Archives for July 2014

ప్రతి రచయిత మదిలో మెదిలే మాస్టారు

చేరాగారితో 80-90 ల నాటి ఏ కవికైనా అనుబంధం లేకుండా ఉందా?  రచయితలెవరికైనా చేరా జ్ఞాపకాలు లేకుండా ఉంటాయా?
1991 లో కవులందర్నీ మొదటి సారి కలుసుకున్న సభలోనే “చేరా” ” “కె.గీత” అంటే డిగ్రీ చదువుతున్నంత చిన్నమ్మాయి అని అనుకోలేదు” అని ఆశ్చర్యపోవడం,  తర్వాతి సంవత్సరం  “నీ కవిత్వ సమీక్ష చూసుకున్నావా?” అని  నవ్వుతూ గద్దించి అడగడం… తొలి నాళ్ల జ్ఞాపకాలు.

తర్వాత ఎప్పుడు ఎక్కడ కనిపించినా కవిత్వం పట్ల ఉన్న ఆత్మీయ స్వరం కవికి కూడా బహూకరించిన మంచి మనీషి చేరా. “ద్రవభాష” కవిత్వ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని పుచ్చుకుని ఇంటికి వెళ్తే “అయ్యో, ఇంటిదాకా రావాలా, గీత కవిత్వం అంటే రెక్కలు కట్టుకుని రానూ…” అని చమత్కరించడం…., భాషా శాస్త్రం లో పీ.హెచ్.డీ చేస్తున్న రోజుల్లో తమ ఇంట్లో పెద్ద చెక్క పెట్టె నిండా ఉన్న పుస్తకాలతో తన అనుబంధాన్ని నాతో పంచుకున్న క్షణాలు…గంటల తరబడి నాతో భాషా శాస్త్రపు చర్చలు……”చాలా తమాషాగా మనిద్దరికీ ఒక సారూప్యత ఉంది చూసేవా, కవిత్వమూ, భాషా శాస్త్రమూ.. రెండు కళ్లు…నాకూ, నీకూ “….అని నవ్వడం…
ఒకటా, రెండా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు…..ఆయన దగ్గర చదువుకోకపోయినా నాకూ ఈ విధంగా చేరా “మాస్టారే”.
కన్నీళ్లు అక్షరాలను చెరిపి వేసే కాగితాలపై రాయకున్నా కీ బోర్డు మీద  తడి వేళ్లు అక్షరాలను మలిపి వేస్తున్న… దు:ఖం………

-కె.గీత

చేరా గారు లేరే అని ఎప్పుడూ అనిపిస్తుంది…!

చేరా గారిని నేను చూసింది, కలిసింది ఒక్కసారే. ఆ కలయిక ఒక జ్ఞాపకం.. అంతే. అయితే చేరా గారిని అనేక వందలు, వేల సార్లు కలుసుకున్నది చేరాతల ద్వారానే. ఆంధ్రజ్యోతిలో చేరక ముందు, చేరిన తర్వాతా.

చేరాతల ద్వారా నా యవ్వనకాలపు అనేక మంది యువ కవులను తెలుసుకోగలిగాను, కలుసుకోగలిగాను, కలబోసుకోగలిగాను. అఫ్సర్లు, యాకూబ్ లు, ఇంకా అనేక మంది… నాకు చేరాతల ద్వారానే తొలి పరిచయం. నేను కవిత్వానికి దూరమయ్యానేమో కానీ… ఈ కవులకు ఎప్పుడూ దూరం కాలేకపోయాను.. వారి భావ పరిణామక్రమం ఎలా వున్నా సరే. నా భావ పరిణామక్రమం ఎలా వున్నా సరే.. వారూ అంతే సన్నిహితంగా వుండిపోతూ వచ్చారు.

అలా.. ఒకరినొకరిని.. కవికి, పాఠకుడికి పీటముడి వేయగల అరుదైన సాహితీ క్రిటిక్ చేకూరి రామారావుగారు. యువకవులను చేరాగారు పరిచయం చేశారంటే… వారిక మన ఇంట్లో బంధువు అయిపోయినట్టే.

మా అమ్మగారి ఊరు వీరులపాడుతోనూ చేరా గారికి ప్రత్యేక అనుబంధం వుంది. ఆ విధంగా నాకూనూ.  వీరులపాడు.. ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దు గ్రామం, కృష్ణా జిల్లాలోది. చేరా గారి సోదరి మెట్టినిల్లు వీరులపాడు. అందువల్ల తరచూ వచ్చిపోతుండేవారు. వీరులపాడు వచ్చినప్పుడు… వారికి కాలక్షేపం అంతా, ఆ ఊరి గ్రంథాలయంలోనే. జీవిత చరమాంకంలోనూ ఆయన అదే పుస్తక పఠన వ్యాపకంలో వున్నారని పత్రికల్లో చదివాను.

అప్పట్లో… చేరా గారి మీద గుసగుసలు వినిపించేవి.. ముఖ్యంగా తోటి కవిలోకంలో. ఆయనెప్పుడూ ఆయనకు తెలిసిన, నమస్కారం కొట్టిన, మరీ ముఖ్యంగా ఖమ్మం కవుల గురించే రాస్తుంటారని. కాలక్రమంలో, నమ్మకంమీద నాకు తెలిసిన విషయం ఏమిటంటే… ఆయన అటువంటి పక్షపాతి కాదని. ఆయన పరిచయం చేయకపోయివుంటే… నాకు ఖమ్మం జిల్లాకు చెందిన వారివే కాదు… చాలా జిల్లాలకు చెందిన కవుల పేర్లు తెలిసేవి కాదు. ఆ రోజుల్లో వారిని చదివి వుండేవాడినీ కాదు.

కొద్ది నెలల క్రితం.. ఫేస్ బుక్ లోనే.. మెర్సీ సురేష్ జజ్జర గారి కొన్ని లైన్లు చూసి… అయ్యో.. మిమ్మల్ని లోకానికి పరిచయం చేయడానికి చేరా గారు లేరే అన్నాను. (చేరా గారు అప్పటికి జీవించే వున్నారు).

ఇంకా కరెక్టుగా చెప్పాలంటే.. చేరాతలు వస్తున్న కాలంలో మీరు కవిత్వం రాసి వుంటే ఎంత బావుండేది అనే భావంతో.

యువ కవులను ప్రోత్సహించి, మంచిచెడ్డలను విచారించి, వారిని ఓ ఉన్నత కవితా స్థాయికి తీసుకెళ్లడంలో చేరా గారు చేసిన కృషి… తెలుగు నేలపై ఇంకా గుబాళిస్తూనే వుంది.

ఆ రోజులు మళ్లీ రావు.

 

-వాసిరెడ్డి వేణుగోపాల్

చేరాగారి చివరి పాఠమేమిటి..?

10534397_326754877475156_564669077665495274_n

భుజాన నల్ల సంచీ, దాన్నిండా కిక్కిరిసిన పుస్తకాలు, గాలికి కదిలే తెల్లజుట్టూ ఆహార్యాలుగా వున్నాగానీ ,దాదాపు ఆరడుగుల వెలుతురు రూపం మన చేరా మాస్టారు. ఎప్పుడూ  పరధ్యానంగా , ఏదో ఆలోచిస్తూ వుంటారు. మొదటిసారి మాట్లాడుతున్నవాళ్ళకయినా సరే ఆయన ఖచ్చితంగా ప్రొఫెసరే అయివుంటాడనిపిస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ దారుడో, ఎల్.ఐ.సి ఉద్యోగో మాత్రం కానేకాదు అనిపిస్తుంది. మాట్లాడ్డం మొదలుపెడితే మాత్రం ఆ ఆప్యాయత ఉరవడిలో ఆయన హోదా ఏమిటో గుర్తురాదు. అంత బాగా జన సామాన్యంతో కలిసిపోయే వ్యక్తిత్వం చాలా తక్కువ మందికే వుంటుంది. ఒక ప్రక్రియలోనే తల పండి అలసిపోయామనుకున్నవారికి మాస్టారి బహుముఖ ప్రజ్ణా, నిరాడంబర వ్యక్తిత్వం నిదానంగా మాత్రమే అర్ధమవుతాయి.

చేరా గురించి నాకున్నన్ని జ్నాపకాలు మా నాన్నతో కూడా వున్నాయో లేదో.

దాదాపు పాతికేళ్ళ క్రితం రంజని ఆఫీసు వాళ్ళు కవి సమ్మేళనం పెట్టి నప్పుడు చదివిన లేబర్ రూమ్ కవిత విని మాస్టారు చాలా మెచ్చుకున్నారు. అప్పటికి అదే కవిత అశ్లీలంగా వున్న కారణంగా ఆంద్ర జ్యోతి వారి చెత్తబుట్టకు చేరువలో వుంది. కాబట్టీ ఆ ప్రోత్సాహం నాకు తెరిపిగా అనిపించింది. చేరా అ0టే చేరాతల రచయిత అని మాత్రమే తెలిసిన నాకు, భాషాశాస్త్రంలో ఆయనకి వున్న ప్రతిభా, వ్యాకరణ , వాక్య నిర్మాణ విన్యాసం, కృషి తెలుసుకున్నాక గర్వంగా అనిపించింది. అప్పటికి నేను రాసిన సందిగ్ధ సంధ్య సంకలనాన్ని సమీక్ష కోసం మాస్టారు ఇచ్చిన చిరునామా కి చాలా భయపడుతూ పంపించాను.  అందులో కొన్ని మాత్రమే బావున్నాయని, కొన్ని అనవసర వాక్యల పొడిగింపు వల్ల నిస్సారంగా వున్నాయని చెబుతూ ఒక ఉత్తరం రాశారు.. సాహిత్య రచనకి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహమూ , వాతావరణము లేని నాకు అది మొదటి పాఠం. రాసినదాన్ని గట్టిగా చదివి చూసుకునే అలవాటు రేడియో కాంపీరింగు వల్ల చాతనయితే , ఎన్నిసార్లు అయినా తిరిగి రాసుకోవడం, సొంత అక్షరాల పట్ల వీలయినంత నిర్మమకారంగా వుండటం మాస్టారి వల్ల సాధ్యమయింది. .

ఎన్ని ఉత్తరాలు రాసుకునేవాళ్లమో , ఒక్కొక్కటి ఒక్కో ఆత్మీయ , సాహిత్య, సామాజిక అక్షర శిల్పం. ఆగాకర కాయ కూర దగ్గరనుంచీ అన్నమయ్యదాకా ఏ విషయం మీదయినా ఆయనదొక భిన్నమైన అభిరుచి ప్రకటన. రె౦డు రెళ్ళు నాలుగు అనేది సంఖ్యా శాస్త్రం . అయిదు, ఆరు,, ఏడు   కూడా ఎందుకు అవుతాయో నిరూపీంచడం భాషా శాస్త్రం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని భాషల, నుడికారాల మధ్యా ఇదే సరి అయినది అని చెప్పడం పిడి వాదం అనేవారాయన. మాస్టారులో వున్న సరళీకృత విధానానికి, నూతన ఆవిష్కరణల పట్ల అనుకూలతకు అదొక గుర్తు.

. మాస్టారులో వున్న నిబ్బరానికి హాస్య ప్రియత్వానికి చాలా ఉదాహరణలున్నాయి. వాక్యంలో బడు ప్రయోగం చర్చ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఖమ్మం నించి ఇటు తిరువూరు వచ్చారు. టిఫినూ కాఫీ అయ్యాక స్నానం చెయ్యడానికి సూట్కేసు తెరిస్తే అందులో పెద్దవాళ్ళు కట్టుకునే జారీ నేత చీరలూ , పగడాల గౌలుసులూ లాంటివి కనబడ్డాయి. ఆయనతో బాటు మేం కూడా  తెల్లబోయా౦. విషయం ఏమిటంటే బస్సులో సూట్కేసు తారుమారయింది. ఏ బస్సులో వచ్చారో ఆ ఆ నంబరు గుర్తులేదు. కనకదుర్గా ట్రావెల్ సర్వీసెస్ అని మాత్రం చెప్పగలిగారు. ఎంత చిన్న వూరు అయినాకానీ భద్రాచలం, మళ్ళీ అక్కడ్నించీ హైద్రాబాదు వెళ్ళి వచ్చిన ఆ బస్సులో ఎవరితోనో దిగిపోయిన సూట్కేసు పట్టుకోవడానికి మూద్రోజులు పట్టి౦ది.. అది దొరికేవరకూ మేం పడ్డ హడావిడి , ఆందోళన అన్నీ మాకే వదిలి తను మాత్ర౦ ఇంట్లో వున్న ఒక రెడీమేడ్ టీషర్ట్, లుంగీ కట్టుకుని, అక్కడి గెస్ట్ హౌసులో కూచుని హాయిగా పేపర్   రాసుకున్నారు. పైగా,

“ ఎందుకంత కంగారు పడతారు. నా పెట్టెలో పుస్తకాలు తప్ప ఖరీదయినవేవీ వుండవు. అవి ఎవరు పట్టుకుపోయి చదువుకున్నా సంతోషమే, నేనెలాగూ అన్నీ పారేసుకూంటాను కాబట్టి మా ఆవిడ ఎలాగూ పాత దుప్పట్లు తువ్వాళ్ళు పెడ్తుంది, ఏమీ పారేసుకోకుండా ఇంటికేడితే మళ్ళీ ఆవన్నీ ఇ౦ట్లో సర్ధడ౦ ఆవిడకే చిరాకు, “ అన్నారు గట్టిగా నవ్వుతూ.

ఒకసారి బెంగుళూరులో జరిగిన ప్రపంచ మహాసభల్లో కవిత్వం చదవడానికి నేనూ, యాకూబ్, అఫ్సరు, శిఖామణీ, దేవీ ప్రియ ఇంకా కొ౦దరు కలిసి వెడుతుంటే రైల్లో ముత్యాల సరాలు పాఠం చెప్పారు. ఆ రాత్రి కదిలే రైల్లో మాస్టారు మంద్రస్వరంతో చెప్పిన ముత్యాలు కిటికీలో పొంచి చూస్తున్న చందమామ ఎత్తుకుపోకుండా కాపలా కాయడం కష్టమయింది. అదే ఛందస్సులో మేమంతా ఎవరికివారం మనసులోనే కవిత్వం మాల అల్లుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళంతా నా శిష్యులు అనుకోవడంలో మాస్టారికెంతో సంతృప్తి వుండేది.

స్త్రీలకొక వాదం కూడానా అని అహంకరిస్తున్న కాలంలో స్త్రీవాద కవిత్వాన్ని అర్ధం చేసుకునే సూక్ష్మదర్శని అందరికీ ఇచ్చింది రామారావు గారే. నిజానికి అంతక్రితం ఎన్నోఏళ్లనుంచీ ఎన్ని వాద వివాదాల గురించి పరిచయం చేసినా స్త్రీవాద పక్షపాతి గానే మాస్టారు అందరి హర్షానికీ , కొ౦దరి ద్వేషానికీ కారణయ్యారు.  నీలి కవితలు, వార కవితలు, వళ్ళు బలిసిన మధ్య తరగతి ఆడవాళ్ళ రచనలు అని దూషించిన వారికి రచయిత్రులెంత బాగా జవాబు చెప్పారో, విమర్శకులుగా మాస్టారూ అంత బాగా మాకు మద్దత్తు ఇచ్చారు.

చేరాగారు ప్రధానంగా పద్య ప్రేమికులు అయినా వచనాన్ని బాగా ప్రచారం చేశారు. కాబట్టి కవిత్వంలో వచనం వున్నా, వచనంలో కవిత్వం వున్నా అస్సలు సహించలేరు. దేనికది ప్రత్యేక వ్యక్తీకరణ వున్న సాహితీ ప్రక్రియ అని గట్టిగా నమ్మేవారు. నేను పత్రికలకోసం రాసిన రిపోర్టుల్లో కవిత్వ ఛాయలు అండర్ లైన్ చేసి అలా రాయద్దని, ఇలాగైతే ఇక నీకు మంచి వచనం పట్టుబడదని హెచ్చరించేవారు.

నడిచే గాయాలు పుస్తకానికి ఆర్ధిక బాధ్యత తప్ప ముద్రణా, అచ్చుతప్పులు దిద్దడం, కవర్ పేజీ వేయీంచడం అన్నీ చేరాగారే స్వయంగా చూశారు. గోడలు అనే కవిత పత్రికలో వచ్చిన రూపంలో కాక ఇంకాస్త బాగా ఎడిట్ చేసి నేను పంపేలోగా పుస్తకం అచ్చయిపోయింది. అప్పుడు నా నిరుత్సాహం చూళ్ళేక రెండవ వర్షన్ కూడా చివరి పేజీలో వేయించారు. ఎంత చిన్న మనిషినయినా పెద్దగానే పట్టీంచుకోవడం మాస్టారికలవాటు.

చేరా ఉస్మానియా యూనివర్సిటీ డీన్ గా వున్నప్పుడు ఒకసారి నే వెళ్ళేసరికి ఏవో ఆఫీసు లెటర్స్ టైపు చేస్తున్నారు.

“ అదేమిటి మాస్టారూ మీరు చేస్తున్నారేమిటి ఈ పని. మీదగ్గర టైపిస్తులు ఎవరూ వుండరా ?”అని అడిగాను.

“ఎందుకుండరు, వుంటారు. కానీ మూడింటికల్లా పంపించివేస్తాను. ఇక్కడి నుంచి మా టైపిస్టు వాళ్ళీల్లు చాలా దూరంట. ఆ అమ్మాయికేవో కుటుంబ సమస్యలున్నట్టున్నాయి.. చెప్పాలనుకుంటే తానే చెబుతుంది. నేను అడగడమెందుకు. అయినా నా పని నేను చేసుకోవడమే హాయి” అన్నారు. దటీజ్ చేరా. ఎదుటివారి వ్యక్తిగతానికి, వ్యక్తిత్వానికి అ౦త చోటు ఇచ్చే బాస్ లు నేను పనిచేసిన చోట ఎక్కడా దొరకలేదు.

ఎవరింటికయినా వెడితే ఆ ఒక్క మనిషితోనే మాట్లాడి వచ్చేసే దురలవాటు నాకు వుండేది. మిగిలినవాళ్లని పట్టీంచుకునేదాన్ని కాదు. అది స్థాయికి సంబంధించిన దూరాన్ని తెలియజేస్తుందని , అలా వుండకూడదని మాస్టారు మాయింట్లో వాళ్ళతో కలిసిపోయిన తీరుని చూసి నేర్చుకున్నాను.

చేరాకి మనుషులు కావాలి. అది ద్వారకా హోటలు అయినా, సుప్రభాతమ్ ఆఫీసు అయినా మా ఇల్లు అయినా , ఇంకోటి ఇంకోటి అయినా ఆటో చేసుకుని వచ్చేస్తారు. మనుషుల్ని౦చి దూరం చేసే ఏ హోదా ఆయన పాటీంచేవారు కాదు.

చేరాలాంటి మహాసముద్రాన్ని గురించి నాలాంటి చిన్న మనీషి ఎన్ని దోసిళ్లతో తవ్వి తలపోసుకున్నా తక్కువే అవుతుంది.

కానీ గత రెండేళ్ల నుంచీ ఎందుకోగానీ మాస్టారు సరిగా పలకడంలేదు. ఏ సభలో కలిసినా ముక్తసరిగానే వున్నారు. ఎవరితో పంచుకున్నా ఇదే అనుభవం చెబుతున్నారు. ఎడ్నార్ధం క్రితం నా పుస్తక ఆవిష్కరణకి మాట్లాడారు. తర్వాత మళ్ళీ మొన్న కృష్ణక్క పుస్తక సభలో చూశాను. రోజూ త్యాగరాయ సభకి వెడుతున్నారని తెలిసి అక్కడికి వేడితే అప్పుడే ఇంటికి వెళ్ళారు అన్నారు. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళినా వుండరని తెలుసుకుని తమాయించుకోవాలి.

మామూలుగా నేను ఎలిజీలు రాయను.. రాయలేను. ఎందుక౦టే మొదటగా జరిగిన సంఘటన జీర్ణించుకుని, మళ్ళీ తేరుకుని, ఆ జ్నాపకాల్నిఆ౦టే బహుశా నిట్టూర్పుల్ని క్రమబద్ధీకరించుకుంటూ రాయాలి.. ఇందుకు సమయం పడుతుంది. కాబట్టి వెంటనే ఆ పని చేయలేకపోతాను. అయితే గత కొన్నాళ్ళుగా చేరా మానసికంగా పాటించిన ఒక మౌనమే మనందరికీ ఒక తాత్త్విక వాతావరణం ఏర్పడేలా చేసింది. బహుశా ఇది కూడా ఒక పాఠమే. చేరా మాస్టారు చెప్పిన చివరి పాఠం. ఈ పాఠం పట్టుబడటం కష్టంగా వుంది చేరాగారూ.

-కొండేపూడి నిర్మల

శనివారం, 26.7.2014

(చిత్రం: రాజు)

వచనాన్ని నిండుగా ప్రేమించిన మాస్టారు చేరా

Image - Copy (2)

చేకూరి  రామారావు గారి  చేరాతలంటే భలే  యిష్టం – అని  త్రిపురనేని  శ్రీనివాస్  కి చెప్పాను.

అప్పుడు శ్రీను మాస్టార్ గారి భలే ఆసక్తిగా చెప్పారు. అప్పటికి శ్రీను విజయవాడ లో వుండేవారు. హైదరాబాద్ లో వున్నప్పటికి చేరా మాస్టార్ ని  సభల్లో చూడటం , పలకరించటం  తప్పా సాహిత్యం గురించి  మాటాడింది లేదు. వొక  రోజు ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధం వుత్తరాల పేజిలో  మసిగుడ్డ కథ మెచ్చుకొంటూ  చేరా మాస్టార్ రాసిన వుత్తరం వుంది. శ్రీనుతో  ‘అరే భలే  రాసారే’ అంటే ‘స్పార్క్ ని  బాగా పట్టుకొంటారు’ అన్నా.

ఆ వుత్తరం సంతోషంతో  పాటు బాధ్యతని తీసుకొచ్చినట్టు అనిపించింది.అదే శ్రీనుతో చెపితే గట్టిగా నవ్వి నీకే కాదు యెవరికైనా  ఆ స్పృహ వుండాల్సిందే అన్నాడు.  ఆయన గమనిస్తుంటారు. ‘మాస్టార్  మెచ్చుకోపొతే బాగుండదు కదా’ అని మనసుకి అనిపించింది. “మనసుకో దాహం పుస్తకాన్ని చేరాతల్లో పరిచయం చేద్దామని రాసాను. జ్యోతికి పంపిద్దాం అనుకుంటుండగా ఆ కాలమ్ యిక ముందు రాదని తెలిసింది. కాని యీ వ్యాసాన్ని ప్రచురణకి యిస్తాను” అని ఫోన్  చేసి చెప్పారు.

‘అగాధ నీలిమ’ కథ వచ్చినప్పుడు కథ మొత్తాన్ని వొక వాతావరణంలోకి  తీసుకెళ్ళి కథ స్థాయిని  భలే పెంచావ్… యీ టెక్నిక్  నీ కథలకి చాలా బాగా అమిరింది’ అని  మాస్టార్ అన్నప్పుడు అవే 24 గంటలు కదా అందరికి. వచ్చినవన్ని చదువుతారు. అంతకు ముందు వచ్చినవి చదువుతారు. ప్రపంచ సాహిత్యాన్ని చదువుతారు. సభలకి వస్తారు ,మాటాడతారు. శ్రోతగా వస్తారు. స్నేహితులతో గడుపుతారు. యింట్లో నేలపై పరచిన బేతం చర్ల  టైల్స్ ని  యెంత బాగా పరిచారో చెపుతారు. వంట చెయ్యగలరు. ముఖ్యంగా మనుష్యులని రోజు కలుస్తుంటారు. టైం మేనేజ్ మెంట్  భలే  చేస్తారు – అంటే మొదట్నుంచి  అలా అలవాటైపోయింది అంటారు. మాస్టర్ గారి స్నేహంతో  నాకు రంగనాయకి గారు అమ్మ అయ్యారు.  సంధ్య తో  స్నేహం. హేమంత్ ని మాస్టర్ ని చూస్తుండటం భలే వుండేది. చేరాగారి  అబ్బాయి క్రిస్ నాకు యిష్టమైన స్నేహితుడు. యింటికి యెప్పుడు వెళ్ళినా సాహిత్యం, కమ్మని ఆహారం తో సంతోషమే సంతోషం.

మాస్టార్గారి ఫెమినిజం గురించి చాలా విలువైన విషయాలని  చెప్పేవారు. ఫెమినిస్ట్ థీయరి, ఫిలాసఫిని  బాగా  అర్ధం  చేసుకోడానికి మాస్టర్ చెప్పే విషయాలు , ఆయనతో సంభాషణ  చాల  వుపయోగపడేవి.  Instant Life కధ పై మాస్టర్ రాసిన  విశ్లేషణ నాకెంతో అపురూపం. అలానే ‘శీతవేళరానీయకు’ పై  ఆయన స్పందన నాకెంతో యిష్టం.

వచనాన్ని ప్రేమించే మాస్టార్ ,భాష – సాహిత్యం  శిఖరమంత యెత్తున తెలిసిన మాస్టర్, తెలుగు సాహిత్యానికి – భాషకి చేసిన మేలు అనంత ఆకాసమంతా.

ఆకాశం యెప్పుడు మనకి కనిపిస్తూనే వుంటుంది. అంత మాత్రాన మనకి ఆకాశం పూర్తిగా తెలుసని కాదు. యెప్పటికప్పుడు కొత్తగా ఆకాశాన్ని తెలుసుకొంటున్నట్టు మాస్టార్  రాసిన పుస్తకాలన్నీ మళ్ళిమళ్ళి చదువుకొంటుండాలి.

నిన్న మాస్టార్ గది షల్ఫ్ లో అనేకానేక పుస్తకాలు అటుయిటు వాలి వున్నాయి నిరంతరం చదువుతున్నట్టు… అంతే కాకుండా కొత్తవాటికి చోటిస్తు…!!!!

-కుప్పిలి పద్మ

సత్యభామ పక్కా లెఫ్టిస్టు!

photo.php

మృత్యుంజయ్

మృత్యుంజయ్

కోలాహలం

10325745_574651602650328_7994500965816693952_n 

ప్రయాణమిది

మనసు ప్రాణాయామమిది

యోగత్వమా…

ప్రాణాలను ప్రేమతో సంగమించే

వేదనా యమున సమ్మోహమా…

ఒప్పుకోలేని విన్నపాలు కళ్ళబడలేని కలలు

అర్థమయ్యే పదాలు ఆశల సవ్వడులు

ఇన్నిటినీ ఇన్నాళ్ళూ మోసుకొచ్చిందీ కాలం

కొన్ని దూరాలు సృష్టిస్తూ అలుస్తాను

కొన్ని గుండెచప్పుళ్ళు వింటూ కలుస్తాను

ప్రశ్నలు సంధించే పొరపాట్లు

మనసు భూకంపాల నడుమ

కొత్త ఆలోచనల శిఖరాగ్రాలు మొలుస్తాయి

ఒక్కో చినుకు కూర్చుకుని

గుండె చప్పుడులో

ఆశల అరణ్యాలు పరుస్తాయి

నాలో నువ్వూ

భౄమధ్యం లో ఉత్తర దక్షిణం

కలల కాన్వాసులో పెనవేతల భూమధ్యరేఖలు

అంతమూ లేదు ఇది ఆదీ కాదూ

మనసు సత్యం

మోహ కోలాహలం

-జయశ్రీనాయుడు

jaya

(painting: Anupam Pal)

నన్ను ఇంకొక చోట నిలబెట్టు

సిద్ధార్థ

సగం చీకటి తనమేనా … గువ్వా

మెట్టు … పైకి జరుపు

మసి కనుపాపను గురిచూసి కొట్టు

పసుపు కొమ్ముల్ని ఆమె చేతిగాజులు దంచినట్టు

గుమ్మొచ్చి పడిపోయిన

వాన మబ్బుల్ని దంచు

అగొనే … ఏందే … గువ్వా

ఎపుడూ … సగం తీర్మానమేనా

సగం ప్రమాణమేనా

సగం మోజులేనా

పక్కనే పీఠభూమి ఉంది

దాన్ని లోయ కొండలతో దిద్దు

ఇంకొక చింతకు చెదిరి ఫో…

లేపుకు పో …

ఇంకొక పొద్దును

నన్ను కూడా ….

– సిద్ధార్థ

(‘క్రోపం’ కావాలనే వాడారు సిద్దార్థ. అచ్చు తప్పు కాదు సుమీ )

వీలునామా – 43 వ భాగం

veelunama11

ఆశా- నిరాశా

 

మిసెస్పెక్చెప్పినవింతకథనుబ్రాండన్ఆసాంతమూఅడ్డుచెప్పకుండావిన్నాడు. విన్నతర్వాతఏమనాలోఅతనికితోచలేదు. కొంచెంసేపుఆలోచించినతర్వాత, అతను

“అయితేనువ్వుతర్వాతఎప్పుడైనాఆపిల్లాణ్ణిపోగొట్టుకున్నఆవిడనికలిసేప్రయత్నంచేసావా?”

“ఎలాచేస్తాను? ఆరాత్రికేపడవఎక్కిసిడ్నీవెళ్ళిపోతిమి. ఆవిడపేరేమిటోకూడానాకుతెలియదు. ఆవిడఎవరో, ఎక్కడవుందో, అసలిప్పుడుబ్రతికుందోలేదో, తనపిల్లాడుమారిపోయినసంగతిగుర్తుపట్టిందోలేదో, ఏదీతెలియదునాకు.”

“ఇదంతాఎప్పుడుజరిగింది?”

“సరిగ్గాముఫ్ఫైనాలుగేళ్ళక్రితం.”

“అప్పుడులండన్లోమీరుబసచేసినసత్రంపేరుగుర్తుందా?”

“పేరుగుర్తుందికానీచిరునామాగుర్తులేదు.”

“మీరుప్రయాణించినపడవపేరు?”

“పేరుగుర్తులేదుకానీ, మేంబయల్దేరినతేదీసరిగ్గాగుర్తుంది. మే 14! ఆతేదీసాయంతోమనంపడవపేరుకనుక్కోలేమా? అమెరికాబయల్దేరినపడవసరిగ్గామర్నాడుబయల్దేరింది.”

“ఆవిడఅమెరికాప్రయాణంఅవుతున్నట్టునీకుగట్టిగాతెలుసా?”

“ఆసత్రంయజమానిమాఅమ్మతోచెప్తూవుంటేవిన్నా.”

నిట్టూర్చాడుబ్రాండన్.

“నిన్నూమీఅమ్మనీఉరితీసినాపాపంలేదు. డబ్బుకోసంపసిపాపనీతల్లినీవిడదీస్తారా? ఇంతకీమీరుసిడ్నీలోఎలాబ్రతికారు?”

“దర్జాగా! అదీహేరీపంపేడబ్బుఅందుతూవున్నంతకాలం.”

“ఫిలిప్స్మీకెక్కడకలిసాడు? అతనికీమీఅమ్మాయికీపెళ్ళెలాజరిగింది? కనీసంఆవిడైనానీసొంతకూతురేనాలేకమళ్ళీఎవరిదగ్గర్నించైనాఎత్తుకొచ్చావా?”

“ఆకృతఘ్నురాలునాకడుపునేచెడబుట్టిందిలే. దానిఅందచందాలన్నీనాపోలికేకదా? ఆఅందాన్నిఎరగాచూపిఫిలిప్స్లాటీడబ్బున్నమగవాణ్ణివలలోవేసుకోమనినేర్పిందినేనేకదా? అయితేఅదిచేసినపనిచూడు! అతన్నిఏకంగాపెళ్ళిచేసుకునినన్నొదిలివెళ్ళిపోయింది.”

“బ్రతికిపోయింది. సరే, ఇప్పుడీకథంతానేనుకాగితాల్లోరాస్తాను. నువ్వునిజమేననిసంతకంచేయాలి.”

బ్రాండన్ ఆమెచెప్పినకథంతా ఏవివరాలూమరిచిపోకుండా ఓపిగ్గా నాలుగుపేజీల్లోరాసి ఆమె ముందు పెట్టాడు.

“నేనుహేరీనిమభ్యపెట్టిపెళ్ళిచేసుకున్నసంగతికూడారాయాలా? దానికీఫ్రాన్సిస్వారసత్వానికీఏంసంబంధం?”

“అదంతానీకెందుకు? నువ్వడిగినకాగితంమీదనేనుసంతకంపెట్టాకదా? ఇందులోఏమీఅబధ్ధాలులేవుకదా? అన్నీనువ్వుచెప్పినసంగతులేకానీ, నేనేంకల్పించిరాయలేదుకదా? ఇహమాట్లాడకుండసంతకంపెట్టు,” చిరాగ్గాఅన్నాడుబ్రాండన్.

ఆ కాగితం మీద సణుక్కుంటూ సంతకం చేసింది మిసెస్పెక్. ఆ తర్వాత తనకీపెక్కీమధ్యనడిచినప్రేమాయణమూ, పెళ్ళివివరాలూచెప్దామనిఅనుకుందికూడాకానీబ్రాండన్ఎటువంటిఆసక్తీకనబర్చలేదు

“ఇంతకీనీకొకవిషయంచెప్పడమేమర్చిపోయాను. ఫ్రాన్సిస్కిక్రాస్హాల్ఎస్టేటువారసత్వంగారాలేదు. పెద్దాయనహొగార్త్రాసినవీలునామావల్లవచ్చింది. ఇప్పుడు నీ కథ వల్ల ఫ్రాన్సిస్హేరీహొగార్త్కొడుకు కాదన్న విషయం తెలిసినా ఒరిగేదేమీ ఉండదు. ఎస్టేటూ, ఆస్తీ అన్నిటికీ అతనే హక్కుదారు,”చావు కబురు చల్లగా చెప్పాడు బ్రాండన్. నిర్ఘాంతపోయింది మిసెస్పెక్.

“ఏమిటీ? వీలునామావల్లా? మరిఆసంగతిముందేఎందుకుచెప్పలేదు? అయితేఆఅక్కచెల్లెళ్ళకిడబ్బొచ్చేఅవకాశమేలేదన్నమాట. హయ్యో! నేనింకావాళ్ళకిఆస్తికలిసొస్తేనాకూకొంచెంబహుమానంఇస్తారనిఆశపడిఈకథంతానీకిచెప్పానే! పేపర్లోవీలునామాసంగతేమీరాయలేదే! విచిత్రమైన పరిస్థితులలో ఎస్టేటు హేరీహొగార్త్కొడుకనిచెప్పుకుంటూ వున్న ఫ్రాన్సిస్ ఎస్టేటు సొంతదారుడయ్యాడు అనిమాత్రమే వుంది పేపర్లో!”

“అయ్యో! అలాగా? ఆ వీలునామాలో ఫ్రాన్సిస్ ఆర్మిస్టవున్గా చలామణీ అవుతున్న ఫ్రాన్సిస్హొగార్త్కి ఆస్తీ ఎస్టేటూ డబ్బూ చెందవలసింది, అనివుంది.”

“మరింకేం? ఆపిల్లాడుఫ్రాన్సిస్ఆర్మిస్టవునూకాడు, ఫ్రాన్సిస్హొగార్తూకాడు. ఎవరోఅనామకుడు. ఈసంగతితెలిస్తేఅతన్నితన్నితగిలేసిమేనకోడళ్ళకేఆస్తిదక్కుతుందేమో! అప్పుడునావెయ్యిపౌండ్లమాటమరిచిపోరుగా?” ఇంకాఆశగాఅడిగిందిమిసెస్పెక్.

ఆమెవంకజాలిగాచూసాడుబ్రాండన్.

“కానీనీమాటలునమ్మేదెవరు? కోర్టుఎటువంటిఋజువులూలేకుండానువ్వుచెప్పేవిషయాలేవీనమ్మదు. అసలునువ్వుచెప్పేదంతానిజమనినాకేఅనిపించడంలేదు. ఫ్రాన్సిస్నీకుడబ్బుపంపడంలేదన్నకోపంతోఇదంతానువ్వేకల్పించివుండొచ్చుగా? ఎలాఋజువుచేస్తావీవింతకథను?”

“పాతపేపర్లుచూస్తేపిల్లాణ్ణిపోగొట్టుకున్నవివరాలేమైనాదొరకచ్చు. ఆలోచిస్తేఏదోమార్గంకనిపించకపోదు. అయినా, ఆచెల్లెలిమీదమనసుపడ్డట్టున్నావు, ఆపిల్లకీడబ్బొస్తుందంటేనువ్వేఅడ్డుపడుతున్నావే!”

మిసెస్పెక్నిరాశ తట్టుకోలేకుండావుంది. ఫ్రాన్సిస్దగ్గర్నించి డబ్బు వచ్చేటట్టయితే అతని తల్లిగా చలామణీ అవుదామని ఆమె తన పెళ్ళిసర్టిఫికేటూ, ఫ్రాన్సిస్పుట్టుకసర్టిఫికేటూ అన్నీ జాగ్రత్తగా దాచుకుంది. ఎప్పుడైతేఫ్రాన్సిస్తనవిన్నపాలుబేఖాతరుచేసాడో, అప్పుడుమేనకోడళ్ళపక్షానచేరాలనినిశ్చయించుకుంది. ఇప్పుడాదారీలేదనితెలియడంతోఆమెకిదిక్కుతోచడంలేదు.

“కనీసంఆవిడపేరైనాతెలిసుంటేపేపర్లోలోనోఅమెరికాలోనోవెతికేఅవకాశంవుణ్డేదేమో. నీకావిడపేరుకూడాతెలియదుకాబట్టిఇప్పూడుఇంకేమీచేయలేము.”

మిసెస్పెక్కోపంపట్టలేకపోయింది.

“ఎంతమోసం! డబ్బొస్తుందనిఆశపెట్టినాతోకథంతాచెప్పించిఇప్పుడేమీవీలుకాదంటావా? ముందాకాగితంఇటిచ్చేయ్!” అతనిపైకిదూకింది.

“ఆగాగుమిసెస్పెక్! నీకేమీభయంలేదు. ఈ కాగితంతో ఫ్రాన్సిస్ని ఎస్టేటు బయటకి వెళ్ళగొట్టలేని మాట నిజమే,కానీ దీన్లో వున్నది నిజమని నిరూపణ అయితే నీకు కనీసం అయిదు వందల పౌండ్లైనా ఇప్పిస్తా సరేనా? నేనూ ఫ్రాన్సిస్దగ్గరి స్నేహితులం, నా మాట అతనెన్నడూ కాదనడు.”

మళ్ళీ నివ్వెర పోయింది మిసెస్పెక్!

“ఏమిటీ? మీరిద్దరూస్నేహితులా? మరిఎందుకుఅంతలాఈకథంతాచెప్పించుకున్నావు? దీంతోనీకేమిటిప్రయోజనం?” అయోమయంగాఅడిగిందిమిసెస్పెక్.

“అది చెప్పినా నీకర్థం కాదులే,” నవ్వాడు బ్రాండన్, లేచి వెళ్ళబోతూ. “అసలిదంతా నీ వల్లే జరిగింది. తగుదునమ్మా అంటూ నువ్వు ఆరోజు అడ్డుపడకపోతే ఆపిల్లతో రెండు వందలకైనా ప్రోనోటు రాయించుకునేదాన్ని.”

“ఆపిల్లకిచిల్లిగవ్వకూడారాదాఆస్తిలోంచిఅనిఎన్నిసార్లుచెప్పినాఅర్థంకాదానీకు?” చిరాగ్గాఅన్నాడుబ్రాండన్.

“మాబాగాజరిగింది. నువ్వుఆఅమ్మాయినిపెళ్ళాడతావల్లేవుందే? నాకూతురిదగ్గరపనమ్మాయినీపెళ్ళాంఅవుతుందన్నమాట. పదిమందిలోనీకాతలవంపులైతేగానీతెలిసిరాదు.”కసిగాఅందిమిసెస్పెక్.

“ఇంకోముఖ్యమైనవిషయం. ఎట్టిపరిస్థితిలోనూనువ్వునీకూతురిఇంటికివెళ్ళగూడదు. వస్తేఫిలిప్స్చాలాకోపగిస్తాడు. నీకూతురిక్కూడాఆవిషయంఇష్టంలేదు.”

“అబ్బో! ఇన్నాళ్ళకిదానికితనతల్లిపనికిరాకుండాపోయిందన్నమాట. ఎంతడబ్బున్నా, ఎంతఖరీదైనబట్టలేసుకున్నానాకూతురుకాకుండాపోతుందా? ఈపెద్దవయసులోకన్నకూతురేనాకొకముద్దపడేయకపోతేనేనెలాచావను?”

“సరే, నేనుఫిలిప్స్తోమాట్లాడినీకేదైనాఏర్పాటుచేయడానికిప్రయత్నిస్తాలే. మళ్ళీనిన్నొచ్చికలుస్తా.” బ్రాండన్లేచిఎల్సీదగ్గరకువెళ్ళిపోయాడు.

ఆ కాగితం చదివి ఎల్సీ ఎంతో నిరుత్సాహపడింది.ఇలా కాగితమ్ముక్క కాకుండా, ఫ్రాన్సిస్హొగార్త్మామయ్య కొడుకు కాడు అని నిరూపించే ఇంకేదో గొప్ప ఆధారం వుంటుందని ఆశపడిందామే. అప్పటికే ఆమె ఊహా లోకంలో ఫ్రాన్సిస్జేన్పెళ్ళాడి సంతోషంగా కాపురం చేసేసుకుంటున్నారు. ఏం చేయాలో తోచలేదామెకి.

“సరే, ఇప్పుడేంచేద్దాం. ఈకాగితంలోవున్నఏవిషయాన్నీమనంనిర్ద్వంద్వంగానిరూపించలేం. అలాటప్పుడుఈసంగతిఫ్రాన్సిస్చెప్పాలావద్దా? అనవసరంగాఅతన్నిబాధపెట్టడంఅవుతుందేమో! ఈవిషయాన్నిఇంతటితోవదిలేద్దామా? పోనీజేన్నిసలహాఅడిగితేనో?”

“వొద్దొద్దుబ్రాండన్! ఇంతవరకూమనంఅక్కయ్యకిచెప్పకుండానేఅన్నీచేసాం. ఇప్పుడూమనమేనిర్ణయించుకుందాం. నాఅనుమానం, జేన్కూడానీలానేఈవిషయాన్నొదిలేయమంటుంది.”

“అయితేజేన్కిఫ్రాన్సిస్మీదపెద్దఇష్టంలేదేమో!”

“అలాకాదు. జేన్కినిజంగానేఅతనంటేచాలాఇష్టం. అయితేతనకోసంఫ్రాన్సిస్త్యాగంచేయడంఇష్టంలేదు, అంతే.”

“నేనైతేనీకోసందేన్నైనావదిలేస్తా, ఎల్సీ!”

“ఆసంగతినాకూతెలుసు. కానీనిజంగానాకోసంనువ్వేదైనావొదులుకోవల్సినపరిస్థితివొస్తుందనుకో, అదినాకిష్టంవుండదుగా? ఇదీఅలాగేనన్నమాట.”

“సరేఅయితేమరిఒదిలేద్దాం. ఇద్దరూవేరేవేరేపెళ్ళిళ్ళుచేసుకొనిస్థిరపడతారు.”

“నాకదీనచ్చడంలేదుబ్రాండన్. ఒకరినిమనసులోవుంచుకొనిఇంకొకరినిపెళ్ళాడడంఎంతహీనమైనపని!నాఆలోచనప్రకారంజేన్, ఫ్రాన్సిస్ఒకరికోసంఇంకొకరుఒంటరిగాఉండిపోవడంమంచిది. జేన్కిమనఇంట్లోఎప్పుడూచోటువుంటుందిగాబ్రాండన్?”

“తప్పక! నీకాసందేహమేవొద్దు.”

“సరేఅయితేఈకాగితందాచేద్దామా?”

“ఉహూ! ఆకాగితంనేనుఫ్రాన్సిస్కిపంపిస్తాను. తనతల్లెవరోతెలుసుకునేహక్కుఅతనికుంటుందికదా? ఆతరవాతఏంచేయదల్చుకున్నాడన్నదిఅతనినిర్ణయం. కానీనిజాన్నిఅతనిదగ్గర్నుంచిదాచకూడదేమో! ఆకాగితంఇటివ్వుబ్రాండన్. నేనుఫ్రాన్సిస్కొకఉత్తరంరాసిదాంతోఈకాగితమూజతచేస్తాను. మనపెళ్ళివిషయంకూడాచెప్పలేదునేనింకాఅతనికి.”

“సరేనీఇష్టం. ఆచేత్తోనేమాఅమ్మకీఒకఉత్తరంరాసిపడెయరాదూ? కాబోయేకోడలిచదువూసంస్కారమూచూసిఅమ్మపొంగిపోతుంది. ఎడ్గర్ ఇహ బ్రహ్మచారి కొంపలో కాకుండా అత్తయ్య సంరక్షణలో వుండబోతాడని ఫానీ కూడా సంబరపడిపోతుంది.”

*********************************

ఆ కళ్ళలో హరివిల్లు

Kadha-Saranga-2-300x268

రెండు రోజుల నుంచీ ఈ లూప్ తెగట్లేదు. ఎక్కడో లాజికల్ మిస్టేక్ ఉంది. డీబగ్గింగ్ లో వేరియబుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎండ్ రిసల్ట్ తప్పొస్తుంది. అబ్బా…..భలే విసుగ్గా ఉంది.

ఇంతలో ఫోన్ రింగయ్యింది. ఇప్పుడెవరా అని విసుక్కుంటూ మొబైల్ అందుకున్నాను. రిమైండర్ రింగ్. ఈ రోజు ఆంటీ బర్త్ డే. ఈ పని టెన్షన్లో పడి ఈ రోజు డేట్ కూడా చూసుకోలేదు. మార్నింగ్ సునీల్ చెప్పనన్నా చెప్పలేదు. మర్చిపోయి ఉంటాడేమో! మొన్న ఊరెల్లోచ్చిన కోపం ఇంకా పోలేదు. ముభావంగా ఉంటున్నాడు. బహుశా అందుకే నాతో చెప్పలేదేమో! వెంటనే సునీల్ కి రింగ్ చేసాను.

“ఏంటో తొందరగా చెప్పు,” భూప్రపంచంలో ఇతనొక్కడే బిజీ అన్నట్టు ఫోసులు.

“ఈ రోజు ఆంటీ పుట్టిన రోజు. నీకు గుర్తుందో లేదోనని”

“ఓ అమ్మ పుట్టిన రోజా, ఇప్పుడు అర్జెంటు పనిలో ఉన్నాను. కాసేపయ్యాక ఫోన్ చేస్తాను”, అన్నాడు.

ఆంటీకి రింగ్ చేసి శుభాకాంక్షలు చెప్పాను.

“నీకు గుర్తుందా!!”, ఆంటీ గొంతులో ఆశ్చర్యం.

“నా మొబైల్ గుర్తుచేసింది. అందుకే మొబైల్ ద్వారా విషెస్ చెపుతున్నాను,” నవ్వేసాను.

“విష్ చేసావు. అంతే చాలు,” ఆంటీ గొంతులో ఆనందం.

“ఈ రోజు స్పెషల్స్ ఏమిటి? అంకుల్ మీరు గుడికి వెళ్ళారా?,” అడిగాను.

“స్పెషల్ ఏముంటుంది! మామూలే అన్ని రోజుల్లోలా”

“కొత్త చీర కొనుక్కోలేదా ఆంటీ?”

“నాకెందుకమ్మా ఇప్పుడు కొత్త చీర”

“అదేమిటి అలా అంటారు? అంకుల్ బర్త్ డే కి స్పెషల్ వండారు. గుడికి వెళ్లి అర్చన చేపించారు. పోనీ, లంచ్ కి మీరిద్దరూ హోటల్ కు వెళ్ళండి”

“మీ అంకుల్ కదలొద్దూ! వంట చేసేసాను, పప్పు దోసకాయ వండాను”

ఇంకో నాలుగు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసాను.

ప్రాబ్లం లూప్ లో కాదు, ఒక పాయింటర్ అడ్రస్ మిస్ అయిందని తెలుసుకోగానే యురేకా అని అరవాలనిపించింది. అరవటం ఆపి ఆ పాయింటర్ దేన్ని అడ్రస్ చెయ్యాలో కనుక్కోమంది బుర్ర. ఆలోచనేమో ఆంటీ మాటల చుట్టూ తిరుగుతుంది. ఈ పాయింటర్ మొదట లోకల్ వేరియబుల్ ని రీడ్ చేసి ఆ తర్వాత ఔటర్ లూప్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఆడ్ చేసుకోవాలి. ఏ ప్రోగ్రామర్ రాసాడో ముందుగా ఈ ప్రోగ్రాంని! లోకల్ వేరియబుల్ని ఇగ్నోర్ చేసి గ్లోబల్ని లూప్లో infinite గా తిప్పాడు.

