Archives for April 2014

మౌనద్వారం

ఆకస్మిక cosmic చిరునవ్వు
నిన్నే ఎందుకు ముద్దుపెట్టుకుంది
 
దుఃఖకౌగిలి వ్యాకరణంలో వాత్సల్యవాయువు
నిన్నే ఎందుకు చుట్టుముట్టింది
వ్యసననయనాలతో అశ్రువులు
నిన్నే ఎందుకు చూశాయి
నిర్జీవమైన పదాల్లోకి

నిన్నే మనసుశ్వాస ఎందుకు ఊపిరితీసుకుంది
రంగుల్లేని గాలి
నిన్నే ఎందుకు పిలిచింది నిర్బింబ అశూన్యంలోకి
ఇక కలవరపడకులే…
రేయింబవళ్ళు లేవు
భగవంతుడు లేడు
శబ్దాలు లేవు
కన్నీళ్లు లేవు
నీ స్నేహపు దారి
ఎందుకు మూసేసావు యకాయకి

                                                                                (రామిశెట్టి విజయకృష్ణకి)

–  ఎం. ఎస్. నాయుడు

~~~

 రామిశెట్టి విజయకృష్ణ గురించి:

1939847_528475647263744_1268761583591337053_nA 1992 Philosophy gold medalist, a unique personality, took Philosophy and Telugu literature as his options for Upsc – to hit only IPS- lived in the dream to become one!A brave police officer of the State won many awards and medals – always felt he being very strong, exercised physically fit body , no illness would touch him – caught in this vicious cycle – my baby could not understand about his inside illness though knew his Big ‘B”s struggle – struggled to get back to uniform – don’t know how all his near and dear come out of this trauma! No words to express the miss!

1620415_529424560502186_5769099433351538644_n

1482959_650829424991118_5019209609135778675_n

 

25వ క్లోను స్వగతం

damu
నా రాత్రికి దుఃఖమూ లేదు సంతోషమూ లేదు
నా చీకటికి మార్మికతా లేదు నిగూఢతా లేదు
నేను నియోహ్యూమన్ వుద్వేగ రహితుడ్ని
దేనికీ తగలకుండా జీవితం గుండా ప్రవహిస్తాను
నాకు భద్రతా లేదు స్వేచ్చయునూ తెలియదు
25 జీవితాలుగా మృత్యువు నన్ను మరచిపోయింది
జ్ఞాపకాలు మరణించాయి వూహలు మొలవలేదు
కోపమూ లేదు తాపమూ తాకదు
వేలాది దినాల విభిన్నత తెలీని కాలము
నాలోకి తిరిగి తిరిగీ కరుగుతోంది
ఈ విశ్వమే నాకు ద్రోహం చేసింది
నా స్వీయ నిరంతర పునఃసృష్టి లోకి కుదించుకు పోయాక
స్వీయ సంభాషణా స్వగతాల్లోకి మౌనాన్ని దిగ్గోట్టాక
సకల మానవ జ్ఞానం నుండి నన్ను నేను రక్షించుకున్నాక
ప్రేమా లేదు అసహ్యమూ లేదు
సానుకూలతా లేదు ప్రతికూలతా రాదు
Picasso7
నేను కాలానికి ఆవల నివసిస్తున్నాను
కొన్ని క్లోనుల కాలంలో కొన్ని క్లోనుల దూరంలో
జీవితము మొదలవలేదు జీవితము అంతమవలేదు
జననమూ లేని మరణమూ లేని
జీవించిందే జీవించిందే జీవించిందే జీవించిందే జీవిస్తున్న
యెడతెగని అనాసక్తి లోకి కూరుకుపోయాను
నా స్థలమూ కాలమూ నేనే
నాకు బయట చూచేందుకూ వినేందుకూ యేమీ లేదు
అర్ధరహిత శూన్యం లోకి పునర్జన్మిస్తూ వస్తున్నానో పోతున్నానో-
యుధ్ధం చేయటానికి నేనూ ఇతరులూ లేని వొక గ్రహమేదో నన్ను
మింగేసిందా?
అమ్మటమూ కొనటమూ మాత్రమే మిగిలిన
ఆనందమే దారి, గమ్యమూ అయిన మనుషుల నుండి
విముక్తి లోకి దిగబడి 25 క్లోనుల కాలం అయిందా
యిప్పుడేదో తిరోగమనాన్ని కాంక్షిస్తున్నానే
మానవలక్షణాల లక్షలాది క్షణాలు మరణించాక కూడా
లోపల్లోపల్లోపల్లోపలెక్కడో మనిషి వాసన మరుగుతుందే
–దాము

ఒక “బర్నింగ్ స్టార్” పుట్టిన వేళా..విశేషం!

unnamed
ఓపన్ చేస్తే…
04-04-2014

ఉదయం 10 గంటలు

ప్రసాద్ ఐమాక్స్ థియేటర్

స్క్రీన్ నెంబర్ -3

సినిమా మొదలయ్యింది….

తెరమీద ఒక కొత్త హీరో “బర్నింగ్ స్టార్” అంటూ ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకుల్లో కోలాహల. ఒక్కసారిగా “జై సంపూ…జైజై సంపూ” అనే నినాదాలు. మల్టిప్లెక్స్ థియేటర్ మాస్ థియేటర్ అయ్యింది. పంచ్ పంచ్ కీ ఈలలు. ఫీట్ ఫీట్ కీ గోలలు. డైలాగ్ కి కౌంటర్ డైలాగులు. యాక్షన్ కి విపరీతమైన రియాక్షన్లు.

నేను థియేటర్లో వెనక నిల్చున్నాను. నేను వింటున్నది, చూస్తున్నది నిజమోకాదో అనే ఒక సందేహం. నవ్వాలో ఆనందించాలో ఇంకా తెలీని సందిగ్ధ పరిస్థితి. బయటికి వచ్చాను. అక్కడ స్టీవెన్ శంకర్ అలియార్ సాయి రాజేష్ నిల్చుని ఉన్నాడు. మొదట అడిగిన ప్రశ్న “థియేటర్లో మనవాళ్ళు ఎంత మంది ఉన్నారు?” ‘రెండు వరుసలు’అని ఒకరి సమాధానం. “గోలచేస్తోంది మనవాళ్ళేనా? ” అనేది రెండో ప్రశ్న. “కాదు. మనవాళ్ళు సైలెంటుగా కూర్చుని విచిత్రాన్ని చూస్తున్నారు. ఎవరో కాలేజి స్టూడెంట్స్ లాగున్నారు. వాళ్ళు సంపూ ఫ్యాన్స్ అంట.” అని మరో వైపు నుంచీ సమాధానం. స్టీవెన్ శంకర్ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నా, తన రెప్పల వెనకదాగున్న కళ్ళలో ఒక కలను సాకారం చేసిన ఆనందం అందరం అనుభవించాం.

సెకండాఫ్ మొదలయ్యింది. అప్పటికి థియేటర్ యాజమాన్యం ఈ అరుపులూ కేకలకు భయపడి ఆ స్క్రీన్ దగ్గరికి వచ్చి ఏంజరుగుతుందో చూస్తున్నారు. సినిమాలోని కీలకఘట్టం. ఇక సినిమా అయిపోయిందేమో అని కొందరి లేస్తుంటే “ఇంకా ఉంది కూర్చోండి” అని మావాళ్ళు కొందరిని కూర్చోబెట్టడం కనిపిస్తోంది. తెరమీద ఒక మ్యాజిక్ జరిగింది. థియేటర్లో సగం మంది అధాట్టున లేచినిల్చుని చప్పట్లు. ఆడియన్స్ లో ఒకడు వెనక కుర్చీలవైపు తిరిగి “సంపూర్ణేష్ బాబూ….నువ్వు దేవుడయ్యా!” అని అరిచాడు. మాకు మతిపోయింది. ఒక స్టార్ జన్మించాడు.
Rajesh and Sampoo—————————
కట్ చేస్తే….
(ఫ్లాష్ బ్యాక్)
మే నెల మిట్టమధ్యాహ్నం, 2013
ఫోనొచ్చింది. “మహేష్ గారూ మీతో మాట్లాడాలి.”
“రండి సర్ ఆఫీస్ లోనే ఉన్నాను.”
సాయి రాజేష్, కోడైరెక్టర్ చైతన్య చరణ్ (నా షార్ట్ ఫిల్మ్ తో దర్శకత్వ విభాగంలోకి అడుగుపెట్టింది) వచ్చారు.
మా ఆఫీసులో నా రూంలో కూర్చున్నాం.
“ఒక సినిమా అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్లో” అంటూ ఒక కథ చెప్పాడు.
తను ఏంచెయ్యాలనుకుంటున్నాడో అర్థమయ్యింది.
“తమిళంలో శాం అడర్సన్, పవర్ స్టార్, మళయాళంలో సంతోష్ పండిట్ లాగా మనకూ ఒక స్టార్ అన్నమాట” అన్నాను.
“అంతకన్నా ఎక్కువేమో. వాళ్ళు unintentional గా తీసిన bad films వల్ల హిట్ అయ్యారు. స్టార్లు అయ్యారు. కానీ మనం ఇక్కడ conscious గా ఒక foolish film తియ్యబోతున్నాం. తెలుగు సినిమాలకు యాంటీ థీసీస్ లాంటి హీరోని తయారు చెయ్యబోతున్నాం. అతని పేరు ‘సంపూర్ణేష్ బాబు’.” నాకు ఆ పేరు వినగానే నవ్వొచ్చింది. కానీ దానివెనకున్న సీరియస్నెస్ అర్థమయింది.
“సరే ఇప్పుడు ఏంచేద్దాం” అన్నాను.
“మీరు ఇందులో యాక్ట్ చెయ్యాలి.” అని ఒక బాంబ్ పేల్చాడు.
“ఏదో స్క్రిప్టు డిస్కషనో, ప్రమోషనల్ స్ట్రాటజీవరకూ అనుకున్నానుగానీ…ఇదేంటండీ! నాకు యాక్టింగ్ రాదు.”
“మీరు ఓకే అంటే నేను యాక్టింగ్ చేయించుకుంటాను. మీకు నేను అనుకుంటున్న క్యారెక్టర్ లుక్స్ ఉన్నాయి.”
ఒక నిమిషం ఆలోచించాను.
“మీకు కావలసినంత టైం తీసుకుని ఆలోచించండి. ముఖ్యంగా మీకు సోషియల్ నెట్వర్క్ లో ఉన్న ఇమేజ్ కి ఇది ఏమైనా దెబ్బేమోకూడా ఆలోచించి, నిర్ణయం తీసుకోండి. ఏం బలవంతం లేదు.” అని టైం ఇచ్చారు సాయి రాజేష్.
ఆ మాట తను అంటున్నప్పుడే నేను నిర్ణయం తిసుకున్నాను.
“ఆలోచించడానికి ఏమీ లేదు. రిస్క్ మీరు ఎలాగూ చేస్తానంటున్నారు కాబట్టి, నేను చేస్తాను. నాకు సోషియల్ నెట్వర్కులో ఏదైనా ఇమేజ్ ఉంటే అది నా ఇష్టమొచ్చినట్టు చేస్తాననేదే. నాకు ఈ కథ నచ్చింది. ఈ కథ ఎన్నుకోవడానికి మీ కారణాలు మీకుండొచ్చు, కానీ నా కారణాలు నావి. ఈ సినిమా ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా పోకడలమీద ఒక గొప్ప సెటైర్ అవుతుందని నా నమ్మకం. నేను ఇదే కంటెంటుని, గొంతు చించుకుని కోపంతో చెబుతూ, రాస్తూ ఉంటాను. మీరు ఒక మెట్టు ఎదిగి ఆ విషయాల్ని సృజనాత్మకంగా తెరపైకి తీసుకుని వద్ధామనుకుంటున్నారు. I would be more than glad to be part of it.” అని కమిట్ అయ్యాను.
“ఈ సినిమా స్వభావరీత్యా నేను ఎవరికీ తెలీకుండా ఉండాలి. నా పేరుకూడా స్టీవెన్ శంకర్ గా మార్చుకుంటున్నాను. స్టీవెన్ శంకర్ గా నేను వెబ్ లో ప్రమోట్ చేసినా, డైరెక్టుగా తెలిసినవాళ్ళు మీరే కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేసే రిస్క్ ఉంది. ఓకేనా” అని మళ్ళీ సందేహంగా అడిగారు సాయిరాజేష్.
“కొత్తగా నాకు పోయేదేమీ లేదులెండి. నేను ఎవర్నీ ప్లీజ్ చెయ్యడానికి పనులు చెయ్యను.” అని కొట్టిపడేసాను.
ప్రయాణం మొదలయ్యింది.
980319_10152010712366115_1155151759_o
——————————
కట్ చేస్తే….
రాష్ట్ర సంపూర్ణేష్ బాబు యువత సంపూర్ణేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
ఫేస్ బుక్ లో షేర్లు. చర్చలు. లైకులు. తిట్లు.
రాజమౌళి ట్వీట్ చేశారు. అంతే పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది.
“ఎవరీ సంపూర్ణేష్ బాబు? ఎక్కడినుంచీ వచ్చాడు? ఎవడో డబ్బున్న ఎన్నారై, సినిమా పిచ్చిపట్టి డబ్బులు తగలెయ్యడానికి వచ్చాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు. ఊహాగానాలైన సమాధానాలు.
వీటిల్లోని మిథ్స్ ని మరింతగా ప్రాపగేట్ చెయ్యాలి.
కలవాలనుకునే ఫ్యాన్స్ కి ఒక ఫోన్ నెంబర్. వచ్చినవాళ్ళందరితో ఫోటోగ్రాఫ్స్. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడెక్కడ ఇంటర్నెట్ ఉందో, అక్కడ అంతా సంపూర్ణేష్ బాబు పేరు చర్చల్లోకి వచ్చింది. పరిశ్రమలో అది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.——————-
కట్ చేస్తే….
జూన్ 2, 2013
షూటింగ్ మొదలయ్యింది.
సంపూర్ణేష్ బాబుని కలిసాను.
సెట్లో అందరూ ముద్దుగా “సంపూ” అనో లేదా “బాబూ” అనే పిలిచేవారు.
ప్రతిభ ఉన్న కళాకారుడో కాదో అర్థమయ్యేది కాదు. సింపుల్గా, మర్యాదగా ఉండే మంచి వ్యక్తి. అంతవరకు ష్యూర్.
చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. సాయి రాజేష్ ని ‘అన్నా’ అనేవాడు. చైతన్యని ‘అక్క’ అనేవాడు. నన్ను ఒక్కోసారి అన్న, ఒక్కోసారి సార్.
మొదటగా చేసింది టెస్ట్ షూట్. టెక్నాలజీ టెస్టింగుతోపాటూ look and feel decide చెయ్యడానికి ఒక ప్రయత్నం. ఎలాగూ షూట్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్రోమోలాగా చేద్దామనేది సాయిరాజేష్ ఆలోచన. ప్రోమో తయారయ్యింది. ప్రోమో చివరిలో ఒక డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాడు ‘సంపూ’. కెమెరా మెన్ తో సహా యూనిట్ మొత్తం చప్పట్లు. ఏదో జరుగుతోందనేదిమాత్రం అర్థమయింది. సంపూ మామూలువాడైతే కాదు. డెడికేషన్ ఉన్న ఆర్టిస్టు. అది అందరికీ తెలిసింది.జూన్17,2013 న ప్రోమో యూట్యూబ్ లో పెట్టి షేర్ చేశాం.
అంతే…..
ఐదురోజుల్లో ఐదు లక్షల వ్యూస్. ఒక చరిత్ర సృష్టింపబడింది.
ఒక సంచలనానికి నాంది పలికింది. సినిమా పరిశ్రమలోనూ, బయటా ఇదే వార్త.
ప్రతిషూటింగ్ లోనూ ఈ ప్రోమో చూపిస్తూ, నవ్వుకుంటూ చర్చ.
కష్టనష్టాలు, శ్రమ ఆనందాల మధ్య షూటింగ్ ముగిసింది.———————–
కట్ చేస్తే…
27 ఫిబ్రవరి, 2014
హృదయకాలేయం ఆడియో ఫంక్షన్
తాజ్ డెక్కన్
సంపూర్ణేష్ బాబు మొదటిసారిగా జనాల ముందుకు వచ్చాడు.
పంతొమ్మిది నిమిషాల నాన్ స్టాప్ స్పీచ్.
ఈ మధ్యకాలంలో ఏ ఆడియో ఫంక్షన్కూరాని రేటింగ్స్.
మాటీవీ వాళ్ళు తొమ్మిదిసార్లు రిపీట్ టెలీకాస్ట్ చేసిన ఆడియో ఫంక్షన్ హైలైట్స్.
హైలైట్స్ కే హైలైట్ సంపూ స్పీచ్.
ఇప్పటికి యూట్యూబ్ లో ఆ స్పీచ్ కి మూడు లక్షల హిట్లున్నాయ్.
అప్పటివరకూ ఇది షార్ట్ ఫిల్మా…అసలు వీళ్ళు ఫిల్మ్ తీస్తారా…ఇదేదో హంబక్ అన్నవాళ్ళ నోళ్ళు పర్మనెంటుగా మూతపడ్డాయి.
సినిమా విజువల్ క్వాలిటీ, సాంగ్స్, ప్రమోషన్లోని క్రియేటివిటీ చూసి చాలా మంది నోళ్ళు వెళ్ళబెట్టారు.
సంపూ అంటే అప్పటివరకూ ఉన్న అవహేళన, మర్యాదగా మారింది.

అదే టైంలో ఎవరో ట్విట్టర్లో సంపూని “నీ మొహం చూసుకో…నువ్వు హీరోవా?” అంటే, “దేవుడిచ్చిన రూపాన్ని నేను మార్చుకోలేను, నాలో చెడుగుణం ఏదైనా ఉంటే చెప్పండి మార్చుకుంటాను” అని సమాధానం చెప్పాడు. అవహేళన చేసిన వ్యక్తి సిగ్గుపడ్డాడ్డు. క్షమాపణలు అడిగాడు. దీనితో సోషియల్ నెట్వర్క్ లో సంపూకు గౌరవం పెరిగింది.

 

————————————–Hrudaya Kaaleyam Latest Posters

కట్ చేస్తే
4 ఏప్రిల్, 2014 సాయంత్రం 6 గంటలు.
అప్పుడే 10tv లో సినిమా రివ్యూ చెప్పి వచ్చి ఫ్రెష్ అవుతున్నాను.
ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గరనుంచీ ఫోన్.
“ఎక్కడున్నావ్”
“ఇంట్లో సార్”
“ఆఫీస్ కి రాగలవా”
“పదినిమిషాలలో ఉంటాను.”
ఆఫీస్ లోకి ఎంటర్ అవగానే… “మీ వాడు సాధించాడయ్యా. హిట్ కొట్టాడు.”
“పొద్దున ప్రసాద్స్ లో చూశాను సర్. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. మల్టిప్లెక్సుల్లో ఓకేగానీ, మధ్యాహ్నం క్రాస్ రోడ్స్ సప్తగిరికి వెళ్ళాను. 60% ఆక్యుపెన్సీ ఉంది. బహుశా సింగిల్ స్క్రీన్స్ లో వర్కౌట్ అవ్వదేమో” అంటూ ఏదో చెప్పబోయాను.ఆయన చిరగ్గా…”అసలేమనుకుంటున్నారయ్యా మీరు. ఇండస్త్రీ గురించి ఏం తెలుసు మీకు? గత ఐదారు సంవత్సరాలుగా ఆ థియేటర్లో జగపతిబాబు, శ్రీకాంత్, శ్రీహరి లాంటి హీరోల సినిమాలు రెగ్యులర్గా వచ్చేవి. మార్నింగ్ షోకి ఈ మధ్యకాలంలో వచ్చిన హయ్యెస్ట్ కలెక్షన్ ఎంతో తెలుసా…..ఐదువేలు. కానీ మీ ముక్కూ మొహం తెలీని హీరోకి వచ్చిన కలెక్షన్ అక్షరాలా పదహారు వేలు. మ్యాట్నీకి ఇరవైఎనిమిది వేలు. ఫస్ట్ షో ఫుల్లయ్యింది. ఇప్పుడే హౌస్-ఫుల్ బోర్డ్ పెట్టారని నాకు ఫోనొచ్చింది. నేను నీకు ఫోన్ చేశాను. మీ సినిమా హిట్టు. పో… మీ డైరెక్టర్ కి చెప్పుపో !” అన్నాడు.———————————–
ఒక ఔత్సాహిక కథకుడు,రచయిత,నిర్మాత.దర్శకుడికి ఒక ఆలోచనవచ్చింది.

రెగ్యులర్ తెలుగు సినిమా లెక్కలతో, హీరోల ట్యాంట్రమ్స్ తో పడేకన్నా, ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని నిర్ణయించుకున్నాడు. ‘మీరు చెప్పింది చేస్తాను’ అనే ఒక డెడికేటేడ్ నటుడు దొరికాడు. అతనిప్పుడు స్టార్ అయ్యాడు. సంపూర్ణేష్ బాబు అయ్యాడు. బర్నింగ్ స్టార్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో అత్యంత క్రేజ్ సంపాదించిన హిట్ చిత్రానికి చిరుమానా అయ్యాడు.

– కత్తి మహేష్

ప్రతి రోజూ ఇలా …

రాత్రి వెన్నెల్లో ఆరేసుకున్న భావాలతో

ప్రభాత పక్షి కొత్త బాణీలు కడుతుంది.

కడలి దొన్నెలో మిశ్రమించి పెట్టుకున్న రంగులతో

నింగి తూరుపు చిత్రం గీసుకుంటుంది.

సెలయేటి నవ్వులమీది ఎగురుతూ ఆటాడే

వజ్ర దేహపు చంద్ర కిరణంలాగో

లేత చిగురాకు బధ్ధకపు విరుపులో పడి

మెలికపడే తొలి సూర్య కిరణం లాగో

ఒక్కోసారి చల్లగా, మరో సారి వెచ్చగా

చక్కిలిగింతలు పెడుతుంది గాలి.

అలంకారాలన్నీ వదిలేసి

నింగికెదురుగా నిలబడి

ఒక్క ప్రకృతి చిత్రానికైనా

కనుపాప దోసిలి పట్టాలి

digital-art-desktop-wallpaper

సన్న జాజితీగల్ని

మృదువుగా మీటే గాలి కొనగోళ్ళ స్పర్శలాంటి

జగన్మోహనాస్త్రమొకటి

గుండెల్లో గుచ్చుకోవాలి.

నింగి బుగ్గన సొట్టలా మొదలై

అనంతంగా విస్తరించే

వెలుగు దరహాసంలా

ఈ పొద్దు విరబూసి

తనలోని మధువుతోనే

మలి పొద్దుకు మెత్తని ఊయలేసి

తృప్తిగా నిష్క్రమించాలి.

–ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

ప్రాణం

నేను చూసాను గూటి నుండి కింద పడి పగిలిన ఓ పక్షి గుడ్డుని
అందులో నుంచి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న మాంసపు ముద్ద

గర్భస్రావమైనట్టు
దానికి ఆసరా ఇస్తూ చేతులు చాపిన మట్టి దేహం
తనలోకి దిగమింగడానికి ప్రయత్నిస్తూనే ఉంది రాలిపడ్డ రక్త మాంసాలను

మిగిలిన కొన్ని శకలాలు వాటంతట అవే ఆకాశంలోని కొన్ని అంచులను తాకుతున్నాయి
ఇప్పుడిప్పుడే

నేను చూసాను మళ్ళీ
పసికందు ఆత్రాన్ని
ఓ కీచు శబ్ధాన్ని
తల్లి రొమ్ములో కుతిక నింకున్న ఓ జీవాన్ని
ఆబగా దప్పిక తీర్చుకుంటున్న కణాన్ని

నేను చూసాను
దేహ ప్రక్షాళన గావిస్తున్న ఒక పదార్థాన్ని
పరాన్న జీవి దశ నుండి పరిణమం చెందిన గుండెరెక్కల చప్పుళ్ళను

ఇంకా కంటూనే ఉన్నా రాలిపడుతున్న కొన్ని మాంసపు ముద్దలను నా కళ్ళనుండి
నెత్తురు ఉబికినప్పుడల్లా..
తిలక్ బొమ్మరాజు

“ రాతి చిగుళ్ళ” మెత్తదనం

1186062_754399994593747_749247437465763954_n

“ రాతి చిగుళ్ళ”  మెత్తదనం “గు౦డె పగిలిన దృశ్యాల”  సౌకుమార్యం, తన కవితకు  గుర్తింపు పత్రం ,చిరునామా అవసరం లేని కవయిత్రి శైలజామిత్ర . ఆవేదనా ప్రవాహం  ,ఆలోచన అంతర్ దర్శనం, అస్తిత్వపోరాటం, అలసిపోయిన ఆరాటం, ఎల్లలు లేని ఆకాంక్ష అన్నీ కలగలిపి కవితాత్మ రంగులద్ది ఆరవేసిన పట్టువస్త్రం శైలజ కవిత్వం. అలాంటి కవిత్వానికి ఈ సంవత్సరం ఉమ్మడిసెట్టి రాధేయ అవార్డు లభించడం సంతోషకరం.

“ రాతి చిగుళ్ళు “ అక్షరాలా, అక్షరాల్లా యాభై ఆరు కవితల సమూహం. సమూహం అనడానికి కారణం ఏ రెండు  కవితలూ ఒక శీర్షికకి౦ద ఇమడని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటమే. ఆరంభంలోనే తనదైన స్వప్నాన్ని పరిచయం చేసారు శైలజామిత్ర

“ఏదైనా ఒకటి

మనల్ని నిత్యం పలకరిస్తోంది అంటే

అది మనం వదిలి వచ్చిన బాల్యమే….

చిన్న చిన్న మాటలు అతిపెద్ద భావన. ఏదైనా ఒకటి … అదేదో ముందు చెప్పరు. కాని అది చేసే పని వివరిస్తారు. మనల్ని పలకరించడంలో  చెప్పకనే చెప్పే ఆప్యాయత ,అనంత స్నేహభావం ,ఎక్కడో చిన్న తెలిసిన తనం లేకపోతె పనిగట్టుకుని రోజూ పలరి౦చరు గద, ఎవరబ్బా అంత చిరపరిచితులు ?  అది మనం వదిలి వచ్చిన బాల్యం. ఇక్కడా లోతుగా తరచి చూస్తే బాల్యాని మనం వదిలి వచ్చాం-మానను బాల్యం వదిలి వెళ్ళలేదు. ఎంత వారలైనా అప్పుడో ఇప్పుడో చిన్నతనం పోనీ పిల్లల్లా ప్రవర్తించడం మన రెండో స్వభావమా?

10154100_747870085246738_1608587565_n

ఇక్కడ బాల్యం మానవీకరి౦చ బడి౦ది. బాల్యం మనలను నిత్యం పలకరిస్తోంది, మనం దానిని పలకరించటం లేదు. వదిలి వచ్చినా విడవకుండా పలకరిస్తోంది. చిన్నప్పటి కళలు , అనుభవాలు , అనుభూతులు మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు రోజుకోసారైనా పలకరించడం అందరికీ స్వానుభావమే. సర్వ జనీనమైన అనుభవాన్ని విశ్వైక భావనగా మనముందుంచారు శైలజ.

మరేదైనా ఒకటి

మనల్ని ధైర్యంగా నిలదీస్తో౦దీ అంటే

ఖచ్చితంగా మనం చేసిన పాపమే.

ఒక్క పలకరి౦తతో రోజు గడిచిపోదు. చేసిన పాపాలు నిలదీస్తాయి.

ఒక వెదుకులాట ,ఒక అంతర్ మదనం అంతేనా ఆరాతియ్యడం పనిలేనితనాన్నీ , ఆలోచించడం తప్పించుకునే ప్రయత్నాన్నీ వీటన్నింటి మధ్య జీవితం ఒక స్వప్నమే.

ఆకాశమంతా ఆవిరైపోతున్నట్టు

ఏమిటో ఈ అసహనపు జల్లులు

ఆకాశమే ఒక శూన్యం అది మొత్తం ఆవిరై మళ్ళీ కురిసే జల్లు

మానవీకరణ , ప్రతీక కవితవ పరికరాలిక్కడ.  పాదరసాన్ని పట్టుకోవడం, లిప్త కాలపు తూటా చప్పుళ్ళు కదులుతున్న కలాలలన్నే కవికి ఎలా అనిపిస్తాయో వివరించారు.

ఒక భావన నుండి మరో భావానికి పాదరసంలా జారిపోయిన కవయిత్రి తనతో పాటు పాఠకులనూ లాక్కుపోతారు. ఒక వాస్తవిక వస్తుగత ప్రయోగం ద్వారా అమూర్త భావనల్లోకి ప్రవహించి అక్కడ మళ్ళీ తనదైన భానిలో ఆవేశ కావేశాలు, ఆకాంక్షలు ,నిరాశా నిస్పృహలు వెళ్ళగక్కి  ఇది౦తే అన్న ఒక ఒక బలమైన ముగింపుకి వస్తారు రచనలో.

10169055_755538614479885_1656040067_n

 

“కదులుతున్న కలాలన్నీ

నిశ్చలనిరాశల మధ్య

అనుభవాల దోబూచులాటలే..

……………….

 

నిరంతర ప్రయాణ సూచికలే …

అంటూ ఖచ్చితమైన ఆత్మాశ్రయ తత్వానికి వచ్చేస్తారు.

“  ప్రవహిస్తున్న క్షణాలు “ కవితలో

ప్రతి వ్యక్తీ ఒక గాజు గదిలో నివాసం

ఒకవైపును౦డి మరోవైపుకు రాళ్ళ ప్రహారం

ఒక అంచునుండి మరో అంచుకు బుల్లెట్ల విహారం

సగటు మానవుల స్థితి కళ్ళకు కట్టినట్టు వివరించారు.

వస్తు పరంగా చూసినపుడు ఒక విస్తృత వైవిధ్యాన్ని చూపారు కవయిత్రి వ్యక్తినుండి, పరిసరాలు, సమాజం, దేశం చివరకు విశ్వైక భావనతో ప్రపంచ సమస్యలూ కవితామయం చేశారు.

వ్యక్తికీ సమాజానికీ మధ్య, సమాజానికీ అంతః చేతనకూ మధ్య, సమాజ వైరుధ్యాల మధ్య, సంఘర్షణ  సమయోచిత  అభివ్యక్తి ఇవన్నే శైలజ కవితలు.

ఒంటరి తనం, అశక్తత వల్ల వచ్చిన నైరాశ్యం, జీవన వైరాగ్యం పర్యవేక్షణ, ఆత్మా పరిశీలన చక్కని భావచిత్రాల్లో అందంగా మలచబడ్డాయి. ఆ భావ చిత్రాలు కొన్ని ప్రగాధంగా ,కొన్ని తేలిపోయే మబ్బు తునకలంత తేలికగా , మరికొన్ని హరివిల్లు తీగలుగా సాగాయి.

అతి మామూలు దృశ్యాల నుండి అరూప భావనలకు తీసుకు వెళ్ళడంలో మాంత్రికురాలు శైలజ.

ఉత్తమ కవితల సరాగమాల తప్పకుండా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందని చెప్పిన మూడో రోజునే ఈ పుస్తకం ఉమ్మిడి శెట్టి కవితా పురస్కారానికి ఎంపిక కావడం ఇంకా మిగిలి ఉన్న సాహితీ విలువలకు తార్కాణం.

మంచి కవితకు చక్కని రూపం “రాతి చిగుళ్ళు”

    – స్వాతి శ్రీపాద

స్వాతీ శ్రీపాద

వీలునామా – 33వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మాతృమూర్తి

 

 

అడిలైడ్ నగరానికి దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో- రహదారికి పక్కనే వున్న ఒక ఇరుకు హోటల్లో, ఆ సాయంత్రం ఒకావిడా, ఒకతనూ కూర్చుని ఉన్నారు. అంద చందాల సంగతటుంచి కనీసం శుచీ శుభ్రతా లేక మురికి ఓడుతూ ఉన్నారు. వాళ్ళెప్పుడైనా ఆనందంగా, గౌరవప్రదంగా వుండి వుంటే అది పూర్వ జన్మలో అయి వుంటుంది.

ఆ స్త్రీకి కాస్త కను-ముక్కూ తీరుగానే వున్నట్టున్నవి. అయితే ఆ ముఖం మీద వయసు వల్ల వచ్చిన ముడతల కంటే అశ్రధ్ధా, నియమాలు తప్పిన జీవన సరళీ తెచ్చిన మార్పులే ఎక్కువ. ఆమె బట్టలూ ఆమెలాగే అశ్రధ్ధగా మురికిగా వున్నాయి. నెరుస్తున్న జుట్టును దువ్వడాని క్కూడా ఓపిక లేనట్టు అంతా ఒక టోపీలోకి దూర్చేసింది. ఆమె కళ్ళల్లో ఒకలాటి నీచత్వమూ, క్రౌర్యమూ వున్నా, మెరుస్తూనే వున్నాయి, ఏదో భయంకరమైన ఆలోచన చెయ్యబోతూన్నట్టు. చేతులూ గోళ్ళూ కష్టపడి పనిచేయడంకంటే జేబు దొంగతనాల్నే ఎక్కువ నమ్ముకున్నట్టున్నాయి. ఆమెకంటే మురికిగా వున్నా, నిజానికి ఆ పురుషుడు అంత ప్రమాదకరమైన వ్యక్తిలా అనిపించడంలేదు. అప్పుడే పోస్టాఫీసు నించి ఒక ఉత్తరం తెచ్చి ఆమె ఒళ్ళో పడేసాడతను. దానిపైన “మిసెస్ పెక్” అని రాసి ఉంది. ఆమె ఆత్రంగా ఉత్తరం చించి చదివింది.

“హమ్మయ్య! నువ్వెదురు చూస్తున్న ఉత్తరం వచ్చేసింది. అంతా అనుకున్నట్టే జరిగిందా?” “నా బొంద. వాడిల్లు తగలెయ్య. దీనికోసమా ఇంతసేపు ఎదురుచూసింది. వాడి చేతులిరిగిపోనూ!” ఉత్తరం చించి కింద పడేసి నోటికొచ్చిన తిట్లు లంకించుకుందామె.

“ఏం జరిగింది? డబ్బివ్వడటా? లిజ్జీ! ఏమన్నాడో చెప్పసలు? నీగురించి వాకబు చేస్తాడా? ఏమంటున్నడు నీకొడుకు?”

“కొడుకా వాడి బొందా! ఈ ఉత్తరం వాడి దగ్గర్నించి కాదు. వాడసలు నా ఉత్తరాలకి జవాబిస్తే కదా? ఇప్పటికి కనీసం మూడు ఉత్తరాలు రాసి ఉంటా. ఒక్కదానికైనా జవాబిచ్చాడా? ఊ..హూ..నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు. అయినా నేను వాణ్ణి ఒదిలేది లేదు. కన్న కొడుకైనా సరే కనికరం చూపించే అలవాటు నాకు లేదు.”

“యెహె! నోర్ముయ్యి! అడిగిందానికి చెప్పకుండా రంకెలేస్తావెందుకు? ఈ ఉత్తరం నీ క్రాస్ హాల్ రాజకుమారుడు కాకపోతే, మరి రాసిందెవరు?” అతను చిరాకు పడ్డాడు.

“ఇంకెవరు? ఆ లాయరు టాల్బాట్!”

“లాయరా? ఏం రాసాడు?”

“ఏముంది! మనం మెల్బోర్న్ వైపు తిరిగి చూడకుండా ఇక్కడే పడి వుంటే ముచ్చటగా మూడు పౌండ్లిస్తాడట. కాదని తెగించి మెల్బోర్న్ వెళ్తే మల మలా మాడి చస్తూన్నా ఫిలిప్స్ నించి ఒక్క పైసా రానివ్వడట. బెదిరిస్తూన్నాడు. వాడి మొహం మండ! అయినా వాణ్ణనేదేమిటిలే, నా ఖర్మ ఇలా కాలింది. ఇద్దరు పిల్లలు నాకు, ఇద్దరూ డబ్బులో మునిగి తేలుతూ ఉన్నారు. నాకు మాత్రం పస్తులు తప్పడం లేదు.”

“నీ పిల్లలా?” వెటకారంగా నవ్వాడతను. “నీ వాలకం జూస్తే నువ్వసలు వాళ్ళ తల్లిలాగున్నావా?”

“ఇద్దరికిద్దరూ- ఫ్రాన్సిస్ హాయిగా క్రాస్ హాల్ ఎస్టేటులో డబ్బు ఖర్చు చేసుకుంటూన్నాడు. ఇహ ఈ లిల్లీ గారి రాజభోగాలైతే చెప్పనే అక్కర్లేదు. గుర్రపు బగ్గీలూ, నౌకర్లూ, వంటమనుషులూ, హబ్బో! ఇహ ఈ అమ్మ దానికళ్ళకెందుకు ఆనుతుంది!” అక్కసుగా అంది ఆమె.

“పోనిలే లిజ్జీ! దక్కిందే చాలనుకుని ఈ అడిలైడ్ లోనే పడి వుందాం. మెల్బోర్న్ కంటే ఇక్కడే చవక కాబట్టి మూడు పౌండ్లతో వెళ్ళదీసుకోవచ్చు….”

“ఛీ నోర్ముయ్యి! వాడెవడు నన్ను ఎక్కడుండాలో చెప్పడానికి? నా ఇష్టమొచ్చిన దగ్గర, ఇష్టమొచ్చినట్టుంటా. అది సరే, హఠాత్తుగా మెల్బోర్న్ రావొద్దంటున్నాడు, వాళ్ళందరూ మెల్బోర్న్ నించి వచ్చే ఆలోచనలో వున్నారేమో. అందుకే నన్ను అక్కడకి రావొద్దంటున్నారు. అయినా, నా తల్లి ప్రాణం ఊరుకుంటుందా, నా కూతుర్ని చూడకపోతే. అసలు స్టాన్లీని పెళ్ళాడమని సలహా ఇచ్చిందే నేనయితే! ఆ రోజు, స్టాన్లీని కలిసే రోజు ఎంత శ్రధ్ధగా తయారు చేసా దాన్ని! ఆ అందం చూసే కదా మూర్ఛపోయి అతను పెళ్ళి చేసుకున్నాడు!”

“వాడెంత తెలివి తక్కువవాడో చూడు! ఏదో ఉంచుకుంటాడనుకున్నా కానీ, ఏకంగా పెళ్ళి చేసి తీసుకుపోయాడు. లిల్లీకి ఎప్పుడెప్పుడు నీతో తెగతెంపులు చేసుకోవాలా అన్నట్టుండేది కాబట్టి వెళ్లిపోయింది.”

“సరే, ఇప్పుడు డబ్బుకేం చేద్దాం?”

“ఏముంది, బెదిరించడమే! ఇన్నిరోజులూ ఫ్రాన్సిస్ ని బతిలాడుతూ, దీనంగా తల్లిలా ఉత్తరాలు రాసావు. ఇప్పుడిక డబ్బివ్వకపోతే చాలా రహస్యాలు బయటపెడతానని బెదిరించు. చచ్చినట్టు డబ్బిస్తాడు.”

“బెదిరింపా? వాణ్ణి బెదిరించడం తో ఏమీ ప్రయోజనం వుండదు. అనుకున్నది చేసేయడమే! దాంతో తెలుస్తుంది నేనంటే ఏమిటో!” అక్కసుగా అందామె.

“ఆగాగు! తొందరపడకు. అనవసరంగా చేతికొచ్చే డబ్బు పోగొట్టుకుంటాము!”

“వాడి వెధవ డబ్బేమీ నాకొద్దు. వాణ్ణి మసి చేసేయాలి  అంతే. అసలు ఆ మేనకోడాళ్ళిద్దరికీ ఆ ఎస్టేటొచ్చి వుంటే తేలిగ్గా డబ్బు లాగే వాళ్ళం. ఆడపిల్లలు బెదిరింపులకి తేలిగ్గా లొంగుతారు. ఈ కొరకరాని కొయ్యకి డబ్బంతా ఇచ్చి పోవాలన్న పాడు బుధ్ధి ఆ చచ్చిపోయిన వాడికెలాపుట్టిందో. నా దగ్గర ఏమాత్రం డబ్బున్నా, పేపర్లలో పెద్దాయన నాతో పెట్టుకున్న సంబంధం బట్టబయలు చేసి ఆ ఫ్రాన్సిస్ ని ఒక ఏడుపు ఏడిపించేదాన్ని కదా!”

“ఈ కోపమే ఒక రోజు మన కొంప ముంచుతుంది. డబ్బున్నవాళ్ళకి పగలూ, ప్రతీకారాలు కానీ మనలాటి తిండిగ్గతిలేనోళ్ళకి కాదు. అది సరే, ఆ మేనకోడళ్ళిద్దరినీ బెదిరిస్తే ఏమైనా రాలొచ్చు. కానీ వాళ్ళని చేరేదెలా? ఉత్తరాల్లో ఇలాటి సంగతులు రాయలేం కదా!”

“ఉత్తరాలంటేనే నాకసహ్యం. ఏదైనా మార్గం ఆలోచించి ఆ ఆడపిల్లలని పట్టుకోవాలి.”

వాళ్ళిద్దరూ ఈ సంభాషణలో మునిగి వుండగానే. అక్కడికొక ప్రయాణీకుడొచ్చి కూర్చున్నాడు. చక్కటి శుభ్రమైన బట్టల్లో హుందాగా వున్న ఆయన వీళ్ళిద్దరి కేసీ చిరాగ్గా చూసాడు. వాళ్ళ వాలకం చూసి ఆయన ఇంకో హోటలుకెళ్దామనుకున్నట్టున్నాడు. లేచి బయటికెళ్ళాడు. కానీ అప్పటికే తన గుర్రం శాలలో కట్టేసి వుండడం వల్ల వెనుదిరిగొచ్చాడు. ఇంతలో ఆ హోటలు యజమాని వొచ్చి,

“అరెరే! మీరా డెంస్టర్ గారూ! రండి రండి! ఇంగ్లండు నించి ఎప్పుడొచ్చారు? లోపలికొచ్చి కూర్చొండి. వీళ్ళని చూసి భయపడుతున్నారా? వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు సార్! కొంచెం దురదృష్టవంతులు అంతే! రండి, రండి! కూర్చొండి. భోజనం చేస్తారా?”

“హల్లో ఫ్రాంక్ లాండ్! ఈ హోటలు నీదని నాకు తెలియనే లేదే! ఇంకా ముందుకెళ్ళే ఓపిక లేదు. ఇహ ఇక్కడే దిగక తప్పేట్టు లేదు,” అక్కడున్న ఇద్దరి వంకా అనుమానంగా చూస్తూ కూర్చున్నాడు డెంస్టర్.

ఆయనకెందుకో ఆ ఇద్దర్నీ చూస్తుంటే మహా రోతగా వుంది. వాళ్ళ వేషభాషలకంటే వాళ్ళ దగ్గర్నించొచ్చే చవక సారాయి వాసన మహా చిరాగ్గా వుంది.

హోటలు చూడడానికలా వున్నా, ఫ్రాంక్ లాండ్ శ్రీమతి చక్కటి భోజనం తయారు చేసింది. భోజనం అయింతర్వాత విశ్రాంతిగా కూర్చున్నాడు డెంస్టర్. ఆయన దగ్గరికి టీ తెచ్చింది ఫ్రాంక్ లాండ్ శ్రీమతి. పనంతా అయిపోవడం వల్ల ఆమె కూడా తీరిగ్గా కూర్చుంది. ఫ్రాంక్ లాండ్ తో పోలిస్తే ఆయన భార్య ఎంతో చురుకైనదీ, తెలివి గలదీ. అతని తెలివితక్కువతనమూ, సోమరి తనమూ వల్ల వాళ్ళెంత డబ్బు నష్టపోయినా, ఆమె ఏదో విధంగా నెట్టుకొస్తూంది. బ్రతికి చెడ్డ మనిషవడం వల్ల తమ కంటే కొంచెం ఆర్థికంగా బాగున్న మధ్య తరగతి మనుషులతో మాట్లాడడం చాలా ఇష్టం ఆమెకి.  అందుకే డెంస్టర్ పక్కన కూర్చుని ఇంగ్లండు గురించీ తామక్కడ వదిలేసి వచ్చిన స్నేహితుల గురించీ మాట్లాడసాగింది.

veelunama11

“అయితే మీ అమ్మాయిని చూసొస్తున్నారన్నమాట! ఎలా వున్నారు వాళ్ళంతా?”

“ఇంగ్లండు నించి ఆస్ట్రేలియా రాగానే, నేను ముందుగా చేసేదదే కదా? అదసలే తల్లిలేని పిల్ల. బానే వున్నారు. మళ్ళీ ఇంకో బాబు!”

“ఆహా! భలే మంచి వార్త చెప్పారే! మరి మీరెలాగున్నారు?”

“నిజం చెప్పనా మిసెస్ ఫ్రాంక్ లాండ్? నా బిడ్డ సంసారమూ, ఇల్లూ పిల్లలూ చూసి సంతోషంగా అనిపించే మాట నిజమే. భార్యగా ఇల్లాలుగా ఒదిగిపోయిన బిడ్డని చూస్తే ఏ తండ్రికి గర్వంగా వుండదు? ఒక్కగానొక్క కూతురు, తల్లి లేదని అల్లారు ముద్దుగా పెంచాను. అయినా నాన్నని ఎంత తేలిగ్గా మరిచిపోయిందా అని అప్పుడప్పుడూ బాధ కలిగే మాటా నిజమే. అందుకే కొంచెం ఒంటరిగా అనిపిస్తూంది.”

“నా మాట విని మిమ్మల్నీ ఇంటినీ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోండి. కాస్త పెద్ద వయసులో వుండి,  సౌమ్యంగా పని చేసుకోగలిగే మనిషైతే..”

“అమ్మో! ఇంగ్లండునించి ఎవరైనా పనికి మనిషిని తెచ్చామనుకో, ఇహ ఆవిడ వచ్చిందగ్గర్నించీ ఇంటికెళ్దామని నా ప్రాణం తోడేస్తుంది. ఇప్పుడు నాకే పని మనుషులూ వొద్దు. ఇలాగే సాగిపోతే చాలు.” శ్రీమతి ఫ్రాంక్ లాండ్ ఏమీ మాట్లాడలేదు.

“అయినా నేను మీరనుకున్ననంత ఒంటరిగా లేను మిసెస్ ఫ్రాంక్ లాండ్. నన్ను ప్రేమించి నన్ను ఒదిలిపెట్టిపోయిన వాళ్ళ ఆత్మలు నా చుట్టూ తిరుగుతునే వుంటాయి ఎప్పుడూ. ఈ మధ్య నేను ఆత్మలతో సంభాషించడం నేర్చుకున్నా తెలుసా.”

“బానే వుంది కానీ, ఆత్మలు వంట చేసి ఇల్లు శుభ్రం చేయలేవు గదా? అలాటి పన్ల కోసమైనా ఇంట్లో ఇంకొక ఆడమనిషి వుండాలేమో ఆలోచించండి. అది సరే కానీ, ఇంగ్లండు నించి మీతో పాటు పడవలో ఇంకెవరొచ్చారు? ఎవరైనా మన పరిచయస్తులొచ్చారా?”

“ఆ! ఈ ట్రిప్పులో చాలా మందే వున్నారు. మనకి తెలిసిన వాళ్ళూ కొందరున్నారనుకోండి. “

“ఆహా? వాళ్ళల్లో మీకు నచ్చిన అందగత్తెలెవ్వరూ కనపడలేదా?” కొంటెగా నవ్వింది శ్రీమతి ఫ్రాంక్ లాండ్.

“అందగత్తెలు నా మొహం చూస్తారండీ? అందమంటే గుర్తొచ్చింది. ఒక అద్భుతమైన అందగత్తెని చూసిన మాట నిజం. కానీ, ఆమె పెళ్ళయిపోయిందట! వాళ్ళది మెల్బోర్న్ కాబోలు. వాళ్ళాయన పేరు ఫిలిప్స్ అనుకుంటా.”

“ఫిలిప్స్ ఆ? వాళ్ళది విరివాల్టా యేనా?” వున్నట్టుండి పెక్ ఆత్రంగా ఈ సంభాషణలో జొరబడింది.

“అదే అయివుంటుంది. పిల్లల నోటినుంచి ఆ పేరు బాగానే విన్న ఙ్ఞాపకం.” ఆమె వంక చిరాగ్గా చూస్తూ అన్నాడు డెంస్టర్.

“ఆవిడ  అంత బాగుందా?”

“హబ్బో! ఏం చెప్పను! చెక్కిన శిల్పం లాగుంది. అయితే పొట్టకోస్తే అక్షరమ్ముక్క రాదు. నోరెత్తిందంటే చెవులు మూసుకోవాల్సిందే. ఆ భర్త ఆమె అందచందాలకే దాసోహమైనట్టుంటాడు. ”

“బాగా డబ్బున్నవాళ్ళేనా?” ఆశగా అడిగింది.

“అయే వుండొచ్చు. నేను లండన్ లో వాళ్ళింటికెళ్ళాను. ఇల్లదీ పెద్దగా బాగానే వుంది.”

“ఎంత మంది పిల్లలు? ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి! నాకు వాళ్ళు చాలా కాలం కింద తెలుసు.”

“పడవ మీద నలుగురున్నారు. ఒక పాప విషజ్వరం సోకి పోయిందన్నారు. కానీ, పడవ మీద ఆవిడ గర్భవతి కాబట్టి ఈ పాటికి పురుడయే వుండాలి. ”

“వాళ్ళాయన కూడా పడవలో వచ్చాడా?”

“వచ్చాడు కానీ మీకు వాళ్ళెలా తెలుసు?” డెంస్టర్ కుతూహలంగా అడిగాడు.

” చాలా యేళ్ళ కింద వాళ్ళింట్లో పని మనిషిగా చేసేదాన్ని. అప్పుడు అంత డబ్బున్నవాళ్ళేం కాదు, ఇప్పుడెలా సంపాదించారో కాని!”

“ఎలాగేముంది? అందర్లాగే! ఫిలిప్స్ చాలా కష్టపడి పని చేస్తాడు. లండన్ లో వాళ్ళ ఇల్లు మాత్రం చాలా బాగుండేది.”

“వాళ్ళకొక గుర్రబగ్గీ కూడా వుండి వుండాలే,” కాస్త వెటకారం జోడించింది పెక్.

“గుర్రబ్బగ్గీ మాటేమో కానీ, ఆ మధ్య వాళ్ళు యూరోప్ అంతా తిరిగొచ్చారు. ఆ ప్రయాణం లో శ్రీమతి ఫిలిప్స్ కూడా ఒక పనమ్మాయిని కూడా తీసికెళ్ళిందట.”

“అబ్బో! పనమ్మాయి కూడానా? ఇంకేం! మరి పిల్లల చదువులూ….”

“దానికొక టీచర్ని ఇంట్లోనే వుండేలా పెట్టుకున్నారు. ఆవిడ చెల్లెలే ఈ పనమ్మాయి. ఆ పనమ్మాయి కూడా అందంగా నాజూగ్గా వుండేది. ఆ టీచరమ్మ మామూలుగా వున్నా, బలే చదువుకున్నది!”

“పనమ్మాయి బాగుండడేమిటి నా మొహం!”

“అంటే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళూ బాగా బ్రతికి చెడ్డవాళ్ళట. చాలా ధనవంతుల ఇంట్లో పెరిగి చదువుకున్నారు కానీ, అకస్మాత్తుగా నిలవనీడ కూడా పోయేసరికి ఇలా దొరికిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ సంగతి పేపర్లలో కూడా వచ్చిందటగా. అదే, ఆ స్కాట్ లాండు భూస్వామి, హొగార్త్ మేనకోడళ్ళు,” ఉత్సాహంగా వివరించాడు డెంస్టర్.

“అంటే పేపర్లలో మెల్విల్ అక్క చెల్లెళ్ళని రాసారు, ” పెక్ మొహం ఉన్నట్టుండి వెలిగిపోయింది. దాన్ని దాచుకోవడానికి ఆవిడ శతవిధాలా ప్రయత్నించింది.

“నేనా కథంతా పేపర్లలో చదివాలెండి. మనలాటి చప్పిడి జీవితాలలో కాస్త ఇలాటి కథలేగా సరదాగా వుండేవి. అయితే ఇప్పుడు ఫిలిప్స్ ఇంటి నిండా జనమే నన్నమాట. భార్యా భర్తలూ, పిల్లలూ, పని వాళ్ళూ…”

“ఆ ఆ! వాళ్ళతోపాటు స్టాన్లీ చెల్లెలు కూడా వుండేది. హేరియట్ అనుకుంటా ఆమె పేరు.”

“పిల్లలెలా వున్నారు? నేను పెద్ద పిల్ల నెలలపాపగా వున్నప్పుడు చూసాను వాళ్ళని అంతే.

బాగా చదువుకుంటున్నారా?”

“వాళ్ళ టీచరు చాలా తెలివైంది కాబట్టి..”

“ ఆ టీచరమ్మ చదువు నేనూహించగలను లెండి. చచ్చిపోయిన క్రాస్ హాల్ హొగార్త్ కి బోలెడంత చదువు పిచ్చి వుండేది.”

డెంస్టర్ ఆశ్చర్య పోయాడు.

“ఓ! అయితే మీకు ఆ ఎస్టేటు, వాళ్ళంతా తెలుసా? అయితే మీకు ఫ్రాన్సిస్ హొగార్త్ కూడా తెలుసా? అదేనండీ, ఈ మధ్యే ఎన్నికల్లో అక్కడ పార్లమెంటుకి ఎన్నికయ్యాడూ!”

“ఏమిటీ? ఎన్నికల్లో కూడ పోటీ చేసాడా?” అక్కసు దాచుకోలేకపోయింది పెక్. ఆమె మొహంలో కోపామూ, గొంతులో ఈర్ష్యా అర్థం చేసుకుని ఆశ్చర్య పోయాడు డెం స్టర్.

“వాడు తెలియకపోవడ మేం ఖర్మ. మీకే వాడి బ్రతుకు గురించి తెలియదు. కొన్ని కొన్ని కథలు చెప్పానంటే.. అయినా చెప్పాల్సిన సమయమొస్తే కాని చెప్పకూడదేదీ. అయినా నాకెందుకులే…” డెంస్టర్ కెందుకో ఆమెతో సంభాషణ రుచించక మౌనంగా వుండి పోయాడు.

“మిసెస్ పెక్! మీరసలేమీ తినడం లేదు,” శ్రీమతి ఫ్రాంక్ లాండ్ మర్యాదగా మాట మార్చింది.

“సరిగ్గా తిన బోయే ముందు ఒక చెడ్డ వార్త విన్నానమ్మా! తినాలన్న ధ్యాసే పోయింది కానీ, ఏం చేస్తాం, తినక తప్పదుకదా! ఈ టీ చల్లారిపోయింది. ఇంకొక కప్పు వేడి టీ తీసుకురామ్మా! అలాగే తినడానికింకేమైనా…” అంటూ మిసెస్ పెక్ కడుపు నిండా తిని, రెండు గ్లాసుల బ్రాందీ తాగి, పెక్ ని బయటికి పంపేసింది కాసేపు ఆలోచించాలంటూ. ముందు మెల్బోర్న్ చేరడానికెలాగైనా డబ్బు పుట్టించాలి. ముందున్న ఈ డెంస్టర్ నే ముంచితే సరి! తన మీద చిరాకుతో మొహం అటు తిప్పి కూర్చున్న డెంస్టర్ కేసి చూసిందామె. మొహమంతా పేద చిరునవ్వు పులుముకుంది. అతనికి చెప్పడానికి అందమైన కథను సిధ్ధం చేసుకుంది.

**********************

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -16 వ భాగం

( గత వారం తరువాయి )

16

ముందురోజు రాత్రి హైద్రాబాద్‌లో ‘జింఖానా గ్రౌండ్స్‌’లో జరిగిన ‘జనసేన’ అవగాహన బహిరంగ సభ ఎంతో విలక్షణంగా, విజయవంతంగా జరగడం రామంకు, గోపీనాథ్‌కు, క్యాథీకి, శివకూ.. ప్రధానంగా సలహాదారులుగా ఉండి వెన్నుతట్టిన ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తిగారికి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు, రాజీవ్‌శర్మ , జగన్నాథంలకు, మానవ హక్కుల సంఘం రాములు సార్‌కు, వేదికపై మాట్లాడిన యితర బాధ్యులకు .. ఎంతో ఆత్మతృప్తినీ, ఉత్తేజాన్నీ కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, మౌనంగా పరిస్థితిని గమనిస్తూ కూర్చున్న పరిశీలకుల్లో, భవిష్యత్తును అంచనావేస్తున్న వ్యూహకర్తల్లో ఒకరకమైన ఉత్సుకతను రేకెత్తించింది. భారత స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్నపుడు గాంధీ ఉన్నట్టుండి ‘అహింస’ సిద్ధాంతంతో ప్రతిఘటనను, సహాయ నిరాకరణను ప్రకటించిన రోజు తలలుపండిన రాజకీయ పోరాట యోధులు అందరూ పెదవివిరిచి, ఒకింత దాన్ని ఒక పనికిరాని వెకిలిచేష్టగా వ్యాఖ్యానించి, అబ్బే.. గీ గిచ్చుడు చర్యతో ఏనుగు మాటవింటుందా, అంకుశం పోటుపడాలిగాని.. పద్దతిలో వెటకారం చేసి గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత.. ఊహించని నిప్పురవ్వ మహారాజ్యాన్ని భస్మీపటలం చేసి రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తుంటే విస్తుపోయి తమ తప్పుడు అంచనాలకు సిగ్గుపడి తలలువంచుకున్నారు.
