Archives for September 2013

చత్తిరి

మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ

అత్త అస్మాన్
కోడలు జమీన్
ఆషాడంల అత్తకోడండ్లు
మొఖాలు మొఖాలు సూస్కో వద్దంటరు
గనీ ,గీ ఆషాడo లనే గమ్మత్తి జర్గుతది గదా
జేష్టం  దాక అస్మాన్ అంతా మండిపోతది
జమీన్ ని అంతా నెర్రెలు బడేట్టు సేత్తది
గంతటి  రోకళ్ళు పగిలి పోయే రోయిణి  కాలంగుడా
ఆషాడం రాంగానే నిమ్మల పడ్తది
జమీన్ కోడలు కడుపుల ఇత్తనం బడే
సైమం అచ్చిందని తెల్వగనె
ఎండల్ని – ఉడ్క పోతల్ని ఇచ్చిన ఆస్మాన్ అత్త
చినుకుల్లెక్క  సల్లబడ్తది
మబ్బుల మీంచి వానై కురుత్తది
*             *     *          *             *
గప్పుడు చత్తిరి మతిల కత్తది
దాన్ని పోయినేడు అటక మీద పెట్టినట్టు యాదికత్తది
గూన పెంకుటింట్ల ఓ మూల డొల్ల పోయిన గుమ్మి పాకి
ఇంటి వాసాల మీన ఉన్నఅటక మీదికి ఎక్కుత
అట్క మీద
బూజు పట్టిన పాత బొక్కెన – చీకి పోయిన తాడు
తాతల నాటి చిల్లు పోయిన గంగాళం
చింత పండు తోముడు లేక కర్రె బడ్డ ఇత్తడి బిందె
కట్టెల పొయ్యి కాగుడికి నల్ల బడ్డ సత్తుగిన్నెలు
కొన్ని టేకు ముక్కలు – పాత చెప్పులు
చినిగిన మా నాయ్న దోతి – అవ్వ పాత చీరలు
నేను పుట్టక ముందు
మా ఎలుపటి దాపటి ఎద్దులకని పర్కాల అంగట్ల
మా నాయ్న తెచ్చిన గజ్జెల పట్టీలు
చేతికి తగుల్తయి
అసొంటనే చత్తిరి కన్పిత్తది
దాన్ని సూడంగనే
చీకట్లల్ల బజారు మీద ఓ గోడ మూలకు నక్కిన
దిక్కులేని కుక్క యాదికత్తది
ఇన్నొద్దులు పట్టించుకోనందుకు
అలిగి ముడ్సుకొని పడుకున్న మా ముత్తవ్వ లెక్కనిపిత్తది
నీటి సుక్క కరువై నారేయక నీరు పెట్టక
పడావు బడ్డ నా పొలం కండ్లల్ల కనబడ్తది
            ***
దుమ్ము దులిపి పాత గుడ్డ తోని తుడ్సినంక
చత్తిరి మల్ల నిగనిగ లాడుతది
వంకీ తిర్గిన చత్తిరి నా చేతిలోకి రాంగనే
నాకు ఎక్కడలేని రాజసం వచ్చినట్లయితది
నా ఒంటరి నడకకు తోడు దొర్కినట్లయితది
ఇగ రాసకార్యం ఏదీ లేకపోయినా
వాన పడ్తానప్పుడు
మా వాడ దాటి సడుగు మీదికి వత్త
పెయ్యంత నిండు చెర్వు లెక్క అయి
గొడ్లను తోలుక పోతున్న మల్లి గాడిని సూసి
చత్తిరి కింద నేను
వాన సుక్క తడ్వకుంట నడుత్తానందుకు
మా గర్రుగ అనిపిత్తది
e91c0d78-dc24-4257-aa5a-8eff6f6840c6HiRes
ఇగో, ఎవ్వలకి తెల్వని ముచ్చట నీకు చెప్పనా
మా ఊళ్లోల్లకి నా చెత్తిరి సూపియ్యదానికే
వానల్ల నేను ఇల్లు దాటి వత్త, ఎర్కేనా
అయితమాయె గనీ,
గిదంత పై పై పటారమే
నివద్దిగా చెప్తే గీ వానల చత్తిరి ఉంటె
పక్కన మనిషున్నట్టే
కాల్వ గట్టు తెగి నీళ్ళు
పొలం లకి అగులు బారుతానప్పుడు
నేను ఉరికురికి పోయి కట్ట కట్టేది
గీ చత్తిరి బలం సూస్కునే..
ఇంటి మీది పగిలిన గూనెల నుంచి
వాన నీళ్ళు కారుతానప్పుడు
మా బడి పుస్తకాలు తడ్వకుంట కాపాడేటిది
గీ చత్తిరే ..
ఇగ, బజార్ నల్ల కాడ్నుంచి మంచి నీళ్ళు తెచ్చేటపుడు
లసుమక్క వసుదేవున్లెక్క
దాని తలకాయ మీది బిందె కిష్ణ పరమాత్మున్లెక్క
చెత్తిరేమో ఆది శేషున్లెక్క
నా కండ్ల కన్పడ్తది
మా ఐదేండ్ల అఖిలు
ముడ్డి మీద జారుతున్న నెక్కరును ఎగేసుకుంట
చత్తిరి పట్టుకోని వత్తాంటే
వామనుడే మా వాకిట్లకి నడ్సి వచ్చినట్లనిపిత్తది
కచ్చీరు అంగట్లకు
కూరలకు వచ్చిన రాజయ్య
చత్తిరి పట్టుకోని నిలబడితే
గోవర్ధన గుట్టని యేలు మీద నిలబెట్టిన
గోపయ్య లాగనిపిత్తడు
బీడీల గంప మీద
చత్తిరి  పట్టుకొని వచ్చే కమలమ్మ
పల్లాకిల పెండ్లి పిల్లను తీస్క పోతాన
ముత్తయిదువ లెక్కనిపిత్తది
చత్తిరి పట్టుకోని
భుజాల మీద నూలు సుట్టలను
మోస్కుపోతాన మార్కండయ్య
మబ్బుల్ని మోస్కపోతాన ఇంద్రుని లెక్కనిపిత్తడు ..
***
మీ అసోంటోల్లకు చత్తిరి అంటే
ఆరు ఇనుప పుల్లల మీద కప్పిన నల్ల గుడ్డ.
గనీ, నా అనుబంల, నియ్యత్ గ చెప్పాల్నంటే
గీ వానా కాలంల చత్తిరి–
చినుకులల్ల పూసిన నల్ల తంగేడు పువ్వు
వూరి చెర్వు కట్ట మీద పెద్ద మర్రి చెట్టు
మనకు సాత్ గ నిలబడ్డ జిగిరి దోస్త్
అత్తా కోడళ్ళ పంచాయితి నడిమిట్ల

అడ్డంగ నిలబడ్డ ఎర్రి బాగుల కొడుకు… !

– మామిడి హరికృష్ణ

త్రిపదులు

ఫనిహారం వల్లభాచార్య

ఫణిహారం వల్లభాచార్య

1. ఎడారిలో

వాన

కవిత్వం

………….

2. నొసట మంట

పెదవి నవ్వు

శివుడు కాదు – మనిషే!

…………….

3. ఒక జీవిత దూరం

ప్రయాణం

గమ్యం రాలేదు

…………………..

4. నాదం

ఇరుక్కున్న

ప్రాణఘోష

…………………..

5. పొత్తిళ్ళు

ఒత్తిళ్ళు

ఆకలిలో తేడా

……………….

Kalpana Iphone photos 239

6. ప్రాణం

మరో గుండెని

ఎత్తుకుపోతుంది

………………….

7. నిత్య ప్రాచీనం

నిత్య నవీనం

మంచం

8. నేను బతకాలనే

ఆమె రాలేదు

నా గుండెలోకి

………………………..

9. దారీ అదే

గమ్యమూ అదే

జీవితం

…………………………

10. పిల్లలూ

పోలీసులూ

మనం బందీలం

……………………………

11. రాత్రికి బతుకు

దానం చేశాను

తెల్లారిపోయింది

…………………………..

12. నన్ను నేను

త్యజించాను

దారి తెలిసింది

-ఫణిహారం వల్లభాచార్య

కార్టూ’నిజం’

శ్యాం మోహన్

శ్యాం మోహన్

 

 syam1———————————————————————————————————————————————————–

కార్టూన్- 2

 Ganesha anindya

 

 – కార్టూన్: రాజవరం ఉష

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఏడు రంగుల ఇంద్రధనస్సు “ సప్తపర్ణి”

Saptaparni cover page చిత్రలేఖనం, ఛాయాగ్రహణం , ఇంకా చలనచిత్రాల పై అనేక  వ్యాసాలున్న  ‘సప్తపర్ణిపుస్తకావిష్కరణ సభ ఇటీవల  హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ దూర దర్శన్ మాజీ అధికారి, ప్రయోక్త  వోలేటి పార్వతీశం సభ ను నిర్వహించారు.  మాజీ పోలీసు అధికారి చెన్నూరి ఆంజనేయరెడ్డి  అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంజనేయరెడ్డి పుస్తకావిష్కరణ చేసాక మాట్లాడుతూమిసిమి, భూమి పత్రికలలో ప్రచురించబడిన కాండ్రేగుల నాగేశ్వరరావు వ్యాసాలు ఇప్పుడు పుస్తకరూపంలో సప్తపర్ణిగా మనముందున్నాయి. కళలను బోధించే ఉపాధ్యాయులకు   పుస్తకం విజ్ఞానదాయినిగా ఉండగలదు. కళ మీద వ్యాసాలు రాయడం  మొదలెట్టింది సంజీవదేవ్. తరువాత నాగేశ్వరరావు ప్రభృతులు. నిజానికి  మాజిక్ రియలిజమ్  గురించి సరళంగా వ్రాయటం ఒక కళ. హైదరాబాదు నగర ప్రభావంతో ఇక్కడివారికి కళ, శిల్పాలపై ఆసక్తి కలుగుతోంది. కష్ట నష్టాలకోర్చి, కళాజ్యోతి బాపన్న మిసిమి మాస పత్రిక, ఇంకా ఇతర పుస్తకాలు వెలువరిస్తున్నందుకు నా అభినందనలుఅంటూ తమ అధ్యక్షోపన్యాసం చేసారు.

వోలేటి పార్వతీశం మాట్లాడుతూ సప్తపర్ణి అంటే ఏడు ఆకులని ,ఏడు అంశాల కలయికే సప్తపర్ణి అని చెప్పారు. సృజన, కళారాధన, కళా సమీక్ష, చిత్రకళ, శిల్పకళ, చలనచిత్ర కళ, వ్యాస రచనల కలయికే ఈ సప్తపర్ణి అని వివరించారు.

శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వాణీ దేవి మాట్లాడుతూ ” కళలపై ఆంగ్లంలో చాలా పుస్తకాలుంటాయి కాని తెలుగు లో బహు తక్కువ. లలిత కళలపై  చక్కటి పుస్తకాన్ని వ్రాసి, ఒక చిత్రకారుడు చేయలేని పనిని  నాగేశ్వరరావు చేసి చూపారు. లలిత కళలపై అవగాహనకు, ఈ పుస్తకం విద్యార్థిలోకానికి దోహదపడకలదు. చిత్రకారుల జీవితం, వారు చిత్రాలను గీయటానికి ప్రేరకమేది, డాడాయిజం వగైరాలను సులభ శైలిలో నాగేశ్వరరావు చెప్పారు. హిట్లర్ ఆధునిక కళలపై ఏహ్యభావం కలిగున్నవాడై, అటువంటి చిత్రాలను వెంటాడి, వాటిని తగులబెట్టించిన విషయం, హిట్లర్ గురించిన వ్యాసం లో మనము చదవవొచ్చు. కొందరి చిత్రాకారుల చిత్రాలు అమ్ముడుపోని స్థితి నుంచి మరికొందరి చిత్రాలు లక్షలు, కోట్ల రూపాయలలో అమ్ముడుపోవటం దాకా మనము గమనించవచ్చు. లెయొనార్డొ విన్సి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను ఫ్లూట్ చక్కగా ఊదుతాడు. గాలిలో ఎగరటం వగైరా శాస్త్రీయ విషయాలపై చిత్రాలు గీసాడు. ఛాయాగ్రహణం, సాలార్ జంగ్ సంగ్రహాలయం , వంగ చిత్రకళారీతులు వగైర అంశాలపై పెక్కు వ్యాసాలున్నాయి సప్తపర్ణి లో ” అని చెప్పారు.

  చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా  కాండ్రేగుల నాగేశ్వరరావు


చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా కాండ్రేగుల నాగేశ్వరరావు

రచయిత నాగేశ్వరరావు మాట్లాడుతూ ” లలిత కళలపై రెండు వ్యాసాలు మిసిమి సంపాదకులకిస్తే, వారికవి నచ్చి మిసిమికి క్రమంగా వ్రాయమని ప్రోత్సాహించారు. సాంస్కృతిక అధ్యయనం మన పాఠకులలో తక్కువగా ఉంది. మిసిమి లాంటి మంచి సాహిత్య పత్రికలు  ఆ లోటు తీరుస్తాయి. నేను అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు వాణి (కీ.శే. పి.వి.నరసింహారావు కూతురు)  గారిని లేపాక్షి తీసుకెళ్ళి చూపించే బాధ్యత నా పై ఉంచారు.  లేపాక్షిలో వారి లైన్ డ్రాయింగ్స్  చూసాను. 17 సంవత్సరాల వయసు నుంచే పత్రికలకు వ్రాయటం ప్రారంభించాను. మా నాన్న గారు వైద్యులు. కాకతీయ రాజ్యపతనం కథాంశంగా  మల్లాది వసుంధర రచన  సప్తపర్ణి అనే చారిత్రక నవల ఈ పుస్తకానికి ఈ పేరుంచటానికి ప్రేరకం. మహర్షి ఇచ్చిన మొక్కకు స్వర్ణం రంగులో ఏడు ఆకులు వస్తాయి. అవే సప్తపర్ణి. కళలకు సంబంధించిన ఈ పుస్తకం లో, చలనచిత్రాలపై  నేను వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. సినిమాలు కదిలే చిత్రాలు. నిజమైన కళాత్మక చిత్రం సత్యజిత్ రే చిత్రం తోనే మొదలయ్యింది. సత్యజిత్ రే చిత్రకారుడు కూడా. బి.నర్సింగరావు, కె.వి.రెడ్డి ఇంకా బాపు దర్శకులు మాత్రమే కాక చిత్రకారులు కూడాను. ప్రపంచ విఖ్యాతుడైన దర్శకుడు Alfred Hitchcock చిత్రకారుడు కూడా. తన సినిమా కు కావల్సిన సెట్టింగ్స్ బొమ్మలు  అన్నీ తనే చిత్రించే వాడు. చిత్రకళకు సినిమాకు చాల దగ్గరి సంబంధం ఉంది. చిత్రాలకు న్యాయం జరిగేందుకై, సప్తపర్ణి ప్రమాణము 9″X9″ గా నిశ్చయించాను. సప్తపర్ణి మూడు భాగాలుగా తీసుకురావాలని ప్రణాళిక. మూడవ భాగంలో పరిశోధనాత్మక వ్యాసాలుంటాయి “ అని చెప్పారు.

సభాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ “1920-26 ల లో అజంతా-ఎల్లొరా ల చిత్రాలకు సుమారు 250  నకళ్ళు గీయించారు. వీటిలో కొన్నింటిని నాగార్జున సాగర్ సంగ్రహాలయం లో ఉంచబోతున్నారు” అని తెలిపారు. సభ ఆద్యంతం ఆసక్తికరంగా, చక్కటి జ్ఞాన, భావ వీచికలతో, వోలేటి పార్వతీశం నిర్వహించారు.

Text and Photographs : సి.బి.రావు

Link for డాడాయిజం = http://en.wikipedia.org/wiki/Dada

 

 

 

 

ఆమె మనసులో దాచుకున్న వ్యథ..కోసూరి ఉమాభారతి కథలు “విదేశీ కోడలు”!

videshi-kodalu

ఆసక్తి ఉంటే ఎంచుకున్న ప్రవృత్తిని ఎప్పుడైనా అభివృధ్ది చేసుకోవచ్చు. వయో పరిమితి లేదు. కాల పరిమితి కూడా ఉండదు. చిన్నతనం నుంచీ సాహిత్యం మీద నున్న అభిమానం, అభిరుచి.. జీవనయానంలో తారసపడిన వ్యక్తుల వ్యక్తిత్వ పరిశీలన, మనస్తత్వాల విశ్లేషణ, నిరంతర శోధన.. వృత్తి రీత్యా పెంచుకున్న భాషాభిమానం  శ్రీమతి ఉమాభారతిని కలం పట్టేట్లు చేశాయని చెప్పచ్చు.

ఈ సంకలనంలో పన్నెండు కథలున్నాయి. అన్నీ ఒక సంవత్సరం వ్యవధిలో రాసినవే. భరతముని కథలో తప్ప అన్నింటి లోనూ స్త్రీలదే ప్రధాన పాత్ర. కూతురిగా, చెల్లెలిగా, అక్కగా, అమ్మగా, స్నేహితురాలిగా ఎదుర్కొన్న అనేక అనుభవాల ఫలితం, వాటి ప్రభావం.. మానసిక వ్యవస్థలు, వాటి విశ్లేషణ తో నడిపించిన కథల సంపుటి ఇది.

కవయిత్రిగా రచనా ప్రస్థానం ప్రారంభించిన రచయిత్రి తన కవితలతో వర్ణనలు సాగించడంతో కొన్ని కథలు ఆధునిక చంపూ పధ్ధతిలో(కొంత పద్యం, కొంత గద్యం కలిసిన కావ్యాన్ని చంపూ కావ్యం అంటారు.) నడిచాయని చెప్పచ్చు. అన్నీ స్త్రీ ప్రధానమైనవే ఐనా..  పోలికలున్నాయని పించిన కథలు తీసుకుని పరిశీలిద్దా మను కుంటున్నాను.

మొదటిది ‘కాఫీ టిఫిన్ తయ్యార్..’. ఆర్ధికంగా వెనుకబడి అధిక సంతానం ఉన్న కుటుంబాలలో, అబ్బాయిలకీ వారి చదువులకీ ప్రాధాన్యం ఇవ్వడం, ఆడపిల్లలు పిన్న వయసు నుంచే అమ్మలకి సహాయం చెయ్యడం సామాన్యమే. అన్నలు చెల్లెళ్ల మీద పెత్తనం చెలాయించడం, పెద్దలు సర్ది చెప్పడానికి ప్రయత్నించడం తప్ప అంతకు మించి ఏమీ చెయ్యలేకపోవడం కూడా సహజమే. అయితే.. ఇంట్లో వారెవ్వరూ, ఆడపిల్ల కాశీ పెళ్లి మాట ఎత్తక పోవడం కొంచెం అసహజంగా అనిపించింది.. అందులో కింది తరగతి కుటుంబాలలో అమ్మాయిలకి త్వరగా.. మళ్లీ మాట్లాడితే మైనారిటీ తీరకుండానే వయో భేదంతో పని లేకుండా చెయ్యడం అందరికీ తెలిసిన విషయమే.

అందరికంటే చిన్నది.. ఆడపిల్ల సంపాదన మీద ఇంటిల్లి పాదీ ఆధారపడి, ఇంచుమించు శ్రమ దోపిడీ చేస్తుంటే.. కన్నతండ్రి కళ్లు మూసుకుని కూర్చోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించక మానదు. మధ్యలో స్నేహితురాలు చెప్పిన హితవు కూడా పెడచెవిని పెడ్తుంది అన్నదమ్ములంటే ఉన్న అభిమానంతో ఆ అమ్మాయి.. అప్పటికి స్త్రీ అయింది.. పరిస్థితులు అవగాహన చేసుకోగలదు. అయినా సరే.. అతి మంచితనమో, అన్నదమ్ముల మీద గుడ్డి ప్రేమో.. తన గురించి ఆలోచించకుండా జీవితం మూడువంతుల భాగం గడిచాక మేలుకుంటుంది.

కుటుంబీకులు ఇంటి ఆడపడుచు మీద అంత అశ్రధ్ద చూపడానికి కారణం కథాంతానికి ముందు తెలుస్తుంది. ఆడపిల్ల సంపాదనమీద ఆధారపడ్డ తండ్రుల స్వార్ధానికి బలై పోయిన స్త్రీ.. నడి వయసు దాటాక ఒక అండ చూసుకుని అనాధల్ని ఆదుకోవడంతో కథ ముగుస్తుంది.

దీనికి వ్యతిరేకంగా కన్న కూతురి స్వార్ధానికి బలైన ఒక తండ్రి ఆవేదన ‘మా నాన్న పిచ్చోడు’ లో కనిపిస్తుంది. ఈ రెండు కథల్లోనూ పెంచుకున్న అనాధ పాప ప్రేమ పాఠకులను కదిలిస్తుంది.  ఏ విధంగా తల్లిదండ్రుల నాదుకుందో, వారి మీద ఎటువంటి ప్రేమ, ఆప్యాయతలు కనపరుస్తుందో.. తండ్రి కళ్లల్లో ఆనందాన్ని చూడటం కోసం అవసరమైతే కోర్ట్ చుట్టూ సంవత్సరాల తరబడి ఏ విధంగా తిరగ గలదో.. రచయిత్రి చెప్పిన విధానం మనసుకు హత్తుకుంటుంది. అదే కన్న కూతురు, తండ్రిని పిచ్చాసుపత్రి పాల్చేసి పెన్షన్ కాజేస్తుంది. ఒక కథలో కూతురి పరంగా, ఇంకొక కథలో తండ్రి పరంగా ఉత్తమ పురుషలో సాగుతుంది కథనం.

స్వార్ధ పరురాలైన స్త్రీ కుటుంబ సభ్యులతోనే కాకుండా స్నేహితులతో కూడా నిస్సంకోచంగా, నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా ప్రవర్తించి వారిని సంక్షోభానికి  గురి చెయ్యడం ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్’ లో కూడా కనిపిస్తుంది. కళ్యాణి వంటి వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు.. ఎంతో కొంత క్రమంలో. మన టి.వి సీరియల్స్ లో ఇటువంటి వారినే చూపిస్తుంటారు. ఎవరికైనా ఏ సహాయమైనా చేసేటప్పుడు “భగవద్గీత గుర్తుకుచేసుకుంటూ ఉండాలి, మనం నిమిత్త మాత్రులమే సుమా..” అని ఈ కథలో ప్రధాన పాత్ర గుర్తు చేస్తుంటుంది.

‘నాకోసం తిరిగి రావూ’ లో మనవరాలి మీద తాతయ్య ప్రేమ, అభిమానం చూస్తాం. పల్లెటూరి వర్ణన ప్రధానంగా సాగే ఈ కథని స్కెచ్ అనుకోవచ్చు.

‘ముళ్లగులాబీ’, విదేశాల్లోనే కాదు.. స్వదేశంలో కూడా యువత ఎదుర్కుంటున్న సంక్షోభం. ఇందులో ఆడ, మగ తేడా లేదు. పెళ్లికి ముందు ఒకలాగ, పెళ్లయ్యాక ఇంకొకలాగ ప్రవర్తించే కోడళ్లు (అల్లుళ్లు) కోకొల్లలు. కనీసం మాలిని రంగులు నిశ్చితార్ధం నాడే బయట పడ్డాయి. కిరణ్ తల్లిదండ్రుల ఆవేదన కొద్దికాలంలోనే, అతను కాబోయే భాగస్వామి అంతరంగం ముందుగానే తెలుసుకుని తగిన చర్య తీసుకోవడంతో ముగిసింది. ప్రస్థుత పరిస్తితుల్లో పిల్లలు స్థిరపడే వరకూ కన్నతల్లి పడే ఆదుర్దాని రచయిత్రి చాలా బాగా వివరించారు. నాకు ఈ కథ బాగా నచ్చింది. కాబోయే కోడల్ని చూసిన ఆనందం, అమ్మాయి నచ్చిందని భర్తతో తన సంతోషాన్ని పంచుకోవడం.. ఆ తరువాత.. అదే అమ్మాయితో కొడుక్కి పెళ్లైతే ఆ పై జీవితం ఎలా.. ఆ అమ్మ అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు రచయిత్రి.

అదే మొండితనం, బద్ధకం కలగలిపిన.. భాష, సంస్కృతి వేరైన ‘విదేశీ కోడలి’ విన్యాసాలు.. ఏవిధంగా ఉంటాయి..

అమాయకంగా ఒక్కగా నొక్క కొడుకు అడిగిందల్లా ఆస్థులు అమ్మి ఇచ్చి, విదేశాలకి పంపుతే.. ఆ కొడుకు, నాలుగు రోజులు కూడా తల్లిదండ్రులు తన దగ్గర ఉండలేని పరిస్థితికి క్షణిక వ్యామోహం లో తీసుకొస్తే.. ఆ తల్లిదండ్రులు పడే వేదన కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది ఈ కథలో.

కోసూరు ఉమా భారతి

కోసూరు ఉమా భారతి

పై రెండు కథలూ చదివిన పెళ్లి కాని యువకులు, జీవిత భాస్వామిని ఎంచుకునే ముందు ఒక్క నిముషం ఆలోచిస్తారు. ఆ విధంగా ఉమాభారతి ప్రయత్నం కొంత సఫలం ఐనట్లే.

అమెరికాలోనే కాదు.. ఎక్కడైనా, వృధ్దాప్యంలో ఒంటరితనం భయంకరమైన శాపమే. దానికి మతి చాంచల్యం తోడైతే.. ఇంక అంతకంటే ప్రత్యక్ష నరకం ఉండదు. కథలో కనుక రేణు కుమార్ కి తార వంటి స్నేహితురాలు దొరికింది. నిజ జీవితంలో.. నిర్దయులైన కొడుకులు గాలికి వదిలేస్తే రెపరెపలాడే పిచ్చి తల్లిని ఎవరాదుకుంటారు.. ‘త్రిశంకుస్వర్గం’ చదువుతుంటే ఒళ్లు గగుర్పాటు చెందకమానదు. ఇది చదివిన వారు తమ మాతృమూర్తిని అక్కున చేర్చుకుంటే రచయిత్రి ఎంతో మధనపడి వ్రాసిన ఈ కథ గమ్యం చేరినట్లే.

‘తొలిపొద్దు’, తండ్రి నిరాదరణకు గురై, భర్త నిర్లక్ష్యంతో దిక్కు తోచని స్త్రీ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలో సూచిస్తుంది. అమ్మ, అమ్మమ్మల ప్రేమతో గారాబంగా పెరిగిన భానుమతి, ప్రేమ రాహిత్యానికి గురైతే.. తనకున్న ఒకే ఆలంబన అయిన బాబుని తన ఆదర్శాలకి అనుగుణంగా పెంచాలని.. మానసికంగా ఒంటరితనం అనుభవిస్తూ.. భౌతికంగా కూడా ఒంటరి పోరాటాన్ని  సాగించడానికి నిశ్చయించుకుంటుంది. ఇది ఆ తరం మహిళకి కష్ట మయిన పనే.. అయినా అటువంటి వారూ ఉన్నారు సమాజంలో..

ఇందులో అన్నీ స్త్రీ సమస్యలకి సంబంధించిన కథలైనా.. ప్రత్యేకించి అమ్మ గురించి రాసిన కథలు రెండున్నాయి.

ఒకటి.. ‘అమ్మతనం అద్భుతవరం..’ మదర్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో వక్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు.. శ్రావణి తన స్వానుభవంలో చెప్పిన, సర్జన్ గారు తల్లిని ఇంట్లోనే జైలు పాలు చెయ్యడం.. ఆ తల్లి రోజుకొక్క సారైనా కొడుకు, మనవలు కంట పడతారు కదా అని ఒంటరి జీవితం గడపడం చదువుతుంటే మనసు ద్రవించక మానదు. అలాగే పక్కింటి వినీత కొడుకు కోసం పడుతున్న తాపత్రయం.. ఈ ఒక్క కథలోనే చాలా కథలు చెప్తారు రచయిత్రి. కొన్ని తీసేసి, కొన్నింటి నిడివి పెంచితే బాగుండేదనిపించింది.

రెండవది.. ‘అమ్మకి సరయిన స్థానం స్వర్గమే..’ అమ్మ కష్టం, ఆవిడ ఆవేదన చూడలేని, దూరాన ఉన్న ఒక కూతురి కోరిక ఇది. వినడానికి వింతగావే ఉండచ్చు.. కానీ కథంతా చదివేశాక మనం కూడా అదే అనుకుంటాము. ఆప్యాయతకి, త్యాగానికి మారుపేరు అమ్మ.. అమ్మ కంటి నీరు తుడవలేని ఒక కూతురి ఆక్రందనని ఆమె మాటల్లోనే వ్యక్తీకరిస్తారు శ్రీమతి ఉమ.

అమ్మ మీద వచ్చిన కవితల్ని, కథల్ని ఎందరు రాసినా, ఎన్ని సార్లు చదివినా భావోద్వేగం కలుగక మానదు ఎవరికైనా. అదే భావం ఈ సంపుటి లో అమ్మ కథలకి కూడా కలుగుతుంది.

ఇంక స్వర్గ లోక వాసుల భూలోక విహారం వివరించే కథలు ‘మానసపుత్రి’, ‘భరతముని భూలోక పర్యటన’. ఈ కథానికల్లో కవితలదే పైచేయి. మానసపుత్రి, నృత్య రూపకం కథగా మలచబడిందని రచయిత్రే చెప్పుకున్నారు. చదువరికి అదే భావం కలుగక మానదు.  ఇవి చదువుతుంటే కథలు చదువుతున్నామని అనిపించక పోయినా.. ప్రాచీనత నుంచి ఆధునికతకి ప్రయాణం.. రెంటినీ మిళితం చేసే ప్రయత్నం పాఠకుడ్ని ఆకట్టుకుంటాయి. భరతముని, సినిమా షూటింగ్ లో నాట్యవిన్యాసాల్ని చూసి ఆవేశపడతాడనుకున్న నాకు.. ఆయన ఆశ్చర్యపోవడంతో ఆపెయ్యడం నిరాశ కలిగించిన మాట వాస్తవం.

ఈ కథల సంపుటి రచయిత్రి తొలి ప్రయత్నం. తక్కువ వ్యవధిలో ఇన్ని కథలు రాసి, పాఠకుల మెప్పు పొందడానికి కారణం ఉమాభారతిగారికి సాహిత్యం మీద ఉన్న తపన.. కళాకారిణిగా భాష మీదున్న పట్టు.

కథలన్నింటినీ పూల గుఛ్ఛంలా అందించేటప్పుడు వస్తు వైవిధ్యం ఉంటే ఇంకా బాగుండేది. ఉదాహరణకి, అనాధ పాపల్ని పెంచుకున్న కథల్లో.. సామాజిక సేవలతో ముగింపు, ఆ అమ్మాయిలిద్దరూ కుటుంబం మీద చూపించే ప్రేమ వంటివి, విడివిడిగా పత్రికల్లో చదివినప్పుడు తెలియదు కానీ.. ఒక దగ్గరున్నప్పుడు సారూప్యం కనిపించక మానదు.

ఒక్కోసారి వర్ణనలు కథని మించి పోయాయేమో అనిపించింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలు తప్పిస్తే ఒక మంచి ఆలోచనా పూరితమైన కథలు చదివిన తృప్తి కలిగింది.

శ్రీమతి ఉమాభారతి మరిన్ని మంచి కథలు వ్రాయగలరనటంలో ఎటువంటి సందేహం లేదు.

          — మంథా భానుమతి.

 

 

 

 

 

 

 

 

 

 

 

ఏక్ ఫిలిం కా సుల్తాన్ (హీరో)

bhuvanachandra

Untold Stories 

ఈ టైటిల్ నేను అతనికి పెట్టలేదు.. అతనికి అతనే పెట్టుకోవడమేగాక, ‘ఆధ్యాత్మికంగా’ నవ్వి నాతో చెప్పాడు. “అదేమిటి?” అన్నాను. అతన్ని కలిసింది మౌంట్‌రోడ్డులో. ఒకప్పుడు ‘స్పెన్సర్శ్  ఉండే చోటికి దగ్గర్లో, సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. “సార్.. సిగ్నల్ దాటాక ఓ క్షణం ఆపుతారా?” పేవ్‌మెంట్ మీదనించి తెలుగులో అరిచాడు. ఆయన్ని చూస్తే చాలా వృద్ధుడు. ముఖంలో కొద్దోగొప్పో ‘అలిసిపోయిన వర్ఛస్సు’ మిగిలుంది.

సిగ్నల్స్ క్రాస్ చేశాక ఆపాను.

“థాంక్స్ సార్..” మిమ్మల్నేదీ  యాచించటానికి రాలేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. నా వయసులో ఉన్నవాడూ, ఇలా మురికి బట్టలు వేసుకున్నవాడూ ఎవరు కారుని ఆపినా, అడుక్కోవటానికే అనుకుంటారు…” చిన్నగా నవ్వి అన్నాడు.

“చెప్పండి.” అన్నాను.  ఇంకేమనాలో తెలియక.

“మీరు నాకు తెలుసు. చాలా సినిమాల్లో ‘గుంపులో గోవిందం’ వేషాలు వేశాను. అయితే ఓ విషయం చెప్పుకోవాలి. నేను ఏక్ ఫిలిం హీరోని. ఏక్ దిన్ కా సుల్తాన్‌లాగా..! మళ్లీ మందహాసం.

“చెప్పండి..!” అన్నాను.

మద్రాసు ఎండలకి ప్రసిద్ధి. అయితే ఆ ఎండ మంచిదే. చెమట పడుతుంది. స్నానం చేశాక వొళ్లు హాయిగా తేలిగ్గా వుంటుంది. సాయంత్రం నాలుక్కల్లా సముద్రపు గాలి వీస్తుంది. కొంచెం జిడ్డుగా. కొంచెం చల్లగా. ఏమైనా మద్రాసు ప్రత్యేకత మద్రాసుదే.

“రామకృష్ణగారు (త్వరలో ఆయన ఫోటో, సెల్ నంబర్‌తో సహా పరిచయం చెయ్యబోతున్నాను.) మీ గురించి చెప్పారు. నెలనెలా మీరు రాస్తున్న ‘అన్‌టోల్డ్ స్టోరీస్’ గురించి కూడా చెప్పారు. నాకో చిన్న ఆశ. నా కథ కూడా మీరు రాస్తారని. ఎందుకంటే…” సందేహించాడు.

“సందేహం వద్దు. ఎందుకూ?” అన్నాను.

“అమెరికాలో వున్న నా పిల్లలెవరన్నా చదివి మళ్లీ నన్ను కలిసే ప్రయత్నం చేస్తారని..” కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు”

“రేపు మీరు మా యింటికి రాగలరా?” నా ‘కార్డ్’ ఇస్తూ అన్నాను.

“తప్పకుండా. అంతకంటేనా..” ఆనందంగా అన్నాడూ.

ఓ పది నిమిషాల తరవాత జ్ఞాపకం వచ్చింది. ఆయన తన పేరు చెప్పలేదనీ… నేను అడగలేదనీ..

 

***

 

“నా అసలు పేరు ‘ఫలానా’. అయి తే దయచేసి నా కథని పేరు మార్చి రాయండి. ఆ పేరు కూడా నేనే చెబుతాను.. ‘యాదయ్య’. ” అన్నాడు. “అసలు పేరు రాయకపోతే మీ పిల్లలు ఎలా గుర్తుపడతారూ? అయినా మీ పిల్లలు ‘సారంగ’ పత్రికని చదువుతారని గ్యారంటీ లేదుగా. ఒక పని చెయ్యండి. మీ పిల్లల పేర్లు. వాళ్లు ఏం చేస్తున్నారో  చెబితే అమెరికాలో వున్న నా ఫ్రెండ్స్‌కి చెబుతా. తోటకూర ప్రసాద్‌గారికీ, వంగూరి చిట్టెన్ రాజుగారికీ, కిరణ్ ప్రభ గారికీ, కల్పన, అఫ్సర్‌గార్లకీ చెబితే కొంత ప్రయోజనం ఉంటుంది..” అన్నాను.

అతను గాఢంగా నిట్టూర్చాడు. “వాళ్లకి నేనంటే అసహ్యం. అలా నన్ను అసహ్యించుకోవడానికి వాళ్ల కారణాలు వాళ్ళకున్నాయి. వాళ్లకి తెలీంది ఒకటే. నా జీవితం గురించి. అది చదివితే కొంత అర్ధం  చేసుకుంటారని నా ఆశ…”

“సరే. మీరన్నట్టుగానే చేద్దాం. చెప్పండి.” అన్నాను.

“మాది విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు. ఆ వూరికంతటికీ సంపన్న కుటుంబం మాదే. నేను చదివింది గుంటూరు AC కాలేజీలో . మా వూల్లో  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. మావాళ్లకి నేనంటే ప్రాణం. ఎంత అడిగితే అంతా ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో “గోల్డ్ ఫ్లేకు టీన్ను”లు కొని స్టైల్ మెయిన్‌టైన్ చేసినవాన్ని నేనే. ఇంకో విషయం.. కొంగర జగ్గయ్యగారూ, గుమ్మడిగారూ, వాళ్లంతా నాకు అప్పట్నించే  పరిచయం..” నిట్టూర్చాడు.

కష్టపడి పైకొచ్చినవాళ్లకి తన మీద తనకి విపరీతమైన నమ్మకమూ, ధైర్యమూ వుంటాయి. పైనించి కిందకి దిగినవాడికి ‘ఆత్మన్యూనత, తన మీద తనకి జాలి ‘డెవలప్’ అవుతాయి.  “తర్వాత?”

“ఇప్పుడిలా వున్నాగానీ నేను చాలా అందంగా  వుండేవాన్ని. దాంతో సహజంగానే సినిమా ఫీల్డువైపు అడుగులు   పడ్డాయి. “కళ్లు మెరుస్తుండగా” అన్నాడు.

“ఊ !”

“మైలాపూర్‌లో ఓ పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాను. మాక్జిమమ్ ఫర్నీచర్, అలంకార సామగ్రి, అంతా స్పెన్సర్స్ నించే. అప్పట్లోనే “బ్యూక్” కారు కొన్నాను. పాండీ బజార్లో కారు పార్కు చేసి అటుపక్కన CSRగారు నిలబడి వుంటే, ఇటు పక్క నా బ్యూక్‌ని పార్క్ చేసి నేను నిలబడి వుండేవాడిని. అయ్యా.. ఆ రోజులు వేరు,  నిర్మాతలూ, దర్శకులూ బాగా చదువుకున్నవారూ, “సినిమా” మీద ప్రేమతో వచ్చినవారు. ప్రొడ్యూసరు  కృష్ణాజిల్లావాడే.  మాకు తెలిసినవాడే.  కాస్త దూరపు బంధువు కూడానూ..” మళ్లీ నిట్టూర్చాడు.

కన్నీళ్లు ఆవిరైనప్పుడు  వచ్చేవే ‘నిట్టూర్పులు’. కళ్లల్లో ఇంకా కన్నీరు మిగల్లేదన్నమాట. గుండెల్లో  ఉండే బాధే..  ‘నిట్టూర్పుల సెగల’ రూపంలో బయటికొస్తుందేమో!

“తర్వాత?” అడిగాను.

“పిక్చర్ మొదలైంది. హీరోయిన్ తమిళమ్మాయి. చాలా అందగత్తె. ఓ వారం షూటింగ్ జరిగాక మా నాన్నగారు సీరియస్ అని నాకు ‘టెలిగ్రాం’ వచ్చింది. రాత్రికి రాత్రే కార్లో బయలుదేరాను. ‘తడ’ దాటాక యాక్సిడెంటైంది. డ్రైవర్‌కి బాగా దెబ్బలు తగిలాయి. నా కాలు విరిగింది. స్పృహ వచ్చి మళ్లీ ఊరికి బయలుదేరడానికి రెండు రోజులు పట్టింది. కాలికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అన్నారు. సిమెంటు కట్టు కట్టారు. ఇంటికి వెళ్ళేసరికి నాన్న పరిస్థితి క్షీణించింది. “బాబూ .. చచ్చి మళ్ళీ నీ కడుపున పుట్టాలనుంది. పెళ్లి చేసుకోవా?” అని బ్రతిమిలాడాడు. బంధువులు కూడా తండ్రి కోర్కె తీర్చమని పట్టు బట్టారు. మూడు రోజుల్లో ముహూర్తం చూశారు. సిమెంటు కట్టుతోనే పెళ్లి పీటలమీద కూర్చున్నాను. ఆయన కళ్లు ఎటో చూస్తున్నాయి శూన్యంగా. బహుశా ‘మాసిపోయిన’ గతంలోకి చూస్తూ వుండొచ్చు.

“ఆ రోజుల్లో ఫలానా పిల్ల అని చెప్పడానికే కాని, పెళ్లి చూపులూ, ఫోటోలు ఉండేవి కావు. నా విషయంలో నేను అదృష్టవంతుడ్నే. పిల్ల నాకు తెలిసిన పిల్లే. ఆ రోజుల్లోనే సెకెండ్ ఫాం చదివింది. ఆడపిల్లలకది గొప్ప చదువే. అదీ వ్యవసాయదారుల కుటుంబాల్లో…!”

“ఊ..!”

“వాళ్ళు   పెద్దగా ‘వున్నవాళ్లు’ కాదు గానీ, మంచి కుటుంబం. పెళ్లి అయినాక నెలన్నర మా వూళ్ళోనే వుండాల్సొచ్చింది.  మద్రాసు వచ్చి నా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదుగా. యవ్వనం ఎలాంటిదంటే సిమెంటు కట్టు కాపురానికి అంతగా అడ్డురాలేదు. ఆ తర్వాత డాక్టర్‌కి చూపిస్తే మరో నెలన్నర రెస్టు తీసుకుని తీరాలన్నాడు. నా కథని చెబుతూ విసిగిస్తున్నానేమో” అడిగాడు.

నిజమే,  ప్రతీ వ్యక్తికీ తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన చాలా ముఖ్యమైనదిగా, చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఇతరుల జీవితాల్లోనూ అలాంటివే ఉంటాయనీ, వాటిని ‘అంతగా’ వివరించక్కర్లేదని అనుకోరు.

వయసైన వాళ్లైతే మరీనూ, అందుకే ఇంట్లో వున్న వయసైన వాళ్లని పిల్లలు విసుక్కునేది. క్లుప్తంగా, చెప్పాల్సినంత వరకూ చెబితే గొడవుండదుగా.

అయితే నా పాత్ర వేరూ. ‘కొంచెం’ ‘క్లుప్తంగా’ ‘చెప్పండి’ అనడానికి వీల్లేదు. అలా అంటే ఆయన చిన్నబుచ్చుకుని చెప్పాల్సిన ముఖ్యమైన విషయాల్ని చెప్పలేకపోవచ్చు.

“లేదు లేదు.. చాలా ఇంట్రెస్టింగా ఉంది. చెప్పండి..!” అన్నాను.

“ఏతావాతా మూడు నెలలు మావూళ్లోనే వున్నాను. దాంతో నా భార్య సరోజకి నెల కూడా తప్పింది. మళ్లీ మద్రాసొచ్చాను. అందరూ మహదానందంగా ఆహ్వానించారు. షూటింగ్ మొదలైన వారం రోజుల తరవాత మా నాన్న పోయారని ‘తెలిగ్రాం వచ్చింది”

మరో నిట్టూర్పు. ఇది ‘జ్ఞాపకాల సమాధి’ ని తవ్వి తీస్తున్న నిట్టూర్పు.

మళ్ళీ వూరెళ్ళాను. దినకర్మలు పూర్తిచేసి తిరిగి వచ్చేసరికి పదిహేను రోజులైంది. మళ్ళీ షూటింగ్ మొదలైన రెండు రోజులకి నిర్మాత బాత్‌రూంలో కాలుజారి పడ్డాడు. కాలు బెణికిందిగానీ ‘తుంటి’ భాగం బాగా రప్చరైంది. మద్రాసు సెంట్రల్ దగ్గరున్న G.H. (జనరల్ హాస్పిటల్) డాక్టర్లు   కనీసం మూడు నెలల రెస్ట్ ఇవ్వమన్నారు. మళ్లీ షూటింగ్ ఆగింది..!”

“ఊ”

“ఇన్నిసార్లు షూటింగ్ ఆగటంతో నాకు ‘అన్‌లక్కీ’ అన్న పేరొచ్చింది. పేరొచ్చింది అనడం కంటే అలా కొంతమంది నన్ను ప్రొజక్ట్ చేశారనడం సబబు. సంసారం ‘రుచి’ మరిగినవాడ్ని. హీరోయిన్ కూడా క్లోజ్‌గా మూవ్ కావడంతో ‘కాస్త’ దారి తప్పాను. నాకేం తెలుసు, నటీమణుల(కొందరి) కళ్లు మనమీద కన్నా మన పర్సు మీదే వుంటాయనీ. వ్యవసాయం మూలబడటంతో ( మా నాన్న మృతివల్ల) నాకు ఇంటినుంచి వచ్చే రాబడి తగ్గింది. నెలకీ, రెణ్నెల్లకీ ఊరు పోవడం ఎకరమో, రెండెకరాలో అమ్మడం మామూలైంది. నా భార్య అడ్డుపడ్డా లాభం లేకపోయింది. ఆ నటీమణి మత్తులో నేను పూర్తిగా కూరుకుపోయానని అప్పుడు నాకే తెలీదు. నా పిక్చర్ రిలీజైతే నంబర్ వన్ నేనే అవుతాననీ, కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదిస్తానని నా నమ్మకం.: మళ్లీ మరో నిట్టూర్పు.

“మరి…”అడగాల్సింది అడగలేక ఊరుకున్నాను.

“మీరు అడగబోయి ఆగిన ప్రశ్న నాకు అర్ధమైంది.. ఎవరూ’సుద్దులు’ చెప్పలేదా? అని కదూ? చెప్పారు.. జగ్గయ్యగారు చెప్పారు. యీ సినీ పరిశ్రమలో సత్‌ప్రవర్తన ముఖ్యమనీ, దానికి చాలా విలువుందనీ.. వింటేనా? మూడు నెలలు గడిచాక డైరెక్టర్ భార్య చనిపోయింది. దాంతో మళ్లీ కొన్ని రోజులు షూటింగ్ ఆగింది. నా ఫేట్ ఏమోగానీ మళ్లీ షూటింగ్ మొదలు కాకముందే ప్రొడ్యూసర్ ‘హరీ’ అన్నాడు. దాంతో నాది ‘ఇనపపాదం’ అన్నారు. పిక్చర్ ఆగిపోయింది. ఓ ఆవేశం, పట్టుదలతో నేనే మిగిలిన పరికరాల్నీ కారు చౌకగా అమ్మి సినిమా పూర్తి చేద్దామనుకున్నా. నాకూ, మా అవిడకీ గొడవలు జరిగాయి. అయినా ఆస్తి అమ్మి మద్రాసు వచ్చి షూటింగ్ మొదలెట్టించా. చనిపోయిన ప్రొడ్యూసర్ కొడుక్కి అప్పటిదాకా అయిన ఖర్చుని ముట్టజెప్పి సినిమాకి నేనే ప్రొడ్యూసర్‌నయ్యా.  డైరెక్టర్ నాకు సినిమా నిర్మాణం గురించి ఏమీ తెలియదని తెలుసుకుని సినిమాని చుట్టేశాడు గానీ, ఖర్చుల చిట్టా మాత్రం భారీగా నాకు చూపించాడు. సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఒకరు ‘పైసా’ ఇవ్వకుండా రిలీజ్ చెయ్యడానికి ఒప్పుకున్నారు. మొదటి షో, అంటే మార్నింగ్ ‘షో’లోనే అది ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ, నా అందం మాత్రం ప్రజల్ని ఆకర్షించిందనే చెప్పాలి.” మరో నిట్టూర్పు.

మొహంజొదారో, హరప్పాల్ని తవ్వినప్పుడు ఏం బయట పడ్డాయి? కుండపెంకులు, ఇటికలూ, ఎముకలూ, పుర్రెలూ అంతేనా?

అతని నిట్టూర్పుల్లో నాకు కనిపించినవీ అంతే.. జ్ఞాపకాల రూపంలో..

“సినీపరిశ్రమ ఓ గొప్ప ఊబి. ఇందులో దిగకూడదు. దిగాక బయటికి రావడం బ్రహ్మతరం కాదు. నా ఫెయిల్యూర్‌ని జీర్ణించుకోలేకపోయాను. అప్పటివరకు నా గోల్డ్ ఫ్లేక్ టిన్నుల్లోంచి చనువుగా సిగరెట్లు తీసుకుని తాగినవాళ్లు, నేను వాళ్ల ‘స్నేహితుడ’నని గొప్పగా చెప్పుకున్నవాళ్లు మొహం చాటేశారు. ఆస్తి పోయిందని (ఖర్చయిందని) తెలిశాక నా ‘హీరోయిన్’ ఇంట్లో వుండి కూడా ‘లేనని’ చెప్పించింది. తరవాత మరో ‘అప్‌కమింగ్’ హీరోకి ‘భార్య’గా సెటిల్ అయింది”అక్కడి దాకా చెప్పి ఆగాడు.