ఎండ్ యూసర్ టెస్టింగ్ లేకుండా ఎన్ని లూప్స్ మనపై రుద్దేసారో. కుటుంబం, సమాజం నడుమన బొంగరంలా తిరుగుతూ తమని తాము మర్చిపోతున్నారా? అలా మర్చిపోకపోతే స్వార్ధమనే ముద్ర వేసేయ్యటం. ముద్రల సంగతి దేవుడెరుగు, నేను మాత్రం అలా ఉండను. నావారికి నేను ఇచ్చే విలువలో నేనూ ఉండేలా చూసుకుంటాను. హమ్మయ్య ఈ బగ్ ఫిక్స్ అయింది. వేళ్ళను విరుచుకుంటూ సీటులో వెనక్కి వాలాను.

అమ్మ కూడా అంతే, తనని తాను పట్టించుకోదు. నాదేముంది, మీ ఇష్టం అనేస్తుంది ఏ మాటకైనా.

నాకా రోజు బాగా గుర్తు. నేను డిగ్రీలో ఉండగా జరిగింది. ఆరోజు అమ్మ పుట్టిన రోజు. నాన్నకు గుర్తు లేకపోవటం చాలా సాధారణమైన విషయం. అమ్మ పుట్టిన రోజని పాయసం వండటం, మేమందరం గుడికి వెళ్ళటం ఎప్పుడు జరగలేదు. నేను, తమ్ముడు విష్ చేసే వాళ్ళం.

నాన్నకు ఇష్టమైన పూర్ణాలు, నాకిష్టమైన కీమా రోల్స్, తమ్ముడి కోసం గులాబ్ జాం….మా పుట్టిన రోజున మాకు ఇష్టమైనవి తప్పకుండా వండేది అమ్మ. అమ్మకి ఇష్టమైన వంటకం ఏంటో మాకు తెలీదు. తనకు ఇష్టమని పలానాది వండుకుని తిన్నది ఏనాడు లేదు.

నేను, తమ్ముడు ఆరోజు అమ్మను surprise చేద్దామనుకున్నాం. కాలేజీ అయ్యాక నేను బేకరీకి వెళ్లి కేక్ కొన్నాను, తమ్ముడు గ్రీటింగ్ కార్డు కొన్నాడు. నాన్నను డబ్బులు అడిగితే ఏమనేవారో తెలీదు కానీ మేము దాచుకున్న పాకెట్ మనీ సరిపోయింది.

మేమిద్దరం ఇంటికి వెళ్లేసరికి యధావిధిగా అమ్మ నలిగిపోయిన కాటన్ చీరలో ఉంది. మేము వచ్చేసరికి ఎదో ఒక స్నాక్ వండటం అమ్మకు అలవాటు. పకోడీలు చేస్తోంది. వంటింట్లోకి వెళ్లి పొయ్యి కట్టేసి చీర మార్చుకోమన్నాను. అమ్మ వింటే కదా!

నాన్న రాగానే కేక్ బయటకు తీసాం. అదిగో ఆ క్షణం అమ్మ కళ్ళలో తళుక్కున మెరిసిన మెరుపు నేను జీవితంలో మర్చిపోలేను. తమ్ముడు ఫోటోలు తీసాడు. కంటితో మేము చూడలేకపోయిన అమ్మ కళ్ళలో దాక్కున్న చిన్నపాటి చెమ్మ ఆ ఫోటోలలో మాకు కనిపించింది.

ఆ రాత్రి అమ్మ మా గదిలోనికి వచ్చి నన్ను, తమ్ముడ్ని దగ్గరకు తీసుకుని….ఉదయం మీరెవరూ విష్ చెయ్యకపోయేసరికి, నా పిల్లలు కూడా మర్చిపోయారే అనుకున్నాను. కొంచెం బాధేసిందమ్మా అంది. మా నుదిటిపై ముద్దిచ్చి వెళ్ళింది.

జ్ఞాపకాలలో నుంచీ బయటపడి, బగ్ ఫిక్స్ అయిందని మెయిల్ చేసి సునీల్ కి మళ్ళీ కాల్ చేసాను.

“ఈవెనింగ్ తొందరగా రా. మీ ఇంటికి వెళ్దాం,” అన్నాను.

“ఆర్ యు క్రేజీ? మాధాపూర్ నుంచీ అమీర్పేట్ కు వర్కింగ్ డే ట్రాఫిక్లో వెళ్తావా? వీక్ ఎండ్లో వెళ్దాం,” అన్నాడు.

“అడగట్లేదు బాస్, వెళ్దామని చెపుతున్నాను. ఈరోజు మీ అమ్మ బర్త్ డే”, అన్నాను.

మొన్న ఊరెల్లినప్పటి కోపం నాకూ ఉంది. పెళ్ళవగానే పెళ్ళాం జీ హుజూర్ అనుకుంటూ మొగుడేనక ఉంటారనుకుంటారో ఏమిటో?!

తొందరగా వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుని ఇన్ ఆర్బిట్ మాల్ కి వెళ్లాను. ఆంటీకి ఏదన్నా గిఫ్ట్ కొనాలి. ఏం కొనాలో తెలియట్లేదు. కళానికేతన్ లో వెంకటగిరి, గద్వాల్ చీరలు చూసాను. నాకు పెద్దవారి చీరల గురించి అంతగా తెలీదు. వంగపండు రంగుకి సన్నటి జరీ బోర్డర్ పుట్టాడ పట్టు చీర బాగుందనిపించింది. సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. కానీ తృప్తిగా లేదు. వాచెస్, హ్యాండ్ బాగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసాను. బంగారం, బట్టలు ఇవి కాదు, ఇంకా ఎదో కావాలి. ఆంటీ అభిరుచికి నచ్చే గిఫ్ట్ కావాలి.

ఆంటీకి పాత సినిమాలంటే ఇష్టం. అంకుల్ చేతిలో రిమోట్ లేకపోతే పాత సినిమా వస్తుందేమోనని అన్ని చానెల్స్ మారుస్తారు. మ్యూజిక్ వరల్డ్ లో పాత సినిమా సిడిల ప్యాక్ కొన్నాను. సిడి పెట్టుకుని ఆంటీ ఒక్కరే చూసేలా portable సిడి ప్లేయర్ కూడా తీసుకున్నాను. రెండూ అందంగా గిఫ్ట్ వ్రాప్ చేపించి సునీల్ కి కాల్ చేసి నన్ను మాల్ దగ్గర పిక్ చేసుకోమని చెప్పాను.

“ఏంటి విశేషం, అత్తగారిని కాకాపడుతున్నావ్,” కళ్ళేగరేసాడు.

“హలో మిస్టర్ పతి దేవ్…..గ్రో అప్…..గ్రో అప్…..గ్రో అప్ లైక్ అ రేమాండ్ కంప్లీట్ మాన్,” నేనూ కళ్ళేగరేసాను.

ఓ క్షణం అర్థం కాలేదు తనకి. అర్థం అయ్యాక నవ్వాలో లేక నా వైపు కోపంగా చూడాలో అర్థం కానట్టు పెట్టాడు మొహం. నా పెదవులపై సన్నటి నవ్వు అతని చూపుని దాటిపోలేదు.

“మొన్న ఊర్లో పెద్ద ఫోసులు కొట్టావ్,” కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.

“నేనేం ఫోసులు కొట్టలేదు. నాకు ఇష్టం లేని పని నేను చెయ్యలేదు..అంతే,” నేనూ స్థిరంగా చెప్పాను.

“పెద్దవారిని గౌరవించాలని నేర్చుకోలేదా”

“గౌరవించాలని నేర్చుకున్నాను. పెద్ద చిన్న అని కాదు మంచి వారిని గౌరవించాలని గ్రహించుకున్నాను. అయినా నాకు అర్థంకాదు, నీతో పెళ్ళవగానే నీ వాళ్ళందరూ నాకు నచ్చెయ్యాలని, అందరికీ నేను విధేయురాలినై ఉండాలని ఎలా అనుకున్నావ్? అయినా ఇప్పుడేంటి వాదన? ”

కారు ట్రాఫిక్ లో స్లో గా వెళ్తుంది.

“నాకు మీ పెద్దమ్మ నచ్చలేదు. కూపీలు లాగినట్టు ఆవిడ అడిగే ప్రశ్నలు, నిలువునా చీల్చుతున్నట్టు చూసే చూపులు, కోడలిపై మాటమాటకి ఫిర్యాదులు, కూతుర్నేమో ఆకాశానికి ఎత్తడాలు, కూతురి అత్తగారిని తిట్టటం……పైగా నాకు నీతి బోధలు. సంవత్సరం క్రితం జరిగిన మన పెళ్ళిలో మీకు మర్యాదలు సరిగ్గా జరగలేదంట. ఇవన్నీ ఒకెత్తు, ఆ మామగారిని ఎలా విసుక్కుంటుందో చూసావా? ముసలావిడ, అత్తగారు అని కూడా లేకుండా”

“ఏదోలే పెద్దాళ్ళ చాదస్తం”

“ఏదోలే మాఆవిడకు ఇష్టం లేదు అని ఎందుకు అనుకోలేవ్? పెద్ద కామిడి ఏమిటంటే, నువ్వు బాగుండాలని నేను వ్రతాలు పూజలు చెయ్యాలంట. నేను బాగుంటే ఆటోమేటిగ్గా మీ అబ్బాయి బాగుంటాడులే అన్నాను, అబ్బో ఆవిడకు ఎంత కోపం వచ్చిందనుకున్నావ్,” నాకు నవ్వొచ్చింది.

“పెద్దమ్మ నీకు బొట్టు పెట్టి, జాకిట్టు ముక్క పెడుతున్నప్పుడు నువ్వు ఆవిడ కాళ్ళకు దణ్ణం పెడతావనుకుంది. కనీసం వచ్చేటప్పుడైనా ఆవిడ కాళ్ళకు దణ్ణం పెడితే నీకేం పోతుంది”

“ఇది మరీ బాగుంది. నువ్వు మా చుట్టాలింటికి వచ్చినప్పుడేమో నీకు సకల మర్యాదలా! అయినా నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను. ఇంక ఈ వాదన ఇక్కడితో ఆపేయ్”

సునీల్ పెదాలు ఎదో పదాన్ని ఉచ్చరించాయి. నాకు వినిపించకపోయినా అదేమిటో నాకు తెలుసు..పొగరు అంటాడు. అనుకోనీ. అతను నన్ను అర్థం చేసుకోవాల్సిందే.

మొన్నీ మధ్య కూడా ఇంతే, నేను ఆంటీకి ఎదురు చెప్పాను అంటాడు. నేను నా అభిప్రాయం చెప్పాను, అది ఎదురు చెప్పటం కాదంటే వినిపించుకోడే! నా అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పటం అంటీకి కూడా నచ్చలేదని నాకు తెలుసు. ఆ మూస పాత్రల్లో నుంచీ, దోరణల్లోనుంచీ బయట పడదామని కూడా అనుకోరు. ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరయినట్టు ఉంటుంది.

మొదట్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా సునీల్ పై కోపం వచ్చేసేది. ఆ తర్వాత ఆలోచించుకుంటే, ఇందులో తప్పంతా సునీల్ ది కాదనిపించింది. అత్త కోడల్ల సంభందం ఎన్ని వంకరలు తిరిగిందో చుట్టూ చూస్తూనే ఉన్నాను. భార్యంటే ఇలాగే ఉండి తీరాలనే అంచనాలు, భ్రమలు మరెన్నోమనలో. చిన్నప్పటి నుంచీ మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న సమాజం, పరిస్తితులు మనల్ని ముద్రల్లా తయారు చేసేస్తాయి. ఇప్పుడు కోపం పోయి నా కర్తవ్యం తెలిసింది.  విమర్శిస్తూ కూర్చోవటం వళ్ళన ఉపయోగం లేదు, అర్థం చేసుకునే అవసరం, ఎదిగే అవకాసం ఇవ్వాలి నేను.

సన్నగా చినుకులు మొదలయ్యాయి. కారు అద్దాలపై పడిన చినుకులు గాలికి పైపైకి వెళ్ళటం చూడటం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆశికి పాటలు ఆన్ చేసాను. తుంబి హో, అబ్ తుంబి హో, జిందగీ అబ్ తుంబి హో పాట కారంతా పరుచుకుంది.

మమ్ముల్ని చూడగానే ఆశ్చర్యం, ఆనందంతో విచ్చుకున్న ఆంటీ మొహం చూస్తుంటే అనిపించింది — మన అమ్మలకు వాళ్లకు వాళ్ళు ప్రాముఖ్యం ఇచ్చుకోవటం తెలీదు. ఇంట్లో అందరికీ అన్నీ సమకూరుస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ చేసుకోరు. మనం కూడా అమ్మను taken for granted గా తీసుకుంటాం. అలా ఉండటం అమ్మలకు ఆనందాన్ని ఇస్తుందా? ఏ మాత్రం గుర్తింపు కోరుకోని మనుష్యులు నిజంగా ఉంటారా?

ఆఫీసులో ఆన్యువల్ రివ్యూస్ అప్పుడు జరిగే రభస గుర్తొచ్చింది. ఇక్కడ నచ్చకపోతే ఇంకో కొలువనుకుని వెళ్ళిపోయే పనిలో సరైన గుర్తింపు రాకపోతేనే తెగ బాధ పడిపోతామే, జీవితమే కుటుంబం అనుకుని బతికే అమ్మకు కొద్దిపాటి గుర్తిపును కూడా ఇవ్వకపోవటం ఎంత దారుణం. ఏమన్నా అంటే, త్యాగాల్లాంటి ఒట్టి మాటలు, బరువైన మూటలు నెత్తిన పెట్టేస్తారు. ఆ బరువులో కాస్త భాగం మీరు మోయ్యండి అంటే ఆడవారికి మాత్రమే వర్తించే నీతులు సూక్తులు వల్లెవేస్తారు. బాబోయ్……. హిపోక్రసీ!

నాకెందుకమ్మా ఇవన్నీ అంటూ మొహమాట పడుతూనే కేకు కట్ చేసారు ఆంటీ. హ్యాపీ బర్త్ డే టు యు….క్లాప్స్ కొడుతూ పాటను నేను మొదలుపెట్టాను – సునీల్, అంకుల్ అందుకున్నారు. ఆంటీ సిగ్గుపడ్డారు. చిటికెలో వంట చేసేస్తానన్నారు. ఈ రోజు మీరు సెలెబ్రిటి, పనేం చెయ్యకూడదు అంటూ ఫుడ్ ఆర్డర్ చేశాం.

“ఆంటీ కోసం కొన్నాను. నువ్వు ఇవ్వు“, గిఫ్ట్ ప్యాకెట్ సునీల్ కు అందించాను.

“ఏంటిది?,” అడిగాడు.

“ఆంటీ అభురుచికి నచ్చే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. I am sure she will love it.”

“ఓహ్!”, సునీల్ ఆశ్చర్యార్ధకం.

“మై డియర్ అబ్బాయ్,మన వారిని ప్రేమించటం, గౌరవించటం, గుర్తించటం అంటే ఇది. కాళ్ళకు దణ్ణాలు పెట్టడం కాదు. ఈ సారి నీ బర్త్ డే కి రేమండ్ సూట్ కొనిస్తాలే”, కళ్ళేగరేస్తూ నవ్వేసాను.

“ఈ రేమండ్ మాన్ ఎక్కడ తగులుకున్నాడు, నా ప్రాణం తీస్తున్నావ్”, సునీల్ హాయిగా నవ్వేసాడు.

సునీల్ గిఫ్ట్ ప్యాక్ ఆంటీకి ఇస్తుంటే ఆవిడ కళ్ళలో మెరుపు. కొన్నేళ్ళ క్రితం అమ్మ కళ్ళలో చూసిన అదే మెరుపు. ఆ మెరుపు సునీల్ హృదయాన్నిసూటిగా తాకింది. నన్ను,ఆంటీని కౌగలించుకుంటూ గర్వంగా, కృతజ్ఞతగా నవ్వాడు.

అంకుల్ మోములో దోబూచులాడిన గుర్తింపు ఆ సాయంత్రానికే నిండుదనాన్ని తెచ్చింది.

“మన విలువను తెలియచెప్పటం కూడా మన బాధ్యతే ఆంటీ”, వెళ్తూ వెళ్తూ చిన్నగా అన్నాను. ఓ వాన చినుకు ఆంటీ కళ్ళలో కురిసి హరివిల్లై మెరిసింది.

   -ప్రవీణ కొల్లి

DSC_0005

 

పాండవుల పుట్టుకపై చర్చ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

సంప్రదాయ పాఠం లేదా వివరణ విడిచిపెట్టిన ఖాళీలను గురించి ఇంతకుముందు చాలా ఉదంతాలలో చెప్పుకున్నాం. కొన్ని మరోసారి గుర్తు చేసుకుందాం:

యయాతి-శర్మిష్టల సంబంధమే చూడండి. వారిద్దరూ మనకు తెలిసిన అర్థంలో భార్యాభర్తలు కారు. యయాతి అధికారిక భార్య అయిన దేవయానికి శర్మిష్ట దాసి మాత్రమే. అయినాసరే, యయాతికి శర్మిష్టకు సంబంధం ఏర్పడి ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో చివరివాడైన పూరునికే రాజ్యాధికారం లభించింది. ‘నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ నువ్వు భర్తవే’ అనీ,‘భార్య, పుత్రుడు, దాసి వారింపలేని ధర్మాలు’ అనీ శర్మిష్ట అన్న మాటలు సూటిగా ఉండి మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఇటీవలి అమెరికా సహా ఒకనాటి బానిస సమాజాలు అన్నిటా దాసిపై, లేదా బానిసపై కూడా యజమాని లైంగిక హక్కును చలాయించిన సంగతి మనకు తెలుసు కనుక, ఆనాడు శర్మిష్ట ఆ హక్కు గురించే మాట్లాడుతున్నట్టు మనం ఈరోజున తేలికగా పోల్చుకోగలం.

ఈవిధంగా శర్మిష్ట మాటల్లో కూడా పురాచరిత్ర వ్యక్తమవుతోంది.

విశేషమేమిటంటే, మహాభారత కథకుడు ఎంతో విలువైన ఈ పురాచారిత్రక సమాచారాన్ని దాచకుండా అందిస్తున్నాడు. అంతకన్నా విశేషం ఏమిటంటే, సాంప్రదాయిక వ్యాఖ్యాతలు యయాతి-శర్మిష్టల సంబంధం ఎలాంటిదో వివరించకుండా మౌనం పాటించడం!

ఇంకో ఉదాహరణకు వస్తే, సత్యవతి, కుంతి కన్యగా ఉన్నప్పుడే సంతానాన్ని కన్నారు. అయినా సరే, ఇద్దరిలో కొంత తేడా ఉందని చెప్పుకున్నాం. పరాశరుని వల్ల సత్యవతికి వ్యాసుడు జన్మించడం వెనుక దైవ సంబంధం కానీ, వరప్రభావం కానీ ఏమీ లేవు. పరాశరుడు ఒక మునే కానీ దైవం కాదు. కానీ కుంతి కర్ణుని కనడం వెనక దుర్వాసుని వరంతోపాటు సూర్యుడనే దైవం ఉన్నారు. సత్యవతి, కుంతి మధ్య ఎందుకు ఈ తేడా అంటే మనకు అర్థమయ్యేది ఒక్కటే…మహాభారత కథకుడు పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారి తల్లి అయిన కుంతికి ఒక ప్రత్యేకతను లేదా విశిష్టతను ఆపాదిస్తున్నాడు.

ఇలాంటి తేడాయే; ద్రౌపదీ-జటిలుడనే ముని కూతురూ, అజిత అనే రాచకూతురుల మధ్య కూడా కనిపిస్తుంది. జటిలుని కూతురు పదకొండుమందినీ, అజిత అయిదుగురినీ పెళ్లిచేసుకున్నట్టే; ద్రౌపది కూడా అయిదుగురిని పెళ్లాడింది. కానీ జటిలుని కూతురూ, అజితల వివాహం వెనక ఎటువంటి వరాలు, శాపాలు, దైవ కారణాలు ఉన్నట్టు కథకుడు చెప్పలేదు. ద్రౌపది వివాహం వెనుకే అలాంటివి ఉన్నట్టు చెబుతున్నాడు. కారణం కుంతి విషయంలో చెప్పుకున్నదే. ద్రౌపది పాండవుల భార్య, తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు!

ఇప్పుడు నియోగ పద్ధతిలో సంతానం కనడం గురించే చూడండి…తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగ పద్ధతిలో సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి ఆదేశించింది. వ్యాసుడు ఒక మునే తప్ప దైవం కాదు. కుంతికి దుర్వాసుడు ఉపదేశించినట్టుగా అంబిక, అంబాలికలకు, వారి దాసికి ఏ మునీ వచ్చి సంతాన మంత్రాన్ని ఉపదేశించలేదు. సహజప్రక్రియలోనే వారికి వ్యాసుని వల్ల సంతానం కలిగారు. తనకు దుర్వాసుని మంత్రం, సూర్యుని అనుగ్రహం ఉన్నప్పటికీ, సంస్కృత భారతం ప్రకారం కుంతి నవమాసాలు మోసే కర్ణుని కంది. దీర్ఘతముడు అనే ముని కూడా బలి అనే రాజు భార్యకు నియోగపద్ధతిలో, సహజప్రక్రియలోనే సంతానం ఇచ్చాడు. కల్మాషపాదుడనే రాజు భార్యకు వశిష్టుడు నియోగపద్ధతిలో, సహజవిధానంలోనే కొడుకును ఇచ్చాడు.

VanaParva

పాండురాజు కూడా నియోగ పద్ధతిలో తనకు సంతానం ఇమ్మనే కుంతిని అడిగాడు. ఆ విధంగా కలిగే సంతానం కూడా అన్నివిధాలా ఔరసునితో సమానమే నని కూడా అన్నాడు. నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని ఎలా తలచుకోమని కుంతి అనడంలో కూడా, తను కనవలసింది స్త్రీ-పురుష సంపర్కం ద్వారా అందరూ కనే సంతానమే తప్ప మరొకటి కాదన్న సూచన ఉండనే ఉంది. తీరా అందుకు అంగీకరించిన తర్వాత, తనకు దుర్వాసుడు ఇచ్చిన వరాన్నీ, ఆ వరప్రభావంతో ఏ దేవుణ్ణి తలచుకుంటే ఆ దేవుడు వచ్చి తనకు సంతానం ఇస్తాడన్న వివరాన్నీ ఆమె పైకి తీసింది. ఏ దేవుణ్ణి తలచుకోమంటావో చెప్పమని పాండురాజును అడిగింది. అలా క్రమంగా ఆమెకు దైవ సంబంధం వల్ల ముగ్గురు కొడుకులు, మాద్రికి ఇద్దరు కొడుకులు కలిగినట్టు కథకుడు చెబుతున్నాడు.

తనకు నియోగపద్ధతిలో సంతానం ఇమ్మని అడిగినప్పుడు పాండురాజు దృష్టిలో ఉన్నది తను పుట్టిన విధానమే. అంబాలికకు నియోగపద్ధతిలో వ్యాసుని వల్ల తను ఎలా పుట్టాడో ఆ ప్రక్రియలోనే తనకు సంతానం ఇమ్మని అతను కుంతిని అడిగాడు. ఆ సంగతి మహాభారతంలోనే స్పష్టంగా ఉంది(ఆదిపర్వం, పంచమాశ్వాసం, 59). కుంతికి గల వరమూ, ఆ వరప్రభావంతో దేవతలు వచ్చి ఆమెకు సంతానం ఇచ్చే అవకాశమూ అతని దృష్టిలో లేవు. అతనికి అంతవరకూ వాటి గురించి తెలియదు కూడా. ‘పరపురుషుని ఎలా తలచుకుంటా’మని కుంతి అన్నప్పుడూ తనకు దుర్వాసుడు ఇచ్చిన వరం ఆమె దృష్టిలో లేదు. అంటే, పాండురాజు, కుంతీ కూడా ఆ సమయంలో కేవలం నియోగం గురించే ఆలోచిస్తున్నారు. తీరా నియోగానికి తను ఆమోదించిన తర్వాత దుర్వాసుని వరం గురించీ, దేవతల గురించీ కుంతి చెబుతున్నదంటే, ఆ మాటలు నిజానికి ఆమెవి కావు, కథకుడివి. కారణం స్పష్టమే. తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారికి దైవసంబంధాన్ని ఆపాదించవలసిన అవసరం అతనికి కనిపించింది.

అదే సమయంలో కథకునిలోని వైరుధ్యాన్ని చూడండి…ఒకపక్క, కుంతికి సహజప్రక్రియలోనే సంతానం కలిగినట్టు తనే సూచిస్తున్నాడు. ఇంకోపక్క, దానికి మహిమను, దైవసంబంధాన్ని జోడిస్తున్నాడు…

***

మహాభారత కథకుని ప్రత్యేకతే అది. అతను నిజం దాచడు. కాకపోతే ఆ నిజంపై కల్పన అనే ఒక పారదర్శకమైన ముసుగు కప్పుతాడు. అందులోంచి నిజం కనిపించిపోతూనే ఉంటుంది.

పాండవుల పుట్టుకనే తీసుకోండి. కాస్త హేతుబద్ధంగా ఆలోచించేవారికి ఆ పుట్టుకపై తప్పనిసరిగా కొన్ని సందేహాలు కలుగుతాయి. భారత కథను ఉన్నదున్నట్టు తీసుకుంటూ విశ్వాసంలో భాగం చేసుకునే ఇప్పటివారికి, ఈ సందేహాలు ఈ కాలంలోనే పుట్టిన పెడధోరణిగా కనిపిస్తాయి. కానీ విశేషమేమిటంటే, పాండురాజు, మాద్రి మరణించిన తర్వాత కుంతి పాండవులను వెంటబెట్టుకుని కొందరు మునులతో కలసి హస్తినాపురానికి వచ్చినప్పుడు అక్కడి జనంలోనే కొందరికి పాండవుల పుట్టుకపై అనుమానాలు కలిగిన విషయాన్ని కథకుడు దాచకుండా చెబుతున్నాడు.

సంస్కృత భారతం ప్రకారం, పాండురాజు కన్నా గొప్పగా కనిపిస్తున్న వీరు అతని కొడుకులు ఎలా అవుతారని కొందరూ; కుంతి, మాద్రి పతివ్రతలు కనుక పాండురాజు కొడుకులేనని మరికొందరూ అనుకుంటే; పాండురాజు ఎప్పుడో శాపగ్రస్తుడైనప్పుడు ఇంత చిన్న వయసు పిల్లలు అతనికి ఎలా కలుగుతారని ఇంకొందరు అనుకున్నారట. అప్పుడు కుంతి వెంట వచ్చిన మునులే కాక, దేవతలు కూడా వీరు పాండురాజు కొడుకులే నని చెప్పారట. పాండవుల పుట్టుకను కొందరు అనుమానించిన సంగతిని మాత్రం తెలుగు భారతం పరిహరించింది.

శతశృంగం నుంచి పాండవులను హస్తినాపురానికి తీసుకొచ్చినప్పుడు వారి వయసు ఎంత అన్న విషయంలో కూడా సంస్కృత, తెలుగు భారతాల మధ్య తేడా కనిపిస్తుంది. పాండవులు ఒక్కొక్కరి వయస్సులలోనూ ఏడాది తేడా ఉందని చెబుతూనే, హస్తినాపురానికి వచ్చినప్పుడు ఆ అయిదుగురూ అయిదేళ్ళ వయసు వారిగానే కనిపించారని సంస్కృత భారతం చెబుతోంది. తెలుగు భారతం పాండవుల వయసులలో ఏడాది తేడా ఉందని అంటూనే హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజు వయసు పదహారేళ్లని చెబుతోంది.

పాండవుల పుట్టుక గురించి సంప్రదాయవర్గాలలోనే ఎంతో చర్చ జరిగింది. ఆ వివరాలు చెప్పుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ చర్చకు తెరతీసిన తెలుగువారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి, చారిత్రక దృష్టి నుంచి మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారే. వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన ‘మహాభారతతత్త్వకథనము’లో పెండ్యాలవారి అభిప్రాయాలను ఖండించారు.

పెండ్యాలవారి వాదం ప్రకారం, పాండవుల జన్మస్థానమైన శతశృంగం నేటి టిబెట్టే. ఒక స్త్రీ అనేకులను పెళ్లాడే ఆచారం టిబెట్టులోనే ఉందని ఆయన అంటారు. అయిదుగురూ ద్రౌపదిని పెళ్ళాడడం ఎలా ధర్మబద్ధమని ద్రుపదుడు ప్రశ్నించినప్పుడు, మా పూర్వుల ఆచారాన్నే మేము పాటించదలచుకున్నామని ధర్మరాజు జవాబిస్తాడు. ఆ మాట టిబెట్టులోని ఆచారాన్నే సూచిస్తుందనీ పెండ్యాలవారు అంటారు. పాండవులు విదేశీయులే కాక, ధర్మరాజుకు విదేశీ భాష (టిబెట్ కు చెందిన భాష) తెలుసు నంటూ మహాభారతంలోని ఒక సందర్భాన్ని ఆయన ఉదహరించారు. అదేమిటంటే:

ధర్మరాజును ధృతరాష్ట్రుడు యువరాజుగా అభిషేకించిన తర్వాత అతను విపరీతమైన జనాదరణను పొందాడు. దుర్యోధనుడు దానిని సహించలేకపోయాడు. తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు. పుత్రప్రేమకు లొంగిపోయిన ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతం అనే ప్రాంతానికి వెళ్లమన్నాడు. పాండవులు కుంతితో కలసి వారణావతానికి బయలుదేరారు. అప్పుడు, హస్తినాపురంలో వారిని అభిమానించే జనం కూడా వారివెంట కొంత దూరం వెళ్లారు. అలాగే విదురుడు కూడా వెళ్ళాడు. అక్కడ ఉన్నవారికి వినిపించినా అర్థం కాని మాటలతో ధర్మరాజుకు విదురుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయాడు.

విదురుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతి ధర్మరాజు దగ్గరికి వచ్చి, విదురుడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగింది. ధృతరాష్ట్రుడు మీ హితం కోరేవాడు కాదనీ, మీకు అపకారం చేస్తాడనీ, ఆహారంలో విషం కలిపే అవకాశం, అగ్ని ప్రమాదం మొదలైన వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలనీ; దుర్యోధనుని కుట్ర కనిపెడుతూ అందుకు చేయవలసిన ప్రతీకారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాననీ విదురుడు చెప్పినట్టు ధర్మరాజు తల్లితో అన్నాడు. విదురుడు ధర్మరాజుతో మాట్లాడింది విదేశీ భాషలోనే ననీ, అది టిబెట్ భాష కావచ్చుననీ పెండ్యాలవారు అంటారు.

అంటే ఆ భాష ధర్మరాజుకే కాక విదురుడికీ తెలుసునన్న మాట.

ఇంకా విశేషం ఏమిటంటే, ఇంద్రుని వల్ల అర్జునుడు ఒక్కడే కుంతికి పుట్టాడనీ, ధర్మరాజు, భీముడు ఆమెకు పుట్టలేదనే భావన కలిగించే వాక్యాలు సంస్కృత భారతంలో ఉన్నాయి. ‘బ్రహ్మచర్యవ్రతంలో ఉన్న పాండురాజుకు ధర్మదేవత ప్రత్యక్షంగా ధర్మరాజును పుట్టించాడు. అలాగే, మహాబలవంతుడైన భీముని వాయుదేవుడు ఇచ్చాడు. ఇంద్రుని వల్ల కుంతికే అర్జునుడు పుట్టాడు’ అని సంస్కృత భారతం(ఆది-అ 126)అంటోంది.

కుంతికి పృథ అనే పేరు ఉంది కనుక, పాండవులలో ఒక్క అర్జునుడికే పార్థుడనే(పృథ కొడుకు పార్థుడు అవుతాడు)పేరు ఉంది కనుక వాస్తవంగా కుంతికి పుట్టింది అతనొక్కడే కావచ్చునని పెండ్యాలవారి అనుమానం. యముడు, వాయువు తలచుకున్న వెంటనే కొడుకుల్ని ఇవ్వగా, ఇంద్రుడు ఏడాది పాటు తపస్సు చేస్తే కానీ కరుణించని సంగతిని ఆయన ఉదహరిస్తారు. ఇంకోచోట ఆయనే, పురాణ మునులలో ధర్ముడు, వాయువు అనే పేర్లతో ఇద్దరు మునులు; ఇంద్రుడు అనే పేరుతో ఇద్దరు మునులు ఉన్నారనీ, వీరి పేర్లతో ఋగ్వేదంలో సూక్తాలు కూడా ఉన్నాయనీ; కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఈ మునుల వల్ల కలిగి ఉండే అవకాశం ఉందని అంటారు. భైరప్ప అన్వయం కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

పెండ్యాలవారి వాదాలను ఖండించడంలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఇటువంటి హేతుబద్ధ పరిశీలన, గ్రంథస్థ వివరాల జోలికి వెళ్లకుండా మునులు, దేవతలు చెప్పిన మాటలనే ప్రమాణంగా తీసుకున్నారు. అంటే, ఆయన వాదనలో కేవలం విశ్వాసానిదే పై చేయి అయిందన్న మాట.

మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

 

 

మన అసలు సిసలు ‘నాయిన’!

drushys drushya 42William Wordsworth అన్న ఆంగ్ల కవి రాస్తడు. నా హృదయం ఆనంద తాండవం చేస్తుందని.
పిల్లల్ని చూసినప్పుడు సింగిడిని చూసినంత ఆనందం అని! దాన్ని గుండెల్లో పొదువుకున్నప్పుడు, అప్పుడు గెంతులు వేసే హృదయమే ప్రమాణం అనీ!
ఆ హృదయోల్లాసం అన్నది మరేమిటో కాదు, పిల్లవాడినవడమే అనీనూ!పిల్లవాడిగా ఉన్నా పెద్దవాడిగా ఎదిగినా ఇదే అనీ!
అదీగాక., ఏనాడైతే ఆ ఆనందాన్ని పొందలేడో, అప్పుడు పెద్దా చిన్నా అన్న తేడా లేదు, ఇక అదే మృత్యువూ అని}

అప్పుడే రాస్తడు. ఆ పాపాయి లేదా ఆ పసివాడు ‘నేనే కాదా’ అన్నంత ఆనందంలో రాస్తాడు.,
రేపటి పౌరులకు మూలం నేటి బాల్యం అని, మానవ నాగరికతకు పిల్లవాడే తొలి ముద్దూ, మురిపెమూ అనీనూ.

+++

My heart leaps up when I behold
A rainbow in the sky:
So was it when my life began;
So is it now I am a man;
So be it when I shall grow old,
Or let me die!
The Child is father of the Man;
And I could wish my days to be
Bound each to each by natural piety.

+++

ఈ చిత్రమూ అదే.
అంతే.

ఆ పాప ఉన్నది చూడండి.
అది పాపాయేనా?

దాని కన్నులు…ముఖ్యంగా ఆ కన్ను…ఆ కనుగుడ్డు..
అది పాపాయిదేనా?

చిత్రమే. విస్మయం.
దాని కన్ను చిత్రమే.

అది పెద్దమనిషిలా చూస్తుందనే విస్మయం.

విశేషమే.

నిశ్చయంగా, నిమ్మలంగా, తల్లి ఒడిలో ఆ తండ్రి లేదా బిడ్డ…
అది పసికూనలా మాత్రం లేదు.
లేదా ఆ పసిగుడ్డులో ఎంతమాత్రం లేని ఒకానొక వయోభారం….
జీవితాన్ని స్థితప్రజ్ఞతతో విచారించే, పరిశీలించే ఏదో ఒక వివేకంతో  కూడిన ప్రవర్తన…ఎటో చూస్తుండగా ఇది కానవచ్చింది. చప్పున ఈ చిత్రం బందించాను…
అదీ నిన్నా ఇవ్వాళా కాదు, గత ఏడాది.
ఒకానొక వీధిలో…ఒకానొక పిల్లవాడినై. తండ్రినై- అకస్మాత్తుగా.

చూడగా చూడగా అది నా తల్లి… తండ్రి అనిపిస్తూ ఉన్నది.
ఒక గమనింపులో అది గమనింపయింది.

తాతముత్తాతలు.
ఆదమ్మ, ఈదయ్య..అందరూ దాని చూపుకేసి చూడాలి.
విస్మయమే. చిత్రమే.

అందుకే కవి కావలసి వచ్చింది నాకు.
చిన్న పద్యమే రాసిండు గానీ, అదీ చిత్రమే.
ప్రకృతిలో దినదినం ఒక ఆకాంక్ష. కానీ, చెరగని ఆకాంక్ష బాల్యం అని, దానికి వినమ్రంగా ఒక గంభీరమైన కవిత్వం కానుకగా అందించి వెళ్లిండు ఆయన.

+++

అనుకుంటాం గానీ, ఆ మహాకవి చెప్పినట్టు ఎప్పుడూ పిల్లవాళ్లమై ఉండటంలోనే జీవితం దాగి ఉన్నది. మరణం అంటే పెద్దవాడవటమే.
అందుకే…తండ్రీ… ఈ విశ్వంలో… మానవేతి హాసంలో…బిడ్డా…మన అసలు సిసలు ‘నాయిన’ ఎవరయ్యా? అని గనుక మీరెవరైనా గనుక ఒక ప్రశ్నార్థకం వంటి మొఖం పెట్టి చూశారా… నేను ఈ చిత్రాన్నే మీ ముందుంచుతాను.

ఇంతకంటే ఇంకేమీ లేదు.
కను-బొమ్మ. అంతే.

పిల్లలే ప్రాణం అని, సమస్త జీవితానుభవానికి బాల్యావస్థే అపూర్వ అనుభవ చ్ఛాయ అనీ చెప్పడమూ వృధా ప్రయాసే.

మీ హృదయం గంతులు వేసే ఆ అనుభవానికి పిల్లలు తప్ప ఇంకే ఇంధ్రధనుస్సూ సరిరాదు.
మరే రచనా ఆస్వాదనా చెల్లదు. ఇంకే విధమైన చరిత్ర మరణసాదృశ్యమే అని వ్యాఖ్యానించడమూ అనవసరమే.

అందుకే ఈ బొమ్మ- కనులారా చూడమని.
దృశ్యాదృశ్యం.

మరి అభివాదం.

 ~ కందుకూరి రమేష్ బాబు

ఎగిరే పావురమా ! – 4 వ భాగం

serial-banner4

( గత వారం తరువాయి )

నాల్గవ భాగం

పిన్ని కాడనుండి కదిలి, గుడికి తయారవుతుండగా, కొట్టాం బయట “సత్యమన్నా,” అని ఎవరిదో పిలుపు. ఇంత పొద్దున్నే ఎవరా! అనుకుని పిన్ని వంక చూసాను. తాత లేచి వెళ్ళి వారగా వేసి ఉన్న కొట్టాం తలుపు తీశాడు.

“నువ్వా వెంకటేశం? రా లోనికి రావయ్యా. నిజంగానే వచ్చావన్నమాట?” అంటూ ఒకతన్ని కొట్టాం లోనికి తెచ్చాడు. వచ్చినాయన చేతిలో ఒక చక్రాల పీట ఉంది.

“చంద్రమ్మా ఈడ చూడవమ్మా. ఇతనే వెంకటేశం. పక్క ఊళ్ళోనే ఉంటాడు. నడక రాని వారికి పనికొచ్చే బండ్లు, పీటలు చేస్తుంటాడు. వాటిని వాడే విధానం కూడా నేర్పిస్తాడు.
మన గాయత్రికి కూడా ఒకటి చేసి ప్రత్యేకంగా ఈ రోజు తెమ్మని అడిగాను. ఇంత పొద్దున్నే మన కోసం ఇలా వచ్చాడు,” అంటూ పిన్నిని పిలిచాడు తాత.

“వెంకటేశం, నువ్వు చేసిన పీట గాయత్రికి చూపిద్దాం. ఈ రోజు చిట్టితల్లి పుట్టినరోజు తెలుసా?” అంటూ అతని చేతిలోని పీట తీసుకొని, నేల మీద ఉంచాడు తాత.

జాలీ చెక్కపీటకి నాలుగు రబ్బరు చక్రాలు ఉన్నాయి. నేల మీద నుంచి పీట కాస్త ఎత్తుగానే ఉంది. ఒక పక్కగా చేత్తో పట్టుకోడానికి పొడవాటి పిడి బిగించి ఉంది.

“గాయత్రికి అది ఎలా పని చేస్తుందో చెప్పవయ్యా వెంకటేశా,” అన్నాడు తాత.

నేను, పిన్ని కూడా చాలా శ్రద్ధగా విన్నాము. కూసేపు ఆ పీట నాకు ఎంతగా పనికొస్తుందో, దాన్ని ఎలా వాడాలో, ఎలా నడపాలో, ఎలా ఆపాలో చెప్పాడు వెంకటేశం.
నా పుట్టినరోజుకి తాత తెప్పించిన చక్రాల పీట బాగుంది. నాకు నచ్చింది.

“తాత నీ గురించి అలోచించి అన్నీ చేస్తాడని చెప్పానా?” అంది పిన్ని నా చెవిలో.
కొద్దికాలం గుంటూరు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశాడంట వెంకటేశం. ఈ పీటలు వాడే నా ఈడు పిల్లల కన్నా, నేను బలంగా, మెరుగ్గా ఉన్నానన్నాడు.

“ఆ దేవత కూడా కనికరిస్తే మా గాయత్రి అవిటితనం పోయి మాములుగా నడుస్తుందిలే, వెంకటేశం. ఆ ప్రయత్నమే చెయ్యాలి,” అంటూ వెంకటేశంని సాగనంపాడు తాత.

**

రోజూ దేవత కాడ నా సంగతి మొరెట్టుకో మన్నాడు తాత. ‘నేనూ అందరి మల్లే నడవాలని, మాట్లాడాలని’ ఆ దేవతని వేడుకోడం మొదలెట్టాను.
అట్టాగే ప్రతిరోజు చక్రాలపీట కూసేపు వాడుతుంటే అలవాటయి, కొట్టాంలో నా కదలిక సుళువయ్యింది. చిన్న పనులు నా అంతట నేనే చేసుకోడం మొదలెట్టాను.

సాయంత్రం కొట్టాంలో మెసులుతూ, దండెం మీద నుండి తీసిన బట్టలు మడతేస్తుండగా వచ్చింది చంద్రం పిన్ని. తన సంచి నుండి తాతకని తెచ్చిన మందులు తీసి తాత పడక కాడెట్టమని నాచేతి కిచ్చింది.
వాకిట్లోకెళ్ళి తాతకాడ కూకుని కబుర్లు చెబుతూ, నా కోసం చక్రాల పీట చేయించినందుకు తాతని మెచ్చుకుంది.

“అన్నా, చెప్పడం మరిచిపోతానేమో! రేపటి నుంచి గోవిందు అనే మరో రిక్షాబ్బాయి వస్తాడు. ఇప్పుడున్నోడిక్కూడా ఆటోరిక్షా వచ్చేసింది. ఇక అతను రాడు. ‘గోవిందు’ ని నేను చూసి మాట్లాడానులే అన్నా,” అని చెబుతూ లేచెళ్ళి – కంచాలు, మంచినీళ్ళెట్టి, మా కోసం చేసి అట్టే పెట్టిన సంకటి, చింతపండు మిరపకాయ పప్పు వడ్డించింది పిన్ని.
**
నా చక్రాల పీటని నాతో పాటే రిక్షాలో గుడికి తెచ్చుకోడం మొదలెట్టాను. పీట సాయంతో అరుగు చుట్టూ కొంత దూరం మెసలడం, నీళ్ళకి కొళాయి కాడికెళ్లడం చేస్తున్నా. అమ్మవారి గుడికాడికెళ్ళి, ప్రసాదాలు తెచ్చుకోడం కూడా చేస్తున్నా.

గుడికొచ్చే భక్తుల్లో నవ్వుతూ పలకరించి, ‘గాయత్రి’ అని రాసున్న చెక్క హుండీలో డబ్బులు వేసేవారు కొందరైతే, “ఇలా మూగ, కుంటిని కూర్చోబెట్టి పూజాసామాను అమ్మించాలా? పక్కనే మరో హుండీ కూడానా అడుక్కోడానికి?” అంటూ నా ముఖం మీదే అనేవారు మరికొందరు.
ఒక్కోప్పుడు  ఆ ఈసడింపులు, చీదరింపులు కష్టమనిపిస్తది.
**
కొత్త పుస్తకాల సంచీ తీసుకొని మూడింటికి వచ్చింది ఉమమ్మ. నా పక్కన కూకుని ఓ బొమ్మల పుస్తకం నాకందించి, నా చేతిలోని పలక, నోటు పుస్తకం తీసుకొని చూసింది.

“పర్వాలేదే, ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు. నా చేతివ్రాత కంటే నీది వందరెట్లు అందంగా ఉంది గాయత్రి.
మా అందరి పేర్లు కూడా రాయగలుగుతున్నావు,” అంటూ నా తల మీద తట్టింది ఉమమ్మ.

“సరే, ఇక నీ పూర్తి పేరు రాయడం కూడా నేర్చుకోవాలి. నీ పేరు చిన్నదే. మూడే అక్షరాలు. ‘గాయత్రి’ అని. పూర్తి పేరు అంటే మాత్రం నీ పేరు వెనక ‘సత్యం’ లేదా ‘సాయిరాం’ అని తాత పేరు కలిపి రాయాలి. ఇలా అన్నమాట,” అని ‘గాయత్రి సాయిరాం’ అని రాసి చూపింది ఉమమ్మ.

పేరు వినడానికి – బాగుందన్నారు అక్కడే ఉన్న తాత, రాములు.
‘అమ్మో’ ఇంత పొడుగు పేరా?’ అన్నట్టు చూశాను ఆమె వంక.
నా ముఖం చూసి ఉమమ్మ ఫక్కున నవ్వింది.
“అయినా పెద్ద తొందర లేదులే. మెల్లగా రోజూ చదువు అయ్యాకే పేరు రాయడం సాధన చెయ్యి,” అందామె.
నేనూ నవ్వేశాను.

“నీవు చదివే ప్రతి పాఠం మన స్కూల్లోని శ్రీనివాసు మాస్టారు సాయంతో నీ కోసం అలోచించి తయారు చేసేదే. నీ పరీక్షలు కూడా ఆయన పథకం ప్రకారమే జరుగుతాయి,” అంటూ నా చేతికిచ్చిన కొత్త బొమ్మల పుస్తకం తీసుకొని పేజీ తిరగేసింది ఉమమ్మ.

“ఈ పుస్తకంలో చూడు. ప్రతి పేజీలో బొమ్మ కింద రెండేసి వాఖ్యాలు – వివరణ ఉంటుంది, అన్నీ చిన్న మాటలే. మాటలు విరిచి గుణించుకుంటూ చదవచ్చు. ఇలా,” అని నా వేలుతో అక్షరాలని చూపుతూ నాకు తెలిసేలా చదివింది ఉమమ్మ.

“ఇలాటివే నంబర్లు వేసి మరో మూడు పుస్తకాలున్నాయి ఈ సంచిలో.
మొదటిది పూర్తయ్యాక, రెండోది చదవడం తేలికవుతుంది.
తరువాత మూడో పుస్తకం చదవగలిగే వరకు వస్తే నీకు చదవడం వచ్చేసిందన్నమాట. ఇక నీ తీరికని బట్టి సాధన చెయ్యి,” అంటూ కూడికలు, తీసివేతలు రాసిచ్చి, కొత్త పుస్తకాల సంచి కూడా నా చేతికిచ్చి రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది ఉమమ్మ.

illustration4

 

**

కొత్త పుస్తకం చదివే ప్రయత్నం సరదాగుంది. నాలో చదవాలన్న కోరిక పెరిగింది. పూలపని అవుతూనే వీలున్నప్పుడల్లా కొత్త బొమ్మల పుస్తకం చేత పట్టుకుంటున్నాను.

మొదట్లో కష్టమనిపించినా, ఎలా చదవాలో తెలిసింది. కాస్త సులువు వచ్చాక, మొదటి పుస్తకం సగమవ్వడానికి మూడు వారాలు పట్టింది.

**

రుద్రాక్షలు, రంగురంగుల పూసలతో నిండిన పళ్ళెం తెచ్చుకొని నా పక్కనే కూకుంది రాములు. పుస్తకం మూసేసి నేను కూడా వాటిని వేరు చేయడం మొదలెట్టాను.

“ఏమో, ఈ సారి ఉమమ్మిచ్చిన పుస్తకాలు వదలకుండా ఉన్నావే? ఎప్పుడూ నీ మొహంకి పుస్తకం అడ్డం. నీ పావురాళ్ళు కూడా అలిగి రాడం మానేస్తాయేమో సూడు,” అంది రాములు.

