A Few Things About The “All Things”!

Sometime in middle of 1978. Old city of Hyderabad burned with Hindus and Muslims killing each other, and the police killing everyone.

Early May 2003. “Characters should behave unaware of the future that lay ahead of them, and it is in this mystery that life wades forward.” I wrote down something along these lines in my notes after copying it from Gary Saul Morson’s “Narrative and Freedom” book. These were my early notes. I needed to write my book. I had no choice. I felt I will have no future if I didn’t write it.

October 2009. Browsing on the net, I discovered “Rahasya Vaana” poem by Kalpana Rentala on her blog. With a naive boldness that comes only from remembering amateurish skills of younger years, I decided my Telugu is good enough to translate her poem into English. A day or two later, found out one Afsar and his poem “Kondaru Snehitulu…Nanna…Oka Artharaatri.” Soon I learned they are of one family. A month or two later all three of us are talking about starting a Telugu publishing company.

November 2010. Saaranga Books. “Aneka.” Months of toil by Kalpana and Afsar. Still more months of near-anal persistence by me for a certain look and feel for the book.

September 2014. All Things Unforgiven,” the final shape taken by those early May 2003 words. Yes, we all did behave unaware of what the future lay ahead of us. And so when Lev Grossman, the New York Times’ best-selling author of “The Magicians” trilogy, led us—I and four other debut novelists—onto the stage at Brooklyn Book Festival in Brooklyn, New York, this Sunday, Sept 21 2014, for a brief moment these past eleven odd years replayed in my head and I smiled inwardly.

I am not at all glorifying this moment. I believe publishers like Saaranga and writers who publish books are everywhere, and there’s nothing special about them. Still, I am writing this note now because in the book “All Things Unforgiven,” a school-boy named Arya walks back from school to his house in old city on the day of the 1978 Hindu-Muslim communal riots. And that boy came alive in the book extract I read onstage after Grossman introduced me to the audience. This was the extract I read to the audience.

As Arya approached the intersection, which was already crowded with people, he saw, coming out from the narrow lane on the left, a stream of bicycles, rickshaws and auto-rickshaws; evidently all the traffic had been diverted from Charminar.

Across the street, on his right and ahead of him, stood a small mosque and near its entrance stood a group of four or five men, all with their white prayer caps on them. It appeared as though they had just finished their prayer and were standing at the junction talking among themselves.

Arya then saw children, mostly girls, playing in front of the shops, jumping up and down a raised platform. A sudden feeling of nearness towards the children rose in his heart. “Don’t you know it is dangerous to let the children out here, into the open like this, at such times?” he was about to ask someone, but instead something else attracted his attention.

In the adjacent meat shop, through the gap between two large pieces of meat that were hanging by metal hooks, he saw a swinging movement of the shop owner’s arm. With a large black meat cleaver in one hand he cut the meat in rhythmic movements as he deftly moved the pieces sideways and around with his other hand, at the same time saying something to the man by the side of the shop. Next to the man there were three or four older men, also with white prayer caps on them, sitting in plastic chairs, talking something.

Arya was transfixed by these views. “Look how they go in and out of the streets, sit on the chairs and stare at the people, as though out here on the street is their living room, while I am afraid,” he thought. He kept looking at one side and the other, mesmerized by the boldness, by the indifference, and by the fearlessness in all that he saw around him. Once again, the same intense feeling of kinship with everything in these streets rose in the boy’s heart.

He crossed the junction, and going through the traffic that kept on coming from the narrow lane on his left, he turned his head over his shoulder, to see who else was going in his direction.

From the group that was standing in front of the mosque, one of the men stared fixedly at Arya for a few moments, and without taking his eyes off him, spat to his side.

Suddenly Arya became conscious of several eyes staring at him, and an awkward feeling of embarrassment rose in him. He wished to run away, to go near someone or something that was familiar. Still fixing his eyes on Arya, the man removed his cap and, now appearing more menacing, pushed his shirtsleeves up, and spoke to the others, without turning to them.

“He is looking at me thinking if I am a Muslim or a Hindu,” thought Arya, now feeling apprehensive at his circumstance, forgetting his earlier pleasant feeling. “They are talking among themselves, planning to come after me from both sides.”

At once all the faces on the street appeared the same to him, with the same menacing, calculating, fixated look on him, with the full knowledge of how to cordon him off, and how to frighten him. He looked away from them, and shifting his school bag from one shoulder to another, increased his pace. But the heavy bag kept swaying and kept hitting his thigh with a thud, and when the sound of the tiffin box lid breaking open came from within, he slowed down, perspiring and excited with a feeling of terror and shame. The consciousness that his fear had a terrible hold on him disappeared, and in that place now he felt the whole fear itself. The boy could not be sure if the ground was giving away beneath him or whether something unpleasant had begun to churn in his stomach. He slowed down further, and with a defiant expression on his face, through the spectacles that were becoming all misty and kept slipping down his nose, he looked back.

Contrary to his expectations and fears, he saw nothing that moved toward him. There were no crowds that were violent to be seen. He felt flushed. Becoming aware of the pulsations of blood flowing rapidly into his ears, making them swollen, itchy and tingling, he continued along that road, and was seen turning the corner onto the street that brought him nearer home.

And these are the pictures. And yes, I still believe one should write as though the characters should be unaware of the future ahead of them. That’s the only way to be truthful to the moment we are in.

10353693_10152681692118972_4706683076368896267_n ByK9OVTIIAAiUjYPhoto with onstage shot used without permission from Aleksandra Pickering – https://mobile.twitter.com/AleksandraJP/status/514181361796911104/photo/1

 

ప్రభాతమైనా…. ప్రదోషమైనా…. ప్రశాంతమే!

నేటి ఆధునిక జీవితం మనుషుల్ని ఎన్ని ఒత్తిడులకు గురి చేస్తోందో అందరికి తెలిసిందే. పగలూ, రాత్రి, ఆఫీసూ.. ఇల్లూ… తేడా లేకుండా యంత్రాల వలె పనిచేస్తూ ఉరుకులు పరుగుల మీద ఉంటున్నారు జనం. డైలీ టార్గెట్లు… వీక్లీ టార్గెట్లు… మంత్లీ టార్గెట్లు… ఇలా పనిచేసే సమయమంతా టార్గెట్లని వెంటాడుతూ ప్రశాంతత కోల్పోతున్నారు. విశ్రాంతి కరువై శారీరకంగానూ, మానసికంగాను అలసిపోతున్నారు. మరి ఈ వలయం నుంచి బయటపడడం ఎలా? పూర్తిగా బయటపడలేకపోయినా, కాస్త విరామం తీసుకుని, కొత్త ఉత్తేజం పుంజుకుని మళ్ళీ పరుగుపందెంలో పాల్గొంటే ఉత్సాహంగా ఉంటుంది.

మరి కొత్త ఉత్తేజం పొందడం ఎలా? కొందరికి పుస్తకాలు, కొందరికి సినిమాలు, కొందరికి ఆటలు, కొందరికి యాత్రలు… ఉత్సాహాన్నిస్తాయి.

యాత్రలలో మళ్ళీ పలురకాలు.. వినోద యాత్రలు.. విజ్ఞాన యాత్రలు.. ఆధ్యాత్మిక యాత్రలు….

ఆధ్యాత్మిక యాత్రలంటే ఎక్కడో దూరంగా ఉన్న కేదారనాథ్, బదరీనాథ్ యాత్రలే కానవసరం లేదు. మనకి దగ్గరలో ఉన్న ఆలయాలని దర్శించడం కూడా ఆధ్యాత్మిక యాత్రే అవుతుంది. “ఈ వయసులో గుళ్ళూ, గోపురాలు ఏంటి బాస్” అని కొందరు, “ఆఁ, గుళ్ళలో మాత్రం ప్రశాంతత ఎక్కడుంది? భక్తులను తరిమే సిబ్బంది, బిచ్చగాళ్ళు… వ్యాపారులూ… అంతా కమర్షియల్ కదా…” అని మరి కొందరు అంటారు. నిజమే. అన్ని ఆలయాలలోను ప్రశాంతత దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేం కాని.. సంవత్సర కాలంలో కొద్ది రోజులు తప్ప మిగతా కాలమంతా అత్యంత ప్రశాంతంగా ఉండే గుడి ఒకటుంది. అదే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.

ఈ ఆలయం గురించి వెళ్ళేవరకూ కూడా నాకు పెద్దగా ఏమీ తెలియదు. కాని అక్కడికి వెళ్ళి ఆ ప్రశాంతతని అనుభూతి చెందాకా, ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ వ్యాసం.

∗ ∗ ∗

KSSinDoubleDeccarTrainది 15 ఆగస్టు 2014 నాడు నేనూ, మా బాబాయి కొల్లూరి గణేశ్ కలిసి ఉదయం 5 గంటల 45 నిముషాలకి మల్కాజ్‌గిరి స్టేషన్‍లో కాచీగుడా – గుంటూరు డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కాం. రైలు ఓ పది నిముషాలు ఆలస్యంగా వచ్చింది. 5.45 కే బండి అని తెల్లారకట్టే లేచాను. 4.45కి తాగిన టీ తప్ప కడుపులో ఏం లేదు. రైల్లో ఇంకో కప్పు టీ తాగచ్చులే అనుకున్నాం కానీ, కాటరింగ్ వాళ్ళెవరు రాలేదు. నల్గొండ స్టేషన్‌లో కేటరింగ్ వాళ్ళొచ్చినా, టిఫిన్లే తెచ్చారు… టీ లేదు. చేసేదేముందని కాసేపు కునుకు తీసాం. మిర్యాలగుడా, నడికుడి స్టేషన్లు ఎప్పుడు దాటిపోయాయో గమనించలేదు. ఇంకో పది నిముషాల్లో పిడుగురాళ్ళ వస్తుందనగా మెలకువ వచ్చింది. పిడుగురాళ్ళలో 9.10కి దిగాం. సూపర్‌ఫాస్ట్ ట్రైన్ అన్నారు కానీ 205 km దూరానికి సుమారు మూడు గంటల సమయం తీసుకుంది.

పిడుగురాళ్ళ స్టేషన్ నుంచి బయటకొచ్చి నర్సరావుపేట వెళ్ళేందుకు బస్ స్టాండ్‌కి షేర్ ఆటోలో వెళ్ళాం. పిడుగురాళ్ళ నుంచి నర్సరావుపేటకి గంటంపావు పట్టింది ఆర్డినరీ బస్‌లో. మా బాబాయి కోటప్పకొండ గుడికి తరచూ వెడతాడు కాబట్టి, నర్సరావుపేటలో కొంతమంది మిత్రులయ్యారు. ఒక ఆటో డ్రైవర్‍తో కూడా టచ్‌లో ఉంటాడు. నర్సరావుపేటలో దిగగానే ఓ మిత్రుడిని కలిసాం. పలకరింపులయ్యాక, టీ తాగి, ఆటోలో కోటప్పకొండకి బయల్దేరాం. నర్సరావుపేట బస్‌స్టాండు నుంచి కోటప్పకొండ ఆలయానికి సుమారు 16కిమీ దూరం ఉంటుంది. ఘాట్ రోడ్ మీదుగా ఆలయానికి చేరాము. ఆఖరి అభిషేకానికి సమయం అవుతుండడంతో, కాళ్ళూ చేతులు కడుక్కుని, మా లగేజ్ అంతా ఆలయ సిబ్బంది వద్ద ఉంచి దర్శనానికి వెళ్ళాం. శ్రావణ శుక్రవారం, సెలవు రోజు కావడంతో కాస్త రద్దీగానే ఉంది గుడి. అభిషేకమూ, అర్చన చూసుకుని బయటకు వచ్చాం. ఆలయ సిబ్బందిలో మా బాబయికి తెల్సినవాళ్ళు ఉండడంతో, మాకు భోజనం ఏర్పాటు చేసారు. వారితో పాటే వారి గదిలోనే అన్నం తిని, ఆలయంకి దిగువన ఉన్న దేవాలయం వారి గది ఒకటి అద్దెకు తీసుకుని, కాసేపు విశ్రాంతి తీసుకున్నాం.

 

∗ ∗ ∗

TempleView

ఆలయ సిబ్బంది నుంచి ఓ బ్రోచర్ సంపాదించి, అక్కడున్న ఓ స్టాల్‌లో డా. పోలేపెద్ది వేంకట హనుమచ్ఛాస్తి రచించిన “కోటప్పకొండ చరిత్ర – క్షేత్ర వైభవం” పుస్తకం కొనుక్కుని అలయ చరిత్ర, స్థల పురాణం తెలుసుకున్నాను. కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనమైనది. చారిత్రాక శాసనాల ప్రకారం క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటికే ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతారు. వివిధ మహారాజుల ఏలుబడిలో గత పదిహేడు వందల సంవత్సరాలుగా పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. నరసరావుపేట మండలంలోని ఎల్లమంద, కొండకావూరు అనే గ్రామాల మధ్య ఉన్న పర్వతరాజం త్రికూటాచలం. దీన్నే కోటప్పకొండ అని కూడా పిలుస్తారు. సుమారు 1600 అడుగుల ఎత్తు, ఎనిమిది మైళ్ళ చుట్టుకొలత ఈ పర్వతాన్ని ఏవైపు నుంచి చూసినా మూడు కూటాలుగా (శిఖరాలు) కనిపిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు రూపాలుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల పేరిట మూడు శిఖరాలున్నాయి.

దక్ష యజ్ఞ విధ్వంసం చేసిన తరువాత లయకారుడైన మహాశివుడు శాంతివహించి బాల వటువులా శ్రీ దక్షిణామూర్తి స్వరూపంలో మధ్య శిఖరమైన రుద్రశిఖరంపై ఉన్న మారేడువనంలో ధ్యానమగ్నుడయ్యాడట. ఈ శిఖరం మీదే బ్రహ్మకు, విష్ణువుకు, సకలదేవతలకు, సనకసనందనాది మునులకు, నారదుడికి, ఎందరెందరో సిద్ధులకు, వశిష్టాది ఋషులకు జ్ఞానబోధ చేసాడట. సమస్తదేవతలు సేవించి తరింప, శివుడు దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రధారుడై దర్శనమిచ్చాడని భక్తుల విశ్వాసం. ఇదే పాత కోటప్ప గుడి. ఇక్కడే ప్రాచీన కోటేశ్వర లింగం ఉంది. శ్రీ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వులు. “ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే | నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||” అని ఆది శంకరులు ప్రార్థించి తరించారు.

రుద్ర శిఖరానికి ఈశాన్య భాగాన మరో శిఖరం ఉంది. అదే విష్ణు శిఖరం. దక్షయజ్ఞం సందర్భంగా శివుడు లేకుండానే హవిర్భాగం స్వీకరించినందుకు దోష నివారణ కోసం, విష్ణువు ఇంద్రుడు ఇతర దేవతలతోకలసి ఇక్కడ తపస్సు చేసాడట. ఈశ్వరుడు కరుణించి ప్రత్యక్షం కాగా, తాము ఎల్లవేళలా అర్చించుకోడానికి లింగరూపంలో ఆ శిఖరంపై నిలచి దర్శనమీయమని దేవతలు కోరగా, తన త్రిశూలంతో రాతిపై పొడిచి జలం ఉద్భవించజేసి, ‘ఈ జలమందు స్నానమాచరించి నన్ను పూజించిన మీ పాపములు నశించునని’ చెప్పి అక్కడ లింగరూపంలో వెలిసాడట. దేవతలు అక్కడ స్నానమాచరించి, తమ పాపాలను పోగొట్టుకున్నారట. పాప వినాశన క్షేత్రమిది.

రుద్రశిఖరానికి నైరుతి దిశలో బ్రహ్మ శిఖరం ఉంది. రుద్ర, విష్ణు శిఖరాలలో పూజనీయ లింగాలు ఉండి తన శిఖరంలో లింగం లేకపోవడంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా, శివుడు అక్కడ కూడా లింగ రూపంలో వెలిసాడు. నేడు అర్చనలు అందుకుంటున్న మహిమాన్విత దివ్యరూప శిఖరం బ్రహ్మశిఖరం. లింగరూపధారుడైన నూతన కోటేశ్వరుడు నేటికినీ ఈ శిఖరం మీదే అశేషభక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ మూడు శిఖరాలలోనూ జ్యోతిర్మయ లింగాలు ఉన్నాయనీ, మానవులకు అగోచరమగుటచే శిలాలింగములు నేడు విశిష్ట పూజలందుకుంటున్నాయని పండితులు చెబుతారు.

∗ ∗ ∗

 

TrekkingPathవిశ్రాంతి అనంతరం, సాయంత్రం నాలుగున్నరకి స్నానం చేసి, రుద్రశిఖరంపై ఉన్న పాత కోటప్ప లింగాన్ని దర్శించాలని బయల్దేరాం. ప్రస్తుతం ఉన్న గుడి నుంచి పైకి సుమారు ఒకటిన్నర – రెండు కిలోమీటర్ల దూరంలో పాత కోటప్పగుడి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పూజలేం జరగడం లేదు. రోజూ పొద్దున్న సాయంత్రం ఓ సాధువు కొండెక్కి, అర్చన, దీపారాధన చేసి వస్తాడట. ఓపిక ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆ కొండెక్కి అక్కడి లింగానికి స్వయంగా పూజలు చేసుకోవచ్చు. పూజాసామాగ్రి తీసుకుని కొండెక్కుదామని బయల్దేరి, కొంత దూరం ఎక్కామో లేదో పెద్దగా వాన! ముందుకు వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకపోయాం. చీకటి పడేలోగా కొండ దిగి వచ్చేయాలని మా ఉద్దేశం. ఈ వానకి జడిసి, వెనక్కి వచ్చేద్దామా అని అనుకున్నాం. కాని ఉదృతి ఆగి, తుంపరగా మారడంతో ముందుకే సాగాం. “పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు” అనే వేమన పద్యాన్ని గుర్తు చేసుకుని ఎక్కడం కొనసాగించాం. కొండపైకి ఎక్కుతున్న కొద్దీ నాకు అలసట, ఆయాసం వచ్చాయి. గత మూడేళ్ళుగా శబరిమలకి కూడా వెళ్ళకపోవడంతో, నాకు ఈ కొండ ఎక్కడం కష్టమనిపించింది. మా బాబయి సులువుగానే ఎక్కేస్తున్నాడు, నేనేమో పది అడుగులు వేయడం ఆగిపోవడం! పనివేళలు పట్టించుకోకుండా, ఏం తింటున్నామో చూసుకోకుండా, సరైన నిద్ర లేకుండా ఉంటుండడంతో బరువు పెరిగిపోయి శరీరం స్థూలకాయమవుతూ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. అప్పుడే స్ఫురించింది శరీరానికి కనీస వ్యాయామం ఎంత అవసరమో. ఆ క్షణంలో ఆ కొండ (ప్రకృతి) మౌనంగా బోధించేది అదేనని అర్థమైంది.

కొండలెక్కడం గురించి ఎప్పుడో చదివిన కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి. “At bottom, mountains, like all wildernesses, challenge our complacent conviction – so easy to lapse into – that the world has been made for humans by humans. Most of us exist for most of the time in worlds which are humanly arranged, themed and controlled. One forgets that there are environments which do not respond to the flick of a switch or the twist of a dial, and which have their own rhythms and orders of existence. Mountains correct this amnesia. By speaking of greater forces than we can possibly invoke, and by confronting us with greater spans of time than we can possibly envisage, mountains refute our excessive trust in the man-made. They pose profound questions about our durability and the importance of our schemes. They induce, I suppose, a modesty in us.” – అని “Mountains of the Mind: Adventures in Reaching the Summit” అనే పుస్తకంలో అంటాడు రచయిత Robert Macfarlane.

PataKotappaGudi

DarkCloudమొత్తానికి తడుస్తూనే, రాళ్లూ రప్పలను దాటుకుంటూ శిఖరాగ్రానికి చేరాము. అనుకున్నట్లే అక్కడ ఎవరూ లేరు. నేను, మా బాబాయి తప్ప మరో మనిషి లేడు. వర్షంతో తడిసిన బట్టలను అక్కడ చెట్ల మీద ఆరేసుకుని, నా బ్యాగ్ లో పట్టుకెళ్ళిన పంచలు ధరించి అక్కడి లింగానికి పూజ చేసుకున్నాం. ఆ శిఖరం నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. అత్యంత ప్రశాంతంగా ఉన్న ఆ చోటు వదిలి రా బుద్ధి కాలేదు. కానీ చీకటి పడేలోగా క్రిందకి దిగాలి కాబట్టి, దిగసాగం. దిగేడప్పుడు అంత కష్టమనిపించలేదు. మళ్ళీ జోరున వాన. ఓ చెట్టు చాటున ఆగాం. జీవితంలో ఏదైనా సాధించడమనేది శిఖరాగ్రాన్ని చేరడం లాంటిదని, అక్కడికి చేరాక, ఇంక సాధించడానికి ఏమీ ఉండదని, మళ్ళీ క్రిందకి దిగి రావల్సిందేనని అనిపించింది. ఎక్కేడప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కామో, దిగేడప్పుడు అంతే జాగ్రత్తగా దిగాము. ఏమరుపాటుగా ఉంటే కాలు జారి పడడం ఖాయం. విజయం తరువాత గర్వం తలకెక్కితే పతనం తప్పదని ప్రకృతి ఈ రకంగా చెబుతోందని అనిపించింది. గదికొచ్చి, తడిసిన బట్టలు ఆరేసుకుని, పొడి బట్టలు ధరించి భోజనం చేసి విశ్రమించాం.

∗ ∗ ∗

కొండ ఎక్కడానికి నానా అవస్థలు పడ్డ నన్ను చూసి మా బాబాయి ఓ కథ చెప్పాడు. ఓ మహిళ కొన్ని సంవత్సరాల పాటు రోజూ ఈ కొండెక్కి ఆ లింగాన్ని పూజించేదని చెప్పాడు. ఆ కథేంటంటే… కొండకావురు గ్రామంలో సునందుడు, కుందరి అనే యాదవ దంపతులకు ఆనందవల్లి అనే కూతురు ఉందేది. పుట్టుకతోనే శివభక్తిని అలవడిన ఆమెకి వయసుతో పాటు ఆ భక్తి పెరిగింది. రోజూ రుద్రశిఖరమెక్కి అక్కడ జంగమరూపంలో ఉన్న శివునికి త్రికరణ శుద్ధిగా పూజచేసి, పాప వినాశన క్షేత్రం నుంచి తీసుకువెళ్ళిన జలంతో అక్కడి లింగానికి అభిషేకం చేసి, తాను తీసుకువెళ్ళిన ఆవుపాలను నైవేద్యంగా పెట్టేది. ఎండనకా, వాననకా ఎంతో శ్రమల కోర్చి కొండ ఎక్కి స్వామిని అర్చించి దిగి వచ్చేది. ఆమె వివాహం ప్రస్తావన లేకుండా నిరంతరం శివుని ధ్యానంలోనే ఉండిపోయేది. ఏళ్ళు గడుస్తున్నా ఆమె భక్తి పెరుగుతోందే తప్ప, తరగడం లేదు. భౌతిక ప్రపంచ విషయాలను పట్టించుకోకుండా, స్వామి తలంపులలోనే గడుపుతూ, ఆధ్యాత్మికానందం పొందుతూండేదట. ఆమెని పరీక్షించాలని స్వామి ఆమెకు మాయాగర్భాన్ని కల్పిస్తాడట. నెలలు నిండినా కూడా కొండ ఎక్కడం ఆపక, నిత్యం కొండెక్కి పూజలు కావించి మళ్ళీ దిగేదట. ఆమె బాధ చూడలేని స్వామి వారు, ఓ రోజు “అమ్మా, నువ్వు ఇలా రోజూ రావద్దు. నేనే నీతో పాటు వస్తాను… నువ్వు కిందకి దిగుతూ ఉండు. నీ వెనుకే నేను వస్తాను. ఎలాంటి చప్పుడైనా వెనుదిరిగి చూడకు. ముందుకు సాగుతునే ఉండు…” అని అన్నారట. ఆమె తలూపి దిగడం ప్రారంభించిదట. ప్రస్తుత ఆలయం ఉన్న చోటుకి రాగానే భయంకరమైన శబ్దమై, భయపడి ఆమె తల తిప్పి వెనక్కి చూసిందట. అంతే స్వామి అదృశ్యుడై అక్కడే లింగంగా వెలిసాడట. ఆ క్షణంలోనే ఆమె ప్రసవం అవడం, మగబిడ్డ పుట్టడం జరుగుతుంది. స్వామి వారు అదృశ్యమైనందుకు చింతించిన ఆమె అక్కడే ప్రాయోపవేశం చేయాలని తలచగా, ఆ నవజాత శిశువు మాయమై శివుడు దర్శనమిస్తాడు. ఆమెకి ముక్తిని ప్రసాదించాడు. నూతన కోటేశ్వరస్వామి వారి ఆలయానికి దిగువనే ఆనందవల్లికి గుడి ఉంది. దీనిని గొల్లభామ గుడి అంటారు. ఈమె గురించి మరో విశేషం ఉంది. శివుడికి అభిషేకం నిమిత్తం సేకరించిన జలాన్ని ఓ బిందెలో ఉంచి, పూల కోసం వెళ్ళినప్పుడు ఓ కాకి వచ్చి ఆ బిందెలోని నీటిని నేలపాలు చేసిందట. కోపించిన గొల్లభామ “ఇక్కడ కాకులుండ కూడదు గాక!” అని శాపమిచ్చిందట. అందుకే కోటప్పకొండ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనబడవు.

రాత్రి 8 గంటల తర్వాత గుడి ఖాళీ. ఒకరిద్దరు సిబ్బంది తప్ప జనాలే లేరు. గుడి ప్రాంగణంలో ఉన్న ఓ సిమెంట్ దిమ్మ మీద కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తుంటే ఏదో ఆనందం. తృప్తి. నిత్యం రణగొణధ్వనులతో నిండిన నగర జీవితం నుంచి ఒక్కరోజయినా దూరంగా ఉండి ప్రశాంతమైన స్థలంలో ఉండడం వల్ల కలిగిన మానసికానందం అదని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఈ గుడి కొండ మీద ఊరికి దూరంగా ఉండడం; ఏం కావాలన్నా, కొండ దిగి కనీసం పది కిలోమీటర్లైనా వెళ్ళాల్సిరావడం వల్ల సాయంత్రమయ్యే సరికి ఇక్కడ జనాలు ఉండరు. ప్రధాన రహదారికి, రైలు మార్గానికి దూరంగా ఉండడం వల్ల వాహనాల రాకపోకల శబ్దాలు, రైలు కూతలు వంటివి లేవు. మైకులూ, లౌడ్ స్పీకర్లు లేవు. పొద్దుగుంకాక, పక్షుల కువకువలు, కోతుల కిచకిచలు తప్ప మరేమీ వినపడదు. చాలా సేపు గుడి ప్రాంగణంలోనే కూర్చుని, నిద్రపోకతప్పదు కాబట్టి గదికి వచ్చి – ఆ పూట పొందిన అనుభవాలను నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. – It was a real bliss!

∗ ∗ ∗

 

DakshinamurthyTemple16 ఆగస్టు 2014 శనివారం పొద్దున్నే లేచి స్నానాదులు గావించి, త్రికోటేశ్వర స్వామి వారి ఆలయానికి దిగువన ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళాం. మళ్ళీ మేమిద్దరమే. పూజారి తప్ప మరెవరూ లేరు. మన గుళ్ళలో చాలా అరుదుగా దొరికే భాగ్యం ఇది. ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోగలగడం! ఆ మూర్తిని చూస్తుంటేనే ఏదో పరవశం. ఇక్కడ పూజాదులు కానించి, త్రికోటేశ్వర స్వామి వారి అభిషేకానికి వెళ్ళాము. దర్శనమయ్యాక, తీర్థ ప్రసాదాలు స్వీకరించి బసకి వచ్చాం. చిత్తచాంచల్యాన్ని దూరం చేసి మానసిక స్వస్థత కలిగించే ఆలయమిదని ప్రధానార్చకులు చెప్పారు. మేం దిగిన గది ఖాళీ చేసి, అక్కడున్న కాంటిన్‍లో టిఫిన్ తిని బయటకు వచ్చేసరికి మా ఆటో అతను వచ్చేసాడు.

DakshinaMurthyIdolఇక్కడ ప్రధానంగా ఉన్న రెండు ఇబ్బందుల గురించి ప్రస్తావించక తప్పదు. కొండ మీద ఉన్నది ఒకే ఒక కాంటిన్. ఏ వస్తువైనా మాములు ధరకన్నా కనీసం రెండు రెట్లు ఎక్కువకి అమ్ముతున్నారు. గ్లాస్ మినరల్ వాటర్ రెండు రూపాయాలు. టీ కాఫీలు పది రూపాయలు. ప్లేట్ ఇడ్లీ (చిన్న సైజువి మూడు) రేటు వింటే ఠారెత్తిపోయింది… గత్యంతరం లేదు కాబట్టి తినక తప్పలేదు. ఇక రెండో ఇబ్బంది కోతులు. గుంపులు గుంపులుగా ఉంటాయి. భక్తుల సంఖ్య కన్నా వీటి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. చేతిలోని వస్తువులను బలవంతంగా గుంజుకుపోతాయి. త్రికోటేశ్వరస్వామి వారిది బ్రహ్మచారి రూపం కాబట్టి ఇక్కడ పార్వతి దేవి ఉండదు. కాబట్టి కళ్యాణోత్సవాలు ఉండవు. సాధారణంగా ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుందీ ఆలయం. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలోనూ, ధనుర్మాసంలో వచ్చే ఆర్ద్రోత్సవానికి మాత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. పునర్దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థిస్తూ, కొండ దిగడం ప్రారంభించాము.

మెట్ల మార్గంలోనూ, కొండకి దిగువన మరిన్ని ఆలయాలు ఉన్నాయి. భక్తులు ఆరాధించిన విగ్రహాలు ఉన్నాయి. ఘాట్ రోడ్ మీద నుంచి దిగుతూ, రోడ్‌కి అటూ ఇటూ ఉన్న పెద్ద పెద్ద బొమ్మలను ఫోటోలు తీసుకున్నాను. దారిలో పిల్లల కోసం అటవీశాఖ నిర్వహిస్తున్న పార్కు ఉంది.

Ganesha GollabhamaTemple PanchamukhaSivalingam KalindiMadugu Shiva Vishnu Brahmaనరసరావుపేట బస్టాండ్‍కి వచ్చి టీ తాగి గుంటూరు వెళ్ళే నాన్-స్టాప్ బస్ ఎక్కాం. మధ్యాహ్నం ఒకటి నలభై కల్లా గుంటూరు చేరి, రైల్వే స్టేషన్ సమీపంలో ఓ హోటల్‍లో భోజనం చేసి, గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురు చూడసాగం. గంట ఆలస్యంగా వచ్చిన రైలు గుంటూరు నుంచి బయల్దేరేసరికి మరో అరగంట పట్టింది. మొత్తానికి రాత్రి పదకొండు గంటలకి సికింద్రాబాద్ చేరాము. ఇంటికి చేరే సరికి పదకొండున్నర. ఏదో రెండు ముద్దలు తిని, పక్కమీదకి చేరి.. “కోటి వేల్పుల అండ కోటప్ప కొండ” యాత్రానుభవాలను స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

∗ ∗ ∗

హైదరాబాదు నుంచి పిడుగురాళ్ళకి ఇప్పుడు చక్కని రోడ్ మార్గం కూడా ఉంది. సొంత వాహనం ఉంటే పొద్దున్నే బయల్దేరితే, దర్శానాదులు కావించుకుని రాత్రికి తిరిగి హైదరాబాదు చేరుకోవచ్చు. లేదూ వారాంతాలు ప్రశాంతంగా గడపదలచుకుంటే శనివారం పొద్దున్నే ప్రయాణమైనా, మధ్యాహ్నానికి గుడికి చేరుతాం. అక్కడ గది తీసుకుని శనివారం సాయంత్రం, రాత్రి ప్రశాంతతని అనుభవించి, ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమైనా శరీరం, మనసు రీచార్జి అవుతాయి. మరి ఆలస్యమెందుకు, వెడతారుగా…?

కొల్లూరి సోమ శంకర్

చీకటి

DRUSHYA DRUSHYAM 41

చీకటి
……………

‘చీకటి కరేల్మని కదులుతుంది’ అంటాడు తిలక్.
ఒంటరి ప్రపంచంలో, ఏకాంతంలో ఇది మెదులుతుంది, ఎందుకో!

+++

తెలియదు గానీ ఒకానొకసారి ఎందుకో మేలుకుంటుంది నిద్ర.
లేచి అటూ ఇటూ తిరుగుతుంటే ఒక శునకం ఆవళించుకుంటూ వెళుతుంది.
లేదా నీలి నీడల్ని కాల్చుకుంటుంది లోలోనే.

అర్థం కాదు. లోపలి కోర్కెలు అలా రెక్కలు చాపుకుని మృగంలా సంచరిస్తాయా? అంత తేలిగ్గా అర్థం కాదు.
లేక నీడ రూపం ధరించి అదట్లా నాలుగు కాళ్ల జంతువై మనిషే అలా సంచరిస్తాడా? తెలియదు.
కానైతే, ఒక్కోసారి మనిషి తనను తాను పశువులో చూసుకుంటూ ఉంటాడేమో!

ఒక రాత్రి. రెండింటికి…గేటు బయటకు చూస్తే ఇది.
అది నిదానంగా నడిచి వస్తుంటే లోపలికి…లోలోపలికి వెళ్లినట్లు వెళ్లి,
నా నుంచి మీ అందరికీ పంచి పెట్టేందుకా అన్నట్టు నాలోని సామాజికుడు మళ్లీ నిద్రలేచి కెమెరా చేతబట్టాడు.
తీసి, దీన్నిలా తీసి పెట్టాను ఒకసారి.

నాకైతే ఇదొక చిత్రం. ఆ రంగు, చ్ఛాయా…అంతా కూడా ‘కొర్కె’ అనిపిస్తుంది.
కామమూ అనిపిస్తుంది. బహుశా చిత్ర ప్రవృత్తిలో మానవీయ అనుభవంలో అమానుషంగా ‘ఇదీ’ ఒకటి దాగి ఉంటూనే ఉంటదేమో!

చూసినప్పుడల్లా బహుశా ఏదైనా ఒక అంతర్జాతీయ పోటీకి పంపదగ్గ ఫొటో ఏమో అని అనుకున్నాను… దీన్నొకసారి.
ఎందుకూ అంటే, దాచుకుని బతికే భారతంలో ఇది అదృశ్యం. దాటిపోతేగానీ ఈ దృశ్యానికి సరైన అర్థం కానరాదని కాబోలు.

+++

ఏమైనా, ఒక్కోసారి అదృశ్యమైన దేహరాగాలని దృశ్యమానం చేసే చిత్రాలూ మనలోనే పుడతాయి.
నిజం. అందులో ఇదొకటని నా భావన.

గమనిస్తారని, మన లోవెలుపలా దాగే కోటి దహనాల కాంతిని ఇముడ్చుకునే చిమ్మ చీకటి మన ముందే ఇట్లా సంచరిస్తుందని, దాన్నిఒడిసి పట్టుకునేందుకే ఈ చిత్రమని నమ్ముతారనే ఇది.
ఈ వారం. చీకటి కరేల్మని…

~ కందుకూరి రమేష్ బాబు

వీలునామా – 42

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

“పారిస్ లో మేమిద్దరం పెళ్ళీ పెటాకులూ లేకుండానే ఒకే ఇంట్లో కలిసి వున్నాం. అక్కడెవ్వరూ ఏదీ పట్టించుకోరు! అక్కడ నాకు బానే వుండేది. అన్నిటికంటే డబ్బుకి కొదవ వుండకపోవడం లోని హాయి తెలిసొచ్చింది. నన్ను హేరీ అప్పుడప్పుడూ, ‘ఆశ పోతూ!’ అని పిలిచేవాడు. కానీ నేనేది అడిగితే అది కొని పెట్టేవాడు.

ఇంతలో అతనికి వాళ్ళ అన్నయ్య ప్రమాదం లో మరణించాడనీ, దాంతో తండ్రి గుండె పగిలి మంచం పట్టాడనీ కబురొచ్చింది. వెంటనే బయల్దేరి ఇంటికెళ్ళిపోయాడు. కొంచెం వెనకగా నేనూ ఇల్లు చేరుకున్నాను. ఒంటరిగా పారిస్ లొ నేను మాత్రం చేసెదేముంది?

అసలు ఇంటికి అమ్మ దగ్గరకెళ్ళాలంటే భయంతో ఒణికిపోయాను. కానీ హేరీ నచ్చచెప్పి పంపాడు. తను తప్పకుండా ఒచ్చి చూస్తుంటాననీ, కావలసినంత డబ్బిస్తాననీ చెప్పాడు. నేననుకున్నట్టుగానే అమ్మ నా మీద విరుచుకుపడింది. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో లేచి పోయానని చావ బాదింది.

అయితే హేరీ గురించి నేను చెప్పగానే కొంచెం శాంతించింది. అంత డబ్బున్న అబ్బాయి పెళ్ళాడితే చాలని, ఎలాగైనా అతన్ని పెళ్ళికొప్పించాలనుకుంది. అందుకొక పథకం వేసింది అమ్మ. నన్ను తిండీ తిప్పలు పెట్టక చిక్కి శల్యమై పోయేలా చేసి, అతనికి కబురు పెట్టించింది. ఆ కబురందుకొని ఆఘ మేఘాలమీద వచ్చేసాడు హేరీ. అప్పటికే వాళ్ళ నాన్న గారు కూడా మరణించారట, ఊళ్ళో చెప్పుకున్నారు. వస్తూనే, మంచం మీద పడుకున్న నన్ను చూసి,

“బేస్సీ! ఏమైంది? ఇలా అయిపోయావెందుకు?” అని అడిగాడు. నేను అమ్మ చెప్పినట్టే మూలుగుతూ పడుకున్నా.

“ఏముంది, అంతా అయిపోయింది నాయనా! ఇహ మన బెస్సీ మననొదిలి వెళ్ళిపోతుందన్నాడు వైద్యుడు!” మా అమ్మ యథా శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది.

నా నాడి పట్టుకుని చూసాడు హేరీ. అతను డాక్టరు పరీక్షకి చదివేవాడన్న సంగతి మర్చిపోయినందుకు అమ్మ తనని తనే తిట్టుకుంది. నాడి చూసి, నవ్వేసాడు.

“మరేం భయం లేదు. కొంచెం తిండి తింటే చాలు. బెస్సీ, నీ ఆరోగ్యానికేం ఢోకా లేదు. లే, లేచి కూర్చో!” అన్నాడు.

“వ్యాధి ఒంటిక్కాదు నాయనా, మనసుకి. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో వున్న ఆడపిల్ల మనసెలా వుంటుంది బాబూ? నా కుతురి మొహాన అందరూ ఉమ్మేస్తున్నారు.”

“అయ్యో! ఆర్మిస్టవున్ గారూ! నేను మీ అమ్మాయిని లేవదీసుకెళ్ళలేదు. తనే నాతో లేచి వచ్చేసింది, అసలు తీసికెళ్ళేదాకా ప్రాణలు తోడిందంటే నమ్మండి!” నవ్వుతూ అన్నాడు.

“బెస్సీ కేమీ ప్రమాదం లేదు, మంచి తిండి తిని విశ్రాంతి తీసుకుంటే తనే లేచి తిరుగుతుంది!” నవ్వుతూ అని లేచి వెళ్ళిపోయాడు. అమ్మకి ఒళ్ళు మండిపోయింది.

“చావుకి పెడితే కానీ, లంఖణానికి రాదు,” అనుకుని నా ఆరోగ్యం క్షీణించాలనీ ఏవేవో మందులు తినిపించింది. నిజం చెప్పొద్దూ, ఆ మందులూ మాకులూ తిని నేనెంత అనారోగ్యం పాలయ్యానంటే నిజంగా చచ్చిపోతానేమోనని భయ పడ్డాను కూడా.

మళ్ళీ కబురు పెట్టింది అమ్మ హేరీకి. ఈ సారి నిజంగానే మంచం పట్టిన నన్ను చూసి హేరీ ఆశ్చర్యపోయాడు.

“పిల్ల బెంగతో చచ్చిపోయేటట్టుంది బాబూ! మీరు దాన్ని భార్యగా అంగీకరిస్తే మనశ్శాంతితో పోతుంది. లేకపోతే ప్రపంచం దృష్టిలో తాను కులటననే బాధతో పోతుంది.” అమ్మ వీలైనంత ఏడుపు గొంతుతో అంది.

నిజంగా నేను తన ప్రేమా పెళ్ళీ కోసం అంత బెంగటిల్లిపోతానని హేరీ ఊహించలేదు. నన్ను అక్కడికక్కడే పెళ్ళాడడానికి ఒప్పుకున్నాడు. అమ్మ వెంటనే ఇద్దరు బంధువులనీ, ఒక చర్చి ఫాదరునీ పిలిచి అప్పటికప్పుడు చట్టబధ్ధంగా భార్యా భర్తలనిపించింది. ఇదిగో ఆ కాగితం. దీంతో హేరీని దిగ్బంధనం చేసాననుకొంది అమ్మ.

అ తర్వాత హేరీ ఎస్టేటు పన్ల మీద లండన్ వెళ్ళాడు. అతనక్కడుండగానే ఫ్రాంక్ పుట్టాడు. ఆ సంగతి ఉత్తరంలో చెప్పాను. హేరీ పిల్లాణ్ణి చూడటానికి హుటాహుటిని బయల్దేరి మా వూరొచ్చాడు. దురదృష్టవశాత్తూ, సరిగ్గా హేరీ ఇంట్లో అడుగుపెడుతూన్నప్పుడు నేను చిన్ననాటి స్నేహితుడు జేమీతో మాట్లాడుతూ వున్నాను. నాకూ హేరీకీ పెళ్ళయిన సంగతి తెలిసి జేమీ చాలా బాధపడ్డాడు. పాపం నా కొసమే వూరొదిలి వెళ్ళిపోయి ఉద్యోగం సంపాదించుకోని స్థిరపడ్డాననీ, నన్ను పెళ్ళాడడంకోసమే తిరిగి వూరొచ్చాననీ చేప్పాడు జేమీ. నేనూ, తననెప్పుడూ మర్చిపోలేదనీ, హేరీతో పెళ్ళి కేవలం మా అమ్మ చేసుకున్నాననీ చెప్తూ వుండగా వొచ్చాడు హేరీ.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నేను తనని ప్రేమ పేరుతో మోసం చేసాననీ, ఇంకెన్నడూ నా మొహం కూడా చూడననీ ఉత్తరం రాసాడు.”

ఊపిరి పీల్చుకోవడానికని ఆగింది మిసెస్ పెక్.

“ఆహ్హా! అయితే ఫ్రాంక్ హేరీ హొగార్త్ గారి కొడుకు కాదన్నమాట. ఆ జేమీ స్టీవెన్సన్ కొడుకు. ఇదేనా నువ్వు నాకు చెప్పదల్చుకొన్న రహస్యం?” ఆత్రంగా అడిగాడు బ్రాండన్.

“నీ తెలివి సంతకెళ్ళా! అలాటిదేమీ లేదు. ఫ్రాంక్ ముమ్మాటికీ హేరీ హొగార్త్ కొడుకే! చెప్పేది పూర్తిగా విను మరి. వెళ్ళిపోయిన హేరీ అప్పుడప్పుడూ పిల్లాడి కోసం డబ్బు పంపుతూ వుండే వాడు, కానీ ఎన్నడూ నన్ను చూడడానికి రాలేదు. ఫ్రాంక్ యేణ్ణర్థం పిల్లవాడుగా వుండగా హేరీ ఇంకొక అన్నయ్య కూడా మరణించాడు. పాపాం, చాలా అల్పాయుష్కులు వాళ్ళందరూ. అప్పుడే హేరీ ఎస్టేటు సొంతదారుడయ్యాడు. అంత డబ్బున్న అల్లుడు చిక్కినట్టే చిక్కి చేజారిపోయినందుకు అమ్మ లబలబ లాడింది. ఏది ఏమైనా చట్ట రీత్యా నేను అతని పెళ్ళాన్ని కాబట్టి కొంతైనా డబ్బివ్వాలని హేరీ మీద ఒత్తిడి తెచ్చింది అమ్మ. దానికి హేరీ సరేనన్నాడు. అయితే నేను స్కాట్ లాండు వదిలి వెళ్ళి ఇంకెక్కడైనా స్థిరపడితేనే డబ్బు ఇస్తానన్నాడు. ముందు మేమిద్దరమూ ఒప్పుకోలేదు. కావాలంటే న్యాయస్థానానికీ వేళ్తామని బెదిరించాము. కానీ హేరీ యే మాత్రమూ లొంగలేదు. పైగా, అనారోగ్యం నటించి అతనిపై వత్తిడి తెచ్చి పెళ్ళి జరిపించామని తానే న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తానని మమ్మల్నే బెదిరించాడు. దాంతో మేము సరేననక తప్పలేదు. ఆ మాటకొస్తే ఆ వూళ్ళో మాకంత ఏముంది గనక?

సిడ్నీకి వెళ్ళే పడవ మీద మా ఇద్దరికీ టిక్కట్లు హేరీ యే కొనిచ్చాడు. మా మీద అతనికేమాత్రం నమ్మకం లేకపోవడంతో, లండన్ వరకూ వచ్చి మమ్మల్ని పడవ యెక్కిస్తానని అన్నాడు. నేనూ అమ్మా చంటి పిల్లాణ్ణేసుకుని లండన్ చేరుకున్నాము. లండన్ లో ఒక చిన్న హోటల్లో బస చేసాము. ఆ రోజు అక్కడ చచ్చేంత జనం వున్నారు.

మళ్ళీ దురదృష్టం నన్ను కాటేసింది. పిల్లాడికి జ్వరం తగిలింది. వాడసలే అర్భకంగా వుండి అప్పుడప్పుడూ అనారోగ్యం పాలవుతూ వుండడంతో మేము పెద్దగా పట్టించుకోలేదు. అమ్మ యేదో మందు వేసి వాణ్ణి పడుకోబెట్టింది. సరిగ్గా హేరీ రావడానికి గంట ముందర పిల్లాడు జ్వర తీవ్రతలో మరణించాడు. అమ్మ లబో దిబో మంది. ఇప్పుడు పిల్లాడు లేడంటే హేరీ పైసా విదల్చడు, అని అమ్మ ఏడుస్తూ వుంటే పిల్లాణ్ణి పోగొట్టుకొని నేనేడుస్తున్నాను.

“హయ్యో! హయ్యో! ఎంత పని జరిగిందే అమ్మా! ఈ ముదనష్టం పిల్లాడు పడవ ఎక్కింతరవాతైనా పోలేదు. ఇప్పుడు హేరీకి ఏం చెప్తాం? ఎవరి దగ్గరైనా పసివాడు దొరికితే ఈ గండం గట్టేక్కొచ్చేమో! అన్నట్టు, ఈ పక్క గదిలో అమ్మాయి పిల్లాడి తల్లి. ఒక్క గంట సేపు పిల్లాణ్ణి ఆడిస్తానని చెప్పి ఏదో మాయ చేసి ఆమె పిల్లాణ్ణి తీసుకొస్తా! హేరీ ఇంతవరకూ ఫ్రాంక్ ని చూడలేదు కాబట్టి గుర్తు కూడా పట్టలేడు,” అంటూ అమ్మ పక్క గదిలోకి పరిగెత్తింది.

ఆ గదిలో ఎవరో ఒక బీదరాలు అమెరికా వేళ్ళే పడవ ఎక్కి వెళ్ళబోతోంది. ఒక్క పౌండు ఇస్తే పిల్లాణ్ణి గంట సేపు తప్పకుండా అరువిస్తుంది, అన్న నమ్మకంతో అమ్మ ఆమె గదికి వెళ్ళింది. విచిత్రంగా, తల్లి పిల్లాణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఎటో వెళ్ళినట్టుంది. అమ్మ చకచకా పిల్లల బట్టలు మార్చి, పిల్లలనీ మార్చేసింది.

కనీసం నాకు ఏడ్చేందుకు కూడా తీరిక నివ్వకుండా అమ్మ, గుర్రబ్బండిలో నన్నూ పిల్లాణ్ణీ ఎక్కించింది. ఆ తర్వతే తెలిసింది నాకు, అమ్మ మా సామాను కూడా బండిలోకెక్కించిందనీ, మేము సత్రం తిరిగి రాగలమన్న నమ్మకమూ, ఉద్దేశ్యమూ ఆమెకెంత మాత్రమూ లేవని!

అలాగే ఏడుస్తూ హేరీని కలుసుకున్నాను. పిల్లాడు పోయిన సంగతి అతనికి చెప్పలేకపోవడం నాకింకా బాధగా వుంది. కానీ హేరీ నా ఏడుపుని నటన అనుకున్నాడు. నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆ పిల్లాణ్ణి చేతులోకి తిసుకున్నాడు. ఎందుకో అతని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.

నా కడుపున పుట్టిన ఫ్రాంక్ ని ఒక్కనాడూ చేరదీసిందీ లేదు, ముద్దాడిందీ లేదు, ఇప్పుడీ అనామకుడెవర్నో చేతుల్లోకి తిసుకొని కన్నీళ్ళు కారుస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ఆ క్షణం నా ఒళ్ళూ మనసూ ఈర్ష్యతో ఎంత భగభగ లాడాయో చెప్పలేను. అమ్మ భయం లేకపోతే అక్కడే నిజం చెప్పేసేదాన్నే. అయితే ఆ పిల్లాడి పట్ల అతని అనురాగం చూసి అమ్మ మొహం ఎందుకో కళకళ లాడింది.

“అయితే, మీరిద్దరూ ఈ పడవ ఎక్కి వెళ్తున్నట్టే గా?” అనుమానంగా అడిగాడు.

“నువ్వు చెప్పాక వెళ్ళక తప్పుతుందా నాయనా? ఇంతకీ మా సంగతేం చేస్తావో చెప్పావు కాదు. కొత్త స్థలం లొ మేం పొట్ట ఎలా పొసుకోవాలి? ఎలా నిలదొక్కుకోవాలి? పైగా నీ పెళ్ళాం బాలింతరాలు, చేతిలో చంటి పిల్లాడూ…”

“పిల్లాడిని నాకొదిలేయండి. మీ ఇద్దరికీ నెలకింతని పంపుతాను,” ఆలోచిస్తూ అన్నాడు హేరీ. నాకు పగలబడి నవ్వాలనిపించింది. నేనేదో అనేలోపలే అమ్మ అందుకుని,

“ఏమిటీ? దానికి వున్న ఒకే ఒక్క ఆసరా ఆ పిల్లాడు. తల్లినీ పిల్లాణ్ణీ వేరు చేస్తావా? ఏమ్మనిషివయ్యా? పెళ్ళానికి దిక్కులేదు గానీ పిల్లాణ్ణి ప్రేమగా పెంచుతాడట! ఎవరైనా వింటే నవ్వి పోతారు! అయితే ఆ పిల్లాణ్ణి నీ కొడుకని ఒప్పుకుంటావా? అది చెప్పు ముందు! “

అయితే అమ్మ మాటల ధాటీకీ హేరీ ఏమీ తడబడలేదు. నెమ్మదిగా, దృఢంగా అన్నాడు,

“పిల్లాణ్ణి ప్రేమగా చూస్తానో లేదో చెప్పలేను. కానీ చక్కటి చదువు సంధ్యలు చెప్పించి మనిషిని చేస్తాను. నీ దగ్గరుంటే వాడు జేబు దొంగ అయేది ఖాయం. ఆలోచించుకోండి!”
“సరే ఏం చేస్తాం! బెస్సీ! గుండె దిటవు చేసుకోమ్మా! తల్లిగా పిల్లాడి మంచి కోసం నువ్వా మాత్రం త్యాగం చేయక తప్పదు. బాబుగారు డబ్బున్న మారాజులు, మనకేమీ లోటు చేయరనుకో! నువ్వు చేసే త్యాగానికి ఎంతో కొంత ప్రతిఫలం ముట్టచెప్పకుండా వుంటారా చెప్పు…”

నాకు నిజానికి వాళ్ళిద్దరి మీదా ఎంత అసహ్యం వేసిందో చెప్పలేను. ఒక్క మాటా మాట్లాడకుండా తల తిప్పేసుకుని నిలబడ్డాను.

హేరీ ఒకసారి అమ్మ వైపు చురుగ్గా చూసి నా వంక చూసాడు. నా కన్నీళ్ళని నమ్మలేదు కానీ, జాలిపడ్డాడు. అమ్మ అనుకున్నట్టే మా ఇద్దరికీ నెల నెలా సరిపడా డబ్బు పంపుతానని మాట ఇచ్చాడు. ఆ డబ్బు మాట వినగానే అతనికి నిజం చెప్పాలన్న కోరిక నాకూ చచ్చిపోయింది. ఆ రాత్రే అతనికీ ఆ పిల్లాడికీ వీడుకోలు చెప్పి అమ్మా నేనూ వెళ్ళిపోయాము.

తన మాట ప్రకారమే హేరీ నెల నెలా డబ్బు పంపుతూ వచ్చాడు.

అయితే ఒకసారి ఆశతో నేను పదిహేను వందల పౌండ్లు అడగడంతో, ఆ తరవాత ఇహ ఎప్పుడూ డబ్బు అడగనని నాతో పత్రం రాయించుకుని పదిహేను వందలూ పంపాడు. నేనెంత తెలివి తక్కువ పని చేసానో ఆ పదిహేను వందలూ ఖర్చయిపోయింతరవాత కానీ అర్థం కాలేదు నాకు. బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకున్నట్టయింది.”
—————————————————————————

“ఏం సంబందమిది?”

“ఒక ముక్కు మొహం తెలీని రచయితకు, ఒక పాఠకునుకి ఏమీ సంబందమో – తల్లి తండ్రులతో, తోబుట్టువుల తో గానీ, చివరకు స్నేహితులు, హితులు, సతులు, సుతులు తోటి మనకెందుకుండదో మీ ఈ వాక్యాలు తెలుపుతున్నవి. అయినా ఈ రచయతలకు మనకు ఏం సంబందం? ఈ ప్రపంచానికి మనకు ఉన్న సంబందమా? వారు ఏడిపిస్తే మనం ఏడుస్తాం. వారు నవ్విస్తే మనం నవ్వుతాం. -అన్ని రకాల భావాల్ని వారితో పంచుకుంటాం. ఏం సంబందమిది?”

With this comment here, Thirupalu, the author of the comment above, went right to the source of what makes us humans.

Take a look at this picture.

https://www.facebook.com/photo.php?fbid=2015473347193&set=a.1359629511507.2044052.1254621224&type=1&theater

Makes you uncomfortable, doesn’t it?

I know you don’t think the man doesn’t matter. I also know that you are not insensitive. And it’s not even that you are cynical.

It is just that the mother in the picture crossed a threshold of kindness that you and I will likely never be able to cross.

It is just that, in one fell swoop, the mother saw right through the noise of the disgust, right through the broken flesh and right through that breaking humanity around her – in the isolation of the man on the sidewalk.

She saw that it was breaking not just because its flesh and bones were broken, but because a certain kind of glue has come undone.

A glue that once held us all together when we were dreaming young, when we were in a state of learning and not forgetting.

When we were not in a state of forgetting, we saw this glue – we felt this glue – across the boundaries of caste, class, race and nationalities. This glue, which nobody can explain what it is, is what made men and women reach out to each other.

But now, in our state of forgetting, this glue has come undone.  This glue has come undone, and as a result, I look at him, I see a rickshaw driver with oily hair, and sweaty forehead. I see her, I see a beggar woman. I look at this child and I think this child is ugly and I look at my fellow country men and women and I am embarrassed by their awkwardness. I look at those men and women and children at the railway station, at that bus station, running over to me and begging, and I think with disgust what animals and what ANIMALS!

I am rotting because that glue has left me. And I left it. I see inside me, I see nothing but emptiness but I am stern in my opinion, confident in my feelings of disgust. I see darkness everywhere, I blame the media thinking that even at such a dire hour, there is a conspiracy.

But is it? A conspiracy? And what has literature got to do with it?

I think we can agree that, in general, we humans cycle from a state of ignorance to a state of learning, then to a state of forgetting, and if we are self-aware enough, enter the state of relearning.

But we are not all like this.

A lot of us remain in ignorance, much like a lot of us get stuck in a state of forgetting and never enter the relearning state.

Remember how when we were young we knew so much, we dreamed so much; how we played with our friends so much, and how we spat in our fingers and wiped the dust from our knees before running off with the other caste boys and girls to play?

Then do you remember how, along the years, we somehow forgot these dreams?

Forgot how we played together but only see how different that other person is, how yucky the other person makes us feel because of her skin color, because of the way she talks, and how her little children made us feel uncomfortable when they entered too much into our homes?

How many of us, then, remember going from such a state of forgetting our dreams and forgetting our plays, back to a state of re-learning, back to a state of a decency and kindness?

I am going to claim, without sufficient proof, that there is one specific quality in us humans that determines who can be good at going from a state of ignorance to a state of learning, and from a state of forgetting to a state of relearning.

That quality is our potential ability to relate.

But this is only a potential ability, not a real capability yet.

It is like swimming. We all have the potential ability to swim, but not all of us possess the capability to swim. Unless we learn how to swim. We need to go to a swimming school. We need to learn the basics of swimming. We are not born with these basics. Then, and only then, we can swim effortlessly, without thinking about it.

Relatedness, and the ability to relate, is also like that. We need a school to develop this relatedness in us. And it is literature, more than any other teacher, that gives us a set of unique habits, a set of unique skills, a set of perspectives, to help us develop this human quality of relatedness.

Only when we fully develop this quality of relatedness in us, only then, we can go from a state of ignorance to a state of learning, and from a state of forgetting to a state of relearning.

So,

1) literature gives us the ability to relate, and

2) this ability to relate helps us to transition to increasing states of relearning and learning.

More on this later.

Featured image credit: Lange, Variation #22

Facebook image link without permission, credit: Mani Bodapati

బౌద్ధం… యుద్ధం… తవాంగ్ దృశ్యం

1

టూరిజం ఓ పెద్ద పరిశ్రమ అయిపోయాక మన మైదానాల సౌకర్యాలన్నీ మనతోపాటే  కొండలెక్కేశాయి. మంచి హోటళ్ళూ, బీరు బాటిళ్ళూ, ఫాస్ట్ ఫూడ్స్, మన ట్రాఫిక్ జాంలూ… చక్కగా వేటినీ వదలకుండా ప్రకృతి వొడిలోకి తెచ్చేసుకుని సెలవుల్ని ఆనందిస్తున్నాం. డార్జిలింగ్, నైనిటాల్, సిమ్లా, మసూరీ, ఊటీ, కొడైకెనాల్ లాంటి కొండ ప్రదేశాలకు పెద్ద పట్నాల వైభవం వచ్చేసి చాలా కాలమైంది.  కష్టపడి ఈ ఊళ్లకు వెళ్తే, ప్రకృతి పారవశ్యాల మాట అటుంచి, మన హైదరాబాద్ కో  ఢిల్లీకో కాస్త చల్లదనాన్ని పూసి, పాత సినిమాల్లో లాగా ఓ రెండు మంచు కొండలూ, ఓ సరస్సూ బ్యాక్ ప్రొజెక్షన్ పెట్టినట్టు ఉంటోంది. వీపున ఓ మూట వేసుకుని ఎవరూ పోని ప్రాంతాలకు ట్రెక్కింగ్ కి పోవటం ఉత్తమమే కానీ అది అన్నిసార్లూ కుదరదు.

మే లో మా కుటుంబం గువాహతి (అస్సాం) వెళ్లాం. అస్సాం వాతావరణం మేలో మన కోస్తా ప్రాంతాల మల్లే ఉంది.  షిల్లాంగ్ చల్లగా ఉన్నా అదీ ఓ పట్నమే కాబట్టి వద్దనుకున్నాం. అంతగా టూరిజం కోరల బారిన పడని అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే బాగుంటుందేమో అని తవాంగ్ కు బయలుదేరాం. ఈ ప్రయాణంలో మార్గం కూడా గమ్యం అంత అందంగా ఉంటుందని విని  దీనిని ఎంచుకున్నాం.

బయలుదేరిన రోజున పొద్దున్నే ఏడు గంటలకల్లా ‘బొలెరో’ తో మా వాహనచోదకుడు సిద్ధం. ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం వేసవిలో తెల్లారుజామున మూడున్నరకే అయిపోతుంది. అయినా మా వాళ్ళందరికీ ఒంట్లోని గడియారాలు ఆరుదాకా గంటలు కొట్టలేదు. బైటకొచ్చి చూస్తే,  పూబాలల్ని సున్నితంగా తడుతూ చిరుజల్లులు… మొత్తానికి ఎనిమిదికల్లా బయలుదేరాము.  ఎర్రటి నేలా,  లేత, ముదురాకుపచ్చ ఆకుల పరదాల మధ్యగా  సారవంతమైన పల్చని బూడిదరంగు నీటితో బ్రహ్మపుత్ర పరవళ్ళు… వీటిమధ్యలోంచి బద్ధకంగా ఆవులిస్తూ నిద్రలేస్తున్న గువాహతి ఊరిలోంచి మా ఎర్ర బొలెరో ప్రయాణం మొదలు పెట్టింది.

 

2

3

ఒక చిన్న ఫలహారశాల, బ్రహ్మపుత్ర

 

ఊరు దాటాక ఒక చిన్నపాటి భోజనశాలలో అల్పాహారం.  నన్ను చిన్నతనంలోకి ఒక్కసారిగా గిరాటు వేశాయి  బల్లమీద పెట్టిన ఇత్తడిపళ్ళెం, దానిలో అరిటాకులో పూరీలూ, ఒక చిన్న ఇత్తడి గిన్నెలో పల్చని శెనగపప్పు, ఆలుగడ్డ కూరా..  మా ఊళ్ళో నా చిన్నప్పుడు వాడకంలో ఉండిన కంచు, ఇత్తడి పాత్రలగురించి పిల్లలకు ఆనందంగా వర్ణిస్తూంటే, కాసేపు ఆ వస్తువులేంటో ఊహకందక,  వింత చూపులు ప్రసరించారు వాళ్ళిద్దరూ.

దారంతా అలాగే ఓ ముప్ఫై ఏళ్ల క్రితం మన పల్లెటూళ్ళు ఎలా ఉండేవో అలా కనపడింది.  అస్సాం అభివృద్ధి చెందలేదని అక్కడి ప్రజల బాధ. టాటాలూ అంబానీలూ అక్కడికి వెళ్ళరు. ఫలితం స్వచ్చమైన నీరూ, గాలీ, పంటా, పైరూ..   చమురు రిఫైనరీలు ఉన్నచోట అస్సాం అభివృద్ధి ఎలా ఉందో నేను చూడలేదు.  ఈ దారిలో కేవలమైన పచ్చదనంతో కూడిన పైర్లూ, గుబురు చెట్లూ,  వెదురుతోనూ, మట్టితోనూ కట్టిన ఇళ్ళూ.. అక్కడక్కడా సిమెంట్ ఇళ్ళు కూడా దిష్టిబొమ్మల్లా ఉన్నాయనుకోండి. మరీ ముఖ్యంగా ఎక్కడా వెదికినా కనబడని ప్లాస్టిక్ లూ, పాలితిన్లూ..  సైకిళ్ళమీద పాఠశాలకు వెళ్ళే పిల్లలు.. తేయాకు తోటలూ..  చక్కని రహదారికిరుపక్కలా ఈ అపురూప దృశ్యాలు తీరిగ్గా రాగాలాపన చేస్తుంటే మా వాహనం ఆ రాగాన్ని మింగేసే మెటల్ బ్యాండ్ హోరులా ఎనభై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం మహా అసంబద్ధ దృశ్యం. ఇవాళ దేశమంతటా కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  అంటేనే అదో గగన కుసుమం.  మన సమయాన్ని ఆదా చేస్తూ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రతీచోటా.

అస్సాం బాటకిరువైపులా...

అస్సాం బాటకిరువైపులా…

దారిలో దిరాంగ్ జిల్లా ఖరుపేటియాలో జనపనార బాగా కనిపించింది. ఈ జిల్లాలో ముస్లిం జనాభా కూడా ఎక్కువగా ఉంది. రౌతల్ గురి  చేరాక, ఇక్కడ బోడోలాండ్ ప్రభావం ఎక్కువని చెప్పాడు మా డ్రైవర్ రాజేష్. ‘బంగ్లాదేశ్ నుంచి  చొరబాట్లు ఈ ప్రాంతంలో సాధారణం’ అన్నాడు.  చొరబాట్ల మీద అదుపు, కాందిశీకులకు సరైన గుర్తింపు, స్థానికులకు సరైన భరోసా ఇవ్వని ప్రభుత్వాల వల్లనే కదా వేర్పాటువాదాలు!

