం’ సినిమా డైరెక్టరు సాయిమొహన్ గారు సరోజని ఒప్పించి సినిమాల్లో నటింపచేశారండి.. ఆ పిక్చర్ సూపర్ హిట్టు. ఇంకేముందండీ. సరోజ చకచక నిచ్చెన మెట్లెక్కితే అసిరయ్య అక్కడక్కడే చక్కర్లు కొడుతా వున్నాడండి. అసలు సరోజకి యాక్టింగ్ నేర్పింది నేనే అని చాలా మందికి పాపం నిజమే చెప్పినా, వాళ్ళు నమ్మలేదు సరిగదా ‘కోతలు ఆపరా నాన్నా’ అని ఎగతాళి చేశారటండి. ఆవిడ మెట్లు ఎక్కుతున్నకొద్దీ యీయనకి అసూయ పెరుగుతూనే వున్నాదండి…!” మళ్ళీ ఆగాడు లోకనాధం.

“సరోజ ఇండస్ట్రీకి వచ్చి అయిదేళ్ళు దాటిందిగదా… యీ అయిదేళ్ళలో ఒక్కసారి కూడా అవినాష్‌ని కల్వలేదా?” అడిగాడు నందకుమార్. “ఎందుకు కలవ లేదండీ? వచ్చిన రోజుల్లోనే కలిసి, సాయి మొహన్ గారి దగ్గర ‘రచనా సహకారం’ పొస్టు ఇప్పిస్తానన్నదాటండీ. యీయనే, ‘ఆడదాని రికమెండేషన్ నాకక్కర్లేదూ.. ఐకేన్ మేక్ ఆర్ బ్రేకు స్టార్స్’ అన్నాడటండీ” వివరించాడు లోకనాధం.

“తరువాత?” అడిగారు సత్యంగారు.

“ఉత్తంగారూ, సరోజగారూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్టు కదండీ. మెల్లగా ఆరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తిందండీ. పెళ్ళికి ముందర కూడా సరోజ అవినాష్‌ని సలహ అడిగితే, ఉత్తంని పెళ్ళి చేసుకుంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్టు అవుతుందీ.. మీ పెళ్ళయిన మరుక్షణమే మీ ఇద్దరికీ ‘క్రేజ్’ పోతుందీ.. ఎఫైర్ కావాలంటే నడుపుకో గానీ, పెళ్ళివద్దు అన్నాడటండి. సరోజ అవినాష్‌ని ఎగాదిగా చూసి, ‘నేనేమీ ఫిలిం ఫీల్డ్ నా జీవితం అనుకుని ఇక్కడికి రాలేదూ. ఎఫైర్ నడుపు కోడానికి నాది లూజ్ కేరక్టర్ కాదు…” అని చికాగ్గా వెళ్ళిపోయిందటండీ గాలి పీల్చుకోడానికి ఆగాడు లోకనాధం.

“అంత నమ్మకంగా ప్రేమించిన దాన్ని ఉత్తమ్ ఎందుకు వదులుకుంటున్నాడూ?” అడిగారు ప్రొ!! సుబ్బారావుగారు.

“అయ్యా.. ఇక్కడే అవినాష్ నక్క తెలివి చూపించాడండీ! ఉత్తం దగ్గరికెల్లి, “ఏదిపోయినా సంపాయించుకోవచ్చు గానీ, ఒక్కసారి జనానికి నీ మీద ‘క్రేజ్’ పోతే సంపాయించుకోవడం దుర్లభం.. అందుకే ‘పెళ్ళి’ అనే ఊబిలోంచి ‘విడాకులు’ తాడు పట్టుకుని బయటపడు” అని చెవిలో బోరీగలా ఉదరగొట్టాడటండీ.”

“అయ్యా ఇన్నేళ్ళ అనుభవం వున్న మీకు తెలీని విషయాలా? పేరూ డబ్బురాదనే జనాలు చుట్టూ చేరి, ‘భజనలు’ మొదలెట్టడం తమకి తెలీదా? మహా మహా వాళ్ళనే ‘మందు’ లోకి దింపో, రేస్ కోర్సులకి తిప్పో, దేనికీ లోబడకపోతే సినిమాల్లోకి దించో సదరు మద్దెల విద్వాంసులు పబ్బం గడుపుకుంటారు. ఎంతమంది పై కొస్తున్న హీరోలు యీ చెత్త గేంగు వల్ల నాశనం కాలేదూ? సదరు మహానుభావుల ముందు ఉత్తమ్ గారో లెక్కా!” తేల్చేశాడు లోకనాధం. అతన్ననది నూటికి నూరుపాళ్ళు కరెక్టే.

“నువ్వు చెప్పేవన్నీ నిజమేగానీ లోకం… ఉత్తమ్‌ని అవినాష్ ఎట్టా పడేశాడూ?” అడిగారు సత్యంగారు.

“సినిమా కధ చెప్పి”. నవ్వాడు లోకనాధం.

“అంటే?”

“ఏవుందండీ ఫలానా హీరో కొడుకు ‘చిట్టిబాబు’ ఏక్ట్ చేసింది సూపర్ హిట్టు… కారణం ఆ సినిమా స్వంతంగా తీయడమే. ఫలానా హీరో “శమంత్’ స్వంత బేనర్లో తీసిన సినిమా తెలుగు సినిమా రికార్డుల్ని బద్దలు గొట్టింది. ఫలానా హీరో మనవడు ‘గగన్’ యాక్టుచేసిన సినిమా 50 కోట్లు కలెక్షన్ దాటింది.. కారణం తాతగారి బేనరు. ఈ విషయాలే ఊదరగొట్టి సొంత సినిమా తియ్యాలనే కోరికని ఉత్తమ్‌లో కలిగించాడు అవినాష్. ఒకటి మాత్రం నిజం చెప్పాలండి అవినాష్‌కి అదే అసిరయ్యకి కధ చెప్పడంలో వున్న టేలంట్ లాంటిది ఇండస్ట్రీలో ఏవరికి లేదండి. అప్పుడెప్పుడో సదా శివబ్రహ్మంగారని ఉండేవారటండీ. ఆయన్ని కధా శివబ్రహ్మ అనే వాళ్ళటండీ… అవినాష్‌కీ అంత టేలంటు వున్నాదండీ ఆగాడు లోకనాధం.

“తరవాత?” మరో పెగ్గు తెప్పించుకుని అడిగాడు నందకుమర్.

“ఇక్కడే ఇంకో మడతపేచీ పెట్టాడండీ అవినాషు. తీసేది తెలుగులో మాత్రమే కాదూ… తెలుగూ, తమిళం. రెండు భాషల్లో తీస్తే మనకి ప్రిస్టేజికి ప్రిస్ట్రేజీ, డబ్బు కి డబ్బు” అని ఎక్కేశాడండి.. అంతేకాకుండా తెలుగులో ‘బ్రహ్మాండం’ స్టార్స్ కూడ తమిల్‌లోకి డబ్ చేస్తే కుదేళ్ళై పోతారు. మొన్న నువ్వు ఏక్టు చేసిన ‘ఎవరు’ సినిమాని ‘యార్’ పేరిట ‘డబ్’ చేస్తే అది నూర్రోజులాడింది. ఆ రికార్డు ఇప్పటి వరకూ నీ ఒక్కడికే సొంతం. అని ఇంకా ఫురెక్కించాడండి.” ఊ!” సిప్ చేస్తూ తల పంకించాడు నందకుమార్.

“బహ్మాండమైన ఐడియా. రైటర్‌గా రెండు భాషల్లో ఒకే సారి పేరు తెచ్చుకోవచ్చు…!” మెచ్చుకున్నాడు సుబ్బారావు.

“అసలు మడత పేచీ మూడోదండి. రెండు బాషాల్లోనూ తియ్యాలి గనక తమిళ్‌లో ఫలానా హీరో గారి కూతుర్ని హీరోయిన్‌గా పెడితే సినిమా అదిరిపోద్దన్నాడండి..”

“వార్నీ. అలాఎందుకూ?” ఆశ్చర్యపోయారు సత్యంగారు.

“అదేనండి అవినాష్ టేలంటు.. అయ్యా ఓసారి ఓ సాములారు ఉపన్యాసం ఇస్తుంటే విన్నానండి. మనుషులందరూ ఒకలానే ఉన్నా – వాళ్ళలో తేడాలుంటాయటండి. దేవతలు – రాక్షసులు, మానవులు అని. ఎవరిలో సత్య గుణం ఉంటుందో వాళ్ళు దేవతలటండీ! అంటే వాళ్ళు యీ జీవితం అశాశ్వతమని గుర్తిస్తారు గనక వీలున్నంత వరకూ అందరికీ మంచి చేస్తారటండీ. ఇతరుల్ని విమర్శించడం, బాధపెట్టడం – పగలు పెంచుకోవడం లాంటివి వారి శివారులోకి కూడ రావటండి. తిట్టినా, పొగిడినా ఏమాత్రం చలించకుండా ‘స్థిరంగా’ వుంటారండి.

ఇహ రెండో రకంవాళ్ళు మానవులంటండీ. వీళ్ళు సుఖం వస్తే పొంగిపోయి దుఃఖానికి కృంగి పోతారంటండీ. చర్యకి తక్షణ ప్రతి చర్య మాత్రమే ఉంటాదటండీ. కోపం వచ్చినా తాటాకు మంటలా గప్పున వచ్చి చప్పున పోతాడటండి. వీళ్ళ వల్ల ఎవరికీ ‘నష్టం’ గానీ ‘బాధ’ గానీ వుండవండి.

ఇహపోతే మూడో రకం వాళ్ళలోనే నంటండీ గొడవంతా.. వాళ్ళని రాక్షసులంటారటండీ!” ఆగాడు లోకనాధం.

“భలే చెప్పాడయ్యా.. ఆ సాములారెవరో! బియ్యంలో అక్కుళ్ళు, కృష్ణకటుకలు.. రాజనాల – స్వర్ణమసూరీ. I.R.8 లాగా మనుషుల్లో కూడ 3 రకాలని చక్కగా చెప్పాడు.. సరే.. రాక్షసుల మాటేమిటీ?” లోకనాధాన్ని అభినందించి అన్నాడు నందకుమార్.

“అయ్యా ఎవడిలో అయితే కామం, క్రోధం, ద్వేషం, అసూయా, అహంకారం, ప్రతీకారం నిండి వుంటాయో వాళ్ళని రాక్షసులంటారండి. ఉదాహరణకి మనం ఓ మంచి వాడికి చెడు చేసినా అతను నవ్వేసి ఊరుకుంటాడే గానీ మనకి చెడు తలపెట్టడటండీ… ఇందాకన్నట్టు వాళ్ళది సత్వగుణంటండీ. మరో రకం మనిషికి అంటే రజో గుణం ఉన్న మనుషులకి మనం చెడుచేస్తే, వాళ్ళు తక్షణమే స్పందిస్తారట గానీ నెలలపాటూ, యేళ్ళ పాటూ గుర్తుపెట్టుకుని మనని సాధించరటండి. యీ మూడో రకం వాళ్ళున్నారే – అంటే తామసగుణం ఉండే ‘రాక్షసులు’ వీళ్ళు దేన్ని మర్చిపోరంటండీ. ఎవర్నీ క్షమించలేరటండీ. ఆఖరికి కన్నవాళ్ళనీ – తాము కన్న వాళ్ళనీ కూడ. మనం తెలిసీ తెలీని వయసులో అటువంటి వాళ్ళకి బాద కలిగించినా, వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూసి చూసీ, అవకాశం దొరగ్గానే విషప్పురుగు కాటేసినట్టు కాటేస్తారటండీ. అవినాష్ గాడిది మూడో జాతండీ. ఆడి కడుపునిండా ‘సరోజ’ మీద అసూయే!” ఆగాడు లోకనాధం.

“మరీ అంత అసూయ ఎందుకోయ్..?” గ్లాసు బోర్లించి అన్నారు నందకుమార్.

“దేనికైనా కారణం వుంటుందండీ. అసూయకి కారణం ఏవుంటాదండి? అయ్యా.. ఓ నటుడున్నాడండీ ఆయనెదురుగా మరో నటుణ్ణి పొగిడి చూడండి.. ‘ఆనాకొడుకా? ఆ ఎదవకి ఏక్టింగంటే ఏంటో తెలుసా? అని అగ్గగ్గులాడతాడండీ! అలాగే ఓ మ్యూజిక్ డైరెక్టరు ముందు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్నీ, ఓ రైటరు ఎదురుగా ఇంకో రైటర్నీ, ఓ హీరోయిన్ ముందు మరో హీరోయిన్నీ మెచ్చుకుని చూడండి… వాళ్ళు నిజంగా మెచ్చుకోదగినవారైనా సదరు మహానుభావులు మెచ్చుకోరండి.. కోపంతోటీ, అసూయతోటి భగ్గుమంటారండీ. మీకు తెలీని దేముందండీ. అసిరయ్యకి అదే బాధండీ. అదే కాలేజీ నించి వచ్చిన సరోజ సూపర్ హీరోయినయింది. ఆయన మాత్రం ఎక్కే మెట్టు దిగే మెట్టూ.. అంతకంటే కారణం కావాలాండీ?” ఆగాడు లోకనాధం.

“ఓహో.. సరే.. ఇంతకీ విడాకులకి రీజనూ?” అమాయకంగ అడిగారు సుబ్బారావుగారు. సామాన్యంగా ప్రొడక్షన్ మేనేజరంటే ఆవలించకుండానే పేగులేకాదు-; నరాలు కూడ లెక్క బెట్టేవాడు. పాపం సుబ్బారావు గారు ఆ టైపు కాదు. సిన్సియర్. “ఫలానా హీరో గారి కూతుర్ని హీరోయిన్‌గా ఒప్పించి కాల్‌షీట్ తీసుకున్నాకే ‘స్వంత ప్రొడక్షన్ గురించి సరోజగారికి చెప్పొచ్చని ఉత్తమ్‌కి చెప్పి సక్సెస్ అయ్యాడు అవినాషు. అది తెలిశాక అగ్గి మీద గుగ్గిలమైంది సరోజ. కారణం ఎమంటే ఉత్తమ్‌గారిదీ, సరోజదీ జాయింట్ ఎక్కవుంటండీ.. హీరోయిన్‌కీ అవినాషుకీ, మిగతా వాళ్ళకీ అడ్వాన్సులు వెళ్ళింది ఆ ఎక్కౌంటు లోంచండీ. మొదట్నించి ఉత్తం సంపాయించేరంటూ. ‘తన’ ఎక్కువుంటులో విడిగా వుంచుకున్నాడండీ. ఈ ప్రొడక్షన్‌కి జాయింట్ ఎక్కువుంటే ఖర్చుపెటడంతో సరోజగారికి సహజంగానే కోపం వచ్చి, కడిగేసారటండీ… “నువ్వు నా పెళ్ళానివి.. నేను చెప్పినట్టువింటే ok లేకపోతే దొబ్బెయ్’ అన్నాడండీ. బస్… ఇంకా చెప్పాలాండి?” చిర్నవ్వు నవ్వాడు లోకనాధం.

సంవత్సరంన్నర తరవాత-:

 

(a)ఉత్తమ్ తన సర్వాన్ని పణంగా పెట్టి తీసిన సినిమా అట్టర్ ఫ్లాపయింది. కధలోని లోపాలవల్లా. లెక్కా జమా లేకుండా పెట్టిన ఖర్చువల్లా.

 

(b) అవినాష్ మరో హీరోని ముగ్గులోకి దించి, అదే కధని ఏ లోపం లేకుండా తీసి స్టార్ రైటరయ్యాడు ప్రస్తుతం కధకి చా. హాలు తీసుకుంటున్నాడని అనధికార వార్త.

 

(c) సరోజ మేముండే వలసర వాక్యంలోనే ఉంటోంది విడాకులప్పుడే ఆమె గర్భిణి. ఇప్పుడు పసిపాపతో, అంటే ఇప్పుడు పదినెలల పాపతో ఉంటోంది. సినిమాల్లో సంపాయించినది ‘జాయింట్ ఎకౌవుంట్’ లో హరించుకుపోయినా, పల్లె ఆస్థులు పదిలంగా వుండటం వల్ల ఆమెకి ఆర్ధిక సమస్యలు లేవు.

మీకందరికి ‘ఉత్తమ్’ పరిస్థితి ఏమిటీ, ఏమయ్యాడో అనే కుతూహలం ఉంటుందని నాకు తెలుసు హైద్రాబాద్‌లో మీరు ‘నిర్మాత’ అవతారం ఎత్తితే అతనే మీ దగ్గరికొస్తాడు. ప్రతి రోజు కారణం ఒకటే – సినిమా ఫ్లాపవడంతో ‘మందు’తో బాధని మర్చిపోవడం అలవాటు చేసుకున్నాడు. అలా పరమపద సోపాన పఠంలో పాముల నోట పడ్డవాడు ఇతనొక్కడే కాదు. ‘సూపర్ హీరోలూ గతంలో ఉన్నారు. కొంచెం ఆలోచిస్తే వారెవరో ఇట్టే మీకు అర్థమౌతుంది.

 

మళ్ళీ కలుద్దాం.. మీ

భువనచంద్ర.

పెద్రో పారమొ-5

pedro1-1

నువు అదృష్టవంతుడివి నాయనా, చాలా అదృష్టంతుడివి.” ఎదువిజస్ ద్యాడా నాతో చెప్పింది.

అప్పటికే చాలా ఆలస్యమయింది. మూలనున్న దీపం సన్నగిల్లుతూ ఉంది. చివరిగా వణికి ఆరిపోయింది.

ఆమె పైకి లేచినట్టు అనిపించింది. ఇంకో దీపం కోసం వెళుతుందనుకున్నాను. దూరమవుతున్న ఆమె అడుగుల చప్పుడు విన్నాను. ఎదురు చూస్తూ అక్కడే కూచున్నాను.

కొద్ది సేపయ్యాక, ఆమె ఇక తిరిగి రాదని నిర్ధారించుకున్నాక, నేనూ లేచాను. చీకట్లో తడుముకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ నాగదికి చేరాను. నేలమీద పడుకుని నిద్ర కోసం ఎదురుచూశాను.

నిద్ర పడుతూ పోతూ ఉంది.

ఆ మధ్యలోనే ఎప్పుడో ఒక ఏడుపు విన్నాను. సాగదీసి ఏడ్చినట్టుగా ఉంది తాగినవాడి కూతలా. “అయ్యో బతుకా! నాకర్మ ఇట్లా కాలిందే!’

మరీ నా చెవిలోనే వినిపించినట్టుండేసరికి దిగ్గున లేచి కూచున్నాను. అది వీధిలోంచీ కావచ్చు గానీ, నేనిక్కడే విన్నాను ఈ గదిగోడలకు అంటుకుని ఉన్నట్టు. నేను లేచేసరికి చిమటల చప్పుడూ, నిశ్శబ్దపు సణుగుడూ తప్పించి అంతా నిశ్శబ్దంగా ఉంది.

లేదు, ఆ కేక తర్వాత నిశ్శబ్దపు లోతు కొలిచే మార్గమేదీ లేదు. భూమి శూన్యంలో నిలబడిపోయినట్టుంది. ఏ శబ్దమూ లేదు – ఆఖరికి నా ఊపిరీ, నా గుండె కొట్టుకునే చప్పుడు కూడా. అస్తిత్వపు శబ్దమే ఘనీభవించినట్టుగా. దాన్నుంచి బయటపడి కుదుటపడుతుండగానే మళ్ళీ అదే కేక. అది చాలాసేపు వినిపించింది. “నువు నాకు బాకీ ఉన్నావు, ఉరితీయబడ్దవాడికి చివరిమాట వినిపించే హక్కు కంటే అది ఎక్కువ కాకపోయినా!”

అప్పుడు తలుపు భళ్ళున తెరుచుకుంది.

“నువ్వేనా దోన ఎదువుజస్?” పిలిచాను. “ఏమవుతూంది? భయపడ్డావా?”

“నా పేరు ఎడువుజస్ కాదు. నేను డమియానాని. నువ్విక్కడ ఉన్నావని విని చూడటానికి వచ్చాను. మా ఇంటికి వచ్చి పడుకో. అక్కడయితే హాయిగా సేద తీరవచ్చు.”

“డమియానా సిస్నెరోస్? మెదియాలూనాలో ఉండే ఆడవాళ్ళలో ఒకరివికాదూ నువ్వు?”

“అక్కడే ఉంటాను. అందుకే ఇక్కడికి రావడానికి ఇంతసేపు పట్టింది.”

“నేను పుట్టినప్పుడు డమియానా అనే ఆవిడ నా ఆలనా పాలనా చూసిందని మా అమ్మ చెప్పింది. అది నువ్వేనా?”

“అవును. అది నేనే. నువు మొట్టమొదటిసారి కళ్ళు తెరిచినప్పట్నుంచీ నాకు తెలుసు.”

“సంతోషంగా వస్తాను. ఈ గోలలో నాకు నిద్రే పట్టడం లేదు. నువ్వు వినలేదా? ఎవరినో చంపుతున్నట్టు. నీకు వినపడలేదా ఇప్పుడు?”

