Archives for November 2013

‘రంగు రంగుల జ్ఞాపకాలు’…మీ ముంగిట్లో…వచ్చే గురువారం నుంచి…!

memories-1

రాత్రయింది. ఊరంతా చీకటి. కానీ ఊరు ఊరంతా సందడిగా ఉంది. ఆ రోజు మా ఊర్లో సినిమా ప్రదర్శిస్తున్నారు. బహుశా మా ఊర్లో అదే మొదటి సినిమా ప్రదర్శన అనుకుంటాను. అప్పటికి నా వయసు ఎంతో కూడా నాకు తెలియదు. ఊరిలోని పీర్ల చావిడి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో సినిమా ప్రదర్శన కి ఊరు ఊరంతా తరలి వచ్చింది. నిజానికి ఈ విషయాలేవీ నాకు గుర్తు లేవు. అసలు ఆ రోజు నేను ఎవరితో కలిసి సినిమాకెళ్లానో కూడా నాకు గుర్తు లేదు.

– సినిమా ఒక అందమయిన జ్ఞాపకం. అది నిజంలాంటి కల. కలలాంటి నిజం. ఈ రెండీటి మధ్యా ఊగిసలాడే మనం! ఆ జ్ఞాపకాల తెర తీస్తున్నారు వెంకట సిద్దా రెడ్డి మీ కోసం! నెలకో సారి మీ ముందు!

బానిసకొక బానిసకొక బానిస!

drushya drushyam-9 photoఒకరిని చిత్రించడం ఒకటి.
-అది మనిషిదైతే అతడి అంతర్ముఖం కనిపిస్తుంది.ఇద్దరిని చిత్రించడం మరొకటి.
-అది ఆలుమొగలదైతే వాళ్లిద్దరి అనుబంధం కనిపిస్తుంది. స్నేహితులదైతే అనురాగం వ్యక్తమవుతుంది.ముగ్గురిని చిత్రించడం మాత్రం పూర్తిగా భిన్నం.
ఎందుకో అది సమాజాలనూ, ప్రపంచాలనూ చూపినా చూపుతుంది!

+++

అవును. ఒక చిత్రంలో గనుక ముగ్గురు ఉన్నారూ అంటే ఆ చిత్రం వ్యక్తులను దాటుతుంది. సామూహికతను మెలమెల్లగా చెప్పడానికి ఆ ఛాయాచిత్రం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్నారూ అంటే అది సంఘమే అవుతుంది. మనిషి హఠాత్తుగా ఒక సంఘటనలో భాగంగా లేదా ఒక సన్నివేశంలోని పాత్రలుగా వ్యక్తమవుతారు. ఒక ప్రవహిస్తున్న ధారకు సంబంధించిన వాహికగా మారి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. కలవర పరుస్తారు. లేదా ఆనందపారవశ్యానికి గురిచేస్తారు. ఈ చిత్రం అటువంటిదే. కాకపోతే ఇది మనల్ని మనకు పట్టి చూపే కాలమ్, అనుకుంటాను!

+++

ఒకానొక రోజు దీన్ని మన దేశ రాజధానిలో చిత్రించాను.

ముగ్గురూ ముగ్గురే.
ఒక బస్టాఫ్ వద్ద కూచున్న ఒక దినసరి కూలి, నిలబడ్డ ఒక సాఫ్టు వేరు ఉద్యోగి. ఒక చిరు కంపెనీలో పనిచేసే మరొకతను…ముగ్గురూ ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నది బస్సుకోసమే.

నిజానికి వేచిచూపు.
ఆ వేచిచూపు అందరిదీ.
కానీ, వ్యక్తులు మాత్రం ఎవరికి వారు.

ఒక్కొక్కరు ఒక్కో రకం. ఒక్కొక్కరిదీ ఒక స్థితి.
చిత్రం చూస్తుంటే ఎవరి వయసేమిటో తెలుస్తున్నది. ఎవరి ఆర్థిక స్థోమత ఏమిటో కూడా అగుపిస్తూ ఉన్నది.
మనం ప్రభుత్వం నుంచి మనం ఏదేనీ ధృవీకరణ పత్రం తీసుకోవాలంటే, నింప వలసినవి ఉంటాయి గదా!
అవన్నీ ఈ చిత్రంలోనూ దాదాపుగా నిండి ఉండనే ఉన్నాయి.

అంతా ఒకే చిత్రము.
కులమూ మతమూ జాతీయతా నివాస స్థలమూ ఆర్థిక స్థోమతా అన్నీ ఏదో విధంగా తెలుపుతున్న చిత్రము.
అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే, ఇది మూడో ప్రపంచ చిత్రం.

వేర్వేరు స్థాయి భేదాలతో…ధనికా పేదా మధ్యతరగతిగా కానవస్తున్న ఆ చిత్రం  అచ్చమైన మన దేశీయ చిత్రమే.
– The third world.

+++

ముగ్గురున్నారని కాదు.
బానిసకొక బానిసకొక బానిస గనుక!

విడగొట్టబడి…
అందరూ చౌరస్తాలో అపరిచితులై ఎదురుచూస్తూ ఉన్నారు గనుక!

~కందుకూరి రమేష్ బాబు

వీలునామా – 22 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

 

హేరియట్ ఫిలిప్స్ వ్యక్తిత్వం

ఆ రోజు ఎల్సీ లిల్లీ ఫిలిప్స్ కొరకు ఒక మంచి గుడ్డను తెప్పించి దానితో ఆమెకి అందమైన బోనెట్ (టోపీ) తయారు చేసింది. వదిన గారి అందమైన బోనెట్ చూసిన దగ్గర్నించీ హేరియట్ కి తనకీ అలాంటిదొకటుంటే బాగుండనిపించింది. మర్నాడు తనతో పాటు దుకాణానికొచ్చి, తనకీ అలాటి గుడ్డనే, వేరే రంగులోది కొనాలనీ,తనకీ అంత బాగా టోపీ కుట్టిపెట్టాలని ఎల్సీకి ఆఙ్ఞ జారీ చేసింది హేరియట్.

మర్నాడే దుకాణానికి బయల్దేరుతూ ఎల్సీని కూడా బయల్దేరదీసింది. వీళ్ళ కూడ బ్రాండన్ కూడా బయల్దేరాల్సి వచ్చింది. స్టాన్లీ ఇంట్లో లేడు, లిల్లీ, పిల్లలూ జేన్ తో కలిసి గదిలో చదుకుంటూన్నారు. అందువల్ల ముగ్గురూ దుకాణానికి బయల్దేరవల్సి వచ్చింది.

హేరియట్ కి తన బలహీనత తనకే తెలియదు. తెలిసి వుంటే కాబోయే భర్తతో కలిసి బట్టల దుకాణానికి వెళ్ళి వుండేదు కాదు. ఎల్సీకీ అంతవరకూ లిల్లీతో కలిసి వెళ్ళిన అనుభవమే కానీ, హేరియట్ తో కలిసి బయటికి వెళ్ళింది లేదు. అయితే ఎంతో చదువుకుని అత్యాధునికంగా అలంకరించుకునే హేరియట్ నించి అలాంటి సంస్కార హీనమైన ప్రవర్తన ఊహించలేదేమో, చాలా సిగ్గుపడింది. తనని సంప్రదిస్తే, తను కావలసిన ధరలో నప్పే రంగులు చకచకా ఎంపిక చేసి ఇచ్చేదే. అయితే హేరియట్ కి నాణ్యమైన బట్టా, నచ్చే రంగులూ కావాలి కానీ దుకాణ దారు చెప్పిన ధరతోటి ఆమె సాధారణాంగా ఏకీభవించదు.  ఆమె దుకాణంలో వున్న అబ్బాయిలని పరుగులు పెట్టించింది. తాను దుకాణంలో అలాంటి పని ఇదివరకే చేసి వున్నందువల్ల ఎల్సీ ఆ అబ్బాయిలని చూసి జాలి పడింది. పాపం, ఒకటి తర్వాత ఒకటిగా లెక్కలేనన్ని డబ్బాలు తెచ్చి పడేసారు వాళ్ళు. ఒక్కటీ హేరియట్ కి నచ్చలేదు.

పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత రచయిత లే హంట్ అన్నాడట, “నువ్వు పెళ్ళాడబోయే అమ్మాయిని ఒక్కసారి బట్టల దుకాణానికి తీసికెళ్ళు. బయటికొచ్చినతర్వాత కూడా ఆమెనే పెళ్ళాడదలిస్తే పెళ్ళాడు,” అని. బట్టలకొట్లోని పనివాళ్ళతో ప్రవర్తనలోనే స్త్రీ వ్యక్తిత్వం బయటపడుతుందని ఆయన అభిప్రాయం.

నిజంగా మగవాళ్ళు పెళ్ళాడబోయే ముందు అమ్మాయిలకీ పరీక్ష పెడితే ఎంత మంది పెళ్ళిళ్ళవుతాయన్నది సందేహమే. దానికి తగ్గట్టు బట్టల దుకాణంలో బట్టలు చూపించే పని వారు ఏమాత్రం నోరూ, ఆత్మాభిమానమూ లేనట్టు ప్రవర్తిస్తారు. సహజంగా వుండే అలంకరణమీద ఆసక్తీ, లోకంలో వుంటూ అలవడే డబ్బాశా, ఆ సమయంలో ఎంతటి సౌమ్యురాలయిన స్త్రీనైనా సివంగిలా మారుస్తాయి.

బ్రాండన్ బట్టలకొట్లోని హేరియట్ ని ఏమాత్రమూ ప్రేమించలేకపోయాడు. అక్కడ హేరియట్ మొరటు ప్రవర్తనని చూసి సిగ్గుపడ్డ ఎల్సీ అతని కళ్ళకి ఎక్కువగా నచ్చసాగింది. అస్సలతనికి ఎల్సీ మీద హేరియట్ చలాయించే ధాష్టీకమే చిరాకెత్తించసాగింది. తన ప్రేమని నిరాకరించినా తనకామె పట్ల కోపమేమీ లేదని చెప్పే ఎల్సీతో అవకాశం వస్తే బాగుండు, అనుకున్నాడు బ్రాండన్.

అయితే అతనికా అవకాశం రాలేదు ఎప్పుడూ.

ఎన్నెన్నో దుకాణాలు వెతికీ, పెట్టెలన్నీ తెరిపించినతర్వాత బోనెట్ కి కావల్సిన లేసులూ, పువ్వులూ, గుడ్డా దొరికాయి. హేరియట్ తృప్తిగా నిట్టూర్చింది. చేతి గడియారం చూసుకుని కెవ్వుమంది.

“అయ్య బాబోయ్! ఎంత ఆలస్యం అయిపోయిందో! ఆకలవుతూంది. పొద్దుటిపూట బట్టలు కొనుక్కోవడం భలే సరదాగ వుంటుంది కదూ? హాయిగా కావలసినవన్నీ కొనుక్కుని భోజనాలకి లేవొచ్చు. అన్నట్టు, మనం ఇంటికెళ్ళేసరికి మనకోసం వదిన కానీ, పిల్లలు కానీ ఆగుతారనుకోను. బ్రాండన్, ఏదైనా మంచి రెస్టారెంటు చూస్తావా? భోజనం చేసేద్దాం. భోంచేసాక ఒక టాక్సీ సరేసరి. మగవాళ్ళతో రావాలోయ్, షాపింగుకి, ఏమంటావ్?” నవ్వింది.

“అలాగే హేరియట్. భోంచేసి టాక్సీలో ఇంటికెళ్దాం. నాకు పెద్ద కొంపలంటుకునే పనేం వుందని,” మామూలుగానే అన్నాడు బ్రాండన్.

“ ఏం మగాడివయ్యా! పెద్ద పన్లుంటే మాతో వచ్చేవాడివి కావన్నమాట! అంత తేలిగ్గా వుందా ఆడపిల్లలంటే? సరే, ఈ సారికి క్షమించి వదిలేస్తాలే!”

హేరియట్ వేళాకోళం చేసింది. ఆమె ఆశపడ్డట్టే బ్రాండన్ వాళ్ళని ఖరీదైన హోటల్ కి తీసికెళ్ళి భోంచేసాక గుర్రపు బగ్గీ కుదిర్చి ఇంటికి తీసికెళ్ళాడు.

“అసలు తన సొంతానికి ఒక గుర్రపు బగ్గీ పెట్టుకోవాలని నేను అన్నయ్యతో ఎన్నిసార్లు చెప్పానో లెక్క లేదు! ఈ ఒక్క విషయంలోనే నాకూ మా వదినకీ ఏకాభిప్రాయం. ఇలా మాటి మాటికీ ఇతర్ల మీద ఆధారపడాలంటే ఎంత విసుగు! పైగా, కిరాయి బగ్గీలని నడిపే వాళ్ళని చూస్తేనే నాకు భయం బాబూ! ఇంతకుముందు వీడేం పని చేసేవాడో కదా, వీడి బండిలో మనకిప్పుడేమేం జబ్బులు అంటుకుంటాయో కదా, అన్న భయం సహజమే కదా?”

“ఏమో మరి! అంత అసహ్యకరమైన ఆలోచనలు నాకైతే ఇంతవరకూ రాలేదు. నాకు సొంత బగ్గీ ఏదీ లేదు కూడా. మా వూళ్ళో గుర్రపు స్వారీ తప్ప వేరే దారి లేదు. మెల్బోర్న్ లో కూడా సాధారణ పౌరులు డబ్బిచ్చి గుర్రబ్బగ్గీ మీద వెళ్ళలేరు. ఈ లండన్ లో బగ్గీ కిరాయి ఎంత చవకా అని నేను ఆశ్చర్యపోయేను. మీరేమో సొంత వాహనాలకలవాటు పడి వీటిని చీదరించుకుంటున్నారు.”

“ఎల్సీ! మీ ఇంట్లో కూడా సొంతానికి ఒక గుర్రపు బగ్గీ వుండేదేమో కదా?”

“వుండేది కానీ, నాకెక్కువగా గుర్రపు స్వారీయే ఇష్టం. అయితే డాక్టరు ఫిలిప్స్ గారితో సాయంత్రపు పూట బగ్గీలో వెళ్ళడం కూడా బానే వుండేది. ఈ మధ్య కాలి నడక తప్ప ఇంకే సౌకర్యమూ లేకపోవడం తో నాకీ బగ్గీ లో హాయిగా వుంది.”

“డెర్బీషైర్ లో డాక్టరు గారితో కలిసి సాయంత్రాలు బయటికెళ్ళడం వల్ల మీ ఆరోగ్యం చాలా కుదుటపడినట్టుంది ఎల్సీ!” బ్రాండన్ అభిమానంగా అన్నాడు.

“అవునవును! నాన్నగారందుకే ఎల్సీ ఆరోహ్యం గురించి ఆందోళన చెందవలసిందేమీ లేదని అననే అన్నారు. మీరిద్దరు అక్క-చెల్లెళ్ళూ ఎందుకంత భయ పడ్డారో గాని! అంతే కాకుండా, నీ ఆరోగ్యానికి ఎడిన్ బరో కంటే లండన్ మంచిదేమో ఎల్సీ! ఇక్కడికొచ్చింతరవాత నువు దగ్గడమే వినలేదు నేను.”

“అవును, నా దగ్గు బాగా తగ్గిపోయింది. మనసు కూడా చాలావరకు కుదుటపడింది.”

“అది సరే కానీ, రేపటికల్లా టోపీ కుట్టేయగలగుతావా? రేపు సినిమాకెళ్ళేటప్పుడు పెట్టుకుందామనుకున్నా,” హేరియట్ అడిగింది.

“రేపటి లోగా కాదేమోనండి. మనం ఇంటికెళ్ళేసరికే ఆలస్యమవుతుంది. పైగా ఇవాళ ఫ్రాన్సిస్ని భోజనానికి రమ్మన్నాం. ఫిలిప్స్ గారు నన్నూ అందరితో కలిసి భోజనం చేయమన్నారు,” ఇబ్బంది పడుతూ చెప్పింది ఎల్సీ.

“అలాగా! ఏం చేస్తాం. ఆ టోపీ పెట్టుకుని వెళ్ళాలని చాలా ఆశపడ్డాను.”

“ఇవాళ ఫ్రాన్సిస్ తో కబుర్లు చెప్పుకుందాం రమ్మంది జేన్. భోజనానికి రానంటే ఫిలిప్స్ గారేమంటారో!” ఎల్సీ భయపడుతూ అంది.

“అయితే ఇవాళ రాత్రి భోజనాల దగ్గర అందరూ చేరతారన్నమాట. స్టాన్లీ నన్ను పిలవడం మర్చి పోయాడల్లే వుంది. అయినా సరే, నేనూ వచ్చేస్తా!” నవ్వుతూ అన్నాడు బ్రాండన్.

“నిన్ను పిలవడమేంటి బ్రాండన్? నీ ఇష్టం వచ్చినట్టు వస్తూ పోతూ వుంటావు గా మా అన్నయ్య ఇంటికి? అది సరే, ఎల్సీ, నువ్వు కొంచెం ప్రయత్నిస్తే టోపీ కుట్టడం అయిపోవచ్చు. నువ్వు ఎడిన్ బరోలో ఎంత వేగంగా బట్టలు కుట్టేదానివో నేను చూసాగా! రెండూ, రెండున్నరకల్లా ఇల్లు చేరుకుంటాం. బోలెడంత టైముంది నువ్వు కుట్టడానికి. మా వదినదీ అలాగే వేగంగా కుట్టి ఇచ్చేసావు గంట సేపట్లో!”

“వదిన గారి టోపీ పూర్తిగా కుట్టలేదండీ! ఆవిడదే రేపటి సినిమా వేళకి ఇచ్చేయాలి నేను. దాని పైన మీ టోపీ, పూర్తిగా కుట్టడానికి నాకు ఒక్క పూట చాలదేమో అని నా భయం. ”

హేరియట్ కోపంగా మూతి ముడుచుకుంది.

“సరేలే, ఎల్సీ! నాకు పెట్టుకోవడానికి ఇంకో టోపీ వుందిగా. మా వదినకైతే కొత్తది వుంది కానీ! మా అన్నయ్య చేసే గారాబంతో ఆవిడంటే ఎంత డబ్బైనా చెల్లిస్తుందీ, ఎంత ఖరీదైన అలంకరణైనా చేసుకుంటుంది. అసలంతంత డబ్బు తన కోసమే ఖర్చు చేసుకోవడానికి ఆవిడకి మనసెలా వస్తుందో! నేను చూడు ఎంత సాదా బట్ట కొనుక్కున్నానో, నా టోపీకోసం.  అయితే అది కుట్టింతర్వాత ఆవిడ టోపీ అంత అందగానూ వుండలి సుమా! వుంటుందా ఎల్సీ?”

“వీలైనంత అందంగా చేస్తానండి,” ఎల్సీ బదులిచ్చింది.

“అంత జాగ్రత్తగా డబ్బు ఎక్కువ ఖర్చు చేయకుండా బట్ట కొంటాను కాబట్టే నాకు బట్టల దుకాణంలో అంత సమయం పడుతుంది!”

బ్రాండన్ మర్యాదగా నవ్వి వూరుకున్నాడు.

“బ్రాండన్, నువ్వు కూడా వస్తున్నావు గా ఇవాళ భోజనానికి. అన్నట్టు నేనసలు ఫ్రాన్సిస్ హొగార్త్ ని ఇంతవరకూ చూడలేదు తెలుసా? అతని గురించి విని వుండడమే కాని. వాళ్ళ నాన్నా, మా నాన్నా స్నేహితులటగా? ఎలాటి వాడతను?” కుతూహలంగా అడిగింది హేరియట్.

“నాకు తెలిసినంతవరకూ సౌమ్యుడు, మర్యాదస్తుడు. జేన్, ఎల్సీలంటే ఎంతో అభిమానంగా వుంటాడు, కదూ ఎల్సీ?” బ్రాండన్ జవాబిచ్చాడు.

“ఓ! జేన్ కి ఇష్టమైనవాడైతే చాలా మంచి వాడన్నమాట. నాకు జేన్ చాలా నచ్చింది. మిగతా ఆడవాళ్ళలాగా తెలివి తక్కువగా వుండదు. అసలు మా నాన్నగారు మమ్మల్ని పెద్ద చదువులు చదివించిందే మేము మిగతా ఆడవాళ్ళలా కాకూడదని. అందుకే నాకు జేన్ అచ్చంగా నాలాటి మనిషే అనిపిస్తుంది. జేన్ చెప్పడం వల్లే నా మేనకోడళ్ళకి ఆ మాత్రం చదువు అబ్బుతుంది. అసలు నువ్వు కూడా టీచరుద్యోగం చేయి ఎల్సీ! మీ మావయ్య నీకందుకే చదువు చెప్పించి వుంటాడు.”

“మీ నాన్న కూడా నువ్వు టీచరుద్యోగం చేయాలని  నీకు చదువు చెప్పించారా హేరియట్?” బ్రాండన్ కఠినంగా అన్నాడు.

“లేదు, లేదు. మా సంగతి వేరు. మాకుద్యోగాల్తో ఏం పని? అయినా, జేన్ లా చదువులు చెప్పాలంటే మాకొచ్చే చదువులు చాల్తాయా ఏమన్నానా? పాపం, ఎల్సీకే, చదువుకున్న చదువంతా వృథా అవుతోంది.”

“నేర్చుకున్న ఏ చదువూ వృథా అవదు హేరియట్. తన విద్య వల్ల ఎంతమందికి ఎన్నివిధాల లాభమో ఎల్సీ ఎప్పుడూ నోరు విప్పి చెప్పదు. కానీ, పెగ్గీ వాకర్ ని అడుగు ఎల్సీ గురించి. అప్పుడు తెలుస్తుంది నీకు, ఇంకొకరి విద్యల విలువలు.”

“అబ్బ! నీకూ, మా అన్నయ్యకీ ఆ పెగ్గీ వాకర్ అంటే అంత ఇష్టం దేనికో అర్థం కాదు. స్టాన్లీకి కూడా పెగ్గీ మాటంటే తిరుగు లేదు!” వెటకారంగా అంది హేరియట్.

“అవును! స్టాన్లీ, నేనూ ఇద్దరమూ పెగ్గీ కెంతో ఋణపడి వున్నాం!”

“నువ్వు కూడానా బ్రాండన్? ఎందుకబ్బా? ఓ, తెలిసింది. మా వదినా పిల్లలని కాపాడి, చూసుకున్నట్టే, నువ్వూ జబ్బు పడితే సేవలు చేసిందటకదా పెగ్గీ?”

బ్రాండన్ ఒక్క క్షణం మౌనంగా వున్నాడు.

“లేదు హేరియట్. నా ప్రాణాలు నిలబెట్టినందుకు కాదు. పెగ్గీని చూసింతరవాతే నేను ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాను. అంత కార్య దక్షతా, ధైర్యమూ, త్యాగనిరతీ, నిజాయితీ, నేనైతే ఇంకెక్కడా చూడలేదు. ”

“మీ అమ్మా, చెల్లెళ్ళ కంటే గొప్పదనుకుంటున్నావా పెగ్గీ?”

“హేరియట్! ప్రతి దానికీ అమ్మా, చెల్లెళ్ళతో పోలిక యెందుకు? వాళ్ళ స్థానం వాళ్ళదే. పెగ్గీ పట్ల నాకుండే గౌరవాభిమానాలకీ, వాళ్ళపట్ల నాకుండే ఆప్యాయతకీ అసలు సంబంధమే లేదు.”

హేరియట్ హేళనగా నవ్వేసి వూరుకుంది.

బ్రాండన్ వ్యక్తిత్వం గురించి హేరియట్ కి అర్థమైందో లేదో కానీ, ఎల్సీకి మాత్రం పూర్తిగా అర్థమయింది. మొదటిసారి తను బ్రాండన్ ని కాదని తప్పు చేసిందేమోనన్న అనుమానం ఆమె మనసులో కదలాడింది. ఆనాటి సంభాషణ గుర్తు రాగానే వున్నట్టుండి ఆమె చెంపలు ఎర్రబడ్డాయి.

వున్నట్టుండి ఆమె మొహం చూసిన బ్రాండన్, ఆ సాయంత్రం ఆమెతో కలిసి కూర్చొని భోజనం చేయబోతున్నాడన్న విషయం తలచుకుని సంతోషపడ్డాడు. ఆ సంగతి తెలిస్తే హేరియట్ ఏమనుకుంటుందో!

(సశేషం)

ఒక రోజా కోసం…

 oka roja kosam -2 (2)

సాధారణంగా తల్లిదండ్రులు – అందులో అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేవాళ్ళు – తమ పిల్లలు ఇంకా ఉన్నత వర్గానికి ఎదగాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని, తమ కంటే విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు.  కాని సెర్దర్ ఓజ్కాన్ ‘ఒక రోజా కోసం’ నవల లోని తల్లి తన కూతురు  అంతరాంతరాల్లో ఉండే ‘నేను’  ని కనుగొనాలని కోరుకుంటుంది.

ఈమె చాలా చిన్న వయసులోనే భర్తను పోగుట్టుకుంటుంది.   ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎరుకతో బ్రతికే ఈమె ఇతరుల కళ్ళల్లో ఆరాధనని చూడటం కోసం తన కలని కూడా విస్మరిస్తున్న కూతురు డయానాని చూసి బాధపడుతుంది.  ఇతరుల కోసం కాక తనకై తాను స్వేచ్ఛగా   బ్రతకడానికి అడ్డుపడుతున్న అహాన్ని డయానా తొలగించుకోవాలని, తాను ప్రవేశించిన ఆనందపు తోటలోని గులాబీలతో మాట్లాడుతూ తన కూతురూ తిరుగాడాలని, కూతురు తన లోలోపలి పరిమళాన్ని ఇతరుల కోసం కోల్పోకూడదని కోరుకుంటుంది.

డయానాకి రచయిత్రి అవాలనే కల బలంగా ఉంది కాని మంచి రచయిత్రి కాకపోతే సమాజం నుండి నిరసన ఎదురవుతుందేమోనన్న భయంతో,  ,తను సమాజంలో గొప్పగానే ఉండాలన్న అహంతో తన కలను చంపుకుని లాయరు అవాలనుకుంటుంది.   చుట్టూ తిరిగే  స్నేహితుల మెప్పుదల కోసం బ్రతుకుతున్న కూతురు డయానాని  వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది తల్లి.  అయితే తన బిడ్డకి నెమ్మదిగా తెలియచెప్పడానికి ఆమెకి భగవంతుడు సమయం ఇవ్వలేదు.  మరో ఐదు నెలల్లో ఆమె చనిపోతుందని డాక్టర్లు  చెప్పడంతో తను చనిపోయిన తర్వాతైనా సరే డయానాలో మార్పు రావాలని పటిష్టమైన పథకం తయారు చేసుకుంటుంది ఆ తల్లి.  తన బిడ్డను విచార మార్గంలో పయనింప చేయడానికి చనిపోయిన భర్త బ్రతికి ఉన్నాడని అంటుంది.  లేని మరో కూతురిని (మేరీ) సృష్టిస్తుంది.  మేరీ రాసినట్లు ఉత్తరాలు రాసింది.  తన స్నేహితురాలైన జైనప్ హనీమ్ అనే తాత్త్వికురాలిని తన బిడ్డని దివ్యత్వానికి దగ్గరగా వచ్చేట్లు చేయమని కోరింది.  ఆఖరికి బిచ్చగాడి సహాయాన్ని కూడా అర్థిస్తుంది.

చనిపోయేముందు రోజు తనకి మరో కూతురు ఉందని, తన భర్త తన నుంచి విడిపోతూ ఆ కూతురిని తీసుకువెళ్లాడని, ఇప్పుడు మేరీ  ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయిందని డయానాకి చెప్తుంది.  మేరీ రాసినట్లుగా తనే రాసిన ఉత్తరాలను డయానాకిచ్చి ఆ ఉత్తరాల ఆధారంతో మేరీని అన్వేషించమని ఆఖరి కోరికగా కోరుతుంది. ఆ అన్వేషణా మార్గంలో తన స్నేహితురాలు, తాత్త్వికురాలు అయిన జైనప్ హనీమ్ ని కలుసుకునేట్లు చేస్తుంది.

తన కవలసోదరిని వెతుకుతానని తల్లికిచ్చిన మాట కోసం ఇల్లు వదిలి జైనప్ హనీమ్ ని కలుసుకుంటుంది డయానా.  అక్కడ – జైనప్ హనీమ్ దగ్గర ‘తన గులాబీకి బాధ్యత వహించడం అంటే ఏమిటో తెలుసుకుంటుంది.  గులాబీలతో మాట్లాడటం, వాటి మాటలను వినడం నేర్చుకుంటుంది.  దేవుడు మన జీవితంలోని అన్ని విషయాల్లోనూ భాగస్వామి అవుతాడని తెలుసుకుంటుంది.   ప్రగతిని సాధిస్తుంది.  చివరికి నీ వరకు మిగిలిన అన్ని తోటలకంటే నీ తోట వేరేదే అయితే మిగిలిన అన్ని గులాబీలకంటే నీ గులాబి వేరేదే అయితే ఆ తేడా నీకు ఆధిక్య భావనని కాక నిన్ను భూమి మీద నిలిపి ప్రపంచమంతటినీ హత్తుకునేలా చేస్తే నీకు దివ్యత్వం లభించినట్లే బిడ్డా! ఇక నువ్వు నన్ను కోల్పోవునీ జ్ఞాపకాల వెనక ప్రతి ఒక్క దాని ద్వారా నేను నీతో మాట్లాడతానుఅని అమ్మ రాసిపెట్టిన ఉత్తరం డయానాకి దొరుకుతుంది.

అప్పుడు – ఆ క్షణంలో డయానా అంతరంతరాల్లో ఉన్న ‘నేను’ ని కనుగొంటుంది.  ముఖంలో అద్వితీయమైన మెరుపుని పొందుతుంది.

oka roja kosam -2 (1)

క్లుప్తంగా ఇదీ కథ

సెర్దర్ ఓజ్కాన్ కి జీవనయానానికి సంబంధించిన లోతైన అర్థాలు వెలికి తీసే రచనలు చేయడం ఇష్టమట.  ‘The Missing Rose’ – ‘ఒక రోజా కోసం’ ఇతని తొలి నవల.  ఈ పుస్తకం ఇప్పటికి 27 భాషల్లోకి అనువదింపబడి ఎంతో ఆదరణ పొందింది.  దీన్ని తెలుగులోకి మంచిపుస్తకం.నెట్ (సురేష్ ) వాళ్లు అనువదించి ప్రచురించారు.

  • ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి మాత్రమే విచారమార్గంలో పయనించేవారికి గర్వం తప్ప ఏమీ మిగలదు.
  • మేథోశక్తితో ఊహించడం ద్వారా అసలైనదేదో తెలుసుకోలేము.
  • హృదయం ద్వారా ప్రకృతిని వినగలిగే శక్తి పుట్టుకతో అందరికీ ఉంది కానీ ఎందుకో కాలం గడిచేకొద్దీ గుండెలు చెవిటివవుతున్నాయి.
  • శిఖరాన్ని చేరుకోవాలని ఉన్నా చేరుకోలేమోనన్న భయంతో ప్రయత్నాన్ని విరమించుకుంటాం.  పట్టు వదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళితే శిఖరాన్ని చేరుకోగలము.  మనకి శిఖరాన్ని చేరుకోవాలనే ఇచ్ఛ కలిగితే అన్ని వైపులనుండీ సహాయం అందుతుంది.
  • నువ్వు అలవి కావు ఒడ్డుని ఢీ కొని మాయమైపోతానని భయపడటానికి.  నీవు సముద్రానివి.
  • గులాబీగా ఉండటం అంటే ఇతరులు పొగిడినపుడు బ్రతికి వాళ్లు తిరస్కరిస్తే అంతరించిపోవడం కాదు.
  • ఇప్పుడు నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నవారే ఏదో ఒక రోజు నిన్ను త్యజిస్తారు. ఎందుకంటే వాళ్లు ఆరాధిస్తున్నది నిజంగా నిన్ను కాదు.  వాళ్ల కోరికల్ని.  వాళ్ల పొగడ్తలలో నీ ఉనికి ఉన్నప్పుడు వాళ్లు నిన్ను త్యజించగానే నువ్వు లేకుండాపోతావు.
  • నువ్వు మోజుపడే ఆత్మ తియ్యటి మృత్యువుని చవి చూసిన తర్వాత నీకు పునర్జన్మ లభిస్తుంది  –    ఇలాంటి వాక్యాలు ఎన్నో పుస్తకం నిండా.  జీవితం పట్ల ఎంతో పరిణితి ఉంటేనే రాయగలిగిన వాక్యాలు.

మనకి నిజంగా ఇష్టమైన పని ఒకటైతే డబ్బు సంపాదన కోసమో, అధికారం కోసమో, ఎంచుకున్న రంగంలో పరిణితి సాధించలేకపోతే ఎదుర్కొనబోయే పరిస్థితులని ఊహించుకొనో ఇష్టమైన రంగాన్ని వదిలేసి సమాజ ఆమోదయోగ్యమైన రంగాన్ని ఎంచుకుంటాం.  మనల్ని అర్థం చేసుకోలేని ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడతాం.  దాని వలననే మనకి లోలోపల సంఘర్షణ, అసంతృప్తి.  తద్వారా జీవితం పొడవునా అశాంతి.

తమ బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలనే కాంక్షతో పిల్లల మనస్సుకి నచ్చినదేమిటో తెలుసుకోలేకపోతున్న తల్లిదండ్రులు, ఇతరుల ఆరాధనతో బ్రతుకుతూ, ఇతరుల కళ్లల్లో తమని చూసుకుంటూ మరుగుజ్జులుగా మారుతున్న యువతీయువకులు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.

అప్పుడు కనీసం కొన్నైనా నాట్యం చేయవలసిన చేతులు గరిటను తిప్పుకుంటూ (ఇక్కడ నా ఉద్దేశం ‘వంట చేయడం మంచిది కాదు’  అని కాదు) , సంగీత కచ్చేరీలు ఇవ్వవలసిన నోళ్లు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉండవు.

మన కలని అనుసరించకపోవడానికి అడ్డుపడే అహాన్ని చంపుకుని చేరుకోవలసిన శిఖరాన్ని ఎలా చేరుకోవాలో,  శాంతిని పొందుతూ ప్రపంచాన్ని ప్రేమతో ఎలా హత్తుకోవాలో ఈ నవల ద్వారా విశదపరిచిన సెర్దర్ ఓజ్కాన్ చిరస్మరణీయుడు.

–    రాధ మండువ

 

 

 

 

 

 

 

 

పాదాలకు తగిలిన ప్రశ్నలు..!

 

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

ఆ రోజు మా చోడవరం ఊళ్లో పూసిన పువ్వులన్నీ ఆలయాల్లోకో, ఆడవాళ్ల కొప్పుల్లోకో చేరిపోలేదు. భక్తప్రజాళి చెవుల ఇరకల్లోకి దూరిపోలేదు. అన్నీ కలిసికట్టుగా మా జాన్‌ మేస్టారి మెళ్లోకి జేరీసేయి. దండలుగా మారిపోయి ఆయన గుండెలమీద కులాసాగా కూచున్నాయి. దిలాసాగా ఊగీసేయి. మా మేస్టారు మాత్రం ఆ పూలమాలల మధ్యన భలే సిగ్గుసిగ్గుగా అయిపోయేరు. అందరూ జేజేలు కొడుతుంటేను.. భుజాలకెత్తుకుని ఊరేగిస్తుంటేను.. ఇంత ధైర్యవంతుడూ అదొకలాగ మొహమాటంగా మొగం పెట్టీసేరు.

మరి, ఆ రోజు మాములు రోజేంటి. మా ఊరికి, మా మేస్టారికీ కూడాను చాలా స్పెషలే. మాకే కాదు. మా ఇరుపంచాల గ్రామాల జనాలకీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. మేస్టారు నెంబర్‌వన్‌ మగాళ్లా మా మారకమ్మ రేవులో ఎలుగుబంటిని  తుపాకీతో పేల్చిచంపీసిన రోజు. చచ్చిన భల్లూకాన్ని వీపుమీద మోసుకుంటూ ఊరివైపు మొనగాళ్లా నడిచొచ్చీసిన రోజు.

అప్పటికి పదిహేను రోజులవుతుంది. సిలవరి బిందిలట్టుకుని మా ఊళ్లో ఆడంగులెవరూ మారకమ్మరేవు గట్టుకి నీళ్లకెళ్లడమే లేదు. ఏటి స్నానాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలనుకునే పతివ్రతలూ అటేపు కన్నెత్తి చూడ్డం లేదు. ఏటి వార మావిడితోటల్లోనూ, తాటిపెండెల్లోనూ, మొక్కామోడుల్లోనూ జనసంచారం అస్సల్లేదు. అంతెందుకు. పేద్ధ చెంబట్టుకుని సిగ్గులజ్జాల్లేకుండా గొప్ప రాజసంగా ఏటి కొసాకి డైలీ దొడ్డికి పోయే మా కరణం సరిపిల్లి సత్తిబాబుగారు సైతం ఆ వైపు తొంగి చూసిందే లేదు. దీనంతటికీ కారణం ఒకానొక ఎలుగుబంటి అంటే నమ్ముతారా. నమ్మితీరవలసిందేను.

మా ఊరెలాటిదంటే, మా విశాఖపట్నం జిల్లా అడవులకి ద్వారబంధం లాటిది. మమ్మల్ని దాటీసే ఎవురైనా ఏజెన్సీకెళ్లాలి. ఊరికి ఆనుకుని ఉండే మారకమ్మ రేవు దగ్గర పొలాల్లోకి, ఏటి సైడు డొంకల్లోకి తరచుగా అరణ్యంలోంచి నానాజాతి నక్కలు, దొంగవరళ్లు, దెష్ట ఎలుగుబంట్లు జొరబడిపోయీవి. వచ్చినవి వచ్చినట్టు దొరికిందేదో తినీసి పాడేరు కొండలమీదికో, గంగరాజు మాడుగుల గిరుల్లోకో పోతుండీవి. ఈసారే ఆలా జరగలేదు. అదే వచ్చిన చిక్కు.

ఈ దఫా మా రేవుకొచ్చీసిన ఓ ఎలుగుబంటి ముండ సామాన్యమైన ముండ కానట్టుంది. కాయ కసరు తింటూ రేవు పొదల్లోనే రోజుల తరబడి తిష్టేస్సింది. వేసింది వేసినట్టుగా ఉండిపోయిందా. అదీ లేదు. పక్కనున్న చాకిరేవులో గుడ్డలారేసుకుంటున్న మడియాలు గంగరాజుమీదికి దూకీసింది. ఆడికి దూదేకీసింది. దుంపతెంచీసి ధూపంవేసీసింది. దొరికినవాణ్ణి దొరికినట్టుగా చీరిపారీసింది.

శనిలా పట్టీసిన ఎలుగును తప్పించుకునేందుకు గంగడు చేయనిపనంటూ లేదు. రక్తాలు కారుకుంటూనే పరిగెట్టేడు. ఏం ఉపయోగం. అదొట్టి బాజోటుమృగం. వీడేమో మంచిమనిషి. ఎలా సాలగల్డు. పరిగెట్టలేపోయేడు. ఆఖరికి ఆ ఎలుగుబంటినుంచి వాణ్ణి విడిపించడానికి మా రజకులంతా నానా సంకలు నాకీసేరు. రాయీ రప్పా, కర్రా కంపా తీసుకుని నాలుగిసర్లు ఇసిరితేనే గానీ అది ఒగ్గింది కాదు.

Kadha-Saranga-2-300x268
ఎలుగు దాడిలో చావసిద్ధమైన గంగరాజును తీసుకొచ్చి ఊరిమయాన ధర్మాసుపత్రిలో పడీసేరు. విషయమంతా తెలిసిపోవడంతో ఊరు ఊరంతా ఒంటేలు పోస్సింది. పరుగుల మీద గవర్నమెంటు ఆస్పట్లకొచ్చీసింది. చర్మం లెగిసిపోయి, ఒళ్లంతా తొక్కలూడిపోయి, మాంసం ముద్దలా అయిపోయిన గంగణ్ణి తనివితీరా తిలకించీసి ముక్కు చీదీసింది. ప్చ్‌…ప్చ్‌…ప్చ్‌లు కొట్టీసింది.

మా ఊరనే ఏంటి. ఇరుగుపొరుగునున్న గోవాడ, ఆంభేరుపురము, రాయపరాజుపేట, ఎంకన్నపాలెం ఇలా అన్ని గ్రామాలూ మా గ్రామం మీదికే వచ్చిపడిపోయేయి. ఎలుగుబంటిని అమ్మలకీ పెళ్లాలకీ తిట్టిపోస్సేయి.

ఈ తిట్లు ఇంకా ఆగేలేదు. మరో దయిద్రవయిన కబురొచ్చీసింది. గంగణ్ణి కొట్టీసిన ఎలుగుబంటి ఇంతలోనే మరో ఉన్మాదానికి దిగీసింది. రేవు మావిడి తోట్లో గంజి తాగుతున్న కాపలాదారు అన్నాబత్తుల కోటేసు సంగతీ తేల్చీసింది. లొట్టలేసుకుంటూ కుండమూకుట్లో గంజి జుర్రుకుతింటున్న కోటేసుగాడిని ఎనాకతల్నించి ఎలుగ్గొడ్డమ్మ ఎక్కీసి తొక్కీసింది. తెల్లపళ్లు, నల్ల బొచ్చు ఉన్నదేదో ఉన్నట్టుండి పీకిమీదకొచ్చీడంతో కోటిగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. తొలీతా అదేదో దెయ్యం అనుకున్నాట్ట. వదిలించుకుందామంటే కుదర్లేదట. ఎలుగుబంటి చమడాలు రేగ్గొడుతుంటే రేవురేవంతా ధ్వనించేలా కేకేలేశాట్ట. దాపల్నున్న చెరుకు రైతులు బరిశెలు, బాడిదల్తో తెగబడి తరిమితే తప్ప ఎలుగు పారిపోలేదట. అలా ఆడికి చావు తప్పి కన్నులొట్టపోయింది. ఆస్పట్లో గంగరాజు పక్క మంచం మీద కెక్కీసేడు. ఇకనంతే. ఆ రోజు నుంచీ మా మారకమ్మరేవు వైపు వెళ్లాలంటే జనానికి వణుకు మొదలైపోయింది.

ఇదే సందు అదే మందు అనుకుందేమో ఎలుగ్గొడ్డూ బాగానే చెలరేగీసింది. పిచ్చెక్కిన పీరండంలా అయిపోయింది. చెరుకుతోటల్లోకి దిగిపోయి మేసినంత మేయడం, ధ్వంసం చేసినంత చేసీడం మొదలెట్టింది.

వాస్తవం మాటాడుకోవాల్సివస్తే, ఏటికీ మా ఊరికీ ఉన్న బంధం మామూల్ది కాదు. తల్లీబిడ్డల పేగు బంధం లాటిది. ఆ బంధాన్ని ఈ ఎలుగుమహాతల్లి పుటుక్కున తెంపీసినట్టయింది. ఇలా రోజులు గడిచీసరికి ఊరిజనానికి కంటిమీద కునుకులేకపోయింది.

సంగతి తెలిసి ఫారెస్టు ఆఫీసోళ్లంతా కంగరెత్తిపోయేరు. చోడవరానికి క్యాంపు కట్టేరు. పోలీసోళ్లూ వారికి సాయం చేస్తామన్నారు. విలేజి ప్రెసిడెంటు కురుముద్దాలి పాపారావు ఆళ్ల కాళ్లు పట్టుకున్నాడు. మునసబు కోట్ని మహాలక్ష్మినాయుడు, కరణం సత్తిబాబు ఆ పని చేయలేదు గానీ అంతకు తగ్గ చాలా పనులు వారికి చేస్సేరు.

ఒకేపున పోలీసు బాబులు, ఫారెస్ట్‌ గార్డులు, మరో దిక్కున మా ఊళ్లో ముదురుటెంకలని అందరూ చెప్పకునే ఆకుల వీరేశు, దేవరాపల్లి రంగడు, కిస్తా గోవిందు ఇలాగందరూ కలిసికట్టుగా ఎలుగుబంటిని చంపీడానికి రేవుకు బయలెల్లేరు. కొందరు కత్తులు, మరికొందరేమో కర్రలు, ఇంకొందరేమో కొడవళ్లు పట్టేరు. ఫారెస్టోళ్లు మాత్రం సరిగ్గా పేల్తాయో లేదో తెలీని రెండో మూడో తుపాకుల్తో వేట మొదలెట్టేరు.

రేవు దగ్గిరివరకూ మహా సూరుమానంగానే వెళ్లిన ఈ మారాజులంతా ఎలుగ్గొడ్డును వెతికీటప్పుడు మాత్రం దడదడలాడిపోయేరు. ఏ బొక్కలోంచి అది పారొచ్చీసీ బొక్కబద్దలు గొడతాదోనని నంగినంగిగానే వెతుకులాడేరు. వీళ్లంతా రేవు ఎక్కనున్న గుబురు పొదల్ని జట్లు జట్లుగా గాలిస్తుండగానే కాస్త దూరంగా వెళ్లి ఎలుగుకోసం తంటాలు పడుతున్న వీరేశుగాడి కేకొకటి గట్టిగా వినిపించీసింది.

”చచ్చాన్రోయ్‌”.. అని వాడు కెవ్వుమనడంతో మిగతా వాళ్లంతా బిక్కసచ్చిపోయేరు. పెద్ద పోటుగాళ్లా చెరుకు పొలాల్లో కాలు మోపిన వీరేశుడు గారిని మడిలోకి దిగీ దిగ్గానే ఎలుగుబంటి ఠక్కున పట్టీసింది. సుబ్బరంగా రక్కీసింది. ఎక్కడబడితే అక్కడే కొరికీసింది. ఆడి నోట్లో కాలుతున్న గుర్రం బీడీ ఉన్నాది కాబట్టి బతికేడు. అగ్గి దాన్ని భయపెట్టింది గనక బతికేడు. లేదంటే పనయిపోను. దెబ్బల్తో పొలాల్లోంచి బయటకొచ్చి వాడు చెబితేనే ఇదంతా అందరికీ తెలిసింది.

ఇక ఈ ఎలుగ్గొడ్డు యవ్వారం మనశక్తికి మించిందని తీర్మానించి వేటజట్టంతా ఊళ్లోకొచ్చీసింది. పంచాయితీ బోర్డు బల్లల మీద కూర్చుని బుర్రలు బద్దలు గొట్టుకుంది. ఊరి పెద్దలూ వీరితో కలిసి వీలయినంతసేపు బుర్రలు పాడు చేసుకున్నారు. చివరాఖరికి ఈ జంతుగోల తప్పించే నికార్సయిన మనిషెవరన్నప్పుడు మా జాన్‌ మేస్టారి పేరు ప్రస్తావన కొచ్చీసింది.

మా జాన్‌ మేస్టారంటే మామూలు మేస్టారు కాదు. ధర్మప్రభువు. మా బోర్డు హైస్కూల్లో పంతులు. మా పిల్లలందర్నీ కంటికి రెప్పలాగ కాపాడీవారు. ఆయనకి పెళ్లాం పిల్లల్లేరు. అలా అని బాధ్యతలేవీ లేవని అనుకోడానికి లేదు. మేమంతా ఆయనకు బాధ్యతలమే. మాకు చిన్న జ్వరం వచ్చినా అల్లాడిపోయీవారు. మా పుస్తకాలు చిరిగిపోతే కొత్తవి కొనిచ్చీవారు. ఆయన తినీది తక్కువ. మాకు మేపీది ఎక్కువ. పక్కోడికోసం పీకతెగ్గోసుకునీరకం.

మేస్టారి ధైర్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. గొప్ప హీరో. ఆయనకు భయం అన్నదే తెలీదు. తాగీసి మా ఊళ్లో ఎవరు తన్నులాడుకున్నా జాన్‌బాబు వచ్చేరంట సైలెంటయిపోయీవారు. ఒకేళ చుక్కేసుకున్నోడు ఎక్కువ మాటాడనే అనుకుందాం. తొలి పాలి మెల్లిగా చెప్పీవారు. రెండో పాలి మాత్రం రెండు తగల్నిచ్చి ఇంటికి తొవిలీసీవారు. తగూ అంటే ఆపడానికి ముందునుండీ ధర్మప్రభువని పేరు తెచ్చుకున్నారు. మనిషి ఆజానుబాహువు. చేతులు చేపాటి కర్రల్లాగుండీవి. కాళ్లు స్థంభాల్లాగ, పాదాలు ఏనుగు పాదాల్లాగా ఉండీవి. ఆయన చేతులు పడితే ఎవడికేనా పులుసులోకి ఎముకలుండవు అన్నట్టుండీవారు.

ఊరందరితోనూ కలిసిపోయి నెత్తురుకి నెత్తురుగాను, ప్రాణానికి ప్రాణంగానూ జాన్‌మేస్టారు బతికీవారు. అన్నట్టు. ఆయన దగ్గరో తుపాకీ ఉండీది. దానికి లైసెన్సూ ఉండీది. చిన్నప్పుడెప్పుడో కుమిలిగాటీల మీద, రైవాడ కొండలమీద మేస్టారు అడవిపందుల వేట చేసీవారని పెద్దలు చెప్పగా విన్నాం.

ఇలాంటి మేస్టారికి, ఆయన తుపాకీకి ఇన్నాళ్లకి మళ్లీ పని పడింది. ఎలుగుబంటి దౌర్జన్యానికి హడలెత్తిపోయిన ఊరి మోతుబరులందరూ ఓనాడు తూరుపు తెల్లారకుండానే ఆయనింటికెళ్లిపోయేరు. లబోదిబోమంటూ జరిగిందంతా ఆయన చెవుల్లో వేస్సేరు. ఎలుగ్గొడ్డు దెబ్బకి చెరుకుతోటలు నాశనమైపోతున్నాయని మొర పెట్టుకున్నారు. ఫారస్టోళ్లంతా చేతులెత్తీసేరనీ చెప్పుకున్నారు. గంగడు, కోటి, వీరేశులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనీ విన్నవించేరు. తుపాకీ తీసి ఎలుగుని చంపితేనే గానీ సుఖం లేదని కోరీ, ప్రార్థించీ, మనవి చేసుకున్నారు. అయినాగానీ, మేస్టారి గుండె ముందయితే కరగలేదు.

”పశు ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపయినా అడవుల్లోకి పోతుంది లెండి”. అనీసేరు తడుముకోకుండా.

”అమ్మమ్మా అలగనీకండి. రోజులెల్లిపోతన్నాయి. ఊల్లో వొవులికీ కంటిమీద కునుకులేదు. నా మొగుణ్ణి నాసనం చేసీనాది. నా బతుకు పాడయిపోనాది..”

ఎల్లుగ్గొడ్డు  దెబ్బకి చావసిద్ధమైపోయిన గంగడి భార్య రత్తమ్మ గగ్గోలు పెట్టింది.

వీరేశు పెళ్లాం లచ్చిమి కూడా రత్తమ్మకి వంత పాడింది. ”నా పెనిమిట్నీ అన్నేయంగా సీరీసింది దేవుడోయ్‌. దేవుడే మమ్మల్ని రచ్చించాల్రోయ్‌” అనీసి నెత్తి కొట్టీసుకుంది. ఎప్పుడైతే ఈ ఆడకూతుళ్లు పడీపడీ దు:ఖిస్తున్నారో అప్పుడిక మా మేస్టారి గుండె లుక్కుమనిపోయింది. ఇంకెంతమందిని ఎలుగ్గొడ్డు యాతన పెడుతుందోననే బెంగ ఆయనలో ఆరంభమైపోయింది.

” ఏం భయం లేదు. నేనీరోజు మారకమ్మ రేవుకి బయలెల్తాను. నాతో మాత్రం ఎవరూ రావద్దు. ఇల్లూ పొల్లూలేని ఒంటిగాణ్ణి. నేను దాని చేతిలో పోయినా పర్లేదు. అదో నేనో తేల్చుకొస్తాను.” మేస్టారు గంభీరంగా భరోసా ఇస్తూ పలికేరు. ఆ మాటలకు జనం తెగమగా సంబరపడిపోయేరు.

ఆ వెంటనే ఇంట్లోకెళ్లిన మేస్టారు పడగ్గదిలోని కర్రబీరువా తెరిచేరు. అందులో ఎప్పట్నుంచో దాచిపెట్టిన ఖాకీ చొక్కా, ఖాకీ ఫేంటు తీసి తొడుక్కున్నారు. తుపాకీ తుడుచుకున్నారు. టార్చిలైట్లో ఏసే బేటరీల్లాంటి మందుగుళ్లను తీసి బందూకు గొట్టంలో వాటంగా దోపీసేరు. మారకమ్మరేవు వైపు ప్రయాణమయ్యేరు. ఆయనతో పాటుగా చాలా మందిరి రేవు పొలిమేరల దాకా వెళ్లేరు. మేస్టారిని లోనికి సాగనంపి వెనక్కి వచ్చీసేరు.

అప్పటికి ఉదయం తొమ్మిదే అయింది. ఊళ్లోని పిల్లా మేకా అందరూ రామకోవెల్లో చేరిపోయి మేస్టారి కోసం భజన్లు చేస్తున్నారు. ఆయన క్షేమంగా వస్తే ఆకు పూజ చేయిస్తానని రైతు కూలీ రాములమ్మ ఆంజనేయస్వామికి మొక్కులెట్టుకుంది. మేస్టారు ఎలుగుబంటి పాలపడకూడదంటూ ఎవరెవరో వేనవేల దేవుళ్లకి దండాలెట్టుకున్నారు. అసలాయన్నెందుకు దాని కాడికి పంపేరని బోడి రాముడు, గెడ్డం సన్నాసిలాంటి మానమర్యాదలు గల అమాయకులు కొందరు ఊరి ప్రముఖుల మీద తిరగబడ్డారు. ఆళ్లని సముదాయించీసరికి పెద్దోళ్లకి పెద్ద పనయిపోయింది.

ఈ లోగానే మధ్యాహ్నం అయిపోయింది. ఎలుగుబంటితోనూ, మేస్టారితోనూ, ఆ మాటకొస్తే అసలు చోడవరంతోనూ నాకేటీ లింకు లేదన్నట్టుగా పడమట కొండల్లో కుంగీడానికి సూరీడు రెడీరెడీచ్‌ అంటున్నాడు. ఇంతలో మునసబుగారు ఆగలేక మాటాడీసేరు.

”ఏట్రా… ఇంతమందిమి ఉండి ఒక్కణ్ణి రేవులోకి పంపీనాం. ఆ తోటల్లో, ఆ తోపుల్లో ఆ సెట్ల మయాన మేస్టారు బాబు అన్నాయంగా ఏం బాదలు పడతన్నాడో. ఒకేపు యేల మించిపోతంది. ఇప్పటికీ మనం ఒల్లక్కూకుంతే మనం మొగోళ్లవే కాదెహే..’ నిష్ఠూరంగా మాట్లాడ్డం మొదలెట్టేడు. మునసబు మాటల్ని అక్కడున్న అందరూ నిజమేస్మీ.. నిజమేస్మీ.. అన్నట్టుగా తలపంకించేరు. పదండి.. పదండంటూ కేకలేసుకున్నారు. అంతా కలిసి రేవు వైపు నడక తీసేరు.

రేవు దాకా చేరేక అక్కడ గోర్జీదారుల్లో బితుకుబితుకు మంటూ అడుగులేస్తున్నారు. తాటాకు కదిల్తే చాలు. దడదడలాడిపోతున్నారు…ఉడతలు పరుగులెడుతున్నా ఎలుగ్గొడ్డే వచ్చి మీద పడిపోయినంతగా హడలి ఛస్తున్నారు. చేతులు చేతులు కలుపుకుని మెల్లిగా ఆడపెళ్లివారిలా జిడ్డోడుకుంటూ నడుస్తున్నారు.