మధ్యాన్నానికి తేజ్ పూర్ దాటి భాలుక్ పాంగ్ చేరుకున్నాం. ఇక్కడినుండి  అరుణాచల్ ప్రదేశ్ మొదలవుతుంది. అరుణాచల్ లో తిరగటానికి అక్కడి ప్రభుత్వపు అనుమతి పత్రం (inner line pass) ఈ వూరిలో తీసుకోవాలి.  భాలుక్ పాంగ్ నుంచి కొండ ఎక్కటం మొదలయింది. కొండ పక్కనే కామెంగ్ నది పరవళ్ళు తొక్కుతూ మా వాహనధ్వని తో జుగల్ బందీ సాగిస్తోంది.  ‘ఇది సతత హరితారణ్యం సుమా’ అంటూ పరచుకున్న పోక, అరటిచెట్లు, వెదురు పొదలు. కామెంగ్ నది చేస్తున్న గాన కచేరీకి పక్క వాద్యాల్ని అందిస్తున్నట్టు చిన్నా పెద్దా జలపాతాల ఝరీ నాదాలు.  ఈ పచ్చసముద్రాన్ని ఈదుకుంటూ టెన్గా లోయ చేరుకున్నాం. అదంతా మన సైన్యం నివసించే ప్రాంతం. చాలా పెద్ద సెటిల్మెంటు. టెన్గా దాటాక ఇంకో గంటలో బొమ్ దిలా చేరుకున్నాం. అప్పటికి చీకటి పడింది. మేము చేరేసరికి ఈ వూరిలో బజారంతా వస్తువులతో, విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. బస వెదుక్కుని, కిందకు భోజనం చేద్దామని వచ్చేసరికి అంతలోనే కర్ఫ్యూ పెట్టినట్టు అంతా నిర్మానుష్యం. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదే అయింది. కష్టంమీద రొట్టెలూ, రాజ్ మా  సంపాదించి తినటం అయిందనిపించాం.

అరుణాచల్ అందాలు

అరుణాచల్ అందాలు

 

రెండో రోజు ఉదయాన్నే బయలుదేరాం. దారంతా ఒకటే వాన. మెత్తటి మట్టిలో ఇరుక్కుపోతున్న వాహనాలు. సరిహద్దు రహదారుల సంస్థ (బీ ఆర్ ఓ) ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నట్టు కనిపించింది. చాలా చోట్ల ప్రోక్లైనర్ లతో పని చేస్తున్నారు.  చంటి పిల్లల్ని వీపున కట్టుకుని పని చేస్తున్న ఆడవాళ్ళు కొంతమంది.  దారి విశాలంగానే ఉందిగానీ రాళ్ళు, బురదతో నిండి మా వాహన వేగానికి బాగానే కళ్ళెం వేసింది. అలా నెమ్మదిగా 13,700 అడుగుల ఎత్తులో ఉన్న సెలా పాస్ చేరుకున్నాం. అక్కడో పెద్ద సరస్సు. ఓ పక్క ప్రశాంతంగా గడ్డి మేస్తున్న జడల బర్రెలూ… కఠిన శిలా సదృశమైన కొండ కొమ్ము పక్కనే పసుపుపచ్చని పూలతో నిండిన లోయ.  హిమాలయాల్లో ఈ ఎత్తులో rhododendron పూలకోసం అప్రయత్నంగా వెదుకుతాయి నా కళ్ళు.   ‘నీకెప్పుడూ నిరాశ కలిగించలేదు కదూ’ అంటూ నవ్వుతున్న నేస్తాల్లా ఎర్రని, తెల్లని, రోజా రంగుల్లోని rhododendrons సమృద్ధిగా…

6

సెలా పాస్ దివ్యత్వం

సెలా పాస్ దివ్యత్వం

సాయంత్రానికల్లా కొండ దిగి జాంగ్ జలపాతం దగ్గరకు వచ్చాం. చాలా పెద్దదైన ఈ జలపాతం దగ్గర 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం ఉంది. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో బోలెడంత సిమెంటూ, ఇనుమూతో చాలా పెద్ద పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా ఆ జాడ్యం అంటుకోకముందే ప్రభుత్వాలు సౌరశక్తి మీద పడితే బాగుంటుందని అనిపించింది.

జాంగ్ జలపాతం,                             కొండ దారుల వలయాలు

జాంగ్ జలపాతం, కొండ దారుల వలయాలు

చీకటి వేళకు తవాంగ్ చేరుకున్నాం.  ప్రయాణం మొదలైన దగ్గరనుంచీ ఒక ‘దీదీ’  రాజేష్ తో మొబైల్ ఫోనులో తెగ మాట్లాడుతూనే ఉంది. మమ్మల్ని తన హోటల్ లోనే దింపాలని ఆవిడ బాధ. ఇతనేమో ‘ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం’ అంటూ హామీలు ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి అతని సలహా ప్రకారమే ఆ హోటల్ లోనే దిగాము.  ఈ రకం ప్రయాణాలలో చాలా వరకూ  క్యాబ్ డ్రైవర్ ల ఇష్టానుసారమే మనం నడిచేస్తూ ఉంటాం. మరో మార్గం ఉండదు. క్యాబ్ లో ద్రైవరయ్యకు నచ్చిన టపోరీ పాటల్ని భరించక తప్పదు. మధ్యలో వినయంగా విన్నవించి కాసేపు మనకి నచ్చిన  సంగీతాన్ని పెట్టబోయినా మొహం ముడిచేస్తాడు.  ‘ఏ పాటలూ వద్దు  ప్రకృతి సంగీతాన్ని విని లయించిపోదామ’ని  ప్రయత్నిస్తూ నేను  మా అమ్మాయితోనూ  క్యాబ్ డ్రైవర్ లతోనూ  ప్రత్యక్ష, ప్రచ్చన్న యుద్ధాలు చేస్తోంటాను.  అదో ఆట.

మొత్తానికి హోటల్ గది శుభ్రంగా కళాత్మకంగా ఉంది. తవాంగ్ హోటల్ లో వంట, వడ్డన, పాత్రలు శుభ్రం చేయటం, అతిథుల సామాను మోయటం కూడా ఆడపిల్లలే చేస్తున్నారు.  ‘ఇదేం బాధ?’ అనుకుని మా సామాన్లు మేమే పట్టుకున్నాం.  ఇక్కడ మగవాళ్ళకంటే ఆదివాసీ ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారని ఒకరిద్దరు చెప్పారు. బైటి పనుల్లో ఆడవాళ్ళు మునిగిఉంటే కొంతమంది మగవాళ్ళు ఇంటినీ, పిల్లలనూ చూసుకుంటారట.

పని పాటలు మన వంతేనప్పా!

పని పాటలు మన వంతేనప్పా!

 

10

తవాంగ్ టూరిస్టు ప్రాంతం అన్నదానికి గుర్తుగా ఊరంతా అక్కడక్కడ చిన్న ఝరుల మధ్య ఖాళీ  ప్లాస్టిక్ సీసాలూ, పాలితిన్ సంచులూ కనిపించాయి. ఘనీభవించిన  పచ్చదనాన్ని చేదిస్తూ రంగుల దుస్తుల్లో మనుషులు కనిపించాలి కానీ రంగుల చిరుతిళ్ళ రేపర్లు కాదుగదా!   ప్రకృతి పట్ల ఈ నిర్లక్ష్యాన్ని మనం ఎప్పటికైనా వదుల్చుకోగలమా?

మరునాడు ఎడతెగని వాన వల్ల అక్కడున్న ఒకటి రెండు సరస్సులు చూడాలన్న మా ప్రయత్నం నెరవేరలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో  ఎత్తైన కొండలమీద వెయ్యి దాకా చిన్నా పెద్దా సరస్సులు ఉన్నాయట. తవాంగ్ మొనాస్టరీ అంతా తిరిగి చూసాం. మేము వెళ్లేసరికి బుజ్జి బుజ్జి అయిదేళ్ళ పిల్లల నుండి పదిహేనేళ్ళ పిల్లల వరకూ ఉదయపు అసెంబ్లీ లో ఉన్నారు. గురువుగారితో పాటు ప్రార్ధన అయాక అందరూ వరుసగా తరగతి గదులకు వెళ్ళిపోయారు.  మహాయాన బౌద్ధంతో పాటు, కాసిన్ని లెక్కలూ, హిందీ, సమాజ శాస్త్రం కూడా పిల్లలకు నేర్పిస్తామని ఒక గురువు చెప్పారు. తవాంగ్  మొనాస్టరీ  మన దేశంలోనే పెద్దది. చాలా పెద్ద గ్రంథాలయం ఉంది ఇక్కడ.  అయిదు వందల మంది దాకా బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. ప్రార్ధనాలయం గోడల మీద ఉన్న చిత్రాలు (murals) పాడవుతూ తమను కాస్త పట్టించుకోమంటున్నాయి. అయిదవ దలైలామా ఆధ్వర్యంలో ఈ మొనాస్టరీని పదహారవ శతాబ్దంలో నిర్మించారట. తవాంగ్ ఆరవ దలైలామా జన్మస్థలం కూడా.

11

తవాంగ్ మొనాస్టరీ

తవాంగ్ మొనాస్టరీ

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయంలో...

ప్రార్ధనాలయంలో…

తవాంగ్ లో మోంపా తెగకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బౌద్ధం ఎక్కువ. బౌద్ధులు కాని మిగతా వారంతా ప్రకృతి ఆరాధకులే.  ఒకప్పుడు టిబెట్ లో భాగమైన తవాంగ్, బ్రిటిష్ వారు మెక్ మోహన్ లైన్ ను సరిహద్దుగా నిర్ణయించాక భారతదేశానిదయింది. 1962 చైనా-భారత్ యుద్ధం తరువాత ఒక ఆరునెలల పాటు చైనా ఆధీనంలోనికి వెళ్ళింది తవాంగ్ .  1962 లో తవాంగ్ దాటి, అస్సాంలోని తేజపూర్ దాకా చైనా సైన్యం వచ్చేసిందట. మొత్తానికి  ఆరు నెలల తరువాత చైనా దీనిని విడిచిపెట్టింది.  ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లో భాగమేననీ, తద్వారా అది తమకు చెందినదే అన్న భావం చైనా వారికి ఉంది. ఇక్కడుండే బౌద్దులకూ, ఆదివాసీలకూ చైనామీద ప్రత్యేక ఆసక్తి సహజంగానే లేదు. పైగా టిబెటన్లను అణిచివేసే చైనా విధానాలవల్లా, దలైలామా మన దేశంలోనే ఆశ్రయం తీసుకోవటంవల్లా, బౌద్ధులకు చైనావాళ్ళంటే గిట్టకపోవటమూ, మన దేశం అంటే కాస్త ఇష్టం ఉండటమూ కూడా సహజమే. తవాంగ్ భారతదేశంలో భాగంగా ప్రశాంతంగానే కనిపిస్తుంది. అయినా ఎటువంటి పొరపాట్లకూ, చొరబాట్లకూ ఆస్కారం ఇవ్వకుండా భారీగా మన సైన్యం అడుగడుగునా పహారా  తిరుగుతూ ఉంటుంది.

1962 లో చైనా మెరుపుదాడిని ఎంత మాత్రం ఎదుర్కోవటానికి సిద్ధంగా లేని భారత్  ఆదరా బాదరాగా దేశం  అన్ని మూలలనుంచీ సైన్యాన్ని తవాంగ్ కు పంపిందట. ఆ యుద్ధంలో సుమారు రెండు వేల మంది దాకా మన సైనికులు మరణించారు. వారందరి స్మృతి చిహ్నాన్ని తవాంగ్ లో కట్టిన  వార్ మెమోరియల్ లో చూసాం. జస్వంత్ సింగ్ రావత్ అనే సైనికుడు మరో ఇద్దరి సాయంతో  చైనా సైన్యాన్ని నిలువరించి, వారి మెషిన్ గన్ ను ఎత్తుకురావటం, చివరకు వారి చేతిలో మరణించటం వంటి సంఘటనలను వివరించే ఆయన స్మృతిచిహ్నం (జస్వంత్ గడ్)  కూడా తవాంగ్ వెళ్ళే దారిలో ఉంది.  ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చైనాసైనికుల సమాధులు కూడా ఉన్నాయి.  ‘They also died for their country’ అని అక్కడ బోర్డు పెట్టారు.  మనసు బరువెక్కించే ఆ యుద్ధం ఆనవాళ్ళు నిండా నింపుకుంది తవాంగ్.

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం,                              చైనా సైనికుల సమాధులు

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం, చైనా సైనికుల సమాధులు

 

 

జస్వంత్ సింగ్ రావత్ సమాధి,     ఆవరణ

జస్వంత్ సింగ్ రావత్ సమాధి, ఆవరణ

 

 

తవాంగ్ వార్ మెమోరియల్,                                  ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

తవాంగ్ వార్ మెమోరియల్, ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

మరునాడు తిరుగు ప్రయాణం.  వరుణుడు తన ఆశీస్సులతో దారంతా ముంచెత్తాడు. సెలా పాస్ దగ్గరకొచ్చేసరికి ఎదురుగా అయిదడుగుల దూరంలో ఏముందో కనిపించటం లేదు. అక్కడ దిగి కాసేపు అటూ ఇటూ పరుగులు తీసి, అక్కడున్న ఒకే ఒక చిన్న ఫలహారశాలలో దూరాం. బయటి వర్షపు పొగలూ, లోపల వేడిగా మోమోలూ, నూడుల్స్ నుండి వస్తున్న పొగలూ… వణికించే చలిలో వేడి పొయ్యి సెగలలో సేదదీరి మోమోలూ, చాయ్ ఆస్వాదించాం.  ఈ షాప్ నడుపుతున్నదీ ఇద్దరు స్త్రీలే. అక్కచెల్లెళ్ళు.  పొయ్యి చుట్టూ అక్కడికి వచ్చిన వారంతా  చేరి  వాతావరణంగురించీ, బురదలో ఇరుక్కున్న వాహనాల గురించీ, ఒకనాటి  యుద్ధం గురించీ కబుర్లు చెప్పారు.  ఆ వర్షంలో రాజేష్  నిదానంగా బండి పోనిస్తుంటే, రోడ్డు విశాలంగానే ఉంది  గనుక ఎదురుగా ఏమీ కనిపించకపోయినా నిశ్చింతగానే కూర్చున్నాం.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో  సేద తీరుతూ మేము.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో సేద తీరుతూ మేము.

సెలా పాస్ ఎత్తుల్లో ఇవీ ఇళ్ళు

సాయంత్రానికి వర్షం నెమ్మదించి, కొండా లోయల అందాలు బయటపడ్డాయి.  దారిలో  ‘కివి’ పండ్ల చెట్లు చూపించి ఇది మంచి వాణిజ్య పంట అని చెప్పాడు రాజేష్.  ఏమయినా డబ్బు, వ్యాపారం పెద్దగా తెలియని మనుషులు వీళ్ళు.  టెన్గా లోయలో వచ్చేటప్పుడు బస. ఆ హోటల్ లో పని చేసే నేపాలీ అతను అక్కడ హోటల్ వ్యాపారం ఎంత కష్టమో వివరించాడు. ఇక్కడ బయటినుంచి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళే ఎక్కువ. స్థానికులు చాల మంది హోటల్ కు వచ్చి డబ్బులివ్వకుండా ఊరికే తిని వెళ్ళిపోతారట. వ్యాపారపు విలువలు వీరికి చాలా తక్కువగా అర్థమవుతాయేమో!  ఆ విలువలే తెలిసిన మనకు,  కొంత కాలం అక్కడ గడిపితే కానీ వీళ్ళ జీవితం అర్ధం కాదు.

మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో అయిదారు కళాశాలల కంటే ఎక్కువ లేవుట.  భారీ ఎత్తున టూరిజం పరిశ్రమా, పెద్ద తరహా వ్యాపారమూ అడుగు పెట్టని చోట ఆదివాసీ తెగలు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతాయో కదా అనిపించింది తవాంగ్ ను ఇలా బయటినుంచి చూస్తే!  కానీ ఆ సమాజాలలో ఉండే అంతర్గత సమస్యలు వారితో కలిసి గడిపితే కానీ అర్ధంకావు కదా!

టూరిస్టుల కోసం దారంతా  స్త్రీల ఆధ్వర్యంలో చిన్న చిన్న భోజనశాలలున్నాయి. శుభ్రమైన సాదా సీదా భోజనం దొరికింది. మోమోలు, తూక్పా(మోంపాల సంప్రదాయ వంటకం), నూడుల్స్, గోధుమ రొట్టెలు, అన్నం, కూరలు వేడిగా దొరుకుతున్నాయి. పదహారు జిల్లాలతో విశాలంగా పరుచుకున్న అరుణాచల్ ప్రదేశ్ లో వ్యవసాయమే ముఖ్యమైన పని.  వాళ్ళ ఇళ్ళు నన్ను చాలా ఆకర్షించాయి.  గట్టి కలపతో చట్రాలు కట్టి, మధ్యలో వెదురు తడకలు బిగించి వాటిపై మట్టి పూసిన ఇళ్ళు కట్టటం వీరి సాంప్రదాయం.  ఉన్న చోటే దొరికే కలపతో కట్టిన ఇళ్ళూ, ఉన్నచోటే పండించుకునే తిండీ, అచ్చమైన గాలీ, స్వచ్చమైన నీటి గలగలలూ…

ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి? అని కాసేపైనా అనిపిస్తుంది, మళ్ళీ మన నగరాలకు వచ్చేసేముందు.

కొంత సమాచారం :  గువాహతి నుంచి తవాంగ్ కు బొలెరోలలో వెళ్ళటం ఎక్కువ. కఠినమైన ఆ రోడ్లకు ఈ వాహనం బాగా సరిపోతుంది.  తేజ్ పూర్ నుంచి బస్సులు ఉన్నాయంటారు కానీ మేము వెళ్ళిన వర్షా కాలంలో ఏ బస్సులూ కనిపించలేదు. ఆరు రోజుల ఈ ప్రయాణానికి బొలెరో కి  Rs.25,000/- వరకూ తీసుకుంటారు. సైన్యం సులువుగా మసలటం కోసం వేసిన విశాలమైన రోడ్లు. దారంతా కన్నుల పండుగే.  సెప్టెంబరు నుంచి నవంబరు అనువైన సమయం. ఫిబ్రవరి, మార్చిలో కూడా సెలా పాస్ దగ్గర మంచూ, గడ్డ కట్టిన సరస్సులూ చూడవచ్చు. ఏప్రిల్ నుంచి ఇక వర్షాలే. తవాంగ్ నుంచి చైనా సరిహద్దు బూమ్ లా పాస్ కూడా  చూడాలంటే మొత్తం ప్రయాణానికి కనీసం ఆరు రోజులు పడుతుంది.     

పుకారు

Sharada1

(చెహోవ్ కథ “A Slander” కి అనువాదం – శారద)

 

అహినీవ్ గారు, అదే, స్కూల్లో మాస్టారు గారు, తన కూతురి వివాహం జరిపిస్తున్నారు. వరుడు హిస్టరీ జాగ్రఫీలు బోధించే మాస్టారు. పెళ్ళి సంబరాలతో ఇల్లంతా గగ్గోలుగా వుంది. హాల్లో పాటలు, ఆటలు, వాయిద్యాలూ అబ్బో, చెప్పలేని హాడావిడి. మధ్యలో పానీయాలూ, తినుబండారాలూ సరఫరా చేస్తూ తెల్లని టై లు కట్టుకున్న బట్లర్లు. ఎడతెగని కబుర్ల జోరు. పక్క పక్కనే కూర్చుని లెక్కల మాస్టారూ, ఫ్రెంచి మాస్టారూ, టాక్సు అధికారీ ఒకరికొకరు అడ్డం వస్తూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో సజీవ సమాధుల దగ్గర్నించీ, ఆధ్యాత్మిక విషయాలవరకూ అన్ని సంగతులూ దొర్లి పొతున్నాయి.

ఆ మాట కొస్తే, వాళ్ళెవరికీ ఆధ్యాత్మికత మీద పెద్ద నమ్మకం లేదు కానీ, మనిషి మేధస్సుకి అందని విషయాలూ వుండి వుండవచ్చని తప్పక ఒప్పుకుంటారు. పక్క గదిలో సాహిత్యాన్ని బోధించే మాస్టారు ఒక సెంట్రీ తన తుపాకీ తో చుట్టూ వున్నవాళ్ళని కాల్చి పారేయడంలో తప్పేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. వినేవాళ్ళకి కొంచెం భయం వేసినా, ఆయన్ వాగ్ధాటికి తాళలేక ఒప్పేసుకుంటున్నారు. లోపలికి రాలేక బయటే నిలబడ్డవాళ్ళు కుతూహలంగా లోపలికి చూస్తున్నారు. గంట మధ్య రాత్రి పన్నెండు కొట్టేసరికి అహినీవ్ గారికి ఇంట్లో విందుకి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయోనన్న అనుమానం వచ్చింది. వంటింట్లోకి దారి తీసారు.

వంటిల్లంతా సామాన్లతోనూ, తినుబండారాల వాసనలతోనూ నిండి పోయి వుంది. రెండూ పెద్ద బల్లలమీద రకరకాల పానీయాలూ, వంటకాలూ అందంగా పేర్చబడ్డాయి. వంటమనిషి మార్ఫా, ఎర్రబడిన మొహంతో, పీపాలాటి శరీరంతో హడావిడిగా బల్లల మధ్య తిరుగుతోంది. అహినీవ్ ఉత్సాహంగా, “మార్ఫా! మనం తెచ్చిన చేపని వండావా? ఏదీ చూపించు. వంటింటి వాసనలు భలే నోరూరిస్తున్నాయి,” అన్నాడు. మార్ఫా పక్కనే ఇంకో బల్ల దగ్గరకెళ్ళి పరచి వున్న పేపరు మూతని జరిపింది. మూత కింద ఒక పెద్ద డేగిశా నిండుకూ పెద్ద చేప వండి వుంది. రకరకాలైన మసాల దినుసులతోనూ, జెల్లీలతోనూ, ఆలివ్ పళ్ళూ, కేరట్ ముక్కల తోనూ అలంకరించి వుందా వంటకం. దాన్ని చూడగానే సంతోషంతో అహినీవ్ కళ్ళు పెద్దవైనాయి. గిన్నె మీదికి వంగి వంటకాన్నించి వచ్చే సువాసనని బలంగా ఆఘ్రాణించి, పెదాలని గట్టిగా చప్పరించాడు. “ఆ… ఎవరు లోపల ముద్దులు పెట్టుకుంటున్నారు? లోపల నువ్వేనా మార్ఫా?” తలుపు దగ్గర గొంతు వినిపించి తిరిగి చూసాడు. స్కూల్లో చిన్నా చితకా పనులు చేసే వాంకిన్ తలుపు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తున్నాడు.

“ఎవరంటూంటే? అహినీవ్, మీరా? ఈ వయసులో ఇదేం బుధ్ధి తాతగారూ? ఆ?” “ముద్దా? నేను ఎవరినీ ముద్దు పెట్టుకోలేదు,” అహినీవ్ కంగారు పడ్డాడు. “నేను ముద్దు పెట్టుకోవటం ఏంట్రా బుధ్ధిలేని గాడిదా? చేప కూర వాసనకి నోరూరి పెదాలు చప్పరించానంతే.” “చాల్చాల్లే, ఇంకెక్కడైనా చెప్పు ఇలాటి కథలు, నాక్కాదు.” నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వాంకిన్. అహినీవ్ మొహం ఎర్ర బడింది.. “ఇదెక్కడి గొడవరా బాబూ! ఈ సన్నాసి ఇప్పుడు ఊళ్ళో అందరికీ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్తాడేమో ఖర్మ! ఎంత పని జరిగిందిరా దేవుడా!” మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ అహినీవ్ ముందు హాల్లో కొచ్చాడు. వాంకిన్ కోసం చుట్టూ పరికించి చూసాడు. హాల్లోనే పియానో పక్కన నిలబడి వున్నాడు వాంకిన్. పియానో పైనించి వంగి, అక్కడకూర్చున్న ఇన్స్పెక్టరు గారి మరదలితో కొంటెగా నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. “నాకు తెలుసు, నాగురించే చెప్తున్నాడు. దరిద్రుడు!ఆ పిల్ల నమ్మేస్తోంది.బాబోయ్, నవ్వుతున్నారిద్దరూ! ఇప్పుడేం చేయాలి? ఏదై నా చేసి ఆ వెధవని ఆపాలి. ఇంకా పుకార్లు పుట్టిస్తాడు లేకపోతే.! వీల్లేదు. నేనూ అందరితో వాడి మాటలు అబధ్ధాలని చెప్పేస్తాను.” అహినీవ్ తల గోక్కున్నాడు.

సిగ్గుతో మొహం ఎర్రబడుతూండగా ఫ్రెంచి మాస్టారు దగ్గరకెళ్ళాడు. “ఇప్పుడే వంటింట్లో కెళ్ళి వస్తున్నా. వంటెలా సాగుతూందో చూద్దామని. లోపల చేపల కూర అయిపోయింది. ఎంత పెద్ద చేపనుకున్నావు? సుమారు గజం న్నర పొడుగుంటుంది. హ! హ! హ! అన్నట్టు ఒక విచిత్రం చెప్పాలి. ఇందాక వంటింట్లో, అదే, పెద్ద చేపని చూడటానికి వెళ్ళినప్పుడోయ్! ఆ చేప కూరను చూసి నోట్లో నీరూరిందనుకో! ఆహా, అని పెదవి చప్పరించాను. ఆ క్షణమే ఈ వాంకిన్ లోపలికొచ్చాడు. వొచ్చి నన్నంటాడూ, హ, హ, హ, ఏం చెప్పేది! నన్నంటాడూ, “మార్ఫాని ముద్దు పెట్టుకున్నావా?” అని! నేను! మార్ఫాని! ముద్దు! బుధ్ధి లేని పక్షి కాకపోతే, ఏమిటా మాటలు? అదీ మార్ఫాని! వంట మనిషిని! దాన్ని ముద్దు పెట్టుకుంటే జంతువుని ముద్దు పెట్టుకున్నట్టే కాదూ? ముద్దట ముద్దు! తెలివి తక్కువ వెధవ!”

“ఎవరినీ తెలివి తక్కువ వెధవ అంటున్నారూ?” లెక్కల మాస్టారు దగ్గరకొచ్చాడు. “ఇంకెవడండీ? అదిగో అక్కడే నిలబడి వున్నాడు  చూడండీ, ఇకిలిస్తూ, వాంకిన్! ఇందాక వంటింట్లో…” మళ్ళీ కథంతా చెప్పాడు. “నేను మార్ఫాని ముద్దు పెట్టుకోవటమేమిటండీ? వాడి తెలివి తక్కువ మాటలకి నాకైతే నవ్వాగటం లేదు. అసలు నన్నడిగితే..” ఆయన వెనుదిరిగేసరికి టాక్స్ ఇన్స్పెక్టరు నిలబడి వున్నాడు. “అబ్బే ఏం లేదు! వాంకిన్ గురించే మాట్లాడుకుంటూన్నాం. భలే విచిత్రమైన వాడు లెండి! ఇందాకేమయిందనుకున్నారు వంటింట్లో? నేను మార్ఫా పక్కన నిలబడి వున్నా. బాగా తాగినట్టున్నాడు, లోపలికొచ్చి, “మార్ఫాని ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావ్?” అని అడిగాడు. నేను! మార్ఫాని! ముద్దు! ఒరి దరిద్రుడా! మార్ఫాని నేనెందుకు ముద్దు పెట్టుకుంటానురా? నాకు ఇంట్లో పెళ్ళాం లేదా?” అని కడిగేసాను కాని నాకు భలే నవ్వొచ్చింది…”

“ఎవరబ్బా అంత నవ్వించింది?” అక్కడికి అప్పుడే వచ్చిన ఇంకొక మాస్టారు అడిగారు. “ఇంకెవరు? మన వాంకిన్! ఇందాక వంటింట్లో….” ఒక్క అర గంటసేపట్లో ఆ వార్త దాదాపు వచ్చిన బంధువులందరికీ తెలిసిపోయింది. అహినీవ్ సంబరపడ్డాడు. “ఇప్పుడు చెప్పుకోరా, ఎవరితో చెప్పుకుంటావో! అసలు నిన్ను ఎవరైనా నమ్ముతారేమో చూస్కో! నువ్వు కథ మొదలు పెట్టగానే, అందరూ, “నోర్ముయ్యవోయ్! అసలేం జరిగిందో మాకంతా తెలుసు” అని నీ నోరు మూయించకపోతే నన్నడుగు!” అనుకున్నాడు గర్వంగా. అతని సంతోషానికి మేర లేకపోయింది. ఆ సంతోషంలో అనుకున్నదానికంటే నాలుగు గ్లాసులు ఎక్కువే తాగేడు. పెళ్ళి విందు ముగిసింతర్వాత ఎక్కడి వాళ్ళనక్కడికి పంపించి అలిసి పోయి నిద్ర పోయాడు అహినీవ్. మర్నాటినించీ ఆ సంగతే మర్చిపోయాడు.

అయితే అంతా మనం అనుకున్నట్టే జరగదు కదా! సరిగ్గా వారం గడిచేసరికి, అహినీవ్ స్కూల్లో టీచర్ల రూములో వుండగా హెడ్ మాస్టారు పక్కకి పిలిచారు. “చూడు అహినీవ్! ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించు. ఇది నాకవసరం లేని విషయం నిజం చెప్పాలంటే. కానీ, ఒక స్నేహితునిగా నిన్ను హెచ్చరించడం నా బాధ్యత. నువ్వు వంట మనిషి వలలో పడిపోయావని ఊరంతా చెప్పుకుంటున్నారు. నువ్వు ఆమెను ప్రేమిస్తావో, ముద్దులే పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ, కనీసం అందరూ చూస్తూండగా వద్దు. నువ్వు స్కూల్ మాస్టారువన్న విషయం మరిచిపోకూడదు!” అహినీవ్ కి స్పృహ తప్పినంత పనైంది. మరుగుతున్న నీళ్ళు మొహం మీద పడ్డ మనిషిలా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అసలు నడుస్తూంటే వీధుల్లో అందరూ తననే గుచ్చి గుచ్చి చూస్తున్నట్టనిపించింది అతనికి. “ఇవాళెందుకో తిండే తినడంలేదు. మీ ధ్యాసంతా ఎక్కడుందో మరి?” భార్య మాటలతో ఈ లోకంలోకొచ్చి పడ్డాడు అహినీవ్. “అంత ఆలోచన దేని గురించో? మీ ప్రియురాలు మార్ఫా గురించే గా? సిగ్గుండాలి! ఇంకా నయం, పాపం నా స్నేహితులు నా కళ్ళు తెరిపించేరు. లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు సాగేదో ఈ వ్యవహారం!” భోజనం మీది నించి లేచి అహినీవ్ కలలోని మనిషిలా నడుస్తూ వాంకిన్ ఇల్లు చేరుకున్నాడు.

వాంకిన్ ఇంట్లోనే వున్నాడు. “నీచుడా! నీకు నేనేం ద్రోహం చేసానురా? ఊరందరి ముందరా నన్ను అవమానాల పాలు చేస్తావా? ఎందుకిలా నా గురించి పుకారు లేపావు?”వాంకిన్ ని పట్టుకుని దులిపాడు అహినీవ్. వాంకిన్ తెల్లబోయాడు. “పుకారా? ఏం పుకారు? అసలునువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు.” “నా గురించీ మార్ఫా గురించీ పుకార్లు లేపుతున్నదెవరు? నువ్వు కాదా?” కోపంగా అరిచాడు అహినీవ్. వాంకిన్ గుడ్లు మిటకరించి నోరు తెరిచాడు ఆశ్చర్యంగా! మెళ్ళో శిలువని చేతితో పట్టుకుని, గంభీరంగా, “భగవంతుని తోడు! నేనారోజు గురించి ఒక్క మాట కూడా ఎవరితోనూ అనలేదు. ఈ మాట అబధ్ధమైతే నేను కలరా సోకి చస్తాను,” అన్నాడు. అహినీవ్ కి అతను నిజమే చెప్తున్నాడనిపించింది. “నువ్వు కాకపోతే ఇంకెవరు?” అహినీవ్ ఆ రోజు జరిగిందంతా ఙ్ఞాపకం తెచ్చుకున్నాడు. “ఎవరై వుంటారబ్బా!” ఎంత ఆలోచించినా అర్థం కాలేదతనికి. —————————————–

చిల్లు జేబులో నాణేలు / సతీష్ చందర్

satish-219x300
బతికేసి వచ్చేసాననుకుంటాను
అనుభవాలన్నీ మూటకట్టుకుని తెచ్చేసుకున్నాననుకుంటాను.
ఇంతకన్నా ఏంకావాలీ- అని త్రేన్చేద్దామనుకుంటాను.

 

గడించేసాననుకుంటాను.
జేబుల్లో సంపాదన జేబుల్లోనే వుండి పోయిందనుకుంటాను.
రెండుచేతులూ జొనిపి కట్టల్ని  తాకుదామనుకుంటాను.

 

అనుభవాల మూటలూ,
నోట్ల కట్టలూ, అన్నీ వుంటాయి.
కొన్ని వెర్రి చేష్టలూ, కాసిన్ని చిల్లర నాణాలూ తప్ప.
జీవితమన్నాక చిన్న చిన్న ఖాళీలూ, జేబు అన్నాక కొన్ని కొన్ని చిరుగులూ తప్పవు.

 

వెయ్యి నోటు వదలి, రూపాయి బిళ్ళ కోసం వెనక్కి వెళ్తానా?
తప్పటడుగుల్తో ముందుకు వచ్చాను. వెనకడుగుల్తో వచ్చిన దూరాన్ని కొలుస్తానా?
తిరుగు బాట తప్పదు. వెతుకులాటే బతుకేమో!

 

పొందిన ప్రేయసిని వదలి, ప్రేమలేఖ కోసం పరిశోధనా?
ఏళ్ళతరబడి  హత్తుకున్నాను. అప్పటి క్షణాల ఎడబాటు ఇప్పుడు అవసరమా?
జ్ఞాపకం అనివార్యం. జారిపోయిందే జీవితమేమో!

 

నా బుగ్గ కంటిన  ఆమె కంటి చెమ్మా,
నా మునివేళ్ళ మీది ఆమె వెచ్చటి ఊపిరీ
అంతలోనే తడిగా, ఆ వెంటనే పొడిగా…
అన్నీ చిల్లు జేబులో నాణాలే.
వాటిలో ఒక్కటి దొరికినా సరే,
కూడ బెట్టిన సంపదంతా చిన్నబోతుంది.
బతికేసిన బతుకుంతా చితికి పోతుంది.

 

ఆ క్షణాని కది బెంగ.
కానీ, ఒక యుగానికి చరిత.

 

III III III

 

నన్ను పోల్చుకోలేని నగరానికొచ్చేశాననుకుంటాను
నా మానాన నేను బతకగల నాగరీకుణ్ణయిపోయాననుకుంటాను.
ముందు వెనుకలడగని ఒక మహా ప్రపంచంలో కలిసి పోయాననుకుంటాను.

 

గట్టెక్కేసాననే అనుకుంటాను.
విజయాలన్నింటినీ వెండి కప్పుల్లో నింపేశాననే అనుకుంటాను.
అలమర అద్దాలు జరిపి మెడల్స్‌ను తడుముకోవచ్చనే  అనుకుంటాను.

 

గదుల్లో ఏసీలూ, మెడనిండా మాలలూ, అన్నీ వుంటాయి.
దాటి వచ్చిన పల్లెలూ, దండ తప్పిన మల్లెలూ తప్ప.
ప్రవాసమన్నాక కొన్ని సంచులు మరవడాలూ, పాత డైరీలు వదలడాలూ తప్పవు.

 

ఈ-బుక్కుల్ని వదలి, పిచ్చి కాగితం వెంట పరుగెత్తుతానా?
తరగతులు దాటుతూ ఎదిగాను, స్థితిగతులు దించుకుంటూ పోనా?
తవ్వాలంటే దిగాల్సిందే. లోతుకు పోవటమే ప్రయాణమేమో!

 

నగరం నడి బొడ్డు వదలి, ఊరి వెలుపలకు దిగిపోవటమా?
కలగలిసిపోయాన్నేను. కుడిఎడమల తేడాలిప్పుడు కావాలా?
తిరిగి రావటం యాత్ర. మూలాన్ని చేరడమే ప్రవాసమేమో!

 

తెల్ల పువ్వు కోసం చెట్టుకూడా ఎక్కలేని వణుకూ
బుల్లి నవ్వు కోసం పూజారి కూతుర్నే గిచ్చిన తెగువా
ముందు చలి, తర్వాత వేడి
రెండూ వద్దనుకున్న వస్తువులే.

 

కలిపి దొరికితే చాలు
ఎక్కిన అంతస్తులు కూలిపోతాయి.
నగర అజ్ఞాతం ముగిసి పోతుంది.

 

ఇప్పటికిది ఆశే
కానీ, రేపటికదే శ్వాస.

 

III III III

 

పల్లెకొచ్చాక బెంగ తీరుతుందనుకుంటాను
కవులు కలవరించే గ్రామం మురిపిస్తుందనకుంటాను.
గుడిసెల మధ్య మేడల్ని చూసి నింగి నేలకొచ్చేసిందనుకుంటాను.

 

ఊరూవాడా ఏకమయందనుకుంటాను.
సరిహద్దు రేఖ చెరిగిపోయిందనే అనుకుంటాను.
పేట విందుల్లో ప్లేటందుకునే పెదరాయళ్ళని పొగడొచ్చనే అనుకుంటాను.

 

అంటనిపించని వంటలూ, చెమట కనిపించని సెంటులూ, అన్నీ వుంటాయి.
దుబాయిలో దిగబడిపోయనా కొడుకూ, పదిరోజులక్రితం పాడె యెక్కిన తల్లీ తప్ప.
ఎదగడమన్నాక, కౌగలింతల్ని కాజేసే దూరాలూ, శవాన్ని మోసిన కలల భారాలూ తప్పవు.

 

తరగని ఎడారుల్ని వదలి, ఎరగని పొలాల కోసం వచ్చేస్తానా?
మునివేళ్ళతో మట్టిలోనే రాశాను.భూమంత గుండ్రంగా కుండను చెయ్యలేనా?
ఓహ్‌! బురద మైలపడుతుందే. ఊరికి అవతలంటే, ఉత్పత్తికి ఆవలేగా!

 

తలలు గొరిగే పనే అక్కడ, వదలుకుంటే ఇక్కడ తలారి పనేగా!
ప్రాణమున్న శిలను శిరస్సుగా చెక్కటమే . పంచ ప్రాణాలతో చేస్తాను.
ముట్టుకుంటే కేశాలు మాసిపోవూ? అంటరానితనమంటే, వృత్తిలేని తనమేగా!

 

సెలవు కొచ్చినప్పుడు గొప్పలూ
కొలువు చేసినప్పుడు తిప్పలూ
అప్పుడే మిరిమిట్లూ, వెంటనే చీకట్లు
వాడలన్నీ క్రిస్మస్‌ చెట్లే.

 

ఏటి కొక మారు చాలు
ఒక రాత్రిలో ఏడాది కాపురం
సమాధి మీదే అమ్మ జ్ఞాపకం

 

వాడ వాడే,
నేనెగిరి పోయేది గాలి ఓడే

 

స్టేజీ ఎక్కుతున్న ‘పతంజలి’!

patanjali natakotsavaaluపతంజలి అంటే వొక ఖడ్గ ప్రహారం!

పతంజలిని అక్షరాల్లో చదవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. వెన్నెముకలేని లోకమ్మీద కసిగా విరుచుకుపడే అతని పదునయిన వాక్య ఖడ్గం  మనం గర్వపడే మన కాలపు వీరుడు వదిలివెళ్లిన ఆస్తి.

అలాంటి వాక్యాల  సైన్యాన్ని రంగస్థలం మీద చూపించడం వొక సాహసం. కానీ, తెలుగు నాటకం అలాంటి సాహసోపేతమయిన ముందడుగుకి సర్వసిద్ధంగా వుందని నిరూపిస్తూ ఇదిగో ఈ పతంజలి నాటకోత్సవాలు ….ఈ వారం హైదరాబాద్ లో…మీరు హైదరబాద్ లో వుండీ వెళ్లలేకపోతే ఆధునిక తెలుగు నాటక రంగచరిత్రలో వొక అద్భుతమయిన సన్నివేశాన్ని కోల్పోతున్నట్టే!

సాహిత్యానికీ, రంగస్థలానికీ మధ్య వంతెన కట్టే కృషిలో నిమగ్నమయి వున్న పెద్ది రామారావు నిర్దేశకత్వంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు చంద్రశేఖర్ ఇండ్ల, నరేశ్ బూర్ల, శివ ఈ ‘ప్రయోగానికి’ నాంది పలికారు.

కథ ఆయన గుండె గూటిలో దీపం!

naannaవొక్క పుస్తకం కూడా కనిపించని చిన్న వూళ్ళో రాజారాం గారు పుట్టారు. పుస్తకాలు దొరికే ఇంకో వూరిని వెతుక్కుంటూ ఆయన రోజూ మైళ్ళ తరబడి నడుచుకుంటూ వెళ్ళే వారు. పుస్తకాల్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టే ఆయన మనుషుల్నీ వెతుక్కుంటూ వెళ్ళడం నేర్చుకున్నారు. దూరాల్ని దాటి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకున్నారు.

వొక్క రచయిత కూడా కనిపించని పరిసరాల్లో రాజారాం గారు పెరిగారు. కానీ, తానే రచయితలని వెతుక్కుంటూ వూళ్ళు దాటారు, సీమ దాటారు. ఆ క్రమంలో ఆయన సీమకథని కూడా సీమ దాటించారు. సీమ రచయితలని బెజవాడ పత్రికా ప్రపంచ పటంలో నిలబెట్టారు. కథని తన గుండె గూటిలో దీపంగా వెలిగించుకుని ఆరాధించారు.

ఇక్కడ ఈ ఆల్బమ్ లో వొక్కో ఫోటోనీ చూస్తూ వుంటే నలుపు-తెలుపు నించి రంగుల్లోంచి మారిన చరిత్రే కాదు. వొక చిన్న పల్లెటూరి వ్యక్తి తన చుట్టూ ఎంత పెద్ద ప్రపంచాన్ని నిర్మించుకున్నాడో తెలుస్తోంది. కేవలం తపన…కేవలం ప్రేమ…కేవలం వొక అంకిత భావం…ఇదీ ఈ వ్యక్తి చరిత్రని, చరితని నిర్మించిన భావనలు.

రాజారాం గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తన విస్తరి తానే కుట్టుకుంటూ కష్టపడి సంపాదించిన నాలుగు మెతుకులతో నాలుగు దిక్కుల నిండా ప్రేమని పంచిన రాజారాం గారి వ్యక్తిత్వాన్ని కళ్ళకి కట్టే చిత్రాలివి.

ఈ చిత్రాల్ని మాకు అందించిన ఆయన కుమారుడు, ప్రముఖ కథకుడు మధురాంతకం నరేంద్ర గారికి మా ధన్యవాదాలు.

 

సచిన్ లా ఆడలేకపోవచ్చు… అతని లా ఉండొచ్చు

kolluriసచిన్ టెండూల్కర్… పరిచయం అక్కర్లేని పేరు.  పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు. క్రీడకన్నా క్రీడాకారుడు ఎక్కువ అభిమానం సంపాదించుకున్న దృష్టాంతం సచిన్ టెండూల్కర్.

క్రికెట్లో ప్రవేశించిన రోజు నుంచీ నేటి దాక ఎందరినో తన ఆటతీరుతోనూ, వ్యక్తిత్వంతోను ఆకట్టుకున్న వ్యక్తి టెండూల్కర్. మన దేశంలో సచిన్‌ని వేలంవెర్రిగా అభిమానించేవారున్నారు, ఆరాధించేవారున్నారు. సచిన్ ఒక ఐకాన్.

సచిన్ టెండూల్కర్ రికార్డులు, ఆటతీరు గురించి ఎన్నైనా పుస్తకాలు వచ్చివుండచ్చు, కానీ సచిన్ అంతటి గొప్పతనం ఎలా సాధించాడో, పొందిన ఔన్నత్యాన్ని ఎలా నిలుపుకున్నాడో చెప్పే పుస్తకాలు తక్కువ. అటువంటి పుస్తకమే “దేవుడిని మర్చిపోదామిక”. సచిన్ ఆట కన్నా అతని వ్యక్తిత్వమే అతనికి ప్రపంచవ్యాప్తంగా మన్ననలను అందిస్తోందని రచయిత రేగళ్ళ సంతోష్ కుమార్ అంటారు. టెండూల్కర్‌లా అయిపోవాలనుకునేవాళ్ళేమీ తక్కువ లేరు మన దేశంలో. “మనకన్నా చిన్నవాళ్ళు మంజ్రేకర్‌ టెండూల్కర్ లూ లేరా మనకెగ్జాంపులు…..” అనుకుని ముందుకు దూకేవాళ్ళుంటే, “బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు ” అని ప్రోత్సాహించేవాళ్ళూన్నారు.

అయితే టెండూల్కర్ ఆటలో అంత నిలకడగా రాణించడానికి రహస్యం టాలెంట్‍తో పాటుగా, సాధన, ఆట పట్ల మమకారం, వివాదరహితమైన వ్యక్తిత్వమే కారణాలు. టెండూల్కర్‌తో పాటు జట్టులోకి వచ్చి, ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన ఆటగాళ్ళెందరో ఉన్నారు. వారికి, టెండూల్కర్‌కీ ఉన్నతేడా ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది. మనలో చాలామంది చేసే పొరపాటుని ఈ పుస్తకం సున్నితంగా ఎత్తి చూపుతుంది. మనం గొప్ప వ్యక్తులను ఆరాధిస్తాం, వారిలా ఆ ఘనతని సాధించాలనుకుంటాం. వారి సుగుణాలను అలవర్చుకోకుండా, వ్యక్తి ఆరాధనకి, అనుకరణకి పూనుకుంటాం. సినిమా హీరోల నుంచి ఆటగాళ్ళ వరకూ చాలా మంది విషయంలో జరిగేది ఇదే.  ఈ తప్పునే చేయద్దంటున్నారు రచయిత.

టెండూల్కర్‌ని వ్యక్తిగా ఆరాధించద్దు, అతని సుగుణాలను గ్రహించి వాటిని మన జీవితాల్లోకి ఆహ్వానించాలని సూచిస్తున్నారు. స్వామి వివేకానంద కూడా  “Learn Everything that is Good from Others, but bring it in, and in your own way absorb it; do not become others.” అంటూ ఇదే విషయాన్ని చెప్పారెప్పుడో.

సచిన్‌లో బాల్యంలో ఉన్న నెగెటివ్ లక్షణాలను కుటుంబం పాజిటివ్ లక్షణాలుగా మార్చిన విధానాన్ని మనం గ్రహించాలి. మనలో బోలెడన్ని నెగటివ్ లక్షణాలుంటాయి. కానీ వాటిని నెగటివ్ గానే ఉంచుతున్నామా… పాజిటివ్‌గా మలచుకుంటున్నామా? బలహీనతగా నిలిచిపోతున్నామా? బలంగా మలచుకుంటున్నామా అనేది కీలకం అని అంటారు రచయిత.

తన అభిమాన హీరో జాన్ మెకన్రోలోని దూకుడుని ఇష్టపడ్డ సచిన్, దాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టలేదు, మెకన్రో తీరుని ఆస్వాదించిన సచిన్ దాన్ని ఉన్నదున్నట్లుగా అనుకరించలేదు. తన హీరోలా ఆవేశాన్ని హావభావాల్లో కాకుండా… తన ఆటలో చూపించాడు. అభివృద్ధికి అనుకరణ తొలిమెట్టవ్వాలే కానీ, రెండో మెట్టూ… చివరి మెట్టూ కూడా కాకుడదూ అని అంటారు రచయిత.

“ఉన్నచోటనే ఉండాలంటే శాయశక్తులా పరిగెత్తాలి, మరింత ముందుకు వెళ్ళాలంటే…. రెట్టింపు వేగంతో పరుగెత్తాలి!” అనే లూయిస్ కరోల్ వాక్యాల్ని ఉటంకిస్తూ… “అలా రెట్టింపు వేగంతో పరిగెట్టిన వారే ఛాంపియన్లవుతారు! చదువులోనైనా…. ఆటల్లోనైనా… ఉద్యోగంలోనైనా… జీవితంలోనైనా!” అని చెబుతారు రచయిత. అది సచినైనా, మీరైనా, నేనైనా…ఎవరైనా అంటూ హామీ ఇస్తారు.

“చెడిపోయే వాతావరణంలో ఉంటూ కూడా… చెడిపోకుండా ఉండగలిగేవాడే గొప్పవాడు” అంటూ బాహ్య ప్రపంచపు ప్రభావాలకు బానిసవకుండా నిలబడేవాడే సచిన్‌లా నిలుస్తాడు అంటారు రచయిత. ఒత్తిడిని జయించేందుకు సచిన్‌ని ఉదాహరణగా చూపుతారు రచయిత. లక్షల మంది మధ్యలో ఉన్నా…. తానొక్కడే ఉన్నట్లు…. తాను ప్రపంచ ప్రభావంలో పడకుండా…. ప్రపంచాన్ని తన తన్మయత్వంలో మునిగేలా చేయలాంటే…. నా కోసం నేనాడుకుంటున్నానన్నట్లు ఆడాలి. ఉదాహరణలను, పోలికలను పట్టించుకోకుండా, మీ పని మీరు చేసుకుపోవాలి, పట్టుదలతో చేసుకుపోవాలి. ఎదుగుదలకి మొదటి పాఠం నిరంతరం సాన… అనుక్షణం పోటీ… పోటీ ఎవరితోనో కాదు… తనతో తనకే పోటీ. మొన్నటికీ నిన్నటికీ తేడా ఏమైనా ఉందా అని పోటీ…! నిన్నటికీ, నేటికీ ఏమైనా మెరుగయ్యానా అని పోటీ…. ఎందుకంటే మొన్న ఏం ఘనత సాధించామో నిన్నకి అక్కర్లేదు. నిన్న ఏం కీర్తి గడించామో నేడీ లోకం పట్టించుకోదు. నేడు ఏం చేస్తున్నామనేదే ముఖ్యం.

పుస్తకం చివర్లో సచిన్‍తో రచయిత జరిపిన ఇంటర్వ్యూ ఉంది. అందులో ఒక ప్రశ్నకి సమాధానంగా “అంకితభావం, ఆత్మగౌరవం, విజయేచ్ఛ” – విజేతల లక్షణాలని సచిన్ చెబుతాడు. ఏ రంగంలోనైనా రాణించాలనుకునేవారికి ఇవి థంబ్ రూల్స్ లాంటివి.

క్రికెట్ దేవుడిగా కంటే మాములు మనిషిగా సాధించిన ఘనతలెన్నో సచిన్ జీవితంలో ఉన్నాయి.  మనం అతనిలా ఆడలేకపోవచ్చు…. కానీ అతనిలా ఉండొచ్చు…. అతనిలా పరుగులు తీయలేకపోవచ్చు…. కానీ అతనిలాగానే పడకుండా నిలబడొచ్చు…! అతనిలా రికార్డులకెక్కలేకపోవచ్చు…. కానీ అతనిలా పైకెదగొచ్చు…..! అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.

ప్రచురణకర్తల వివరాలు:

ప్రచురణ: సహృదయ సంతోషం ఫౌండేషన్

ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి,

సికిందరాబాదు- 500009

sahrudayasanthosham@gmail.com

ఏకబిగిన చదివించే “దేవుణ్ని మర్చిపోదామిక, సచిన్‌ని గుర్తుంచుకుందాం” అనే ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ  చూడండి.

“ఇది పాట కానే కాదు…ఏ రాగం నాకు రాదు”

Siva_3అఫ్సర్ గారు, “మీకు సినిమా సంగీతం, అదే.. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు, అరవం, కరవం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే…మీరు వాటి గురించి ఎందుకు రాయకూడదు,? ” అని అడిగినప్పుడు, “నేనెప్పుడూ రాయలేదండీ..అయినా ప్రయత్నిస్తాను,” అని చెప్పాను. నాలో నేను అనుకున్నాను, “నేను మెలకువగా ఉన్నంత సేపూ ఏదో ఒక సినిమా పాటని ఖూని రాగం చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి రాయలేకపోతానా,” అని.

వ్రాద్దామని కుర్చొంటే అప్పుడు అర్ధం అయ్యింది అసలు విషయం ఏంటో! ఇది టి.వి లో ఎన్నో ఏళ్లుగా టెన్నిస్ చూసాం కదా, దాని పైన బుక్కు రాయటం ఏం పెద్ద పనా అని అనుకొని ప్రయత్నించటం లాంటిదని.

బుర్ర బ్లాకై పోయింది. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ పాటలు వాన తుంపర్ల లాగా ఎడతెరిపి లేకుండా కురవసాగాయి. ”నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి,” అంటూ అమరగాయకుడు ఘంటసాల వారిని తలచుకొని ముందుకు సాగుదామనీ, ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని, ఏకాగ్రతతో, కలానికి పని చెబుదామనీ, కూర్చొన్నా.

“మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నల డోలలూగెనే….కొమ్మల గువ్వలు గుస గుస మనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, నీవు వచ్చేవని,” అంటూ మంద్రస్థాయిలో మృదు మధురంగా భానుమతి గళం ఎక్కడి నించో వినిపించి ఇబ్బంది పెట్టేస్తోంది. ఒక సారి తల విదిలించుకొని, “ఫోకస్..ఫోకస్”, అని నాలో నేనే అనుకొని, కలం కదిపే లోపు, మళ్ళీ అదే గొంతు, “పిలచిన బిగువటరా? అవురవుర! చెలువలు తామే వలచి వచ్చినా” అని   మందలింపు. లెంపలేసుకొని, స్ఫూర్తి కోసం, కొన్ని భానుమతి పాటలు హమ్ చేస్తుండగా, “సడి సేయకో గాలి, సడి సేయ బోకే” అని లాలిత్యం ఉట్టిపడుతూ లీల సున్నితంగా నా పాట నాపేసి, ఏదో మత్తు లోకి తోసింది. “లాలీ..లాలీ..లాలీ..లాలీ.. వట పాత్ర శాయికీ వరహాల లాలీ” అంటూ సుశీలమ్మ నన్ను మరింత నిద్ర లోకి నెట్టే లోపల, “ఘల్లు ఘల్లునా గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్లి పడ్డది,” అంటూ గుర్రపు డెక్కల తాళం లో జానకమ్మ నన్ను మొట్టి లేపింది.

మనస్సు పరిగెత్తినంత వేగంగా నా కలం పరిగెడితే ఈ పాటికి పది పేజీల కాలమ్ పూర్తయ్యేది అన్న ఆలోచన పూర్తయ్యేలోపే  మరొక ఆలోచన  నా వ్రాతకు ఆనకట్ట వేసింది.

“కొత్త పాటల తుంపరలు ఒక్కటీ నా మీద ఇంకా పడలేదేమిటబ్బా!  ఏ పార్టీ జరిగినా మా ఇంట్లో మ్రోగేవి, నేను రెండు గ్లాసుల వైన్ తాగిన తరువాత గెంతేవి ఆ పాటలకే కదా! ఇప్పుడేమిటీ పాటల గురించి వ్రాద్దామని కూర్చొంటే మాత్రం ఒక్కటీ నోట్లో ఆడట్లేదు? నేను మరీ ముసలాడినైపోతున్నానా? చాదస్తంగా ఓల్డంతా గోల్డేనని పాతవే పట్టుకు వేళ్ళాడుతున్నానా?” అంటూ కొన్ని నిమిషాల పాటు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండిపోయా. “కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అంటూ శ్రీశ్రీ నా చెవిలో దూరి అరుస్తున్నా సరే, ఆ నెగటివ్ ఆలోచనలను పక్కకు నెట్టి మళ్ళీ పన్లో పడిపోయా.

“మీకిష్టమైన పాటలేంటి?” అని ఎవరైనా అడిగితే, చటుక్కున నేను పుట్టకముందు పుట్టిన సినిమా పాటలే గుర్తుకొస్తాయి. ఒకసారి ఉండబట్టలేక, మా ఫ్రెండు ఒకడు కడిగేసాడు. నువ్వింకా “కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది” అని ఇక్ష్వాకుల కాలం నాటి పాటలు పాడుకుంటూ ఉంటే, రేపు మీ మనవళ్ళ కాలం వచ్చేనాటికి అంతే తాదాత్మ్యతతో, “సార్..రొస్తా రొస్తారా రొస్తా రొస్తా రొస్తా రా..” అనో “మై లవ్ ఇస్ గాన్.. మై లవ్ ఇస్ గాన్” అనో పాడుకుంటావా అని.

వాడెంత చురకేసినా నేను మాత్రం సీరియస్ గానే చెప్పా, శంకరాభరణం శంకరశాస్త్రి నన్ను ఆవహించినట్లుగా. “బాల్య, కౌమార్య, యౌవన, వృద్ధాప్యాలు పాటలు పాడేవాళ్ళకీ, శ్రోతలకీ ఉంటాయేమో కానీ, పాటలకు కాదురా! ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం దైవాంశసంభూతులైన కొందరి వ్యక్తుల భక్త్యావేశాలు ఒక ప్రవాహమై, శబ్ద రూపేణ ప్రాణం పోసుకొంటే, ఆ ధ్వనులేరా సాంప్రదాయ సంగీతమై, కొన్ని కోట్ల గళాలలో ప్రతిధ్వనిస్తూ, మన సంస్కృతి ఉమ్మడి ఆస్థిలా తరతరాలకూ సంక్రమిస్తూ, శాస్త్రీయబద్ధమైన కర్నాటక సంగీతంలా పక్వత చెంది, లలిత సంగీతంలా సరళీకృతమై,  పాశ్చాత్య రీతులతో సంగమించి, కొంత ప్రకాశించి, మరింత కృశించిన, నేటి మన తెలుగు పాట!”

ఏనాడో రచించిన అన్నమయ్య, రామదాసు కీర్తనలు, త్యాగరాజు, శ్యామశాస్త్రి పాడిన కృతులు ఈనాటికీ  పాడుకుంటున్నాం. కనుక నా మనవళ్ళకు నేను వినిపించపోయే పాటల గురించి నువ్వు జోక్ చెయ్యకు. ఇంకొక వంద  ఏళ్ళు గడచినా “జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా” అని పాడేవాళ్ళు, అది విని ఆనందావేశాలలో తూలిపోయేవాళ్ళు, ఉంటూనే ఉంటారు”, అని నేను ఏకబిగిన ఇచ్చిన ఉపన్యాసానికి అలసిపోయి ఆగిపోయాను.

“అదే మరి, సంగీత రాజా ఇళయరాజా అత్యద్భుతంగా స్వరపరిస్తే అమృతం జాలువారే గాత్రాలతో బాలూ, శ్రేయా ఘోసాల్ పాడిన పాటేగా…నేను నా కార్లో ఎప్పుడూ అదే వింటూ ఉంటా” అంటూ తన సంగీతజ్ఞాన ప్రదర్శన చెయ్యటంతో నా బి.పి తార స్థాయిలోని నిషాదాని కంటింది.

“స్వరబధిరుడా (టోన్ డెఫ్), త్యాగరాజు, పల్లవి, అనుపల్లవి, పది చరణాలతో, వెయ్యేళ్ళు నిలిచిపోయేలా, నట రాగంలో చేసిన రామ సంకీర్తన గురించి నేను ప్రస్తావిస్తే, నువ్వు వేరే రాగం కూస్తావా,” అని విరుచుకు పడ్డాను. “ఇంతకు ముందు వీడి పాటే భరించలేమనుకున్నాం, వీడి మాట కుడా కర్ణ కఠోరం,” అని నాకు వినబడేలా  విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను? అదే నా పాత పాటల పైత్యం గురించి కదూ అసలిదంతా మొదలయ్యింది. పాత పాటలంటే ఏదో కొత్తగా అబ్బిన అభిరుచి గానీ, పెరిగిందీ, ఏళ్ల తరబడి ఆస్వాదించింది “కొత్త” పాటలనే. కొత్తవంటే ఏదో శాస్త్రీయ సంగీతం, ఉదాత్త సాహిత్యం, సింగినాదం అని ప్రాకులాడే కళాతపస్వి సినిమాల్లో పాటలే కాదు, “వినదగు నెవ్వరు కొట్టిన” అని అన్నిరకాల పాటలకూ, తలకాయ అడ్డంగా కొన్నిసార్లు, నిలువుగా మరిన్ని సార్లు ఊపుకుంటూ ఎంజాయ్ చేస్తూనే పెరిగాను. అయినా మరీ దారుణం కాకపోతే, “సంగీతాన్ని కొట్ట్టటం” ఏమిటో! లావుపాటి బెత్తాలతో విపరీతంగా బాదే వెస్టర్న్ డ్రమ్ముల ప్రయోగం మన పాటలలో ప్రారంభించిన దగ్గరనించీ పాట కట్టటం నించి కొట్టటం అయ్యిందేమోనని నా వెధవనుమానం.

ఇలా కొత్త పాటల మేఘాలు కమ్ముకున్నాయో లేదో, తుంపర్లు కాదు, ఏకంగా వడగళ్ళే పడటం మొదలెట్టాయి, గానగాంధర్వ గళంలో. గత నలభై ఏళ్ళలో, నలభైవేల పై చిలుకు పాటలు పాడిన బాలు స్వర తరంగాలు చేరని చెవులు తెలుగు దేశం లో అస్సలు ఉండే ఛాన్సే లేదు. అన్ని పాటలున్నందుకేనెమో, ఓ పట్టాన గబుక్కున ఏదీ మనసుకు తట్టక పోయినా, ఒక సారి మొదలయ్యిందంటే మాత్రం తుఫానే.

“ఏ దివిలో విరిసిన పారిజాతమో…” అని అబ్బురపడ్డా, “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..” అంటూ పాఠాలు చెప్పినా,  “ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా?” అంటూ అన్నగారి గొంతుతో వదినెమ్మను కవ్వించినా, తన గాత్ర వైవిధ్యంతో, అన్ని వర్గాల శ్రోతలని ఆకట్టుకోవటం, బాలూ కే చెల్లింది. అద్గదీ, దొరికింది నేను వ్రాయటానికి టాపిక్. “ఈ ఒక్కాయన కోటు తోకలు పట్టేసుకొని మన సినిమా పాటల సంద్రాన్ని అవలీలగా ఈదెయ్యచ్చు,” అనుకున్నానో లేదో, ఫుల్ వాల్యూం లో “సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది” అంటూ “చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం” అకంపెనీమెంట్ తో, వినిపించే సరికి మళ్ళీ తెలివిలోకొచ్చా.

సినిమా పాటంటే, ఓన్లీ గాయకులేనా గుర్తుకొచ్చేది? “పాటల గురించి వ్రాద్దామని కూర్చోన్నావు, పాటలు వ్రాసేవాళ్ళ నేల మరచితివీవు?” అంటూ మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నుండి, వేటూరి, సీతారామశాస్త్రి గార్ల వరకూ కళ్ళ ముందుకొచ్చి కళ్ళెర్ర చేసినట్లుగా అనిపించింది.

స్వరకర్తల సంగతేమీటంటూ సాలూరి, పెండ్యాల నుండి కోటి, తమన్ వరకూ నిలదీసి ఇరుకున పడేశారు. వారందరికీ స్ఫూర్తినిచ్చి వాళ్ళ నించి అంత గొప్ప వర్క్ ని రాబట్టుకున్న యల్.వి.ప్రసాద్, ఆదుర్తి, విశ్వనాథ్ లాంటి దిగద్దర్శకులు మాత్రం మందహాసాలతో మాటల్లేకుండా నన్ను అయోమయంలోకి నెడుతుంటే, “ఏ తావున రా? నిలకడ నీకు?” అంటూ భానుమతి పాటే మళ్ళీ రియాలిటీ లోకి లాక్కొచ్చి పడేసింది.

“అసలు వీళ్ళందరి గురించి వ్రాయడానికి నీ కున్న అర్హతేంటి? పెద్ద పెద్ద పరిశోధనా గ్రంధాలే వచ్చాయి. మరిక నువ్వు కొత్తగా చెప్పొచ్చేదేంటి?” అంటూ సీరియల్ సెల్ఫ్ డౌట్ చుట్టేసింది.

“ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు” అన్న పాట కూడా  ఇప్పుడే గుర్తుకురావాలా! అసలు ఇంత ఆలోచన అవసరమా? నేను వ్రాయబోయేది చదివేది కూడా నాలాంటి సగటు పాట ప్రేమికులే కదా. నా కోసం, నా మూడ్ బట్టీ, నాకు నచ్చిన ఏ పాట(ల) నైనా, నాది చేసుకొని, నా భావాలను, అనుభవాలను, అనుభూతులను శ్రుతి మించకుండా వ్యక్తపరిస్తే, నచ్చి ఆదరిస్తారేమో! ఒక కొత్త ఆశ చిగురించినా, అఫ్సర్ గారికి ఏమీ వ్రాయలేదనీ, ఆలోచనలతోనే సమయం అంతా గడిపేశాననీ, ఎలా చెప్పాలా అన్న చిన్న విచారంతో నా కలానికి మూత బిగించా.

దేవస్మిత

samanya1resize22/10/2004

ఇవాళ నా శరీరం పై పడిన దెబ్బలు ఎన్నో సారివో లెక్క తేలటం లేదు .  ఐదేళ్ళ   కాపురంలో నా వెదుకులాట దేనికో, అతని గింజులాట ఎందుకో. అనుకునే ఇవంతా జరుగుతున్నాయా?  చికాకుగా వుంది. చచ్చిపోవాలనిపిస్తోంది. దేవస్మితా చచ్చిపోతావా?మరి పిల్లల్నేం చేస్తావ్? నాకు నేనే వేసుకునే ఈ ప్రశ్నకు నాకు నేను ఏమని సమాధానం ఇచ్చుకోను?

10/12/2004

ఇవాళ అత్తమ్మ మాటల్లో మాటగా భోగం బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నది. విపరీతంగా కోపమొచ్చింది. చేతిలో ఉన్న మొబైల్ ని ఆవిడ మీదకి విసిరికొట్టాను. ఆవిడ దెబ్బని తప్పించుకున్నది. కానీ శశిధర్ చేతిలో నాకు దెబ్బలు తప్పి పోలేదు. నాలుగు గోడల మధ్యలో వున్నదాన్ని దెబ్బలెలా  తప్పించుకోగలను?