“ఆ ప్రతిధ్వని ఏదో ఇక్కడే ఇరుక్కుపోయినట్లుంది. చాలా కాలం క్రితం టోర్బిడొ అల్బ్రెట్‌ని ఈ గదిలోనే ఉరి తీశారు. తర్వాత ఈ గదిలోనే వదిలేసి తాళం పెట్టారు. అందుకే అతనికెప్పుడూ శాంతి కలగదు. ఈ గది తాళం చెవి లేకుండానే నువ్వెట్లా లోపలికి వచ్చావో నాకు తెలియదు.”

“దోనా ఎదువిజస్ తెరిచింది. ఈ గదొక్కటే ఖాళీగా ఉందని చెప్పిందామె.”

“ఎదువిజస్ ద్యాడానా?”

‘అవును. ఆమే!”

“పాపం ఎదువిజస్! అంటే ఆమె ఆత్మ దారి తప్పి ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉందన్న మాట!”

 

 

ఫుల్గోర్ సెడనో నామధేయుడనూ, యాభయి ఏళ్ళ అవివాహితుడనూ, వృత్తిరీత్యా వ్యవహర్తనూ, దావా వేయుటలోనూ, కేసులను వాదించుటలోనూ అనుభవజ్ఞుడనూ అయిన నేను నాకివ్వబడిన సర్వహక్కులనూ నియోగించుకునియున్నూ, నా అధికారమును వాడుకొంటున్నూ ఈ క్రింది ఆరోపణలు చేయుచున్నాను….”

టోర్బిడో అల్డ్రెట్ చేసిన అకృత్యాలపై ఫిర్యాదు చేసినప్పుడు అదీ అతను రాసింది. “ అపరాధం సరిహద్దులను తారుమారు చేయడం.”

Pedro-Páramo-de-Juan-Rulfo

 

“నిన్నెవడూ ఏమీ అనలేడు డాన్ ఫుల్గోర్. నీ అంతట నువు నిలబడగలవు. నీవెనక ఉన్న అధికారంతో కాదు, నీ అంతట నువ్వే.”

అతనికి గుర్తుంది. ఫిర్యాదు చేసిన సందర్భంగా తాగుతూ సంబరం చేసుకుంటున్నప్పుడు ఆల్డ్రెట్ అన్న మొదటి మాట అది.

“ ఈ కాగితం నువ్వూ నేనూ నాలుక గీసుకోడానికి కూడా పనికి రాదు డాన్ ఫుల్గోర్. అంతకు మించి ఏం కాదు. అది నీకూ తెలుసు. ఇంకోరకంగా చెప్పాలంటే, నీకు సంబంధించినవరకూ నీ పని నువ్వు చేశావు. నేను మొదట్లో కంగారుపడ్డాను కానీ ఇదంతా చూశాక నవ్వొస్తూంది. సరిహద్దులను తారుమారు చేయడమా? నేనా? అంత బుర్రతక్కువ వెధవ అయితే అతను సిగ్గుతో తలవంచుకోవాలి”

అతనికి గుర్తుంది. వాళ్ళు ఎదువిజస్ ఇంటి దగ్గర ఉన్నారు. అతను ఆమెను అడిగాడు కూడా.

“విజస్! ఆ మూల గది వాడుకోవచ్చా?”

“ఏ గది కావాలంటే అది తీసుకోండి డాన్ ఫుల్గోర్! అవసరమయితే అన్నీ తీసుకోండి. రాత్రంతా ఉంటారా?”

“లేదు, ఒకటి చాలు. మాగురించి ఎదురు చూడక పడుకో. తాళం చెవి మాత్రం ఇవ్వు!”

టోర్బియో ఆల్డ్రెట్ అందుకున్నాడు “సరే, డాన్ ఫుల్గోర్! నేను చెపుతున్నట్టు నీ మగతనాన్ని ఎవడూ శంకించడు. కానీ మీ పెంటముండకొడుకుతోటే నేను విసిగిపోయాను.”

అతనికి గుర్తుంది. తెలివి సక్రమంగా పని చేసినంతవరకూ విన్నమాటల్లో చివరిది అది. తర్వాత పిరికివాడిలా కేకలు వేశాడు “నా వెనక అధికారముందనా అన్నావు? నిజమా?”

 

కొరడా పిడితో పేద్రో పారమొ ఇంటి తలుపు తట్టాడు. రెండువారాలక్రితం మొదటిసారి వచ్చినప్పుడు అట్లాగే చేసినట్టు గుర్తొచ్చింది. ఎదురుచూశాడు, మొదటిసారి చూసినట్లే. మళ్ళీ అప్పుడు చేసినట్టే, తలుపుపైన వేలాడదీసిన నల్లటి ముడులలాంటి అలంకారాలను పరీక్షించి చూశాడు. అయితే మళ్ళీ అప్పటిలా వ్యాఖ్యానించలేదు: “అబ్బో, ఒకదాని మీద ఇంకొకటి వేలాడదీశారే! మొదటిది మాసిపోయింది, రంగు వేసినట్టు కనపడుతున్నా కొత్తది పట్టులా తళతళలాడిపోతుంది.”

 

మొదటిసారి చాలాసేపు ఎదురుచూస్తూ ఇంట్లో ఎవరూ లేరేమో అనుకున్నాడు. చివరికి వెళ్ళిపోదామనుకుంటుండగా పేద్రో పారమొ కనిపించాడు.

“లోపలికి రా నేస్తం!”

అప్పటికి అది రెండోసారి వాళ్ళు కలవడం. మొదటిసారి కలిసిన విషయం అతనికి మాత్రమే తెలుసు, పేద్రో అప్పుడే పుట్టిన పిల్లాడు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు. ఇదే మొదటిసారి అనుకోవచ్చు కూడా. కానీ తనతో సమానంగా చూస్తున్నాడు. ఏం చెప్పాలి? కాలిని కొరడాతో చిన్నగా కొట్టుకుంటూ, పెద్ద అంగలు వేస్తూ ఫుల్గోర్ అతన్ని అనుసరించాడు. ఏది ఏదో తెలిసిన వాడినని అతను త్వరలోనే గ్రహిస్తాడు. అతను తెలుసుకుంటాడు. నేనెందుకు వచ్చానో కూడా.

“కూర్చో ఫుల్గోర్! ఇక్కడ తాపీగా మాట్లాడుకోవచ్చు!”

వాళ్లు గుర్రాల శాలలో ఉన్నారు. పేద్రో పారమొ దాణా వేసే గొట్టం మీద కూచుని ఎదురు చూస్తున్నాడు.

“కూర్చోదలుచుకోలేదా?”

“నిలబడే ఉంటాలే పేద్రో!”

“నీ ఇష్టం. కానీ ‘డాన్’ అనడం మర్చిపోకు!”

ఎవడనుకుంటున్నాడు ఈ కుర్రాడు తన గురించి అలా మాట్లాడడానికి? వాళ్ళ నాన్న డాన్ లూకాస్ పారమొ కూడా అంత ధైర్యం చేయలేదు. మెదియా లూనాలో అడుగు కూడా పెట్టని, వీసమెత్తు పని కూడా చేయని ఈ కుర్రాడు మొట్టమొదటిగా చేస్తున్నది తనో జీతగాడన్నట్లు మాట్లాడడం! ఇంకేం చెప్తాం!

“వ్యవహారం ఎందాక వచ్చింది?”

సెడానోకి ఇదే సందు అనిపించింది. “ఇప్పుడు నావంతు!” అనుకున్నాడు.

“అంత బాలేదు. ఏమీ మిగల్లేదు. మిగిలిన పశువుల్నీ ఒక్కటి కూడా మిగలకుండా అమ్మేశాం.”

పత్రాలన్నీ చూపించడానికి బయటికి తీయసాగాడు. “మనం ఇంతా బాకీ” అని చెప్పబోయేంతలో ఆ కుర్రాడే అడిగాడు.

“మనం ఎవరికి బాకీ ఉన్నాం? ఎంత అనేది నాకు అనవసరం, ఎవరికి అన్నదే ముఖ్యం.”

 

ఫుల్గోర్ పేర్ల జాబితా చివరిదాకా చూసి అన్నాడు. “కట్టడానికి డబ్బు ఎక్కడినుంచీ వచ్చే అవకాశం లేదు. అసలు సమస్య అదీ!”

“ఎందుకని?”

“ఎందుకంటే మీ కుటుంబం అంతా తినేసింది. చిల్లిగవ్వ చెల్లు వేయకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ పోయింది. ఏనాటికయినా కట్టాలి కదా? నేనెప్పుడూ చెప్తూ ఉండేవాడిని ‘ఏదో రోజు ఉన్నదంతా ఊడ్చేస్తారు’ అని. సరిగా అట్లాగే అయింది. సరే, పొలం కొనడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళొకరు నాకు తెలుసు. మంచి ధరే ఇస్తారు. అప్పులన్నీ తీరిపోగా కొంచెం మిగలొచ్చు కూడా. మరీ ఎక్కువ కాదనుకో!”

“ఆ ఒకరూ నువ్వు కాదూ?”

“అట్లా ఎందుకనుకుంటున్నావు?”

“నా నీడనే నేను నమ్మను. రేపు పొద్దున మన వ్యవహారాలన్నీ చక్కపెడదాం. ముందు ఆ ప్రెసియడొస్ ఆడవాళ్ల సంగతి చూద్దాం. అందరికంటే ఎక్కువ వాళ్లకే ఇవ్వాలి అని కదా అన్నావు?”

“అవును. వాళ్ళకే అందరికంటే తక్కువ చెల్లవేసింది. మీ నాన్న జాబితాలో వాళ్ళను చివరన ఉంచాడు. వాళ్లలో ఒక అమ్మాయి మటిడా ఏదో పట్టణానికి వెళ్లిపోయింది. గ్వాడలజరానో, కోలిమానో గుర్తు లేదు. ఆ లోలా, అదే దోనా డలొరిస్ అన్నీ చూసుకుంటుంది, డాన్ ఎన్మెడియో పొలం అదీ. మనం అప్పు తీర్చవలసింది ఆమెకే.”

“అయితే రేపు పొద్దున నువ్వెళ్ళి లోలాని పెళ్లి చేసుకుంటానని చెప్పు.”

“ఆమె నన్నెందుకు చేసుకుంటుంది? ఇంత ముసలాడిని..”

“నీకోసం కాదు, నా కోసం అడుగు. కంటికి కాస్త నదురుగానే ఉంటుంది కదా! నేను ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పు. ఆమెకి ఇష్టమో కాదో అడుగు. వచ్చే దారిలో ఆగి ఫాదర్ రెంటెరియాని ఏర్పాట్లు చేయమని చెప్పు. ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు జమజేయగలం?”

“ఒక్క ఏగానీ కూడా లేదు డాన్ పేద్రో!”

“సరే, అతనికి ఏదో మాట ఇద్దాం. నా చేతిలో రొక్కం పడగానే అతనికి ఇచ్చేస్తానని చెప్పు. అతను అడ్డు వస్తాడని నేననుకోను. రేపే చేయి ఆ పని. పొద్దున్నే.”

“మరి ఆల్డ్రెట్ సంగతి ఏం చేద్దాం?”

“ఆల్డ్రెట్‌తో మనకి సంబంధమేముంది? నువు ప్రెసిడియో ఆడవాళ్ళు, ఫ్రెగోసోస్, ఇంకా గుజ్మాన్ల గురించే కదా చెప్పావు? ఇప్పుడు ఈ ఆల్డ్రెట్ సంగతేమిటి?”

“సరిహద్దుల గొడవ. అతను చుట్టూ కంచెలు వేస్తూ ఉన్నాడు. చివరి భాగం మనం వేస్తే సరిహద్దుల పని పూర్తి అయిపోతుందంటున్నాడు”

“అదంతా తర్వాత. ఆ కంచెలగురించి ఇప్పుడు ఆలోచించకు. కంచెలూ అవీ ఏవీ ఉండవు. పొలాన్నేమీ భాగాలు వేయడం లేదు. ఆలోచించు ఫుల్గోర్, ఇప్పుడే ఎవరికీ చెప్పకు. ఇప్పుడు మాత్రం  ముందు ఆ లోలాతో కుదుర్చు. కూర్చో రాదా?”

“కూర్చుంటాను డాన్ పేద్రో. దేవుడి మీదొట్టు, నీతో పనిచేయడమంటే పసందుగా ఉండేటట్లుంది.”

“లోలాను దారిలో పెట్టు, నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పు. అది ముఖ్యం. అది నిజమే సెడానో, ఆమెని నిజంగానే ప్రేమిస్తున్నాను. తెలుసా, ఆమె కళ్లు చూసే! నువ్వు పొద్దున్నే తొట్టతొలిగా ఆ పని చేయి. కొన్ని బరువుబాధ్యతలనించి నిన్ను తప్పిస్తాను. ఆ మెదియా లూనాను నాకొదిలేయి.”

 

జిత్తులన్నీ ఈ కుర్రాడు ఎక్కడ నేర్చాడో అనుకున్నాడు ఫుల్గోర్ సెడనో రెండోసారి మెదియాలూనాకి వెళ్ళినప్పుడు. అతను ఏదయినా చేయగలడని అనుకోలేదు నేను. “వాడొట్టి పనికిమాలినవాడు” మా పెద్దాయన డాన్ లూకాస్ అనేవాడు. “పుటకతోటే చవట”. నేనేం వాదించలేకపోయాను. “ఫుల్గోర్, నేను పోయాక వేరే ఉద్యోగం చూసుకో!” “అట్లాగే డాన్ లూకాస్!” “ఫుల్గోర్, ఏదో తిండికయినా సంపాదించుకుని నేను పోయాక తల్లిని చూసుకుంటాడని బడికి పంపుదామని చూశా. అదీ మధ్యలో వదిలేశాడు.” “మీకు రావలసిన కష్టం కాదు డాన్ లూకాస్” “వాడిమీద ఏ ఆశలూ పెట్టుకోకు. ఆఖరికి నా వయసు ఉడిగాక నన్ను చూసుకోబోడు. దేనికీ కొరగాకుండాపోయాడు. అంతే!” “సిగ్గుచేటు డాన్ లూకాస్!”

 

ఇప్పుడు ఇట్లా. మెదియాలూనా మీద అంత ఇష్టమే లేకపోయినట్లయితే మిగెల్ని కలిసేవాడే కాదు. అతన్ని కలవకుండానే వెళ్ళిపోయేవాడు. ఆ నేలంటే తనకి చాలా ప్రేమ: దున్నగా దున్నగా ఏ యేటికాయేడు కొద్దికొద్దిగా పట్టు సడలించుకుంటున్న బంజరు కొండలు.. ప్రేమాస్పదమైన మెదియాలూనా.. ఎమ్మెడియో పొలంలాగా కొత్తగా కలుస్తున్నవీ..”దగ్గరకురా ప్రియతమా”. అతను చూడగలుగుతున్నాడు అప్పటికే జరిగిపోయినట్లు. మరి ఒక స్త్రీ ఏ మాత్రం? “అంతే” అంటూ కొరడాతో కాలిమీద కొట్టుకుంటూ ఆ కొట్టం ప్రధాన ద్వారం దాటాడు.

 

లోరిస్‌ను బుట్టలో వేసుకోవడం తేలికగానే అయిపోయింది. ఆమె కళ్ళు వెలిగి మొహంలో కంగారు కనిపించింది.

“అబ్బ, సిగ్గుగా ఉంది క్షమించండి డాన్ ఫుల్గోర్! డాన్ పేద్రో అసలు నన్ను గమనించాడంటేనే నమ్మలేకపోతున్నాను.”

“నీగురించి ఆలోచిస్తూ నిదరకూడా పోవడం లేదు.”

“ఆయన కావాలంటే ఎవర్నయినా ఎంచుకోవచ్చు. కోమలాలో ఎంతమంది అందగత్తెలు లేరు? ఈ సంగతి తెలిస్తే వాళ్ళేమంటారో!”

“అతను నిన్ను తప్ప వేరెవరి గురించీ తలవడం లేదు. ఒక్క నిన్నే!”

“నాకు దడ పుట్టిస్తున్నావు డాన్ ఫుల్గోర్! కలలోకూడా అనుకోలేదు..”

“అతను ఎక్కువ మాట్లాడే రకం కాదు. చచ్చి ఎక్కడున్నాడో ఆ డాన్ లూకాస్ పారమొ నిజానికి నువ్వు అతనికి తగవనే చెప్పాడు. తండ్రి మీద గౌరవంతో నోరు మెదపలేదు. ఇప్పుడు ఆయన పోయాక అడ్డేముంది? ఇది అతని మొదటి నిర్ణయం – నేనే ఆలస్యం చేశాను పనుల్లో పడి. పెళ్ళి ఎల్లుండి అయితే నీకు ఫర్వాలేదా?”

“అంత తొందరగానా? ఏవీ సిద్ధంగా లేవు. పెళ్ళిబట్టలూ వాటికి సమయం కావాలి. అక్కకి ఉత్తరం రాయాలి. లేదులే ఎవరి చేతనన్నా కబురు పంపిస్తా. కానీ ఏం చేసినా ఏప్రిల్ 8 లోగా తయారు కాలేము. ఇవాళ ఒకటి కదా! అవును, ఎనిమిదికంటే ముందు కుదరదు. ఈ కొద్దిరోజులూ ఆగమని చెప్పు.”

“కుదిరితే ఈ క్షణంలోనే చేసుకుందామని ఉందతనికి. పెళ్ళి డ్రస్సే సమస్య అయితే, అది మేం తీసుకు వస్తాం. చనిపోయిన వాళ్లమ్మ కోరిక ప్రకారం ఆమె పెళ్ళి డ్రస్ నీకే చెందుతుంది. అది వాళ్ల వంశాచారం.”

“అంత సమయం కావాలనడానికి వేరే కారణం కూడా ఉంది. అది ఆడవాళ్ల సమస్య, తెలుసు కదా! అయ్యో, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది డాన్ ఫుల్గోర్.నా మొహం రంగులు మారుతూ ఉండి ఉండాలి. ఛీ, ఎట్లా చెప్పాలి? సిగ్గుగా ఉంది.ఇది నా నెలసరి..”

“అయితే ఏమయిందమ్మా! పెళ్ళంటే నీ నెలసరా కాదా అన్న ప్రశ్నే కాదు. అది ఒకళ్లనొకళ్లు ప్రేమించుకోవడం. అదుంటే ఇక ఏదెట్లా అయినా ఫర్వాలేదు.”

“నేనేం చెపుతున్నానో మీకు అర్థమవుతున్నట్లు లేదు డాన్ ఫుల్గోర్!”

“నాకు అర్థమయింది. పెళ్ళి ఎల్లుండే.”

వారం కోసం, ఒక్క వారం కోసం ఆమె చేతులు సాచి బ్రతిమలాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.

డాన్ పేద్రోకి చెప్పడం మర్చిపోకూడదు – దేవుడా ఆ పేద్రో ఎంత చురుకైన వాడు – ఆస్తిని ఉమ్మడి యాజమాన్యం కిందకి మార్చమని జడ్జికి గుర్తు చేయమని అతనికి చెప్పడం మర్చిపోకూడదు. రేపుపొద్దున్నే ఆ సంగతి అతనికి చెప్పడం మర్చిపోకు ఫుల్గోర్!

ఈలోపు డలోరిస్‌ వేడి చేయడానికి నీళ్లు వంటగదికి తీసుకునిపోతూంది. “తొందరగా వచ్చేందుకు నేనేమయినా చేయాలి. ఏం చేసినా మూడు రోజులు ఉంటుంది. ఇంకో మార్గం లేదు. కానీ, ఎంత ఆనందంగా ఉందో! చాలా ఆనందంగా ఉంది. దేవుడా , నీకు కృతజ్ఞతలు ఎలాతెలుపుకోను డాన్ పేద్రోని నాకిచ్చినందుకు!” మళ్ళీ అనుకుంది “ఆ తర్వాత అతనికి నేనంటే మొహం మొత్తినా ఫర్వాలేదు!”