కరక్టుగా వీరంతా అరమైలు నడిచేరో లేదో భీకరాకారంగా, రొప్పుతూ మహావీరుళ్లా ఎదురొస్తున్న జాన్‌మేస్టారు కంటబడ్డారు. ఆయన చొక్కా, ఫేంటు చెమటధారలతో ముద్దకట్టీసేయి. ఒక భుజం మీద తుపాకీ. మరో భుజం మీద నల్లటి మూటలాంటిదేదో మరోటీ ఉంది. ఊరివారిని చూడగానే ఆయన ” ఓహో.. రండర్రోహో..” అని ఆనందంతో కూడిన గావుకేకలాంటిదేదో వేసేరు.

మామూలుగానే మేస్టార్ని చూస్తే ఎప్పుడూ ఆనందపడే జనం ఆవేళ ఆయనంటే మరీ పిచ్చెక్కిపోయేరు. మారాజు క్షేమంగా వచ్చీసేడంతే చాలనుకుని ఆయన కాడికి మూగీసేరు. జనమంతా దగ్గరకి రాగానే జాన్‌మేస్టారు మరీ సంతోషపడిపోయేరు. భుజానున్న నల్లమూటని భళ్లున నేలకేసికొట్టీసేరు. కిందపడ్డ మూటని చూసి జనానికి మూర్ఛపోయినంత పనయిపోయింది. అది మూట కాదు. ఒకటోరకం ఎలుగ్గొడ్డు. చచ్చిన ఎలుగ్గొడ్డు. మేస్టారి చేతుల్లో, ఆయన తుపాకీ గుళ్లకి చచ్చిన ఎలుగ్గొడ్డు. జనం కేరింతలకి హద్దు లేదు. తుళ్లింతలకి హద్దూ పద్దూ లేదు. ఒకటే ఈలలు. ఒకటే గోల. మేస్టార్ని భుజానికెత్తుకుని ప్రజానీకమంతా డేన్సులు కట్టేరు. చచ్చిన ఎలుగ్గొడ్డును ఆనందంతోనూ, ఆశ్చర్యంతోనూ తేరిపార చూస్సేరు.

”బాబూ.. ఊరికి పట్టిన దయిద్రాన్ని వదలగొట్టీసేవు. ఎలుగును సంపీసి మమ్మల్ని, మా పొలాల్నీ రక్షించీసేవు. నువ్వయ్యానాయినా మొగోడివి. మా కోసమే జనమ ఎత్తినావు నాయనా. నాయినా..” బాగా పొగిడీసేరు.

”అసలింతకీ ఈ ముదనష్టపు గొడ్డు ఎలా సచ్చింది బాబూ..” ఉండబట్టలేక వివరాలడిగీసేరు.

ముందూ వెనుకా జనాలు నడుస్తుండగా..ఇద్దరు మనుషులు కావిడి కట్టి ఎలుగ్గొడ్డు కళేబరాన్ని కొయ్యమీద మోస్తుండగా.. పెద్ద గొంతెట్టుకుని మేస్టారు మొదలెట్టారు. ఉదయంనుంచీ తనని ఎన్ని తిరకాసులకి ఎలుగుబంటి గురి చేసిందో పూసగుచ్చేరు.

ఆఖరికి వెంటబెట్టగా వెంటబెట్టగా రేవుగట్టుమీదికి పోయిన దొంగసచ్చిన ఎలుగు సాయంత్రం నాలుగ్గంటలకి గానీ ఏట్లోకి దిగి నీళ్లు తాగలేదట. అదే సమయంలో అక్కడే మాటేసి కూచున్న మేస్టారు తుపాకీ గురి చూసి ఠక్కుమనిపించేరట. గుండు దాని గుండెల్లోకి దూరీసిందట. ఠపీమని  చచ్చూరుకుందిట. దాన్ని మూటలా కలీగట్టీసి సంబరంగా మేస్టారు మోసుకుంటూ వచ్చేరన్నమాట.

మొత్తానికి ఎలుగ్గొడ్డును చంపిన మేస్టార్ని ఊరేగింపుగా ఊరి రామమందిరానికి తీసుకువచ్చారు ప్రజ. వెనువెంటనే అప్సరా ఫోటో స్టూడియో రమణగాడికి కబురెళ్లింది. ఈలోగానే తాటి తడపలతో నాలుగు వెదురు కర్రముక్కలు తెచ్చేడు షరాబు నీలకంఠం. నాలుగు కర్రల్ని చచ్చిన ఎలుగుకాళ్లకి కట్టి చేటపెయ్యిలా నిలబెట్టేడు. వస్తూవస్తూనే ఫోటోగ్రాఫర్‌ రవణ చాలా ఫోజులు కొడుతూ వచ్చేడు. చాలా ఫోజుల్లో మేస్టార్నీ, ఆయన తుపాకీని, చచ్చిన ఎలుగునీ, ఊళ్లో పెద్దల్నీ కలిపి రకరకాలుగా ఫోటోలు తీస్సేడు. ఆనకేమో అంతా కలిసీసి ఎలుగ్గొడ్డుని సొసానంలో గొయ్యి తీసి కప్పెట్టీసేరు. ఇదంతా ఫారెస్టోళ్లు సూసీ సూణ్ణంట్టుండిపోయేరు.

ఫోటోల రవణగాడు అమర్నాడు కాక మర్నాడనుకుంటా. ఫోటోలన్నీ పెద్ద పెద్ద బొమ్మలుగా కడిగీసి పలచటి అట్టముక్కలకి అంటించీసి మేస్టారికి, ఊరిబడాబాబులికీ ఇచ్చీసేడు. దీనంతట్నీ ఊరి కుర్రనాయాళ్లందరం కళ్లారా చూసేం. కళ్లింతింతలు చేసుకుని చూసేం. ఒకానొక ఉద్వేగంతో చూసేం. అప్పటికి మా వయసు పదేళ్లుంటుందేమో. మా మాస్టారుగారికి ఏభయ్యుంటుంది. చదువులు అవీ పూర్తి చేసుకుని మా గుంటజట్టంతా ఉద్యోగాల కోసం వైజాగు నగరం పట్టీసినా మాస్టారిని, ఎలుగ్గొడ్డు వ్యవహారాన్ని చాలా మాట్లే గుర్తు తెచ్చుకుంటుంటాం.

ఇదంతా ఇలాగుండగానే, ఈ మధ్యనోసారి నేను మా ఊరు వెళ్లవలసివచ్చింది. జీవితం పట్ల తీవ్రంగా భయం పుట్టిన ఒకానొక బలహీన క్షణంలో మా ఊరి కరకచెట్టు పోలమాంబకి నేను కొన్నేళ్లకిందట రకరకాల మొక్కులు పెట్టీసుకుని ఉన్నాను. పెట్టుకున్న మొక్కుబళ్లన్నీ పెట్టుకున్నట్టే ఉండిపోయేయి. ఇంట్లో ఆడోళ్లు పోరుతుంటే ఆ మొక్కులేవో తీర్చేసుకుంటే వదిలిపోతుందని చోడవరం వెళ్లేను.

బస్టాండ్లో దిగానో లేదో పెడ అరిటిపళ్లు కొనీసేను. డైరెక్టుగా అమ్మవారి గుడికే కాళ్లు కదిపీసేను. మా పోలమాంబకి ధూళి దర్శనమంటే మహా మక్కువ. అందుకే కాళ్లయినా కడుక్కోకుండా అమ్మ విగ్రహం పాదాల దగ్గర పండూకాయా పెట్టీసి చేతులు జోడించేను. తీసుకెళ్లిన చీర, రవికెల గుడ్డ సమర్పించేను. నన్ను, నా ఇల్లు పిల్లాద్రినీ చల్లగా చూడమ్మా.. అని దండం పెట్టేను. ధ్వజస్థంభం చుట్టూ మూడు సుట్లు తిరిగేను. అమ్మవారి తమ్ముడు పోతురాజు బొమ్మ దగ్గరకెళ్లి భక్తిగా ఊదొత్తు పుల్లలకి అగ్గి పెట్టేను. నైవేద్యంగా ఇంటినుంచి పట్టుకెళ్లిన బెల్లం అచ్చులు వదిలీసేను. కోవెల బయటకొచ్చీసేను.

సరిగ్గా అప్పుడే గుర్తుకొచ్చేరు మా జాన్‌ మేస్టేరు. ఆయన్ని చూడాలనిపించింది. తొంభయ్యో పడిలో పడ్డారు కదా. ఒకసారి వెళితే మంచిదే అనుకున్నాను. వెంటనే ఆయన ఇంటిదారి పట్టేను. గుడికీ మేస్టారింటికీ పెద్ద దూరం ఉండదు. త్వరగానే వచ్చీసిందది.

రకరకాల పచ్చాపచ్చని మొక్కల్ని దాటి చిన్న పర్ణశాలలాంటి మేస్టారి ఇంటికి చేరేను. వసారాలో పడక్కుర్చీలో దేవుళ్లా వాలి కూచోనున్నారాయన. మనిషి బాగా లొంగిపోయేరు. వృద్ధాప్యం ముంచుకొచ్చీసింది కాబట్టి ఆరముగ్గిన అంటిపండులా అయ్యేరు. మిగలపండిన మావిడిపండులా కానొచ్చేరు. కంఠం మాత్రం ఖంగుఖంగుమంటోంది.

”నమస్కారం మేస్టారు..” అనగానే కళ్లు పెద్దవి చేసుకుని తేరిపారచూసేరు. అయినా గుర్తు పట్టలేపోయేరు. ఫలానా పంతులుగారి కొడుకునని చెప్పుకున్నాను.

”ఓరేయన నువ్వట్రా..” అంటూ నా చేతులు పట్టీసుకుని ఎంతగా ఇదయిపోయేరో చెప్పలేను. ఎదురుగా ఉన్న బల్లమీద కూచోబెట్టేరు. చాన్నాళ్లకి చూసినందుకో మరెందుకోగానీ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నా నేత్రాలూ తడిసిపోయేయి. ఎలాంటి మేస్టారు. ఎలాగయిపోయేరు. కమ్మిచ్చువు తీసనిట్టుండే కండలన్నీ ఎక్కడికిపోయేయి. దెబ్బ.. దెబ్బ.. వస్తే చావుకయినా సిద్ధపడిపోయే అంత బలిష్టమైన శరీరం ఏటైపోయింది. మనిషిని వయస్సు ఎంతగా వంచేస్తుందో.. ఇలా రకరకాల ఆలోచనలు తలని పట్టీసేయి.

ఇంతలోనే, నా చూపు వసారా గోడకు తగిలించిన ఫోటో మీదికి పోయింది. అప్పుడెప్పుడో ఎలుగుబంటిని చంపినందుకు గుర్తుగా దాంతో కలిపి మేస్టారికి తీసిన చిత్రం అది. దాదాపు నలభైయ్యేళ్లయిపోయింది కదా. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోకి కొన్ని కొత్త రంగులేవో పట్టీసినట్టు అదోరకంగా తయారయింది. నేను దగ్గరకెళ్లి మేకుకి తగిలించిన ఫోటో చేతుల్లోకి తీసుకుని రుమాలుతో తుడిచేను. ఆనాటి ఎలుగ్గొడ్డు సంహారం గురించి మేస్టారికి నవ్వుతూ గుర్తు చేసేను.

”మీసారూ మీరెంత దైర్యవంతులండీ” అన్నాను.

”మేస్టారూ మీకెంత తెగువ ఉండేదండీ” అనీ అన్నాను.

”మనిషంటే మీరే మనిషండీ” అంటూ ప్రశంసలు కురిపించేను. నాటి నా జ్ఞాపకాలన్నీ ఆయనతో చకచకా పంచీసుకున్నాను. అంతా విన్న ఆయన మెల్లగా గొంతువిప్పేరు.

” పోనిస్తూ. అవన్నీ వదిలిద్దూ. అప్పుడేదో అలా అయిపోయింది. ఎలుగుబంటిని చంపినంత మాత్రాన పెద్ద మొనగాడయిపోతానేంట్రా. అడివి జంతువుని హత్య చేసినంత మాత్రాన పులిసిబలిసిన ముల్లుడనయిపోతానేంట్రా. నోరు లేని జీవిని చంపడమూ ఓ గొప్పేనేంట్రా.” అన్నారు నిస్సారంగా.

ఆ మాటలు ఆయన తేలిగ్గా అంటున్నట్టుగా పైకి వినిపించినా వాటి వెనుక ఒక బాధ, ఒక యాతన ఏదో అన్నట్టుగా నాకయితే అనిపించింది. ఆ మాటలంటున్నప్పుడు ఆయన గొంతులో శోకమేదో ధ్వనించింది. ఇంతలో ఆయనే మళ్లీ అందుకున్నారు.

” మన ఊరికి అప్పుడు ఒక్క ఎలుగుబంటే వచ్చిందిరా. దాన్ని చంపీగానే దరిద్రం తీరిపోయిందిరా. ఇప్పుడు దాన్ని మించిన క్రూర జంతువులు ఊళ్లోకి దిగిపోయేయిరా. వాటిని నేను ఏం చేయగలిగేన్రా. ఎలుగుబంటిని చంపేనుగానీ, మన ఊరి బక్క రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుని మందుల ఫ్యాక్టరీ పెట్టీసిన ఉప్పల సూర్యనారాయణదొరని ఏదయినా చేయగలిగేనేంట్రా..? మన ఊరి జనం వద్దు వద్దంటున్నా వినకుండా న్యూక్లియర్‌ ప్లాంటు పెట్టిన మార్వాడీ సేట్‌ ఉదయ్‌లాల్‌ వెంట్రుక ముక్కయినా తెంపగలిగేనేంట్రా..? సమ్మెకట్టిన మన జనపనార మిల్లు వర్కర్లని పిట్టల్లా కాల్పించీసిన ఫ్యాక్టరీవోనరు పానకాల రాయుడి అంతు తేల్చీగలిగేనేంట్రా..? చెప్పరా.. చెప్పు.. చెప్పు..” అంటూ ఆవేశంగానూ చాలా కోపంగానూ కడిగీసినట్టుగా నన్నడిగీసేరు. ఆ సమయంలో ఆయన మాటాడుతుంటే సింహాచలం ఉగ్రనరసింహస్వామిలాగ, అనకాపల్లి నూకాల్తల్లిలాగ, గంధవరం మరిడిమాంబలాగ భయంకరంగా ఆవుపించారు.

దెబ్బకి నా గుండెకాయ గొంతులోకి వచ్చీసినట్టయింది. తొంభైయ్యేళ్ల అమావృద్ధుడైవుండి కూడా జనకంటకులమీద మీద నిప్పులు కురిపిస్తూ మేస్టారు మాట్లాడుతుంటే నాకయితే దడుపు పుట్టీసింది. ఆయన హృదయంలో ఎంతటి దావాగ్ని దాంకుందో అర్థమైపోయింది. ఏదో అనబోయేను. ఈలోగానే, ఎలుగుబంటితో అప్పుడెప్పుడో దిగిన ఫోటోను గభాల్న నా దగ్గర్నించి ఆయన లాగీసుకున్నారు. దాన్ని పరపరా చింపీసేరు. చిరిగిన ఆ ముక్కల్ని వీధులో విసిరీసి చక్కావచ్చి కుర్చీలో మౌనంగా కూచుండిపోయేరు. ఆ వయసులో మేస్టారు అలా ఊగిపోవడం చూసి నాకు భయం వేస్సింది. ఆ వేళ ఆయన్ని మరింక ఎక్కువగా కదపకూడదనుకున్నాను. నమస్కారం పెట్టీసి మెల్లగా ఇంట్లోంచి బయటపడిపోయేను.

రోడ్డుమీదికొచ్చీసి గాభరా గాభరాగా నడుస్తున్నాను. నాలుగే నాలుగు అడుగులు పడ్డాయో లేదో. మేస్టారు చంపీసి పారీసిన పాత ఫోటో ముక్కలు వీధిలో ఎదురుపడ్డాయి. గాలికి రెపరెపలాడుతూ నా పాదాలకూ అడ్డం పడ్డాయి ” బాబూ! మీ జాన్‌ మేస్టారు ఆవేశంగా మాటాడిన మాటల్లో తప్పేటయినా ఉందా..? ఒకేళ ఉంటే గనుక, ఆ తప్పేంటో బేగా చెప్పీ..  బేగా చెప్పీ బాబూ..!” అంటూ అవన్నీ నన్ను నిలువునా నిలదీసినట్టుగా ఆ క్షణంలో నాకు తోచింది. ఉన్నపళంగా ఉక్కిరిబిక్కిరయిపోయేను.


డా. చింతకింది శ్రీనివాసరావు

ఖాళీలలోనే ఉంది కథంతా…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

ఋతుమతి యై పుత్రార్థము

పతి గోరిన భార్యయందు బ్రతికూలుండై                                    

ఋతువిఫలత్వము సేసిన

యతనికి మరి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్

                                             -నన్నయ

 (శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

ఋతుమతి అయిన భార్య, పుత్రుని ఇవ్వమని భర్తను కోరినప్పుడు నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేసినవాడికి గర్భస్థ శిశువును చంపిన పాపం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతారు.

  ***

అదీ విషయం…ఋతుమతి అయిన భార్య పుత్రుని ఇమ్మని భర్తను కోరినప్పుడు, భర్త నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకోదా అని శుక్రుని యయాతి అడుగుతున్నాడు!

  ఋతుకాలాన్ని విఫలం చేయడం, భ్రూణహత్య అనే మాటలు చర్చను మరో ప్రాంగణంలోకి తీసుకెడుతున్నాయి. బహుశా అవి పురాదశకు చెందిన  స్త్రీ-పురుష సంబంధాలను ఇప్పటి మన అవగాహనకు భిన్నంగా నిర్వచిస్తున్నాయి. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన ఇక్కడ చాలా కీలకం. భ్రూణహత్యా పాపం అనేది ఒక విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఒక మతవిశ్వాసం అంత బలీయమైనది. అంతేకాదు, స్త్రీ-పురుష సంబంధాల గురించి నేటి మన విశ్వాసాలు, భావనల కంటే కూడా అది బలీయం. పురా మానవుడి దృష్టిలో విశ్వాసాన్ని మించిన బలవత్తర శక్తి ఇంకొకటి లేదు. పురామానవుడు నూటికి నూరుపాళ్లూ విశ్వాసజీవి.  స్త్రీ-పురుష సంబంధాల గురించిన ఊహలు, శీలం, ఏకపత్నీవ్రతం,లేదా ఏకపతీవ్రతం మొదలైనవి మానవ పరిధిలోకి చెందినవి. సామాజిక కల్పనలు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన వాటిని మించినది. అది మానవ పరిధినీ, సామాజిక పరిధినీ దాటేది. ఒక అతీతశక్తి పట్ల, లేదా ప్రకృతిపట్ల జరిగే దారుణ అపచారానికీ, ద్రోహానికీ అది సూచన. 

ఈ సందర్భంలో నాకు ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ’ నవల గుర్తుకొస్తోంది. ఆ నవల ప్రారంభమే ఋతుకాల భయాలతో జరుగుతుంది. మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ  భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ, స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.

books

భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది.

ఋతుకాల విఫలత్వం భ్రూణహత్యా పాపాన్ని చుట్టబెడుతుందన్న ఆదిమ విశ్వాసం ఆధునిక కాలంలోనూ మొన్న మొన్నటివరకూ శ్రోత్రియ కుటుంబాలలో కొనసాగింది. ‘రజస్వలాత్పూర్వ వివాహం’ గతంలో ఒక పెద్ద చర్చనీయాంశం.  పాటించి తీరవలసిన ఒక నియమం. దీనికి ఏవేవో సామాజిక కారణాలు చెబుతారు. వాటిలోనూ నిజం ఉంటే ఉండచ్చు కానీ, నా ఉద్దేశంలో భ్రూణ హత్యా పాపం గురించిన భయాలే ఆ నియమానికి అసలు కారణం. రజస్వలాత్పూర్వ వివాహాల పట్టింపు క్రమంగా కొంత సడలి, రజస్వల అయిన వెంటనే పెళ్లి చేసే తొందరకు దారి తీసింది. ఇప్పుడు ఆ పట్టింపు కూడా చాలావరకూ పోయింది. చట్టం కూడా బాల్యవివాహాలను నిషేధించింది.

మరికొంత వివరించుకుంటే, పైన చెప్పుకున్న ఋతుకాల భయాలనేవి స్త్రీ-పురుష సంబంధాలను వివాహం అనే సామాజిక రూపంలో వ్యవస్థీకరించడానికీ; స్త్రీకి ఒకే పురుషుడన్న నియమానికీ; స్త్రీ శీలం గురించిన నేటి భావనలకూ కూడా పూర్వదశకు చెందిన వనడానికి అవకాశం ఉంది. ఆవిధంగా ఋతుకాలభయాలకూ, వివాహానికీ ముడి అనంతర కాలంలో ఏర్పడిందనుకుంటే, బహుశా ఋతుకాలం ప్రాప్తించిన స్త్రీకి వివాహం వెలుపల సైతం దానిని సఫలం చేసుకునే హక్కూ, తద్వారా సంతానం పొందే హక్కూ ఉండి ఉండాలి. పురుషుడికి ఉన్నట్టే స్త్రీకి కూడా ఋతుకాల వైఫల్యం వల్ల కలిగే భ్రూణ హత్యాభయాలు ఉంటాయి కనుక, ప్రస్తుత సందర్భంలో కథకుడు చెప్పకపోయినా శర్మిష్ట ఆ భయాలను యయాతిపై ప్రయోగించే ఉంటుంది.

దీనిని విస్తరించుకుంటూ వెడితే ఈ చర్చ క్రమంగా మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల గురించిన చరిత్రలోకి తీసుకువెడుతుంది. మాతృస్వామ్యంపై పితృస్వామ్యానిది పై చేయి అయి, స్త్రీ క్రమంగా పురుషుడి ప్రైవేటు ఆస్తిగా మారి, వివాహ వ్యవస్థ బిగుసుకునే క్రమంలో దానికీ;  స్త్రీ ఋతుకాల హక్కుకూ, సంతాన హక్కుకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉండాలి.  భైరప్ప ప్రకారం శల్యుడి కాలానికే ఆ పరివర్తన జరిగిపోయి ఉండాలి. అయితే వ్యవస్థ మారినంత వేగంగా విశ్వాసం మారదు. దాని ఫలితమే శల్యుని భ్రూణహత్యా భయాలు.

పై వివరణ ఇప్పటి నమ్మకాలను, మనోభావాలను గాయపరిచేలా ఉండచ్చు కానీ, స్త్రీకి ఒకే పురుషుడన్న నీతిని మించి ఋతుకాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పే సాక్ష్యాలు మహాభారతంలోనే పుష్కలంగా ఉన్నాయి. ముందుగా మూడు ఉదాహరణలు చెప్పుకుంటే…

ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో కథకుడైన వైశంపాయనుడు వ్యాసుని పుట్టుక గురించి జనమేజయునికి చెప్పి, ఆ వెంటనే, దేవదానవుల అంశతో భీష్మాది వీరులు పుట్టి భారతయుద్ధం చేశారని అంటాడు. అలా పుట్టిన రాజులందరూ భారతయుద్ధంలో నశించడానికి కారణమేమిటని జనమేజయుడు అడుగుతాడు. వైశంపాయనుడు సమాధానం చెబుతూ, పరశురాముడు ఇరవయ్యొక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ సంహరించాడనీ, అప్పుడు ఆ రాజుల భార్యలు సంతానం కోరి ఋతుకాలంలో ధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారనీ, దాంతో రాజవంశాలు వర్ధిల్లాయనీ అంటాడు. ఎన్నో ఆసక్తికర విశేషాలున్న వైశంపాయనుని సమాధానం మొత్తాన్ని నేను ఇక్కడ ఇవ్వడం లేదు. వేరొక సందర్భంలో దాని గురించి చెప్పుకుందాం. ప్రస్తుతానికి వస్తే…

మృతులైన రాజుల భార్యలు ఋతుకాలంలో ధర్మం తప్పకుండా, అంటే ఋతుకాలధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారని పై సమాచారం వెల్లడిస్తోంది. ఇక్కడ ఋతుకాల ప్రస్తావన చేయకుండా, విప్రుల ఆశీస్సులతో సంతానం పొందారని చెప్పి ఉంటే, దానికి ఏదో మహిమను ఆపాదించి సమర్థించుకోవచ్చు. కానీ ఋతుకాలాన్ని ప్రస్తావించి మరీ కథకుడు ఈ సంగతి చెప్పాడుకనుక దీనిని వాస్తవికార్థంలోనే తీసుకోవలసి ఉంటుంది.

రెండో ఉదాహరణ, ఉదంకుని ఉదంతం. ఉదంకుడు పైలుడనే ముని శిష్యుడు. ఫైలు డొకసారి దేశాంతరం వెడుతూ ఇంటి బాధ్యతలు ఉదంకునికి అప్పజెబుతాడు. అంతలో ఫైలుని భార్యకు ఋతుకాలం సంభవిస్తుంది. ఇతర స్త్రీలు ఉదంకునితో ఈ విషయం చెప్పి, గురువు దగ్గరలో లేరు కనుక ఆయన స్థానంలో నువ్వు ఆమెకు ఋతుకాలోచితాన్ని నిర్వర్తించాలని చెబుతారు. ఉదంకుడు అందుకు తిరస్కరిస్తాడు. గురువు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం ఆయనకు చెబుతాడు. అప్పుడు గురువు ఉదంకుని మెచ్చుకుంటాడు. ఉదంకునికి స్త్రీలు ఆ సూచన చేశారంటే, అప్పటికి అలాంటి ఆనవాయితీ ఉందనుకోవాలి. ఉదంకుడు తిరస్కరించాడంటే, ఆ ఆనవాయితీకి కాలం చెల్లుతూ ఉండాలి. ఈ సందర్భాన్ని కథకుడు ప్రధానంగా మరొకందుకు వాడుకున్నాడు. అది, ఉదంకుని గురుభక్తిని చెప్పడం.

నాకు ఈ ఉదంతంలో లీలగా ఇంకొకటి కూడా స్ఫురిస్తూ ఉంటుంది. యజమాని దేశాంతరం వెళ్ళడం, ఒక కట్టుగా ఉన్న స్త్రీలు మాతృస్వామ్యం తాలూకు ఒక ఆనవాయితీని అమలుచేయడానికి ప్రయత్నించడం, యజమాని ప్రతినిధి అయిన ఉదంకుడు అందుకు నిరాకరించడం -ఋతుకాలోచితం విషయంలో  స్త్రీ-పురుషుల మధ్య అప్పటికింకా కొనసాగుతున్న ఘర్షణను సూచిస్తూ ఉండచ్చు.  విశేషమేమిటంటే, సంస్కృత భారతంలో ఉన్న ఈ ఉదంతాన్ని అనువాదంలో నన్నయ పరిహరించాడు.

ఇక మూడో ఉదాహరణకోసం నేరుగా కథలోకి వెడదాం:

శర్మిష్టకు కొడుకు పుట్టాడు. పేరు, దృహ్యువు. దేవయాని ఆశ్చర్యపోయింది.  ‘చిన్నదానివైనా మంచి వినయశీలాలతోనూ, గౌరవంగానూ, మనోవికారాలకు దూరంగానూ ఉంటున్న ఈ పరిస్థితిలో నీకు కొడుకు ఎలా పుట్టాడు? చాలా ఆశ్చర్యంగా ఉందే!’ అంది.

శర్మిష్ట సిగ్గుపడుతూ తలవంచుకుని, ‘ఎక్కడినుంచో ఒక మహాముని, వేదవేదాంగపారగుడు వచ్చి ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకును ప్రసాదించాడు’ అంది.

దేవయాని (ఏమీ మాట్లాడకుండా) తన నివాసానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత శర్మిష్టకు వరసగా అనువు, పూరువు అనే మరో ఇద్దరు కొడుకులు కలిగారు.

దేవయానికి శర్మిష్టలో హఠాత్తుగా వినయశీలాలు, గౌరవనీయత కనిపించడం విశేషం. దానినలా ఉంచితే, శర్మిష్ట సమాధానం గమనించండి…ఎవరో మహాముని వచ్చి, ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకునిచ్చా’ డని చెబుతోంది. పైన రాజుల భార్యల విషయంలో చెప్పుకున్నదే ఇక్కడా వర్తిస్తుంది.  శర్మిష్ట ఋతుకాలం లో ఉన్నప్పుడే ఆ ‘మహాముని’ ఆమెకు కొడుకునిచ్చి వెళ్ళాడు. అది అబద్ధమైనా, అది వెల్లడిస్తున్న ఆనవాయితీ అబద్ధం కాదు. ఆ ఆనవాయితీ దేవయానికి కూడా తెలుసు. అందుకే శర్మిష్ట అలా చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్లిపోయింది. నిజానికి ‘నీకు కొడుకు ఎలా పుట్టా’ డన్నదే దేవయాని ప్రశ్న అయుంటుంది. యయాతి వల్ల కలిగాడా అన్నది తేల్చుకోవడమే ఆమెకు కావాలి.  యయాతి వల్ల కాకుండా, ఇంకెవరి వల్ల శర్మిష్టకు కొడుకు పుట్టినా దేవయానికి అభ్యంతరం లేదు, అందులో ఆశ్చర్యమూ లేదు.

ఇక, ఆమె ప్రశ్నలోని మిగతా భాగమంతా కథకుని కల్పన. ఎందుకంటే, ఋతుకాల ప్రాధాన్యాన్ని వెల్లడించే ఆ ఆనవాయితీ చర్చలోకి రాకూడదు. అందుకే, దేవయాని నోట తన మాటలు పలికిస్తూ ఆ ఆనవాయితీపై  కథకుడు ముసుగు కప్పుతున్నాడు. కారణం ఇంతకుముందు చెప్పుకున్నదే:  ఆ ఆనవాయితీ గురించి తెలియని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు అతడు కథ చెబుతున్నాడు. లేదా, తనే ఆ ఆనవాయితీని సరిగా పోల్చుకోలేకపోయీ ఉండచ్చు.

కథలోకి వెడితే…శర్మిష్ట కొడుకులు ముగ్గురూ, ఒంటి మీద ఆభరణాలు లేకపోయినా సహజకాంతితో మూడు అగ్నుల్లా ప్రకాశిస్తూ తన ముందు ఆడుకుంటుండగా వినోదిస్తున్న యయాతి దగ్గరికి; శర్మిష్టనూ, ఇతర దాసీ కన్యలనూ వెంటబెట్టుకుని వైభవం చాటుకుంటూ శచీదేవిలా దేవయాని వచ్చింది. తేజస్సు ఉట్టిపడుతుండగా, యయాతి ప్రతిబింబాల్లా ఉన్న ఆ ముగ్గురినీ చూసి ‘ఈ పిల్ల లెవ’ రని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పలేదు. ‘మీ తల్లిదండ్రు లెవ’ రని ఆ పిల్లలనే అడిగింది. వారు లేత చూపుడు వేళ్ళతో యయాతినీ, శర్మిష్టనూ చూపించారు.

తనకు తెలియకుండా యయాతి శర్మిష్టవల్ల సంతానం పొందాడని దేవయానికి తెలిసిపోయింది. కోపమూ, దుఃఖమూ ఆమెను ముంచెత్తాయి. ఈ ‘దానవి’తో సంబంధం పెట్టుకుని యయాతి తనను నిలువునా వంచించాడనుకుంది. తక్షణమే పుట్టింటికి వెళ్ళి, తండ్రి పాదాలమీద పడి దీర్ఘనేత్రాలనుంచి ఉబికివచ్చే జలధారలతో వాటిని కడిగింది.

యయాతి కూడా బతిమాలుతూ దేవయాని వెంటే వెళ్ళి శుక్రుని దర్శించి నమస్కరించాడు.  ‘ధర్మం తప్పి ఈ రాజు రాక్షస పద్ధతిలో ఆ రాక్షసిమీద అనురక్తుడై ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. నన్ను అవమానించాడు’ అని దేవయాని గద్గదస్వరంతో అంది. శుక్రునికి కోపం వచ్చింది. ‘యవ్వన గర్వంతో కళ్ళు మూసుకుపోయి నా కూతురికి అప్రియం చేశావు కనుక నువ్వు వృద్ధాప్యభారంతో కుంగిపోతావు’ అని యయాతికి శాపమిచ్చాడు.

అప్పుడు, ‘ఋతుమతియైన భార్య కొడుకునిమ్మని భర్తను కోరినప్పుడు అతడు నిరాకరించి ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యా పాపం సంభవిస్తుందని పెద్దలు చెప్పలేదా, దానికి భయపడే ఆ మానవతి కోరిక తీర్చాను, ఇందుకు ఆగ్రహించడం న్యాయమా’ అని యయాతి ప్రశ్నించాడు. ఆ వెంటనే గడుసుగా, కూతురిపై శుక్రునికి ఉన్న మమకారానికి గురి పెడుతూ, ‘ఈ దేవయానిపై నాకింకా కోరిక తీరలేదు. ఇప్పుడే వృద్ధాప్యాన్ని ఎలా భరించను?’ అన్నాడు. ఆ మాటకు శుక్రుడు మెత్తబడ్డాడు. ‘అలా అయితే నీ వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఒకరికిచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. విషయసుఖాలతో తృప్తి చెందిన తర్వాత తిరిగి వాడి యవ్వనాన్ని వాడికి ఇచ్చేసి, నీ వృద్ధాప్యాన్ని తిరిగి పుచ్చుకో. ఇంకో విషయం, నీ వృద్ధాప్యాన్ని తీసుకున్నవాడే నీ రాజ్యానికి అర్హుడు, వంశకర్త అవుతాడు’ అన్నాడు.

02Kach

దేవయానీ, శుక్రుల పరంగా ఇందులో విశ్లేషించుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రస్తుతానికి అలా ఉంచితే, ఋతుమతి అయిన భార్య కొడుకునిమ్మని అడిగితే భర్త ఎలా నిరాకరిస్తాడని యయాతి అనడాన్ని గమనించండి… ఇంతకీ శర్మిష్టకు యయాతి ‘భర్త’ ఎలా అయ్యాడు?! ఈ సందర్భం, భర్త అనే మాటకు నేడున్న అర్థాన్ని దాటిపోతోంది. ఇక్కడ భర్త అంటే ఒక స్త్రీకే పరిమితుడైన మొగుడు కాదు. తన పోషణలో ఉన్న దాసీలపై కూడా లైంగిక హక్కు ఉన్న యజమాని, నాథుడు, మాస్టర్. ‘భార్య-దాసి-కొడుకు వారించరాని ధర్మా’లన్న శర్మిష్ట మాట దానినే చెబుతోంది. ఇది ఒకనాటి గృహ ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది.

విశేషమేమిటంటే, శర్మిష్టకు తనను భర్తగా యయాతి చెప్పడంలోని మర్మం ఏమిటన్న సందేహం సంప్రదాయ పండితులెవరికీ వచ్చినట్టు లేదు. కనీసం, దివాకర్ల వేంకటావధాని, జీవీ సుబ్రహ్మణ్యం గార్ల వ్యాఖ్యానంతో టీటీడీ ప్రచురించిన కవిత్రయ భారతం, ఆదిపర్వంలో దీనిపై ఎలాంటి వివరణా లేదు. సంప్రదాయ పఠన పాఠనాలు విడిచిపెట్టిన ఇలాంటి సందేహాల ఖాళీలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఆ ఖాళీలలోనే ఉంది అసలు కథ అంతా!

 

 – కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

మంచి రచన ప్రథాన లక్షణం హాయిగా చదివించగలగడం; ఆ పై ఆలోచింపజేయడం. కాలానికి తట్టుకుని నిలిచేది ఉత్తమ రచన అని కొంతమంది అంటూంటారు. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని రికార్డు చేయడం, ఆయా అనుభూతులను, అనుభవాలను, స్మృతులను, ఆనందాల్ని, బాధల్ని అక్షరబద్ధం చేయడాన్ని డైరీఅనవచ్చు. మరి డైరీలూ, ఉత్తమ రచనలేనా అని కొందరు ప్రశ్నించవచ్చు. అన్ని డైరీలు కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖుల డైరీలు సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసాయని చెప్పక తప్పదు. పూడూరి రాజిరెడ్డి పలక పెన్సిల్అనే పుస్తకం ఉప శీర్షిక ఒక మగవాడి డైరీమనకి ఇదే చెబుతుంది.
మనిషి జీవితంలోని ఒక్కోదశలో అతని ప్రవర్తన, భావాలూ, ఆలోచనలు, జ్ఞాపకాలు, సంశయాలు, సందిగ్ధాలు, సమస్యలు, విజయాల గురించి చెప్పింది. పుస్తకంలోని ఆర్టికల్స్ (ఇవన్నీ గతంలో సాక్షి ఫండేలోనూ, ఈనాడు ఆదివారం అనుబంధంలోనూ ప్రచురితమైనవే) మనిషి జీవితంలో ఒక క్రమంలో ఎదగడాన్ని సూచిస్తాయి. రచయిత ఉద్దేశానికి తగినట్టే ముఖచిత్రం మీద అన్వర్ వేసిన బొమ్మలు వ్యక్తి జీవితంలోని శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, ముదిమిలను ప్రతిబింబిస్తున్నాయి. పుస్తకంలోని ఆర్టికల్స్‌ని బలపం, పెన్సిల్, పెన్ను విభాగాలుగా విభజించడం బాల్యం, కౌమారం, యవ్వనాలకు ప్రతీకగా పరిగణించవచ్చు. సాధారణంగా డైరీ అంటే ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం అని భావిస్తాం. కానీ ఈ డైరీ వ్యక్తిగతం కాదు, ఓ వ్యక్తి గతాన్ని, వర్తమానాన్ని మిళితం చేస్తూ, ఆ వ్యక్తిలాంటి ఎందరో వ్యక్తుల అనుభవాలు, అనుభూతులను, భావాలను వెల్లడించింది. శిశువుగా ఓ కుటుంబంలో జన్మించి, ఎదుగుతూ బంధాలను కలుపుకుంటాడు మనిషి. యవ్వనంలోకి వచ్చేసరికి కుటుంబం పరిధి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతూంది కూడా. కొత్తబంధాలు ఏర్పడుతాయి. అయితే చాలామంది చేసే పొరపాటు పాతవాటిని వదిలేసుకోడం అని అవ్యక్తంగా చెబుతారు రచయిత. తన ఊరు, పొలం జ్ఞాపకాలు, తమ్ముడి స్మృతులు, తను చూసిన సినిమాలు, తన చదువు ముచ్చట్లు – “బలపంవిభాగంలోని ఆర్టికల్స్ చెబుతాయి. ఈ విభాగంలోని ఆర్టికల్స్ చదువుతుంటే ఎప్పుడో బాపుగారి దర్శకత్వంలో వచ్చిన స్నేహంసినిమాలోని ఓ పాట ఎగరేసిన గాలిపటాలు….” పాటలోని కొన్ని వాక్యాలు …. “చిన్ననాటి ఆనవాళ్ళుస్నేహంలో మైలురాళ్ళుచిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు….” మనసు పొరల్లో దోబూచులాడాయి. పెన్సిల్ విభాగం కౌమారంతో ప్రారంభం అవుతుంది. కలం స్నేహం చేయాలనే అభిలాషతో గోవాలోని ఓ అమ్మాయికి మొదటి లేఖలోనే…. తన గురించిమొత్తం చెప్పేయడం…. కానీ ఆ లేఖకి జవాబు రాకపోవడం…. తను చేసిన తప్పేంటో తర్వాతర్వాత తెలుసుకుంటారు రాజిరెడ్డి.

చిన్నచిన్న పదాలతో కోనసీమ కొబ్బరిచెట్లని మనోజ్ఞంగా వర్ణించారు రచయిత. అదే భావ శబలతతో తన సొంతూరుని వర్ణించిన తీరు, ఎవరికైనా తమ స్వంత ఊరుని గుర్తు చేయకమానదు.

మనిషికి తోడు ఎందుకు కావాలో తెలుసా? అందరూ తమ దుఃఖాన్ని పంచుకోడానికి మరొకరు కావాలనుకుంటారు. కాని రాజిరెడ్డికి మాత్రం అలా అనిపించదు. హృదయంలో పొంగి పొరలుతున్న సంతోషాన్ని ఒక్కడే అనుభవించక, తోడు కావాలని కోరుకుంటారతను. అంతలోనే బంధం ఎన్నాళ్ళని ప్రశ్నిస్తూ, తనే సమాధనం చెబుతారు జీవితకాలం అని. “రూపం లేని, ఇదీ అని చెప్పలేని ప్రేమకి రూపం వస్తేఅదిగోఅది మీ ఇంట్లో ఉండే మీ మనిషిగా ఉంటుంది…” అంటూ జీవితభాగస్వామి గురించి అద్భుతంగా చెప్పారు.

PalakaPencilFrontCover

భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయబేధాల గురించి ఇలా అంటారు – “నేను కాదంటాను. నువ్వు చేసే రాచకార్యమేమిటి? అని హోమ్ పాయింట్ ఎదురవుతుంది. నేను చెప్పబోయేవేవీ వాదనకు నిలబడవని నాకు తెలుసు. అందులో కొన్నింటిని చెప్పుకోలేమనీ తెలుసు. అందుకని అసహనాన్ని ఆశ్రయిస్తాను. వాళ్ళు నిరసనని ఆయుధంగా చేసుకుంటారు. ఆ నిరసనని నిరసిస్తూ నేను మౌనం పాటిస్తాను. ఆ మౌనాన్ని ఛేదించడానికి మాటల ఈటెలు విసరబడతాయి. వంద విసుగులు, వెయ్యి నిట్టూర్పులు శవాలుగా నేల కూలుతాయి. చేస్తున్నది ధర్మయుద్ధం కాబట్టి, చీకటి పడగానే దాన్ని అలా అక్కడికి ఆపేస్తాం“. ఈ వాక్యాలు చదివాక, ఇది తమకి సంబంధించినది కాదని పాఠకులు అనుకోగలరా? తమ గురించే రచయిత రాసేసినట్లు భావించరూ?

పిల్లల్ని ఎలా పెంచాలో మరో చోట చెబుతూ.. “బతకడం ఎలాగో మనమే నేర్చుకుంటున్నప్పుడు, పిల్లలకు జీవితం అంటే ఏం చెప్పగలం?” అని ప్రశ్నిస్తారు. బహుశా, ఇది ప్రతీ తల్లీ తండ్రీ తమకి తాము వేసుకోవాల్సిన ప్రశ్నేమో

“మనకి మనమే ఎందుకు ఇంతగా నచ్చకుండా పోతాం? మన అలవాట్లను ఎందుకు ఇంత తీవ్రంగా నిరసిస్తున్నాం? మనం ఉన్న స్థితే కరెక్టు అని తెలియాలంటే, దీనికంటే భిన్నస్థితిలోకి ఒకసారి వెళ్ళిరావాలి…” అంటారు. వ్యక్తిత్వ వికాస రచయితలు పెద్ద పెద్ద పదాలతో చెప్పే విషయాన్ని సూక్ష్మంగా, సునిశితంగా చెప్పేసారు రాజిరెడ్డి.

భోగిమంటల్లో ఏమేమి వెయ్యాలో హృద్యంగా చెప్పారు ఈ పుస్తకంలో. మోసం, కపటం, అసూయ, అపరాధ భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్వీటిని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలట. “రక్తప్రసరణ పెంచుకుని, జుట్టుని రాల్చుకుని, ముఖాన్ని మాడ్చుకుని…. వాటిల్లో మనం దహించుకుపోడమా, వాటినే మనం దగ్ధం చేయడమా?” అని అడగడంలో ఆనందంగా జీవించడమెలా అనే కళని చెప్పకనే చెప్పారు రచయిత.

ఎవరినో ఎందుకు మార్చాలి? ఇతరులలో తప్పులెందుకు పట్టాలి? జీవితాంతం జీవించడం నేర్చుకుంటూనే ఉండాలనే సెనెకా మాటలని ఉదహరిస్తూ ఈ ప్రపంచం పర్ఫెక్ట్ కాదంటారు. “నేనేమిటోఅన్న వ్యాసం పూర్తిగా రచయితకి సంబంధించినదే అయినా, ఇందులోని చాలా పాయింట్లతో చదువరులు తమని తాము ఐడింటిఫై చేసుకుంటారు.

పెన్ను విభాగంలోని రచనలు క్లుప్తంగా ఉన్నా, వాటిలో విస్తృతమైన, విశాలమైన భావాలున్నాయి. తాత్త్వికత జోడించిన అంశాలివి. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం పిల్లలకి మాత్రమే ఎందుకు సాధ్యమవుతుందో, ఆటతో పోలుస్తూ చెప్పడం బాగుంది. ప్రేమ, బాధ, ఆప్యాయత, అసూయ…. ఏ గుంపుకైనా సహజ లక్షణాలు అనుకున్నప్పుడు సంసారానికి, సన్యాసానికి పెద్దగా తేడా ఉండదంటారు రాజిరెడ్డి. “చెట్టు కదలకుండానే పెరుగుతుంది చూడు; మనిషి కూడా అలా లోలోపల పెరగలేడంటావా?” అని అడిగిన మల్లయ్య ప్రశ్న మనల్నీ ఆలోచనల్లో పడేస్తుంది.

ఇదే పుస్తకంలో మరోచోట అంటారు – “ఆడవాళ్ళతో సమస్యలుంటాయేమో గాని అమ్మతో పేచీ ఎప్పుడూ ఉండదుఅని. అమ్మల గురించి చెప్పినా, అందం అంటే ఏమిటో వివరించినా, స్త్రీలు అంటే ఎవరో నిర్వచించినా కుటుంబాన్ని, సమాజాన్ని దగ్గర్నించి చూసి, గ్రహించి, నిర్వచించినట్లు తెలుస్తుంది ఆయా వాక్యాలు చదువుతూంటే.

పుస్తకం కవర్ పేజి మీద ఉన్న పలక బొమ్మ మీద రాసిన అక్షరాలు – “: అతడు; : ఆమెమనకెన్నో సంగతులు చెబుతాయి. మనం మన గురించి కాక, ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. వాళ్ళిలా…. వీళ్ళిలా అంటూ వేరేవారి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఆపాదిస్తాం. కాని అసలు మనకి కావల్సింది ఎవరిని వారు తెలుసుకోడం అంటారు రాజిరెడ్డి.

ఈ పుస్తకం ఒక నాస్టాల్జియా! గతాన్ని నెమరువేసుకునే జ్ఞాపకం!! భవిష్యత్తులోకి భవ్యంగా నడిపే మార్గదర్శి!!! చదవడం పూర్తయ్యాక, ఈ పుస్తకం ఉపశీర్షిక ఒక మగవాడి డైరీఅనికాకుండా, “ఒక మనిషి డైరీఅని ఉండుంటే సరీగ్గా ఉండేదని అనిపిస్తుంది.

ఈ పుస్తకం గురించి అఫ్సర్ గారు తన ముందుమాటలో చెప్పిన వాక్యాలతో వ్యాసం ముగిస్తాను. “జీవితం ఒక వొత్తిడి. మనసుకీ, చేతకీ మధ్య, ఆలోచనకీ, సిరాకీ మధ్య – మనసు తీసే కూని రాగాలన్నీ వరుసబెట్టి కాయితమ్మీద తుమ్మెద బారులాగా చూసుకుంటే… అదిగో… అలాంటి పని రాజిరెడ్డి “పెన్ను” చేసింది. అనేక రకాల వొత్తిళ్ళ మధ్య మాట క్లుప్తం అవుతుంది. కానీ, మాటకి వొక పొందిక వస్తుంది. వొక జెన్ యోగి నిశ్శబ్దంలోంచి రాలిన హైకూలాంటి అరుదైన ఆకులాంటి భాష.”

సరళ వచనం, నమ్మశక్యంగాని సులభమైన శైలి ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివేలా చేస్తాయి. సారంగ బుక్స్ ప్రచురించి 113 పేజీల ఈ పుస్తకం వెల రూ. 75/- నవోదయ బుక్ హౌస్‌లో లభిస్తుంది. భారతదేశం బయట తెలుగువారికి అమెజాన్, సారంగ బుక్స్, ఎవికెఎఫ్ లోనూ లభిస్తుంది.

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

నిజం చెప్పద్దూ, మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు. దూరపు చుట్టాలలో సంగీతజ్ఞులు, ఇదే ఇంటిపేరుతో కొంతమంది రచయితలు వున్నా వారితో అనుబంధం తక్కువ. మరి నాలో ఈ సాహిత్యాభిలాష ఎక్కడిదా అని వెతుక్కుంటూ నాలోకి నేనే చూసుకుంటే –

ముందు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. గత పాతికేళ్ళుగా ఆమె జ్ఞాపకంగానే మిగిలింది. పాత సినిమాపాటలో, లలిత సంగీతమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా లేకుండా ఆమె నాకు గుర్తుకురాదు. రేడియో పాడుతుంటే, ఆమె పనులు చేసుకోవటం ఆమె గురించి గుర్తున్న సంతోషకరమైన జ్ఞాపకాలలో ఒకటి.

ఇక అదే రేడియోలో ఏ రాత్రిపూటో నాన్న పెట్టే కర్ణాటక సంగీతం – తెలియకుండానే త్యాగరాజునీ, శ్యామదాసునీ, పురంధరదాసునీ పరిచయం చేసేవి. సుబ్బలక్ష్మి, శమ్మంగుడి, మహారాజపురం, కున్నకూడి, పట్టమ్మాళ్ ఇలా ఒక్కొక్కళ్ళే మా గోడమీద చెక్కస్టాండ్ స్టేజి పైకి ఎక్కి టేప్ రికార్డర్ రూపేనా కచేరీలు చేస్తుండేవాళ్ళు. వీళ్ళంతా నాన్న సేకరించిన వందలకొద్ది సంగీతం క్యాసెట్లలో సంగీత సామ్రాట్టులు. వీరందరి మధ్యలో అక్కడక్కడ కనిపించే నాలుగైదు సినిమా పాటల క్యాసెట్లలో నుంచి ఎ.ఎమ్.రాజా, ఘంటసాల, లీల, సుశీల గొంతు సవరించేవాళ్ళు. వీళ్ళంతా అమ్మకోసం నాన్న రికార్డ్ చేయిస్తే ఇంటికి వచ్చిన అతిథులు. ఈ సంగీతం, సినీగీతం మధ్యలో ఎక్కడో కళల గురించి ఆసక్తో, అభిరుచో మొదలైంది.

వేమన్నని, పోతన్నని పరిచయం చేసింది మేనత్త. తొలి అడుగులు వేస్తున్నప్పుటి నుంచే తెల్లవారుఝామున లేపి, నీళ్ళు పోసి, దేవతార్చనకి పూలు కోసే నెపంతో నన్ను పక్కింటికి తీసుకెళ్ళి “శుక్లాంబర ధరం”తో మొదలుపెట్టి, “ఇంతింతై వటుడింతై” అంటూ పోతనని పలకరించి, ఆ తరువాత పాడ్యమి విదియ తదియలు, ప్రభవ విభవలు చెప్పించేది. తెల్లవారుఝామున చెప్పిన పద్యాలు, చదివిన చదువులు, నందివర్ధనం చెట్టు మీద నుంచి రాలిపడిన మంచుబిందువులంత స్పష్టంగా గుర్తున్నాయి. అక్కడ తెలుగుతో పరిచయం అయ్యింది.

“నానమ్మా కథ చెప్పవూ” అనే మాటతోనే రాత్రుళ్ళు మొదలయ్యేవి మాకు. రాజకుమారుడు, తెల్లగుర్రాలు, పూటకూళ్ళపెద్దమ్మలు, కాశీమజిలీలు, భోజరాజు కథలు, విక్రమార్కుడు… నిద్ర… కథ…! వింటూ నిద్రపోతూ, కథల్లో తూగుతూ, కలల్లో కథని చూస్తూ, మనమే యువరాజులై గుర్రం పైన స్వారీ చేస్తూ వుంటే… ఇంతలో రాక్షసుడొస్తే పక్కనే ధైర్యం చెబుతూ నానమ్మ. కొంత వూహ తెలిసాక రామాయణం, మహాభారతం ఆ తరువాత ధృవుడు, ఇంకోరోజు హరిశ్చంద్రుడు… “లోహితా, లోహితా” అంటూ హరిశ్చంద్రుడు ఎంత ఏడ్చాడోకానీ, నానమ్మ ఆ కథ చెప్పిన ప్రతిసారీ ఏడవడం ఒక ఆశ్చర్యకరమైన జ్ఞాపకం. కథతో, అందులో వుండాల్సిన ఎమోషన్ తో తొలి పరిచయం.

ఆ తరువాత ఇంకేముంది – మనకి చదవటం వచ్చేసింది. పాఠ్య పుస్తకాలలో – మొక్కపాటి, పానుగంటి, జాషువా, కరుణశ్రీ, సర్ ఆర్థర్ కానన్ డాయల్, సోమర్ సెట్ మామ్, బయట పుస్తకాలలో – యండమూరి, మల్లాది, సూర్యదేవర, యద్దనపూడి వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరినీ చదివి అవన్నీ చాలక కనపడ్డ పుస్తకమల్లా నమిలేస్తూ, నెమరేస్తూ – కిరాణా కొట్టులో కట్టిచ్చిన పొట్లాల కాగితంతో సహా చదివేసి తృప్తిగా తీరుబడిగా కూర్చున్నాక ఒక శుభముహుర్తాన శ్రీశ్రీ కనపడ్డాడు. ఆయన వెంట మొదలుపెట్టిన పరుగు “కలం కల” అంటూ కవితై మయూరి వారపత్రికలో అచ్చైంది. ఆ తరువాత కథలు – 1995 తొలికథ ఆంధ్రప్రభ ఆదివారం పత్రికలో దీపావళి కథలపోటీలో సాధారణ ప్రచురణ. అప్పుడే రైల్వే జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కథలపోటీలో మొదటి బహుమతి. తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

Cover

సాహితీవైద్యం కోసం వసుంధరగారికి రాయచ్చో రాయకూడదో అనుకుంటూ, ఒక రోజు ధైర్యం కూడగట్టుకోని “ఈరేశంగాడి ముచ్చట” పంపించాను. “కథాంశం బాగుంది. మీకంటూ ఒక శైలి ఏర్పడాలంటే మీరు ఎక్కువగా చదవా”లని వారి నుంచి ఉత్తరం. పెద్దల మాట చద్దన్నం మూట అని నాన్నమ్మ చెప్పిన మాట. అప్పుడే మరిన్ని పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నాను!

అదే మొదలు. ఇట్నుంచి షిడ్నీ షెల్డన్, అగాథా క్రిస్టీ అట్నుంచి ముళ్ళపూడి, కొకు, బుచ్చిబాబు, చలం…. చదువుతున్నకొద్దీ కుచించుకుపోయి, నేను రాసినవీ కథలేనా అని ఆ మహామహుల రచనలలో ఆవగింజంతైనా అందుకునేదాకా రాయకూడదని ఆరేడు సంవత్సరాలు అజ్ఞాతవాసం. నేను రాసేది నాకు నచ్చేదాకా చదవటమే ఒక పని (ఇప్పటికీ కొనసాగుతోంది). గుజరాత్ లో చదువులు ఆ తరువాత కార్పొరేట్ వుద్యోగం. వుద్యోగం వూళ్ళు తిప్పింది. కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొత్త పుస్తకాలు… కొత్త కొత్త కథలు. ఇందోరులో వున్నప్పుడు ఉజ్జైనిలో మంచినీటి కటకట గురించి పేపర్లో చదివిన తరువాత మళ్ళీ కలం కదిలింది. కొత్తగా పరిచయమైన టెక్నాలజీ సాయం తీసుకొని బ్లాగులు, అంతర్జాల పత్రికలకే పరిమితమై వుండిపోయాను.

ఆ తరువాత పరిచయమైన సాహితీ మిత్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. బ్లాగుల్లో గుట్టుగా వున్న నన్ను అచ్చోసిన రచయితని చేశారు.

వసుంధరగారిని మళ్ళీ పలకరించాను. “మీ కథలకి ఇక సాహితీవైద్యం అవసరంలేదు. పుష్టిగా వున్నా”యన్నారు. పత్రికలో నా కథ వచ్చినప్పుడల్లా చదివి అభినందించారు, ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఇచ్చిన ధైర్యం తోనే ఈ పుస్తకానికి వాళ్ళనే ముందుమాట అడిగేదాకా తీసుకొచ్చింది. వారి వాత్సల్యానికి, ప్రోత్సాహానికి నా సగౌరవనమస్సులు.

