Archives for July 2014

మధుర లంబాడీలు…నిండు వసంతం వారి సొంతం!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

 

మామిడిపండులా మధురంగా కనిపించి నా మనసు దోచుకున్న వారిని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండడం లోనే రోజులూ, నెలలూ సంవత్సరాలూ కాలగమనంలో దోర్లిపోయాయి.   వారిని నేను మొదట చూసింది మంచిర్యాల నుండి ఆదిలాబాద్ బస్సులో వెళ్తూ. వారి ఆహార్యం వింతగా కొత్తగా ఉండి వారి పట్ల ఆసక్తి రేకెత్తించింది.  ఆ తరువాత కొన్ని ఏళ్ళకి అంటే నేను నిజామాబాద్ జిల్లాలోని వర్ని వచ్చేవరకూ ఎప్పుడూ వాళ్ళని చూసే అవకాశం రాలేదు.  


ఓ రోజు, ఆశ్చర్యగొల్పుతూ వారు మా ఇంటి ముందు నుండి బారులు తీరిన  ఏండ్ల బళ్ళలో వెళుతూ ..  ఆతర్వాత ఓ రోజు మా ఇంటి దగ్గర వారి బళ్ళు ఆపుకొని మా బోరింగ్ దగ్గర కూర్చొని వారు వెంట తెచ్చుకున్న జొన్న రొట్టెలు తినడం నాకు వాళ్ళని గమనించడానికి అవకాశం దొరికింది. వాళ్ళు అక్టోబరు మాసంలో చెరుకు కొట్టడానికి ఇళ్ళనుండి బయలు దేరి వెళ్ళిన వాళ్ళు మార్చిలో వెనక్కి వస్తున్నారట.   ప్రతి సంవత్సరం అలా పిల్లాపాపలతో, గొడ్డు గోదా తీసుకొని వెళ్తారని మా వాళ్ళు చెప్పారు. చక్కని ముఖ కవళికలతో అందంగా, మంచి రంగుతో, పొడుగ్గా ఉండే వారి నడినెత్తిపైకి  కట్టి ఉండే జుట్టు, వారి మెడలో కనిపించే పూసలు, నిండు రంగులలో ఉండే బట్టలూ  ఆసక్తితో గమనించేదాన్ని.  మా వాళ్ళందరూ  చిన్నప్పటినుండి చూస్తూ ఉండడం వల్లనేమో వాళ్ళకి ఆ జాతి వారిని ప్రత్యేకంగా చూసేవారు కాదు.   నాకు మాత్రం వారు చాలా ప్రత్యేకంగా ఆనాటికీ ఈనాటికీ… నన్ను అంతగా ఆకర్షించిన వారే మథుర లంబాడీలు.

మధుర లంబాడాలు మాములుగా మనకు కనిపించే లంబాడాలు లేదా బంజారాలు లేదా సుగాలీలు లకు భిన్నంగా కనిపిస్తారు.  వారి భాష, ఆచార వ్యవహారాలు, కట్టు అన్నింటిలో ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తారు 

మధుర లంబాడాలు మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా కొద్దిగా కనిపిస్తారు. వీరు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో కూడా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు.  గుజరాత్ లో ఎక్కువ .  వీరిని మహారాష్ట్ర, గుజరాత్ లలో మధుర బంజారా, చత్తీస్ గడ్ లో మధుర లంబాని, మధ్యప్రదేశ్ లో మధుర లబాన్, ఉత్తర ప్రదేశ్ లో మధురాలు లేదా మధూరియా అని అంటారు.  మహారాష్ట్రలో వీరిని డి నోటిఫైడ్ విముక్త జాతులుగా ప్రకటించారు.
రాజస్థాన్ లోని బికనీర్, బహాల్యాపూర్ , పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ జాతి ఆవిర్భవించిందాని చరిత్ర కారుల అంచనా.  రాజపుట్ వంశస్తుల అనచివేయబడిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళారని చరిత్రకారుల అంచనా.
DSC_0002
రాజస్థాన్ /గుజరాత్  నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం  పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా ,  నిజామాబాద్ ).
నిజామాబాద్ జిల్లాలో  వీరిని  మధుర లంబాడాలు అనీ, కాయితి లంబాడాలు అనీ, కొప్పు లంబాడాలని , జుట్టు లంబాడాలని రకరకాలుగా పిలుస్తారు.   వారి భాష, వేషధారణ, నగలు ,  పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వాయిద్య పరికరాలు అన్నీ ప్రత్యేకమే.  అటవీ ప్రాంతాల్లోనే వీరి నివాసం.  మైదాన ప్రాంతాలకి వారాంతపు అంగళ్ళకి  వస్తారు. 
 
మధుర లంబాడాలలో 11 గోత్రాలు ఉన్నాయి. అవి నాయక్, బామన్, బాద్రియా, కిత్రియా,లేల్యా, మాంద్యా, బర్దావల్, తిత్రియా , పెళ్యా, సాబ్ల్యా, భట్ .    నాయక్ అందరికన్నా పై స్థాయిలో ఉంటే భట్ లు అందరికన్నా తక్కువ.
రాజస్థాన్ /గుజరాత్  నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం  పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా , వర్ని మండలం, నిజామాబాద్ ). అయితే తమ వాళ్ళు ఎప్పుడొచ్చింది ఖచ్చితంగా చెప్పలేమని, మా ముత్తాతల ముత్తాతలది కూడా ఇదే ఊరు అంటాడు అతను.
మేం అంతా బస్సు తీసుకొని మా జాతి అంతా ఒక దగ్గర కలుస్తోంది అని తెలిసి గోకుల్ మధుర వెళ్లి వచ్చాం. అక్కడికి మాకు చూస్తే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా .  వాళ్ళు అంతా  చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో . డాక్టర్లు , ఇంజనీర్లు , కలెక్టర్లు . కొందరు అమెరికాలో . ఇక్కడ మేం ఇంకా అడవిలోనే .  చదువు సంధ్యలకు దూరంగానే ..  మా పిల్లలను  బాగా చదివించాలని ఇప్పుడు మా తపన అన్నాడు గోకుల్ దాస్ తండాకు చెందిన నాయకుడు బారత్యానాయక్
మా ముత్తాతల ముత్తాతల ముందు తరాల వాళ్ళు వందల ఏళ్ళ  క్రితం వచ్చినప్పుడు మా జాతి ఎట్లా ఉందో అట్లానే మా జాతి లక్షణాలు మా దగ్గరే బతికి ఉన్నాయి.  అక్కడ మా జాతి కట్టు బొట్టు , వేషభాషలు ఏమీ ఇప్పుడు  కనిపించవు  అన్నాడు పదవతరగతి వరకు చదివిన సజ్జన్లాల్ .
ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ గోత్రాన్ని బట్టి వాళ్ళు మా జాతీయులు అని గుర్తించవచ్చు అంటాడు ఇంజినీరింగ్ చదువుతున్న పతేసింగ్.   వందల ఏళ్ళ క్రితం చెల్లా చెదురు అయిపోయిన మా జాతిని గుర్తించడానికి, ఒక దగ్గర చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అందుకు టెక్నాలజీ కూడా చాలా ఉపయోగపడుతోంది  అన్నాడు ఈ ప్రాంతంలో మధుర లంబడాల  జాతి నుండి కాబోయే మొదటి ఇంజినీర్.
జీవన విధానం 
ప్రకృతి ఒడిలో కొండ వాలులోనో, అటవీ ప్రాంతంలోని వాగు సమీపంలోనో ఉంటాయి మథుర లంబాడాల నివాసాలు.  మధుర లంబాడాలు ప్రధానంగా పశులకాపరులు.  వ్యవసాయం చేస్తారు. గోవుల కాపరి శ్రీకృష్ణుడి రాజధాని గోకుల మధుర మాది అని వాళ్ళు చెప్తారు.    వీరి మెడలో జంధ్యం ఉంటుంది.  గాయత్రి మంత్రంతో పవిత్ర జంధ్యం వేసుకుంటారు.  వాళ్లకు వాళ్ళు మేం క్షత్రియులం అని చెప్పుకుంటారు.  కానీ, బయట ప్రపంచం వీరిని గిరిజన తెగలకు చెందిన వారిగానే చూస్తుంది.
వీరు సంచార జీవులుగా ఉన్న కాలంలో వీరు తండాల్లో ఉండేవారు.  వీళ్ళ నాయకుడుని నాయక్ అంటారు . వంశానుగాతంగా ఆ పదవి వస్తుంది.  నాయక్ ఎప్పుడూ తమ వారి మంచి కోసం ఆలోచిస్తూ కృషి చేస్తాడు.  అందరూ అతని మాటని గౌరవిస్తారు.
illu
ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ కనిపిస్తాయి.  ఒక్క కుటుంబంలో అరవై డెబ్బై మంది కుడా ఉంటారు.  వ్యవసాయ పనులు, పశువుల పెంపకం అంతా కలసి చేసుకుంటారు .  పిల్లలు పెద్దల పట్ల గౌరవంతో ఉంటారు.
ఇప్పుడు  తగ్గిపోయింది కానీ ఐదారేళ్ళ క్రితం వరకూ గోవులను మేపుతూ అలా రోజులు నెలల తరబడి వెళ్ళేవారు . ఇంటికి దూరంగా ఉండే వారు. గోవుల మందలను తోలుకెల్లి పొలాల్లో మంద పెట్టె వాళ్ళు.  అందుకు ప్రతిఫలంగా రైతులు జొన్నలు , వడ్లు ఏదో ఒక ధాన్యం ఇచ్చే వారు.  వీరి  జీవనం చాలా కష్టంగా సాగేది.  అప్పట్లో మాకు నాగరికత తెలియదు.  గత 20 ఏళ్లలో మా  జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి.  నాగరికత తెలిసింది.  మా  కట్టు-బొట్టు, ఆచార వ్యవహారాల్లోనూ మార్పు వచ్చింది అంటాడు భారత్యా నాయక్ బంధువు .
అవును, అప్పుడు మాకు  అప్పులు లేవు.  ఇప్పుడు అప్పులు వచ్చాయి. ప్రభుత్వం వారూ, బాంకు వాళ్ళు రుణాలు ఇస్తున్నారు.  అవకాశం ఉంది కదా అని  భార్య పేరున  , పిల్లల పేరా అప్పులు చేసి ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు ,  పొలాలు , బోర్లు సమకూర్చుకుంటున్నాం. కానీ అప్పటి రోజులే బాగున్నాయి అప్పులు లేకుండా యాలకింత తిని కంటి నిండా నిద్ర పోయే వాళ్ళం అన్నాడు భారత్యా నాయక్.
ఇప్పటికీ వ్యవసాయంలో నాగలి, రెండు  చక్రాల ఎడ్ల బళ్ళను  ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్వవసాయం చేసుకుంటూ ఉంటారు.   ఇప్పుడిప్పుడే  ట్రాక్టర్లు , కొత్త మిషన్లు వంటి యంత్రాలు వీరి జీవనంలోకి వచ్చి చేరుతున్నాయి.  
 
ఆహారం
వాస్తవానికి వీరు శాఖాహారులు.  అయితే నేటి తరం వారు మద్యం, మాంసాహారానికి అలవాటుపడిపోయారు.   వీరి సాంప్రదాయిక ఆహారం రోటి. జొన్నలు బాగా తింటారు .   గోధుమ, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము , కంది పప్పులు ఎక్కువగా తింటారు . టమాటా , వంకాయ వంటి రకరకాల కూరగాయలు వాళ్ళ పొలాల్లో పండేవి తింటారు. ఆకుకూరలు తింటారు.  వరి బియ్యం తినడం ఒకప్పుడు లేదు. తిన్నా ఎప్పుడో పండుగ సమయాల్లో మాత్రమే తినేవారు. యన్. టి. రామారావు ప్రభుత్వం ఏర్పాటైన  తర్వాత రెండురూపాయల బియ్యం ఇచ్చినప్పటి నుండి నెమనెమ్మదిగా  బియ్యం తినడం అలవాటు అయింది  అంటాడు మాజీ సర్పంచ్ భర్త మోతిలాల్.
జామ, అరటి , యాపిల్ వంటి పళ్ళన్ని వారాంతపు సంతలో తెచ్చుకుంటారు.  పెరుగు, నెయ్యి  బాగా వాడతారు.  తీపి పదార్ధాలు ఇష్టపడతారు. టీ తాగుతారు.   పల్లీలతో, కందగడ్దలతో( చిలగడ దుంప) పండుగ సమయాల్లో పాయసం చేసుకుంటారు.
వారి ఇళ్ళు 
కొండ కోనలకు సమీపంలో వీరి నివాస సముదాయాలు ఉంటాయని ముందే చెప్పాను కదా !  సమీపంలోని అడవినుండి తెచ్చిన టేకు దుంగలను గోడలుగా అమర్చుకుంటారు.  పైన వర్షాకాలపు పంటకు వచ్చే  వరిగడ్డిని తెచ్చుకుని ఇళ్ళపై  కప్పుతారు.  ఇంటి ముందు పశువుల పాకలు ఉంటాయి.  పశువులే వారి ఆస్తి. లేగ  దూడలను ఇంట్లో తమతో పాటే ఉంచుకుంటారు.  వంటకి కట్టెల పొయ్యి వాడతారు.  
గతంలో పొయ్యిలో నిప్పు ఉన్నప్పుడే అన్నం తినేవారు. ఆరిపోతే తినరు . ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉపయోగించుకొని కొందరు పక్కా ఇళ్ళు కట్టుకున్నారు. దాదాపు అన్ని ఇళ్ళలో విద్యుత్ దీపాలు కనిపిస్తాయి.  మీటరు ఉండదు కానీ వైర్ తగిలించి విద్యుత్ దీపాలు వెలిగించు కుంటారు కొందరు.  కొందరి ఇళ్ళలో టి.వి లు కూడా వచ్చేశాయి.  నాగరిక ప్రపంచంలో కనబడే అనేక వస్తువులు అడవుల్లోనో , అటవీ అంచుల్లోనో ఉండే వారి ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి ఆశ్చర్యం కలిగిస్తాయి. 
 
స్నేహానికి ప్రాణమిచ్చే మథుర లంబాడీలు కొద్దికాలం క్రితం వరకూ అటు నక్సలైట్లు ఇటు పోలీసుల మధ్య నలిగిపోయారు. 
muchchatalo
మాతృభాష 
వీరి భాష లంబానా భాష.  వీరి  భాషలో మరాఠీ , హిందీ, బంజారా భాషా పదాలు మిళితమై కనిపిస్తాయి.   నిరక్షరాస్యులైన వీరు మాతృభాషతో పాటు స్థానిక భాషలు మాట్లాడతారు.
భాషలో కొన్ని పదాలు 
లెహెంగ  (లంగా)
కచలి  (జాకెట్)
నమస్తే –  రామ్ రామ్
యా/బాయి  – అమ్మ
బా – నాన్న
దాదా – అన్న
జీజీ – అక్క
జీజొ – బావ
దండో – తాత
డంగి – నాన్నమ్మ
పుప్పీ – అత్త
పెళ్లి – బ్యహ
బాడువా – వడక లగ్గం
నాక్డా – నాయక్
పూజించే దేవతలు 
 
వీరు శ్రీ కృష్ణుడిని కొలుస్తారు.  తిరుపతి బాలాజీ , పూరి జగన్నాధ్ ని పుజిస్తారు.  
 
పండుగలు 
మథుర లంబాడాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పండుగ గోకులాష్టమి.  వీరి నివాసాలకు వెళితే శ్రావణమాసం అంతా పండుగ వాతావరణమే కనిపిస్తుంది.
DSC_0016
వస్త్రధారణ 
పెళ్ళికాని ఆడపిల్లలు లేహంగా, కచలి (జాకెట్ ) వేసుకుంటారు . పెళ్లి అయిన స్త్రీలు  చీర వాళ్లపద్దతిలో కట్టుకుంటారు.  
మగవారి ఆభరణం జంధ్యమే . దీన్ని జనువా అంటారు.  సాంప్రదాయంగా ధోతీ (బారకషి ), జుబ్బా (జహంగల ) వేసుకుంటారు. 
 
చదువు 
చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. అతి కొద్ది మంది ఇంటర్ వరకు చదివి  ఉద్యోగం చేస్తున్నారు.  ఇద్దరు మిలిటరీలోకి వెళ్ళారు.  ఆడ పిల్లల్లో చదువుకునే వారి సంఖ్యా మరీ తక్కువ.  ఇప్పుడిప్పుడే 10 వతరగతి కి వచ్చారు . ఒకరిద్దరు ఇంటర్ చదివితే , ఒకమ్మాయి మాత్రం నిజామాబాద్ లో ఉంది ప్రైవేటు కాలేజిలో ఇంగ్లిషు మీడియంలో డిగ్రీ చదువుతోంది.
పెళ్లి: 
మగవాళ్ళకి 21, వదువుకి 16 పెళ్లి వయస్సు.
మధుర లంబాడాల తండాలో నాయక్ అందరికీ పెద్దగా ఉండి గ్రామ మంచి చెడులు, గ్రామ మంచి కోసం చేసే కార్యాలు చేస్తాడు.  అలాగే భట్ గోత్రికుడి కి కూడా వంశపారంపర్యంగా బట్ పని వస్తుంది.  అతను నాయక్ కి సహాయకుడిగా ఉంటాడు. అంతే కాకుండా పెళ్లిల్లప్పుడు పెళ్లి పనులు చేస్తాడు.
అతను చేసే సేవలకు వారి వారి ఆర్ధిక స్థాయిని బట్టి కొత్త సొమ్ము ఇచ్చేవారు. మొన్నటి వరకూ పదకొండు వందల రూపాయలు ఇచ్చేవారు.  ఇప్పుడు 5 వేలు ఆరు వేలు కూడా ఇస్తున్నారు.
ఊరిలో ఎ సమాచారమయినా అందరికి చేరవేస్తాడు భట్.  పెళ్లి పిలుపులు , చావు వార్తలు అతనే చేర వేస్తాడు.
మానవ జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు సహజంగానే వారినీ ప్రభావితం చేయడం కనిపిస్తుంది.  ఒక  సమాజానికి  మిగతా సమాజాల వారితో సంపర్కం ఏర్పడ్డాక, రాకపోకలకు సదుపాయాలు ఏర్పడ్డాక, సమాచార వినిమయం పెరిగాక వచ్చే మార్పులు వీరి జీవన విధానంలోకి చోచ్చుకోచ్చేశాయి.
ఇంతకు ముందు పెళ్లి పత్రికలు వేయించేవారు కాదు.  ఆకులు – పోకలు ఇచ్చి ఫలానా వారి పెళ్లి ఉందని చెప్పి పిలిచే వాళ్ళు. ఇప్పుడు పెళ్లి పత్రికలు వేయిస్తున్నారు.
ఒకప్పుడు బ్రాహ్మడు ముహూర్తం చూసి పెళ్లి సమయం నిశ్చయించే పద్ధతి లేదు.  పెళ్లి సమయాన్ని నాయకుడే నిర్ణయించే వాడు.  ఆ సమయానికే పెళ్లి జరిగేది.  ఇప్పుడు కూడా నాయక్ పెళ్లి ఎప్పుడు చేయాలో చెప్తున్నాడు కానీ బ్రహ్మడికి కూడా చూపిస్తున్నారు.  ఆ సమయం మంచిదో కాదో చెప్పించుకుంటున్నారు.
అమ్మాయి అబ్బాయి పెళ్ళికి ముందు చూసుకునే పద్ధతి కూడా లేదు.  అమ్మాయి తరపు వారు అబ్బాయి గురించీ, అబ్బాయి తరపు వారు అమ్మాయి గురించీ ముందే బంధు మిత్రుల ద్వారా తెలుసుకుంటారు.  ఆ తర్వాత ఇరువర్గాలు నాయకుడి ఇంటి దగ్గరికి వస్తారు.  ఆకులు – పోకలు ఇచ్చి పుచ్చుకుంటారు. తింటారు.  పెళ్లి చేసే విధానంలోనూ అనేక మార్పులు.
పెళ్ళైన ఆడపిల్లకి కాలిపాట్ అని నల్లపూసల మంగళసూత్రం ఉంటుంది.  రక్షడి,  కాఖడి  జుట్టులో పెట్టుకుంటారు. ఇత్తడి కాళ్ళ కడియాలు, గూటి (టో రింగ్ ), బిడ్ (మెడ , చెవుల నగలు ). ఒకసారి పెడితే అవి చని పోయే వరకూ తీయరు. భర్త చని పోయిన స్త్రీ అవి తిసివేస్తుంది.
విడాకులు తక్కువ .  పిల్లలు పుట్టకపోతేనో , భార్య చనిపోతేనో, ఆరోగ్యం బాగోలేకపోతేనో మళ్లీ పెళ్లి చేస్కోరు.  విడాకులు తీసుకున్న వాళ్ళు, భర్త చనిపోయిన మహిళలు  మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలా రెండో సారి పెళ్లి చేసుకొనే మహిళ వాళ్ళు విడాకులు తీసుకున్న వారినో , భార్య చనిపోయిన వ్యక్తినో చేసుకుంటారు.  విధవరాలిని రండ్ అంటారు.
మగవాళ్ళు విడాకులు కోరితే ఆడపిల్ల వారికి కుల పంచాయితీ పెద్దలు చెప్పిన విధంగా భరణం చెల్లించాలి.  విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత భర్తదే. పెళ్లి జరిగాక చేసే పెళ్లికి సంబంధించిన గుర్తులన్ని ఉంచుకోవచ్చు. భార్య/భర్త నడవడి బాగోలేకపోతే విడి పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు.  రెండో పెళ్ళిని మొహ్తుర్ అంటారు.
కట్నం ఇచ్చి పుచ్చుకోవడం లేదు.  ఒకప్పుడు అబ్బాయి అమ్మాయికి కట్నం ఇచ్చే పద్దతి ఉండేది.  ఒలి ఇవ్వలేక అబ్బాయిలు ముదిరిపోయేవారట. ఓలి ఇచ్చి చేసుకునే వారు లేక అమ్మాయి ల పెళ్ళిళ్ళు అలస్యంగానే జరిగేవి.  అయితే ఇప్పటికీ పెళ్ళిలో అమ్మాయికి 11 రూపాయలు కట్నంగా ఇచ్చే పద్ధతి ఉంది.  ఓలి  పద్ధతి లేదు.  గురువు వచ్చాక ఆ విధంగా ఇవ్వడం మానేశారు.
 అమ్మాయి కుటుంబం పేదదయితే పెళ్లి చేసే స్తోమత లేకపొతే , ఆ అమ్మాయిని తమ ఇంటి కోడలిగా తీసుకు వెళ్ళలనుకుంటే అమ్మాయి పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు ఆబ్బాయి వాళ్ళు ఇస్తారు. పెళ్లి చేసుకొని  అమ్మాయిని తమ ఇంటికి తెచ్చుకుంటారు.
ఇంటి కోడలు పురిటికి కన్నవారింటికి వెళ్ళే ఆచారం లేదు.  అత్తవారింటిలోనే పురుడు పోసుకుంటారు. పురిటి ఖర్చు అత్తింటి వారిదే . బిడ్డ  పుట్టిన రెండు మూడు నెలల తర్వాత వెళతారు.  ఒకప్పుడు ఇంటిదగ్గరే పురుడుపోసుకునే వారు. ఇప్పుడు ఆసుపత్రి కి వెళుతున్నారు.  నెలరోజులు పురిటి మైల పాటిస్తారు. ప్రత్యేకమైన గదిలోనే ఉంటారు.  ఆసమయంలో బిడ్డపనులు, తన పనులు తప్ప తల్లి ఏ పని  చేయదు. 
vaari veedhi
 బహుభార్యాత్వం 
సాధారణంగా ఏకభార్యత్వం పాటిస్తారు.  కొన్ని సందర్భాల్లో బహుబార్యత్వం కనిపిస్తుంది.  మొదటి భార్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అలా చేసుకుంటారు.
బంధుత్వాలు
చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న పిల్లల్ని చేసుకోరు. మేనరికాల్ని చేసుకుంటారు.
అన్న చనిపోతే వదినని తమ్ముడు చేసుకోవచ్చు.  కానీ, తమ్ముడి భార్యని అన్న చేసుకోడు.
వాయిద్య పరికరాలు 
నగారా , బాజాలు , గిల్ల
మహిళల భాగస్వామ్యం 
మగవాళ్ళ లాగే మహిళలూ అనడంతో పాటు ఎత్తుగా బలంగా ఉంటారు. స్త్రీలు ఇంటిపని, పొలం పని, పశువులు పాడిపనో  ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు.  ఒకప్పుడు బట్టలు చేత్తోనే కుట్టుకునే వారు.  ఇప్పుడు వాళ్ళ బట్టలు కుట్టడానికి ప్రత్యేకంగా ఉన్న దర్జీ కుడతారు.  వాళ్ళతో మాట్లాడినప్పుడు వారెవరికీ మిషను కుట్టడం రాదన్నారు.  గతంలో తీరిక సమయాల్లో  రకరకాల చేతికుట్లు కుట్టేవారట. ఇప్పుడు కుట్టడం లేదు అంటూ ఇప్పుడు అంతా కాలం మారిపోయింది కదా ..  ఆ కుట్టినవి.   ఇప్పటి వాళ్ళు వేసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది ఓ వృద్దురాలు.
నాలుగేళ్ళ క్రితం గుజరాత్ నుండి ఎవరో వచ్చారు.  మా తండాలన్నీ తిరిగారు. మా దగ్గర ఉన్న చినిగిపోయిన బట్టలకు ఉన్నవయినా సరే మేం చేత్తో కుట్టిన వాటిని అడిగారు. వాటికి బదులుగా మాకు ఇత్తడి సామాన్లు ఇస్తామన్నారు.  ఏమి చేసుకుంటాం అని మా దగ్గర ఉన్నవన్నీ వెతికి వెతికి వాళ్ళకి ఇచ్చేశాం అంటూ వాళ్ళు ఇచ్చిన ఇత్తడి గిన్నెలు చూపింది ఓ మహిళ.  ఇప్పుడు మా దగ్గర మేం చేసిన కుట్లు అల్లికలు లేవు. ఎక్కడో  ఒకరి దగ్గర తప్ప. అవి వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు.  ఇప్పటి ఆడపిల్లలు ఎక్కడ నేరుస్తున్నారు ..? అంది జమునాబాయి .
మధుర లంబాడాల కుటుంబాల్లోనూ  మగ పిల్లవాడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆడపిల్లకి ఇవ్వరు.  ఆడపిల్లలు బడికి పోయేవాళ్ళు చాలా తక్కువ.  గొడ్డు గోదా మేపడానికో, చేను కాపలాకో, ఇంటి పనులు చేయడానికో ఆడపిల్లలని బడికి పంపకుండా ఇంటిదగ్గరే ఉంచుతారు. ఏ పనులూ లేనప్పుడు  పంపినా తమ తండాలో ఉన్న బడికే. చాలా కొద్ది మంది ఆడపిల్లలు ఊరు దాటి వెళ్లి చదువుకునేది.  అదే మగపిల్లలయితే బడి ఉన్నప్పుడు ఊర్లొ కనిపించేది చాలా తక్కువ.
నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేనడిగే ప్రశ్నలకి జవాబు చెప్తూనే మా గురించి అన్ని అడుగుతున్నావ్.. నీమిటి లాభం అని ఒకరు అంటే .. సర్కారు జీతం ఇస్తుందా అని మరొకరు .. ఆ ఏమి లాభం లేకుంటే చదువుకున్నోళ్ళు మన ఇళ్ళు ఎందుకు వస్తారు అంటూ మహిళల నుండి ప్రశ్నల పరంపర.  ఏదైనా ఆర్దికపరమైన లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరని వారి ప్రగాఢమైన నమ్మకం.
ప్రపంచీకరణ, ఆధునికీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా శరవేగంగా  జరుగుతున్న మార్పులు, చోటు చేసుకుంటున్న ధోరణులు స్వచ్చమైన ముత్యంలా మెరిసే మథురాలలొకి వచ్చి వారినీ ప్రభావితం చేస్తున్నాయి.  ఈ క్రమంలో వారి అభివృద్ధి ఎంత వరకూ జరుగుతుందో తెలియదు కానీ మథుర లంబాడాల జాతి ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన తమ అస్తిత్వాన్ని మాత్రం ఇక ఎక్కువ కాలం నిలుపుకోక పోవచ్చేమో త్వరలోనే కోల్పోతుందేమోనని నా  బెంగ.
వి. శాంతి ప్రబోధ

‘ఎగిరే పావురమా’! ….. రెండవ భాగం

GD banner part 2

“దసరాలయ్యి వారమైనా, ఈ తడవ మిగులు పనులు అవ్వనే లేదు. అమ్మోరికి భక్తులిచ్చుకున్న కానుకలు, చీరలు సగమైనా సర్దలేదు,” అంది రాములు మాల కడుతూ.

పదిరోజుల దసరా పూజలకి గుడి హుండీలో తరగని చిల్లర చేరిందంట.
పూల పనులయ్యాక చిల్లర పట్టుకెళ్ళి వేరుచేయమని పంతులుగారు పిలిస్తే వెళ్ళింది రాములు.

చిల్లరతో నిండున్న పళ్ళాలు దొంతిగా పేర్చి పట్టుకొని, అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా వస్తున్న రాములుని చూసి నవ్వొచ్చింది.
అరుగు మధ్యగా పరిచిన తెల్లటి తుండు మీద చిల్లర పోసుకొని, కాసుల్ని వేరు చేయడం మొదలెట్టాము.
“ఆ చిల్లరంతా అయ్యేంతమటుకు రోజూ కాసేపు చెయ్యాలంట ఈ పని,”… అంది రాములు.

మధ్యానం ఒంటిగంటకి ముందే, కూరల బడ్డీ కాడ ఉండాల్సిన తాత గుడిలోకి రాడం అగుపడింది మాకు. వెనకాల ఓ పెద్దాయన, ఓ ఆడమనిషి కూడా ఉండారు.

“గుడి మూయడానికి ఇంకా అరగంటైనా ఉందే! సత్యమయ్య ఇయ్యాళ కాస్త పెందరాళే తినడానికి వస్తున్నాడా?” అంది రాములు అటుగా చూస్తూ. అప్పటికే ఆ పూట తినడానికి మాకు ప్రసాదాలు, తాగడానికి కొబ్బరినీళ్ళు తెచ్చి పక్కనెట్టింది.
“కాదులే, ఆయనెంట ఇంకెవరో కూడా ఉండారుగా,” అంది మళ్ళీ తనే.

మాకు దగ్గరగా వచ్చాక, ‘ఇప్పుడే వస్తా’ అన్నట్టు సైగ చేసి వచ్చినోళ్ళని గుళ్ళోకి తీసుకుపోయాడు తాత.
**
చిల్లర సంచులు అప్పజెప్పడానికి రాములటెళ్ళగానే, అరుగుల కాడికొచ్చాడు తాత.
తన వెంటున్నోళ్ళని ఆయుర్వేద డాక్టర్లు – లలితమ్మ, శివయ్యలుగా చెప్పాడు.
వాళ్లకి దణ్ణాలెట్టాను.

శివయ్య నాకు ఎదురుగా కూకుంటూ, ”బాగా ఎదిగావు పాప! నిన్ను మూడేళ్ళప్పుడు మా వద్దకు తెచ్చాడు మీ తాత. నిన్ను పరీక్షించి – ఆరోగ్యం, ఎరుక, తెలివితేటలు వయసుకి తగ్గట్టుగానే అనిపించడంతో, నీ కాళ్ళల్లో చలనం, నీ నోటెంట మాట తప్పక వస్తాయనే చెప్పాము,” అన్నాడు.

లలితమ్మ నా పక్కనే కూకుని నా కాళ్ళు పరీక్షించింది. ఎదురుగా నిలబడ్డ తాత వంక చూసి, “చూడు సత్యం, మేము గాయత్రిని చూసి కూడా అప్పుడే ఐదేళ్లవుతుంది. ప్రస్తుతం ఎనిమిదేళ్ళ వయస్సుకి తగ్గట్టుగానే ఉంది. పెరుగుదల విషయంగా ఏ లోటు లేదనిపిస్తుంది,” అన్నదామె.

“మరి నేనిచ్చే తైలం, పసరు కాళ్ళకి పట్టిచ్చి కాస్త మర్దన చేస్తున్నారా గాయత్రీ?” అని ఆమె నన్నడిగిన దానికి తలాడించాను. వారానికి ఒకసారే చేస్తున్నామన్న సంగతి ఆమెకి నచ్చలేదు.

తాత వంక తిరిగి, “పిల్లకి పద్దెనిమిదేళ్ళ వయస్సు వరకు పెరుగుదల ఉంటుంది.
ఈ లోగానే, ముందైతే, గాయత్రిని ఒకసారి మావద్దకి తీసుకొనిరా.
కాళ్ళకి వ్యాయామం చేయడం నేర్పిస్తాను,” అంది డాక్టరమ్మ.

చిల్లరప్పజెప్పి తిరిగొచ్చిన రాములు, ఆమె మాటలింటూ కాస్త ఎడంగా నిలబడుంది.

ఇక వెళ్లాలంటూ అరుగుల మీద నుండి లేచారు లలితమ్మ, శివయ్య.
“ఏమ్మా గాయత్రీ, నువ్వు ఈ పరిమితులు అధిగమించి వృద్ధిలోకి రావాలని కోరుకుంటాము,” అంటూ నన్ను ఆశీర్వదించి వెళ్లారు..

రాములు దగ్గరగా వచ్చి నా భుజం తట్టింది…

“అంటే నీ ఇక్కట్లని దాటి, అందరిలా నువ్వూ నడవాలని, మాట్లాడాలని అంటుంది ఆ డాక్టరమ్మ,” అంది అరుగు మీద పక్కకెట్టిన ఫలారాలు అందుకుంటూ….

**

 

సామాను అప్పజెప్పి మేము ఇంటి దారి పడుతుండగా, మరునాడు సాయంత్రం గుళ్ళో పురాణ కాలక్షేపం ఉందని మాకు గుర్తు చేసాడు పంతులుగారు.
మూడు నెలలకోసారి జరిగే పురాణ కాలక్షేపంకి ఊరంతా కదిలి వస్తది. అదయ్యేంత మటుకు నేను, తాత గుళ్ళోనే ఉండిపోతాము కూడా.

**

మధ్యానం నాలుగింటికి ఇంకోసారి అరుగులు శుభ్రం చేయించారు పూజారయ్య.
నేను, రాములు ముందుగానే పుజసామాను పంతులుగారికి అప్పజెప్పి అరుగుల మీద ఓ పక్కగా కూకున్నాము.
ఆరింటికి మొదలయ్యే కాలక్షేపం కోసం, గంట ముందే – అరుగుల కాడ ప్రత్యక్షమయ్యారు సుబ్బి, మాణిక్యం.

“కాసేపు నీతో కూచుని మాట్లాడచ్చని ముందుగా వచ్చామమ్మా ఓ రాములమ్మా,” అంది నవ్వుతూ సుబ్బి. “ఇదిగో నీకోసం మిరపకాయ బజ్జీలు చేశాను,” అంటూ రాములికి పొట్లం అందించింది మాణిక్యం.
ఆ పొట్లం నా ముందుంచి, ఎదురుగా అరుగు మీద స్నేహితురాళ్ళకి దగ్గరగా కూకుంది రాములు.
నేను ముగ్గుల పుస్తకం ముందేసుకుని, బజ్జీ తింటూ వాళ్ళ మాటలు వింటున్నాను.
కాసేపు ముగ్గురూ కబుర్లు, నవ్వుల్లో గడిపారు.

“కబుర్లకేముంది కాని రాములూ, నీ మామతో సంగతి తేల్చుకున్నావా? లేదంటే నిన్నింకా కాపురానికి పిలుస్తాడన్న భ్రమలోనే ఉంటావా? అడిగింది సుబ్బి.

రాములు తలొంచుకొని నేలచూపులు చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

రాములలా కంటతడి పెట్టడం నాకు చాలా బాధేసింది. ఆమె కష్టం ఏంటని తెలియకున్నా, రాముల్ని అలా చూడలేకపోయా.
మాణిక్యం మాత్రం, లేచి రాములికి దగ్గరిగా వచ్చింది.

ఆమె భుజం మీద చేయివేసి, “ఏడవమాకే రాములు. నీకు సాయపడదామన్న ధ్యాసతో గట్టిగా అడిగింది సుబ్బి. నిన్ను కష్టపెట్టాలని కాదు. నువ్వు కళ్ళు తుడుచుకో. తరువాత మాట్లాడుదాములే,” అని సర్దేసింది మాణిక్యం.

“నువ్వుండవే మాణిక్యం. ప్రేమించానంటూ మేనమామని ఈ గుళ్ళోనే కదా! ఏడేళ్ళ కిందట మనువాడింది రాములు. అతనేమో దీన్నొగ్గేసి అప్పుడే నాలుగేళ్ళగా మరెవ్వత్తినో కట్టుకొని వేరే కాపురమెట్టాడు. ఇదేమో అతన్ని గదమాయించి అడగదు. పాతికేళ్ళకే ఒంటరిదై ఎలా బతుకుతుంది ఇది?” అంటూ మండిపడింది సుబ్బి.

‘ఏందో ఇదంతా? వాళ్ళ ముగ్గురి మధ్య గొడవ’ నాకొకింత భయమేసింది.

‘వాళ్ళిద్దరూ తన మేలు కోరేవాళ్ళని, తనకన్నా బాగా చదువుకున్నాకే పెళ్ళిళ్ళు చేసుకొన్నారని చెబుతుంటుంది రాములు. పాలెంలోనే ఉంటూ, కేవలం తన మీద ఆపేక్ష కొద్దీ వచ్చి పోతుంటారంటుంది కూడా.
‘మరి ఇంతలా ఈ తగువులెందుకో, ఈ కేకలెందుకో వీళ్ళ మధ్య’ అనుకున్నాను.