అమ్మా ఎంత గుర్తొస్తున్నావ్, నీమీద చాలా కోపమొస్తోంది. నీ నీడ నా  మీద పడనీయొద్దు అనుకున్నావ్ కదా? పాపం పిచ్చి అమ్మా ! నువ్వు నీడలా, నా వొంటి పైన పుట్టుమచ్చలా నన్ను వదలటమే లేదమ్మా…వేశ్యవి అమ్మా నాకు కథలు రాయడం రాదమ్మా, చెప్పడం కూడా రాదమ్మా లేదంటే నీకథ వింటే బండరాయి మా అత్త కూడా కరగాలేమో. కానీ అంతా ఉత్తిదే, బండరాళ్ళు ఎప్పటికీ కరగవు. అమ్మా!  నువ్వారోజు మీ పేద ఇంటి నుండి, మీ సంప్రదాయాల నుండి లేచిపోయి రాకుంటే నేనివాళ మంచి కుటుంబపు స్త్రీని అయి వుండేదాన్ని కదా, పోనీ నాకు జన్మనిచ్చిన మగాడు నిన్ను వదిలేయకుండా వుండి వుంటే, భాష తెలియని నగరంలో, దిక్కుతోచని దీనత్వంలో, ఆకలికి ఏడ్చే పసిబిడ్డ కోసమనో, మరే త్వరిత మార్గమూ లేకనో నువ్వు నీ శరీరాన్ని అమ్ముకోక పోయి వుంటే భోగంతనం నా ఇంటిపేరు కాకపోయేది కదా అమ్మా!

ఇవాళ మా మిషనరీ స్కూల్, హాస్టల్ బాగా గుర్తొస్తోంది.అది గుర్తొస్తే భయమేస్తుంది. అమ్మ ఎందుకు ఎప్పుడో ఏడాదికొకసారి మాత్రమే వస్తుంది? సెలవలలో వెళ్ళడానికి నాకో ఇల్లెందుకు లేదు? అమ్మ వున్నా నేను అనాధని ఎందుకవుతాను? ఇట్లా ఎన్ని ప్రశ్నలో. పాపం అమ్మ ఎంత బాధపడేదో. నా వత్తిడి భరించలేక తనుండే  వేశ్యా వాడకి తీసుకెళ్ళింది అమ్మ. ఆ వాడలో అమ్మ ఉంటున్న చిన్న గదిలో పరుపుపైన దగ్గరగా కూర్చోపెట్టుకుని  తన కథ చెప్పినప్పుడు అమ్మ వాడిపోయిన కళ్ళ నిండుగా ఊరిన కన్నీళ్ళు.  ప్చ్! ఆ కన్నీళ్ళు గుర్తొస్తే ఎంత బాధేస్తుందో. అమ్మ గది పరిశుభ్రంగా ఉండింది. గదిలో ఒక మూల అందమైన చెక్కడపు పూజామందిరం, ఆ మందిరంలో పతిత పావనుడు సీతా సమేత రాముడు. అక్కడున్న అందరూ అమ్మలా చీర కట్టుకుని లేరు, చాలా మంది చిన్న చడ్డీలతో, బ్ర్రాతో స్వేచ్చగా తిరుగుతున్నారు, చుట్టూ అంతటా మురికి, వచ్చిపోయే కస్టమర్లు. ఇంకా స్నానమైనా చేయని ఆ మురికి ఆడవాళ్ళతో యెట్లా రమిస్తారు? స్త్రీని కామించడానికి మగవాడికి ఏమీ అక్కర్లేదేమో, ఒక జననాంగమే చాలేమో!

అంతే ఆనాడు ఆ వాడలో కలిగిన భయం… ఆ రాత్రి అమ్మ పరుపుపైన ముడుచుకుని ముడుచుకుని, జుగుప్సతో, కలలో కలత నిద్రలో వొందల స్థనాలు పాములై సాగి సాగి, నన్ను చుట్టుముట్టి, నలిమి నుజ్జుచేసి, నా కన్నీళ్ళై…  ప్రభువా! జీసస్! నాయనా నాకొద్దీ కష్మలం, కల్మషం, వేలాంగాల వీర్యాలతో తడిసిన జననాoగాల వాడా సంచారం నాకొద్దు. జీసస్! జీసస్! రక్షించు. నేనే వారై, వారే నేనై … అంగమే అన్నమై కడుపులోకెళ్ళే స్త్రీలు నాకొద్దు జీసస్. జీసస్! కురిసే వాన చినుకులలో ఆకుల గొడుగు క్రింద అటుఇటు చంచలించే రంగు రంగు పిట్టలతో అందంగా, పరిశుభ్రంగా భద్రంగా వుండే ప్రపంచం కావాలి నాకు. పైన పరిగెడుతున్న మేఘాల్లా, ఆకాశం అంచున మిలమిలలాడే వెన్నెల్లా పరిశుభ్రత కావాలి. నన్ను పాపలా హత్తుకుని ప్రేమించే నీ లాటి భద్రమైన చేతులు కావాలి. అమ్మ వద్ద నుండి పారిపోవాలి పారిపోవాలి…. శశిధర్ నుండి అతని కుటుంబం చేసే అవమానాల నుండి పారిపోకపోవడానికి ఆరోజు నాలో కలిగిన ఆ భయమే కారణమేమో. లేదంటే మనిషిని మనిషి పశువులా కొట్టే హింసని తనేనాడైనా ఊహించిందా? పక్షినీ,పశువునీ, మనిషినీ సమంగా ప్రేమించే ధర్మం కదా తను నేర్చుకుంది.

కష్టపడి చదివి ఎయిర్ హోస్టెస్ వుద్యోగం సంపాదించి, అమ్మా రామ్మా నా వద్దకు రామ్మా అంటే అమ్మ ఏమన్నదీ, ”వద్దు బంగారూ నువ్వు మంచిగా పెళ్లి చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, నేనొకదాన్ని ఉన్నానని మరిచిపో, ఎవరడిగినా అనాధనని చెప్పు.  పొరపాటుగా కూడా నా గురించి చెప్పకు,” అని. అలా చెప్పిందా తను శశిధర్ కి , లేక జీవితంలో నిజాయతీ ముఖ్యమనుకుందా?  శశిధర్ ఎంత మంచివాడు, ఎంత సున్నిత మనస్కుడు. శశిధర్ కి నిజమే చెప్పాలి తనని అంతగా ప్రేమిస్తున్నాడు కదా, వేశ్య కూతురినైనంత మాత్రాన వదులుకుంటాడా? అసలు వదులుకోడు! ప్చ్! ఎంత నమ్మకం. ఎంత నిజాయితీగా శశిధర్ కి ఆ సంధ్య వేళ ఏర్పోర్ట్ వెలుపలి కాఫీడే కేన్ కుర్చీల్లో ఒక మూలగా కూర్చుని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. అంతకంటే ఆత్మీయులు ఎవరున్నారు జీవితంలో, అందుకే పొంగి పొంగి వచ్చింది ఏడ్పు ఎంత ఆపినా ఆగిందా? కానీ దేవస్మితా నీతి, నిజాయతీ అనేవి అమాయకత్వానికి అక్కచెల్లెళ్ళు. అమ్మ అట్లాగే అమాయకంగా మోసపోయి కదా లేచొచ్చింది. అమ్మ కూతుర్ని నేను తెలివైన దాన్ని కాగలనా? ఏం చేసాడు శశిధర్. అతను చెప్పిన ప్రేమ, జీవితకాలపు బంధం అంతా వట్టి మాటలే. నా శరీర నగ్నత్వాన్ని, నా హృదయ నగ్నత్వాన్ని అనుభవించి పారిపోవాలనుకున్నాడు. మా అమ్మ నాన్నలు నాకు ఎదురు చెప్పరు అన్న నోటితోనే, వాళ్ళు వొప్పుకోవటం లేదు అనేశాడు. ఎందుకని? వేశ్య కూతురిననే కదా? అమ్మ పుడుతూనే వేశ్యగా పుట్టిందా? అనాధనంటే ఎందుకు ఇష్టపడ్డాడు. ఏ వేశ్యో కని  అనాధగా వదిలేసి ఉండకూడదా? అమ్మ బ్రతికి ఉండటమే అతని అభ్యంతరమా? వత్తిడి భరించలేక, చెప్పుకునే తోడు లేక అమ్మకి చెప్తే అమ్మ ఏం చేసింది. తన అడ్డు లేకుండా చేసింది. నిజంగా అనాధను చేసేసింది. అన్నేళ్ల కష్టాలను భరిస్తూ వచ్చి ఈ కష్టాన్ని భరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య నారక్తంలో ఉందేమో లేకుంటే ఎందుకు ఊరికే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నాకు? కుటుంబం వద్దనుకుంటే ఒక్క నిమిషంలో వదిలిపోయే హింస ఇదంతా,  కానీ ఎలా వదులుకోను?

03/03/2006

చిన్నీని, పాపని స్కూల్ నుండి తీసుకొస్తున్నాను. చిన్ని మధ్యలో పిజా తిని వెళ్దామన్నాడు. చేతిలో ఎప్పుడైనా డబ్బు ఉంటుందా! లేదు నాన్నా ఇంటికెళ్ళి నానమ్మనడిగి మనీ తీసుకుని తరువాత  వెళ్దామంటే వాడు ఊరుకున్నాడా ఒకటే ఏడుపు. చిరాకు పుట్టింది. తొడ పాశం పెట్టేసాను. వాడి ఏడుపు చూసి ఒకటే ఏడుపొచ్చింది. ఎన్నిసార్లడిగింది తను శశీని కొంత మనీ ఇవ్వు నాకు అన్నింటికీ మీ అమ్మనడగలేకున్నాను అని. అతను నా  పట్ల ఎందుకంత కఠినంగా  ఉంటాడు. ఔననో కాదనో చెప్పొచ్చు కదా. “అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన దానివి, నీకు పెద్ద వాళ్ళ విలువ ఎలా తెలుస్తుందిలే. కానీ అట్లా నీకు పర్సనల్ మనీ ఇవ్వడం కుదరదు ఏదైనా అమ్మనడిగి తీసుకోవాల్సిందే,” అన్నాడు. అతను అదే తరహాలో మాట్లాడతాడని తెలిసినా మనసు మళ్ళీ మళ్ళీ చిన్నబుచ్చుకుంటుంది ఎందుకనో, పోనీ వుద్యోగం చేయనీయోచ్చు కదా అంటే పిల్లల్నెవరు చూస్తారు? అతని తల్లినెవరు కనిపెడతారు.ఆడపిల్ల అంటే ఇంకో అర్ధం అడ్జెస్ట్ మెంట్ అనేమో. ఎంతకని సర్దుకుపోను? చాలా ఫ్రస్ట్రెటింగ్ గా అనిపిస్తుంది.

08/12/2007

అత్తమ్మ కూతురి దగ్గరకు వెళ్ళిపోయినప్పటి నుండి ఏవిటో ఒకటే దిగులు. ఎప్పుడు ఇంటినిండా మనుషులు ఉండాలనిపిస్తోంది. ఒంటరి బ్రతుకు కావడం చేతేమో ఇల్లంతా బోసిగా అనిపిస్తోంది. ఆవిడకి నేనంటే ఎంత ద్వేషమైనా ఆవిడ మీద కోపం రాదు. ప్చ్ అందరం ఆఫ్ట్రాల్ వొందేళ్ళు బ్రతికి చచ్చే మనుషులమే కదా. శశిధర్ మీద వున్న కోపం కూడా ఆవిడ మీద కలగదు నాకు. ఎందుకో బాగా ఒంటరిగా అనిపిస్తోంది.నిజమే నేను అనాథని.

10 /01/2008

ఇవాళ చాలా పెద్ద గొడవ జరిగింది.’జిన్నూ’ మాజీ ఎం ఎల్ ఎ  కొడుకుని కరిచింది. పసిబిడ్డ వాడిని కరవడం నిజంగా బాధే. కానీ వాడు దాన్ని ఎందుకు కొట్టాలి. వాళ్ళమ్మ  గొడవకు వచ్చింది. ఎంతచెప్పినా వినిపించుకోదే. చివరికి విసిగి ఇంట్లోకొచ్చి తలుపు వేసేయ్యగానే ఆవిడకి ఇగో దెబ్బతిన్నట్లుంది. కొడుకు చేతిలో కర్ర తీసుకుని సిటవుట్లో ఉన్న నిలువెత్తు యాక్వేరియంలు రెంటినీ పగలకొట్టేసింది. నేను తలుపు తీసుకుని వచ్చేలోపు వెళిపోయింది. నాకు గిర్రున తల తిరిగింది. ఎంత అహంకారం. తిని తిరగడం తప్పించి ఇంకోపని ఉండదు ఆవిడకి. డబ్బుందనే కదా ఆ అహంకారం. ఈవిడే కాదు ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళంతా డబ్బుండే వాళ్ళే. వాళ్ళతో కలవడం కూడా అసహ్యం నాకు. కిట్టీ పార్టీలని వీళ్ళు కలిసి మాట్లాడేదంతా బూతులే. ఎవరు ఎవరితో పడుకున్నారు, ఎవత్తె  ఎవడితో వుంది ఇదే. ఐ హేట్ దిస్ లొకాలిటీ. శశిధర్ నాకు ఆత్మనూన్యత అంటాడు. నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను వాళ్ళతో కలవనీయటం లేదంటాడు. నేనెందుకు ఇన్ఫీరియర్ గా ఫీలవుతాను వాళ్లకి తెలియనన్ని, ఎప్పుడు వినను కూడా వినని పుస్తకాలు నేను చదివాను, సంగీతం తెలిసినదాన్ని, దేశాలను చూశాను, మనుషులని కలిసాను.  మొద్దు  మొఖాలు వాళ్ళతో నాకు పోలికేంటి. ట్రూలీ ఐ హేట్ శశిధర్. చేపలన్నీ కిందపడి గిలగిలలాడుతుంటే ఏడుపు ఆగలేదు.  గబగబ పరిగెత్తి బకెట్లో నీళ్ళు తెచ్చి అన్నింటినీ తీసి బకెట్లో వేసినా చిన్ని చిన్ని చేపలు నాలుగు  చచ్చిపోయాయి.  కోపం గిర్రుమని వచ్చి తల తిరిగింది. వాళ్ళింటికి వెళ్లి ఆవిడని బయటకి పిలిచి పాప టెన్నిస్ బాట్ తో యాక్వేరియం పగలకొట్టిన చేతిమీద ఒక్కటిచ్చాను. అందరూ గొడవకొచ్చేరు. ఇంటికొచ్చి తలుపేసుకున్నాను. శశిధర్ రాగానే కంప్లైంట్ చేశారు. చెయ్యి విరగకొట్టానని నా మీద కేసు పెడతామన్నారు. శశిధర్ నా ముఖం మీద వుమ్మేసి  తన ఖర్మ కొద్దీ దొరికానన్నాడు.

03/03/2008

ఈ రోజొక తమాషా జరిగింది. కోర్టుకి వెళ్ళానా, కోర్టులో ఒకతను కనిపించాడు. చాలా అందగాడు. మగవాళ్ళ అందాన్ని నేనెప్పుడూ గమనించలేదు. అలా గమనించాల్సిన అవసరం లేకుండానే అతను అందగాడని తెలిసిపోతోంది. కోర్టులో ఎవరికో దారి ఇవ్వడానికి వెనక్కి జరిగానా,  వెనకే వున్న అతనికి గుద్దుకున్నాను. బేలన్స్ చేసుకోలేకపోతున్న నన్ను రెండు చేతులతో పట్టుకున్నాడు. సారీ చెప్పి వెనక్కు జరిగాను. అలా జరిగేప్పుడు చూసుకున్నాను నేనతనికి సరిగా భుజాల వరకు వున్నాను. చాలా పొడవుగా ఉన్నాడు. నేనే జండా కొయ్యలా ఉంటానని అంటాడు కదా శశిధర్, బహుశా అతను ఆరుంపావు అడుగులు ఉంటాడేమో. అక్కడ ఉన్నంత సేపు అప్పుడప్పుడు అతన్నే చూస్తూ ఉన్నాను.

08/05/2008

ఇవాళ లాయరాఫీసులో మళ్ళీ అతను కనిపించాడు. పలకరింపుగా నవ్వాను . చేతులు కట్టుకుని నిల్చున్నవాడు ఆ చేతులు విప్పకుండానే ‘హాయ్’అని చేతివేళ్లు కదిలించాడు. ఏదో టెన్షన్ లా వుంది. నేను వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి అతను కూడా వచ్చి కూర్చుని అక్కడున్న మేగజైన్ చదవటం మొదలు పెట్టాడు. ఎందుకనో అతన్ని చాలా సార్లు చూశానని అనిపించింది.  అతనితో అదే విషయం చెప్తే, తనో కాలమిస్టునని, ఫలానా ఇంగ్లీష్ మంత్లీ లో  తన ఫోటో చూసి ఉండొచ్చునని చెప్పాడు. అప్పుడు జ్ఞాపకమొచ్చింది.  తన రీసెంట్ రైటింగ్ పైన నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అదే చెప్పాను, అతను శ్రద్దగా విన్నాడు. చివరిగా వచ్చేస్తూ ఏదో అడ్వర్టైజ్ మెంట్ లో చూపించినట్లు నా మొబైల్ కనిపించట్లేదు ఒకసారి రింగ్ చేస్తారా అనాలేమో. కానీ నాకు అబద్ధం చేతకాదు. ఎందుకో మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలనిపిస్తూ వుంది. మీరు చాలా అందంగా వున్నారు అందుకని అన్నాను. అప్పుడతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూసాను. కొంచమన్నా మార్పులేదు, సర్ ప్రైజ్. చాలా కేజువల్ గా చేయిచాచి కమల్ అగర్వాల్ అన్నాడు. నేను చేయి కలిపి దేవస్మిత అని నవ్వాను. మీ పేరు బాగుంది లైక్ యువర్ స్మైల్ అన్నాడు, అని మీ మొబైల్ కి రింగ్ చేసేదా అన్నాడు. ఇంటికొస్తున్న దారిలో నాకు నేనే నా ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోయాను. యెందుకలా  ప్రవర్తించాను? అయినా నేను ఈ కాలపు అమ్మాయిని. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడటం తప్పేంటి? ఇదేం తప్పు కాదు నిజమే. కానీ, ఇంతకు ముందు నేనలా లేను కదా మరి.  మే బీ అయాం  ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ డెస్పరేషన్. ఫ్రాయిడ్ ని వెతకాలి.

16/08/2008

కమల్ తో బాగా స్నేహం కలిసింది. మాట్లాడేందుకు బోలెడు విషయాలు. కానీ అతను పైకి కనిపించినంత స్టేబుల్ కాదు. చాలా ఎమోషనల్. మార్వాడీ తండ్రికీ హిందూ తల్లికీ జన్మించాట్ట. అక్రమ సంతానం. మనువు ప్రకారం ఇతను ఏ చండాల కులంలోకి వస్తాడో.  విధిలేని పరిస్థితుల్లో తండ్రి అతన్ని అంగీకరించాట్ట అయినా తండ్రితో దాదాపుగా లేడు. సగం చదువు విదేశాలలో. తల్లీ, అతను. నేనో వేశ్య కూతుర్నని చెప్పాలనుకున్నాను. ఇష్టమనిపించలేదు. నా జీవితంలో ఇంకో మగాడ్ని నమ్మడమా? సమస్యే లేదు!

15/10 /2008

కమల్ ఇవాళ ఇంటికొచ్చాడు. నా పుస్తకాలు చూసి ఆశ్చర్యపడ్డాడు. అతని పుస్తక పరిజ్ఞానం నన్ను ఆశ్చర్య పరిచింది. ఆకర్షణా కలిగింది. ఇతన్ని చూపించి శశీతో చెప్పాలి. చూశావా అతనెంత చదువుతాడో అని. నువ్వేం చదవవు. ఎదుగూ బొదుగూ లేకుండా అక్కడే వున్నావు. నాకు ఏ ఆకర్షణ లేదు నీ పై అని. అప్పుడేం అంటాడు శశిధర. నవ్వొస్తుంది. ఏముంది బూతుల  మేళం మొదలెడతాడు.  కమల్ వచ్చేసరికి నా సంగీత సాధన జరుగుతోంది. అందుకని పాడమంటున్నాడేమో  అనుకున్నాను. కానీ కాదు.  అతనికి సంగీతమంటే పిచ్చి. హిందుస్తానీ, వెస్ట్రన్ బాగా తెలుసు. అందుకని త్యాగరాజ  కీర్తన ”రామ నీ సమానమెవరు రఘు వంశోద్ధారక/ భామ మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక /పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు…”పాడాను. పాడి ముగించగానే కళ్ళు విప్పార్చుకుని నన్ను చూస్తూ ఆ పాట అర్ధమేమిటో చెప్తావా అన్నాడు. యేమని చెప్పను, అన్యమెరుగని ప్రేమని భక్తి అంటారని చెప్పాను, ఇంకా యేవో చెప్పాను. అర్ధం చెప్పగానే లేచి నా రెండు భుజాలు పట్టుకుని గొంతుపైన ముద్దుపెట్టాడు. విదిలించి కొట్టి గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. అతనిపై నా భావమేంటి? నా పై అతని భావమేంటి? అతను అందంగా కనిపించడమంటే కామించానని అర్ధమా, విషయాన్ని ప్రేమించడమంటే ఆ సంబంధిత వ్యక్తిని ప్రేమించినట్లా, ఎందుకనో ఏడుపొచ్చింది. కాసేపాగి వచ్చి చూసేసరికి అతను లేడు.

22/10 /2008

కమల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసాను. మనసుకేం కావాలో ఏం వద్దో క్లారిటీ లేదు. తను మెసేజ్ పెట్టాడు ”దేవీ నేను చేసింది తప్పని నీకు తోచి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చెప్పమంటావా ఐ నీడ్ యు వెరీ బాడ్లీ . అమ్మాయిలేం నాకు కొత్త కాదు. కానీ నువ్వు మాత్రం చాలా కొత్త. మనం ఇప్పుడు కావాలంటే విడిపోదాం, ఒక పదేళ్ళకి కలుద్దాం. అప్పుడు కూడా నా అభిప్రాయంలో మార్పు రాదు. నాకు నువ్వు కావాలి. ఇద్దరు పిల్లల తల్లిని ఇలా అడగడం న్యాయం కాదు కానీ అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా, పిల్లల్తో సహా నాతో వచ్చేయగలవా,” అని. మెసేజ్ చదవగానే తలతిరిగింది. ఓటిదో మోటుదో ఒక కుటుంబం వుంది కదా నాకు. దాన్ని వదిలేయమని ఎలా అంటాడు ఇతను. చిరాకేసింది.

28/10/2008

కమల్ నుండి చిన్న పలకరింపు కూడా లేదు. ఏమిటో ఒక చెడ్డ నిశ్శబ్దం. హృదయంలోనూ, భౌతికంగానూ. నేనెందుకీ వత్తిడి భరించాలి. అతనితో మాట్లాడి మందలించేయాలి. అమ్మాయిలు మగవాళ్ళతో  స్వేచ్చగానో, కొంచెం చనువుగానో  ఉండకూడదా.  ఛీ! అయినా నేనేంటి మరీ టిపికల్ విమెన్ లాగా ఇలాంటి డైలాగ్స్ చెప్పుకుంటున్నాను. తనకీ నాకూ మధ్య ఒక కెమిస్ట్రీ డెవలప్ అవుతుందని తెలియనంత చిన్న పిల్లనా? యేరు దాటాక, తుంగ బుర్రలా నాకటువంటి ఉద్దేశం లేదు  అని చెప్పాలా? అది ఆత్మ వంచన కాదా? ఛీ! చిరాగ్గా వుంది ఏవిటో. శశి రేపు వెళిపోతాడు కదా, అప్పుడు పిలవనా. అయినా నేనెందుకు పిలవాలి.

10/11/2008

పిల్లల్ని స్కూల్ లో  వదిలి వస్తుంటే ఎదురుగా వున్నషాపింగ్ మాల్ నుండి వస్తున్నాడు కమల్ . ఒక క్షణం నన్ను చూసి వెళ్ళిపోయాడు. ప్రేమ అన్నాడు కదా ఇదేనన్నమాట ప్రేమ. కోపమొచ్చింది. అతనికి ఫోన్ చేసాను. కానీ ఏం మాట్లాడాలో తోచలేదు, కట్ చేసి ఇంటికెళ్ళేసరికి ఇంటిముందు తన కారు.

17/02/2009

దేవస్మిత చెడిపోయింది. మామూలుగా చెడిపోతే పర్లేదు కానీ మనసా వాచా కర్మణా చెడిపోయింది. యెట్లా? రోజు రోజుకీ పెరిగిపోతున్న కాంక్ష.  ఎప్పుడూ తనతోనే వుండాలని, అతనితోనే చచ్చిపోవాలని, ప్రతిసారీ అతనంటాడు నాతో వచ్చేయవా అని. ముందూ వెనుకా ఎవరూ లేని దాన్ని వెళ్ళిపోతేనేం. కానీబాధేస్తుంది. పిల్లల్ని నాలానే చేయాలా? జీవితాంతం వాళ్ళమ్మని తల్చుకుని బాధపడాలా?

22/12/2009

ఇవాళ కమల్ ని శశిధర్ చూశాడు. ఊరికే చూడటం కాదు. నన్ను కమల్ ముందే దారుణంగా కొట్టడం మొదలు పెట్టాడు. కమల్ అడ్డమొచ్చాడు, కమల్ నీ కొట్టడం మొదలెట్టాడు. నాకు ఏడుపొచ్చింది కమల్ ని బయటకి నెట్టి  తలుపేసాను. శశిధర్ ముఖం పాలిపోయింది. నాకు  కొంచమన్నా సిగ్గుగానో వెరపుగానో అనిపించలేదు. పైపెచ్చు ఏదో సాధించినట్టు మనసుకి హాయిగా అనిపించింది. గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. పిల్లలొచ్చారని తలుపు తీశాను. అతను లేడు.

01/01/2010

శశిధర్ ఒక వారంగా ఇంటికి రాలేదు. ఇవాళే  వచ్చాడు అతను రాలేదని నాకు దిగులు కూడా అనిపించలేదు. కమల్ ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాడు వచ్చేయమని. ఈ ఘర్షణ  క్రుంగదీస్తోంది వెళ్ళాలా వద్దా అని. పాప మెడ చుట్టూ చేతులేసి ఎంత మంచి అమ్మ మా అమ్మ అన్నపుడు ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. మరి ఎలా వెళ్ళను?

ఈరోజు శశిని చూడగానే చిరాకేసింది. పిల్లలు నిద్రపోయాక నా పక్కన చేరాడు. ఏం నేను చాలలేదా? అమ్మ బుద్ధులు తలెత్తాయా? అంటూ ఏమిటేమిటో అన్నాడు. మీద పడ్డాడు. అది కామమా? ఇంకో మగాడిని ఇష్టపడుతున్నానని తెలిసీ అతనికి నా మీద కామమెలా సాధ్యమయింది? నెట్టినా గిల్లినా కొట్టినా వదలలేదు. ఆశ్చర్యమేసింది. వళ్ళు శుభ్రంగా కడుక్కుని వచ్చి,”నీకో విషయం చెప్పాలి శసి ఐ స్లెప్ట్ విత్ హిమ్ సో మెనీ టైమ్స్. మన మధ్య ఇక కాపురం అసాధ్యం,” అన్నాను. నిజానికి నాట్ మెనీ  టైమ్స్, కానీ అట్లా చెప్పాలనిపించింది. కమల్ తాకిన శరీరాన్ని ఇతను తాకకూడదనా? ఏమో!  ఏమైనా నేను డ్యుయల్ సిం కార్డ్ మొబైల్ ని కాదు. కర్మ చాలక వేశ్య అయిన అమ్మ కూతురినే కానీ వేశ్యని కాదు. అయినా ఈ లోకంలో వేశ్యలు లేరు. విటులు మాత్రమే వున్నారు. వాళ్ళు కొంతమంది ఆడాళ్ళని ఉపయోగించుకుని వేశ్యలని పేరు పెడతారు. అంతే. ఐ హేట్ మెన్. అతను తలకింద చేతులుంచుకుని అలాగే నగ్నంగా పడుకున్నాడు. అతని నగ్నత్వం జుగుప్స కలిగించింది. అతనేం సమాధానం ఇవ్వలేదు. వెళ్లి హాల్లో పడుకున్నాను. తెల్లారేసరికి అతనులేడు.

26/01/2010

రెండో తేదీ కమల్ ని పిలిచాను. విషయం వినగానే అతని ముఖంలో రంగులు మారాయి. రంగులు మారిన అతని ముఖాన్ని చూడగానే నాకు మనసులో నవ్వొచ్చింది. నేను ఇంకా కూడా శశీ భార్యనే. నన్ను తాకడానికి సర్వ హక్కులూ వున్నవాడు అతను. అట్లా కాదు నన్ను తాకనివ్వను అని నేనితనికి చెప్పానా? ఏవిటో చిరాగ్గా వుంది. ”మనం ఫారిన్ కి వెళ్దాం. నాకు జాబ్ ఈజీగా వస్తుంది, నేను లింగ్విస్ట్ ఎక్సపర్ట్ ని. గ్రీన్ కార్డ్ హోల్డర్ని,” అన్నాడు. నేను మాట్లాడలేదు. అతన్ని కౌగిలించుకుని కూర్చున్నాను అప్పుడొచ్చాడు శశిధర్. మళ్ళీ గొడవ. నాకు విపరీతంగా దెబ్బలు తగిలాయి. కమల్ నన్ను బయటకి తీసుకొచ్చాడు. నేను కమల్ తో వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ ఊరెళ్ళే బస్సెక్కించమని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. నేను కమల్ తో వెళ్లలేదని ఎలా తెలుసుకున్నాడో శశి జయంతికి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. జయంతికి అన్నీ తెలుసు పదిరోజులకు నన్ను తీసుకుని ఇంటికి బయల్దేరింది. నాకసులు క్లారిటీ రావటంలేదు. పిల్లలు ఒకటే గుర్తుకొస్తున్నారు. కమల్ గుర్తుకొస్తున్నాడు. ఊర్లో దిగగానే హోటల్ రూం తీసుకుని కమల్ ని పిలిచాను.జయంతి తో  కలిసి డిన్నర్ కి వెళ్లాం అర్దరాత్రి దాటింది. వస్తూ వున్న దారిలో చీకటి  పూసినట్ట్లున్న చెట్టుకింద కమల్ హట్టాత్తుగా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. జయంతి పక్కనే వుంది.  అయినా అన్ని రోజుల ఎడబాటు నన్నతనికి అల్లుకునేట్లు చేసింది. కార్లో జయంతి ముభావంగా కూర్చుంది. మరుసటి రోజు ఇంటికెళ్లాం. శశి, జయంతిని చూడగానే ముఖం దుఃఖంగా పెట్టాడు. పెట్టడమే కాదు అతని కళ్ళలో నీళ్ళొచ్చాయి. జయంతి అతనితో, ”జరిగిందేదో జరిగి పోయింది రెండు  చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. స్మిత నాకు ఎప్పటి నుండో  తెలుసు. తను అలాటిది కాదు. మీరు  కూడా అది అనాధ అని అలుసు తీసుకుని , ఏం చేసినా అడిగే వాళ్ళెవరూ లేరని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. తను జీవితం లో చాలా సఫరయింది ఇంకా ఎంతకని బాధ పడగలదు.  ఇకనైనా బాగుంటే  మంచిది. మీరు ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు,” అంది. నేను  అక్కడినుండి లేచి వచ్చేసాను. ఏడుపొచ్చింది. చక్కటి కుటుంబాన్ని గురించి ఎన్ని కలలు  కన్నది తను. జయంతి చెప్పినా ఎవరు చెప్పినా గతం పునరావృతం కాగలదా? శనివారం జయంతి వెళిపోయింది.

8/4/2010

ఇప్పుడు శశి ఇంతకు ముందటిలా కాదు. ఎక్కడికెళ్ళినా పదే పదే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఎన్ని సార్లడిగేదో తన, ఫోన్ చెయ్యవా రోజుకోసారన్నా అని. నీకులాగా నాకు పని లేదనుకున్నావా అనేవాడు. ఒక ఎయిర్ హోస్టెస్ గా ఒక పైలెట్ కి ఎంత పని ఉంటుందో తనకి తెలియదా? ఇప్పుడెట్లా సమయం దొరికింది? వెళ్తూ వెళ్తూ వేలకి వేలు టేబుల్ మీద పెట్టి వెళ్తాడు. కమల్ ప్రస్తావన అసలు రానీయడు. ఇది ప్రేమా? ఏమో నాలో ప్రేమ చచ్చిన తరువాత ఇతనిలో ప్రేమ మొదలయినట్లుంది పాపం. కానీ శశీ నీకోసం ఈ మనసు ఎంత తపన పడేదో. కలలొ నువ్వు తాకినా శరీరం పులకరించేది. నువ్వు విమానమెక్కిన ప్రతి సారీ నీకేమయినా అయితేనో అని వణుకొచ్చేది. అట్లా అయితే   గుండాగి చచ్చిపోతానేమో అనుకునేదాన్ని. ఒక వేళ  అట్లా కాకుంటే నీతో పాటూ ఆత్మ హత్య చేసుకుంటాను కానీ నిన్ను వదిలి బ్రతక గలనా అనిపించేది. నిన్ను  పిచ్చిగా ప్రేమించిన దేవస్మితని ఎంత పతనం చేసావు కదా? నా ప్రేమని పిచ్చి పురుగులా కాలికింద వేసి నలిపేసావ్. మళ్ళీ నువ్వు చెప్పినట్లు విని ఇంతకు మునుపులా నీ జీవితంలో ఉండడానికి నేను నువ్వు నడిపే విమానాన్నా శశీ?

24/05/2010

ఇక తనతో వచ్చేయాల్సిందే అన్నాడు కమల్. వెళ్లాలని నాకూ వుంది. శశిధర్ ని ఏం చెయ్యను? అన్నేళ్ళూ అతను నన్ను పెట్టిన హింసంతా ఏమయింది? ఇప్పుడింత సాత్వికంగా ఎలా వుండగలుగుతున్నాడు. అతని నిజ స్వభావం ఏది. ప్చ్! విసుగ్గా వుంది.

12/06/2010

ఈ రోజు కమల్ తో వుండగా అనుకోకుండా శశి వచ్చాడు. మళ్ళీ ఘర్షణ జరుగుతుందేమోనని చిరాకేసింది.  మీ ఇద్దరితో మాట్లాడాలి కూర్చోండి అన్నాను. ఆ క్షణం ఆలోచించేందుకు అవకాశముండి, ఆలోచించి  మాట్లాడి వుంటే ఏం మాట్లాడి ఉండేదాన్నో తెలీదు కానీ అప్పుడు మాత్రం చాలా మామూలుగామ, ”శశీ నాకు మీ ఇద్దరు కావాలి. పిల్లల కోసం, కుటుంబంగా నువ్వు కావాలి. ఎందుకంటె నా పిల్లలు నాలా బాధపడకూడదు. అట్లాగే  నా హృదయంలో హృదయం గా కమల్ కావాలి. నువ్వు లేకున్నా నేను బ్రతకగలను.కమల్ లేకుండా బ్రతకలేను. నేను కావాలని నీకు గాఢం గా  ఉంది కాబట్టి ఒకపని చేద్దాం, నేను ఇద్దరితోనూ ఉంటాను. మీ పెదనాన్నకి వున్న ఇద్దరు భార్యలు సర్దుకుపోయినట్లు మీ ఇద్దరు సర్దుకుపొండి, లేదా నేను కమల్ తో వున్నట్లు నీకు తెలియకపోతే ఎలా వుండేవాడివో అలా తెలియనట్లు వుండిపో. కానీ ఇకపై నన్ను కొట్టడం, తిట్టడం కుదరదు. అలాగే కమల్, నేను శశిధర్ తో వున్నా కూడా నువ్వు నాతో వుంటున్నావ్ కదా, అలానే ఇక మీదట కూడా ఉండు. ఒక ఇల్లు తీసుకో, నేను వస్తూ పోతూ ఉంటాను. ఇకపై నువ్వీ ఇంటికి రాకు. కానీ నువ్వు ఇంకొకర్ని పెళ్లి చేసుకోకూడదు. నాకోసమే ఉండిపోవాలి,” అన్నాను. నా మాట వినగానే కమల్ లేచి నా వైపు కూడా చూడకుండా వెళిపోయాడు. శశిధర్ సరేననో,  కాదనో చెప్పకుండా గదిలోకి వెళ్లిపోయాడు. నేనొక్కదాన్నే గదిలో మిగిలిపోయాను.

2/8/2012

నాలుగు దిక్కులూ
నేనే అయిన ఏకాంతంలో
నీ జ్ఞాపకాల బురదలో
దిగులు కమలం పూస్తుంది.
ఒక నాలో ఇంకో నేను
నా రహస్య దుఃఖాన్ని ఓదార్చుకుంటాను
దుఃఖాన్నీ నేనే
ఓదార్పునీ నేనే అయిన
దిగులు దారుల ప్రయాణంలో
జీవితం
తిరిగి తిరిగీ చిగురించే
వసంతం కానందుకు ఆనందం వేస్తుంది.
ఎంత దూరం నడిచినా
దారీ తెన్నూ దొరకనీయని
నిశ్చయ నిష్ఫల స్వప్నం
నీవు .
అయినా ఎదురుచూపును
వదులుకోదు మనసు, ఎందుకనో!
నువ్వు నాకోసం
దుఃఖాన్ని మాత్రమే కేటాయించావని
తెలిసి పోయాక
సందేహం కలుగుతుంది.
ప్రియ పురుషుడా!
నేను దేన్ని ప్రేమిస్తున్నాను
నిన్నా??? దుఃఖాన్నా????

ఛానెల్ 24 / 7 – మూడవ భాగం

sujatha photo

(కిందటి భాగం తరువాయి)

“శ్రీజ ఇంకా ఏడుపు ఆపలేదు” అన్నాడు మేకప్‌మాన్ దామోదర్.

పేపర్ చదువుకొంటున్న శ్రీకాంత్ దామోదర్ వంక చూశాడు.

“ఇదేం గోలరా బాబూ పొద్దున్నే.. ఎంతసేపు ఏడుస్తుందంట..” అన్నాడు చిరాగ్గా..

“ఆవిడ్ని అంతమందిలో  అలా అరవటం బావుండలేదు సర్,” అన్నాడు దామోదర్.

“ఓహో.. తమరికీ బాధ కలిగిందన్నమాట,” అన్నాడు శ్రీకాంత్.

“నాకేమిటి సర్, ఇంతవరకూ ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. మీరు నన్నరుస్తారని వచ్చాను,” అన్నాడు దామోదర్ మొహం మాడ్చుకొని.

పేపర్ టేబుల్‌పైన పడేసి కాబిన్‌లోంచి చుట్టూ చూశాడు శ్రీకాంత్. ఎవరి పనుల్లో వారు ఉన్న అందరి చెవులూ ఇప్పుడు తన మాటనే వింటాయనిపించింది శ్రీకాంత్‌కి.

కోపం తెచ్చుకోకూడదని ఎంత కంట్రోల్ చేసుకొన్నా ఆ నిముషం నోరు ఊరుకోదు. ఇక ఆ తర్వాత ఎంత తల విదిలించినా పరిస్థితి చేతుల్లోకి రాదు. మళ్లీ ఈవిడ సీన్ క్రియేట్ చేసింది. ఎండిగారి దగ్గర క్లాసు పీకించుకోవాలి.

“ముసలాయన వచ్చాడా,” అన్నాడు శ్రీకాంత్.

“ఎవరు సార్,” అన్నాడు దామోదర్.

కళ్లెత్తి అతనివైపు చూశాడు.

ముసలాయనేమిటి.. ఆయన ఎండి చచ్చినట్టు సరిగ్గా మాట్లాడు అన్నట్లున్నాయి దామోదర్ చూపులు. వీడొక పుడింగ్‌గాడు. నన్నే కొశ్చెన్ చేస్తాడేమిటి. ఈ రోజంతా వీడికి తిండి లేకుండా, ప్రోగ్రామ్  బ్రేక్ లేకుండా చేయకపోతే మారుపేరు  పెట్టుకొంటా అనుకొన్నాడు మనసులో శ్రీకాంత్.

“దామోదర్ అస్సలే చిరాగ్గా వున్నాను. నువ్వో తద్దినం పెట్టకు పదా. ఆవిడెక్కడుంది..”

“వాయిస్ ఓవర్ స్టూడియో ఎదురుగ్,గా” అన్నాడు దామోదర్. మొహంలో మాయరోగం వదిలిందా అన్న ఫీలింగ్ ఉందనిపించింది శ్రెకాంత్‌కి.

దేవుడా.. సరిగ్గా ఎండి క్యాబిన్ ముందు ఏడుస్తూ కూర్చుందన్నమాట. ఐపోయాను ఇవ్వాళ అనుకొన్నాడు. టైమ్ చూసుకొన్నాడు. తొమ్మిదిన్నర. ఇంకేం ప్రోగ్రాం. ఇంకో అరగంటకు బయలుదేరినా స్పాట్‌కి చేరేటప్పటికే పన్నెండు. లైటింగ్ చూసుకొనేసరికి లంచ్ టైం. నాశనం చేసింది ప్రోగ్రామంతా. మనసులో తిట్టుకొనేందుకు కూడా శ్రీకాంత్‌కు ధైర్యం చాలలేదు.

“పద,” అన్నాడు లేచి నిలబడి.

లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా  ఫోర్త్‌ఫ్లోర్‌కు గబగబా నడిచాడు. మెట్ల దాకా వచ్చిన దామోదర్ ఆగిపోయాడు. నవ్వొచ్చింది అతనికి. నాలుగు రోజులకొకసారి శ్రీకాంత్‌కు ఈ ఫీట్స్ తప్పవు. పాపం అనుకొన్నాడు. ఆ పిల్ల కూడా అంతే.  శ్రీజ ఏడుపు తలుచుకొంటే ఇంకా నవ్వొచ్చింది. రావటమే ఎనిమిదిన్నరకి.  శ్రీకాంత్ ముందే చెప్పాడు. తొమ్మిదికల్లా కారెక్కాలి అని. అతను వెళ్ళేదాకా చూస్తూ వింటూ ఊరుకొంది. రోజూ ఉండేదేగా అనుకొని మేకప్ అయ్యాక హెయిర్ స్ట్రెయిట్ చేయమంది. హెయిర్ డ్రస్సర్ ఒక్కో పాయ తీస్తూ స్ట్రెయిట్ చేస్తోంది.  శ్రీకాంత్ వచ్చేసరికి శ్రీజ తీరిగ్గా చెయిర్‌లో వెనక్కు వాలి మ్యూజిక్ వింటోంది. సగం సగం మేకప్ కాగానే పెద్దగా అరిచాడు.

“ఏవుంది సర్ ఫైవ్ మినిట్స్.. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక చేతుల పని చూద్దాం,” అంది.

“ఇంకా ఏం చేంజ్.. వేసుకొన్నవి బాగా వున్నాయ్‌లే పదా,” అన్నాడు చిరాగ్గా.

“లేదు సర్ కాస్ట్యూమర్ వెయిట్ చేస్తున్నాడు. కార్నర్‌లో ఉన్నాట్ట. షోరూమ్ నుంచి డ్రెస్‌లు తీసుకొస్తున్నాడతను. నేను వచ్చేస్తాను సర్,” అంది కూల్‌గా శ్రీజ.

శ్రీకాంత్‌కి కాస్త కోపం ఎక్కువే. గబగబా కాస్ట్యూమర్ రాజుకు ఫోన్ చేశాడు.

“సర్ ఇక్కడే షాపులో డ్రస్‌లు రెడీగా వున్నాయి. ఇదే దారికదా పట్టుకుపోండి సర్. నేను శ్రీజకు చెప్పాను,” అన్నాడు.

అతని వంకే సినిమా చూసినట్టు చూస్తోంది శ్రీజ. నీ కుప్పిగంతులు నా దగ్గరా అన్నట్లున్నాయి ఆమె చూపులు. చీటికి మాటికి అరిచే శ్రీకాంత్ అంటే వళ్ళుమంట శ్రీజకి. అతనితో పని చెయక తప్పదు. డెయిలీ ప్రోగ్రాం. ప్రతిరోజు దాదాపు షూటింగ్ వుంటుంది. రోజూ  వుండే  పనే కదా కూల్‌గా వుందాం అనుకోడు శ్రీకాంత్. కాస్త కోపం కానీ మనిషి మంచివాడే అనుకొంది శ్రీజ. ఇదాంతా నాలుగు రోజుల కొకసారి ఆఫీస్‌లో అందరికీ కనులకీ, చెవులకీ విందు. శ్రీకాంత్ టెన్షనూ, శ్రీజ కూల్‌గా కనిపిస్తూ విసిగించటం..

ఫోర్త్ ఫ్లోర్‌కి ఒక్క ఊపున పరుగు తీశాడు . ఆయాసం వచ్చింది శ్రీకాంత్‌కి. ఎదురుగ్గా కనపడుతున్న దృశ్యం చూసేసరికి గుండె గొంతులోకి వచ్చింది.

పొడుగ్గా వంగిపోయి ఎండిగారు. ఆయన ఎదురుగ్గా ఏడుస్తూ శ్రీజ. పరుగులు ఆపి నడుస్తూ వచ్చాడు శ్రీకాంత్. ఎండి ఎస్.ఆర్.నాయుడు కళ్లజోడు పైనుంచి శ్రీకాంత్ వైపు చూశాడు.

“నువ్వు ఇవ్వాళే వెళ్లిపోతావా, హెచ్ఆర్‌లో చెబుతాను సెటిల్ చెయ్యమని,” అన్నాడు కూల్‌గా.

“ఏంటి సార్” అన్నాడు శ్రీకాంట్. మళ్ళీ కంగారుగా  గుడ్ మార్నింగ్ అన్నాడు.

“నీ న్యూసెన్స్ భరించలేకపోతున్నానోయ్. రిజైన్ చేయి పోయి” అన్నాడు మళ్లీ. ఆయన గొంతులో కోపం లేదు. మాటల్లోనే అంతా.

“సారీ సర్. లేట్ చేస్తోంది సార్. ఎంతకీ తయారవదు. లోకేషన్ దూరం సార్. దిల్‌షుక్ నగర్ దాటాలి. అవతల సెలబ్రిటీ సర్. ప్రోమో షాట్ల కోసం ఇన్వైట్ చేశాం సర్. ఆమె హాఫెనవర్ టైమ్ ఇస్తానంది సర్. స్పెషల్ కుకరీ, సెలబ్రిటీ కుకర్. శ్రీజ ఎప్పుడూ లేట్ సర్,” అన్నాడు గబగబ.

ఎండిగారు తీరిగ్గా ఆమె వైపు చూశాడు. ఆయన ఎదురుగా ఎవరు వుంటే వాళ్ల సైడ్‌కి మారిపోతూ వుంటాడు.

“ఏమ్మా, ఎందుకు లేట్”

“సర్ వచ్చాను సర్. సెలబ్రిటీ వస్తున్నారు కదా సర్. మంచి డ్రెస్ కోసం కాస్ట్యూమర్ వెళ్లాడు సర్. ఆవిడ బాగా తయారై వస్తారు కదా సర్. మరి ఎలా పడితే అలా ఎలా వెళ్లాలి సర్,” అన్నది.

” ఏం చేద్దాం,” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

శ్రీజకు కోపం దిగిపోయింది. శ్రీకాంత్‌ను ఉద్యోగంలోంచి తీసేస్తానని ఎండి అనడం లోపలనుంచి ఆనందం తన్నుకు వచ్చింది.

“ఏం లేదు సర్ బయలుదేరుతున్నాం,” అన్నాడు శ్రీకాంత్.

చైర్‌లో వెనక్కి వాలి కూర్చొంటూ, కళ్లజోడు పైనుచి శ్రీజను చూస్తూ ఏం చేద్దాం అన్నాడు ఎస్.ఆర్.నాయుడు. మళ్లీ ఆయన మొహంలో నవ్వు.

“వెళుతున్నాం సర్,” అన్నది శ్రీజ.

ఆయనకు నమస్కారం చేసి గబగబ కిందకి వెళ్లిపోయింది.

శ్రీకాంత్ వంక చూశాడు ఎండి.

“నోరు అదుపులో పెట్టుకో. ఆడపిల్లలతో ఏమిటి నీకు,” అన్నాడు చిరాగ్గా.

“ఒక్కమాట కూడ వినిపించుకోదు సర్. టైమ్ మెయింటెయిన్ చేయదు. చాలా ప్రాబ్లం,” అన్నాడు శ్రీకాంత్.

“అయితే వెళ్ళిపొమ్మని చెప్దాం,” అంటూనే అటు తిరిగి  మెసేజ్‌లు చూసుకోవటం మొదలుపెట్టాడాయన.

నన్ను పంపించకపోతే చాలు అనుకొంటూ వెనక్కి తిరిగాడు శ్రీకాంత్.

“ఏంటి.. ఏమంటాడు,” అన్నాడు పక్క లైబ్రరీలోంచే ఈ ఫార్స్ చూస్తున్న అవుట్‌పుట్ ఎడిటర్ శ్రీధర్. ఎండి గురించి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడతను. ఇంకో గంటలో హైద్రాబాద్‌లో జరిగిన విధ్వంసం పైన లైవ్ మొదలుపెట్టాలి. వరసగా అందరికీ ఫోన్‌లు చేసుకొని ఎండి కోసం పడిగాపులు పడుతున్నాడు.

“ఏవంటాడూ.. దాన్నీ..” అంటూనే ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూశాడు శ్రీకాంత్.

“శ్రీజని తీసేయ్యాలిట.”

“తీసి ఎక్కడ వేయాలి” నవ్వాడు శ్రీధర్.

“ఆయన నెత్తిమీద. ఇది గంటకోసారి ఆయన కాబిన్ ముందు నిలబడుతుంది. ఈవిడ పోయట్రీకి ఇన్స్పిరేషన్ ఆయనేనట”

“ఆమె పోయట్రీకి ఈ ముసలాడు ఇన్స్పిరేషనేమిటిరా. ఈవిడకు ఆయన్ను చూసి కవిత్వం పొంగటమేమిటో అర్ధం కాదు.”

శ్రీకాంత్ చిరాకు చూసి ఇంకా నవ్వొచ్చింది శ్రీధర్‌కి.

“దాని ఉద్యోగానికి ఇది పర్మినెంట్ స్టాంపు.”

“శ్రీజలాగా మన ఆఫీసులో కనీసం వందమందికి ఇన్స్పిరేషన్ ఆయన. మన డెస్క్ రమణగాడు చూడు. నిముషానికి ఓ సారి అభిసారికలాగా సార్ అంటూ  పరిగెత్తుకొస్తుంటాడు. తన లైవ్‌లో ఎటువైపు చూసినా దీపం పురుగుల్లా జర్నలిస్టులు ముసురుతుంటారని మొన్న కోర్ మీటింగ్‌లో ఎండి మూర్ఛపోయాడు. అసలింతకీ రమణగాడు ఎందుకు వచ్చాడో తెలుసా..? ఇప్పుడు ఎడిట్ అవుతున్న ప్రోగ్రామ్‌లో వైట్ షర్ట్ గ్లేర్ కొట్టిందంట. ఆ తెల్లటివి వేసుకోవద్దని కెమెరా పరశురాం చెప్పమన్నాడని వచ్చానన్నాడు. ఈ సంగతి చెప్పేందుకు రమణ రావాలా చెప్పు. ఎండీగారు రమణగాడి పొగడ్లకి  కోమాలోకి వెళ్ళిపోయాడనుకో,” అన్నాడు శ్రీధర్.

ఒక కన్ను ఎండి కాబిన్‌వైపు పెడుతూ, కేబిన్ ఎదురుగా ఆయన పి.ఏ. సరిత సీరియస్‌గా కంప్యూటర్‌కి అతుక్కుపోయి కనిపిస్తుంది. ఆమె ఎదురుగా పదిమంది ఎండిగారి కోసం వెయింటింగ్‌లో వున్నారు.

“లైవ్ వుందిరా బాబూ పోతున్నా. ఆయనకు గెస్ట్ లిస్ట్ ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది,” అంటూ అటు పరిగెత్తాడు శ్రీధర్.

సరితకు ఎదురుగా నిలబడ్డాడు. ఓ సెల్యూట్ కూడా కొట్టేశాడు.

“చాల్లే బడాయి” అన్నది సరిత నవ్వు ఆపుకొని.

“ఆయనకు పర్మిషన్ ఇవ్వొచ్చుగా నన్ను కలిసేందుకు,” అన్నాడు సీరియస్‌గా.

సరిత మళ్లీ నవ్వింది.

“ఇవ్వను,” అన్నది సిస్టంలోంచి ఏదో నంబర్ నోట్ చేసుకొంటూ.

“ప్లీజ్ మేడం. చచ్చి నీ కడుపున పుడదామన్నా టైం లేదు. టాంక్‌బండ్ మీద విగ్రహాలు మొత్తం మటాష్”

“సర్లే బాబూ ఓవరాక్షన్ ఆపి పోయి పనిచేసుకో,” అన్నదామె.

క్యాబిన్ అద్దంలోంచి ఎండి ఫోన్‌లో మాట్లాడతం కనిపిస్తోంది. అద్దంలోంచి కనిపిస్తున్న శ్రీధర్‌కి తలవూపి లోపలికి రమ్మన్నాడు.

“అదేమిటండి . విగ్రహాలన్నీ.. అబ్బ అవన్నీ అంటే నాకెంతో ఇష్టం,” అన్నది సరిత. ఎదురుగ్గా గోడపై ఫిక్స్ చేసిన టీవీలో లైవ్ చూస్తూ, చూస్తుండగానే జాషువా విగ్రహం నేలమట్టమైపోయింది.

శ్రీధర్‌కి మొహంలో నవ్వు మాయమైపోయింది.

“చరిత్రకి సాక్ష్యాలు కూడా మిగల్చరా వీళ్లు. ఏం సాధిస్తారో..” అంటూనే ఏండి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.

హుస్సేన్‌సాగర్‌పైన జరుగుతున్న విధ్వంసం లైవ్‌లో కనిపిస్తోంది. వందలకొలదీ విధ్యార్థులు దూసుకు వస్తున్నారు. విగ్రహాలు కూలిపడుతున్నాయి. పోలీస్ వ్యాన్ దొర్లి పడింది.

“అమ్మో.. టెన్షన్‌గా వుంది,” అన్నది సరిత. ఎదురుగ్గా కూర్చొన్నవాళ్లవైపు చూసి. ఎదురుగా న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ విగ్రహంలా కూర్చుని వున్నాడు. ఆయన మొహంలో ఏ ఫీలింగ్ లేదు.

“శ్రీనివాస్‌గారూ స్పాట్‌కి వెళ్ళలేదా,” అన్నది సరిత.

“సరితగారూ, ఓ నిముషం సార్‌ని కలుస్తా” అన్నాడు శ్రీనివాస్.

“ఏమయిందండీ అంటూ…” ఇంటర్‌కం ఫోన్ తీసింది.

“ప్రతి విషయం మీ పర్మిషన్ తీసుకోలేనండి” అన్నాడు శ్రీనివాస్.

సరిత మొహం మాడిపోయింది.

ఫోన్  పెట్టేసి, సార్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు అన్నది శ్రీనివాస్ వైపు చూస్తూ.

“మధ్యలో నా పర్మిషన్ ఏమిటండి” అన్నది రెట్టిస్తూ మళ్లీ.

“ప్లీజ్ సరితగారూ, నన్ను వదిలేయండి. ఎల్లాగూ మీ వెర్షనే ఆయన వింటాడు. నాపైన దయదలచి నన్ను వదిలేయండి.” అన్నాడు రెండు చేతులు జోడించి.

సరిత దిక్కులు చూసింది. చుట్టూ చాలా మంది విజిటర్స్ ఉన్నారు. ఏం మాట్లాడినా శ్రీనివాస్ గొంతు పెంచేలా ఉన్నాడు.

మళ్లీ ఫోన్ తీసింది.

“సార్ శ్రీనివాస్ సార్  ఓ నిముషం మాట్లాడాలంటున్నారు.”

“శ్రీధర్‌ని పంపేస్తాను” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“ఏమంటాడు కుదరదు అంటున్నాడా?” గొంతు పెంచుతున్నాడు శ్రీనివాస్.

“ఆయనతో నాకేం పని లేదండి. జస్ట్ రిజైన్ చేసిన పేపర్ ఇస్తాను అంతే ” అన్నాడు పెద్ద గొంతుతో.

“శ్రీనివాస్‌గారూ ప్లీజ్. శ్రీధర్ రాగానే మీరు వెళ్లండి” అన్నది సరిత.

శ్రీనివాస్ మనసు  ఉడికిపోతుంది. వందమంది రిపోర్టర్స్‌కి న్యూ ఇయర్ కోసం టార్గెట్స్‌తో ఎడ్వర్‌టైజ్‌మెంట్స్‌ కోసం ఎంత కష్టపడ్డాను. వాళ్లు ఉద్యోగాలు మాని కంపెనీకి డబ్బు రావాలని కష్టపడ్డారు. ఒక్కో రిపోర్టర్‌కి ఐదేసి లక్షలు టార్గెట్. పాపం అంతా చేశారు. ఏం జరిగిందీ. ఒక్కళ్లకి కూడా సింగిల్ పైసా పర్సంటేజ్ ఇవ్వలేదు. మొత్తం ఎండి ఖాతాలోకి వెళ్లిపోయింది. టార్గెట్స్ పెట్టిన సంగతి, రిపోర్టర్స్ పని చేసిన సంగతి మేనేజ్‌మెంట్ దాకా వెళ్లనేలేదు. మొత్తం తన ద్వారానే వచ్చిందని ఎండి క్రియేట్ చేసుకున్నాడు. స్టాఫంతా తన పైన పడతారు. తను చీట్ చేశారంటారు. దిక్కుమాలిన ఉద్యోగం. పళ్లు కొరుక్కున్నాడు శ్రీనివాస్.

శ్రీధర్ బయటకు వస్తూ శ్రీనివాస్‌కి విష్ చేసాడు. శ్రీనివాస్ నవ్వులేని మొహంతో నిలబడ్డాడు. ఒక్క నిముషం కళ్లు మూసుకొని ఎండి రూంలోకి గబగబ వెళ్లాడు.

“శ్రీనివాస్ కూర్చోండి. లైవ్ ప్రోగ్రాం తర్వాత ఒక అరగంట ఈ టాంక్‌బండ్ విషయాలపై రౌండప్ నాదే. మూడుగంటల బులెటిన్ ముందు నా రౌండప్ ఉండాలి. లైవ్‌లో పోలీస్ అఫీషియల్స్‌ని పిలవండి.” అన్నాడు.

“సార్.. నా రిజిగ్నేషన్” అన్నాడు శ్రీనివాస్ పేపర్ ఆయన ముందుకు తోస్తూ.

“వ్వాట్.. ఎందుకు..? ఏమయింది..?” అన్నాడాయన ఉలిక్కిపడి.

“ఎందుకు లెండి సార్.. నేనీ  ఉద్యోగానికి తగను” అన్నాడు శ్రీనివాస్.

“శ్రీనివాస్ ఇవాల్టి పరిస్థితి ఇలా వుంటే, మనం ఏ  సైడ్ తీసుకోవాలో తెలియని  క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు నేనేం నిర్ణయాలు తీసుకోలేను. తర్వాత మాట్లాడదాం. చూడు హుస్సేన్ సాగర్ దగ్గర ఎంత గందరగోళం..” అన్నాడాయన.

“నేను నా నిర్ణయం తీసుకొన్నాను సర్.. ఇది నా కెరీర్‌కు సంబంధించింది” అన్నాడు శ్రీనివాస్ అయన వైపు చూస్తూ.

ఎండి మాట్లాడలేదు. కాస్సేపు ఊరుకొన్నాడు.

“శ్రీనివాస్ నువ్వు మేనేజ్‌మెంట్ గుడ్‌లుక్స్‌లో వున్నావు. పొలిటికల్ ఎడిటర్‌గా ప్రమోషన్ ఇద్ద్దామనుకొంటున్నాను. అంటే నువ్వే చానల్‌కు మెయిన్ రోల్. ఆర్‌యూ హ్యాపీ నౌ…”

“నో సర్.. నేను వెళ్ళిపోతాను. సర్. నేను మీ దగ్గర ట్రెయినీగా చేరాను. నన్ను మీరు పెంచారు. కానీ నాకు డబ్బుకంటే  కెరీర్ ముఖ్యం సార్. నాకెంతో  జీవితం వుంది. నేను ఎవరినీ మోసం చేయలేను..”

ఎండి మొహం ఎర్రబడింది.

“అంటే ఏమిటి నీ ఉద్ధేశ్యం.”

“ఏవుంది సార్. అన్నింటికీ నేను అడ్డం వుంటాను. ఈ  చానల్‌లో ప్రతి ఎంప్లాయికీ జరిగే ప్రతి అన్యాయం నా చేతులపైనే జరుగుతోంది. రిపోర్టర్స్ చాలా అసహ్యించుకుంటున్నారు. వాళ్ళు కష్టపడతారు. మీకు పేరు వస్తోంది. రేపు మన రెండో చానల్‌కు కూడా మీరే హెడ్. మరి చాకిరి చేసేవాళ్ల గతి ఏమిటి?”

ఎండికి అర్ధం అయింది. పరిస్థితి ఇంకా ఎటూ పోలేదు. బాల్ తన కోర్టులోనే వుంది. శ్రీనివాస్‌కు కావలసింది ఏమిటో అర్ధం అయింది.

“ఎంటర్‌టెయిన్‌మెంట్ చానల్ వచ్చిన తర్వాత హెడ్‌గా నువ్వే వుంటావనుకున్నాను” అన్నాడు తాపీగా వెనక్కి వాలి.

శ్రీనివాస్ మొహంలో కోపం తెరలు కాస్త తొలగిపోయాయి.

“సార్…” అన్నాడు లోగొంతులో.

“శ్రీనివాస్ టీవీ21 వాళ్లు చూడు. ఏం టైటిల్ పెట్టారో. ఈ అల్లరి మూకలా రేపు పాలించేది.. బావుంది కదా” అన్నాడు.

శ్రీనివాస్ గొంతు పెగల్లేదు.

“నాకు లైవ్ వుంది. రాత్రికి మాట్లాడుకొందాం,” అన్నాడాయన లేస్తూ.

శ్రీనివాస్ పేపర్స్ తీసుకొని బయటికి వచ్చాడు. అతని మొహం వెలిగిపోతోంది.

వందమంది ఆశలు తను తీసుకువచ్చాడు. ఇప్పుడు తన ఆశ ఒక్కటే తను తీర్చుకొన్నాడు. ముప్పై ఎనిమిదేళ్లు వస్తున్నాయి. ఇవ్వాల్టికీ కారు లేదు. ఇల్లు లేదు. మొన్ననే బాబు పుట్టాడు. ఖర్చులు పెరుగుతున్నాయి. మంచి జీవితం ఇవ్వాలి వాళ్లకు. తనో రూల్ పెట్టుకుని న్యాయం ధర్మం అంటూ వేళ్ళాడలేదు. మనిషిగా మిగలాలి అనుకోకపోతే చాలు ఈ ప్రపంచంలో మహారాజుగా బతకవచ్చు.

సరిత ఎదురుగ్గా కూర్చున్నాడు. సరిత మొహంలో స్పష్టంగా నవ్వు కనిపిస్తోంది. ఎండి. పిఏ ఆమె. సమస్తం ఆమెకు తెలుసు. ఎండి బ్యాంకు ఎక్కౌంట్లు ఆమె చేతుల్లోనే వుంటాయి. శ్రీనివాస్ పాత్ర ఏమిటో, లోపల అతనేం చేయబోతాడో, ఎలా బయటికి వచ్చాడో ఊహించింది సరిత. ఇలాంటి వాళ్లని ఎండి ఎంతమందిని చూసి వుంటాడు. బంజారాహిల్స్‌లో అంత పెద్ద భవనం ఎలా కట్టేడు. పిల్లలు ఫారిన్‌లో, బావమరుదులు, మరదళ్లు ఆయన ఆఫీస్‌లో ఎంతగా పాతుకుపోయారో ప్రతి నిముషం ఎవరేం మాట్లాడుకొన్నా ఆయనకు ఇన్‌ఫర్‌మేషన్ ఎలా వస్తుందో చక్కగా తెలుసు. శ్రీనివాస్ కోపం ఎంత సేపు.

“టీ తాగుతారా శ్రీనివాస్‌గారూ,” అంది సరిత.

“వుందా,” అన్నాడు శ్రీనివాస్ నీరసంగా.

***

వచ్చే గురువారం …

“నాకు American Way of Life బొత్తిగా నచ్చడం లేదు”

చికాగో  14 – 7 – 95

Dear Narendra,

క్షేమం.

ఫోనుపైన మాట్లాడుతూనే వున్నా వివరాలన్నీ చెప్పడం సాధ్యం కాలేదు. హైదరాబాదుకు ఫోన్ చేసి మీ మామగారితోనూ, దామల చెరువుకు ఫోన్ చేసి సాంబమూర్తితోనూ మాట్లాడాను. ఈ దేశంలో R.S.సుదర్శనంగారితోనూ, దాక్షాయణి దంపతులతోనూ, సిన్‌సినాటీలోని రోజాతోనూ మాట్లాడాను. న్యూయార్కు పరిసరాల్లో వున్న కిశోర్ ఎట్లాగో నంబరు తెలుసుకుని నన్ను కలిశారు. ఎటొచ్చి నైవేలీలోనూ, పలమనేరులోనూ టెలిఫోన్ సంబంధాలు నెట్టుకురానీకి వీల్లేకపోయింది. ఈ రోజు ఉదయం చిత్తూరునుంచి ఫోన్ చేసి మహి, గీత మాట్లాడారు. ఎలా బెంగపడుతు వుందో ఏమో. మీ అమ్మతో మాట్లాడి వుంటే బాగుండేది.