నిన్న జరిగింది అదే.. దాదాపు నెలరోజుల క్రితం ఒక ఊహకందని, ఊహిస్తే నమ్మశక్యంగాని, అహింసాయుతమైన ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్నీ, జనాన్ని ప్రశ్నించే పదునైన ఆయుధంగా మార్చి అవినీతి రాక్షసిపైకి ప్రయోగించే ఒక మహత్తర సాధనంయొక్క స్వభావాన్ని రామం తన ఆలోచనగా ప్రకటించినపుడు చాలామంది దాన్ని ఒట్టి అపరిపక్వ ఆలోచనగా కొట్టేశారు. అదసలు సాధ్యమయ్యేదేనా ఇది. అని కొందరు పరిహసించారు కూడా. చీమ ఏనుగును కుట్టి ఏం సాధిస్తుంది.. అని పెదవి విరిచారు. సాయుధులైన నక్సలైట్లు, అనేక ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమకారులు గత నలభై, యాభై ఏళ్ళుగా ప్రతిఘటిస్తూ ఈ ఘనీభవించిన అవినీతి పర్వతాన్ని ఒక ఇంచ్‌కూడా కదిపి పెళ్ళగించలేంది.. ఈ ప్రజాచైతన్య, ప్రక్షాళన వంటి సున్నిత కార్యక్రమాలతో ఏం జరుగుతుందిలే అని హేళన కూడా చేశారు కొందరు.
కాని మనిషి దుఃఖించాలంటే ఒంటిని గాయపరిచి హింసిస్తే లాభంలేదు. వాని హృదయం చలించి కరిగినప్పుడు మాత్రమే కన్నీటి చుక్క పొటమరిస్తుంది. అది ఎంతో గూఢమైన, సత్యమైన పరమ రహస్యం. ఆ రహస్యం నిన్న లక్షలమందిని ఏకకంఠంతో కదిలించే మహాశక్తిగా మార్చి చూపి ఊర్కే ప్రేక్షకుల్లా గమనిస్తున్న మేధావుల్ని దిగ్భాంత్రుల్ని చేసింది.
ఒక బిందువువంటి శుద్ధ ఆలోచన ఊహగా ఆరంభమై, భావంగా ఎదిగి, ఆలోచనగా పాదుకుని, ఆచరణగా విస్తరించి విస్తరించి, నియమాలుగా, సూత్రాలుగా,సిద్ధాంతాలుగా పరివర్తిన్నవేళ, ప్రయోగం ఫలించి అద్భుతమైన ప్రభావాలను ప్రసరించిన వేళ.. బిందువే ఒక సింధువును సృష్టిస్తూ తవనెంట లాక్కెళ్తున్నవేళ..,
”యిన్ని లక్షలమంది జనం తామంతట తాము.. ఎవరికి వారు. రాష్ట్రం నలుమూలల నుండి.. తమ స్వంత ఖర్చులతో.. స్వచ్ఛందంగా నాటి సభకు తరలి రావడం. ఎర్రటి ఎండలో గంటలకొద్దీ ఓపిగ్గా కూర్చొని.. ఎక్కడా జనాన్ని రెచ్చగొట్టేలా కాకుండా ఆలోచింపజేసే వక్తల ప్రసంగాలను విని ఆకలింపు చేసుకుని మమేకం కావడం. యిదంతా నన్ను పులకింపజేస్తోంది రామం. నిజంగా ఒక చిన్న అతి సున్నితమైన ఆలోచనను బ్రహ్మస్త్రంగా మలచి ప్రయోగించి చూపావయ్యా.. యామ్‌ ఎక్ట్స్రీమ్లీ హాపీ.. ఇప్పుడు మన ‘జనసేన’ బాధ్యులందరికి కోటి ఏనుగుల బలమొచ్చింది.. యిక పడగెత్తిన ఈ జనమహాసముద్ర తరంగ తురంగ ఉధృతిని నిలువరించడం ఎవరితరమూ కాదు.. యిప్పటికే బయట అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ప్రశ్నించేవాడూ, అడిగేవాడూ, నిలదీసేవాడూ లేనంతకాలమే ఎవని ఆటలైనా సాగేది. యిక ఈ దుష్టచదరంగం ఆటకు చెక్‌ పడ్డది..డాక్టర్‌ గోపీనాథ్‌ మాటలు గలగలా గోదావరీ ప్రవాహంలా సాగుతున్నాయి. ఆయన ఒక హర్షాతిరేక తాదాత్మ్యతలో మునిగిపోయాడు.
జనపథంలోని జనసేన ప్రధాన కార్యాలయం ప్రధాన సభామందిరంలో ఒక వలయసభ ఏర్పాటు చేయబడిందారోజు.. దానికి ఒక అధ్యకక్షుడు, ఒక అతిథి, ఒక వక్త.. అలా ఏవిధమైన సాధారణ సాంప్రదాయాలూ లేవు. మనుషులు.. మనసులు కలవడం, అభిప్రాయాలను, ప్రతిపాదనలను, అంతరంగాలను చర్చించుకోవడం, పంచుకోవడం.. ప్రజాస్వామ్యయుతంగానే కాని నిబద్ధతతో కూడిన క్రమశిక్షణతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం.. యిదీ అక్కడ ఇన్నాళ్ళుగా జరుగుతూ వస్తున్నది.. ఆ రోజూ జరుగవలసిఉన్నది కూడా.
ఆ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నేపథ్యంలో ఒక్క బోసినవ్వులు చిందిస్తున్న గాంధీ పటం మాత్రమే ఉంది. పటం క్రింద ఆనాటి సమావేశ లక్ష్యం ”ప్రక్షాళన సభ”అని బేనర్‌ ఉంది. రౌండ్‌ టేబుల్‌ మధ్య టేబుల్‌తో సమాన ఎత్తులో ఉన్న అందమైన చెక్కబల్లపై రెపరెపలాడ్తూ భారత జాతీయపతాక  హుందాగా ఎగుర్తోంది.
గత ఇరవైరోజుల క్రితం జనసేన ఎంపికచేసిన నూటా ఎనిమిది మంది ఋషులవంటి స్వార్థరహిత..రామం ఎన్నో ఏళ్ళుగా తన నిఘా విభాగాన్ని ఉపయోగించి, అధ్యయనాలు జరిపించి గుర్తించినవారే చాలామంది.. వ్యక్తులతో కూడిన ‘మార్గదర్శక సభ’  ఆరోజు సమావేశమైంది. అతి ప్రధానమైన ఆదేశిక సూత్రాలను రూపొందించి ఆచరణ విధానాలతోసహా ‘జనసేన’ మూల కార్యకర్తలకందించడం, అమలులో ముందుండి జనసేనకు నాయకత్వం వహించడం, కావలసివచ్చినపుడు ఏ అధికారినైనా, శత్రువునైనా, ఏ ప్రత్యర్థినైనా నిలువరించి ఎదుర్కోవడం.. సంస్థలో ప్రాణసమానమైన క్రమశిక్షణను స్వయంగా పాటిస్తూ, తమ విభాగంచే పాటింపజేయడం..యివీ మార్గదర్శక సభ సభ్యులు చేసేపని.
క్రమశిక్షణ.. సంయమనం.. సహనం. యివి ‘జనసేన’ యొక్క ప్రధానమైన ప్రాణసూత్రాలు.

ekkadi-April10
ఎవరికీ స్వార్థంలేకపోవడం, అధికార కాంక్షలకు కారణభూతమైన ఏ పదవులూ సంస్థలో లేకపోవడం, క్రమంగా మనిషిని ‘లౌల్యా’నికి అతీతంగా తయారు చేయగల ఉద్యమసంస్కారం ప్రతి కార్యకర్తలోనూ నిండి ఉండడం.. యివి అంకితభావం వల్ల అందరికీ సంక్రమించిన సులక్షణాలు.
సరిగ్గా నూటా ఎనిమిదిమంది ఉన్న ఆ ‘మార్గదర్శక సభను ప్రారంభిస్తూ, రామం లేచి నిలబడి.,
”మిత్రులారా.. ఈ నెలరోజుల తర్వాత మనం యిప్పుడు ఒక అతిముఖ్యమైన కీలకథకు చేరుకున్నాం. ఈ మాసం కాలంలో మనం ముందే అనుకున్నట్టు మన జనసేన సంస్థను ప్రజల్లో భవిష్యత్తులో అందరికీ ప్రాణసమానమైన అవసరంగా ప్రతిష్టించి వాళ్ళ హృదయాల్లో స్థాపించగలిగాం.. యిది సాధారణమైన విజయంకాదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నూటా అరవై కార్యాలయాలతో దాదాపు నాల్గు లక్షలపైచిలుకు సభ్యులు సైనిక సమానులైన కార్యకర్తలుగా ఉన్నారు. మనకు యిప్పుడు ‘జనసేన’ ఒక అజేయమైన సంస్థగా నిలబడ్డది. ఆకాశమంత ఎత్తులో. యిక మిత్రులారా.. మనం కార్యాచరణలోకి దూకబోతున్నాం. ప్రజలు అహింసా పద్ధతులను పాటిస్తూనే శాంతియుతంగా ఉద్యమిస్తూ సంఘటితంగా ఎన్నెన్ని అద్భుతాలు చేసి చూపించగలరో ప్రత్యక్షంగా రేపటినుండి మనం ఋజువు చేయబోతున్నాం. ‘ప్రక్షాళన’ యొక్క రూపురేఖలు మన కార్యాచరణ ఎలా ఉంటుందో పెద్దలు ‘అగ్ని’ వార్తా చానల్‌ అధినేత మూర్తిగారు మనందరికి వివరిస్తారు. మూర్తిగారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.” అని రామం ప్రశాంతంగా కూర్చున్నాడు కుర్చీపై,
ఆదేశికసూత్రాలలో, ప్రాథమిక జనసేన కార్యకర్తల శిబిరంలో నాయకులెప్పుడూ అతి తక్కువగా, సూటిగా, క్లుప్తంగా మాట్లాడాలని ఒక ప్రధాన అంశంగా శిక్షణ యివ్వబడింది. దాన్ని ప్రతిఒక్కరూ పాటిస్తారు.
మూర్తిగారు చేతిలో కొన్ని కాగితాలతో గంభీరంగా లేచి నిలబడి తన ముందున్న మైక్‌ను సవరించుకుని.,
ఆ హాల్‌లో సౌకర్యాలన్నీ అత్యాధునికంగా ఉన్నాయి. రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతున్న స్థలానికి ఎదుట ఒక పెద్ద ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ ఉంది. ప్రక్కనే యల్‌సిడి స్క్రీన్‌ ఉంది. ఇటు ప్రక్క మాట్లాడ్తున్న వక్త యొక్క ఫీలింగ్సు, హావభావలు స్పష్టంగా కనబడ్డానికి అతని లేజర్‌ ఇమేజ్‌ను చూపించే మరో తెర ఉంది. సభలో పాల్గొంటున్న ప్రతి సభ్యుని ముందు ఒక్కొక్క ఇండివిడ్యువల్‌ మైక్‌ ఉంది. హాల్‌ మొత్తం సెంట్రల్లీ ఏర్‌ కండీషన్డ్‌. కమ్యూనికేసన్‌ సౌకర్యాలు, డాటా సేకరణ, విశ్లేషణ, రాష్ట్రంలోని వందల కార్యాలయాలతో ఏ వ్యక్తితోనైనా సంధానించబడ్డానికి అత్యాధునిక ఏర్పాట్లు.. అన్నీ ఏ ప్రభుత్వ లేదా అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్‌ కంపెనీల కంటే కూడా ఆధునాతనంగా ఉండాలనీ క్యాథీ మొదట భావించి తను స్వయంగా పర్యవేక్షించి ఆ భవనాన్ని నిర్మింపజేసింది.
ఎదురుగా లేజర్‌ తెరపై మూర్తిగారి పొట్రేట్‌.
ఎల్‌సిడి స్క్రీన్‌పై ఒక విండో ఓపెనై.. జనసేన.. డాటా బ్యాంక్‌.. అని లోగోతో సహా ఒక స్క్రీన్‌ డిస్పే ్ల ఐ..,
అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
”మిత్రులారా.. ఒక చిన్న కథ చెబ్తా చాలా క్లుప్తంగా. ఒక తెలివైన భార్య, బ్రతుకనేర్చిన భర్త తాము నలభై ఏండ్ల వయస్సున్నపుడు కొన్ని బ్యాంకులను ట్రాప్‌ చేసి బ్యాంక్‌ అధికారులకు విపరీతంగా లంచాలిచ్చి నాల్గు కోట్ల రూపాయలను అప్పుచేసి అత్యాధునికమైన సర్వసౌకర్యాలున్న భవనాన్ని, కార్లనూ. అన్నీ సమకూర్చుకుని హాయిగా బ్రతకడం మొదలెట్టారు. నాల్గుకోట్ల రిపేమెంట్‌ టైం ముప్పయ్యయిదేళ్ళు, గ్రేస్‌ పీరియడ్‌ మరో పదేళ్ళు.. వడ్డీరేటు.. ఎంతోకొంత.. వాళ్ళకు తెలుసు ఈ నలభై ఐదు ఏండ్లకాలంలో తాము తప్పకుండా చచ్చిపోతామని. లంచాలు తీసుకుని అప్పిచ్చిన బ్యాంక్‌ అధికారులకూ తెలుసు నలభై ఐదేండ్ల తర్వాత తాము ఉద్యోగాల్లో ఉండమని.. నలభై ఏండ్ల తర్వాత.. ఈ పెళ్ళాం మొగులూ హాయిగా బ్రతికి హాయిగా చచ్చిపోయారు. బ్యాంక్‌ అధికారులు ఉద్యోగ విరమణ చేసి హాయిగా వాళ్ళూ చచ్చిపోయారు. చెల్లించవలసిన అప్పుల క్రింద నలభై ఏండ్ల తర్వాత వాళ్ళ పిల్లలిద్దరు అన్ని ఆస్తులనూ అమ్మినా అప్పులే తీరక, వడ్డీలు కట్టలేక.. ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు పిచ్చోడైపోయాడు.
మిత్రులారా.. అర్థమైందనుకుంటూ ఇపుడు నేను చెప్పింది.. ఎలా పసిగట్టారో గాని మన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులు బంగారు బాతువంటి ప్రపంచ బ్యాంక్‌ సంగతిని పసిగట్టారు. దాన్నుండి గత ఇరవై ఏండ్లలో ఎన్ని లక్షలకోట్లను తీసుకుని తిని మనకు ఎంత అప్పును వారసత్వంగా మిగిల్చిబెట్టారో ఇప్పుడు నేను చెబితే జనం గుండె పగిలి చచ్చిపోతారు. మంత్రులందర్ని ముఖాలపై ఉమ్మేస్తారు. ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులను చెప్పులతో కొడ్తారు.”
తెరపై వివరాలు కనబడ్డం మొదలైంది.
1999- ఎపిఇర్‌పి ప్రపంచబ్యాంక్‌ నుండి రూ. 1298.56 కోట్లు, మళ్ళీ రూ. 364 కోట్లు కర్నూల్‌ కడప ప్లాన్‌ కింద రూ. 555 కోట్లు, తుంగభద్ర రూ. 45 కోట్లు, తెలుగు గంగ రూ. 450 కోట్లు, ఖమ్మం.. వరంగల్‌ మరియు కోస్తా జిల్లాలకు రూ. 123.8 కోట్లు, యస్‌ఆర్‌బిసి క్రింద 939.85 కోట్లు, జూరాల, సోమశిల, సాగర్‌ ప్రాధాన్యతల పనికి రూ. 1095 కోట్లు.. చిత్రావతి నది రూ 78 కోట్లు, గన్నవరం రు. 34.8 కోట్లు, నిర్వాసితుల ఆరక్షణ క్రింద రూ. 136.18 కోట్లు, రు782 కోట్లు …యిలా చదివి చదివి మన నోరుపోతుంది. నా దగ్గర ప్రపంచ బ్యాక్‌, ఇంటర్నేషనల్‌  మానిటరీ ఫండ్‌, జపాన్‌ వంటి దేశాలనుండి తెచ్చిన అప్పుల జాబితా వివరాలు ముప్పైరెండు పేజీల నిండా ఉన్నాయి. వీటిని చూస్తే కంపరమెత్తుతోంది.
ఐతే…. మిత్రులారా… పెద్ద పెద్ద పరిశ్రమలు, దేశాలు అప్పుచేయకుండా ఎలా నిధులు సంపాదిస్తాయి. ఎలా సంక్షేమ పథకాలను చేపడ్డాయి  …అనే ప్రశ్నకు ఆర్థికశాస్త్రం ఏమంటోందంటే.భారీ ఋణాలనెప్పుడు ‘ఉత్పాదక రంగం’ కోసం చేయమంటోంది. ఉదాహరణకు.. ఒక ఉక్కు కార్మాగార నిర్మాణం కోసం వేయికోట్ల అప్పుచేస్తే.. అది ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత లాభాలతో అప్పు చెల్లించవచ్చు. కాని అనుత్పాదక రంగం కోసం అప్పు చేస్తే అవి శిరోభారమై వ్యవస్థను తినేస్తాయి.
ఐతే ఈ ఇర్రిగేషన్‌ ప్రాజెక్టుల క్రింద, రోడ్లు, ఆరోగ్యాభివృద్ధి, మురుగు కాల్వల అభివృద్ధి- మరమ్మత్తులు, వంతెనలు, విద్య.. ఆధునీకరణ.. ఇటువంటి అవ్యవస్థ రంగాల కోసం ఈ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు అప్పుతెచ్చి మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఐఎఎస్సాఫీసర్లు, ఇంజినీర్లు, మున్సిపల్‌స్థాయి నాయకులు.. అందరూ బినామీ పేర్లమీద కాంట్రాక్టర్లయి, సప్లయర్లయి, డెవలపర్సయి, కన్‌స్ట్రక్టర్లయి.. అంతా పంచుకు తినడమే.. పోనీ ఆ చేసిన కొద్దిపాటి పనుల్నైనా నాణ్యంగా, ప్రామాణికంగా చేస్తారా అంటే అదీలేదు. అంతా నాసిరకం. సిమెంట్‌ లేదు, ఇసుక లేదు. స్టీల్‌ లేదు.. అంతా దుమ్ము, దుబ్బ, రోత.. లోతుకుపోయి చూస్తే తెలుసుకుని గుండెలు పగిలి చస్తాం మనం.
పాపం.. మహానుభావులు.. కె. కన్నబీరన్‌, కె. బాలగోపాల్‌ 14 డిసెంబర్‌ 2003న ప్రపంచ బ్యాంక్‌కు సవివరంగా ఒక లేఖ రాశారు.. యిక్కడి అవినీతికర పరిస్థితులను సవివరంగా వివరిస్తూ అయ్యా మహాప్రభో మీరిచ్చే దీర్ఘకాలిక కోటానుకోట్ల అప్పులను మా వాళ్లు పంచుకుని, నంజుకుని తింటున్నారు. మీరు మీస్థాయిలో తగుమోతాదులో లంచాలనుతీసుకుని యిస్తున్న లక్షల కోట్ల ఋణాలను ఇకనైనా ఉదారంగా మా నెత్తిన రుద్దడం ఆపేయమనీ, మమ్మల్ని ఇంకా ఋణాల ఊబిలో ముంచవద్దనీ వేడుకున్నారు. నోబుల్‌ బహుమతి గ్రహీత. అమర్త్యసేన్‌ కూడా భారతదేశంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ నుండి పైరవీ చేసి తెచ్చుకుంటున్న అప్పు నిధులను స్వాహా చేస్తున్నాయి గానీ సక్రమంగా ఉపయోగించడం లేదనీ.. అందువల్ల యిక అప్పులీయడం దయచేసి బంద్‌ చేయండనీ అభ్యర్థించాడు. కాని ప్రపంచబ్యాంక్‌ వాడింటాడా.. కమీషన్లు తీసుకుని అప్పివ్వడం వానికిష్టం.. అప్పుచేసి పంచుకుతినడం యిక్కడ వీనికిష్టం.. అదీ తంతు.
ఐతే.. యిప్పుడు సరిగ్గా ఈ దౌర్భాగ్య దయనీయ స్థితిపైన మనం మన ప్రజాచైతన్య బాంబు పేల్చి మన మొదటి యుద్దాన్ని ప్రకటించబోతున్నాం.
మిత్రులారా జాగ్రత్తగా వినండి.. యిప్పుడు నేను చెప్పబోయేది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా.. కోట్లాది రూపాయల ప్రాజెక్ట్‌లుగా.. పద్దెనిమిది ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, ఇరవై ఆరు మేజర్‌ నేషనల్‌ రోడ్లనిర్మాణ పనులు, పద్దెనిమిది వంతెనల నిర్మాణాలు, ఇరవై ఎనిమది వివిధ మైనింగు ఆపరేషన్స్‌, పద్దెనిమిది మున్సిపాలిటీలలో ప్రపంచ బ్యాంక్‌ నిధులతో మురికివాడల అభివృద్ధి పనులు, ఎనిమిది గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకాలు, ఆరు పేద వృత్తిదారులకు ఉపకరణాల పంపిణీ పథకాలు.. ఇలా మొత్తం నూటా ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువకు తక్కువలేని పనులు అతి రోతగా, నాసిరకంగా, పంచుకుని మనం మనం తిందాం తరహాలో జరుగుతున్నాయి. వాటి పూర్తి వివరాలు యివిగో యివి.
ఎదుట ఎసిడీ స్క్రీన్‌పై ఒక్కో విండో ఒక ప్రాజెక్ట్‌ వివరాలు స్లైడ్‌షో వలె అంకెలతో సహా చూపిస్తోంది.
మనం ఈ నూటా ఎనిమిది ప్రాజెక్టులకు నూటా ఎనిమిది ‘జనసేన’ కమిటీలను ఆ పనులు జరుగుతున్న స్థలానికి దగ్గర్లో ఉన్న మన కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో.. ఆయా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఎక్స్‌పర్డ్‌ కమిటీ సారథిగా ఉంటాడు. ఉదాహరణకు..వరంగల్లులో ఎన్‌హెచ్‌ సెవెన్‌లో తొంభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌నుండి నూటా నలభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌ వరకు మొత్తం యాభై కిలోమీటర్లు రోడ్‌ లేయింగు వర్క్‌.. దీనికి.. ఇరవై ఎనిమిదిమంది జనసేన సభ్యులతో కలిపి కమిటీ వేస్తున్నాం. చైర్మన్‌ జి.పురుషోత్తమరావు. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌. ఆర్‌ అండ్‌ బి. రోడ్డు దాని పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలిసినవాడు. మరొక ఎమ్‌.టెక్‌ స్ట్రక్చర్స్‌ చదివిన యువ విద్యార్థి నాయకుడు ఆర్‌. గోఖలే ఉపసారథి. ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ మురళీమనోహర్‌ వ్యవహర్త. ధర్మసాగర్‌ ఇండిపెండెంట్‌ ఎం.పి.టి.సి., ఎమ్మే చదివిన యాదరిగి, ఇతరేతర యువకులు మొత్తం ఇరవై ఎనిమిది మంది టీం యిది.
మన దగ్గర ఈ ప్రాజెక్ట్‌, ఫండ్స్‌ వివరాలు.. అవి ఏ నాబార్డ్‌ శాంక్షన్‌ క్రింద విడుదలయ్యాయి, మొత్తం ఎప్పుడు ఎంత విడుదలయ్యాయి.. వాటికి టెండర్లు ఎప్పుడు పిలిచి ఎవరికి కాంట్రాక్ట్‌ అప్పజెప్పారు. ఆ కాంట్రాక్టరెవరు.. అతని వివరాలు.. వర్క్‌ షెడ్యూల్‌, వర్క్‌ స్పెసిఫికేషన్‌.. ఆ పని ఎప్పుడెప్పుడు ఎంతవరకు కావాలి. ఎప్పుడు ఫినిష్‌ కావాలి. ఆ సమాచారమంతా ”రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌ – 2005” క్రింద ఆయా సంబంధిత అధికారుల నుండి సర్టిఫైడ్‌ కాపీలను తీసుకుని సిద్ధంగా ఉంచాం. నిజానికి పని ప్రారంభిస్తున్నప్పుడు ఆ స్థలంలో ఆ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు పొందుపరుస్తూ ఒక ప్రజాప్రకటన ఉంచబడాలి. కాని అదక్కడ లేదు. అన్ని వివరాలతో మనమే కొన్ని బోర్డులు రాయించాం. అవి యివిగో..”
వెంటనే ఎస్‌డిసీ స్క్రీన్‌పై బోర్డులు కనిపించాయి
”మన ‘జనసేన’ కార్యకర్తల చేతుల్లో ఎప్పుడూ కొన్ని ప్లెకార్డులుంటాయి.. పని జర్గుతున్న ప్రతిరోజూ మనవాళ్ళు అక్కడ ఉండి నాణ్యతా ప్రమాణాలను చెక్‌ చేస్తారు. మెటీరియల్‌,మిక్సింగు నిష్పత్తులు, రీఇన్‌పోర్సింగు స్టీల్‌ క్వాలిటీ, క్యూరింగు.. బి.టి. రోడ్డయితే దాని స్పెసిఫికేషన్స్‌.. అన్నీ..”
స్క్రీన్‌పై ప్లెకార్డులు దర్శనమిచ్చాయి. ” ఈ ప్రాజెక్ట్‌ డబ్బు ప్రజలది”.. ”ప్రజల డబ్బు ప్రజలకు చెందాలి.” ”నాణ్యతా ప్రమాణాలు మాకు ప్రాణం”, ‘నిర్మాణంలో అవినీతి సహించం.” ‘జనం డబ్బుకు జనమే కాపలా”, కాపలా కుక్కలం – తప్పు చేస్తే కరుస్తాం” .. ఇవీ
”మిత్రులారా.. అసలు ఈ పనిని మనచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైన ఎంపిటిసిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుచేయాలి రాజ్యాంగం ప్రకారం.. కాని వాళ్ళే కాంట్రాక్టర్లయి దోచుకుంటున్నారు. కాబట్టే ఈ ప్రజల గర్జన, గాండ్రింపు అవసరమౌతున్నది.. మీరు మరో విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి.. మనం చేయబోతున్నది పూర్తిగా చట్టబ్దమైంది. సమాచారచట్టం ప్రకారమే మనం ప్రశ్నిస్తున్నాం. కాకుంటే ఒక బలమైన ప్రజావాణిని భరించలేనంత కటువుగా వినిపిస్తున్నాం.. ఇలా ప్రశ్నిస్తున్నామని.. ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు, సంబంధిత శాఖాధికారులకు ముందే తెలియజేశాం. అందరూ అంగీకారం తెలిపారు. తెలుపక తప్పదు వాళ్ళకు. లేకుంటే రేపు వాళ్ళే ప్రశ్నించబడ్తారు. ఎవ్రీథింగు యాజ్‌పర్‌ కాంస్టిట్యూషనల్‌ ప్రొవిజన్‌.. ఇక దీంతో చూడండి మిత్రులారా.. అధికార పీఠాలు కదుల్తాయి. ఇక నిశ్శబ్ద రక్తపాతరహిత విప్లవం రెక్క విప్పుతుంది.. గెట్‌ రెడీ.. జై జనసేన.. జై జై జనసేన..”
హాలునిండా చైతన్యం ఉప్పొంగి పొంగి వికసించింది.
నిస్వార్థమైన చింతన.. శుద్ధమైన ఆలోచన.. నిండైన అంకితభావం అక్కడి మనుషుల హృదయాల్లో తొణికిసలాడ్తున్నందువల్ల అందరి ముఖాల్లోనూ అతి సహజమైన జీవకాంతి, నిర్మలత్వం వెల్లివిరుస్తోంది. అందరిలోనూ విజయోత్సాహం ఉరకలెత్తుతోంది.
మూర్తిగారు కూర్చోగానే.. శివ లేచి.. ”మిత్రులారా.. వరంగల్లుకు సంబంధించిన ఎనిమిది కమిటీలవాళ్ళు.. బయట ప్రకటనా ఫలకంపై ఉన్న తమ తమ పేర్లను చూచుకుని సేవా విభాగం ఐదు నుండి తమ కమిటీకి సంబంధించిన ఆర్‌టిఐ సర్టిఫైడ్‌ కాగితాలు, ప్లకార్డులు.. అన్నీ తీసుకుని మీ కమిటీ సభ్యులతో విషయాలు చర్చించుకోవాలి. మేము యితర జిల్లాలలో ఉన్న మన మిత్రులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని సూచనలూ చేస్తాం.. ఈ రోజు తేదీ పదిహేను. సరిగ్గా ఇరవైయవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మనం అనుకున్న నూటా ఎనిమిది వర్క్‌ స్టేషన్ల దగ్గరికి ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఏకకాలంలో అన్ని కమిటీల వాళ్ళం హాజరౌతాం. ఇది భావి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతున్న ఓ మహత్తర ఘట్టం. మనం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం మిత్రులారా.. జై జనసేన…”
అందరూ నిశ్శబ్దంగా.. ఒక సైనిక శిబిరంలోలా నిబద్ధతతో విన్నారు.
వెంటనే… స్క్రీన్‌పై ‘జనసేన’ సమావేశ ముగింపు సంప్రదాయమైన లఘుచిత్రం ప్రత్యక్షమైంది.
ఒక దీపం.. ఆమె చేతిలో.. కదిలి కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఇంకాస్త కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఆ మూడు దీపాలూ కదిలి. మరికొన్ని దీపాలు.. మరిన్ని దీపాలు.. వత్తులు అంటుకుని వెలిగి వెలిగి .. ఎన్ని దీపాలో.. అన్నీ దీపాలే.,
అంతా తెల్లని కాంతి.

(సశేషం)

ఒక చెహోవ్ కథలోంచి ఐరిష్ కథలోకి….

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

కొత్త వస్తువులకు, కొత్త ఆలోచనలకు భయపడుతూ, వాటిని నిషేధిస్తూ, సాంప్రదాయిక భద్రత అనే గూడులో ముడుచుకుని జీవించే బెలికోవ్ లాంటి గుల్ల మనుషులు ప్రతి సమాజంలోనూ కనిపిస్తారు. వీళ్ళల్లో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు. వీరు తమ భద్రతకు లేదా ఉపాధికి ఉపయోగపడతాయనుకునే కొత్త పరికరాలను, కొత్త ఆలోచనలను దిగుమతి చేసుకుంటూనే; అందుకు ఉపయోగపడవనుకున్న వాటిని, ముఖ్యంగా తమ భద్రతను దెబ్బతీయగలవనుకున్న వాటిని మాత్రం నిషేధిస్తూ ఉంటారు. వీళ్లతో పోల్చితే బెలికోవ్ కొంత నిజాయితీపరుడిలా కనిపిస్తాడు. సరే, దానిని అలా ఉంచితే, బెలికోవ్ లాంటి మనుషులు జీవించే గుల్ల -సంస్కృతీ, సంప్రదాయాలు, విశ్వాసాల రూపంలో ఘనీభవించినదే తప్ప మరొకటి కాదు. ఆ గుల్లను శిథిలం చేసే ఎలాంటి పరిణామాల పోటు దాని మీద పడినా అది వారికి తీవ్ర ఆఘాతం అవుతుంది. దానినే మనం సాంస్కృతిక ఆఘాతం (cultural shock) అంటాం. బెలికోవ్ ఆ షాక్ తోనే విచారానికి లోనై జబ్బుపడి కన్నుమూశాడు. చెహోవ్ పందొమ్మిదో శతాబ్ది చివరిలో ఈ కథ రాసిననాటినుంచి ఇప్పటివరకు స్త్రీ తనను తాను పునర్నిర్వచించుకునే మార్గంలో ఎన్ని కీలకమైన అడుగులు ముందుకు వేసిందో ఆ చరిత్ర అంతా మన ముందు ఉంది. ఈ క్రమంలో ఎంతమంది బెలికోవ్ లు బద్దలవుతున్న తమ గుల్లను చూసుకుని తల్లడిల్లారో, మానసిక మరణానికి గురయ్యారో; లేదా రాజీ పడ్డారో మనం ఊహించుకోవచ్చు.

 

నాకు ఎంతో ఇష్టుడైన రష్యన్ కథారచయిత యాంటన్ చెహోవ్ రాసిన కథ ఒకటుంది…

దాని ఇంగ్లీష్ అనువాదం శీర్షిక, THE MAN WHO LIVED IN A SHELL. ‘గుల్లలో జీవించిన మనిషి’ అని మనం అనువదించుకోవచ్చు. కొంచెం సంక్షిప్తం చేయాలనుకుంటే ‘గుల్ల మనిషి’ అన్నా అనచ్చు.

పైకి చాలా సీరియస్ గా చెబుతున్నట్టు అనిపించే ఈ కథ అడుగడుగునా హాస్యాన్ని పండిస్తూ పోతుంది. ఆ హాస్యంలో అంతర్లీనంగా విషాదమూ, బీభత్సమూ ఉన్నాయేమో కూడా. ఇద్దరు మిత్రులు ఉబుసుపోకకు చెప్పుకునే కబుర్లనుంచి ఈ కథ మొదలవుతుంది. ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

anton-chekhov-006

‘ప్రకృతిరీత్యానే తమలో తాము ముడుచుకుపోయి జీవించేవారు చాలామంది ఉంటారు. నత్త తన గుల్లలో మొహం దాచుకున్నట్టు వీళ్ళు కూడా మొహం దాచుకుంటూ ఉంటారు. మనిషి సామాజిక జీవి కాకముందు గుహల్లో ఏకాంతవాసం చేసిన కాలానికి వీరు తిరోగమించేవారిలా కనిపిస్తారు. నేను నేచురలిస్టును కాదు కనుక, మనుషుల్లో ఇలాంటి జీవులు కూడా ఒక రకమా అన్నది చెప్పలేకపోతున్నాను’ అంటూ మిత్రుడు కథ ప్రారంభించి, తనకు తెలిసిన అలాంటి ఒక జీవి గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

అతని పేరు బెలికోవ్. అతను ఓ గ్రామంలోని స్కూలులో గ్రీకు భాషను బోధించే ఉపాధ్యాయుడు. నడి వయసు మనిషి. బయటి వాతావరణం ఎంత బాగున్నా సరే అతను గొడుగు వేసుకునే వెడతాడు. మంచులో నడిచేటప్పుడు వేసుకునే బరువైన బూట్లే సర్వకాలాలలోనూ  వేసుకుంటాడు. పెద్ద కోటుతో ఒంటి నంతటినీ కప్పుకుంటాడు. కళ్ళకు నల్లని అద్దాలు ధరిస్తాడు. చెవుల్లో దూది పెట్టుకుంటాడు.

గొడుగును అతను ఓ కేసులో ఉంచుకుంటాడు. అతని వాచీకి కూడా ఒక తొడుగు ఉంటుంది. పెన్సిల్ చెక్కడానికి చిన్నపాటి చాకును ఒక కేసులోంచి బయటకు తీస్తాడు. ఆయన ముఖం కూడా ఒక కేసులో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే, ఆయన కోటు కాలర్ ను ముడుచుకోడు,  పైకి తెరచిపెట్టి ఉంచుకుంటాడు. దాంతో ఆ కాలర్ అతని ముఖానికి ఓ తొడుగులా ఉంటుంది. ఆయన గుర్రబ్బండిలో ఎక్కడికైనా వెడుతున్నప్పుడు తప్పనిసరిగా గూడు వేయవలసిందే. ఆయన పడుకునే గది కూడా ఒక పెట్టెలా ఉంటుంది. గాలి కొంచెం కూడా చొరడానికి వీలులేకుండా తలుపులు బిగించుకుంటాడు. పాదాల నుంచి మొహంవరకూ దుప్పటి కప్పుకుంటాడు.

చివరికి తన ఆలోచనలను కూడా ఆయన ఒక కేసులో పెట్టుకుంటాడు. స్కూల్లో అప్పుడప్పుడు వచ్చే సర్క్యులర్లలోనూ, వార్తాపత్రికల్లోనూ కనిపించే నిషేధాల సమాచారం మీదే ముందస్తుగా ఆయన దృష్టి పడుతూ ఉంటుంది. నిషేధాలే ఆయనకు అమితమైన ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అవే ఆయనకు అర్థమవుతూ ఉంటాయి. విద్యార్థులు రాత్రి తొమ్మిది తర్వాత వీథుల్లో తిరగడాన్ని నిషేధిస్తూ ఏదైనా సర్క్యులర్ వచ్చినా , ఏదైనా పత్రికలో సెక్స్ విషయాలపై వచ్చిన ఓ వ్యాసాన్ని ఖండించవలసివచ్చినా ఆయన ఆలోచనలు ఎంతో తేటగానూ, సూటిగానూ ఉంటాయి. ఇలాంటివి ఎప్పటికీ నిషేధించితీరవలసినవే!

ఎవరైనా ఒక మంచి పని తలపెట్టినా సరే, ఆయన మొట్టమొదటగా దానినుంచి కీడునే శంకిస్తాడు. ‘దీని వల్ల ఎటువంటి చెడూ జరగకుండుగాక!’ అని ఆకాంక్షిస్తాడు.

ఈ గుల్ల మనిషి గురించి ఇలా చెప్పుకోవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. వాటిని అలా ఉంచి అసలు విషయానికి వస్తే, ఆయన పనిచేసే స్కూలుకి చరిత్ర బోధించే ఒక ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చాడు. అతనికి ఓ పెళ్లి కాని సోదరి ఉంది. ఆమె పేరు వర్వా. వయసు ముప్పై దాటింది. గుల్ల మనిషి లానే ఆమె కూడా తేడా మనిషి. కాకపోతే ఒకరికొకరు  భిన్న ధ్రువాలు. ఆమె ఎప్పుడూ గల గలా మాట్లాడుతూ ఉంటుంది. ఉండి ఉండి అట్టహాసంగా నవ్వుతుంది. ఉక్రెయిన్ పాటలు గొంతెత్తి పాడుతూ ఉంటుంది.

అలా ఉండగా, వీరిద్దరూ ఒక పార్టీలో కలుసుకున్నారు. ఒకే చోట పక్క పక్కనే కూర్చున్నారు. ఆమె ఓ ఉక్రెయిన్ పాట పాడింది. మీ ఉక్రెయిన్ పాట గ్రీకు భాషలానే శ్రావ్యంగా ఉందని ఆయన అన్నాడు. దాంతో ఆమె ఉత్సాహంగా మరికొన్ని పాటలు పాడింది.

ఈ విచిత్రజీవులిద్దరూ పక్క పక్కన కూచున్న దృశ్యాన్ని మిగిలిన ఆడవాళ్ళు కన్నార్పకుండా చూశారు. అంతలో వాళ్ళకు ఓ ఆలోచన వచ్చింది. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది! బెలికోవ్ కు పెళ్లి కాలేదన్న సంగతి ఇంతవరకు తమకు తట్టకపోవడం ఆ క్షణంలో వాళ్ళకే ఆశ్చర్య మనిపించింది.

నిజానికి బెలికోవ్ ఆడవాసనకు ఆమడ దూరంలో ఉంటాడు. అందుకే మగవంటమనిషిని పెట్టుకున్నాడు. ఏ కళనున్నాడో కానీ వర్వాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆమె ఫోటోను కూడా తన డ్రాయర్ మీద పెట్టుకున్నాడు. ఆమె ఇంటికి రాకపోకలూ, ఆమెతో మాటలూ సాగిస్తూ వచ్చాడు.

ఇలా ఉండగా ఓ రోజున ఆయన ఓ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. కళ్ళు నులుముకుంటూ మళ్ళీ మళ్ళీ చూశాడు. జ్వరం వచ్చినట్టు అయిపోయింది. వర్వా సోదరుడు ఒక సైకిల్ మీద వస్తూ కనిపించాడు! అదే దారుణమనుకుంటే, వర్వా అతని వెనకే ఇంకో సైకిల్ మీద వస్తోంది!!! అతను సైకిలు తొక్కడమే తప్పు. ఆపైన ఆమె…!

సైకిలు ఆయన నిషేధిత వస్తువుల్లో ఒకటి. అదే కాదు, ఆధునికమైనవన్నీ ఆయనకు నిషిద్ధాలే.

ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుని ఇంటికి వెళ్ళాడు. ఇదెక్కడి దారుణం అన్నాడు. సైకిల్ తొక్కడమే కాక, నువ్వు ఎంబ్రాయిడరీ చొక్కాలు కూడా వేసుకుంటున్నావు, ఎంత తప్పు అన్నాడు. అవి తప్పెలా అవుతాయని అతనన్నాడు. మాటా మాటా పెరిగింది. నీ సంగతి హెడ్ మాస్టర్ తో చెబుతానని బెలికోవ్ బెదిరించాడు. చిర్రెత్తిన అతను చెప్పుకొమంటూ బెలికోవ్ కాలర్ పుచ్చుకుని తోసేసాడు. బెలికోవ్ కింద పడిపోయాడు. అప్పుడే ఇంటికి వచ్చిన వర్వా ఆ దృశ్యం చూసి అలవాటుగా అట్టహాసంగా నవ్వేసింది.  బెలికోవ్ బిత్తరపోయాడు. ఆమెను పెళ్లి చేసుకోకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. టేబుల్ మీంచి ఆమె ఫోటో తీసేశాడు.

కానీ  ఆమె సైకిలు తొక్కుతున్న దృశ్యాన్ని మాత్రం మనసులోంచి తీసేయలేకపోయాడు. అది కలిగించిన షాకునుంచి ఎప్పటికీ తేరుకోలేకపోయాడు. ఆ రోజే మంచం పట్టాడు.  రోజు రోజుకీ కృశించిపోయాడు. నెల రోజులకు కన్నుమూశాడు!

***

కొత్త వస్తువులకు, కొత్త ఆలోచనలకు భయపడుతూ, వాటిని నిషేధిస్తూ, సాంప్రదాయిక భద్రత అనే గూడులో ముడుచుకుని జీవించే బెలికోవ్ లాంటి గుల్ల మనుషులు ప్రతి సమాజంలోనూ కనిపిస్తారు. వీళ్ళల్లో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు. వీరు తమ భద్రతకు లేదా ఉపాధికి ఉపయోగపడతాయనుకునే కొత్త పరికరాలను, కొత్త ఆలోచనలను దిగుమతి చేసుకుంటూనే; అందుకు ఉపయోగపడవనుకున్న వాటిని, ముఖ్యంగా తమ భద్రతను దెబ్బతీయగలవనుకున్న వాటిని మాత్రం నిషేధిస్తూ ఉంటారు. వీళ్లతో పోల్చితే బెలికోవ్ కొంత నిజాయితీపరుడిలా కనిపిస్తాడు.

సరే, దానిని అలా ఉంచితే, బెలికోవ్ లాంటి మనుషులు జీవించే గుల్ల -సంస్కృతీ, సంప్రదాయాలు, విశ్వాసాల రూపంలో ఘనీభవించినదే తప్ప మరొకటి కాదు. ఆ గుల్లను శిథిలం చేసే ఎలాంటి పరిణామాల పోటు దాని మీద పడినా అది వారికి తీవ్ర ఆఘాతం అవుతుంది. దానినే మనం సాంస్కృతిక ఆఘాతం (cultural shock) అంటాం. బెలికోవ్ ఆ షాక్ తోనే విచారానికి లోనై జబ్బుపడి కన్నుమూశాడు. చెహోవ్ పందొమ్మిదో శతాబ్ది చివరిలో ఈ కథ రాసిననాటినుంచి ఇప్పటివరకు స్త్రీ తనను తాను పునర్నిర్వచించుకునే మార్గంలో ఎన్ని కీలకమైన అడుగులు ముందుకు వేసిందో ఆ చరిత్ర అంతా మన ముందు ఉంది. ఈ క్రమంలో ఎంతమంది బెలికోవ్ లు బద్దలవుతున్న తమ గుల్లను చూసుకుని  తల్లడిల్లారో, మానసిక మరణానికి గురయ్యారో; లేదా రాజీ పడ్డారో మనం ఊహించుకోవచ్చు.

ఇక్కడి నుంచి మనం ఓసారి కాలంలో వెనక్కి వెడదాం. అది కూడా 4,500 సంవత్సరాల వెనక్కి! అప్పుడు స్త్రీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం కూడా బెలికోవ్ లాంటి వారికి స్త్రీ సైకిల్ తొక్కడాన్ని మించిన తీవ్ర సాంస్కృతిక ఆఘాతమే.

నా ఉద్దేశంలో, కాలగతిలో అనేక ఆటుపోట్లకు, వడపోతకు గురవుతూనే కాలపరీక్షను తట్టుకుని ఎదైతే నిలబడి ఉందో అదే నిక్కమైన సాంప్రదాయిక విలువ. ఆ విలువను ఏదీ ధ్వంసం చేయలేదు. అది అన్ని కాలాలకూ, సమాజాలకూ చెందిన మానవాళి ఉమ్మడి విలువ.

***

కాలంలో వెనక్కి వెళ్ళి చెప్పుకోవలసిన కథే, నేను కిందటి వ్యాసం చివరిలో ప్రస్తావించిన ‘Mother Right’ గురించిన పురాతన ఐరిష్ కథ:

***

ఐర్లాండ్ రాజు ఎచాయిడ్ కు ఆరుగురు కూతుళ్ళు. వారిలో మీవే ఒకతె. ఆమె ఎంతోమంది రాకుమారులను కాదని కెల్టిక్ జాతీయుడు, లెయిన్ స్టర్ కు చెందిన అయిలిల్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఓ రోజు రాత్రి ఆ జంట క్రౌచాన్ అనే చోట ఉన్న తమ కోటలోని అంతఃపురంలో తమ పడకగదిలో విశ్రమించడానికి ఉపక్రమించారు. వారిమధ్య ఎంతో ప్రశాంతత, ఉల్లాసం వెల్లివిరుస్తున్న ఆ సరసమైన క్షణాలలో…

ఉన్నవాడు ఊరుకోకుండా అయిలిల్ ఓ విరసపు సంభాషణకు తెరతీశాడు:

“ఒక ఉత్తముడి భార్య ఉత్తమురాలే అవుతుందని నానుడి. అది నిజమే” అన్నాడు.

“ఆ నానుడికీ నీకూ ఏమిటి సంబంధం?” అని మీవే అడిగింది.

“ఏమిటి సంబంధమంటే, మన పెళ్ళైన రోజుకీ, ఇప్పటికీ చూస్తే నువ్విప్పుడు ఉత్తమ స్త్రీవి అయ్యావు” అన్నాడు అయిలిల్.

“అబద్ధం. నిన్నసలు చూడకముందు కూడా నేను ఉత్తమురాలినే”, అంది మీవే.

“నీ మాట విచిత్రంగా ఉంది. పెళ్ళికి ముందు నువ్వు ఉత్తమురాలివనే మాట నేను ఇంతవరకు ఎవరి నోటా వినలేదు. ఆడదానిగా నీ తళుకు బెళుకులనే నువ్వు నమ్ముకుంటూ వచ్చావనీ, శత్రువులు నీ సరిహద్దుల్లోకి చొరబడి నీ సంపదనంతా యథేచ్ఛగా దోచుకుపోయేవారనే విన్నాను” అన్నాడు అయిలిల్.

ఇక అప్పుడు మీవే అతని మాటకు మాట అప్పజెప్పడం ప్రారంభించింది.

“నేనెప్పుడూ ఇలాగే ఉన్నాను. మా నాన్నకు పుట్టిన ఆరుగురు కూతుళ్లలో నేనే గొప్పదాన్ని. నన్నే అంతా ఎక్కువగా ఆరాధించేవారు. మా నాన్న నాకే ఎక్కువ వైభవాన్ని కట్టబెట్టాడు. యుద్ధాలలో కూడా నేనే గొప్ప. నా చేతికింద మూడువేల మంది రాచయోధులు కిరాయికి ఉండేవారు. అందరూ సర్దారుల కొడుకులే. వాళ్ళలో ఒక్కొక్కరి కింద మళ్ళీ పదిమంది యోధులు ఉండేవారు. మళ్ళీ వాళ్ళలో ఒక్కొక్కరి కింద ఎనిమిది మంది యోధులు ఉండేవారు. మళ్ళీ ఆ ఎనిమిది మందిలోనూ ఒక్కొక్కరికి ఏడుగురు చొప్పున, ఆ ఏడుగురికీ ఆరుగురు చొప్పున…ఇలా యోధులు ఉండేవారు. వీళ్ళంతా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేలా అందుబాటులో ఉండేవాళ్లు. అందుకే మా నాన్న తన ఐర్లాండ్ రాజ్యంలోని క్రౌచాన్ అనే ఈ ప్రాంతాన్ని నాకు ఇచ్చాడు. అందుకే నన్ను అంతా ‘క్రౌచాన్ రాణీ మీవే’ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది నా క్రౌచాన్ రాజ్యం లోనే….

ఆ తర్వాత ఏమైందంటే, నన్ను పెళ్లాడతానంటూ నీతో సహా ఏడుగురు రాజులు కబురు పంపారు. నేను మిగిలిన వాళ్లందరినీ తిరస్కరించాను. ఎందుకో తెలుసా? నేను వధువుకు చెల్లించే కట్నం కింద ఏ ఆడదీ ఏ మగవాడినుంచీ కోరుకోని ఒక విచిత్రమైన కట్నాన్ని కోరుకున్నాను. అదేమిటంటే, నాకు కాబోయే మొగుడు పిసినారిగా ఉండకూడదు, అతనిలో అసూయ ఉండకూడదు, పిరికితనం ఉండకూడదు…

నేనిలా ఎందుకు కోరుకున్నానో తెలుసా? నా మొగుడు ఉదారుడు అయితేనే అతనిని మించిన ఔదార్యం నాకుందని  నిరూపించుకోవడానికి వీలవుతుంది. అతడు పిసినారి అయితే ఆ అవకాశం ఉండదు. అది సమవుజ్జీల మధ్య పోటీ అవదు. అలాగే, అతను పిరికివాడు అయితే, యుద్ధాలలో అతనిని మించిన విజేతను నేనే ననిపించుకోవడం కుదరదు. ఇక నాకు కాబోయే మొగుడిలో అసూయ ఉండకూడదని నేను ఎందుకు కోరుకున్నానంటే, నాకు అందుబాటులో ఒక మగవాడు, అతని వెనక్కాల ఇంకో మగవాడు లేకుండా నేను ఎప్పుడూ లేను. నీలో నేను కోరుకున్న ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి కనుక నిన్ను పెళ్లి చేసుకున్నాను…

అదీగాక, నీకు పెళ్లి కానుకల కింది ఒక ఆడదాని హోదాకు తగినవన్నీ ఇచ్చాను. నీకు వినోదం కలిగించడానికీ, నీకు దుస్తులు అలంకరించడానికీ పన్నెండుగురు మగవాళ్ళను ఇచ్చాను. ఇరవయ్యొక్క బానిస కన్యల విలువ చేసే యుద్ధ రథాన్ని ఇచ్చాను. నీ మొహం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పున ఎర్రని బంగారం ఇచ్చాను. నీ ఎడమ మోచేయి బరువుకు తూగే తెల్ల కంచు(తగరం)ను ఇచ్చాను. ఇవి ఎందుకు ఇచ్చానంటే, నీకు ఎవరివల్లనైనా మానభంగం జరగచ్చు, అవయవలోపం కలగచ్చు, నిన్ను ఎవరైనా మోసం చేయచ్చు. అప్పుడు వాటికి బీమా కానీ, నష్టపరిహారం కానీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నీ మానాన్ని నేను ముందే కొనేసుకున్నాను. నువ్వు ఇప్పుడు నా లోదుస్తుల  సేవలకు ఉపయోగపడే పింఛనీ(petticoat pensioner)వి మాత్రమే.”

ఈవిధంగా ఆమె తనను కడిగివిడిచిపెట్టడంతో మొహం కందగడ్డలా అయిపోయిన అయిలిల్, “అయితే, నీ ఆస్తి ఎంతో, నా ఆస్తి ఎంతో పోల్చి చూసుకుందాం, పద” అన్నాడు రోషంతో. ఆమె అంగీకరించింది.

ఇద్దరి ఆస్తులను విడివిడిగా ప్రదర్శనకు పెట్టారు. వాటిలో పానపాత్రలు, ఇనప సామగ్రి, కుండలు, గుండిగలు, బీరువాల దగ్గరనుంచి; బంగారు ఉంగరాలు, గాజులు, రకరకాల ఆభరణాలు, రంగు రంగుల దుస్తుల వరకూ సమస్తం ఉన్నాయి. ఆ తర్వాత అసంఖ్యాకంగా ఉన్న గొర్రెల మందల్ని, గుర్రాలను, పందులను కూడా రప్పించి బేరీజు వేశారు. ఇవన్నీ ఇద్దరికీ సమానంగానే ఉన్నాయని తేలింది.

అయితే, పశువుల మందల్ని బేరీజు వేస్తున్నప్పుడు, అయిలిల్ మందలో ఉన్న ఒక ఎద్దు మీద మీవే దృష్టిపడింది. దాన్ని చూడగానే ఆమె మొహం వెలవెల పోయింది. అది భారీగానూ, మంచి దర్పంగానూ ఉంది. దాని కొమ్ములు తెల్లగా ఉన్నాయి. మీవే మందలో దానితో పోల్చదగిన ఎద్దు ఒక్కటి కూడా లేదు. నిజానికి అది లేగగా ఉన్నప్పుడు మీవే మందలోనే ఉండేది. కానీ ఆడదాని మందలో ఉండడానికి నామోషీపడి అయిలిల్ మందలోకి ఫిరాయించింది.

మొగుడి ఆస్తీ, తన ఆస్తీ సమానం కావన్న సంగతి దానితో అర్థమై మీవేకు తల కొట్టేసినట్టు అయింది. అలాంటి ఎద్దు తన మందలో లేనప్పుడు తన ఆస్తి గులకరాయి పాటి కూడా చేయదనుకుంది.

వెంటనే మాక్ రాత్ అనే తన వార్తాహరుణ్ణి పిలిపించింది. ఐర్లాండ్ లోని ఏ ప్రాంతంలో నైనా అలాంటి తెల్ల కొమ్ముల ఎద్దు  ఉందా అని అడిగింది.

“ఎందుకు లేదు? దానికి రెట్టింపు పరిమాణంలో, అంతకంటే ఠీవిగా ఉండే ఎద్దు, కూలీ అనే ప్రాంతంలో డైరే అనే అతని దగ్గర ఉంది” అని అతను అన్నాడు.

“అయితే వెంటనే బయలుదేరి వెళ్ళు. తన ఎద్దును ఒక ఏడాదిపాటు నాకు ఎరువు ఇస్తాడేమో అడుగు. ఏడాది తర్వాత అతనికి వడ్డీ కింద ఆ ఎద్దుతోపాటు యాభై ఆవుల్ని కూడా ఇస్తాను. ఒకవేళ అంత అమూల్యమైన వస్తువును కొద్దికాలమైనా బయటకు పంపడం అశుభం అని అతనున్న చోట ఎవరైనా అభ్యంతరం పెడితే, ఎద్దుతో సహా అతనే ఇక్కడికి రావచ్చు. అతనికి అక్కడ ఎంత జమీ ఉందో అంత జమీ ఇక్కడే ఇచ్చి, ఇక్కడే స్థిరపడేలా చేస్తాను. దానికి అదనంగా ఇరవయ్యొక్కమంది బానిస కన్యల విలువచేసే రథం ఇస్తాను. అంతేకాదు, నా కటిభాగం(upper thighs)తో అతన్ని స్నేహం చేసుకోనిస్తాను” అని మీవే అంది.

మాక్ రాత్ వెళ్ళి డైరేను కలిశాడు. మీవే చెప్పినవన్నీ చెప్పాడు. డైరే ఎగిరి గంతేశాడు. అయితే, ఒక ఆడదానికి భయపడి ఎద్దును ఇవ్వడానికి ఒప్పుకున్నావంటూ డైరేను అతని సాటివాళ్లు నిందించారు. దాంతో పౌరుషానికి పోయిన డైరే, ఎద్దును ఇవ్వడానికి తిరస్కరించాడు.

అప్పుడు మీవే సైన్యంతో వెళ్ళి అతని మీద దాడి చేసి ఎద్దును ఎత్తుకు వచ్చింది.

***

ఈ కథకుగల పురాచారిత్రక నేపథ్యం గురించీ, ఇతర విశేషాల గురించీ తర్వాత…

 – కల్లూరి భాస్కరం

 

The God of Small Things

drushya drushyam-27చూడటానికీ, దర్శించడానికీ ఉన్న తేడా గురించి చాలా చర్చ చేయవచ్చు.
కానీ, చూడండి. ఇప్పుడు ఇక్కడే ఆ ఎములాడ రాజన్న సన్నిధిలో ఉన్న ఈ తల్లిని చూడండి.
అది నిజంగా దర్శనమే.నిజం.
మనుషులను దైవానికి మోకరిల్లగా చూడాలి.
అదీ దర్శనమే.

ఎంత నిండుదనం.
ప్రేమా, శాంతీ.
తపస్సూ!

+++

విశేషం ఏమిటంటే, దైవ సన్నిధిలో కనిపించినంత నిండుగ మనుషులు మరెప్పుడూ ఇట్లా కనిపించరు!
సకలాంగులూ వికలాంగులూ అని కాదు, ఎవరైనా సరే, దేవుడి ముందు దీపమై వెలుగుతారు.