ఈ పుస్తకంతో నా సాహితీ ప్రస్థానం మొదలైంది.

***

చివరిగా ఒక్క మాట – ఇదంతా సోత్కర్షలా వుంటుందని తెలిసినా చెప్పే ధైర్యం చేశాను. చెప్పాల్సిన అవసరం వుందనిపించింది కాబట్టే ఆ సాహసం.

తెలుగు భాషని మరుగుపరుస్తున్నారన్న అపవాదు మోసే తరంలో వాడిని నేను. ఆంగ్లమాధ్యమంలో చదువులు, కార్పొరేట్ వుద్యోగాల పరుగుల మధ్యలో తెలుగు భాషాభిమానాన్ని, సాహితీ ఆసక్తిని సజీవంగా వుంచుకోవచ్చని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నాలాంటివారు ఎందరో వున్నారు. తెలుగు భాష అంతరించిపోతోందని బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మానకూడదు. రేపటి తరానికి రెండు కథలు, నాలుగు పద్యాలు, కాసిన్న సామెతలు చెప్పి తెలుగు భాషని రుచి చూపించండి. ఆ తరువాత పఠనాసక్తిని కలిగించి వదిలిపెట్టండి. ఏ మాధ్యమంలో చదివినా, జీవనానికి మరే భాష అవసరం అయినా తెలుగు మీద మక్కువ ఎక్కడికీ పోదు. అందుకు నేనే సాక్ష్యమని చెప్పడానికే ఈ ముందుమాట.

 

భవదీయుడు

అరిపిరాల సత్యప్రసాద్

final invi

అతనిలా ఇంకెవరున్నారు?!

“కాలే గచ్చుపై కుంకుండు గింజలు గీకి
నాకు తెలీకుండా నువ్వు చురుగ్గా అంటించినప్పుడు
పరిక పొదల్లో గుచ్చిన ముళ్ళని
నొప్పి తెలీకుండా నేను సుతారంగా తీసినప్పుడు
ఎర్రటి మధ్యాహ్నం మనం భూతద్దపు చేతులతో
రెండు పచ్చి అగ్గిపుల్లలని వెలిగించ చూసినప్పుడు”

ఈ గుప్పెడు పదాలూ చదివేసరికి, మనం ఎక్కడి వాళ్ళమక్కడి నుండి తప్పుకుని, పసితనపు వీథుల్లోకి పరుగూ తీస్తాం. జ్ఞాపకాన్ని వెన్నెలకిరణమంత సున్నితంగా స్ఫృశిస్తూ , మనకే తప్ప మరొకరికి తెలీదనుకున్న బాల్యాన్ని అక్షరాల్లో గుప్పిస్తూ “నీలాగే ఒకడుండేవాడు” అంటూ పేరుతోనే మనసులకు ఎర వేసి లాగిన వాణ్ణి – ‘ఆ మాట నీకెలా తెలిసిందసలు’ అంటూ ప్రశ్నించేందుకు సిద్ధమవుతాం. నిండా పాతికేళ్ళు నిండని పసివాడు కదా, బహుశా కవిత్వమంటే బాల్యమేనన్న భ్రమలో ఉన్నావాడేమో కదా, లోకాన్ని చూడని అమాయకత్వం పదాల్లో వెల్లువలా పొంగుతోంటే, కవిత్వమంటూ మనకిచ్చాడు కానీ…అని ఊహిస్తూ ఊరికే పేజీలు తిరగేస్తోంటే..

“వెన్నెల స్నేహితా!
నిన్నేమీ అనను. నువ్వు చేస్తున్న దేన్నీ ప్రశ్నించను. నీకు దేహం కావాలి. సత్తువతో నిండిన దేహం. శుభ్రత నిండిన మనసు, స్వచ్ఛత నిండిన ఆత్మ కావాలి. మనం మనమై జీవించడం కావాలి. అనుభూతి సంపదను సృష్టించడం కావాలి. ఏం చేద్దాం?! అవేమీ నా దగ్గర లేవు. ఉన్నదల్లా ఒక అనారోగ్యమైన దేహం, గాయాలు నిండిన మనసూ, వెలుతురు లేని ఆత్మ. నీ అద్భుత హృదయం లాంటిదే నాకూ ఉంటే బాగుండు. ఈ విషాదాలు, నిషాదాలూ అన్నీ ఒకేసారి అంతమైతే బాగుండు. చిందరవందరగా పడి ఉన్న ఊహలకి నిశాంతమేదైనా ఆవహిస్తే బాగుండు. కానీ-

కానీ, ఏదీ జరగదు. ఒక పిచ్చి ఊహలో తప్ప ఏవీ ఎక్కడా అంతమవవు.
దుఃఖిత సహచరీ!
మసకలోనే అడుగులేస్తాను. మసకలోనే తప్పిపోతాను. మసకలోకానికే జీవితం రాసిచ్చి ప్రయోజనం లేకుండా పరుగు తీస్తాను.” అంటూ ఊపిరి వేగం పెరిగేంత ఉద్వేగం కలిగిస్తాడు. ఎవరితను? చలాన్ని గుర్తు చేసేంత తీవ్రతతో జ్వలించిపోతున్న పిల్లవాడు – ఎవరితను?

గుర్తొస్తారు, ఒక్కో కవితా మొదలెట్టగానే, ఎవరెవరో కవులు గుర్తొస్తారు. కానీ కవిత పూర్తయ్యేసరికి మాత్రం, ఈ కవి ఒక్కడే మిగులుతాడు, ఒక అపూర్వ అనుభవాన్ని మనకి విడిచిపెడుతూ. అదే నంద కిశోర్ ప్రత్యేకత. ఇతనికి తనదైన గొంతు ఉంది, తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలి ఉంది. ఇంకా, అతనికి మాత్రమే సొంతమైన కొన్ని అనుభవాలున్నాయ్. అయితే, అవి ఎలాంటివైనా, ఆ బాధనో, సంతోషాన్నో, పాఠకులకు సమర్థవంతంగా చేరవేయగల నేర్పూ, ఆ విద్యలో అందరికీ దొరకని పట్టూ కూడా ఉన్నాయ్. పాఠకులను ఆదమరచనివ్వడు. పరాకుగా చదివే వాళ్ళను కూడా “ఓయ్, నిన్నే!” అని కవ్వింపుగా పిలిచి మరీ ప్రశ్నించే అతని గడుసుదనం, ఈ కవిత్వాన్ని తేలిగ్గా తీసుకోనివ్వదు. అంత తేలిగ్గా మరచిపోనివ్వదు.

“చేపలా తుళ్ళేటి పరువాన్నంతా
దేశాలమీదుగా విసురుకున్నవాళ్ళం.
వానలా కురిసేటి యవ్వనపు కోరికని
సముద్రపు అంచులకు వదులుకున్నవాళ్ళం.
ఒరుసుకున్న రాళ్ళ మీదా ఓడించే నీళ్ళ మీదా
సంతకాలు చేసినవాళ్ళం, సంతోషం పొందిన వాళ్ళం.
చెప్పు! ఏదో ఒకటి..
అంతా అర్థమవుతోందనో
అప్పటిలా ఉండలేననో చెప్పు.
అసలే తెలీదనో
అణువంతైనా గుర్తులేదనో చెప్పు.
నిశ్శబ్దాన్ని వింటూ
రక్తం ఇంకిపోకముందే

నేనేడ్వనుగాని
ఓయ్!నిన్నే…”

“నిశ్శబ్ద్దాన్ని వింటూ, రక్తం ఇంకిపోకముందే” అన్న నాలుగు పదాల్లో ఆశానిరాశల ఊగిసలాటనీ, తానిక మోయలేని బాధనీ సుస్పష్టంగా చూపెడుతూనే, “నేనేడ్వను గానీ” అన్న మరుసటి పాదంలో తనకున్న తలబిరుసునంతా చూపెడతాడు. ఆ “ఓయ్! నిన్నే” అన్న పిలుపుకు ఎంత వేటాడే లక్షణమున్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గుండె ఒక్కసారిగా ఝల్లుమని, నన్నేనా అన్న ఉలికిపాటుతో లోకంలోకి, అతని లోకంలోకి, కవిత్వంలోకీ గబగబా వెళ్ళి చక్కర్లు కొడుతూంటామే – అప్పుడనిపిస్తుంది, కవిత్వం ఇతనికి అడక్కుండా దొరికిన వరమని.

ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలను సమీక్షిస్తే, అనుభూతిని ఆమోదయోగ్యంగా, ఆస్వాదయోగ్యంగా చేయడానికి ఉన్న పద్ధతుల్లో,” స్వాత్మీయీకరణ” ప్రథానమైనది. పఠితకు అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవి వ్యక్తీకరించడం, దానిని పఠిత ఆత్మీకరించుకుని తాదాత్మ్యంతో అనుభవించడం ఈ ప్రక్రియలో కనపడుతుంది. ఈ సంపుటిలో ఎన్నో కవితలు కవికి ఈ ప్రక్రియలో గల పట్టుకి అద్దం పడతాయి. కవితల దాకా కూడా వెళ్ళక్కర్లేదు, “నీలాగే ఒకడుండేవాడు” అన్న శీర్షికలోనే ఎంత కవిత్వం ఉందో , చూసే కళ్ళుంటే!

“నీలాగే ఒకడుండేవాడు..
వాడు నీలాగే-
అచ్చం నీలాగే నవ్వుతూ తుళ్ళుతూ
పొద్దు నెత్తికెక్కుతుంటే గారాలు దులుపుకుంటూ
చేతిలో సంచితో, సంచిలో సద్దితో
సద్దిలో బువ్వతో, బువ్వలో అమ్మతో
పొద్దుగూకేదాక బళ్ళోనే దాగిపోయి
సాయంసంధ్యపైన సూరీడై వెలిగేవాడు”

అని ఈ నందుడు అంటున్నప్పుడు ఎందరు యశోదల మనసులు బరువయ్యాయో ఊహించడం అసాధ్యమేం కాదుగా!

“కవిత అందరిళ్ళకూ వెళ్ళదు, ఎవరి ఇంటి తలుపు తడుతుందో, అతడిక ఉన్మత్తుడు” అంటారు చినవీరభద్రుడో కవితలో. నందకిశోర్ కవిత్వంలో ఆ ఉన్మత్తత ఉంటుంది. అది ఎదుటి వాళ్ళకి వెన్నులో నుండి జలదరింపు తెప్పించేంత గాఢమైనది.లోతైనది.

“తూరుపు దోసిట్లోంచీ సూర్యుడు రాకముందే ఊపిరి నదుల్లో స్నానం చేసి రావాలి. పోనీ- నాలోంచీ నువ్వూ, నీలోచీ నేనూ నడుచుకుంటూ పోతాం, ఏంటట? నా కాళ్ళకి వెన్నెల అంటుకోనీ..నీ కాళ్ళు రెండూ రాళ్ళు తగిలి చిట్లిపోనీ..ఏంటట” అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పేస్తాడో!

“శిశిరాన్నిగెలిచిన పిచ్చిలో వెర్రిలో
చెట్టుకి ఏమీ పట్టకపోవచ్చు.
వాలే పక్షులకి ఏ చెట్టైనా ఒక్కటే
గూడు కడ్తే గుండె పగిలిపోతుంది.
గాలివానొకటి గట్టిగా వీస్తే
నిజం నిక్కచ్చిగా తెలిసిపోతుంది.”

– అన్నప్పుడు చేదు జీవిత సత్యాలను అలతి పదాలలో కూర్చిన నేర్పుకి అవాక్కయ్యాను. ఆత్మాశ్రయ పద్థతిని దాని చివరి అంచుల దాకా కొనసాగిస్తే, ఏనాడైనా బాహ్య ప్రపంచాన్ని పునర్దర్శించే పరిణామం తప్పదు. ఉదాహరణగా పై కవితనే తీసుకుందాం. ఇక్కడ చెట్టును జీవితంతోనూ, వాలే పక్షులను అవసరాలుగానూ ఊహించుకోండి. మీకొక భావం చప్పున స్ఫురిస్తుంది. అలా కాకుండా చెట్టును ఒక మనిషి గానూ, వాలే పక్షిని స్త్రీగానూ ఊహించుకోండి – మరొక అద్భుతమైన అర్థం దొరుకుతుంది. ఇహ దాని నుండీ “గూడు కడితే గుండె పగలడం” ఎందుకో, “గాలివాన వస్తే తేలిపోయే నిజ”మేమిటో కవి చెప్పక్కర్లేదు. గొంతుకలో కొట్టాడుతున్న ఆ భావాన్ని నిజానికి పదాల్లో పెట్టక్కర్లేదు. అదే ఈ కవితలోని సౌందర్యం. కవి ఏ ఉద్దేశ్యంతో రచన చేశాడో అంతకంటే భిన్నమైన స్ఫూర్తినివ్వగల శక్తి దానికి ఉన్నప్పుడే, అది కాలం ధాటికి తట్టుకుని నిలబడగలదు. ఈ కవితకు ఆ శక్తి ఉందో లేదో, ప్రతీకలను అర్థవంతమైన వస్తువులతో పూరించగల పాఠకులెవరైనా తీర్మానించగలరు.

1461245_10102664998433657_1684156529_n

ఈ పుస్తకం ఉత్తరార్థం మాత్రం ఒకింత పలాయన లక్షణాలతో ఊహాజనిత దుఃఖ పరిథికి కుదించుకుపోవడం మొదలెట్టింది. ఉదాత్తంగానూ సమస్తాన్నీ ఆత్మీకరించుకోగలిగింత విస్తృతంగానూ కనిపించిన ప్రణయ భావం మెల్లిగా ప్రతికూలమై, జీవితానికే ప్రతికూలమై “ముగింపు” కోసం ప్రాకులాడుతున్న భావన కలిగిస్తుంది.

“ఎవరికీ చెప్పకుండా, ఎవర్నీ అడగకుండా/ఎందుకో తెలీకుండా ఉరి వేసుకుంతారు” అన్న పంక్తుల్లోనూ,

“సముద్రం వాణ్ణి ప్రేమించిందని
ఎవ్వరికీ చెప్పడు
కల్లోలాన్ని వాడు కోరుకున్నట్టు
ఎప్పటికీ తెలీదు
తెలిసేదల్లా
వాడిక లేడనే!”

అన్నప్పుడూ ఇదే ధోరణి కనపడుతుంది.

రెండవ సమస్య అతని భాషకు సంబంధించినది. చాలా చోట్ల అతను కొత్త పదాలను కూడా సృజించాడు, సందర్భోచితంగా వాడాడు. మచ్చుకు, ఒక కవితలో “నిశిద్దోహలు” అని వాడాడీ కవి. ఆ పదం ఉందా? లేదు. మరెందుకలా వాడాడూ? అతని కవిత చెప్తుంది. కొన్ని చోట్ల భాషాపరంగా, శైలిపరంగా ప్రయోగాలూ చేశాడు. వాటితో కూడా నాకేం పేచీ లేదు. “రాఖీ” కవితలో చక్కటి తెలంగాణా మాండలీకాన్ని వాడాడు. నన్నడిగితే ఆ కవిత ఈ పుస్తకానికే తలమానికమంటాను.

“గనపడంగనే
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు తుడుసుకున్నట్టు..
తెచ్చిన దారప్పోసల రాఖీకి
నీ లెక్క నా లెక్క గుచ్చిపెట్టిన..” అంటూ ఆర్ద్రంగా సాగిపోయే ఆ కవిత, ఏమో, మామూలుగా వ్రాసి ఉంటే ఏ మేరకు అలరించేదన్నది ప్రశ్నార్థకమే. కానీ ఇలా వ్రాయడంలో మాత్రం తమ్ముడి చేతికి రాఖీ కట్టేందుకు తపిస్తోన్న అక్క తడికళ్ళత్ మన ముందుకొస్తుంది.

అలాగే “పిచ్చిరాత” కవితలో “దృశ్యాదృశ్య సంకెలలు తెగి/నిస్సందేహ స్వేచ్ఛావాయువులలో/ఏకాంతముగా సంగమించు” అంటూ గ్రాంథికంలోకి ముడుచుకున్నప్పుడు కూడా దానినొక విలక్షణతగానే స్వీకరించగల్గుతాం ( ఈ కవితలో ఒకే ఒక్క పాదంలో మాత్రం శిష్ట వ్యావహారికాన్ని కవి వాడటం కనిపిస్తుంది – అది కవితా ప్రవాహానికి అడ్డు కలిగించకపోగా దాని ప్రత్యేకతను నొక్కి చెప్తుంది). కనుక, ఈ కవికి భాష ఉన్నది ఎందుకో తెలుసు. ఏ మాండలీకంలో లేదా ఏ శైలిలో తన మనసు లోతుల్లో ఉన్న భావం నర్మగర్భంగా పాఠకులకు చేరవేయాలో సుస్పష్టంగా తెలుసు. ఇంత తెలిసినవాడు కూడా మామూలు భాషలో సాగుతోన్న కవితల్లో “వాణ్ణి” అనవలసిన చోట “వాన్ని” అనడమే, బొత్తిగా మింగుడుపడని విషయం. అలాగే “అట్లా” అని దీర్ఘం ఉండవలసిన చోట హ్రస్వంతో రాజీపడటం (ఉదాహరణకు ఆఖరు పేజీలోని – “రాళ్ళెట్ల వికసించేదీ, పువ్వులెట్లా బద్దలయ్యేదీ రహస్యం” అనడం) అకారణమనిపిస్తుంది. ఇవి అచ్చుతప్పులో, కవి ఈ పదాలను పలికే పద్ధతిదేనో పాఠకులకు అర్థమయ్యే అవకాశం లేదు. ఏదేమైనా, ఈ పలుకురాళ్ళ ఏరివేతలో పాయసపు రుచిని మరచిపోయే ప్రమాదమెంతైనా ఉంది కనుక, మలి ముద్రణల్లో ఈ లోపాలు సవరించబడతాయని ఆశిద్దాం.

ఒక సంవత్సర కాలంలో సృజింపబడ్డ కవిత్వం కనుక, సమకాలీన సమాజపు పోకడలేవో కవిని ప్రభావితం చేయడమన్నది ఊహించదగ్గ విషయమే. స్పందించే లక్షణమూ, దానిని భద్రపరచాలన్న తలంపూ ఉన్నవాడవడం వల్లేమో, “కాంక్ష” అంటూ పాక్, ఆఫ్గన్, సిరియాలను చుట్టేసి వచ్చాడు. కవిలో అకస్మాత్తుగా కనపడ్డ ఈ అభ్యుదయవాదం మాత్రం ఆశ్చర్యపరచింది. భావకవిత్వ లక్షణాలతో ఉప్పొంగిన ఈ కవితా సంపుటిలో, ఈ ఒక్క కవితా తన చుట్టూ తానే ఒక గిరి గీసుకుని పాఠకులను అటు నుండటే వెళ్ళిపొమ్మంది. ఈ సంపుటిలో ఇమడదనిపించిన ఒకే ఒక్క కవిత ఇది.

మొదటి 36 కవితలకు అనుబంధంగా వచ్చిన వచనాన్ని ( అనుకోకుండా, ఒక సంధ్యావస్త కాలంలోంచీ)చదువుతున్న కొద్దీ, ఈ కవికి బలమైన అభివ్యక్తి, శిల్పానికి సంబంధించి గొప్ప అభిరుచీ, ప్రత్యేకతా ఉన్నాయని తెలుస్తుంది. “చిట్టితల్లీ” అనేటప్పుడతడి నిష్కల్మషమైన అనురాగమూ, “దేవీ, దేవీ!” అంటూ తపించే ఇతగాడి వలపూ, “వెన్నెల స్నేహితా!”, “దుఃఖిత సహచరీ!” అంటూ ఆర్తిగా పిలుచుకునే నవనీత హృదయమూ, మనకు తెలీకుండానే కవితో ఓ దగ్గరి సంబంధాన్ని కలుగజేస్తాయి. “తన బాధను లోకం బాధ”గా మలచిన కృష్ణశాస్త్రి అసంకల్పితంగా గుర్తొస్తారు.

” ఆ కొత్త రోజుల్లో, మేలుకున్న కొత్త సమాజంలో తనకు లభించిన ఒకటి రెండు అనుభవాలనో, కష్టసుఖాలనో కవి తన దివ్యకావ్యాల్లో పెట్టాడు. తరువాత అహంకారం వల్లనో, అశ్రద్ధ వల్లనో ఆ అనుభూతుల్నే కౌగిలించుకుని చుట్టూ ఆవరణ కట్టి కూర్చున్నాడు”
– (–పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం, భారతి రజతోత్సవ సంచిక)

కృష్ణశాస్త్రి తన కవిత్వం గురించి తానే చెప్పుకున్న మాటలివి. పునరుక్తి దోషాలకు తన బాధ్యత ఎంతవరకూ ఉందో లోకం ముందు ఒప్పుకుంటూ చెప్పిన సత్యమిది. శైలి, భాష, శిల్పాల పరంగా ఏ పోలికా లేకపోయినా, ప్రస్ఫుటంగా కనపడే సంవేదన ఇద్దరిలోనూ ఒకటే కనుక, పై మాటలు ఈ కవి భవిష్యత్తులో ప్రచురించబోయే మరే కవితా సంపుటికీ అద్దం పట్టే స్థితి రాకూడదని అభిలషిస్తున్నాను. ఆ ఆవరణలు మరీ సంకుచితమై, కరుడు గట్టి, కవికీ పాఠకులకు మధ్య ఏ అఖాతాన్నీ సృష్టించకుండా నందకిశోర్ తగిన జాగ్రత్తలు తీసుకోగలడనే విశ్వసిస్తున్నాను.

నందకిశోర్లోని కవితాదృష్టి విశ్వరహస్యాల్నీ, జీవిత రహస్యాల్నీ వర్తమాన వస్తుప్రపంచంలో చూడటాన్ని నిరాకరించి, లేదా అధిగమించి అనుభూతి వైశిష్ట్యంలో అన్వేషించింది. అందుకే అంత ప్రత్యేకంగా కనపడుతుందది. అమలిన శృంగారాన్ని ప్రతిపాదించడంలోనూ, అనుభూతులకు పట్టం కట్టి రూపపరంగా నూతన అభివ్యక్తి మార్గాలను సుసంపన్నం చేయడంలోనూ, అనుభూతిని విస్తరింపజేయడానికి సమర్థంగా కవితాభాషను రూపొందించుకోవడంలోనూ ఈ కవి తనదైన ముద్రను ప్రతి పుటలోనూ చూపెడుతూ వచ్చాడు. ఆనందానికి ఒకింత నిర్లక్ష్యాన్నీ, బాధలకు ఒకింత నిబ్బరాన్నీ జోడించి, మోహంలో మాత్రం ప్రాణాలర్పించే నిజాయితీని ప్రకటిస్తూ సాగిన ఈ సంపుటి, “నీలాగే ఒకడుండేవాడు” అన్న కవి మాటలకు నిజమేనని జవాబివ్వగల అనుభవాన్నైతే ఇచ్చే తీరుతుంది. ఆశ్చర్యానికి పదాలు మరచిన లోకంలో మనను వదలిన ఈ కవి, మరిన్ని సంపుటులతో మళ్ళీ మన ముందుకు రావాలనీ, “నీలా మరెవ్వరూ ఉండరు” అనిపించేంత ప్రత్యేకంగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలనీ మనసారా ఆకాంక్షిద్దాం.

–మానస చామర్తి

మానస చామర్తి

మానస చామర్తి

అంట్లు.. పాచి… కూసింత ఆత్మీయత!

amma and satavathi

పనిమనిషి, పనమ్మాయి మా ఇంట్లో వినిపించనేకూడని ఒకేఒక్క పదం.

                 ఐతే మా ఇంట్లో ఎవరూ పనిచేయరని కాదు. పనిచేస్తారు. సబ్బు లక్ష్మి, సముద్రం(మనిషి పేరు), సిరి, నాగవేణి, నాగమణి, సత్యవతి-ఇలా ఎందరు మా ఇంట్లో పనిచేసినా పేర్లతో పిలవడమే తప్ప “మా పనమ్మాయి” అని ఎప్పుడూ అమ్మ అన్నది లేదు. మేము “పనమ్మాయి వచ్చిందమ్మా” అని చెప్తే ఊరుకున్నదీ లేదు. స్వావలంబన, సమానత్వం, వ్యక్తి గౌరవం లాంటి పెద్ద పదాల గురించి మా అమ్మ చదివినట్టు లేదు కానీ నాకు తెలిసినంతలో వాటి స్పృహ, ఆచరణల్లో ఆమెని మించినవారిని నేనెన్నడూ చూడలేదు. ఇంకో విశేషమేంటంటే మా అమ్మ సహృదయత, సంస్కారం మా చుట్టపక్కాలకే కాదు మాకే స్పష్టంగా తెలిసేది కాదు. కొడుకును కాబట్టి అమ్మ ఆచరణను దగ్గరనుంచి చూస్తూండగా ఏళ్లకేళ్లలో నాకు అర్థమైంది మా ఇంట్లో పనులు చేసేవాళ్లను ఆమె చూసుకునే పద్ధతి. అమ్మా నువ్విలా చేస్తున్నావు తెలుసా అంటే ఆమె కూడా ఆశ్చర్యపోయిందంటే చూడండి.
                అమ్మ నాకు మా తాతముత్తాతల గురించీ,పెదనాన్నలు, అత్తయ్యల గురించి తెలుసుకున్న విశేషాలు(పుకార్లు చెప్పేది కాదు. కచ్చితంగా తెలిసినవే చెప్పేది), వాళ్ల జీవితంలో చీకటివెలుగులు చెప్తూంటుంది. అలాంటి వాటిలో ఒకటి మా పెదనాన్న-అతని నౌకరు కథ. మా తల్లిదండ్రులది మేనరికం. మా నాన్నారి అక్కకూతురు మా అమ్మ. ఇద్దరూ మేనమామ-మేనకోడళ్లు. పైగా ఆమె బాల్యం చాలావరకూ(దాదాపు ఆమె 10ఏళ్ల వయసు వరకూ) మా పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తయ్యలు, నాన్నమ్మలతో మా స్వగ్రామంలో ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. మా పెదనాన్న(అంటే అమ్మకి పెదమావయ్య) గ్రామ కరణం. బహుశా ఈ కథ 1975-80 కాలంలోనిది. ఓరోజు నౌకరు కొడుకు వెంకడు(పేరుమార్చాను) మా ఇంటికి వచ్చాడట. అతనిదీ చాలా చిన్న వయసే. మా అమ్మ బయటకి వచ్చి “పెదమావయ్య స్నానం చేస్తున్నాడు. అలా అరుగు మీద కూచో” అందట. మంచినీళ్లేమైనా కావాలా అనడిగి, పెద్దాయనకి చెప్పేందుకు వెళ్ళింది. స్వతహాగా మా పెదనాన్నది ప్రథమకోపం.
అరుగుమీడకి వచ్చీరాగానే పిచ్చగా తిడుతూ కొట్టినంత పని చేసాడు.  అతని మాటల్లోనే తేలిన విషయమేమిటంటే- కచేరీ చేసే అరుగు మీద నౌకరు కొడుకు కూర్చోవడమేంటి? ఊళ్ళో రాజులేవరైనా చూస్తే మళ్లీ మా అరుగెక్కుతారా? నిజానికి మా అమ్మ అప్పటికి చాలా చిన్నది. ఇలా కూడా ఉంటుందా లోకం అని కొత్తగా తెలిసింది ఆమెకి. ఐతే మా అమ్మ కథ ఇక్కడితో ఆపలేదు. ఓ పదేళ్లు తిరిగేసరికి వెంకడల్లా గ్రామనౌకరుగా ప్రభుత్వంచే నియమింపబడ్డాడు. మా పెదనాన్న ఉద్యోగం సక్రమంగా చేయాలంటే నౌకరు చక్కగా సహకరించాలి కదా. పైగా నాటికి సాంఘికమైన కొన్ని కట్టుబాట్లు, మూర్ఖపు పట్లు పలచబడ్డాయి. వెంకడితో మండల కేంద్రానికి వెళ్ళే పని పడింది. పాత విషయాలేవీ గుర్తులేని ఆయన “రా ఎక్కు” అని (మోటారు)బండి ఎక్కమని పిలిచాడు. అతను గతం మర్చిపోలేదు. “మీ బండి ఎక్కితే పెద్దమనుసులు ఎవురైనా మళ్లీ ఎక్కుతారాండీ” అని గతం గుర్తుచేసుకుని బాధపడ్డాడు. మా పెదనాన్న అయ్యో ఏదో అప్పుడు అలా జరిగిపోయింది లే బాధపడొద్దని సముదాయించాడు. ఆ తర్వాత అతను రెవెన్యూ ఉద్యోగి కూడా అయ్యాడు. అప్పుడు కూడా “మీ అరుగు మీదకి నేనెక్కితే పెద్దమనుషులు ఎవరైనా మీ అరుగు తొక్కుతారాండీ” అని వేళాకోళంగా అనేవాడు. గతం తిరగదోడాడు. అప్పటికి మా అమ్మకి పెళ్లయింది, దీనికీ అమ్మ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇలాంటివి ఎన్నో ఆమె దృక్పథం వెనుక ఉండి ఉంటుంది. “పనివాళ్లయితే మనుషులు కాదా. జరుగుబాటు లేని ఇళ్ళలో వాళ్ళు పుట్టారు. ఎంతో కొంత జరుగుబాటున్న ఇంట్లో మనం పుట్టాం. అంతే కదమ్మా తేడా” అంటుంది అమ్మ. అందుకే మా ఇంట్లో పనిమనుషులన్న మాట చాలా తప్పు మాట.
                           అమ్మ పెళ్ళవగానే “ఎంప్లాయర్” అయ్యింది; మా అమ్మ దగ్గర పని చేసిన మొదటి పనిమనిషి పేరు సబ్బు లక్ష్మి. పల్లెటూళ్ళో కాపురం. 2 పెద్ద అరుగులు, కాఫీ వసారా, ఉత్తరంపు వసారా, విశాలమైన చావిడి, వంట గది, పూజగది, తూర్పువైపు గది, పెద్ద మెట్టు(వీధి వైపుంటే అరుగంటారు అది మగాళ్ల సామ్రాజ్యం, మరి ఏ వైపున్నా మెట్టంటారు. అక్కడ అమ్మలక్కల కబుర్లు సాగుతూంటాయి).బయట దస్త్రాల గదితో సహా 500గజాల్లో ఉండే పేద్ద ఇల్లు అంతా మా అమ్మ చక్కబరుచుకోవాల్సి వచ్చేది. మిగిలిన పెద్దనాన్నలు ఇల్లు వాటా వేసుకున్నా ఊళ్ళో ఒకరు, పక్కూరిలో మరొకరు, హైదరాబాదులో ఇంకొకరు అద్దెకుండేవారు. దాంతో మా అమ్మ వాళ్ళ వాటాలతోపాటు ఇల్లంతా తుడిచి,అలికి,బాగుచేసుకోవాల్సి వచ్చింది. మాకు పనిచేసే లక్ష్మి ఈ భారమంతా తన మీద వేసుకునేదిట. మొత్తం ఇల్లంతా ప్రతీ నెల రెండుసార్లు అలికి, రోజూ తుడిచి, పండగ వచ్చినపుడల్లా బూజు దులిపేది. మిగతా అంట్లు, చుట్టూ ఉన్న మరో 500గజాల స్థలం ఊడ్పులు సరేసరి. అలికినప్పుడు మా అమ్మే లక్ష్మి వాళ్ల ఇంటిలో పొయ్యి వెలిగే పనిలేకుండా వంట చేసేది.
                            అలాంటి లక్ష్మికి ఓరోజు పెద్ద కష్టం వచ్చిపడింది. తాగుడికి డబ్బులివ్వడం లేదని, పుట్టింటివాళ్ళతో తనకెన్ని గొడవలున్నా లక్ష్మి పుట్టింటికి వెళ్తూనే ఉందని, ఇలా చిన్నా చితకా, పెద్దా పరకా గొడవలతో లక్ష్మి భర్త ఆమెతో పెద్ద దెబ్బలాట పెట్టుకున్నాడు. తిట్టుకున్నంత సేపు ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు గానీ అతను లక్ష్మిని రోకలిబండ పుచ్చుకుని కొట్టాకా ఆమె ధైర్యం సడలిపోయింది. దానికితోడు లక్ష్మిని చంపుతానంటూ కత్తి పట్టుకుని వెంటపడ్డాడు. పారిపోతూ రక్షణ కోసం ఊరంతా తిరిగింది. “ఆడు కత్తి పట్టుకుని తిరుగుతున్నాడంటే నిన్నేమీ నరికేస్తానికి కాదు. ఏదో భయపెడతన్నాడు అంతే”, అని కొందరు “మొగుడూ పెళ్ళాలు మళ్ళీ ఒకటవుతారు. మధ్యలో చేడేది మేమే” అని ఇంకొందరు.
ఆ స్థితిలో 19ఏళ్ల వయసున్న మా అమ్మ(చిన్నవయసు పెళ్లి లెండి తనది) ఆమెని దాచిపెట్టింది. ఊళ్ళో కావాల్సినవాళ్లు”వాడు పెద్ద పిచ్చెదవ. పసిపిల్లలు ఉన్నదానివి నీకెందుకీ గొడవ. దాన్ని వదిలెయ్” అన్నారు, ఇరుగుపొరుగు “మీకెందుకు సాయి గారో ఈ గోల. ఆళ్ళూ ఆళ్లు ఒకటైపోయి మీకు సెడ్డ పేరు మిగులుద్ది” అని సలహాలిచ్చారు.   లక్ష్మి భర్త రోజూ కత్తి పట్టుకుని,”లచ్చీ బైటికి రా. కరణం గారింటో ఉంటే ఏటీ సెయ్యలేనని అనుకుంటన్నావేమో. నీ సంగతేంటో సూత్తాన”ని బెదిరించేవాట్ట. కానీ మా అమ్మ లక్ష్మిని ఆమె మొగుడి చేతికి వదలలేదు.
                      మా నాన్నగారేమీ అడ్డు చెప్పలేదట కానీ నిర్ణయమూ, నిర్వహణా పూర్తిగా మా అమ్మదే. రోజుకో గదిలో దాచిపెట్టి, పొద్దుట కాఫీ నుంచి రాత్రి భోజనం వరకూ అమ్మ లక్ష్మికి గదిలోకే పట్టుకెళ్లేది. కాలకృత్యాలు, స్నానం లాంటివాటికైతే అదాటున పరుగెత్తి బాత్రూంలో దూరి, ముగించుకుని టకీమని మళ్లీ ఇంట్లోకొచ్చేసేదట. అమ్మ చీరలే మూడురోజులు కట్టేది. మూడు రోజులు అలా గడుస్తూండగా మా అమ్మ ముందు ఇంక రంకెలు చెల్లవని అర్థం చేసుకుని లక్ష్మి భర్త పెద్దమనుషులతో మా ఇంటికొచ్చాట్ట. తాగనని పోలేరమ్మ మీద, పెళ్లాన్ని కొట్టనని వాళ్ళ అమ్మ మీద, లక్ష్మి డబ్బు పాములా చూస్తానని ఒట్టు పెట్టుకుంటే తప్ప లక్ష్మిని పంపనని తెగేసి చెప్పింది అమ్మ. బెట్టు చేసి, బెట్టు చేసి చివరకు తలొగ్గి ఒట్లు పెట్టి, లక్ష్మిని తీసుకెళ్ళాడట. దేవతలకీ, ప్రమాణాలకి జడిసే రకం కాబట్టి ఇంకెపుడూ ఆ పనులు చెయ్యలేదు. అయితే “సాయి గారు ఊరుకుని ఉంటే నేను ఇలా అయిపోయేవోణ్ణి కాదు. ఇంకెప్పుడూ ఆరింట్లో పనికి ఎళ్లొద్దని”, భార్యపై ఆంక్ష పెట్టాడు. కళ్ల నీళ్ల పర్యంతమై ఆ మాట మా అమ్మకి చెప్పి మా ఇంట్లో కొలువుకి సెలవు పుచ్చుకుంది సబ్బు లక్ష్మి.  ఆ తర్వాత పల్లె నుంచి పట్నం వచ్చేవరకూ పదేళ్లకు పైగా అంతటి ఇల్లంతా మా అమ్మే అలికింది అక్కడ ఉన్నన్నాళ్లూ. విచిత్రం ఏంటంటే లక్ష్మి భర్తకి మా అమ్మ మీద ఉన్న కోపం కోపమే కానీ మళ్లీ “ఆరోజు సాయిగారు ఆపకపోతే మా లచ్చిని ఆ ఊపులో నరికేద్దునో ఏమో” అని కృతజ్ఞతగానూ మాట్లాడతాడు.
                  పల్లెటూళ్ళో చంద్రమ్మ, పట్టణం వచ్చాకా సముద్రం, నాగవేణి, నాగమణి, సత్యవతి ఇలా చాలామంది పనిచేశారు కానీ  సబ్బు లక్ష్మిలా ఇంట్లో మనిషల్లే చేసిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటుంది మా అమ్మ.
                  మా అమ్మ నన్ను కడుపుతో ఉండగా ముమ్మరమైన చలికాలంలో “మామిడిపళ్ళ”డిగిందట. మా నాన్నగారు తణుకు, అత్తిలి, భీమవరం తెగతిరిగి చివరికి ఓ జ్యూస్ షాపులో మామిడిపళ్లు పట్టకున్నారట. జ్యూస్ షాపు వాడు జ్యూసులే తప్ప పళ్లు ఇవ్వం అని పట్టుపట్టాడు. నానా రకాల ప్రయత్నించి కళ్లుతిరిగే రేటుకు ఓ మూడు మావిడి పళ్లు కొని మా అమ్మకి ఇచ్చారట నాన్నారు. సంగతేమిటంటే మా అమ్మ నుంచి కడుపులో ఉన్ననాడే మా చెల్లెళ్లకి, నాకూ మావిడి పళ్లంటే పిచ్చి ఇష్టం పట్టుకుంది. ప్రతీ వేసవికీ అన్ని రకాల మావిడిపళ్లు కొనిపెడుతూ ఆ పిచ్చిని ఆనందంగా భరించిన మా నాన్నారు ఓ వేసవిలో మాత్రం కొనితేలేదు. మా నాన్నమ్మకు విపరీతమైన అనారోగ్యం చేస్తే మా అమ్మానాన్నలే ఆర్థికంగా, శారీరికంగా పనిచేయడం వల్ల, మేము చదువులకు ఎదిగి రావడం, అప్పుడే మా ఇల్లు కట్టుకోవడం వంటివి ఆర్థికంగానూ, మానసికంగానూ మా నాన్నారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ హడావుడి రోజుల్లో మావిడి పళ్ళు లాంటి చిన్న చిన్న సరదాల కోసం పర్సు తీయలేకపోయారు. పాపం ఏమనుకున్నారో వేసవి ముగుస్తుండగా ఓ పరక మంచి రసాలు కొని తీసుకువచ్చారు. “పోనీలే పిల్లలు ఒకటికి మూడు తిననీ” అనుకుని ఉంటారు. పెద్దవాళ్ళకి చెరో పండు, పిల్లలకు చెరి 3పళ్ళు వాటా పెట్టాల్సింది పోయి మా ముగ్గురికీ రెండేసి పళ్లే పంచింది. తనకి ఒక్కపండూ అక్కరలేదని మొత్తం నాలుగు పళ్ళూ ఇంట్లో పనిచేసే నాగవేణికి మా చేత్తోనే ఇప్పించింది. “ఇంటిల్లి పాదీ చెరో పండు తినండి”అని పంపింది నాగమణిని.
                     అలా ఇచ్చేందుకు మాకు ముందే చెప్పి ఒప్పించింది అమ్మ. “మీరు కొంచెం పెద్ద పిల్లలు కదా మీకే ఇంతగా తినాలనిపిస్తూ ఉంటే, పాపం నాగవేణి పిల్లలు చాలా చిన్నపిల్లలు కదా మరి వాళ్ళు ఎంత మొహం వాచి ఉంటారో కదా. మనలాంటి ఉద్యోగస్తులమే కొనలేకుండా ఉన్నామే, ఇళ్లల్లో పనిచేసే నాగవేణి ఏమి కొనిపెడ్తుంది. మన ఇంట్లో డస్ట్ బిన్ ఖాళీ చేసేప్పుడు మావిడి టెంకలు చూస్తె పిల్లల్ని తలుచుకుని ఎంత బాధపడుతుంది”అంటూ మాకు సర్ది చెప్పే చేసింది అమ్మ. ఇది ఓమారు మా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది కలిగిన సమయంలో జరిగిన కథ. ఐతే అంతకు ముందూ, ఆ తరువాతా కూడా ప్రతి వేసవి కాలంలోనూ మా అమ్మ రహస్యంగా నా చేత కనీసం రెండు పరకలు మామిడిపళ్లు తను కష్టపడి తేనెటీగలా కూడబెట్టిన డబ్బులు వాడి తెప్పించేది. అప్పుడు మా ఇంట్లో ఎవరు పనిచేస్తే వారికే ఇప్పించేది. రహస్యం ఎందుకూ అంటే ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇల్లు గుల్లవుతోంది అంటారేమోనని.
మా నాన్నమ్మ జీవించి ఉన్నన్నాళ్ళూ ఇంట్లో పనిచేసే అమ్మాయికి కాఫీ, నీళ్లు ఇచ్చేందుకు వేరే గ్లాసులు, టిఫిన్ పెట్టేందుకు వేరే ప్లేట్ పెట్టాలనే పధ్ధతి ఉండేది. మా అమ్మకి అలా వాళ్లని అవమానించడం ఇష్టం ఉండేది కాదు. ఎవరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక తాను ఆ గ్లాసుని, ప్లేటునీ వాళ్లకే ఇచ్చి కాఫీకి వచ్చినప్పుడల్లా తెచ్చుకోండి అనకుండా మా అమ్మే రహస్యంగా మెయింటైన్ చేసేది. మా అమ్మ చేతికి పూర్తిగా ఇంటి వ్యవహారం వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఆ గ్లాసుల పధ్ధతి మానెయ్యడమే. ఇప్పుడు మా ఇంట్లో వేరే గ్లాసుల పధ్ధతి లేదు.
                మరోమాటు మా అమ్మ వీధిలోకి వచ్చి “బాబూ! చేపలూ ఇటు రా” అని పిలిచింది. వీధి వీధంతా బిత్తరపోయింది శుద్ధ శాకాహారులమైన మా ఇంటి నుంచి ఆ పిలుపు విని. ఆ చేపల బుట్ట ముంగిట్లోకి వచ్చాకా మా వంటింట్లో పనిచేస్తున్న నాగమణిని పిలిచి “ఎలాంటి చేపలు కావాలో ఏరుకో. డబ్బులు గురించి ఆలోచించకు. ఇవన్నీ నీ జీతంలో కొయ్యను. బహుమతి అనుకుని తీసుకో” అంది. జీవితంలో ఎప్పుడూ అలాంటివి ఎరగదో ఏమో ఆమె చాలా కరిగిపోయింది. అసలేం జరిగిందంటే-మేము మూడంతస్తుల బిల్డింగులో మొదటి అంతస్తులో ఉండేవాళ్లం. మా ఇంటి వాకిట్లో నిలబడ్డ మా అమ్మ నాగవేణి కిందకి తొంగి చూడడం చూసింది. మళ్లీ తలతిప్పేసుకుని లోపలికి వచ్చేస్తున్న ఆమెని ఆపి అలా ఏం తొంగి చూసి వస్తున్నావని అడిగింది చాలా మామూలుగా మా అమ్మ.
ఆమె ఇబ్బందిగా, సిగ్గుగా, అవమానభారంతో “ఏం లేదమ్మా” అనేస్తుంటే ఏదో ఉందనుకుని కిందికి వంగి చూసింది అమ్మ. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు చేపల బేరం చేసి ముగించుకుని చేపలతో కింది ఫ్లోర్ వాళ్లూ, పక్కింటివాళ్లూ ఇళ్లలోకి వెళ్తున్నారు చేపలబుట్టతో అమ్మే అతను వీధిదాటి వెళ్లిపోతున్నాడు. “ఏమ్మా చేపలు చూసి ఎందుకలా వచ్చేస్తున్నావు?” అంది అమ్మ. “ఏమీ లేదమ్మా ఊరికే కొందామని…” అంటూ అర్థోక్తితో ఆగిందామె. “అదే ఎందుకు కొనలేదు?” “డబ్బులెక్కడివమ్మా..” అంటూ నవ్వులో బాధని కలిపేసే ప్రయత్నం చేస్తూ చెప్పిందామె.
                 ఇక మా అమ్మ ఆగలేదు స్వయంగా పిలుచుకొచ్చి ఇంటిముందు తొలిసారి చేపలబుట్ట దింపించింది. ఆమె మొత్తానికామె ఓ చేప తీసుకుంది. మా అమ్మకు అంచనా తెలియదు కానీ ఒకటి ఇంట్లోవాళ్లకి సరిపోతుందా అని అనుమానమొచ్చి చేపలతన్నే అడిగితే ఇద్దరికైతే సరిపోద్దండీ నలుగురైతే సరిపెట్టుకోవాలని చెప్పాడు. “మీ పిల్లలు ఇంకాస్త కూర వెయ్యి అని అడిగితే ఏం చేయ్యగలవు? అసలు పెట్టకపోయినా పర్లేదుగానీ పసివెధవల్ని అర్థాకలితో లేపి ఏడిపించకూడదు. ఇంకో చేప తీసుకో” అని బలవంతాన ఒప్పించింది. వీటితో కూర ఐపోదు కదాని ఉల్లిపాయలు, బియ్యం, ఇతర దినుసులు కూడా మా ఇంటి నుంచే ఇచ్చింది ఏమేమి అవసరమౌతాయో పక్కింట్లో మా అమ్మ ఫ్రెండ్ ఒకావిణ్ణి అడిగి తెలుసుకుని. మా ఇంట్లో లేని కొన్ని మసాలా దినుసుల్ని వాళ్ళింట్లో అరువడిగి ఇప్పించింది.
నాగవేణి భర్త ఇదంతా తెలుసుకుని “ఏదో ఆరు కొనిపెట్టారే అనుకో ఇదే అదునని ఒకటికి రెండు తీసేసుకుంటావా?” అని తిట్టాట్ట.
               కొసమెరుపేమిటంటే- “సాయిగారు చేపల బుట్టని పిలిచేరేంటి. ఆళ్లు బ్రేమ్మలు కదా” అని చాలామంది అడిగారట నాగవేణిని. ఇలా నాకోసం అని చెప్తే ముక్కున వేలేసుకుని, మా అమ్మ దగ్గరకి వచ్చినప్పుడు “పనోళ్లని మరీ అంత ఇదిగా చూడకూదదండీ. లోకువకట్టేత్తార”ని బోధించే ప్రయత్నం చేశారు. “జరుగుబాటు లేక కానీ వాళ్లకీ కొనుక్కోవాలనే ఉంటుంది కదండీ. నేనేం వాళ్ల జీవితాలు బాగు చేసెయ్యలేను. ఏవో చిన్న సరదాలు తీర్చాను. మీ ఇంట్లో చేపలు రుద్దేప్పుడు మాకు లేవే అని బాధపడితే మంచిదా ఏంటి?” అని చెప్పుకొచ్చింది. వాళ్ల గొడవ అమ్మకి పట్టదు. అమ్మ లెక్క వాళ్లకి రాదు. అయినా మా అమ్మకి పనిచేసే వాళ్ల మనసులు చివుక్కుమన్న చప్పుడు కూడా వినిపిస్తుంది.
                       సత్యవతి మా ఇంట్లో పనిచేసేప్పుడు “సత్య.. సత్య” అని పిలిచేది ఆమెని. అలా కాలేజి పిల్లలా సత్య అని పిలిపించుకోవాలని ఆమె ఆశట. నీకు ఎలా పిలిస్తే ఇష్టం అని తెలుసుకుని మరీ అలా పిలిచేది అమ్మ. అప్పుడే మాటలు వస్తున్న మా మేనకోడలి చేత కూడా “సత్య”(సచ్చ అని పిలవడమే వచ్చేది తనకి) అని పిలిపిస్తే సత్యవతి “మాయమ్మే ఎంత ముచ్చటగా పిలుస్తున్నావమ్మా” అని మురిసిపోయేది. చాన్నాళ్ళు మా ఇంట్లో పనిచేశాకా  మేము ఇల్లు మారిపోతే రెండు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నడిచి వచ్చేది. చివరకి “మిమ్మల్ని వదల్లేక పోతున్నానండీ సాయి గారూ” అనంటూనే మానేసింది సత్య.
              నాగలక్ష్మి పిల్లలు కాన్వెంట్లో పనిచేస్తోంటే మా నాన్నారి పరిచయాలు ఉపయోగించి ఫీజులు బాగా తగ్గించడం లాంటివి మొదలు చిన్నవీ చితకవీ ఇంకా చాలానే ఉన్నాయి గానీ విషయం మాత్రం ఒకటే. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు కదా.
santhosh-సూరంపూడి పవన్ సంతోష్

ఎక్కడి నుండి ఎక్కడి దాకా…? -మొదటి భాగం

rama intro

ముప్పది ఐదు సంవత్సరాల పరిపూర్ణ స్త్రీ లీల ఒంటిపైనున్న మెత్తని ఉన్ని శాలువను సున్నితంగా సవరించుకుంది. విమానం నిండా గంభీర నిశ్శబ్దం..మేఘాలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న గర్జనవంటి మౌనధ్వని..గాత్రం ప్రవాహంలా సాగుతూంటే ఒక అంతర్లీనంగా వినిపించే ప్రాణప్రదమైన శృతివలె.

                ఫస్ట్‌క్లాస్‌ కేబిన్‌లో..అతి సౌకర్యవంతంగా..ఏర్‌హోస్టెస్‌ల కన్నుసన్నలలో..ముప్పదిఆరువేల ఫీట్ల ఎత్తులో, గంటకు తొమ్మిదివందల కిలోమీటర్ల వేగంతో..,

                అతివేగం..అతి అతిక్రమణ..అతి దూసుకుపోవడం..ఇవన్నీ ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిశ్చలంగా,ఎంత గంభీరంగా ఎంత ఉత్సుకతతో నిండి ఉంటాయో…తన జీవితంలోవలె.

                ఎదురుగా ఇరవైమూడు అంగుళాల ఎల్‌సీడీ కంప్యూటర్‌ కం టి.వి. తెరపై ‘దోహా’ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువకాబోతున్న తమ విమానం ఏరియల్‌ వ్యూ కనబడ్తోంది..నాలుగ్గంటల క్రితం హైద్రాబాద్‌ ఏర్‌పోర్ట్‌లో ఐదు గంటలకు విమానంలోకి ఎక్కిన తర్వాత..బాంబే మీదుగా అరేబియా సముద్రం..సముద్రంపై వందల కిలోమీటర్ల ప్రయాణం..

                మనిషి ఒదిగి ఒదిగి, వంగి వంగి, నంగి నంగి తలవంచుకుని నిలబడి ఉన్నంతసేపు ఈ ప్రపంచం నీపై స్వారీ చేస్తూనే ఉంటుంది. నీపై ఉక్కుపాదాన్ని మోపి తాడనం చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి తల విదిలించి, నిక్కి నిలబడి ప్రశ్నించడం, ఎదురుతిరగడం, ఎదురొడ్డి నిలబడడం, బిగించిన పిడికిలితో సమాజంపై స్వారీ చేయడం మొదలెట్టిన తర్వాత..ప్రపంచం చిన్న బొచ్చు కుక్కపిల్లలా మనిషికి స్వాధీనమైపోవడం, లొంగిపోవడం, వెంట అతి వినమ్రంగా నడిచివస్తూండడం.. ఇదంతా తెలుస్తూంటుంది విజ్ఞులకు.

ప్రపంచం నువ్వు జవాబు చెప్తున్నంతసేపు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఒక్కసారి నువ్వే ప్రశ్నించడం ప్రారంభిస్తే అది ఖంగుతిని తనే జవాబుదారీగా మారి జవాబులు చెబుతూనే ఉంటుంది. స్వారీ సమర్థవంతంగా చేస్తే గుర్రం నీకు లొంగిస్వాధీనమౌతుంది. అసమర్థంగా ఉంటే కింద నేలపై పడేసి పెక్కపెక్క తన్ని తరిమేస్తుంది.

అందుకే సమర్థుడైన నిర్వాహకుడు ఎప్పుడూ పగ్గాలను తన దగ్గర, తన అధీనంలో ఉంచుకుంటాడు.  ఎవరో చెబితే తను వినడం వేరు.. తను చెబుతూంటే ప్రపంచం వినయంగా విని విధేయంగా ఉండడం వేరు,

ఎందుకో లీల హృదయం వర్షించబోయేముందు, ఉరిమే ముందు ఆకాశంలా గంభీరంగా, ఆవేశంగా, ఉద్విగ్నంగా ఉంది.

ఒంటరితనం..మనిషిని వెంటాడ్తుంది.. గతాన్ని తవ్వి తవ్వి గాలివానలా ధ్వంసించి ధ్వంసించి, చిలికి చిలికి.. ఒక్కొక్కప్పుడు పుండును కాకిలా పొడిచి పొడిచి రక్తసిక్తం చేసినట్టు ..నొప్పి..హృదయంలో నొప్పి..అంతరాంతరాల్లో గుప్తమై రగిలే నొప్పి..బాధ..కసి..క్షోభ.. కన్నీళ్ళు..అపజయాలు..ఆకలి..దిక్కులేనితనం, నిస్సహాయత…అవమానాలు..తలవంచుకుని రాత్రులు రాత్రులు ఏడ్వడాలు..,

కాలేజిలో.. గణితం సబ్జెక్టులో ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ తనే..కాలుక్యులస్‌..సంకలీకరణ..ఇంటిగ్రేషన్‌..రెండు అవధులు.. లోయర్‌ లిమిట్‌.. అప్పర్‌ లిమిట్‌..జీరోనుండి ఇన్‌ఫినిటీ..విస్తరణ. శూన్యంనుండి ప్రారంభమై విస్తరిస్తూ విస్తరిస్తూ..ఎదిగి ఎదిగి..వ్యాపించి వ్యాపించి..అనంతానంతాల పర్యంతం ఒక క్షేత్రమై.,

విస్తరణ..విస్తరణ.,

జీవితాన్ని ఎవరికి వారు నిర్మించుకుంటూ, కూలిపోతూ, ఓడిపోతూ, పాఠాలను నేర్చుకుంటూ మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించుకుంటూ..జీవించడమంటే నిజానికి ఒక అంతులేని నిరంతర నిర్మాణక్రియను కొనసాగించడమే కదా.

నిజానికి..జీవితాన్ని నిర్మించుకోవడం..తన దృష్టిలో ఒక ఇసుకగూడును కట్టడం వంటిది..కాలు తీయగానే కూలిపోవడం..మళ్ళీ సరిగ్గా మెత్తి, మరమ్మత్తులు చేసుకుని..ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక భౌతిక ఉనికిని..ఒక స్వప్నాన్ని ఆకృతీకరించడం..గూడు అందంగా కట్టడం ఒక అధ్యాయమైతే దాన్ని అలా కొనసాగించడం, కాపాడుకోవడం, రక్షించుకోవడం..ఆ క్రమంలో గూడును ఆనందించడం మరో అధ్యాయం. నిజానికి ఈ రెండవ అధ్యాయమే కీలకమైంది.. ప్రధానమైందికూడా.

అరేబియా సముద్రంపై విమానం ఎగురుతున్నపుడు..తన హృదయం ఎంత ఉద్విగ్నమైపోయిందో.

సముద్రం లోతైందా..మనిషి హృదయం లోతైందా..సముద్రం విశాలమైందా. మనిషి హృదయం విశాలమైందా..అనంతమైన అలజడితో, కల్లోలంతో నిత్యం ప్రళయగర్భయై భాసిల్లే మహాసముద్రం నిజానికి నిత్యపోరాటంతో జీవించే నిజమైన మనిషితో పోల్చినపుడు..ఒక సమాంతర ప్రతీకగా,

మనిషి..సముద్రం – సముద్రం..మనిషి.