“నేను మళ్లీ పంతంతో మరో పిక్చర్‌లో నా ‘వర్త్‌’ ని నిరూపించుకోవాలనుకున్నాను. నా భార్యా, వాళ్ల తల్లిదండ్రులకి ఏకైక సంతానం. ఓ ఏడాది అత్తారింట్లోనే ఉండి, వాళ్లకి బాగా ‘నూరి పోసి’ అస్తిని అమ్మించి సినిమా మొదలెట్టాను. నా భార్య మొదటి కాన్పులో మగపిల్లాడ్ని, రెండో కాంపులో ఆడపిల్లని ప్రసవించింది గానీ నేను మాత్రం ‘సక్సెస్’ని సాధించలేకపోయాను. నానా కారణాల వల్ల నేను మొదలెట్టిన సినిమా ఆగిపోయింది. మూడేళ్లు గడిచాయి. నాకు మరో కొడుకు పుట్టాడు. ఓ నిజం చెప్పాలి. నేను నా భార్య దగ్గరికి వెళ్లానే గానీ ఏనాడూ నా భార్యని మద్రాస్‌కి తీసుకురాలేదు. జనందృష్టి లో నేను బ్రహ్మచారినే. పెళ్ళాయినవాడంటే ‘గ్లామర్’ పోతుందని పెళ్ళయిన విషయం ‘లీక్’ కానివ్వలా!” మరో దీర్ఘ  నిట్టూర్పు .

జ్ఞాపకాల శవాలు కాలిన వాసనుంది అందులో.

నేను ఏమీ మాట్లాడలా. గుర్తు తెచ్చుకుంటాడని మౌనంగా ఉండలేదు. మర్చిపోలేరుగా మనుషులు అడగటాన్ని.

“అప్పులు పెరిగినై. ఊళ్ళో ఇల్లూ అమ్మేశా. అప్పుడు నా భార్య ఆన్నది. నీకోసం నీ బిడ్డల్ని నాశనం చెయ్యలేనని”..దాంతో నాకు కోపం వచ్చింది. పొమ్మన్నా. వెళ్ళిపోయింది. చాలాసార్లు కలుద్దామనిపించేది. బిడ్డల్ని చూసుకోవాలనిపించేది. కానీ ఆమె అడ్డువచ్చేది!” ఈ నిట్టూర్పులో మమకారం తప్ప అహంకారం కనపడలేదు.

నా భార్య వాళ్ల మేనమామల దగ్గరకి (బోంబే) వెళ్లిపోయింది. రెండుసార్లు నా పిల్లల గురించి ఎంక్వైర్ చేశా. వాళ్లకి ఏం చెప్పారో ఏమో నా పేరు వినగానే, ‘డోంట్ టాక్ అబౌట్ హిం’ అన్నారుట.” మరో నిట్టూర్పు.

ప్రతి వ్యక్తి తన ‘తప్పుని’ సమర్ధించుకుంటాడు. యీయన ఆ ప్రిన్సిపుల్‌కి అతీతుడు కాడనిపించింది. “కేవలం ఆస్తి పాడు చేసినందువల్లే మీ పిల్లలు మీకు దూరమయ్యారా?” అని అడిగాను.

మా ఇద్దరి మధ్యా ‘నిశ్శబ్దం’ చాలా సేపు రాజ్యమేలింది. “నేను మరో తప్పు చేశా. అది ‘తాగుడు.’ నా పరాజయాన్ని జీర్ణించుకోలేక తాగుడు  మొదలెట్టా.. బానిసనయ్యాను. రెండో సినిమా కోసం బంగళా అమ్మేశా. టి.నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న గుడిసెల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడే నా భార్యతో పోట్లాట జరగటం. ఆ కచ్చలో మరో ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీయడం జరిగింది” తలొంచుకున్నాడు.

“మీరు గ్రాడ్యుయేట్ కదా.. కనీసం ఉద్యోగం కోసం ప్రయత్నించలేదా?” అడిగాను.

“యీ ఫీల్డు సంగతి మీకు తెలీనిది ఏముందీ? మీరు మెకానికల్ ఇంజనీరని నాకు తెల్సు. ఇపుడు మీరీ ప్రొఫెషన్ని వదిలి మళ్లీ స్పేనర్ పట్టుకోగలరా?” ఆయన మాటల్లో కొంచెం కోపం. నాకు నవ్వొచ్చింది.

“అయ్యా,  అదృష్టవశాత్తు నేను నిలదొక్కుకున్నా గనక యీ ఫీల్డులోనే వున్నాను. మీరనుకున్నట్టు నాకు ఇంకా పేరు రావాలనీ, ఇంకా డబ్బు సంపాదించి అస్తులు కూడబెట్టాలనీ ఏనాడూ లేదు. అందుకే పరిశ్రమ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినా నేను ఇక్కడే ఉండిపోయా. నాకొచ్చే పాటలు చాలు. తీసికెళ్లలేనివి పోగు చెయ్యటం ఎందుకు?When  you can’t carry .. why should you collect?”  ఇదే నా ప్రిన్స్‌పుల్. మా నాన్నగారు నాకు నేర్పింది ఇదే.. యీ క్షణంలో కూడా ‘రెంచి్’ పట్టుకోవడానికి నేను సిద్ధమే?” అన్నాను.

“అది మీ స్వభావం. చిన్నతనం నించీ స్వేచ్చగా  పెరగటం వల్ల ఎవరి కిందో పని చెయ్యడం నామొషీ అనిపించి ఉద్యోగ ప్రయత్నం చెయ్యలేదు” నిర్లిప్తంగా అన్నాడు.

“సరే.. తరవాత ఏమైంది?”

“ఎక్‌స్ట్రాగా మిగిలా. తాగుడువల్ల అందం పోయింది. ఆరోగ్యం పాడు అయింది. నిజం చెప్పాలంటే ఏ ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీశానో ఆవిడే మూడునెళ్ల క్రితం వరకూ నన్ను పోషించింది. మూణ్నెల్లక్రితం చచ్చిపోయింది..” మరో సుదీర్ఘ నిట్టూర్పు.

“యాదయ్య అనే పేరు పెట్టమన్నారు. ఆ పేరు మీ వాళ్లకి తెలుసా?”

“పిల్లలు చిన్నప్పుడు నన్ను యాదూ, యాదయ్యా, యాదీ అంటూ  పిలిచేవారు. అందుకే ఆ పేరు పెట్టమన్నాను.”

“సరే. నిజం చెబితే ఇది పత్రికకి ఎక్కాల్సిన కథ కానే కాదు. కానీ పంపుతా. దేనికంటే కొందరైనా మీలాగా కాకుండా ‘బాధ్యతల్ని’ తెలుసుకొంటారని. అయ్యా.. మీరేమీ అనుకోకండి. మీలో నాకు కనిపిస్తున్నది పచ్చి స్వార్ధం. దానితో మీ పెద్దల ప్రేమని గానీ, మీ భార్యాపిల్లల బాగోగులు గానీ, వృద్ధులైన మీ అత్తామామల మంచి చెడ్డల్ని గానీ చూడకుండా మీ కీర్తి కండూతి కోసం సర్వాన్ని నాశనం చేశారు.  మిమ్మల్ని విమర్శించే హక్కు నాకు లేదు. కనీసం అంత చదువు చదివి ఓ చిన్న ఉద్యోగం చేసినా ఎంతో బాగుండేది. అల్లా చెయ్యకపోగా మళ్లీ ఓ స్త్రీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు కూడా మీ ప్రయత్నం  పిల్లల్ని మంచి చేసుకుని వారి మీద ఆధారపడాలనే గానీ వారి మీద ప్రేమవల్ల కాదు. అవునా?” సూటిగా అడిగాను.

మామూలుగా అయితే అతనెవరో ? నేనెవరో? కానీ అతనడిగింది ఆయన కథ వ్రాయమని. అందువల్లే అలా మాట్లాడాను.

విన్నాక నాకు అనిపించింది ఒకటే. మనిషి ‘ఇంత’ స్వార్ధపరుడుగా కూడా ఉంటాడా అని. కళ్లెదురుగానే ఉన్నాడుగా.

“నే తెలిసి ఏ తప్పూ చేయ్యలేదు. పరిస్థితులవల్లే ఇలా అయ్యాను” రోషంగా అని లేచాడు.

“తప్పుని పక్కవాళ్ల మీద తొయ్యడమో, పరిస్థితులను అడ్డుపెట్టుకోవడమో మీ అంత చదువుకున్నవాళ్లు చెయ్యాల్సిన పని కాదు. నా మాటలు మీకు బాధ కలిగిస్తే క్షమించండి. అయితే మీ కథని మాత్రం రాసి పంపుతాను. మీ పిల్లలు దాన్ని చదివి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది మీ అదృష్టం.” నేనూ లేచాను.

అయ్యా.. ఇదీ సంగతి. ఇతని జీవితంలోంచి నేర్చుకోవల్సింది చాలా వుంది. కనీసం మనిషి ‘ఎలా వుండకూడదో’ తెలుస్తుందిగా. ‘బాధ్యతా రాహిత్యానికి’ ఇతనో లైవ్ ఎగ్జాంపుల్. నేను చెప్పగలిగింది ఇంతే..

 

మళ్లీ కలుద్దాం.

నమస్సులతో

భువనచంద్ర

వీలునామా – 14వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

“ఏమిటీ? ఆడవాళ్ళకి సంగీతం తేలికగా అబ్బదా? విచిత్రంగా వుందే? వాళ్ళు ఎప్పుడు చూడూ పియానో వాయిస్తూ పాటలు పాడుతూ వుంటారు కదా?”

“అదే మరి! అంత మంది సంగీతం నేర్చుకున్నా, ఒక్కళ్ళైనా మంచి సంగీతం సమకూర్చడం విన్నామా మనం? అదే కవిత్వమూ చిత్రలేఖనమూ తీసుకోండి. ఎక్కువమంది ఆడవాళ్ళు నేర్చుకోకపోయినా, మంచి కవయిత్రులూ, చిత్రకారిణులూ వున్నారు.  అందుకే ఆడవాళ్ళకి సంగీతం కంటే కవిత్వమూ చిత్రలేఖనమూ సహజంగా అబ్బుతాయేమో అనిపిస్తుంది.”

“ఆహా! ఎన్నాళ్ళకు విన్నాను ఇంత చల్లని మాట! మా పిన్నీ, ఆవిడ కూతుళ్ళిద్దరూ రోజూ నాకు ఈ విషయం మీద తలంటుతున్నారంటే నమ్మండి. ఆడా, మగా సమానమేననీ, ఇద్దరికీ అన్ని విద్యలూ సమానంగా వస్తాయనీ నాతో ఒప్పించే దాకా ఊర్కునేలా లేరు వాళ్ళు. మీరేమో ఆడవాళ్లకీ అన్ని విద్యలు సహజంగా రావని అంటున్నారు. అన్నట్టు ఈ సారి వాళ్ళతో వాదించేటప్పుడు ఈ పాయింటు దొరకబుచ్చుకుంటా! మీకేమైనా అభ్యంతరమా?”

“భలే వారే! ఇందులో అనుకోవడానింకేముంది. అయితే ఇంతటి విలువైన ఆయుధాన్ని మా శతృవుల చేతుల్లో పెట్టటమా అని సంకోచం, అంతే!” నవ్వింది ఎల్సీ.

“శతృవులా? ఎంత మాటన్నారు! నేనింకా మీ స్నేహం కోసం అర్రులు చాస్తుంటే!”

చూస్తూండగా బ్రాండన్ కి ఎలీజా రెన్నీ కవితలు చదవడం కంటే ఎల్సీ తో కబుర్లాడడం లోనే ఎక్కువ ఉత్సాహంగా అనిపించింది. కాసేపయ్యాక ఆ ఆల్బం బల్ల మీద పడేసి,

“పదండి! మళ్ళీ హాలులోకెళ్ళి పాటలు విందాం!” అన్నాడు. ఎల్సీకి ఆ కవితలు చదువుతూంటే భలే ఆనందంగా అనిపించింది. తన కవితలే ఎలీజా కవితలకంటే బాగున్నాయనే నిర్ధారణ కొచ్చింది ఆమె. దాంతో ఆమె నిరాశ కొంచెం తగ్గినట్టనిపించింది.

బయటికొచ్చిన ఎల్సీ, విలియం డాల్జెల్ లారా విల్సన్ తో మాట్లాడుతూండడం చూసింది.

విలియం గంభీరంగా లారాతో తన గురించీ, తన పొలాల గురించీ చెప్తూన్నాడు. ఎందుకో అతని గొంతూ, ఆరాధనగా అతను లారా వైపు చూసే చూపులూ, తెచ్చి పెట్టుకున్న గాంభీర్యమూ చాలా చిరాకెత్తించాయి ఎల్సీని.

“నీలాటి మోసగాడికి లారా విల్సన్ లాటి తెలివి తక్కువ డబ్బున్న

అమ్మాయే సరి జోడీ,” అనుకుందామె అక్కసుగా. డబ్బుంటే ఎన్ని లోపాలన్నీ కప్పబడిపోతాయ్, డబ్బు లేకుంటే ఎన్ని సుగుణాలైనా మరుగున పడతాయి, అనుకుంది మళ్ళీ అంతలోనే.

విలియం కొద్దిసేపటి తర్వాత జేన్ దగ్గరికి వచ్చాడు. ఆమెని చూసీ పలకరించకపోవడం మర్యాద కాదనుకున్నాడు. అంతకు ముందు ఎల్సీని పలకరించే ప్రయత్నం చేసాడు కానీ ఎల్సీ ముక్తసరిగా మాట్లాడింది.

జేన్ అతనితో ఎలాటి వైషమ్యాలూ లేకుండా సౌమ్యంగా మాట్లాడింది. అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. తనను చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుందనీ, దెప్పి పొడుస్తుందనీ, తన కష్టాలు చెప్పుకుంటుందనీ ఎన్నెన్నో ఊహించాడు. అదేమీ లేకపోగా జేన్ ఎప్పట్లాగే మర్యాదగా మాట్లాడింది. తను లారా విల్సన్ తో మాట్లాడుతూండడం చూసి ఈర్ష్యపడలేదు సరికదా, అసలా ప్రసక్తే ఎత్తలేదు. అక్కడికీ విలియం ఉండబట్టలేక తమ పాత స్నేహాన్నీ, ఆప్యాయతనీ గుర్తు చేయబోయాడు. జేన్ అదంతా మర్చిపోయినట్లు మాట్లాడేసరికి అతనికి కొంచెం  అసహనంగా కూడా అనిపించింది.

తానూ, తన తల్లీ వాళ్లని చూడడానికి రాలేకపోయామనీ, దానికెంతో బాధ పడ్డామనీ అతనన్నాడు.

దానికంత బాధ పడాల్సిందేమీ లేదనీ, తనకసలు వాళ్ళు రాలేదన్న సంగతే గుర్తు లేదనీ ఆమె అన్నంది.

“హాయిగా ఎస్టేటులో వున్న తర్వాత పెగ్గీ చిన్న ఇంట్లో ఇరుకుగా ఇబ్బందిగా వుందా?”

“అబ్బే, అదేం లేదు. అయినా పనితో తల మునకలుగా వుంది. ఇంకేదీ పట్టించుకునే తీరిక లేదు.”

“పెగ్గీ ఏమైనా..”

“పెగ్గీ చాలా మంచిది. మర్యాదస్తురాలు.”

“పిల్లలు ఏమైనా ఇబ్బంది..”

“పిల్లలు చాలా బుధ్ధిమంతులు.”

ఆ సంభాషణ అయిపోయేసరికి ఇద్దరూ సంతోషపడ్డారు. అతను మళ్ళీ లారా విల్సన్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. జేన్ లేచి ఎల్సీని వెతుక్కుంటూ లోపల లైబ్రరీలోకెళ్ళింది.

ఈసారి అక్కడ ఎల్సీ ఫ్రాన్సిస్ తో కలిసి ఎలీజా రెన్నీ కవితల పుస్తకం చదువుతూ చర్చిస్తోంది.

“ఫ్రాన్సిస్! నువ్విక్కడ వున్న నాలుగు రోజులూ మా ఇంటికి వస్తావు కదూ? అసలు మనం కొన్ని రోజులు సరదాగా గడపాలి. రేపు సినిమాకి, ఎల్లుండి చిత్రకళా ప్రదర్శనకి, మర్నాడు పాట కచేరీకి వెళ్దాం, సరేనా?”

ఎల్సీ ఆశ్చర్యంగా అక్కవైపు చూసింది.

“నేను రాలేను జేన్. నాకు కొంచెం నలతగా వుంది.”

“చచ్చినా ఒప్పుకోను. ముగ్గురం కలిసే వెళ్దాం. ఆ తర్వాత నేనొక టైలరింగ్ షాపులో పనికి కుదురుకుంటున్నా కాబట్టి ఇప్పుడు నా మాట వినాల్సిందే!”

“జేన్! ఎల్సీకి నాతో రావడం ఇష్టం లేదేమో!” ఫ్రాన్సిస్ అన్నాడు.

ఎల్సీ మొహం ఎర్రబడింది.

“అయ్యొయ్యో! అదేమీ లేదు ఫ్రాన్సిస్. నాకు ముందు నీమీద కొంచెం కోపంగా వున్నమాట నిజమే. నీవల్లే మాకీ కష్టాలన్నీ అనుకున్నా కూడా. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ఇందులో నీ తప్పేం లేదని. నా దురుసుతనానికి క్షమించు!”

“ఇందులో క్షమాపణలకేముంది ఎల్సీ! మీ స్థానంలో ఎవ్వరున్నా అలాగే అనుకుంటారు. అది సరే, రేపు ఉదయాన్నేనాతో వస్తే నీకు ఎడిన్ బరో ఎంత అందంగా వుంటుందో చూపిస్తాను. జేన్ కి చూపించి లాభం లేదు. తనకసలు ఏమాత్రం కళా హృదయం లేదు. నీలాటి సున్నిత

మనస్కురాలికే ఆ సౌందర్యం అర్థమవుతుంది. ఏమంటావ్?” నవ్వుతూ అడిగాడు ఫ్రాన్సిస్.

అతని అభిమానానికీ, స్నేహానికీ ఎల్సీ పెదవులు విచ్చుకున్నాయి. మర్నాడు అతనితో కలిసి కాసేపు గడపాలని నిశ్చయించుకుందామె.

***

ఫ్రాన్సిస్ నిర్ణయం

పార్టీ నించి వచ్చి పడుకునేసరికి ఆలస్యం అయింది. జేన్, ఎల్సీ లిద్దరూ మర్నాడు లేచేసరికే పెగ్గీ పని మీద బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ పెగ్గీ తిరిగి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండయింది. ఆడ పిల్లలిద్దరూ అప్పటికి లేచి ఫ్రాన్సిస్ కొరకు ఎదురు చూస్తున్నారు.

తలుపు చప్పుడైంది. తమని బయటికి తీసికెళ్ళడానికి ఫ్రాన్సిస్ వచ్చి వుంటాడనుకొని ఇద్దరూ చెప్పుల వైపు కదిలారు. పెగ్గీ తలుపు తెరిచింది. అటు చూసిన ముగ్గురూ ఆశ్చర్యపోయారు. వచ్చింది ఫ్రాన్సిస్ కాదు! బ్రాండన్. పెగ్గీ ఆశ్చర్యాన్ని చూసి నవ్వాడు!

“పెగ్గీ! నిన్ను నాలుగు వీధులవతల చూసి వెంబడించాను. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తావేమో ఆగమని సైగ చేద్దామంటే, ఏదీ, నువ్వు గబ గబా నడుచుకుంటూ వచ్చేసావు. నీతో సమానంగా నడవలేకపోయాను నేను! నగర వీధుల్లో నడవదం అలవాటు తప్పినట్టుంది నాకు.”

పెగ్గీ ఇంకా ఆశ్చర్యం లోంచి తేరుకోలేదు. జేన్ ఎల్సీ ల వైపు తిరిగాడు బ్రాండన్.

“పెగ్గీ! నువ్వు మీ అక్కయ్య పిల్లలని చెప్తూ వుండే దానివి. వీళ్ళా ఆ పిల్లలు?” నమ్మలేనట్టు అడిగాడు.

“అయ్యొయ్యో! కాదండీ. మా అక్కయ్య పిల్లలందరూ బడికెళ్ళారు. అయినా, వాళ్ళని చూస్తుంటే మీకు వాళ్ళు మాలాటి వాళ్ళ పిల్లల్లా కనబడుతున్నారా? వాళ్ళిద్దరూ ఊరికే ఇక్కడ అద్దెకుంటారు. వాళ్ళు మా వూళ్ళో వుండే భూస్వామి గారి మేన కోడళ్ళు.”

“అలాగా? నిన్న రాత్రి నేను ఒక విందులో వీళ్ళిద్దరినీ కలిసాను. అందుకే ఆశ్చర్యపోయాను.”

“అదిసరే,  మీరు ఇటువైపెందుకొచ్చారు?” పెగ్గీ అడిగింది.

“అసలు నిన్ను చూడడానికి నువ్వు ఇచ్చిన మీ వూరి అడ్రసుకే వెళ్దామనుకున్నా. ఇంకా నయం వెళ్ళాను కాదు. ఊరికే ఒక ప్రయాణం దండగయ్యేది. నిన్ను చూడాలని చాలా అనుకున్నాలే. ”

“మొన్న మొన్నటి దాకా ఊళ్ళోనే వున్నా. ఇహ పిల్లలు పెద్ద స్కూల్లో చదువుకుంటామంటే ఇక్కడికి వచ్చాం. వాళ్ళ తాతగారిక్కూడా ఇక్కడ బాగుందట. ”

పెగ్గీ అమ్మాయిలవైపు తిరిగింది.

“అమ్మాయిగారూ! ఈయన మా బ్రాండన్ గారు. నేను చెప్పలా? ఆయనే.”

బ్రాండన్ చలి మంట దగ్గరకొచ్చి కూర్చున్నాడు.

“హబ్బా! పెగ్గీ! ఆస్ట్రేలియా లాటి వెచ్చటి ప్రదేశంలో వుండి నువ్విక్కడ చలి యెలా తట్టుకుంటున్నావు?”

“అటూ ఇటూ నడుస్తూ వుంటే చలి తగ్గుతుందండీ!”

“పెగ్గీ! నువ్వసలేం మారలేదు. అన్నట్టు నీకొక ముఖ్యమైన వార్త చెప్పాలి.”

“చెప్పండి! ఏంటది?”

“ఏంటా? నువ్వసలు మెల్బోర్న్ వదిలి వుండల్సింది కాదు. ఇప్పుడు మెల్బోర్న్ లో డబ్బే డబ్బు! అన్నట్టు పోవెల్ గుర్తున్నాడా? అతని పెళ్ళయ్యిందో లేదో గుర్తు రావడం లేదు.”

“నేను మెల్బోర్న్ లో వున్నప్పుడే ఆయనకి పెళ్ళయింది లెండి. ఇంతకీ సంగతేమిటి?”

“ఇప్పుడు పోవెల్ మెల్బోర్న్ లొని పెద్ద ధనికులలో ఒకడు తెలుసా? నాకంటే ఎక్కువ డబ్బూ, గొర్రెలూ, పొలమూ సంపాదించాడు. అతన్ని పెళ్ళాడకుండా పొరపాటు చేసావేమో పెగ్గీ!”

“ ఇప్పుడదంతా ఎందుకు కానీ, ఆయనకి ఏమైనా పిల్లలా?”

“ఇద్దరు. అబ్బో! ఇహ ఆయన మురిపం చెప్పనలవి కాదు.”

“ఆయన భార్య మంచిదేనా?”

“మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ, నీ అంత పనిమంతురాలు మాత్రం కాదు. ఆమెకి ఎంత సేపూ తన బట్టలూ, అంద చందాల మీదే ధ్యాస. అదలా వుంచు కానీ, నీ లాయరు లేడూ, టాల్బాట్ గారు! ఆయన నీకోక సందేశం ఇచ్చాడు.”

“టాల్బాట్ అక్కడ నా డబ్బు వ్యవహారాలన్నీ చూసే వాడు, ” పెగ్గీ కొంచెం గర్వం నిండిన కంఠంతో అంది అమ్మాయిలతో.

మళ్ళీ బ్రాండన్ వైపు తిరిగి, “ఏమంటాడు టాల్బాట్?” అని అడిగింది.

“నువ్వు నీ కొట్టు అద్దెకిచ్చావు చూడు, వాడికి కొట్టు కొనుక్కునే హక్కు కూడా ఇచ్చావు కదా? అలా ఇవ్వకుండా వుండాల్సింది అని బాధ పడ్డాడు.”

“నేనా కొట్టు అమ్మింది ఒక చిల్లర వ్యాపారస్తుడికి. వాడి జన్మకి వాడు రెండొందల యాభై పౌండ్లు ఎప్పటికి కూడబెట్టాలి, ఎప్పటికి కొనాలి? టాల్బాట్ అనవసరంగా భయ పడుతున్నాడు.”

“కానీ, ఇప్పుడా కొట్టు వున్న స్థలం దాదాపు రెండువేల పౌండ్ల కంటే ఎక్కువ ఖరీదు చేస్తుంది! ఆ కిరాయిదారు భలే ఉపాయం వేసాడులే. నీ లీజు అయిపోయేదాకా ఏమీ మాట్లాడడు. నువ్వడిగిన తక్కువ అద్దె కడుతూ అలాగే వుంటాడు. లీజు అయిపోయే సమయానికి స్థలం కుదువబెట్టి రెండొందల యాభై పౌండ్లు తెచ్చి నీకిచ్చి కొట్టూ, స్థలమూ అంతా తన పేర రాయించుకుంటాడట. ఈ విషయం వినగానే నీ మీద నాకు మహా చికాకు కలిగింది. అంత మంచి స్థలాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నావు చూడు!”

“హాయ్యో! ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం వూహించగలరు చెప్పండి! ఆ రెండొందల యాభై ఏదో ఓ రోజు నాకొస్తుందన్నమాట! పోన్లెండి. దక్కిందే మనదనుకుంటే సరిపోయే! అన్నట్టు, అదిగో, పిల్లలొచ్చేసారు.”

మెట్ల మీద అడుగుల సవ్వడి విని అంది పెగ్గీ!

“ఆఖరికి వచ్చారన్నమాట! నువ్విన్ని త్యాగాలు చేసి పెంచిన ఆ పిల్లలు ఎలా ఉంటారో అన్న కుతూహలంతో చస్తున్నాను! వస్తూనే వాళ్ళ పేర్లేమిటో చెప్పాలి నువ్వు.”

వాళ్ళు వస్తూంటే వరసగా పేర్లు చెప్పింది పెగ్గీ.

“టాం, జేమీ, నాన్సీ, జెస్సీ, విల్లీ!”

“చక్కటి పిల్లలు! చురుగ్గా వున్నారు. వీళ్ళని ఆస్ట్రేలియాకి తీసికెళ్తా నాతో! పైకొస్తారు.”

బ్రాండన్ ప్రశంసలకి పెగ్గీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“అంతా భగవంతుడి దయ. ఆరోగ్యాలు చల్లగా వుంటే అంతే చాలు. కానీ మహా అల్లరి పిల్లలు లెండి.” జవాబిచ్చింది.

ఇంతలో టాం కలగజేసుకున్నాడు.

“పిన్నమ్మా! కింద మెట్లదగ్గరెవరో ఒకాయన నిలబడి వున్నాడు. ఎవరు కావాలని అడిగితే, జేన్, ఎల్సీల కోసమొచ్చానన్నాడు. పైకి రమ్మన్నాను కానీ, రానని అక్కడే వుండిపోయాడు.”

“పెగ్గీ! అది ఫ్రాన్సిస్ అయి వుంటుంది. పైకి రమ్మను టాం. మేము సిధ్ధంగానే వున్నాం. ఒక్క అయిదు నిముషాలు కూర్చొని వెళ్ళిపోవచ్చు.” జేన్ చెప్పింది.

 టాం వెళ్ళి పిలిచినమీదట ఫ్రాన్సిస్ వచ్చాడు. బ్రాండన్ ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు, కానీ పెగ్గీ తమ పూర్వ పరిచయం గురించి వివరించింది. బ్రాండన్ తో రెణ్ణిమిషాలు మాట్లాడి ముగ్గురూ బయటికెళ్ళారు.

బయట పగటి వెల్తుర్లో కానీ అక్క చెల్లెళ్ళిద్దరిలో వచ్చిన మార్పు ఫ్రాన్సిస్ కనిపెట్టలెకపోయాడు. చిక్కిపోయిన ఆకారాలూ, పాలిపోయిన మొహాలూ చూస్తే అతనికి కడుపులో దేవినట్టైంది. అందులోనూ కుట్టుపనికి వెళ్తానని జేన్ అన్నప్పట్నించీ అతని మనసు మనసులో లేదు.

కొద్ది రోజులుగా తన మనసులో మెదుల్తున్న విషయం గురించి ఆలోచిస్తున్నాడతను. జేన్ అంటే అతనికి చాలా ఇష్టమన్న విషయం అతనికి కూడా అర్థమైపోయింది. కానీ జేన్ ని పెళ్ళాడితే ఆస్తి పాస్తులు వదిలేసుకోక తప్పదు. ‘ఈ డబ్బుతో నాకేం పని? ఇవన్నీ వదిలేసి హాయిగా జేన్ ని పెళ్ళాడితే పోలా?’ అని ఈ మధ్య బలంగా అనిపిస్తుందతనికి. ఇంతకు ముందు ఉద్యోగమే మళ్ళీ చేసుకుంటూ, యేడాదికి రెండొందల యాభై పౌండ్లతో ఎంతైనా హాయిగా బ్రతకొచ్చు. అందుకోసం కావాలంటే తన ఖరీదైన పుస్తకాల అలవాటూ, నాటకాలకెళ్ళే అలవాటూ, అన్నీ మానుకోగలడు తను.

మనసుకి నచ్చిన మనిషితో దుర్భరమైన పేదరికాన్ని భరించొచ్చు కానీ, ప్రేమించేందుకు మనిషి లేక అష్టైష్వర్యాల మధ్యా క్షణం కూడా వుండలేం.

‘నన్ను ఆమె పెళ్ళాడుతుందన్న నమ్మకం వుండి వుంటే మర్నాడే ఆ ఎస్టేటూ, ఇల్లూ అన్నీ గాలికొదిలేసి ఇక్కడే హాయిగా వుండిపోదును కదా! కానీ, ఆమెకి నా మీద ఎలాటి అభిప్రాయం వుందో! ఇప్పుడు నేను ఈ విషయం మాట్లిడితే, తన నిస్సహాయతను అవకాశంగా తీసుకుంటున్నానుకుంటుందో ఏమో!’

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. డబ్బు వల్ల తనకి కొత్త అలవాట్లేమీ రాకపోయినా, ఆ తీరుబడిగా వుండే జీవితమూ, ఎప్పుడూ డబ్బుకొసం తడుముకోవాల్సిన అవసరం లేని నిశ్చింతా అతని ప్రాణానికి చాలా సుఖంగానే వున్నాయి. ఇప్పుడవి వొదులుకోవదమంటే తననుకున్నంత తేలికైన పనేనా?

జేన్ కోసం డబ్బూ, ఇల్లూ వదిలి వచ్చేస్తానంటే ముందు అసలు రెన్నీ గారు తన పాత ఉద్యోగమిస్తారా లేక తిట్టి పంపేస్తారా? ఇంకో విషయం కూడా ఆలోచించాలి. జేన్ ని పెళ్ళాడితే, జేన్ తో పాటు ఎల్సీ బాధ్యత కూడా తీసుకోవలి. వచ్చే డబ్బుతో ముగ్గురం సర్దుకోగలమా? ఎందుకంటే జేన్ ని పెళ్ళాడడమొక్కటే కాదు తనకు కావల్సింది, ఆమెని సంతోషంగా వుంచడం కూడా! అంతే కాదు, ఆ డబ్బుతో తను పదిమందికీ పనికొచ్చే పనులు చాలా చేయాలని ఆశపడ్డాడు. మరి వాటి మాటో?

రకరకాల ఆలోచనలు సాగిపోతున్నాయి అతని మనసులో.

జేన్ వైపు తల తిప్పి చూసాడు. ఆమె కళ్ళల్లో ఆప్యాయత, స్నేహం చూసి అతనికి తనేం చేయాలో అర్థమైపోయింది. తను డబ్బూ, ఎస్టేటు అన్నీ ఏదైనా చారిటీ ట్రస్టులకిచ్చి జేన్ ని పెళ్ళాడతాడు. తను ఒప్పుకుంటుందా? తప్పక ఒప్పుకుంటుంది. తన మనసేమిటో ఇంకా ఆమెకి తెలియదా? తను ఇక ఒంటరివాడు కాదు.

ఆ రాత్రి అతను ఆలోచనలతో నాటకం సరిగ్గా చూడలేకపోయాడు. జేన్, ఎల్సీలు మాత్రం చాలా సంతోషంగా ఆ రాత్రి నాటకాన్ని చూసారు. తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు నాటకం గురించి మాట్లాడడానికి ఫ్రాన్సిస్ కేమీ తోచలేదు. విమర్శ అంతా ఎల్సీయే చేసింది.

  ***

(సశేషం)

ఒక నడి వయసు ప్రేమ కథ: లిజన్.. అమాయా!

జ్ఞాపకాలే జీవితం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే జ్ఞాపకాలు… ఎంత సత్యం! ఇట్స్ ఎ ప్రాక్టికల్ ట్రూత్! ఆ విషయాన్నే చెపుతుంది లిజన్.. అమాయా!

జిందగీ న మిలేగీ దొబారా…ఎవరన్నారు బాస్? జిందగీ మిలేగీ దొబారా! జీవితం మొదలుపెట్టిన కొన్నాళ్లకే జీరోకి చేరితే.. అంతా అయిపోదు. మళ్లీ ఒకటి, రెండు, మూడు అంకెలుంటాయి! పాత జ్ఞాపకాలను, అనుభవాలను ఓ భాగం చేసుకుంటూ కొత్తగా మొదలుపెట్టొచ్చు! దాన్నే చూపిస్తుంది లిజన్.. అమాయా! అమాయా.. అంటే రాత్రికల! బతుకు రాత్రి కలలాగే మిగిలిపోకూడదు!  జీవితం ఇలాగే ఉండాలనే ఫ్రేమ్‌లో మనసున్న వాళ్లెవరూ ఇమడలేరు! ఈ ప్రయాణంలో అనుభవమయ్యే ప్రతిమలుపునూ స్వీకరించడం..ఆస్వాదించడమే! విధివింతల్లో భాగస్వామ్యులవడమే!

ఇవన్నీ స్త్రీ, పురుషులిద్దరికీ సమానమే అయినా  స్త్రీ విషయానికొచ్చేసరికే ఎక్కడలేని సంఘర్షణ! ప్రేమ, సహచర్యం విషయంలో మరీ! ఆమెకు జిందగీ నమిలేగి దొబారా! ఒకవేళ కోల్పోయిన జీవితాన్ని మళ్లీ పొందాలనే ఆశపుడితే కట్టుబాట్ల నుంచి కన్న పిల్లల దాకా అందరికీ శత్రువు అవుతుంది!  కట్టుబాట్లనెదిరించే ధైర్యం చూపినా పిల్లలను కన్విన్స్‌చేసే సాహసం చేయలేదు ! అసలు ఆమెకు ప్రేమించే హక్కేలేనప్పుడు జీవితంలో మలిప్రేమ ఊపిరిగురించి ఊసా? అదీ మధ్యవయసులో! ఆ చర్చనే తల్లీకూతుళ్ల మధ్య సున్నితంగా లేవనెత్తుతుంది లిజన్ అమాయా..!

రమా సరస్వతి

రమా సరస్వతి

చలం రాజేశ్వరి చేసిన ధైర్యం లిజన్ అమాయాలో లీలా చేస్తుందా? రాజేశ్వరికి లోకం ప్రేమ మయం! పిల్లల బంధాలు, బంధనాలు లేవ్! కాని  లీల అలాకాదు! షి ఈజ్ ఎ అర్బన్ లేడి! మెచ్యూర్డ్ అండ్ మోడర్న్‌డాటర్‌కి సింగిల్ పేరెంట్! భర్త చనిపోతే అన్నీ తానై, తనకు కూతురే లోకమై బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. సినిమా కథలో మనకు కనిపించే లీల..ఢిల్లీలో బుక్ ఎ కాఫీ పేరుతో కెఫ్తీరియా నడుపుకొంటూ జీవిస్తున్న మిడిల్‌ఏజ్డ్ ఉమన్! ఆ కెఫ్తీరియాలోనే పరిచయం అవుతాడు ఫోటో జర్నలిస్ట్ జయంత్! అతని భార్యా, పాప ఓ కార్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. నడివయసు దాకా ఒంటరిగానే ఈదాడు! లీలతో పరిచయం స్నేహంగా మారుతుంది! ఎంతలా అంటే కెఫ్తీరియాకి వచ్చిన అపరిచితులు జయంత్, లీలను భార్యాభర్తలు అనుకునేంతగా!
లీల కూతురు అమాయా.. ఔత్సాహిక రచయిత! జయంత్‌తో చాలా చనువుగా ఉంటుంది. తన కెరీర్‌కి సంబంధించి ఎన్నో సలహాలు తీసుకుంటుంది. ఆయన్ని ఓ ఫ్రెండ్‌లా, గైడ్‌లా భావిస్తుంది!
లీలా  వయసొచ్చిన తన బిడ్డను ఓ స్నేహితురాలిలా చూస్తుంది. అన్నీ పంచుకుంటుంది. కూతురూ తనతో అన్నీ పంచుకునే స్వేచ్ఛనిస్తుంది. తామిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం అనే భావనలో ఉంటుంది లీల. కాని తర్వాత తెలస్తుంది తనది వట్టి భ్రమేనని!

1005330_10200530760220688_1798645539_n
రాఘవ.. అమాయా ఫ్రెండ్! ఆత్మవిశ్వాసం అమాయా రూపు తొడుక్కుందా అన్నట్టున్న ఆ పిల్లను చూసి ప్రేమలో పడ్తాడు. ఆమె మనసు గెలుచుకోవడానికి నానా తంటాలు పడ్తుంటాడు. అందులో భాగమే కెఫ్తీరియాలో లీలకు సహాయం చేస్తుండడం! ఓపెన్ మైండ్.. మోడర్న్ థింకింగ్ ఉన్నట్టు కనిపించే అమాయాతో సహచర్యం చేయాలని తపిస్తుంటాడు!
కాని తనపట్ల తల్లికి, రాఘవకున్న అభిప్రాయలు అబద్ధాలని తేల్చేస్తుంది అమాయా ..ఈ వయసులో తోడు కావాలనుకుంటున్నావ్ ఆఫ్టర్‌ ఆల్ ఫర్ సెక్స్? అన్న ఒకేఒక మాటతో!
ఖంగుతింటుంది లీల! మనిద్దరం ఒకరికొకరం చాలా అర్థమయ్యాం అనుకునేదాన్ని. కాని అపరిచితులం అని ఇప్పుడు అర్థమైంది అని బాధపడ్తుంది లీల. నా కూతురైతే చెంప చెళ్లుమనిపించే వాడిని అంటాడు జయంత్! ఓపెన్‌మైండ్ అండ్ మోడర్న్ గర్ల్‌గా ఉన్నట్టు నటిస్తావ్.. ఇదేనా నీ ఓపెన్‌నెస్? మీ అమ్మ విషయంలో నీ మాటతో నన్ను చాలా డిస్‌అప్పాయింట్ చేశావ్ అమాయా.. అంటాడు రాఘవ!
అమాయా కరుకు ప్రవర్తనకు, ఘర్షణకు కారణం.. వాళ్లమ్మ జయంత్‌తో ప్రేమలో పడడం. ఆ ఇద్దరు ఆ వయసులో పెళ్లితో ఒకటికావాలనుకోవడమే! ఆ నిర్ణయంతో అమాయా ప్రవర్తనలో మార్పువస్తుంది. తండ్రి అంటే అమాయాకు వల్లమాలిన ప్రేమ! తండ్రిపోయినా ఆ జ్ఞాపకాల్తో తను బతుకుతున్నట్లే తల్లీ బతకాలనుకుంటుంది. తన తండ్రి స్థానంలో ఇంకో పురుషుడిని తల్లి పక్కన ఊహించలేదు! ఆ సంఘర్షణతో మానసికంగా తల్లికి దూరమవుతూ ఉంటుంది. విచక్షణ కోల్పోతుంది. తండ్రి స్థానం ఆక్రమించుకుంటున్నట్టుగా ఊహించుకొని జయంత్‌నూ శత్రువుగా చూస్తుంది.
నిజానికి జయంత్ అమాయా అభిప్రాయాలను చాలా గౌరవిస్తుంటాడు. ఆమె తండ్రి స్థానాన్ని అతను కోరుకోడు. లీలను తనకు తోడుగా, తను ఆమెకు తోడుగా మాత్రమే కోరుకుంటాడు. తమ ఇద్దరి అనుబంధం గురించి అమాయాతో మాట్లాడమని లీల అడిగినా.. ఆమే అర్థంచేసుకోవాలికాని మనం కన్విన్స్‌చేసి ఒప్పించాల్సిన విషయంకాదంటాడు జయంత్!
అన్నట్టుగానే బోలెడంత మానసిక వేదన తర్వాత తల్లికోణంలోంచి ఆలోచించడం మొదలుపెడుతుంది అమాయా. నెమ్మదిగా లీల, జయంత్‌ల మధ్య ఉన్న ప్రేమను అర్థంచేసుకుంటుంది.
ఆధునికత అంటే మారిన టెక్నాలజీని మాత్రమే అడాప్ట్ చేసుకోవడం కాదు స్త్రీ, పురుష సంబంధాలను అవగతం చేసుకోవడం… ప్రేమ విషయంలో స్త్రీ స్వేచ్ఛను అంగీకరించడం… ఆమె మనసును అర్థంచేసుకోవడం.. ఆమె అవసరాన్నీ గుర్తించడం అని రుజువు చేస్తుంది లిజన్.. అమాయా!
నడివయసు.. ప్రేమలు అసహజం కావు! ఆ మాటకొస్తే తోడు కావాలనిపించేది ఆ వయసులోనే కదా. అయితే అమాయా అపోహ పడ్డట్టు నాట్ ఫర్ సెక్స్! మనిషి తాలూకు జ్ఞాపకాలు మనసు నిస్తేజం కాకుండా చూస్తాయేమో కాని జీవితాన్ని నడిపించలేవ్! పాత బంధాలను కలిపి ఉంచేది కచ్చితంగా పిల్లలే కాదనడంలేదు! అంతమాత్రాన ఒంటరైన తల్లో, తండ్రో ఇంకో తోడు కోరుకుంటే ముందు బంధానికి వచ్చిన ముప్పూలేదు! అసలామాటొకొస్తే ఈ రెండిటినీ పోల్చాల్సిన అవసరమూ లేదు! ప్రాక్టికల్‌గా అసాధ్యం కూడా! అవి వర్ణించుకోవడానికి బాగుంటాయంతే! పురుషుడు ఇంకో తోడు కావాలంటే సమాజం ఇలాంటివన్నీ కన్వీనియెంట్‌గా పక్కనపెట్టడంలేదా? ఆ స్వేచ్ఛ స్త్రీకి ఎందుకు లేదు? ఈ చర్చలన్నిటికీ లిజన్.. అమాయా మంచి డయాస్!

1360787547-listen_amaya_20130211
ప్రకతిలో ఇన్ని రంగులున్నా జీవితంలో రెండే రంగులు..బ్లాక్ అండ్ వైట్! ఇది ఈ సినిమాలో మాటే! ఈ నిజాన్ని గ్రహిస్తే మానవసంబంధాల్లోని మంచి, చెడులు కాదు సుఖదుఃఖాలు మాత్రమే తెలుస్తాయి! స్త్రీ ప్రేమించే హక్కుకు పూసిన నలుపు తెలుపుగా కనపడుతుంది! ప్రేమ అనంతం… ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా పుట్టొచ్చు..దాన్ని అంగీకరించడం, వ్యతిరేకించడం కేవలం వ్యక్తిగతం! ఇది అర్థమైతే చాలు దాన్ని మోయాల్సిన బరువును సమాజం తప్పించుకున్నట్టే!
you dont always have to be  right.. you have to be happy అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన లిజన్.. అమాయా సున్నితంగా మనసును తట్టి.. కళ్లను తడిచేసే అద్భుతప్రయోగం! ఈ చిన్న సినిమాను చూశాక పెద్ద ఆలోచన చేయకపోరు!
తన మొదటి సినిమానే ఓ ప్రయోగంగా మలచుకున్న దర్శకుడు అవినాశ్‌కుమార్ సింగ్ సాహసానికి హ్యాట్సాఫ్! అతని ఎక్స్‌పరిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్! గీతాసింగ్ కథకు మంచి న్యాయమే జరిగింది. అయితే అవినాశ్ క్రెడిట్‌లో సింహభాగం  సీనియర్ యాక్టర్స్ దీప్తినావల్, ఫరూఖ్ షేక్‌లదే! వాళ్లు నటించలేదు ఆ పాత్రల్లో బతికారు! అమాయాగా స్వరాభాస్కర్ సింప్లీ సూపర్బ్!

మొన్న ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో కనిపించే అవకాశంలేదు! కాబట్టి డివీడీ దొరికితే డోంట్ మిస్సిట్! బాలీవుడ్‌లో కనిపించే ఇలాంటి ప్రయత్నాలు తెలుగుకి రావడానికి ఇంకో తరమైనా పట్టొచ్చు! అప్పటిదాకా కనీసం రచయితలైనా ఇలాంటి అంశాల మీద కథలు, నవలలు రాస్తే చర్చకు ఆస్కారం ఉంటుంది!

– సరస్వతి

నయీ గాడీ

“నీకు బండి అర్జెంట్ కావాలి అంటున్నావు .. ఉద్యోగం కోసం ., చూడు షామీర్ భయ్యా! మా షోరూం లో ఇప్పుడు ఒక స్కీం వుంది . నెలనెలా పదమూడు వందలు కట్టాలి . ప్రతి నెల చివరి ఆదివారం స్కీంలోని సభ్యులందరి పేరు మీద డ్రా తీస్తాము. డ్రా వెళితే మిగతా  పైసల్ కట్టనవసరం లేదు., ఇలా యాభై కిస్తీలు కట్టాలి. డ్రా ల ఎల్లకుంటే లాస్ట్ ల బండి ఇస్తారు. ఇగ నువ్ అర్జెంట్ అంటున్నావ్ కనుక ఒక పదివేలు డౌన్ పేమెంట్ కింద కట్టి స్కీంల చేరు.. బండి తీస్కో , మధ్యల్ ఎల్తే నీకు మంచిదే, ఎల్లకుంటే నెల నెల పైసల్ కట్టుకో…ఎం అంటావ్ షామీర్ ..వింటున్నావా?”

“ఆ ఆ వింటున్న రమేష్ అన్న..ఇగ నాకు బండి ఎలాగు కావాలి. మైక్రో ఫైనాన్సుల కలెక్షన్ బాయ్ గా చేరాలంటే . కచ్చితంగా బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తా అని మేనేజర్ చెప్పిండు. ఇంట్లో నాన్న రిటైర్ అయ్యాడు , తన ఆరోగ్యం కూడా బాలేదు, నేను ఈ సమయంల ఉద్యోగం  చేయాలి అన్నా! ..”

సరే షామీర్! నువ్వు ఎప్పుడు పదివేలు తీసుకొని వస్తావో చెప్పు. నేను బండి తెప్పిస్తా. కాగితాలు రెడీ చేసి పెడతా సరేనా….”

“వెళ్ళొస్తా రమేష్ అన్న! వీలైతే వచ్చే గురువారం తీసుకుంటా..మళ్ళా  లేట్ అయితే ఉద్యోగం  వేరేవాళ్ళకు ఇస్తారు.

 షోరూంలకెళ్ళి బయటకు రాగానే ఎదురుగా మా  చిన్నమామ లతీఫ్.

“సలామా లేకూం  మామ…”

“వాలేకుం అసలాం ……క్యారే షామీర్.. రెండ్రోజుల నుండి రమేష్ తో కనపడుతున్నావ్ బండి గిట్ల  కొంటున్నావా!”  నోట్లో వున్న జర్దాను తుప్పుక్కు తుప్పుక్కు అని కింద ఉమ్మేస్తూ ఒక వెకిలి నవ్వుతో మామ అంటున్నాడు .

“ఆ అవును మామ ..ఇక్కడ మన ఊర్ల మైక్రో ఫైనాన్సు ఆఫీస్ లో  కలెక్షన్ బాయ్ వుద్యోగం ఉంది, చేరాలంటే బండి కావాలంటా, డిగ్రీ చేసిన వూరి పిల్లగానికే ఆ వుద్యోగం ఇస్తారంట. అందుకే రమేష్ అన్నతో మాట్లాడుతున్నాను.”

అంతా విని మళ్ళి తుప్పుక్కు అని ఉమ్మేసి “ఔరా ! షామీర్ ఇంట్లో నాయన రిటైర్ అయ్యి మంచాల ఉన్నాడు .,నీకు వేరే వుద్యోగం యేది దొరకలేదా ర..ఇప్పుడు బండెట్ల  గొంటావ్? ఏదైనా సెకండ్ హ్యాండ్ పాత బండి గిట్ల చూడు !”

“మామ! చూసిన కాని అవి మంచిగా లేవు, వాటిని కొన్నాక మల్ల రిపేర్ చేయించాలి…అందుకే కొత్త దే అడుగుతున్నా . రమేష్ అన్న ఒక పది వేలు కడితే ఇస్తా అన్నాడు, మిగతా పైసల్ నెల నెల జీతంలకెళ్ళి కడుతా.”

“అబ్బో ..సరే నీ ఇష్టం” అనేసి మామ పాన్ డబ్బా దగ్గరకు వెళ్ళాడు .

 ఇంటికొచ్చి నాన్న మంచంల కూర్చున్నా  ………”బేటా, వెళ్ళిన పని ఏమైంది? రమేష్  బండి ఇస్తా అన్నాడా?”

“పది  వేలు డౌన్ పేమెంట్ కడితే గురువారం బండి తీసుకోమన్నాడు” అని చెప్పిన నాన్నకు.

“అంత ఆలోచన ఎందుకు ర షామీర్ ! నేను ఇస్తా కదా నీకు పదివేలు .’బ్యాంకు ల నా ఎకౌంటుల మూడు లక్షలు ఉన్నాయి కదా అందులో ఒక పదివేలు తీసుకో. ఎలాగు నీకు వుద్యోగం బండి ఉంటే ఇస్తారు అంటున్నావు!” అప్పుడే వచ్చిన అమ్మ కూడా ‘నాన్న చెప్పినట్టు చెయ్యు’ అని అంది .

మధ్యతరగతి జీవితాలు ఇంతేనేమో! ఏది కొనాలన్నా అన్నీ ఆలోచించాలి.

  నాన్న బ్యాంకు అకౌంట్ లో అక్క పెళ్లి కోసం దాచిన మూడు లక్షలు మాత్రమే ఉనాయి, రిటైర్ అయాక వచ్చిన డబ్బు ఇంటి రిపేర్ కి నాన్న జబ్బు  తగ్గడానికి ఖర్చు  చేసాము. నాన్నకు నేను, అక్క, ఇంకో చెల్లె. చిన్న కుటుంబమే అయినా నాన్న జీతం మిగిలేది కాదు. రిటైర్ అయాక తన ఆరోగ్యం ఖరాబు కావడం, నా చదువు అయిపోవడం ఒకేసారి అయింది. ఇప్పుడు అక్క పెళ్లి చేయాలనీ నాన్న సంబందాలు చూస్తున్నారు.

ఈ పరిస్థితిలో కొడుకుగా నేను నాన్నకు సాయం చేయాలి ., సరిగ్గా ఇలాంటి సమయంలో అల్లాహ్ దయ వలన ఈ వుద్యోగం కోసం నా గురించి ఆ మేనేజర్ కు నా  దోస్తు చెప్పాడు. నా చదువు , కుటుంబ పరిస్థితి చూసి ఆ మేనేజర్ వుద్యోగం నాకే ఇస్తాను అన్నారు,  కాని బండి వుండాలని కండిషన్.

ఎందుకంటే చుట్టూ వున్న ఒక ఇరవై ఊర్లలో  వర్క్ కోసం తిరగాల్సి ఉంటుంది  .

అక్క పెళ్లి ఖాయం అయ్యే అంతలో ఉద్యోగం లో చేరితే నాన్నకు ఆసరా ఉండాలని నా ఆలోచన. రమేష్ అన్న కు ఫోన్ చేసి చెప్పిన గురువారం బండి తీసుకుంటా అని. బ్లాక్ కలర్ స్ప్లెండర్ , ఎప్పటి నుండో నేను కొనాలనుకుంటున్న బైక్ అది.

 ఆ రోజు గురువారం .  నాన్నతో కలిసి బ్యాంకులో పదివేలు తీసుకొని నేరుగా హీరో షోరూంకు నాన్నతో కలిసి వెళ్ళినా. అప్పటికే బండితో రమేష్ నవ్వుతూ ఎదురు చూస్తున్నాడు. పేపర్ వర్క్  చేసుకొని స్ప్లెండర్ బైక్ కీస్ నా చేతిలో పెట్టాడు. ఆనందంతో నా మొహం వెలిగింది. నాన్నను బండి మీద కూర్చోపెట్టుకొని రమేష్ కి నమస్తే చెప్పి ఇంటికి బయలుదేరాను కొత్త స్ప్లెండర్ బండి మీద .

ఇంటి దగ్గర అమ్మ అక్క చెల్లె ఎదురు చూస్తున్నారు. రాగానే అమ్మ నాతో “షామీర్!  అక్కతో కలిసి దర్గా వెళ్లి మొక్కి రా రా …అల్లాహ్ అంతా  మంచి చేస్తాడు” అని చెప్పింది.

దర్గా వెళ్లి దారిలో స్వీట్ షాప్ లో ఒక అరకిలో లడ్డు తీసుకొని ఇంటికి రాగానే అమ్మతో మాట్లాడుతూ లతీఫ్ మామ కనిపించాడు.

“ఏమి రా షామీర్! ….మంచి జోష్ మీద ఉన్నావ్ ! బండి కొన్నావు.. ” మామ మాటలకు నవ్వుతూ అమ్మ చేతిలో లడ్డు పాకెట్ పెట్టి ఏమి మాట్లాడకుండా మా దోస్త్ రాము ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి బండి స్టార్ట్ చేసినాను.

 జీవితం సాఫీగా గడుస్తుంది కొంచం ఇప్పుడు. చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. మైక్రో ఫైనాన్సు మేనేజర్ కి నా మీద మంచి అభిప్రాయం కలిగింది.

మా ఇంటి పక్కన  వుండే షేర్ సాహెబ్ మా అక్క కు ఒక మంచి సంబంధం చెప్పాడు. అబ్బాయి సింగరేణి బొగ్గు కంపెనీలో కాంట్రాక్టు ఫిట్టర్ గా పనిచేస్తాడు, నెలకు ఒక పన్నెండు వేలు జీతం, ఇంకో రెండేళ్ళు చేస్తే పర్మినెంట్ చేస్తారంట. ఒక్కడే కొడుకు . ఊర్లో  సొంత ఇల్లు వుంది.

అమ్మానాన్నలకు, నాకు ఈ సంబంధం నచ్చింది. పెళ్లి చూపులు ఆదివారం పెట్టుకున్నాము.  అంతా సాఫీగా జరిగింది.  పిల్లాపిల్లడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండ్రోజుల తరువాత కట్నకానుకల కోసం వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, పొద్దున్నే నాన్న, నేను, మా లతీఫ్ మామ కట్నం కోసం మాట్లాడటానికి వెళ్లిన్నాము.  లతీఫ్ మామ స్వభావం నాకు తెలుసు. తను పుల్ల ఎలా పెట్టాలా అని చూసే రకం. తను రావడం నాకు ఇష్టం లేదు  కాని మామ పెద్దవాడు ఇంకా పెళ్లి కొడుకు మేనమామ, లతీఫ్ మామ బచ్పన్  దోస్తులంటా ! అందరం కుర్చోన్నాము వాళ్ళ ఇంట్లో.. నాన్న పెళ్ళికొడుకు నాన్నతో మాట్లడుతున్నాడు , లతీఫ్ మామ పెళ్ళికొడుకు మామతో ముచ్చట్లలో ఉన్నాడు . నేను దేవుడికి మనసులో దండం పెట్టుకుంటున్నాను.  కట్నం తక్కువ వుండాలని, ఒక లక్ష నగదు, మూడు తులాల బంగారం, ఇంకా పెళ్లి కూతురు కోసం సామాను పర్నిచర్ …నాన్న వాళ్ళతో చెప్పాడు ఇంతే ఇవ్వగలము అని. సరే అందరు ఒపుకొన్నారు,

ఇంతలో పెళ్లి కొడుకు మేనమామ నాన్నతో “చూడండి ఇవ్వాళ్ళ అందరు పెళ్లి లో బైక్ పెడ్తున్నారు కట్నం కింద  మీరు మా వాడికి బైక్ పెట్టాల్సిందే అన్నాడు, నాన్న కుదరదు అని చెప్పాడు ఇంతో మా లతీఫ్ మామ నాన్న తో చూడు జహింగిర్ బావ…ఇంత దాకా వచ్చాక్కా బండి కోసం పరేషాన్ ఎందుకు? మన షామీర్ గాదిది కొత్త బండే కదా ! కొని రెండు నెలలే ఐంది, అది ఇద్దాము కట్నం కిందా అన్నాడు …ఒక్కసారిగా నాకు ఏదోలా అయింది. సరే మేము వెళ్లి కబురు చేస్తాం అని ఇంటికి వచ్చాము.

ఆ రోజు రాత్రి నాన్న నేను ఆలోచనలో పడ్డాము, నేను నాన్నతో అన్నాను … “నాన్న అక్క పెళ్లి ముఖ్యం మనకు,  బండి ఏముంది నాన్న మళ్లి కొందాము” .,

నాన్న నా తల మీద చేయి వేసి “మరి వుద్యోగం ఎలా?” అన్నాడు,

“నేను మేనేజర్  కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్దం” అన్నాను., అక్కడే వున్న అక్క కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి .

తెల్లారగానే ఆఫీస్ లో మేనేజర్ ని కలిసి విషయం చెప్పినాను, తను నా సమస్య అర్థం చేసుకొని ప్రత్యామ్నాయం ఆలోచిస్తా. ఏం భయపడకు షామీర్!  నీ వుద్యోగం నీదే” అన్నాడు, మేనేజర్ కి దండం పెట్టి బండి స్టార్ట్ చేసి పనికి వెళ్ళిపోయాను.

వచ్చే నెల పదో తారీకున పెళ్లి . పెళ్లి పనుల కోసం నాన్న నేను తిరుగుతున్నాము, చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది, మా స్తోమత ప్రకారం అయినంతలో చాలా బాగా పెళ్లి జరిగింది. అంత అయిపోయి పెళ్లి కారు , సర్వీసు వెళ్ళే సరికి రాత్రి ఒంటిగంట అయ్యింది. అక్క ఏడుపు ఆపుకోలేక పోయింది, నాకు ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అందరు వెళ్ళాక దూరంగా లతీఫ్ మామ, పెళ్ళికొడుకు మేనమామ నా బండి దగర ఏదో మాట్లాడుతున్నారు.  సలాం చెప్పి బండి స్టార్ట్ చేసి వాళ్ళ మామ నా దగర వచ్చి “షామీర్ పెళ్లి మంచిగా ఐంది, ఇక బండి నేను తీసుకొని వెళ్తున్నా.  నువ్ వలీమాకు వచ్చేటప్పుడు బండి పేపర్ లు మర్చిపోకు.  వెళ్తా మరి” అని నమస్తే చెప్పి నా బ్లాక్ స్ప్లెండర్ మీద వెళ్ళిపోయాడు…….అలానే చూస్తూ ఉన్న నేను ఏదో అలికిడి కావడంతో పక్కకు చూస్తే మా లతీఫ్ మామ జర్దాను తుప్పుకు తుప్పుకు అని ఉమ్మేస్తూ నా వైపు వస్తున్నాడు.

కొత్త బండి….అక్కతో పాటే వెళ్ళిపోయింది .. అల్లా అంతా మంచి చేస్తాడు.

–కార్తీక్ సాయిరాం

కవిత్వ ‘బాధ’లో ఒక సుఖముంది!

మనసుకి బాధ కలిగితే కవిత్వం వస్తుందంటారు. కానీ శరీరానికి బాధ కలిగితే కూడా కవిత్వం వస్తుంది అన్న నానుడి నేను ఎక్కడా వినలేదు. అయితే , శరీరానికి కలిగే బాధలు ఎంత చిన్నవైనా, ఎంతో కొంత మన ఉత్సాహాన్ని , శక్తిని తగ్గిస్తాయి. రోజువారీ దినచర్య కొంత నత్త నడక సాగుతుంది. అదే ఏదైనా భరించలేని నొప్పి వచ్చిందంటే ఇంక చెప్పేదేముంది? తప్పని బాధ్యతలు ముక్కుతూ మూలుగుతూ పూర్తి చెయ్యాల్సి వస్తుంది. చేసే పనిలో ఉత్సాహం , తపన కరువై , తప్పదురా భగవంతుడా అనుకుంటూ చేస్తాం. మొత్తానికి ఏ చిన్న అనారోగ్యమైనా మన కేంద్రీకరణ శక్తిని తగ్గించేసి అలవాటుపడిన దినచర్యకి ఆటంకం కలిగిస్తుంది.

అలా కాకుండా అమితమైన మనోబలం ఉన్న కొద్ది మంది మాత్రం పెద్ద పెద్ద అనారోగ్యాల్ని కూడా త్రుణప్రాయంగా తోసేసి వీలైనంతవరకు అవి తమ కార్యకలాపాలను ప్రభావితం చెయ్యకుండా చూసుకుంటారు. ఇది అరోగ్యకరమైన శక్తి. అలాంటి మనోబలం, మనో నిబ్బరం పొందాలని ఎవరికుండదు? అందుకే చిన్న చిన్న నొప్పులకి సైతం నీరుకారిపోయే కొంతమంది ధ్యానం ద్వారానో, యోగా ద్వారానో అలాంటి మనోబలాన్ని పొందాలని ఆరాటపడుతూంటారు.

64681_101182536614807_2154683_n

అయితే కవిత్వానికున్న శక్తి కూడా అలాంటిదే అని నాకనిపిస్తుంది. మానసికోల్లాసం ద్వారా శారీరక వికాసం కవిత్వం కలిగిస్తుందనేది స్వీయానుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. అచ్చంగా అలాంటి అనుభవమే విన్నకోట రవి శంకర్ గారి “బాధ” కవిత మొదటి సారి చదివినప్పుడు నాకు కలిగింది. ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మన శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా తేలికైన భాషలో కవిత్వీకరించారు. శారీరక బాధ అనేది ఎప్పుడో అప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవించే ఉంటారు కాబట్టి ఈ కవిత చాలా తేలికగా మనసుకి హత్తుకుపోతుంది. అంతే కాదు, ఒక్కసారి గుర్తుచేసుకుంటే అలాంటి బాధలనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి మొరాయించే   శరీరానికి నూతనోత్సాహానిస్తుంది.

 

కవి ఈ కవితలో చెప్పినట్టు

 

“మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు

  శరీరం బాధని మాత్రం

  ఎవరికి వారే మోసుకోవాలి

  ఎదురైన ఏ సుఖాన్నైనా

  వద్దని ఒదులుకోవచ్చుగానీ,

  బాధని కాదనటానికి కూడా వీలుండదు. “

కాబట్టే, బాధను ఉపశమింపజేసే సాధనాల్లో ఈ కవిత కూడా ఒకటయిందంటాను. ప్రతి మనిషీ నొప్పి కలిగినప్పుడు ఇదేరకమైన బాధని అనుభవిస్తాడు. అలాంటి బాధని ఇలా కవిత్వరూపంలో చూసుకోవడం ఒక చిత్రమైన అనుభూతి. పెదవులపై చిరునవ్వులు పూయించి బాధని కాసేపు మర్చిపోయేలా చేస్తుందీ కవిత.

 

అంతా సవ్యంగా ఉన్నంతసేపూ

  

   అన్ని వైపులా పాదులా అల్లుకుపోయే శరీరం

   ఏ చిన్న భాగం ఎదురు తిరిగినా

   బాధతో లుంగలు చుట్టుకుపోతుంది.

 

   వేల ఆనందపుష్పాలు

   విరబూసే శరీరవృక్షం

   ఒకే ఒక బాధా విషఫలంతో

   వాటన్నిటినీ రాల్చుకొంటుంది.

 

శరీరం వీణ మీద

   ఒకో చోట సుఖం ఒకోలా పలికినా,

   బాధ మాత్రం అన్ని చోట్లా     

   ఒకలాగే పలుకుతుంది.

   సుఖాన్ని మించిన సుఖం ఉందనిపిస్తుంది గానీ,

   ఏ బాధా మరొక బాధకి తీసిపోదు.

 

   చుట్టూ ఉన్న ప్రపంచం తన అందాన్ని

   అతి తేటగా ప్రకటిస్తున్నప్పుడు

   ఒక్క బాధ చాలు –

   కళ్ళకి కన్నీటి తెరకట్టి

   మొత్తంగా దానిని మసకబరుస్తుంది.

 

   మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు

  శరీరం బాధని మాత్రం

  ఎవరికి వారే మోసుకోవాలి

  ఎదురైన ఏ సుఖాన్నైనా

  వద్దని ఒదులుకోవచ్చుగానీ,

  బాధని కాదనటానికి కూడా వీలుండదు.

 

   మనసు ఒప్పించలేని

   మనిషి చివరి ఒంటరితనాన్ని

   శరీరం ఒక బాధాదీపపు వెలుతురులో

   సరిపడా రుజువుచేస్తుంది.

– ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవిత

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

 

ఈ రోజు  ముఖంలో ముఖం పెట్టి

అంటోంది ప్రేమించవేం ప్రియా ?

“సమైఖ్యం” గా ఉందామని

 

ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్  గోరటోని లాగా

అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-

 

చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ

ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి

ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా

 

చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ

తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ

ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం

 

స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!

images1

నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం

రావేం ప్రియా అని బతిమాలుడుదాం

విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం

 

కవి గాయక వైతాళికులను రమ్డోయ్ రారమ్డోయ్ అని నినదిద్దాం

ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం

చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం

అదీ కాక పోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం

పొంగుకొచ్చే బాన కడుపులను

అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిసెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం

 

జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా

గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా

పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబిలో పొందికగా మడచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా

చదువుకొని శిక్షణలు పొంది

కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా

 

ఇంకా ఇక  ఉద్యోగాలుండవని అరుద్దాం

నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు ముడ్డి  మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం

జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం

జారి పోకుందా ఉండేందుకు

అందరమూ కలిసి

సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం

 

నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం

కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ ‘సమైఖ్యత’నొక ప్రతీకగా నిలబెడదాం

 

ఈ రోజుటి ముఖమ్మీద

తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజి ఒక్క ప్రేమ లేఖనయినా-

 

-అవ్వారి నాగరాజు

 

 

 

 

 

 

 

 

 

 

 

వొక కొండపిల్ల

sudhakar

విజయనగరం జిల్లాలోని ” పోరాం’ గ్రామంలో జూన్ 22, 1986లో పుట్టారు బాలసుధాకర్ మౌళి. ఇప్పటి వరకు నాలుగు కథలు రాశారు. కవిత్వంలోనూ ప్రవేశం ఉంది. మొదటి కథ “థింసా దారిలో’ 2011లో సాహిత్య ప్రస్థానంలో ప్రచురితమైంది. ఈయన కథ “గొంతెండిపోతోంది’  హిందీలోకి అనువాదమైంది. రాశికన్నా వాసి ముఖ్యమనే ఈ రచయిత బడుగు, బలహీన వర్గాల తరపున నిలబడి మాట్లాడతాడు.

వేంపల్లెషరీఫ్

 

 

1

పార్వతి..
కొండకు కొత్తందం వచ్చినట్టుండే నీలికళ్ల కొండ పిల్ల ‘పార్వతి’. పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగలా, తీగె  పవిటంచుకు పూసిన ఎర్రటి పువ్వులా.. అడవి అడవినంతా గుండెల్లో నింపుకున్న కోయపిల్ల పార్వతి.

అడవి నెత్తురంతా థింసా రంగే..
అలాంటిది- అడవికే థింసాని నేర్పే వసంతోత్సవ నాట్యకారిణి పార్వతి.

నెత్తి మీద సూర్యున్ని అలంకరించుకుని కిందకు దిగుతున్న వనకన్యలా.. పార్వతి నడుస్తోంది. కాలిమువ్వల సవ్వడి లయాత్మకంగా చుట్టూ ధ్వనిస్తోంది.
ఆమె నడుస్తున్న దారంతా ‘కొండపూల సుగంధం’. మొక్కా మొక్కా, పువ్వూ పువ్వూ-
ఆమె వెళ్లిన వేపే చూస్తూ.. దిగులు పడుతూ.. పార్వతి పునరాగమనానికై రేపటిని కాంక్షిస్తూ……

సంధ్యా కాంతి- చల్లని గాలిని వెంటేసుకుని కొండ దిగువకు ప్రసరిస్తుంది.
పార్వతి నడుస్తూ నడుస్తూ వెనక్కి తిరిగి.. అడవిని ఆప్యాయంగా చూసుకుంది.

ఇప్పుడిప్పుడే బతుకు రహస్యాలను గ్రహిస్తున్న పార్వతి నడకలో- గొప్ప జీవితేచ్ఛ తొణికిసలాడుతుంది.

2

పార్వతికి పదహారేళ్లు.
అమ్మలేని పార్వతి- కొండ కొంగు పట్టుకుని అడవంతా పిల్లకోడిలా కలియతిరుగుతుంది.

కొండ మీద పుట్టే ప్రతీ ప్రాణి.. పార్వతికి పరిచయమే. గూళ్లల్లో నుంచి గువ్వపిల్లలను చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెడుతుంది.
తుప్పల్లో ముడుచుకు కూచున్న కుందేటి కూనల్ని పట్టుకుని శరీరంపై మృధువుగా నిమురుతుంది. లేళ్లతో పాటూ గంతులేస్తుంది. అడవి మేకల ఆలన తీరుస్తుంది.
పామన్నా.. పురుగన్నా… ఏ మాత్రం భయపడదు పార్వతి.
పార్వతికి- కొండ మీద అమ్మ మీద ఉన్నంత ప్రేమ.
కొండంటే.. పార్వతికి అమ్మే.

కొండ పాదాల చెంత పార్వతి ‘గుడిసె’.
గుడిసె ముందు జామచెట్టు.
చెట్టు నీడలో అమ్మ ‘లచిక’ సమాధి.
సమాధిపైన.. చెట్టు కొమ్మకు వేలాడుతూ ‘ఊయల’.
రోజూ చీకటి పడే వేళ- లచిక వచ్చి ఊయల ఊగుతుందని అమ్మమ్మ ‘మరియమ్మ’ నమ్మిక. ఎప్పుడైనా పార్వతి ఊయలలో ఊగుతుంటే.. అలా ముచ్చటగా కళ్లార్పకుండా చూస్తూనే వుంటుంది ‘మరియమ్మ’.

పార్వతి రావడం- మరియమ్మ చూసింది.

”పారోతి.. ఎలిపొచ్చినవమ్మా.. తల్లీ… కొండకు పొద్దుచ్చినేళ ఎల్లినవు… సీకటి పడ్డంక వొచ్చినవా…. పామూ పురుగూ కరుత్తదన్నా యినవే.. నా సిట్టి తల్లి…….. అడవిల పడ్డ పద్దినాలకే నిన్ను నా సేతిల ఎట్టి
ఎల్లిపోనాది గదే మీ అమ్మ….. దాన్నని యిప్పుడేటిలే.. అదా గూటిలో గంటిజావ.. తాంగి తొంగో… పెటకన జాంకాయ మర్సిపోకు……………..”

పార్వతి- అమ్మమ్మ ఉంచిన గంటిజావ తిని.. ఏరుకొచ్చిన కొండరేగు పళ్లు నంజుకుని… ఆరుబయట అమ్మమ్మ పక్కనే.. చుక్కల్ని లెక్కపెడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది.

Picture 059

3

తెల్లారింది.
కొండ గుమ్మం- పసుపు రాసినట్టు ధగధగా మెరిసిపోతుంది. ఎక్కడ నుంచి వచ్చిందో.. జామచెట్టు కొమ్మపైన కూర్చున్న ‘ఎర్రముక్కు పిట్ట’ కమ్మగా కూస్తుంది.
అడవిలో- రోజూ పార్వతి వినే కూతే అది. సంబరపడింది.
”యే.. ఎర్రముక్కు పిట్టా! అడవికి రమ్మని పిలుపుకొచ్చినవటే.. పార్వతి రాకపోతే అడవి మాడిపోదూ.. పువ్వూ పిందే రాలిపోవూ… చిలకలు అలకపూనవూ…………!”
పార్వతి మాటలను అర్థం చేసుకున్నట్టుంది- ‘ఎర్రముక్కు పిట్ట’ తుర్రున ఎగిరిపోయింది. అడవంతటికీ పార్వతి మెళకువ గురించి కబురందించాలనుకుందేమో……….

గుడిసె ముందు- అడవి కోళ్లకు ‘గంటిలు’ వేస్తూ… పెంచుకుంటున్న కుందేలు పిల్లని గంప కింద నుంచి చేతుల్లోకి తీసుకుని ముఖానికి ఆనించుకుని గారాము చేసింది.

అమ్మమ్మ ‘మరియమ్మ’- పార్వతిని చూసి గతాన్ని గుర్తు తెచ్చుకుంది.
గతంలో జరిగిన సంఘటలన్నీ- మరియమ్మకు రోజూ జ్ఞాపకానికొస్తూనే ఉంటాయి.

‘పారొతి అమ్మకి పదనాలుగో ఈడుకే లగ్గమయింది. దీనికి పదేడేళొత్తున్నయి.. ఈ మాగమాసానికి.. ఈ ఈడుకొ అయ్య సేతిల ఎట్టాల…. దీనికా బాగ్గిం నేదు. తల్లీ నేదు. తండ్రీ నేడు. నాను సూత్తే ముసిలి ముండని……..’
‘లచికను- పారొతి తండ్రి మోసం సేసాడు. కొండ దిగువూరినించొచ్చి.. కొండోలతో సేయం నటించి.. కొండోల కట్టమంతా దోసుకునీవోడు. ఎదిగిన లచికను సూసి.. పేమించానని.. పేణమని సెప్పి లగ్గమాడాడు. లచికకు కడుపొచ్చాక సల్లగ జారుకుని ఎలిపోనాడు. మళ్లా పికరనేదు…………….’
గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్లు తుడుచుకుంది.

జ్ఞాపకాల దొంతరల నుంచి బయటకొచ్చి…..
”అమ్మా… పారొతి.. పిట్టలకు మేత ఏత్తున్నవటే తల్లీ…. ”
పార్వతి దగ్గరకొచ్చి తలని గుండెలకు ఆనించుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుంది.

అమ్మ గుండెల మీద- బెంగా భీతీ లేకుండా తలవాల్చుకోవాల్సిన పార్వతి.. అమ్మమ్మ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది.

పార్వతికి- తండ్రి గురించిన విషయాలేవీ తెలియకుండా పెంచింది మరియమ్మ. ‘తండ్రి వలనే తల్లి చనిపోయిందని’ మాత్రం పార్వతికి తెలుసు.
కానీ ఊరిలో ఆ నోటా ఈ నోటా విన్న మాటలని బట్టి… యిప్పుడిప్పుడే ‘తల్లి ఎందుకు చనిపోయిందో…’  అర్థమౌతుంది పార్వతికి.

దిగువ ఊర్ల గురించీ.. ఆ మనుషుల గురించీ.. వాళ్ల ‘మాయా-మర్మం’ గురించీ తెలుసుకుంటుంది. అందుకే పార్వతికి దిగువ ఊర్లన్నా.. ఆ మనుషులన్నా భయం.

ఎప్పుడైనా గుడిసెకు ఎవరన్నా కొత్తవాళ్లు వస్తే.. బిగుసుకుని.. గుడిసె లోపలికెలిపోతుంది. ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడదు. బయటకు చెప్పుకోలేని బాధ.. పార్వతిని చుట్టు ముడుతుంది.       ఎలాంటి బాధలోనైనా పార్వతికి ఉపశమనం- ‘థింసా’నే. పార్వతికి ‘థింసా’ అంటే ప్రాణంతో సమానం. తల్లి ‘లచిక’ కూడా ఆ కొండ చుట్టు పక్కల ఊర్లలో మంచి ‘థింసా’ నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన ‘కళ’ను కొనసాగించాలని పార్వతి ఆశ.
ఆడా మగా- చేయి చేయి కలుపుకుని.. ఒకరినొకరు అనుసరిస్తూ… తుడుం దరువులకి అనుగుణంగా కాళ్లను లయబద్ధంగా కదపడమంటే…. పార్వతికి ఎక్కడలేని ఉత్సాహం. పార్వతి ‘థింసా’ని చూసిన.. ఆ ‘ఊరి’ స్త్రీలు పార్వతిని- వాళ్ల అమ్మతో పోల్చుతుంటారు. అలాంటప్పుడు పార్వతి గుండె తడవుతుంది. ఇంకా ఇంకా
బాగా నర్తించాలని పట్టుదల పెరుగుతుంది.

4

‘పండగ రోజులు’ దగ్గర పడుతున్నాయి.
కొండ ఊరిలో ‘ఆనందం’ తాండవిస్తుంది.
మగవాళ్లు, నడి వయసు ఆడవాళ్లూ.. దిగువ ఊర్లకెళ్లి… కట్టెలు, బొగ్గులు, చింతపండు, సీతఫలాలు అమ్మి.. పప్పు, నూనె, కొత్తబట్టలు కొనుక్కొని కొండకు తిరిగి వస్తున్నారు.
తుడుంలు, డప్పులు, పినలగర్రలు- సవరించుకుంటున్నారు.

కొండ ఊరికి పండగంటే.. ఇప్పుడు- ‘దిగువ ఊర్ల పండగే’.
కొండోల కందికొత్తల పండగ, విత్తనాల పండగ ఇవన్నీ.. కొత్తతరాలకు అనుభవంలో లేవు. వాళ్లకు పండగంటే సంక్రాంతి, కనుమలే.
కొండ ఊరివాళ్లు.. పండగ పూట- దిగువ ఊర్లకెళ్లి థింసా చేస్తారు. ఐదారు ఊర్ల నుంచి పిండివంటలు, బియ్యంలాంటివి కొండకు తీసుకుని వస్తారు. ప్రతీ ఏటా పండగప్పుడు దిగువకు వెళ్లడం.. కొండవాళ్లకు రివాజుగా మారిపోయింది.
ఎప్పుడూ వెళ్లడం వేరు. పండగ పూట వెళ్లడం వేరు. పండగ రోజుల్లో వాళ్లకు ‘థింసా..’ జీవితాధారంగా కూడా మారిపోయింది.

థింసా- కొండ గుండెల్లో ప్రవహించే ‘జీననది’.
తరతరాలుగా గిరిపుత్రుల సంస్కృతిని మోస్తున్న ‘అడవి తల్లి గుండె లయ’.

dhimsa_dance

పార్వతికి- థింసా అంటే ప్రాణం. కొండ ఒడిలో పుట్టి నడక నేర్చినప్పటి  నుంచి ‘థింసా’నే చూస్తుంది. థింసాలోనే సేదతీరుతుంది. ‘కొండా-థింసా’ పార్వతికి రెండు కళ్లు.
థింసా కోసం- దిగువ ఊర్ల మీద ఉన్న అయిష్టతను పక్కన పెట్టి.. పండగ రోజు- దిగువకు తన వాళ్లతో పాటూ వెళ్లింది.
కనుమకూ, ముక్కనుమకూ రెండు రోజులూ ‘థింసా’ ఆడింది.
తర్వాత- అందరూ తిరిగి కొండకు వచ్చేసారు.

పార్వతికి ఉబుసుపోలేదు. ‘థింసా’ ఇచ్చిన మత్తును మరిచిపోలేకపోతుంది. తుడుంలు, డప్పులు, పినలగర్రలు మధ్య ఆడిన కాళ్లను, చేతులను పదేపది చూసుకుంది. ఆ వాయిద్యపరికరాలన్నీ.. యిప్పుడు మూలకు చేరాయి.

థింసా- కేవలం ‘ఆకలి తీర్చే ఆట’గానే మారిందని పార్వతికి బెంగ.       పండగలోనో, జాతరలోనో మాత్రమే కనిపించే.. ‘థింసా’ స్థితికి- పార్వతికి గుండె కోసేసినంత దుఃఖం.

ఒంటరిగా, నిశబ్దంగా- అడవిలోకి బయలుదేరింది పార్వతి. ఆకూ ఆకూ.. కొమ్మా కొమ్మా- పార్వతి రాకను గమనించి గూళ్లలోకి సందేశాన్ని పంపాయి. పక్షులన్నీ కిలకిలమని అరుస్తూ.. వచ్చి.. పార్వతిని పలకరించాయి.
లేళ్లూ, కుందేల్లూ- పార్వతికి ఎదురొచ్చాయి.
చెవులు రిక్కించి.. పార్వతి మాట కోసం- అలా చూస్తూనే ఉన్నాయి.

పార్వతి ఎవరితోనూ ఏ మాటా ఆడలేదు.
ఓ చెట్టు కింద మౌనంగా కూర్చుంది.
తన ఆలోచనల్లో- ‘అమ్మ, థింసా’ తప్ప ఇంకోటి లేదు.

5

కొన్ని రోజులు ఇలాగే స్తబ్దంగా గడిచాయి.

ఒక రోజు- కొండకు ‘దుర్వార్త’ వచ్చింది.
”కొండను బాంబులతో పేల్సి.. పెద్దపెద్ద బండలను పట్నం తీసికిలిపోతారట!  ఆటితో గొప్పగొప్ప భవంతులు, డేంలు కడతారట! కొండోల గుడిసిలన్నీ కూల్సిత్తారట! యెక్కడో దిగువున వుండడానికి కుసింత జాగవ సూపెడతారట! పని కూడా సూపెడతారట…………….!”
కొండంతా- ఈ వార్త దావానలంలా పాకింది. కొండోల్లంతా ఒకరి ముఖాల్నొకరు చూసుకున్నారు. కొందరు బిక్కచచ్చినట్టు ఊరుకున్నారు. కొందరు గుండెలు బాదుకున్నారు. కొందరు ధైర్యం చేసి.. ఈ వార్త నిజమో! కాదో! తెలుసుకోవడానికి దిగువకు వెళదామనుకున్నారు. వెళ్లారు.
‘అంతా నిజమేనని…. ‘ వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారు.

కొండోలు అల్లాడిపోయారు.
‘ఎప్పుడు కొండను పేల్చేస్తారో……’ అని గుండెని రాయి చేసుకుని.. క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆ ‘చెడ్డ రోజు’ రానే వచ్చింది.
కొండోళ్ల ప్రమేయం లేకుండా గుడిసెలన్నింటినీ ప్రొక్లెయినర్లతో దౌర్జన్యంగా తీసేసారు.  పెద్ద పెద్ద లారీలు, లారీలతో రకరకాల మిషన్ల్, ఎక్కడెక్కడి నుంచో.. రోజు రోజుకీ.. ట్రాక్టర్లతో కూలీలు. అంతా గోల గోల.

కొండ ముందు- ‘నాగర్జునా క్వారీ వర్క్స్’ బోర్డు పడింది. క్వారీ పనులు ప్రారంభమయ్యాయి.
రోజూ- ఎ.సి కార్లు వచ్చి ఆగుతున్నాయి. అందులో నుంచి ఖరీదైన మనుషులు దిగుతున్నారు. కూలోళ్ల చెమటతో లేచిన ఎ.సి రూముల్లోకి వెళ్లి సేదతీరుతున్నారు.
బయట ఎండనక, వాననక కూలీలు- ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారు.

బాంబులతో కొండ దద్దరిల్లిపోతుంది.
మిషన్లతో- చతురస్రాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా పెద్ద పెద్ద బండలను కోసి.. పెద్ద పెద్ద లారీల మీదకెక్కించి పట్నం తీసుకెళిపోతున్నారు.
పనంతా- వాళ్లు అనుకున్న లెక్క ప్రకారం జరుగుతుంది.
కొండోళ్లంతా చెట్టుకొకరు, పుట్టకొకరు చెదిరిపోయారు. కలివిడిగా వొక చోట బతికిన వాళ్లందరూ ఉన్నట్టుండి అదృశ్యపోయారు.
ఒకటీ, అరా కొండోళ్లు మాత్రం- వాళ్ల దయాదాక్షిణ్యాలతో ఎ.సి. గదులకు దూరంగా పాకలు వేసుకున్నారు. వొకరిద్దర్ని పనిలోకి తీసుకున్నారు. కొండ దిగువ ఊర్ల వాళ్లను కూడా చాలా తక్కువ మందిని.. అదీ చిన్నాచితక పనుల్లోకే తీసుకున్నారు.

‘మరియమ్మ, పార్వతి’ని కూడా అక్కడే పాకల్లో ఉండడానికి అనుమతిచ్చారు.
ఇన్నాళ్లూ అండగా ఉన్న కొండ స్వరూపం ఒక్కసారిగా మారిపోవడంతో.. వాళ్లకిదంతా అయోమయంగా అనిపించింది. చూస్తుండగానే రోజు రోజుకీ కొండ తరిగిపోతుంది. పెద్ద పెద్ద గొయ్యలు పుడుతున్నాయి.
బాంబుల శబ్దానికి పక్షులన్నీ- ఎటో ఎగిరిపోయాయి. కుందేళ్లూ, నెమళ్లూ- క్వారీ యజమానుల ఆకలికి  బలైపోతున్నాయి.

మరియమ్మ, పార్వతి కొండ దగ్గరే.. శిథిలమౌతున్న కొండ దగ్గరే… కాలాన్ని ఈడుస్తూ- కొండ ఔన్నత్యాన్ని తలచుకుంటూ.. దుఃఖించి, దుఃఖించి చివరకు వాళ్లు ఏడ్వడమే మరిచిపోయారు.

కొండల్లో- పార్వతి తిరుగాడిన ప్రదేశాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
పార్వతి తల్లి ‘లచిక’ సమాధి- ఎక్కడుందో ఆనవాలు కూడా కనిపించట్లేదు. పలకబారిన పళ్లతో గుమగుమలాడే జామచెట్టూ అదృశ్యమైపోయింది. తెల్లారితే పలకరించే ‘ఎర్రముక్కు పిట్టా’ కనిపించలేదు.

థింసా?!
బాంబుల శబ్దానికి, సుత్తి దెబ్బలకు- కుంటి కాళ్లతో ఎక్కడ.. ఏ రాతిపొరల మధ్యన మరణవేదన పడుతుందో!
థింసా నాట్యకారిణి ‘పార్వతి’- యిప్పుడు ఏ ప్రత్యేకతలు లేని రోజు కూలీ.
మరియమ్మ- గతం జ్ఞాపకాలను వర్తమాన విషాదంతో నెమరువేసుకుంటూ.. భవిష్యత్తుని ఎంత మాత్రం కలగనని వొక పరాజిత. కాలం తనను వెళ్లదీస్తుందో! తనే కాలాన్ని వెళ్లదీస్తుందో!

పార్వతి వొక్కర్తే- యిప్పుడు ఇంటికి ఆదరువు.
చిన్న చిన్న రాళ్లను గమెన్లతో ఎత్తడం, క్వారీ పనోళ్ల వంటకు నీళ్లు పట్టడం- పార్వతి పని.

6

రోజులు గడుస్తున్నాయి.

వొక రోజు చీకటి పడిన వేళ-
ఎప్పటి నుంచి అదును కోసం ఎదురుచూస్తున్నాడో… ‘సూపర్ వైజర్- ప్రసాద్’ పార్వతిని అడ్డగించాడు. పట్నం నుంచి నెల రోజుల కిందటే క్వారీలో జాయిన్ అయ్యాడు. బతిమాలి, బుజ్జగించి, ధైర్యం చెప్పి, మాయ మాట్లాడి, పెళ్లి చేసుకుంటానని….. కోరిక తీర్చుకున్నాడు.
కొండని, థింసాని, అమ్మని కోల్పోయిన పార్వతి- అతనిని నమ్మింది. కొన్నాళ్లు కాపురం చేసాడు. ఫలితంగా గర్భం దాల్చింది.

ఉన్నట్టుండి- ఒంట్లో ఏ జబ్బూ లేకుండానే.. అమ్మమ్మ చనిపోయింది.
పార్వతికి తెలిసినంతలో ‘అమ్మమ్మ’ మరణమే తొలి మరణం.

దిగులు పడింది.
అమ్మమ్మ మరణానికి కారణం- ఆలోచిస్తున్న కొద్దీ పార్వతికి అర్థమవసాగింది.

కొన్ని రోజుల తర్వాత-
పట్నం పని మీద వెళ్తున్నానని చెప్పాడు ప్రసాద్. మళ్లీ తిరిగి రాలేదు.
క్వారీలో- తోటి ఉద్యోగస్తులనడిగితే తెలియదన్నారు. యజమానులు పార్వతిని పట్టించుకోలేదు.
పైగా.. ”నీలాటి ముండ అవసరం తీరింది.. యెల్లి పట్నంలో.. యే ముండ పక్కన తొంగుండో…..”

నోటికొచ్చిన మాటలన్నీ ఆడారు.
పార్వతికి కోపం వచ్చింది. దుఃఖం వచ్చింది. కానీ ఏమీ చేయలేని చేతకానితనం.

రోజులు గడుస్తున్నాయి.
పార్వతికి- తొమ్మిది నెలలు నిండాయి. కూలీల సాయంతో సంక్రాంతి రోజున- సూర్యుడు ఆకాశంలో పొడుస్తుండగా ‘ఆడబిడ్డ’ని కనింది.
అమ్మ లేదు. అమ్మమ్మా లేదు.
కొండా లేదు. ‘థింసా’ లేదు.
పార్వతి.. పురిటితల్లి పార్వతి.. వొంటరి ఆడది.

తన కన్నా ముందే.. మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ‘అమ్మ’ గుర్తొచ్చింది. ప్రతీసారి మోసపోతున్న తన జాతి గుర్తొచ్చింది. మా వాళ్లలా నేనూ మోసపోయాననుకుంది.

Picture 060

7

ఆ రోజు అర్థరాత్రి-

పార్వతి- వొంటిలో ఉన్న శక్తినంతటినీ కూడదీసుకుంది.
‘థింసా’ ఆడి ఆడి రాటుదేలిన కాళ్లు రెండింటినీ.. దగ్గరకు లాగి నిటారుగా నిలబడింది.
నేల మీద- అమాయకంగా నిద్రిస్తున్న పసికందుని పైకి తీసి, చీరతో వీపు వెనక్కి కట్టుకుని.. అడుగు ముందుకు వేసింది.  బయలుదేరింది.

అడవి లోపలకి లోపలికి ఇంకా లోపలికి.. లోపలి లోపలికి నడుస్తోంది.
నడుస్తోంది.
నడుస్తోంది.
బొడ్డులో వొక కత్తిని రహస్యంగా పెట్టుకుంది. దారిలో- మొదటి వేటుగా వొక ‘సింహాన్ని’ నరికింది. ఈసారి- బక్కాబడుగుజీవాల నెత్తురు తాగుతున్న ‘నరసింహాల్నే’ నరకాలనుకుంటుంది.

‘తన సంస్కృతిని- తన జాతిని రక్షించుకోవడమనే మహా సంకల్పంతో బయలుదేరిన ఓ వీరవనితా.. జయహో…. జయ జయహో………………….’
చీకట్లో- ఏ లోయల్నుంచో.. ఏ రాళ్ల అంతర్భాగాల నుంచో… పురాతనమైన, పరిచయమైన గొంతు వొకటి తెరలు తెరలుగా ప్రతిధ్వనిస్తోంది.

8

ఈ రోజు పార్వతి చూపు ‘అరణ్యం’ వైపు..
రేపు ?

– బాల సుధాకర్ మౌళి

కథాచిత్రాలు: ఎస్. గురుమూర్తి

ఎవరి రహస్యం వాళ్ళదే…ఎవరి భాష వాళ్ళదే!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఆ దుష్యంతు డనంతసత్త్వుడు సమస్తాశాంతమాతంగమ

ర్యాదాలంకృతమైన భూవలయ మాత్మాయత్తమై యుండగా

నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో

నాదిక్షత్రచరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, చతుర్థాశ్వాసం)

దుష్యంతుడు మహాబలవంతుడు; దిక్కుల చివర నున్న ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్యకిరణాలూ, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతోనూ తొలి క్షత్రియుల నడవడితోనూ ఏలాడని ఈ పద్యం చెబుతోంది.

ఇందులోని భాషా పటాటోపం చూసి ‘మహోగ్రారణ్యా’లతో సహా భూమండలాన్ని ఏలిన దుష్యంతుడు ఎంత పెద్ద రాజో అనుకుంటాం కానీ, కాదు. అలా పటాటోపంగా చెప్పడం పౌరాణిక శైలి. సంపదకూ, అధికారానికీ అప్పటికింకా భూమి కొలమానం కాలేదు. సంపదను గోవులతోనే  కొలిచేవారు. అంటే, నాటికి రాజు గోపతే తప్ప భూపతి కాలేదు.  అసలు సంగతేమిటంటే, నాటి ఉగ్రారణ్యాలను పాలించడాని కంటూ ఏమీలేదు. అప్పటి రాజులకు అవి ఆరో వేలు లాంటివి. పైగా వారి పాలన అరణ్యాలలో చెల్లదు. అక్కడ ఆదివాసులున్నారు. తొలి రాజులు ఆదివాసులను స్వతంత్రజీవనులుగా గుర్తించి వారితో కొంతవరకు సఖ్యంగానే ఉన్నారు. వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి, అడవుల్లోకి చొచ్చుకు వెళ్లవలసిన అవసరం ఏర్పడ్డాకే రాజులకూ, ఆదివాసులకూ మధ్య ఘర్షణలు ముదిరాయి. ఆనాటికి మహారణ్యాలను ఛేదించడానికి చాలినంత ఇనుము అందుబాటులోకి రాలేదు. పోడు వ్యవసాయమే ఆధారం. ఇనుము పుష్కలంగా లభించడానికి మరికొన్ని వందల సంవత్సరాలు ఆగాలి. ఇనుము కొరత తీరడంతోనే చాలా మార్పులు జరిగిపోయాయి. జనపదాలు రాజ్యాలు అయ్యాయి. గణాలు జనాలుగా, మహాజనాలుగా మారాయి. అరణ్యాలను పెద్ద ఎత్తున ఛేదించదానికి శ్రామికవర్గం అవసరమై వర్ణవ్యవస్థ బిగుసుకుంది. చివరికి మగధ, కోసల రాజ్యాలతో ఈ సామాజిక పరివర్తన ఒక కొలిక్కి వచ్చింది. అదంతా వేరొక అధ్యాయం.

dushyanta

కాకపోతే, దుష్యంతుడు మహోగ్రారణ్యాలను  ఏలాడన్న కవి, అప్పటికి దేశం అరణ్యమయమనీ, అరణ్యాలు ఇంకా లొంగి రాలేదనే ఒక ముఖ్య చారిత్రక వివరాన్ని అందిస్తున్నాడు.  అదలా ఉంచితే, దుష్యంతుడు ‘ఆదిక్షత్ర చరిత్ర’ తో ఏలాడన్న మాట ఈ వ్యాసానికి ప్రధాన వస్తువు.

నన్నయకు ఇలా ఆదిక్షత్రియులను స్మరించుకోవడం చాలా ఇష్టం. రాజరాజ నరేంద్రుడి గురించి చెబుతూ, అతడు “ఆదిరాజ నిభు డత్యకలంకచరిత్ర సంపదన్’“అంటాడు. “…ఆదిరాజులెల్ల నధిక ధర్మ సత్యయుక్తి జేసి సకల లోకంబులు వడసి భాగదేయ భాగులయిరి” అని అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో మార్కండేయమునితో ద్రౌపదికి చెప్పిస్తాడు.  ఆది క్షత్రియుల గురించి నన్నయ కలవరింత వెనుక పురాచారిత్రక వారసత్వం చాలా ఉందని నేను అనుకుంటాను. ఎప్పుడో చరిత్రకు అందని కాలంలో (సు)క్షత్రియజాతి క్షీణించిపోయింది. అప్పటినుంచీ సాంప్రదాయిక వర్గాలలో క్షత్రియ క్షీణత ఒక విషాదస్మృతిగా మిగిలిపోయింది. ఒక అఖండగ్రహంలోంచి అర్థభాగం విడిపోయి అదృశ్యమైపోతే, రెండో అర్థభాగం దాని కోసం పరిభ్రమిస్తూ, పరితపించడం లాంటిదే ఇది కూడా. క్షత్రియులు-విప్రులు ఆనాడు ఒక నిరంతరద్వయం. ఒకరి ఉనికికి ఇంకొకరు ఆధారం. ఈ జంట ఒక దశలో సమాజగతిని శాసించింది. మహాభారతంలో అంగారపర్ణుడనే గంధర్వుడు క్షత్రియ-విప్ర అన్యోన్యత గురించి అర్జునుడికి బోధిస్తాడు.  ఎంతో అపురూపమైన ఆ సంభాషణ గురించి మరోసందర్భంలో చెప్పుకుందాం.

అజ్ఞాత కాలానికి చెందిన ఆ విషాదస్మృతి ఒక ఆకాంక్షగా మారి, అంతే అజ్ఞాతంగా వందలు, వేల సంవత్సరాలను దాటుకుంటూ వచ్చి నేటి కాలపు సాంప్రదాయిక వర్గాలలోనూ గుప్తంగా ఉండిపోయింది. అదే ఇక్కడ ఆసక్తికరం.  ‘క్షత్రియులు పరిపాలన చేయా’లనే ఆ ఆకాంక్ష ఈ వర్గాలలో నేటికీ వ్యక్తమవుతుంటుంది. అయితే, మారిన కాలమాన పరిస్థితులలో దానిని యథాతథంగా బయటపెట్టే అవకాశం లేదు కనుక, అది భిన్నరూపాలలో వ్యక్తమవుతుంది.

పాశ్చాత్య ప్రపంచంతో పోల్చితే భారతదేశం ప్రత్యేకత ఇదే. ఇక్కడ పురావారసత్వం పూర్తిగా అంతరించలేదు. దానినే గణసమాజ అవశేషంగా చెప్పుకుంటే, ఆ అవశేషం నేటికీ ఈ దేశంలో పదిలంగానే ఉంది. భారతదేశం వైవిధ్యవంతం అనిపించుకోడానికి అదీ ఒక కారణం. వైవిధ్యవంతం అనే మాట అందరినోటా నలిగి, అరిగి ఇప్పుడు అర్థస్ఫూర్తిని కోల్పోయి ఉండచ్చు కానీ, లోతుల్లోకి వెడితే అది చిత్రవిచిత్ర వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఒకరకంగా చెప్పుకుంటే, భారతదేశం నేటికీ మహాభారత కాలంలోనూ, మహాభారత సమాజంలోనే ఉంది. దీనినే మరోలా చెబితే, భారతదేశం ఇప్పటికీ క్రీస్తు పూర్వ దశలోనే ఉంది తప్ప క్రీస్తుశకంలోకి అడుగు పెట్టలేదని నాకు అనిపిస్తుంది. క్రీస్తు శకానంతర పరిణామాలు ఇక్కడ సాంకేతిక ప్రాయాలు మాత్రమే.  పాశ్చాత్య సమాజం దృష్టిలో భారతదేశం ఇప్పటికీ ఒక ‘రహస్య’ ప్రదేశం. ఈ ‘రహస్య’ భారతం ఎంతోమంది పాశ్చాత్యులను అన్వేషణకు పురిగొల్పడం (In Search of Secret India- Paul Brunton)  మనకు తెలుసు. నిజానికి భారతదేశం గురించి చెప్పుకునే వైవిధ్యం ఒప్పుడు పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతటా ఉంది.  పాశ్చాత్యసమాజం తన వైవిధ్యాన్ని పనిగట్టుకుని తుడిచిపెట్టుకుంది. ఏకశిలా సదృశమైన సమాజాన్ని నిర్మించుకోడానికి ప్రయత్నించింది.  అదో పెద్ద చరిత్ర.  ప్రస్తుతానికి దానిని పక్కన పెట్టి చెప్పుకుంటే,  భారతదేశపు వర్తమానం పాశ్చాత్యసమాజానికి గతం. అది వారిలో ఏవో పురాస్మృతులను రేపుతుంది. భారత్ పట్ల దాని ఆసక్తి, ఆకర్షణల రహస్యం అదే.

ఈ రహస్య భారతంలో, ఏ సమూహానికి ఆ సమూహానికే తమవైన తంతులు, విశ్వాసాలు, సాంస్కృతిక అభివ్యక్తులు, ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించినప్పుడు; ఆ సమూహాలను నేను రహస్య సమాజాలు, రహస్య ప్రపంచాలు అంటాను. మళ్ళీ ఈ రహస్య సమాజాల ఉనికి కూడా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తమే. ఆ మధ్య డావిన్సీ కోడ్ అనే నవల వచ్చింది. అంతవరకూ పుస్తక పఠనం అలవాటు పెద్దగా లేని యువత కూడా ఆ నవలను విరగబడి చదివింది. అందులోని సస్పెన్స్, థ్రిల్లర్ మసాలా వాళ్ళను ఆకట్టుకుని ఉండచ్చు. వేరే అంశాలు నన్ను ఆకర్షించాయి. అది రహస్య సమాజాల గురించి, గుప్తలిపుల గురించి మాట్లాడుతుంది. అందులో పాశ్చాత్య సమాజాల పురాచరిత్ర ఉంది. ఆ కోణం నుంచి ఆ నవలను ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అప్పట్లోనే దానిపై నేనొక వ్యాసం రాశాను.

ఇప్పటి సంగతి చెప్పలేను కానీ, నిన్న మొన్నటి వరకు మనదేశంలో ఊరి శివార్లలో కొన్ని రహస్యప్రదేశాలు ఉండేవి. వాటిని పవిత్రమైన తోపులు (sacred groves) అంటారు. మొదట్లో ఆ తోపుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉండేది. పురుషుడు వాటిలోకి అడుగుపెడితే విపరీత పరిణామాలుంటాయనేవారు. మన పురాణాలలోనే కాదు, ప్రపంచ పురాణాలలో కూడా ఇందుకు సంబంధించిన కథలున్నాయి. స్త్రీల రహస్య ప్రదేశం లోకి అడుగుపెట్టిన నారదుడు స్త్రీ అయిపోయాడని ఒక పురాణ కథ. ఇటువంటివే జానపద కథల్లోనూ ఉన్నాయి.  ‘జగదేకవీరుని కథ’ అనే సినిమాలో దేవకన్యలు జలక్రీడలాడుతుండగా చూసిన నాయకుడు శిల అయిపోతాడు. పైన చెప్పిన తోపులు క్రమంగా పురుషుల రహస్య ప్రదేశాలుగా మారిపోయాయనీ, వాటిలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించారనీ కోశాంబి అంటాడు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగిన పరివర్తనకు అది సూచన.

స్త్రీ, పురుషులు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో పక్క పక్కనే ఉంటున్నా ఎవరి రహస్య ప్రపంచాలు వారికి ఉన్నాయనిపిస్తుంది. కొన్ని తంతులలో మా అమ్మ పాటించే గోప్యత, చేసే పనులు నాకు చిన్నప్పుడు విస్మయం కలిగిస్తూ ఉండేవి. స్త్రీలు చేసే నోములు, వ్రతాలు, పేరంటాలు ఒక రహస్య ప్రక్రియలా  అనిపిస్తాయి. వాటి ఆనుపానులు పురుషునికి ఎప్పుడూ పూర్తిగా అర్థం కావు. వాళ్ళు పాడే పాటలు, వాటిలో దొర్లే పలుకుబడులూ పురుషునికి ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తాయి. శుభకార్యాలప్పుడు ఆడవాళ్ళు అందరూ చేరి చెప్పుకునే ముచ్చట్లు, చేసే పనులు  పురుషునికి వ్యతిరేకంగా జరిగే ఏదో ‘కుట్ర’ను తలపిస్తాయి. ఈ రహస్య ప్రపంచ వారసత్వం తల్లినుంచి కూతురికి అతి సహజంగా అందిపోయే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.  ఇక ఉపనయనం తంతు పురుషుల రహస్య ప్రపంచానికి చెందినది. అందులో తల్లి పాత్ర కన్నా, తండ్రి పాత్ర కీలకం.  ఉపనయనం ఒక విధంగా తల్లి ప్రభావాలనుంచి కొడుకును దూరం చేసి, అతనికి పెద్దరికం కల్పించే ప్రక్రియ. ఈ ఉపనయన విధి మన దేశంలోనే, అందులోనూ కొన్ని కులాలలోనే ఉందనేది అపోహ మాత్రమే. ఉపనయనం ప్రపంచమంతటా పురాసమాజాలన్నిటా ఏదో ఒక రూపంలో ఉంది.  దాని గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.

నా చిన్నప్పటినుంచి పోలాల అమావాస్య అనే మాట వింటూ ఉండేవాడిని. మా అమ్మ పోలాల అమావాస్యనాడు కందపిలకను పూజించేది. అది కడుపు చలవకు ఉద్దేశించిన తంతు అని చాలాకాలానికి తెలిసింది. ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు ఒడి కట్టులో కందపిలకను వేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒకానొకప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు అందరూ ఒకే రహస్య ప్రపంచాన్ని పంచుకోవడం! పసిఫిక్ మహాసముద్రంలో టోబ్రియాండ్ దీవులున్నాయి. అక్కడి ఆదివాసుల సౌభాగ్య దేవత పేరు ‘పోలేరు’. వారి ప్రధాన ఆహారం యాం అనే దుంప. పిల్లలు లేని పడతులు ఒక వృద్ధ వనితను ఆశ్రయిస్తారు. ఆమె కడుపు చలవ గల తల్లి కట్టి విడిచిన గడ్డి లంగాను తెచ్చి ఆ పడుచు తల మీద కప్పి, “ఓ పోలేరూ, ఈ పడుచు కడుపు పండించు” అంటూ మంత్రాలు చదువుతుంది. మనకు కూడా పొలి, పోలి, పోలెరు సౌభాగ్య దేవతలే (జనకథ-రాంభట్ల కృష్ణమూర్తి).

images

చెప్పొచ్చేదేమిటంటే, విశ్వాసాలు, ఆచారాలు, ఆకాంక్షలు కాలానికి లొంగినట్టు కనిపిస్తూనే కాలాన్ని ధిక్కరిస్తాయి. కాలాన్ని ఏమార్చడానికి అవి రహస్యాల ముసుగులు ధరిస్తాయి. గుప్తలిపులుగా మారి రహస్య సమాజాలను సృష్టిస్తాయి. ఆదిక్షత్రియుల గురించిన కలవరింత అలాంటిదే నని నేను అనుకుంటాను. అదలా ఉంచి, ఈ దేశంలో ఒకే భాష మాట్లాడుతూ, ఒకే ప్రాంతానికి చెందినవారి మధ్య కూడా నిగూఢత అనే ఇనప తెరలు ఉన్నాయనీ, ఒకరికొకరు తెలియనితనం ఉందనీ ఛళ్ళున చరచి చెప్పిన ఒక ఘటన ఈ సందర్భంలో గుర్తుకొస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు-కొవ్వూరు రైలుమార్గంలో బ్రాహ్మణగూడెం అనే ఊరు, నిజానికి బాపన్న గూడెం అనే పేరుకు అది సంస్కృతీకరణ. ఓ శీతాకాలం సాయంత్రం కొవ్వూరు వెళ్ళడం కోసం బ్రాహ్మణగూడెం స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాను.  అదో చిన్న స్టేషన్. రైలు లేటు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ప్రారంభమైంది. అంతలో స్టేషన్ ను ఆనుకునే ఉన్న ఓ విశాల ప్రదేశంలో కొంతమంది చెరుకు పిప్పి పోగేసి మంట పెట్టారు. బతుకు జీవుడా అనుకుంటూ నేను కూడా  ఆ మంట దగ్గరికి చేరాను. చూస్తూ ఉండగానే ఆ పరిసరాలలో ఉన్న ఆడా, మగా; చిన్నా పెద్దా అంతా వచ్చి వాలిపోయారు. ఆ వెచ్చదనం ఉల్లాసం నింపినట్టుంది, కబుర్లు ప్రారంభమయ్యాయి. మాటలు ఒకరినుంచి ఒకరికి అంత్యాక్షరిలా ప్రవహించసాగాయి. అవి క్రమంగా సరసాలుగా మారాయి. సరసాలు ఒకరి ‘సంబంధాలు’ ఒకరు కెలుక్కునే వరకూ వెళ్ళాయి. ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో విరబూసిన  తుళ్లింతలు, ఇకిలింతలు, చిరునవ్వులు, సిగ్గు దొంతరల కాంతులు  ఆ చలిమంటతో పోటీ పడ్డాయి. పోటాపోటీగా మాటలు రువ్వడంలో ఆడా, మగా ఎవరూ ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు.

నేను అప్రతిభుడినైపోయాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. సభ్యత గురించి, సంస్కారం గురించి  ‘నా ప్రపంచం’ నాలో నూరిపోసిన నమ్మకాలు ఆ క్షణంలోనే ఆ చలిమంటలో దూకి ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అనిపించింది. ఈ దేశంలో భిన్న సమాజాలు, భిన్న ప్రపంచాల ఉనికి అర్థమయింది.

కోశాంబి అంటాడు:

Better-known religious observances can also be traced back into the primitive or prehistoric past. The holi spring festival, an obscene and nowadays rather  depraved saturnalia, has dancing around a great bonfire as its central feature. …it is always followed the next day by a great deal of vociferous public obscenity; in out-of-the-way places by sexual license and promiscuity as well. In prehistory the diet was poor, life hard, procreation none too easy. The obscenity was then necessary as a stimulus. (The Culture & Civilization of Ancient India-in Historical Outline)

ఇప్పుడు తలచుకుంటే, శీతవేళ దేహానికి గిలిగింతలు పెట్టే ఆ వెచ్చని అనుభవం, మనిషి జన్యుసంపుటిలో లోతుగా ఇంకిపోయిన ఏవో ఆదిమస్మృతులను అప్రయత్నంగా రెచ్చగొట్టిందనిపిస్తుంది. ఎప్పుడో ఊహ కందని కాలంలో రాజుకున్న ఆ చలినెగడు అప్పటినుంచీ అలాగే నిలిచి మండుతోందనిపిస్తుంది.

 

 – కల్లూరి భాస్కరం

 

 

మణి మహేష్ ఇలా పిలిచింది మమ్మల్ని!

SAM_9392

(యాత్రాకథనాలకు ఆహ్వానం: ఎక్కడికో వెళ్ళాలి. ఏదో వెతుక్కోవాలి. ఏమేమో చూడాలి. ఎవరెవరితోనో మాట్లాడాలి.  రొటీన్ గా అనిపించే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి. ఈ తపన బహుశా వొక ప్రేరణ యాత్రలకూ…దూర ప్రయాణాలకు! అలాంటి యాత్రా సాహిత్యాన్ని అందించే ఉద్దేశంతో ‘యాత్రాస్మృతి’ అనే ఈ కొత్త శీర్షిక. మీ యాత్రా అనుభవాలను రాయండి. ‘సారంగ’కి పంపండి. ఈ వారం ఈ శీర్షిక ప్రముఖ కథా రచయిత, యాత్రా సాహిత్యకారుడు దాసరి అమరేంద్ర గారి రచనతో మొదలు పెడ్తున్నాము. చదివి, ఎలా వుందో చెప్పండి.)

“అమరేంద్రాజీ.. ఆగస్టు చివర్లో మణిమహేష్ యాత్ర ప్లాన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి” జులై మొదటివారంలో ఫోను చేసాడు మా డిల్లీ బీ.ఈ.ఎన్ లో  సహోద్యోగి సంజయ్ అగర్వాల్. ఇరవై ఏళ్ళ పరిచయం… నాలాగే ట్రెక్కింగ్ అంటే ఆసక్తి.

“తప్పకుండా.. నన్ను లెక్క వేసుకో.. కానీ ఓ మాట చెప్పు. అక్కడ గుర్రాల సదుపాయం ఉందా?” ముందు జాగ్రత కోసం అడిగాను. ఉందన్నాడు.    ఇలా గుర్రాల కోసం తాపత్రయపడడం ట్రెక్కింగు స్ఫూర్తికి విరుద్ధం. కానీ ఆ మధ్య షష్టిపూర్తి కానుకగా  ప్రకృతి మోకాలి నెప్పులు ప్రసాదించింది.  మే నెలలో ఓ మూడువారాలు ఫిజియోధెరపీ తర్వాతే కాళ్ళు కొంచం చెప్పిన మాట వింటున్నాయి. ‘ఇహ ట్రెక్కింగులకు చరమగీతం పాడాలేమో’ అనుకుంటున్న సమయంలో ఈ ప్రలోభపు ఆహ్వానం.!

నెట్‌లోకి వెళ్లాను. డిల్లీనుంచి పఠాన్‌కోట్, చంబాల మీదుగా 670 కిలోమీటర్లు వెళీతే హిమాచల్ ప్రదేష్‌లోణి ‘భర్‌మౌర్’ అన్న చిరు పట్టణం వస్తుంది. మరో పదిహేడు కిలోమీటర్లు రోడ్డున వెళితే ‘హడ్‌సర్’ అన్న చిరు గ్రామం…. అక్కడ్నించి మరో పదమూడు కిలోమీటర్లు కాలి నడకన కొండదారుల్లో వెళితే మధ్య హిమాలయాల మధ్యన, సముద్ర తలానికి 4115 మీటర్ల (13,500 అడుగుల) ఎత్తున ఈ మణిమహేష్ చిరు సరోవరం. దాని పక్కనే ధీరగంభీరంగా 5775 మీటర్ల  ఎత్తున్న మణిమహేశ కైలాస శిఖరం. శివుని (రెండోదో, పన్నెండోదో) ఆవాసమట. ప్రతి ఏడాది జన్మాష్టమి నుంచి పదిహేను రోజులపాటు భక్తులు యాత్రగా వెళ్లిరావడం తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ అట.

 

* * *

 2013, ఆగస్టు 20, రాత్రి ఎనిమిదిన్నరకు అంతా న్యూడిలీ స్టేషన్లో కలిసాం. సంజయ్, అతని భార్య ముక్త, పదమూడేళ్ల కూతురు సంజక్త, తోడల్లుడు సంజీవ్, ఆయన పన్నెండేళ్ళ కూతురు రూపాంశి., ఇరవై ఏళ్ల సంజయ్ మేనల్లుడు ప్రధి, నేను . వెరసి ఏడుగురం. “మన ఈ ఉత్తర  సంపర్క క్రాంది రేపు ఉదయం నాలుగున్నరకు పఠాన్‌కోట్ చేరుస్తుంది. ఓ ఇన్నోవా  మాట్లాడి ఉంచాను. పదీ పదకొండుకల్లా భార్‌మౌర్ చేరుకొంటాం. పగలు అక్కడి గుళ్లూ గోపురాలు చూసుకొని సాయంత్రానికి హాడ్‌సర్ చేరుకొంటాం… రోజంతా ట్రెక్కింగు. మణీమహేష్వర్‌లో రాత్రి మజిలీ,  ఒక ఉదయాన పూజలూ పునస్కారాలూ ముగించుకొని క్రిందకి దిగి సాయంత్రానికల్లా హాడ్‌సర్  చేరతాం.  వెంటనే ఇన్నోవా ఎక్కి రాత్రి చంబాలో హాల్టు. 24 రోజంతా చంబాలోనూ, అక్కడికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న ఖడ్జుయార్ పచ్చిక బయలు లోనూ, మరో ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న డల్‌హౌస్ పట్టణంలోనూ, రాత్రికి పఠాంక్‌కోట్ చేరి డిల్లీ బండి పట్టుకొని 25 ఉదయానికల్లా గూటికి చేరతాం . టూకీగా కార్యక్రమ రూపురేఖలు వివరించాడు సంజయుడు.

SAM_9361

ఇన్నోవాలో అరగంట ప్రయాణించేసరికి వెలుగురేకలు విచ్చుకోవడం మొదలయింది. గలగలమని పారుతోన్న ‘రావి’నది ఒడ్డునే మా ప్రయాణం. తల ఎత్తి మరీ చూడవలసిన ఉన్నత గిరిశిఖరాలు. వాటి చెరియల్లో నిడుపాటి ‘పైన్’ వృక్షాలు. వర్షాకాలం గాబట్టి అన్నివైపులా పరిపూర్ణమైన పచ్చదనం. ‘ఎటు చూసినా అందమే’ అంటూ మనసు పాడటం మొదలెట్టేసింది.

సంజయ్‌తో పాటూ ముక్తకూ, వాళ్ల పాప సంజక్తకూ ట్రెక్కింగ్ అభిరుచి ఉంది. సంజీవునికి వాళ్ల పాప రూపాంశ్ కి  కూడా ట్రెక్కింగులో చెప్పుకోదగ్గ ప్రవేశముంది. ప్రధి సరేసరి. పిల్లలు ముగ్గురికీ చదివే అలవాటూ ఉంది. సంజక్త, రూపాంశి ఫేమస్ ఫైవ్, సీక్రెట్ సెవెన్లు దాటుకొని ఎనిడ్ బ్లైటమ్ దగ్గరకి చేరారు. రస్కిన్‌బాండ్ దారిలో ఉన్నారు. ప్రధీ అప్పుడే ఖాలిద్ హుస్సేనీ దగ్గర్నించి టాగోర్ దాకానూ, స్టీవెన్ స్పిల్‌బర్గ్ నుంచి సత్యజిత్ రే దాకానూ ఔపాసన పట్టేసి ఉన్నాడు. మరింకేం.. మాటలు సాగాయి. గంట గడిచేసరికల్లా స్నేహం పండింది. ఆటలు.. పాటలు.. కబుర్లూ.. కోలాహలం.

“మోకాలు ఇబ్బంది పెట్టొచ్చు. అయినా ప్రయత్నిస్తాను. అవసరమయితే గుర్రం. అదీ కుదరకపోతే మధ్యలో ఆగిపోయి మీరు తిరిగొచ్చేదాకా ఉంటాను” అని మాటల మధ్య అంటే..” అదెలా అంకుల్! ముందే అలా అనేసుకుంటే ఎలాగా? చివరిదాకా వెళ్లి తీరాలి అని సంకల్పం చెప్పుకోండి. జరిగి తీరుతుంది” అని  హితవు చెప్పింది తొమ్మిదో క్లాసు సంజక్త. భర్తృహరిగారి “ఉత్తమ పుత్రికా?” అని  అబ్బురపడ్డాను.

ఇంజనీరింగ్ చదువుతోన్న ప్రధి అడిగాడు.”ఎన్నెన్నో ట్రెక్కింగులు చేసారు గదా. అందుకు ప్రేరణ ఏమిటి? ఏం ఆశిస్తూ ఉంటారు?”  ఆలోచనలో పడ్డాను. “కారణాలు నాలుగు.. అద్భుతమైన ప్రకృతి. నాలోకి నేను చూసుకొనే అవకాశం. పదిమందినీ కలిసి తెలుసుకొనే అవకాశం. నా మానసిక, భౌతిక శక్తులను పునర్నిర్వచించుకొనే అవకాశం..”

* * *

 SAM_9381

 

ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చంబా చేరుకొన్నాం.

జిల్లా కేంద్రమది. కొండలమధ్య ఊహాతీతమైన విశాల మైదానంలో ఆ పట్టణం ఊరు మధ్య ఐదారు ఫుట్‌బాల్ కోర్టులు వచ్చే బడా మైదానం. దిగువన పారుతున్న ‘రావి’ నది. ఎదురుగా కలెక్టరాఫీసు. కోర్టులు, సర్క్యూట్ హౌస్.. బ్రిటీషు కాలం నాటి బంగాళాలు.. కాస్తంత ఎగువన వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ మందిరం.  చేరువలోనే ఓ మ్యూజియం. ఊరు నాకు తెగ నచ్చేసింది. మళ్ళీ వెళ్లాలి.

చంబా దాటీ దాటగానే దిగువన పిక్చర్ పోస్ట్ కార్డ్‌లాంటి అందాలున్న చక్కని ప్రదేశమూ, అక్కడే ఓ డిగ్నిఫైడ్ మధ్యవయసు మహిళ నడుపుతోన్న  ఒక దుకాణమూ. అరగంట ఫోటోలు సరేసరి. అలా ఆడుతూ పాడుతూ, అనిపించిన చోటల్లా ఆగుతూ పదిన్నరా పదకొండు ప్రాంతంలో భర్‌మౌర్ చేరాం. వాకబు చెయ్యగా ఒకరికిద్దరు ఓ పంజాబీ ఢాభాకేసి చూపించారు. మరిహనేం. ఆనాటి ముఖ్యభోజనం అక్కడ. అన్ని పదార్థాలూ అతి రుచికరంగా ఉండగా అందరం ఒంటెల్లా భోంచేసాం!

భర్‌మౌర్ ఆలయాల నిలయం. ముఖ్యమైన భరణీ మాత మందిరం ఓ కొండ చిటారుకొమ్మన ఉందట. మణి మహేష్ వెళ్ళెవాళ్లంతా ఈ దేవి అనుగ్రహం పొంది మరీ ముందుకు సాగడం మర్యాదట. మా బృందం కొండెక్కడానికి సిద్ధపడిపోయింది. నా మోకాలును ఆచితూచి వాడుకోవాలి. రేపటికి దాచి ఉంచాలి అనేసి నేను  ఉండిపోయాను.

ఆగస్టు ఆపిళ్ళ సీజను. ఊళ్లో ఎక్కడ చూసినా యాపిలు చెట్లు. కాయలు. పళ్లు. మెల్లగా సాగగా ఊరిచివరి ఓ పేద్ద యాపిల్ తోట. ‘అపురూప ప్రదేశం’ అని అందులో తనివితీరా తిరుగాడాను.  రెండు మూడు గంటలే అనుకొన్నది మా బృందం తిరిగొచ్చేసరికి సాయంత్రం నాలుగయింది. వెంటనే హడ్సర్ ప్రయాణం చేరేసరికి ఆరు దరిదాపు. వర్షాకాలం గాబట్టి దారిలో లాండ్ స్లయిడ్లు ఉండవచ్చౌనని అనుభవజ్ఞులు అన్నారు గానీ మేం ఏ అడ్డంకి లేకుండానే చేఅరాం.

హడ్సర్ మరీ చిన్న పల్లెటూరు. అంతా కలిసి అయిదొందల జనాభా. అసలీ యాత్ర సమయంలోనే ఊరు మేల్కొనేది. అప్పుడే ఓ  లంగరు వెలిసింది. వసతి సౌకర్యం పూజ్యం. కానీ కొంచెం వెదగ్గా ఊరి పొలిమేరన ఎత్తైన కొండ చెరియన ఓ పి.డబ్ల్యూ. డి వారి గెస్ట్‌హౌస్ దొరికింది. సంబరం. రూములు బాగా విశాలంగా ఉందటమే గాకుండా వేడినీళ్ల సౌకర్యమూ ఉంది. మరిహనేం?

ఇలాంటి  యాత్రాసమయాల్లో యత్రికుల సౌకర్యం కోసం ఉచిత భోజన సదుపాయం కలిగించే ‘లంగర్లు” దారి పొడవునా విరివిగా వెలవడం ఉ త్తరభారతదేశంలో కద్దు. అలాంటి ఓ లంగర్లో డిన్నరు చేసాం. దాని నిర్వాహకుడు మాతో కబుర్లలో పడ్డాడూ. అతనికి ఏభై ఏళ్లుంటాయి. పంజాబు ప్రభుత్వ ఉద్యోగి. పఠాన్‌కోట్ నివాసి. గత ఇరవై ఏళ్లుగా ఈ దారిలో నాలుగయిదు లంగర్లు నిర్వహిస్తున్నాడట. యాత్రా సమయంలో మూడు నాలుగు వారాలు ఇక్కడే మజిలీ..

“ఏమిటి మీ ప్రేరణ?” అని అడిగాం. ” 1993లో మొదటిసారి యాత్రకు వచ్చాను. ఆ రాత్రి మణిమహేష్‌లో గడిపాం. తిండి దొరకలేదు. పైగా భయంకరమైన చలి. తలపైన ఏ కప్పూ లేదు. కంబళ్ళూ, రజాయిలూ సరేసరి. ఇదిగాదు పద్ధతి అనిపించింది. నలుగురినీ కూడగట్టుకుని ఈ లంగరు వ్యవస్థను ప్రారంభించాను. భోజనంతోపాటు ప్రాధమిక వసతి సౌకర్యమూ కల్పిస్తున్నాం” వివరించాడాయన.  సమ హృదయ భక్తులూ, స్నెహితుల పుణ్యమా అని డబ్బు సమస్యే లేదంట”

 

* * *

 

పచ్చని ప్రకృతి తోడుంటే...జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

పచ్చని ప్రకృతి తోడుంటే…జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

22 ఉదయం ఆరింటికల్లా ట్రెక్కింగు మొదలెట్టాం.

మామూలుగా మనం పార్కుల్లో అయితే గంటకు ఐదారు కిలోమీటర్ల వేగంతో  నడుస్తాం. సాధారణంగా అది ట్రెక్కింగులో రెండు మూడుకు పడిపోతుంది. ఎత్తులు ఎక్కాలి గాబట్టి. కాని మణిమహేశ్వర్ మార్గం మరీ ఎగుడు. హడ్సర్ ఉన్నది 2100 మీటర్లన అయితే మణిమహేశ్వర్ 4115 మీటర్లు.  అంటే మదమూడు కిలోమీటర్ల నడకలో రెండువేల మీటర్లు ఎత్తు ఎక్కాలన్నమాట. దుర్గమం. అంచేత కనీసం పదిగంటలయినా పడుతుందని తెలుసు. సాయంత్రం నాలుగు గంటలకల్లా గమ్యస్థానం చేరాలన్నది ఆనాటి మా లక్ష్యం.

“బాప్‌రే! ఆ కొండల్ని చూసారా? నిట్టనిలువుగోడల్లా ఉన్నాయి. వాటినన్నింటినీ దాటుకుని వెళ్లాలి మనం. గుండె గుభేలుమంటోంది” అన్నాడు సంజయుడు. నిజానికి మాలో అది అతి దిట్టమైన మనిషి అతనే. ముక్త బక్క పలచన. పైగా నిన్నటి భర్‌మౌర్ భ్రమణంలో జారిపడగా మోకాలు పట్టేసింది. ఆడపిల్లలు బాగా చిన్నవాళ్లు. సంజీవుడు ఒకప్పటి జాతీయ స్థాయి ఈతగాడే అయినా ఇపుడూ మాత్రం సేఠ్ జీ స్వరూపం. ప్రధి కూడా స్థూలకాయుడే. నా మోకాలు…. వద్దులెండి. ఎన్నిసార్లని దాన్ని కీర్తించడం? అయినా ఎవ్వరం గుర్రాల సంగతి ఎత్తలేదు. ఓ గంటన్నర నడక మహాచురుగ్గా సాగింది.
SAM_9351

 

దారిపక్కనే  పాలవరదలా పారుతోన్న ‘గౌరీనాలా’ అనే చిరునది. అడపాదడపా  నిడుపాటి కొండల్లోంచి పడుతోన్న  సుందర జలపాత ధారలు. ఇరవై పాటిక్ డిగ్రీల ఉష్ణోగ్రత – ట్రెక్కింగుకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణమది. దారిలో కనిపించిన ఓ లంగర్లో అన్నమూ. పప్పులతో బ్రేక్‌ఫాస్ట్ ముగించాం. అందరమూ స్వేచ్చా విహంగాల్లా సాగిపోతూ ఉంటే అపశృతిలా రూపాంశ్‌ని అనవసరపు, అతి జాగ్రతల నియంత్రణలో ఉంచాలని ప్రయత్నించే  వాళ్ల నాన్నగారు.. చెలంగారుంటే సుబ్బరంగా దెబ్బలాడేవారే. నేనూ నర్మగర్భంగా చెప్పి చూసాను.

దారి నిర్ధాక్షిణ్యం రెండు గంటలు గడిచాకే స్పష్టమయింది. దారులూ, రాళ్లూ, రప్పలూ, బండలూ. వర్షాలవల్ల చిత్తడి. అదపాదడపా చీలమండలదాకా నీళ్లు. ఎత్తు ఎక్కవలసి రావడం సరేసరి. అయినా ఆ దారిలో అంతా ఉల్లాసమే. ‘బాధే సౌఖ్యం’ సన్నివేశమన్నమాట. మాతో పాటే వస్తున్న ఓ పాతిక ముప్పై మంది సహయాత్రికులు. యాత్ర ముగించుకొని వస్తోన్న వాళ్ల ప్రోత్సాహపు పలుకులు.. అలా ఆడుతూ, పాడుతూ పదిగంటల ప్రాంతంలో “ధాంభో’ అన్న  ఆరు కిలోమీటర్ల దూరపు ప్రదేశానికి చేరాం. సగం దారి గడిచిందన్నమాట. 2900 మీటర్ల ఎత్తు. చెట్లు కనుమరుగై పర్వత సానువుల్లో తుప్పలూ, పచ్చికా మాత్రమే. మిగులుతోన్న సమయం ఆ ధాంభోలో ఒకళ్ల నొకళ్ళం పరామర్శించుకొంటూ కొత్తవాళ్లను పలకరిస్తూ, సేద తీరుతూ ఓ గంట. “మా లంగరుకు రండి అంటే ఎమా లంగరుకు రండి’ అని నిర్వాహకుల ఆహ్వానాలు.

విరామం కలిగించిన ఉల్లాసంతో మళ్లా మార్గారోహణ మొదలెట్టాం. కాస్త సాగగా – ‘ధాంభో’ జలపాతం. భస్మాసురుడి బారినుంచి తప్పించుకొనే ప్రయత్నంలో పరమశివుడు ఈ జలపాతం వెనకాల దాక్కున్నాడని స్థలపురాణం. ఎక్కడా విడుపులేని ఆరోహణ ఆశ్చర్యమనిపించింది. ఏ మామూలు ట్రెక్కింగు మార్గంలో అయిన ఆరోహణలూ. అవరోహణలూ, సమతల ప్రదేశాలూ, అరుదుగా పీఠభూములూ ఉండడం సామాన్యం. ఇక్కడ మాత్రం ఒక్కటే రాగం. ఆరున్నొక్క ఆరోహణా రాగం..

ఆ కష్టమార్గంలో దొరికిన అలవోక సుఖం పిల్లల సాహచర్యం.

“మీరు వస్తోంది పుణ్యం కోసమా? ట్రెక్కింగు ఆనందం కోసమా? అని అడిగితే ఆనందం కోసమే అనేసారు రూపాంశీ, సంజక్త.

SAM_9352“అంకుల్. జీవితంలో డబ్బు పాత్ర ఏమిటి? అన్న గొప్ప ఫిలసాఫికల్ ప్రశ్న వేసి ఆశ్చర్యపరిచాడు ప్రధి. “అది మనకు బానిస అవ్వాలి. సేవలు చెయ్యాలి. డబ్బు అవసరమే. సందేహం లేదు. కానీ దాన్ని  నీ పదో ప్రయారిటీగా ఉంచు. సుఖపడతావు. మనలాంటి మహానగరపు  మధ్యతరగతి జీవులకు జీవనోపాధి సమస్య కానేకాదు. దురాశకు పోనంతవరకూ మనకు డబ్బును చిన్నచూపు చూసే శక్తి వుంటుంది. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను డబ్బు పరంగా తీసుకోకు, సుఖం కోల్పోతావు” విపులంగా హితవు పలికాను. మరో రెండు అనుబంధ ప్రశ్నలు. నా శక్తిమేర జవాబులు .. తమకు ఆసక్తి ఉన్న సంగీతం, నటన, వక్త్రుత్వం, సాహితీపఠనం గురించి సంజక్త, రూపాంశ్ ప్రశ్నలడిగారు. “మనిషి మానవుడవడానికి ఇవన్నీ సమపాళ్లలో ఉండడం చాలా చాలా అవసరం. కానీ ఎంతైన ఇవి పక్క వాయిద్యాలే. చదువన్నదే అసలు సిసలు రాగం. చదువు విషయంలో రాజీ పడకండి. రాణించడం అవసరం” అన్నాను.

(రెండో భాగం వచ్చే వారం)

– దాసరి అమరేంద్ర

బేషరం వద్ద ఓ జవాబు ఉండదు

సైఫ్ అలీ గోరె సయ్యద్

సైఫ్ అలీ గోరె సయ్యద్

1.
అనుమతి లేకుండా ఎందుకలా చూస్తున్నావ్
అని జాబిల్లి  అడిగితే ఏం జవాబు చెప్పాలో తెలీదు .

కాలిపోతున్న దీపపు వత్తి కాంతి లో
చెవికమ్మల్ని చూసి తృప్తిగా నిదురపోయే బేషరం ని నేను
బేషరం వద్ద జవాబు ఉండదు

2
బేషరం
దేవుడి గురించి ఆలోచిస్తుంటే
తెలియనేలేదు ..
ఎప్పుడు నీ కురులు తెల్లబడ్డాయో !
తిరిగి నేనే సరిచేసుకుంటాను
ఆ కురులని ఆ కుచ్చీళ్ళని
నువ్వు తరువాత లేచి వెళ్ళి
దేవుడి గది శుభ్రం చేసుకుంటూ ఉండు

4
నీళ్ళు తగిలితే తడిచిపోయే
చిన్న నిప్పురవ్వకు కాలిపోయే
చిన్న చెద పురుగుకు తలుచుకుంటే  కనుమరుగయ్యే
ఓ పలుచని కాగితం ముక్కమీద
సంతకం పెడితే
మనకు ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం ఏమిటో
అర్ధం పర్ధం లేని తెలివైన దరిద్రం

5
రోజుల తరబడి కాల్చిన
ఇటుకలతో గోడలు కట్టుకున్న ఏం లాభం
వేకువ జాము కాకమునుపే
కమిలిపోయే పువ్వులు ఎలాగో వాడిపోవాల్సిందే

Love-artist-Vasily-Myazin

6
ఆజ్ఞను పాలించేవాడిని
ఆజ్ఞల్ని ఎలా ఇవ్వగలను
నీకు బేషరం నా కౌగిళ్ళు ముద్దులు
నా చేతి రెండు ముద్దలు ఇవ్వగలను

7
ఒప్పించడం కోసం ఈ సూర్యుడిని వాడుకోలేను
కొన్ని రాత్రులు భూమ్మీద ఈ తలకు
నీ గుండెల మీద ఆశ్రయం కావాలి అంతే
ఏ వృత్తలేఖిని తో గుండ్రని ఓ సరిహద్దు రేఖ
గీయబడుతుందో కాని …
దాని నుంచి బయటకు కాలుమోపడం అయ్యేపని కాదు

8
వాన పడిన ఓ రాత్రి
మసిపట్టి ఆరిపోయిన దీపపు బుడ్డిలో
బేషరం  రెండు మిణుగురులు కొద్దిసేపు అలా అలా తిరిగి
ప్రళయం రాకముందే
ఎప్పుడు బయటకు వెళ్ళిపోయాయో ఏమో ..!

9
లోకాన్ని కాపాడే దేవుడికి
పోలీసుల రక్షణ ఉన్నట్లు
కొన్ని హృదయాలకు  బయటి నుంచి ఎవరు కాపలా ఉండరు

10
నీ ముఖం అద్భుతంగా ఉందంటే నువ్వు నమ్మలేకపోవచ్చు బేషరం
అది నా జీవితాని మాత్రం అద్భుతంగా మార్చింది ఇది నేను నమ్ముతాను.

– సైఫ్ అలీ గోరే సయ్యద్

నీల్ కమల్

అరుణ్ సాగర్

అరుణ్ సాగర్

సముద్రమూ ఆకాశమూ డెనిమ్! వర్ణాంధుడైనా కాంచగలడు. రిధమ్ బ్లూస్: పిచ్చిస్వేచ్ఛగా ఎగురుకుంటూ-దే వోంట్ రియలీ కేర్ ఎబౌట్ అజ్ అని మైకేలు జాక్సనుడు బ్లూజీన్స్ వేసుకునేకదా ఎలుగెత్తి పాడాడు. ఆకాశాన్ని అంటినట్టు. సముద్రంలో దుంకినట్టు.
పాతకొత్త బట్టలు. నీతోపాటు సీజనైన స్నేహితులు. నీతోపాటూ వెదరైన వెలిసిన వికసించిన. వెలిసిపోయిన కొద్దీ వెలిగిపోయే డెనిమ్. జస్ట్ లైక్ మన స్నేహం. పాతబడిన కొద్దీ కొత్తగా. బలం హార్లిక్స్ తాగితే వస్తుందా, ఛెర్మాస్ షర్ట్ వేసుకుంటే వస్తుందా.
ఉరికే బైకు సీటు మీద పరిగెత్తుకు వెళ్లి ఎక్కుతుండగా ఆమె ననుజూసి ముసిముసిగా నవ్వుకుంటూ హాస్టల్ లోనికి వెళ్లిపోయెను. రెండు బాక్ పోకెట్లూ మూడు ఇత్తడి బటన్లూ నాలుగు వరసల దారాలతో టాప్ టూ ట్యాపింగ్ ఫుట్ నిలువుగా కట్లపాము లాంటి బ్రౌను రంగు స్టిచెస్-అండ్ అఫ్ కోర్స్ దట్ హెవీమెటల్ జిప్ ఆన్ యువర్ క్రాచ్. అందుచేతనే ఎంతటి బక్క పోరగాడైనా కొమ్ములొచ్చి మొద్దుగా మాఛోగా. మర్ద్! ఆమె నవ్వుకుండును గాక మనకేమి?
బఫెలో ఈజ్ మై ఫస్ట్ జీన్స్. నాన్న ఇచ్చిన తళతళలాడే కొత్తనోట్లు జేబులో పెట్టుకుని-ఓషన్స్ ఆఫ్ బ్లూ. గో టూ షాప్. యూ కాంట్ వెయిట్ ఫర్ యువర్ బర్త్ డే టూ కమ్. దానిమీద ఓ క్రోకడైల్ టీ షర్ట్ వేస్తేనా. బాసూ. శరీరభాషకు కొత్త మాడ్యులేషన్. నడక మారిపోయిందా నీటుగాడా. ఫాస్ట్ ఫార్వార్డ్ సినిమా గుర్తుందా. ముగ్గురు. మూడు జీన్స్ పాంట్లు పైన లైట్ పింక్, లైట్ యెల్లో, లైట్ బ్లూ ఫ్లో షర్ట్స్. తీన్మార్ టైటిల్ కొత్తగా పెట్టినట్టు పోజుకొడతారేమిటి గురూ.
ఇదియొక టెంపరుమెంటు. జీన్స్ ఒక యాటిట్యుడ్. బహుశా ఆ టైంలో గానీ జీన్సుంటేనా: దుర్యోధనుడు ఐ లివిన్ ఇట్ అనేటోడు. జీన్స్ ఒక కమ్యూనికేషన్ టూల్. భావవాహకము. వింటున్నవా అన్నా. విను జీన్స్ వాంట్ టూ టెల్ యూ సంథింగ్. విను. ఆ భాష అర్ధం చేసుకో. దాని డిమాండ్లు అంగీకరించు.
మూడునెలలు జిమ్ముకెళ్లారో లేదో రొమ్ము విరుచుకు తిరిగే పోరగాళ్లు. పట్టుమని పదిహేనేళ్లు నిండాయో లేదో జీన్స్ లాంగ్వేజ్ మాటాడే కుర్రోళ్లు. ఏదో బలమొచ్చినట్టు. కొత్త శక్తి వచ్చినట్టు. కుబుసం విడిచినట్టు. కొత్తగా రెక్కలొచ్చినట్టు. గుర్రమెక్కినట్టు. నో, గుర్రమే అయినట్టు! ఇది బూస్ట్ తాగితే వచ్చేదికాదు బేటా.
image_ga.php
మేబి! నువ్వెప్పుడూ పారేయలేదేమో. వెలిసినా మాసినా చిరిగిపోయి చింకిపాతయినా. వాన్ డామ్మ్ ఇంటిపేరు జీన్. జీన్ పాల్ బెల్మేండో గుర్తున్నడా. ఆడవాళ్లకి డైమండ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు గాక. నీకు కష్టంలో సుఖంలో మాయలో మోహంలో నీళ్లలో బురదలో మట్టిలో ఇసుకలో అడుగడుగులో. నువ్వెపుడైనా నీతోపాటూ ఏజ్ అయిన జీన్స్ ను మ్రుదువుగా ముట్టుకున్నవా. యే దోస్తీ హం నహీ చోడేంగే.
బ్లూజీన్స్ అండ్ బేర్ ఫుట్! బీచ్ ఒడ్డున పాంట్ పైకి మడిచి షూస్ చేతిలో పట్టుకుని. కెరటాల కాంతి ప్రతిఫలిస్తున్న సిలుయెట్! ఎన్నో ఫేమస్ పోస్టర్లు కలవు. మెమొరీస్. ఇత్తడి రివిట్లు కలిపినట్టు.
నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీతో కలిసి తొలి బైక్ రైడ్ చేసినపుడు ఈ జీన్సే వేసుకున్నాను. నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీతో తుళ్లింతలైనపుడు పారబోసుకున్న కాఫీ మరకల్ని మోసుకు తిరుగుతున్నాను. నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీ కోసం పరిగెత్తినపుడే మోకాలు దగ్గర చించుకున్నాను. నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీ కోసం ఎండలో వానలో చలిలో తిరిగి తిరిగి చివరకు ఆ పార్కు బెంచీ మీద ముడుచుకు పడుకున్నాను. ఒక్కడినే కాదు. ఈ జీన్స్ లోనే.
నిద్రపట్టని రాత్రులు ఓల్డ్ సిటీకెళ్లి ఛాయ్ తాగాను. షాలిమార్ లో సినిమాలు చూసాను. ప్రహరీ గోడమీద కూర్చుని రాళ్లు విసిరాను. ఎవడో పడేసిన బీరుసీసాని కాలితో తన్నుకుంటూ ఈ రోడ్లమీడే నడిచాను. పాతగోడ మీద బొగ్గుముక్కతో పేర్లు చెక్కాను. జ్వరం సలిపినపుడూ మాసిన రగ్గు మీద అలజడితో పొర్లాను. బారెడు పొద్దెక్కాక లేచి బన్ మస్కా తిన్నాను. ఒక్కడినే కాదు. ఈ జీన్స్ లోనే.
ఆసిడ్ వలన కాలదు. ఐస్ వలన చెదరదు. స్టోన్  వలన  చిరగదు- భగవద్గీత కాదు గురూ వాషాది వాషులుగా ఎన్నెన్నో అవతారములెత్తి లెవీస్ట్రాస్ విశ్వరూపదర్శనం. ప్రతి ఫేడూ ఓ న్యూ షేడ్. ప్రతి షేడూ ఓ నీడ. ఆ నీడలో గడచిన కాలపు జాడ. పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నీకు నచ్చిన కాలంలో నచ్చిన వాక్యం రాసుకో.
ఏం కావాలన్నా ఈ జీవితానికి. మంచోడికి ఓ జీన్స్ పాంట్ ఉంటే చాలదా?
-అరుణ్ సాగర్

వినాయకచవితి జ్ఞాపకం: మాష్టార్ని చూస్తే దిగులు!

నామాల మురళీధర్

నామాల మురళీధర్

“ఒరేయ్ పిల్ల రాక్షసుల్లారా! వినాయకచవితంటే పిల్లల పండగరా. వినాయకుడు విద్యలకు అధిపతి. ఇళ్ళళ్ళోనే కాదు బడిలో కూడా పూజలు చేయాలి. వినాయకుడ్ని కాదంటే చదువబ్బక మొద్దు వెధవల్లా తయారవుతారు.

ఒరేయ్ పిలక పంతులు, మీ గుడికి కొబ్బరికాయలు, అంటిపళ్ళొచ్చాయంట కదా. ఒకటో,రెండో కొబ్బరికాయలు ఒక అరడజను అంటిపెడ పట్రా. ఒరేయ్ కరణంగారబ్బాయ్ మీ ఇంటికి వెల్ల వేస్తున్నారంట కదా. సాయంత్రం కాస్త పట్టుకొచ్చి మన బడిగోడకి కొట్టెయండ్రా” అని ఇంకా ఏదో చెబుతున్న సూర్నారాయణ మాష్టారి మాటలకు అడ్డుపడుతూ కరణంగారబ్బాయ్ లేచాడు.

“పంతులుగారూ, ఇంటి నుండి వెల్ల తీసుకొచ్చి వేస్తే మా నాన్న తంతాడండి” అని వినయంగా విన్నవించుకున్నాడు.

“ఒరేయ్ సన్నాసి, మా ఇంటికొచ్చి వెల్లవెయ్యమన్నానా? బడికే కదా. రోజూ మీరే కదరా ఈ స్కూల్లో కూర్చుని చదువుకునేది. మీ నాన్న ససేమిరా అంటే ఏ సాయంత్రమో ఎవరూ చూడకుండా పట్టుకొచ్చెయ్యాలి కానీ, ఇవన్నీ నేను చెప్పాలట్రా మీకు?” అని లౌక్యం చెప్పారు మాష్టారు.

“దొంగతనం తప్పు కదండీ” అన్నారెవరో వెనకనుండి. పిల్లలంతా గొల్లుమన్నారు.

“ఆ తప్పండి. ఎవడ్రా ఆ అడ్డగాడిద ఆ కిరాణకొట్టు కిష్టి గాడేనా? ఏరా పక్కింటి పంతులమ్మగారి దొడ్లోకి దూరి జాంకాయలెత్తుకు రావటం మాత్రం తప్పు కాదేం? నువ్వు మీ కొట్లో నుండి బియ్యం, పప్పులు పట్రాపో అప్పుడు చెప్తాను వెధవ” అని వెక్కిరిస్తూనే వాడి వాటా ఏంటో చెప్పేసారు మాష్టారు.  “ఒరేయ్ నామాలవారబ్బాయ్ పసుపులు,కుంకుమలులాంటి పూజసామాన్లు ఇంటి నుండి పొట్లాలు కట్టి నువ్వు పట్రా” అని నా సంగతి తేల్చారు.

“మరి పూలు,పత్రి ఎవరు తెస్తారర్రా?” అని అందరిని చూస్తూ అడిగారు.

“పంతులుగారూ, ఆ ఢిల్లీ బామ్మగారింటి పెరట్లో చాలా రకాల పూలున్నాయండి. సాయంత్రం చేసి చీకట్లో కోసుకొచ్చేస్తాను” అన్నాడు తుంటరి పరమేశంగాడు.

మాష్టారు విలాసంగా నవ్వారు. అంతలోనే ఏదో గుర్తొచ్చి “ఒరేయ్ కోతి వెధవ దొరికిపోతే నా పేరు గానీ చెప్పావ్. తాటతీస్తాను” అని హెచ్చరించారు. ఆ అలవాటేనేమో ఇప్పటికీ ఒక పువ్వో, కొమ్మో ఏదో ఒకటి దొంగతనంగా ఎత్తుకొచ్చి వినాయకుడికి పెట్టకపోతే, ఎంత పూజ చేసినా తృప్తే ఉండదు.

ఇన్నేళ్ళొచ్చి ఇంట్లో ఎంత ఘనంగా చేసుకున్నా వినాయకచవితంటే చప్పున గుర్తొచ్చేది మాత్రం పొడుగ్గా, సన్నగా చెఱుకుగడలా ఉండి, తెల్ల జుబ్బా వేసుకుని, షోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని తిట్లతో అందరికీ తలంటు పోస్తూ, తాను నవ్విస్తూ, మా అందరినీ నవ్వించిన సూర్నారయణ మాష్టారే. తుప్పుపట్టిన పాత సైకిల్‌కి ఒక సంచి తగిలించుకుని తిరిగే సూర్నారయణ మాష్టారే.

ఇలా దసరా అనో, వినాయక చవితనో ప్రతి పండగకి పంతులుగారి భత్యాలని ఏదో ఒకటి తెమ్మంటున్నారని మాష్టారంటే చిన్నప్పుడు చాలా కోపం ఉండేది. కొంతమంది తల్లిదండ్రులు బడికొచ్చి మాష్టార్ని నిలదీసేవాళ్ళు కూడా. పాపం మాష్టారు మా దగ్గరే తప్ప ఊర్లో నోరెత్తేవారు కాదు. ఎవరైనా వచ్చి అడిగితే తడబడిపోయి నీళ్ళు నములుతూ నేల చూపులు చూసి వారికి ఏదో సర్దిచెప్పేవారు. అదేంటో గమ్మత్తుగా మాష్టారి మీద అంతవరకూ ఉన్న కోపం పోయి మా మాష్టార్ని ఇలా అందరిముందు నిలదీస్తారా అని ఉక్రోషం వచ్చేసేది. తల్లిడండ్రుల్ని బడికి తీసుకు వచ్చినవాడితో పిల్లలంతా ఒక జట్టుగా కొన్నిరోజులు మాట్లాడకుండా వేలేసేవాళ్ళం.

మాష్టారు అది గమనిస్తే “ఒరేయ్ బడుద్దాయిల్లారా, ఏం పనిరా ఇది? వాడేం చేస్తాడు కుంక. బ్రతకలేక బడిపంతులని, బడిపంతుల మీదకంటే ప్రతివోడు చొక్కా మడతెట్టుకొస్తాడు. సరి సరి వాడినేం అనకండి పాపం” అని వాడిని దగ్గరకి తీసుకునేవారు.

ఆ చిన్న వీధిబడిలో మాష్టారు మాకేం గొప్ప చదువులు చెప్పెయ్యలేదు. కాసిన్ని అక్షరాలు నేర్పారు. అంతకంటే ఎక్కువ చదువు ఆయనకి వచ్చో రాదో నాకిప్పటికీ తెలియదు. కానీ ఆయనకొచ్చినవి, మాకు అక్కరకొచ్చేవి ఆయినా ఆ కాసిన్ని అక్షరాలు, పద్యాలు ఎంతో శ్రద్ధగా చెప్పారు. ఒత్తులు, దీర్ఘాలు స్పష్టంగా పలికేంత వరకూ వల్లెవేయించేవారు.

ఆయనకి అప్పటికే పెళ్ళికెదిగిన కూతురు, ఉద్యోగం లేని కొడుకు ఉండేవారు. పాపం మాష్టారికొచ్చే ఆ గొఱ్ఱెతోక జీతంతోనే కుటుంబాన్ని లాక్కొచ్చేవారు. అది సరిపోక సాయంత్రం ఇంటి దగ్గర మాకు ప్రైవేటు కూడా చెప్పేవారు. పంతులుగారి పెళ్ళప్పుడు కట్నంగా వచ్చాయని చెప్పే ఫ్యాను, రేడియో తప్ప ఇంటిలో పెద్దగా వస్తువులేవీ ఉండేవి కాదు. ఆ పసిప్రాయంలో మా బుర్రలకు తట్టలేదు కానీ ఆ పండగ మామూళ్ళన్నీ ఆ బండెడు కుటుంబాన్ని లాగటానికి ఏమూలకి సరిపోతుంది. “అయ్యవారికి చాలు అయిదువరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” అని ఎంతపాడినా అయ్యవారికి అయిదు వరహాలిచ్చే వెర్రిబాగులాడెవడున్నాడు ఆ ఊరిలో.

13_10

వినాయక చవితిరోజు మాష్టారు చెప్పినవన్నీ తీసుకురాకపోయినా, వీలయినవి తీసుకుని వెళ్ళేవాళ్ళం. మాష్టారు “ఏమిరా ఇలా చేసారు” అని కాసేపు నసిగినా అందరిని బుద్దిగా, శ్రద్ధగా కూర్చోబెట్టి నిదానంగా పూజ చేసేవారు. అందరి పేర్లు, గోత్రాలు చెప్పించేవారు. చివర్లో వినాయక వ్రతకథ చెప్పి, అందరి తలల మీద అక్షింతలు చల్లేవారు. పిల్లలు ఎవరూ చెప్పకుండానే వెళ్ళి మాష్టారి కాళ్ళు మొక్కేవారు. మాష్టారు మురిసిపోతూ “ఒరేయ్ బడుద్దాయిలు, పెద్దవాళ్ళయి పెద్ద ఆఫీసర్లయిపోయి ఈ పంతుల్ని, బడిని మర్చిపోకండి” అని మనస్పూర్తిగా దీవించేవారు.

ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడయినా ఊరు వెళితే రోడ్డు మీద పాత సైకిల్‌తో కనిపించేవారు మాష్టారు. కొడుకుకి పెళ్ళయితే అయ్యింది కాని ఇంకా ఏ పనిలోనూ కుదురుకోలేదు. ఈ వయసులో కూడా కాస్త చత్వారంతో బాధపడుతూ నలుగురైదుగురు పిల్లల్ని వెంటేసుకు తిరుగుతున్న మాష్టార్ని చూస్తే దిగులుగా అనిపిస్తుంది. ప్రైవేట్ కాన్వెంట్‌లు ఎక్కువయిపోవటంతో పంతులుగారి దగ్గరకి పిల్లలని ఎవరూ పంపటంలేదు కానీ మాష్టారి హస్తవాసి మంచిదని అక్షరాభ్యాసం చేసాక ఆయన చేత అక్షరాలు దిద్దించటానికి ఆయన పూర్వ విధ్యార్ధులు తమ పిల్లలను తీసుకు వచ్చి తృణమో, పణమో ఇచ్చి వెళ్తున్నారు.

“వీడిని నా దగ్గరకు పంపకూడదురా నాలుగు రోజులు అక్షరాలు నేర్చుకోవటానికి” అని అక్షరాలు దిద్దుంచుకోవటానికి వచ్చిన ఎవరినైనా మాష్టారు చనువుగా అడిగితే, “మాష్టారూ, ఈ రోజుల్లో చదువులు ఎలా ఉన్నాయో మీకు తెలియదా? పద్యాలు పాతబడిపోయాయి. ఇప్పటి నుండే ఇంగ్లీష్ నేర్పించాలి” అని చెప్పి ఇంకాసేపుంటే ఏమడిగేస్తారో అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు.

ఇన్నాళ్ళుగా జీవితమనే యుద్దాన్ని పోరాటానికి వేలమంది దండుని తయారు చేసిన మాష్టారు, యుద్ధమే మారిందో, తన విద్యలే పాతబడిపోయాయో తెలియని వృద్ధ సైనికుడిలా మిగిలిపోయారు. అందమైన అక్షరాల్లో పెట్టలేకో, అమ్ముకోవటం చేతకాకో మరుగునపడిపోయిన ఇలాంటి బీద బడిపంతుల్ల ఆత్మకథలన్నీ మధురకావ్యాలే.

సూర్నారయణ మాష్టారూ, ఆ విద్యలకు అధిపతైన గణపయ్య, విద్యే జీవితంగా గడిపిన మీకు చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నా.

 

కార్టూ’నిజం’

రాజు

రాజు

telugu cartoon

కార్టూన్లకు ఆహ్వానం!

ఈ వారం నించి సారంగలో ఒక కార్టూన్ కూడా వుంటుంది. కార్టూనిస్టులకు ఇదే మా ఆహ్వానం. ఒక్క రాజకీయ అంశాలు మినహాయించి ఏ అంశం మీద అయినా కార్టూన్ పంపవచ్చు. కళలూ, సాహిత్యం, సాంస్కృతిక అంశాల మీద కార్టూన్లకి ప్రత్యేక ప్రాధాన్యం. మీ కార్టూన్లు editor@saarangabooks.com కి పంపించండి.

 

మంత్రి కృష్ణమోహన్ కవిత్వం :మనిషికోసం అక్షరం ఆర్తనాదం

 మళ్ళీ మరొకసారి జాతీయ స్థాయిలో తెలుగు కవిత్వం రెప రెపలాడింది . అయితే ఈ సారి నలమల కొండల నడుమ ఉన్న , కార్పొరేట్ చదువుల వల్ల మనం మర్చిపోయిన ,మట్టి పలకల  గ్రామం ప్రకాశం జిల్లాలోని  మార్కాపురం  కు చెందిన నవ్యభావాల యువకవి మంత్రి కృష్ణ మోహన్ ఆ ఎగసిన జెండా రెపరెపలకు కారకుడయ్యాడు . 2012 లో ప్రచురించిన అతని తొలి వచన కవితా సంపుటి “ప్రవహించే పాదాలు” 2013  కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార విజేత గా ప్రకటించటంతో కృష్ణ మోహన్ తెలుగు సాహితీ వినీలాకాశంలో మెరుపై మెరిశాడు. 44 వచన కవితలున్న యీ  పుస్తకం,  35 యేళ్ళ యువకవికి    ఈ అత్యన్నత స్థాయి కీర్తి పతాకం  అందించింది.

కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం అందుకున్న మంత్రి కృష్ణ మోహన్ కవిత్వ సంపుటి

కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం అందుకున్న మంత్రి కృష్ణ మోహన్ కవిత్వ సంపుటి

దేని గురించి చెప్పాలన్నా సాహసం కావాలి, ప్రేమ కావాలి అన్నట్లు ఈ యువ కవి ఏ  వస్తువు గురించి కవిత అల్లినా అందులో సాహసం తో కూడిన నిజాయితీ, మమేకమై పోయిన ప్రేమ స్పష్టంగా కన్పిస్తాయి ..  కవిత్వ నిర్మాణం లో ప్రారంభ దశ నుండే ఒక టెంపో , టెక్నిక్ చిత్రంగా పట్టుకున్నాడు, కవిత్వానికి పదను పెట్టుకున్నాడు కనుకనే ఇవాళ విజేతగా నిలిచాడు .

విజేతలు భిన్నంగా ఉండరు , వారు చేసే పనులు మాత్రమే విభిన్నంగా ఉంటాయన్నట్లు ఈ యువకవి వస్తువు ఎంపిక లోను , అభివ్యక్తి లోను వైవిధ్యం, నవ్యత కనిపిస్తాయి . అన్నింటి కన్నా సమాజం పట్ల , మనిషి పట్ల ఈ కవికి ఉండే ప్రేమ , కవిత్వమంతా ఆర్త్రంగా గాఢం గా పరచుకొని పాఠకుడ్ని అలరిస్తాయి . నాలుగైదేళ్లుగా కవిత్వాన్ని తన కన్న తల్లిలా , పుట్టిన ఊరిలా ప్రేమిస్తున్నాడు.

Untitled-1

కృష్ణ మోహన్

 

పొరలు పొరలుగా విడి పోయే మట్టి పలకల నేపథ్యంలోంచే తన తొలి పద్యం మొలకెత్తిందంటాడు. సున్నితత్వం,సౌమ్యత ,కరుణ పుష్కలంగా తొణికిస లాడే వ్యక్తిత్వం లో ప్రతి అంశానికి తీవ్రంగా స్పందిస్తాడు. హృదయ  చలువ నేత్రాలు విప్పారి చూస్తాడు. స్వేచ్చగా రెక్కలు విప్పుకుని కదులుతాడు . చివరగా కవిత్వ అలలు పాదాలు తాకుతూ, వెనక్కి వెళుతూ అల్లరి, అలజడి చేసేలా రాస్తాడు.

గత మూడేళ్లుగా  యువ పురస్కారాలు అందిస్తుంది కేంద్ర సాహిత్య అకాడెమీ . తొలి, మలి  పురస్కారం వేంపల్లె  గంగాధర్-‘మొలకల పున్నమి’ నవలకి , జుమ్మా- వేంపల్లి షరీఫ్ కథలకు అందుకున్నారు .

 

 

267652_4261540530952_560180931_n—పెరుగు రామకృష్ణ

నేటికీ ‘పురి’ విప్పుతున్న వంశం

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)హిమకరు దొట్టి పూరు భరతేశు కురుప్రభు పాండుభూపతుల్

క్రమమున వంశకర్తలనగా మహి నొప్పిన యస్మదీయ వం

శమున బ్రసిద్ధులై విమల సద్గుణశోభితులైన పాండవో

త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం)

(చంద్రునితో మొదలు పెట్టి, పూరుడు, భరతుడు, కురువు, పాండురాజు క్రమంగా వంశకర్తలైన నా వంశంలో ప్రసిద్ధులు, సద్గుణవంతులు అయిన పాండవోత్తముల చరిత్ర నాకు ఎప్పుడూ వినాలనే ఉంటుంది)

నన్నయభట్టారకునితో రాజరాజనరేంద్రుడు అన్న మాటలివి.  క్రీ.శ. 11 వ శతాబ్దిలో రాజమహేంద్రవరం రాజధానిగా వేంగీ రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజు -రాజరాజ నరేంద్రుడు తనను పాండవ వంశీకునిగా చెప్పుకుంటున్నాడు! అదెలాగో తెలియదు. ఋషి వంటి నన్నయ ఈ అభూతకల్పనను ఆమోదించి దానికి పద్య రూపం ఇవ్వడం, ఇప్పటి చరిత్ర ప్రమాణాలతో చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వాస్తవం ఏమిటంటే, నన్నయ ఋషితుల్యుడే, అవిరళ జపహోమ తత్పరుడే. కానీ, ‘కుసుమాస్త్రుండైన(మన్మథుడైనా) జొన్న కూడే కుడుచున్’ అంటూ ఒకప్పటి పలనాటి పరిస్థితుల గురించి శ్రీనాథుడు అన్నట్టుగా; ఎంతటివాడైనా దేశకాల పరిస్థితులకు లొంగి ఉండక తప్పదు.

కనుక, నన్నయ తప్పేమీలేదు. తప్పు ఉంటే గింటే మనకు చరిత్ర గురించిన స్పృహ, పట్టింపు, క్రమశిక్షణ లేకపోవడంలో ఉంది. కల్పనను చరిత్రగా చలామణీ చేయడం, చరిత్రను కల్పనగా మార్చడం మొదటినుంచీ మన సంప్రదాయంలో ఉన్నదే. అభూతకల్పన (myth making) అనేది ప్రపంచమంతటా మనిషి స్వభావంలో ఆదిమకాలంనుంచీ ఉందనీ, అది సానుకూల పాత్రను కూడా పోషించిందనీ A SHORT HISTORY OF MYTH లో కరేన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే రచయిత్రి అంటారు. ఘటనాక్రమంతో కూడిన చరిత్రను నమోదు చేసే క్రమశిక్షణ అభివృద్ధి చెందిన తర్వాత myth making కు ఆదరణ తగ్గి, అపహాస్యానికి లోనవుతూ వచ్చిందని ఆమె అంటారు. కాకపోతే, ఈ అభూత కల్పన ప్రక్రియ మన దేశంలో మరింత ఎక్కువ కాలం కొనసాగి, ఇప్పటికీ చలామణిలోనే ఉంది. ఈ రచయిత్రి పరిశీలన గురించి మరిన్ని విషయాలు చెప్పుకునే అవకాశం ముందు ముందు రావచ్చు కనుక ప్రస్తుతానికి వద్దాం.

యయాతి, దేవయాని, శర్మిష్టలు మహాభారత ప్రసిద్ధులు. యయాతికి దేవయాని వల్ల యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; శర్మిష్ట వల్ల ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పై పద్యంలో పేర్కొన్నది ఈ పూరుడినే. అతనిని తన వంశకర్తలలో ఒకడిగా రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటే;  మనుచరిత్రలో అల్లసాని పెద్దన  శ్రీకృష్ణ దేవరాయలను యయాతి మరో కొడుకైన తుర్వసునితో ముడిపెట్టాడు.  1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు ‘తుళువ’ వంశీకుడు.  పెద్దనగారికి తుర్వస-తుళువల మధ్య పోలిక కనిపించింది. అంతే, రాయలవారిని తుర్వస వంశీకుని చేశాడు. పెద్దనను ఒరవడిగా తీసుకుని నంది తిమ్మన కూడా పారిజాతాపహరణములో రాయలవారిని తుర్వస వంశీకునిగా పేర్కొనడమే కాక, మరో అడుగు ముందుకు వేసి యాదవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ దేవరాయలుగా అవతరించారడంటూ శ్లేషయుక్తంగా పద్యాలు రాశాడు.

Krishna3

ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ప్రారంభిస్తే, అది చాతుర్వర్ణ్య(నాలుగు వర్ణాల) చరిత్ర మొత్తంలోకి మనల్ని తీసుకువెడుతుంది.  క్లుప్తంగా చెప్పుకుంటే, నిజానికి నాలుగు వర్ణాలు అనే చట్రం సూత్రరీత్యానే కానీ ఆచరణలో ఉన్నది తక్కువ.  వర్ణవిభజనతో ప్రారంభమై వృత్తి విభజనగా పరిణమించిన ఈ నాలుగు వర్ణాల చట్రాన్ని పకడ్బందీగా ఉంచే ప్రయత్నం ఏనాడూ ఫలించలేదు. వర్ణసాంకర్యంతో పాటు వృత్తి సాంకర్యమూ పెద్ద ఎత్తున జరిగిపోయింది.  దక్షిణభారతానికి వచ్చేసరికి నాలుగు వర్ణాల చట్రం మరింత సడలి పోయింది. అయినాసరే, రాజ్యాధికారం క్షత్రియుడిదనీ, లేదా రాజ్యాధికారం కలిగిన వారు అందరూ క్షత్రియులేననే భావన సాంప్రదాయిక వర్గాలలో నిన్నమొన్నటి వరకూ  ఉండిపోయింది.  రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్లడం చరిత్రపూర్వ కాలంలోనే మొదలై, చరిత్ర కాలంలో సంపూర్ణమైనట్టు కనిపిస్తుంది.  క్షత్రియుల్లో చరిత్రకాలానికి ముందే హెచ్చు, తగ్గులు వచ్చి; వన్నె తక్కువ క్షత్రియులను వ్రాత్య క్షత్రియులనడం ప్రారంభించారు. శాక్య వంశీకుడైన బుద్ధుడు, లిచ్ఛవీ తెగకు చెందిన మహావీరుడు వ్రాత్యక్షత్రియులే. మనదేశంలో నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం మగధ, కోసల రాజ్యాలతో(క్రీ.పూ. 6వ శతాబ్దం) ప్రారంభమైంది. అయితే ఈ రెండు రాజ్యాల పాలకులనూ హీన జాతి క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అన్నారే తప్ప సుక్షత్రియులుగా గుర్తించలేదు. ఎలా పిలిచినా అందులో క్షత్రియ పదం ఉండడం, రాచరికానికీ-క్షత్రియత్వానికీ ముందునుంచీ ఉన్న ముడిని సూచిస్తుంది. మగధ, కోసల రాజులు తమను క్షత్రియులుగా గుర్తింపజేసుకోడానికీ, క్షత్రియులతో వివాహసంబంధం ద్వారా తమ సామాజిక స్థాయిని పెంచుకోడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని ఆసక్తికర ఘట్టాలను సృష్టించాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. దక్షిణ భారతానికి వచ్చేసరికి రాజ్యాధికారానికీ, క్షత్రియత్వానికీ ఉన్న సంబంధం మరింత పలచబారి చతుర్థ కులస్థులు(శూద్రులు) రాజులు కావడం మొదలైంది. అయినా సరే, క్షత్రియులన్న ముద్ర కోసం వారు కూడా  ఆరాటపడడం; సూర్య, చంద్ర రాజవంశాలతో ఏదో ఒక వంశంతో తమను ముడి పెట్టుకోవడం కొనసాగింది. ఇందులో భాగంగా ‘హిరణ్యగర్భ’ క్రతువుల వంటివీ పుట్టుకొచ్చాయి. రాజ రాజనరేంద్రుడు తనను పాండవవంశీకునిగా చెప్పకోవడం, కృష్ణ దేవరాయలను తుర్వస వంశీకునిగా పెద్దన పేర్కొనడం వెనుక ఇదీ అసలు విషయం.

శూన్యం నుంచి పుట్టిన వర్ణ/వృత్తి విభజన మొదట రెండు వర్ణాలతో మొదలై ఆ తర్వాత మూడు, నాలుగు వర్ణాలుగా మారి క్రమంగా అసంఖ్యాక కులాల అవతరణకు దారితీయించింది. వర్ణవ్యవస్థా పరిణామ క్రమాన్ని, ముఖ్యంగా క్షత్రియులనుంచి  వైశ్యవర్ణం ఏర్పడిన తీరును రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో చాలా ఆసక్తికరంగా చర్చించారు. దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం. భారతీయ సమాజంలోనూ, రాజకీయాలలోనూ కులం ఇప్పటికీ పాత్ర పోషిస్తూనే ఉంది. అయినా సరే, కుల/వర్ణ పరిణామక్రమం గురించిన చరిత్ర చర్చలో లేదు. వాటి గురించి అపోహలు, అపార్థాలే ప్రచారంలో ఉన్నాయి తప్ప స్పష్టత లేదు. ఆమధ్య జనగణనతోపాటే కులగణన కూడా చేపట్టాలని పార్లమెంటులో కొన్ని రాజకీయపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం గుండెల్లో రాయి పడింది. కులగణన అంటే కందిరీగల తుట్టను కదపడమేనని అది భావించింది. దేశవ్యాప్తంగా కులాలు వేల సంఖ్యలో ఉండడం అందుకు ఒక కారణం. సాంప్రదాయికంగా చూస్తే, ‘పంచ’ములను కలుపుకుని వర్ణాలు అయిదే. ఇప్పటి భాషలో అగ్ర/అగ్రేతరాలుగా చెప్పుకుంటే, అవి రెండే. జరిగింది ఏమిటంటే, చతుర్థ వర్ణమే వేల కులాలుగా చీలిపోయింది. వాటన్నిటినీ చతుర్థవర్ణంగా గుర్తిస్తే మిగిలేది సాంప్రదాయికమైన పంచమవర్ణ వ్యవస్థే.

కులం గురించిన ఈ పరిశీలన చారిత్రక దృష్టినుంచి చేస్తున్నదే తప్ప మరొకటి కాదని మనవి చేస్తూ ముందుకు వెడతాను.

క్షత్రియేతర వర్ణాలనుంచి రాజులు అవతరించడం ప్రారంభమయ్యాక, వారు సాంప్రదాయిక విభజనలోకి రారు కనుక ప్రారంభంలో వారిని వన్నె తక్కువ క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అంటే; చరిత్రకారులు వారిని అస్పష్ట మూలాలు కలిగినవారుగా చెప్పడం ప్రారంభించారు. నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం వీరితోనే మొదలైంది. దక్షిణభారతానికి వచ్చేసరికి సాంప్రదాయిక వర్ణ విభజన మరింత పలచబారి, స్థానిక తెగలనుంచి రాజులు ఆవర్భవించారు. శాతవాహన రాజులతో ప్రారంభించి, చాళుక్యులు, విజయనగర రాజుల వరకూ దాదాపు అందరినీ చరిత్రకారులు అస్పష్ట మూలాలు కలిగినవారుగానే చెప్పారు. సాంప్రదాయిక విభజన ప్రకారం వీరంతా చతుర్థవర్ణంలోకే వస్తారు. క్షత్రియత్వం వీరిపై కృత్రిమ ఆపాదన మాత్రమే.

ఇంకా విశేషం ఏమిటంటే, ఒక కోణం నుంచి చూసినప్పుడు మహాభారతం ప్రధానంగా రెండు విషయాలు చెబుతోంది. మొదటిది, సాంప్రదాయిక క్షత్రియులు అంతరించిపోవడం గురించి! హోమర్ చెప్పిన ‘ఇలియడ్’ లానే మహాభారతం కూడా ఒక గొప్ప వంశం అంతరించిపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రారంభమవుతుందని కోశాంబి అంటాడు. రెండోది, రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్ళడం గురించి! ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్న ఈ చర్చను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

కోశాంబి మౌలికంగా గణితశాస్త్రజ్ఞుడు. ఆయన నిర్ధారణలు చాలా చోట్ల గణిత సూత్రాలలా ముక్తసరిగా ఉంటాయి. వాటి ఆధారంగా ఒక్కోసారి మనం లెక్కలు చేసుకోవలసిందే. గట్టి ఆధారాలు లేకుండా ఊహల మీద ఆధారపడి నిర్ధారణకు రావడానికి ఆయన ఒప్పుకోడు. అటువంటి వ్యక్తి, అలెగ్జాండర్ తో పోరాడిన పోరస్ పురువంశపు చివరి రాజు అనడమే కాదు, పంజాబ్ లో ఈ రోజున ‘పురి’ అనే ఇంటిపేరు ఉన్న వారు పురువంశీకులే కావచ్చునని అంటాడు. ఆవిధంగా ఇతిహాస కాలాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి రెంటి మధ్యా అవిచ్ఛిన్నత ను కల్పిస్తున్న కోశాంబి పరిశీలన పురాచరిత్రాన్వేషకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఆయన ప్రకారం చూసినప్పుడు, పదకొండో శతాబ్దికి చెందిన రాజరాజనరేంద్రుడు పూరుని తన వంశకర్తలలో ఒకడిగా చెప్పుకున్నా అది కల్పన మాత్రమే. 21వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ సినీ నటులు అమ్రీష్ పురి, ఓం పురి; పాత్రికేయుడు, రచయిత బలరాజ్ పురి; రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ కె.ఆర్. పురి; వ్యాపారవేత్త, ఇండియా టుడే ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పురి తదితరులు అసలు సిసలు పురు వంశీకులు అవుతారు. పురు వంశీకులు వేద కాలం నుంచి నేటి కాలం వరకూ పంజాబ్, దాని చుట్టుపక్కలే ఉన్నారు.
ఓం పురి

ఓం పురి

ఇక యయాతి కొడుకైన తుర్వసునితో కృష్ణ దేవరాయలను పెద్దన ముడిపెట్టాడని చెప్పుకున్నాం. దీని వివరాలలోకి వెళ్ళడం మరింత ఆసక్తిదాయకం.  రాంభట్ల కృష్ణమూర్తి(వేద భూమి) ప్రకారం, యయాతి తండ్రి నహుషుడు పశ్చిమాసియాకు చెందినవాడు. మ్లేచ్ఛ భాషలో నహుషుడు అనే మాటకు కొండచిలువ అని అర్థం. ఆనాడు వైదికార్యులకు పశ్చిమాసియాతో దగ్గరి సంబంధాలు ఉండేవి. పశ్చిమాసియా నుంచి వాయవ్య భారతం వరకూ ఆనాడు ఆర్యావర్తంగా ఉండేదనిపిస్తుంది.  వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు కొన్ని మాటలకు ఆర్యభాషల్లో అర్థం దొరకనప్పుడు మ్లేచ్ఛ భాషార్థాన్ని చూడమని పూర్వమీమాంసా సూత్రకర్త జైమిని చెప్పడాన్ని రాంభట్ల ఉదహరిస్తారు. యయాతి కొడుకు తుర్వసుని పేరులోని ‘తురు’ అనే మాటకు మ్లేచ్ఛ భాష అయిన సుమేరులో ‘పల్లం’ అని అర్థం. తుర్వసును సుమేరులు ‘తుర్కీ’ అంటారు. నేటి టర్కీ యే ఈ తుర్కీ. సుమేరు భాషలో ‘కీ’ అంటే భూమి అని అర్థం. తుర్కీ అంటే పల్లపు భూమి. తుర్వసు అనే మాటలోని వసువుకూ భూమి అనే అర్థం. ‘తురుష్కులు’ అనే మాట కూడా తురు నుంచే పుట్టిందని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఆవిధంగా చూసినప్పుడు, పదిహేనో శతాబ్దికి చెంది, దక్షిణ భారత రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలను కేవలం తుళువ/తుర్వసుల మధ్య ఉన్న స్వల్పమైన ఉచ్చారణ సామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తుర్వస వంశీకునిగా చెప్పడం myth making లో మన కవుల ప్రావీణ్యానికి మచ్చు తునక.

 –కల్లూరి భాస్కరం

 

 

 

మొహమాటం లేకుండా…ఇప్పటి కథల గురించి కొన్ని ఫిర్యాదులు!

 972368_1415799075312585_947027319_n

సాహిత్య సృజనకూ సమకాలీన సామాజిక సందర్భానికీ అన్యోన్య సంబంధం ఉంది. ఈ సంబంధాల సరళమైనవి కావు. అత్యంత క్లిష్టమైనవి. గత రెండు మూడు శతాబ్దాల చరిత్ర చలనంలో భిన్న పార్శ్వాలున్నాయి. అనేకానేక వైరుధ్యాలున్నాయి. గతిశీలత ఉంది. వీటిని అవగాహన చేసుకోవడానికీ, తమ అనుభవంలోకి ఇంకింపజేసుకోడానికీ తమ కథల ద్వారా వ్యక్తీకరించడానికీ రచయితలు మునుపటికంటే ఎక్కువగా ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. ఇతివృత్తాలను ఎన్నుకోవడంలో, పాత్రచిత్రణలో, కథన రీతుల్లో, నేపథ్య చిత్రణలో, ప్రాంతాలకు-వర్గాలకు సంబంధించిన భాషాభేదాల వాడకంలో రచయితలు ఈ కాలంలో ఎంతో వైవిధ్యాన్ని సాధించారు. ఈ ప్రయత్నాన్నీ, ఈ సాధననూ ఆహ్వానిస్తూ, అర్థంచేసుకొంటూ కథలిచ్చే నాగరిక సంస్కారాన్ని ముందుకు తీసుకొనిపోయే పాఠకుడు ఎప్పుడూ అవసరమే.

అయితే మంచి పాఠకుడైన విమర్శకుడు-విస్తార సాహిత్య పరిచయమున్న విమర్శకుడు-కేవలం కథా నిర్మాణ రీతుల మీద మాత్రమే దృష్టి పెట్టడు. ఆ నిర్మాణానికి మూలమైన చరిత్ర, సంస్కృతి, ఇతరేతర సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశాల వెలుగులో కథని విశ్లేషించి కొత్త ద్వారాలను తెరవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు-రచనల ద్వారా అందే స్పందనలను, రచనల వస్తు శిల్పాలను, రచయితల ప్రాపంచిక దృక్పథాన్నీ చర్చిస్తూ పాఠకులకు ఒక చూపునివ్వగలిగిన వివేచనా శక్తిని అందిస్తాడు. ఇది గమనించినపుడు సమకాలీన కథా రచయితల ముందున్న సవాళ్ళకంటే ఈనాటి కథా విమర్శకుల ముందున్న సవాళ్ళూ బాధ్యత ఎక్కువే.

కథా విమర్శ అంటున్నప్పుడు సాధారణంగా చాలామంది సమీక్షకులూ విమర్శకులూ వస్తు పరిచయానికి మాత్రమే పరిమితమై ఉంటారు. ఇది దోషం కాకపోవచ్చు; కానీ వస్తువు వెనక ఉండే సామాజిక శక్తులను పరిశీలించడం గానీ  ఆ వస్తువును వాహికగా చేసుకొన్న రూపానికి గానీ ప్రాధాన్యమివ్వరు. వస్తు-శిల్పాలను అనుభూతం చేసే భాషా శైలులను అసలు పట్టించుకోరు. అవి పట్టించుకోకపోవడం వల్లనే నిర్హేతుకమైన పరస్పర విరుద్ధ భావాలు కాకపోతే దుర్భ్రమలు చెలామణిలోకి వచ్చాయి.

కథా విమర్శకు సంబంధించిన ఈ మథన, ఈ చింతన ఎ.కె. ప్రభాకర్‌కు ఉండడం వలనే ఈ వ్యాసాల్లో కథా విమర్శ స్థాయిని అతను పెంచాడు. ఈ స్థాయి ఈ సంపుటిలోని ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది. సమకాలీన రచయిత చుట్టూ పెరుగుతూ పోతున్న సామాజిక సంక్షోభాలను ప్రభాకర్‌ ఈ వ్యాసాల్లో గుర్తించాడు. గుర్తించడమే కాదు, రచయితల అస్తిత్వ వేదనలూ, ఆకాంక్షలూ, ఆశయాలూ-వాటికి  కారణమైన భిన్న వాదాలూ, ఉద్యమాలు కథల్లో ఏ విధంగా ప్రతిఫలనం చెందాయో లోతుగా తరచి చూశాడు. ఉదాహరణకు-తెలంగాణ రచయితల భాష విషయంలో, శిల్పి విషయంలో కొందరికున్న అపోహలను ప్రస్తావిస్తూ ‘అదంతా బతుకు పోరునీ-వేదనా భరితమైన తండ్లాటనీ, మొత్తం సమాజంలోని కల్లోలాన్నీ తమ రచనల్లో ప్రతిఫలిస్తున్న యీ రచయితల్ని రూపవాదులు ఒక మూసలోకి ఇమడ్చాలని ప్రయత్నించడం తప్ప మరేంకాదు’ అని ప్రభాకర్‌ నిర్మొహమాటంగా చెబుతాడు. వస్తువు-రూపం పడుగుపేకల్లా కలసిపోయిన ఆడెపు లక్ష్మీపతి కథల్ని మనముందుంచుతాడు.

అట్లాగే స్త్రీవాదానికి చెందిన పదజాలం లేకుండా కథ నడపడం కుప్పిలి పద్మ కథల్లో ఒక సుగుణమని ప్రభాకర్‌ పేర్కొంటాడు. ఉద్యమాలు పగిలిన అద్దంలాగా ఎట్లా ఉంటాయో ఎస్‌. జయ ప్రతీకాత్మకంగా చెప్పిన కథను ఉదహరిస్తాడు. అయితే ఈ సందర్భంలోనే బలమైన సామాజిక వాస్తవాలైన కులాన్నీ, మతాన్నీ విస్మరించిన విషయాన్ని కూడా మనముందుంచుతాడు. ఓల్గా గొంతులోని కాఠిన్యాన్ని గుర్తిస్తూనే  దానిలోని స్థెర్యాన్ని మెచ్చుకొంటాడు. లోపలి వ్యక్తిగా బి.ఎస్‌. రాములు, బయటి వ్యక్తి గీతాంజలి వంటి రచయితలు ప్రకటించిన దృక్పథాల్ని చర్చకు పెడతాడు.

‘సమకాలీనం’ ముప్పై కథా విమర్శ వ్యాసాల సమాలోచనం. మహాశ్వేతాదేవి కథలు, భారతీయకథలు, లోకేశ్వర్‌ చేసిన అనువాద కథల మీదా చేసిన పరామర్శ తప్ప మిగతా ఇరవైయేడు వ్యాసాలూ సమకాలీన తెలుగు కథల సామాజిక మూలాలను, రచనా సంవిధానాలనూ చర్చించినవే.

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

వర్తమాన కథపై ఎంతో ప్రేమతో రాసిన వ్యాసాలివి.వ్యాసాల్లో ఆయా రచయితల మీద అభిమానం కనిపిస్తే కనిపించవచ్చు గానీ అతిశయోక్తులతో కూడిన పొగడ్తలూ, వీరారాధనలూ లేవు. ఒక ప్రజాస్వామిక లక్షణం ఈ వ్యాసాలకు గీటురాయి. అందుకే వివిధ కథా రచయితల రచనల స్వరూప-స్వభావాలను ఒక వైపు విశ్లేషిస్తూనే కొన్ని రచనల్లోని సంకలనాల్లోని లోపాలను ఖండించడంలో ప్రభాకర్‌ వెనుకాడలేదు. తీరం తాకని కథా తరంగాలు ఒక పద్ధతీ పాడు లేకుండా కూర్చిన 300 పేజీల కలగూరగంప అనీ, కథా తరంగాల్లో ఏ మాత్రం సంచలనం లేనివీ ఎగసిపడి పాఠకుడిని తాకనివీ ఎక్కువనీ నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. అలాగే కర్నూలు కథా సంకలనంలో నిర్దిష్ట ప్రణాళిక లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు.

‘కథావసంతం’ పోటీ కథలను పరిశీలిస్తూ వర్తమాన కథకులు గమనించవలసిన అంశాలను ప్రభాకర్‌ నిర్ద్వంద్వంగా పాఠకుడి ముందుంచుతాడు. పోటీల్లో నిలబడ్డ కథల్లో ప్రభాకర్‌ గమనించిన అంశాలు కొన్ని :

– గ్రామీణ నేపథ్యానికీ, ప్రాంతీయతకూ పోటీ రచయితలు ఆమడ దూరంలో ఉన్నారు.

– అస్తిత్వ చైతన్యం తాకలేదు, వస్తు విస్తృతి లేదు, శిల్ప వైవిధ్యమూ లేదు- కొన్ని రచనలు వ్యాఖ్యానాలు-స్కెచ్‌లుగా మిగిలిపోయాయి.

– సంవిధానం పట్ల రచయితలు శ్రద్ధ చూపలేదు.

– జీవితం లోతుల్లోకి చూపు మందగించింది, సామాజిక సంక్లిష్టత కథల్లోకి ఎక్కలేదు.

– సంఘటన ప్రధానంగా నడవలేదు, సంఘర్షణ లేదు.

– దృక్పథ లోపం ఉంది.

విమర్శనాత్మకమైన ఈ అంశాలను పరిశీలిస్తే కొత్త వారివైనా, పాతవారివైనా ప్రసిద్ధులవైనా, అప్రసిద్ధులవైనా కథలను ఏయే కోణాల్లోంచి మనం చూడాలో స్పష్టమవుతుంది.

పాపినేని శివశంకర్‌ కథల మీద చేసిన అనుశీలన ఒక్కటే ఈ ముప్పై వ్యాసాల్లో పెద్దది. మిగతావన్నీ చిన్నవే కానీ మనసు పెట్టి రాసినవి. అందుకే ఈ వ్యాసాల్లో విస్పష్టమైన చింతనాబలం ఉంది. వాదనాపటిమ ఉంది. వ్యాసరూప నిర్మాణ శ్రద్ధ ఉంది. నిజాయితీ ఉంది. ఆలోచనాత్మకమైన సరళశైలి ఉంది. మన ఆలోచనలకు కొత్త చూపునూ, కొత్త సంస్కారాన్నీ ఇచ్చే శక్తి కూడా ఈ వ్యాసాలు అన్నిటికీ ఉంది.

నిజానికి ఈ ముప్పై వ్యాసాల మీద పెద్ద చర్చ చేసే అవకాశం ఉంది. అయితే-ఒక ఆత్మీయుడిగా చేస్తున్న పరిచయమే ఇది. ఈ వ్యాసాలన్నీ చదివాకా సాహిత్య పాఠకులకు సంపుటిలో ప్రస్తావించిన రచయితల రచనలతోపాటు కథా సాహిత్యాన్ని విరివిగా చదవాలనే ఆసక్తి పెరిగితే మంచిదే. సమకాలీన కథా సాహిత్యం మీద ప్రభాకర్‌ పంచుకొంటున్న ఈ ఆలోచనలను పాఠకులు మాత్రమే కాకుండా కథకులు, విమర్శకులు కూడా పట్టించుకొంటే మరీ మంచిది. కథా సాహిత్యం, కథా విమర్శ మరింత దిటవుగా వర్థిల్లడానికి ‘సమకాలీనం’ వ్యాసాలు మనోచలనంగా తప్పక పని చేస్తాయని గట్టిగా నమ్ముతున్నాను.

కేతు విశ్వనాథరెడ్డి

Kethu Viswanatha Reddy

 

 

 

 

సెప్టెంబర్ 6 న ‘సమకాలీనం’ విమర్శ వ్యాసాల సంపుటి ఆవిష్కరణ
కథా విమర్శకుడు ఎ.కే ప్రభాకర్ ‘సమకాలీనం’ విమర్శ వ్యాసాల సంపుటి ఆవిష్కరణ ఈ శుక్రవారం హైదరాబాద్ లో  జరుగుతుంది.  వివరాలు ఈ ఆహ్వాన లేఖలో….

533246_10153204953790385_1512291172_n

హోరు

ఇంటికి దగ్గరలో ఎలాటి సముద్రమూ లేదు, పోనీ అలాగని ఏ చిటాకమో చివరికి నీళ్ళగుంట అయినా లేదు. అయినా నాపిచ్చి గాని మూసీ మీదే ఆక్రమణలూ అద్దాల మేడలూ వచ్చాక ఇంకా నదులూ చెరువులూ ఎక్కడ? అయితేనేం ఈ సముద్రపు హోరు ఎక్కడిది? కొంచెం ఇలా ఏకాంతం వాలితే చాలు చెవులు దిబ్బళ్ళు వేసేట్టు ఈ హోరు…

నేనూ సమత చిన్నప్పుడు సముద్రం పక్కన బీచ్ లొ గంటలు గంటలు గడిపినా ఇలా ఎప్పుడూ అనిపించలేదు. అవును అప్పట్లో మద్రాస్ బీచ్ కి దగ్గరలో ఉన్న చిన్న ఇంట్లో పక్కపక్క పోర్షన్స్ లోనే ఉండే వారం ఇద్దరమూ . ఇంట్లో అమ్మ , నేను ,ఇద్దరు తమ్ముళ్ళు …నాన్న. నాన్నకు టీ నగర్ లో ఇరవై నాలుగ్గంటలూ కిటకిటలాడే బట్టల దుకాణం.

పొద్దున్న పూజా పునస్కారాలు భోజనం చేసి షాప్ కి వెళ్తే మళ్ళీ ఆయన తిరిగి వచ్చేది అర్ధరాత్రి పన్నెండు దాటాకే ,అందుకే మా చదువులు , మంచి చెడులన్నీ అమ్మే చూసుకునేది.

పక్కింట్లో ఉండేది సమత ,వాళ్ళమ్మ దేవిక ఇద్దరే . వాళ్ళ నాన్న గురించి ఎవరూ ఎప్పుడూ అడగలేదు , కాని దేవకీ గారు మాత్రం  మొహాన రకరకాల బొట్లు రోజుకొ రకం అలంకరించుకునే వారు.  ఆవిడ ఏదో ఆఫీస్ లో పెద్ద అఫీసరని చెప్పుకునే వారు.వాళ్ళ నాన్న మాత్రం ఎదో తప్పుచేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడని అనేవారు.  కాని ఒక్కరోజూ సమత కాని, వాళ్ళమ్మ గాని అయన ఊసే ఎత్తే వారు కాదు.

ఒకే కాంపౌండ్  లో ఉన్న రెండు ఇళ్ళు కొన్నప్పుడు; ఇద్దరికీ పెద్ద అభ్యంతరం అనిపించలేదు. కష్ట సుఖాల్లో , పండుగ పబ్బాల్లో కలిసి మెలిసి ఉండే వారం.

వాళ్ళింట్లో తల్లీ కూతుళ్లిద్దరూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడే వారు. దేవకీ గారే మంచి కాన్వెంట్ లో చదువుకున్నారట. అసలు సమత తండ్రి గురించి ఎవరికీ తెలియదు. పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కూడా కాదు. దేవకీ గారు కొత్త కొత్త ఫాషన్లు వదిలిపెట్టకుండా అనుకరిస్తూ ఎప్పుడు చూసినా ఉత్సాహానికి మారుపేరులా ఉండే వారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఒక నిశ్చలమైన నదిలా ఎంతో అందంగా మనోజ్ఞంగా అనిపించేవారు.

సమత మా ఇంట్లో అందరితోటీ చాలా బాగా కలిసిపోయింది. మాఇంట్లో అమ్మ చేసే మల్లెపూల లాంటి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు  ఎంతో ఇష్టంగా తినేది. అమ్మకూడా ఇంట్లో అమ్మాయి లాగానే చూసేది. ఏ పండగ వచ్చినా మాతో పాటు సమతకూ రకరకాల డ్రెస్ లు కొనేది. ఏ జాతరకో, పుణ్యక్షేత్రానికో వెళ్ళినా పూసలో, గాజులో కొనకపోతే అనుకోవాలి.

“ఎంతైనా ఆడపిల్ల ఉండే కళే వేరు “ అనేది.

“ పోనీ మించిపోయిందేమిటి , మరోసారి ..”అంటూ ఏడిపించేవాడు నాన్న.

నాకేమో దేవకీ ఆంటీ సాండ్ విచ్ లు , టోస్ట్ లు లాటివి బావుండేవి. చిన్నప్పుడు ఒకసారి  నా పుట్టిన రోజుకి  ఆవిడ కొనిచ్చిన పూలపూల చొక్కా ఎంత ఇష్టమో — అమ్మ చెప్పేది , రోజూ అదే వేసుకునే వాడినట … ఉతకాలి మొర్రో అన్నా వినకుండా … చివరికి అది దాచిపెడితే గాని వేరే షర్ట్ ఏదీ వేసుకోలేదట.

పిల్లలకి ఏ ఇల్లు ఎవరిదని పెద్ద తేడా కూడా తెలిసేది కాదు. అమ్మ ఇంటికి సుదూరంగా మరో రాష్ట్రం లో ఉన్నా పద్ధతులన్నీ తూచా  తప్పకుండా పాటించేది. ఆషాడ మాసంలో బోనాల పండుగ , బతుకమ్మ పేర్చడాలు,కృష్ణాష్టమి…పెద్దలకు బియ్యాలు ఇవ్వడం    వాటిన్నింటికీ దేవకీ గారు , సమత మాతోపాటే ఉండే వారు .అల్లాగే దేవకీ గారు వరలక్ష్మీ వ్రతం, అట్ల తద్దె , సంక్రాంతి పెద్ద గొప్పగా చేసినప్పుడు మేమందరం అక్కడే ఉండే వారం.

పేరుకి రెండు ఇళ్ళయినా ఎప్పుడు  ఎవరు ఎవరింట్లో ఉంటారో ఎప్పుడూ తెలిసేది కాదు.

చిన్నప్పుడు ఇద్దరం కలిసే చదువుకునే వాళ్ళం, ఒకరికొకరం సాయపడే వాళ్ళం. సమతకు లెఖ్ఖలు రావని నేను సాయం చేస్తే, తను నాకు ఇంగ్లీష్ హోమ వర్క్ చేసి పెట్టేది.

తొమ్మిదో తరగతిలో అనుకుంటా ఒకసారి సాయంత్రం ఆరున్నర దాటాక నా ఇంగ్లీష్ హోం వర్క్ కోసం వాళ్ళింటికి వెళ్లాను ఎప్పటిలా , తలుపు ఓరగా వేసుంది. కాస్త జడిపిద్దామని శబ్దం కాకుండా తలుపు తీసి లోపలకు అడుగు పెట్టె లోపలే దేవకీ గారి స్వరం వినబడింది,

“ నువ్వలా మాటిమాటికీ వాళ్ళింటికి వెళ్ళడం ఏంబాగాలేదు, ఇది వరకులా చిన్నపిల్లవు కాదు, అయినా వాళ్ళింట్లో అమ్మాయిలు ఉంటే అదో దారి అందరూ అబ్బాయిలే . ”

“ అమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు.నిన్నటి దాకా లేని తేడా ఇప్పుడెందుకు వస్తోంది, ” సమత గట్టిగానే అడిగింది.

“ ఆడపిల్లలు నిన్నటి దాకా ఉన్నట్టు ఇవాళ ఉన్నారా? నిన్నటిదాకా ఉన్నట్టు నువ్వున్నావా? ఉద్యోగం చేసినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వదిలేయ్యనా? అమ్మగా నా బాధ్యతా నాది. నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. పెరిగిన పిల్లవు,” నిశ్శబ్దంగా వెనక్కు వచ్చేశాను.

ఈ దెబ్బకు సమత నాతో మాట్లాడదనుకునాను కాని మర్నాడు సాయంత్రమే స్కూల్ అయాక ఇద్దరం బీచ్ కి వెళ్లి దూరంగా రాళ్ళమీద కూచున్నాం.

“చిన్నప్పటినుండి కలసిపెరిగాం , అప్పుడు లేని హద్దులు ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పు? ఏదేమైనా కానీ నిన్ను చూడందే,మాట్లాడందే నేను ఉండలేను, ” ఖచ్చితంగా చెప్పింది.

అవును అంతకు ముందు బహిరంగంగా అందరిముందూ కలిసి తిరిగే వాళ్ళం , ఇప్పుడు పెద్దలకు తెలియకుండా.

సమత కాలేజీ చదువుకు వచ్చేసరికి నాన్నకు కూడా ఏదో పెద్ద బిజినెస్ ఆఫర్ వచ్చి మద్రాస్ నుండి హైదరాబాద్ మారిపోయాం . అదేం చిత్రమో సరిగ్గా మేము మారే సమయానికి దేవకీ గారికి కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది.

ఇద్దరి ఇళ్ళూ కలిపి రియల్ ఎస్టేట్ వాడికి పెద్ద లాభానికే ఇచ్చేశారు.

హైదరాబాద్ లొ మంచి లొకేషన్ లొ ఇద్దరికీ పక్కపక్కనే ఇళ్ళు చూశాడు నాన్న.

కాలేజి చదువులకు వచ్చాక ఒకరికొకరం పెద్దగా సాయపడలేకపోయినా రోజుకోసారైనా కలిసి జరిగేవి జరుగు తున్నవి ఒకరికొకరం చెప్పుకుని చర్చించుకునే వాళ్ళం .

చివరికి ఇద్దరం  డాక్టర్లమైతే కష్టమని ,ఇల్లు వాకిలీ ఎవరు చూడాలని నేను మెడిసిన్ కి వెళ్తే తను ఫాషన్ డిజైనింగ్ లొ చేరింది.

మనకు ఇద్దరు పిల్లలు చాలు ఒకరిని మెడిసిన్ మరొకరిని ఇంజనీరింగ్ చదివిద్దామని అనుకున్నాము. మేము సెకండియర్ లో ఉండగా చిన్నగా మొదలయ్యాయి ఈ కొత్త గోడలు.

ఎప్పుడో 69 లో అణిగిపోయిన ప్రాంతీయత రాజకీయ లబ్ది కోసం మళ్ళీ తెర మీది కొచ్చింది.

గొడవలు గొడవలుగా ఉంది. ఎప్పుడు కాలేజీలు మూసేస్తారో ,ఎవరు ప్రాణ త్యాగం అంటారో తెలియడం లేదు. సమత కాస్త ఉదాసీనంగా మారిపోయింది.

“ ఈ రాజకీయాలు మనకెందుకు చెప్పు, మనం పరిచయం అయిన రోజున ఉన్నాయా ఇవి, మనం ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేమనుకున్న రోజున ఉన్నాయా?”

ఎన్నో మార్లు నచ్చజెప్పాను. “ అవును రవీ , అసలు నువ్వు లేకుండా నేను జీవితాన్నే ఆలోచించలేను. అదేమిటో విడివిడిగా చూస్తే అదివేరు ఇదివేరు అనిపిస్తుంది. కాని అడుగడుగునా ఆచారాలు, పద్ధతులు , ఆనవాయితీలు మళ్ళీ ప్రాంతాల పైనే ఆధారపడి ఉన్నాయి. అంతెందుకు , కూరల్లో పులుసూ బెల్లం వేసుకుంటామని ఆంటీ యే మొదట నవ్వేవారు. అల్లాగే మీరు అన్నిట్లో ఇంత అల్లం వెల్లుల్లి ముద్దా పారేస్తారని మా వాళ్లకు ఈసడింపు. ఏం అర్థం కావటం లేదు రవీ ” అనేది.

ఈ రెండేళ్ళుగా మా రెండిళ్ళ మధ్య కాస్త స్నేహ వాతావరణం తగ్గిందనే చెప్పాలి. ఎవరిల్లు ఎవరి సరదాలు వాళ్ళవిగా ఉంది. బహుశా మా ఇంట్లోనూ  మార్పు అనేది చల్లగా ఏ మూల నుండో దూరి ఉంటుంది.

ఒకరినొకరు పిలుచుకోడం తగ్గిపోయింది. కూరలు వంటలు ఇచ్చిపుచ్చుకోడాలు తగ్గిపోయాయి. అమ్మకు మా ప్రాంతం అనే గర్వం కాస్త వచ్చింది.

“ఇంకెంత ఇవ్వాలో రేపో తేలిపోతుంది. ఎగబడి వచ్చిన నా బిడ్డలంతా తోకముడుసుకొని పోవాలె “అనేది, రెండుమూడు సార్లు నేనే విన్నాను.

“వెర్రినామొహాలు అంతా  నవాబుల చేతుల్లో పెట్టి కూచ్చున్నారు,ఇప్పుడు నాలుగక్షరాలు నేర్చే సరికి పనికిరాకపోతున్నాము” దేవకీ గారు రుసరుసలాడేది.

నాకు నవ్వొచ్చేది.

ఈ నేల ఈ గాలి ప్రతి వ్యక్తీ వాళ్ళ అబ్బ సొత్తు  అయినట్టు దెబ్బలాడుకోడం… మొన్నమొన్నటి వరకు వాళ్ళూ, మేమూ పరాయి రాష్ట్రంలోనే గా ఉన్నాము. అక్కడి వాళ్ళు మమ్మల్నిలా వేరుగా చూడలేదే. మా పనేదో మేం చేసుకున్నాం, కలిసోచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం.

మరి పుట్టి పెరిగిన చెన్నై మా స్వంత రాష్ట్రమైతే ఇది ఇద్దరికీ వేరే రాష్ట్రమేగా?

ఎక్కడి నుండి పుట్టుకు వస్తోంది ఈ స్వార్ధం నాదనే స్వార్ధం , నేల నాది గాలి నాది ఆకాశం నాదనే స్వార్ధం? వీటికి నేనేం చేశాను? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడిక్కడికి వచ్చి మా తాతల నేల నాదనడం?

ఎక్కడికక్కడ ఇలా గోడలు కట్టుకుంటూ పొతే చివరికి ఎవరి చుట్టూ వారికి ఒకగోడ , ఎవరి చుట్టూ వారికి ఒక సముద్రం , దాని హోరు మిగులుతాయేమో!

అమెరికా వెళ్ళినా అంతరిక్షాని కెళ్ళినా ఇక్కడి హక్కులు మాత్రం భద్రంగా  పదిల పరచుకునే తీరతారా ? నా మాతృభూమికి నేనేం చెయ్యగలనన్నది ఆలోచించాలి గాని ..

ఇవెక్కడైనా పోనీ నా సంగతీ, సమత సంగతీ తేలాలి.

ఖచ్చితంగా ఈ జీవిత సగభాగం సమత తప్ప మరొకరు కాలేరు.

భగవంతుడా ఈ హోరునుండి  ఎలా బయట పడాలి?

సమతను కలుసుకుని మూడు రోజులైంది. ఉహు తను కనిపించకపోతేనే తోచదు.

సాయంత్రం సమతను కలిసే వరకూ ఆ హోరు అలాగే కొనసాగింది.

చీకటి పడ్డాక కూడా చాలా సేపు బిర్లా మందిర్ మెట్లమీద అలా కూర్చుండి పోయాం నిశ్శబ్దంగా.

ఎప్పటికో ఏదో చెబ్దామని తలెత్తాను .సరిగ్గా అదే ఉద్దేశ్యంతో సమత నావైపు చూసింది.

ఇద్దరమూ మాట్లాడలేదు.

మళ్ళీ కాస్సేపటికి కాస్త స్థైర్యం కూడగట్టుకుని పెదవి కదిపాను.

“సమతా ఈ ప్రాంతీయ విభజన ఇవ్వాళా జరగవచ్చు, మరో పదేళ్లకు జరగవచ్చు, జరక్కపోనూ వచ్చు. మనం మాత్రం చిన్నప్పటినుండీ పెంచుకున్న ప్రేమ వృక్షం ఇప్పుడిలా ఎవరికోసమో నరికేసుకోము. కాని నీకూ నాకూ సంబంధించినంతవరకే కాదు రేపటి మన బిడ్డల తరానికీ ఈ హోరు , ఈ ఏకాంతపు పోరు వద్దు సమతా. మనబిడ్డలు ఎక్కడి వారవుతారు? ఆలోచించు సమతా ఏ ప్రాంతమయినా మన ఇద్దరిదీ నువ్వు వేరు నేను వేరు కానప్పుడు , నాకు సంబందించిన వన్నీ నీవి, అలాగే నీకు చెందిన వన్నీ నావికూడా. ఏమంటావు”

సమత మాట్లాడలేదు. సుదూరంగా కనిపిస్తున్న బుద్ధ విగ్రహాన్ని చూస్తోంది.

నా మనసులో హోరు మాత్రం చిత్రంగా మాయమయింది.

“రా సమతా , వెళ్దాం చాలా రాత్రయింది” లేచి చెయ్యందించాను.

***

swathi –స్వాతి శ్రీపాద

 

 

 

 

 

 

 

 

బతుకు బండి

venu photo

ఇప్పటికైతే వేణు గురించి చెప్పడానికేం లేదు. ఇతను ఒక మామూలు జర్నలిస్టు. రైతు కడుపున పుట్టిన బిడ్డ. 27 ఏళ్ల పడిలో తోటి సమాజం కోసం బెంగ పెట్టుకుని రచయిత అయ్యాడు. బందరులో పుట్టి హైదరాబాద్‌లో జీవిక కొనసాగిస్తున్నాడు.  తొలి కథ ఈ ఏడాది జనవరిలోనే సాక్షిలో ప్రచురితమైంది. ఇప్పుడిది అతని రెండో కథ. మరి నమ్మొచ్చో లేదో మీరే చెప్పాలి. — వేంపల్లెషరీఫ్‌

 ***

 ‘నీకు అక్క చెల్లెళ్లు లేర్రా దొంగలంజి కొడకా… మనిషన్నాక నీతుండాల్రా’ ప్యాసింజర్‌ రైలు బోగీలో రెండు బాత్రూంల మధ్య ఉన్న స్థలంలోంచి అరుపులు మొదలయ్యాయి. సమయం రాత్రి పన్నెండున్నర. ఏప్రిల్‌ మాసాంతంలో… చల్లని గాలి బోగీ మొత్తాన్ని ఆక్రమించి.. చెవుల్లో హోరు పెడుతుంటే… ఆ హాయిని ఆస్వాదిస్తూ ఆదమరిచి నిద్రపోతున్న వాళ్లందరూ ఆ గోలకు లేచారు.

బాత్రూంలకి ఎదురుగా నాలుగడుగుల  దూరంలో సింగిల్‌ సీట్లో ఉన్న నాకూ మెలకువ వచ్చింది.

‘పొయ్యి నీ అమ్మకు పెట్టరా ముద్దు  బాడ్కో నా కొడకా’ అంటూ ఆ ఇరవై ఎనిమిదేళ్ల స్త్రీ ఎర్ర చొక్కా అతనిపై గట్టిగా అరుస్తోంది. ఆమె పక్కనే ఆమె మూడేళ్ల పాప… బతికే ఉందా? అని సందేహం కలిగించే రీతిలో నిద్రపోతోంది.

‘నువ్వేగా నా ఒళ్లో తలపెట్టావు’ అంటున్నాడా అపరిచితుడు. పీకలదాకా తాగి ఉండటంతో మాటలు తడబడుతున్నాయి.

‘నోరు ముయ్యిరా. ఎక్కువ మాట్టాడితే ఎడంకాలి చెప్పుతో కొడతా నా కొడకా’ అని గట్టిగా అరిచిందామె.

‘ఓయ్‌… ఏమయ్యోయ్‌’ అన్న ఆమె పిలుపుకి నా పక్కనే కింద పడుకుని ఉన్న ఆమె భర్త లేచాడు. ‘ఏమయ్యింది మే’ అంటూ వాళ్ల దగ్గరికి వెళ్లాడు. అతని ఎర్రచొక్కా వెనకంతా మురికి. అతనూ కైపు మీద ఉండటంతో అడుగులు తడబడుతున్నాయి.

‘ఈడు నన్ను ముద్దు పెట్టుకున్నాడయ్యా’ అని చెప్పింది భర్తతో.

‘నా కొడకా’ అంటూ ఆమె భర్త అతని పైకి వెళ్లాడు.  ఇద్దరి వయసూ దాదాపు ముప్పైఐదు ఉంటుంది.

‘ఆమే నా ఒళ్లో పడుకునింది’ అంటున్నాడా అపరిచితుడు.

ఆ ముగ్గురూ టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కారని చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. టిక్కెట్టు లేని ప్రయాణం చట్టరీత్యా నేరం. సమాజరీత్యా లేకీతనం. లేకీవాళ్లతో మనకెందుకు అనుకున్నారో ఏమో… ఎవరూ వాళ్ల గొడవలో వేలు పెట్టలేదు.

‘ఆ నా కొడుకుతో మాటలేంది చెప్పుతో కొట్టక’ గట్టిగా అరిచిందామె. రెచ్చిపోయిన భర్త ఆ అపరిచితుడిపై కలబడ్డాడు. అతను ఒక్క తోపు తొయ్యటంతో వచ్చి నా కాళ్ల దగ్గర పడ్డాడు.

‘చెప్పుతో కొడతా’ అంటూ తూలుతూ చెప్పు చేతిలోకి తీసుకునేలోపే.. ఆ అపరిచితుడు తన కుడికాలి చెప్పుతీసి అతని నెత్తి మీద నాలుగు కొట్టాడు.

‘తప్పు నువ్వుచేసి నా మొగుణ్ని కొడుతున్నావేందిరా బాడ్కో’ అంటూ ఆమె వాళ్ల దగ్గరికొచ్చి ఆ అపరిచితుణ్ని వెనక్కి లాగింది.

‘ఓయ్‌ ఏంది మీ గొడవ. కామ్ముగా ఉంటారా? రైల్లోంచి దింపెయ్యాలా?…’ నాకు అటువైపు బారుసీట్లో కూర్చుని ఉన్న ఓ అరవై ఏళ్ల ముసలాయన గద్దిస్తూ వాళ్ల దగ్గరకొచ్చాడు…. రైలేదో ఆయన సొంత ఆస్తి అయినట్లు.

‘ఈ నీతిమాలినోడు నన్ను ముద్దుపెట్టుకున్నాడు’ ఆ వృద్ధుడితో చెప్పిందామె.

‘అదే నా ఒళ్లో పడుకుంది’ ఆ అపరిచితుడు అన్నాడు.

‘అది అంటున్నావేందిరా నా కొడకా’ అంటూ ఆమె అతని చెంపపై కొట్టబోయింది. ఆ వృద్ధుడే ఆపాడు.

‘ఏంది.. గోల ఆపరా. ఓయ్‌ రైలు ఆపండయ్యా వీళ్లని దించేద్దాం’ అన్నాడా వృద్ధుడు.

భయపడ్డారో ఏమోగానీ ఆ అపరిచితుడు బోగీ అవతలి వైపునకు వెళ్లాడు. భార్యాభర్తలు బాత్‌రూంల దగ్గరికి చేరారు.

అది బెంగుళూరు నుంచి గుంటూరు వస్తున్న ప్యాసింజర్‌. నా వేసవి సెలవులు ముగియటంతో కాలేజీకి బయలుదేరాను నేను. బళ్లారి నుంచి గుంటూరుకు డైరెక్టుగా ప్యాసింజర్‌ బండి లేదు. నేను నరసరావుపేటలో దిగాలి.ప్యాసింజర్‌ అయితే ఖాళీగా ఉంటుంది. రిజర్వేషన్‌ గొడవ ఉండదు. పైగా చార్జీ చాలా తక్కువ. బళ్లారిలో డైరెక్ట్‌ టిక్కెట్టు తీసుకుని… రాయచూరు ప్యాసింజర్‌లో గుంతకల్‌ దాకా వచ్చి ఈ బండి ఎక్కటం మొదటి నుంచీ అలవాటే నాకు. ఆ రోజు ఆ బండి అరగంట ఆలస్యంగా ఆరుగంటలకు వచ్చింది. ఖాళీగా ఉన్న ఓ బోగీ చూసి ఎక్కేశా. సింగిల్‌ సీటు ఓదాన్ని పట్టుకుని కూర్చున్నా. అది బాత్‌రూంలకి ఎదురుగా నాలుగడుగుల దూరంలో ఉంది. కొంచెం మూత్రం వాసన వస్తోంది. కాసేపటికి అదే అలవాటయి పోతుందని నా ధీమా. పది నిమిషాలకి బండి కదిలింది. నా ఎదురుగా ఉన్న బాత్రూంల మధ్యలో ఉన్న స్థలంలో రెండు ప్లాస్టిక్‌ గోతాలున్నాయి. వాటి ఎడమ వైపు సింకు కింద ఓ మహిళ కూర్చుని ఉంది. ఆమె పక్కనే మూడేళ్ల పాప నిద్రపోతోంది. ఆమెను చూస్తే ఎవరికీ ఏ భావనా కలగదు. ఆమె ముఖంలో ఏ కళాకాంతీ లేవు. లోకంలోని అన్యాయాలన్నీ ఒక్కసారిగా దాడిచేస్తే.. భరిస్తూ.. నానాటికీ కృసిస్తున్న తీరుగా ఉంది.

Batuku Bandi

‘ఓయ్‌ ఎవరయ్యా ఈ గోతాలు ఇక్కడ పెట్టింది. బాత్‌రూంకి అడ్డంగా.’ అంటూ ప్రశ్నించాడో యాభైఏళ్ల వ్యక్తి.

‘మాయేనండి’ ఆ స్త్రీకి పక్కనే డోర్‌ దగ్గర కూర్చున్న ఆమె భర్త వచ్చి చెప్పాడు.

‘ఏమున్నయ్యి వాటిలో’ అడిగాడా వ్యక్తి. ‘బేల్దారి సామాను, గిన్నెలండి’ చెప్పాడు భర్త.

‘బెంగుళూరులో మేస్త్రి పనులు అయిపోయినట్టా’ అడిగాడా యాభై ఏళ్ల వ్యక్తి.

‘ఆ.. వానాకాలం వస్తందిగా… ఇక కట్టడం పనులు పెద్దగా సాగవు. ఊళ్లో పనులు మొదలవుతయ్యి. అందుకే వస్తన్నాం’ చెప్పాడు భర్త.

బండి మద్దికెర రాగానే ఎర్రచొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ఎక్కాడు. అతని దుస్తులు కొంచెం మాసిపోయి ఉన్నాయి. జుత్తు చింపిరిగా ఉంది. గడ్డం బాగా మాసి ఉంది. అతణ్ని చూస్తే వస్తువులు కాజేసే మాదిరిగా కనిపించాడు నాకు. బోగీలో కాసేపు అటూ ఇటూ తిరిగి మాయమయ్యాడు. డోన్‌లో బండి ఆగింది.

‘ఓయ్‌…పిల్లకి తినటానికి ఏదన్నా తీసుకరాపో’ అని అడిగిందామె భర్తని.

‘ఇక్కడేమీ ఉండవే’ అన్నాడతను.

‘ఉండవంటావేంది. అదిగో వాళ్లు దోసెలు తెచ్చుకుని తింటంటే’ ప్రశ్నించిదామె.

‘ఇంటికి పొయ్యి తిందాంలేమే’ చిరాకుగా చెప్పాడతడను.

‘ఇంటికి పొయ్యేలకి తెల్లారుద్ది. అప్పటిదాకా పిల్ల ఎలా ఉంటది.’ అందామె.

ఆమె పోరు భరించలేక దిగివెళ్లి రెండు ఇడ్లీలు తెచ్చాడు.

‘రెండే తెచ్చావేంది’ ఆమె విరక్తిగా ప్రశ్నించింది.

‘నా దగ్గర డబ్బులు లేవుమే’ అన్నాడతను

.‘తాగటానికయితే ఉంటయ్యా’ ఆమె కోపంగా అంది. పాపను లేపి నోట్లో పెడుతుంటే.. అతనే ఒకటి తినేశాడు.

ఓ అరగంట తర్వాత భర్త బాత్రూంలోకి వెళ్లాడు. ఓ ఖాళీ క్వార్టర్‌ మందు సీసాతో బయటకి వచ్చి తలుపులోంచి బయటకు విసిరేశాడు. మరి కాసేపు అక్కడక్కడే తిరిగి వచ్చి నా పక్కన కింద అలాగే పడుకున్నాడు. బండి నంద్యాల దాటింది. బయటి నుంచి చల్లగాలి ఎక్కడో కురుస్తున్న వాన వాసనను మోసుకొస్తోంది. బోగీలో దాదాపుగా అందరూ కూర్చునే కునిక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాదితో డిగ్రీ అయిపోతుంది. తరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తూ కూచున్న నేను. బాత్రూంల దగ్గర మహిళ ఆ దారికి అడ్డంగా అలాగే వాలిపోయి విశ్రమిస్తోంది. అట్టలు కట్టిన ఆమె జుత్తు గాలికి భారంగా కదులుతోంది. ఆమె దుస్తులు బాగా మాసి ఉన్నాయి. ఆమెకు అటువైపుగా రెండు బాత్రూంల మధ్యలో పాప ఉంది. ఇంకా నిద్ర పోలేదు. రెండు చేతులూ గాల్లోకి ఎగరేస్తూ ఆడుకుంటోంది. మధ్యలో కిలకిలా నవ్వుతోంది. ఆ నవ్వు చాలా ముచ్చటగా ఉంది. చిన్నారి జాకెట్టు.. పరికిణీ కూడా మాసి ఉన్నాయి. అయితే నిర్మలమైన ఆ నవ్వు ముందు మాలిన్యం లెక్కలోకి రావటం లేదు. నిర్మలత్వానికి ఉన్న శక్తి నాకు మరోసారి బోధపడింది. రాత్రి పదిన్నర సమయంలో భర్త లేచి తూలుతూ ఆమె దగ్గరికి వెళ్లాడు..ఆమె తల దగ్గర కూర్చుని మరో క్వార్టర్‌ బాటిల్‌ ఖాళీ చేసి సీసా బయటికి విసిరేశాడు. ఓ బీడీ వెలిగించాడు. ఆమె ఒకసారి మెడ లేపి అతణ్ని చూసింది. పాపని పక్కన పడుకోబెట్టుకుని మళ్లీ నిద్రలోకి జారకుంది. అతను కాసేపు అక్కడే కూర్చుని మళ్లీ తిరిగొచ్చి ఇందాకటి స్థానంలో నిద్రపోయాడు. బండి కంబం దాటింది. ఇందాక మాయమైన ఎర్రచొక్కా అపరిచితుడు ఆకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కాసేపు అటూఇటూ తిరిగాడు. ‘దొంగ’ అని అతనిపై ముందే నాకు గట్టి అభిప్రాయం ఏర్పడటంతో అతణ్ని గమనిస్తూ కూర్చున్నా. కొంత సమయం ఆమె తల పక్కన ఉన్న గేటు దగ్గర నుంచున్నాడు.  తర్వాత ఆమె తల పక్కన కూర్చున్నాడు. తీక్షణంగా ఆమెను గమనించటం ప్రారంభించాడు. నాకు అనుమానం పెరిగింది. అయితే ఆమె ఒంటిమీద వీసమెత్తు బంగారం కూడా లేదు. ఏం చేస్తాడో చూద్దామని అలాగే చూస్తూ కూర్చున్నా. ఆశ్చర్యంగా ఆమె తన తలను అతని ఒళ్లో పెట్టింది. కాసేపటికి అతను ఆమె తలపై నిమరటం మొదలు పెట్టాడు. ఓ అరగంటదాకా ఆ తంతు చూశాక.. హాయి గాలి మళ్లీ నన్ను నిద్రలోకి లాక్కెళ్లింది.

మెలకువ వచ్చే సరికి ఎదురుగా గోల. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆమె కదా నేను చూస్తుండగానే అతని ఒళ్లో తల పెట్టి పడుకుంది. అతను అంతసేపు తలపై నిమిరినా నిశ్శబ్దంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు కేకలేస్తున్నట్టు. వృద్ధుడి కేకల తర్వాత బోగీలో మళ్లీ గాలిహోరు మొదలైంది. బాత్‌రూంల దగ్గర భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు.

‘ఇందాక నువ్వు నా పక్కనే కూసింటివే. ఆడిది కూడా ఎర్ర సొక్కానే ఆయె. ఆడు నువ్వే అనుకున్నా. అందుకే ఒళ్లో తలకాయ పెట్టా. అయినా ఆ నా కొడుక్కి నీతి ఉండొద్దా’ ఆమె భర్తతో చెప్పింది. నాకు అసలు విషయం బోధపడింది. ఆమెను తప్పుగా అనుకున్నందుకు కొంచెం బాధపడ్డా.‘వాడు పీకలదాకా తాగి తూలతన్నడు.. వాణ్ని కొట్టలేకపోతివే.. తోస్తే అక్కడిపోయి పడితివి.. నీ చాతగాని చచ్చినోడా’ ఆమె భర్తను కొంచెం గట్టిగానే తిడుతోంది.‘ఆడు మూరకంగా ఉన్నాడుమే. రాచ్చసి నాయాలు.’ అని ఏదో సర్ది చెబుతున్నాడు భర్త. ఆమె పట్టించుకోవటం లేదు. కాసేపటికి అతను లేచివచ్చి యథాస్థానంలో పడుకున్నాడు. ఆమె నిద్రపోలేదు. పాప బొజ్జపై మెల్లగా జో కొడుతూ కూర్చుంది. బండి మార్కాపురం దాటింది. బోగీ సగం ఖాళీ అయ్యింది. ఈ సారి ఆమెను మరింత పరీక్షగా గమనించాను నేను. ఆమెకు చదవటం కూడా వచ్చి ఉండదు. భర్తే ఆమె ప్రపంచం అయ్యుండాలి. నిర్లిప్తంగా డోర్‌లోంచి అలా బయటకి చూస్తూ కూర్చుందామె. కాసపేపటికి అపరిచితుడు అక్కడికి వచ్చి డోర్‌ దగ్గర నుంచున్నాడు. వాడి మీద ఇంతెత్తున లేస్తుందనుకున్న ఆమె.. ఏమీ పట్టనట్లు అలాగే పాపను జోకొడుతూ కూర్చుంది. ‘నువ్వేగా నా ఒళ్లో తలపెట్టింది’ అంటూ అతను ఆమె పక్కనే కూర్చున్నాడు.ఆమె ఏమీ అనలేదు. కనీసం పక్కకి కూడా జరగలేదు. అతను ఇంకా ఏదో చెబుతుంటే వినీ విననట్లు కూర్చుంది.

‘నేను కాగితాల యాపారం జేస్తా.. వారానికి రెండు వేలు సంపాదిస్తా’ అతను చెప్పాడతను. ‘మీరు యాడనుంచి’ అని అడిగాడా వ్యక్తి. తాగి ఉండటం వల్లో ఏమో ఏ బెరుకూ లేకుండా కొంచెం పెద్దగానే మాట్లాడుతున్నాడు.

‘బెంగళూరులో బేల్దారి పనికి పోయినాం. ఇప్పుడు అయిపోయినయ్యి. అందుకే మా ఊరు దొనకొంద వచ్చేత్తన్నాం.’ చెప్పిందామె.

‘నా పెళ్లాం చచ్చిపొయ్యింది. నాకు మద్దికెరలో ఓ పాతకాగితాల కొట్టుంది. గుంటూరులో నా పెళ్లాం అన్న కూతురి పెళ్లి ఉంటే పోతన్నా’ అని అడక్కుండానే ఆమెతో చెప్పాడతను. కాసేపటికి ఇద్దరూ మాటల్లోకి దిగారు.

‘నీ మొగుడు బాగా సంపాదిత్తాడా?’ అడిగాడా అపరిచితుడు.

ఆ మాటతో ఆమెను మరింత నిర్లిప్తత ఆవహించింది. ‘ఏం చెప్పాలి. నా మొగుడు సచ్చినోడికి ఎప్పుడూ తాగుడు గొడవే. పెళ్లాంపిల్లలు తిన్నారో లేదో కూడా పట్టదు ఆ ఎదవకి. నా కూలి డబ్బులు కూడా తీసుకుని ముండల దగ్గరికి పోతాడు గాలినాబట్ట. ఆడపిల్లను కని నా ఎదన పడేస్తివేందే అని ఎపుడూ కొడతా ఉంటాడు. పీక పిసికి చెరువులో పడేస్తే పోద్ది అంటడు. ఆడి తల్లి అలాగే అనుకుంటే ఆడు ఉండేవోడా? నేను ఎక్కడ సుకపడిపోతానో అని నా ఎదానెయ్యటానికి ఆడితల్లి ఆణ్ని కనింది. పెళ్లాన్నికాపాడుకునే దయిర్యం కూడా లేదు చాతగాని నాబట్టకి’ ఆమె తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కింది.

‘నాతో వచ్చియ్యి. నిన్ను రానిలా చూస్కుంటా. ఆడితో నీకు ఎందుకు. నీ పిల్లని చదివిత్తా’ అతను అడిగాడతను.

అతని ధైర్యం చూసి నాకు మతిపోయింది.

‘తాగుబోతు సచ్చినోల్లని ఎప్పటికి నమ్మాలి? తాగుబోతోడిది పందిబుద్ధి. ఎప్పటికీ బరదలోకే  లాగుతుంటది.’ అందామె.

‘అది కాదు. నేను ఒట్టు పెడతన్నాగా… నిన్ను బాగా చూసుకుంటా.. వచ్చియ్యి నాతో’ అభ్యర్థించాడా వ్యక్తి.

‘చెపితే అర్దమవదా నీకు… తాగుబోతు ఎదవా’ ఆమె కోపంగా అంది.

ఇక అతను ఆ మాట మర్చిపోయాడు. ఇంకా ఏవేవో మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు అతను ఆమె తొడపై కొడుతూ మాట్లాడుతున్నాడు. జేబులోని వందనోట్లు మాటిమాటికీ బయటకుతీసి చూపిస్తున్నాడు. అతని మాటలకు ఆమె మెల్లిగా నవ్వటం ప్రారంభించింది. ఆమె కూడా అతని భుజంపై తడుతూ మాట్లాడుతోంది. నా పక్కనే కింద ఆమె భర్త శవంలా నిద్రపోతున్నాడు. కొంతసేపటికి ఇద్దరూ నావైపు పదేపదే చూడటం మొదలెట్టారు. నాకు కొంత అనుమానంగా తోచింది. వాళ్ల వైపే చూస్తూ కూచున్నా. చల్లగాలికి మళ్లీ నా కళ్లు మూతపడ్డాయి. ఓ పావుగంట తర్వాత ఎందుకో మెలకువచ్చి చూస్తే.. వాళ్లిద్దరూ కనిపించలేదు. పాప అలాగే నిద్రపోతోంది. ఈ మధ్యలో ఏ స్టేషనూ వచ్చినట్లు లేదు. మరి ఎక్కడికి వెళ్లారు. బాత్రూంలలో ఎడమ వైపు ఉన్నది మూసుకుని ఉంది. నా అనుమానం బలపడింది.  ఓ ఐదు నిమిషాల తర్వాత అది మెల్లగా కొంచెం తెరుచుకుంది. ఐదు సెకన్ల అనంతరం ఆ స్త్రీ మెరుపువేగంతో బయటకు వచ్చి… అంతే వేగంగా పాప పక్కన పడుకుంది. ఐదు నిమిషాల తర్వాత అపరిచితుడు కూడా బాత్రూంలోంచి బయటకు వచ్చి… నా పక్కనే ఉన్న బారు సీటులో కిటికీ పక్కన కూర్చున్నాడు. బండి వినుకొండ దాటింది. టైం మూడున్నర. ‘వినుకొండ వచ్చిందా’ ఆమె భర్త అకస్మాత్తుగా లేచి నన్ను అడిగాడు.‘ఇప్పుడే దాటింది’ అని చెప్పా. ‘మేయ్‌ అంటూ అతను లేచెళ్లి భార్యను తొందర పెట్టాడు. ఆ గోతాలను కొంచెం ముందుకు లాగాడు. అపరిచితుడు వెళ్లి వాళ్ల పక్కనే నిలుచున్నాడు.  వాళ్లు దొనకొండలో దిగాలి. అక్కడ బండి నిమిషం కన్నా ఎక్కువ ఆగదు. పైగా ఆ ప్లాట్‌ఫాం ఎత్తు చాలా తక్కువ. బండి ఆగింది. ఆమె పాపను ఎత్తుకుని దిగింది. గోతాలు దించుకోవటానికి భర్త ఇబ్బంది పడుతుంటే ఆ అపరిచితుడు సాయం చేశాడు. బండి కూతపెట్టింది.

‘బండి కదలతంది. వచ్చి సాయం పట్టన్నా’ అని నన్ను పిలిచాడతను. వెళ్లి ఓ చెయ్యి వేశా. బండి మెల్లిగా కదిలింది.‘పొయ్యొస్తాం అన్నా’ అని నవ్వుతూ ఆ అపరిచితుడితో చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయిందా స్త్రీ. నా తల మరోసారి గిర్రున తిరిగిపోయింది. నిమిషం పాటు రెప్ప వేయకుండా అలాగే శూన్యంలోకి చూస్తూ నుంచున్నా. ‘రెండు గుక్కలు విస్కీ తాగటానికి బాత్‌రూంలోకి తీసకపొయ్యింది ఆమె. మంట మంట అని అరిచింది.’ అంటూ ఆ అపరిచితుడు సగం ఖాళీగా ఉన్న మందు సీసా బయటకు తీసి మూత తొలగిస్తూ అటువైపు వెళ్లిపోయాడు. ఈ సారి నా బుర్ర పనిచెయ్యటం మానేసింది. మరో పది నిమిషాల తర్వాత నా స్టేషన్‌ వస్తే దిగిపోయాను నేను.

*

—- వేణుబాబు మన్నం

(కథాచిత్రం అందించిన మహీ బెజవాడకు ధన్యవాదాలు)

పిలవని పేరంటం

” ఏం చేస్తున్నావే ” అంటూ స్వతంత్రంగా  గది తలుపు తోసుకొచ్చారు  అత్తగారు .  ఆకాశం లోని ఇంద్రధనుస్సును ఒక్కలాగు లాగి భుజాలమీద వేసుకొచ్చేసినట్టూ ఆవిడ భుజాలనిండుగా రంగురంగుల చీరలు .

“తులసిదళం చదువుతున్నానండీ” . అంటూ చేతిలో పుస్తకం మడిచి కిందపెట్టి లేచి నుంచున్నాను .  “అయ్యో… అదేవిటే ! అంత పవిత్రమయిన పుస్తకాన్ని అలా కింద పెట్టేస్తావూ ! “ అంటూ …అదాట్న భుజమ్మీద  ఇంద్ర ధనుస్సును  మంచమీదికి గిరాటేసి , యండమూరి తులసిదళాన్ని వంగి తీసుకుని భక్తిగా కళ్ళకద్దుకుని , నా కళ్ళచుట్టూ కూడా ఓ తిప్పు తిప్పి పైనపెట్టారు. నాకు నవ్వొచ్చింది కానీ  దాచేసుకున్నాను .

మా అత్తగారు తెచ్చిన చీరల్ని వరసగా మంచం మీద పేర్చి, కాస్త వెనక్కి జరిగి గడ్డం మీద వేలుంచుకుని వాటినే తదేకంగా చూస్తూ దీర్ఘంగా ఓ శ్వాస తీసి వదిలారు .

” ఈ ఎర్రంచు వెంకటగిరి చీర క్రితంసారి ఎప్పుడు కట్టుకున్నానో నీకేవన్నా గుర్తుందటే…ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రావటంలేదు ” అన్నారు . నేను అలవాటయిన అయోమయాన్ని ప్రదర్శిస్తూ తల అడ్డంగా ఊపాను .

పోనీ ఈ నేరేడుపండు రంగు చీర ? అన్నారు ఆ చీర ఎత్తి పట్టుకుని నా కళ్ళముందు  ఆడిస్తూ . నేను తల అటూ ఇటూఆడిస్తూ ఊ..హు అనేసాను  .

ఈ గంధం రంగు గద్వాలు చీర బ్రేమ్మలింట్లో పేరంటానికి  కట్టుకున్నానంటావా ? అన్నారు నన్నే గుచ్చి గుచ్చి చూస్తూ . అప్పటివరకూ,  ఆ ..ఏదయితే ఏంటిలే అని , అలా అలా… తలాడించేస్తున్న నాకు ఇక ఆలోచించక తప్పలేదు .

ఓసారి ఎడంచేత్తో కుడి చెవి నలుపుకుని , వేళ్ళు విరుచుకుని , నుదురు చిట్లించి తల పంకించాను ( అలా చేస్తే నేను నిజంగానే ఆలోచిస్తున్నట్టు ఆనవాలు మా అత్తగారికి ) . రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత ” ఆ…కట్టుకున్నారండోయ్”  అనేశాను నమ్మకంగా. నా  అదృష్టం పండి పక్వానికి రావటం వల్ల , ఎప్పుడూ? ఏ పేరంటానికి? ఆ వేళ తిధీ నక్షంత్రం ఏవిటీ ? వంటి అనుబంధ ప్రశ్నలు   రాల్చకుండా ఊరుకున్నారు అత్తగారు .

ఎంత కాలక్షేపం కాకపోతేమటుకు వేళకాని వేళలో ఈ చీరల సంత ఏవిటీ ? అని అడిగేద్దామా అనుకుంటుంటే అందుకున్నారు అత్తగారు . ” అదికాదే……కరణంగారి తల్లిగారిని తేలు కుట్టిందని తెలిసి పెద్దత్తయ్యా  , నేనూ వెళ్ళి చూసొస్తే బావుంటుందనుకున్నాం కదా   . అక్కడికి కట్టుకెళ్ళటానికి చీర తీసి పెట్టుకోవద్దూ . తీరామోసి, ఇదివరకూ కట్టుకెళ్ళిన చీరే కట్టుకెళ్ళిపోతానేమో అని ….నాకసలే మతిమరుపూ “అంటూ నుదురుకొట్టుకున్నారు  అక్కడికి అదేదో మహా అపరాధం అన్నట్టు .

“నాకు జ్ఞాపకం వున్నంతవరకూ ఇదుగోండి… ఈ  చందనం రంగు చీర  మీరింతవరకూ ఊర్లో ఎవరింటికీ కట్టుకెళ్ళలేదు “. అని మామిడిపిందెల బుటా  ఉన్న ఉప్పాడ చీర తీసి అత్తగారికి అందించాను . ఆవిడ దాన్ని భూజం మీద అటూ ఇటూ వేలాడేసి చూసుకుని సంతృప్తిగా తలాడించేరు. నిజమేనేవ్….ఇది మొన్న దీపావళికి మా రెండో అన్నయ్య పెట్టిన చీర కదా ! ఇదే కట్టుకెళతాను . పైగా చీర ఎక్కడ కొన్నారు అని అడిగినవాళ్ళందరికీ మా పుట్టింటివాళ్ళు పెట్టారని చెప్పకనే చెప్పొచ్చు అని మురిసిపోతూ కదిలారు.

వెళుతూ వెళుతూ ఏదో గుర్తొచ్చినట్టూ గిరుక్కున వెనక్కి తిరిగి,” ఆ తులసిదళం చదివేస్తే నా గదిలో బల్లమీద కుమారీశతకం , రుక్మిణీ కళ్యాణం ఉన్నాయి అవి తీసుకో , ఇంకా కాలక్షేపం కాకపోతే గోడబీరువాలో మీ ఆయన చిన్నప్పుడు కొన్న పెదబాలశిక్ష వుంది అది తెచ్చి చదువుకో . నే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను”  అంటూ హుషారుగా నిష్క్రమించారు .

కుమారీ శతకం చదువుకోవాలా … ఇంకా నయం!? వ్యవసాయ పంచాంగం చదువుకోమన్నారు కాదు. అది తప్పు కుమారీ -ఇటు కూడదు కుమారీ  అని ఇన్నాళ్ళూ వేపుకు తిన్నారు మావాళ్ళు. ఏదో శ్రీమతినయి బ్రతికిపోయానని నేను సంబరపడుతుంటే ,  ఇంకా శతకాలు చదవమంటారేవిటీ !   అని నాతో నేనే సంభాషించుకుని, అప్పటికే ముప్పై ఆరుసార్లు చదివిన ఆ సస్పెన్స్ నవలని ముప్పై ఏడోసారి ఆశక్తిగా చదవటానికి  ప్రయత్నించాను .

మనసు పుస్తకం మీదికి పోనని మొరాయించింది . అత్తగారి వెంట కొత్తకోక కట్టుకుని షికారుకి  పోదాం  అని సరదాపడింది. ఈ మూల గదిలో కూర్చొని ‘ఈగంట గడిస్తే చాలు’ , ‘దుపట్లో మిన్నాగు’ , ‘ఒంటరి పక్షి’  వంటి నవల్లు నమిలే బదులు ఎంచక్కా అలా నాలుగిళ్ళు తిరిగొస్తే నలుగురి కష్ట సుఖాలూ తెలుస్తాయి కదుటే ! అంటూ ఉత్సాహపరిచింది .  నిజమేనేవ్…..! కానీ అత్తగారేవంటారో ! అని సందేహిస్తూ …’పద పద ఒక ప్రయత్నం కావించి చూద్దాం  అనుకొని అత్తగారిని  వెతుక్కుంటూ బయలుదేరాను.

అంతలోనే చక్కగా  ముస్తాబయిపోయిన అత్తగారు వీధిగుమ్మంలో చందనం బొమ్మలా నిటారుగా నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు .  నన్ను చూస్తూనే   ”   ఎప్పటికి వస్తుందో మీ పెద్దత్తగారు  ”  అంటూ ఒకటే హైరానా పడిపోతూంటే , వీధిలో పెద్ద గేటు తోసుకొచ్చాడు అందరూ నత్తగాడని పిలిచే సత్తిగాడు ( మా పెదమాంగారి పాలేరు) .  వాడికి నాలుగు క్షణాలు మనకి నాలుగు కాలాలు, వాడికి నాలుగు కాలాలు మనకి నాలుగు యుగాలు అదీ లెక్క .

నత్తలా నడిచొస్తున్న వాడిని చూస్తూ చింతకాయ తిన్నట్టూ మొఖం చిట్లించి వాకిట్లోకి ఎదురెళ్ళిపోయారు అత్తగారు . ” మజ్జేనం-  మూడు -గంటల -కల్లా-రెడీ- గ- వుండ -మని –సెప్ప- మన్నా -రండి -మా అయ్యగారు ” అంటూ తెచ్చిన కబురు తాపీగా ఒక్కో మాటా విడదీసి అందించాడు . ఇంకా ఏవిటి విషేషాలు !? అన్నట్టూ  అలాగే ఆశక్తిగా వాడికేసి చూస్తున్న అత్తగారితో ” అంతేనండీ -ఇంకేలేదండి” అని టూ.కీ గా  అనేసి తల బకురుకుని  నేలచూపులుచూస్తూ  నిలబడిపోయాడు .

అత్తగారు మిరియం గింజ నమిలినట్టూ మొఖం కారంగాపెట్టి , “అసలేవిట్రా మీ అయ్యగారి పద్ధతి . తీర్చి తివాటించుకుని మూడు గంటలకి ఇళ్ళ దగ్గర బయలుదేరితే తిరిగి దీపాలవేళకి ఇల్లు చేరొద్దూ. మీ రాజుగారింట్లో టౌను అలవాట్లు మరిగేరు . ఎనిమిదయ్యేవరకూ భోజనాలకి కూర్చోరు. మా ఇంట్లో ఆరు దాటితే ఆకలికి ఆగలేరు .  పైగా బయటికెళ్ళిన మగాళ్ళు ఇల్లుచేరేసరికి ఎదురుగా కనిపించకపోతే కొంపలంటుకుపోవూ  .ఆవిడకేం ….ఒకరికి  ఇద్దరు కోడళ్ళున్నారు . ఇద్దరూ చెరో పనీ చేసేసి, అత్తగారొచ్చేసరికి అన్నీ అమర్చి ఉంచుతారు . అందరికీ ఆ అదృష్టం వుండద్దూ “ అని ఒక గాట్ఠి నిట్టూర్పు విడిచారు  . హమ్మ..! ఇదేవిటి ఉరుము వురిమి మంగళం మీద పడ్డట్టు!  అటుతిప్పీ ఇటుతిప్పీ నన్నే పొడుస్తారు  అనుకొని నేనూ నిష్టూరంగా  ఒక నిట్టూర్పు విడిచాను  .

ఒకసారి ఊపిరితీసుకుని మళ్ళీ అందుకున్నారు అత్తగారు  “ఇదిగో వస్తుందీ అదిగో వస్తుందీ అని ఎదురుచూస్తూ ఇక్కడ నేను గంట నించీ గబ్బిలంలా వేలాడుతుoటే …తీరామోసి ఇప్పటికి ఈ కబురు తెస్తావా ! తగలేసినట్టేవుంది”  అంటూ వాడిమీద గయ్యిమనేసరికి , వాడు అవన్నీ తనకి కాదన్నట్టూ నింపాదిగా ఓ చూపు చూసి, “అలా -సెప్పమంటారాండీ -అయితే ?” అంటూ మళ్ళీ తల బకురుకున్నాడు .  దాంతో అత్తగారు కంగారుగా నాలుక కరుచుకుని,  “ ఏడ్చావులే “  అని వాడినో కసురు కసిరి,  ” మూడుగంటలకి వెళితే ఆలశ్యం అయిపోతుందటండీ… ఠంచనుగా పావు తక్కువ మూడు గంటలకన్నా బయలుదేరితే బావుంటుందన్నారని  చెప్పుఫో” … అని  ఆజ్ఞాపించినట్టుగా అనేసి మరో మాటకు తావులేకుండా వచ్చి అరుగు చివర కూర్చుండిపోయారు ఆయాసపడుతూ.( అత్తగారు అంత ఆయాసపడిందీ పావుగంట ముందువెనకలకోసం  కోసం కాదనీ , ఇందులో ఇంకేదో  రాజకీయం వుందని తలున్నవాడికెవరికన్నా తెలుస్తుంది . ఒక్క కబురు మోసుకుపోతున్న నత్తగాడికి సారీ…సత్తిగాడికి తప్ప)

ఉమ్మట్లో ఉన్నన్నాళ్ళూ నన్ను వేపుకు తినేసింది చాలదులావుంది …నాకు కోడలొచ్చినా నాకీ తోటికోడలి  అజమాయిషీ తప్పదులావుంది,  అయ్యో…రాత ! ఎప్పుడూ ఆవిడ చెప్పటం నేను వినడమేనా  అంటూ తనలో తనే గొణుక్కుంటున్నారు.

అగ్గిమీద గుగ్గిలంలా చిటపటలాడుతున్న అత్తగారి దగ్గర ఆ సమయంలో ‘అత్తా -నేనూ వత్తా ‘ అని గారాలుపోవటం అంత మంచిదికాదని ఎంచి , గడపవెనకే నిశ్శబ్ధంగా నిలబడిపోయాను. వంటింట్లోకి వెళ్ళి ఒక చెంబు నీళ్ళు తాగొచ్చిన అత్తగారు కాస్త చల్లబడి మళ్ళీ వీధి అరుగు మీదికి చేరి ఎదురుచూపుల పర్వం కొనసాగిస్తున్నారు . ఇక పనయ్యేట్టులేదని   ‘మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే’  అని నా బుజ్జి మనసుకి నచ్చచెప్పుకుని, తులసిదళ పారాయణంలో పడ్డాను .

ఇందాకా ఇక్కడి కబురు మోసుకు వెళ్ళిన నత్తగాడు తిరిగొచ్చి వీధి గేటు దగ్గర బాగా  వంగి నిలబడ్డాడు. ( అంత బరువయిన కబురేమో మరి ) . అత్తగారు పెద్దరుగుమీంచీ చిన్నరుగు మీదికి ఒక్క గెంతు గెంతి , నాలుగు అంగల్లో వాడిని చేరి తలెగరేసారు . ఏవిటో చెప్పమన్నట్టూ !?

వాడు ఒకడుగు గేటు బయటా ఇంకో అడుగు లోపలా పెట్టి , “మూడుగంటలకి ఒక్క నిమసం అటూ ఇటూ అయినా మా అయ్యగారు రాటానికి ఈలుపడదంటండి . అంత కంగారుగా వుంటే తవరినే ఎల్లి రమ్మనీ సెప్పమన్నారండి ” అని వాడికి చేతనయినంత కుదురుగా  కబురు చెప్పేసి రెండో అడుగు కూడా అవతల పెట్టేసి నెమ్మదిగా నడివీధిలో  కలిసిపోయాడు  “ఒరేయ్….” అని అత్తగారు వెనకనించీ అరుస్తున్నా లెక్కచేయకుండా .

సెగలు కక్కుకుంటూ వచ్చి పడ్డారు అత్తగారు .”చూసావంటే ఆ నిర్లక్ష్యం . వాడిని కాదు అనాల్సింది….ఆ తలబిరుసూ, ఆ లెక్కలేనితనం అంతా అయ్యగారి చలవే అంటూ …..అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి ” అసలు ఆ తూర్పోళ్ళ పద్ధతే అంత . అందులోనూ తునోళ్ళ సంగతి చెప్పాలా అమ్మో.. పెద్ద పిటింగు మేస్టర్లు కదూ! . అంటూ తోటికోడలిమీద అక్కసుని అక్కడే కక్కేసారు.

ఏవిటో ఈ తోటికోడళ్ళ తిక్కబాగోతం . ఎదురుగా వుంటే ఒకరి  మాట ఒకరు జవదాటనట్టూ ‘అవునా అంటే -అవునేవ్ ‘ అనుకొంటూ సరీగా సమయం వచ్చినపుడు మాత్రం ‘ఎడ్డెం అంటే తెడ్డెం’  అంటూ చెలరేగిపోతారు అని మనసులో ఓ మూలుగు మూలిగి , పైకిమాత్రం ‘  ఆహా….అలాగా ! ‘ అని తలాడించాను . “ఎప్పటికెయ్యది ప్రస్తుతమో….”  అని పెద్దలే చెప్పారు కదా !

ఇంతకీ ప్రయాణం వున్నట్టో లేనట్టో తేలక మా అత్తగారు గడియారం వంకా గేటువంకా చూస్తూ కూర్చున్నారు. నేను ‘ఈ గంట గడిస్తే చాలు’ చదువుదామా లేక  ‘ ఒంటరి పోరాటం’ లో మునుగుదామా అన్నది తేల్చుకోలేక సతమతమయిపోతున్నాను .

అంతలో హటాత్తుగా ” నువ్వు కరణంగారి ఇల్లు చూళ్ళేదు కదూ ” అన్నారు అత్తగారు . అడుగంటిన ఆశలు చిగురిస్తుండగా ” అబ్బే లేదండీ అత్తయ్యా ….కరణంగారి ఇల్లూ చూళ్ళేదు , కరణంగారి తల్లిగారినీ చూళ్ళేదు . ఆమాటకొస్తే  అసలు తేలు కుట్టిన మనిషినే ఎప్పుడూ  చూళ్ళేదు ” అని  గొంతులో పట్టినంత నిరాశని నింపుకుని జవాబిచ్చాను.  నా నోటినించి అరుదుగా వినవచ్చే “అత్తయ్యా”  అన్న పిలుపుకి ఆవిడ  వెన్నముద్ద మింగినట్టూ మొఖం పెట్టి, “అదేం భాగ్యం !పద నే తీసుకెళతాను. ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం. ఎవరిగొడవో మనకెందుకూ”   అని మెత్తగా అనేసరికి , రొట్టెవిరిగి నేతిలో పడ్డం అని దీన్నే అంటారేమో అనుకుంటూ ….హుషారుగా లేచి నుంచున్నాను .

ఎవరొచ్చినా రాకపోయినా మనం మాత్రం పావుతక్కువ మూడుకల్లా ఠంచనుగా బయల్దేరిపోవాల్సిందే కాబట్టి

నువ్వు అయిదంటే అయిదు నిమిషాల్లో తెమిలిపోవాలి అన్న అత్తగారు మూడున్నర నిమిషాల్లో ముస్తాబు పూర్తిచేసుకొచ్చిన నన్ను చూసి అవాక్కయిపోయారు. అంతలోనే తేరుకుని, నే కట్టుకున్న నల్లంచు తెల్లచీర ని ఎగాదిగాచూసి, “అబ్బా…ఏం బావుందే ఈ చీర , ఇక చీరలే లేనట్టూ …..!  నీ పుట్టినరోజునాడు కట్టుకున్నావ్ చూడు   చిట్టిచామంతి రంగుచీర  అది కట్టుకురా ఫో”  అంటూ ఆర్డరేసారు (నేకట్టిన నల్లంచు తెల్లచీర మా అమ్మాగారు పెట్టిందయితే  చిట్టిచామంతుల  చీర అత్తింటివారు పెట్టిందీ – అయ్యా అదీ సంగతి – అదేకదా అసలు సంగతి  )

నేను ఉస్సూరంటూ వెళ్ళి చీర మార్చుకొచ్చేసరికి మా అత్తగారు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు వాకిట్లో నిలబడిపోయారు . అప్పటికి గడియారంలో సమయం సరీగా రెండు గంటలా నలభై అయిదు నిమిషాలు .

మాంగారు, మా రాజుగారు చుట్టాలింట్లో ఊపనయానికి వెళ్ళటంతో  ‘వెళ్ళమంటారా  ’  అంటూ అర్జీ పెట్టుక్కునే అవసరం లేకపోయింది .

పెద్ద గదులు రెండింటికీ తాళాలు వేసి, మిగతా వసారాలు, వంటిల్లు ఎవడు ఎత్తుకుపోతాడులే అని  గెడలుమాత్రం తగిలించి   ఇద్దరం మా రాజమార్గం అయిన పెరటిగుమ్మoలోకొచ్చాం. అక్కడ నీడన గోళీలాడుకుంటున్న అప్పలమ్మ మనవడ్ని పిలిచి, తిరిగొచ్చాకా బెల్లం మిఠాయి పెడతాను . అందాకా ఇక్కడే అడుకోరా అని వాడిని కాపలాగా వుంచి , మా పెరట్లోని రెండడుగుల పాటిమట్టిగోడ అదాట్న దిగేసి అవతల పిల్లెంక మామ్మగారి దొడ్లోకి ఎంటరయిపోయాం .

మధ్యాహ్నం ఉక్కపోతకి నిద్రపట్టక అట్టముక్కతో ఉస్సురు ఉస్సురని విసురుకుంటూ అవస్థ పడుతున్న పిల్లెంక మామ్మయ్య మమ్మల్ని చూస్తూనే ” ఏవర్రా ….కరణంగారి ఇంటికేనా నేనూ వస్తా  ఆగండి అంటూ అలా మాయమయి ఇలా ప్రత్యక్షమయిపోయారు తెల్లని గ్లాస్కో చీర లో ఉమ్మెత్తపువ్వులా .

తోటికోడలిమీద పంతానికి ప్రయాణమయితే అయ్యారు కానీ  లోలోలపల  అత్తగారికి కొంచెం బెదురుగానే వుంది . ఇద్దరం ఎలాగూ వెళ్ళటం అని. ఎందుకంటే,  నాలుగు దిక్కులా నలుగురయినా లేకపోతే అత్తగారికి అడుగు పడదు. ఊర్లో రోడ్డుమీద నడవాల్సివచ్చిన ప్రతిసారీ  కొత్తగా ఓణీవేసిన పడుచుపిల్ల పదిమందిలో మసలాల్సివచ్చినప్పుడు  ఎంత తత్తరపడుతుందో  అంతకంటే ఓ మోతాదు ఎక్కువే కంగారుపడతారు . అందుకే ఆవిడ వస్తాననగానే “ అంతకంటేనా పిన్నమ్మా . అసలు నేనే మీకు కబురుపెడదామనుకున్నాను” అనేసారు .

మేం  ముగ్గురం మామ్మయ్యగారి దడి కంతల్లోంచీ అవతల పక్కనున్న వర్మగారి వాకిట్లోకి, అక్కడినుంచీ సందులా వున్న సన్నని మట్టి రోడ్డుని గబుక్కున దాటేసి, మందపాటోరి పెరట్లోకి వెళ్ళాం .

మమ్మల్ని చూస్తూనే మందపాటివారి చిన్నకోడలు చేస్తున్న పని వదిలేసి , మొహం చాటంత చేసుకుని ఎదురొచ్చేసారు . రండి రండి ….ఇప్పుడే అనుకుంటున్నాం ఏం తోచటంలేదు ఎవరన్నా వస్తే బావుండూ అని ” అంటూ మా చేతులు పట్టుకుని సావిట్లోకి లాక్కుపోయి చాపమీద కూర్చునేదాకా వదల్లేదు.

హుం…పాపం!  మనుషులకి మొఖం వాసిపోయి వున్నట్టున్నారు అనుకున్నాను. ఎకరం స్థలంలో చుట్టూ కోటగోడలాంటి ప్రహారీ మధ్యన ఎక్కడో లోతుగా వున్నట్టుందా ఇల్లు. కావాలని వారి  వాకిట్లోకి వచ్చివాలిన జీవులు తప్ప ఇతరాలేవీ వారి కళ్ళపడవు .  ఆ లంకoత కొంపలో వుండే మనుషులు ముచ్చటగా ముగ్గురే  .

మనం వెళ్ళవలసింది కరణంగారి ఇంటికి కదా మధ్యలో ఈ మజిలీలేవిటీ అని మా అత్తగారి చెవి కొరికాను . ఆవిడ ఏం చెప్పకుండా  మొఖం అంతా నవ్వు పులుముకుని, ” కరణంగారి ఇంటికి వెళుతూ మిమ్మల్నీ చూసిపోదామని వచ్చాం….ఇంతకీ మీ అత్తగారెక్కడా …. పడుకున్నారా ? అని ఆ ఇంటావిడని ఆరాగా అడగుతుంటే ….”ఓసోస్ ….మీరటే  ఎన్నాళ్ళయింది చూసి, అందరూ బావున్నారా “ అని బోసి నవ్వులు  చిందిస్తూ వచ్చారు మందపాటి మామ్మగారు .

మిలట్రీ సెల్యూట్ లా  మర్యాదకోసం ఓ సారి లేచి నుంచొని మళ్ళీ కూర్చున్నాం అందరం .

“మాకేం నిక్షేపంలావున్నాం. మీ ఆరోగ్యం ఎలావుందీ ? “ ఆరాగా అడిగారు అత్తగారు.

“పళ్ళసెట్టేనా ? బీరువాలో వుందమ్మా . ఎమేవ్….తీసి చూపించు”  అని కోడలికి సైగ  చేసారు.

మేం అందరం గుడ్లుతేలేసి, ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం .

ముందుగా తేరుకున్న పిల్లెంక మామ్మయ్య….” పెద్దకొడుకు ఇంటినుంచీ ఎప్పుడొచ్చారు?”  అనడిగారు కాస్త స్వరంపెంచి .

“మరే ….బాగా చెప్పారు వదినియ్యా.  పెద్దాడు కట్టించిన పళ్ళు చిన్నాడింట్లో అరగ్గొట్టుకుంటే బావుంటుందా . అందుకే ఇక్కడికి రాగానే తీసి బీరువాలో పెట్టించాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాకా  తగిలించుకుంటాను ” అంటూ ఒక బోసినవ్వు మాకు వరంగా ప్రసాదించారు. వెనకే నిలబడి తలకొట్టుకుంటున్న కోడలిని ” తీసి చూపించవే ” అంటూ గద్దించేసరికి ఇక తప్పదనుకొన్న ఆవిడ, గోడబీరువా తీసి , అందులోంచీ ఒక ప్లాస్టిక్ డబ్బా తెచ్చి మా ముందుపెట్ట్టారు .

నీళ్ళలో తేలుతున్న కట్టుడుపళ్ళు  ఊరేసిన ఉసిరికాయల్లా బాగానే వున్నాయి .

ఏంచెప్పమంటారు పెద్దావిడ చాదస్తం . మేం కొన్న కాలిజోడు మా గుమ్మం దాటాకా విప్పేస్తారు . కూతురు వేయించిన కళ్ళజోడుతో కూతురు కాపురమే చూస్తారట . ఇదిగో ఇప్పుడిలా ….అంటూ ఆ కోడలు చెప్పుకుంటున్న కష్ట సుఖాలని వింటూ ఆవిడ పెట్టిన కారప్పూస -కోవాబిళ్ళ కాదనకుండా తినేసి , చల్లని మంచినీళ్ళు తాగి ఇక వెళతాం – మళ్ళీ ఎపుడయినా తీరిగ్గా వున్నప్పుడు తప్పక వస్తాం అంటూ లేచాం .

అక్కడినుంచీ మరో నాలుగిళ్ళు చుట్టి, నలుగురి యోగక్షేమాలూ విచారించాం .

ప్రమీల అత్తయ్య స్పెషల్ గా ఆర్డరిచ్చి నేయించుకున్న బండారులoక చీరలు  లాగీ-పీకీ చూసి,  ఆహా- ఓహో అనేసి అక్కడే కాసిన్ని జంతికముక్కలూ ఇంకాసింత టీ నీళ్ళు కడుపులో పోసుకున్నాం. పెనుమత్స వారి రెండు మండువాల లోగిలి లో ఉన్న ఆరువాటాలవారినీ ఒకసారి పలకరించి, వాళ్ళు కొత్తగా కొనుక్కున్న స్టీలు కేనులూ, ఇత్తడి పళ్ళాలు వంటివాటి నాణ్యతా ప్రమాణాలమీద కాసేపు చర్చించుకొన్నకా చిమ్మిలుండలూ, కరకజ్జం , మజ్జిగదాహం వంటివి వద్దు వద్దంటూనే పట్టించేశాం .

అలాగే , పనిలో పనిగా… కూరలు కోస్తూ  వేలుకోసుకుని,  రక్తంకంటే ఎక్కువ కన్నీరు కార్చేసిన సుబ్బరాజుగారి పట్నం కోడలి కళ్ళుతుడిచి (  వాళ్ళమ్మగారిది  హైడ్రాబేడ్ లెండి ) ఏం పర్లేదు అదే అలవాటవుతుందిలే అని ధైర్యం చెప్పి, ఈ మధ్యే కిడ్నీలో నాలుగు రాళ్ళు పోగేసుకున్న భాస్కరం గారిని ” ఇప్పుడెలావుందండీ- పాపం అంత బరువెలామోస్తున్నారో ” అని  తలుపుచాటునుంచే పరామర్శ కావించీ , అమెరికాలో ఉంటున్న అచ్చిగారు అక్కడ మంచులో కాలు జారి పడబోయారుటకదా  అందదూరం వెళ్ళి ఎలాగూ విచారించలేం  అని, ఇక్కడే వుంటున్న అచ్చిగారి తాలూకా వాళ్ళని వివరాలు అడిగి -మాకు తోచిన జాగ్రత్తలు చెప్పి  జనాభాలెక్కల కోసం ఇల్లిల్లూ తిరిగేవాళ్ళలాగా ఒక్క ఇల్లూ వదిలిపెట్టకుండా  ఆ వరసలోఉన్న అన్నిళ్ళూ చుట్టేసాం. మళ్ళీ ఎప్పటికి ఇంట్లోంచి బయటికొస్తామో ఏవిటో అనుకుంటూ . (అవతలి వరసలోకి కూడా వెళ్ళేవాళ్ళమే కానీ ఆ వరసలోనే మా అత్తగారి తోటికోడలుండేది)
అప్పటికే  మేం బయలుదేరి చాలా సేపయింది .

ఇదే ఈ వీధిలో చివరిల్లేమో ! ఇక నయినా కరణంగారింటికెళదామా ….లేకపోతే ఇక్కడినుంచే వెనక్కి మళ్ళేద్దామా అనడిగాను అత్తగారి వీపుగోకుతూ రహస్యంగా. మా అత్తగారు నాకేసి గుర్రుగా చూసి, అటువైపు కూర్చున్న పిల్లెంక మామ్మ తో సంప్రదించి, దారిలో చిట్టిపంతులుగారి కొత్తకోడలిని చూసి, చివరాకర్లో ఆ పక్కనే వున్న కరణంగారింటికి వెళితే యాత్రా పరిసమాప్తమయినట్టే అని తీర్మానించేరు .

పంతులుగారి ఇల్లు  హైస్కూల్ వెనక వుందట  . దాంతో ఇక రాజుల వీధి వదిలి రోడ్డెక్కక తప్పలేదు . దొడ్డిగుమ్మాలూ, మొండిగోడలూ మీదుగా చేసే చాటుమాటు ప్రయాణం ఇక తప్పింది కదా  దర్జాగా నడివీధిలో నడిచిపోవచ్చు అని సంబరపడుతున్న నన్ను వెనక్కి గుంజి “ఇదిగోవిను ”  అంటూ కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు అత్తగారు . వాటిలో ఒకటీరెండు – తలొంచుకుని రోడ్డు చూస్తూ నడవాలి తప్ప తలెత్తి పరిసరాల పర్యవేక్షణ చేయకూడదనీ , ఎవరన్నా ఎదురుపడి మాట్లాడిస్తే ఓ చిరునవ్వు నవ్వు నవ్వితే చాలనీ, అదేపనిగా నోరంతా తెలిచి మాట్లాడక్కరలేదనీ . నేను ఆ ప్రకారముగా వాటినే నెమరేసుకుంటూ … ఏవిటో ! ఎంచక్కా దర్జాగా తలెత్తుకు తిరగాల్సినచోట, దొంగల్లాగా ఈ దొడ్డిదారి ప్రయాణాలేంటో. పోనీ ఇప్పటికన్నా వీధిన పడ్డాం అని సంతోషించడానికి లేకుండా మళ్ళీ ఈ చాటుమాటులెందుకో   అర్ధరాత్రి స్వతంత్రం గురించి గాంధీగారు ఆలోచించేశారు కాబట్టి, మాఊర్లో మేం పట్టపగలు నడివీధిలో నిటారుగా నడిచి పోయే రోజు కోసం నేను పోరాటం చెయ్యాలో ఏమో అని కుంచెం సీరియస్గా ఆలోచిస్తూ తలొంచుకుని మా అత్తగారి కొంగు ఆనవాలుగా ముందుకి కదిలాను .

మా అత్తగారు వినయవిధేయతలు ప్రదర్శిస్తూ భుజాలు మెడా కాస్త వంచి “పిన్నమ్మా మీరు ముందు నడుద్దురూ….” అంటూ మమ్మయ్యని ముందుకు తోసి ఆవిడ వెనకాల నక్కి నక్కి నడుస్తున్నారు . హతవిధీ…అనుకుంటూ నేను అత్తగారిని అనుసరిస్తున్నాను. చింత చచ్చినా పులుపు చావలేదనీ, ఇంకా ఈ ఘోషాలూ, భేషజాలూ ఎందుకండీ. మా ఊర్లో మేం ఎంచక్కా అవతల వీధికీ ఇవతలవీధికీ మా ఇష్టం వచ్చినట్టూ తిరుగుతాం మమ్మెల్నెవరూ ఏవీ అనరు తెలుసా ! అని ఒకసారెప్పుడో అత్తగారితో వాదనకు దిగాను.

“  ఏవిటా వితండవాదం….మీ ఊళ్ళోవాళ్ళకి పద్ధతులూ పాడూ తెలీవు  . ఈ ఊళ్ళో ఇదే పద్ధతి ఇలానే వుండాలి లేకపోతే ఆక్షేపిస్తారు. పూర్వంలా మీనాలూ, పల్లకీలూ లేకపోయినా మా అత్తగారి కాలం వరకూ తెరలుకట్టిన  సవారీ బండ్లలో వెళ్ళేవారు . రానురానూ రెండెడ్లబండి ఎక్కడం అంటే చిన్నతనం అయిపోయింది. అందుకే ఇలా రెండు కాళ్ళకీ పనిచెప్పాల్సి వస్తుంది అంటూ  చెరిగిపారేసారు . రెంటికీ చెడ్డ రేవడులాగా అటు సవారీబళ్ళూ లేవు, ఇటు ఘోషాలూ తప్పటంలేదు   . హుమ్మ్…ఏం చేస్తాం రోమ్మ్ లో ఉన్నప్పుడు రోమన్ లా వుండమన్నారు  అనుకుంటూ అత్తగారిని ఫాలో  అయిపోతున్నాను .

అలా రైలుబండి లాగా  ఒకరి వెనక ఒకరం నాలుగు గజాలదూరం నడిచి చిన్న మలుపు తిరగ్గానే  టక్కున సడెన్ బ్రేక్ వేసినట్టూ నిలబడిపోయారు అత్తగారు . ఏవిటా!  అని తలెత్తిచూద్దును కదా  రోడ్డుపక్కగా ఎవరి వాకిట్లోనో దడివారగా నిండా పూలతో కళకల్లాడుతున్న ముద్దబంతి చెట్టును చూస్తూ   నిలబడిపోయారు పిల్లెంక మామ్మయ్య . ఇంజనులాంటి ఆవిడ అలా ఆగిపోతే బోగీలం మేం ముదుకెళ్ళాలేం కదా ! మా అత్తగారు …అయ్యో రాత అనుకుంటూ “రండి పిన్నమ్మా ఎవరన్నా చూస్తే బాగోదు”  అని ఆవిడ బుజం పట్టుకు లాగుతున్నారు . ఆవిడ అదేం పట్టించుకోకుండా “అబ్బ..! ఎంతపెద్ద పువ్వులో చూడవే  నాలుగు పువ్వులు కోద్దామంటే విత్తనాలు కట్టుకోవచ్చు”. అని అదేపనిగా మురిసిపోతున్నారు . ఇంతలో చూరుకిందనించీ తొంగిచూసిన ఆ ఇంటావిడ  బయటికొచ్చి, “అయ్యగారూ  తవరా… “ అని అమితానందంతో పులకించిపోతూ” ఎండగావుంది కున్ని మంచినీళ్ళు ఉచ్చుకుంటారా…పోనీ మజ్జిగదాహం కలపమంటారా “ అంటూ వాకిట్లో నులకమంచ వాల్చి అతిధి మర్యాదలకు దిగింది . ఆ సమయంలో మా అత్తగారి ముఖంలో మారిన రంగులు చూసితీరాల్సిందే. ”  చాల్లే వే … మేవేవన్నా కాశీ రామేశ్వరం పోతూ మార్గమధ్యంలో మీ ఇంట్లో విడిది చేశామా ! అని  వెట ’ కారం‘ గా అనేసి  , ఇంకా అక్కడే నిలబడ్డ మామ్మయ్యని ఒక్క గుంజు గుంజి రోడ్డెక్కించారు.

“ కోడలుగారు గావాలసండి …… ముద్దబంతిపువ్వులా ఇంచక్కున్నారు “ అని  ఆ ఇల్లాలు వెనకనించీ అనడం నాకు వినిపిస్తూనేవుంది. ఇలాంటిచోట ఇంకాసేపుంటే ఇంకెన్ని ‘ఎంచక్కని’  మాటలు వినచ్చో కదా ! ఏవిటో అత్తగారి  పద్ధతి.  ఇలాంటి మాటలు అస్సలు చెవికెక్కించుకోరు.  ఆమధ్య మా ఇంటికి సారె పంచడానికొచ్చిన బొండాం షావుకారు భార్య ” కోడలుగారు పటికీబెల్లం ముక్కలా మిలమిల్లాడిపోతన్నారండి ” అంది ఆ మాట కూడా మా అత్తగారు విననట్టే ప్రవర్తించారు . హుం…అదేవిటో ! అని మనసులో అనుకుంటూ అయిష్టంగానే అత్తగారిని అనుసరించాను .

మరో రెండు నిమిషాలు తలొంచుకు నడిచి, చివరికి పంతులుగారి  ఇల్లు చేరాం. మార్గమధ్యంలో మాకు ఎదురయిన  కొన్ని సైకిళ్ళూ, గడ్డిమోపులూ, నీళ్ళకావిళ్ళూ వాటంతట అవే పక్కకి  తప్పుకుంటే ఒకటో రెండో మమ్మల్ని ఖాతరుచేయకుండా అదే స్పీడులో ముందుకెళ్ళిపోయాయి. అలా వెళ్ళినవాటిని ‘ ఫలానా కదూ ‘ అని మా అత్తగారు వివరాలతో సహా గుర్తుపెట్టుకున్నారు .

వాకిట్లో  పడక్కుర్చీలో విశ్రాంతిగా పడుకున్న  చిట్టిపంతులుగారి అబ్బాయి , మా అత్తగారిని చూస్తూనే  హెడ్మాస్టర్ని ఇంటిదగ్గర చూసిన స్కూలు పిల్లాడిలా తడబడిపోయి , బాగోదన్నట్టుగా ఒక బలవంతపు నవ్వి, పలకరించే అవకాశం లేకుండా పెద్దపెద్ద అంగలేసుకుంటూ రోడ్డుమీదికి పారిపోయారు ( ఎందుకూ? ఏవిటీ? అనేది ఇంకోసారి చెప్పుకుందాం)

”  మీరా ….రండి రండి . ఏవిటో విశేషం ! ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేసారూ ….అందరూ కులాశానా ” అంటూ  మందారమొగ్గలు కోసుకుంటున్న పంతులుగారి భార్య ఆశ్చర్యపోతూ ఎదురొచ్చారు

అన్ని ఇళ్ళలోనూ చెప్పుకొచ్చినట్టే” ఇలా కరణంగారింటికెళుతూ…..అంటూ కాశీ మజిలీకథంతా  చెప్పుకొచ్చారు అత్తగారు.  “అలాగా”  అంటూ ఆవిడ నా దగ్గరగావచ్చి “కోడలుగారూ విశేషాలేం లేవా ” అనేసరికి నేను కాసిన్ని సిగ్గులు ఒలకపొయ్యాల్సివచ్చింది. అలా నాలుగు కబుర్లయ్యేసరికి,  ప్రత్యక్షమయింది పంతులుగారి కొత్త కోడలు పచ్చనిపాదాలతో , పాపిట్లో కుంకుమా కంఠానికి గంధం, తలలో చామంతిచెండు తో . “అచ్చం పార్వతీదేవిలా లేదూ” అన్నారు మా అత్తగారు నా చెవిలో . అవున్నిజమేనండోయ్…పార్వతీదేవి చేతిలో అరటిపళ్ళ అత్తం కూడా వుంది అన్నాను ఆమెనే ముచ్చటగాచూస్తూ .  ప్లేట్లో చలివిడీ  , అప్పాలు పెట్టుకొచ్చారు కామాక్షమ్మగారు .

అప్పటికే బిగ్గా పట్టించేసిన మేం అబ్బెబ్బెబ్బే…..అని ఎంత తోస్తున్నా వదలకుండా  తలోరెండూ తినిపించేసారు. తింటున్నంతసేపూ …పంతులుగారి కోడలి గుణగణాల గానం చేస్తూనేవున్నారు మా అత్తగారు . ఆహా..ఏం వినయం, ఏం వందనం, ఏం మర్యాద, ఏం అభిమానం…ఏం అదీ..ఏం ఇదీ…. ఆ రంగూ, ఆ రూపూ ,ఆ స్వరం  అంటూ ,  ఆ గానం అలా ఎందాకా సాగేదోకానీ,

” అయ్యగారండోయ్…మీరిక్కడ కూకొని కథలు సెప్పుకుంటన్నారా …..మీకోసం ఊరంతా తిరిగితిరిగి వత్తన్నాను . రాజుగారు ఊర్నించీ వచ్చేసేరండి. కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చేవోళ్ళు లేరని నిప్పులు కక్కేత్తన్నారండి బాబూ….” అంటూ  ఫైరింజన్  సైరన్లా  వీధిలోంచే అరిచేస్తున్నాడు అబ్బులు .  ఆ హడావిడికి   తింటున్న చలివిడి అంగిట్లో అంటుకుపోయి ఊపిరాడక కళ్ళుతేలేసారు అత్తగారు. పార్వతీదేవి లాంటి పంతులగారికోడలు నిమ్మళంగా నీళ్ళుతాగించి, వెన్ను పామేసరికి తేరుకుని తెరిపినపడ్డారు  .

“ఇక వెళతాం”  అని చెప్పేసి అర్జెంటుగా గుమ్మందిగేసిన అత్తగారితో ” అయ్యో ఇంతాచేసి కరణంగారి ఇంటికి వెళ్ళొద్దూ….తేలు కుట్టినావిడని చూడొద్దూ ??” అంటుంటే  ” అబ్బా ఇంకోసారి వద్దాంలేవే ” అని నన్ను తోసుకొచ్చేసారు అత్తగారు. ఇంకోసారంటే మళ్ళీ  తేలుకుట్టినప్పుడా అని అడగాలనుకున్నాను కానీ , అప్పటికే మా అత్తగారు  ” ఒరేయ్…నువ్వెళ్ళి ఇద్దరికీ వేణ్ణీళ్ళు కాచిపొయ్యి  అంతలోపల మేం వచ్చేస్తాం “ అని అబ్బులిని ఆజ్ఞాపిస్తూ వెనకాముందూ చూసుకోకుండా  రోడ్డెక్కేసి , వాడికంటే ముందు నడిచి చిరుచీకట్లో కలిసిపోయారు   కంగారులో ఘోషా మాట మర్చిపోయిన కలిదిండి మహరాణిగారు .

–దాట్ల లలిత

కలలు కావాలి జీవితం దున్నడానికి…!

“కళ్ళు తుడుస్తాయి కమలాలు వికసిస్తాయి మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా”- కవిత్వాన్ని ఒక ఉత్సవంగా పాడుకునే గజల్ సంస్కృతిని అమితంగా ఆరాధించే గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యాల్లో ఆ సౌకుమార్యం, అత్తరు సౌరభాల సంగీతం గుభాళిస్తూ ఉంటాయి. వసంతం వాసనేస్తే ఉండబట్టలేని నవకోకిలలా జీవన తరుశాఖల్లో తియ్యని రాగాల్ని ఒలకడమే ఈయన కవిత్వ లక్షణంగా కనపడుతుంది. పువ్వునీ శిల్పాన్నీ దారంతో కలిపి ఇల్లు అల్లుకునే సాలెపురుగు లోని ప్రజ్ఞ ఈయన కవితా వైవిధ్యంలో గోచరిస్తుంది.

నిశ్శబ్ధమైన తోట మానసిక ఆవరణంగా, అక్కడి కొమ్మలపైని పక్షి పాడుకునే పాటలు భావోద్వేగాలకు ప్రతీకలుగా, పక్షి ఉత్సాహ ,విశ్రాంత, విషాద అనుభూతులకు సంకేతంగా- ఇవే చిహ్నాలు ఎన్నో సందర్భాల్లోని సంఘటనలకు రూపాంతరాలుగా మారి అంతస్సూత్రంగా కనిపిస్తుంటాయి శేషేంద్ర కవితా ఇతివృత్తాల్లో. మరికొన్ని చోట్ల అదే తోట స్థబ్ధమయ్యి, నిర్లిప్తమయి “గాలితో కుట్ర చేసి ఒక్కో పరిమళం/ ఒక్కో గడిచిపోయిన దూరదూర జీవితదృశ్యాన్ని” ఆవిష్కరిస్తుంటే “గుండెనరాల్ని తెంపే/ఆ క్రూరమైన పక్షుల గానస్వరాలకు” తట్టుకోలేక తల్లడిల్లే స్వాప్నికుడు ఎదురవుతాడు. అటువంటి కలవరపాటు కవి సమయాల్లో వెలువడ్ద ఒక కవితలోని పంక్తులు ఇవి;

 

గడియారంలో కాలం

                                        -గుంటూరు శేషేంద్ర శర్మ

అందరూ నిద్రపోయారు

గడియారాన్ని ఒంటరిగా విడిచిపెట్టి…

భయంతో కొట్టుకుంటోంది దాని గుండె-

మొరుగుతూ ఉంది ఒక కుక్కలా దూరాన

దిగంత రేఖ

ప్రార్ధిస్తోంది రాత్రి మైదానాల్లో మోకరించి

 

భూదృశ్యాలూ సముద్రదృశ్యాలూ

తపస్సులు చేస్తున్నాయి,

ఒక్క పాటకోసం బతుకు బతుకంతా సమర్పించిన

వాడెక్కడని

వాటికి గొంతులు ఇచ్చేవాడు వస్తాడనీ

మాటల దేశాల్లో వాటికి దేవాలయాలు కడతాడనీ

నిరీక్షిస్తున్నాయి.

 

తిరుగుబాట్లు లేస్తున్నాయి మనోమయలోకాల్లో

నిశ్శబ్ధాల గనుల్లో నా ఆత్మ సొరంగాలు తవ్వుతూ ఉంది

విలువైన రాళ్ళకోసం అన్వేషిస్తూ-

ఆకాశాన్ని చూస్తుంది రెక్కలు విప్పి

నా కిటికీ…

 

వలలు కావాలి సముద్రం దున్నడానికి

పడవ భుజాన వేసుకున్నవాడికి

కలలు కావాలి జీవితం దున్నడానికి

గొడవలు భుజాన వేసుకున్నవాడికి

విలవిల కొట్టుకుంటున్నాను నీళ్ళు కోల్పోయిన చేపలా

కలలు కోల్పోయిన నేను-

—-

87648618-seshendrasharma-the

జీవన సంరంభానికి కాసేపు విరామమిచ్చి లోకమంతా చీకటి పక్కపై ఒత్తిగిల్లింది.  అరక్షణమైనా ఆగడానికి వీల్లేని కాలం మాత్రం వేకువ కోసం ఎదురు చూస్తూ రాత్రంతా ఒంటరితనపు భయాన్ని పోగొట్టుకునేందుకు గుసగుసగా లోపలెక్కడో చెప్పుకునే మాటల శబ్ధంలా- గడియారపు ముళ్ళు నిద్రల్లో, నిశీధిలో నిర్విరామంగా కాలం గుండెచప్పుడులా మోగుతూ ఉన్న సమయం. దిక్కులన్నీ భూమికి అవతల కాంతి వలయాల్లో కలుసుకునే చోట- ఎత్తునుంచీ, దూరాన్నుంచీ వేర్వేరు రూపాలుగా కనపడుతున్న భూభాగాలని చూసి వాటికన్నిటికీ కలిపి ఒకే అర్ధం ఇవ్వలేక, ఒక వృత్తంలో చుట్టెయ్యలేక నిరాశ పడుతుంది దిగంతరేఖ.

  సడి లేని వేళ అనువు చుసుకుని తపస్సుకి సిద్ధమౌతాయి మైదానాలు, సముద్రాలు, పర్వతాలు అన్నీ ఒక రససిద్ధి కోసం. దృశ్యాలుగా వాటికో సవర్ణమైన ప్రతిబింబాన్నిచ్చే కుంచెకోసమో, మాటలుగా పాడే కవి కోసమో. జీవితాన్ని త్యజించి రాత్రులని ఒత్తులుగా చేసి కలలని వెలిగించుకున్న సాహసి కోసమో, “ఒక్క పాటకోసంబతుకు బతుకంతా సమర్పించిన” స్వాప్నికుడి కోసం రాత్రులు మైదానాల్లో సాష్టాంగపడి ప్రార్ధిస్తూ ఉంటాయి.

నడక విసుగెత్తిన కాళ్ళు మజిలీ కోసం మొరాయిస్తే అలసట లేని ప్రయాణదాహం రెక్కల మొలిపించుకొమ్మంటుంది. కిటికీ రెక్కలు తెరుచుకుని పక్షిలా ఎప్పుడూ ఒకేదూరం నుండి ఆకాశాన్ని చూస్తూ ఏమని ఆశపడుతుందో తెలీదు. ఈ వేగం చాలదని, ఈ దారి మార్చమనీ, అమూల్యమైనవి సాధించుకోవడం కోసం గొంతు పెకల్చుకొమ్మని, నీ ఆశల్ని చెప్పెయ్యగల ఒకే ఒక్క మాటను సంపాదించుకొమ్మనీ మనసు తిరుగుబాటు మొదలు పెట్టింది. ఏకాంతం కుదిరిన కొన్ని అరుదైన క్షణాల్లోనే వెతుక్కోవలసిన లోపలి నిధులకోసం నిశ్శబ్ధాన్ని పొరలుగా పెకలించుకుంటూ మూలాలకి చేరుకున్నప్పుడు దొరకబోయే రాళ్లలో రత్నాలెన్నో అన్న ఆరాటంతో “ఆత్మ సొరంగాలు తవ్వుతూ ఉంది.”

అలలపైన తేలడమే బతుకైన వాడికి పడవ మోస్తున్న తన బరువుని బాధ్యత రూపంలో పడవతో పాటుగా తిరిగి తన భుజాలపైకి ఎత్తుకోక తప్పదు. ఉప్పునీటిని వడకట్టేసి  సముద్రసంపదని వెలికి తీసుకొచ్చే వలల్లాగే గొడవల్ని, అసంతృప్తుల్నీ అసాధ్యాల్నీ నీళ్లలా జార్చేసి సౌందర్యాన్ని, సంతోషాన్నీ మాత్రమే మిగిల్చి చూపించగల కలలూ అవసరమే “జీవితం దున్నడానికి గొడవలు భుజాన వేసుకున్నవాడికి”. గడియారంలోని కాలంలా వాస్తవాల్లో బందీ అయి అదే వృత్తంలో తిరగడం తప్పనిసరి అయినప్పుడు, ఒక లిప్తపాటు ఆ భ్రమణం నుంచి తప్పించుకుని కలల ఆకాశాల్లో ఎగిరిపోవాలనే కవి తపన ఈ కవితలో వ్యక్తమౌతుంది.

 

                                                                                                       —–**—-                                                    1swatikumari-226x300—స్వాతి కుమారి

 

ఒక తెలుగమ్మాయి ఇంగ్లీష్ నవల

sathyavati

ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థితప్రజ్ఞత(జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతోపాటు పత్రికని కూడా పక్కన పెట్టేసి పనుల్లో మునిగిపోగలం . అయితే మరొక వార్త  దాని పక్కనే ఉంటుంది. రైతుల కుటుంబాలకి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిందని!,. ప్రకటించడానికీ .ఇవ్వడానికీ మధ్య ఉన్న అంతరం తెలీని సామాన్యులం, “గుడ్డిలో మెల్ల” అనుకుంటాం.

ఈ అంతరాన్ని గురించే కోట నీలిమ “షూజ్ ఆఫ్ ది డెడ్” అనే ఒక ఆలోచనాత్మకమైన నవల వ్రాసింది. ఇక ఇప్పుడు “మెల్ల” ఏంలేదు అంతా అంధకారమే అనిపిస్తుంది ఈ నవల చదువుతుంటే .అయితే కోట నీలిమ ఈ నవలని ఒక ఆశావహ దృక్పథంతో ముగించింది. దాన్ని మనం “విష్ ఫుల్ థింకింగ్” అనుకున్నాకూడా!! విదర్భలోని పత్తి రైతుల ఆత్మహత్యలు ఈ నవలకి మూలం అని ఆమే చెప్పుకున్నది.విదర్భలో విస్తృతంగా పర్యటించి అనేకమందితో సంభాషించి వ్రాసానని చెప్పింది. రైతుల ఆత్మహత్యలు,డిల్లీ రాజకీయాలు, జర్నలిజంలో నిబద్ధత ముప్పేట అల్లికగా సాగిన ఈ నవల , కథ క్లుప్తంగా…

అసలు రైతుల ఆత్మ హత్యలకి నిజమైన కారణాలు శోధించడం ఎక్కడ నుంచీ మొదలు పెట్టాలి? ఆహార పంటలకి అనువైన పొలాల్లో వ్యాపార పంటలు వెయ్యడం మొదలుపెట్టినప్పటినించా? రైతులు తమ విత్తనాలు తాము తయారుచేసుకోకుండా మేలిమి విత్తనాలని నమ్మచెప్పే కంపెనీల విత్తనాలు కొనుక్కోడం మొదలుపెట్టినప్పటినుంచా? అధిక దిగుబడి ఇస్తాయని చెప్పి కృత్రిమ ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలూ వాటికి అనువుకాని నేలల్లో వెయ్యడాన్ని ఎవరూ నిరుత్సాహపరచకపోవడం మొదలు పెట్టినప్పటినుంచా? తమ ఆరోగ్యాలనుకూడా లెక్కచెయ్యకుండా సంప్రదాయ కీటక నాశనుల బదులు ఘాటైన పురుగుమందులు చల్లడం మొదలుపెట్టినప్పటినుంచా? అధిక దిగుబడి మీద రైతుకు  ఆశ కలుగచేసిన మార్కెట్ సంస్కృతా? చాపకిందనీరులా పాక్కుంటూ వచ్చిన ఈ క్రమాన్నిఇప్పటికైనా గుర్తిస్తున్నామా? మరి ఇప్పటికిప్పుడు వాటినిఆపడం ఎట్లా? రైతుల్ని బ్రతికించుకోడం ఎట్లా? అని సామాన్యులం ఆలోచిస్తాం. .కానీ “మాన్యుల” ఆలోచనలు మరొక విధంగా కూడా వుంటాయి..అంటే ఇలా:

రైతుల ఆకస్మిక మరణాలన్నీనిజంగా ఆత్మహత్యలేనా? పోనీ ఆత్మహత్యలే అనుకుందాం, అవి వానలు కురవక పంటలు పండక, విత్తనాలకీ ఎరువులకీ పురుగుమందులకి చేసిన అప్పులు తీర్చలేక అప్పిచ్చిన వారి వత్తిడి భరించలేక చేసుకున్న ఆత్మహత్యలా? విలాసాలకీ  తాగుడికీ అలవాటుపడి అప్పులుచేసి తీర్చలేక చేసుకున్న ఆత్మహత్యలా?  టీ వీ, సినిమాల ద్వారా పల్లెటూళ్ళకి పాకిన వినిమయ సంస్కృతా? లేక చావుద్వారా తమ కుటుంబానికి నష్టపరిహారం రూపంలో డబ్బు రావాలని చేసుకున్నవా? ఒకే ప్రదేశంలో కొద్దిరోజుల్లోనే ఇన్ని ఆత్మ హత్యలు ఎందుకు సంభవిస్తున్నాయి?అందుమూలంగా ఆ ప్రదేశానికి చెందిన ప్రజాప్రతినిధికి తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని పట్టించుకోడంలేదని  చెడ్డపేరు రాదా?!!  పార్టీలో అతనికున్న పలుకుబడికి  ఎంత విఘాతం? పార్టీకి కంచుకోటలా వున్న ఆ నియోజకవర్గంలో రైతులు నిస్సహాయులైపోయి, ఆత్మహత్యలనే తుది పరిష్కారాలనుకోడం , ఎంత అపఖ్యాతి? ఇవి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లొ మళ్ళీ ఆ పార్టీని. ఆ ప్రతినిధిని ప్రజలు ఎన్నుకుంటారా? కాబట్టి ఈ సమస్యను ఎట్లాపరిష్కరించాలి.?  వాటి సంఖ్యని తగ్గించి చూపించా? ప్రమాదాల స్థాయిని తగ్గించి చూపడం ప్రభుత్వాలకి అలవాటే కదా!!

వారసత్వ రాజకీయ పదవీ సంపద అనే వెండి చెంచాతో పుట్టిన ఒక యువప్రజాప్రతినిథికి  వచ్చిపడిన సమస్య ఇది అతడు“రాజకీయాలలోకి వచ్చాక మొహానికి  మాస్క్ వేసుకోనవసరం లేకుండా మాస్క్ తోనే పుట్టాడ”ట .పదవీ, అధికారం తనకు పుట్టుకతోనే వచ్చాయనీ ,తను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననీ అతని నమ్మకం,అభిజాత్యం  కూడా ఎందుకంటే,అతని తండ్రి ప్రస్తుతం అధికారంలో వున్న మిశ్రమ ప్రభుత్వంలో మెజారిటీ పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీ ముఖ్య కార్యదర్శుల్లో ఒకరు .ఆయన మంత్రిగా వున్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో కలిగిన జన నష్టానికి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామాచేసి పార్టీకే అంకితమైన నిజాయతీపరుడుగా ప్రఖ్యాతిపొందాడు. అటువంటి మహనీయునికి  కొడుకుని పార్లమెంట్ కి గెలిపించడం పెద్ద కష్టమేమీ కాదు కదా! పైగా అనేక మంది వృద్ధ నేతల్లాగే దీపం వుండగానే రాజకీయాల్లోకి వారసులను ప్రవేశపెట్టాలనే కోరికకు అతీతుడేమీ కాదు !అందుకని  కొడుకుని జాగ్రత్తగా తీర్చి దిద్దుకుంటూ వస్తున్నాడాయన. అట్లా ఆరునెలలక్రిందట పార్లమెంట్ లో అడుగుపెట్టిన  ఈ యువ ప్రతినిథి పేరు కేయూర్ కాశీనాథ్ ,ఆ తండ్రిపేరు వైష్ణవ్ కాశీనాథ్.. అతని నియోజకవర్గం అయిన మిత్యాలలో , గడచిన నలభై రోజుల్లో ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కేయూర్ ను  కలవర పెడుతున్న సందర్భంలో :

shoes

ఈ సమస్యను చర్చించడానికి కొంతమంది ప్రముఖులతో ఒక నాటి సాయంత్రం  ఒక అంతరంగిక సమావేశాన్ని కొత్త డిల్లీ లోని తన బంగళా వెనక తోటలో  ఏర్పాటుచేశాడు. ఈ అంతరంగిక సమావేశానికి కొంతమంది పత్రికా ప్రతినిథులు, ఒక పరిశోధన సంస్థ దైరెక్టర్,అసిస్టెంట్ డైరెక్టర్  ,ఒక మహా సర్పంఛ్ హాజరయ్యారు..మహా సర్పంచ్ అంటే  జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు కలిసి  ఇద్దరు మహా సర్పంచుల్ని ఎన్నుకుంటారు అలా ఎన్నుకున్న ఈ పెద్దమనిషి, డబ్బూ పలుకుబడీ, ప్రాబల్యం కలవాడు.ఇటువంటి మహాసర్పంచ్ లు జిల్లాకి ఇద్దరుంటారు. ఈ సమావేశానికి వచ్చిన మహాసర్పంచ్ పేరు లంబోదర్. అతన్ని వాళ్ళ జిల్లాలో “అపాత్ర”లంబోదర్ అంటారు. “అపాత్ర” అతని ఇంటిపేరేంకాదు . ఆత్మ హత్యలు చేసుకున్న రైతులు పరిహారానికి పాత్రులా, అపాత్రులా అని నిర్ణయించడానికి  జిల్లా కమిటీ ఒకటి వుంటుంది.ఆ కమిటీ వేసే ఓటు ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబానికి  నష్ట పరిహారం,మంజూరు చేస్తారు.ఆ కమిటీ సభ్యుడైన లంబోదర్ ఎప్పుడూ ఎవరికీ “పాత్రత” ఓటు వెయ్యడు.అందరూ ఆయన ఉద్దేశంలో అపాత్రులే .అంచేత ఆయన్ని “అపాత్ర లంబోదర్” అని పిలుస్తారు.  ఆత్మహత్యలు చేసుకోడం ప్రభుత్వాన్ని అవమానించడమని ఆయన ఉద్దేశం .

ప్రజాప్రతినిథి అయిన కేయూర్ తన నియోజక వర్గంలొ ఆత్మహత్యల్ని అరికట్టడానికి ఏం చెయ్యాలో సూచించమని  ఈ సమావేశానికి హాజరయిన వారిని అడిగాడు. ఈ అంశం మీద పరిశోధన చేసి నివేదిక తయారుచేసుకొచ్చిన పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ దయ, తమ సిఫార్సులను చదివి వినిపించమని అతని అసిస్టెంట్ వైదేహికి చెబుతాడు. ఆ నివేదిక ప్రకారం రైతులు అధిక పంటలకోసం ఎక్కువ ఎరువులు ఎక్కువ పురుగుమందులు వాడుతున్నారు. నేలలో ఎక్కువ బోర్ లు వేసి నీటి సారాన్ని పీల్చేస్తున్నారు. వీటికోసం అప్పులు చేస్తున్నారు అవితీర్చలేకపోతున్నారు .అంతే కాదు ఇప్పుడు పెరిగిన రవాణా సౌకర్యాలు పట్నాలనీ పల్లెల్నీ దగ్గర చేసి గ్రామాలలోకూడా వినిమయ సంస్కృతి పెరిగింది..టీవీలూ సినిమాలూ ఆ సంస్కృతిని పెంచిపోషిస్తున్నాయి. భూమి చిన్న చిన్న శకలాలుగా విడిపోయినందువల్ల అందులో ఎక్కువ బోర్లు వేసినందువల్ల భూమిలోని నీరంతా పీల్చేస్తున్నారు.ఊట తగ్గిపోతోంది.కనుక రైతులకి ఎరువుల మీదా విద్యుత్తుమీదా ఇచ్చే రాయితీలు రద్దు చేస్తే వాళ్ళు వ్యవసాయం మానుకుని ఇతర పనుల్లోకి పోతారు ఆ భూమి ఇతరత్రా ఉపయోగపడుతుంది. రైతులు ఆత్మ హత్యలకు పూనుకోకుండా వాళ్లకి ఆధ్యాత్మికమైన కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంతేకాక పట్నవాసపు పోకడలను గ్రామీణ యువకులు అనుకరిస్తున్నారు కనుక కొంతమంది పట్నవాసపు యువకులను గ్రామాలకు రప్పించి పట్నవాసాన్ని గురించిన మిధ్యాభావాలను తొలిగించాలి” ఆ నివేదికలోని సిఫార్సులలో కొన్ని ఇవి.

ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను చెప్పే క్రమంలో  ఆ నియోజక వర్గంలో ఆత్మ హత్యల సంఖ్య పెరగడానికి గల కారణాన్ని లంబోదర్ ఇట్లా చెప్పాడు. అతనుండే గోపూర్ గ్రామంలో వ్యవసాయానికి చేసిన అప్పుతీర్చలేక సుధాకర్ భద్ర అనే యువకుడు కొంతకాలం కిందట ఆత్మ హత్య చేసుకున్నాడు.అతనికి వివాహం అయింది ఇద్దరు పిల్లలు కూడా. చదువుకుని పట్నంలో టీచర్ ఉద్యోగం చేస్తున్న అతని తమ్ముడు గంగిరి భద్ర, అన్న మరణ వార్త వినగానే వచ్చాడు. అన్న ఆత్మ హత్య కు ఇచ్చే నష్టపరిహారంతో అప్పులుతీర్చి వదినెనూ పిల్లల్నీ తనతో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాడు.కానీ సుధాకర్ భద్రది వ్యవసాయానికి సంబంధించిన అప్పులు తీర్చలేక చేసుకున్న ఆత్మహత్య కానే కాదనీ అతను తాగుడు అలవాటుచేసుకుని అప్పులు చేశాడనీ, అతనికి వ్యవసాయం మీద అసలు శ్రద్ధ లేదనీ కమిటీ అతనికి నష్ట పరిహారం తిరస్కరించింది.. తన అన్నకుటుంబానికి నష్టపరిహారం ఇవ్వలేదనే కసితో, గంగిరిభద్ర తన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామంలో స్థిరపడ్డాడు. అతను జిల్లా కలెక్టర్ ను ఒప్పించి  ఆత్మహత్యల నిర్థారణ కమిటీలో సభ్యుడయ్యాడు . అప్పటినుంచీ  అతను తక్కిన సభ్యుల్ని కూడా ఏదో విధంగా ప్రభావితంచేసి .అన్ని రకాల మరణాలనీ ఆత్మహత్యలుగా నిరూపిస్తున్నాడు.అన్నీ వ్యవసాయ సంక్షోభ సంబంధిత ఆత్మహత్యలు గా తేలుతున్నాయి.అతన్ని కమిటీ లోనుంచీ తప్పిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. అతన్ని తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు కలెక్టరు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు” అని చెప్పాడు.ఈ సమావేశం కోసం దక్షిణ మధ్య భారతం నించీ వందల మైళ్ళు ప్రయాణం చేసి రాజధానికి వచ్చిన లంబోదర్ మహాసర్పంచ్.

“మరి  ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?” అని చర్చ జరిగింది

“పరిష్కారం గంగిరి భద్రే ..మహా సర్పంచ్ బదులు అతన్నే ఈ సమావేశానికి పిలువవలసింది” అంటాడు  ఒక పత్రికా ప్రతినిధిగా వచ్చిన నాజర్ ప్రభాకర్.

“పరిశోధన కేంద్రం వారి సిఫార్సులు ఒట్టి కంటితుడుపు” అనే అతని వ్యాఖ్యలు, అతను గంగిరిని సమర్థించడం అక్కడ చాలామందికి నచ్చవు’ ఆసమావేశాన్ని గురించీ అక్కడ మాట్లాడిన మాటల గురించీ ఎవరూ పత్రికల్లో వ్రాయవద్దని కేయూర్ అభ్యర్థించాడు.కానీ నాజర్ ప్రభాకర్ అప్పటికప్పుడే  కేయూర్ నియోజకవర్గమైన మిత్యాలలో లెక్కకు మిక్కిలిగా సంభవిస్తున్న ఆత్మహత్యల్ని గురించి తన పత్రికలో వ్రాశాడు. నాజర్ పత్రికా రచనను సీరియస్ గా తీసుకునే వ్యక్తి.తన అభిప్రాయాలను మార్చుకోవలసిన వత్తిడి వచ్చినప్పుడు ఉగ్యోగానికి రాజీనామా చేస్తాడేగానీ ఎవరికీ తలవంచడు.రైతుల ఆత్మహత్యలు అతన్ని నిజంగానే కలవరపెట్టాయి.తను వ్రాసే వార్తలవలన ఏదైనా ఒక క్రియ జరగాలని ఆశపడతాడు.మిత్యాల దరిదాపుల్లోని మూడు జిల్లాల్లో 99 శాతం పొలాల్లో పత్తి పండిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఒక అన్ననో తండ్రినో  భర్తనో పోగొట్టుకోని స్త్రీలు లేరు.

“పూర్వం అక్కడ ఇళ్ళకి తలుపులు వుండేవి కాదు.ఎందుకంటే అక్కడందరి ఇళ్ళూ సమృద్ధిగావుండి ఎవరికీ దొంగతనం చేయాల్సిన అవసరం వుండేది కాదు.ఇప్పుడూ తలుపులు లేవు.ఎందుకంటే దోచుకోడానికి ఏ ఇంట్లోనూ ఏమీలేదు” అని ముగిసింది అతని రిపోర్ట్.

మిత్యాల జిల్లా ఆత్మహత్యల నిర్థారణ కమిటీలో కలెక్టర్ తో సహా పదిమంది సభ్యులున్నారు. అందులో ముఖ్యులు మహా సర్పంచ్ లంబోదర్ ,వడ్డీవ్యాపారి దుర్గాదాస్ మహాజన్ .మిగతా అందరూ వీళ్ళు చెప్పినట్లు వినాల్సిందే. లంబోదర్ కి రాజకీయ ప్రయోజనాలున్నాయి.తన కొడుకుని తనతరువాత అక్కడ ప్రతిష్టించాలనే గాఢమైన కోరిక వుంది వచ్చే ఎన్నికల్లో కేయూర్ స్థానంలో పార్లమెంట్ కి నిలబట్టాలని కూడా వుంది. అతను పోయిన ఎన్నికల్లో కేయూర్ గెలవడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టాడు.అందుకు బదులుగా ఒక వందఎకరాల స్థలంలో తన కొడుకు చేత ఏదో పరిశ్రమ పెట్టించాలని అందుకు కేయూర్ తండ్రి సాయంచేయాలనీ ఆశిస్తున్నాడు. ఈ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమ ప్రణాళిక కేయూర్  కి నచ్చక  పోయినా అతను తండ్రిని ఎదిరించలేడు. అందుచేత కేయూర్ లంబోదర్ కి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేడు.

ఇక మరొక ముఖ్య  సభ్యుడు .దుర్గాదాస్ మహాజన్  వడ్డీ వ్యాపారి. ఇతను కూడా కేయూర్ గెలవడానికి ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టాడు .అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న ప్రతిరైతుకీ అతని దగ్గర అప్పుంది. వాళ్ళ పొలాలు తాకట్లున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల తన కెంత లాభమో ఆలోచిస్తాడు. నష్టపరిహారం రాకపోతే ఆ పొలం అతను చవుకగా కొనేసుకుంటాడు. అప్పు తక్కువున్నప్పుడు ఒక వేళ పరిహారం అంటూ వస్తే దాన్ని అప్పుకింద తనే జమ కట్టుకుంటాడు .కానీ పరిహారం రాకపోతేనే అతనికి లాభం. గంగిరి అన్న సుధాకర్ పొలంకూడా అట్లాగే కొనుక్కోవాలని అతను ఆశపడ్డాడు. అంతకు ముందు గంగిరి తండ్రి సగం  పొలం అప్పు కింద దుర్గా దాస్ కే అమ్మి వున్నాడు .గంగిరి చదువుకున్నవాడు.ఇంగ్లిష్ మాట్లాడగలడు.దేనిగురించి మాట్లాడాలన్నా ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని వస్తాడు. ఆత్మహత్యలు అంతకుముందూ వున్నాయి ఆ జిల్లాలో….అయితే అవన్నీ సహజ మరణాలుగా చిత్రింపబడి ఆ సంఖ్య ఇంతగా పత్రికలకెక్కలేదు.

గంగిరి  కమిటిలో సభ్యుడైనాక మిగతా సభ్యులందర్నీ కలిసి  మృతులకుటుంబాలకు న్యాయంజరిగేలా వోటు వెయ్యమని నయానో భయానో చాకచక్యంగా ఒప్పించాడు .అంచేత మెజారిటీ ఓట్లతో చాలా కేసుల్లో న్యాయం జరుగుతోంది  అందుకే ఆత్మహత్యల సంఖ్య అంత ప్రస్పుటంగా కనిపిస్తోంది.ఇది కంటకప్రాయం అయింది లంబోదర్ , దుర్గాదాస్ లకి .ఈ సంగతులన్నీ ఆ సమావేశంలో లంబోదర్ కేయూర్ కి చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎట్లా అయినా గంగిరిని దెబ్బకొట్టాలని నిశ్చయించారు. అప్పుడక్కడికి వేరే పనిమీద వచ్చిన పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్  వైదేహి కి ఆమాటలు వినపడ్డాయి.ఆమె ఆ సంగతి నాజర్ కి చెప్పి గంగిరి ప్రమాదంలో పడ్డాడనీ ఒక ఫోన్ చేసి అతన్ని హెచ్చరించమనీ కోరుతుంది.గోపూర్ దగ్గర ఉన్న తమ సిమెంట్ ఫాక్టరీ ఉద్యోగి ద్వారా గంగిరికి ఒక సెల్ ఫోన్ పంపిస్తుంది. తనమీద దాడి జరగబోతోందనె విషయాన్ని మొదట గంగిరి నమ్మడు తరువాత నమ్మక తప్పలేదు అయినా.అతని మీద దాడి జరిగింది గూండాలు అతన్ని కొట్టారు బలవంతంగా ఆత్మహత్యల నిర్థారణ కమిటీనుంచీ రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెట్టించారు ఇల్లూ వూరూ వదిలి పొమ్మన్నారు.కానీ గంగిరి అట్లా చెయ్యలేదు.   “వ్యూహం లేని నిజాయతీ వ్యర్థం”అన్న నాజర్ మాటలు అతనికి నచ్చాయి . అతను ఆవిషయాన్ని కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు.మళ్ళీ మామూలుగానే కమిటీ సమావేశాలకి హాజరయ్యాడు.కలెక్టర్ అతని రక్షణ భారాన్ని లంబోదర్ దుర్గాదాస్ లకే అప్పచెప్పి గంగిరికి ఏం జరిగినా వాళ్లదే బాధ్యత అన్నాడు.తన మీద దాడిచేయించింది కేయూరేనని గంగిరికి కలెక్టర్ కీ కూడా అర్థం అయింది.

కేవలం తన అన్న కుటుంబానికి పరిహారం ఇవ్వలేదనే కోపంతో కాదు గంగిరి గ్రామంలో స్థిరపడింది. సుధాకర్ విషయంలో కమిటీ సభ్యుల ప్రవర్తన అతన్ని చాలా నొప్పించింది. సుధాకర్  తాగుడుకి అప్పచేసాడని దుర్గాదాస్,లంబోదర్ వాదించారు.” నా భర్తకి తాగుడు అలవాటులేదు.తినడానికే డబ్బు లేకపోతే తాగుడికి ఎక్కడ్నించీ వస్తుంది? అని సుధాకర్ భార్య పద్మా, గంగిరీ వాదిస్తే వాళ్ళవన్నీ అబద్ధాలని కొట్టిపడేశారు. మిగిలిన పొలం కొనుక్కోడానికే దుర్గాదాస్ ఇట్లా మాట్లాడుతున్నాడని అర్థం అయింది గంగిరికి. అప్పుడే అతనొక నిశ్చయానికి వచ్చాడు . ఇంక ఎవరూ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకూడదు .ఒక వేళ అలాజరిగినా  ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు న్యాయం చేయ్యాలి.ఈ సంకల్పంతో.  పట్నంలో సుఖమైన జీవితాన్నీ,మంచి జీతాన్నీ వదులుకుని వచ్చాడు గంగిరి. పట్నంలో అతను గుంపులో ఒకడు…కానీ ఇక్కడ తను చెయ్యవలసిన పని ఉన్నది.అతనికి  ఊళ్ళో రాజకీయాలు అర్థం అవుతున్నాయి . అతని దగ్గరవున్న డబ్బు ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చిన పాత బకాయి మాత్రమే .దాన్ని అన్ని ఖర్చులకీ జాగ్రత్తగా వాడాలి. అది ఇంట్లో అందరికీ రెండు పూటలా భోజనానికి చాలదు. పిల్లలు దేవాలయంలో రోజూ సాయంత్రం పెట్టే ప్రసాదంతో ఒకపూట పొట్టనింపుకోవాల్సి వస్తోంది. అతని ఎదుట రెండు ఎంపికలున్నాయి.ఒకటి ,ఇల్లూ పొలమూ వచ్చిన కాడికి అమ్మేసి పట్నంలో ఉద్యోగంచూసుకుని వదినెనూ పిల్లల్నూ తీసుకుని వెళ్ళిపోవడం,.లేదా ఇట్లా వాళ్లని పస్తులు పడుకోబెట్టి ఊరికోసం పనిచెయ్యడం.గంగిరి రెండవ దాన్నే ఎంచుకున్నాడు. తన ఆదర్శంకోసం వాళ్ళను బలిచేస్తున్నానని తెలుసు!

గంగిరిమీద త్వరపడి అట్లా దాడి చేయించి వుందకూడదని  కేయూర్ ని అతని తండ్రి  మందలిస్తాడు,ఈ లోగా మిత్యాల నియోజక వర్గపు రైతుల ఆత్మహత్యల్ని గురించి నాజర్ ప్రభాకర్ వ్రాసే రిపోర్ట్ లు వరుసగా పత్రికలో  వస్తున్నాయి. గంగిరి మీద జరిగిన దాడి గురించీ ,అతన్ని కమిటీ నుంచీ తప్పుకుని ఊరువిడిచి పొమ్మని బెదిరించడం గురించీ కూడా వ్రాసాడు. పార్టీ కేయూర్ ని  ప్రెస్ మీట్ పెట్టమని ఆదేశించింది.  ప్రెస్ మీట్ లో సంయమనం కోల్ఫోయాడు కేయూర్.  ఆ ప్రెస్ మీట్ ఘోరంగా విఫలమయినాక కేయూర్ స్వయంగా నియోజకవర్గంలో పర్యటనకి బయలు దేరాడు. అప్పుడుకూడా అతను గంగిరికి ఆ వూరి విడిచిపొమ్మని మర్యాదగానే చెప్పాడు, కానీ గంగిరి వెళ్లనంటాడు.అపాత్ర మని కొట్టిపడేసిన ఆత్మహత్యల కేసుల్ని తిరగదోడి చాలామందికి పరిహారం వచ్చేలా చేస్తాడు కేయూర్..దాన్ని మెచ్చుకుంటాడేగానీ తను వెళ్లనంటాడు గంగిరి ఈ లోగా లంబోదర్ ప్రణాలికలను అర్థం చేసుకుంటాడు కేయూర్.

గంగిరికి సంకల్పబలం వుంది.ఆదర్శం వుంది.ఆత్మగౌరవం వుంది.కానీ దానితోపాటే పేదరికం వుంది. అన్న చేసిన అప్పువుంది .తను పొలంలో పంట వేయడానికి చేసిన అప్పు వుంది. అతనిమీద గౌరవంతో నాజర్ ప్రభాకర్ గానీ డాక్టర్ గానీ డబ్బు అప్పు ఇస్తామంటే తీసుకోడు.అది అభిజాత్యం కాదు. తనలాగా పరిచయాలు లేని సామాన్యులకు దక్కని సహాయం తనకొక్కడికే ఎందుకు? అనుకుంటాడు.దానిఫలితం తిండిలోపంవల్ల అన్న కొడుకు ఆరేళ్ళ బాలు క్షయవ్యాధి బారిన పడతాడు. వాడి వైద్యం కోసం గంగిరి,అందరు రైతుల్లాగే  దుర్గా దాస్ దగ్గరికే వెళ్ళి అప్పు అడుగుతాడు. దుర్గాదాస్ అతన్ని హీనాతిహీనమైన మాటలతో అవమానిస్తాడు.కోపంతో అతని గొంతు పట్టుకుంటాడు గంగిరి.దుర్గాదాస్ అనుచరులు గంగిరిని కింద పడేసి కొడతారు.కలెక్టర్ కి ఆవిషయం తెలిసి దుర్గాదాస్ ని పిలిపించి అతని వ్యాపారానికి లైసెన్స్ రద్దు చేస్తానంటాడు కానీ గంగిరి తనమీద దుర్గాదాస్ అనుచరులు దాడి చెయ్యలేదని ఆ దెబ్బలు మరెక్కడో తగిలాయనీ చెప్పి దుర్గాదాస్ లో పరివర్తన తెస్తాడు.ఈ లోగా ఆరేళ్ళ బాలు మరణిస్తాడు.

ఆ పిల్ల వాడి మృతికి తనే కారణం అన్న అపరాథబావం తట్టుకోలేని  గంగిరి ఆత్మహత్య చేసుకుంటాడు. అతను చేస్తున్న పనినీ అతని సభ్యత్వాన్నీ తన మిత్రుడు వడ్రంగికి అప్పజెబుతాడు.వడ్రంగి తండ్రి కూడా అప్పులు తీర్చలేక ఆత్మహత్యకి పాల్పడ్డవాడే.అతనికి కూడా పరిహారం నిరాకరించబడింది.చివరికి గంగిరి ఆత్మహత్యకు పరిహారం అతని వదినెకు ఇస్తారు.కేయూర్ కాశీనాథ్ పదవికి రాజీనామా చేసి నియోజకవర్గంలో పని చెయ్యడానికి డిల్లీ వదిలిపెట్టి వస్తాడు .ఈ నవలలో  నిబద్ధత కల రాజకీయ నాయకుడు శ్రీనివాస మూర్తి, జర్నలిస్ట్ నాజర్ ప్రభాకర్ మనకి భవిషత్తుమీద ఆశ కలిగించే వ్యక్తులు.

అప్పులు తీర్చలేకపోవడం ఒకటైతే అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు రైతుల్ని చేసే అవమానాలు చాలా ఘోరంగా వుంటాయి. రైతుల్ని బంధించడం ,స్త్రీలని బజార్లో అవమానించడం, పిల్లల్ని పాఠశాలలకు వెళ్ళనీయకపోవడం వంటివి.ఒకరైతుని కాలువలోకి నెట్టి  చాలాసేపు బయటకు రానివ్వకుండా చేస్తే అతను చనిపోతాడు. కనుక ఆత్మహత్యలకు అవమానాలు చాలావరకూ కారణం.అందుకే ఆత్మహత్యల నివారణకు గంగిరి కొన్ని మార్గాలు సూచించాడు.పదెకరాల లోపు వున్న రైతులకి అప్పు తీర్చడానికి ఒక సంవత్సరం గడువువ్వాలి.అందువల్ల తాజా అప్పులు తీసుకునేందుకు అభ్యంతర పెట్టకూడదు..బ్యాంకుల నుంచీ గాని వడ్డ వ్యాపారుల నుంచీ గానీ అప్పుతీసుకుని తీర్చలేకపోయిన వారి జాబితా తయారు చెయ్యాలి.ఈ జాబితాలో రెండేళ్ళపాటు కానీ అంతకన్న ఎక్కువ గానీ ఉన్న వారకి ఏవైనా సంక్షేమ పథకాల ద్వారా సాయం చెయ్యాలి. విత్తనాలు గానీ ఎరువులుగానీ పురుగులు మందులు గానీ అమ్మే వారి రైతులకి అవి నకిలీవి కాదని భరోసా ఇవ్వాలి. తరువాత అప్పులు వసూలు చేసేటప్పుడు బ్యాంక్ లుగానీ వడ్డీ వ్యాపారులు గానీ. పంచాయితీనుంచీ అనుమతి తీసుకోవాలి. వసూలుకు వచ్చేవారితోపాటు కొందరు సాక్షులు వుండాలి.

నవలంతా చదివాక పాఠకులకు వచ్చేసందేహాలు కొన్ని: తన కెంత ఆత్మగౌరవం వుండనీపో ,అన్నకొడుకు కళ్ళ ఎదుట చనిపోతుంటే చూస్తూ వుండడ మేమిటి? ఎవరైనా అప్పు ఇస్తానన్నప్పుడు  తీసుకుని తరవాత ఎందుకు తీర్చరాదు? దుర్గాదాస్.వంటి కరడుగట్టిన వడ్డీ వ్యాపారులు ,కేయూర్ వంటి రాజకీయనాయకులు అంత త్వరగా పరివర్తన చెందుతారా?   తను చేసేయుద్ధం తన సమ ఉజ్జీలతో కాదనీ తనకన్న అధికులతో ననీ తెలిసిన అతనికి  కేవలం ముక్కు సూటిగా పోవడం కాక దానికో వ్యూహం (strategy) వుండాలని  తెలియదా? ఇట్లాంటి ప్రశ్నలు పక్కన పెడితే ఈ నవలలో కోట నీలిమ చిన్న రైతులు చేసే వ్యవసాయం కత్తిమీద సాములాంటిదని చాలా వివరంగా చెప్పింది. ఒక గంగిరిభద్ర ఆత్మ త్యాగం చెయ్యకపోతే  తప్ప రాజకీయ నాయకులు కళ్ళకు కట్టుకున్న గంతలు కాసేపైనా విప్పరు. ఒక నాజర్ ప్రభాకర్  రిపోర్ట్ ల మీద రిపోర్ట్ లు వ్రాస్తే తప్ప తమ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోరు. కనీసం ఎవరి ఓట్లతో అయితే గెలిచారో ఆ జనాన్ని గెలిచిన తరువాత ఒక్కసారైనా కలవరు. ఇంకా గ్రామాల్లో భూస్వాములూ వడ్డీ వ్యాపారులూ రాజ్యమేలడం, బ్యాంక్ అధికారులూ ప్రభుత్వ డాక్టర్లూ కూడా వాళ్ళకు దాసోహమనడం జరుగుతూనే వుంది. రాజకీయ నాయకులకూ   భూస్వాములకూ మధ్య “క్విడ్ ప్రో కో” లు నడుస్తూనే వున్నాయి. ఎకరాల భూమి చేతులు మారుతూ వందలాది మంది పేదలు నిర్వాసితులౌతునేవున్నారు. ఇదంతా ఎలా జరుగుతుందీ నీలిమ కళ్ళకు కట్టిస్తుంది. నీలిమ శైలి నవలను ఒక్క బిగిని చదివిస్తుంది,వాక్యాలు పదునైన కత్తుల్లా వుంటాయి. వ్యంగ్యం ఆమె కు సహజం.

కోటనీలిమ  ఢిల్లీ నుంచీ వెలువడే “సండే గార్డియన్” పత్రికలో పొలిటికల్ ఎడిటర్ గా పనిచేస్తారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని ద పాల్ హెచ్ నీచే స్కూల్ ఆఫ్ అడ్వాన్సుడ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో సౌత్ ఏషియన్ స్టడీస్ లో రీసెర్చ్ ఫెలో గా వున్నారు. ఆమె ఢిల్లీలోనూ వాషింగ్టన్ లోనూ వుంటూ వుంటారు, ఈ నవలకు ముందు “రివర్ స్టోన్స్” “దడెత్ ఆఫ్ అ మనీలెండర్”అనే నవలలు వ్రాసారు.ఈ నవలను రూపా ప్రచురించింది( 2013).ఈ నవల మీద నాకు ఆసక్తి కల్గడానికి పాలగుమ్మి సాయినాథ్ హిందూ లో వ్రాసిన వ్యాసాలూ ఆయన పుస్తకం “ఎవిరిబడీ లవ్స్  ఎ గుడ్ డ్రాట్” కారణం.

 – పి. సత్యవతి

 

 

“పోయినోళ్ళు అందరూ…..అవును చాలా, చాలా మంచోళ్ళు….

మా తాత గారి, బామ్మ  గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, మా అమ్మ, మా బాబయ్య గారు (అంటే మా నాన్న గారు) అంతకు రెట్టింపు ఆప్యాయత, బాధ్యతలతో పంచిపెట్టిన “బంధు ప్రేమ” అనే అపురూపమైన అనుబంధాన్ని తనివి తీరా అనుభవించిన తరం మాది. ముఖ్యంగా నా చిన్నప్పుడు ..అంటే 1950-60 దశకాలలో బంధువుల రాకపోకలతో, వాళ్ళు రాగానే సినిమా ప్రోగ్రాములతో, అడ్డాట, ఇస్పేటు మదాం లాంటి అచ్చ తెలుగు పేకాటలతో, కేరమ్స్, చదరంగాలతో, తెల్లారాదేకా అస్సలు ఏం మాట్లాడుకున్నామో ఎవరికీ ఏ మాత్రం జ్జాపకం లేక పోయినా చిన్నా, పెద్ద కలిసీ, ఎవరి వయస్సు  గ్రూప్ వారూ రాత్రి తెల్ల వార్లూ డాబా మీద పడుకుని కబుర్లు చెప్పేసుకుకోవడం మొదలైన వ్యాపకాలతో మా తరం వారి అందరి జీవితాలూ సరదాగా గడిచి పోయేవి. ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే మరీనూ.

“ఆ పోదురూ, మీరు మరీనూ….మీ తరువాత “ఎర్ర త్రికోణం” రోజులు వచ్చేసి, చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోయింది. తరవాత్తరవాత కంప్యూటర్లూ, గ్లోబలైజేషన్లూ వచ్చేసి ఎవరి కుటుంబం చుట్టూ వాళ్ళు  చుట్టూ గీతలు గీసేసుకున్నారు. “ అని చాలా మంది  అంటుంటారు. నా పాయింటు కూడా సరిగ్గా అదే. మా చిన్నతనం గడిచినంత ఆనందంగా ఈ తరం వారి చిన్నతనం లేదు అని మా బోటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. తమాషా ఏమిటంటే ఇప్పటి తరం వాళ్ళు పెద్ద వాళ్ళయి వారి ఆత్మ కథ వ్రాసుకున్నప్పుడు వారు కూడా సరిగా అలాగే అనుకుంటారు!

అన్నట్టు మా బంధువుల గురించి నేను చెప్పుకునేటప్పుడు మా ఇంట్లో ఉండే ఒక తమాషా అలవాటు గురించి ముందే చెప్పుకోవాలి. అదేమిటంటే అసలు బంధుత్వం ఏదైనా ఒక వ్యక్తిని పిల్లలందరరం ఒకే రకం గా పిలిచే వాళ్ళం. ఉదాహరణకి మా నాలుగో మేనత్త కొంత మందికి అక్క, మాకు మేనత్త, మరో కొంత మందికి పిన్నీ అయినా మా బంధువులకీ, స్నేహితులకీ ప్రపంచంలో  అందరికీ ఆవిడ  రంగక్కే.  ఈ వ్యాసం లో కూడా ఆ పద్ధతే పాటించాను. లేక పొతే ఎవరి గురించి వ్రాస్తున్నానో తెలియక గందర గోళం పడిపోతాను. “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు కనక వారి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తాను.

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

నా జీవితం  మీద  సాహిత్య పరంగా కాకపోయినా,  వ్యక్తిత్వ పరంగా చెరగని ముద్ర వేసి ఆత్మీయత విలువని చెప్పకనే చెప్పిన వారిలో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన లని మొట్టమొదటగా చెప్పుకోవాలి. వరసకి మేనరికం అయిన ఆ దంపతులు అన్ని శుభ కార్యాలకీ పది హీను రోజులు ముందే వచ్చి, అవాంతరాలకి తక్షణమే వాలి పోయి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని మూడు-నాలుగు తరాల అన్ని కుటుంబాలకీ “మూల స్తంభం” లా నిలిచారు. వారికి పిల్లలు లేరు కానీ డజన్ల కొద్దీ బంధువుల పిల్లలందరినీ సొంత పిల్లల లాగానే చూసుకునే వారు. మా ఆఖరి మేనత్త సూర్య భాస్కరం (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం), & పండ్రవాడ సుబ్బారావు (పెద్దాపురం మామయ్య గారు)  దంపతుల పెద్ద కూతురు మా జయ వదిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా జయ వదినని చూడకుండా ఉండను. మా చిట్టెన్ రాజు బాబయ్య మా నాన్న గారికి వరసకి పెద్ద తమ్ముడు. అంటే…మా తాత గారి సవితి తమ్ముడి పెద్ద కొడుకు. కాకినాడలోనే పుట్టి, అక్కడే చదువుకుని , చాలా సంవత్సరాలు మిలిటరీ లో పని చేసి కో- ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా రిటైర్ అయాడు.  వైజాగ్ లో చదువుకునప్పుడు (1961-62)  మా బాబయ్య పనిచేసిన కశింకోట, విజయ నగరం, శృంగవరపు కోట మొదలైన అన్ని ఊళ్ళూ వెళ్ళి, అక్కడ కూడా వారు స్థానికంగా అందరికీ తలమానికంగా ఉండడం నేను స్వయంగా చూసాను.  ఒక సారి  తనే స్వయంగా అంధ్ర విశ్వవిద్యాలయం లో మా హాస్టల్ కి వచ్చి, భోజనం చేసి “రాజా గాడి హాస్టల్ భోజనం బాగా ఉంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి” అని కాకినాడ మా అమ్మకి ఒక కార్డు రాసాడు.  ఆత్మీయతకి, అభిమానానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి?

1951 లో మా తాత గారు, బామ్మ గారు ఒకే రోజున పోయినప్పుడు, మా నాన్న గారు, అమ్మా పోయినప్పుడూ వారిద్దరే దగ్గరుండి కర్మకాండలు నిర్వహించడంలో సహాయం చేశారు. మా ఇంట్లో అందరి పెళ్లిళ్ల నిర్వహణ, మా తమ్ముడి పెళ్లి కుదర్చడం మొదలైన శుభ కార్యాలకి వారే సూత్రధారులు. మా బాబయ్య ఆదేశాలతో పది రోజులకి సరిపడా కూర గాయలు కొనడానికి నేను కూడా మా బాబయ్యతో ఎడ్ల బండ్ల మీద కాకినాడ సంత చెరువు దగ్గర పెద్ద మార్కెట్ కి వెళ్ళే వాడిని. రాత్రి పడుకోడానికి మా మామిడి చెట్టు కింద మడత మంచం నేనే వేసే వాడిని. కొంచెం పెద్ద వాడిని అయ్యాక , ఆయనతో పేకాట కూడా ఆడే వాడిని.  నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పడూ కూడా గోళ్ళు కొరుక్కునే అలవాటు ఉంది. అది ఎప్పుడు చూసినా ఠకీమని తన వేళ్ళు నా నోటి దగ్గర పెట్టి “నా గోళ్ళు కొరకరా. యింకా రుచిగా ఉంటాయి రా” అని ఆ అలవాటు మాన్పించడానికి సరదాగా ప్రయత్నాలు చేసే వాడు.  మా చిట్టెన్ రాజు బాబయ్య పోయి పదేళ్ళు దాటింది. ఇందుతో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన ఫోటో జతపరుస్తున్నాను. అలాగే ఆయన తమ్ముళ్లు శంకరం బాబయ్య, రామం బాబయ్య కూడా మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. వారిద్దరూ కూడా దివంగతులే.

నాకు ఐదుగురు మేనత్తలు. ముగ్గురు మేన బావలు- అంటే మా మేనత్తల కొడుకులు. వాళ్ళని అమలాపురం బావ, దొంతమ్మూరు బావ, పెద్దాపురం బావ అనే వాళ్ళం అప్పుడప్పుడు. అందులో అమలాపురం బావ ..పెద్ద బావ..మా పెద్ద మేనత్త (ఆవిడని నేను చూడ లేదు)- పెద్ద మామయ్య గారి (గిడుగు వెంకట రత్నం గారు) కొడుకు. పేరు సూర్య ప్రకాస రావు..అంటే మా తాత గారి పేరే. అతను చామన చాయలో పొడుగ్గా భలే తమాషాగా ఉండే వాడు. ఆయన భార్య సుందరక్క , ఆరుగురు ఆడ పిల్లలు (నా మేనగోడళ్ళు) చాలా అందమైన వారు. వృత్తి రీత్యా అడ్వొకేట్ అయిన మా పెద్ద బావ ఎప్పుడు వచ్చినా మాట్లాడడం తక్కువ కానీ ప్రతీ మాటా, చేతా సరదాగానే ఉండేవి.

ఆ తరువాత రెండో మేనత్త (ఆవిడని కూడా నేను చూడ లేదు)  ని  తనని పెంచి పెద్ద చేసిన మేనమామ గారి కొడుకు కుంటముక్కుల కామేశ్వర రావు గారికి ఇచ్చి పెళ్లి చేసారు మా తాత గారు. మా బాసక్క (వరసకి వదిన), హనుమంత రావు బావ వారి పిల్లలే. ఆ మేనత్త పోయిన తరువాత ఆవిడ చెల్లెలు, మా నాలుగో మేనత్త అయిన రంగనాయకమ్మని (ఆవిడ నే రంగక్క అని పిలిచే వాళ్ళం) ఇచ్చి ద్వితీయ వివాహం చేసారు.  హనుమంత రావు బావ మా పెద్దన్నయ్య కంటే చిన్న, మా చిన్నన్నయ్య కంటే పెద్ద. వీళ్లు ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉండే వారు. కలిసే అల్లరి చేసే వారు. కాకినాడలో మా ఇంట్లోనే చదువుకుని నగరంలో సోషల్ సర్కిల్ లో బాగా తిరిగే వాడు. అలనాటి సినీ నటుడు రామశర్మ కి మంచి మిత్రుడు . అతనితో సినిమా తియ్యడానికి ప్రయత్నం చేసాడు కానీ మా నాన్న గారు ఒప్పుకో లేదు. మా కామేశ్వర రావు మామయ్య గారు  హఠాత్తుగా గుండె పోటు తో పోయినప్పుడు మా బావ చిన్న వాడు కాబట్టి మా నాన్న గారు వారి 400  ఎకరాల మిరాసీ పొలాన్ని ని తనే స్వయంగా వ్యవసాయం చేసి తరువాత మా చిట్టెన్ రాజు బాబయ్య మధ్యవర్తిగా మొత్తం ఆస్తి మా బావకి అప్పజెప్పారు.

ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ…మా గాంధీ నగరం పార్కుకి మా హనుమంత రావు బావ ట్రస్టీ గా ఉండే వాడు. ఒక సారి నేను, కొంత మంది కోతి మూకతో కలిసి రాత్రి చీకటి పడ్డాక మట్టి తవ్వేసి పార్కులో ప్రతీ మూలా కలువ పువ్వులతో కళకళ లాడుతూ ఉండే చెరువు కప్పెట్టేసే ప్రయత్నంలో ఉండగా పెద్దులు అనే తోటమాలికి దొరికి పోయాను. ఆ పెద్దులు గాడు మా ఇంట్లో పాలు పితికే గొల్ల వాడే అయినా, చీకట్లో గుర్తు పట్టక నన్నూ, మిగిలిన కుర్రాళ్ళనీ  తాళ్ళతో కట్టేసి అక్కడే లైబ్రరీ లో ట్రస్టీ మీటింగ్ అవుతుంటే అక్కడికి లాక్కుని పోయి నిలబెట్టి “ఈ రౌడీ కుర్ర నాయాళ్ళు సెరువు కప్పెట్టేసి సింద్ర వందర సేసారండి. తవరు ఊ అంటే సంపేత్తానండి, ఆయ్య..” అనేసి పెర్మిషన్ కోసం చూస్తూ ఆ వెలుగులో నా మొహం చూసాడు. ఆ తరువాత మా బావ మొహం చూశాడు. అంతే సంగతులు. నేను చావు తప్పించుకుని మా బావ ధర్మమా అని బయట పడ్డాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అరవై ఏళ్ళ  పాటు ఏ చెరువూ, ఆఖరికి అతి చిన్న గుంట కూడా కప్పెట్టే ప్రయత్నం చెయ్య లేదు. చేసినా పెద్దులు గాడి మొహము, మా బావ మొహమూ గుర్తుకు వస్తాయి. మా హనుమంత రావు బావ ఏకైక కుమార్తె లక్ష్మి కి పెళ్లి చేసిన  16  రోజుల పండగ నాడు ఊరేగింపులో గుండె పోటుతో మరణించాడు. మేనల్లుడి మరణాన్ని తట్టుకో లేక కాబోలు మరాక రెండు నెలలలో మా నాన్న గారు ఆ కూడా పోయారు. అప్పుడు నేను అమెరికాలో ఇరుక్కుపోయాను. మా హనుమంత రావు బావ ఎప్పుడూ తన సంగతి చూసుకోకుండా అందరికీ ఎంతో మంచి చేసే వాడు. అలా ఆయన దగ్గర సహాయం పొందిన ఒకాయన ఎవరో పిఠాపురం “హనుమంతరాయ కళాశాల” అని ఒక కాలేజ్ కి అతని పేరు పెట్టి ఆ ఋణం తీర్చుకున్నారు.

ఇక మా పెద్దాపురం  అబ్బులు బావ (ఆఖరి మేనత్త కొడుకు, జయ వదిన తమ్ముడు ) నా కంటే రెండేళ్ళు పై వాడయిన మా సుబ్బన్నయ్య వయసు వాడు. అతని పేరు కూడా (సత్య) సూర్య ప్రకాశ రావే. అబ్బు-సుబ్బు అని వాళ్ళిద్దరూ, రాజా-అంజి అని నేను, మా తమ్ముడూ కవల పిల్లల లాగే  పెరిగాం. అతను కూడా కాకినాడలో మా ఇంట్లోనే ఉండి పాలిటెక్నిక్ చదువుకున్నాడు. మా గేంగ్ అందరం పొద్దుట మా పెద్ద నూతి దగ్గర పంపు తో ఆదరా బాదరాగా నీళ్ళు కొట్టుకుని..అవును చన్నీళ్ళే…. స్నానాలు చేసేసి, తరవాణీయో మరోటో తినేసి ఎవరి స్కూళ్ళకో, కాలేజీలకో వెళ్లి పోయి, సాయంత్రం క్రికెట్ ఆడేసుకుని, శివాలయానికి వెళ్లి పురాణాలో, హరికథలో వినేసి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే వాళ్ళం. నేను ఇంజనీరింగ్ లో ప్రవేశించే దాకా మా అబ్బులు బావ టీ=స్క్వేర్ మరియు , స్లైడ్ రూల్ అనే ఇంజనీరింగ్ పరికరాలు భుజాన్న వేసుకుని సైకిల్ మీద వెడుతూ అందరిలోకీ హీరోలా కనపడే వాడు. ఆ పరికరాలు ఇప్పుడు ఎక్కడైనా మ్యూజియంలలో ఉంటాయేమో! అబ్బులు బావ ఎప్పుడూ గలగలా నిష్కల్మషంగా నవ్వే వాడు. పేకాట లో అయినా, కేరమ్స్ లో అయినా ఏ ఆటలో అయినా మా అబ్బులు బావ ఉంటేనే ఆటలు రక్తి కట్టేవి. అతను మా కుటుంబం మీదా, మా నాన్న గారి మీద అభిమానంతో వైజాగ్ లో రామలింగేశ్వర స్వామి దేవాలయం (మా నాన్న గారి పేరు) కట్టించడంలో ఎంతో సహాయం చేసాడు. అమెరికా ఎప్పుడు వచ్చినా హ్యూస్టన్ వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులు ఉండే మా అబ్బులు బావని విధి నిర్దయగా రెండేళ్ళ క్రితం పొట్టన పెట్టుకుంది. ఇందుతో చిన్నప్పుటి (బహుశా 1955) మా అబ్బులు బావ, మా హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య (ముగ్గురూ దివంగతులే) ఏడిద కామేశ్వర రావు, మరొక మిత్రుడితో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికీ ఎంత మంది మేన బావలు ఉన్నా, మా అబ్బులు బావదే అగ్ర తాంబూలం.

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

ఇక మా నాన్న గారి తరంలో అతిముఖ్యమైన, అతి దగ్గర అయిన బంధువులలో మా సూరీడు బాబయ్య గారే  (రాజమండ్రి) మొదటి వారు. ఆయన మా నాన్న గారి పిన తల్లి (చెల్లంబామ్మ గారు) ఏకైక కుమారులు. ఆయనా, మా నాన్న గారూ చిన్నప్పటి నుంచీ  ఇద్దరూ న్యాయవాదులయ్యే దాకా కలిసే చదువుకున్నారు. ఇద్దరూ మద్రాసు లా కాలేజ్ లో చేరినా, మా నాన్న గారు త్రివేడ్రం లో డిగ్రీ పూర్తీ చేస్తే , మా సూరీడు బాబయ్య గారు మొత్తం మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికే  మొదటి వాడి గా నిలిచి మద్రాసు లా కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. నేను యింకా చూడ లేదు కానీ ఆయన పేరు ఇప్పటికీ ఆ కాలేజ్ లాబీ లో చెక్కబడి ఉంటుందిట. ఆయన పూర్తీ పేరు అయినంపూడి సూర్యనారాయణ మూర్తి గారు ఆయన ప్రాక్టీస్ రాజమండ్రిలోనే కానీ దక్షిణ భార దేశం లో ఆయన అతి పెద్ద సివిల్ లాయర్ ఐఎనెన్ మూర్తి గా నాలుగైదు దశాబ్దాలు పేరు పొంది నేను అమెరిక రాక ముందే చనిపోయారు. మా చిన్నన్నయ్య ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నా వయసు వాడే అయిన అయన కొడుకు (రమణ మూర్తి తమ్ముడు)  ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సూరీడు బాబయ్య గారి భార్య (స్వర్హీయ మాణిక్యం అక్కయ్య)  మా  అమలాపురం బావకీ తోబుట్టువే!

ఇక్కడ మరొక పిట్ట కథ…..మా సూరీడు బాబయ్య గారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే నా పదేళ్ళప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన. అప్పుడు వాళ్ళబ్బాయి అంటే ..మా రమణ మూర్తి తమ్ముడు కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. నేనూ, మా నాన్న గారు వాణ్ణి చూడడానికి రాజమండ్రి వెళ్లాం బస్సులో. నాకు తెలిసీ నేనూ, మా నాన్న గారూ మాత్రమే కలిసి చేసిన ఒకే ఒక్క బస్సు ప్రయాణం అదే! అప్పుడు నేను ఒక్కడినీ ఇంట్లో ఉండగా ఎవరో ఒక పెద్దాయన కూడా మా తమ్ముణ్ణి చూడడానికే ఇన్నీసు పేటలో మా సూరీడు బాబయ్య గారి ఇంటికి వచ్చాడు. అందరూ హాస్పిటల్ కి వెళ్ళారు అని నేను చెప్పగానీ “నీకు ఆసుపత్రికి దారి తెలుసా?” అని అడిగారు. “మాది కాకినాడ సార్, రాజమండ్రి నాకు తెలీదు” అని వెర్రి మొహం వేసాను. ఆయన చతికిల పడి పోయి “ఓరి నాయనోయ్ ఇప్పుడు ఎలాగా?” అని బెంగ పడిపోతూ ఉంటే నా బుర్రలో ఒక వెలుగు వెలిగి “రిక్షా వాడిని పిలిచి జనరల్ హాస్పిటల్ కి పోనీ అంటే వాడే తీసుకేడతాడు గదా” అన్నాను ఆయనతో. ఆయన “అవును” సుమా…హాస్పత్రి దారి నాకెందుకూ తెలియడం. రిక్షా వెధవకి తెలిస్తే చాలుగా “ అని ఆశ్చర్య పడిపోయి ఆ నాటి నా “తెలివి తేటలని” ఊరంతా టాం టాం చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. అదిగో అప్పటి నుంచీ మా సూరీడు బాబయ్య గారికీ మా కుటుంబంలో మిగిలిన వారికీ నేను తెలివైన వాడి కింద లెక్క. నాకైతే ఆ మాట మీద అంత నమ్మకం లేదు.

ఇలా మా చిన్నతనంలో నన్ను ప్రభావితంచేసిన బంధు కోటిలో మా అమ్మ వేపు వారైన  మా సుబ్బారావు  రావు నాన్న, లక్ష్ముడక్కయ్య, సీతక్క, జనార్దనం బావ, సీతారమణ మావయ్య,  సుబ్బారావు తాతయ్య గారు,  అటు తణుకు నుంచి తాళ్లూరి లక్ష్మీపతి తాతయ్య గారు మొదలైన వారందరూ దివంగతులే. వీలున్నప్పుడు వారి గురించి ప్రస్తావించి  వారి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను.

ఇప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తున్న బంధువులు చాలా మంది ఉన్నా, ఇప్పుడు “ఉన్నోళ్ళందరూ తీపి గుర్తులే” అయినా  అప్పటికీ, ఇప్పటికీ “బందు ప్రేమ” డిపార్ట్మెంట్ లో చాలా తేడా ఉంది అని నాకు అనిపిస్తుంది. మా చిన్నప్పుడు ముందుగానీ “కాల్చేసి” , ఉత్తరం “తగలేసి” అప్పుడు రావడాలు ఎక్కువ అలవాటు లేదు. ఏకంగా పెట్టె, బేడాతో ఎప్పుడు పడితే అప్పుడు దిగిపోవడమే! ఇప్పుడు నేను తాత, మామయ్య, బాబయ్య, బావ మొదలైన ఏ హోదాలోనైనా సరే  “కాల్” చేసి మా బంధువుల ఇంటికి “ఎప్పాయింట్ మెంట్” తీసుకుని వెడితే ముందు పది నిముషాలు అందరూ చుట్టూ కూచుని పలకరిస్తారు. “ఎప్పుడొచ్చావు?, ఏ హోటల్ లో ఉన్నావు? ” అనే ప్రశ్న లోనే “ఎప్పుడు వెళ్తున్నావు?” అనే ధ్వని వినపడుతుంది. అరగంట తరవాత మెల్ల, మెల్లగా కొందరు ఎవరి గదులలోకి వారో, బయటకో జారుకుంటారు ”సీ యు లేటర్” అనుకుంటూ.  ఇక కూచోక తప్పని వారు వాచీలు చూసుకోవడం, టీవీ ఆన్ చెయ్యడం లాంటి చేష్టలు చేస్తారు. ఇక పెళ్ళిళ్ళు మొదలైన వాటిల్లో మండపాల్లోనే అన్ని మంతనాలూనూ.  అమెరికాలో బంధువులు అయితే ఆరు నెలలకో ఏడాదికో ఫోన్ లోనే మాటా, మంతీనూ. ఏం చేస్తాం. అమెరికా ఫ్రీ కంట్రీ కాబట్టి మనం ఎవరి ఇంటికీ వెళ్ళక్కర లేదు, వాళ్ళు రావక్కర లేదు. ఖర్చు తగ్గింది కదా అని ఆనందిస్తాం అందరూ “అమెరికూపస్థ మండూకాలే”.

chitten raju— వంగూరి చిట్టెన్ రాజు

Divine Tragedy

వంశీధర్ రెడ్డి

వంశీధర్ రెడ్డి

KS స్పోర్ట్స్ ఎక్స్ ట్రా డాట్స్, విస్పర్ అల్ట్రా క్లీన్
ఐదు పాల పాకెట్లు, రెండు రేజర్లూ
పార్క్ అవెన్యూనో మైసూర్ సాండలో
వైల్డ్ ఫాంటసీ వాసనా
ఓ బియ్యం బస్తా కిలో టొమాటోలూ డజను గుడ్లూ పళ్ళూ
గుళ్ళో గంటా కొబ్బరికాయలూ …
కొత్త సంసారానికీ.. పాతబడుతున్న సహజీవనానికి ..

ఎప్పుడైనా కలలో
కాలో నడుమో తగిల్నపుడూ
బాత్రూం షవర్కింద నీళ్ళు సుడుల్తిరిగినపుడూ
ఓ ఏకాంతానికో ఒంటరితనానికో తెరపడిందని
వెంట్రుకలకు వేళ్ళాడ్తోన్న కొబ్బరినూనె అంటిన దిండు చెబితే తప్ప,
నేనింకా అకేలానే.. కేలాలు తింటూ..

తత్వం బోధపడడానికి
చాలా రాత్రులూ కొన్ని పగళ్ళతో గతానికి కట్టేసుకున్నాక
మెలకువొచ్చేప్పటికి నాలో నాకు దూరం కొన్ని జన్మలై..
బ్రతికిన క్షణాలు తెలిసిన పోయినోళ్ళరాతలే దిక్కపుడు
పిల్లాడి ఏడుపుల్లోంచి దారడగడానికి,

పడగ్గది వాసనకి విసుగొచ్చిన సాయంత్రం మిత్రుడి పిలుపొస్తుంది
నిశాచరుడివై నషానిషాదపు బీ ఫ్లాట్ గొంతులో దూరదాం
దురదెక్కిన చర్మాలున్నాయి వేలిగోళ్ళు పెంచుకురమ్మని

కాలం మరణం నేనూ
మూడుముక్కలాడుతుంటాం మాడు ముక్కలయ్యేదాకా,
సముద్రాలు పీపాల్తాగి ఆకాశమ్మీదికి మూత్రిస్తుంటాయి
తోడేళ్ళు రొమ్ముల్నాకి హత్యించిన స్త్రీలు
సమాధుల్లో ఆకలేసి కేకలేస్తుంటారు,
నీ సగమూ ఉండొచ్చు వాళ్ళలో..

ముప్పై మూడో పెగ్గులో
కాలానికీ మరణాన్ని ఊహించి మరణం తర్వాతి కాలాన్ని ప్రశ్నిస్తాను,
మూడు ఆసులు పడగానే సమాధానం దొరికిందనుకుని
జోకర్ ముఖంతో వెలిగిపోతాను,
బీట్ కనిస్టీబు విజిల్విని భయమేసి భూమిని కప్పుకోగానే
కాలమూ మరణమూ పట్టుబడి రిమాండుకెళ్తాయి..

మత్తు తలకెక్కి నాలోని ఖగోళాల్లోకి జారిపడి
వంటింటిగిన్నెలో తేలగా పిల్లాడు ఏడుస్తుంటాడు పాలు లేక,
ఇది ఏ యుగమో ఎన్నో నాగరికతో పోల్చుకునేలోపు
దోసిలిలో పోగేసుకున్న రెప్పల్ని
పెరుగన్నమ్ముద్దలో తడిపి కడుపులో దాచేస్తుంది తను,
పిల్లాడి ఏడుపు ఆగిపోతుంది రక్తమోడుతున్న రొమ్ము నోటికందాక,
నే చెప్పాలనుకున్నవన్నీ తనకు తెలిసిపోయి
“నేనెవరు” అని అడిగి దీపాన్ని ఆర్పేస్తుంది..
వెయ్యిన్నొకటోసారి పునర్జన్మిస్తాను నేనపుడు ఎప్పట్లాగే..

తరాల తర్వాత ఓ రోజు,
పిల్లాడిని ఆడిస్తుండగా తాజా వార్త,
మరణానికీ కాలానికీ ఉరేయబడిందని,
ఆకాశం చిట్లి పాలపాకెట్లు కూలి
దొంగజేబులోని కండోములు కాలిపోతాయి,

మర్నిమిషం సముద్రపొడ్డున,
రెండు ఖాళీ కుర్చీల నడుమ మూడుముక్కలు
ఆడుతుంటాడు పిల్లాడు నిండా మీసాలు పెంచుకుని,
స్థలకాలాలన్నీ ఆవృతమౌతుంటాయి
మీసాల గడ్డాల పిల్లాడు
జోకర్ ముఖమంటించుకుంటాడు  వీపుకి.. నాలాగే..
ఎక్కడో ఎవరో అన్నం కలుపుతుంటారు కళ్ళు పొడుచుకుని
ఎప్పటిదో రక్తంవాసన
చెవులకు కన్పిస్తుంటుంది  మెత్తగా..

ఎన్నీల ఎలుగు

అన్నవరం దేవేందర్

అన్నవరం దేవేందర్

తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం
వాకిట్ల గడన్చల ఎల్లెలుకల పండి
తాత చెప్పిన శాత్రాలు ఇన్నందుకేమో
కొంతైనా కైత్వాల అల్లకం అబ్బింది
మక్కజొన్న కావలి కాడ
ఎత్త్హైన మంచె మీన్నుంచి చూసిన
గోరుకొయ్యల మూలసుక్కల మాంత్రికత
మదిల మెదులుతున్న ఆ మెరుపులేనేమో
అప్పుడప్పుడు ఒలుకుతున్న చమత్కార్యాలు
పెద్దెగిలివారంగ ఎన్నీల ఎలుగుల
వరికల్లంల ఎడ్ల బంతి కట్టి తిమ్పుడు
గడ్లె కెల్లి ఎల్లిన వడ్లను తూర్పాల పట్టి
బర్తి బండి ఇంటికి కోట్టుకచ్చిన జ్ఞానం
ధాన్యం దరిద్రం ల మద్య దూరం తెలిసింది
కృష్ణ టాకీసుల రెండో ఆట
మడికట్లల్ల మంద పెట్టిన్నాడు కావలి
కల్లంల దినుసు కాడ నిద్ర
నాత్రి నాత్రి ఏ పనికి పోయినా సరే
తాటి బొత్త్లల పానాది నిండా ఎన్నేలే ఎన్నేలా
ఆ ఎన్నీల నడకలే ఈ కైత్వపు పాదాలు
పురాగ ఎన్నీలా అని కాదు
సిమ్మని సీకటి అంతకన్నా కాదు
వొర్రెలు  వాగులు దాటుకుంట దాటుకుంట
కలువాలునుకున్న తావున
నర్రెంగ సెట్టు కింద కలయిక
మనసంతా పులకరించిన జరం
ఆ సాయ సాయ కై నీడలనే
మెరిసిన జిలుగు వెలుగుల చందమామలు
index
అసోయ్ దూల అసోయ్ దూల
ఆశన్న ఉశన్నల గజ్జెల చప్పుళ్ళు
పీరీల గుండం సుట్టు తిరిగిన కాళ్ళు
కనుచూపుల సైగలు కలుపుకొని
మందిలకెల్లి మందిలకేల్లె  మాయమవుడు
ఆ ఎన్నెల రాత్రుల్లోనే
నిండు పున్నం నాడు పండు వెన్నెల
భూమికి సున్నం ఎసినట్లు
ఎన్నీల ఎలుగు పల్లెటూరంత స్వచ్చం
ఎన్నీల ఎలుగే మనసు నిమ్మళం నిమ్మళం ..
– అన్నవరం దేవేందర్
చిత్రం: కాపు రాజయ్య