దీపం కింది చీకటి గురించిన బెంగ లేదు. దాన్ని ఆ భగవంతుడు చూసుకుంటాడనే ఈ ముద్ర.
నిమగ్నత. లీనం. కదలకుండా అట్లా ఆ కాసిన్ని క్షణాలు నిశ్చలమై నిలవడం.

మళ్లీ కదిలితే జీవితం. భక్తి ఆవిరైపోయి మళ్లీ మామూలే. మామూలు చిత్రమే.
అందుకే అనిపిస్తుంది, ఆరిపోని జీవితంలో రెండు చేతులారా ఆ భగవంతుడికి నమస్కరించడంలో ఒక ఆత్మశాంతి.

కానీ, ఒకటి మాత్రం నిజం.
ఆ దైవ సన్నిధిలో ఎవరైనా అసంపూర్ణమే.
బహుశా అందుకే ఆ నిండుదనం కావచ్చును!

+++

నిజానికి దైవ సన్నిధిలోనే కాదు, ఎవరైనా సరే, కళ్లు మూసుకుని తమలోకి తాము చూసుకునే ఏ చిత్రమైనా గమనించి చూడండి. అది ఆ మనిషి స్థాయిని పెంచినట్లే ఉంటుంది. ఒక అలౌకిక స్థితిని దర్శనం గావిస్తుంది. కారణం, లోపలికి చూసుకోవడమే! వెలుపలి నుంచి లోపలికి చేరుకోవడమే. తమ పరిమితిని దర్శించడమే. అందుకే కాబోలు, కళ్లు మూసుకోగా జీవితం విస్తరించి కనబడుతుంది,

ఇక్కడ విస్తరణ, వాకర్.

+++

అవును. వాకర్.
ఆ తల్లి మోకరిల్లడంలో భగవంతుడే కాదు, ఆ వాకర్ పక్కనున్నది. చూడండి.
మూడు కాళ్ల ముసలమ్మకు ఆ వాకరే నాలుగోకాలు. పంచభూతాల్లో కలిసేదాకా కన్నబిడ్డలు వెంటున్నా లేకున్నా ఇప్పుడు ఆ వాకరే తనకు ఆలంబన. గుడి దాటాకా దేవుడు.

ఆమె కళ్లు మూసుకుని దండం పెట్టుకుంటున్నప్పుడు ఆమె నుంచి ఆ వాకరే కంట పడుతున్నది.
ఆమె స్థితీ గతీని ఆవిష్కరిస్తున్నది.

తన పేదరికానికి చిహ్నం అది. అతుకులు వేసుకుని తన రైక కుట్టుకున్నట్టే ఆ వాకర్నీ ఆమె జాగ్రత్త చేసుకున్న తీరు ఒక మహిమ. జీవన లాలస. మానవ ప్రయత్నం.

ఉన్నదాన్ని తనతో పాటు ఉంచుకుని ఈ జీవన సమరాన్ని జయించేదాకా బహుశా అదే తన ఆధారం.
అందుకే కాబోలు, ఆమె ఎంత శ్రద్ధగా దాన్ని చూసుకుంటున్నదో చూడండి.

దాని కాళ్లు చూడండి.
ఆమె కాళ్లూ చూడండి.

ఒక జత ప్రాణాలనిపించవూ అవి!

సరిగా లేవు. అయినా సరి చేసుకున్న తీరు చూడండి.
ఆ ప్లాస్టర్ అతికింపులూ…ఆ సుతిల్ తాడు ప్రయత్నం,
అంతా ఒక శక్తిమేరా ప్రయత్నం.

ఒకప్పుటి ఆమె ధారుడ్యానికి చిహ్నంగా ఉన్న తన చేతులు…
వాకర్ చేతులూ, బాహువులూ చూడండి. అతుకులు పడ్డవన్న భయం లేదు.
ఆమె జాగ్రత్తగా ఉందని చెప్పే ఆ చిన్న చిన్న రిపేర్లనూ చూస్తుంటే మానవ ప్రయత్నం ముందు ఆ దేవుడు చిన్నబోడూ…
లేదూ హమ్మయ్య…తన ప్రయత్నం అక్కర్లేదని ఆనందించడూ!

నిజమే కాబోలు.
భగవంతుడి సన్నిధిలో ఆమె కళ్లు మూసుకుని ఉన్న ఆ దృశ్యం… అనివార్యంగా తనకు రక్షణగా నిలిచిన ఆ వాకర్ తో కలిసి ఒక అపూర్వ సన్నివేశాన్ని వ్యక్తం చేస్తున్నది.

చూడటం కాదు, దర్శించడం. కనిపించేది ఒక్కటి కాదు, రెండు.

అదీ విషయం.

ఒక కన్ను మూసుకుని వీక్షించే ఛాయా చిత్రకారుడి ధ్యానమంతా ఇటువంటి చిత్కళను ప్రదర్శించడమే కదా!
దృశ్యాదృశ్యం అంటే ఇదే మరి!

మరి చిల్లర దేవుళ్లకు వందనం.
వారికి ఊతమిచ్చే వాటన్నిటికీ అభివందనం!

ప్రవాహం !

 pravaaham

కొత్త ప్రాజెక్టు, కొత్త ఊరు, కొత్త అపార్టుమెంట్!

“కొత్త “ ల బారిన పడక తప్పని  పరిస్థితి !  నాలుగేళ్ల  కూతురు మహతి తో శాన్ ఫ్రాన్సిస్కో కి  దగ్గర లో ఉన్న ఓ ఊరికి  ఒచ్చారు వసుంధర దంపతులు.

దేశాలు పట్టుకు రాగా లేనిది, ఊర్లు మారటం గురించి  అంతలా ఆందోళన  పడకని  భార్గవ్   పదే పదే  చెప్పినప్పటికీ,

“రోజంతా ఆఫీసులో ఉండొచ్చే నీకు ఏం తెలుస్తుంది ?! పైగా మన వాళ్ళు తక్కువగా ఉండే ఊరిది …..“  అనే ధోరణిలో  వసుంధర….

కొంచెం కుదుట పడ్దాక, కూతురికో నేస్తాన్ని వెతికే పనిని అన్నిటి కన్నా ముందు పెట్టుకుంది. అపార్టుమెంటు మేనేజరు పక్క వాటాలోనే ఉండటంతో, ఈ విషయమై మాట కలిపింది.

వాళ్ళ కాంప్లెక్సు లోనే ఓ చిన్నపిల్ల ఉన్నదనీ, వర్కింగ్ పేరెంట్స్…  వెరీ స్వీట్ కపుల్  అని చెప్పిందామె.

ఓ రోజు ,  తలుపు తీసుకుని అల్లరి గా  బయటకు పరుగెత్తింది మహతి . ఆ పరుగుని పసిగట్టి  బయటకి వెళ్ళేటప్పటికి ,  పాటియో కి  దగ్గరగా మహతితో పాటు ఓ యువతి నిల్చొని ఉంది.

“ హియర్ ఈజ్ యువర్ ప్రిన్సెస్ మామ్ !”  అంటూ నవ్వింది.

కూతురి చెయ్యి అందుకుని, ఆమెకు ధ్యాంక్స్  చెపుతూ, తనని “వసు” గా పరిచయం చేసుకుంది.

“నా పేరు లిండా ! నాకూ మీ అమ్మాయి వయసు కూతురుంది, ఇప్పుడే  తనని  ప్రీ స్కూల్ లో దింపి  వొస్తున్నాను ,  మీ అమ్మాయి పూల్ వైపు పరుగు పెడుతుండటం  చూసి  ఆపాను, ఈ వయసే అంత, తప్పేది , తగిలేది వాళ్ళకి అర్ధం కాదు “ అంది.

ఆమె మాటలతో ఏకీభవిస్తూ, మీరు ఫలానా అపార్టుమెంటులో ఉంటారా ?! బహుశా  మీ అమ్మాయి గురించే మేనేజరు చెప్పిందని  ఉత్సాహపడిన వసుంధర , తాను కూడా మహతిని ప్రీ స్కూల్ లో  చేర్చాలనుకుంటున్నానని  చెప్పి  వివరాలు తెలుసుకుంది .

లిండాని ఇంట్లోకి  రమ్మనమని అహ్వానించినప్పటికీ , తాను ఫార్మసిస్టుగా పని  చేస్తానని , తన వర్కింగ్  అవర్సు  మరి కొద్ది సేపట్లో మొదలవుతాయి కనుక మరెప్పుడయినా   వస్తానని  చెప్పి వెళ్ళిపోయింది.

లిండా చెప్పిన  ప్రీ స్కూలుకి  కమ్యూనిటీలో మంచి పేరే ఉందని తెలుసుకున్న వసుంధర, మహతిని కూడా అక్కడే  చేర్పించింది. లిండా కూతురి పేరు ఏప్రిల్ ! భలే ముద్దుగా ఉండటంతో పాటు, స్నేహంగా కూడా ఉంటుంది.  త్వరలోనే ఏప్రిల్ , మహతిలు స్నేహితులయ్యారు!

ప్లే డేట్లు కావాలంటూ మహతి డిమాండ్ లు చేస్తూంటే, వీలు చూసుకుని, లిండాతో మాట్లాడితే బావుండుననని  వసుంధర ఎన్నో సార్లు అనుకుంది.

ఏప్రిల్ ని  స్కూల్ దగ్గర  లిండా  దింపినా ,  మధ్య్హా న్నం వేరే ఆమె ఇంటికి  తీసుకురావడం గమనించింది. అపార్టుమెంటు  పార్కింగ్ ఏరియా దగ్గర ఆ యువతిని చాలా సార్లు చూడటం కూడా జరిగింది, ఆమె వస్త్ర ధారణ వసుంధరకి ఆసక్తిగా ఉండేది…

స్ప్రింగ్  సీజన్ మొదలయ్యింది….

మూడున్నర గంటల ప్రాంతంలో  ఏప్రిల్ స్వ్హిమ్మింగ్ కి  వొస్తుంది,  అదే టైంలో మనం  కూడా వెళ్ళాలని మహిత పట్టుపట్టిందో రోజు . అప్పటికే మహతి కొంత వరకు బాగానే స్విమ్మింగ్ చేస్తుండటం, అలాగే ఆ పిల్ల  పోరు భరించలేక, జాగ్రత్తలన్నీ తీసుకుని బయలుదేరింది వసుంధర.

వాళ్ళు వెళ్ళేటప్పటికి స్విమ్మింగ్ ఫూల్ లో ఏప్రిల్ , తనని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే యువతి కూడా కనిపించారు. వాళ్లని  చూస్తూనే  మహతి  ఉత్సాహంగా  ఫూల్ లో దిగింది. మూడు అడుగుల లోతు వరకే ఉండమని కూతుర్ని  హెచ్చరించింది.

“ఇట్స్  ఓకే !  డొంట్ వర్రీ  …”  అంటూ  వసుంధరకి భరోసా  ఇచ్చింది   ఏప్రిల్ తో  ఉన్న యువతి.  పిల్లలతో సమానమైన ఉత్సాహంతో  ఆమె వాళ్ళని  ప్రోత్శ హించడంతో ,  కేరింతల్లో  మునిగిన వారి ముఖాలు వెలిగిపోయాయి.

పూల్ నుంచి  బయటికి వొచ్చిన తరువాత,

ఏప్రిల్ తో ఉన్న యువతి,

నా పేరు లిన్ , మీ అమ్మాయి గురించి ఏప్రిల్  కబుర్లు చెపుతుంది.  లిండా కూడా మిమ్మల్ని కలిసానంది.  నేను సాయంత్రం ఆరింటికి ఆఫీసుకి  వెళ్ళాలి , అందుకే ఈ టైంకి  ఏప్రిల్ ని  స్విమ్మింగ్ కి  తీసుకొస్తాను.  మీకు అభ్యంతరం లేకపోతే , వీలయితే , ఈ సమయానికి రండి, స్నేహితురాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తారు. మీరేం భయపడాల్సిన పనిలేదు, నేను పూల్ లోనే ఉంటాను. ఏప్రిల్ ని చూసుకోవడం కోసం లిండా  డే  షిఫ్టు , నేను నైట్ షిఫ్ట్  ఎడ్జస్టు  చేసుకున్నాం.  కలిసి  గడపడానికి ఇద్దరికీ  సమయం కరవవుతోంది , కానీ వర్కింగ్  పేరెంట్స్ కి  ఇలాంటివి   తప్పదు కదా !  అంటూ, ఆఫీసుకి  టైమవుతోందని చెప్పి,  ఏప్రిల్ ని తీసుకు వెళ్ళిపోయింది.

పిల్లల కేరింతలు, వెలిగిపోయిన  వాళ్ళ పసి ముఖాలు ఇంకా కదలాడుతున్నాయి!

ఇంట్లో పనులు చేసుకుంటుందే కానీ, వసుంధర తన ఆలోచనలకి ఎంత అడ్డుకట్ట వెయ్యాలని ప్రయత్నించినా అగటం లేదు…” స్వీట్  కపుల్  , ఇద్దరికీ  సమయం కరవవుతోంది …. , వర్కింగ్  పేరెంట్స్,  ‘’ …అన్నీ  కలిపితే  ఏదో   సూచిస్తున్నట్టుగా  ఉంది.  శాన్ ప్ర్హాన్ సిస్కో  చుట్టు పక్కల  కొంత లిబరల్ కమ్యూనిటీ అని , గే, లెస్బియన్ , మరితర తరహా జంటలు తారసపడటంలో  అశ్చర్యం  లేదని తెలుసు కానీ , అదేదో  తన  అనుభవంలోకే వొచ్చిందా ….ఏదో సంకోచం….. !?  మట్టి బుర్ర…. అని తనని తాను విసుక్కుంది.

ఏప్రిల్  తో స్నేహం మానెయ్యమని  మహతికి  చెప్పాలా ? ఏ ముఖం పెట్టుకు చెపుతాను  ?!  చెప్పినా అర్ధం చేసుకునే వయసా ? పేరెంట్ గా నా కర్తవ్యం ఏమిటి ? తెలిసీ తెలియని  వయసులో  ఇలాంటి  వ్యక్తుల తో  పరిచయం వల్ల పిల్లలపై పడే ప్రభావం ఏమిటి ? భవిష్యత్తులో ఏం చేసినా, ఎలా ఉన్నా  తప్పు లేదన్నట్టు తయారవుతారా?   ఇంతకీ వాళ్లతో  నాకున్న ఇబ్బంది ఏమిటి ? ఆ  పసిపిల్ల పట్ల అన్యాయంగా వ్యవహరించడం  అవదా ?! తెలిసిన వాళ్ళు , చుట్టాలు  ఇలాంటి స్నేహాలేంటి …  అంటారనా ? కూతురిని సంప్రదాయ వాతావరణంలో , పధ్ద్దతిగా పెంచడంలేదంటారనా ?!  ఇటువంటి సంబంధాలకు సమాజంలో సమ్మతి ఉండదనా ? ఏంటి నా  సమస్య ? అని వెతుకులాడింది.

pravaham-1-

కొంతసేపటికి తనే తెప్పరిల్లి … ఒక వేళ ఈ నా అంచనాయే తప్పయితే ?! లిన్ ని ఏప్రిల్ పేరు పెట్టి  పిలవడం గుర్తు చేసుకుంది…  ఒక వేళ అలా కాదేమో ! నేనే తప్పుగా అర్ధం చేసుకుంటున్నానేమో ! విషయం ఏమిటో నిర్ధారించుకుని కానీ నిర్ణయం తీసుకోకూడదనుకుంది.

తమ కాంప్లెక్సులోనే ఉండే మరో కుటుంబం ద్వారా , లిన్- లిండాలు లెస్బియన్ కపుల్  అని, సరిగ్గా వసుంధర వాళ్ల  పై ఫ్లోర్ లో ఉండే అపార్టుమెంటులో కూడా మరో  గే కపుల్ ఉంటున్నట్టు తెలుసుకుంది.  ఈ రెండు జంటలూ కూడా తోటి వారితో స్నేహంగా ఉంటారని, ఎవరి జోలికి రారు, ఇబ్బంది పడ్డ పరిస్థితులు తమకు రాలేదని ఆ కుటుంబం చెప్పడం కొంత ఉపశమనాన్నిచ్చింది.

ప్రవాసం అంటేనే ప్రవాహం! ఎన్నో కలుపుకు పోవాలి… ఎన్నిటితోనో కలిసిపోవాలి …  భిన్నంగా ఉన్నంత మాత్రాన ….వాళ్ళని సహించలేకపోవడం లోపమే కదా! మహతి స్నేహ బంధాన్ని విడగొడితే, ఆ పసితనాన్ని గాయపరుస్తానేమో అనే బాధ, అపరాధ భావనే   నన్ను సమాధాన పరుస్తోందా?  అనే ప్రశ్నలూ  వేసుకుంది.  నా పిల్లలను కూడా మా “గంప ” లోనే  పెంచేస్తాను, నా  ఇల్లే  “సరైన “ప్రపంచం…  అనే మానసిక స్థితి  నుంచి  బయటపడి, అన్ని దిక్కులూ చూడటం… ముందు తరానికి మెరుగైన  ఆలోచనలు పంచడానికి ఉపయోగపడుతుంది అనే సానుకూలతను తన ఆలోచనలకు జోడించేందుకు ప్రయత్నించింది.

మరో వైపు …

పరిపరి విధాలుగా పోతున్న తన అలోచనల గురించి భార్గవ్ కి ఏకరవు పెట్టింది.

అఫీసుల్లో కూడా రకరకాల వ్యక్తులు  తారసపడతారు,  వారితో మన సాన్నిహిత్యం ఎంత వరకు పోవాలి అనేది మనం వారిని అర్ధం  చేసుకోగలిగినంత, వారిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడనంత మేరకు అని నా ఉద్దేశం!  పిల్లల కళ్లకి  అన్ని వేళలా గంతలు కట్టి ఉంచాలంటే సాధ్యం కాదు… వాళ్ళో మిశ్రమ సంస్కృ తి లో పెరుగుతున్నారు,  సహజమైన వాతావరణం వాళ్ళ చుట్టుపక్కల ఉంచకపోతే, పెద్దవుతున్న కొద్దీ  గందరగోళ పడతారన్నాడు.

ఏది ఏమయినా,  సున్నితమయిన  విషయం…ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, మన  జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుంది.

మధ్యాన్నం మూడున్నరకి , మళ్ళీ పూల్ దగ్గర వసుంధర, మహతి రెడీ!

స్నేహితురాళ్లిద్దరూ షరా మామూలే , ప్రపంచాన్నే మరచిపోయినట్టు !

రోజులు గడుస్తున్న కొద్దీ , పిల్లలిద్దరూ పూల్ లో సురక్షి తంగా  ఈత కొట్టగలరనే నమ్మకం కుదిరిన తరువాత,  కొంతసేపు వసుంధరతో మాటలు కలపడానికి  వొచ్చి కూర్చునేది లిన్ .

సరైన అవగాహన లేక,  వాళ్ళు నొచ్చుకునేట్టు ఎమైనా అడుగుతానేమోనని వసుంధర వ్యక్తిగతమైన ప్రశ్నలు పెద్దగా వెయ్యకపోయినా ,  మాటల మధ్యల్లో లిన్ కొన్నిటిని  గుర్తుచేసుకునేది.

కొలీగ్ గా  లిండా తో పరిచయం, అప్పటికే డైవోర్సు కి అప్లయి చేసి ఉన్న లిండా  ! ఇరువురి మధ్య చిగురించిన  ప్రేమ,  కుటుంబాల వ్యతిరేకత,  వీళ్ళ విషయం  తెలిసి , లిండా  కూతురి  భవిష్యత్తు పట్ల  ఆందోళన చెందుతూ , ఆ పిల్ల తండ్రి వేసిన  ప్రశ్నలు,  చైల్డ్  కస్టడీ కోసం చేసిన యుద్దం…  అయినా ఒకరి పట్ల , మరొకరికి చెదరని ఇష్టం ! ఎటువంటి పరిస్థితినైనా కలిసి ఎదుర్కోగలమనే  గట్టి విశ్వాసం, తమ అనుబంధానికో రూపం ఇవ్వాలని డొమెస్టిక్ పార్టనర్ గా రిజిస్టర్ అవటం,  ఓ కొత్త ఆరంభం కోసం,  రెండేళ్ల క్రితం ఈ ఊరికి రావడం లాంటి వివరాలు  నెమ్మది నెమ్మదిగా తెలిసాయి .

ఈ జంట గురించి భార్గవ్ తో  మాట్లాడినప్పుడల్లా … ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని సమస్యలకు  సిద్దపడతారు? అనేది వసుంధర.

పార్కులో ప్లే డేట్  పెట్టుకున్నప్పుడు, సాధారణంగా లిండా వొస్తుండేది.   మీ అమ్మయి చాలా మర్యాదస్తురాలు, తన అలవాట్లు, మాట్లాడే తీరు ముచ్చటేస్తుంది , మహతిని కూడా  అలవాటు చేసుకోమని చెబుతుంటానని  అన్నప్పుడు, ఏ మాత్రం తేడాగా ఉన్నా, వీళ్ళ పేరెంట్స్ ఎంత అరాచకంగా ఉంటారో అంటూ తమ లాంటి వారి పిల్లలపై  అతి సులభంగా ఓ ముద్ర వేస్తారనే  స్ప్ఱహ  అనుక్షణం వెంటాడుతుంటుందని లిండా చెప్పడం వసుంధర మనసుని తాకింది.

లిన్ చెల్లెలు మెలిస్సా కి ఇక్కడే స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. లిన్ తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు కానీ, ఆర్ధిక అవసరాల రీత్యా ఇది తప్పదని మెలిస్సా  చెప్పడంతో వాళ్ళు ఏం చెప్ప లేకపోయారు.  మెలిస్సా  రాకతో ఏప్రిల్ ని చూసుకోవడంలో కొంత  సహాయం లభించినట్టయింది లిన్ –  లిండాలకి.

రోజులు గడుస్తున్న కొద్దీ,  లిన్ – లిండాల కాపురాన్ని సాధారణంగానే తీసుకోవడం మొదలుపెట్టింది వసుంధర. ఏ పార్కు లోనో , పూల్ దగ్గరో కలవడం,  పిల్లలు ఆడుకుంటుంటే కబుర్లు చెప్పుకోవడం మామూలయిపోయింది.  ఓ సంవత్సరం గడిచిపోయింది. పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ లో జాయిన్ అయిపోయారు.
ఏప్రిల్ కి ఓ బుజ్జి తమ్ముడు పుట్టబోతున్నాడు, నేను కూడా వాడితో ఆడుకోవచ్చని ఏప్రిల్ చెప్పింది, ఓ రోజు సంబరంగా ప్రకటించింది మహిత.

పిల్లలు తెలిసీ తెలియక ఏదో మాట్లాడుకుని ఉంటారని వసుంధర అనుకుంది కానీ, లిండా – లిన్ లు కూడా ఈ శుభవార్తని వసుంధర తో పంచుకున్నారు. అన్ని కుటుంబాల లాగా …పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు లు , మనవలు, మనవరాళ్లు…ఇలా కోలాహలంగా తమ అనుబంధం సాగాలనే కల గురించి చెప్పారు.

ఇది సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆధునిక పరిఙానం సహాయం తీసుకున్నామని, ఎటువంటి డోనర్ నుంచి స్పర్మ్  కావాలో చర్చించుకుని, ఇద్దరూ ప్రయత్నించినా, లిండా గర్భవతి కావడంతో తమ ప్రయత్నం ఫలించిందనే అనందంలో మునిగితేలుతూ కనిపించారు.

వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోకుండా ఉండలేకపోయింది వసుంధర! పరిచయం పెరుగుతున్న కొద్దీ,  సున్నితంగా ఆలోచించే వాళ్ళ వ్యక్తిత్వాలు కట్టిపడేస్తున్నాయని భార్గవ్ తో చెప్పింది. కుటుంబం పట్ల వాళ్ళకున్న అభిప్రాయం భారవ్గ్ ని  కూడా ఆకట్టుకుంది.

లిండా కి “బేబీ షవర్ “ చెయ్యాలని లిన్ ముచ్చట పడుతుంటే, వసుంధర ఉత్సాహంగా సహాయం చేసింది. అలాగే డెలివరీ అపుడు   లిన్ కి సహాయంగా ఉండాలని ఏప్రిల్  బాధ్యతలు కొన్ని తీసుకుంది.

చిన్నారి  “లియం” ఇంటికి రాగానే , కుటుంబ సమేతంగా వాళ్ల ఇంటికి వెళ్ళి చూసొచ్చారు.  లిండా‌ – లిన్ ల తల్లిదండ్రులు కూడా మనవడిని చూడటానికి వొచ్చారని తెలిసి,  అసలు కంటే వడ్డీ ముద్దు అనే లాజిక్ ఇక్కడ కూడా అప్లయి  అవుతోందని అనందపడ్డారు.

“లియం కి ఇద్దరు మామ్స్ …సో కూల్ “ మహతి అన్నదో రోజు.

“డాడీ ని మిస్సవుతాడంటావా ? “ ఏం చెపుతుందో తెలుసుకోవాలని అడిగాడు భార్గవ్.

“ ఇట్ ఈజ్ ఓకె డాడీ ! సమ్ కిడ్స్ డజంట్ హావ్ మామ్స్ , సమ్ కిడ్స్ డజంట్ హావ్ డాడ్స్  … నథింగ్ టు ఫీల్ అబౌట్ ! “ తేలికగా సమాధానం చెప్పి ఆటలో పడిపోయింది మహతి.

ఓ సారి  స్కూల్ కి వెళ్ళి వాలంటీర్ గా పనిచేసి చూడు… స్నాక్ టైం లో , లంచ్ టైం లో టేబుల్ దగ్గర కూర్చొని ఈ పిల్లలు తెగ మాట్లాడుకుంటారు…. అవి విన్న తరువాత, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడగవు అంటూ నవ్వింది వసుంధర.

మామీ లిండా – మామీ లిన్ లు  ఇంకా బిజీ  అయిపోయారు. “లియం” తో ఆడుకోవాలనే మహతి రిక్వెస్టు లూ  పెరిగిపోతున్నాయి….

కాలం పరుగెడుతోంది !

“ఈ డ్రస్ లియం కి కొందాం, ఇది వేసుకుంటే క్యూట్ గా ఉంటాడు” వసుంధర కూతురు మహతి చాలా ఉత్సాహంగా అడిగింది.

“వాడి పుట్టిన రోజుకి ఇంకా నాలుగైదు నెలల టైముందిగా? ఇప్పుడే ఎందుకు ? తన పుట్టిన రోజు దగ్గర పడినప్పుడు మళ్ళీ షాపింగ్ కి వొద్దాం  “ కూతురికి  సర్ధిచెప్పబోయాడు భార్గవ్.
“నో.. హి ఈజ్ మై బేబీ బ్రదర్ , ఐ నీడ్ టు బై దిస్ ఫర్ హిమ్ !  ప్లీజ్ …ఈ డ్రస్ కి ‘టీతర్ ( Teethar) ” కూడా ఉంది. వాడు భలే ఎంజాయ్ చేస్తాడు” తల్లిదండ్రులకి మరింత నొక్కి చెప్పింది మహతి.

లియం అంటే మహతికి చాలా ఇష్టమని తెలిసినా, వాడు నా తమ్ముడని పట్టుపట్టేంత  ప్రేమని, ఎలా అనునయించాలో తెలియక, అడిగింది కొని ఇచ్చేసారు వసుంధర, భార్గవ్ లు…. !

– హిమబిందు . ఎస్ .

చిత్రరచన: మహీ బెజవాడ

జావేద్

పెరుగుతున్న గోడలు, కూలుతున్న పూదోటలు

Sketch56104048-2

 

 

బిచ్డే అభీ తో హమ్ బస్ కల్ పర్సో

జీయోంగీ మై కైసే, ఇస్ హాల్ మే బర్సో

మౌత్ నా ఆయీ తేరీ యాద్ క్యో ఆయీ

హాయ్ లంబీ జుదాయీ

చార్ దినోంకా ప్యార్ హో రబ్బా

బడీ లంబీ జుదాయీ, లంబీ జుదాయీ..

https://www.youtube.com/watch?v=hEejj51WJ7s

ఈ పాట నాకెంత ఇష్టం అంటే కొన్ని వందల సార్లు వినివుంటా. టేప్ రికార్డర్లు వుండే రోజుల్లో పదేపదే పెట్టుకు వినేవాడిని. ఇప్పుడిక యు ట్యూబ్ కూడా వచ్చేసింది కాబట్టి ఎప్పుడు కంప్యూటర్ పెట్టుకున్నా ఈ పాట ఒకసారి విని తీరాల్సిందే. అందరిలాగే ‘హీరో’ సినిమాలో పాటలో ఒక విరహగీతం మాత్రమే అనుకునే వాడిని. కానీ, ఆ తర్వాత తెలిసింది ఆ పాట అసలు రేష్మాది అని.
ఆ రస్టిక్, ముతక, గుండెల్ని పిండేసే ఆ గొంతు పాకిస్తాన్ గాయకురాలిదని. అయితే, ‘సోలిటరీ రీపర్’ ఎవరైతేనేం, ఆమె భాష ఏదైయితేనేం, నన్ను ఆ గొంతు వెంటాడింది. వెంటాడుతూనే వుంది. నేను ఆ పాటతో ప్రేమలో పడ్డ రోజుల్లో నాకు అసలు హిందీ ఒక్క ముక్క రాదు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు కూడా రాదు. హైదరాబాదు వచ్చేవరకూ అంతే. కానీ, ఏదో బాధని, ఇంకెంత మాత్రం భరింప రాని బాధని, పలికిస్తోందని అనిపించింది. అవధుల్లేని దుఖ్ఖం ఆమె హృదయంలోంచి ఉప్పెనలా వస్తోందని అనిపించింది.

ఇక ఆ పదాలకి అర్ధం తెలిసేక ఆ పాట మీద, ఆమె మీద గౌరవం పెరిగిందే కాని తగ్గలేదు. ఏ కవి లేదా కవయిత్రి ఏ దుఖ్ఖాన్ని ఆవాహన చేసుకుని రాసివుంటారు? ఏ తెగిన బంధం గుండెల్ని బద్దలు చేస్తే బెంగటిల్లి వుంటారు?

***

అలాటి ఒక రోజు, మళ్ళీ ఆపాట పెట్టుకుని చూస్తున్నా. ఆ పాటని, లేదా అలాటి కొన్ని పాటల్ని, జీవితాంతం పాడుతూ, పాడుతూ వడలిపోయిన రేష్మా ఎక్కడో స్టేజీ మీదకొచ్చింది. నాలాటి వాళ్ళు కొందరు, అక్కడ కూచుని వింటున్నవాళ్లు, లేచి నుంచుని ఆహ్వానిస్తున్నారు. ఆమె పాడటం మొదలుపెట్టింది. అందరూ పెదవులు కదుపుతున్నారు, తలలు ఊపుతున్నారు.
సరిగ్గా అప్పుడే మా అయిదేళ్ళ పాప వచ్చింది.
“నాన్నా, ఎవరు ఆమె,” అని అడిగింది.
“రేష్మా. చాలా బాగా పాటలు పాడుతుంది. నాకు చాలా ఇష్టం,” అన్నాను.
“ఆమెది ఏ ఊరు”

“పాకిస్తాన్”

“పాకిస్తానా? మరి పాకిస్తాన్ వాళ్ళు చెడ్డవాళ్లు కదా. మన మీద బాంబులు వేస్తారు కదా,” అంది, చాలా ఆశ్చర్యపోతూ.
ఆ ప్రశ్న ఒక షాక్ నాకు. పాకిస్తాన్ మీద, ముస్లింల మీద స్టీరియో టైపు కామెంట్లు మనకి అలవాటే. అందులో మనకి కొత్తేముంది అందులో? కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఇంత చిన్నపిల్లకి ఆ విషయం ఎవరు చెప్పి వుంటారు? ఎందుకంటే, మనం ఎందుకు చెప్తాం అలాటి అన్యాయమైన విషయాలు ఇంట్లో.
అప్పటికి ఏదో సద్ది చెప్పాను అలకి. కానీ, అప్పటినించి ఆ ప్రశ్నే వెంటాడుతుండేది. పిల్లల్ని ఎంత చిన్నప్పటి నుంచి తయారు చేస్తున్నాం, ఒక దేశానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా? పిల్లల మనసుల్ని ఎంత నిర్హేతుకమైన నిరాధార విషయాలు చెప్పి కలుషితం చేస్తున్నాం?
మొత్తం దేశం దేశమంతా చెడ్డదై పోతుందా? మొత్తం మనుషులు చెడ్డవాళ్లై పోతారా? చేజేతులా పిల్లల దృష్టిని కురచ చేస్తున్నాం కదా. ఈ మకిలి ఆలోచనల్నుంచి, ఈ కనిపించని హింసకి expose కాకుండా పిల్లల్ని కాపాడుకోవడం ఎలా అని అనిపించేది.

***

సరిగ్గా అప్పుడే గోపాల్ మీనన్ ముజఫర్ నగర్ ఊచకోత మీద తీసిన డాక్యుమెంటరీ కాపీ నగరానికొచ్చింది. లౌకిక, ప్రజాస్వామిక, సాహిత్య, సాంస్కృతిక ఫ్రంట్ వాళ్ళు వేస్తే చూడ్డానికి వెళ్ళేం అందరం. అల ఓ వందో, రెండువందలో ప్రశ్నలు అడిగింది, డాక్యుమెంటరీ చూస్తూ, స్వేచ్చ (టీవీ9 ఏంకర్) కూతురుతో ఆడుకుంటూ.
“హిందువులకి ముస్లింలు అంటే ఎందుకు అంత కోపం,” అని.
“ఆ పిల్లలు కూడా ముస్లింలేనా (హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పిల్లల్ని చూసి),” అని.  బహుశా, పిల్లలని కూడా చూడలేదా అని కావచ్చు.
రిలీఫ్ కేంప్ లో వున్న పిల్లల్ని చూసి, “మరి ఆ పిల్లలు బొమ్మలు తెచ్చుకోలేదా,” అని.
బహుశా పిల్లల బొమ్మల ప్రపంచాన్ని కూల్చివేసిన దృశ్యమేదో ఆమెకి కనిపించి ఉండవచ్చు. ఆ మేరకు కొంత బాల్యపు అమాయకత్వం ఆమె కోల్పోయి ఉండవచ్చు.

***

ఈ ప్రశ్నల్ని కొన్నిటిని ఫేస్ బుక్ లో పెడితే ఒకరిద్దరు well-meaning మిత్రులు నన్ను కోప్పడ్డారు. పిల్లల్ని అలాటి దృశ్యాలకి expose చెయ్యడం తప్పు కదా అని. నిజమే. అందులో సందేహం ఏముంది. ఆ దృశ్యాలు చూసి చిన్న మనసులు బాధపడతాయి కావచ్చు. ఆ డాక్యుమెంటరీలో నిజానికి హింసాయుత సన్నివేశాలు కొన్ని మాత్రమే వున్నాయి. కానీ మిత్రుల సూచనల పై రెండో అభిప్రాయమే లేదు.
కానీ, మనకి ఎప్పుడూ కొన్ని మాత్రమే హింసాయుతంగా కనిపిస్తాయి. తెలుగు సినిమాల నిండా హింస. హింస అంటే కేవలం కొట్టుకోవడం, చంపుకోవడం మాత్రమే కాదు. బూతు, నాటు సంభాషణలు. మతపరమైన సన్నివేశాలు (అంటే దేవుడిని మొక్కడం, ప్రతిజ్ఞలు చెయ్యడం), శృంగార సన్నివేశాలు, అసభ్య నృత్యాలు, పాటలు – ఇవన్నీ మనకి చాలా సహజం అయిపోయాయి. వీటిని చూపించడం, వీటికి పిల్లల్ని expose చెయ్యడం మనకి తప్పని ఎప్పుడూ అనిపించని స్థాయికి వెళ్లిపోయాం.

ఇక సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో చిన్న పిల్లలకి కూడా అన్నీ రసాలూ (శృంగార, బీభత్స రసాలతో) సహా నేర్పిస్తాం. వాళ్ళతో ప్రదర్శనలు ఇప్పిస్తాం. మనం ముచ్చటపడి చూస్తాం. కానీ, అందులో వున్న హింస ఎంత హింస? ముక్కుపచ్చలారని పిల్లలతో వాళ్లకి మరో పదేళ్ళకి గాని సహజంగా కలగని భావాల్ని పిలికిస్తారు ఆ నృత్యాలలో . కానీ, మనకది సహజం అయిపోయింది.  సాంప్రదాయం అయిపొయింది కాని హింస అనిపించలేదు . అనిపించదు.
ఒక హింసకి పోటీగా మరో హింసని చూపించే ప్రయత్నం చెయ్యడం లేదు నేను. హింస ఏ రూపంలో వున్నా వ్యతిరేకించాలి. కానీ, వ్యవస్థీకృత హింస వెయ్యి కనిపించని ముఖాలతో, కాళ్ళతో, చేతులతో మనల్ని ధృతరాష్ట్ర కౌగిలితో నలిపివేస్తున్నది. ప్రస్తుతం అది బలం పుంజుకుంటున్నది. భయపెడుతున్నది. నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తున్నది.
పిల్లలపై సమాజం జరుపుతున్న ఈ హింసతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దవాళ్ళకి ఏది దారి?

***

రేష్మా నిలదీస్తోంది,

హిజ్రికీ ఊంచీ దీవార్ బనాయీ 

బాగ్ ఉజడ్ గయే ఖిలనే సే పెహ్లే 

పంచీ బిచడ్ గయే మిల్నే సే పెహ్లే 

 

మనుషుల మధ్య చాలా ఎత్తైన గోడల్ని కట్టేస్తున్నాం

పూవులు పూయకముందే తోటల్ని ధ్వంసం చేసేస్తున్నాం
కలవక ముందే మనుషుల ప్రేమల్ని కాలరాసేస్తున్నాం.

 – కూర్మనాధ్ 

హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్!

గమనిక: సింధూరం “హాయ్ రే హాయ్” ట్యూన్లో పాడుకోవలెను!

హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్
హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్
సామాన్యుడి పార్టీ పెట్టెరోయ్ కొత్తగా …

ఏం హంగురా, ఏం ఢంగు రా …
ఏం హంగురా, ఏం ఢంగు రా …

గెలిచిపోతే అంతకన్నానా అయ్యబాబోయ్ ..

హాయ్ రే హయి .. క్రేజీబాబు రోయ్
హాయ్ రే హాఇ .. క్రేజీబాబు రోయ్

చరణం 1:

దానవీరశూరకర్ణ ఎన్ టీ ఆరు లా
సిపాయి చిన్నయ్య ఏయన్నారులా
ప్రతీకార జ్వాల రగిలే శోభన్ బాబులా
అల్లూరి సినీమాలో సూపర్ స్టారులా

ఫైటుసీన్లలో చిరంజీవిలా … తొడలుగొట్టే బాలకృష్ణలా …

యయయ యయయ యయ్యయాయ యయయ యయయ యై
యయయ యయయ యయ్యయాయ యయ్య యయ్య యై

లక్ష్మి వెంకీలా, బాస్ నాగ్ లా
ఢిల్లీ బాబుల తాటతీసెరో పోరగాడు

హాయ్ రే హాయ్ .. క్రేజీ బాబు రోయ్ ..

చరణం 2:

SMS ల పేరుతోటి Govt ఇలా
మెజారిటీ లేకున్నా form చేసే అలా ..
50 డేసు ఆడలేని ఫ్లాపు బొమ్మలా
నలభై తొమ్మిది రోజులు మాత్రం ఉండెనే కలా

ప్రభుత్వానికీ ప్రతిపక్షానికీ…. తేడా తెలియని కార్యకర్తలా ..

యయయ యయయ యయ్యయాయ యయయ యయయ యై
యయయ యయయ యయ్యయాయ యయ్య యయ్య యై

పుణ్యకాలమూ రెబెల్ స్టారులా
ధర్నాలతో వెళ్ళబుచ్చెరో సారువాడు

హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్
హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్

-భరద్వాజ్ వెలమకన్ని

1609865_10202268640051518_1868149718_n

ఈ కార్పొరేట్ నేల మీద ఖదీర్ “డాక్టర్” గారు ఎవరి డాక్టర్?!

( ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి )

( రెండో భాగం )

khadeer book

మొదటిగా రచన ప్రయోజనం చూద్దాం. ఈ రచనకి పూనుకొన్నప్పుడు రచయిత ఆశించిన ప్రయోజనం ఏమిటి? సంపాదన వేటలో మనుషులు ఒత్తిళ్లకి లోనవుతున్నారనీ, అందువల్ల పిల్లలు సమాజానికి దూరమైపోతున్నారనే. దీనికి విరుగుడుగా రచయిత సూచించినది పిల్లల్ని కొంత ప్రజా జీవితానికి దగ్గరగా పెంచాలని. కానీ ఈ ప్రయోజనాన్ని ఈ కథ సాధించిందనీ, ఈ సందేశాన్ని బలంగా వినిపించగలిగిందనీ చెప్పలేం. కథని “రసవత్తరంగా” చెప్పాలనే ఉత్సాహమూ, రహస్య ఆకాంక్షలూ కథ ప్రయోజనాన్ని సున్నా చుట్టేశాయి. డాక్టరుగారి ప్రవర్తన వర్ణనా, నైటీలూ, పెదవులూ, ఆకర్షణా, కిసుక్కుమని నవ్వడాలూ, తనలో తనే మురిసిపోవడాలూ, వగైరాలకీ కథ నడకకీ ఏమీ సంబంధం లేదు. “ఏదో” “ఏదో” జరగబోతోందన్న ఉత్కంఠని పాఠకుల్లో లేవనెత్తి కథని చదివించే ప్రయత్నం కథ ప్రయోజనానికి సరిపడదు. ఇదంతా కథని “రసవత్తరంగా”నడిపి చివరికి కథారచన రచయిత ప్రతిష్టలో భాగమైపోతుంది. సంపాదన వేటకి ఫలితం ఒత్తిళ్లు అని గుర్తించిన కధ ఆ సంపాదన వేటకి మూలాల్ని గుర్తించలేక పోయింది. ఉత్పత్తి విధానం పెట్టుబడిదారీ విధానం కావడంతో ప్రజల ఆరోగ్యం కూడా “సరుకు”గా మారి వ్యాపార సూత్రాలకు లోబడి పోటీ, లాభం అనే అంశాలు మానవ జీవితాలకు నిర్ణాయక శక్తులుగా వున్నాయనీ కథ స్పష్టం చెయ్యగలిగి వుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరేది. శ్రామికుల జీతాల్నీ, పని గంటల్నీ పోటీ నిర్ణయిస్తుందన్న మార్క్స్ వాక్యం (Pre -Capital formation అన్న నోట్సులో) ఒక్కటి చాలు కథని ప్రయోజనా పూర్వకంగా మలచడానికి. ఒక రచయిత తాను చూసిన విషయాన్ని కథగా రాసే ముందు చెయ్యవలసిన అధ్యయనం ప్రాముఖ్యాన్నీ, ఆ అధ్యయనం లేకపోతే కలిగే అనర్ధాన్నీ చెప్పటానికే ఇదంతా రాసాను. మనం చూసిందే రాయాలంటే సాహిత్యం అవసరం. ప్రయోజనం పెద్దగా వుండదు. మనం చూసిన విషయాలు అందరూ చూస్తున్నారు. కొందరు రోజూ చూస్తున్నారు. సమస్య ఏంటంటే చూస్తున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అనేదే.. ఆ సమస్యే సాహిత్య ప్రయోజనం. వాస్తవానికీ, వాస్తవికతకీ వున్న తేడా అదే. కనిపించింది చెప్పేవాడు వ్యాఖ్యాత. కనిపించనిది విప్పి చెప్పేవాడు రచయిత.

ఇంతకీ డాక్టరుగారి కష్టాలకి కారణాలేమిటి? అని ప్రశ్నించుకోవడం అవసరం.

కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం రూపంలో వ్యవసాయంలో ప్రవేశించిన పెట్టుబడి వుత్పత్తిని పెంచి “మిగులు”ని తయారు చేసి వినిమయం, మారకం లేదా అమ్మకం, కొనుగోలు రూపంలో బజారుని తయారు చేసిన తర్వాత అది అక్కడితో ఆగదు. ఈ మిగులు బ్రహ్మరాక్షసి. దాని పెరుగుదలకి ఒక క్రమం, ఒక విధానం, ఒక పద్ధతి వున్నాయి. ఆ వివరాల్లోకి ప్రస్తుతం వెళ్ళకుండా అవసరం మేరకే మాట్లాడితే పెట్టుబడిదారీ తను పెరిగే క్రమంలో ఒక రకపు శ్రమ విభజనను ప్రవేశ పెడ్తుంది. అదే సమయంలో అది “నైపుణ్యాలకి” పెద్ద పీట వేసి కీర్తనలు పాడి, ఆ నైపుణ్యాలని “సరుకు”గా మార్చి, క్రమంగా మింగేస్తుంది.

వైద్యంలో దీన్ని చూస్తే డాక్టరుగారి తండ్రిలాంటి పరిమిత పరిజ్ఞానం గలవాళ్లు ఒక దశలో సరిపోతారు. వీళ్లు తమ బతుకుతెరువుకోసం ఒక మంగలి, ఒక చాకలి, కంసాలి, వడ్రంగి  వగైరా చేతి వృత్తుల వాళ్లలాగ గ్రామం మీద, సమాజం మీద ఆధారపడతారు. ఈ పరస్పర సహకారం ఇద్దరికీ అవసరంగా వుంటుంది. మార్కెట్ విస్తరించేకొద్దీ నైపుణ్యాలూ, శ్రమ విభజన పెరుగుతుంది. వైద్యంలో రకరకాల స్పెషలిస్టుల రాక ఇదే. ఆరోగ్యం అనే వుత్పత్తిని చెవుల,గుండెగా, ప్రసవంగా, ఎముకలుగా, వూపిరి తిత్తులుగా విడగొట్టి దానిలోని నిపుణుల్ని తయారు చేసింది. వ్యవసాయంలో నాగలి స్థానంలో ట్రాక్టరు వచ్చినట్టుగానే వైద్యంలోనూ రకరకాల యంత్రాలు రంగప్రవేశం చేసాయి. స్టెతస్కోపు, ధర్మామీటరుతో ఆగకుండా రకరకాల స్కానింగ్ మిషన్లు, మనిషి “చర్మం వొలిచి” లోపల ఏం వుందో చూపే యంత్రాలు వచ్చాయి. అయితే ఈ యంత్రాలు వుత్పత్తిదారుల చేతుల్లో వుండవు. డాక్టర్లూ, కంపౌండర్లూ,నర్సులూ.. వీటిని కొనలేరు.

ఈ పద్ధతిలో వ్యవసాయంలో భూమికి యజమానిగా వున్న రైతు అది పోగొట్టుకుంటాడు. వృత్తికారులు, చేనేత కావచ్చు. జాలర్లు కావచ్చు. తమ పనిముట్లు పనికిమాలి పోయాయని గుర్తించేలోపు రెండు చేతులు తప్ప ఏమీలేని కూలీలుగా మిగులుతారు. వ్యవసాయ కూలీలు, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, వైద్యుడు ఎవరైనా ఒక్కటే. వ్యక్తిగత యజమానిగా, ఒక చిన్న రైతులాగ, సొంత కార్ఖానా పెట్టుకున్న వడ్రంగి, కమ్మరిలాగా, వున్న మంగలి డాక్టరుగారి  తర్వాత దశ వ్యక్తిగత నైపుణ్యం వున్న డాక్టరుగారే. స్పెషలిస్టులే. అలాగే రైతులు, వృత్తికారులూ, కూలీలైపోయి గ్రామాన్ని, చిన్న సమాజాన్ని వదిలేసి పట్నం చేరినట్లే డాక్టరుగారూ చేరారు. ఆ మేరకు రైతుల పట్ల వుండే సాధారణ సానుభూతి వైద్యుల పట్లా నాకు వున్నది.

కానీ, మంగలి డాక్టరుగారిలాగ సొంత డిస్పెన్సరీ నడుపుకునే దశనుంచీ కార్పోరేట్ ఆసుపత్రుల్లో కూలీలుగా మారిపోయే దశలోనూ, ఆ తర్వాతా ఈ వైద్యులు ఎవరివైపు నిలబడ్డారు? అన్నది నా సానుభూతికి గీటురాయిగా నిలుస్తుంది.

కారణాలేమైనా, మన దేశంవరకూ తీసుకుంటే ప్రభుత్వం వైద్యాన్ని ఒక కంటి తుడుపుగానైనా నిర్వహిస్తున్నది. గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలున్నారు. రోగాలు ఎక్కువగా గ్రామాల్లోనే వున్నాయి. మలేరియా, డయేరియాల్లా చిన్న చిన్న రోగాలకే చచ్చిపోతున్నవారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు. ప్రభుత్వం ప్రకటించిన గ్రామాలు ఆర్ధిక గణాంకాలు(Rural Health Statistics) ప్రకారం చూస్తే మార్చి 2012 నాటికి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) 4 శాతం వాటిల్లో డాక్టర్లు లేరు. 36 శాతం వాటిల్లో లాబ్ టెక్నిషియన్లు లేరు. 23 శాతం వాటిల్లో మందులిచ్చే ఫార్మసిస్టు లేడు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సర్జన్లలో 75 శాతం, ప్రసూతి డాక్టర్లలో 65 శాతం, చిన్న పిల్లల డాక్టర్లలో 80 శాతం, సాధారణ ఫిజిషియన్లలో 80 శాతం కొరత వున్నది. మొత్తంగా చూస్తే అవసరమైన దాంట్లో కేవలం ముప్పై శాతం మాత్రమే వున్నారు. ప్రభుత్వం సాంక్షన్ చేసిన పోస్టుల్లో 52 శాతం సర్జన్ల పోస్టులూ, 40 శాతం ప్రసూతి డాక్టర్లూ, 53శాతం ఫిజిషియన్లూ, 43 శాతం చిన్న పిల్లల డాక్టర్ల పోష్టులు  ఖాళీగా వున్నాయి. మొత్తంగా చూస్తే శాంక్షన్ అయిన పోష్టుల్లో  43 శాతం పోష్టులు ఖాళీగా వున్నాయి.

వివరాలూ, గణాంకాలూ కావాలంటే టన్నులకొద్దీ ఇవ్వచ్చు కానీ మామూలుగా చూసినా గ్రామాల్లో వైద్యం లేదనీ, చిన్నరోగాలకి కూడా పనులు మానుకుని, కూలీ మానుకుని పట్టణాలకి పరిగెత్తి ఆసుపత్రుల వరండాల్లో గంటలగ్గంటలు పడిగాపులు పడాలని అందరికీ తెలిసిందే. గ్రామాల్లో రెండేళ్ళు పని చెయ్యాలన్న నిర్బంధం పెట్టినా డాక్టర్లు గ్రామాలకి రావడం లేదని ప్రకటించి, ప్రచారం చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎటు పోతున్నారు?

ఉత్పత్తి సాధనాలు చేతిలో వుంచుకొని శ్రమని దోపిడీ చేస్తూ వుండే పెట్టుబడిదారుల వైపే ఉన్నారు. డాక్టరుగారు స్పష్టంగా చెప్పినట్టు సాఫిస్టికేటెడ్‌గా మోసం, వంచన చేస్తున్నవారి వైపే వున్నారు. “పేదల కారాగారం”లో వీరు పేదల వైపు లేరు. అందుకే నాకు వారిపై ఏమీ సానుభూతి లేదు. అన్నదాత, మహా పతివ్రత, వైద్యోనారాయణోహరీ లాంటి బిరుదుల వెంక వున్న అసలు ఉద్దేశ్యాల్ని గ్రహించగలిగిన వాళ్లు డాక్టరు పాత్రపై ఏమీ సానుభూతి  చూపించలేరు. మరో విషయం చూస్తే మరిన్ని యంత్రాలు ప్రవేశ పెట్టడం ద్వారా, ఎంతోమంది శ్రామికుల్ని బతుకుతెరువు నుంచి దూరం చేస్తోందనీ, అలా నిరుద్యోగులైపోయిన శ్రామికులు “పారిశ్రామిక సైన్యం”గా తయారై కూలీ మరింత తగ్గిపోవడానికీ, శ్రామికుల బతుకు మరింత దిగజారిపోవడానికీ కారణంవుతారనీ సిద్ధాంతం. కావలసినవాళ్లు సుళువుగా తెలియాలంటే మార్క్సు రాసుకున్న pre-capitalist economic formulate రాతలో చూడొచ్చు. ఆయన గ్రంధం కాపిటల్‌లో చదవొచ్చు.

ఇంతకీ ఈ క్రమంలో “పారిశ్రామిక సైన్యం” ఎవరని ఆలోచించాలి. మంగలి డాక్టరిలాగ, చిన్న రైతులాగ స్వంత యజమానులుగా ఉన్నప్పుడు వాళ్లతో కలిసి సమాజం మీద ఆధారపడి బతికే కొంతమంది ఉంటారు. వాళ్లు రైతు కూలీలు కావచ్చు. కథలోంచి చూస్తే కంపౌండర్లు, మందులిచ్చే ఫార్మసిస్టు, మంత్రసానిలాంటి నర్సు, ఆసుపత్రి శుభ్రం చేసే మనుషులు.. ఇలా  కనీసం ముగ్గురు నలుగురుంటారు. అది కొంచెం పెద్దది అయ్యి ఆసుపత్రిగా మారితే ఇంకొంచెం ఎక్కువమంది వుంటారు. వైద్యం నగరీకరణ అయ్యి, కేంద్రీకృతం అయిపోయిన  క్రమంలో వీళ్లంతా నిరుద్యోగులై పోయారు. ప్రభుత్వ రంగంలో చూస్తే ఇందాక మనం చెప్పుకున్న అంకెలు కేవలం డాక్టర్లకీ, కంపౌండర్లు, నర్సులు వగైరాల విషయంలో ఇవి చాలా దారుణంగా వున్నాయి.

ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయం ప్రకారం ప్రతి PHCలోనూ, డాక్టరు కాక పద్నాలుగుమంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నలుగురు డాక్టర్లు కాక ఇరవై ఒక్క మంది సిబ్బంది ఉండాలి. వాస్తవంలో వీటిలో ఒకరిద్దరు కూడా ఉండరు. అంటే సిబ్బంది కొరత ఏ స్థాయిలో వున్నదో ఆలొచించుకోవచ్చు. డాక్టర్లు లేరనే సాకు చూపించి సిబ్బందిని నియోగించకుండా చేతులు దులిపేసుకుంటున్న ప్రభుత్వం ఎంత నిరుద్యోగం పెంచుతోంది? పారిశ్రామిక సైన్యం ఎంత పెరిగింది? దయచేసి వెతకండి. కథలో డాక్టరుగారికి వీరిపట్ల ఏ బాధ్యతా లేదు. వైద్యం “నోబెల్ ప్రొఫెషన్”గా ఇంక ఎంత మాత్రమూ లేదన్న బాధే తప్ప కనీసం తన చుట్టూ వున్న వాళ్లెలా వున్నారన్న స్పృహ లేదు. వెయ్యి చిన్న క్లినిక్‌లని మింగి, ఏనుగులా నిలబడ్డ కార్పొరేట్ ఆసుపత్రి, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ పేరుతో వేలాదిమంది శ్రామికుల స్థానంలో యంత్రాల్ని, నలుగురు సిబ్బందినీ వుంచి తమ గుత్తాధిపత్యం వల్ల ధరలు విపరీతంగా పెంచి, మోసం, వంచన చేసి పేదల రక్తం పీలుస్తూ వుంటే డాక్టరు గారి వ్యక్తిగత దుఃఖాల పట్ల, ఆవిడ కొడుకు మొక్కలు పెంచుకోవడం పట్ల నాకేం సానుభూతి లేదు.

అయితే డాక్టర్లందరూ మనకి పనికి రాని వాళ్ళేనా? వాళ్లకీ మనకీ ఏం సంబంధం లేదా? అని ప్రశ్నించుకుంటే… వుత్పత్తిదారుడు (కథ విషయంలో డాక్టర్లు, కంపౌండర్లూ, నర్సులూ) వుత్పత్తి (కథలో ప్రజల ఆరోగ్యం) నుంచి వేరు పడే క్రమంలో వాస్తవానికి, డాక్టర్లు ఒక రకంగా పెటీ బూర్జువా (మధ్యవర్తులు)ల్లాంటివాళ్లు. పెట్టుబడి  పెరిగి పెరిగి గుత్త సంస్థలుగా మారే క్రమంలో (క్లినిక్ – నర్సింగ్ హోం – ఆసుపత్రి -మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్) ఈ పెటీ బూర్జువాలు నిస్సహాయులనీ అంటాడు ఒకాయన తన రాజ్యమూ -విప్లవమూ అనే  పుస్తకంలో. పెట్టుబడికి ఎదురొడ్డి పోరాడేది కార్మికులేనని స్పష్టం చేస్తాడు. మరి ఏ డాక్టర్లని మనం ఈ రకపు నిస్సహాయుల జాబితాలొ వేద్దాం. రకరకాల కారణాల వల్ల గ్రామాల్లో తమ ప్రాక్టీసు చేసుకుంటూనో, ప్రభుత్వ డాక్టర్లుగా పని చేస్తూనో వున్న వాళ్లని ఈ జాబితాలో వేస్తాం. అది బాగా ఉదారవాదమైనప్పటికీ ప్రస్తుతానికి ఉన్న స్థితిలో వీళ్లపట్ల మనం కొంత సానుభూతితో వుంటాం.

