Archives for August 2013

నాలో మా ఊరు

 GOWRINAIDU

ఊరొదిలి పట్నం వొచ్చినప్పుడు

నాతో తెచ్చుకున్నానొక పచ్చని పంట పొలాన్ని,

తీసుకొచ్చేనొక నదిని,

ఒక చెట్టునీ.. మడిగట్టునీ..

నలుగురు నేస్తాల్నీ,

నాగలి సరే ..

అమర్చుకున్నాను నా పుస్తకాల నడుమ

అద్దాల పలకల మధ్య బొబ్బిలి వీణలా.

అక్కడ మా ఊరిలో

ఇంటిముందు మా అమ్మ కల్లాపు జల్లే వేళ

పట్నంలో నా ఇరుకు గదిలో

పూలజల్లు కురిసి

పరిమళిస్తుంది వేకువ.

అక్కడ మా ఇంటి గడపలో

చెల్లెలు వేసిన తిన్నని పిండిముగ్గు కర్ర

నా గది కిటికీలోంచి కిరణమై తాకి

పులకరిస్తుంది మెలకువ.

పట్నం కదా

నా చుట్టూ విస్తరిస్తున్న ప్రపంచం

నా బతుకేదో నన్ను బతకనివ్వదుగదా,

వేషమూ, భాషా నన్ను నాలాగా ఉండనివ్వవుగదా,

నాకునేను పరాయినైపోతున్నాననుకున్నప్పుడల్లా

ఆకుపచ్చ పంటపొలాన్ని ఎదురుగా పరుచి

పైరగాలిరెపరెపల్లో తేలిపోతాను మైమరచి.

నాతో తెచ్చుకున్న నదిని తెరిచి

తలారా స్నానంచేసి ఈతలుకొడతాను

నేస్తాలతో కలిసి.

నొప్పితెలీకుండా కొంచెం కొంచెం

నన్ను కొరుక్కు తింటుంది నగరమని నాకు తెలుసు,

మత్తేదో జల్లి మెల్లగా

లొంగదీసుకుంటుంది నగరమని నాకు తెలుసు,

అనేకానేక బలహీనతలతో  ఘనీభవించి

నన్ను నేను అసహ్యించుకుంటున్నప్పుడల్లా

చాళ్ళుచాళ్ళుగా దున్ని దున్ని నాగలి

నా హృదయక్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది.

గంటేడ గౌరునాయుడు

మహాఖననం

 

సిద్ధార్థ

సిద్ధార్థ

యములోడా… ఇది భస్మ సరస్సు 
రణ గొంగలి కప్పుకున్న యవ్వన భూమి 
ధిక్కార ప్రాంతాన 
నిలిపిన నిషేధ ద్వారం… 
                          ఇంగలాల నిచ్చెన 
కాలు, తగలబడు, వేలాడు 
ఉరుకెత్తే రైలు బండికెదురుగ బోయి 
                          ఢీ కొట్టు… 
పెరుగన్నం తిని పాటలు పాడి 
రోడ్డెక్కి 
నవ్వుతూ చావు రథమెక్కి 
ఉరుముకుంటూ పో… 
యములోడా వింటున్నావా 
నాది భస్మ సరస్సు… 
 
వాయిదాలూ, చర్చలూ, తనిఖీలు, ప్రకటనలు 
వెన్నుదెబ్బలూ 
ఉచ్చపోసుకుంటూ చెప్పుకునే మాటలు 
సుతీమానం లేని ఎవ్వారం 
యములోడా… ఇది భస్మ సరస్సు 
ఏదీ తినాలనిపిస్తలేదు 
ఏదీ తాగాలనిపిస్తలేదు 
బేచేనీ జిందగీ ఈ రూప లావణ్యం 
అవమానం తలకెక్కి గుండెను 
                                     తూట్లు పొడుస్తుంది 
అనుమానం నిద్రను కొరికి చంపుతుంది 
సోపతి వల్లకాడయ్యి 
                                    పుష్పవతి కాకుండానే గర్భవతయ్యింది 
                                    శవాలను కంటున్నది 
యములోడా… యములోడా… 
యములోడా… 
picasso-pine-tree-nude
 
ఎన్నో తరాల పాపం 
ఎన్నో నమ్మకాల ఎర్రితనం, గాండుతనం 
తందురుస్తుగా సుఖంగా పడుకున్న 
అంధకారపు మత్తు వదిలింది 
 
కనబడుతూన్నదంతా, మిగిలినదంతా 
దెయ్యాల దిబ్బ… 
మెడకు పూసలతాడు 
దొబ్బదేహం…నలుపు దుఃఖం 
ఇదే కదా దొరికింది 
తెలివి తెచ్చుకోవడమే చేసిన పాపం 
ప్రశ్నించడమే ఘాతుకం 
అయితే… 
ఒక్కో అంగాన్ని కోసుకుని అంటించుకుని 
వదిలేస్తూ వుంటాను చూస్కో… 
ఊదుతూన్న కొద్దీ… ఊరు అంటుకుంటూనే 
                                           ఉంటుంది
మానం పగిలి కాలిన నెత్తురు 
                               పట్నానిదీ పల్లెలదీ…
దీన్ని నుదుటికి పూసుకుని 
వలయ పరా వలయాన్నై 
నీ దొడ్డి దారినుంచే ప్రపంచాన్ని 
                                  చుట్టుకొస్తుంటాను 
నేనిప్పుడు
వెయ్యి కాళ్ళతో నడిచే కాష్టాన్ని
 
సుక్కల రుమాల్  ని వేలుకు కట్టుకుని 
దిమ్మీసలాడుతూ… భూమ్మీద 
తైతక్క లాడుతూనే వుంటాను 
 
                              సిద్ధార్థ

విరామమెరుగని వీవీ ఇంట….అరుదయిన ఒక క్షణం!

vvfamily

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1

నేను’ నిత్యనిర్బంధ’ వరంగల్ వాసిని.

అవి ‘ఎమర్జెన్సీ’ చీకటి రోజులు. అప్పట్లో వరంగల్ విరసం శిబిరంలో  వరవరరావు గారి ఉపన్యాసం విని చాలా ఉత్తేజితున్ని అయ్యాను.  అప్పటి నించి వి .వి. మైకం నన్ను కమ్మేసింది. హన్మకొండలోని వాళ్ళింటికి తరచూ వెళ్ళేవాన్ని. సృజన సాహితీ మిత్రులతో ఆ ఇళ్లోక విప్లవ కర్మాగారంలా  కనిపించేది.

నాకు మొదట్నించీ సాహిత్యమూ, ఫోటోగ్రఫీ జమిలిగా నా రక్తంలో ఇమిడి ఉన్నాయి. అట్లా తరచూ సాహితీ మిత్రుల ఫోటోలు తీస్తూ ఉండేవాన్ని.  వరవర రావు గారి ఫొటోలతో సహా.

భాస్కర్ కూరపాటి

భాస్కర్ కూరపాటి

నాకు మొదట్నుంచీ వీవీ సర్ వాళ్ళ ఫామిలీ ఫోటో తీయాలని కోరిక బలంగా ఉండేది. కాని ఆయన  ఎప్పుడూ మీటింగ్స్ అనీ, రచనలనీ ఇతర వ్యాపకాలతో చాలా బిజీగా ఉండేవారు.
ఈలోగా నేను ఉద్యోగపర్వంలో హైదరాబాద్ వచ్చిపడ్డాను.

2

అవి ‘ఎమర్జెన్సీ’ చీకటి రోజులు అని ముందే చెప్పానుకదా…
అరెస్టులు, నిర్భందాలు, భావప్రకటనారాహిత్యం అలముకొని ఉన్న రోజులు.

వరవరావు గారి కోసం జైళ్ళు ఎప్పుడూ నోళ్ళు తెరుచుకొని ఉండేవి.
వరంగల్ గోడలనిండా ‘లేపుతాం లేపుతాం , వరవరరావును లేపుతాం, బాలగోపాల్ను లేపుతాం’ అనేవే ఎక్కడ చూసినా భయకంపితుల్ని చేసేవి.
సరిగ్గా అల్లాంటి పరిస్తితుల్లో సార్ హైదరాబాద్ రావడం, ‘ఇదిగో మీ వరవరరావు’ అంటూ దేవిప్రియగారు ‘ప్రజాతంత్ర’లో ఓ మంచి ఆర్టికల్ రాయడం జరిగింది.
సార్ ఫామిలితో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఓ ఆదివారం సాయంత్రం బాగ్ లింగంపల్లిలోని సార్ ఇంటికి వెళితే అందరు ఉన్నారు. సార్ ఏదో మీటింగ్ కోసం వెళ్ళే తొందరలో ఉన్నారు. ఉన్నఫళంగా తొందరగా ఓ రెండు ఫొటోలు  తీశాను. అప్పుడు నా మనసు నిజంగా కుదుటపడింది.

అప్పుడు సార్ నవ్వుతూ “ఇన్నాళ్ళకు నీ కోరికా, మా కోరికా తీరినట్లయ్యింది. పట్టువదలని  విక్రమార్కుడివి అనిపించుకున్నావ్,  రా మీటింగ్ కు వెళదాం’ అంటూ కూడా తీసుకువెళ్ళారు.

-భాస్కర్ కూరపాటి

———————————————————————————

అపు’రూప’ చిత్రాలకు ఆహ్వానం

అపు’రూపం’ శీర్షిక అపురూప చిత్రాల ఆల్బం. మీరు ఎందరో ప్రసిద్ధ రచయితలని కలిసి వుంటారు. వారితో గడిపిన క్షణాలని మీ కెమెరాలలో బంధించి వుంటారు. అలాంటి అపురూపమయిన దృశ్యాలను ఇక్కడ పంచుకోండి.

—————————————————————————

“ సబర్మతి “

 Untold Stories  – 5

నా పై దుష్ప్రచారం చేస్తున్నారు : కనక

దేవదాస్ నా అస్తిని అపహరించాలని చూస్తున్నాడు.

తమిళసినిమా, న్యూస్‌లైన్: నటి కనక గురించి రెండు మూడు రోజులుగా రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె కాన్సర్ వ్యాధితో అనాధలా కేరళలోని అలంపుళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఒక ప్రముఖ నిర్మాత ఆమెని గుర్తించి మెరుగైన వైద్యం చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ నటి కనక మంగళవారం చెన్నై ఆళ్వార్‌పెటలోని  తన స్వగృహం లో విలేకరులతో మాట్లాడారు. తాను కేరళ ఆలంపుళలోని ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా వదంతి అని స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఇలాంటి దుష్ప్రచారాలను తన తండ్రిగా చెప్పుకునే దేవదాస్ చేస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తిని అపహరించడానికి అతను కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. తాను అతన్ని ఎట్టి పరిస్థితులలోను తన ఇంటికి రానీయనని స్పష్టం చేసారు. దేవదాస్ తన తల్లికి మంచి భర్తగా ప్రవర్తించలేదని, తనకు ఏనాడూ మంచి తండ్రిగా నడుచుకోలేదని దుయ్యబట్టారు. అతను ధనాశపరుడని పేర్కొన్నారు. అతని ప్రవర్తన కారణంగానే మగాళ్లంటే తనకు ద్వేషం కలిగిందని, అందువలనే వివాహం కూడా చేసుకోకుండా ఒంటరిగా నివసిస్తున్నట్లు వెల్లడించారు. దేవదాస్ తన తల్లికి చేసిన ద్రోహాన్ని తాను మరచిపోలేనని అన్నారు. కాగా నటి కనక కన్నుమూసినట్లు మంగళవారం కొన్ని టీవీ చానళ్లు, వెబ్‌సైట్‌లలో వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఆమెకు పలువురు ఫోన్ చేసి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారట. వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్టు కనక పేర్కొన్నారు.

 

bhuvanachandraమొన్నటి పేపర్లో అలనాటి నటీమణి ‘దేవిక’ కుమార్తె ‘కనక’ కేరళలోని ఒక హాస్పిటల్ వరండాలో దిక్కులేకుండా పడి వుంటే ఓ చిత్రప్రముఖుడు చూసి గుర్తించాడనీ, ఆమెకి మెరుగైన ‘వైద్యం’ ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనీ వార్త చదివాను. ఆమెకి ‘కేన్సర్’ అని రాసారు. ఆ వార్త చదవగానే మనసంతా మూగబోయింది.

కనకతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా అమె  తెలుగులో మొదటిసారి నటించిన ‘వాలుజడ – తోలుబెల్టు’ సినిమాకి అన్ని పాటలు నేనే రాసాను. చక్కని తెలుగు మాట్లాడుతుంది. హాయిగా నవ్వుతుంది. చిన్నతనంలో ‘దేవిక’ సినిమాలో చూసి వదిన అంటే ఇలా  ఉండాలని తీర్మానించుకున్న వాళ్లల్లో నేనూ ఒకడ్ని. ఆ వార్త చదవగానే అర్జంటుగా కనక గురించిన వివరాలు సేకరించి వెళ్లి చూడాలని అనిపించింది..  చేతనైనది ఎలాగూ చేస్తా గదా.

ఇవ్వాళ మరో వార్త. కనకే ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చింది అవన్నీ వొట్టి పుకార్లనీ, తాను మద్రాసులో క్షేమంగా వున్నాననీ, తన తండ్రి ఆస్థి కోసం ఆడుతున్న డ్రామాలో ఆ పుకార్లు ఒక భాగమనీ చెప్పింది. మనసు కుదుటపడినా బాధ తగ్గలేదు.

అలనాటి అందాలనటి కాంచనా అంతే. కన్నవాళ్ల దురన్యాయానికి బలైంది. చివరికి ఆస్థి దక్కినా, ఆ ఆస్థి మొత్తాన్నీ (కోట్లలోనే) తిరుపతి వేంకటేశ్వరస్వామికి అర్పించి, ఓ  ఆలయంలో నిర్మలంగా, ప్రశాంతంగా ప్రస్తుతం కాలం గడుపుతోంది.

అసలు ‘సినిమా’ వాళ్లకెందుకీ సమస్యలూ? ఇతర్లకి రావా అంటే వస్తాయి. కానీ సినిమా వాళ్లకి ఎక్కువ. శరీరంలో శక్తి ఉన్నంత కాలం, డబ్బు సంపాయించినంత కాలం, జనాలూ, బంధువులూ, స్నేహితులూ చుట్టూ ఉంటారు. అదో ‘రక్షణ’ కవచం అన్నట్టు భావింపజేస్తారు. ఎప్పుడైతే శక్తి ‘ఉడిగి’ పోతుందో ఆ క్షణమే యీ రక్షణ కవచం కాయితం మేడలా కుప్పకూలిపోతుంది. నిజం చెబితే కాయితాలు గాలికి ఎగిరిపోయినట్టు చుట్టాలూ, పక్కాలూ, స్నేహితులూ అందరూ క్షణాల్లో ఎగిరిపోతారు. మిగిలేది మనిషి – మనసూ – ఒంటరితనం.

“లెక్కకు మించి దానం చెయ్యకు. అపాత్ర దానం అసలే చెయ్యకు. అన్ని ధర్మాల కంటే గొప్పదీ ‘స్వధర్మం’.  కలిమిలో నీ తోడుండేవాడు ఎవడూ కష్టాల్లో నీ తోడుండడు …” ఈ మాటలు చెప్పింది సాక్షాత్తు పద్మశ్రీ చిత్తూరు నాగయ్యగారు. అంత ఘోరంగా ఆయన చివరి రోజులు గడిచాయి. మన మహానటులు అయిదువందల రూపాయలు పారితోషికం తీసుకునే రోజుల్లో ఆయన సినిమాకి ‘లక్ష’ తీసుకున్నారు. గజారోహణాలు, కనకాభిషేకాలూ లాంటి సత్కారాలు ఎన్నో అందుకున్నారు. చివరికి ‘గుంపులో గోవింద’లాగా ఒక్క డైలాగ్ కూడా లేని వేషాలు వేయ్యాల్సొచ్చింది. ‘ఇచ్చింది’ మాట్లాడకుండా పుచ్చుకోవాల్సి వచ్చింది. అందుకే దీన్ని ‘చిత్ర పరిశ్రమ’ అంటారేమో! ఓ కస్తూరి శివరావు… మహానటి కన్నాంబ… ఎంత మంది.. ఎంత మంది నటీనటులు ‘విరాళాలతో, చందాలతో’ మహాప్రస్థానానికి పయనం సాగించారు. సావిత్రిని మించిన నటి వున్నదా? గిరిజ.. ఒద్దు మహాప్రభో.. వద్దు. అంతులేని ఆస్థిపాస్తులతో, అభిమానులతో కళకళలాడిన జీవితాలు నూనెలేని దీపంలా కొడిగట్టి పోయినప్పుడు  చూసే దుస్థితి ఎటువంటిదో, అనుభవిస్తేగానీ అర్ధం కాదు.

మొన్న పొద్దున వాకింగ్‌లో “మన ‘సబర్మతి’ హాస్పిటల్లో ఉందిట..!” కబురు తెచ్చాడు సుబ్బారావు. సుబ్బారావు ప్రొడక్షన్ మేనేజరుగా యీ మధ్యే  ప్రమోట్ అయ్యాడు. మరో సుబ్బారావు గారు ఉన్నారు. చాలా సీనియర్ ప్రొడక్షన్ మేనేజరుగారు. చాలా నిజాయితీ వున్నవాడూ. నిక్కచ్చి మనిషి. పిల్లాపాపల్తో  హాయిగా  మా వలసరవాక్కం ‘లోనే రిటర్డ్ లైఫ్‌ని ఆనందంగా అనుభవిస్తున్నారు.

“ఏమైందిట?” అడిగాను.

“ఏముంది గురూగారూ. కొడుకూ, కోడలూ ఆవిడ్ని హాస్పిటల్ వరండాలో పడేసి చాలా తెలివిగా ఏ వూరో చెక్కేసారు. వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసి వుంది. అర్జంటుగా ఓ పదివేలు పోగు చేసి ‘సురేష్’ డాక్టరుకి వొప్ప చెప్పి వచ్చాను” అన్నాడు.

మరో ‘సినీజీవి’ అయితే ‘సబర్మతీ’ గురించి ఏ  ఛానల్   మాట్లాడరు. ఏ పేపర్లోనూ వార్తలు రావు. ఎందుకంటే సబర్మతీ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అంట్లు తోమే ఆడది. యూనియన్ కార్డు ఉండి ఉండోచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకునేదెవరూ?

ఆరోజుల్లో ‘భగవతి’ హోటల్ ముందు పొద్దున్నే ఓ పదైనా ప్రొడక్షన్ వేన్‌లు ఆగేవి .. టిఫిన్ల కోసం. అంట్లు తోమడానికీ, సర్దడానికీ తీసుకు వెళ్టారనే ఆశతో చాలామంది ఆడవాళ్లు అక్కడే ఎదురు చూసేవాళ్లు. వాళ్లకో యూనియన్ ఉందనీ, వాళ్లు యూనియన్ మెంబర్సేననీ, కాని వాళ్లకి ఆ చాన్స్ దక్కదనీ తెలీడానికి నాకు చాలా రోజులు పట్టింది.

ప్రతి ప్రొడక్షన్ మేనేజర్‌కీ ఓ ‘బేచ్’ వుంటుంది. సబర్మతి కూడా నారాయణరావు బేచ్‌తో వచ్చేది. చాలా కళగల మొహం. చక్కని మాటతీరు. మనిషి కూడా తీర్చిదిద్దినట్టుండేది.  ఈ మాట ఓసారి నాతోటి రచయితతోటి అంటే “గురూ.. నాతో అన్నారుగానీ ఎవరితో అనకు.. నీ టేస్టు చాలా ‘చవకబారు’దంటారు.” అన్నాడు. నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలీలేదు. ఒక వ్యక్తిని మెచ్చుకోవడానికి కూడా  ‘ఇన్నియాంగిల్స్’ లో ఆలోచించాలని నాకు నిజంగా తెలీదు. అసలు మనిషిని మనిషిగా ఎందుకు గుర్తించం? నిన్నటిదాకా మా కళ్లముందు పాండీబజార్లో తిరిగినవాడు ఓ సినిమాలో హీరో కాగానే అందరూ “హీరోగారొచ్చారు..” అని నానా హంగామా చేస్తారో?, సదరు కుర్రాడు కూడా కంటికి నల్ల కళ్లద్దాలతో చేతిలో ఫైవ్ ఫైవ్ ఫైవ్ సిగరెట్టు పేకెట్టుతో ఆకాశం నుంచి  అప్పుడే  ఊడిపడినట్టు ఎందుకు పోజు కొడతాడో తెలీదు. నాకు అర్ధం కారు. “మంత్రిగారొచ్చారు”… “ప్రొడ్యూసర్ గారొచ్చారు” “డైరెక్టర్ గారొచ్చారు” “హీరోయిన్‌గారు ఆలస్యంగా వస్తారట” “కవిగారికి కడుపు నొప్పిట!” ప్రొద్దున్నే లేవగానే వినపడే మాటలు ఇవే. మనిషి పేరు మరుగయి.. వృత్తి పేరే ప్రముఖమవుతుంది. సరే…!

నేను ‘కారం’ ఎక్కువ ఇష్టపడతాను. కారంగా ఉంటే చెట్నీలని ఇంకొంచెం వేసుకుంటా. ఎలా కనిపెట్టిందో ఏమోగానీ, నేను పని చేసే షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా ‘కారం’గా ఉండేవాటినే పొందిగ్గా వడ్డించేది. ఆ విషయం నేను గమనించడానికి కొంత కాలం పట్టిందనుకోండి. అది వేరే సంగతి.

టి.నగర్‌లో “ముప్పత్తమ్మ గుడి” సినిమా వాళ్లకి బాగా అలవాటైన గుడి. ఆ దేవత చాలా నిఖార్సైన దేవత. నూటికి నూరుపాళ్లు మొక్కుకున్న మొక్కుల్ని తీరుస్తుందని మావాళ్ల నమ్మకమేగాదు నిజం కూడా..

నాలుగేళ్ల క్రితం ఓ డబ్బింగ్ సినిమా ‘స్క్రిప్ట్’ పూజ కోసం మా ప్రొడ్యూసర్ ఆ గుడికి తీసికెళ్లాడు. అంతకుముందు చాలాసార్లు వెళ్లాను. ఆ రోజునే సబర్మతినీ, సబర్మతి ఇరవైయ్యేళ్ల కొడుకునీ చూడటం జరిగింది. పిల్లాడు అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. వాళిద్దరూ పక్కపక్కనే వుంటే అక్కాతమ్ముడిలాగా వున్నారుగానీ తల్లీకొడుకుల్లా లేరు. మాకు నమస్కరించి

కొడుకుని పరిచయం చేసింది. కుర్రాడు స్కాలర్‌షిప్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నాట్ట. మనసులోనే సబర్మతికి సెల్యూట్ కొట్టాను.

నాకు తెలిసి ఒకాయన అనేవాడు. ” మనం లోకానికి వచ్చాం. పోతాం. అది ముఖ్యం కాదు. లోకానికి ఏమిచ్చాం అనేది ముఖ్యం…” అని.

సబర్మతి అంట్లు తోమింది. అది నిజం.. కానీ, లోకానికి ఓ ఇంజనీర్‌ని ఇచ్చింది. అది గ్రేట్.

రెండేళ్ల క్రితం కుర్రాడి పెళ్లి అనీ, వాడు TVSలో పని చేస్తున్నాడనీ, గొప్ప జీతమనీ, పిల్ల కూడా బాగా చదువుకుందనీ, ఉద్యోగం చేస్తానంటోందనీ చెప్పి, అందమైన వెడ్డింగ్ కార్డుని చేతికిచ్చింది. కార్డులో ఆవిడ పేరు లేదు. శ్రీమతి & శ్రీ వీరభద్ర చౌదరి అని వుంది.

“ఎవరు ఆ చౌదరిగారూ?” అనడిగా.

“బాబు చదువుకి సహాయం చేసినవారండి. నాకు తల్లిదండ్రుల్లాంటివారు కాదు.. దైవాలు…!” అన్నది.

చేసిన సహాయాన్ని క్షణంలో మరిచిపోయే యీ రోజుల్లో సబర్మతి తన కృతజ్ఞతని ప్రకటించుకున్న విధానం నా కళ్ళు చెమర్చేట్టు చేసింది.