మద్రాసు ఎయిర్‌పోర్టులో మీరు అద్దాలకటు వైపునుండి వీడ్కోలు చెబుతూ వుంటే నా తొందరలో పరిగెత్తవలసి వచ్చింది. అవతల నా లగేజి, టికెట్టు కౌంటర్‌లోని అమ్మాయి దగ్గర వున్నాయి. నేను స్టేట్ బ్యాంకు కౌంటర్ దగ్గరకు వెళ్లి రూ.300/- ట్రావెల్ టాక్స్ కట్టి రసీదు తీసుకొస్తున్నాను. ఆ కౌంటర్ దగ్గరే  పులికంటి కృష్ణారెడ్డి కలిశారు. మేమెక్కిన విమానం ఉదయం 4.30 గంటల  ప్రాంతంలో డిల్లీలో దిగాం. అక్కడ  2 గంటల విరామం. అక్కడి ఏర్‌పోర్టులో చాలా పెద్దదైన బోయింగ్ విమానం ఎక్కించారు. అందులో 400 మంది ప్రయాణీకులుంటారు. ఆహార పానీయాదులకు కొరత లేదు. నేను sweets తినకూడదు కనుక నా ఆహారం పరిమితమైపోయింది. అయినా ఫరవాలేదు. 29 సాయంకాలము  3 గంటలకు డిల్లీ చేరుకున్నాము.

అక్కడ మళ్ళీ రెండు గంటల విరామం. న్యూయార్కు 8 గంటల ప్రయాణం. అయితే న్యూయార్కులో దిగినపుడు తేదీ మారలేదు. చీకటి మారలేదు. అక్కడ అప్పుడు సాయంకాలం 4 గంటలు అయింది.  మా టికెట్టు ఆ విమానంలో న్యూయార్కు వరకే. అందువల్ల 4 గంటల పాటు ఆగవలసి వచ్చింది. బాపు, జగ్గయ్యగార్లతో కలిసి మాకు తానా కార్యకర్తలు అక్కడ మాత్రం ఓ యింట్లో వంటల ఏర్పాటు చేశారు. స్నానం, భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి 9 గంటలకు విమానమెక్కించారు. రాత్రి 11 గంటలకు చికాగో చేరుకున్నాము.

సభా నిర్వాహకులు విమానాశ్రయంలో కలిసి దగ్గర్లోనే వున్న HYAT హోటలుకు తీసుకెళ్ళారు. అది పదంతస్తుల కట్టడం. వందలకొద్ది గదులున్నాయి. సభలకు ఈ దేశంలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు 7 లేక 8 వేలమంది వచ్చారు. బయటినుంచి వచ్చినవాళ్లందరికీ బసలు ఏర్పాటు చేశారు. మన దేశం నుండి దాదాపు వందమంది తానా ఆహ్వానితులు వచ్చినట్టున్నారు. సదాశివరావు, లవణం, ఇస్మాయిల్, చలసాని ప్రసాదరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మొదలైన తెలుగువారు కలిశారు. జులై 1, 2, 3, తానా సభలు.నాలుగు రోజులపాటు హోటల్లో వున్నాము.

రెండురోజుల్లో ఉదయం ఉపాహారలు మాత్రం చేసి హోటల్లో బస చేయవలసి వచ్చింది. డా.రాశీ చంద్రలత, డా.సుబ్బారెడ్డి దంపతులది కడపజిల్లా. సభలు జరిగిన రోజుల్లో మాత్రమే మేము అందరితో కల్సి హోటల్లో భోజనం చేశాము. ఒక్కసారిగా 7, 8 వేలమంది ఒకే చోట కూర్చుని భోజనం చేయడం అపురూపమైన సన్నివేశం. ‘తానా’ సభల నిర్వాహకులు ఎంతో ఉదారంగా సర్వ సదుపాయాలు సమకూర్చారు. వేర్వేరు హాల్సులో సాహిత్య, సాంఘిక,  స్త్రీ ఉద్యమ సమావేశాలు జరిగాయి.

కొంతదూరంలోని పెద్ద గుళ్ళో సంగీత, నాట్య కార్యక్రమాలు జరిగాయి. ఒక సాహితీ సభలో నేను, కృష్ణారెడ్డి, మేడసాని మోహన్ పాల్గొన్నాము. విష్ణు, జాషువా, బాపిరాజుల వర్ధంతి సభలు జరిగాయి. మునుపటి సభల్లో కన్నా ఈ సభల్లో ఏర్పాటైన కార్యక్రమాలు బాగున్నట్టు చెప్పుకున్నారు. మమ్మల్ని యిక్కడికి ఆహ్వానించిన డా.రాణీసంయుక్త, డా. కట్టమంచి ఉమాపతి సంతృప్తి పొందగలిగారు. సభలు పూర్తయిన మరునాటినుంచి మా బస సంయుక్తగారి యింట్లోనే, 4,5 తేదీల్లో లవణంగారు కూడా మాతోబాటుగా యిక్కడే వున్నారు.

5వ తేదీ సయంకాలం గ్రేటర్ చికాగోలోని రామాలయంలోని  బేస్‌మెంటులో నాస్తికవాద ప్రవక్త లవణంగారు సత్యాహింసల గురించి  ప్రసంగించారు. సభలో మేడసాని మోహన్, ((నేలబర్కవము)), S.V.రామారావు (సుప్రసిద్ధ చిత్రకారులు, చికాగో వాస్తవ్యులు) పాల్గొన్నారు. నాలుగైదు సార్లు డౌన్‌టౌన్‌లోని రద్దీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి ఆకాశ హర్మ్యాలను చూపించారు. వివేకానందుడు ఉపన్యసించిన భవనం అక్కడే వుంది. C.S.టవర్ అనే 110 అంతస్థుల భవనాన్ని ఎక్కి, విశాల షికాగో నగరాన్ని చూచాము. ఈ నగరానికంతా నీళ్లు సరఫరా చేసే మిచిగన్ మహా సరస్సు వుంది. మరొకరోజు గ్రహాంతర పరిశోధనల మ్యూజియం, ప్లానిటోరియం చూశాము.

ఆ రెండు రోజుల్లోను మధ్యాహ్నాల్లో ఒకరోజు ఇటలీ హోటల్లో పిజ్జా, ఇంకొకరోజు చైనా హోటల్లో వాళ్ళ తిండి భోంచేసాము. ఈలోగా ఒక రోజు డాక్టరుగారింట్లో  నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి Blood Sugar చేక్ చేయించారు. 121 మాత్రమే వుంది. ఒకసారి సాయంకాలం కట్టమంచి వారి యింటికి వెళ్లి భోజనానికి పిల్చాము. ఒక యింటికి, మరొక యింటికి, యిళ్ళకు, బళ్లకూ, కార్యాలయాలకు మధ్య 20,25 మైళ్ల దూరముండడం యిక్కడ సామాన్యమైన విషయం. హోటల్లో వుండగానే శ్రీధర్‌కు ఫోన్ చేశాను. కలుపుగోలుగా వుండి యిక్కడివారిలో కలిసిపోయారు.

ఆదివారం నాడు రెండు కార్లలో విస్కాన్సిన్ వెళ్ళాము. ఆ నగరం ఒక పెద్ద పర్యాటక కేంద్రం. దాన్ని ఒరుసుకుని పారే నదిలోని ఒక జలాశయంలో రకరకాల సర్కస్ విన్యాసాలు జరుగుతాయి. నదిలో తొమ్మిదిమైళ్ల స్టీమరు లాంచీ ప్రయాణం. ప్రాచీన రెడ్ ఇండియన్ల గుహలు నదీతీరంలోని కొండల్లో కానవస్తాయి. 30 నుంచి ఈనాటివరకు గృహస్థులందరూ ఉద్యోగులు కావడంవల్ల పగటివేళ  దాదాపుగా అందరం ఇంట్లో వుంటున్నాము.

విష్ణు, వీణ అని వీరి ఇద్దరు పిల్లలు. వాళ్లు యింట్లో వుండడమే అబ్బురం.ఈ నగరంలో యిళ్లు దూర దూరంగా వుంటాయి. ఇరుగుపొరుగు అన్న ప్రసక్తే వుండదు. ఎక్కడో Busy Placesలో తప్ప పాదచారులే కనిపించలేదు. కార్లు, ఫోనులు లేకపోతే నగర జీవితం లేదు. ఈ ఇంట్లో వున్నవారు నలుగురు, ఉన్న కార్లు మూడు. ఈ పరిమితి వల్ల బయటకు వెళ్తే పార్కింగ్ ప్లేసులు దొరకడమే పెద్ద సమస్య.

ఇద్దరు ముగ్గురు కల్సి వచ్చిన కారులో వచ్చిన కత్తిరించి 475 డాలర్లకి బిల్లు వేశారు (475 x 32) ప్రతి వస్తువు గిరాకీగానే  వుంటుంది. కిలో చిక్కుడుకాయలు 6 డాలర్లు (32 x 6= రూ.192)సంపాదనలాగే వీళ్లకు ఖర్చు కూడా ఎక్కువే. సిన్‌సినాటి నుండి రాజా ఫోన్ చేసి తనకు పైసలు చాలడం లేదని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మనవాళ్లకు ఈ దేశం పైన యింత వ్యామోహమెందుకో బోధపడడం లేదు.

నాకు American Way of LIfe బొత్తిగా నచ్చడం లేదు. కార్లకు హారన్లుండవు, ఇళ్ల తలుపులు ఎప్పుడూ మూయబడి వుంటాయి. ఇంట్లో మనుషులున్నారో లేదో బోధపడదు. ఈ ప్రశాంతికి, క్రమబద్ధతకు మనం అలవాటు పడడం చాలా కష్టం. సరే అదంతా అలా వుంచితే వారంలో 5 రోజులు ఏకాగ్రతతో పని చేస్తారు గనుక వీళ్లకు weekendలో మాత్రమే విరామం. అందువల్ల మేము శని ఆదివారాల కోసం వేచి చూస్తు మిగతా 5 రోజులు ఏకాంత గృహంలో చదువుకుంటూనో, నిద్రపోతు, ఫోన్‌కాల్స్‌కు జవాబు ఇస్తూ గడపాలి.

కట్టమంచి ఉమాపతిరెడ్డిగారు గొప్ప గడుసరి వారు. మేము 60లలో సంపాదించాము. పెద్ద పెద్ద యిళ్లు కట్టుకున్నాము. మీరు ఏ గదిలోనైనా వుండొచ్చు. తొందరేముంది? మీరు  మీ దేశం వెళ్లి చెయాల్సిన అర్జంటు పనులేమున్నాయి. ఏవైనా రాయదల్చుకునే యిక్కడే రాసుకోండి. అని మోగమాట పెడుతున్నారు. చివరికలా కుదరదని, తిరుగు ప్రయాణానికి ఒక తేదీ నిర్ణయించుకుని కార్యక్రమాలన్నింటిని ఆ మేరకు ఏర్పాటు చేసుకోవడం బాగుంటుందని తెలియచెప్పుకున్న తర్వాత ఒక ప్లాను తయారు చేశారు.  15,16 తేదీలలో ఒహియో రాష్ట్రంలోని can bush, కడప సుబ్బారాయుడుగారు  డాక్టరు (శతావధాని సి.వి.సుబ్బన్నగారి తమ్ముడు) కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.. 20 నుండి 24 దాకా హూస్టన్, డల్లాస్ నగరాలు, 26న మళ్లీ యిక్కడే సభా కార్యక్రమం యింతవరకు ఏర్పాటయింది.

ఈలోగా తలవని తలంపుగా న్యూయార్క్ దగ్గరగా వున్న న్యూజెర్సీనుంచి ఒక ఫోను కాల్ వచ్చింది.  ఆయన పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ. న్యూజెర్సీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు. ఆయన చిరకాలంగా నా కథలు చదువుతున్నారట. ఎంతో ఆప్యాయంగా పలకరించి న్యూజెర్సీకి ఆహ్వానించారు.

మాకు నయాగరా చూడాలని వుందంటే డెట్రాయిట్‌లోని తన మిత్రునికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయించారు. దాని ప్రకారం మేము 27న డెట్రాయిట్ వెళ్లాలి. 28న అక్కడే వుండాలి.29 శనివారం నయాగరా చూపిస్తారు. 30 ఆదివారం న్యూయార్క్ చేరుకోవాలి.  అక్కడ సత్యనారాయణగారు రిసీవ్ చేసుకుంటారు. సుదర్శనం, దాక్షాయిణి, కిశోర్ గార్లను కలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారాంతంలో తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకుని న్యూయార్కునుంచి విమానంలో సీట్లు రిజర్వు చేయించుకోవాలి.

ఈ వారంలో సుబ్బారెడ్డిగారు నన్ను వేర్వేరు హాస్పిటల్స్ తీసుకెళ్లి రక్త పరీక్ష, నేత్ర పరీక్ష చెయించారు. రక్తపరీక్ష రిపోర్తు వచ్చింది. ఫలితాలు తృప్తికరంగా వున్నాయని చెప్పారు. నేత్ర పరీక్ష చేసిన డా. చిత్ర.వి.నడింపల్లిగారు ఇల్లిందల సరస్వతీదేవిగారి కూతురట. ఈమె అత్తగారిల్లు తిరుపతి. డాక్టరు వి.రామకృష్ణ అని ప్రసిద్ధ నేత్ర వైద్యులుండేవారు. ఈమె ఆయన కోడలు.ఎంతో శ్రద్ధగా పరీక్షలు చేసి Prescription యిచ్చింది. అద్దాలు తిరుపతిలోనే కొనుక్కోమంది. ఇవీ విశేషాలు. కొనుక్కో దలచిన వస్తువులు కోసం Departmental Stores అన్నీ తిరుగుతున్నాము. వంద డాలర్లు పెడితే గాని మంచి  కెమెరా వచ్చేటట్టు తోచదు. వంద డాలర్లు  అంటే 3200 రూ గదా. అట్లాగే మిగిలిన వస్తువులన్నీ, బాగా తెలిసినవాళ్లని తీసుకెళ్లి ఏమైనా కొనుక్కోవాలి. ఈ మధ్య నైవేలికి, పలమనేరుకు కూడా జాబు రాశాను. అయితే యింత వివరంగా రాయలేదు.  నువ్వు జిరాక్సు తీసి పంపిస్తే వాళ్లు సంతోషిస్తారు. లతకు ఆశీస్సులు.  రాసాని దంపతుల్ని అడిగినట్టు చెప్పు. అల్లాగే జాన్, భాస్కర రెడ్డి యింకా మనవాళ్లందరినీ అడినట్లు చెప్పు.

శుభాకాంక్షలతో

రాజారాం గారి ఏకలవ్య శిష్యుడ్ని: డా. కేశవరెడ్డి

naanna2

( ఏప్రిల్ 1, మధురాంతకం రాజారాం గారి వర్థంతి సందర్భంగా )

“మునెమ్మ” నవలను చతుర మాస పత్రిక (అక్టోబర్ 2007)లో ప్రచురించినప్పుడు స్వపరిచయం రాస్తూ “మధురాంతకం రాజారాంగారి వద్ద ఏకలవ్య శిష్యరికం చేసి సాహిత్య ప్రస్థానం చేశాను”, అని పేర్కొన్నాను. నేను తెలుగు సాహిత్యంలో ఎంతో కొంత నిలదొక్కుకోగలిగినానంటే దానికి రాజారాంగారే కారణం. నేను మొట్టమొదట చూసిన, మాట్లాడిన రచయిత రాజారాంగారే. మొట్టమొదట చదివిన పాఠ్యేతర పుస్తకం రాజారాంగారి కథల పుస్తకాలే. వారిది మా పొరుగు గ్రామము కావడమే అందుకు కారణం.

రాజారాంగారిది, మా అమ్మగారు పుట్టిన ఊరు ఒకటే. అది చానా చిన్న పల్లెటూరు. నా చిన్నతనంలో మా అమ్మగారితో పాటు చాలా సార్లు ఆ ఊరికి వెళ్ళుతుండేవాడిని. మావాళ్లు చెప్పేవాళ్లు, “అద్దో ఆయనే రాజారాం అయ్యవారు. ఆయన కథలు రాస్తాడు,” అని. ఆయన ఆడ్డపంచ కట్టుకొని భుజంపైన కండువా వేసుకొని వీధి వెంబడి నడిచి వెళుతూ ఉంటే నేను పిట్టగోడమీద కూర్చొని చూస్తుండేవాడిని. అలా కొంతకాలం అయ్యాక, నాకొక ఐడియా వచ్చింది. ఇలా ఒక మారుమూల పల్లెటూల్లో పుట్టి పెరిగిన ఒక మనిషి కథలు రాయగా అదే నేపథ్యం కలిగిన నేను రాయలేనా? అని ఆలోచించాను.

ఇంతకీ ఆయన రచనలు ఎలా ఉంటాయి? వెంటనే వారి కథా సంపుటాలు రెండింటిని సంపాదించాను. తాను వెలిగించిన దీపాలు, కమ్మతెమ్మర అనే రెండు సంపుటాలను సంపాదించి చదివాను. అవే నేను మొట్టమొడట చదివిన పాఠ్యేతర పుస్తకాలు. ఒక్కొక్క కథను ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. చదివీ చదివీ వాటిలో ప్రతి వాఖ్యమూ కంఠతా వచ్చేసింది. ఆ కథల ద్వారా ఎంత ప్రభావితుడనయ్యానంటే నా తొలి రచనలలో రాజారాంగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అవే పదబంధాలు, అవే వాక్యనిర్మాణం. అలా కొన్ని కథలు రాసాను. ఆ తర్వాత నవలలు వ్రాయడం ప్రారంభించాను.

చదువుల నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, పాండిచ్చేరిలో గాని, నిజామాబాద్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఊరికి వెళ్లినా రాజారాంగారిని కలవకుండా తిరిగి వచ్చేవాడిని కాదు. కల్సినప్పుడల్లా ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం, కాని సాహిత్య మర్మాలను గురించి నేను ఎప్పుడూ అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఆయన నాకొక గొప్ప ప్రేరణ ఇచ్చారు. సాధకుడిని నేనే.

ఆనాడు ఏకలవ్యుడు చేసింది ఇదే. ఏకలవ్యుడు గొప్ప విలుకాడు. కాని ద్రోణాచార్యుడు అడివికి వెళ్ళి అతనికి విలువిద్య నేర్పలేదు. అతనొక ప్రేరణ ఇచ్చాడు. అంతే సాధకుడు ఏకలవ్యుడే. బమ్మెర పోతన “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట,” అన్నాడు. అతడు తన భక్తి పారవశ్యంలో అలా అని ఉండవచ్చు కాని.. రామభద్రుడు దిగివచ్చి ఒంటిమెట్ట గ్రామానికి వెళ్ళి పోతనకు వ్యాకరణము, ఛందస్సు నేర్పలేదు. అతడొక ప్రేరణ ఇచ్చాడు. సాధకుడు పోతనామాత్యుడే. సాహిత్యం అత్యంత బౌద్ధికమైన ప్రక్రియ. ఇదొక ముక్తి మార్గము. దీనిని ఎవరూ ఎవరికీ నేర్పించలేదు. ఎవరికి వారు సాధన చేసి నేర్చుకోవలసిందే. అయితే ప్రతి రచయితకు ఏదో ఒక దశలో ఒక వ్యక్తి ప్రేరణగా నిలుస్తాడు. అలా నాకు ప్రేరణ ఇచ్చిన మధురాంతకం రాజారాంగారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

మరో కథన కెరటం ‘ ప్రాతినిధ్య’ !

invitation

స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విద్య కోసం జీవితకాలం కృషి చేసిన మహాత్మా  సావిత్రీ బాయ్ ఫూలే ను ఆదర్శం గా తీసుకొని బాలికావిద్య ను ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఏర్పాటైన సంస్థ ‘సామాన్యకిరణ్ ఫౌండేషన్’.  మనిషి సహజాత లక్షణమైన ఆధిపత్య ధోరణిని తిరస్కరిస్తూ , ఏ రకమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, పీడననైనా ప్రశ్నించగలిగే సమ సమాజ నిర్మాణ కాంక్ష లో భాగంగా అస్తిత్వం పేరిట మొలకెత్తిన ప్రశ్నలకు వేదిక ” ప్రాతినిధ్య”. అందుకు తొలి అడుగు ఈ ” ప్రాతినిధ్య” కథాసంకలనం.

“శైలీ, శిల్పసౌందర్యాల కోసం కథలు రాస్తున్న కాలం కాదు ఇది. కులం పేరిటో, స్త్రీ అనే పేరిటో, మతం, ప్రాంతం అనే పేరిటో దాడులకు, దోపిడీలకు, అణచివేతలకు గురవుతూ, బిట్వీన్ లైన్స్ మలిగిపోతున్న అనేకానేక అస్తిత్వాల  గొంతులు ఇవాళ సాహిత్య రూపాన్ని పొందుతున్నాయి. బలమైన ఈ గొంతుకలకు స్పేస్ ని కల్పించటం, ప్రధాన స్రవంతి సమాజం లోకి ప్రమోట్ చేయడమూ అనే అంశాలే ‘ ప్రాతినిధ్య’ కథల ఎంపిక లో ప్రాతిపదికగా నిలుస్తాయి. ఆయా కథలు వాచ్యంగా ఫలానా అస్తిత్వాన్నే చెప్పాల్సిన పని లేకున్నా, ప్రశ్నలు, వెదుకులాట, తపన, సహృదయత పట్ల ప్రేమ లేని కథలు మాత్రం ‘ ప్రాతినిధ్య ‘ లో చోటు చేసుకోవు.” అంటున్నారు సామాన్య కిరణ్ ఫౌండేషన్ వారు.

ప్రతి ఏడాది అనేకానేక కథాసంకలనాలు విడుదల అవుతున్నాయి.ప్రతి సంకలనం ఒక దిశా నిర్దేశాన్ని సూచిస్తోంది. సదుద్దేశ్యం తో, సంకల్పం తో ప్రారంభమైన ఈ ‘ ప్రాతినిధ్య’ కథా సంకలనానికి  సంపాదకులు గా కథా రచయిత్రులు సామాన్య, కుప్పిలి పద్మ  వ్యవహరించారు. ఈవస్ సంకలనం  లోని  కథలు, వాటి ఇతివృత్తాలు, శిల్పనైపుణ్యాల గురించి ప్రముఖ కవి, విమర్శకుడు అఫ్సర్ ముందు మాట రాశారు. ఈ సంకలనం లో అఫ్సర్, గోపరాజు నారాయణ రావు, సువర్ణకుమార్, వినోదిని, పసునూరు రవీందర్, మెహర్, కుప్పిలి పద్మ, పల్ల రోహిణీ కుమార్, పి, సత్యవతి, వేంపల్లె షరీఫ్, కోట్ల వనజాత, పెద్దింటి అశోక్ కుమార్, సామాన్య ల కథలున్నాయి.

2012 వ సంవత్సరం లో ప్రచురితమైన కథల నుంచి ఎంపిక చేసి  ప్రచురిస్తున్న ” ప్రాతినిధ్య” కథాసంకలనం ఆవిష్కరణ సభ మార్చి 28 , గురువారం  హైదారాబాద్ లోని సుందరయ్య విజ్నాన కేంద్రం మినీ హాలు లో  జరుగనున్నది. సంకలనాన్ని ప్రముఖ రచయిత జి. కళ్యాణ రావు ఆవిష్కరిస్తుండగా,  పాణి, ఖాదర్ మొహియుద్దీన్, జీలుకర శ్రీనివాస్, జి.ఎస్.కె. మీనాక్షీ  ప్రసంగించనున్నారు.

వేళ్ళచివరి ఉదయం

vamsidhar_post

శీతాకాలాన

కుప్పగా పోసుకున్న మద్యాహ్నపు ఎండలో

చలి కాచుకుంటారు వాళ్ళు.

ఉన్నిదుస్తులకు “లెక్క”తేలక,

రెండు రొట్టెల్ని వేడిచారులో

ముంచుకుని నోటికందించుకుంటారు

పగుళ్ళు పూసిన నేలగోడల మధ్యన…

 

ఇక

సూర్యుడు సవారీ ముగించుకుంటుండగా

సీతాకోకరెక్కల్ని పట్టే లాంటి మృదుత్వంతో

ఆమె అతడి చేయిని తడుముతుంది

ఏదైనా పాడమని…

 

దానికతడు

శూన్యం నింపుకున్న కళ్ళను

కాసేపు మూసి చిర్నవ్వుతూ

“పావురాలొచ్చే వేళైంది..కిటికీ తెరువ్”

అని బీథోవెన్ మూన్ లైట్ సొనాటానో,

మరి మొజార్ట్ స్ప్రింగ్ నో వేలికొసలలోంచి

చెక్కపెట్టెలోని పియానో మెట్లమీదికి జారవేస్తాడు…

 

ఒక్కోటే

కిటికీ దగ్గరికి చేరతాయి పావురాళ్ళు

కురుస్తున్న మంచుకి

ముక్కుల్ని రెక్కల్లో పొదుముకుని వొణుకుతూ…

 

మెల్లగా

నల్లనిమబ్బులు వెంట్రుకలు రాలుస్తాయి

చీకట్లకి తోడుగా నురగలమంచు పైకప్పుని కప్పేసి

చిమ్నీలోని ఆఖరివెలుగును కమ్మేస్తుంది…

 

మంచంకిందికో

బల్ల సొరుగులోకో

దారివెతుక్కుంటాయి పావురాలు…

 

అతడు

కదులుతాడు వంటగదివేపు,

అసహనాన్ని చేతికర్రగా మార్చుకుని

అడుగుల్ని సరిచూసుకుంటూ…

 

గోడవారగా నిలుచున్న కుర్చీని

చిమ్నీలో తోసి

బాసింపట్టేసుకుని కూర్చుంటుంది ఆమె…

 

కాల్చిన వేరుశనగల్ని

పావురాలకందించి

రాత్రికి రాగాలద్దడంలో మునిగిపోతాడు అతడు,

 

మళ్ళీ

ముడతల దేహపు అలసటతో

ఆమె పడుకుని ఉంటుంది అప్పటికే,

అతడికి ఓ ఏకాంతాన్ని ప్రసాదించి…

 

ఉదయపు

తొలికిరణం మంచుని చీల్చేవరకు

ఆ గదిలో ప్రవహించిన

ఎండిపోని సంగీతపు చారికలకు

ఆకలేసిన పావురాల

కిచ కిచలు గొంతుకలుపుతాయి …

 

గడ్డకట్టిన అతడి వేళ్ళచివర

పూసిన ఇంద్రధనస్సుల్ని చూసి

తూర్పువైపుగా

కొన్నిగాలులు ఊపిరిపీల్చుకుంటాయి

వెలుగుల్ని వాళ్ళ శరీరాలమీదుగా దూకిస్తూ…

 

Front Image: Portrait – Illustration – Drawing – Two figures at night, Jean-François Millet. Painting.

చలిమంట

Dog_team_Dawson_Yukon_1899

 

మూలం: జాక్ లండన్

murthy gaaru

అప్పుడే తెల్లవారుతోంది… ఆకాశం క్రమంగా బూడిదరంగులోకి మారుతోంది. విపరీతంగా చలి వేస్తోంది. ప్రధానమైన యూకోన్ (Yukon) నది జాడవదిలి, అతను పక్కనే బాగా ఎత్తుగా ఉన్న మట్టిదిబ్బ ఎక్కేడు; ఆ మట్టిదిబ్బ మీదనుండి తూర్పుగా, దట్టమైన స్ప్రూస్ చెట్ల మధ్యనుండి ఎక్కువమంది వెళ్ళినట్టు కనపడని సన్ననిజాడమాత్రం ఒకటి కనిపిస్తున్నాది. ఆ దిబ్బ చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉండడంతో, దిబ్బమీదకి చేరగానే ఊపిరి నిభాయించుకుందికి వాచీ చూసుకునే మిషతో కాసేపు ఆగేడు.

సమయం తొమ్మిది గంటలు అయింది. ఆకాశంలో ఒక్క మబ్బుతునకా లేకపోయినా, సూర్యుడుగాని, సూర్యుడువచ్చే సూచనలుగాని ఏ కోశానా కనిపించడం లేదు. ఈ రోజు ఆకాశం చాలా నిర్మలంగాఉన్న రోజు…. అయినా, సూర్యుడు లేకపోవడంతో, పరిసరాలు చెప్పలేని విషాదం కమ్ముకున్నట్టు, నిరుత్సాహంగా చీకటిగా కనిపిస్తున్నాయి. ఆ విషయం అతన్ని ఏమాత్రం కలవరపెట్టలేదు. సూర్యుడు లేకపోవడానికి అతను అలవాటు పడిపోయాడు. అతనసలు సూర్యుడిని చూసి ఎన్నో రోజులయింది. అతనికి తెలుసు. దక్షిణదిశనుండి అందమైన ఆ బింబం దిక్కుల చివరనుండి మొదటిసారిగా తొంగిచూసి వెంటనే గుంకిపోడానికి మరికొన్ని రోజులు పడుతుందని.

ఆ మనిషి తను వచ్చినత్రోవని ఒకసారి సింహావలోకనం చేసుకున్నాడు. అక్కడ యూకోన్ నది ఒకమైలు వెడల్పుగా ఉండి, మూడడుగుల మందమున్న ఘనీభవించిన మంచులో కప్పబడి ఉంది. ఆ మంచుగడ్డమీద మరో అంత మందంలో కొత్తగా కురిసిన మంచు ఉంది. గడ్డకట్టుకుపోయిన నీటితావులమీద అలలు అలలుగా పరుచుకుని తెల్లని తెలుపు. ఉత్తరం నుండి దక్షిణం వరకూ కనుచూపు మేర ఎక్కడచూసినా ఖాళీలేని తెలుపు…

ఒక్క దక్షిణ దిశగా ద్వీపంలాఉన్న దట్టమైన స్ప్రూస్ చెట్లచుట్టూ తలవెంట్రుకలా వంపులుతిరిగి, ఉత్తరానఉన్న మరో స్ప్రూస్ చెట్ల ద్వీపంలో కనుమరుగైపోయిన త్రోవ మినహాయిస్తే. ఈ తలవెంట్రుక లాగా కనిపిస్తున్న త్రోవే అసలు మార్గం… ఉన్న ఒకే ఒక్క త్రోవ… దక్షిణానికి 500 మైళ్ళు వెనక్కి Chilcoot కనుమ, Dyea, Salt Water కి వెళ్తుంది … ఉత్తరానికి Dawson 70 మైళ్ళూ, Nulabo కి మరో వెయ్యి మైళ్ళూ, అక్కడనుండి St. Michael on Bering Sea మరో 1500 మైళ్ళూ ఉంటుంది.

అయితే ఇవేవీ… తలవెంట్రుకలా కనీ కనిపించని సుదీర్ఘంగాఉన్న గహనమైన మార్గంగాని, ఆకాశంలో సూర్యుడు లేకపోవడంగాని, విపరీతంగా వేస్తున్న చలిగాని, భయంకరమైన పరిచయంలేని ఆ పరిసరాలుగాని అతనిమీద ఏమాత్రం ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. దానికి కారణం, ఇవన్నిటికీ బాగా అలవాటు పడిపోయాడనికాదు; నిజానికి అతనీ ప్రాంతానికే కొత్త; మొదటిసారి వస్తున్నాడు. ఇదే అతని మొదటి శీతకాలం ఇక్కడ. అతనితో ఉన్న చిక్కు ఏమిటంటే అతనికి బొత్తిగా ఆలోచన లేదు. లౌకికమైన విషయాలయితే తొందరగా గ్రహించి, స్పందించగలడు. అయితే ఆ స్పందనకూడా విషయాలకే పరిమితంగాని, వాటి పర్యవసానాలకు కాదు.

సున్నాకి దిగువన యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే, ఎనభై డిగ్రీల దరిదాపు కొరికే మంచు అన్నమాట. అంత చలీ, అందులో వణకడం గట్రా సరదాగా అనిపించి అతనికి బాగా నచ్చేయి. అంతవరకే! తను చలిప్రదేశంలో బ్రతకలేని బలహీనుడినన్నఊహ గాని, అసలు మనిషే… వేడి అయినా, చలి అయినా కొన్ని అతిచిన్న ఉష్ణోగ్రతల పరిమితులమధ్య బ్రతకగలిగిన ప్రాణి అన్న ఆలోచనగాని; ఆపైన విశ్వంలో మనిషి స్థానం గురించి, అతని శాశ్వతత్వమూ మొదలైన ఊహాత్మకమైన విషయాల జోలికిగాని అతని ఆలోచన సాగలేదు.

యాభై డిగ్రీలు మైనస్ అంటే అర్ధం మంచుకొరికితే అది విపరీతంగా బాధిస్తుంది; దానినుండి ఎలాగైనా కాపాడుకోవాలి … చేతికి గ్లోవ్జ్ తొడుక్కోడం, చెవులకి తొడుగులూ, కాళ్ళకి దట్టమైన మేజోళ్ళూ, మొకాసిన్లూ… ఖచ్చితంగా ఉండితీరాలి. కానీ, అతనికి యాభైడిగ్రీల మైనస్ అంటే యాభైడిగ్రీలు మైనస్ … ఒక అంకె… అంతే. తను అనుకుంటున్నట్టు కేవలం ఒక అంకెకాకుండా అంతకుమించి దానికి ఏదైనా అర్ధం ఉండడానికి అవకాశం ఉందన్న ఆలోచనే అతని బుద్ధికి తట్టలేదు.

అతను ముందుకుపోడానికి ఇటు తిరిగి, ఎంత చలిగా ఉందో పరీక్షించడానికి ఉమ్మేడు. అది చేసిన పదునైన చిటపట శబ్దం అతన్ని ఆశ్చర్యపరిచింది. అతను మళ్ళీ మళ్ళీ గాలిలోకి ఉమ్మేడు క్రిందనున్న మంచుమీద పడకుండా. అతనికి తెలుసు యాబై డిగ్రీల మైనస్ దగ్గర మంచుమీద ఉమ్మితే అది శబ్దం చేస్తుందని. కానీ, ఇది గాలిలోనే శబ్దం చేస్తోంది. అంటే, ఉష్ణోగ్రత మైనస్ యాభై డిగ్రీలకంటే ఇంకా తక్కువే ఉందన్న మాట — కానీ ఎంత తక్కువో తెలీదు. అయినా, ఇపుడు తనకి ఉష్ణోగ్రతతో పనిలేదు.

తనిప్పుడు హెండర్సన్ క్రీక్ చీలికకి ఎడమవైపునున్నతన పాత హక్కుభూమి వైపు వెళుతున్నాడు. ఇప్పటికే పిల్లలు అక్కడ చేరి ఉంటారు. వాళ్ళు ‘ఇండియన్ క్రీక్ కంట్రీ’ దగ్గర చీలిన రోడ్డునుండి అడ్డంగా వెళ్తే, తను యూకోన్ నదిలోని లంకలనుండి వేసవిలో దుంగలు తేవడానికిగల సాధ్యాసాధ్యాలు పరీక్షించడానికి చుట్టూతిరిగి వెళ్తున్నాడు. తను శిబిరం చేరేసరికి సాయంత్రం 6 గంటలు అవుతుంది, అప్పటికే బాగా చీకటిపడిపోతుంది.

అయితేనేం, కుర్రాళ్ళు అక్కడే ఉంటారు, చలిమంట మండుతూ ఉంటుంది, తన కోసం వేడివేడిగా రాత్రిభోజనం సిద్ధంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే, అని అనుకుని, తన జాకెట్ లోంచి ఉబ్బెత్తుగా కనిపిస్తున్న పొట్లాంమీద చెయ్యివేసి తణిమేడు. ఆ పొట్లాం కూడా, రుమాల్లో చుట్టి, ఒంటికి ఆనుకుని తన చొక్కాలోపల ఉంది.

బిస్కట్లు చలికి గడ్డకట్టుకుపోకుండా ఉంచాలంటే అదొక్కటే మార్గం. ఆ బిస్కట్ల గురించి ఆలోచన రాగానే, తనలో తనే హాయిగా నవ్వుకున్నాడు… ఎందుకంటే ఒక్కొక్క బిస్కత్తూ చీల్చి అందులో వేచిన పంది మాంసం బాగా దట్టించి, పంది కొవ్వులో ఊరవేసినవి అవి.

అతను బాగా ఏపుగా ఎదిగిన స్ప్రూస్ చెట్లలోకి చొరబడ్డాడు. తోవ చాలాసన్నగా కనీకనపడకుండా ఉంది. ఇంతకుముందు వెళ్ళిన కుక్కబండీ (sledge) జాడమీద అప్పుడే ఒక అడుగు మందం మంచు కురిసింది. అతను బండీ ఉపయోగించకుండా వంటిమీద బరువులేకుండా తేలికగా నడుస్తున్నందుకు ఆనందించేడు. నిజానికి అతను మధ్యాహ్నభోజనానికి మూటగట్టుకున్న బిస్కత్తులుతప్ప వంటిమీద ఇంకేవీ లేవు. అతనికి ఈ చలిచూస్తే చాలా ఆశ్చర్యం వేసింది.

వాతావరణం బాగా చల్లగా ఉంది. తిమ్మిరెక్కిన తన ముక్కునీ, బుగ్గల్నీ చేతికున్న గ్లోవ్జ్ తో ఒకసారి గట్టిగా రాసేడు. అతను చాలాదట్టంగా గడ్డంపెంచే వ్యక్తి; అయినా ఆ గడ్దం ముందుకి పొడుచుకువచ్చిన దవడ ఎముకలని, మంచుకురుస్తున్నగాల్లోకి చాలా కుతూహలంగా తొంగిచూస్తున్న ముక్కునీ వెచ్చగా ఉంచలేకపోతోంది.

ఆ మనిషివెనక అడుగులోఅడుగు వేసుకుంటూ ఒక కుక్క పరిగెడుతోంది. అది ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినదే; బలిష్టంగా, గోధుమరంగులోఉండి దాని చూపులలో, ప్రవర్తనలో తోడేలుకి ఏమాత్రం తేడా కనిపించక, తోడేళ్ళని వేటాడడానికి పనికివచ్చే వేటకుక్క అది.

విపరీతంగా ఉన్న ఆ చలిలో నడవడం ఆ జంతువుని చాలా అసహనానికి గురిచేస్తోంది. దానికి తెలుసు అది ప్రయాణానికి అనువైన సమయం కాదని. మనిషికి వాడి వివేకం చెప్పిన దానికంటే, దానికి తన సహజప్రవృత్తి అసలు పరిస్థితి స్పష్టంగా తెలియజేస్తోంది. నిజానికి అప్పుడున్న ఉష్ణోగ్రత సున్నాకి దిగువన యాభై డిగ్రీలూ కాదు, అరవై డిగ్రీలూ కాదు, డెబ్భై డిగ్రీలు కాదు; అది డెబ్భై అయిదు డిగ్రీలు మైనస్. నీటి ఘనీభవన ఉష్ణోగ్రత సున్నాకి ఎగువన ముఫై రెండు డిగ్రీలు కనుక, దాని అర్థం నూట ఏడు డిగ్రీల చలి అన్నమాట.

ఆ కుక్కకి ఉష్ణమాపకాలగురించి ఏమీ తెలియదు. బహుశా దానిమెదడులో, అతిశీతలత్వాన్ని మనిషిమెదడు గుర్తించగలిగినట్టు గుర్తించే ఇంద్రియజ్ఞానం ఉండకపోవచ్చు. కాని, ఆ జంతువుకి దాని జంతుప్రకృతి దానికి ఉంది. లీలగా ఏదో చెప్పలేని భయం ఊహించింది గాని దాన్ని అణుచుకుని మనిషి వెంట నక్కి నక్కి నడుస్తోంది; ఆ మనిషి ఎక్కడో ఒకచోట ఏదైనా శిబిరంలోదూరి చలిమంటవేసుకోకపోతాడా అని ఊహిస్తోందేమో, దాని నడక అలవాటులేని అతని అడుగుల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది. కుక్కకి చలిమంటగురించి తెలుసు. దానికి ఇప్పుడు చలిమంటైనా కావాలి, లేదా, ఈ చలిగాలినుండి రక్షించుకుందికి, మంచులో గొయ్యితీసి అందులో ముడుచుకుని పడుక్కోనైనా పడుక్కోవాలి.

దాని ఊపిరిలోని తేమ దాని ఒంటిబొచ్చుమీద సన్నగా మంచుపొడిలా రాలి ఉంది; ముఖ్యంగా దాని చెంప దవడలూ, మూతీ, కనుబొమ్మలూ గడ్డకట్టిన నిశ్వాసపు తేమతో తెల్లగా కనిపిస్తున్నాయి. ఆ మనిషి ఎర్రని గడ్డమూ, మీసమూ కూడా అలాగే అతని ఊపిరిలోని తేమకి, అంతకంటే ఎక్కువగా ముద్దకట్టేయి గానీ, ఆ ముద్దకట్టినది మంచురూపం దాల్చి, అతను ఊపిరివిడుస్తున్నప్పుడల్లా మరింత పేరుకుంటున్నాది.

దానికితోడు, ఆ మనిషి పుగాకు నములుతున్నాడు; అతని మూతిదగ్గర పేరుకున్నమంచు అతని పెదాల్ని ఎంత గట్టిగా పట్టిఉంచిందంటే, ఆ పుగాకురసం ఉమ్మిన తర్వాత అతని చుబుకాన్ని అతను తుడుచుకోలేకపోతున్నాడు. దాని పర్యవసానం, అతని చుబుకం మీద తెల్లనిగడ్డం క్రమక్రమంగా దట్టమైన జేగురు రంగులోకి మారుతోంది. అతనుగాని ఇప్పుడు క్రింద బోర్లపడితే, అది గాజులాగ చిన్నచిన్నముక్కలుగా పగిలిపోతుంది. అతనిప్పుడు తనగడ్డం రంగుమారడం గురించి పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో పుగాకు నమిలే వాళ్లందరూ చెల్లించే పరిహారం అది. ఇంతకు ముందు రెండుసార్లు చలివాతావరణంలో బయటకు వెళ్ళేడు గాని, అప్పుడు ఇంత చలి లేదు. అరవయ్యవ మైలురాయి దగ్గర అక్కడి స్పిరిటు థర్మా మీటరు మైనస్ దిగువ యాభై అయిదు డిగ్రీలు నమోదు చెయ్యడం తను చూసేడు.

అలా ఓపిక బిగబట్టుకుని సమతలంగా ఉన్న మైళ్ళపొడవైన అడవిదాటి, విశాలమైన పొగాకు తోటలు దాటి, గడ్డకట్టిన ఒక చిన్నసెలయేటిగట్టు దిగేడు. అదే హెండర్సన్ క్రీక్. అతనికి తెలుసు తను ఈ క్రీక్ చీలికకి పదిమైళ్ళదూరంలో ఉన్నానని. అతను చేతివాచీ చూసుకున్నాడు. పదిగంటలు అయింది. అంటే, తను గంటకి నాలుగుమైళ్ళచొప్పున నడుస్తున్నాడన్నమాట. ఆ లెక్కన తను ఈ క్రీక్ చీలిక చేరడానికి రెండున్నరగంటలు పడుతుంది, అంటే పన్నెండున్నరకి చేరుకుంటాడు. అక్కడకి తను చేరుకున్న ఆనందంతో, తన మధ్యాహ్న భోజనం అక్కడ చేద్దామని నిర్ణయించుకున్నాడు.

ఎప్పుడైతే అతను గడ్దకట్టిన సెలయేటి ఉపరితలం మీద నడక ప్రారంభించాడో, ఆ కుక్క నిరాశతో తోకవేలాడేసుకుని, దాని మడమలమీద వాలిపోయింది. ముందువెళ్ళిన కుక్కలబండి చక్రాల చాళ్ళు స్పష్టంగానే కనిపిస్తున్నాయి, కాని పరిగెత్తిన కుక్కల అడుగులమీద అప్పుడే పన్నెండంగుళాల మందం మంచు కురిసింది. నెలరోజుల వ్యవధిలో ఈ నిశ్చలమైన సెలయేటిమీద అటునుంచి ఇటుగాని, ఇటునుంచి అటుగాని ఎవ్వరూ వెళ్ళిన జాడ కనిపించదు.

ఈ మనిషిమాత్రం స్థిరంగా నడక సాగిస్తున్నాడు. అతనికి పెద్దగా ఆలోచించే అలవాటూ లేదు, అతనికి ఇప్పుడు ప్రత్యేకించి ఆలోచించడానికికూడా ఏమీ లేదు. అతను ఈ సెలయేటి చీలిక చేరిన తర్వాత మధ్యాహ్నభోజనం చేస్తాడన్నదీ, సాయంత్రం ఆరు గంటలకల్లా పిల్లలతో శిబిరందగ్గర ఉంటాడన్నదీ తప్ప. నిజానికి మాటాడ్డానికి తోడు ఎవరూలేరు; ఒకవేళ ఉన్నా, మూతిమీద గడ్డకట్టుకుపోయిన మంచువల్ల మాటాడడం సాధ్యపడదు కూడా. అందుకని, ఆ జేగురురంగులోకిమారుతున్న గడ్డం పొడవుపెంచేలా, విరామంలేకుండా అలా పొగాకు నములుకుంటూ పోతున్నాడు. ఉండుండి ఒక్కసారి అతని మనసుకి ఇవాళ చాలా చల్లగా ఉందనీ, ఇంత చలి ఇదివరకెన్నడూ తను యెరుగననీ తడుతోంది.

నడుస్తూనడుస్తూ చేతికున్న ఉన్ని గ్లోవ్జ్ తో తన ముక్కుకొననీ, పొడుచుకువచ్చిన బుగ్గఎముకలనీ గట్టిగా రుద్దుతున్నాడు. ఆ పని అసంకల్పితంగానే అప్పుడప్పుడు చేతులు మార్చిమార్చి చేస్తున్నాడు. కానీ, అతను ఎంత రుద్దనీ, అతను రుద్దడ ఆపగానే బుగ్గఎముకలు తిమ్మిరెక్కేవి, మరుక్షణంలో ముక్కుకొస చైతన్యం కోల్పోయేది. అతని బుగ్గలు ఇక మంచుకి గడ్డకట్టుకుపోవడం ఖాయం; ఆ విషయం అతనికీ తెలుసు. అందుకనే ముక్కుకి Buds (హిమపాతమప్పుడు వేసుకునే ముక్కుపట్టీలు) వేసుకోలేదే అని ఒక్కసారి విచారం వేసింది; ఆ పట్టీలు బుగ్గ ఎముకలమీదనుండి పోతూ వాటికికూడా రక్షణ కల్పించి ఉండేవి. అయినా ఇప్పుడనుకుని ఏం ప్రయోజనం? బుగ్గలు గడ్డకడితే ఏమౌతుందట? కొంచెం బాధగా ఉంటుంది. అంతే గదా; దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ వచ్చిపడదు.

ఎపుడయితే ఆలోచనలు లేక అతని మనసు ఖాళీగా ఉందో, అతని చూపులు పదునెక్కి, సెలయేటి ఉపరితలం మీద దుంగలు మార్గాన్ని మూసేసినచోట్లూ, అది వంపులుతిరిగిన చోట్లూ, అది లోయల్లోకిదిగినచోట్లూ నిశితంగా గమనించడంతోపాటు, తను అడుగువేసే ప్రతిచోటూ అతిజాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఒకసారి ఒకవంపుని చుట్టివస్తూ, భయపడ్డ గుర్రంలా ఒకచోట అకస్మాత్తుగా ఆగి, నడుస్తున్నమార్గం వదిలి, తన అడుగులజాడలోనే వెనక్కి వచ్చేడు.

అతనికి తెలుసు ఆ సెలయేరు అడుగు వరకూ గడ్డకట్టిపోయిందని — నిజానికి ఈ ఆర్కెటిక్ చలికి ఏ సెలయేటిలోనూ నీళ్ళన్న ఊసు ఉండదు — అయితే, కొండవాలులంట పైనకురిసిన మంచుబరువుకి అడుగునఉన్నమంచు కరిగి ఊటలై ప్రవహించి, ఒకోసారి ఇలాంటి గడ్డకట్టిన సెలయేటి తలాలపై ప్రవహిస్తుంటాయన్నవిషయంకూడా అతనికి తెలుసు; అవి ఎంతచలివాతావరణంలోనైన గడ్డకట్టవనీ తెలుసు; వాటివల్ల వచ్చే ప్రమాదము గురించీ బాగా తెలుసు. నిజానికి అవి ఉచ్చులు. పైన పేరుకున్న మంచుకింద మూడు అంగుళాలనుండి మూడడుగులలోతువరకూ ఎంతవరకైనా నీటిగుంటలు ఉండవచ్చు. ఒక్కొసారి వాటిని అరంగుళంమాత్రమే మందంగల మంచుపలక కప్పిఉండొచ్చు. మంచుపలకపై ఒక్కోసారి మంచుపేరుకుని ఉండొచ్చు. లేదా కొన్ని వరుసల్లో ఒకదాని మీద ఒకటిగా నీరూ- పలకా, నీరూ-పలకా ఉండి, ఒకసారి మనిషి వాటిమీద కాలుపెడితే, మంచుపలకలు ఒకటొకటిగా విరిగి మనిషి మొలబంటి వరకూ మంచునీటితో తడిసిపోవచ్చు.

అందువల్లనే అతను అంత గాభరాపడి వెనక్కి అంతతొందరగా అడుగులువేసింది. అతను అడుగువేసినచోట మంచుపొరక్రింద మంచుపలక విరిగిన చప్పుడు విన్నాడు. అటువంటి చల్లనివాతావరణంలో కాళ్ళు తడవడమంటే … కష్టమేకాదు, ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే. తక్కువలోతక్కువ అతనికి ఆలస్యం అవడం, ఎందుకంటే అపుడతను తప్పనిసరిగా చలిమంట వేసుకుని, దాని వేడిమిలో వట్టికాళ్ళు రక్షించుకుంటూ, మేజోళ్ళనీ, మొకాసిన్లనీ ఆరబెట్టుకోవాలి. అందుకని, సావధానంగా నిలబడి జాగ్రత్తగా సెలయేటిఉపరితలాన్నీ, దానిగట్లనీ పరిశీలించి, నీటిప్రవాహం కుడిపక్కనుండి వస్తోందని గ్రహించేడు.

ముక్కునీ బుగ్గలనీ రాపిడిచేసుకుంటూ, క్షణకాలం విషయాలన్నీ మదింపుచేసుకుని, అప్పుడు ఎడమప్రక్కకి తిరిగి, భయంభయంగా అడుగువేస్తూ, వెయ్యబోయే ప్రతిఅడుగునీ పరీక్షించుకుంటూ, సెలయేటిని దాటేడు. ఇక ప్రమాదంలేదు అనుకున్నతర్వాత కొత్తగా మరొక ‘పట్టు’ పుగాకుతీసి నములుతూ, తన మిగిలిన నాలుగు మైళ్ళ ప్రయాణానికి ఉత్సాహంగా అడుగులెయ్యడం ప్రారంభించాడు. తర్వాతి రెండుగంటలప్రయాణంలోనూ అలాంటివి చాలాఉచ్చులు ఎదుర్కొన్నాడు. నీటిగుంటలమీద పొరలా పేరుకున్నమంచు పీచుమిఠాయిలా ముడుచుకుపోయిఉండి ప్రమాదాన్నిసూచిస్తుంది.

అయినాసరే, అతను మరొకసారి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు; అప్పుడు ప్రమాదాన్నిశంకిస్తూ, ముందు కుక్కని పొమ్మన్నాడు, అది పోనని మొరాయించింది. చివరికి అతడు దాన్ని ముందుకి తోసేదాకా వెళ్లలేదు; తోసినతర్వాత విరగని పలకమీదనుండి తొందరగా పరిగెత్తింది; ఇంతలో పలకవిరిగి, అది ఒకపక్కకి ఒరిగిపోయినా, గట్టి ఆనుదొరికి వెళ్లగలిగింది. దాని పాదాలూ, ముందుకాళ్ళూ, తడిసిపోవడమేగాక, కాళ్లకుఅంటుకున్ననీళ్ళు వెంటనే గడ్డకట్టుకుపోయాయి. పేరుకున్నమంచుని విదిలించుకుందికి ప్రయత్నంచేసి, మంచుమీద వెల్లకిలా పడుకుని, కాలివేళ్ళ మధ్య చిక్కుకున్న మంచుని నోటితో కొరకడం ప్రారంభించింది. అది అసంకల్పితంగా చేసిన చర్య. మంచుని అలా వదిలెయ్యడం అంటే, కాళ్ళు ఒరిసిపోనియ్యడం. ఆ విషయం దానికి తెలీదు. దానికి తెలిసిందల్లా, ఆ జీవిలో రహస్యలిపిలో లిఖించబడ్డ అద్భుతమైన ప్రతిచర్య ప్రకారం నడుచుకోవడమే.

కాని మనిషికి ఈ విషయమ్మీద ఖచ్చితమైన అవగాహన ఉండడంతో, కుడిచేతి చేజోడు తొలగించి గడ్డకట్టిన మంచుముక్కలు తొలగించడంలో సాయం చేసేడు. ఒక నిముషందాటి అతని వేళ్ళని బయట పెట్టలేదు. అయినప్పటికీ, అంతలోనే అవి కొంకర్లుపోడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. తొందర తొందరగా చెయిజోడు తొడిగి, గుండెకేసి మోటుగా చెయ్యిని కొట్టేడు.

సరిగ్గా మిట్టమధ్యాహ్నం వేళకి రోజంతటికంటే వెలుగు బ్రహ్మాండంగా ఉంది. అయినా సూర్యుడు శీతకాలపు పొద్దవడంచేత క్షితిజరేఖకి చాలా దగ్గరలో ఉన్నాడు. కారణం హెండర్సన్ క్రీక్ దగ్గర నేల బాగా ఎత్తుగా ఉంది. అతను అక్కడ నడుస్తున్నప్పుడు నీడ కాళ్ళక్రిందే ఉంది. సరిగ్గా పన్నెండున్నర అయేసరికల్లా తననుకున్న చీలిక దగ్గరికి చేరేడు. అతను అనుకున్నవేళకి రాగలగడంతో నడుస్తున్న వేగానికి అతనికి చాలా సంతృప్తి కలిగింది.

తను అదేవేగంతో నడవగలిగితే సాయంత్రం ఆరోగంటకల్లా కుర్రాళ్ళని కలవగలుగుతాడు. అతను జాకెట్టు, చొక్కావిప్పి లోపలదాచిన మధ్యాహ్నభోజనం పొట్లాం బయటకితీసాడు. దీనికి పావునిమిషంకూడా పట్టలేదు. అయినా, ఆ తక్కువ వ్యవధిలోనే, తొడుగుతీసిన చేతివేళ్ళు తిమ్మిరెక్కిపోయాయి. వెంటనే గ్లోవ్జ్ వేసుకోకుండా, ఆ చేతిని కాలికేసి ఒక డజనుసార్లు దబదబ బాదేడు. తర్వాత మంచుతోకప్పబడిన ఒక దుంగమీద కూర్చున్నాడు తిందామని.

అతను చేతిని కాలికేసిబాదినపుడు కలిగిన చిన్ననొప్పి అంతలోనే మాయమవడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికిప్పుడు ఆ బిస్కట్లు కొరికే అవకాశం లేదు. పదేపదిసార్లు చేతులు కాలికేసికొట్టుకుని, చేతికి మళ్ళీ గ్లోవ్జ్ తొడిగి, రెండో చేత్తో తిందామని దాని గ్లోవ్జ్ విప్పేడు. నోటినిండా ఒక ముక్క కొరుకుదామని ప్రయత్నించేడు గాని, మూతిదగ్గర పేరుకున్న మంచు సాధ్యపడనీలేదు. అతను చలిమంటవేసి దాన్ని కరిగించడం మరిచిపోయేడు. తన తెలివితక్కువదనానికి అతనికి నవ్వు వచ్చింది. నవ్వుతూనే, ఇప్పుడు తొడుగులేని చేతివేళ్ళుకూడా కొంకర్లుపోవడం గమనించేడు. అలాగే తను కూచుంటున్నప్పుడు కాలివేళ్లలో కలిగిన నొప్పి అప్పుడే తగ్గిపోవడం కూడా గమనించేడు. అతనికి అనుమానం వచ్చింది కాలివేళ్ళు వెచ్చగా ఉన్నాయా లేక అవికూడా తిమ్మిరెక్కాయా అని. మొకాసిన్ లోంచే వాటిని కదిపి అవి స్పర్శకోల్పేయన్న నిర్థారణకి వచ్చేడు.

చేతికి ఆతృతగా గ్లోవ్జ్ తొడిగి నిలబడ్డాడు. కొంచెం భయపడ్డాడు. కాళ్ళలోకి మళ్ళీ చైతన్యం వచ్చేదాకా కాసేపు గెంతేడు. ఇప్పుడు నిజంగానే వాతావరణం చాలా చల్లగాఉందని అభిప్రాయపడ్డాడు. ఈ దేశంలో ఉండుండి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడిపోతుందని ఆ సల్ఫర్ క్రీక్ లో కలిసిన వ్యక్తి సరిగ్గానే చెప్పేడు. తనే ఆ మాటకి పరిహాసంగా నవ్వేడు గాని! దాని అర్థం మనిషి ఎప్పుడూ ఏ విషయాన్నీ రూఢిగా తీసుకో కూడదు. వాతావరణం బాగా చల్లగా ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు అనుకున్నాడు.

వంట్లో మళ్ళీ వెచ్చదనం ప్రవహిస్తోందని రూఢి అయ్యేదాకా అతను క్రిందకీ మీదకీ గబగబా నేలమీద కాళ్ళు బలంగా వేస్తూ, చేతులూపుకుంటూ నడిచేడు. అప్పుడు జేబులోంచి అగ్గిపెట్టెతీసి చలిమంట వేసుకుందికి ప్రయత్నించేడు. అక్కడ చుట్టుపక్కల కలుపుమొక్కలలో క్రిందటిమాటు వర్షాలకు కొట్టుకొచ్చి చిక్కుకున్న కర్రా కంపా ఏరి తెచ్చుకున్నాడు మంట రగల్చడానికి. నెమ్మది నెమ్మదిగా ప్రారంభించి, త్వరలోనే మంట గట్టిగా అందుకున్నాక తనముఖం మీద గడ్డకట్టిన మంచు కరిగించుకుని, ఆ వేడిలోనే తన భోజనం కానిచ్చేడు. ఆ కాస్సేపు అక్కడి చలి వెనుకంజ వేసింది. కుక్కకూడా ఇటు వేడి తగిలేంత, అటు వొళ్ళు చురకనంత దూరంలో మంటకి దగ్గరగా సంతోషంగా కాళ్ళుజాచుకుని కూచుంది.

ఆ మనిషి తన భోజనం అయిన తర్వాత హుక్కా దట్టించి, ప్రశాంతంగా పొగతాగేడు. అప్పుడు తనచేతికి మళ్ళీ మిటెన్స్ తొడుక్కుని, చెవులు పూర్తిగా కప్పేలా తన టోపీ సరిచేసుకుని క్రీక్ లోని ఎడమవైపు బాట పట్టేడు. కుక్కకి చాలా నిరాశ కలిగింది. దాని మనసు మళ్ళీ మంటవైపే లాగుతోంది. ఈ మనిషికి చలి అంటే ఏమిటో తెలీదు. బహుశా అతని వంశంలో ఎవరికీ తెలిసి ఉండదు, చలంటే మామూలు చలికాదు, నిజమైన చలి, నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రతకి నూట ఏడు డిగ్రీల దిగువ ఉండే చలి… కానీ, కుక్కకు తెలుసును; దాని వంశం అంతటీకీ తెలుసును, ఆ పరిజ్ఞానం దాని నరనరాల్లోనూ జీర్ణించుకుంది. దానికితెలుసు: ఇటువంటి భయంకరమైనచలిలో బయటకు అడుగుపెట్టడం క్షేమంకాదని. ఇప్పుడు మంచులోగొయ్యిచేసుకుని, వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన ఈ తేడాకి మూలకారణమైన అంశం తొలిగేదాక నిరీక్షిస్తూ గుమ్మటంగా పడుక్కోవలసిన సమయం.