ఫక్కుమని నవ్వాను. ‘అయితే పుస్తకాల్లో మునిగి ఉంటున్నానని రాములు అలిగిందన్నమాట’ అనుకున్నాను.

‘నేను నీకు చదువు చెబుతాను. నా లాగా నువ్వూ పుస్తకాలు చదివేయచ్చు,’ అని సైగ చేసాను.

“నాకా? సదువా?” అంది రాములు. కొద్ది క్షణాలాగి, “మా అమ్మ చనిపోకుండా ఉంటే, అమ్మమ్మ కాడికి ఎళ్ళకుండా ఈడనే ఉండి సుబ్బి, మాణిక్యం లాగా బుద్ధిగా సదువుకునుంటే బాగానే ఉండేదిరా,” అంది నా జడ లాగి.
“అంతే కాదు, మా అమ్మమ్మ అతిగారాంతో, ‘ఆడపిల్లకి సదువేంది? ఏమవసరం?’ అని నన్ను పాడుచేసింది. నా కన్నా పెద్దోడు, నా మామతో కలిసి పుట్లెంట, గట్లెంట తిరిగి సెడాను… సదువు కాదు కదా, కనీసం వంటా-వార్పు అయినా వంటబట్టాయి కాదు నాకు,” అంది దిగులుగా రాములు.
ఆమె వంకే చూస్తూ ఆమె చెబుతున్నది వింటున్నాను.
“ప్చ్, ఎవర్నని ఏమి లాభంలే! అమ్మ, అమ్మ ప్రేమ, మంచి-చెడు సెప్పే అమ్మ ఆదరణ లేని జీవనం, అందుకే ఇలాగయ్యింది,” అని బాధపడుతూ తిరిగి పూసలు వేరుచేసే పనిలో పడింది రాములు.
**
శనివారం నాడు కొబ్బరులమ్మి పెందరాళే వచ్చాడు తాత. రాములికి, నాకు కాసిన్ని ద్రాక్షపళ్ళు తెచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి పైమెట్టు మీద నా పక్కనే చెట్టునానుకొని కూకున్నాడు.

“రాములూ, ఇలా రాయే. ఈ ద్రాక్షలు కడిగి ఇద్దరు తినండి,” అంటూ ఎనక్కి జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు.

ఐదు నిముషాలైనా రాములు రానేలేదు. నా కర్ర తీసుకొని చెట్టుకు కట్టిన గంటని మెల్లగా కొట్టాను. అవసరం వస్తే రాములు కోసం అట్టా పిలవడం నాకలవాటే.

మరో రెండు నిముషాలకి వచ్చింది రాములు. మొహం దిగులుగా ఉంది. తాతని, ద్రాక్షని చూపెట్టా. ద్రాక్ష తీసుకొని లోనికెళ్ళి కాసేపటికి తాతకి టీ కూడా తెచ్చింది.
నాకు ద్రాక్ష, తాతకి టీ గ్లాసు అందించి తాత కాడనే కూకుంది.

“ఏమయిందే రాములు? బాగా ఏడ్చినట్టున్నావు. నీ పెనిమిటి సంగతేమయింది?” టీ తాగుతూ రాముల్ని అడిగాడు తాత.

బొళ్లున ఏడ్చేసింది రాములు. “వాడికి వ్యాధి ముదిరిందంటయ్యా. వాడి రెండో భార్య వాడి కాడ డబ్బులు తీసుకోడమే కాని, వాడి సంగతే పట్టించుకోదంట. మామని ఎవరితోనూ కలవనివ్వదంటయ్యా.
మామని చూడ్డానికి, చివరికి నేనెల్లినా, వాడ్ని చంపేస్తానందంటయ్యా,” అంది వెక్కుతూ ఆమె.

“బంగారం లాంటి నిన్ను పిల్లలు పుట్టలేదన్న పిచ్చి సాకుతో వదిలేసి, తెలిసి తెలిసి అసుమంటి దాన్ని మారు మనువాడితే, బాధలు పడక తప్పుతాదా? అది మాత్రం కన్నదా పిల్లల్ని? లేదే.
పైగా ఇద్దరూ కలిసి తాగుడికి బానిసయ్యారంట. వాడి ఖర్మ. నువ్వు బాధపడమాకు. నీ చేతుల్లో ఏం లేదే,” అంటూ రాముల్ని ఓదార్చాడు తాత.
ఖాళీ అయిన టీ గ్లాసు పక్కకెట్టి నిముషం ఆగాడు..

“అయినా, నువ్వు కూడా మొండిగా, వయసులో పెద్దోడైన నీ మేనమామనే మనువాడుతానని గోలెడితివే? చదువుకోకుండా, మాటినకుండా నీ అయ్య పక్షవాతంతో మంచాన పడేవరకు బాధపెడితివి… ఇప్పుడు నువ్వేడుస్తుండావు. నీ కష్టం చూసి నా గుండె కలిచేస్తుంది రాములు,” అన్నాడు తాత బాధగా.

**

రెండు రోజులయినా రాములు దిగులుగానే ఉంది. ఆమెని మాట్లాడించాలనే ప్రయత్నం చేస్తున్నా.

రాములట్టా మాటలేకుండా ఉంటే రోజంతా అస్సలు తోచడం లేదు. చేసేది లేక ఇంకింతసేపు పుస్తకం చదవటం చేస్తున్నా.

రెండో పుస్తకం సగమయ్యేప్పటికి చుట్టూ ఉన్న ప్రపంచం అక్షరమయంగా తోచింది నాకు. ఎక్కడ అక్షరాలు కనబడ్డా చదవడం సంతోషంగా ఉంది. చిన్న సాదా మాటలు గుణించుకొనే పనిలేకుండా చదవగలను. ఇప్పుడు చిన్న తరగతి పుస్తకాలు చదివి, లెక్కలు కూడా చేస్తున్నా.
**
మరో రెండు ఎండాకాలాలు, రెండు చలికాలాలు గడిచాయి. నాకు పన్నెండేళ్ళు నిండాయి.
గడిచిన రెండేళ్ళల్లో నా చదువు విషయంగా ఉమమ్మ నన్ను మెచ్చుకొంది.
నా మీద నాకు నమ్మకం, ధైర్యం వచ్చాయి.
‘ఇప్పుడు నాకు మాట వస్తే కాస్త చక్కంగానే మాట్లాడగలను కూడా!’ ఉమమ్మకి మల్లే …..అనుకున్నాను.
ఏదైనా బాగానే చదవగలను. రాయగలను. పెద్ద పదాలు కూడా అర్ధమవుతున్నాయి.

ముందుగా నా వెనుక రావి చెట్టునున్న బోర్డుల మీద వివరాలు సుళువుగా చదివాను.
‘విన్నపము’ అని రాసున్న బోర్డు మీద నా పేరు, నా పేరుతో పాటున్న వివరాలు ముందుగా చదివాను……
‘గాయత్రి’ అనే ఈ అమ్మాయి – మాట, నడక లేని అభాగ్యురాలు. జీవనాధారం లేని ఈ చిన్నారికి వైద్య సహాయార్ధం దయతో మీ విరాళాన్ని ‘గాయత్రి’ హుండీలో వేయ ప్రార్ధన.
ధన్యవాదములు…. – ఇట్లు ఆలయ నిర్వాహకులు ….

అక్కడినుండే అందరికీ నా పేరుతో పాటు పూర్తిగా నా గురించి తెలుస్తుందన్న సంగతి అర్ధమయ్యింది.

పోతే, పైన ఉన్నది పూజా వస్తువుల వివరాలు, ఖరీదుల పట్టికలు, డబ్బు చెల్లించే పద్ధతి….

‘ఆలయ నిధుల కోసం పూజాసామగ్రిని మీ వీలు కోసం విక్రయిస్తున్నది గాయత్రి. వస్తువులు కొన్నవారు నిధులని పక్కనే ఉన్న ‘గుడి’ హుండీలో వేయ ప్రార్ధన – ఇట్లు ఆలయ నిర్వాహకులు’
ఆరు నెల్లక్కోసారి ఆ పలకలకి, బోర్డులకి రంగులు వేయించి తిరిగి కొత్తగా రాయిస్తుంటారు పూజారయ్య.
(ఇంకా ఉంది )

రచనలో వినిపించే స్వరం ఎవరిది?!

 10565093_10152677529194683_7972848941163645770_n

పసునూరు రవీందర్ కథలు చదువుతున్న సమయంలోనే యింకో వేపు సమకాలీన అమెరికన్ కథ మీద జరుగుతున్న వొక చర్చ నన్ను అమితంగా ఆకట్టుకుంది – రవీందర్ తన కథల్లో సాగిస్తున్న అన్వేషణకీ, ఈ చర్చకి చాలా దగ్గరి చుట్టరికం వుందికాబట్టి. ఈ చర్చలోంచి మూడు విషయాలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాలి:

ఒకటి – వొక సమకాలీన సందర్భం లేదా సంఘటన అది ఇంకా జరుగుతూ వుండగానే దాన్ని కథ చేయగలమా? అంటే- ఇంకో రకంగా చెప్పాలంటే, జీవితంలోని immediacy (తక్షణికత)ని కథా లక్షణంగా మార్చగలమా?

రెండు: కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు?

మూడు: భిన్నకులాలూ మతాలూ వున్న సమూహాల్లో భిన్నస్వరాలు ఎలాంటి ప్రాతినిధ్యాన్ని (representation) కోరుకుంటాయి?

రవీందర్ కథల్లో ఈ మూడు విషయాలూ వొక బలమైన వాదాన్ని వినిపిస్తాయి. రవీందర్ తన కథల్ని “తెలంగాణా దళిత కథలు” అంటున్నాడు. ఆ విధంగా తన కథల్ని భిన్నంగా చదవడానికి తనే వొక తలుపు తీసి మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు.

అయితే, అలాంటి వొక “తెలంగాణా దళిత” తలుపు తెరచి, తన చదువరిని ఆ తలుపులోంచే తనని చదివి తీరాలని అతనేమీ మంకు పట్టు పట్టడం లేదు. నేను చదివినంత వరకూ, నాకు అర్థమైనంత వరకూ కథని discourse గా మార్చి, ఆ కథలోంచి వొక చర్చని సహనంతో తీసుకువచ్చి, అంతే సహనంతో మిగిలిన గొంతులు వినడానికి కూడా సిద్ధంగా వుండే కొద్దిమంది రచయితల్లో రవీందర్ వొకడని కచ్చితంగా చెప్పగలను.

అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సంపుటిలో కథకుడిగా రవీందర్ మనం తెలిసీ తెలిసీ దాచిపెట్టే కొన్ని కీలకమైన విషయాలను uncover చేస్తున్నాడు.

Uncover అనే మాటని నేను “to allow (something) to be seen by removing a covering” అనే కచ్చితమైన అర్థంలో వాడుతున్నాను, ఎందుకంటే రవీందర్ ఈ సంపుటికి ఇచ్చిన శీర్షిక ద్వారానే కాకుండా, పుస్తకం లోపలి కథల్లో కూడా ఖాయంగా చేస్తున్న పనే అదే కాబట్టి! ఈ uncovering కీ, పైన ప్రస్తావించిన మూడు విషయాలకూ –immediacy, authorial voice, representation కీ చుట్టరికం వుంది. రవీందర్ కథల్లో ఇతరేతర అంశాలు చాలా వున్నప్పటికీ, అతను అతనుగా ఈ కథల్లో అచ్చంగా ఏం చేస్తున్నాడో చెప్పడం మాత్రమే యిక్కడ నా ప్రయత్నం.

1

ఇప్పటికి అరవయ్యేడు ఏళ్ల కిందట అమెరికా కథానిక వొక రూపాన్ని వెతుక్కుంటున్న సమయంలో Martha Foley అనే విమర్శకురాలు ఇలా రాసింది : It is a literary truism that there must be a period of distillation before the real impact of some tremendous event, either historical or personal, can emerge in writing.

ఆమె ప్రధానంగా కథలో సమకాలీనత గురించి మాట్లాడుతోంది. వొక సంఘటన జరిగిన వెంటనే లేదా, వొక సందర్భం కొనసాగుతూ వుండగానో దాన్ని కథగా మలచలేమన్నది ఆమె వాదం. కొంత కాలం గడిస్తే తప్ప ఆ సంఘటనా, సందర్భం నిజమైన ప్రభావం ఏమిటో తెలీదనీ, అది తెలిస్తే గాని దాన్ని కథగా మలచలేమనీ ఆమె అభిప్రాయం. అంటే, ఆ అనుభవం పక్వమయ్యే దాకా ఎదురుచూడాలని ఆమె అనేది.

ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచనాలు చెప్పినా, కవిత్వం ఉద్వేగ కళ. వొక వుద్వేగాన్ని వ్యక్తీకరించగలిగితే కవిత్వం పని చాలా మటుకు అయిపోయినట్టే. దానికి భిన్నంగా కథ అనేది ప్రధానంగా ఆలోచనకి సంబంధించిన ప్రక్రియ. కేవలం వుద్వేగానికే పరిమితమయిపోతానంటే ఆ కథని అంత తేలికగా వొప్పుకోలేం. అనుభవ సారం ఎంతో కొంత కథలో ఇమడాలి. కథ చదివాక కొంత నిగ్రహమైన ఆలోచనని కూడా చదువరి కోరుకుంటాడు. ఆ మేరకు Martha Foley వాదంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. కాని, అది కొంత మాత్రమే!

కాని, 9/11 తరవాత వచ్చిన అమెరికన్ కథకులూ, విమర్శకులూ ఈ వాదాన్ని పడనివ్వడం లేదు. వొక ఏదో సందర్భంలో శ్రీశ్రీ అన్నారట: దినదినాభివృద్ది కాదు, క్షణ క్షణాభివృద్ది కోరుకుంటున్నానని! అభివృద్ధి వేగాన్ని క్షణాలతో కొలుస్తున్న కాలం ఇది. ముఖ్యంగా సాంకేతిక విప్లవం వచ్చాక ప్రపంచం చాలా మారిపోయింది. భౌతిక సాంకేతికత, వ్యక్తి మానసికతా రెండూ వొక విధమైన అంతుపట్టని యుద్ధంలో కూరుకుపోతున్న దశ ఇది. ఈ రెండీటికి మధ్యా వుండే దూరాన్ని ఇప్పుడిప్పుడే తెలుగు కథా రచయితలు పట్టించుకుంటున్నారు. కథల్లో అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలూ, సోషల్ మీడియా నెట్ వర్కుల ప్రస్తావనా, వాటి పర్యవసానాలూ కథల్లోకి అనివార్యంగా ప్రవేశిస్తున్నాయి. అంటే, గ్లోబలైజేషన్ కి సంబంధించి రెండో దశలోకి తెలుగుకథ ప్రవేశించిందనే చెప్పాలి. రవీందర్ ఈ కథా సంపుటికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని పేరు పెట్టడం ఈ దశకి బలమైన సంకేతం. అలా పేరు పెట్టడం ద్వారా జీవితంలోని immediacy (తక్షణికత)ని తన కథా లక్షణంగా చెప్పక చెప్తున్నాడు రవీందర్.

రవీందర్ వ్యక్తీకరణలో ఈ తక్షణికత ఎలాంటి కథలుగా మారుతోంది? కాలానికి అతీతమైన నిర్జీవ విషయాల్నితన కథకి వస్తువుగా ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోలేడు రవీందర్. తన కాలంలో తన స్థలంలో నిలబడి మాట్లాడడం అతని కథకి జీవలక్షణం. ఈ సంపుటిలోని మొదటి కథ –వెరేవర్ యు గో -అనే కథలోనే రవీందర్ ఈ లక్షణానికి నాంది పలుకుతాడు. ఇప్పటికీ మనలోని కొంత మంది “లౌకికులు” మనకే కులాలూ మతాలూ ప్రాంతాలూ లేవని వొక అమూర్త మానవ ముఖాన్ని(abstract human face) తొడుక్కొని వుంటారు. వాళ్ళు తొడుక్కుంటే పర్లేదు కాని, ఇతరులు కూడా అలాంటిదేదో ముసుగు తొడుక్కోకపోతే అనుమానంగా చూస్తారు. కాని, కులాలూ మతాలూ ప్రాంతాలూ ఇంకా ఇంకా బలంగా మన ఉనికిని నిర్ణయిస్తూనే వున్నాయని, అవి వేరే రూపం దాల్చి మన మధ్యనే   వున్నాయని గుర్తించడానికి నిరాకరిస్తారు. ఇది తెలిసీ తెలిసీ నిరాకరించడం! “ఎహె గీ కాలంల …క్యాస్ట్ గీస్ట్ ఎక్కడిది సార్?!” అనే పెద్దమనిషి తరహా ముసుగు uncover చేసే కథ ఇది.

రవీందర్ కథల్లో చాలా మటుకు కులం ముఖ్యమైన విషయంగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు. పది నిజాల కంటే వొక అబద్దం ఎక్కువ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. పైగా, ఆ అబద్ధం ఆ పది నిజాల్ని కప్పిపుచ్చేది అయితే కోపం ఇంకా కట్టలు తెచ్చుకుంటుంది. రవీందర్ కథల్లో ఈ సామాజిక అధర్మం మీద ధర్మాగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, వొక్కో కథనీ దగ్గిరగా చదువుకుంటూ వెళ్తే, అతనిలో కేవలం కోపం మాత్రమే లేదనీ, ఆ కోపాన్ని నిగ్రహించుకొని మాట్లాడే శక్తి కూడా చాలానే ఉందనీ అర్థమవుతుంది. ఆ నిగ్రహం తన చుట్టూ వున్న అధర్మాన్ని ఆలోచనతో చూడడం వల్ల సాధ్యపడిందనీ అర్థమవుతుంది. ఉదాహరణకు: గోవర్ణం కథ. మొదటి సారి ఈ కథ చదివినప్పుడు ఇందులోని కథాంశాన్ని నేను నమ్మలేకపోయాను. అంటే, నాగరికుల మీద నాకూ కొన్ని భ్రమలున్నాయని, ఆ భ్రమ వల్లనే ఈ కథని నేను మొదట నమ్మలేకపోయాననీ తరవాత నన్ను నేను తర్కించుకుంటే అర్థమైంది. ఈ కథలోని విషయం నా కవరేజీ పరిధిలో లేకపోవడం కూడా ఇంకో కారణం కావచ్చు.

రవీందర్ కథలు ఎలాంటి కనువిప్పు కలిగిస్తాయో అదొక ఉదాహరణ మాత్రమే. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలో వొక పాత్ర చేత అనిపిస్తాడు రవీందర్. “పట్నంల కూడా కులముంటదే. కాకుంటే బయిటికి కనిపించకుంట దాని పని అది చేస్తుంటది. దానితో దెబ్బతిన్నోల్లకే అది కనిపిస్తది దాన్ని పాటిస్తూ, ఆదిపత్యం చెలాయించే పెద్దకులపోళ్ళకి అది లేనట్టుగా భ్రమింప జేస్తది. గందుకే, ఇగ బాధపదేటోళ్ళు బాధపడుతుంటే, బాధపెడ్తున్నోల్లు మాత్రం కులమెక్కడిదని నీతులు చెబ్తుంటరే!” ఇది వొక పాత్రలోంచి రవీందర్ ఆవేదన, ఆగ్రహం!

సమకాలీనం అన్న మాటని తెలుగు సాహిత్యంలో చాలా అన్యాయంగా వాడేస్తున్నారు. నిజానికి సమకాలీనం అనదగ్గ రచనలు చాలా తక్కువగా వస్తున్నాయి. రచయితలు వొక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని, అదే సమకాలీనం అనుకుంటూ ఆ లోకంలోనే అందరూ ఉండాలన్న అందంగా నిర్మిస్తున్న కాలం ఇది. ముఖ్యంగా చాలా మంది కథకులకు (ఇక కవుల సంగతి చెప్పక్కరలేదు!) సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకునే శక్తి లేదు. వాళ్ళ చదువూ అవగాహనా అందుకు సరిపోవడం లేదన్నది నా అభిప్రాయం. తమ చుట్టూ వున్న లోకం రాజకీయ అతీతంగా, పరిశుద్ధంగా ఉండాలన్న భ్రమ ఇంకా చాలా మందిలో వుంది. కార్పోరేట్ జమానాలో కులాలు లేవనడం ఎంత అబద్దమో దానికి పది రెట్లు అబద్దం ఈ రాజకీయాతీత కలవరింత. అయితే, రాజకీయ లోకంలో ఇంకా వేరే భ్రమలు కొన్ని వున్నాయి. అలాంటి భ్రమల నిలువుటద్దం ఊగి..ఊగి ఉయ్యాల కథ.

రవీందర్ కథలు అచ్చంగా సమకాలీన కథలు- నాకు అర్థమైనంత వరకూ ఆ సమకాలీనత ఎంత సమకాలీనం అంటే అవి ఈ క్షణపు వేగాన్ని అందుకుంటున్న కథలు. ప్రతి కథలోనూ వొక పట్టి పీడిస్తున్న ఇప్పటి సమస్యా, దాని ఆనుపానులు తెలుసుకోవాలనుకునే తపనా, అన్నిటికీ మించి రవీందర్ పరాయీ స్వరాల మీద ఆధారపడకుండా తన గొంతుకతో మాట్లాడాలన్న వెతుకులాటా ఈ కథల లక్షణం.

ఈ కథల్లోంచి రవీందర్ స్వరాన్ని ఎలా వినాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు? అన్న రెండో విషయానికి వద్దాం.

1545666_10152155164074683_826845966_n

 

2

 

“What do you have to say?”

“This. I have this to say, and I want you to listen to my voice, to the tone of my voice, because that will tell you what I have to say.”

–          Elizabeth Strout, 2013.

కథలో గానీ కథనంలోగానీ రచయిత కనిపించకూడదనీ, రచయిత స్వరం వినిపించకూడదనీ చాలా కాలంగా వొక సాహిత్య సౌందర్య భ్రాంతిని మనం నమ్ముతూ వచ్చాం; ఇప్పటికీ నమ్ముతున్నాం. అలాంటి స్వరాన్ని సవరించుకునే నెపం మీద చాలా మంది కథకులు సాహిత్యంలో సమకాలీన లేదా తక్షణ వాస్తవికతని వాయిదా వేస్తూ వెళ్తారు. ఆ అనుభవం పరిపక్వమైన తరవాతనే మాట్లాడుకుందామనుకునే ధోరణి తక్షణ జీవితాన్ని గురించి ఏమీ అనలేని స్థితికి రచయితని నెట్టేస్తుంది. అంటే, తక్షణ జీవితం మొత్తంగానే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయిపోతుంది మన సాహిత్యంలో!

అస్తిత్వవాద రచనల్లో రచయిత స్వరం మీద ఎలాంటి కట్టుబాట్లూ లేవు. ఇలాంటి రచనల్లో సౌందర్యం కేవలం రూపపరమైన పరిమితుల్లో మాత్రమే వుండిపోదు. రచయిత చెప్పదలచుకున్న విషయమూ దాని సూటిదనం కూడా రచనా సౌందర్యంలో విడదీయలేని భాగమవుతాయి. ఫలానా విషయం కచ్చితంగా మాట్లాడి తీరాలన్న అస్తిత్వ కట్టుబాటు రచనని నడిపిస్తుంది. అయితే, ఆ “ఫలానా” రచయితని బలహీనపరచవచ్చు కూడా- అంటే, వొక విధంగా కథన సౌందర్యం పట్ల ప్రత్యేక దృష్టి వున్న రచయిత కంటే, అస్తిత్వవాద రచయితకి శిల్పం ఎక్కువ కత్తి మీద సాము అవుతుంది, తన స్వరం బలహీనపడకుండా కథనం కుంటుపడకుండా చదువరిని వొకే దృక్కోణంలో ఖైదు చేయకుండా కథ నడిపించాలి కాబట్టి!

రవీందర్ కథనంలో ఇలాంటి సందిగ్ధం కనిపించదు. ఏం చెప్పాలో అతనికి కచ్చితంగా తెలుసు. అంతకంటే ముఖ్యంగా ఎలా చెప్పాలో కూడా తెలుసు. ఉదాహరణకు పెంజీకటి కథ. జీవితంలోని కొన్ని అనుభవాల్ని వొక మహాకావ్యం లేదా మహానవల (శ్రీశ్రీ, రావిశాస్త్రిలు వాడిన అర్థంలోనే) గా వ్యక్తం చేయాలన్న సృజనాత్మక కోరిక మనవాళ్ళలో కొత్త కాదు. కాని, అవి రెండూ సైజుకి సంబంధించిన అంశాలు అనుకున్నప్పుడే సమస్య. సాహిత్య రూపం అనే భావన స్వభావం మారింది అనుకోడానికి సిద్ధంగా వుంటే, చిన్న కవిత చిన్న కథ కూడా వొక మహాకావ్యం, మహానవల చేయగలిగే పని చేస్తుంది. శ్రీశ్రీ ‘ఆహా” కవిత నా దృష్టిలోమహాకావ్యమే, అలాగే, రావిశాస్త్రి ‘పిపీలికం’ మహానవలే! రవీందర్ కథ పెంజీకటి ఇక్కడ అచ్చులో కొన్ని పేజీలే కాని, ఆ కథ ఆవిష్కరించే జీవితం వొక మహానవల పరిమాణంలో వుంది.

ఈ కథని ఊహించడంలో రవీందర్ వెళ్ళిన దూరాలు నాకు ఆసక్తి కలిగించాయి. ఈ కథారూపంలో నాటకానికి సంబంధించిన నిర్మాణ అంశాల్ని చాలా సహజంగా, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. అంతకంటే ఎక్కువగా వొక నవలకి కావలసిన జీవితపు ముడిసరుకు తీసుకొని, దాన్ని కొన్ని పేజీల కథలోకి కుదించడం రవీందర్ శిల్ప విజయం.

అయితే, రవీందర్ కథనస్వరానికి వున్న నిర్దిష్టత వల్లనే ఇది సాధ్యపడిందని నా నమ్మకం. కథావస్తువుని objective గా తీసుకొని, అందులో subjective tone ని కాపాడుకుంటూ వెళ్ళడం ద్వారా రవీందర్ ఈ కథల్లో శిల్పపరంగా కనీసం రెండు మూడు అడుగులు అదనంగా నడుచుకుంటూ వెళ్ళాడని నేను అనుకున్నా. ఈ నడవడంలో అతనిలో వున్న కథకుడు వొక కొత్త ఆత్మవిశ్వాసంతో మెరవడం కూడా నేను చూస్తున్నా.

సాహిత్య వాతావరణం ఆసక్తికరంగా కనిపిస్తున్నప్పటికీ- రచయిత వ్యక్తిగత స్థాయిలో ఎంతో కొంత నిరాశలోకీ, దిగులులోకి నెట్టివేయబడుతున్న కాలం కాని కాలంలో ఆ రచయితస్వరంలో, నడకలో ఈ ఆత్మవిశ్వాసం ఎటు నించి వస్తుంది?

నాకు తెలిసీ అది ఆ రచయిత తనని తాను ధీమాగా ధిక్కారంగా అలాగే కొంచెం open గా తెరుచుకునే representative vision (ప్రాతినిధ్యపు దృష్టి) నించి వస్తుంది. అస్తిత్వ వాద రచయిత ఇతర బహుముఖాలకి ఎంత open గా వుండగలడు? అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది.

 

3

రవీందర్ కథలు రాస్తున్న ప్రస్తుత దశలో కేవలం తెలంగాణా కథలే కాదు, దళిత కథలే కాదు. ఇతర అస్తిత్వాల రచనలూ వస్తున్నాయి. కాని, ఈ కథలకి రవీందర్ “తెలంగాణా దళిత కథలు” అని ఉపశీర్షిక పెట్టుకున్నాడు. అలా బహిరంగంగా తన అస్తిత్వం ప్రకటించుకోవడంలో వొక సౌకర్యమూ అసౌకర్యమూ వున్నాయి. ఆ అస్తిత్వ కోణం నించి మాత్రమే తనని చూడాలన్న కట్టడి అతను చదువరికి పెడ్తున్నాడా? పెడితే, అప్పుడు చదువరి కోరుకునే స్వేచ్చ ఏమవుతుంది?

ముఖ్యంగా సాహిత్య రంగంలో అన్ని వేపులా చదువరి వొక open-endedness ని కోరుకుంటున్న కాలం ఇది. అదే సమయంలో అనేక రకాల ప్రాతినిధ్యాలు రచనలలోకి వస్తున్నాయి. రవీందర్ కథల్ని నేను రవీందర్ చెప్పిన “తెలంగాణా దళిత” కోణం నించి మాత్రమే కాదు, వాటిని నా వైపు నించి – అంటే నాకు వుండే భిన్న అస్తిత్వాల – నించి కూడా చదువుతాను. నా reading ని రవీందర్ కట్టడి చేయలేడు, చేయాలనే వుద్దేశం కూడా అతనికి వుండకపోవచ్చు. కాని, వొక చదువరిగా నేను నా ప్రపంచంలోకి రవీందర్ ని ఎలా పిలుచుకోవాలి?

The other – అన్యత్వం- అన్న భావన ఇప్పుడు సాహిత్య రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ పెద్ద సమస్యే. ఎందుకంటే, సమాజంలోని representations తప్పనిసరిగా సాహిత్యంలోకి వస్తాయి కాబట్టి-

If literature is a “representation of life,” then representation is exactly the place where “life” in all its social and subjective complexity, gets into the literary work. (W.J.T. Mitchell)

ఈ విషయాన్ని ఎలాంటి సంశయాలూ లేకుండా వొప్పుకుంటాను కాబట్టి, రవీందర్ open చేసే “social and subjective complexities” నాకు కావాలి. అయితే, చదువరిగా నాకు వుండే అవే complexities తోనే నేనూ రవీందర్ ప్రపంచంలోకి వెళ్ళాలి. “తెలంగాణా” “దళిత” అన్నప్పుడు రవీందర్ నాకు వొక doubly oppressed identity కేంద్రంగా పనిచేసే ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాడు. అంటే, రెండు ప్రాతినిధ్యాల మధ్యకు తీసుకు వెళ్తున్నాడు. అవి రెండూ కాని నాదైన ప్రాతినిధ్య భూమికతో నేను ఈ కథల్లోకి వెళ్ళాలి. అంటే, మా ఇద్దరి మధ్య వొక dialogic space తెరుచుకోవాలన్నమాట.

మన సాహిత్యంలో ఇలాంటి dialogic space కి ఇంకా అనువైన కాలం రాలేదు. తన సానుకూల క్షేత్రం (comfort zone) నించి విడివడి ఇతర spaces లోకి వెళ్ళే మానసిక సంసిద్ధత లేదా స్వాతంత్రం ఇంకా రాలేదు మనలో చాలా మందికి – అలాంటి మానసిక స్వాతంత్రం లేనప్పుడు రవీందర్ గాని ఇంకో రచయిత కాని, తను ఫలానా అని కచ్చితంగా చెప్పుకున్నప్పుడు అది మొదట్లో చాలా అసౌకర్యంగా, uneasy గా వుంటుంది. కాని, అలా వుండడమే మంచిది. ఆ తరవాతి సంభాషణ హాయిగా వుంటుంది. నా భిన్నమైన అస్తిత్వ కోణం నించి నేను రవీందర్ “తెలంగాణా” “దళిత” కథలు చదువుతున్నప్పుడు యీ కథల్లోని జీవితం, వాతావరణం, పాత్రలు, సంఘర్షణలూ, ఉద్యమాలూ, ఆశలూ నిస్పృహలూ నాకు తెలిసిన లోకంలో నా కవరేజ్ ఏరియాలో లేని సంగతుల్ని, లేదా నేను కవర్ చేయడానికి ఇష్టపడని/ నిరాకరించే విషయాల్నీ రవీందర్ నాకు “ఇదీ” అని pointed గా చూపిస్తున్నాడు. సాహిత్యంలో తన representation గురించి resolute concerns వున్న బుద్ధిజీవి అయిన రచయిత మాత్రమే ఇలాంటి concern తో మనల్ని పలకరిస్తాడు. అయితే, నేను ఇక్కడ resolute అని దాన్ని qualify చేయడాన్ని మీరు గమనించాలి.

రవీందర్ కి తెలంగాణా దళిత వాదం అతని రచనా జీవన విధానం. అతని అనేక సామాజిక సాంస్కృతిక సాహిత్య అంశాలు దాని చుట్టూ తిరుగుతాయి. దాన్నించి అతన్ని విడిగా చూడలేనట్టే, అతని imaginative realm ని కూడా వొక వేరే ద్వీపంగా ఊహించలేం. అదే realmలో వుంటూ వొక కథకుడిగా రవీందర్ చాలా జీవితాన్ని ఈ కథల్లో కవర్ చేస్తున్నాడు. దాన్ని నేను resolute concern అని అంటున్నా. అస్తిత్వవాదం విధించే కనిపించని సంకెలని గౌరవిస్తూనే, జీవితంలోని ఇతర ప్రాతినిధ్య అంశాలని సృజనాత్మకంగా అక్కున చేర్చుకోవడంలో రవీందర్ మూలతత్వం అర్థమవుతుంది. బహుశా, ఆ కారణంగానే రవీందర్ ఆవిష్కరిస్తున్న తెలంగాణా దళిత దృశ్యం ఇక్కడ నిండు కాన్వాస్ మీద convincing గా కనిపిస్తుంది. అయితే, ఇంకాస్త ముందుకు వెళ్లి, రవీందర్ కథలు కేవలం “తెలంగాణా దళిత” కథలు కావనీ, “తెలంగాణా దళిత రాజకీయ” కథలనీ చెప్పడం అతని కథాతత్వానికి అతికినట్టు సరిపోతుంది. అస్తిత్వవాద రాజకీయ కోణం అనేది తెలుగు సాహిత్యంలో ఇంకా సరిగా ఆవిష్కారం కావడం లేదన్నది నిజం. ఎందుకంటే, ఆ విషయాన్ని సవిమర్శతో చూసే సంయమనం ఇంకా మనకి రాలేదు. వాదాలని ఉద్వేగ దశలోనే కాకుండా, వాటి తరవాతి ఆలోచనాత్మక దశని కూడా చూడగలిగే వోర్పు వున్నప్పుడు మాత్రమే రచయితకి రాజకీయ విమర్శ సాధ్యపడుతుంది. “పొద్దయింది” “ఊగి ఊగి ఉయ్యాల..” “అన్నీ తానై..”లాంటి కథల్లో ఈ కోణాన్ని చూడవచ్చు. ఉద్విగ్న రాజకీయ సన్నివేశంలో బతుకుతూ కూడా, రచయితగా ఎలాంటి objectivity ని వ్యక్తం చేయవచ్చో రవీందర్ ఇక్కడ రుజువు చేస్తున్నాడు.

4

నాలుగు ముక్కల్లో ఏ రచన గురించి అయినా ఎంత న్యాయం చేయగలమో ఇంకా నాకు అపనమ్మకమే. మన దగ్గిర వున్న విమర్శ సాధనాలు చాలా చాలా కొద్ది. మన ముందు వున్న జీవితాలు సంక్లిష్టంగా వున్నప్పుడు, కథకులు ఆ సంక్లిష్టతని అందుకొని దానికి తగిన కాన్వాస్ కోసం వెతుక్కునే తపనలో వున్నపుడు, విమర్శ స్థాయిలో మాట్లాడేది అంత తృప్తినివ్వదు. అందుకే, చదువరికి తన spaceలో తను సంచరించే స్వేచ్చనిచ్చే రచనని, విమర్శని నేను ఇష్టపడ్తాను. అలాగే, రచయిత తనకి తానుగా ఇచ్చే స్వేచ్ఛ కూడా నాకు ఇష్టం. రవీందర్ కూడా అలాంటి స్వేచ్చని ఇష్టపడే తాత్వికుడు. ఈ కథల్లో నాకు కొన్ని వర్ణనలు నాకు అసంతృప్తి కలిగించిన మాట వాస్తవం. ఉదాహరణకు : “జాగీరు” కథలో “మా ఇద్దరి మధ్య స్నేహ కుసుమాలు విరబూశాయి.” లాంటి వాక్యాలు చాలా archaic గా అనిపించాయి. ఈ కథల్లో సాధారణంగా కనిపించే రవీందర్ వాక్యాలకు పూర్తి వ్యతిరేకమైన వర్ణనా శైలి అది. అది శైలిని మరింత కమ్ముకోకుండానే వాటికి దూరంగా వుండి రాయాలసిన అవసరం ఇప్పటి రచయితలకి వుంది.

ఆ వొక్క చిన్న లోపం మినహాయించి రవీందర్ కథాభాష చాలా హాయిగా వుంటుంది, కొత్త భాషని నిజమయిన యాసని కథలోకి అద్భుతంగా తీసుకువచ్చాడు రవీందర్. అతను తీసుకువస్తున్న paradigm shift కి ఈ భాషతో సహా అతని వస్తువూ, సంవిధానమూ, కథాకథనమూ బాగా వొదిగాయి. తెలంగాణా దళిత జీవితాల్లో balanced diet పెద్ద కల. కాని, తెలంగాణా దళిత కథల్లో ఆ balanced diet కలగా మిగలకూడదన్న మొండి పట్టుదల రవీందర్ లో కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇలాంటి కథా ధోరణికి చాలా అవసరం.

–          అఫ్సర్

జులై 5, 2014.

 

 

 

 

 

లెమనేడ్

Kadha-Saranga-2-300x268

పదకొండు గంటలవేళప్పుడు నేను ఇంటిబయట నిమ్మకాయల బండి దగ్గర్నించి లోపలి కెళ్ళబోతుంటే వీధిమలుపు దగ్గర కనిపించింది మా అక్కయ్య.

“అయ్యో, వెళ్ళిపోయాడే! నేను కూడా తీసుకునేదాన్ని నిమ్మకాయలు” అంది దగ్గరికి రాగానే. నేనేం మాట్లాడకుండా అక్క చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాను.

“ష్ష్…” అంటూ ఆయాసపడుతూ కుర్చీలో కూర్చుంది అక్క. “దగ్గర్లోనే ఉంటున్నా వారానికోసారైనా కలవడానికి కుదరట్లేదు. ఇవాళ మీ బావ ఎవరిదో పెళ్ళని వెళ్ళారు. ఇంట్లో ఒక్కదాన్నేకదాని ఇట్లా వచ్చాను” అంది.

మంచినీళ్ళు తెచ్చిచ్చి “కాఫీ పెట్టనా?” అని అడిగాను.

“అబ్బ! ఏం ఎండలే తల్లీ! ‘నాలుగు వీధులు దాటడమేకదా! అంతమాత్రమైనా నడవకపోతే ఎట్లా?’ అనుకుని రిక్షా ఎక్కలేదు. నోరెండిపోయి నాలుక పిడచకట్టుకుపోతోంది. కాఫీ వద్దుగానీ చల్లగా కాసిని నిమ్మకాయనీళ్ళు కలిపివ్వు” అంది అక్క.

“ఇంట్లో నిమ్మకాయలు లేవే” ఇబ్బందిగా చెప్పాను.

“అదేమిటే, నేను వచ్చేటప్పటికి నిమ్మకాయలబండి దగ్గరే ఉన్నావు?” ఆశ్చర్యంగా అడిగింది అక్క.

“ఎక్కడ కొన్నాను? బేరం కుదరందే” అన్న నా సమాధానానికి ప్రశ్నార్థకంగా నావైపు చూసింది అక్క.

“ఆకురాపిడి మచ్చల్తో కసుగాయల్లా ఉన్నాయి, ఒక్కోటి మూడురూపాయలు చెప్పాడు. ఎక్కువ తీసుకుంటే రేటు కాస్త తగ్గిస్తాడేమోనని’ డజనెంతకిస్తావు?’ అనడిగాను. ‘ముప్ఫైయారు ‘ అన్నాడు నిర్లక్ష్యంగా. ‘ముప్ఫై కిస్తావా?’ అన్ననంతే, నావైపు చూడనుకూడా చూడకుండా బండి నెట్టుకుని వెళ్ళిపోయాడు” ఉక్రోషంగా చెప్పాను.

“హ్హు…!”  అంటూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలింది అక్క. “ఎండవేళప్పుడు చల్లగా తాగొచ్చు, ఎవరైనా ఇంటికొస్తే ఇవ్వడానికి కూడా బాగుంటుంది, నిమ్మకాయ షర్బతు చేసి పెట్టుకుందామని బుద్ధి పుట్టింది మొన్న. నిమ్మకాయలు కొనుక్కొద్దామని బజారు కెళ్ళాను. రోడ్డుపక్కన గంపలో పెట్టుకుని అమ్ముతున్నాడు గోళీక్కాయలంత నిమ్మకాయలు. వాణ్ణేదో ఉద్ధరిస్తున్నా ననుకుంటూ ‘యాభైకాయలు తీసుకుంటాను. కరెక్టు రేటు చెప్పు’ అన్నాను. వాడు నన్నో అడవిమృగాన్ని చూసినట్టు చూశాడు. ‘యాభైకాయలు నువ్వు తీసుకుంటే వాళ్ళందరికీ ఏమమ్మాలి?’ అన్నాడు చుట్టూ నిలబడి ఉన్నవాళ్ళను చూపిస్తూ. వాడి మాటలు అర్థంకాక నేను వెర్రి చూపులు చూస్తుంటే ‘మనిషికి పదికాయలు మించి ఇచ్చేది లేదు ‘ అన్నాడు. నేను ఆ షాకులోంచి బయటపడి ‘పోనీ, ఆ పదికాయలే తీసుకుందాం’ అనుకునేటప్పటికీ వాడు గంప ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడు. ‘ఎట్లాంటి రోజులొచ్చాయి?’ అనుకున్నాను. ఇక్కడికి వస్తుంటే ఎదురుగా నిమ్మకాయలబండి కనిపించగానే ప్రాణం లేచొచ్చింది. కానీ… ఏం చేస్తాం? ప్రాప్తం లేదు” అంది అక్క ఇంకా దీక్ఘమైన మరో నిట్టూర్పు వదిలి.

అక్క మాటలకి బిత్తరపోయిన నేను అసంకల్పితంగా టీవీ పెట్టాను.

ఏదో సినిమా పాట వస్తోంది. హీరో, హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి పచ్చికబయల్లో కింద పడుకున్నారు. పైనెక్కడో లారీల్తో గుమ్మరించినట్టు నిమ్మపళ్ళు దొర్లుకుంటూ వచ్చి వాళ్ళ చుట్టూ చేరిపోయాయి. లాంగ్షాట్లో అప్పటిదాకా ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీద ఇద్దరు మనుషుల ఆకారాలున్నట్టు కనిపిస్తున్న సీనల్లా పసుపుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీదికి మారిపోయింది.

చిరాగ్గా ఏదో గొణుక్కుంటూ అక్క నా చేతిలోంచి రిమోట్ లాక్కుని ఛానల్ మార్చింది.

అక్కడ వ్యాపార ప్రకటనలు వస్తున్నాయి. నల్లగా నిగనిగలాడుతున్న ఒకమ్మాయి సబ్బంతా అరగదీసి ఒళ్ళు రుద్దీ రుద్దీ స్నానం చేసి మిలమిలా మెరిసిపోతూ బయటికొచ్చి అందాలరాణి కిరీటం గెలుచుకుంది. కిరీటం ఆ అమ్మాయి శిరస్సు నలంకరించగానే నిమ్మకాయల వాన కురిసింది. ‘శ్రేష్ఠమైన నిమ్మకాయల రసంతో మీ చర్మసౌందర్యంకోసం ప్రత్యేకంగా తయారుచేసిన మా సబ్బునే వాడండి’ అనే బ్యాక్గ్రౌండ్ ఎనౌన్స్మెంట్తో ప్రకటన ముగిసింది.

అక్క మొహంలో చిరాకు ఇంకా ఎక్కువైంది. మళ్ళీ ఛానల్ మార్చింది. అక్కడా ప్రకటనలే వస్తున్నాయి.

పనిమనిషి అంట్లు తోముతూ సబ్బుని విసిరికొట్టింది. యజమానురాలు పనిమనిషిమీద చెయ్యెత్తింది. పనిమనిషి యజమానురాలిని దూరంగా నెట్టేసి బొడ్లోంచి ఇంకో సబ్బు తీసి దాంతో అంట్లు తోమి తళతళా మెరిపించింది. యజమానురాలు నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తుంటే పనిమనిషి “ఒక్కో సబ్బులో పది నిమ్మకాయల రసముంటుంది అమ్మగారూ! ఎంత జిడ్డుపట్టిన గిన్నెలైనా, మాడిపోయిన అంట్లైనా దీని దెబ్బకి లొంగాల్సిందే” అంది. ఇద్దరూ కలిసి నిమ్మకాయలు ఎగరేసుకుంటూ డాన్సు చెయ్యడం మొదలుపెట్టారు.

అక్క మొహం చూస్తే రిమోట్ని టీవీమీదికి విసిరేస్తుందేమోనని భయమేసి, రిమోట్ అక్క చేతిలోంచి పీక్కుని, ఛానల్ మార్చి, రిమోట్ దూరంగా పెట్టి వంటింట్లో కెళ్ళాను.

నేను కుక్కరు పెట్టి బయటికి రాగానే “ముందా టీవీ ఆపు” అని అరిచింది అక్క. నేను బెదిరిపోయి గబుక్కున టీవీ ఆపేశాను.

“పళ్ళు తోముకునే పేస్టులో నిమ్మకాయట, లెట్రిన్ కడుక్కునే లిక్విడ్లో నిమ్మకాయట, నాలుగురోజులు పోతే ‘మీరు బూట్లకి వేసుకునే పాలిష్లో నిమ్మకాయ ఉందా? కళ్ళకు పెట్టుకునే కాటుకలో నిమ్మకాయ ఉందా?’ అని కూడా అడుగుతారు. వాళ్ళకి పిచ్చో, మనకి పిచ్చో అర్థం కావట్లేదు” కోపంతో బుసలు కొడుతోంది అక్క.

‘అక్కని చల్లబరచడం ఎట్లాగా’ అని ఆలోచిస్తూ లోపలికెళ్ళి, అట్నించి ఎకాఎకిని బయటికి గెంతి, కాసేపట్లో అదే వేగంతో ఇంటికొచ్చాను.

“ఏమిటే ఆ పరుగులు?” కంగారుగా అడిగింది అక్క.

“ఉండు, ఇప్పుడే వస్తా” అంటూ వంటింట్లోకి దూరాను.

పదినిముషాల తర్వాత వంటింట్లోంచి ఇవతలికి వచ్చిన నన్ను “ఇప్పుడే వస్తానని ఇంతసేపు చేశావేంటి?” అయోమయగా అడిగింది అక్క.

మాట్లాడకుండా నా చేతిలోని గ్లాసు అక్క చేతిలో పెట్టి ఎదురుగా కూర్చున్నాను.

“ఏమిటీ…ఇది?” అంది అక్క గ్లాసు తీసుకుంటూ.

“రస్నా! లెమన్ ఫ్లేవర్” అన్నాను.

“మనకింక ఈ ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ డ్రింకులే గతి” అంది అక్క ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేసేసి.

Jyothiపాలపర్తి జ్యోతిష్మతి

చీకటి

DRUSHYA DRUSHYAM 41

చీకటి
……………

‘చీకటి కరేల్మని కదులుతుంది’ అంటాడు తిలక్.
ఒంటరి ప్రపంచంలో, ఏకాంతంలో ఇది మెదులుతుంది, ఎందుకో!

+++

తెలియదు గానీ ఒకానొకసారి ఎందుకో మేలుకుంటుంది నిద్ర.
లేచి అటూ ఇటూ తిరుగుతుంటే ఒక శునకం ఆవళించుకుంటూ వెళుతుంది.
లేదా నీలి నీడల్ని కాల్చుకుంటుంది లోలోనే.

అర్థం కాదు. లోపలి కోర్కెలు అలా రెక్కలు చాపుకుని మృగంలా సంచరిస్తాయా? అంత తేలిగ్గా అర్థం కాదు.
లేక నీడ రూపం ధరించి అదట్లా నాలుగు కాళ్ల జంతువై మనిషే అలా సంచరిస్తాడా? తెలియదు.
కానైతే, ఒక్కోసారి మనిషి తనను తాను పశువులో చూసుకుంటూ ఉంటాడేమో!

ఒక రాత్రి. రెండింటికి…గేటు బయటకు చూస్తే ఇది.
అది నిదానంగా నడిచి వస్తుంటే లోపలికి…లోలోపలికి వెళ్లినట్లు వెళ్లి,
నా నుంచి మీ అందరికీ పంచి పెట్టేందుకా అన్నట్టు నాలోని సామాజికుడు మళ్లీ నిద్రలేచి కెమెరా చేతబట్టాడు.
తీసి, దీన్నిలా తీసి పెట్టాను ఒకసారి.