పెళ్ళికి వెళ్లాను. చాలా చక్కగా పొందిగ్గా ఏ మాత్రం ఆర్భాటం లేకుండా చాలా చాలా ఆత్మీయంగా పెళ్లి జరిపించింది. వివాహ మండపం చిన్నదే. కాని ఆహుతులందరూ హాయిగా స్వంత  ఇంట్లో వున్నట్టు ఫీలయ్యారు. వచ్చిన ‘పరిశ్రమ’ వాళ్లు కూడా ‘ప్లాస్టిక్’ నటనలు మాని హాయిగా సంతోషంగా వివాహాన్ని చూశారు. ‘అఫ్‌కోర్స్ పెద్దవాళ్లు’  ఎవరూ రాలేదనుకోండి. రాకపోవడమే మంచిదైంది. వస్తే వాతావరణం మరోలా ఉండేది. ఆ విషయమే సబర్మతితో అంటే “నేనసలు పెద్దపెద్దవాళ్లని పిలువలేదండి. వారు నాకు తెలిసినా నేను వాళ్లకి తెలీదు కదా. ఒకవేళ వాళ్లు పెద్ద మనసుతో వచ్చినా, వారికి తగ్గట్టు మర్యాద చేసే ‘తాహతు’ నాకు లేదు కదా!” అన్నది.

అంత ఆరోగ్యంగా ఉండే, ఆరోగ్యంగా ఆలోచించే సబర్మతి ఇలా దిక్కులేనిదాని లాగా అవడమేమిటి? కొడుకూ కోడలూ ఆవిడ్ని ‘వదిలించు’ కోవటం ఏమిటి? నాకు తెలిసి సబర్మతి ఎవర్నీ నొప్పించే మనిషి కాదు. అసలు కారణం ఏమిటి?

సుబ్బారావు నేనూ కలిసి సురేష్ హాస్పిటల్‌కి వెళ్లాం. మనిషి బాగా చిక్కింది ఆమెకి శారీరక అనారోగ్యం కంటే మానసిక వ్యధ ఎక్కువగా  ఉన్నదనిపించింది. నన్ను లోపల వదిలి సుబ్బారావు బయటకు వెళ్లాడు.

“ఏం జరిగింది?” అడిగాను అనునయంగా. ఆ పలకరింపుకే సబర్మతి కళ్లలోంచి కన్నీళ్లు వానలా కురిశాయి. సన్నగా రోదించడం మొదలెట్టింది. నేనూ ఆపలా. నవ్వడం ఒక గొప వరం అయితే ‘ఏడవగలగటం’ చాలా చాలా గొప్పవరం. బాధ గుండెల్లో ఘనీభవించిన వాళ్లకి మాత్రమే ఏడుపులోని ‘సుఖం’ అర్ధమౌతుంది.

చివరికి ఆమె మాటల సారాంశం చెప్పి వదిలేస్తాను. కొడుకు ఆఫీసువాళ్లు పార్టీ ఇమ్మని అడిగారంట. కోడలికి కూడా ఉద్యోగం వచ్చిన సందర్భం కావటంతో అట్టహాసంగా ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారట. అదీ సబర్మతి ఊళ్ళో లేని రోజున. రెండు రోజుల తర్వాత రావల్సిన సబర్మతి ఆ మధ్యాహ్నమే ఇంటికొచ్చేసరికి అట్టహాసంగా ‘పార్టీ’ జరుగుతోంది. ‘ఎవరు ఆమె’ అని అడిగిన అతిథులకి, ‘మా ఇంట్లో  పనిమనిషి.. ఊరినుండి ఇప్పుడే వచ్చింది.’ అని కొడుకూ, కోడలూ చెప్పడం తన చెవులతో స్వయంగా సబర్మతి విన్నదట. తనే బయటికి వచ్చేసిందట.

ఇంకేం చెప్పక్కర్లేదుగా.. చాలా ఏళ్ల క్రితం ఓ హిందీ హీరో, స్కూలు టీచరైన తన తండ్రిని ఇలాగే ‘మా పొలంలో పని చేసే రైతు’ అని ఇంగ్లీషులో ఎవరితోనో  చెబుతుంటే (తండ్రి ఎలిమెంటరీ స్కూలు టీచరు గనక  అంత ఇంగ్లీషు రాదనుకుని) ఆ తండ్రి ఆ రోజే హార్డ్ ఎటాక్‌తో మరణించాడని విన్నాను.

కన్నతల్లిని హిపోక్రసీతో ‘పనిమనిషి’ అని అంటే ఏం జరిగిందో ఇవ్వాళ  కళ్లారా చూస్తున్నాను. సబర్మతి బతుకుతుంది. బతికి తీరుతుంది కానీ కొడుకు అద్దెకి తీసుకున్న ఆ ‘భవనం’లో కాదు. ఆ విషయం సబర్మతి, ఆత్మాభిమానం గురించి తెలిసిన వారందరికీ తెలుసు.

మళ్లీ ‘భగవతి హోటల్’ ముందు కొన్నాళ్ల తర్వాత నేనామెను చూడగలను. తన కాళ్ల మీద తను నిలబడ్డానన్న ఆత్మాభిమానంతో ‘ నా పనే నాకు దైవం’ అన్న గర్వంతో.

స్వశక్తితో ఓ ‘ఇంజనీర్’ని తయారుచేసిన మనిషి పగిలిపోయిన తన గుండెని మళ్లీ మరమత్తు చేసుకోలేదూ?

 

మళ్లీ కలుద్దాం

—భువనచంద్ర

***

 

 

 

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!”

శరత్ కుమార్

శరత్ కుమార్

 

ఒక దశాబ్దం క్రితం వచ్చిన “యాదే”(హిందీ) సినిమాలో ఒక పాట ఉంటుంది. “నగ్మే హై, షిక్వే హై, కిస్సే హై, బాతే భూల్ జాతే హై, యాదే యాద్ ఆతే హై” అని. అలా కలకాలం గుర్తుండిపోయే యాదే, సామల సదాశివగారి “యాది”.

సామల గారి రచనా శైలి విలక్షణం, తనదైన ప్రత్యేక శైలిలో,పాఠకుడిని మంత్ర ముగ్దుడిని చేస్తారు. వారి శైలి విశిష్టత ఏంటంటే మన పక్కనే కూర్చుండి, మనతో మాట్లాడుతూ ఆ జ్ఞాపకాల్నితను నెమరు వేసుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంటుంది. “రచయిత-పాఠకుడు ” అన్న గీతని చేరిపివేస్తారు. అప్పటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్ళి మనల్ని తన జీవితపు మధుర జ్ఞాపకాల్లో విహరింపజేస్తారు.

నీ యాదిలోని ముచ్చట్లు చెప్పు తాతా….! అని తన మనవడు అడిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, తనకోసం ఈ ముచ్చట్లు గుర్తు చేసుకుంటున్నట్లుగా- మనవడా ఇదిగో విను..అంటూ తన జ్ఞాపకాల దొంతరలోంచి ఒక్కొక్కటిగా విడమరచి చెబుతుంటారు.

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!” అని వేడుకుంటున్నాడు ఉర్దూ కవి “సఫీ లఖ్నవీ”. పిలిస్తే మాత్రం గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? రాదు. ఆ సంగతి కవికి తెలుసు- మనకి తెలుసు. కాబట్టి మనమే గతం లోకి వెళ్లి, కొన్ని తీయని జ్ఞాపకాలు పట్టి తెచ్చి,పాఠకుల ముందు పరిస్తే మంచిది-అంటారు సదాశివ. ఈ “యాది” మొత్తం ఆ ప్రయత్నమే. “జో సునా ఉస్కా భళా- జోనసునా ఉస్కా భళా”..ఎవరు విన్నారో వాళ్లకు మేలగుగాక-ఎవరు వినలేదో వాళ్ళకూ మేలగుగాక.

సదాశివ గారు రుబాయిల గురించి, సూఫీ కవుల వేదాంతం గురించీ చెబుతారు. సూఫీ వేదాంతపు లోతులను అర్థం చేసుకుని, దాన్ని భారతీయ వేదాంతం తో అన్వయించుతూ తను ఎలా ఆ సూఫీ కవుల రచనల్ని (కవితల్ని) అనువదించారో చెబుతారు. ఇందులో మొదటగా చెప్పుకోవలసింది “అమ్జద్” గారి గురించీ.ఆయన్ని “హజ్రత్ అమ్జద్ హైదరాబాది” అంటారు. అతనొక సూఫీ కవి. అతని రుబాయీలు ప్రశస్తమైనవి.

“రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై
రామ్ సబ్ మే హై సబ్ రామ్ మే హై”
“అన్ని పేర్లలో రాముని ప్రసక్తి ఉన్నది. అన్నింటిలో రాముడున్నాడు. రామునిలో అన్నీ ఉన్నాయి”. అంటారు అమ్జద్.

సూఫీలలో  చిస్తియా సంప్రదాయానికి చెందిన మరొక సూఫీ “యాషిన్ షా” గురించీ చెబుతూ, ఈ మౌల్వీ సాహెబ్ గొప్పదనానికి ఒక విషయం చెబుతారు. “మౌలానా అబుల్ కలాం ఆజాద్” ఖురాన్ షరీఫ్ కి భాష్యం రాసేటప్పుడు సందేహాలు వస్తే, ఈ మౌల్వీ సాహెబ్ కి ఉత్తరాలు రాసి ప్రత్యుత్తరాల ద్వారా తన సందేహాలు తీర్చుకునేవారట.

కాళోజీ రామేశ్వర రావు గారు అసలు ‘కవిత’ కి ఇచ్చిన నిర్వచన అద్భుతంగా అనిపిస్తుంది.
“జరాసా జోష్ థోడా దర్ద్ థోడా ఖులూసే దిల్
మిలాకర్ డబ్సే దిల్ కి బాత్ కహ్ దో షాయిరీ హోగీ”
“కొంచం ఆవేశం, కొంచం ఆవేదన, కొంచం సహృదయత ఇవన్నీ కలిపి ఒక పద్ధతిలో మనసులోని మాటను చెప్పండి. అది కవిత్వమవుతుంది” అని అర్థం. పద్ధతి అంటే “శైలి”, “రీతి”. భావం మనసులోనిది ఉండాలి. కవిత్వానికి ఇంతమంచి నిర్వచనం చదవలేదనిపిస్తుంది.

సదాశివ

సదాశివ

కాళోజీ నారాయణ రావు గారు మిర్జా గాలిబ్ కవితనొకటి చెప్తారు.

“ఖైదే యయాత్ బందే గమ్ అస్లమే దోనో ఏక్ హై
మోత్ సే పహారే ఆద్మీ గమ్ సే సజాత్ పాయే క్యోం”

తాత్పర్యం ఏంటంటే “జీవిత బంధంలో ఉన్నంత కాలం బాధలు ఉండేవే. మృత్యువు కంటే ముందు మనిషి బాధల నుండి ఎలా తప్పించుకుంటాడు?” అని. ఈ సమయం లో నాకు జగ్జిత్ సింగ్ ఘజల్ ఒకటి గుర్తొస్తుంది. “వొహ్ కౌన్ హై దునియా మే జిసే గమ్ నహీ హోతా..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాతం నహి హోతా?”

అర్థం ఏంటంటే “ప్రపంచం లో బాధలు /దుఖం లేని మనిషి ఎవరు ? సంతోషం తప్ప మృత్యువు ఉండని ఇల్లు ఉంటుందా?”  అని.
ఈ రెండూ ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నాయన్న భావనతో ఈ ఘజల్ ని ప్రస్తావించటం జరిగింది.

మీర్జా గాలిబ్ కి కఠినం గా ఉండే కవిత చెప్పటం ఇష్టమట. అతని సమకాలీనులు “అయ్యా..! ,ఈ కవిత మీకే అర్థం కావలె లేదా పైవానికి అర్థం కావలె. మా లాంటి వాళ్లకు అర్థం అయ్యేది కాదు” అని పరిహసించేవాళ్ళట.