అయితే కుక్కకీ మనిషికీ ఏ విధమైన అనుబంధమూ లేదు. ఒకటి రెండో దానికి అవసరానికి పనికొచ్చే బానిస. అతని దగ్గరనుండి దానికి లభించిన ఏకైక లాలన కొరడాతో కొడతానని గట్టిగా చేసిన బెదిరింపులూ, అప్పుడప్పుడు కొరడాతో నిజంగా వేసిన దెబ్బలూను. అందుకని కుక్క తన భయాన్ని అతనికి తెలియపరచడానికి ప్రయత్నించలేదు. దానికి ఆ మనిషి శ్రేయస్సుతో సంబంధం లేదు. అది తన శ్రేయస్సుకోసం మళ్ళీ వెనక్కి మంటవైపు పోదామని ప్రయత్నించింది. కానీ, అతను గట్టిగా ఈలవేసి, కొరడా ఝళిపించేసరికి, వెనుదిరిగి అతన్ని అనుసరించసాగింది.

~~~~~~~~

ఆ మనిషి ఒక పుగాకుపట్టుతీసి నమలడం ప్రారంభించాడు. అతనిగడ్డం తిరిగి జేగురురంగులోకి మారడం ప్రారంభించింది. అలాగే అతని ఊపిరిలోని తేమ అతని మీసాలపై, కనుబొమలపై, కనురెప్పలపై తెల్లటిపొడిలా రాలడం ప్రారంభించింది. ఈ హెండర్సన్ క్రీక్ కి ఎడమప్రక్క ఎక్కువగా కొండవాగులున్నట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఒక అరగంట దాకా అతనికి అలాంటి ఛాయలేవీ కనిపించలేదు. అదిగో అప్పుడు అనుకోని సంఘటన జరిగింది. అక్కడ ఏ చిహ్నాలూలేనిచోట, మెత్తగా, మధ్యలోఖాళీలులేకుండా బాగా గట్టిగాఉన్నట్టు కనిపించినచోట, విరిగి అతను లోపలికి పడిపోయాడు. అది పెద్దలోతేం కాదు. గట్టినేల దొరికేవరకు తొట్రుపడి, ముణుకులకి సగానికి పైగా తడిసిపోయేడు.

అతనికి బాగాకోపంవచ్చి తన దురదృష్టానికి గట్టిగా బయటకు తిట్టుకున్నాడు. అతను తన కుర్రాళ్ళదగ్గరికి ఆరుగంటలకి చేరుతానని లెఖ్ఖవేసుకున్నాడు. ఇప్పుడు అధమపక్షం గంట ఆలస్యంఅవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తప్పనిసరిగా చలిమంట వేసుకుని తన పాదరక్షలని పొడిగా ఆరబెట్టుకోవాలి. అంత తక్కువ ఉష్ణోగ్రతలవద్ద అది తప్పనిసరి— అంతమట్టుకు అతనికి తెలుసు. అందుకని అతను గట్టువైపు నడిచి ఒడ్డు ఎక్కేడు. గట్టుమీద చాలా చిన్నచిన్న స్ప్రూస్ చెట్ల మొదళ్లచుట్టూ వర్షానికి కొట్టుకొచ్చి అక్కడి కలుపుమొక్కల్లో చిక్కుపడిపోయిన ఎండుపుల్లలూ, విరిగిన కొమ్మలతోపాటు, క్రిందటేడువి పెద్ద దుంగలూ, ఎండిన రెల్లుగడ్డి దుబ్బులుకూడా ఉన్నాయి.

మంచుమీద పెద్ద దుంగలు పడేసి, మంటకి మంచుకరిగినపుడు మండుతున్న చిన్నచిన్న చితుకులు ఆరిపోకుండ ఒక పునాదిలాంటి వేదిక తయారుచేశాడు. అతని జేబులొంచి ‘బర్చ్(Birch)’ బెరడుతీసి దానికి అగ్గిపుల్లగీసి మంటవెలిగించేడు. అది కాగితంకంటే వేగంగా మండింది. దాన్ని పునాదిలో ఉంచి, పిడికెడు ఎండుగడ్డి, చిన్నచిన్న ఎండు చితుకులతో మంట పెద్దది చెయ్యడం ప్రారంభించాడు.

చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా, రాబోయే ప్రమాదాన్ని బాగా ఎరిగిమరీ మంటని ప్రజ్వలనం చేశాడు. క్రమక్రమంగా, మంట పెద్దదవుతున్న కొద్దీ, అందులో వేసే చితుకులప్రమాణం పెంచుతూ మంట నిలబెట్టేడు. అతను మంచులో చతికిలబడికూర్చుని, పొదల్లో చిక్కుకున్న కట్టెలని లాగుతూ సరాసరి మంటలో వెయ్యనారంభించేడు. అతనికి తెలుసు ఇందులో తను కృతకృత్యుడు అయితీరాలి.

అందులోనూ, సున్నాకి దిగువన డెబ్బై అయిదు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండి, కాళ్ళుతడిసిపోయేయంటే, మొదటిప్రయత్నంలోనే సఫలమయితీరాలి. అతని పాదాలేగనక పొడిగాఉండిఉంటే, మొదటిప్రయత్నంలో విఫలమైనా, త్రోవంట ఒక అరమైలు పరిగెత్తి అతని రక్తప్రసరణని యధాస్థితికి తెచ్చుకోగలడు. కానీ డెబ్బైఅయిదుకి దిగువన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తడిసిపోయి, చలికి గడ్దకట్టుకుపోయిన పాదాలలో రక్తప్రసరణని పరిగెత్తడం వల్ల తిరిగి రాబట్టలేడు… తను ఎంతవేగం పరిగెత్తనీ, తడిపాదాలు ఇంకా గడ్డకట్టుకుపోతాయి.

అదంతా ఆ మనిషికి ఎరుకే. క్రిందటి ఏడు శీతకాలంలో సల్ఫర్ క్రీక్ దగ్గర ఒక పాతకాపు మాటల్లో ఈ విషయాలన్నీ చెప్పేడు, ఇప్పుడు ఆ సలహా ఎంత విలువైనదో అతను గ్రహించగలుగుతున్నాడు. ఇప్పటికే అతని పాదాల్లో స్పర్శజ్ఞానం పూర్తిగా నశించిపోయింది. ఈ నెగడు వెయ్యడానికి చేతికున్నతొడుగుకూడా విప్పేయడంతో చేతివేళ్ళుకూడా తొందరగా తిమ్మిరెక్కిపోయేయి. గంటకి నాలుగుమైళ్ళ వేగం అతను నడిచిన నడక చర్మమూ, శరీరంలోని మిగతా అన్నిమూలలకీ గుండెనుండి రక్తం ప్రసరించేలా చేసింది. ఒకసారి అతను నడక ఆపెయ్యడంతో గుండెవేగంకూడా తగ్గింది.

వాతావరణంలోని శీతలపవనం భూమ్మీద ఏ రక్షణాలేని ఆ కొనని తాకితే, ఆ కొనదగ్గర అతనుండడంతో, అది పూర్తితీవ్రతతో అతన్ని తాకింది. శీతలపవనం ముందు శరీరంలోని రక్తం గడగడలాడింది. కుక్కలాగే, రక్తంకూడా సజీవంగానే ఉంది; దానిలాగే ఏదైనా రక్షణక్రింద దాగుని, ఈ భయంకరమైన చలినుండి కాపాడుకోవాలనుకుంటోంది. అతను నాలుగుమైళ్ళవేగంతో నడుస్తున్నంతసేపూ, ఇష్టంఉన్నా లేకపోయినా చర్మంమీది అన్నిభాగాలకీ రక్తం పరిగెత్తింది. ఇప్పుడు అది వెనక్కితగ్గి శరీరంలోని అంతరాంతరాల్లోకి జారుకుంది. అది లేని లోటును ముందుగా అనుభవిస్తున్నవి శరీరంఅంచుల్లో ఉన్న అవయవాలు.

అతని తడికాళ్ళు త్వరగా గడ్డకట్టుకుపోవడం ప్రారంభించేయి. చేతులు గడ్డకట్టుకోకపోయినా, త్వరగా తిమ్మిరెక్కిపోయాయి. ముక్కూ, బుగ్గలూ అప్పుడే గడ్డకట్టుకుపోవడం ప్రారంభించేయి, అతని చర్మం రక్తప్రసరణ లేకపోవడంతో అప్పుడే చల్లబడిపోయింది.

అయితే, అతనిప్పుడు క్షేమంగానే ఉన్నాడు. కాలివేళ్ళు, ముక్కూ, బుగ్గలు మాత్రమే ప్రస్తుతానికి చలికి గడ్డకట్టుకు పోయాయి, మంట నిలిచి కాలుతోంది. ఇప్పుడతను తన వేలిపొడుగుపుల్లలు వేస్తూ మంట నిలబెడుతున్నాడు. ఇక కాస్సేపటిలో తన చెయ్యిమందం కొమ్మల్ని మంటలో వెయ్యగలుగుతాడు; అప్పుడు తడిసిపోయిన తన కాలితొడుగులు తీసి ఆరబెట్టుకోగలుగుతాడు. ఒకపక్క అవి ఆరుతుంటే, తన వట్టికాళ్ళని మంటదగ్గర వెచ్చచేసుకుంటాడు, కాలిపోకుండా ముందు మంచుతో రుద్దుకునే అనుకొండి. చలిమంట పూర్తిగా సఫలమైనట్టే. ఇపుడతనికి ప్రమాదం తప్పినట్టే.

సల్ఫర్ క్రీక్ దగ్గర ఆ పాతకాపు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అతని ముఖంమీద చిరునవ్వు మొలిచింది. ఆ పాతకాపు వాతావరణం యాభై డిగ్రీలకు తక్కువగా ఉంటే “క్లోండైక్” ప్రాంతంలో ఒంటరిగా సంచరించకూడదని సిద్ధాంతరీకరించేడు. కాని ఇప్పుడు తనక్కడే ఉన్నాడు; ప్రమాదం జరిగింది; తను ఒంటరిగానే ఉన్నాడు కూడా; అయినా తనని తను రక్షించుకోగలిగేడు. ఆ పాతకాపులు ఆడవాళ్లలా పిరికివాళ్ళు; కనీసం అందులో కొందరు, అని మనసులో అనుకున్నాడు. ఇలాంటిసమయాల్లో మనిషిచెయ్యవలసిందల్లా ఆవేశపడిపోకుండా, వివేచనకోల్పోకుండా ఉండడం.

అప్పుడు అతనికి ఏమీ కాదు. మగవాడన్నవాడెవడైనా నిజంగా మగతనంఉంటే ఒంటరిగా ప్రయాణం చెయ్యగలడు. కాని ఎంతవేగంగా అతని ముక్కూ, బుగ్గలూ గడ్డకట్టుకుపోతున్నాయో చూస్తే ఆశ్చర్యంవేస్తోంది అతనికి. అంత తక్కువసమయంలో అతనివేళ్ళు స్పర్శకోల్పోగలవని ఊహించలేదు. నిజంగా వాటిలో ప్రాణంఉన్నట్టు అనిపించడం లేదు. ఎందుకంటే, అతను చేతులతో ఒక పుల్లని పట్టుకుని కదపలేకపోతున్నాడు. అవి తననుండీ, తన శరీరంనుండీ ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అతను ఒక కట్టెను తాకితే, అతను పట్టుకున్నాడో లేదో అటువైపు తిరిగి చూస్తేతప్ప తెలియడం లేదు. వేళ్లకొసలనుండి తనకి నరాలు తెగిపోయినట్టు, ఏ రకమైన సమాచారమూ అందటం లేదు.

వాటివల్ల ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు నెగడు వెయ్యడం అయింది, అందులో మండుతున్న ఒక్కొక్క కట్టె ఠప్ ఠప్ మని శబ్దం చేసి విరుగుతూ, నృత్యం చేస్తున్నట్టు లేస్తున్న ప్రతి కీలతోనూ జీవితం మీద ఆశని పెంచుతోంది. అతనిప్పుడు కాళ్లకున్న మొకాసిన్లు విప్పడం ప్రారంభించేడు. అవి మంచు పూతపూసినట్టున్నాయి. దళసరిగాఉన్న జర్మనుసాక్స్ ముణుకులకి సగందాకా ఒక ఇనపతొడుగులా కనిపిస్తున్నాయి ఇప్పుడు. మొకాసిన్ లకి ఉన్న తాళ్ళు ఏదో పెద్దమంటలోచిక్కుకుని అష్టవంకరలుపోయిన ఇనపకడ్డీల్లా ఉన్నాయి. క్షణకాలం తన స్పర్శకోల్పోయిన చేతివేళ్లతో విప్పడానికి ప్రయత్నం చేసేడు గాని, అది ఎంత తెలివితక్కువో వెంటనే గ్రహించి, మొలలో ఉన్న ఒరలోంచి కత్తి బయటకు తీసేడు.

అతను తాళ్లని తెంచేలోగా అది జరిగిపోయింది. అది అతని తప్పిదమే… కాదు, కాదు, చేసిన చాలా పెద్ద పొరపాటు. అతను ఒక స్ప్రూస్ చెట్టుక్రింద మంటవెయ్యకుండా ఉండవలసింది. అతను ఆ మంట ఆరుబయటవేసి ఉండాల్సింది. కానీ అతనికి పొదల్లోంచి ఎండుకట్టెలులాగి మంటలోకి నేరుగావెయ్యడం సులువని ఆ పనిచేశాడు. అతను ఏ చెట్టుకిందయితే మంటవేశాడో దానికొమ్మల్లో మంచుపేరుకుపోయి ఉంది.

వారాలతరబడి అక్కడ గాలివీచకపోవడంతో ప్రతికొమ్మమీదా అది భరించగలిగినంత మంచు గడ్దకట్టి ఉంది. అతను మంటలోకి పుల్లవేసిన ప్రతిసారీ, అతని వరకు ఆ విషయం గ్రహించలేకపోయినా, చెట్టులోకొంత కదలిక తీసుకువచ్చాడు… ఆ కదలికే ఈ విపత్తుకి దారితీసింది. ఒక చిటారుకొమ్మ దానిమీదపేరుకున్న మంచుబరువుకి తలవాల్చడంతో ఆ మంచు క్రిందికొమ్మమీదా, అది దానిక్రిందకొమ్మమీదా పడి మొత్తం చెట్టుమీదఉన్నమంచుఅంతా ఒక్కసారి దబ్బున పడిపోయింది. ఆ పడడం పడడం కొండమీంచిదొర్లిపడ్డ హిమపాతమై అతని మీదా, మంటమీదాపడి ఒక్కసారిగా మంట ఆరిపోయింది. ఇంతవరకు మంట ఉన్నచోట ఇప్పుడు చెల్లాచెదరైన మంచు తప్ప మరోటి లేదు.
ఆ మనిషి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.

అది అతని మరణశిక్ష ప్రకటించినట్టు అనిపించింది. ఒక్క క్షణకాలం తాపీగా కూర్చుని అంతవరకు మంట ఉన్నప్రదేశాన్ని కళ్ళప్పగించి చూశాడు. బహుశా సల్ఫర్ క్రీక్ లోని పాతకాపు చెప్పిందే నిజమేమో. అతనికి మరొకతోడు ఉండిఉన్నట్టయితే అతనిప్పుడు ప్రమాదంలో చిక్కుకుని ఉండేవాడు కాదు. సరే, ఏం చెయ్యగలం. మళ్ళీ మంటని ప్రజ్వలింపజెయ్యవలసిన బాధ్యత తనదే. ఇక రెండోసారి వైఫల్యానికి ఆస్కారమే లేదు. ఒకవేళ అతను సఫలమైనా అతను కొన్ని కాలివేళ్ళు నష్టపోవడం ఖాయం. ఈ పాటికి అతని కాళ్ళు గడ్దకట్టుకుపోయి ఉంటాయి. ఈ రెండో మంట మళ్ళీ బాగా వెలగడానికి కొంతసమయం తీసుకుంటుంది కూడా.

అతని ఆలోచనల సరళి అలా కొనసాగుతోంది. అలాగని ఆలోచిస్తూ అతను కూర్చోలేదు. అతని మనసులో ఒకప్రక్క ఆలోచనలు కదలాడుతుంటే రెండోప్రక్క అతను పనిచేసుకుంటూపోతున్నాడు. మంటకోసం కొత్తగా వేదిక తయారుచేశాడు. వరదకికొట్టుకొచ్చిన ఎండుగడ్డీ చితుకులూ మళ్ళీ సేకరించాడు. అతను వేళ్లతో ఆ పనిచెయ్యలేకపోయినా చేతులు మొత్తంగా ఉపయోగించి చెయ్యగలిగేడు.

ఈ క్రమంలో అతను అవాంఛనీయమైన తడి పుల్లలూ, పచ్చగాఉన్న నాచుకూడా పోగుచేశాడు. శక్తివంచనలేకుండా అతను చెయ్యగలిగినది అదే. అతను చాలా క్రమపద్ధతిలో మంట బాగావెలిగినతర్వాత ఉపయోగించడానికని పెద్ద ఎండుకొమ్మలు కూడ సమీకరించేడు. ఈ తంతు జరుగుతున్నంతసేపూ కుక్క అలా కూచుని అతని చర్యలని గమనిస్తోంది కళ్లలో ఎంతో ఆశతో. ఎందుకంటే ఇప్పుడు దానికి నెగడు ఏర్పాటు చెయ్యడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం అతనే. నెగడు వెయ్యడం ఆలస్యం అవుతూనే ఉంది.

అన్నీ సమకూర్చుకోవడం పూర్తయినతర్వాత, అతని జేబులో ఉన్న రెండో బర్చ్ బెరడుకోసం చెయ్యి పెట్టేడు. చేతులకి స్పర్శలేకపోవడంవల్ల తెలియకపోయినా, దాన్ని వెతుకుతున్నప్పుడు అది చేసిన చప్పుడువల్ల అక్కడ ఉందని తనకి తెలుస్తోంది. అతను ఎంతప్రయత్నించినా దాన్ని చేతితో పట్టుకోలేకపోతున్నాడు. అలా దానికోసం ప్రయత్నిస్తున్నంత సేపూ అతని తనకాళ్ళు గడ్డకట్టుకుపోతున్నాయన్న విషయం తెలుస్తూనే ఉంది, ఆ ఆలోచన మనసులో మెదులుతూనే ఉంది. ఈ ఆలోచన అతన్ని ఆందోళనకి గురిచేస్తున్నప్పటికీ, దాన్ని ధైర్యంగా నిలదొక్కుకుని ప్రశాంతంగానే ఉన్నాడు.

చేతులకి పళ్లతో పీకి మిటెన్స్ తొడిగి, చేతుల్ని అటూ ఇటూ గట్టిగా జాడించి, శక్తికొద్దీ తుంటికి దబదబా గట్టిగా బాదేడు. ఆ పని అతను కాసేపు కూచునీ, కాసేపు నిలబడీ చేసేడు. ఇంతసేపూ కుక్క మంచులోనే కూర్చుని తన ముందటికాళ్లచుట్టూ తోడేలు తోకలాంటి తనతోకని కప్పి వెచ్చగా ఉంచుకుంది. దాని చెవులు రిక్కించి ముందుకి జాచి అతని చేస్తున్న ప్రతి పనినీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆ మనిషి తన చేతులు జాడిస్తూ, ఒంటికేసి కొట్టుకుంటూ చలిని తట్టుకుందికి దాని శరీరానికి ఉన్న సహజ నిర్మాణానికి కొంచెం అసూయపడ్డాడు కూడా.

అలా కొంతసేపు కొట్టిన తర్వాత ఎక్కడో లోలోపల లీలగా స్పర్శజ్ఞానంజాడ తగిలింది చేతుల్లో. అది క్రమంగా పెద్దదై పెద్దదై భరించలేనినొప్పిగా మారింది. అయినా దానికి అతను సంతోషంగానే ఉన్నాడు…స్పర్శ తెలుస్తున్నందుకు. వెంటనే అతని కుడిచేతినుండి మిటెన్ తీసి బర్చ్ బెరడు బయటకి తీసేడు. నగ్నంగా ఉన్నవేళ్ళు వెంటనే కొంకర్లుపోవడం ప్రారంభించేయి. అతని దగ్గర ఉన్న సల్ఫరు అగ్గిపుల్లలు తీసాడు. అప్పటికే విపరీతమైపోయిన ఆ చలి ఆ వేళ్లలో స్పర్శ లేకుండా చేసింది.

ఆ పుల్లల్లోంచి ఒకటి వేరుచేసే ప్రయత్నంలో మొత్తం అన్నిపుల్లలూ మంచులో పడిపోయేయి. మంచులోంచి బయటకి తీయడానికి ప్రయత్నించేడు గానీ, విఫలమయేడు. స్పర్శలేని చేతులు వాటిని తాకనూ లేకపోయాయి, పట్టుకోనూ లేకపోయాయి. అతను చాలా ఏకాగ్రతతో ఉన్నాడు. కాళ్ళు, ముక్కూ, బుగ్గలూ గడ్డకట్టుకుపోతున్నాయన్న విషయం తనమనసులోంచి తీసేసి, అతని దృష్టి అంతా ఆ అగ్గిపుల్లల్ని బయటకుతియ్యడం మీద లగ్నంచేసి ఉంచాడు. స్పర్శజ్ఞానానికి బదులు చూపుని ఉపయోగించి అతని చేతులు రెండూ అగ్గిపుల్లలకి రెండుప్రక్కలా రాగానే రెండు చేతుల్నీ దగ్గరకు తీసాడు… లేదా, దగ్గరకు తియ్యాలనుకున్నాడు. కానీ, చేతివేళ్లకు సమాచారం అందకపోవడంతో, వేళ్ళు సహకరించలేదు. వెంటనే కుడిచేతికి తొడుగుతొడిగి చాలా గట్టిగా ముణుకులకేసి కొట్టసాగేడు. అప్పుడు తొడుగు ఉన్న చేతులతోనే అగ్గిపుల్లల్ని కొంత మంచుతోసహా తన ఒడిలోకి తీసాడు. దానివల్ల పెద్దతేడా ఏమీ పడలేదు.

కొంత నేర్పుగా ప్రయత్నంచేసిచేసి ఆ అగ్గిపుల్లలకట్టని చేతితొడుగుల మడమలమధ్యకు తీసుకురావడంలో సఫలమయ్యాడు. అలాగే మీదకి ఎత్తి తన నోటిదాకా తీసుకు వచ్చేడు. అతను తల గట్టిగా విదిలించి నోరు తెరవ ప్రయత్నించడంతో, మూతిమీద పేరుకున్న మంచు ముక్కలుగ విరిగి నోరు స్వాధీనంలోకి వచ్చింది. క్రింది దవడని లోపలికి లాగి, పై పెదవి అడ్డుతగలకుండా వొంచి, పంటితో ఆ కట్టనుండి ఎలాగైతేనేం అతిప్రయత్నం మీద ఒక పుల్లను వేరు చెయ్యగలిగాడు, కానీ, అది అతని ఒడిలో పడిపోయింది. దాంతో అతనికి ప్రయోజనం లేకపోయింది. దాన్ని చేత్తో తియ్యలేకపోయాడు. అందుకని ఒక పథకం ఆలోచించాడు. దాన్ని పంటితోతీసి కాలికేసి రుద్దేడు. అలా ఒక ఇరవైసార్లు రుద్దిన తర్వాత చివరకి దాన్ని వెలిగించగలిగేడు. వెలుగుతున్న ఆ పుల్లని అలాగే బర్చ్ బెరడుదగ్గరకి నోటితోనే తీసుకెళ్ళేడు. కాని మండుతున్న గంధకము అతని ఊపిరితిత్తులనిండా నిండిపోయి అతనికి ఆపుకోలేని దగ్గుతెర వచ్చింది. ఆ దగ్గుకి వెలుగుతున్న అగ్గిపుల్ల తుళ్ళిపోయి మంచులోపడి ఆరిపోయింది.

ఒక్క క్షణం నిస్పృహ కలిగింది గాని, దాన్ని అణుచుకుంటూ, సల్ఫర్ క్రీక్ దగ్గరి పాతకాపు చెప్పినదే సరి: మైనస్ యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనిషి ఒక తోడుతీసుకుని ప్రయాణం చెయ్యాలి అనుకున్నాడు. అతను చేతుల్ని దబదబ బాదేడు కాని వాటిలో ఏ చైతన్యాన్నీ తీసుకురాలేకపోయాడు. అతనొక్కసారి రెండు చేతులకున్న తొడుగుల్నీ విప్పేసేడు పళ్ళతో. మొత్తం అగ్గిపుల్లలకట్టనంతటినీ మోచేతులమధ్య గట్టిగా అదిమిపట్టేడు. అతని భుజాల కండరాలు ఇంకా చలికి గడ్డకట్టుకోకపోవడం అతనికి ఉపయోగించింది.

ఇప్పుడు ఆ కట్టనంతటినీ కాళ్లతో రుద్దడం ప్రారంభించాడు. ఒక్కసారి డెబ్భైఅగ్గిపుల్లలూ మండటంతో భగ్గుమని మంటవచ్చింది. ఆరిపోతుందని భయపడడానికి ఇప్పుడు గాలిలేదు. ఆ మంటవల్ల శ్వాసకు ఇబ్బంది కలగకుండా అతను తలని ఒకపక్కకి వాల్చి, ఆ మండుతున్న పుల్లల్ని బర్చ్ బెరడు దగ్గరకి తీసుకువచ్చేడు. అతనిలా పట్టుకోవడమేమిటి, అతనికి అతని చెయ్యి చర్మం కాలుతోందన్న స్పృహకలిగింది. ఆ వాసన అతనికి తెలుస్తోంది. ఆ స్పృహ మెల్లిగా నొప్పిలోకి, తర్వాత భరించలేని బాధలోకి మారింది. అయినా దాన్ని అతను సహిస్తూ, బర్చ్ బెరడు దగ్గరికి తొట్రుపడుతూ, తొట్రుపడుతూ తీసికెళ్ళేడు. అతని చేతులు అడ్డుగా ఉండి, ఉన్న వేడి అంతా అవే తీసుకోవడంతో అది అంత త్వరగా అంటుకోవడం లేదు.

చివరకి ఇక భరించలేక చేతులు ఒక్క కుదుపుతో వేరుచేసాడు. ఆ మండుతున్న అగ్గిపుల్లలు మంచులోపడి ‘చుంయ్’ మని చప్పుడు చేస్తూ ఆరిపోయేయి. అయితే బర్చ్ బెరడుమాత్రం అంటుకుంది. అతను ఎండుగడ్డీ చిన్నచిన్న ఎండుపుల్లలూ దానిమీద వెయ్యడానికి ప్రయత్నించేడు. కానీ, అతను సరియైనవాటిని ఎంచుకుని మిగతావి పారేసే స్థితిలో లేడు. ఎందుకంటే ఇప్పుడు అతను పనిచెయ్యగలిగింది మోచేతులతోనే. తడిసి కుళ్ళిపోయిన కర్రలూ, పచ్చనినాచూ కూడా అంటుకుపోయిఉన్నాయి పుల్లలకి. వాటిని సాధ్యమైనంతవరకు నోటితోకొరికి పారేస్తున్నాడు. అతని పనితనంలో నేర్పులేకపోయినా, నెమ్మదిగా మంటని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అది అతనికి జీవన్మరణ సమస్య.

మంట ఎట్టిపరిస్థితిలోనూ ఆరిపోకూడదు. అతని చర్మంమీద రక్తప్రసరణ లేకపోవడంతో అతనిప్పుడు వణకడం ప్రారంభించేడు, దానితో అతని కదలికలు ఇంకా మొరటుగా కనిపిస్తున్నాయి. ఆ వెయ్యడంలో ఒక పెద్ద పచ్చని నాచుముక్క తిన్నగా ఇంకా సన్నగా ఉన్న మంటమీద పడింది. అతను తన వేళ్లతో దాన్ని తొలగించడానికి ప్రయత్నించేడుగాని, అతనిశరీరం బాగా వణుకుతుండడంతో నిభాయించుకోలేక, మంట ఎక్కువ కదిపేయడం, మొదలునుండీ మంట కెలకబడి, మండుతున్న గడ్డీ, పుల్లలూ వేటికవి వేరయి, చెల్లాచెదరుగా పడిపోవడం జరిగిపోయింది. వాటిని దగ్గరగా పోగుచెయ్యడానికి ప్రయత్నించేడు గాని, ఆ ప్రయత్నంలోని ఒత్తిడితో బాటు, అతనిశరీరం అదిమిపెట్టలేనంతగా వణకడంతో అవన్నీ దారుణంగా చెల్లాచెదరైపోయాయి.

మండుతున్న ప్రతిపుల్లా ప్రాణంపోయినట్టు ఒక్కసారి పొగవదిలి ఆరిపోయాయి. ఆ ప్రకారంగా నెగడు వెయ్యడం విఫలమైంది. అతను నిరాశగా నాలుగుపక్కలా చూస్తుంటే, అతని దృష్టి ముందుసారి తను వేసినమంట ఆరిపోయిన చోట కూర్చున్న కుక్క మీద పడింది. అది మంచులో ఒదిగికూర్చుని, ఒకసారి ఒక కాలూ, రెండోసారి రెండో కాలూ లేపుతూ, మంట ఎప్పుడు తయారవుతుందా అన్న ఆదుర్దాతో తన శరీరభారాన్ని ముందుకాళ్లనుంచి వెనకకాళ్ళకీ, వెనకకాళ్లనుండి ముందుకాళ్లకీ మార్చుకుంటూ, అసహనంగా ఉంది.

“అతను తన తన చేతులమీదా మోకాళ్లమీదా వాలి పాకురుకుంటూ దాని వైపు వెళ్ళేడు.”

కుక్కమీదకి దృష్టి మరలగానే అతనికి ఒక కథ గుర్తుకొచ్చి మనసులో ఒక పిచ్చిఆలోచన వచ్చింది. అందులో ఒకడు మంచుతుఫానులో చిక్కుకుంటాడు. కానీ, ఒక ఎద్దు అందుబాటులో ఉంటే, దాన్ని చంపి, దాని చర్మంలోదూరి తన ప్రాణాలు రక్షించుకుంటాడు. అలాగే, తనుకూడా దీన్ని చంపి, దీని వెచ్చనిశరీరంలో తన చేతులు తిమ్మిరివదిలేదాకా దాచుకుంటే, అప్పుడు ఇంకో మంటవేసుకోవచ్చు అనుకున్నాడు. అందుకని కుక్కని తనదగ్గరకు రమ్మని పిలుస్తూ, సంభాషణ మొదలుపెట్టాడు. కాని ఇంతకుమునుపెన్నడూ అతను దాన్ని అలా పిలవకపోవడంచేతా, అతని గొంతులో ఏదో వింతభయం తొంగిచూస్తూఉండడంచేతా అది జడుసుకుంది. ఏదో విషయం ఉంది…

దాని అనుమాన ప్రవృత్తి ఇదమిత్ధం అని పోల్చుకోలేకపోయినా, ఎక్కడో, ఏదో ప్రమాదంఉందని మాత్రం దాని మెదడులో అనుమానం రేకెత్తించింది. ఆ మనిషి మాట చప్పుడుకి దాని చెవులు కిందకి వాల్చి, ముందుకాళ్ళూ వెనకకాళ్ళూ బారజాపుకుని, ముందుకాళ్ళు చాలా అశాంతితో ఇటూ అటూ కదుపుతూ ఉంది కాని, అది మాత్రం అతని దగ్గరకి పోలేదు. దాంతో, ఆ మనిషి చేతులమీద కాళ్ళమీదా వాలి కుక్కవైపు పాకరడం ప్రారంభించేడు. అతని ఈ అసాధారణమైన శరీరభంగిమ దాని అనుమానాన్ని మరింత రగిల్చి అది అతనినుండి సంకోచిస్తూనే దూరంగా పక్కకి తప్పుకుంది.

ఆ మనిషి మంచులో లేచికూచుని, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించేడు. అతను చేతులకి మళ్ళీ తొడుగులు పళ్ళ సాయంతో వేసుకుని, లేచినిలబడ్డాడు. పాదాల్లో స్పర్శలేక, భూమికీ తనకీ అనుబంధంఉన్నట్టు అనిపించకపోవడంతో ఒకసారి నిజంగా నిలుచున్నాడో లేదో నిర్థారణ చేసుకుందికి క్రిందికి చూసుకున్నాడు. అతను కాళ్ళమీద నిలబడడంతో కుక్క మనసులో అనుమానాలు తొలగిపోయాయి. అతనెప్పుడైతే కొరడాతో కొట్టినట్టు గట్టిగా అరిచాడో, అది పూర్వపు విధేయతతో తోకాడించుకుంటూ అతనిదగ్గరికి వచ్చింది.

అది అతనికి అందుబాటులో ఉన్నంతదూరంలోకి రాగానే మనిషికి పట్టుదప్పింది. కుక్కని పట్టుకుందామని అతను ఒక్కసారి చేతులు గాల్లోకి విదిలించి ప్రయత్నించేడు గాని, అతని చేతులు వంగనూ వంగక, దాన్ని పట్టుకోనూ పట్టుకోలేకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. చేతుల్లో ఏ కోశాన్నా స్పర్శతెలియడంలేదు. అవి ఎప్పుడో స్పర్శజ్ఞానంకోల్పోయేయనీ, అవి త్వరత్వరగా గడ్డకట్టుకుపోతున్నాయనీ అతను మరిచిపోయాడు. ఆ జంతువు తప్పించుకునేలోగా అతను దాన్ని తన మోచేతులలో చుట్టేసేడు. అతను మంచులో కూచుండిపోయి ఆ కుక్కని అలాగే పట్టుకున్నాడు. అది మూలుగుతూ, గుర్రు గుర్రు మంటూ, తప్పించుకుందికి విశ్వప్రయత్నం చేస్తోంది.

అదొక్కటే ఇప్పుడతను చెయ్యగలిగింది… దాన్ని కౌగలించుకుని కూచోడం. అతనికి దాన్ని తను చంపలేడని విశదమైపోయింది. ఆ పని ఏ రకంగానూ చెయ్యలేడు. సత్తువలేని చేతులతో మొలలోంచి కత్తి తియ్యనూ లేడు, పట్టుకోనూ లేడు, కనీసం దాని పీకని నులమనైనా నులమలేడు. దాన్ని అతను వదిలేసేడు. దాని తోకని కాళ్లమధ్య దాచుకుని ఒక్క గెంతు గెంతింది ఇంకా గుర్రు మంటూనే. నలభై అడుగుల దూరంలో ఆగి, చెవులు రిక్కించి అతనివంక తిరిగి, కుతూహలంగా పరీక్షించసాగింది.

అతని చేతులెక్కడున్నాయో తెలుసుకుందికి అతను క్రిందకి చూసేడు; అవి అతని మోచేతుల చివరలకి వేలాడుతున్నాయి. చేతులెక్కడున్నాయో తెలుసుకుందికి కళ్ళతో చూడవలసివచ్చిందని తలుచుకుని అతనికి చిత్రంగా అనిపించింది. అతను అతని మోచేతుల్ని ముందుకీ వెనక్కీ గట్టిగా విదిలించసాగేడు… తొడుగులున్న చేతుల్ని పక్కలకేసి కొట్టసాగేడు. అలా ఒక ఐదు నిమిషాలు గబగబా చేసిన తర్వాత అతని గుండెనుండి పై చర్మానికి తగినంత రక్తప్రసరణ జరగడంతో, అతనికి వణుకు తగ్గింది. కానీ చేతుల్లోమాత్రం ఏ స్పర్శా లీలగాకూడా కలగలేదు. అతనికి అతని చేతులు మోచేతుల చివరలకి తూకపురాళ్ళలా వేలాడుతున్నాయన్న భావన కలిగింది, కానీ వాటిని వెతికితే కనిపించలేదు.

ఇక మృత్యువు తప్పదన్న సన్నని భయం, నిర్వీర్యంచేసే భయం అతనికి కలిగింది. అది క్రమక్రమంగా ఆలోచిస్తున్నకొద్దీ అతని చేతులూ, కాలివేళ్ళూ గడ్డకట్టుకుపోవడమో; లేదా చేతులూ, కాళ్ళూ కోల్పోవడం కాదనీ, అది కేవలం జీవన్మరణసమస్య అనీ, అందులో తనకి జీవించడానికి అవకాశాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయనీ స్పష్టమైపోయింది. దాంతో అతను ఆందోళనకు గురై, వెనక్కి తిరిగి, క్రీక్ ఉపరితలంమీద కనీకనిపించని అతని అడుగుల జాడవెంట పరిగెత్తడం ప్రారంభించేడు. కుక్క అతన్నిఅనుసరిస్తూ వెనకే పరిగెత్తడం ప్రారంభించింది.

ఇంతకు మునుపు ఎన్నడూ ఎరగని భయంతో, ఒక లక్ష్యం, గమ్యం అంటూ లేకుండా గుడ్డిగా పరిగెత్త సాగేడతను. నెమ్మదిగా మంచుని తవ్వుకుంటూ, తొట్రుపాటు పడుతూ పరిగెత్తగాపరిగెత్తగా ఇపుడతనికి కొన్ని స్పష్టంగా కనిపించసాగేయి, ఆ సెలయేటి గట్లూ, పెద్దదుంగలు మార్గాన్ని మూసేసినచోట్లూ, ఆకుల్లేని ఏస్పెన్(Aspen) చెట్టూ, ఆకాశం… అన్నీ.

పరిగెత్తడంవల్ల అతనికిప్పుడు కొంచెం సుఖంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అతనిప్పుడు వణకడం లేదు. బహుశా అలా పరిగెత్తుతూ ఉంటే అతని కాళ్ళుకూడా వేడేక్కుతాయేమో; లేకపోయినా అతను అలా పరిగెడుతూఉంటే అతను తన శిబిరమూ చేరుకోవచ్చు, పిల్లల్నీ కలుసుకోవచ్చు. అతను కొన్నిచేతివేళ్ళూ, కాలివేళ్ళూ కోల్పోడం ఖాయం; అయితేనేం, అతనక్కడికి వెళ్ళగలిగితే కుర్రాళ్ళు తనని సంరక్షిస్తారు, శరీరంలో మిగతా భాగమైనా మిగులుతుంది.

దానితోపాటే అతనికి ఇంకోఆలోచనకూడా వచ్చింది: తను తన శిబిరంకి చేరడం గాని, పిల్లల్ని కలవడం గాని అసాధ్యం అని; తన శిబిరం ఇంకా చాలామైళ్ళదూరం ఉందనీ, అప్పుడే తను గడ్డకట్టుకుపోవడం ప్రారంభించడంతో, త్వరలోనే అతను బిరుసెక్కి చనిపోవడంఖాయం అని. ఈ ఆలోచననిమాత్రం పరిగణించక ఆలోచనలవెనక్కి నెట్టేసేడు.

ఒక్కోసారి అది ముందుకువచ్చి తనమాట వినమనిచెప్పినా దానినోరునొక్కి మిగతావిషయాలగురించి ఆలోచించడం ప్రారంభించేడు.

అతని కాళ్ళు అంతలా గడ్డకట్టుకుపోయి, అవి ఎప్పుడు నేలమీద ఆనుతున్నాయో, తనబరువు ఎలా మోస్తున్నాయో కూడా తనకి తెలియకపోయినాప్పటికీ, తనుపరిగెత్తగలగడం అతనికి కొంచెం చోద్యంగా అనిపించింది. అతనికేమో గాలిలో ఈదుతున్నట్టు, భూమితో ఏమీ సంబంధంలేనట్టూ అనిపించింది. అతనికెక్కడో దేవదూత మెర్క్యురీ(Mercury)ని రెక్కలతో ఎగురుతూ చూసినట్టనిపించి, అతనుకూడా భూమిమీద తనలాగే ఈదుతున్నట్టు భావిస్తాడా అన్న సందేహం కూడా వచ్చింది.

“చాలా సార్లు అడుగులు తడబడి, చివరకి తూలిపోయి, ఒళ్ళంతా కూడదీసుకుని, క్రింద పడిపోయాడు…”

అతను తన శిబిరంనీ, పిల్లల్నీ కలిసేదాకా పరిగెత్తడం అన్న వాదంలో ఒక లోపంఉంది: అతనికి దాన్నితట్టుకోగల శక్తిలేదు. చాలాసార్లు అడుగులుతడబడి, చివరకి తూలిపోయి, ఒళ్ళంతా దగ్గరకు లాక్కున్నట్టు పడిపోయాడు. అతను లేవడానికి ప్రయత్నించేడుగాని విఫలమయ్యాడు.

తనింక కూర్చుని విశ్రాంతితీసుకోవాలనీ, మళ్ళీసారి తను పరిగెత్తడం కాక నడకే కొనసాగించాలనీ నిర్ణయించుకున్నాడు. లేచికూచుని, కాస్త ఊపిరి సంబాళించుకున్నాక, అతని వొళ్ళు వెచ్చగా ఉన్నట్టూ, తనకిప్పుడు బాగానే ఉన్నట్టూ అనిపించింది. అతను వణకడం లేదు, అతని గుండెలోకీ, శరీరంలోకీ, కొంత వేడిమి వచ్చినట్టుకూడా అనిపించింది. అయితే అతను తన ముక్కూ, బుగ్గలూ ముట్టుకుంటే ఏ స్పర్శజ్ఞానమూ కలగటం లేదు.

పరిగెత్తడం వల్ల వాటి పరిస్థితిలో మార్పు రాదు. చేతులకీ, కాళ్ళ సంగతి కూడా అంతే. అప్పుడతనికి గడ్డకట్టుకుపోవడం శరీరం అంతటా వ్యాపిస్తోందన్న భావన కలిగింది. దీన్ని మరిచిపోడానికీ, నిర్లక్ష్యంచేసి మిగతావిషయాలు ఆలోచించడానికీ ప్రయత్నించేడు. దానివల్ల వచ్చే ఆందోళన ఎలాంటిదో అతనికి తెలుసు; అందుకని ఎక్కడ ఆందోళన కలుగుతుందో అని భయపడ్డాడు.

కానీ ఆ ఆలోచన పదేపదే రాసాగింది… విడవకుండా; అతని శరీరంఅంతా గడ్డకట్టుకుపోయినట్టు ఒక భ్రమ కల్పించసాగింది. అది అతనికి భరించశక్యం కాలేదు. అందుకని మరోసారి పిచ్చిగా పరిగెత్తసాగేడు. ఒకసారి అతను వేగంతగ్గించి నడుద్దామనుకున్నాడు గాని, తను గడ్డకట్టుకుపోతానేమో నన్న భయం అతను మళ్ళీ పరిగెత్తేలా చేసింది.
ఇంతసేపూ, కుక్క అతని వెనక, అతని అడుగుల వెంటే పరిగెత్తింది. అతను రెండోసారి పడిపోయినప్పుడు, దాని ముందుకాళ్ళచుట్టూ తనతోకనిచుట్టి, అతని ముందు, అతనిముఖానికి ఎదురుగా, ఏమయిందా అన్న కుతూహలంతో కూర్చుంది. ఆజంతువు క్షేమంగా, వెచ్చగాఉండడం అతనికి కోపంతెప్పించి, అతణ్ణి శాంతపరచడానికా అన్నట్టు అది దాని చెవులని వాల్చేదాకా దాన్ని తిడుతూనే ఉన్నాడు.

ఈమాటు వణుకుడు ఒక్కసారి అతని శరీరం అంతా కమ్మేసింది. అతను కొరికే మంచుతో తన పోరాటంలో ఓడిపోతున్నాడు. అతని శరీరంలోకి అన్ని వైపులనుండీ అది ప్రవేశిస్తోంది. ఆ ఆలోచన అతన్ని ముందుకి తోసింది గాని, అతను వంద అడుగులకు మించి పరిగెత్తలేక, కాళ్ళు తడబడి, తలక్రిందులుగా పడిపోయాడు. అదే అతను చివరగా భయపడింది. అతను ఊపిరి తీసుకుని నిలదొక్కుకున్నాక అతను మృత్యువును గౌరవప్రదంగా ఎదుర్కోవడం ఎలాగా అని ఆలోచించేడు. అతనికి ఇప్పుడతను చేసినపని అంతగౌరవప్రదంగా కనిపించలేదు.

అతను మెడ కోసిన కోడిలా అన్నిదిక్కులా పరిగెత్తుతున్నట్టు అనిపించింది. సరిగ్గా ఆ పోలిక అతనికి తట్టింది. ఇక అతను ఎలాగూ గడ్డకట్టుకుపోక తప్పదు. అలాంటప్పుడు మృత్యువును మర్యాదగా స్వీకరించడం మంచిది అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో అతనికి మొదటితెర మత్తు ఆవహించింది. నిద్రలోనే చనిపోవడం మంచిదే అనుకున్నాడు. అది ఒక మత్తుమందు తీసుకున్నట్టు ఉంటుంది. గడ్డకట్టుకుపోవడం మనుషులనుకున్నంత ఘోరమేం కాదు. ఇంతకంటే ఘోరంగా ఎన్నో రకాలుగా చావొచ్చు అనుకున్నాడు.

అతను కుర్రాళ్ళు తన శరీరం కనుక్కోవడం ఊహిస్తున్నాడు. తనని వెతుక్కుంటూ దారివెంట వెళ్ళిన తను, హఠాత్తుగా వాళ్ళని కలిసాడు. వాళ్లతో ఉంటూనే, త్రోవవెంట ఒక మలుపు తిరిగేక తనని తను మంచులో పడి ఉండగా చూశాడు. అతనిప్పుడు తనకి చెందడు, అలా అనుకున్నా, ఇప్పుడతను, అతనిలోంచి బయటకు వచ్చేసేడు, పిల్లలపక్కన నిలబడి మంచులో తనని చూస్తున్నాడు. అబ్బో చాలా చల్లగా ఉందనుకున్నాడొక్కసారి.

తను అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు చలి ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్తాడు. తర్వాత అతని ఆలోచనలు సల్ఫర్ క్రీక్ లోని పాతకాపు వైపు మళ్ళేయి.

తనిప్పుడు ఆ పాతకాపుని స్పష్టంగా చూడగలుగుతున్నాడు… పైపులో పొగాకు పీలుస్తూ, హాయిగా, వెచ్చగా ఉన్నాడతను.

“నువ్వు చెప్పిందే నిజం. ఎంతైనా యుద్ధంలో రాటుదేరిన గుర్రానివి. నువ్వు చెప్పిందే నిజం,” అని ఆ పాతకాపుతో ఏదో గొణుగుతున్నాడు.

తర్వాత ఆ మనిషి ఎన్నడూ ఎరగని సంతృప్తినిచ్చే, సుఖనిద్రలోకి జారుకున్నాడు. ఆ కుక్క అతని ఎదురుగానే నిరీక్షిస్తూ కూచుంది. సాగి సాగి కొనసాగిన సంధ్య, చీకట్లకు త్రోవ ఇవ్వడంతో రోజు పరిసమాప్తమైంది. ఆ మనిషి ఎక్కడా చలిమంటవేయడానికి ప్రయత్నిస్తున్న జాడ కనిపించలేదు దానికి. దాని అనుభవంలో మంచులో అలా మంటవెయ్యకుండా కూచున్న మనిషిని ఎరగదు అది.

చీకట్లు ముసురుతున్నకొద్దీ దానికి చలిమంటమీద కోరిక ఎక్కువై ముందుకాళ్లు ఎత్తుతూ దించుతూ నెమ్మదిగా మూలగడం ప్రారంభించింది; మళ్ళీ అతను తిడతాడేమోనని చెవులు క్రిందకి వాల్చింది. కాని మనిషి ఏం మాట్లాడలేదు. తర్వాత గట్టిగా అరిచింది. మరికొంచెంసేపు గడిచిన తర్వాత మనిషికి దగ్గరగా వెళ్ళి చావువాసన పసిగట్టింది. ఒక్కసారి దానికి గగుర్పాటుకలిగి వెంటనే వెనక్కి తగ్గింది.

నక్షత్రాలు స్పష్టంగా పైకిలేచి, మిణుకుమిణుకుమంటున్న ఆకాశంలోకి చూసి అరుస్తూ, కాసేపు అక్కడే తచ్చాడి, తర్వాత వచ్చినత్రోవలోనే వెనుతిరిగి, తనకి పూర్వపరిచయంవల్ల ఎక్కడ తిండీ, చలిమంటా దొరుకుతాయో అటువైపు పరిగెత్తుకుంటూ పోసాగింది.

***

To read the original story in English please visit this link:

http://www.jacklondons.net/buildafire.htm

Front page image by Edwin Tappan Adney [Public domain or Public domain], via Wikimedia Commons. Photograph, A. C. Company’s dog team, Dawson, YT, 1899, Edwin Tappan Adney, Silver salts on glass – Gelatin dry plate process – 10 x 12 cm

ఒక బొమ్మ వెనక కథే…ఈ “ఊహాచిత్రం” !

satyaprasadప్రతి కళలో కొంత కష్టం వుంటుంది. ఆ కష్టం పేరు పురిటి నొప్పులు.

ప్రతి కళాకారుడికీ ఒక సుఖం వుంటుంది. ఆ సుఖం పేరు కూడా పురిటి నొప్పులే.

ఏదో చేసెయ్యాలన్న తపన వుంటుంది. ఏవేవో తలపుకొస్తుంటాయి. ఎన్నెన్నో తొలుపుకొస్తుంటాయి. ఒక కథ రాయాలన్నా, ఒక కవిత రాయాలన్నా, ఒక బొమ్మ వెయ్యాలన్నా అవి ఒక రూపాన్ని సంతరించుకునే వరకూ ఒక అసహనం, ఒక తపన, ఒక ట్రాన్స్ లాంటి మెలకువ కళాకారులందరికీ అనుభవమే. నిద్ర, ఆకలి లేకపోవటంతో పాటు మిగతా శరీరావయాలు పనిచెయ్యడం మానేసే సందర్భాలు. పక్కనే ఎవరో పిలుస్తున్నా వినపడదు, కళ్ళ ముందు టీవీ నడుస్తున్నా అది మెదడుదాకా వెళ్ళదు. ఇలాంటి ఒక సంధి కాలాన్ని అక్షరబద్ధం చెయ్యాలని చాలా రోజుల్నుంచి అనుకుంటూ వున్నాను.

ఒక మిత్రుడి (ప్రముఖ చిత్రకారుడు)తో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితిని యథాలాపంగా ప్రస్తావించారు. “ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను. అది చేసే లోపే నేను పోతే..” అన్నారు. అక్కడ కథకి బీజం పడింది. ఆయనతో మాట్లాడినప్పుడు దొర్లిన ఆర్టిస్ట్ కు సంబంధించిన అంశాలు కొంత ముడి సరుకును ఇచ్చాయి.

ఒక మాస్టర్ పీస్ పుట్టడం వెనక ఇంత తపన, ఇంత వేదన వున్నా అంత వేదనలో నుంచి పుట్టిన ఆ కళని గుర్తించడంలో ఈ ప్రపంచం విఫలం కావచ్చు. కనీసం ఆ కష్టాన్ని కూడా గుర్తించకపోవచ్చు. ఆ గుర్తించని ప్రపంచంలో పాఠకులు వుండచ్చు, స్నేహితులు వుండచ్చు, తల్లీదండ్రీ ఆఖరుకు భార్యాబిడ్డలు కూడా వుండచ్చు. కానీ కళాసృష్టి వెనక జరిగే మధనాన్ని మరో కళాకారుడు తప్పకుండా గుర్తిస్తాడు. ఆలా గుర్తించిన సాటి కళాకారుడి అభినందన మించిన అవార్డు వుండదేమో ఈ ప్రపంచంలో. ఇది కథలో కొసమెరుపు అయ్యింది.

కథానాయకుడు చిత్రకారుడు కాబట్టి కథ కూడా ఒక సర్రియల్ చిత్రంలా వుండాలని అనుకున్నాను. కొంత చైతన్య స్రవంతి ధోరణిలో సాగినా, కాస్త రీసెర్చ్ చేసి అరువు తెచ్చుకున్న ’ఆర్ట్’ సంబంధించిన సాంకేతిక పదాలు వున్నా  సామాన్య పాఠకుడికి కూడా అర్థం అయ్యేలా రాయాలనుకున్నాను. అందుకు కొంత పాశ్చాత్య సాహిత్యం చదివిన అనుభవం ఉపయోగపడింది.

చివరగా ఈ కథ ప్రచురించబడినప్పుడు ఎందరో చిత్రకారులు నాకు ఫోన్ చేసి అభినందించడం, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు “మీరు బొమ్మలు కూడా వేస్తారా?” అని అడగటం ఆనందాన్ని ఇచ్చింది. కీర్తిశేషుడైన ఓ చిత్రకారుడి భార్య ఫోన్ చేసి ఆయన అసంపూర్ణంగా వదిలేసిన బొమ్మలను నాకు ఇస్తానని అనడం ఈ కథకు నాకు లభించిన అతి పెద్ద అవార్డు.

***

ఊహాచిత్రం

నేను లేచాను. ఇంకా మత్తుగా వుంది. లేచిన చోట అలాగే కూర్చుని గట్టిగా కళ్లు నులుపుకొని కిందకి చూశాను. కాళ్లకింద ఆ బొమ్మ … “ఆన్ క్రాస్” చార్‌కోల్ ఆన్ తార్ రోడ్. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను గీసిన బొమ్మ లాగానే వుంది. ఇంకా ఇలా రోడ్డు మీద వుండటమే ఆశ్చర్యం. దీనంగా గీసిన క్రీస్తు ముఖంలో చిన్న చిరునవ్వు … నన్ను ఆహ్వానిస్తున్నట్టు నవ్వు. నేనున్న చోటు నుంచి ఆ బొమ్మని చెరపకుండ వుండాలని జాగ్రత్తగా కదిలాను. అదృష్టవశాత్తు పాదాలు నేలకి ఆనడం లేదు.

ఎదురుగా ఏముందో కనపడటం లేదు … మొత్తం మంచుతెర. మసక మసకగా ఎక్కడో దూరంగా ఏదో జరుగుతున్నట్టు అలికిడి. మంచు కరుగుతోంది … అలా ముఖం మీద రంగులై జారుతోంది. అంతా ఏదో సర్రియలిజం పెయింటింగ్‌లాగా … ఇంకా చెప్పాలంటే మాస్ సర్రియలిజంలాగా కనపడుతూ … కరుగుతోంది …!

ఎదురుగా ఒక టీ బండి. అలాగే చూస్తూ వుండిపోయాను. అదేదో కలిసిపోయిన రకరకాల పెయింటింగ్స్ గేలరీలాగా వుంది. ఆ గోడని చూస్తుంటే అక్కడక్కడ పెచ్చులూడి, రంగులు వెలసి ఒక అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్‌ప్రెషనిజం … అదిగో అక్కడ గోడ కిందుగా ఆ మరకలు. అవి ఒంటికాలిపైన నిలబడి టీ తాగుతూ, రెండో కాలు గోడ మీద ఆనుకునే మనుషుల రకరకాల బూటు గుర్తులు, చెప్పు గుర్తులు … వాటిపైన ఎవరో పాన్ తిని వూసిన గుర్తులు. చూస్తుంటే డెభ్బైల్లో వచ్చిన ఏదో మినిమలిజం తాలూకు పెయింటింగ్ లాగా వుంది. జామెట్రిక్ అబ్స్‌ట్రిక్ట్ అన్నా కాదనలేను కాకపోతే ఆ మరకల్లో సిమెట్రీ లేదు! ఆయన పేరేంటి … అదే జామెట్రిక్ అబ్స్‌ట్రాక్ట్ కనిపెట్టిన రష్యన్ … కాజిమీర్ … కాజిమీర్ … ఏదో వుండాలి! “ఒక టీ” చెప్పాను బండి వాడితో.

పక్కనే ఒక పెద్ద రాయి. దాని మీద కూర్చున్నాను. రాయి చాలా మెత్తగా వుంది. నా వెనక గోడ మీద సగం చించేసిన సినిమా పోస్టర్. చించేసిన సగంలోనుంచి వారం క్రితం అంటించిన మరో పోస్టర్ కనపడుతోంది. కొలాజ్ …’రివీలిజం’ అనొచ్చా … అట్లాంటిది ఒకటి వుందా? ఏమో తెలియదు… టీ అమ్మే అతని వైపు చూశాను. నేనొకణ్ణి ఉన్నానన్న స్పృహే లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప్రత్యేకమైన ముఖం. మా గురువుగారు చెప్పినట్లు వృత్తం, త్రిభుజం, చతుర్భుజం ఈ మూడిటితోనే అతని ముఖం తయారైంది. రోజులో సగం కూడా గడవలేదు కాబట్టి … ఇంకా ఫ్రెష్‌గానే వున్నాడు. సాయంత్రం వచ్చి అతను చెమటతో తడిసిపోయి వున్నప్పుడు ఒక లైవ్ ఆర్ట్ చెయ్యాలి.

తల తిప్పి మళ్లీ ఎదురుగా చూశాను. నేను దాటి వచ్చిన కిటికీ ఎక్కడో దూరంగా వుంది. చూస్తుండగానే వెనక్కి వెనక్కి వెళ్లిపోయింది. ఎదురుగా జనం … పెద్ద గుంపుగా జనం. ఎంత అద్భుతంగా వుందో చెప్పలేను. అసలు జనాన్ని చూడటమే ఒక అద్భుతమైన అనుభవం. ఇంతింత చిన్న చిన్న ముఖాలలో ఎన్ని వేల ఎక్స్‌ప్రెషన్లు వుంటాయో! అదుగో అటు చూడండి … కూరగాయలకోసం వచ్చి అదంతా మర్చిపోయి గుంపు మధ్యలోకి తొంగి చూస్తున్న బట్టతలాయన … ఆయన ముఖంలో ఆత్రుత … ఆదుర్దా! ఆయన చెయ్యి పట్టుకొని “వెళ్దాం” అంటూ లాగుతున్న మూడేళ్ల పిల్ల. ఆ పిల్ల ముఖంలో చిరాకు, తొందర. పక్కనే వున్న ఆ అమ్మాయిని చూశారా … అహహ … ఆమె కాదు … ఆ లావుగా, మెరూన్ కలర్ చీర పక్కన … ఆ అదే ఆ కుక్కపిల్ల. ఆ అమ్మాయి కట్టుకున్న ఎర్ర రంగు చీరచెంగు గాలికి ఎగిరి పక్కనే వున్నాయన నల్లటి పాంట్‌మీద పడుతుంటే భలే వుంది. ఎరుపు నలుపు కాంబినేషనే అంత…!

ఇలాగే ఈ గుంపుని బొమ్మ గీసేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది … క్యూబిజంలో అయితే బాగుంటుందేమో … ఆ అమ్మాయిని మాత్రం క్యూబిజంలో ఇరికించేసి అన్ని వైపుల్నించి ఆ అమ్మాయి ముఖం గీసేస్తే … అబ్బా … మాస్టర్ పీస్ చెయ్యొచ్చు!
“ఎంతసేపు టీ ఇవ్వడానికి?” గట్టిగా అరిచి మళ్లీ గుంపువైపు తిరిగాను.

గుంపు మధ్యలోనించి ఏదో కదులుతూ బయటికి వస్తోంది. రంగు … ఎర్రటి రంగు … ఆ రంగుని చూడగానే మనసు వురకలేస్తోంది… క్యూబిజం పక్కన పెట్టి క్లాసికల్ రియలిజం వైపు మనసు పోతోంది. అవును అలాగే వెయ్యాలి. అప్పుడే నా ప్రతిభ తెలుస్తుంది … రియలిజం … నియోక్లాసిజం కలిపి … అవును నా బ్రష్‌లు ఎక్కడ పెట్టాను? నా ఇంట్లోకి ఎలా వెళ్లాలి? నల్లటి వర్షం మొదలైంది.

ఎన్ని నీళ్ళు పడ్డా ఆ ఎర్రరంగుకి ఏం కావడం లేదు… అది రంగు కాదు … నా కర్థమైంది … రక్తం! గుంపు మధ్యలో ఎవరిదో రక్తం … ఆదుర్దాగా లేచాను… పరిగెత్తాను. ఆ గుంపుని చీల్చుకొని లోపలికెళ్లి చూశాను.

ఆ శవం … ఆ శవం …

నాదే …!!

నేనే అక్కడ పడివున్నాను … ముదురు గోధుమరంగు ముఖం నాది … నా ముఖం మీద ఎర్రటి రక్తం … ఎంతైనా చెప్పండి … కాంబినేషన్ కుదరలేదు … వర్షం పచ్చగా మారింది.

***

akbar“నువ్వు నారాయణగారి పెయింటింగ్ వెయ్యాలి…”

ఈ మాట వినగానే ఎగిరి గంతేసాను. నా చేత్తో మా గురువుగారి బొమ్మగీసే భాగ్యం … అంత కన్నా ఇంక కావాల్సిందేముంది …! ఆయనంటే నాకెంత అభిమానమో చెప్పలేను…!

అసలు మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు కత్తి తీసుకొని పొడిచేద్దామనిపించింది … చంపేస్తే ఏమౌతుంది? అని ఒక క్షణం ఆలోచన వచ్చింది … ఈర్ష్య సార్ … మహా చెడ్డది ఈ ఈర్ష్య!

ఆయన వయసు అరవై దాటుతోంది! అయినా ఏదైనా బొమ్మని చూస్తే ఇంకా పిల్లాడే …! ప్రతి బొమ్మనీ, ప్రతి గీతనీ ఆ కళ్లద్దాల సందుల్లోంచి తదేకంగా చూస్తుంటాడు … ఎంత చిన్న పిల్లాడు గీసిన బొమ్మైనా సరే … అది తినేసే చూపు! ఆ తరువాత తను గీస్తాడు … మళ్లీ మళ్లీ గీస్తాడు. తాను చూసిన ఆ ఆర్ట్ ఏదైనా సరే … తనకి పట్టుబడేదాకా వూరుకోని పట్టు వదలని విక్రమార్కుడు … అందుకే పోర్ట్రేట్స్ దగ్గర్నుంచి అబ్స్‌ట్రాక్ట్స్ దాకా, ఇలస్ట్రేషన్స్ నుంచి క్యారికేచెర్స్ దాకా అన్నీ చేశాడు. ఇంకా చేస్తూనే వున్నాడు.

“ఆకలి చాలా ముఖ్యం … ఆకలికి దాసోహమనని కళ లేదు” అన్నాడొకసారి.

“అవును వ్యాన్‌గో అంత గొప్ప బొమ్మలు గీసాడంటే పాపం కడుపులో రగుల్తున్న ఆకలే కారణం … కదా గురువుగారూ?” అన్నాను అజ్ఞానంగా. ఆయన నవ్వేశాడు.

“నేను చెప్పేది ఆ ఆకలి గురించి కాదు … కొత్తది ఏమైనా నోర్చుకోవాలనే ఆకలి … అది మనసులో భగభగ మండుతుంటే ఇలాంటివి ఇంకా ఎన్నో నేర్చుకోవాలనిపిస్తుంది …” చెప్పాడాయన. ఆ తరువాత తెరిచాడు ఆయన సేకరించిన రకరకాల బొమ్మల ప్రపంచాన్ని.

ఎక్కడో చైనాలో గీసిన అబ్స్‌ట్రాక్ట్ బొమ్మలు, జర్మనీ పత్రికల్లో వచ్చిన కార్టూన్ స్ట్రిప్స్, ఇంకెక్కడో మధ్యప్రాచ్యంలో గీసిన పోస్టర్ డిజైన్స్ … ఇలాంటివి ఎన్నో . ఒక్కొక్క బొమ్మ ప్రత్యేకతని, ఆ గీతల నైపుణ్యాన్నీ చూపిస్తుంటే … ఆయనలో మరింత వుత్సాహం … నాలో నైరాశ్యం! ఆ ప్రపంచాన్ని వదిలి ఏ రాత్రి వేళో ఇల్లు చేరాక నా మీద నాకే అసహ్యం వేసింది. అన్ని బొమ్మలు చూశాక, అంత మంది ఆర్టిస్టులను కలిశాక ఇంక నన్ను నేను ఆర్టిస్ట్‌నని చెప్పుకోడానికి అర్హత లేదనిపించింది. నా ఎదురుగా వున్న నాలుగు పెయింటింగ్స్ … నేను గీసినవే … నన్ను వెక్కిరిస్తున్నట్లు. వాటి మీద కసి కొద్దీ రంగులు చల్లేశాను. ఎర్రరంగు ఇండియన్ ఇంక్ బాటిల్ మొత్తం కుమ్మరించాను.

***

ఎర్రటి రక్తం రోడ్డు మీద పరుచుకుంటోంది. ఆ రక్తం నాదే … నా శవానిదే. నేను చచ్చిపోయాను అని తెలియగానే భలే ఏడుపొచ్చింది. నా భార్యా పిల్లలు గుర్తుకు రాలేదు. అమ్మా, నాన్న, బంధువులు, మిత్రులు … వీరెవ్వరూ గుర్తుకు రాలేదు! మా గురువుగారు కూడా గుర్తుకు రాలేదు.

నా కళ్లముందు అస్పష్టంగా కనిపించింది. నేను వేస్తున్న నారాయణగారి పోర్ట్రెయిట్ పెయింటింగ్! ఇంకా పూర్తి కాలేదు … స్ట్రక్చెర్ అయిపోయింది … బేస్ కలర్స్ వేసేశాను … ఇంకా చెయ్యాల్సిన పని చాలా వుంది. అదంతా ఎవరు పూర్తిచేస్తారు అనిపించింది. అసలు పూర్తి చేస్తారా? అని అనుమానం వచ్చింది. నా వూహల్లో తయారైన చిత్రం … దానికి ఈ భూమిమీద పుట్టే అవకాశం లేకపోయింది … నా చావుతో … ఆ బొమ్మ పుట్టకముందే చచ్చిపోయింది.

ఇలాంటిదొకటి మొదలు పెట్టానని ఎవరికీ తెలిసే అవకాశం కూడా లేదు. నాకు అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి ఆ డబ్బుల కోసం వస్తాడేమో కాని, నేను గీసి సగంలో ఆగిపోయిన బొమ్మని తీసుకెళ్లడానికి మాత్రం రాడు … ఆ బొమ్మ అలా దీనంగా ‘ది క్రయింగ్ చైల్డ్’ బొమ్మలాగా అలా ఒక మూలన పడుండాల్సిందే.

ఏదో ఒక రోజు మా ఆవిడకి అదంతా అడ్డంగా తోస్తుంది. ఆ రోజు ఏ పాత సామాన్ల బండిమీద పడిపోతుందో … అంతకన్నా ఏం చెయ్యగలదు చెప్పండి … అంటే నా భార్యకి బొమ్మలంటే ఇష్టంలేదని కాదు, బొమ్మ మొత్తం గీస్తే అది బాగుందో లేదో చెప్పగలదు గానీ, ఏం బాగుందో చెప్పలేదు. అలాంటప్పుడు పూర్తిగా గీయని బొమ్మను చూసి, అది అర్థాంతరంగా ముగిసిపోయిన మాస్టర్‌పీస్ అని గుర్తించడం అసంభవం.

“ఏమిటా ఆ పరధ్యాన్నం” అంటుండేది అప్పుడప్పుడు.

“అబ్బే ఏం లేద”నే చెప్పాను చాలాసార్లు. అంతకన్నా ఏం చెప్తాను? నా మనసులో ఏదో మూల ఒక రష్యన్ చిత్రకారిణి గీసిన పెన్సిల్ ఆర్ట్ తొలుస్తోందని చెప్పనా? డావించీ కుంచె నా గుండెల్లో కస్సున దిగి రంగులు పులుముతోందని చెప్పనా … లేకపోతే నేను గీయబోతున్న బొమ్మ తాలూకు పురిటి నొప్పుల గురించి వివరించనా.

“ఇదిగో … ఒక కాలికి ఒక రకం చెప్పు, రెండో కాలికి ఇంకో రకం చెప్పు వేసుకున్నారు” చెప్పింది నేను బయలుదేరినప్పుడు.

కాళ్లవైపు చూసుకున్నాను. అవును కరెక్టే. ఇందాక వేసుకునేటప్పుడే అనుకున్నాను సిమెట్రీ లేదు అని.

నవ్వేసి “మా గురువుగారింటికి వెళ్లొస్తా …” అన్నాను చెప్పులు మార్చుకుంటూ.

“అలా ఏదో ఆలోచిస్తూ బండి నడపకండి …” జాగ్రత్త చెప్పింది పాపం.