హామ్లెట్ నుంచి హైదర్ దాకా…!

images1

ప్రపంచ సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా తెలిసిన షేక్స్ పియర్ ప్రఖ్యాత నాటకం “హామ్లెట్”. అత్యంత విజయవంతమైన విషాదాంత కథ అయిన దీన్ని సినిమా గా మలచటం అంత తేలికైన పని కాదు, దీనికి బహుశా షేక్స్ పియర్ ఆత్మను ఒడిసి పట్టిన విశాల్ భరద్వాజ్ మాత్రమే సరైన వ్యక్తి . ఇంతకు మునుపే “మాక్బెత్” ఆధారంగా “మక్బూల్”, “ఒథెల్లో” ఆధారంగా” ఓంకార” లాంటి చిత్రాలు తీసి అదే దారిలో “హామ్లెట్” ఆధారంగా రూపొందించిన చలన చిత్రం “హైదర్”

విశాల్ భరద్వాజ్, షేక్స్ పియర్ కథల ఆధారంగా నిర్మించే చిత్రాల విషయంలో ఎంచుకొనే నేపధ్యం ఆ చిత్రానికి ఆయువు పట్టు , అలాగే ఈ సినిమాకి 1995 లో కాశ్మీర్ సమస్య ను నేపధ్యంగా తీసుకోవటంతో ఈ సినిమా ను ఒక క్లాసిక్ గా నిలబెట్టింది . మానవ నైజాలు, అధికారం / ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు, మోసాలు ఇదే నేపధ్యం, ఈ నేపధ్యం కొత్త కాకపోవచ్చు, కానీ దాన్ని కాశ్మీర్ సమస్యకు ముడిపెట్టటం, దాన్ని హామ్లెట్ ఆధారంగా నడిపించటం ఇది సినిమాని మరింత రక్తి కట్టించేలా చేశాయి,. అదే సమయంలో టెర్రరిజానికి, సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్దంలో సామాన్యులు ఎలా బలవుతున్నారో కూడా మనకు కళ్ళముందు చూపుతుంది ఈ సినిమా . నిజానికి హామ్లెట్ లో ముఖ్యమైన మలుపు ఒక కల రూపంలో ఉంటుంది . ఇలాంటి ఒక ఇల్యూజన్ ని ఇలాంటి మోడరన్ కథలో విశాల్ భరద్వాజ్ చెప్పిన విధానం చాలు, అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో చెప్పటానికి, మరో గొప్ప విషయం హామ్లెట్ లో లా ఇందులో హామ్లెట్ తండ్రి చనిపోయాడు అని మనకు ముందుగా తెలియదు, అలా నేరుగా చెప్పాల్సిన పాయింట్ ని ఇల్యూజన్ గా, ఇల్యూజన్ గా చెప్పాల్సిన పాయింట్ ని నేరుగా చెప్పటం ద్వారా హామ్లెట్ కు సరికొత్త రూపు అందించాడు విశాల్ భరద్వాజ్.

images

కాశ్మీర్ తీవ్రవాదులకు కి ఆశ్రయం ఇస్తున్నాడు అనే కారణంతో భారతసైన్యం డా.హిలాల్ మీర్(నరేంద్ర జా) ని మాయం చేస్తుంది, అతని భార్య గజాలా (టాబూ) , తన తండ్రిని వెతుక్కుంటూ వస్తాడు హైదర్ (షాహీద్ కపూర్) , ఆ వెతుకులాటలో అతని తండ్రి మాయానికి తన బాబాయి ( కె కె మీనన్) కారణం అని తెలుస్తుంది, అదే సమయంలో తన తల్లి ని బాబాయి పెళ్ళి చేసుకుంటాడు , అసలు హిలాల్ మీర్ ఏమయ్యాడు, అతని మాయానికి కెకె కి సంబంధం ఉందా ?? తల్లి కి కూడా సంబంధం ఉందా ?? అసలు తండ్రి మాయానికి బాబాయికి సంబంధం ఉంది అని హైదర్ కి ఎవరు చెప్పారు ?? ఆ సమాచారం నిజమేనా ?? ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే హైదర్ ని చూడాల్సిందే

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి ఆంటే, తాబూ ఇంతకు ముందే తన ప్రతిభ నిరూపించుకుంది కాబట్టి కొత్తగా చెప్పేదేమీ లేదు ,ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షాహీద్ కపూర్ గురించి, ఇన్ని రోజులు కేవలం లవర్ బాయ్ గా కనిపించిన షాహీద్ కపూర్ లో ఇంతటి నటుడు ఉన్నాడంటే నమ్మశక్యం కాదు, అంత అధ్బుతంగా నటించాడు, ఎక్కడా మనకు హైదర్ తప్ప షాహీద్ ఎక్కడ మనకు కనిపించడు. నేపధ్య సంగీతం కూడా విశాల్ భరద్వాజే సమకూర్చుకోవటంతో ఎక్కడ ఎంత మోతాదులో ఎలాంటి ఫీల్ ఇవ్వాలో అలాగే ఉంది, పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ కాశ్మీర్ అందాలనే కాదు, దాని వెనుక ఉన్న ప్రమాదాలను, మోసాలను, మాయలను కూడా కళ్ళముందుంచింది.

ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ మరో గొప్ప విషయం, అసలు ఈ సినిమాని విడుదల చేయటానికి భారత ప్రభుత్వం కానీ, సైన్యం కానీ ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చెయ్యకపోవటం. ఒకటి, రెండు సన్నివేశాలు భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నా దాన్ని కథలో భాగంగానే చూడాలి తప్ప, అది ఏ ఒక్క వర్గానికో వ్యతిరేకంగా చూడకూడదు, మనకు ఇన్నాళ్ళు కాశ్మీర్ కు సంబంధించి, ఏదో ఒక వర్గానికి సంబధించిన కోణంలో మాత్రమే చూడటానికి అలవాటు పడ్డ మనకు, ఇది కాశ్మీర్ గురించి ఇరు వర్గాల కోణంలో చూపించటం ఒక విశేషం.

-మోహన్ రావిపాటి

mohan

లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

Mohan Rushi

 

 

 

 

 

 

ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే

ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి

కొత్త దుస్తుల్నే ధరించి చరించాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆల్ ఈజ్ వెల్

పాటలనే పాడి పరవశించాలి.

 

చూసే కళ్ళల్లో అందాన్ని దిగ్గొట్టాలి. ఆకుపచ్చ కామెర్లు అంటించుకోవడానికి

ఆపరేషన్లు చేయించుకోవాలి. సంకనాకిపోయినా జీవితంలోని సౌందర్యాన్నే

కీర్తించాలి. చావుదెబ్బలు తగుల్తున్నా సమ్మదనాన్నే అభినయించాలి. జీలో

కాల్తున్నా జీమూతవాహనుడికే జిందాబాద్ కొట్టాలి.

 

ప్రేమించే హృదయాన్ని ఫ్రేము కట్టుకు తిరగాలి. నిజాల మీద నిప్పులు పోసి

పప్పులుడికే ప్లాన్లు వెయ్యాలి. మంట మండిస్తున్నా, మర్యాద రామన్న మాస్కులో

మూస్కోవాలి. ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే,

అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ

                                                           – మోహన్ రుషి

మరో మొనాలిసా

Mamata K.
న్యూయర్క్ జిలుగుల 
నీడల్లో ఓ పక్కకి ఒదిగి 
నెలలు నిండిన పొట్ట నిమురుకుంటూ 
ఒక మెక్సికన్ యువతి.
ఆమె చేతిలో
వడలి పోతున్న ఎర్రగులాబీ 
బొకేలనుంచి తేలివచ్చింది
దశాబ్దకాలపు గ్నాపకం.
ప్రపంచానికి ఆవలి తట్టున, ఇలాంటివే 
మసిబారిన కాంక్రీటు దుమ్మల మధ్య
ఒక చేతిలో చిట్టి చెల్లాయిని
మరో చేతిలో 
తాను మోయలేనన్ని మల్లెమాలలతో
నా కారులోకి ఆశగా చూస్తూ
ఏడెనిమిదేళ్ళ పాప.
తన దగ్గరనుంచి 
ఒక్క పువ్వూ 
తెచ్చుకోలేకపోయిన
ఊగిసలాట  మరుగున నా స్వార్థం
ఇదిగో ఇప్పుడిలా నా రీర్ వ్యూ మిర్రర్లో
నిరాశ దు:ఖాన్ని దాచేసి
నిర్వికారమైన చిరునవ్వు నావైపు విసిరి
ఎన్నటికీ మాయని గాయాన్నింకొకదాన్ని 
నా గుండెలో రేపి
రోడ్డు మలుపులో మాయమయ్యింది.

‘ఎగిరే పావురమా!’ – 15

egire-pavuramaa15-banner

ఇప్పుడిప్పుడే నా కొత్త కాలితో నడవగలుగుతున్నాను. రోజూ కాళ్ళకి వ్యాయామం చేస్తూ, ఇదివరకటి కంటే బాగానే కదులుతున్నాను. ఇంకా కనీసం నెలరోజుల వైద్యం మిగిలి ఉంది. కాలు సెప్టిక్ అవకుండా ఇంకా మందులు, వారం వారం ఎక్సరేలు అవుతున్నాయి.

 

మునుపటిలా గోవిందు టెంపోలో కాకుండా, కొత్తకాలి ఆసరాతో, క్రచస్ సహాయంతో, క్యాంటీన్ కి నడిచి వెళ్ళి వస్తున్నాను. నెమ్మదిగా కుంటుతూనే అయినా, కనీసం ఇట్లాగైనా   కదలగలగడం కొత్త శక్తిని, తృప్తిని కలిగించింది.

ఈ రోజుకి ఆపరేషనయ్యి సరీగ్గా ఐదో వారం. కొత్తకాలు వచ్చి మూడో వారం.

మళ్ళీ నెలకి, చర్చ్ లో గోవిందుతో నా పెళ్ళి ఏర్పాట్లు చేసింది కమలమ్మ.

 

రెండు రోజులకోసారి జేమ్స్ వచ్చి నా నిర్ణయం ఏమిటని అడిగి వెళుతున్నాడు. పది రోజుల టైం ఇచ్చాడు వాడు.

వాడు చెప్పిన మూడు దారుల్లో – నాకు మంచిది, శ్రేయస్కరమైనది తాతతో జీవితమే. నేను ఆయనకి చేసిన అన్యాయం, ఆయన మనస్సుని గాయపరిచిన తప్పిదం సరిదిద్దుకునే అవకాశం కావాలి.

కాని, అసలెలా అది సాధ్యమౌనో తెలీడం లేదు.

నాకీ జన్మకి పెళ్ళిగాని, మరొకరి సాంగత్యం గానీ అవసరం లేదు… నాచిన్నప్పటి జీవితం నాకు చాలు…అనిపిస్తుంది…

 

తాతకి నేను రాసిన ఉత్తరానికి జవాబుగా – రాంబాబాయి నాకోసం వచ్చాడని తెలిసిన రోజే, నా మనస్సు పశ్చాత్తాప సందేశంతో, ‘శాంతి పావురంలా’ తాత వద్దకి వెళ్ళిపోయింది.

దానికి మినహా నేనేమి చేయగలను? నా జీవితాన్ని, తప్పుల్ని ఎలా సరిదిద్దుకోగలను? అని నిత్యం మదనపడుతున్నాను. ఏదో ఒక మూల నుండి సహాయం దొరకాలి…

గాయత్రీ అమ్మవారిని నమ్ముకోమని పంతులుగారు అన్నది గుర్తే…..ఆ అమ్మవారినే మననం చేసుకుని ప్రార్ధించుకుంటాను. అలాగే ఆదివారాలు ‘మదర్ తెరెసా’ చర్చికెళ్ళి, ఆ ప్రభువు కాడ నా గోడు చెప్పుకుంటాను…నాకు ధైర్యాన్నిమ్మని ప్రార్దిస్తాను…

 

రాంబాబాయి ఎప్పుడొస్తాడాని ఎదురు చూస్తున్నాను.

రాంబాబాయిని కూడా తిట్టి గోలచేసే కమలమ్మ వైఖరిని ఎలా ఎదుర్కోవాలి? పోనీ ఆమెకి మంచిగా చెప్పి ‘నా దారిన నేను పోతానని నచ్చచెప్పగలనా? ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు.

కాలం నత్త నడకలు నడుస్తుంది…

**

పనయ్యాక సాయంత్రం ఏడు గంటల సమయంలో వాకిట్లో అడుగుపెట్టగానే… ఎదురుగా కనిపించాడు…రాంబాబాయి. వాకిలెదురుగా రేకు కుర్చీలో కూర్చుని ఉన్నాడు…

ఇది ..నిజమా? భ్రమ పడుతున్నానా? అనిపించింది ఓ క్షణం…

లేచి నా వైపు వచ్చాడు బాబాయ్…

ఉద్వేగాన్ని ఆపుకోలేక పోయాను..

ఆయన కూడా కళ్ళు తుడుచుకున్నాడు…

“ఎదిగిపోయావు గాయత్రీ… ఎలా ఉన్నావు? రా కూచో,” అంటూ నాకు దారిస్తూ, పక్కకి జరిగాడు.

 

లోపల, కమలమ్మ, గోవిందు, జేమ్స్ ఉన్నారు. పంచాయతీ పద్దతిలో బాబాయి ఎదురుగా కూర్చుని నాకోసమే చూస్తున్నరులా ఉంది.

 

లోనికొచ్చి, మంచినీళ్ళు తాగిన   కాసేపటికి, వెళ్ళి స్థిమితంగా బాబాయి పక్కన కూచున్నాను.

దాదాపు రెండు నెలల క్రితం నేను తాతకి రాసిన ఉత్తరం గురించి మాట్లాడాడు బాబాయి.

ఆ విషయంగా – కమలమ్మ, జేమ్స్ నుండి, నేను   విన్న విషయాలే మళ్ళీ చెప్పాడు. స్వార్జితమైన తాత పొలం, ఇంటి కొట్టాంల పైన ఆయనకి తప్ప, ఇతర వ్యక్తులకి ఎటువంటి హక్కు ఉండదని చెప్పి, క్షణమాగి, నా వంక చూశాడు రాంబాబాయి…

egire-pavuramaa-15

“చూడు గాయత్రి, ఇలా నలుగురిలో పంచాయతి పెట్టుకునే అవసరమేముంది చెప్పు. నీకు ఆయన తాత. నీ కోసమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునున్నాడు. నీ మంచి కోరే ఏదైనా చేసాడు. చేస్తాడు కూడా. కాబట్టి నీవిప్పుడు చేరవలసింది సత్యమయ్య కాడికే.. అలోచించి ఏ సంగతీ చెప్పు… నా వెంట వచ్చెయ్యి,” అన్నాడు బాబాయ్…

 

“ఇదిగో రాంబాబు…ఏంది నీ మాటలు? మేము ఎంత కష్టపడితే, ఈ మూడేళ్ళు బతుకెళ్ళదీసింది నీ గాయత్రి? వైద్యం సేయించి బాగుసేసినంక, పిట్టలాగా ఎగరేసుకుపోదామని సూస్తుండావా?

ఆ పిల్లకి భరోసా ఇచ్చి, ఆ పొలం-కొట్టాం దానికి కట్టబెట్టి, నిలబడి పెళ్ళి సేయండ్రి. పెళ్ళి కుదిరిపోయింది గాయత్రికి.   వచ్చే నెలలో ఈడనే పెళ్ళి. మర్యాదేమన్నా తెలుసా మీకు?

ఈడనుండి తీసుకెళ్ళతానంటావ్? మళ్ళీ ఆ అమ్మాయిని గుడి మెట్ల మీద అడక్కతినిపిస్తారా? దాని ఆదాయం కోసమేగా ఆ తాత పన్నాగం,” అరిచి వెనక్కి పడినంత పనిచేసింది కమలమ్మ.

 

“అక్క, ఏందే నీ అరుపులు? నెమ్మదిగా ఉండు. పిచ్చి వాగుడు నువ్వూ…మరోమాట మాట్టాడితే ఊర్కోను,” ఆమెని గదమాయించాడు గోవిందు.

వాళ్ళ మాటలతో చెవులు తూట్లు పడుతున్నాయి…

గదిలో కాసేపు….నిశ్శబ్దంగా అయింది..

“చూడు రాంబాబు, …అందరి మాటలు విను. ఆలోచించు…ఏది ఏమైనా గాయత్రికి ఇంకా నెలరోజుల వైద్యం ఉంది.. ఇంతా చేసాక, అది సరిగ్గా పూర్తయ్యేలా చూడ్డం కూడా అవసరం…

ఇప్పుడు గాయత్రి మేజర్.   పెళ్ళి విషయంతో పాటు మరే విషయమైనా ఆమె ఇష్టానుసారమే జరుగుతుంది. ఆమెకి సమయం ఇవ్వండి. తెలివిగా నిర్ణయం తీసుకోనివ్వండి,”…అంటూ ఆగాడు…జేమ్స్.

కాసేపు ఎవ్వరూ ఏమీ అనలేదు…

బాబాయే నోరు విప్పాడు. నావంక సూటిగా చూసాడు.

 

“సరే, గాయత్రి, నిన్ను దేనికీ బలవంత పెట్టద్దని, ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోవద్దని, సత్యమయ్య నాకు మరీ మరీ చెప్పి పంపాడు.

నిన్నల్లరి పెట్టడం ఇష్టంలేకే అప్పట్లో, పోలీస్ రిపోర్ట్ కూడా వద్దన్నాడు,” అంటూ క్షణమాగి, తన జేబు నుండి ఓ కవర్ తీసి నాకిచ్చాడు.

 

“ఉమమ్మ చేత రాయించిన ఈ ఉత్తరం నీకివ్వమన్నాడు తాత…. నా ఎదురుగా చదువుకో… నీవు చదివాకే నేను వెళతాను…ఆ కింద ఉమమ్మ ఫోన్ నంబర్ ఉంది. నా నంబర్ ఉంది. గుడి పంతులుగారి నంబర్ కూడా ఉంది. నీకోసం రాములు, ఉమమ్మ, మీ పిన్ని కూడా ఎదురు చూస్తున్నారు మరి…,” అని ముగించాడు….

 

అదురుతున్న గుండెలతో ఉత్తరం చదవసాగాను.

 

ప్రియమైన గాయత్రీ,

ఇంతకాలానికి నీ నుండి వచ్చిన ఉత్తరం నాకు పట్టలేని ఆనందాన్నిచ్చింది తల్లీ. నీ కాలుకి చికిత్స జరుగుతున్నందుకు కూడా సంతోషం తల్లీ…

మూడేళ్లగా నీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆరోగ్యం చెడి ఆశ సన్నగిల్లింది. చూపు ఆనడం లేదు. నిన్ను చూడలేని కంటిచూపు అవసరం లేదులేమ్మా.  

మొదటిసారి నిన్ను చూసింది మాత్రం పెనుతుఫానులో కాలవగట్టున చలికి వణుకుతున్న పసిబిడ్డగా. ఆ రూపం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటాది…

గాలిలో కొట్టుకుంటున్న నీ బుజ్జి చేతులని కాసింత దూరాన్నించి చూడగలిగాను. దగ్గరగా వచ్చి చూస్తే – కక్కటిల్లి నువ్వు ఏడుస్తున్నా, బయటకి వినబడని రోదనే. నిన్ను కదలనివ్వని నలిగి నెత్తురోడుతున్న నీ పాదాలు, కాళ్ళు చూసి, బాధతో తట్టుకోలేకపోయానమ్మా..

 

అరవై ఏళ్ళ ఏకాకినైన నాకు అనాధగా దొరికావు. కళ్ళల్లో దీపాలెట్టుకుని పెంచాను. నీ జీవితంలో పువ్వులు పూయించాలనే, నీ ముఖాన నవ్వులు చిందించాలనే పూజారయ్యని ఆశ్రయించాను. ఆరోగ్యం బాగోక బతుకుతెరువు లేని నాకు, కోవెల్లో కొలువిప్పించి ఆదుకున్నాడాయన.

నువ్వు నాకు దొరికిన రోజే నీ పుట్టిన రోజుగా, నన్ను నీ శ్రేయోభిలాషిగా తాలుకాఫీసులో నమోదు చేయించాడు పూజారయ్య. ‘గాయత్రి’ అని నామకరణం చేసి, కోవెల్లో ఓ స్థానమిచ్చి, నీకు ఓ గౌరవమైన జీవనం కల్పించింది కూడా పూజారయ్యే.

 

నిన్ను చదివించాలని ఆశపడ్డాను. చెప్పుడు మాటలు నమ్మి నన్ను వదిలి వెళ్ళిపోయావు. దగాకోర్ల నుండి నిన్ను కాపాడలేక పోయానే అని కుమిలిపోతుండాను.

 

ఇకపోతే, నీ అవిటితనం నయమయ్యే అవకాశం ఉందని నా నమ్మకం. నీది పసితనంలో అఘాతం వల్ల ఏర్పడ్డ అవిటితనం అని నా గట్టి నమ్మకం. జరగవలసిన నీ వైద్యం కోసం, నీ సొమ్ము కూడా పక్కకెట్టే ఉంచానమ్మా.

అంతేగానీ నువ్వనుకున్నట్టు నీ అవిటితనం మీద యాపారం చేసి బతకాలని కాదు – అని నీకు తెలియ జెప్పాలనే నా తాపత్రయం. పనిచేయలేని పరిస్థితిలో కూడా ఫించను మొదలయ్యాక గాని ఆటో నడపడం మానలేదు. నీ తాత మీద నీకున్న అనుమానం దూరం చెయ్యాలనే ఈ గోడు చెప్పడం.

 

 

ఇప్పటికైనా పాలెంకి తిరిగొచ్చి నేను ఆశ పడుతున్నట్టుగా అందరి మధ్య గౌరవంగా బతుకుతావని ఆశిస్తాను.

నాదైన పొలం-కొట్టాం, అనుభవించే హక్కు పూర్తిగా నీదే తల్లీ.

నీకు కొదవలేకండా ఉండేలా, చేతనైనంతలో   కొన్ని ఏర్పాట్లు చేసాను గాయత్రీ. చదువుకున్నదానివి కనుక నీకు అన్నీ అర్ధమవుతాయి.

నువ్వు అవస్థలు పడవద్దు. అలోచించి తిరిగి వచ్చేయి తల్లీ.

నిన్ను ఈ కళ్ళతో చూసుకునే అదృష్టం నాకు ఉందో లేదో మరి.   ఆ అమ్మవారి కనికరం నీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను…

ప్రేమతో,

తాత….(తాత మాటలు రాసింది ఉమమ్మ)

కళ్ళ నుండి తెగబడే నీళ్ళని ఆపుకుంటూ తాత రాసిన ఉత్తరం చదవడం ముగించాను. ఇలాటి దేవుడినా అనుమానించి, అవమానించి పారిపోయాను?