తమ సంపాదనని కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే డాక్టర్లని మనం గౌరవిస్తాం.

తప్పనిసరిగా, ఒక కొట్నీస్‌నో, ఒక రామనాధాన్నో అలాటి వాళ్లనో భుజాలకెత్తుకుంటాం.

విషయమేమిటంటే.

పోష్ కాలనీలో త్రీ బెడ్‌రూమ్  ఫ్లాట్‌లో వుండేవాళ్లని నేలమీద వుండే ప్రజలు కలుపుకుంటారా అని?

పెట్టుబడికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడేది శ్రామిక వర్గమే కాబట్టి, అది తప్పనిసరి కాబట్టి.. ఆ శ్రామిక ప్రజలు తమ నేల మీదకి ఎవర్ని రానిస్తారు? ఎవర్ని కలుపుకుంటారు? అన్నది. తమను గురించి  పట్టించుకోని వాళ్లని వాళ్లెందుకు తమలో కలుపుకోవాలి? ఈ పెటీ బూర్జువాల ఖాళీ సమయాల్లో వాళ్లకి ఒక రిలాక్సేషన్ సోర్స్‌గా తామెందుకు వుండాలి? అనుకోవచ్చు.

ఇంతకీ ఈ కథ ఇలా ఎందుకు తయారైంది? అనేది దృక్పధాల సమస్య మాట్లాడుకుందాం. కొంచెం ఆగండి.

కథ చెప్పిన విధానాన్ని చూస్తే శిల్పంగా పిలవబడేది స్థిరము కాదు. జఢము కాదు. తీరుబాటు సమాజంలో సాహిత్యానికి వర్తించే సూత్రాలు ప్రతి క్షణమూ పెట్టుబడికి యంత్రభూతముల కోరలు తోమే సమాజంలో ఎంత మాత్రమూ నప్పవు. సమయం తక్కువైన సమాజంలో డాక్టరుగారి జీవితం నుంచి చూసినా సరే, ఏ విషయమైనా క్లుప్తంగా చెప్పడం తప్పనిసరి అవుతుంది. నలభై పేజీల కథ ఆ మేరకి ఏం సాధిస్తుందన్నది ప్రశ్నార్ధకమే. నాలుగు తరాల జీవిత చరిత్ర వివరంగా విస్తరించుకొన్నప్పటికీ పాఠకుడికి కొత్తగా అందిన తెలివిడి ఏమీ వుండదు. చిన్న కథలో రాయబడ్డ ప్రతీ వాక్యమూ మరో వాక్యానికీ, మరీ ముఖ్యంగా కథాంశంగా పిలవబడే ప్రధాన విషయానికి పెనవేసుకుని పొవాలి. కేంద్రాన్ని బలపరిచేదిగా వుండాలి. కథలో ఈ అంశం ఎంత మాత్రమూ కనబడదు. ప్రజల(జీవితం)తో సంబంధం పోగొట్టుకున్న మనవడి ముత్తాతకీ, తాతకీ ప్రజలతో సంబంధం లేదా? తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంబంధం తోటే వున్నారే! మరి ఆ జీవితాలన్నీ అంత వివరంగా ప్రస్తావించడం ఎందుకు? అదేం కాదు. ముత్తాత సంగీతము, తాత మొక్కల పెంపకం ఇలా కేవలం విశ్రాంతి అనేదే ప్రధాన విషయం. అంటే కథ నేలమీద కాకుండా పూర్తిగా గాలిలో పుట్టినట్టే. ఫ్యూడల్ సంస్కృతిలోముత్తాత, పెత్తందారీ సంస్కృతిలో తాత ఎంతో విశ్రాంతిగా బతికారనుకోవడం, కలలూ, ఆనందాలూ ఆస్వాదించారనీ రాయడం వాస్తవానికి ఎంత దగ్గరగా వున్నది? పైగా కథకి అక్షరాలుగా చెప్పబడే ఏకసూత్రత, అనుభూతి ఐక్యత ఎలా సాధించినట్టు? చదువుతున్నంత సేపూ పరస్పర విరుద్ధ భావాల్ని కలుగచేసే కథ శిల్పం పరంగా వుత్తమంగా వుందని అనలేం.

మూడవ భాగం

 

ఇంతకీ ఈ కథ ఎందుకిలా తయారైంది అని మనం ప్రశ్నించుకొంటే, చాలా మాట్లాడుకోవాలి గానీ క్లుప్తత కోసం మూడు విషయాలకి పరిమితం అవుదాం.

మొదటిగా రచన ప్రయోజనం చూద్దాం. ఈ రచనకి పూనుకొన్నప్పుడు రచయిత ఆశించిన ప్రయోజనం ఏమిటి? సంపాదన వేటలో మనుషులు ఒత్తిళ్లకి లోనవుతున్నారనీ, అందువల్ల  పిల్లలు సమాజానికి దూరమైపోతున్నారనే. దీనికి విరుగుడుగా  రచయిత సూచించినది పిల్లల్ని కొంత ప్రజా  జీవితానికి దగ్గరగా పెంచాలని. కానీ  ఈ ప్రయోజనాన్ని ఈ కథ సాధించిందనీ, ఈ సందేశాన్ని  బలంగా వినిపించగలిగిందనీ చెప్పలేం. కథని “రసవత్తరంగా” చెప్పాలనే ఉత్సాహమూ, రహస్య ఆకాంక్షలూ కథ ప్రయోజనాన్ని సున్నా చుట్టేశాయి. డాక్టరుగారి ప్రవర్తన వర్ణనా, నైటీలూ, పెదవులూ, ఆకర్షణా, కిసుక్కుమని నవ్వడాలూ, తనలో తనే మురిసిపోవడాలూ, వగైరాలకీ కథ నడకకీ ఏమీ సంబంధం లేదు. “ఏదో” “ఏదో” జరగబోతోందన్న ఉత్కంఠని పాఠకుల్లో లేవనెత్తి కథని చదివించే ప్రయత్నం కథ ప్రయోజనానికి సరిపడదు. ఇదంతా కథని “రసవత్తరంగా”నడిపి చివరికి కథారచన రచయిత ప్రతిష్టలో భాగమైపోతుంది. సంపాదన వేటకి ఫలితం ఒత్తిళ్లు అని గుర్తించిన కధ ఆ సంపాదన వేటకి మూలాల్ని గుర్తించలేక పోయింది. ఉత్పత్తి విధానం పెట్టుబడిదారీ విధానం కావడంతో ప్రజల ఆరోగ్యం కూడా “సరుకు”గా మారి వ్యాపార సూత్రాలకు లోబడి పోటీ, లాభం అనే అంశాలు మానవ జీవితాలకు నిర్ణాయక శక్తులుగా వున్నాయనీ కథ స్పష్టం చెయ్యగలిగి వుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరేది. శ్రామికుల జీతాల్నీ, పని గంటల్నీ పోటీ నిర్ణయిస్తుందన్న మార్క్స్ వాక్యం (Pre -Capital formation  అన్న నోట్సులో) ఒక్కటి చాలు కథని ప్రయోజనా పూర్వకంగా మలచడానికి. ఒక రచయిత తాను చూసిన విషయాన్ని కథగా రాసే ముందు చెయ్యవలసిన  అధ్యయనం ప్రాముఖ్యాన్నీ, ఆ అధ్యయనం లేకపోతే కలిగే అనర్ధాన్నీ చెప్పటానికే ఇదంతా రాసాను. మనం చూసిందే రాయాలంటే  సాహిత్యం అవసరం.  ప్రయోజనం పెద్దగా వుండదు. మనం చూసిన విషయాలు అందరూ చూస్తున్నారు. కొందరు రోజూ చూస్తున్నారు. సమస్య ఏంటంటే  చూస్తున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అనేదే.. ఆ సమస్యే సాహిత్య ప్రయోజనం. వాస్తవానికీ, వాస్తవికతకీ వున్న తేడా అదే. కనిపించింది చెప్పేవాడు వ్యాఖ్యాత. కనిపించనిది విప్పి చెప్పేవాడు రచయిత.

ఒక వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడూ  అన్నది అతని దృక్పధమనీ, తన దృక్పధాన్ని పాఠకుల్తో పంచుకోవడం ద్వారా వాళ్లని ప్రభావితం చేసే ప్రయత్నమే సాహిత్య ప్రక్రియ అనీ మనం అంగీకరిస్తే ఒక రచన ప్రతిఫలించిన సంస్కారం ద్వారా రచయిత దృక్పధాన్ని నిర్ణయించవచ్చు. ఈ కథ చదివిన తర్వాత పాఠకుల్లో కలిగే భావాలేమిటి? రచయిత ఆశయము, ప్రయత్నమూ ఏదైనా కావొచ్చు కానీ పాఠకుల్లో డాక్టరుగారి పట్లా, పిల్లవాడి  పట్లా ఒక రకమైన సానుభూతి కలుగుతూంది. అయ్యో ఎన్ని కష్టాలు పడుతున్నదిరా అనిపిస్తుంది. అలాగే పిల్లవాడి పట్ల కూడా.. దీనిలోని అపసవ్యత గురించి పైన మనం మాట్లాడుకున్నాం.

ముత్తాత సంగీతంలోనూ, తాత మొక్కల్లోనూ “ఆనందం”పొందారని రాయడం పెత్తందారీ సమాజాలకి లేని మంచి తనాన్ని ఆపాదిస్తుంది. అప్పటి మంగళ్ల వాయిద్యాన్ని “సంగీతం”గా ఎవరూ గుర్తించలేదు. అది పొట్టకూటికి చేసే మరో విద్యే. సా.పా.సా అని సాగతీసి పాడే “శాస్త్రీయ” సంగీతకారులకి “మేళం”గా పిలవబడే మంగళ్లకు  దొరికే గౌరవం,స్థానం ఒకేలా, పోనీ కనీసం కుడి ఎడమలుగా వున్నాయా?

గ్రామంలో వైద్యం చేసి పొట్ట పోసుకున్న తాత, నిచ్చెన మెట్ల  సమాజంలో పై మెట్టుకి ఎగబాకే ప్రయత్నమే చేశాడు గానీ, ప్రజల జీవితంలోని హెచ్చుతగ్గుల్ని సరిచేసే సంస్కారం ఏమీ ప్రయత్నించలేదు. “ముందుగా మీ వాడిలో ఏమైనా వుందేమో చూడండి” అన్న కథకుడు గానీ, తన తాత తండ్రుల సంగీత సాధనని వైనవైనాలుగా వర్ణించిన డాక్టరుగారు గానీ సంగీతం, విద్య వగైరా అనువంశికాలనీ, దైవదత్తాలనీ, పూర్వజన్మ సుకృతాలనీ ప్రచారం చేసే బ్రాహ్మణీయ భావజాలానికి భిన్నంగా ఆలోచించలేదు.

గతంలో  ప్రజలు విశ్రాంతిగా, కళాత్మకంగా జీవించేరు, ఆనందించేరు. ఇప్పటి స్పీడు( ఉసూరుమనిపిస్తుందండీ) దాన్ని దూరం చేసిందన్న భావం ఎవరికైనా కలిగే అవకాశం వున్నది. అది మనల్ని వ్యక్తిగతంలోకి, భూస్వామ్య,  పెత్తందారీ సంస్కృతి (దేవరా!) వైపూ, ఆ శిధిల సమాజం వైపూ ఆశగా చూసేటట్టు చేస్తే ఆ తప్పెవరిది?

కథ చెప్పిన విధానాన్ని చూస్తే శిల్పంగా పిలవబడేది స్థిరము కాదు. జఢము కాదు. తీరుబాటు సమాజంలో సాహిత్యానికి వర్తించే సూత్రాలు ప్రతి క్షణమూ  పెట్టుబడికి యంత్రభూతముల కోరలు తోమే సమాజంలో ఎంత మాత్రమూ నప్పవు. సమయం తక్కువైన సమాజంలో డాక్టరుగారి జీవితం నుంచి చూసినా సరే, ఏ విషయమైనా క్లుప్తంగా చెప్పడం తప్పనిసరి అవుతుంది. నలభై పేజీల కథ ఆ మేరకి ఏం సాధిస్తుందన్నది ప్రశ్నార్ధకమే. నాలుగు తరాల జీవిత చరిత్ర వివరంగా విస్తరించుకొన్నప్పటికీ  పాఠకుడికి కొత్తగా అందిన తెలివిడి ఏమీ వుండదు. చిన్న కథలో రాయబడ్డ ప్రతీ వాక్యమూ మరో వాక్యానికీ, మరీ ముఖ్యంగా కథాంశంగా పిలవబడే ప్రధాన విషయానికి పెనవేసుకుని పొవాలి. కేంద్రాన్ని బలపరిచేదిగా వుండాలి. కథలో ఈ అంశం ఎంత మాత్రమూ కనబడదు. ప్రజల(జీవితం)తో సంబంధం పోగొట్టుకున్న మనవడి ముత్తాతకీ, తాతకీ  ప్రజలతో సంబంధం లేదా? తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంబంధం తోటే వున్నారే! మరి ఆ జీవితాలన్నీ అంత వివరంగా ప్రస్తావించడం ఎందుకు? అదేం కాదు. ముత్తాత సంగీతము, తాత మొక్కల పెంపకం ఇలా కేవలం విశ్రాంతి అనేదే ప్రధాన విషయం. అంటే కథ నేలమీద కాకుండా పూర్తిగా గాలిలో పుట్టినట్టే. ఫ్యూడల్ సంస్కృతిలోముత్తాత, పెత్తందారీ సంస్కృతిలో  తాత ఎంతో విశ్రాంతిగా బతికారనుకోవడం, కలలూ, ఆనందాలూ ఆస్వాదించారనీ రాయడం వాస్తవానికి ఎంత దగ్గరగా వున్నది? పైగా కథకి  అక్షరాలుగా చెప్పబడే ఏకసూత్రత, అనుభూతి ఐక్యత ఎలా సాధించినట్టు?  చదువుతున్నంత సేపూ పరస్పర విరుద్ధ భావాల్ని కలుగచేసే కథ శిల్పం పరంగా  వుత్తమంగా వుందని అనలేం.

సంభాషణల రూపంలోనూ, మారే దృశ్యాలతోనూ, పరిపుష్టమైన పాత్రలతోనూ నడిచే కథ కళాత్మకతను సంతరించుకుంటుంది. డాక్టరుగారి అంతులేని వుపన్యాసంతోనూ, రకరకాలుగా ప్రవర్తించే  పాత్రలతోనూ సాగిన కథ కళావిలువలుగా పిలువబడే సౌష్టవానికి చాలా దూరంలోనే వుండిపోయింది.

పాత్రల చిత్రణ, కథా సంవిధానం, నాటకీయత వగైరా ఎన్నో విషయాలు గురించి మరోసారి ఎప్పుడైనా మాట్లాడదాం.

ధ్యానం

chinnakatha

చిన్నప్పుడు మా పక్కింట్లో బిఎస్సీ విద్యార్థి ఒకతను ఉండేవాడు. ‘అన్నయ్యా, అన్నయ్యా’ అంటూ చుట్టుపక్కల పిల్లలమందరం అతని వెనకాల తిరుగుతుండే వాళ్ళం.

ప్రతి ఆదివారం సాయంత్రం అన్నయ్య మమ్మల్నందర్నీ మా ఊరిని ఆనుకుని ప్రవహిస్తున్న యేటి ఒడ్డుకు తీసుకెళ్ళేవాడు. అక్కడ ఇసుకలో పిల్లమూకనంతా చుట్టూ కూర్చోపెట్టుకుని సైన్సుపాఠాలు, నోటిలెక్కలు, పొడుపుకథలు, వాళ్ళ కాలేజీ విశేషాలు చెప్తుండేవాడు.

ఉన్నంటుండి ఒకరోజు “అందరూ మాట్లాడకుండా పద్మాసనంలో కూర్చుని ధ్యానం చెయ్యండి. రోజూ కాసేపు ధ్యానం చేస్తే తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. బాగా చదివుకో గలుగుతారు” అన్నాడు అన్నయ్య.

“ధ్యానం అంటే ఏంటి?” అని అడిగాడొక పిల్లాడు.

“మెడిటేషన్” అన్నాడు అన్నయ్య.

“మెడిటేషనంటే?” అడిగిందింకో పిల్ల.

“ధ్యానం” అన్నాడో కొంటె పిల్లాడు.

అన్నయ్య వాడివైపు ప్రశాంతంగా ఒక చూపు వేసి “నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని కూర్చోవడం” అని చెప్పాడు. అందరం ఏం మాట్లాడకుండా ‘అన్నయ్య ఎప్పుడు కళ్ళు తెరవమంటాడా’ అని ఎదురుచూస్తూ కళ్ళుమూసుక్కూర్చున్నాం.

మళ్ళీ ఆదివారం అన్నయ్య మమ్మల్ని ఏటి ఒడ్డుకు తీసుకెళ్ళేలోపల మేం ఏ ఇద్దరం ఎప్పుడు కలిసినా ‘ధ్యానం చేసినప్పుడు ఎవరికి ఏం ఆలోచనలు వచ్చాయి?’ అన్న విషయమే మాట్లాడుకున్నాం. ఏతావాతా తేలిందేంటంటే ఒకడు అమ్మ చేసి దాచిపెట్టిన అరిసెలు అమ్మకు తెలీకుండా ఎట్లా తినాలా అని ఆలోచిస్తే, ఇంకొకడు మాయచేసి తన హోంవర్కు అక్కచేత ఎట్లా చేయించాలా అని ఆలోచించాడు. ఒక అమ్మాయి అమ్మ చెప్పే పని ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తే, ఇంకో అమ్మాయి తెల్లవారుజామున లేచి చదువుతున్నట్టుగా నటిస్తూ ఎట్లా నిద్రపోవాలా అని ఆలోచించింది.

అన్నయ్య మా ఊళ్ళో చదివు అయిపోయి పై చదువులకు వెళ్ళిపోయాక మా ఏటి ఒడ్డు సమావేశాలు ఆగిపోయాయి. మిగతావాళ్ళంతా ఏం చేశారో నాకు తెలీదుగానీ నేను మాత్రం ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పించుకున్నాను.

కాలక్రమంలో ‘మెడిటేషన్’, ‘ధ్యానం’ అన్న పదాలు కనిపించిన ప్రతి పుస్తకం చదివేశాను కానీ ధ్యానమగ్నురాలిని కాలేకపోయాను.

ఆమధెప్పుడో మా ఊళ్ళో యోగా తరగతులు పెడుతున్నారనీ, ధ్యానం చెయ్యడం నేర్పిస్తారనీ తెలిసి ఆ తరగతులకి వెళ్ళాలని తెగ ఆరాటపడిపోయి, నన్ను చేర్చుకుంటారో లేదో అని కంగారుపడిపోయి, నానాతిప్పలూపడి సీటు సంపాదించి, అష్టకష్టాలూపడి కోర్సు పూర్తిచేశాక నాకర్థమైందేంటంటే అన్నయ్య ధ్యానం చెయ్యమన్నప్పుడు పిల్లలంతా కళ్ళు మూసుక్కూర్చుని చేసిన వెర్రిమొర్రి ఆలోచనలనే ధ్యానం అంటారని.

‘అయ్యో! అన్నయ్య చెప్పిన ప్రకారం మానకుండా ధ్యానం చేస్తూ ఉండుంటే పాతికేళ్ళనుంచి నేను ధ్యానం చేస్తున్నానని గొప్పగా చెప్పుకునేదాన్ని కదా’ అని కాసేపు బాధపడి, ‘సరే! అయిపోయిందేదో అయిపోయింది. యోగా తరగతుల్లో నేర్చుకున్న ధ్యానాన్ని మాత్రం వదలకూడదు’ అని నిశ్చయించుకున్నాను. అట్లా మనసులో వచ్చే ఆలోచనలని గమనిస్తూ కూర్చుంటే కాసేపటికి ఆలోచనలు ఆగిపోతునాయి. ‘అబ్బో! నేను ధ్యానం చెయ్యగలుగుతున్నాను ‘ అని సంతోషించేలోపల నాకు తెలిసిందేమిటంటే ధ్యానం చేస్తున్నాను అనుకుంటూ నేను కూర్చుని నిద్ర పోతున్నానని.

‘కూర్చుని నిద్రపోవడమేంటి ఛండాలంగా, హాయిగా పడుకుని నిద్రపోక’ అనుకుని ఆ ధ్యానాన్ని వదిలేశాక ఏ సంస్థ ధ్యానతరగతుల్ని నిర్వహించినా వెళ్ళడం, ‘ఇది నాకు కుదిరేది కాదు’ అనుకుని వదిలెయ్యడం నాకు అలవాటైపోయింది.

ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ‘స్కూల్ ఆఫ్ యోగా’ వాళ్ళ ధ్యానశిక్షణకి వెళ్ళబోతూ ‘ఇదే ఆఖరు, ఎట్లాగైనా దీన్ని సాధించాలి’ అని స్థిరంగా నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టుగానే మొదటి రెండు రోజులు చాలా ఆసక్తికరంగా సాగిన శిక్షణ చివరిదైన మూడోరోజుకు చేరుకుంది. ఆరోజు పైనుంచి పెద్దగురువుగారు వచ్చారు ఉపన్యాసం ఇవ్వడానికి.

“ఆధ్యాత్మికత అంటే ఏమిటి?” అన్న ప్రశ్నతో క్లాసు మొదలయింది.

ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా సమాధానం చెప్పారు. ఆధ్యాత్మికత అన్న పదానికి చాలా నిర్వచనాలే వచ్చాయి కానీ గురువుగారికి ఏదీ నచ్చినట్టు లేదు. ఎవరేం చెప్పినా గురువుగారు “ఇంకా…ఇంకా…” అని అడుగుతూనే ఉన్నారు. ఇంకేం సమాధానాలు రాని దశ వచ్చాక ఒక పదేళ్ళ అమ్మాయి లేచి నిలబడింది.

ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లల్ని “మీలా మా కాలంలో మేం టీవీ లెరుగుదుమా? కంప్యూట ర్లెరుగుదుమా? సెల్ ఫోన్లెరుగుదుమా?” అంటూ సాధించే లిస్టుకి యోగాక్లాసుల్ని కూడా కలపాలని నిర్ణయించుకున్నా న్నేను ఆ పిల్లని చూశాక.

“మగవాళ్ళయితే కాషాయబట్టలు కట్టుకుని, గడ్డాలూ, మీసాలూ పెంచుకోవడం, ఆడవాళ్ళైతే కాసంత బొట్టు పెట్టుకుని, పట్టుచీరలు కట్టుకోవడాన్ని ఆధ్యాత్మికత అంటారు” అని చెప్పిందా అమ్మాయి.

ఆ మాటలకి ఉలిక్కిపడ్డ జనం గట్టిగా నవ్వడానికి భయపడి మూతులకి చేతులు అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళని కళ్ళతోనే వారించి గురువుగారు ఆప్యాయంగా ఆ అమ్మాయి తల నిమురుతూ “అట్లా చెప్పావేంటమ్మా? నీ కెందు కట్లా అనిపించింది?” అని అడిగారు.

దానికా అమ్మాయి “టీవీల్లో అటువంటి వేషాల్తో కనిపించే వాళ్ళని ఆధ్యాత్మిక గురువులు అంటారు కదండీ! అందుకే అట్లా చెప్పాను” అందా అమ్మాయి.

తలకాయ అడ్డంగా ఊపి గురువుగారు అరమోడ్పు కన్నులతో “ఆధిదైన ఆత్మయొక్క కతే ఆధ్యాత్మికత” అంతూ ఎవ్వరికీ అర్థం కాని ఒక విచిత్రమైన నిర్వచనం ఇచ్చారు.

“ఆధి అంటే ఎవరండీ?” అని అడిగిందా అమ్మాయి.

గురువుగారు ఆ అమ్మాయిని కూర్చోమన్నట్టు సైగచేసి “టైం చాలా అయింది. ఇంకా మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

ముందు అందరూ ఒక అరగంట ధ్యానం చెయ్యండి” అన్నారు.

కళ్ళు మూసుకుని ‘ఆధ్యాత్మికత’ అన్న పదానికి నాదైన నిర్వచనం తయారుచెయ్యలనుకున్నాను కానీ నా వల్లకాక ‘గురువుగారు తొందరగా కళ్ళు తెరవమంటే బాగుండు’ అనుకుంటూ కూర్చున్నాను.

ఎట్టకేలకు గురువుగారికి దయకలిగి “అందరూ మెల్లగా కళ్ళు తెరవండి” అన్నారు. ‘అమ్మయ్య’ అనుకుని కళ్ళు తెరిచి, ‘ఇంక ఇంటికెళ్ళండి’ అని ఎప్పుడంటారా అని ఎదురుచూస్తున్నాను.

“ఇప్పుడొక ముఖ్యమైన విషయం చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి” అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు. “రాజధాని నగర పొలిమేరల్లో మనం ఒక పెద్ద ధ్యాన కేంద్రాన్ని నిర్మించుకో బోతున్నాం. ధ్యాను లెవరైనా అక్కడ ధ్యానసాధన చేసుకోవచ్చు. పదివేలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు డార్మిటరీలలో ఉండే అవకాశం పొందుతారు. లక్ష రూపాయలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు ప్రత్యేకగది వసతి కల్పిస్తాం. దూరప్రాంతాలనుంచి కానీ, విదేశాలనుంచి కానీ ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళకి రోజుకు వెయ్యి రూపాయల చెల్లింపుమీద ఎన్నిరోజులైనా ఉండడానికి వీలుగా అన్ని వసతులతో కాటేజీలు కట్టిస్తున్నాం. ధ్యానకేంద్ర నిర్వాహకులు నడిపే భోజన ఫలహారశాల లుంటాయి. చేతనయినవా ళ్ళెవరైనా హోటళ్ళు పెట్టుకుని నడుపుకోవచ్చు.ధ్యానకేంద్రం పరిసరాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ళస్థలాలు దొరుకుతున్నాయి. అవి కొనుక్కుని ఇల్లు కట్టుకో గలిగితే అంతకంటే అదృష్టం మరొకటుండదు. శాశ్వతంగా అక్కడే ఉండిపోయి ధ్యానంలోని మాధుర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు. ధ్యానంలో ఆసక్తి ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు ఈ విషయాలు చెప్పి మన ధ్యానకేంద్రం అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడండి…” గురువుగారి ఉపన్యాసం కొనసాగుతోంది కానీ అక్కడితో నా బుర్ర పనిచెయ్యడం మానేసింది.

‘ఇకమీదట ఏ ధ్యానశిక్షణ తరగతులకి వెళ్ళకూడ’దని గట్టిగా ఒట్టు పెట్టుకుని అక్కడినుంచి బయటపడ్డాను.

Jyothi–పాలపర్తి జ్యోతిష్మతి

 

కురూపి భార్య: చిన్న కథలో ఎన్ని కోణాలు!?


KODAVATIGANTI-KUTUMBARAO
కురూపి భార్యలో కథకుడి (అంటే తన కథ చెప్పుకున్నతనే) టోన్ నీ, నాటి సాంఘిక వాస్తవికతని వాచ్యంగా చెప్పిన దాని వెనక ఉన్న వ్యంగ్యాన్నీ అర్థం చేసుకోకపోతే కథ ప్రయోజనం నెరవేరలేదన్నమాటే. మామూలు మనుషుల మనసుల్లో సంఘం చేత ప్రోది చెయ్యబడ్డ (implant చేసి పెంచబడ్డ) కుహనా విలువలూ, మానవ సంబంధాలలో (ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య) ప్రేమరాహిత్యం, డొల్లతనమూవాటి పరిణామంగా హృదయాలు పూర్తిగాఎండిపోయిఅసూయా క్రౌర్యాలతో విరుచుకుపడటమూ (సంఘం ఏర్పాటు చేసినకట్లని ఎవరెపుడు కొంచెం వదులు చేసుకోవాలని ప్రయత్నించినా) – ఇవన్నీ చిన్న కథలో ఇమడ్చగలిగాడు కొ.కు.

నాటి పెళ్ళిళ్ళన్నీరాసిపెట్టినవేస్నేహం, ప్రేమ అనేదాని అర్థంతో కానీ అవగాహనతో కాని సంబంధం లేకుండా (బహుశా నాటికీనేమో!). అలా వచ్చి పడ్డ సంబంధాలలోనే ప్రకృతి సహజమైన సుఖం వెతుక్కునేఅల్పసంతోషిఅయిన కథకుడి మెదడులో అందచందాలకున్న ప్రాముఖ్యాన్ని చొప్పించింది సంఘం. ఆమెతో కాపురం చెయ్యడానికి అతనికి ఉన్న అభ్యంతరంఅతనిలోని సహజ ప్రకృతికీ, సంఘం తయారు చేసిన అతనిఅభిప్రాయానికీజరిగిన సంఘర్షణలోంచి వచ్చిందే. కథకుడు కూడా (మనందరిలాగే) సంఘంలోని మామూలు మనిషి. కురూపి భార్య చనిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకునే వీలు గురించి ఆలోచించడమూ, కురూపి భార్యతో ఎటువంటి స్నేహభావం పనికి రాదన్న తీర్మానమూ, కాటుక రంగుని చర్మం రంగుతో సమానం చేసినోరుజారడమూ” – ఇవన్నీ దీన్నే సూచిస్తాయి. కానీ అతనికి కూడా ఎక్కడో (మనలాగే) చటా్రల నించి బయట పడాలనే జిజ్ఞాసా, స్పందించే హృదయమూ (ఒక్కసారిగా అన్నీ మర్చిపోయిఎందుకు ఏడుస్తున్నావు?” అని అడగడం) ఉన్నాయి. అందువల్లనే అతనిలోని ప్రేమని వెలికి తెచ్చుకోగలిగాడు. “కురూపి అయిన భార్య మీద ప్రేమ చూపించరాదుఅన్న అభ్యంతరాన్ని దాటినాక (ఇక్కడ కూడా కొ.కు అతనిని idealise చేయకుండాకోకిల కంఠస్వరాన్నీ, అందమైన జుట్టునీ ఇంకా అంతకన్నా ముఖ్యం ఆమెలో ఉన్న స్నేహాన్ని, ప్రేమని చిత్రించారు balance tilt అవడానికి) కూడా సంఘం అతన్ని వదల్లేదు. ఇంకో రకం గా చెప్పాలంటే సంఘం చేత ప్రభావితమయ్యే లేత, బలహీనమైన మనసు అతన్ని పట్టుకొని పీడిస్తూనే ఉంది.

దీన్నించి బయట పడటానకి కొంత గడుసుగా ప్రయత్నించినట్లున్నాడు ( నాలుగు రోజులూ ఏదో విధంగా గడిచిపోనివ్వమనికోప్పడటమూ“, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకో అందగత్తె దొరక్కపోతుందా అని భార్యని ఏడిపించడమూ వగైరా) కానీ ఫలితం లేకపోగా చుట్టూ ఉన్న వాళ్ళు భార్య పట్ల స్నేహాన్నీ, ప్రేమనీపశుకామంగా పరిగణించి హేళన చెయ్యడం మొదలుపెట్టారు.

 

సంఘం ఏర్పాటు చేసిన ప్రమాణాలు లేని రూపం ఉన్నవాళ్ళతో (అందునా భార్యతో) స్నేహంగా, ప్రేమగా ఉండటం అనేవి ఆనాటి సాంఘిక పరిస్థితులలో ఊహించడానికి కూడా కష్టమేనేమో చాలా మందికి!

 

ప్రపంచం లోని విషయాలన్నీ తమ అవగాహనకే లోబడి ప్రవర్తించాలనుకునే కుహనా శాస్త్రవాదులు (మేనమామ కొడుకు) చెప్పినది (మరొక స్తీ్రని ఎరుగని కారణం చేతనే పశుకామం కొనసాగుతుందనడం) కథకుడికి సహించరానిదయింది.

 

తన జీవితాన్ని వెలిగిస్తున్న భార్య సాహచర్యమూ, తాము ఎంతో తమకంగా అనుభవిస్తున్న ప్రేమానుభవాలూ (కళ్ళతో మాట్లాడటం, భార్య తన కంటి భాష కోసం వెతకడం, ఒళ్ళు జిల్లుమనడం, ముక్కుతో చక్కిలిగింతలూ); ఇవన్నీ కాక తన అనాకారితనం వల్ల భర్తకు కలుగుతున్న తక్కువతనాన్ని తల్చుకొని ఆమె పడే బాధవీటి వల్ల కథకుడికి తన భార్య మీద ఉన్న ప్రేమ ద్విగుణీకృతం అవుతున్నది ఒక పక్క.

ఇంకో పక్క సంఘం ఇదికేవలం పశుకామమేఅని నిర్థరిస్తున్నది. సమస్యని తెగ్గొట్టడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఇంకో ఆడదాని పొందుని రుచి చూసి తేల్చుకోవడంఅప్పటికీ తన భార్య పట్ల తనకున్న సంబంధం లో మార్పు రాకపోతే అదికేవలం కామంకానట్లే.


కథకుడు ఇంకొక స్త్రీతో  సంబంధం పెట్టుకోకుండా, తనకు భార్యకు మధ్యలో ఉన్న అనురాగం (కథకుడి మాటల్లోనువ్వు కూడా చక్కని దానివేనని“) నిజమేనని తేల్చుకోలేడు. అందుకనే అలా చెయ్యాల్సొచ్చింది.

 

కథకుడిని నవమన్మధుడిగా వర్ణించడం కొ.కు శిల్పం లోని నేర్పు. సంఘటన (ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం అనేది) సులువుగా జరగడానికి వీలుగానే ఇలా కథకుడిని నవమన్మధుడిగా చిత్రించారనిపిస్తుంది.

 – రాధ మండువ

కథకి లింక్  http://ramojifoundation.org/flipbook/201402/magazine.html#/54

అతడు – ఆమె – ఓ బొల్లిగిత్త !

కేశవరెడ్డి మేజిక్‌ రియలిజమ్‌

ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు? మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే. మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

   తెలుగులో రచనని, సామాజిక మార్పుకోసం ఒక పరికరంగా మార్చుకున్న సృజనకారులలో కేశవరెడ్డి ప్రముఖుడు. అధోజగత్‌ సహోదరుల వ్యదార్ధ జీవితాఇన్న కేశవరెడ్డి ఎన్నో నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు. కేశవరెడ్డి తాజా నవల ‘మునెమ్మ’ మిగతా నవలల కంటే కొంత భిన్నమయినది. సహజంగానే కేశవరెడ్డి రచనలలో విజువల్‌ ఇమేజ్‌ ఎక్కువ. దీనికి మేజిక్‌ రియలిజమ్‌ కలగలవడంతో, మునెమ్మ ఒక అద్భుతమయిన పఠన, దృశ్య కావ్యంగా మారింది.
శైలి, శిల్పము, వస్తువు ఈ మూడూ పడుగు పేకల్లా కలిసిపోతేనే ఏ రచనకయినా జవమూ, జీవమూ! ఈ మూడిరటిలో ఏది బ్యాలెన్స్‌ తప్పినా రచనలో ఏదో లోపించినట్లుగా వుండి పాఠకుడికి మేధోపరమయిన అసంతృప్తి ఏర్పడుతుంది.
అసలు రచన అంటే ఏమిటి? రచయిత స్థల కాలాలకి అతీతుడా లాంటి ప్రశ్నల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎవరయినా రచన జీవితానికి రెండో వైపు అని చెప్పగలరు. ‘మునెమ్మ’లో కేశవరెడ్డి చూపిస్తున్న ‘రెండో వైపు’ ఎలా వుందో పరిశీలించడమే ఈ వ్యాసం.
‘‘స్థలకాల బద్దుడయిన సామాజిక వ్యక్తి కాకుండా రచయిత రచన చేయలేడు. అందుకనే రచయిత వ్యక్తిగానే రచన చేస్తున్నట్టు కనిపించినా సమిష్టి జీవితపు వేళ్ళు లేకుండా రచనా వృక్షం మొలకెత్తడానికి కూడా అవకాశం లేదు. రచయిత చుట్టూ వున్న సామాజిక జీవితం రచయిత మెదడులో ఆవేశ భావ రూపాల స్థితని పొంది క్రమబద్ధంగా రూపొందుతుంది. ఈ క్రమాన్నే సృష్టి అంటాం. మనిషి అంతరింద్రియ వ్యాపార క్రమాలకు, సామాజిక క్రమాలకు వుండే సంబంధం అవగాహన చేసుకోకపోవడం వలన సాహిత్య సృజన విషయంలో అనేక తప్పుడు అభిప్రాయాలు ప్రపంచానికి వచ్చాయి’’
ఇది కేశవరెడ్డి ‘‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’’ నవలకు ముందు మాట రాస్తూ త్రిపురనేని మధుసూధనరావు వెలిబుచ్చిన అభిప్రాయం. ఆయన యింకా యిలా అంటున్నారు.
‘‘ మానవులు తమ సంకల్ప శక్తితో తమ యిష్టం వచ్చినట్టు మానవ సంబంధాలు పెట్టుకుంటారా? అలాగే కనిపించవచ్చు కానీ అది వాస్తవం కాదు. చచ్చిపోయిన వాళ్ళతో కానీ, పుట్టబోయే వాళ్ళతో కాని మానవులు యిష్టం వున్నా సంబంధం పెట్టుకోవడం కనీసం ప్రస్తుతానికి సాధ్యం కాదు. జీవించే వ్యక్తుల మధ్యన సంబంధాలు వుంటాయనేది వుల్లంఘించడానికి వీల్లేని సత్యం. ఎప్పుడో చచ్చిపోయిన ముత్తాతతో ముని మనుమడు సంబంధం పెట్టుకున్నట్టు ఎవరయినా రాయెచ్చు.

చచ్చిపోయిన తన పెళ్ళాం ఎక్కడో పుట్టి వయసొచ్చి ఏ బస్సులోనో కనపడినట్టు పూర్వజన్మ స్మృతితో ఆ పిల్ల ముసలాడిని పట్టుకుని నువ్వే నా మొగుడివి వదలను గాక వదలను అన్నట్టు రాయెచ్చు. కానీ అది నవల కాదు. అవి మానవ సంబంధాలు కావు. అది పురాణం, ఆ సంబంధాలు భ్రమాజనితాలు. భ్రమలకు కూడ పరిమితులుంటాయి. మానవ సంబంధాలను పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ఠ రూపంలోనే పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ట రూపంలోనే పెట్టుకోగలుగుతారు. ఆ సంబంధాలు స్థల కాల మార్పులకు ఆధీనంగా వుండలవసిందే’’.

munemma
మునెమ్మ నవలలో స్థలము, కాలము రెండు వున్నాయి. రచయితకు మాత్రమే కాలిక స్పృహ లోపించింది. అయితే కేశవరెడ్డి తన కధన చాతుర్యంతో ఏ అంశాన్నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. ‘అతడు అడవిని జయించాడు’, ‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’, ‘మూగవాని పిల్లనగ్రోవి’, ‘మునెమ్మ’ ఇలా ఏ నవల నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. పాఠకుడి తను చదువుతున్నది వాస్తవమా, పురాణమా అన్న సంశయం కలుగుతూ వుంటుంది పదే పదే. మూగవాని పిల్లనగ్రోవి నవలలో బక్కిరెడ్డి చనిపోయినప్పుడు ప్రకృతి యావత్తు భోరు భోరుమని విలపించడమూ, మునెమ్మలో తరుగులోడిని సంహరించే సన్నివేశంలో బొల్లిగిత్త ఎవరెవరికి ఎలా ఎలా కనిపించింది అన్న సన్నివేశాన్ని చిత్రీకరించడం లాంటి లక్షణాలు కేశవరెడ్డి కధనాపటిమకు మెచ్చుతునకలు.
మేజిక్‌ రియలిజమ్‌ తోడ్పాటుతో కేశవరెడ్డిలోని ఈ లక్షణం మునెమ్మలో తారాస్థాయిని అందుకుంది. గాబ్రయేల్‌ గార్షియా మార్కుజ్‌ లాంటి నోబుల్‌ బహుమతి గ్రహీతలు తమ భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించలేని వ్యవస్థలో మేజిక్‌ రియలిజమ్‌ మాటున దాక్కున్నారు. తెలుగులో మేజిక్‌ రియలిజమ్‌ కొత్తదేమీ కాదు. మునిపల్లె రాజు మేజిక్‌ రియలిజమ్‌ కథల పేరుతో ఒక కథా సంపుటాన్నే ప్రచురించాడు. వి. చంద్రశేఖరరావు చాలా కథలలో మేజిక్‌ రియలిజమ్‌ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మునిపల్లె రాజులో మేజిక్‌ రియలిజమ్‌ పరాకాష్ట నందుకుంటే కేశవరెడ్డి మునెమ్మలో ఇది తేటనీటి అడుగు చేపపిల్లల కదలికల్లాగా కనిపించీ కనిపించకుండా కనిపిస్తూ పాఠకుడిని సంభ్రమాశ్చర్యచకితులని చేస్తుంది. నిజానికి ఈ కధన పద్దతిని కనుక కేశవరెడ్డి కనుక ఎన్నుకోక పోయినట్లయితే యిది ఒక సాదా సీదా క్రైమ్‌ థ్రిల్లర్‌లాగా, షాడో ఇనవెస్టగేషన్‌లాగా మిగిలిపోయేది.
కథ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చిత్తూరు జిల్లాలోని ఒంటిల్లు అనే కుగ్రామంలో మునెమ్మ, జయరాముడు అనే పడుచు జంట. వీళ్ళ బతుకు రధాన్ని లాగడానికి ఆధారమయిన ఓ బొల్లిగిత్త. బొల్లిగిత్తకి మునెమ్మపైన లైంగికపరమయిన ఆకాంక్ష కలగిందన్న ఒక చిన్న అనుమానం జయరాముడిలో మొదలయి, బొల్లిగిత్తను కసిదీరా చావ బాది, ఆ తర్వాత మద్దిపాలెం పరసలో అమ్మెయ్యాలని నిశ్చయించుకుంటాడు.
బొల్లిగిత్తను మద్దిపాలెం పరసకు తోలుకుపోయిన తర్వాత, ఒంటరిగా బొల్లిగిత్త తిరిగివస్తుంది. కానీ జయరాముడు రాడు. ఆ రాత్రి మునెమ్మకి కలలో తన భర్త జయరాముడిని ఎవరో హత్యచేశారన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత జయరాముడి హంతకుల కోసం మునెమ్మ వేట/ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మునెమ్మకి సినబ్బ తోడవుతాడు. సినబ్బకి ఆమెకి ఒక వరుసలో తమ్ముడు. ఒక వరుసలో మరిది. మునెమ్మ సినబ్బను మరిదిలాగా భావిస్తుంది. సినబ్బ మునెమ్మని తమ్ముడులాగా భావించుకుంటాడు. సినబ్బ ద్వారానే పాఠకుడికి కథను రచయిత చెప్తాడు. ఒక రకంగా రచయితకు సినబ్బ ప్రతినిధి.
ఒంటిల్లు నుండి మద్దిపాలెం దాకా, అక్కడినుండి రామినాయుడిపల్లె మీదుగా కాణిపాకం తిరగి ఒంటిల్లు దాకా సాగిన ఈ ప్రతీకార యాత్ర యావత్తు మునెమ్మ అతీంద్రీయ, తార్కిక, జ్ఞానశక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మునెమ్మ అనే ఈ సాధారణ వ్యకిలోని అసాధారణ తత్వానికి సినబ్బ అడుగడుగునా ఆశ్చర్య చకితుడు అవుతూ వుంటాడు.
తనకు వచ్చిన కల ఆధారంగా జయరాముడు ‘మరిక లేడు’ అన్న నమ్మకం మునెమ్మలో బలపడుతుంది. ఆ నమ్మకాన్ని సినబ్బకి చెపితే ‘‘అది ఆమెలో వున్న మూర్ఖత్వానికి పరాకాష్ట’’ అని భావించిన సినబ్బ నాలుగు రోజుల తరువాత అది మూర్ఖత్వం కాదని, ‘‘అంతర్‌దృష్టి’’అనీ అవధువుల లేని ఆవేదన ద్వారా పొందిన యోగమే ‘‘అంతరదృష్టి’’ అనీ అర్ధం చేసుకుంటాడు.
ఈ నవలలో కేశవరెడ్డి వదిలేసిన లూస్‌ ఎండ్స్‌ ఎన్నొ. జయరాముడి వ్యక్తిత్వంలో వస్తున్న ప్రతి మార్పుకి ఒక ఆధారభూతమయిన అంశాన్ని వివరిస్తూ, జయరాముడి కూడా తండ్రిలాగే తయారయ్యాడన్న వాస్తవానికి ఒక లాజికల్‌ రీజనింగ్‌ యిచ్చిన కేశవరెడ్డి, జయరాముడి హత్య వరకు అతి సాధారణ గృహిణిలాగా వ్ను మునెమ్మలో ఆ తర్వాత అద్భుతమయిన, ప్రేరణ, అతీంద్రీయ శక్తులకు మించిన జ్ఞానం కలగడం కావలసిన తాత్విక భూమికను ఏదీ చూపించలేదు. జయరాముడి వ్యక్తితవ్వంలో మార్పులకు ఇన్‌హెరిడిటీ/ జన్యుపరమయిన అంశాలు కారణం అయినట్లుగా మునెమ్మ అంతర్‌దృష్టికి ఏ రీజన్‌ లేదు.
వ్యవసాయక సమాజంలో పశువులకు, మనుషులకి మధ్య సన్నిహిత సంబంధాలు వుండటం సహజమే. పల్లె పట్టులలో వుండే ఎవరికయాని, తమతో సన్నిహితంగా వుండే మనుషులను పశువులను నాలుకతో నాకడమూ, మొహం మీదకు ముట్టె సాచి ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటి అంశాలు అనుభవంలోకి వచ్చేవే. మనుషుల స్పర్శను పశువులు కోరుకోవడంలో లైంగిక పరమయిన కాంక్ష వుంటుందా? నాలుగు కాళ్ళ జంతువులా కనిపించిన మునెమ్మ మీదికి బొల్లిగిత్త రెండు కాళ్ళు ఎత్తి నడుము మీద వేయడం యితరేతర పశువుల ప్రవర్తన కంటే భిన్నమయినదా? వ్యవసాయిక సమాజమునుండి వచ్చిన జయరాముడికి పశువుకి, మనిషికి మధ్య వుండే సంబంధం గురించిన అవగాహన లేశ మాత్రమయిన లేదా!
కథాకాలం స్వాతంత్య్రానికి  పూర్వం. అప్పటికి మనుషులు యింకా యింతగా కలుషితం కాలేదు. అలాంటప్పుడు తరుగులోడు , నాటువైద్యుడి సహాయంతో జయరాముడిని హత్యచేయండ కేవలం డబ్బుకోసమే అనుకుంటే అందులో సమంజసత్వం వుందా! హత్యకి మోటివ్‌ ఏం లేదు?
జయరాముడి హత్యకి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం వెనుక మునెమ్మలో అపరాధ భావం వుండా? జయరాముడి బొల్లిగిత్తను చావబాదడానికి కారణం అది తనను కామించడమే అయితే, దాన్ని యాక్సెప్ట్‌ చెయ్యడం ద్వారా జయరాముడికి అన్యాయం చేశానన్న భావం/గిల్టీ మునెమ్మలో వుందా? మునెమ్మకి జయరాముడి పైన వున్న ప్రేమకి, బొల్లిగిత్తపైన వున్న ప్రేమకి వున్న సాంద్రతలో తేడాలున్నాయా? ఒక మనిషి ఏక కాలంలో మనిషిని, పశువుని ప్రేమించడం సాధ్యంకాదా? అది నేరమా?
జయరాముడి స్థానంలో బొల్లిగిత్తను అంగీకరించడం ద్వారా పోయటిక్‌ జస్టిస్‌ జరిగిందన్న సురేంద్రరాజు మాటలో కేశవరెడ్డి ఏకీభవిస్తున్నారా? ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌కి త్రిపురనేని మదుసూధనరావు రాసిన ముందు మాటని ‘‘నవలలోని కొన్న అంశాలను గురించి రచయిత పునరాలోచించవలసి వుందని’’ పేర్కొన్నారు. ‘‘కానీ అనాటి పరిస్థితులలో అలా పునరాలోచించాల్సిన అవసరం వుందని నేను భావించలేదు’’ అంటూ ఖండిరచిన కేశవరెడ్డి సురేంద్రరాజు మాటను ఖండిరచలేదు అంటే తన జస్టిస్‌గా అదే అనే కదా అర్ధం. అలాంటప్పుడు సింగిల్‌ ఉమెన్‌ సమస్యల పట్ల కేశవరెడ్డి దృక్పధం ఎలాంటి సంకేతాలని ఇస్తుంది.
ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు?
మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే.
మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

– వంశీకృష్ణ

ఒక ప్రశ్నలోంచి పుట్టిన కథ !

10253980_10154027889035385_5076761124300498188_n

(కథ 2013 ఆవిష్కరణ సందర్భంగా – అందులో ఎంపికైన కొన్ని కథల నేపథ్యాలు వరసగా ప్రచురించాలని ఆలోచన. ఈ వారం అనిల్ ఎస్. రాయల్ కథ “రీబూట్” నేపథ్యాన్ని అందిస్తున్నాం)

కథ ఎలా పుడుతుంది? ఒక్కో కథకుడికీ ఒక్కో విధంగా.

నావరకూ అది ఓ ప్రశ్నలోంచి పుడుతుంది

‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నలోంచి. 1898లో హెచ్.జి.వెల్స్ War of the Worlds రాశాడు. సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అదో మైలురాయి. అంగారకవాసులు భూగ్రహమ్మీద దాడి చేసి దొరికినవారిని దొరికినట్లు చంపుకుతినటం ఆ నవల ఇతివృత్తం. మొదట్లో చెలరేగిపోయిన మార్స్ దళాలు, అనుకోనిరీతిలో భూమ్మీది బాక్టీరియా ధాటికి కుదేలవటం, దెబ్బకి తోకముడిచి తమగ్రహానికి పారిపోవటంతో ఆ నవల ముగుస్తుంది.

ఆ నవల చదివినప్పట్నుండీ నన్నో ప్రశ్న తొలిచేది. ‘అలా పారిపోయిన మార్షియన్స్ రోగనిరోధకశక్తి పెంపొందించుకుని తిరిగి మన మీద దాడి చేస్తే? వాళ్లని కాచుకోటానికి ఉన్న ఒక్క ఆయుధమూ నిర్వీర్యమైపోతే మనుషుల పరిస్థితేంటి?’.

నేను కథలు రాయటం ప్రారంభించిన తొలినాళ్లనుండి ఈ అంశంతో ఓ కథ రాయాలన్న ఆలోచనుండేది. అంటే, War of the Worldsకి సీక్వెల్ రాసే ఆలోచన అన్నమాట.

‘నాగరికథ’, ‘మరో ప్రపంచం’, ‘కల్కి’ తర్వాతో రెండున్నరేళ్లు విరామం తీసుకున్నాక, మళ్లీ కథ రాసే మూడొచ్చింది; సీక్వెల్ ఆలోచనకి దుమ్ము దులిపే వీలు కుదిరింది. అలా ఈ కథ మొదలయింది. దీనికి ముందు నేను రాసిన మూడిట్లో రెండు కథలు టైమ్‌ట్రావెల్ నేపధ్యంలో రాసినవే. అదే నేపధ్యంలో మరోటీ రాసేసి ‘ఇదిగిదిగో నా టైమ్‌ట్రావెల్ త్రయం’ అనాలనే దుగ్థ ఒకటి ఈ రెండున్నరేళ్లుగా తొలుస్తూనే ఉంది.

అందుకే, War of the Worldsకి కొనసాగింపు రాయటానికి సిద్ధమైనప్పుడు దానికి అనుకోకుండానే టైమ్‌ట్రావెల్ నేపధ్యమై కూర్చుంది. నా కథల్లో జరిగిన/జరుగుతున్న చరిత్ర, ఎప్పుడో జరిగిపోయిన/జరగని పురాణాల ప్రస్తావన లీలా మాత్రంగా చొప్పించటం నాకలవాటు – వాటిక్కాస్త సైన్స్ పూతపూసి. ‘రీబూట్’ దానికి మినహాయింపు కాదు. ‘మానవుల మధ్య కలహాలు ముదిరిపోయి ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగితేలుతుంటే విసిగిపోయిన దేవుడు ప్రళయం ద్వారా మానవజాతిని మళ్లీ మూలాల్లోకి పంపటం’ అనేదో ప్రపంచవ్యాప్త నమ్మకం.

దీన్ని నా కథకి అనుగుణంగా వాడుకుందామనుకున్నాను. మూడో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితులు, మానవులు భూగృహాల్లో బతకటం, ఇలాంటివి అలా వచ్చి కథలో కలిశాయి. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో మనుషుల బదులు మరసైనికులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి (అది మరో విధంగా ఇప్పటికే జరుగుతుంది, నిజానికి), ఆ రకంగా కథలోకి రోబాట్స్ కూడా వచ్చి చేరాయి. మరమనిషి ప్రధాన పాత్ర అనగానే ఐజక్ అసిమోవ్ కథలు గుర్తొస్తాయి.

ఆ తరహా సాహిత్యమ్మీద ఆయన వేసిన ముద్ర అంత బలమైనది. ఆ మహారచయిత గురించి తెలుగు పాఠకలోకంలో ఎక్కువమందికి తెలీదు. అందుకే, ఆయన్ని పరిచయం చేసినట్లుంటుందని కథలో అసిమోవ్ ప్రస్తావన తెచ్చాను. ఈ పెద్ద కథని రెండు భాగాలుగా ఏప్రిల్ 6న అసిమోవ్ వర్ధంతి సందర్భంగా ప్రచురించటం జరిగింది.

-అనిల్ .ఎస్.రాయల్

 

 

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10253024_10202317416069206_1368318419_oరీబూట్

(a tribute to Isaac Asimov)

***

 

 

క్రీ.. 2372, సెప్టెంబర్ 1. సాయంత్రం నాలుగూ పది.

 

కిటికీలోకి చూస్తున్నాడు విక్రమాదిత్య. బయటకనుచూపుమేరంతా బూడిద వర్ణం. ఒకప్పుడదో మహానగరం. బహుళంతస్తుల భవనాలు, వాటిని కలుపుతూ రహదార్లు. పచ్చదనం పంచుతూ చెట్లు. వాటి కింద సేదదీరుతూ మనుషులు. ఇప్పుడో? శిధిల నగరం. సూర్యుడిని కమ్మేసిన ధూళి మేఘం. పగలూ రాత్రీ ఏకమైన సమయం. కమ్ముకున్న చిమ్మ చీకటి. దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడూ లేజర్ మెరుపులుమార్స్ వాసులకీ, మరమనుషులకి మధ్య పోరాటానికి గుర్తుగా. 

 

విక్రమాదిత్య చూపులు బయటున్నా మనసు మాత్రం కొడుకు మీదుంది. ప్రయోగానికింకా రెండుగంటలే ఉంది. అన్నీ సరిగా ఉన్నాయోలేదో ఆఖరుసారి పరీక్షించాలి. వేరే విషయాలు ఆలోచించే సమయం లేదు. కొడుకు మీదనుండి బలవంతంగా మనసు మళ్లిస్తూ కిటికీ అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని చూసుకున్నాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ మరియు రోబోటిక్స్ జంటవిభాగాల అధినేతగా, రక్షణశాఖ కీలక సలహాదారుగా నిరంతరం ఎదుర్కొనే వత్తిడి నలభై ఐదేళ్లకే తెచ్చిపెట్టిన వార్ధక్యం వెక్కిరిస్తూ కనపడింది. ఎర్రబారిన కళ్లు రెండ్రోజులుగా కరువైన నిద్రని గుర్తుచేస్తున్నాయి. తన ముఖంలో గాంభీర్యం తననే భయపెడుతుండగా రిమోట్ అందుకుని ఆఫ్ బటన్ నొక్కాడు. మరుక్షణం కిటికీలోంచి అతని ప్రతిబింబం, దాని వెనకున్న అధివాస్తవిక దృశ్యం మాయమైపోయాయి. అప్పటిదాకా కిటికీలా భ్రమింపజేసిన త్రీడీ టెలివిజన్ తెర వెల్లవేసిన తెల్లగోడలా మారిపోయింది.

బాస్

వెనుకనుండి వినబడ్డ యాంత్రికమైన పిలుపుకి ఉలికిపడి తలతిప్పి చూశాడు. ఐజక్ నిలబడున్నాడక్కడ.

 ***

 

మనిషి పుట్టుక మీద లెక్కకు మిక్కిలి వాదాలు. కోతినుండి మనిషొచ్చాడనే వాళ్లు కొందరు. వేరేదో గ్రహం నుండి వలస వచ్చాడనే వాళ్లింకొందరు. అదనంగా, పురాణాలు ప్రవచించే ఆదిమానవుడి గాథలు. ఆవిర్భావంపై వివాదాలెలా ఉన్నా, మనిషి ఎలా అంతరిస్తాడనే విషయంలో మాత్రం ప్రస్తుతం ఎవరికీ అనుమానాల్లేవు. 