పురాణంకి జనం రాడం మొదలవడంతో, ముగ్గురూ కాస్త సర్దుకున్నారు.

egire-paavurama-2-inside
**
పురాణ కాలక్షేపంలో – మధ్యన కూసేపు, నా ఈడు పిల్లలు పాటలు పాడారు. వాళ్ళల్లో ఎనిమిదేళ్ళ కవలలు చక్కగా పాడారని జనమంతా మెచ్చుకున్నారు. వాళ్ళు పంతులమ్మ మహలక్ష్మిగారి కూతుళ్ళంట.
శిష్యులందరి తరఫునా, ఆమె మెప్పులందుకుంది.
**
ఇలా గుడికొచ్చే నా తోటి పిల్లల్ని చూసినప్పుడు మాత్రం వాళ్ళకీ-నాకు మధ్య తేడా గుర్తొస్తది. అంతే కాదు పోను పోను నా స్థితి ఏమిటో ఎరుకయింది. ‘నేను అందరిలా మాట్టాడలేనని, నడవలేననే కాదు. ఎన్ని రోజులు గడిచినా నాకు మాట, నడక ఇక రావనిపిస్తది. ఎప్పటికీ ఇక ఇంతేనని’ గుబులుగా కూడా ఉంటది.

వెంటనే తాత గుర్తొస్తాడు. నన్ను తాత ఎంతో ప్రేమతో సాకుతున్నాడన్నదీ గుర్తొస్తది.
పసిబిడ్డగా దిక్కులేని నన్ను తాత దయతో దగ్గరికి తీసాడని నాకెరుకే. మరి నాకు అమ్మా నాన్న లేనట్టేగా! అని బాధగా ఉంటది. ఒకవేళ ఉన్నారేమో! ఉంటే ఏమయ్యారు? అని కష్టంగా అనిపిస్తది.

నా చుట్టూ లోకాన్ని చూస్తుంటే, రోజంతా ఈ మధ్య ఇలాంటి ఆలోచనలే కమ్ముతున్నాయి. ఒక్కోసారి పావురాళ్ళు వచ్చి నా ఆలోచనలని మళ్ళిస్తాయి. ఒకటైనా వచ్చి నా భుజం మీద కూడా వాలుతుంది.
పావురంలా ఎంచక్కా నేనూ ఎగిరిపోగలిగితే? నడవలేను-మాట్లాడలేను అన్న ఆలోచనే ఇక ఉండదుగా అనుకొని నవ్వొస్తది.
**
“కోవెల్లో మళ్ళీ దీపాల పండుగ సందడి రాబోతుంది,” అంది అరుగులు కడుగుతూ రాములు.
అరుగులు కాడ తచ్చాడి, అప్పుడే ఆకాశంలోకి ..దూసుకుపోతున్న పావురాళ్ళ వంక చూస్తూ, మా కాడికి వచ్చాడు పంతులుగారు.

చేతుల్లోని ప్రసాదం దొన్నెలు నా పక్కనే అరుగు మీదెడుతూ, మా దినచర్యలో భాగమయిపోయిన పావురాళ్ళు నిజానికి పెంపుడు పక్షులేనన్నాడు ఆయన.
“పావురాయి – శాంతికి, ప్రేమకి, చిహ్నం. నిష్కళంకమైనది కూడా. మీ ఇద్దరూ వాటిని దయతో చూస్తున్నారుగా! మంచిదే,” , “అలాగే ఆ గాయత్రీ దేవిని నమ్ముకోండమ్మా. మిమ్మల్ని ఆ తల్లి కాపాడుతుంది,” అంటూ నా వంక చుసాడాయన.

“ఏమ్మా గాయత్రీ, ఈ మధ్య పూలదండలు కూడా తయారు చేస్తున్నావుగా! ఇవాళ తులసిమాల నీవు చేసిందేనని చెప్పింది రాములు. చక్కగా ఉందమ్మా. కానివ్వు, మంచి పనే,” అంటూ వెనుతిరిగాడు పంతులుగారు.

రాములు వచ్చి నా పక్కనే కూచుని, ప్రసాదం అందుకుంది.
“అంటే, మన పావురాళ్ళు నీకు మల్లేనే అమాయకమైనవి, చాలా మంచివని చెబుతున్నాడు మన పంతులుగారు,” అంది నవ్వుతూ రాములు.
**
దీపాల పండుగ అనంగానే, బారులు తీరే పెమిదలు, రకరకాల తీపి మిటాయిలు, ప్రసాదాలు గుర్తొచ్చాయి. పండుగ బాగుంటుంది.

దీపాల పండుగప్పుడే నా చేత రాములుకి, పిన్నికి కూడా చీర, రవిక, గాజులు ఇప్పిస్తాడు తాతని గుర్తొచ్చింది.

“మా అయ్య జబ్బుపడి మంచాన ఉంటే, మరి మీ తాతే నా మనువు జరిపించాడు. అందుకే సత్యమయ్య నాకు తండ్రితో సమానం,” అని రాములు, గుర్తు చేసుకుంటే,
“సవితితల్లి బిడ్డనైన నన్ను, తన బిడ్డలా చూసుకుంటాడు మా అన్న,” అంటూ కంటతడి పెడుతుంది చంద్రం పిన్ని.
తాతంటే వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ అని కూడా గుర్తొచ్చింది.

**

వర్షం మూలంగా గుడి కాడనే, ఒకింత ఆగినంక ఇంటిదారి పట్టాము.
కొట్టాం చేరగానే, కాళ్ళు చేతులు కడుక్కొని, పొయ్యికాడ మూతేసున్న ముద్దపప్పుతో బువ్వ తింటుండగా వచ్చారు చంద్రం పిన్ని, రాంబాబాయి.

“ఏందన్నా? ఆలస్యంగా వచ్చారా ఇయ్యాళ? తొందరేం లేదు. మేమాగుతాములే. నింపాదిగా తినండి,” అంటూ మాకు కాస్త దూరంగా గట్టు మీద కూకున్నారు.

గబగబా తినేసి వాళ్ళ కాడికెళ్ళాడు తాత.
“ఇదిగోనే చంద్రమ్మా, నీ లెక్క. ఈ తడవ నువ్వన్నట్టు, చిల్లరంతా పోగేసి నోట్లుగా మార్చి ఉంచాను,” అంటూ తన చొక్కా జేబు నుండి డబ్బు నోట్లు తీసాడు తాత.
“ఇదేమో నీకియ్యాల్సింది. ఇదేమో మన గాయత్రి చెక్క హుండీ లోది. మరి చిన్నదాని లెక్కంతా నీ చేతుల్లోనే ఉంది,” అంటూ వేరువేరుగా ఆ డబ్బుని చంద్రం పిన్ని చేతికిచ్చాడు.

ఆమెనా డబ్బు లెక్కెట్టుకోనిచ్చాడు.
“ఏమైనా, నీ మేలుకి రుణపడి ఉంటానే చంద్రమ్మా. ఇంటి లెక్క, వంట, మా బాగోగులు అన్నీ నీవు చూడకపోతే, మేమెట్టా బతుకుతామో కదా!,” అన్నాడు తాత.
లెక్కెట్టిన డబ్బుని చెంగున ముడేసుకొంది చంద్రమ్మ.
“ఊర్కో అన్నా. ప్రతిసారి నువ్వీ మాటనాలా? తల్లొగ్గేసిన నన్ను ఆగమైపోకుండా కాపాడావన్న విశ్వాసమే అనుకో నాకు,” అంటూ లేచి, వెంట తెచ్చిన వెచ్చాలు పొయ్యికాడ ఉంచొచ్చింది పిన్ని.
రాంబాబాయి కూడా లేచెళ్ళి, పొయ్యి ఎనకాతల కిటికీలో మేకులు కొట్టి, ఏదో చెక్కపని చేడం మొదలెట్టాడు.

“సరేలే గాని, ఇక నుంచి గాయత్రిని రిక్షాలో గుడికి చేర్చన్నా. మా ఆయన కూడా అదే అంటున్నాడు.
నీ వయస్సుకి, ఇంత పిల్లని రెండు ఆమడల దూరం బండి మీద లాగడం మామూలు విషయం కాదు. చిన్న చక్రాలతో తేలిగ్గా ఉండేట్టు నువ్వు గూడురిక్షా చేయించినా, లాగాలిగా! నీ ఆరోగ్యం చూసుకో మరి. లేదంటే, గాయత్రికే కష్టమవుతది.
ఎల్లుండి నుంచి నేను మాట్లాడి పెట్టిన రిక్షాబ్బాయి వస్తాడు,” అని నా స్నానానికి బట్టలు, తుండు అందుకొంది పిన్ని.

“నీకు తెలిసిన రిక్షానా?” అడిగాడు తాత.
“అవును, మా ఆయన పని చేసే రవాణా ఆఫీసులో ఆటోరిక్షా ఇప్పించమని అర్జీ పెట్టాడంట ఒక తెలిసినబ్బాయి. ప్రస్తుతం పాలెంలోనే రిక్షా నడుపుతున్నాడులే అన్నా. మా ఆయన ఈ విషయం నాకు చెబితేనే ఇలా ఏర్పాటు చేసాను,” అంటూ భరోస ఇచ్చింది పిన్ని.

ఈ లోగా మా పొయ్యి ఎనకాతల కిటికీలో, వాళ్ళ కొట్టాం వైపుగా ఒక బడిగంట లాంటిది బిగించాడు రాంబాబాయి. నాకది చూపెట్టి, ‘గణగణా’ దాన్ని మోగించి ఇనిపించాడు కూడా. అత్యవసరంగా వాళ్ళని పిలవాలంటే “గంట మోగించడమే,” అంటూ చేతులు దులుపుకొని, పొలం సంగతి మాట్లాడాలని తాతని బయటికి తీసుకుపోయాడు.
“కాసేపు బాతాఖానికేమో, అట్టా బయటకెళ్ళారు. ఇద్దరికీ మంచి స్నేహితంలే. ఈలోగా నీ పని, నీ బట్టల పని కానిద్దాం పద ,” అంటూ కదిలింది పిన్ని.

**
శుక్రవారాలు అలవాటుగా అమ్మవారికి తులసి మాలలు కడుతుంది రాములు…
మాలలు అందించడానికి వెళ్ళినామె, చేతుల్లో రెండు గ్లాసులతో తిరిగొచ్చింది.
బెల్లం పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదం ఇచ్చాడంట పంతులుగారు. నా కిష్టమని తెచ్చానంటూ గ్లాసు చేతికిచ్చింది.
“తాతక్కూడా కాస్త తీసి అట్టే పెట్టాలే, నువ్వు కానిచ్చేయి,” అంది రాములు నా పక్కనే కూకుంటూ.
**

పాయసం తాగాక నా చేతి నుండి గ్లాసందుకుంది.
“నీకు రెండు జడలు ఎయ్యాలని ఉంది. అట్లతద్ది కదా! మధ్యాహ్నం వరకు గుడికి భక్తుల రద్దీ ఉండకపోవచ్చు. గుడిలోని పెద్దదీపాలు బయట పెట్టించారు పూజారయ్య. అవి శుభ్రం చేయడమే ఈ పూట పని. అంటే రద్దీ లేదు, పనీ లేదు, పొద్దూ పోదు,” నవ్వింది రాములు

“నీకు నా ‘అట్లతద్ది’ బహుమానంగా తలకి కొబ్బరి నూనె రాసి, తల దువ్వి ఈత జడెయ్యనా? లేదా రెండు జడలేసి యువరాణికి రిబ్బన్లు కట్టనా?” అని అడిగింది రాములు నా తలపైన మొట్టి.
రాములు తల దువ్వితే నాకిష్టమే. అందుకే రెండు జడలు కావాలని సైగ చేసాను.
నా భుజాల మీద చేతులేసి తలపైన ముద్దెట్టుకుంది రాములు.

”నీ జుట్టు ఇంత ఒత్తుగా, పొడుగ్గా అందంగా ఉంది. నీ బుగ్గన చొట్టలు, చారడేసి తేనెరంగు కళ్ళు, ముద్దొచ్చే నవ్వులు. యువరాణి అందమే. ఎవరి పోలికో గానీ,” అంటూ ఛటక్కున మాటలు ఆపేసింది రాములు.

వెనక్కి తిరిగి లోనికెళ్లి నూనె, రిబ్బన్ల పెట్టి తీసుకొనొచ్చింది. అరుగు మీద నన్ను ముందుకి జరిపి కూకోబెట్టి, జుట్టు చిక్కుదీడం మొదలెట్టింది.

“సరేలే, తిన్నగా కదలకుండా కూకోవాలి మరి. నీ జుట్టు బారెడు. పెద్ద పని కదా. గంట పడుతుందేమో!” అంది రాములు.

ఒకింత సేపటికి విసుగనిపించింది. కూనిరాగాలు తీస్తున్న రాముల్ని సైగలతో ఏదన్నా కథ చెప్పమన్నాను.

ఒక్క క్షణం ఆగి, “ఇయ్యాళ మీ తాత కథ నాకు తెలిసినంత మటుకు సెబుతాను,” అంది రాములు.
తాత గురించి నాకు తెలియని ఊసులు వినడం నాకెంతో ఇష్టం. అసలు, తాత కథ అంటూ రాములు మునుపెన్నడూ చెప్పనేలేదు. వినాలని సంతోషంగా ఉంది. (ఇంకా ఉంది)

**

వీలునామా-41

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మిసెస్ పెక్ ఆత్మకథ

 

ఆ మర్నాడు తన ఇంట్లోకి వస్తూన్న బ్రాండన్ ని చూసి మిసెస్ పెక్ కొంచెం ఆశ్చర్యం తో పాటు భయానికీ లోనయింది. అయితే బింకంగానే మాట్లాడింది.

“అబ్బో! ఎల్సీ ని మా ఇంటికి రమ్మంటే ఆమె రాదన్నావు. మరి నువ్వెందుకొచ్చినట్టో!” తనకలవాటైన వెటకారపు ధోరణిలో అన్నది.

“నిన్న మధ్యాహ్నం నీ బేరం పాడు చేసా కదా? దాని గురించి మాట్లాడదామనీ..” అంతే వెటకారంగా జవాబిచ్చాడు బ్రాండన్.

“మధ్య వర్తులతో నేను చస్తే మాట్లాడను. ఏదైనా వుంటే ఆ ఎల్సీతోనే మాట్లాడతా!”

“నీలాటి మనిషితో ఏ పరువైన ఆడపిల్లా మాట్లాడదని గుర్తుంచుకో! ఐనా ఇదిగో ఎల్సీ ఉత్తరం. తన తరఫున నాతో నువ్వు మాట్లాడొచ్చని రాసి ఇచ్చింది, ” ఆమె చేతిలో ఒక కాగితం పెడుతూ అన్నాడు బ్రాండన్.

అమాయకురాలితో బేరం ఆడడమంటే బానే వుంటుంది కానీ, ప్రపంచం చూసిన మొరటు మగవాడితో బేరం తెగదని తెలుసు ఆమెకి.అయినా విధిలేక అతనితోనే మాట్లాడింది.

“సరే అయితే చెప్పు, నా దగ్గరున్న రహస్యానికెంత ఇవ్వగలవు నువ్వు?”

“నువ్వు చెప్పే రహస్యం వల్ల ఎల్సీ, జేన్ క్రాస్ హాల్ ఎస్టేటు సొంత్ దార్లయేటట్టయితే వెయ్యి పౌండ్లు!”

“రెండు వేలకంటే ఒక్క చిల్లి కానీ తగ్గను. ఆ ఎస్టేటు ధర ఎంతుంటుందో నీకు తెలియదా?”

“నిజానికి నువ్వు చెప్పే ఏ రహస్యమూ రెండు వేల విలువ చేయదు. ఒక వేళ నీకూ పెద్దాయన హొగార్త్ కీ జరిగిన పెళ్ళి చెల్లదనుకుందాం. అది నిరూపించడం కష్టం. అసలు ఇన్నేళ్ళయింతర్వాత నువ్వెవరో, నీ మాటల్లో నిజమెంతో కూడా నిర్ధారించడం కష్టం. అందుకని నువ్వు నీ రహస్యం గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోకు.” నిర్మొహమాటంగా అన్నాడు బ్రాండన్.

veelunama11

“నేనెవరో నిరూపించడానికి నాదగ్గర హొగార్త్ రాసిన ఉత్తరాలూ, రాసిచ్చిన చెక్కుల కాపీలూ వున్నాయి,” సంచీలోంచి కాగితాలు కొన్ని తీసి చూపించింది మిసెస్ పెక్.

“మరి ఆయన ఇచ్చిన డబ్బంతా ఏమయిపోయింది?”ఆశ్చర్యంగా అడిగాడు బ్రాండన్.

“అంతా పెక్ మొదలు పెట్టిన వ్యాపారాల్లో కొట్టుకుపోయింది,” నిరాశగా అంది మిసెస్ పెక్.

“ఇంతకీ నువ్వీ పెక్ ని ఎప్పుడు పెళ్ళాడావు?”

“పెళ్ళా నా బొందా! హొగార్త్ తో విడిపోయినతరవాత నేను పెళ్ళి చేసుకోనేలేదు. వేరే పెళ్ళి చేసుకుంటే ఆయన డబ్బివ్వడేమోనని భయపడ్డాను. “ఆమె వంక చూసి నిట్టూర్చాడు బ్రాండన్.

“నువ్వు చెప్పేదాంట్లో ఏది నిజమో, ఏదబధ్ధమో నీకైనా తెలుసనుకోను. అయితే నువ్వు నిజంగానే హొగార్త్ పెళ్ళాడిన ఎలిజబెత్ ఆర్మిస్టవున్! అంత వరకూ నిజమే అనిపిస్తుంది! అయితే ఫ్రాన్సిస్ నీ కొడుకే అయినా హొగార్త్ కొడుకు అయి వుండడు. అయితే అదిప్పుడు నిరూపించడం కష్టం కాబట్టి ఆ రహస్యం వల్ల ఎవరికీ పెద్ద ప్రయోజనం వుండదు.”

“ఆ విషయాన్ని నేను నిరూపించగలిగితే? రెండు వేలిస్తావా?”

“నువ్వెంత అరిచి గీపెట్టినా అంతే. నీకు వెయ్యి పౌండ్లు వద్దనుకుంటే నేనిక బయల్దేరతాను,” బ్రాండన్ లేచి నిలబడ్డాడు.

“అయితే ఆ ఫ్రాన్సిస్ ని ఆస్తంతా అనుభవించమని వదిలెస్తావా? నన్ను గడ్డి పోచ కంటే హీనంగా తీసి అవతల పడేసాడు. ఏలాగైనా అతన్ని ఎస్టేటు నుంచి వెళ్ళగొట్టి తీరతాను. అతను ఆ ఆస్తంతా అనుభవించడానికి అనర్హుడు.”

నవ్వాడు బ్రాండన్.

“అయితే నీదంతా ఫ్రాన్సిస్ మీద అక్కసే నన్నమాట! చెప్పు మరీ, వెయ్యి పౌండ్లకి నీకు తెలిసిందంతా చెప్తావా?”

“ముసలి దానితో ఇంత సేపు బేరాలు సాగిస్తావేమిటయ్యా నువ్వూ! సరే,అలాగే కానీ.”

తనతో తెచ్చిన అగ్రిమెంటు మీద తాను సంతకం చేసి, తరవాత మిసెస్ పెక్ తో సంతకం చేయించాడు బ్రాండన్.

“ఇప్పుడు చెప్పు నీకంతగా తెలిసిన ఆ రహస్యమేమిటో! ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. నిజమే చెప్పాలి. ఎక్కడ అబధ్ధాలాడినా నేను కనుక్కోగలను. ఆ తరవాత మళ్ళీ నీకు దిక్కుండదు!” బెదిరించాడామెను.

మిసెస్ పెక్ ఉత్సాహంగా చెప్పడానికి సిధ్ధపడింది. ఈ దెబ్బతో ఫ్రాన్సిస్ వీధిన పడతాడు. ఇప్పుడేదో వెయ్యి పౌండ్లంటున్నారు కానీ, ఎస్టేటంతా చేతిలో పడితే అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంకొంచెం చేయి విదిలించకుండా వుంటారా? ఆ ఆశతోఆమె మొదలు పెట్టింది.

*******************

“నువ్వడిగినట్టు నిజమె చెప్తానబ్బాయి. అబధ్ధాలతో ఒరిగేది మాత్రం ఏముందిలే? నిజంగానే నా పేరు ఎలిజబెత్ ఆర్మిస్టవున్. క్రాస్ హాల్ ఎస్టేటు దగ్గర్లో వుండే పల్లెటూళ్ళో వుండేవాళ్ళం మేము. మా నాన్న ఒక దుకాణం నడిపే వాడు, అమ్మ బళ్ళొ పాఠాలు చెప్పేది. అయితే నాన్న తెలివి తక్కువతనంతో డబ్బంతా పోగొట్టుకొని వీధిన పడాల్సి వచ్చింది. ఆ విషయానికి అమ్మ మా నాన్నని చచ్చేదాకా సాధించింది పాపం! అక్కడ నన్ను జేమీ స్టీవెన్ సన్ పెళ్ళాడతానన్నాడు. పెద్ద చదువూ సంధ్యా డబ్బూ ఏమీ లేని వాడు. అయితే నాకంతకంటే మంచి మగవాడు దొరుకుతాడన్న నమ్మకం మాత్రం ఏముంది? అందుకే సరేనన్నాను. అమ్మ మాత్రం మండి పడింది. అప్పట్లో నేను చాలా అందంగా వుండేదాన్నిలే. లిల్లీని చూడలే? అదంతా నా పోలికే మరి!

నా అందచందాలకి ఇంకొంచెం డబ్బున్న మగవాడు దొరకచ్చని ఆశపడింది అమ్మ. వెంటనే నన్ను ఆ పల్లెటూరి నించి పట్నం తన స్నేహితురాలిదగ్గరికి పంపించేసింది. ఆ స్నేహితురాలు చదువుకుంటున్న విదార్థులకోసం ఒక సత్రం నడిపేది. ఆవిడ దగ్గర వుంటూ పని చేసుకుని నాలుగు రాళ్ళు సంపాదించుకోమని అమ్మ సలహా. సరే నని అక్కడికెళ్ళాను.

అక్కడికొచ్చే విద్యార్థులంతా బాగా డబ్బున్నవాళ్ళూ, సరదా మనుషులూను. వాళ్ళతో బాగా పొద్దుపోయేది. అయితే ఎవరూ ప్రమాదకరమైన వాళ్ళు కారు. చిన్న పిల్లల తరహా, అంతే. అక్కడికి రెండో సంవత్సరంలో వచ్చాడు హేరీ హొగార్త్.

అప్పట్లో చాలా తెలివైన వాడని చెప్పుకునేవారందరూ. అయితే కొంచెం సౌమ్యుడు. అంత పెద్ద ఎస్టేటుకి యజమాని నౌతానని తెలిసి వుండదు కాబట్టి పెద్ద గర్వంగా కూడా వుండేవాడు కాదు. పారిస్ లో చదువుకుంటానంటే వాళ్ళ నాయన కోప్పడి స్కాట్ లాండులోనే వుంచేసాడు.అయితే వున్నట్టుండి ఒకరోజు పెద్దాయన ఊడిపడ్డాడు కొడుకుని చూడటానికని. తలుపు తెరిచిన నన్ను చూసి మొహం చిట్లించాడు.

ఏమనుకున్నాడో ఏమో కానీ, వెంటనే హేరీని తన ఇష్ట ప్రకారమే పారిస్ వెళ్ళి చదువుకోమన్నాడు. హేరీ ఎగిరి గంతేసాడు. ఆ రాత్రి సత్రం లో పిల్లలందరూ పెద్ద పార్టీ చేసుకున్నారు.

 

పార్టీనించి హేరీ తిరిగొచ్చేసరికి నేనొక్కదాన్నీ హాల్లో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఎందుకో ఆ రోజు నాకు చాలా దిగులుగా ఒంటరిగా అనిపించింది. నన్నలా చూసి హేరీ ఆశ్చర్యపోయాడు. అయితే ఆ అమాయకుడు నేనేదో తనని ప్రేమించి తననొదిలి ఉండలేక ఏడుస్తున్నాననుకున్నాడు.

ఆ తర్వాత హేరీ తన ప్రయాణాన్ని వారం రోజులు వాయిదా వేసుకున్నాడు. ఆఖరికి అనుకున్నట్టే పారిస్ వెళుతూ నన్నూ తనతో తీసికెళ్తానన్నాడు. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఇద్దరమూ పారిస్ వెళ్ళిపోయాము.

***

-అనువాదం: శారద

శారద

శారద

” ఫ్రిజ్ లో ప్రేమ ” అనువాద నాటకం – 5 వ భాగం

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

 

దృశ్యం-2

వర్షాకాలం

(స్టేజ్ మీద వెలుగు వచ్చే వరకు ప్రసన్న మున్షీ డెస్క్ దగ్గర కూర్చుని రాసుకుంటూ కనపడతాడు. ఫ్రెష్ గా)

ప్రసన్న: నేనీ మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు వారివారి జీవితాలతో, వాళ్ళతో నాకు సంబంధించినంతవరకు లాజిక్ కుదురుస్తుంటారు. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమయింది. నాకింకొకటి కూడా అర్థమయ్యింది. ఏంటంటే….

మిత్రుడు: …. నేనొక…. అర్థంకాని వాణ్ణి. అర్థం చేసుకోవడం కష్టమయిన మనిషిని అయుండాలి. నాలాంటి ఓ మనిషిని అర్థం చేసుకోవడానికి ఎంతయితే సమయం పడుతుందో అంత సమయం ఈ జగంలో ఎవరి దగ్గరా లేదు. ఇందులో వాళ్ళ తప్పు లేదు.

ప్రసన్న: (రాస్తూ) వాళ్ళ తప్పు లేదు. చేతిలోకొచ్చిన తాజా పుస్తకం లాంటి వాళ్ళు ఎదురొచ్చిన ప్రతి మనిషీనూ! వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి. పుస్తకమయినా, మనిషయినా!

మిత్రుడు: నాకా సమయం ఇచ్చేవారే ఎవరూ లేరు.

ప్రసన్న: అందుకే నాకీ మధ్య నేనంటేనే భయం పట్టుకుంది. చుట్టుప్రక్కల వాళ్ళ గురించి ఏమీ అన్పించదు.

మిత్రుడు: ఇక్కడి వరకు బాగానే ఉంది; కానీ ముందు ముందు తెలుగులో రాయడం కష్టం. ఇంత భావాత్మకంగా, ఉత్కృష్టంగా వీటిని మించి శారీరక సుందరత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు…. తెలుగులో కష్టం అవుతుంది.

ప్రసన్న: కానీ, ఎందుకు?

ఇద్దరూ: కాస్త ఆగుదాం.

(ప్రసన్న ఓ రెండు క్షణాలు అస్వస్థతగా కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత చేతిలోని కాగితాలని చింపి పడేస్తాడు. ఏడవడం మొదలెడతాడు. మిత్రుడు పరుగున వెళ్లి అతన్ని దగ్గరికి తీసుకుంటాడు.)

మిత్రుడు: ఏమయింది?

(ప్రసన్న ఏడుస్తూనే ఉంటాడు.)

మిత్రుడు: అన్నీ సర్దేసుకొని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చును. ఏదీ బలవంతంగా చేయాల్సిన పని లేదు ఎవరూ. మనం రాగానే మన వెనక తలుపులు మూసుకోలేదు.

(ప్రసన్న ఏడుస్తూనే లేదు లేదంటాడు.)

(కాసేపయిన తర్వాత కళ్ళు తుడుచుకొని ఏడవడం ఆపుతాడు; కానీ వెక్కిళ్ళు వస్తుంటాయి.)

మిత్రుడు: ఏ విధమైన బలవంతం లేదు. రాయాలన్న నిబంధన లేదు. సమయం నిర్దేశమూ లేదు. మనసుకెలా తోస్తే అలా…. కాబట్టి ప్రశాంతంగా రాయి.

ప్రసన్న: మంచినీళ్ళు.

(మిత్రుడు నీళ్ళు తేవడానికి లోపలి వంటగదిలో కెళతాడు. ఇంతలో ఫోన్ మ్రోగుతుంది. మిత్రుడు ఫోన్ వైపుకెళ్తుంటాడు. ప్రసన్న అతడికి వద్దు వద్దని చెప్పే అంతలో అతడు ఫోన్ ఎత్తుతాడు.)

మిత్రుడు: ఎవరూ మాట్లాడేది? శ్రేయ….

(ప్రసన్న పరుగున వెళ్ళి రిసీవర్ తీసికొని చిన్న పిల్లాడి గొంతులో మాట్లాడడం మొదలుపెడతాడు.)

ప్రసన్న: హలో…. హలో…. ఎవలూ…. ఎవరు మాటాడేదీ? నేనా…. నేను నీళ్ళు తాగుతున్నాను ఎవలూ? శ్లేయా…. శ్లేయక్క బజారు నుండి సీట్లు తేవడానికెల్లింది చాలా శ్లేయక్క ఆచ్చిపోయింది…. మీరూ పోండి.

(ఫోన్ పెట్టేస్తాడు.) (మళ్ళీ ఫోన్ మ్రోగుతుంది.)

హలో…. ఎవలూ మాటాడేది?

(ఫోన్ కట్ అవుతుంది. ప్రసన్న గట్టిగా నవ్వుతాడు. మిత్రుడు కూడా నవ్వుతాడు.)

మిత్రుడు: ఏంట్రా ఇదంతా?

ప్రసన్న: శ్రేయ వాళ్ళమ్మ ఫోన్ చేస్తారు. General …. watch ఉంచడానికి, నేనొచ్చిన రోజే శ్రేయ చెప్పింది ఫోన్ ఎత్తవద్దని. నేన్నీకు చెప్తూనే ఉన్నంతలో నువ్వు ఫోన్ ఎత్తేసావు.

మిత్రుడు: మరిప్పుడు?

ప్రసన్న: శ్రేయ చెప్పుకుంటుందిలే, ఏమైనా…. చూద్దాం!

(ఒక్కసారిగా ఇద్దరూ కాసేపటి వరకు Block అయిపోతారు.)

ప్రసన్న: మా అమ్మ ఫోన్ వచ్చింది ప్రొద్దున్న. నాన్నా కూడా మాట్లాడారు.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నా గురించి పడే బెంగ బయట పడనివ్వకుండా మాట్లాడారు. పోయినసారి మూటాముల్లె సర్దుకొని ముంబాయి నుండి తిరిగి వెళ్ళిన వాణ్ణి కదా! బెంగ పడడం సహజమే కదా? కానీ వాళ్ళకూ ఎక్కడో తెల్సిపోయింది నేనా ఇంట్లో ఉండలేనని…. వాళ్ళతో నాకేం గొడవ లేదు; పైగా నాతో నాకే గొడవ. ఈ మధ్య నేనిలా అసంబద్ధంగా మాట్లాడుతున్నానా ?

మిత్రుడు: నాకెందుకు కన్పిస్తుందలా?

ప్రసన్న: ఒక్క నాన్నకి మాత్రం నాకిక్కడేం ప్రాబ్లం లేదని అర్థమయిందనుకుంటాను.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నాన్నన్నారు, ‘వెళ్ళు! నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఏదో మంథనం జరుగుతుందని మాత్రం అన్పిస్తుంది. వేరే ఇంట్లో ఉంటే నువ్వు ముందుకెళ్తావ్ అనుకుంటే, అలాగే వెళ్ళు!’ కాకపోతే రాసుకునేందుకు అనువుగా నాకు వీలయిన వాతావరణం తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

మిత్రుడు: ఇక్కడనుండి సూర్యాస్తమయం కన్పిస్తుందా?

ప్రసన్న: శ్రేయ నడిగాను నేను. తన గదిలోని కిటికీ నుండి కన్పిస్తుంది. పద….

(ప్రసన్న, మిత్రుడు లోపలికెళ్తారు. స్టేజ్ కొన్ని క్షణాల వరకు ఖాళీగా ఉంటుంది. మిత్రుడు లోపట్నుండి బయటకొస్తాడు. హాల్లోని lamp shades ల్లోని bulb on చేస్తాడు. నీలం రంగు చిత్రం మీద వెలుగు. అతడు రాసిన కాగితాలన్నీ సరిగ్గా అమర్చి బొత్తుగా పెడుతుండగా ఒక కాగితం పెడుతు పెడుతూ ఆగుతాడు. ఆ కాగితం పట్టుకొని ధ్యాసగా చదువుతుంటుంటే అతడి మొహంలో ప్రసన్నని గురించిన ఆదుర్దా.)

మిత్రుడు: గబ్బిలం….

సరిగ్గా నా కిటికీ ఎదురుగా రెండు విద్యుత్ తీగెల మధ్య చిక్కుకుని ఓ గబ్బిలం చచ్చిపోయింది. రాత్రిపూట ఆ తీగెలకానుకొని విద్యుత్ ఘాతంలో పోయింటుంది. అప్పట్నుండి నాకు తెలీకుండానే అంతా తలక్రిందులుగా జరుగుతూపోయింది. ఆ తీగల మీది గబ్బిలం చాలా బాగుండేది. అందుకనే దాని ఫోటోలూ తీయబడ్డాయి. దాని శరీరం నుండి అతివేగవంతమైన విద్యుత్ ప్రవాహం జరుగుతుండడం మూలాన అది అతి మెల్ల మెల్లగా పాడవుతూ వచ్చింది. ఓ ఆర్నెల్ల పాటు నేను దాన్ని చూస్తున్నప్పుడల్లా అయోమయంలో రకరకాల భావాలకు గురయ్యేవాడిని. మూడు నాలుగు నెలల్లో మధ్యలో ఆకారం అంతా ఎండిపోయింది. బక్కచిక్కిపోయింది. కానీ ఆ తీగల మధ్య చిక్కిన నల్లటి రెక్కలు అలానే ఉండిపోయాయి. అంతా అయిపోవచ్చాక వర్షాకాలం దాన్లోని ఒక్క రెక్క మాత్రం రాలి పడింది. ఇంకో రెక్క మాత్రం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ అలాగే ఆ తీగలకి అతుక్కుని ఉంది. అది రాలడానికి ఇంకా సమయం పడ్తుందని నాకన్పిస్తుంది.

(మిత్రుడు చీకట్లో కనీకన్పడకుండా ఉండిపోతాడు. ఫోన్ మ్రోగుతుంటుంది. ప్రసన్న లోపలనుండి మెల్లిగా వచ్చి ఫోన్ ప్రక్కన శాంతంగా కూర్చుంటాడు. అతడి మొహం మీద అప్పుడే సూర్యాస్తమయం చుసిన ప్రశాంతత. ఫోన్ మ్రోగి మ్రోగి ఆగిపోతుంది. శ్రేయ ఇంట్లోకి వస్తుంది మెల్లగా.)

(అలసిపోయింటుంది.)

(ఒంటి మీద పూలపూల కాటన్ చీర. బొమ్మలా ఉంటుంది.)

శ్రేయ: ఎలా ఉన్నావ్? ఇంట్లోనే ఉన్నావా?

ప్రసన్న: నేనెక్కడికెళ్తాను?

శ్రేయ: సారీ, ఇలా లంచ్ ముగించుకొని వచ్చే నా అలవాటు మారదు.

ప్రసన్న: It doesn’t matter . అలసిపోయినట్టున్నావ్, చాయ్ పెడతాను.

శ్రేయ: పనెలా జరుగుతుంది? రోజంతా రాసుకున్నావా?

ప్రసన్న: ఆ….

శ్రేయ: అమ్మ ఫోన్…. నాకివాళ కాస్త ఆలస్యం అయింది.

ప్రసన్న: మీ ఇంటికి పక్కింటి చిన్న పిల్లాడు వస్తుంటాడు. మధ్యమధ్యలో ప్రక్కింటి వాళ్ళు అప్పుడప్పుడూ వాణ్ణి నీ దగ్గరుంచి వెళ్తుంటారు. నీకు పిల్లలంటే ఇష్టమని.

(శ్రేయ చురుక్కున చూస్తుంది.)

…. ఇవాళ ఆ పిల్లవాడు ఫోన్ ఎత్తాడు.

శ్రేయ: No …. ఏమంటున్నావు నువ్వు?

ప్రసన్న: పొరపాటున ఇవాళ నేను ఫోన్ ఎత్తాను.

(ఇద్దరూ గలగలా నవ్వుకుంటారు.)

శ్రేయ: ప్రసన్నా, ఒక గుడ్ న్యూస్.

ప్రసన్న: ఏంటి?

శ్రేయ: నాకివాళ ఒక ad assignment దొరికింది.

ప్రసన్న: Oh wow ! Great ! నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వివాళ ఈ చీరెందుకు కట్టుకున్నావా అని!

శ్రేయ: నాలుగు ఆడిషన్స్ తీసుకున్నారివాళ. మధ్యాహ్నం మూడున్నర వరకు నా షూటింగ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఉండమన్నారు. మళ్ళీ రెండు టెస్ట్ షూట్స్ తీసికొని మరీ ఈ న్యూస్ చెప్పారు.

రెండు నెలల కాంట్రాక్ట్. నా కన్నిటికన్నా ఇందులో నచ్చినదిదే. నేను చాలాకాలం వీటిల్లో ఇరుక్కుని ఉండలేననిపిస్తుంది.

ప్రసన్న: ఎందుకు?

శ్రేయ: ఏం లేదు.

(ప్రసన్న చాయ్ ఇస్తాడు.)

ప్రసన్న: ఇదేమన్నా బాగుందా? నీకింత మంచి assignment దొరికిన రోజు మన మిలా కూర్చుని చాయ్ తాగడం, ఏం బాలేదు.

శ్రేయ: పార్టీ కావాలా ? పోదాం పద బయటికి.

ప్రసన్న: బయటికా? బయటికెందుకు? కాస్తాగు.

(ప్రసన్న లేస్తాడు. సామాన్లనుండి ఒక CD వెదికి తీసి Player లో వేస్తాడు. Wild music వస్తూంటుంది. అతడు ఆమె ముందుకెళ్ళి తనని లేవమన్నట్టుగా సైగ చేస్తాడు. ఆ ఇద్దరూ ఒళ్ళు మరిచి నృత్యం చేస్తారు. ఇద్దరూ very graceful dancers . శ్రేయ ఒక్క క్షణం అలసిపోయి కూర్చుంటుంది. ప్రసన్న తన ముందు కూర్చుంటాడు. ఇద్దరూ నవ్వుతారు.)

శ్రేయ: పిచ్చా…. ఎంత మంచి music పెట్టావ్! నా అంత నేను….

(తనకు మాట్లాడడం రాదు.)

ప్రసన్న: కాసేపయాక మళ్ళీ చేద్దామా?