ఆ మాటలు విన్నాను … కానీ ఆలోచనలు వూహలు కలలు మన చేతుల్లో లేవు కదా! అవి వచ్చి నన్ను కమ్మేసి ముద్దుల్లో ముంచేస్తుంటే … అరెరే నేను కుడి వైపు సందులోంచి వెళ్లాల్సింది. మాటల్లో పడి మర్చిపోయాను. కొంచెం ముందుకు వెళ్లి టర్నింగ్ తీసుకోవాలి. గురువుగారి పెయింటింగ్ ఎలా వెయ్యాలో దాదాపు ఖరారైంది … కొన్ని రిఫరెన్స్‌లు తీసుకోడానికి గురువుగారి దగ్గరకే వెళ్తున్నా. ఆయనకి బాగా పేరుతెచ్చిన మేజిక్ రియలిజం స్టైల్లో ఆయన బొమ్మ గీయాలి. దాటేస్తున్నా … దాటేస్తున్నా … మర్చిపోయి మళ్లీ కుడివైపుకి తిరగడం మర్చిపోయి, వున్నట్టుండి తిప్పడం … ఆ వెనకే వస్తున్న లారీ ఢీ కొట్టడం … అసలు ఎప్పుడు జరిగిందో తెలిసేలోగా నేను నేలమీద పడ్డాను …! నా బొమ్మ అనాథ అయిపోయింది.

***

నేనొక పిచ్చోణ్ణి. నా ముందు మసక మసకగా వున్న చిత్రాన్ని చూసి సర్రియలిజమో ఇంకేదో అనుకున్నా … ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో! పైగా టీ ఇవ్వలేదని కోపమొకటి! అలా ఎంతసేపు పెయింటింగ్‌కి పోజిచ్చినవాడిలా కూర్చోవాలో మరి. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!

నా శవం చుట్టూ జనం పెరుగుతున్నారు.

“అరెరే … హెల్మెట్ పెట్టుకోకపోతే చూశారూ …” ఆయనెవరో నీతి సూత్రం చెప్తున్నాడు.

“నేను చూస్తూనే వున్నా … అడ్డదిడ్డంగా నడుపుకుంటూ వస్తున్నాడు… తాగున్నాడేమో అనుకున్నా … వున్నట్టుండి తిప్పాడు” మరో ప్రత్యక్ష సాక్షి.

నాకు అక్కడ వుండబుద్ధి కావటం లేదు. కాని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామంటే వెళ్లనివ్వకుండా ఏదో పట్టి లాగుతోంది.

భూమ్మీదే ఏదో శక్తి ఆపుతోంది.

పోలీసులు వచ్చారు. నా మొబైల్ తీసుకొని అందులో నెంబర్లకి ఫోన్‌లు చేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.

అంబులెన్స్ వచ్చింది. నా భార్యాపిల్లలూ వచ్చారు. ఆమె ఒకటే ఏడుపు. నాకు ఏడుపు రాలేదు … ఎందుకో!

ఇంక అయిపోయింది. ఇంకాసేపట్లో తీసేస్తున్నారు. ఇకనైనా నా ఆత్మ కదలాలి … లేదే … ఇంకా ఏదో ప్రతిబంధకం!!

“ఏమైంది?” గుంపు చివర నిలబడి పక్కనే వున్న కుర్రాణ్ణి అడిగాడు ఒక ముసలాయన.

“ఏక్సిడెంట్ …. స్పాట్‌లో పోయాడు …” ఎవరో చెప్తున్నారు.

“అయ్యయ్యో … ఎవరో తెలిసిందా?”

“ఎవరో బొమ్మలేస్తాడట … ఆర్టిస్ట్” చెప్పాడతను. ముసలాయన గుంపును తోసుకొని లోపలికి వెళ్లాడు. నా శవం వైపు చూస్తూ చేతులు జోడించి నిలబడ్డాడు.

“ఏం బొమ్మ నీ కళ్లముందు కనపడతా వుండిందో నాయనా … నీ సావు నీకు కనపడలా…” అని బయటికి వచ్చాడు అతను. అదే నేను వినాలనుకుంది. నా చావుతో నా బొమ్మ మిగిలిపోయింది. నా వూహలో బొమ్మ అర్థాంతరంగా ఆగిపోయింది. కానీ, కనీసం ఒకరికైనా నా చావుకు కారణం తెలిసింది. అదే నేను వినాలనుకున్నది. నా ఆత్మ గాల్లోకి లేచింది.

ఆ ముసలాయన రోడ్డు మీద గీసిన క్రీస్తు బొమ్మపైన చిల్లర ఏరుకుంటున్నాడు. 

పదేళ్లుగా వెంటాడుతున్న ప్రళయ కావేరి!

ramasundari

అమ్మంటే కన్నతల్లి మటుకే కాదు. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.

-స.వెం.రమేశ్ Quote

ప్రళయ కావేరి కథలు…

ఈ కధలు పదేళ్ళ క్రితం నా ఆదివారపు ఉదయాలను సమ్మోహపరిచేవి. ఆ కధన సుగంధాలను రోజంతా ఆస్వాదించి, సోమవారం కాలేజ్ లో హరిత, నేను మళ్ళీ నెమరేసుకొనే వాళ్ళం. ఆ నాలుగు నెలలు ఈ కధలు మమ్మల్ని నవ్వించి, ఏడిపించి, కోపించి, స్నేహించి, బోధించి, గాలించి, గాయపరచి, నయం చేసి, చిరునవ్వుతో మాయమయ్యాయి. పదేళ్ళ తరువాత ఆ కధలు ఈ మధ్య నన్ను వేటాడటం మొదలుపెట్టాయి. దానికి కారణం  నాకు పక్షుల మీద పెరిగిన ఆసక్తి  ఒక్కటే కాదు. ఆ కధల సమ్మోహనత్వాన్ని మరింత కావలించుకోగలిగిన మనః పరిణితి పెరగటం కూడా అనుకొంటాను.

ఇటీవల మళ్ళీ ప్రాచుర్యం లోకి వచ్చిన శ్రీ రమణ ‘మిధునం’ కధ కూడ ఈ పుస్తకాన్ని నాకు గుర్తు చేసింది. ఈ కధలను రాసిన  కాలమాన, భౌగోళిక, చారిత్రక నేపధ్యంలో ఉన్న భిన్నత్వం, ఆయన కధావస్తువుగా ఎన్నుకొన్నసామాజికవర్గం, అన్నిటికి మించి ఆయన కధాస్థలాన్ని, కధలలోని పాత్రలను ప్రేమించి రాసిన వైనం నాకు పలు సార్లు గుర్తుకు వచ్చి మళ్ళీ ఈ కధలను చదవాలనే కోరిక పెరిగింది. ప్రళయ కావేరి ప్రాంతానికే (ఇప్పటి పులికాట్) పరిమితమైన  ప్రత్యేక మాండలికం, పక్క జిల్లావాసిగా నేను అర్ధం చేసుకోగలటం కూడా నన్నీ కధలలో మమేకం చేయగలిగింది .

ఈ పుస్తకం కోసం నేను ప్రయత్నం చేస్తూనే పులికాట్ కు గత డిశంబర్ లో ప్రయాణం కట్టాను. పక్షులను చూడాలనే వంక పెట్టాను కాని ప్రళయ కావేరి  దీవులను చూడచ్చు అనే కోరిక కూడా ఉండింది. నేను పులికాట్ వెళుతున్నవిషయం విని మా అమ్మ “మీ తాతలు అక్కడ నుండే వలస వచ్చారట” అని చెప్పింది. అయితే పరిమితమయిన సమయం, వనరులు మమ్మల్ని శ్రీహరి కోట వరకు మాత్రమే తీసుకొని వెళ్ళ గలిగాయి. ఊరుకోలేక  రోడ్డు దిగి పులికాట్ లో అడుగు పెట్టాను. అడుగు, అర అంగుళం మేర కూరుకు పోయింది. “మే బద్రం! మీ గెట్టి నేలోళ్ళు మా అడుసు నేలలో నడవటం చెతురు కాదమ్మే!” అని వెంకన్న తాత సైగ్గా నుల్చుని చెప్పినట్లనిపించింది.

ఈ పుస్తకం నాకు దొరికి, పుస్తక పరిచయం రాయాలని అనుకొన్నప్పుడు; పరిచయం కాదు ఈ కధలు మీద ఒక పరిశోధనే జరగొచ్చని అనిపించింది.  నిజానికి ఈ పుస్తకం ఒక నడిచిన చరిత్ర. ఒక పర్యావరణ శాస్త్రం. పరిణామ క్రమాన్ని, సామాజిక శాస్త్రం తో కలబోసి మనకు అందించిన విజ్ఞానం. ముఖ్యంగా ఈ ప్రాంత మాండలికానికి చెందిన సొగసు చదువరులకు గిలిగింతలు పెడుతుంది.  ‘ఉత్తరపొద్దు’ ప్రచురణ కాగానే మొదటి స్పందన దాశరధి రంగాచార్య నుండి వచ్చిందట. “ఉత్తరపొద్దు  తెలుగు పున్నమి వెన్నెల్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకు చక్కదనం, కలుపు మొక్క లేని తెలుగు పంట” అని స్పందించారు. కలుపు మొక్కలేదు అనటం లో ఆయన అర్ధం ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడ ఈ కధల్లో వాడక పోవటం కూడా  అనుకొంటాను.

అంతరించిపోతున్న చాలా తెలుగు పదాలని ఈయన ఈ కధలలో నిక్షిప్తం చేసారు. ఇక సామెతలు, ఉపమానాలు, నుడికారాలు పుష్కలంగా; తెలుగు సాహిత్యాభిమానులకు మనసు నిండుగా ఉన్నాయి. అక్బర్ గారు, చిదంబరం గార్ల స్కెచ్ లు మనలను కధలలోకి నేరుగా లింక్ చేస్తాయి. ఆ మాండలికంలో మనకు అర్ధం కాని పదాలకు ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు.

kaveriప్రళయ కావేరి దీవుల్లో నడిచే ఈ కధలన్నీ ఒక బాలుడి భాష్యంతో నడుస్తాయి. ఈ దీవుల్లో ఒకటైన ‘జల్లల దొరువు’లో ఉంటున్న తాతా, అవ్వల దగ్గరికి సెలవల్లో గడిపి, అక్కడి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనాన్నిరచయిత  ఆకళింపు చేసుకొని పెద్దయ్యాక తన భాషాపరిజ్ఞానంతోను, సామాజిక సృహ తోనూ రాసిన కధలివి. శంకరంమంచి ‘అమరావతి కధలు’, వంశీ ‘పసలపూడి కధలు’ ఖదీర్ బాబు ‘దర్గామిట్ట కధలు’, నామిని ‘పచ్చ నీకు సాక్షిగా’.. ఇవన్నీ ఒక ప్రాంతానికీ, రచయితకి ఉన్న అనుబంధానికి చెప్పిన అందమైన భాష్యాలే. కాని ప్రళయ కావేరి కధల్లో అనుబంధంతో పాటు ఆ ప్రాంత భౌసర్గిక స్వరూపం,  ఆహారపు అలవాట్లు, వారి సాంస్కృతిక జీవనానందాలు ,వాళ్ళ పంటలు, పిల్లల ఆటపాటలు, స్రీల జానపదాలు, పొడుపు కధలు….వీటన్నిటి వర్ణన ఉంటుంది. ఇదంతా ఎంత హృద్యంగానంటే గుండె మార్పిడి జరిగినట్లు; రచయిత అనుభవం, అనుభూతి సంపూర్తిగా పాఠకుడికి బదిలీ అవుతుంది.

రచయిత జీవితాన్ని అన్ని ముఖాల్లోంచి దర్శిస్తాడు . ప్రళయ కావేరి కధల రచయిత స.వెం.రమేశ్ అందులో పూర్తిగా సఫలీకృతం అయినట్లు నాకు అనిపించింది. ఈయన తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం పూర్తి కాలం పని చేస్తున్న కార్యకర్త.  చదివిన చదువు మానవ సమాజ పరిణామ క్రమం, తెలుగులలో రెండు ఎమ్మేలు.

రచయితకు తన తాతే బోధకుడు, తాత్వికుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని   పదాడంబరంతో కాకుండా సహజమైన సహవాసం, సాన్నిహిత్యంతో మనకు అర్ధం చేయిస్తాడు రచయిత. “అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.” అని నేర్పిన తాత రుణం ఈ కధలు రాసి తీర్చుకొన్నాడు రచయిత.

ఈ కధల నాయకుడు వెంకయ్య తాత మన రచయితను తన భుజాలమీద ఎక్కుంచుకొని లెక్కలు నేర్పాడు. “అబ్బయా! సేరుకి రెండు అచ్చేర్లు. ఒక అచ్చేరుకి రెండు పావుసేర్లు. పావుసేరుకి రెండు చిట్లు. రెండు బళిగలయితే ఒక చిట్టి. దాని కన్న చిన్నది ముబ్బళిక. అన్నింటి కన్న చిన్న కొలత పాలాడ. మూడన్నర సేరు ఒక ముంత. నాలుగు ముంతలు ఒక కుంచాము. రెండు కుంచాలు ఒక ఇరస. రెండు యిరసలయితే ఒక తూము. ఇరవై తూములు ఒక పుట్టి. రెండు తూములయితే యిద్దుము. మూడు తూములయితే ముత్తుము….పది తూములయితే పందుము.” (పుబ్బ చినుకుల్లో)

” ముక్కు కింద సంచి మాదిరి యాలాడతుండాదే అది గూడబాతు. బార్లు దీరి నిలబడుండేటివి కాళ్ళ ఉల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతావుండేటియి గుండు పుల్లంకులు. అద్దో! ఆ జత తెడ్డుమూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరెడు ముక్కుతో, పసురువన్నె రెక్కతో సొగసుగా వుండేది  ఎర్రకాళ్ళ కొంగ…….” ఇలా పక్షిశాస్త్రాన్ని భోదిస్తాడు. (కొత్త సావాసగాడు)

ఇక చేపల రకాల గురించి చెబుతూ  “ఆ తట్టు యెండి మాదిరి మెరుస్తుండాయే, అయ్యి వంజరం చేపలు. అల్లా సప్పిటి మూతియి వాలగలు. వాలగ బలే వాతపు చేప. నాలుగునాళ్ళు వరుసగా తిన్నామంటే, కాళ్ళు, కీళ్ళు కదలవు. వుల్లంకుల వన్నెవి కానాగంతలు.   తెడ్డు అమ్మిడ మూరెడు పొడుగు ఉండాయే, అవే మాగ చేపలు. సముద్ర చేపల్లో మాగంత రుసి యింకేది వుండదు. అయి తుళ్ళు సేపలు. వొట్టి ముళ్ళ కంపలు. పాము మాదిరి సన్నంగా వుండేటివి మొలుగులు, నోట్లో యేసుకొంటే యెన్న మాదిరి కదిరి పోతాయి.” (సందమామ యింట్లో సుట్టం)

కోస్తా తీరం వెంబట  పెరిగిన నేను ఈ చేపలన్ని రుచి చూసాను.

ఈ కధలలో ప్రధాన పాత్రలను పక్కన బెడితే, కొద్ది సేపున్నా నన్ను అత్యంత ప్రభావితం చేసిన పాత్ర గేణమ్మ. (కత్తిరి గాలి) వెంకన్న తాత అక్క కాశెమ్మవ్వ కూతురు. “గేణమ్మవ్వ మంచిది” అని తనలోని బాలుడి చేత చెప్పించి, గేణమ్మ ఎంత పని చేసేదో రచయత తన ఎదిగిన మెదడుతో చెబుతాడు. “ఇల్లంతా బూజులు గొట్టి చిమ్మింది. పాలవెల్లి దించి శుద్దం చేసింది. పరంటింట్లో, సుట్టింట్లో యాడన్న గుంటలు పడుంటే బంకమట్టి పూసి సదరం చేసింది. పేడేసి యిసిరంగా అలికింది. పరంటింటికి సున్నం గొట్టి యెర్రమట్టి వోరు తీసింది. బొట్టల క్రింద కలుకుల్లో పొగపెట్టి యెలికల్ని తరిమింది. మునగ చెట్టుకు పట్టిన కమ్మిటి పురుగుల్ని యెదురు కర్రకు మసేలిక సుట్టి గబ్బుసమురుతో ముంచి మంట కాల్చి చంపింది. మల్లి గుబురుకి పాది చేసి, ఆకు దూసి నీళ్ళు పోసింది. ”

ఇలా రెండు పేరాలు రాసి చివర్లో “ఇరవై కాళ్ళు, ఇరవై చేతుల్తో వొంటి మనిషి వొకటే మాపన కత్తిరి యెండల్ని లెక్కబెట్టకుండా పన్లన్నీ చేసింది గేణత్త” అంటూ ముగిస్తాడు. ఈమెలో మనకు మానవపరిణామక్రమంలో నాగరికత అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆదిమకాలంనాటి స్త్రీ మూర్తి ఆవిష్కరిస్తుంది. ఒక్క గేణమ్మే కాదు, మండుటెండలో దాహంతో అల్లాడుతున్న బాలుడికి తన చనుబాలుతో బతికించిన వసంతక్కలో కాని, దిగులుతిప్పలో కూరుకుపోయిన బాలుడ్ని రక్షించటానికి తన ఎనిమిది గజాల కోకను ఇప్పేసి బిత్తలిగా నిలబడిన సుబ్బమ్మవ్వలో కాని; భుజానికి బిడ్డలను కట్టుకొని వేటాడి కడుపులు నింపిన మాతృసామ్య మహిళలే కనబడతారు కాని, అనుక్షణం స్త్రీత్వం ఆపాదించి రొమాంటైజ్ చేయబడిన నేటి సాహిత్యంలోని దౌర్భాగ్య స్త్రీ పాత్రలు కనబడవు.

ఇంకొక ఆసక్తికరమైన పాత్ర వసంతక్క. అడవిలో నల్లబావతో కలిసి రాత్రంతా కాపలాకాసి పట్టిన చెవుల పిల్లులను (కుందేళ్ళు) నల్లబావ భోంచేస్తాడని  “అకా! ఇంత కష్టపడి పట్టుకొనింది సంపేసేదానికా” అని బాలుడు కన్నీళ్ళు పెట్టుకోగానే వాటిని వదిలిపెట్టి నల్లబావకు “సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి.” అని ముసిముసిగా నవ్వుతూ జవాబు చెబుతుంది. (సందమామ యింట్లో సుట్టం)

ఈ కధా కాలం ఎనభైవ దశకం అనుకొంటాను. అప్పటికీ ప్రళయకావేరి దీవుల్లో భాగాతాలు, నాటకాలు, వాటిని చూడటానికి పక్క దీవుల నుండి చుట్టాలు బండ్లెక్కి రావాటాలు ఇవన్నీ ఉండేవి. పల్లెల్లో సాంస్కృతిక కాలుష్యం గురించి రచయిత తన ఆవేదనను కధలో జొప్పించాడు. “మా కడగళ్ళు దేనికి అడగతావులే సోమి! పేటలో సినిమా ఆటంట, పెద్ద కొట్టాం కట్టి , దాంట్లో దినానికి రొండాట్లు ఆడతా వుండారు. పేట చుట్టు పక్కల వూళ్ళల్లో యిప్పుడు భోగాతాలు సూసే వాళ్ళే లేరు. నెమిలాటలు లేవు. పామాటలు లేవు. కీలు గుర్రాలు లేవు. మరగాళ్ళు లేవు. యీరదాళ్ళు లేవు, పంబజోళ్ళు లేవు.యానాది చిందుల్లేవు, యీరబద్ర పూనకాలు లేవు.” (కాశెవ్వభోగోతం) ఇక్కడ ఒక సమాజంగా బ్రతికిన కులాలు పెద్దీటి గొల్లలు, యానాదులు, తూరుపు రెడ్లు, వెలమలు, బేరిశేట్లు, పట్టపు కాపులు, దేశూరి రెడ్లు.

రచయితలోని భావుకుడు కధకొక సారైనా తొంగి చూస్తాడు.

“సలికాలం సాయబోయిన అమ్మ నేతకోక, వానాకాలం చిక్కంగా అల్లిన జమ్ముగూడ, యెండాకాలం సల్లని కానగమాను నీడ; యీటిల్లోమునిగి, ముదుక్కొని, వొదిగి, వొళ్ళిరుసుకోని బతుకు దేనికి?”

“ఆకాసం నుండే సుక్కలన్నీ అడివిలోకి వొచ్చేసినుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకు మిస మిస మెరిసి పోతుండాది. అడివమ్మ ఒల్లంత తళుకులు అంటుకొనీ తళతళమంటా వుండాయి.” (మిణిగురు పురుగుల వర్ణన).

“నీలమంటే అట్టాంటిట్టాంటి నీలం కాదు, కావేరమ్మను పలకరించను మిన్ను దిగొచ్చినట్లు, మిన్నువన్నె మన్నువన్నె కలిపి మిసమిస లాడే నీలం”.

“సడీ, సందటి లేకుండా సందకాడ సల్లంగా కురిసి పోయ్యింది వాన. తల్లాకిట అవ్వేసిన సంద ముక్కర్ర, వానతో పాటు వీధి పెత్తనానికి పొయ్యింది. దడి పక్కన ముడుసుకొని కూసున్న మల్లి గుబురు, పుట పుట చినుకులు రాలతోనే వొళ్ళు ఇరుసుకొని, తెల్ల పూల కోక కట్టుకొనింది. మల్లె గుబురు పైనుంచి వొచ్చిన వానగాలి, సల్లటి వాసనతో నాకు సక్కలిగిల్లి పెట్టి, పరమటింట్లో పటాలకు మొక్కను పొయ్యింది.”

ఇలాంటి గిలిగింతలు పెట్టే పదలాలిత్యం పుస్తకమంతా తొణికిసలాడుతూ ఉంటుంది.

అక్షరాలతో నోరూరించగలిగాడు ఈ కధకుడు.

“వొంగొగురు, యిసిక మెత్తాళ్ళు. కలిపి యెగరేసుకొంటే, సట్టిడు కూడు సడీ సప్పుడు లేకుండా లోపలికి ఎల్తాది.”

“అటికి మామిడాకులో పెసల పప్పేసి యెణిపినబయా”

“ పెసర పొప్పులో పుట్ట కూడేసి యిగరేసుకొంటే, ఆ రుసి చెప్పబళ్ళే!”

ఇక అవ్వ చేతి చిరుతిళ్ళు చూడండి. “తంపటేసిన గెణుసు గడ్డలు, యేంచిన చెనక్కాయలు, సద్దనిప్పట్లు, ఉడకేసిన బెండలం గెడ్డలు. నిప్పట్లు, మణుగుబూలు, పులుసన్నం, రవ్వుంటలు, చెనగుంటలు, బొరుగుంటలు, మూసుంటలు, చిమ్మిరుంటలు, తైదుంటలు, పెసలుంటలు, నువ్వుంటలు, సాపట్లు, దూపట్లు, దిబ్బట్లు, చీపిరొట్లు, తెదురొట్లు, పాకం పోరలు, కమ్మరట్లు, అలసందొడలు, పులిబంగరాలు, సియ్యాళ్ళు, కారామణి గుగ్గిళ్ళు”

ప్రళయ కావేరి వాసుల ప్రధాన పంట తమదలు (రాగులు). (ఏడాదికి రెండు వానలు పడితే పండే తమదలను వదిలేసి దండిగా నీరు కావాల్సిన వరిపంటను పండించటం గురించి రచయత బాధ పడ్డాడు.) చిక్కని మజ్జిగ కలిపిన అంబలి చిన్నతపీలుడు తాగటం, నెల్లి చెట్టు కింద కూసోని దోసిట్లో వేసిన సద్ది కూడు కిచ్చరగాయ(నారింజ కాయ) ఊరగాయతో తినటం,,,నా ఊహ తెలిసాక మా అమ్మమ్మ చెబుతుంటే యిలాంటివి విన్నాను.

ఇక అవ్వ “యాడ్నించి తెస్తాదోగానీ, అటిక మావుడాకు, నాసరజంగాకు, పొప్పాకు, యెన్నముద్దాకు, చెంచులాకు, బచ్చలాకు, కోడి జుట్టాకు, ముళ్ళ తోటాకు, చామాకు, బొక్కినాకు, దొగ్గిలాకు, కాశాకు, తుమ్మాకు, మునగాకు, అవిశాకు,….యిట్టా ఎన్నో రకాల ఆకులు తెచ్చి కూరలు చేస్తుంటాదవ్వ. ఆ పొద్దు కూడ చెంచలాకు కూర చేసుండాది.” ప్రళయ కావేరి దీవుల్లో  ఫల సంపద పాలపండ్లు, కలిగి పండ్లు, బీర పండ్లు, బిక్కిపండ్లు, నిమ్మటాయలు, ఊటి పండ్లు, గొంజి పండ్లు, బలిజ పండ్లు, ఎలిక చెవులు, పిల్లొట్టాలు, చిట్టీతకాయలు, అత్తిపొండ్లు, నుంజలు (ముంజలు). ఈ ఆహారాలతో పెరిగిన మన రచయత అంత ఆరోగ్యమైన రచనలను మనకందించాడు.

ఈ పిట్టల పేర్లు మీరెప్పుడైనా విన్నారా! “చిలుకలు, గోరింకలు, బెళవాయిలు, జీని వాయలు, గోరింకలు, చిలవలు, చింతొక్కులు, టకు టకు పిట్టలు, జిట్టి వాయిలు, పాల పిట్టలు, వూరికాకులు, జెముడుకాకులు, పందిట్లో పిచుకలు, యింట్లో కోళ్ళు, గిన్నె కోళ్ళు. యింటి ఆవరణంతా ఒక తూరి తిరిగితే, యెన్ని వన్నెల యీకలు దొరకతాయో చెప్పలేము.”

ప్రళయ కావేరి పిల్లల బాల్యాన్ని పండిచిన ఆటలు: మగపిల్లల ఆటలు కోతికొమ్మచ్చి, కోడుంబిళ్ళ, వుప్పరపిండి, పిళ్ళారాట, వొంటి బద్దాట, రెండు బద్దీలాట. ఆడపిల్లల ఆటలు వామన గుంటలు, అచ్చంగాయలు, గెసిక పుల్లలు, గుడుగుడు గుంజెం, చికు చికు పుల్ల, బుజ్జిల గూడు, బుడిగీలాట, కుందాట, కుర్రాట, మిట్టాపల్లం, వొత్తిత్తి సురొత్తి. (ప్చ్. మన పిల్లలు ఎంత దురదృష్టవంతులో!)

రచయితకి ప్రాచుర్యం అవార్డుల ద్వారా రాదు. ఆయన సృష్టించిన పాత్రలలో పాఠకులు ఎంత మమేకం అయ్యారో అనే దాని మీదే వస్తుంది . ఆ రకంగా ఈ రచయత ధన్యత చెందినట్లే. ఒక పాఠకుడు కధలోని పాత్రలు నిష్క్రమించటం మీద కోపం  ప్రకటిస్తూ ఉత్తరం రాసారు. ఎప్పుడైనా ‘జల్లల దొరువు ‘ వెళితే ఆ పాత్రలు తమను ఆహ్వనించాలట. ఒక పాఠకుడు “నేను తప్పిపోయిన లోలాకులగాడ్ని” అంటూ ఉత్తరం రాసారు. ఒక పాఠకురాలు “నేను గుండుపద్నను రా” అంటూ.  అంతగా పాఠకులు ఈ కధలలో ఇన్వాల్వు అయ్యారు. పాఠకులందరూ కోరుకొన్నట్లుగా స.వెం.రమేశ్ గారి  నుంచి ఇంకా ఎంతో మంచి సాహిత్యాన్ని నేనూ కోరుకొంటున్నాను.

ప్రతులకు:

http://kinige.com/kbook.php?id=478&name=Pralayakaveri+Kathalu

 

‘ఊరిచివర ఇల్లు’ నుంచీ ‘ఎడారి వర్షం’ వరకూ…

సాహిత్Edari Varsham-2 (edited)యాన్ని సినిమాలుగా తియ్యడం అనేది కత్తి మీద సాములాంటి ప్రక్రియ. అప్పటికే పాప్యులరైన రచనగానీ, అత్యధికంగా గౌరవింపబడి ప్రేమింపబడుతున్న రచయితల సాహిత్యమైతే మరీను. ఎందుకంటే రచన అపరిమితమైన భావపరిధిలో ఉంటూ ఇమ్యాజినేషన్ పరంగా ఎల్లలులేని విధంగా ఉంటుంది. పాఠకుడికి-రచయితకూ మధ్య ఉన్న అప్రకటిత నిశ్శబ్ధ అనుబంధం లాంటి జంట సంభాషణలాగా గడిచిపోతుంది. కానీ సినిమా అలాకాదు. అదొక పరిమితమైన దృశ్య మాధ్యమం. దానికి ఫ్రేములుంటాయి. సింటాక్స్ పరిథి ఉంటుంది. ఎల్లలు చాలా ఉంటాయ్. నటీనటులు, లొకేషన్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, బడ్జెట్ ఇలా  పరిమితులు చాలా అధికంగా ఉంటాయి.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వీలైనంత అధిగమిస్తూ, రచయిత ఇచ్చిన కథలోంచీ ఒక అంగీకారాత్మక భాష్యాన్ని స్క్రీన్-ప్లే గా కుదించి సినిమాగా తియ్యాలి. కొన్ని కొన్ని సార్లు సినిమా కథకన్నా గొప్పగా తయారవ్వొచ్చు. ఒక్కోసారి కథకన్నా వేరేగానూ తయారు కావచ్చు. చాలా వరకూ కూసింత కథ చదివిన పాఠకుడిని, సినిమా చూసే ప్రేక్షకుడినీ నిరాశపరచొచ్చు. దీనికి గల కారణాలు మాధ్యమాల మార్పు కొంత అయితే, రచనని విజువల్ లాంగ్వేజ్ లోకి మార్చలేని ఫిల్మ్ మేకర్స్ విజన్ కొరత మరింత.

సత్యజిత్ రే లాంటి ఫిల్మ్ మేకర్ బిభూతిభూషణ్ బందోపాధ్యాయ నవలను  పథేర్ పాంచాలి గా తీసినప్పుడు “అబ్బే నవల లాగా లేదు” అన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. దానికి సమాధానంగా సత్యజిత్ రే భాషాపరమైన లేదా రచనపరమైన సింటాక్స్ కి ,సినిమాటిక్ లాంగ్వేజ్ కీ మధ్య తేడాలను ఉంటంకిస్తూ పెద్ద వ్యాసమే రాయాల్సి వచ్చింది. అయినా తిట్టేవాళ్ళు తిట్టారు, అర్థం చేసుకున్నవాళ్ళు చేసుకున్నారు. ఇప్పటికీ అటు నవల ,ఇటు సినిమా రెండూ క్లాసిక్స్ గా మనం చదువుతున్నాం, చూస్తున్నాం. అందరూ సత్యజిత్ రేలు కాకపోయినా, సాహిత్యం నుంచీ సినిమాతీసే అందరు ఫిల్మ్ మేకర్స్ ఫేస్ చేసే సమస్యే ఇది.

తెలుగు ఇండిపెండెంట్ సినిమా గ్రూప్ సాహిత్యం నుంచీ కథను ఎన్నుకుని లఘుచిత్రం చేద్దాము అనుకున్నప్పుడు మొదట ప్రతిపాదించబడ్డ కథల్లో చలం, బుచ్చిబాబు, తిలక్ కథలు ఉన్నాయి. రిసోర్సెస్ పరంగా మాకున్న లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని కొద్ది పాత్రలతో మానవీయ కోణాన్ని ఆ రచయిత గొప్పతనాన్ని షోకేస్ చెయ్యగల కథకోసం వెతకగా ఫైనల్ చేసిన కథ “ఊరిచివర ఇల్లు”. కథని యథాతథం గా  తీద్దామా, అడాప్ట్ చేసుకుందామా అనే ప్రశ్న అస్సలు ఉదయించలేదు. ఎందుకంటే స్క్రీన్-ప్లే అనేది అనుసరణే అవుతుంది తప్ప కథానువాదం కానేరదు. నాతోపాటూ మరో ముగ్గురు రచయితలు వారి వారి వర్షన్స్ లో స్క్రీన్-ప్లే రాశారు. గ్రూప్ గా స్క్రీన్ ప్లే మీద చర్చ జరిగినప్పుడు నా వర్షన్ ని సినిమా తియ్యడానికి ఎంచుకోవడం జరిగింది.

“ఊరిచివరి ఇల్లు” కథ జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథ.

తిలక్ “ఊరిచివరి ఇల్లు” కథని అడాప్ట్ చేసుకుని  రాస్తున్నప్పుడు స్క్రీన్ ప్లే రచయితగా నాకు మూడు విషయాలు పొసగలేదు. ఒకటి, రమ జగన్నాథానికి తనకు ప్రేమలో జరిగిన దురదృష్టం, ఆతర్వాత నమ్మిన పెద్దమనిషి చేసిన మోసం, ఇప్పుడు అవ్వ పంచన బ్రతుకుతున్న వైనం చెప్పేస్తే రమ ఒక వేశ్య అనే విషయం ఆల్రెడీ సజెస్ట్ అయిపోయిన భావన కలుగుతోంది. ముఖ్యంగా రమ పాత్రలోని సంశయం, మాటిమాటికీ రమ జగన్నాథం తో(సినిమాలో శేఖరం అయ్యాడు) ‘ఇంకేమీ అడక్కండీ’ అంటూ ఏడవటం చాలావరకూ ‘giving away’ ఫీలింగునే కలిగించాయి. పైగా కథాకాలం ప్రకారం చూస్తే ఆరంభంలో వచ్చే ఇంటి సెటప్ వర్ణన ‘సానెకొంప’ అనే విషయాన్ని అన్యాపదేశంగా రచయిత సజెస్ట్ చేసిన భావన కలిగింది. ఇలా రివీల్ అయిపోతే జగన్నాథం షాక్ కి విలువ తగ్గిపోతుంది. అంతేకాక దాన్ని విజువల్ గా చూపించాలంటే లాంగ్ షాట్లో వర్షం కురుస్తుండగా ఇంటిని ఎస్టాబ్లిష్ చెయ్యాలి. అది కొంచెం కష్టమే అనిపించింది.  కాబట్టి తండ్రి గురించి చెప్పే విషయాలనుంచీ పెద్దమనిషి చేసిన మోసం వరకూ కొంత కన్సీల్ చేసేస్తే సినిమా ఇంకొంచెం గ్రిప్పింగా ఉంటుందనిపించి దాన్ని తీసేశాను. షూటింగ్ సౌలభ్యం కోసం వర్షం ఎఫెక్ట్ లో ఉన్న ఇంటి ఇంటీరియర్లో ఆరంభపు సీన్ కానిచ్చేశాను.

రెండోది రమ-జగన్నాథం లు ఆ రాత్రి ప్రేమించుకున్నారా లేదా అనేది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటం, ప్రేమను తెలుపుకోవడం వరకూ చాలా క్లియర్గా కథలో ఉంది. కానీ ఇద్దరిమధ్యా భౌతికమైన కలయిక జరిగినట్టు కథలో సజెస్ట్ చేశారని నాకు అనిపించిందేతప్ప జరిగినట్టు ఖచ్చితంగా చెప్పలేము. జగన్నాథం అవ్వమాటలకు అంతగా గాయపడాలన్నా, రమ తనని అంతగా మోసం చేసిందని అనుకోవాలన్నా,‘అమ్మాయి అంతగా నచ్చిందా’ అని అవ్వ ప్రశ్నించాలన్నా వీటన్నిటీకీ ఒక బలమైన ఫౌండేషన్ కావాలి. అది కేవలం ప్రేమ వెలిబుచ్చుకుంటే రాదు. ప్రేమించుకుంటేనే (through making love) వస్తుంది. తిలక్ గారు కూడా ఒక దగ్గర రమకు ఆవరించిన ఆవేశాన్ని, కమ్మిన మైకాన్ని గురించి చెబుతూ తన సెక్సువల్ అగ్రెషన్ ని చూపిస్తాడు. రమ ముద్దులు పెడుతుంటే ఊపిరాడక జగన్నాథం చేత “అబ్బ వదులు-వదులు రమా” అనిపించాడు. ఆ తరువాత రమ తయారైన తీరు గురించి వర్ణన, ఆపైన ఇద్దరి మధ్యా నడిచే రొమాన్స్ చెప్పకనే వారి కలయిక గురించి సజెస్ట్ చేస్తాయి. ముఖ్యంగా “ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనస్సుయొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెలుచుకుంటూన్నట్టనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతున్నట్టు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి వెయ్యిరేకుల పద్మంలా విరిసింది” అనే వాక్యాలు ఎంత బలీయంగా సెక్సువల్ రెఫరెన్సెస్ అనిపిస్తాయి అనడం నా interpretation కి మూలం. అందుకే స్క్రీన్ ప్లే లో నేను లిబర్టీ తీసుకుని వాళ్ళమధ్య ప్రేమ జరిగినట్టు రాశాను. ఒక పాటనేపధ్యంలో వాళ్ల మధ్య రొమాన్స్ కూడా తీశాం.

తిలక్ గారి మనవరాలు నిషాంతి ఒక నటి. ఎల్.బి.డబ్లు అనే తెలుగు సినిమాలో నటించింది. రమ పాత్రను తనైతే బాగుంటుంది, పైగా తిలక్ కథలో తిలక్ మనవరాలు నటిస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో అడగటం, స్క్రిప్టు పంపడం, చర్చించడం జరిగింది. తను కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించలేకపోయింది. కానీ స్క్రిప్టు చదివాక తను అన్న మాట “మీరు తిలక్ కథకి చలం స్క్రీన్ ప్లే రాశారనిపించింది” అని. బహుశా అది నేను చేసిన ఈ మార్పుని ఉద్దేశించో లేక నేను చెప్పబోయే మరో మార్పు గురించో మాత్రం తెలియలేదు. కాస్త సంతోషంగా మాత్రం అనిపించింది.

అవ్వ లేనిపోని అపోహల్ని జగన్నాథం లో కల్పించడం, నిద్రపోతున్న రమకు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా జగన్నాథం పర్సు పరుపు మీద పడేసి వెళ్ళిపోవడం. నిద్రలేచి విషయం తెలుసుకున్న రమ పర్సుపట్టుకుని పరుగెత్తడం. కదులుతున్న ట్రైన్ లో ఉన్న జగన్నాథానికి పర్సు అందించడం. ఆ పర్సులో చూసుకున్న జగన్నాథం డబ్బులు అన్నీ ఉండి కేవలం తన ఫోటో లేకపోవడం తరువాత కథలో జరిగే పరిణామాలు. ఫోటోలేని పర్సుని చూసి జగన్నాథం రమ డబ్బుకోసం తనని మోసం చెయ్యలేదు అనే గ్రహింపుకు వస్తే, ఇమ్మీడియట్ గా చైన్ అన్నా లాగి బండిని ఆపెయ్యాలి లేదా తరువాతి స్టేషన్లో దిగన్నా రావాలి. కథలోలాగా ఆ పాయింట్లో ముగిస్తే సినిమా చాలా అసంపూర్ణంగా ఉంటుంది. పైగా, ముసలిది చెప్పిన కొన్ని అబద్ధాల్ని నమ్మి ప్రేమించానని కన్ఫెస్ చేసిన ఇతగాడు, నిద్రపోతున్న రమని లేపి కనీసం “ఎందుకిలా మోసం చేశావ్” అని ప్రశ్నించకుండా అనుమానపడి పర్సు పరుపుమీద పడేసి వెళ్ళిపోతాడు. అట్లాటోడు తిరిగొస్తేమాత్రం రమకు ఏమిటి సుఖం? ఎంతవరకూ అలాంటివాడి ప్రేమ నిలబడుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే శేఖరం(జగన్నాథం) పాత్రని అప్రస్తుతం చేసి (కనీసం చూపించనైనా చూపించకుండా) రమ- శేఖరం కోసం ట్రెయిన్ వెంబడి పరుగులెత్తి అలసి సొలసి ప్లాట్ ఫాం మీద పడిపోవడంతో ముగించి చివరగా “జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు దురదృష్టవంతులు. ఏం కోల్పోయామో ఎప్పటికీ తెలుసుకోలేని వాళ్ళు శాపగ్రస్తులు” అంటూ శేఖరం ని శాపగ్రస్తుడిని చేసి వదిలేశాను. కథను అభిమానించిన చాలా మందికి ఈ ముగింపు నచ్చలేదు. కథలో ఉన్న హెవీనెస్ ఫిల్మ్ లో రాలేదన్నారు. అలా అన్న కొందరికి నేను చెప్పిన సమాధానం “ఒక ఫెమినిస్టుగా ఆ ముగింపు నాకు నచ్చలేదు. అందుకే కొంత మార్చాను” అని.

ఛివరిగా శీర్షిక గురించి. స్క్రిప్టు మొత్తం రాసేసరికీ కథ ధృక్కోణం తిలక్ గారి కథలోలాగా కాకుండా వేరేగా కనిపించడం మొదలయ్యింది. జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథలాగా కాకుండా, వర్షం కోసం ఎదురుచూస్తున్న ఎడారిలాంటి రమ జీవితంలో శేఖర్/జగన్నాథం ఒక తొలకరిజల్లులా కురిసి కనీసం తడి ఆనవాలు కూడా లేకుండా ఇగిరిపోయి, రమను మళ్ళీ ప్రేమకోసం అలమటించేలా వదిలేసిన ఒక శాపగ్రస్తుడి కథలాగా అనిపించింది. ఇందులో జరిగిన ఘటన ప్రముఖం. రమ ప్రేమ అనిర్వచనీయం. ఉన్నతం. శేఖరం ఉనికి అంత ఉదాత్తమైన ప్రేమకు అర్హం కాని దయనీయం. అందుకే లఘుచిత్రం “ఎడారి వర్షం” అయ్యింది.

STORY

FILM
Part1

Part 2

ఛానెల్ 24 / 7 – రెండో భాగం

Channel 24-2 

(కిందటి భాగం తరువాయి)

sujatha photo

“ఉపేంద్రా… నాకు తెలుసు.. నువు నన్ను పట్టించుకోవటం లేదు.. ”

“అంటే…”

“అంటే ఏవుందీ.. నాకెన్ని బులెటిన్‌లు? ఉదయం 8 గంటలకు ఒకటి, రాత్రి ఎనిమిదికి ఒకటి… అంటే ఎన్ని గంటలు.. నన్ను సాధిస్తున్నావు కదూ..” గొంతు పోయింది పల్లవికి.

ఉపేంద్ర తల పైకి ఎత్తకుండానే కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. తను అలా చూస్తే ఎంతో రొమాంటిక్‌గా వుంటాడని మేకప్‌మెన్ రుద్ర లక్షసార్లు చెప్పాడు ఉపేంద్రకి.

“నా గురించి నీకు అలాంటి ఇంప్రెషన్స్ ఉన్నాయంటే ఐయాం సారీ..”

“ఇంప్రెషనేమిటీ.. ఫాక్ట్.. కావ్యకి నాలుగు బులెటిన్లున్నాయి. ఆమె మొహం అంత నచ్చిందా..?”

“ఓ షిట్.. నాకు నచ్చటమేమిటి.. మీరేమంటున్నారు పల్లవీ..”ఉపేంద్ర మొహం ఎర్రబడింది.

పల్లవి కంగారు పడింది.
“ఉపేంద్ర.. ప్లీజ్.. మీరు వేరే విధంగా అనుకోవద్దు. చనువుకొద్దీ అన్నాను. మీరు తప్ప నన్ను ఈ ఫీల్డ్‌లో ఎంకరేజ్ చేసేవాళ్లు ఎవరున్నారు?” అన్నది లాలనగా.

ఉపేంద్ర మొహం చూస్తూనే పల్లవికి ధైర్యం వచ్చింది. జుట్టు చేత్తో సరిచేసుకొంది. చెవుల జూకాలు కదిలేలాగ ఓ సారి తల తిప్పింది. నల్ల బ్లేజర్‌లోంచి తెల్లగా కనిపిస్తున్న తన తెల్లటి చేతులవైపు చూసుకొంది. పర్లేదు. ఇవ్వాళ ఉపేంద్ర చేత అవుననిపించాలి.

“వన్.. మినిట్..”

ఉపేంద్ర సెల్‌లో ఎవరితోనో మాట్లాడటం మొదలుపెట్టాడు. పల్లవి చుట్టూ చూసింది. కాబిన్‌లో యాంకర్స్ ఎవళ్ళూ లేరు. నయన థర్ద్ స్టూడియోలో వుంది. రెండు గంటలవరకూ రాదు. మార్చి ఎయిట్ సెలబ్రేషన్స్ లైవ్‌లో కావ్య ఇరుక్కుపోయింది. మినిమం వన్ అవర్. చచ్చినా రాలేదు. బ్లూ‌మేట్‌లో రవీంద్ర.. యమున పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ రికార్డింగ్‌లో ఉంది. వాయిస్ ఓవర్ శాంతికి, కృష్ణకి మునిగిపోయేన్ని ప్యాకేజీలు వున్నాయి. చెరో పాతిక స్క్రిప్ట్‌లు పట్టుకొని ఆడియో రికార్డింగ్ స్టూడియోలో వేలాడుతున్నారు. కన్‌ఫర్మ్. ఇవ్వాళ ఉపేంద్ర ఊ అనేదాకా.. నోవే..

మొహం పైకి నవ్వు తెచ్చుకొంది పల్లవి.

ఫోన్ మోగింది. మ్యూట్‌లో వుంది కనుక ఎవ్వళ్లకీ వినబడదు. విసుక్కుంటూ పల్లవి ఫోన్ తీసింది. సంతోష్.. రిజక్ట్ చేసింది. ఫోన్ వంకే చూస్తోంది. తప్పనిసరిగా మెసేజ్ పెడతాడు. వెంటనే మెసేజ్ వచ్చింది. పాపకి ఫీవర్ నార్మల్ వచ్చింది, ఈ రోజు నాకు సెలవు దొరికిందని.

పల్లవికి ఈల వేయాలనిపించింది. సంతోష్ ఇంట్లో వుంటే ఇక బెంగే లేదు. తను చూసుకొంటాడు. ఫోన్ బ్యాగ్‌లోకి తోసేసి ఉపేంద్ర వైపు నవ్వు మొహం పెట్టుకు కూర్చొంది.
ఉపేంద్ర ఫోన్ పక్కన పెట్టాడు.

“నీకూ.. రవివర్మకి అండర్‌స్టాండింగ్ ఏమిటి?”

డైరెక్ట్‌గా ముగ్గులోకి వచ్చాడనుకొంది పల్లవి.

“ఏవుంది?  ప్రోగ్రాం.. మార్నింగ్ ఫైవ్ రెగ్యులర్‌గా నేను, రవివర్మ కలిసి చేయాలని ఎం.డి. అన్నారు కదా…”

రిలాక్స్‌గా వెనక్కు వాలి కూర్చుంది. ఉపేంద్ర ప్రాబ్లం అర్ధం అయింది పల్లవికి. రవివర్మ అంటే జెలసీ.

“నీకు మార్నింగ్ బులెటిన్స్ ఓకేనా ? ” అన్నాడు ఉపేంద్ర.

పల్లవి గబగబా ఆలోచించుకొంది. అంటే రవివర్మతో మార్నింగ్ ఫైవ్‌ని వదిలించుకోవాలి. తనకి ప్రోగ్రామ్స్ ఎందుకు , న్యూసే కావాలి.

“మరి ఆ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు?” అంది దిగులుగా మొహం పెట్టి.

“ఎవళ్ళో ఒకళ్ళు.. ఉషాకి ఇద్దాము.. “టెన్షన్‌గా అంటున్నాడు ఉపేంద్ర.

“రవివర్మ ఉషాగార్ని రిజక్ట్ చేశాడు,” అన్నది పల్లవి.

ఆవిడ పెద్దావిడ కదా. నాతో కాంబినేషన్ బావుండదు అన్నాడు ఎం.డీ.గారితో,” అన్నది పల్లవి.

నవ్వు ఆపుకొన్నా ఆగటం లేదు ఆమెకు.

ఉపేంద్ర, రవివర్మ.. ఇద్దరికీ తన పైన నమ్మకం వుంది. తను ఉపేంద్ర వైపు వుంటేనే లాభం. న్యూస్ బులెటిన్లు ఫస్ట్ షిఫ్ట్ వేస్తాడు. తనకి హ్యాపీ కదా. సంతోష్‌కి ఎటూ సెకండ్ షిఫ్టే. ఇంకా నయం నేనూ సంతోష్ ఇద్దరం హాయిగా ఇంట్లో అంటే పాపం ఇతను మొహం ఎలా పెడతాడో…?

“ఏమిటి ఆలొచిస్తున్నావు, ” అన్నాడు ఉపేంద్ర.
అతనివైపు చూసింది. ఉపేంద్ర మొహంలో యంగ్ లుక్ పోతోంది. జుట్టు పల్చబడింది. గడ్డం ఫ్రెంచ్ కట్ చేయించాడు. మొహం ఏమీ బావుండలేదు. ముసలాడు అనుకొంది పల్లవి.

“ఏం లేదు.. మీరేం డిసైడ్ చేసినా నాకు ఓకే,” అన్నది.

ఉపేంద్ర ఆలోచనలో పడ్డాడు. నైట్ షిఫ్ట్ వేస్టే మన కంట్రోల్ వుంటుంది. ఎండీ ఒకవేళ ఉదయం రవివర్మతో కూడా ప్రోగ్రామ్  చేయమని అంటే ఈమెని తప్పించే వీలుండదు. కొన్నాళ్లు చూద్దాం. ఎక్కడికి పోతుంది అనుకొన్నాడు.

“సరే పల్లవి. మార్నింగ్ షిఫ్ట్‌లో వన్ థర్టీ బులెటిన్ చేసుకొని వెళ్లిపో… తర్వాత చూద్దాం. ఎయిట్ థర్టీ బులెటిన్, తర్వాత డిస్కషన్ లైవ్, వన్ థర్టీ బులెటిన్.. లేకపోతే టెన్‌కి బులెటిన్ వన్ అవర్, స్టేట్ రౌండప్ ఐనా సరే.. నేనోసారి ఎఫ్.పి.సి చూస్తాను,” అన్నాడు ఉపేంద్ర.

ఎగిరి గంతేయాలనిపించింది  పల్లవికి.

ఆమెనే చూస్తున్నాడు  ఉపేంద్ర. చాలా బావుంటుంది. ఎందుకు జారిపోనివ్వాలి అనిపించిందతనికి.

పల్లవి  అతన్నే గమనిస్తోంది. మంచి అవకాశం. ఉదయం షిఫ్ట్ పూర్తి చేసుకొంటే పాపాయితో పగలంతా ఎంజాయ్ చేయచ్చు. సంతోష్‌కి చాలా కష్టం ఐపోతోంది పాపతో. ఎంతమంచి భర్త సంతోష్. నన్ను పాపాయిని ఒక్కలాగే చూస్తాడు. ఎలాగైనా ఇతన్ని మేనేజ్ చేయాలి అనుకొంది.

“థాంక్యూ ఉపేంద్రా,” అన్నది చేయి చాపి.

చాపిన చేతిని  అందుకొన్నాడు ఉపేంద్ర.
“సో… నైస్.. ” అన్నాడు మెచ్చుకోలుగా..

***

వచ్చే గురువారం …

 Front Image: Mahy Bezawada 

కలయో! వైష్ణవ మాయయో!

rekklagurram-1ఆయన యింత పని చేస్తారని కలలో కూడా వూహించలేదు.

ఇంతకు ఎవరాయన? ఏమిటా పని?

ఆయన మా తాతగారు.

అంటే మా అమ్మనాన్న..  సంస్కృతంలో మాతామహులు.

నేను మనవణ్ణి. దేవభాషలో దౌహిత్రుణ్ణి. మా తాతగారికి ఆరుగురూ ఆడపిల్లలే. లేటు వయసులో ఆయనకు వంశం నిలుపుకోవాలనే ఆలోచన వచ్చింది. నేను మూడో అమ్మాయి రెండో అబ్బాయిని.వాడిని దత్తత తీసుకొని మీరు అనుకున్నట్టు వంశం నిలుపుకోండని అంతా సలహా యిచ్చారు. నాకు హరిశ్చంద్ర నాటకంలో పద్యం జ్ఞాపకం వచ్చేది. “వంశం నిలపనేకద వివాహము. అట్టి వైవాహిక స్ఫురణ..” అని దీర్ఘంగా సాగేది.

నాకప్పుడు పదహారు వెళ్లి పదిహేడు వచ్చింది గాని డిగ్రీ ఫస్టియర్‌లోంచి సెకండియర్‌లో పడలేదు. మా నాన్నమ్మ ససేమిరా,మాకు మాత్రం ఏనూరుగురున్నారని మా యింటి దీపాన్నివ్వడం,పైగా వాడేమన్నా పనికిమాలినవాడా? అని అడ్డంగా తల ఊపారు.

నాకు మాత్రం వుత్సాహంగానే వుంది. హాయిగా వడ్డించిన విస్తరాకులా ఇల్లూ వాకిలీ, పొలమూ పుట్రా, కాలం చేసిన అమ్మమ్మ నగా నట్రా, నల్లమానుతో చేసిన పందిరి పట్టెమంచం యిలా బోలెడు హంగామాకి యజమానిని అయిపోవడం తమాషా కాదు. పోనీ బరువులెత్తాలా అంటే అదీ లేదు. కాకపోతే వంశం నిలపాలి. మరి కొన్ని హక్కులున్నప్పుడు కొన్ని బాధ్యతలు తప్పవు కదా. దత్తత స్వీకారోత్సవం అయిపోయింది.

చదువు జ్ఞానానికే గాని ధనార్జనకి కాదని నాకు తెలిసిన మరుక్షణం చదువుకి స్వస్తి చెప్పాను. తాతగారు కొన్నాళ్ళుండి వెళ్ళిపోయారు. ఆయన దైవభక్తుడు, దేశభక్తుడు. క్విట్ ఇండియా వుద్యమంలో బంగారం లాంటి వుద్యోగాన్ని,వుద్యోగరీత్యా సంక్రమించిన జట్కాబండిని త్యజించారని చెప్పుకునేవారు. అదేం కాదు ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి పెళ్ళికి ఎదిగి వచ్చారు. అంచేత పుల్‌టైమ్ ఆ పని మీద వుంటేగాని మూడు కన్యాదానాలు సాధ్యం కాదని నౌకరీ వదిలేశారు అని కొందru దగ్గిర వాళ్లనుకోగా విన్నాను. ఎందుకో నాకిదే సమంజసంగా అనిపించింది.

బ్యాంకు లాకర్ అంతా ఖాళీ అయింది గాని, ఒక్క రామకోటి పుస్తకం మాత్రం మిగిలింది. వదిల్తే మళ్లీ అంత పెద్ద లాకర్ దొరకదన్నినీ, స్టేటస్ సింబల్‌గా వుంటుందని దాన్ని మేపుతూ వస్తున్నాను. అమ్మమ్మ కట్టె వంకీ మార్చి అప్పట్లో మా ఆవిడకి రెండు జతల గాజులు చేయించడంతో లాకర్ రామనామంతో మిగిలింది. ఆరోజు నాకు వున్నట్టుండి, లాకర్‌ని వృధాగా మెయిన్‌టెయిన్ చేస్తున్నాననే ఆలోచన వచ్చింది. వెళ్ళి తీశాను.

రామకోటి పుస్తకం అందులో మిగిలిన స్థిరాస్థి. నిరాసక్తంగ పుస్తకం తిప్పాను. ఒక మెరుపు. అందులో ఫిక్సెడ్ డిపాజిట్ బాండ్! దాని ముఖవిలువ లక్షా నలభై వేలు. నలభై ఏళ్ళ క్రితం ఆ బ్యాంకులోనే వేశారు. గడువు తీరి ముప్పై ఏళ్లు దాటింది. నా నుంచి తప్పించుకుంది. దాని విలువ యిప్పుడు పదకొండున్నర లక్షలు దాటింది. నాకు అంతా సినిమా చూస్తున్నట్లుంది.

“మీకు చాలా సార్లు రెన్యూ చేయమన్నాం. కాని తమరు పట్టించుకున్నారు కాదు,” అన్నాడు మేనేజరు. మనం రాసే రిమైండర్లు సారుదాకా వెళ్తాయా?  ఆ గుమస్తాలు చించి పడేసి వుంటారని బ్యాంకు పెద్ద గుమస్తా నాకు దన్నుగా నిలబడ్డాడు.

ఆ బాండ్ మీద అప్పటి  మేనేజర్ సంతకం, మొత్తం ఎంత పేరుకుంది లాంటి లెక్కలు సాగిస్తుండగా ఒకాయన దూసుకు వచ్చాడు. “వడ్డీ మీద టాక్స్ పడకుండా  నే చూసుకుంటాను. మీరలా వుండండి,” అన్నాడు చనువుగా.

“టాక్స్‌లు మర్చిపోవడం మన జన్మహక్కు. మీరెందుకు వర్రీ అవుతారు. నేను కట్టనుగాక కట్టను,” అని అరిచాను.

నాకే కాదు, ఇంటిల్ల్లిపాదికి మెలకువ వచ్చింది..

Image: Mahy  Bezawada 

వింతశిశువు / వేంపల్లె షరీఫ్

vintasisuvu

టిఆర్‌పి రేటింగ్స్‌లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న టీవీ చానల్స్‌లో మురళీ పనిచేస్తున్న వార్తా చానల్ కూడా ఒకటి. ఆవేళ పొద్దుటి డ్యూటీలో ఉన్నాడు. వార్తా విభాగంలో అతని ఉద్యోగం. ఆ షిఫ్ట్‌కి మురళీ ఇన్‌చార్జ్‌. ఆ షిఫ్ట్‌లో వచ్చే వార్తల ప్రాధాన్యతను నిర్ణయించి ప్రసారం చేయాల్సిన బాధ్యత అతనిదే. సమయం తొమ్మిది గంటలవుతోంది. కంప్యూటర్ ముందు కూర్చోని ఉన్నాడు. ఎదురుగా గోడకు టీవీ దుకాణంలో తగిలించినట్టు వరుసగా పది టీవీలున్నాయి.

కుడినుంచి ఎడమకు లెక్కేసుకుంటే మొదటి టీవీలో మురళీ పనిచేసే చానల్ ‘టీవీ `ఎక్స్’ వస్తోంది. చివరి టీవీలో ‘టీవీ`7’ వస్తోంది. ఇక మధ్యలో ఉన్న టీవీల్లో కూడా రకరకాల పోటీ చానల్స్ వస్తున్నాయి. ఒకసారి వాటివైపు చూశాడు మురళీ. ఉద్యోగంలో భాగంగా అప్పుడప్పుడు పోటీ చానల్స్‌లో ఏయే వార్తలు వస్తున్నాయో గమనిస్తుండాలి. నిజానికి గోడమీద అన్ని టీవీలు ఉంచిందే అందుకు. టీవీ7లో బ్రేకింగ్ వస్తోంది. ‘‘పశ్చిమగోదావరిజిల్లాలో వింత, తోకతో ఉన్న శిశువు జననం, వింత చూడ్డానికి ఎగబడుతున్న జనం’’

ఎర్రెర్రటి గ్రాఫిక్ ప్లేట్లతో తాటికాయంత తెల్లటి అక్షరాలతో టీవీ7లో వార్త నడుస్తోంది. ఓవైపు రిపోర్టర్ ఫోన్‌లో విశ్లేషణ ఇస్తున్నాడు. మరోవైపు బాక్సులో శిశువు దృశ్యాలు వేస్తున్నారు. శిశువు ఎర్రగా, సాయంత్రపు ఎండలో మెరిసే పూమొగ్గలా ఉన్నాడు. ఎవరివో రెండు చేతులు అతన్ని ఎత్తుకుని అతని వెనుక భాగాన్ని కెమెరాకు చూపిస్తున్నారు. పిర్రల దగ్గర కొద్దిగా, గోరంత చర్మం ముందుకొచ్చినట్టు కనబడుతోంది. ‘‘దీన్నే తోకంటూ కనిపెట్టాడు కాబోలు టీవీ7 వాడు..’’ గొణుక్కున్నాడు మురళీ. వెంటనే సీట్లోంచి లేచెళ్లి టీవీ ముందు నిలబడి కొంచెం వాల్యుమ్ పెంచాడు. ‘జన్యుపరమైన సమస్య వల్ల శిశువు అలా పుట్టాడని, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని, ఆపరేషన్ చేసి తీసేయొచ్చని, ఇదేం పెద్ద విషయం కాదని’ వైద్యులు చెబుతున్నట్టు రిపోర్టర్ తన విశ్లేషణలో వివరిస్తున్నాడు.

అయినా ఆ చానల్ వాళ్లకు అదేం పెద్ద పట్టడం లేదు. వాళ్ల శ్రద్ధంతా దాన్ని ఒక ఎనిమిదో ప్రపంచ వింత లాగ చూపడంపైనే ఉంది. మనసు చివుక్కుమంది అతనికి. ‘‘ఇంకాసేపుంటే ఆ శిశువు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అవతారమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు…’’  వచ్చి మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు.

నిజానికి ఆ వార్త తన దగ్గర కూడా ఉంది. కానీ అతనే ప్రసారం చేయకుండా ఆపాడు. అలా ఆపడం పై బాసులకు తప్పుగా తోస్తుందని అతనికి తెలుసు. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కూడా తెలుసు. అయినా అతనికెందుకో ఆ వార్తలో జనాసక్తి తప్ప జనానికి ఉపయోగపడే విషయం ఏమీ లేదనిపిస్తోంది. అందుకే ఎవడొచ్చి అడిగినా ఆ వార్తను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ మొన్న మధ్యాహ్నం షిఫ్ట్‌లో జరిగిన అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి అతనికి గుర్తుకొచ్చింది.

ఆ వేళ మురళీకి ` సబ్‌ఎడిటర్ రమాదేవికి పెద్ద గొడవ. వింతలూ ` విశేషాలు, ఆసక్తికరమైన వార్తలు రాసి టిఆర్‌పి పెంచే సబ్ ఎడిటర్‌గా రమాదేవికి మంచి పేరుంది. ఆ చొరవతోనే ఆమె ` ఇన్‌చార్జ్ అయిన మురళీక్కూడా చెప్పకుండా రిపోర్టర్ దగ్గరి నుంచి వార్త రాగానే దానికి కావాల్సిన హంగులూ, పొంగులూ, మసాలాలు అన్నీ దట్టించి టిఆర్‌పి యుద్ధానికి సిద్ధం చేసి ఉంచింది. అంతేకాదు ఆవార్త చాలా ప్రముఖమైందని హెడ్‌లైన్ పెట్టి ప్రసారం చేయాల్సిందిగా మురళీకి సూచించింది.

అసలే ఆదివారం. వార్తలు కూడా పెద్దగా లేకపోవడంతో రమాదేవి చెప్పిన తీరును బట్టి ఆ వార్త మీద ఆసక్తి కలిగి కంప్యూటర్‌లోనే ఫైల్ ఓపెన్ చేసి చూశాడు మురళీ.

‘‘ఇదీ కనీవినీ ఎరుగని వింత. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే జరుగుతోంది. అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన ఓ మహిళకు వరాహం  పుట్టింది. స్థానిక లక్ష్మీదేవి అనే మహిళ గత రాత్రి ప్రసవించింది. శిశువు వరాహం అవతారంలో ఉన్నాడన్న విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు దావానలంలా వ్యాపించింది. దీంతో జనం ఆ వింతను చూడ్డానికి బారులు తీరుతున్నారు…’’ ఇలా కొనసాగుతోందావార్త. మురళీకి చిరాకేసింది. మధ్యలోనే చదవడం ఆపేశాడు. ఈ జనానికి పెద్ద పనేమి ఉండదు. వింత అనే పదం వినపడితే చాలు బారులు తీరేస్తారు. ‘బొప్పాయిలో వినాయకుడని, కొబ్బరికాయలో అల్లా..’ అని రకరకాల నమ్మకాలు. వాటికి మీడియాలో ప్రచారం. ‘ఎందుకీ వార్తను పంపార’ని రిపోర్టర్‌ని అడిగితే ‘జనాసక్తి గల విషయం కాబట్టి పంపామ’ని బుకాయింపు. ‘‘అసలు ఆ ఆసక్తిని కలిగిస్తోంది ఎవరు? లేని ఆసక్తి రగిలించి జనాన్ని రెచ్చగొడుతోంది ఎవరు?’’ అని అడగాలనిపిస్తుంది అతనికి.

కానీ అడగలేడు. టీవీ మీడియాలో చేరినప్పటినుంచి అంటే సుమారు గత ఆరేళ్లుగా అతను ఇదే క్షోభను అనుభవిస్తున్నాడు. అంతకుముందు వివిధ పత్రికల్లో పనిచేశాడు. ఆయా పత్రికలకు కూడా కొన్ని సొంత ఎజెండాలున్నాయి. కడుపాత్రం కాబట్టి ఆయా ఎజెండాలకు తగ్గట్టు వార్తలు రాశాడు. పెద్ద బాధనిపించలేదు. కానీ టీవీ మీడియాలో చేరాక సామాజిక బాధ్యత ఉన్న వార్తల పట్ల కూడా ఆత్మవంచన చేసుకోవాల్సి వస్తున్నందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు. అలా అని ఉద్యోగం వదిలేయలేడు. పెరిగిన ఖర్చులు, సంసార భారం దృష్ట్యా తిరిగి పత్రికలో చేరి తక్కువ జీతానికి పనిచేయనూ లేడు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఇలాంటి రకరకాల వార్తలు వచ్చి అతనికినరకం చూపిస్తున్నాయి.

ఒక మహిళై ఉండికూడా ఈ వార్త పట్ల ఇంత ఆసక్తి చూపిన రమాదేవి మీద ఒకరకమైన అసహనం కలిగింది మురళీకి. కానీ ఆమేం చేస్తుంది? టీవీ మీడియా ఆమెను అలా మార్చేసింది. టీవీ మీడియాను మార్కెట్ శాసిస్తోంది. సొంత ప్రయోజనాలు శాసిస్తున్నాయి. రకరకాల ఎజెండాలకు లోబడి ఇక్కడ పనిచేయాలి. లేకపోతే మనుగడ ఉండదు. అందుకే మనుషులు అప్పుడప్పుడు తాము మనుషులమనే సంగతిని మర్చిపోతుంటారు. ఒకసారి రమాదేవి కూర్చునే కంప్యూటర్ వైపు చూశాడు మురళీ. ఆమె ఇంకా ఆ వార్తకు సంబంధించిన గ్రాఫిక్స్ ఏవో తయారు చేస్తోంది. రమాదేవి ఆ వార్త రాసేముందే ఒకసారి చూపించి ఉంటే అప్పుడే వద్దని చెప్పేవాడు మురళీ. కానీ ఇప్పుడు ఆ వార్తను దిద్ది అన్ని రకాల మసాలాలు దట్టించి సిద్ధం చేసిన తర్వాత వద్దంటే ఆమెకు కోపమొచ్చే అవకాశమే ఎక్కువ.