 

మొదట్లో అవసరాల్లోంచి యుద్ధాలు పుట్టేవి. తర్వాత యుద్ధాల కోసం అవసరాలు పుట్టుకొచ్చాయి. క్రమంగా యుద్ధమే అవసరంగా మారింది. అది కల్పించే విస్తారమైన వాణిజ్యావకాశాల కోసం ఇరవై మూడో శతాబ్దం రెండో అర్ధభాగంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలయింది. విచ్చలవిడి అణువిస్ఫోటాలకి భూమండలం భస్మీపటలమయింది. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పైకెగసిన అణుధూళి మేఘాలు సూర్యుడిని కమ్ముకుని ప్రపంచాన్ని అంధకారంలో ముంచేశాయి. సూర్యరశ్మి సోకక చెట్లు, అడవులు నశించిపోయాయి. వాటిమీద ఆధారపడ్డ జీవరాశి అంతరించిపోయింది. ఓజోన్ పొర ఆవిరైపోయింది. రేడియేషన్ వల్ల అపరిమితంగా వేడెక్కిన ఉపరితలం ఆవాసయోగ్యం కాకుండాపోయింది. అణుయుద్ధాన్ని తట్టుకోటానికి ముందస్తు సన్నాహాలు చేసుకున్న దేశాలు మాత్రం కొద్ది శాతం మనుషుల్ని, కొన్ని జాతుల జంతువుల్ని భూగర్భ బంకర్లలోకి తరలించి కాపాడుకున్నాయి. 

 

అప్పట్నుండీ మనుషులు పాతాళంలోనే బతుకుతున్నారు. పైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. నూట ఎనభై ఏళ్ల సుదీర్ఘ సమరంలో ప్రపంచపటం పూర్తిగా మారిపోయింది. పాత దేశాలెన్నో కనుమరుగయ్యాయి. పాతిక దేశాలు, అవి కట్టిన రెండు కూటములు మిగిలాయి. వాటి తరపున మరసైనికులు భూమ్మీద  మొహరించి పోరాడుకుంటుండగా …. ఐదేళ్ల కిందటొచ్చిపడిందో ఊహించని ఉపద్రవం. దానివల్ల యుద్ధమైతే ఆగలేదు. కానీ యుద్ధ లక్షణాలు మారాయి. లక్ష్యమూ మారింది. 

 

అది క్రీ.. 2367. అరుణగ్రహం నుండి మొదటి బెటాలియన్ భూమ్మీద పాదం మోపిన ఏడాది. ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగి ఆదమరిచిన మానవుల మీద ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి మార్స్ సైన్యాలు. అంగారకుడిమీద బుద్ధిజీవుల ఆనవాళ్లే లేవని అపార్చునిటీ మొదలు ఇరవైపైగా రోవర్లు పంపిన సమాచారమంతా తప్పులతడకని అర్ధమయేసరికే ఆలస్యమైపోయింది. వెలుపలి నుండి వచ్చిపడ్డ ప్రమాదాన్ని కాచుకోటానికి తప్పనిసరి పరిస్థితుల్లో తమ గొడవలు పక్కనబెట్టి ఏకమయ్యారు మనుషులు. 

 (మిగతా కథ – కథ 2013- సంకలనంలో చదవండి)

 

మా సత్తెమ్మ తల్లీ, గుళ్ళూ, గోపురాలూ

chitten raju

మా చిన్నప్పుడూ, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మేము శేరీ పొలం వెళ్ళినా, మొట్టమొదట చేసే పని, చెరువు గట్టు ఎదురుగా రావి చెట్టు క్రింద ఉన్న మా  సత్తెమ్మ తల్లికి మనసారా దణ్ణం పెట్టడం. ఆ తరవాతే పొలం లోకి అడుగుపెట్టినా, ఏ పనులు చేసినా.

ఈ సత్తెమ్మ తల్లి  ని ఎవరు ఎప్పుడు ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు కానీ మా లోకారెడ్డి వారి చెరువా ఇస్తువా పంపు అనే శేరీ 1920 లలో మా తాత గారు కొన్నప్పటి నుంచీ, గ్రామాలకి గ్రామ దేవతలా ఈ సత్తెమ్మ తల్లే మా పొలాలకి అధిదేవత. రాతి రూపంలో పసుపు కుంకుమల తో ఉన్న ఈ అమ్మ వారికి రోజూ దీపం పెట్టడం, పూజలు చెయ్యడం లాంటి పూజా పునస్కారాలు ఉండవు.  కానీ ఏడాది పొడుగునా జరిగే విత్తనాలు జల్లి నారు పొయ్యడం, నాట్లు వెయ్యడం, కలుపు తీత, ఎరువులు వెయ్యడం, కోతలు, గడ్డి  కుప్పలు వెయ్యడం, కళ్లం తయారు చెయ్యడం, కుప్ప నూర్పులు, ఆరబెట్టడం, కాటా వేసి రైస్ మిల్లర్లకో వర్తకులకో అమ్మకం చేసి డబ్బు రూపేణా ఫలసాయం పొందే దాకా జరిగే ఏ పని మొదలుపెట్టేటప్పుడైనా సత్తెమ్మ తల్లికి పూజ చేసి, కోడిని కోసి ఆశీస్సులు తీసుకోవడం మా తరతరాల ఆచారం.

ఇక పండగల సమయంలో, ముఖ్యంగా పెద్ద పండగ అయినా, మా పాలికాపుల ఇళ్ళలో పెళ్లి లాంటి ఏ శుభకార్యం జరిగినా మేక ని కొయ్యడం కూడా మా పాలికాపుల ఆచారం.  ఇలా కొలిచిన దానికి  ప్రతిఫలంగా సత్తెమ్మ తల్లి మా పొలం లో ఏ విధమైన దొంగ తనాలు, తప్పుడు పనులు జరగకుండా కాపాడుతుంది అని ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలలోనూ, మా కుటుంబానికీ నమ్మకం. నాకు తెలిసీ ఇప్పటి దాకా ఒక్కటంటే ఒక్కసారి కూడా ఏ విధమైన దొంగతనం అనేది జరగ లేదు.  ఇటీవల నేను అక్కడికి వెళ్లినప్పుడు మా సత్తెమ్మ తల్లికి దణ్ణం పెడుతూ తీయించుకున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి..మా పిల్లలతో సహా….ఎవరికైనా చూపిస్తే ..ఆ మాట కొస్తే కొంత మంది పెద్ద వాళ్ళు కూడా నవ్వుతారేమో నాకు తెలియదు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.నా యిచ్చయే గాక నాకేటి ఎరవు?” అన్నాడు కృష్ణశాస్త్రి.

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

మా సత్తెమ్మ తల్లికి సంబంధించి రెండు సంఘటనలు నాకు ఇంకా గుర్తున్నాయి. మా చిన్నప్పుడు వేసవి కాలంలో రాత్రి నూర్పులు అయ్యాక ధాన్యం కుప్పలు గా వేసే వారు. కుప్పకి సుమారు పాతిక బస్తాల చొప్పున చాలా కుప్పలే ఉండేవి. అప్పుడు నాకూ, మా తమ్ముడికీ, తన పెద్ద బావమరిది వెంకట్రావుకీ ఒక ప్రధానమైన డ్యూటీ వేసేవాడు. అదేమిటంటే ఆ కుప్పలన్నింటి మీదా ఆంజనేయ స్వామి ముద్రలు వెయ్యడం. అంటే మా పొలాలకి ఆంజనేయ స్వామిని అందంగా చెక్కిన ఒక రాజ ముద్రిక ఉండేది. ప్రతీ ధాన్యం కుప్ప మీదా మూడు వరసలలో , ఒక్కొక్క వరసకీ ఐదారు చొప్పున  అర చేతి సైజు లో ఉండే మట్టి పిడకలని మా ఉద్దారుడు…అంటే పెద్ద పాలికాపు….జాగ్రత్తగా సరి అయిన పద్ధతిలో  అతికించే వాడు. ఇక్కడ టెక్నాలజీ ఏమిటంటే ఎవరైనా ఆ కుప్పలో పై నుంచి కానీ, కింద నుంచి కానీ ధాన్యం లాగేస్తే ఈ మట్టి పిడక కిందకి పూర్తిగా జారి పోవడమో, కొంచెం చితికి బీటలు పడడమో జరిగి ఎవరు దొంగతనం చేశారో తెలియక పోయినా ఖచ్చితంగా ధాన్యం దొంగతనం జరిగినట్టు తెలిసిపోతుందన్న మాట.

అందు చేత ఈ పిడకల “ప్లేసింగ్” ని మా పెద్దన్నయ్య స్వయంగా పర్యవేక్షించే వాడు.  కొంచెం దైవ భయం కూడా  జోడించడానికి  కొంచెం తడిగా ఉండే ఈ పిడకల మీద ఆంజనేయ స్వామి ముద్ర “అద్దే” వాళ్ళం. ““అద్దే” వాళ్ళం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే,  ఆ ముద్ర గట్టిగా కొడితే మట్టి పిడక చితికిపోతుంది. మరీ సున్నితంగా కొడితే ఆంజనేయ స్వామి కనపడడు.

ఇక ప్రతీ కుప్పా కళ్ళం లో నేల మీద పది, పదిహేను అడుగుల వృత్తులాకారంలో ఉండి ఐదారు అడుగులు ఎత్తు ఉండేవి. ఒక సారి కొత్తగా పని లోకి వచ్చిన ఒక కుర్ర కూలీ అత్యంత లాఘవంగా ప్రతీ కుప్ప నుంచీ ఎక్కడా ఈ “సెక్యూరిటీ” పిడకలు ఏ మాత్రం కదలకుండా కొంచెం ధాన్యం చొప్పున  అన్ని కుప్పల నుంచీ కలిపి అర బస్తాడు ధాన్యం దొంగతనం చేసి మసక చీకట్లో పారిపోతూ మా పొలం సరిహద్దుల దగ్గరకి రాగానే కాలు జారి కాలవ లో పడి లేవలేక పోయాడు. ఐదారు గంటల తరువాత మా పాలికాపులు అతన్ని చూసి బైటకి తీసి దొంగతనం చేస్తున్నాడని తెలుసుకున్నారు. ఇక ఆ చుట్టు పక్కల అన్ని గ్రామాల లోనూ “రామం గారి శేరీ లో దొంగతనం చెయ్యబోతే వాణ్ణి సత్తెమ్మ తల్లి పొలం సరిహద్దులు దాటనియ్యకుండా కట్టి పడేసింది” అని నిస్సంకోచంగా నమ్మారు.

మా ఇంట్లో భోజనం చేస్తున్న కొందరు రైతులు

ఈ ఉదంతం బహుశా “దివాణం” గారి హయాం ..అంటే  మా నాన్న గారి హయాం లోనే జరిగినా, హేతువాద దృష్టిలో ఈ సంఘటన కేవలం కాకతాళీయమే అయినా, గత ఎనభై ఏళ్లగా మా పొలంలో అతి చిన్న దొంగతనం కూడా జరగక పోవడం మా సత్తెమ్మ తల్లి రక్షణే అని అందరి నమ్మకం.  అంతెందుకు,  మా “చిన్న దివాణం” హయాంలో ..అంటే మా పెద్దన్నయ్య హయాంలో ఒక సారి ఒక నక్సలైట్ తుపాకీ తో పొలంలో మా మకాం కి వచ్చి , ఏడాదికి పది వేలు ఇవ్వక పోతే రక రకాల ఇబ్బందులు పెడతానని బెదిరించాడు. అప్పుడు మా రైతులు సత్తెమ్మ తల్లి గురించి వివరంగా చెప్పి, దమ్ముంటే మళ్ళీ శేరీ లో అడుగుపెట్టమని ఛాలెంజ్ చెయ్యగానే దేవుళ్ళనీ , దేవతలనీ నమ్మని ఆ నక్సలైట్ కూడా మళ్ళీ  మా పొలం చుట్టుపక్కలకి రాలేదు.

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

ఇదంతా చదివి మా వంగూరి వారు గ్రామ దేవతల దగ్గర నుంచీ మనకున్న కోటానుకోట్ల  దేవదేవుళ్ళందరినీ ఆరాధించేస్తూ విపరీతమైన దైవ భక్తులు అని అనుకుంటే “తప్పులో కాలేసినట్టే”.  నాకు తెలినంత వరకూ మాకు మా ప్రాంతాలలో సాధారణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే స్థాయి లోనే మా దైవిక పరమైన వ్యాపకాలు ఉండేవి. ఇంచు మించు అన్నీ పండగలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు , పేరంటాల చుట్టూ తిరిగినవే.  మతపరమైన అంశాలలో ఎక్కడా “ఓవర్ ఏక్షనూ” లేదు. అలా అని ఆధిక్షేపణ అంతకంటే  లేదు. ఇంటా, బయటా సరి అయిన మోతాదులోనే ఉంటాం.  మా పూర్వీకుల విషయం నాకు స్పష్టంగా తెలియదు కానీ వారు తణుకు దగ్గర సిద్దాంతం గ్రామ కారణాలుగా ఉండే సమయంలో …అంటే 1690 సంవత్సరం ప్రాంతాల నాటి సూరప రాజు  గారి హయాంలోనే, ఆ తరువాతనో మా ముత్తాతలు ఒక వినాయకుడి గుడి కట్టి ఆలయ అర్చకులకి జీవనోపాధికి ఇచ్చారుట.

నేను సుమారు పదేళ్ళ క్రితం మొట్టమొదటి సారిగా మా పూర్వీకుల అన్వేషణలో అక్కడికి వెళ్లి  ఆ గుడి చూశాను. అప్పుడు చాలా పురాతనంగా ఆ గుడి పై భాగంలో “వంగూరి వారు కట్టించి ఇచ్చిన ఆలయము” అని సంవత్సరం కూడా వ్రాసి ఉంది కానీ చదవడానికి వీలులేని స్థితి లో ఉంది. క్రిందటేడు ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మళ్ళీ సిద్దాంతం వెళ్లాను. ఇప్పుడు పురాతన కట్టడాన్ని నిర్మూలించి ఆ గుడిని ధర్మకర్తలు పున:నిర్మాణం చేసి ఆనాటి ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేశారు. మూడు దశాబ్దాల క్రితం నాటి “వంగూరి వారి వినాయకుడి గుడి”  ఈ నాటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

ఇక మా తరానికి వస్తే, ఐదారేళ్ళ క్రితం మా పొలానికి ఆనుకుని ఉన్న చిన జగ్గం పేట  గ్రామంలో ఆ పెద్దన్నయ్య కృష్ణుడి గుడి కట్టించడం చెప్పుకో దగ్గ విశేషమే!  ఈ గుడి కట్టించడానికి మా పెద్దన్నయ్య దైవ భక్తి చిన్న కారణం కానీ అంత కంటే ముఖ్య కారణాలు వేరే ఉన్నాయి.  ఈ చిన జగ్గం పేట  వెయ్యి గడపల గ్రామంలో ఉప్పర్లు, మాలలు, గొల్లలు సమ సంఖ్యలో ఉంటారు. ఈ మూడు కులాల వారు అనేక తరాల నుంచీ మాతో బాటు మా  పొలాన్నే నమ్ముకున్న వాళ్ళే. గత అరవై, డభై ఏళ్లగా మేము ఎప్పుడైనా ఏ పెళ్ళిళ్ళ కొ, చదువులకో కొంత పొలం అమ్మినా, వీళ్ళలో ఏదో ఒక కులం వారు సమిష్టిగా కొనుక్కుని ఇప్పటికీ మా శేరీ లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.  సుమారు పదిహేనేళ్ళ క్రితం అప్పటి మునసబో, మరెవరో ఆ గ్రామంలో ఒక చిన్న సీతారామస్వామి దేవాలయం కట్టించారు.  ఈ గ్రామం  లో అదే మొట్టమొదటి దేవాలయం.

రామారావు పేటలో శివాలయం

రామారావు పేటలో శివాలయం

పక్కనే ఉన్న తాటిపర్తిలో ఒక ఆలయం ఉంది కానీ, విశేషం ఏమిటంటే ఆ చుట్టూ పక్కల పది గ్రామాలలోనూ దేవుడికి దీపం పెట్టడానికి ఒక్క పూజారి కుటుంబం కూడా లేదు.  ఎందుకంటే, కరిణీకాలు రద్దు చేసెయ్యడం, పంతుళ్ళకి జీతాలు ఇవ్వక పోవడం మొదలైన రాజకీయ కారణాల వలన ప్రస్తుత  గ్రామీణ వాతావరణం  లో పొట్టపోసుకునే అవకాశాలు లేక బ్రాహ్మణ కుటుంబాలు పట్టణాలకో..ఆ మాట కొస్తే అమెరికాకో..వలస పోయారు.  ఇప్పుడు సీతారామస్వామి ఆలయం కొత్తగా చిన జగ్గం పేట లో వెలియగానే, ఎవరో ఒక పూజారి గారిని బతిమాలుకుని ఆయన తాటిపర్తిలో కాపరం ఉండేటట్టూ, రోజూ  అక్కడి గుడికీ, ఇక్కడి గుడికీ సైకిల్ మీద వచ్చి దీపం పెట్టి, ఆరాధన చేసేటట్టూ ఏర్పాటు చేశారు.

అప్పుడు ఈ గ్రామం లో ఉన్న గొల్లలు తమ కుల దైవం అయిన శ్రీ కృష్ణుడి కి కూడా గుడి కట్టిస్తే,  దాని పోషణ అంతా తాము చూసుకుంటాం అనీ, పూజారి గారికి కూడా భుక్తి గడుస్తుంది అనీ మా పెద్దన్నయ్య ని కోరారు. “తరతరాలుగా మన శేరీ నే నమ్ముకున్న  ఈ గ్రామ ప్రజల ఋణం ఇలాగైనా తీర్చుకుందాం” అనుకునీ, తన పేరు అక్కడ కలకాలం నిలబడుతుందనే సంతోషం తోటీ, తన 77 వ ఏట మా పెద్దన్నయ్య , ఆ సేతారామస్వామి గుడిలో కొత్త విగ్రహాలు పున;ప్రష్టాపన చేసి,  పక్క స్థలంలో శ్రీ కృష్ణుడి గుడి కట్టించి పుణ్యం చేసుకున్నాడు. రెండేళ్ళ క్రితం మా పెద్దన్నయ్య పోయినప్పుడు ఆ గ్రామ వాస్తవ్యులు ఆయన విగ్రహం చేయించి, గుడి ప్రాంగణంలో  పెట్టించారు. ఇందుతో ఆ గుడి, మా పెద్దన్నయ విగ్రహం దగ్గర నేనూ, ఆలయ నిర్వాహకుడి ఒకాయనతో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను.  అలాగే కాకినాడలో మా పెద్దన్నయ్య సంవత్సరీకాలకి వచ్చి భోజనం చేస్తున్న మా కొంతమంది రైతుల ఫోటో కూడా జతపరుస్తున్నాను.

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

గుళ్లూ, గోపురాల గురించి మాట్లాడుతున్నప్పుడు , మా కాకినాడ రామారావు పేట లో ఉన్న శివాలయం గురించి ప్రస్తావించకుండా ఉండ లేను.   ఎందుకంటే, నా జీవితంలో సుమారు ఇరవై ఏళ్ళు…అవును..ఇరవై ఏళ్ళు , నేను ఆ శివాలయాని కి వెళ్లి, ఏడడుగుల పొడుగున్న బక్క పలచటి ఆచారి గారు పెట్టే సాతాళించిన శనగలు తినని రోజు లేదంటే అతిశయోక్తి కానే కాదు.  ఆ శివాలయం ఇప్పటి ఫోటో ఒకటి జత పరుస్తున్నాను…ఎందుకంటే, మా చిన్నప్పుడు దేవుడి గుడిలో ఫోటోలు తీయించుకోవడం మాకు తెలియదు.  ఆ శివాలయం లోనే, ఆ వీధిలోనే ఉన్న ఈశ్వర పుస్తక భాండాగారం లోనే నేను కొన్ని వందల హరి కథలు, పురాణాలు, బుర్ర కథలు, ప్రవచనాలు విని తరించాను.

నా దృష్టి లో మానవ మేధస్సు సృష్టించిన రెండు అధ్బుతాల లో ఒకటి దేవుడు అనే సిద్దాంతం. మరొకటి ధనం. దేవుడి మీద నమ్మకమూ, డబ్బు మీద ఆశా, ఈ రెండూ తగిన మోతాదులో ఉంటేనే మన మనుగడ సమపాళ్ళలో ఉంటుంది.  నాకు ఏక్షన్ ఇష్టమే కానీ, ఓవర్ ఏక్షన్ ఇష్టం లేదు కాబట్టి నా ప్రయత్నం ఎక్కువ లేకుండానే  నా  జీవితంలో రెండిటికీ “సమ న్యాయం “ చేశాననే అనుకుంటున్నాను.

నేల మీద నమ్మకం వుంటే ఈ పుస్తకం చదవండి తప్పక!

samvedana logo copy(1)

గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు.

నేడే చదవండి.పల్లె బతుకు లోతుల్ని తవ్వి తీసిన విద్యాసాగర్ అపురూపమైన అక్షర చిత్రం పల్లెను మింగిన పెట్టుబడి. మాయా లేదు, మర్మం లేదు. గాలిమేడలు కట్టడం అసలే లేదు.నిద్రలో ఉన్నవారిని, నిద్రనటించేవారిని మేల్కొలిపే రాత యిది. ఈ నేల గురించి ఈ నేలను నమ్ముకున్న మనుషుల గురించి  ప్రేమ ఉన్న వారు, వారికోసం ఏమైనాచేయాలనుకునే వారు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మా రోజుల్లో అనే తలపోతల నుంచి, పల్లెలు కూడా చెడిపోతున్నాయి అనే వలపోతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపకరించే సాధనం ఈ పుస్తకం. పట్నవాసపు సౌఖ్యాలను అందుకుంటూ పల్లెగురించి తెలిసీ తెలీని రాతలు రాసే రచయితల వల్ల వ్యాపించిన రోమాంటిసిజమ్ అనే వ్యాధిని నయం చేసే కషాయం ఈ పుస్తకం. గ్రామీణ సమాజం,వ్యవసాయం,వృత్తులు,వలస, పెట్టుబడి, వాటి అంతస్సంబంధాల గురించి అధ్యయనం చేయాలనుకునే వారు అవశ్యం పఠించాల్సిన గ్రంధం. తిరోగామి వాదాన్ని పురోగామివాదంగా విప్లవకరంగా ప్రచారం చేస్తూ చరిత్రను, సామాజిక చలనాల్ని తలకిందులుగా చూపిస్తున్న మేధావులను సరిచేసి నిటారుగా నిలబెట్టే శక్తి కలిగిన అక్షరాయుధం. వామపక్ష రాజకీయాల్లో ఇటీవల తీవ్రస్థాయిలో సాగుతున్న  మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ డిబేట్‌ని ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న పుస్తకం. సాధారణ కార్యకర్తలకు సైతం సులభంగా ఆ అంశాలను వివరించగలిగిన పుస్తకం. ఆ రకంగా  సామాజిక రాజకీయ రంగాలకు విద్యాసాగర్‌ చేర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.

 

పుస్తక రచయిత విద్యాసాగర్

పుస్తక రచయిత విద్యాసాగర్

విద్యాసాగర్‌ ఏం చెప్పారు? గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌ అనే పరమ చెత్తను మోసుకు తిరుగుతున్న వారి బండారాన్ని బయటపెట్టారు. గ్రామీణ సమాజంలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని అది కొందరి స్వకపోల కల్పితమని ఆధారాలతో సహా చూపించారు.శ్రీకాకుళం జిల్లాను నమూనాగా తీసుకుని ఊరూరూ తిరిగి గొడ్డుచాకిరీ చేసి మరీ నిరూపించారు. గతంలో సుందరయ్య లాంటి వారు చేసిన సర్వేల కంటే విసృతమైనది ఇది. ఉత్పత్తి, రవాణా మెరుగుపడని సమాజాల్లో జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో నివేదికల సాక్ష్యంగా చూపించారు విద్యాసాగర్‌. గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి  పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు. రైలు అనే ఒక సాధారణ రవాణా సాధనం తెచ్చిన మార్పుల గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చక్రానికే అంత శక్తి ఉంటే శాటిలైట్‌కి ఎంత ఉండాలి!  పెట్టుబడికి ఒక స్వభావముంది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం షరతు ఏమీ కాదు. షరతుగా చెప్పడమంటే ఉత్పత్తి సంబంధాలకు మనిషి చైతన్యానికి మధ్య సంబంధాన్ని తిరస్కరించడం. పాత సంబంధాలను ధ్వంసం చేయకుండా పెట్టుబడి పురోగమించలేదని విద్యాసాగర్‌ తేల్చిచెప్పారు. పెట్టుబడి తనతో పాటు తీసుకువచ్చే సాంకేతికత  ఫ్యూడల్‌ సంబంధాలను నాశనం చేయడానికి ఎలా ఉపయోగ పడుతుందో చూపించారు. వాడిపడేసే ప్లాస్టిక్‌ గ్లాసులు రావడం రెండు గ్లాసుల విధానం పోవడానికి ఎలా దారితీసిందో చిన్న ఉదాహరణతో సంకేతాత్మకంగా చెప్పారు. ఇది చదువుతుంటే ఉత్తరాదిన నాగళ్లు పోయి ట్రాక్టర్లు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కుల అణచివేతకు సంబంధించిన కొన్ని రూపాలు ఎలా అంతరించాయో చెప్పే అధ్యయనాలు గుర్తొచ్చాయి. గతంలో అనూరాధాగాంధీ లాంటివారు గ్రామీణ-కుల సంబంధాలను మార్చడంలో పెట్టుబడి పాత్ర గురించి ప్రస్తావించినా దాని ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు. వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్‌ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు. విద్యాసాగర్‌ ఆ  ఖాళీని పూరించారు.

14844_front_cover

మెరుగైనా రవాణా సౌకర్యాలు ఏర్పడడం కూలీరేట్లు పెరగడానికి ఏ విధంగా దోహదం చేసిందో రచయిత వివరించారు. ”కులవృత్తుల విధ్వంసం అనేది పెట్టుబడి చొరబాటుకు మౌలిక అవసరం. గ్రామీణ ధనిక రైతాంగానికి అర్థబానిస రూపంలో దీర్ఘకాలం కట్టివేయబడిన ఈ కులవృత్తుల సమాజం స్వేచ్ఛగా శ్రమను అమ్ముకునే కూలీలుగా మారారు” అని తేల్చారు. వృత్తులు కొనసాగాలని కోరుకోవడమంటే మనుధర్మాన్ని కొనసాగించాలని కోరుకోవడమేనని, వామపక్ష మేధావులు కూడా అ పాట పాడడం అన్యాయమని చెప్పారు. ఎన్ని సాకులు చెప్పి ఏ రూపంలో వివరించినా అది తిరోగమనమేనని నిర్మొహమాటంగా చెప్పారు. భారత దేశంలో పురోగామివాదులు ప్రధానంగా మార్క్స్‌ అనుయాయులు. లేదంటే అంబేద్కర్‌ అనుయాయలు. ఇద్దరి లోంచి అవసరమైనవి తీసుకోవాలని భావించేవారు కూడా ఉండొచ్చు. ఆ ఇద్దరూ వృత్తులు ధ్వంసం కావాలనే కోరుకున్నారు. వృత్తులు కొనసాగాలని కోరుకున్నది గాంధీ. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ప్రవచించిన విషయాలు ఆచరణ సాధ్యం కానివి. సమాజాన్ని వెనక్కు తీసికెళ్లేవి. కానీ విచిత్రంగా మార్క్సిస్టులని చెప్పుకునేవారు కూడా రకరకాల వాదనలతో వృత్తులను ఆరాధించడం  చూస్తూ ఉంటాం. సమాజాన్ని మార్చాలనే బాధ్యతను భుజాన  వేసుకున్న వారెవరైనా వ్యూహాలు-ఎత్తుగడలకు సంబంధించిన గాంధీ నాయకత్వ పటిమనుంచి స్ఫూర్తి పొందొచ్చు. ఆయన వాదంనుంచి కాదు.  వ్యక్తిగా ఆయన మహానాయకుడు. ఆయన జీవితం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా చదివి తీరాల్సిన పాఠం. కానీ మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆయన్ను దూషించడం, భావజాలంలో ఆయనను అనుసరించడం వంటి విచిత్రాలు మనం చాలాకాలంగా చూస్తున్నాం. అందుకే ఈ రచయిత మీరెటువైపు, మనువు-గాంధీవైపా, మార్క్స్‌-అంబేద్కర్‌ వైపా అనేరీతిలో అడగాల్సిన ప్రశ్నే అడిగారు.

22vzgss03-book__23_1594038e

విద్యాసాగర్‌ ఇంకా ఏం చెప్పారు? వ్యవసాయ సంక్షోభం ఏటికేడు ఎందుకు తీవ్రమవుతున్నదో వివరించారు. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంక్షోభం పెరగడం వెనుక కారణాలను సరిగా పట్టుకున్నారు. ప్రధానంగా అది చెల్లింపుల సంక్షోభం అని తేల్చారు. వ్యవసాయం వ్యాపారంగా మారిపోయిందని విస్పష్టంగా వివరించారు. సేద్యంలోకి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం దగ్గర్నుంచి రైతాంగం జీవనశైలి మార్పుల దాకా అనేకానేక అంశాలను చర్చించారు. పిల్లల చదువులకు ఎక్కువ ఖర్చుపెట్లాల్సిన స్థితితో పాటు బర్త్‌డే పార్టీల్లాంటివి పెరిగిపోవడం లిక్కర్‌ వాడుక పెరిగిపోవడం లాంటి అంశాలను మన ముందుంచారు. “తక్కువ ఖర్చుతో జీవితం గడిచినప్పటికీ అతితక్కువ ఆదాయం ఉండడంతో ఫ్యూడల్‌ సమాజం ఒకరకం సంక్షోభం సృష్టిస్తే పెరిగిన ఆదాయాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చులు పెంచి పెట్టుబడి మరో రకం సంక్షోభం సృష్టిస్తోంది” అని   ప్రకటించారు. వాస్తవానికి ఒకనాడు గ్రామీణ సమాజంలో ఖర్చు అంటే ప్రధానంగా తిండి ఖర్చే. ఇవాళ పట్టణాల మాదిరే ఇతర ఖర్చులు తిండి ఖర్చును మించిపోయాయి. ఈ మార్పు సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్లిందనేదానికి సంకేతం. ఇవాళ గ్రామాలంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అవి పట్టణాల ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే అని చక్కని మాట చెప్పారు. ఇళ్లలో పాల చుక్కవాడకుండా అన్నీ పాలకేంద్రాలకే పోస్తున్న ధోరణి గురించి రచయిత ఒక చోట ప్రస్తావించారు. గ్రామాల్లో పెట్టుబడి తెచ్చిన విషాదం ఇక్కడుంది. ఒకనాడు ఎదురింటి రైతుకు కుడితి నీళ్లు పోస్తే పెరుగో మజ్జిగో పోసేవారు. కూలీపని నుంచి వస్తూ వస్తూ ఏదో ఒక పొలంలో పిడికెడు గోంగూర పెరక్కొచ్చుకుని ఏదో ఒక రొట్టె చేసుకుంటే పూటగడిచేది. ఒక వీధిలో చిక్కుడు పాదుకు కాయలు కాస్తే ఆ ఆవీధిలోని ఇళ్లన్నింటా ఆ రోజు చిక్కుడు గుభాలించేది. ఏదీ లేని నాడు ఊరికే పడిఉండే మునగచెట్లనుంచి నాలుగు ఆకులు దూసి ఉడికేసుకుంటే పూటగడిచేది. అమ్మడం-కొనడం జీవితాన్ని ముంచెత్తని  దశ కావడం వల్ల ఇరుగు పొరుగు సహకార జీవనం ఒకటి ఉండేది. ఒకే సాంఘిక హోదా కలిగిన కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి ఆదాన ప్రదానాలుండేవి. అన్నీ సరుకులుగా మారి మార్కెట్‌కు వెళ్లడం వల్ల  ఇవాళ పల్లెల్లో కూడా ఈ రకమైన జీవనం కనిపించడం లేదు. గుంపు జీవనంలో ఉన్న అణచివేత తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో పాటు అదే జీవనంలో కొంతవరకు అంతర్భాగంగా ఉండే  సహకార ధోరణి పోయి వ్యక్తి ఒంటరవుతున్న దృశ్యం కనిపిస్తోంది.

గ్రామీణ సమాజం సంవత్సరమంతా మట్టిగడ్డలను కౌగిలించుకుని, అర్థబానిస తరహా శ్రమను చేస్తూ పండించిన ఉత్పత్తిని మార్కెట్‌కు ‘విలువ తక్కువ’ ఉత్పత్తులుగా  ఎగుమతి చేస్తోంది. తిరిగిన తనకు అవసరం ఉన్నా లేకపోయినా ‘విలువ ఎక్కువైన’ పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిని మార్కెట్‌ కల్పించింది. ఈ చెల్లింపుల సంక్షోభమే నేటి రైతు సంక్షోభం” అని విద్యాసాగర్‌ వివరించారు.  వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం గురించిన ప్రస్తావన ఒక చోట చేశారు. తాను కొనుగోలు చేసే వస్తువుల రూపంలో పన్నుభారం, వ్యవసాయంపై మదుపు భారం అనే  ” ఈ రెండు పర్వతాలను మోస్తున్న భారతీయ రైతాంగం ఆ భారాన్ని వదిలించుకోవడానికి పట్టణ శ్రామిక వర్గంగా మారుతోంది.” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లోపించడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉత్ప్తత్తి ఇంకా ఎందుకు దారుణంగా ఉంటోంది? చైనాలో హెక్టార్‌కు ఆరు టన్నులకు మించి వరి పండిస్తూ ఉంటే మనం మూడు టన్నులు కూడా ఎందుకు చేరలేకపోతున్నాం అనేది ఆలోచించాలేమో! ఒక సీజన్‌లో కిలో యాభై రూపాయలు పలికే ఉల్లి, టమోటా, ఆలూ మరో సీజన్‌లో రోడ్డుమీద పారేయాల్సిన స్థితికి ఎలా వెడుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాలేమో!  వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి అతిగా మాట్లాడే ప్రభుత్వాలు ఆచరణలో దుర్మార్గమైన నిర్ల్యక్షం చూపడాన్ని కచ్చితంగా ప్రశ్చించాలి. కోళ్లకు దాణాగా ఉన్న మొక్కజొన్న శ్రీకాకుళం జిల్లాలో 8500 ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పెరగడాన్ని ప్రస్తావిస్తూ”మనుషులు తినే ఆహారం కోసం విదేశాలవైపుకు కోళ్ల ఆహారం కోసం దేశీయ పొలాలకు అనే వ్యూహం ఏ న్యాయసూత్రాల ప్రకారం సరైనదో ఆలోచించాలి” అన్నారు. ఇక్కడ రచయిత ఒక విషయం మర్చిపోయారు. కోళ్లు కూడా మనుషులు తినే ఆహారమే. ఈ దేశంలో ఎక్కువ జనాభా తినే ఆహారం. ఒకనాడు పండక్కో పబ్బానికో లేక ఇంటికి బంధువొచ్చినపుడో మాత్రమే తినగలిగే ఆహారం ఇవాళ బ్రాయిలర్‌ కోళ్ల వెల్లువ వల్ల తరచుగా తినే ఆహారంగా మారింది. ఇది సానుకూలంగా చూడాల్సిన పరిణామమే. రచయిత చెప్పిన అర్థంలో అయినా మనుషులు తినే ఆహార ఉత్పత్తిలో మనమేం వెనుకబడిలేం. ఏటా కోట్ల టన్నుల ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆహారపంటల వైశాల్యం తగ్గిపోతోందని ఆందోళన పడాల్సిన అవసరమేమీ ఇవాళ లేదు. ఇలాంటి చిన్న చిన్న వివరాల విషయం పక్కనబెడితే మౌలిక మైన విషయాలన్నింటా రచయిత పూర్తిగా శాస్ర్తీయమైన దృక్పధాన్ని పాటించారు.

తెలుగు నేలమీద వలస వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నది. బలవంతపు వలసలను వ్యతిరేకించవచ్చు. పేదరికాన్ని ఆసరా చేసుకుని భూములు తక్కువకు కొనుగోలు చేసే దోపిడీని వ్యతిరేకించవచ్చు. ”కుండా సట్టి మూటనుగట్టి ఉండా బిడ్డల చంకనబెట్టి మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదల” బతుకుల గురించి ఆందోళన తోనూ ఆర్తితోనూ చర్చించొచ్చు. కానీ మొత్తంగానే వలస అనేపదాన్ని బూతుపదంగా మార్చకూడదు. ఇక్కడ రచయిత సరైన వైఖరి తీసుకున్నారు. వలస  తెచ్చిన సానుకూల పరిణామాలను చూపారు. కూలీ రేట్లలో వేతనాల్లో వచ్చిన మార్పులను చూపారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో కూలీలు తమకిష్టమైన చోట శ్రమను అమ్ముకునే వెసులుబాటు కలిగిన తీరును చూపారు. తలదాచుకోవడానికి గ్రామం-శ్రమను అమ్ముకోవడానికి బస్తీ అనే పరిణామాన్ని పట్టుకున్నారు. మద్రాస్‌ పోయిన దళిత కూలీలు తమ గ్రామాల్లో రైతులకు డబ్బులు అప్పు ఇచ్చే స్థితికి చేరిన విధానాన్ని వివరించారు. “మనిషి తన వృత్తిని మార్చుకోగలగడమే అతని మనుగడకు పునాదిగా ఉందని గుర్తించాలి. అలా గుర్తించకపోతే మనిషి రాకాసి బల్లి అయ్యే ప్రమాదముంది” అని చక్కని మాట చెప్పారు. అప్పుల విధానంలో వచ్చిన మార్పుల గురించి చెపుతూ ఫాయిదాలు, ముందస్తు ధర ఖండన ,అప్పులిచ్చిన షావుకారికి పంటను అమ్మాలనే షరతులు రద్దయ్యాయి. ఆ స్థానంలో సరళమైన వడ్డీరేట్లతో అప్పులు దొరికే స్థితికి శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలు చేరుకున్నాయి” అని  మంచి మాట చెప్పారు. సరళమైన అప్పులైనా మన వ్యవసాయ రంగంలో ఉరిత్రాడే. కాదనలేం. కాకపోతే సామాజిక సంబంధాల పరంగా చూసినపుడు గ్రామీణ వడ్డీవ్యాపారికి ముందస్తు ధరకు పంట అమ్మడం లాంటి బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేది ముఖ్యమైన పరిణామం. ”ఏ దేశంలో అయినా ఫ్యూడల్‌ వ్యవస్థను ధ్వంసం చేసేది పెట్టుబడే. ఆ పని భారతదేశంలో దాదాపుగా పూర్తయ్యింది”. అని మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఈ సమాజం స్వరూపస్వభావాలేమిటో చెప్పకనే చెప్పారు. సామాజిక సంబంధాల విషయంలో నిశిత పరిశీలన వల్ల  వాస్తవాలను వాస్తవంగా చూపే వీలు కల్పించింది. ముఖ్యంగా రచయిత  శ్రామికుల- శ్రామిక కులాల దృక్కోణం నుంచి సమాజాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామీణ సంబంధాల్లో మార్పులను పైనించి చూసేవారికి కోల్పోయిన దర్జా గుర్తొస్తుంది. కింది నుంచి చూసేవారికి వదిలించుకున్న బానిసత్వం గుర్తొస్తుంది.  పాలేర్ల వ్యవస్థ పోవడంతో పశుసంపద అంతరిస్తున్న వైనాన్ని సాగర్‌ బాగా చెప్పారు. రైతుకు-పశుసంపదకు తల్లీ బిడ్డ సంబంధమని అదనీ ఇదనీ మనదగ్గర పురోగామివాదులనుకునే వారు సైతం బోలెడు సెంటిమెంట్లు గుమ్మరిస్తుంటారు. అనుబంధం ఉండే మాట వాస్తవమేగాని అది తన జీవికను మించి కాదు. పశుమాంసం ఎగుమతిలో మన దేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న విషయం గుర్తు చేసుకుంటే మన పశువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు వాటిని తరలిస్తున్నారో అర్థం అవుతుంది. గతంలో దళితులు నికర ఉద్యోగంగా లభించే పాలేరు వృత్తి దొరకడమే అదృష్టంగా భావించేవారని ఆ స్థితి ఇవాళ పోయి కాస్త మెరుగైన ఉపాధి దొరుకుతున్నదని సానుకూల పరిణామాన్ని రచయిత వివరించారు. ”గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు వృత్తిని ఉపాధిని కల్పించిన అర్థబానిస వ్యవస్థ అయిన పాలేరు వృత్తి నుంచే కాక, అర్థాకలితో మాడ్చి చంపిన వ్యవసాయ కూలీ రంగం నుంచి కూడా దళితులు నిష్ర్కమిస్తున్నారు” అని గతాన్ని వర్తమానాన్ని కలిపి వివరించారు. “స్వతంత్ర జీవనం సాగించడానికి పట్టణాల్లో ఉపాధి దొరకడం, సాంఘిక గౌరవం లభించడం” అనేవి పాలేరు వ్యవస్థ పోవడానికి కారణాలుగా దళితుల మాటల్లోనే చూపారు. సాంఘిక గౌరవమనగానే పట్నాల్లో కులం లేదా అని దీర్ఘాలు తీయనక్కర్లేదు. పల్లెల్లో కులానికి పట్నాల్లో కులానికి తేడా ఉంటుంది. ఈ మార్పు కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే కొందరికి కనిపించొచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది గుణాత్మకమార్పుగా మారుతున్నదని అర్థమవుతుంది. యాంత్రీకరణ జరిగితే ఉపాధి పోతుందని ‘సర్‌ప్లస్‌ పీపుల్‌’ పెరుగుతారని గాంధీలాగే చాలామంది ఇప్పటికి కూడా భావిస్తుంటారు. ట్రాక్టర్లు వచ్చాక కూలీలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణబాట పట్టారని దీనితో కూలీల కొరత తీవ్రమై కూలీరేట్లు పెరిగాయని వాస్తవ స్థితిని రచయిత వర్ణించారు.

అయితే ఏమిటి? ఇంతకుముందున్నది నరకమూ, ఇప్పటిది స్వర్గమూనా అనొచ్చు. కానే కాదు. రచయితకు స్పష్టత ఉంది. విద్యాసాగర్‌ కమ్యూనిస్టు. ఎంత కమ్యూనిస్టు అంటే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి రాయాల్సి వచ్చినపుడు మహాత్మాగాంధీకి కోట్స్‌ పెట్టే అంత కమ్యూనిస్టు. కాట్‌స్కీని ఎక్కువగా కోట్‌ చేస్తే తనమీద రెనగేడ్‌ ముద్ర పడే ప్రమాదముందని తెలిసీ సదాశయం కోసం తెగింపుతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమైనదే. లాభం తప్ప మరేమీ పట్టని ఈ వ్యవస్థను, మనిషిని యంత్రంగా మార్చే ఈ వ్యవస్థను, మనిషికి మనిషిని నిరంతరం పోటీ పెట్టే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే దానికోసం ఇంతకంటే దుర్మార్గమైన గతాన్ని ఆశ్రయించరాదు అని రచయిత చెప్పారు. ఇది పాతవ్యవస్థ కాదు. దానిని తలదన్ని ఏర్పాటైన కొత్త వ్యవస్థ. కొత్త వ్యవస్థ వల్ల కొన్ని  మార్పులున్నాయి. అవి  మౌలిక మైనవి కావు. పెట్టుబడికి అవసరమైన మార్పులు మాత్రమే. అసమానతలు పోగొట్టే మౌలిక మైన మార్పుల కోసం పోరాటం సాగాల్సిందే. కాకపోతే దానికి పాత మాటలు, పాత సాధనాలు పనిచేయవు అని కూడా రచయిత చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపించింది.

జి ఎస్‌ రామ్మోహన్‌

 

ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక Butterfly Effect

ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect…

 

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ.  2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు  మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం.  ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం.  మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది.  నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై,  కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం.  తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది.  శైవక్షేత్రం శ్మశానమయ్యింది…

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.

బడబాగ్నికి సలిలం లక్ష్యం.

దేహాగ్నికి దేహమే లక్ష్యం.

ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.

నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా !    —   అల్లమప్రభు.

 

 

కేదార్ నాథ్ ఆలయం వెనుక మహోన్నతంగా కనిపించే చౌరాబరీ గ్లేసియర్ మందాకిని జన్మస్థానం. గ్లేసియర్ సరస్సు వానలతో నిండి, మంచు కూడా కరిగి ప్రవహించటంతో తొణికి,  దూకి, అక్కడే పుట్టిన మందాకినితో కలసి, అడ్డొచ్చిన గండ శిలల్ని అలిగిన పిల్లాడు గోళీకాయల్ని విసిరికొట్టినట్టు కొట్టి, లోయ స్వరూపాన్నే మార్చేసింది. లక్షలకొద్దీ యాత్రికులు వెళ్ళే దారిలో వానా, దానివల్ల వచ్చే ప్రమాదం గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాత్ర ఆగలేదు. విధ్వంసం తప్పలేదు.

చౌరాబరీ గ్లేసియర్, కట్టడాలమధ్య ఒదిగిపోయిన కేదార్ నాథ్ గుడి

               

జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత, ఇది ప్రకృతి విలయమా మనుషుల స్వయంకృతమా అనే విశ్లేషణ చాలానే జరిగింది.  హిమాలయ పర్వతాలు వయసులో చిన్నవి.  పైగా గ్లేసియర్లు కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ భూగర్భ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ పని పెడుతూ ఉంటాయట. ప్రకృతిలోని ఈ  చిన్నా పెద్దా కదలికలకు తోడు ఆ కొండల్లో ‘చార్ ధామ్ యాత్ర’ పేరుతో మన కదలికలు కూడా ఎక్కువైపోయాయి. కేదార్ నాథ్ కొండల్లో లక్షలాది మనుషులు వేసిన  అడుగుల్లో నావి కూడా ఉన్నాయి.  2012 మే లో, అంటే ఈ విలయానికి ఒక సంవత్సరం ముందు,  కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి..  ఈ మూడు క్షేత్రాలు దర్శించటానికి మా అన్నయ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మొత్తం 15 మంది బయలుదేరాం. మాతోపాటు, డ్రైవర్, వంటమనిషి, అతని సహాయకుడు. రావు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాం.

ఢిల్లీ నుండి బయలుదేరి, హరిద్వార్, ఋషికేష్ చూశాక రుద్రప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా గుప్త కాశీ చేరుకున్నాం. దేవ ప్రయాగ దగ్గర అలకనంద, మందాకినీ నదుల సంగమం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. హిమాలయాల్లోనే  పుట్టిన ఈ రెండు హిమానీ నదాలు, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లా దేవ ప్రయాగ సంగమం దగ్గర రెండు రంగుల్లో తమ భిన్నత్వాన్ని చూపిస్తాయి. మందాకిని ఆకుపచ్చని నీలపు రంగులో ఉంటే, అలకనంద మట్టి రంగులో ఉంది.

దేవ ప్రయాగ శాంత మందాకిని

గుప్త కాశీ చేరుకున్నాక అక్కడినుండి మాలో ఆరుగురు హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళ్ళిపోయారు. మిగతా తొమ్మిదిమందితో  మా బస్సు 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు పొద్దునే బయలుదేరింది. పదిగంటలలోపు గౌరీకుండ్ చేరిపోతే అక్కడినుండి మరో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు నడుచుకుంటూ సాయంత్రం ఆరు గంటల లోపు చేరిపోవచ్చునని లెక్కలు వేసుకున్నాం. కానీ సగం దూరం తరువాత బస్సు కదిలితేగా!! ముందంతా ముసురుకున్న వాహనాలు. పే…ద్ద ట్రాఫిక్ జామ్. ఇంతలో మమ్మల్ని వెక్కిరిస్తూ బస్సులోకి ఒక ఈగల దండు వచ్చేసింది. అక్షరాలా ఈగలు తోలుకుంటూ  మధ్యాన్నం నాలుగ్గంటల దాకా బస్సులోనే ఈసురోమని, చివరకు గౌరీకుండ్ చేరాం. (అక్కడి జనం సందడి చూస్తుంటే ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ గుర్తువచ్చింది నాకు. “వానచినుకుల మధ్యనుండీ గుర్రాన్ని నడపటం ఏం గొప్ప? జనం ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో పక్కవాడి చెమటచినుకులు ఒంటికి అంటకుండా దాదర్ స్టేషన్ నుంచి బైటికి రా చూద్దాం” అని నకులుడిని సవాలు చెయ్యొచ్చు).

గౌరీకుండ్ నుంచి నా స్నేహితురాలు లక్ష్మీ, మరో ఇద్దరూ గుర్రాలు ఎక్కి ప్రయాణం సాగించారు.  సాయంత్రం అయిదు గంటలకు కర్రలు చేత  పట్టుకుని నేనూ, జయసూర్యా, మా తమ్ముడు శంకర్, మరదలు జానకి, మేనల్లుడు కాశ్యప్ నడక మొదలు పెట్టాం. మరో బుజ్జి మేనల్లుడు ఏడేళ్ళ కౌశిక్ ని చిన్ని బుట్టలో ఎక్కించాం. ఇలా బుట్టల్లో యాత్రికులను వీపున మోస్తూ తీసుకెళతారు కొంతమంది.  అచ్చంగా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తున్నట్టే అనిపించింది.  అక్కడ వాహనాలు దూసుకుంటూ మీదకొస్తాయి. ఇక్కడ గుర్రాలు, డోలీలు… వీటిని తప్పించుకుంటూ, కాస్త విశాలంగానే ఉన్నా, యాత్రికుల ట్రాఫిక్ తో ఇరుగ్గా అనిపించిన దారిలో ఏడు కిలోమీటర్లు నడక సాగించి, ‘రాం బాడా’ అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి రాత్రి సుమారు తొమ్మిదయింది. బురదలో, వాన చినుకుల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రెండు టార్చిలైట్ల సాయంతో అక్కడికొచ్చాక ఇక ఆ చీకట్లో ముందుకి సాగలేమని అర్ధమయింది. దారిపక్కన ఒక చిన్న ధాబాలాంటిది కనిపించింది. దాని యజమాని మనిషికో వంద రూపాయలిస్తే మాకు పడుకోవటానికి చోటు చూపిస్తానన్నాడు. ఒక పరదా వెనుక మాకు చెక్క మంచాలమీద పరుపులతో పక్కలు అమర్చి ఇచ్చాడు. అక్కడ వేడిగా రొట్టెలూ, అన్నం, పప్పుతో భోజనం కానిచ్చి రజాయిల్లో దూరాం. పక్కనే భీషణంగా నది చేస్తున్న రొద. నాకు ఒకంతట నిద్ర పట్టలేదు. పొద్దునే అయిదు గంటలకు మళ్ళీ బయలుదేరిపోయాం. కేదార్ నాథ్ చేరటానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం ఉంది.  హెలికాప్టర్ లో, గుర్రాలమీదా వెళ్ళినవాళ్ళు ముందురోజే చేరిపోయి, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే రోజు మళ్ళీ అందరం కేదార్ నాథ్ నుంచి వెనక్కు వచ్చెయ్యాలి. నడుస్తూ వెళితే, కేదార్ చేరేసరికి ఆలస్యం అవుతుందనిపించి, గుర్రాల మీద బయలుదేరాం.. రాం బాడా నుంచీ కొండ దారి విశాలమయింది.  రాగాలు తీస్తున్న పిట్టలు… బద్ధకాన్ని వదిలించుకుంటున్నట్టు తలలు విదిలిస్తూ, అడుగులు చురుగ్గా వేస్తూ గుర్రాలు… విరిసిన అడవి పూలు… సన్నగా చెవుల్లోంచి దూరి మెదడును చేరి, నిద్ర మత్తును వదిలిస్తున్న చలిగాలి.  ఆ సమయంలో వాన వెలిసి, ఖాళీగా ఉన్న తడిసిన దారిలో మెత్తటి లేయెండలో రామ్ బాడా నుంచి కేదార్ నాథ్ ప్రయాణం ఓ అందమైన పాటలాగా సాగింది.  సరిగ్గా మరో ఏడాదికి, 2013 జూన్ లో  విరుచుకుపడిన కేదార్ నాథ్ వరదల్లో ఆ చిన్నగ్రామం ‘రాం బాడా’ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే గౌరీకుండ్ కూడా.  ఆ రాత్రి రాం బాడాలో మాకు ఆశ్రయం ఇచ్చిన ధాబా, అక్కడి మనుషులూ, ఆ గుర్రాలూ, అన్నీ ఏమయాయోనని ఆలోచిస్తే మనసు కలుక్కుమంటుంది.

-రామ్ బాడా ధాబాలో వంట-

కేదార్ నాథ్ చేరాక అప్పటికే అక్కడికి చేరిపోయిన మావాళ్ళందరూ మమ్మల్ని చూసి తేలిక పడ్డారు. గౌరీకుండ్ నుండి ఇక సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు పనిచెయ్యలేదు. ఎవరి దారి వారిదే. ముందు రాత్రి మేము ఎక్కడ ఆగిపోయామో  వాళ్ళకు తెలియలేదు. “మేమంతా గుడికి వెళ్లి వచ్చేశాం. మీరూ తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సాయంత్రానికి మళ్ళీ గుప్త కాశీ చేరిపోవా”లన్నారు.  స్నానాలు కానిచ్చి గుడికి పరుగెత్తాం. అక్కడ రద్దీ చూడాలీ… దర్శనం కోసం పెద్ద పెద్ద వరుసల్లో వేలాడుతున్న మనుషులు.  హెలికాప్టర్లు దిగి వచ్చిన వాళ్లకు మాత్రం ప్రత్యేక హోదా. ఎందుకంటే వాళ్ళు దర్శనం కానిచ్చి వెంటనే ఎగిరి వెళ్లిపోవాలి. ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరుగుతున్న మా మీదకు ఓ పూజారి వల విసిరాడు. “మనిషికో వెయ్యి రూపాయలు ఇచ్చెయ్యండి. ఎలాగోలా లోపలికి పంపించేస్తాన”న్నాడు. “ఈ బేరాలేమిటి, దర్శనం లేకపోతే పోయిందిలే వెనక్కు పోదా”మనిపించి, చిన్నగా నస మొదలుపెట్టానుగానీ, జయసూర్య భక్తి పారవశ్యంలో నా సణుగుడు అణిగిపోయింది. దైవ దర్శనంతో అడ్డదారిన తలా కాస్తా పుణ్యం మూట కట్టుకుని బైటపడ్డాం. దర్శనం అయాక గుడి ఆవరణలో మమ్మల్ని కూర్చోబెట్టి పూజా కార్యక్రమం కానిచ్చి, రేటు మరి కాస్త పెంచి, మనిషికో పదిహేను వందల చొప్పున పండిట్ జీ  సొమ్ము చేసుకున్నాడు.

శ్రీశైలంలో చెంచులు చక్కగా అలంకారాలు చేసుకుని ఆటలు, పాటలతో శివుణ్ణి అలరిస్తారు. ఇక్కడ అలాంటి పూజలేమైనా ఈ గఢవాలీలు కూడా చేస్తారేమోనని ఆశించాను గానీ, సోమరిగా కూర్చుని భంగు కొట్టే సాధువులే తప్ప, జాతరల జాడలేవీ నాకు కనిపించలేదు.

ఊహించినట్టే కేదారేశ్వరుడి గుడి  పురాతనత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆ రాతి గోడల మీదుండే చాళ్ళు (striations) ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలపాటు మంచులో కూరుకుపోయి ఉందని చెప్తున్నాయని కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరువాత గ్లేసియర్ వెనక్కు జరగటంతో ఆలయం బైటపడి ఉండవచ్చు. ఇది పాండవులు శివుడిని పూజించిన చోటని చెప్తారు. ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని చరిత్ర.  మొన్న జరిగిన విలయంలోనూ గుడి  చెక్కు చెదరలేదు. కొట్టుకొచ్చిన గండ శిలలు ఆలయ ప్రాంగణం బైటనే ఆగిపోయాయట. కేదార్ నాథ్ ఊరంతా సిమెంట్ భవనాలు కనిపిస్తుంటే, ఇది కూడా ఓ పెద్ద వేసవి విడిది కావటానికి ఎక్కువ కాలం పట్టదని అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడా కట్టడాలన్నీ వరదలో సమాధి అయాయి. ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్ లోని ఈ చార్ ధామ్ దారంతా కొండ వాలుల్లో సిమెంట్ అంతస్తులు ప్రమాదకరంగా, వికారంగా కనిపిస్తుంటాయి. సాంప్రదాయక కట్టడాలను  టూరిజం కోసం పూర్తిగా బలి పెట్టిన చోటు గడ్ వాల్.

గుర్రం యజమాని దేవ ప్రయాగ దగ్గర కాంక్రీట్ అడవి

మధ్యాహ్నం ఒంటిగంటకు మా బృందం గౌరీకుండ్ వైపు నడక ప్ర్రారంభించాం. ఈ సారి లక్ష్మి కూడా నడక మొదలుపెట్టింది. అలిసిపోయే వరకూ నడిచి, అక్కడి నుండి గుర్రం మాట్లాడుకుంటానంది. మనుషుల మీది నుండి కళ్ళను తప్పించి పక్కకు దృష్టి సారిస్తే, విశాలంగా మెత్తటి పష్మీనా శాలువాలా తెల్లని మంచును ధరించిన హిమాలయాల వరకూ అడ్డు లేకుండా దూసుకెళ్ళాయి చూపులు. కేదార్ నాథ్ లోయ మహా విశాలం. యాత్రికులకోసం మంచి రహదారి ఏర్పాటు చేసేశారు. చుట్టూ ప్రకృతినీ, యాత్రికుల సంరంభాన్నీ చూస్తూ నడవటమే. చేతుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో మంచినీళ్ళు పట్టుకుని, బట్టలూ తిండీ మూటగట్టి భుజాన వేసుకుని పయనం కట్టిన గ్రామీణులు… డోలీల్లో, బుట్టల్లో కదలకుండా కూర్చుని అలసిపోతున్న పట్నవాసులు… నిజంగా అలా కూర్చోవటం పెద్ద శిక్షే.  ఏమాత్రం కదిలినా మోసే వాళ్ళకి కుదురు తప్పి కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది.