“జిస్ ఖదర్ లోగోంకో నా తిఖ్..! యాద్ హై
హై వహీ దీవనె-మత్బూ -ఆ మేరా ”

    అంటే ‘ఎంతవరకు నా కవిత లోకుల నాలుకల మీద నిలచివున్నదో అదే ముద్రితమైన నా దివాన్ అని అంటారు “నాతిఖ్ లఖ్నవీ” అనే కవి. (దివాన్ అంటే కవితా సంకలనం)సామల గారి రచనలు కూడా అంతే. లోకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని కూర్చుంటాయి. మధురానుభూతులుగా పదే పదే నెమరువేసుకునేలా చేస్తాయి. పాఠకులకి ఎన్నో యాదిలు (జ్ఞాపకాలు) మిగిల్చే పుస్తకం యాది. “అయ్యో ఉర్దూ రాదే, నేర్చుకుంటే ఇంకా బాగా ఈ కవితా మాధుర్యాల్ని ఆస్వాదించవచ్చు” అనిపిస్తుంది.అమరగాయకుడు కె. ఎల్. సైగల్ ఎవరి దగ్గరా నేర్చుకోకున్నా దైవదత్తమైన అద్భుత కంఠంతో ఎన్నటికీ మర్చిపోలేని పాటలు పాడారు. అతని పాటలకు పరవశించని వారెవరు? అని అడుగుతారు సదాశివ.అవును.!ఆ గాన మాధుర్యానికి పరవశించని వారేవరుంటారు? ప్రస్తుత కాలంలో కేవలం రనగొనధ్వనుల సంగీతం తో ఐపాడ్ లో పాటలు వింటూ తామూ  సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాము, అనుకునే నేటి తరానికి సైగల్ పాటలు రుచించవేమో కాని, సంగీతం, గానం లోని రసాస్వాదానికి అలవాటున్న వారికి ఇప్పటికీ ,ఎప్పటికీ సైగల్ పాటలు మరచిపోలేని “గాంధర్వ గాన మాధుర్యాలే”.తన నవలల్ని సినిమాలుగా తీస్తూ కె. ఎల్. సైగల్ కు హీరో పాత్ర అప్పగించి ఉచ్చారణ అంత సరిగాలేని బెంగాలి పాటలు అతని నోటివెంట పాడిస్తూ విని శరత్ బాబు అంతటివాడు పరవశించినాదట. శరత్ బాబు సుప్రసిద్ధ నవలా రచయితే కాక చిత్ర లేఖనం, శాస్త్రీయ సంగీతం లో ప్రవేశమున్నవాడు.సినిమా రంగంలో సైగల్ పాటలకు లభించిన కీర్తికి అసూయ పడే వాళ్ళు కొందరు అతన్ని “బేపీర్” అని ” బే ఉస్తాదియా” అని పరిహసించేవాళ్ళట. అంటే ఏ గురువు దగ్గరా సంగీతం నేర్చుకొని వాడని.

ఆగ్రా ఘరానా ను రంగీలా ఘరానా అని అంటారు. ఆ ఘరానా లో నాయకమణి వంటివాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్”.

ఒకసారి ఎక్కడో ఒక చోట ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ కాళ్ళు జాపి పడుకుని శిష్యులతో మాట్లడుతున్నాడట. కె. ఎల్. సైగల్ అతని కాళ్ళు అదుముతూ కూర్చున్నాడట. అది గమనించిన ఉస్తాద్ లేచి కూర్చుండి “ఇదేమిటి కుందన్ లాల్?” నువ్వు ఇప్పటికే గొప్ప గాయకునివి మేమంతా నీ పాటలకు ముగ్దులము అవుతున్నాము. ఈ సేవ ఎందుకు?” అని ప్రశ్నించాడట.

“ఉస్తాద్ నన్నంతా బే పీర్ అని బనాయిస్తున్నారు.మీ వంటి ఉస్తాద్ శిష్యుణ్ణి అనిపించుకోవటం నాకు గర్వ కారణం. మిమ్మల్ని ఇలాగే సేవించుకుంటాను. ఏదైనా అనుగ్రహించండి” అని వేడుకున్నాడట కె. ఎల్. సైగల్. ఉస్తాద్ అతన్ని శిష్యునిగా స్వీకరించి కొన్ని రాగాలు శ్రద్ధగా నేర్పినారట. అందులో ముఖ్యమైన రాగం భైరవి.
గురుశిష్యుల అనుభంధం అలా ఉండేది ఆ రోజుల్లో. సైగల్ అంతటి స్థాయిలో ఉండి కూడా గురు శుశ్రూషకి అంతటి విలువనిచ్చాడు.

– శరత్ కుమార్ గడ్డమీది

వాన వెలిసింది !

ఆ చూపుకి, మాటకీ ఎంత శక్తి! ఎన్నడూ కనీసం ఊహించనైనా లేదు. పిల్లదాని మాటలో నన్ను నిర్బంధించే శక్తి  ఉందని. ఎక్కడికి వెళ్లినా, ఎందరితో మాట్లాడుతున్నా మనసులో ముద్రితమైన దాని మాట మాత్రం నన్ను వొంటరిగా లాక్కుపోతోంది. ఆఫీస్‌ టైమ్‌ అయిన హడావుడిలో దాన్నసలు పట్టించుకోవడం లేదు. తీరా వీధి గుమ్మం దగ్గరికి రాగానే అడ్డుపడి ‘ఇవాళ వెళ్లకమ్మా… నిన్ను పోనీనంతే..!’  అని గట్టిగా కావలించుకుంటుంది. ఇవాళా అంతే. నా హడావుడిలో దాన్ని విడిపించుకుని పట్టుకోమని అమ్మకి చెప్పి బస్సెక్కాను. కానీ ఆ పిచ్చిముండ ఎంత బాధపడుతోందో తెలీకా కాదు. ఈమధ్య ఆఫీసు పని ఎక్కువై దాని సంగతే పట్టించుకోవడం లేదు.

దానికి అమ్మే దగ్గరయింది. ఎప్పుడూ తన దగ్గరే ఎక్కువ ఉండటం, నన్ను చూస్తే కోపం, చిరాకూను.  నేనేం చెయ్యను? ఉద్యోగం చేయడం తప్పడం లేదు. అయినా ఇలాంటి నగరాల్లో బతకాలంటే ఇంటిల్లపాదీ చిన్నా చితకా ఉద్యోగం చేయక తప్పదు. అప్పడే కాస్తంతైనా ఆనందం. ఇదుగో యిలా నాలుగేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే నన్ను నా కూతురికి దూరం చేసింది. దానితో ఆడుకోవాలనుకునే సమయంలో ఉద్యోగం తప్పింది కాదు. ఆయన స్నేహితుల వల్ల మోసపోయి వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు. రెండేళ్లుగా మరీ పిచ్చెత్తినట్టు తిరుగుతున్నారు. ఆయన్నని లాభమేమిటి? అంఆ దురదృష్టం గాక. అప్పటికీ ఓ చిన్న ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉన్నారు… ఆలోచనలు తెగేసరికి ఆఫీస్‌ బస్టాప్‌ వచ్చేసింది.

ఓ పదడుగులు నడిచి ఆఫీస్‌ చేరగానే జయ లాంగ్‌లీవ్‌ అయి చేరినట్టు తెలిసింది. ఇవాళ ఆఫీసర్‌ లేకపోవడంతో పని తగ్గించుకుని జయ కోసం పక్క సెక్షన్‌కి వెళ్లాను. చాలా రోజులకి కలవడంతో ఎంతో ఆనందించింది. ఇద్దరం క్యాంటిన్‌కి వెళ్లి చిన్నపిల్లల్లా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. తను ఏవో చాలా సంగతులు చెప్తోంది. నేను మాటల మధ్యలో ఎందురుగా గోడ మీద వాలిన పిచ్చికని చూస్తుండిపోయాను. అది ఒక్కసారి రెక్కలాడించడం, ముక్కుతో మట్టిని తాకడం తమాషాగా అనిపించింది.  నాకు నా కూతురు గుర్తొచ్చి ఏం చేస్తోందోనని ఆలోచనలో పడ్డాను..

నన్ను నిలదీసి అడిగేంత శక్తి ఎలా వచ్చిందోనని, నన్ను నేను ఆలోచించుకునేట్టు  ఎలా  అనగలిగిందోనని  ఆలోచనలో పడ్డాను. అంతలో బుజం మీద గట్టి దెబ్బ తగిలి ఆలోచనలు తెగాయి.

‘‘ఏమాలోచిస్తున్నావే. ?  ఇందాకట్నించీ పిలుస్తున్నాను. ఏమయింది?’’ నా స్నేహితురాలు అడిగింది.

‘‘ఏం లేదు.  ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను.’’

నీకేమైనా పిచ్చా ?? ఆరేళ్ల తర్వాత గవర్నమెంట్‌ జాబ్‌ వదులుకుంటావా?’’

‘………..’

‘‘ఉద్యోగాల్లేక జనాలు ఛస్తుంటే, ఉన్నది వదులుకుంటానంటావే?!’’

అది నిజమే. కానీ పిల్లదానికి  మరీ దూరమవుతున్నాను. ఈ ఉద్యోగం కంటే దాని ప్రేమే కావాలి. అది కనీసం నా వైపేనా చూడ్డం లేదు. నేనంటే అయిష్టం ఏర్పడింది. కానీ ఇవన్నీ ఎలా ఎవరికి చెప్పుకోను? జయ కూడా అర్థం చేసుకోలే దేమో? నన్ను నేను తర్కించుకుంటున్నాను.

‘‘పిల్లదానితో అమ్మా,  చెల్లెలూ అవస్థలు పడుతున్నారే..’’ అనగలిగాను.

‘‘మరి ఇంటి సంగతి ?’’

‘‘అదే ఆలోచిస్తున్నాను. నేను ఉద్యోగం చేయడం అందరికీ అవసరం. నాకు పిల్ల ఆవసరం’’

పిల్లకి మాత్రం నేనక్కర్లేదట! నాకు దుఖం పెల్లుబికింది. జయను కావలించుకుని ఏడ్చేశాను. నన్ను ఊరుకోబెట్టడానికి తను చాలా సంగతులు చెప్పింది.

సాయంత్రం ఆఫీస్‌ అయి ఇద్దరం చెరో దారాన బస్‌ ఎక్కాం.  ఆలోచన మాత్రం తెగలేదు. నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానిస్తుందో లేదో నన్న భయమూ పట్టుకుంది. నాలో ఎందుకింత మార్పో అర్థం కావడం లేదు. పిల్లకి కోపం ఉండదన్న సంగతి మర్చిపోయి పిల్లది నేను ఆఫీస్‌కి వస్తుంటే చూసిన చూపుకి ఇంకా భయపడుతూనే ఉన్నాను. నాదో చిత్రమైన పరిస్థితి… ఇంతలో కండక్టర్‌ అరిచాడు..

‘‘అమ్మా, నారాయణగూడా వచ్చింది. దిగండి’’.. ఇటూ ఇటూ కంగారుగా చూసి గబగబా దిగాను. అక్కడి నుంచి నిదానంగా ఇల్లు చేరుకునే సరికి టైమ్‌ ఏడయింది.

హాల్లో కుర్చీలో కూచుని హోమ్‌వర్క్‌ చేసుకుంటున్న పిల్ల నా వైపు ఒకసారి తీక్షణంగా చూసింది. మళ్లీ తన రాత పనిలో మునిగింది. నా యింట్లో నేను అపరిచితురాలిలా నిదానంగా చెప్పులు ఓ మూల విడిచి బ్యాగ్‌ టీపాయ్‌ మీద పడేసి అతిధిలా లోపలికి వెళ్లాను. కాఫీతో మళ్లీ వచ్చేసరికి అమ్మలు అమ్మ దగ్గర కథ వింటోంది. అప్పుడు డిస్టర్బ్‌ చేయడం యిష్టంలేక,  తర్వాతనైనా దాన్ని పలకరంచి సారీ చెబుతామని ఎంతో ఆత్రుతతో అటూ యిటూ పచార్లు చేశాను. కానీ గుండెలో భయం మాత్రం పోలేదు. చిన్నప్పుడు లెక్కలు తప్పు చేస్తే నాన్న  కొట్టడం గుర్తొచ్చింది. నాన్నంటే ఎంత భయమో యిప్పుడీ చిన్న ముండంటే అంత భయమూ పట్టుకుంది. కానీ అది దూరమవుతోందన్న  బెంగ పట్టుకు  పీడిస్తోంది.

మా యిద్దరి మధ్యా భూమి బద్దలై అది నాకు కనుమరుగయినట్లనిపిస్తోంది … అబ్బా! తల తిరిగి పెరట్లో మెట్లపై పడ్డాను. ఒక్క పరుగున అమ్మ వచ్చి లేపింది. కానీ కాలు బెణికి విపరీతంగా నొప్పిగా  ఉంది, ఏడుపొస్తోంది. అయినా నేనిలా మరీ పరాధ్యానంగా ఉండటానికి కారణం తనకీ తెలుసు. అందుకే ఏమీ అనలేకపోయింది. కనీసం ఈ క్షణాన్నైనా పిల్లవచ్చి కావలించుకుంటుందని అనుకున్నాను. కానీ అది నా అరుపు విని హాల్లో గుమ్మందగ్గర సగం వేసిన తలుపుకి బుగ్గలు ఆనించి భయం భయంగా చూసి వెళ్లిపోయింది. నాకు ఏడుపు ఆగలేదు.

భోజనాలయ్యాక చిన్నదాన్ని ఎలాగయినా దగ్గరికి చేర్చుకోవాలనుకున్నాను. బెడ్‌ రూమ్‌ కిటికీలోంచి అది వీధిలో వర్షానికి నిలిచిన నీళ్లని చూస్తోంది. వెనగ్గా వెళ్లి పట్టుకున్నాను.