అందుకే ‘‘ఎలా ఈ ప్రమాదాన్ని నివారించాలా..?’’అని ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి దృశ్యాలు చూడ్డానికి పక్కనే ఉన్న ఎడిటింగ్ విభాగానికి వెళ్లాడు. వరాహావతారంలో శిశువు పుట్టిందని వచ్చిన వార్త తాలూకు దృశ్యాలు చూపించమని అడిగాడు. వాళ్లు కంప్యూటర్‌లో ప్లే చేశారు. కళ్లముందు దృశ్యాలు కదులుతున్నాయి. అది ఇల్లో..గుడిసో.. చెప్పడం కష్టం. ఇంటి లోపలి వాతావరణం దిగులుగా, చీకటిగా ఉంది. కేవలం కెమెరా వెలుతురులో మాత్రమే ఆ దృశ్యాలను తీసినట్టు తెలుస్తోంది. ఒక పక్కగా శిశువు తల్లి . ఆమె తల్లి వయసున్న ఆడమనిషి మీద తలపెట్టి కూలబడింది. పక్కనే చాప మీద తెల్లటి వస్త్రం పరిచి పడుకోబెట్టారు ఒక చిన్నటి, నల్లటి ఆకారాన్ని. వస్త్రంపై ఆ ఆకారం మెల్లగా పురుగులాగ కదులుతోంది. కాసేపటికి పోల్చుకున్నాడు మురళీ ఆ ఆకారమే శిశువు అని. నిజమే శిశువు అందవికారంగా ఉంది. ఏది ముక్కో ఏది నోరో పోల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ వరాహం  మాత్రం కాదు.

‘‘వరాహావతారం అనేది కేవలం మీడియా, మీడియాలాంటి మనుషుల సృష్టి మాత్రమే. కడుపులో బిడ్డ పెరిగేటప్పుడే ఏదో తేడా జరిగింది. అసలే చదువులేని మనుషులు. ఎప్పటికప్పుడు డాక్టరు దగ్గరికెళ్లి ఏ నెలకానెల కడపులో బిడ్డ ఆరోగ్యం,పెరుగుదల గురించి తెలుసుకోవాలని తెలియనివాళ్లు. తెలిసినా చూపించుకోవడానికి డబ్బు లేనివాళ్లు.’’ అతనికి బాధేసింది. ‘‘పాపం ఆ తల్లి ఎంత క్షోభ అనుభవిస్తోందో?’’ అనుకున్నాడు. అంతలో శిశువు ఆకారంపై ఉన్న కెమెరా మెల్లగా కదిలి ఆ మాతృమూర్తి ఉన్న వైపుకు తిరిగి జూమ్ అయ్యింది.

ఇందాక పక్కనున్న మనిషిమీద తలపెట్టి కూలబడ్డ తల్లి ఇప్పుడు ఏడుస్తోంది. ‘‘ల్యాక ల్యాక పుట్టిండెనే సామి ఈ బిడ్డ. ఇట్ట పుట్టించినావేమిట్రా దేవుడా. నేనేం తప్పు చేసినాను సోమి. అడిగినోళ్లందరికీ పెట్టినదాన్నేనే. ఇప్పుడేం జెయ్యాల. ఇట్ట జరిగిండేదానికేనా ఇన్ని అగసాట్లు పడింది? ఇన్నినొప్పులు బరించింది? నా రాతెందుకు ఇట్టుండాది రా నాయనా.. ! ఏం చేయాల్ల ఈ పిల్లను? ఆడకూతురే. ఎట్ట పెద్ద చేయాల్రా దేవుడా..?’’ దీర్ఘాలు తీస్తోంది. కడుపు మీద దబాదబా గుద్దుకుంటోంది. ఇక ఆ దృశ్యాలను చూడలేకపోయాడు మురళీ. వాటిని తీసిన రిపోర్టర్ మీద, కెమెరా మెన్ మీద కోపమొచ్చింది. ‘‘అయినా వాళ్లదేం తప్పు? ఆ వార్తను తీసుకురాకపోతే వాళ్ల ఉద్యోగం పోతుంది. వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించారు. ఇలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రసారం చేసి వారితో ఇలాంటివాటిని తెప్పిస్తున్న మార్కెట్ మాయాజాలానిది తప్పు?’’ మౌనంగా వచ్చి అతని స్థానంలో కూర్చున్నాడు. మనసంతా దు:ఖంగా ఉంది.

ఓ నిమిషం పోయాక తేరుకుని ‘‘రమాదేవీ, తల్లి మాట్లాడింది విన్నావా?’’ అన్నాడు అటువైపు తిరిగి కూర్చోనున్న ఆమెతో.  ‘‘విన్నాను.. బ్రహ్మాండంగా మాట్లాడింది కదా..’’ అంది రమాదేవి. మురళీకి ఏం చెప్పాలో తెలీలేదు. అంతటి విషాదంలో కూడా ఓ నవ్వు మొహం పెట్టాడు. అలా నవ్వాలి. అదే నాగరికత. అవతలివాడిని దవడ పగిలేలా కొట్టాలనిపించినా కొట్టకుండా పళ్లు ఇకిలించాలి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ‘నాయకత్వ లక్షణాల’ పేరుతో ‘వ్యక్తిత్వ వికాస’ కోర్సుల్లో చేరి, నేడు యువత నేర్చుకుంటోంది ఇదే. ఆ విద్యే అతనూ నేర్చుకున్నాడు. కానీ ఎంత నేర్చుకున్నా మొహానున్న నవ్వుకి జీవం మాత్రం తీసుకురాలేక పోతున్నాడు. ఇక తప్పదనుకుని కొంచెం కఠినంగానే ‘‘ఆవార్త ప్రసారం చేస్తే బాగోదు. హెడ్‌లైన్ వద్దు. వార్త కూడా వద్దు,’’ అన్నాడు. మురళీ అనుకున్నట్టుగానే రమాదేవికి మండిరది. ‘‘వేరే ఇన్‌చార్జ్ ఉంటే చక్కగా నేను రాసిన వార్తలు పెట్టుకుంటాడు. నువ్వేంటి ఎప్పుడూ ఏది రాసినా ఇది అవసరం లేదు..అది అవసరం లేదు అని లాజిక్కులు మాట్లాడతావ్..’’ అంటూ అరిచిందా పిల్ల.

అందరిముందు అలా అరవడం మురళీకి కొంచెం అవమానంగా అనిపించినా నిబాయించుకున్నాడు.

‘‘ఒకసారి నువ్వే ఆలోచించు. అసలే ఇలాంటి బిడ్డ పుట్టిందేంటా.. అని ఆ తల్లి బాధలో ఉంటే మనం ఆ వార్త వేసి ప్రచారం చేస్తామా? టీవీలో వార్త చూసి ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్లంతా ఆమె ఇంటి ముందు క్యూ కడతారు. అది అవమానంగా భావించి ఆమె ఏమైనా చేసుకుంటే? అసలు ఆ వార్త ఇవ్వడం వల్ల ఎవరికిప్రయోజనం? అందులో ఆ పుట్టిన పాప వికారంగా ఉందేమో కానీ వరాహంలా లేదు. ఉత్తినే ఆమె కడుపున ‘పంది’ పుట్టిందని ఎలా వేస్తాం. అలా వేస్తే ఆ తల్లికి ఎంత నరకం?’’ ఇంకా ఏదో చెప్పబోయాడు మురళీ. ‘‘మరి టిఆర్‌పిలు.. టిఆర్‌పిలు అని మా ప్రాణాలు తీస్తారెందుకు?’’ అంది రమాదేవి అడ్డుకుని కఠినంగా. ‘‘నిజమే. పై వాళ్లు అలాగే ప్రాణాలు తీస్తారు. మనమే కొంచెం విచక్షణ ఉపయోగించాలి. మన పరిధిలో ఉన్నంతవరకైనా ఇలాంటి వార్తలు ఆపుదాం,’’ అన్నాడతను నచ్చచెబుతున్నట్టుగా.

ఏమనుకుందో ఏమో తర్వాత ఏం మాట్లాడలేదు రమాదేవి. కానీ ఎక్కడో అతనిలో ఓ చిన్న అనుమానం.

‘‘ఒకవేళ రమాదేవి ఈ విషయాన్ని పై వాళ్లతో(బాసులతో) చర్చించి పెద్దది చేస్తే ఏం చేయాలి?’’ అని. అందుకే మంచో చెడో..దానికి తగ్గ సమాధానం కూడా ఒకటి సిద్ధం చేసి ఉంచుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఈ వార్త మీద తర్వాత ఎలాంటి చర్చ జరలేదు. ఆరోజు గండం అలా గడిచిందనుకుంటే మళ్లీ ఇవ్వాళ టీవీ7 వాడి రూపంలో మరో గండం వచ్చి పడింది. అది అసలే నెంబర్ వన్ చానల్‌. అది ఆ వింత వార్తను పట్టుకుని అలా గింజుతుంటే మిగతా వాళ్లుకూడా అదే బాట పడతారు. అసలే టీవీ మీడియా ‘గొర్రెల మంద’ లాంటిదంటారు. ఒకరు ఒక వార్తను పట్టుకుని హడావిడి చేస్తే మిగతావాళ్లు కూడా దాన్నే పట్టుకుని లాగుతారు. అందులోని మంచి చెడుల గురించి ఆలోచించరు. అందరూ హడావిడి చేస్తే ఇక తనక్కూడ ఆ వార్తను ప్రసారం చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే అతనికి గుండెల్లో గుబులు గుబులుగా ఉంది. మనసంతా కీడు శంకిస్తోంది. అన్నట్టే కాసేపటికి డెస్కులో అగ్గి రాజుకుంది.

‘‘వార్త మనకొచ్చి అరగంటైనా మనవాళ్లు బ్రేకింగ్ వేయలేదు. టీవీ 7 వాడు ఆడుకుంటున్నాడు’’ అని లేసింది ఓ గొంతు.

వెనక్కి తిరిగి చూస్తే శ్రవణ్‌. అతను న్యూస్ కో ఆర్డినేటర్‌. ఏదైనా వార్త చానల్‌కి రాకపోతే అతనే దగ్గరుండి తెప్పిస్తాడు. ఒకవేళ వచ్చి కూడా ప్రసారం కాకపోతే ఇలాగే అరుస్తాడు. అతన్ని చూడగానే మురళీకి గుండె గుభేలుమంది. మొన్న వైజాగ్ బీచ్‌లో ముగ్గురు పిల్లలు కొట్టుకుపోయారు. వాళ్ల శరీరాలు దొరికాయి. ఆ దృశ్యాలు అందరికన్నా ముందుగా తెప్పించాడు శ్రవణ్‌. కానీ కాస్త అటు ఇటుగా ఇతర చానల్స్‌కి కూడా ఆ దృశ్యాలు వస్తాయి. దొరకని, దొరకడానికి వీల్లేని దృశ్యాలైతే కాదు. కానీ శ్రవణ్ ఒకటే హడావిడి. దేశంలోనే ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టినట్టు.. గోల. ఆ శవాల దృశ్యాల మీద ‘ఎక్స్‌క్లూజివ్‌..మార్కు’ వేయమని ఒత్తిడి.

‘‘బిడ్డలు నీటిలో మునిగి చచ్చిపోయి ఆ తల్లులు పుట్టెడు దు:ఖంతో ఉంటే మనకోసమే చచ్చిపోయినట్టు ఆ దృశ్యాల మీద ఎక్స్ క్లూజివ్ వేయడం నైతికం కాదు,’’ అన్నాడు మురళీ కటువుగా. అనడమే కాదు ‘ఎక్స్ క్లూజివ్ మార్కు’ వేయకుండానే ఆ దృశ్యాలను ప్రసారం చేశాడు. అది మనసులో ఉంచుకున్నాడు శ్రవణ్. దానికి తోడు ఇప్పుడు మళ్లీ ఆజ్యం పోస్తే భగ్గుమంటాడు.

అందుకే `‘‘శ్రవణ్ అది అస్సలు వార్తేనంటావా?’’ వీలైనంత ప్రశాంతంగా అడిగే ప్రయత్నం చేశాడు మురళీ . ‘‘వార్తో…కాదో ముందు టిఆర్‌పి. టీవీ7 వాడు అంతలా ఆడుకుంటుంటే నేనేదో గాడిదలు కాస్తున్నాను ఆఫీసులో అనుకుంటారు అందరూ. వెంటనే వార్తను ఎక్కించు. ‘ఎక్స్‌క్లూజివ్’ అని వేయ్., ‘ఫస్ట్ అన్ `టీవీఎక్స్’ అని వేయ్. ‘వాటర్ మార్కు’ వాడు. ‘ఫుల్ ప్లేట్‌్ బ్రేకింగ్’ కొట్టు.’’ `తనకు తెలిసిన విద్యలన్నీ చెప్పి గగ్గోలు పెట్టాడతను. మురళీకి చిరాకేసింది. కానీ అంతలోనే అతని మీద జాలి కూడా కలిగింది. ఆ వార్తను ప్రసారం చేయకపోతే తెప్పించలేదనుకుని శ్రవణ్‌ని మేనేజ్‌మెంట్ తప్పుగా అనుకునే అవకాశం ఉంది. అది అతని ఉద్యోగానికే ప్రమాదం. శ్రవణ్ హడావిడిలోనూ అర్థముంది. ఆలోచించాడు మురళీ. మెల్లగా శ్రవణ్‌కు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

‘‘సరే శ్రవణ్.., ఆ వార్తను నేనే ప్రసారం చేయకుండా ఆపాను. ఎవరైనా నిన్ను అడిగితే నా పేరు చెప్పు? నీ మీద వేసుకోవద్దు,’’ అన్నాడు.

శ్రవణ్ అప్పటికి ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించినా పక్కకెళ్లి ఫిర్యాదు చేశాడని మురళీకి ఈజీగానే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు అతని ల్యాండ్ లైన్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. మురళీకి తెలుసు ఆఫోన్ తన బాసుల దగ్గర్నుంచే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ శ్రవణ్ ఫిర్యాదు ప్రభావమే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ ఎత్తితే ఆ వార్త ప్రసారం చేయక తప్పదని. ఒకసారి టీవీ7 వైపు చూశాడు. వింత శిశువు..వార్త ఇంతింత అక్షరాలతో ఇంకా ఇంకా వస్తూనే ఉంది. మురళీకి పిచ్చెక్కింది. గట్టిగా అరిచాడు. ‘‘తోకతో పుట్టిన వింతశిశువు ఆ పిల్లాడు కాదురా.. మీర్రా..మీరు..’’

 Front Image: Anwar

భారతీయ కథలో వేంపల్లె జెండా!

shariff -1

(మన కథకుడు వేంపల్లె షరీఫ్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం
గౌహతి లో మార్చి 22 వ తేదీ అందుకుంటున్న సందర్భంగా)

రాయలసీమ ముస్లిం జీవితాల్ని సన్నిహితంగా చూసిన వాళ్ళకి వొక విషయం ఇట్టే తెలిసిపోతుంది –

మిగిలిన  ప్రాంతాల కంటే కూడా సీమలో ముస్లింలు ఇక్కడ స్థానిక జీవితంలో బాగా ఇమిడిపోయారు అని! సీమలో ముస్లింల ఇంటి పేర్లు మిగిలిన చోట ముస్లింల ఇంటిపేర్లలా మహమ్మద్, షేక్, సయ్యద్ అని మొదలవ్వడం చాలా అరుదు. వేంపల్లె, పెనుకొండ, కొదుమూరు, కలికిరి ఇవీ ఎక్కువ మంది ముస్లింల  ఇంటి పేర్లు. ఇంకాస్త ముందుకు వెళ్ళి, పల్లెల్లో పీర్ల పండగలూ, ఇతర సూఫీ పీర్ల స్మృతి చిహ్నంగా జరిగే ఉరుసు ఉత్సవాలు గమనిస్తే సామూహిక స్థాయిలో హిందూ-ముస్లింల మధ్య ఎలాంటి అనుబంధం వుందో తెలుస్తుంది.

తెలుగు సాహిత్యంలో ముస్లిం కథకుల పేర్లు వినిపించడం విశేషమేమీ కాదు. కానీ, వేంపల్లె షరీఫ్ కథలు చదవగానే అవి సాధారణ ముస్లిం కథలకు భిన్నంగా అనిపించడానికి కారణం షరీఫ్ సీమ నేపధ్యమే! అందుకే, షరీఫ్ కథల్లో కనిపించే మెజారిటీ-మైనారిటీ బంధం కూడా భిన్నంగా వుంటుంది. ఇందులో సంఘర్షణ తక్కువగా వుంటుంది, సామరస్యం ఎక్కువగా వుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు ఆ తేడాని గమనించలేనంతగా ఆ రెండు సమూహాల సంబంధాలూ కలగలిసిపోయి వుంటాయి. ఆ కారణంగా షరీఫ్ తన కథల్లో వర్ణించే ముస్లిం జీవన దృశ్యం కేవలం వొక మైనారిటీ కోణంగా కనిపించదు. స్థానికత అనేది సమకాలీన తెలుగు కథ ప్రధాన లక్షణం అనుకుంటున్న ఈ దశలో షరీఫ్ కథలు ఆ లక్షణానికి  పక్కా ఉదాహరణగా నిలుస్తాయి.

స్థానికతకి వొక ప్రత్యేకమయిన శిల్ప సౌందర్యం కూడా వుంటుంది. స్థానికత ఇరుసుగా వున్న కథ ఎక్కువ అలంకారాలు ధరించదు. సాదాసీదా అందంతో మన ముందుకు వస్తుంది. వొక్కో సారి ఈ అందం వొక అందమేనా అన్న సంశయం కలిగేంతగా ఈ కథలో అందం ఇంకిపోయి వుంటుంది. షరీఫ్ కథలు చాలా మామూలుగా మొదలయి, చాలా మామూలుగా నడుస్తూ చాలా మామూలుగా ముగుస్తాయి. అతని వాక్యాలు సాంద్రత కోసం వెతుక్కోవు.

ఇంత మామూలు వాక్యాలు కథలో ఎలా ఇమిడాయా అని ఆశ్చర్యపోతుండగా చదువరిని చివరి దాకా తీసుకు వెళ్ళే అత్యంత పరిచిత వ్యక్తిలా కనిపిస్తాడు షరీఫ్. కథలో వొక ఆత్మీయ స్వరం వినిపిస్తూ వుంటుంది. బయటి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ఇలాంటి ఆత్మీయ స్వరాన్ని వినిపించడం అంత తేలిక కాదు. ఇది ఖదీర్ బాబు కథల్లో వినిపించే లాంటి ఆత్మీయ స్వరం కాదు. (కథా శిల్పానికి సంబంధించి ఇంకో విషయం: చాలా మంది ఖదీర్ బాబు రచనని నామిని కథాశిల్పంతో ముడిపెట్టి మాట్లాడుతూ వుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. నామిని కథనంలో rationalization అసలు వుండదు. ఖదీర్ కథన శిల్పంలోని వొకానొక జీవధాతువు నామిని నించి వచ్చిందే కానీ, ఖదీర్ కథనశిల్పం నామిని కంటే ఆధునికం, సమకాలీనం. అది అతని rationalization వల్ల సాధ్యమయింది. అందుకే ఖదీర్ కథన సంప్రదాయం అనే మాటని విడిగా వాడుతున్నా)

ఈ ఇద్దరి సంప్రదాయాన్ని   సహజ అందంగా కలిపి ముందుకు తీసుకెళ్తున్న కథకుడు షరీఫ్. ఈ కథల్లోని ఆత్మీయ శిల్పం ఆత్మీయంగా వుంటూనే ముక్కు సూటిగా కొన్ని హేతుబద్ధమయిన ప్రశ్నలు అడుగుతుంది. అసలు అలాంటి ప్రశ్న అడక్కుండా షరీఫ్ కథ ముగింపు దాకా రాదు. కథ ముగిశాక ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంతో ఈ కథల పఠితకి ఇంకో ప్రయాణం మొదలవుతుంది. ‘జుమ్మా’ సంపుటి నించి ఈ సారి “కథాసారంగ”లో ప్రచురిస్తున్న షరీఫ్ సరికొత్త కథ ‘వింత శిశువు’ దాకా ఈ ప్రశ్న వినిపిస్తూనే వుంటుంది. అయితే, ఈ ప్రశ్న స్వరం చెంప మీద చెళ్లుమని కొట్టినట్టుగా కాకుండా, ఆత్మీయ స్వరంతో ధ్వనించడం షరీఫ్ కథనమార్గం!

వొక మాంత్రికుడితో కొన్ని మాటలు

 మార్చి 10 కేశవరెడ్డి గారి పుట్టిన రోజు 

MaheshVenkat_KesavReddy1

(ఎడమ వైపు నుంచి) డా. కేశవ రెడ్డి, వెంకట్ సిద్ధారెడ్డి, కత్తి మహేష్ కుమార్

ధైర్యం కూడగట్టుకుని ఫోన్ చేశాను. అటువైపు రింగ్ అవుతోంది. ఊపిరిబిగబట్టి ఆ రింగ్ వింటున్నాను. ఆ రింగ్ కన్నా నా ఊపిరి నాకే ఎక్కువగా వినిపిస్తోంది. అటువైపునుంచీ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.

“హలో”

“సర్, నాపేరు మహేష్ అండీ, కేశవరెడ్డిగారేనా!” అంటూ నేను కొంచెం లోవాయిస్ లో…

“అవునబ్బా! కేశవరెడ్డినే. చెప్పండి.”

***

సంవత్సరం 2009.

“మునెమ్మ” చదివాక ఒక ఉన్మాదం ఆవరించింది. అప్పుడప్పుడే ఒక డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాయడం, కొన్ని సినిమాలకి స్క్రిప్టు సహకారం అందించడం ద్వారా మెయిన్ స్ట్రీం సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న తరుణం. మునెమ్మ గురించి విన్నప్పుడే ఒక శక్తివంతమైన సినిమాకు సంబంధించిన సరంజామా అనిపించింది. ఒకసారి చదివాక ఆగలేని ఉత్సాహం నిండుకుంది. కాలేజిలో హెమింగ్వే  ‘ఓల్డ్ మెన్ అండ్ ది సీ’ చదువుతున్నప్పుడు తెలిసిన  రెఫరెన్స్ తో “అతడు అడవిని జయించాడు” పుస్తకం చదవటంతో డాక్టర్ కేశవరెడ్డి అనే పేరు పరిచయం అయ్యింది. మా చిత్తూరు రచయిత అనే అభిమానమో ఏమోగానీ, పేరు మాత్రం అలాగే గుర్తుండిపోయింది. మళ్ళీ మునెమ్మ దెబ్బకి ఆ పేరు మర్చిపోలేని విధంగా మెదడులో నిక్షిప్తమైపోయింది.

నా మిత్రుడు, సహరచయిత సిద్దారెడ్డి వెంకట్ (‘కేస్ నెంబర్ 666/2013’ సినిమా దర్శకుడు) తో మునెమ్మ గురించి చర్చిస్తున్నప్పుడు “అరే! నువ్వు కేశవరెడ్డిగారిని ఇన్నాళ్ళూ మిస్ అయ్యావా. చదవాలి బాస్. ఆయన నవల ‘సిటీ బ్యూటిఫుల్’ చదివాకగానీ నాకు తెలుగులో అంత గొప్ప పుస్తకాలు ఉన్నాయని తెలీదు” అంటూ ‘సిటీబ్యూటిఫుల్’ నవలని పరిచయం చేశాడు. ఒక్కబిగిన చదివిన నవలలు నాజీవితంలో తక్కువే. సిటీ బ్యూటిఫుల్ ఆ కోవలోకి చేరింది. చైతన్య స్రవంతి శైలిని గురించి వినడం చదవడం అప్పటికే చేశాను. తెలుగులో అంపశయ్య నవీన్, వడ్డెర చండీదాస్ రచనలు ఆ శైలితో సుపరిచితమే. కానీ కేశవరెడ్డి విన్యాసంలోఆశైలి ఇంకో అద్వితీయమైన స్థాయికి చేరిందని నేను ఖరాఖండిగా చెప్పగలను. చైతన్య స్రవంతికి జేమ్స్ జాయ్స్ ఆద్యుడైతే, తెలుగులో చలం తరువాత ఆ శైలిని ఉఛ్ఛస్థితికి తీసుకెళ్ళిన రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కాశీభట్ల వేణుగోపాల్ లాంటివాళ్ళు దీన్ని ఇంటర్నల్ మోనోలాగ్ అన్నా, నాకైతే స్ట్రీమ్ ఆఫ్ కాంషస్నెస్ గానే అనిపిస్తుంది.

ఇక వేట మొదలయ్యింది. ఇన్ క్రెడిబుల్ గాడెస్, చివరి గుడిసె, స్మశానం దున్నేరు, మూగవాని పిల్లనగ్రోవి, రాముడుండాడు రాజ్జిముండాది చదివాకగానీ ఆకలి తీరలేదు. ప్రతిపుస్తకం చదువుతుంటే ఒక అద్భుతమైన సినిమా చూసిన అనుభవం. ధృశ్యాలు కళ్లముందు కదలాడి, ఉద్వేగాలతో శరీరాన్ని ఊపేసిన అనుభూతి. ఇంత సులువుగా, ఇంత శక్తివంతంగా, ఇంత ప్రభావవంతంగా రాయగలగడం ఒక సాధన.

***

“మీ మునెమ్మ నవల చదివాను సర్”

“ఎట్లుంది? బాగుందా?”

“అద్భుతంగా ఉంది సర్. ఆ నవలను సినిమాగా తియ్యాలనుంది సర్.”

“మునెమ్మనా…సినిమాగానా! మనోళ్ళు చూస్తారా? అయినా సినిమా అంటే పెద్ద కష్టం లేబ్బా.”

“నిజమే…కానీ తీస్తే బాగుంటుంది అనిపించింది సర్. మిమ్మల్ని కలవాలనుంది. మీరు హైదరాబాద్ కి ఎప్పుడైనా వస్తున్నారా సర్”

“హైదరాబాదా…ఇప్పట్లో రాలేనుగానీ, నువ్వే మా నిజామాబాద్ కి రా ,కూచ్చుని మాట్లాడుకుందాం.”

“సరే సర్….సార్ మాదీ చిత్తూరు జిల్లానే సర్..పీలేరు దగ్గర యల్లమంద.”

“అవునా…నాకు బాగా తెలుసునే ఆ ఏరియా అంతా…సరే ఇబ్బుడు క్లినిక్ లో ఉండాను. మధ్యాహ్నంగా ఫోన్ చెయ్ మాట్లాడుకుండాము.” అంటూ అటువైపునుంచీ నిశ్శబ్ధం.

నేను ఫోన్ పెట్టేసాను.

***

అప్పట్నించీ అడపాదడపా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. నేను అవడానికి చిత్తూరువాడినే అయినా, చదువురీత్యా, ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో తిరగడం కారణంగా భాష చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోయి ఏవోకొన్ని పదాలలో తప్ప మా యాస నాకు దూరమయ్యింది. కానీ డాక్టర్ కేశవరెడ్డిగారితో మాట్లాడుతుంటే, ఆ యాస వింటుంటే ఏదో తెలీని ఆత్మీయత. ఆయన జీవితమంతా నిజామాబాద్ లో గడిపినా, అక్కడి యాసతో భాషతో ఒదిగిపోయినా తన ఇంటొనేషన్, కొన్ని టిపికల్ పదాలువాడటం అన్నీ ‘సిత్తూరు’తీరే.

కొన్నాళ్లకు మిత్రులసహాయంతో ధైర్యం చేసి మునెమ్మ నవల హక్కులు తీసుకోవడానికి నిర్ణయించుకుని నిజామాబాద్ ప్రయాణం అయ్యాను. కలిసాను. ఫోన్లో ఎంత సింప్లిసిటీ వినిపించిందో అంతకన్నా సింపుల్ గా మనిషి కనిపించారు. క్లినిక్ నుంచీ పికప్ చేసుకుని ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం కలిసినవాళ్లం మాటల్లో సాయంత్రం ఎప్పుడయ్యిందో తెలీలేదు. ప్రపంచ సినిమాపై కేశవరెడ్డిగారికున్న పట్టు, తన దగ్గరున్న స్క్రీన్ ప్లే కలెక్షన్లూ చూశాక ఆయన నవలలు చదువుతుంటే సినిమా ఎందుకు కనిపించిందో అర్థమయ్యింది. నాదగ్గరున్న చిట్టాకూడా ఏకరువు పెట్టాను. వెనుదిరిగి వచ్చాక పోస్టులో కొన్ని డివిడి లు.  పుస్తకాలు పంపాను.

మునెమ్మ మా సొంతమయ్యింది. పుస్తకం మీదో లేక నా ల్యాప్ టాప్ లోనో ఏదో పిచ్చిగా నోట్స్ రాసుకోవడం. మునెమ్మ పాత్రను, కథను, ఉపకథల్ని పొడిగించుకోవడం, కొత్త కోణాల్ని జోడించడం కేశవరెడ్డిగారికి ఫోన్ చేసి విసిగించడం. పాపం ఆయన ఎప్పుడూ విసుక్కున్న దాఖలాలు మాత్రం కనిపించలేదు. కొన్నిరోజులకి ఇప్పట్లో మునెమ్మను సినిమాగా తియ్యలేమనే నిజం తెలిసొచ్చింది. నేను నిరాశపడ్డా కేశవరెడ్డిగారు నిరాశపడలేదు. “సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసులేబ్బా! చూద్దాం ఏమవుతుందో” అనేవాళ్ళు. నేను చెప్పిన క్లైమాక్స్ మార్పులకు మించిన ముగింపులు కొన్ని తనే తయారుచేశారు. ఆయన స్వప్నించి మునెమ్మని సృష్టిస్తే నేను ఆ మునెమ్మను ఇంకా శ్వాసిస్తూ ఉన్నాను.

***

డాక్టర్ కేశవరెడ్డిగారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా కలిసే ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడప్పుడూ ఫోన్లు. సాహితీచర్చలు. సినిమాల గురించి మాటలు. మునెమ్మ గురించి తక్కువగా మాట్లాడతాం.

***

తెలుగు నవలాకారుల్లో డాక్టర్ కేశవరెడ్డి ఒక మాంత్రికుడు. అత్యుత్తమ కథకుడు. ల్యాండ్ స్కేప్ ను, మిథ్ ను, మ్యాజిక్ ను, ఫోక్ లోర్  ని, జీవజంతువుల్ని కలగలిపి వాటితోనే మనుషులకు కథ చెప్పించగలిగిన అరుదైన కళాకారుడు. డాక్టర్ కేశవరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు.

  

అతను- ఆమె – నేను – ఒక కథ

rm umamaheswararao‘ఇది ఫెయిల్యూర్ స్టోరీ,’ తలకోన అడవిలో ఖదీర్ బాబు అన్న మాట ఇది.

ఆకాశం ఎత్తుకు ఎదిగి, నీలిమబ్బులతో గుస గుసలాడుతున్న మహా వృక్షాల నీడలో కథలు రాసే ఎందరో, అప్పుడు కూర్చుని ఉన్నారు. అయ్యో… ఈ అడివి చెట్లు, నీలి మబ్బులతో మాట్లాడే భాష ఖదీర్ కి అర్ధం కాలేదే! అనుకున్నాను.

బహుశా ఖదీర్ పుష్పవర్ణమాసంలో పుట్టలేదనుకుంటాను.

కథని కంప్యూటర్ తెర మీద చదవడం కంటికీ, మనసుకీ కూడా అంత హాయిగా ఉండదు. అసలే ఉబ్బదీసిన మధ్యాహ్నం చిరచిరలాడుతోంది. తిరుమల కొండ ఎండుబారిపోయి దిగులు నింపుతోంది. సవాలక్ష కారణాలతో మనసంతా చికాగ్గా ఉంది. ‘మహిత’ రాసిన సామాన్య మెయిల్ లో పంపిన కథ చదవకుండా ఆగడం ఎలా? కథ పూర్తి చేసి చూద్దును కదా, కిటికీ బయట దిరిసెన చెట్టు, ఎర్రటి ఎండలో దగ దగా మెరిసిపోతోంది. ఎండా కాలపు ధూళిలో, వెలుగు రేఖలు ముదురుపచ్చ ఆకులను ముద్దాడి, చేతులు సాచి పిలుస్తున్నాయి. కొమ్మల నిండా అటూ ఇటూ ఎగురుతూ కిచకిచలాడుతున్న పిచుకలు, గుబురు ఆకుల నడుమ మౌనంగా కూర్చున్న కోయిల.

ఆ వెలుగుపచ్చ అందానికీ, నాకూ మధ్య ఇనుప ఊచల కిటికీ.

ఇంతదాకా నేను చదివిన కథ నా కంటి ముందు ప్రత్యక్షమయిన అనుభూతి. కథలోకి నేను వెళ్ళానా? కథ నాలోకి ప్రవేశించిందా? కథా, నేనూ కలగలసిపోయిన వింత అనుభవం. గొప్ప సౌందర్యం ఏదో గాలి తెమ్మెరలా నన్ను స్పర్శించి, నా లోలోపలికి ప్రవేశించింది. కంప్యూటర్ తెరమీది కథలోంచా, కిటికీ బయటి గుబురు పచ్చ వృక్షం లోంచా? ఎక్కడి నుంచో అర్ధం కాలేదు.

లేచి వాకిట్లోకి వచ్చాను. గంగిరేణి చెట్టు కింద పండి రాలిన ఆకుల పసుపుదనం, గోడ మీద పాకుతున్న కమ్మెట పురుగు వయ్యారపు నడక, ఎదురుగా కొబ్బరాకుల మీద వాలుతున్న గద్ద నైపుణ్యం, చింకి పొదల మీద ఆరేసిన రంగుబట్టలతో వాలెండ వర్ణ విన్యాసం, ఎప్పుడూ చూసే వరండాలోని కలంకారీ చిత్రంలోనూ కనిపించిన కొత్త అందం. సమస్తమూ సౌందర్యభరితంగా కనిపించిన క్షణం అది.

సామాన్య రాసిన ‘పుష్పవర్ణమాసం’ కథ చదివాక నాకు కలిగిన అనుభవం ఇది.

పుష్ఫవర్ణమాసం ఏమిటి? ఏముంది ఆ కథలో…?

అతను, ఆమె. ఆ ఇద్దరే.

భర్త, ఇల్లు, పని, పనివాళ్లు… ఇంతేనా? రోజూ ఇంతేనా?

పంజరం బంగారమైనంత మాత్రాన అనందం కలుగుతుందా?

అప్పుడు చూసింది ఆమె అతన్ని, కిటికీ అవతల గుబురు మామిడి చెట్టుమీద ఆకుల్లో ఆకులా కలగలిసిపోయిన అతన్ని. అతని భుజం మీద కోయిల.

ఎవరతను? దయ్యమా? దేవుడా? భ్రమా?

ఎందుకో, రోజూ అతని కోసం ఎదురు చూసేది ఆమె. ‘సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను.’ పలకరిస్తే మాయమయ్యేవాడు. కొన్ని రోజులు కనిపించేవాడు కాదు. ఉగ్ర రూపమెత్తి కురిసిన వానని వింటూ ఆమె నిద్ర పోయిన రాత్రి, తెల్లవారింది బీభత్సంగా. రాలిన ఆకులు, తెగిపడ్డ పిందెలు, విరిగిన కొమ్మలతో యుద్ధక్షేత్రంలా మారిన మామిడి చెట్టు మీద మొఖం నిండా దిగులుతో కనిపించాడతను. ఏమయ్యారు, ఇన్ని రోజులు? అని నిష్టూరంగా పలకరించిన క్షణమే చెరిపేసిన గీతలా మాయమయ్యాడతను. ‘రాత్రి కురిసిన వానలా’ ఏడ్చి ఏడ్చి పడుకున్నది ఆమె. పొద్దున్నే సంపెంగ పూ చెట్టు కొమ్మ మీద కూర్చుని కిటికీ ఊచలు పట్టుకుని పలకరించాడతను.

అప్పుడు నేర్చుకుంది ఆమె ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష.’

ఇక, ఒకటే మాటలు, గలగలా జలపాతంలా. ఆ ఇద్దరి మీదా వాలిన పిట్టలు పాటలు పాడేవి. ఆ పాటల్లో వాళ్ళ మాటలు వాళ్ళకే వినిపించేవి. భూమికీ, ఆకాశానికీ మధ్య కిటికీ. బయట అతను, లోపల ఆమె. అతను రాని రోజు రాత్రి, ‘బల్లంతా బంగారు రంగు జలతారు వెలుతురు పరుచుకుని, మనసు నిండుగా ఉత్తరం రాసేది’ ఆమె.

ఆమె నవ్వులూ, మాటలూ, పాటలూ ఆ ఇంట్లోని వాళ్ళకి వింతనిపించాయి. ఆమెకి దయ్యం పట్టిందన్నారు. పుట్టింటికి పంపారు. తిరిగి వచ్చింది ఆమె, అతని కోసం ఆర్తిగా.

అప్పుడు అనిపించింది ఆమెకి, ‘లక్ష ఊచల పంజరమై, అతన్నీ, అతని పక్షుల్నీ బంధించెయ్యాలని.’

అప్పుడు అర్ధమైంది ఆమెకి, అతనూ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడని. లంకె కుదరని మాటలేవో నడిచాయి, తడబాటుగా ఆ ఇద్దరి మధ్యా. ‘అడవి పచ్చరంగు చీర, ఆకాశ నీలం రవిక ధరించిన ఆమె, చినుకు చుంబించిన నేల పరిమళం’ లా కనిపించింది అతనికి. ‘ఆకాశ సముద్రాన్ని ఈదే చంద్రుడి’ లోంచి కొంత భాగం తీసుకుని ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి ఇచ్చాడు ఆమెకి.

అప్పుడు కలిగిందామెకి, ‘అతను కావాలి’ అని.

‘మనం మంచి స్నేహితులం, అంతే’ అన్నాడతను. అతను మాట్లాడుతుండగానే ఒక మొక్క ఆమె మనసులో మొలిచి, మారాకు వేసుకుని వేగంగా పెరిగింది. ‘అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు’ అతనితో వాదించగలదా ఆమె! ఇరవై నాలుగు రేకుల ‘వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది’. అతను రాలేదు, చాలా రోజులు. ‘అతను కావాలి’ అని ఆమె ఒంటరి ధ్యానం.

ఒక రోజు అతనొచ్చాడు. కృశించిపోయిన ఆమెని చూసి దిగులుపడి వర్షించాడు. ఇప్పుడతని చుట్టూ పక్షులు లేవు. ఎందుకు ఆమె అంతగా కోరుకుంది అతన్ని. ఏం చేసుకుంటుంది అతన్ని? అతనేమివ్వగలడు ఆమెకి? ఆమెకి లేనిదేమిటి? అతనికీ, ఆమెకీ మధ్య ఉన్న కిటికీని ఏం చేసి మాత్రం ఎవరైనా తొలగించగలరు?

అప్పుడు ఇంకా బలంగా అనిపించింది ఆమెకి, ‘అయినా సరే, అతను కావాలి’ అని.

అప్పుడు మాట్లాడాడు అతను అచ్చు ఒక మగవాడిలా ఆమెతో.

ఏడుపు దాచుకున్న వైరాగ్యపు నవ్వు ఆమె పెదవుల మీద నర్తించింది. అతను వెళ్ళిపోయాడు, తొలి పరిచయపు రోజుల్లో అతను ఇచ్చిన గోమేధికం మాత్రం ఉండి పోయింది, ఆమె మెడలో మోయలేనంత బరువుగా మారి.

దయ్యాలని తరిమేసే కామాక్షమ్మ గుడి మెట్ల మీద కూర్చుని ఆమె అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది, అతను వస్తాడనే నమ్మకంతో, మెడలో నిప్పులా కణకణ మండిపోతున్న బండరాయంత గోమేధికం ధరించి.

ఇంతకీ, అతనొస్తాడా?

ఈ కథలో రచయిత్రి సమాజానికి ఏం చెప్ప దలచుకుంది?

పెళ్ళయిన ‘ఆమె’,అతన్ని కోరుకోవడం అనైతికం కాదా?

దయ్యం ఏమిటి, అశాస్త్రీయంగా.

అసలు పుష్పవర్ణమాసం ఎక్కడుంది?

ఇట్లా అడిగే వాళ్ళతో ఏం మాట్లాడగలం?!

ఏ కథ అయినా మనసుకి దగ్గరగా ఎప్పుడు వస్తుంది? ఆ కథలో మనకి మనం కనిపించినపుడు. ముసుగులేసుకునో, రంగులు పూసుకునో, మనసు పొరల్లో దాక్కునో ఎక్కడో అక్కడ ఎలాగో ఒకలాగ మనకి మనం దొరికిపోతాం. అప్పుడిక అది మన కథే అనిపిస్తుంది. అద్దంలా మనల్ని మనకు చూపుతూనే, మెల్లగా ఎక్కడికో దారి తీస్తుంది. ఆ దారి మంచిదో చెడ్డదో తీర్పులు చెప్పకుండా, తేల్చుకోమని ఒక ఆలోచన ఇస్తుంది. అప్పుడిక మనసు, పగిలిన జిల్లేడు కాయలోంచి బయటపడి ఎగిరే విత్తనంలా మారుతుంది. ఎక్కడో ఏ చెమ్మ నేల మీదో వాలి, తొలి చినుకు కోసం ఎదురు చూస్తుంది.

పుష్పవర్ణమాసం కథ చదివాక, ‘ఆమె’ ఎవరు? ‘అతను’ఎవరు? అనే ప్రశ్రలు ఉదయిస్తాయి. ఆమె ఎవరో తెలిసిపోతుంది సులువుగానే. ఆమె ఎవరో తెలిసి పోయాక, అతని కోసం అన్వేషణ మొదలవుతుంది. అతను అమూర్తం. అతను అనేకం. ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నది అతని కోసమే కదా అనిపిస్తుంది. అబ్బ ఎంత సౌందర్యం! అతను కావాలి అనిపిస్తుంది. అతను కనిపించాక కానీ పంజరం గుర్తుకురాదు. సకల జీవన బంధాలనీ గుర్తు చేసే రెక్కల పిట్ట అతను. నడి అడవిలో గాలి ఊదే వెదురు గానం అతడు. మనిషా, దేవుడా, దయ్యమా..? ఎవరైతేనేం! అతని ప్రేమ కావాలనిపిస్తుంది, ఎక్కాల పుస్తకంలో ఇష్టంగా దాచుకున్న నెమలీక కొందరికి అతను. మరి కొందరికి మాత్రం అతను ఒక రహస్యోద్యమం. నిద్ర రాత్రి తల కింద దాచుకున్న ఆయుధం. పశువుల మందని అడవికి తోలుకెళ్ళే పాలేరు పిల్లగాడికి దొరికిన భరోసా. అందుకే, అతను కావాలి. అతని కోసమే నిరీక్షణ. అతనొస్తాడనే ఆశ. అతనొస్తాడనే నమ్మకాన్ని గుండెల నిండా నింపుతుంది పుష్పవర్ణమాసం కథ.

ఈ కథ నిర్మాణ రూపం మీద కూడా కొందరికి అసహనం, సూటిగా చెప్పొచ్చుగా, ఇన్ని ప్రతీకలెందుకని చిరాకు. మార్య్యూజ్ ని ఇలా ఎందుకు రాశావయ్యా అని అడగ్గలమా? అలా రాయడం అతని అవసరం, అప్పటి అవసరం. అవసరమే కదా కథకి రూపశిల్పాన్ని నిర్దేశిస్తుంది. అనుభవించి పలవరించినపుడే అది ప్రవాహంలా బయటకొస్తుంది. పుష్పవర్ణమాసం కూడా ఇంతే.

ఇంతకీ ఈ కథ నీకెందుకు నచ్చిందీ అనడిగితే, నేనేం చెప్పగలను?

బహుశా పుష్పవర్ణమాసంలో పుట్టానేమో అని తప్ప.

*****

పుష్పవర్ణమాసం

~సామాన్య

Painting of saamaanya -- pushpavarnamasam

ఆ  రోజు  నా మేనకోడలికి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. మా గ్రామ దేవత కామాక్షమ్మ గుడికి ఎడం చేతి వైపున వుంటుంది సుబ్బరాయుని పుట్ట. అందరం అక్కడ చేరాం. పుట్టు వెంట్రుకలు తీస్తుంటే, పిల్ల పాపం ఘోరంగా ఏడ్చేస్తుంది. కొందరు పొంగళ్ళు పొంగించేందుకు  పొయ్యి పెట్టడం కోసం రాళ్ళు వెదుకుతున్నారు. మా గుడి ఆవరణ అంతా పరుచుకుని గల గల లాడుతూ, ఎండలో  వెండిలా మెరిసిపోతూ  వుంటుందో పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ ఎత్తుగా కట్టిన అరుగు వుంటుంది. పుట్ట దగ్గర జరుగుతున్న తతంగాలకి చిరాకు వచ్చి, నేను వెళ్లి ఆ అరుగు పైకి చేరి, మందిరం  ఆవరణలో అక్కడక్కడా తచ్చాడుతున్న భక్తుల్ని  చూస్తూ కూర్చున్నా.

గుడికి కుడి వేపున వున్న మండపంలో   స్తంభానికి ఆనుకుని ఎవరో ఒకామె  కూర్చుని వుంది. గొప్ప అందంగా వుంది. నేను అద్దాలు తీసి తుడిచి పెట్టుకుని మళ్ళీ చూశా. దానిమ్మ పువ్వు రంగు ఝరీ  చీరలో కొంత వాడిన మొగలిపువ్వులా వుంది. ఆవిడ వొంటి రంగు, చీర రంగుల అద్భుత సమ్మెళనమో, మరోటో, వద్దన్నా బలవంతంగా తనవైపుకి లాగేస్తుంది ఆమె  సౌందర్యం. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరీవిడ?  ఇంతక ముందెప్పుడూ ఇక్కడ  చూడలేదే … ? ఎవరినడగాలి ఈవిడ గురించి … ఆలోచిస్తుంటే  విఘ్నేస్వరుడి మందిరం లో నుండి బయటకొచ్చాడు చిన్న పూజారి శేషాచార్యులు . శేషు చిన్నప్పుడు నా ఆటల పాటల  జట్టులో ప్రధాన సభ్యుడు. నా కంటే ఏడెనిమిదేల్లు  చిన్న వాడు. వాడిని పిలిచి గుసగుసగా “ఏం శేషు! ఏంటి సంగతి ఈ మధ్య తపస్సులూ గట్రా మొదలెట్టావా ఏంటి? దేవకన్యలని గుడికి రప్పించావ్” అన్నా. తలా తోక లేని నా మాటలకి  అచ్చు చిన్నప్పట్లానే వెర్రి ముఖం ఒకటి పెట్టేసి, “దేవకన్యలేంటి పెద్దక్కా?” అన్నాడు ఆశ్చర్యపడిపోతూ, నేను ఇంకా గుస గుస పెంచి, అదిగో ఆ మండపం లో స్తంభానికి ఆనుకుని కూర్చుని వుందే ఎవరేమిటి  ఆవిడ దేవకన్య కాకపోతే” అన్నాను. అది విని శేషు ముఖం వికాసంగా పెట్టి “దేవకన్య కాదు పెద్దక్క, దెయ్యం” అన్నాడు పూలు కొబ్బరిచిప్ప  చేతిలో పెడుతూ.

అప్పుడే అటోచ్చిన మా అత్త   “పెద్దమ్మాయ్  నడువ్, నడువ్ ఎక్కడకొస్తే అక్కడ స్నేహితులు, మాటలూ…అందరూ నీ కోసం వెతుకుతున్నారు” అన్నది. నేను అరుగు దిగి అత్త వెనకాలే నడుస్తూ ఆవిడను చూసాను. అదే ఫీలింగ్. దానిమ్మ పూరంగు పట్టుబట్టలో చుట్టిన మొగలి పూపొత్తిని చూసినట్లు. ఆవిడ దెయ్యమేంటి, ఈ శేషుకి చిన్నప్పట్నుంచి వేపకాయంత వెర్రి వుంది.ఇప్పుడది తాటికాయ అయ్యుంటది. మా  గుడికి దయ్యం పట్టిన వాళ్ళని చాలా మందినే తీసుకొస్తుంటారు. చాలా మంది నయమై కూడా వెళ్తుంటారు, కానీ వాళ్ళెవరూ ఈవిడలా శుభ్రంగా వుండరు, ఎందుకో ఆవిడతో మాట్లాడాలనిపించింది. ఆవిడ సౌందర్యం వల్లనేమో…మా అత్త చేతి నుండి నా చేతిని విడిపించుకుని ఇదిగో అత్తా నీ వెనకే వచ్చేస్తా గానీ నువ్వు  పద అని మండపం వైపు నడిచా.

పువ్వులా ఆ స్తంభానికి ఆనుకుని కూర్చుని వుంది ఆవిడ, నిశ్చలంగానో, పరధ్యానంగానో. నేను నిశ్శబ్దంగా, ధ్యానానికి వచ్చిన భక్తురాల్లా ఆవిడకి కొంచం ఎడమగా  కూర్చుని, శేషు  ఇచ్చిన కొబ్బరిచిప్ప  పగలకొట్టడం మొదలుపెట్టాను. ఆవిడ పరిసర స్పృహలో లేదు. దగ్గరగా ఇంకా బాగుంది. రింగుల జుత్తు, నిండు నవ్వు పెదవులు.

కాసేపటికి చేతికొచ్చిన చిన్న కొబ్బరి ముక్క ఆవిడ వైపుకు సాచి, పరిచయపూర్వకంగా నవ్వుతూ “తీసుకోండి” అన్నాను. ఆవిడ చిర్నవ్వి “థాంక్ యు” అంది.  అమ్మయ్య ఈవిడ  దయ్యం కాదు దేవతే. కానీ పలకరించడం  ఎట్లా?  కాస్తా బలంగా  ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి “మాది ఈ ఊరే. కానీ, మిమ్మల్ని ఇంతకు  ముందు ఎప్పుడూ ఇక్కడ చూసినట్టు జ్ఞాపకం లేదు” అన్నాను. ఆవిడ నా మాట విని, పల్లవి అసలే లేని పాటలా “ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడికి రాలా నేను! దయ్యం పట్టిందట నాకు! దయ్యం పట్టాలని  నేను గాడాతి  గాడంగా కోరుకుంటున్నానూ… అయినా పట్టడం లేదు అని చెప్పా. ఎవరూ వినలా. ఇక్కడ తెచ్చి వదిలారు. కానీ నాకిక్కడ బాగుంది. సందె వాలిందంటే చాలు ఆ చెట్టు పైకి ఎన్ని పక్షులొస్తాయో తెలుసా. అతనితో పాటూ అట్లాగే వచ్చేవి రకరకాల పక్షులు, రంగు రంగులవి, సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను” అన్నది.

నాకు అయోమయం అనిపించింది. ఏం మాట్లాడుతుందీవిడ, శేషు చెప్పినట్లు ఈవిడ తేడానేనా ?కానీ టూ క్యూరియస్. అందుకే తల ఊపి “మీరు భలే అందంగా వున్నారు. ఎంతసేపైనా చూడాలనిపించేట్టు…ఇంతకీ ఎవరతను” అన్నాను

“ఎవరూ”

“అదే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, సౌందర్యాన్ని వెంట తెచ్చేవాడని అతను.”

“ఓ! అతనా, అతను దయ్యం! , పేరు నాక్కూడా తెలియదు”

నేను ఆశ్చర్య పడ్డాను. తల ఒకసారి విదిలించి, వెళ్దామా అని ఆలోచించాను. పగలు మద్యాహ్నం లోకి  జారబోతుంది. సుబ్బరాయుడి పుట్ట దగ్గర, పొయ్యికి మూడురాళ్ళు దొరికినట్టే వున్నాయి సన్నటి పొగ లేస్తుంది. ఎందుకో పోలేక ఆగి, ఆవిడ వైపు చూసి “దయ్యాలు ఉన్నాయంటారా?” అన్నాను. ఆవిడ “దయ్యాలున్నాయి, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్లకి కనిపిస్తాయి” అన్నది. పుష్ప వర్ణ మాసమా…! అదేం మాసం? నేనెప్పుడూ వినలేదే ఆ పేరు, బహుశ   పుష్య మాసాన్ని ఈవిడిట్లా చెప్తుందేమో అనుకుని, “అవునా… ఎక్కడ చూసారు దయ్యాన్ని మీరు?” అన్నాను.

ఆవిడంది “ఒకరోజు మధ్యాహ్నం పన్నెండూ అట్లా అయి వుంటుంది. వైశాఖ మాసపు చివరి రోజులవి. నా పడక గదిలో దిళ్ళకి ఆనుకుని, కిటికీలోంచి చూస్తూ వున్నాను. పెద్ద కిటికీ మాది. కిటికీ లోంచి లోపలికి రావడానికి తెగ ప్రయత్నిస్తూ వుంటుంది సంపెంగ చెట్టు. ఆ పువ్వుల రంగూ, మధురమైన ఆ  వాసన ఎంత బాగుంటాయో. దాని వెనక జామ చెట్టు, బాగా పెద్దది. మా అత్తగారు కాపరానికి వచ్చినప్పుడు వేసిందట. అది కూడా పూత పూసింది. తెల్లటి జామి పూలు. దాని వెనక మామిడి చెట్టు. ‘బేనిషాన్’. బోలెడు కాపు కాసింది ఆ ఏడాది. గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతున్నాయ్. ఆ అందమైన వర్ణాల కలివిడి ఎంత బాగుండిందో, చూస్తూ కూర్చున్నాను.

చాలా సేపటి నుండి ఒక కోయిల ఆర్తిగా, అదే పనిగా ఎవరినో పిలిచినట్టు కూస్తుంది. నేను లేచి, సరిగా కూచుని మామిడి చెట్టులో మూల మూలలా కోయిలని వెతకడం మొదలెట్టాను. అదిగో అప్పుడు చూశాను ఆ దయ్యాన్ని … అదే అతన్ని. కోయిల అతని భుజం పైనే వుంది. మొదట నాకేం అర్ధం కాలేదు. చెట్టు గుబురులో ఆకుల్లో ఆకులా అతను. ధ్యానంగా, ఎక్కడో దూరంలో నిమగ్నమై, శరీరం  మాత్రం అక్కడ వున్నట్లు. నేనేమైనా భ్రమ పడుతున్నానా? లేచి టేబిల్ పైన నీళ్ళు తీసుకుని తాగి, గదిలోనే మూడు నాలుగు సార్లు అటూ ఇటూ నడిచి, మళ్ళీ  వచ్చి చూశాను. అతను అక్కడే, అట్లానే వున్నాడు. చుట్టూ  పింద, దోర మామిళ్ళు, భుజం పైన కోయిల, ఆకులు గాలికి అటూ ఇటూ కదుల్తుంటే అతనిపై  పరుచుకుంటున్న వెలుగునీడల తారాటలు… ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎంత సుందరమైన దృశ్యం కదా అది అని.

మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్ళకి దయ్యాలు కనిపిస్తాయని. మా అమ్మ కూడా అదే మాసంలో పుట్టింది. ఎంత బాగుండేదో మా అమ్మ. మొక్కల్ని, సీతాకోకల్ని,ఆకాశాన్నీ, ఆరుద్రల్నీ, వాన చినుకుల్నీ అన్నింటినీ ప్రేమించేది, తియ్యగా పాడేది, గొప్పగా రాసేది. ఎంత బాగుండేదో తెలుసా! బహుశా మా అమ్మమ్మ ఆ మాసంలో పుట్టలేదనుకుంటా ఆవిడ నగల్ని, వాహనాల్ని, నౌకర్లు చాకర్లు ఉండే మేడల్ని ప్రేమించేది. మా అమ్మ చీటికి మాటికీ మా నానతో గొడవపడి, నన్ను తీసుకుని మా అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేది. కానీ మా అమ్మమ్మ మళ్ళీ మా అమ్మని నాన దగ్గరికే  పంపేసేది. ఒకసారి మా అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుండి నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగా. మా అమ్మమ్మ, నేను కూడా పుష్ప వర్ణ మాసంలోనే పుట్టినందుకు బాగా దిగులు పడేది.ఆ దయ్యాన్ని చూడగానే నాకు అదంతా గుర్తొచ్చింది.

అట్లా నేను దాదాపు ఒక వారం రోజులు ఆ దయ్యాన్ని చూస్తూ వుండేదాన్ని. చూస్తూ చూస్తూ వుండగా నాకో రోజు అతన్తో మాట్లాడాలనిపించింది. ఏం చెయ్యాలి ఎలా అతని దృష్టి నా  వైపుకి తిప్పుకోవాలి. ఆలోచించి, ఆలోచించీ చివరికి  పని వాళ్ళని రప్పించి, దోర మామిళ్ళను కొయ్యమని చెప్పా. నేను ఆశించినట్టే ఆ మనుషుల అలజడికి అతను ధ్యానంలోంచి బయటకొచ్చాడు.

దయ్యాలలో మనీశ్వరుడు అనే దయ్యాలు కూడా ఉంటాయట. అవి ఎప్పుడూ మౌనంగా ఉంటాయట మా ఊర్లో చెప్పేవాళ్ళు. ఇతను అది కాదు కదా అనుకుంటూ, “మీరు నాకు కనిపిస్తున్నారు అదిగో ఆ గదిలోంచి మిమ్మల్ని చూశా, మీతో మాట్లాడాలని వుంది” అని చెప్పా. అతను తల వంచి ఎత్తైన ఆ చెట్టు పైనుంచి నన్ను చూశాడు. ఆ తరువాతి  నిమిషంలో అతనక్కడ లేడు. ఎంత గుచ్చి గుచ్చి,కొమ్మ కొమ్మా వెతికినా, అతను అక్కడ కనిపించలేదు. నా మాటలు విని, మామిడికాయలు కోస్తున్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నానేమో  అనుకున్నారు. నేను గబగబా నా గదిలోకి  వచ్చి  అక్కడినుండి చూశా. అతను లేడు. ఆ తరవాత నుండీ ప్రతి రొజూ అతని కోసం వెతికా. మధ్యాహ్నం పూట కదా అతను నాకు కనిపించింది. అందుకని, ప్రతి మధ్యాహ్నమూ అది పనిగా వెతికేదాన్ని. కానీ  అతను మళ్ళీ కనిపించలేదు.

ఒకరోజు పగలంతా బాగా ఎండ కాసింది, రాత్రి ఏడూ ఎనిమిది అవుతుండగా వర్షం మొదలయింది. ఉరుములూ, మెరుపులతో  ఆకాశం ఎర్రగా మెరుస్తూ ఉగ్రరూపమెత్తింది. రాత్రంతా వర్షమే. వర్షాన్ని వింటూ నిదురపోయాను. పొద్దుట లేచి చూద్దును కదా, ఎంత బీభత్సమో… ! మామిడికాయలు పిందెల తో సహా రాలి పొయ్యాయి. ఆకులూ, అక్కడక్కడా రాలి పడిన కొమ్మలూ  … గొప్ప యుద్ధక్షేత్రంలా వుంది అక్కడంతా. అదిగో ఆ రోజు మధ్యాహ్నం, మళ్ళీ చూశా అతన్ని. ఎంత దిగులో  ముఖం నిండా, గభ గభా లేచి, చెట్టు క్రిందకి వెళ్ళా. రాత్రి వర్షానికి తడిసి జడిసిన పక్షులు అతని దగ్గర సేద తీరుతున్నాయ్. నేను తల పైకెత్తి “ఇన్ని రోజులు రాలేదే, ఏమయ్యారు?” అన్నాను. అతను నన్ను చూశాడు. నేను అతన్నే చూస్తూ వున్నాను. చూస్తూ ఉండగానే, బోర్డు మీద వేసిన బొమ్మ డస్టర్తో చెరిపేస్తే ఎలా చెరిగిపోతుందో అలా చెరిగిపోయాడు. పక్షులు మాత్రం మిగిలాయి.

నాకు ఏడుపొచ్చింది. గదిలోకొచ్చి మామిడి చెట్టు వంక చూస్తుంటే, ఎందుకో తెలీదు… రాత్రి కురిసిందే ఉదృతమైన వర్షం, ఉరుముల మెరుపుల వర్షం, అట్లా వచ్చింది ఏడుపు. గది తలుపులు భిగించి, పెద్ద పెట్టున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుని ఏడ్చుకుని పడుకున్నాను. బహుశా గంట తర్వాత అనుకుంటా మెలకువ వచ్చింది. మామిడి చెట్టు వంక చూడటానికి తల తిప్పానో లేదో, నా కిటికీ దగ్గరగా ఊచల్ని పట్టుకుని, సంపెంగ పూచెట్టు కొమ్మ పైన కూర్చొని వున్నాడు అతను. నా మెలుకువ కోసమే చూస్తున్నట్లు, ఆత్రుతగా “ఎందుకు ఆ ఏడుపు?” అన్నాడు. నేనతన్ని చూశాను. యదావిదిగా అతని చుట్టూతా పక్షులు, సీతాకోకలూ, ఇప్పుడు సంపెంగలూ…చూసి చూసి, అతన్ని కళ్ళనిండుగా నింపుకుని “తెలీదు” అన్నాను. అతను నిశ్శబ్దంగా మామిడి చెట్టు వంకే చూసి, చాలాసేపటికి “ఒకటేరోజుటి వర్షం, చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో పిచ్చిదానిలాగా” అన్నాడు. అతని ముఖం నిండుగా దిగులు.

అట్లా మొదలయింది మా పరిచయం. అతను ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష’ మాట్లాడేవాడు. మొదట్లో ఆ భాష నాకు అర్ధమయ్యేదే కాదు. తరువాత నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ భాష, అతని మాటా ఎలా ఉంటుందంటే, అతనితో మాట్లాడిన తరువాత హృదయం, చినుకులతో తడిసిన పుడమిలా మారేది.

ఆ కొత్తల్లోనే ఒకసారి అడిగా “ఈ ఇంటితో మీకేమైనా అనుభందమా?” అని. ఎందుకడిగానో నిజంగా నాకూ తెలీదు. ఆ ప్రశ్న వినగానే అతను దిగులుగా తలవాల్చి “ఈ ఇంట్లో తనుంది” అన్నాడు.

“తనంటే?”

“నేనూ తనూ ప్రేమించుకున్నాం, కోతకొచ్చిన పంటని ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందే …అట్లా వాళ్ళ  ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేసేసారు. ఆ తరువాత నించీ నేనిట్లా. ఈ మామిడి చెట్టు వున్న చోటే. ఏడు మామిడి చెట్లు  పెరిగీ …మరణింఛీ … పెరిగాయి. కానీ ఆవిడ ఆ  ఇంట్లోంచి బయటకు రాదు ఎంత ప్రార్దించినా……..” అతని కళ్ళలో నీళ్ళు. ఎలా ఓదార్చను అతన్ని.

నాకు హట్టాత్తుగా గుర్తొచ్చింది. నా పెళ్ళైన కొత్తల్లో ఓ మధ్యాహ్నం తలారా స్నానం చేసి, ఎందుకో ఏడుస్తూ వట్టి గచ్చు మీదే పడుకున్నా. గచ్చు మీద పరుచుకుని నా జుత్తు. ఎందుకో, ఆ మగతలో ఎవరో తెల్లగా ఇంత పెద్ద కన్నులున్న ఒకావిడ చల్లగా నా నుదుటిని, జుట్టుని నిమిరినట్టు, నా దుఖాన్ని ఒదార్చినట్టు భ్రాంతి కలిగింది. మా అమ్మేమో అనుకున్నాను అప్పుడు. కానీ కాదు. ఆవిడ, ఇతను చెప్పే ఆవిడ. అతనితో  అన్నాను “ఆవిడ తెల్లగా ఉంటారా” అని. అతను దుఃఖంలోంచి ఒత్తిగిలి “తను మేలి ముత్యం లాగుంటుంది” అన్నాడు మురిపెంగా. అంతే ఆ తరువాత మా మధ్య ఆ సంభాషణ మళ్ళీ ఎప్పుడూ రాలేదు.

అతను ఎంత పురాతనుడో, ఎప్పటి వాడో, ఎక్కడి వాడో నాకేం అవసరం? నేనేం చేసుకుంటా ఆ వివరాలన్నీ? అదీకాక దుఃఖంతో నిండిపోయిన అతని గతాన్ని నేనెందుకు కదిలించాలి. అందుకే ఏడు మామిడి చెట్ల అతని గతాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు.

క్రమంగా అతను నాకొక వ్యసనమయ్యాడు. సంపెంగ పూ చెట్టుపైకి అతను రావడం ఆలస్యం  ఎక్కడెక్కడి  పక్షులూ  వచ్చి నా కిటికీ పైనా, నా పైనా, అతని పైనా వాలేవి. ఎన్నెన్నో పాటలు పాడేవి. ఆ పాటల్లో మా మాటలు మాకే కొన్నిసార్లు వినిపించేవి కాదు. ఆ పక్షుల్లో ఒక కోయిల నా గదిలోపలికొచ్చి గూడు పెట్టడం మొదలెట్టింది. ఎక్కడినుండో పుల్ల పుల్లా ఏరుకొచ్చి గూడు కట్టేది. పొరపాటున  అదెక్కడ  ఫాన్ రెక్కలు  తగిలి చచ్చిపోతుందోనని నాకు భయమేసేది. ఫాను స్విచ్చికి  గట్టి టేప్ ఒకటి అతికించి ఫాన్ తిరగకుండా చేసేశాను.

అప్పుడడిగాడు మా ఆయన ”ఫాన్ స్విచ్ ఎందుకిట్లా చేశావు” అని. నేను మామూలుగానే చెప్పా కోయిల గూడు కడుతుందండీ, ఫాన్ రెక్కలు  తగిలితే చచ్చిపోతుంది అని. విచిత్రంగా మా ఆయన నా వంక వెర్రి చూపు చూసి,”కోయిల  గూడా? ఎక్కడ? అసలు కోయిల గూడు పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నావా?” అని వాదులాటకొచ్చాడు.

నేను ఓపికగా స్టూలు తెప్పించి కోయిల పేర్చిన పుల్లల్ని, సగం పూర్తయిన దాని గూటినీ  చూపించాను. అప్పుడు కోయిల, కిటికీ ఊచల మీదే నిలబడి మా ఆయన వంకే చూస్తుంది కూడా. అయినా సరే అదేం మా ఆయనకి  కనిపించలేదు. నా వంక అనుమానంగా చూట్టం మొదలెట్టాడు. ఇంట్లోవాళ్ళు, నేనతనితో  మాట్లాడేప్పుడు దొంగచాటుగా వినే వాళ్లు. ఏదో  పిచ్చి భాషలో మాట్లాడుతానట, నవ్వుతానట. ఆ విషయం మా ఆయన ఒక రాత్రి ప్రస్తావించాడు. నేనెట్లా చెప్పేది, నీలిమేఘం అడవితో మాట్లాడే భాష ఒకటి ఉంటుందని …ఆయనకి  నేనెట్లా అర్ధం చేయించగలను? ఆయన పుష్ప వర్ణ మాసంలో పుట్టలేదు కదా. ఆ దయ్యాన్ని, అదే అతన్ని నేనెలా ఈయనకి చూపించగలను? అందుకే అదేమీ లేదండీ, ఏదో పాట నేర్చుకుంటున్నాను, అంతే అని చెప్పా.