మలుపులు తిరుగుతూ, అలా అలా మళ్ళీ సన్నబడ్డ లోయ, ‘గరుడ చట్టీ’ దగ్గర, చీమల బారును శ్రద్ధగా వంగి చూస్తున్న పిల్లవాడిలా, యాత్రికుల వరుసలని వంగి గమనిస్తున్న కొండల బారు.  లయబద్ధంగా అడుగులు వేస్తూ ఊపిరి తీస్తూ, డోలీల్లో మనుషుల్ని మోసుకు పోతున్నవాళ్ళు… వీళ్ళను తప్పించుకుంటూ సాగే గుర్రాల ప్రయాణం… వీటి మధ్యలో కౌశిక్ తో పాటు నేనూ పరుగులు తీశాను. ఈ తిరుగు ప్రయాణంలో వాడు బుట్ట ఎక్కలేదు. నడుస్తానన్నాడు. నున్నగా అరిగిపోయిన ఆ రాళ్ళ దారిలో ఇద్దరం చాలాసార్లు జారిపడుతూ, నవ్వుకుంటూ పరుగెత్తాం. కౌశిక్ చేతిలోంచి జారిపోతున్న పెద్ద ఊతకర్ర వాడికంటే పొడవుగా ఉంది. దానికి తోడు చిన్నగా పరుగులు తీస్తూ మీద మీద కొస్తున్న గుర్రాలు. వీడు వాటి కాళ్ళ కిందకు ఎక్కడ వెళ్ళిపోతాడోనని నాక్కాస్త ఆందోళన.

కౌశిక్ తో నేను. అలసిన దేహాలు.

 

మొత్తానికి ప్రమాదాలేవీ లేకుండా  రామ్ బాడా వరకూ వచ్చాక, ఇక ఇలా నడుస్తూ ఉంటే గౌరీకుండ్ చేరేసరికి బాగా రాత్రయిపోతుందని శంకర్ అనటంతో మళ్ళీ అయిదుగురం గుర్రాలు తీసుకున్నాం.  రాం బాడా చెక్ పోస్టు దగ్గరా, కేదార్ నాథ్ లోనూ గుర్రాల సంఖ్య చూస్తే వేలలో ఉన్నట్టు  అనిపించింది. మే నుండి అక్టోబర్ వరకూ జరిగే ఈ యాత్రలో గుర్రాల మీద మనుషులను గమ్యం చేరుస్తూ కాస్త డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది. అవి వరుసలు తీరి కాలకృత్యాలు తీర్చుకోవటం… పెద్ద సిమెంట్ తొట్లదగ్గర ఆగి నీరు తాగి మళ్ళీ అడుగులు వెయ్యటం… వీపు మీద మనుషులు లేనప్పుడు హుషారుగా దౌడు తియ్యటం… శివ తత్వమేదో అర్ధం అయినా కాకపోయినా, ‘అద్దె గుర్రాల జీవన విధానం’ మాత్రం కాస్త అర్ధమయింది.

నేనూ, జానకీ ఎక్కిన గుర్రాలను ఒకే మనిషి నడిపిస్తున్నాడు. అవి రెండూ అల్లరివే. అతని మాట ఏమాత్రం వినటం లేదు. కొండ అంచువెంటనే నడవటం వాటికి ఇష్టం. మా మోకాళ్ళు రాళ్ళకీ, విద్యుత్ స్తంభాలకీ రాసుకుపోతుంటే నేను కాస్త భయంతో బిగుసుకున్నాను. ఇంతలో ఎదురుగా వస్తున్న గుర్రాన్ని నా గుర్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా ధీమాగా  రాసుకుంటూ పోయింది. దీనితో నేను ఓ పక్కకు వాలిపోయి పడిపోబోయాను. ఈ అల్లరి గుర్రంతో ఇక సాహసం చెయ్యలేక, దిగి నడుస్తానని పట్టు పట్టేశాను. గట్టిగా ఒక పది నిముషాలు కూడా గుర్రం మీద వెళ్ళక పోయినా, గుర్రాల యజమానులకు మొదట అనుకున్న డబ్బు మొత్తం ఇచ్చి, నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా గుర్రాలు దిగిపోయారు. అందరం మళ్ళీ పరుగు లాంటి నడక మొదలు పెట్టాం. గౌరీకుండ్ చేరేసరికి ఏడు గంటలైంది. అప్పటికే చీకటి పడిపోయింది.

కేదార్ నాథ్ లో బయలుదేరినప్పుడే లక్ష్మి “నేను నెమ్మదిగా నడుస్తాను. మీరంతా ముందు నడవండి. నడవలేనని అనిపిస్తే గుర్రం తీసుకుంటాన”ని చెప్పటంతో మేమంతా తొందరగా నడిచాం. తను కొంత దూరం తరువాత కనిపించలేదు. దారిలో కూడా ఎక్కడా తగల్లేదు. ‘గుర్రం ఎక్కి మాకంటే ముందే చేరిపోతుందిలే’ అనుకున్నాం కానీ, మేము గౌరీకుండ్ చేరి అరగంట గడిచింది. గంట గడిచింది. తన జాడ లేదు. గౌరీకుండ్ ఒక పెద్ద సంతలా ఉంది. ఆ జనంలో తనని వెదకటం కష్టం. అప్పటికే నడకతో ఒళ్ళు అలిసిపోయి, అందరం తనకోసం ఎదురు చూస్తూ ఒకచోట కూలబడ్డాము. హెలికాప్టర్ లో వెళ్ళినవాళ్ళు గుప్త కాశీ చేరిపోయారు. మేమందరం మా బస్సులో అక్కడికి చేరాల్సి ఉంది. మళ్ళీ పొద్దునే నాలుగ్గంటలకు అందరం కలిసి గుప్త కాశీ నుంచి బదరీ నాథ్ కు బస్సులో బయలుదేరాలి.  మొబైల్ ఫోన్లు ఏవీ పని చెయ్యటం లేదు. ఆఖరుకు నేనూ, జయసూర్యా లక్ష్మి వచ్చేవరకూ అక్కడే వుంటాం అని, మిగతా వాళ్ళనందర్నీ వెళ్ళిపొమ్మని చెప్పాం. ఇంకేం చేసేదిలేక వాళ్ళంతా బస్సులో వెళ్ళిపోయారు. మనసులో ఆందోళన. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు నొప్పులు. కడుపు ఖాళీ. ఎదురుగా అన్నీ తినటానికి దొరుకుతున్నా, ఏమీ తోచనితనంతో అక్కడక్కడే నీరసంగా తిరుగుతున్నాం. ఇలా గౌరీకుండ్ ఇంకా చేరనివాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడున్న చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో వాళ్ళగురించి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళలో తెలుగువాళ్ళ పేర్లు కొన్ని వినిపించాయి. మేము కూడా పోలీసుల చేత అనౌన్స్ చేయించి, మైక్ లో మేమూ అరుస్తూ, ఎంతసేపు ఎదురు చూసినా ఫలితం లేదు. లక్ష్మి కొంత అనారోగ్యంతో ఉంది. అయినా చాలా ధైర్యస్తురాలు. సమయస్ఫూర్తి కూడా ఎక్కువే.  “దారిలో గుర్రం మీదనుంచి పడిపోయిందా? ఆ చీకటిలో ఎవరైనా చూశారా లేదా? ఆసలెలా ఉందో, ఎక్కడుందో?” ఇలా ముసురుతున్న మా ఆలోచనలు…  దారిలో ఏవయినా హెల్త్ సెంటర్ లు ఉంటే అక్కడ తనగురించి కనుక్కోమని పోలీసులను అడిగాము.  వాళ్ళు చాలా ఓపిగ్గా వీలైనంతవరకూ తప్పిపోయిన వాళ్ళ ఆరా కనుక్కుంటూనే ఉన్నారు.  దారిలో ఉన్న రెండు హెల్త్ సెంటర్ లకు చేరిన వాళ్ళలో తను లేదని చెప్పి, మాకు ధైర్యం చెప్పారు.  కాలం నెమ్మదిగా ఆవులిస్తూ రాత్రి పది గంటల్ని కూడా మింగింది.  జనం బాగా పల్చబడ్డారు. రాత్రంతా ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చెయ్యాలీ ఎక్కడుండాలీ  అని మేమిద్దరం ఆలోచిస్తూ అక్కడక్కడే చిన్నగా అటూ ఇటూ తిరుగుతున్నాం..  ఇంతలో హఠాత్తుగా ప్రత్యక్షం అయింది లక్ష్మి.  నోరంతా ఎండిపోయి, కళ్ళు వాలిపోతూ, మొహం పీక్కుపోయి, అయినా ధైర్యపు ఛాయ మొహం మీదనుంచీ కొంచెమైనా తొలగకుండా…  కొంచెం నీళ్ళు తాగాక స్థిమితపడి తను పడ్డ పాట్లన్నీ చెప్పుకొచ్చింది. జీను సరిగ్గా లేని గుర్రం ఎక్కటం, దానిమీదనుంచీ పడిపోవటం, పెద్దగా దెబ్బలు తగలకపోవటం, మళ్ళీ లేచి నడుచుకుంటూ రావటం.. ఇంకో గుర్రం ఎక్కటం… ఇలా … మొండిధైర్యంతో మమ్మల్ని ఎలాగైనా చేరటమే లక్ష్యంగా పెట్టుకుని, నోట్లో మంచినీళ్ళు పోసుకొనే సోయి కూడా లేకుండా పడుతూ లేస్తూ వచ్చేశానని చెప్పింది. అప్పటిదాకా భయంతో వణుకుతున్న నా గుండె తనని చూశాక  కాస్త స్థిరంగా కొట్టుకోవటం మొదలెట్టింది.  అక్కడున్న ఫలహారశాలలో కాస్త తిని, గుప్తకాశీ ఇప్పుడు ఎలా చేరగలమా అని చూస్తుంటే, ఒక ఇన్నోవా కనిపించింది. దానిలో ముగ్గురం బైలుదేరి గుప్తకాశీలోని మా వాళ్ళను చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది. లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్  హిమాలయాల ఒడిలో ఒదిగిన మహా సౌందర్యం.  కానీ, ఇంతలా   కొండల్లో ట్రాఫిక్ జామ్ లు సృష్టించుకుంటూ, మళ్ళీ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని నేను ఊహించలేదు.   మన తెలుగువాళ్ళలో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించే అలవాటు ఈనాటిది కాదు. ఏ కాలం నుంచో కష్టాలకోరుస్తూ ఈ యాత్రలు చేసినవాళ్ళున్నారు.  ఇప్పుడు తీర్థయాత్రలు కూడా ప్యాకేజీల్లో అమ్మకానికి వచ్చాక, ప్రయాస తగ్గి, పుణ్యం కొనుక్కోవటం ఎక్కువయింది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఎంతోమంది గుర్రాలు నడుపుకునే వాళ్ళకూ, డోలీలు మోసే వాళ్ళకూ, తిండి వస్తువులూ, పూజ సామాన్లూ అమ్ముకునే వాళ్ళకూ, వంట వాళ్ళకూ ఉపాధినిచ్చింది.  ఏ స్థాయి టూర్ ఆపరేటర్లు ఆ స్థాయిలో దండిగా జేబులు నింపుకున్నారు.  చిట్ ఫండ్ కంపెనీలు ఒక్కసారిగా దివాలా తీసినట్టు, ఈ యాత్రలన్నీ ఒక్కవరదతో కొట్టుకుపోయి ఉత్తరాఖండ్ ఆర్ధిక స్థితినే దెబ్బ తీశాయి. కనీసం ఇంకో అయిదేళ్ళ వరకూ కేదార్, బదరీ, గంగోత్రి దారులేవీ బాగుపడేటట్టు లేవు. కేదారేశ్వరుడు కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతాడేమో!

యాత్ర కళ కళ లాడే ఆ రోజుల్లో మేము సందడిగా, తొక్కిడిగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా కేదార్ ప్రయాణం పూర్తి చేసుకుని ఆ జ్ఞాపకాల మూట మోసుకుని మరునాడు తెల్లారుజామునే బస్సులో బదరీనాథ్ బయలుదేరాం… (

 

(మిగతా యాత్ర గురించి మరోసారి…)

 

lalitha parnandiల.లి.త.

 

 

 

 

ఎవరు తవ్విన గోతులివి??

2007062553850301

పెద్ద రోడ్లపై, చిన్న రోడ్లపై,

సందులు గొందుల సన్న రోడ్లపై,

జూబిలి హిల్సూ, చింతల బస్తీ,

పెద్దల నగరూ, పేదల వాడా

భేదభావమే లేకుండా

                   గుంటలు! గుంటలు! గుంటలు! గుంటలు!

                   గోతులు!! గోతులు!! గోతులు!! గోతులు!!

సంకురాతిరికి ముగ్గులు వేస్తూ

తాటకి పెట్టిన చుక్కలు గోతులు,

నగరారణ్యపు మనుషుల వేటకు

యముండు పన్నిన ఉచ్చులు గోతులు

అనిపించేలా రోడ్లన్నీ

                   గుంటలు! గోతులు! గుంటలు! గోతులు!

                   గోతులు!! గుంటలు!! గోతులు!! గుంటలు!!

బురద గుంటలూ, మురుగు గుంటలూ,

లోతు గోతులూ, లేత గోతులూ,

మ్యాను హోలుసూ, మ్యాన్ మేడ్ హోల్సూ,

చిన్నా పెద్దా, ఎన్నో సైజులు,

ఎన్నో గుంటలు, ఎన్నో గోతులు!!

                   గోతులు! గుంటలు! గోతులు! గుంటలు!

                   గోతులు!! గోతులు! అబబా!! గోతులు!!

తుచ్ఛపు నోట్లకు బ్రహ్మాస్త్రాలను

అమ్మిన పాపం తలలకు చుట్టగ

ఉచ్చుకు చిక్కిరి పిచ్చిజనం!

తమ గోతిని తామే తవ్వుకుని

అందులో దూకిరి వెర్రిజనం!!

— వెల్లంపల్లి అవినాష్

నగల్స్-సెనగల్స్!

10149293_4157458311857_502515035_n

-మృత్యుంజయ్

11937_578811308820340_1396284388_n

ప్రార్థించే కళ్లు!

drushya drushyam 26
ప్రశాంతి ….బహుశా ప్రార్థనా సమయం విద్యార్థిగా ఉన్నప్పుడే ఉంటుందా?
ఏమో!కానీ, నిత్య విద్యార్థిగా భుజానికి కెమెరా వేసుకుని, ఉదయాన్నే వాడకట్టులన్నీ తిరుగుతూ ఉంటే, పరిసర ప్రపంచంలోని మనుషులు ఒక్కరొక్కరుగా తెరిచిన పుస్తకమై హత్తుకుంటుంటే, ఒక మావవేతిహాసం దానంతట అది ఆహ్వానించి సరికొత్త జీవన మాధుర్యాన్ని పంచుతూ ఉంటే, జనగనమన అక్కరకు రాదు.
అప్పుడనిపిస్తుంటుంది! ప్రార్థించే పెదవులకన్నా కళ్లు గొప్పవేమో అని, రాయాలనీ అనిపిస్తుంది!’కాంతి వాచకం’ అనదగ్గ ఫొటోగ్రఫీ కారణంగా కళ్లు అత్యున్నతమైన ప్రార్థన కోసం చికిలించుకుని నిదానంగా తెరుచుకుంటూ ఉన్నప్పుడు ఒక గొప్ప భావం కలిగేను….అదే శాంతి. అవును. శాంతి… అందలి ప్రశాంతి….పీస్ ఆఫ్ మైండ్.

మైండ్ అని అనడమే గానీ అది హృదయం.
ఈ జగద్ధాత్రిలో వికసించే హృదయరాగం. అదే ప్రార్థన.

ఈ చిత్రం అటువంటిదే అని మనవి చేస్తూ మొదలు….

+++

ఆ రోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దాటానో లేదో ఆ మూల మలుపులో గుడెసెల వద్ద ఆగక తప్పలేదు. వరుసగా ఉన్న గుడిసెల్లో ఒకానొక గుడిసె ముందుకు రాగానే కళ్లు అతడిపై వాలాయి. ఒక సషుప్తిలో ఉన్నటువంటి అనుభవం వైపు ఏకాగ్రం అయ్యాయి. చప్పున కెమెరా తెరిచి ఒక కన్ను మూసి ఈ ఛాయను ఒడిసి పట్టుకున్నాక ధన్యుణ్నయ్యాను.

గుడిసె అంటే ఒక గుడి.
ఈ హృది నివాసం గనుక అది గుడి.

కాషాయం కాదు, చల్లగా ఉండేందుకా అన్నట్టు దళిత జీవితపు సుఖమయ ఆరాటానికి ప్రతీకా అన్నట్టు ఆ నీలం రంగు వరక్కాయితాలు పరిచిన గుడిసె…దాని ముందు… నీలం రంగు షర్టే వేసుకున్న ఆ మనిషి…
తాను తలపై అట్లా చేయించుకుని ఎంతసేపైందో!

క్షణాలు దొర్లుతున్నా కదలక మెదలక అట్లా నిశ్భబ్దంగా…

చూడగానే ఆగిపోయాను. దగ్గరకు సమీపించాను. ముందొక ఫొటో తీసుకుందాం అనుకున్నాను.
కానీ, ఆ ఒక్క ఫొటో తీసుకుని చూసుకుంటే, ఇక ఇంకా వద్దనే అనిపించింది.
అది చక్కగా రావడంతో సంతషించి ఇక వెనుదిరిగాను.

వెనుదిరుగుతుంటే మళ్లీ ఒక భావం. వీళ్లను ఎవరైనా ఇట్లా చూస్తున్నారా?
పదులు, వందలు, వేలు, లక్షల మంది ఇట్లా ఇంత హాయిగా, ఇంత నిర్భయంగా, ఇంత స్తైర్యంతో ఇట్లా ఉండగా లక్షలు, వేలు, వందలు, ఒక్కరు…అవును, ఒక్కరైనా ఇట్లా ఉండగా చూస్తున్నారా? అనిపించిందొక క్షణం.
తక్షణం ప్రార్థన అనుకున్నాను.

అందరికీ లభించే అదృష్టం కాదిది! అనిపించింది.
జనసామాన్యంలోని దారిద్ర్యాన్ని, ఎదురీతను మాత్రమే చూసే సమస్త లోకంపై ఒక చిన్న మందహాసం.
ఆ వెంటనే నన్ను నేను తమాయించుకుని వెనుదిరిగాను.

వెనుదిరిగినా అతడే. ఎన్నోసార్లు చూసుకున్నాను.
పదే పదే ఈ చిత్రాన్ని చూస్తుంటే ఎంత బాగుంటుంది!

అది ఎండాకాలమే. కానీ, తన ముందర నీళ్ల చెంబు.
స్టీలుదే!  కానీ, దాహం తీర్చుకోవడం ఎంత ముఖ్యమో, మంచినీళ్ల ఆనవాలు చెప్పే ఆ ఒక్క చెంబు మొత్తం కంపోజిషన్ ను హాయిగా మలిచిందనిపించింది. నిజానికి ఆ నీలం రంగు వరకు చినిగింది. రంధ్రం ఉన్నది. కానీ, అది చేసిన గాయాన్ని ఈ చెంబు తీర్చిందనే అనిపించింది.

ఇక తన కింద ఆ చెద్దరు. తల గడపలా ఆ ఎర్రెర్రని చెద్దరు.
రంగుల సమ్మేళనం చూడవస్తే కిందికే పోవాలి. అధో జగత్తు సహోదరుల వద్దే నేర్చుకోవాలి.
ఏం జీవన సమ్మేళనం అని ఆచ్చెరువొందవలసిందే!

అప్పుడు ఉదయం ఏడెనిమిది అవుతున్నది. తాను అప్పటికే నిద్రలేచి చాలా సమయం అయిందేమో. మల్లొక కనుకు తీస్తూ ఉన్నాడేమో…లేదా… ఏదో ఆలోచించి స్థిమిత పడ్డాడేమో!

ఏమైనా ఒక శాంతి.
లోవెలుపలా ప్రశాంతి.

తన ముందర ఒక ఎండ పొడ తాలూకు చిన్న వెలుతురు క్రీడ, నీడ…
అదొక కాంతి. చీకటి లేదని చెప్పే చిరుదీపమూ…

అనుకుంటాం గానీ, పేదవాళ్లు చీకూ చింతా లేకుండా ఉంటారని!
ఉంటారు. అయితే, ఒక చిత్రమైన విషయం…భగవంతుడు మనకొక ముఖాన్ని ఇస్తాడు. కానీ, దాన్ని వికృతం చేసుకోకుండా నిద్రపోం కదా మనం! కానీ, నిరుపేదలు అలా కాదు. వాళ్లకు ఆర్థిక సామర్థ్యం అంతగా ఉండదన్న మాటేగానీ, మిగతా వాటన్నిటిలో వాళ్లు ధనవంతులు. భాగ్యవంతులు….
అందుకే వాళ్ల ముఖాల్లో కృతకం ఉండదు., నైర్మల్యం తప్ప!
భీతి ఉండదు, స్థిమితం తప్ప!
చిత్రమే.కానీ వాస్తవం.

అధికారం, హోదా వాళ్లకు బహు తక్కువ. అందువల్ల కూడా వాళ్లు అదృష్టవంతులు.
అందువల్లే వాళ్ల సహజ ప్రవృత్తి ఇట్లాగే నిరాడంబరంగా, నిఖార్సంగా ఉంటుంది.

తలపై చేయించుకున్న విధానమే చూడగలరు.
ఒక చేయిని ఆలంబన చేసుకుంటే మరో చేయిని అభిమానం చేసుకున్న విధానం…
చూడగలిగితే మనిషంత మహత్తరమైన జీవగ్రంథం ఇంకేదైనా ఉంటుందా, చదవడానికైనా!
అందుకే వాళ్ల చిత్రాలు సజీవగ్రంథాలు. ప్రపంచ సాహిత్యంలో ఎల్లవేళలా చదవతగ్గవే!
కాలదోషం పట్టని జీవధాతువులే.

విషయం ఏమంటే, ఆ మట్టి మనుషులకు వందనం అని!
తల దాచుకోవడానికి పక్కా ఇల్లయినా లేని ఎందరో మహానుభావులు…వాళ్లింకా శాంతమూర్తులే!
అందుకూ ధన్యవాదాలే!+++ప్రార్థించవలసింది ఏదైనా ఉంటే ఇదే.
కళ్లతో చూసి, వాళ్లు ఇంత చల్లగా ఇంకా ఉన్నందుకే!
సేవ చేయడం అంటే ఇదే. వాళ్లను అశాంతిలోకి నెట్టకుండా ఉండటమే!మరి, నా గీతం విన్నందుకు కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు !?!

murali

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది. కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

జీవితచరమసంధ్యాసమయంలో ఉన్న చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారిని కవిత్వలక్షణం ఏమిటని శ్రీశ్రీ అడిగితే ఆయన అన్నారట: 1) రమ్యాక్షరనిబంధం వల్ల కంఠవశం కాగల రచన 2) జాతీయజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో మననం చేసుకోవటానికి అనువయిన పదసంచయనం 3) ధారావిశుద్ధి మూలాన రసనాగ్రనర్తకిగా ఉండటం.

శాస్త్రిగారు చెప్పిన ఆ మూడు లక్షణాలూ పదపరివృత్తిని బట్టి వస్తుతః సమానార్థబోధకాలే అయినా వాటిలో కొంత ఛాయావిభేదం లేకపోలేదు.

రమ్యాక్షరనిబంధమన్నది కవితాశైలికి సంబంధించిన మసృణత్వం. అది సందర్భవశమే కాని సర్వకాల సర్వావస్థాగతం కాదని పొరబడకూడదు. ‘రమ్యత’ అంటే పాఠకుడు ఒక రచనను చదివిన కొంతకాలం తర్వాత దానిని మళ్ళీ అధ్యయనం చేసినప్పుడు – ప్రతిపాద్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలగటం వల్ల, జీవితంలో తాను పొందిన సుఖదుఃఖాల అనుభవపరిణామం వల్ల, ఆత్మసంస్కారం వల్ల ఆ రచన మరింత కొత్తగానూ, మరింత దీప్తంగానూ భాసించే స్వభావాన్ని కలిగి ఉండటం అన్నమాట. కవియొక్క ప్రతిభాశక్తి కాలాంతరంలోని పాఠకుల అవగాహన పరిధికంటె ఎన్నోరెట్ల గాంభీర్యౌన్నత్యాలతో విలసిల్లితే గాని ఆ రమ్యాక్షరనిబంధం సాధ్యం కాదు. కవి ఎన్నెన్ని పూర్వజన్మలలో ఆరాధించి ఎంతమంది మహాకవుల నుంచి మూటగట్టి తెచ్చుకొన్న పుణ్యఫలమో అది!

కవిత్వాన్ని జాతీయ జనజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో విశ్వజనీనంగా తీర్చిదిద్దాలన్న ఆదర్శంలో కవి మనీషిత, లోకహితైషిత గోచరిస్తాయి. వేణికలల్లటం కేవలం ఆఖ్యానశిల్పానికి పరిమితమైన ఔపచారిక శబ్దప్రవృత్తి కాదు. కథాగతులైన వ్యక్తుల శీలౌన్నత్యానికి, శీలభ్రష్టతకు కారణాలేమిటో నిరూపించి, లోకానికి ఉపదేశప్రాయమైన రచనను చేయగలగటం అన్నమాట. ఆ రచనకు మూలాన్ని జాతీయ జనజీవితాలలో నుంచి తీసుకోవటం వల్ల పాఠకుడు తన జీవితాన్ని దానితో సరిపోల్చుకొని, తన జీవితానికొక గమ్యాన్ని, ఒక ఆదర్శాన్ని కల్పించుకోగలుగుతాడు. కవిత్వ రచనోద్దేశం ఆ ఆదర్శకల్పనల ఫలమైన సమాజాభ్యుదయమే. ఒక్కొక్క యుగంలో పరిభాష మారుతుందే కాని పార్యంతికఫలశ్రుతి అదే.

ధారాశుద్ధి అంటే వర్షామేఘం నుంచి తెంపు లేకుండా స్రవించే నీటిచాలు లాగా కవిత్వం పరిశుద్ధమైన పదసంపదతో హాయిగా సాగిపోవటం. పద్యమైనా, గేయమైనా పాఠకులకే గాక రచించిన కవికి సైతం గుర్తుండని స్థితి ఏర్పడటానికి కారణం ఈ ధారావిశుద్ధి లోపమే. ఈ ధారావిశుద్ధి స్వస్వరూపంతో చదువరుల గుండెలకు హత్తుకొనిపోవాలనే విశ్వనాథ వారు కావ్యరచనావేళ ఒక పూర్తి సన్నివేశాన్ని పూర్తిగా మనస్సులో కూర్చుకొన్నాక లేఖకునికి చెప్పి వ్రాయించటం జరిగేది. అజంతా గారు ఒక గేయం పూర్తిగా మనస్సులో నిలిచిపోయిన తర్వాత దానిని ఎన్నోమార్లు నెమరువేసుకొని, ధారణను సరిచూసుకొని, నిబ్బరంగా కుదిరిందని అనిపించిన తర్వాతనే ఆ నిరాకార శబ్దస్రవంతిని కాగితం పైకి ప్రవహింపజేసేవారు. చెళ్ళపిళ్ళ వారికీ, శ్రీశ్రీకీ, ఎంతోమంది మహాకవులకూ అభ్యస్తపూర్వమైన కవితా రచనా దృగ్విషయం అది.

viswa

అనువాదాలపై ఆధారపడక స్వతంత్రావిర్భావవికాసాలను కలిగివుండటం కూడా ఉత్తమకవిత్వపు సాముద్రికలక్షణమని వెంకటశాస్త్రి గారు సూచించారట.

రూపానికి ప్రాధాన్యం ఇచ్చి వస్తువు విషయాన్ని ప్రసక్తింపలేదని ప్రథమదృష్టికి భాసింపవచ్చును గాని, ప్రతిపాద్యవస్తువుకు చిరంజీవిత వెంకటశాస్త్రిగారు అనుభవపూర్వకంగా చెప్పిన స్మరణయోగ్యత వల్లనే సిద్ధిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యమే.

భావికాలికాకాంక్ష లేని కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమని శ్రీశ్రీ తరచు అంటుండేవారు. అపురూపమైన ఆ సగుణశక్తిసాధన తోనే శ్రీశ్రీ తనకాలంనాటి మూడు తరాలకు నాయకత్వం వహింపగలిగారు. అభ్యుదయకవులు ఆయనను శబ్దబ్రహ్మగా ఆరాధించి, అనుకరించి, పదికాలాలపాటు పదిలంగా నిలిచే పదబంధాలెన్నిటినో కవిత్వపరిభాషలో నియతంగా నిలిపారు. ఆయన ప్రకల్పించిన శబ్దపు తంత్రులను మ్రోగించి, నూతనస్వరాలను పలికించి, ఆత్మీయాదర్శాలతో జాతి అంతరంగసంగీతాన్ని వినిపించారు.

అభ్యుదయకవిత్వావిర్భావదశకం

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది.

కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

srisri-profile

రాయప్రోలు కాల్పనికజీవనదిలో నుంచి తీసిన భావకవితాకుల్యను మళ్ళీ విశ్వనాథ సంప్రదాయజలధిలో కలిపివేయడంతో భావకవితాయుగంలో ఒక సువర్ణావృత్తి పూర్తయింది.

ఆ ఉరవడికి తట్టుకొని స్వీయవ్యక్తిత్వాన్ని నిలుపుకొన్న సామాజిక శబ్దవిధాతలు అబ్బూరి రామకృష్ణారావు, ఉమ్రాలీషా, కృష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్య, కుసుమ ధర్మన్న, జాషువా, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి కనుపిస్తారు. ఆ తర్వాత శిష్ట్లా, శ్రీశ్రీ, నారాయణబాబులు సృష్టించిన అభ్యుదయ ప్రవర అనిసెట్టి సుబ్బారావు, ఆరుద్ర, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఆవంత్స సోమసుందర్, దాశరథి, బైరాగి, అజంతా, కవిరాజమూర్తి, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలుకొని కాళోజీ, డా|| సి. నారాయణరెడ్డిల దాకా నిరంతరాయితంగా కొనసాగింది.

బోయి భీమన్న, గుంటూరు శేషేంద్రశర్మ, కోవెల సుప్రసన్నాచార్య, మాదిరాజు రంగారావు, చెరబండరాజు, జ్వాలాముఖి, సుబ్బారావు పాణిగ్రాహి, కె. సత్యమూర్తి, శివారెడ్డి, వరవరరావు, ఇస్మాయిల్, వేగుంట మోహన్ ప్రసాద్, గద్దర్, వంగపండు ప్రసాదరావు, ఓల్గా, ఘంటసాల నిర్మల, పాటిబండ్ల రజని, ముకుందరామారావు, పెన్నా శివరామకృష్ణ, త్రిపురనేని శ్రీనివాస్, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్, యాకూబ్, శిఖామణి, ఖాదర్ మొహియుద్దీన్, సతీష్ చందర్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, చల్లపల్లి స్వరూపరాణి, మానస చామర్తి మొదలైన సమాజ ప్రియంభావుక కవులు తమతమ తీరుల కొత్త దారులను అభిమానించి వర్తమాన శరతల్పం మీదికి ప్రగతిశీల నవ్యోక్తివైఖరుల సంజీవనీ కావ్యజలధారను అమృతాయమానంగా తీసుకొనివచ్చినవారిలో కొందరు. వీరిలో పెక్కుమంది తమ వరివస్యతో అభ్యుయానంతర కవితా క్షితిజరేఖలను దిగంతాలకు విస్తరించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.cherabandaraju

అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో అనూహ్యమైన వేగంతో మారుతున్న సమాజంలో ఈనాడు కవులు సామాజిక హృదయస్పందనకు నేతృత్వం వహింపలేకపోవటానికి కారణం ఏమిటి? సాహిత్యప్రక్రియలపై ప్రసారసాధనాలు, ప్రచార రాజకీయాల దాడి ఈ మధ్యకాలంలో పదునెక్కుతున్నది. సారస్వతవ్యాపారసంస్థల పురస్కారసంస్కృతి ఈ పతనావస్థకు ప్రతిఫలనం. అన్యభాషలలో వలె కాక తెలుగువారు కవుల చలనచిత్రరంగప్రవేశాన్ని విస్ఫారితనేత్రాలతో తిలకించటం వల్ల ప్రాంతీయ వాణిజ్యావసరాలు సాహిత్యపరిభాషను శాసించటం మొదలయింది. నిర్ణేతృక సర్వసైన్యాధ్యక్షపదవిని వదులుకొని కవులే బంట్లుగా బానిసతనానికి తలొగ్గుతున్నారు.  విజాతీయధోరణులతో స్వరూపస్థితిని కోల్పోతున్న జాతిని దళితవాదకవయితలు వచ్చి మేల్కొలుపకపోతే నేటి సాహిత్యం పూర్తిగా నిర్నిమిత్తమై, విస్మరణీయావస్థలోకి జారుకొనేదనటంలో అతిశయోక్తి లేదు.

ఓల్గా

ఓల్గా

శ్రీశ్రీ యుగప్రభావం నాటి ప్రతిభావిలసన క్రమంగా పరిమితం కాసాగినందు వల్ల కవులు అల్పప్రాయమైన రూపవాదానికి ప్రాధాన్యమిచ్చి, చిరంతనమైన సమసమాజాదర్శాన్ని గౌణీకరించి, కల్పనాశిల్పాన్ని అనాదరిస్తున్నారు. సాహిత్యికులలో వ్యుత్పత్తిగౌరవం, క్రాంతదర్శిత క్రమంగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం వైపుకు పరుగులుతీస్తున్నది. అస్తిత్వవాదం నుంచి సంఘటితశక్తిగా ఆవిర్భవించి దళిత బహుజనకవిత్వం సమాజనిష్ఠం అవుతున్న రోజులలో కూడా కవులు వైయక్తికాదర్శాలతో వెలసిన వార్తాపత్రికలే వస్తునిర్దేశికలుగా సరిపెట్టుకొని, జాతిభవితవ్యం పట్ల మౌనం పాటిస్తూ స్వార్థ రాజకీయవిధాతల వేలుపట్టుకొని నడుస్తున్నారు. ప్రజాస్వామిక మానవసంబంధాలకు కట్టుబడిన చైతన్య ధనుష్పాణుల గొంతుక సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఇంకా బలంగా వినబడుతుందని ప్రజలు బ్రతుకుబాటలో తమకు దారిచూపే శబ్దవిధాతల పాటకోసం వెయ్యికళ్ళతో వేచిచూడక తప్పటం లేదు.

ఏల్చూరి మురళీధరరావు

పాండవులు ‘కౌరవులు’ ఎందుకు కారు?

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

సంవరణుడు పన్నెండేళ్ళు అడవిలోనే ఉండిపోయి, తపతితో కాపురం చేయడం; అక్కడ అతని రాజ్యంలో అనావృష్టి ఏర్పడడం, అప్పుడు వశిష్టుడు వచ్చి దంపతులు ఇద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లడం, దాంతో అనావృష్టి దోషం తొలగి పోవడం గురించి చెప్పి, చివరిగా…

‘అంత సంవరణునకుం దపతికిం దాపత్యుండై కురువంశకరుడు కురుండు పుట్టె, నది మొదలుగా మీరు దాపత్యుల రయితిరి’ అని గంధర్వుడు చెప్పాడు.

ఈ చివరి వాక్యంలో కథకుని గొంతు, గంధర్వుని గొంతు విడివిడిగా మరింత స్పష్టంగా వినిపిస్తున్నాయి చూడండి…అంతే కాదు, ఉభయులూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్నారని కూడా ఈ వాక్యం చెబుతోంది. సంవరణునికీ తపతికీ ‘తాపత్యుడు’గా కురుడు పుట్టాడని చెప్పడం గంధర్వుని ప్రయోజనం అయితే, ఆ వెంటనే ‘కురువంశకరుడు’ పుట్టాడని చెప్పడం కథకుని ప్రయోజనం. మీరు తాపత్యవంశీకులు అంటూ మొదట శృతి చేసింది గంధర్వుడే కనుక, తపతీ సంవరణులకు కురుడు పుట్టినప్పటినుంచీ మీరు తాపత్యవంశీకులు అయ్యారన్న మాటతో అతనే కథనానికి ముగింపు చెపుతున్నాడు.

మొత్తం మీద ఈ ఘట్టం కథకుడికీ, ఆదివాసీ గంధర్వుడికీ మధ్య సయోధ్య, సర్దుబాటు ఎలా ఏర్పడ్డాయో, ఇద్దరూ ఎలా ‘రాజీ’ పడ్డారో కూడా చెబుతోంది. ఇలా రాజీ పడడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వివిధ తెగలు, వాటికి గల వేర్వేరు ప్రయోజనాలు, వేర్వేరు విశ్వాసాలు, వేర్వేరు ఆరాధనా పద్ధతుల మధ్య సంఘర్షణ జరగడం, చివరికి రాజీపడడం భారతదేశ పురాచరిత్ర, చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. భౌగోళిక స్థితీ, విస్తారమైన వనరుల అందుబాటు మొదలైన కారణాల వల్ల భారతదేశానికి స్వభావ సిద్ధంగా సంక్రమించిన గుణం అది.  కోశాంబీ చేసిన విలువైన ప్రతిపాదనలలో ఇది ఒకటి.

వ్యక్తుల ముఖతా వ్యక్తమవుతున్న ఈ రాజీని వారు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలకు ఆపాదించి చూడండి…మీరు తాపత్యవంశీకులు అని పాండవులకు నొక్కి చెబుతున్న గంధర్వుడు మాతృస్వామ్యవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంటే, కురువంశకరుడుగా కురుడు పుట్టాడని చెబుతున్న కథకుడు పితృస్వామ్యవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మానవజీవన ప్రస్థానంలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లడం ఒక గొప్ప మలుపు అనుకుంటే, ఆ పరివర్తన క్రమంలో ఒక దశలో ఉభయవ్యవస్థలూ రాజీ పడడం, అంటే రెండు రకాల గుర్తింపులనూ ఆమోదించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అదే జరిగిందనడానికి, మన దగ్గరే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి కూడా.

బహుశా తపతీ-సంవరణుల కథ ఆ దశకు చెందినదే!!!

అందులోకి మరింత లోతుగా వెళ్లబోయే ముందు, మరో ముఖ్యమైన అంశం గురించి చెప్పుకుని, కిందటి వ్యాసం చివరిలో వేసుకున్న ప్రశ్నల దగ్గరికి వెడదాం.

మీరు తాపత్యవంశీకులని గంధర్వుడు పాండవులకు అంత గుచ్చి గుచ్చి ఎందుకు చెబుతున్నాడు? తపతి తమ ఆదివాసుల ఆడబడచు కనుక, ఆవిధంగా మనకు చుట్టరికం ఉందని చెప్పడం ఒక ఉద్దేశం. ఆ చుట్టరికం కారణంగానే అర్జునునికి చాక్షుసి అనే విద్యనూ, పాండవులందరికీ గుర్రాలనూ ఇవ్వజూపాడు.  చాలా కాలానికి కలసుకున్న గణబంధువులు ఒకరి కొకరు కానుకలు ఇచ్చి పుచ్చుకునే గణసంప్రదాయాన్ని కూడా అది వ్యక్తీకరిస్తూ ఉండచ్చు. అంతకు మించి, మీరు తాపత్యవంశీకులు, అంటే తపతి పరంపరకు చెందినవారే తప్ప కురుని పరంపరకు చెందినవారు కారని నొక్కి మరీ చెప్పే ఒకవిధమైన పట్టుదల గంధర్వుడి మాటల్లో ధ్వనిస్తోంది.

Arjuna_and_His_Charioteer_Krishna_Confront_Karna

కురువంశీకులుగా పాండవులు కూడా కౌరవులే అవుతారు. కానీ, కౌరవులుగా దుర్యోధనుడు, అతని సోదరులు మాత్రమే గుర్తింపు పొందుతున్నారు. పాండవులకు ఆ గుర్తింపు లేదని చెప్పడానికి గంధర్వుడు మీరు తాపత్యవంశీకులని ప్రత్యేకించి చెబుతున్నాడా?!

మొత్తానికి ఈ ‘గుర్తింపు’ల విషయంలో చాలా గందరగోళమే ఉన్నట్టుంది. నిజంగా కూడా కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా. అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో. ధర్మరాజును, అతని సోదరులను తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న గుర్తింపు లేని సంగతి స్పష్టమే. ఇంతకీ ఈ గుర్తింపు తేడాలు ఏం చెబుతున్నాయి? కౌరవులు పితృస్వామికవ్యవస్థకు, పాండవులు మాతృస్వామిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతినా? పాండవులు తాపత్యవంశీకులని గంధర్వుడు నొక్కి చెప్పడానికి కారణం, వారు మాతృస్వామ్యవ్యవస్థకు చెందినవారని గుర్తుచేయడమా? అది కూడా ఎప్పుడు? పాండవులు సరిగ్గా ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళేముందు! ఆ అయిదుగురు సోదరులూ ఆమెను వివాహం చేసుకోబోతున్నారు కనుక, అందువల్ల తలెత్తగల ఆక్షేపణను నివారించే ముందు జాగ్రత్తలో భాగంగా వారి మాతృస్వామిక నేపథ్యం గురించి గంధర్వునితో కథకుడు మాట్లాడిస్తున్నాడా? సరే, పితృస్వామిక కోణం నుంచి కథ చెప్పడం మీదే కథకునికి ఎక్కువ ఆసక్తి అన్నది వేరే విషయం. ద్రౌపదీ-పాండవుల వివాహానికి ఎదురు కాగల ఆక్షేపణలకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని వ్యాసుడు కూడా మరో రూపంలో త్వరలోనే చేయబోతున్నాడు. ఇక కుంతికీ, ద్రౌపదికీ సామ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కుంతి కన్యగా ఉన్నప్పుడు ‘వర’ ప్రభావంతో ఒక కొడుకునీ, వివాహితగా ‘నియోగ’ పద్ధతిలో ముగ్గురు కొడుకుల్ని కంటే; ద్రౌపది అయిదుగురు సోదరులను వివాహమాడింది. ఇప్పుడు కుంతీ, ద్రౌపదులతో ధృతరాష్ట్రుని భార్య గాంధారిని పోల్చి చూడండి. ఆ ఇరువురితో ఈమెకు ఎలాంటి పోలికా కనిపించదు. పెళ్లి కాకముందు గాంధారి పూర్తిగా తండ్రి చాటు బిడ్డ. ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశానని తండ్రి సుబలుడు చెప్పడం, అప్పటికప్పుడు ఆమె ధృతరాష్ట్రునికి అర్థాంగిగా మారిపోయి నేత్ర పట్టం కట్టుకోవడం, పెళ్లి తర్వాత భర్త చాటు ఇల్లాలుగా అంతఃపురానికే పరిమితం కావడం; కుంతీ, ద్రౌపదులకు భిన్నంగా ఆమెను చూపిస్తున్నాయి. గాంధారి పితృస్వామిక స్త్రీకి అసలు సిసలు ప్రతినిధి. పాండవులకు కౌరవులన్న గుర్తింపును నిరాకరించడం అంటే ఏమిటి? దానిని ఇంకొంచెం పొడిగిస్తే, పైతృకమైన ఆస్తిలో కూడా వాటా నిరాకరించడమా?! కొంపదీసి కురు-పాండవ ఘర్షణ మొత్తానికి అదే కీలకమా? ఈ విధంగా ఇది మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య ఘర్షణ అనుకుంటే, యుద్ధం చివరిలో అశ్వత్థామ ఉపపాండవులనందరినీ వధించడం మాతృస్వామ్య అవశేషాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం అనుకోవాలా? చివరికి చూడండి, తనకు మాత్రమే భార్య అయిన సుభద్ర వల్ల అర్జునుడికి కలిగిన అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే అనంతర కాలంలో రాజయ్యాడు. అంటే మాతృస్వామ్యానికి కాలం చెల్లిందనీ, పితృస్వామ్యం స్థిరపడిందనీ అది సూచిస్తోందనుకోవాలా?

మొత్తానికి ఈ ‘గుర్తింపు’ల విషయంలో చాలా గందరగోళమే ఉన్నట్టుంది.  నిజంగా కూడా కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా.  అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో.  ధర్మరాజును, అతని సోదరులను తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న గుర్తింపు లేని సంగతి స్పష్టమే.

ఇంతకీ ఈ గుర్తింపు తేడాలు ఏం చెబుతున్నాయి? కౌరవులు పితృస్వామికవ్యవస్థకు, పాండవులు మాతృస్వామిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతినా? పాండవులు తాపత్యవంశీకులని గంధర్వుడు నొక్కి చెప్పడానికి కారణం, వారు మాతృస్వామ్యవ్యవస్థకు చెందినవారని గుర్తుచేయడమా? అది కూడా ఎప్పుడు? పాండవులు సరిగ్గా ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళేముందు! ఆ అయిదుగురు సోదరులూ ఆమెను వివాహం చేసుకోబోతున్నారు కనుక, అందువల్ల తలెత్తగల ఆక్షేపణను నివారించే ముందు జాగ్రత్తలో భాగంగా వారి మాతృస్వామిక నేపథ్యం గురించి గంధర్వునితో కథకుడు మాట్లాడిస్తున్నాడా? సరే, పితృస్వామిక కోణం నుంచి కథ చెప్పడం మీదే కథకునికి ఎక్కువ ఆసక్తి అన్నది వేరే విషయం. ద్రౌపదీ-పాండవుల వివాహానికి ఎదురు కాగల ఆక్షేపణలకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని వ్యాసుడు కూడా మరో రూపంలో త్వరలోనే చేయబోతున్నాడు.

ఇక కుంతికీ, ద్రౌపదికీ సామ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కుంతి కన్యగా ఉన్నప్పుడు ‘వర’ ప్రభావంతో ఒక కొడుకునీ, వివాహితగా ‘నియోగ’ పద్ధతిలో ముగ్గురు కొడుకుల్ని కంటే; ద్రౌపది అయిదుగురు సోదరులను వివాహమాడింది. ఇప్పుడు కుంతీ, ద్రౌపదులతో ధృతరాష్ట్రుని భార్య గాంధారిని పోల్చి చూడండి. ఆ ఇరువురితో ఈమెకు ఎలాంటి పోలికా కనిపించదు. పెళ్లి కాకముందు గాంధారి పూర్తిగా తండ్రి చాటు బిడ్డ. ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశానని తండ్రి సుబలుడు చెప్పడం, అప్పటికప్పుడు ఆమె ధృతరాష్ట్రునికి అర్థాంగిగా మారిపోయి నేత్ర పట్టం కట్టుకోవడం, పెళ్లి తర్వాత భర్త చాటు ఇల్లాలుగా అంతఃపురానికే పరిమితం కావడం; కుంతీ, ద్రౌపదులకు భిన్నంగా ఆమెను చూపిస్తున్నాయి. గాంధారి పితృస్వామిక స్త్రీకి అసలు సిసలు ప్రతినిధి.

పాండవులకు కౌరవులన్న గుర్తింపును నిరాకరించడం అంటే ఏమిటి? దానిని ఇంకొంచెం పొడిగిస్తే, పైతృకమైన ఆస్తిలో కూడా వాటా నిరాకరించడమా?! కొంపదీసి కురు-పాండవ ఘర్షణ మొత్తానికి అదే కీలకమా? ఈ విధంగా ఇది మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య ఘర్షణ అనుకుంటే, యుద్ధం చివరిలో అశ్వత్థామ ఉపపాండవులనందరినీ వధించడం మాతృస్వామ్య అవశేషాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం అనుకోవాలా? చివరికి చూడండి, తనకు మాత్రమే భార్య అయిన సుభద్ర వల్ల అర్జునుడికి కలిగిన అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే అనంతర కాలంలో రాజయ్యాడు. అంటే మాతృస్వామ్యానికి కాలం చెల్లిందనీ, పితృస్వామ్యం స్థిరపడిందనీ అది సూచిస్తోందనుకోవాలా?

చూసారా, విషయం ఎన్ని లోతుల్లోకి వెళ్లిపోతోందో! అనుకోకుండా కీ ఇచ్చి విడిచిపెట్టిన కారు బొమ్మలా నా ‘కీబోర్డు’ మీద ఈ విషయాలు వాటంతట అవే పరుగు పెడుతున్నాయి. ఈ పరుగుకు అర్జెంటుగా కళ్ళెం వేయాల్సిందే. సమస్యేమిటంటే, ఇంత గంభీరమైన విషయంలోకి పూర్తిగా తలదూర్చడానికి నేనిప్పుడు సిద్ధంగా లేను. అయితే, చాపల్యం అలాంటిది….ఎలాగూ మునిగాను కనుక, ఈ చర్చనుంచి పక్కకు తప్పుకునే ముందు చివరిగా ఒక్క ఆసక్తికరమైన పరిశీలనను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.

అదేమిటంటే, పైతృకమైన ఆస్తికి అర్హత ప్రశ్నార్థకం అయినది పాండవులు ఒక్కరి విషయంలోనేనా?… కాదు, అదే వంశంలో, వారికి సమకాలికంగానే మరొకరు ఉన్నారు…ఆయన భీష్ముడు!

అవును, భీష్ముడే. పాండవులు కౌంతేయు లైనట్టే భీష్ముడు గాంగేయుడు. అంటే, గంగ కుమారుడు. పాండవులలానే అతడు కూడా భరతవీరుడే, అందుకు అభ్యంతరం లేదు. భరతవంశస్థు డనేది ఒక విశాలమైన గుర్తింపు. కౌరవులనేది అలా కాదు. అది, ఒక నిర్దిష్టమైన గుర్తింపుగా కనిపిస్తుంది.  కనుక కౌంతేయులైన పాండవులలానే, గాంగేయుడైన  భీష్ముడు కూడా ‘కౌరవుడు’ కాడనే అనుకోవాలి. నేను ఆ దృష్టితో మహాభారతాన్ని పరిశీలించలేదు కనుక, భీష్ముని కానీ, పాండవులను కానీ కౌరవ్యులుగా ఎక్కడైనా పేర్కొన్నారా, పేర్కొని ఉంటే ఎన్నిసార్లు పేర్కొన్నారనేది చెప్పలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు ఆదిపర్వంలోని కొన్ని పేజీలను తిరగేస్తే భీష్ముని చాలాసార్లు గాంగేయుడిగానూ, ఒక్కసారి మాత్రం ‘పౌరవ్యుడి’గానూ పేర్కొనడం కనిపించింది…

చూడబోతే, ఈ గుర్తింపుల వ్యవహారం అంత సాదా సీదాగా తేలేలా కనిపించడం లేదు. ఇందులో చాలా మతలబులే ఉన్నాయనిపిస్తోంది.

ఇంతకీ కురుడు వంశకర్తగా కౌరవులు అనే పేరు ఏర్పడినతర్వాత ఎన్ని తరాలు గడిచాయో చూద్దామని లెక్క వేశాను. కురుడి నుంచి పాండవుల దగ్గరికి వచ్చేసరికి తొమ్మిది తరాలు మాత్రమే గడిచాయి. ఈ మధ్యలో వంశకర్తలు ఎవరూ లేరు. మహాభారతం పాండవులనే ఒక వంశంగా చెబుతోంది. అంటే కురుని తర్వాత పాండురాజే వంశకర్త అయ్యాడన్నమాట.  ఆ వంశంలో ప్రసిద్ధుడైన చివరి రాజు జనమేజయునికి కథ చెబుతున్న కథకుడు, జనమేజయుని  వరకూ సుదీర్ఘవంశక్రమాన్ని వివరించిన తర్వాత చివరిగా ఆ మొత్తం వంశాలను అయిదుగా వర్గీకరిస్తున్నాడు.

అవి: 1. ఐలులు 2. పౌరవులు 3. భరతులు 4. కౌరవులు 5. పాండవులు.

అసలు ఈ వంశక్రమాన్ని వివరించడం లోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని మరో సందర్భానికి వాయిదా వేస్తాను. పాండవులు, కౌరవుల కాలానికి వచ్చేసరికి, వారికి తొమ్మిది తరాల వెనకటివాడైన కురుని పేరిట ఏర్పడిన ‘కౌరవు’లనే వంశనామమే చలామణిలో ఉంది. అదే అధికారిక వంశనామం కూడా. బహుశా అదే అప్పటికి నిష్కళంకమైన వంశ నామం కూడా. ఎందుకంటే, కురునితో మొదలు పెట్టి ప్రతీపుని వరకూ…అనగా ఏడు తరాలపాటు ఆ వంశంలోని రాజుల వైవాహిక సంబంధాలలో ‘విలక్షణత’ ఏమీ లేదు. మాతృస్వామ్య/పితృస్వామ్య కోణంలో చెప్పుకోవాలంటే అవి పితృస్వామిక సంబంధాలే కాక, బహుశా సజాతి సంబంధాలు. ఆవిధంగా కురువంశం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లాంటిది.

కానీ ప్రతీపుని కొడుకు శంతనుని దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి తిరగబడింది. శంతనుడు గంగా తీరానికి వేటకు వెళ్లినప్పుడు గంగ అందమైన స్త్రీ రూపంలో అతనికి కనిపించింది. ఆమె పట్ల అతను ఆకర్షితుడై తనను చేపట్టవలసిందని ప్రతిపాదించాడు. అందుకామె షరతులు పెట్టింది. అతనివల్ల తనకు కలిగిన సంతానాన్ని తను ఏం చేసినా అతను అడ్డు చెప్పకూడదు! అడ్డు చెప్పిన తక్షణం తను అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఆమె అందానికి బందీ అయిపోయిన శంతనుడు ఒప్పుకున్నాడు. ఆమె తనకు కలిగిన ఒక్కొక్క సంతానాన్నే గంగపాలు చేస్తూ వచ్చింది. కష్టమనిపించినా షరతుకు కట్టుబడి శంతనుడు అడ్డు చెప్పలేకపోయాడు. ఏడుగురు కొడుకుల్ని అలా చేసిన తర్వాత, ఎనిమిదో కొడుకు విషయంలో ఊరుకోలేక పోయాడు. అడ్డు చెప్పాడు.  ఆ కొడుకును శంతనునికి అప్పగించేసి షరతు ప్రకారం గంగ అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అతడే భీష్ముడు… గాంగేయుడు!

ఈ కథ పూర్తి వివరాలలోకి నేనిప్పుడు వెళ్లదలచుకోలేదు. ప్రస్తుతానికి అవసరమైన ఒక వివరం ఏమిటంటే, గంగా తీరంలో నీకు ఒక స్త్రీ కనిపిస్తుందనీ, ఆమె కులగోత్రాలు ఏమిటని అడగకుండా ఆమెను పెళ్లి చేసుకోమనీ తండ్రి ప్రతీపుడే శంతనునికి చెప్పడం. కుల గోత్రాలు అడగవద్దు అనడంలో ఆమెది సందేహాస్పద నేపథ్యం అన్న సంగతిని కథకుడే అమాయకంగా బయట పెడుతున్నాడు.  మళ్ళీ, తండ్రే ఆమెను చేసుకోమన్నాడని చెప్పడం ద్వారా దానిని పెద్దలు కుదిర్చిన సంబంధంగా, ఇంకా చెప్పాలంటే పితృస్వామిక వివాహంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దానినలా ఉంచితే, గంగా-శంతనుల వివాహం, తపతీ-సంవరణుల వివాహం లాంటిదే. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే అది కూడా మాతృస్వామిక వివాహం.

కనుక, గాంగేయుడైన భీష్ముడు కౌంతేయులైన పాండవుల్లానే కౌరవుడు కాదు, కావడానికి వీల్లేదు. ఆ విధంగా అతను సింహాసనానికీ అర్హుడు కాదు. అతని సింహాసన త్యాగానికీ, తన వారసులు కూడా సింహాసనానికి పోటీదారులు కాకూడదనే ఉద్దేశంతో అతను పెళ్లి కూడా మానేయడానికీ కథకుడు ఎలాంటి కారణాలైనా చెప్పవచ్చు గాక… కురువంశ స్వచ్ఛతను, పితృస్వామిక విలువలను కాపాడాలంటే అతనిని సింహాసనానికీ, పెళ్లికీ కూడా దూరంగా ఉంచవలసిందే. ఎన్ని కట్టుదిట్టాలు చేసినా భీష్ముడు మాట తప్పుతాడనే భయం ఉండచ్చు కనుక, అతణ్ణి ఈ లోకానికే దూరం చేయడం మరింత మెరుగైన పరిష్కారం. కానీ అక్కడికి వచ్చేసరికి తండ్రి శంతనుడు చక్రం అడ్డేశాడు. అతనికి ‘స్వచ్ఛంద మరణం’ అనే వరం ఇచ్చాడు. స్వచ్చంద మరణం అంటే, నీ మరణం నీ చేతుల్లోనే ఉంటుంది తప్ప, ఇంకొకరు నీ ప్రాణం తీయరని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే నీకు సహజ మరణమే కలుగుతుందని శంతనుడు అభయమిచ్చాడన్న మాట.