‘‘నా తల్లి గదూ, బంగారం కదూ, రామ్మా…’ అంటూ మీదికి లాక్కోబోయాను. అది నన్ను విదిల్చుకుని లేవబోయింది. దాని కాళ్లు పట్టుకని భోరున ఏడ్చాను.

‘‘నన్ను వొంటరిదాన్ని చెయ్యద్దని’ ఏడుస్తూ దాని వొళ్లో తలవాల్చాను కొంతసేపటికి అది తన చిట్టి చేతులతో నా ముఖాన్ని ఎత్తి  కన్నీళ్లు తుడిచింది.

‘‘నాన్న వెళుతున్నాడుగా నువ్వెందుకు ఆఫీసుకి వెళ్ళడం. అమ్మమ్మ, పిన్నీ యింట్లోనే ఉన్నారుగా?’ అంటూ అదీ ఏడ్చింది.

‘‘లేదమ్మా నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను’’ అంటూ ఎత్తుకున్నాను. ఆ క్షణంలో నా ఆనందానికి అంతేలేదు. పిచ్చిగా అరిచాను. గట్టిగా నవ్వాను. దానితో దొంగా పోలీస్‌ ఆడాను. అంత చలిలోనూ  దానితో వీధి గేటు దగ్గర రోడ్డు మీదా నిలిచిన నీళ్లలో దానికంటే వేగంగా చిందులు వేశాను. ఈ ఆనందాన్ని పోగొట్టుకోకూడదనిపించింది. అలా ఆడుతూనే పిచ్చిదానిలా నవ్వుతూనే పక్కింటికెళ్లి ఫోన్‌ అడిగాను. అప్పటికి రాత్రి తొమ్మిది దాటింది. ఆఫీసర్‌ యింటికి ఫోన్‌ చేసి నేను వారం రోజులు రానని చెప్పాను.

ఆయనేమన్నాడో తెలీదు… వినలేదు… కాదు ఈ ఆనందంలో వినిపించలేదు..

— టి.లలితప్రసాద్‌

 

వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే!

ప్రయత్న పూర్వకంగానే యంత్రమయం చేసుకున్న బ్రతుకుల్ని కూడా కాలం తరుముతూనే ఉంటుంది. నిర్విరామంగా సాగిపోయే ఆ పరుగులో తుప్పట్టిన యంత్రాల వాసనే ఎటు చూసినా. ఆ పరుగైనా కాస్త జీవంతో నవ్వాలంటే మనల్ని ప్రేమించే ప్రకృతి సహాయం ఎంత అవసరమో, మూర్ఖుల్లా కళ్ళుమూసుకుని పరుగెడితే ఏం కోల్పోతామో సుస్పష్టంగా, సూటిగా, సరళమైన వాడుక భాషలో ‘సుహానా సఫర్ ‘ కవితలో చెబుతారు ఇక్బాల్ చంద్. 

iqbal

ప్రకృతి సౌందర్యానికి ఒక చిరునామా కోనసీమ. అక్కడి అందాల్ని పచ్చగా శ్వాసిస్తూ గోదారి పరవళ్ళలాంటి పదాలతో మనకు వర్ణించి చెప్తాడు కవి. మనసారా, తనువారా అక్కడి ప్రకృతి ప్రేమని అనుభవిస్తూ తన దాహార్తిని తీర్చుకోవాలనుకుంటాడు. ఏడ్చే బిడ్డను అక్కున చేర్చుకుని లాలించే తల్లి లాంటిది కోనసీమ అంటాడు మొదటి వాక్యంలోనే. అలా తల్లితో సమానమంటూ అగ్రతాంబూలమిచ్చేయడంలోనే తెలుస్తుంది అక్కడి ప్రకృతి మనకందించే ప్రేమ ఎలాంటిదో.

ఏడ్చే బిడ్డను లాలించి

          స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

          చందమామ చేపపిల్లనై ఎగురుతూ

          దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

అంతటి ప్రకృతి సౌందర్యానికి వర్షం కూడా తోడైతే ఇక భావుకుల పరిస్థితి చెప్పేదేముంది. మానసికానందానికి సమయం కేటాయించుకోలేని దైనందిన జీవితాలు ఎడారిలో పయనిస్తున్నట్టే ఉంటాయి. మనసనేది సంతోషపడకపోతే కళ్ళలోకి వెలుగెలా వస్తుంది మరి? అందుకే

ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

           కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

అంటాడు.

 

కోనసీమ అందాలు చూశాక మనసు తడవని మనిషుండడు. మచ్చుకైనా భావుకత్వం లేని మనిషైనా సరే, అక్కడి ప్రకృతిని కళ్ళార్పకుండా చూస్తాడు. అనుభూతులూ , స్పందనలూ అవసరం లేని కఠినమైన మనిషయినా, అక్కడున్నంతసేపూ, గోదారి నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ నాట్యమాడే పచ్చని చెట్టవుతాడు. అది చెప్పడానికే

 

ఇక్కడ పాషాణ కత్తులైనా

            విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

అంటాడు కవి.

 

నాగరికత అని అబద్ధం చెప్పుకుంటూ తిరిగే ఈ నాటి బ్రతుకుల్ని రక్షించేది, రక్షించాల్సిందీ ప్రకృతి ఒక్కటే. ప్రకృతిని సంరక్షించుకోలేకపోతున్నాం. ప్రేమించలేకపోతున్నాం. కనీసం ఆటవిడుపుగానైనా ప్రకృతిని కాసేపు చూస్తూ మన కళ్ళని వెలిగించుకోగలిగితే, పచ్చని పాటని కాసేపు వినగలిగితే, బ్రతుకు పరుగు అహ్లాదంగా సాగుతుంది.

  అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

            మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే

మనిషికి ఏనాటికైనా ప్రకృతే గమ్యమని చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన వాక్యం వేరే అవసరం లేదనుకుంటాను.

 

పూర్తి కవిత:

 

  సుహానా సఫర్

————

  ఏడ్చే బిడ్డను లాలించి

               స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

               వర్షం వచ్చి తడిసినా సరే

               కిటికీ తెరిచి చూపుల్తో అల్లుకోవాల్సిందే

               వెలిసిపోయే ఊపిరి చిత్రాలపై

               కొత్త రంగులు పూస్తాయి

               ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

               కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

               చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

               చందమామ చేపపిల్లనై ఎగురుతూ

               దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

               ఎక్కడి దుఃఖితుల చెంపల్ని తుడవటానికో

               ఆకుల సందుల్లోంచి జారిపోతూ మబ్బు చాపలు

               కాలం తరిమే బ్రతుకులై తేలిపోతూంటాయి.

               జల్లు పడుతూ … ఊగుతున్న చేట్లూ …

               అంతర్ముఖంగా మాత్రమే పలకరించే

               ఇంకా లిపి లేని ఏ భాషో ఆవిష్కరించుకుంటుంది.

               ఏ గంధర్వుడు వదిలి వెళ్ళిన స్వప్నాంతర్యమో

               పచ్చ శాలువా కప్పుకుని నడుస్తున్న

               నిండు గర్భిణీ గుంభనపునవ్వులా ఉంది

               ఎవరూ అల్లని ఈ పహ్చ తివాచీ మీంచి నడుస్తుంటే

               గోలీలాడుతూ పోగొట్టుకున్న క్షణాలు పలకరిస్తాయి

               గుండె ముడతలిప్పుతుంటే

               ఎన్ని నగ్న ప్రపంచాలు రెప్పలు తెరిచి నవ్వుతాయో

               ఇక్కడ పాషాణ కత్తులైనా

               విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

               ఇక్కడి ప్రతీ ఆకుకూ తెలుసు ప్రకృతి రహస్యం

               దాహార్తుల పెదాల్ని ఎలా స్పృశించాలో

               ఇక్కడ కదిలే ప్రతి గాలి పైటకూ తెలుసు

               ప్రకృతి కొత్త రుతువై మనిషిని కవిత్వం చేస్తుంది

               ఈ అనాథస్వామ్యంలో మనిషిని రక్షించేది ప్రకృతే

               అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

               మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే.

– ప్రసూన రవీంద్రన్ PrasunaRavindran

కిటికీ దగ్గర…

మనలో ఉత్తములైన వారికి కూడా భద్రతాభావాన్ని కలుగజేసే

నిరాశావాదం మీద అంత ఖచ్చితమైన అభిప్రాయముండేది కాదు నాకు.

నా మిత్రులు నన్ను చూసి పరిహసించిన రోజులున్నాయి.

నే నెన్నడూ మాటలమీద అంత పట్టున్నవాడిని కాను.

 

ఎందుకో, ఓ రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత,

చెప్పదలుచుకున్నది సరిగా చెప్పిన పేరూ లేదు నాకు,

దానికి కారణం చాలా సార్లు చెప్పడానికి ఏమీలేకపోవడమూ

ఏదో చెప్పాల్సి రావడం, ఎవరూ వినకూడదనుకోవడమూ.

 

నా జీవితం ఒకే ఒక దారప్పోగుకి వేలాడుతోంది.

నాకేమీ అర్థం కావడం లేదని అనిపించిన రోజులున్నాయి.

నా సంకెళ్ళు నీటిమీద తేలియాడుతున్నాయి.

నా కోరికలన్నీ నా కలల్లోంచి పుట్టినవే.

 

నా ప్రేమని నేను మాటలతో ఋజువుచేసేను.

నన్ను నేను ఎటువంటి అద్భుతమైన జీవరాశికి సమర్పించుకున్నాను!

నా ఆలోచనలు నన్ను బలవంతంగా, ఎంత దుఃఖమయమైన ప్రపంచంలోకి బంధిస్తున్నాయి!

నాదైన ఒక వింత ప్రపంచంలో నేను ప్రేమించబడ్డానని నమ్మకంగా అనిపిస్తుంది

 

నా ప్రేమిక భాష ఈ మానవభాషకి ఎంతమాత్రం చెందదు.

ఈ మానవ శరీరం నా ప్రేమిక శరీరాన్ని తాకనైనా తాకదు.

నా ఆలోచనలలో మోహ వాంఛలు అధికమూ, అనవరతమూ…

అయినప్పటికీ, నన్ను తప్పుచేయడానికి ఏదీ ప్రేరేపించలేదు.

 

***

సూచన: ఈ అనువాదంలో “ప్రేమిక” అన్న పదం స్త్రీ, పురుషులిద్దరికీ సమంగా వర్తిస్తుంది.

220px-Paul_Éluard_circa_1930

ఈ కవిత చాలా మానసిక విశ్లేషణతో కూడిన కవిత. దీన్ని అర్థం చేసుకుందికి కొంచెం పరిశ్రమ కావాలి. ఈ కవిత Platonic Loveకి ఒక ఉదాహరణ. మొదటివాక్యంలోనే ఒక అద్భుతమైన థీసిస్ ఉంది. “నిరాశావాదం చాలామందికి ఒక భద్రతాభావం ఇస్తుంది”… ఇది ఒక రకంగా Oxymoron. అంటే, పక్కపక్కనే రెండు వైరుధ్యభావనలని చెప్పడం. నిరాశావాదంలో భద్రత ఎక్కడినుండి వస్తుంది?  అభద్రతవల్లే కదా నిరాశ వస్తుంది? కాని, ఇందులో కవి చెప్పదలుచుకున్నది, కొందరు ప్రేమించడం కంటే, ప్రేమించామనుకున్న భావనను ప్రేమిస్తారు; లేదా, అవతలి వ్యక్తి నిజంగా ఎంత గాఢంగా ప్రేమిస్తున్నా, వాళ్ళ అసంతృప్తికి కారణం తిరిగి ప్రేమింపబడకపోవడం కాదు; అంతకుమించి వాళ్ళు కోరుకుంటున్నదేదో వాళ్ళకి దొరకకపోవడం.