ఎర్నెస్ట్‌ హెమింగ్వే నవలతో రూపొందిన సాహసోపేతమైన ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ది సీ’ సినిమా జ్ఞాపకమొచ్చింది లీలకు.

పోరాటం.. పోరాటం.. నిరంతరం ఎడతెగని పోరాటం..అంతులేని పోరాటం. బ్రతకడానికి.. ఆకలి తీర్చుకోడానికి.. డబ్బు సంపాదించడానికి .. అధికారంకోసం.. పేరు ప్రతిష్టలకోసం.. శాశ్వతమైన తన అహంతో నిండిన ఆత్మతృప్తి కోసం.. పోరాటం.. కుట్రలు..కుతంత్రాలు.. పెనుగులాటలు.. వ్యూహాలు.. పాచికలు.. మందుపాతరలు..పెదవులపై చిరునవ్వులు.. మోసపూరిత పథకాలు.. ఎన్నో,     విమానం మెల్లగా ఆగడం..కాబిన్‌ లగేజ్‌నుండి అటెండెంట్‌ చేతికందివ్వగా తన అతి ఖరీదైన సామ్‌సొనైట్‌ బ్యాగ్‌ను తీసుకుని లేచి.. ఒకడుగు వేయబోతూండగా..హోస్టెస్‌ మిస్‌ హాస్టలర్‌ వినమ్రంగా తల పంకించి.. అంతా మౌనమే..కాని చిరునవ్వులు చిందే పెదవులు..పలకరించే కళ్ళు..ముకుళించే ముఖాలు..వ్యాపారమే ఐనా పరిమళించే మానవ సౌరభాలు..,

 

లీల ప్రీమియం ఎంట్రీలోకి ప్రవేశిస్తూ, తన బ్లాక్‌బెర్రీ సెల్‌ఫోన్‌ను స్విఛాన్‌చేసి ‘మెమో’ షీట్‌ తెరిచింది.

15 మే అపాయింట్‌మెంట్స్‌.

స్టే ఎట్‌ గ్రాండ్‌ రీజన్సీ ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌ రూం. నంబర్‌ 206. మహమ్మద్‌ రఫీక్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తాడు.

మూడు అపాయింట్‌మెంట్స్‌. భారత జాయింట్‌ సెక్రటరీ టు డిపార్ట్‌మెంటాఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ అండ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, రాంసక్సేనా, మినిస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, గవర్నమెంటాఫ్‌ అస్సాం అరుణ్‌ ఉజ్లేకర్‌, నీరజారావ్‌ కౌన్సిల్‌ ఎట్‌ ఫ్రాన్స్‌..మొత్తం రెండు గంటల నలభై నిముషాలు ఇంటరాక్షన్‌. నాల్గువందల ముప్పయి రెండు కోట్ల రూపాయల డీల్‌. తర్వాత దోహా స్థానిక ఇండస్ట్రియలిస్ట్‌ మహమ్మద్‌ బిన్‌ ఉసామాతో డిన్నర్‌..నాలుగు గంటలు నిద్ర..ఉదయం ఆరుగంటల పది నిముషాలకు ఎమిరేట్స్‌ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

ఎందుకో ఒకసారి తనవైపు తనే చూచుకుంది లీల..ఏర్‌కండిషన్డ్‌ బస్‌ దిగుతూ మక్‌మల్‌ మడతల మధ్య ధవళవర్ణంలో ధగధగా మెరుస్తున్న మంచిముత్యంలా ఉంది తను.

ప్రపంచాన్ని మొట్టమొదట ఆకట్టుకునేది మనిషి బాహ్యరూపు..అందం..ఆకర్షణ. ఆ తర్వాత ఆ మనిషి వ్యక్తీకరణ, ప్రతిభ, తెలివితేటలు..ఆ తర్వాత ఆర్థిక, అధికారిక, వ్యాపారాత్మక లావాదేవీలు – ఇవన్నీ ఎంతో స్పష్టంగా తెలుసు లీలకు.

లీలకు మనుషుల మూలతత్వాల గురించి చాలా విపులమైన లోతైన అవగాహన ఉంది. ఆమె ఎదుటి వ్యక్తులతో చాలా తక్కువగా, అవసరమైనపుడు మాత్రమే మాట్లాడ్తుంది. ఎక్కువగా చూపులతో అధ్యయనం చేసి మొదట ఎదుటి మనిషిలోని బలహీనతలను కనిపెడ్తుంది. ప్రతి మనిషికీ ఏదో ఒక బలహీనత ఉంటుందని బలంగా నమ్ముతుందామె. అది డబ్బు కావచ్చు, కాంతా కనకాలు కావచ్చు, అధికార వ్యామోహం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు..ఏదో ఒకటి. ఏదో ఒక వ్యామోహం ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ బలహీనతను గ్రహించి సరిగ్గా అక్కడ దెబ్బకొట్టగలిగితే వాడే విజయుడు.

భారతదేశంలో ఎంత పెద్దమనిషైనా తప్పకుండా ఏదో ఒక ప్రలోభానికి లొంగుతాడు. ఎంత ఉన్నతస్థానంలో ఉన్నవాడైనా తప్పకుండా ఏదో ఒకదానికి అమ్ముడుపోతాడు. దాసోహమై తనను తాను కోల్పోతాడు. నిశ్శబ్దంగానే మనుషులను, వాళ్ళ దిక్కుమాలిన వ్యామోహ వివశతలను పసిగట్టి చెస్‌ ఆటలో పావులను కదిపినట్టు ఒక్కో వ్యూహాత్మక కదలికతో జయిస్తూ వస్తున్న తను గత థాబ్దకాలంపైగా సాధించిన విజయాలు తనకు ఒక నిషానూ, మత్తునూ కలిగించే అనుభవాలుగా మిగిలిపోయాయి. ఇంత పెద్ద మనుషులు ఇంత సుళువుగా చిత్తయిపోతారా అని ఆశ్చర్యంతో తాను బిత్తరబోయిన సందర్భాలెన్నో.,

ఐతే..చాలా సమయాల్లో అవసరానికి మించి అతిగా మాట్లాడ్డం అనే అతిపెద్ద బలహీనతని లీల ఎంతో ప్రధాన విషయంగా గమనించింది. నిజానికి ఒక ఎగ్జిక్యూటివ్‌ యొక్క వ్యూహాత్మక మౌనం ఎదుటి మనిషిలో ‘భయం’ కల్గిస్తుంది.

first week fig-1

‘ఎగ్జిట్‌’ దగ్గరికి రాగానే తనూహించినట్టుగానే రఫీక్‌ వడివడిగా ఎదురొచ్చి ఒక అందమైన, విలువైన పూలబొకే అందించి, ఆమె చేతుల్లోని బ్యాగ్‌ను అతి వినయంగా అందుకున్నాడు.

”వెల్కం మేడం” అన్నాడు ముద్దముద్దగా.

ఆమె మాట్లాడలేదు. ఒక చిర్నవ్వు చిలకరించి మౌనంగా, గంభీరంగా అతని వెంట నడిచింది. అలా నడుస్తున్నపుడు విరజిమ్ముతున్న విద్యుత్‌కాంతుల నడుమ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో ఆసక్తిగా అవాక్కయి తనను గమనిస్తున్నట్టు ఆమె గమనించింది.

రఫీక్‌ డోర్‌ తెరుస్తూండగా బయట సిద్ధంగా ఉన్న బిఎండబ్ల్యు కారు వెనుక సీట్లోకి చేరిందే తడవ..కారు మెత్తగా.. సర్రున నల్లని త్రాచుపాములా కదిలింది.

వేగం.. గాజుపలకపై ఇనుప గోళీలా..దూసుకుపోయే వేగం.,

తన ప్రతి క్యాంప్‌ ఏర్పాట్లను తన అత్యంత అంతరంగిక కార్యదర్శి నిర్మల స్వయంగా పర్యవేక్షిస్తుంది..మినట్‌ టు మినట్‌ కదలికలు, ప్రాంతాలు, వ్యక్తులు, వ్యవహారాలు, రక్షణ, బాధ్యతల అప్పగింతలు..అన్నింటినీ మించి ఫాలోఅప్‌, మానిటరింగ్‌.. వీటి విషయంలో నిర్మల నిజంగా సుపర్బ్‌.

‘యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌…’ఇంగ్లీష్‌లో ప్రకటన..ఎన్ని వందలసార్లు విన్నదో తను విమానాల్లో పయనిస్తూ..ఇక విమానం భూమిపైకి దిగబోతోంది. సీట్‌ బెల్ట్స్‌ పెట్టుకోండి, సీట్లను నిటారుగా ఉంచుకోండి. సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ మోడ్‌లోనే ఉంచండి..వంటి అంశాలు..చివరికి పైలట్‌ ‘దయతో ప్రయాణంలో సహకరించినందుకు మీకందరికీ ధన్యవాదాలు..’అని ఓ సాంప్రదాయ వినమ్ర నివేదన.

ర్ర్‌ర్‌ర్‌మని ..విమానం టైర్లు నేలను తాకిన మ్రోతతో కూడిన భీకర ధ్వని.. కుదుపు. విడిచిన బాణంవలె దూసుకుపోతున్న గాలిధ్వని..ఒక పెద్ద సంరంభం.

ప్రక్కనున్న కిటికీలోనుండి చూచింది లీల. దోహా నగరం విద్యుత్‌కాంతులతో మిలమిలా మెరిసిపోతోంది. కతార్‌ ఎయిర్‌వేస్‌ ప్రధాన స్థావరం. అరబ్‌ దేశాల గుండెలా ఎదుగుతున్న అంతర్జాతీయ విమానయాన క్షేత్రం. ఇస్లాం సాంప్రదాయాలను పాటిస్తూనే వడివడిగా అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్న అత్యాధునిక విమానయాన సంస్థ కతార్‌.

తన ఆల్‌ గోల్డ్‌ వాచ్‌ చూచుకుంది లీల.

ఎనిమిది గంటల పన్నెండు నిముషాలు..’ఇప్పుడు నిర్మల తనతో మాట్లా..’అని మనసులో అనుకుంటూండగానే ఆమె సెల్‌ఫోన్‌ మోగింది.

”గుడీవినింగ్‌ మేడం..మీ కారు దోహా మాల్‌ దాటి అల్‌ ఖలీషా రోడ్‌లోకి ప్రవేశిస్తోందా..”

”ఎస్‌ నిర్మలా..”

”ఇంకో పన్నెండు నిముషాల్లో మీరు హోటల్‌ గ్రాండ్‌ రీజన్సీలో ఉంటారు. ఫ్రెషప్‌ కాగానే..సరిగ్గా తొమ్మిది గంటలకు రాంసక్సేనా ఐఎఎస్‌ మీ గదికొస్తాడు. అతను ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ‘పరిశ్రమలు – పర్యావరణ కాలుష్యం..నివారణ’ అంశంపై మాట్లాడ్డానికి రెండ్రోజుల క్రితమే ఫ్రాన్స్‌లో ఉన్నాడు. మీతో మాట్లాడి ఆ ఎనభైకోట్ల రూపాయల ఎబిటు జీరోఫైవ్‌ బాపతు డీల్‌ను ఫైనల్‌ చేస్తాడు. అందుగ్గాను మనం అతనికి ఆరుకోట్ల క్యాష్‌ను స్విస్‌ బ్యాంక్‌ హిడెన్‌ కాతాకు బదిలీ చేస్తాం.. మేడం ఒకసారి మీ లాప్‌టాప్‌లో రెండు నిముషాల క్రితం నేను మీ జడ్‌ మెయిల్‌కు పంపిన ఫోల్డర్‌లో చూడండొకసారి. ఓవర్‌ వ్యూ వస్తుంది.. సి యు మేం..”గడగడా, స్పష్టంగా, పొల్లుపోకుండా చెప్పుకుపోయింది నిర్మల.

ఎందుకో లీల చిన్నగా నవ్వుకుని..లాప్‌టాప్‌ను తెరిచింది. ప్రపంచంలోనే అతి సన్నని లెనోవా 0.9 ఇంచ్‌ కంప్యూటర్‌ అది. చకచకా రిడిఫ్‌ మెయిల్‌ తెరిచి తన రహస్య పన్నెండవ ఇ మెయిల్‌ క్లిక్‌ చేసింది. నిముషమున్నర క్రితం వచ్చిన నిర్మల మెయిలది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాం ఇన్ఫోటెక్‌ అనే సంస్థ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ వ్యాల్యూ ప్రైస్‌వాటర్‌ కూపర్‌ మదింపుద్వారా నాల్గువేల కోట్లుగా నిర్దారించబడింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెజ్‌ల ఏర్పాటుక్రింద భారత ప్రభుత్వానికి భూమి కేటాయింపు గురించి ధరఖాస్తు పెట్టుకుంది. నూటా యాభై ఎకరాలను కనీస నామమాత్రపు ధర క్రింద రాం ఇన్ఫోటెక్‌కు కేటాయిస్తే నాల్గు సంవత్సరాలలో స్థలాన్ని అభివృద్ధిపర్చి, పరిశ్రమను స్థాపించి, మూడు వేలమందికి ఉపాధి..,

..ఇలా ఉంది ఫైల్‌-

‘అంతా ట్రాష్‌.. చెత్త…’అనుకుని వాస్తవస్థితిని ఉజ్జాయింపుగా అంచనా వేసింది లీల. నూటా యాభై ఎకరాలను ఎకరానికి యాభైవేల చొప్పున కొనుక్కుని ఏడున్నరకోట్ల పెట్టుబడితో నాల్గుసంవత్సరాల తర్వాత మూడువందల కోట్ల ఆస్తిగా మార్చుకోవాలని దుష్టమైన ప్రణాళిక. అందులో ముఖ్యమంత్రి బామ్మర్ధి కొడుకు పేరుమీద ఇరవైకోట్ల నగదు లంచం, భారీ పరిశ్రమల మంత్రి ఉంపుడుగత్తెకు పదికోట్లు.. మిగతా తతంగమంతా ప్రవీణ్‌రెడ్డి చూచుకోవాలి. ఆ పరంపరలో క్లియరెన్స్‌కోసం ఒక క్లెయింట్‌గా తమను ఆశ్రయించాడు ప్రవీణ్‌రెడ్డి. ‘లీలకు కేస్‌ అప్పజెప్పి కూచుంటే అంతా నిశ్చింత. బేఫికర్‌. ముందే కన్సల్టెన్సీ ఫీ మాట్లాడుకుని డాక్యుమెంట్లన్నీ ఇస్తే యిక అన్ని లెవెల్స్‌లో లీల తనే మేనేజ్‌ చేసుకుని పనిని సాధించిపెడ్తుంది.. బ్లాక్‌ యాక్టివిటీస్‌ చేయడానికి లీల హైలీ రిలయబుల్‌ వైట్‌ ఏజెంట్‌. ముందే అంతా స్పష్టం..’

లంచాల కింద ఇరవైరెండు కోట్లు..తన ఫీ ఐదు కోట్లు..టైం పీరియడ్‌ మూడు నెలల పదిరోజులు-

కేస్‌ స్టేటస్‌.. స్టేట్‌ గవర్నమెంట్‌నుండి అన్నీ క్లియరై..అనుకూలమైన రిమార్క్స్‌తో ఫైల్‌ భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు పంపబడింది..పద్నాల్గు రోజుల క్రితం. ఫైల్‌ నంబర్‌ ఎఫ్‌ఫోర్‌ / టు త్రీ ఫైవ్‌ సిక్స్‌ / ఇండస్ట్రీస్‌ / 09 తేది 6 జూన్‌ రెండువేల తొమ్మిది.

అంతా అర్ధమైంది లీలకు.

తమకు అప్పటికే రెండుకోట్ల అరవై లక్షల అడ్వాన్స్‌ ముట్టింది. లంచాలు ఎనిమిది కోట్ల చిల్లర ఖర్చయింది.. ఇప్పుడు జాయింట్‌ సెక్రటరీ రాంసక్సేనా స్వయంగా ‘సెజ్‌’ శాంక్షన్‌ కాగితాలను తన దగ్గరకు తెచ్చిస్తాడు. అదీ ఏర్పాటు.

ఈ పనిని సాధించడానికి తన ఆధీనంలో పనిచేసే ఎందరో రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లలో ఫార్మర్‌ హోం సెక్రటరీ రాజన్‌ పిళ్ళై ఎంతో సహకరించారు. పిళ్ళై, రాంసక్సేనా యిద్దరూ బాటిల్‌మేట్స్‌..రూట్‌ దొరికింది. సరియైన పనికి సరియైన నైపుణ్యంగల మనిషిని వెదికిపట్టుకుని ఆ పనిని అప్పజెప్పి నిర్విఘ్నంగా సాధించడమే ఒక మంచి మేనేజర్‌ లక్షణం.

నవ్వొచ్చింది లీలకు..ఈ ప్రపంచంలో ఎవడైనా డబ్బుకు లొంగేవాడేకదా..ఒకడు ఎక్కువకు, మరొకడు ఇంకా ఎక్కువకు.. కాని లొంగడం మాత్రం ఖాయమైన వర్తమానంలో మనిషి ‘మార్కెట్‌’గా మారి…వ్చ్‌, క భ్రాంతిమయ అనుభూతి ఆమెను ఆకస్మాత్తుగా ఆవహించింది. ఎక్కడి ఆంధ్రప్రదేశ్‌లో తూఫ్రాన్‌ వద్ద వెంకట్రావ్‌పల్లె దగ్గరి సెజ్‌..ఎక్కడి ఢిల్లీ…ఎక్కడి ప్రవీణ్‌రెడ్డి, ఎవరీ లీల..ఎక్కడి దోహా..ఎవరీ రాంసక్సేనా..ఆ భూమి తాలూకు కాగితాలను యిక్కడ..ఈ అరబ్‌ గడ్డపైకి తెచ్చి తనకు యివ్వడమేమిటి..?

వ్యాపారం..అంతా వ్యాపారం..డబ్బు..డబ్బు..,

మార్క్స్‌ అన్నట్లు..మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలేనా?

కారు ట్రాఫిక్‌ను చీల్చుకుంటూ డి- రింగ్‌రోడ్‌, అల్‌ సౌదన్‌, ఫరీజ్‌ అల్‌ అమిర్‌ రోడ్‌ మీదుగా..గ్రాండ్‌ రీజెన్సీ హోటల్‌ చేరుకుని..పొర్టికోలో ఆగి-

మెరుపులా రఫీక్‌ కిందికి దిగి..డోర్‌ తెరిచి.,

అద్భుతమైన హోటల్‌ అది. రోజుకు రెండువేల యాభై యుఎస్‌ డాలర్స్‌. గేట్‌ దగ్గర ఆరున్నర అడుగులఎత్తు ఓ షోమ్యాన్‌ వినయంగా వంగి సలాం చేసి..,

డబ్బు.. డబ్బు..డబ్బుతో హోదా..హోదాతో గౌరవం..గౌరవంతో తృప్తి, అహం..అహం ఒక ఎడతెగని నిషా.. రాజ్యాలూ, రాజ్యాధికారాలూ అన్నీ అహంతో సంభవించిన దర్పంతోనే ధ్వంసమైపోయినట్టు అరుస్తూ చెప్పే మానవ చరిత్ర.,

రఫీక్‌ అప్పటికే రిసెప్షన్‌లోనుండి లేజర్‌ మానిటర్‌ను తీసుకుని, పెద్ద హాల్‌కు ఒక ప్రక్కన ఉన్న కాంతులీనే లిఫ్ట్‌ దగ్గరికి తోడ్కొనిపోయి,

…రెండు వందల ఆరు..ఎగ్జిక్యూటివ్‌ సూట్‌..చుట్టూ గాజు తలుపుల్లోనుండి.. స్విమ్మింగ్‌ పూల్‌.. దూరంగా సముద్రం.. ఇటు ప్రక్క గార్డెన్‌..సన్నగా సంగీతం..వాతావరణం నిండా ఏదో భాషకందని మత్తు..శరీరాన్ని వీణతంత్రులను మీటినట్టు పులకింపజేసే పరిమళం., గాలినిండా ఏదో మహత్తరమైన వివశత.

”మేడం ..షలై టేక్‌ లీవ్‌.. మై డ్యూటీ ఈజోవర్‌..మార్నింగ్‌ మిస్టర్‌ నాయర్‌ విల్‌ కం ఎట్‌ ఫైవ్‌ థర్టీ.. టు టేక్‌ యు టు ఏర్‌పోర్ట్‌..’రఫీక్‌.,

”ఓకే..థ్యాంక్యూ.”

రఫీక్‌ వంగి..సలాం చేసి..అతను దృఢంగా..కండలు నిండిన శరీరంతో అరబ్‌ గుర్రంలా ఉన్నాడు. వీళ్ళందర్నీ ఇండియా నుండి నిర్మల ఏర్పాటు చేస్తుంది. రఫీక్‌కు వెళ్ళేప్పుడు రిసెప్షన్‌లో ఐదువందల డాలర్ల టిప్‌ ముడ్తుంది. అతని రోజుకూలీ వేయి డాలర్లు కాకుండా. ఊహకందని పేమెంట్స్‌. ప్రతి రహస్య కార్యకలాపం చాలా ఖరీదుగానే ఉంటుంది మరి.

రఫీక్‌ వెళ్ళగానే..వెన్నెల ముద్దలా ఉన్న డబుల్‌ బెడ్‌పై ఒక్క క్షణం ఒరిగి కళ్ళు మూసుకుంది లీల.

‘కన్ను తెరిస్తే ఒక ప్రపంచంలో నువ్వు ,

కన్ను మూస్తే నీలోనే ఒక గర్జించే ప్రపంచం..’ఎవరివో కవితాపంక్తులు.

వేగం.. వేగం..ఒక అతివేగవంతమైన ప్రపంచంలో కాలాన్ని వేటాడ్తూ తను..తనను వెంటాడ్తూ కాలం..ఊపిరి సలపని పరుగులో పూర్తిగా మృగ్యమైపోయిన విచక్షణ..తనలోకి తను తొంగి చూచుకోలేని తీరికలేనితనం..నిజానికి ఒక్కసారైనా ఆత్మలోకి అవలోకించుకోడానికి తనకే తెలియని ఏదో భయం.

అసలేంచేస్తోంది తను..ఎక్కనినుండి మొదలై ఎక్కడికి కొనసాగుతోంది తన గమనం..అసలు తనకు ఒక గమ్యం అనేది ఉందా..తన అంతిమ లక్ష్యం ఏమిటి?

సుడిగాలిలోని కాగితం ముక్కకు ఒక థ, దిశ ఉంటుందా.?

ఎందుకో ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టయి..దిగ్గున లేచి..బాత్‌రూంలోకి వెళ్ళింది. అన్నీ స్వర్గాన్ని మరిపించే ఏర్పాట్లు. మంచుతుంపరలు కురుస్తున్నట్టు కాంతి. తెల్లని వెండి మేఘాల తరగలపై నడుస్తున్నట్టు నేల..సన్నగా ఏదో మృదుధ్వని..పరిమళం.,

స్నానం కానిచ్చి..బట్టలను మార్చుకుని..డ్రైయర్‌కింద ఆరబెట్టకున్న జుట్టును విరబోసుకుని..డ్రెస్సింగ్‌ టేబుల్‌ముందు ..బంగారు చెంపలకు ఓలె క్రీం కొద్దిగా పూసి..,

‘ఎంత అందంగా ఉంది తను’ అనుకుంది లీల ఎదుట అద్దంలో తనను తాను చూచుకుంటూ..నాల్గడుగులు వెనక్కునడచి., బెడ్‌పై వాలి.,

టైం ఎనిమిదీ యాభై ఐదు.,

సెల్‌ఫోన్‌ మ్రోగింది.. నిర్మల.

”మేం. రాం సక్సేనా ఈజ్‌ ఆన్‌ద వే. వితిన్‌ ఫైవ్‌ మినట్‌ హి విల్బీ..”

ఫోన్‌ కట్‌ చేసింది ఏమీ మాట్లాడకుండానే

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..ఓ అక్సర్‌ యాద్‌ ఆతీహై..’అనూహ్యంగా ముఖేశ్‌ గీతం వినబడింది చానల్‌ మ్యూజిక్‌లో..సన్నగా.,

కత్తితో వెన్నముక్కను ఎవరో కోస్తున్నట్టు..సర్‌ర్‌ర్‌మని ఏదో..చటుక్కున సముద్రమై పొంగిన దుఃఖం..ఆకాశమంత ఎత్తున్న అల విరిగి పైనబడ్డట్టు ఏదో బీభత్స విధ్వంసం..

ఒక్కపాట..ఒక్క చరణం..మనిషిని ఇంతగా కకావికలు చేస్తుందా..?

వ్చ్‌.,

సరిగ్గా అప్పుడే..బయట బజర్‌మ్రోగింది.

లీలకు తెలుసు..వచ్చింది రాం సక్సేనా అని..చేతిలోని లేజర్‌ రిమోట్‌తో బయటి డోర్‌ తెరిచింది.

ఔను రాంసక్సేనానే..”గుడీవినింగ్‌ మేడం” అన్నాడు వస్తూనే.

‘ప్లీజ్‌’ అంది..ఎదుట ఉన్న సోఫా చూపిస్తూ.

రెండు నిముషాల మౌనం..నిశ్శబ్దం..తర్వాత..అతను తన బ్రీఫ్‌కేస్‌ను తెరిచి ఒక అందమైన ప్లాస్టిక్‌ ఫోల్డర్‌ను ఆమెకు వినయంగా అందించాడు.

సక్సేనా యిదివరకు ఢిల్లీలో జరిగిన ఒక పెళ్ళివిందులో తనకు పరిచయం. పిళ్ళై చేశాడు.

”శాంక్షన్‌ ప్రోసీడింగ్సాఫ్‌ దట్‌ సెజ్‌..మిస్టర్‌ ప్రవీణ్‌రెడ్డీస్‌..”

”ఊఁ..”కాగితాన్ని పరిశీలనగా, మెరుపుపాటుకాలంలో చూచి,

”హౌమచ్‌ యుహావ్‌ రిసీవ్డ్‌ సోఫార్‌”

”టు క్రోర్స్‌ మేడం. మిస్టర్‌ పిళ్ళై కన్‌సెంటెడ్‌ దిస్‌ అసైన్‌మెంట్‌ యాజె ప్యాకేజ్‌ ఫర్‌ ఫోర్‌ క్రోర్స్‌..”అని అర్ధాంతరంగా ఆగి.,

”ఐనో..ఐనో..”

”ఆల్‌రెడీ.. దిస్‌సెజ్‌ శాంక్షనీజ్‌ పబ్లిష్డ్‌ ఇన్‌ ఎస్టర్‌డేస్‌ గెజిట్‌”

”ఓకే..”

లీల చకచకా తన లాప్‌టాప్‌ను తెరిచి..ఏదో అకౌంట్‌లోకి వెళ్ళి ఇ-ట్రాన్స్‌ఫర్‌ ఆపరేషన్‌ ప్రారంభించి.,

”యు వాంట్‌ దిస్‌ మనీ టు బి క్రెడిటెడిన్‌ యువర్‌ జడ్‌ టు జడ్‌..హిడెన్‌ అకౌంట్‌..ఈజిట్‌”

”యస్‌ మేం..”

”నౌ దిసీజ్‌ డన్‌..యు కెన్‌ వెరిఫై..”

”నాట్‌ నెసెసరీ మేం..ఐ బిలీవ్‌”

దొంగల మధ్య నిజాయితీ, క్రమశిక్షణ, వృత్తిధర్మంపట్ల నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. హవాలా లావాదేవీలన్నీ ప్రపంచవ్యాప్తంగా కాగితంముక్కకూడా ఆధారంలేకుండా అందుకే నిక్కచ్చిగా జరుగుతున్నాయి..కోట్లకు కోట్లుగా.

రాంసక్సేనా లేచి..” ఐ టేక్‌లీవ్‌ మేం..ఆల్వేస్‌ వుయ్‌ విల్‌బీ ఎట్‌ యువర్‌ డిస్పోజల్‌” అని వినయంగా తలపంకించి,

డబ్బు ముందు..వాడు ఐ ఎ ఎస్సా..ఆర్మీ ఆఫీసరా..రాజకీయ నాయకుడా..అన్న మీమాంస లేదు. లొంగిపోవాల్సిందే.. రేటు మారుతుందంతే.

అతను వెళ్ళిపోయాడు.

కాగితాన్ని బ్రీఫ్‌కేస్‌లో పెట్టింది. ఈ ఫైల్‌ క్లోజ్‌. హైద్రాబాద్‌ పోగానే ఇంకో యాభై లక్షల రూపాయలను పంచిపెడితే ఈ సెజ్‌ ప్రవీణ్‌రెడ్డి పరమైపోతుంది. భూమి వానివశమైపోయే కాగితాలన్నీ చకచకా తయారౌతాయి. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ింద మిగిలిన రెండు కోట్ల నలభై లక్షలు తన బినామీ అకౌంట్‌లో జమైపోతుంది.

అన్నీ అంకెలు…ఒక అంకెప్రక్కన ఎన్నో ఎన్నో సున్నాలు.

అంకె లేకుంటే ప్రక్కనున్న సున్నాల విలువ సున్న. ప్రక్కన సున్నాలు లేకుంటే ఒంటరి అంకె విలువ విలువ లేనిదే.,

తను ఒక అంకెనా..ఒక సున్నానా..వాటి సమ్మేళనమా.,

అస్సాం పవర్‌ మినిస్టర్‌ అరుణ్‌ ఉజ్లేకర్‌ అపాయింట్‌మెంట్‌ తొమ్మిదీ యాభై నిముషాలకు..ఇంకా అరగంట టైముంది.

చకచకా లిక్కర్‌ ర్యాక్‌ తెరిచింది..మాకల్లన్‌ విస్కీ బాటిల్‌. సోడా సీసా, ఐస్‌క్యూబ్స్‌.. క్రిస్టల్‌ గ్లాస్‌లో మిలమిలా మెరుస్తూ స్వర్ణద్రవం.

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..’

ఏవైతే మరిచిపోవాలనుకుంటూంటామో..ఆ జ్ఞాపకాలే ఎందుకో మళ్ళీ మళ్ళీ వెంటాడ్తూంటాయి మనిషిని.

జ్ఞాపకాలు ముఖంపై వర్షపు చినుకుల్లా..శిరసుపై చిరుజల్లు ముసురులా, మూసిన కళ్ళపై ముసిరే తూనీగల్లా.. ఒంటరిగా నడుస్తున్నపుడు తలపై రాలే పొన్నపూల జల్లులుగా,

ఎక్కడో వీణతీగ మ్రోగి..రాగాలను చిందించి..మైమరపించి..చటుక్కున తెగి..అతికి..మళ్ళీ తెగి..,

అతను జ్ఞాపకమొచ్చాడు..అతను..పన్నెండేండ్లక్రింద పరిచయమై, ఒక మానవ పరిమళమై..ఒక స్పర్శించే వీచికై..ఒక అర్థంకాని ఏదో ఐ..అతను..అతను..అతను.,

మనసు నిండా ఒక సముద్ర గంభీర నిశ్శబ్దం.. స్తబ్ద ప్రళయం..మౌన అలజడి.,

అస్సాం మంత్రి అరుణ్‌ రావడానికి..ఇంకా పదినిముషాలు.

తెలుసు..ఆ కేస్‌ వివరాలన్నీ లీలామాత్రంగా మేథోపథంలో ఉన్నాయి. డిబ్రూగడ్‌లో స్థాపించబడ్తున్న రెండు వందల తొంబయ్‌ మెగావాట్ల పవర్‌ప్లాంట్‌లో రెండు గ్యాస్‌ టర్బయిన్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘మిత్రా కన్‌స్టక్షన్‌’కు యిప్పించాలి. నూటా ఎనభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌. మిత్రా కన్‌స్ట్రక్షన్‌ కాకతీయ గ్రూప్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన దామెర లక్ష్మయ్యది. స్వంత రాష్ట్రంలో కాంట్రాక్ట్‌లు చేస్తే బద్‌నాం ఔతున్నామని ఇతర రాష్ట్రాలకు ఎగబాకుతున్న కంపెనీ. పదికోట్ల డీల్‌. గ్యాస్‌ రేట్‌ ఒడంబడికలో తను చేస్తున్న రేటు పెంపుదలతోనే ఎనిమిది కోట్ల లాభం వాడికి. చిన్న వెంట్రుకవాసి రేటు తేడా కొన్ని కోట్ల రూపాయల ఫలిత ప్రభావాన్ని చూపిస్తుంది.

సరిగ్గా పది నిముషాల తర్వాత కాలింగ్‌ బజర్‌ మ్రోగింది. తెలుసు లీలకు ఆ వచ్చింది అరుణ్‌ అని.

బెడ్‌పై కొద్దిగా సర్దుకుంటూనే.. లేజర్‌ రిమోట్‌తో డోర్‌ తెరిచి..

‘రాజకీయ నాయకులు, మంత్రులంటే పచ్చి లంజలకంటే కడహీనులు’ అనుకుంటూండగానే,

”గుడ్‌ మార్నింగ్‌ మేడం…”

వీడికి మార్నింగ్‌..ఈవినింగ్‌., నైట్‌ ..తేడాలు తెలియట్లేదనుకుని.,

”బోలియే ఉజ్లేకర్‌ సాబ్‌..కైసేహై ఆప్‌” అంది.

”బహుత్‌ మజేమే..”

”హమ్‌ ఆప్కో..”

”పూరా యాద్‌ హై..ఇస్‌ హఫ్తామే ఓ లక్ష్మయ్య సాబ్‌కా కాగజ్‌ దస్తకత్‌ కర్కే బేజ్‌దేంగే…పూరా కామ్‌ హోగయా.. బేఫికర్‌..”

”కామ్‌ హోతేహీ..ఆప్‌కా కిసీ ఆద్మికో ఢిల్లీమే 9390109293 నంబర్‌ మే కాంటాక్ట్‌ కర్లేకే పూరా దో కరోడ్‌ క్యాష్‌.. దౌజంట్‌ నోట్స్‌ లేజానా..ఓ ఆర్డర్‌లేకే హమ్‌కో ఫాక్స్‌ కర్‌దేనా..ఠీక్‌ హై”

”ఠీక్‌ హై మేడమ్‌..ఏక్‌ దమ్‌..పూరా క్యాష్‌ మిలేగా క్యా”

”హా..వోహీ చాహియేనా ఆప్‌కో”

”హా”

అతను లేచాడు.. మరో రెండు నిముషాల్లో ఆమెవైపు భయం భయంగా, కొద్దిగా ఆశగా ఆకలిగా చూచి..నీళ్ళు నములుతూ.., బై” అంది లీల.

ఖేల్‌ కతమ్‌..తాలీ బజావ్‌.,అరుణ్‌ ఉజ్లేకర్‌ నిష్క్రమించాడు.

లీలకు అస్సాం గ్యాస్‌ పవర్‌ ప్లాంట్‌లో జపాన్‌ ప్రభుత్వం పరస్పర అభివృద్ధి పథకాల, పరస్పర సహకార ప్రణాళికల కింద ముప్పయి ఎనిమిది మిలియన్ల ఎన్స్‌ అప్పు..ఆ తతంగమంతా జ్ఞాపకమొచ్చింది.

అప్పు అంతా ప్రజలవంతు..ఆనంద తాండవాలన్నీ, అనంత సుఖాల భోగాలన్నీ ప్రభుత్వాధికారులదీ, రాజకీయ నాయకులదీ ఐన ఈ వర్తమానం దేశాన్ని ఎవరికెవరికి, ఎంత దారుణంగా కుదువ బెడ్తోందో తలుచుకుంటే..అయ్యో పాపమనిపించి, నిట్టూర్చి.,

ఆకలి అనిపించింది లీలకు..అకస్మాత్తుగా.,

ముందరున్న స్క్రీన్‌పై చికెన్‌ టిక్కా, ఖలీఫా తందూరి ముర్గా ఆర్డర్‌ చేసింది.

ఎదురుగా..పల్చని బంగారు మాకల్లన్‌ విస్కీ ద్రవం..తెల్లని మంచుపూల వలె ఐస్‌.,

ఒక సిప్‌ చేసి.,

ప్రపంచం యావత్తు ఆనంద సముద్రంలో తేలిపోతున్నట్టనిపించి,

ఏ మనిషికైనా తన దుఃఖమే ప్రపంచదుఃఖం..తను అనభవిస్తున్న తన ఆనందమే చుట్టూ ఉన్న ప్రపంచ మానవాళి అందరి ఆనందమనుకుంటూ..ఒక భ్రాంతిలో బ్రతుకుతూ..ఒక మార్మిక ఆత్మవ్యంజనలో..,

ఇంకా గంట సమయం ఉంది..ఆ రోజు మూడవ కేస్‌ నీరజా రావ్‌తో. ఒక జర్మనీ కంపెనీ భారతదేశంలో స్థాపించాలనుకుంటున్న ఆటోమొబైల్‌ కంపెనీ తాలూకు అన్ని క్లియరెన్స్‌లు, ల్యాండ్‌ అలాట్‌మెంట్‌.. వగైరా ఏర్పాట్లన్నీ.. మూడువేల కోట్ల ప్రాజెక్టు. అందులో స్పెషల్‌ గ్రేడ్‌ రోవర్‌ వెహికిల్స్‌ను ఆరేళ్ళపాటు ఇండియన్‌ డిఫెన్స్‌ కోసం కొనుగోలు చేసేందుకు యంఓయూపై అడ్మిరల్‌ కులకర్ణీతో ఒప్పందం..డీల్‌-

‘అబ్బా..యిప్పుడు ఓపిక ఉందా..ఇదంతా చేయడానికి..’అనుకుంది లీల.

లేదు.. అని గోముగా జవాబొచ్చింది లోలోపల్నుండి.

వెంటనే నిర్మలకు ఫోన్‌ కలిపింది లీల..

‘నిర్మలా..కెన్‌ యు గెట్‌ నీరజారావ్‌ ఆన్‌ లైౖన్‌ ఫర్‌ డిస్కషన్‌..ఐ కాంట్‌ మీట్‌ హర్‌ పర్సనల్లీ నౌ..ఐ షల్‌ డిస్పోజ్‌హర్‌ ఓవర్‌ ఫోన్‌ ఓన్లీ.’

‘యస్‌ మేం. ఐ విల్‌ బి బ్యాక్‌ టు యు ఆఫ్టర్‌ టెన్‌ మినట్స్‌’

లైన్‌ తెగిపోయింది.,

ఒక దేశపు సైనిక శిబిరాల్లోనైనా తన సంస్థలో ఉన్న క్రమశిక్షణ ఉంటుందా. నిబద్ధత ఉంటుందా. బాధ్యతలపట్ల ఇంత అంకితభావముంటుందా అని అనిపించింది లీలకాక్షణంలో.

ఈ రోజు లీల ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. భారతదేశం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఏ పనంటే ఆ పని.. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, సైనిక, రాయబార సకల రంగాల్లో ఏదైనా సరే.. ఆ పనిని అతి విశ్వసనీయంగా నిర్వహించగల ఏకైక శక్తి.. లీల.

లీల అంటే..నమ్మకం..గ్యారంటీ..లీలంటే ఒక ఓటమి ఎరుగని విజయం..లీలంటే ఒక వ్యూహాత్మక కార్పొరేట్‌ ఎత్తుగడ.. ఒక ఆధిపత్య ప్రతీక.

మొబైల్‌ సన్నగా ప్రకంపించింది.

”హలో”

” మేడం. నేను నీరజా రావ్‌ని..”

”హై..హలో నీరజా..చెప్పు..”

”మీరు చెప్పిన పనులన్నింటినీ విజయవంతంగా ముగించాను మేడం. రిపోర్ట్స్‌న్నీ నా దగ్గరున్నాయి. జర్మనీ ఆటోమొబైల్‌ జెయింట్‌ రోవర్‌కు ఆదిలాబాద్‌ దగ్గర వందా యాభై ఎకరాల స్థల కేటాయింపు, వాళ్ళు తయారుచేసే డిఫెన్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌కు ఆరేళ్ళపాటు పర్చేజ్‌ గ్యారంటీ ఒప్పందం..అంతా ఓకే..సంబంధిత అధికారులు, నాయకులు, మంత్రులు..అందరూఓకె. పద్దెనిమిది కోట్ల లంచాలు..మిసలేనియస్‌ ఖర్చులు ఇంకో రెండు కోట్లు. వెరసి మీరు ఈ డీల్‌ను ముప్పయికోట్లకు ఓకే చేసుకోవచ్చు. మేడం, రోవర్‌వాళ్ళు ఐదుకోట్లు మన కువైట్‌ అకౌంట్‌లో రేపు వేస్తామంటున్నారు. మీరు ఓకే అంటే.. ఐ విల్‌ వెయిట్‌ ఫర్‌ యువర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌.”

నీరజా రావ్‌ ఐఐఎమ్‌ బెంగళూర్‌ యంబిఎ క్వాలిఫైడ్‌. మెరుపులాంటి మేధ.. చూపితే కొండ ప్రాకే తత్వం. తన కన్‌సెల్టెన్సీలో మిడిల్‌ ఈస్ట్‌ ఇంచార్జ్‌. కాని పైకి మాత్రం ఫ్రాన్స్‌లోని రోవర్‌ కంపెనీలో రెసిడెంట్‌ కన్‌స్టలెంట్‌..

అంతా బినామి..

ఎక్కడా..తమ పేరు ఉండదు బాహాటంగా..అంతర్గతంగా మాత్రం అంతటా తమ పేరే ఉంటుంది.

ఉండీలేనట్టుగా..లేకా ఉన్నట్టుగా అనిపించేదే లీల కదా.

లీల ఒక మిథ్య…ఒక సత్యం..ఒక స్వప్నం..ఒక సందిగ్ద సందర్భం..భయంకొల్పే వాస్తవం..అంతిమంగా ఒక ఓటమి ఎరుగని విజయం.

చటుక్కున ఏదో తోచినట్టు ఉలిక్కిపడి..నీరజారావ్‌కు ఫోన్‌ కలిపింది క్షణంలో. ఆమెతో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ డ్యూటీలో ఉన్న తమ ఇన్నర్‌ సర్కిల్‌ అసోసియేట్స్‌ లీల స్పెసిఫిక్‌ టూర్‌లోఉన్నప్పుడు హై అలర్ట్‌లో హాట్‌లైన్‌పై అందుబాట్లో ఉండి క్షణాల్లో ఆన్‌లైన్‌లో కొస్తారు పిలవగానే. లీల కంపెనీ పనిసంస్కృతి అది.

‘వెల్‌ నీరజా..రోవర్‌తో డీల్‌ పక్కా చెయ్‌’. మనం లాస్ట్‌ డిస్కషన్‌లో మెక్సికన్‌ కంపెనీ రిచర్డ్‌సన్‌ పవర్‌ సిస్టమ్స్‌ గురించి చర్చించాం. గుర్తుందా. కువైట్‌లో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూరపాటి అండ్‌ సన్స్‌ గ్లోబల్‌ టెండర్‌కు అడ్డుతగుల్తున్నాడు వాడు. వాళ్ళ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వచ్చే ఇరవై ఎనిమిదిన ఫ్రాంక్‌ఫర్ట్‌ వస్తున్నాడు. డిటెయిల్స్‌, ఫ్లైట్‌ నంబర్‌, హోటల్‌..వివరాలన్నీ నీకు మెయిల్‌లో వస్తాయి. వాణ్ణి టాకిల్‌ చేయాలి. వినకుంటే వాటర్స్‌ హాలో రోడ్‌లో ఆరోజు రాత్రి ఒక రోడ్‌ యాక్సిడెంట్‌పేర వాణ్ణి లేపెయ్యాలి. వాడు ఆరోజు జాన్సన్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో ఒక పార్టీలో పాల్గొంటాడు. ఆపార్టీనుండి వస్తూండగా..ప్లీజ్‌ నోట్‌’

”ఓకే మేం..”

”గెట్‌ బ్యాక్‌ టు మీ..ఆన్‌ ట్వంటీ నైన్త్‌ ఈవినింగ్‌ ఎట్‌ సిక్సోక్లాక్‌ పాజిటివ్లీ”

”యస్‌ మేం..”

ఫోన్‌ పెట్టేసి..టకటకా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలోని ఒక సీనియర్‌ మంత్రి విశ్వనాథరెడ్డికి లైన్‌ కలిపి..”మీరు రేపు ఉదయమే..ఎనిమిది గంటలలోపు ప్రెస్‌మీట్‌ పెట్టి ముఖ్యమంత్రి పనితీరుపై, అసమర్థతపై మండిపడ్తూ తీవ్రపదజాలంతో ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వండి. చదరంగం ప్రారంభమైంది. ఒక పావు కదపాలిప్పుడు మనం. మీకది ఉపయోగకరంగా ఉంటుంది..”అని ఆదేశించింది.

”యస్‌ మేడం..”

గుండెల్లో ఏదో ఉద్వేగం..ఒకని మరణశాసనం..ఒక ప్రభుత్వ పతనానికి ముహూర్తం.,

కళ్ళు మూసుకుంది..అలసటగా.

ఎదురుగా..విశాలమైన గాజుతలుపుల కారిడార్‌లోనుండి..చొచ్చుకొచ్చి నిరీక్షిస్తున్న నీలి సముద్రం. అలల ఎడతెగని చప్పుడు..లయబద్ధంగా..నిరంతరంగా..వింటోంది..వింటూనే ఉంది..,

ఆమెకర్ధమౌతోంది.. ఆమె బయట.. ఎదుట మాత్రమే కాదు.. తన లోలోపలకూడా ఒక నిశ్శబ్ద సముద్రం గర్జిస్తోందని,

టైం చూచుకుంది లీల కొద్దిసేపైన తర్వాత. రాత్రి రెండూ యాభై నిముషాలు.

ఈ దిక్కుమాలిన ప్రపంచంలో రాజకీయాల్లోగానీ, ఇతరేతర ఏ కీలక రంగాల్లోగానీ అతిప్రధానమైన నిర్ణయాలన్నీ రాత్రుళ్లే జరిగిపోతాయి. రాత్రుళ్ళు వ్యూహించుట..పగళ్ళు అమలు..ఒక రేయింబవళ్ళు వేట,

ఎందుకో ఆమెకు తన ఇష్టమైన ‘ఎర్త్‌’ బ్లూరే డివిడి చూడాలనిపించింది. లాప్‌టాప్‌లోనుండి ఎదుట ఉన్న శాంసంగ్‌ హోం థియేటర్‌ సిక్ట్సీ ఫోర్‌ ఇంచెస్‌ టి.విలోకి డిస్ని నేచర్‌ ‘ఎర్త్‌’ ఫైల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసి ‘ప్లే’ నొక్కింది.

‘ఎర్త్‌’..అంటే..భూమి..ఫృథ్వి..పుడమి..ధరణి.,

స్త్రీ.. అంటే అన్నింటినీ భరించేది..ధరించేది..ధరణేకదా., టి.వి. తెరపై విశాలంగా ఒక ఎడారి విచ్చుకుని పరుచుకుంది. ఒక ఒంటరి గ్రద్ద..విశాలంగా విప్పుకున్న రెండు రెక్కలు.. పరుగెత్తుతోంది..పైన ఆకాశం..క్రింద భూమి,

లీల అలసిపోయిన ప్రతిసారీ ఈ ‘ఎర్త్‌’ డివిడిని చూస్తుంది..చూడగానే హృదయం రీచార్జ్‌ ఔతుంది. తను పునరుత్తేజిత ఔతుంది. ఈ భూమిపై చిగురించి, ఎదిగి, ఒదిగి, వికసించి, నశించి, దహించుకుపోయి, శిథిలమై, ఒట్టి అవశేషంగా మిగిలి..స్తబ్దమై..నిర్జీవమై..మళ్ళీ చిగురించి..,

‘వలయం వలయేతి..’

చక్రం.. కాలచక్రం..ఋతుచక్రం.. జీవచక్రం..జ్ఞానచక్రం..జగమంతా ఒక అవ్యవస్థిత చక్రగమనం.. చక్రభ్రమణం,

ఏనుగు శరీరం ఎంతో పెద్దది. కళ్ళు ఎంత చిన్నవో,

పక్షి ఏదైనా..రెక్కలు రెండు..ఎంత చిన్నవో..ఈదవలసిన ఆకాశం ఎంత విశాలమైందో..

గుర్రం కాళ్ళు ఎంత  సన్ననివి..కాని, దాని వేగం ఎంత ప్రచండమైంది. ఐతే జీవితమంతా పరుగే..పుట్టి భూమిపైన పడ్డ మరుక్షణం నుండి చచ్చేవరకు గుర్రం నిరంతరం రేయింబవళ్ళు ఎప్పుడూ నిలబడి ఉండడమే. అలసట ఎరగకుండా.. విధేయంగా, సహనంగా..ఎంత శిక్ష..జీవితకాల శిక్ష.

రెక్కలు మొలుస్తున్నపుడు ప్రతి పక్షీ ఎంత పులకించిపోతుంది,

పుడ్తున్నపుడు ఏ మొక్కయినా ఎంత అందంగా ఉంటుంది జీవకాంతితో.

ప్రతి జలపాతం..క్రింద పడి..పతనమై..చితికి…చింది..స్థూల ప్రవాహం ఒక సూక్ష్మ విస్తరణగా, వ్యాప్తిగా మారి..ఉత్థానం..పతనం..శృంగం, ద్రోణి – శిఖరం..లోయ..చీకటి, వెలుగు..ఉదయం, అస్తమయం..ప్రక్కప్రక్కనే, వెంటవెంటనే,

ఒక జింకను ఒక పులి వేటాడ్తోంది.. ఆకలిగా, కసిగా, దీక్షగా..తెరపై .,

ఆ క్షణం ముందు పులి పొడ జింకకు తెలియదు.. జింక ఉనికి పులికి తెలియదు..ఒకదానికి మరొకటి తటస్థపడగానే.. ఆత్మరక్షణ..వేట..వేటాడబడ్డం.,

భూమ్మీది ఈ సకల చరాచర జీవరాశులన్నీ జీవించడానికి పోరాడ్తూనే, ఆత్మరక్షణ కోసం వ్యూహాత్మకంగా బ్రతుకంతా యుద్ధం చేస్తున్నాయి..కదా.

యుద్ధం..యుద్ధం..జీవితమంటే..యుద్ధం..పోరాటం.,

ఎవరితో..?

సముద్రాలు..ఎడారులు..అడవులు..ఆకాశం..ఈ సమస్త జీవజాలం..,

అంతా ఏనాడూ ఎవరికీ అర్ధంకాని ఒక వ్యవస్థ..ఒక పాఠం..ఒక సజీవ బోధన..అంతా ఉండి చివరికి ఏదీ ఉండదని నిరంతరం ఒక సత్యాన్ని ప్రవచించే ప్రజ్వలిత చేతన.,

లీల మనసునిండా ఒక ఛాయామాత్రంగా సమస్త సృష్టి.. క్రమంగా వ్యాపించి..అల్లుకుపోతూ..ఎక్కడో తెలిపోతూ.,

గాలి కనబడ్తుందా..?ప్రశ్న.

కనబడదు కాబట్టి గాలిలేనట్టు కాదుగదా.

కనబడనివన్నీ లేనట్టా.. కనబడేవన్నీ ఉన్నట్టా..,ప్రతి మనిషికీ తెలిసే ‘ఆకలి’ ఉన్నట్టా లేనట్టా.

ఎందుకో ఆమె హృదయపు లోపొరల్లో అన్నమయ్య కీర్తన కదిలి సన్నగా వినిపించడం మొదలైంది.

‘అంతర్యామీ..అలసితి..సొలసితి..’

లీల కళ్ళు మూసుకుంది.

ఎందుకో ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండి..దుఃఖం పొంగి పొంగి,

అప్పుడామె తీరాన్ని చేరబోతున్న సముద్రపుటలలా..కల్లోలంగా ఉంది.

(సశేషం)

ఉహూ ….కారణాలేమయినా ?

జిందగీ మౌత్ నా బన్ జాయే సంభాలో యారో :

శరత్కాలం ఆకుల్లా కలలన్ని రాలిపడుతున్నపుడు
జ్ఞాపకాల వంతెన పగుళ్ళు పాదాలని
సుతిమెత్తగానే అయినా కోస్తూ ఉంటే
గుండె మంటలను చల్లార్చే మేజిక్ నైపుణ్యాలు
నిశ్శబ్దం గా నిద్ర పోతూనప్పుడు
తడి ఆరని కళ్ళు రాత్రి పాటల నైటింగేల్ లా
రెప్పలు అలారుస్తూ

ప్రపంచాన్ని ప్రేమించాల్సిన  చిన్న హృదయం
ఒకే వ్యక్తి ప్రేమ కోసం మరింత చిన్నబోతుంటే
నైతికతల జలదరింపు లో శూన్యమైన
ఆకుల గుస గుస లలో ఒక ఉత్కంఠభరితమైన నిట్టూర్పుతో
శరదృతువు ఇంకోసారి ఎర్రబడినప్పుడు
ఒంటరి రాత్రుల నిదురలనెందుకు లేపటం ?

ఎన్నిసార్లో

చీకటి కి మెలుకువకి మద్య మగతల్లో
జీవితాన్ని ఇంకో సారి దగ్గర కి తీసుకొవాలని
గుండెల్లో దాచుకొని హత్తుకోవాలని
మునివేళ్ళతో  తన బుగ్గలను మృదువుగా సృశించాలని ,
తన చెంపల మీద కన్నీటి మచ్చలను నెమ్మదిగా తుడవాలని
తన కి మాత్రమే వినపడేటట్లు సుతిమెత్తగా
మృదు స్వరం లో లాలి పాడి నిద్రపుచ్చాలి

అని ఎన్ని సార్లు మనసు కొట్టుకుంటుంది
బహిష్కరించలేని బాధలు భూమ్మీద
ప్రతి ప్రాణికి విజయపు ఓటములంత నిజం
అని చెప్పాలని ఎన్నిసార్లు అనుకుంటాను

అలాగే

ఉదయపు ఎండలు శరీరం తో ఆటలడుతున్న వేళ
ఊహల ఉచ్చుల ఇమేజ్ అద్దం లో ఉండదని
ఫెయిరీ టేల్ కవిత్వం కనులముందు కనిపించదని
నిజం అబద్ధం కి మధ్య గీతలు చిన్నవని
మనసుకు గోలుసులేసి అవి తమతో
లాగుతూ ఉంటాయని
గుండె చప్పుడు స్థిరంగానే ఉంటుంది
కాని (వి)శ్వాసలే విరిగి ముక్కలవుతాయని
మనసుకు మనసుకు మద్య  ద్వేషాల చైనా వాల్
స్థిరంగా , బలంగా ఉండిపోతుందని
స్మైల్స్ మద్యలో మైళ్ళ దూరం దాగుందని
చెప్పాలి అని గుండె విప్పాలి అని  అనుకుంటాను

Van_Gogh-09

ఉహూ ….కారణాలేమయిన ?

విరిగిన అద్దం ముక్కల ను అతికించి
పైన  ఎంత gloss పెయింటింగ్ చేసినా
నవ్వుతున్న పగిలిన పెదవుల లా
గాయాల వికృతత్వం కనిపించకుండానే
కనిపిస్తూ ఉన్నంతవరకు
వర్షించని నల్ల మబ్బుల్లో నీళ్ళు ఉంటాయని
కనిపించని ఆకాశం ఉక్రోషంలో గర్జిస్త్తే
వర్షం పడుతుంది అని
ముసుగుల వెనక దాగిన
గుండెల్లో ఎక్కడో వినిపించని
మానవత్వం చిరుమువ్వలు సవ్వడి చేస్తూంటాయని
నమ్మని  , నమ్మించలేని వెక్కి వెక్కి ఏడ్చే వెర్రి గుండె
మౌలా మేరి లేలే మేరి జాన్ పాడే  పాటల్లో
కష్టం వెనక మిగిలిన నిజం ఒక్కటే

అబ్సొల్యూట్ ట్రూత్స్ అంటూ  లేని జీవితం లో
వందలు గా వేలుగా కూడి చేరి
గూడు కట్టిన నిస్పృహల ప్రయాణం
దేవుడి మేనిఫెస్టో నుండి
రొమాంటిక్ మేనిఫెస్టో దార్లను వెతుకుతూ
కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కి చేరి ఓడిపోయినపుడు
కన్నీళ్ళకు తప్ప యూనివర్సల్ ఈక్వాలిటీ  ఎవరికీ సాధ్యం ?