శ్రేయ: పిచ్చి పట్టిందా ఏమిటి? ఎంత బాగా డాన్స్ చేస్తావ్!

ప్రసన్న: నేను రాక పూర్వం, సాయంత్రం ఇంటికొచ్చాక ఏం చేసే దానివి?

శ్రేయ: అంటే….ఆ…. చెప్తా నుండు. నేను…. ఇలా వచ్చేదాన్ని.

(ఆమె లేచి గుమ్మం దగ్గరికి వెళ్తుంది. ఏం చెప్తూ ఉంటుందో అది చేసి చూపిస్తూ ఉంటుంది.)

నేనిలా వచ్చేదాన్ని సీదా లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఈ గదిలో ఆగేదాన్ని కాదు. అమ్మతో ఫోన్లో మాట్లాడేదాన్ని. తినాలనిపిస్తే తినే దాన్ని…. ఏదో ఒకటి తినేదాన్ని…. అటుకులు, మురమురాలు, పేలాలు ఈ గదిలో లైట్ కూడా వేసేదాన్ని కాదు. ఒక్కళ్ళం ఉన్నప్పుడు చిన్న గదుల్లోనే సురక్షంగా అన్పిస్తుంటుంది కదూ! చుట్టుప్రక్కల గదులన్నీ చీకటిగానే ఉంచేదాన్ని. ఈ గదులన్నీ లేవనుకొని లోపలి గదిలో మాత్రం దీపం ఉంచుకొనేదాన్ని…. ఒక్కటే…. ఏడ్చేదాన్ని.

ప్రసన్న: ఏడవడం దేనికి?

శ్రేయ: ఏడ్చేదాన్ని. ఒంటరి మనిషి. మాట్లాడతాడా, నవ్వుతాడా? కేవలం ఏడవడమే చేయగలదు. నువ్వెప్పుడన్నా ఒక్కడివి ఉన్నావా ?

ప్రసన్న: చాలాసార్లు.

శ్రేయ: చాలాసార్లు?

ప్రసన్న: ఆ…. ఆ తర్వాతేం చేసేదావి ?

శ్రేయ: రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దీపం ఉంచుకునేదాన్ని. లోపలనుండి తలుపు మూడు గడియలు పెట్టేసుకునేదాన్ని. నల్లాలన్నీ గట్టిగా కట్టేసేదాన్ని.

ప్రసన్న: చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా ఇంటి కందరూ వచ్చేవాళ్ళురా, బాబాయి పిల్లలు, మేనత్త పిల్లలు, మామయ్యగారి అబ్బాయి, అమ్మాయిలు అందరూ. రోజంతా ఎంత కొట్టుకొని తిట్టుకున్నా రాత్రయేసరికి అందరూ కల్సి ఒక్క గదిలో పడుకోవాలని ఆరాటపడేవాళ్ళం. ఎలాగోలా. ఎలా పడితే అలా పడుకునేవాళ్ళం మేం. ఒకరు తలుపు దగ్గరయితే, ఒకరు కిటికీ అరుగు మీద పడి నిద్రపోయేవాళ్ళం. నేనేమో ఇంతుండే వాణ్ణి. బక్క పలచగా. ఓ మూలకొదిగి పడుకునే వాణ్ని. కానీ అలా అందరం కల్సుండడం ఎంత బాగనిపించేదో, అలా గది నిండా మన వాళ్ళ మధ్య ఎప్పటికీ ఉండిపోవాలన్పించేది.

శ్రేయ: ఏమయింది మరి?

ప్రసన్న: ఏముంది, అందరం పెరిగిపెద్దవాళ్ళమయాం.

శ్రేయ: ఊ…

(కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉంటారు.)

శ్రేయ: (ఉన్నట్టుండి) ‘ఒక తప్పుడు సహవాసం కన్న ఒంటరితనం మేలు’ అనుకుంటూ అనుకుంటూ ఒంటరితనం అనుభూతిలోకి రావడం మొదలుపెడుతుంది.

(శ్రేయ అలసటగా తన మొహం మీద, జుట్టులో చేతులు కప్పుకొంటుంది.)

ప్రసన్న: మధ్యాహ్నం వంట ఎక్కువ చేసిపెట్టాను. పద, భోంచేద్దాం.

(ప్రసన్న kitchenett వైపుకి వెళ్తాడు. శ్రేయ అతడు రాసిన కాగితాలు పరిశీలిస్తుంటుంది.)

శ్రేయ: ఏంటీ వాక్యం…. ఇంత పొడుగ్గా.

ప్రసన్న: చాలాసార్లు నేను పూర్ణవిరామం మర్చిపోతాను వాక్యం చివరలో. శ్రద్ధగా చదువు. నిజం చెప్పాలంటే, ప్లీస్…… ఉండనీయ్ ఇప్పుడు చదవడం. దానిమీద ఇంకా పని కావాల్సి ఉంది. ఇంకా మార్పులూ, చేర్పులూ ఉన్నాయి.

శ్రేయ: ఈ పరిమళ్ పశ్చిమానికి వెళ్ళాడూ అంటే విదేశాలకు వెళ్ళాడనా ?

ప్రసన్న: పెట్టెయ్ శ్రేయా, Please .

శ్రేయ: సర్లే, పెట్టేస్తాను. ఇంతకీ నీ నవలలో ఏం రాస్తున్నావ్ ?

ప్రసన్న: నా వల్ల కావట్లేదు. ఇవాళ చెప్పుకోదగ్గ పని జరగనే లేదు. రాయలేకపోయాను అనుకున్నట్టుగా!

(అతడు భోజనం పళ్ళాలు తెస్తాడు. ఇద్దరూ మౌనంగా తలలు వంచుకొని తింటూ ఉంటారు.)

శ్రేయ: నువ్వు రాసేదంతా ఎక్కడయినా ఎప్పుడయినా చెప్పగలగాలి. నేను.

ప్రసన్న: నువ్వు నటివి, నేను రాస్తుంటాననా! కానీ నేను నాటకాలు, సినిమా రాయను కదా! అప్పుడప్పుడు ads కోసం రాస్తాను. అది పెద్దగా రచనల క్రిందికి రాదు.

( ఫోన్ మ్రోగుతుంది.)

శ్రేయ: మ్రోగనీ…. రోజూ అదే అదే reporting ఏమనివ్వాలి తనకు.

(ప్రసన్న వెళ్ళి ఫోన్ ఎత్తి మళ్ళీ చిన్న పిల్లాడిలాగా మాట్లాడడం మొదలు పెడ్తాడు. మాట్లాడుతూనే ఉంటాడు.)

(శ్రేయ అతని చేతుల్లో నుండి రిసీవర్ లాక్కుంటుంది.)

శ్రేయ: చెప్పమ్మా…. అవును. పక్కింట్లోని కాళే వాళ్ళ అబ్బాయి. ఆడుకోవడాని కొస్తుంటాడు. అవునమ్మా…. రెండు…. రెండున్నరేళ్ళ పిల్లాడు. అవును…. ఈ మధ్యే వచ్చారు కొత్తగా. మంచివాళ్ళు. కాస్త మనిషి తోడుగా ఉంటారు. అమ్మా, నాకివాళ ఒక ad దొరికింది. నూనెది. నాన్నకి కుడా చెప్పు. Thank you . పదిహేను రోజుల్లో షూటింగ్ ఉంటుంది. అ…. ఆ సినిమా అయిపోయింది. నావి ఓ తొమ్మిది పది scenes ఉండొచ్చు. అంతే. కానీ హాయిగా జరిగిపోయింది షూటింగ్. రేపా…. రేపు ఎల్లుండి ఆడిషన్స్ ఉన్నాయి. అమ్మా, నేను భోంచేస్తున్నాను. రేపు మళ్ళీ మాట్లాడతాను. Okay మంచిది!

ప్రసన్న: అమ్మ తెలుగు సీరియల్స్ చూస్తుంటుంది, నాన్న…. నాన్నేమో ఆవరణలో పచార్లు చేస్తుండొచ్చు. గులామ్ ఆలీ గజల్స్ వింటారాయన రోజూ.

శ్రేయ: నువ్వొక్కడివేనా ?

ప్రసన్న: ఇప్పుడొక్కణ్ణే. అన్న పోయాడు. నిద్రమాత్రలు మింగేసాడు తను.

శ్రేయ: ఎప్పుడు ?

ప్రసన్న: నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. అన్నకి ఇరవై- ఇరవై ఒకటి ఉండొచ్చు. అసలు అమ్మ మంచి ధైర్యస్థురాలు. అప్పట్నుండి ఎలాగో అయిపోయింది. నాన్న ఏమీ పట్టనట్టుగా వట్టి కోపిష్టిగా ఉండేవారు, ఇప్పుడు శాంతంగా అయిపోయారు. అప్పుడప్పుడు నా వైపు అదో తరహాగా నేనేమయిపోతానో అన్నట్టు చూడడం అస్సలు చూడబుద్ధవదు.

అన్న నా హీరో. నాకు బైక్ నేర్పాడు. మొదటి బీర్ తనతోనే తాగాను. తన పాకెట్ మనీలో నుండి ప్రతి నెలా నాకు పది రూపాయిలిచ్చేవాడు. అన్న పోయినప్పుడు అమ్మానాన్నల ఆగని ఏడుపు చూసి నాకు కన్నీళ్ళే రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చుని అన్న గురించి అంతా రాసుకుని పెట్టుకున్నాను. అది శుభ్రంగా మరోసారి రాస్తున్నప్పుడు అర్థమయింది నాకు, అన్న పోవడమంటే ఏమిటో, ఆ పోవడం ఏమేం తీసుకెళ్ళిందో!

శ్రేయ: రాస్తే అర్థమవుతుందా ఏం కోల్పోయామో!

ప్రసన్న: నాకు.

శ్రేయ: ఎలా…. ఎలా రాస్తావ్ నువ్వు? అంటే ఏం అన్పిస్తుంది? రాసే ముందు ఏం చేస్తావ్?

ప్రసన్న: కొత్త స్టేషనరీ సామాను తెచ్చుకుంటాను. ఎప్పుడు రాసినా రాసే ఆరంభం నేను కొత్త స్టేషనరీ తోనే చేస్తాను. కొత్త కాగితపు ఫోల్డర్స్, నోట్స్ కి పెట్టే చిన్న చిన్న రంగురంగుల క్లిప్స్…. కొత్త కాగితాలు. ఇంతకు ముందు నేను దేని మీద పడితే దాని మీద రాసేవాడిని. ఫోన్ ప్రక్కనుండే రాయని పెన్నులని దులిపి దులిపి మరీ రాసేవాడిని.

ఓ చిత్రకారుడు నా మిత్రుడు. అతనీ ఫౌంటెన్ పెన్ నాకు తెచ్చిచ్చాడు. ఇక ఇప్పుడు నేనీ పెన్ను నిబ్ శుభ్రం చేస్తాను. పెన్నులో సిరా పోసుకుంటాను. ఆ తర్వాత అన్నీ ముందు పెట్టుకు కూర్చుంటాను. సత్యనారాయణ వ్రతం పూజా సామాగ్రి అమర్చుకొంటున్నట్టుగా!

శ్రేయ: ఆ తర్వాత కుదురు వస్తుందా?

ప్రసన్న: ఆ…. ఒక్కోసారి…. ఒక్కోసారి అస్సలు కుదరదు.

శ్రేయ: సినిమాకి ఆక్టర్స్ ని ఇలా స్వచ్ఛంగా తెచ్చి పని చేయించడం కుదరదు… అసలు చెప్పాలంటే సినిమా పనంతా ముక్కలు ముక్కల్లో అవుతుంది. అది కాక చుట్టుప్రక్కల అంతా జనం…. అస్తవ్యస్తంగా…. వస్తువులు….! వేలాడే వైర్లు, థర్మాకోల్స్…. ధగధగలాడే లైట్స్…. ఏ క్యారెక్టర్ తో పని చేయాలో చాలాసార్లు వాళ్ళని మనం కలుసుకోలేం.

నా మొదటి సినిమా అప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లిమెల్లగా నేర్చుకున్నాను. ఆ గందరగోళంలో మనమే మన స్పేస్ వెతుక్కోవాల్సి ఉంటుందని నా కర్థమయింది. నాకు నా వంతు స్థలం దొరికింది.

ప్రసన్న: మేకప్ రూమ్?

శ్రేయ: ఛ…. ఛ…. అస్సలు కాదు. షాట్ ప్రారంభించే ముందు కొన్ని క్షణాలు మన మొహం ముందు క్లాప్ తీస్తారు. మనకీ జనాలకీ మధ్య. అప్పుడు సెట్ మీద ఒక momentary silence ఉంటుంది. అప్పుడు నేనోక్షణం కళ్ళు మూసుకుంటాను. ఆ తర్వాత అన్నీ వదిలేస్తాను. నన్ను నేను కూడా.

(ఒక్కసారిగా వెళ్ళి కూలబడినట్టుగా కుర్చీలో కూర్చుంటాడు.)

ప్రసన్న: పని చేస్తూండడం ఎంత బాగుంటుంది కదా! అదీ ఇష్టమయిన పని. నాకో స్నేహితుడు ఉన్నాడు.

శ్రేయ: చిత్రకారుడు?

ప్రసన్న: అవును-చిత్రకార మిత్రుడు…. అతనంటుంటాడు. పనిలో మనసు లగ్నం చేసిన మనుషులు అందర్లోకి అందంగా కన్పిస్తారు. అతి అందమైన వాళ్ళ కన్నా అందంగా!

శ్రేయ: నీ స్నేహితుడి పేరేంటి?

ప్రసన్న: పేరొద్దు. వట్టి చిత్రకార మిత్రుడు.

శ్రేయ: ఎక్కడుంటాడు అతను?

ప్రసన్న: బయటికి వెళ్ళాడు, వస్తాడు.

శ్రేయ: అసలు నీతో పరిచయం అయినట్టుగానే అన్పించదు నాకు. అప్పుడప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తావ్.

ప్రసన్న: చాలా విషయాల్లో మనమిద్దరమూ ఒకేలాంటి వాళ్ళం శ్రేయా, మనలాంటి ఒకేతీరు వాళ్ళకి చాలాసార్లు ఒక్కళ్ళనొకళ్ళం ఎరగమేమోననే భావన కలుగుతుంటుంది ప్రతీసారి. ఎందుకంటే మన ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మనం బయటి ఊర్ల నుండి, ఇంచుమించు ఒకే లాంటి ఇంటి పద్ధతుల నుండి అంతా వెనకాల వదిలేసి వచ్చిన వాళ్ళం మనం. ఒంటరులం.అందుకే నిన్ను అర్థం చేసుకో గలుగుతాను నేను.

శ్రేయ: My God ! ఏం అర్థం చేసుకున్నావ్ నువ్వు నన్ను?

ప్రసన్న: ఏముందీ, నువ్వు మంచి అమ్మాయివి. కష్టజీవివి. ఇంటి నుండి బయటపడిం తర్వాత ఈ గజిబిజి నగరంలో కలిసిపోతావ్ అయినప్పటికీ నీ ఎనర్జీ ని అలాగే కాపాడుకుంటావ్. ప్రొద్దున్న ఇంటి నుండి బయల్దేరేప్పుడు ఏదయితే మంచితనం ఉందో దాన్ని నవ్వు మొహంతో తీసికెళ్ళి మళ్ళీ సాయంత్రం అలాగే కాపాడుకుని తిరిగి సాయంత్రం ఇంటికొస్తావ్. నీకేం కావాలో నీకు తప్పక దొరుకుతుంది శ్రేయా!

శ్రేయ: నిజంగా?

ప్రసన్న: నిజంగా!

శ్రేయ: నేనేం ఏదో పెద్ద దిగివచ్చానని కాదు; కానీ చాలా కష్టపడ్డాను నా కాళ్ళమీద నేను నిలద్రోక్కుకోవడానికి!

కేవలం acting మాత్రమే కాదు కదా. అన్నీ…. అన్ని విషయాల్లో. నా పద్ధతిలో నేను బ్రతుకుదాం అనుకున్నాను గనక! ఈ ముంబాయి, పుణే మహానగరాల సంగతే తెల్సు నీకు…. కానీ చిన్న పట్టణాల్లో, ఊళ్ళల్లో ఆడపిల్లల్ని సరిగ్గా చూడరు ప్రసన్నా…. ఏ నిర్ణయమూ ఆడపిల్ల తీసుకోలేదు. ఆమె తరపున నిర్ణయాలన్నీ ఆమె బంధుజనమే తీసుకుంటారు. నేను కాలేజ్ చదువుకోసం వచ్చిందాన్ని ఇక తిరిగి వెళ్ళలేదు నేను. నా గూడు నేను ఏర్పరచుకొందామని తాపత్రయం.

(కాసేపు ఒక్కసారిగా విచారంగా మారిన మొహంతో ప్రసన్న వైపు చూసి, నవ్వి మెల్లిగా లోపలికెళ్తుంది.)

(కొన్ని క్షణాలు అంధకారం)

(మళ్ళీ ప్రకాశం వచ్చేవరకు మధ్య రాత్రి.)

(శ్రేయ లోపలనుండి దిండూ దుప్పటి తీసికొని వస్తుంది. ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. అతని కేసి చూసి గదిలో ఓ వైపుకి పక్క వేసుకొని పడుకుంటుంది.)

(చీకటి)

 


తెలుగు అనువాదం:  గూడూరు మనోజ

గూడూరు మనోజ

అలసిన వేళల చూడాలీ…

drushya drushyam 40

నీడ గురించి మాట్లాడుకుంటాం ఫొటోగ్రఫీలో.
వెలుగుతో పాటు నీడ గురించి ఎంతైనా చర్చించుకుంటాం.
సరికొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నమూ చేస్తాం.

కానీ, మనల్ని వెంటాడేది నీడ మాత్రమేనా?
కాదు. విశ్రాంతి కూడా.

నిజం. జీవితాన శ్రమతో పాటు విశ్రాంతీ ఒక వెలుగు. అది నీడలా వెన్నాడుతూనే ఉంటుంది
లేదా సమ్మిళితమై జీవితం పొడవునా నిశ్శబ్ద రాగాలు ఒలుకుతూ ఉంటుంది.
వాటిని పట్టుకున్నఒకానొక బంగారు క్షణం ఈ చిత్రం.

ఒకపరి చూసి, మళ్లీ చదవరారండి,.

+++

మీకు తెలియంది కాదు. కానీ చెప్పడం. నిజానికి శ్రమైక సౌందర్యం అంటం. అది కూడా కేవలం శ్రమ గురించి మాత్రమే కాదు! అది విశ్రాంతిలో విరిసే ఇంధ్రధనుస్సే. విశ్రాంతి నీడన పెరిగే కానుగ చెట్టు నీడ కూడా.
ఈ తల్లి చిత్రం అదే.

ఇది ఒక మిట్ట మధ్నాహ్నపు జీవన చ్ఛాయ.
మనందరం కార్యాలయాల్లో ఉండగా, కార్యభారం నుంచి వైదొలిగిన ఒక చిన్నపాటి కునుకు.
నీడ. ఒక స్వప్నలిపి. అలౌకిక ధార.

ఇంకా చెబితే, ఒక తెలంగాణ తల్లి.
పనంతా అయినాక జారగిలబడి, నిమ్మలంగా సేదతీరిన ఒక ‘అమ్మ’ నవల.
ఒక అత్తమ్మ లీల. ఒక గృహిణి స్వతంత్రంగా ఊపిరి తీసుకునే జీవన లాలస.

+++

చిత్రం ఇంకా చాలా మాట్లాడుతుంది.
చూస్తూ వుంటే చదవనక్కరలేదు. చదివి చూస్తే కూడా కొత్త చిత్రమే.

స్థలం గురించి కూడా చూడాలి.
ఆమె అట్లా ఒరిగినప్పుడు ఆ ఇల్లు కాస్త ఎత్తుమీదన ఉన్నది.
నాలుగు గజాల దూరం నుంచి తీశాను. నా ఎత్తున ఉన్నది ఆమె తల.
దగ్గరకు వెళ్లితే కొంచెం వొంగిని తీయాలి. కానీ, ఉన్నచోటు నుంచే, చూసిన కాడనుంచే తీశాను.
తర్వాత మళ్లీ ఏమి తీసినా ఇంత విశ్రాంతి ఉండదు.
అందుకే వెనుదిరిగాను.

+++

అయితే, మళ్లీ చూశాను.
ఆమె ఒరిగిన గడప, కిందన ఉన్నది అరుగు. అవును. అది ఎత్తైనది. కిందుగా అటూ ఇటూ మెట్లు.
నడుమ మళ్లీ కాసింత జాగా. అక్కడ ముగ్గు. తర్వాత గడప. ద్వారం. దాటితే మల్లెసార. ఇంకా అన్నీ.

ఇల్లు అంటే అన్నీ.
స్త్రీ నిర్మాణ కౌశలం.

ఇక్కడ అన్నిటికీ అంతటా ఒక నిర్మాణం ఉన్నది.
ప్రతి దానికీ ఒక వాస్తు ఉన్నది. అన్నిటికన్నా మిన్నకళ ఉన్నది. ఆమే ఉన్నది. కళావతి.
బయట ఉన్నఇంట్లో లేకపోవచ్చు. కానీ, నా లెక్కన ఆమెనే వెలుతురు. వెలుగు…నీడా.
ఇక భయం లేదు.

ఆమె ఒక ఇల్లాలు.
బహశా కోడలు… కాదు కాదు… అత్తమ్మ లేదా తల్లి.
నిర్వాహకురాలు.

తనకు పిల్లల భారం తీరవచ్చు, తీరకనూ పోవచ్చు.
కోడలూ రావచ్చు రాకనూ పోవచ్చు. కానీ వయసు మీద పడ్డా పడకపోయినా ఆమె ఒక ఇల్లు.
తనంతట తాను ఒక సౌందర్యం. పోషణ. సాంస్కృతిక సౌజన్యం.

ఇవన్నీకానవస్తుండటం ఈ చిత్రం మహిమ.
ఈ చిత్రాన్ని బంధించినాక ఒక తృప్తి.

+++

నిజానికి ఆ తల్లి కాసేపు అలా ఒరిగింది గానీ, బహుశా ఆమెకు కన్నంటుకున్నదిగానీ, అదమరచి నిద్రపోలేదు. ఏమరుపాటుగానే ఉన్నది. అందుకే, ఆమె దర్వాజ దగ్గరే గడప మీదే తల వాలుస్తది.

ఒక చేయి ఇల్లు.
ఇంకొక చేయి వాకిలి.

ఆ చేతి గాజుల సవ్వడి…అది జీవన సంగీతం.
ఇలాంటి ఘడియలో ఆ గాజుల నిశ్శబ్దం…అదీ సంగీతమే.
కొమ్మమీది ఒక సీతాఫలం వంటి చేయి.
ఒక మధుర జీవన ఫలం తాలూకు గాంభీర్యం.

కష్టమూ సుఖమూ…
అక్కడే ఇంటిద్వారం మధ్యే నడుం వాల్చడంలో ఒక ధీమానూ…
ఇవన్నీకానవస్తుంటే ఇంటిముఖం పట్టాను.
ఇంట్లోకి వెళితే మళ్లీ ఆమె.
ఇంకో స్త్రీ.

అప్పుడర్థమైంది. అంతటా ఉన్నదే.
చూడగా తెలిసిందీ అని!

బహుశా ఒకసారి చూడాలి.
తర్వాత ఆ చూపు మనల్ని విస్తరింపజేస్తుందేమో!

ఇదలా వుంచితే, మళ్లీ ఆ చిత్రం.

+++

అలంకరించబడ్డ గడప. పసుపుతో వేసిన చిత్రలిపి. పక్కన ఏదో మొక్క. చేతులకు నిండైన గాజులు.
అవిశ్రాంతగా పనిచేసే మనిషని చెప్పకనే చెప్పే ఆ బంగారు తల్లి కన్నుల చుట్టూరా క్రీనీడలు. వలయాలు.
అయినా శాంతి. విశ్రాంతి.

నాకైతే ఎందుకో ఒక వేపచెట్టు రెల్లలులా ఆమె శాంతిని పంచుతున్నట్టనిపించింది.
బహుశా ఇది బోనాల సమయం కదా… అందుకే ప్రకృతే అలా సేద తీరిందా అన్నప్పటి చిత్రం లాగున్నది.
అంతకన్నా ముఖ్యం, ఆమె అమ్మవారిలా అలా ఒరిగి కనిపించింది.

ఈ రీతిలో తల్లి దర్శనభాగ్యం కలిగినందుకు ధన్యుణ్ని.

+++

నిజం. ఒక్కోసారి భగవంతుడిని దర్శించుకుంటాం.
కానీ, జీవితాన్ని కూడా దర్శించుకున్నప్పటి విశ్రాంతి ఇది.

 

– కందుకూరి రమేష్ బాబు

ramesh

మహాభారతంలో ఒక భౌగోళిక వివరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

తనకు క్షేత్రజులను ఇమ్మని కుంతిని కోరుతూ పాండురాజు ఇంకో సంగతి కూడా గుర్తుచేశాడు…

అది, కుంతి చెల్లెలు శ్రుతసేన కూడా క్షేత్రజులను కనడం! కేకయరాజు శారదండాయని భార్య శ్రుతసేన. తనవల్ల పుత్రసంతానం కలగకపోవడంతో నియోగపద్ధతిలో సంతానం కనమని కేకయరాజు భార్యకు చెప్పాడు. అప్పుడు శ్రుతసేన పుంసవన హోమం చేయించి ఋత్విజుల ద్వారా ముగ్గురు కొడుకులను కంది.

అయితే, పాండురాజు ప్రతిపాదనకు కుంతి వెంటనే ఒప్పుకోలేదు. ‘నువ్వు భరతకులశ్రేష్ఠుడివి. నీకు మేము ధర్మపత్నులం. పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటాం?’ అంది. ‘అదీగాక మా మీద నీ అనుగ్రహం ఉంటే సంతానం అదే కలుగుతుంది. అలాంటి ఒక పుణ్యకథను నేను పౌరాణికుల ద్వారా విన్నాను’ అంటూ ఆ కథ చెప్పింది.

“పూర్వం వ్యుషితాశ్వుడు అనే రాజు ఉండేవాడు. అతను పురువంశంవాడు. వంద అశ్వమేధయాగాలు చేశాడు. అతని భార్యపేరు భద్ర. వారికి సంతానం కలగలేదు. అతను భార్యతో విపరీతకామాసక్తితో నిరంతరం సంగమించేవాడు. దాంతో అతనికి రోగం వచ్చింది. ఆ రోగంతో కన్ను మూశాడు. భర్త వియోగాన్ని భార్య భరించలేకపోయింది. ‘నువ్వు లేకుండా నేను జీవించలేను. నేనూ నీతోనే వస్తాను. లేదా నీ లాంటి కొడుకులనైనా నాకు ఇవ్వు’ అంటూ భర్త శవాన్ని కౌగలించుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడా శవంలోంచి ఒక దివ్యవాణి వినిపించింది. ‘విచారించకు. నీకు కొడుకులు కలిగేలా వరమిస్తున్నాను. ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదో రోజున గానీ, పద్నాలుగో రోజున గానీ శుచిగా పాన్పు మీద పడుకుని నన్ను తలచుకో’ అని చెప్పింది. ఆమె అలాగే చేసింది. అప్పుడామెకు ముగ్గురు సాల్వులు, నలుగురు మద్రులు- మొత్తం ఏడుగురు కొడుకులు కలిగారు”.

ఈ కథ చెప్పిన కుంతి,‘ఆ రాజులానే నువ్వు మమ్మల్ని అనుగ్రహించి సంతానం పొందు’ అని పాండురాజుతో అంది. పాండురాజు దానికి సమాధానం చెప్పలేదు. ‘వెనకటి కాలంలో స్త్రీలు పురుషుల అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరించేవారనీ, అఖిలప్రాణి సాధారణమైనధర్మం పాటిస్తూ ఋతుకాలం తప్పకుండా తమ తమ వర్ణాలలో స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ కూడా సంబంధం పెట్టుకునేవా’రని అంటూ, ఉద్దాలకుని కథ చెప్పాడు. ఆ కథలో ఉద్దాలకుని భార్యను ఒక వృద్ధవిప్రుడు సంతానం కోసం కామించగా, ఆమె కొడుకు శ్వేతకేతుడు ఆగ్రహించాడు. ‘ఇకనుంచి స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, అందువల్ల సకల పాపాలూ చుట్టుకుంటాయనీ, ఈ మేరకు తను కట్టడి చేస్తున్నాననీ, దీనిని మనుషులందరూ పాటించా’లనీ శాసించాడు.

కుంతి, పాండురాజుల మధ్య సాగిన ఈ కాస్త సంభాషణా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఉదాహరణకు, నీ చెల్లెలు శ్రుతసేన భర్త నియోగంతో క్షేత్రజులను కందని కుంతితో పాండురాజు అన్న తీరు చూస్తే, తన చెల్లెలు ఎలా సంతానం కన్నదో అక్కకే తెలియదా అనిపించి, అసంబద్ధంగా కనిపిస్తుంది. లేదా, తన కోరికను సమర్ధించుకోవడం కోసం, తన చెల్లెలు సంగతిని కుంతికి పాండురాజు గుర్తుచేశాడనుకుంటే బహుశా అది రెండు సూచనలు చేస్తోంది: మొదటిది, క్షేత్రజులను కనడం అనే ఆనవాయితీ, అందులో తప్పు లేదన్న భావనా అప్పటికే పాతుకుని ఉండడం. రెండోది, కుంతి కన్యగా ఉన్నప్పుడు కర్ణుని కన్న ఉదంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆమె సామాజిక నేపథ్యంలో క్షేత్రజసంతానం ఏమంత ఆక్షేపణీయం కాకపోవడం. భైరప్ప తన ‘పర్వ’ నవలలో కూడా కుంతిది నిమ్నసామాజికవర్గంగా చిత్రిస్తారు. ఆమెకు ఒక తరం వెనకే, ఆమె కంటే ఉన్నత సామాజికవర్గంగా కనిపించే భరతకులానికి చెందిన క్షత్రియకుటుంబం నియోగ పద్ధతిని ఆశ్రయించి క్షేత్రజ సంతానాన్ని(వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్ర, పాండురాజులు జన్మించడం)పొందిన మాట నిజమే. కానీ అప్పటికే ఉన్నత సామాజిక వర్గాలలో అది ఆక్షేపణీయంగా మారుతూ ఉండవచ్చు.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

అదే సమయంలో ఇంకొకటి జరుగుతూ ఉండచ్చు. అది,నిమ్నసామాజికవర్గాల ఊర్ధ్వచలనం(upward mobility). పాండురాజుకు కుంతిని ఇవ్వడం ద్వారా భరతకుల క్షత్రియులతో వియ్యమందుతున్న భోజకులకు(కుంతి దత్తత తండ్రి కుంతిభోజుడు భోజక తెగకు చెందిన యాదవుడు) కుంతి పుట్టింట కన్యగా ఉండి కొడుకును కన్న సంగతిని రహస్యంగా ఉంచవలసిన అవసరం కనిపించి ఉండవచ్చు. భైరప్ప అన్వయం ఇంచుమించు ఇలాగే సాగుతుంది.

నా అభిప్రాయంలో దీనిని మరోలా చూడవచ్చు: క్షేత్రజ సంతానం పట్ల కానీ, కన్యాగర్భం పట్ల కానీ ఉన్నత, నిమ్న సామాజిక వర్గాలలో(అలాంటి స్పష్టమైన విభజన నిజంగా ఉందనుకుంటే) ఎటువంటి అభ్యంతరాలు, లేదా ఆమోదాలు ఉన్నాయో మనకు కచ్చితంగా తెలియదు. మనకూ, వారికీ మధ్య; భిన్న కాలాలకు, విలువలకు చెందిన కథకుడు ఉన్నాడు. మన ఎదురుగా ఉన్నది; అతని అభ్యంతరాలను, లేదా ఆమోదాలను కూడా సూచించే వ్యాఖ్యాన రూపంలోని కథ మాత్రమే. అతని గుప్పిటి సందులలోంచి జారిపడే వాస్తవాల తునకలే మనకు ఆధారం. ఆ తునకల ఆధారంగానే కథను మనం పునర్నిర్మించుకోవాలి. కుంతి-పాండురాజుల సంభాషణలో క్షేత్రజుల గురించి జరిగిన చర్చ అలాంటి తునకలలో ఒకటి.

క్షేత్రజ సంతానాన్ని ఆక్షేపణీయంగా భావించడం ప్రారంభించిన ఉన్నత సామాజిక వర్గానికి పాండురాజు ప్రతినిధి అనుకుందాం. క్షేత్రజ సంతానం అంత ఆక్షేపణీయం కాకపోయినా, ఊర్ధ్వచలనంలో భాగంగా ఆ ఆనవాయితీనుంచి బయటపడాలనుకునే నిమ్నసామాజికవర్గానికి కుంతి ప్రతినిధి అనుకుందాం. అప్పుడు వారిద్దరి సంభాషణా కొంత అర్ధవంతంగా కనిపిస్తుంది. తమ స్థాయిలో క్షేత్రజ సంతానం గౌరవప్రదం కాదని పాండురాజుకు తెలుసు. తన అన్న ధృతరాష్ట్రుడికి అలాంటి అవసరం లేదన్న సంగతి అతని దృష్టిలో సహజంగానే ఉంటుంది. తను క్షేత్రజ సంతానం పొందితే సాటివారిలో తలవంపుగానే ఉంటుంది. కానీ ఒక దశలో అంతకంటే గత్యంతరం లేదని అతనికి అనిపించింది. క్షేత్రజ సంతానానికి కుంతిని ఒప్పించడంతోపాటు, బహుశా అంతకంటే ఎక్కువగా తను సమాధానపడడానికి అతను ఎక్కువ సమయం తీసుకోవలసి వచ్చింది. ఎక్కువ ఆలోచనా, ధైర్యమూ చేయవలసి వచ్చింది. సమర్ధింపులనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఏకాంతంలో తన బాధను కుంతి దగ్గర వెళ్లబోసుకోవడం, పన్నెండురకాల కొడుకుల గురించి వివరించడం, క్షేత్రజులు ఔరసులకు ఏమాత్రం తక్కువ కారని అనడం, వెనకటి కాలంలో స్త్రీ-పురుష సంబంధాలు ఎలా ఉండేవో చెప్పడం, కుంతి చెల్లెలి ఉదాహరణను ప్రస్తావించడం -కుంతిని మానసికంగా సిద్ధం చేయడంగానూ, అంతకంటే ఎక్కువగా తను మానసికంగా సిద్ధపడే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.

కుంతి సమస్య వేరు. తన సామాజిక నేపథ్యం రీత్యా క్షేత్రజసంతానం ఆమెకు అంత ఆక్షేపణీయం కాదు. ఆ విషయంలో స్వయంగా తనకే అనుభవం ఉంది కూడా. కానీ ఇప్పుడు తను భరతకుల క్షత్రియుల కోడలు. తన స్థాయి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ క్షేత్రజ సంతానం వైపు మళ్లడం ఆమెకు స్థాయీ పతనంగా కనిపిస్తుంది. డానికి తోడు తోటికోడలు గాంధారి ఆమె కళ్ల ముందు ఉంటుంది. గాంధారికి క్షేత్రజ సంతానం కనవలసిన అవసరం లేదు. కనుక క్షేత్రజ సంతానం కనడం కుంతికీ సాటివారిలో తలవంపే. అయితే, పాండురాజుకులానే ఆమెకూ గత్యంతరం లేదని తెలుసు.

ఈ మొత్తం చర్చ అంతా ఎక్కడ ఎలా ప్రారంభమైందో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సంతానం లేని తనకు ఉత్తమగతులు ఉండవన్న పాండురాజు చింత నుంచి ఇదంతా ప్రారంభమైంది. అయితే, అంత స్పష్టంగా చెప్పకపోయినా ఇక్కడ ఆస్తిహక్కు, వారసత్వాల గురించిన చింత కూడా ఉంది. క్షేత్రజులు కూడా ఔరసుల లానే బంధువులు, దాయాదులు అవుతారని పాండురాజు అనడమే చూడండి. అలా అనడంలో ఆస్తిహక్కు గురించిన కోణమూ బయటపడుతూ ఉండచ్చు. ఈ కోణం నుంచి చూసినప్పుడు పాండురాజు-కుంతి సంభాషణ రూపంలో పైకి కనిపించే కథ వెనుక, కనిపించని కథ చాలా ఉందని అనిపిస్తుంది. కురు-పాండవుల మధ్య ఆస్తి పోరాటం తాలూకు మూలాలు అక్కడినుంచే ఉన్నాయని కూడా అనిపిస్తుంది. పాండురాజు-కుంతి సంభాషణలో కనిపించని టెన్షన్ చాలా ఉన్నట్టూ అనిపిస్తుంది.

వందల సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న పురాణ కథల విషయంలో ఒక సమస్య ఉంది. అవి కాలగతిలో ఒక విశ్వాసంగానూ; ప్రశ్నలకు, అనుమానాలకు, హేతుబద్ధతకు అతీతంగానూ ఘనీభవించిపోతాయి. వాటిని ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోడానికి అలవాటుపడిపోతాం. వాటిని తార్కికంగానూ, హేతుబద్ధంగానూ పరిశీలించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఘనీభవస్థితి నుంచి అవి కరగడం ప్రారంభించి కొత్త కోణాలను బయటపెడుతూ కొత్త రూపాలు తీసుకుంటాయి.

ఏదో విధంగా తను సంతానవతి కావడం మినహా గత్యంతరం లేదని తెలిసినా, కుంతి భర్త దగ్గర వెంటనే బయటపడలేదు. తన వెనకటి సామాజిక నేపథ్యమూ, క్షేత్రజుని కనడంలో తనకున్న పాత అనుభవమూ ఆ క్షణంలో ఆమెను కెలుకుతూ ఉండచ్చు. మారిన తన సామాజికస్థాయి కారణంగా ఆమెలో కొంత జంకు, భర్త దృష్టిలో పలచనవుతానన్న భయమూ ఉండడం సహజమే. అందుకే భరతకుల శ్రేష్ఠుడవైన నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటామంది. తనతోపాటు, సవతి అయిన మాద్రిని కూడా కలుపుకుంది. అంటే, ఈ విషయంలో మొత్తం బాధ్యతను తనొక్కతే తీసుకోడానికి కుంతి సిద్ధంగా లేదన్న మాట. మాద్రిని కూడా భాగస్వామిని చేస్తే తనపై ఉన్న చిన్నతనపు భారం కొంత ఆమెకు బదిలీ అవుతుంది. ఆ తర్వాత నియోగపద్ధతిలో నకుల, సహదేవులను కనడం ద్వారా మాద్రి ఇందులో పూర్తి భాగస్వామిని అయింది కూడా.