నేనేదో అన్యాయమైపోయానని, తాత నన్ను అవిటిని చేసి, నా సంపాదన తింటున్నాడని అపోహతో మానసికంగా బాధపడ్డ నాది మూగవేదనా?

లేక అనాధనైన నన్ను దగ్గరికి తీసి, గొప్పగా పెంచి ఓ గౌరవమైన జీవితాన్ని ఇవ్వాలనుకుని నా వల్ల మనక్షోభ అనుభవించిన తాతది మూగవేదనా?

నా మేలు తప్ప వేరే ఆలోచనే లేకుండా గత పద్దెనిమిదేళ్ళగా నా ధ్యాసతోనే జీవించి నా మూలంగా ఈ వయస్సులో కూడా వేదన అనుభవించడంలేదా?

ఎన్నో ప్రశ్నలు నన్ను చుట్టేశాయి. ఉత్తరం చదివేసాక కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ అలా ఉండిపోయాను…

 

అంత వరకు ఎట్లాగో ఓపిగ్గా ఉన్న కమలమ్మ మళ్ళీ నోరెత్తింది.

“సుఖంగా ఉన్న పిల్లని అడ్డమైన ఉత్తరాలతో, మాటలతో ఎంత కష్టపెడతారయ్యా? ఇగ బయలుదేరండి. కాలు బాగయి పిల్లకి పెళ్ళి కూడా అవబోతుందని సెప్పండి… దాని డబ్బు, ఆస్థి ఇస్తామని సత్యమయ్యని కబురెట్టి పెళ్ళికి రమ్మను…,” అంటూ నావంక చూసింది..

“మీ బాబాయేగా, సెప్పు గాయత్రీ,” అంది…

(ఇంకా ఉంది)

 

ఆమె అప్పుడూ …ఇప్పుడూ…

drushya druhsyam 53

మొదట దృశ్యం.
అటు పిమ్మట అదృశ్యం.
నిజం.

+++

కొంతమంది పొట్రేచర్ చేస్తున్నప్పుడు అప్పుడేమీ తెలియదు.
మెడలో నల్లపూసలున్నయా లేవా అన్నది చూడం.
కానీ, ఏడాది గడిచిన తర్వాత మళ్లీ ఆమెను చూసినప్పుడు బోసి మెడ కనబడింది.
భర్త మరణించిండట!

పండుగకు పువ్వులు అమ్మే ఈమె గత ఏడాది ఇలా కనిపించింది.
ఈ ఏడాది విచారం కమ్ముకుని ఫొటో తీయలేని స్థితి కల్పించింది.

తొలుత మనిషిని నేరుగా ఎదుర్కుంటం.
ఏ భావమూ ఉండదు. తర్వాత ముభావం అవుతాం.

మధ్యలో ఉన్నది, అదే.
between the lines.

దృశ్యాదృశ్యం.
అది ఆది అంతాల నడిమంత్రం.

+++

పోట్రేచర్ – రూప చిత్రణం.
అందులో లావణ్యం కనిపిస్తుంది. విషాదమూ మూర్తీభవిస్తుంది.

ఒక లోవెలుపలి నావ ఒకచోట లంగరు వేయడమూ తెలుస్తుంది.
దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడటమూ తెలుస్తుంది.

ఇది గతం.
వర్తమానం అగమ్యం..

+++

చిత్రమేమిటంటే, ఒక ఫొటో తీస్తున్నప్పుడు తెలియదు.
తీసినాక ఆ వ్యక్తి పరిచయం అవుతుంది.
మళ్లీ కలిసినప్పుడు గతంలో తీసిన చిత్రం తాలూకు శోభ ఉన్నదా లేదా అని తెలియకుండానే దేవులాడుతాం.
ఉంటే మరింత ముచ్చటగా ఇంక ఫొటో తీస్తాం. లేకపోతే కలవర పడతాం.

చిత్రమేమిటంటే, ఫొటోగ్రఫి అన్నది ఫొటోగ్రాఫర్ పొట్రెయిటే!
దీపం అరకుండా చేతులు వుంచే ఒక రెపరెపలు పోకూడదన్నఅసంకల్పిత చేతన.

కానీ, ఎన్ని చెప్పినా తొలి చిత్రమే అసలు చిత్రం.
అద్వితీయం. మిగతావన్నీ ద్వితీయమే.

నిజానికి మనం తీసిన చిత్రమే కావచ్చు. కానీ, ఆ చిత్రంతోని- మనమే ఆ మనిషిని మరలా మరలా పోల్చుకోవడమే విచిత్రం. ఆ భావం, అనుభవం, తొలి నుంచి మలికి ప్రసరిస్తుంది. అటు తర్వాత బాగున్నా బాగలేకపోయినా మొదలే తుదికంటా కొలమానం అవుతుంది.

ఇదంతా తెలియకుండానే జరిగే ఒక చిత్రం.
అందుకే అనిపిస్తుంది,, గతం వర్తమానాన్నినిర్దేశిస్తుంది. అది క్రమేణా భవిష్యత్తు గురించి ఆలోచింపచేస్తుంది.
చిత్రంలో కూడా అదే ఒరవడి అని!
ప్రతిసారీ ఇంతే.
first impression is the best impression. చిత్రం.

+++

తొలి ఫొటో తీయడం అన్నది నిజానికి చాలా కీలకమైంది, ఫొటోగ్రఫీలో, పోట్రేచర్లో.
తొలి చూపుల వంటిదే ఇదీనూ.

తొలి పరిచయం, తొలిచూపులు,
ఏవైనా – ఎవరికైనా – ఎందుకైనా – కీలకమే.

మలిచూపులో ఆ కన్నుకు లేదా చూపుకు కొత్త చిత్రంలో ఏదో ఒక లోటు కనిపిస్తే ఇక మాట అవసరం పడుతుంది. అప్పటిదాకా కంటితో సరిపెట్టిన వారెవరైనా నోరు తెరిచి మాటాడక తప్పదు.
అట్లాంటి స్థితే ఎదురైతే, మలి చిత్రం అన్నది తొలి చిత్రానికి కొనసాగింపే అవుతుంది.
ఆ లెక్కన అదొక పొట్రెయిట్ కాదిక. విడి ఇమేజ్ కిందికి రాదిక.

ఫాలోఅపే.

+++

మొన్న పండుగకు, బతుకమ్మ పూలు కొన్నాక ఆ విచార వదనాన్నిఅడిగితే తెలిసింది, భవనం పై నుంచి పడిపోయి భర్త మరణించిండట. అప్పటికే కుడి కన్ను అదిరింది. అయినా వ్యూ ఫైండర్లో కన్నువుంచితే నిలబడలేదు. రూపం హత్తుకోలేదు.

నిజానికి, పొట్రేచర్ అంటే వ్యక్తి రూప చిత్రణ.ముఖ చిత్రణ.
ఇక ఆమెను చేయలేం. ఏం చేసినా ఆమె రూపం ఆమె జీవితంతో ముడిపడి ఉన్న రూపం గుర్తొచ్చి., కేవలం దేహాన్ని తీయడం అంటే కాదిక. కుదరనే కుదరదు. తనని వదిలిన దేహం ఒకటి మనకు కనిపించడుగానీ, వుండనైతే ఉంటుంది ఆ లోటు. .

దాంతో ఒకట్రెండు పోట్రయిట్ల చేశానుగానీ, లాభంలేదు.
నిజానికి పోట్రేచర్ చేస్తుండగానే అనుమానం వచ్చింది.
మొదలు చెప్పినట్టు, గతంలోలా లేదేమిటా అన్న శంక కలిగింది.
అడిగితే చెప్పింది.

“ఆయన పోయాడు గదా. ఇక మాకు పండుగలు లేవు.
కేవలం పువ్వులు అమ్మడమే’ అందామె.

ఇక వల్ల కాలేదు.

10723593_744834935588896_1602093144_n
పోట్రేచర్ ఆపి, ఆమెను, ఆమె ఇద్దరు కూతుళ్లనూ కూర్చోబెట్టి విచారంగానే మరో చిత్రం చేశాను.
అయిష్టంగా, భయంతోనే చేశాను. మళ్లీ వచ్చే సంవత్సరం ఆమె ఇలాగైనా ఉంటుందో లేదో అని!
పిల్లలు ఈ మాత్రం ఆనందంగానైనా ఉంటారో లేదో అని!

వెళుతుంటే అంది  ‘పనిమనిషిగానైనా చేస్తాను, ఎక్కడైనా చూడరాదూ’ అంది!
ఒక నిర్లిప్తమైన నవ్వు.

-ఇట్లా ఒక నవ్వు వాడిపోతుంది, మలి చిత్రం చేశాక.
అందుకే తొలి చిత్రాలకు ఫాలోఅప్ చేయడం నిజానికి చిత్రవధే.

– కందుకూరి రమేష్ బాబు

ఈ సాహిత్య నోబెల్ మరో ‘రాజకీయ’ దురాక్రమణ!

untitled

ప్రతి యేటా అక్టోబర్ మొదటి వారం రాగానే సాహితీ ప్రియులంతా ఆత్రుతగా యెదురు చూసేది, ఈ యేడు సాహిత్యంలో నోబెల్ బహుమతి యెవరికొస్తుందా అని! దాదాపు నెల రోజుల ముందు నుండే ప్రపంచ వ్యాప్తంగా నోబెల్ బహుమతి విజేతలు యెవరౌతారా అని బెట్టింగ్ ప్రారంభమౌతుంది! ఇంగ్లాండ్ కు చెందిన లాడ్ బ్రోక్స్ అనే బెట్టింగ్ సంస్థ వెబ్ సైట్ లో ప్ర్తతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా యెవరు నోబెల్ ఫేవరైట్స్ అని బెట్టింగ్ ప్రాంభమైంది . జపాన్ కు చెందిన నవలా రచయిత హారుకి మురకామి, సిరియా కు చెందిన మహాకవి అదోనిస్, అమెరికా కు చెందిన నవలా రచయిత ఫిలిప్ రాథ్ అమెరికా కవి గాయకుడు బాబ్ డిలాన్ తదితరులు దాదాఉ ప్రతి సారీ ఈ బెట్టింగ్ లలో ప్రధానంగా కనబడతారు.

కీన్య రచయిత గూగీ

కీన్య రచయిత గూగీ

అయితే ఈ సారి దాదాపు అన్ని బెట్టింగ్ లలో ప్రముఖ కేన్యా రచయిత న్గూగి వాథియాంగో ముందు వరసలో వినబడింది. గత రెండు మూడు యేండ్లుగా అదోనిస్ పేరూ వినబడింది. అమెరికన్ నవలా రచయిత ఫిలిప్ రాథ్ ప్రతి యేటా వినబడుతూనే ఉంది. బహుశా నాలాంటి వాళ్ళకు మాత్రం న్గూగి పేరు వినబడడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రజల విముక్తి కోసం నిలబడి, ప్రజా ఉద్యమాల్లో భాగమై, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం రచనలు చేసి, అనేక మార్లు జైలు పాలయి, ప్రవాసంలోకి నెట్టబడి , వ్యక్తి గతంగా యెన్నో ఒడిదుడుకులకు, ఇబ్బందులకు, కష్టాలకు లోనైనా వెనుకంజ వేయకుండా గొప్ప నిబద్దతతో ఉద్యమ సాహిత్యం సృష్టిస్తున్న న్గూగి కి నోబెల్ రావచ్చేమో అని ఒకింత ఆశ కూడా కలిగింది. నిజానికి గత రెండు మూడేళ్ళ నుండి అరబ్ మహాకవి అదోనిస్ కు రావాలని చాలా ఆశ కూడా ఉండింది. పాలస్తీనా మహాకవి దార్వీష్ ని (ఆయన జీవించి ఉన్నపుడు) , అదోనిస్ ని , న్గూగి ని నోబెల్ కమిటీ గుర్తిస్తుందని అనుకోవడం అత్యాశే నేమో!

అవార్డుల పట్ల మోజూ, యేవో అవార్డులొస్తేనే రచయితలు కవులు గొప్పవారనే దురభిప్రాయం లేకున్నా, ఆ అవార్డ్ ద్వారా, ముఖ్యంగా నోబెల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అవార్డు ద్వారా వారు ప్రతినిధులుగా ఉన్న ప్రజలూ వారి ఉద్యమాలూ , కన్నీళ్ళూ, కష్టాలూ, యుద్ధాలూ, జీవన్మరణ పోరాటాలు – వీటన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుందనీ, వెలుగు లోకి వస్తాయనీ ఒక ఆరాటం! వాటికి ఒక వేదిక, జాగా దొరుకుతుందని తండ్లాట!

చివరకు సాహిత్యం లో నోబెల్ ప్రకటించబడ్డది – ఫ్రెంచి రచయిత పాట్రిక్ మాడియానో కు నోబెల్ ఇచ్చారు. నాజీ దురాక్రమణలో నలిగిపోయి మరుగునపడిన జీవన ప్రపంచాల్ని , పట్టుచిక్కని మానవ అనుభవాలని ఆయన రచనల్లో గొప్ప గ్నాపక కళతో వెలికితీసినందుకు’ ఆయనకు నోబెల్ ఇచ్చినట్టు కమిటీ ప్రకటించింది. యెప్పుడూ వినలేదు చదవలేదు యెవరీ మాదియానో అని దాదాపు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఒక్క ఫ్రెంచివాళ్ళు తప్ప. ఫ్రాన్సు లో ఆయన బాగా ప్రసిద్ధి చెందిన రచయిత నట! కొన్ని మినహాయింపులతో ఆయన ప్రముహ ఫ్రెంచి రచయిత ప్రౌస్ట్ అంత వాడట! ‘తప్పిపోయిన మనిషి’ అనే 130 పేజీల నవల ఫ్రాన్సు లో బాగా ప్రసిద్ది చెందినదట! తన గ్నాపకశక్తి కోల్పోయిన ఒక డిటెక్టివ్ తన అస్తిత్వం కోసం చేసిన ప్రయత్నాన్ని ఆ నవల చిత్రించిదట! డిటెక్టివ్ నవలా ప్రక్రియకి (genre) చెందినదట! కోల్పోయిన జీవితాన్ని వెతుక్కోవడం లో ఉండే సమస్యలని (వెతుక్కోవడమూ, పొందడమూ, దాన్ని అర్థం చేసుకోవడమూ కాదు) మాదియానో తన రచనలలో చిత్రించాడని, చాలా సరళంగా , సులభంగా రాసినట్టున్నా మాదియానో రచనల్లో అత్యంత సంక్లిష్టమైన మానవ జీవితం ప్రతిఫలిస్తుందని పత్రికలు రాసాయి.

అయితే మాదియానో ఫ్రెంచ్ దేశస్తుడు – ఇప్పటి దాకా 14 ఫ్రెంచి రచయితలకు నోబెల్ వచ్చింది. ఈయన 15 వ వాడు. మాదియానో యూదుడు – ఇప్పటిదాకా 13 మంది యూదులకు (కేవలం సాహిత్య రంగంలోనే ) నోబెల్ వచ్చింది ఈయన 14 వ వాడు. అట్లా అని ఫ్రెంచి వాళ్ళకు యూదులకు నోబెల్ రావద్దని కాదు – కేవలం ప్రతిభనాధారం చేసుకునే నోబెల్ ఇస్తున్నారని మనమనుకుంటే అది అసాధ్యం కూడా కాకపోవచ్చు! కానీ నోబెల్ ప్రధానంగా ఐరోపా వారినే వరిస్తుందనీ, అదీ 1948 తర్వాత యూదులకే ఎక్కువసార్లు ఇచ్చారనీ (సాహిత్యమూ యితర రంగాల్లో కూడా) అపవాదు నోబెల్ కమిటీ పైనున్నది. అయితే అది పెద్ద సమస్య కాదు.

నిజంగానే యూదులు ప్రతిభావంతులు కాబట్టి వారికే నోబెల్ వస్తుందనీ అనుకోవచ్చు. నాజీ దురాక్రమణ , హోలోకాస్ట్ అనేవి మానవ జాతి చరిత్రలో పెద్ద మచ్చలే! వాటి గ్నాపకాలు వెంటాడి వేటాడుతుంటాయి నిజమే! కానీ ప్రధానంగా యూదులచే నడుపబడుతున్న పాశ్చాత్య రాజకీయార్థిక చట్రమూ (ప్రభుత్వాలూ, ఆర్థిక వ్యవస్థలూ ) దాని చే నియంత్రించబడుతూ తిరిగి దానిని ప్రభావితం చేస్తున్న సాంస్కృతిక వ్యవస్థా నాజీ దురాక్రమణనూ, హోలోకాస్టునూ విపరీతంగా ప్రచారం చేసాయి. ప్రపంచ సాంస్కృతిక చరిత్రా గమనమూ అంతా వాటిచుట్టే తిప్పాయి. అవే యింకా ప్రదాన సమస్యలుగా, అవి తప్ప ప్రపంచప్రజలకు యింక వేరే యే కష్టాలూ కన్నీళ్ళూ లేవన్నట్టుగా తీవ్రంగా ప్రచారం చేసి వాటిని ఒక సాంస్కృతిక వ్యవస్థలుగా యేరాటు చేసినయి. ఒక్క తీరుగా మనల్ని నమ్మించినయి.

ఎడోనిస్

ఎడోనిస్

నిజమే నాజీ ల దురాక్రమణలో యూదులు చెప్పనలవి కాని కష్టాలు పడ్డారు. కాదనడం లేదు. చరిత్రలో పాలకులు యెప్పుడూ ఒక పని చేస్తూ ఉంటారు. తమ చరితే ప్రజల చరిత్ర అనీ , తమ కష్టాలే అందరి కష్టాలూ అనీ, తమ సంస్కృతే అందరి సంస్కృతి అనీ ప్రచారం చేసి ఒక వ్యవస్థగా యేర్పాటు చేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓటమి తర్వాత దేశదేశాలకు వలసపోయిన యూదులకు ఒకే దేశం పేరు మీద ‘తమ దేశం ఇజ్రాయిల్’ అని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఆయువుపట్టైన చమురు విస్తారంగా దొరికే మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని కబ్జా చేసుకోవడానికి, అక్కడి అరబ్బుల మీద ప్రత్యక్ష పెత్తనం చలాయించడానికి అమెరికా ఐరోపాలు కుట్రపూరితంగా ఇజ్రాయిల్ ని యేర్పాటు చేసారు. అప్పటిదాకా అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజలని నిర్వాసితుల్ని చేసారు. పాలస్తీనా ప్రజలని తమ దేశంలోనే కాందిశీకుల్ని చేసి ఆ ప్రాంతాన్ని దురాక్రమించుకున్నారు.

యిప్పటికీ ఆ దురాక్రమణ కొనసాగుతున్నది. గత ఆరు దశాబ్దాలకు పైగా అక్కడి ప్రాంతం పాలస్తీనా ప్రజల నెత్తురు కన్నీళ్ళతో తడిస్తున్నది. నిన్న గాక మొన్న ఇజ్రాయిల్ గాజా మీద నెల రోజులకు పైగా యెడతెరిపిలేని దాడులు చేసి ఆప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెయ్యి మందికి పైగా పాలస్తీనా ప్రజలను (స్త్రీలు పిల్లలు ముఖ్యంగా) హత్య చేసి లక్షలాది ప్రజల్ని నిర్వాసితుల్ని చేసింది. ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేసింది. నిజానికి నాజీ దురాక్రమణ, హోలోకాస్టు గత ఆరు దశాబ్దాలకు పైగా ఇజ్రాయిల్ అమెరికా ఐరోపా దేశాల సహయంతో పాలస్తీనా ప్రజలమీద చేస్తున్న దురాక్రమణ దాడుల ముందు వెల వెల బోతాయి. ఇజ్రాయిల్ అంత దుర్మార్గంగా దాడులు హత్యలు దురాక్రమణ చేస్తూ అది ఆత్మ రక్షణకోసమే అని బుకాయిస్తోంది కూడా!

బెంజమిన్ నెతన్యాహూ ని మరో హిట్లర్ గా, హిట్లర్ కన్నా దుర్మార్గుడిగా అనేక మంది (ప్రజాస్వామ్య వాదులైన యూదులతో సహా ) వ్యాఖ్యానించారు. జియోనిజం నాజీ లకన్నా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనీ, ప్రపంచాన్ని కబళించాలని పన్నాగాలు పన్నుతుందనీ ప్రజాస్వామిక వాదులు ప్రపంచవ్యాప్తంగా యెలుగెత్తుతున్నారు. నిరసిస్తున్నారు. అయినప్పటికీ జియోనిస్టు దురాక్రమణవాదులచే నియంత్రించబడుతున్న పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నయి. వారి సాంస్కృతిక యంత్రాగాలు మాత్రం యింకా నాజీ దురాక్రమణ గురించీ, హోలోకాస్టు గురించీ, వాటిలో యూదులు పడ్డ కష్టాల గురించీ ఆ గ్నాపకాల గురించీ పదే పదే ప్రచారాలు చేసి ప్రస్తుత చరిత్రలో తాము చేస్తున్న దుర్మార్గాలని, దాడులని, దురాక్రమణలనీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

నోబెల్ కమిటీ జియోనిస్టుల నియంత్రణలో ఉన్న పాశ్చాత్య ఆధిపత్య వ్యవస్థలకు అతీతమైంది కాదు. నిస్సందేహంగా వాటి నియంత్రణ లోనే ఉండి, ఆ పరిధిలోనే పని చేస్తుంది! కేవలం ప్రతిభకే పట్టం కడతామని చెప్పుకున్నా ప్రపంచంలోని ప్రతిభ అంతా పాశ్చాత్య దేశాల్లోనే ఉంది అదీ ఒక వర్గం ప్రజలకే ఉంది అని అవార్డులు ప్రకటించడం యాదృచ్చికమేమీ కాదు. హోలోకాస్టు కి వెయ్యి రెట్లకు మించి దురాక్రమణా దాడులకు, హింసకూ ప్రపంచవ్యాప్తంగా యెన్నో దేశాల్లో ప్రజానీకం గురవుతున్నారు. వారి కష్టాలూ కడగండ్లూ ఆనాడు యూదుల కష్టాలకన్నా నిస్సందేహంగా యెన్నో రెట్లు యెక్కువ కూడా! అది పాలస్తీనా లో కావచ్చు, ఆఫ్రికా దేశాల్లో కావచ్చు, లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు – ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి మరో సారి హోలోకాస్టు గ్నాపకాల గురించి రాసిన ఐరోపా యూదునికే సాహిత్యం లో నేబెల్ ఇవ్వడం ఆశ్చర్యమూ అన్యాయమూ కూడా!