మొదటి పద్యాన్ని, రెండవపద్యాన్ని ఇప్పుడు పోల్చి చూడండి. కొంతమంది ప్రేమని ప్రకటించేటప్పుడు మాటలు ఆచి తూచి వాడతారు. అంటే, వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలు బహిర్గతమవకుండా ప్రయత్నిస్తారు. అందుకే “వాళ్ళు పరిహసించిన రోజులున్నాయని కవి అంటాడు. నాకు మాటలమీద అంతపట్టులేదనీ, చెప్పదలుచుకున్నది సరిగా చెప్పగలిగిన పేరూ లేదనీ” అంటాడు. నిజానికి ప్రేమని ప్రకటించడానికి భాష ఆవశ్యకం కాదు, ఒక ఉపకరణం. “చాలా సార్లు చెప్పడానికి ఏమీ ఉండదు” అందుకని అతనికి భాషమీద పట్టు లేకపోయినా అది ఒక అవరోధం కాదు. అయినా, ఆ మాటాడేది కూడా ఏదో మాటాడాలి కాబట్టి. అది వినకపోయినంత మాత్రం చేత వచ్చిన నష్టం కూడ లేదు. ఎందుకంటే ప్రేమికులు ఒకరి సమక్షంలో ఒకరు, మాటాడిన విషయాలకంటే, మాటాడకుండా ఒకరితో ఒకరు సంభాషించుకునే విషయమే ఎక్కువ ఉంటుంది. Just you feel like spending eternity in the presence of your love… without speaking a word. అ సామీప్యం ఇచ్చే ఆనందం అటువంటిది.

 

తర్వాత పద్యంలో కవి తన మానసిక వ్యధను వెళ్ళగక్కుతున్నాడు. జీవితం ఒక దారప్పోగుకి వేలాడుతోంది… అంటే డెమొకిల్స్ కత్తిలాటిది కాదు. (అది జీవితాన్ని నిత్యం భయంతో ఉంచేది). ఇది గాలిపటంలాగ స్వేచ్ఛగా ఎగరడం లాటిది… ఒకే ఒక దారప్పోగుతో. నిజమైన ప్రేమ జీవితాన్ని తేలిక పరుస్తుంది. ఆ ప్రేమ అవతలి వ్యక్తినుంచి వచ్చేది కాదు… మనం అనుభవించే ప్రేమభావన. మనకు కలిగే ప్రేమభావన. అటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నప్పుడు, లేదా ఉండగలిగినప్పుడు, “ప్రేమిక” భాషకూడా అలౌకికంగా కనిపిస్తుంది. ఆ స్నేహం, ఆ ప్రేమా, భౌతికపరిమితులుదాటి భద్రంగా దాచుకోవాలనిపిస్తుంది. అదికూడా చెబుతున్నాడు కవి. నిజానికి అవతలివ్యక్తి మనం అనుకున్నంతగా మనల్ని ప్రేమించకపోవచ్చు. మనకి నిజానికి ఆనందం ఇచ్చేది అవతలివ్యక్తి మనల్ని అమితంగా ప్రేమిస్తున్నారని మనం మనసులో అనుకునే భావన. More than the other person loving us, we will be elated with our conception of other person loving us.

అలాగని ఇద్దరు స్త్రీపురుషుల స్నేహంలో శరీరక వాంఛలకి చెందిన భావనలు ఉండవా? ఉంటాయి. నైతిక ప్రమాణాలతో చూస్తే ఆ భావనలు అంత స్వచ్ఛమైనవేం కావు. అంతమాత్రంచేత అవి నిష్కల్మషంగా అవతలివ్యక్తితో ప్రవర్తించడానికి అడ్డురావు… ఒక ఆలోచన ఒక ఆలోచన. అంతే. అది ఆచరణ కాదు. ఆలోచనలని నియంత్రించలేము. కానీ మన ప్రవర్తనని మనం అదుపులో ఉంచుకోగలం. కానీ ఎప్పుడు? అటువంటి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలిగినప్పుడు. అలా ఉంచుకోగలిగినవారికే ఈ Platonic Love అర్థం కాగలదు.

 

ఇంతకీ, ఈ కవితకి కిటికీ అని శీర్షిక ఎందుకు పెట్టినట్టు? కిటికీ మనసుకి, మన అంతర్లోచనకి ఒక ప్రతీక. కిటికీలోంచి అన్ని ఇష్టమైన వస్తువుల్నీ చూస్తుంటాం. కానీ మనకు వాటిని అందుకోవాలన్న గాఢమైన కోరిక ఉండదు. అందలేదన్న నిరాశ ఉండదు. అందులోంచి వస్తువుల్ని పదే పదే చూస్తూ ఆనందించగలుగుతాం. అది ఒక రకమైన మానసిక ప్రేమ.

 

English Translation of Original:

 

At the Window

.

I have not always had this certainty,

this pessimism which reassures the best among us.

There was a time when my friends laughed at me.

I was not the master of my words.

A certain indifference,

I have not always known well what I wanted to say,

but most often it was because I had nothing to say.

The necessity of speaking and the desire not to be heard.

My life hanging only by a thread.

There was a time when I seemed to understand nothing.

My chains floated on the water.

 

All my desires are born of my dreams.

And I have proven my love with words.

To what fantastic creatures have I entrusted myself,

in what dolorous and ravishing world has my imagination enclosed me?

I am sure of having been loved in the most mysterious of domains, my own.

The language of my love does not belong to human language,

my human body does not touch the flesh of my love.

My amorous imagination has always been constant

and high enough so that nothing could attempt to convince me of error.

.

Paul Eluard

murthy gaaru— నౌడూరి  మూర్తి

గాంధీజీ హత్య-పోలీసు ‘శ్రాద్ధం’

Gandhi_Assassinationవర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను నిషేధించే మతవిశ్వాసమే పురురాజు ఓటమికి ఒక కారణం కావచ్చుననుకున్నాం. ఒకవేళ పురురాజే ఆ యుద్ధంలో గెలిచి ఉంటే భారతదేశచరిత్ర ఏ మలుపు తిరిగేదో!? అదలా ఉంచి, మతవిశ్వాసం లేదా మతఛాందసం చరిత్రను తిప్పిన మలుపులు ఇంకా ఉన్నాయి.  నాకు అర్థమైనంతవరకు గాంధీజీ హత్యోదంతం వాటిలో ఒకటి. ఎంతో కాలంగా నన్ను వెంటాడుతున్న ఆ కథనాన్ని మీతో పంచుకోడానికి ఇంతకంటె తగిన సందర్భం రాకపోవచ్చు. విషయమేమిటంటే, గాంధీ హత్యను నివారించలేకపోయిన అనేక వైఫల్యాలకు తోడు, ఒక పోలీస్ అధికారి మతవిశ్వాసం కూడా కొంత పాత్ర పోషించింది.

గాంధీజీ హత్యకు ఎలా పథక రచన జరిగిందో, దానిని ఎలా అమలు చేశారో, పోలీస్ దర్యాప్తు ఎలా సాగిందో పూసగుచ్చినట్టు వివరించిన రచనలు చాలానే వచ్చాయి. వాటిలో నేను చదినవి రెండు: మొదటిది, The men who killed Gandhi (మనోహర్ మల్గోంకర్). ఈ రచన ఆధారంగా త్వరలో సినిమా కూడా రాబోతోంది. రెండోది, Freedom at Midnight (Larry Collins and Dominique Lapierre).

మొదటగా గాంధీ హత్యలో పాల్గొన్న కుట్రదారుల పేర్లు చెప్పుకుని ముందుకు వెడదాం: 1. నాథూరాం గాడ్సే 2. నారాయణ్ ఆప్టే 3. విష్ణు కర్కరే 4. గోపాల్ గాడ్సే 5. మదన్ లాల్ పహ్వా 6. దిగంబర్ బడ్గే 7. శంకర్ కిష్టయ్య (బడ్గే దగ్గర పనివాడుగా ఉన్న ఇతను తెలుగువాడు)

1948, జనవరి 30న గాంధీ హత్య జరగడానికి పది రోజులముందు, జనవరి 20న గాడ్సే బృందం ఆయనను హతమార్చడానికి ఒక విఫలయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ ప్రసంగ వేదిక సమీపంలో బాంబు పేల్చిన మదన్ లాల్ పహ్వా పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే, గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తుల వివరాలు సేకరించి, ఇంకోసారి ఆ ప్రయత్నం జరగకుండా నివారించే గట్టి ఆధారం పోలీసులకు దొరికిందన్న మాట. పైగా పది రోజుల వ్యవధి కూడా ఉంది. అయినా నివారించలేకపోవడం భారత పోలీస్, పాలనావ్యవస్థలను శాశ్వతంగా సిగ్గుతో తలవంచుకునేలా చేసిన ఒక హాస్యాస్పద విషాదాధ్యాయం.

జనవరి 20 ప్రయత్నంలో కూడా ఒక మతవిశ్వాసం ప్రభావం చూపడం ఆసక్తికరం. ముందస్తు పథకం ప్రకారం, దిగంబర్ బడ్గే గాంధీ ప్రసంగ వేదిక వెనకనున్న సర్వెంట్స్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఒక గది కిటికీ లోంచి గాంధీ మీద కాల్పులు జరపాలి. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ గది గుమ్మంలో ఒక ఒంటి కన్ను మనిషి కనిపించాడు! బడ్గే గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాడు. ఒంటి కన్ను మనిషి కనబడడం పెద్ద అపశకునం కనుక నేను ఆ గదిలోకి వెళ్ళనని చెప్పేశాడు. ఆ తర్వాత, ఆ కిటికీ లోంచి గాంధీ పై బాంబు విసిరే పని గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేకు అప్పగించారు. కిటికీ చాలా ఎత్తుగా ఉండడంతో అతను ఆ పని చేయలేకపోయాడు. అంతలో మదన్ లాల్ బాంబు పేల్చడం, పోలీసులకు పట్టుబడడం జరిగిపోయాయి.

Nathuram

కూర్చున్నవారు-ఎడమనుంచి కుడికి: నారాయణ్ ఆప్టే, సావర్కర్, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే.
నిలబడినవారు-ఎడమనుంచి కుడికి: శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్ లాల్ పహ్వా, దిగంబర్ బడ్గే.

ఆ రోజు 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ డీ.డబ్ల్యూ. మెహ్రాకు సమాచారం అందింది. మదన్ లాల్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగానికి ఆయన ఆదేశించాడు. అంతలో, “ఈ కేసు దర్యాప్తు నేను స్వయంగా పర్యవేక్షిస్తాను, దాని గురించి పట్టించుకోకు” అని, ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ అధిపతిగా కూడా ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ చీఫ్ డీ.జే. సంజీవి ఆయనకు చెప్పాడు. ఏడు గంటలసేపు జరిగిన ఇంటరాగేషన్లో మదన్ లాల్ నుంచి మూడు ముఖ్యమైన క్లూలు దొరికాయి.  వాటి ప్రకారం, కుట్రదారులు ఏడుగురు. మదన్ లాల్ సహా ఏడుగురూ హత్యాయత్నానికి ముందు సావర్కర్ సదన్ కు వెళ్ళి ఆయనను దర్శించుకున్నారు. కుట్రదారులలో ఒకరి పేరు ‘కిర్క్రీ’( కర్కరే పేరు అలా చెప్పాడు). ఇంకొకరు(గాడ్సే) రాష్ట్రీయ లేదా అగ్రణి అనే మరాఠీ వార్తాపత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు(ఆ పత్రిక పేరు నిజానికి ‘హిందూ రాష్ట్ర’). ఇంటరాగేషన్ జరుగుతుండగానే కొంతమంది పోలీసులు హిందూ మహాసభ కార్యాలయానికీ, మెరీనా హోటల్ కూ పరుగుతీశారు. హోటల్ లో రూమ్ నెం.40లో వారికి నాలుగో క్లూ దొరికింది. అది హిందూ మహాసభ నాయకుడు అశుతోష్ లాహిరి సంతకంతో ఉన్న ఒక పత్రం.  గాడ్సే, నారాయణ్ ఆప్టేలు ఎనిమిదేళ్లుగా ఆయనకు తెలుసు. హిందూ రాష్ట్ర అనే పత్రికకు గాడ్సే ఎడిటర్ అని కూడా తెలుసు.