గంగా తీరంలో గంగ కనబడినట్టే, శంతనునికి యమునా తీరంలో దాసరాజు కూతురు సత్యవతి కనిపించింది. ఆమెను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. సత్యవతి అప్పటికే పరాశర మహర్షి వల్ల వ్యాసుడనే కొడుకుని కంది. కనుక ఆమె మాతృస్వామ్యానికి చెందినది. అయితే, సత్యవతి గంగలా తానుగా శంతనునితో పెళ్ళికి షరతు పెట్టలేదు. ఆమె తండ్రి షరతు పెట్టాడు. అంటే ఆమె తెగ పితృస్వామ్యంలోకి మళ్లే సంధి దశలోనూ ఉందన్న మాట. ఆ షరతు కూడా, సత్యవతికి కలిగే కొడుకులే నీ అధికారానికి వారసులు కావాలని మాత్రమే.

ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటంటే, గంగ శంతనుని ఇంటికి, అంటే హస్తినాపురానికి వచ్చి అతనితో కాపురం చేసినట్టు కథకుడు ఎక్కడా చెప్పలేదు. కానీ సత్యవతి హస్తినాపురం వచ్చి శంతనునితో కాపురం చేసింది. ఆమె వల్ల శంతనునికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కొంతకాలానికి శంతనుడు మరణించాడు.

కానీ విచిత్రం చూడండి…భీష్ముని దూరంగా ఉంచడం కూడా కురువంశ పవిత్రతను కాపాడలేకపోయింది. చిత్రాంగదుడు ముందే మరణించగా, భీష్ముడు కాశీరాజు కూతుళ్లను ఎత్తుకువచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసినా అతను సంతానం కనకుండానే కన్ను మూశాడు. అప్పుడు సత్యవతి కురువంశాన్ని నిలబెట్టే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు మాతృస్వామ్య నేపథ్యం ఎలాగూ ఉంది. కనుక ‘విచిత్రవీర్యుడి భార్యలతో నువ్వు సంతానం కను’ అని భీష్ముడుకి చెప్పింది. భీష్ముడు ఒప్పుకోలేదు. ఇక మిగిలింది ‘నియోగ’ పద్ధతి. అది స్వయంగా ఆమెకు అనుభవమే. పరాశరుని వల్ల తనకు కలిగిన వ్యాసుని రప్పించింది. అతడు కూడా భీష్ముని లానే విచిత్రవీర్యునికి సోదరుడి వరసే. విచిత్రవీర్యుని భార్యలకు సంతానమిమ్మని భీష్ముడికి చెప్పినట్టే వ్యాసునికీ చెప్పింది. ఆ చెప్పడంలో కూడా ‘తల్లి హక్కు’(Mother Right)ను చాటే ఒక మాతృస్వామిక న్యాయాన్ని గుర్తుచేసింది. ‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నేను చెప్పినట్టు చేయి’ అంది. అంటే, సత్యవతి ఈ విషమ ఘట్టంలో తన మాతృస్వామిక హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించిందన్న మాట. వ్యాసుడు తల్లి మాట శిరసావహించాడు. విచిత్రవీర్యుడి భార్యలు అంబికకు, అంబాలికకు సంతానమిచ్చాడు. ‘ఆంబికేయుడు’గా ధృతరాష్ట్రుడు, ‘ఆంబాలికేయుడు’గా పాండురాజు పుట్టారు. ఈవిధంగా వారిది మాతృస్వామిక నేపథ్యం.

కానీ విచిత్రం చూడండి…భీష్ముని దూరంగా ఉంచడం కూడా కురువంశ పవిత్రతను కాపాడలేకపోయింది. చిత్రాంగదుడు ముందే మరణించగా, భీష్ముడు కాశీరాజు కూతుళ్లను ఎత్తుకువచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసినా అతను సంతానం కనకుండానే కన్ను మూశాడు. అప్పుడు సత్యవతి కురువంశాన్ని నిలబెట్టే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు మాతృస్వామ్య నేపథ్యం ఎలాగూ ఉంది. కనుక ‘విచిత్రవీర్యుడి భార్యలతో నువ్వు సంతానం కను’ అని భీష్ముడుకి చెప్పింది.  భీష్ముడు ఒప్పుకోలేదు.  ఇక మిగిలింది ‘నియోగ’ పద్ధతి. అది స్వయంగా ఆమెకు అనుభవమే. పరాశరుని వల్ల తనకు కలిగిన వ్యాసుని రప్పించింది. అతడు కూడా భీష్ముని లానే విచిత్రవీర్యునికి సోదరుడి వరసే.  విచిత్రవీర్యుని భార్యలకు సంతానమిమ్మని భీష్ముడికి చెప్పినట్టే వ్యాసునికీ చెప్పింది. ఆ చెప్పడంలో కూడా ‘తల్లి హక్కు’(Mother Right)ను చాటే ఒక మాతృస్వామిక న్యాయాన్ని గుర్తుచేసింది. ‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నేను చెప్పినట్టు చేయి’ అంది. అంటే, సత్యవతి ఈ విషమ ఘట్టంలో తన మాతృస్వామిక హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించిందన్న మాట.

వ్యాసుడు తల్లి మాట శిరసావహించాడు. విచిత్రవీర్యుడి భార్యలు అంబికకు, అంబాలికకు సంతానమిచ్చాడు. ‘ఆంబికేయుడు’గా ధృతరాష్ట్రుడు, ‘ఆంబాలికేయుడు’గా పాండురాజు పుట్టారు. ఈవిధంగా వారిది మాతృస్వామిక నేపథ్యం.

ఇప్పుడు మనం మళ్ళీ పాండవులు కౌరవులు ఎందుకు కారనే ప్రశ్న దగ్గరకు వస్తున్నాం. ధృతరాష్ట్రుడు అంధుడైతేనేం, ఇద్దరిలో పెద్దవాడుగా కురువంశ స్వచ్ఛతను, పితృస్వామికతను పునరుద్ధరించగల ఆశాకిరణంగా కనిపించాడు. పితృస్వామిక విలువలకు ప్రాతినిధ్యం వహించే సుబలుని కూతురు గాంధారిని ఇచ్చి అతనికి పెళ్లి చేశారు. ఆ విధంగా ‘కౌరవుడు’ అనిపించుకునే అర్హతా, తద్వారా సింహాసనంపై హక్కును స్థాపించుకునే అవకాశమూ ధృతరాష్ట్రుడికి లభించాయి. పితృస్వామిక వివాహ ఫలితంగా అతనికి కలిగిన దుర్యోధనాదులకు కూడా ‘కౌరవులు’ అనిపించుకునే అర్హతా, దాంతోపాటే అధికారమూ సహజంగానే సంక్రమించాయి.

మాతృస్వామ్య నేపథ్యం ఉన్న కుంతిని పెళ్లాడడం ద్వారా ‘కౌరవుడు’ అనిపించుకునే అర్హతను మొదట కోల్పోయింది పాండురాజు. ఆ తర్వాత తల్లి కుంతి ఆదేశంతో ద్రౌపదిని అయిదుగురూ పెళ్లి చేసుకుని మాతృస్వామ్య సంప్రదాయాన్ని పాటించడం ద్వారా పాండవులూ ఆ అర్హతను కోల్పోయారు. దాంతో, ‘కౌరవు’డిగానే కాక, పితృస్వామ్య ప్రతినిధిగా రాజ్యం మీద నాదే హక్కు అని దుర్యోధనుడు అన్నాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం కౌరవులన్న గుర్తింపుకు, పితృస్వామిక విలువలకు మధ్య జరిగిన పెనుగులాట. ఆ పెనుగులాటలో చివరికి పాండవులే గెలిచారు. అయినా సరే, వారికి ‘కౌరవు’ లన్న గుర్తింపు లభించే అవకాశం లేదు. కనుక పాండురాజునే వంశకర్తను చేసి పాండవులన్న గుర్తింపుకే వారు పరిమితమయ్యారు.

ఇక్కడే ఇంకో విశేషం కూడా చెప్పుకోవాలి. కురుని పేరుతోనే ఉన్న కురుక్షేత్రంలోనే యుద్ధం జరగడం, ఆ యుద్ధాన్ని ధర్మయుద్ధంగా, ఆ క్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా చెప్పడం; అది కురువంశం మీదా,తద్వారా అధికారం మీదా హక్కును స్థాపించుకోడానికి జరిగిన యుద్ధమన్న సంగతిని ప్రతీకాత్మకంగా చెబుతున్నాయా?

విశేషమేమిటంటే, దుర్యోధనుడు యుద్ధంలో ఓడినా అతడు ప్రాతినిధ్యం వహించే పితృస్వామ్యం గెలిచింది.  ఎందుకంటే, అది అప్పటికి పురోగామి వ్యవస్థ. పాండవులు కూడా పితృస్వామ్యం వైపు క్రమంగా మళ్ళారు…

***

ఎన్నో లోతైన, గంభీరమైన విషయాలను ఈ చిన్న వ్యాసంలో చెప్పి వాటికి అన్యాయం చేసేనేమో నన్న అసంతృప్తి నన్ను బాధిస్తోంది. ఇవన్నీ చాలా విపులంగా చెప్పుకోవలసిన విషయాలు. ఎన్నో మౌలికమైన విషయాలలోకి నేను పూర్తిగా వెళ్లలేకపోయాను.  వాటినలా ఉంచితే, సంవరణుడు పన్నెండేళ్ళు అడవిలో తపతి దగ్గరే ఎందుకు ఉండిపోయాడన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది. అందులోకి వెళ్లబోయే ముందు, పైన ‘Mother Right’ అనే ప్రస్తావన చేశాను కనుక, కాస్త రిలీఫ్ కోసం Mother Right గురించిన ఆసక్తికరమైన ఓ పురాతన ఐరిష్ కథ గురించి చెప్పుకుందాం.

అది వచ్చే వారం…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

వర్షం

సౌత్ ఆఫ్రికా కథ

                                  ఆంగ్ల మూలం:రిచర్డ్ రైవ్

                                                                    అనువాదం:     ఎలనాగ

    676x380      అప్పటిదాకా వున్న కలకలాన్ని పీల్చేస్తూ మిలిటరీ బ్యాండులా గట్టిగా ప్రతిధ్వనించే శబ్దంతో కురవసాగింది వర్షం. తడిసిన అద్దాల్లా వున్న వీధుల్లోని ఎరుపు, పసుపుపచ్చ రంగుల ప్రకాశవంతమైన నియాన్ లైట్ల కాంతిని ముంచేసింది వాన. సైడుకాలువలు పొంగినయ్. రోడ్ల మీద పొంగిన నీరు శబ్దం చేస్తూ పేవ్ మెంట్ల మీదికి చేరింది. నీటి ప్రవాహం గురగుర శబ్దం చేస్తూ డ్రెయినేజీల మూతల్ని పీల్చేసింది. బూడిదరంగులో వున్న వర్షధారలూ, పొగమంచూ కలిసి నగరం మధ్యలో వున్న కొండని కనపడకుండా చేసినయ్. ఉదాసీనంగా వున్న కేప్ టౌన్ నగరంలోని సిటీహాల్ క్లాక్ టవర్ ధీరత్వంతో తొమ్మది గంటలు కొట్టడానికి ప్రయత్నించింది. విధ్వంసకర శబ్దాల్ని చేస్తూ విసురుగా ఉధృతంగా కురిసింది వర్షం.

సోలీస్ గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ బిల్డింగు లోపలి నుండి పసుపుపచ్చని కాంతి బయటికి వస్తోంది. బయటి వాతావరణం నుండి రక్షణ కోసం దాని తలుపు గట్టిగా మూయబడి వుంది. లోపల  శరీరాల వేడిమి, గుడ్డల వేడిమి, మళ్లీ మళ్లీ వేడి చేసిన చేపనూనె వాసన – అన్నీ కలిసి ఊపిరాడనివ్వ కుండా వాంతి తెప్పించే విధంగా వున్నయ్. కిటికీల గాజుతలుపుల మీద పొగమంచు తాలూకు మసక చిత్రాలు. తలుపు కింది నుండి లోపలికి తన్నుకొచ్చిన నీళ్లు రంపపు పొట్టుతో కలిసిపోయి అక్కడ చిన్న మడుగులా తయారైంది.

చేతుల చొక్కా తొడుక్కున్న సోలీ చెమటతో తడిసిపోయాడు. అతనికి బూతులు మాట్లాడాలనిపిచేటంత చిరాకుగా వుంది. నీళ్లోడుతూ అప్పుడే లోపలికి వచ్చిన స్త్రీని చూసి “తలుపును గట్టిగా ముయ్. ఇది టెంటనుకున్నావా” అని బిగ్గరగా అరిచాడు.

“అరవకు సోలీ”

“కోపం తెప్పించొద్దు. మీ నల్లోల్లు ఎప్పుడూ తలుపుల్ని సరిగ్గా మూయరు”

“తెల్లోడా, అరవకు”

“నేను నీ మీద అరుస్తున్నాను కదా. ఔను మరి”

“ఇక పోనియ్. నాకు రెండు చేప ముక్కలు, తోక నరికినవి”

“రెండు చేప ముక్కలా? ఓకే”

“బయట కుండపోతగా వర్షం” అన్నదామె ఎవరినీ ఉద్దేశించకుండానే.

“అవును. వర్షం ఉధృతంగా వుంది” అంటూ లోపలికి వచ్చాడొక బక్కపలుచని మలేషియన్ యువకుడు. అతడు తల మీద హ్యాట్ పెట్టుకున్నాడు.

“ఒకటిన్నర పౌండ్ల ఫిష్షూ చిప్సూ కావాలి”

“ఒకటిన్నర పౌండ్లు. థాంక్యూ. కాని ఆ తలుపును మూసెయ్”

“సరే కాని ఈ హానోవర్ స్ట్రీట్లో ఒక్క నీ షాపుకే తలుపుందనుకుంటున్నావా?

“అయితే చావు” అంటూ మాటలు ఆపి, మరో కస్టమర్ వైపు తిరిగాడు సోలీ.

ఉత్తరం వైపు నుండి బలమైన వర్షపు ఈదురుగాలులు కిటికీల అద్దాల్ని బాదుతున్నాయి. హానోవర్ స్ట్రీట్ బస్టాపులో ఒక బస్సు జారుడు శబ్దం చేస్తూ ఆగింది. అందులోంచి దిగిన ప్యాసెంజర్లు వాన నుండి తప్పించుకోవడానికి ఎదురుగా వున్న సినిమా హాలు గేట్లోకి పరుగెత్తారు. వీధిదీపాలు మసకగా వెలుగుతున్నాయి.

చేపముక్కల్నీ చిప్సునూ పాత వార్తాపత్రికల్లో కస్టమర్లకు కట్టి యిస్తుంటే సోలీ చెమటలు కక్కుతున్నాడు. ఫిష్షూ, చిప్సూ. వినెగర్ వేసియ్యాలా? పేపర్లో కట్టి ఇవ్వాలా? ఇక్కడే తింటావా? “ఒకటిన్నర పౌండ్లవి ప్లీజ్.” థాంక్యూ. నెక్స్ట్. ఫిష్షూ చిప్సూ. వద్దా? రెండు ఫిష్ ముక్కలు, చిప్సు. వద్దా? ఉప్పూ, వినెగర్ చల్లనా? “ఒకటిన్నర పౌండ్లవి ఇవ్వండి.” థాంక్యూ. నెక్స్ట్. ఫిష్షూ, చిప్సూ.

అప్పుడే లోపలికి వచ్చిన ఒక స్త్రీతో “తలుపు మూసెయ్” అని బిగ్గరగా అరిచాడు సోలీ. సారీ అన్నట్టుగా ఆమె చిన్నగా నవ్వింది.

“మీ నల్లోల్లు నాస్తికులకన్నా ఘోరం” అన్నాడు సోలీ.

ఆమె తలుపు మూయటానికి యాతనపడి, రంపపు పొట్టూ నీళ్లూ కలిసిన మడుగులో నిలబడింది. ఆమె శరీరం  మీది నుండి  నీళ్లు కారుతున్నాయి. సోలీ రెండు వంటచెరుకు కట్టెల్ని పొయ్యిలో వేయటానికి కౌంటరు దగ్గర్నుంచి కదలగానే ఆమె పక్కకు జరిగి తోవనిచ్చింది. అంతకు ముందు సోలీ అన్న వాక్యానికి మరో కస్టమరు కోపం తెచ్చుకుని, “మీ యూదులు మా నల్లోల్లను ఎప్పుడూ బయటికి తోయటానికే వున్నారు” అన్నాడు.

తన జాతి మీద వచ్చిన వ్యాఖ్యను తిప్పికొట్టటం కోసం “అయితే చావు” అన్నాడు సోలీ. ఫిష్షూ, చిప్సూ. వినెగర్ తోనా? ఉప్పు వెయ్యనా? ఒకటిన్నర పౌండ్లవా? థాంక్యూ.

“ఏం కావాలి చెప్పండి మేడమ్”

“సినిమా యెప్పుడు వొదుల్తారో కొంచెం చెప్తారా?”

“నేనేం సినిమా టాకీసు మేనేజర్ననుకున్నావా?”

“ప్లీజ్”

“పదిన్నరకు” అని చెప్పాడు మలేషియన్ యువకుడు.

“థాంక్యూ. అంత వరకు నేనిక్కడ నిలబడొచ్చా? బయట వర్షం బాగా వుంది” అన్నదామె సోలీతో.

“బయట బాగా వర్షం కురుస్తుందని తెలుసు నాకు. కాని ఇది ధర్మసత్రం కాదు” అన్నాడు సోలీ.

“ప్లీజ్ బాస్”

ఈ వాక్యంతో సోలీకి హృదయం లోపల తెలియకుండానే గిల్లినట్టైంది. ఆరో జోన్ లోని ఆ మూలలో అతని దుకాణం చాలా సంవత్సరాలుగా వుంది. ఇంతకు ముందు యెన్నోసార్లు యెందరో తనకు బాధ కలిగించే మాటలనటం అతనికింకా జ్ఞాపకమే. అతనెప్పుడూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడామె అన్న వాక్యం అతడు ఊహించనిది. ప్లీజ్ బాస్…ఈ వాక్యం అతనికి నచ్చింది. తను వేసుకున్న కోటుకూ, టైకీ ఆ వాక్యం సరిపోయేట్టుగా వుందనుకున్నాడు. ప్లీజ్ బాస్…ఆహా ఎంత బాగుందీ వాక్యం!

“సరే సరే. కొంత సేపటిదాకా వుండు. కానీ వర్షం ఆగగానే వెళ్లిపోవాలి”

ఆమె తలూపి ముసురు వెనకాల మసకగా కనపడుతున్న టాకీసు పేరును చదవటానికి ప్రయత్నించింది.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా?” అడిగాడు సోలీ.

ఆమె యేమీ మాట్లాడలేదు.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడుగుతున్నాను”

అప్పటికీ ఆమె నుండి ఏ సమాధానమూ లేదు.

“చావు” అన్నాడు సోలీ మరో కస్టమరు వైపు తిరిగి.

 

వర్షపు మసకలోంచి సియెనా చూస్తోంది కానీ ఆమె చూపులు దేనిమీదా లేవు. తడిసిన రోడ్ల మీద జారుతూ పోతున్న కార్లు. వర్షంలో రకరకాల హారన్ల చప్పుళ్లు. టైర్ల కిందికి వచ్చిన నీళ్లను చిమ్ముతూ బస్సులు. గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ ప్యాలెస్ లో బిగ్గరగా మనుషుల మాటలు. ఆమె చూపులు ఎదురుగా వున్న కొండ మీది నీటి పాయలను దాటి, చలికాలపు కేప్ టౌన్ ను దాటి, బోలండ్ అనే వూరి వేసవిలోకి ప్రవేశించాయి. స్టెలెన్ బాష్ పార్ల్ ల ఆకుపచ్చని ద్రాక్షతోటల్ని దాటి, మాల్మెస్ బరీలోని ఉక్కపోత నిండిన గోధుమపొలాల్ని దాటి, తెస్లర్స్ డాల్ గ్రామంలోని కేరింతల్నీ , బద్ధకంగా ఆవులించే సూర్యుణ్నీ చేరుకున్నాయి. అక్కడ సూర్యుడు ఉదయించటం కోసం, వెలుగునివ్వటం కోసం, అస్తమించటం కోసం శ్రమ పడుతూ అలసిపోయినట్టుగా వుంటాడు.

పంతొమ్మిదవ శతాబ్దపు ఎత్తుగోడల మిషన్ చర్చిలో ఆమె మొదటిసారిగా జోసెఫ్ ను కలిసింది. ఆ చర్చి ఇప్పటికీ వుందక్కడ. ఎంతో అందంగా పైకి పాకే ఐవీ తీగ ఆ చర్చి అందాన్ని మరింతగా పెంచుతుంది. బాగా పాలిష్ చేయబడి తళతళ మెరిసే పెద్దపెద్ద చమురు దీపాలు పైకప్పు నుండి వేలాడబడి వుంటాయి. ఆ చర్చిలో ఆ దీపాల రెపరెపల్లోనే ఆమె మొదటిసారిగా అతణ్ని చూసింది. అతడు ఆ చర్చిని చూడటానికి కేప్ టౌన్ నుండి వచ్చాడు. ఆ రాత్రి ఆమె చర్చిలో అంతకు ముందెప్పుడూ పాడనంత బాగా ఒక భక్తిగీతాన్ని పాడింది. “మృత్యుచ్ఛాయలు నిండిన లోయలో నడుస్తున్నా, ఓ నా ప్రియతమా” అంటూ సాగుతుంది ఆ గీతం.

అప్పుడతడు ఆమెను చూశాడు. అందరూ ఆమెనే చూశారు. ఎందుకంటే సోలోలను ఆమె అద్భుతంగా పాడుతుంది.

“ఏ దుష్టశక్తికీ వెరవను నేను” అంటూ చరణం.

నిజంగా ఆమె భయం లేకుండా అతణ్ని ప్రేమించింది. అతనికోసమే పాడింది. అతని విశాలమైన కళ్లకోసం, పసిమి నిండిన అతని చర్మం కోసం, అందమైన అతని చెక్కిలి కోసం పాడింది. జోసెఫ్ అనే మనిషిని సృష్టించిన సృష్టికర్త కోసం పాడింది. చుక్కలు పొదిగిన పాలపుంతలో వీణతీగల్ని బిగించిన ఆకాశం మీద చంద్రుడు బొమ్మలా అడుగులు కదిపిన రాత్రులవి. తన చెవిలో అతడు గుసగుసగా పలికిన వలపు వాక్యలు నిండిన రాత్రులవి. అతని కొంటె మాటలకు ఆమె సిగ్గుపడి కిసుక్కున నవ్వింది. అట్లా నవ్వటం సభ్యతే అనుకున్నదామె.  తాను కేప్ టౌన్లోని ఆరో జోన్ లో ఒక వీధిలో ఉంటున్నాననీ, ఆడపిల్లలు తనంటే పడిచస్తారనీ చెప్పాడతడు. మోలీ, మియెనా, సోఫియాల గురించీ, స్కూలుటీచరుగా పని చేస్తూ ఎప్పుడూ ఇంగ్లిష్ లోనే మాట్లాడే చార్మేన్ అనే ఆవిడ గురించీ అతని ద్వారానే తెలిసిందామెకు. కానీ తనకు మాత్రం తెస్లర్స్ డాల్ మీదనే ప్రేమ కలిగిందని అన్నాడు జోసెఫ్. అతణ్ని నమ్మాలా వద్దా అన్నది ఆమె నిశ్చయించుకోలేక పోయింది. మబ్బు వెనకాల చంద్రుని నడకతో పాటు యవ్వన సంపదను కనుగొన్నాడతడు.

ఆ తర్వాత కేప్ టౌన్ కు వెళ్లే రైలు తాలూకు కీచుశబ్దం. ఎంత పెద్ద శబ్దమంటే అది తన కుటుంబం తెలిపిన నిరసనను ముంచేసింది. తన తండ్రి ఉగ్రరూపం దాల్చడం, తెస్లర్ డాల్ చర్చిలోని అవివాహితులైన నన్స్ విసిరే మర్మపూరిత వీక్షణాలు. తన పారవశ్యాన్నీ, వెర్రి ఆవేశాన్నీ ముంచేసేటంత శబ్దం చేస్తూ రైలు. లక్షలకొద్దీ విద్యుద్దీపాల వెల్తురులో వేలకొద్దీ కార్లు తిరుగుతూ చేసే శబ్దంలో మునిగిపోయి తబ్బిబ్బవటం. కేప్ టౌన్ కు ప్రత్యేకం అయిన ఉత్సవ సాయంత్రాలు నిండిన వేసవి కాలం. ఆరో జోన్ లోని చిన్న గదిలో తనివి తీరని వ్యామోహం నిండిన ప్రేమ. నాలుగు తెల్లని గోడలూ, కిర్రుమనే ఒక పాత కుర్చీ, “ఈ యింటికి మా దీవెనలు” అంటూ గొణుగుతున్నట్టున్న గోడల అంచుల్లోని కార్డ్ బోర్డ్ పట్టీ.

ఆ తర్వాత అతడు ఆలస్యంగా ఇంటికి రావటం. అప్పుడప్పడు మరీ ఆలస్యంగా రావటం. కొన్నిసార్లు అసలే రాకపోవటం. రోజురోజుకూ అతని మోహం తగ్గుతూ ఇతర అమ్మాయిల పేర్లను గొణుక్కోవటం. మోలీ, మియెనా, సోఫియా, చార్మేన్. అతడు తననుండి జారిపోతున్నాడనే ఎరుక అసహాయతలోకి తోస్తూ , మరింత వడివడిగా వేగాన్ని బాగా పెంచుతూ…

“నేను నింద మోపటం లేదు. కేవలం విన్నానని అంటున్నానంతే”

“అప్పుడప్పుడు రాత్రుళ్లు నువ్వెందుకు సినిమాకు పోవు?”

మరియా ప్రియుడు జోసెఫ్ కోసం వెతుకుతున్నాడు.

జోసెఫ్ కోసం నిఘా. జోసెఫ్ కోసం వెతుకులాట. జోసెఫ్ ను పొడవటం కోసం ప్రయత్నాలు. జోసెఫ్. జోసెఫ్. జోసెఫ్. మోలీ. మియెనా. సోఫియా. పేర్లు, పేర్లు, పేర్లు. పుకార్ల మీద పుకార్లు. ఏకపక్ష వాంఛ. సినిమాకు వెళ్లరాదూ. సినిమాకు పోయి ఏం చూడాలి? ఎందుకు చూడాలి? ఎప్పుడు చూడాలి? ఎక్కడ చూడాలి?

వరుసగా వారం రోజుల పాటు అతడు రాకపోయే సరికి అతణ్ని వెతకాలని గట్టి నిర్ణయం చేసుకుంది. వర్షంలో నడిచివెళ్లి, ఆ మర్యాద లేని సోలీ గాడి ఫిష్ అండ్ చిప్స్ దుకాణంలో నిలబడాలని నిశ్చయించుకుంది. షో అయిపోయే దాకా వేచి చూడాలి.

కిటికీ అద్దాల మీద అప్పటి దాకా విసురుగా కొట్టిన వాన ఆగిపోయింది. కేవలం చర్మాన్ని మాత్రమే కొద్దిగా తడిపే ముసురు మొదలైంది. ఎడతెరిపి లేకుండా. అంతం లేకుండా. ప్రతి రూపాన్నీ, దృశ్యాన్నీ ముసురు తాలూకు సన్నని పొరతో నల్లని దిగులుతో కప్పేస్తూ. ఒక నియాన్ లైటు వణుకుతూ, రోదిస్తూ మూర్ఛరోగి లాగా వెలుగుతూ ఆరిపోతోంది. అలసిపోయిన సోలీ కౌంటరు మీదున్న చవకబారు గడియారం వైపు క్షణం పాటు చూపును విసిరాడు.

“పదిన్నర అయింది. సినిమా షో నుండి జనం బయటికి వస్తారిక”

ముసురు తాలూకు మసకపొర లోంచి సియెనా తదేక దృష్టితో చూసింది. సినిమా హాలు ప్రాంగణంలో ఏ మాత్రం మనుషుల అలికిడి లేదు.

“జనం బయటికి వచ్చే సమయమైంది” అంటూ షో తర్వాత తన దుకాణాన్ని ముంచెత్తే కస్టమర్ల తాకిడిని తట్టుకోవటానికి సన్నద్ధుడయ్యాడు సోలీ.

“ఇవ్వాళ్ల జనం బయటకు రావటం లేటయింది” అన్నాడు సోలీ.

“అవుననుకుంటా” అన్నది సియెనా.

సోలీ తన కళ్లచుట్టూ కారుతున్న చెమటను తుడుచుకుని, శుభ్రంగా నిరాడంబరంగా వున్న ఆమె శరీరాన్ని పరిశీలనగా చూశాడు. ఆమె ముఖం అలిసినట్టుంది కాని కాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సినిమా హాలు నుండి చాలా జనం ఆవరణలోకి వచ్చాక, ఆఖర్న ఒకరిద్దరు చలిలో వణుకుతూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. బయట ఈదురు గాలులు వీస్తూ అంతా తడితడిగా వుంది.

“మీ ఆయననున్నాడా సినిమా థియేటర్లో?”

ఖాకీ యూనిఫాంలో వున్న ఒక వ్యక్తి థియేటర్ గేటును తెరవడానికి అవస్థ పడుతుంటే ఆమె అతణ్నే పరీక్షగా చూస్తోంది.

“మేడం, మీ ఆయనున్నాడా లోపల?”

లోపలి జనమంతా టాకీసు కాంపౌండులోకి వచ్చారు. గేటు తెరిచి జనాన్ని బయటికి  వదలటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ యూనిఫాంలోని మనిషి .  తుపుక్కున ఊసినట్టు, వాంతి చేసుకున్నట్టు జనం బయటికి రాబోతున్నారు.

“థియేటర్లో మీ ఆయనున్నాడా?”

జవాబు లేదు.

“చావు” అన్నాడు సోలీ.

వాళ్లంతా ఇప్పుడు బయటికొస్తారు. జోసెఫ్ కూడా వస్తాడు. ఆదరబాదరాగా సోలీకి కృతజ్ఞతలు చెప్తూ ఆమె తలుపు వైపు పరుగెత్తింది.

“తలుపును మూసెయ్”

ఆమె దేన్నీ వినే స్థితిలో లేదు. ముసురు ఆగిపోయింది. నిర్జనమైన వీధిలో, టాకీసులోని ఖాళీ ఆవరణలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. తన ఖాళీ హృదయంలో కూడా అదే నిశ్శబ్దం. థియేటర్ ఎక్సిట్ తలుపు ముందున్న మెట్లలో చివరిమెట్టు మీద ఆశాభావంతో నిల్చుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూండగా.

అప్పుడు నవ్వుకుంటూ, తోసుకుంటూ ఒకరి వెంట ఒకరు వచ్చారు. ఆమె వాళ్ల ముఖాలను అత్యంత తీక్షణంగా పరిశీలించింది కానీ ఆ ముఖాలు చాలా వేగంగా కదిలిపోయాయి. నవ్వుతూ, తుళ్లుతూ, బిగ్గరగా అరుస్తూ…వెడల్పైన కన్నులతో, పసిమి వన్నె వాళ్లు, నల్లని కన్నులవాళ్లు, బలమైన చెక్కిలి ఎముకల్తో నల్లనివాళ్లు, గోధుమరంగువాళ్లు, తెల్లనివాళ్లు, పసుపుపచ్చని వన్నె వాళ్లు, నల్లని కన్నులవాళ్లు, నవ్వే కళ్లతో, ఎంతో ఆహ్లాదంగా, ఎగిరెగిరి పడుతూ. కానీ వాళ్లలో జోసెఫ్ లేడు. వేగంగా కొట్టుకుంటున్న తన గుండె వెయ్యి ముక్కలవుతుందా అనిపించిందామెకు. జోసెఫ్ అసలే కనపడకపోతే? ఎవరెవరి ముఖాలో కనిపిస్తున్నాయి ఆమెకు. వాటిలో సోలీ ముఖం కూడా వుంది. నల్లని ముఖాల, గోధుమరంగు ముఖాల సముద్రంలో చిక్కని నీలికళ్లూ, చక్కని తెల్ల గెడ్డమూ ఉన్న ముఖం కోసం పిచ్చిగా వెతుకుతూ…మళ్లీ సోలీ ముఖం కనపడుతోందేమిటి! యాభై ముఖాల్ని చూసినా అందులో జోసెఫ్ లేడు. తనకు తెలిసిన పెద్ద చెక్కిలివాడి కోసం వెతుకుతూ ఆమె. సోలీ, మోలీ, మియెనా, చార్మేన్, ఎన్నెన్నో ముఖాలు కదులుతున్నయ్.

ముసురు మళ్లీ మొదలైంది. అప్పుడు ముఖాల్ని కాకుండా షర్ట్లనూ, ఓవర్ కోట్లనూ చూస్తోంది ఆమె. సోలిటేర్ షాపులో బేరం చేసి ఒకటిన్నర పౌండ్లకు తాను కొన్న లేత నీలంరంగు షర్ట్ కోసం, దాని మీది కోటు కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి ఆమె కళ్లు. ఒకటిన్నర పౌండ్లకు వాటిని చేజిక్కించుకోవటం కోసం ఆమె ఎంతో గింజుకుంది. షాపువానితో ప్రాధేయపడింది. తన ఒక వారం రాబడి అది. ఊహల్లో మునుగుతూ జోసెఫ్ ముఖం కోసం వెతుకుతోంది. గుంపు పల్చబడి ఆఖర్న ఒకరిద్దరు మెల్లగా బయటకు వస్తున్నారు. వాచ్ మన్ ఇనుప గేటును మూసేస్తున్నాడు. జోసెఫ్ ను లోపల వేసి మూశారేమో. తనొక్కతే బయట. వాచ్ మన్ లే మిగిలిపోయారు. ఇంకా బలమైన ఇనుప గేట్లు.

“జోసెఫ్ వున్నాడా లోపల? ప్లీజ్ చెప్పండి”

“జోసెఫ్ ఎవరు?”

“జోసెఫ్ ఇంకా లోపలే ఉన్నాడా?”

“జోసెఫా? అతనెవరు?”

వాళ్లు ఆమెను ఆటపట్టిస్తున్నారు. వెనకాల నవ్వుతున్నారు. జోసెఫ్ ను వెతకటంలో ఆమెకు ఆటంకం కలిగిస్తున్నారు.

“జోసెఫ్ లోపలున్నాడు” పిచ్చిదానిలా గట్టిగా కేక వేసిందామె.

“చూడండి మేడమ్, కుంభవర్షం కురుస్తోంది. ఇంటికి వెళ్లండి మీరు”

ఇంటికెళ్లాలా? ఎవరి దగ్గరికి? దేని దగ్గరికి? ఖాళీ గదిలో ఖాళీ పడక మీదికా? “ఈ యింటిని దీవించండి” అని అబద్ధం పలుకుతున్న రోడ్డుమీదికా?

మూల మీద గుంపును చూసిందామె. జోసెఫ్ అక్కడున్నాడేమో అనుకుంది. పరుగెత్తుతూ ప్రతి ముఖంలోకి పరీక్షగా చూస్తోంది. ఓ నా జోసెఫ్. గుంపు వర్షంలో తడుస్తోంది. నడుమ ఇద్దరు భీకరంగా పోట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఒకడు జోసెఫ్. మురికి కాలువలోని బురదలో ఒకరి మీద మరొకరు కలియబడుతూ, జారుతూ. తొడుక్కున్న బట్టల్లోంచి బురద కారుతూ, ఆ రెండు శరీరాలు రేఖామాత్రంగా. నీలిరంగు షర్టును తొడుక్కున్న జోసెఫ్ ను గుర్తించిందామె. కళ్లమీంచి కారుతున్న వర్షపు నీటిని తుడుచుకుంటూ జోసెఫ్ ను చూసిందామె. ప్రాణరక్షణ కోసం పోట్లాడుతున్న జోసెఫ్ ను చూసింది. సైడు కాలువలో నిస్సహాయంగా మరొకడిని తన్నుతున్నాడు జోసెఫ్. అంతలోనే పోలీసుల విజిల్. పోలీస్ వ్యాను వచ్చి కీచుమంటూ ఆగిందక్కడ.

“ప్లీజ్ సర్. ఇతనిదేం తప్పు లేదు. మిగతా వాళ్లందరూ పారిపోయారు. ప్లీజ్ సర్. ఇతను జోసెఫ్. ఇతనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదు. బాస్. ప్లీజ్ సర్. ఇతడు నా జోసెఫ్. ప్లీజ్ బాస్.

“పక్కకు తప్పుకో”

“ప్లీజ్ సర్. అసలుదోషి ఇతడు కాదు. వాళ్లంతా పారిపోయారు. నిజం బాస్”

images

ఒంటరిగా మిగిలిందామె. ఒంటరి పడక. ఒంటరి గది.

సోలీస్ గ్రాండ్ ఫిష్ అండ్ చిప్స్ ప్యాలెస్ గుంపుతో నిండిపోయింది. లోపల మనుషుల తొక్కిసలాట. ఈదురు గాలితో కలిసిన వాన మళ్లీ తలుపునూ, కిటికీల్నీ బాదుతోంది. పొంగిన సైడుకాలువలు తమ మీదికి వస్తున్న మరింత మట్టినీటిని ఇముడ్చుకోలేకపోతున్నాయి. సినిమా తర్వాతి రష్ ను తట్టుకోలేక సోలీ చెమటలు కక్కుతున్నాడు.

ఫిష్షూ చిప్సా? వినెగర్ కలపాలా? ఉప్పు వెయ్యాలా? ఒకటిన్నర పౌండ్లదా? థాంక్యూ. సారీ. ఫిష్ అయిపోయింది. ఐదు నిమిషాలాగాలి. కేవలం చిప్సా? వినెగర్? తొమ్మిది పెన్నీలు. చిన్న చిల్లర.  థాంక్యూ. సారీ. ఫిష్ లేదు. ఐదు నిమిషాలాగండి. చిప్సా? తొమ్మిది పెన్నీలదా? థాంక్యూ. సోలీ ఊపిరి పీల్చుకోవడం కోసం ఆగి, చేపముక్కల్ని పైవి కిందకూ కిందవి పైకీ తారుమారు చేశాడు.

“బయట ఏం గొడవ?”

“సినిమా కోసం వచ్చాను సోలీ”

“జాగా లేదు. బయటికి వెళ్లాలి”

“సినిమా కోసమని చెప్పానుగా”

“పోలీసోళ్లేం చేశారు? సారీ, ఫిష్ లేదు సార్. ఐదు నిమిషాలాగండి. పోలీసోళ్లేం చేశారు?”

“భోరున కురిసే వానలో భయంకరమైన పోట్లాట”

“జీసస్! వర్షంలోనా?”

“ఔను”

“పోట్లాడుకున్నదెవరు?”

“జోసెఫూ ఇంకొకడూ”

“జోసెఫా?”

“ఔను. అరుండేల్ వీధిలోని వాడు”

“అతడా. ఆ జోసెఫ్ నాకు తెలుసు. ఎప్పుడూ ఎవరితోనో తంటా పడతాడు. వాడి బతుకెప్పుడో రోడ్డు పాలైంది”

“అవును వాడే”

“ఇంకొకడెవడు?”

“తెలీదు”

“పోలీసులు పట్టుకున్నారా?”

“జోసెఫ్ ను పట్టుకున్నారు”

“ఎందుకు పోట్లాడుకున్నారు? ఫిష్షా? ఒక్క నిమిషంలో ఇస్తాను సార్”

“ఎవరో అమ్మాయి గురించి”

“ఎవరామె”

“పటేల్ కంపెనీలో పన్చేసే మియెనా తెలుసు కదా. ఇప్పుడామెతో వ్యవహారం నడుస్తోంది. ఆమె ప్రియుడు పట్టుకున్నాడు వీళ్లను”

“సినిమాలోనా?”

“ఔను”

సోలీ బిగ్గరగా, గుంభనంగా నవ్వాడు.

“పోలీసుల ముందు ఏడ్చిన ఆమెను చూశావా?”

“ఎవరామె?”

“పోలీసుల దగ్గర ఏడ్చింది చూడు, ఆమె”

“ఆమె జోసెఫ్ ప్రియురాలంటున్నారు”

“జోసెఫ్ కు ఎప్పుడూ బోలెడు మంది ప్రియురాళ్లుంటారు” ఫి-ష్ త-య్యా-ర్. మీకు రెండు ముక్కలా సార్. ఒకటిన్నర పౌండ్లదా. చిల్లర ప్రాబ్లెం. ఫిష్షూ చిప్సా? ఒకటిన్నర పౌండ్లవా? థాంక్యూ. కేవలం ఫిష్షేనా? వినెగర్ వద్దా? ఉప్పు? తొమ్మిది పెన్నీలదా? చిల్లర ప్రాబ్లెం. థాంక్యూ.

“ఆ స్త్రీ గురించి చెప్పు”

“ఆమె పోలీసుల ముందు ఏడ్చిందంటున్నారు”

“ఓహ్, జోసెఫ్ కు బోలెడు మంది ప్రియురాళ్లు”

“ఈమె అతనితో కలిసి బతుకుతోంది”

“ఎట్లా వుంటుందావిడ? ఫిష్ కావాలా సర్?”

“ఔను, ఆమె కాళ్లు చాలా బాగుంటాయి”

“ఓహో” అన్నాడు సోలీ. “ఎవరది? తలుపు మూయండి వెంటనే” అన్నాడు మళ్లీ.

సియెనా లోపలికి వచ్చింది. క్షణం పాటు నిశ్శబ్దం. తర్వాత గుసగుసలు, గోల.

ఎవరో చెవిలో గుసగుసగా అడిగితే ఔనన్నట్టు తల వూపాడు సోలీ. “ఈవిడ ఇప్పటిదాకా ఇక్కడే నిల్చుని ఎదురు చూసింది. అతనికోసం కాదనుకుంటా” అన్నాడు మళ్లీ.

జీన్స్ లో వున్న ఒక అమ్మాయి కిసుక్కున నవ్వింది.

“ఫిష్షూ చిప్సుకు ఒకటిన్నర పౌండ్లు మేడం”

“ఒకప్పుడు ఒకటింపావు పౌండ్లే కాదా”

“అది బోర్ యుద్ధంకన్న ముందు మేడం. ఇప్పుడు చేపల ధర పెరిగింది. బంగాళా దుంపల ధర పెరిగింది. అయినా ధర పెంచొద్దంటారా?”

“అవును, ఎందుకు పెంచాలి?”

“ఓహ్, చావు. నెక్స్ట్ ప్లీజ్”

“ఔను. మాకు చావే గతి సోలీ”

“క్షమించండి మేడం”. సియెనా వైపు తిరిగి “ఫిష్షూ చిప్సూ కావాలా? డబ్బు లేకపోయినా

ఫరవా లేదు. ఉచితంగా యిస్తాను”

“థాంక్యూ బాస్”

జనం బయటికి పోతుంటే వర్షం భోరున కురవసాగింది. సోలీ డ్రాయరు లాగి డబ్బును లెక్క పెట్టుకున్నాడు. వీధిలో నీటి పాయలు జలాశ్వాల్లా దౌడు తీస్తున్నాయి. పేవ్మెంటు మీదికీ డ్రెయినేజీ రంధ్రాల్లోకీ వాననీరు ఉధృతంగా పోతోంది. భవనాల పైనుండి చిన్నచిన్న జలపాతాలు దూకుతున్నయ్. ఎడతెగని ప్రవాహాలు. మసకబారిన వీధిదీపాలు. ఫిష్షూ చిప్సూ కట్టివున్న న్యూస్ పేపర్ను నీరసంగా పట్టుకుంది సియెనా.

“వర్షం ఆగేదాకా నువ్విక్కడ ఉండొచ్చు” అన్నాడు సోలీ.

కన్నీరు నిండిన కళ్లతో పైకి చూసింది సియెనా. తన పచ్చని పళ్లు బయటపడేలా నవ్వాడు సోలీ. “ఏం ఫరవా లేదు”

ఒక్క క్షణం పాటు ఆమె ముఖం మీద చిన్న నవ్వు మెరిసింది.

“ఏం ఫరవా లేదు నాక్కూడా” ఆమె కిందికి చూసి ఒక్క క్షణం సందేహించింది. తర్వాత తలుపు తీయటానికి అవస్థ పడింది. పెద్ద శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. ఊళ వేస్తూ ఉత్తరదిక్కు నుండి కొడుతున్న వాన సోలీస్ ప్యాలెస్ లోకి వచ్చింది.

“తలుపు మూయ్” అన్నాడు సోలీ నవ్వుతూ.

“థాంక్యూ బాస్” అని వణుక్కుంటూ వర్షంలోకి నడిచిందామె.

***

 

 

 

 

 

 

కొత్త మందు

Kadha-Saranga-2-300x268

”శర్మకి యా క్సిడెంటయింది  ,తెలుసా —?”ఇంటిలోకి అడుగు పెట్టగానే అంది నా శ్రీమతి.

”ఎక్కడ  –?”కంగారుగా అడిగాను.

”ఇంకెక్కడా –ఫెక్టరీలోనే —మీకు తెలియి దా ? మీ ఫెక్టరీలోనేగా అతడూ  పని చేసేది —”

నిజమే! శర్మమా ఫెక్టరీలోనే పని చేస్తాడు. — గంధకామ్లం తయారు చేసే విభాగంలో —పైగా నాకు ఆప్త మిత్రుడు. అయినా నాకు ఆ సంగతి తెలియికపోవటం ఆశ్చర్యంగా అనిపించింది.

”ఎప్పుడైంది యాక్సిడెంటు —-”

”రెండు మూడు వారాలైనట్లుంది ”

గత మూడు వారాలుగా నేను ఆఫీసు పని మీద ఉర్లు  తిరుగుతునాను. మార్కెటింగ్ మేనేజరుగా పని చేసేవాడికి ఉర్లు తిరగటం తప్పదు కదా !అయితే మాత్రం —-

”ఫోను చేసినప్పుడు చెప్పలేదేమిటీ ?”కొంత కంగారుగానూ కోపంగానూ అడిగాను.

శ్రీమతి మాట్లాడలేదు.

”ఎక్కడవున్నాడిప్పుడు ?”

”పట్నంలో —ప్రభుత్వాసుపత్రిలో —-”

విప్పే షూలేసు సు మళ్ళీ కట్టుకొని ,వెంటనే బైకెక్కి  ఇంటి గేటు దాటాను.

పశ్చిమాంబరాన ప్రమాదానికి గురైన  సూర్యుని నెత్తురికి తడిసి న మబ్బులు ఎర్రగా కనబడ్డాయి. ఎక్కడనుంచో వచ్చిన చీకటి ప్రపంచాన్ని మెల మెల్లగా తన గుప్పటిలోకి తీసుకుంటోంది. మా ఉరివాళ్ళ బ్రతుకులాంటి గతుకుల రోడ్డు మీద జాగ్రత్తగా ముందుకు సాగాను.

రోడ్డు మలుపు తిరిగి పెద్ద రోడ్డెక్కగానే ఎదురుగా కనబడింది ప్రత్యేక ఆర్ధిక మండలి. ఊరిలోవుండవలసిన వెలుగు మొత్తం అక్కడేవున్నట్లు విద్యుత్తు దీపాలతో కళకళలాడుతోంది.

నేనూ ,శర్మ ఉద్యోగం చేసే కర్మాగారం అక్కడేవుంది. మనుషుల జబ్బులకు మందు తయారుచేసే కర్మాగారం మాది. మందులు తయారు చేయడమే కాక ,కొన్ని పాత జబ్బులకు కొత్త మందులు ,కొత్త జబ్బులకు కొత్త మందులు కనిపెట్టడానికి విస్తృతంగా రీసెర్చు కూడా చేస్తువుంటారు.

కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ రోడ్డు నిండా చీకటి. ప్రత్యేక ఆర్ధిక మండలిలోని వెలుగు కార్మికుల నివాసాలదాకు చేరటం లేదు –రోడ్డుకి ఎడంవైపు ఆర్ధిక మండలిలో పని చేసేవారికోసం ఎవ్వరో నిర్మించిన అగ్గిపెట్టెలాంటి అద్దె ఇళ్ళు –వాటి చుట్టూ  మసక మసక వెలుతురు –శర్మ అక్కడే వుంటాడు. ఒకసారి అటు చూశాను –శర్మ ఇంటిలో దీపం వెలగటం లేదు.

రోడ్డుకి కుడివైపు గుడెసెలు. మండలిలో రోజువారీ కూలికి పనిచేసేవారి నివాసాలు అవి. అక్కడ హడావిడిగా ఉంది. ఆ రోజు సంపాదించిన డబ్బు ఖర్చు చేసే హడావిడి అక్కడ. డబ్బు సంపాదించడానికీ ,సంపాదించినది ఖర్చు చేయడానికీ చేసే హడావిడియేగా జీవితం !

గట్టిగా నిట్టూర్చాను. నాకు నా చిన్ననాటి ఊరు గుర్తు వచ్చింది అప్పుడు ఊరిలోని వెలుగు మొత్తం ఊరి జమీందార్ గారి ఇంటిలోనేవుండేది. ఇప్పుడూ అంతే అనిపించింది. నాడు పంట పొలాల ఆస్తి కలిగినవారు  జమీందార్లు –నేడు ఆర్ధిక మండలీలు వున్నవారు  జమీందార్లు –అంతే తేడా !

రోడ్డువైపు దృష్టి వుంచి జాగ్రత్తగా సాగాను. పాపం,శర్మ!ఏం ఇబ్బంది పడుతున్నాడో ,ఏమో ! అసలే వాడి ఆర్ధిక పరిస్థితులు అంతంతమాత్రం. ప్రమాదం ఫాక్టరీలోనే జరిగింది కనుక ఖర్చు యజమాన్యంవారే  భరించాలి. అలాంటప్పుడు కార్పోరేటు ఆసుపత్రిలో కాక ప్రభుత్వాసుపత్రిలోచేర్చారెందుకో !

నేనూ శర్మ చిన్నప్పటినుంచి కలసి చదువుకున్నాం; అడుకున్నాం; కలిసే తిరిగేవాళ్లం. శర్మ చాలా ప్రతిభావంతుడు. రాబోయే సమస్యలను ముందే పసి కట్టేవాడు. కాలానికి ముందే ఆలోచించే వాడి ప్రతిభకి సరైన గుర్తుంపు రాలేదని బాధ పడుతువుంటాను నేను. లేకపోతే వుత్త మట్టి బుర్రైన నేను —రెండు మూడు సార్లు పరీక్ష వ్రాసి పాస్ అయ్యానని అనిపించుకున్న నేను –మార్కెటింగ్ మేనేజర్ కావటమేమిటీ –ఇంజినీరింగు డిప్లొమా పాసైన శర్మ నట్టులు బొల్టులు విప్పే మెకానికుగా పని చేయడమేమిటి !

డిప్లొమా పాస్ ఆయిన తరువాత కొన్ని సంవత్సరాలు శర్మ నాకు కనబడలేదు. ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. హటాత్తుగా ఒక రోజు మా కర్మాగారంలోని కేంటీనులో ప్రత్యక్షమయ్యాడు.

‘నువ్వేమిటి,ఇక్కడ —” ఆశ్చర్యంగా అడిగాను నేను.

”ఈ కాపెనీలో చేరానురా ”

‘అదెప్పుడు —ఏ సెక్షన్ —”

”గంధకామ్లం తయారుచేసే ప్లాంటులో –మెకానిక్కుని  –ఓ నెల అవుతోంది చేరి ”

”సరేలే –సాయంత్రం ఇంటికిరా ”భోజనం బల్ల వద్ద  మిగతా మేనేజర్లు నా  చుట్టూ  కూర్చున్నారని గుర్తిస్తు అన్నాను.

”ఏ జెమ్ ఒఫ్ ఏ వర్కర్ !”శర్మ వెళ్ళగానే నా పక్కనే కూర్చున్న జి.యం. గారన్నారు ”ఉద్యోగంలో చేరి నెల రోజులైనా కాలేదు ,అప్పుడే పని అట్లా పట్టేసాడు. హి  ఇస్ యువర్ ఫ్రంట్ –?”

”యెస్ ; చిన్ననాటి స్నేహితుడు ”

”వెరీ గుడ్ ; అతడు పని రాక్షసుడు.చేతిలోవున్న పని పూర్తి అయినంత వరకు పనినుంచి కదలడు ”

”మనకు కావాలిసింది అదే కదా  –”ఫైనాన్స్  మేనేజర్ మాట కలిపాడు.”కార్మికులు ఓ , టి. చేసినా మనం డబ్బులు ఇవ్వం కదా. అందువల్ల పని వత్తిడి వున్నప్పుడు ఓ. టి.చేయమని గడ్డంపట్టుకొని బతిమాలవలసి వస్తుందట. శర్మ లాంటివారు కొందరువుంటే లాభానికి లోటు వుండదు.

మేనేజర్లు అందరూ శర్మ పనితనం గురించి గొప్పగా మాట్లాడారు. నాకు చాలా సంతోషం కలిగింది.

” చిన్నప్పటినుంచివాడు  చాలా ప్రతిభావంతుడండి. ”అనే మాటలతో  మొదలు పెట్టి శర్మ చరిత్ర మొత్తం వివరించాను.

కాని ,ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు.ఒక సారి టూరుకి వెళ్ళి రాగానే ,వెంటనే కేబిన్ లోకి రమ్మని కబురు పెట్టారు జి. యం. గారు. భయం భయంగా వెళ్ళాను. ఎందుకంటే ఆ సారి టూరులో పెద్దగా ఆర్డర్లు సంపాదించలేక పోయాను. ఉద్యోగులు చేసిన మంచి పనులనూ ఆర్జించి పెట్టిన లాభాలనూ వెంటనే మరిచిపోతారు యజమాన్యం వారు –పైగా అది వాళ్ళ బాధ్యత అంటారు. చేయలేకపోయినవాటిని అసలు మరిచిపోరు.

టూరు విషయం ఎత్తలేదు జి. యం. గారు. అది నా అదృష్టం అని అనుకున్నాను.

‘’సీ ,మిస్టర్ రావ్ –‘ తన బల్లమీదవున్న గ్లోబుని వ్రేలుతో తిప్పుతూ అన్నారు జి.యం.’’నేను చెప్పే విషయం ప్రత్యక్షంగా మీకు సంబంధించినది కాదు అని నాకు తెలుసు. అయినా మీకు  చెబుతే మంచిదేమోనని అనిపించింది. ఎందుకంటే ఒక మంచి వర్కరుని కోల్పోవటం నాకు ఇష్టం లేదు’’

పరీక్షా హాలులో అర్ధం కాని ప్రశ్నాపత్రం అందుకున్న విద్యార్ధిలా కంగారు బడ్డాను నేను.

‘’అదే మీ  ఆప్తమిత్రుడు ఉన్నాడు కదా –అదే శర్మ –అతని గురించే —‘’

బల్లమీదవున్న ఫోను మ్రోగింది. ఫోనులో మాట్లాడిన జి. యం. ముఖం యెర్రగా కందిపోయింది. ‘’ఇస్తారయ్యా –ఇస్తారు’’

జి. యం. ఫోనులో అన్నాడు.’’పని మొదలుపెట్టమని చెప్పవయ్యా –కాగితం వచ్చినంతవరకు అంటే –నేను చెబుతానులే –కానీ –‘’

ఫోను గట్టిగా పెట్టి విసుక్కున్నారు జి. యం. ‘’తెలివి మీరిపోతునారు . ప్రతి పనికీ అడ్డుపెడుతున్నారు.—లేటు చేస్తున్నారు. ‘’కోపంగా కుర్చి వెనకు జారి అన్నారు’’ఇదిగో ,ఇదండి వరస –భద్రత గురించి వర్కర్లకు అవసరానికి మించిన అవగాహన కల్పించాడు మీ శర్మ. ఇప్పుడు వర్కర్లు పంపులకి గార్డులు పెట్టాలని,అంటునారు. పంపు మరామత్తుకి ఇచ్చే ముందు పూర్తిగా ‘’డ్రైన్ ‘’ చేసినటు సంతకం పెట్టిన కాగితం ఇమ్మని అడుగుతున్నారు  పనులు ఆలస్యమవుతున్నాయి. ఉత్పత్తి తగ్గే చోట కొద్దిగా చూసి చూడనట్లు  ఉండాలి కదా. మీ శర్మ ఇక్కడకి రాక ముందు ఇలాంటి గొడవలు లేవు ‘’

నేను మౌనం పాటించాను.

బల్లమీదవున్న పైపు అందుకున్నాడు జీ. యం. పైపులోని బూడిద దులిపి కొత్త పొగాకు నింపుకుంటూ అన్నాడు. ‘’పెళ్ళాం పిల్లలూ వున్న  వాడు కదా అని ఆలోచిస్తున్నాను. పైగా మంచి వర్కరు కూడానూ –లేకపోతేనా —‘’గట్టిగా పొగ పీల్చి అన్నారు జి. యం. ‘’మీరు ఒక సారి శర్మతో మాట్లాడండి .గోరుతో పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకు ?’’

బాధగా కేబిన్ బయటికి వచ్చాను. బరువెక్కిన పాదాలతో అడుగులు వేసి వెళ్ళింది సమయం.