నిజానికి సాహిత్యం లో నోబెల్ ఇచ్చే పద్దతి చూస్తే దురాక్రమణలకూ దాడులకు గురవుతున్న దేశాల ప్రజల రచయితలకు ఆ బహుమతి ఇస్తారని ఆశించడం అత్యాశ కూడా! యెందుకంటే వారికి నోబెల్ అవార్డుల కమిటీ లలో యెటువంటి ప్రాతినిధ్యం లేదు గనక!

-నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

‘కారవాన్’ లో మన శివారెడ్డి, వరవర రావు, ఇస్మాయిల్

poetry_caravan-magazine_october-2014

 

For most Indian readers in English, contemporary poetry in Telugu lies below the horizon, its existence sometimes reported but never directly encountered. But even from this very small sample of the work of three Telugu poets, translated by the novelist Raj Karamchedu, it’s clear that this is a field as exciting as any other in Indian literature. Whether it is Siva Reddy’s poem about two human subjects and a burrow, Varavara Rao’s remarkable poem about speaking corpses and deaths in police custody, or Ismail’s unforgettable image of a real turtle inside a well and a metaphorical one inside the human mind, here are voices, images, rhythms and metaphors that proclaim a burning faith in  the power of poetry to both reveal and imagine the world afresh.

 The Caravan

 

విజయానికి క్షితిజ ‘రేఖ’ ఆమె!

index
ఒకప్పుడు లక్షలాదిమంది అభిమాన తారగా, కలలరాణిగా వెండితెరపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన నటి రేఖ. కెరీర్ ఆరంభంలో విమర్శకు గురైన తన రూపురేఖలను కాస్త మార్చుకొని అందాల తారగానే కాక, ప్రతిభావంతురాలైన నటిగా ప్రశంసలు పొందిన ఆమె జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలో. ఎంతమంది మగవాళ్లతో ఆమె పేరు కలిసి వినిపించిందో. అయినా ఒంటరిగానే వాటిని ఎదుర్కొంటూ, బలమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచిన రేఖ జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలు.

* మనదేశంలో ఫిట్‌నెస్ వీడియో ట్రెండును ప్రారంభించింది బిపాషా బసు, శిల్పాశెట్టి అని మనలో చాలామంది అనుకొంటూ ఉంటారు. కానీ ఈ ట్రెండును ప్రారంభించింది రేఖ. అవును. 1980లోనే ‘రేఖాస్ మైండ్ అండ్ బాడీ టెంపుల్’ అనే వీడియోను ఆమె విడుదల చేసింది. అంటే బిపాషా, శిల్పా కంటే రెండు దశాబ్దాల ముందుగానే వీడియో ద్వారా ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చింది రేఖ.
* స్కూలుకెళ్తూ మధ్యలోనే చదువు మానేసిన రేఖ బాలనటిగా పన్నెండేళ్ల వయసులో తెలుగు సినిమా ‘రంగుల రాట్నం’ (1966)లో మొదటిసారి నటించింది. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఖిలాడియోం కా ఖిలాడి’లో నటనకు గాను ఉత్తమ విలన్‌గా ఆమె స్టార్ స్క్రీన్ అవార్డును గెలుచుకుంది. అయితే ఆ కేరక్టర్ అంటే తనకు అయిష్టమని తెలిపింది రేఖ.
* బాలీవుడ్ సెక్స్ సింబల్‌గా పేరుపొందడానికి ముందు మరీ నలుపుగా ఉందనే విమర్శకూ, చిన్నచూపుకూ గురయ్యింది. ఆమెలో దక్షిణభారత రూపురేఖలు ఎక్కువగా ఉన్నాయనీ, ఆమె ముఖం ‘అగ్లీ’గా ఉంటుందనీ, హిందీ సినిమాలకు పనికిరాదనీ విమర్శకులు ఆమెను కించపరిచారు. కానీ తర్వాతి కాలంలో వారే ఆమెను చక్కని నటిగా, అగ్రతారగా అంగీకరించక తప్పలేదు.
* 1976లో వచ్చిన ‘దో అంజానే’ సినిమా నటిగా రేఖ జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటివరకూ కనిపించిన తీరుకు భిన్నంగా ఇందులో ఆమె కొత్త రూపుతో కనిపించి, ఆకట్టుకుంది. మరో రెండేళ్లకు వచ్చిన ‘ఘర్’ ఆమె నట జీవితంలో ఓ మైలురాయి. అత్యాచార బాధితురాలిగా ఆమె ప్రదర్శించిన నటన ఫిలింఫేర్ నామినేషన్‌ను తెచ్చిపెట్టింది. దాని వెంటనే అమితాబ్ బచ్చన్ జోడీగా ఆమె నటించిన ‘ముకద్దర్ కా సికందర్’ విడుదలై ఆ దశాబ్దంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమాతో బాలీవుడ్ అగ్ర తారల జాబితాలో చోటు సంపాదించింది రేఖ.
* చాలామంది నటులతో ఆమె పేరు కలిసి వినిపించింది. రాజ్ బబ్బర్, వినోద్ మెహ్రా, నవీన్ నిశ్చల్‌తో పాటు తనకంటే చిన్నవాళ్లయిన సంజయ్‌దత్, అక్షయ్‌కుమార్‌తోనూ ఆమెకు సంబంధం అంటగడుతూ ప్రచారం జరిగింది. అయితే ఎక్కువగా ఫేమస్ అయ్యింది మాత్రం అమితాబ్-రేఖ ప్రేమాయణమే. ‘గంగా కీ సౌగంధ్’ సినిమా సెట్స్‌పై రేఖతో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై అమితాబ్ చేయిచేసుకోవడంతో ఆ ఇద్దరి మధ్యా అనుబంధం ఉందంటూ వదంతులు మొదలయ్యాయి.
* పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్‌తో ఆమె పెళ్లి జరిగింది. కానీ పెళ్లయిన ఏడాదికే ముఖేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అనే సూసైడ్ నోట్ దొరికింది. అయితే అమితాబ్, రేఖ మధ్య అనుబంధాన్ని తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రచారంలోకి వచ్చింది.
* ప్రస్తుతం రేఖ టైటిల్ రోల్ పోషించిన ‘సూపర్ నాని’ సినిమా ఈ అక్టోబర్ 31న విడుదలకు సిద్దంగా ఉంది. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారతీ భాటియా అనే మధ్యవయస్కురాలి పాత్రను చేసింది రేఖ. ప్రతి స్త్రీలోనూ అంతర్గతంగా అమితమైన ప్రతిభా సామర్థ్యాలు దాగుంటాయనీ, కావలసినదల్లా అవి తనలో ఉన్నాయని తెలుసుకోవడమేననీ చెప్పే ఓ గుజరాతీ నాటకం ఆధారంగా ఈ సినిమా తయారైంది. అలా తన శక్తి ఏమిటో తెలుసుకున్న ‘సూపర్ నాని’గా కొద్ది రోజుల్లోనే రేఖ మన ముందుకు రాబోతోంది.

(అక్టోబర్ 10 రేఖ పుట్టినరోజు)

-బుద్ధి యజ్ఞ మూర్తి

లండన్ లో చరిత్ర సృష్టించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

 

సౌవెనిర్ ఆవిష్కరణలో...

సౌవెనిర్ ఆవిష్కరణలో…

లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ 27-28, 2014 తేదీలలో దిగ్విజయంగా జరిగి తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి తెర తీసింది. కళ్యాణి గేదెల మొదటి రోజు “మా తెలుగు తల్లికి” , రెండవ రోజు “జయ జయ ప్రియ భారత” శ్రావ్యంగా ఆలపించిన ప్రార్థనా గీతాలతో ప్రారంభం అయిన ఈ మహా సభలకి ఇంగ్లండ్, అమెరికా , ఫ్రాన్స్ , జర్మనీ దేశాలనుండి సుమారు 150 మంది సాహిత్యాభిలాషులు, కవులు, రచయితలూ పాల్గొనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారు ప్రధాన అతిథిగా విచ్చేసి తెలుగు బాషని ప్రపంచ బాషగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభోపన్యాసం, కేంద్ర సాహిత్యా ఎకాడెమీ బహుమతి గ్రహీత “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కీలకోపన్యాసం చేయగా సుప్రసిద్ధ కవులు “సిరివెన్నెల “ సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల, అశోక్ తేజ తమ అద్భుతమైన ప్రసంగాలతో రెండు రోజులూ ఈ సాహిత్య సభకి వన్నె తెచ్చారు. పౌరాణిక నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ తన పద్యాలతో సభని రంజింప జేయగా, ఫ్రెంచ్ దేశీయుడైన డేనియల్ నేజేర్స్ తన దండక పఠనంతోనూ, సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, పత్రికా సంపాదకురాలు కేతవరపు రాజ్యశ్రీ ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. సినీ నటులు సునీల్, రాజా రవీంద్ర ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచి సముచిత ప్రసంగాలు చేశారు.

ఈ మహా సభలని ఇటీవల నిర్యాణం చెందిన బాపు గారికి అంకితం ఇస్తూ జరిగిన అంకిత సభలో వంగూరి చిట్టెన్ రాజు, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల బాపు గారితో తమ వ్యక్తిగత అనుభవాలని సభికులతో పంచుకున్నారు. ఈ మహా సభల సందర్భంగా బాపు గారికి అంకితం ఇస్తూ ఎంతో తక్కువ సమయంలో డా. వెలగపూడి బాపూజీ రావు గారి సంపాదకీయంలో ఎంతో ఆకర్షణీయంగా వెలువరించిన సావనీర్ ని, తనికెళ్ళ భరణి రచించిన “ప్యాసా” రాజ్యశ్రీ రచించిన “రెక్కల్లో గీతామృతం”, సుద్దాల అశోక్ తేజ కవితల ఆంగ్ల అనువాదాలు పుస్తకం, వడ్డేపల్లి కృష్ణ గారి గేయాల సీడీ “తెలుగు రాగాంజలి” మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ ఎ. చక్రపాణి గారి కుమార్తె నీరజ రేగుల రచించిన “మై డాడ్” అనే పుస్తకం, ఆచార్య “పద్మశ్రీ” కొలకలూరి ఇనాక్ గారి కుమార్తె మధుజ్యోతి రచించిన ఆయన జీవిత చరిత్ర “నాన్న” ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయి.

స్వీయ రచనా పఠనం విభాగంలో డా. వ్యాకరణం అచ్యుత రామారావు, దివాకర్ అడ్డాల, డా. జొన్నలగెడ్డ మూర్తి, కేతవరపు రాజ్యశ్రీ మొదలైన వారు తమ కవితాలాపనలతో సభికులని రంజింపజేసారు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి శ్రీశ్రీ, దేవులపల్లి, భానుమతి, రేలంగి, సూర్యాకాంతం, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా, బాపు- బాపూజీ మొదలైన అనేక రంగాల లబ్ధప్రతిష్టులైన పైన తను రచించిన వచన కవితలను అద్భుతంగా చదివి సభ మెప్పుదల పొందారు.

అవధాని సత్కారం గుడ్

ఈ మహా సభలకి పరాకాష్ట గా యావత్ ఐరోపా ఖండంలోనే మొట్ట మొదటి సారిగా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంస్కృత పదాలు ఎక్కడా వాడకుండా అచ్చ తెనుగు పదాలతో అపురూపమైన అవష్టావధాన కార్యక్రమాన్ని, ధారణతో సహా కేవలం గంటా పదిహేను నిముషాలలో ముగించి చరిత్ర సృష్టించారు. కవి జొన్నవిత్తుల గారి సమర్థవంతమైన సంచాలకుడిగా ఆద్యంతం ఆహ్లాదంగా జరిగిన ఈ అష్టావధానంలో కేతవరపు రాజ్యశ్రీ (దత్త పది), శ్రీ రంగస్వామి (సమస్య), మాదిన రామకృష్ణ (చిత్రాక్షరి), డేనియల్ నేజేర్స్, వడ్డేపల్లి కృష్ణ (నిషిద్ధాక్షరి), అక్కిరాజు సుందర రామకృష్ణ (వర్ణన), “అమెరికా ఆస్థాన అప్రస్తుత ప్రసంగి” గా పేరొందిన వంగూరి చిట్టెన్ రాజు అప్రస్తుత ప్రసంగిగా చమత్కారమైన ప్రశ్నలతో పృఛ్చకులుగా వ్యవహరించారు. అవధానం అనంతరం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అవధాని పాలపర్తి వారి సత్కార కార్యక్రమం జరిగింది.

నాకు ఉప ముఖ్యమంత్రి గారి సత్కారం 2

వంగూరి చిట్టెన్ రాజు గారికి సత్కారం

ఈ మహా సభలలో “భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఉండే భారత దేశం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలుగు వారు విడిపోయిన నేపధ్యంలో, హిందీ భాష అభివృద్ది నమూనాలో తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ది బాధ్యతలు, కేంద్ర ప్రభుత్వమే చేపట్టి “కేంద్రీయ తెలుగు సంస్థ” ని ఏర్పాటు చేయాలి “ అనే తీర్మానాన్ని వంగూరి చిట్టెన్ రాజు ప్రవేశ పెట్టగా ఆ తీర్మానాన్ని నాలుగవ ప్రపంచ తెలుగు సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ సందర్భంగా ఈ రోజు ప్రారంభ సభలో వంగూరి చిట్టెన్ రాజు ప్రతిపాదించిన “యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో తెలుగు పీఠం” ఆవశ్యకతను గుర్తిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగానూ సహకరిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.యి. కృష్ణ మూర్తి, శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సమావేశాన్ని అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు, యునైటెడ్ కింగ్డం వాస్తవ్యులు డా. మాదిన రామకృష్ణ, డా. వెలగపూడి బాపూజీ రావు, కృష్ణ యలమంచి వేదిక నిర్వహణ బాధ్యతలని చేపట్టారు. ఈ రెండు రోజుల సమావేశాలని యుక్త అధ్యక్షులు జయకుమార్ గుంటుపల్లి పర్యవేక్షించగా, కిల్లి సత్య ప్రసాద్ & వెంకట పద్మ దంపతులు అన్ని చోట్లా వారే నిర్వహణ బాధ్యతలని చేపట్టి ఎంతో సేవ చేశారు. శ్రవణ లట్టుపల్లి, నరేంద్ర మున్నలూరి నాయకత్వంలో ప్రమోద్ పెండ్యాల, రాజశేఖర్ కుర్బా, అమర్ నాథ్ చింతపల్లి, ప్రసాద్ మద్దసాని, ఉదయ్ కిరణ్ బోయపల్లి, ఉదయ్ ఆరేటి, కృష్ణ యలమంచిలి, సుదీర్ కొండూరు, బలరామ్ ప్రసాద్ తదితరులు ఎంతో శ్రమ కోర్చి ఈ మహా సభలు విజయవంతం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించారు.

 

 -వంగూరి చిట్టెన్ రాజు

చరిత్ర అద్దంలో ‘హిందుత్వ’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నేను ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో చెప్పాను…

వేల సంవత్సరాల గతం– కాలమూ, ప్రాంతమూ విధించిన హద్దులను దాటుకుంటూ మనం ఊహించని రీతిలో వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. యూదుల గతం ఇందుకు ఇంకొక ఉదాహరణ.

యూదులు పురాచరిత్రలో/చరిత్రలో కనీసం మూడువేల అయిదువందల సంవత్సరాలుగా కనిపిస్తున్నారు. విశేషమేమిటంటే, వారు అంత సుదూరగతంలో ప్రపంచానికి అందించిన ఒక భావన, ఈ క్షణాన మనదేశంలో ఒక వర్గం నోట ఒక విలక్షణమైన వాదం వినిపించడానికి కారణమవుతోంది. ఆ వర్గం, హిందుత్వవాదులు. ఇది ఒకవిధంగా సున్నితమూ, వివాదాస్పద అంశమే కానీ, యూదుల గురించి చెప్పడానికి పూర్వరంగంలో ఆ అంశంలోకి వెళ్ళడం అనివార్యమవుతోంది. ఈ వ్యాసాలు అన్నింటిలో పాటిస్తున్నట్టే, చారిత్రక తటస్థతను పాటిస్తూ అందులోకి వెడతాను.

‘హిందూ’ అనేది ఒక ‘మతం’ కాదని పలు సందర్భాలలో హిందుత్వ సిద్ధాంత వాదులు నొక్కి చెప్పడం చూస్తూ ఉంటాం. హిందూ అనేది ‘ఒక జీవనవిధానం’ అని వారు అంటుంటారు. ఈమేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉటంకిస్తూ ఉంటారు. మతంగా కాకుండా, ఒక జీవనవిధానంగా ఉండడం ప్రపంచం మొత్తం మీద హిందువుల ప్రత్యేకతగా వారు ఉద్ఘాటిస్తూ ఉంటారు. ఈవిధంగా వారికి సంబంధించినంతవరకు ‘మతం’ అనే మాటకు, ‘జీవనవిధానం’ అనే మాట ప్రత్యామ్నాయపదంగా మారింది.

అయితే, చారిత్రక దృష్టితో చూసినప్పుడు, తమది ‘మతం’ కాదని వారు అనడంలో కొంత నిజం ఉంది, కొంత నిజం కానిది ఉంది. మతం అనే మాటను విశాలార్థంలో తీసుకున్నప్పుడు ఒకానొక ఆధ్యాత్మిక విశ్వాసాన్నీ, ఆరాధనా పద్ధతినీ అనుసరించేది ప్రతిదీ ఒక మతమే. ఆవిధంగా హిందూకు పూర్వరూపమైన వైదికం కూడా ఒక మతమే. బౌద్ధ, జైనాలను కూడా మతమనే అంటాం. అయితే, ఇవి క్రీస్తుపూర్వ కాలానికి చెందిన మతాలు. క్రీస్తుశకానికి దగ్గరగా, లేదా క్రీస్తుశకంలోకీ వస్తే, క్రైస్తవం, ఇస్లాం అనే రెండు మతాలు, ‘మతం’ అనే మాటను విశాలార్థం నుంచి తప్పించి; నేడు మన ఊహలో ఉన్న రూఢ్యర్థాన్ని లేదా పరిమితార్థాన్ని ఆ మాటకు ఇచ్చాయి. ఆ మతాల స్వభావం అందుకు అవకాశమిచ్చింది. ఎలాగంటే, అవి ఏకేశ్వర మతాలు! ఆ మతాలకు ఒక ప్రామాణిక పవిత్ర గ్రంథం ఉంటుంది.

ఇక్కడ యూదుల ప్రమేయం ఏమిటంటే, ఈ ఏకేశ్వర భావనను, పవిత్రగ్రంథ భావనను ప్రపంచానికి అందించినది వారే. అది కూడా క్రీస్తుపూర్వ కాలంలోనే. ఆవిధంగా మతం అనే మాటకు నేటి రూఢ్యర్థం యూదుల వల్ల వచ్చింది. క్రీస్తుపూర్వ కాలంలో వారు ప్రారంభించిన ఆ ప్రక్రియ క్రైస్తవంతోనూ, ఇస్లాంతోనూ ఒక కొలిక్కి వచ్చింది. అంతకంటే విశేషంగా అదే ప్రక్రియ, కాలాన్ని క్రీస్తుపూర్వంగానూ, క్రీస్తుశకంగానూ విభజించి కాలగణనానికి ఒక కొండగుర్తునూ ఇచ్చింది.

కనుక, ‘ఏకేశ్వర భావన కలిగి, ఒక ప్రామాణిక పవిత్రగ్రంథం ఉన్నదే మతం’ అనే రూఢ్యర్థంలో తీసుకున్నప్పుడు, తమది మతం కాదన్న హిందుత్వ వాదుల వాదనలో నిజం ఉంది. అలా కాకుండా, మతం అనే మాటను క్రీస్తుపూర్వపు విశాలార్థంలో తీసుకున్నప్పుడు వైదికమతంలానూ, బౌద్ధమతంలానూ హిందుత్వ కూడా ఒక మతమే అవుతుంది. ‘హిందూ’ అనేది ఒక మతం కాదనడంవల్ల ఇప్పుడు ఎలాంటి విచిత్ర పరిస్థితి ఏర్పడిందంటే, దానిని గుర్తించడానికి ఒక సరైన మాట లేకుండా పోయింది. చివరికి ‘హిందు’, ‘హిందుత్వ’అనే మాటలతో సరిపెట్టవలసివస్తోంది.