జిందగీ తో జి తే జి మౌత్ బన్ గయా
అబ్ క్యా సంభాల్నా మేరె దోస్త్ ?

నిశీధి 

చిత్రరచన: వాంగో

నదీమూలంలాంటి ఆ యిల్లు!

 

యాకూబ్

యాకూబ్

చాలాచోట్లకు చాలా సందర్భాల్లో , అసందర్భాల్లో వెళ్ళలేకపోయాను
వెళ్ళినందువలన ,వెళ్ళలేకపోయినందున
అంతే ;అంతేలేని ,చింతే వీడని జ్ఞాపకంఊళ్ళో ఇప్పుడెవరూ లేరు
వృద్ధాప్యంలో ఉన్న యిల్లు తప్పఇల్లంటే చిన్నప్పటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం;
చిన్నిచిన్ని కిటికీలు రెండు;
కొన్ని దూలాలు;
వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు
బెంగగా వుంటుంది దూరంగా వచ్చేసానని .
కలల్లోనూ అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూలేచి ,పక్కలో తడుముకుని దొరక్క
వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తానుఅప్పటికవి ప్రేమిస్తాయి
ఇంకా నాలో మిగిలిఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి.
1
ఇంతున్నప్పుడు

నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను; అవి నన్ను మోస్తున్నాయి
ఒళ్ళంతా పాకిన గజ్జికురుపులమీద చల్లుకుని పేడరొచ్చులో ఉపశమించాను
వేపాకు నూరి పూసుకుని కురుపుల్లా మాడి చేదెక్కాను
కాలిబొటనవేలి దెబ్బల్నిఒంటేలుతో కారుతున్న రక్తానికి అభిషేకం చేసాను
ఎర్రటి ఎండలో బొబ్బలెక్కిన కాళ్ళ మీద ఆవుమూత్రం రాసుకుని
ఆనందంతో గంతులేశానుఋణమేదో అంతుబట్టని రహాస్యమై కలల్ని ముట్టడిస్తుంది;
గాయాల సౌందర్య రహాస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది
picasso-paintings-17-575x402

2
అక్కడున్నది ఖాళీ ఖాళీ నేలే కావొచ్చు;
ఎవరూ సంచరించని ,నిద్రించని,
గంతులేయని ఉత్తి భూమిచెక్కే కావొచ్చు
అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి,
నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి ,
పెంచి పోషించిన కాలం వుంది
వెళ్ళలేక చింతిస్తున్న ,
దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది
చాలా చోట్లకు వెళ్ళలేక పోవడం క్షమించలేని నేరమే
మరీముఖ్యంగా నదీమూలంలాంటి ఆ యింటికి.
-యాకూబ్

అవ్యక్తం

భాస్కర్ కొండ్రెడ్డి

భాస్కర్ కొండ్రెడ్డి

1

 ఎదురుచూస్తునే వుంటాం మనం,

కళ్లువిప్పార్చుకొని, ఇంకొన్ని ఆశలు కూర్చుకొని,

ఆ చివరాఖరి చూపులు

మళ్లీ తెరుచుకోకుండా, మూసుకొనేదాకా.

 

2

ఎన్ని కష్టాలు తలలకెత్తుకొని తిరుగాడిన దుఃఖాలనుంచి

విముక్తినొందే సమయాలను మళ్లీమళ్లీ తలుచుకుంటూ

వదిలిపోయిన చిరునవ్వుల చివరిస్పర్శల పలకరింతలను

పదిలంగా దాచుకొని, దాచుకొని

పగలకుండా, ఓదార్చుకుంటున్న

ఓ పురా హృదయాన్ని, కొత్తగా పునర్మించుకోలేక

వదలని వేదనను, హత్తుకొని సముదాయుంచుకొంటూ

 

3

ఎన్నెన్ని ఆలోచనలు సమసిపోయాయో

ఏ ఏ అనుభూతులు వదలిపోయాయో

ఎన్ని జీవితకాంతులు,అలా చూస్తుండగానే ఆరిపోయాయో

లెక్కలకందని,లెక్కించలెన్నన్ని తారకల్లా తెల్లారిపోయాయో

ఒక హృదయసాక్షానికి, తార్కాణంగా మిగలడానికి కాకపోతే

ఎందుకిలా, ఇక్కడే చూస్తుండిపోతాం.

దేన్నీవదలకుండా, ఎటూ కదలకుండా.

4

మొదలుకావడంలో మన ప్రమేయమే లేనట్లు

పయనమంతా మనమే చేసినట్లు, భరించినట్లు

ఇహలోకబంధాలు వదిలించుకొని,

ఇకరా అని, ఎవరో పిలిచినట్లు,

 

ఒక్కొక్క అంశాన్ని ఎంత జాగ్రత్తగా,

పునఃసమీక్షించుకుంటుంటామో కదా, మనం.

 

మనకు మనమే ఒక వైభోగవంతమైన వలయాన్ని,

కందకంలా నిలుపుకొని, కనులముందు

ఎంతగా విలపిస్తామో మరి,  దాన్నిదాటలేక.

– భాస్కర్ కొండ్రెడ్డి

రాలిపోయిన కాలం

ఎమ్వీ రామిరెడ్డి

ఎమ్వీ రామిరెడ్డి

మిగిలిపోయిన గాయాల గురించి

బెంగలేదు

పగుళ్లిచ్చిన కలల గురించి

పశ్చాత్తాపం లేదు

ముళ్లను కౌగిలించుకోబట్టే

పాఠాలు బోధపడ్డాయి

కళ్లు నులుముకున్న ప్రతిసారీ

నిప్పులకుంపట్లు బయటకు దూకేవి

అధ్యాయాల్ని ఔపోసన పట్టడానికి

తెల్లవారుజాముల్లో ఎన్నెన్ని మరణాలు

చీకటితెరల్ని చించుకుంటూ

వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ

చచ్చుబడిన కణాలను నిద్రలేపిన గుర్తులు`

అక్షరాలు అలసిపోయేదాకా

పరుగుపందెం ఆపబుద్ధి కాదు

pablo-picasso-paintings-0004

గుండెలమీద రెపరెపలాడే పేజీలు

దేహాత్మలోకి వెన్నెలదృశ్యాల్ని దించుతున్నప్పుడు

చుట్టూ సూర్యకిరణాల పరిభ్రమణం

ఎటు చూస్తే అటు ఓ విశాల బాట

మైలురాళ్ల వెంట ఆహ్వానతోరణాలు

తీరం చేరిన ప్రతిసారీ ఒక విజయోత్సవం

పరుగెత్తే మోహంలో

ఏమేం పోగొట్టుకున్నానో గుర్తించలేక

రాలిపడుతున్న చంద్రుళ్లను ఏరుకుని

మళ్లీ ఒంటికి అతికించుకోలేక

ధ్వంసమైన క్షణం మళ్లీ కొరడా ఝళిపిస్తుంది

రాలిపోయిన కాలాన్ని ఏ రూపంలో ఏరుకోవాలి

వెంట నిలబడటమా

వెన్నెముకను వదులుకోవటమా

అంటిపెట్టుకుని అంటకాగటమా

ఆరిపోయిన దీపాలను వెలిగించటమా

 గాయాల్లోంచి సన్నగా వేణుగానం

కలల కారడవుల్లో హరితకాంతి

పాఠాల పునశ్చరణలో నూతనశకం

– ఎమ్వీ రామిరెడ్డి

ఉరిమిన మబ్బు

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

ఫోను మాట్లాడిన నాకు ఎగిరి గంతేయాలని అనిపించింది. రోడ్డు మీద దొరికిన టికెటుకి లాటరీ తగిలినంత ఆనందం కలిగింది. అగ్ని కర్తీరిలో చల్లని వాన కురిసినట్లు తోచింది.

ఒక ఊదటున లేచి ‘సేల్స  బ్యాగు ‘చంకకి తగిలించుకున్నాను. షూ లెసు ముడి వేసుకుంటూ వుంటే ,మా ఆవిడ

కేకేసింది. ‘’ఏమండోయ్   ,టిఫిను రెడి. తిని వెళ్ళండి.మళ్ళీ ఎప్పుడు ఇల్లు చేరుతారో ,ఏమూ —–‘’

వాచీ చూశాను. టైం పావు తక్కువ తొమ్మిది !

కచ్చితంగా తొమ్మిది గంటలకు రమ్మన్నాడు అతడు. తొమ్మిది దాటుతే అతడు  ఉండడట !

గేటు వైపు నడిచాను. చాలా ఉక్కగా వుంది. ఆకాశం నిండా నల్లని మబ్బు. చినుకు రాల్చని ఆ నల్లని మబ్బు ఆర్డర్లు రాల్చని కస్టమర్లను గుర్తు చేసాయి.

‘’ఏమండోయ్  —‘’ మళ్ళీ కేకేసింది మా ఆవిడ.

పట్టించుకోలేదు. మగడికి తిండి పెట్టె విషయంలో ఆడది చూపే ప్రేమ మరే విషయంలోనూ చూపదు కదా !

బైకు ఎక్కాను. టైముకి వెళ్ళాలి. వెళ్తే ఒక ఆర్డరు రావచ్చు.

ఆర్డరే కదా ,మాలాంటి ‘సేల్స్ మేను’ల ఉద్యోగానికి ప్రాణవాయువు !

మా మేనేజర్ కూడా అదే మాట అన్నాడు. ‘’ఎలాగోలా ఆర్డర్లు సంపాదించాలయ్యా.రెండు నెలలుగా ఒక ఆర్డరైనా తేలేదు నువ్వు’’

నిజమే !తల దించుకున్నాను.

‘’ఈ నెలలోనైనా ఆర్డరు తేలేకపోతే —–‘’

ఏమవుతుందో నాకు తెలుసు.’సేల్స్  బ్యాగు ‘ తిరిగి ఇచ్చేయాలిసిందే.

‘’ఒక పని చేయి ‘’మేనేజర్ సానుభూతితో అన్నాడు. ‘’నేను ఒక వెయ్యి  కరపత్రాలు అచ్చు వేయిస్తాను. అవి పంచు.గోడల మీద ,స్తంబాల మీద అంటించు. మన కంపెనీ గురించి జనానికి తెలియాలి కదా ‘’

అలాగే చేసాను. ఊరిలోని ప్రహారి గోడలు నిండా మా కరపత్రాలే !

మాది అంతర్జాలం అద్దికిచ్చే కంపెని . వెంటనే ఫలితం కనబడింది. ఫోను వచ్చింది.

నవ్వుతూ ఆత్మీయంగా స్వాగతం పలికాడు అతడు. ఇంటిలోపలకి తీసుకొని వెళ్ళి కూర్చోమని చెప్పాడు

అరవై సంవత్సరాలు దాటిన మనిషి అతడు. వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతని మాట తీరు చూస్తువుంటే ఆర్డరు ఇస్తారనే అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చాను.

‘’సరే ,వెంటనే కనెక్షన్ ఇచ్చేస్తావు. ‘’అతడు అన్నాడు ‘’మరి ఏదైనా సమస్య వస్తే —-‘’

‘’నేను ఈ ఊరిలోనే ఉంటాను కదండీ సార్.ఒక ఫోను కొట్టండి.చాలు వెంటనే స్పందిస్తాను ‘’

‘’కచ్చితంగా ——‘’

‘’కచ్చితంగా స్పందిస్తాను సార్ ‘’

‘’అయితే సరే ఫోను చేస్తాను ,ఈ రోజే ‘’

నాతో పాటు గేటు దాకా వచ్చాడు అతడు.

‘’మా ప్రహారీగోడ మీద అంటించిన కరపత్రం మీదే కదా —‘’

‘’అవును ,సార్ ‘’

‘’శుభ్రంగా పైంటు చేసి వుంచిన గోడ పాడు చేసారెమిటి ? ‘’అతని గొంతు మారింది ‘’ఆ కరపత్రం పీకెసి గోడ శుభ్రం చేసి వెళ్ళండి ‘’

నేను ఖంగు తిన్నాను. ఒక నిమిషం పోయాక అన్నాను ‘’అలాగే సార్ . కుర్రవాడ్ని పంపుతాను ‘’

‘’ఈ మాత్రం దానికి కుర్రవాడేందుకు ?’’

నేను మాట్లాడలేదు.

‘’అంటే మీరు చెయరన్న  మాట. అంతేగా. –ఇప్పుడేగా చెప్పారు సమస్యకి వెంటనే స్పందిస్తారని. ఇదేనా మీ స్పందన—‘’

ఇరకాటంలో పడ్డాను.

గోడ మీద కరపత్రం చించి గోడ శుభ్రం చేసి బైకు ఎక్కాను.

ఆకాశం నిండా మబ్బే !కాని మబ్బు కురవలేదు ;ఉరిమింది.

    –ఎల్. ఆర్ . స్వామి

*

 

 

 

అడుక్కునే ఆ వేళ్ళల్లో…ఒక హరివిల్లు!

DRUSHYA DRUSHYAM-8
నిజాం కాలేజీ గ్రౌండ్స్ వద్ద తరచూ అనేక రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతూ ఉంటై. సామాజిక ఉద్యమకారులూ పెద్ద పెద్ద సభలూ నిర్వహిస్తరు. దగ్గర్లోనే విద్యుత్ ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరపగా అప్పటి అమరుల స్మతి చిహ్నమూ అక్కడే ఉంది. నక్సలైట్ల మందుపాతరలో మరణించిన మాధవరెడ్డి ప్రతిమా ఉన్నది. ప్రెస్ క్లబ్బూ ఉంది. పోలీస్ కంట్రోల్ రూమూ ఉన్నది. ఇంకా చాలా ఉన్నయ్. విద్యార్థులున్నారు. మేధావులున్నారు.  అక్కడే ఈ మనిషీ ఉన్నడు.

ఇతడు కుష్టు వ్యాధిగ్రస్థుడు. వీధి భిక్షువు. అందరూ ఉన్న అనాథ.

తనను తాను తోలుకునే ఒక వీల్ చెయిరు వంటి ప్రపంచంలో తానొక అర్భకుడు…
ఊరూ పేరూ కులమూ మతమూ ప్రాంతమూ దేశమూ ఎముకలూ చీమూ నెత్తరూ ఆత్మా ఉండి కూడా ఏమీ లేని మనిషి. అభాగ్యుడు. అపరిచితుడు. పాపి.

అవును. ఎవరున్నా లేకున్నా…కొత్తగా ఎన్ని లేచినా ఏమున్నది గనుక అన్నట్టు, మట్టికొట్టుకుపోతున్న దేహమూ, దేనిపైనా ఆశలేని విరాగమూ, ఎండకు ఎండి, వానకు తడిసి, శీతలానికి తట్టుకోలేని నిస్సహాయ ప్రాణమూ, దాన్ని తనంతట తాను వదలలేక ఆ శిలువ వేసిన క్రీస్తును తలుచుకుంటూ కానవచ్చే పాపి.

అతడు వినా ఏదీ ఆ వీథిలో నన్ను ఆకర్షించదేమీ? అని చింతిస్తూ, నిర్దయగా నా నగరమూ ప్రజలూ అని వాపోతూ బతుకును చిత్రిక పడుతూ పోవడం పరిపాటయింది నాకు!

తెలుసునా?..ఒక దృశ్యం చిత్రించేటప్పుడు గుండె కలుక్కుమంటుంది. ఆ దృశ్యం చెంత నుంచి చప్పున అదృశ్యం కావాలనిపిస్తుంది. కానీ అది మెదడు.

గుండె వేరుగా పనిచేస్తుంది. ఆగిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఆ జీవితాన్ని శ్వాసించినాకే అడుగు ముందుకు వేయనిస్తుంది.

ఆ క్షణంలో ఏదీ గుర్తుకు రాదు. కానీ ముందూ వెనకా మనసు పరిపరివిధాలా పోతుంది.
ఆ వృధ్దుడి దీనావస్థకు మనసు కలికలి అవుతుంది. కలకలా అనిపిస్తుంది.

కళ కళ కోసమేనా, కాసుల కోసమేనా అన్న చర్చకాదు గానీ మనిషి మనిషి కోసమేనా? కాదా అన్న బాధతో కడుపు రగిలిపోతుంది.

కవులైతే కవిత్వం, గాయకులైతే పాట, తాత్వికులైతే మీమాంస, రాజకీయ నేతలైతే హామీలవుతున్నారు. ఇక దేవుండ్లయితే బద్మాష్ లే అవుతూ తప్పుకుంటున్నారని వాపోతుంది.
ఇదంతా ఆలోచన. కానీ, అంతకన్నా విలువైనది తాదాత్మికత.

అందువల్లే చిత్రం మహత్తరం అవుతుంది.
అందలి జీవితం గురించి స్పందించేలా చేసి మనుషుల్ని మహానుభావుల్ని చేస్తుంది.

unsung unwept unnoticed unhonored  అని భావించే ఎన్నిటిపైనో ఆ మనిషి మనసును లగ్నం చేసేలా చేస్తుంది.
అందుకే ఆస్కార్ వైల్డూ, నువ్వన్నది నిజమే!జీవితం చిన్నదైనా కళ అపూర్వం. art is long.

ఆటా రచనల పోటీలు

ata

మెరికా తెలుగు సంఘం వారు పదమూడవ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు  రచయితల నుండి ఈ క్రింది సాహితీ ప్రక్రియల్లో రచనలు ఆహ్వానిస్తున్నారు:

1. కథలు

2. కవిత్వం (వచన కవిత్వం, ఛందోబద్ధమైన కవిత్వం)

3. వ్యాసాలు/గల్పికలు/వ్యంగ రచనలు/లేఖలు/పేరడీలు

పోటీల నిబంధనలు, రచయితలకు సూచనలు:

• రచయితలు పైన పేర్కొన్న ఏ విభాగానికైనా తమకు నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని, అన్ని తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని , సమాజ, ఆచార వ్యవహార స్థితిగతుల్ని ప్రతిబింబిస్తూ రాసే రచనలకు పెద్దపీట వేయబడుతుంది.

• ఉత్తమ రచనలకు $116 బహుమతితో పాటు ఆటా జ్ఞాపిక అందజేయబడుతుంది. బహుమతి ప్రధానం  జూలై 3, 4, 5 తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే ఆటా వార్షికోత్సవ మహాసభలలో జరుగుతుంది.

• బహుమతి పొందిన రచనలు, సాధారణ ప్రచురణకు ఎంపిక చేయబడిన రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది.

రచనలు చేరవలసిన ఆఖరి తేదీ మార్చి 30, 2014. ఈ తేదీలోపు కంటే ముందే, వీలైనంత త్వరగా పంపగలిగితే మరీ మంచిది.

• కథలు: కథల నిడివి చేతి వ్రాతలో పది పేజీల లోపు, టైపింగ్ లో ఐదు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• కవిత్వం: కవిత చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది. ఆదునిక కవిత, ఛందోబద్ధమైన పద్యకవిత్వం, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.

• వ్యాసాలు, గల్పికలు, వ్యంగ రచనలు, పేరడీలు, లేఖలు: చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• రచయితల యొక్క అముద్రిత స్వీయ రచనలు మాత్రమే స్వీకరించబడతాయి. అనువాదాలు, అనుసరణలు, అనుకరణలు అంగీకరించబడవు. బ్లాగులు, వెబ్ సైట్స్, వెబ్ పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించబడ్డ రచనలు పరిగణింపబడవు. ఈ విషయాలను ధృవీకరిస్తూ హామీపత్రం జత చేయాలి.

• రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. కాని, రచయితలు తమ రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించే లోపు ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.

• రచనల్ని యూనికోడ్ ఫాంట్స్ లో పంపాలి. ఒకవేళ మీకు యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపించవచ్చు. దయచేసి వీలైనంత వరకు యూనికోడ్ లో టైప్ చేసి పంపించగలరని కోరుతున్నాం. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు. రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ క్రింది ఈమెయిల్ అడ్రసుకు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.

• కనీసం ఐదుగురు న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు. న్యాయనిర్ణయం అంతా తగిన నిబద్ధత, కొలబద్దల ఆధారంగానే జరుగుతుంది. విజేతల నిర్ధారణలో అన్ని విషయాలలోనూ నిర్వాహకులదే అంతిమ నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

• రచనలు పంపవలసిన ఈమెయిలు: souvenir@ataconference.org. ఈమెయిలులో మీ పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, చిరునామాల తో పాటు ఒక పేజీకి మించకుండా మీ నేపద్యం కూడా పంపించడం మరిచిపోవద్దు.

వీలునామా – 21 వ భాగం

శారద

శారద

[su_quote] (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)  [/su_quote]

 అంతగా విద్యా గంధం అంటని మనిషి రాసినట్టుంది ఆ ఉత్తరం.

మెల్బోర్న్

20 ఏప్రిల్

 ప్రియామైన ఫ్రాన్సిస్,

నీకీ మధ్య బాగా డబ్బొచిందటగా? ఆ పెద్ద మనిషికి మాబాగా అయిందిలే. మనిద్దరినీ రోడ్డు మీద  పడేయాలని బాగా ఆశపడ్డాడు, కానీ పాపం ఏం లాభం? అమ్మని మర్చిపోకు నాయనా. ఎంత బలవంతంగా నిన్ను నానుండి లాక్కున్నాడు! నీకు నా మొహం కూడా గుర్తులేదేమో.

పోయేవరకూ నాకు యేడాదికి నూటాయాభై పౌండ్లు పంపే వాడులే! అది ఆగిపోయేసరికి ఏమైందా అని వాకబు చేసా. అప్పుడు తెలిసింది, ఆయన పోయి ఆస్తంతా నీ చేతికొచ్చిందని. నాకొక్క మాటైనా చెప్పలేదెవ్వరూ. అయినా నా గతి ఎప్పుడూ అంతేలే. నా మొహం చూసి కష్టసుఖం పట్టించుకున్నదెవరు?

కనీసం నువ్వైనా ఈ అమ్మని కొంచెం కనిపెట్టి వుండు. నేను నిన్ను వదిలిపెట్టలేదు. ఆ పెద్దమనిషే నిన్ను లాక్కొని  నన్ను ఆస్ట్రేలియా పంపించాడు. ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలని వుంది కానీ, రానూ బోనూ ఖర్చుల మాట? అందుకే ఏమనుకోకుండా కొంచెం డబ్బు పంపావంటే, నిన్ను చూడ్డానికొస్తా. ఏమంటావ్?

ఈ పాడు ప్రపంచకం రోజు రోజుకీ నాశనమవుతూందిలే. నన్ను కనిపెట్టి వుండడం నీకే మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కనిపెట్టి వుంటావులే, ఇహ మళ్ళీ నేను చెప్పేదేమిటి!

ఈ కింద చిరునామ కి ఒక ఉత్తరం రాసి కొంచెం డబ్బు పంపించు. శ్రీమతి పెక్ అంటే ఎవరో అనుకునేవు. నేనే, ఆ పెద్దాయన నన్ను నా పేరూ వుంచుకోనివ్వలేదు, తన పేరూ ఇవ్వలేదు. నా ఖర్మ, ఏం జేస్తాం!

వుంటా నాయనా,

మీ అమ్మ,

ఎలిజబెత్ హొగార్త్.

శ్రీమతొ పెక్.

హెన్రీ టాల్బోట్.

వకీలు.

మెల్బోర్న్.

 

తా.క. వెంటనే డబ్బంపుతావుగా? నాకు చాలా కష్టం గా  వుంది చేతిలో డబ్బు లేక.

జేన్ ఉత్తరాన్ని శ్రధ్ధగా ఒకటికి రెండు సార్లు చదివింది. తపాలా ముద్రలూ, చిరునామా అన్నీ పరిశీలించింది.

“ఏమంటావ్ జేన్? ఆ ఉత్తరంలో వున్నది నిజమేనంటావా?”

“మన వకీలు, మెక్ ఫర్లేన్ గారికి చూపించావా? మావయ్య వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు. ఆయన ఏమన్నాడు?”

“ఆయన ఇంతవరకూ మా అమ్మ ఫోటో కానీ, చేతి వ్రాత కాని చూడలేదట. అందుకే చెప్పలేనన్నాడు.”

“యేడాదికి నూట యాభై పౌండ్లు పంపిన సంగతి ఆయనకి తెలిసుండాలి కదా?”

“అదీ తెలియదట, అయితే ఆ డబ్బు ఆవిడ నోరు మూయించడానికి నాన్న గారు వాడి ఉండొచ్చనుకున్నాడు.”

“మావయ్య బాంకు పాస్ బుక్కులు చూడకపోయావా? ఆయన క్రమం తప్పకుండా డబ్బు చెల్లిస్తూ వచ్చి వుంటే ఆ సంగతి బాంకు పాస్ బుక్కులో వుంటుంది కదా?”

“హయ్యో జేన్! నాన్న గారెంత ఆశ్రధ్ధగా లెక్కలు రాసారనుకున్నవు? ఒక్క దానికీ సరైన వివరణలే లేవు. డబ్బు బాంకు నించి తెచ్చిన సంగతి రాసారు కానీ, అది ఎలా ఖర్చయిందో మాత్రం ఎక్కడా రాయలేదు. ఎలా కనిపెట్టడం?”

“సరే, అయితే వకీలు గారి సలహా ఏమిటి?”

“ఏముంది? ఆ ఉత్తరం పట్టించుకోకుండ వదిలేయమన్నారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నిజంగా నన్ను కన్న తల్లేనో కాదో తెలియదు. ఆయన ఒకసారి నాన్నగారితో అన్నారట, ‘ఫ్రాన్సిస్ తల్లికీ ఏదైనా డబ్బు ఏర్పాటు చేయి, ఆవిడ ఎక్కడుందో, ఎలా వుందో,’ అంటూ. దానికి నాన్నగారు చాలా చిరాకు పడి, ‘ఆవిడ నా భార్య అని నిరూపించడానికి ఒక్క ఆధారమూ లేదు, ఆమెకి చిల్లి గవ్వ ఇవ్వాల్సిన పని లే’దంటూ మండి పడ్డారట. డబ్బు అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారట. వకీలు గారి ఊహ ఏమంటే, ఆమెకి డబ్బిచ్చి నాతో సహా తమ సంబంధాన్ని గురించిన అన్ని ఆనవాళ్ళూ నాన్నగారు కొనేసుకున్నారని. ఆవిడ అందినంత డబ్బు తీసుకొని నా గురించి కానీ, నా పెంపకం గురించి కానీ పట్టించుకోవడం మానేసింది.”

“సరే, మరైతే ఇప్పుడీ ఉత్తరం గురించి ఏమైనా వాకబు చేయిస్తావా, లేదా ఊరికే వదిలేస్తావా?”

“అసలు నాకు ఇదంతా ఆలోచించాలంటేనే చిరాగ్గా వుంది. అయితే ఈవిడ నిజంగా మా అమ్మేనా కాదా అన్న సంగతి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా వుందనుకో. నువ్వేమంటావు జేన్? నీ సలహా ఏమిటి?”

“ఇలాటి సున్నితమైన విషయాన్ని గురించి నేనేం సలహా ఇవ్వగలను ఫ్రాన్సిస్? నీకెలా తోస్తే అలా చేయి.”

“నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావ్?”

“అదెలా చెప్పగలం? మనిద్దరం వేర్వేరు మనుషులం, మన వ్యక్తిత్వాలూ, మనస్తత్వాలూ వేర్వేరు. ఒకే పరిస్థితిలో ఇద్దరం వేర్వేరుగా ఆలోచిస్తాం. అందువల్ల నేను చెప్పేది నీకు పనికిరాకపోవచ్చు.”

“కానీ, నీ వ్యక్తిత్వం నాకంటే వెయ్యి రెట్లు మెరుగు జేన్. అందుకని నా ఆలోచన కంటే నీ ఆలోచనే సబబుగా వుండే అవకాశం ఎక్కువ. నాకైతే ఏం చేయాలో తోచడంలేదు. ఒకవేళ ఆ విల్లులో, నేను అమ్మకి సాయపడకూడదు అని వుంటే, అప్పుడు ఈ ఉత్తరం రాసినావిడని చూడాలనీ, డబ్బివ్వాలనీ కోరిక బలంగా కలిగేదేమో.  నాకీమధ్య ఆ వీలునామాని వీలైనంతగా ఉల్లంఘించాలని కోరిక పుడుతోంది. అసలా వీలునామా నా జీవితాన్ని నాశనం చేసింది జేన్! ఆ డబ్బు నాకెందుకూ పనికి రాదు. నాకెంతో ఇష్టమైన మనిషికి సాయపడకుండా అడ్డంపడే ఆ విల్లంటే నాకెంత కోపమో చెప్పలేను.”

ఫ్రాన్సిస్ మొహంలో ఆవేదనా, కంఠంలో ఆవేశమూ చూసి జేన్ చాలా ఆశ్చర్యపోయింది. ఉన్నట్టుండి జేన్ కి అతనీ మధ్య ఉత్తరాలెందుకు తగ్గించాడో అర్థమైనట్టుంది. ఆమె గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది.

“సరే ఫ్రాన్సిస్, నువ్వంతగా నా సలహా అడుగుతున్నావు కాబట్టి చెప్తా.  ఈ ఉత్తరం రాసిన స్త్రీ గురించి వాకబు చేయి. ఆ తరవాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. అదృష్టవశాత్తూ, ఈ ఉత్తరం మెల్బోర్న్ నించి వచ్చింది కాబట్టి మనం వాకబు చేయడం చాలా తేలిక. స్టాన్లీ ఫిలిప్స్ గారికో,  బ్రాండన్ గారికో తప్పక ఈ వకీలు టాల్బోట్  తెలిసే వుండలి. సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ, ఈ పేరెక్కడో విన్నట్టే వుంది! ఒకవేళ అలా కాకపోతే, బ్రాండన్ గారు ఇంకొద్ది రోజుల్లో మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నారు. అప్పుడు వాకబు చేయమందాం! ఒక విషయం గుర్తుంచుకో, మావయ్య రాసిన వీలునామా గురించీ, నీ గురించీ అక్కడక్కడా పత్రికలలో వచ్చింది. ఎవరైనా ఆ వార్తలు చదివి ఇలా ఊరికే ఓ రాయి వేసి చూద్దాం అని ఈ ఉత్తరం రాసి వుండొచ్చు. ఈ ఉత్తరం లో ఇంగ్లాండు యాస వుంది. కానీ మావయ్య మీ అమ్మ స్కాటిష్ యువతి అన్నట్టు గుర్తు. అందుకే మనం ఈ విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశిలిద్దాం.”

“సరే!”

“నువ్విక్కడే వుండు. స్టాన్లీ గారిని నువ్వు పిలుస్తున్నావని చెప్పి ఇక్కడికి పంపుతాను,” జేన్ లేచి వెళ్ళింది.

జేన్ దగ్గరి బంధువని ఫ్రాన్సిస్ ని స్నేహంగా పలకరించాడు స్టాన్లీ ఫిలిప్స్.

కొద్దిసేపు మామూలు కబుర్లు అయ్యాక అడిగాడు ఫ్రాన్సిస్ ఆయనని.

“మీకు మెల్బోర్న్ లో వుండే హెన్రీ టాల్బోట్ అనే వకీలు తెలుసా?”

 

veelunama11

“తెలుసు! ఆయన మెల్బోర్న్ లో పెద్ద పేరు మోసిన వకీలు. అయితే ఆయనతో నాకు పెద్దగా పరిచయం మాత్రం లేదు. మన బ్రాండన్ కి ఆయన బాగా పరిచయం. పెగ్గీ వ్యవహారాలు కూడా ఆయనే చూసేవారనుకుంటా.”

“అలాగా? అయితే మీకు వారింట్లో వుండే పెక్ అనే స్త్రీ తెలుసా? ఆవిడ పూర్తి పేరు ఎలిజబెత్ పెక్ అనుకుంటా…” ఇంకేదో చెప్పబోయిన ఫ్రాన్సిస్, స్టాన్లీ మొహం చూసి ఆపేసాడు.

“ఆవిడ సంగతి ఎవరికి తెలీదు? ఆవిడ నుంచి దూరంగా వుండండి ఫ్రాన్సిస్. ఆవిడ ఎంత దుర్మార్గురాలో చెప్పలేను. ఆమెగురించి మీరెందుకు అడుగుతున్నారు?”

“ఆమె నా తల్లినని చెప్పుకుంటుంది!”

“ఏమిటీ? అయితే నేను చెప్పేది వేరే స్త్రీ అయి వుండొచ్చు! నాకేం అర్థం కావడం లేదు.” స్టాన్లీ లేచి అలజడిగా గదంతా పచార్లు చేయడం మొదలు పెట్టాడు.

“ఆవిడ మీకేమైనా ఉత్తరం రాసిందా? ఆవిడ చేతి రాత చూపిస్తారా?”

చేసేదేమీ లేక ఫ్రాన్సిస్ మౌనంగా ఉత్తరాన్ని ఆయనకి అందించాడు.

“ఈ ఉత్తరాన్ని మీకభ్యంతరం లేకపోతే చదువుతాను. భయపడకండి. నేను ఇంకెవ్వరితోనూ ఈ విషయాన్ని గురించి మాట్లాడను.”

ఫ్రాన్సిస్ ఇబ్బందిగానే ఒప్పుకున్నాడు. స్టాన్లీ ఉత్తరాన్నంతా చదివి తిరిగి ఇచ్చేసాడు.

“ఈ ఉత్తరం లో ఆమె మీ అమ్మనంటుంది. ఆమె ఎంత అబధ్ధాలకోరంటే, ఆమె చెప్పే ఒక్క మాటైనా నిజం కంటే అబధ్ధం అయ్యే అవకాశం ఎక్కువ. నా మాట వినండి ఫ్రాన్సిస్. ఆమెకి ఎంత దూరంగా వుంటే మీకంత మంచిది. ఆమెకి మీరు జవాబూ ఇవ్వవద్దు, డబ్బూ పంపవద్దు. ఉత్తరంలో చెప్పినంత పేదరాలేమీ కాదు. ఉత్త అబధ్ధాలకోరు!”

“ఆమె ఎవరు? మీకెలా తెలుసు?” ఎన్నో పశ్నలు అడగాలనుకున్నాడు ఫ్రాన్సిస్, కానీ స్టాన్లీ మొహం లో కోపం చూసి ఏదీ అడగలేకపోయడు. కొంచెం సేపయాక కూడదీసుకొని,

“మిమ్మల్ని అడగమని జేన్ అంది!” అన్నాడు.

“ఏమిటీ? ఈ సంగతి జేన్ తో కూడ చెప్పావా? ఎంత పని చేసావయ్యా!”

“అసలు నేను వచ్చిందే ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడడం కోసం. జేన్ ఈ సంగతి ఎవ్వరితోనూ అనదు. నాకా నమ్మకం వుంది. అసలింతకీ జేన్ ఏది?”

స్టాన్లీ జేన్ ని పిలిపించాడు.

లోపలికొచ్చిన జేన్ స్టాన్లీ మొహంలో చిరాకూ అసహనమూ చూసి ఆశ్చర్య పోయింది  .

“జేన్! ఫ్రాన్సిస్ ఇప్పుడే మెల్బోర్న్ లో వుండే ఒక స్త్రీ గురించి అడిగాడు. నాకు తెలిసినంతవరకూ ఆవిడ  ఒక మోసగత్తె. ఈ ఉత్తరం లో వున్న ప్రతీ మాటా అబధ్ధమే అని నా అభిప్రాయం. నువ్వూ, ఫ్రాన్సిస్ ఈ విషయం గురించి ఇక్కడే మరిచిపోవడం మంచిది. నువ్వు ఈ విషయాలేవీ ఎల్సీతో కుడా అనొద్దు. నేనలా బయటికెళ్ళొస్తాను. ఫ్రాన్సిస్, రేపు రాత్రి మీ భోజనం మా యింట్లోనే. సరే మళ్ళీ కలుద్దాం!” అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు స్టాన్లీ ఫిలిప్స్.

“జేన్! మా అమ్మ గురించి మా నాన్న గారు వెలిబుచ్చిన అభిప్రాయాలే సరిగ్గా ఈ పెక్ గురించి స్టాన్లీ గారంటున్నారు. దాన్ని బట్టి చూస్తే ఆవిడే మా అమ్మయి వుండొచ్చు కదా? సరేలే, ఆయన అన్నట్టు ఈ విషయం ఇక్కడే వదిలేయడమే మంచిదేమో. మనం ఇంకా పొడిగిస్తే స్టాన్లీ గారికి కోపం రావొచ్చు. నిన్నింతగా గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చిన మనిషికి మనం కోపం తెప్పించటం అంత అవసరమా? అది సరే, ఆయనకి ఎప్పుడూ ఇలాగే కోపం వస్తూ వుంటుందా?”

“అదే నాకూ అంతు బట్టటం లేదు. చాలా నెమ్మదిగా సౌమ్యంగా వుంటాడాయన. ఇంత కోపం రావడం నేనైతే ఎప్పుడూ చూడలేదు.”

“నీతో ఎల్సీతో బానే ప్రవర్తిస్తాడు కదా?”

“ఆయన బానే వుంటాళ్ళే! లిల్లీ గారే, కొంచెం గయ్యాళి.”

“ఎందుకు ?నీతో ఎప్పుడైనా దెబ్బలాడుతుందా?”

“నన్నేమీ అనదు కానీ ఎల్సీనే చాలా ఏడిపిస్తుంది. అందులోనూ ఎల్సీ ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోదు. భయం భయం గా ఒణికిపోతూ, తననెవ్వరు ఏ తప్పు పడతారో అన్నట్టు ఒదిగి ఒదిగి ఉంటుంది. ఆలోచనా, తెలివితేటలూ, మంచితనమూ ఏ కోశానా లేని ఒక మూర్ఖురాలికింద నోరూ వాయీ లేని మెతక మనిషి పని చేస్తే ఏమవుతుంది?”

“ఇప్పుడు ఇక్కడ ఎల్సీ పనిని కూడా నువ్వే పర్యవేక్షించాలి కదా? నీకిబ్బందిగా లేదూ?”

“అవును, కొంచెం ఇబ్బందిగానే వుంది. అయితే ఎల్సీ చాలా ఆత్మ న్యూనతతో బాధ పడుతూంది. దానిని ఎలా సరిచేయాలో నాకర్థం కావడం లేదు. నేను దేన్నైనా తట్టుకోని నిలబడగలను. కానీ, ఎల్సీ పాపం సున్నిత మనస్కురాలు. చిన్న చిన్న విషయాలకే మొహం చిన్న బుచ్చుకుంటుంది.”

“కవితలు ప్రచురించే ప్రయత్నం ఎలా వుంది?”

“ఇక్కడ లండన్ లో కూడా ప్రయత్నించా, కానీ కాలేదు.”

“ఈ మధ్య మళ్ళీ ఏమన్నా రాస్తుందా?”

“ ఇక్కడ లిల్లీ, హేరియట్ ఇద్దరి పరిచర్యలతో దానికి సమయం ఎక్కడుంది? అసలు వాళ్ళకి దాన్ని నాతో మధ్యాహ్నం కాసేపు నడవడానికి పంపడం కూడా ఇష్టం వుండదు. నేనే డాక్టరు గారు కోప్పడతారని వాళ్ళిద్దర్నీ బెదిరించి నాతో పాటు కాస్త నడకకి తీసుకెళ్తాను! అన్నట్టు ఆ డాక్టరు గారు మావయ్యకి మంచి స్నేహితులట తెలుసా? నువ్వు ఒక్కసారి డెర్బీషైర్ వెళ్ళి ఆయనని కలిసి రారాదూ?”

“అలాగే. బ్రాండన్ ఇక్కడికొస్తూ వుంటాడా? అతన్ని చూస్తే అతనికి ఎల్సీ మీద ప్రత్యేకమైన అభిమానం వున్నట్టు అనిపించింది నాకు! అదేమైనా ముందుకెళ్ళిందా?”

జేన్ తల అడ్డంగా ఊపింది.

“ఇప్పుడు ఆయన హేరియట్ ఫిలిప్స్ మీద ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నాడు.”

“అయ్యో! నేనింకా ఆయన ఎల్సీని పెళ్ళాడతాడని ఆశ పడ్డాను.”

వాళ్ళిద్దరూ మాటల్లో వుండగానే ఎల్సీ వచ్చింది. లిలీ పన్లన్నీ చేసి అలసిపోయినా ఆమె మొహం ప్రశాంతంగా వుంది. ఫ్రాన్సిస్ ఆమెని ప్రేమగా పలకరించాడు. జేన్ కానీ, ఫ్రాన్సిస్ కానీ ఆమెకి ఆస్ట్రేలియా నించొచ్చిన ఉత్తరం గురించి ఏమీ చెప్పలేదు.

  ***

(సశేషం)

రామా చంద్ర మౌళి కలం నుంచి కొత్త సీరియల్ వచ్చే వారం నుంచి ప్రారంభం!

Saranga_1

 

నిత్య నూతనం అన్నమయ్య పాట !

కాలంతో పాటు పాత బడేవి ఉంటాయి. కాని కాలంతో పాటు నడచి వస్తూ ఎప్పుడూ సరికొత్తగా కనిపిస్తూ ఆనందాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి. సూర్యుడు ఎంత పాత వాడో ఎప్పుడూ అంత సరికొత్త వాడు కూడా. నేను ఇటీవలే ఒక మంచి పాట విన్నాను. అందులోని భావ సౌకుమార్యం, కొత్తదనం చూస్తే ఇది ఆరువందల ఏండ్ల నాడు కట్టిన పాటా, కాని ఇంత సరికొత్తగా ఉందే అని ఆనందం ఆశ్చర్యం కలిగాయి. అది అద్భుతమైన భావనా శక్తిని దాచుకున్న పాట అనిపించింది. పరమానందం కలిగింది అదీ గొప్ప గాయనీమణుల నోట వింటుంటే. ముందు పాటను ఇక్కడ చూపి దాన్ని గురించి రాస్తా.

పొద్దిక నెన్నడు వొడచునే పోయిన చెలి రాడాయెను

నిద్దుర కంటికి దోఁపదు నిమిషంబొక ఏడు                   || పొద్దిక ||

 

కన్నుల నవ్వెడి నవ్వులు, గబ్బితనంబుల మాటలు

నున్నని ఒయ్యారంబులు, నొచ్చిన చూపులును

విన్నఁదనంబుల మఱపులు, వేడుక మీరిన వలపులు

సన్నపు చెమటలు దలచిన, ఝల్లనె నా మనసు                     || పొద్దిక ||

 

ఆగిన రెప్పల నీరును, అగ్గలమగు పన్నీటను

దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు

కాగిన దేహపు సెగలును, కప్పిన పువ్వుల సొలపులు

వేగిన చెలి తాపమునకు, వెన్నెల మండెడిని                || పొద్దిక ||

 

దేవశిఖామణి తిరుమల, దేవునిఁ దలచిన బాయక

భావించిన ఈ కామిని భావము లోపలను

ఆ విభుడే తానుండిక ఆతడె తానెరుగగవలె

ఈ వెలదికి గల విరహంబేమని చెప్పుదము.               || పొద్దిక ||

 

పైన పాట నిర్మాణాన్ని చూస్తేనే ఇది అన్నమయ్య పాట అని తెలిసిపోతుంది. పైన చెప్పిన పాటలో ప్రత్యేకతని గురించి ఇందులోని నేటికీ కనిపించే కొత్తదనాన్ని గురించి చెప్పే ముందు. అన్నమయ్యపాటను గురించి నాలుగు మాటలే చెప్పాలి.

annamayya-telugu-movie1

అన్నమయ్య పాటలో రెండు పాదాల పల్లవి ఉంటుంది. మూడు చరణాలు ఉంటాయి ప్రతి చరణంలో నాలుగు పాదాలుంటాయి వాటిలో యతి మైత్రి ఉంటుంది, కాని ఎక్కడ అనే నియమం లేకుండా ఏదో ఒకచోట తప్పని సరిగా ఉంటుంది. అంతే కాదు పాదాలు నాలుగింటిలో ప్రాసనియమం ఉంటుంది. ఎంచుకున్న ఈ పాట నిర్మాణం పాడడానికి చాలా బాగా ఒదిగి పోతుంది. లయ సాధ్యం అవుతుంది. అయితే మూడు చరణాలకంటే ఎక్కువ ఉన్నవి లేదా తక్కువ ఉన్నవి ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. కాని సాధారణంగా అన్నమయ్య పాటలు అత్యధికంగా ఒక పల్లవి మూడు చరణాలు పెన చెప్పిన పద్ధతిలో ఉంటాయి.

ఇది సుమారు ఆరు వందల ఏండ్ల నాడు కట్టిన పాట.  ఇక్కడ నేను రాసిన పాట అని అనలేదు. కారణం అన్నమయ్య కూర్చుని పాటలు రాయలేదు. ఆయన పాటకట్టి పాడుకుంటూ పోయాడు. తర్వాత వాటిని ఆయన కుమారులు శిష్యులు రాసారు. అంతే కాదు వాటిని రాగిరేకుల మీద చెక్కించారు. ఈ కీర్తి ఎక్కువ ఆయన మనవడికి దక్కుతుంది. అన్నమయ్య 32 వేల పాటలు కడితే నేటికి మనకు పద్నాలుగు వేలకు పైగా దొరుకుతున్నాయి. వీటిలో ఏ పాటను పట్టుకున్నా తియ్యదనం జలజలలాడుతుంది.

పై పాటలో ఒక స్త్రీ దూరంగా వెళ్ళిన చెలికాని గురించి బాధపడుతూ విరహాన్ని అనుభవించే ఘట్టాన్ని వర్ణించాడు. ఇందులో పోయిన చెలి రాడాయెను అని అన్నాడు. ఇక్కడ చెలి అనే మాటను చెలికాడు ప్రియుడు భర్త అనే అర్థంలో వాడాడు. చెలి అనగానే స్త్రీ అని అనుకుంటాము. పురుషుని కూడా చెలి అనిడం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్త్రీ తన భర్త దూరంగా వెళ్ళి ఉన్నాడు అతనినే తలుస్తూ ఉంది ఈమె. ఆమె ఈ స్థితిలో ఉన్న బాధని లోతైన భావాన్ని వర్ణిస్తున్నాడు కవి.

రాత్రి సమయంలో ఉన్న ఆమెస్థితిని చెబుతూ  పొద్దిక (పొద్దు ఇక) ఎన్నడు వొ (పొ)డచునో పోయిన చెలి రాడాయెను. ఈ పొద్దు ఎప్పుడు పొడుస్తుందో రాత్రి ఎలా ఎప్పటికి గడుస్తుందో పోయిన చెలికాడు రాలేదు అన్నాడు పల్లవి లో, తర్వాత ఏ మంటాడో చూడండి. నిద్దుర కంటికి తోపదు నిమిషంబొక ఏడు. నిద్ర రావడం లేదు నిముషమే ఒక ఏడాదిగా గడుస్తూ ఉంది.

మొదటిపాదంలో  కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు. నవ్వులు ఆమె నోటి తో కాకుండా కన్నులతో నవ్వుతూ ఉంది అనడం అన్నమయ్య కాలంనాటికి ప్రచలితంగా కావ్య ప్రబంధ వర్ణనలలో ఎక్కడా కనిపించదు. పాటలో సరికొత్తగా కన్నులతో నవ్వడం అని చెప్పాడు. ఇది ఈనాటికీ కొత్తగా కనిపిస్తూ ఉంది. గబ్బితనంబుల మాటలు అంటే పైకి గంభీరంగా పలికే పలుకులు అని ఇక్కడి భావం. గబ్బితనం అంటే కపటపు మాటలు అనే అర్థం కూడా ఉంది వీరోచితమైన మాటలు అని కూడా ఉంది. కాని ఇక్కడ లోపలి బాధను వ్యక్తం చేయకుండా పైకి గంభీరంగా చెప్పే మాటలు అనే భావం. నున్నని ఒయ్యారంబలు నొచ్చిన చూపులను అనే పాదంలో రెండూ కొత్త భావనలే ఒయ్యారం అంటే అందం దాని హొయలు.  నున్ననిది అని చెప్పడం అంతే కాదు రెండిండిని తెలుగు పదాలను వాడడం తర్వాత చూపులు గురించి చెబుతూ నొచ్చిన చూపులు అని అనడం బాధను అంటే విరహాన్ని వ్యక్తం చేసే కళ్ళను గురించి చెప్పడం ఆనాటికి సాహిత్యంలో చాలా కొత్త భావన. తర్వాత విన్నతనంబుల మఱపులు వేడుక మీరిన వలపులు అనే పాదం గురించి స్పష్టం. దీని తర్వాతి చరణంలోని నాలుగో పాదం చూడండి సన్నపు చెమటలు దలచిన ఝల్లనె నామనసు. అన్నాడు. సన్నపు చెమటలు. అవి ధారగా కారుతున్న చెమటలు కావు. సన్నగా ఆ విరహస్థితిని చూపే చెమటలు వాటిని తలచుకుంటే మనసు ఝల్లుమందట.

తర్వాతి చరణం మరింత బాగుంటుంది. మొదటి పాదంలో ఆగిన రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు అని రెండుపాదాలలో ఒక భావాన్ని చెప్పాడు. కన్నీరు రెప్పల వెనుకే ఆగింది కాని చెక్కిలి మీదికి జారలేదు. చాలా అధికమైన పన్నీటిలో చల్లదనం కోసం మునిగినా అంటే దోగినా తన లోపలి విరహం ఆ పన్నీటిలో మునగలేదు అంటే ఆమె భావన  చల్లారలేదు. ఆతర్వాత చూడండి. కాగిన దేహపు సెగలు కప్పిన పువ్వుల సొలపు, దేహం కాగుతుంటే పువ్వులను కప్పారట ఇది ఆనాటి ప్రబంధ ధోరణి వర్ణనే కాని తర్వాత వేగిన చెలి తాపమునకు వెన్నల మండెడిని అన్నాడు. వెన్నెల చల్లదనాన్ని ఇవ్వకుండా వేడి సెగలు పుట్టిస్తున్నాడు అని చెప్పడం ప్రబంధాలలో ఆయన కాలానికి ఉన్నది. కాని వేగిన చెలి తాపానికే వెన్నల మండుతూ ఉంది అని చెప్పడం మరొక తీరు. ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది.

దోచిన పయ్యెద అని చెప్పడం అద్భుతం. ఆమె పయ్యెదను అంటే పైటను దోచుకున్నాడట. ఇక్కడ దోచుకున్నది పైటను కాదు మరేదో అని  ఎంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించడో గమనించవచ్చు. ఇప్పటికి ఎంత మంది చేస్తున్నారు ఇలా. అదృష్టవంతులు అనే సినిమాలో చింతచెట్టు చిగురు చూడు అనే పాటలో ఒక సినిమా కవి (ఆత్రేయ) పాలవయసు పొందు కోరి పొంగుతున్నది, నా పైట కూడ వాడి పేరే పలవరిస్తది. అని చరణంలో రాసాడు. వింటే వాహ్ ఎంత అద్భుతంగా చెప్పాడు అని అనిపిస్తుంది. ఇక్కడ అన్నమయ్య పాట కూడా దోచిన పయ్యెద అని అనగానే వాహ్ ఎంత అద్భుతం అని అనిపిస్తుంది.

ఇక చివరి చరణంలో అన్నమయ్య తన ముద్రను వేంకటేశ్వరుని పేరిట ఏదో ఒక తీరులో వేస్తాడు. దాన్ని దేవశిఖామణి తిరుమల దేవుని తలచిన బాయక, భావించిన ఈ కామిని భావము లోపలను ఆవిభుడే తానుండి అతడే తనను  గురించి తెలుసుకోవాలని అని అనడమే కాకుండా ఈ వెలదికి కమ్మిన ఈ మాయను ఏమని చెప్పాలి అని అంటాడు.

ఇక్కడ ఏ స్త్రీవిరహాన్ని గురించీ అన్నమయ్య వర్ణించలేదు. ఇక్కడ కవే స్వయంగా ఆ స్త్రీ అన్నమయ్య వేంకటేశ్వరుని పరమ పురుషుడుగా తన నాథుడుగా భావించడం ఆ విరహంలో (భక్తికి చెందిన విరహం)  తనను తాను ఒక స్త్రీగా భావించి వర్ణించడం ఉంది. భగవంతుడే పురుషుడు అని తమను తాము భగవద్విరహంలో ఉన్న స్త్రీ అని చెప్పుకోవడం భక్త కవులు అన్నమయ్యలా చెప్పినవారు ఇంకా ఉన్నారు. ఈయన కూడా ఇంకా వేరే పాటల్లో చెప్పడం ఉంది. కాని ఈపాటలో చేసిన వ్యక్తీకరణలు తెలుగు పదాల సొంపు సరికొత్త సమాసచాలనం గమనిస్తే దీనిలో ఈనాటికీ నిలిచిన కొత్త దనం కనిపిస్తుంది.

ఈ నాటి వచన కవులు భావించేలా అతి నవ్యమైన తాజాగా ఉండే భావనలు ఈ పాటలో ఉన్నాయి. కన్నులతో నవ్వే నవ్వులు, నున్నని ఒయ్యారాలు, విన్నతనంబుల మరపులు, సన్నని చెమటలు, ఆగిన రెప్పల నీరు, దోచిన పయ్యెద అని చెప్పడం అన్నీ కూడా వాహ్ వాహ్ అనే అద్భుతమైనవే కాదు, ఆనాటికి లేనివి తాజావి. తర్వాత ఈనాటికి ఇలాంటివి సరికొత్త సృజనకు ప్రతీకలుగా ప్రతిభావంతంగా కనిపించిడం ఈ పాటలోని విశేషం. ఇటీవల హైదరాబాదులోని ఒక సంగీత కార్యక్రమంలో ప్రియ సోదరీమణలు (ప్రియసిస్టర్స్ అని పిలిచే హరిప్రియ షణ్ముఖ ప్రియలు) ఈ పాటని పాడారు. పాటలోని విరహాన్ని అత్యంత మధురంగా పాడి కొన్ని వందలమందిని మంత్రముగ్ధుల్ని చేశారు. విన్నవారికి ఆ పరవశంలోనుండి బయటికి రావడానికి చాలా సేపు పట్టింది. ఆరువందల ఏండ్లనాడు కట్టిన అచ్చతెలుగు పాటకి మాటకి ఇంత శక్తి ఇంత కొత్త దనం ఉందా అని ఆశ్చర్యపోవడం, దాని ఫలితమే ఈ వ్యాసం.

పులికొండ సుబ్బాచారి

చిత్రరచన: బాపు (తాడేపల్లి  పతంజలి గారి పుస్తకానికి వేసిన బొమ్మ)

లెక్కల చిక్కు “రుణం”

మరో వుత్తమ కథ చూద్దాం. ఇదో అప్పు కథ. విలువల కథ. వంశగౌరవాల కధ. పరువు-ప్రతిష్టల కథ.