పాండురాజు వల్ల తమకు సంతానం కలిగే అవకాశం లేదని కుంతికి తెలుసు. అలాగే, తను పురుష సంపర్కంతోనే సంతానం కలుగుతుందని తెలియని అమాయకురాలేమీ కాదు. కనుక, నీ అనుగ్రహం ఉంటే మాకు సంతానం అదే కలుగుతుందని ఆమె అనడంలో అర్థంలేదు. భర్త కోరికను వెంటనే ఆమోదించి తను తేలికవకూడదనే ఉద్దేశంతో ఆమాట అన్నట్టు తెలుస్తూనే ఉంది. ఆపైన, ఆమె చెప్పిన కథ వల్ల ఆ ఉద్దేశం మరింత హాస్యాస్పదమైన మలుపు తిరిగింది. చనిపోయిన భర్తను కౌగలించుకుని భార్య ఏడుస్తూ సంతానం ఇమ్మని అడిగినట్టూ, అప్పుడు, నీకు సంతానం కలిగేలా వరమిస్తున్నానని భర్త కళేబరం నుంచి దివ్యవాణి పలికినట్టు, ఆమెకు ఏడుగురు కొడుకులు కలిగినట్టు ఆ కథ చెబుతోంది.

కాస్త లోతుగా పరిశీలిస్తే పైకి అమాయకంగా కనిపించే ఈ కథలో అతితెలివి దాగి ఉన్న సంగతీ అర్థమవుతుంది. చనిపోయిన భర్త కూడా భార్యకు సంతానం అనుగ్రహించగలడని కుంతి ముఖతా కథకుడు చెబుతున్నాడు. అంటే, భర్తకు దివ్యత్వం (దివ్యవాణి)ఆపాదిస్తున్నాడు. కానీ మరోవైపు, వ్యుషితాశ్వుని భార్యకు మనుష్య ప్రక్రియలోనే సంతానం కలిగిన విషయాన్నీ తనే బయటపెడుతున్నాడు. ఎలాగంటే, వ్యుషితాశ్వుడు పురువంశ రాజు. అతని భార్యకు కలిగిన ఏడుగురు కొడుకులలో నలుగురు సాల్వులు, ముగ్గురు మాద్రులు. అంటే వారు సాల్వ, మద్రతెగలకు చెందిన పురుషుల ద్వారా కలిగిన సంతానమన్న మాట. దీనినిబట్టి ఇందులో భర్త నియోగం కూడా లేదనీ, భర్త మరణించాక భార్య ఇతరుల వల్ల సంతానం కన్నదనీ తెలిసిపోతోంది. పైగా, ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదవరోజు, లేదా పద్నాలుగవరోజు సంతానం పొందడానికి యోగ్యమైన సమయమన్న వివరాన్ని కూడా ఈ కథ చెబుతోంది. ఈ విధంగా కథకుడు ఎన్నోచోట్ల చేసినట్టుగా మనుష్యధర్మం మీదే దేవధర్మం లేదా దివ్యత్వం అనే ముసుగు కప్పి శ్రోతలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎప్పటిలా విఫలయత్నంగా మారుతోంది.

అంటే ఏమిటన్నమాట? భర్త కోరికకు వెంటనే ఆమోదించనట్టు కుంతి కనిపిస్తూనే, ఆ కోరికకు అనుకూలించే కథే చెబుతోంది.

ఇక్కడినుంచి పాండురాజు అక్షరాలా స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్ర గురించి చెప్పడం ప్రారంభించాడు. వెనకటి కాలంలో స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఋతుకాలంలో ధర్మం తప్పకుండా స్వపురుషులతో, పరపురుషులతో సంతానం కనేవారని చెప్పడం దీనికి ప్రారంభం. ఆ తర్వాత ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు దానిని ఎలా నిషేధించాడో కూడా చెప్పాడు. నిషేధించినప్పుడు తను కుంతిని క్షేత్రజసంతానం కనమని అడగడం ఎలా పొసగుతుందనే ప్రశ్న వస్తుంది. దానికి పాండురాజే ఆ వెంటనే సమాధానం ఇస్తున్నాడు. శ్వేతకేతు నిషేధం మనుష్యజాతికి చెందిన స్త్రీల పరపురుష సంబంధానికి మాత్రమే వర్తిస్తుంది. అది పశుపక్షులకూ, ఉత్తరకురుభూములలోని వారికీ వర్తించదు. పశుపక్షులలోనూ, ఉత్తర కురుభూములలోనూ వెనకటి ధర్మమే అమలు జరుగుతోంది!

అదీ సంగతి…స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్రలో భాగంగా పాండురాజు వాటి ప్రాంతీయభేదాల గురించి కూడా చెబుతున్నాడు. అంతేకాదు, కుంతిని క్షేత్రజులను ఇమ్మని అడుగుతున్న పాండురాజు ఇప్పుడు భార్యల సహితంగా హిమాలయాలకు అవతల ఉత్తర కురుభూములలోనే ఉన్నాడు!

మహాభారతంలో స్పష్టమైన భౌగోళిక వివరాన్ని అందిస్తున్న ఘట్టాలలో ఇదొకటి.

పాండురాజు, అతని భార్యల ప్రయాణమార్గాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. మన్మథక్రీడలో ఉన్న మృగదంపతులను అన్యాయంగా చంపిన తర్వాత, మగమృగం తనను శపించిన తర్వాత విరక్తుడై తపస్సు చేసుకోవాలనుకున్న పాండురాజు భార్యలతో కలసి ఉత్తరదిశగా ప్రయాణం సాగించాడు. నాగశైలాన్ని, చైత్రరథాన్ని, హిమవంతాన్ని దాటివెళ్ళాడు. సురులు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉన్నాడు. అక్కడినుంచి మళ్ళీ బయలుదేరి ఇంద్రద్యుమ్న మనే కొలనునూ, హంసకూటాన్నీ దాటి ఎత్తైన శిఖరం కలిగిన శతశృంగం అనే పర్వతానికి చేరుకున్నాడు. అది కూడా సిద్ధులు, దేవతలు, యక్షులు నివసించే ప్రాంతం. ఆ శతశృంగంలోని ఉత్తరభాగంలో తపస్సు చేసుకుంటున్నాడు.

స్వర్గానికి వెళ్ళే మార్గంలోనే శతశృంగం ఉంది. దివ్యవిమానంలో వచ్చిపోయే దేవతలతో ఆ ప్రాంతం ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. అప్పుడే ఊర్ధ్వలోకాలకు వెడుతున్న మునులు అతనికి కనిపించారు. ఆరోజు అమావాస్య కనుక బ్రహ్మను దర్శించడానికి బ్రహ్మలోకానికి వెడుతున్నామని చెప్పారు. పాండురాజు, భార్యలతో సహా వారి వెనక బయలుదేరేసరికి, మిట్టపల్లాలతో నిండిన ఈ మార్గంలో సుకుమారులైన కుంతీ, మాద్రులు నడవలేరనీ, అదీగాక ఇది దేవతలు వెళ్ళే మార్గాలనీ చెప్పి మునులు వారించారు. దాంతో పాండురాజు శతశృంగంలోనే ఆగిపోయి సంతానం కోసం ఆలోచన ప్రారంభించాడు.

అంటే, ఉత్తరంగా హిమాలయాలకు అవతల ఉన్న ప్రాంతాన్నే ఉత్తరకురుభూములు అంటారన్నమాట. హిమాలయాలకు ఇవతల ఉన్న ప్రాంతం కురుభూమి కనుక, అవతల ఉన్నవి ఉత్తర కురుభూములు అవుతాయి. పాండురాజు ఉన్న శతశృంగం ఉత్తరకురుభూములలో భాగమే. ఆ ప్రాంతమంతటా సిద్ధులు, యక్షులు, దేవతలు, మునులు నివసిస్తున్నారు. గమనించండి, అక్కడ ‘మనుషులు’ ఉన్నట్టు భారతం చెప్పడం లేదు.

పురాకాలంలో జాతులు, తెగల వర్గీకరణకు సంబంధించి ఇది ఒక ఆసక్తికరమైన వివరం. ఒకవిధమైన జీవనశైలిని, ఆచారాలను, ఆహారవిహారాలను పాటించేవారికి; భిన్నమైన జీవనశైలి, ఆచారాలు, ఆహారవిహారాలను పాటించేవారు తమకంటే పూర్తి భిన్నులుగా కనిపించడం సహజమే. అవి వారికి విచిత్రంగానూ, అద్భుతంగానూ కనిపించడం కూడా సహజమే. ఆ విలక్షణత వారికి ఒక మాంత్రికతను, మార్మికతను ఆపాదింప చేసేలానూ ఉండచ్చు. తమకంటే అన్నివిధాలా భిన్నులనే భావనతో వారిని వేరే పేర్లతో పిలిచి ఉంటారు. ముఖ్యంగా మన ప్రస్తుతాంశానికి సంబంధించి, అక్కడ స్త్రీ-పురుష సంబంధాలు కూడా కురుభూములలో కంటే భిన్నంగా ఉంటాయి.

శతశృంగంనుంచే స్వర్గానికి వెళ్ళే మార్గం ఉంది. అది కూడా మిట్టపల్లాలతో ఉంటుంది. అంటే, స్వర్గం మరెక్కడో లేదు, ఈ భూమి మీదే ఉందని ఈ వివరాలు చెబుతున్నాయి. హిమాలయాలకు అవతల ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు భౌగోళికంగా వేర్వేరు దేశాల పేర్లతో ఉండి ఉండవచ్చు. పాండురాజు ప్రయాణమార్గాన్ని సూచిస్తూ మహాభారతం పేర్కొన్న స్థలనామాల ఆధారంగా ఇప్పటి ప్రదేశాలను, దేశాలను గుర్తించడం ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు. కానీ మనకు బాగా తెలిసిన హిమాలయాలను పేర్కొంది కనుక ఈ మొత్తం ఘట్టం భౌగోళిక సమాచారాన్ని ఇస్తున్నదనడంలో సందేహం లేదు.

మహాభారతంలో ఉత్తరకురుభూముల ప్రస్తావన, అదే స్వర్గమన్న సూచన, అక్కడ స్త్రీ-పురుషసంబంధాలు భిన్నంగా ఉంటాయన్న సంగతీ ఇక్కడ ఒక్కచోటే కాదు; చాలా చోట్ల వస్తుంది. ఆ వివరాలలోకి ఇప్పుడు పూర్తిగా వెళ్లలేం. కాకపోతే ఒక విషయం చెప్పుకోవాలి. పాండురాజు ప్రయాణ సమాచారం హిమాలయాలను కూడా దాటిపోయే మన పూర్వుల సంచార పరిధిని వెల్లడిస్తోంది. అంతేకాదు, ఆయా ప్రాంతాలు, మనుషులతో వారికి గల సంబంధాల వైశాల్యాన్నీ సూచిస్తోంది. దేశాలు, ప్రాంతాలు, మనుషుల మధ్య నేడు ఉన్నట్టు కృత్రిమమైన హద్దులు ఏవీ లేని కాలం అది. అటువంటి ఆ కాలం మన పూర్వుల దృష్టి వైశాల్యాన్ని ఎంత నిరవధికంగా పెంచి ఉంటుందో; రక రకాల ప్రాంతాలు, వ్యక్తులతో సంబంధాలు వారికి ఎటువంటి అనుభవాలు కలిగించాయో, వారి ప్రాపంచిక దృష్టిని ఏమేరకు ప్రభావితం చేసి ఉంటాయో-ఈరోజు అనేక హద్దులు, పరిమితులలో జీవించే మన ఊహకు అందడం కష్టం. మన పూర్వులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన ప్రపంచాన్ని చూశారన్న చరిత్రకారుడు హెచ్.జి.వెల్స్ మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి.

ప్రస్తుతానికి వస్తే, చివరిగా, కల్మాషపాదుడనే రాజు నియోగించడంతో, అతని భార్య వశిష్టుని వల్ల అశ్మకుడనే కొడుకును పొందిన ఉదంతాన్ని కూడా పాండురాజు కుంతికి చెప్పాడు. తర్వాత కుంతి నియోగపద్ధతిలో సంతానం కనడానికి అంగీకరించింది. తనకు పూర్వం దుర్వాసుడు ఇచ్చిన వరం గురించి చెప్పింది. ఆ మంత్రప్రభావంతో ఏ దేవతను ఆరాధించినా వారు వచ్చి తనకు సంతానం ఇస్తారనీ, ఎవరిని ఆరాధించాలో చెప్పమనీ అడిగింది. పాండురాజు యమధర్మరాజును ఆరాధించమని చెప్పగా కుంతి అలాగే చేసింది. అప్పుడు ఆమెకు ధర్మరాజు పుట్టాడు. ఆ తర్వాత వరసగా వాయుదేవుని వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు ఆమెకు కలిగారు. ఆ తర్వాత మాద్రి కోరగా కుంతి వరప్రభావం వల్ల ఆమెకు కూడా నకుల, సహదేవులు కలిగారు.

పాండవుల జననంలో కూడా మళ్ళీ తెలివిగా దేవధర్మం, మనుష్యధర్మాలను జోడించడం ఉంది. దానితోపాటు, మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

-కల్లూరి భాస్కరం

విదూషకుడు పాడిన విషాద గీతం ‘మూలింటామె’

మూలింటామె‘ నవల చదవడం పూర్తి చేసి పుస్తకం మూతపెడుతూ ‘ఏమిటీ రంకు ముండా గోల? నామినికి మతిపోయిందా యేమి?’ అనుకున్నాను. ‘ఎలావుంది పుస్తకం?’ అని అత్యంత కుతూహలంగా అడిగిన మిత్రుడు మోదుగుల రవికృష్ణతో కూడా ఆ మాటే అన్నాను.

ఐతే, ఈ కథను గురించిన ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. కథంతా ముక్కలు ముక్కలుగా గుర్తొస్తూ వెంటాడుతూనే వుంది. ఎందుకో ‘బీభత్సరస ప్రధాన విషాదాంతం’ అని శ్రీశ్రీ కన్యాశుల్క నాటకాన్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటలు ఆ నాటకానికి వర్తిస్తాయో లేదో గానీ, ఈ నవలకు మాత్రం పూర్తిగా వర్తిస్తాయి.

పుస్తకం మరోసారి చదవడం మొదలెట్టాను. ఇది నామిని రాసిన పూర్వపు గ్రంథాల్లా తమాష తమాషగా నడిచే పుస్తకం కాదు. నామిని గొంతులోని చిలిపితనం మాయమయ్యింది. సీరియస్‌ టోన్‌లో ఈ కథ చెప్తాడు. ఈ మార్పు నామిని రెగ్యులర్‌ పాఠకుణ్ణి కొంచెం చకితుణ్ణి చేస్తుంది. హాస్యం తగ్గించినా వ్యంగ్యం అంతర్లీనంగా నడుస్తూనే వుంటుంది. వర్తమాన వ్యవస్థపైన ఆక్రోశంతో కూడిన వ్10521865_10154366304195385_905769971_nయంగ్యం అది.

 

మూలిల్లు అంగిడిల్లుగా మారడం మూలింటామె నవలలోని యితివృత్తం. మూలిల్లు అంగిడిల్లుగా మారే క్రమంలో పూర్వ సంప్రదాయాలు ఎలా అంతరించి పోతాయో, నైతిక విలువలు కొత్త రూపాన్ని ఎలా సంతరించుకుంటాయో, సమాజంలోని అన్ని రకాల విలువలూ ధన దౌర్జన్యాలకు ఎలా ప్రభావితమౌతాయో ఆసక్తికరంగా వివరిస్తుందీ కథ. వెరసి సంప్రదాయ జీవితాన్ని మార్కెట్‌ శక్తులు ఎలా కబళిస్తాయో, మనుషులెలా పరాయీకరణ చెందుతారో వివరిస్తుందీ కథ.

మూలింటోళ్లది ఒద్దికైన యిల్లు. ముగ్గురాడవాళ్లు. ఒక మగవాడు, ఇద్దరు పిల్లలు… ఆ యింట్లో ఉండే మనుషులు. అందరికంటే పెద్దావిడని మొదుటామె అనీ, ఆమె కూతుర్ని నడిపామె అనీ, ఆమె మనవరాల్ని కొనమ్మి అనీ పిలుస్తారు. మొదుటామె కొడుకు పేరు నారాయుడు. అతని చెల్లెలు నడిపామె. ఈ నడిపామె కూతురు కొనమ్మినే నారాయుడు పెళ్లాడాడు. వీళ్లకిద్దరు పిల్లలు.

మూలింటోళ్లు పెరట్లోనూ, చేనిగెనిమల కాడా ఉన్న చెట్లను చక్కగా సాక్కుంటారు. పెంపుడు జంతువుల్ని కూడా కన్నబిడ్డల్లా ప్రేమిస్తారు. ఆకలో తల్లా అని యింటి కొచ్చిన వాళ్లకు ఉన్నదాంట్లోంచి యింత తీసి పెడతారు. ముప్పొద్దులా చాకిరి చేస్తారు, సంతృప్తిగా జీవిస్తారు. సాటి మనుషుల కొచ్చే కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు.

ఇట్లా సుఖంగా జరిగిపోతున్న దశలో ఆ యింటి ఇల్లాలు కొనమ్మి మొగుణ్ణీ పిల్లల్నీ వదిలేసి కళాయి బోస్కునే ఒక అరవ మాదిగోడితో లేచిపొయ్యింది. ఈ విషయం సహజంగానే ముందు ఊళ్లోవాళ్లకు, చివరిగా యింట్లో వాళ్లకు తెలిసింది. ఊళ్లో పెద్దమనుషులు, పతివ్రతలు మూలింటి దగ్గర గుంపుకట్టారు. అనాల్సిన మాటలన్నీ అన్నారు. లేచిపోయిన పిల్లని వెనక్కి తేవాలని తీర్మానం చేశారు. లేచిపోయిందాన్ని వెనక్కి తెచ్చేదెందుకు? రేపు మనగ్గూడా కొంగు పరవక పోతుందా అని పెద్దమనుషులు ఆశ. మనలో మరొకటి చేరుద్దిగదా అని పతివ్రతల కులుకు.

పోయిన పిల్ల మొండిది. ‘నాకు మూదేవి గమ్మి గడప దాటొచ్చేసి తప్పు జేసినా. యింగా గడప తొక్కను. బావ మొకం చూళ్లేను. నేను కర్మురాల్ని. చచ్చిందాంతో సమానమని నన్ను మర్సిపోండి’ అని తలకొట్టుకొని ఏడుస్తూ వెళ్లిన వాళ్లను వెనక్కు పంపేసింది.

ఆడమనిషి ఇలా లేచిపోవడమనేది గుట్టుగా నడుపుకొనే సంసారాల్లో ఎంత కల్లోలం రేపాలో అంతా రేపింది. లేచిపోయిన పిల్ల అత్తకు మనవరాలు మొగుడికి మేనకోడలు. తానులో తాను, ముక్కలో ముక్క. ఆ కుటుంబాన్ని లోకులు పెట్టిన హింసకు పరాకాష్ట రంజకం వొక్కలు ముక్కలుగా మాట్లాడిన మాటలు. ‘ఏమే మొదులా! కొనదానికీ కళాయోడికీ నడిమద్దిన తడిక మాదిర వుండింది నువ్వేనంటనే! కళాయోణ్ణి కోడలితో కులకమని జెప్పి నువ్వు అడ్డాపింటి ముందర కావిలుండే దాని వంటనే! అవరా! అవరా! కొడుకని అన్నా జూసినావా నువ్వు? నీ మనవరాలు జిల్లా పటంగవితే నువ్వు దేశిపటంగివే!’

 

ఎన్ని అవమానాలు జరిగినా మొదలామెకి మనవరాలి మీద మమకారం చావలేదు. ఏదో ఒక రోజుకి తిరిగి ఇంటికి వస్తుందనే ఆశ పోలేదు. అప్పుడు కూతురు (నడిపామె) తల్లికి ఉపదేశం చేసింది. ‘అమా, నీకు పున్నెముంటాది. దాన్ని మర్సిపో. మనం గానీ ఆ యమ్మిని కడుపులోనే పెట్టుకొంటే యింట్లో వుండే లేదర పిలకాయల్ని కూడా సాక్కోలేము, చదివించుకోలేము. అన్నకు మళ్లీ పెండ్లి చేద్దారి’. మొదులామె అంగీకరించలేదు. కానీ ఆమె అంగీకారం కోసం ఎవరూ ఎదురు చూడలేదు.

లేచిపోయిన కొనమ్మికి ఎవరి సానుభూతీ దక్కలేదు. బహిరంగంగా ఆమె చేసిన తప్పును అసహ్యించుకోవడం ద్వారా ఊరు తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంది. కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలబడలేని స్థితి. సమాజం కుటుంబంపైనా వ్యక్తిగత విషయాలపైనా ఎంత దౌర్జన్యం చెయ్యగలదో అంతా చేసింది. అంతటి దుఃఖాన్నీ, అవమానాన్నీ దిగమింగుకుంటూ చెట్టూ చేమల్నీ, కయ్యా గనుమల్నీ, పిల్లీ పిచికనీ ఏమరలకుండా సాక్కుంటూనే ఉన్నారు, నడిమింటోళ్లు.

సమాజం లోకువగా ఉన్న మనుషుల్ని ఊరికే వదిలిపెట్టదు. వాళ్ల ఏడుపు కూడా వాళ్లను ఏడవ నివ్వదు. మరీ ముఖ్యంగా బంధువులైతే సానుభూతి మిషతోనో, మేలు చేసే మిషతోనో వాళ్ల వ్యవహారాల్లో వేలు పెడుతూనే ఉంటారు. మొదుటామె అక్క తన తోటికోడలి మనవరాల్ని నారాయుడికి మారు మనువుకి మాట్లాడుకొచ్చింది. నడిపామె కూడా సహకరించింది. మొదుటామెకి ఇష్టం లేకపోయినా నారాయుడి పెళ్లి పందొసంతతో జరిగిపోయింది.

పందొసంత లేచిపోయిన పిల్ల లాగా నోట్లో నాలుక లేనిది కాదు. తనకు నచ్చినపని, తాను చెయ్యాలనుకున్న పని ఎవరు ఔనన్నా కాదన్నా చేసెయ్యగల తెంపరి. మొదుటామె తనకు సానుకూలంగా లేదని వచ్చిన వెంటనే గ్రహించింది. ఐనా ‘ముసిల్దానా! దేనికెప్పుడూ ముటముటా అంటా మూతి నల్లంగా పెట్టుకోనుంటావు? నవ్వతా పేల్తా వుండలేవా నువ్వు? నవ్వు! మా ముసిల్దిగదా, నవ్వు! నవ్వు! నిన్ను ఆ పక్కట్టితో నాలుగు దొబ్బితే గానీ దోవకు రావా ఎట్ట?” అని చక్కిలిగిలి పెడుతూ ఆసికాలాడింది. మొగుడితో గూడా అంతే. మంచం మింద కుచ్చోనుంటే మెడమింద చేతులెయ్యడం, పక్కన పొనుకోని కాళ్లెయ్యడం – ఆ కులుకు నింక చెప్పలేమసలికి. వూరికొచ్చి పద్దినాలు గాకనే దానికి యిల్లిల్లూ తెలిసిపోయింది. సినమ్మా అనాల్సినోళ్లని సినమ్మా అనీ, అత్తా అనాల్సినోళ్లను అత్తా అనీ బావా అనాల్సినోళ్లను బావా అనీ పిల్సుకుంటా ఊరంతా పోయ్‌ అరట్లు దొబ్బేసి వస్తా వుంటింది. ఇంట్లో కడిగిన చెయ్యి ఆమెకు పరావోళ్ళింట్లో ఆరాల్సిందే. మొలకమ్మ యిల్లు మొదులుకోని, రంజకం యిల్లు మొదులుకోని, చాకలోళ్లిండ్లు మొదులుకోని యాడ జూసినా తిరగతానే వుంటుంది. మొదటామెకి ఆమె తిరుగుళ్లు నచ్చక పోయినా ఒకటంటే నాలుగు వినాల్సొస్తుందని గమ్మునుండేది. వూళ్లో మొగోళ్లకూ ఆడోళ్లకూ మాత్రం ‘పందొసంతకు కొత్తా పాతా లేదు. మనూరికి రావాల్సిన బిడ్డే!’ అని పేరెత్తుకొనింది.

Mulintame600

వ్యాపారానికీ, మార్కెట్‌ సంస్కృతి నిలబడటానికీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా ముఖ్యం. పందొసంతలో ఆ స్కిల్స్‌ కొల్ల. ఐతే మార్కెట్‌లో నిలబడాలంటే కేవలం స్కిల్‌ ఒక్కటే చాలదు. ఒక బలమైన అండ ఉండాలి. ఒక గాడ్‌ఫాదర్‌ కావాలి.

రంగబిళ్ల ఆ చుట్టు పక్కలూళ్లల్లో కొంచెం పేరెత్తుకున్నోడు. అతగాడు నారాయుడికి తమ్ముడొరస. పందొసంత కన్ను మొదట అతని మీదే పడింది. ‘రంగబిళ్లా, ఏం మేనమామ కొడకా! మరదాల్ని చూసేసిపోవా? మరదాల్తో మాట్లాడి పోకూవర్తీ కనుక్కోవా?’ అంటా పైయ్యేస్కోని పిలిచేది. ‘నువ్వేంది బావా బీడీలు తాగేది, సిగిరెట్లు తాగు’ అని చెళ్లబడేది. ఒక రోజు సందేళపూట ‘బావా నన్ను ఉప్పు గుర్రం ఎక్కించుకో’ అని రంగబిళ్ల యీపెనకాన ఉప్పుగుర్రం ఎక్కి మిట్ట మిందంతా ఒకటికి పది చుట్లు తిరిగింది. మొదుటామె మనవరాలు లేచిపోయినప్పుడు వొక్కలు ముక్కలుగా మాట్లాడిన రంజకం యిదంతా యీదిలో నుంచి చూసి పకపకా నవ్వేసింది. ‘బావా మరదాలు బలే కులుకు మిందుండారే!’ అని కండ్లారా చూసింది గానీ ఏం యిచ్చిత్ర పోలా!

రంగబిళ్ల కంటే గుడుగుడు చెంద్రడు మరింత శక్తిమంతుడని, లాభకారి అని, పందొసంతలోని వ్యాపార శక్తి కనిపెట్టేసింది. గుడుగుడు చెంద్రడు పది పన్నెండెకరాల ఆసామి. మూడు టాకట్రలకు యజమాని. యాడ టాకట్రు దున్నకం మిందుంటే ఆడికి గుడుగుడు మోట్రమీద పొయ్‌ ఊళ్లు తిరుగుతాడు. అందుకే అతన్ని ఆ పాయకట్టంతా గుడుగుడు చెంద్రడని పిలుస్తారు. సొంత వూళ్లో మాత్రం అతన్ని కర్రెడ్డి అంటారు మనిసి బొగ్గు వర్నంతో వుంటాడు గాబట్టి. పందొసంత మేని వర్ణాన్ని చూసే మనిషికాదు. డబ్బుకు వర్ణభేదం వుండదని తెలిసిన మనిషి. ఆమె చూపు అతని మింద పడిన మరుక్షణం గుడుగుడు మోటారు మూలింటి ముందు ఆగిపోయింది. మంచి మద్యానం వచ్చిన మనిసి రేత్తిరి ఏడు దాకా పందొసంతతో మాట్లాడిన వాడు మాట్లాడినట్టే ఉన్నాడు. నారాయుడు కూడా గుడుగుడు చెంద్రడికి ఎంతో మరేదిచ్చినాడు.

పందొసంత దూరదృష్టి గల మనిషి. క్రైసిస్‌ మేనేజిమెంటు ఆమెకు బాగా తెలుసు. ముందు ముందు వ్యవహారాలు సజావుగా సాగాలంటే గుడుగుడు చెంద్రడికీ నారాయుడికీ మంచి సఖ్యత ఏర్పడాలని గుర్తించింది. అందుకోసం రకరకాల విద్యలు ప్రయోగించింది. మొగుడి బుజాల మింద చేతులేసి పైపైన పడేది. ఏదో ఒగటి మాట్లాడమని గారాం జేసేది. నారాయుడి ముసిముసి నవ్వులు నవ్వతా ఒకటి రెండు మాటలు మాట్లాడగానే ‘పెండ్లాం మాట అట్ట యినాల’ అని చెప్పి ముద్దులు బెట్టేది. గుడుగుడు చెంద్రడొచ్చినప్పుడు అతగాడి దగ్గర సిగరెట్టు పెరుక్కోని మొగుడి కిచ్చేది. ఆ సిగరెట్టు ముట్టించమని గుడుగుడు చెంద్రడికి ఆర్డరేసేది. గుడుగుడు చెంద్రడు ముట్టిస్తా వుంటే, ‘యిప్పుడు పోటాగాన తీస్తే ఎన్టీరామారావుకు నాగేస్పర్రావు ముట్టించినట్టుగా వుంటాది’ అని చెంద్రడి మింద పడిపడి నవ్వేది.

ఒకానొక రేత్రి గుడుగుడు చెంద్రడికి పెండ్లయి పెళ్లాం బిడ్డలుండినా గాజులమండ్యంలో యిల్లూ వాకిలీ వుండినా మూలింటామె యింటి ముందరుండిన టాకట్రను ఎగజూపెట్టుకోని జాగారం చెయ్యాల్సొచ్చింది. నారాయుడు మంచాన్నీ పెళ్లాన్నీ చెంద్రడి కొదిలేసి ఈతాకు చాపమింద వైబోగంగా నిద్దరబొయ్‌నాడు. ఇట్లాంటి వార్తలు ఊరిమీద వేగంగానే పాకుతాయి. మిట్టూరోళ్లంతా మూతుల మింద చేతులేసుకున్నారు. ‘పందొసంత యీ వూరికి కోడలైన పది పదైద్దినాలల్లోనే వూరి పినపెద్ద కొడుకు రంగబిళ్లను పెట్టుకొనింది. నెలైనా వోడితో సావాసం చేసిందో లేదో అష్టతెలువుల్తో పది పన్నెండెకరాలుండి వొకటికి మూడు టాకట్రలుండే గాజులమండ్యం రెడ్డిని ఒళ్లో యేస్కొనింది. అదే యింట్లో పుట్టి పెరిగిన పెవడముండ ఏమి జేసింది? అరవ మాదిగోడితో పూడిసింది. వొకటి మూలింటోళ్లకు తలొంపులు తెచ్చి దాని దోవ అది చూసుకుంటే, యింకొక పున్నాత్మురాలొచ్చి వాళ్ల నెత్తిన కిరీటం పెట్టింది’. అని మూలింటోళ్ల మింద కుళ్లుకున్నారు కూడా!

వ్యాపార సంస్కృతి ప్రబలమయ్యే కొద్దీ సంప్రదాయవాదుల గొంతులు బలం కోల్పోతాయి. పందొసంత వ్యవహారశైలి గురించి చీమంతమ్మ సుకుమార్‌ లాంటి వాళ్లు గొణిగినా వారి నోళ్లను మొలకమ్మ రంజకం లాంటి వాళ్లు తేలిగ్గానే మూయించగలిగారు.

తన చాకచక్యం ఇంటినీ వీధినీ గెలిచిందని పందొసంతకు అర్ధమైంది. తదుపరి కార్యాచరణకు దిగింది. ఇంటి చుట్టూతా, పొలం గట్ల మీదా ఉన్న చెట్లను సామిల్లు వాడికి మంచి రేటుకు అమ్మేసింది. తరతరాలుగా పిల్లలకు కాయా గసురూ అందిస్తూ నీడనిస్తున్న చెట్లను కొట్టేయొద్దని మూలింటామె అడ్డం రాబోయింది. “అడ్డం వొస్తావా! కావాలంటే అరవ మాదిగోడితో దొబ్బుకొని పూడ్సిన నీ మనవరాల్ని కూడా తొడకరాబో? యిద్దురూ చెట్లకాడ అడ్డంగా పొడుకుందురు. పోపోయే ముసిల్దానా! నాలుగు నాళ్లకంతా యింటికాడా, చేనుకాడా కిలీనుగా యిలాశియంగా వుంటాది. నువ్వు పదే ముసిలీ!’ అంటా పందొసంత పకపకా నవ్వుతా ఎనప దూడను జవురుకొన్నట్టుగా జవురుకోని తెచ్చి ముసల్దాన్ని బండమింద మరేదగా కుచ్చనబెట్టింది.

చెట్ల నమ్మిన డబ్బు పన్నెండు వేలలోంచి పన్నెండు వందలు తీసి బంకొకటి తెప్పించి యింటి ముందర అంగిడి తెరిపించింది పందొసంత. మరసట్రోజే బంకు నిండికీ సామానొచ్చేసినాయి. ఒక వస్తవ ఉండాది ఒక వస్తవ లేదు అనాల్సిన పన్లా. కొనుక్కోడానికి డబ్బుండక్కర్లా. సమయానికి డబ్బు లేకపోతే పందొసంత వివరంగా గుర్తు రాసుకోని అప్పిచ్చేస్తాది. వూరి జనానికి పందొసంత అంగిడి వల్ల ఇంత మేలుగా ఉండాది. ఏడున్నరా ఎనిమిది కంతా అంత చారూకూడూ తినేసి పొనుకునే వూరు తొమ్మిదీ తొమ్మిదిన్నరకు అంగిట్లో లైట్లు ఆరినాకనే పొనుకునేది నేర్చింది.

పందొసంత అంగిడి తెరిచే దాంతో ఆగలేదు. ఆ వెంటనే చీరల వ్యాపారం, దాంతో పాటే తండల వ్యాపారం, పనిలో పనిగా చీటీల వ్యాపారం కూడా మొదలేసింది. యిన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నా మొగుణ్ణి నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆరుగాలం ఎద్దుల్ని మడికాడకి తోలకపోయి సందేళ వాటి కోసం కసవు మోపును నెత్తిన బెట్టుకోని కాళ్లీడ్చుకుంటూ యింటికి వచ్చే మొగుణ్ణి చూస్తావుంటే ఆమెకు కడుపు రగలకపొయ్యేది. గుడుగుడు చెంద్రడి టాకట్రుండగా ఎద్దుల సేద్యం ఎందుకు చెయ్యాలనిపించింది. బండీ ఎద్దుల్ని ఆరువేలకు అమ్మేసి పట్టిన శని యీడేర్చింది. మొగుడికి మోపెడ్‌ కొనిచ్చింది. నారాయుడిప్పుడు మోపెడ్‌ మీద తిరగతా కొట్లోకి సామాన్లు తెస్తుండాడు. పొరుగూరు పోయి బిలేరి కోడి మాంసం కావాలన్నప్పుడల్లా తెస్తుండాడు.

ఇంక భూమి మిగిలిపోయింది. ఆ రెండెకరాల కయ్యనూ అమ్మితే అరవై వేలన్నా వస్తాయి. ఆ డబ్బు కనుక వొడ్డీల మింద తిరిగితే ఇరై ముప్పై ఎకరాలు సేద్యం చేసే దానికంటే ఎక్కువ మిగల బెట్టుకోవచ్చు. మొగుణ్ణి ఎగదోసింది. ‘నేను నిన్ను బతికినంతకాలం కుచ్చనబెట్టి కూడేస్తాను బావా! నువ్వేంది బావా ఆ మడికాడికి బొయ్‌ వొంగివొంగి పనిచేసేది? నువ్వు కుచ్చుంటే నాకు కుశాల. నువ్వు ఎండలోకి పొయ్‌ చేనులో వొంగితే నాకు బాద” అని కండ్ల నిండికి నీళ్లు పెట్టుకొనింది. గుడుగుడుచెంద్రడితో కలిసి జోరుగా మందు తాగుతున్న నారాయుడు “కయ్యమ్మాలనుకున్నాం గదా. మాయమ్మకు కొంచిం మంచిగా ఉండు. మూకుళ్లలో కూడూ, కోడికూరా దండిగా కలుపుకోని పొయ్‌ పిల్లులకు పెట్టు. చిన్నామున్నుల్లాలా, కానాచ్చుల్లాలా, కొండాచ్చుల్లాలా అని మాయమ్మ యినేటట్టుగా పిల్లుల్ని పిల్చి బండకాడ పిల్లులకు కూడూ కూరా పెట్టేసి రాబో’ అనేసి అన్నాడు ఓ అని నవ్వతా! ఆ ఒక్క మాటతో నారాయుడు తాను తల్లి పక్షం కాదనీ భార్య పక్షమేననీ స్పష్టంగా చెప్పినట్టైంది. ఇది పందొసంతకు గొప్ప విజయం.

ఐతే విజేతకు అడుగడుగునా సవాళ్లు ఎదురౌతూనే ఉంటాయనేందుకు నిదర్శనంగా అప్పుడొక సంఘటన జరిగింది. వాళ్లింటి ముందు గుడుగుడు చెంద్రడి పెళ్లాం ఆటో దిగింది. దిగుతూనే నేరుగా మొగుడి దగ్గరికొచ్చి వాడి మొకాన కేకరించి ఎంగిలూంచి, పందొసంత ఎదుర్రొమ్ము మింద అట్టనే ఎగిసి ఎడం కాల్తో తన్ని, ‘నా మొగుళ్ళంజా! మా కొంప మూడు ముక్కలయ్యే దాకా వీణ్ణొదలవాసేయ్‌’ అంటా ఆగిత్తం పట్టించింది. ఈ గోలకు యింటి ముందు పోగైన జనాన్ని చూసి, ‘యీ వూళ్లో యిట్టాంటి పలుబోటి లంజలు కూడా ఉండాయా! యీ మాదిర్తో వూరోళ్ల మొగుళ్లను పక్కలో యేస్కోని యింటికి రానీకుండా చేసే ఆడదాన్ని ఏం చేస్తే కర్మాలు తీరునో మీరే చెప్పండి. యీనా సవితిని పట్టుకోని నలగ్గుమ్మేద్దామనుండాది’ అని కాసుగ్గాకుండా మాట్లాడింది.