అప్పటి నుండి ఇక జాగ్రత్త పడడం మొదలు పెట్టాను. మా ఇంటికి  వెనక వైపు పది పన్నెండు మెట్లు పైన రెండు గదులున్నాయ్..ఒక దాంట్లో ఎప్పుడో ఒక వంటావిడ ఉండేదట. ఒకసారి వాళ్ళ ఊరికెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదట. ఎందుకనో ఆ గదికి, నేను వచ్చినప్పటినుండి తాళం వేళ్ళాట్టమే చూశాను గానీ, తెరవడం చూళ్ళేదు. దాని పక్కనే ఇంకో చిన్న రూమ్ వుంటుంది. దాంట్లో, మా తోటల్లోంచి కోసుకొచ్చిన దోర పళ్ళని పెట్టి మగ్గ వేస్తుంటారు. రక రకాల పళ్ళు. మగ్గిన తర్వాత ఇంటిలోపలికి తీసుకొస్తారు. ఆ గది భలే వుంటుంది. రంగురంగుల పళ్ళతో, మిళితమై పోయిన అనేక రకాల వాసనలతో…

మేమిద్దరం అక్కడ కలుసుకునేవాళ్ళం. అక్కడా కిటికీ బయట తను, లోపల నేను. భూమికి ఆకాశానికి మధ్య కిటికీ వుంటే ఎట్లా వుంటుందో అట్లా అనిపించేది నాకు. ఒక్కోసారి అతను రెండు మూడు రోజులు వొచ్చేవాడు కాదు. అప్పుడు నేనతనికి, రాత్రంతా కూర్చుని నా మనసు నిండుగా  ఉత్తరం రాసేదాన్ని. ఒకరోజు అట్లాగే నా మనసుని బల్లపైన పరచి రాస్తూ కూర్చున్నాను. బల్లంతా బంగారు  రంగు జలతారు వెలుతురు పరుచుకుంది. అతని స్మృతి నా పెదాలపై నవ్వై పరుచుకుంది. నేను రాసుకుంటూ పోతున్నాను. హటాత్ గా మా ఆయన నిదరనించి  లేచి “ఏం చేస్తున్నావ్” అన్నాడు. అంతే నేను గబగబా నా మనసునంతా జవిరి నా రెండు చేతుల మధ్యకు నెట్టి, కష్టపడి ఆ కాంతినంతా దాచి దాచి “ఏం లేదు ఏదో రాసుకుంటున్నా” అన్నాను. ఆయన ఆశ్చర్య పడి,”చీకట్లో ఏం రాస్తున్నావ్” అన్నాడు. చీకటా! చీకటెక్కడ! మిల మిల మెరిసిపోయే ఇంత కాంతి ఉండగా…నేను మౌనంగా ఉండిపోయాను. మా ఆయన చిరాకు పడి “వచ్చి పడుకో” అని గద్దించాడు. నేను నెమ్మదిగా లేచి వెళ్లి పడుకున్నాను.

మరుసటి రోజు అతనొచ్చాడు. ఉత్తరం చదివావా అని నేనతన్ని అడగలేదు, అడగాల్సిన అవసరమూ లేదు. ఆ ఉత్తరాన్ని ఎలా చదవాలో అతనికి తెలుసు.

ఆ రోజుల్లో మేం గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. ఏం మాట్లాడుకునే వాళ్ళమో ఇప్పుడు కొంచేమన్నా గుర్తు  లేదు. కానీ అతనితో మాట్లాడటం నాకు చాలా బాగుండేది. ఎందుకంటె అతను, చీకటిని బంతాడే సూర్యుడి లాగా, మరో ప్రపంచపు కల లాగా, స్వప్నాలకే స్వప్నం లాగా సంభాషించే వాడు.  కొండవాలు లో పుట్టిన అనాది  గానం లా ఉండే వాడు. అతనికి పక్షుల భాష, పూల భాషా అన్నీ  తెలుసు. ఒక సారి నా ముందే మా కుక్క అతనితో మాట్లాడటం నేను చూశాను.

మా ఇంట్లో నా గురించి గుస గుసలు ఎక్కువై పోయాయి. నేను ఒక్కదాన్నే వెళ్లి ఆ మూల గదిలో కూర్చుంటున్నానని, నాలో నేను మాట్లాడుకుంటూ, నవ్వుకుంటున్నానని అనుకోవడం మొదలుపెట్టేరు. మా ఆయన విసిగి నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళాడు.అందరికీ, సంక్రాంతి పండుగకి ఊరికెళ్ళిఒదని  చెప్పుకున్నారు. మా ఊరంటే మామూలు రోజుల్లో నాకెంత సంతోషమో .ఈసారి అట్లా అనిపించలేదు. నా బట్టలంతా నాకు తెలీకుండానే  పనిపిల్ల ఎప్పుడో సర్ది పెట్టేసింది  .రాత్రి పదిగంటల వేళ మా ఆయన “బయల్దేరు” అన్నాడు.నేను ముందు మొరాయించాను,ఏడ్చాను, అతనికి చెప్పకుండా ఎలా వెళ్ళగలను ?.అతను నన్ను వెతుక్కోడా …ఏమనుకుంటాడు,ఇంకెప్పటికీ రాకుండా అద్రుశ్యమైపోడా?

మా ఆయన, అమ్మమ్మకి ఏమిటేమిటో చెప్పాడు.నేను మాట్లాడుతున్న పిచ్చి భాష గురించి చెప్పాడు.వినివిని మా అమ్మమ్మ “ఏం చేసేది నాయనా  అన్నీ వున్నా సుఖ పడే రాత  నా నుదుటున రాసిపెట్టలేదు ఆ దేవుడు ,లేకుంటే తల్లిలాగే ఇదీ పుష్పవర్ణ మాసంలోనే పుట్టాలా” అని ఏడ్వటం మొదలుపెట్టింది.

నేను మా అమ్మమ్మ తిప్పిన గుడులూ, మసీదులూ అన్నీ తిరిగాను.నాకేం కాలేదని చెప్పినా మా అమ్మమ్మ వినిపించుకోలా. నీలిమేఘం అడవితో మాట్లాడే భాష గురించి చెప్పబోయినప్పుడల్లా టపటపా చేత్తో తల బాదుకునేది.నేనింక భయపడి ఆమాటే ఎత్తడం మానేశా.కొన్ని రోజులకిక  నేను కుదుట పడ్డానని చెప్పి  మా అమ్మమ్మ నన్ను మా ఇంటికి తెచ్చి వదిలి వెళ్ళింది.

ఆ రోజు తలస్నానం చేసి, కిటికీ దగ్గర కూర్చుని, వేళ్ళతో జుత్తు చిక్కులు  తీస్తూ వున్నాను.దిగులుగా ఉంది. అతను ఇక రాడా …నన్ను మరిచిపోయుంటాడా! అని.అతను వచ్చాడు.అతనితో పాటు వచ్చిన పక్షులు ,మేత తెచ్చిన అమ్మకోసం నోరంతా తెరిచి అరుస్తాయే బుజ్జి పిట్టలు, అట్లా నన్ను చూసీచూడగానే అరవడం మొదలుపెట్టాయి.అతన్నట్లా చూడగానే నాకు  ఒక్క సారిగా లక్ష ఊచల పెద్ద పంజరాన్నై పోయి అతన్ని చుట్టేసి అతన్నీ, అతని పక్షుల్నీ అట్లాగే బంధించేయ్యాలనిపించింది.  అతను నన్ను చూసి   గొంతు పెగల్చుకొని ,చాలా నీరసంగా  “ఇన్ని రోజులూ ఎక్కడికెళ్ళారు వీణాధరి” అన్నాడు.అదే అతని పెదవులు నా పేరుని మొదటిసారి పలకడం.నేనెప్పుడూ అతనికి నా పేరు చెప్పలేదు ,అతని పేరూ అడగలేదు.ఆ తరువాత ఇంకొక్కసారి అతను నన్ను పేరుతో పిలిచాడు మా మొత్తం పరిచయంలో.

అతని నోటి వెంట  నా పేరు వినగానే ఒక్కసారిగా  శరీరమంతా కంపింఛి పోయింది .గుండె దడదడమని కొట్టుకుంది.కళ్ళలో నీరు కమ్మింది.ఆ ఉద్వేగం నుండి బయటకు రాక మునుపే ,అతను చాలా మొరటుగా “ఏం గొంతు నొప్పా? మాట్లాడవేం…? చెప్పడానికేం…? ” అని ఏకవచనంతో గద్దించాడు. ఆ గద్దింపుకి నవ్వొచ్చింది.అతని అక్కరకి ఏడుపు పొంగుకొచ్చింది . నవ్వి ,కళ్ళ నీళ్ళని కళ్ళలోనే దాచిపెట్టేసి ”అచ్చు దయ్యం లాగే మాట్లాడుతున్నారు” అన్నాను.అతను నెమ్మదిగా శాంతించాడు.ఎన్ని ఆలోచనలో  తెలుసా?పగలూ రాత్రి ఆ మామిడి చెట్టు మీదే కూర్చున్నా తెలుసా !అన్నాడు.అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ” మీకు ముగ్గులేయడం వచ్చా ?” అన్నాడు పిచ్చిగా .మళ్ళీ “పండగకి ఏం చీర కట్టుకున్నారు” అన్నాడు .నేను ఉక్కిరిబిక్కిరయ్యాను ఆ కొత్త కొత్త ప్రశ్నలకి .ఎట్లాగో మనసు కూడదీసుకుని “అడవి పచ్చ రంగు చీర,ఆకాశ నీలం రవిక “అన్నాను.అతను కళ్ళు మూసుకుని ధ్యానంగా  “చినుకు చుంబించిన నేల పరిమళంలా ఉన్నావ్ ” అన్నాడు.

ఆ రోజు రాత్రి ,మా ఆయన పని మీద ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళాడు.అతను మొగ్గలు విడుతున్నసంపెంగ చెట్టు మీద, నేను కిటికీ లోపల కూర్చుని వెన్నెల కౌగిట్లో తడిసి ముద్దయ్యాం.చంద్రుడు ఆకాశాన్ని  ఆ ఒడ్దు నుండి ఈ ఒడ్డుకి త్వరత్వరగా ఈదేస్తున్నాడు.అట్లా ఈదే చంద్రుడిలో కొంత భాగం తీసుకుని ,ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి నాకిచ్చాడు.ఆ పువ్వు ధగ ధగా మెరిసిపోతూంది.గమ్మత్తుగా గుబాలిస్తుంది .దాన్ని పక్కనుంచుకుని వేకువున, ఎప్పుడో అతను వెళ్ళాక నిదురపోయాను.

మరుసటి రోజు నిదురలేచినప్పట్నుంచి ఏదో దిగులు. ఒక చోట నిలువనీయని దిగులు .నాకేదో కావాలి ,ఏదో కాదు ,నాకు అతను కావాలి ,నాకు నాకే సొంతంగా కావాలి, అతను నావాడైపోయి నేను అతని దాన్నైపోవాలి,హృదయం లోంచి  పొంగుకుని పొంగుకుని వచ్చింది దుక్కం  .ఏడుస్తుంటే నా గదిలో గూడు కట్టుకున్న కోయిల నన్నే రెప్ప వేయకుండా చూడటం మొదలుపెట్టింది.చూసీ చూసి చివరకి  ” అతనితో నేను చెప్తానులే ఏడవకు” అన్నది.

అతనొచ్చాడు .ఇవాళ అతని ముఖం కాంతిగా ఉంది.పెదాలపై నవ్వుంది. అతనొచ్చీ రాగానే  కోయిల వెళ్లి అతని భుజంపై కూర్చుని, ఒక పాట పాడటం మొదలుపెట్టింది.’ ఆకుపచ్చటి పాట’.పాట వింటూ ఉండగానే అతని ముఖం వివర్ణమవడం  మొదలు పెట్టింది. పాట ముగిశాక, కోయిలని భుజంపై నుండి చేతిలోకి తీసుకుని “నువ్వు పాడకుంటే నేను తెలుసుకోలేననుకున్నావా  కోయిలా” అన్నాడు.

నేను తలవంచుకుని కూర్చున్నాను. మనసంత ఆందోళనగా, భయంగా ఉంది.దిగులు పొగలాగా కమ్ముకుంటూ ఊపిరాడనీయకుండా ఉంది.అయినా అట్లాగే దిగులుగా చెప్పాను “నాకు మీరు కావాలి” అని .అతనేం మాట్లాడలేదు చాలాసేపు .చివరికి “మీరు అతని భార్య వీణాధరి , మిమ్మల్ని ఎట్లా స్వీకరించగలను”అన్నాడు.నాకేం మాట్లాడాలో తోచలేదు.సంపెంగల గాలికి పక్షులన్నీ శాంతిగా ,నిశ్సబ్దంగా కూర్చున్నాయ్.ఆ నిశ్శబ్దం లోంచి నేను మొండిగా  “నాకు నువ్వు కావాలి” అన్నాను.అంత ఏక వచనపు చనువు ఎట్లా పుట్టిందో  నాకు …మళ్ళీ రెట్టించి ”నాకు నువ్వు కావాలి”అన్నాను.నాకు అదొక్కటే తెలుసు మరి.

అతను నిట్టూర్చి “మీకు అట్లాంటి ఆలోచన కలగడానికి నేను చేసిన తప్పేంటి? అన్నాడు.అతను మాట్లాడుతూ ఉండగానే, హటాత్తుగా  నా మనసులో ఒక మొక్క మొలవడం చూశాను.  అది మారాకు  వేసుకుంటూ అతి వేగంగా పైకి వస్తున్నది .నేనా మొక్కనే గమనిస్తూ వున్నాను .అతను  “నాకు మీతో మాట్లాడటం బాగుంటుంది.అయినా  నేను ఆమెని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా.మనం మంచి స్నేహితులం అంతే ” అన్నాడు  .నేనేం మాట్లాడలేదు .నా మనసులో పుట్టిన మొలకను మొదలకంటా పీకి ,గోటితో చిన్న చిన్న తునకలుగా చేసి కిటికీలోంచి విసిరేశాను.అతనది చూశాడు, దిగులుగా “మీది చాలా మంచి జీవితం వీణా ,ఇది మీకు మంచిది కాదు ,కొంచెం  కూడా మంచిది కాదు”అన్నాడు.నేను ఊరుకున్నాను.అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు.ఒక వేసం   కాలపు నీల మేఘం, అతని ప్రియమైన మామిడి చెట్టును ఏం చెయ్యగలిగిందో  తెలిసిన వాడు ,అతనికి బదులు మాట్లాడటం నాకెలా సాధ్యం?.సాధ్యా సాధ్యాల ప్రసక్తి ఎలా వున్నా ,నాకు ఇష్టం లేదు అంతే.నేను ఊరుకున్నాను. అతను వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు అతను రాలేదు ,ఆ తర్వాత చాలా రోజులు రాలేదు. బట్టల అల్మారాలో  దాచిపెట్టుకున్న  వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది.నేను కృశించి పోవడం మొదలుపెట్టాను.అయినా అష్ట సిద్దులలోని మూడు సిద్ధులు ప్రాప్తి,ప్రాకామ్య,వశత్వాలు పొందాలని తీవ్రంగా ధ్యానించేదాన్ని.ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు,గది తలుపులు భిగించుకునే దాన్ని .తిండి తినేదాన్ని కాదు .ఒకే ఒక్క ఆలోచన  ‘అతను కావాలి’ .ఈ సంఘటనకు ముందువున్న యధాతధ స్థితి ఇంకెలా సాధ్యం.ఏమో ఇదంతా కాదు, నాకు అతను కావాలి .

ఒకరోజు అతనొచ్చాడు.నా అవతారాన్ని చూసి దిగులుపడి ,వర్షించి , చివరికి  అన్నాడు “ఎందుకట్లా?”అని. నేను “ఎందుకు రావటం మానేశావ్”?అన్నాను .అతను తలొంచుకున్నాడు.అతని చుట్టూ ఇప్పుడు పక్షులు లేవు.”తప్పు చేసానో ఏమో ?” ఇదంతా ఎలా జరిగింది.అతన్ని కోరుకోవడమేంటి,ఏం చేసుకుంటానతన్ని నేను? అతను నాకేం ఇవ్వగలడు?నాకు లేనిదేమిటి?మా మధ్యనున్న కిటికీని ఏం చేసి ఎవరమైనా తొలగించగలం? ఒకర్నొకరు ఏం చేసుకోగలం? ఇదంతా సరే,అయినా సరే అతను నాకు కావాలి ,నువ్వు నాదానివని   అతను నాకు చెప్పాలి

నా మౌనాన్ని, ఆలోచనలని విరగగొడుతూ అతను “రాకూడదని కాదు ,రాకుండా వుండగలిగీ కాదు,మీరు బాగుండాలి మీ జీవితం మంచిది.మీరు కోరుకుంటున్నది మంచిది  కాదు ” అన్నాడు.ఏడు మామిడి చెట్లను చూసిన వాడు కదా అతను, అందుకని ఏడుపుని ఆపేసుకుని ,నవ్వి ఊరుకున్నాను.అతను వెళ్ళిపొయ్యాడు.

మా ఇద్దరి పరిచయపు మొదటి రోజుల్లో అతను, నాకో గోమేధికం పొదిగిన  పతకాన్ని ఇచ్చాడు.చిన్న కుంకుడు గింజంత రాయి అది.ఆవు పంచతం రంగులో ,నిప్పు కణిక రంగులో మెరిసి పోయేది .అదంటే నాకు చాలా ఇష్టం.ఎప్పుడూ నా గుండెల మీద అందంగా నిలిపి వుంచుకునేదాన్ని.ఎప్పుడైతే అతను రావడం మానేసాడో ,అప్పట్నిండి అది ప్రతి రోజూ కొంత కొంతగా పెరగడం మొదలు పెట్టింది. విపరీతమైన భరువు,మోయలేనంత భరువు ,మెడలు వంచేసేంత భరువు,ఏ పనీ తోచనీయంత భరువు,ఆ భరువు మోయడం కన్నా చచ్చి పోతే పోతుంది కదా హాయిగా అనిపించేంత భరువు వేసేది ఆ రాయి.

మొదట్లో దాన్ని తీసేద్దామని ప్రయత్నించాను. నాకు చేత కాలేదు,నువ్విచ్చింది  నువ్వే తీసుకెళ్ళు అని అతనికే చెప్తామనుకున్నాను. అయినా ఎందుకు చెప్పాలి.అతనికి తెలియకనా.అందుకే ఒక సానరాయి తీసుకుని గోమేధికాన్ని కొంత కొంతగా అరగదీయడం మొదలుపెట్టాను,గది తలుపులు బంధించుకునే అరగదీసేదాన్ని,అయినా ఇంట్లోవాళ్ళు  నా మీద గూడచర్యం చేశారు.నాకు దయ్యం పట్టిందనీ ,ఇదంతా దయ్యం చేష్టలేనని తేల్చారు.అక్కడికీ నేను చెప్పా ,మీరనుకున్నట్టు నాకు ఏ దయ్యమూ పట్టలేదు ,పట్టాలని నేను తపస్సు చేస్తున్నా అని .గోమేధికాన్ని కూడా చూపించా. ఏం చెప్పినా ,ఏం చూపించినా వాళ్లకి కొంచం కూడా అర్ధం కాలేదు.ఎక్కడ నీ గోమేధికం ?,ఎక్కడ నీ దయ్యం? అన్నారు.నన్నిక్కడకి  తీసుకొచ్చి వదిలారు.నాకేం దిగులు లేదు ,ఇక్కడ చాలా బాగుంది ,ఎప్పుడో ఒక రోజు అతను వస్తాడు.మా మధ్య  మాటలు  లేవు   కానీ  , నా గురించి అతను యోచించే క్షణాలు నాకు ,అతని గురించి నేను కలగనే క్షణాలు అతనికీ ,తెలిసి పోతూనే ఉంటాయ్.ఈ గాలిలోనో,ఈ కొమ్మల్లోనో దాగి అతను నన్ను చూస్తూనే ఉంటాడు ,నాకు తెలుసు . అన్నట్లు నేను చెప్పేదంతా మీరు నమ్ముతున్నారా ,చూడండీ పెద్ద మామిడికాయంత పెరిగి పోయింది ఈ గోమేధికం .మీకు కనిపిస్తుందా?’’ అన్నదావిడ.నేను భ్రాంతిలోంచి బయట పడ్డట్టు ఆవిడ గుండెవైపు చూశాను.మొదట ఏమీ కనిపించలేదు ,రెండవ క్షణంలో కనిపించింది ‘బండ రాయంత గోమేధికం’ కణకణ మండిపోతున్నట్లు నిప్పు రంగులో.

నేను దిగులుగా ఆవిడ వైపు చూసి “మీదే పొరపాటేమో అతను మొదటే చెప్పాడు కదా తను ఎవర్నో ప్రేమిస్తున్నట్లు”అన్నాను.ఆవిడ చిన్నగా నవ్వింది .”అతను నన్ను ప్రేమిస్తున్నాడని భ్రమ పడ్డాననా మీ భావన ” అన్నది.నేను తలూపాను. ఆవిడ “మా మధ్య నడిచిన గాలికి కూడా అమ్బిగుఇట్య్ [ఆమ్బిగ్యుటి]  ఉంది.దానిని మీకెలా కావాలంటే అలా మలుచుకోవచ్చు .నాకు కావలసినట్లు నేను, అతనికి కావలిసినట్లు అతను చెప్పుకోవచ్చు.మీ పేరేంటో నాకు తెలీదు కానీ  ,మీకో విషయం చెప్పేదా ,ఏనుగులను మచ్చిక చేసుకునే మావటీలు ,ఏనుగులతో ఒక ప్రత్యేక భాషలో సంభాషిస్తారు,అది మీకు ఐడియా ఉందా ? ఒకసారి నేనో  మావటీని ఇంటర్వ్యూ చేశా .’’ప్రేమని వ్యక్త పరచడానికి  ఏం పదాలు వాడుతారు మీరు ‘’అని. ఆ  ప్రశ్నకి అతనేం బదులిచ్చాడో తెలుసా ”అందుకేం పదాలూ లేవు .మన చేతలలలో, ప్రవర్తనలో నుండి మన ప్రేమ ,అనురాగ  భావనని అవి గ్రహించుకుంటాయి ” అని .ప్రేమ అట్లాటిది. దానికి భాషే అవసరం లేదు,ఆ ఇంట్లో వున్నావిడని ఇష్టపడ్డాడని కదా మీరు అడిగారు, ఆ ఇంట్లో వున్నది మరెవరో కాదు “నా మరో నేను ” అన్నది.

ఆవిడని తీసుకెళ్ళడానికి ఎవరో వచ్చారు .నేను లేచి మా  వాళ్ళ వైపు నడిచాను .వెళ్తున్న దారిలో ఎవరో ఒకావిడ మట్టిలో దొర్లి దొర్లి ఏడుస్తుంది.”ఒసేయ్ కామాక్షి ,నన్నొదిలి పెట్టే…నన్నొదిలి పెట్టే …నా చేతుల్ని  కట్టేయ్యకే కామాక్షి ,నేనీ బాలని తీసుకెళ్ళ డానికే వచ్చానే కామాక్షి ,దీని మీద నాకు మోజే కామాక్షి ,దీన్ని నేను వదిలి పెట్టనే …అని ఏడుస్తుంది .ఎందుకో  దిగులేసింది.చిన్నప్పటినుండీ అమ్మవారి మందిరం చుట్టూ,దయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తూనే పెరిగా .ఎప్పుడూ భయం కలగ లేదు. ఇవాళెందుకో మొదటి సారి భయమేసింది .ఇందాక నేను ఆవిష్కరించలేక పోయిన ”పుష్ప వర్ణ మాసం”నాకు ఆవిష్క్రుతమవడం మొదలు పెట్టింది   .దిగులు,ఆవిడ చెప్పిన పొగలా ఊపిరాడనీయకుండా నన్ను కప్పేయడం మొదలు పెట్టింది.

యుద్ధ భూమిలో శాంతి కోసం ఓ కల!

sathyavati“యుద్ధం పురుషులది. యుద్ధ నిర్ణయాలు స్త్రీలకి వదిలిపెడితే వాళ్ళు పరస్పరం చర్చించుకుని ఆ సమస్యను ఎప్పుడో పరిష్కరించి వుండేవాళ్ళు. అసలు యుద్ధ పర్యవసానాలను భరించేది స్త్రీలే! భర్తల, సోదరుల, ప్రేమికుల, బిడ్డల, మరణ శోకాన్ని భరించేది ఇరువైపులా కూడా స్త్రీలే. అయినా స్త్రీలు యుద్ధాలకి పరష్కారాలు చూపించడం ఎక్కడా వినలేదు.ఆత్మీయుల మరణ శోకపు కంటితడి తుడుచుకునే విరామంకూడా లేకుండానే వాళ్ళు కుటుంబాలకి ఆహారం సమకూర్చాలి. పురుషుల వీరోచిత కార్యాలతో దీన్ని పోల్చడం లేదు నేను. కుటుంబాన్ని చూసుకోడం ఒక గొప్ప విషయంగా స్త్రీలెప్పుడూ భావించలేదు.

తుపాకి పట్టుకుని ఉద్యమంలో పనిచెయ్యని స్త్రీల సేవలు తక్కువవేమీ కావు. తమ దుస్తుల మడతల్లో చీటీలు దాచుకుని చెక్ పోస్టుల మధ్యనుంచీ ధైర్యంగా వెళ్ళి అజ్ఞాతంలో వున్న ఉద్యమకారులకి సందేశాలు చేరవేశారు భోజనాలు అందించారు. పురుషులు ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు, ఒంటరిగా వ్యవసాయం చేసి పంటపండించారు ఇంట్లో పురుషులు చేసే పనులన్నీ చేశారు. ఆ చీకటి దినాలలో కుటుంబం గడవడానికి స్త్రీలు పడ్డ కష్టాన్ని ఎవరూ ఎక్కువ కాలం జ్ఞాపకం వుంచుకోరు. ఎందుకంటే యుద్ధం పురుషులకు సంబంధించినది స్త్రీలది కాదు.”

“యుద్ధంకోసం ఎంత ఉత్సాహంతో పనిచేశారో అంతే ఉత్సాహంతో శాంతికోసం పనిచేస్తే ఎంత బాగుండేది? యుద్ధం స్వల్పకాలంలో ముగియాలి. ఎక్కువకాలం కొనసాగితే అది మనలో శక్తిని చంపేస్తుంది. ఈ యుద్ధం గ్రామాల మధ్య జరిగే యుద్ధం లాంటిది కాదు. ఇదొక పెను యుద్ధం. మనకన్న అతి పెద్దదైన భారత దేశం మనతో వంద సంవత్సరాలైనా యుద్ధం చెయ్యగలదు. మనకి కావలసింది శాంతి. ప్రజల జీవితానికి భద్రత.”

ఈస్టరీన్ కైర్ ఇరలు (Easterine Kire Iralu) వ్రాసిన “బిట్టర్ వర్మ్ వుడ్” అనే నవలలో తుపాకి పట్టుకుని స్వయంగా నాగా విముక్తి ఉద్యమంలో పాల్గొని, తరువాత ఉద్యమపు కలల నుంచీ బయట పడిన ఒక స్త్రీ అనేమాటలు ఇవి. ఇటీవల హిందూ లిట్ ఫర్ లైఫ్ పోటీలో షార్ట్ లిస్ట్ లో వచ్చిన అయిదు నవలల్లో ఒకటి. ఒక శక్తిమంతమైన నాగా సాహిత్యకారిణి సంయమనంతో వ్రాసిన నవల ఇది.

09TH_EASTERNINE_KI_1359464e

1937 లో జన్మించి 2007 లో హత్యకు గురైన మోసె జీవిత కథగా సాగే ఈ నవలలో నాగా విముక్తి ఉద్యమ చరిత్ర కూడా సమానాంతరంగా సాగుతుంది.

నాగా తెగల జీవితం వాళ్ల ఆచారవ్యవహారాలు, వాళ్ల శాంతియుత జీవనం, తెగల మధ్య సమానత్వం పరస్పర ప్రేమాభిమానాలు వర్ణిస్తూ మొదలై ఆ జీవితాల్లోకి వచ్చిపడిన మార్పుల మీదుగా సాగుతూ కళ్ళఎదుట జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేక ఎంతోమంది యువకులు ఉద్యమంలో చేరడం ఉద్యమం నుంచీ బయటికి రావడం, తరువాత ఉద్యమంలో చీలికలు, ఒకర్నకరు చంపుకోడం అదొక కల్లోల భూమిగా మారి సామాన్య ప్రజలకి ఇంటా బయటా భద్రతలేకుండా పోయిన కాలం దాపరించి మోసే. అతని వంటి అనేక మంది హత్యకు గురవడం స్థూలంగా కథ.

1832 లో ఈశాన్యప్రదేశాలను ఆక్రమించిన బ్రిటన్ ని, భారతదేశాన్ని విముక్తి చేసినట్టే, తమనూ విముక్తం చెయ్యమనీ తమకుభారతదేశంలో చేరే ఉద్దేశం లేదనీ నాగా ప్రజలు కోరుతూనే వున్నారు.కానీ బ్రిటన్ తను ఆక్రమించిన భూభాగం మొత్తంఇండియాకు ధారా దత్తం చేసింది. తామెప్పుడూ భారతదేశంలో ఒక భాగం కారు కనుక తమది వేర్పాటు ఉద్యమం కాదని అంటారు వాళ్ళు.నాగా ప్రజలు నివసించే భూభాగాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి భారత ఆక్రమణ నించీ తమకి విముక్తి కలిగించాలనేదే వాళ్ల ఉద్యమం.

కానీ స్వతంత్రం సాధించిన ఇండియా నాగా ల్యాండ్ ను అస్సాం లో ఒక భాగం చేసింది. అయితే భారత దేశ స్వాతంత్రానికి ఒకరోజు ముందే వాళ్ళు అనధికారికంగా నాగా స్వతంత్ర దినం జరుపుకున్నారు బ్రిటన్ ఆక్రమణకు ముందు నాగా తెగలలో కుల వ్యవస్థ, కులాల ఎక్కువ తక్కువలూ లేవు.తెగలన్నీ సమానమే. ఎవరితెగ ఆచారాలు వాళ్ళు పాటించుకునేవారు నాగా తెగలన్నీ దాదాపు తొమ్మిది పది దాకా వున్నాయి. తరువాత మిషనరీ లొచ్చి చాలమందికి క్రైస్తవం ఇచ్చారు ఇంగ్లీష్ నేర్పారు. క్రైస్తవం తీసుకున్నా పాత ఆచారాలను వదిలిపెట్టలేదు చాలామంది.

అట్లా క్రైస్తవం తీసుకున్నవారిలో మోసే కుటుంబంకూడా ఒకటి. మోసె తల్లి విలా (vilau) పొలంలో పనిచేసుకుంటూ వుండగా నొప్పులొచ్చి( 1937 లో) అక్కడే బిడ్దను ప్రసవిస్తుంది. అక్కడి చాలా మంది స్త్రీలకి అది మామూలే. ఆమె అత్తగారు ఖ్రియెన్యో ( khrienuo) ఆమె పక్క ఇంట్లో వుంటూ. విలా ని కూతుర్లా చూసుకుంటుంది ఒకే వంటిల్లుంటే స్నేహ బంధాలు నిలవవంటుంది ఆవిడ. విలా భర్త లూ ( Luo-o) బిడ్దను చూసి మురిసిపోతాడు. కానీ తరువాత కొద్దిరోజులకే అడవిలో ఒక చెట్టుకొట్టుకురావడానికి వెళ్ళి దానికిందపడి మరణిస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ పొలంలో పనిచేసుకుంటూ మోసె ని ముద్దుగా పెంచుకుంటూ వుంటారు.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.
మోసే ఆరేళ్ళొచ్చి స్కూల్ కి పోదామనుకునే వేళకి జపాన్ యుద్ధం వల్ల స్కూళ్ళన్నీ మూతపడ్డాయి వాళ్ళ తెగలో అనేకమందిలాగానే బాంబుల భయానికి మోసే కుటుంబం కూడా కోహిమా నుంచీ వెళ్ళిపోయి వేరే వూళ్ళోతలదాల్చుకోవలసి వచ్చింది. అప్పుడే అతను ఆకాశంలో ఒక విమానం మంటలు చిమ్ముతూ కూలిపోవడం చూశాడు. యుద్ధం ముగిసి స్కూళ్ళు తెరిచేసరికి మోసేకి ఏడేళ్ళొచ్చాయి.

ఒక మిషన్ స్కూల్లో చేరిన మోసేకి నీట్యూ ( nietuo) తో స్నేహమైంది, నీట్యూ కన్న మోసే కి గ్రహణ శక్తి ఎక్కువగా వుండేది. అతను స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీష్ తల్లికీ నానమ్మకీ చెబుతూ వుండేవాడు. తల్లికి ఇంటిపనిలో సాయం చేసేవాడు పొలం పనిలోనూ సాయం చేసేవాడు. వేరు వేరు ఇళ్ళల్లో వున్నా ఆ ముగ్గురిదీ ఒక ప్రేమ మయమైన కుటుంబం. అప్పుడు వాళ్ళొక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కున్నారు అది వాళ్ళ చిన్న ఇంటిని ప్రపంచంతో కలిపింది.అందులో రోజూ ఇంగ్లిష్ వార్తలు విని తల్లికీ నానమ్మకీ చెప్పేవాడు మోసె. నానమ్మ కి అవి విని మనమడి చేత చెప్పించుకోడం ఎంతిష్టమో! గబగబ పన్లు చక్కబెట్టుకుని వచ్చి కూర్చునేది.

1947 నాటికి మోసె మూడో తరగతిలోకొచ్చాడు.

ఆసంవత్సరం చాలా విశేషాలు చెప్పింది రేడియో! బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోయారు దేశ విభజన గురించిన వార్తలే వార్తలు! ఇండియాలో ముస్లిమ్ ల హత్యలు,పాకిస్తాన్ లో హిందువుల హత్యలు!! తమ పొరుగువారిని చంపుకోడం నిజంగా ఎంత పిచ్చితనం అనుకున్నారు ఆ అత్తాకోడళ్ళు. రోడ్డుమీద నడిచిపోయే వాళ్ళు, స్కూల్లో పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో మోసె కి “నాగా విముక్తి” అనేమాటకుడా ఎక్కువ వినబడింది. నాగా ప్రజలు చాలా మంది ఇండియానుంచీ స్వతంత్రం కోరుకుంటున్నారని. అతని స్నేహితుడు నీట్యూ తండ్రి చెప్పాడు కొంతమంది గాంధీజీ దగ్గరకు వెళ్ళి తమకు స్వతంత్ర నాగా దేశం కావాలని అడిగారనీ దానికి గాంధీజీ మద్దతు ఇస్తానన్నారనీ చెప్పాడు.

ఒక రోజు రేడియో గాంధీ హత్య వార్త చెప్పింది. గాంధీ ఎవరు ఏమిటీ అని ఆముగ్గురూ మాట్లాడుకున్నారు.తను స్కూల్లో విన్నవీ పాఠాల్లో తెలుకున్నవీ చెప్పాడు మోసే ఆడవాళ్ళిద్దరికీ. గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాదు ప్రధాన మంత్రి వేరే వున్నాడు ఆయన పేరు నెహ్రూ ఆ ఇద్దరిపేర్లూ ఎప్పుడూ కలిసి వినిపించినా వాళ్ళూ అన్నతమ్ములు కారు. ఒక రోజు చర్చికి వెళ్ళినప్పుడు తెలిసింది,నాగాలకు స్వతంత్రం కావాలని వారిని ఇండియాలో విలీనం చెయ్యొద్దని వ్రాసినందుకు ఫిజో అనే ఆయన్ని ఇండియా ప్రభుత్వం అరస్ట్ చేసిందని. అప్పుడు నానమ్మ అంది “అవును నాగాలు ఇండియాలో ఎందుకు చేరాలి? వాళ్ళెప్పుడూ ఇండియాలో భాగం కారు” అని. “మనం జీసస్ ని ప్రార్థించాలి ఆయన్ని త్వరగా విడుదల చేయించమని. పాపం ఆయన పిల్లలు ఆయన కోసం ఎంత తపిస్తున్నారో కదా?” అంది.

1950 నాటికి మోసే ఆరో తరగతిలోకి వచ్చాడు. ఒకరోజు వాళ్ళు సాయంత్రం చలిమంట దగ్గర కూచున్నప్పుడు విలా చెప్పింది “నేనివాళ పొలం నుంచీ త్వరగా వచ్చాను. రోడ్డు మీద చాలా సైనిక వాహనాలు వున్నాయి.చాలా సేపు అవి అక్కడే ఆగి వున్నాయి మాకు చాలా భయం వేసింది వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు.”

“అవును జపాన్ యుద్ధం అప్పుడు ఒకామెని సైనికులు ఎత్తుకెళ్ళారు.తిరిగొచ్చాక చాలా కాలం ఆమె ఏడుస్తూనే వుండేది,” అన్నది నానమ్మ. స్కూల్లో కూడా పిల్లల్ని బయట తిరగవద్దని చెప్పారు. ఇప్పుడు జపాన్ యుధ్ధమప్పుడు ఎంతమంది సిపాయిలున్నారో అంతమందికన్న ఎక్కువ వున్నారు. మోహరించిన భారత సైన్యం అది.

అప్పుడు డిసెంబర్ లో ప్లెబిసైట్ జరిగింది. అందరూ వెళ్ళి మాకు స్వతంత్రం కావాలనే అర్జీ మీద వేలుముద్రలు వేసొచ్చారు. కానీ ఇండియా ప్రభుత్వం దాన్ని లెక్కపెట్టలేదు ఒకరోజు కోహిమాలో ప్రొటెస్ట్ మార్చ్ జరిగింది. వాళ్లమీద పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. గుంపు చెల్లాచెదరైనా ఒకతను గుండుతగిలి చనిపోయాడు పట్నంలో కర్ఫ్యూ విధించారు.

1952 లో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. నాగాల్యాండ్ లోనూ వచ్చాయి,కానీ అక్కడంతా ఎన్నికలు బహిష్కరించారు. పోలీసులు చాలామందిని తీసుకుపోయి బలవంతంగా బ్యాలెట్ పేపర్లమీద వేలిముద్రలు వేయించారు అట్లా మోసే తల్లీ నానమ్మ కూడా వేసొచ్చారు. ఇండియా కి ఎవరు ప్రధాన మంత్రి అయితే మనకేమిటి? మనం ఎందుకు వోట్లు వెయ్యాలి? వాళ్ళు చేస్తున్నది చాలా తప్పు అన్నది నానమ్మ. సైన్యం ధాన్యపు కుప్పల్ని తగలబెడుతోదనీ విచక్షణారహితంగా కాల్పులకి తెగబడి అమాయక పౌరులను పొట్టన పెట్టకుంటోందనీ మోసే వింటున్నాడు. కానీ ఈ వార్తలేవీ వాళ్ళు వినే రేడీయోలో రావు. చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళి నాగా విముక్తి ఉద్యమంలో చేరిపోతున్నారు. పెళ్ళయిన వాళ్లు మాత్రమే ఊళ్ళల్లో మిగిలివుంటున్నారు తమ మీద జరుగతున్న దౌర్జన్యానికి నాగాప్రజలు కోపోద్రిక్తులౌతున్నారు. చాలా చోట్ల సైనకుల చేతిలో స్తీలు అత్యాచారాలకు గురౌతున్నారు. ఎవరికీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. అప్పుడే ఒక సైనికుడు పేల్చిన తూటా పొలంనుంచీ వస్తున్న నానమ్మను బలితీసుకుంది.

ఆమె మరణం మోసే ను బాగా కదిలించింది. 1959 నాటికి మోసేకి 19 ఏళ్ళొచ్చాయి.

అతని తల్లి విలా కి అత్తగారి మరణం తరువాత ఏళ్ళకిమించిన వృద్ధాప్యం వచ్చినట్లయింది. స్కూల్ ఫైనల్ అవకుండానే మోసే చదువు మానేశాడు. సైనికుల ఆగడాలు చూస్తున్నకొద్దీ ఆగ్రహావేశాలు అదుపులోకి రావడం లేదతనికి. ఒకరోజూ అతనూ అతని స్నేహితుడు నీట్యూ అజ్ఞాత నాగా సైనికుల్లోచేరిపోయి అడవులకు వెళ్ళిపోయారు. తల్లి తన కొడుక్కి హృదయపూర్వకంగా అనుమతి ఇచ్చింది. ఏడు సంవత్సరాల కాలం అతను అడవులలోనే వుండిపోయాడు గెరిల్లా శిక్షణ తీసుకున్నాడు అక్కడ అతనికి తనతో పాటు గెరిల్లా శిక్షణ పొందుతున్న నీల్హౌనో (nielhounuo) పరిచయమౌతుంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. అంతా ఆమెని రైఫిల్ గర్ల్ అంటారు.

మోసె ప్రాణానికి తెగించి ఒకరోజు కోహిమా వచ్చి రహస్యంగా నాగా పతాకం ఎగరేసి పోతాడు. ప్రభుత్వ సైన్యాలకూ ఉద్యమకారులకూ మధ్య కాల్పులూ ఎదురుకాల్పులూ మొదలౌతాయి. వీరిద్దరిమధ్య సామాన్య పౌరులు ప్రాణాలు పోగొట్టుకూంటూ వుంటారు. ఆపరిస్థితుల్లో అప్పటివరకూ అస్సాంలో ఒక భాగంగా వున్న నాగా ప్రాంతం 1963 లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుంది. ఈ పరిణామం ఉద్యమకారులలో క్రోధాగ్ని రగిలిస్తుంది కొందరు కోహిమాకు వెళ్ళి రాష్ట్రావతరణ ఆపాలంటారు. కొందరు అప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగంది కనుక అట్లా చెయ్యడం మంచిది కాదంటారు. తీవ్రమైన చర్చలు జరగుతాయి. సీనియర్ నాయకులు హింస తగ్గించమంటారు. చివరికి వీరిమాట నెగ్గింది. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు ప్రారంభించింది.

అందులో భాగంగా ఉద్యమాన్ని వదిలి జన జీవనంలో కలిసే వారికి కొంత డబ్బో భూమో ఇస్తానని ప్రకటించింది. ఎక్కువమంది ఉద్యమ కారులు ఇందుకు ఇష్టపడలేదు. చాలా కొద్దిమంది మాత్రమే బయటికొచ్చారు. ప్రభుత్వ సైనికులకీ ఉద్యమ కారులకీ మధ్య కాల్పులు ఉధృతమైన సమయంలో ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. అప్పుడే మోసే తల్లి విలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోదని తెలసి అతను తన స్నేహితుడు నీట్యూ తో కలిసి ఇంటికి వస్తాడు. “నేను రమ్మనలేదు కదా,” అంటుంది తల్లి. ఆమె క్యాన్సర్ చివరి దశలో వుంది. మోసే తల్లిదగ్గరే వుండిపోతాడు. తనకి అజ్ఞాత జీవితంలో పరిచయమైన నీల్హౌనో కూడా బయటికి వచ్చేసింది ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతనికి ప్రభుత్వం ఉద్యోగమేదో ఇస్తానంటే ఇష్టం లేక కిరాణా దుకాణం పెట్టుకుంటాడు. అతని ఉద్యమ జీవితం ముగిసింది. అతనికొక కూతురూ అతని స్నేహితుడు నీట్యూకి కొడుకూ జన్మిస్తారు.

ఇంక అక్కడనంచీ రాష్ట్రంలో జరిగే సంఘటనలన్నీ ఆ స్నేహితుల సంభాషణల ద్వారా చర్చల ద్వారా మనకి అర్థం అవుతాయి. మోసే కూతురుకి గానీ నీట్యూ కొడుక్కిగానీ ఉద్యమం మీద ఆసక్తిలేదు. అతను చదువుకుని స్కూల్లో టీచరౌతాడు ఆమె స్వంతంగా నేత పని ప్రారంభిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లిచేసుకుంటారు. మోసే మనమడు నీబో(niebou) డిల్లో శ్రీరామ్ కాలేజీలో చదువుకోడానికి వెడతాడు. అక్కద ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపట్ల, విద్యార్థినుల పట్ల తోటి విద్యార్థులూ పౌరసమాజం చూపుతన్న వివక్ష వారిపై జరిగే దాడులూ దేశంలోని వివిథ ప్రాంతాలలో వారిపై చూపుతున్న జాతివివక్ష గమనిస్తాడు. అవడానికి తామందరూ భారత పౌరులే మరి!

ఒక దశలో చదువుమానుకుని వెళ్లిపోదాం అనుకుంటుండగా అతనికి రాకేశ్ అనే సహవిద్యార్థితో పరిచయం అవుతుంది. అతను అరవైల్లో నాగాల్యాండ్ లో పనిచేసిన హిమ్మత్ అనే ఆర్మీ కమాండెంట్ మనుమడు. ఆయన్ని కలుస్తాడునీబో. రిటైరైన హిమ్మత్ కి నాగాల్యాండ్ అంటే ఇష్టం ఆయన ద్వారా ఆర్మీ దృష్టి నుంచీ నాగా ఉద్యమాన్నీ ప్రభుత్వ వైఖరినీ చూస్తాం మనం. చాలాకాలం ఇంటికి దూరంగావుండడం కొత్త ప్రదేశం కొత్త భాష, తమలో ఎవరికి ఏం జరిగినా రెచ్చిపోయి కాల్పుల జరపడం వంటి సైనికుల మానసికావస్థలను గురించి చెప్పి అప్పటి సైనికుల చర్యల గురించి, “నేను ప్రభుత్వ ఆజ్ఞాబద్ధుడను.” అంటాడు. కానీ నాగాఉద్యమాన్ని సమర్థిస్తాడు. అజ్ఞాత సైనికుడైన మోసేని చూడాలనుకుంటాడు. మోసే 2007 లో హత్య కి గురౌతాడు. నాగా ఉద్యమ చరిత్రే కాదు, మొత్తం కుటుంబసభ్యుల మధ్య స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య అత్తాకోడళ్ల మధ్య పిల్లల తల్లితండ్రుల మధ్య ప్రేమానురాగాలు ఎట్లా వుండాలో చెబుతుందీ నవల. అందరూ ఆలోచనాపరులే. అందరూ మనుషుల్ని ప్రేమించేవారే. చివరికి తన తాత మోసే ని చంపిన వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకోదలుచుకోలేదు నీబో.

ఫాక్షనిష్టులేం చేశారు?

దుకాణాలపెట్టుకునో మరో విధంగానో బ్రతుకుతున్న సీనియర్ ఉద్యమకారులపై దాడులు చేశారు అవమానించారు. కొంతమందిని చంపారు. బాగా చదువుకుని అందమూ ఆస్తీ వుండికూడా ఉద్యమంలో చేరి ఫాక్షన్ల మధ్య ఐక్యతకోసం ప్రయత్నించిన మాయంగర్ అనే యువకుణ్ణి హత్య చేసారు. అటు ప్రభుత్వమూ ఇటు ఫాక్షనిష్టులూ కూడా మోసే వంటి పాత ఉద్యమకారులపై నిఘా పెట్టారు. బలవంతపు వసూళ్ళకి దిగారు. దీనివలన నాగాప్రజలుకూడా ఇన్సర్జెన్సీని సమర్థిస్తున్నారని ఇండియన్ ప్రెస్ లో వార్తలొచ్చాయి. కిల్లీ కొట్టుపెట్టుకుని జీవిస్తున్న బీహారీ యువకుడిని డబ్బు కోసం కాల్చబోతే అడ్డుపడబోయిన మోసేని కాల్చేశారు. జనం మధ్యలో నిర్భీతిగా కాల్పులు జరిపి తుపాకి భుజానికి ఆనించుకుని వెళ్ళిపోయారు.

ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నింటినీ ఒక చోటికి తెచ్చి వాళ్లమధ్య అవగాహన కల్పించే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్యల కొంత తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఈ కన్నీటి కల్లోల ప్రాంతంలో శాంతి ప్రసరించే ఛాయలు కనపడుతున్నాయని ముందుమాటలో అంటుంది ఈస్టరీన్. ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన మోసే తన బంధువు దే దేననీ సంఘటనలన్నీ యదార్థాలనీ చెప్పింది. ఇందులో హిమ్మత్ కూడా నాగాల్యాండ్ లో పనిచేసి వెళ్ళిన ఒక కమాండెంట్ కు పేరు మార్పేననీ అన్నది. ఈ పుస్తకం చివర పొందుపరిచిన నికేతు ఇరాలు ప్రసంగంలో ఇట్లా అంటాడు, “సార్వభౌమత్వం కాకుండా మరేదైనా అంగీకరించడానికి నాగాలు సిద్ధంగా వుంటే డిల్లీతో ఒక గౌరవనయమైన అంగీకారయోగ్యమైన అవగాహనకు రావడం కష్టం కాదు.అది ఇరువైపులకు మంచిది….ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నీ ఒక అవగాహనకు వచ్చి డిల్లీతో ఒక ఒప్పందానికి రావడం మంచిది తరవాతేం చెయ్యాలో భవిష్యత్తు తరాలు నిర్ణయించుకుంటాయి. ఇప్పుడు కావాల్సింది శాంతి, అభివృద్ధి.”

యుద్ధాలు నిర్ణయించేది సైనికులూ కాదు ప్రజలూ కాదు రాజకీయ నాయకులు, అని అర్థం అయింది వాళ్లకి.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.

చీర చెప్పిన కథ!

bhuvanachandra“నిజంగా మీ పేరు బయటికి రానీను… కానీ… నిజం మాత్రమే చెప్పాలి.. సరేనా?”

“అలాగే.. నేను పుట్టిన వూరు ‘క’తో మొదలవుతుంది. బాగా ధనవంతులం కాదుగానీ ఏదడిగినా ‘లేదు’ అనకుండా మా అమ్మానాన్న పెంచారు.. గొప్పగానే పెరిగాను. ఓ క్షణం మౌనంగా వుండిపోయింది కమల.

” ఊ.. తరవాత?” అడిగాను.

“9thలో పెద్దమనిషినయ్యాను. అప్పటిదాకా నా గురించి నేనేం పట్టించుకోలేదనే చెప్పాలి. పెద్దమనిషి అయ్యాకే మొట్టమొదటిసారి నేను ‘అందగత్తె’నని నాకు తెల్సింది… నాకే కాదు మా ఊరందరికీ కూడా తెలిసింది..” నవ్వింది.

ఆ నవ్వులో ఓ నిర్లిప్తత వుంది. నేను మౌనంగా కూర్చున్నా.

” ఓ మాట చెప్పనా.. తను అందగత్తెనని ఆడదానికి ఎప్పుడు తెలుస్తుందో అప్పటినించే మనసు వెర్రితలలు వేస్తుంది. దానికి నేనే ఉదాహరణ. చదువుమీద నాకు తెలీకుండానే శ్రద్ధ తగ్గింది. అప్పటిదాకా అసలు పేరే తెలియని క్రీములూ, పౌడర్లు, నెయిల్ పాలిష్‌లూ వాడటం మొదలుపెట్టి ఎవరు నా వంక మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తున్నా పొంగిపోయేదాన్ని!” మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో ‘గతపు’ కమల ప్రతిఫలించింది.

“అలాంటి అలంకార సామగ్రి అందరూ వాడేదేగా.. అలాగే ఏ ఆడపిల్ల ఐనా అందంగా వుంటే జనాలు వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూడటం ఆ పిల్ల పొంగిపోవటమూ సహజమేగా?” మామూలుగా అన్నాను.

“మీరొకటి మర్చిపోతున్నారు.. అప్పటి నా వయసు గురించీ, ఆ వయసులో కలిగే భావాల గురించి ఆలోచించండి. నేను ఏ స్టేజికి చేరుకున్నానంటే ఏ కుర్రాడైనా నా వంక చూడకపోతే అది ప్రెస్టీజ్‌గా తీసుకుని , ఎలాగైనా వాళ్ల అటెన్షన్ నా మీద పడేట్టు చేసుకునేదాన్ని. అప్పటికిగానీ నా ‘ఈగో’ చల్లారేది గాదు!”

పరీక్షగా ఆమె వంక చూశా. ఆ కన్ను ముక్కు తీరూ, ఆ పెదవుల వొంపూ, శరీరాకృతీ చూస్తే ఇప్పటికీ అంటే యీ వయసుకీ ఆమె అందంగానే వుందని చెప్పుకోవాలి. నలభై దాటాయి గనక శరీరం వొడలటం, అందం అలవటం తెలుస్తోంది. అలిసిపోయినా అందం అందమేగా. “కాలేజీ కొచ్చేసరికి నా శరీరాకృతి ఎంత అందంగా తయారైందో, నా మనసు అంతకన్నా ఎక్కువ అహంభావంతో నిండిపోయింది. డబ్బుకి పెద్దగా లోటు లేదు గనక నన్ను పొగిడే స్నేహితురాళ్ళనే చుట్టూ వుంచుకునేదాన్ని. వాళ్లకీ సరదాలు వుండేవి గనక నేను ఎక్కడికెళ్తే అక్కడికి నాతో వచ్చేవాళ్ళు…!”

“ఊ…”

“అప్పుడు పరిచయమైనవాడే మధు. చదువులో మా కాలేజీలోనే బెస్ట్. చదువుతున్నది డిగ్రీ అయినా అపారమైన తెలివితేటలుండేవి.

మా కాలేజీ లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పగలిగినవాడు అతనొక్కడే. అంతే కాదు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టించుకోనివాడు అతనొక్కడే!”

“తరవాత?”

“కాలేజీ యానివర్సరీ ఫంక్షన్‌లో ఓ నాటకం వెయ్యాల్సి వచ్చింది. దాన్ని సులభమైన వ్యావహారిక భాష లో రాసిందీ, డైరెక్ట్ చేసిందీ కూడా మధునే.శకుంతలగా నన్ను వెయ్యమన్నారు. మధు దుష్యంతుడుగా వేస్తేనే నేను వేషం వేస్తాననీ లేకపోతే వెయ్యననీ పంతం పట్టాను.!” అన్నది కమల. ఆమె చూపులు ఎక్కడో వున్నాయి. నాకు నవ్వొచ్చింది.

“కమలా.. యీ ఇన్సిడెంట్ మాత్రం కొంచెం సినిమాటిక్‌గా ఉంది సుమా!” అన్నాను.

“సినిమా జీవితం కాకపోవచ్చుగానీ, జీవితం మాత్రం సినిమాలాంటిదే కవిగారు!” ఆమె గొంతులో కొంచెం కోపం.

” ఆ విషయం ప్రస్తుతానికి వొదిలేద్దాం. సరేనా.. సారీ. ఇప్పుడు చెప్పండి. మధుగారు దుష్యంతుడుగా వేశారా?”

“పంతం పట్టానన్నాగా. వెయ్యకుండా ఎలా ఉంటాడూ? ఆ సందర్భాన్ని ‘చనువు’గా మలుచుకున్నాను. అప్పుడే ఓ సంఘటన నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసింది!” నిట్టూర్చింది.

” ఏ సంఘటన?”

” ‘ము’గారు మీకు తెలుసుగా.. ది గ్రేట్ హీరో. ఆయన మా కాలేజీ పూర్వ విద్యార్థి కావటంతో ఆయన్నీ యానివర్సరీకి ఆహ్వానించారు. మా శకుంతల నాటకం చూసి నా అందమూ, నటనా, ఆ నాటకానికే ఓ ‘వన్నె’ తెచ్చాయనీ, నేను ఫిలిం ఫీల్డులోకి వస్తే చిత్ర పరిశ్రమ నన్ను చేతులు జాచి ఆహ్వానిస్తుందని అన్నారు. ఆ పొగడ్తలకి నేను పూర్తిగా ‘ఫ్లాట్’ అయిపోయాను. అంతేగాదు మధులో గొప్ప రచయిత వున్నాడనీ, అతను సినిమాల్లోకొస్తే ఆత్రేయగారంత పేరు తెచ్చుకొనగలడనీ కూడా అన్నారు.” ఓ క్షణం మళ్ళీ మౌనం మౌనంగా నర్తించింది.

“తరవాత?”

“మధూది దిగువ మధ్య తరగతి ఫేమిలీ. రెస్పాన్సిబిలిటీసూ ఎక్కువే. కానీ నేను పెంచుకున్న ‘చనువు’తో అతనిలో ఓ కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. మావాళ్ళు సాంప్రదాయాల్ని బాగా పాటిస్తారు. నేను నాటకంలో వేషం వెయ్యడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అందుకే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు. కానీ అప్పటికే నేను ‘హీరోయిన్’ కావాలని ఫిక్సైపోయా. బలవంతాన మధూని ఒప్పించి చాలా డబ్బు, నగలతో మద్రాసు పారిపోయా…!”

“ఓహ్..! సామాన్యంగా ఇలాంటి పని మగవాళ్లు చేస్తారు.”

“ఆశకి మగా, ఆడా తేడా లేదు కవిగారూ. టి నగర్. ఆనందన్ స్త్రీట్‌లో ఒక సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తీసుకున్నాం. మీకు నేను గుర్తుండకపోవచ్చుగానీ, మీ మొదటి సినిమా ‘నాకూ పెళ్ళాం కావాలి’ ప్రొడక్షన్ ఆఫీసూ అదే స్ట్రీట్‌లో ఉండేదిగా? చాలా సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీసులోనూ వేషం కోసం ప్రయత్నించా!” నవ్వింది కమల.

“నిజంగా? గాడ్… నాకు తెలీనే తెలీదే!” ఆశ్చర్యపోయాను.

“ఆశ్చర్యం ఎందుకూ? అందరూ మీలాంటి అదృష్టవంతులు కారుగా. సరే, మాట ఇచ్చాడు గనక మధు వచ్చాడు గానీ, అతనికి ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం ఇష్టం లేకపోయింది. మూడు నెలలు కలిసి ఒకే బెడ్‌రూం ఫ్లాట్‌లో వున్నా అతను నన్ను కనీసం ‘టచ్’ కూడా చెయ్యలేదంటే నమ్ముతారా?”

“నమ్ముతా.. ఎందుకంటే పెళ్ళి చేసుకుని కూడా దశాబ్దాల పాటు ఒకేచోట వున్నా ప్రేమకి తప్ప శరీరాకర్షణకి లోబడని ‘జంట’ నాకు తెలుసు. వారి జీవితం జగద్విదితం..!”

“నాకే జాలేసి అతన్ని వెళ్ళిపొమ్మన్నా.. మరో ‘పైకి రాగలడనుకున్న’ యువకుడ్ని నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నాను. ఓ రోజు రంగరాజపురం రోడ్డులో ‘ము’గారు కనిపిస్తే ‘గతం’ గుర్తు చేసి ఏమన్నా వేషం ఇప్పిస్తారేమోనని అడిగా. చిత్రమేమిటంటే ఆయనకి శకుంతల గుర్తుందేమోగాని ఆ వేషం వేసిన ‘కమల’ గుర్తులేదు. పైగా, “చూడమ్మా..అనేక ఫంక్షన్స్‌కి పిలుస్తారు. కొన్నిటికి వెళ్ళక తప్పదు. నీ విషయమే తీసుకో. ‘స్టేజీ’ మీద నువ్వు బాగా చేసి వుండొచ్చు. ఓ ‘మాదిరి’గా చేసినా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మేము మెచ్చుకుంటాం. దాన్నే ఓ ‘డిగ్రీ’ గా భావించి ఇలా వచ్చేస్తే ఎలా? హాయిగా ఇంటికెళ్ళి పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో వుండు” అని ఓ సలహా పారేసి తన దారిన తాను పోయారు!” సుదీర్ఘంగా నిట్టూర్చింది

కమల.

“ప్రస్తుతం పరిస్థితి ఏమిటి?”

“నేను ‘లేచిపోయానని’ మావాళ్లు మా వూళ్ళో తలెత్తుకోలేక వున్నవన్నీ అమ్మేసి ఇప్పుడు ‘బళ్ళారి’ దగ్గర ఓ విలేజ్‌లో వుంటున్నారు. నేను వెళ్ళినా నా మొహం చూడరని నాకు తెల్సు. అలాగే ఎవరు ‘పైకి’ వస్తాడని భావించి నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నానో అతను నిజంగా పైకి వచ్చాడు. హీరోగా కూడా చేశాడు. పేరు ‘ర’ తో మొదలవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చాలా విభాగాల్లో చాలా వ్యాపారాలు చేస్తున్నాడు.

“ఊ.. అతను మిమ్మల్ని ఎంకరేజ్ చేయ్యలేదా?” అడిగాను.

“నా నగలన్నీ అయిపోయేవరకూ ‘ఎంకరేజ్’ చేస్తూనే వున్నాడు. అతనికి మరో ‘నిచ్చెన’ దొరగ్గానే నన్నొదిలేసి అక్కడ చేరాడు. అయితే ‘ఆమె’ చాలా టఫ్. ఇప్పుడు అతని భార్యా, అతని పిల్లలకు తల్లి ఆవిడే!” నవ్వింది . ఆ నవ్వులో సంతోషము లేదు. దుఖము లేదు.

“ఫ్యూచర్ సంగతి ఏమిటి?” అడిగా.

“నిజం చెబితే నా వయసిప్పుడు నలభై ఆరేళ్ళు. అందరికీ నలభై అని చెపుతున్నాననుకోండి…. ! ఒక్క సంవత్సరం ఓపిక పట్టి నా డిగ్రీ పూర్తి చేసి వుంటే నా జీవితం మరోలా వుండేది. ఎక్కడో చదివా.. “ఎంత ముందుకొచ్చావంటే వెనక్కి తిరిగి వెళ్లలేనంత. వెళ్లినా ఎక్కడ్నించి పయనం మొదలైందో అక్కడికి చేరలేనంత!” అని . సో. ఫ్యూచర్ గురించి ఆలోచనే లేదు. ఊ..! చదువు కొద్దో గొప్పో వున్నది గనక నా జీవితాన్ని ఓ పుస్తకంగా అంటే ఓ బుల్లినటి ఆత్మకథగా తీసుకురావాలని వుంది. తేవొచ్చా?” నవ్వింది .

“ఎందుకు తేకూడదు?”

“ఆత్మకథలు గొప్పవాళ్లకేగా!. వాళ్ల జీవితాలైతే అందరూ చదువుతారు. నాలాంటివాళ్ల జీవితకథలు ఎవరు చదువుతారు ?”

“కమలగారూ.. నిజం చెప్పనా… ఆకాశాన్ని ఆక్రమించిన చెట్టుకైనా వేళ్ళు భూమిలోకే ఉంటాయి . ఆకులూ, కొమ్మలూ కాదు ఆత్మకథంటే.. ఆ చెట్టుకి పునాది అయిన వేళ్ళ కథలు. ఆ ‘వేళ్ళ’ కథలు చెట్టు చెబితేనే గానీ తెలీదు. కొమ్మల్ని బట్టి, కాండాన్ని బట్టి చెట్టు వయసునీ, గొప్పతనాన్నీ వూహించవచ్చు. కానీ ఎన్ని పురుగులు తల్లి వేరుని, మిగతా వేళ్లనీ కొరికాయో, కొరికే ప్రయత్నం చేశాయో ఆ చెట్టుకి తప్ప ఎవరికీ తెలీదుగా! తప్పక రాయండి. ఒట్టేసి చెబుతున్నా. మీ ‘స్క్రిప్టు’ మొదట నేను చదువుతా!” సిన్సియర్‌గా అన్నాను.

“వేరు పురుగుల గురించేగా రాయాల్సింది. అదీ తప్పే. నాకు ఇష్టం లేకుండా ఏదీ జరగలేదు. ఏ తప్పు జరిగినా నాకు తెలిసే జరిగింది. అందుకే నేనెవరినీ నిందించాలని అనుకోవట్లా. కానీ, జరిగింది జరిగినట్లు మాత్రం రాస్తాను.”

“గుడ్. నిజాన్ని నిజంగా వ్రాయగలగడం అంత కష్టం మరొకటి ఉండదు. చాలా ధైర్యం కావాలి!”

“అది వుంది లెండి. ఇంతకీ నేను వ్రాయబోయే కథలపేరు తెలుసా?”నవ్వింది. ఆ నవ్వులో చిన్న చిలిపిదనం దోబూచులాడింది.

“చెప్పండి!” ఉత్సాహంగా అన్నాను.

“చీర చెప్పిన కథలు!” పకపకా నవ్వింది.

 

*******************************************

 

అయ్యా… కమల ఇంకా మద్రాసులోనే ఉంది. ‘మధు’ ప్రస్తుతం ఓ గొప్ప కాలేజీలో లెక్చరర్‌గా ఉంటూ ఆ జాబ్ వదిలేసి ఆస్త్రేలియా వెళ్లాడట. ‘ది అన్‌టోల్ద్ స్టోరీస్’లో ఉన్న వ్యక్తులందరూ ప్రస్తుతం మన మధ్య వున్నవాళ్ళే. కొంతమంది ‘పర్మిషన్’ ఇస్తామన్నారు. ఇస్తే వారి ఫోటోల్ని, సెల్ నంబర్స్‌ని కూడా ప్రచురించడం జరుగుతుంది. బహుశా ఈ శీర్షిక మీకు నచ్చవొచ్చనే అనుకుంటున్నాను. వీలున్నంతవరకూ ‘చీకటి’ వ్యవహారాల్ని ‘రాత’లోనే ‘ఎడిట్’ చేశానని మనవి చేస్తూ (పేర్లు మార్చానని చెప్పక్కర్లేదుగా)…

మీ భువనచంద్ర…