సారధి అనే కథకుడు తను పని చేస్తున్న ఒక ప్రభుత్వరంగ సంస్థ తను ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పుని తీర్చగలిగే స్థితిలో వుండి కూడా  వాయిదాకోసం ప్రయత్నించడం గురించి ఆవేదన చెందిన కథ. తను చిన్నప్పుడు బూట్లు ఎరువు తీసుకుని అవి పాడైపోతే వాటి ఖరీదు కట్టి ఇవ్వలేక పడ్డ ఆవేదన కథ. ఆ మిత్రుడు  మాధవరావుని కలిసి, దాదాపు ముప్పయ్యేళ్ల తర్వాత, క్షమాపణ కోరి తన “విలువల్ని” కాపాడుకున్న కథ. క్షమాపణ తర్వాత సారధి “మనస్సు ఉతికిన బట్టలా తేలిక అయ్యింది” అనుకుంటాడు. వెంటనే “కుటుంబాల నుండి, వంశాలనుండి,  వాటికంటూ ఒక ధారలాంటిది ఉంటుంది” అంటాడు. “విలువలు మారుతూనే ఉంటాయి. అయితే మారకూడని విలువలు కూడా వుంటాయి” అంటాడు. కథ చదివిన తర్వాత మనకొక ప్రశ్న వస్తుంది. ఎన్ని కష్టాలైనా పడి అప్పు తీర్చి తీరాలన్నది ఎలా “మారకూడని విలువ” అవుతుంది? దీనికి సమాధానం దొరకాలంటే మనం “అప్పు” పునాదిని పరిశీలించాలి. అప్పుకి మూలం అసమానత.  అవసరానికి మించిన డబ్బు, కేవలం మారక మాధ్యమం(Exchange Medium) ఒక చోట, అవసరాలకి సరిపోని ఆదాయం ఒక చోట వుండడం వల్ల అప్పు ఒక అవసరంగా వచ్చి ఆయుధంగా తయారౌతుంది.

జీవనోపాధికి అవసరమైన భూమి కొద్దిమంది చేతుల్లో వుండిపోవడంతో ఎంతోమంది కూలీలుగా, బీదవారుగా మిగిలిపోయేరు, కనీస అవసరాల కోసం వారు ఆదాయం చాలక, అప్పుపై ఆధారపడ్డారు. వాడకం సరుకుల వ్యాపారంతో పాటు మారకం సరుకు వ్యాపారం కూడా మొదలైంది. మొదటి దాంట్లో మిగులు ని “లాభం” అంటే రెండో దాంట్లో మిగులుని “వడ్డీ” అన్నారు. సాధారణంగా, అప్పులు తీసుకొనేది బీదవారు కాబట్టి వారి దగ్గర గోళ్లూడగొట్టి వసూలు చేసుకోవడం అవసరమైంది. దండోపాయం ప్రతీసారి కష్టమూ, ఖర్చూ  కాబట్టి

భేదోపాయంగా, అప్పు తీర్చి తీరాలన్న దాన్ని ఒక ఆదర్శంగా, విలువగా ప్రచారం చేసారు. ఈ “విలువ” పూర్తిగా “మిగులు” వున్న శ్రేణులకి, మధ్య తరహా శ్రేణికి వుపయోగపడేదే. భూస్వామ్య సమాజంలో అది ఒక నీతి. ఒక విలువ. ఒక ఆదర్శం. పతిభక్తి, రాజభక్తి, వర్ణాశ్రమ ధర్మం, కుల కట్టుబాటు వగైరా ఎన్నో విషయాల్లాగే ఇదీ ఒక భేదోపాయం.

వ్యవసాయం మీద ఎక్కువమంది ఆధారపడినప్పుడు సమాజం చిన్న సమూహాలుగా (గ్రామాలుగా) వుంటుంది. అక్కడ భూస్వామ్య సమాజపు నీతులు, ఆదర్శాలు, విలువలు చలామణి అవుతాయి. ఎన్ని కష్టాలు పడి అప్పు తీరిస్తే అంత నీతిమంతుడుగా,  పరువుగలవాడుగా సాగే ప్రచారం. చిన్న సమూహంలో ఈ విషయాన్ని మరింత ఘనీభవింప చేసి సంఘ భయాన్ని సృష్టిస్తుంది. సారధి తండ్రి కూడా ఆ సమాజంలోనే  జీవించారు. ఆ విలువల మధ్యనే పెరిగేడు అందుకే షావుకారుకి మళ్లీ నోటు రాశాడు. అప్పు తీర్చేడు. మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే సారధి తండ్రితో పాటు చాలామంది అలా నోట్లు రాసి ఇచ్చే వుంటారు. షావుకార్లు సారధి తండ్రితో పాటు ఇంకా ఎంతో మందికి  అప్పులిచ్చే వుంటారు. అది వాళ్ల వృత్తి. వాళ్లలో మిగిలిన వాళ్లు కూడా నోట్లు ఇచ్చే వుంటారు. లేకపోయి ఉంటే, ఆ చిన్న సమూహంలో కొంత అల్లరి,అలజడి. ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే వుండాలి. షావుకార్లు అంత తొందరగా వూరుకోరు. అగ్నిప్రమాదం జరిగినపుడు కేవలం సారధి తండ్రి నోటు ఒక్కటే కాలిపోవడం అనేది మనం నమ్మగలిగే విషయం కాదు. దీన్నేదో చాలా గొప్ప విషయంగా”కుటుంబాలు, వంశాలు” అని రాయడం కొంత ఆదర్శరీకరణే. పౌరాణిక పద్ధతే. దీంట్లో వంశాలు, కుటుంబాలు, గౌరవాలు ఏమీ లేవు. కొన్ని కుటుంబాలు , వంశాలు నీతి గలవనీ గొప్పవనీ కొన్ని కావనీ అర్దం వచ్చేలా రాయడం అంటే వర్ణ వర్గ వ్యవస్ఠని సమర్ధించడమే.

60ల్లో  శ్రీకాకుళంలోని గిరిజన ప్రాంతాల్లో అప్పులు తీర్చ  వద్దంటూ కమ్యూనిస్టు పార్టీ ప్రచారం చేసింది. పార్టీని అనుసరించిన గిరిజనులందరూ సొండీల, శావుకార్ల అప్పుని తీర్చారు. పార్టీ ప్రచారం  కంటే సంఘభయం ఎక్కువ పని చేసింది. ఈ రోజుకి కూడా అడవులు, కొండల్లో వుండే గిరిజనులు అప్పులు తప్పక తీరుస్తారు. “మళ్లీ ఇస్తాడు కదా షావుకారు” అనేది వాళ్ల సమాధానం. ఇప్పటికి కూడా, వ్యాపార సమాజపు నియమాలు పూర్తిగా ఎక్కని కొన్ని శ్రేణులు, స్త్రీలు, కూలీవారు, వగైరాలు అప్పులు తప్పక తీరుస్తారన్నది డ్వాక్రా అప్పులు, ఇందిరమ్మ ఇళ్ల అప్పులు చరిత్ర చదివిన వారికి స్పష్టమౌతుంది. సారధి పని చేసే ప్రభుత్వరంగ సంస్ధకి ఈ నీతి వర్తించదు. ఈ సూత్రాలు పనికి రావు. అదొక వ్యాపార సంస్థ. పెట్టుబడిదారీ సమాజ సూత్రాలు వేరు. అక్కడ లాభం ఒక్కటే ప్రధానం.  మిగతావేవీ వర్తించవు. కథలో చూస్తే ప్రభుత్వం ఇచ్చినది వడ్డీలేని అప్పు. ఈ డబ్బు సంస్థలో వున్నంత కాలం దాన్ని మదుపుల్లో పెట్టడానికి(Investments) వాడుకోవచ్చు. ఎక్కువ సరుకు (Stock) వుంచి డీలర్లపై రుద్ది అమ్మకాలు పెంచి లాభం గడించొచ్చు. అరువులు ఎక్కువ ఇచ్చి (Debtors) దానిపై వడ్డీ రాబట్టవచ్చు. ధర (Pricing) తమ అదుపులో వుంచుకోవచ్చు. సరఫరాదార్లకి  తక్షణమే ఇస్తామని చెప్పి (Creditors) బేరాలాడి  ధర తగ్గించుకోవచ్చు. స్థిర, చరాస్థులు (కార్మికులకి ఇళ్ళు కట్టడం, బస్సులు కొని రవాణా సౌకర్యం ఏర్పరచడం) కొని జీతాల బిల్లుల్లో కొంత మిగల్చవచ్చు. యంత్రాలు  వగైరా కొనేటప్పుడు DPGలు, LCలు వగైరా కాకుండా నేరుగా నగదు ఇచ్చి బాంకు ఖర్చులు మిగుల్చుకోవచ్చు. ధరలు తగ్గించుకోవచ్చు. ఏదీ కాకుంటే వుద్యోగులకే రకరకాల అప్పులిచ్చి వడ్డీతో సహా జీతాల్లో కోసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా వాడుకునే ప్రతి చర్యా సంస్థ లాభాల్ని పెంచేవే. అందుకే సంస్థ పెద్దలు అప్పు చెల్లింపుని  వీలైనంత కాలం  పొడిగించడానికి ప్రయత్నించడం ఎలా తప్పు అవుతుందీ?. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కథకుడు మాట్లాడుతున్నది ఒక ప్రభుత్వరంగ సంస్థ గురించి. వాటిల్లో వచ్చిన “లాభం” అంతా తిరిగి ప్రభుత్వానికే బదిలీ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య తేడా అదే. లాభాలు తిరిగి ప్రభుత్వ పరం కావడమే. నేను చెప్పినవి అస్థి అప్పుల పట్టీ (balance sheet) మీది కనీసపు విషయాలు. నా అవగాహన అంతే. లోతుల్లోకెళ్లి చెప్పగలిగే వాళ్లెంతోమంది వున్నారు. MBAలూ, CA లూ చదివిన వాళ్లు. ఇది అర్ధం చేసుకోలేని సారధి పాతకాలం తూకపు రాళ్లతో విషయాన్ని చూసి వేదన చెందుతాడు.

“ప్రైవేటు రంగానికి ఇచ్చిన రాయితీలు లేదా రుణ మాఫీలతో పోలిస్తే మనలాంటి పబ్లిక్ సెక్టారు పొందేది లెక్కించ దగిందేం కాదు” అన్న సీ.ఎఫ్.ఓ మాటలు సారధికి అర్ధం కాలేదు. అతని ఆలోచనలూ, ఫైనాన్స్ రంగ సూత్రాలకు వ్యతిరేకం. సంతోష్‌కి అతను, నిరాసక్తంగా చెప్పిన కారణాలు. “కొత్త వేతన ఒప్పందం వల్ల  పెరిగే వేజ్ బిల్లు, ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదలయ్యే శివరామపూర్ ప్రాజెక్టుకు మూలధన అవసరాలు, వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో మూతబడబోయే ప్రాజెక్టులవల్ల తగ్గే రాబడి” ఇవేవీ సూత్రాలకి సరిపోవు. వేజ్ బిల్లు లాభనష్టాల ఖాతా వ్యవహారం. అప్పు ఆస్థి అప్పుల వ్యవహారం. కరెంటు బిల్లులు. మొబైల్ బిల్లులు, ఆదాయం (జీతం)లోంచి కడతాం. కొత్త ప్రాజెక్టుకి మూలధనం, ప్రభుత్వంనుంచో లేదా ప్రజలనుంచో తెస్తాం(shares). మూడు సంవత్సరాల తర్వాత రాబడి తగ్గుతుంది కాబట్టి ఈ అప్పు వాయిదా కూడా అప్పుడే కడతాం అనడం హాస్యస్పదం. మూడేళ్లలో నేను రిటైర్ అవుతాను. నా జీతంలోంచి కట్టలేను. పెన్షన్లోంచి కడతాను. కాబట్టి EMIలు అప్పటినుంచి ఇవ్వండి అని బాంకువాళ్లని అడిగి చూడండి. అప్పు వాయిదా కట్టేది నగదు రాబడుల్నించి. అది కేవలం అమ్మకాలు, లాభాలే కానక్కరలేదు. ఇందాక మనం అనుకున్న అనేక మార్గాలున్నాయి. “ఫండ్స్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో చూపించాం” అన్న సారధి  సరిగ్గా ఆలోచించలేదు. సారధి తయారు చేసిన నోట్‌ని సి.ఎం.ఓ తప్పక మార్చి వుంటాడు. క్లుప్తంగానే చెప్పాను. అవసరం అనుకుంటే చర్చిద్దాం.

ఈ సారధి ఆలోచనల్ని “మానవ సంబంధాలకుండే ఆర్ధిక కోణాన్ని కార్పోరేట్ వాతావరణానికి అన్వయించి  చెప్పటం వల్ల మేధను తాకే కథగా రూపొందింది” అని ప్రశంసించడం బృహదాశీర్వచనం. సంస్థకీ,  ప్రభుత్వానికీ మానవ సంబంధాలుండవు. సారధి ఆలోచనల్లో మేధస్సూ లేదు.

ఇంతకీ కథలో ముఖ్యవిషయం. వ్యవసాయ రుణాల మాఫీ. “రెండేళ్ళ క్రితం స్థోమత వుండి అప్పు, వడ్డీ కట్టకుండా, మాఫీతో లాభం పొందినోళ్ళు ఎందరో. ఇదిగో వీడే రెండు లక్షల దాకా మిగుల్చుకున్నాడు” అన్న మాధవరావు తండ్రి మాటలో వున్నది. అవి వాస్తవానికి రచయిత మాటలే. రచయిత ఆవేదనా అదే. 2008లో ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ ప్రకటించినపుడు గోలగా ఒక ప్రచారం జరిగింది. అప్పులు ఎగ్గొట్టే అలవాటుని ఇది తీసుకొచ్చిందనీ, దేశ సంపదనంతా దోచి పెట్టుతున్నారనీ పత్రికలూ, టీవీలూ వగైరా అంతా గగ్గోలుగా చెప్పిన విషయాలు రెండు. దేశంలో కౌలు రైతులు ఎక్కువ వుండడం, కౌలు రికార్డు కాకపోవడం వల్ల  ఈ ౠణమాఫీ కేవలం భూముల యజమాన్లకే సాయపడిందనీ,  నిజంగా వ్యవసాయం చేసిన కౌలు రైతులకి ఏం దక్కలేదనీ. రెండోది రుణం రద్దు వల్ల పెద్ద రైతులకే  లాభం జరిగిందనీ, అర్హత లేనివాళ్లు రద్దు వల్ల లాభపడ్డారనీ. ప్రచారం చేసేవాళ్లు వ్యూహాత్మకంగా చిన్న రైతుల్ని తోడు తెచ్చుకుని వాళ్లకేం దక్కలేదని చెప్పారు.

[su_note] మొదటి దాని గురించి కథలో ఏమి లేదు కాబట్టి రెండు వాక్యాల్లో ముగిద్దాం. కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయ  ఎంట్రప్రెనూర్ లు వాళ్లు చేసేది వ్యవసాయ నిర్వహణ (organisation) పొలంలోకి దిగకుండా, భూమి(Land) కౌలుకు తీసుకొని కూలీల్తో, అవకాశం వున్నచోట యంత్రాల్తో పని చేయించి (Labour), పెట్టుబడి (Capital)  పెట్టి వ్యవసాయం నిర్వహిస్తారు. (Organisation). కూలీల విషయంలో వీళ్లు యజమాని కంటే ఎక్కువ ఘోరంగానే ప్రవర్తిస్తారు. కారణం లాభాపేక్ష. తొందరతొందరగా ఎక్కువెక్కువ లాభం సంపాదించాలన్న ఆకాంక్ష. ఎరువులు కుమ్ముతారు. కూలీల్ని పిండుతారు. పురుగుల మందు విషాన్ని చల్లుతారు. పర్యావరణాన్ని , ప్రజల్ని నాశనం చేసి లాభాలు దండుకుంటారు. ఇదంతా పెట్టుబడిదారీ వ్యవహారం. ఆ సూత్రాలే వీరికీ వర్తిస్తాయి. ఇక కథలో వున్నదీ, రెండోదీ అర్హత లేనివాళ్లు స్థోమత వున్నవాళ్లు రుణం రద్దు పొందారన్నది. నిజంగా ఇది ఆలోచించవలసిన అంశమే. చర్చించవలసినదే. అయితే రచయిత పొసగని అంశాల మధ్య కత్తు గట్టి కథ రాయడం వల్ల కథా శిల్పం, ప్రయోజనం రెండూ దెబ్బతిన్నాయి. విషయమేమిటంటే 2008లో రుణమాఫీ పెద్దలకి పూర్తిగా దోచిపెట్టలేదు. బోల్డు ఆంక్షలు పెట్టింది, రద్దు మొత్తాన్ని ఒక లక్షరూపాయలకు కుదించింది. ఆసక్తి వున్నవాళ్లు రిజర్వు బ్యాంకు సర్కులర్ RB1/2007-08/373 Dt. 19/6/2008 చూడవచ్చు.[/su_note]

నిజమే నష్టాలన్నీ ప్రజల పరం చేసి లాభాలు వ్యక్తుల పరం చెయ్యడం పెట్టుబడిదారీ మనుగడకి అవసరం. వాళ్ల ప్రతినిధిగా వున్న ప్రభుత్వం అదే చేస్తుంది. అమెరికాలో ఫ్రెడ్డీ, ఫానీ, లేమాన్ బ్రదర్స్ లాంటి ఎన్నో సంస్థలు కూలిపోతే, పెద్ద పాక్ఖేజీలు ప్రకటించి వాళ్ల కొమ్ము కాసింది ప్రభుత్వం. కోట్ల కోట్ల డాలర్లతో విదేశీ కంపెనీలు కొన్న కింగ్‌ఫిషర్ కంపెనీ యజమాని, ఎయిర్‌లైన్స్ వుద్యోగులు జీతాలడగితే ‘నా దగ్గర డబ్బుల్లేవ్’ అని నిస్సిగ్గుగా  ప్రకటించి విదేశాల్లో విలాసంగా గడిపేడు. మోడీ, గోయెంకాల్లాంటి ఎన్నో కంపెనీలు అప్పులు ఎగ్గొట్టి వుద్యోగుల జీతాలు ఎగ్గొట్టి BIFR వెనక ఆశ్రయం తీసుకున్నాయి. మన డెక్కన్ క్రానికల్ కథ చూడండి. కనీసం రోజుకొక్క కంపెనీ కథ వస్తుంది పేపర్లో. చాలా చిన్న అక్షరాల్తో. అప్పులు ఎగ్గొట్టడం, దివాలా తియ్యడం పెట్టుబడిదారీలో ఒక సూత్రం. ఒక విధానం

అర్హత లేని స్థోమత వున్న రైతులు రుణం రద్దు వాడుకోకూడదన్న ఆదర్శ ప్రకటన ఎవరి నుద్ధేశించి చేస్తున్నాడు రచయిత. ఆదర్శాల వల్ల, నీతిబోధల వల్ల, ఈ కథలు ఏనాటికీ చదవని పెట్టుబడిదార్లు “ఆత్మప్రబోధం” చేసుకుంటారా?రుణం రద్దు లేకపోయి వుంటే ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు వగైరా వ్యవసాయాధారిత వ్యాపారం ఎంత దెబ్బ తిని వుండేది. బాంకుల డబ్బు ఆగిపోతే వాళ్లు రుణాలివ్వకపోతే కన్స్యూమర్ వస్తువులు ఇనుము, సిమెంటు, గృహనిర్మాణ రంగ పరిశ్రమలు, కార్లు, రకరకాల వాహనాలు తయారు చేసే కంపెనీలూ ఏమై పోతాయి?

ఈ కథ పేరు రుణం.

రచయిత శ్రీ ముళ్లపూడి సుబ్బారావు.

ప్రచురణ: ఆదివారం ఆంధ్రజ్యోతి, 8 మే.2011

 

[su_box title=” Banks wrote off over Rs 1 lakh cr in last 13 yrs: Chakrabarty (BUSINESS LINE, BUSINESS STANDARD 19.11.13)”]

RBI Deputy Governor K.C. Chakrabarty has said banks have written off a whopping Rs 1 trillion in the past 13 years and criticised the lenders because as much as 95% of these write—offs were for large borrowers. He said that over 95% of such write—offs have been observed in the case of big accounts and expressed anguish that public discourse focuses only on the government’s agri debt waiver scheme of 2008. “We only talk about the debt waiver of the agricultural borrowers, we don’t say big players and of this (Rs 1 lakh Cr) 95% are all big borrowers and it has been written off,” he said. Chakrabarty was particularly critical of the system of a “technical write-off” by the lenders, saying he does not understand the system. [/su_box]

 

—చిత్ర

అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ

 

ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి, చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలూ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువూ పరిశీలకుడూ సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లెయొనార్దొ చిత్రాలన్నీ కళాఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించీ మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్ఫోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలనీ, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్థాలు అన్వేషిస్తూ ఉండాలనీ అనిపించేలా చేస్తాయి.

ప్రపంచానికంతా తెలిసిన మహానుభావులమీద ఉద్వేగభరితమైన నవలలు రాసిన ఇర్వింగ్ స్టోన్ తన కథానాయకుల జీవితం సమస్తాన్నీ కళ్లకు కట్టే పదబంధాలను సృష్టించి ఆ నవలల శీర్షికలుగా మలిచాడు. ఆ నవలలో ఒకటి పదహారో శతాబ్దపు చిత్రకారుడు మైకెలాంజెలో జీవితకథ అగొనీ అండ్ ఎక్ స్టసీ. ఆ పదబంధం ఆ నవలానాయకుడు మైకెలాంజెలోకు ఎంతగా సరిపోతుందో గాని, ఆయన కన్న ఇరవై ఏళ్లు పెద్దవాడు, చిత్రకళలో ఆయనకు ప్రత్యర్థి, డా విన్సీ అనే పొరపాటు పిలుపుతో ప్రఖ్యాతుడైన లెయొనార్దొ ద వించి కి అక్షరాలా సరిపోతుంది. లెయొనార్దొ జీవితమంతా అంతులేని వేదన, అద్భుత సంరంభం.

వివాహేతర సంబంధపు సంతానంగా, దాదాపు అనాథగా, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం తోసుకువచ్చి ఎక్కడా నిలకడగా ఉండనివ్వని నిరంతర జీవన అస్థిరత. చిన్నచిన్న రాజ్యాల మధ్య యుద్ధాలతో ఆ ప్రభువులను నమ్ముకున్న కళాకారుడిగా ఉత్థాన పతనాలు. బాల్యంలో కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, సోదరుల ప్రేమను పొందడానికేమో శిష్యులతో మెలగిన తీరుకు తప్పుడు వ్యాఖ్యానాలతో స్వలింగ సంపర్క నేరారోపణలు, విచారణలు, ఖైదు. తనకందిన పనుల్లో అనేకం బద్దకం వల్లనో, పరిపూర్ణతా భావనతోనో పూర్తి చేయలేకపోయిన అసంపూర్ణ ప్రజ్ఞ,…. ఆయన జీవితమంతా అంతులేని వేదనే.

మరొకపక్క చిన్ననాటి నుంచే ఆయన వేళ్లకొసలనుంచి జాలువారిన అద్భుత కళానైపుణ్యం. దేశదేశాల రాజుల, మతాధిపతుల, కళాభిమానుల, కళా విమర్శకుల ఆదరణ చూరగొన్న ప్రతిభా వికాసం, ఎప్పుడూ చుట్టూరా ఎంతో మంది శిష్యులు, అభిమానులు, ఒక్క చిత్రకళ మాత్రమే కాదు, దాదాపు ఆధునిక విజ్ఞానశాస్త్ర అన్వేషణలెన్నిటికో బీజరూప వ్యక్తీకరణలు – ఆయన జీవితమే అద్భుత సంరంభానికి ఎత్తిపట్టిన పతాక.

ఏదో ఒక శాస్త్రంలో, ఒక రంగంలో, ఒక చిన్న శాఖలో నైపుణ్యంతో మహా మేధావులుగా పేరు తెచ్చుకోగలుగుతున్న వర్తమాన స్థితితో పోల్చినప్పుడు యూరప్ లో భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారీ విధానానికి సమాజం పరివర్తన పొందుతున్న యుగంలో మేధావులు ఎన్ని శాస్త్రాలలో, ఎన్ని రంగాలలో, ఎంత లోతయిన కృషి చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లెయొనార్దొ ఆ నాటికి శాస్త్రవేత్త, కళావేత్త. ఇవాళ్టి శాస్త్రాల, కళల పరిభాషలో చెప్పాలంటే గణితశాస్త్రజ్ఞుడు, నిర్మాణశాస్త్ర నిపుణుడు, మానవ శరీరశాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త, భూ పటాల చిత్రకారుడు, వృక్షశాస్త్రవేత్త, చిత్రకారుడు, శిల్పి, వాస్తుశిల్పి, నీటిపారుదల వ్యవహారాల నిపుణుడు, సంగీతకారుడు, రచయిత. పునరుజ్జీవన యుగపు మానవుడికి మూర్తీభవ రూపం అని, అతనిది తీరని కుతూహల దాహం అనీ, అతనంత సర్వవ్యాపిత బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞా కలవారు లేరనీ ఎన్నెన్నో విశేషణాలున్నాయి. లెయొనార్దొను అర్థం చేసుకోవాలంటే ఆయన జీవించిన స్థల కాలాలను అర్థం చేసుకోవాలి.

Da Vinci

పద్నాలుగో, పదిహేనో శతాబ్దపు ఇటలీ తొలి పునరుజ్జీవన సంస్కృతికి వేదిక. అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పెట్టుబడిదారీ విధానం భూస్వామ్యపు కరడుగట్టిన విలువలను తోసి రాజంటూ, రాజకీయ స్వాతంత్ర్యం, పట్టణ జీవితం, కళారాధన వంటి వ్యక్తి ప్రధాన, హేతుబద్ధ జీవిత విధానాలను ప్రవేశపెడుతోంది. రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన ఐదో శతాబ్ది నుంచీ ఈ కదలికలు మొదలయిన పద్నాలుగో శతాబ్దం దాకా దాదాపు ఒక సహస్రాబ్ది యూరప్ చీకటిలో మగ్గిపోయిందని ఆ నాటి మేధావులు భావించారు. వాటిని మధ్యయుగాలు అని పిలిచారు. రోమన్ సామ్రాజ్యంలో గొప్ప కళా వికాసం పరిఢవిల్లిందని, అది మళ్లీ తలెత్తుతోందని, అది పునరుజ్జీవనమని వాళ్లు భావించారు. ఇదంతా సంప్రదాయం నుంచి ఆధునికతకు, బర్బరత్వం నుంచి నాగరికతకు ప్రయాణమని అనుకున్నారు. రోమన్, గ్రీక్ నాగరికతలలో లాగ మళ్లీ ఒకసారి పట్టణాలకు ప్రాధాన్యత వస్తున్నదని వాళ్లు వాదించారు. పూర్వీకులు వించి అనే గ్రామం నుంచి వచ్చినప్పటికీ, లెయొనార్దొ పుట్టినదీ, ఎక్కువకాలం గడిపినదీ ఫ్లారెన్స్ నగరంలోనే. ఆ నగరం 1460 నాటికే వర్తక కేంద్రం. అప్పటికే అక్కడ ముప్పై మూడు బ్యాంకులు ఉండేవి. బట్టల వ్యాపారం జోరుగా సాగేది. 270 ఉన్ని దుకాణాలు, ఎనబై ఎనిమిది వడ్రంగి దుకాణాలు, ఎనబై మూడు పట్టుబట్టల అంగళ్లతో యాభైవేల జనాభాతో అలరారుతుండిన నగరం అది.

ఈ చారిత్రక నేపథ్యమే లెయొనార్దొ జీవితాన్ని నిగూఢమూ చేసింది, సుసంపన్నమూ చేసింది. అప్పుడప్పుడే ఒక పెట్టుబడిదారీ వర్గం తలెత్తుతూ, అంతకు ముందరి భూస్వామిక రాచరిక మత కట్టుబాట్ల స్థానంలో లిఖితపూర్వక ఒప్పందాలు, ఆస్తి ఘర్షణలు మొదలవుతున్నప్పుడు పుట్టుకొచ్చిన నోటరీల, న్యాయవాదుల కుటుంబానికి చెందినవాడు లెయొనార్దొ. ఆయన తాత వ్యవసాయంలోకి దిగాడు గాని అంతకు ముందు మూడు తరాలు నోటరీలే. ఆయన తండ్రీ నోటరీయే, అలా ఆయన ఇంట్లోనే కొత్తవిలువల బతుకుకు పునాది ఉంది.

ఇక బైట సమాజంలో, కనీసం ఆలోచనాపర వర్గాలలో ఒక గొప్ప మేధో మథనం, సామాజిక సంచలనం సాగుతున్నది. అదంతా పునరుజ్జీవనమని ఆ నాటి మేధావులు భావించారు గాని మోహన్ అన్నట్టు “నిజానికి సామాన్య మానవుల విషయంలో మధ్యయుగాలకు, పునరుజ్జీవనానికి మధ్య ఎలాంటి తేడా లేదు. కేవలం కవులు, కళాకారులు, మేధావులకు మాత్రమే ఈ విభజన రేఖ పనికొస్తుంది. …పునరుజ్జీవన భావన కేవలం గుప్పెడు మంది కళాకారులకు, ధనిక వ్యాపార, కులీన, పాలక వర్గాలకు సంబంధించిన ఒక తాత్విక లోకం మాత్రమే.”

అయితే పునరుజ్జీవన భావన శిష్ట వర్గాలదే అయినా, పునాదిలో వస్తున్న మార్పులు గాలిలో కొత్త భావాలను వీచాయి. తూర్పు భళ్లున తెల్లవారింది, పాతలోకం కదలబారింది. వ్యక్తి వికాసం మొదలయింది. మానవచరిత్రలో ఇదివరకెన్నడూ లేనట్టుగా, వ్యక్తికి తన సామర్థ్యంపై తనకు అపార విశ్వాసం మొదలయింది. తన శక్తి సామర్థ్యాలు భగవద్దత్తమో, విధిలిఖితమో కాదని, తాను తలచుకుంటే తన భవిష్యత్తును తానే రూపుదిద్దుకోగలనని మనిషికి ఆత్మవిశ్వాసం మొదలయింది. సకల కళల్లో ఆరితేరిన విశ్వనరులు రూపొందాలని మనుషులు తలపోశారు. భూస్వామ్యం, మతం, సంప్రదాయం విధించిన బంధనాలను కూలదోసే వ్యక్తి స్వేచ్ఛా భావనలు తలెత్తాయి. లెయొనార్దొ చనిపోయినాక యాభై ఏళ్లకు పుట్టిన ఇంగ్లిష్ తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ “సమస్త జ్ఞానాన్నీ నా అధీనంలోకి తీసుకున్నాను” అని వ్యక్తీకరించిన ఆత్మవిశ్వాస ప్రకటన ఈ పునరుజ్జీవన భావనకు, ఆ భావన విస్తరణకు సూచికే.

సామాజిక పరివర్తన జరుగుతున్న ఆ పునరుజ్జీవన యుగం గొప్ప సంచలనాలకు, ఉద్వేగాలకు, అన్వేషణలకు ఆలవాలమైన కాలం. ఈ పునరుజ్జీవనం పారిశ్రామిక విప్లవానికి మూలమూ విస్తరణా కూడ. ఆ ప్రవాహంలో నుంచే ఆధునికత, వ్యక్తి ప్రాధాన్యత, హేతుదృష్టి, శాస్త్రవిజ్ఞానం, కాల్పనికత, ప్రకృతి సౌందర్యారాధన, మనిషి కూడ యంత్రమేననే ఆలోచన వంటి ఎన్నో కొత్త భావనలు, ధోరణులు పుట్టుకొచ్చాయి. పారిశ్రామిక విప్లవం యంత్రంలో చలనాన్ని సాధించింది. సమాజంలో చలనానికి కారణమైంది. ఆ కొత్తగాలులు వీచడం చూసిన మనుషులు తమ చుట్టూ చలనంతో పాటు తమ లోలోపలి చలనాల్ని కూడ గుర్తించారు. ఈ మూడు స్థాయిల చలనాలు పరస్పర అన్యోన్య ప్రభావాలతో మరింత విస్తృతమయ్యాయి. అందువల్లనే యూరప్ లో ఆ యుగం అత్యంత ప్రతిభావంతులైన, బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞలు కలిగిన మేధావులెందరినో సృష్టించింది. ఆ మేధావుల సుదీర్ఘ జాబితాలో తొలి తరం నాయకులలో ఒకరు లెయొనార్దొ.

చిన్నతనంలో లాటిన్, రేఖాగణితం, గణితం నేర్చుకున్న లెయొనార్దొ పద్నాలుగో ఏట చిత్రకళను అభ్యసించడానికి వెరాకియో స్టుడియోలో చేరాడు. అక్కడ సైద్ధాంతిక శిక్షణతో పాటు ఆచరణాత్మకంగా వైవిధ్యభరితమైన కళానైపుణ్యాలు నేర్చుకుని ఉంటాడని, ఆ సాంకేతిక నైపుణ్యాలలో రచన, రసాయనశాస్త్రం, లోహశాస్త్రం, లోహ వస్తువుల తయారీ, నమూనాల తయారీ, తోలు పని, యంత్రశాస్త్రం, వడ్రంగం, చిత్రకళ, శిల్పకళ వంటివి ఉండి ఉంటాయని చరిత్రకారులు రాస్తున్నారు. అలా ఇరవయో ఏట లెయొనార్దొ ఆనాటి వైద్యుల, కళాకారుల గిల్డ్ అయిన గిల్డ్ ఆఫ్ సేంట్ లూక్ లో సభ్యుడయ్యాడు. ఇటువంటి కళాకారుల, చేతివృత్తిదారుల గిల్డ్ లే  భూస్వామ్య బందిఖానా నుంచి శ్రామికులను విడుదల చేసి, పట్టణాలలో వారికి పని కల్పించాయి. నవనవోన్మేష అన్వేషణకూ, ఇతోధిక ఉత్పాదకతకూ మార్గం సుగమం చేసి చరిత్ర గమనానికి గొప్ప చోదకశక్తిగా అత్యద్భుతమైన పాత్ర నిర్వహించాయి.

అలా ఇటు సొంత ఇల్లు, పట్టణం కల్పించిన వాతావరణం, అటు సమాజంలో చెలరేగుతున్న సంచలనాలు కలిసి లెయొనార్దొ అనే వ్యక్తి వికాసానికి తగిన వనరులను సృష్టించిపెట్టాయి. అయితే, లెయొనార్దొ వంటి అపురూప వ్యక్తి రూపు దిద్దుకోవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు ఆనాటి సామాజిక జీవనం పునాది అయితే, ప్రత్యేకించి కళా ప్రతిభకు కారణమేమై ఉంటుందని ఈ నాలుగు శతాబ్దాలలో చాల అన్వేషణ జరిగింది. కళా చరిత్రకారుల నుంచి కాల్పనిక రచయితల దాకా, రసాయన శాస్త్రవేత్తల నుంచి నేరపరిశోధనా శాస్త్రవేత్తల దాకా, మనస్తత్వశాస్త్రవేత్తల నుంచి సామాజిక శాస్త్రవేత్తల దాకా ఎందరెందరో ఇటు తొంగిచూశారు. లెయొనార్దొ ఫలానా చిత్రంలోని ఫలానా రేఖ, రంగు ఇందుకు సూచన అన్న దగ్గరి నుంచి, ఆయన బాల్యంలో అనుభవించిన ఫలానా సంఘటన, ఆయన బాల్యం నుంచి గుర్తున్న ఫలానా సన్నివేశం, ఆయన రచనలోని ఒక ఖండం ఆయనను ఎలా తీర్చిదిద్దాయో చాల వివరణలు వచ్చాయి.

ఆయన “…బాల్యం సంక్లిష్ట, సంఘర్షణాత్మక అనుభవాలతో గడిచింది. పల్లెలో తల్లి పెంపకం, వించీలో పెంపుడు తల్లి ఆలనా పాలనా, ఏ లోటూ రానివ్వకుండా చూసుకునే తండ్రి, అన్ని కష్టాలతో సతమతమయ్యే తల్లి, సవతి తండ్రి, సమాజంలో అక్రమ సంతానమనే ముద్ర, మరోపక్క గుండెలపై ఆనించుకునీ, భుజాలపై కూర్చోబెట్టుకునీ ముద్దుచేసే చిన్నాన్న. పెరిగి పెద్దయ్యే వయసులో కారుమబ్బులా ఆవరించిన ఒంటరితనం. ఈ అనుభవాలే అతని భావి జీవితానికి, కళకు ధాతువులయ్యాయి. అతని వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలు పరిచాయి” అని మోహన్ అంటాడు.

నానమ్మ లూసియా వైపు కుండలు తయారు చేసేవాళ్లు. ఆ కుండల మీద చక్కని లతలు, జ్యామితీయ ఆకృతులు ఉండేవి. లెయొనార్దొకు ఆ కళావారసత్వం వచ్చి ఉంటుందనీ మోహన్ అంటాడు. “డావిన్సీది పక్కా జానపదుడి హృదయం. ప్రకృతి అతని ఆరాధ్య దేవత” అని బాల్యంలో వించీ చుట్టుపక్కల చూసిన జీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వడ్రంగులు, పశువుల కాపర్లు ఎట్లా లెయొనార్దొ చిత్రాలలోకి ఎక్కారో వివరిస్తాడు. పల్లెల్లోని నూనె గానుగలను బాల్య కుతూహలంతో కళ్లింత చేసుకుని చూసిన లెయొనార్దొలో ఆ యంత్రాలే బీజం వేశాయనీ అతని నోటు పుస్తకాల్లో వందలకొద్దీ మొక్కలు, చెట్లు, పళ్లు కనిపిస్తాయనీ లెయొనార్దొ అనే అద్భుత వ్యక్తి తయారయిన మూల కారణాల సంక్లిష్టతను అర్థం చేయించడానికి మోహన్ ప్రయత్నిస్తాడు.

“దేన్నయినా సరే చూసి, విని, తాకి, శోధించి నిర్ధారణకు రావడం డావిన్సీ సిద్ధాంతం” అటాడు మోహన్. ఇది మొత్తంగానే పునరుజ్జీవన యుగపు సిద్ధాంతం. పెట్టుబడిదారీ అన్వేషణలకు మూలమైన సిద్దాంతం. బైబిల్ చెప్పిందనో, చర్చి చెప్పిందనో దేన్నీ అంగీకరించకు. పంచేంద్రియాలు ఉపయోగించి, హేతుబుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకో అని మనిషి మీద మనిషికి విశ్వాసం కలిగించిన విలువలు అవి. మనిషిని విధి చేతిలోని కీలుబొమ్మలా కాక క్రియాశీల, సృజనాత్మక  ఉత్పత్తి శక్తిగా చూడకపోతే పెట్టుబడిదారీ విధానం లేచి నిలవడమే సాధ్యమయ్యేది కాదు. ఆ తొలిరోజుల, విప్లవాత్మక పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదించాయి. కాని అతి త్వరలోనే ఆ ప్రగతిశీల, ఉదాత్త, సర్వమానవ సౌభ్రాతృత్వ ధోరణి అంతా మణగిపోయింది. పెట్టుబడిదారీ విధానం మనిషిని విడుదల చేయదని, మనిషిని మనిషి దోపిడీ చేసే, పీడించే సాంఘికధర్మాన్ని బలోపేతం చేస్తుందని అర్థమయింది. పెట్టుబడిదారీ విధానం, పునరుజ్జీవన ఆధునికత ఈ వైరుధ్యాల పుట్ట.

పెట్టుబడిదారీ విధానం ఎదుగుతున్న క్రమంలో ఈ వైరుధ్యాలు అంతకంతకూ ఎక్కువగా బహిర్గతం కావడం మొదలయింది గాని ఒక సున్నిత సునిశిత మేధావిగా లెయొనార్దొ జీవితంలోనే ఈ వైరుధ్యాల బీజాలు గోచరిస్తాయి. “…యుద్ధంలో సైనికులను ఊచకోత కోయడానికి చరిత్ర ఎరుగని మారణ యంత్రాలను కూడా ఊహించి వాటికి కాగితాలపై రూపమిచ్చాడు. గుర్రాల వెన్నుతట్టి వాటి హృదయంతో సంభాషించిన డావిన్సీ, వాటిని పొడవాటి పదునైన కత్తుల రథానికి పూన్చి బొమ్మ వేయడానికి వెనుకాడలేదు. రంగుల్లో ప్రేమ జీవననాదాన్ని హృద్యంగా పలికించిన అతడు మనుషుల ఉసురు తీసే రోమాంచిత ఊహల్లోనూ తేలిపోయాడు….” అనీ, “పూలను, గడ్డిపోచలను ముగ్ధమనోహరంగా చూపిన డావిన్సీ ఈ కుత్తుకలు తరిగే మారణ యంత్రాలకు ఊపిరిపోయడం పెద్ద వైచిత్రి” అనీ అంటూనే “ఈ వైరుధ్యం, వైచిత్రి డావిన్సీ వైయక్తికమైంది మాత్రమే కాదు, నాటి సమాజం, రాజకీయాలు సృష్టించిన పరిస్థితులది కూడా” అంటాడు మోహన్.

అయితే లెయొనార్దొ జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాఢమైన అన్వేషణ. అది ప్రకృతి గురించీ కావచ్చు, జంతువుల గురించీ కావచ్చు. నీటి ప్రవాహాల గురించీ కావచ్చు.  కొత్త యంత్రాల గురించీ కావచ్చు, మానవ శరీరం గురించీ కావచ్చు, సమూహంలో వైవిధ్య భరితమైన మానవ ప్రవర్తన గురించీ కావచ్చు. మత భావనల చిత్రీకరణలలోనూ, మనుషుల చిత్రీకరణలోనూ ఆయన ఆ అన్వేషణా ఫలితాలన్నీ రంగరించాడు, రంగుల్లోకి దించాడు. రంగుల్లో కుదించాడు. ఆరు దశాబ్దాలు దాటిన ఆ మహాద్భుత వర్ణమయ జీవితాన్ని మోహన్ ఈ పుస్తకంలో అంతే వర్ణమయంగా అక్షరాలకెక్కించాడు.

నిజానికి ఇది ముందుమాట గనుక, దీనికి నిడివి పరిమితి ఉంది గనుక ఇంక ఎక్కువ రాయను, ఎన్నెన్నో భాగాలను యథాతథంగా ఉటంకించాలనే కోరికను అణచుకుంటున్నాను.

మిలాన్ పాలకుడు లుడొవికో దగ్గర కొలువు కోసం తనకు ఏయే కళలు వచ్చునో లెయొనార్దొ రాసిన లేఖ, లెయొనార్దొ మిగిల్చి పోయిన దాదాపు ఆరువేల పేజీల నోట్స్, లెయొనార్దొ వేసిన చిత్రాలలో చాల భాగం చెడిపోవడంలో కాలం పాత్ర, మనిషి పాత్ర, మిలాన్ సమీపంలో ఆల్ప్స్ పర్వతాలలో నదుల గురించి లెయొనార్దొ చేసిన అన్వేషణలు, లెయొనార్దొ రాసిన చిత్రకళా బోధిని, చేసిన యంత్రాలు, యంత్ర భాగాలు, మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి మృతదేహాలపై లెయొనార్దొ చేసిన ప్రయోగాలు, ప్రకృతి, ఖగోళ శాస్త్ర అన్వేషణలు, అద్దాలపై, కటకాలపై అన్వేషణలు, మతభావనలు, వృద్ధాప్యపు కల వంటి అనేక సందర్భాలలో మోహన్ రచన పాఠకులను సమ్మోహితులను చేస్తుంది, ఐదువందల ఏళ్ల వెనక్కి, ఆ నాటి సామాజిక సాంస్కృతిక వాతావరణంలోకి తీసుకుపోతుంది. ఇక చిత్రాల గురించి – మరీ ముఖ్యంగా జినిర్వా, జెరోమ్, సెయింట్ ఆన్, ఆంగియారి, మోనాలిసా, సెయింట్ జాన్, సిసిలియా, లుక్రీజియా వంటి ఎన్నో చిత్రాల – వివరణలైతే ఒక వచన రచయిత, కళా విమర్శకుడు మాత్రమే చేయగలిగేవి కావు. స్వయంగా చిత్రకారుడు, రంగుల, రేఖల స్వభావ స్వరూపాలు కూలంకషంగా తెలిసిన కళా మర్మజ్ఞుడు మాత్రమే రాయగలిగినవి.

“డావిన్సీ చిత్రకళా సృజనను పక్కనపెడితే అతడు ఇంజనీరింగ్, వాస్తు వగైరా రంగాల్లో కంటే అనాటమీలోనే ఘన విజయాలు సాధించాడు. సుతిమెత్తని కుంచెలు పట్టుకున్న చేతుల్తోనే కరకు కత్తులు పట్టుకుని మృత మానవ దేహాలను రక్తమంటిన చేతులతో శోధించాడు. మానవ గుండెను కుడిచేత్తో పట్టుకుని రక్తపు మరకలంటిన కాగితంపై ఎడమ చేత్తో దాని రూపాన్ని చిత్రించాడు… మనిషి బయటి, లోపలి నిర్మాణాన్ని స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, నిర్దుష్టంగానే కాకుండా కళాత్మకంగా కూడా చూపిన తొలి అనాటమీ కళాకారుడు డావిన్సీనే. అతడు తన అనాటమీ చిత్రాలతో కళాకారుడికి, శాస్త్రవేత్తకు మధ్య ఉన్న తేడాను చెరిపేశాడు…. అతని జ్ఞానపిపాసను మతం అడ్డుకోలేకపోయింది” అనీ, “కళ్ల కదలికలకు కారణమేంటి? కనుబొమలు ఎలా ముడిపడతాయి? కనురెప్పలు ఎందుకు మూతపడతాయి? ముక్కుపుటాలు, నోరు, పెదవులు తెరచుకోవడం, మూసుకోవడం వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఉమ్మడం వెనుక మతలబేంటి? ఎందువల్ల నవ్వుతున్నాం, ఆశ్చర్యపోతున్నాం అని డావిన్సీ ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నలను ఓ పుర్రెబొమ్మ వేసిన కాగితం వెనక రాసుకున్నాడు. చీదడం, ఆకలి, నిద్ర, మైథునం, చెమట, కండరాల కదలికలకు కారణమేంటో తెలుసుకోవాలని రాసుకున్నాడు” అనీ అంటాడు మోహన్.

నిజానికి మోహన్ రచనలో ఇటువంటి ఆర్ద్ర, సున్నిత, కాల్పనిక, కళాత్మక వ్యక్తీకరణలను ప్రేరేపించగల శక్తి లెయొనార్దొ జీవితంలోనే ఉంది. స్వయంగా లెయొనార్దొ మనకోసం వదిలిపెట్టిపోయిన రచనలలో కూడ ఉంది. ఉదాహరణకు, “ఆత్మికోద్వేగాలను భంగిమల ద్వారా చెప్పగలిగితేనే చిత్రానికి విలువ ఉంటుంది”, “నా శ్రమతో ప్రకృతిలోని రహస్యాలు బట్టబయలవుతాయి”, “ఒకసారి అధ్యయనం చేసిన వాటి గురించి రాత్రిపూట ఆలోచిస్తే మంచిదని స్వానుభవంతో చెబుతున్నా. మనం పడుకున్నప్పుడు రాత్రి నిశ్శబం వల్ల ఆలోచన పదునెక్కుతుంది. దాంతో మనం సృజించిన వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దగలం”, “పోషకులు మొదట్లో నిన్ను ఆకాశానికెత్తేస్తారు. తర్వాత కష్టమైన పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత విశ్వాసహీనంగా ప్రవర్తిస్తారు. ఆపై నిన్ను నిందిస్తారు”, “అచ్చేసిన పుస్తకాల మాదిరి చిత్రాలకు పెద్దసంఖ్యలో నమూనాలు ఉండకూడదు. ఒక చిత్రం ఒక చిత్రంగానే ఉండాలి. పిల్లల్ని పుట్టించగూడదు. అప్పుడే అది ప్రత్యేకంగా, మిగతా వాటికంటే గొప్పగా భాసిల్లుతుంది”, “పక్షి గణిత సూత్రాల ఆధారంగా పనిచేసే యంత్రం. ఆ యంత్రాన్ని మనిషి తయారు చేయగలడు. అయితే అతని యంత్రానికి పక్షికున్నంత శక్తి ఉండదు. పక్షి హృదయమూ ఉండదు. కనుక మనిషి ఆ లోపాన్ని యంత్రానికి తన హృదయాన్ని అందించి అధిగమించాలి” వంటి ఆణిముత్యాలెన్నో లెయొనార్దొ రచనల్లో ఉన్నాయి.

“చిత్రకారుడు సమస్త జీవజాలపు, ప్రకృతి సారాంశం. జంతువులు, మొక్కలు, పళ్లు, మైదానాలు, శిఖరాలు, భయం గొల్పే ఆవరణలతో పాటు ఆహ్లాదకర ప్రాంతాలు, గాలి వాలుకు తూలిపోయే రంగురంగుల పూలతో కూడిన పొదలు, ఎత్తయిన పర్వతాల నుంచి బలంగా కిందికి దూకే నదులు, వాటిలో కొట్టుకుపోయే రాళ్లు, చెట్ల వేళ్లు, మన్ను, నురగ, ఝంఝామారుతంతో ఎదురొడ్డి పోరాడే తుపాను కడలి సారాంశం… చిత్రకారుడు… మానవుల్లోని సౌందర్యం నశిస్తుంది. కాని కళలోని సౌందర్యం నశించదు” అన్నాడు లెయొనార్దొ ద వించి.

ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలు గడిచింది. ఆయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహన గానం ఈ పుస్తకం. చదవండి.

Da Vinci – 1/8 demy, 264+8 pages, Rs. 150, Kaki Prachuranalu

For copies: All leading book shops/
Kaki Prachuranalu, Plot No. 304, H.No. 3-5-118/15, Second Floor, GPR Nilayam, Krishnanagar, Hyderguda, Rajendranagar, Hyderabad 500048, Ph: 9949052916

–          ఎన్ వేణుగోపాల్

ఋతుకాలోచితం –స్త్రీ కి ప్రకృతి వరం !!

అసదృశయౌవనం బిది యనన్యధనం బగునొక్కొ! నాకు ని

క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గ వల్లరీ

కుసుమ సముద్గమం బగునొకో! పతిలాభము లేమి జేసి; యొ

ప్పెసగగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో!

                                                       -నన్నయ

   (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

సాటిలేనిది కదా ఈ యవ్వనం! ఈ సంపద అన్యధనం అవుతుందో కాదో! నాకు కలిగిన ఈ కుసుమ(రజో)దర్శనం, భర్త లేకపోవడం వల్ల, ఎవరూ ప్రవేశించలేని కోటలోని తీగకు పూసిన పూవు చందమైపోతుందేమో!  భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో!?

***

అమ్మలకు, అమ్మలగన్న అమ్మలకు, అక్క చెల్లెళ్లకు ముందుగా భక్తిపూర్వకంగా నమస్కరించి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని ఒక చరిత్రకారుని దృష్టితో పరిశీలించినప్పుడు, ఆ ప్రయత్నం నేటి విశ్వాసాలకు, మనోభావాలకు నొప్పి కలిగించవచ్చు. అశ్లీలంగానూ తోచవచ్చు. కనుక, ఇది తటస్థబుద్ధితో చేసే విశ్లేషణ మాత్రమే సుమా అని ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకుంటున్నాను.

ఇంతవరకు మౌననాయికగా పొడగట్టిన శర్మిష్ట,  పై  పద్యంలోని మాటలు అనుకుంటుంది.

[su_note]పురుషుడు స్త్రీకి సొంతభాష లేకుండా చేసి వంచించవచ్చు. తన ప్రతిధ్వనిగానే ఆమెను మలచి ఉండవచ్చు. కానీ ప్రకృతి కరుణామయి. తను స్త్రీని వంచించలేదు. స్త్రీకి తనదైన భాష నిచ్చింది. యవ్వనమనే వశీకరణ సాధనాన్నీ, పునరుత్పత్తి అనే హక్కునూ ప్రసాదించింది. స్త్రీకి తన శరీరంలో వచ్చే మార్పుల గురించిన భాష తెలుసు. స్త్రీకి తన శరీరంతో మాట్లాడడం తెలుసు. అది ప్రకృతి దత్తమైన వరం.

శర్మిష్ట ఇక్కడ తన శరీరంతో మాట్లాడుతోంది. ఇది ఎంత గొప్ప యవ్వనం అనుకుంటోంది. ఇతరులకు అనుభవయోగ్యమైన సంపద కాకుండా, ఎవరూ చొరలేని కోటలోని తీగకు పూసిన పూవులా ఇది వాడి పోతుందా అనుకుని బాధపడుతోంది. భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో అనుకుంటోంది.

శర్మిష్ట హృదయంలో గూడు కట్టుకున్న ఆ గుబులు శతాబ్దాలుగా, బహుశా సహస్రాబ్దాలుగా స్త్రీనుంచి స్త్రీకి ప్రవహిస్తోంది కాబోలు. ఈ సందర్భంలో, శారద అనే కలం పేరుతో ఒక పురుష రచయిత (నటరాజన్) రాసిన ‘మంచి-చెడు’ నవలలోని పద్మ పాత్ర గుర్తుకొస్తోంది. ఆ నవల గురించి ఎలాంటి విశ్లేషణలు వచ్చాయో నాకు గుర్తులేదు. ప్రకృతిధర్మం అనే కోణం నుంచి నేను ఆ నవలను విశ్లేషించాను(కాలికస్పృహ: మరికొన్ని సాహిత్యవ్యాసాలు). ప్రకృతిధర్మాన్ని పై కెత్తి చూపించిన ఆ నవల నాకు ఓ అద్భుతంగా, అసాధారణంగా తోస్తుంది. పద్మను వయసు మళ్లిన ఒక సంపన్న వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. యవ్వన సహజమైన కోరికలు తీరక పద్మ చిత్రవధ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె అనుకున్న మాటలు నాకు గొప్ప కవిత్వంలా తోస్తాయి:

వసంతకాలాలూ, చలిరాత్రులూ, వర్షపు రోజులూ ఏటేటా వస్తూనే ఉంటాయి. ప్రకృతిధర్మం ఒక్కలానే ఉంటోంది- దశాబ్దాల తరబడి. కానీ వ్యక్తి జీవితంలో అనుభవనీయమైన రాత్రులు కొన్నే! అవి ఇట్లా మానవకల్పితమైన నీతులకు, కట్టుబాట్లకు లోబడి వ్యర్థం కావలసిందేనా? [/su_note]

సమవయస్కుడైన సవతి కొడుకుపై ఆమె దృష్టి పడుతుంది. సంఘభయంవల్ల వెనకడుగు వేస్తుంది. అంతలో వ్యాపారంలో భాగస్వామి వంచన వల్ల భర్త ఆస్తి హరించుకుపోతుంది. భర్త కూడా చనిపోతాడు. పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి ఉన్నంతకాలం శరీరసౌఖ్యం కోసం పరితపించినా, ఆమె నీతి తప్పే ధైర్యం చేయలేకపోతుంది. ఆస్తి కరిగిపోగానే అంతవరకూ తనను బంధించిన భయాలనుంచి ఆమెకు విముక్తి లభించినట్లవుతుంది. శారీరకవాంఛను ఎలాగో అణచుకున్నా, ఆకలి అనే ప్రాకృతికధర్మాన్ని అణచుకోవడం ఆమెకు అసాధ్యమవుతుంది. చివరికి అయిదు రూపాయిలకు శీలాన్ని అమ్ముకుని కడుపాకలినీ, శరీరపు ఆకలినీ కూడా తీర్చుకుంటుంది. అప్పుడామె శారీరక, మానసిక స్థితులను రచయిత ఇలా వర్ణిస్తాడు:

నునుపుగా, ఎన్నడూ లేనంత అందంగా కనబడుతోంది ఆమె మొహం. అది ఈ రెండురోజుల నుంచి కలిగిన సౌఖ్యప్రాప్తి వల్ల, ఇష్టం వచ్చిన తిండి తినడం వల్ల ఏర్పడ్డ నునుపేమో…పద్మ మనస్సు లేడిలా, పంజరం నుంచి విడిపించుకున్న చిలకలాగా ఎగురుతోంది. తన ప్లాను వీళ్ళకు తెలియడం అసంభవం. తెలిస్తే అది వ్యభిచారమని అంటారు. కానీ ఏవిధంగా తన క్షుద్బాధను తీర్చుకోగలదు? తన తృష్ణను న్యాయమైన విధాన చల్లబరచుకోవడానికి అవకాశం ఎక్కడ?…

సవతి కొడుకు పాత్ర మరో అపురూప సృష్టి. అతడు సంఘనీతికి బద్ధుడు. అయినాసరే, సాక్షి మాత్రుడుగా ఉంటూనే సంఘనీతికీ, ప్రకృతిధర్మానికీ మధ్య పద్మలానే అతను కూడా నలిగిపోతాడు. పద్మ నడవడిని అతను గమనిస్తూనే ఉంటాడు. తప్పుపట్టకపోగా ఆమెపై సానుభూతితో కరిగి నీరైపోతాడు. ఇలా అనుకుంటాడు:

నిజానికామె ఈ యవ్వనకాలాన్ని ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో హాయిగా గడపవలసింది. సహజవాంఛల్నీ, ఆకలినీ తీర్చుకోవడంలో కలిగే ఆనందాన్ని, ప్రకృతిదత్తమైనదిగా, సమాజ శుభాశీస్సులతో అనుభవించవలసింది. కానీ నేడామె ఆ ఆనందాన్ని రహస్యంగా, దొంగలాగా అనుభవించవలసివస్తోంది.