పందొసంతకు జరుగుతున్న అవమానం అక్కడి జనం సహించలేకపోయారు. పందొసంత లాంటి తీరైన మనిషికి, పదిమందికి తల్లో నాలుకలా ఉండే మనిషికి జరగాల్సిన అవమానమా అది? వెంటనే మొలకమ్మ అందుకుంది. ‘పందొసంతకు ఎవురూ సపోరట రారని అనుకోబాక. మేమంతా చచ్చినామా! యిది వూరనుకున్నావా అడివను కున్నావా? నీ మొగ్గుణ్ణి అదుపులో పెట్టుకోవాల్నే గాని వొకమ్మ గన్న బిడ్డిమిందికి వొంటికాలి మింద ఎందుకొస్తావు?” అని మూతి మింద కొట్టినట్టుగా మాట్లాడింది. ఆ వెంటనే రంజకం అందుకుంది. ‘యిందాక పందొసంత ఎదుర్రొమ్ముల మింద తన్నినావంట గదే. నీ కాళ్లల్లో గండుమల్లి పుండు బుట్టదా! యింగొక్కసారి వాళ్ల పనిలో వాళ్లుండగా యీ మాదిర బైసాట్లు చేస్తా వొచ్చినావంటే నీ శిండ చించి, బజిని గుడికాడ కట్టేస్తాం. నీ నాయం నీకుంటే మా నాయం మాకుంటాది’ అనింది. చెంద్రడి పెళ్లాం బిత్తరపోయింది. శత్రువు బలం అర్ధమైంది. ‘మీరు పొండి తల్లుల్లారా! నా బంగారం మంచిది కాదు’. అని మళ్లా మొగుడి మొకాన వూంచి వొచ్చిన ఆటో ఎక్కి మళ్లా తిరుక్కోని పూడిసింది. పందొసంత వూరిని గెలిచింది.

అరవై వేలకు భూమిని అమ్మేందుకు ఒప్పందమైపోయింది. పొలం అమ్మాలంటే మొదుటామె వేలిముద్దరెయ్యాల. ముసల్ది బిగుసుకుపోయింది. పందొసంత చాణక్యాలు ఆమె మీద పనిచెయ్యలేదు.

మార్కెట్‌ శక్తులు తమపని సాఫీగా సాగిపోతున్నప్పుడు ఎంత ఉదారంగా ఉంటాయో వ్యతిరేకత వచ్చినప్పుడు అంత కంతా క్రౌర్యం చూపిస్తాయి. మొదులామె ప్రాణప్రదంగా పెంచుకొనే పిల్లల్లో రెంటికి విషం పెట్టి చంపేసింది పందొసంత. వేలిముద్దరెయ్యకపోతే మిగిలిన వాటికి కూడా అదే గతి పడుతుందని మొదుటామెని హెచ్చరించింది. మొదటామె ఒక నిర్ణయానికొచ్చేసింది. తనబోటి వాళ్లకివి రోజులు కావు. వెంటనే లేచి యింత వొడిశాకు పెరుక్కోని తినేసింది. ముసిల్ది వొడిశాకు తినేసిందని వూళ్లో ఎట్ట తెలిసిపొయ్యిందో గానీ అందురూ యీదిలో వుడ్డ జేరి పొయ్‌నారు. చీమంతమ్మ వొచ్చి ముసిల్దాని తలకాయ వొళ్లో బెట్టుకొంది. ముసిల్దానికి వూపిరి పీల్చేదానికి కష్టిమై ఆపసోపాలు పడుతూ కూడా చీమంతమ్మకు ఒక మాట చెప్పి మరీ కన్నుమూసింది.

“నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతే గానీ మియాం మియాం అంటా నీ కాళ్ల కాడా నా కాళ్ల కాడా చుట్టక లాడే పిల్లిని చంపలేదే!”

ఈ నవల్లో పందొసంత ఆధునికతను అభిమానించే వారు కళ్లకద్దుకోవాల్సిన పాత్ర. వ్యక్తిస్వేచ్ఛ, స్వతంత్ర భావజాలం, సంప్రదాయాలపై తిరుగుబాటు, సంఘ నియమాల ధిక్కరణ, ప్రాక్టికాలిటీ యిలాంటి ఆధునిక లక్షణాలు కలిగి వున్న పాత్ర. మరీ ముఖ్యంగా వ్యక్తి ఔన్నత్యాన్ని డబ్బుతో కొలిచే సంస్కృతికి ప్రతిరూపం యీ పాత్ర. సంప్రదాయవాదులు గొంతు చించుకొనే నీతి నియమాలు ఎంత డొల్లవో అడుగడుగునా నిరూపించడమే కాకుండా నీతి నియమాలకు కొత్త భాష్యాలు చెప్పగలిగిన పాత్ర. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, అది సాధించేందుకు ఉన్న మార్గాలను కనుక్కోవడం, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, తగిన స్ట్రేటజీస్‌ని అమలు చేయడం, అంతిమంగా విజయాన్ని అందుకోవడం…. ఆధునిక కాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు బోధించే అనేక పాఠాలు పందొసంత పాత్ర ఆచరణలో చూపుతుంది. పందొసంత వలన మార్కెట్‌ సంస్కృతి పుట్టుకొస్తుందా, మార్కెట్‌ సంస్కృతి పందొసంతల్ని పుట్టిస్తుందా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్న.

ప్రాచీన సంప్రదాయాలతో మనుగడ సాగించే దేశాలన్నిటిలో వ్యక్తులు పరిమిత స్వేచ్ఛ కలిగి ఉంటూ ప్రకృతితోనూ తోటి సమాజంతోనూ మమేకమై జీవించడం కన్పిస్తుంది. వలసవాదులు సంప్రదాయ జీవనానికి ఆలవాలమైన దేశాలను ఆక్రమించి ఆయా దేశాలకు మార్కెట్‌ సంస్కృతిని, అందుకవసరమైన వ్యక్తి స్వేచ్ఛను విస్తృతంగా ప్రచారం చేశారు. క్రమేపీ మార్కెట్‌ సంస్కృతి ప్రపంచీకరణకు దారితీసింది. మార్కెట్‌ సంస్కృతి కోరుకొనేది ఒక్కటే! లాభం. యీ సంస్కృతిలో లాభం కోసం చేసే కార్యకలాపాలకే గౌరవం. యీ మార్కెట్‌ సంస్కృతి 1984 నాటికే దేశం నలుమూలలా వ్యాపించిందని మూలింటామె నవలలో రచయిత సూచన మాత్రంగా చెబుతాడు. తేదీల సంగతి ఎలా ఉన్నా యీ సంస్కృతి నేడు దేశం మారుమూలలకూ వ్యాపించిందనేది నిజం. దీని ఫలితంగానే పర్యావరణం, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు నశిస్తున్నాయనేది నిజం. దీనికి వ్యతిరేకంగా పోరాడే వారు కూడా ఆధునికతను అక్కున చేర్చుకోవడం విచిత్రం. మార్కెట్‌ సంస్కృతి వ్యాప్తిని రచయిత నిస్సహాయంగా, విషాదంగా, క్రోధంగా పరికిస్తున్నట్టు నవలలో మనకు సూచనలందుతాయి. నామినిలోని ఒక తాత్త్విక దృక్పథం మొట్టమొదటిసారిగా మనకు పరిచయమౌతుంది. మునికన్నడి సేద్యం నవలలో కూడా యీ ఛాయలున్నప్పటికీ ఇంతటి స్పష్టత లేదు.

గ్రామీణ జీవితంలోని దారిద్య్రాన్ని, బతుకు పోరాటాన్ని హాస్యంతో రంగరించి ఆత్మకథాత్మకంగా తన రచనల్లో యింతకు పూర్వం చిత్రించిన నామిని ఆ వొరవడిలో అనేక మంది నూతన రచయితలు ఆవిర్భవించేందుకు కారణమయ్యాడు. పిల్ల వసుచరిత్రలనేకం పుట్టుకొచ్చాయి. మూలింటామె నవల ఇతరులు అనుకరించలేనిది. గతంలో నామిని లోని విదూషకత్వాన్ని (పాపం శమించుగాక) ఆస్వాదించిన పాఠకులకు గానీ సాటి రచయితలకు గానీ మూలింటామె నవలలోని కథావస్తువు దాన్ని చెప్పేందుకు అతనెన్నుకున్న స్వరం ఒక పట్టాన రుచించకపోవచ్చు. కానీ ప్రపంచీకరణ దుష్ఫలితాల్ని, ఒకానొక మారుమూల గ్రామంలో అవి ప్రతిఫలించిన విధానాన్ని అత్యంత సహజంగా నామిని చెప్పిన తీరు మాత్రం అత్యద్భుతమనే చెప్పాలి. ఒక అంతర్జాతీయ సమస్యను అదే స్థాయిలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన నవలగా మూలింటామె నవల విమర్శకుల మెప్పును పొందుతుంది. ఎన్నుకున్న నేపథ్యం, పాత్రల చిత్రణ, ఎలాంటి ప్రతిపాదనలు ఉపదేశాలు చెయ్యకపోవడం, చెప్పదలుచుకున్న అంశం వైపుకే పాఠకుడి దృష్టి ఉండేలా అనవసరమైన విషయాల్ని పరిహరించడం, అతి కొద్ది పేజీల్లో ఒక విస్తృతమైన అంశాన్ని ఆలోచనాత్మకంగా మలచడం ఇవన్నీ నామినిని ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన తెలుగు రచయితగా నిలబెడతాయి. మూలింటామె ప్రపంచ సాహిత్యంలో స్థానం పొందగల రచన. ఈ నవల ఆంగ్లానువాదం కోసం ఎదురుచూడాల్సి ఉంది.

-పిన్నమనేని మృత్యుంజయరావు

Mruthyunjaya Rao

ష్…….!

Sketch26115252-1

ఆకాశం ఎప్పుడూ నిశ్శబ్దంగా

నేల చూపులు చూస్తుంది

ఏ ఓజోను పొరనో నుజ్జు చేసుకుంటూ

ఓ పిడుగు లా బద్దలవక ముందు.

ధరియిత్రీ  అంతే నిశ్శబ్దం ధరిస్తుంది

వత్తిళ్ళకు మట్టి వలువల పొరలు

పిగిలి నలు చెరగులూ

పెను ప్రకంపనగా కదలక ముందు.

మలయానిలమెప్పుడూ

మంద్రంగానే వీస్తుంది

బ్రద్దలవుతున్న బండలమధ్యగా

వడగాలి సుడిరేగక ముందు.

ఓ లావణ్య సలిల ధార

దీనాతి దీనంగానే పారుతుంది.

తనలో  కరిగించుకున్న

హిమసైన్యంతో మున్ముందుకు హోరెత్తకముందు

నిప్పురవ్వ సవ్వడి సేయక

తుళ్ళి తుళ్ళి పిల్లి గంతులేస్తుంది

ఇంధనాన్ని  మింగి అగ్నికీలగా

నింగిదిశగా రాజుకునే ముందు

ఓ జ్ఞాని

మౌనిలానే ఉంటాడు

లేచి అరాచకత్వంపై

విరుచుకు పడేముందు

అందుకేనేమో –

నిశ్శబ్దం నేనైతే

శబ్దం నా ఆవిష్కరణం

వర్చస్వి

నీ గది

 srikanth

 

 

 

 

 

తళతళలాడింది నీ గది: ఆనాడు. అప్పుడు, ఇంకా మబ్బు పట్టక మునుపు –

నీకు నచ్చిన

అగరొత్తులను వెలిగించి నువ్వు కూర్చుని ఉంటే, నీ చుట్టూతా

నిన్ను చుట్టుకునే

 

సన్నటి, పొగల అల్లికలు.

అవి, నా చేతివేళ్ళు  అయితే బావుండునని ఊహించాను నేను, ఆనాడు:

అప్పుడు

 

చిరుగాలికి, చిన్నగా కదిలాయి

కర్టెన్లూ, నేలపై నువ్వు చదివి ఉంచిన దినపత్రికలూ, నువ్వు రాసుకున్న

కాగితాలూ

 

పచ్చిక వలే

నీ ముఖం చుట్టూ ఒదిగిన నీ శిరోజాలూ, చివరిగా నేనూనూ. “కొమ్మల్లోంచి

ఒక గూడు రాలిపోయింది

సరిగ్గా

 

ఇటువంటి

వానాకాలపు మసక దినాన్నే. చితికిపోయాయి గుడ్లు – వాటి చుట్టూ

గిరికీలు కొట్టీ కొట్టీ

అలసిపోయాయి

 

రెక్కలు. తెలుసా నీకు?

అమ్మ ఏడ్చింది ఆ రోజే ” అని చెప్పాను నేను. “నాకు తెలుసు” అని అన్నావు

తిరిగి పొందికగా నీ గదిని

 

సర్దుకుంటూ నువ్వు:

t1

నేలపై పరచిన తివాచీ, తిరిగిన ప్రదేశాల జ్ఞాపకార్ధం కొనుక్కు వచ్చిన బొమ్మలూ

పింగాణీ పాత్రలూ

 

ఓ వెదురు వేణువూ

ఇంకా సముద్రపు తీరం నుంచి నువ్వు ఏరుకొచ్చుకుని దాచుకున్న శంఖమూనూ.

ఇక నేనూ పొందికగా

 

ఆ వస్తువుల మధ్య

సర్ధబడీ, అమర్చబడీ, బొమ్మగా మార్చబడీ నువ్వు ముచ్చటగా చూసుకుంటున్నప్పుడు

ఎక్కడో అలలు

 

తెగిపడే వాసన –

nos6

తీరాలలో అవిసె చెట్ల హోరు. ఒడ్డున కట్టివేయబడిన పడవలు అలజడిగా కొట్టుకులాడే

తీరు. కళ్ళల్లో కొంత

ఇసుకా, ఉప్పనీరూ-

 

మరి, తళతళలాడి

ఆనక మబ్బుపట్టి, ఈదురు గాలికి ఆకులూ, పూవులూ, ధూళీ రాలడం మొదలయ్యిన

ఆనాటి నీ గదిలో

 

ఇక ఇప్పటికీ ఒక వాన కురుస్తూనే ఉందా?

 

– శ్రీకాంత్

Between the Lines

Drushya drushyam 39

చాలాసార్లు దూరతీరాలకేసి చూస్తం.
కానీ, దగ్గరే మన కోరికలు తీర్చేవి ఉంటై.చూపుకు మామూలుగా అందవు. తేలికగా కనపడవు. కొద్దిగా శ్రమించాలి.
ఒక్కోసారి ‘చంకలో బిడ్డలాగా’ మరపు వల్ల ఉన్నదాన్ని ఉన్నచోటే వెతుక్కోవలసే వస్తుంది.కానీ చిత్రం.
ఒకానొక శుభవేళ ఒకరు దయతో చెప్పారు. తల్లి చుట్టు మూడు చుట్లు తిరిగితే చాలని! తులిసమ్మ పూజ చేసినట్లే అనీనూ! కొద్దిగా మేలుకున్నట్టయింది.

ఇక కన్నతల్లి చుట్టూ కొంగు పట్టుకుని తిరిగే పిల్లవాడివలే ఉన్నఊరును, పట్టణంలోని బస్తీలను కిలోమీటరు పరిధిలో తిరగడం మొదలెట్టాను, అవును. కెమెరా చేత బట్టుకునే. ఇదొక అధ్యయనం. అన్వేషణ. సఫలత.

కెమెరాతో రోజురోజుకూ మెలమెల్లగా విస్తరించాను.
పది, పదిహేను, ఇరవై కిలోమీటర్ల మేరా తిరగసాగాను.

అట్లా తిరగాడటంలో చూపు నిదానించింది.
ఉన్నది ‘ఉన్నది’ అనిపించడం మొదలైంది.
లేనిది “లేదులే’ అన్న విచారమూ మటుమాయం అయింది.

ఒక రోజు, ఆరున్నరకు హైదరాబాద్ లోని పార్సిగుట్ట నుంచి బయలుదేరి ఇందిరా పార్కుకు చేరుకున్నాను.
కొన్ని రాలి పడిన పువ్వులు తీశాను. ఎంత బాగా వచ్చాయో! దూరంగా కొలను ఆకర్శించింది. సరోవరమా? ఏమో!
బాతులు ఎంత ముద్దుగ వచ్చాయో! యు అన్న ఆంగ్ల అక్షరంలో ఒకదాంతో ఒకటి ఇమిడినట్టు వాటి నీడలు కూడా కొత్త భాషలు పోయేట్టు తీశాను. చూసిన మిత్రులు ఇవి నీ చిత్రాలేనా అన్నారు. మురిసిపోయాను.

ఇంకా కొన్ని అడుగులు వేశాను. మరీ దగ్గరయ్యాను అనుకుని వెనక్కి వెనక్కి నడిచి ఈ చిత్రాన్ని చిత్రీకరించాను.
ఆశ్చర్యం. కోనసీమలో ఉన్నట్లుంది, సీనరీ!
నాకూ అదే అనుభవం. చూసిన వారికీనూ.

పెద్ద ప్రింట్ వేసి ప్రదర్శిస్తే ఒకరిద్దరు ఇంట్లో వుంచుకున్నారు.
వారి దృష్టిలో నేను లేను. ఒక పరిధి పెట్టుకుని తిరుగాడే ఫొటోగ్రాఫర్ అస్సలు లేడు. వారి అనుభవమే అట్లా చల్లగా, హాయిగా ఉదయం వలే ఆ డ్రాయింగ్ రూములు.

ఒక రోజు చూసిన వాళ్లు అది, ‘కేరళనా?’ అని అడిగారు.
ఇంకొకరు అడిగారు, ‘ఆడమ్ అండ్ ఈవ్ కదా!’  అని.

దృశ్యాదృశ్యం.

అవును. నిజం. ఒకరు ఆ దృశ్యంలోని ప్రకృతిని ఇదివరకు తమ దృక్పథంలోంచి పోల్చుకుని చూసి కేరళకు వెళ్లినట్లుంది అన్నారు. ఇంకొకరు ఆ సరోవరంలో అట్లా నిశ్చలంగా ఉన్న ఆ పడవల కేసి చూసి, పక్కపక్కనే ఉన్న వాటి ఉనికిని గాఢంగా ఫీలయి, ఒక పురాతన దృశ్యం… ఎపుడో అదృశ్యమైన మన పరంపరకు మూలం, జీవం అన్నట్టు, అవి రెండూ మన ఆదిమ వారసత్వానికి ప్రతీకలా అని అడిగినారు.
అచ్చు’ఆడం ఈవ్ వలే ఉన్నార’నీ అన్నారు.

ఆశ్చర్యం.
ఆ కొబ్బరి చెట్ల నీడలు సరేసరే…
ఆ పడవల నీడలూ వారిని సరాసరి అక్కడకు తీసుకెళ్లాయనీ అన్నరు.

అప్పుడర్థమైంది, చిత్రానికి పరిధి లేదని!
జీవనచ్ఛాయలు మనుషుల వల్లే ఏర్పడవని!
మనిషిని పయణింపజేసే ప్రతి ఆవిష్కరణలోనూ మనిషి ఉన్నడని!

మరో అనుభవం.
ఒకాయన అన్నరు, ఈ చిత్రంలో హ్యూమన్ ఎలిమెంట్ లేదని!
దానికి జవాబుగా మరొకరు చెప్పనే చెప్పారు…. ‘ఈ చిత్రంలో మనిషి లేకపోవచ్చు. కానీ, ఈ ‘చిత్రీకరించడం అన్నది ఉన్నదే…అదే మానవ అంశం…హ్యుమన్ ఎలిమెంట్’ అని!

అలా ఇలా పరిపరి విధాలు. చిత్రవిచిత్రాలు.
పాఠక ప్రపంచం మాదిరే ప్రేక్షక ప్రపంచానికి ఒక చదువు వుంటుందన్న నమ్మకం క్రమంగా అనుభవంలోకి వచ్చింది.
ప్రేక్షకుడికి అనుభవం నుంచి ఒక చదువు వుంటుంది. వారిదైన చదువరితనం వల్ల ఆ వస్తువు లేదా దృశ్యం అందులోని ప్రతి అంశం విభిన్నం, విస్తృతం, విశేషమూ అవుతుందని!

‘బిట్విన్ ది లైన్స్’ మాదిరే ‘బిట్వీన్ ది ఇమేజ్’ ఒకటున్నదని అనిపించడం మొదలైంది.
అన్నిటికీ మించి ఒక ‘విస్తృతి’ పరిచయం అయింది.
నేను ఒక స్థలం పెట్టుకుని తిరగాడటం ఒకటి ఉన్నది. కానీ, ఆ ఒకదానితో చిత్రానికి సంబంధం ఉండవచ్చూ ఉండకపోవచ్చును.
ఈ చిత్రానికి వస్తే, అది తీసిన స్థలం ఇందిరాపార్కు అని అనుకోవడం నా కథనం.
కానీ, అది ప్రేక్షకుడి అనుభవంలో ఇంకొకటి గుర్తు చేస్తే అదీ రీడింగే!
ప్రేక్షక సమయం అది. వారి సందర్భమూ ముఖ్యమే.

చిత్రమేమిటంటే, ఈ చిత్రం చూస్తూ ఒకరు కేరళకు వెళ్లడం. ఇంకొకరు మనిషి పుట్టిన కాడికి వళ్లడం.
నేనేమో మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకుని ఊరు చుట్టూ తిరిగి ఒక తులసీదళం వంటి చక్కటి చిత్రం తీద్దామనుకుంటే, వారు మహత్తరంగా విస్తరించారు. నన్నూఅసాధారణంగా విస్తారం చేశారు.
ఇదంతా బిట్విన్ ది ఇమేజ్.

అందుకే చిత్రాలు చదవరారండి…
దయవుంచి నన్ను మా ఊరునుంచి బయట పడేయండి.

 

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

నన్ను వెతుక్కుంటూ వొచ్చింది కవిత్వం!

premio-nobel-de-literatura-chileno-pablo-neruda-2013-03-22-57728

 

“నెరుడా గురించి రాయమన్న వెంటనే నాలోపల ఏదో గాలి సందడి చేసింది.పగలబడినవ్వాలనిపించింది. సరే అని రాయటం మొదలుపెడితే కాగితాలు కాగితాలునిండిపొయ్యాయి. నేను రాయల్సింది కొద్దిగనే కదా అని గుర్తుకుతెచ్చుకోని, రాసినదంతా పడేసి ఏదో పది వాక్యాలు రాద్దాం అని కూర్చుంటే- అలా కవితలువస్తున్నాయ్. నెరుడాని అమితంగా ఇష్టపడే వాళ్లకు  నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది.

 

మా ఇంట్లోనే ఒక గోడౌన్  ఉండేది. అక్కడికి సామాన్యంగా ఎవ్వరూపోరు. ఒక్కతినే అక్కడికి వెళ్లి, అక్కడ వేలాడుతున్న చిన్న బల్బునువెలిగించి, అక్కడి నిశ్శబ్దానికి నెరుడా కవిత్వాన్ని వినిపించే వాడిని.  ఆనిశ్శబ్దంతో ఒక సంబంధం ఏర్పరుచుకున్నానో ఏమో, అక్కడికి వెళ్లి దొరికిన నెరుడాకవిత్వం అంతా చదవటం ఒక అలవాటు గా మారిపోయింది. ఇక్కడ నేను కవిత్వంరాయకుండా కేవలం వాస్తవాలను రాస్తూ నెరుడాని పరిచయం చేయటానికివిశ్వప్రయత్నం చేయదల్చాను.

 

నెరుడా చిలీకి చెందిన మహాకవి. నిజానికి నెరుడాని చిన్నవయస్సులో మరో గొప్ప కవయిత్రి గబ్రిఎల్ మిస్ట్రల్ చాలాప్రొత్సహించింది. నెరుడా కి తన సవతి తల్లి అంటే ఎంతో ఇష్టం. నెరుడా తన “మెమోఇర్స్” లో ఆమె పై తన ప్రేమను అత్యంత కవితాత్మకంగా చెప్తాడు. ఆమె “ఇంట్లోని చీకట్లనుండి బయటకి వొచ్చే నిశ్శబ్ద నీడ” అంటాడు.

 

నెరుడాతన తొలి పుస్తకం – “ఇరవై ప్రేమ కవితలు మరియూ ఒకవిషాద గీతం” – 1921 లో ప్రచురితమయ్యింది. అత్యంత చిన్న వయసుతోనే ఆ పుస్తకంద్వారా నెరుడా సాహిత్యలోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తనప్రేమ స్మృతులన్నీ – చిలీ దేశపు ప్రకృతి అందాలని కలగలిపి ఒక కవితాత్మక రూపంఇవ్వటంలో నెరుడాకు సాటి ఎవ్వరూ లేరు. గొప్పకవి అయిన లోర్కా నెరుడా కు మంచిస్నేహితుడు. లోర్కా నెరుడా గురించి యిలాచెప్తాడు “తనకు తత్వశాస్త్రం కంటేచావుతోనే ఎక్కువ సాన్నిహిత్యం, అంతర్గత ఆలోచనల కంటే బాధకి ఎక్కువ దెగ్గర-సిరా కంటే రక్తం గురించే ఎక్కువ తెలుసు. ఆ కవిలో ఎన్నో రహస్యమైన గొంతులువినిపిస్తూ ఉంటాయ్, అవేంటొ తనకే తెలియవు.”

 

రాజకీయంగా, నెరుడా కమ్యునిస్టు భావాలని నమ్మాడు. 1971 కాలం, నెరుడా రాజకీయ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి చేరుకున్న సమయం.  చిలీకమ్యునిస్టు పార్టీ నెరుడా ని ప్రసిడెంట్-అభ్యర్థిగా గా ఎన్నుకున్నప్పుడుతను ఆ భాద్యతని సాల్వడార్ అలండేకి ఇచ్చాడు. ఆ కాలంలోనే తనకు నొబెల్పురస్కారం కూడా వొచ్చింది. కాని ఆరోగ్యం క్షీణించడం వల్ల 1973లోకన్నుమూసాడు.

 

‘కవిత్వం’ అనే ఈ కవితలో నెరుడా తనకు మొట్టమొదటి సారికవిత్వం తో ఎలా పరిచయం అయ్యిందో చెప్తాడు. ఎది నాకు ఎంత ప్రియతమైన కవితఅంటే దీన్ని ఇంట్లో నా గోడ పై రాసుకుని రోజు పొద్దుననే లేచి చదివే దాన్ని .

 

ఈ నెల కవి: పాబ్లో నెరుడా

 tumblr_lgmaonlhmf1qdy8lno1_500

కవిత్వం 

 

 

 

అప్పుడు, ఆ వయసులో నన్ను వెతుక్కుంటూ

వొచ్చింది కవిత్వం.

 

నాకు తెలీదు, 

అది ఏ శీతాకాలం నుండో, ఏ నది లోంచి పుట్టిందో

దాని గురించి ఏమీ తెలీదు.

 

 

ఎలా వొచ్చిందో, ఎప్పుడు వొచ్చిందో,

అది స్వరం కాదు,పదాలూ నిశ్శబ్దం కాదు.

 

అకస్మికంగా రాత్రి శాఖల ద్వారా

ఒక వీధి నన్ను రమ్మని పిల్చింది,

క్రూరమైన మంటల నుండో, ఒంటరిగా తిరిగి వెల్తున్నప్పుడో.

అక్కడ ఒక అనామకుడిగా నిల్చుండిపోయినప్పుడు 

 

కవిత్వం నన్ను తాకింది. 

 

నాకు ఏం చెప్పాలో తెలియదు, 

మాట్లాడటానికి దార్లన్నీ మూసుకుపొయ్యాయి,

నా చూపు గుడ్డిదయింది, 

లోపల ఏదొ మొదలయ్యింది, 

జ్వరమో, మరచిన రెక్కనో ,

ఆ జ్వాల అర్థాన్ని వెంటాడుతూ,

నా దారిన నేను వెళ్లిపోయాను,

 

అప్పుడు రాసాను

ఏమీ తెలియని వాడు రాసే స్వచ్చమైన జ్ఞానంతో

పదార్థం లేని, బలహీనమైన,

శ్రేష్టమైన, అర్థరహితమైన, 

మొదటి అస్పష్ట వాక్యం, 

 

అకస్మికంగా స్వర్గాలు విడుదలయ్యాయి, 

గ్రహాలు తెరుచుకున్నాయి, తోటలు జీవం పోసుకుని ఆడాయి, 

నీడలకు చిల్లులు పడ్డాయి, 

 

 

బాణాలు, మంటలు, పూలు, 

ముడుచుకుంటున్న రాత్రి, ఈ విశ్వం

అన్నీ పొడుపుకథలు అయ్యాయి. 

 

 

 

అక్కడ అత్యంత సూక్ష్మజీవిని అయిన నేను,

రహస్యం లాంటి ప్రతిమ కలిగిన

ఆ గొప్ప నక్షత్రాల శూన్యాన్ని తాగి

నాకు మాత్రమే తెలిసిన స్వచ్చమైన అగాధం లో

నక్షత్రాల చక్రాలను నడుపుతుంటే


హృదయం గాలులతో స్వేచ్చగా విహరించింది.

 

 

 పరిచయం

సిరా– This name is a pseudonym. Please represent me as a pseudonym. Hope you see that many poets in history had written with a pseudonym. I would like to use the photo of Pessoa who is the master of pseudonyms and here is how I would like to introduce myself-

కేవలం సాహిత్యం కోసమే ఒక జన్మ ఉంటే బాగుంటుంది.

ప్రపంచం లోని అన్నిరకాల విషయాలను మర్చిపొయ్యి కేవలం సాహిత్యానికే పరిమితమవ్వాలి అనే  ఒక ఆలోచన ఎంత బాగుంటుంది?

సాహిత్యాన్ని సమాజాన్ని వేరు చేసే ప్రయత్నం కాదు, కాని సమాజం లో ప్రతిమూలని కెకేవలం సాహిత్యంతో చూస్తే ఎలా ఉంటుంది?

అసలు సమాజం అంతా మారుతున్నప్పుడు సాహిత్యం స్ఠానం ఏమిటి? ఇలాంటి  ఆలోచనలనుండి పుట్టినది సిరా.

సిరా కి స్వచ్చంగా నవ్వటం తెలుసు. అన్యాయం జరుగుతుంటే ఖండించటం తెలుసు. మౌనంగా కుర్చోని రోజులు గడపటం తెలుసు. గొప్ప సాహిత్యం చదివాక దానితో ఎప్పటికీ వీడలేని బంధం ఏర్పరుచుకోవడం తెలుసు. కుదిరితే అప్పుడప్పుడు అనువాదం చేయటమో, కవిత్వం రాయటమో తెలుసు.
There is a surreal Pessoa’s photo representing his many faces. I hope, that suits as my picture.

pessoa_________-

 

ఎంత దూరము..అది …ఎంత దూరము ?

Kadha-Saranga-2-300x268

ఆ గడపతో ఆమెకెంత అనుబంధమున్నా, ఆ క్షణంలో మాత్రం తను పూర్తిగా పరాయిదనట్టు, అపరిచితునింటికొచ్చినట్టు.. కొత్త గా, బెరుకుగా, చెప్పలేనంత జంకుతో అలానే నిలబడిపోయింది – మూసిన ఆ తలుపు బయట.
కాలింగ్ బెల్ నొక్కబోయిన చేతిని అప్పటికి రెండు సార్లు వెనక్కి లాక్కుని, మరో సారి ప్రయత్నించనా వద్దా? – అనే సందిగ్ధంలో ఆగింది.
ఎవరింటికైనా, మనం ఇష్టముంటే వెళ్తాం. లేకుంటే మాన్తాం. కానీ పెళ్ళైన ఆడపిల్ల పరిస్థితి మాత్రం అలా కాదు. ఇష్టమున్నా, లేకున్నా, మొగుడింటికి వెళ్ళాల్సిందే. వెళ్ళి తీరాల్సిందే. అదొక సోషల్ లా! సామాజిక చట్టం. ఫామిలీ రూల్. దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. అంతే. అదంతే.
ఇప్పుడు దీప్తి కూడా అదే సిట్యుయేషన్ లో వుంది. కాదు. ఇరుక్కుంది.
ఆమె వెనకే నుంచుని, – కూతురు పడుతున్న అవస్థనంతా గమనిస్తున్న ఆ తండ్రి హృదయం ఒక్కసారి గా నీరైపోయింది. ఆ కన్న తండ్రి గుండె కలుక్కుమంది. గారం గా పెంచుకున్న కన్నబిడ్డనా స్థితిలో చూడటం భరించలేనంత బాధగావుంది. చూస్తూ వూరుకోడం అమానుషం అని పిస్తుంది. ఒక్కసారిగా ఉద్వేగం పెల్లుబుకింది. ‘వొద్దురా దీపూ. నీకిష్టం లేని పని చేయొద్దు. నువ్వు నాకు భారమౌతావా. కాదు. ముమ్మాటికీ కాదు. పద. మనింటికి పోదాం’ అని అనాలనుకున్న మాటలు పెదవి దాకా వచ్చి, తిరిగి గొంతులోకెళ్ళి, ఆగిపోయాయి. కాదు. ఆపబడ్డాయి. భార్య మాటలు గుర్తుకు రాడంతో. “ అక్కడ మీకు అవమానం జరిగిందనో, తల కొట్టేసినట్టైందనో, ఇంకోటనో, మరొకటనో…కూతుర్ని వెంట పెట్టుకు రాకండి. మీరు వెళ్తోంది దాన్ని, దాని మొగుడింట్లో దింపి రావడానికి. దాని కాపురాన్నది సరిదిద్దుకోడానికి అన్న సంగతి అస్సలు మర్చిపోకండి. ఏమిటీ, వింటున్నారా?” ..ఆయనేం మాట్లాడ్లేదు. సరే అన్నట్టు తలూపూడు. కళ్ళముందింత జరుగుతున్నా, భార్య మాటకు కట్టుబడ్డ వాడిలా, అందుకే – మౌనంగా వుండిపోయాడు. దీపూ వైపు అసహాయంగా చూస్తూ.
ఇక అదే చివరిసారనట్టు, కళ్ళు మూసుకుని ధైర్యం తెచ్చుకుంటూ, ఎలా ఐతేనేం! కాలింగ్ బెల్ నొక్కింది.
కోయిల కూత కమ్మగా కూ..కూ..అంటూ మోగింది. ఈ ట్యూన్ ని తనే సెలెక్ట్ చేసింది. శ్రీకాంత్ కి ఇష్టమని తెలిసి.
కోయిల పాట ఆగిపోయింది. ఆమె లో కంగారు మొదలైంది.
ఇప్పుడు తలుపులు తెరుచుకుంటాయి. తనని చూస్తాడు. ఊ… చూసి? ఏమంటాడు?
నవ్వుతాడు. కాదు. దానికంటె ముందు ఆశ్చర్యపోతాడు. పట్టలేని ఆనందంతో అతని కళ్ళింతింతలై పోతాయి, వెన్నెల కాంతితో విచ్చుకుంటాయి.
తననిన్నాళ్ళూ మిస్సైనందుకు ఏమంటాడు? అతని మొదటి మాట ఎలా వుంటుంది? వినాల్నుంది.
అసలు మనిషెలా వున్నాడూ? దేవదాసు లా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నీరసంగా కనిపిస్తాడా? లేక, మజ్ఞూ లా మాసిన బట్టల్తో అగుపిస్తాడా?
ఆమె ఆత్రానికి, ఊహలకీ ఫుల్ స్టాప్ పెడుతూ..’యెస్..కమింగ్..’ అంటూ లోపలనించి, అతని స్వరం వినిపించింది. ఆ తర్వాత ఆ తలుపు తెరుచుకోడమూ జరిగిపోయింది.
ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోందని, అర చేతులు చల్లబడుతున్నాయన్న సంగతి కూడా ఆమెకి తెలీడం లేదు.
ఆమె నవ్వ బోయింది. అది చూసి అతని మొహం అప్రసన్నంగా మారిపోయింది. మరు క్షణంలో విపరీతంగా గంభీరమై పోతూ ఆమె మొహం లోకి లోతుగా చూసాడు.
ఎందుకొచ్చావ్? అని అడిగినట్టనిపించిందామెకి. వెంటనే ప్రాణం చచ్చినట్టైంది.
భరించలేనంత అవమానంతో కళ్ళు దించేసుకుంది.
మొగుడనేవాడు చూపుల్తోనే ఇంత కఠినంగా అవమానించగలడన్న సంగతి ఆమెకిప్పుడే తెలుస్తోంది. ఆమె అమాయకత్వం కానీ, అసలు త్రేతా యుగం నాట్నించీ కూడా మొగుడి తీరు ఇంతే. ఆ రాముని అవమానపు చూపులు భరించలేక కాదూ?, ఆ సీతమ్మ తల్లి నిప్పుల్లో దూకింది?! హు.
అయినా, మొగుడు అన్ని చోట్లా మొగుడు కాదట. అనుభవజ్లులైన ఇల్లాళ్ళ మాటలు కాదని కొట్టేయలేం. ఇవన్నీ తనకూ తెలిసి రావాలంటే దీప్తికింకా టైం పడుతుంది. అవును, పాపం! ఎన్నాళ్ళైందనీ పెళ్ళై? సరిగ్గా యేడాది కూడా కాలేదు మరి.
ఇంతలోనే ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కారణం – ఆమె దృష్టిలో పెద్దదే. అందుకే ఇల్లొదిలి వెళ్ళిపోయింది. తన కోపం తీర్చి, కాళ్ళు పట్టుకుని బ్రతిమాల్తాడనుకుంది..కానీ ఆ పప్పులేం వుడకనట్టున్నాయి.
రోజులు, వారాలు, గడచి, నెలలు దాటినా మొగుడి జాడ లేదు. అయితే ఇక రాడా? వొదిలేసినట్టేనా? దిగాలు పడిపోయింది. కళ తప్పిన కూతురి మొహం చూసి తల్లే నెమ్మదిగా అన్నీ అడిగి తెలుసుకుంది. మంచి మాటలు చెప్పి, కూతుర్ని దింపి రమ్మని చెప్పింది వాళ్ళాయనకి.
అదీ జరిగిన సంగతి.
ఇలా వెనక్కి రావడం దీప్తికస్సలిష్టం లేదు.