ఇంతకీ సారాంశం ఏమిటంటే, హిందూ అనేది మతం కాదని అనడంలో హిందుత్వ సిద్ధాంత వాదులు చెప్పకనే చెబుతున్నది, అది క్రైస్తవం లానూ, ఇస్లాంలానూ ఒక పవిత్ర గ్రంథం కలిగిన ఏకేశ్వరమతం కాదనే! అయితే ఆ మాట వారు స్పష్టంగా అనడం లేదు. హిందూ ఏకేశ్వరమతం కానప్పుడు సహజంగానే అది ‘బహుళేశ్వర మతం’ అవుతుంది. అప్పుడది ఏకేశ్వర, బహుళేశ్వర మత చర్చగా పరిణమిస్తుంది. కానీ, హిందుత్వ సిద్ధాంతవాదులు హిందూ అనేది బహుళేశ్వర మతం అని కూడా స్పష్టంగా అనడం లేదు. హిందూకు సంబంధించి మతం అనే భావననే తీసుకురావడానికి వారు ఇష్టపడడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా హిందూ ‘ఒక జీవన విధానం’ అనే మాటను ప్రచారంలోకి తెస్తున్నారు.

దానికి ఒక స్పష్టమైన నేపథ్యం ఉంది. అది, ‘మతతత్వం వర్సెస్ లౌకికవాదం’ అనే పేరిట చాలాకాలంగా జరుగుతున్న రాజకీయ చర్చ. తమది మతతత్వం అంటూ లౌకిక వాదులు అదే పనిగా దాడి చేస్తున్నారు కనుక, హిందూ ‘ఒక మతం’ అనే భావననే తోసిపుచ్చడం హిందుత్వ వాదులకు ఒకానొక వ్యూహంగా మారింది. మతం అనే భావననే నిరాకరించడమంటే, మతాలకు సంబంధించిన చరిత్రను, చర్చను కూడా నిరాకరించడమే. అప్పుడీ చర్చ మొత్తం అకడెమిక్ చర్చకు ఏమాత్రం సందివ్వని రాజకీయ వ్యూహాత్మక చర్చగా పరిణమిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.

హిందూ ‘ఒక జీవన విధానం’ అన్నప్పుడు కూడా దానికి ఒక స్పష్టమైన నిర్వచనం సాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. ప్రపంచంలోని ఏ ఇతర సమాజాలలోనూ, సంస్కృతులలోనూ లేని విలక్షణ జీవనవిధానం హిందువులకు మాత్రమే ఉందని– రెండు రెళ్ళు నాలుగు అన్నంత స్పష్టంగా నిరూపించనప్పుడు ఆ మాట కూడా బ్రహ్మపదార్థం లాంటి ఒక అనిర్వచనీయ భావనగానే మిగిలిపోతుంది.

 

***

చరిత్రలోకి వెడితే భిన్నదృశ్యం కనిపిస్తుంది. ‘ఒక మతం కాకపోవడం, ఒక జీవన విధానం కావడం’ అనేది హిందువుల ప్రత్యేకత అన్న వాదాన్ని మాటవరసకు అంగీకరిస్తే, అది ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా ఉన్న ప్రత్యేకతే. ఒకింత వివరంగా చెప్పుకుంటే, ఆ ప్రత్యేకత ఇలా ఉంటుంది:

ఒకప్పుడు జనం ఒక దేవినో, దేవుడినో కాకుండా అనేకమంది దేవీ, దేవతలను పూజించేవారు. ఇది ‘బహుళ దైవారాధన’. దీనిని ఒకవిధమైన ‘ఆస్తిక ప్రజాస్వామ్యం’ అనచ్చు. వేరే దేవీ, దేవతలను పూజించేవారు ఒక ప్రాంతాన్ని జయించినప్పుడు ఆ ప్రాంతంలోని దేవీ, దేవతలను కూడా సాధారణంగా సొంతం చేసుకునేవారు. అంటే, విజేతలు, విజితులు (ఓడిపోయినవారు) ఒకరి దేవీ, దేవతలను ఒకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఆస్తికరంగంలో పాలు, నీళ్లలా కలసిపోయేవారు. ఆ విధంగా దేవీదేవతల సంఖ్య కూడా పెరిగేది. జనం కలసిపోయి చుట్టరికాలు కల్పించుకున్నట్టే, దేవీ, దేవతల మధ్య కూడా చుట్టరికాలు ఏర్పడేవి. ఈ ప్రక్రియను చరిత్రకారులు ‘థియోక్రేసియా’అన్నారు. ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా, ఇప్పటికీ మనదేశంలోనూ జరుగుతూ వచ్చిన ఈ ప్రక్రియను హెచ్.జి. వెల్స్ (A Short History of the World) చాలా ఆసక్తికరంగా వివరించారు. అలాగే, రాజులను, చక్రవర్తులను దైవాంశ సంభూతులుగా కొలుస్తూ వాళ్ళకు గుడి కట్టడం కూడా ఉండేది.

దీనంతటినీ వ్యవహార సౌలభ్యం కోసం ‘బహురూప ఆస్తికత’ అనీ, దీనికి భిన్నమైనదానిని ‘ఏకరూప ఆస్తికత’ అనీ అందాం.

పైన చెప్పిన ‘బహురూప ఆస్తికత’ స్థానంలో క్రమంగా ‘ఏకరూప ఆస్తికత’ అడుగుపెట్టింది. ఏకరూప ఆస్తికత అడుగుపెట్టి బలపడడాన్నే నేటి మన కాలగణనలో క్రీస్తుశకం పేరిట కొండగుర్తుగా మార్చుకున్నట్టు పైన చెప్పుకున్నాం. ఆవిధంగా బహురూప ఆస్తికత క్రీస్తుపూర్వపు చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.

ఇక్కడే ఇంకో తమాషా ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రజాస్వామ్యం వైపు వెళ్లిన, లేదా వెళ్లాలని భావిస్తున్న ప్రపంచం; ఆస్తికరంగంలో మాత్రం (మనదేశం వంటి మినహాయింపులతో) దానికి భిన్నమైన మార్గంలో, అంటే ఏకరూప ఆస్తికతలోకి వెళ్లింది. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా తనను చెప్పుకునే పాశ్చాత్యక్రైస్తవ ప్రపంచం ఆస్తికంగా మాత్రం ఏకరూపతకు మళ్ళడం విచిత్రంగా ఉంటుంది. ఆ ఏకరూప ఆస్తికతను పురోగామిరూపంగా కూడా అది విశ్వసించింది. అందుకే తన వలసగా మార్చుకున్న భారత్ తో సహా అనేక దేశాలను క్రైస్తవీకరించే ప్రయత్నాలకు పాశ్చాత్యప్రపంచం మద్దతు ఇచ్చింది. కానీ అది బెడిసికొట్టడంతో వెనకడుగు వేసిన ఉదాహరణలూ ఉన్నాయి. చర్చితో పోరాడిన చరిత్ర కూడా తనకు ఉంది కనుక మతాన్నీ, రాజకీయాన్నీ అది విడదీసింది. తను ఆస్తికరంగంలో ఏకరూపతకు మళ్లినా రాజకీయంగా బాహుళ్యంవైపు, అంటే ప్రజాస్వామ్యంవైపు మొగ్గింది కనుక, అందులో భాగంగా భిన్న ఆస్తిక విశ్వాసాల ఉనికిని సూత్రప్రాయంగానైనా అది గుర్తిస్తుంది.

ఇస్లాం ప్రపంచానికి వస్తే, పాశ్చాత్యప్రపంచంలా అది ఏకరూప ఆస్తికతలోకి మళ్లినా, రాజకీయ ప్రజాస్వామ్యానికి పూర్తిగా మళ్లలేదు. కాలగణనం నుంచి చెప్పుకుంటే ఈ రెండు ప్రపంచాల మధ్యా ఉన్న ఒక పోలిక- క్రీస్తుపూర్వ కాలానికి చెందిన బహురూప ఆస్తిక నుంచి, క్రీస్తుశకానికి చెందిన ఏకరూప ఆస్తికతలోకి అవి రెండూ అడుగుపెట్టడం.

మనదేశానిది పూర్తిగా భిన్నమైన అనుభవం. మనం మొదటినుంచీ, ఇప్పటివరకూ కూడా భిన్న మతాలు, పంథాలు, ఆరాధనాపద్ధతుల రూపంలోని బహురూప ఆస్తికతలోనే ఉన్నాం. ఇందుకు మనదేశ భౌగోళిక పరిస్థితులు కూడా కొంత దోహదం చేశాయని కోశాంబీ సూత్రీకరణ. అలాగని మన దేశంలో అక్కడక్కడైనా ఏకరూప ఆస్తికతను విధించడానికి ప్రయత్నం జరగలేదని కాదు. క్రీస్తుపూర్వకాలంలో బౌద్ధం అనే ఉదాహరణ ఒకటి కనిపిస్తుంది. అయితే, బౌద్ధం స్వతస్సిద్ధంగా క్షీణించడం వల్ల నేటి హిందూకు పూర్వ రూపమైన వైదిక లేదా సనాతనమతం దాని స్థానంలోకి విస్తరించిందా, లేక బౌద్ధాన్ని అణగదొక్కి విస్తరించిందా అన్న ప్రశ్నకు అవకాశం ఉంది. అందులోకి నేను మరి అంత లోతుగా వెళ్లలేదు కనుక ప్రస్తుతానికి దానిని ప్రశ్నగానే వదిలేస్తాను. మనదేశంలో అక్కడక్కడ ఏకరూప ఆస్తికత విధించడానికి జరిగిన ఇతర ప్రయత్నాలు క్రీస్తుశకంలోకే వస్తాయి. వీరశైవ, వైష్ణవ మతాలు మొదలుకుని బ్రిటిష్ కాలంలో బ్రహ్మ సమాజం తదితర ఏకేశ్వర మతాలవరకూ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఏకరూప ఆస్తికతకు చెందిన క్రైస్తవ, ఇస్లాంల వరవడిలో పుట్టినవి.

బహురూప ఆస్తికత నుంచి ఏకరూప ఆస్తికతకు మళ్లడం అనేది అంత సునాయాసంగా ఏమీ జరగలేదు. అందులో ఎంతో పీడన, హింస ఉన్నాయి. పాశ్చాత్య ప్రపంచమూ, ఆ తర్వాత ఇస్లామూ బహురూప ఆస్తికతను పనిగట్టుకుని తుడిచిపెట్టి మరీ క్రీస్తుశకంలోకి అడుగుపెట్టాయి. ఈ కోణంనుంచి (ఇంకా మరికొన్ని కోణాలనుంచి కూడా) చూసినప్పుడు మనదేశం ఇంకా క్రీస్తుశకంలోకి రానే లేదు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా ఒకటి రెండు సందర్భాలలో ప్రస్తావించాను.

విచిత్రం ఏమిటంటే, క్రైస్తవ, ఇస్లాం మతాలలా తమది ఒక ‘మతం’ కాదనీ, ‘జీవనవిధాన’మనీ హిందుత్వ సిద్ధాంత వాదులు అంటూనే; మళ్ళీ ఆ మతాలనే వరవడిగా తీసుకుంటూ ఆ ‘జీవనవిధానా’న్నే ‘ఏకరూప జీవనవిధానం’గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇంకొకటి కూడా చేస్తున్నారు. అది, క్రీస్తు పూర్వదశనుంచీ ఈ దేశంలో ఉన్న ఒకవిధమైన ఆస్తిక ప్రజాస్వామ్యాన్నీ, నేటి రాజకీయ ప్రజాస్వామ్యాన్నీ కలగాపులగం చేయడం! ఈ దేశం మొదటినుంచీ ప్రజాస్వామ్యదేశమే(రాజకీయంగా, సామాజికంగా కూడా) నని విస్తృతార్థంలో నొక్కి చెబుతూ, దానికి ఆస్తిక ప్రజాస్వామ్యాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

క్రీస్తుపూర్వ దశకు చెందిన బహురూప ఆస్తికతలో ఇప్పటికీ అధికారికంగా కొనసాగుతున్న దేశం ఒక్క మనదేశం తప్ప ఈ క్షణాన నాకు ఇంకొకటి స్ఫురించడం లేదు. క్రీస్తుపూర్వ కాలంలో బహురూప ఆస్తికతనుంచి తనను కాపాడుకోడానికి ఏకరూప ఆస్తికత ఎంతో పెనుగులాడవలసివచ్చింది. అజ్ఞాతజీవితం కూడా గడపవలసివచ్చింది. అలాంటిది, చరిత్ర తిరగబడి, ఏకరూప ఆస్తికత దాడిని కాచుకుంటూ నేడు బహురూప ఆస్తికత బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది.

నేటి సువిశాల ఏకరూప ఆస్తిక సాగరంలో బహురూప ఆస్తికతను కాపాడుకుంటున్న ఒంటరి దీవి మనదేశం!

***

మన దేశంలో బహురూప ఆస్తికత ప్రత్యక్ష సత్యం కనుక మరీ ఎక్కువ ఉదాహరణలు ఇచ్చుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి కులానికీ, ప్రతి తెగకూ, ప్రతి ప్రాంతానికీ తమవైన దేవీ, దేవతలు ఉన్నారు. తమవైన పూజాప్రక్రియలు ఉన్నాయి. ఒక్క అమ్మవారి పూజల్నే తీసుకుంటే అందులో ఉండే వైవిధ్యం అంతాఇంతా కాదు. కొన్ని కులాల పూజల్లో జాతరలు, జంతుబలులు, గరగ నృత్యాలు, శరీరాన్ని హింసించుకోవడం మొదలైనవి ఉంటే; కొన్ని కులాల పూజల్లో సాత్విక నైవేద్యాలు, అష్టోత్తరశతనామాలు, సహస్రనామాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలైనవి ఉంటాయి.

ఈ సందర్భంలో ఆది శంకరాచార్య గురించి ప్రస్తావించుకోవడం అవసరం. ప్రామాణిక చరిత్రకు తెలిసినంతవరకు మనదేశంలో తొలి మత సంస్కర్త ఆయనే. స్థూలంగా చెప్పుకుంటే, యజ్ఞాలు, జంతుబలులు ప్రాధాన్యం వహించే ఒకనాటి వైదిక మతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సంస్కరించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. మరోవైపు, జానపద పూజా పద్ధతులనూ, విశ్వాసాలనూ కూడా ఆయన చక్కదిద్దడానికి చూశారు. నేడు క్షుద్రపూజలుగా చెప్పుకునే కొన్ని రకాల ఉగ్రపూజా పద్ధతులను సాత్వికం చేయడం ఆది శంకరాచార్య ప్రధాన సంస్కరణగా కనిపిస్తుంది. ‘పంచాయతనం’ పేరుతో దేవీ దేవతల సంఖ్యను పరిమితం చేయడానికైతే ఆయన చూశారు కానీ, బహురూప అస్తికతను పూర్తిగా ఏకరూప ఆస్తికతగా మాత్రం మార్చలేదు. మన దేశస్వభావమూ, స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను అయిదుగురు దేవీ దేవతలకు పరిమితం చేసి ఉండవచ్చు. ఆ అయిదుగురు దేవీ, దేవతలు: అంబిక, సూర్యుడు, గణపతి, కుమారస్వామి, విష్ణువు. దాంతోపాటు పూజా విధానాన్ని సరళమూ, సాత్వికమూ చేశారు. అయితే శంకరాచార్యులవారి ప్రయోగాలు పూర్తిగా విజయవంతమయ్యాయని చెప్పలేం.

శంకరాచార్య కాలం గురించే వివాదం ఉంది. ఆయన క్రీస్తు శకానికే చెందినవారన్న వాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఏకరూప ఆస్తికత దిశగా ఆయన ఆలోచన చేశారా అనిపిస్తుంది. తాత్విక స్థాయిలో ఆయన అభివృద్ధి చేసిన అద్వైత సిద్ధాంతంలో దాని ఛాయలు కనబడవచ్చు. పూజా విధానం మేరకు పంచాయతనానికి పరిమితమయ్యారు.

శంకరాచార్యులవారి గురించి ఈ నాలుగు మాటలూ ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు చెప్పినవే కానీ, ఇది సమగ్ర, పరిశీలనా కాదు, అందుకు ఇది సందర్భమూ కాదు.

***

క్రీస్తు పూర్వకాలానికి చెందిన బహురూప ఆస్తికత ఏకరూప ఆస్తికతలోకి పయనించి క్రీస్తుశకాన్ని అవతరింపజేయడం రోమన్ సామ్రాజ్యకాలంలో జరిగింది. హెచ్, జి. వెల్స్ చిత్రించిన ఆ పరిణామక్రమాన్ని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

అది తర్వాత…

అతనూ నేనూ

నాకేం తొందరలేదు అతని లాగే

నన్ను నేను పరుచుకుని కూర్చున్నాను తననే  చూస్తూ
నాలోంచి చూపుల్ని వెనక్కి లాక్కుని
రెప్పల కింద అతను దాచుకున్నపుడు
కొలుకుల్లోంచి కణతల మీదుగా నాచు పట్టిన చారికలు
మళ్ళీ కొత్తగా తడిసిన చప్పుడు
ఉండుండీ  అతని లోపలి కఫపు అలికిడి
మా చుట్టూ కోట కట్టుకున్న నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ
ఏ జ్ఞాపకాలు ఆత్రంగా తడుముకున్నాయో
వట్టి పోయిన  పెదాల మీద చెమ్మ చెమ్మగా చిరునవ్వు
గుప్పెడు గుండె చేస్తున్న ఒంటరి పోరాటం
అతని మెదడు మెలికల్లోకి మంచి రక్తాన్ని ఎగదోస్తూ
చిక్కుల దొంతరల మధ్యన ఆశగా నిలబడి
ఓర్పు పాఠాన్ని దొంగిలిస్తున్న నేను
శరీరం పై తేరిన ముడతల అడుగున
వయసుతో బరువెక్కిన అతని స్పష్టమైన చరిత్ర
వేళ్ళ వంకర్ల మధ్య నుండి స్వేచ్ఛగా
రాక పోకల్ని సాగిస్తూ గాలీ వెలుతురూ
ఇద్దరివీ ఎదురు చూపులే
తన ప్రాణాన్ని తీసుకెళ్ళే యమ పాశం కోసం అతను
నాకోసం ప్రాణాలిచ్చే అల్ప జీవి కోసం నేను
ఎటొచ్చీ అతనిది ముసలి శరీరం, నాది బలమైన సాలె గూడు అంతే తేడా
                                                             – సాయి కిరణ్ 

సరళమైన వాడు

 chand
వాడు వెలివేయబడ్డాడు
హృదయాలను మార్చుకుంటూ ప్రవహించలేక
వాళ్ళ పాదాల మద్య స్తంభించి పోయాడు
పల్చని తెర లాంటి  హృదయాన్ని
ఆకాశంలా పరుచుకున్నాడు
***
వాడు శూన్యం
కన్నీళ్ళు, గాయాలు
నువ్వు, నేను, ప్రపంచం ఏమీ లేవు
ప్రేమించడానికి ముందు
హృదయాన్ని బోర్లించాలంటాడు
***
దేహం లేనివాడు
చచ్చిన మనసులను చూసి నవ్వుతుంటాడు
నవ్వుతున్న దేహాలపై జాలి పడతాడు
రెప్పలు నుండి కురిసే వానకే నిండిపోతాడు
***
వెన్నెలై కురిసే హృదయం తప్ప
వాడి దగ్గర ఇంక ఏ అక్షరాలు లేనోడు
కాగితంపై రక్తం వొంపుకుంటూ
ఇదే కవిత్వమంటాడు
***
నువ్వెవరు అని అడిగిన ప్రతీ సారీ
తెలుసుకోవడానికే బ్రతికున్నానంటాడు
-చాంద్

వెన్నెల్లో వెనిస్!

నీటి మీద తేలుతున్న నగరం!

ప్రపంచంలోనే అరుదైన అందమైన నగరం! వెనిస్!

ఇటలీలోనేకాక, ప్రపంచంలోనే ప్రేమికుల ప్రముఖ ప్రణయ నగరం!

ఒక్క రోడ్డు కూడా లేని పెద్ద నగరం. ఊరంతా నీటి మీదే! అక్కడే టాక్సీలు, బస్సులూ, హోటళ్ళ షటిల్ బస్సులూ, స్కూలు బస్సులూ. ‘లాహిరి, లాహిరి’ పాడుకోటానికి గండోలాలు.

ఇదో వింత అనుభవం!

౦                 ౦                 ౦

ఎన్నో కాలువలతోనూ, బ్రిడ్జీలతోనూ, రకరకాల నీటి వాహనాలతోనూ, పో – పియావే నదుల మధ్యన 118 చిన్న చిన్న దీవులని కలిపి, చిందరవందరగా వున్న మనుష్యులను దగ్గరకు తీసిన నగరం. ఇటలీలో వెనేటో ప్రాంతానికి రాజధాని. మొత్తం 160 చదరపు మైళ్ళు లేదా 415 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. వెనిస్ గ్రాండ్ దీవి మీద 60,000మంది జనాభా అయితే, మొత్తం 118 దీవులూ కలుపుకుంటే 270,000 జనాభా. సగటున రోజుకి యాభై వేల మంది పైన యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారని చెప్పారు.