ప్రకృతిధర్మం అనే గీటురాయి మీద లైంగికవాంఛను పరిశీలిస్తున్న ఈ వాక్యాలు ప్రకృతి అంత సహజంగానూ, సూటిగానూ, స్వచ్ఛంగానూ  నా చెవులకు ధ్వనిస్తాయి. ఎంతో సాంద్రమైన ఆర్ద్రతా, అనుకంపల లోతులనుంచి ఇవి పలుకుతున్నట్టుంటాయి. లైంగికవాంఛను ఇలా వ్యాఖ్యానించిన రచయిత ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

ప్రస్తుతానికి వస్తే…

sarmishta

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది. ఏ ఆడదైనా కోరుకునేది భర్తనూ, కొడుకులనూ పొందాలనే, ఆ రెండూ దక్కిన దేవయాని అదృష్టమే అదృష్ట మనుకుంటోంది.

యయాతి తొలిసారి తనను చూసినప్పుడే ఆ చూపుల్లో తన మీద ఉట్టిపడుతున్న ఇష్టాన్ని శర్మిష్ట పోల్చుకుని ఉంటుంది. అప్పుడే నిశ్శబ్దంగా తన హృదయంలో అతనిని నిలుపుకుని ఉంటుంది.  అతనిమీదే నా హృదయం ఎప్పుడూ లగ్నమై ఉంటుందని ఇప్పుడు కూడా అనుకుంటున్న శర్మిష్ట, ‘నన్నీతడు గరము  కారుణ్యమున  బ్రీతి గలయట్ల జూచు…’ ననుకుంది.

సామాజిక స్థాయీ భేదాలు మానవసంబంధాలలోనే కాక; వాటి వ్యక్తీకరణకు ఉపయోగించే మాటల్లో కూడా తేడా ఎలా తీసుకొస్తాయో పౌరాణికుడు ఇక్కడ అలవోకగా సూచిస్తున్నాడు. యజమాని ఒక దాసిపై  చూపించే అనురక్తిని ప్రేమ అనో, అనురాగమనో అనకూడదు; కారుణ్యం అనాలి. దాసి కూడా యజమాని నుంచి కారుణ్యాన్ని మాత్రమే ఆశిస్తుంది. పై వాక్యం శర్మిష్ట దాసిత్వాన్నే కాక ప్రస్తుత సందర్భంలో ఆమె దయనీయతను కూడా వెల్లడిస్తోంది.

దేవయానిలానే నేను కూడా ఇతనినే భర్తను చేసుకుంటానని శర్మిష్ట అనుకుంది. సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’ అంది.

‘పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు.

‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.

[su_note note_color=”#ff6696″] శర్మిష్టకు శరీరంతో మాట్లాడే భాషే కాదు, దానికి కావలసినవి సాధించుకునే తర్కమూ తెలుసు. అందుకు అవసరమైన పాండిత్యమూ ఆమెకు ఉంది. మగవాడి బలహీనతపై ఒడుపుగా గురిచూసి కొట్టి లొంగదీసుకునే నేర్పూ ఉంది. ప్రకృతి ప్రతి ప్రాణికీ ఆయాచితంగా ప్రసాదించిన నేర్పు అది. ప్రకృతి సిద్ధమైన ఆమె బలవత్తర వాంఛ ఆ క్షణంలో దేవయానిపట్ల భీతిని కూడా జయించింది.

శర్మిష్టను, యయాతిని కాసేపు పక్కన ఉంచి కథకుని దగ్గరకు వద్దాం. నిజానికి వాళ్ళ ఇద్దరి ముఖంగా కథకుడే శ్రోతలతో ఇక్కడ సంభాషిస్తున్నాడు. వారిద్దరి సంబంధానికి సమర్థన అందించే వ్యూహంతో ఈ ఘట్టాన్ని నిర్మిస్తున్నాడు. ఎలాగంటే, శర్మిష్టతో యయాతి సుఖించడానికి ఎలాంటి సమర్థనలూ అవసరం లేదు. దాసీతో సంబంధం ఆనాడు తప్పు కాదు. కాకపోతే, దేవయానికి ఇష్టం లేదు కనుక అది రహస్య సంబంధంగా పరిణమించి ఉండచ్చు. శుక్రునికి ఇచ్చిన మాట ఎలా తప్పనని  యయాతి అన్నప్పుడు, కొన్ని సందర్భాలలో మాట తప్పవచ్చునని శర్మిష్ట గుర్తుచేయడంలో అర్థముంది. కానీ, నా యజమానురాలికి భర్తవు కనుక నాకు కూడా భర్తవే ననీ; భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయరాని ధర్మాలనీ విడమరచి బోధించడంలో అర్థం లేదు. ఎందుకంటే, రాజూ, యజమానీ అయిన యయాతికి ఆ విషయం తెలియకుండా ఉండదు. కనుక, ఆ బోధ శర్మిష్ట యయాతికి చేస్తున్నది కాదు; కథకుడు శ్రోతలకు చేస్తున్నది! కారణం, ‘భార్య-దాసి-కొడుకు’ అనే విడదీయలేని ధర్మాలకు చెందని, భిన్న సామాజిక దశలోని శ్రోతలకు కథకుడు ఆ విషయం చెబుతున్నాడు!

అయితే, భిన్న సామాజిక దశకు చెందిన శ్రోతలను ఉద్దేశించడంలో కథకుడు  తెలిసో, తెలియకో అంతకంటే కీలకమైన ఒక అంశాన్ని కలగా పులగం చేస్తున్నాడు. అది, తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని శర్మిష్ట అడిగిన సందర్భం.[/su_note]

ఋతుమతి అనే మాట ఉంది. దాని అర్థం మనకు తెలుసు. అది మొదటిసారి పెద్దమనిషి కావడాన్ని సూచిస్తుంది. ఋతుకాలం వేరు. అది నెల నెలా సంభవిస్తుంది. ఋతుకాలం సంతానం పొందడానికి యోగ్యమైన కాలం. శర్మిష్ట తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతోంది. అంటే, తనిప్పుడు ఋతుకాలంలో ఉన్నాననీ, సంతానం ఇవ్వమనీ అడుగుతోంది. ఇలా ఆయా స్త్రీలు ఋతుకాలోచితం ప్రసాదించమని అడగిన సందర్భాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. వాటి ప్రస్తావనను ప్రస్తుతానికి వాయిదా వేస్తే; కథకుడు తెలివిగానో, లేక అతి తెలివితోనో, నిజంగానే తెలియకో ఋతుమతి-ఋతుకాలోచితం అనే రెండు మాటలనూ ఒకే అర్థంలో ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించడంలో ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చి సందేహాలకు తావిస్తున్నాడు.

ఎలాగంటే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాత, శర్మిష్ట-యయాతుల మధ్య సమాగమం గురించి చెబుతూ,  ‘శర్మిష్ట సంప్రాప్తయవ్వనయు, ఋతుమతియు అయిం’ దని అంటున్నాడు! అంటే, కొత్తగా ఆమె ఋతుమతి అయిందనే భావన కలిగిస్తున్నాడు. అంతవరకు జరిగిన కథను గమనిస్తే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాతే శర్మిష్ట యవ్వనవతి, ఋతుమతి అయిందనడం నమ్మశక్యంగా ఉండదు. దేవయానికీ, శర్మిష్టకూ స్పర్థ ఉంది కనుక వారిద్దరూ ఇంచుమించు సమవయస్కులే అవుతారు. మహా అయితే, ఇద్దరి మధ్యా ఒకటి రెండేళ్ల అంతరం ఉండచ్చు. వయసులో తేడా ఎలా ఉన్నా; శర్మిష్ట దేవయాని పెళ్ళికి ముందే యవ్వనవతి అయుండాలి. ‘అతిశయ రూప లావణ్య సుందరి’ అయిన శర్మిష్టను దేవయాని పక్కన చూసి యయాతి ఆమె ఎవరో తెలుసుకోగోరాడని చెప్పడం ద్వారా అతడు ఆమెవైపు ఆకర్షితుడయ్యాడని కథకుడు అప్పుడే సూచించాడు. కనుక అప్పటికే ఆమె యవ్వనవతీ, ఋతుమతీ అయుండాలి.

మరి కథకుడు ఎందుకీ  కల్పన చేసినట్టు?! ఎందుకంటే,ఋతుమతి, ఋతుకాలోచితం అనే మాటల మధ్య ఉన్న అర్థభేదాన్ని అతడు గమనించి ఉండకపోవచ్చు. శర్మిష్ట ఋతుకాలోచితం ప్రసాదించమని అడుగుతోంది కనుక అప్పుడే ఆమె ఋతుమతి అయిందని పొరబడి ఉండచ్చు. ఇంకొకటి జరగడానికీ అవకాశముంది. కథకుడు ఉద్దేశపూర్వకంగానే ఋతుకాలోచితం అనే మాటకు ఉన్న భిన్నార్థాన్ని మరుగుపుచ్చే ప్రయత్నం చేసి ఉండచ్చు. ఎందుకంటే, ఋతుకాలోచితం ప్రసాదించమని అడగడం కూడా ఒకానొక సామాజిక దశకు చెందిన ప్రయోగం. కానీ, కథకుడు వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు కథ చెబుతున్నాడు…

మిగతా విశేషాలు తర్వాత….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

సంస్కృతీ విరాట్ స్వరూపాన్ని అద్దం లో చూపగలమా?

ఆట సంస్కృతిలో భాగం, వేట సంస్కృతిలో భాగం, మాట సంస్కృతిలో భాగం, పోట్లాట సంస్కృతిలో భాగం, వివాహం సంస్కృతిలో భాగం, వివాదమూ సంస్కృతిలో భాగమే. మడిగట్టుకోవడం సంస్కృతిలో భాగం. అమ్మవారికి వేట వెయ్యడమూ సంస్కృతిలోని భాగం. బొట్టు పెట్టుకోవడం, కత్తిపట్టుకోవడం, మట్టి కాల్చి కుండలు చెయ్యడం అన్నీ అన్నీ సంస్కృతిలో భాగాలే. ఒక జాతి చేయగల మంచి, చెడూ సంస్కృతిలో భాగాలే. తెలుగునాట ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా నోములు నోచుకుంటారు. ఎలా భిక్షాటన చేస్తారు. ఎలా పెళ్లి చేస్తారు. ఏ విధంగా విడాకులు తీసుకుంటారు. యుద్ధాల్లో ఎలా పాల్గొంటారు. ఓటమిని ఎలా ఎదుర్కొంటారు. వృద్ధాప్యంలో ఎలా ఉంటారు. యౌవనాన్ని ఎలా ఆస్వాదిస్తారు ఇలాంటివన్నీ సంస్కృతిలో భాగమే. దొంగలు, దొరలు, పూజారులు, వేశ్యలు, అధికారులు, సామాన్యులు, వీరులు, భిక్షకులు, విద్యావేత్తలు, నిరక్షరాస్యులు ఇలా ఎందరుండే వీలుందో అందరూ సంస్కృతిలోనే ఉండగలరు. ఏం చేసినా సంస్కృతిలోనే చెయ్యగలరు. తెలుగు దొంగలు ఎలా జేబులు కొడతారు, తెలుగు వేశ్యలు ఎలా విటులను ఆకర్షిస్తారు,  తెలుగు పిల్లలు ఎలాంటి ఆటలాడుకుంటూంటారు వగైరా అన్నీ ఆ పేద్ధ వృత్తంలొ భాగం. ఇది సంస్కృతి గురించి నా అనుకోలు, అవగాహనానూ. “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ”, “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” సంస్కృతిలో భాగమైతే అణాకాసంత బొట్టు పెట్టుకుని పేరంటాలిచ్చిన వాయినాలతో నోము నుంచి తిరిగొస్తున్న సోమిదేవమ్మా సంస్కృతిలోని భాగమే. “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతూ, ఇవాళ్టికేమైనా వస్తుందేమోనని చూసి చూసి ఇంటికి వెళ్లి భార్య ఇచ్చిన తులసి ఆకుల తాంబూలం తృప్తిగా తిని వెర్రినవ్వు నవ్వుకునే పూజారీ సంస్కృతిలోనివారే.
ఇక సాహిత్యం అంటే టీషర్టుల మీద రాసిన రాతలు మొదలుకొని జనుల నాల్కలు తాటియాకులుగా లిఖింపబడ్డ పద్యాల వరకూ అంతా సాహిత్యమే. దాని ప్రయోజనమూ వేర్వేరు పద్ధతుల్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక చక్కని ఊహ చదివితే ఒళ్లు పులకించింది అది సాహిత్య ప్రయోజనమే. ఒక చిన్న జోకు చదివితే పేద్ద నవ్వు కాకున్న చిరునవ్వు పొటమరించిందీ అదీ ప్రయోజనమే. ఒక రచన చదివి జీవితంపై మనకుండే అవగాహనే మారిపోయిందనుకోండి అదీ ప్రయోజనమే. ఐతే వాటి మధ్య చాలా అంతరువులున్నాయి. కానీ ఒక స్తరంలో చూస్తే లక్ష్యసిద్ధి ఉన్న సాహిత్యమే అవి మూడూను. ఆ సాహిత్యానికి ఎన్నో రూపాలుండవచ్చును. సామెతగా లోకరీతులు చెప్పినా, పేదరాశి పెద్దమ్మకథగా మరోలోకాల్లోకి తీసుకుపోయినా అవి చక్కని సాహితీప్రక్రియలే. సరే నాకు సాహిత్యం పట్ల ఉన్న అవగాహన ఇది.(అటు ఇటుగా మిగిలిన సృజనాత్మక ప్రక్రియలకు కూడా ఇంత పరిధీ ఉంటుంది)
ఇప్పుడు ఒక సృజనాత్మక ప్రక్రియ సంస్కృతిని ప్రతిబింబించింది అన్నమాటకు అర్థమేమిటి చెప్పండి? నా అవగాహన వరకైతే సంస్కృతి అన్న పేద్ద కాంపౌండును ఒక రచనలో ప్రతిబింబించడం ఎలా సాధ్యపడుతుంది? సంస్కృతిలోని చాలా అంశాలను చక్కగా వివరించొచ్చు. పైగా ఎన్నో ప్రాంతాల, వృత్తుల సంస్కృతులని(పైన నేను చెప్పుకున్న వివరణనే సంస్కృతి విషయంలో గుర్తుతెచ్చుకోండి) కలగలిపితేనే ఒకనాటి తెలుగువారి సంస్కృతి ఏర్పడుతుంది. అందువల్ల ఆ విరాట్ స్వరూపాన్ని మనం ఎంతవరకూ దర్శించగలమో అంతవరకే కనిపిస్తుంది. బ్రాహ్మణుల జీవన విధానం రూపుకడితే సంస్కృతిలోని కొన్ని విశేషాల్ని ఎట్టేదుట పరిచినట్టే, ఐనంత మాత్రాన తెలుగు సంస్కృతినంతా ఆవిష్కరించంచినట్టు అవదు. అంత పని చేయాలంటే మహాభారతమంత లోతూ, విస్తృతీ కలిగిన ఉద్గ్రంథం అవసరమవుతుంది తప్ప చిన్న కథ, కవిత, నవలికలకు కుదరదు. విస్తృతీ, లోతూ ఒనగూడినా సంస్కృతి అంతటి మహా సాగరాన్ని మొత్తంగా ప్రతిబింబిస్తాయా అంటే కాదనే చెప్పాలి. ఆ పని ఎలాంటిదంటే ఆకాశమంతటినీ ఒక అద్దంలో చూపడం లాంటిది. ఆకాశాన్ని అద్దంలో చూపగలమా? చూపగలం. ఆకాశమంతటినీ ఒకే అద్దంలో చూపగలమా? ఏమో ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేసి విజయం సాధించినవారు ఉన్నట్టు నాకు తెలియదు. ఐతే సంస్కృతిని అనే ఆకాశాన్ని సాహిత్యమే సాగరం అత్యంత అరుదైన సందర్భాల్లో ప్రతిబింబించి ఉండొచ్చు. కాని మన చిన్న స్కేళ్లు దాన్ని నిరూపించలేవు.
మరి చేయగలిగింది ఏమిటంటే ఎవరి స్థాయిలో వారు సంస్కృతి విస్తృతిని అర్థం చేసుకుని తమ తమ స్థాయిల్లో ప్రతిబింబించగలగడమే. అలా చేస్తూన్నారు కూడా. అందుకే తెలుగు వారి సంస్కృతిని ప్రతింబింబించే సృజనగా దేన్నైనా చెప్తున్నారు అంటే వారు దాన్ని వాచ్యార్థంగా చెప్పలేదనో, సంస్కృతి అన్న పదానికి ఉన్న విస్తృతి వారికి తెలియదనో అర్థం చేసుకోవాలి.
ఇక మరో అంశం. ఎవరైనా సంస్కృతిని ప్రతిబింబించే సృజన అని అన్నప్పుడు సంస్కృతిలో భాగాన్ని ప్రతిబింబించి సారస్వతాన్ని సంపన్నం చేస్తోందన్న అర్థం స్వీకరించడం మాని ఇదే తెలుగు సంస్కృతా అని ప్రశ్నించి అంతటితో ఆగక ఇది జనాభాలో ఇంతశాతం మాత్రమే ఉన్నవారి అనుభూతులు, అనుభవాలు, ఆశలు, ఆశయాల సమాహారం మాత్రమే కనుక ఇది తెలుగు సంస్కృతి కాదని తిరస్కరిస్తున్నారు. ఐతే వారు కూడా తెలియకుండానే సంస్కృతి అనే విశాలమైన బంజరును కంచె వేసి సంకుచితం చేసేస్తున్నారు. ఫలానా వారి రుచులు, అభిరుచులు మాత్రమే సంస్కృతి కాదు అని చెప్పేప్పుడు అది ఫలానావారి సంస్కృతి అని దాన్ని సృజనాత్మకంగా చెప్పగలగడం వారి హక్కు అని మరచిపోతున్నారు.
నిజంగా సంస్కృతీ అన్వేషకులు చేయాల్సిన పని అది కాదు. ఏ అంశాలను తెలుగు సారస్వతం విస్మరించిందో పట్టుకోవాలి. సృజన గలవారైతే దాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించాలి. డబ్బున్నవారు అలాంటి విషయాన్ని సాహితీకరించడమో, తెరకెక్కించడమో చేసేవారికి దన్నుగా నిలవాలి. ఇవేవీ లేనివారు అలాంటివారిని కనీసం ప్రోత్సహించాలి. అప్పుడే సాహిత్యం సుసంపన్నమవుతుంది. ఆకాశం అరచేతిలో ఇముడుతుంది.
“జయంతి తే సుకృతినోః రససిద్ధా కవీశ్వరః
 నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం”
santhosh—సూరంపూడి పవన్ సంతోష్

బౌద్ధం… యుద్ధం… తవాంగ్ దృశ్యం

1

టూరిజం ఓ పెద్ద పరిశ్రమ అయిపోయాక మన మైదానాల సౌకర్యాలన్నీ మనతోపాటే  కొండలెక్కేశాయి. మంచి హోటళ్ళూ, బీరు బాటిళ్ళూ, ఫాస్ట్ ఫూడ్స్, మన ట్రాఫిక్ జాంలూ… చక్కగా వేటినీ వదలకుండా ప్రకృతి వొడిలోకి తెచ్చేసుకుని సెలవుల్ని ఆనందిస్తున్నాం. డార్జిలింగ్, నైనిటాల్, సిమ్లా, మసూరీ, ఊటీ, కొడైకెనాల్ లాంటి కొండ ప్రదేశాలకు పెద్ద పట్నాల వైభవం వచ్చేసి చాలా కాలమైంది.  కష్టపడి ఈ ఊళ్లకు వెళ్తే, ప్రకృతి పారవశ్యాల మాట అటుంచి, మన హైదరాబాద్ కో  ఢిల్లీకో కాస్త చల్లదనాన్ని పూసి, పాత సినిమాల్లో లాగా ఓ రెండు మంచు కొండలూ, ఓ సరస్సూ బ్యాక్ ప్రొజెక్షన్ పెట్టినట్టు ఉంటోంది. వీపున ఓ మూట వేసుకుని ఎవరూ పోని ప్రాంతాలకు ట్రెక్కింగ్ కి పోవటం ఉత్తమమే కానీ అది అన్నిసార్లూ కుదరదు.

మే లో మా కుటుంబం గువాహతి (అస్సాం) వెళ్లాం. అస్సాం వాతావరణం మేలో మన కోస్తా ప్రాంతాల మల్లే ఉంది.  షిల్లాంగ్ చల్లగా ఉన్నా అదీ ఓ పట్నమే కాబట్టి వద్దనుకున్నాం. అంతగా టూరిజం కోరల బారిన పడని అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే బాగుంటుందేమో అని తవాంగ్ కు బయలుదేరాం. ఈ ప్రయాణంలో మార్గం కూడా గమ్యం అంత అందంగా ఉంటుందని విని  దీనిని ఎంచుకున్నాం.

బయలుదేరిన రోజున పొద్దున్నే ఏడు గంటలకల్లా ‘బొలెరో’ తో మా వాహనచోదకుడు సిద్ధం. ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం వేసవిలో తెల్లారుజామున మూడున్నరకే అయిపోతుంది. అయినా మా వాళ్ళందరికీ ఒంట్లోని గడియారాలు ఆరుదాకా గంటలు కొట్టలేదు. బైటకొచ్చి చూస్తే,  పూబాలల్ని సున్నితంగా తడుతూ చిరుజల్లులు… మొత్తానికి ఎనిమిదికల్లా బయలుదేరాము.  ఎర్రటి నేలా,  లేత, ముదురాకుపచ్చ ఆకుల పరదాల మధ్యగా  సారవంతమైన పల్చని బూడిదరంగు నీటితో బ్రహ్మపుత్ర పరవళ్ళు… వీటిమధ్యలోంచి బద్ధకంగా ఆవులిస్తూ నిద్రలేస్తున్న గువాహతి ఊరిలోంచి మా ఎర్ర బొలెరో ప్రయాణం మొదలు పెట్టింది.

 

2

3

ఒక చిన్న ఫలహారశాల, బ్రహ్మపుత్ర

 

ఊరు దాటాక ఒక చిన్నపాటి భోజనశాలలో అల్పాహారం.  నన్ను చిన్నతనంలోకి ఒక్కసారిగా గిరాటు వేశాయి  బల్లమీద పెట్టిన ఇత్తడిపళ్ళెం, దానిలో అరిటాకులో పూరీలూ, ఒక చిన్న ఇత్తడి గిన్నెలో పల్చని శెనగపప్పు, ఆలుగడ్డ కూరా..  మా ఊళ్ళో నా చిన్నప్పుడు వాడకంలో ఉండిన కంచు, ఇత్తడి పాత్రలగురించి పిల్లలకు ఆనందంగా వర్ణిస్తూంటే, కాసేపు ఆ వస్తువులేంటో ఊహకందక,  వింత చూపులు ప్రసరించారు వాళ్ళిద్దరూ.

దారంతా అలాగే ఓ ముప్ఫై ఏళ్ల క్రితం మన పల్లెటూళ్ళు ఎలా ఉండేవో అలా కనపడింది.  అస్సాం అభివృద్ధి చెందలేదని అక్కడి ప్రజల బాధ. టాటాలూ అంబానీలూ అక్కడికి వెళ్ళరు. ఫలితం స్వచ్చమైన నీరూ, గాలీ, పంటా, పైరూ..   చమురు రిఫైనరీలు ఉన్నచోట అస్సాం అభివృద్ధి ఎలా ఉందో నేను చూడలేదు.  ఈ దారిలో కేవలమైన పచ్చదనంతో కూడిన పైర్లూ, గుబురు చెట్లూ,  వెదురుతోనూ, మట్టితోనూ కట్టిన ఇళ్ళూ.. అక్కడక్కడా సిమెంట్ ఇళ్ళు కూడా దిష్టిబొమ్మల్లా ఉన్నాయనుకోండి. మరీ ముఖ్యంగా ఎక్కడా వెదికినా కనబడని ప్లాస్టిక్ లూ, పాలితిన్లూ..  సైకిళ్ళమీద పాఠశాలకు వెళ్ళే పిల్లలు.. తేయాకు తోటలూ..  చక్కని రహదారికిరుపక్కలా ఈ అపురూప దృశ్యాలు తీరిగ్గా రాగాలాపన చేస్తుంటే మా వాహనం ఆ రాగాన్ని మింగేసే మెటల్ బ్యాండ్ హోరులా ఎనభై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం మహా అసంబద్ధ దృశ్యం. ఇవాళ దేశమంతటా కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  అంటేనే అదో గగన కుసుమం.  మన సమయాన్ని ఆదా చేస్తూ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రతీచోటా.

అస్సాం బాటకిరువైపులా...

అస్సాం బాటకిరువైపులా…

దారిలో దిరాంగ్ జిల్లా ఖరుపేటియాలో జనపనార బాగా కనిపించింది. ఈ జిల్లాలో ముస్లిం జనాభా కూడా ఎక్కువగా ఉంది. రౌతల్ గురి  చేరాక, ఇక్కడ బోడోలాండ్ ప్రభావం ఎక్కువని చెప్పాడు మా డ్రైవర్ రాజేష్. ‘బంగ్లాదేశ్ నుంచి  చొరబాట్లు ఈ ప్రాంతంలో సాధారణం’ అన్నాడు.  చొరబాట్ల మీద అదుపు, కాందిశీకులకు సరైన గుర్తింపు, స్థానికులకు సరైన భరోసా ఇవ్వని ప్రభుత్వాల వల్లనే కదా వేర్పాటువాదాలు!

మధ్యాన్నానికి తేజ్ పూర్ దాటి భాలుక్ పాంగ్ చేరుకున్నాం. ఇక్కడినుండి  అరుణాచల్ ప్రదేశ్ మొదలవుతుంది. అరుణాచల్ లో తిరగటానికి అక్కడి ప్రభుత్వపు అనుమతి పత్రం (inner line pass) ఈ వూరిలో తీసుకోవాలి.  భాలుక్ పాంగ్ నుంచి కొండ ఎక్కటం మొదలయింది. కొండ పక్కనే కామెంగ్ నది పరవళ్ళు తొక్కుతూ మా వాహనధ్వని తో జుగల్ బందీ సాగిస్తోంది.  ‘ఇది సతత హరితారణ్యం సుమా’ అంటూ పరచుకున్న పోక, అరటిచెట్లు, వెదురు పొదలు. కామెంగ్ నది చేస్తున్న గాన కచేరీకి పక్క వాద్యాల్ని అందిస్తున్నట్టు చిన్నా పెద్దా జలపాతాల ఝరీ నాదాలు.  ఈ పచ్చసముద్రాన్ని ఈదుకుంటూ టెన్గా లోయ చేరుకున్నాం. అదంతా మన సైన్యం నివసించే ప్రాంతం. చాలా పెద్ద సెటిల్మెంటు. టెన్గా దాటాక ఇంకో గంటలో బొమ్ దిలా చేరుకున్నాం. అప్పటికి చీకటి పడింది. మేము చేరేసరికి ఈ వూరిలో బజారంతా వస్తువులతో, విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. బస వెదుక్కుని, కిందకు భోజనం చేద్దామని వచ్చేసరికి అంతలోనే కర్ఫ్యూ పెట్టినట్టు అంతా నిర్మానుష్యం. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదే అయింది. కష్టంమీద రొట్టెలూ, రాజ్ మా  సంపాదించి తినటం అయిందనిపించాం.

అరుణాచల్ అందాలు

అరుణాచల్ అందాలు

 

రెండో రోజు ఉదయాన్నే బయలుదేరాం. దారంతా ఒకటే వాన. మెత్తటి మట్టిలో ఇరుక్కుపోతున్న వాహనాలు. సరిహద్దు రహదారుల సంస్థ (బీ ఆర్ ఓ) ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నట్టు కనిపించింది. చాలా చోట్ల ప్రోక్లైనర్ లతో పని చేస్తున్నారు.  చంటి పిల్లల్ని వీపున కట్టుకుని పని చేస్తున్న ఆడవాళ్ళు కొంతమంది.  దారి విశాలంగానే ఉందిగానీ రాళ్ళు, బురదతో నిండి మా వాహన వేగానికి బాగానే కళ్ళెం వేసింది. అలా నెమ్మదిగా 13,700 అడుగుల ఎత్తులో ఉన్న సెలా పాస్ చేరుకున్నాం. అక్కడో పెద్ద సరస్సు. ఓ పక్క ప్రశాంతంగా గడ్డి మేస్తున్న జడల బర్రెలూ… కఠిన శిలా సదృశమైన కొండ కొమ్ము పక్కనే పసుపుపచ్చని పూలతో నిండిన లోయ.  హిమాలయాల్లో ఈ ఎత్తులో rhododendron పూలకోసం అప్రయత్నంగా వెదుకుతాయి నా కళ్ళు.   ‘నీకెప్పుడూ నిరాశ కలిగించలేదు కదూ’ అంటూ నవ్వుతున్న నేస్తాల్లా ఎర్రని, తెల్లని, రోజా రంగుల్లోని rhododendrons సమృద్ధిగా…

6

సెలా పాస్ దివ్యత్వం

సెలా పాస్ దివ్యత్వం

సాయంత్రానికల్లా కొండ దిగి జాంగ్ జలపాతం దగ్గరకు వచ్చాం. చాలా పెద్దదైన ఈ జలపాతం దగ్గర 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం ఉంది. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో బోలెడంత సిమెంటూ, ఇనుమూతో చాలా పెద్ద పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా ఆ జాడ్యం అంటుకోకముందే ప్రభుత్వాలు సౌరశక్తి మీద పడితే బాగుంటుందని అనిపించింది.

జాంగ్ జలపాతం,                             కొండ దారుల వలయాలు

జాంగ్ జలపాతం, కొండ దారుల వలయాలు

చీకటి వేళకు తవాంగ్ చేరుకున్నాం.  ప్రయాణం మొదలైన దగ్గరనుంచీ ఒక ‘దీదీ’  రాజేష్ తో మొబైల్ ఫోనులో తెగ మాట్లాడుతూనే ఉంది. మమ్మల్ని తన హోటల్ లోనే దింపాలని ఆవిడ బాధ. ఇతనేమో ‘ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం’ అంటూ హామీలు ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి అతని సలహా ప్రకారమే ఆ హోటల్ లోనే దిగాము.  ఈ రకం ప్రయాణాలలో చాలా వరకూ  క్యాబ్ డ్రైవర్ ల ఇష్టానుసారమే మనం నడిచేస్తూ ఉంటాం. మరో మార్గం ఉండదు. క్యాబ్ లో ద్రైవరయ్యకు నచ్చిన టపోరీ పాటల్ని భరించక తప్పదు. మధ్యలో వినయంగా విన్నవించి కాసేపు మనకి నచ్చిన  సంగీతాన్ని పెట్టబోయినా మొహం ముడిచేస్తాడు.  ‘ఏ పాటలూ వద్దు  ప్రకృతి సంగీతాన్ని విని లయించిపోదామ’ని  ప్రయత్నిస్తూ నేను  మా అమ్మాయితోనూ  క్యాబ్ డ్రైవర్ లతోనూ  ప్రత్యక్ష, ప్రచ్చన్న యుద్ధాలు చేస్తోంటాను.  అదో ఆట.

మొత్తానికి హోటల్ గది శుభ్రంగా కళాత్మకంగా ఉంది. తవాంగ్ హోటల్ లో వంట, వడ్డన, పాత్రలు శుభ్రం చేయటం, అతిథుల సామాను మోయటం కూడా ఆడపిల్లలే చేస్తున్నారు.  ‘ఇదేం బాధ?’ అనుకుని మా సామాన్లు మేమే పట్టుకున్నాం.  ఇక్కడ మగవాళ్ళకంటే ఆదివాసీ ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారని ఒకరిద్దరు చెప్పారు. బైటి పనుల్లో ఆడవాళ్ళు మునిగిఉంటే కొంతమంది మగవాళ్ళు ఇంటినీ, పిల్లలనూ చూసుకుంటారట.

పని పాటలు మన వంతేనప్పా!

పని పాటలు మన వంతేనప్పా!

 

10

తవాంగ్ టూరిస్టు ప్రాంతం అన్నదానికి గుర్తుగా ఊరంతా అక్కడక్కడ చిన్న ఝరుల మధ్య ఖాళీ  ప్లాస్టిక్ సీసాలూ, పాలితిన్ సంచులూ కనిపించాయి. ఘనీభవించిన  పచ్చదనాన్ని చేదిస్తూ రంగుల దుస్తుల్లో మనుషులు కనిపించాలి కానీ రంగుల చిరుతిళ్ళ రేపర్లు కాదుగదా!   ప్రకృతి పట్ల ఈ నిర్లక్ష్యాన్ని మనం ఎప్పటికైనా వదుల్చుకోగలమా?

మరునాడు ఎడతెగని వాన వల్ల అక్కడున్న ఒకటి రెండు సరస్సులు చూడాలన్న మా ప్రయత్నం నెరవేరలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో  ఎత్తైన కొండలమీద వెయ్యి దాకా చిన్నా పెద్దా సరస్సులు ఉన్నాయట. తవాంగ్ మొనాస్టరీ అంతా తిరిగి చూసాం. మేము వెళ్లేసరికి బుజ్జి బుజ్జి అయిదేళ్ళ పిల్లల నుండి పదిహేనేళ్ళ పిల్లల వరకూ ఉదయపు అసెంబ్లీ లో ఉన్నారు. గురువుగారితో పాటు ప్రార్ధన అయాక అందరూ వరుసగా తరగతి గదులకు వెళ్ళిపోయారు.  మహాయాన బౌద్ధంతో పాటు, కాసిన్ని లెక్కలూ, హిందీ, సమాజ శాస్త్రం కూడా పిల్లలకు నేర్పిస్తామని ఒక గురువు చెప్పారు. తవాంగ్  మొనాస్టరీ  మన దేశంలోనే పెద్దది. చాలా పెద్ద గ్రంథాలయం ఉంది ఇక్కడ.  అయిదు వందల మంది దాకా బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. ప్రార్ధనాలయం గోడల మీద ఉన్న చిత్రాలు (murals) పాడవుతూ తమను కాస్త పట్టించుకోమంటున్నాయి. అయిదవ దలైలామా ఆధ్వర్యంలో ఈ మొనాస్టరీని పదహారవ శతాబ్దంలో నిర్మించారట. తవాంగ్ ఆరవ దలైలామా జన్మస్థలం కూడా.

11

తవాంగ్ మొనాస్టరీ

తవాంగ్ మొనాస్టరీ

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయంలో...

ప్రార్ధనాలయంలో…

తవాంగ్ లో మోంపా తెగకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బౌద్ధం ఎక్కువ. బౌద్ధులు కాని మిగతా వారంతా ప్రకృతి ఆరాధకులే.  ఒకప్పుడు టిబెట్ లో భాగమైన తవాంగ్, బ్రిటిష్ వారు మెక్ మోహన్ లైన్ ను సరిహద్దుగా నిర్ణయించాక భారతదేశానిదయింది. 1962 చైనా-భారత్ యుద్ధం తరువాత ఒక ఆరునెలల పాటు చైనా ఆధీనంలోనికి వెళ్ళింది తవాంగ్ .  1962 లో తవాంగ్ దాటి, అస్సాంలోని తేజపూర్ దాకా చైనా సైన్యం వచ్చేసిందట. మొత్తానికి  ఆరు నెలల తరువాత చైనా దీనిని విడిచిపెట్టింది.  ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లో భాగమేననీ, తద్వారా అది తమకు చెందినదే అన్న భావం చైనా వారికి ఉంది. ఇక్కడుండే బౌద్దులకూ, ఆదివాసీలకూ చైనామీద ప్రత్యేక ఆసక్తి సహజంగానే లేదు. పైగా టిబెటన్లను అణిచివేసే చైనా విధానాలవల్లా, దలైలామా మన దేశంలోనే ఆశ్రయం తీసుకోవటంవల్లా, బౌద్ధులకు చైనావాళ్ళంటే గిట్టకపోవటమూ, మన దేశం అంటే కాస్త ఇష్టం ఉండటమూ కూడా సహజమే. తవాంగ్ భారతదేశంలో భాగంగా ప్రశాంతంగానే కనిపిస్తుంది. అయినా ఎటువంటి పొరపాట్లకూ, చొరబాట్లకూ ఆస్కారం ఇవ్వకుండా భారీగా మన సైన్యం అడుగడుగునా పహారా  తిరుగుతూ ఉంటుంది.

1962 లో చైనా మెరుపుదాడిని ఎంత మాత్రం ఎదుర్కోవటానికి సిద్ధంగా లేని భారత్  ఆదరా బాదరాగా దేశం  అన్ని మూలలనుంచీ సైన్యాన్ని తవాంగ్ కు పంపిందట. ఆ యుద్ధంలో సుమారు రెండు వేల మంది దాకా మన సైనికులు మరణించారు. వారందరి స్మృతి చిహ్నాన్ని తవాంగ్ లో కట్టిన  వార్ మెమోరియల్ లో చూసాం. జస్వంత్ సింగ్ రావత్ అనే సైనికుడు మరో ఇద్దరి సాయంతో  చైనా సైన్యాన్ని నిలువరించి, వారి మెషిన్ గన్ ను ఎత్తుకురావటం, చివరకు వారి చేతిలో మరణించటం వంటి సంఘటనలను వివరించే ఆయన స్మృతిచిహ్నం (జస్వంత్ గడ్)  కూడా తవాంగ్ వెళ్ళే దారిలో ఉంది.  ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చైనాసైనికుల సమాధులు కూడా ఉన్నాయి.  ‘They also died for their country’ అని అక్కడ బోర్డు పెట్టారు.  మనసు బరువెక్కించే ఆ యుద్ధం ఆనవాళ్ళు నిండా నింపుకుంది తవాంగ్.

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం,                              చైనా సైనికుల సమాధులు

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం, చైనా సైనికుల సమాధులు

 

 

జస్వంత్ సింగ్ రావత్ సమాధి,     ఆవరణ

జస్వంత్ సింగ్ రావత్ సమాధి, ఆవరణ

 

 

తవాంగ్ వార్ మెమోరియల్,                                  ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

తవాంగ్ వార్ మెమోరియల్, ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

మరునాడు తిరుగు ప్రయాణం.  వరుణుడు తన ఆశీస్సులతో దారంతా ముంచెత్తాడు. సెలా పాస్ దగ్గరకొచ్చేసరికి ఎదురుగా అయిదడుగుల దూరంలో ఏముందో కనిపించటం లేదు. అక్కడ దిగి కాసేపు అటూ ఇటూ పరుగులు తీసి, అక్కడున్న ఒకే ఒక చిన్న ఫలహారశాలలో దూరాం. బయటి వర్షపు పొగలూ, లోపల వేడిగా మోమోలూ, నూడుల్స్ నుండి వస్తున్న పొగలూ… వణికించే చలిలో వేడి పొయ్యి సెగలలో సేదదీరి మోమోలూ, చాయ్ ఆస్వాదించాం.  ఈ షాప్ నడుపుతున్నదీ ఇద్దరు స్త్రీలే. అక్కచెల్లెళ్ళు.  పొయ్యి చుట్టూ అక్కడికి వచ్చిన వారంతా  చేరి  వాతావరణంగురించీ, బురదలో ఇరుక్కున్న వాహనాల గురించీ, ఒకనాటి  యుద్ధం గురించీ కబుర్లు చెప్పారు.  ఆ వర్షంలో రాజేష్  నిదానంగా బండి పోనిస్తుంటే, రోడ్డు విశాలంగానే ఉంది  గనుక ఎదురుగా ఏమీ కనిపించకపోయినా నిశ్చింతగానే కూర్చున్నాం.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో  సేద తీరుతూ మేము.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో సేద తీరుతూ మేము.

సెలా పాస్ ఎత్తుల్లో ఇవీ ఇళ్ళు

సాయంత్రానికి వర్షం నెమ్మదించి, కొండా లోయల అందాలు బయటపడ్డాయి.  దారిలో  ‘కివి’ పండ్ల చెట్లు చూపించి ఇది మంచి వాణిజ్య పంట అని చెప్పాడు రాజేష్.  ఏమయినా డబ్బు, వ్యాపారం పెద్దగా తెలియని మనుషులు వీళ్ళు.  టెన్గా లోయలో వచ్చేటప్పుడు బస. ఆ హోటల్ లో పని చేసే నేపాలీ అతను అక్కడ హోటల్ వ్యాపారం ఎంత కష్టమో వివరించాడు. ఇక్కడ బయటినుంచి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళే ఎక్కువ. స్థానికులు చాల మంది హోటల్ కు వచ్చి డబ్బులివ్వకుండా ఊరికే తిని వెళ్ళిపోతారట. వ్యాపారపు విలువలు వీరికి చాలా తక్కువగా అర్థమవుతాయేమో!  ఆ విలువలే తెలిసిన మనకు,  కొంత కాలం అక్కడ గడిపితే కానీ వీళ్ళ జీవితం అర్ధం కాదు.

మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో అయిదారు కళాశాలల కంటే ఎక్కువ లేవుట.  భారీ ఎత్తున టూరిజం పరిశ్రమా, పెద్ద తరహా వ్యాపారమూ అడుగు పెట్టని చోట ఆదివాసీ తెగలు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతాయో కదా అనిపించింది తవాంగ్ ను ఇలా బయటినుంచి చూస్తే!  కానీ ఆ సమాజాలలో ఉండే అంతర్గత సమస్యలు వారితో కలిసి గడిపితే కానీ అర్ధంకావు కదా!

టూరిస్టుల కోసం దారంతా  స్త్రీల ఆధ్వర్యంలో చిన్న చిన్న భోజనశాలలున్నాయి. శుభ్రమైన సాదా సీదా భోజనం దొరికింది. మోమోలు, తూక్పా(మోంపాల సంప్రదాయ వంటకం), నూడుల్స్, గోధుమ రొట్టెలు, అన్నం, కూరలు వేడిగా దొరుకుతున్నాయి. పదహారు జిల్లాలతో విశాలంగా పరుచుకున్న అరుణాచల్ ప్రదేశ్ లో వ్యవసాయమే ముఖ్యమైన పని.  వాళ్ళ ఇళ్ళు నన్ను చాలా ఆకర్షించాయి.  గట్టి కలపతో చట్రాలు కట్టి, మధ్యలో వెదురు తడకలు బిగించి వాటిపై మట్టి పూసిన ఇళ్ళు కట్టటం వీరి సాంప్రదాయం.  ఉన్న చోటే దొరికే కలపతో కట్టిన ఇళ్ళూ, ఉన్నచోటే పండించుకునే తిండీ, అచ్చమైన గాలీ, స్వచ్చమైన నీటి గలగలలూ…

ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి? అని కాసేపైనా అనిపిస్తుంది, మళ్ళీ మన నగరాలకు వచ్చేసేముందు.

కొంత సమాచారం :  గువాహతి నుంచి తవాంగ్ కు బొలెరోలలో వెళ్ళటం ఎక్కువ. కఠినమైన ఆ రోడ్లకు ఈ వాహనం బాగా సరిపోతుంది.  తేజ్ పూర్ నుంచి బస్సులు ఉన్నాయంటారు కానీ మేము వెళ్ళిన వర్షా కాలంలో ఏ బస్సులూ కనిపించలేదు. ఆరు రోజుల ఈ ప్రయాణానికి బొలెరో కి  Rs.25,000/- వరకూ తీసుకుంటారు. సైన్యం సులువుగా మసలటం కోసం వేసిన విశాలమైన రోడ్లు. దారంతా కన్నుల పండుగే.  సెప్టెంబరు నుంచి నవంబరు అనువైన సమయం. ఫిబ్రవరి, మార్చిలో కూడా సెలా పాస్ దగ్గర మంచూ, గడ్డ కట్టిన సరస్సులూ చూడవచ్చు. ఏప్రిల్ నుంచి ఇక వర్షాలే. తవాంగ్ నుంచి చైనా సరిహద్దు బూమ్ లా పాస్ కూడా  చూడాలంటే మొత్తం ప్రయాణానికి కనీసం ఆరు రోజులు పడుతుంది.     

జ్ఞాపకాల నీడలో వసుంధర

bhuvanachandra (5)“తాగి తాగి చచ్చింది. చచ్చి బతికిపోయింది..!” నిట్టూర్చి అన్నాడు శీను. ‘శీను’ అనే పేరు సినిమా పరిశ్రమలో చాలామందికి ఉంది. ప్రొడక్షన్ వాళ్లలో ‘శీను’లే ఎక్కువ. అలాగే ప్రసాద్‌లు. ఈ ‘శీను’ మాత్రం కాస్ట్యూమర్. వయసు అరవైకి  పైమాటే.

“అదేంటి మావా అలా అంటావూ? ఆవిడకేం మూడిళ్ళు. లెక్కలేనంత ఆస్థి, మొగుడు, పిల్లలు. ఇంకేం కావాలి?” ఆశ్చర్యంగా అన్నాడు సూరిబాబు.

“అందుకే మరి జనాలు నిన్ను వెర్రివెలక్కాయనేది. ఒరే సూరి! ఏది ఎంతున్నా, మనశ్శాంతి లేని బతుకు బతుకవుతాదిట్రా? గంజినీళ్లు తాగినా మనశ్శాంతి వుంటే ఆరోగ్యం ఉంటాది. ఆరోగ్యం వుంటే ఆనందం వుంటాది. ఏవుందా అమ్మకి? ఒరే! గొప్ప గొప్ప హీరోయిన్ల దగ్గర్ పన్జేశా. అందరి ‘కొలత’లూ నాకు తెల్సురొరే! కొలతలంటే జాకెట్టు కొలతలూ, బాడీ కొలతలు కాదు. ఆళ్ల మనసు లోతులూ అన్నీ తెలుసు. కానీ వసుంధరమ్మంత పిచ్చి ముండ ఇంకోతి వుండదు” చెబుతూ చెబుతూ సైలెంటైపోయాడు శీను.

‘ఫ్లాష్‌బాక్, ఫ్లాష్ ఫార్వార్డ్ ల్ని సినిమాల్లో చూపిస్తారు. ‘అదెలా?’ అని అనుకుంటామేగానీ, ప్రతీ మనిషీ రోజుకి కనీసం వందసార్లయినా ‘గతం’లోకి వెళతాడని గ్రహించలేం. ఏం.. మీగురించే మీరు ఆలోచించుకోండీ. రోజుకి ఎన్నిసార్లు గతంలోకి పయనిస్తున్నామో మీకే తెలుస్తుంది.

శీను కూడా గతంలోకి పోయుండాలి. అతనికా హక్కూ, అవకాశం రెండూ వున్నాయి. ఎందుకంటే సగానికి పైగా అతని జీవితం వసుంధరకి పర్సనల్ కాస్ట్యూమర్‌గానే గడించింది. ఆ అమ్మాయి పదహారేళ్లప్పుడు మొదటిసారి బాబూరావు (ఈ మధ్యే చనిపోయారు.  ఓ రెండేళ్ళవుతుంది) దగ్గర పనిచేసేవాడు. బాబూరావు చాలా పనిమంతుడు. టాప్ హీరోయిన్లు అతన్ని పర్సనల్ కాస్ట్యూమర్‌గా కోరుకునేవారు. ఆయన కింద కనీసం ఓ ఇరవైమంది టైలర్లుండేవారు. పగలూ రాత్రి అదే పని. బాబూరావులో వుండే ఒకే ఒక డిఫెక్టు అతని చిరాకు. నిద్రలేవడం దగ్గర్నించీ, నిద్రపోయేదాకా పచ్చి బూతులే. సాయంత్రం కాగానే ‘మందు’ తప్పనిసరి. ఆ  టైంలో ఎవడ్నో ఓకడిని నానా తిట్లూ తిట్టి హేళన చేస్తే గానీ అతని మనసు శాంతించేది కాదు. అయితే అదృష్టవశాత్తు ఓ రోజున ఓ మహానుభావుడు అతని చేత ‘మందు’ మాన్పించాడు. దాంతో శాడిజమూ తగ్గింది.

సినిమా పరిశ్రమలో ‘గురువు’ ఎప్పుడూ గురువే. ఎంత తిట్టినా, కొట్టినా, నోటికి తొంభైమంది ‘గురువు’ని ఏనాడూ తప్పుబట్టరు. తూలనాడరు. శీనుకీ, బాబూరావంటే గౌరవం అందుకే మిగిలుంది. మనిషి ఎలాంటివాడైనా ‘పని’లో మాత్రం కింగ్. అందుకే బాబూరావు శిష్యులు సరదాగా ఇప్పటికీ అంటారు.. “మా గురువారికి ‘టేపు’ అక్కర్లేదండి.. చూపుల్తోనే కొలతలు తీస్తాడు!” అని.

వసుంధరకి పదహారూ, శీనుకి  ఇరవై రెండూ. వసుంధర తల్లి  బ్రాహ్మణ స్త్రీ. తండ్రి అరవచెట్టియార్. వసుంధరకాక ఇంకో మగపిల్లాడు. సెయింట్ జాన్స్‌లో చదువుతుండగా వసుంధరకి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

“నేను స్కూల్ డ్రామాలో యాక్ట్ చేస్తుండగా డైరెక్టర్ బాలకిషన్ అంకుల్ చూసి ‘హీరోయిన్’గా చేస్తావా అమ్మా అనడిగారు” అని వసుంధర తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేది. నిజం మాత్రం అది కాదు. వసుంధర తల్లి ‘బాలకిషన్’ని చాలా నెలలు ‘అలరించాకే’ వసుంధరకి హీరోయిన్ చాన్స్ వచ్చిందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

“నీకు సినిమాల్లో ‘కేరక్టర్’ కావాలా? అయితే నీ ‘కేరెక్టర్’ నా దగ్గర వొదిలేసెయ్!” అని పరిశ్రమ అంటుందిట. ఇదో జోక్ గాని జోక్.

వసుంధర నిజంగా అందగత్తె. పాలల్లో మంచి పసుపూ, గులాబి రంగూ కలిసిన దేహచ్చాయ. ముత్యాల్లాంటి పలువరుస. అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తు. చక్కని బిగువైన ఒళ్ళు. చూడగానే పిచ్చెక్కించే చిరునవ్వు. ఇంకేం కావాలి? ‘గ్లామర్ డాల్’ అన్నారు.

“ఏంది మావా ఆలోచనా?” అడిగాడు సూరిబాబు.

“నావల్ల కావటంలేదురా…!” కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు శీను.

“పోనీ వెళ్ళి చూసొద్దాం పద!” లేచాడు సూరిబాబు.

“ఊహూ! చూళ్ళేను. చూస్తే గుండె పగిలి పోతుంది…!”

రెండు చేతుల్తో మొహం కప్పుకున్నాడు శీను. మళ్లీ ఏవో జ్ఞాపకాలు.

 

***********

 

కొత్తగా వచ్చిన హీరోయిన్ ‘కొలత’ ఎంత ‘సినిమాటిక్‌’గా కొలవాలో అంత ఘోరంగానూ తీశాడు బాబూరావు.. చూస్తూ ‘గురువు’గారు చెప్పిన కొలతల్ని నోట్ చేస్తున్న శీనుకే కంపరం పుట్టింది. వసుంధర సిగ్గుతో చచ్చిపోతోంది.

“అదేంటమ్మాయ్! సిగ్గుపడితే ఎలా? కెమెరామన్ దగ్గరా, కాస్ట్యూమర్ దగ్గరా ‘వొళ్ళు’ దాచుకోకూడదు. దాచుకుంటే తెరమీద ‘గ్లామర్’ కనిపించదు. ఇంకో రెండు సినిమాలయ్యాక నువ్వే చెబుతావు మాకు. ఎక్కడ ఎత్తులూ, ఎక్కడ వొంపులూ పెట్టి కుట్టాలో…!” ఫకాల్న నవ్వి వసుంధర ‘సీటు’ మీద చరిచి అన్నాడు బాబూరావు.

కళ్ళనీళ్ల పర్యంతమైన  వసుంధరని చూడగానే తన చిన్న చెల్లెలు జ్ఞాపకం వచ్చింది శీనుకి. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్టు. అయితే వసుంధర ‘బిడియాన్ని’ చిదిమేసి ‘కసి’ని పెంచింది మాత్రం బాబూరావులాంటి ధీరులే. రెండో సినిమాని వెంటనే వొప్పుకోలేదు వసుంధర తల్లి. టాప్ రెమ్యూనరేషన్ ఆఫరయ్యేదాకా ఆగింది. సినిమా సంతకం చెయ్యగానే వసుంధర  డైరెక్టుగా ప్రొడ్యూసర్‌తో అన్నది. “సార్.. నాకు కాస్ట్యూమర్‌గా బాబూరావు వొద్దు. అతని అసిస్టెంట్ శీను కావాలి. యీ సినిమా నించి అతనే నా పర్సనల్ కాస్ట్యూమర్” అని .. అంతే శీను దశ తిరిగింది.

వసుంధర  బాబూరావుని వొద్దన్న సంగతి జనాలకు తెలిసింది. ఒక్కొక్క సినిమాలో వసుంధర  పైకి వెళ్తున్న కొద్దీ, బాబూరావు కిందకి దిగిపోవాల్సి వచ్చింది. టాప్ హీరోయిన్  ‘వద్దన్న’వాడిని పనిలో  పెట్టుకోవడానికి గుండా చెరువా?

రెండే రెండేళ్ళలో బాబూరావు దగ్గరి అసిస్టెంట్లందరూ శీను దగ్గర చేరిపోయారు. బాబూరావ్ ‘సినీ’ టైలర్స్ కాస్తా బోర్డు తిప్పి కోడంబాకంలో మామూలు టైలర్‌గా మిగిలిపోయాడు. బాబూరావే కాదు, మొదటి సినిమా కెమెరామాన్ వైద్యలింగాన్ని, నానా తాగుడూ తాగి చిత్రహింసలు పెట్టిన  డైరెక్టర్ బాలకిషన్‌ని కూడా నిర్ధాక్షిణ్యంగా ‘తొక్కేసింది’. వసుంధర. ప్రొడ్యూసర్ మంచివాడు గనక బతికిపోయాడు. మేకప్ సుబ్బరామన్ అప్పటికే వయసుమీరినవాడు. అయితే గొప్ప పనిమంతుడు. ఆ సుబ్బరామన్ రిటైరయ్యాక కూడా నెలకి కొంత డబ్బులు పంపి ఆదుకుంది వసుంధర. హాస్పిటల్ ఖర్చులూ ఆమే భరించేది. దాంతో వసుంధరకి ‘గొప్ప మానవతావాది’ అన్నపేరు వొచ్చింది. ‘కరోడా’ అన్న పేరు ఎలాగూ వచ్చిందనుకోండి..

***

 

“శీనూ… నువ్వూ మన మేకప్‌మేన్ నరసింహులూ నా తరఫున సాక్షి సంతకాలు పెట్టాలి” ఇరవై ఆరో ఏట శీనుని తనున్న హోటల్ రూంలోకి పీల్చి చెప్పింది వసుంధర. అప్పటికామె నందకుమార్ (హీరో) ప్రేమలో పూర్తిగా మునిగిపోయిందని పరిశ్రమలో అందరికీ తెల్సు.. “అదికాదమ్మా.. నందకుమార్‌గారికి ఆల్రెడీ పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూదా. ఇప్పుడు…”చెప్పబోయాడు శీను.