ఇన్నాళ్ళ సాహచర్యం చేసిన కృతజ్ఞతైనా లేని ఈ మనిషి – రమ్మని పిలవకుండా, కనీసం ఫోనైనా చేయకుండా..తనంతట తానై రావడం మనసుకి నచ్చట్లేదు. పైగానామోషీ గా కూడా వుంది.
అయినా, ‘పోన్లే పాపం మొగుడుం గారే కదా’అని తిరిగొస్తే…ఇలానా ఆహ్వానించడం?
‘ఛ’ అనుకుంటూ తల దించేసుకుంది.
అతనికిదేం పట్టనట్టు లోపలకెళ్ళిపోయాడు. తను ఆఫీస్ కెళ్లే హడావుడి లో వున్నాడన్న సంగతి ఆ ఇద్దరికీ అర్ధమయ్యేలా ..గబ గబా షూస్ వేసుకుని, ఆ లేసులకి ఓ రెండు ముళ్లు బిగించాడు. మెడకేసుకున్న టై కు ఓ ముడేసి, క్షణంలో లాప్టాప్ ని బాగ్ లో తోసి, కారు కీస్ తీసుకుని పెద్ద పెద్ద అడుగులతో గడప దాటుకుంటూ… లిఫ్ట్ వైపు వేళ్ళిపోయాడు దురుసుగా.
అతని ప్రవర్తనకి ఆ ఇద్దరూ ఖిన్నులైపోయారు. చిన్నబోయారు. ఆమె – చలనం లేనిదైపోయింది. అయితే ముందుగా తేరుకున్న ఆ తండ్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే తనేం చేయాలో అర్ధమైన వాడిలా, చేతిలోని సూట్ కే ని లోపలకి తోసేసి, “అల్లుడు గారూ! వుండండి..నేనూ వస్తున్నా..అక్కడ దాకా డ్రాప్ చేద్దురుకానీ..” అంటూ అల్లుడికి వినిపించేలా ఓ కేకేసి, అంతే వేగంగా ఇటువైపు తిరిగి అన్నాడు. “ వస్తానురా తల్లీ. జాగ్రత్త! అవసరమైతే వెంటనే కాల్ చేయ్.” అంటూనే, ‘ నీకేం ఫర్వాలేదు నేనున్నా..’ అని భరోసోగా సైగ చేసి పరుగులాటి నడకతో వెళ్ళిపోయాడాయన.
నిజానికి కూతుర్ని కొత్తగా కాపురానికి పంపుతున్నప్పుడు కంటేనూ, ఆడపిల్లనిలా బలవంతంగా అత్తారింట్లో దింపి, వెళ్లిపోవాల్సి రావడమే ఏ తండ్రికైనా దుఃఖం తో గుండె చెరువౌతుంది. గుండె భారమౌతుంది. రంగనాధానికి కూడా అలానే వుంది. కానీ భార్య అలా అనుకోకూడదనీ, ఆ ఆలోచన్లతో మనసుని బాధపెట్టుకోకూడదనీ, సర్ది చెప్పింది. అందుకు తగిన కారణాన్ని కూడా ఎంతో సహనంగా వివరించడం తో ఆయన ఆగుతున్నాడు.
ఏ కారణాలెలా వున్నా, అవేవీ దీప్తి ని ఓదార్చలేకపోతున్నాయా క్షణం లో.
ఆమె ఒంటరిగా అక్కడే నిలబడి పోయింది, మాట రానిదానిలా, అసలేమీ అర్ధం కాని దానిలా అయిపోయింది పరిస్థితి.

10411164_610855999030323_8810754119747777955_n

Painting: Rajendra Jadeza

మన వివాహ వ్యవస్థే అంత. సమస్త అస్తవ్యస్తాల మయం. అశాంతి నిలయం. మనసులు కలవని స్త్రీ పురుషులు కేవలం పెళ్ళి కారణంగా కలుసుండటం ఎంత దారుణం?- ఎవరికోసం?ఎందుకోసం? దేని కోసం? ఏ గమ్యం కోసం? ఈ కలసి బ్రతకడం అనిపిస్తుంది. అన్నీ ప్రశ్నలే. తెలీని పజిల్సే.
ఎందుకెళ్ళాలి తను లోపలకి? అసలెందుకు రావాలి తను వెనక్కి? ‘అవును. నిన్నెవరు రమ్మనేడ్చారిక్కడా? ’ అని తనని మొహమ్మీదే అడిగినట్టు లేదూ?, అతనూను, అతగాని ప్రవర్తనాను..?
“అలా అనుకోకు. నీ ఇంట్లో నీకవమానమేవిటీ, వింత కాకుంటే? ఊ?.. చూడు దీపూ! అదే నీ ఇల్లు. నీ ఇంటికి నువ్వెళ్తున్నావ్. ఎవరో వచ్చి నిన్ను బొట్టు పెట్టి పిలవాలని ఎందుకనుకుంటావ్? వెళ్ళు. నా మాటవిని వెళ్ళు. ” తల్లి మాటలు గుర్తుకొచ్చాయి.
“అవును. ఇది తన ఇల్లు. చట్ట ప్రకారం అతను తన భర్త. అతని మీదే కాదు, ఈ ఇంటిపై కూడా తనకు సర్వ హక్కులూ, అధికారాలూ వుంటాయి. వుండి తీర్తాయి. అసలా మాటకొస్తే, తనెప్పుడైనా రావొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కాదని ఎవరంటారో తనూ చూస్తుంది. ఏమనుకుంటున్నాడు తనని? హు.!” ఉక్రోషం తో ముక్కుపుటాలదిరాయి.
“అయినా, నువ్విప్పుడింతగా అప్సెట్ అయ్యేందుకేముంది చెప్పు! నీ మొగుడు నిన్ను పన్నెత్తి పలకరించలేదన్న మాటే కానీ, నీ మొహం మీద తలుపులు మూసి పోలేదు గా పొమ్మని. అంటె పరోక్షంగా, లోపలకి రమ్మనే గా దానర్ధం? పద. లోపలకి పద. గడపలోకి ముందు గా కుడికాలు పెట్టు. ..” అంటూ ఆమెకి ధైర్యాన్నిస్తూ, ముందుకు తోసింది అంతరాత్మ.
గట్టిగా నిట్టూర్చి, లోపలకడుగేసింది దీప్తి. కొత్తపెళ్లికూతురు గృహప్రవేశం చేసినట్టు. ఒక్కసారి నలువైపులా కలయచూసింది.
ముందు హాలంతా గజిబిజిగా వుంది. న్యూస్ పేపర్లు గుట్టలు గుట్టలు గా పడున్నాయి. టీవీ స్క్రీన్ మీద దుమ్ము పేరుకు పోయుంది. షూ రాక్ లో చెప్పులు, షూస్ ఎడా పెడా బోర్లా పడున్నాయ్. టేబుల్ కాలెండర్ ల్ పేజ్ మార్చనే లేదు.
ఐ తను వెళ్ళిన నెలనే చూపిస్తోంది. అంటే – మారలేదు. శ్రీ కూడా మారలేదు. తన గురించి ఆలోచిస్తూ..అలానే విరక్తిగా వుండిపోయాడా!?
ఆ ఒక్క చిన్ని తలపే..మనసులోని భారాన్నంతా దించేసింది.
స్త్రీ హృదయం-
పాషాణం కాదు. నవనీతం మరి.
మనల్ని ప్రేమించే వారి ప్రేమ, ఎంత శాతమనే విషయం మనం దగ్గరున్నప్పుడు కంటేను దూరమైనప్పుడే తెలుస్తుంది. నా అనుకున్న వారి అసలైన ప్రేమ మన ఆబ్సెన్స్ లో నే తెలియాలి.
శ్రీని చూస్తూనే అనుకుంది. చిక్కిపోయాడని. ఇప్పుడీ ఇల్లు చూస్తుంటే మరీ జాలేసిపోతోందామెకి.
‘నీ కోసమే మేమంతా ఎదురుచూస్తున్నాం..ఎన్నళ్ళైపోయింది నువ్వు మా అతీ గతీ పట్టించుకోక? ఏమైపోయావు మిత్రమా? అని తనని దీనంగా అడుగుతున్నట్టు తోచింది.
ఆ ఇల్లాలి గుండె కరిగిపోయింది. అవును. ఏ ఇల్లాలైనా మొగుడి తర్వాత అమితంగా ప్రేమించేది తన ఇంటినే ! నా ఇల్లు, నా సంసారం అనే ప్రేమతో కూడిన కమిట్మెంటే కనక లేకుంటె ఏ ఇల్లాలికైనా, ఈ ఇళ్ళన్నీ ఏమైపోయెండేవి? ఎంత చెత్త కుండీలైపోయేవీ కావూ?
హాల్ దాటుకుని ఇటుగా, వంటింట్లోకొచ్చి చూసింది. కిచెన్ ప్లాట్ ఫాం అంతా యెడా పెడా డబ్బాలతో, స్టీల్ గ్లాసులతో, విరిగిపోయిన గాజు కప్పుల తో నిండిపోయుంది. సింక్ నిండా చెత్తా చెదారము, అన్వాష్డ్ డిషెస్ తో నానా బీభత్సంగా కనిపించింది.
పనమ్మాయి సంగీత రావడం లేదా పనికి? ఫోన్ చేయాలి.
శ్రీకాంత్ కి వంటిల్లు ఎలా వుండాలంటె, స్పిక్ అండ్ స్పాన్ లా వుండాలి. ఏ ఒక్క వస్తువు బయటకి కనిపించకూడదంటాడు. మరి ఇప్పుడీ వాతావరణాన్నెలా ఎలా భరిస్తున్నాడూ? – ‘నువ్వు లేవన్న విషాదంలే..” మనసు చెప్పింది. ఎంత ఆనందమేసిందో అంతర్వాణి మాటలకు.
వేళకేం తింటున్నాడో ఏవిటో అని గ్రోసరీ షెల్ఫ్ తెరిచి, ఆరాగా చూసింది. వస్తువులన్నీ అలానే వున్నాయి. డస్ట్ బిన్ నిండా బయట్నించి తెచ్చుకున్న ఫుడ్ పాక్స్ కనిపించాయి. అంటే, వంట చేసుకోడం లేదన్నమాట. ఈ మూణ్నెల్లన్నించీ హోటళ్ల కూడే తింటున్నాడా? అయ్యో! శ్రీ కాంత్ కి అస్సలు బైట తిండంటేనే – ఎలర్జీ కదూ?
‘పాపం! మరేం చేస్తాడే?, వండి వార్చి పెట్టే ఇల్లాలు హఠాత్తుగా ఇల్లొదిలి పోతే?- నీ చేతి వంటంటే ఎంత ఇష్టమూ? ఎన్నిసార్లు చెప్పాడు నీకాసంగతి? మర్చిపోయావా? “
“ఊహు. మర్చిపోలేదు. “
“మరెందుకెళ్లినట్టు..ఆ పిచ్చాణ్ణి వొదిలి?”
“ఎందుకంటె, ఎం..దుకం..టే.. ఇప్పుడు కాదులే తర్వాత చెబుతాలే..నా మనసా, చేయక రభస, అవతలికి ఫో..” నవ్వుకుంటూ తనలో తను, పడగ్గదిలో కి తొంగి చూసింది.
నల్ల టేకు, నగిషీ చెక్కిన డబల్ కాట్ మంచం. రాత్రి రంగుల స్వప్నం.
ఇదేమిటీ, ఇలా? మంచానికి అడ్డంగా ఆ తలగడలు?
అది కాదు, మంచం మీద పరచివుండాల్సిన బెడ్షీట్ జారిపోయి, బ్లాంకెట్ కార్పెట్మీద కూలిపోయి పడుంది. క్లాజెట్ డోర్స్ సగానికి జరిపి, వదిలేసున్నాయి. లోపల హాంగర్కి ఒక్క చొక్కా వ్రేలాడి లేదు. బట్టలన్నీ ఒకదాని పైనొకటి ఇష్టమొచ్చినట్టు జారిపడి కుప్పపోసుకునున్నాయి. చూడం గానే, కంపరం పుట్టుకొచ్చింది ఆమెకి.
పాపం, శ్రీకాంత్! తను లేనని, ఇక రానని నిరాశతో, బెంగతో…హూ!
ఇలా నిట్టూరుస్తారు కానీ, చాలామంది ఇల్లాళ్ళకు అదే ఓ గొప్ప బలాన్నిచ్చే అంశం. ‘మా ఆయన నేను లేకుండా బ్రతకలేరు. కనీసం కాఫీ అయినా పెట్టుకుని తాగలేరు..అంటూ గర్వంగా చెప్పుకోడం ఇష్టం. అదొక హోదా. పెళ్లానికి మొగుడు చేయించకుండానే అమిరే ధగధగల నగ.
ప్రస్తుతం ఆ సంబరం లోనే వుంది మన దీపూ కూడా.
హూ! పిచ్చివాడు!చెలి లేని చిరుగాలులెందుకు? …నా దేవి లేని ఈ గుడి ఎందుకు? అని అనుకున్నాడేమో! మరి ఆ సంగతి తనతో చెప్పలేదెందుకనీ?
“ పెళ్ళాలయ్యాక – ప్రేమికులు ప్రేమించుకోడం మానేస్తారట. నీకా భయం వుండదు. ఎందుకంటే నీది ప్రేమ వివాహం కాదు కాబట్టి. నువ్వు ఇష్టపడి శ్రీకాంత్ ని పెళ్ళి చేసుకుంటోంది.. అతన్ని జీవితాంతం ప్రేమిచడానికే. తెలుసా?”
తల్లి – తన చెవిలో రహస్యం గా చెప్పిన మాటలు తలపుకొచ్చాయి.
ఎంత బాగా చెప్పింది అమ్మ! తను వినదు కానీ, అమ్మ చెప్పే ప్రతి మాటా ఎంతో విలువైనది! నిజానికి అమ్మ చెబితేనే గా, తను వెనక్కి వచ్చేసింది ఇలా!
“అలా అమ్మ మీద కంతా నెట్టేయకు. నీకు మాత్రం మనసులో రావాలని లేదా, ఏమిట్లే.” మనసు టీజ్ చేసింది. .
అప్పటి దాకా మొగుడి మీదున్న అనుకొండ లాటి కోపం పోయి, ఆ స్థానే, అనురాగ గంగ వెల్లువై పుట్టుకొచ్చింది.
తల్లి మాటలు గుర్తుకొచ్చాయి గుప్ఫున. “ ప్రతి భర్తకీ తన భార్య అవసరం ఎంతో వుంటుందన్న సంగతి తెలుసు. కానీ, ఎటొచ్చీ ఇంత అని చెప్పడం మాత్రమే తెలీదు. అంత మాత్రాన, అతను నిన్ను ప్రేమించడం లేదని అపోహపడటం సమంజసం కాదు సుమా. భర్త కోపంలో వున్నప్పుడే భార్య అతన్ని అర్ధం చేసుకోవాలి. అప్పుడే అర్ధాంగి అనే పదానికి అసలైన అర్ధం లా నిలుస్తుంది ఇల్లాలు.”
“నిజం చెప్పావమ్మా! ..ఇదిగో ఈ ఇంటినిలా సంత లా చూస్తుంటే, ఈ ఇంటికి నా అవసరం ఎంతుందో, ఈ మనిషికి నా ఆవశ్యకత ఏ రేంజ్ లో వుందో ఇట్టే తెల్సిపోతోంది. థాంక్స్ అమ్మా, థాంక్యు!” -మనసులోనే తల్లికి థాంక్స్ చెప్పుకుంది సంతోషంగా.
భర్త మీద పట్టలేనంత కోపమొచ్చినప్పుడు, మనస్పర్ధలు మితి మీరినప్పుడు . ఆ ఆగ్రహంలో ఏ స్త్రీ అయినా డిసైడైపోతుంది. ఇక ఇతనితో కలసి కాపురంచేయడం కంటే, విడిపోయి ఒంటరిగా బ్రతకడమొకటే సుఖమని. కానీ, అదే భర్త – తను దూరమైతే బ్రతకలేడన్న సంగతి తెలుసుకున్నప్పుడు మాత్రం – తన తప్పుడు ఆలోచనకి పశ్చాత్తపం చెందుతుంది. అందుకు నిదర్శనమే ఈమె!- దీప్తి.
సాయంత్రం ఆయనగారు ఆఫీస్ నించి ఇంటికొచ్చేలోపు ఈ కూలబడ్డ సామ్రాజ్యాన్ని పునః నిర్మించి, యువరాజా వారి పాలెస్ లా మార్చేయాలని గట్ఠిగా నిర్ణయించుకుంది.
ఉత్త ఇల్లేనా? లేక అతనికమిత ప్రియమైన బెడ్రూం కూడా అలంకరిస్తావా?”
-‘ ఫోవోయ్, నా ఇల్లు, నా మొగుడు – నా ఇష్టం. నేనేమైనా చేసుకుంటా. మధ్యన నీకుందుకు చెప్పాలి? బిడియ పడిపోయింది.
‘గుడ్ దీపూ. గుడ్. అదీ స్పిరిట్ అంటే. నువ్వెదుగుతున్నావ్’ అమ్మ నవ్వుతూ వెన్ను తట్టినట్టైంది.
ఇంటిని ఒక పట్టు పట్టాలంటే..ముందు ఓ కప్ – ఫిల్టర్ కాఫీ కావాలి తనకు. అర్జెంట్ గా!
నడుం చుట్టూ, చీర కొంగు బిగించి కుచ్చెళ్ళు పైకి దోపి, వంటింట్లో కెళ్ళి, స్టవ్ వెలిగించింది.
డికాషన్ కని, నీళ్ల గిన్నె వుంచుతూ..అల్లరిగా ఓ అడ్వర్టైజ్మెంట్ ని ఇమిటేట్ చేసింది. “ టింగ్ టింగ్..మొగుడితో పోట్లాడి పుట్టింటికెళ్ళి, తిరిగొచ్చారా?
ఇల్లంతా యుధ్ధం తర్వాతి వాతావరణం కనిపిస్తోందా? అయితే వినండి. మొండి మొగుణ్నీ, ఇంటి చెత్తనీ ఒక కొలిక్కి తేవాలంటే మీకు వెంఠనే కావాలి ఈ దీప్తి చేతి కాఫీ ! ..చిక్కనైన రుచి గలది, చక్కని చురుకుదనాన్ని కలిగించేది..దీప్తి చేతి కాఫీనే తాగండి. తాగించండి. క్షణాల్లో కోపం మాయం. ఇంటి పని శుభ్రం. ఇంక ఆలస్యమెందుకు. పదండి అసలైన సిసలైన కాఫీని ఆస్వాదిద్దాం. టింగ్ టింగ్..’ తన ప్రకటనలకి తనే లిరిక్ కట్టి పాడుకుంటూ, ..ఘుమఘుమలాడే కాఫీ తయారుచేసుకుంది. ఆ కేరళా కాఫీ ఫ్లేవర్ ఘుమాయింపుల ఆఘ్రాణింపులో.. ఆహాహా..! ఎక్కడ్లేని ఉత్సాహం పొంగుకొచ్చేసింది. ఆ వెనకే, ఉల్లాసంగా..పనిలోకి దూకింది.
రేడియో ఎఫెం హిందీ సాంగ్స్ వింటూ, హమ్మింగ్స్ తో..హాహా రాగాలతో.. హోరుగా, హుషారుగా డస్టింగ్, వాషింగ్, క్లీనింగ్ పనుల్లో మునిగి తేలింది. అప్పుడప్పుడు మెడొనాని గుర్తుచేసుకుంటో, బూజు కర్రలు పట్టుకుని షకీర లా నడుం ని రింగులు తిప్పుతూ.. ఈల వేసుకుంటూ, గోల చేసుకుంటూ… చకచకా ఇంటి పనంతా ఫినిష్ చేసేసింది.
అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. “దీపూ! కాలాన్ని సంతోషంతో నింపుకుంటూ, క్షణక్షణాన్ని అనుభూతించడానికే మనకీ జన్మ సరిపోదు. అలాటిది సమస్యలను కొనితెచ్చుకోడానికి నీకు టైమెక్కడుంటుంది చెప్పు? ఊ?”
‘ అబ్బ. కరెక్ట్ గా చెప్పావు మమ్మీ..అద్భుతం నీ మాటలు.” మనసులోనే తల్లిని ప్రశంసించింది.
మనం కష్టంలో వున్నప్పుడు, ఊరడించే వారి మాటలే మనకెక్కువగా గుర్తుకొస్తుంటాయి. అవి జీవితానుభవాల తో కూడి వుంటం వల్ల వెన్నెంటే వస్తుంటాయి. అందుకే దీప్తికి తల్లి మాటలు అడుగడుగునా, పదే పదే తలపుకొస్తున్నాయి.
*******
పగలైపోయింది. సాయంత్రం చీకట్లు చుట్టుకునే దాకా ఆమెకి టైమే తెలీలేదు.
బూజు రాలగొట్టడంతో – గోడలు, దుమ్ము వదిలించడంతో గ్లాస్ అద్దాలు, తళతళమంటున్నాయి. పాలరాతి ఫ్లోరింగ్ – అద్దం లా మెరిసిపోతోంది.
కిటికీలకి, తలుపులకీ కొత్త కెర్టెన్స్ మార్చింది. సోఫా దిళ్ళకి మిర్రర్ వర్క్చేసిన కవర్లు తొడిగింది.
బాల్కనీ లో పూల కుండీలన్నిటికీ నీళ్ళు పెట్టి, వాట్నొక క్రమంలో అమర్చింది.
చివరగా, ఫ్లవర్ వాజ్ లో తాజా పూలు సర్ది, స్ప్రే జల్లింది. గుప్పుమనే గుభాళింపులతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా.
తన టాలెంటంతా ఉపయోగించి మరీ ప్రత్యేక శ్రధ్ధతో ఇంటిని అలంకరించింది. ఆమె – ఇంటీరియర్ డెకరేషన్ లో స్పెషల్ డిప్లొమా చేసింది. కొన్నాళ్ళయ్యాక, కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా వుంది.
శ్రీకాంత్ ఇంటినిలా చూస్తూ చూస్తూనే..అతనికి తన మీదున్న కోపమంతా పోవాలి. అలకలన్నీఅటకెక్కి, తామిద్దరూ కలిసి మునపటిలా..హాయిగా నవ్వుకోవాలి.
అమ్మేం చెప్పింది?
“మాటల్లో సైతం గతంలోకెళ్లకుండా జాగ్రత్తపడాలి. తెలిసిందా? ఎందుకంటే, అన్ని యుధ్ద్ధాలకి మూలకారణాలు -మాటలే! భార్యాభర్తలు మాట్లాడుకోడం వల్ల – కాపురంలో శాంతి కలగాలి కానీ, చిచ్చు రగలకూడదు. గుర్తుపెట్టుకో. సరేనా దీపూ?”
“అలాగే అమ్మా! ప్రామిస్. అసలేమీ అనను. అతన్ని మాటల్తో సాధించను సరా?”
అవును. ఇకనించి అన్నీ అమ్మ చెప్పినట్టే వింటుంది తను.
అతనికిష్టమైన వంటకాలు చేసి, డైనింగ్ టేబుల్ మీద నీట్ గా సర్దేసి..ఒక్కసారి ఇంటినంతా పరికించి చూసింది.
ఇంద్ర భవనం లా కనిపించింది. ఇంటిని ప్రేమించడమంటే…దేవుణ్ని ప్రేమించడమే. అందుకే ఇల్లాలు దేవత అని అంటారు కామోసు!
******
మూణ్నెల్ల తర్వాత భర్త తో గడపబోతున్న మధుర క్షణాలు మదినూరిస్తుంటే..కళ్ల ముందు ఇంద్ర ధనస్సొచ్చి వాలుతుతున్నంత సంబరం గా వుందామెకి. వుండదు మరి!
భార్యా భర్తల మధ్య నిజమైన రొమాంటిక్ క్షణాలెప్పుడుంటాయంటే, ఎప్పుడూ అన్యోన్యంగా వుంటం వల్ల కాదు.
ఇద్దరి మధ్య ఒక ఘోర యుద్ధం జరిగాక, కుదిరిన సమన్వయం తర్వాతనే.
అతను మాధవుడో కాదో కానీ, ఈమె మాత్రం అచ్చు రాధికలా ..ఆ పాత్రలో లీనమైపోతోంది.
మొన్న కాదనుకున్న కాపురం, వొద్దేవొద్దనుకున్నభర్త ..నేడు కావాలనుకుంటూ విరహించడం ఎంత వింత కదూ? కానదే చిత్రం. స్త్రీ మనస్తత్వం.
ఎందుకు ప్రేమిస్తుందో
ఎందుకు కలహిస్తుందో..
ఎందుకు నిశ్శబ్దమౌతుందో
మరెందుకు నీరౌతుందో
కన్నీరౌతుందో
నీ – రవమౌతుందో!
ఎలా తెలుస్తుంది? అవును. ఎలా తెలుస్తుంది. ఆమెని అర్ధం చేసుకోగల హృదయం అతనికి లేకపోతేను?
పొద్దుట్నించీ, నడుం విరిగే లా పనిచేసీ చేసీ ..అలసిన శరీరానికిప్పుడు స్నానం ఒకటే గొప్ప రిలాక్సేషన్!
వొళ్ళు విరుచుకుంటూ, బాత్ రూం వైపు నడిచింది. షవర్ బాత్ కోసం.
ఈ షవర్ స్నానాన్ని ఎవరుకనుక్కున్నాడో కానీ, ఒకసారి దీని ప్రేమలో పడితే టైమే తెలీనీదు. జలపాతాలని తలపిస్తూ, కాదు కాదు, చిరు వర్షపు జల్లుల తడుపుతూ… పూల నక్షత్రాలు విసురుతూ, వొళ్లంతా ఎక్కడా సూది మొనంత చోటైనా వదలక, జడిజల్లుల, తడిపెదవుల చుంబనాలతో ముంచేస్తుంది. ..వహ్వా..ఎంత అద్భుతమైన భావాలని ఇచ్చిపోతుంది షవర్ బాత్!
బాత్ టబ్ ఒక సరస్సు అయింది. అందులో ఆమె ఒక జలకన్య లా మారింది.
బృందావనమెందుకో, యమునాతటమెందుకో..నా ముందర నువ్వుంటే నందనవనమెందుకో?..
మునకలన్నీ మంచి గంధాల లేపనాలు గా ..నీ మధుర జ్ఞాపకాలేవో..మరి మరి మరులు గొలుపుతూ..
మధురోహల తేలుతూ..అలా అలా..అలుపు తీరేదాకా స్నానిస్తూనే వుంది.
తలుపు చప్పుడైతే…గబగబా టవల్ చుట్టుకునొచ్చి చూసింది. ఎవరూ లేరు.
నిరాశ అనిపించినా, తన సింగారం పూర్తి కాకుండా అతను రాకపోడమే మంచిదని సంతోషించింది.
****
ఏడు దాటిపోయింది.
అతను రాలేదు.
ప్లాస్క్ లో సిధ్ధం గా వుంచిన టీ ని తనే రెండు సార్లుగా సేవించింది.
అతని కిష్టమని కట్టుకున్న పాల నురుగు షిఫాన్ జరీ చీర వైపు, వేసుకున్న చేతి గాజుల వైపు మార్చి మార్చి చూసుకుంది.
జడలో జాజి పూల దండ సాయంత్రం కన్నా, ఇప్పుడు మరికాస్త రెక్కలిప్పుకుని, యవ్వనాన్నొలకబోస్తోంది.
ఎనిమిది దాటింది.
తొమ్మిదైంది.
పదిలోకి మారింది.
నిట్టూర్చింది, గోడ గడియారం వైపు చూస్తూ.
కాసేపు టీవీ సీరియల్ చూసింది. బోర్. మరి కాసేపు కర్ణాటక సంగీతం వినబోయింది. కర్ణ కఠోరంగా వినిపించింది. ఎం టీవి మ్యూజిక్ – చెవిలో హోరుగా వుంది. న్యూస్ చూడబోయింది. తలనొప్పొచ్చేసింది. టీవీ కట్టేసి, అలా డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూలబడి పోయింది.
ఇల్లంతా నిశ్శబ్దం..నిశ్శ..బ్దం. గుబులుగుబులు గా చీకటి . తెరలుతెరలుగా గుండె లోతుల్లోంచి ఏదో బాధ పొగలు చిమ్ముకుంటోంది. బయట బాల్కనీ లోంచి రాత్రిచీకటంతా ఇంట్లోకి ప్రవహిస్తూ..కాదు తన వొంట్లోకి ఇంకిపోతూ..
ఒక్కసారిగా ఒంటరి తనం – నల్ల తాచు పాములా.. ఆమెని నిలువునా చుట్టేసుకోడంతో ఎక్క డ్లేని దిగులొచ్చింది. దుఖాన్నాపుకోలేనిదైంది. గభాల్న రెండు చేతుల్లో ముఖం దాచుకుంది..
ఏమిటీ? అసలు తను ఏం చేస్తున్న పనేమిటీ? తన పొరబాట్లను లెక్కోసుకుంటోంది. ఇలా –
సిగ్గు లేకుండా, అతను రమ్మనకుండానే రావడం తను చేసిన మొదటి తప్పు. వచ్చాక, కనీసం అతను పలకరించనైనా పలకరించకుండా వెళ్లిపోయినా, ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం రెండో తప్పు.
పొద్దుట్నించీ కనీసం ఒక్క ఫోన్ కాలైనా చేయని ఈ కసాయి కోసం..తనిలా ఎదురుచూడటం..నిజమైన తప్పు.
అసలే కాలం లో వుంది తను? ..అమ్మ లా, అమ్ముమ్మలా ఇలా మొగుడి కరుణా కటాక్షాలకోసం, కంటి చూపుల కోసం పాకులాడటమేమిటీ, పడిగాపులు కాయడమేంటీ? అదీ – తనేమిటీ, తన వ్యక్తిత్వమేవిటీ? తన మనస్తత్వానికీ విరుధ్ధం గా తను చేస్తోందేమిటీ?
అదలా వుంచు. ఇదేమిటీ, ఇలా, శొభనపు పెళ్ళికూతురిలా తయారై కూర్చోవడమేమిటీ, రాని వాని కోసం ఈ నిరీక్షణలేమిటీ? నిట్టూర్పుల సెగలేమిటీ? పరమ అస్సహ్యంగా! …ఇదంతా దేనికోసమూ..అని ఆలోచిస్తే ఆమెకి తన మీద తనకే పట్టలేనంతా ఆగ్రహమేసింది.
చివ్వున లేచి, జడలో జాజిపూల చెండు తీసి, మూలకిసిరేసింది. తెల్లచీరలోంచి వెంటనే నైటీ లోకి మారింది. అతనితో కలసి గుడికెళ్దామనుకుంది. కానీ, ఇప్పుడు ఆ ఆలోచన చేసినందుకు తనని తాను నిందించుకుంటోంది.
విస్సురుగా గదిలొకెళ్లి, అంతకంటే విసురుగా మంచం మీద బోర్లా పడి, దిండులో ముఖం దాచుకుంది.
పొద్దుట్నించి తిండీ తిప్పలు లేకున్నా దగ్గరకి రాని నీరసం…ఇప్పుడు అతని నిరాదరణకి నిస్సత్తువెత్తుకొచ్చింది.
జీవిత భాగస్వామ్యుల మధ్య అవగాహన కంటే ముందు మర్యాద వుండాలి. దాన్నిచ్చిపుచ్చుకునే విధానం వుండాలి. ఆత్మ గౌరవానికీ, ఆత్మాభిమానాలకి భంగం కలగకుండా నడచుకునే ఓ గట్టి నిర్దేశికత కలిగి వుండాలి. ఇవేవీ..లేనప్పుడు, ఇక శూన్యమనుకున్నప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు తను ఎదుర్కుంటున్న పరిస్థితే గనక ఏ ఆడపిల్లకైనా ఎదురైతే ఏం చేయాలి?
శుభ్రంగా అతగాణ్ణి నాలుగు కడిగి, నీ ఏడ్పు నువ్వేడు. నాకు నీలాటి పనికిమాలిన వాడితో కాపురం చేయాల్సిన అగత్యం కానీ, అవసరం కానీ లేదని చెప్పి, వెళ్ళిపోవాలి. ఇతనొక శాడిస్ట్ అని కోర్ట్ లో నిలబెట్టి, విడాకులు ఇప్పించుకోవాలి. ‘పో రా! ఫో.’ అంటూ చెంపలు వాయించి పంపాలి.
కరెక్ట్. యు ఆర్ రైట్ దీపూ, రైట్.
అలా చేయడమే న్యాయం.
కోర్ట్ ల నిండా విడాకుల కేసులే అంటూ వాపోతున్నారు కానీ, ఇలా కానరాకుండా భార్యల్ని కాల్చుకుతినే మగాళ్ళ మోసకారితనాలు మాత్రం బయటకు తెలీవు. తనకి మాత్రం తెలిసిందా, తననింత మానసికంగా హింసించే మొగుడని వీడు? తన దాకా వస్తే కానీ తెలీదంటారు అందుకే.
‘అబ్బా తల పేలిపోతోంది. నడుం నొప్పి నమిలేస్తోంది. కళ్ళల్లోంచి ఈ జలపాతాలేమిటి? ..తను బేలయిపోతోందేవిటీ, ఇలా?- అందరాడపిల్లల్లా..కాదు. తను కాదు. తను ధైర్యవంతురాలు. సాహసవంతురాలు. తను ఓడిపోదు. ఎందులోనూ ఓడిపోదు.
ఎంత టైమై వుంటుంది. పదీ? పదకొండు? పన్నెండు? ..ఏమో అర్ధ రాత్రి దాటిపోయిందేమో.
అదిగో బయట్నించి తలుపు లాక్ తీస్తున్న చప్పుడు.
చెవులు రిక్కించి వింది.
శ్రీకాంత్ లోపలకొచ్చాడు.
మళ్లీ తలుపు మూసిన చప్పుడైంది. ఆ తర్వాత ..ఐదు నిముషాలు ఎలాటి అలికిడి లేదు.
ఆమె వింటోంది. బాత్ రూంలొంచి..నీళ్ళ శబ్దాన్ని. చాలా సేపు తర్వాత గదిలోకొచ్చాడు. లైటేసాడు. ఆమె కదలకుండా కళ్ళుమూసుకుని పడుకుంది.
ఏం చేస్తాడా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని. నైట్ డ్రెస్ తీసుకున్నాడు. మరో నిమిషం తర్వాత మంచం దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ఆమె గుండె వేగం గా కొట్టుకుంది. కాని, అంతలోనే అంత వేగం గానూ, మంచం మీంచి పిల్లో లాక్కుని, విస్సురుగా వెళ్లిపోయాడు.
కళ్లు మూసుకున్నా ఇదంతా కళ్ళక్కట్టినట్టు కనిపిస్తోనే వుందామెకి.
ఎవరన్నారు, హృదయానికి కళ్ళుండవని. నిజమే, ప్రేమ గుడ్డిదైతే కదా!
షేమ్ షేమ్ దీపూ.. షేమ్ షేమ్ ! నీ కలలిక కట్టిపెట్టు. నీ మొగుడు నిన్ను తాకడం మాటలా వుంచు, కనీసం కన్నెత్తి చూడటానికి కూడా ఇష్ట పడటం లేదని గ్రహించు. లేకుంటె, నీకే ప్రమాదం.
ఆమెకొక్కసారిగా ఏడ్పొచ్చేసింది..పొంగుకుంటూ. ఎంత వద్దనుకున్నా, ఆగకుండా, ముంపెత్తిన గోదారిలా.
ఇంతగా శిక్షించడానికి, అసలు తను చేసిన తప్పేమిటనీ? ..అతనే కదా చెప్పాడు..తన క్లాస్ మేటు నీతా తనని ప్రేమించిందని..వెంటపడేదనీ..పెళ్ళి చేసుకోమని ప్రాధేయపడిందనీ..అదడిగిందనీ..ఇలా చేయి పట్టుకుందనీ.. తను ప్రేమించకుంటే బ్రతకనందని కూడా చెప్పలేదూ?
మరి ఇప్పుడేమవసరమొచ్చిందనీ? ఆవిడగార్ని ఫేస్ బుక్ ఫ్రెండ్ చేసుకోవాలి? అదే అడిగింది.
జవాబు చెప్పలేదు. పైగా మేధావిలా ఓ వెధవ నవ్వొకటి నవ్వూరుకున్నాడు.
తను అనుమానిస్తున్నట్టె అయింది. ఇద్దరూ కలసి రెస్టారెంట్ కీ వెళ్ళారు. తనకి మాట మాత్రం గా నైనా చెప్పలేదు. ఆ రోజున, అతను బాత్ రూం లో దూరినప్పుడు సెల్ ఫోన్ లో చూసింది. మెసేజ్ లో ఆమె ఎంజాయి చేసినట్టు, అందుకు థాంక్స్ అని చెప్పడాన్ని కళ్ళారా చదివి తెలుసుకుందా నిజాన్ని.
తెలిసాక, ఏ పెళ్ళామైనా మరి అడగదా? అడిగింది. దులిపింది. తనకు జవాబు కావాలంది.
ఏమన్నాడు? చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఐతే నాకూ నీతో వుండాల్సిన అవసరం లేదంది.
‘నీ ఇష్టం’ అంటూ చుర చురా చూసుకుంటూ వెళ్ళి పోయాడు. తనూ రోషం కొద్దీ అమ్మగారింటికెళ్ళింది. అతనితో చెప్పాల్సిన అవసరం కూడా కనిపించలేదామెకా క్షణంలో.
జరిగిందాంట్లో తన తప్పేముందనీ? తప్పో ఒప్పో, తెలుసుకుని తనంతట తానే గా తిరిగొచ్చింది?
ఇక మాటలనవసరం. ఇతనితో కాపురం – తనకిక కుదిరే వ్యవహారం కాదు. ముమ్మాటికీ కాదు. రేపొద్దునే తనెళ్ళిపోవాలి ఇక్కణ్నించి. ఈ మనిషి నించి శాస్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ పెళ్ళీ, ఈ మొగుడు అంతా ఓ పీడ కలగా మర్చిపోవాలి.
ఏం? మొగుడు లేకుండా బ్రతికే వాళ్ళు లేరా? మొగుణ్నొదిలేసిన ఆడవాళ్ళు జీవించడం లేదా? చస్తున్నారా? పక్కింటి శకుంతల సంగతేమైందీ? మొగుడొదిలేస్తే, పుట్టింటికొచ్చి మిషన్ కుట్టుకుని బ్రతకడం లా? విరజ కూడా అంతే. మొగుడు ఆమెని మంచం మీంచి తోసేసేవాడట. వొద్దని. ఇలాగే కాపురానికి తోలే వాళ్ళు ఆమెని మళ్ళా మళ్ళా. కానేం చేస్తుంది?వాడు వొద్దు బాబోయి అంటే మరి? విడాకులు తీసుకుంది. మళ్ళీ పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. మరి తను? చస్తే మళ్ళీ పెళ్ళి చేసుకోదు. వీడి తో వచ్చిన బుధ్ధి చాలు. తనింకా చదువుకుంటుంది. కెరీర్ మీద చాన్సెంట్రేట్ చేస్తుంది. అమెరికాలో అక్కా బావల సాయం తో ఓ ఉద్యోగం సంపాదించుకుని, అక్కడే సెటిలైపోతుంది. అంతే. అంతే. అదే తన నిర్ణయం. చివరినిర్ణయం. తిరుగులేని నిర్ణయం.
ఆలోచిస్తూ ఆలోచిస్తూ..నిద్రలోకెళ్ళిపోయిందామె.
***
శ్రీకాంత్ హాల్లోని సోఫాలో ఒరిగి పేపర్ అందుకున్నాడు.
ఒక్క అక్షరమూ కనిపించడం లేదు. అసలు చూపక్కడ నిలిస్తే కదా! మనిషి ఉడికిపోతున్నాడు.
ఎంత మాటంది తనని వెళ్తూ వెళ్తూ. నేను నీతా తో రోజూ..తిరిగుతున్నానా? పైగా మా ఇద్దరి మధ్య ..అది వుందని అంటుందా? వినంగానే ఎంత విలవిలమంది మనసు?
అసలీ ఆడవాళ్ళు ఏమనుకుంటారు? శీలం, దాని పవిత్రత పేటెంట్ హక్కులన్ని వాళ్లకేనా సొంతం? మగాడికీ కారెక్టర్ వుంటుందనీ, దాన్ని శంకిస్తే వాడికీ రగుల్తుందని తెలీదా? అదే మాట తను అంటే ఆమెని? వూరుకుంటుందా? అయినా అలాటి అనైతిక సంబంధాల్లోకి ఎలా ఈడుస్తుంది తనని? అందులో తనని ..తనని అంత మాటనా అనడమా? మొగుడన్న గౌరవం వుండొద్దూ? నోటికెంతొస్తే అంత అ నడమే? ఎంత పెళ్ళామైతె మాత్రం, కాస్త హద్దుండొద్దాంటా? ఇదేమైనా సినిమానా? అలా పెట్టెలు సర్దుకుని ఇంట్లోంచి పారిపోడానికీ? అదీ తనతో చెప్పనైనా చెప్పకుండా ఇంటికి తాళమేసి పోడమే? ఊహూ? – ఇదేనా ఇల్లాలి లక్షణం? – తనలో తనే వాదించుకుంటున్నాడు. తనే కరెక్టే అని ఓదార్చుకుంటున్నాడు.
పోని ఆ విషయం వదిలేద్దాం. ఇంటికొచ్చింది కదా, ఒక్కసారి ఆఫీస్ కి ఫోన్ చేసి, ఎలా వున్నావని అడగొచ్చు కదా? ఏదో తెలీక వాగి, బాధపెట్టాను సారీ అని చెబ్తే ఈవిడ గారి సొమ్మేం పోయిందో కదా?..ఎంత గా ఎదురుచూసాడు, ఫోన్ చేస్తుందనీ? ఎన్ని సార్లు ఉలిక్కిపడ్డాడు, సెల్ మోగినప్పుడల్లా ఆమెనే అనీ! హు. మొండిది. పెంకి పెళ్ళాం. పెంకి పెళ్ళామని.
అందుకే ఆమెకీ శిక్ష. ఎన్నాళ్ళైనా కానీయి, ఎన్నేళ్ళైనా కానీయి..తనకి సారీ చెప్పాకే, ఆమెతో కాపురం చేసేది. లేదంటే లేదంతే. ఇంతే. ఇలా సోఫాలో నే పడుకుంటాడంతే. – డిసైడైపోయాడు.
నిద్ర పోదామని, లైట్లు ఆర్పేసుకున్నాడు. కాని కళ్ళు మూత పడటం లేదు.
అబ్బబ్బా..ఎప్పుడూ లేంది, ఈ సోఫా ఏమిటీ ఇలా గుచ్చుకుంటోంది? ఆ?
తనకి బెడ్రూం లో, ఆ బెడ్ మీదే నిద్ర పడుతుంది. ఇలా ఎక్కడపడితే అక్కడ నిద్ర వచ్చి చావదు.
మహా తల్లి. మంచమంతా పరుచుకుని పడుకుందిగా, మహా రాణిలా.
ఆ మంచం లో నిజానికి తనకీ సగం జాగా వుంటుంది కదా? అవును. భలే పాయింట్ దొరికింది. ఇక లాభం లేదు. తనెళ్ళి, తన భాగం లో తనూ పడుకుంటాడు.
కోపంగా పైకి లేచి, చేతిలోకి దిండు తీసుకుని గదిలోకొచ్చాడు. చప్పుడు చేయకుండా మంచం మీద చోటు చేసుకున్నాడు.
మరి కొన్ని క్షణాల తర్వాత, ఇటు వాడు కాస్త అటు తిరిగాడు.
రెండు కనుమల మధ్య వాగులా..ఒక నిశ్శబ్ద వెన్నెల ప్రవాహం లా ఆమె! మల్లె దండని, ముగ్ధ మనోహరిని గుండెలకి హత్తుకోలేని మగ జన్మా ఒకజన్మే?
గాలి జోరుకి పూల కొమ్మ వూగినట్టు…మబ్బువెనకే మెరుపు మెరిసినట్టు..గ్రీష్మానికి మాడిన మట్టి -ఒక్క వాన చుక్క కోసం ..తపిస్తున్నట్టు..అతని పరిస్థితీ అలానే వుంది. దాహందాహంగా..
ఒక్కసారి తాకితే ఏమౌతుందనీ? కయ్యి మంటేనో? ఆ, అనన్నీ, నిద్దట్లో చూడ్లేదని అబధ్ధమాడేయొచ్చులే. తప్పేముంది?
చొరవచేసాడు.
వులిక్కిపడి, మేల్కొంది. పక్కన మనిషున్న ఆనవాలు. అది కూడా కాదు, నడుం మీద అతని చేతి వేళ్ళ కదలికలు..
ముందు నమ్మలేనిదైంది. ఆ తర్వాత ..కడుపులోంచి దుఖం..గొంతు దాటి, .కళ్ళలోంచి..పొంగి ప్రవహిస్తూ..
ఈ చేయినే కదూ నమ్మి తను ఇతగాని వెంట నడిచింది…ఈ చేతిలో నే కదూ..తన చేయుంచి..పెళ్ళి ప్రమాణాలు చేయించింది..ఈ చేతి చిటికెన వేలు ఒక్కటి చాలని కాదూ..తన మీద సర్వ హక్కుల్నీ ఇతనికి రాసిచ్చింది..ఈ చేయే కదూ..తన శిరస్సున తాకిన మొదటి స్పర్శ… ఈ చేతికి తెలీందేముందని? తనేమిటో, తన మనసేమిటో?
మరి ఎందుకనీ ఇంత దూరంగా వుంచి, తనకింత నరకాన్ని చూపింది..
ఈ చేయి తనని తాకలేదనే కదా తనిప్పటిదాకా కుమిలిపోయిందీ?..
ఉధృతమైన ఉద్వేగం భారాన్ని తట్టుకోలేని ఆ చిన్నది బిగ్గరగా ఏడ్చేసింది.
అతనూహించని సీన్ కావడంతో కలవరపడిపోతూ “దీ..ప్స్..” అని పిలిచాడు కంగారుకంగారుగా.
ఆమె మాత్రం అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని…వెక్కెక్కిపడుతూ చెప్పింది. “శ్రీ..ఇంకెప్పుడూ..నన్నింతగా పనిష్ చేయొద్దు..నే భరించ..లేను..చచ్చి పో..తా..ను..” అతను గబుక్కున ఆమె నోటి మీద చేయుంచాడు.
రెండు చేతులతో ఆమె భుజాలను చుట్టుకుని, దగ్గరకి తీసుకున్నాడు. అంతే, అమాంతం అతని గుండెల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా..చాలా సేపు..చాలా చాలాసేపు.
భార్యలో వున్నదంతా అహం అని అపోహపడ్డాడే కానీ, ఆమె లోని పసి హృదయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఛ. ఎంత కఠినం గా మారాడు!…ఇంకెప్పుడూ దీప్స్ పట్ల ఇలా ప్రవర్తించకూడదని ఒట్టేసుకున్నాడు.
ప్రాయశ్చిత్తంగా ఓ వేయి ముద్దుగులాబీలను అర్పించుకుని, ఆ ముగ్ధ్రాల్ని, బాధనించి విముక్తిరాలిని చేసాడు. పాపం!
*******
కూతురు మళ్ళీ తిరిగిరావడం ఖాయం అనుకున్న రంగనాధం, ఆ జంట హనీమూన్ కోసం సింగపూర్ కెళ్ళిందని తెలిసి చాలా ఆనందపడిపోయాడు. ఆ క్రెడిట్ అంతా భార్యకే ఇచ్చేసాడు.
“అద్సరేనోయ్ పెళ్ళాం! కోపమొచ్చి కొమ్మెక్కి కూర్చున్న అల్లుడి దగ్గరికి పిల్లనెలా పంపావోయ్? వాళ్ళిద్దరూ కలుస్తారని ఎలా గెస్ చేసావ్? నేనైతే ఆశలొదిలేసుకున్నా సుమా! ఇంకా చెప్పాలీ అంటే, అల్లుడి ప్రవర్తన మీద భలే కోపమొచ్చేసిందనుకో నాకు..”
“అబ్బా! అలానేం? మనకు పెళ్ళైన కొత్తల్లో..మరి మీ ప్రవర్తనకి మా నాన్నకెంత కోపమొచ్చుండాలి స్వామీ, మీ మీద?” నవ్వుతూ, నవ్వుతూనే మొగుడి మీద బాణం వేసి నవ్వింది సుజాత. నవ్వాక మళ్ళీ చెప్పింది. “ మనకి రోజులో దుర్ముహుర్తాలు, రాహు కాలాలు వున్నట్టె, శుభ ముహుర్తాలు, అమృత ఘడియలూ వుంటాయి. అలానే, కాపురం లో కూడా కలతలు, కలహాలతో బాటు అమృత పాన క్షణాలూ,అనురాగ బంధా లూ వుంటాయి. వివాహానికి అసలైన భాష్యాన్ని వివరించే అతి విలువైన ఘడీయలవి. ఆ విలువంటూ ఒక్కసారి తెలిస్తే.. ఎన్ని ఆటంకాలు రానీ, పోనీ.. భార్యాభర్తలు ఒకర్నించి మరొకరు విడిపోలేరు. జీవితాంతమూ అన్యోన్యంగా కలిసే వుంటారు.
తొందరపాటు లో విడిపోవాలనుకునే జంటలను తిరిగి కలిపే – ఈ చిన్ని మలుపు ఎంత దూరమో..అది అంత చేరువ కూడా.
అందుకే, ఆ అమృత ఘడియ వచ్చే వరకూ అమ్మాయి అక్కడే వుండాలని చెప్పా..మీకు.
“అవునూ..ఈ టెక్నికులన్నీ నీకెలా తెలిసాయబ్బా?”
“అనుభవం సార్..స్వానుభవం..” అంటూ ఫక్కున నవ్వింది.
అర్ధం కాకున్నా, ఆయనా నవ్వేశాడు భార్యతో కలసి.