సాయంత్రం శర్మ ఇంటికి వెళ్ళాను.జరిగినదంతా వివరంగా చెప్పాను. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను,కూడా. కాని నా మాటలు పట్టించుకోలేదు శర్మ. పనిలో భద్రత గురించి, వర్కర్లకు పూర్తి అవగాహన కలిగించటం అవసరమన్నాడు. అందువల్ల ఉత్పత్తి పెరుగుతుందని అన్నాడు. యాజమాన్యం వారుకూడా ఆత్మార్ధంగా భద్రతకి పెద్ద పీట వేయాలని అన్నాడు.

నాకు శర్మ పట్ల జాలి కలిగింది. పనిలో ప్రతిభావంతుడైన వాడు యాజమాన్యం ఆలోచనలను పసి కట్టలేక పోతున్నాడెందుకని !

“ ఒరేయి  ‘’ నేను అన్నాను. ‘’ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయ,రా.కాని ప్రయోగిగంకా ఆలోచించాలి. ఎవ్వరు ఏం చెప్పినా ,ఎంత చెప్పినా ,భద్రత గురించి పర్యావరణం గురించి ఖర్చు చేయడానికి ఏ యాజమాన్యమైనా కొద్దిగా వెనకాడుతుందిరా .వాటి మీద ఖర్చు చేసే డబ్బుకి రిటర్న్ ఉండదు కదా . చట్ట ప్రకారం ఎంత తక్కువ చేయాలంటే అంతే’’

శర్మ తలయెత్తి నన్ను ప్రశ్నార్థకం గా   చూసాడు.నే ను మళ్ళీ అన్నాను. ‘’పైగా ఈ ఆర్ధిక మండలి అలనాటి ఈస్ట్ ఇండియ కంపెని లాంటిది. అందువల్ల నీ వేగం కొద్దిగా  తగ్గించు.నేను ఎందుకు చెబుతున్నానని  అర్ధంచేసుకో . మంచి వర్కరనే పేరుంది నీకు.  జి. యం.గారికి కూడా నీ మీద అభిమానమే. నీ తెలివి తేటలనూ మంచి పేరునీ ఉద్యోగంలో పైకి రావటం కోసం ఉపయోగించు . ఇలాంటి అనవసరమైన —–‘’

‘’ నేను అనుకోవటం లేదు అనవసరమని . ‘’శర్మ గొంతు లేచింది. ‘’పాపం కూలి కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పని చేస్తునారు  . మొన్న ఏమైందో తెలుసా –గంధకామ్లం పంపు చేసే పంపు ,పూర్తిగా డ్రైన్ చేయకుండా మరామత్తుకి ఇచ్చేసారు. హెల్పరు ,బొల్టు విప్పగానే వానలా బయటికి దూకింది ఆమ్లం –అతని అదృష్టం బాగుండటం వల్ల కళ్ళు పోలేదు అంతే. తప్పు చేసినవాడు పొరపాటు ఒప్పుకుంటాడా —అందుకే పూర్తిగా డ్రైన్ చేశారని సంతకం పెట్టి కాగితం ఇమ్మంటున్నాం. ‘’

‘’అలాంటి చోట పని చేసేటప్పుడు వేసుకోవలసిన ప్రత్యేక దుస్తులూ వాడవలసిన భద్రతాపరికరాలు ఉంటాయి కదా ‘’

‘’ఆయనే ఉంటే మంగలివాడు ఎందుకురా —‘’

శర్మలాగే కర్మాగారంలోని యంత్రాలు  కూడా నిర్విరామంగా తిరిగాయి. ఉత్పత్తిలోనూ కొత్త మందులు కనిపెట్టడంలోనూ మా సంస్ధ ముందడుగు వేసింది. కొత్తగా కనిపెట్టిన మందులు మనుషుల మీద ప్రయోగించడానికి సిద్ధమైంది  .

అప్పుడు జరిగింది ఆ సంఘటన —

పొగ గొట్టం మరామత్తు కోసం పైకి ఎక్కిన ఒక వర్కర్ క్రిందపడి చనిపోయాడు. పెద్ద గొడవకి దారి తీసింది ఆ సంఘటన. ఎత్తులో పని చేసేటప్పుడు సేఫ్టీ బెల్టు వాడటం తప్పనిసరి. అతడు బెల్టు వాడాడు. కాని అది బలంగా ఒక చోట తగిలించలేదని ,అందువల్ల పడిపోయాడని యాజమాన్యం వారు అన్నారు. పైగా అతడు మద్యం మత్తులో ఉండేవాడని కూడా ఋజువు చేసారు. కాని కార్మికులు ఒప్పుకోలేదు. వాడిన బెల్టు పాతదని అలాంటివే కర్మాగారంలో లభ్యమని ,వాటి బలాన్ని టెస్టు చేయించకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందని వాదించారు. వర్కర్లను ఉసికొల్పేది శర్మే నని నమ్మింది యాజమాన్యం. సమస్య సమ్మేకి దారి తీస్తుందేమో నని భయపడిన యాజమాన్యం జి. యం. గారిని ఉద్యోగంనుంచి తొలిగించి శాంతి కుదుర్చుకున్నారు.

కొత్త జి. యం. చేరగానే కార్మికులతోనూ వర్కర్లతోనూ సమావేశమైనాడు.  జరిగిందేదో జరిగిపోయిందని ఇక మీదట అలా జరగదని హామీ ఇచ్చారు. అంతే కాదు , పనిలో భద్రత ను త్యాగం చేస్తే ఊరుకునేది లేదని నొక్కి వక్కాణించాడు. ఎవ్వరైనా  భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినా  ,ఉల్లంఘించ డానికి ప్రోత్సాహం ఇచ్చినా వెంటనే –అర్ధరాత్రీ అయినా –తనకి ఫోను చేసి మాట్లాడమని నిర్దేశించారు .అంతే కాదు శర్మని ప్రత్యేకంగా తన కేబినులోకి పిలిచి అభినందించాడు కూడా  .

‘’సీ ,మిస్టర్ శర్మా –‘’కొత్త జి.యం.అన్నారు. ’’మీరు పని చేసే ఈ కర్మాగారంలో పని చేయటం నా అదృష్టం. ప్రతి కర్మాగారంలోను మీలాంటివాడు ఒకడైనా వుంటే పరిశ్రమల్లో ప్రమాదాలకు తావుండదు. వాట్ ఏ డెడికే ట్టడ్ మాన్ యు ఆర్ !ఉత్పత్తి తగ్గితే  మరో రోజు సాధించవచ్చు –కాని ప్రమాదానికి గురైన  వాడ్ని తెచ్చుకోగలమా —‘’

శర్మతో పాటుకార్మికులు కూడా ఆ మాటకి పొంగి పోయారు.  భద్రతపట్ల అంకింత భావంగల జి. యం. వచ్చినందుకు సంతోషించారు. ఆ ఆదివారం కలిసినప్పుడు అదే మాట అన్నాడు శర్మ.

‘’నువ్వు పొరపడుతున్నావురా ‘’నేను అన్నాను ’’నువ్వు ఎంత ప్రతిభావంతుడు వైనా యాజమాన్యం వారి ధోరణి పట్టుకోలేకపోతున్నావు ‘’

“ ఏంటిరా   , అలా అనేసావు ? ’’

‘’నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి శర్మా  –పాత జి. యం. అయినా కొత్త జి.యం.అయినా , జి.యం. జి.యం.నే . వాళ్ళ ఆలోచనలు బయట కనబడినా ,కనబడక పోయినా ఒకే లాగానే ఉంటాయి.పనికి సంబంధించిన ఆలోచనలు మనిషిని బట్టి మారవు. పదవినిబట్టి మారుతాయి. ‘’

‘’నాకు అర్ధం కాలేదురా –‘’

‘’జి.యం.ఎవ్వరైనాసరే , ఆలోచనా ధోరణిలో మార్పువుండదు. నీకు ఒకటి తెలుసా – జి. యం.ఉద్యోగాల మార్పిడి కుండ మార్పుల పెళ్ళిలాంటిది. ‘’

‘’అంటే —‘’

‘’ఆ  జి.యం. ఎక్కడకి వెళ్లారనినీకు  తెలుసా —మన కొత్త జి.యం.ఖాళీ చేసి వచ్చిన పోస్టుకి—మన యజమాన్యంవారే సర్దుబాటు చేసారట. ‘’

‘’సార్ ,ఇక్కడే  —‘’ఎవ్వరో కేక వేసి పిలవటం విని బైకు అపాను. ప్రభుత్వాసుపత్రి గేటు వద్దవున్నాను నేను. మా కర్మాగారంలో పనిచేసే ఇద్దరు ముగ్గురు నా  చుట్టూ  చేరారు.

‘’ఎలావుంది శర్మకి —‘’బైకు పార్కు చేసి  అడిగాను.

‘’ఎలావుంది అంటే —-‘’

‘’ఏమైందని  చెప్పరేం —?’’నా మనసు కీడు శంకించింది .

‘’ఏం చెప్పను ,సార్ ,’’ ఒకడు కళ్ళు వత్తుకొని అన్నాడు.

‘’పోనీ ,ఆ రోజు ప్రమాదం ఎలా జరిగింది ?’’

‘’ఆ రోజు రాత్రి —మరిగించిన గంధకం పంపు చేసే  పంపు పని చేయటం మానేసింది  సార్. ఎంత ప్రయత్నించినా స్టార్టు కాలేదు. జి.యం.గారు శర్మని తీసుకురమ్మంటే ఇంటికెళ్ళి తీసుకొచ్చాం. ఇంత వరకెప్పూడూ రాత్రి పూట  అతన్ని తీసుకురావలిసిన అవసరం రాలేదు. శర్మ ఎప్పుడూ పగలేగా పని చేసేది —‘’

‘’ఏమైందని చెప్పండి ‘’

‘’వస్తూనే పంపువద్దకు  పరిగెత్తాడు శర్మ. మరిగే గంధకం నిలువు చేసే టాంకు పైన వుంటుంది పంపు. దానిమీద వుండే పలక ఒకటి –పంపుదగ్గరదే  –ఎప్పుడో ఎవ్వరో తీసి వుండడం శర్మ గమనించలేదు. హడావిడిగా వెళ్తూ ఒక కాలు మరిగే గంధకంలో కి —‘’

‘’అమ్మ బాబోయి —‘’

‘’కాని గంధకం కాళ్ళకు  తగలలేదండి. వ మరిగించడానికి వాడే ‘’స్టీమ్ ‘’తగిలింది. మోకాళ్ళ దాకా కాలింది. ‘’

‘’ఏ గదిలో వున్నాడు ?’’

‘’నూరో నెంబరులో —‘’

ఒక ఉదుటున లోపలకి వెళ్ళాను. ఒక కుర్చీలో కూర్చుని బయటికి చూస్తునాడు శర్మ. ‘

“ ఒరేయి  ,శర్మా —-‘’

వాడు వెనక్కు  తిరిగి చూడలేదు. వెక్కి వెక్కి ఏడవటం వినబడింది.

‘’అన్యాయమై పోయానురా –నేను అన్యాయమై పోయానురా –‘’

‘’ఊరుకోరా –ఇప్పుడు ఏమైందని –ఒక నెల రోజుల్లో మళ్ళీ మామూలు అవుతావురా –‘’

ఒక నిమిషం మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత అన్నాడు.

‘’ఒక సారి నా దగ్గరకి వచ్చి కిటికీనుంచి చూడరా –‘’

‘’ అక్కడ ఏముందిరా చూడడానికి  —‘’ నేను శర్మ దగ్గరకి వెళ్ళాను.

‘’అదిగోచూడు  ,ఆ కనబడేది బీచురోడ్డు కదూ –‘’

‘’అవును ‘’

‘’ఈ రోజు పున్నమి కాబోలు –పిచ్చెక్కిన సముద్ర కెరటాలు బీచులో నిలబడినవాళ్ళ పాదం క్రింత ఇసుకను లాగేస్తునాయి . పున్నమి వెన్నెల లో వెండి పూత పోసుకున్న సముద్రం —‘’

‘’అవునవును ‘’

‘’దూరంగా బెర్తు కోసం ఎదురు చూసే నావలు ,మన బ్రతుకులలా –అయ్యో చూడు ,ఆ చంటి పిల్ల రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతోంది. పరిగెత్తుకొచ్చే కారు క్రింద —-‘’

‘’ఏంటిరా ,ఈ పిచ్చి మాటలు —‘’

‘’నాకు అంతా బాగానే కనబడుతున్నాయి కదురా ‘’

‘’ఎవ్వరన్నారురా నీకు కనబడటం లేదని —‘’

‘’డాక్టర్ అన్నారురా నాకు రేచీకటి అని –రాత్రి పూట నాకు ఏది కనబడదని –అందుకే యాక్సిడెంటు జరిగిందని —‘’

నేను తుళ్ళి పడ్డాను.

‘’ఇది మెడికల్ కాలేజీ తాలూకు ఆసుపత్రి కదా –ఇక్కడ డాక్టర్ సర్టిఫికటు ఇచ్చేసారు రా –ఇక నాకు ఫాక్టరీ ఉద్యోగానికి అర్హత లేదట.ఇక ఫాక్తరికి రానవసరం లేదన్నారురా ‘’

నా గుండె తరుక్కుపోయింది –అంటే శర్మ ఇలా—బుర్ర పిచ్చెక్కినటైంది. గది బయటికి పరిగెత్తుకొస్తూ   అనుకున్నాను.

అవును ,మా కంపెని వారు కొత్త మందులు కనిపెడుతునారు !

***

LR-SWamy-240x300 –ఎల్. ఆర్. స్వామి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఫిబ్రవరి: హాస్య కథల హవా!

 2 (1)

 

 

[ఫిబ్రవరి కథలలోకి వెళ్ళే ముందు ఓ చిన్నమాట. జనవరి నెల కథల పరిశీలనలో రెండు మంచి కథలు మా దృష్టిని దాటిపోయాయి. అవి – హిట్లర్ జ్ఞాపకాలు (డా. వి. చంద్రశేఖరరావు, పాలపిట్ట), చావుదేవర (రమాసుందరి, పాలపిట్ట). “హిట్లర్ జ్ఞాపకాలు” లేయర్డ్ గా సాగే కథనంతో కాలేజీ కేంపస్ లోని రాజకీయాలను పరిచయం చేస్తే, “చావుదేవర” సొగసైన ఒంగోలు మాండలికంలో సాగిన ఇద్దరాడవాళ్ళ కథ. రెండింటిలోనూ ప్రతీకాత్మకంగా రెండు జంతువులుండటం, రెండింటిలోనూ మిస్టిక్ లక్షణం వుండటం ఓ చిత్రమైన సామీప్యం. గత మాసంలో ప్రకటించిన జనవరి మంచి కథల జాబితాలో ఈ రెండు కథలూ తప్పకుండా చేర్చతగినవి. జరిగిన పొరపాటు సహృదయంతో అర్థం చేసుకోని క్షమించగలరని ఈ ఇద్దరు రచయితలను, పాఠకులను కోరుతున్నాము. మేము వీలైనంత సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాకున్న పరిమితుల వల్ల ఏవైనా కథలు/పత్రికలు మా దృష్టిని దాటిపోతే పాఠకులు సూచించడం ద్వారా ఈ కృషిని సమిష్టిగా, సమగ్రంగా చేయగలరని మళ్ళీ కోరుతున్నాము.]

 

ఇక ఫిబ్రవరి కథలలోకి వద్దాం –

ఫిబ్రవరి కథలలో రెండు ప్రత్యేకతలు వున్నాయి. మంచి కథల జాబితాలో చేర్చతగిన కథలలో చాలా వరకు హాస్యకథలు వున్నాయి. ఇది చాలా “ఆనందకరమైన” పరిణామం. రెండవది – చాలావరకు మంచి కథలు వెబ్ పత్రికలలో రావటం. సంఖ్యాపరంగా వెబ్ పత్రికలన్నీ కలిపితే కొన్ని కథలే వస్తున్నప్పటికీ వాటిలో మంచి కథల శాతం, ప్రింటు పత్రికలలో వస్తున్న మంచి కథల శాతం కన్నా ఎక్కువ వుండటం మరో పరిణామం. ఇది విస్తరిస్తున్న వెబ్ సాహిత్యానికి నిదర్శనమా లేక ప్రింటు పత్రికలలో క్షీణిస్తున్న ప్రమాణాలకు చిహ్నమా అన్నది మరింత లోతుగా పరిశీలించవలసి వున్నది. మరి కొన్ని నెలల పరిశీలన తరువాత ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుకుందాం.

ఇందాక చెప్పినట్లు ఈ నెల హాస్య కథల హవా నడిచింది. ఓ అంతర్జాల పత్రిక హాస్య కథల పోటీ నిర్వహించి అందులో బహుమతి పొందిన కథలను ప్రకటించడం అందుకు ముఖ్యకారణం కావచ్చు. అయితే తెలుగు సాహిత్యంలో హాస్య కథల విషయంలో ఓ చిన్న చూపు వుంది. ప్రముఖ వార్షిక సంకలనాలలో హాస్యకథలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఎక్కడో సెటైర్ కథలలో తప్ప కథాంశంలో బలం వుండదనీ, పాఠకులను నవ్వించడమే తప్ప ఇలాంటి కథలతో సామాజిక ప్రయోజనం పెద్దగా వుండదనీ కారణం చెప్తారు. పాఠకులను నవ్వించడమే ఓ సామాజిక ప్రయోజనమనే వాదన కూడా వుంది. ఏది ఏమైనా హాస్య కథ రాయడం కష్టమైన పని. మంచి పరిశీలన (వస్తువు కోసం), మంచి వాక్య నిర్మాణం (శైలి) వుంటే తప్ప హాస్యకథలు పండవు. అందుచేత ఈ నెల హాస్య కథలను ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాము. ఇవేవీ కాకపోయినా మిగిలిన (సో కాల్డ్ సీరియస్) కథలు ఇచ్చే నిరుత్సాహం నుంచి కాస్త తెరిపిగానైనా వీటిని చదువుకోవచ్చు.

ఇక మిగిలిన కథల గురించి –

గత మాసం చెప్పినట్లుగానే తెలుగు కథకులలో వస్తు వైవిధ్యం కోసం ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమకాలీన అంశాలకు కథా రూపం ఇచ్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. రైతు కష్టాలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వంటి నిలవ కథాంశాలు అడపాదడపా కనపడుతున్నా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వర్తమాన వస్తువులతో కథలు వస్తున్నా ఆ వస్తువు లోతుల్లోకి వెళ్ళే విషయంలో కొంత అలసత్వం కనిపిస్తోంది. వస్తు వైవిధ్యం ప్రోత్సహించవలసినదే కానీ, వస్తువు పట్ల మరికొంత గాఢమైన పరిశీలన లేకపోవడం లేదా అది కథలో ప్రతిఫలించలేకపోవడం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఓ గంభీరమైన విషయాన్ని కథలో ప్రవేశపెట్టినంత మాత్రాన అది గంభీరమైన కథ అయిపోదు. ఆ విషయం తాలూకు విభిన్న కోణాలు కథలో సూత్రామాత్రంగానైనా స్పృశించబడాలి.

ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ కథలను చూద్దాం –

“సుపుత్రుడు” (బి. గీతిక, స్వాతి మాసపత్రిక) కథ రొటీన్ అనాధ వృద్ధుల కథ అయినప్పటికీ ఓ అనాథను తెచ్చి పెంచుకోవడంతో ముగిసే విభిన్నమైన ముగింపు ఉన్న కథ. “శివుడి పెళ్ళి” (జయంతి వెంకటరమణ, నవ్య వారపత్రిక) కథకు (పెళ్ళికి) ఆడపిల్లలు దొరకకపోవటం అన్న అంశం మీద ఆధారపడింది. ఇది సమకాలీనమే అయినా ఆ అంశం గురించి తక్కువ మాట్లాడటం వలనా, ఒక వ్యక్తి అనుభవంలా మాత్రమే మిగిలిపోవటం వలన చిక్కదనం కొరవడింది. “వెలుగు రేఖలు” (రాజేష్ యాళ్ళ, ఈనాడు ఆదివారం), “ఓటమి” (సనిహిత్, కౌముది) కథలు కార్పొరేట్ ప్రపంచంలోని ఉరుకులు పరుగుల గురింఛిన కథలు. రెండింటిలోనూ నాటకీయత ఎక్కువైనప్పటికి ఇప్పటి సందర్భానికి చెప్పవలసిన కథలు. “ఇదో రకం పోరాటం – ఈ నాటి పోరాటం” (గంటి భానుమతి, భూమిక) కథలో కూడా కార్పొరేట్ ప్రపంచం నేపధ్యం. అయితే అందులో స్త్రీ ప్రత్యేకమైన సమస్యలను ప్రతిపాదించారు. అలాగే “గడువు” (ప్రతాప వెంకట సుబ్బారాయుడు, స్వాతి వారపత్రిక) అదే ప్రపంచంలో నుంచి ఓ personality development కథను రాయగలిగారు. దొరికినదల్లా ’వాడుకునే’ లక్షణం గురించి “కొత్త పరుగు” (సి.యస్. రాంబాబు, సారంగ), అందినంతవరకు దోచుకునే లక్షణం గురించి “గుడి” (భువనచంద్ర, స్వాతి వారపత్రిక) ప్రస్తావించాయి. మనిషి యొక్క మౌలికమైన స్పందనలు – దయ, ఆశ, మోసం, మోహం వంటి గుణాలను విశ్లేషిస్తూ “వజ్రం” (జి. వెంకటకృష్ణ, ఆదివారం ఆంధ్రజ్యోతి), “కురిసిన మనసు” (జి. వెంకటకృష్ణ, నవ్య) కథలు కనిపిస్తాయి. చాలా పాత (సినిమా) కథాంశాన్ని కొత్తగా చెప్పిన “ముళ్ళగులాబి” (పులిగడ్డ విశ్వనాథరావు, తెలుగువెలుగు), కొంత అసహజంగా వున్నా ఆశావహంగా వున్న కథ “జనాగ్రహం” (డా. జి.వి. కృష్ణయ్య, స్వాతి వీక్లి) చెప్పుకోదగ్గవి.

వస్తుపరంగా చెప్పుకోదగ్గ ముఖ్యమైన కథ “టైలర్ శీను” (ప్రసాదమూర్తి, సారంగ). తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాసిన ఈ కథ వర్తమానంలోనే వుంది. అయితే వివిధ వృత్తుల గురించి వాటిని కోల్పోవడం గురించి మొదలైన ఈ కథ, క్రమంగా చెప్పదల్చుకున్న సమస్యలోకి వెళుతుంది. అందువల్ల చెప్పదల్చుకున్న సమస్య కొత్తగా వచ్చి చేరినట్లు, కథ దిశ మారినట్లు అనిపించే ప్రమాదం వుంది.

ఇక భాష, కథనపరంగా చెప్పుకోవాల్సిన కథలు కొన్ని వున్నాయి. పైన ప్రస్తావించిన “టైలర్ శీను” కథే కాకుండా, “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” (వై. విశారద, కినిగె పత్రిక), “ఓ చిత్ర కథ” (పూర్ణిమ తమ్మిరెడ్డి, కినిగె పత్రిక) కథలు విశేషంగా చెప్పుకోదగినవి. కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాలు “టైలర్ శీను” కథకు కొత్త అందాన్ని ఇచ్చాయి. “తరళ మేఘచ్చాయ..” చాలా పెద్ద కథ అయినప్పటికీ శైలి పరంగా చాలా మంచి అనుభూతి మిగిల్చింది. “ఓ చిత్ర కథ” ఓ చక్కని ఫోక్ లోర్ కథని అన్వయిస్తూ సాగింఛిన కథనం బాగుంది. అయితే “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” కథలో వస్తు బలం లేకపోవటం; “టైలర్ శీను”, “ఓ చిత్ర కథ” కథలలో ఫోకస్ మారిపోవడం వంటి సమస్యలవల్ల కథ ప్రారంభంలో ఒక మంచి కథ చదవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించినా, కథ గడిచే కొద్దీ ఆ నమ్మకం పల్చబడినట్లు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే కథలన్నింటిలోనూ నాటకీయత ఎక్కువగా కనపడుతోంది. కథల్లో కనిపించే పాత్రలూ, జరిగే సంఘటనలూ మన చుట్టుపక్కల సాధారణంగా కనిపించేవీ, జరిగేవీ అయినప్పుడు మాత్రమే పాఠకులకి ఆ కథ నమ్మశక్యంగానూ, ఆలోచించదగినదిగానూ అనిపిస్తుంది తప్ప, కేవలం కథని నడపడం కోసమే పాత్రలనీ, సన్నివేశాలనీ సృష్టిస్తే అవి అసహజంగానూ, నాటకీయంగానూ కనిపిస్తాయి. పాఠకుడు అలాంటి కథని చదివిన వెంటనే మర్చిపోతాడు.

“శివుడి పెళ్ళి”, “సుపుత్రుడు”, “కురిసిన మనసు”, “గుడి” వంటికి కథలల్లో నాటకీయత పాళ్ళు కాస్త తూకం తప్పితే, “జనాగ్రహం”, “వెలుగురేఖలు”, “ఓటమి” వంటి కథల్లో దాదాపు అసహజత్వానికి దగ్గరగా వెళ్ళిపోయాయి. ఇది తెలుగు రచయితలు సమీక్షించుకోవాల్సిన అంశం. ఈ అసహజత్వానికి మరింత దోహదపడుతున్నవి సంభాషణలు. మామూలుగా మనం మాట్లాడుకునే విధానం కథలలో అరుదుగా కనపడుతోంది. చివర్లో ప్రసంగంలాంటి సంభాషణలు (ఇదో రకం పోరాటం…, వెలుగు రేఖలు మొదలైనవి), ఈ ప్రసంగం వల్ల ప్రధాన పాత్రలో తక్షణం మార్పు రావటం జరుగుతోంది. పాఠకుడికి కథా నేపథ్యం చెప్పడం కోసం పాత్రలు తమకు తెలిసిన విషయాలను vocalగా సంభాషించడం చాలా కథల్లో జరుగుతోంది. ఈ విషయం గురించి కూడా మరింతగా చర్చించాల్సిన అవసరం ఉన్నది.

వస్తుపరంగా బాగున్న కథలు కథనంలో వెనుకబడటం, కొన్ని కథలలో కథనం బాగున్నా వస్తు బలం లేకపోవటం, కథ తాలూకు లక్ష్యం స్థిరంగా లేకపోవటం, సహజత్వాన్ని దూరం చేసే నాటకీయత – ఈ నెల కథలలో ప్రధాన సమస్య. ఈ కారణంగా మొత్తం కథలలో ఉత్తమ కథ అంటూ ఏ ఒక్క కథ ఉండేందుకు ఆస్కారం లేదని మేము భావిస్తున్నాము.

 

ఫిబ్రవరి నెల హాస్యకథలు

వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్టు, ఈ నెలలో కొన్ని మంచి హాస్యకథలు రావడం కొంత రిలీఫ్ కలగజేసింది. ఆ కారణం గానూ, రచయితల ప్రయత్నాన్ని అభినందించడానికి గానూ, ఒక్కో కథనీ పరిచయం చేస్తున్నాం!

ఆనందబాష్పాలు (గోతెలుగు, ఫిబ్రవరి) :: పి వి సాయిసోమయాజులు

మండుతున్న ఉల్లిపాయల ధరల గురించి. హాస్యకథ గా పర్వాలేదనిపించింది.

 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (గోతెలుగు, ఫిబ్రవరి) :: అశోక్ పొడపాటి

సాఫ్ట్ వేర్ ఇంజనీరే తన అల్లుడు కావాలని పట్టుబట్టిన మామ కథ. కథనంలో మంచి హాస్యాన్ని అందించగలిగారు.

 

సుబ్బారావూ, బ్యాంకు అకౌంటూ (గోతెలుగు, ఫిబ్రవరి) :: రాజేష్ యాళ్ళ

ఇంటింటికీ తిరిగి ఎకౌంట్లు ఓపెన్ చేసే ఓ బాంకు పెట్టిన కష్టాల కథ. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న మంచి హాస్యకథ.

 

 

ఫిబ్రవరి నెల కథలు

పైన వ్యాసంలో ప్రస్తావించిన ఫిబ్రవరి నెల కథలు ఇవి. చదివి, మీరూ వాటి మంచిచెడ్డల గురించి ఆలోచించదగ్గ కథలు.

కథ

రచయిత

పత్రిక

సంచిక

ఇదోరకం పోరాటం – ఈనాటి పోరాటం గంటి భానుమతి భూమిక ఫిబ్రవరి
ఓ చిత్ర కథ పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగె పత్రిక ఫిబ్రవరి
ఓటమి సన్నిహిత్ కౌముది ఫిబ్రవరి
కురిసిన మనసు జి. వెంకటకృష్ణ నవ్య 19 ఫిబ్రవరి
కొత్తపరుగు సి. యస్. రాంబాబు సారంగ ఫిబ్రవరి
గడువు ప్రతాప వెంకట సుబ్బారాయుడు స్వాతి వారపత్రిక 7 ఫిబ్రవరి
గుడి భువనచంద్ర నది మాసపత్రిక ఫిబ్రవరి
జనాగ్రహం డా. జి.వి. కృష్ణయ్య స్వాతి వీక్లీ 14 ఫిబ్రవరి
టైలర్ శీను ప్రసాదమూర్తి సారంగ ఫిబ్రవరి
తరళ మేఘచ్చాయ, తరువాతి ఎడారి వై. విశారద కినిగె పత్రిక ఫిబ్రవరి
ముళ్ల గులాబి పులిగడ్డ విశ్వనాథరావు తెలుగు వెలుగు ఫిబ్రవరి
వజ్రం జి. వెంకటకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతి 16 ఫిబ్రవరి
వెలుగు రేఖలు రాజేష్ యాళ్ళ ఈనాడు ఆదివారం 16 ఫిబ్రవరి
శివుడు పెళ్ళి జయంతి వెంకటరమణ నవ్య 26 ఫిబ్రవరి
సుపుత్రుడు బి. గీతిక స్వాతి  మాసపత్రిక ఫిబ్రవరి

(అకారాది క్రమంలో..)

—అరిపిరాల సత్యప్రసాద్, ఏ. వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర్ రెడ్డి

02. T Chandra Sekhara Reddy

 01. Ramana Murthy03. Aripirala

ద్రావిడ సాహిత్యాల మధ్య వారధి ఇప్పటి అవసరం: నలిమెల

నలిమెల భాస్కర్ తో నారాయణ శర్మ

నలిమెల భాస్కర్ తో నారాయణ శర్మ

 

నాలుగు భాషలు కలిస్తే నలిమెల భాస్కర్! తెలుగు భాష మీది ప్రేమ ఆయన్ని ఆ భాషకే పరిమితం చేయలేదు, ఇంకో నాలుగు (నాలుగు ఇక్కడ బహువచన ప్రతీక మాత్రమే!) నేర్చుకోడానికి ప్రేరణ ఇచ్చింది. కేవలం నేర్చుకోవడమే కాదు, ఆ భాషల నించి తర్జుమా చేసే శక్తి నలిమెల అపూర్వ విజయం! కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకున్న సందర్భంగా నలిమెల భాస్కర్ తో నారాయణ శర్మ ముఖాముఖి!

ప్ర 1.మీ అనువాదమెప్పటినించి ప్రారంభమైంది..ఇతర సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ మీరు అనువాదంపై మక్కువ పెంచుకోవడానికి కారణం ఏమిటీ?

 

  జ నేను 1982 లో అనుకుంటాను ఒక చిన్న తమిళ కవితను అనువదించి తోటమహదేవ్ తీసిన వెల్లువ కు పంపించాను.అయితే వాస్తవానికి మిత్రుడు నందినీ సిథారెడ్డి “మంజీర “కోసం నాతో ప్రత్యేకంగా “పాకిమనిషి కొడుకు”నవలను 1986 ప్రాంతాల్లో అనువదింపజేసుకున్నాడు. ఆ తరువాత ఇప్పటివరకు చాలా అనువాదాలు చేసాను.

సాహిత్యంలో సృజన,అనుసృజనలు అక్కా చెలెళ్లు దేని ప్రాధాన్యం దానిదే. ఇది సమాచారయుగం. మనం ఈ సందర్భంలో ఇరుగుపొరుగు సాహిత్యాల వైపుకు చూడకపోతే వెనకబడి పోతాం. అనువాదలవల్లనే జాతీయ,అంతర్జాతీయ సాహిత్య  పరిణామాలు అర్థమవుతాయి.ఇవాళ పాతతరం పాఠకులని అడగండి.గోర్కీ”అమ్మ”చదువని వాళ్లు ఎవరైనా ఉన్నారా ?అని. దాదాపు కవులు,రచయితలు,సీరియస్ పాఠకులందరూ దానిని అక్కున  చేర్చుకున్నారు. రామాయణ, భారతదులు. ఖురాన్, బైబిల్ మొ.లేకపోతే ఆధ్యాత్మిక వికాసం ఎక్కడిది. మా ఊరు(కరీoనగర్ జిల్లా-నారాయణ పురం)లోని శ్రీరామా చందదారుల గ్రంధాలయంలో నేను చదివిన శరత్, ప్రేం చంద్ లనుండి తెలుగులోకి వచ్చిన అనువాద రచనలుకూడా నాలో అనువాదం పట్ల ఇష్టాన్ని పెంచి ఉంటాయి.

ప్ర2.మీ విద్యార్ధి దశలో మీరెప్పుడైనా అనువాదాలు చేయటంకాని,ఆకర్షితులవటం కాని జరిగిందా..?

 

నేను తొమ్మిదవ తరగతిలో ఉండంగా(1969)బాలసాహిత్యం,అనువాద సాహిత్యాలపట్ల ఆకర్శితుణ్నయ్యాను.మా ఊరి గ్రంథాలయంలో ఉన్న చందమామ కథలు,బాలల బొమ్మల రామాయణం , పంచతంత్ర కథలు నన్నాకట్టుకున్నాయి. అయితే నేను విద్యార్థి దశలో ఎటువంటి అనువాదాలు చేయలేదు.

unnamed

ప్ర3.ఏ అనువాదకుడైనా తనస్వభావానికి దూరంగా అనువాదాలు చేయడని సాహిత్యలోకం భావిస్తుంది కదా,  “స్మారకశిలలు”నవల మిమ్మల్ని ఆకర్షించడానికి కారణం  ?

 కొంతమంది అనువాదకులు తమకు ఏది దొరికితే అది అనువాదం చేస్తారు. అనువాదకుడికి బాగ నచ్చిన తరువాత అనువాదం చేస్తే ప్రయోజన కరంగా ఉంటుంది. అన్ని సందర్భాలలో అనువాదకుడి అనుభవానికి దగ్గరగా ఉండే రచనలు మూలభాషలో ఉండవు. అనువాదాలు మన అనుభవానికి దూరంగ ఉన్నా ,మన సమాజం లోని ఇతర వ్యక్తుల అనుభవానికి దగ్గరగా ఉంటే చాలు.  స్త్రీలు వివక్శకు గురౌతున్నారు కనుక స్త్రీ వాద సాహిత్యాన్ని అనువదించవచ్చు. అట్లాగే దళితులు మొదలైనవారి అనుభవాలకు దగ్గరగా ఉన్న ఇతర భాషల్లోని సాహిత్యాన్ని మనం మాతృభాషలోకి అనువదించవచ్చు. అవే అనుభవాలు లక్ష్యభాషలో ఉన్న స్త్రీలు, దళితులు , మైనారిటీలకు వున్నయి గనుక అలాంటి స్పందనలే ఉంటాయి.

స్మారకశిలలు-నవలను నాచేత కెంద్ర సాహిత్య అకాడెమీయే అనువాదం చేయించింది.ఎంపిక వాళ్లదే.  అందులో నాప్రమేయం లేదు. నాకు తెలిసిన భాషలలో ద్రావిడభాషలంటే బాగా ఇష్టం కనుక ఆనందంగా అనువదించాను.

photo

ప్ర 4. ఆ నవలని సంక్షిప్తంగా పరిచయం చేయగలరా..?

 

పునత్తిళ్ కుంజిబ్దుల్ల రచించిన నవలకు కోళికోడ్ సమీపంలోని ఒకగ్రామం కథాస్థలం.ఆగ్రామంలో మసీదు, సమీపంలో స్మశానవాటిక..ఇందులో ప్రధాన స్థలాలు. పుక్యోయ తంగళ్ అనేవ్యక్తి స్త్రీలోలుడు. ఆయనకు ఆట్టబీబి భార్య.తంగళ్ నీలిని వశం చేసుకుంటాడు. ఆమె ఓ కొడుకుని కని చనిపోతుంది.నీలి ప్రసవించి నప్పుడేతంగళ్ భార్య ఆట్టబీబి కూడా ఒక బిడ్డని కంటుంది. ఆమె పేరు” పూక్యుంజలీ”. తంగళ్ నీలి కొడుకుని చేరదీసి “కుంజాలి”అని నమకరణం చేస్తడు. పూక్యుంజీబి ఈ కుంజాలీని ప్రేమిస్తుంది.ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతున్న సందర్భంలో..తంగళ్ ను అతను ఒకస్త్రీతో సంగమిస్తున్నప్పుడు ఆస్త్రీ భర్త వచ్చి కత్తి తో పొడిచి చంపేస్తాడు. తంగళ్ చనిపోయాక అతని తండ్రికి ఉంపుడుగత్తెగావున్న స్త్రీతో జన్మించిన “ఇబ్రాయి” అనే వ్యక్తి ఇంట్లో పాగా వేస్తడు. తంగళ్ భార్య ఆట్టబీబిని పెళ్ళి చేసుకుంటాడు. తంగళ్ కూతురు పూక్యుంజీబీ కుంజాలిని ప్రేమిస్తున్నదని. ఇబ్రాయి ఆమెని క్షయరోగికి ఇచ్చి పెళ్లిచేస్తాడు. దాంతో పూక్యుంజీబి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.ఆతరువాత కుంజాలి అఙ్ఞాతంలోకి వెళ్లిపోతాడు.

ఈ నవలా రచయిత కుంజిబ్దుల్లకు బాల్యం నుండే దయ్యాలు, పిశాచాల కథలంటే చాలా ఇష్టం. చనిపోయిన వాళ్లే పిసాచాలుగామార్తారన్న అంసాన్ని, ప్రజల్లో ఉండే నమ్మకాన్ని యథా తథంగా చిత్రించాడు.చనిపోయి సంశాన వాటికలో సమాధులుగా ఉన్నవాళ్ల కథలే ఈనవలలో ఉన్నాయి కాబట్టి”స్మారక శిలలు”అనే పేరు చక్కగా సరిపోయింది.

ప్ర5.మీరు పదునాలుగు భారతీయ భాషలను అధ్యయనం చేసారు.అందులోంచి అనువాదాలు తెలుగులోకి ,తెలుగునించి వాటిలోకి చేసారు.ఎక్కువగా ఇతర ద్రావిడభాషలవైపుకి మీరుమొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది దానికి ప్రధాన కారణం ఏదైనా ఉందా?

 

మూలద్రావిడం నుంచి వచ్చిన ఈభాషలన్నీ సొదరభాషలు. వీటి మధ్య సారూప్య సమీప్యాలు ఎక్కువ. ద్రావిద భాషల మధ్య జరిగె అనువాదాలు చాలా సహజంగా ఉంటాయి. వాటి వాక్య నిర్మాణ పద్దతితో బాటు, పదజాలమూ దగ్గర దగ్గరగా ఉంటాయి. అందువల్లే నేను ఎక్కువగా వీటికి సీమితమై చేసాను. పైగా ఈద్రావిడ సంస్కృతి ప్రాచీనమూ,సుసంపన్న మైంది.తెలుగు,తమిళ,కన్నడ ,మళయాల భాషల మీద నేను చేసిన పరిశొధనల ప్రభావం కూడా నా అనువాదాల పై ఉంది.

ప్ర6.మీరు మళయాల తెలుగు సామేతల తులనాత్మక అధ్యయనం పేరుతో పరిశొధనచేసారు.?మీ పరి శోధన మీకు అనువాదం పై మక్కువని పెంచిందా ?లేక ఐచ్చికంగ ఆసక్తి చూపిన అనువాదం పరిశోధనకు పురిగొల్పిందా ?

 

ఎం.ఫీల్ లో నా పరిశోధనాంశం ‘తెలుగు సామేతలు…ఇతర ద్రావిడ భాషలతో పరిశీలన” ద్రావిడ భాషలనగానే గుర్తుకొచ్చేవి తెలుగుతో బాటు ఇందాక చెప్పుకున్న నాలుగు భాషలే.సుమారు నలభైవేల సామేతలు ఇంకొంచం లోతుగా పి.హెచ్ డి పరిశొధన చేయడానికి పుగొల్పాయి. తెలుగు,మళయాలకె పరిమితమయి సంత్రుప్తిగా పరిశొధన ముగించాను. పరిశొధన పూర్తయ్యాక అనువాదాలు ప్రారంభించాను. కనుక పరిశొధనే అనువాదం పై మక్కువ పెరగడానికి కారణం. అయితే నేరుగా ఆయా భాషలనుండి అనువదించాలనే కొరిక ఇంకొక కారణం.

.

ప్ర7.మీరు ఇంగ్లిష్, హింది, సంస్కృతం లాంటి భాషలను అధ్యయనం చేసికూడా వీటిల్లోకి అనువాదాలుతేవడం కాని, వీటినించి ఇతరభాషలకి తేవడంకానీ ఎక్కువగా కనిపించదు..? దానిపై మీ స్పందన..

 

తెలుగు,హింది,ఇంగ్లీష్.సంస్కృతం,ఉర్దూ కూడా తెలిసినవాళ్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. త్రిభాషా సూత్రం అమలు అయిన రాష్ట్రం కనుక ఇందాకటి భాషలు తెలిసిన వాళ్ళు ఎక్కువ. తెలంగాణలో ఒకప్పుడు అధికార భాషగా ఉర్దూ ఉండటం వల్ల ఉర్దూ తెలిసిన వాళ్లూ ఎక్కువే. ఈళ్ల సంఖ్యతో పోల్చినప్పుడు తమిళం,మలయాళం,కన్నడం-తెలుగు తెలిసిన వాళ్లు తక్కువ. తెలుగు-మలయాళం రెండు భాషలు వచ్చిన వాళ్లు నలుగురైదుగురు మాత్రమే.  ద్రావిడభాషలు నాల్గింటి మధ్య పరస్పరం జరిగిన అనువాదాల సంఖ్య తక్కువే. ఈ అగాధాన్నిపూరించాలంటే. ఈ ఖాళీ సవరించాలంటే ద్రావిడ భాషలమధ్య పరస్పరానువాదాలు, ఆదాన ప్రదానాలు ఎక్కువగ జరగాలి. ఇంకా చెప్పాలంటే తెలుగు-పంజాబి,అస్సామీ మొ.భాషల్లోకి అనువాదాలు ఇంకా జరగాలి.

 

ప్ర8.చాలావరకు అనువాదకులు (Link Language )సంబంధ భాషనించి చేస్తారు..మీరు మూలభాషనుంచి చేయడానికి పదునాలుగు భాషలను అధ్యయనం చేసారు.ఇందులో ఏ మార్గం సరైనదని భావిస్తారు..? ప్రధానంగా ఎందులో కవిని ,కవిరచనని సంపన్నంగా అందించడానికి వీలవుతుందని భావిస్తారు..?

 

నేరుగా ఆయా మూల భాషలనుండి  లక్ష్య భాషలోనికి అనువాదం చేయడం సరైనది. ఎంతగొప్ప అనువాదమైనప్పటికి మూలం స్వారస్యం మన మాతృభాషలోకి దిగదు. అటువంటప్పుడు వయా అనువాదాలు చేయడం వల్ల నాణ్యత కొరవడే అవకాశం ఉన్నది. కానీ నేరుగా అనువాదం సాధ్యం కానప్పుడు లింక్ లాంగ్వేజ్ నుంచి చేయటం తప్పుకాదు. ఒక మూల భాషలోని గొప్పరచనను ఇంగ్లీష్,హిందీ నుంచి చదివి అది తప్పకుండా లక్ష్య భాష అయిన తెలుగులోకి రావాలనుకున్నప్పుడు చేయడంలో తప్పులేదు. కాని సంబంధ భాషనుండి తేలికగా అనువదించ వచ్చుకదా అనుకుని డైరెక్ట్ అనువాదకులని పట్టించుకోక పోవడం పెద్ద పొరపాటు.

ప్ర9.తెలుగులోకి అనువాద రూపంలో వస్తున్న రచనలసంఖ్యగానీ,తెలుగులోకి ఇతరభాషల్లోంచి వస్తున్న అనువాదల పట్లగానీ మీ అభిప్రాయం ..?

 

తెలుగులోకి అనువాదపరంగా వస్తున్నరచనలు రాసిలోనూ వాసిలోనూ బాగున్నాయి. ఐతే ఇతర భాషలతో పోల్చి చూసుకుంటే ఇవి సంఖ్యా పరంగ తక్కువ అని చెప్పక తప్పదు. తెలుగులో ప్రత్యేకించి “విపుల” పత్రిక చేస్తున్న కృషి ప్రశంసనీయం. సాహిత్య అకాడెమీ,ఎన్,బీ,టీ తదితర ప్రభుత్వ సంస్థల అనువాదాలు సరేసరి. హెచ్ బీ టీ, పికాక్ క్లాసిక్స్ వంటిసంస్థలు అనువాదాలను ప్రొత్సహిస్తున్నాయి. పత్రికలు కూడా ఆదివారం అనుబంధాల్లో కథలు,కవితలకు చోటునిస్తున్నాయి.ఇది శుభపరిణామం. అయితే తెలుగునుండి ఇతరభాషలలోనికి ఎక్కువగా వెళ్లడంలేదు. దీనికి పరిష్కారం ఒక్కటే . మూల రచయితకు తమరచనని అనువాదంలో చూసుకోవాలన్న శ్రద్ధ ఉండాలి. తెలుగునుండి ఇతరభాషలకు తీసుకువెళ్లగలిగిన అనువాదకులని గుర్తించాలి.  ముఖ్యంగా అనువాదకులందరూ కలిసి ఒక వేదికపైకి వస్తే ఫలితాలు బాగుంటాయి. వాస్తవంగ ఆలోచిస్తే ఈ బృహత్తర కార్యాన్ని విశ్వవిద్యాలయాలు చేపట్టాలి.

ప్ర10.మీరు తెలంగాణా పదకోశాన్నిరూపొందించారు..తెలంగణా ప్రజవ్యవహారంలో వచ్చిన సాహిత్యం,ఇతర రచనలు అనువాదనికి లొంగవు అన్న అభిప్రాయంతో మీరెంతవరకు ఏకీభవిస్తారు.?ఇది సత్యమే అయితే దీనికి అనువాదకులుగా ఏదైనా పరిష్కారాన్ని పంచుకుంటారా..?

ఆధునిక ప్రమాణ భాషలో వచ్చిన రచనలు అనువాదానికి సులభంగా లొంగుతాయి.అది నూటికి నూరుపాళ్లు సత్యం.ఒకే రాష్ట్రంలోని ఆయాప్రాంత వ్యవహారం(మాండలికం)లో వచ్చిన రచనలు అనువాదాల్లోకి వెళ్లటం కష్టమైన పనే.కాకపోతే ఏదీ జరగక పోవడం కన్న కొంతైనా జరగడం మిన్న కనుక నిరాశపడవలసింది లేదు. మాండలికంలో ఉన్న రచన ఇతరమాండలికాల్లోకి వెళ్లవలసిన అవసరం ఉంది. అది సాధ్యంకానప్పుడు ఇక్కడి మాండలికరచన అక్కడి మాండలికానికి దగ్గరగ ఉన్న రచనగానైనా లేదా అక్కడిప్రమాణ భాషలోకైనా వెళ్లుతుంది.దీనికి పరిష్కారం ఏమిటంటే ఇలాంటి అనువాదాలకు తెలుగు బాగా తెలిసిన ఇతర భాషల్లోని అనువాదకులని గుర్తించాలి. ఉదాహరణకు తమిళంలో “ఇళంభారతి “ఉన్నారు. ఆయన “అంపశయ్య నవీన్”గారి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డ్ పొందిన నవల “కాలరేఖలు”ను గొప్పగా”కలచ్చువడుగళ్”గ అనువదించారు.

ప్ర11.తెలంగాణా సామాజిక వాతవరణానికి,ఇతర ద్రావిడభాషాప్రాంతాల సామాజిక వాతావరణానికి మధ్య ఏదైనా సారూప్యతలేమైనా మీరు గుర్తించారా..?ఆయ భాషలలో సామాజికంగ వచ్చే సాహిత్యానికి,ఇక్కడి సాహిత్యానికి ఏదైనా పోలికలు మీకు కనిపించాయా..?

తెలంగాణా సామాజిక వాతావరణానికి,ఇతర భాషల సామాజిక వాతావరణానికి సారూప్యతలు ఉంటాయి.ఇదంతా ద్రావిడభాషాసమాజం.ద్రవిడంలో మళయాలానికి ఒక ప్రత్యేకత ఉంది.అక్కడ దాదాపు 1929 వరకు నాయర్లు తదితర కుటుంబాలల్లో బహుభార్యాత్వం ఉంది. మాతృస్వామిక వ్యవస్థ “మరుమక్కత్తాయం”ఉన్నది.ఇక తెలంగాణా సామాజిక వాతావరణానికి హైదరాబాద్ ..కర్ణాటక లో గుల్బర్గా,రాయచూర్,బీదర్ జిల్లాలు 1952 కు ముందు హైదరాబాద్ లో ఉండేవి. తెలంగాణా వెనకబాటుతనంలాగే అయాజిల్లాల వెనుకబాటుతనాలు.సంస్కృతి,సాంప్రదాయాలు కూడ దగ్గరగా ఉంటాయి.కాకపోతె అక్కద వీర శైవం ఎక్కువ.సాహిత్యాల మధ్య పోలికలు చాలా ఉన్నాయి.స్త్రీవాద,దళితవాదం మొ.న సాహిత్యోద్యమాలు అక్కడ ఇక్కడా ముందో వెనకో వచ్చినవే.

ప్ర12.మీరు కథా రచయితగా”మంద””లాంటి గొప్ప కథలని రాసారు,కవిత్వం విషయంలో “సుద్దముక్క”లాంటి గొప్ప కవిత్వమూ ఉంది..అనువాదకుడుగా తమిళంవంటిభాషలలోకి,ఇతరాలకి అనువాదం చేసారు…మిలో మీకు నచ్చిన ..అలా అనడంకంటే మిమ్మల్ని ఎక్కువ సంతోష పెట్టే సాహిత్య వ్యక్తిత్వం ఏమిటి..డా.నలిమెల భాస్కర్ ని ఎలా చూడాలని కోరుకుంటారు.

 

నన్నుబాగా సంతృప్తి పరిచే అంశం అనువాదం. సాహిత్యానికి మాత్రమే పరిమితమై చూసినప్పుడు అనువాదం ఇష్టం.ఇంకా విస్తృతంగా ఆలోచించినప్పుడు నాకు” బోధన”ఇష్టం. అయితే అది ప్రస్తుతాంశం కాదు.  సృజన ఎవరో ఒకరు ఏదో ఒకరీతిలో చేస్తూనే ఉంటారు. అనుసృజన కష్టం. పైగా అది నిష్కామ కర్మ యోగం. ప్రతిఫలాపేక్షలేని పని. మూల భాషలోని రచయిత అనువాదం ద్వారా ఇంకొక భాషలోకి వెళ్లడం. మనిషి ఇరుగుభాషల్లో కి ప్రవహించేగుణం .నన్ను నేను అనువాదకుడుగా ఇష్టపడుతాను.

ప్ర13.చాలావరకు అధ్యయనం కోసం మీఆరోగ్యాన్ని ఫణంగా పెట్టారు.మిమ్మల్ని దగ్గరగా గమంచిన కొంతమందికి ఈ విషయం సుస్పష్టంగా తెలుసు. అయినా మీరు ఇంకా ఇలా(ఆరోగ్యాన్ని లక్షపెట్టకుండా)కొనసాగించడానికి పదిలమైన లక్షమేదైనా ఉందా..?

ప్రత్యేక లక్షం అంటే..అనువాదం విషయానికొస్తే నా దగ్గర వివిధ భారతీయ భాషలకు సంబంధించిన గొప్ప కథలు ఓ యాభై నుండి డెబ్భైవరకు ఉన్నాయి. వాటిని ఆయ కారణాలవల్ల ఇప్పటివరకు అనువదించలేక పోయాను. వాటిని తెలుగు పాఠకులకు అందించాలన్నది ప్రణాళిక…అనువాదాన్నించి బయటికి వచ్చిచూస్తే నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. తెలంగాణా పదకోశాన్ని కనీసం పదిహేనువేలకి తగ్గకుండా తీసుకొని రావడం. నాజీవిత కాలమంతా ఆ నిఘంటువుని అప్ డేట్ చేసుకుంటూ రావడం. పాల్కురికి సోమనాథుడు,భక్తరామ దాసు,పోతన వారి పదప్రయోగ సూచికని తయారు చేయడం. తెలంగాణా సామేతలని ఒక బృహత్సంకలనంగా తీసుకు రావటం…ఇలాంటివి ఇంకా ఉన్నాయి

ప్ర14.యూనివర్సిటీలలో అనువాదన్ని కోర్స్ గా ప్రారంభించి ప్రధానంగా ద్రావిడభాషలనించి అనువాదకులను ఎక్కువగా తయారు చేసుకోవాలన్న ఆలోచనకు మీస్పందన..?

గొప్ప ఆలోచన.అనువాదాలు అప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తాయి.సాహిత్య వికాసానికి,హృదయవికాసానికి,సమాజాభ్యుదయానికి,ప్రాపంచిక పరిణామ పరిశీలనకి అనువాదాలు గొప్ప మాధ్యమాలు.విశ్వవిద్యాలయాల్లో అనువాదం కోర్సుగా ఉండాలి.స్నాతకోత్తర స్థాయిలో అనువాదాన్ని పాఠ్య ప్రణాళిక లో ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టవచ్చు.ప్రత్యేకించి ద్రావిడ భాషల్లో పరస్పరానువాదాలు.ఆదానప్రదానాలకు కారకులైనవరిని గుర్తించి వారిచేత భావితరాలను తయారీకి తోడ్పడాలి.

ప్ర15.”సాహితీ సుమాలు” పేరుతో సాహితీవేత్తలని పరిచయం చేసారు..తమిల తెలుగు సాహిత్యాలని తులనాత్మకంగా అందించే ప్రయత్నం మీనుంచి ఆశించవచ్చా..?

తమిళ తెలుగు సాహిత్యాలను తులనాత్మకంగ అందించే ప్రయత్నంలో భాగంగానే తెలుగు-తమిళ సామేతలను పరిశోధనగ చేసుకొన్నాను.

(తెలుగులో సామేతలు-ఇతర ద్రావిడ భాషలతో తులనత్మక పరిశీలన)అంతే కాదు తెలుగు తమిళ పొడుపుకథలు అంటూ పెద్దవ్యాసం రాసి ప్రకటించాను.భవిష్యత్తులో రెండుభాషల్లోని పొడుపుకథలగురించి ఒక పుస్తకం తీసుకొని రావలన్నది నాసంకల్పం.”భారతీయ సామేతలు” అన్నపేరుతో ప్రచురించిన పుస్తకంలో తెలుగు-మళయాల సామేతల సమానార్థకాలున్నాయి.ఈ సారి అదే పేరుతో వచ్చే గ్రంథంలో “తెలుగు-తమిళ సామేతల సమనార్థకాలుండే అవకాశం ఉంది.

 

ప్ర16.మీకుటుంబ సభ్యులనుంచి,మీ మిత్రులనుంచి ,తెలంగాణా సాహిత్యవాతవరణం నుంచి మీకందుతున్న అభినందనలపై స్పందిస్తారా..?

 

నా అర్థాంగి సావిత్రి సహకారం మరిచి పోలేనిది. అవార్డ్ రావడం పట్ల ఆమె చాలా సంతోషించింది. తను గొప్ప అదృష్ట వంతురాలు అని భావించింది. మా కూతురు చైతన్య , అల్లుడు శ్రీనివాస్  మనుమరాలు ఔచిత్యల ఆనందానికి అంతే లేదు. అమ్మ అనారోగ్యంతో ఉంది కనుక మాట్లాడలేదు. తమ్ముళ్లు,సోదరీ మణులందరూ సంతోషానికి లోనయ్యారు. మిత్రులనుండి ముఖ్యంగా జూకంటి జగన్నాథం,నిజాం వెంకటేశం,అన్నవరం దేవెందర్,పెద్దింటి అశోక్ కుమార్ వంటి ఎందరో మిత్రుల సంభ్రమాశ్చర్యాలకు లెక్కే లేదు. తెలంగాణా నుండి అందుకున్న ప్రతిస్పందన  చూస్తుంటే ఈ అవార్డ్ తెలంగాణాకే వచ్చినంత ఆనందం వేస్తున్నది. తెలంగాణా సాధించుకున్నాక మొదటి జాతీయ పురస్కారం కాబట్టి ఆ బహుమతిని తమకే వచ్చినట్టుగా అందరూ “స్వీయం” చేసుకుంటున్నరు. ఇది అందరికీ ఆనందాన్నిచ్చే సందర్భం కావడం నాకు అందివచ్చిన మంచి అవకాశం.

ముఖాముఖి: ఎం. నారాయణ శర్మ