“నాకు తెలుసు శీను! ఇప్పటివరకూ సంపాదించింది మొత్తం మా అమ్మా, తమ్ముడు వాళ్ల పేరు మీద దాచేసుకున్నారు. ఇప్పటికైనా ఆ వూబిలోంచి బయటపడకపోతే జన్మలో ఎప్పటికీ బయటపడలేను. నందకుమార్ ఎలాంటివాడైనా నిజంగా నేనంటే ప్రేమ వున్నవాడు. ఇంకొకటి ఏమంటే అతను భార్యని ఒప్పించాడు. ఆమె అనుమతితోటే మా పెళ్ళి జరుగుతోంది. అతన్ని కాదనుకున్నా రేపు ఇంకొకడెవడో  వచ్చి ఏం వొరగబెడతాడూ?” మనసులోని మాట శీనుకి చెప్పింది వసుంధర. అప్పటితో ‘ఆపటం’తనకీ మంచిదని మౌనం వహించాడు శీను.

***

‘ఆరువళ్లూరు’ వీరరాఘవస్వామి గుళ్ళో గుట్టుగా  పెళ్లి జరిగింది. విషయం తెలిసిన వసుంధర తల్లి లబోదిబోమన్నది. శీనునీ, మేకప్‌మేన్ నరసింహుల్నీ నానాబూతులు తిట్టింది. పరిశ్రమలో పెద్దల దగ్గరకు వెళ్లి మొత్తుకుందిగానీ వాళ్ళేం చెయ్యగలరు?

నెలరోజులు ‘హనీమూన్’ ట్రిప్ కానిచ్చాక మళ్ళీ బిజీ అయింది వసుంధర. వసుంధర అదృష్టమేమోగానీ ‘మంచి’ సినిమాలు పడ్డాయి. అన్నీ ‘హీరోయిన్’ ఓరియంటెడ్ సినిమాలే. పెళ్ళయ్యాక గ్లామర్ డాల్ కాస్తా ‘అభినయ సరస్వతి’గా పేరు తెచ్చుకుంది. కుప్పతెప్పలుగా డబ్బు. నందకుమార్ ఎప్పుడూ ఏవరేజ్ హీరోనే. ఈ దెబ్బకి అతను వసుంధర పేరున మూడు బంగళాలూ, తన పేరున మూడు బంగళాలూ కొనడమేగాక చెన్నై చుట్టూపక్కల వందల ఎకరాలు స్థిరాస్థి కొనేశాడు. కాలక్రమేణా వసుంధరకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మొత్తం కుటుంబం అంతా కలిసే వుండేవారు. నందకుమార్ భార్యా వసుంధర అడుగులకి మడుగులొత్తేది. వసుంధరా అంతే ప్రేమగా ఆవిడ్ని చూసేది. తను ఏ నగలసెట్టు కొనుక్కున్నా ఆవిడకీ కొనాల్సిందే. తన పిల్లలకి ఏది కొన్నా ఆవిడ పిల్లలకీ కొనాల్సిందే.

కాలగర్భంలో ఓ దశాబ్దం కలిసిపోయింది. కొత్త నీరు వచ్చింది. పాతనీరు కొట్టుకుపోయింది. ఇవ్వాళ వచ్చిన హీరోయిన్ రేపు టాపు. ఎల్లుండి ఫ్లాపు. కేరళ నించీ, ముంబై నించీ, డిల్లీ, గుజరాత్‌ల నించీ హీరోయిన్ల దిగుమతి పెరిగింది. ఆల్ హేపీ. సినిమా రంగానికి కావాల్సిన ‘పట్లు’ పూర్తిగా నేర్చుకుని ముంబై నించి వస్తున్నారు గనక హీరో ఖుష్… డైరెక్టర్ ఖుష్.. ప్రొడ్యూసర్, మేకప్‌మేన్, డిస్ట్రిబ్యూటర్ అందరూ ఖుష్. బయ్యర్లతో సహా. ‘కేరక్టర్’ వదులుకోవడమంటే షేక్‌హాండ్ ఇచ్చినంత తేలిక. ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకో. కమర్షియల్స్ అయినా, అయిటం సాంగ్ అయినా ఏదైనా ఒకటే.. హార్డ్ కేష్.. అంతే!

చప్పట్లకీ, పచ్చనోటు రెపరెపలకీ అలవాటు పడ్డ హీరోయిన్లు రిటైరై ఇంట్లో కూర్చోలేరు. అలాగని తల్లి వేషాలు వెయ్యలేరు. కానీ వసుంధర అన్నింటికీ సిద్ధపడింది. కూతుళ్లు ‘వయసు’కి వచ్చారు. వాళ్లని కథానాయికలుగా చెయ్యాలంటే డబ్బు కావాలి. ఆ మాటే నందకుమార్‌తో అన్నది. నందకుమార్ తన స్వంత కూతురి పెళ్లి చేసేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో. వసుంధర డబ్బుతో కొడుకుని (స్వంత కొడుకుని) హీరోగా పెట్టి సినిమా తీశాడు. అది బిగ్గెస్టు ఫ్లాపు. సినిమాకి చూపినవన్నీ దొంగలెక్కలే. మూడొంతులు వసుంధర ఆస్థిని నందకుమార్ ‘నొక్కేశాడు’, ఆ విషయం మొదట గ్రహించింది శ్రీను.

“అమ్మా .. జాగ్రత్తపడండి. సినిమాని ‘చుట్టేసారు’ ఖర్చులు మాత్రం చూపించారంట. మీ మధ్య గొడవలు పెడదమన్న ఉద్ధేశ్యంతో కాదు. మీ  ఉప్పు తిన్న విశ్వాసంతో చెబుతున్నా.!” చాలా కష్టం మీద వసుంధరని వొంటరిగా కలిసి చెప్పాడు శీను.

నందకుమార్ హయాంలోనే శీనుకు ఉద్వాసన పలికాడు. శీనుకి అప్పటికే మంచి పేరుంది గనక త్వరలోనే వేరో ఒక అప్‌కమింగ్ హీరోయిన్‌కి పర్సనల్ కాస్ట్యూమర్‌గా వెళ్ళిపోయాడు. బాగా సంపాదించాడు కూడా. ఒక విషయం నిజం. వసుంధర శీనుని సొంతమనిషిలానే చూసింది. శీను పెళ్లికి కూడా బోలేడంత డబ్బు ఖర్చు పెట్టింది. “నాకు తెలుసు శీను.. ఇప్పుడు ఏమీ చెయ్యలేను. ఆస్థి ఆయన చేతుల్లో ఉంది. కానీసం ‘మల్లిక’ అయినా హీరోయిన్‌గా నిలదొక్కుకుంటే…” నిట్టూర్చింది వసుంధర. అప్పుడు సమయం ఉదయం పది. అప్పటికే వసుంధర ‘తీర్థం’ సేవించి మత్తులో ఉంది.

మాట్లాడకుండా బయటికొచ్చాడు సీను. “అన్నా.. ఆ అరవ ముండాకొడుకు వసుంధరమ్మని తాగుడికి అలవాటు చేశాడు. తెల్లార్లూ మందే…!”శీనుతో గుసగుసగా అన్నది ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి మొదట్నించీ వసుంధరకి ‘టచప్ వుమన్’ వసుంధరతోటే వుంటుంది. నిట్టూర్చాడు శీను.

“అంతేకాదు శీనయ్యా.. హీరో అయ్యుండీ అమ్మాయిల్ని తెచ్చి వ్యాపారం చేయిస్తున్నాడు. నేనూ రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను.”చెప్పింది ముత్తులక్ష్మి. ఆ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసిందే. ‘మాజీలు’ కొందరు  యీ వ్యాపారం మీదే జీవనం సాగిస్తుంటారు. అదే తప్పుగా అనిపించకపోవటమే విచిత్రం. కుటుంబంలో మగపిల్లలకి కూడా ఇదంతా మామూలుగా అనిపించడం మరో విచిత్రం. అక్కో, చెల్లెలో వ్యభిచారం నేరం మీద పట్టుబడ్డా ఆ మగధీరులు మాత్రం మామూలుగానే తిరగేస్తుంటారు. అక్కచెల్లెళ్ల మీదే బతికేస్తూ వుంటారు.

వసుంధరకీ, నందకుమార్‌కీ జరిగిన ‘డిస్కషన్స్’ చెప్పాలంటే ఓ పెద్ద నవల అవుతంది. ఎందుకంటే నందకుమార్ గోతికాడ నక్క. అతని మొదటి పెళ్ళాం ‘బాగా’ తెలివైంది. ‘కాదు’ అని బయటపడకుండా ‘అవును’ అని అన్నీ దక్కించుకుంది.

ఏ రేంజికంటే తరవాత్తరవాత వసుంధర ‘కూతుళ్ల’ మీద సంపాదించేంత. తన కూతురు, కొడుకూ మాత్రం సేఫ్. సవతి కూతుళ్లనీ బిజినెస్’లోకి దించి, సవతి కొడుకుని ‘వెధవ’ని చేసింది. తనకి పుట్టినవాళ్లనే ‘బిజినెస్’లోకి దించిన ఘనత ది గ్రేట్ కేరక్టర్ ఆర్టిస్ట్ నందకుమార్‌ది.

నేలమీదనించి ఓ కొండ శిఖరానికి ఓ ‘రాయి’ని చేర్చాలంటే చాలా కష్టం. అక్కడ్నించి ఆ రాయిని కిందకి తోసెయ్యాలంటే క్షణం పట్టదు.

వసుంధర పతనమూ అలాగే అయింది. సంస్కారం వున్న వసుంధర జరుగుతున్న దాన్ని చూస్తూ సహించలేకపోయింది. అలాగని పిల్లల్ని తండ్రికి దూరమూ చెయ్యలేకపోయింది. అందరూ చేసే పనే తనూ చేసింది. అన్నీ మర్చిపోవడానికి అది దగ్గరి మార్గం ‘తాగుడు’. ఆ తాగుడికి బానిసైంది. లేవగానే మందు.. ఇంకా ‘కిక్కు’ కోసం మందుతోపాటు గుట్కా. ముత్యాల్లాంటి పలువరస పుచ్చిపోయింది. వొళ్లు ఏభయేళ్ళకే బండగా తయారైంది. కూతుళ్లు సినిమాల్లో  రాణీంచలేకపోయారు. ఒకతి మాత్రం ఓ మళయాళం వాడిని దొంగతనంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండోది ఎప్పుడు ఎవరితో ఉంటుందో దానికే తెలీదు. కొడుక్కి చదువబ్బలా. తండ్రి కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తాగి తాగి చివరకు చచ్చిపోయిన వసుంధర. మంచం మీదనించి కిందపడి చనిపోయిందని ఒకరంటే, గుండె ఆగి చచ్చిపోయిందని మరొకరు అన్నారు. ఏమైతేనేం మరో దుఃఖజీవికి ‘విముక్తి’ లభించింది. సర్వాంతర్యామి వున్నది అందుకేగా..

 

***

 

వసుంధర ‘పెద్ద కర్మ’ చాలా అట్టహాసంగా జరిగింది. నిలువెత్తు ఫ్లెక్సీలు, అన్ని పేపర్లలోనూ శ్రద్ధాంజలి. అన్ని చానల్సులోనూ ఆవిడ గురించిన వార్తలూ, కటింగ్సే. నందకుమార్ నటనకి జోహార్లు..  గ్లిజరిన్ లేకుండా టీవీ కెమెరాల ముందు ‘భార్యపోయిన దుఃఖాన్ని’ రక్తి కట్టించాడు. చూస్తున్న ప్రేక్షకులు అతని ప్రేమకి చలించిపోయారు. నందకుమార్ భార్య ఇంకా అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ‘వసుంధర నాకు దేముడిచ్చిన చెల్లి, నా ప్రాణంలో ప్రాణం” అంటూ వలవలా ఏడ్చింది. వసుంధర కూతుళ్లూ, కొడుకు మాత్రం నిర్వికారంగా నిలబడ్డారు.

“నేను బ్రతికుండీ ఆమెకి ఏమీ చెయ్యలేకపోయాను గురువుగారూ.. చెయ్యగలిగిందింతే!” కళ్లనీళ్లతో అన్నాడు శీను. డాబా హోటల్లో ఓ చిన్న సంతాప సభ జరిగింది. మేం మొత్తం పదిమందిమి. ఏర్పాటు చేసింది కాస్ట్యూమర్ శీను. (DATA UDIPI HOTEL). ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాం. (దానివల్ల ఎవరికి ఉపయోగం? అడక్కంది. అదో వెర్రి సంప్రదాయం).

“వసుంధర పిల్లల పరిస్థితి ఏమిటి?” ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. స్వంత తండ్రి వున్నాడు. కానీ ఆ తండ్రే కూతుళ్లని (అంటే వసుంధర కూతుళ్లని మాత్రమే) బిజినెస్‌లోకి దించి ‘కొడుకు’ని డ్రైవరుగా వాడుకుంటున్నాడు. ఆయన అసలు కొడుకూ, కూతురూ చాలా చాలా గొప్ప స్థితిలో వున్నాడు. మరి వీళ్లు పిల్లలు కారా? ఇంత పక్షపాతం ఎందుకూ? అదీ వసుంధర సర్వస్వాన్నీ కొల్లగొట్టాక కూడా”

జావాబు దొరకని ప్రశ్నల్లో ఇదొకటి. వసుంధరని తల్చుకుంటే నాకో పాట గుర్తొస్తుంది.. “తేరి దునియాసే దూర్ చలేఁ హోకె మజ్‌బూర్ హమే యాద్ రఖ్‌నా…” అన్నది

జ్ఞాపకాలు తప్ప వసుంధర గురించి ఇంకేం మిగిలాయి..

 

భువనచంద్ర..

 

 

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన ” న్యూయార్కు కథలు”

పారుపల్లి శ్రీధర్

పారుపల్లి శ్రీధర్

 

పశ్చిమ తీరంలో మనకు తెలిసిందనుకున్న ప్రపంచంలో తెలియని లోకాలను చూపించే యత్నం కూనపరాజు కుమార్ కథా సంపుటం ‘న్యూయార్కు కథలు’.   పన్నెండు కథలతో గుదిగుచ్చిన ముత్యాలహారమిది. అమెరికా కలల సౌధాలను కూల్చిన టెర్రరిస్టుల ఘాతుకానికి  ఎందరో బలయ్యారు. సెప్టెంబర్  తొమ్మిది  కి నివాళే మొదటి కథ ఊదారంగు తులిప్ పూలు.

లవ్ కెమిస్ర్టీ తోటే రంగుల కెమిస్ర్టీని ఆవిష్కరించారు రచయిత. బూడిదైన బతుకుల్లో ఒక పాత్ర జూలీ. ఆమె విషాదాంత గాధను ఒక ప్రత్యేక టెక్నిక్ తో చెప్పటం ఈ కథలోకొసమెరుపు. చంద్రమండలానికి వెళ్లినా మనవాళ్ల ప్రవర్తన మారదంటూ సునిశిత హాస్యంతో జాలువారిన కథనం గెస్ట్ హౌస్. ఉన్నత శిఖరాలను చేరటానికి రెక్కలు కట్టుకుని డాలర్ల దేశంలో వాలిన ఆశాజీవులు పడే పాట్లను, గెస్టు హౌస్ లో వీరి జీవన శైలిని చక్కగా చెప్పారు కుమార్. బ్రాడ్ వే నాటకాలను చూసి  భీమేశ్వర తీర్ధంలో నాటకాల నాటి నాస్టాలజియాలోకి వెళ్లిపోయారు రచయిత. వియత్నాం యుద్ధం రేపిన కలకలం నుంచి బయటపడిన మిత్రులు కొందరు ఎలా తమ జీవితాలను పునరుద్ధరించుకున్నారో వివిరించే మూవ్ ఇన్ నాటకాన్ని పరిచయం చేశారు.కళ కళకోసం కాదని, సామాజిక ప్రయోజనం కోసమేనని జాన్ పాత్ర ద్వారా చెప్పారు. జీవన వైవిధ్యాన్ని వివరించిన తీరు బాగుంది. పరిశోధనలంటే ప్రాణమిస్తూ, కొత్త కొత్త ఆవిష్కారాల కోసం తపించే అమ్మాయి  దీప. టచ్ మి నాట్ మొక్కతో ఆమె కనుగొన్న అద్భుతం వైజ్ఞానిక లోకాన్ని ఆకట్టుకుంది.  ప్రకృతిలోనే మనిషికి కావలసినవి అన్నీ ఉన్నాయన్న సందేశంతో రిసెర్చ్ చేసి, తనఆవిష్కారాలతో  ప్రతిష్ఠాత్మక ఇంటెల్ ప్రైజ్ సాధించింది దీప. రాబోయే కాలంలో కాబోయే యువ సైంటిస్టులకు ఎంతో స్ఫూర్త్తినిచ్చే కథ మిమోసా పుదీకా.

 

న్యూయార్క్ కథల్లో కదిలించే కథ..మంచు కురిసిన ఆదివారం.  ఘనీభవించిన హృదయాలను కరిగించే హృద్య గాధతో కుమార్ అద్భుతంగా రాసిన కథాకథనమిది. ఓ కవి మిత్రుడన్నట్లు.. కంటికి తడి అంటకుండా జీవితాన్ని దాటిందెవరు? ఘనీభవించిన మంచు వెనుక ద్రవీభవించిన ఒకానొక అరవిందు అంతరంగ ఆవిష్కరణ ఇది. ఆ మధ్య ఓ సినామాలో మన్ హాటన్ పై ఓ పాట వినే వుంటారు. నిజానికి ఆ పాటలో మన్ హాటన్ ఆత్మ కనపడదు. మన్ హాటన్ లో మానవతాపరిమళాలను, సేవా సదనాల్లో ప్రేమానురాగాల్లోబందీలైన కొందరి గాధలు ఈ కథలో కదిలించే శైలిలో రాశారు రచయిత కుమార్ కూనపరాజు. బౌరి స్ర్టీట్ లో ప్రవహించిన ఎన్నారై మిత్రుల ప్రేమను కొలవటానికి ఏ పదాలు సరిపోతాయి? గోడవారగా చేగగిలబడి పిచ్చి చూపులు చూస్తున్న అతడిని చూశాక అరవింద్ హృదయ స్పందన తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. పేజీలన్నీ తిరగేశాక కళ్లు చెమర్చని వారెవరైనా వుంటే దయచేసి వారి అడ్రస్ చెప్పండి. పరిశోధన సాగిద్దాం కరకు హృదయాల మీద.

కొంచెం ఛీజ్ వేస్తావా అని అడిగిన ఆ వ్యక్తి చరిత్ర ఏమిటి? ఈ  ఆశ్రమాల ఆశ్రయించిన (చేరిన) నేపథ్యమేమిటో చదివి తీరాలి. మానసిక చురుకుదనంతో మతి కోల్పోయిన  నల్లజాతి  పాటల రచయిత మైకేల్ రాబర్ట్ అండర్సన్ ను వీరి సేవలు ఎంతగా కదిలించాయో చెప్పటానికి మాటలక్కరలేదు. అరవిందుకు ఆస్తిని రాసేయటం, మైకేల్ చివరి చూపుదక్కకపోవటం,ఇటువంటి మరికొందరు అభాగ్యులను ఆదుకోవటానికి అరవిందు దంపతులు ముందుకు రావటాన్ని హృద్యంగా చిత్రించారు రచయిత. ఎంత సేపటికీ మనీ కల్చర్ లో, మన ప్రపంచంలో బతికే మనం ఇటువంటి లోకాలను చూసి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. పరమార్ధం గ్రహించాలి. ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? ప్రేమించే హృదయమే వుండాలి.  ఆ హృదయ స్పందనకు సరిహద్దులతో పనేముంది అంటే మైకేల్ తనవీలునామా లేఖలో రాయటం గొప్ప సందేశం.

NY Book Title 3 copy copy

గడ్డ కట్టిన మంచులో ఎర్ర పిచుకలు ఏమైపోయాయోఅంటూ అరవింద్ స్పందించటం అతడి సున్నితత్వాన్ని, స్వభావానికి నిదర్శనం. మన్ హాటన్ కాంక్రీట్ జంగిల్ సొరచేప కింది దవడలా వుందంటూ రచయిత చెప్పటం ఆయనలో అంతర్లీనంగా అలజడి చేసే వామపక్ష వాదిని మనముందుంచుతాయి. డాలర్ల దేశంలో రెక్కలు కట్టుకుని వాలిన ఆశాజీవుల కష్టాలను ఆవిష్కరించే యత్నం వెంకోజీ ..కథ. ఉద్యోగం కోసం వెంకోజీ పడిన పాట్లు.. చివరికి  ఎలాగో స్థిరపడి ఇంటికి డబ్బు పంపిస్తే..  ఏం మిగిలింది? వెంకోజీ ట్రాజెడీని న్యూయార్క్ బ్యాటరీ పార్క్ లో శిల్పంతో పోల్చటం బాగుంది. మాన్యుమెంట్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ తో సాపత్యం చక్కగా వుంది. న్యూయార్క్ కథల సంపుటిలో గుర్తుండిపోయే మరో కథ లిటిల్ బుద్ధాస్. బుద్ధుడి జీవిత క్రమం, జ్ఞానోపదేశాల ఆధారంగా బాలవికాస్ పిల్లలు వేసిన బుద్ధా నాటకం…వారి జీవితాలనెలా మార్చిందన్నది ఈ కథ సారాంశం. నాటకంలో ఒక పాత్ర ధరించిన దీక్షిత, శిష్యుడి రోల్ లో కన్పించిన రాబర్ట్ లు బుద్ధుని బోధనలతో ఎలా మారిపోయారు?  నాటకాన్ని డైరెక్ట్ చేసిన సుధీర్ మనోభావాలేమిటి? తదితర అంశాలను  ఆకట్టుకునే శైలిలో చెప్పారు రచయిత కుమార్.

మసక లాడుకుంటున్నాయి లాంటి పదాలు కొన్ని మనం మరచిపోతున్న తెలుగును గుర్తు చేస్తాయి. స్వేచ్ఛా, సౌభాతృత్వాల ప్రతీక..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ కథ వాల్డ్ ట్రేడ్ సెంటర్.. జంట శిఖరాలను కూల్చకముందు మనసులో వుంచుకుని తర్వాత రాసినది. స్టీమర్ లో స్టాచ్యూ ఉన్న ఐలెండ్ కు వెళుతుంటే మన్హాటన్ అందాలను అభివర్ణించారు. మన్హాటన్  నీళ్లలోంచి వచ్చిన కాంక్రీట్ జంగిల్లా ఉంది. ఆ భవనాల మధ్యలో ఉన్న ఎత్తయిన ట్విన్ టవర్స్ గుమ్మం ముందు నిలబడ్డ నవదంపతుల్లా ఉన్నాయంటూ వర్ణించారు రచయిత.

న్యూయార్క్ కథల సంపుటిలో మరో విశిష్ట కథ గురు పౌర్ణమి.  గురువు జీవన విషాదానికి చలించిన ఓ శిష్యుడి అంతరంగ ఆవిష్కరణం, మోదం, ఖేదం, సందేశాల సమాహారం కథనం. మేక్ బెత్ నాటకాన్ని విశ్లేషించిన గురువు గారు ఇంత చిన్న పల్లెటూరులో ఎందుకు ఉండిపోయారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం. ప్రపంచాన్ని బాగుచేసే గురువులు తమ జీవితాన్ని బాగుచేసుకోలేరు. ఊరంతా ప్రేమించి,అంతటి శిష్యగణం ఉన్నా.. మాస్టారు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగలేదు. అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకమన్న సినీ కవి వాక్కులు గుర్తుకొస్తాయి. ఆషాఢభూతుల్లాంటి శిష్యులు కొందరి నైజం లోకం పోకడకు దర్పణం పడుతోంది. సున్నిత మనస్కుడైన కథానాయకుడు..మనిషి అమెరికాలో ఉన్నా..మనసంతా తను పుట్టి పెరిగిన ఊరిమీదనే ఉంటుంది. మాస్టారి కూతురి ఉత్తరంతో కదిలిపోయి..ఇండియా వచ్చి వారి కుటుంబ దురవస్థకు చలించి పోతాడు. బుద్ధుడి బోధనలనే మాస్టారు ఆదర్శంగా తీసుకున్నారేమో అన్పిస్తుంది.  బుద్ధ భగవానుడి పుట్టిన రోజు, నిర్యాణం చెందిన రోజూ పౌర్ణమే. గురువు గారు ప్రైవేటు పాఠశాలలో శిష్యులకు వీడ్కోలు సందేశం లో బుద్ధుని బోధనలను గుర్తుచేయటం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. కథకు గురుపౌర్ణమి అని పేరుపెట్టడం సందర్భోచితంగా ఉంది. పూర్వం పల్లెల్లో  ప్రైవేటు బడులు, బడి ఎగ్గొట్టే పిల్లలను మాస్టారు పంపించిన భటులు (క్లాసులీడర్లు) వచ్చి తీసుకెళ్లటం..లాంటి స్మృతుల్ను రచయిత సునిశిత హాస్యంతో రాశారు. చంద్ర మండలం వెళ్లినా మన వాళ్లకు హూందాగా ప్రవర్తించరేమో! కథా సంపుటిలోని మనమింతేనా..అనే కథ ఇదే అర్ధంలో సాగిన సెటైర్. మువ్వల సవ్వడి వినిపిస్తోంది రచయిత కళాభిరుచికి నిదర్శనం.

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన కథలు. ఒక మధ్యతరగతి మానవుడు అమెరికా వెళ్లి గుండెల నిండా నింపుకొన్న అనుభూతులను, అద్దుకున్న పరిమళాలను హృద్యంగా ఆవిష్కరించారు రచయిత కుమార్. తొలి ప్ర యత్నంలోనే ఇంత మంచి కథా సంపుటి వెలువరించటం అభినందనీయం. ఎక్కడా భాషా భేషజాలు లేకుండా..అందరికీ అర్ధమయ్యే సరళ శైలిలో రాశారు.

-పారుపల్లి శ్రీధర్

శివలీల

drushya drushyam-7...

చాలా సామాన్యమైనవే. మామూలు ముఖాలే. ఎక్కడ పడితే అక్కడ కానవచ్చే మనుషులే అయి ఉండవచ్చు.

రాలిపడ్డ ఆకులు, చితికిన టమాట పండు, తెగిపోయిన చెప్పు, వాకిట్లో కురిసిన పారిజాతాలు, చెట్ల కొమ్మల్లో చిక్కిన గాలిపటం, ఈల వేస్తున్న యువకుడు, చింగులు సర్దుకుంటున్న మగువ, చుట్టను చప్పరిస్తున్న ముదుసలి, బీడీలు చుడుతున్న నాయినమ్మ, ఈదురుగాలికి చెల్లాచెదురైన గుడిసెలు, ఏం కానున్నదో తెలియక నవ్వుతున్న పిల్లలూ…

ఇవన్నీ మామూలు విషయాలే కావచ్చును. కానీ, ఒక కుతూహలంతో చూడటం, ఒక అవ్యాజమైన అనురాగంతో చేయి చాచడం, అభిమానంతో ఆలింగనం చేసుకోవడం, ఒక అనురాగ చేష్ట, ఛాయా చిత్రలేఖనం. కానీ, నమ్ముతారో లేదో, ఒక్కోసారి అసంకల్పితం ఈ లేఖనం. ఒక్కోసారీ కాదు, అనేకసార్లూ మన అలక్ష్యమే లక్షణం. అపుడే దృశ్యం మనల్నిఆకట్టుకుంటుంది. ఇక ఆ లేఖనం మహత్త్తు అపూర్వం. అందులోనిదే ఈ తట్టా పారా…ఒక లిప్త.

+++

భాగ్యనగరంలో పార్సీగుట్ట నుంచి ముషీరాబాద్ చౌరస్తాకు వెళ్లే దారిలో, చౌరస్తాకు చేరుకోక మునుపే కుడివైపు, ఈ చిత్రం జీవం పోసుకుని కానవస్తుంది. అది ఇసుక అమ్మే స్థలం. ‘తట్టకు ఇంత’ అని అమ్ముతూ ఉంటారు. ఇండ్లళ్లో చిన్న చిన్న రిపేర్లు చేసుకోదలచిన వాళ్లు, లేదంటే వీథి మేస్త్రీలు ఆ ఇసుకను ఖరీదు చేసుకుని వెళుతుంటారు. అందుకు సౌకర్యం కల్పించే ఒక వీథి అమ్మకం స్థలం ఇది.

ఇక్కడ ఎప్పుడూ ఒక ఇద్దరు కూర్చుని ఉంటారు. ఒక మహిళ, ఒక పురుషుడు. వాళ్లు ఎప్పుడు అమ్ముతారో తెలీదుగానీ ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూచుని ఏవో ముచ్చటించుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడికి రాగానే, ఈ చిత్రం తీసిన స్థలానికి చేరుకోగానే, హాయిగా నవ్వుకునే ఆ జంట కూడా ఒక ముచ్చటైన చిత్రం. వారిద్దరినీ ఒక ఎండపొడ వాలున, ఒకే గొడుగు నీడన ముచ్చటిస్తూ ఉండగా మరో నాడు తీసిన చిత్రమూ ఒకటుంది నా వద్ద!  అయితే, వారిరువురి జీవన వ్యాపారంలోని అతి కీలకమైన విషయమూ, ఒకానొక decisive moment, దాని స్థల మహత్యమూ, అందలి పురాణ కాలక్షేపమే ఈ చిత్రం.

+++

చిత్రమేమిటంటే, ఇక్కడే నా భవిష్యత్తు కళా ప్రదర్శన తాలూకు ముఖచిత్రం నమోదైంది, మూడేళ్ల క్రితం.

అంటే గతంలోనే నా భవిష్యత్తు నమోదై, అది సరిగ్గా ఆ నిర్ణయాత్మక క్షణంలో వర్తమానమూ అయి మళ్లీ ఇప్పుడు గతమూ అయి, ఎప్పటికీ చెదరని ఛాయా చరిత్రా అయింది. ఇదంతా తెలియకుండానే…అదొక విచిత్రం.
అయితే, ఛాయాచిత్రలేఖనం అన్న ప్రక్రియలో చిత్రకారుడు లేదా రచయితా ప్రేక్షకుడే అవడం మరో చిత్రం!

+++

మళ్లీ మూడేళ్ల క్రితానికి వస్తే, ఆ రోజు సన్నగా వర్షం కురుస్తూ ఉన్నది.
కొంచెం తెరపి ఇచ్చాక బయలుదేరాను. ఇక్కడకు చేరుకున్నానో లేదో అకస్మాత్తుగా నా దృష్టి పామరశాస్త్రంపై…ఈ తట్టా పారలపై పడింది. ఒక “కనికట్టు’ అనే అనిపిస్తుంది.  విస్మయమే! ఎందుకు ఏ దృశ్యం మనల్ని లోబర్చుకుంటుందో ఏమో తెలీని స్థితి! నేను ఆగిపోయాను. ఆ దృశ్యంలోకి చూశాను. చూడగా వర్షం వెలిసినాక ఆ తడి తడి ఇసుక, పైనా…కిందా… కొంచెం గాఢ గోధుమ వర్ణంలో ఆ ఇసుక …రేణువులూ…అవన్నీ ఎంత సౌందర్యాత్మకం అంటే ‘పిండారబోసిన వెన్నెల’ అన్న సమాసం కూడా బహుశా తక్కువే. లేదా ‘ఇష్టమైన పిండి పదార్థం నైవేద్యం’గా పెట్టడం అన్నా వృథాయే!
ఆ దృశ్య సమాసం నన్ను సుతారంగా లోబర్చుకున్నది.

బండి ఆపేశాను. దిగలేదు. భూమిపై కాళ్లు ఆనించుతూ ఉన్నానో లేదో…ఒడుపుగా నేను కెమెరాకోసం చేయి చాచానో లేదో…కెమెరా అన్నది బ్యాగులోంచి ఎప్పుడు ఎలా బయటకు వచ్చిందో, అది నా కెమెరా కంటికి ఎప్పుడు ఆనిందో, వ్యూ ఫైండర్ నుంచి ఎప్పుడు చూశానో ఏమీ తెలియదు. ‘క్లిక్’ మన్న సవ్వడీ లేదు. కానీ, ఒకే ఒక షాట్ ఎక్స్ పోజ్ చేశాను.
ఆ తర్వాత చూశాను, కెమెరా స్కీన్లో…అప్పుడు కనిపించాయి. నిగనినగలాడుతున్న పనిముట్లు..వాటి బలిమి… ఇసుకలో దాచుకున్న వాటి లావణ్యం,…అంతకు మించి ఒక పారపై అమర్చినట్టున్న తట్ట. దానిపైన ఎరుపు పూవు….అంతా అలౌకికం…

పైనా కిందా కన్ను తడుముతూ ఉంటే, చెట్టుపై నుంచి వర్షంతో జాలువారిన లేత ఆకుపచ్చ ఆకులూ, ఎర్రెర్రెని పువ్వులు రెమ్మలు అంతా దళాలూ…రేణువులూ…

+++

అన్నీ ఆశ్చర్య పర్చినవే.
they are in the world but not worldly…అనిపిస్తుంటే …
ఒక physical… metaphysical…అంతా ఒక సంయోగం…లీనం…ధ్యానం…
పువ్వులూ రెమ్మలూ పనిముట్లూ…తడితడి పూజా ద్రవ్యమూ…అంతా ఒక గర్భగుడిలోని దివ్య మంత్ర పుష్ఫ సంచయం.ఆ దృశ్యంలో అవన్నీ కెమెరా స్ర్కీన్ పై ఎంత భావ గర్భితంగా లాస్యమాడుతున్నాయి అంటే తెలియక రాసిన కవితలా ఏదో ఒక కవితాన్యాయం…”అబ్బ! దర్శనం’ అనుకున్నాను. మానవుడి అవిశ్రాంత యానంలో ఒక శాంతి ఉంటుందే అదే ఇది అని తృప్తిల్లాను. ఒకానొక రుతువులో ప్రకృతి శోభ ఉంటుందే అదే ఇదేమో అని కూడా అనిపించింది.
ధ్యానం చేయడానికి యోగ్యం లేని పామరులుంటారే, వారికి ఇదే శివాలయం…గర్భగుడి…లింగధారణా అనిపించింది.
ఆ చిత్రానికి లోబడి ఇక మళ్లీ మరొక చిత్రం ప్రయత్నించలేదు. దొరికింది చాలనుకుని మళ్లీ నా లౌకిక జీవనంలోకి పయణమయ్యాను.+++ఈ చిత్రాన్ని తర్వాత చక్కటి ప్రింటు తీసుకున్నాను. ఎంతదనుకున్నారు! పే…ద్దది. ముప్పయ్ ఇంటూ నలభై అంగుళాల చిత్రం అచ్చువేయించాను. దానికి మరింత అందం పెరిగేలా చుట్టూ జాగా వదిలి మరింత మంచిగా ఫ్రేం చేయించాను. నా తొలి చిత్ర కళా ప్రదర్శనలో మకుటామయమైన చిత్రంగా దీనిని ప్రదర్శించాను. అంతేకాదు, నా బ్రోచర్ పైనా ముఖచిత్రంగా దీనినే అచ్చు వేయించాను. ‘ఎందుకో తెలుసా’ అని అడిగితే చెప్పలేను.
+++

చాలా మంది అడిగారు కూడా, ‘ఇదేమిటీ?’ అని.
నవ్వి ఊరుకున్నాను.
ఇంకా చాలామంది అడగలేదు కూడా, ‘ఏమిటేమిటీ’ అని!
అందుకూ చాలా సంతోషించాను.
అయితే, ఇదొక్కటే కాదు, ప్రదర్శించే ప్రతి చిత్రానికీ ఒక ప్రాధాన్యం ఉంటుంది. అప్రయత్నమూ ఉంటుంది.
బహుశా దీనికి కారణం ఆ చిత్రం ‘మనం తీయనిది’ అయి వుండటం!
ఆ రచన మనం వాంచితంగా “చేయనిది’ అవడం!

 

+++

 

నిజమే మరి.
చిత్రాలు రెండు రకాలు. ఒకటి, మనం తీసుకునేవి. రెండు, మన చేత తీయించుకునేవి.
నా చిత్ర కళా ప్రదర్శనలో నేను ఎంచుకున్న రచనా పద్ధతి కూడా ఇదే. నేను తీయని చిత్రాల ప్రదర్శనే అది!
అందులో ఎన్నో…

ఒక రాలి పడిన ఆకు. బెలూను ఊదుతున్న మనిషి. అఖండదీపం ముందు ఒక భక్తురాలు.
ఇంకా…ముందు చెప్పిన చిత్రాలెన్నొ. అందులో ఈ దేవాలయం కూడా ఒక అప్రయత్నం.

 

+++

 

చిత్రమేమిటీ అంటే, దీన్ని ఎందరో దర్శించుకున్నారు…
ఒకరికి తెలిసి, మరొకరికి తెలియక. తెలిసీ తెలియక, సేమ్, నాలాగే ~ ఒకానొక కనికట్టుకు లోబడి.

అంతిమంగా అంతా ఒక ప్రేక్షకపాత్ర. మానవుడి నిమిత్తం లేని నిర్ణయానిదే తొలిపాత్ర.
తట్టా పారలకు వందనం అభివందనం.

~కందుకూరి రమేష్ బాబు

పెళ్లి ఒకరితో…ప్రేమ ఒకరిపై…

శర్మిష్టను కోరి దేవయానికి తాళి

 

నన్ను వివాహమై నహుషనందన! యీ లలితాంగి దొట్టి యీ

కన్నియలందరున్ దివిజకన్యలతో నెన యైనవారు నీ

కున్నతి బ్రీతి సేయగ నృపోత్తమ! వాసవు బోలి లీలతో

ని న్నరలోకభోగము లనేకము లందుము నీవు, నావుడున్

                                                       -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

నహుషుని కుమారుడవైన ఓ యయాతీ! నన్ను వివాహం చేసుకుని, దేవకన్యలకు సాటివచ్చే ఈ సుందరి(శర్మిష్ట)తోపాటు ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా నరలోకంలో అనేక భోగాలు అనుభవించు…

   ***

  దేవయాని పరంగా చెప్పిన కథలా కనిపిస్తున్నా నిజానికిది శర్మిష్ట కథ అన్నాను. ఈ కోణం నుంచి ఈ కథను  ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారో లేదో నాకు తెలియదు. సంప్రదాయం అలాంటి పరిశీలనలకు సాధారణంగా అవకాశం ఇవ్వదు. అది పురాణ, ఇతిహాసాల చుట్టూ ఒక బలమైన ఊహా చట్రాన్ని నిర్మించి దానికి కాపలా కాస్తూ ఉంటుంది. తను అనుమతించిన మేరకే స్వతంత్ర పరిశీలనకు స్వేచ్ఛ నిస్తుంది. సంప్రదాయం నిర్మించే చట్రం ఎంత, బలంగా ఉంటుందంటే, ఆ చట్రం లోపలే ఆలోచించడం ఒక అసంకల్పిత చర్యగా మారిపోతుంది.  అనేక సందేహాలు, అసంబద్ధాలు ఆ చట్రం కింద అణిగిపోతాయి.  వాటిపై మౌనం ఒక ఉక్కు తెర వేలాడుతూ ఉంటుంది. మహాభారతం లోంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు. యయాతి-దేవయాని-శర్మిష్టల కథే ఒక గొప్ప ఉదాహరణ.  

అదే సమయంలో ప్రతికాలంలోనూ, ప్రతి తరమూ తన జ్ఞానవారసత్వాన్ని నూతన విజ్ఞానం వెలుగులో సరికొత్తగా దర్శిస్తూనే ఉంటుంది.  మానవ అనుభవానికీ, జ్ఞానానికీ నిత్య నవీనత్వాన్ని, తాజాదనాన్ని సంతరిస్తూనే ఉంటుంది.  దీనిని నేను అదనపు విలువను జోడించడం అంటాను. ఇలా అదనపు విలువను జోడించడం కూడా వాటి అస్తిత్వాన్ని పొడిగించే కారణాలలో ఒకటని నేను భావిస్తాను.  అలాగని సంప్రదాయపాఠాన్ని తక్కువ చేయకూడదు. శతాబ్దాలుగా సంప్రదాయ పఠన పాఠనాలు పురాణ, ఇతిహాసాలను కాపాడుకుంటూ వస్తున్నాయి కనుకే, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకు సంప్రదాయ కవి పండితులకు, పౌరాణికులకు కృతజ్ఞతా వందనాలు అర్పించుకోవలసిందే!

ఇక్కడే ఇంకొక వివరణ కూడా ఇచ్చుకోవాలి. అదనపు విలువ జోడించే ప్రయత్నంలో ప్రతిసారీ ప్రమాణాలూ, ఆధారాలూ, కచ్చితమైన అన్వయాలూ ఇవ్వలేకపోవచ్చు. గ్రంథస్థ విషయాలనుంచి పక్కకు జరగచ్చు. ఊహల మీద ఆధారపడవలసి రావచ్చు. పురాణ, ఇతిహాసాలలో వాస్తవాలను పట్టుకోవడం సాధారణంగా గడ్డిమేటలో సూదిని వెతకడంలా పరిణమిస్తుంది. అయినాసరే, ఊహకు ఉండే విలువ ఊహకూ ఉంటుంది. వాస్తవాల అన్వేషణలో  ఒక్కోసారి ఊహ తొలి అడుగు కావచ్చు.

ప్రస్తుతానికి వస్తే…

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న ’అతిశయ రూప లావణ్య సుందరిఅయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ‘ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు’ అంది.

ఆ వెంటనే, ‘నన్ను నూతిలోంచి  పైకి తీసినప్పుడే ఆ సూర్యుని సాక్షిగా నీ కుడి చేతితో నా చేయిపట్టుకున్నావు. అది నన్ను పెళ్లాడడమే. ఆ సంగతి విస్మరించడం నీకు న్యాయం కాదు’ అని హెచ్చరించింది. ఆపైన, ‘నహుషుని కొడుకువైన  యయాతీ, నన్ను పెళ్లి చేసుకుని ఈ సుందరాంగితోపాటు, దేవకన్యలకు సాటి వచ్చే ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా దేవేంద్రుడిలా ఈ నరలోకంలో అన్ని భోగాలూ అనుభవించు’ అంది. దేవేంద్ర భోగాలు అనుభవించమనడంలో తెలివిగా ‘ఓ నహుషనందనా’ అని సంబోధించింది. నహుషుడు కొంతకాలం ఇంద్రపదవిలో ఉన్నాడు.

01Kach

దేవయాని ప్రతిపాదనకు యయాతి అభ్యంతరం చెప్పాడు. క్షత్రియకన్యలను బ్రాహ్మణులు వివాహం చేసుకోవచ్చు కానీ, బ్రాహ్మణకన్యలను క్షత్రియులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఉందా, వర్ణాశ్రమధర్మాలను కాపాడవలసిన రాజునైన నేనే ధర్మం తప్పితే ప్రపంచం నడక అస్తవ్యస్తమైపోదా అన్నాడు. అప్పుడు దేవయాని, ‘గొప్ప బాహుబలం కలవాడా’ అని అతన్ని సంబోధించి, ‘ధర్మాధర్మాలు నిర్ణయించే లోకపూజ్యుడైన శుక్రుడు ఆదేశిస్తే నన్ను పెళ్లిచేసుకుంటావా?’ అని అడిగింది. ‘బాహుబలం కలవాడా’ అనడంలో, రాజ్యపాలనే నీ బాధ్యత తప్ప ధర్మాధర్మనిర్ణయం కాదు, అది శుక్రుడు చేయవలసిన పని అనే మెత్తని చురక ఉంది. అంతేకాదు, తండ్రిని తను ఒప్పించగలనన్న ధీమా కూడా ఆ మాటల్లో ఉంది.

ఆ మహాముని ధర్మవిరుద్ధం కాదంటే నిన్ను వివాహమాడతానంటూ యయాతి ఆ సంభాషణకు అంతటితో తెర దించాడు. దానిని పొడిగించడం వల్ల అతనికి నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే, అప్పటికే అతను శర్మిష్టవైపు ఆకర్షితుడయ్యాడు. దేవయాని ఆమెను తన దాసిగా పరిచయం చేసింది కనుక, ఆమెను నేరుగా తను పొందగల అవకాశం లేదు. దేవయానిని తను పెళ్లిచేసుకుంటేనే శర్మిష్ట తన దవుతుంది. బహుశా నేరుగా ఆమెను తను స్వీకరించడానికి సామాజిక స్థాయికీ, హోదాకూ చెందిన అభ్యంతరాలు కూడా ఉండి ఉండచ్చు. దేవయాని మాట నేర్పు, స్వభావం అప్పటికే అతనికి అర్థమయ్యాయి. ఆమె తనతో పెళ్ళికి తండ్రిని ఒప్పించగలదన్న నమ్మకమూ అతనికి కలిగి ఉంటుంది. దేవయానితో పెళ్ళికి అంగీకరిస్తేనే శర్మిష్ట  తనకు దక్కుతుంది కనుక దేవయానితో తన పెళ్లి ధర్మమా, కాదా అన్న చర్చ తనకు అనవసరం. అది తేల్చే బాధ్యత దేవయాని తీసుకుంది.

జాగ్రత్తగా గమనించండి…యయాతి దేవయాని పట్ల ఆకర్షితుడు కాలేదు. ఇంతకుముందు ఆమెను నూతి లోంచి పైకి తీసిన తర్వాత అతను తన దారిన తను వెళ్లిపోయాడని చెప్పడం ద్వారా కథకుడు ఆ సూచన చేయనే చేశాడు. ప్రస్తుత సందర్భంలో, ‘అతిశయ రూపలావణ్యసుందరి’ అయిన శర్మిష్ట గురించి తెలుసుకో గోరాడని అనడం ద్వారా ఆమె వైపు అతను ఆకర్షితుడయ్యాడన్న సూచన అంతకంటే స్పష్టంగా ఇచ్చాడు.

దేవయాని, యయాతి ల మధ్య నడిచినది ఒకవిధమైన మైండ్ గేమ్. ఇద్దరిలోనూ లౌక్యమూ, గడుసుదనమూ ఉన్నాయి. ఇద్దరికీ తమవైన వ్యూహాలు ఉన్నాయి. దేవయానికి రాజును పెళ్లాడడం ముఖ్యం. తద్వారా లభించే రాచవైభవం ఆమెకు కావాలి. యయాతికి రూపలావణ్య సుందరి అయిన శర్మిష్ట కావాలి. శర్మిష్ట మనసులో ఆ క్షణంలో ఎటువంటి ఆలోచనలు చెలరేగాయో మనకు తెలియదు. అప్పటికామె ఎటు వంచితే అటు వంగవలసిన మైనపు బొమ్మ!

దేవయాని అప్పటికప్పుడు తండ్రిని రప్పించింది. ‘ఈ రాజు ఇప్పటికే నా పాణిగ్రహణం చేశాడు కనుక వివాహ సంబంధంగా ఇంకొకరు నా చేయి పట్టుకోవడం ఎలా ధర్మమవుతుంది? కనుక ఈ జన్మలో ఇతడే నా భర్త. నువ్వు ఒప్పుకుంటే నన్ను పెళ్లాడతానని ఇతడు కూడా మాట ఇచ్చాడు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడు’ అని తండ్రితో అంది. గమనించండి…దేవయాని ఈ పెళ్లి ధర్మబద్ధమో, కాదో చెప్పమని అడగలేదు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడమని మాత్రమే అడిగింది. అంటే తన terms and conditions ను స్పష్టంగా నిర్దేశించిందన్నమాట. శుక్రుడు వాటిని దాటి మాట్లాడే ప్రశ్నే లేదు. ఈ వివాహంలో ఎలాంటి ధర్మోల్లంఘనా లేదన్న ఒకే ఒక వాక్యంతో ఆమోదం తెలిపేశాడు. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.

ఆ తర్వాత శుక్రుడు శర్మిష్టను యయాతికి చూపించి, ’ఈమె వృషపర్వుని కూతురు. ప్రేమతో ఈమెకు అన్నపానాలు, వస్త్రాభరణాలు, సుగంధలేపనాలు వగైరాలు సమకూర్చి సంతోషపెట్టు. అయితే ఈమెతో నువ్వు పడక సుఖానికి మాత్రం దూరంగా ఉండాలి’ అన్నాడు. యయాతి శుక్రుని వద్ద సెలవు తీసుకుని దేవయానినీ, శర్మిష్టతో సహా దాసీకన్యలనూ  వెంటబెట్టుకుని రాజధానికి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఒక చక్కని మేడలో దేవయానిని ఉంచి; ఆమె అనుమతితో శర్మిష్టనూ మిగిలిన కన్యలనూ అశోకవనం సమీపంలోని ఒక గృహం లో ఉంచాడు.

యయాతితో శుక్రుడు అన్న పై మాటలు అతని స్వభావాన్నీ, దేవయాని స్వభావాన్నీ కూడా మరోసారి వెల్లడిస్తున్నాయి. దేవయానిలో అహమూ, అసూయే కాక; అవకాశవాదమూ, స్వార్థమూ కూడా హెచ్చుపాళ్లలోనే ఉన్నాయి. యయాతిని తనతో పెళ్ళికి ఒప్పించే ముందు; శర్మిష్టనూ, మిగిలిన దాసీ కన్యలనూ చూపించి దేవతాస్త్రీలకు సాటివచ్చే ఈ సుందరాంగులందరూ నిన్ను సుఖపెడతారని ఆశపెట్టింది. తీరా యయాతి పెళ్ళికి ఒప్పుకున్నాక మాట మార్చింది. యయాతిని శర్మిష్టతో కలసి పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆ మాట యయాతితో తను నేరుగా చెప్పకుండా తండ్రితో చెప్పించింది. తండ్రి ఆదేశాన్ని ఉల్లంఘించే సాహసం యయాతి చేయడని ఆమె ధీమా.

శుక్రుడు కూతురి అభిమతాన్ని కాదనే ప్రసక్తే లేదు కనుక, శర్మిష్టను పడక సుఖానికి  మాత్రం దూరంగా ఉంచమని యయాతికి ప్రత్యేకించి చెప్పాడు. అయితే, వృషపర్వుని కూతురైన ఈమెకు అన్నీ సమకూర్చి సంతోషపెట్టు అని కూడా అంతే ప్రత్యేకంగా చెప్పాడు. అలా చెప్పడంలో శర్మిష్టపై అతనికున్న పుత్రికావాత్సల్యమూ, సుకుమారంగా సుఖాల మధ్య పెరిగిన ఆమెను కష్టపెట్టవద్దని చెప్పే ఔదార్యమూ, ధార్మికతా వ్యక్తమవుతూ ఉండచ్చు.

ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, శర్మిష్టకు అన్ని వసతులూ కల్పించి పడక సుఖానికి మాత్రం దూరంగా ఉంచమని శుక్రుడు చెప్పడంలో, ఆమెనుంచి పడక సుఖం కూడా పొందమన్న ధ్వని ఉండడానికీ అవకాశముంది. దాని గురించి వివరించుకోవడం ప్రారంభిస్తే, ఆ వివరణ ఇంతకుముందు చెప్పినట్టు, దేవయాని పరంగా చెప్పిన కథను శర్మిష్ట పరంగా మార్చివేస్తుంది. శర్మిష్టనే కథానాయికగా మనముందుకు తీసుకొస్తుంది.

ఎలాగంటే, యయాతికి శర్మిష్టను చేపట్టడమే ప్రధాన లక్ష్యం. అందులో వ్యక్తిగత ఆకాంక్షే కాక, రాజకీయ అవసరం కూడా ఉండచ్చు. తను రాజు కనుక రాచకన్యద్వారానే వారసుని కనవలసి ఉంటుంది.  అప్పుడే దానికి సమాజం నుంచి హర్షామోదాలు లభిస్తాయి. దేవయానికి కలిగే సంతానానికి సమాజం ఆ ప్రతిపత్తి ఇవ్వదు. వారసుని ఎంపికలో ఆనాటి రాజుకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదు. అది సమాజమూ, రాజూ కలసి తీసుకోవలసిన సమష్టి నిర్ణయం. యయాతికీ, శుక్రుడికీ కూడా ఆ అవగాహన ఉంది. అయితే, ఇక్కడ మధ్యలో దేవయాని ఉంది. ఇంతవరకు శుక్రుడికి నెత్తి మీద దేవతగా ఉన్న దేవయాని ఇకముందు యయాతికి చిక్కుముడిగా మారబోతోంది. బహుశా యయాతి-శర్మిష్టల మధ్య కలగబోయే సంబంధం శుక్రుని ఊహలో ముందే ఉండి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే, అందుకు సంబంధించిన రాజకీయ ప్రణాళికలో శుక్రుడు కూడా భాగస్వామి అయుండచ్చు.

కూతురిపై అపరిమిత మమకారం ఉన్న శుక్రుడు ఆమె కాపురంలో చిచ్చు పెట్టే పాత్ర నిర్వహించాడంటే వినడానికి విడ్డూరంగానూ, విపరీతంగానూ ఉండే మాట నిజమే. అయితే, కాసేపు దేవయాని పరంగా చెప్పిన కథ అన్న సంగతి మరచిపోయి శర్మిష్ట పరంగా చెప్పిన కథగా ఊహించుకోండి. యయాతి అసలు శర్మిష్టనే చేపట్టాలనుకున్నాడు. అయితే, ఆమె దేవయానికి అప్పటికే దాసిగా మారిపోయింది కనుక యజమానురాలిని పెళ్లాడితేనే శర్మిష్ట తనకు దక్కుతుంది. యయాతి వైపునుంచి ఈ మొత్తం వ్యూహానికి సంబంధించిన అవగాహన లోకజ్ఞుడైన శుక్రుడికి పూర్తిగా ఉంది. దేవయానికి లేదు. ఎందుకంటే, ఆమెది పూర్తిగా వైయక్తికమైన అజెండా. అందులో ఇతరేతర అంశాలకు చోటులేదు.

  అసలు శర్మిష్ట కథను దేవయాని వైపునుంచి కథకుడు ఎందుకు చెప్పినట్టు? రెండు కారణాలను ఊహించవచ్చు. మొదటిది, దాసిగా ఉన్న శర్మిష్టను రాజమార్గంలో చేపట్టడానికి యయాతికి అవకాశంలేదు. అందుకు సామాజిక నిర్బంధాలు అడ్డువస్తాయి. రెండవది, కథకుడికి దేవయానిని ప్రధానం చేసి కథ చెప్పడమే ఇష్టం. ఎందుకంటే, ఆమె భృగువంశీకురాలు. కోశాంబీ ప్రకారం మహాభారత పరిష్కరణలో భృగులు ప్రధాన భూమిక పోషించారు. భృగులను విశిష్టులుగా చిత్రించే ఘట్టాలు మహాభారతంలో చాలా ఉన్నాయి. పరశురాముడు ఇంకో ఉదాహరణ.  

కథలోకి వస్తే, ‘దేవయాని అనుమతి’తో శర్మిష్టను ఇతర దాసీ కన్యలతోపాటు యయాతి అశోకవన సమీపంలో ఒక గృహంలో ఉంచాడని కథకుడు చెబుతున్నాడు. ఆ సమాచారంతో యయాతి-శర్మిష్టల మధ్య జరగబోయే సమాగమాన్ని  సూచిస్తున్నాడు. అంటే, ఎంత దేవయాని వైపునుంచి కథ చెప్పినా కథకుడు శర్మిష్ట ప్రాధాన్యాన్ని కప్పిపుచ్చలేకపోతున్నాడన్నమాట!  అదలా ఉంచితే, ‘దేవయాని అనుమతితో’ శర్మిష్టను (తను తరచు విహరించే) అశోకవన సమీపంలో ఉంచాడని చెప్పడం  ద్వారా, అనేకమందితో రహస్య ప్రణయాలు సాగిస్తూ, భార్యపట్ల అతి విధేయతను ప్రదర్శించే దక్షిణనాయకుడిగా యయాతిని కథకుడు మన ముందుకు తెస్తున్నాడు.

అనంతర కథ తర్వాత…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 –కల్లూరి భాస్కరం