– ఆర్.దమయంతి

damayanthi

 

 

 

 

 

Sudden Fiction లో ముగింపు చదువరిదే: బి. పి. కరుణాకర్

nadustunna katha

మే నెల కథల్లో ఉత్తమ కథ ‘ఇరుకు పదును’ రచయిత శ్రీ బి పి కరుణాకర్ తో ఇంటర్వ్యూ

B P Karunakar

మీ గురించీ, మీ రచనా వ్యాసంగం గురించి చెప్పండి

పుట్టింది పెరిగింది గుంటూరులో. ఖమ్మం జిల్లాలో, పూణేలో పని చేసి 1983లో సికింద్రాబాద్ BHEL చేరి అక్కడే పదవీవిరమణ చేశాను. భార్య హేమలత ఇప్పుడు లేదు. కూతుళ్ళు ఒకరు అమెరికాలో, మరొకరు సంగారెడ్డి లో స్థిరపడ్డారు. నేను ఒంటరిగా ఈ ఇంట్లో వుంటాను. ప్రస్తుతం నా వయస్సు 71 సంవత్సరాలు.

1962 చిత్రగుప్తలో మొదటి కథ అచ్చైంది. 96 దాకా రచనలు చేశాను. ఆ తరువాత కుటుంబ బాధ్యతల వల్ల పదకొండేళ్ళ విరామం తీసుకోని 2007 నుంచి రెండో అంకం మొదలుపెట్టాను. “అంబాలీస్”, “నిర్నిమిత్తం”, “రాజితం” ఇప్పటివరకు ప్రచురింపబడ్డ నా కథాసంపుటాలు. నాలుగో కథల సంపుటి సిద్ధం అవుతోంది. ఇప్పటివరకూ నా కథల మీద నాలుగు పరిశోధనలు జరిగాయి.

మీరు రాసిన కథలు రెండు మూడు పేజీలు దాటవు. ఇలా రాయాలని మీరే ఎంచుకున్నారా?

ఇలా రాయలని అనుకోని రాయలేదు. చిన్నప్పటినుంచి చదవటం అలవాటు. గైడిమపాస, మామ్, మార్క్ ట్వైన్, ఎమిలీజోలా, ఓ హెన్రీ ఇలాంటి రచయితల కథలు అనువాదాలై విరివిగా వస్తుండేవి. వాటితో పాటు చలం, ధనికొండ హనుమంతరావు వంటి రచయితలనీ చదివాను. వీరిలో బహుశా సోమర్ సెట్ మామ్ ప్రభావం కొంత వుందేమో. కానీ నేను రాస్తున్న పద్దతిని Sudden Fiction అంటారని ఆ తరువాత ఎప్పటికో కానీ తెలియలేదు.

Sudden Fiction గురించి ఇంకా వివరంగా చెప్పండి

మామ్ కథలు చూడండి. పూర్తిగా చెప్పాల్సిన పనిలేదు. ముగింపు పాఠకుడికే వదిలివేయటం. కథలలో దృశ్యస్ఫురణ జరగాలి. పూర్తిగా చెప్పనప్పుడు క్లుప్తత వస్తుంది. ముగింపు పాఠకుడికే వదిలేస్తే ఆ గాఢత చాలా కాలం వెంటాడే లక్షణం వస్తుంది. గోప్యత వస్తుంది. అదే సడన్ ఫిక్షన్ – ఓపెన్ ఎండెడ్. నిడివి తక్కువగా రాయడం ఈ పద్ధతిలో ముఖ్య వుద్దేశ్యం. ఈ విషయం తెలియకుండానే చాలా కాలం క్రితమే ఈ రకంగా రాశాను. నా కథలలో తొంభై శాతం ఇదే పద్ధతిలో వుంటాయి. ఇరుకుపదును కథ కూడా సడన్ ఫిక్షన్ కథే.

“ఇరుకు పదును” అన్న పేరే చిత్రంగా వుంది. అలా ఎందుకు పెట్టారు?

కథకు శీర్షిక చాలా ముఖ్యమైనది. నేను రాసే ప్రక్రియ (Sudden Fiction)లో పాఠకుడికి ముగింపు పూర్తిగా తెలియకుండా వదిలిపెట్టాలి. అక్కడక్కడ కథలో కొన్ని సూచనలు వుంటాయి. కానీ కథ శీర్షిక కథాసారాన్ని చెప్పేయకూడదు. ఇది నా పద్ధతి. అండుకే నా కథలకు పెట్టే పేర్లు అర్థం కావటంలేదని అంటారు. “కోచెరగు”, “ముమ్మూర్తి”, “తూనికనీళ్ళు”, “నిర్నిమిత్తం”, “నీటిబీట” ఇవన్నీ అలాంటి పేర్లే. ఈ కథ విషయానికి వస్తే సరస్వతి పాత్ర నన్ను (కథలో కథకుణ్ణి) పదునైన ప్రశ్నలతో ఇరుకున పెడుతోంది. అందుకే “ఇరుకు పదును” అన్నాను.

ఈ కథా నేపధ్యం ఏమిటి?

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన కథ ఇది. నేను నేనే ఈ కథలో. చాలా వరకు పాత్రల పేర్లతో సహా వాస్తవాలు. “నర్సింగరావు” నాకు మంచి స్నేహితుడు. ఎంత స్నేహితుడైనా ఇంటికి పిలిచేవాడు కాదు. ఉద్యోగరీత్యా కలుస్తుండేవాళ్ళం. ఇంట్లో నేను ఒక్కణ్ణే కాబట్టి తరచుగా వస్తుండేవాడు. సొంతింట్లో వున్నట్లే స్వతంత్రంగా వుండేవాడు. కానీ అతని ఇంటికి మాత్రం తీసుకెళ్ళేవాడు కాదు. అతను చనిపోయిన రోజునే నేను మొదటిసారి అతని భార్యని చూడటం. తరువాత ఆమె వుద్యోగంలో చేరటం, నన్ను కలవటం అన్నీ నిజంగానే జరిగాయి.

మేము ఈ కథలో చాలా కోణాలని చూసి మా వ్యాసంలో రాసాము. ఇవన్నీ ఓ సాధారణ పాఠకుడికి చేరుతాయని మీరు అనుకుంటున్నారా?

చేరకపోవచ్చు. అంతే కాదు ఇంకా కొన్ని వున్నాయి. అసలు సరస్వతి నర్సింగరావు తాలూకు గతం కూపీలాగటానికే ఉద్యోగంలో చేరింది. ఆమెకు భర్తమీద ముందు నుంచే అనుమానం వుంది. ఈ విషయం కథలో ఎక్కడా చెప్పలేదు. కానీ చేర్చేందుకు అవకాశం వుండింది. పాఠకులు కథ గురించి ఆలోచించి, కొత్త కోణాన్ని వెతుక్కోవటంలోనే కొత్త అనుభూతిని పొందుతారు. నా కథలలో మొదటి రెండు పేరాల వరకే నేను పాఠకుడి చెయ్యి పట్టుకోని తీసుకెళ్తాను. మూడో పేరా నుంచి పాఠకుడు కథలో లీనమైన తర్వాత నేను తప్పుకుంటాను. కథ పూర్తైన తరువాత పాఠకుడు ముగింపు అర్థం కాక నా కోసం చూస్తాడు, కానీ నేను కనిపించను. దాంతో పాఠకుడే సమాధానాలు వెతుక్కుంటాడు.

ఇది యధార్థంగా జరిగిన కథ అయినప్పుడు, చెప్పని వివరాలన్నీ చేర్చుకుంటూ పెద్ద కథ రాయచ్చు. ఉదాహరణకి సరస్వతికి మొదట్నుంచి అనుమానం వుంది అని ఇందాక చెప్పారు. ఈ కోణాన్ని కథలో ఎందుకు చెప్పలేదు?

ఎంతవరకు చెప్పాలి అన్నది తెలియాలి. ఇది చాలు అనుకుంటే అక్కడ ఆపేయచ్చు. నేను రాసిన కథలు చూడండి. ఒకే ఒక్క సంఘటనను తీసుకోని మొత్తం జీవితాన్ని చిత్రంచే ప్రయత్నం చేశాను- ఒక పెద్ద కాన్వాస్ తీసుకోని అందులో మూడు చుక్కలు పెట్టినట్టు. చెప్పవలసినదానికంటే ఎక్కువగా నేను చెప్పను. దానివల్ల ఏం ఉపయోగం వుండదు. ఇంకా నిర్మాణం దెబ్బతినే అవకాశం వుంది. కథలో కొన్ని విషయాలను దాచిపెడుతూ, కొద్దిగా చెబుతూ వస్తుంటే కథకి పరిపూర్ణత వస్తుందని నా అభిప్రాయం.

నిజంగా జరిగిన సంఘటనలను కథలుగా రాయడానికి ఊహని ఎంత పాళ్లలో కలుపుతారు?

నేను రాసిన కథలు దాదాపుగా అన్ని జరిగినవే. ఎక్కువశాతం నా అనుభవాలు. కథగా మార్చేటప్పుడు మూడొంతులు ఊహ కలపాల్సివస్తుంది. ఊహని జోడింఛకపోతే అది కథగా మారదు. కేవలం ఒక సంఘటనగానో, వార్తగానో మిగిలిపోతుంది.

ఇరుకు పదును గురించి పాఠకుల రెస్పాన్స్ ఎలా వుంది?

చాలా మంది అభినందించారు. రెండువందల యాభై దాకా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓ డెబ్భై ఎనభై మెసేజులు వచ్చాయి. ఒక నలుగురు మాత్రం మాకు అర్థం కాలేదన్నారు. ఒకావిడ లోకల్ ఫోన్ నుంచి చేసింది. పేరు కళ అని చెప్పింది. నిజమో కాదో తెలియదు. ఈ కథలో మీరు ఫొటోలు ఎవరివో సరస్వతికి ఎందుకు చెప్పలేదు? అంటూ అడిగింది. దాని వల్ల సమస్యలు వస్తాయని చెప్పలేదు అన్నాను. మీకు కథలు రాయడం చాతకాదు అంది. వాదన తరువాత ఫోన్ పెట్టేసింది. బహుశా సరస్వతి వున్న స్థితిలోనే ఆమె కూడా వుందేమో అనుకున్నాను!

కథ బాగున్నది అన్నవాళ్ళందరికి కథ అర్థం అయ్యిందని అనుకోడానికి కూడా లేదు. వారిలో కొంతమందికి కథ పూర్తిగా అర్థం కాలేదు. అర్థం కానివాళ్ళు చాలా వరకు మెసేజిల ద్వారా అడిగారు. నేను వివరంగా చెప్తే ఇప్పుడు అర్థం అయ్యింది అన్నారు.

మీ కథలో చాలా పొరలూ, దానికి తోడు ఒక ఆకస్మిక (abrupt) ముగింపు ఉన్నాయి. ఇలాంటి కథని పాఠకుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. లేని అర్థాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కోణాలే తెలుసుకోని తృప్తిపడచ్చు. ఒక కథా రచయితగా ఈ ప్రక్రియలో ఉన్న లోపమేమో అనిపించడం లేదా?
లోపం అనుకోవడం లేదండీ. అయితే, అలా జరుగుతుందని ఒప్పుకుంటున్నాను. కానీ పాఠకుణ్ణి మన స్థాయికి తీసుకొచ్చే రచనలే చెయ్యాలి. మనం పాఠకుడి స్థాయికి వెళ్ళి రచనలు చెయ్యకూడదు. పాఠకుణ్ణి తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా రచయితకు వుంది. పాఠకుణ్ణి పైకి లాగండి. ఇంకా చందమామ దగ్గరే వుంటే ఎట్లా?

ఇప్పటి కథలు, పాఠకుల గురింఛి మీ అభిప్రాయం ఏమిటి?

మునుపటి పాఠకులు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. అప్పుడు వచ్చిన కథలు వేరు, ఇప్పుడు వస్తున్న కథలు వేరు. ఇప్పుడు వస్తున్న కథలు చాలా బాగుంటున్నాయి.

ఇప్పటి రచయితల గురించి –

ఒక సంవత్సరం పాటు అమెరికాలో వున్నాను. అక్కడ చాలా పుస్తకాలు చదివాను. ఇంగ్లీషుతో పాటు, చైనీస్, మెక్సికన్, ఇటాలియన్ ఇలా ఎన్నో భాషల కథలు చదివాను. చాలా సినిమాలు కూడా చూశాను. ఆ సంవత్సరం చాలా గొప్ప కథలు చదివాను. ఇప్పటికీ నేను మా అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆమె లైబ్రరీ కార్డు వాడి డెభై అయిదు పుస్తకాలు తెచ్చుకుంటాను. అన్నీ కథల పుస్తకాలే. అవన్నీ చదవడం వల్ల ఆయా భాషల కథాసాహిత్యంలో వస్తున్న పోకడలు తెలుస్తాయి. ఇతర భాషల కథలను అర్థం చేసుకోగలిగితే రచయితలో పరిపక్వత వస్తుంది. ఇప్పుడు కొంత మంది రచయితలు పట్టుమని పది కథలు రాస్తే పట్టడానికి లేకుండా పోతున్నారు. ప్రపంచసాహిత్యాన్ని, మన పాతతరం సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. It is a must. ఇప్పుడు ఎవరైనా కుర్ర రచయితని “చాసో చదివావా” అంటే చాసో ఎవరు అంటున్నారు. బుచ్చిబాబు కథలు చదివావా? అంటే “ఆయన మైదానం చదివానండీ” అంటున్నారు. ఈ పద్దతి మారాలి. చదవాలి. చదివితే మనసు పదునెక్కుతుంది. రాయాలన్ని కుతూహలం కలుగుతుంది. మాలతీ చందూర్ ఏదో సందర్భంలో “వెయ్యి కథలు చదివినప్పుడు ఒక్క మంచి కథ రాయగలుగుతాను” అని చెప్పారు.

ప్రపంచకథలతో బేరీజు వేస్తే తెలుగు కథ ఎక్కడ వుందని మీకనిపిస్తోంది?

చాలా మంచి కథలు వస్తున్నాయి. కాకపోతే ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇతర భాషల రచనలు అనువాదాలై అన్ని భాషల పాఠకుల దగ్గరకు చేరుతున్నాయి. తెలుగు కథలకు ఆ అవకాశం లేకుండాపోతోంది. అదే జరిగితే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు ఏ ప్రపంచసాహిత్యానికి తీసిపోవు.
ధన్యవాదాలు, కరుణాకర్ గారూ! మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని మంచి కథలు రాయాలని ‘సారంగ’ తరఫునా, మా పాఠకుల తరఫునా మీకు శుభాకాంక్షలు.

థాంక్ యూ..!

మూడు ‘క్షేత్రా’ల ముడి

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నే నిప్పుడు ఒక విచిత్రమైన తర్కానికి లోనవుతున్నాను. దాని గురించి ముందుగా చెప్పాలనిపిస్తోంది.

ఈ వ్యాసాలను కేవలం ‘చూసే’ వారు ఉంటారు. యధాలాపంగా చదివేవారు ఉంటారు. ఆసక్తితో, ఇష్టంతో, లోతుగా చదివేవారు ఉంటారు. ఒకవిధమైన ఆసక్తి ఉన్నా అయిష్టంగా చదివేవారు ఉంటారు. ఆసక్తి లేకుండా కేవలం అయిష్టంగా చదివేవారు ఉంటారు. పాఠకులలో అనేక రకాలు. నేను కూడా ఇలాంటి పాఠకరకాలలో ఒక రకానికి చెందినవాణ్ణే కనుక ఈ వైవిధ్యాన్ని గౌరవిస్తాను.

ఈ పాఠకరకాలలో ఒక రకంవారికి, లేదా కొన్ని రకాల వారికి ‘మళ్ళీ మళ్ళీ ఇదేల భారతం’ అనిపిస్తూ ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళ దాకా ఎందుకు? ఎంతోమంది మహాపండితులు రాసిన భారతం, రామాయణం, పురాణాలు, ధర్మశాస్త్రాల సంగతులు నేనెందుకు రాస్తున్నానని ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది.

నేను విచిత్రమైన తర్కానికి లోనవుతున్నా నన్నది -ఇదిగో, ఇక్కడే!

నిజానికి నేనివి రాస్తున్నప్పుడు భారతం గురించి రాస్తున్నానన్న స్పృహ నాలో లేదు. భారత కథలు, పాత్రలు, ఘట్టాల గురించి ఇంతగా రాస్తున్నప్పుడు ఇది భారతం గురించి కాకుండా ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది తర్కం. సంగతేమిటంటే, భారతం మిషతో నేను భారతదేశం గురించి రాస్తున్నాను. భారతంలో కనిపించే భారతదేశ మూలాల గురించి, మన మూలాల గురించి రాస్తున్నాను. భారత, రామాయణాలను, పురాణాలను, ధర్మశాస్త్రాలను ఒకానొక కాలానికి చెందినవిగా మాత్రమే చూస్తూ; కాలమనే నదిలో ప్రవహిస్తున్న వాటికి ఆనకట్ట పడినట్టు ఊహించుకుంటున్నవారికి నేను భారతం గురించి మాత్రమే రాస్తున్నట్టు కనిపిస్తుంది. మరల ఇదేల భారతం అనిపిస్తుంది. కానీ నా అవగాహన వేరు. నా ఊహలో కాలమనే నదిలో ప్రవహిస్తున్న భారతరామాయణాదులకు ఎలాంటి ఆనకట్టలూ లేవు. చాలామందికి అవి గతంలా అనిపిస్తాయి. కానీ అవి నాకు వర్తమానం!!!

ఇంకోలా కూడా చెప్పుకుందాం. మనం ఇప్పటికీ మనిషి గురించి చెప్పుకుంటున్నాం. ‘మళ్ళీ ఇదేల మనిషి గురించి’ అనుకోవడం లేదు. కానీ ఈ మనిషి ఎప్పటివాడు? మనం ఇప్పటికీ విశ్వం గురించీ, ప్రపంచం గురించీ మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ విశ్వమూ, ప్రపంచమూ ఎప్పటివి? మనం ఇప్పటికీ భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ భారతదేశం ఎప్పటిది? అలాగే, భారతరామాయణాదులే కాదు; ప్రపంచ వాజ్మయం సమస్తం -మనిషి, విశ్వం, ప్రపంచం, భారతదేశం లాంటివే. కనుక వాటి గురించి ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం.

ఇంకా నా ఉద్దేశంలో భారతం అంటే భారతదేశమే. భారతం గురించి చెప్పుకోవడం అంటే, భారతదేశం గురించి చెప్పుకోవడమే. ఇంకా చెప్పాలంటే ఒకనాటి ప్రపంచం గురించి చెప్పుకోవడమే. ఇంత వైవిధ్యవంతమైన ప్రపంచంలో ఏ విషయంలోనైనా ‘ఇది కచ్చితం’‘ఇది ఇంతే’ అనగలిగిన సాహసం ఏ మానవమాత్రుడికీ ఉండదని నేను నమ్ముతాను. అయినాసరే, ఒక విషయంలో మాత్రం నా అనుభవంనుంచి ఒకింత కచ్చితానికి దగ్గరగా మాట్లాడతాను. అదేమిటంటే, భారతంతో (అలాగే ఇతర పురాతన వాజ్మయంతో)తగు మేరకు పరిచయం లేకపోతే భారతదేశమూ, ప్రపంచమూ కూడా అర్థం కావు. సమకాలీనమైన ఏ సమస్య పైన అయినా మీరు సాధికారంగా మాట్లాడదలచుకుంటే, భారతం సహా పురావాజ్మయంతో మీకు కొంత పరిచయం ఉండితీరాలి!

ఒక ఇతిహాసం పేరే ఒక దేశానికి పేరైన ఉదాహరణ నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో మరొకటి లేదు. మళ్ళీ నేనిక్కడ భారతాన్నో, మరొకదాన్నో గ్లోరిఫై చేస్తున్నానని అనుకోవద్దు. నేను కవిత్వం రాయడం లేదు. అక్షరాలా ఉన్న మాట చెబుతున్నాను.

ఈ వ్యాసాల క్రమంలో ఇదే వివరణను-అచ్చంగా ఈ మాటల్లో కాకపోయినా-అప్పుడప్పుడు ఇచ్చుకుంటూనే వచ్చాను. అయినా మరోసారి ఇవ్వవలసి రావడం చూస్తే, నాకు ‘బ్రాహ్మణుడు-మేక’ కథ గుర్తొస్తోంది. ఆ కథలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞానికి మేకను తోలుకుపోతుంటే, ఆ మేకను కాజేయాలనుకున్న కొందరు దొంగలు దారిలో తలో చోటా కాపు కాసి,‘అదేమిటి అయ్యవారూ, కుక్కను తోలుకుపోతున్నారు’ అంటారు. నలుగురూ అలా అనేసరికి బ్రాహ్మణుడు అవునేమో ననుకుని దానిని వదిలేసి పోతాడు.

నేను కూడా ఆ బ్రాహ్మణుడిలా మోసపోకుండా జాగ్రత్త పడడానికే ఈ ఆత్మవిమర్శ లాంటి వివరణ.

***

మన ప్రాచీనులు లైంగికత్వాన్ని, స్త్రీ-పురుష సంబంధాలను మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన దృష్టి నుంచి చూశారనీ; లైంగిక సుఖాన్ని ప్రకృతిలో భాగంగా, అతి సహజంగా, స్వచ్ఛ, పవిత్ర కార్యంగా అర్థం చేసుకున్నారనీ కిందటి వ్యాసంలో అన్నాను. పురాచరిత్ర కోణం నుంచి ఇది చాలా ముఖ్యమైన వివరం. మనలో చాలామందికి ఈ విషయంలో తలకిందుల అభిప్రాయం ఉంది. లైంగికత విషయంలో మన పూర్వులు చాలా నిష్ఠను, కట్టడిని, నైతికతను పాటించారనీ; మన దగ్గరకు వచ్చేసరికి అవి పలచబారిపోయాయనీ వారు భావిస్తారు. ఈ విషయంలోనే కాక ప్రతి విషయంలోనూ వెనకటి తరాలవారి కంటే నేటి తరాలు అన్నివిధాలా పతనమై పోయాయనే ఒక సూత్రీకరణ వినిపిస్తూ ఉంటుంది. లోతుగా చూస్తే, ఈ అభిప్రాయంలో నిజం కన్నా అపోహే ఎక్కువ.

నేను లైంగికతపై ప్రాచీనుల దృష్టి గురించి పై మాటలు రాసిన తర్వాత, యధాలాపంగా ‘SEXUAL LIFE IN ANCIENT GREECE’ (ByHANSLITCH-1952 ముద్రణ) అనే పుస్తకం తిరగేయడం ప్రారంభించాను. ఈ పుస్తక రచయిత అక్కడక్కడ చేసిన వ్యాఖ్యలు నా అభిప్రాయాన్ని నూటికి నూరుపాళ్లూ ధ్రువీకరించేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. గ్రీకు కామెడీలో లైంగికోద్దీపక లక్షణం, అశ్లీలం చాలా ఎక్కువ పాళ్లలో ఉండడం గురించి రచయిత రాస్తూ, ప్రాచీనులు లైంగికత్వాన్ని చాలా అమాయకంగానూ, సహజంగానూ చూశారనీ, దానిపై ఎలాంటి రహస్యాల ముసుగులూ వేయలేదనీ అంటాడు. పైగా, లైంగికతను సమస్త ప్రాణుల అస్తిత్వానికి మూలమైన ప్రాథమిక అవసరంగా మతవిశ్వాసకోణంనుంచి చూసి ప్రస్తుతించారంటాడు(పేజీ-153).

అంతేకాదు,‘Religion And Erotic’ అనే అధ్యాయంలో,‘మతపరమైన అవసరాన్ని, మతపరమైన ఆకాంక్షను సఫలం చేసుకోవడం వెనుక చాలావరకూ లైంగికతే ఉందనీ, కొన్ని సందర్భాలలో అది ఉద్దేశపూర్వకంగా కూడా వెల్లడవుతుందనీ’ రచయిత అంటాడు(పేజీ-180). ఈ వాక్యం చూసినప్పుడు మనకు తాంత్రిక ధోరణులు గుర్తుకొస్తాయి.

అలాగే, లైంగికత విషయంలో యూదు-క్రైస్తవ దృక్పథం గురించి రచయిత ప్రస్తావిస్తాడు(పేజీ-180). మన దగ్గర ‘ఇనుప కచ్చడాలు కట్టుకున్న ముని మ్రుచ్చు’లన్నట్టుగానే, యూదు-క్రైస్తవ దృక్పథం కూడా శరీరాన్ని అన్ని విధాలా కష్టపెట్టుకోవాలనీ, కృశింపచేసుకోవాలనీ చెబుతుంది. అదే మనిషికి గొప్ప నైతికాదర్శమంటుంది. దేవతలు లైంగిక వాంఛకు అతీతులనీ, పవిత్రజీవితం గడిపినవారికే మరణానంతరం ఉత్తమగతి లభిస్తుందనీ అంటుంది. ఏకపక్షంగా ఈ అభిప్రాయాలను సమర్ధించేవారికి లైంగికతకు, మతానికి చాలా దగ్గర సంబంధం ఉందన్న సంగతిని అర్థమయ్యేలా చెప్పడం కష్టమంటాడు రచయిత.

లైంగికతకు, మతానికి ఉన్న ఈ ముడి గ్రీకు సమాజ, సంస్కృతులకే పరిమితం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంతో సహా ప్రాచీన సమాజాలు, సంస్కృతులు అన్నిటా ఈ ముడి ఉంది. తాంత్రిక ధోరణుల గురించి పైన ప్రస్తావించుకున్నాం. కేవలం పురాచరిత్ర కోణం నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రాచీన సమాజాలు మతపరమైన తంతులో లైంగికతను కూడా భాగం చేసి, అక్షరాలా దానిని ‘సెలెబ్రేట్’ చేసుకున్నాయి. ఆధునిక కాలంలోనూ కొత్త కొత్త రూపాలలో ఈ ముడి కనిపిస్తూనే ఉంది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్న ఈ కోణం గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తే ఇప్పట్లో పైకి తేలడం కష్టం. కనుక ప్రస్తుతానికి వస్తే…

***

పన్నెండు రకాల కొడుకుల గురించి చెప్పిన పాండురాజు, ఔరసులతో అన్ని విధాలా తులతూగే క్షేత్రజులను తనకు సంతానంగా ఇమ్మని కుంతిని కోరాడు. ఔరసుడి నుంచి అపవిద్ధుడి వరకూ ఉన్న ఆరు రకాల కొడుకులూ బంధువులే కాక దాయాదులు కూడా అవుతారన్నాడు. ఈ ఆరుగురిలోకి వచ్చే క్షేత్రజుడు, గూఢోత్పన్నుడు అనే రెండు రకాలవాళ్లూ నిజభర్తకు కలిగినవారు కాదు. అయినా సరే, వారు బంధువులే కాక, ఆస్తి హక్కు కలిగిన దాయాదులు కూడా అవుతారని చెప్పడం ద్వారా పాండురాజు వీరిని పూర్తి స్థాయిలో ఔరసులుగా గుర్తిస్తున్నాడు. మిగిలిన ఆరు రకాల వాళ్ళలో కూడా కానీనుడు, సహోఢుడు, పౌనర్భవుడు అనే ముగ్గురు కూడా నిజభర్తకు కలిగిన వాళ్ళు కాదు. పాండురాజు వీరిని బంధువులుగా గుర్తిస్తున్నాడు. ఇప్పటి వారసత్వ చట్టం గురించి నాకు అంతగా తెలియదు కానీ, అందులో ఇంత సడలింపు ఉంటుందని మాత్రం నేను అనుకోను. తెలిసినవారు చెప్పాలి.