౦                 ౦                 ౦

మేము వెరోనా అనే నగరం నించీ ట్రెయిన్లో వెళ్లి వెనిస్ నగరంలో దిగాం. అక్కడికి ట్రైన్ ఒక బ్రిడ్జ్ మీదుగా వెడుతుంది. అక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వుంది. నీటి పైన ఎగురుతూ వచ్చి ఈ దీవి మీద విమానాలు దిగుతాయి.

ట్రైన్ స్టేషన్లో దిగాక, అదే దీవిలో అయితే కాలి నడక. దగ్గరగా వున్న మిగతా దీవులకీ వెళ్ళాలంటే కూడా బ్రిడ్జిల మీద కాలి నడక. లేదా కొంచెం దూరంగా వున్న దీవులకి వెళ్ళాలంటే టాక్సీలు, బస్సులూ. అన్నీ నీటి మీదే.        అప్పుడే నాకు బాపుగారు వేసిన ఒక కార్టూన్ గుర్తుకు వచ్చింది. ఒక స్వామిగారు నీటి పైన నడిచి వెడుతుంటాడు. అది చూసి ఒకతను అంటాడు, “అరె, చూడు ఆయన నీటి మీద ఎలా నడిచి వెడుతున్నాడో” అని. అప్పుడు రెండో అతను అంటాడు, “పాపం, ఆయనకి ఈత రాదేమోరా.. అందుకే నడిచి వెడుతున్నట్టున్నాడు” అని!

ఇక్కడ ఆ సన్నటి సందులూ గొందుల మధ్య నడుచుకుంటూ వెడుతుంటే ఎంతో బాగుంటుంది. మధ్యాహ్న సమయాల్లో కూడా ఎండగా వున్నా, చల్లటి గాలి తగులుతుంటే నడవటానికి బాగుంటుంది. కాకపొతే అక్కడ వున్న కొన్ని సైన్ బోర్డులు గందరగోళంగా వుంటాయి. అక్కడ ఎవరినైనా అడగటం మంచిది.

venice1

మేము దిగిన హిల్టన్ హోటల్ చాల దూరంగా ఇంకొక ద్వీపం మీద వుంది. గమ్మత్తేమిటంటే, ఆ ద్వీపం వున్నదంతా మా హోటలే. హోటల్లోనించీ ఏవైపు బయటికి వచ్చినా నీళ్ళే. ముందు వైపున నీళ్ళల్లో మాత్రం హోటల్ వారి షటిల్ బస్సూ, టాక్సీలు ఆగటానికి నీళ్ళల్లోనే ఒక బస్టాపు. గ్రాండ్ దీవి నించి మేము హోటల్ వారి షటిల్ బస్ తీసుకుని, హోటలుకి వెళ్ళాం.

ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాల వున్నాయి. అన్నిటిలోకి ముఖ్యమైనది సైంట్ మార్క్స్ స్క్వేర్. దీన్ని ఇటాలియన్ భాషలో శాన్ మార్కో పియాజాజ్ అనికూడా అంటారు. వెనిస్ వచ్చిన ప్రతి యాత్రీకుడు చూడవలసిన ప్రదేశం ఇది. ఎంతో అందంగా కట్టిన కట్టడాలు. మూడు పక్కలా ఎన్నో రెస్టారెంట్లు, ఆరు బయట షామియానాలు, కొన్ని గొడుగులు. వాటి క్రింద జనం కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూస్తూ, జలపుష్పాల పాస్టా తింటూ, కూర్చుని వుంటారు. ఎక్కడ చూసినా ఇటాలియన్ వైన్ సీసాలు. దాని పక్కనే సైంట్ మార్క్స్ బసీలికా చర్చి. చాల అందమైన కట్టడం. లోపలా, బయటా కూడా బాగుంటుంది. ఆ పియాజాజ్ మధ్యలో ఎన్నో పావురాలు, ఆహారం పడేస్తుంటే అక్కడే ఎగురుతూ ఇంకా ఎంతో అందాన్నిస్తాయి.

venice2

 

ఇక్కడ చీకటి పడేసరికీ అంతా మారిపోతుంది. ఎన్నో వేల లైట్లతో వెలిగిపోతుంటుంది. మూడు నాలుగు చోట్ల, కొంతమంది చిన్న స్టేజ్ మీద పియానో, వయోలిన్, చల్లో, డ్రమ్స్ మొదలైన వాయిద్యాలతో చెవులకి ఎంతో హాయిగా వుండే సంగీతం. కొన్ని చోట్ల ఇటాలియన్ భాషలో మధురమైన పాటలు కూడా పాడుతుంటారు. మేము రాత్రి భోజనానంతరం, ఎనిమిది గంటల నించీ పదకొండు గంటల దాకా అక్కడ తిరుగుతూనే వున్నాం.

venice3

 

అక్కడ చాలామంది బంగ్ల్లాదేశ్ వాళ్ళు లైట్లతో ఎగిరే బొమ్మ విమానాలు, వెలిగే మంత్రదండాలు మొదలైనవి అమ్ముతుంటారు. అవి కొనమని మన వెంటపడతారు కూడా.

మర్నాడు ఆ చుట్టుపక్కల, కొంచెం దూరంగానే వున్న మూడు నాలుగు దీవులకి, ఒక మోటార్ బోటులో టూర్ బుక్ చేసుకుని వెళ్ళాం. వాటిలో ముఖ్యంగా రెండు దీవుల గురించి చెబుతాను. ఒకదాని పేరు మురానో. ఇంకో దాని పేరు బురానో. మా టూర్ గైడ్ అమ్మాయి మురానో, బురానో అంటుంటే ఆ అమ్మాయిలాగానే అందంగా వున్నాయి ఆ మాటలు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటాలియన్ కూడా అజంతా భాష (మాటలు అన్నీ అచ్చులతో అంతమవుతాయని) కనుక అలా అంటారు కానీ, రెండిటికీ ఆ ఒక్కటీ తప్ప వేరే సంబంధం ఏమీ లేదు. ఏ భాష అందం దానిదే అని నా అభిప్రాయం. నేను మాత్రం ఇటాలియన్ భాషని, తెలుగు ఆఫ్ ది వెస్ట్ అనే అంటాను!

మురానో దీవి గ్లాస్ పరిశ్రమకి ప్రసిద్ధి. ఇటాలియన్లు కేథలిక్ క్రిస్టియన్ మతస్తులు కనుక, వారి చర్చిలలో ఎన్నో రకాల గ్లాసు అద్దాలు, బొమ్మలూ, దీపాలు.. వాటిలో చాలావరకూ ఇక్కడే తయారవుతాయి. మనలాటి యాత్రీకుల కోసం, వాళ్ళు రకరకాల బొమ్మలు (గుఱ్ఱాలు, ఏనుగులు, నెమళ్ళు లాటివి), ప్లేట్లు, కప్పులు, పూల గుత్తులూ, కొవ్వొత్తులు పెట్టికునే స్టాండులు.. ఒకటేమిటి ఎన్నో రకాలవి చేస్తారు. అవి ఎలా ఊడుతూ తయారు చేస్తారో చెబుతూ మాకు ఒక చిన్న ప్రదర్శన కూడా ఇచ్చారు. అది ఎంతో కళాత్మకమైన, నైపుణ్యంతో కూడిన విద్య.

బురానో దీవిలో చూసేది, అక్కడ తరాల తరబడి నివసించే వారి సంస్కృతిని ప్రతిబింబించే భవనాలు, వారి దుస్తులూ, నగలూ మొదలైనవి చూడ ముచ్చటగా వుంటాయి. కొనుక్కునేవాళ్ళకి, ఎంత కప్పుకి అంత కాఫీ!

వెనిస్ వెళ్ళినవాళ్ళందరూ చేయవలసిన పని ఇంకొకటి వుంది. అదే ‘గండోలా’ బోటులో ‘లాహిరి లాహిరి’ విహారం. ఎనభై యూరోలు ఇస్తే దాదాపు నలభై ఐదు నిమిషాలు, మనల్ని ఆ చిన్న పడవలో సందుల గొందుల మధ్య తిప్పుతాడు. అప్పుడే నీళ్ళల్లో ఇళ్ళ ఎలా కడతారో తెలుసుకోవచ్చు. మా గండోలా అతను ఇటాలియన్ యాసలో ఇంగ్లీష్ బాగా మాట్లాడాడు. ఇండియా వెళ్లి ఆగ్రా, జైపూర్ చూసి వచ్చాడుట. మంచి జోకులు కూడా వేశాడు.

venice4

నేను అప్పుడు తెలుసుకున్నదేమిటంటే, నీళ్ళల్లో పూర్తిగా మునిగిన చెక్కలు, ఆక్సిజన్ తగలక పాడవవు. అదే చెక్క నీళ్ళలో బయట వుంటే త్వరగా పాడవుతుంది. అదీకాక నీళ్ళని తగులుతున్న ప్రతి భవనం మొదటి అంతస్తు ఖాళీగా వుంచుతారుట. మనుష్యులు వుండేది రెండు, మూడు, ఆ పైన అంతస్తులలో. ఈ గండోలా విహారం చేస్తున్నప్పుడే చూశాం, నీళ్ళ ఒడ్డునే కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు. ఇక్కడ బస్టాపులు, టాక్సీ స్టాండులు కూడా నీళ్ళల్లో తేలుతూ వుంటాయి. మన ఒడ్డు వేపు నించీ ఎక్కి, రెండో పక్కన వున్న బస్సులు ఎక్కుతామన్నమాట! గండోలా విహారం వెన్నెల రాత్రులలో ఇంకా బాగుంటుంది.

ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమైనది గాలరీ డెల్ ఎకాడమియా. ఇక్కడ వెనీషియన్ చిత్రకారులు టిటియాన్, టింటరెట్టో మొదలైనవారి చిత్రాలు వున్నాయి.

మేమూ ఆరుబయట షామియానా క్రింద కూర్చుని పిజ్జాలు పాస్టా తిన్నాం. అమెరికాలో తినే ఇటాలియన్ పదార్దాలకీ, ఇటలీలో తినే వాటికీ చాల తేడా వుంది. అమెరికాలో ఇచ్చినన్ని కాయగూరలు ఇవ్వరు వాళ్ళు. చీజ్ మాత్రం ఎన్నో రకాలు. ఒకే పిజ్జా మీద నాలుగు, ఆరు రకాల చీజులు వేస్తారు.

దగ్గరుండి అన్నీ కనుక్కుని వడ్డించింది మాకు సోనియా.

పాత జేమ్స్ బాండ్ సినిమాలో, రోజర్ మూర్ రోజుల్లో అనుకుంటాను, ఒక సినిమాలో జేమ్స్ బాండుకి ఏ దేశంలో ఎక్కడ చూసినా అదే అమ్మాయి కనపడుతుంటుంది. అలాగే ఇటలీలో ఏ వూళ్ళోనయినా సరే, నాకు ఏ వెయిటర్ని చూసినా, ఆ అమ్మాయి పేరు సోనియా అయివుంటుందేమో అనిపించేది!

౦                 ౦                ౦

 

 

 

అతను అంగారం, ఆమెలోని సింగారం!

untitled

నేను వణికే వర్జిన్ మొదటి స్పర్శని

నేను  సున్నితంగా గుచ్చుకునే తన దొంగ ముద్దు ని

నేను   మేలిముసుగు లోంచి తొంగి చూసే ప్రేమ చూపు ని

అంటూ ఎక్కడయినా కనిపిస్తే  ఈ లైన్స్ చదవగానే ఈ కాలపు   ఔత్సాహిక ఇంటర్నెట్ కవి ఎవరో ప్రేమోద్రేకాల వ్యక్తీకరణలో కాస్త తడబాటు ఆటలు ఆడుకున్నాడు /కున్నది అని పాటకుడు అనుకుంటే గట్టి ముద్దపప్పులో కాలు వేసినట్లే  , ఎందుకంటే అదే పోయెమ్ లో ఇంకో పాదం లో

నేను భూమి గుండెల్లో పేలే అగ్ని పర్వతం

నేను అడవులని నిలువుగా దహించే కార్చిచ్చును

నేనే నరకపు పిచ్చి క్రోదాలను చూపే  సముద్రం 

అంటూ  ఒక్కసారిగా  ఆవేశం క్రోధం , ఆక్రోశం వెలిగక్కే అంటూ ఉలిక్కిపడేలా చేసే కొత్త వాక్యాలు కనిపిస్తాయి

tagore-nazrul1

ఇంకొంచం ముందుకు వెళ్లి ఇంకో రెండు పాదాలు చదువుకుంటే

నేను ఒక శాశ్వతం అయిన తిరుగుబాటు దారుడని

ప్రపంచాన్ని ఎదిరించడానికి నా తల ఎత్తుకుంటాను

అన్న వాక్యాలు కనిపించి  ఒక ఉద్యమ విప్లవకారుడి ప్రేమ  మన హృదయాన్ని మొదటి ముద్దుగా  కాకపోయినా గుండెల్లో గుచ్చుకున్న బలమయిన  భావంగా దిగబడిపోతుంది .

ఒక అనిర్వచనీయమైన ప్రేమ ఒక ఆవేశం ఒక విప్లవం కవిత పేరు విరోధి కవి కాజీ నజ్రుల్ ఇస్లాం. 

najrul1

 

మెదడులో ఒక 100 వోల్టుల బల్బు ఒకటి వెలిగి మొత్తంగా భారత స్వాతంత్ర సమరోద్యమం అందులో బెంగాలీ రైటర్స్ అంతా ఒక్క సారి గా కళ్ళముందు నిలబడి మనల్నే చూస్తున్నట్టు లేదు ? ఒక పక్క శాంతి వచనాల గురుదేవుడు రవీంద్రుడు బెంగాల్లో  ఉద్యమం ని తన కవితల రచనల ద్వారా ఎంత ముందుకు తీసుకెళ్లాడో కరెక్ట్ గా అదే సమయం లో నాణంకి రెండో పక్క  తన విరోధి ,అగ్నివీణ లాంటి రచనలతో స్వాతంత్రోద్యమం లో మధ్య మధ్య చల్లారే గుండెలకి నిజంగానే కార్చిచ్చు అంటించిన కవి గాయకుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం . మనకి బంగ్లాదేశ్ కి సాంస్కృతిక వారసత్వపు దారంలా అక్కడ రవీంద్రుడు రాసిన అమర్ షోనార్ బంగ్లా ఎ సాంగ్ బంగ్లాదేశ్ జాతీయ గీతం అయితే అదే ఆ కాలం లోనే మతపరమయినా , జెండర్ బేస్డ్ మూడ విశ్వసాలకి వ్యతిరేఖంగా అన్ని రకాల సోషల్ జస్టిస్ కోసం గళం విప్పిన రచయిత నజ్రుల్ బంగ్లాదేశ్ కి జాతీయ కవి .

 

 

ఇది చూడండి

ఏ తేడా చూడండి లేదు ఒక మనిషికీ  స్త్రీ కీ మధ్య

ఏది గొప్ప లేదా ప్రియమయిన విజయం 

ఈ ప్రపంచంలో ఒక సగం  మహిళ ,ఇతర సగమే మనిషి ”

అంటూ లింగ వివక్షతల మీద  ఎన్నో కవితలు రాసుకున్నాడు

 

అలాగే  ఇంకో చోట అయితే  

Who calls you a prostitute, mother?

Who spits at you?

Perhaps you were suckled by someone

as chaste as Seeta.

……………

And if the son of an unchaste mother is ‘illegitimate’,

so is the son of an unchaste father.

(Translated by Sajed Kamal : వికీపీడియా )

అలాగే “Come brother Hindu! Come Musalman! Come Buddhist! Come Christian! Let us transcend all barriers, let us forsake forever all smallness, all lies, all selfishness and let us call brothers as brothers. We shall quarrel no more” అంటూ జాతీయ భావాన్ని మతాలకి అతీతంగా మనసులను ఉత్సాహపు భంగార్ గాన్‘ (ప్రళయ గానం) తో గడగడలాడించి . తన ప్రచురణ ధూమకేతు ద్వారా స్వదేశీ సంగ్రామాన్ని ఉత్తేజిత పరచడం తనకే సాధ్యం అయింది .ఇంత డైరెక్ట్ గా ఇంత ఉదృతంగా పదాలకు కూడా మేలి ముసుగులు వేసే కాలం లో రాయగలరు అంటే నమ్మలేం కదూ అందుకే నజ్రుల్ కి మాత్రమే అప్పట్లో   విప్లవ కవి అని తాఖిదులిచ్చి గౌరవించుకున్నాం .

 –నిశీధి

తన్మయత్వం అంటే…?

చదివేటప్పుడు పాఠకుడు నేను ఎక్కడ ఉన్నాను?’ అని ప్రశ్న వేసుకుంటే నేను ఇక్కడ ఉన్నానుఅని స్వీయ లోకం నుంచి కాకుండా మరోలోకం నుంచి మారు బదులు వస్తే అదే తన్మయత్వంఅంటారు ప్రముఖ సాహిత్యవేత్త కవికొండల వెంకటరావుగారు యనభై ఏళ్లకిందట ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకని రాసిన ఒక వ్యాసంలో. వారి అబిప్రాయం ప్రకారం పాఠకుడు తన దృష్టిపథాన్ని విడిచిపెట్టి.. కవి దృష్టిపథాన్ని విడిచి పెట్టి.. చదివే అంశం దృష్టిపథం వెంటబడి పోవడమే ఆ తన్మయత్వ ముఖ్య లక్షణం. వాస్తవంకూడా అంతేననిపిస్తోంది.

రామాయణం రాసిన వాల్మీకి కథ కాదు. చదివే పాఠకుడి కథ అంతకన్నా కాదు. సీతారాముల కథ. మనల్ని మనం  మరచి, వాల్మీకినీ మరచి, సీతారాములనే స్మరించుకుంటో చదువుతాం కదా.. అదేనేమో వెంకటరావుగారు ఉటంకించిన ఆ పరలోక శక్తి! నిజమే. శ్లోకం ప్రతిపదార్థమో.. తాత్పర్యమో తెలుసుకుంటో అంతః సారంలోకి వెళ్ళకుండా పదే పదే ఎంత వల్లె వేసినా అది పురాణ పఠనం అవుతుందేమో  గానీ తన్మయత్వం కాబోదు గదా! ఆ తన్మయలోక ప్రయాణానికి టిక్కెట్టు దొరకటం అంత సులభం కూడా కాదేమో!

అంశా’న్నే లక్ష్యంగా తీసుకోవడం -అంటున్నారు వెంకటరావు గారు. అంటే ఏమిటో? బాహ్య స్వరూపమైన భాషను అనా అర్థం? ఆంతరంగికమైన భావాన్ని అనా అర్థం? రెండూ కాదు. అంశం ప్రతిపాదించే ధర్మం అని అనుకుంటా వెంకటరావుగారి ఉద్దేశంలోఉన్నది.

 ధర్మం ప్రతిపాదించని అంశం అంటూ ఏదైనా అసలు ఉంటుదా? ఉండదేమో. ధర్మం సహజ లక్షణం మర్మం. ఆ మార్మికత మీద లక్ష్యం ఉంచడమే తనయత్వం సాధించే ప్రక్రియల్లోని ముఖ్య మార్గం అనిపిస్తోంది.  రావణాసురిడి పది తలలమీదో, రాములవారి ధనుర్విద్యా పాటవం మీదో దృష్టి లగ్నం చేస్తే పర శక్తి కనికరించదు. సీతారాముల చరిత్ర ముఖ్య ధర్మం  నైతికత. భాతృధర్మం, పితృవాక్య పరిపాలన, ఏకపత్నీవ్రత సంకల్పం. నిష్ట, నైష్టిక ప్రవృత్తి, శరణాగత ఆర్త త్రాణ పరాయణత్వం లాంటి చరిత్రోదితాలైన ‘ధర్మా’లమీద దృష్టిసారిస్తేనే తన్మయత్వం సాధ్యం అయేది.

unnamed

రావుగారి లెక్క ప్రకారం ఈ ధర్మం మళ్లీ రెండు విధాలు.

1.విశ్రుతం

2.విస్మృతం

ప్రచండ వేగంతో వీచి, పెద్ద పెద్ద చెట్లను పడదోసి, భయంకరమైన వాననీటితో ముంచెత్తే గాలివాన ఆర్భాటం లాంటిది కేవల శ్రుత ధర్మం అయితే..  దూదిగుట్టలాగా విశాల ఆకాశానికి ఒక మూల ఒదిగి  సూర్యకాంతికి ఆరుతున్నట్లుండే తెలిబూది మేఘంలాంటిది విస్మృత ధర్మం.

ప్రకృతిలో  ఆ రెండు ధర్మాలూ విడివిడిగా ఉండవు. ఒకే ఒరలోని  రెందు కత్తుల్లా ఉన్నా.. ముందు మన మనసుకు తళుక్కుమని  తట్టేదే ప్రధాన ధర్మం. తుఫాను వీచేటప్పుడు విరామాన్ని గురించిన ఆలోచన తోచదు కదా! కదలక మెదలక  నిలబడి ఉన్న మేఘ శకలాన్ని చూసినా అంతే! అలాగే అప్పటిదాకా అది చేసిన ప్రయాణం కాని, ఇకముందు చేయబోయే ప్రయాణాన్ని గురించి గానీ మనసుకు తట్టదు. తుఫానుది చలనం.. మేఘశకలానిది నిశ్చలనం.. ప్రధాన ధర్మాలు కావడమే ఇందుకు కారణమేమో! అయితే ఇది కేవలం బాహ్యలోక లక్షణం మాత్రమే.