నాకైతే ఇదొక చిత్రం. ఆ రంగు, చ్ఛాయా…అంతా కూడా ‘కొర్కె’ అనిపిస్తుంది.
కామమూ అనిపిస్తుంది. బహుశా చిత్ర ప్రవృత్తిలో మానవీయ అనుభవంలో అమానుషంగా ‘ఇదీ’ ఒకటి దాగి ఉంటూనే ఉంటదేమో!

చూసినప్పుడల్లా బహుశా ఏదైనా ఒక అంతర్జాతీయ పోటీకి పంపదగ్గ ఫొటో ఏమో అని అనుకున్నాను… దీన్నొకసారి.
ఎందుకూ అంటే, దాచుకుని బతికే భారతంలో ఇది అదృశ్యం. దాటిపోతేగానీ ఈ దృశ్యానికి సరైన అర్థం కానరాదని కాబోలు.

+++

ఏమైనా, ఒక్కోసారి అదృశ్యమైన దేహరాగాలని దృశ్యమానం చేసే చిత్రాలూ మనలోనే పుడతాయి.
నిజం. అందులో ఇదొకటని నా భావన.

గమనిస్తారని, మన లోవెలుపలా దాగే కోటి దహనాల కాంతిని ఇముడ్చుకునే చిమ్మ చీకటి మన ముందే ఇట్లా సంచరిస్తుందని, దాన్నిఒడిసి పట్టుకునేందుకే ఈ చిత్రమని నమ్ముతారనే ఇది.
ఈ వారం. చీకటి కరేల్మని…

~ కందుకూరి రమేష్ బాబు

వీలునామా – 42

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

“పారిస్ లో మేమిద్దరం పెళ్ళీ పెటాకులూ లేకుండానే ఒకే ఇంట్లో కలిసి వున్నాం. అక్కడెవ్వరూ ఏదీ పట్టించుకోరు! అక్కడ నాకు బానే వుండేది. అన్నిటికంటే డబ్బుకి కొదవ వుండకపోవడం లోని హాయి తెలిసొచ్చింది. నన్ను హేరీ అప్పుడప్పుడూ, ‘ఆశ పోతూ!’ అని పిలిచేవాడు. కానీ నేనేది అడిగితే అది కొని పెట్టేవాడు.

ఇంతలో అతనికి వాళ్ళ అన్నయ్య ప్రమాదం లో మరణించాడనీ, దాంతో తండ్రి గుండె పగిలి మంచం పట్టాడనీ కబురొచ్చింది. వెంటనే బయల్దేరి ఇంటికెళ్ళిపోయాడు. కొంచెం వెనకగా నేనూ ఇల్లు చేరుకున్నాను. ఒంటరిగా పారిస్ లొ నేను మాత్రం చేసెదేముంది?

అసలు ఇంటికి అమ్మ దగ్గరకెళ్ళాలంటే భయంతో ఒణికిపోయాను. కానీ హేరీ నచ్చచెప్పి పంపాడు. తను తప్పకుండా ఒచ్చి చూస్తుంటాననీ, కావలసినంత డబ్బిస్తాననీ చెప్పాడు. నేననుకున్నట్టుగానే అమ్మ నా మీద విరుచుకుపడింది. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో లేచి పోయానని చావ బాదింది.

అయితే హేరీ గురించి నేను చెప్పగానే కొంచెం శాంతించింది. అంత డబ్బున్న అబ్బాయి పెళ్ళాడితే చాలని, ఎలాగైనా అతన్ని పెళ్ళికొప్పించాలనుకుంది. అందుకొక పథకం వేసింది అమ్మ. నన్ను తిండీ తిప్పలు పెట్టక చిక్కి శల్యమై పోయేలా చేసి, అతనికి కబురు పెట్టించింది. ఆ కబురందుకొని ఆఘ మేఘాలమీద వచ్చేసాడు హేరీ. అప్పటికే వాళ్ళ నాన్న గారు కూడా మరణించారట, ఊళ్ళో చెప్పుకున్నారు. వస్తూనే, మంచం మీద పడుకున్న నన్ను చూసి,

“బేస్సీ! ఏమైంది? ఇలా అయిపోయావెందుకు?” అని అడిగాడు. నేను అమ్మ చెప్పినట్టే మూలుగుతూ పడుకున్నా.

“ఏముంది, అంతా అయిపోయింది నాయనా! ఇహ మన బెస్సీ మననొదిలి వెళ్ళిపోతుందన్నాడు వైద్యుడు!” మా అమ్మ యథా శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది.

నా నాడి పట్టుకుని చూసాడు హేరీ. అతను డాక్టరు పరీక్షకి చదివేవాడన్న సంగతి మర్చిపోయినందుకు అమ్మ తనని తనే తిట్టుకుంది. నాడి చూసి, నవ్వేసాడు.

“మరేం భయం లేదు. కొంచెం తిండి తింటే చాలు. బెస్సీ, నీ ఆరోగ్యానికేం ఢోకా లేదు. లే, లేచి కూర్చో!” అన్నాడు.

“వ్యాధి ఒంటిక్కాదు నాయనా, మనసుకి. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో వున్న ఆడపిల్ల మనసెలా వుంటుంది బాబూ? నా కుతురి మొహాన అందరూ ఉమ్మేస్తున్నారు.”

“అయ్యో! ఆర్మిస్టవున్ గారూ! నేను మీ అమ్మాయిని లేవదీసుకెళ్ళలేదు. తనే నాతో లేచి వచ్చేసింది, అసలు తీసికెళ్ళేదాకా ప్రాణలు తోడిందంటే నమ్మండి!” నవ్వుతూ అన్నాడు.

“బెస్సీ కేమీ ప్రమాదం లేదు, మంచి తిండి తిని విశ్రాంతి తీసుకుంటే తనే లేచి తిరుగుతుంది!” నవ్వుతూ అని లేచి వెళ్ళిపోయాడు. అమ్మకి ఒళ్ళు మండిపోయింది.

“చావుకి పెడితే కానీ, లంఖణానికి రాదు,” అనుకుని నా ఆరోగ్యం క్షీణించాలనీ ఏవేవో మందులు తినిపించింది. నిజం చెప్పొద్దూ, ఆ మందులూ మాకులూ తిని నేనెంత అనారోగ్యం పాలయ్యానంటే నిజంగా చచ్చిపోతానేమోనని భయ పడ్డాను కూడా.

మళ్ళీ కబురు పెట్టింది అమ్మ హేరీకి. ఈ సారి నిజంగానే మంచం పట్టిన నన్ను చూసి హేరీ ఆశ్చర్యపోయాడు.

“పిల్ల బెంగతో చచ్చిపోయేటట్టుంది బాబూ! మీరు దాన్ని భార్యగా అంగీకరిస్తే మనశ్శాంతితో పోతుంది. లేకపోతే ప్రపంచం దృష్టిలో తాను కులటననే బాధతో పోతుంది.” అమ్మ వీలైనంత ఏడుపు గొంతుతో అంది.

నిజంగా నేను తన ప్రేమా పెళ్ళీ కోసం అంత బెంగటిల్లిపోతానని హేరీ ఊహించలేదు. నన్ను అక్కడికక్కడే పెళ్ళాడడానికి ఒప్పుకున్నాడు. అమ్మ వెంటనే ఇద్దరు బంధువులనీ, ఒక చర్చి ఫాదరునీ పిలిచి అప్పటికప్పుడు చట్టబధ్ధంగా భార్యా భర్తలనిపించింది. ఇదిగో ఆ కాగితం. దీంతో హేరీని దిగ్బంధనం చేసాననుకొంది అమ్మ.

అ తర్వాత హేరీ ఎస్టేటు పన్ల మీద లండన్ వెళ్ళాడు. అతనక్కడుండగానే ఫ్రాంక్ పుట్టాడు. ఆ సంగతి ఉత్తరంలో చెప్పాను. హేరీ పిల్లాణ్ణి చూడటానికి హుటాహుటిని బయల్దేరి మా వూరొచ్చాడు. దురదృష్టవశాత్తూ, సరిగ్గా హేరీ ఇంట్లో అడుగుపెడుతూన్నప్పుడు నేను చిన్ననాటి స్నేహితుడు జేమీతో మాట్లాడుతూ వున్నాను. నాకూ హేరీకీ పెళ్ళయిన సంగతి తెలిసి జేమీ చాలా బాధపడ్డాడు. పాపం నా కొసమే వూరొదిలి వెళ్ళిపోయి ఉద్యోగం సంపాదించుకోని స్థిరపడ్డాననీ, నన్ను పెళ్ళాడడంకోసమే తిరిగి వూరొచ్చాననీ చేప్పాడు జేమీ. నేనూ, తననెప్పుడూ మర్చిపోలేదనీ, హేరీతో పెళ్ళి కేవలం మా అమ్మ చేసుకున్నాననీ చెప్తూ వుండగా వొచ్చాడు హేరీ.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నేను తనని ప్రేమ పేరుతో మోసం చేసాననీ, ఇంకెన్నడూ నా మొహం కూడా చూడననీ ఉత్తరం రాసాడు.”

ఊపిరి పీల్చుకోవడానికని ఆగింది మిసెస్ పెక్.

“ఆహ్హా! అయితే ఫ్రాంక్ హేరీ హొగార్త్ గారి కొడుకు కాదన్నమాట. ఆ జేమీ స్టీవెన్సన్ కొడుకు. ఇదేనా నువ్వు నాకు చెప్పదల్చుకొన్న రహస్యం?” ఆత్రంగా అడిగాడు బ్రాండన్.

“నీ తెలివి సంతకెళ్ళా! అలాటిదేమీ లేదు. ఫ్రాంక్ ముమ్మాటికీ హేరీ హొగార్త్ కొడుకే! చెప్పేది పూర్తిగా విను మరి. వెళ్ళిపోయిన హేరీ అప్పుడప్పుడూ పిల్లాడి కోసం డబ్బు పంపుతూ వుండే వాడు, కానీ ఎన్నడూ నన్ను చూడడానికి రాలేదు. ఫ్రాంక్ యేణ్ణర్థం పిల్లవాడుగా వుండగా హేరీ ఇంకొక అన్నయ్య కూడా మరణించాడు. పాపాం, చాలా అల్పాయుష్కులు వాళ్ళందరూ. అప్పుడే హేరీ ఎస్టేటు సొంతదారుడయ్యాడు. అంత డబ్బున్న అల్లుడు చిక్కినట్టే చిక్కి చేజారిపోయినందుకు అమ్మ లబలబ లాడింది. ఏది ఏమైనా చట్ట రీత్యా నేను అతని పెళ్ళాన్ని కాబట్టి కొంతైనా డబ్బివ్వాలని హేరీ మీద ఒత్తిడి తెచ్చింది అమ్మ. దానికి హేరీ సరేనన్నాడు. అయితే నేను స్కాట్ లాండు వదిలి వెళ్ళి ఇంకెక్కడైనా స్థిరపడితేనే డబ్బు ఇస్తానన్నాడు. ముందు మేమిద్దరమూ ఒప్పుకోలేదు. కావాలంటే న్యాయస్థానానికీ వేళ్తామని బెదిరించాము. కానీ హేరీ యే మాత్రమూ లొంగలేదు. పైగా, అనారోగ్యం నటించి అతనిపై వత్తిడి తెచ్చి పెళ్ళి జరిపించామని తానే న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తానని మమ్మల్నే బెదిరించాడు. దాంతో మేము సరేననక తప్పలేదు. ఆ మాటకొస్తే ఆ వూళ్ళో మాకంత ఏముంది గనక?

సిడ్నీకి వెళ్ళే పడవ మీద మా ఇద్దరికీ టిక్కట్లు హేరీ యే కొనిచ్చాడు. మా మీద అతనికేమాత్రం నమ్మకం లేకపోవడంతో, లండన్ వరకూ వచ్చి మమ్మల్ని పడవ యెక్కిస్తానని అన్నాడు. నేనూ అమ్మా చంటి పిల్లాణ్ణేసుకుని లండన్ చేరుకున్నాము. లండన్ లో ఒక చిన్న హోటల్లో బస చేసాము. ఆ రోజు అక్కడ చచ్చేంత జనం వున్నారు.

మళ్ళీ దురదృష్టం నన్ను కాటేసింది. పిల్లాడికి జ్వరం తగిలింది. వాడసలే అర్భకంగా వుండి అప్పుడప్పుడూ అనారోగ్యం పాలవుతూ వుండడంతో మేము పెద్దగా పట్టించుకోలేదు. అమ్మ యేదో మందు వేసి వాణ్ణి పడుకోబెట్టింది. సరిగ్గా హేరీ రావడానికి గంట ముందర పిల్లాడు జ్వర తీవ్రతలో మరణించాడు. అమ్మ లబో దిబో మంది. ఇప్పుడు పిల్లాడు లేడంటే హేరీ పైసా విదల్చడు, అని అమ్మ ఏడుస్తూ వుంటే పిల్లాణ్ణి పోగొట్టుకొని నేనేడుస్తున్నాను.

“హయ్యో! హయ్యో! ఎంత పని జరిగిందే అమ్మా! ఈ ముదనష్టం పిల్లాడు పడవ ఎక్కింతరవాతైనా పోలేదు. ఇప్పుడు హేరీకి ఏం చెప్తాం? ఎవరి దగ్గరైనా పసివాడు దొరికితే ఈ గండం గట్టేక్కొచ్చేమో! అన్నట్టు, ఈ పక్క గదిలో అమ్మాయి పిల్లాడి తల్లి. ఒక్క గంట సేపు పిల్లాణ్ణి ఆడిస్తానని చెప్పి ఏదో మాయ చేసి ఆమె పిల్లాణ్ణి తీసుకొస్తా! హేరీ ఇంతవరకూ ఫ్రాంక్ ని చూడలేదు కాబట్టి గుర్తు కూడా పట్టలేడు,” అంటూ అమ్మ పక్క గదిలోకి పరిగెత్తింది.

ఆ గదిలో ఎవరో ఒక బీదరాలు అమెరికా వేళ్ళే పడవ ఎక్కి వెళ్ళబోతోంది. ఒక్క పౌండు ఇస్తే పిల్లాణ్ణి గంట సేపు తప్పకుండా అరువిస్తుంది, అన్న నమ్మకంతో అమ్మ ఆమె గదికి వెళ్ళింది. విచిత్రంగా, తల్లి పిల్లాణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఎటో వెళ్ళినట్టుంది. అమ్మ చకచకా పిల్లల బట్టలు మార్చి, పిల్లలనీ మార్చేసింది.

కనీసం నాకు ఏడ్చేందుకు కూడా తీరిక నివ్వకుండా అమ్మ, గుర్రబ్బండిలో నన్నూ పిల్లాణ్ణీ ఎక్కించింది. ఆ తర్వతే తెలిసింది నాకు, అమ్మ మా సామాను కూడా బండిలోకెక్కించిందనీ, మేము సత్రం తిరిగి రాగలమన్న నమ్మకమూ, ఉద్దేశ్యమూ ఆమెకెంత మాత్రమూ లేవని!

అలాగే ఏడుస్తూ హేరీని కలుసుకున్నాను. పిల్లాడు పోయిన సంగతి అతనికి చెప్పలేకపోవడం నాకింకా బాధగా వుంది. కానీ హేరీ నా ఏడుపుని నటన అనుకున్నాడు. నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆ పిల్లాణ్ణి చేతులోకి తిసుకున్నాడు. ఎందుకో అతని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.

నా కడుపున పుట్టిన ఫ్రాంక్ ని ఒక్కనాడూ చేరదీసిందీ లేదు, ముద్దాడిందీ లేదు, ఇప్పుడీ అనామకుడెవర్నో చేతుల్లోకి తిసుకొని కన్నీళ్ళు కారుస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ఆ క్షణం నా ఒళ్ళూ మనసూ ఈర్ష్యతో ఎంత భగభగ లాడాయో చెప్పలేను. అమ్మ భయం లేకపోతే అక్కడే నిజం చెప్పేసేదాన్నే. అయితే ఆ పిల్లాడి పట్ల అతని అనురాగం చూసి అమ్మ మొహం ఎందుకో కళకళ లాడింది.

“అయితే, మీరిద్దరూ ఈ పడవ ఎక్కి వెళ్తున్నట్టే గా?” అనుమానంగా అడిగాడు.

“నువ్వు చెప్పాక వెళ్ళక తప్పుతుందా నాయనా? ఇంతకీ మా సంగతేం చేస్తావో చెప్పావు కాదు. కొత్త స్థలం లొ మేం పొట్ట ఎలా పొసుకోవాలి? ఎలా నిలదొక్కుకోవాలి? పైగా నీ పెళ్ళాం బాలింతరాలు, చేతిలో చంటి పిల్లాడూ…”

“పిల్లాడిని నాకొదిలేయండి. మీ ఇద్దరికీ నెలకింతని పంపుతాను,” ఆలోచిస్తూ అన్నాడు హేరీ. నాకు పగలబడి నవ్వాలనిపించింది. నేనేదో అనేలోపలే అమ్మ అందుకుని,

“ఏమిటీ? దానికి వున్న ఒకే ఒక్క ఆసరా ఆ పిల్లాడు. తల్లినీ పిల్లాణ్ణీ వేరు చేస్తావా? ఏమ్మనిషివయ్యా? పెళ్ళానికి దిక్కులేదు గానీ పిల్లాణ్ణి ప్రేమగా పెంచుతాడట! ఎవరైనా వింటే నవ్వి పోతారు! అయితే ఆ పిల్లాణ్ణి నీ కొడుకని ఒప్పుకుంటావా? అది చెప్పు ముందు! “

అయితే అమ్మ మాటల ధాటీకీ హేరీ ఏమీ తడబడలేదు. నెమ్మదిగా, దృఢంగా అన్నాడు,

“పిల్లాణ్ణి ప్రేమగా చూస్తానో లేదో చెప్పలేను. కానీ చక్కటి చదువు సంధ్యలు చెప్పించి మనిషిని చేస్తాను. నీ దగ్గరుంటే వాడు జేబు దొంగ అయేది ఖాయం. ఆలోచించుకోండి!”
“సరే ఏం చేస్తాం! బెస్సీ! గుండె దిటవు చేసుకోమ్మా! తల్లిగా పిల్లాడి మంచి కోసం నువ్వా మాత్రం త్యాగం చేయక తప్పదు. బాబుగారు డబ్బున్న మారాజులు, మనకేమీ లోటు చేయరనుకో! నువ్వు చేసే త్యాగానికి ఎంతో కొంత ప్రతిఫలం ముట్టచెప్పకుండా వుంటారా చెప్పు…”

నాకు నిజానికి వాళ్ళిద్దరి మీదా ఎంత అసహ్యం వేసిందో చెప్పలేను. ఒక్క మాటా మాట్లాడకుండా తల తిప్పేసుకుని నిలబడ్డాను.

హేరీ ఒకసారి అమ్మ వైపు చురుగ్గా చూసి నా వంక చూసాడు. నా కన్నీళ్ళని నమ్మలేదు కానీ, జాలిపడ్డాడు. అమ్మ అనుకున్నట్టే మా ఇద్దరికీ నెల నెలా సరిపడా డబ్బు పంపుతానని మాట ఇచ్చాడు. ఆ డబ్బు మాట వినగానే అతనికి నిజం చెప్పాలన్న కోరిక నాకూ చచ్చిపోయింది. ఆ రాత్రే అతనికీ ఆ పిల్లాడికీ వీడుకోలు చెప్పి అమ్మా నేనూ వెళ్ళిపోయాము.

తన మాట ప్రకారమే హేరీ నెల నెలా డబ్బు పంపుతూ వచ్చాడు.

అయితే ఒకసారి ఆశతో నేను పదిహేను వందల పౌండ్లు అడగడంతో, ఆ తరవాత ఇహ ఎప్పుడూ డబ్బు అడగనని నాతో పత్రం రాయించుకుని పదిహేను వందలూ పంపాడు. నేనెంత తెలివి తక్కువ పని చేసానో ఆ పదిహేను వందలూ ఖర్చయిపోయింతరవాత కానీ అర్థం కాలేదు నాకు. బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకున్నట్టయింది.”
—————————————————————————

జానపదంలో మెరిసిన మెరుపులు ​

unnamed-1

జానపద గీతాలు

మన తెలుగు జానపద బాణీల ప్రేరణతో ఎన్నో జానపద సినీగీతాలను తయారు చేసారు మన సినీ సంగీతకారులు. పాత నలుపు-తెలుపు చిత్రాలన్నింటిలో దాదాపు ఒక జానపద గీతం తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఐటెం సాంగ్ ఉన్నట్లన్నమాట :) సినిమా కథతో సంబంధం లేకపోయినా ఓ స్టేజ్ షో లాగనో, హాస్యనటుల పైనో లేదా నేరుగా నాయికానాయకుల పైనో ఈ జానపదగీతాలను చిత్రీకరించేవారు. ఇంపైన సంగీతసాహిత్యాలతో ఈనాటికీ చిందెయ్యాలనిపించేంతటి సమకాలీనత ఆ పాటలలో ఉంది. వీటిలో విశేషం ఏంటంటే సరదాగా ఉంటూనే ఏదో ఒక నీతిని తెల్పేలాగ లేదా ఒక విషయాన్నిగురించిన ఇరు పక్షాల చర్చల్లా కూడా కొన్ని సాహిత్యాలు ఉంటాయి. వినడానికి సరదాగా ఉండే అలాంటి కొన్ని సినీజానపద గీతాలను కొన్నింటి గురించి ఇవాళ చెప్పుకుందాం.

జానపద బాణీల్లో ఉన్న హిట్ సాంగ్స్ తలుచుకోవాలంటే మూగమనసులు చిత్రంలో “గోదారి గట్టుంది”, “గౌరమ్మా నీ మొగుడెవరమ్మా..”, రాజమకుటంలో “ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రేడు”, సాక్షి చిత్రంలో “అటు ఎన్నెల ఇటు ఎన్నెల”, పాండవ వనవాసం” లో సముద్రాల రాఘవాచార్య రచన “మోగలిరేకుల సిగదానా”, కలసి ఉంటే కలదు సుఖం లో “ముద్దబంతి పూపెట్టి”.. ఇలా బోలెడున్నాయి. “నాకూ స్వాతంత్య్రం వచ్చింది” చిత్రంలో గోపి రచించిన “ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపోతుంటే” అనే పాట కూడా బాగుంటుంది కానీ లింక్ ఎక్కడా దొరకలేదు. ఇలా ఎంకి మీద “దాగుడుమూతలు” చిత్రంలో బి.సరోజాదేవి పాట ఒకటి బావుంటుంది. సాంఘిక చిత్రమే అయినా సందర్భానుసారంగా ఎంకి వేషంలో మురిపిస్తుంది సరోజాదేవి.

* ఎంకొచ్చిందోయ్ మావా…

* తోడికోడళ్ళు చిత్రంలో “టౌనుపక్కకెళ్ళద్దురా డింగరి” అనే జానపద బాణీ ఉంది. బస్తీకెళ్దాం, సొమ్ము చేసుకుందాం అని అబ్బాయి పాడితే, పట్నం మోజులో పడి మోసపోవద్దు అని అమ్మడు పాడుతుంది. చక్కని సందేశం, నీతి రెండూ ఉన్న పాట ఇది.

* “వెన్నెల రేయి చందమామ వెచ్చగనున్నది మావా

మనసేదోలాగున్నది నాకేదోలాగున్నది.. ”

అంటూ వయసులో ఉన్న యువతీయువకులు పరస్పరం చెప్పుకునే ఊసులే ఈ పాట. రంగుల రాట్నం చిత్రంలోని ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చినది ఎస్. రాజేశ్వరరావు గారు, కొసరాజు సాహిత్యం. పాడినది బి.గోపాలం, ఎస్.జానకి. ఈ పాట చివర్లో వచ్చే డప్పు వాయిద్యం చాలా ఉత్సాహకరంగా ఉంటుంది.

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7057

* ఊ..హూ… ఊ… అంటూ ఓ మధురమైన హమ్మింగ్… తర్వాత,

“గట్టుకాడ ఎవరో… చెట్టునీడ ఎవరో

నల్ల కనుల నాగసొరము.. ఊదేరు ఎవరో”

అంటూ సాగే జానకి పాడిన ఈ పాట బంగారు పంజరం చిత్రంలోనిది. దేవులపల్లి సాహిత్యం.

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2089

ఈ జానపద గీతాల్లోని ఇంకో ప్రత్యేకత ఏంటంటే మొహమాటాలూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్లు మనసులో మాటలన్నీ చెప్పేసుకుంటున్నట్లుంటాయీ సాహిత్యాలు. సరదాగా ఒకరినొకరు వేళాకోళాలాడుకుంటూనే అభిమానాలూ తెలుపుకుంటారు జంటలు. అనురాగం చిత్రంలోని ఈ పాట అందుకో చక్కని ఉదాహరణ..

“శనగ సేలో నిలబడి చేయ్యిజాపే ఓ పూసలోళ్ళ రాజమ్మా..” అనే పాటను క్రింద లింక్ లో వినవచ్చు:

అలాంటిదే “భలే రంగడు” చిత్రంలో ఇంకో పాట ఉంది..

“మెరిసిపోయే ఎన్నెలాయే

పరుపులాంటి తిన్నెలాయే

నన్ను ఇడిసి ఏడ బోతివిరా… బంగారుసామీ

రేతిరంతా ఏమిసేతునురా – ”

అనే పి. సుశీల పాడిన ఈ పాటను క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1225

* “వెలుగు నీడలు” చిత్రంలో “సరిగంచు చీరగట్టి బొమ్మంచు రైక తొడిగి ” అని ఓ స్టేజ్ సాంగ్ ఉంది. ఈ పాట సాహిత్యంలో “మింగ మెతులు లేదాయే..”, ఇంట్లో ఈగల మోత..” మొదలైన రెండు మూడు సామెతలు కూడా దొర్లుతాయి.

*ఇదే సినిమాలో హీరోహీరోయిన్లు నదిలో పడవ మీద వెళ్తుంటే, ఏటి గట్టు వెంబడే వెళ్టున్న పల్లెపడుచులు ఒకరినొకరు హుషారు చేసుకుంటూ పాడుకునే మరో గీతం ఉంది.

“ఓ రంగయో పూల రంగయో

ఓరచూపు చాలించి సాగిపోవయో

పొద్దువాలిపోతున్నదో..ఓఓయి.. ఇంత మొద్దు నడకనీకేల పోవోయి.. ”

* మంచి హుషారును తెప్పించే పాత పాటల్లో జమునారాణి పాడిన ఈ పాటను జత పరుచుకోవచ్చు. “ఎర వేసి.. హ… గురి చూసి.. పట్టాలి మావా..” అనే లైన్ భలే ఒడుపుగా పలుకుతారావిడ. బంగారు తిమ్మరాజు చిత్రం లోని ఈ పాటన్ ఉ ఇప్పటికీ టివి, స్టేజ్ షోస్ లో పాడుతూనే ఉన్నారు జమునారాణి.

“నాగమల్లి కోనలోన

నచ్చింది లేడికూన

ఎర వేసి గురి చూసి పట్టాలి మావా ” –

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7035

* జానపద బాణీ లానే కాక ఈ పాటలోని నీటిసూత్రాలు ఎంతో ఆకట్టుకుంటాయి ఈనాటికీ. మంచి మనసులు చిత్రంలో జమునారాణి, ఘంటసాల పాడారీ గీతాన్ని.

మావ మావ మావ

ఏమే ఏమే భామా…

* “రోజులు మారాయి” చిత్రంలో “పొలియో పొలి” అనే జానపద గీతం ఉంది. ఇది కాక బాగా పాపులర్ అయిన మరో పాట “ఏరువాకా సాగారో”. రైతన్న నైజాన్నీ, కృషినీ, దేశానికి చేసే సేవనూ మెచ్చుకుంటూ పాడే ఈ పాట సాహిత్యం ఎంతో బావుంటుంది. వహీదా రెహ్మాన్ హిందీ చిత్రాల్లో ఇంకా పాపులర్ అవ్వక మునుపు నటించిన నృత్యగీతం ఇది.

” కల్లాకపటం కాననివాడా

లోకంపోకడ తెలియని వాడా

ఏరువాకా సారారోరన్నో చిన్నన్నా

నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా..”

* “అదృష్టవంతులు” చిత్రంలోని “మొక్కజొన్న తోటలో ” పాటను మోస్ట్ పాపులర్ జానపద గీతం అనచ్చేమో! రేడియోలో చాలాసార్లు విన్నాకా ఓసారి టివిలో ఈ పాట చూసినప్పుడు బోలెడు ఆశ్చర్యపోయాను. ఇలాంటి పాటా ఇది అని?! నిజంగా ఏ పొలాల్లోనో, మంచె పక్కనో ఓ అమ్మాయి నిలబడి పాడుతుందేమో అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ వినడానికి మాత్రం భలే సరదాగా హుషారుగా ఉంటుందీ పాట. కె.వెంకటరత్నంగారు రాసిన జానపద గీతం ఇది.

http://www.raaga.com/player5/?id=191693&mode=100&rand=0.06835282778691398

* “తల్లిదండ్రులు” చిత్రంలో “గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో ” అనే పాట ఉంది. పల్లెపడుచులందరూ చక్కగా గొబ్బిళ్ళు పెట్టుకుంటూ పాడుకునేలాంటి పాట. ఇది కూడా నెట్ లో ఎక్కడా దొరకకపోతే నా దగ్గర ఉన్నది క్రింద లింక్ లో అప్లోడ్ చేసాను.

“చెంచులక్ష్మి” చిత్రంలోని పాపులర్ సాంగ్ “చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?” నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. జిక్కీ, ఘంటసాల పాడిన ఈ పాటకు సంగీతం ఎస్.రాజేస్వరరావు.

మరికొన్ని జానపద బాణీల్లోని సినీగీతాలు వాటి క్రింద ఉన్న లింక్స్ లో వినవచ్చు:

* “అల్లుడొచ్చాడు” చిత్రంలో అది కూడా జానపద బాణీలోని పాటే అనుకోవచ్చు.

“అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు

నేనేదింక కోరేదికలేదు అందరివోలె అడిగేదాన్ని కాదు

కొందరివోలె కొసరేదాన్నికాదు

ఓ మావా..ఓహో బంగారి మావా…” అని టి.చలపతిరావు సంగీతంలో సుశీల పాటొకటి సరదాగా బావుంటుంది. . వినాలంటే క్రింద లింక్ లో మొదటి పాట:

http://tunes.desibantu.com/alludochchadu/

* “పట్నంలో సాలిబండ పేరైనా గోలకొండ

చూపించు సూపునిండా”

– అమాయకుడు

(క్రింద పేజ్ లోని లిస్ట్ లో నాలుగవ పాట)

http://www.sakhiyaa.com/amayakudu-1968-%E0%B0%85%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/

* ఎయిర సిన్నోడేయ్ రా – పూలరంగడు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1739

* చివరిగా… “నీతోటే ఉంటాను శేషగిరి బావా” – జమిందార్

ఎగిరే పావురమా! – 3

serial-banner3

మూడవ భాగం

తాత పూర్తి పేరు ‘సత్యం సాయిరాం’ అంది. వాళ్ళది మంగళగిరిలో చీర నేతగాళ్ళ కుటుంబమంట. పదారేళ్ళ వయస్సులోనే సవతితల్లితో పడలేక ఇల్లొదిలి విడిగా వొచ్చేసి గంగన్నపాలెం చేరాడంట. కొన్నాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ, తరువాత ఆటో రిక్షా నడపడం మొదలెట్టాడంట.

 కోవెలకి వస్తూపోతూ పూజారయ్యతో పరిచయం, కొలువు కాడ రాములు తండ్రితో స్నేహం పెంచుకున్నాడంట తాత.

అందరూ తాతని ‘సత్యమయ్యా’ అని పిలిస్తే పూజారయ్య మాత్రం ‘సత్యం’ అని పిలుస్తారంట.

 పూజారయ్య కూతురు ఉమమ్మని బడికి తీసుకెళ్ళడం, ఆయన భార్య మంగళమ్మకి ఇంటి పనులతో సాయం చేయడం, పూజారయ్యని స్నాతకాలకి, వ్రతాలకి తీసుకెళ్ళడం చేస్తూ, పూజారయ్య కుటుంబానికి దగ్గరయ్యాడంట తాత.

 “ఇంటున్నావా లేదా మీ తాత కథ? అడిగింది….రాములు నన్ను.

‘చెప్పు, ఆపకు,’ అని సైగ చేసాను.

పాలెంలోనే ఉంటూ అందరికీ చాతనైన సాయం చేస్తూంటాడంట. తనని ఆదుకొని  గుళ్ళో పనిప్పించింది కూడా తాతేనంది రాములు.

తాత గురించి వింటుంటే, నాకు కన్నీళ్ళాగలేదు.

అది చూసి, “ఇదిగో నువ్విట్టా ఏడిస్తే నేను చెప్పను,” అని కోపగించుకుంది రాములు. కళ్ళు తుడుచుకొని ఇంకా చెప్పమని బతిమాలాను.

క్షణమాగి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.

“ఇకపోతే, సత్యమయ్యకి పెళ్ళాం, ఒక కొడుకు ఉండేవారని ఇన్నాను. కొడుకు పుట్టి చిన్నప్పుడే జబ్బు చేసి పోవడంతో, మనస్సు పాడయి పెళ్ళాం ఎటో ఎళ్ళిపోయిందని అంటారు.

ఇంకోప్రక్క తండ్రిని – అతని రెండో పెళ్ళాం మోసగించి పారిపోతే, అతనితో పాటు పదేళ్ళ చంద్రమ్మని కూడా దగ్గరెట్టుకుని సత్యమయ్యే సాకాడని కూడా ఇన్నాను.

కష్టపడి పని చేసేవాడని, కడుపు నొప్పితో బాధపడుతూ కూడా చానాళ్ళు ఆటో నడిపాడని అందరికీ తెలిసిందే. వాంతులయ్యి తరచు ఆసుపత్రిలో చేరేవాడు,” అని క్షణమాగింది రాములు.

‘ఆగావెందుకు? చెప్పు’ అన్నట్టు రాములు కాలు మీద తట్టాను.

“జబ్బు పడ్డప్పుడల్లా కషాయం కాసిచ్చేదాన్ని,” అని ఆమె అన్నప్పుడు

మళ్ళీ ఏడుపు ఆగలేదు నాకు. రాములికి కనబడకుండా కళ్ళు తుడుచుకున్నాను.

“ఇక రానురాను నీరసపడిపోయి ఆటో నడపలేక, గుడిలో పని వొప్పుకున్నాడు. ఆ తరువాతే మీ తాత ఆరోగ్యం కాస్త కుదురుగా ఉంది,” అని  నిట్టూర్చింది రాములు.

రెండో జడ కూడా వేయడం ముగించి, రాములు నడినెత్తిన తట్టడంతో, “ఏమిటి?” అన్నట్టు చూసానామెని.

“ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? ఇంకిప్పుడు ఎర్ర రిబ్బన్లు పెట్టబోతున్నా. ఎంత బాగుంటాయో సూడు నీ జడలు,” అంది రాములు.

జడలు తడిమి చూసుకొని మళ్ళీ తల తిప్పి ఆమె వంక చూసాను.

‘మరి నా సంగతి ఏంటి? నేనెప్పుడు? ఎలా వచ్చాను? తాత కాడికి,’ అని సైగలతో అడిగాను.

“నాకేం తెలుసు నీ సంగతి,” అంటూ నవ్వింది రాములు.   గమ్మునుండిపోయాను. రాములు మీద కోపంతో తల వంచుకున్నాను.

నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి, “నీ బుంగమూతి సూడాలని అట్టాగన్నాలే. మరీ చిన్నపాపలా అట్టా అలగమాకు, నీకిప్పుడు ఎనిమిదేళ్ళు,” అంటూ నా బుగ్గలు నొక్కింది రాములు.

నా గురించిన విషయాలు చెప్పడం మొదలెట్టిందామె.

 

egire-paavurama-3-pic-part

“మీ తాతకి దగ్గర దగ్గర అరవైయేళ్ళ వయస్సులో, ఇంకా ఆటోరిక్షా నడుపుతున్నప్పుడే నువ్వు అతని కాడ చేరావుగా! పసిపిల్లవంట.

మీ అమ్మ నిన్ను పెంచలేకపోయిందంటలే.   పూజారయ్యగారి చేత నీకు ‘గాయత్రి’ అని అమ్మవారి పేరు పెట్టించి, కష్టపడి పెంచుకున్నాడు సత్యమయ్య.

నేను ఈడ గుడికి స్వీపరుగా వచ్చినప్పుడు నీకు నాలుగేళ్ళు కదా! నీ ఇషయాలే చెప్పేవాడు. ఐదోయేడు నిండాక గాని, నిన్ను గుడికాడికి తెచ్చాడు కాదు,” అంటూ మళ్ళీ ఆగింది రాములు.

నా జడలకి రిబ్బన్లు పెట్టడం ముగించి నా ముందుకి వచ్చి కూకుంది. ముంగురులు సర్దుతూ నా గురించిన విషయాలే చెబుతూ పోయింది. చెవులప్పగించి వింటున్నాను.

“ఇక ఆరోయేడు నుండీ, పూజసామాను అమ్మకాలకి కూకుంటున్నావు కదా! ప్రతిపొద్దు నీ ముందు పూజసామాను మీ తాత సర్దితే, నీకు మరో పక్కన కాస్త ఎనకాలకి ‘గాయత్రి’ హుండీ’ – అదే, ఆ చెక్కపెట్టి- ఉంచేది నేను కదా!

అది ‘నీ కోసం’ పెట్టిందన్నమాట. అది ఆడుంచి నీకు సాయం చేయమని పురమాయించారు మన పూజారయ్య. నిన్నీడ కూకోబెట్టాలన్నదీ పూజారయ్యే. చెక్కపెట్టి హుండీ మీద ఉమమ్మ చేత ‘గాయత్రి’ అని నీ పేరు రాయించింది కూడా మన పూజారయ్యే.

అసలీ అరుగుకి పైకప్పు యేయించి, ఎనకమాల గదులు బాగుచేయించింది కూడా నీ కోసమేరా,”

అని ఇక అక్కడికి చెప్పడం ఆపి, గట్టిగా ఊపిరి తీసుకొంది రాములు.

“అదమ్మా మీ కథ. నీ జడలు బాగా కుదిరాయి. అద్దం తెస్తాను సూసుకో. నాకైతే ఆకలిగా ఉండాది. నీక్కూడా తినడానికి ఏదైనా తెస్తా,” అంటూ పైకి లేచి నూనె సీసా, సామాను తీసుకొని లోనికెళ్ళింది రాములు.   పోతూ ఖాళీ అయిన పావురాళ్ళ గింజల డబ్బా కూడా అందుకొంది.

**

తాత గురించి రాములు చెప్పిందే ఆలోసించాను. పూజారయ్యగారమ్మాయి ఉమమ్మ గురించి కూడా… అందంగా ఉంటది ఉమమ్మ. మొన్ననే పద్నాలుగేళ్ళు నిండాయంట ఆమెకి.

‘కనపడినప్పుడల్లా నవ్వుతూ నా కాడికొచ్చి పలకరిస్తది కూడా’ అని గుర్తు చేసుకున్నా.

**

అద్దం, బొరుగుల పొట్లం ఓ సేత్తో, పెద్ద బరువైన సంచీ మరో సేత్తో పుచ్చుకుని కాళ్ళీడుస్తూ వచ్చింది రాములు. అన్నీ అరుగు మీదుంచి ఎదురుగా కూకుంది.   అది రయికల బట్టల సంచీలా కనిపించింది.

తలెత్తి ఆమె వంక చూసాను.

“నేను పోయి పెద్ద దీపాలు కడిగివ్వాలి. నువ్వు ఈ రైకల బట్టల్ని సక్కగా మడతలేసి పక్కనెట్టు. పంతులుగారు వాటికోసం అట్టడబ్బా ఇస్తాన్నాడులే,” అంటూ ఎళ్ళింది రాములు.

సంచి నుండి రయికలు తీస్తుండగా, దూరంగా ఉమమ్మ మాటలు వినొచ్చాయి. పక్కకి తిరిగి చూస్తే గుడి బయట నుండి తాతని వెంటెట్టుకొని ఉమమ్మ నావైపు రాడం అగుపడింది.

దగ్గరగా వచ్చి, తాతని ఎదురుగా అరుగు మీద కూకోమని, తను నా పక్కనే కూకుంది.

నా చేయి తన చేతిలోకి తీసుకుంది ఉమమ్మ.

“నీకిప్పుడు ఎనిమిదేళ్ళు నిండాయి గాయత్రీ. నువ్వు చదువుకోవాలని మీ తాత ఆశ పడుతున్నాడు. నువ్వు బడికి పోలేవుగా! అందుకొని నేను నీకు చదువు చెప్పడం మొదలెడతాను.

వారానికి రెండురోజులు గంటసేపన్నా నా దగ్గర చదువుకోవాలి. మిగతా రోజుల్లో నేర్చుకున్నవి చదివి, రాసి మళ్ళీవారం నాకు అప్పజెప్పాలి. చేస్తావా?” అనడిగిందామె నన్ను.

పెద్ద తరగతి చదివే ఉమమ్మ నాకు చదువు చెబుతానంటే సంతోషమనిపించింది. సరేనని తలూపాను.

తన చేతిసంచి నుండి నాకు చాక్లెట్టు తీసిచ్చింది.

“సరే కానీ, నీ జడలు ఎవరు వేసారు? చాలా అందంగా ఉన్నాయే? మా అందరి తలనీలాలు కలిపితే నీ ఒక్క జడంత ఉంటాయేమో,” అని గలగలా నవ్వింది ఉమమ్మ.

ముందుకు పడిన జడల్ని వెనక్కి తీసుకున్నాను… నన్నామె మెచ్చుకుందని బాగనిపించింది.

“ఇవాళ నాకు స్కూలు సెలవు. ఓ గంటలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను.

తయారుగా ఉండు. ఇవాళే నీ చేత అక్షరాలు దిద్దిస్తా,” అని చెప్పెళ్ళినామె, గంటలోపే కొత్త నోటుపుస్తకం, పెన్సిళ్ళు, పలక, బలపం తీసుకొచ్చింది.

అమ్మవారికి అర్చన చేయించాక నాచేత ఓనామాలు దిద్దించింది.

తాతతో పాటు పూజారయ్య, పంతులుగారు, నాయుడన్న, రాములు కూడా సంతోషించారు.

“నువ్వు శ్రద్ధపెట్టాలే గాని, నేను పద్ధతిగా చదివిస్తానని సత్యమయ్యకి మాటిచ్చాను. మీ తాత కూడా తొమ్మిదో తరగతి వరకు చదివాడని తెలుసా? అడిగింది ఉమమ్మ.

“ఇకపోతే నాకు బుధవారాలు కాక ఆదివారాలు సమయం దొరుకుతుంది. వచ్చే వారం నుండి ఆ రెండు రోజులు మధ్యాహ్నాలు మూడింటికి వస్తా. సరేనా?” అడిగింది ఉమమ్మ.

‘ఉమమ్మ మాటతీరు ఎంతో బాగనిపించింది నాకు. అందరి మాటల్లా కాకుండా, చక్కంగా, తీయంగా తోచాయి ఆమె మాటలు. వింటూ ఆమెనట్టాగే చూస్తుండిపోయాను. ఆమె కాడ చదువే కాదు, ఆమెలా సక్కంగా మాట్లాడ్డం నేర్చుకుంటే గొప్పగా ఉంటుంది’ అనిపించింది.

పూజారయ్య నేనున్న అరుగు కాడికి వచ్చారు.

“నీకు ఉమమ్మ ఇచ్చిన అట్లతద్ది బహుమానం ఈ అక్షరాభ్యాసం, శ్రద్ధగా చదువుకోవాలి మరి,” అంటూ నా తలను తాకి దీవించారాయన………

“గుడి కార్యకలాపాలు, ఈ చదువు, గాయత్రి ఎదగదలకి  సరైన పునాదులు. బాగానే చదువుకుంటుందిలేరా సత్యం,” అన్నాడాయన ఎదురుగా ఉన్న తాతతో….

“పెద్ద పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయంటమ్మా అవిటివాళ్ళకి ప్రత్యేక బడులు.

మన పాలెం బడిలో అట్టా వసతి లేదన్నారు మాస్టారుగారు.  అసలు గాయత్రిది పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం కాకపోనేమో అని నా ఆశ. అందుకే తమరు దానికి కాస్త చదువంటూ మొదలెడితే బాగుంటుందని చొరవ చేసి అడిగాను. నీకు పుణ్యమే ఉమమ్మా,” అన్నాడు వినయంగా తాత.

 

ఇంతలో, రెండు మట్టి ముంతలు తెచ్చి నాకొకటి, ఉమమ్మకొకటి ఇచ్చింది రాములు.   గోరింటాకు ముంతలంట. ఇంటికెళ్ళి పనులయ్యాక పెట్టుకోమంది.

అలా ఆ రోజు నుండి నాకు చదువు చెప్పడం మొదలెట్టింది ఉమమ్మ.

అందరూ అరుగుల కాడ ఉండగానే, రోజూ రెండోసారి వచ్చే సమయానికే పావురాళ్ళు కూడా వచ్చాయి. అరుగులకి దూరంగా తచ్చట్లాడుతూ గింజల కోసం కువకువలాడ్డం మొదలెట్టాయి.   గింజల డబ్బా అందుకొని వాటికి దానా ఎయ్యడానికి అటుగా పోయింది రాములు.

**

నేను చదువుకోడం తాతకి చాలా గర్వంగా ఉంది. మధ్యానాలు ప్రసాదం తింటూ చదువుల మాటలే చెబుతున్నాడు. బాగా చదువుకుంటే జీవనం బాగుంటదన్నాడు.

“నాకు చదువుకోవాలని ఎంతో ఆశగా ఉండేదిరా గాయత్రీ. నాకు దక్కని అవకాశం కనీసం నీకైనా ఉండాలనే నా తపనంతా,” అన్నాడు ఓ మారు.

ఈ మధ్య, తన ఊరు మంగళగిరి గురించి, అమరావతి అమ్మవారి ఆలయం గురించి చెప్పాడు. ఈ ఊళ్ళకి కుడి పక్కన పారే కృష్ణానది, చుట్టుపక్కలనున్న ఉండవల్లి గుహల అందాలు గురించి చెప్పాడు. తను స్నేహితులతో సైకిళ్ళ మీద ఉండవల్లి, భట్టిప్రోలు గుహల వరకు కూడా వెళ్ళేవాడంట.

“ఇవన్నీ మనకి దగ్గరలోనే, గుంటూరు జిల్లాలోనే ఉన్న ఊళ్లు, గ్రామాలు,” అన్నాడు తాత. “విజయవాడ మాత్రం కాస్త దూరంగా ఉంది, అక్కడ కృష్ణానది తీరానే కనకదుర్గమ్మ ఆలయం బ్రహ్మాండంగా ఉంటదిరా, ఆ తల్లి దర్శనానికి ఎప్పటికైనా పోదాములే,” అని కూడా అన్నాడు.

**

గుళ్ళో ఎప్పుడూ ఉండే సందడికి తోడు, చదువు, పరీక్షల మధ్య రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి.

కొద్ది రోజుల్లో నాకు పదేళ్ళు నిండుతాయని గుర్తు చేసుకుంటుంటాడు తాత.

చదువు మొదలెట్టి గడిసిన రెండేళ్ళల్లో అక్షరాలు దిద్దాక, ఇప్పుడు చిన్న మాటలు రాయగల్గుతున్నాను.

చిన్న లెక్కలు చేయగలను. నా పేరే కాక ఇతరుల పేర్లు చిన్నవైతే చదవగలను, గుర్తించగలను.

ఉమమ్మ మాటతీరు కూడా గమనించి నాకిష్టమైన మాటలు గుర్తెట్టుకుంటున్నాను.

రాములు నా పక్కనెట్టే చెక్కపెట్టి మీద, రావి చెట్టునున్న మరో బోర్డు మీద కూడా నా పేరు చూశాను. ఆడనుండే కొందరు నన్ను పేరు పెట్టి పలకరిస్తారని ఎరుకయింది.

**

పనయ్యాక, నాకాడ చేరిన ప్రసాదాలు, డబ్బులు సర్దుకొని ఇంటిదారి పట్టాము. రిక్షా ఎనకాలే నడుస్తున్న తాత దారిలో పుజారయ్యగారి ఇంటి ముందు ఆగమన్నాడు.

మా కోసం ఆరుబయటకి వచ్చిన పూజారయ్యతో నా గురించి చెప్పాడు. “రేపు గాయత్రి పుట్టినరోజయ్యా. నిండా పదేళ్ళండయ్యా. ఓసారి తమరు ఆలోచన చేసి, గాయత్రి మాట-నడక విషయమై పట్నంలో వైద్యుల కాడికి పంపే ఏర్పాటు చెయ్యాలండయ్యా ,” అన్నాడు తాత చేతులు జోడించి.

‘……నా పుట్టిన రోజంట రేపు…’ వాళ్ళ మాటలింటున్నాను….

“అలాగేలే సత్యం, తప్పకుండా పట్నంలో వైద్యులతో మాట్లాడుదాము. పోతే, రేపు కాస్త పొంగలి, బెల్లంపాయసం చేయించి గుడి మెట్లకాడ పంచుదాములే. నువ్వు అమ్మవారి అర్చనకి మాత్రం డబ్బుకట్టుకో,” అంటూ నా వంక చూసి, “ఏమ్మా చదువు బాగా సాగుతుందా?” అని అడిగారు.

ఔనన్నట్టు తలాడించాను.

“ఆ చిన్నపిల్ల పై మా అందరికి జాలేరా, సత్యం. పైగా గాయత్రి పూజసామగ్రి దగ్గర రోజంతా కూర్చుని, కోవెలకి తన వంతుగా సాయపడుతుంది కదా! మనం కూడా మరి ఆ అమ్మాయి కోసం, భక్తుల సాయం అర్ధిస్తూ ‘గాయత్రి’ పేరుతో హుండీ కూడా పెట్టించాముగా,” అన్నారాయన మళ్ళీ తాత వంక తిరిగి.

“అంతా తమరి దయ,”చేతులు జోడించి దణ్ణాలెట్టాడు తాత.

**

చీకటితో  నిద్ర లేపాడు తాత. ముఖం కడిగించి పక్కింటి నుండి పిన్నిని పిలుచుకొచ్చాడు. నా పుట్టినరోజున పెందరాళే తలంటి, కొత్తబట్టలు వేసి, ప్రత్యేకంగా ముస్తాబు చేయమని ఆమెని పురమాయించాడు.

బుద్ధి తెలిసినప్పటి నుండి నాకు అన్నీ చేసేది చంద్రం పిన్నే. చంద్రమ్మని ‘పిన్ని’ గా అనుకోమన్నదే తాత. నామటుకు నాకు చంద్రమ్మ, అమ్మతో సమానమే. నాకు పిన్నంటే బాగా చనువే.

నాకు, పుట్టినరోజన్న ఉత్సాహం లేదు. అసలు చికాకుగా ఉంది. కొద్ది రోజులుగా నా అవిటితనం గురించి దిగులు ఎక్కువయ్యింది. నా ఈడువాళ్ళలా పలకాలని,  పరుగులెట్టాలని వెర్రి  ఆశగా ఉంటుంది నాకు. కానీ మాట పెగలక, కాళ్ళు కదలక దుఃఖం పొంగుకొస్తుంది. నా స్థితి ఇలా ఎందుకుంది? అసలు నాకేమయింది? తాతని అడగాలనుకున్నాను.

నా తల దువ్వుతున్న పిన్నితో మాట కలుపుతూ నా పక్కనే కూకునున్నాడు తాత.

ఇక నాకు దుఃఖం ఆగలేదు. గట్టిగా ఏడ్చేశాను. తాతని అడిగేశాను.

కాన్నీటితో వెక్కిళ్ళెడుతూ, “ఆ, అమ్,” అని నోటితో పదే పదే నాకు చేతనయిన శబ్దాలు చేస్తూ, చేతితో నా గొంతు తాకి, నా పాదాలు తట్టి చూపిస్తూ ఏడ్చాను.  “ఏ ఏం,” ఎందుకు నేను ఇట్టా?” అన్నట్టు సైగలతోనే అడిగాను.   కోపగించుకున్నాను.

“నీకు తెలుసు తాత, సెబుతావా లేదా,” అనాలని ఏడుస్తూ తాత భుజాలు పట్టుకు కుదిపేశాను. నా ఏడుపుకి, చేష్టలకి చంద్రమ్మతో పాటు తాత కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

తన కళ్ళెంట కూడా నీరు కారుతుంటే, నా కళ్ళు తుడిచాడు తాత.

నన్ను దగ్గరికి తీసుకొని, తల నిమిరాడు.

“అంతా ఆ దేవుడు లీల తల్లీ, నీవు రోజూ ఆ దేవతకి కనబడుతావుగా! అడుగు. నేనూ అడుగుతాను. ఎప్పుడో ఒకప్పటికి ఆ అమ్మవారు పలుకుతాది, నీ మీద దయ సూపుతాది,” అంటూ లాలించాడు తాత.

చంద్రం పిన్ని కూడా కళ్ళు తుడుచుకొంది.

“పిచ్చిపిల్లా అంత ఉక్రోషం ఎందుకే? తాత నీకోసం అన్నీ చేస్తున్నాడు.   తన సుఖం కూడా చూసుకోకుండా ఈ వయస్సులో నీ కోసం ఎన్ని అమర్చాడో తెలుసా?

రాములమ్మ తోడు, ఉమమ్మ సదువు, పూజారయ్య ఆశీస్సులు అన్నీ నీ బాగు కోసమే. తాత మంచితనం, సేవ వల్లనే నువ్వు ఇంత మాత్రం ఆనందంగా ఉన్నావురా,” అంటూ నా తల నిమిరింది.

“అంతెందుకు? మీ తాతని బట్టే కదా నిన్ను నా సొంతబిడ్డలా చూసుకుంటున్నాను.

పసిగుడ్డుని నిన్ను పగలంతా నా కాడ వదిలి, ఆరోగ్యం బాగోకున్నా కష్టపడి ఎన్నో గంటలు, ఎంతో దూరాలు ఆటో నడిపి సంపాదించేవాడు. రాత్రంతా నిద్రకాచి మరీ పెంచుకున్నాడే తాత నిన్ను.

సంతోషంగా ఉండాలమ్మా. నీవు బాగయ్యే రాతుంటే అవుతుంది. తాత ప్రయత్నిస్తాడులే,” అంది పిన్ని నన్ను దగ్గరకి తీసుకొని.

కాసేపు పిన్ని వొళ్ళో తల పెట్టుకు తొంగున్నాను.

(ఇంకా ఉంది)

**

గమ్యం దగ్గిరే అని చెప్పే చిత్రం “ఎంతెంతదూరం ..?”

poster_ed

వేణు నక్షత్రం గారి ఎంతెంత దూరం సినిమా చూసాను. ఇది చాల చక్కగా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నపుడు నాకు నా బాల్యం గుర్తుకొచ్చినది. నేను కూడా గ్రామీణ ప్రాంతములో తెలంగాణా ప్రాంతములో పుట్టి పెరిగాను. అవే గుడిసెలు అవే మిద్దెలు- వాటన్నిటి మధ్యలో పుట్టి పెరిగాను . దాని తరువాత ఈ పిల్లలు ఏ పరిస్థితులలో అక్కడ చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏ పరిస్థితులలో పిల్లలని పోషిస్తున్నారు, వాళ్ళకుండే అలవాట్లు ఏంటి ? వాళ్ళకుండే సాధకభాదకలేంటి? తరవాత భార్యా భర్తల మధ్య ఒక సంఘర్షణ ఒక విద్యార్థికి తల్లితండ్రులకి మధ్య సంఘర్షణ, తరువాత ఒక దొరకు ఒక పాలేరుకు మధ్య సంఘర్షణ . తరువాత బానిసత్వము దాని తరువాత ఈ దొరతనము అవ్వన్ని కూడా చాల చక్కగా దర్శకుడు వివరించారు.

పేదరికం అనేది చదువులో మార్కులు సంపాయించడంలో కాని లక్ష్యానికి ఎక్కడ కూడా అడ్డం కాదు, ఆ పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాదించవచ్చు అనేది ఆ అబ్బాయి పాత్ర ద్వారా చూపించారు . తరువాత రెండవది తల్లి పాత్ర చాల చక్కగా చూపించారు దర్శకుడు. బాధ్యతరహితంగా తిరిగే ఒక తండ్రి వున్నప్పుడు , ఆ ఇంటి ఇల్లాలు బాధ్యతగ తన కొడుకు ను ఎలా చదివించు కోగలిగింది ?తరువాత తల్లికి తండ్రికి మధ్య ఎలాంటి సంఘర్షణ చక్కగా వివరించారు ఈ చిత్రంలో .

పేద వారిలో తండ్రి కొడుకుల బంధం, ఉన్నత చదువుల కోసం కొడుకు తండ్రి తో ఘర్షణ చాల అద్భుతంగా చిత్రీకరించారు. భూస్వాములు ఎలా బ్రతుకుతారు గ్రామీణ ప్రాంతాలలో, ఒక్కపుడు ఏవిదంగా బ్రతికేవారు తరువాత వాళ్ళు చేసుకునే పండగలు వారి పబ్బాలు అలాగే వాళ్ళకుండే ఆలోచనా విధానంఏంటి? అలాగే పాలేర్ల పిల్లలని ఏ విధంగా చూస్తారు , తెలంగాణా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఈ సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకులు . అందులో నటించిన నటీ నటులు చాల చక్కగా నటించారు, వాళ్ళు మన కళ్ళకు కట్టినట్టుగా మన గ్రామీణ సమాజాన్ని మన ముందుంచారు నిజం చెప్పాలంటే జీవించేసారు వాళ్ళ పాత్రలలో. ఒక పేద తండ్రి పాత్ర లో , మాభూమి, కొమరం భీమ్ , దాసీ లాంటి ఎన్నో ఆణిముత్యల్లాంటి చిత్రాల్లో నటించిన డాక్టర్ భూపాల్ రెడ్డి నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్పొచ్చు. ప్రముఖ టీవీ సినీ నటి , నంది అవార్డు గ్రహీత మధుమణి చక్కగా తల్లి పాత్రలో ఒదిగి పోయారు . వీరిద్దరికి దీటుగా వూరి పెత్తందారు పాత్ర లో జి.ఎస్ నటన కూడా చెప్పో కో దగ్గది. ఇంకా కొన్ని ఒకటి , రెండు సన్నీ వేషాల్లో కన పడ్డ చిన్న పాత్రలు అయినా , మురళి గోదూర్, చాయ తమ పాత్రలకి చక్కగా సరి పోయారు .

ఈ సీక్వెన్స్ అఫ్ ఈవెంట్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టినట్టుగా అనిపించదు చాల గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి క్షణం కూడా మనకి ఈ అబ్బాయి నిజంగా చదువు కుంటాడ చదువుకోడా అని ఈ భూస్వామి ఇతన్ని కొడతాడ లోకపోతే ఈ పిల్లవాడికి మార్కులు ఎక్కువగా వచ్చినయని భూస్వామి బిడ్డకి తక్కువ వచ్చినయని ఈ పిల్లవాడిని కానీ అతని తండ్రిని కానీ నిలతీస్తడా అన్న విషయాలన్నీ చాల చక్కగా వివరించారు దర్శకుడు . తండ్రికి కొడుకు మీద ఎంత కోపం ఉన్నా కూడా ఇంత పేదరికంలో కూడా ఎన్ని భాదలున్న కూడా పిల్లవాడు మంచి పనిచేసాడని పిల్లవాన్ని అక్కున చేరుచుకోవడం అనేది చాల బాగా చిత్రీకరించారు. చివరగా ఈ పేదరికంలో ఉన్న కూడా మద్యం అనేది ఎలా వీళ్ళని కబలిస్తుంది అనేది కూడా చక్కగా చూపించారు . మా చిన్నతనం నుంచి ఉన్న సమస్యలే ఇప్పటికి ఉన్నాయి కాకపోతే సమస్యలు ఇంకా ఎక్కువయినవి. పేదరికంతో పాటు మధ్యంపానం కూడా తోడయినది కాబట్టి బ్రతుకులన్ని బజారున పడుతున్నాయి , దీని గురించి కూడా చక్కగా వివరించారు

still3_ed

ముఖ్యంగా ఈ చిత్రానికి ప్రాణం డాక్టర్ పసునూరి రవీందర్ కథ, దాన్ని దృశ్య రూపకం లో మలచడం లో దర్శకుడు వందకు వంద శాతం న్యాయం చేయకలిగాడు అనటంలో ఏ సందేహం లేదు. శరత్ రెడ్డి కెమరా మ్యాజిక్ కూడా దీనికి తోడయ్యింది . ఇక పోతే ఈ చిత్రం మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు , అందరిని ఎలాంటి ఆధునిక సంగీతపు పోకడలకు పోకుండా గ్రామీణ వాతావరణంలో విహరిస్తున్నట్టు గా ఒక అనుభూతికి లోనయ్యే చక్కటి సంగీతాన్ని విష్ణు కిశోర్ అందించగా , ఏ ఒక్క పది సెకండ్ల ఫ్రేమ్ కూడా మనకు అవసరం లేదు అనడానికి వీలు లేకుండా తన కత్తెరకు పని చెప్పాడు ఎడిటర్ అమర్ దీప్ నూతి .

సినిమా అంటే టీం వర్క్ , ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో అంత వరకే వుపయోగించు కొని ఒక చక్కటి చిత్రాన్ని అందించడం లో వేణు నక్షత్రం దర్శకునిగా వంద శాతం సక్సెస్ కాలిగాడు ఈ చిత్రంతో .
ఆయనకు మంచి ఫ్యూచర్ వుంది . కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించే ఒక కళ ఆయనకు అబ్బినట్టుగా వుంది అని నాకు అనిపిస్తుంది . రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీస్తారని నేను ఆశిస్తున్నాను .

Video:

Enthentha dooram Trailer:

-డాక్టర్ ప్రవీణ్ కుమార్

PraveenKumar-IPS.1jpg

“ఫ్రిజ్ లో ప్రేమ” అనువాద నాటకం – 6 వ భాగం

friz

దృశ్యం-2

వర్షాకాలం

 

(స్టేజ్ మీద వెలుగు వచ్చే వరకు ప్రసన్న మున్షీ డెస్క్ దగ్గర కూర్చుని రాసుకుంటూ కనపడతాడు. ఫ్రెష్ గా)

ప్రసన్న: నేనీ మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు వారివారి జీవితాలతో, వాళ్ళతో నాకు సంబంధించినంతవరకు లాజిక్ కుదురుస్తుంటారు. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమయింది. నాకింకొకటి కూడా అర్థమయ్యింది. ఏంటంటే….

మిత్రుడు: …. నేనొక…. అర్థంకాని వాణ్ణి. అర్థం చేసుకోవడం కష్టమయిన మనిషిని అయుండాలి. నాలాంటి ఓ మనిషిని అర్థం చేసుకోవడానికి ఎంతయితే సమయం పడుతుందో అంత సమయం ఈ జగంలో ఎవరి దగ్గరా లేదు. ఇందులో వాళ్ళ తప్పు లేదు.

ప్రసన్న: (రాస్తూ) వాళ్ళ తప్పు లేదు. చేతిలోకొచ్చిన తాజా పుస్తకం లాంటి వాళ్ళు ఎదురొచ్చిన ప్రతి మనిషీనూ! వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి. పుస్తకమయినా, మనిషయినా!

మిత్రుడు: నాకా సమయం ఇచ్చేవారే ఎవరూ లేరు.

ప్రసన్న: అందుకే నాకీ మధ్య నేనంటేనే భయం పట్టుకుంది. చుట్టుప్రక్కల వాళ్ళ గురించి ఏమీ అన్పించదు.

మిత్రుడు: ఇక్కడి వరకు బాగానే ఉంది; కానీ ముందు ముందు తెలుగులో రాయడం కష్టం. ఇంత భావాత్మకంగా, ఉత్కృష్టంగా వీటిని మించి శారీరక సుందరత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు…. తెలుగులో కష్టం అవుతుంది.

ప్రసన్న: కానీ, ఎందుకు?

ఇద్దరూ: కాస్త ఆగుదాం.

(ప్రసన్న ఓ రెండు క్షణాలు అస్వస్థతగా కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత చేతిలోని కాగితాలని చింపి పడేస్తాడు. ఏడవడం మొదలెడతాడు. మిత్రుడు పరుగున వెళ్లి అతన్ని దగ్గరికి తీసుకుంటాడు.)

మిత్రుడు: ఏమయింది?

(ప్రసన్న ఏడుస్తూనే ఉంటాడు.)

మిత్రుడు: అన్నీ సర్దేసుకొని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చును. ఏదీ బలవంతంగా చేయాల్సిన పని లేదు ఎవరూ. మనం రాగానే మన వెనక తలుపులు మూసుకోలేదు.

(ప్రసన్న ఏడుస్తూనే లేదు లేదంటాడు.)

(కాసేపయిన తర్వాత కళ్ళు తుడుచుకొని ఏడవడం ఆపుతాడు; కానీ వెక్కిళ్ళు వస్తుంటాయి.)

మిత్రుడు: ఏ విధమైన బలవంతం లేదు. రాయాలన్న నిబంధన లేదు. సమయం నిర్దేశమూ లేదు. మనసుకెలా తోస్తే అలా…. కాబట్టి ప్రశాంతంగా రాయి.

ప్రసన్న: మంచినీళ్ళు.

(మిత్రుడు నీళ్ళు తేవడానికి లోపలి వంటగదిలో కెళతాడు. ఇంతలో ఫోన్ మ్రోగుతుంది. మిత్రుడు ఫోన్ వైపుకెళ్తుంటాడు. ప్రసన్న అతడికి వద్దు వద్దని చెప్పే అంతలో అతడు ఫోన్ ఎత్తుతాడు.)

మిత్రుడు: ఎవరూ మాట్లాడేది? శ్రేయ….

(ప్రసన్న పరుగున వెళ్ళి రిసీవర్ తీసికొని చిన్న పిల్లాడి గొంతులో మాట్లాడడం మొదలుపెడతాడు.)

ప్రసన్న: హలో…. హలో…. ఎవలూ…. ఎవరు మాటాడేదీ? నేనా…. నేను నీళ్ళు తాగుతున్నాను ఎవలూ? శ్లేయా…. శ్లేయక్క బజారు నుండి సీట్లు తేవడానికెల్లింది చాలా శ్లేయక్క ఆచ్చిపోయింది…. మీరూ పోండి.

(ఫోన్ పెట్టేస్తాడు.) (మళ్ళీ ఫోన్ మ్రోగుతుంది.)

హలో…. ఎవలూ మాటాడేది?

(ఫోన్ కట్ అవుతుంది. ప్రసన్న గట్టిగా నవ్వుతాడు. మిత్రుడు కూడా నవ్వుతాడు.)

మిత్రుడు: ఏంట్రా ఇదంతా?

ప్రసన్న: శ్రేయ వాళ్ళమ్మ ఫోన్ చేస్తారు. General …. watch ఉంచడానికి, నేనొచ్చిన రోజే శ్రేయ చెప్పింది ఫోన్ ఎత్తవద్దని. నేన్నీకు చెప్తూనే ఉన్నంతలో నువ్వు ఫోన్ ఎత్తేసావు.

మిత్రుడు: మరిప్పుడు?

ప్రసన్న: శ్రేయ చెప్పుకుంటుందిలే, ఏమైనా…. చూద్దాం!

(ఒక్కసారిగా ఇద్దరూ కాసేపటి వరకు Block అయిపోతారు.)

ప్రసన్న: మా అమ్మ ఫోన్ వచ్చింది ప్రొద్దున్న. నాన్నా కూడా మాట్లాడారు.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నా గురించి పడే బెంగ బయట పడనివ్వకుండా మాట్లాడారు. పోయినసారి మూటాముల్లె సర్దుకొని ముంబాయి నుండి తిరిగి వెళ్ళిన వాణ్ణి కదా! బెంగ పడడం సహజమే కదా? కానీ వాళ్ళకూ ఎక్కడో తెల్సిపోయింది నేనా ఇంట్లో ఉండలేనని…. వాళ్ళతో నాకేం గొడవ లేదు; పైగా నాతో నాకే గొడవ. ఈ మధ్య నేనిలా అసంబద్ధంగా మాట్లాడుతున్నానా ?

మిత్రుడు: నాకెందుకు కన్పిస్తుందలా?

ప్రసన్న: ఒక్క నాన్నకి మాత్రం నాకిక్కడేం ప్రాబ్లం లేదని అర్థమయిందనుకుంటాను.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నాన్నన్నారు, ‘వెళ్ళు! నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఏదో మంథనం జరుగుతుందని మాత్రం అన్పిస్తుంది. వేరే ఇంట్లో ఉంటే నువ్వు ముందుకెళ్తావ్ అనుకుంటే, అలాగే వెళ్ళు!’ కాకపోతే రాసుకునేందుకు అనువుగా నాకు వీలయిన వాతావరణం తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

మిత్రుడు: ఇక్కడనుండి సూర్యాస్తమయం కన్పిస్తుందా?

ప్రసన్న: శ్రేయ నడిగాను నేను. తన గదిలోని కిటికీ నుండి కన్పిస్తుంది. పద….

(ప్రసన్న, మిత్రుడు లోపలికెళ్తారు. స్టేజ్ కొన్ని క్షణాల వరకు ఖాళీగా ఉంటుంది. మిత్రుడు లోపట్నుండి బయటకొస్తాడు. హాల్లోని lamp shades ల్లోని bulb on చేస్తాడు. నీలం రంగు చిత్రం మీద వెలుగు. అతడు రాసిన కాగితాలన్నీ సరిగ్గా అమర్చి బొత్తుగా పెడుతుండగా ఒక కాగితం పెడుతు పెడుతూ ఆగుతాడు. ఆ కాగితం పట్టుకొని ధ్యాసగా చదువుతుంటుంటే అతడి మొహంలో ప్రసన్నని గురించిన ఆదుర్దా.)

మిత్రుడు: గబ్బిలం….

సరిగ్గా నా కిటికీ ఎదురుగా రెండు విద్యుత్ తీగెల మధ్య చిక్కుకుని ఓ గబ్బిలం చచ్చిపోయింది. రాత్రిపూట ఆ తీగెలకానుకొని విద్యుత్ ఘాతంలో పోయింటుంది. అప్పట్నుండి నాకు తెలీకుండానే అంతా తలక్రిందులుగా జరుగుతూపోయింది. ఆ తీగల మీది గబ్బిలం చాలా బాగుండేది. అందుకనే దాని ఫోటోలూ తీయబడ్డాయి. దాని శరీరం నుండి అతివేగవంతమైన విద్యుత్ ప్రవాహం జరుగుతుండడం మూలాన అది అతి మెల్ల మెల్లగా పాడవుతూ వచ్చింది. ఓ ఆర్నెల్ల పాటు నేను దాన్ని చూస్తున్నప్పుడల్లా అయోమయంలో రకరకాల భావాలకు గురయ్యేవాడిని. మూడు నాలుగు నెలల్లో మధ్యలో ఆకారం అంతా ఎండిపోయింది. బక్కచిక్కిపోయింది. కానీ ఆ తీగల మధ్య చిక్కిన నల్లటి రెక్కలు అలానే ఉండిపోయాయి. అంతా అయిపోవచ్చాక వర్షాకాలం దాన్లోని ఒక్క రెక్క మాత్రం రాలి పడింది. ఇంకో రెక్క మాత్రం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ అలాగే ఆ తీగలకి అతుక్కుని ఉంది. అది రాలడానికి ఇంకా సమయం పడ్తుందని నాకన్పిస్తుంది.

(మిత్రుడు చీకట్లో కనీకన్పడకుండా ఉండిపోతాడు. ఫోన్ మ్రోగుతుంటుంది. ప్రసన్న లోపలనుండి మెల్లిగా వచ్చి ఫోన్ ప్రక్కన శాంతంగా కూర్చుంటాడు. అతడి మొహం మీద అప్పుడే సూర్యాస్తమయం చుసిన ప్రశాంతత. ఫోన్ మ్రోగి మ్రోగి ఆగిపోతుంది. శ్రేయ ఇంట్లోకి వస్తుంది మెల్లగా.)

(అలసిపోయింటుంది.)

(ఒంటి మీద పూలపూల కాటన్ చీర. బొమ్మలా ఉంటుంది.)

శ్రేయ: ఎలా ఉన్నావ్? ఇంట్లోనే ఉన్నావా?

ప్రసన్న: నేనెక్కడికెళ్తాను?

శ్రేయ: సారీ, ఇలా లంచ్ ముగించుకొని వచ్చే నా అలవాటు మారదు.

ప్రసన్న: It doesn’t matter . అలసిపోయినట్టున్నావ్, చాయ్ పెడతాను.

శ్రేయ: పనెలా జరుగుతుంది? రోజంతా రాసుకున్నావా?

ప్రసన్న: ఆ….

శ్రేయ: అమ్మ ఫోన్…. నాకివాళ కాస్త ఆలస్యం అయింది.

ప్రసన్న: మీ ఇంటికి పక్కింటి చిన్న పిల్లాడు వస్తుంటాడు. మధ్యమధ్యలో ప్రక్కింటి వాళ్ళు అప్పుడప్పుడూ వాణ్ణి నీ దగ్గరుంచి వెళ్తుంటారు. నీకు పిల్లలంటే ఇష్టమని.

(శ్రేయ చురుక్కున చూస్తుంది.)

…. ఇవాళ ఆ పిల్లవాడు ఫోన్ ఎత్తాడు.

శ్రేయ: No …. ఏమంటున్నావు నువ్వు?

ప్రసన్న: పొరపాటున ఇవాళ నేను ఫోన్ ఎత్తాను.

(ఇద్దరూ గలగలా నవ్వుకుంటారు.)

శ్రేయ: ప్రసన్నా, ఒక గుడ్ న్యూస్.

ప్రసన్న: ఏంటి?

శ్రేయ: నాకివాళ ఒక ad assignment దొరికింది.

ప్రసన్న: Oh wow ! Great ! నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వివాళ ఈ చీరెందుకు కట్టుకున్నావా అని!

శ్రేయ: నాలుగు ఆడిషన్స్ తీసుకున్నారివాళ. మధ్యాహ్నం మూడున్నర వరకు నా షూటింగ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఉండమన్నారు. మళ్ళీ రెండు టెస్ట్ షూట్స్ తీసికొని మరీ ఈ న్యూస్ చెప్పారు.

రెండు నెలల కాంట్రాక్ట్. నా కన్నిటికన్నా ఇందులో నచ్చినదిదే. నేను చాలాకాలం వీటిల్లో ఇరుక్కుని ఉండలేననిపిస్తుంది.

ప్రసన్న: ఎందుకు?

శ్రేయ: ఏం లేదు.

(ప్రసన్న చాయ్ ఇస్తాడు.)

ప్రసన్న: ఇదేమన్నా బాగుందా? నీకింత మంచి assignment దొరికిన రోజు మన మిలా కూర్చుని చాయ్ తాగడం, ఏం బాలేదు.

శ్రేయ: పార్టీ కావాలా ? పోదాం పద బయటికి.

ప్రసన్న: బయటికా? బయటికెందుకు? కాస్తాగు.

(ప్రసన్న లేస్తాడు. సామాన్లనుండి ఒక CD వెదికి తీసి Player లో వేస్తాడు. Wild music వస్తూంటుంది. అతడు ఆమె ముందుకెళ్ళి తనని లేవమన్నట్టుగా సైగ చేస్తాడు. ఆ ఇద్దరూ ఒళ్ళు మరిచి నృత్యం చేస్తారు. ఇద్దరూ very graceful dancers . శ్రేయ ఒక్క క్షణం అలసిపోయి కూర్చుంటుంది. ప్రసన్న తన ముందు కూర్చుంటాడు. ఇద్దరూ నవ్వుతారు.)

శ్రేయ: పిచ్చా…. ఎంత మంచి music పెట్టావ్! నా అంత నేను….

(తనకు మాట్లాడడం రాదు.)

ప్రసన్న: కాసేపయాక మళ్ళీ చేద్దామా?

శ్రేయ: పిచ్చి పట్టిందా ఏమిటి? ఎంత బాగా డాన్స్ చేస్తావ్!

ప్రసన్న: నేను రాక పూర్వం, సాయంత్రం ఇంటికొచ్చాక ఏం చేసే దానివి?

శ్రేయ: అంటే….ఆ…. చెప్తా నుండు. నేను…. ఇలా వచ్చేదాన్ని.

(ఆమె లేచి గుమ్మం దగ్గరికి వెళ్తుంది. ఏం చెప్తూ ఉంటుందో అది చేసి చూపిస్తూ ఉంటుంది.)

నేనిలా వచ్చేదాన్ని సీదా లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఈ గదిలో ఆగేదాన్ని కాదు. అమ్మతో ఫోన్లో మాట్లాడేదాన్ని. తినాలనిపిస్తే తినే దాన్ని…. ఏదో ఒకటి తినేదాన్ని…. అటుకులు, మురమురాలు, పేలాలు ఈ గదిలో లైట్ కూడా వేసేదాన్ని కాదు. ఒక్కళ్ళం ఉన్నప్పుడు చిన్న గదుల్లోనే సురక్షంగా అన్పిస్తుంటుంది కదూ! చుట్టుప్రక్కల గదులన్నీ చీకటిగానే ఉంచేదాన్ని. ఈ గదులన్నీ లేవనుకొని లోపలి గదిలో మాత్రం దీపం ఉంచుకొనేదాన్ని…. ఒక్కటే…. ఏడ్చేదాన్ని.

ప్రసన్న: ఏడవడం దేనికి?

శ్రేయ: ఏడ్చేదాన్ని. ఒంటరి మనిషి. మాట్లాడతాడా, నవ్వుతాడా? కేవలం ఏడవడమే చేయగలదు. నువ్వెప్పుడన్నా ఒక్కడివి ఉన్నావా ?

ప్రసన్న: చాలాసార్లు.

శ్రేయ: చాలాసార్లు?

ప్రసన్న: ఆ…. ఆ తర్వాతేం చేసేదావి ?

శ్రేయ: రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దీపం ఉంచుకునేదాన్ని. లోపలనుండి తలుపు మూడు గడియలు పెట్టేసుకునేదాన్ని. నల్లాలన్నీ గట్టిగా కట్టేసేదాన్ని.

ప్రసన్న: చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా ఇంటి కందరూ వచ్చేవాళ్ళురా, బాబాయి పిల్లలు, మేనత్త పిల్లలు, మామయ్యగారి అబ్బాయి, అమ్మాయిలు అందరూ. రోజంతా ఎంత కొట్టుకొని తిట్టుకున్నా రాత్రయేసరికి అందరూ కల్సి ఒక్క గదిలో పడుకోవాలని ఆరాటపడేవాళ్ళం. ఎలాగోలా. ఎలా పడితే అలా పడుకునేవాళ్ళం మేం. ఒకరు తలుపు దగ్గరయితే, ఒకరు కిటికీ అరుగు మీద పడి నిద్రపోయేవాళ్ళం. నేనేమో ఇంతుండే వాణ్ణి. బక్క పలచగా. ఓ మూలకొదిగి పడుకునే వాణ్ని. కానీ అలా అందరం కల్సుండడం ఎంత బాగనిపించేదో, అలా గది నిండా మన వాళ్ళ మధ్య ఎప్పటికీ ఉండిపోవాలన్పించేది.

శ్రేయ: ఏమయింది మరి?

ప్రసన్న: ఏముంది, అందరం పెరిగిపెద్దవాళ్ళమయాం.

శ్రేయ: ఊ…

(కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉంటారు.)

శ్రేయ: (ఉన్నట్టుండి) ‘ఒక తప్పుడు సహవాసం కన్న ఒంటరితనం మేలు’ అనుకుంటూ అనుకుంటూ ఒంటరితనం అనుభూతిలోకి రావడం మొదలుపెడుతుంది.

(శ్రేయ అలసటగా తన మొహం మీద, జుట్టులో చేతులు కప్పుకొంటుంది.)

ప్రసన్న: మధ్యాహ్నం వంట ఎక్కువ చేసిపెట్టాను. పద, భోంచేద్దాం.

(ప్రసన్న kitchenett వైపుకి వెళ్తాడు. శ్రేయ అతడు రాసిన కాగితాలు పరిశీలిస్తుంటుంది.)

శ్రేయ: ఏంటీ వాక్యం…. ఇంత పొడుగ్గా.

ప్రసన్న: చాలాసార్లు నేను పూర్ణవిరామం మర్చిపోతాను వాక్యం చివరలో. శ్రద్ధగా చదువు. నిజం చెప్పాలంటే, ప్లీస్…… ఉండనీయ్ ఇప్పుడు చదవడం. దానిమీద ఇంకా పని కావాల్సి ఉంది. ఇంకా మార్పులూ, చేర్పులూ ఉన్నాయి.

శ్రేయ: ఈ పరిమళ్ పశ్చిమానికి వెళ్ళాడూ అంటే విదేశాలకు వెళ్ళాడనా ?

ప్రసన్న: పెట్టెయ్ శ్రేయా, Please .

శ్రేయ: సర్లే, పెట్టేస్తాను. ఇంతకీ నీ నవలలో ఏం రాస్తున్నావ్ ?

ప్రసన్న: నా వల్ల కావట్లేదు. ఇవాళ చెప్పుకోదగ్గ పని జరగనే లేదు. రాయలేకపోయాను అనుకున్నట్టుగా!

(అతడు భోజనం పళ్ళాలు తెస్తాడు. ఇద్దరూ మౌనంగా తలలు వంచుకొని తింటూ ఉంటారు.)

శ్రేయ: నువ్వు రాసేదంతా ఎక్కడయినా ఎప్పుడయినా చెప్పగలగాలి. నేను.

ప్రసన్న: నువ్వు నటివి, నేను రాస్తుంటాననా! కానీ నేను నాటకాలు, సినిమా రాయను కదా! అప్పుడప్పుడు ads కోసం రాస్తాను. అది పెద్దగా రచనల క్రిందికి రాదు.

( ఫోన్ మ్రోగుతుంది.)

శ్రేయ: మ్రోగనీ…. రోజూ అదే అదే reporting ఏమనివ్వాలి తనకు.

(ప్రసన్న వెళ్ళి ఫోన్ ఎత్తి మళ్ళీ చిన్న పిల్లాడిలాగా మాట్లాడడం మొదలు పెడ్తాడు. మాట్లాడుతూనే ఉంటాడు.)

(శ్రేయ అతని చేతుల్లో నుండి రిసీవర్ లాక్కుంటుంది.)

శ్రేయ: చెప్పమ్మా…. అవును. పక్కింట్లోని కాళే వాళ్ళ అబ్బాయి. ఆడుకోవడాని కొస్తుంటాడు. అవునమ్మా…. రెండు…. రెండున్నరేళ్ళ పిల్లాడు. అవును…. ఈ మధ్యే వచ్చారు కొత్తగా. మంచివాళ్ళు. కాస్త మనిషి తోడుగా ఉంటారు. అమ్మా, నాకివాళ ఒక ad దొరికింది. నూనెది. నాన్నకి కుడా చెప్పు. Thank you . పదిహేను రోజుల్లో షూటింగ్ ఉంటుంది. అ…. ఆ సినిమా అయిపోయింది. నావి ఓ తొమ్మిది పది scenes ఉండొచ్చు. అంతే. కానీ హాయిగా జరిగిపోయింది షూటింగ్. రేపా…. రేపు ఎల్లుండి ఆడిషన్స్ ఉన్నాయి. అమ్మా, నేను భోంచేస్తున్నాను. రేపు మళ్ళీ మాట్లాడతాను. Okay మంచిది!

ప్రసన్న: అమ్మ తెలుగు సీరియల్స్ చూస్తుంటుంది, నాన్న…. నాన్నేమో ఆవరణలో పచార్లు చేస్తుండొచ్చు. గులామ్ ఆలీ గజల్స్ వింటారాయన రోజూ.

శ్రేయ: నువ్వొక్కడివేనా ?

ప్రసన్న: ఇప్పుడొక్కణ్ణే. అన్న పోయాడు. నిద్రమాత్రలు మింగేసాడు తను.

శ్రేయ: ఎప్పుడు ?

ప్రసన్న: నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. అన్నకి ఇరవై- ఇరవై ఒకటి ఉండొచ్చు. అసలు అమ్మ మంచి ధైర్యస్థురాలు. అప్పట్నుండి ఎలాగో అయిపోయింది. నాన్న ఏమీ పట్టనట్టుగా వట్టి కోపిష్టిగా ఉండేవారు, ఇప్పుడు శాంతంగా అయిపోయారు. అప్పుడప్పుడు నా వైపు అదో తరహాగా నేనేమయిపోతానో అన్నట్టు చూడడం అస్సలు చూడబుద్ధవదు.

అన్న నా హీరో. నాకు బైక్ నేర్పాడు. మొదటి బీర్ తనతోనే తాగాను. తన పాకెట్ మనీలో నుండి ప్రతి నెలా నాకు పది రూపాయిలిచ్చేవాడు. అన్న పోయినప్పుడు అమ్మానాన్నల ఆగని ఏడుపు చూసి నాకు కన్నీళ్ళే రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చుని అన్న గురించి అంతా రాసుకుని పెట్టుకున్నాను. అది శుభ్రంగా మరోసారి రాస్తున్నప్పుడు అర్థమయింది నాకు, అన్న పోవడమంటే ఏమిటో, ఆ పోవడం ఏమేం తీసుకెళ్ళిందో!

శ్రేయ: రాస్తే అర్థమవుతుందా ఏం కోల్పోయామో!

ప్రసన్న: నాకు.

శ్రేయ: ఎలా…. ఎలా రాస్తావ్ నువ్వు? అంటే ఏం అన్పిస్తుంది? రాసే ముందు ఏం చేస్తావ్?

ప్రసన్న: కొత్త స్టేషనరీ సామాను తెచ్చుకుంటాను. ఎప్పుడు రాసినా రాసే ఆరంభం నేను కొత్త స్టేషనరీ తోనే చేస్తాను. కొత్త కాగితపు ఫోల్డర్స్, నోట్స్ కి పెట్టే చిన్న చిన్న రంగురంగుల క్లిప్స్…. కొత్త కాగితాలు. ఇంతకు ముందు నేను దేని మీద పడితే దాని మీద రాసేవాడిని. ఫోన్ ప్రక్కనుండే రాయని పెన్నులని దులిపి దులిపి మరీ రాసేవాడిని.

ఓ చిత్రకారుడు నా మిత్రుడు. అతనీ ఫౌంటెన్ పెన్ నాకు తెచ్చిచ్చాడు. ఇక ఇప్పుడు నేనీ పెన్ను నిబ్ శుభ్రం చేస్తాను. పెన్నులో సిరా పోసుకుంటాను. ఆ తర్వాత అన్నీ ముందు పెట్టుకు కూర్చుంటాను. సత్యనారాయణ వ్రతం పూజా సామాగ్రి అమర్చుకొంటున్నట్టుగా!

శ్రేయ: ఆ తర్వాత కుదురు వస్తుందా?

ప్రసన్న: ఆ…. ఒక్కోసారి…. ఒక్కోసారి అస్సలు కుదరదు.

శ్రేయ: సినిమాకి ఆక్టర్స్ ని ఇలా స్వచ్ఛంగా తెచ్చి పని చేయించడం కుదరదు… అసలు చెప్పాలంటే సినిమా పనంతా ముక్కలు ముక్కల్లో అవుతుంది. అది కాక చుట్టుప్రక్కల అంతా జనం…. అస్తవ్యస్తంగా…. వస్తువులు….! వేలాడే వైర్లు, థర్మాకోల్స్…. ధగధగలాడే లైట్స్…. ఏ క్యారెక్టర్ తో పని చేయాలో చాలాసార్లు వాళ్ళని మనం కలుసుకోలేం.

నా మొదటి సినిమా అప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లిమెల్లగా నేర్చుకున్నాను. ఆ గందరగోళంలో మనమే మన స్పేస్ వెతుక్కోవాల్సి ఉంటుందని నా కర్థమయింది. నాకు నా వంతు స్థలం దొరికింది.

ప్రసన్న: మేకప్ రూమ్?

శ్రేయ: ఛ…. ఛ…. అస్సలు కాదు. షాట్ ప్రారంభించే ముందు కొన్ని క్షణాలు మన మొహం ముందు క్లాప్ తీస్తారు. మనకీ జనాలకీ మధ్య. అప్పుడు సెట్ మీద ఒక momentary silence ఉంటుంది. అప్పుడు నేనోక్షణం కళ్ళు మూసుకుంటాను. ఆ తర్వాత అన్నీ వదిలేస్తాను. నన్ను నేను కూడా.

(ఒక్కసారిగా వెళ్ళి కూలబడినట్టుగా కుర్చీలో కూర్చుంటాడు.)

ప్రసన్న: పని చేస్తూండడం ఎంత బాగుంటుంది కదా! అదీ ఇష్టమయిన పని. నాకో స్నేహితుడు ఉన్నాడు.

శ్రేయ: చిత్రకారుడు?

ప్రసన్న: అవును-చిత్రకార మిత్రుడు…. అతనంటుంటాడు. పనిలో మనసు లగ్నం చేసిన మనుషులు అందర్లోకి అందంగా కన్పిస్తారు. అతి అందమైన వాళ్ళ కన్నా అందంగా!

శ్రేయ: నీ స్నేహితుడి పేరేంటి?

ప్రసన్న: పేరొద్దు. వట్టి చిత్రకార మిత్రుడు.

శ్రేయ: ఎక్కడుంటాడు అతను?

ప్రసన్న: బయటికి వెళ్ళాడు, వస్తాడు.

శ్రేయ: అసలు నీతో పరిచయం అయినట్టుగానే అన్పించదు నాకు. అప్పుడప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తావ్.

ప్రసన్న: చాలా విషయాల్లో మనమిద్దరమూ ఒకేలాంటి వాళ్ళం శ్రేయా, మనలాంటి ఒకేతీరు వాళ్ళకి చాలాసార్లు ఒక్కళ్ళనొకళ్ళం ఎరగమేమోననే భావన కలుగుతుంటుంది ప్రతీసారి. ఎందుకంటే మన ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మనం బయటి ఊర్ల నుండి, ఇంచుమించు ఒకే లాంటి ఇంటి పద్ధతుల నుండి అంతా వెనకాల వదిలేసి వచ్చిన వాళ్ళం మనం. ఒంటరులం.అందుకే నిన్ను అర్థం చేసుకో గలుగుతాను నేను.

శ్రేయ: My God ! ఏం అర్థం చేసుకున్నావ్ నువ్వు నన్ను?

ప్రసన్న: ఏముందీ, నువ్వు మంచి అమ్మాయివి. కష్టజీవివి. ఇంటి నుండి బయటపడిం తర్వాత ఈ గజిబిజి నగరంలో కలిసిపోతావ్ అయినప్పటికీ నీ ఎనర్జీ ని అలాగే కాపాడుకుంటావ్. ప్రొద్దున్న ఇంటి నుండి బయల్దేరేప్పుడు ఏదయితే మంచితనం ఉందో దాన్ని నవ్వు మొహంతో తీసికెళ్ళి మళ్ళీ సాయంత్రం అలాగే కాపాడుకుని తిరిగి సాయంత్రం ఇంటికొస్తావ్. నీకేం కావాలో నీకు తప్పక దొరుకుతుంది శ్రేయా!

శ్రేయ: నిజంగా?

ప్రసన్న: నిజంగా!

శ్రేయ: నేనేం ఏదో పెద్ద దిగివచ్చానని కాదు; కానీ చాలా కష్టపడ్డాను నా కాళ్ళమీద నేను నిలద్రోక్కుకోవడానికి!

కేవలం acting మాత్రమే కాదు కదా. అన్నీ…. అన్ని విషయాల్లో. నా పద్ధతిలో నేను బ్రతుకుదాం అనుకున్నాను గనక! ఈ ముంబాయి, పుణే మహానగరాల సంగతే తెల్సు నీకు…. కానీ చిన్న పట్టణాల్లో, ఊళ్ళల్లో ఆడపిల్లల్ని సరిగ్గా చూడరు ప్రసన్నా…. ఏ నిర్ణయమూ ఆడపిల్ల తీసుకోలేదు. ఆమె తరపున నిర్ణయాలన్నీ ఆమె బంధుజనమే తీసుకుంటారు. నేను కాలేజ్ చదువుకోసం వచ్చిందాన్ని ఇక తిరిగి వెళ్ళలేదు నేను. నా గూడు నేను ఏర్పరచుకొందామని తాపత్రయం.

(కాసేపు ఒక్కసారిగా విచారంగా మారిన మొహంతో ప్రసన్న వైపు చూసి, నవ్వి మెల్లిగా లోపలికెళ్తుంది.)

(కొన్ని క్షణాలు అంధకారం)

(మళ్ళీ ప్రకాశం వచ్చేవరకు మధ్య రాత్రి.)

(శ్రేయ లోపలనుండి దిండూ దుప్పటి తీసికొని వస్తుంది. ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. అతని కేసి చూసి గదిలో ఓ వైపుకి పక్క వేసుకొని పడుకుంటుంది.)

(చీకటి)

( సశేషం)

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

మరాఠీ మూలం : సచిన్ కుమ్డల్కర్

గూడూరు మనోజ

గూడూరు మనోజ

తెలుగు అనువాదం : గూడూరు మనోజ

మల్లీశ్వరి చూడలేని చేదు నిజం!

‘“ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేఛ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సాహిత్యం) కొత్త జీవితాన్ని పొందలేదు”.

-రాల్స్ ఫాక్స్ “నవల- ప్రజలు” (తెలుగుసేత-వల్లంపాటి వెంకటసుబ్బయ్య)

సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. శాస్త్రవేత్తలు, సామాన్యులు, కళాకారులు తమ అవగాహనను అభివ్యక్తం చేయడంలో బేధాలుంటాయి. చూచిన దానిని చెప్పటంలోనూ తేడాలుంటాయి. అందుకనే మామూలు సంభాషణకన్నా, వార్తకన్నా, సాహిత్య రచన భిన్నంగా వుంటుంది. అందువల్ల రచయితలు సమాజాన్ని చూడటంలోనే దృష్టి బేధాన్ని దానివల్ల వాళ్ళ సాహిత్య సృష్టిలో వచ్చే భేదాలను రచయితల సాహిత్యాన్ని పరిశీలించే ముందు తెలుసుకోవాల్సి వుంటుంది.

రచయితలు సమాజంలో భాగస్వాములు, సమిష్టి మానవ జీవితంలో వాళ్ళ అనుభవాలు కూడా వుంటాయి. రచయితలు వాళ్ళ సొంత లేదా వాళ్ళకు పరిచయమైన జీవితాన్ని రచనకు వస్తువుగా తీసుకుంటారు. అందులోని మంచి చెడులను విశ్లేషిస్తారు. పాఠకులను చెడుకు వ్యతిరేకంగా, మంచికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. చెడుకు చోటులేని ప్రత్యామ్నాయ సమాజాన్ని ప్రతిపాదిస్తారు. రచయితలు ఇంత పని చేయాలంటే ఒక దృక్పథం లేకుంటే సాధ్యం కాదు. సమాజ పరివర్తనలో రచయితలు క్రియాశీల సృజనాత్మక పాత్ర నిర్వహించడానికి వాళ్ళకు సహకరించేది వాళ్ళ ప్రాపంచిక దృక్పథమే. అయితే, అందరు రచయితల ప్రాపంచిక దృక్పథం ఒకటి కాకపోవచ్చు. అలానే అన్ని కాలాల ప్రాపంచిక దృక్పథమూ ఒకటి కాకపోవచ్చు. రచయిత నేపథ్యాన్ని బట్టి సమాజంలో ప్రచురంగా వుండే భావజాలాన్ని బట్టి రచయితల మీద సమాజ, ప్రభావాల్ని బట్టి ప్రాపంచిక దృక్పథం ఏర్పడుతుంది. రచయిత రచనకు పూనుకునే ముందు తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్ధారించుకొని రచన ప్రారంభిస్తాడు.

విమర్శకులు ఏ రచయితనైనా అధ్యయనం చేసేటప్పుడు మొదట ఆ రచయిత ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకుంటే తక్కిన సాహిత్యాంశాలు వాటంతట అవే విశదమైపోతాయి. విమర్శకులు ఈ పని చేయాలంటే విమర్శకులకే మొదట స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం వుండాలి. ఆధునిక సాహిత్య రంగంలోనూ, సాహిత్య విమర్శరంగంలోనూ ఈ కారణంగానే ప్రాపంచిక దృక్పథం ప్రధానాంశంగా వుంది. అయితే అనేక మంది విమర్శకులు ఈ ప్రధానాంశాన్ని ఇంకా జీర్ణం చేసుకొకుండానే విమర్శ రాస్తున్నందువల్ల గందరగోళం రాజ్యమేలుతోంది. విమర్శకుడు తమ ప్రాపంచిక దృక్పథమేమిటో స్పష్టంగా, నిర్ధిష్టంగా ఏర్పడక ముందే తమ అజ్ఞానాన్ని దాచుకొని, అరకొర కొలమానాలతో విమర్శకు పూనుకుంటే, నమ్మకంలేని వాటిని గురించి బలంగా మాట్లాడే ప్రమాదం వుంది. పైగా సాహిత్య విమర్శ అభివృద్ధి చెందలేదనే అభిప్రాయం కలుగుతుంది.

రచయిత సామాజిక చలన సూత్రాలను స్పష్టం చేసే పనిని నెత్తికెత్తుకున్నాడు. సంస్కర్తగా, జాతీయవాదిగా, అభ్యుదయ, విప్లవవాదిగా దిగంబరుడిగా, దళిత, స్త్రీ, మైనారిటీవాదిగా, ఆర్థిక, సాంఘీక, రాజకీయ, సాంస్కృతిక జీవిత వ్యాఖ్యాతగా మారాడు. రచయితలు గుర్తింపబడని శాసనకర్త అని ఒక నాడు మాథ్యూఆర్నాల్డ్ అన్నాడు గానీ ఇవాళ రచయితలు గుర్తింపబడిన శాసన కర్తల్లో ఒకడయ్యాడు. రచయిత దృష్టికి, రచయితలుకాని వారి దృష్టికి తప్పకుండా తేడా వుంటుంది. ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసిన, ఒక సామాజిక సంఘటనను చూసినా, ఒక సామాజిక పరిణామాన్ని పరిశీలించినా రచయిత దృష్టి నిశితంగా సృజనాత్మకంగా వుంటుంది. అయితే అందరి రచయితల దృష్టికోణం కూడా ఒకటే కాదు కనుక దృష్టి వైవిధ్యం కనిపించినా, దృష్టి వైచిత్రి మాత్రం అందరిలోనూ వుంటుంది. పారిశ్రామిక నాగరికత బలిసిపోయి మానవ సంబంధాలు కృత్రిమంగా తయారైన పాశ్చాత్య నాగరికత వల్ల ఎంతో మంది మానసికంగా ఆందోళన చెంది వుంటారు కానీ టి.ఎస్. ఇలియట్‍కు మాత్రమే అది ‘ఊసర క్షేత్రం’గా (waste land)గా కనిపించింది.

భారతీయ సామాజిక వ్యవస్థ, సంస్కృతులు విశ్వనాథ సత్యనారాయణకు వేయిపడగలుగా కనిపించాయి అదే వ్యవస్థ, అదే సంస్కృతి గుర్రం జాషువాకు నాల్గుపడగల నాగరాజుగా కనిపించాయి. విశ్వనాథ సత్యనారాయణ ’వేనరాజు నాటకానికి ప్రతిగా త్రిపురనేని రామస్వామి చౌదరి ’ఖూనీ’ నాటకం రాశారు. దృష్టి బేధమే ఇందుకు కారణం. సంప్రదాయవాదికి అమ్మ ’మాతృదేవోభవ’ అవుతుంది. స్త్రీవాదికి అమ్మ ’మండుతున్న పొయ్యిలా’ (విమల-వంటిల్లు) కనిపిస్తుంది. ఇంకాచెప్పాలంటే ’మసిగుడ్డ’గా(కుప్పిలి పద్మ) కనపడుతుంది. మరొకరి దృష్టికి ’త్రీ ఇన్ వన్‍గా’ (సి.సుజాత) కనపడుతుంది. అందువల్ల సాహిత్యాధ్యయనంలో రచయిత దృష్టి ప్రాపంచిక దృక్పథమంత ముఖ్యమైంది.

మామూలు మనిషి దృష్టి కన్నా రచయిత దృష్టి విశిష్టంగా వున్నప్పుడు రచయిత సృష్టి కూడా విశిష్టంగా వుంటుంది. మరి దాన్ని అందుకునే స్థాయి విమర్శకులకు కూడా అవసరం. మల్లీశ్వరి ఆ దృష్టి వైవిధ్యాన్నిఎంత బాగా అవగహన చేసుకుందో వర్తమాన కథకులైన గౌరు నాయుడు, అట్టాడ అప్పల నాయుడు కథల్ని తీసుకొని ఇద్దరినీ ఒకే గాట కట్టారు. గౌరునాయుడు ఆదర్శవాది, అప్పలనాయుడు విప్లవాచరణవాది. వాళ్ళిద్దరి కథా సాహిత్యాన్ని చదివిన సాధారణ పాఠకులకు సైతం ఇది అర్థమయ్యే విషయం. గౌరునాయుడికి గ్రామాలపట్ల, గ్రామీణప్రజలపట్ల, గ్రామీణవ్యవస్థపట్ల వర్తమానంలో చూస్తున్నదానిమీద వ్యతిరేకత వుంది. ఆవ్యతిరేకతతో ఒక ఆదర్శపూరిత గ్రామీణజీవనాన్ని ఆకాంక్షిస్తాడు. అదెలా సాధ్యమన్నది అతనికి పట్టని విషయం. ఇక సాధ్యాసాధ్యాల చర్చ వస్తే, అదే అతని కథలకు పరిమితి. సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో కూడా ఆయనకు వర్గాతీత భావన వుంది. కానీ అప్పలనాయుడు సమాజాన్ని భౌతికవాద దృష్టితో చూస్తాడు. సామాజికంగా జరిగే చలనాలను, ఘటనలకు వర్గదృక్పథం వుందని అతని కథలు చెబుతాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మార్క్సిస్ట్ దృష్టికోణమతనిది.

దాదాపు అతను కథారచన ఆరంభించిన ’పువ్వులకొరడా’ కాలం నుండి ఇప్పటి ’సంధిగ్ధాకాశం, వికృతి’ కథల వరకు సామాజికంగా, ప్రాకృతికంగా జరిగే అనేక మార్పులను, సంఘటనలను ఉత్తరాంధ్ర స్థానిక జీవితాన్ని నిర్ధిష్టంగా చిత్రించినా కొంచెంకొంచెం తేడాలతో, అన్ని ప్రాంతాల జీవితానుభవాల వ్యక్తీకరణ రూపాన్ని తన కథల్లో చిత్రించారు. ’క్షతగాత్రగానం’ (వంశధార కథలు-21ఫిబ్రవరి1999) ’షా’ (ప్రజాసాహితి నవంబర్ 2005) ఉత్తరాంధ్ర సామాజిక, సాంస్కృతిక ఆర్థిక పరిణామాలనేకాక తెలుగు నేల నాలుగు చెరుగుల విస్తరిస్తున్న సామ్రాజ్యవాద సాంస్కృతిక ప్రతిరూపాలుగా అలరారుతున్న నగరాలు మొదలుకొని పల్లెసీమల వరకు ఈ విషవలయంలోనే చిక్కుకున్నాయని నమ్మడం ఎంత వాస్తవమో అట్టాడఅప్పలనాయుడి కథలకు సార్వజనీన లక్షణం వుండడం కూడా అంతే వాస్తవం.

560804_290376897745258_1563925822_n’క్షతగాత్రగానం’ కథ గురించి మల్లీశ్వరి ’పెద్ద రైతు నేపధ్యంలో రాసినప్పటికీ వ్యవసాయ రంగంలోని ఫ్యూడల్, అర్థఫ్యూడల్ దోపిడీకి, వర్తమానంలోని పెట్టుబడిదారీ దోపిడీకి మధ్యనున్న తేడాగా మార్పుల్ని అర్థం చేస్తున్న కథ’ అన్నారు. నిజానికింతే కాదు ఇంకా అప్పటికి(1998) యెరుకలోకే రాని కార్పొరేట్ వ్యవసాయీకరణ ప్రవేశాన్ని చింత్రించిన కథ ఇది. ఈ అంశాన్ని గ్రహిస్తే, అది పెద్ద రైతుల పక్షాన మాత్రమే చెప్పిన కథగా కనిపించదు. ఈకథలోని రైతు పెద్ద రైతు కాదు. భూమి కోసం పడరాని పాట్లు పడి, తాతల తరం పొట్టచేతబట్టుకొని పరాయి దేశానికి(బర్మా) వలసపోయి, సంపాదించిన భూమిని, industrialized transformation జరిగిన తరవాతి తరం హరించేస్తుంది. దానికి కారణాలుగా రచయిత సామాజిక ఆర్థిక రాజకీయ భూమికలను కథలో అనేకచోట్ల చూపిస్తారు.

ఉదాహరణకు “వ్యవసాయంలో….వ్యాపార పంటలొచ్చాయి. షుగర్, జూట్ మిల్లు లొచ్చేయి. ఆ పంటల మార్కెట్ యెగుడూ దిగుళ్ళతో అప్పుల్తో మిగిలేరు”…
“పడమర దోవలో యెవరిదో మోడ్రన్ రైస్ మిల్లోకటి-పరాయిదేశ చక్రవర్తి స్థాపించిన విజయస్తంభంలా కన్పిస్తోంది. తూర్పుదారిలో-కాఫీ,టీ దుకాణాలు! కొత్తవీధి గుండా ఆటో-బలసిన పెనుమృగంలా నిల్చిన శంకర్రాజు ఎరువుల గోడాంని దాటింది. వీధులు, రోజ్ గార్ నిధుల కంకర రోడ్డుతో విశాలమయినట్లున్నాయి. వీధి మలుపులో “స్నోవైట్” కాన్వెంట్- చిలుకలను బొధించిన పంజరంలా వుంది!ఆటో ఆగిపోయింది”.(పే.నెం.282 అట్టాడ అప్పలనయుడు సాహిత్యం మొదటి సంపుటం కథలు కొన్ని 2013)

ఒకరకంగా, విద్యాసాగర్ గారి పుస్తకంలో ప్రతిపాదించిన విషయాలను, మల్లీశ్వరి వ్యాసాంతంలో చెప్పిన ’జీవితాలను అర్థంచేసుకొని అక్షరబద్ధం చేసిన బాధ్యతాయుత రచయిత’కథగా దీన్ని ఉదహరించవచ్చు. గానీ మల్లీశ్వరి….ఇందులో వైరుధ్యాన్ని ఇటీవలి కథల్లో అప్పలనాయుడుగారు అధిగమిస్తూ వస్తున్నారన్నారు. ఇందులోగల వైరుధ్యమేమిటో, దాన్ని ఆయన ఏకథల్లో ఎలా అధిగమించారో చెప్పలేదు. క్షతగాత్రగానం-మారిన గ్రామీణ పరిస్థితులను 1999 నాటికే ఎత్తిపట్టి చూపించిన గొప్పకథ. కార్పొరేట్ వ్యవసాయీకరణ, యాంత్రీకరణ, హైటెక్నాలజీ, కొత్తతరం జీవన విధానం, వారి ఆలోచనలు…….కోటేశ్వరరావు, పురుషోత్తం, భుక్త, ప్రవీణ్, తాత….సుభద్ర, పాలేరు…..అందరి జీవితాల్లోంచి విధ్వంసాలనెన్నింటినో చింత్రించిన కథ. పర ప్రాంత పెట్టుబడి, దాని విశ్వరూపం, అది నిర్ధిష్ట ప్రాంతపు రాజకీయ, ఆర్థిక రంగాలనెలా శాసిస్తుందన్న వస్తువుతో వచ్చిన కథ. ’షా’కథను మల్లీశ్వరి అర్థం చేసుకున్నట్టు……’పెట్టుబడి దారులందు స్థానిక పెట్టుబడిదారులుమేలయా’ అని కథలో ఎక్కడా రచయిత చెప్పలేదు. కథ కూడా అలాంటి భావనలకు ఎక్కడా ఊతమియ్యదు. ఈమె అపార్థంచేసుకుందనడానికి…..ఈ రెండు కథలపై ఆమె చేసిన వ్యాఖ్యానాలే ఉదాహరణలు.

పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యముంటుంది. స్థానిక స్థానికేతర వైరుధ్యమది. ఆవైరంలో స్థానికులు ఓడిపోతారు. పెట్టుబడిని ఓడించేది, జనసమూహమే తప్ప వేరొకరుకాదన్నది ఈ కథ సారాంశం. ‘షా’ కథ పేరే దాన్ని సూచిస్తుంది. చదరంగం ఆటలో బంటుల్తో రాజును ముట్టడించటాన్నే ‘షా’ అంటారు. ఈ కథలో ముట్టడికి నాయకత్వం వహిస్తున్న రైతుకూలీ సంఘం నాయకుడు రైతుకూలీ సంఘం డిమాండ్లను స్థానిక పెట్టుబడి దారుడుగా ఎదిగిన శంభునాయుడు విని శభాష్ అనుకుంటాడు. శంభునాయుడి తండ్రి వ్యవసాయకూలీ ఉద్యమకారులతో పాటూ గొంతు కలుపుతాడు. కథలో ఎక్కడా స్థానిక పెట్టుబడిదార్ల మద్దతుగా వాక్యంగానీ, సంఘటనగానీ లేదు. అయితే మల్లీశ్వరి పొరబాటు ఎక్కడపడుంటుందంటే శంభునాయుని వైన్ షాప్‍లో పనిచేసే సేల్స్‍మేన్ తన అంతరంగం నుంచి శంభునాయుడి ఎదుగుదలని, బతుకు అవకాశాల్ని పాఠకులకు ఇలా వినిపించారు. ‘ఇతగాడంటే మోతుబరోడు…..తండ్రిని కాలవ భూముల ఊరిలో దించి, యితగాని పట్నంలో దిగేడు’. అని శంభు నాయుడి స్థానాన్ని అంచనా కడతాడు.

స్థానికులు స్థాపించిన మోడరన్‍రైస్‍మిల్లును, శంకర్రాజు ఎరువుల గోడౌన్‍ని ‘బలిసిన మృగంలా, స్నోవైట్ కాన్వెంట్‍ను చిలుకలను బంధించిన పంజరంతోనూ అప్పలనాయుడు పోల్చడం జరిగింది. మరి స్థానికులేర్పాటు చేసిన ఇంత చిన్న పెట్టుబడులను కూడా బహుళజాతి పారిశ్రామిక పెట్టుబడులకు ఉపయోగించాల్సిన ఉపమానాలనే ఎందుకు వాడారు? ఈ ఉపమానాల వాడకాన్ని బట్టి స్థానిక, స్థానికేతర పెట్టుబడుల వ్యత్యాసాలను పాటించినట్లుగా అనిపిస్తుందా మల్లీశ్వరి.

కథ ముగింపులో కూడా, నదీ జలాల వినియోగానికి సంబంధించిన డిమాండ్‍ను రైతు కూలీ సంఘం పెడుతోంది తప్ప స్థానిక పెట్టుబడిదారుడు కాదు. అసలు కథంతా స్థానిక పెట్టుబడిదారుడు. పరప్రాంత పెట్టుబడి పోటీలో ఓడిపోవడాన్ని సహించలేక, ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతాడు. అయినా వాళ్ళను ఎదిరించలేడు. వాళ్ళేదో ఎరగని ఆట ఆడుతున్నారనుకుంటాడు. ఆట కట్టించాలనుకుంటాడు కానీ కట్టించలేడు. కట్టించగలిగేది ప్రజాసమూహాలే అన్న పరిష్కారంతోనే ‘షా’ కథ ముగింపు ఉంది. ముగింపులో ఇంత స్పష్టంగా బోధపడుతుంటే, మల్లీశ్వరికెందుకు బోధపడలేదు చెప్మా!

‘కథంతటిలో కార్పొరేట్ పెట్టుబడి విశ్వరూపాన్ని చూపిన అప్పలనాయుడు దానిని ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని విశ్వసించారు. తమ ప్రాంతానికి చెందని ఏ పెట్టుబడినైనా వ్యతిరేకించటం కోసం స్థానికంగా వుండే అన్ని వర్గాలవారు కలిసి పనిచేయడాన్ని ఈ కథ ద్వారా ప్రతిపాదించారు.’ అని మల్లీశ్వరి అట్టాడచేసిన ప్రతిపాదనలుగా ప్రతిపాదించడం ఆమె అవగాహనాలేమిని తెలియజేస్తుంది. ఏదేశంలోనైనా, ఎప్పుడైనా, శ్రమజీవులే. పెట్టుబడిని, సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటారు. ఓడిస్తారు. ఇది అనివార్యం.

అప్పలనాయుడు తన కథలో కిరణ్ పాత్రద్వారా ఈక్రమాన్ని చిత్రించారు తప్ప మల్లీశ్వరి ఆశించినట్లు, అర్థంచేసుకున్నట్లుగా, ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని చెప్పారె తప్ప, స్థానికవాద, ప్రాంతీయఉద్యమ ప్రబోధకంగా కథనం చేయలేదు. స్థానిక పెట్టుబడిని రక్షించుకోవాలి లేదా నిలుపుకోవాలనే ప్రయత్నం కథలో ఎక్కడా ప్రస్థావించలేదు. ఉద్యమించిన ప్రజలు శంభునాయున్నిగానీ, శంభునాయుని తండ్రినిగానీ పట్టించుకోలేదు. పెట్టుబడితో తమ పోరాటం తాము చేశారు. నాయకత్వ స్థానంలో నిలబడ్డారు. ప్రజలనాయకత్వాన్ని శంభునాయుడు మెచ్చుకుంటాడు, ఆశ్చర్యపోతాడు కూడా. అతని తండ్రికి మరోమార్గంలేక నాయకత్వం వెంట నడుస్తాడు. శంభునాయుడి తండ్రిది భూస్వామ్య మనస్తత్వం. తన రాజ్యంలో ప్రవేశించిన శత్రు సైన్యంలాగానే బహుళజాతి కంపెనీల వాహనాలను, వర్కర్స్ ను చూస్తాడు. మరి అతడు ప్రజాసంఘాల నాయకత్వంలోకి రావడానికి ప్రజా ఉద్యమాలపట్లగల మమేకత్వంతో కాదు.

స్వతహాగా భూస్వామికి స్థానిక ఉత్త్పత్తివనరులైన భూమి నదులపట్లగల ప్రేమతోనే. శంభు నాయుడు దూరమవుతున్న అతని మూలాల్ని గుర్తుచేస్తాడు. స్వతహాగా శంభునాయుడిది మోతుబర్ల కుటుంబం. అందుకే అతనిమూలాల్ని గుర్తుచేసే ఎరుకలో ఏమాయా మర్మం కనిపించలేదు. తననుతాను స్వఛ్చందంగానే ఆవిష్కరించుకుంటాడు. ఆ ఆవిష్కరణే శంభునాయుడ్ని తనతండ్రికి ప్రకృతి వనరులపట్లగల ప్రేమ అతన్ని ద్రవీభూతం చేస్తుంది. అతను తండ్రి ఆలోచనలపట్ల ఎప్పుడు? ఎందుకు? మూవ్ అవుతున్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే, తన రాజకీయ జీవితానికి ముప్పు వాటిల్లిందనుకున్నప్పుడే శంభునాయుడు తండ్రిని గుర్తించగలుగుతున్నాడు, భూస్వామి మనస్తత్వం ,పెట్టుబడిదారీ మనస్తత్వాలలో కొద్దికొద్ది తేడాలున్నప్పటికి, ఇద్దరి లక్ష్యం ప్రజావ్యతిరేక పథాయే. అయితే, తమ ఉనికికే భంగం కలుగుతున్నప్పుడు శంభునాయుడు,అతని తండ్రిలాంటి వాళ్ళందరూ ప్రజాఉద్యమంలో కలవాల్సిన అనివార్యతను ‘షా’కథలో అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. అంతమాత్రంచేత అది ప్రజాపోరాటం కాకుండా పోదు. వీళ్ళందరూ తాత్కాలిక ప్రయోజనాల కోసం కలిసినంత మాత్రాన, అది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం కాకుండాపోదు. అంతే తప్ప, ఒక ప్రాంతంలో వచ్చినంత మాత్రాన అది స్థానిక ఉద్యమం కాదు. ఏ ఉద్యమమైనా ఎక్కడో ఒకచోట మొదలుకాక తప్పదు. స్థానికత నుండే సార్వజనీనతను పొందుతుందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను. మరి అట్టాడ అప్పలనాయుడి కథల్లో మల్లీశ్వరి అస్థిత్వవాదమెందుకు తెచ్చిందో అర్థంకాదు.

ఈమే స్వయంగా పాలపిట్టమాసపత్రిక, ఆగస్టు, 2013. సంచికలో అట్టాడ అప్పలనాయుడుతో చేసిన ఇంటర్వ్యూలో కూడా రచయితను అస్థిత్వవాదంపై వేసిన ప్రశ్నకు జవాబుగా అట్టాడ ఇచ్చిన సమాధానంలో ఆయన ప్రాంతీయ, వర్గ దృక్పథాల పట్ల తనకుగల అభిప్రాయాలను స్పష్టీకరించిన దాన్ని అక్షరబద్ధం చేసింది. వాళ్ళ మాటల్లోనే గమనిద్దాం!

“వర్గచైతన్యం నుంచి ప్రాంతీయ అస్థిత్వవాదిగా మీ పరిణామం కేవలం సాహిత్య సంబంధమైనదేనా?” అనే ప్రశ్నకు అట్టాడ జవాబుగా, “నిజానికి మీరన్నట్లు నేను కేవలం ప్రాంతీయ అస్థిత్వవాదిని కాను. ప్రాంతీయ ప్రజాపొరాటాలనేవి రూపంలో అస్థిత్వ ఉద్యమాలలాగా కనిపిస్తాయిగానీ సారంలో అవి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు. అటువంటి ఉద్యమాలుగా అభివృద్ధి కాగలవు. ఆ భావనతోనే ప్రాంతీయ ఉద్యమాలను అర్థం చేసుకుంటాను. కనుక నిర్ధిష్ట ప్రాంతీయ పోరాటాలను అక్షరీకరిస్తున్నాను. వర్గచైతన్యానికి పోటీగానూ, ప్రత్యామ్నాయంగానూ ప్రాంతీయ అస్థిత్వాన్ని ఆహ్వానించటం లేదు. కాకపోతే వర్గ చైతన్యమనేది, నేడు అస్థిత్వ పోరాటాలను భూమికగా తీసుకొని అభివృద్ధి కావాలన్నది నాభావన.”

190291_290372241079057_1667688954_n

మల్లీశ్వరే స్వయంగా అట్టాడ అప్పలనాయుడి సమాధానాన్ని అక్షరాలా సాక్షీకరించింది. మరి ఈ సమాధానాన్ని ఎంతమాత్రం విని, రాసిందో లేక రాయించిందో కానీ మల్లీశ్వరి అట్టాడ అప్పలనాయుడ్ని ప్రాంతీయవాదిగా ముద్రవేసే విఫలయత్నం చేసింది.ఇలా తన అజ్ఞానాన్ని ‘వివిధ’ లాంటి ప్రతిష్టాత్మక సాహిత్య పేజీలో నలుగురితో పంచుకోవడమేకదా! దయచేసి ఇప్పుడైనా అప్పలనాయుడి ముఖచిత్రంతో వచ్చిన పాలపిట్ట ప్రత్యేక సంచికను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మంచిది.

విద్యాసాగర్ ‘పల్లెను మింగిన పెట్టుబడి’ గ్రామీణ పరిశోధన గ్రంధం ఆధారంగా వర్తమాన కథను పరిశీలించదలచి, గౌరునాయుడు, అప్పలనాయుడుల రెండు కథలను మాత్రమే గ్రహించి, (తిరుగుడు గుమ్మి, నీటిముల్లు, ఒకరాత్రి రెండు స్వప్నాలు-గౌరునాయుడు; మమకారం, ప్రత్యామ్నాయం, భద్రయ్య, యజ్ఞం తరువాత- అప్పలనాయుడు కథలిన్ని ఉండగా)ఒకటి రెండు కథల్లో రచయిత దృక్పథాన్ని పోల్చడం, అంచనా కట్టగలగడం అంత సరైన పద్ధతీ కాదు. సాధ్యంకాదు. మల్లీశ్వరి ఈ వ్యాసాన్ని విద్యాసాగర్ పుస్తకాన్ని సమీక్షగా చేసుకొని తన వ్యాసాంతంలో రచయితల బాధ్యత గురించి, గ్రామాలలో మారిన పరిస్థితులను అర్థంచేసుకోవడానికి రచయితలు తప్పక చదవాల్సిన గ్రంధంగా చెప్పింటే ప్రయోజనముండేది. విద్యాసాగర్ అభిప్రాయాలకు- అప్పలనాయుడు, గౌరునాయుడు కథలకు గల సహజాత వైవిధ్యాన్ని ఒక లోపంగా, పొరపాటుగా చెప్పడం వలన అటు విద్యాసాగర్ పుస్తకానికీ న్యాయం జరగలేదు. ఇటు ఈ ఇద్దరి రచయితల కథలకు న్యాయం జరగలేదు. ఎందుకంటే, విద్యాసాగర్ పల్లెల్లోకి ప్రవేశించిన పెట్టుబడి విశ్వరూపాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా సేకరించిన గణాంకాలను ప్రచురించారు.

ఒకప్పటి పల్లెల్ని చూసిన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మేధో వ్యవసాయం చేసేవారికి, మారిన పల్లెల్ని చూడని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ పరిశోధన గ్రంథం కళ్లు తెరిపిస్తుంది. అయినా, ఇది 2013సంవత్సరంలో వచ్చిన గ్రంథం. ఒక దశాబ్ధమున్నర ముందుగానే “క్షతగాత్రగానం”(1988) దానికి ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చిన ‘షా’ (2005)కథలు అప్పలనాయుడు రాశారు. విద్యాసాగర్ ప్రచురించిన గ్రామీణ ఆర్థికం ఈ పరిశోధన గ్రంథానికంటే ముందుగానే పల్లెల్లో అభివృద్ధిపేర కొనసాగుతున్న విధ్వంసాన్ని అట్టాడ తన కథల్లో చర్చనీయాంశం చేశారు. విద్యాసాగర్ పరిశోధించి ఆవిష్కరించిన సత్యాలను అట్టాడఅప్పలనాయుడు తన కథల్లో ఇంతకుముందే చిత్రీకరించారు. ఈ అంశాన్ని డా.మల్లీశ్వరి పరిశీలించలేకపోయారు. దృష్టిలోపమా? దృష్టికోణంలోనిలోపమా?.

– డా. కె. శ్రీదేవి

 అసోసియేట్ ప్రొఫెసర్

తెలుగు శాఖ

ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం .

రక్తంలో డ్రమ్స్ మోగించే ఊరేగింపు!

Vv_writing

“ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి నగర్ లో అక్టోబర్ 1970 దసరా రోజు సాగిన విప్లవ రచయితల సంఘం ఊరేగింపు యీనాటికీ నాకు కళ్లకు కట్టినట్లుగా రక్తంలో డ్రమ్స్ ను మోగిస్తుంది… ఒక చిన్న పోరాట రూపంగా ఊరేగింపు నాకనిపిస్తుంది.

ఉపన్యాసాలు మనిషిని వేదికి మీదికి తీసుకపోతే ఊరేగింపులు మనుషుల్లోకి తెస్తాయి. సంకోచం, బెట్టు, సిగ్గు, పోజ్, ఇన్హిబిషన్స్, కాంప్లెక్సులన్నీ పటాపంచలు చేసి పెటీబూర్జువా వయ్యక్తిక ఆలోచనల నుంచి గుంపు మనస్తత్వంలోకి, మంది ఆలోచనల్లోకి తెచ్చే డీక్లాసిఫయింగ్ లక్షణం ఊరేగింపుకు ఉన్నది.”

1974 జనవరిలో నా మూడవ కవితా సంకలనం ‘ఊరేగింపు’ వెలువడినపుడు నేను రాసుకున్న మాటలివి. ఇవ్వాళ ఖమ్మం వర్తక సంఘం హాల్ – వర్తక సంఘం హాల్ గానే మిగిలిందో, ఇంకా రూప సారాలు మార్చుకున్నదేమో గాని ఆనాడు మాకు అది పాణిగ్రాహినగరే. నీరుకొండ హనుమంతరావు రూపుకట్టిన పాణిగ్రాహి నగర్. నేనింకా ఆ హాల్ ముందు ఆయనతోనూ, రావెళ్ల వెంకటరామారావు తోనూ, ‘కౌముది’తోనూ ఊరేగింపు ముగిసిన శరద్రుతు సంధ్యాకాలం అస్తమిస్తున్న అరుణకాంతుల్లో ఉద్వేగంగా పరిచయం చేసుకుంటున్న జ్ఞాపకం.

అంతకుముందు నేనేమైనా ఊరేగింపుల్లో పాల్గొన్నానా? 1952-53లో ముల్కీ ఉద్యమం రోజుల్లో హనుమకొండ మర్కజీ విద్యార్థిగా మొదటిసారి క్లాసు బాయ్ కాట్ చేసి పాల్గొన్నాను. కనుక వ్యక్తిత్వం వికసించే క్రమంలో కలిగే తొలి అనుభవం ఏదైనా హృదయానికి హత్తుకుని ఎన్నటికీ చెరగని ముద్ర వేసినట్లుగా ఖమ్మం ఊరేగింపు ఎప్పుడూ నా జ్ఞాపకాల్లో కదం తొక్కుతూనే ఉంటుంది.

అప్పటికిప్పటికి వందల వేల ఊరేగింపుల్లో పాల్గొని ఉంటాను. ఒక అనుభవం – అధిక ధరలకు వ్యతిరేకంగా 1973 ఆగస్టులో వరంగల్ పోచమ్మ మైదానం నుంచి సుబేదారి కలెక్టరాఫీసుకు సాగిన వేలాది మంది ఊరేగింపు. మా ఊరేగింపులో మఫ్టీలో పాల్గొని, మాకన్న ఆవేశపూరితమైన నినాదాలిచ్చి, డిఐజి ఆఫీసు ముందుకు రాగానే మమ్మల్ని ఎంచుకొని లాఠీ చార్జ్ రూపంలో చితుకబాది పడేసిన అనుభవం.

varavara.psd-1

మరొక మరపురాని ఊరేగింపు కరీంనగర్ లో రైతుకూలీ సంఘం రెండవ మహాసభల సందర్భంగా 1983లో సాగిన ఊరేగింపు నాతో ‘భవిష్యత్తు చిత్రపటం’ రాయించింది. అంతకన్న చరిత్రాత్మకమైనది 1990 మే 6 న వరంగల్ జగదీశ్ నగర్ నుంచి కాజీపేట దగ్గు రాయలింగు, గోపగాని ఐలయ్య నగర్ దాకా సాగిన సుదీర్ఘమైన లక్షలాది మంది ఊరేగింపు. సందర్భం రైతుకూలీ సంఘం మహాసభలు. పద్నాలుగు లక్షల మంది పాల్గొన్న సభలు. ఊరేగింపు నక్కలగుట్ట దాకా వచ్చిన తర్వాత నేను, చలసాని ప్రసాద్ వచ్చి మిమ్మల్ని తీసుకపోతాం – అని కాళోజీకి మాట ఇచ్చాం. కాని ఆ ఊరేగింపు నుంచి ఎంత ప్రయత్నించీ బయటికి వెళ్లలేకపోయాం. అంత గొప్ప అవకాశం మావల్ల కోల్పోయినందుకు కాళోజీ కన్ను మూసేదాకా ఆ విషయం గుర్తుకు వస్తే మమ్ములను తిట్టేవాడు.

హైదరాబాదులో చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా టిడిపి తప్ప మిగతా పార్టీలు, ప్రజాసంఘాలు అన్నీ కలిసి చేసిన ఊరేగింపులో విరసం క్రియాశీలంగా పాల్గొన్నది. బషీర్ బాగ్ చౌరస్తాలో నేను, విమల మొదలైన సభ్యులం చూస్తుండగానే మా కళ్లముందే పోలీసు ఫైరింగ్ జరిగి ఊరేగింపు చెల్లాచెదరైంది. కళ్లల్లో నిండిన గంధకధూమం పొగలు, కసి, కన్నీళ్లతో బయటపడడమే కష్టమైపోయింది.

ఇంక కాళోజీ శతజయంతి, విరసం 44వ మహాసభల సందర్భంగా 2014 జనవరి 11న హనుమకొండ అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియం దాకా ఊరేగింపు బీటలు వారిన నేల పులపుల మొలకెత్తిన అనుభవం. నమ్మలేని పునరాగమనం. ప్రతి అడుగూ అమరుల నెత్తుటితో తడిసిన బాట.

–          వరవరరావు

 

అమ్మాయి వెళుతోంది

dasaraju

నా ఇంటిని నా ఇష్టానికే వదిలేసి
సర్దిన తీరులో తన ఇష్టాన్ని ముద్దరేసి
కాలానికి నా ఎదురుచూపు లానించి

అమ్మాయి వెళుతోంది

కట్ చేస్తే

గుండెల మీద ఆడినప్పుడు
అ ఆ లు నేర్చుకోవాలన్నానేమో
వీధిలోకి ఉరికినప్పుడు
పట్టుకుపోయేటోడొస్తాడన్నానేమో
చంకనెక్కి, చందమామని చూపినప్పుడు
తెచ్చిస్తనని, మాట తప్పానేమో
ముద్దులొలకబోసినప్పుడు
మూట గట్టుకోవడం మరిచినానేమో

కట్ చేస్తే

రెండుజడలు వేసుకొన్నప్పుడు
పేరొందే కవయిత్రి కావాలని అని వుంటాను
అక్క చున్ని వేసుకొని గొడవ పడినప్పుడు
అక్క దిక్కే మొగ్గు చూపివుంటాను
సినిమాల మీద మోజు చూపినప్పుడు
సమాజం చర్చ చేసివుంటాను
అమ్మ ఒళ్ళో తలపెట్టి గొప్పలు పోతున్నప్పుడు
నా వాటా ఏమీ లేదాని ప్రశ్నించి వుంటాను

కట్ చేస్తే

విద్యార్హతలను ఉద్యోగంతో తూచ ప్రయత్నించానేమో
టాలెంటే సర్వాధికారి, సర్వాంతర్యామి అయినప్పుడు
వీక్ పాయింట్ దగ్గర వీక్ నెస్ ని రెట్టించానేమో
సెల్ చార్జింగ్ కి కరెంట్ కోతలున్నట్లు
సెల్ రీచార్జీలకి రూల్స్ పెట్టానేమో
రుచులను, అభిరుచులను
బ్రాకెట్లో బంధించానేమో

కట్ చేస్తే

కాబోయే సరిజోడును
కలల వూహల్తో కొలుస్తున్నప్పుడు
అతిశయోక్తి నుచ్చరించి వుండొచ్చు
వయసు దాటుతోందని
ఆప్షన్ల సంఖ్య కుదించి వుండొచ్చు
కాలం కఠినంగా గడుస్తోందని
హెచ్చరికలు చేసి వుండొచ్చు
తన కాలం కఠినంగా గడుస్తోందని
కన్ను ఒత్త్తిగిల్లిన సంగతి కని,విని వుండకపోవచ్చు
కట్ చేస్తే

అమ్మాయి వెళుతోంది
ఈ భూమి నుంచి ఆ భూతలస్వర్గానికి
డాలర్ల పక్కన చేరిన ఆయన సందిట్లోకి

తను ఏమడిగినా
సృష్టించైనా ఇవ్వడానికి సిద్దమైనా
తను పూదిచ్చిన ఇంటిని
చిటికెనవేలుతోనైనా మలుపకుండా వుంచడానికే నిర్ణయించిన

ఈసారి కట్ చేయొద్దు

అయ్య చేతిలో తనను పెట్టినప్పుడు
చేతులతో పాటు మనసూ వణికింది
అరుంధతి నక్షత్రం చూపించినవాడు
అమెరికాకి రమ్మంటున్నడు

పెళ్ళి రోజున
నా ఇంటి గడప కడిగి
కడుపు తడి చేసి
కనిపెంచిన రుణం తీర్చుకొని

అమ్మాయి వెళుతోంది

రుణాలని తేర్పుకోవచ్చు
ప్రేమలని తేర్పుకోవడముంటదా…

—దాసరాజు రామారావు

నువ్వొంటరివే!

861_10203100224966079_1515021072_n

ఒక ఆశ్చర్యాన్ని వేటాడుతున్నప్పుడు

ఒళ్ళు మరిచిన పరవశంలో

నువ్వు ఒంటరివే-

ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు

అలల వలల్లో తుళ్ళిపడే

ఒంటరి చేపవు నువ్వే-

ఒక పాట వెంట కాందిశీకుడిలా పరుగు తీసినప్పుడు

నిశ్శబ్ద అగాధంలోకి జారిపడ్డ

ఒంటరి అక్షరానివి నువ్వే-

చీకటిని తెరిచినప్పుడు

వెలుతురును మూసినప్పుడు

కాంతిరేఖల రహస్యం తెలుసుకుని మాడి మసైపోయిన

ఒంటరి మిణుగురు నువ్వే-

ఎవరినో కోరుకున్నప్పుడు

ఎవరూ కోరుకోనప్పుడు

నీ పగిలిన గాజుకన్నుకు గుచ్చుకుని వేలాడే

ఒంటరి కల… నువ్వే!

ఒక భయానికి ముక్కలుగా తెగిపోతున్నప్పుడు

వికల శకల సకలమైన ఒంటరివే నువ్వు!

ఒక విజయానికి రెక్కలతో ఎగిరిపోతున్నప్పుడు

శూన్యంలో పక్షిలానూ

నువ్వొక్కడివే-

20140715_190028-1

ఒక దిగులు… నల్లని మల్లెల తీగలా పెనవేసుకున్నప్పుడు

నెత్తుటిని బిగపట్టిన గాయాల చెట్టులా

నువ్వొంటరివే…

ఒక స్వప్నం ఇసక తుపానులా

నిన్ను చీకట్లోకి విసిరిపారేసినప్పుడు

వెన్నెల ఒయాసిస్సు కోసం అర్రులు చాస్తూ

ఒక్కడివే… ఒంటరివే!

పుటకలోంచి బతుకులోకి

బతుకులోంచి చితిలోకి

చితిలోంచి చింతనలోకి

దేహంలానో

ధూపంలానో

ధూళిగానో

వెళ్తున్నప్పుడు

వెళ్ళి వస్తున్నప్పుడు

వస్తూ పోతున్నప్పుడు

ఒంటరివే…

నువ్వొంటరివే-

***

(సాయంత్రం 5.30 గం.లు, 30 జూన్, 2014)

 

-పసునూరు శ్రీధర్ బాబు

నిజమైన చరిత్ర ‘బహుజన’ తెలంగాణాలో వుంది!

sangisetti- bharath bhushan photo
    షరతులు, మినహాయింపులు, ఆంక్షలతోనైతేనేమి ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఇవ్వాళ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తెలంగాణ ప్రజలు కోరుకుంది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు ‘బంగారు తెలంగాణ’ కావాలని కోరుకుండ్రు. ఈ బంగారు తెలంగాణ కేవలం ‘బహుజన తెలంగాణ’ ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమౌతుంది. సామాజిక న్యాయం అంటే సమాజంలోని అట్టడుగు వర్గానికి సైతం వారి జనాభా దామాషాలో చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం. ఒక్క ప్రాతినిధ్యమే కాదు అభివృద్ధిలో భాగస్వామ్యమూ కూడా కావాలి. 60 యేండ్ల తెలంగాణ పోరాటానికి  నిజమైన గుర్తింపు, గౌరవం, న్యాయం ‘బహుజన తెలంగాణ’తోనే సాధ్యమౌతుంది.

ప్రత్యేక తెలంగాణ న్యాయమైన డిమాండ్‌ అని చెబుతూ ఏ విధమైన సిద్ధాంతాలు, వాదనలు, ప్రాతిపదికలు, పోరాట ప్రతీకల్ని ముందుకు తీసుకొచ్చి, చారిత్రిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, పరిశోధకులు, బుద్ధిజీవులు చైతన్యాన్ని కలిగించారో ఈనాడు ‘బహుజన తెలంగాణ’ కోసం కూడా అదే విధమైన ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరముంది. ఒక ప్రాంతంగా తెలంగాణ అస్తిత్వం ఖాయమైంది. ఇప్పుడు అస్తిత్వానంతర దశలో 90శాతంగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఎలా దక్కాలనే అంశంపై దృష్టి సారించాలి. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటాని యాచించకుండా శాసించే స్థాయికి సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు ఎదగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణకు  సార్ధకతా వస్తూంది.
ఇప్పటికే తెలంగాణ పౌరుషం, పోరాట పటిమ, త్యాగాల చరిత్ర అంటే చాలు సమ్మక్క సారలమ్మ మొదలు, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, మియాసాహెబ్‌, జంబన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, బందగీ, కొమురం భీమ్‌, దొడ్డి కొమురయ్య, షోయెబుల్లాఖాన్‌, చాకలి ఐలమ్మలు, సదాలక్ష్మి, సంగెం లక్ష్మిబాయి తదితరులు రికార్డయ్యారు. వీరికి సరిసమానులైన బహుజన వీరులు, వీర వనితలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరెవ్వరూ ఇంతవరకూ చరిత్ర పుటల్లో కెక్కలేదు. పాఠ్యపుస్తకాల్లో అసలే లేరు. వీరిని వెలుగులోకి తీసుకొచ్చి కొత్త చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాయాలి. కొత్త రాష్ట్రంలో విద్యార్థులందరూ వీరి ఘనతను తెలుసుకోవాలి. ఈ పని ఇప్పుడు చేయనట్లయితే భవిష్యత్తులో మరింత కష్టతరమైతుంది. భౌగోళిక తెలంగాణ కోసం అగ్రవర్ణాలతో కలిసి బహుజనులు కొట్లాడిరడ్రు. ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’ కోసం అవసరమైతే అగ్రవర్ణాల వారితో సైతం తలపడాలి. ఇందుకోసం బహుజన సమాజాన్ని మరింతగా చైతన్య పర్చాల్సిన అవసరముంది.

ఈ బాధ్యత బుద్ధిజీవులు, ఉద్యమకారులపై మరింత ఎక్కువగా ఉంది. సమాజంలో అణచివేతకు గురైన అట్టడుగు వర్గాల వారి చరిత్రను, ఘనతను ఎలా వెలుగులోకి తేవాలో, తద్వారా ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందో ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అమల్లో చేసి చూపెట్టింది. తెలంగాణలో న్యాయంగానైతే పీడిత ప్రజల పక్షాన నిలబడుతామని చెబుతున్న ప్రభుత్వం విస్మరణకు గురైన బహుజన వీరుల్ని వెలుగులోకి తేవాలి. ఒక వేళ ప్రభుత్వం ఆ పని చేపట్టనట్లయితే బుద్ధిజీవులు అందుకోసం ముందుకు రావాలి. కేంద్ర, రాష్ట్ర పరిశోధక సంస్థలు ఈ విషయమై దృష్టి సారించాలి. పరిశోధన చేయించాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందుకు తోడ్పడాలి. మాయావతి అధికారంలో ఉన్న కాలంలో 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి చరిత్రలో చిరస్మరణీయమైన స్థానాన్ని కల్పించింది.
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలో బహుజనసమాజ్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుజన చరిత్రకు గౌరవం దక్కింది. అప్పటి వరకు మరుగునపడ్డ మహనీయుల చరిత్రను వెలుగులోకి తేవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించి మరీ పరిశోధన చేయించింది. వాటిని అందరికీి అందుబాటులోకి తెచ్చింది. వివక్షకు, విస్మరణకు గురైన వీరులను జ్ఞాపకం చేసుకునేలా ‘సామాజిక్‌ పరివర్తన్‌ కే లియే సంఘర్ష్‌ కర్నేవాలే మహాపురుషోంకా సమ్మాన్‌’ పేరిట మాయావతి ప్రభుత్వం పుస్తకం ప్రచురించింది. విస్తృత ప్రచారం కల్పించింది. జిల్లాలకు బహుజన యోధుల పేర్లు పెట్టడం తద్వారా ఆ వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడిరప జేసింది. అప్పటి వరకూ ఆదరణ లేకుండా పోయిన మహాత్మ బుద్ధ, మహర్షి వాల్మీకీ, ఏకలవ్య, కబీర్‌దాస్‌, అహల్యాబాయి హోల్కర్‌, ఛత్రపతి సాహూ మహరాజ్‌, జ్యోతి బాఫూలే, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్‌ల గురించి విరివిగా ప్రచారం జరిగింది. వారి రచనలన్నింటిని పునః ప్రచురించడమైంది.

1380399_10201616179779262_1021311603_n

1857 పోరాటంలో వీరాంగనలు పోషించిన పాత్రను కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బుందేల్‌ఖండ్‌లో రాణీ లక్ష్మీబాయికి మారుగా యుద్ధం చేసిన బహుజన వనిత రaల్కారీ బాయితో పాటుగా స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న బహుజన పులి బిడ్డలు ఉదాదేవి, మహవీరి దేవి, అవంతీబాయి లోధీ, పన్నాధాయిల చరిత్ర బిఎస్పీ అధికారంలో ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చాయి. బిఎస్పీ మొదట 1995 జూన్‌లో అధికారంలోకి వచ్చింది. అప్పటికే మండల్‌ కమీషన్‌ అమలుకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు చేసిన అలజడిని నిరసిస్తూ దళిత, బహుజనులు ఒక్కటై ఉద్యమం చేసిండ్రు. ఈ చైతన్యం తర్వాతి కాలంలో మాయావతి అధికారంలోకి రావడానికి తోడ్పడిరది. 1984 నుంచి బిఎస్పీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ అధికారం దక్కించుకోవడానికి ఒక దశాబ్దం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కవులు, రచయితలూ పాటలు, కవిత్వం, వ్యాసాలు, రచనల ద్వారా తామూ చరిత్రకెక్కదగిన వారమే అని నిరూపించుకున్నారు. ప్రతి తాలూకా కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్‌లో దళితులకు సంబంధించిన చిన్న చిన్న పత్రికలు ప్రచురితమయ్యాయి. ఇవన్నీ దళిత అస్తిత్వ ఉద్యమానికి ఊతమిచ్చాయి. ఇదే తర్వాతి కాలంలో అధికారం అందుకోవడానికి సోపానమయ్యాయి. దాదాపు ఇవే పరిస్థితులు తెలంగాణలో ‘టీఆర్‌ఎస్‌’ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. వందలమంది బహుజన కవి, గాయకులు వేల పాటల్ని కైగట్టి పాడిరడ్రు. విస్మరణకు గురైన వీరుల్ని/వీర వనితల్ని వెలుగులోకి తెచ్చిండ్రు. సమాధి చేయబడ్డ ప్రతిభకు పట్టం కట్టిండ్రు.
1995 నుంచీ మరీ ముఖ్యంగా 2005 నుంచీ దళిత చైతన్యం`స్ఫూర్తి, చరిత్రకు సంబంధించిన సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వెలుగులోకి వస్తోంది. పెద్ద ఎత్తున ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల గురించి రచనలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రాణీ లక్ష్మీబాయికి తోడ్పడిరది రaల్కారీబాయి. ఈమె బహుజన వనిత. ఇప్పటికీ తెలంగాణ మాదిరిగానే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తున్న బుందేల్‌ఖండ్‌లో జానపద గాయకులు ఆమె యశస్సును గానం చేస్తారు. మోహన్‌దాస నైమిశ్రాయ్‌ ఆమెపై హిందీలో పుస్తకం అచ్చేశాడు. తెలుగులో కూడా ఆమె జీవిత చరిత్రను హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఇటీవల ప్రచురించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బద్రినారాయణ దళితుల ఔన్నత్యం, చరిత్రకు సంబంధించిన అనేక వ్యాసాలు, సోషల్‌సైంటిస్ట్‌, ఇపిడబ్ల్యూ లాంటి ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో వెలువరించాడు. ఇటీవలే దళితోద్యమ చరిత్రను వెలువరించాడు.‘విమెన్‌ హీరోస్‌ అండ్‌ దళిత్‌ అస్సర్షన్‌ ఇన్‌ నార్త్‌ ఇండియా ` కల్చర్‌, ఐడెంటిటీ అండ్‌ పొలిటిక్స్‌’ పేరిట బద్రినారాయణ పుస్తకాన్ని 2006లో వెలువరించాడు.
సరిగ్గా ఇదే పద్దతిలో తెలంగాణలోని బహుజనుల జీవిత చరిత్రలు వెలుగులోకి రావాల్సిన అవసరముంది.    కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న వీర వనితలు సమ్మక్క, సారలమ్మలు, గోల్కొండ కోట మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న, పరాయి వారి పాలన పోవాలంటూ బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు తుర్రెబాజ్‌ఖాన్‌ల గురించి ‘ఈటన్‌’లాంటి విదేశీయులు పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన విషయాల్నయినా తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. చెరువులు తవ్వించి పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టిన రాబిన్‌హుడ్‌లు పండుగ సాయన్న, మియా సాహెబ్‌ల గురించి ఇప్పటికీ పాలమూరు జిల్లాలో క్యాసెట్ల రూపంలో కథలు ప్రచారంలో ఉన్నాయి. అధికారులు వీరిని గజదొంగలు అని ముద్ర వేసినప్పటికీ వీరు ప్రజోపయోగమైన పనులు చేసి ప్రజల మన్ననలకు పాత్రులయ్యారు. చార్మినార్‌ కొమ్ములకు తాడేసి ఉయ్యాల ఊగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రజా వీరుడు బండ్లోల్ల కురుమన్న ఈ గడ్డ బిడ్డలే అన్న సోయితో మెలగాలి.
నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య, వీర సంగమయ్య దేవ చరిత్ర, శిష్యప్రబోధము అనే ద్విపద కావ్యాలను రాసిన కుమ్మరి కులానికి చెందిన పోశెట్టి లింగకవి, నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్ధనాష్టకము తదితర గ్రంథాలను రచించిన నల్లగొండ జిల్లావాడు కందుకూరు రుద్రకవి, 1417లోనే ‘తెలంగాణ పురము’ అనే పదాన్ని మొదట శాసనాల్లో వేయించిన తెల్లాపూర్‌ (మెదక్‌ జిల్లా) పంచాణం వారి గురించి గానీ, ‘సీమంతిని విలాసం’ కావ్యాన్ని రాసిన ‘గాండ్ల’ తెలిక కులానికి చెందిన వరంగల్‌ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన సుంకరనేని ఫణికుండలుడు, ఈతని తమ్ముడు ‘విజయ విలాసం’ అనే కావ్యాన్ని, సుభద్రా పరిణయమనే యక్షగానాన్ని రాసిన సుంకరనేని రాజమౌళి, ఇబ్బడి ముబ్బడిగా తత్వాలు, కీర్తనలు రాసి, పాడి వందలాది మంది భక్తులకు మార్గదర్శనం చేసిన మాదిగాయిన దున్న ఇద్దాసులకు చరిత్రలో న్యాయమైన స్థానము దక్కలేదు. వీరే కాదు ఇంకా వేపూరి హనుమద్దాసు, గుజ్జరి యెల్లాదాసు, ఏలె ఎల్లయ్య, కైరం భూమాదాసు, మఠం మహంతయ్య, ఆయన భార్య మఠం మహంతమ్మ, గడ్డం రామదాసు, గవండ్ల రాజలింగకవి, కంసాలి సుబ్బకవి లాంటి అనేకమంది కవులకు తెలుగు సాహిత్య చరిత్రలో అనామకులుగా మిగిలారు. గోలకొండ కవుల సంచికలో ప్రతి కవీ ఏ కులానికి చెందిన వాడో విడిగా వివరంగా పేర్కొన్నారు. వారి గురించి లోతైన పరిశోధనలు జరిపినట్లయితే ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
తెలంగాణ బహుజనుల్లో చైతన్యం తీసుకురావడానికి తమ జీవిత కాలం కృషి చేసిన ఎందరో మహానుభావుల గురించి తెలుసుకోవాల్సిన తరుణమిది. కల్లు డిపోల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ మొదలు, గౌడ విద్యార్థులు చదువుకునేందుకు 1925 ఆ ప్రాంతంలోనే లక్షల రూపాయలు వెచ్చించిన చైతన్య స్ఫూర్తి చిరాగు వీరన్న గౌడ్‌, ఆంధ్రమహాసభ మూడ్రోజుల పాటు నిజామాబాద్‌లో 1937లో సమావేశాలు నిర్వహించింది. ఇందులో దాదాపు వెయ్యిమంది వివిధ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా వచ్చిన వారందరికి ఆ మూడ్రోజులు ఎలాంటి లోటు రాకుండా భోజన వసతి కల్పించిన వారు నర్సాగౌడ్‌,  దేశంలోనే మొట్టమొదటి సారిగా డిచ్‌పల్లిలో కుష్టువ్యాధి చికిత్సా కేంద్రం ఏర్పాటుకు కారణం కూడా ఈయనే. నర్సాగౌడ్‌ వందేళ్లకు పూర్వమే 100ల ఎకరాల స్థలాన్ని అందుకోసం ఉచితంగా ఇచ్చిన వితరణశీలి. ఆంధ్రప్రాంతం నుంచి ఏ పండితుడు వచ్చినా తన ఇంట్లో అతిథి మర్యాదలు చేసిన దర్జీ నాంపల్లి గౌరీశంకరవర్మ. భారతదేశానికి ‘సింగర్‌’ కుట్టు మిషన్‌ని పరిచయం చేయడమే గాకుండా, తాను బాగా డబ్బు సంపాదించడమే గాకుండా, ధనాన్నంతా సాహిత్య, సాంస్కృతిక రంగానికి వెచ్చించాడు.

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి ఎంతో సేవచేసిండు. హైదరాబాద్‌ నగరంలో వందేండ్లకు పూర్వమే పాఠశాలను స్థాపించి బహుజనుల కోసం కృషి చేసిన యదటి సత్యనారాయణ సాగర్‌, ఆవుశెట్టి మంగయ్య, యాదటి పుల్లయ్యలుకూడా సగర వంశస్థుల అభివృద్ధికి పాల్పడ్డారు. పిక్టోరియల్‌ హైదరాబాద్‌ రెండు సంపుటాలుగా వెలువరించి హైదరాబాద్‌ ఘనతను ప్రపంచానికి చాటిన మాజీ హైదరాబాద్‌ మేయర్‌ కృష్ణస్వామి ముదిరాజ్‌, ఇదే కులానికి చెందిన కేశవులు, బి.వెంకట్రావ్‌, బి.వెంకటస్వామి, బి. రంగయ్య, చింతల వెంకటనర్సయ్య, నవాడ ముత్తయ్య, కేవల్‌కిషన్‌ తదితరుల గురించి అందరికీ తెలియాలి. శ్యామరాజు, కామరాజు లాంటి భట్రాజు సోదరుల ప్రతిభ అందరికీ తెలియదు. 1920 నాటికే యాదవ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగెం సీతారామయ్య యాదవ్‌, ఆంధ్రమహాసభలు ఎక్కడ జరిగినా ఆర్థికంగా ఆదుకున్న వారిలో ముందువరుసలో నిలిచేది పద్మశాలి వితరణశీలురు హకీం నారాయణదాస్‌, హకీం జనార్ధన్‌ దాస్‌. వీరిద్దరూ నిజాంకు రాజవైద్యులుగా పనిచేశారు. అలాగే గుంటుక నరసయ్య పంతులు, మాటేటి పాపయ్య ఆయన తనయుడు సికింద్రాబాద్‌ తొలి కమీషనర్‌ మాటేటి రామప్పలు కూడా తెలంగాణలో ప్రజా చైతన్యానికి దారులు వేసిండ్రు. నిజాం రాష్ట్రాంధ్ర ‘మున్నూరు కాపు మహాసభ’ను స్థాపించిన బొజ్జం నర్సింలు, సింగంశెట్టి బాబయ్య, శ్రీపతి రంగయ్య, గిరి పెంటయ్య తదితరులు సంఘాల్ని పెట్టడమే గాకుండా హాస్టల్స్‌ స్థాపించారు. పేద విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. గ్రంథాలయాల్ని కూడా స్థాపించిండ్రు.

1932లోనే విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించిన చింతపల్లి రాఘవాచార్యులు, కొల్లాపురం లక్ష్మినరసింహాచారి, ముమ్మడి లక్ష్మణాచారిల గురించి కనీస సమాచారం కూడా  అందుబాటులో లేదు. సమాజంలో అణచివేతకు గురైన ఆడబాపల గురించి పట్టించుకోవడమే గాకుండా సంఘసంస్కరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహామనీషి సిద్దాబత్తుని శ్యామ్‌సుందర్‌. సికింద్రాబాద్‌లో పాఠశాలలు స్థాపించడమే గాకుండా, కళావంతుల సభలు పేరిట ఆడబాపల ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసిన ఉదాత్తుడు. దక్కన్‌ మానవసేవా సమితిని ఏర్పాటు చేసి జంతుబలికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాడు. గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో ‘నాయి సభ’ను ఏర్పాటు చేసి తమ వర్గం వారి అభ్యున్నతికి ఆంధ్రమహాసభల్లో సైతం పాల్గొని గొంతుని వినిపించిన ‘జనపాల రఘురాం’ ఇంకా అనేకమంది బహుజనుల అభ్యున్నతికి అలనాటి తెలంగాణలో పోరాటాలు చేసిండ్రు.
తెలంగాణలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా హైదరాబాద్‌ అంబేద్కర్‌గా పేరు పొందిన బి.ఎస్‌. వెంకటరావు, గోలకొండ కవుల సంచికలో కవిత్వాన్ని వెలయించిన అరిగె రామస్వామి,  (ఈయన బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేశారు), 1957లోనే అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటుని ఉద్యమంగా చేపట్టిన శ్యామ్‌సుందర్‌, సుతారి బాబయ్య, సుబేదార్‌ సాయన్న, గుంటిమల్ల రామప్ప, బందెల చిత్తారయ్య, జె.ఎస్‌. ముత్తయ్య తదితరులు దళిత చైతన్యానికి ప్రతీకలు. వీరికన్నా ముందు వల్తాటి శేషయ్య, ఎం.ఎల్‌ ఆదయ్య, రాజారామ్‌ భోలే తదితరులు హైదరాబాద్‌లో పేద, దళిత విద్యార్థుల కోసం పాఠశాలల్ని ఏర్పాటు చేసిండ్రు. సభలు, సమావేశాలు, గ్రంథాలయోద్యమం, రాత్రి పాఠశాలల ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిండ్రు. 1952లో హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో  పోటీ చేసిన దళిత నాయకులందరికీ ఫైనాన్స్‌ చేసిన వితరణశీలి ముదిగొండ లక్ష్మయ్య. ఈయన కంపెనీలో తయారైన 555 బ్రాండ్‌ పాదరక్షల్ని దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోయేవి. టి.వి. నారాయణ, టి.ఎన్‌.సదాలక్ష్మి, సుమిత్రాదేవి, ఈశ్వరీభాయి తదితరులు తర్వాతి కాలంలో దళితోద్యమానికి బాసటగా నిలిచారు. ఉర్దూలో మొదటి సారిగా రచనలు చేసిన నాట్యగత్తె, విదుషీమణి మహలఖాభాయి చాందా గురించి అమెరికా వారు పరిశోధన కోసం డబ్బులు వెచ్చించిండ్రు. ఎఫ్లూలో ఆమె తవ్వించిన బాయిని కాపాడ్డానికి ఆర్థిక సహాయం అందజేసిండ్రు. ఈమె ఉర్దూలో రాసిన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడమే గాకుండా ఆమె విశేషమైన నాట్య ప్రతిభను, నేటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడ్డ ఆమె జాగీరు గురించీ, మౌలాలిలోని ఆమె సమాధి గురించీ అందరికీ తెలియజెప్పాలి.
వహబీ ఉద్యమాన్ని దక్షిణాదికి తీసుకొచ్చిన మౌల్వీ విలాయత్‌ అలీ సలీం, దీనికి అండగా నిలిచిన స్వయాన నిజాం రాజు నాసిరుద్దౌలా తమ్ముడు ముబారిజ్‌ద్దౌలా, ముస్లిం మహిళల కోసం ( ఆమాట కొస్తే మొత్తం స్త్రీల కోసం) దేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించిన షమ్సుల్‌ ఉమ్రా, బ్రిటీష్‌ వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని సాలార్జంగ్‌పై హత్యా ప్రయత్నం చేసిన సైనికుడు జహంగీర్‌ఖాన్‌, హైదరాబాద్‌ జర్నలిజానికి పితామహుడి లాంటి వారు మౌల్వీ మొహిబ్‌ హుసేన్‌, నిర్బంధ విద్యను, స్కాలర్‌షిప్‌లను ప్రతిపాదించిన సంస్కర్త ముల్లా అబ్దుల్‌ ఖయూం, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన అబిద్‌ హుసేని, సఫ్రాని, ముల్కీ ఉద్యమాన్ని 1919లోనే చేపట్టిన మౌల్వీ అబుల్‌ హసన్‌, సయ్యద్‌ అలీ, సయ్యద్‌ అబిద్‌ హుసేన్‌ తదితర ముస్లిం చైతన్య మూర్తుల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి చాలా ఉంది. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూనే ప్రజల కోసం పాటు పడ్డ వారి స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి. పఠాన్‌ యోధుడు తుర్రెబాజ్‌ఖాన్‌ గురించీ, ఆయనకు తోడ్పడ్డ మౌల్వీ అల్లాఉద్దీన్‌ గురించీ, బందగీ, షోయెబుల్లాఖాన్‌, మగ్దూం మొహియుద్దీన్‌లతో పాటు వందలాదిగా ఉన్న స్థానిక ఉర్దూ సాహిత్యకారుల ప్రతిభనూ అందరికీ తెలియజేయాలి.
కళా రంగాల్లో ఆర్టిస్టులు కాపు రాజయ్య మొదలు కంభాలపల్లి శేఖర్‌ వరకూ, చిందు ఎల్లమ్మ, ఒగ్గు కళాకారులు మిద్దెరాములు, కవి గాయకులు సుద్దాల హనుమంతు, రాజారామ్‌, బండి యాదగిరి, పెయింటర్‌, కవి, రచయిత మడిపడగ బలరామాచార్య, సాహితీవ్తే సామల సదాశివ, జానపద సాహిత్యానికి గౌరవం, గుర్తింపు కలిగించిన జాతీయ ప్రొఫెసర్‌ బిరుదురాజు రామరాజు తదితరులు తెలంగాణకు చేసిన కృషి చిరస్మరణీయమైనది. రాజకీయ రంగంలో 1952లో రాజకీయ దిగ్గజం మాడపాటి హనుమంతరావుని ఓడిరచిన పెండెం వాసుదేవ్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, బొమ్మగాని ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డితో పాటుగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఆనాటి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు సుంకం అచ్చాలు, ఎం.ఆర్‌.కృష్ణ, ఎమ్మెల్యేగా ఎన్నికైన బుట్టి రాజారాం, భాగ్యరెడ్డి వర్మ తనయుడు హైదరాబాద్‌ అసెంబ్లీ సభ్యుడు ఎం.బి. గౌతమ్‌లు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ సత్తా చాటిన నల్లా నర్సింలు, ఉప్పల మల్సూర్‌, చీమ గురువయ్య, బిజ్జ వెంకన్న, అనుముల లింగయ్య, మధిర తిరపన్న, వడిశాల పిచ్చయ్య, ఆవుల పిచ్చయ్య తదితరులందరూ తెలంగాణ వికాసోద్యమానికి దారులు వేసిండ్రు. వీరితో పాటుగా దళితోద్యమ చరిత్రను రాయడమే గాకుండా స్వయంగా ఉద్యమాల్లో పాల్గొన్న పి.ఆర్‌. వెంకటస్వామి, రజాకార్ల చేతిలో హతుడైన బత్తిని మొగిలయ్య, వైద్య రంగంలో హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన డాక్టర్‌ మల్లన్న, డాక్టర్‌ ముత్యాల గోవిందరాజులు నాయుడు, న్యాయ రంగ నిపుణుడు జస్టిస్‌ కొమ్రన్న, స్వాతంత్య్ర సమరయోదులు కోత్మీర్‌ ప్రేమ్‌రాజ్‌ యాదవ్‌, కాటం లక్ష్మినారాయణ ఇంకా కొన్ని వేల మంది గురించి విపులంగా చర్చించుకోవాలి. చరిత్రకెక్కించాలి.
గోండ్వానా రాష్ట్రపు అంకమ రాజులు మొదలు రాంజీ గోండు వరకూ చరిత్రలో స్థానంలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న బహుజన, ఆదివాసీ, గిరిజన వీరుల సాహస చర్యల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనికి పాక్షిక మినహాయింపు ‘మనకు తెలియని మన చరిత్ర’. బహుజనులు కాపాడిన కళలు పెంబర్తి ఇత్తడి పనులు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చీరలు, ఆదిలాబాదు రంజన్లు, నిర్మల్‌ బొమ్మలు, చేర్యాల నకాషీ పెయింటింగ్‌లు, జోగిపేట గొంగళ్లు ఇలా తెలంగాణలోని ప్రతి ఊరికీ చరిత్ర ఉంది. అది చారిత్రక కట్టడాలు కావొచ్చు, ఆలయాలు కావొచ్చు, వీరగల్లులు కావొచ్చు. ఈ చరిత్రను వెలుగులోకి తేవాలి.
తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించింది సబ్బండ వర్గాల వారు. సకల జనులు. జయశంకర్‌ సార్‌ మార్గదర్శనం, కొండాలక్ష్మణ్‌ బాపూజీ పోరాట స్ఫూర్తి, శ్రీకాంతాచారి, యాదయ్యల ఆత్మ బలిదానం ఇవన్నీ చరిత్రలో రికార్డు చేయాల్సిన సందర్భమిది. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన ఎక్కాయాదగిరి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన అందెశ్రీ, తెలంగాణ లోగోని తీర్చి దిద్దిన ఏలె లక్ష్మణ్‌లు బహుజన ఆలోచనల నుంచి వచ్చిన వారే!
ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది. ఇవ్వాళ మళ్ళీ ఆదివాసీలను ఆగం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మరో వైపు స్వయం పాలన కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డల ఆశలకు గండి వేస్తూ హైదరబాద్‌లో గవర్నర్‌ పాలన పేరిట ‘కేంద్ర పాలిత ప్రాంతం’ తద్వారా సీమాంధ్ర కబ్జాదారుల కొనసాగించేందుకు, పెట్టుబడిదారులకు పట్టం కట్టేందుకు మోడీ సర్కార్‌ యోచిస్తోంది. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తూ మన ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గతంలో కన్నా ఎక్కువ సోయితో వ్యవహరించాల్సిన అవసరముంది. ఇన్నాళ్ళు ఇన్నేండ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరుని, గతకాలపు వీరుల్ని కూడా స్మరించుకోవాలి. ఈ పనిని బహుజనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టనట్లయితే ఉద్యమానికి దూరంగా ఉండి, రాళ్లేసిన వారు రాసే చరిత్రగా మారే ప్రమాదముంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే గాకుండా ‘మనము కూడా చరిత్రకెక్క దగిన వారమే’ అనే స్పృహతో తెలంగాణ చరిత్రను రికార్డు చేయాలి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా పరిశోధనలు జరిపించి పోరాట వీరుల్ని వెలుగులోకి తీసుకు రావాలి. వెలుగులోకి తీసుకువచ్చిన వారి ప్రతిభ/చైతన్యాన్ని పదుగురికి తెలిసే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ పని ఎంత ఆలస్యమైతే తెలంగాణ బహుజనులకు అంత నష్టం జరుగుతుంది. తెలంగాణ చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాద్దాం.

    – సంగిశెట్టి శ్రీనివాస్‌

మా మాధ్యమిక పాఠశాల – ఈశ్వర పుస్తక భాండాగారం రోజులు …

chitten raju

 

 

 

 

 

కాకినాడ గాంధీ నగరానికి ఎల్విన్ పేటకీ సరిహద్దులో ఉన్న అప్పటి “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు లో ఐదో క్లాసు పూర్తి చెయ్యగానే నన్ను రామారావుపేట లో ఉన్న మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో చేర్పించారు మా నాన్న గారు. అప్పటికే మా సుబ్బన్నయ్య..అంటే నా పై వాడు పి.ఆర్. కాలేజియేట్ హైస్కూల్ లోనూ, మా అక్క మెక్లారిన్ హై స్కూల్ పక్కనే ఉన్న గర్ల్స్ హై స్కూల్ లోను చదువుకునే వారు. వాళ్లిద్దరూ రోజు బస్సులో స్కూల్ కి వెళ్ళే వారు. బహుశా ఆ అవస్త చూడ లేక అరగంటలో నడిచి వెళ్లి పోయే ఈ రామారావు పేట మిడిల్ స్కూల్లో నన్ను వేశారేమో నాకు తెలియదు కానీ మా ఇంట్లోంచి ఆ స్కూల్ కి  వెళ్ళిన వారిలో నేనే మొదటి వాడిని. నా తరువాత మా తమ్ముడు ఆంజీ (హనుమంత రావు), మా ముగ్గురు చెల్లెళ్ళూ (భాను, పూర్ణ, ఉష) అ స్కూల్లోనే , ఆ తరువాత గాంధీ నగరం మ్యునిసిపల్ హైస్కూల్ లోనూ చదువుకున్నారు. అంటే సుమారు ఇరవై ఏళ్ళు మా ఇంట్లోంచి ఎవరో ఒకరు ఈ రెండు పాఠశాలలలోనూ చదువుకున్నారు. నాకు తెలిసీ ఇది ఒక రికార్డే!

మా చిన్నప్పుడుఈ ఎల్కేజీ, పీకేజీ అంటూ “కేజీ” గోల, కేజీల కొద్దీ పుస్తకాల మోతా ఉండేది ఉండేది కాదు. ఐదో ఏట అక్షరాభ్యాసం అవగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ప్రాధమికపాఠశాల అంటే ఎలిమెంటరీ స్కూల్, ఆ తరువాత పదో ఏట ఒకటో ఫార్మ్ లో ప్రవేశించి మూడో ఫార్మ్ దాకా మాధ్యమిక పాఠశాల అంటే మిడిల్ స్కూల్, ఆ తరువాత మూడేళ్ళు ఉన్నతపాఠశాల అంటే హై స్కూల్…నాలుగో ఫార్మ్ , ఐదో ఫార్మ్ & ఎస్.ఎస్.ఎల్.సి..అనగా సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తో స్కూల్ చదువు పూర్తి అయేది.

1954-55 లో నేను రామారావు పేట లో శివాలయం రోడ్డు మీద ఉన్న ఈ మాధ్యమికపాఠశాల లో ఫస్ట్ ఫార్మ్ లో చేరాను. అప్పుడు ఆ స్కూల్లో మూడోఫార్మ్ దాకానే ఉండేది. నేను మూడో ఫారం లోకి వచ్చాక నాలుగో ఫార్మ్ పెట్టారు. ఒక్కొక్క ఫార్మ్ కీ “ఎ” సెక్షన్ అనీ “బీ” సెక్షన్ …విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ గా ఉంటే “సీ” క్లాస్ అనీ సుమారు నలభై మంది ఉండే రెండు, మూడు సెక్షన్స్ ఉండేవి. ఎందుకో తెలియదు కానీ కాస్త తెలివైన వాళ్ళని “ఏ” క్లాస్ లో వేసే వారు. నేను ఎప్పుడూ “ఏ” క్లాస్ లోనే ఉండే వాడిని. అంచేత తెలివైన వాడిని అనే అనుకోవాలి. అదేం విచిత్రమో అందులో కూడా నేను మొదటి వాడిగానే ఉండే వాడిని. ఎందుకంటే ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా అందరి కంటే ఎక్కువ మార్కులు నాకే వచ్చేవి. అలా అని నేను ఎప్పుడూ “రుబ్బుడు” గాడిని..అంటే పుస్తకాల పురుగుని కాదు. ఎప్పుడూ గట్టిగా కష్టపడి చదివిన జ్జాపకం లేదు కానీ మేష్టారు చెప్పిన పాఠం శ్రద్ధగా వినడం, జ్జాపకం పెట్టుకోవడం మటుకు బాగా జ్జాపకం. ఇప్పటికీ నాకు ఎవరైనా”ప్రెవేటు” చెప్తుంటే వినడం ఇష్టం. ఎవరైనా దొరికితే “ప్రెవేటు” చెప్పడం అంతకన్నా ఇష్టం.

నా మూడవ ఫార్మ్ లో

అప్పుడు మా స్కూల్లో రెండు సిమెంటు బిల్డింగులు, వెనకాల ఒక పెద్ద పాక ఉండేవి. ఆ పాకలో ఒకటో ఫార్మ్, రెండో ఫార్మ్ తరగతులు, ఒక సిమెంట్ బిల్డింగులో మూడో ఫార్మ్, ఆ తరువాత నాలుగో ఫార్మ్ క్లాస్ రూములు ఉండేవి. రెండో సిమెంట్ బిల్డింగులో ప్రధానోపాధ్యుడి గారి ఆఫీసు, సైన్స్ లాబ్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ గది ఉండేవి. అప్పుడూ, ఆ తరువాత హైస్కూల్ కి వెళ్ళాకా కూడా ఆరేళ్ళ పాటూ మా హెడ్మాస్టర్ గారు ఒక్కరే.

ఆయన పేరు వి.ఎస్.ఆర్.కే.వి.వి.వి.యస్. సత్యనారాయణ గారు. ఆయన ఏదో మాట వరసకి ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పేవారు కానీ హెడ్మాస్టారు పనులే ఎక్కువగా చేసే వారు. మాధ్యమిక తరగతులలో “పాక’లో పాఠాలు చెప్పిన వారిలో బాగా జ్జాపకం ఉన్న వారు తాతబ్బాయి గారు, జి. సత్యనారాయణ గారు. ఇందులో తాతబ్బాయి గారు చాలా తమాషాగా, కారు నలుపు మనిషి అయినా ఆయన తెల్లటి పంచె, లాల్చీలతో, కుర్చీలో కాళ్ళు రెండూ మడత పెట్టుకుని కూచుని ఒక దాని తరువాత ఒకటి గా నాలుగైదు సబ్జెక్టులు చెప్పే వారు. పొద్దుట ఎనిమిది గంటల నుంచి పన్నెండు దాకా నాలుగు పీరియడ్స్ అవగానే మేము గబా, గబా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పరిగెట్టే వాళ్ళం.

హడావుడిగా తిండి తినేసి మళ్ళీ ఒంటి గంట కల్లా క్లాసుకి చేరగానే ఆయన అప్పటికే సుష్టుగా భోజనం చేసి కుర్చీలో కునుకు తీస్తూ ఉండే వారు. అంచేత మధ్యాహ్నం క్లాసులన్నీ మందకొడి గానే జరిగేవి. ఆయన మాట్లాడేది తక్కువ. నాచేత, మిగిలిన తెలివైన కుర్రాళ్ళ చేత చదివించేసి, లెక్కలు చేయించేసి, తన కునుకు కంటిన్యూ చేసే పద్ధతి ఎక్కువ గా ఉండేది. ఎటొచ్చీ ఆయన చేతిలో ఒక బెత్తం, పక్కనే డ్రాయర్ బయటి లాగి పెట్టి ఉంచిన ఒక బల్ల ఉండేవి. ఆ నిద్రలో కూడా మా కుర్రాళ్ళలో ఎవరైనావెర్రి వేషాలు వేసినట్టు గమనించారా…ఇక అంతే సంగతులు. బెత్తం తో కొట్టడం చిన్న శిక్ష కానీ, కుర్రాళ్ళ చేతి వేళ్ళని కొసన లో పెట్టి ఠకీమని ఆ డ్రాయర్ మూసేస్తే ఆ బాధ నరక యాతనే! అందరమూ నెల మీదే కూచునే వాళ్ళం కాబట్టు బెంచీ ఎక్కే సదుపాయమూ, గోడ కుర్చీ వేసే ఏర్పాట్లూ ఉండేవి కాదు.

 

నా విషయానికి వస్తే ఆ క్లాసుకి నేనే మానిటర్ ని. అందుచేత ఎవడైనా అల్లరి చేస్తే ఆ వివరాలు తాతబ్బాయి గారికి మెలకువ రాగానే చెప్పవలసిన బాధ్యత నాదే. ఆ అల్లరి తీవ్రతని బట్టి ఆయన బెత్తమా, చేతివేళ్ళు చితికిపోవడమా అని నిర్ణయించే వారు. నేను “రాము మంచి బాలుడు” కాబట్టి ఆ రెండిటికీ ఎప్పుడూ నోచుకోక పోయినా, క్లాస్ మానిటర్ గా నా రిపోర్టింగ్ సరిగ్గా లేదు అని ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఆ శిక్షలు నాకు పడే అవకాశం ఉండేది.

దేవుడి దయ వలన ఆ అవకాశాన్ని నేను ఎప్పుడూ ఉపయోగించుకో లేదు. ఇక సత్యనారాయణ గారు చరిత్ర పాఠాలు ఎంతో ఆసక్తికరంగా చెప్పే వారు. ఇప్పుడూ టక్ చేసుకుని దర్జాగా ఉండే వారు. ఒకటో ఫార్మ్ నుంచి మూడో ఫార్మ్ దాకా మాకు తెలుగు పాఠాలు ఎవరు నేర్పారో నాకు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు లేకపోవడం చాలా సిగ్గుగా ఉంది. బహుశా వేదుల సత్యనారాయణ గారే అయిఉండాలి. తెలుగులో నాకు ఇప్పటికీ పాండిత్యం అబ్బ లేదు కానీ మార్కులు బాగానే వచ్చేవి.

ఇక అన్ని క్లాసులూ బాహాటంగా ఉంటే ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ క్లాసు మరొక ఎత్తు. దానికి చుట్టూ స్టీలు తడికలతో ఎవరూ దొంగతనం చెయ్యకుండా తాళం వేసే వీలు ఉండేది. ఆ క్లాస్ రూము లో డ్రాయింగ్ సామానులు ..అంటే కుంచెలూ, రంగు డబ్బాలూ, కుట్టు యంత్రాలు, బొమ్మలు చేసే రబ్బరు మొదలైనవి ఉండేవి. అన్నింటి కన్నా ముఖ్యంగా గాంధీ గారి రాట్నాలతో దూది నుంచి దారం వడికి, దాంతో మా చెడ్డీలు మేమే కుట్టుకోవడం నేర్పించే వారు. ఆ విద్య నాకు అబ్బ లేదు. ఎప్పుడు దారం తీసినా అది చిక్కు పడిపోయి నా మొహం లా ఉండేది. చెడ్డీ కాదు సరికదా, జేబు రుమాలు కూడా కుట్టుకోడానికి పనికొచ్చేది కాదు   అన్ని క్లాసులకీ కలిపి ఇవన్నీ నేర్పే ఒకే ఒక్క బక్క చిక్కిన మేష్టారు ఉండే వారు. ఆయన పేరు గుర్తు లేదు కానీ అందరూ ఆయన్ని “తకిలీ” మేష్టారు అనే పిలిచే వారు.

నేను మూడో ఫార్మ్ దాకా నేల మీదే కూచుని చదువుకున్నాను. క్లాస్ మేట్స్ పేర్లు గుర్తు లేవు కానీ లక్ష్మీ నారాయణ అని ఒక కుర్ర్రాడు, అతని చెల్లెలూ కూడా మా సెక్షన్ లోనే ఉండే వారు. విశేషం ఏమిటంటే అతనికి ఎప్పుడూ నా కంటే నాలుగైదు మార్కులు తక్కువే వచ్చేవి. ఎలాగైనా నన్ను మించిపోవాలని, మా ఇంటికి కంబైండ్ స్టడీస్ కి వచ్చే వాడు. కానీ మనం అసలు అంతగా చదివితేగా?

ఇది కాక మా స్కూల్ లో ఎ.సి.సి అనే విభాగం ఉండేది. అంటే అసోసియేటేడ్ కెడేట్ కోర్ అనమాట. ఇది హైస్కూల్ లో ఉండే ఎన్.సి.సి (నేషనల్ కేడేట్ కోర్) కి అనుబంధ సంస్థ. అందులో నేను కొంచెం హుషారుగా పాల్గొనే వాడిని. అది నిర్బంధమో కాదో నాకు గుర్తు లేదు కానీ నమ్మండి, నమ్మక పొండి, నాకు అలా ఆర్మీ వాళ్ళ లాగా, పెద్ద పోలీసు వాళ్ళ లాగా యునిఫారం వేసుకుని తిరగడం సరదాగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఒకే ఒక్క కాన్వెంట్ స్కూల్లో తప్ప స్కూల్ యునిఫార్మ్స్ ఉండేవి కాదు. ఎవరికీ తోచిన చొక్క్కాలు, చెడ్డీలూ వాళ్ళు వేసేసుకోవడమే! మేము వేసుకునే బట్టలని బట్టి మా సోషల్ స్టేటస్ ..అప్పుడప్పుడు కులం తో సహా తెలిసిపోయేది.

సరిగ్గా అదే కారణానికి నేను కొన్నాళ్ళు ఆర్. ఎస్.ఎస్. లోకూడా చేరాను. ఎ.సి.సి. లో తుపాకీ పట్టుకోవడం నేర్పిస్తే వీళ్ళు కుస్తీలు, పెద్ద తాళ్ళతో పీట ముడి వెయ్యడాలు మొదలైన డిఫెన్స్ విద్యలు నేర్పే వారు. నాకు ఆ రెండూ రాలేదు. మా రోజుల్లోనే రైట్ టర్న్, మార్చ్ లాంటి ఇంగ్లీషు పదాలు పోయి బాయే ముడ్, పీచ్చే ముడ్, ఆగే బడ్ లాంటి హిందీ మాటలు వచ్చి వాటి మీద మా క్లాసు రౌడీలు చెప్పకూడని జోకులు వేసుకునే వారు. నేను బ్రాహ్మల అబ్బాయిని కాబట్టి నన్ను చూడగానే ఠపీమని నోరు నొక్కేసుకునే వారు . బహుశా ఈ రోజుల్లో దానికి ఆపోజిట్ ఏమో !

నేను మిడిల్ స్కూల్ లో ఉండగా ఉన్న ఒకే ఒక్క ఫోటో ఆ ఎ.సి.సి యూనిఫారం లో ఉన్నదే. అది ఇక్కడ జత పరుస్తున్నాను. రూపు రేఖలు మారిపోయిన ఆ స్కూల్ ముందు గుమ్మం ఫోటో కూడా ఒకటి జతపరుస్తున్నాను.

Ramarao peta school 1 ఓకే

మా మిడిల్ స్కూల్ ప్రాంగణం లోనే “ఈశ్వర పుస్తక భాండాగారం” అనే చిన్న అతి విశిష్టమైన బిల్డింగ్ ఉంది. నిజానికి దాని పవిత్రత, చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా దాన్ని “భవనం” అనాలి.  “శ్రీ వేణు గోపాల సంస్కృత ప్రచార సభ” అనే ఆ బిల్డింగ్ 1903 లో కట్టారు. రోజూ సాయంత్రం  అయ్యేటప్పటికల్లా అన్ని పేపర్లూ, పుస్తకాలూ చదవడానికి వచ్చే జనం తో ఆ హాలు నిండి పోయేది.

అక్కడ మా తాత గారి పుస్తకాలతో పాటు కొన్ని వందల అపురూపమైన తెలుగు పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. కానీ చదివే వాళ్ళే కరువై పోయారు. ఆ బిల్డింగ్ వెనకాల ..అంటే మా స్కూల్ గ్రౌండ్స్ వేపు ఒక చిన్న వేదిక ఉండేది. ఇంచుమించు ప్రతీ రోజూ ఆ వేదిక మీద ఏదో ఒక హరి కథో, బుర్ర కథ, పురాణ కాలక్షేపం, సాహిత్య ప్రసంగం మొదలైనవి జరుగుతూ ఉండేవి. పండగల రోజుల్లో రికార్డింగ్ డాన్సులు కేవలం రోడ్ల మధ్యలో వేసిన పందిళ్ళలో జరిగేవి.

నా రోజు వారీ రొటీన్ ఏమిటంటే సాయంత్రం స్కూల్ బెల్లు కొట్టగానే ఇంటికి పరిగెట్టి, క్రికెట్ బేటు, వికెట్లూ వగైరాలు పట్టుకుని పి. ఆర్. కాలేజీ గ్రౌండ్స్ కి వెళ్లి ఆడుకోవడం. ఆట అయి కొంచెం చీకటి పడే సమయానికి “సత్తెయ్య” గాడు అర నిముషం ఆలస్యం చెయ్యకుండా ఠంచనుగా పట్టుకొచ్చే వేరు శనక్కాయలు, ఐస్ క్రీం కడ్డీలు, ఒకటో, రెండో తినెయ్యడం. అక్కడ నుంచి ఈశ్వర పుస్తక భాండాగారం దగ్గర మా స్కూల్ ఇసక గ్రౌండ్స్ లో కూచుని ఈశ్వర పుస్తక భాండాగారం వారు ఏర్పాటు చేసిన పురాణ కాలక్షేపం తన్మయత్వంలో విని, తరించి, అది అయిపోగానే ఆ రోడ్డు మీదే ఉన్న శివాలయానికి వెళ్లి దణ్ణం పెట్టుకుని ఆచారి గారు పెట్టిన సాతాళించిన శనగలు ప్రసాదం తినేసి “ఆటలు, పాటలు, నాటికలూ” చాలించేసి ఇంటికెళ్ళి పోవడం.

మా రోజుల్లో “హోమ్ వర్క్” ఇచ్చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపేసుకునే వారు కాదు. వాళ్ళు ఏం చెప్పినా క్లాసులోనే క్షుణ్ణంగా చెప్పే వారు. మేము ఏం నేర్చుకున్నా క్లాస్ లోనే నేర్చుకునే వాళ్ళం. టీవీలు లేవు. రేడియోల పాత్ర పరిమితమైనదే.   అందుకే ఆట, పాటలకీ, పై పుస్తకాలు చదువుకోడానికీ సమయం ఉండేది. పిల్లలం పిల్లలుగానే జీవించే వాళ్ళం. అది మా తరం చేసుకున్న అదృష్టం.

ఇక గతం నాస్తి అనుకుని ఎంతో విచారంగానే ప్రస్తుతానికి వస్తే, నేను ఇటీవల (ఫిబ్రవరి 2014) కాకినాడ వెళ్ళినప్పుడు రూపు రేఖలు మారిపోయిన మా స్కూలు, ఈ గ్రంధాలయాల లో కొన్ని గంటలు గడిపి, పెద్ద పోజు పెట్టి మా మాధ్యమిక పాఠశాల దగ్గరా ఈశ్వర పుస్తక భాండాగారం లోనూ ఫోటోలు తీయించుకున్నాను కానీ నా కంప్యూటర్ కి ఏదో వైరస్ మాయ రోగం ఆవహించి నేను తాళ పత్రాలు తిరగేస్తున్న ఒక్క ఫోటో తప్ప మిగిలిన ఫోటోలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. అది ఇక్కడ జతపరుస్తున్నాను.

Eswara Pustaka Bhandagaram 2 ఓకే

ఇప్పటి దౌర్భాగ్యం చూడాలంటే అలనాడు మాకు సాంస్కృతిక భిక్ష పెట్టిన మా ఈశ్వర పుస్తక భాండాగారం ఈ నాడు ఎలా ఉందో ఇందుతో జత పరిచిన ఒక ఫోటో చూస్తే తెలుస్తుంది. ఆలనా, పాలనా లేక పోయినా, కార్పొరేషన్ వారు గాలికొదిలేసి, వారి రాజకీయాల గాలి మేడలు కట్టుకుంటున్నా, స్థానిక విద్యావేత్త, సాంస్కృతిక ప్రముఖురాలు అయిన డా. చిరంజీవినీ కుమారి గారి నాయకత్వంలో కొందరు ఆ గ్రంధాలయాన్ని ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. కృష్ణ కుమార్ అనే నాట్యాచార్యులు గారు ఆ హాలు లోనే కూచిపూడి నృత్యం నేర్పిస్తూనే ఉన్నారు.

ఈ ఫోటో చూడగానే విధి ఎంత విపరీతమైనదో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నూట పది సంవత్సరాల క్రితం ఈ స్థలం సమాజానికి విరాళంగా ఇచ్చి అక్కడ గ్రంధాలయం, సాంస్కృతిక వేదిక కట్టిన వారు ఈ నాటి కమ్యూనిస్ట్ రాజకీయ ప్రముఖులైన యేచూరి సీతారాం గారి పై తరం వారు. ఈ నాడు అదే కమ్యూనిస్ట్ పార్టీ వారు ఈ బిల్డింగ్ గోడల మీద రంగుల బొగ్గుతో తమ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు.

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

 

 

నేను తీసుకున్న ఫోటోలు హుష్ కాకీ అయిపోయాయి కాబట్టి ఈ వ్యాసం కోసం అడిగిన వెంటనే ఈ ఫోటోలు తీసి పంపించిన రామారావు పేట నివాసి, ఆత్మీయ మిత్రుడు అయిన యనమండ్ర సూర్యనారాయణ మూర్తికి పత్రికా ముఖంగా నా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. నలుగురి సహకారంతో  ఆ గ్రంధాలయాన్ని కొంతైనా పునరుధ్ధరించే ప్రయత్నంలో ఉన్నాను. చూద్దాం ఎంత వరకూ చెయ్యగలమో?

సాయం

radhamanduva1

 

ఫెళ ఫెళ ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం. ఆకాశం అంతా నల్లని కాటుకగా మారి నా చుట్టూ ఉన్న చెట్లనీ, నా ఒడ్డున ఉన్న ఇళ్ళనీ అంధకారం లోకి నెట్టేసింది. రివ్వున వీస్తున్న చలిగాలికో మరి అక్కడ నుండి కదలడం ఇష్టం లేకో నాలోని ప్రతి నీటి అణువూ వణికిపోతూ ముడుక్కుని కూర్చున్నట్లు నిశ్చలంగా ఉంది.

 

‘రత్తో! అన్నం తింటివా?’ అనో, ‘నరిసీ పనిలోకి బోలా?’ అనో, ‘ఒరేయ్! ఆడకూతురికి సాయం చెయ్యకుండా అట్లా చూస్తా నిలబడినావేందిరా – ఇట్ల పట్టియ్ ఆ కోడిని!?’ అనో గోలగోలగా ఏవేవో మాట్లాడుకునే జనం నా గట్టు మీద ఒక్కళ్ళు లేరు. వానకి దడిసి అందరూ ఇళ్ళల్లో దూరి కూర్చున్నారు. చెట్లల్లో నుండి నా అంచుల్లోకి దుమికి దుమికి ఆడుకునే జీవాలు కూడా ఎక్కడివక్కడ దాక్కున్నాయి.

రంగమ్మవ్వ రాత్రి ఆమెని సముదాయించి ఆమెనీ, ఆమె కూతురునీ తనింట్లోకి తీసికెళ్ళినప్పుడు విముక్తమైనట్లుగా ఉరిమిన ఆకాశం సన్నని తుంపర్లను విదిలించింది. నాలుగో ఝాము నుంచీ మరీ క్షణం తీరిక లేకుండా బిందెలతో పోసినట్లుగా కుమ్మరిస్తూ నా ప్రయాణానికి సన్నాహాలు చేస్తుంది. చెట్లు, పుట్టలు, దార్లు అన్నీ నీళ్ళమయమై నాలోకి చేరుతున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా నీటి బిందువులు మిరుమిట్లు గొలుపుతున్నాయి.

ఎన్నో చోట్లలో నాకు ఆనుకుని ఉన్న చెట్లనీ, దుబ్బులనీ, రాళ్ళనీ, రప్పలనీ తాకుతూ చెంగుచెంగున పరిగెత్తాలనే నా కోరిక ఇంకాసేపట్లో తీరబోతోంది. దీని కోసం నాలుగేళ్ళ నుండీ ఎదురు చూస్తున్నాను. నిజమే – కాని నాకు ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు.

పుట్టినప్పటి నుండీ సంతోషంగా పరుగులు తీస్తూ ఆడుకున్నాను. ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఉండేదాన్ని. నా ప్రక్కనున్న చెట్లనీ చేమలనీ అడిగి వాటి రంగురంగుల ఆకులతో, పువ్వులతో రోజుకో రకంగా అలంకరించుకునేదాన్ని.   ఒడ్డునున్న రాళ్ళని కావాలని తాకి నవ్వేదాన్ని. అవి నేను పెట్టే గిలిగింతలకి నాతో పాటు నవ్వి నవ్వి అలిసి అరిగిపోయేవి.

ఎంత బావుండేవి ఆ రోజులు!? వర్షం ఎక్కడికెళ్ళిందో మరి ఐదేళ్ళనుండీ…. నాకు కనపడకుండా పోయింది. నాలోకి చేరవలసిన నీరు సంగతి అలా ఉంచి, ఉన్న నీరే సూర్యుని దాహానికి సరిపోవడం లేదు. అందరినీ, అన్నింటినీ పలకరిస్తూ పారుతూ పోవలసిన నేను నాలుగేళ్ళుగా ఇక్కడే ఆగిపోయాను. శుష్కించిన శరీరంతో మడుగులాగా పడి ఉన్నాను.

ఆశాదృక్పథంతో జీవితాన్ని సాగించాలనుకునే నేను ఇక్కడ కొచ్చిన కొత్తల్లో పెద్దగా బాధ పడేదాన్ని కాదు. నిజానికి ఈ కొత్త రకమైన నిశ్చలతకి సంతోషంగా ఉండేది.   నా చుట్టూ ఉన్న వాటిని పరిశీలించడం మంచి అలవాటుగా అలవడింది.

నేను ఇక్కడ ఆగాకే నా ఎదురుగ్గా ఇందిరమ్మ ఇళ్ళు లేచాయి. నా ఒడ్డు పై నుంచి మెట్లు ఏర్పరచుకోని ఆడవాళ్ళు బిందెలతో నా దగ్గర కొచ్చి నవ్వుతూ, తుళ్ళుతూ నా నీళ్ళని తీసికెళుతుంటే భలే ఆనందపడేదాన్ని.

తరవాత్తర్వాతే నాలో ఓ రకమైన నిర్లిప్తత ఏర్పడింది. ఏమీ చేయలేని నిస్సహాయత, నిస్పృహలతో బాధపడేదాన్ని.

రెండేళ్ల క్రితం – ఆ రోజు …. నాకు బాగా గుర్తుంది. పడమటింట్లో విశ్రాంతి కోసం సూర్యుడు వేగిరపడుతున్నాడు. ఆర్ర్తత లేశమాత్రమైనా లేని నన్ను గమనిస్తున్న నింగి మందంగా మేఘాలను కదిలిస్తుంది. నేను దిగులుగా ఆకాశాన్ని చూస్తున్నాను. బహుశా ప్రార్థిస్తున్నానేమో!

ఆ సమయంలో నా ఒడ్డు పైన మెత్తని పాదాల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూశాను.

అడుగులో అడుగేస్తూ నడుస్తున్న ఆమెకి 24 ఏళ్ళుంటాయి – పుష్టిగా, బొద్దుగా ఉంది. నల్లని నీల మేఘ ఛాయ మేని. పసుపులో అద్దిన తెల్లని పెళ్ళి చీర, మెడలో పసుపుతాడు. దానికి వేళ్ళాడుతూ ఆమె గుండెలని తడుముతున్న మంగళ సూత్రాలు. గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులు. కుడి చేతి చిటికెన వ్రేలిని భర్త ఎడమ చేతిలో ఉంచి పారాణి ఆరని పాదాలతో సన్నని అడుగులు వేస్తూ దించిన కళ్ళని మరింత దించి నా వైపు చూసింది.   నా కళ్ళు ఆమె కళ్ళతో కలిసి ఒక్కసారిగా జిగేలుమన్నాయి. చిత్రమైన అనుభూతి నాలో గాఢంగా.

సాయంకాలపు ఎండ కెంజాయ రంగు ఆమె బుగ్గలను తాకి నా నీళ్ళల్లో ప్రతిఫలించింది. చల్లని మలయ మారుతం ఆమె తలలోని మలె్లల పరిమళాన్ని నింపుకొని నా మీదకి వాలింది.   నా వైపు అలాగే చూస్తూ నడిచి తూర్పు దిక్కున నేను ఆగిన చోట ఆగి ఎదురుగ్గా ఉన్న ఇంట్లోకి వెళ్ళింది.

సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. పనుల నుండి జనం ఇళ్ళకి చేరారు. “మ్మే సుజాతా! మన సూరి గాడు పెళ్ళాన్ని పిలచకొచ్చినాడంట సూసేసొద్దాం దా” అంది రత్తి.

“అవునంట. మూడు నిద్దర్లన్నా చేయించకుండా అట్లెట్లా పంపిచ్చేసినారక్కా! సవితి తల్లి వదిలిచ్చేసుకుందనుకో కన్నతండ్రి అన్నా చెప్పగూడదా?” అంది సుజాత కోపంగా.

“ఆఁ! సరేలే పా! వాడొక తండ్రా? తల్లి చచ్చిపోతే సాకాల్సొస్తుందని చిన్నప్పుడే హాస్టల్లో చేర్పించినాడు. పది గూడా చదువుకోనీకుండా ఆ పాప తావున సంపాదిచ్చల్లని మిల్లులోకి కుట్టు పనికి అంపించినాడు. కూతురికి పెండ్లి చేయకపోతే నలుగురూ మొకానూస్తారని చేసినాడు…. ఆ పాప సంపాదించిండే డబ్బుతో తాళిబొట్లు కొని. – తల్లిలేని పిల్ల పాపం, ఈ తాగుబోతు సూరెదవేం బాదలు పెడతాడో? – తొందరగా పోయొద్దాం పద. తెల్లవారి చేసిండే కూర రొంతే ఉంది. ఈ పూట రసం పెట్టాల్ల” అంది రత్తి.

వింటున్న నాకు నా గుండె గొంతుకలో కొట్టాడినట్లయింది.   కళ్ళ నిండా కలలు నింపుకుని సిగ్గుపడుతూ అతని ప్రక్కన సున్నితంగా నడిచి వెళ్ళిన ఆ అమ్మాయిని తల్చుకుని ‘పాపం’ అనుకున్నాను.

అప్పటినుండీ ఆమెనే గమనిస్తున్న నాకు సమయం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఆమె నవ్వినప్పుడు నేను నవ్వుతూ, ఆమె దిగులుగా ఉన్నప్పుడు ఏమయిందో అని ఆశ్చర్యపోతూ ఆమెలో ఒక భాగమయ్యాను.

నీళ్ళకి అమ్మలక్కలతో వస్తే ఆమె గురించిన విషయాలు తెలుస్తాయనుకుంటే ఎప్పుడూ ఒక్కతే అందరూ పనులకి పోయాక ఏ మధ్యాహ్నమో వస్తుంది. అది నాకు విశ్రాంతి సమయం. నేను పడుకుని ఉంటే నా ప్రక్కనే కూర్చుని నా వైపే కన్నార్పకుండా చూసేది. అప్పుడప్పుడూ సన్నగా నవ్వేది.

2010-10-18

ఆమెని అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. మరీ ఆమె పక్కింట్లో ఉండే రంగమ్మవ్వ ఆమెని తన సొంత కూతురు లాగా చూసుకుంటుంది. కొడుకు కోడలు పనికి పోయాక రంగమ్మవ్వకి ఆమెతోనే కాలక్షేపం.

ఒకరోజు రంగమ్మవ్వ ఆమె పొట్ట వైపు చూస్తూ “పాపా! ఎన్నో నెల?” అంటుంటే నాకు చాలా సంతోషం కలిగింది.

రోజులు గడిచేకొద్దీ నిండుగా మారుతున్న ఆమెని చూస్తూ ఆందోళన పడ్డాను. పిల్ల పుట్టింది. ఆ పిల్ల పుడుతున్నపుడు ఆమె పెట్టిన కేకలకి నేను ఎంతగా వణికిపోయానో!   ఇక ఆ రోజు నుంచీ ఆమె తప్పేమీ లేకుండానే ఆమె జీవితంలోకి చీకటి, దు:ఖం నిర్దాక్షిణ్యంగా అడుగుపెట్టాయి.

“ఆడపిల్లని కనడం నేరమా అవ్వా!” అని బిడ్డని ఒళ్ళో పెట్టుకొని ఆమె అవ్వని అడుగుతుంటే ఇటు నేను అటు రంగమ్మవ్వ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం.

“నీ కర్మ పాపా! ఈ తాగుబోతోడి సంగతి మాకు ముందే తెలుసు. ఆడపిల్లని కాదు పాడు కాదు, ఏదో ఒకటి వంక పైకి దూకి కొట్టడానికి. లోపలికి పద – తుంపర్లు పడతాండాయి – బిడ్డ తడిసిపోతంది” అంది అవ్వ.

నేను గలగలలు మర్చిపోయి ఇక్కడ ఆగిపోయినప్పుడు నాకు కలిగిన దు:ఖం ఆమెలో చూశాను. చీకటి పడుతుందంటే ఇప్పుడు భయంగా ఉంటోంది . మత్తుని తాగి తూలిపోతూ వచ్చే అతను ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే దబదబ ఆమెని కొడుతున్న చప్పుడు, పసిపాప రోదన హృదయ విదారకంగా. ఆ ఏడుపుని వినీ వినీ నా గుండెలు ఎండిపోతున్నాయి. రోజు రోజుకీ క్షీణించిపోతున్నాను. తూర్పు వైపు నుండి పడమర వైపుకి – ఆమె ఇంటి నుంచి దూరంగా – ఇవతలకి జరిగిపోతున్నాను.

ఈమధ్య అతను ఇంటికి సరిగ్గా రావడం లేదు. అతను రాని రోజు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అతను ఇంటికి కావలసినవి కూడా ఏమీ తేవడం లేదులా ఉంది. రోజు రోజుకీ ఆమె నాలాగే కృశించి పోతోంది. మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని బరువెక్కిన ముఖంతో నా ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చునేది. నాతో ఆమె బాధలన్నీ చెప్పుకొని సాంత్వన పొందేదేమో లేచి లోపలకి వెళ్ళేప్పుడు నన్ను చూసి మెల్లిగా నిర్లిప్తంగా నవ్వేది.   నాకు ఆమె ఏమైపోతుందోనన్న ఆందోళన కలగసాగింది.

నింగిని వేడుకొని వేడుకొని వేసారి పోయి నేను నిష్టూరాలకి దిగిన ఆ రోజుల్లో ఆమె ముఖంలో ఏదో నిర్ణయం తాలూకు ఆలోచనలు కదలాడటం గమనించాను. నాలోని విచారం మాయమై ఆసక్తి చోటు చేసుకుంది.   ఆమెకి మంచి రోజులొచ్చాయన్న భావం నాలో కలిగి ఉప్పొంగిపోయాను.

ఆరు నెలల క్రితం అనుకుంటా పొద్దున్నే ఆమె పాపని రంగమ్మవ్వకి ఒప్పచెప్పి ఎక్కడికో వెళ్ళింది. సాయంకాలం వచ్చేప్పుడు చేతిలో సంచులు. “అవ్వా! పని దొరికింది. ఇంతకు ముందు నా చేత చీరలు కుట్టించుకున్నోళ్ళంతా తలా ఒక చీరిచ్చినారు కుట్టమని” అంది. ఆమెలో, ఆమె మాటల్లో మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసం నాకు కనపడింది. గర్వపడ్డాను. ఆరోజు ఆకాశం నన్ను సన్నని జల్లులతో తడిపింది. పోయిన ప్రాణం వచ్చినట్లయింది.

ఆమె ముఖంలో ఈ మధ్య ఓ తృప్తిని చూస్తున్నాను.   రెండు నెలల క్రితం పెద్ద బంకు తెచ్చి ఆమె ఇంటికి ఆన్చి షాపులాగా పెట్టుకుంది. కారుల్లో పెద్ద పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఆమెకి చీరలు ఇచ్చి పోతున్నారు. రకరకాల పూసలతో, ముత్యాలతో, దారాలతో ఆమె ఆ చీరలని అందంగా అలంకరిస్తుంటే నేను చెట్ల ఆకులతో, పువ్వులతో అలంకరించుకునే రోజులు గుర్తొచ్చి ఆనందం కలుగుతోంది.

పగలంతా అంత పని చేస్తూ కూడా వెలిగి పోయే ఆమె ముఖం చీకటి పడుతుందంటే చాలు నల్లబడిపోయేది. ప్రతిరోజూ అతని చేతిలో ఆమె తన్నులు తినవలసిందే. ఎప్పుడూ వర్షం కురవాలని ప్రార్థించే నేను ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయి ఆమె ఏడవకుండా ఉండాలని ప్రార్థించసాగాను.

రోజులు గడుస్తున్నాయి. నాకేదో సంతోషం కలిగించాలని అప్పుడప్పుడూ చిన్న చిన్న జల్లులు తప్ప ఆకాశం నా ఏ కోరికా తీర్చడం లేదు.

ఆ రోజు మొదటి ఝాము వరకూ వెన్నెలని కురిపించిన పౌర్ణమి చంద్రుడు క్రమంగా మందగిస్తున్నాడు. నీడలు పొడుగ్గా పడుకుని విశ్రమిస్తున్నాయి. ఆ సమయంలో అతను తూలుతూ వచ్చాడు. రోజూ అతన్ని చూసి అసహ్యంతో కనులు ముడుచుకునే నేను ఆ రోజు ఏదో అగాధమైన మానసిక స్థితిలోకి నెట్టబడినట్లుగా అభావంతో చూస్తుండిపోయాను.

ఆమె వాకిట్లో కూర్చుని దీపపు వెలుగులో చీర కుట్టుకుంటోంది. ఆమెని అలా చూస్తున్న నాలో ఏదో చైతన్యం లోపల లోలోపల అంతరాంతరాలలో మొదలై మెల్లమెల్లగా నా హృదయాన్ని శాంతిమయం చేస్తోంది. కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఏం జరగబోతుందో వినడానికి ఆయత్తపడుతున్నాను.

ఒక్కసారిగా భగ్గుమంటూ వెలుగు, వెనువెంటనే ఆమె ఆక్రందన. అతనంతగా ఆమెని హింసిస్తున్నా ఎప్పుడూ కూడా అలాంటి అరుపు ఆమె నోటి వెంట రాలేదు.   దిగ్భ్రాంతితో కూడిన అదురుతో అదాటున కళ్ళు తెరిచి చూశాను. ఆమె అరుస్తూ తన కాళ్ళ దగ్గర మండుతున్న చీరని వంగి చేతులతో ఆర్పుతుంది.

అప్పటికే ఆమె కేక విన్న ప్రక్క ఇళ్ళ వాళ్ళూ, నా ఒడ్డున ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న వాళ్ళూ లేచి పరిగెత్తుతున్నారు.   ఏం జరిగిందో అర్థం కాక ఉద్వేగంతో నా ప్రాణం పోతున్నట్లయింది. ఉన్నట్లుండి హోరుగా చలిగాలి వీచసాగింది – చెట్ల వేళ్ళని కదిలించేంత బలంగా. నేను ఆమెకేమయ్యిందో తెలుసుకోవాలని గాలి సాయంతో ఊపు తెచ్చుకొని ఆమె ఇంటి వైపుకి జరిగాను.

ఆమె ఇంటి ముందు జనం గుంపుగా చేరి గందరగోళంగా అరుచుకుంటున్నారు. గుంపులోంచి దారి చేసుకోని రంగమ్మవ్వ, ఒక చేతిలో లాంతరు మరో చేతిలో ఆమె రెక్కా పట్టుకొని నడిపించుకుంటూ నా దగ్గర కొచ్చింది. వాళ్ళ వెనకే నలుగురైదుగు ఆడవాళ్ళు. అవ్వ లాంతర్నికింద పెట్టింది. గాలికి లాంతరు రెపరెపలాడుతోంది. రంగమ్మవ్వ నా మీదకి వంగి నా అంచునున్న బురద మట్టిని తీసి ఆమె అరచేతులకి పూసింది. కాలి బొబ్బలెక్కిపోయి ఉన్నాయి ఆమె చేతులు.

“అవ్వా! చీర కాలిపోయింది.   మేడమ్ కి ఏం సమాదానం చెప్పాల్ల? ఇట్లని తెలిస్తే ఇంకెవురూ పనియ్యరవ్వా!” ఆమె కదిలి కదిలి ఏడుస్తోంది పేగులు కదిలిపోయేట్లుగా.

“ఏం జరిగింది పాపా అసలు?” అంది రంగమ్మవ్వ.

“కరెంటు పోయిందిగా అవ్వా. రేపు మద్దేనానికంతా చీర ఇచ్చెయ్యాల్లని చెప్పింది మేడమ్. గుడ్డి దీపంలో కనిపిచ్చకపోతే ఎన్నెల ఎలుతురుండాదని వాకిలి తీసి చీర కుట్టుకుంటున్నా. ‘వాకిలి తీసి పెట్టి ఎవుడికి గేలమేస్తన్నావే’ అంటా నా మీద కొచ్చాడు కొట్టడానికి. తూలి దీపం బుడ్డి మీద పడ్డాడు. దీపం చీర మీద పడి మంటలు లేచినాయి. ఆర్పినాను గాని ఆపాటికే చీర పైట కొంగంతా కాలిపోయింది. బయమేస్తాందవ్వా! ఆ మేడమ్ కేం చేప్పేది? ఏమంటాదో?” అంది. ఆమె గొంతులో నిస్సహాయతని విన్న నా హృదయం ద్రవించిపోయింది.

వెనగ్గా వస్తున్నోళ్ళు కూడా గబగబా ఆమె చుట్టూ చేరారు.

“అందురూ మొకానూసినా సిగ్గులేకుండా ఎద్దులాగా పడి నిద్రపోతాన్నాడు ఎదవ సచ్చినోడు” అంది రత్తి.   రత్తి చేతిలో ఆమె బిడ్డ ఉంది.

“నీకేం కర్మమొచ్చిందే ఈ మొగుడితో పడి ఏడవడానికి. చీరలు కుట్టుకోని సంపాదిచ్చుకుంటాండావు. వాడికి నువ్వు కూడేస్తండావు గాని నీకు వాడు కూడేస్తాండాడా? నేనైతే లెయ్యరా నా బట్టా! నీతో నాకేం పని? అని అనుండేదాన్ని. నువ్వు గాబట్టి వానితో యాగతావుండావు” అంది నరిసి.

“తాగినోడి తావున తన్నులు తినే దాన్ని నిన్నే చూసినా. వాన్నీడ్చి పాడేయలేనిదానివి నువ్వేమి ఆడదానివమ్మే? చేతిలో కట్టె పట్టుకో రేపటినిండి – పైకి దూకితే ఎయ్యి సచ్చినోడిని కాళ్ళిరిగేట్టు” అంది రత్తి కసిగా.

“ఊరుకోండమ్మే కొట్టుకుంటా ఉంటే సంసారాలేం బాగుపడతాయి? రేపు వాడిని పంచాయితీకి లాగి బయం పెట్టిచ్చాల్ల ఇంకోసారి పాప ఒంటి మీద సెయ్యి ఎయ్యకుండా వార్నింగిప్పిచ్చాల్ల” అంది రంగమ్మవ్వ.

ఆ మాటలు విన్న ఆమె ఏడవడం ఒక్కసారిగా మర్చిపోయి తల ఎత్తి వాళ్ళ వైపు చూసింది. వేదనతో కమిలిన ఆమె బుగ్గల మీద నుండి అప్పటి వరకూ ధారాపాతంగా కారిన కన్నీళ్ళు ఆగిపోయాయి.

“మీరందురూ నా తావున నిలబడుంటే నాకు బయం పోయిందవ్వా! మా అమ్మకి గూడా అప్పుడు పక్కిళ్ళోళ్ళు ఇట్లా దైర్యం చెప్పిండింటే మందు తాగి చచ్చిపోయుండేది కాదేమో అవ్వా! ” అంటూ భుజంతో కన్నీళ్ళని తుడుచుకుంది.   తల్లిని తలుచుకోవడం వల్ల అయుంటుంది ఆమె తుడుచుకుంటున్నా కూడా ఆగకుండా కన్నీళ్ళు కారిపోతున్నాయి.

“ఏడవగాకమ్మే మేమంతా ఉళ్ళా” అంది రత్తి ఆమెకి దగ్గరగా వచ్చి.

“రత్తక్కా! చీర నువ్వు పని చేసి పెట్టే మేడమ్ దే” అంది ఆమె.

“చీరని గూర్చి గూడా దిగులొద్దులే పాపా! రేపు పంచాయితీ అయినాక బజారుకి పోయి అలాంటి చీరే ఒకటి కొని కుట్టిద్దువుగాన్లే. దొరక్కపోతే దాని కరీదు కడుదువుగాని” అంది రంగమ్మవ్వ.

“చాలా కరీదుంటదవ్వా! అంతేడదెచ్చేది?” రత్తి దగ్గరున్న బిడ్డని తీసుకొని భుజాన వేసుకొంటూ అంది ఆమె.

“ఎట్లోకొట్లా చేద్దాం లేమ్మే!” అంది సుజాత. ఆ ఏరియాలో సుజాతే కాస్త కలిగినది.

“నేను గూడా చెబుతాలే మేడమ్ కి, ఆయమ్మ మంచిది” అంది రత్తి

‘ఇవుళ్ళా’ అన్నట్లు బిడ్డ ఆమె మెళ్ళో ఉన్న పసుపుతాడుని పట్టుకుంది నిద్రలో. మంగళ సూత్రాలు తన అరచేతిలోకి తీసుకుని వాటి వైపే తదేకంగా చూసి తల ఎత్తి రంగమ్మవ్వ వైపు చూసింది. ఆ చూపుని, ఆ చూపులోని నిశ్చయాన్ని గుర్తించిన ఆ ఆడవాళ్ళ ముఖాలు తెరిపిన పడ్డట్లయ్యాయి.

నేను గిర్రున సుళ్ళు తిరుగుతూ ఆనందబాష్పాలతో ఆకాశాన్ని చూశాను.

ఫెళ ఫెళ మంటూ ఆకాశం ఉరిమింది. ‘వర్షం వచ్చేట్లుంది పదండి పదండం’టూ జనం గబగబా అక్కడ నుండి కదిలారు. రంగమ్మవ్వ ఆమెని ఆమె బిడ్డతో సహా తనింట్లోకి నడిపించుకు వెళ్ళింది.   సన్నని జల్లుగా మొదలైన ఆ వర్షం తెల్లవారేప్పటికి బలపడి ఏకధారగా కురుస్తోంది.

సంతోషంగా ప్రయాణించవలసిన నేను ఆమె జీవిత పయనాన్ని కళ్ళారా చూడాలని కదలకుండా ముడుక్కున్నట్లుగా కూర్చుని ఉన్నాను. అంతా అర్థం అయ్యి కూడా అర్థం లేకుండా ఆతృత పడుతున్న నన్ను చూసి ఆకాశం మెరుపు ముఖమేసుకుని ఆప్యాయంగా నవ్వుతోంది.

ఆ నవ్వు చూసిన నా మనసు నెమ్మదించి నిండుగా మారింది.   ఆమెని, ఆమె చుట్టూ ఆమెకి రక్షణగా ఉన్న స్రీ్తలని తల్చుకుంటూ నేను నిదానంగా, గంభీరంగా అక్కడ నుండి సాగిపోయాను.

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

10419479_10204326595991984_5763381120454654266_n

15న  పులికొండ సుబ్బాచారి “బాడిశ మొక్కబోయింది” ఆవిష్కరణ సభ

సుబ్బాచారి కవిత్వ సంపుటి కి అఫ్సర్ రాసిన ముందు మాట ఇది.

1

మొదలెట్టడం ఎప్పుడూ సమస్యే.. సుబ్బాచారి గురించి ఎక్కడ మొదలెట్టాలి?! నాకు ఇంకా కవిత్వం గాలి సోకని కాలంలో పుస్తకాల పురుగునై లైబ్రరీల మధ్యా, మనుషుల మధ్యా దాహార్తినై సంచరిస్తున్న  తొలి యౌవనకాలంలో తొలినాటి ఖమ్మం సాహిత్య మిత్రబృందంలో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వాడు సుబ్బాచారి. మా బంధం కవిత్వంతోనే మొదలైందో, సుబ్బాచారి కష్టజీవితం పట్ల నాకున్న ఇష్టంతో మొదలయిందో చెప్పడం కష్టం.

కాని, ఆ రోజుల్లో సుబ్బాచారిని చూడడం వొక ఆనందం. వొక ఉత్సాహం. వొక స్ఫూర్తి. తరవాతనే మొదలయింది మా సాహిత్య బంధం! ఇప్పటికీ మరచిపోలేని గుర్తులు ఖమ్మం రికాబ్ బజార్ స్కూలు వెనక కూర్చొని మేం అల్లుకున్న కవిత్వ కబుర్లు. వూరికి ఇంకో దిక్కున ప్రభాత్ టాకీస్ ఎదుట మా కోసమే అన్నట్టుండే వొక శిధిలమైన బెంచీ మీద రైళ్ళ రాకపోకల్ని గమనిస్తూ కలబోసుకున్న ఇంకేవో కబుర్లు. తిలక్ అన్నట్టు- “ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విషాదమో, విషాదం లాంటి ఆనందమో!” కాని, ఆనందమే ఎక్కువ అని చెప్పగలను.

సుబ్బాచారి క్రమంగా సుబ్బన్న అయిపోయాడు. అక్షరాలకు మించిన ఆ ఆత్మీయతే ఇవాళ తనని గురించి ఈ నాలుగు మాటలూ రాయాలని ఉత్సాహపెడుతోంది.

అవును, రాయాలి…శ్రమ సౌందర్యంలోంచి జీవితాన్ని నెగ్గుకు వచ్చిన సుబ్బన్న గురించి, పరిశోధన కోసమే జీవితాన్నీ, చాలా కాలం వరకూ కవిత్వాన్ని కూడా త్యాగం చేసిన సుబ్బన్న గురించి, కాలం కాని కాలంలో జీవితంలో అసలైన విలువల వెంట అమాయకంగా అదే అంకిత భావనతో సూటిగా వెళ్ళిపోతున్న సుబ్బన్న గురించి రాయాలి!

మొన్నా, నిన్నా సుబ్బన్న కవిత్వం చదువుతూ ఏమన్నా రాద్దామని కూర్చున్న వేళలోనే మార్క్వెజ్ మరణ వార్త నన్ను నిశ్శబ్దంలోకి నెట్టేసింది. వొక పాతిక ముప్పయ్యేళ్ళుగా చదువుతూ అనుభవిస్తూ పలవరిస్తున్న రచయిత కన్నుమూసినప్పుడు వాక్యాలు మొరాయిస్తాయి.

సుబ్బన్న గురించి రాస్తూ రాస్తూ నేను మార్క్వెజ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా సుబ్బన్నని చూసాను ఈ వాక్యాల్లో:

Ultimately, literature is nothing but carpentry. Both are very hard work. Writing something is almost as hard as making a table. With both you are working with reality, a material just as hard as wood. Both are full of tricks and techniques. Basically very little magic and a lot of hard work are involved.

ఆ రోజుల్లో సుబ్బన్నని గురించి నాన్నగారు అనే వారు: “చిత్రిక పట్టడం అలవాటైన చేతుల్లో కవిత్వం శిల్పం అవుతుంది. సుబ్బాచారి కవిత్వం మీద దృష్టి పెడితే మంచి కవిత్వ శిల్పి అవుతాడు.” అని!

 

2

 

కాని, వొకే దారిలో వెళ్ళనిస్తే అది జీవితం కాదు కదా!

సుబ్బన్న పరిశోధనలో చాలా దూరాలు వెళ్ళాడు. అతని పరిశోధన విలువని గుర్తించే స్థాయికి ఇంకా మన ప్రమాణాలు ఎదగలేదు. ఇక్కడ అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ఆ పరిశోధన ఎంత విలువైనదో నాకు తెలుసు. శ్రమించే చేయి, చిత్రిక పట్టే ఆలోచనా, అంకితమైపోయే చిత్తం వున్నప్పుడు ఏ రంగమైనా “చిత్తం!” అనేస్తుంది. ఇంత కూడా విరామం లేకుండా పనిచేస్తూనే సుబ్బన్న ఇంకో కిటికీ రెక్క తెరచి పెట్టుకున్నాడు, కవిత్వం కోసం! అదీ కష్టమైన పని.

వొక రంగంలో నిలబడి, ఆ పరిభాషతో తలపడుతున్నప్పుడు కవిత్వమనే సున్నితమైన భాషలోకి రాకపోకలు అంత తేలిక కాదు మరి! కష్ట సాధ్యమైంది సాధించడమే సుబ్బన్న జీవన సారం! శ్రమ పాఠం! ఈ పుస్తకంలో ప్రతి పుటలో మీకు సుబ్బన్న అంతరంగం కనిపిస్తుంది. అతని వేదనల తరంగాలు మిమ్మల్ని తడిపేస్తాయి. కష్టజీవికి ఇరుపక్కలా వుండే వాడే నిజమైన కవి. నిజమే! కాని, కష్టజీవే కవి అయినప్పుడు ఆ కవిత్వం ఎలా వుంటుంది..అందులో పలికే హృదయం ఎలాంటి చప్పుడు చేస్తుంది…మీరే వినండి!

3

తెలుగు సాహిత్యంలో  మనం కష్టజీవుల గురించి మాట్లాడుతూనే వున్నాం. కాని, సాహిత్యంలో ప్రతిఫలించిన కష్టజీవులు చాలా మటుకు అమూర్త మానవులు – అంటే, నిర్దిష్టంగా ఫలానా రకం కష్టజీవి – శ్రీశ్రీ అన్నట్టు కుమ్మరిచక్రం, చేనేత మగ్గం, లేదా ఈ కవిత్వంలో సుబ్బాచారి చెప్తున్న బాడిస బతుకుల జీవన చిత్రం లాంటివి కచ్చితంగా చిత్రిస్తున్న వాళ్ళు అరుదు. ఈ నేపధ్యంలో కష్టజీవికి నిర్దిష్టమైన నిర్వచనం ఇస్తూ, ఆ కష్టానికి తగిన పరిభాషని నిర్మిస్తున్న కవిగా సుబ్బాచారి ఈ కవితా సంపుటిలో కనిపిస్తున్నాడు.

“బాడిస మొక్కబోయింది” అనే కవిత నా మటుకు నాకు ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో వొక అరుదైన వ్యక్తీకరణ రెండు కారణాల వల్ల- 1) అంతకు ముందు మనం కవిత్వంలో విని వుండని వొక నిర్దిష్టమైన కులవృత్తి అస్తిత్వ వేదనని చెప్పడం, 2) ఏ కవిత ప్రత్యేకత అయినా వొక కొత్త వస్తు నిర్దేశం దగ్గిరనే ఆగిపోకూడదు. ఆ వస్తువు తనదైన కొత్త శిల్పాన్ని కూడా ఆవిష్కరించుకోవాలి. ఈ కవితలోని శిల్పాన్ని ఆత్మీయంగా చూసే చదువరికి వొక వుద్వేగ తీవ్రతని చిత్రిక పట్టే కొత్త భాష, పదచిత్ర నిర్మాణం అబ్బుర పరుస్తుంది.

కవిత ఎత్తుగడలోనే సుబ్బాచారి శిల్ప విన్యాసం కనిపిస్తుంది. “ఇంటి నిండా కంటి నిండా /కళని కుమ్మరించిన చెయ్యి”, “దంతే, గంటక, గొర్రు, కాడిమాను, బండిచక్రాలు, పందిరి మంచాలు, కార్నీసు దూలాలు” ఇవన్నీ అమర్చి పెట్టిన చెయ్యిని గుర్తు చేయాల్సి రావడంలో విషాదం వుంది. కాని, ఈ వస్తు సముదాయాన్నంతా గుర్తుచేయడం ద్వారా ఆ శ్రమజీవుల సౌందర్యాన్ని మాత్రమె కాకుండా, వారి జీవన ప్రాముఖ్యతని కావ్యబద్ధం చేసాడు సుబ్బాచారి. ఈ కవిత శిల్పంలో కూడా ఆ రెండు అంశాలు- సౌందర్యం, ఆ కులవృత్తి గతమైన జీవన ప్రాముఖ్యం కలిసి చేస్తున్న ప్రయాణం  వుంది. నిజానికి వొక దీర్ఘ కావ్యానికి కావలసిన సామాగ్రి ఇందులో వుంది.

బిడ్డలా సుబ్బాచారి కవిత్వ వ్యక్తిత్వంలో అది వొక కోణం మాత్రమే. ఈ సంపుటిలో సుబ్బాచారి ఇతర కవితలు అతని వున్న భిన్నత్వాన్ని చెప్తాయి. కవిత్వంలో వైయక్తిక కోణాన్ని దర్శించే పధ్ధతి వొక్కో కవికి వొక్కో విధంగా వుంటుంది. ఈ సంపుటిలో మొదటి కవిత “యుగళయానం” దీనికి వుదాహరణ. ఈ కవితలో నన్ను బాగా ఆకట్టుకున్న సందర్భమూ, వ్యక్తీకరణ:

 బిడ్డల కత్తి పడవలు ఒంటి మీద నడుస్తూంటే

తొణికిన తరంగాల దారి చెదరకుండా నిలబడింది.

 

వ్యక్తిగతమైన సందర్భాల్ని సాధారణీకరించి వాటికి కవిత్వ గౌరవాన్ని ఇవ్వడంలో సుబ్బాచారి నిబద్ధత కనిపిస్తుంది. ఇలాంటి కవితలు కవి దార్శనికతని కూడా చెప్తాయి. ఇలాంటిదే మరి కవిత “ తనువూ తనువూ మధ్య తనూభాష”. ఈ కవితలో చివరి వాక్యం “పెళ్లి ఒక ఉత్తుత్తి మిష” వొక జీవన సందర్భాన్ని తనదైన దృష్టితో చెప్పడం అంటే ఏమిటో చెప్తుంది. వృత్తి వొక సామాజిక సందర్భం అయితే, దాంపత్యం కౌటుంబిక వ్యక్తిగత సందర్భం. ఆ రెండీటి మధ్యా సమతూకమే దార్శనికత. సుబ్బాచారి కవిత్వంలో నాకు ప్రధానంగా కనిపించిన లక్షణం ఇదే!

4

ఈ సంపుటిలో సుబ్బాచారి కవిత్వ అనువాదాలు కూడా వున్నాయి. ప్రసిద్ధ ఉర్దూ కవి ఫైజ్ అహమద్ ఫైజ్ అంటే సుబ్బచారికి ప్రత్యేకమైన అభిమానం వున్నట్టు వుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. బహుశా, జీవితాన్ని శ్రమజీవుల కోణం చూస్తూనే, అందులో ఇమడాల్సిన పద్య సౌందర్యాన్ని పోగొట్టుకోని అరుదైన కవిత్వ శిల్పి ఫైజ్. సుబ్బాచారి ఆ వారసత్వాన్ని నిలుపుకొనే ప్రయత్నంలో భాగంగా ఈ అనువాదాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే, తన కవిత్వ వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే సాధనాలని నిర్మించుకునే దారిలో వాటి ఆసరాని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సుబ్బాచారి.

అలాగే, ఇతర భారతీయ భాషల నించి చేసిన అనువాదాలు కూడా సుబ్బాచారి వ్యక్తిత్వంలో వొదిగే లక్షణాలతో వుంటాయి. ఈ అనువాదాల ద్వారా ఈ తరం కవులకి కవిత్వ అభ్యాసానికి సంబంధించిన పాఠం చెప్తున్నాడు సుబ్బాచారి.

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

సుబ్బాచారికి ఆ ఆనంద రహస్యం తెలుసు.అందుకే, అతనికి చినుకు ఓనమాలు అర్థమవుతాయి. అయితే, ఈ వర్ష ధారలు బలపాలై నేల పలకతో సంభాషించినప్పుడే కవిత్వ వర్షానికి సార్ధకత అని కూడా సుబ్బా చారికి తెలుసు.

ఈ సారవంతమైన సార్ధకమైన కవిత్వ ధార సదా నిలిచి వుండాలని నా ఆకాంక్ష.

*

 

ఉన్నా లేని నేను…

alone-but-not-lonely

సన్నగానో
సందడిగానో
దిగులు వర్షం మాత్రం మొదలయ్యింది.

మనసంతా గిలిగింతలు పెట్టిన క్షణాలు
గుండెలో గుబులుగా తడుస్తూ
ఇపుడింక జ్ఞాపకాలుగా.

ఎన్నిసార్లు విసుక్కోవాలో
సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ
రమ్మనో పొమ్మనో

తడిమిన ప్రతిసారీ

నిశ్శబ్దమే నవ్వుతోంది
వెచ్చగా ఉండే వెన్నెల
కొత్తగా చలిగా.

నిస్సహాయత పలకలేని కళ్ళతో
పదే పదే రెప్పలని కసురుకొంటూ.
కమ్ముకోమనీ  తప్పుకోమని

———-

ఉన్నా లేని నేను.

-శ్రీలేఖ

సరే, గుర్తుచేయన్లే!

మానస చామర్తి

గుర్తొస్తూంటాయెపుడూ,

వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో
నువు పొగమంచులా ప్రవేశించి
నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు,

లేలేత పరువాల పరవళ్ళలో
లయతప్పే స్పందనలను లాలించి
ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు
వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు ,

లోతు తెలీని లోయల్లోకి మనం
తమకంతో తరలిపోతూ
మలినపడని మంత్రలోకాల్లో ఊగిసలాడిన క్షణాలు-

నీకూ గుర్తొస్తాయా..ఎప్పుడైనా…

1540514_505395279575961_1379096292_o

శబ్దాలు సిగ్గుపడే చీకట్లో
అగణిత నక్షత్ర కాంతుల్ని
నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు

కలిసి నడచిన రాగాల తోటల్లో
రాలిపడ్డ అనురాగపరాగాన్ని
దోసిళ్ళతో గుండెలపై జల్లి
నను గెల్చుకున్న త్రోవలు

గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ
గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక
ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు –

సరే, గుర్తుచేయను. సరదాకైనా,
నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను.

పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద
మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.

-మానస చామర్తి

painting: Anupam Pal

ప్రకృతి ఒడిలో అందాల దీపం- కేనరీ ద్వీపం!

విహార యాత్రా స్పెషల్-1

 satyam mandapati

(ఇప్పుడు ప్రేమయాత్రలకి నా వయసు కుసింత ఎక్కువయినట్టుంది. అక్కడ ప్రత్యేకమైన విశేషాలు ఏమైనా వుంటే తప్ప తీర్ధయాత్రలకి మనసెప్పుడూ లేదు. అయినా ఎన్నో విహార యాత్రలు, మరెన్నో వినోద యాత్రలు, ఆఫీసు పని మీద చాల వ్యాపార యాత్రలు చేశాను. కొన్ని ఒంటరిగా ఏకో నారాయణా అనుకుంటూ, కొన్ని అర్దాంగితో కలిసి లాహిరి లాహిరిపాడుకుంటూ, కొన్ని కుటుంబ సభ్యుల సపరివార సమేతంగా, కొన్ని మిత్రులతో సరదాగా, కొన్ని ‘కొలీగుల’తో దేశవిదేశాలు(కాంపులకి వెళ్లారు అనేవాళ్ళు ఇండియాలో). మధ్యే మధ్యే రోమ్, అమృత్సర్, జెరూసేలంలాటి తీర్ధ/చారిత్రాత్మక యాత్రాలూ వున్నాయండోయ్!

లాగులు తొడుక్కునే ప్రతివాడూ ట్రావెలాగులు వ్రాస్తూనే వున్నాడు మళ్ళీ నేనెందుకు వ్రాయటం అనుకున్నాను ముందు. కానీ ‘ఎవరి లాగులూ, ట్రావెలాగులూ వాళ్ళవే కదా, మీరూ వ్రాయండి’ అన్నారు మిత్రులు. సరే అలాహే కానివ్వండి అని ‘విహార యాత్రా స్పెషల్’ అనే ఈ శీర్షిక “సారంగ” అంతర్జాల పత్రికలో వ్రాస్తున్నాను. పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను వ్రాయమని అడుగుతూ, ఆలస్యం చేసినందుకు నన్ను కుంచెం కోప్పడి, ఈ శీర్షిక వ్రాయించుకుంటున్న మిత్రులు అఫ్సర్ గారికి ధన్యవాదాలు. ప్రతి నెలా ఒక్కొక్క ప్రదేశం గురించి వ్రాద్దామనుకుంటున్నాను. వీటిలో చాల వరకూ నేను చూస్తున్న కొత్త ప్రదేశాల మీదా, కొన్ని నా పాత వ్యాసాలకు కొంచెం మెరుగుపెట్టి తిరగ వ్రాసీ, మీ ముందు వుంచుదామని నా ఈ ప్రయత్నం. మీకివి నచ్చినన్ని రోజులు, చదివి ఆనందించండి. నచ్చకపోతే వెంటనే చెప్పేయండి. ముఖమాటం లేదు. ఆపేద్దాం.

మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటుంటే, నా వ్యాసాలు వాటి గురించి మరి కొంచెం అవగాహనని పెంచుతాయని నా ఉద్దేశ్యం. ఇతర కారణాల వల్ల, ఆ ప్రదేశాలకి వెళ్ళొద్దులే అనుకుంటే ఏమీ ఫరవాలేదు, అక్కడికి వెళ్ళినంత సరదాగా ఈ వ్యాసాలు చదువుకోండి! సందర్భానుగుణంగా మీ కోసం కొన్ని ఫోటోలు కూడా జత చేస్తున్నాను మరి!)

౦                           ౦                           ౦

ఈమధ్య మేము ఐదు వారాలపాటు యూరప్ యాత్రకి వెళ్ళాము. స్పెయన్లో కేనరీ ద్వీపాలు, బార్సిలోనా; ఇటలీలో రోమ్, ఫ్లారెన్స్, పీసా, వెరోనా, వెన్నిస్; స్విట్జర్లాండులో ఎంగెల్బర్గ్, జెనీవా, లుజర్న్; ఇంగ్లాండులో లండన్ మొదలైన ప్రదేశాలు చూసివచ్చాం. వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ ఆనాటి చరిత్రలో కానీ, ఈనాటి ఆధునిక జీవితంలో కానీ ఎంతో వైవిధ్యం వున్నదే!

మేము ముందు కానరీ ద్వీపాలకి ప్రయాణం కట్టాం. అమెరికాలోని ఆస్టిన్ నించీ లండనుకి వెళ్ళే విమానం లండన్ హీత్రో ఎయిర్ పోర్టుకి వెడుతుంది. అక్కడినించీ లండన్ గాట్విక్ ఎయిర్ పోర్టుకి వెళ్లి, టెనరిఫే ద్వీపానికి వెళ్ళే విమానం ఎక్కాం. అన్నట్టు మేము ఆస్టిన్ నించీ ఎక్కిన విమానం బోయింగ్ వారి సరికొత్త విమానం. ఎన్నాళ్ళ నించో ఎదురు చూస్తున్న 787 Dream Liner. ఈమధ్యనే నడపటం మొదలుపెట్టారు.

‘అది సరేనయ్యా.. ఎక్కడ వున్నాయి ఈ ద్వీపాలు.. ఏముంది అక్కడ.. ఏమిటి ఆ కథా.. కమామిషు..’ అని మీరు అనబోయే ముందుగా, ఇవిగో ఆ వివరాలు.

కెనేరియాస్ అనబడే ఈ కేనరీ ద్వీపాలు కెనడాలో లేవు. అవి స్పెయిన్ దేశానికి చెందినా, నిఝంగా స్పెయిన్ భూభాగంలోనూ లేవు. ఉత్తర ఆఫ్రికాకి కొంచెం ఉత్తరంగా, ఇంకొంచెం పడమటగా.. అంటే మొరాకో దేశానికి వాయువ్య మూలగా 62 మైళ్ళ దూరంలో, అట్లాంటిక్ మహా సముద్రంలో వున్నాయి.

ఇక్కడ ఏడు పెద్ద ద్వీపాలు, ఎన్నో చిన్న చిన్న ద్వీపాలు, ఇక్కడ వున్న అగ్ని పర్వతాలలోనించీ వచ్చిన లావా ప్రవహించటం వల్ల ఏర్పడ్డాయి. వీటిలో అన్నిటికన్నా పెద్ద ద్వీపం మేము వెళ్ళిన టెనరిఫే. దాని తర్వాత ఇంకా చిన్న ద్వీపాలలో చెప్పుకోదగ్గవి, ఫూర్తే వెంత్యురా, గ్రాన్ కెనేరియా, లా పాల్మ, లా గొమేర మొదలైనవి.

అసలు కేనరీ ద్వీపాలు అంటే అర్ధం, లాటిన్ భాషలో కుక్కలు వున్న ద్వీపాలు అని. ఆ రోజుల్లో అక్కడ ఎన్నో పెద్ద పెద్ద కుక్కలు వుండేవిట. అవి నిజంగా కుక్కల సంతతి కాదు, అవి సీల్ జాతికి చెందిన నీటి కుక్కలు అనీ, తర్వాత పరిణామ జీవనంలో అంతరించి పోయాయనీ ఒక కథ వుంది. మేము ఈ ప్రదేశాలన్నీ చూడక ముందే, వీటి గురించి కొంత చరిత్ర చదివాను. మహాకవి శ్రీశ్రీగారు అన్నట్టు, ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.. నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం.. నరజాతి చరిత్ర సమస్తం, పరస్పరాహరణద్యోగం..”… ఇంగ్లండు, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా… ఏ దేశ చరిత్ర చూసినా అదే!

కేనరీ ద్వీపాల చరిత్ర కూడా అంతే! ఈ ద్వీపాలని ఎన్నో దేశాలు ఒకటి తర్వాత ఒకటి – రోమన్, మొరాకో, గ్రీక్, డచ్, స్పెయిన్ దేశాలతో సహా – ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం కేనరీ ద్వీపాలు స్పెయిన్ దేశం ఆధీనంలో వున్నాయి. 2900 చదరపు మైళ్ళ వైశాల్యంలో 2.1 మిలియన్ల జనాభా వుంది. వీరిలో 77 శాతం కెనేరియన్లు, 8.5 స్పెయిన్ భూభాగం నించి వచ్చినవారు, 14 శాతం విదేశీయులు, అంటే ముఖ్యంగా జర్మనీ, బ్రిటిష్, ఇటలీ, కొలంబియా, వెనిజువేలా, క్యూబా, మొరాకో మొదలైన దేశాల సంతతి. వీరిలో ఒక్క టెనరిఫే ద్వీపంలోనే 785 చదరపు మైళ్ళ వైశాల్యంలో తొమ్మిది లక్షల మంది వున్నారు.

టెనరిఫేలో రెండు ఎయిర్పోర్టులు వున్నాయి. బస్సు సౌకర్యం చాల బాగుంది. టాక్సీల అవసరం తక్కువే. కొన్ని చోట్లకి రైళ్ళు కూడా వున్నాయి.

టెనరిఫేకి రాజధాని శాంతా క్రూజ్. ఇక్కడ చెప్పుకునే ఇంకొక పెద్ద వూరు లా లగూన.

టెనరిఫేలో సముద్రం ఒడ్డునే వున్నాం మేము. మా బాల్కనీలో నించీ వంద గజాల దూరంలో సముద్రం, ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతూ, ఇంకొక రోజు గంభీరంగా గర్జిస్తూ కనిపిస్తూ వుంది. ఈ ద్వీపాలు అగ్నిపర్వతాల లావాతో ఆవిర్భవించాయి కనుక, చాల చోట్ల భూమి మీద నల్లటి రాళ్ళు, నల్లటి ఇసక కనిపిస్తుంది. బీచి ఒడ్డున, కొన్నిచోట్ల, బయట నించి ఎన్నో వేల టన్నుల తెల్లటి ఇసుక తెచ్చి పోశారు. అందుకే ఆ నలుపూ తెలుపుల ఇసుక అందం, ఆకాశంలోని నీలి రంగు, ఒడ్డున వున్న చెట్టూ చేమల ఆకుపచ్చ రంగు, సముద్రపు నీలి నీలి నీటి రంగులతో కలిసి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

వెయ్యి మాటల కన్నా ఒక్క చిత్రపటమే ఎక్కువ చెబుతుంది అనే నానుడి వుంది. అందుకని టెనరిఫే ద్వీపంలో ఎక్కువగా చెప్పుకునేవి ఇక్కడి అందాలే కనుక, ఈ వ్యాసంలో ఎక్కువ మాటల కన్నా ఫోటోలే మీకు సరైన అవగాహన ఇస్తాయని, అవే కొన్ని పెడుతున్నాను. చిత్తగించండి.

satyam1

 

satyam2

 

 

ఇక్కడ మేము చూసిన వాటిలో ముఖ్యమైనది, ‘టైడే’ అనే అగ్నిపర్వతం. ఇప్పటికీ అడపా దడపా బుస్సుమంటూ కాసిని నిప్పులు కక్కుతున్న పర్వతం. 18,990 హెక్టారుల భూవైశాల్యంతో 3718 మీటర్ల ఎత్తున, అంటే 12,198 అడుగుల ఎత్తున, టెనరిఫే ద్వీపం మధ్యలో వున్న చల్లటి చక్కటి పర్వతం! ఇది స్పెయిన్ పర్వత శ్రేణిలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతం. రోమనులు పాలన కాలంలో అంత ఎత్తు వుండేది కాదు కానీ తర్వాత వరుసగా లావా వచ్చి, ‘టైడే’ ఎత్తు పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడప్పుడూ లావా కొంచెం కొంచెం వస్తున్నా, చివరిసారిగా పెద్ద ఎత్తున అగ్ని కురిపించినది 1798లో. అప్పుడే ఆ చుట్టుపక్కల లావా ప్రవాహం వల్ల మరి కొన్ని చిన్న ద్వీపాలు కూడా వెలిసాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం అక్కడ వున్న స్థానికులు ఈ పర్వతాన్ని ఒక దైవ సంబంధంగా భావించి పూజలూ కూడా చేసేవారుట!

satyam3

 

మేము వెళ్ళిన రోజున కొండ మీద కొంచెం సన్నగా మంచు పడుతున్నది. బాగా చలి, విపరీతమైన గాలి. అయినా కొంచెం వెచ్చటి దుస్తులు వేసుకుని, ఆ తెల్లటి నల్ల పర్వతం అందాలని చూస్తూ అలాగే చాలా సేపు నుంచున్నాం.

 

satyam4

ఈ పర్వత శ్రేణి మీదనే బాగా ఎత్తున ఒక అబ్జర్వేటరీ కూడా వుంది. అక్కడ ఎంతో నక్షత్ర శాస్త్ర పరిశోధన జరుగుతున్నది.

 

satyam6

ఇక్కడ చూడవలసిన ఇంకొక ప్రదేశం ‘మస్కా’ లోయ. కొండ మీద నించీ ఈ మస్కా లోయని చూస్తుంటే ఎంతో మనోహరంగా వుంటుంది.

ఒక పక్క నీలం రంగు సముద్రం, సముద్రపు అలలు ఒడ్డుకు తగిలి ఎగురుతూ మెరుస్తున్న తెల్లటి నురుగు, ఇంకొక పక్క ఆకుపచ్చని చెట్లతో నిండిన కొండలు, లోయలు. వాటి మధ్య ఎర్రని బంగాళా పెంకులతో కట్టిన రంగు రంగుల ఇళ్ళూ, వాటి పక్కనే నల్లటి తారు రోడ్లూ… ప్రకృతి కన్య విలాసంగా నాజూకు అందాలను సంతరించుకుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టుగా వుంది.

satyam5

ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో రామచిలుకలు వున్న లోరో పార్క్, సియాం నీటి పార్క్, గరాచికో, చిరానానా మొదలైన చారిత్రాత్మక ప్రదేశాలు.. ఇలా ఎన్నో వున్నాయి. మీ ఓపిక, సరదా, గుఱ్ఱం స్వారీ, జేబులోని పచ్చనోట్లుని బట్టి, చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత!

ఇంకో విషయం కూడా చెప్పాలి. మిగతా పెద్ద పట్టణాలలో లాగా ఇక్కడ ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళు తక్కువ. ఎక్కువమంది మాట్లాడేది కెనేరియన్ స్పానిష్. స్పెయిన్ భూభాగంలో మాట్లాడే స్పానిష్ కొంచెం వేరేగా వుంటుంది. ఏ రాయయితేనేం పళ్ళు వూడగొట్టుకోవటానికి అని, మాకు ఏ స్పానిష్ అయినా ఒకటే.. అర్ధం కాదు కనుక. మేము టెక్ససులో మాట్లాడే స్పానిష్ కొంచెం (‘పొకీతో’) వాడదామని ప్రయత్నం చేసాను కానీ, అది వాళ్లకి అర్ధం కాలేదు.

శాకాహార భోజనం ఏమాత్రం దొరకదు. అక్కడక్కడా కొంచెం వివరంగా అడుగుదామనుకున్నా భాషా సమస్య వుండటం వల్ల అదింకా కష్టమయింది. ‘వెహిటేరియానో’ కావాలని అడిగినా, చికెన్, కొన్ని చోట్ల చేపలు వాళ్లకి శాకాహారాలే! శాకాహారాల కోసం మాలో మేమే కొంచెం హాహాకారాలు చేసుకున్నాం. మా ఆస్టిన్ నగరంలో దొరికే టెక్స్ మెక్స్ స్పానిష్ పదార్ధాలు – వెజ్జీ ఎంచిలాడ, బరీటో, వెజ్జీ కేసడీయా లాటివి వాళ్లకి అసలే తెలీదు.

చివరికి ఒక పెద్ద రెస్టారెంటులో, ఒక చిన్న వంకాయ ముక్క మీద కొంచెం ఛీజ్, దాని మీద కొంచెం పెరుగు పోసి, ఒక్కొక్క ముక్కకీ పది డాలర్లు తీసుకున్నాడు. నాలాటి శాకాహారులకి ఆపుల్ పళ్ళు, అరటిపళ్ళు లాటి సాత్విక భోజనం, బ్రెడ్డు, క్రెసాంట్లు, బిస్కత్తులు మొదలైనవి ఇక్కడ ఆరోగ్యానికి మంచివి. హిమక్రీములకి మాత్రం కొదువలేదు. వైనతేయులకి కావలసినంత వైన్. కెనేరియన్లు పూర్వజన్మలో సురాపానం చేసిన సురులై వుండాలి. స్వర్గం లాటి ఈ అందమైన ప్రదేశంలో, పులిసిన ద్రాక్ష రసం త్రాగుతూ జీవితం అనుభవిస్తున్నారు మరి!

సత్యం మందపాటి