ఈ ‘క్షేత్రజుడు’ అనే మాట పుట్టుక గురించి నా ఊహలు పరి పరి విధాలుగా పోయాయి. సంతానం కనే స్త్రీని క్షేత్రంగా, సంతానాన్ని ఇచ్చే పురుషుని బీజంగా, లేదా విత్తనంగా చెప్పడం ఉంది. ఈ క్షేత్ర, బీజాల పోలిక వ్యవసాయం విస్తరిస్తున్న దశకు చెందినదని అనిపిస్తుంది. మగవాడి చేయి పైన, స్త్రీ చేయి కింద అవడం కూడా అప్పటినుంచే నని పురాచరిత్రకారులు అంటారు. ఈ క్షేత్రం, బీజం అనే మాటలు కూడా వ్యవసాయానికి చెందినవే. స్త్రీ, పురుష సంబంధాలతో సహా మొత్తం సమాజ, సాంస్కృతిక జీవితం మీద వ్యవసాయసంస్కృతి ఎంత లోతైన ప్రభావం వేసిందో చెప్పడానికి ఇదొక ఆధారం కావచ్చు.

 

పంటను ఇచ్చే వ్యవసాయభూమి క్షేత్రమైనట్టే, సంతానాన్ని కనే స్త్రీ కూడా క్షేత్రం అయింది. ఆవిధంగా వాటి మధ్య పోలిక కుదిరింది. వ్యవసాయభూమిలానే స్త్రీని కేవలం క్షేత్రంగా గుర్తించడమంటే ఏమిటన్నమాట? వ్యవసాయభూమి ఏ ఒకరి యాజమాన్యం కిందో ఉండకుండా ఉమ్మడి వనరుగా ఉన్న దశ ఉందనుకుందాం. అప్పుడు ఆ భూమిలో విత్తు నాటిన వాడికే పంట మీద హక్కు ఉన్నట్టుగా; స్త్రీ క్షేత్రంలో బీజావాపన చేసినవాడికే సంతానం మీద హక్కు ఉంటుంది. శర్మిష్ట కథలో చెప్పుకున్నట్టుగా, ఋతుమతి అయిన స్త్రీకి వివాహంతో సంబంధం లేకుండా సంతానం పొందే హక్కు ఉందనుకుంటే, తన క్షేత్రంలో పుట్టే సంతానం మీద ఆ దశలో ఆమెకే హక్కు ఉండడానికీ అవకాశం ఉంది. గంగా-శంతనుల కథలో తనకు పుట్టే సంతానాన్ని ఏమైనా చేసుకునేలా శంతనుడితో గంగ ఒప్పందం చేసుకోవడమే చూడండి. అంటే ఆమె తన క్షేత్ర హక్కును స్థాపించుకోదలచిందన్న మాట. ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ నవలలో ఇచ్చిన అన్వయాన్ని బట్టి చూస్తే, గంగ తనకు కలిగిన ఏడుగురు సంతానాన్నీ తన దగ్గరే ఉంచుకుని; ఎనిమిదో సంతానమైన భీష్ముని విషయంలో శంతనుడు అడ్డు చెప్పాడు కనుక అతన్ని శంతనుడికి ఇచ్చేసి, ఒప్పందం నుంచి తప్పుకుంది.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

ఇంకో సినేరియోను చూద్దాం. క్షేత్ర ప్రాధాన్యం, బీజ ప్రాధాన్యం అనే మాటలూ, వాటి గురించిన చర్చా సంప్రదాయవర్గాలలో కూడా కనిపిస్తాయి. ఎక్కడ ఏ ప్రాధాన్యాన్ని వర్తింపజేయాలన్నది ఒక్కోసారి చిక్కుముడిగా పరిణమిస్తుంది. ఉదాహరణకు, సత్యవతి-పరాశరుడు; అంబిక, అంబాలిక-వ్యాసుల సంబంధాన్నే చూద్దాం. వ్యాసుడు మత్స్యకన్యకు పుట్టినా, ఆయనను సంప్రదాయం ‘పరాశరుని కొడుకుగా’; లేదా ‘పరాశరుని కొడుకుగా కూడా’ గుర్తిస్తుంది. పరాశరుని వర్ణమే ఆయనకు ఇస్తుంది. అంటే అక్కడ బీజప్రాధాన్యం చెబుతోందన్న మాట. అదే, క్షత్రియులైన అంబిక, అంబాలికల దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడి వల్ల వారికి కలిగిన చిత్రాంగద, విచిత్రవీర్యులను క్షత్రియులుగా చెబుతోంది. అంటే అక్కడ క్షేత్రప్రాధాన్యాన్ని చెబుతోంది. అలాగే, అంబిక దాసికి వ్యాసుడి వల్ల కలిగిన విదురుని దాసుడుగా, శూద్రుడుగా చెప్పడంలో కూడా క్షేత్రప్రాధాన్యమే ఉంది.

దీనినిబట్టి ఒకటి అనుకోవాలి: పురుషుడు కేవలం సంతానం కోరి ఒక స్త్రీ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే, అందుకు ఆమె ఒప్పుకుంటే ఆ సంతానం పురుషుడికే చెందుతుంది. అక్కడ బీజప్రాధాన్యం వర్తిస్తుందన్న మాట. తెలుగు భారతంలో పరాశరుడు సంతానం కోసమే సత్యవతి పొందు కోరినట్టు లేకపోయినా (నేను సంస్కృత భారతం ఇంకా చూడలేదు) సత్యవతి-పరాశరుల సంబంధాన్ని భైరప్ప ఇలాగే అన్వయిస్తారు. ఒకవేళ పురుషుడు కేవలం లైంగిక సుఖం కోసమే స్త్రీతో సంబంధం పెట్టుకుంటే, అప్పుడు ఆ స్త్రీ కనే సంతానం ఆమెకే, అంటే క్షేత్రానికే చెందుతుంది. గంగా-శంతనుల సంబంధం నిజానికి అలాంటిదిగానే కనిపిస్తుంది. చిత్రాంగద, విచిత్రవీర్యుల విషయానికి వస్తే, తన కోడళ్ళకు సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి నియోగించింది కనుక, ఆ సంతానానికి క్షేత్రప్రాధాన్యం కలిగి వారు క్షత్రియులయ్యారు. ప్రస్తుత సందర్భంలో పాండురాజు కూడా క్షేత్రపద్ధతిలో సంతానం ఇమ్మని కుంతిని అడుగుతున్నాడు కనుక, అంటే నియోగిస్తున్నాడు కనుక ఆ సంతానం అతనికే చెంది, అతనిలానే క్షత్రియులవుతారు.

వ్యవసాయభూమిపై ఉమ్మడి యాజమాన్యం పోయి వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడిన దశలో సినేరియో కొంత మారుతుంది. భూయజమాని తన క్షేత్రంలో తను పండించుకోవచ్చు, లేదా ఇంకొకరికి తన క్షేత్రాన్ని అద్దెకు ఇవ్వచ్చు. అప్పుడు క్షేత్రానికి యజమాని వేరొకరు అయినా పంట, పండించినవాడిదే అవుతుంది. వ్యవసాయ క్షేత్రానికి, స్త్రీ క్షేత్రానికి ఉన్న పోలికే పూర్వుల దృష్టిని ప్రముఖంగా ఆక్రమించుకుందనీ, వ్యవసాయక్షేత్రానికి వర్తింపజేసిన నీతినే యథాతథంగా స్త్రీ క్షేత్రానికీ వర్తింప జేశారనీ అనేక ఉదాహరణలను గమనిస్తే అనిపిస్తుంది.

ఇక, క్షేత్రం అనే మాట మరో సందర్భంలో కూడా కనిపిస్తుంది. అది: ‘పుణ్యక్షేత్రం’ అనడంలో. దేవాలయం ఉన్న చోటును పుణ్యక్షేత్రం అంటాం. ఇంతకీ వ్యవసాయక్షేత్రం, స్త్రీ క్షేత్రం, పుణ్యక్షేత్రం అనే ఈ మూడు క్షేత్రాలకూ మధ్య ఏమైనా ముడి ఉందా? ఉన్నట్టే కనిపిస్తుంది. లైంగిక సంబంధాన్ని, పునరుత్పత్తిని పూర్వులు మతకోణంలోంచి చూసి ఒక పవిత్రవిధిగా పరిగణించారు కనుక; వ్యవసాయ, స్త్రీ క్షేత్రాలు రెండూ పునరుత్పత్తికి చెందినవే కనుక ఆ రెండింటికీ పుణ్యక్షేత్రంతోనూ ఒక ముడి ఏర్పడింది. సౌభాగ్య(fertility)వర్ధనాలుగా వ్యవసాయ, స్త్రీ క్షేత్రాల మధ్య ఉన్న పోలికా, వాటిపై అభివృద్ధి చెందిన మతపరమైన తంతు, అందులో భాగమైన తాంత్రికతలో స్త్రీకి గల పాత్ర గురించి చెప్పుకోవలసింది చాలా ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పుకున్నట్టు వ్యవసాయం మనిషి చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అంతకుముందు లేనంత అన్న పుష్కలత్వాన్ని వ్యవసాయం ఇచ్చింది. వ్యవసాయంతోనే స్థిరనివాసాలు ఏర్పడడం, జనాభా పెరగడం తదితర పరిణామాలు సంభవించాయి.

అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం కోసం అడవుల్ని నరకడం, జనాన్ని వ్యవసాయంవైపు మళ్ళించడం, వ్యవసాయభూముల విస్తరణకు వీలుగా స్థిర జనావాసాలను ఏర్పాటు చేయడం అంత తేలికగా జరగలేదు. సామదాన దండోపాయాలను ఆశ్రయించవలసి వచ్చింది. వ్యవసాయాన్ని పవిత్రకార్యంగా సూచించే క్రమంలో దేవాలయం ఉన్న ప్రదేశం పుణ్యక్షేత్రం అయినట్టే; వ్యవసాయభూమి కూడా క్షేత్రం, అంటే పుణ్యక్షేత్రం అయింది. వ్యవసాయక్షేత్రాలు ఉన్న చోట దేవాలయక్షేత్రాలూ అవతరించాయి. సుమేరు, సింధు నాగరికతలలో వ్యవసాయభూములు దేవాలయ అధీనంలోనే ఉండేవి. ఏటా దేవాలయంలోనే పాచికలు వేసి భూములు పంచేవారు. మన దగ్గర కూడా దేవాలయాలకు మాన్యాలు కల్పించడం ఉంది. దేవాలయంలో ‘క్షేత్ర’పాలకులుగా కొందరు దేవతలు ఉంటారు. వ్యవసాయక్షేత్రాలకూ కాపలాదారులు అవసరమే.

ఇక స్త్రీ క్షేత్రానికీ, పుణ్యక్షేత్రానికీ ఉన్న ముడిని చూద్దాం. ఇందుకు దేవాలయాలలో మైథున చిత్రాలే గొప్ప సాక్ష్యం. సౌభాగ్య వర్ధనానికి- స్త్రీ, వ్యవసాయ, పుణ్యక్షేత్రాలు మూడూ కేంద్రాలే. సుమేరు, సింధు, గ్రీకు సహా ప్రాచీన సమాజాలు అంతటా దేవాలయాలలో ‘పవిత్ర వ్యభిచారం’ జరుగుతూ ఉండేది. దేవాలయాలలో శృంగారకేళి అన్న మాట వినడానికే మనకు ఈ రోజు చాలా కంపరంగా ఉంటుంది. కానీ లైంగిక క్రియకు, దేవాలయానికి ఒకే విధమైన పవిత్రత్రను ఆపాదించిన ప్రాచీనుల దృష్టిలో అది అపవిత్రం కాదు.

క్షేత్రంతోపాటు కలిపి చెప్పుకునే మరో మాట తీర్థం. ఈ తీర్థం కూడా సౌభాగ్యవర్ధన కేంద్రమే. పురాతన కాలంలో మతపరమైన ప్రతి పండుగా, ప్రతి ఉత్సవం, ప్రతి తీర్థక్షేత్రాలూ లైంగిక విశృంఖల సందర్భాలే. తీర్థాలు, తిరునాళ్ళలో ఇలాంటి ముచ్చట్లు ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ప్రముఖ రచయిత్రి లత ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు శివరాత్రికి పట్టిసీమ(ప.గో. జిల్లా) తీర్థానికి వెళ్ళి రాత్రివేళ కారులో తిరిగివస్తున్నప్పుడు గోదావరి గట్టు పొడవునా జంటలు కనిపించాయని రాశారు.

కోశాంబీ AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY లో ఇలా అంటారు:

When local gods were adopted as relatives, attendants, incarnations, variants of Brahmin deities, while the locality coincided with or developed into a centre of production, or of trade, there arose great religious pilgrimage centers like Banaras, Mathura and Nasik (page-45)

(స్థానిక దేవతలను [బ్రాహ్మణీయ దేవతలకు] బంధువులుగా, సేవకులుగా, అవతారాలుగా, బ్రాహ్మణ దేవతలలోనే భిన్న రకాలుగా మలచుకున్న చోట్ల; అప్పటికే ఉత్పత్తి కేంద్రంగానో, వర్తక కేంద్రంగానో ఉన్న చోట్ల, లేదా ఆ దిశగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలోనే బెనారస్, మథుర, నాసిక్ లాంటి గొప్ప యాత్రాక్షేత్రాలు అవతరించాయి)

                                                                                                   మిగతా వచ్చే వారం

-కల్లూరి భాస్కరం

‘ఎగిరే పావురమా!’–మొదటి భాగం

 

my pic 3

రచయిత్రి , కళాకారిణి కోసూరి ఉమా భారతి
రచయిత్రి – శ్రీమతి. కోసూరి ఉమాభారతి Director – Archana Fine Arts Academy, U.S.A కూచిపూడి నృత్య కళాకారిణి, నాట్య గురువు, నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి. ఆంధ్రప్రదేశ్ నుండి సాంస్కృతిక రాయబారిగా ఉమాభారతి దేశావిదేశాలు పర్యటించారు. కళ ద్వారా స్వచ్చంద సమాజసేవకి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు, అవార్డులు పొందారు. చలన చిత్రాల్లో నటించి, నృత్య సంబంధిత చిత్రాలని నిర్మించి, దర్శకత్వం వహించారు. 1982లో హ్యూస్టన్, టెక్సాస్ లో ‘అర్చనా డాన్స్ అకాడెమి స్థాపించారు. శాస్త్రీయ నృత్యరూపక రచనలకి అవార్డులు పొందారు. రచనానుభావం : శాస్త్రీయ నృత్య సంభందిత వ్యాసాలతొ పాటు, పలు నృత్యరూపకాలు రచించి దేశవిదేశాల్లో ప్రదర్శించారు. వాటిల్లో ప్రేక్షకుల ఆదరణ, అవార్డులు పొందినవి – ‘భరత ముని భూలోక పర్యటన’ (తాన మహా మహా సభలు 1998) , ‘అమెరికాలో అనసూయ’, ‘ఈ జగమే నాట్యమయం’ (ఆటా తెలుగు సభలు), ‘తెలుగింటి వెలుగు’, ‘లయగతులు’ (తానా 2002) ‘పెళ్లిముచ్చట’, ‘కన్య’, ‘మానసపుత్రి’ …… ‘భారతీయ నృత్యాలు'(డాకుమెంటరీ), ‘ఆలయ నాదాలు’ (టెలిఫిలిం), ‘రాగం-తానం-పల్లవి’ (శాస్త్రీయ నృత్య టెలిఫిలిం) లకు కాన్సెప్ట్, కొరియాగ్రఫీ, & డైలాగ్ సమకూర్చారు. ఇతర రచనలు: గత రెండేళ్లగా – ప్రవాసాంద్రుల జీవన విధానాన్ని ప్రతిబింబించే వ్యాసాలు, కుటుంబవ్యవస్థ లోని మానవ సహ సంబంధాలు ఇతివృత్తంగా, ఆమె చేసిన నృత్యేతర రచనలు నలభైకి పైగా పలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 2012, 2014 లో వంగూరి ఫౌండేషన్, USA వారి ఉగాది ఉత్తమ రచన పురస్కారం అందుకున్నారు. 2013 లో ‘విదేశీ కోడలు’ కథాసంపుటి వంగూరి వారి ముద్రణగా ‘తాన సభల్లో ఆవిష్కరించబడింది. ‘రాజీ పడిన బంధం’ ఆమె రచించిన తొలి నవల కాగా, ‘సారనగా సాహిత్య పత్రికలో’ జూలై నుండి ప్రచురింపబడుతున్న తొలి ’ సీరియల్ గా ‘ఎగిరే పావురమా!’

నా మాట ....

 

...... మహారాష్ట్రలో కొద్దిమంది గ్రామీణులు తమ ఆడపిల్లకి “నకూసా” అని పేరు పెడతారని మీకు తెలుసా? ‘నకూసా’ అంటే ‘అవాంఛిత’ అని అర్ధం. ‘నకూస’ వద్దంటే పుట్టిన ఆడపిల్ల, చంపేయలేక వదిలేసిన ఆడపిల్ల. ఆ పిల్ల జీవిత పర్యంతం, తానో అవాంఛితనని ప్రకటించుకుంటూ బ్రతికి, అవాంఛితగానే మరణిస్తుందని   మీకు తెలుసా?....(విహంగ పత్రిక – జనవరి 2012)

 

ఆడపిల్ల పుట్టిందన్న నిరాశతో, ఆ పసికందుని చంపారనో, వదిలేసారనో వార్తల్లో విన్నప్పుడల్లా – ఓ నాలుగు మాటలనడమో లేదా బాధపడ్డమో చేసేదాన్ని. కాని ‘నకూసా’ గురించి చదివినప్పుడు చాలా కలవరంగా అనిపించింది. “ఇంతటి అన్యాయం ఎలా సాధ్యం?’ అని జీర్ణించుకోలేక పోయాను. ప్రేమకి, త్యాగాలకి ప్రతిరూపాలు తల్లితండ్రులని నమ్మే నన్ను ‘నకూసా’ గురించిన విషయం ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది....

ఆ స్పందనే ‘ఎగిరే పావురమా!’ రాయడానికి ప్రేరణ అయింది.

చదివి ఆదరిస్తారని, మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తాను.

..... ఉమాభారతి

 

 

 

 

కోవెలలోని రావిచెట్టు నీడనే, అలవాటుగా నేను కూకునే నా స్థానం.
చీకటితో తలార స్నానాలు చేసి తయారయ్యాక, పొట్టి చక్రాల బండి మీద నన్ను గుడికాడికి తెస్తాడు తాత. గుడివాకిళ్ళు తెరవక మునుపే, మేము అమ్మవారి గడపల్లోకి చేరుకుంటాము.

కోవెల వెనుకనుండి వస్తే తిన్నగా రావిచెట్టు కాడికే చేరుతాం.
వస్తూనే చెట్టుపక్కనున్న కొళాయి నీళ్ళతో మళ్ళీ ముఖం కడిగించి, నా నుదుటిన అమ్మవారి కుంకుమెడతాడు తాత.

“బొట్టెడితే మాలక్ష్మివేనే. వేడుకున్నా పలకని ఆ దేవత కన్నా పలకలేని నీ నవ్వులే నాకు చాలమ్మా,” అంటూ నా తలమీద ముద్దెట్టుకొన్నాకే ఆ దేవుడికి దణ్ణాలెట్టుకుంటాడు తాత.

రావిచెట్టు నీడనున్న అరుగు మీద నన్ను కూకోబెడతాడు.
నా కాళ్ళ చుట్టూ కంబడి కప్పి, నాకు కావాల్సినవన్నీ అందేలా సర్దుతాడు.

“దట్టంగా విస్తరించిన ఈ రావిచెట్టుని చూడు,” అంటాడు తాత ఒక్కోప్పుడు.
“అన్ని వైపులనుండి నీ అరుగుని చేతులతో కాపాడుతున్నట్టుగా ఉందిరా, గాయత్రీ,“ అంటాడు నాతో.

నాకేమో, నా అరుగు సాంతం ఆ రావిచెట్టు పొట్టలో ఉన్నట్టుగా అగుపించి నవ్వొస్తది.
దాని పెద్దపెద్ద కొమ్మలేమో అరుగుకి చుట్టూ కాపలాగా ఉన్నట్టనిపిస్తది.

నేను కూకున్న మేరకు, అరుగుకి దిట్టమైన పైకప్పేసే ఉంది. ఆ చెట్టు నీడన కూకుంటే వానచినుకుల తడి గాని, ఎండవేడి గాని అంతగా నన్ను తాకవు. ముంచెత్తే వానలైతేనే అరుగు తడుస్తది.

బుద్ధి తెలిసిన కాడినుండి – చంద్రం పిన్ని సాయంతో పొద్దు మొదలై, నా జీవనం ఆ రావిచెట్టు నీడనే గడుస్తది. పగలంతా గుడిలో పంచే ప్రసాదాలతోనే నా కడుపు నిండుతది.

**

రోజూ నేను అరుగుమీద చేరిన కాసేపటికే, చీకట్లు పోయి ఎలుగొచ్చేస్తది. సూరీడి ఎలుగులతో పాటే, ఆకాశంలో నుండి సూటిగా నా వైపుకే ఎగిరొస్తాయి పావురాళ్ళు. నా భుజం మీదగా పోయి అడుగులేస్తూ ఒకింత దూరంగా నంచుంటాయి, ‘మేమొచ్చాము’ అన్నట్టు. అవి అట్టా బారుతీరి రోజూ అదే సమయానికి రాడం బాగనిపిస్తది..

నేను చిమ్మిన గింజల్ని, అవి ముక్కులతో ఒక్కోగింజ ఏరుతుంటే, చూస్తూ నా పూల పని మొదలెడతాను.....
**
మా ఊరు గంగన్నపాలెం లోని ‘గాయత్రి’ అమ్మవారి గుడి అది. ‘శ్రీ గాయత్రీ కోవెల’ అంటారు.
గుడి చుట్టూ పెద్ద ఆవరణ. తెల్లారేలోగా ఆ మేరకు శుభ్రం చేస్తాడు తాత.

పూజారయ్య వచ్చినాక, నా ముందు బల్లపీటేసి, అమ్మకానికి దేవుని బొమ్మలు, పూజసామాను, పుస్తకాలు, జపమాలలు, లక్ష్మికాసులు దాని మీద సర్డుతాడు.
అందరు అంటకుండా వస్తువులు కాగితాల్లో చుట్టే ఉంటాయి. వస్తువుల ధరలు రాసిన పలకలు రావిచెట్టుకి కట్టుంటాయి.

సామాను తీసుకున్నోళ్ళు, నా పక్కనే భూమిలోకి దిగేసున్న ‘గుడి హుండీ’లో వాటికి సరిపడా డబ్బులేస్తారు. చీకటిపడ్డాక మాత్రం పూజసామాను గుడిలో పంతులుగారి కాడ తీసుకోవాల్సిందే.

పూజసామాను కొనడానికి వచ్చినోరు కొందరు నాతో నవ్వుతూ మాట్లాడతారు కూడా.
“నీ తేనెరంగు కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా పాపా?” అంటారు.
“నీవు నవ్వితే నీ బుగ్గన చొట్టలు ఎంత ముద్దుగా ఉంటాయో తెలుసా గాయత్రీ?” అంటారు.

నాకు సిగ్గనిపిస్తది.

**

తాతతో పాటు గుడి పనులకి రాములు ఉంది. కోవెల్లో ‘స్వీపరు’గా చాన్నాళ్ళగా పని చేస్తుందంట.
నేను అరుగు మీద చేరగానే పూలబుట్టలు, ఓ చెక్కపెట్టి తెస్తుంది. చెక్కపెట్టిని నాకు మరో పక్కన కాస్త ఎడంగా పెట్టి, పూలబుట్టలు నా ముందుంచుతుంది.

గుడి చెట్ల నుండి కర్వేపాకు, పూజారయ్య ఇచ్చే కొబ్బరిచిప్పలు సంచులకేసి, అమ్మకానికి దారవతల కూరలబడ్డీ కాడికెళ్ళి కూకుంటాడు తాత.

“కాస్త నా బిడ్డని సాయంత్రం వరకు చూసుకోవే రాములు,” అంటాడు తాత బయటకి పోయే ముందు.
“అట్టాగేలే సత్యమయ్యా, బంగారు తల్లి మన గాయత్రి. దానికి అందరూ చుట్టాలే,” అంటది బదులుగా రాములు ప్రతిసారి. రాములు అసలు పేరు రాములమ్మ. ఎప్పుడూ నవ్వుతుండే ఆమెని అందరు ‘రాములు’ అనే పిలుస్తారు. ఆవరణలోనే రావిచెట్టుకి అవతల పెంకుటింట్లో ఉంటది.
ఇంకా ఈడ కొలువు చేసే మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాడు తాత. వాళ్ళే - అర్చకులు పంతులుగారు, గుడి కాపలాదారు నాయుడన్నా.
వాళ్ళు కూడా కుటుంబాలతో రాములు పెంకుటిల్లు ఎనకాలే మిద్దెల్లో ఉంటారు.

ఇక, ఈ కోవెలకే కాదు – మా ఊరిక్కూడా పెద్దదిక్కు, పూజారయ్య సోమయాజులుగారేనంట.
వీధవతల పెద్ద ఇంట్లో ఉంటారు పూజారయ్య కుటుంబం. ......

”గుడి వ్యవారాలన్నీ చూస్తూ, అందరికి మేలు చేసే పూజారయ్యని చుట్టూ ఊళ్ళవాళ్ళు కూడా గౌరవిస్తారు. మంచిమనిషి మన పూజారయ్య,” అంటాడు తాత.
**
ఇక ఇప్పుడు ‘దసరా’ మూలంగా గుడి అవరణ రోజంతా జనంతో కిటకిటలాడుతుంది. ఈ యేడు పూజలకి, ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని తాత, చంద్రం పిన్ని అనుకున్నారు.
పిన్ని, ఆమె పెనిమిటి - రాంబాబాయి మా పక్క కొట్టాంలోనే ఉంటారు.

“నా చంద్రమ్మ చెల్లికి మనమీద గొప్ప ప్రేమరా గాయత్రి. యేడకీ పోకుండా మనకోసం పక్కనే చిన్న కొట్టంలో వుండిపోయారు పిన్ని వాళ్ళు,” అంటాడు తాత.

“రాంబాబాయి మనకి చుట్టాలబ్బాయవుతాడులే. అందుకే సాయంగా తోడుగా ఉంటాడు,” అంటుంది పిన్ని.

పండుగ పూజలకని ఇంకాస్త పెందరాళే నిద్ర లేపుతున్నాడు తాత.
పొద్దున్నే సాయం చేయడానికి వచ్చే పిన్ని, దసరాపూజలు జరిగినన్నాళ్ళు నాకొకింత ముస్తాబు చేసి మరీ కోవెలకి పంపుతుంది.
**
పండుగ ఆఖరి రోజున అమ్మవారి పూజలకి ఆడోళ్ళంతా ఎర్రరంగు దుస్తులు ఏసుకోవాలంట. పిన్ని నాచేత ఎర్రచుక్కలంచు పరికిణీ, ఆకుపచ్చ జుబ్బా వేయించింది. ఎర్రటి బొట్టు, గాజులతో సహా.

సాయంత్రం జరగబోయే పాటకచేరి-డాన్సు ప్రోగ్రాంల గురించే ఊరంతా చెప్పుకుంటున్నారంది పిన్ని. పాట-డాన్సు చూడాలని నాకూ ఉత్సాహంగా ఉంది.
ఈ గుళ్ళో నేను చూస్తున్న మూడో దసరా ఇది. మొదటిసారి దసరాకి నాకు ఐదేళ్ళంట.

“అందంగా బొమ్మల్లే ఉన్నావే,” తల దువ్వడమయ్యాక, నా బుగ్గలు నొక్కింది పిన్ని.
“పద, పద, ఇకెళ్ళండి. తయారయి నేనూ పెందరాళే వచ్చేస్తా” అంటూ నన్ను, తాతని బయలుదేరదీసింది.
**
గుళ్ళో అడుగు పెడుతూనే, రాములు నీళ్ళ బిందెతో ఎదురుబడ్డది.
జాప్యం లేకుండా పనులు చకచకా జరగాలన్నాడు తాత, మాతో.

రాములు తెచ్చిన ఐదు బుట్టల పూలు విడదీసి, గుట్టలుగా పోసుకొని పని మొదలెట్టాము. తొడిమలు తీసి, కాడలు కత్తిరించి నేను పూలని బుట్టకేస్తుంటే, అరుగుల మధ్య గింజలేరుతున్న పావురాళ్ళని గమనిస్తూ మాలలు కడుతుంది రాములు.

“ఆ చిన్నగువ్వలు నీకు మల్లేనే ముద్దుగా, బొద్దుగా ఉన్నాయి కదూ,” అంటూ వాటికి మరో గుప్పెడు గింజలు చిమ్మిందామె.
అట్టా అన్నందుకు తల వంచుకొని నేను కోపం నటించాను.

“అబ్బో, మా గాయత్రి బుంగమూతి ఎంత ముద్దుగా ఉందో, ఇయ్యాల చేతులకి గాజులు, కాళ్ళకి పట్టాలెట్టి, గువ్వపిట్టల్లె సక్కగా ఉంది పిల్ల,” అంటూ నా నెత్తిన మొట్టింది. ఇద్దరం నవ్వుకున్నాం.

రాములుకి నేనంటే ప్రేమని ఎరుకే. ఎప్పుడన్నా నా జడ కుదరకపోతే, పనులయ్యాక కబుర్లాడుతూ మళ్ళీ జడేస్తుంది..

రాములు, తాత కూడా రోజూ కాసేపు కబుర్లు చెప్పి నన్ను నవ్విస్తుంటారు.
నాకెన్నో సంగతలు తెలిసేలా ఇవరంగా చెబుతారు.
తిరిగి నేనూ ఏదైనా అన్నా, నా సైగలని తెలుసుకునేది తాతతో పాటు రాములు, చంద్రం పిన్నే.

మధ్యానాలు గుడి తలుపులు మూసాక, ఒక్కోమారు కాసిన్ని బొరుగులు తెచ్చిచ్చి, పక్కనే కూకుని, కథలు చెబుతూ చక్కని బొమ్మలు కూడా గీస్తుంది రాములు. దగ్గరుండి చూసినా నాకు ఆమెలా బొమ్మేయడం చాతవలేదు.

ఇట్టా రాములు గురించే అనుకుంటూ పూలపని ముగించేప్పటికి, ఆమె దండలు కట్టడం కూడా అయినట్టుంది.

“ఏయ్ గాయత్రి, ఏమంతగా ఆలోచన? పండుగపూట, చకచకా పనులు కానీమన్నాడుగా తాత ! నీ పూలిటియ్యి, అన్ని దేవుళ్ళకి అందించాలి,“ అంటూ నా కాడి పూలు కూడా కలిపి నాలుగు బుట్టలకేసి, ఆవరణలోనే ఎడంగా ఉన్న చిన్నగుళ్ళ వైపుగా కదిలింది.
**
రాములు కాళ్ళకెట్టిన మువ్వల చప్పుళ్ళు వింటూ ఆమె వంకే చూసాను. పండుగ ముస్తాబుగా కళ్ళనిండా కాటుకెట్టి, చేతులకి రంగురంగుల మట్టి గాజులేసింది రాములు. కడియాలు, ముక్కెరతో సహా.
‘ఎన్ని గాజులో! ఎన్ని రంగులో! చూడ్డానికి బాగున్నయి. రాములు ముస్తాబే కాదు - నాకు ఆమె చెప్పే కథలు కూడా బాగుంటయి’ అనుకుంటూ అరుగు మీద చిందరవందరగా పడున్న తొడిమలు, కాడలు, రాలిన ఆకులు అందినంత మేరకు బుట్టకెయ్యడం మొదలెట్టాను.
కోవెలకి వచ్చినోళ్ళందరూ రాములుతో ప్రేమగా మాట్టాడుతారు. నాకే కాదు, రాములంటే అందరికీ ఇష్టమే. ఆమె చిరకాల స్నేహితులు - సుబ్బి, మాణిక్యం. ఒక్కోప్పుడు గుడికొచ్చి కాసేపు ఆమెకి కబుర్లు చెప్పి పోతుంటారు.

రాములు గురించి అనుకుంటూ నా చుట్టూ ఉన్న అరుగంతా శుభ్రం చేసేసాను.
ఇంతలో బుట్టెడు పత్తి తెచ్చి నా ముందుంచింది రాములు.

“పండుగలు కదా! ఎన్ని వొత్తులైనా చాలడం లేదు. పంతులుగారికి ఇంకా వొత్తులు కావాలంట,” అంటూ పక్కనే కూకుంది.
సగం పత్తి విడదీసి తన ముందేసుకొని, “ఏమాలోచిస్తున్నావు? అడిగింది నా వంక చూస్తూ...

‘నీ గురించే,’ అని సైగ చేసాను.
నా చెవి పిండింది రాములు. “తిన్నగా ఎనిమిదేళ్ళు లేవు నీకు. నా గురించి ఆలోసించేంత పెద్దదానివా? పని కానీయ్,” అంది తనూ నవ్వుతూ.

“చేతిలో పనయ్యాక నీ జడలోకి మల్లె చెండు కడతాలే,” అంది.
ఇద్దరం వొత్తులు చేయడం మొదలెట్టాము.
**
సాయంత్రం పండుగ సంబరాలకి సుబ్బి, మాణిక్యం సహా చాలా జనం వచ్చారు.
పాట కచేరి – డాన్స్ మొదలయ్యాయి.

నా ఈడు ఆడపిల్లలు అందంగా అమ్మవారికి మల్లేనే తయారయి, కాళ్ళకు గజ్జెలు కట్టి - అందంగా ఆడుతున్నారు. మధ్యమధ్యలో నాకన్నా చిన్న కూనలు గొంతెత్తి, కీర్తనలు... దేవుని పాటలు - తాళమేసి మరీ పాడుతున్నారు. జనాలు మెచ్చుకుంటున్నారు.

డాన్సులు చూస్తూ పాట వింటుంటే, వాళ్ళకు మల్లే నేనెందుకు ఆడలేనని - ఈ తడవ మరింత నిరాశగా అనిపించింది.
అసలెందుకు కదలలేనని దిగులుగా అయిపోయాను.
ఇట్టా నా ఈడువాళ్ళు పట్టుపరికిణీలు వేసి పరుగులెట్టడం చూసినప్పుడల్లా, నాకూ వాళ్ళలా పరిగెట్టాలనిపిస్తది. నా అరికాళ్ళు చీమలు పాకినట్టుగా చిమచిమలాడతాయి.
బొద్దుగా కనబడినా నడువలేవు నా కాళ్ళు. కావలసినప్పుడు చేతుల సాయంతోనే నేల మీద కాస్త దూరం మెసలగలను. సాయం పడితే, పైకి లేచి కొంత దూరం గెంతుతూ కదలగలను.

నా ఆసరా కర్ర ఎప్పుడూ నాతోనే ఉన్నా కదలడానికి మరొకరి సాయం ఉండాలి. ప్రతిరోజూ నాకు సాయం పట్టి, “ఇంకోమారు, మరోమారు,” అంటూ నన్ను అరుగుల చుట్టూత తిప్పుతది రాములు.

నా ఈడు వాళ్ళలా చిలుకల్లె పలుకలేను. దేవుని ముంగిట గొంతెత్తి పాడనూలేను.
అందరిలా నేనూ పలకాలనీ, పాడాలనీ కష్టపడ్డప్పుడల్లా గొంతు మంటెట్టి, నొప్పెట్టి కన్నీళ్ళొస్తయి.

‘అ, మమ్, మ, ఉమ్’ అని మాత్రమే శబ్దాలు చేస్తది నా గొంతు.
ఎప్పుడన్నా కష్టంగా తోచి గట్టిగా అరవాలనిపిస్తది కూడా.

‘అంతకన్నా ఏం చెయ్యగలను, ప్చ్,’ అనుకుంటూ తలొంచుకొని ఉండిపోయిన నా భుజంమీద ఎవరో తట్టారు. తిరిగి చూస్తే చేతిలో ప్రసాదాలతో పిన్ని.

“అట్టా చూస్తూండిపోయావేరా? అలిసిపోయావా? లోన పూజ ముగిసి హారతి ఇవ్వడం కూడా అయ్యిందిలే,” అంటూ ప్రసాదం అందించింది పిన్ని.
“కళ్ళకద్దుకొని తినేసెయ్యి. ఇంక ఇంటిదారి పడదాము. తాత మనకోసం మెట్లకాడ ఉంటాన్నాడు,” అంటూ పక్కనే కూకుంది.
“ఎందుకా దిగులు మొహం? కాస్త నవ్వు. ఈ పండుగనాడు నీ ఈడు పిల్లలందరిలో నువ్వే ముద్దుగా ఉన్నావంట తెలుసా? మన వీధి అమ్మలక్కలంతా అంటున్నారు,” అన్నది నన్ను నవ్వించాలని పిన్ని.
నా నవ్వులు బాగుంటాయని తాత అంటాడు. రాములు కూడా నాకు చక్కిలిగింతలు పెట్టి మరీ నవ్విస్తది. ...............
(ఇంకా ఉంది)
**