 

కావ్య ప్రపంచంలో అలా ఉంటుందా?  రెండు ధర్మాలూ ఒకే చర్యలో సమ్మిశ్రితంగా  ఉండి.. పాఠకుడి మనోనేత్రానికి ఒకేసారి దృగ్గోచరం  అవుతుంటాయి కదా! అంశం పరిపూర్ణంగా ప్రత్యక్షం అయే దాకా ఉత్కంఠను నిలిపి ఉంచేదీ ఈ సమ్మిశ్రిత ధర్మ సూత్రమే.

ఆకాశంలో నిలకడగా ఉన్న మేఘాన్ని కాళిదాసు మహాకవి దేశ దేశాల వెంట తిప్పి విశ్రుతం చేసాడు. విస్మృతిలో ఉన్న మేఘానికి విశ్రుత ధర్మం ఆపాదించడమే మేఘదూతంలో మహాకవి చూపించిన గడుసుదనమేమో! అక్కడ పాఠకుడు తన్మయత్వం పొందాలంటే ముందు విస్మృత స్థితిలో ఉన్న మేఘాన్ని దర్శించాలి. దాని వెంట దేశదేశాలు తిరుగుతున్నట్లు ఉహించుకుని శ్లోకాలు చదువుకోవాలి. మనన చాతుర్యం లేకుండా కేవలం పఠన చాతుర్యంతో  తన్మయత్వాన్ని సాధించడం అంటే   తివిరి ఇసుమున తైలంబు తీసే ప్రయాసే అవుతుంది.

అయితే ఆ తన్మయత్వపు స్థాయి చదువరి పఠన చాతుర్య భేదాల మీద ఆధారపడి ఉంటుంది. సుడిగాలి బాలకృష్ణుణ్ని ఎగరేసుకు పోయే తృణావర్తుని కథ చదువుతున్నాం అనుకుందాం. కథ వరకూ చదివి ఊరుకుంటే అది విశ్రుతం. తన్మయత్వానికి ఇ అక్కడ తావన్నదే లేదు. ఆ సుడిగాలిని అచి మందస్మితారవిందంతో కిందకి దిగివచ్చే బాలకృష్ణుణ్ని విస్మృతికి తెచ్చుకుంటేనేగాని సంపూర్ణ తన్మయత్వం సాధ్యం కాదు.

 తన్మయత్వాన్ని పాఠకుడి స్మృతిపథంలోకి మళ్ళించే రసవిద్య బాధ్యత  కృతికర్తది అయితే.. కావ్య పఠనంలోని తన్మయత్వ స్థాయిని అందిపుచ్చుకునే శక్తి చదువరి  బుద్ధిస్థాయి ఆధారితం. ఆ సృజన శక్తి  కవులందరికీ ఒకే విధంగా వశం కానట్లే.. ఈ పఠన కౌశలమూ చదువరులందరి బుద్ధి స్థాయికీ ఒకే విధంగా అందదు. ఆ రస రహస్యం అంతుబట్టకే కావ్య(కవిత్వ)లోకంలో అప్పుడూ ఇప్పుడూ ఇన్నిన్ని వృథా కుమ్ములాటలు!

 

(ఆంధ్ర పత్రిక 1931 సంవత్సరాది సంచిక లోని కవికొండల వెంకటరావుగారి తన్మయత్వంగల్పిక చదివిన తరువాత కలిగిన ఆలోచనలు)

 – కర్లపాలెం హనుమంతరావు

65591_493465577379457_2073403944_n

 

బ్రతుకు భయాన్నిపోగొట్టే కధ .. ‘భయం’

karalogo

నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

29-raghavaబుజ్జీ!

ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే కా.రా.కధ ‘భయం’ మరొకసారి చదివాను. అది నాలో రేపిన భావసంచలనంతో, జీవిత సాక్షాత్కారంతో, నమ్మిన ప్రాపంచిక దృక్పధం అలా అక్షరాల్లో పరుచుకుని కళ్ళెదుట నిలిచినపుడు కలిగే పారవశ్యం తో ఇదిగో .. ఇక్కడిలా మౌనంగా కూర్చుని ’సారంగ’ మాధ్యమంగా నీకు ఈ కధ ను చేరవేస్తున్నా.

‘భయం’- భలే కధ. భయాన్ని జయిస్తే ఏమవుతుందో చెప్పే కధ. భయం గుట్టును విప్పే కధ. అంతటా చీకట్లే కమ్ముకుంటున్నప్పుడు,ఆ చీకట్లకు కారణమైన పరిస్థితులు అర్ధమవుతున్నప్పుడు, భ్రమలు చెదిరిపోతున్నప్పుడు, కాటేసే పాఁవులు మీది మీదికొస్తా ఉన్నప్పుడు, మిర్రి మిర్రి చూస్తా ఉన్నప్పుడు వాటిని కొట్టాల, వొదిలిపెట్టాలో, లేక చేతుల్జోడించి దణ్ణాలు పెట్టాలో తేల్చుకోడానికి ఒక అవకాశమిచ్చే కధ.

కధ మొదలవడం మొదలవడమే అత్యంత ఆసక్తికరంగా ఉద్విగ్నభరితమైన సన్నివేశంతో మొదలవుతుంది. “ఓలమ్మ పాఁవర్రా..” అంటూ ఒక్క దాటువేసి వాకిట్లోకి వచ్చి పడింది పారమ్మ. పూరింటి గుమ్మంలో ఆమె ఎత్తిపడేసిన బుడ్డి దీపం భగ్ భగ్ మని మండుతోంది – ఇవీ కధలోని ఆరంభ వాక్యాలు.. ఇవి చదివిన ఎవ్వరైనా, ఏఁవైందా అని ముందుకెళ్ళకుండా ఆగగలరా? అద్భుతమైన ఎత్తుగడ గదా!

సర్వసాక్షి దృష్టికోణంలోంచి కధ చెబుతాడు కా.రా. ఇందుల. కానీ అది కేవలం చెప్పడమేనా అంటే కాదనిపిస్తుంది. ఫ్రేం తర్వాత ఫ్రేం గా దృశ్యాలు మనసు కళ్ళకు అలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మామూలు అర్ధంలో ’చెబుతాడు’ అని సింపిల్ గా ఎలా అంటాం? నువ్వే చూడు, పారమ్మకి పాఁవు కనబడ్డ చోటుని ఎలా చూపెడుతున్నాడో.. “అసలే సంజవేళ. దానికి తోడు పొరుగు పెరటి చింతచెట్టు జీబూతంలా పెరిగి ఉంది. ఆ అర చీకట్లో- పూరింటి ముంజూరు, ముంజూరు కింద పెల్లలు విరిగి పడ్డ పిట్టగోడ, పిట్టగోడ పక్కనున్నది కర్రల పొయ్యి, పొయ్యి వెనుక కరుదూపం పెచ్చులు గట్టిన పాత గోడ, గోడవతల మూలని పొయ్యికోసం తురిమిన కమ్మరేకులూ, తాటిగొడితెలూ…” – ఒకఛందోబద్ధ గేయం లాగ, కళ్ళముందు దృశ్యంలాగా లేదూ ఈ వర్ణన? – “ఎక్కడే?” అంది ముసలమ్మ. “అదిగాదా?…కమ్మరేకుల్లోకి తల, బైటికి తోకా!..గోడ వోరనుంది”- చూపు సరీగ్గా ఆనని ఆ ముసలమ్మ సంగతేఁవో గానీ నీకూ నాకూ మాత్రం పాఁవు కనపట్టం ఖాయం..అవునా కాదా? జలదరించే ఒళ్ళు సాక్షిగా అవునంటున్నావ్. కదూ..?

కధంతా ఇలాగే, ఏం చెప్పినా అది దృశ్యమానమయ్యేలా అత్యంత సహజమైన, నిరలంకారమైన సంభాషణలు, సన్నివేశాలు.

ఫోటో: కూర్మనాథ్

ఫోటో: కూర్మనాథ్

పారమ్మకి కనపడిన పాఁవు ఆమె పెనిమిటి గౌరేసుని కాటేసింది. పాఁవుల రాఁవులయ్య మంత్రమేశాడు. గౌరేసు బతికాడు. కానీ పురుడు వికటించి పారమ్మ చచ్చిపోయింది. మంత్రగాడి వైద్యం వికటించి గౌరేసు కాలు పుండైపోయింది. విషవైద్యుల మీద, పాఁవు కధల మీద భ్రమలు కోల్పోయిన గౌరేసు కొడుకు సత్యం తన పదిహేనోయేట మొదటిసారిగా ఒక పాముని కొట్టాడు. పాతికేళ్ళొచ్చేసరికల్లా ’పాముల సత్తెయ్య’ అనే పౌరుషనామం తెచ్చుకున్నాడు.

సత్తెయ్య తొలిసారి పాముని కొట్టే సన్నివేశంలో కోళ్ళగంపలో దూరి కోడిపిల్లల్ని పొట్టనబెట్టుకున్న పాముతో కోళ్ళు పోట్లాడతా ఉంటాయి. ముసలి నారయ్య ఎన్ని సార్లు తరిమినా కోళ్ళు ఆ చోటుని విడవట్లేదు, పాముని వొదలట్లేదు. ఇక్కడ రచయిత ఒక ఆసక్తికరమైన మాటంటాడు. “పాపిని చంపడఁవా మానడఁవా అనే మీమాంస మనుషులకే గాని కోళ్ళకున్నట్టులేదు..”. సత్తెయ్య ఆ పాముని చంపేశాక కూడా కొందరు ’భూతదయాపరులు’ ఇలా అంటారు “అయ్యో పాపం, ఎర మింగిన పాఁవర్రా..అలాంటి పాఁవుని సంపకూడదు” వ్యంగ్యంతో కూడిన ఈ కంఠస్వరం వెనుక రచయిత హృదయం మనకు అర్ధమవట్లా? మన బతుకులకు ముప్పుతెచ్చే వర్గ శత్రువు పట్ల ధర్మసూత్రాలు పాటించాలా లేక సామూహిక ప్రతిఘటనకు తెగబడాలా?..

ఇవిగో, సత్తెయ్య మాట్లాడే ఈ మాటల్లో కూడా రచయిత మనకి దొరుకుతాడు.

“పాఁవు మీకు బగమంతుడితో సమానఁవా? సెప్పండి. దండాలెట్టుకుందాం. పాఁవు మాయమైపోద్ది.- కాదు, దాన్ని సంపడం పాపమంటారా, తగువే నేదు. మీ పాఁవుని మీ ఇంటనే ఎట్టుకోండి, నానెల్లిపోతాను. అదీ ఇదీ కాదు- పాఁవు కరుస్తాదీ, అది ఇషప్పురుగూ – అంటారా, ఇక మాట్టాడకండి. సంపి అవతల పారేస్తాను. పుట్ట మీదెయ్యమన్నా యెయ్యను”

“సత్తెయ్య పాఁవుల యెడల భయభక్తులు నాశనం చెయ్యడమే కాకుండా, మంత్రతంత్రాల పట్ల విశ్వాసాలను కూడా పాడు చేసేవాడు”- సత్తెయ్య ఏ చారిత్రక శక్తులకు ప్రతినిధిగా చిత్రించబడ్డాడో మనకి అర్ధమవట్లా..?

ఇదిగో, ఒకనాడు సత్తెయ్యకీ,తన పెళ్ళాం రత్తాలుకీ జరిగిన ఈ సంభాషణ గమనిస్తే సత్తెయ్యా, సత్తెయ్యలో ఉన్న రచైతా స్పష్టంగా అర్ధమైపోతారు.

“పోనీ ఈ ఇంట్ల దూరిన పాఁవుని నువ్ సంపు, నాను కాదన్ను. ఎవళ అటకమీదో ఉన్న పాఁవుని నువ్వేల సంపాల?”

“ఒకలాగనుకుందాఁవు. నేనూ, మా నాయన, ముసలోళ్ళు, పిల్లలు..మేఁవందరఁవూ ఇక్కడ తొంగున్నాం.నువ్ గడపట్ల ఉన్నావ్. తెలిగేసున్నావ్. కర్ర కూడా నీ సేతికందువిడిగింది. సూర్లోంచి పాఁవొకటి వొచ్చింది. అది నీ కాసి సూణ్ణేదు. మా మీదికి పారొస్తోంది…నువ్వేటిసేస్తావ్? సస్తే మాఁవు గదా సచ్చేదని వూరుకుంటావా? నీ పేణఁవేనా వొదిలి మమ్మల్ని కాపాడతావా?”

ఈ ప్రశ్నకి మనందర్లో మెదిలే జవాబునే రత్తాలు సులువుగా ఇచ్చేసింది “నువు – మీరంతా నాకైనట్టు ఈ లోకవంతా నీకౌద్దా?”

సత్తెయ్యే మనం ఊహించని జవాబు ఠక్ మని చెప్తాడామెకు “అవుద్ది”

-ఈ మాట మనలో చాలా మందికి నమ్మబుద్ధి కాదు గదా. “ ఏంటీమనిషి? తనవాళ్ళూ, ఊళ్ళో వాళ్ళూ ఒకటేనంటాడేమిటీ..? వాళ్ళ కోసం తన ప్రాణాల మీదకైనా తెచ్చుకుంటానంటాడేమిటీ..? ఈ పాత్రనిక్కడ చాలా అవాస్తవికంగా చిత్రించాడబ్బా రచయిత..” అనిపిస్తుంది గదా. అంతేనా? ఇది నిజంగా అంత అసంబద్ద, శుద్ధ ఆదర్శ, అవాస్తవిక చిత్రణేనా? అలాంటి వాళ్ళసలుండరా? లేరా? లేరా? లేరా?

“ఎవ్వరో ఈ బిడ్డలూ…అడవి మల్లె పువ్వులూ…” జయరాజన్న పాట గుర్తు రావట్లా? అమరులెందరో గుర్తురావట్లా?..ఇప్పుడర్ధమవట్లా ఇక్కడి ప్రతీక?…దటీజ్ కా.రా. అందుకే ఆయన ’మాస్టారు’. వల్లంపాటి చెప్పినట్లు ‘గోప్యత’ ఆయన ప్రధాన కధన శిల్పం. వాచ్యత చాలా చాలా తక్కువగా గల కధారచయిత కా.రా. కధావస్తువును మరొక వస్తువు మీద ఆరోపించి గోప్యంగా సూచన చేయడం ఆయన పద్ధతి. ఈ అవగాహన మనకుంటే .. “కా.రా. రచయితగా భయస్తుడు. పరిష్కారాలన్నీ తెలిసీ స్పష్టంగా దేన్నీ చూపడు” అన్న కె.వి.ఆర్. మాటల్తో ఏ కోశానా ఏకీభవించలేం.

మరొక అద్భుతమైన పాత్ర .. నేను, అమ్మ, అమ్మమ్మ, అంకుల్, ఆంటీ.. మాలాంటి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించే పాత్ర ‘సుబ్బాయమ్మ గారు’. పాఁవు చావాలి. దానివల్ల తనకో, తన పిల్లలకో నష్టం కలిగే అవకాశముంది కనుక. ఐతే దాన్ని ఏ సత్తెయ్యో, సొమ్ముల గురవయ్యో చంపాలి. తానూ, తన పిల్లలూ, మనవళ్ళూ ఆ చాయలకే రాగూడదు. ఇదీ సుబ్బాయమ్మ గారి ఆలోచనా దృక్పధం.

సుబ్బాయమ్మ గారి పాత్ర ను చూస్తే బాలగోపాల్ మాటలు గుర్తొస్తాయ్. “మధ్యతరగతి బుద్ధిజీవులకు ఒక లక్షణం ఉంటుంది. న్యాయాన్యాయాల సంఘర్షణ మన నిత్యజీవితానికి ఎంత దూరాన జరిగితే మనం అంత సులభంగా న్యాయం పక్షం వహిస్తాం. ఆ సంఘర్షణ మన జీవితానుభవానికి చేరువయ్యేకొద్దీ న్యాయం పక్షం వహించడం కష్టమవుతుంది”- ఎంత సరిగ్గా చెప్పాడో బాలగోపాల్! కదా?

సుబ్బాయమ్మగారి ఇంటి వెనుక ఒక పూరిల్లు. అందులో ఒక పాము. మెల్లగా కలుగులోకి పోతూ ఉంది. తోక బయటకు పెట్టి ఉంది. బండి తోలుకుని పోతున్న సత్తెయ్యను నడి దారిలో పట్టుకుని విషయమేంటో కూడా చెప్పకుండా ఇంటికి లాక్కుపోయింది సుబ్బాయమ్మ గారు. కలుగులోకి జారుకుంటూ ఉన్న ఆ పామును తాను తోకపట్టుకుని బైటకులాగి పడవేస్తే వెంటనే ఆ పడిన చోట దాన్ని కొట్టేందుకు ఒక ధైర్యమైన చేతోడు ఉండాలంటాడు సత్తెయ్య.

తన కొడుకుని ఆ జోలిగ్గూడా వెళ్ళొద్దని హెచ్చరించి పరుగు పరుగున వెళ్ళిన సుబ్బాయమ్మ పదమూడేళ్ళ వయసున్న ఒక సొమ్ముల కాపరి, సొమ్ముల గురవడ్ని వెంట పెట్టుకొచ్చింది. ఈ గురవడు ఉషారైనోడు. ఆలోచించగలవాడు. ఇంకా ఘనీభవించని స్పందించే గుండెకాయను కలిగి ఉన్నోడు. నీలాంటి, నీ తోటి పిల్లల్లాంటి వాడు. సుబ్బాయమ్మ మాటల్ని పట్టించుకోవద్దని నచ్చజెప్పబోయిన సత్తెయ్యను “ఓయ్ ఊరుకోవయ్యా! పాఁవు దూరింది ఆళ్ళ ఇరకలోనా? సాయానికి నువ్వూ నేనా? చెయ్యి సాయం తోడుండమంటే ఎలాగ సస్తారో మీరిద్దరూ సావండి గాని, నా కొడుక్కి మాత్రం దాని గాలి కూడా తగల్నానికి ఒల్లకాదంటాదా ఆ యమ్మ..? యీయిడే కన్నాదేటి కొడుకుని! నిన్నూ నన్నూ అమ్మ కన్లేదేటి?..”అని దబాయించినోడు.

మొత్తం మీద సుబ్బాయమ్మ కొడుకునొక పక్కా, సొమ్ముల గురవడ్నొక పక్కా నిలబెట్టి రెండు చేతుల్తో తోకనందుకుంటాడు సత్తెయ్య. కానీ పాఁవు ఎత్తు మార్చేస్తుంది. అంతా కంగాళీ ఐపోతుంది. సత్తెయ్యను కాటందుకుంటుంది పాఁవు. తర్వాత ఏమవుతుంది?.. సత్తెయ్య బతుకుతాడా లేదా?..

ఊరు ఊరంతా సత్తెయ్య చుట్టూ ఉంటే అక్కడ ఉండడానికి మనస్కరించని సొమ్ముల గురవడు మాత్రం మందకేసి నడిచాడు. తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఇంతకాలం తను చూసిన లోకమే , ఊరే ఇప్పుడు తనకి కొత్తగా కన్పిస్తున్నాయ్. మందలో పశువులన్నీ వేర్వేరు వర్గాలుగా కనిపించసాగాయ్. వాడికి ’ఎపిఫనీ(జీవిత సాక్షాత్కారం)’ కలిగింది. ఏమిటా ఎపిఫనీ? అది నీకూ,నాకూ కూడా కలుగుతుందా కధ చదివితే…? లేక మన జీవితానుభవాల్లోంచి మనకది కలిగితే దాన్నిక్కడ సరిపోల్చుకోగలమా…?

“ఏంటి ఈ ప్రశ్నలు వెయ్యడం” అంటావా? బుజ్జీ! నేనెంత చెప్పినా అది అసమగ్రమే అవుతుందమ్మా. మాష్టారి కధ, అందులోని సజీవమైన భాష, పాత్రపోషణ, సంఘర్షణ, నిర్మాణసౌష్ఠవం, పీడిత జన పక్షపాతం….-ఎన్నని చెప్పగలను? నువ్వే చదువుకో…ఇదిగో ఇక్కడ కధ లంకె నీ కోసం…- ఉండనా మరి

                                                                                    ప్రేమతో

                                                                                    నాన్న.

[రామిరెడ్డి రాఘవరెడ్డి గారు వృత్తి రీత్యా టీచరు. “ఊగులోడు”, “ఒక బాల కార్మికురాలు, నాలుగవ తరగతి ఏ సెక్షన్ ” ఇంకా కొన్ని కధలు ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్ర భూమి వారపత్రికల్లో వచ్చాయి. అయితే ఆయనకు ఇష్టమైన రచనా  వ్యాసంగం కవిత్వం. వీరివి  చాలా కవితలు అనేక పత్రికల్లో వచ్చాయి. పతంజలి, శివారెడ్డి ని ఎక్కువగా ఇష్టపడతారు.]

 వచ్చే వారం ‘ఆదివారం’ కధ మీద  సి. హెచ్ వేణు గారి పరిచయం

 

 

“భయం” కథ లింక్ ఇదిగో: