1. ఎడారిలో
వాన
కవిత్వం
………….
2. నొసట మంట
పెదవి నవ్వు
శివుడు కాదు – మనిషే!
…………….
3. ఒక జీవిత దూరం
ప్రయాణం
గమ్యం రాలేదు
…………………..
4. నాదం
ఇరుక్కున్న
ప్రాణఘోష
…………………..
5. పొత్తిళ్ళు
ఒత్తిళ్ళు
ఆకలిలో తేడా
……………….
6. ప్రాణం
మరో గుండెని
ఎత్తుకుపోతుంది
………………….
7. నిత్య ప్రాచీనం
నిత్య నవీనం
మంచం
8. నేను బతకాలనే
ఆమె రాలేదు
నా గుండెలోకి
………………………..
9. దారీ అదే
గమ్యమూ అదే
జీవితం
…………………………
10. పిల్లలూ
పోలీసులూ
మనం బందీలం
……………………………
11. రాత్రికి బతుకు
దానం చేశాను
తెల్లారిపోయింది
…………………………..
12. నన్ను నేను
త్యజించాను
దారి తెలిసింది
-ఫణిహారం వల్లభాచార్య
ఫణిహారం వల్లభాచార్య గారి త్రిపదులు చాల బావున్నాయి
దారీ అదే
గమ్యమూ అదే
జీవితం”…. చక్కటి జీవిత సత్యం .
మణి వడ్లమాని
“వెనకటి గ్రంథాలు చదవని వాడెవ్వడు ఈనాడు సరసమైన సాహిత్య రచన చెయ్యలేడు. ఇదివరకు వేయబడిన గట్టి పునాదుల మీదనే ఈనాటి సాహిత్య సౌధం నిర్మించబడుతున్నది ” అని బలంగా వాదించిన మహాకవి శ్రీశ్రీ ఒక్కరే (తెలుగులో)బహుశః ప్రాచీన, ఆధునిక సాహిత్య సారస్వాల మేలుకలయిక, పురానవ సృజనశీలి అనుకుంటాను. నన్నయ ఆడంబరం, తిక్కన విస్తృతి, పోతన శబ్దలౌల్యం, పెద్దన భావచౌర్యం, వేమన సామర్ధ్యం, గురజాడ వైశిష్ట్యం…. (ఇవి నా ఉద్దేశాలు కాదు, శ్రీశ్రీ దృష్టిలో) అర్థం చేసుకొని, ఇంకా, కవి చౌడప్ప నుండి రాయప్రోలు, అబ్బూరి, బసవరాజు, నండూరి, విశ్వనాథ, దేవులపల్లి, కవికొండల ప్రభృతుల నుంచి, ఆరుద్ర, అనిశెట్టి మీంచి,దిగంబర కవులు, విప్లవ కవుల వరకూ, ఇంకా ఫ్రెంచి, ఆంగ్ల, జర్మన్, పురానవ కవుల వరకూ అనంతమైన సాహిత్యాన్ని తీరని దాహంతో ఔపోసన పట్టిన శ్రీశ్రీ వంటి కవి ఒక్కరే కావడం గురించి బాధపడే వాడిని. ఆ legacy కొనసాగింపుకి సంబంధించి, వాడ్రేవు చిన వీరభద్రుడు ఒక చిగురుటాశలా కనిపించేవారు నాకు.
నేను ఆంధ్ర ప్రభ దినపత్రిక లో పనిచేసే రోజుల్లో (20 ఏళ్ళ క్రితం), ఆంధ్ర ప్రభ వారపత్రికలో పనిచేసే ఫణిహారం వల్లభాచార్య గారి పట్ల కూడా అటువంటి ఆశే కలిగింది నాకు. ఏదో బ్రహ్మతేజస్సుతో వెలిగేది ఆయన ముఖం. అప్పటికే, ఆంధ్ర పత్రిక, భారతి లలో వచ్చిన వ్యాసాల్ని “మధుకశ” పేరిట వేశారు. ఫణిహారం వారు కూడా ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు చదువుకున్నారు.
కానీ, హఠాత్తుగా “నన్ను నేను/ త్యజించాను/ దారి తెలిసింది” అంటూ బహుశా ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్ళారు. మనదైన సాహిత్యపు వెలుగు నీడల్ని ఆధునికత సోకని దృష్టితో చూసి విశ్లేషించే సత్తా ఉన్న ఫణిహారం వారు తర్వాత దశల్లో చేసిన ప్రయాణం గురించి నాకు అంతగా తెలియదు.
“నేను బతకాలనే/ ఆమె రాలేదు/ నా గుండెలోకి” అని ఇప్పుడేవో కొత్త అనుమానాలు రేపుతున్నారు.
మళ్ళీ ఈ త్రిపదులతో, “ఒక జీవిత దూరం/ ప్రయాణం/ గమ్యం రాలేదు” అంటూ ఒక సశేషాన్ని సూచిస్తూ, నాతో పాటు, సాహిత్యాభిమానులకి కొత్త ఆశలు పెడుతున్నారు..
వల్లభాచార్య గారూ, మీ త్రిపదులు బాగున్నాయి. కొత్త మీటర్ అనుకుంటాను…
వల్లభాచార్య గారూ ..దాదాపు ఇరవై ఏళ్ళ తరవాత త్రిపదుల పుణ్యమా అని కలుసుకోడం సంతోషం ..బావున్నారా !