ఆ రోజు అర్థరాత్రికి మదన్ లాల్ ఇంటరాగేషన్ ముగించిన పోలీసులు, తొలి నాటి దర్యాప్తు వివరాలు నమోదుచేసి కేసు డైరీని మూసేశారు. ఆ ఏడుగంటల దర్యాప్తులో సేకరించిన వివరాలు పోలీసులకు ఎంతైనా సంతృప్తి కలిగించి ఉంటాయని Freedom at Midnight రచయితలు అంటారు. గాంధీ హత్యాయత్నం వెనుక ఒక పథకం ఉన్నట్టు పోలీసులకు అర్థమైంది. కుట్రదారుల సంఖ్య తెలిసింది. వారు, అప్పటికి కొన్ని మాసాలుగా పోలీసు నిఘాలో ఉన్న వీర సావర్కర్ అనుయాయులన్న సంగతి తెలిసింది. తమకు లభించిన సమాచారం ఆధారంగా కొద్దిపాటి ప్రయత్నం చేసి ఉంటే గాడ్సే, నారాయణ్ ఆప్టే లను వారు ఇట్టే గుర్తించి ఉండేవారు. వాళ్ళిద్దరూ ఢిల్లీ విడిచి పూణేకు బయలుదేరే లోపలే అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ అది జరగలేదు. కొన్ని గంటల వ్యవధిలో అంత విలువైన సమాచారం సేకరించిన ఆ దర్యాప్తు, ఆ తర్వాత ఆశ్చర్యం కలిగించేంత నత్త నడక నడిచింది. అది ముప్పై ఏళ్ల (1976 నాటికి ) తర్వాత కూడా వివాదం రేకెత్తిస్తూనే ఉందని పై రచయితలు అంటారు.

 

కుట్రదారులు బొంబాయి రాష్ట్రానికి చెందినవారని తెలిసింది కనుక, కేసు బాధ్యతను ఎవరైనా ఒకరికి  అప్పజెప్పవలసిందిగా బొంబాయి పోలీసులను సంజీవి కోరాడు. వారితో దర్యాప్తును సమన్వయం చేయడానికి ఢిల్లీ సీ.ఐ.డీ అధికారు లిద్దరిని బొంబాయి పంపించాడు. అయితే, ఆ ఇద్దరూ మదన్ లాల్ ఇచ్చిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కానీ, గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రికకు సంబంధించిన ఉజ్జాయింపు సమాచారాన్ని కానీ తీసుకెళ్లకుండా చేతులూపుకుంటూ బొంబాయి చేరారు. వాళ్ళ దగ్గర ఉన్నది ‘కిర్క్రీ’ అనే పేరు రాసుకున్న చిన్న కాగితం ముక్క మాత్రమే.

ఆ సమయంలో బొంబాయి రాష్ట్రంలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి హోం మంత్రిగా ఉన్నారు. అప్పటికి వారం రోజుల క్రితం, గాంధీని హత్య చేయబోతున్నామని ఒక వ్యక్తితో మదన్ లాల్ అన్నట్టు వేరే మార్గంలో ఆయనకు సమాచారం అందింది. బొంబాయి సీ.ఐ.డీ స్పెషల్ బ్రాంచ్ కి ఇన్ చార్జిగా ఉన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ నగర్వాలాకు దర్యాప్తు బాధ్యత అప్పగించిన హోం మంత్రి, ఈ సమాచారం కూడా ఇచ్చాడు. అహమ్మద్ నగర్ కు చెందిన విష్ణు కర్కరే పేరు ఆ సమాచారంలో ఉంది.  అంటే, ఢిల్లీ అధికారులు తనను కలసుకునే సమయానికే నగర్వాలా వద్ద వారి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ, మెరుగైన సమాచారం ఉందన్న మాట.

కర్కరేను గుర్తించడానికి నగర్వాలా వెంటనే సిబ్బందిని రంగంలోకి దించాడు. మదన్ లాల్ వారం క్రితం సావర్కర్ ను కలసిన భోగట్టా కూడా తన వద్ద ఉండడంతో సావర్కర్ ను అరెస్ట్ చేయడానికి అనుమతించమని మొరార్జీ దేశాయిని కోరాడు. దేశాయి కోపంతో మండిపడుతూ “నీకేమైనా పిచ్చా? ఈ రాష్ట్రం మొత్తం భగ్గున అంటుకు పోవాలని నీ ఉద్దేశమా?” అన్నాడు. నగర్వాలా దాంతో అరెస్ట్ ఆలోచన విరమించుకుని సావర్కర్ ఇంటి దగ్గర నిఘా పటిష్టం చేశాడు. కొన్నిగంటల్లోనే అతనికి విష్ణు కర్కరే గురించి సమాచారం అందింది. అంతలో పూణేకు చెందిన చిన్నపాటి ఆయుధ వ్యాపారి దిగంబర్ బడ్గే, కర్కరే సహచరుడన్న సంగతి ఒక పోలీస్ ఇన్ ఫార్మర్ ద్వారా తెలిసింది. ఆ భోగట్టాతో పూణే పోలీసులు బడ్గే దుకాణానికి వెళ్లారు. బడ్గే వారికి కనిపించలేదు. విచిత్రం ఏమిటంటే, ఆ తర్వాత పూణే పోలీసులు బడ్గే ఆచూకీ కోసం మళ్ళీ ప్రయత్నించలేదు. తనకోసం పోలీసులు వచ్చి వెళ్ళిన కొన్ని గంటలకే పూణే చేరుకున్న బడ్గే తర్వాత పది రోజులపాటు తన దుకాణంలో కూర్చుని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అల్లుకుంటూ తీరుబడిగా గడిపాడు.

ఢిల్లీ సీ.ఐ.డీ నుంచి వచ్చిన ఇద్దరు అధికారుల వద్దా పనికొచ్చే సమాచారం ఏమీ లేకపోవడంతో వాళ్ళ సాయం తనకు అక్కర్లేదనుకున్న నగర్వాలా తన వద్దనున్న సమాచారం వారికిచ్చి ఢిల్లీ పంపేశాడు.

జనవరి 24 కల్లా మదన్ లాల్ తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని కక్కేశాడు. ముఖ్యంగా గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రిక పేరును హిందూ రాష్ట్రీయ గా దాదాపు కరెక్టుగా చెప్పి, అది పూణే నుంచి వెలువడుతుందని కూడా చెప్పాడు. ఢిల్లీ లోని హోం శాఖకు గానీ, సమాచార-ప్రసార శాఖకు కానీ ఒక్క సబ్ ఇన్ స్పెక్టర్ ను పంపితే, ఆ పత్రిక వివరాలు అన్నీ క్షణాలలో తెలిసిపోయేవి. కానీ ఢిల్లీ పోలీస్ చీఫ్ సంజీవి ఆ పని చేయలేదు. గాడ్సే, ఆప్టే లను ఎనిమిదేళ్లుగా ఎరిగున్న అశుతోష్ లాహిరి అనే హిందూ మహాసభ నాయకుని సంతకం ఉన్న పత్రం మొదటి రోజే దొరికినా ఆయనను ప్రశ్నించలేదు. మదన్ లాల్ ఇచ్చిన తాజా సమాచారాన్ని బొంబాయిలోని నగర్వాలాకు అత్యవసరంగా పంపే ఏర్పాటు కూడా చేయలేదు. పూణే పోలీసులకు ఒక్క ఫోన్ కాల్ చేసి హిందూ రాష్ట్ర ఎడిటర్ గురించి అడిగినా చెప్పేవారు. అదీ చేయలేదు.

ఇప్పుడిక ఆయన కంటే ఘనుడైన పోలీస్ అధికారి గురించి చెప్పుకుందాం. ఆయనే నిజానికి మన కథానాయకుడు.  పేరు యూ.హెచ్. రాణా. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ హోదాలో ఆయన పూణేలో నేర దర్యాప్తు విభాగం ఇన్ చార్జిగా ఉన్నాడు. జనవరి 25వ తేదీన ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చాడు. పూణేలో ఆయన దగ్గర ఉన్న ఫైళ్లలో గాడ్సే, ఆప్టే, బడ్గే, కర్కరేల గురించిన మొత్తం సమాచారం ఉంది. కర్కరే, ఆప్టేల ఫోటోలు కూడా ఉన్నాయి.  వెంటనే చేయవలసింది, ఆ ఫోటోలను బిర్లా హౌస్ లో గాంధీకి కాపలాగా ఉన్న పోలీసులకు పంపడం. అది జరగలేదు.

రాణాను సంజీవి  తన కార్యాలయానికి పిలిపించాడు. 54 పేజీలు ఉన్న మదన్ లాల్ వాఙ్మూలంలో ఒక్కొక్క పేజీనే  రెండుగంటలపాటు ఇద్దరూ పరిశీలించారు. అందులోని ప్రతి వాక్యానికీ రాణా అప్రమత్తుడు కావలసిందే. ఎందుకంటే కుట్రదారులలో కనీసం ఇద్దరు ఆయన అధికార పరిధిలోకి వస్తారు. హిందూ రాష్ట్ర  అనే పత్రిక పేరు ఆయనకు తెలియక పోయే ప్రశ్నే లేదు. ముందు సంవత్సరం జూలై లోనే ఆ పత్రిక మూసివేతకు ఉత్తర్వులిచ్చారు. ఆ పత్రిక పై ఉంచిన పోలీస్ నిఘాను నవంబర్ లో రాణా స్వయంగా రద్దుచేశాడు. అంతకుముందు పూణేలో జరిగిన ఒక బాంబు పేలుడుకు ఆప్టే బాధ్యుడన్న సమాచారమూ ఆయన దగ్గర ఉంది.

తన అధికార పరిధిలోకి వచ్చే ఇన్ని కీలక వివరాలు దొరికినా, రాణా కనీసం తన కింది అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేదు. తక్షణమే దర్యాప్తు ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వలేదు. తనైనా హుటాహుటిన విమానంలో బయలుదేరి వెళ్లాలనుకోలేదు. విమాన ప్రయాణం ఆయన ఆరోగ్యానికి పడదట. రైలులో బొంబాయికి బయలు దేరాడు. అది కూడా చుట్టుదారిలో వెళ్ళే ఒక లంఖణాల బండిని ఎంచుకున్నాడు. దాంతో 36 గంటలు పట్టే ప్రయాణకాలానికి మరో 6 గంటలు జమయ్యాయి. అదలా ఉండగా, Freedom at Midnight ఇవ్వని ఒక అదనపు సమాచారాన్ని, నాకు గుర్తున్నంతవరకు, The men who killed Gandhi ఇచ్చింది.  అది బాధనూ, నవ్వునూ కూడా తెప్పించే సమాచారం. రాణా మార్గ మధ్యంలో (గయలో?) దిగి పితృదేవతలకు పిండప్రదానం చేశాడు!

జనవరి 20 న గాంధీ పై జరిగిన హత్యా ప్రయత్నం పై దర్యాప్తు ఇలా నత్త నడకన సాగుతుండగానే అక్కడ పూణేలో గాడ్సే బృందం మరో ప్రయత్నానికి శరవేగంతో సన్నాహాలు చేసుకుంటూ పోయింది. తన శ్రాద్ధ కర్మ ముగించుకుని రాణా మళ్ళీ లంఖణాల రైలెక్కి బొంబాయిలో దిగే లోపలే గాడ్సే, ఆప్టే లు ఢిల్లీ విమానం ఎక్కేశారు. జనవరి 30 న వారు తమ పథకాన్ని అమలు చేయడం… చరిత్ర.

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)—కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

పద్దెనిమిది గంటలు

417671_580561545289734_1052452842_n

రామాచంద్రమౌళి తొలికథ  ‘సువర్ణశతదళ పుష్ప రహస్యం’ 1964లో చందమామలో ప్రచురితమైంది. ఇప్పటివరకు 250 దాక  కథలు రాశారు. 18 నవలలు, 8 కవితాసంకలనాలు, రెండు విమర్శా పుస్తకాలు వెలువరించారు. అనేక సాహిత్య వ్యాసాలు రాశారు. అవి రెండు సంకలనాలుగా వచ్చాయి. ఇంగ్లీషు, తమిళ్‌, మలయాళీ, కన్నడ, పంజాబీ, బెంగాళీ భాషల్లోకి ఈయన రచనలు అనువాదమయ్యాయి. 2011లో గ్రీస్‌లో జరిగిన ‘22వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయెట్స్‌’లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.  అలాగే సార్క్‌సాహిత్య సమవేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లారు. పలు టెలీఫిలిమ్స్‌ రాశారు. ఇప్పటికే అనేక పురస్కారాలు అందుకున్న రామాచంద్రమౌళి ప్రస్తుతం వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్‌ కాలేజిలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.–వేంపల్లె షరీఫ్

***

 

 

   భారతదేశం.

                చెన్నై ఇంటర్‌నేషనల్‌ ఏర్‌పోర్ట్‌..అటు హార్బర్‌.

                హార్బర్‌నుండి పన్నెండువందల ముప్పయి కిలోమీటర్ల దూరంలో అండమాన్‌ నికోబార్‌ దీవులు.

                అండమాన్‌ రాజధాని పోర్ట్‌ బ్లైయర్‌.

                వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

                పోర్ట్‌ బ్లెయర్‌లో కేంద్రపాలిత ప్రాంత నగరం..సకల పాలనావ్యవస్థ కేంద్రీకృతమై.,

                నగరం నడిబొడ్డున 1896-1906 మధ్య బ్రిటిష్‌వాళ్ళచే నిర్మించబడిన.. భారతదేశ శుద్ధ స్వాతంత్య్ర సమరయోధులను కఠినాతికఠినంగా, రాక్షసంగా, అమానవీయంగా హింసించి వందలమందిని ఉరితీసిన 696 ఒంటరి కారాగార గృహాలు గల ‘సెల్యులర్‌ జైల్‌’

కేవలం పర్యాటక వ్యాపకాన్నే జీవనవనరుగా బ్రతుకులను వెళ్ళదీసే నిజాయితీ, అమాయకత్వం నిండిన జనం..,

పోర్ట్‌బ్లెయర్‌ నుండి..చుట్టూ తన మాతృకౌగిలిలో జోలబుచ్చే బంగాళాఖాత సముద్రంలో.. యాభై కిలోమీటర్ల దూరంలో ప్రశాంతంగా..హావలక్‌ ద్వీపం.

హావలక్‌ ద్వీప..శాంత గంభీర తూర్పు తీరంవెంట..,

యుగయుగాలుగా అమాయకులను కొల్లగొట్టి, ప్రకృతి వనరులను ధ్వంసించి, ఆక్రమించి, అతిక్రమించి, సకల మానవీయ ధర్మాలను ఉల్లంఘించి కొనసాగిస్తూ వస్తున్న దోపిడీ వర్గాల స్థావరాలు.. లగ్జరీ విల్లాలు..వరుసగా..సండేజ్‌ బీచ్‌ రిసార్ట్‌, అంజనా బీచ్‌ రిసార్ట్‌, బే వ్యూ రిసార్ట్‌, స్మైల్‌ గార్డెన్‌ రిసార్ట్‌, హాప్పీ రిసార్ట్‌, సీషెల్స్‌, ఎక్కోవిల్లా, అమెజాన్‌ బీచ్‌ రిసార్ట్‌..ఒక పరంపర.

‘చీమలుపెట్టిన పుట్టలు పాముల..’ ఒక అనుభవసూత్రం.. యుగయుగాలనాటి పాతది.

ఈ దీవులలో ఎక్కడా..స్థానీయ అండమాన్‌ మూలవాసి ఒక్కరుకూడా కనబడని అత్యంత విషాదకర సందర్భంలో.,

జైలుదేశమైన అండమాన్‌కు.. అవసరార్థమై, బానిస పనులకోసం, పొట్టకూటికోసం, దిక్కులేని పరిస్థితుల్లో, మనుషులు వలసలై..వలస పకక్షులై..ఏ చెట్టుపక్షో ఈ కొమ్మపైవాలి..ఏ కొమ్మ పూలో ఈ దండలో ఒదిగి.,

గ్రీన్‌ వ్యాలీ రిసార్ట్‌,

సాయంత్రం నాలుగ్గంటలు.. సూర్యాస్తమయానికింకా రెండున్నరగంటల వ్యవధి.

ఎదుట ప్రశాంతంగా.. నిశ్శబ్దంగా సముద్రం..నీలిరంగు నీరు..నీలిరంగుదే ఆకాశం. అది సిల్వర్‌ సాండ్‌ ప్రాంతం.. యిసుకంతా వెండిరజనువలె..మెత్తగా, సన్నగా, పొడిపొడిగా..మెరుస్తూ.,

అందమైన ఎనిమిది ఏర్‌కండిషన్డ్‌ గదులతో మనుషులు ముట్టుకుంటే మాసిపోయేట్టున్న మెరుగుపెట్టబడ్డ వెండిగోడలతో నిర్మించినట్టున్న నిశ్శబ్ద, సుందర, నిర్మానుష్య, నిసర్గ సౌందర్య భవనపు ముందున్న ‘బే సీ’ షెల్టర్‌ క్రింద..ఆమె..ముప్పది ఎనిమిదేళ్ళ ప్రౌఢ..చురుకైన జింక కళ్ళు, పదునైన పాదరసంవంటి మేధ, బంగారంతో పోతపోసినట్టున్న శరీరం, దేవతలందరూ పోటీపడి శిల్పించి తుదిరూపమిచ్చినట్టున్న కాంతులీనే మేను, లిప్తకాలంలో సూపర్‌ కంప్యూటర్‌ వేగంతో వ్యూహాలను రచించగల హృదయం.. ఆమె..అరుంధతి ఆడెపు. బి.టెక్‌..ఐఐటీ మద్రాస్‌, ఎమ్‌టెక్‌.. ఐఐటి కాన్పూర్‌, ఎమ్‌బిఎ ఐఐమ్‌ అహమ్మదాబాద్‌,

చూస్తోంది అరుంధతి సముద్రంలోకి, ఆకాశంలోకి, శూన్యంలోకి..శూన్యాంతరాల్లో.. మౌనంగా..నిశ్శబ్దంగా.. అభావంగా.

ఎమ్‌బిఎలో టాపర్‌ ఐ స్వర్ణపతకాన్ని సాధించి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎనిమిది బహుళజాతి కంపెనీల్లో ఏడాదికి అరవై లక్షల జీతంతో అవకాశాలను పొందగలిగిన తను.. ఏ ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు.

స్వతంత్రత.. స్వతంత్ర జీవితం.. స్వతంత్ర అభివృద్ధి..స్వతంత్ర సంపాదన..స్వతంత్ర అధిపత్యం.

”డెసిషన్‌ మేకింగ్‌” చాప్టర్‌ను చెబుతున్నపుడు ప్రొఫెసర్‌ మౌళి చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి అరుంధతికి చటుక్కున..ఆయనన్నాడు.. ‘జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన సందర్భం రావద్దు..’ అని.

చాలా లోతైన, పరమసత్యమైన, గంభీరమైన ప్రవచనమది. ఆ క్షణం చాలా ఆలోచించింది తను.

నిర్ణయం..డెసిషన్‌..దేని గురించైనా కావచ్చు..ఉద్యోగం..ప్రేమ..పెళ్ళి..పిల్లలు..వ్యూహాలు, పథకాలు, ప్రణాళికలు, రాజకీయాలు, క్రీడలు, కుట్రలు, కుతంత్రాలు..త్యాగాలు..చివరికి యుద్ధాలు.,

నిర్ణయమంటే..ఒకానొక ఎత్తుగడ.. ఒక అడుగు.. ఒక కదలిక.. ఒక ఆయుధం.

”ట్రణ్‌ణ్‌ణ్‌ణ్‌..” మొబైల్‌ మ్రోగింది. ఉలిక్కిపడ్డది అరుంధతి.. ఏదో తెగిపడ్డట్టు., ఏదో చిట్లిపోయినట్టు..ఎవరో   బలవంతంగా తట్టినట్టు.,

‘హలో..’ అంది మృదువుగా..తీయగా..గంభీరంగా.

‘మేడం వుయార్‌ రీచింగ్‌.. ఎక్స్‌ అండ్‌ వై’ అంది మృదుల అట్నుండి. మృదుల అరుంధతి పర్సనల్‌ సెక్రటరీ.

‘హౌ’

‘బై ఎ స్పెషల్‌ ఫెర్రీ’

‘వాటెబౌట్‌ ఎ అండ్‌ బి’

‘దె డు కం..బై ఎనదర్‌ వాటర్‌ వెహికిల్‌ సూన్‌.. మోస్లీ విథిన్‌ ట్వంటీమినట్స్‌’

‘మన షెడ్యూల్‌లో డిలే ఏమి లేదుకదా..ప్రాజెక్టు ఫర్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’

‘నో డిలే మేడం..’

‘దట్స్‌ గుడ్‌.. డు కం’ – లైన్‌ తెగిపోయింది.

అరుంధతి ఎందుకో లేచి..రెండు నిముషాలు మెత్తని ఇసుకపై నడుస్తూ, అటు పశ్చిమాకాశంవైపు చూసింది. సూర్యుడు అలసి ఎర్రగా..ఎత్తైన కొండల చాటున,

ఉదయం..అస్తమయం..పొంగుట, కృంగుట.. గెలుచుట ఓడిపోవుట..జన్మించుట మరణించుట.. ఈ ద్వంద్వాలన్నీ పరమసత్యాలేననీ తెలిసి మనిసి.. హుఁ.,

నిట్టూర్చింది అరుంధతి చేతులను వెనక్కి ముడుకుని..నడుస్తూ.

చుట్టూ సముద్రపుటలల లయాత్మక ధ్వని..కొబ్బరిచెట్ల కొమ్మల వింతరొద, చెట్ల గుబుళ్ళలోనుండి పకక్షుల గోల.. వీటన్నింటి మధ్యా నిశ్శబ్దమైన గాలి శబ్దం.

కళ్ళుమూసుకుని ఈ పద్నాలుగ్గంటల ప్రణాళిక, రూపకల్పన, మనుషుల అంగీకారత, వాళ్ళ వాళ్ళ వాటాల వితరణ, సకల సుఖవంతమైన సౌకర్యాల ఏర్పాటు.. ఈ అన్ని విధులనూ తన అజ్ఞాత కంపెనీ ‘రైడర్స్‌’ ఉద్యోగులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహించుట..,

ఎక్కడా రవ్వంత కూడా సడలని నిష్టాపూరితమైన క్రమశిక్షణ..జాగ్రత్త..సమర్థత కనిపించేది దొంగల్లో, దోపిడీ దారుల్లో, ఆక్రమణదారుల్లోనేకదా. అప్రమత్తత, వ్యూహాత్మకత, దీర్ఘదృష్టితో వీక్షణ.. ఇవన్నీ వ్యాపారాత్మక విజృంభణకు మూలలక్షణాలు.

‘మనిషిలోని బలహీనతలను సంపదగా మార్చుకోవడమే వ్యాపారం’ అనికదా ప్రొఫెసర్‌ మౌళి చెప్పింది.

బలహీనత..సంపద

సంపదే బలహీనత- సంపదకు లొంగనివాడెవరున్నారీ ప్రపంచంలో.. సంపదంటే డబ్బు, బంగారం, భూములు, ఆస్తులు, అందాలు, వయస్సు..దేహం..దేహసౌందర్యం..తెలివి..ప్రతిభ.. ఏదైనా.

కళ్ళు మూసుకుంది అరుంధతి సాలోచనగా.

‘ఆపరేషన్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’ ఒకసారి వీడియో ఫిల్మ్‌వలె కదిలింది మదిలో.

‘ఈ ప్రపంచంలో, ఎవరైనా ఏదో ఒకదానికి తప్పనిసరిగా లొంగిపోతారు ‘అన్న సార్వత్రిక సూత్రం తన అజ్ఞాత సంస్థ ‘రైడర్స్‌’ ఆవిర్భవానికి మూలసూత్రం.. సంస్థకు అసలు ఆఫీసే ఉండదు. తనది ఒక ‘వర్చువల్‌ ఆర్గనైజేషన్‌’. ఉద్యోగులందరూ వర్కింగ్‌ ఫ్రం హోమ్‌ ఆర్‌ సెల్‌. అవసరమైతే తప్ప ఎవరికి ఎవరూ కనబడరు. రెండువందల నలభై రెండు మంది ఉద్యోగులని కలిగి, నెలకు పదిహేను కోట్ల జీతాలను బట్వాడా చేస్తూ కనీసం నెలకు పదివేలకోట్ల టర్నోవర్‌తో వందకోట్ల లాభమైనా సంపదించకుండా ఉండలేని తన కంపెనీ వాస్తవంగా ఒక వర్చువల్‌.. అభౌతిక సంస్థ. ఎక్కువమంది అరవైకి పైబడ్డ వయసు కలిగి..ప్రభుత్వ సెక్రటేరియట్లలో పూర్వ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీస్‌, ఇంటలిజెన్స్‌ శాఖలో ఉన్నతోద్యోగులుగా, దేశ ప్రధాన వనరులు, పరిశ్రమలకు సంబంధించిన మాజీ ఎగ్జిక్యూటివ్స్‌, బ్యాంక్‌ల రిటైర్డ్‌ జి ఎమ్‌ స్థాయి ఉద్యోగులు.. ఎవరెవరికి కీలకమైన పదవుల్లో ఎన్నెన్ని ఎక్కువ పరిచయాలున్నాయో అటువంటి వ్యక్తులు.. వాళ్ళతో కూడిన విశాలమైన నెట్‌వర్క్‌ తనది. రిటైర్డ్‌ ఇండస్ట్రీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రామనాథన్‌ పిళ్ళై యిప్పుడీ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతనికి బొగ్గు, చమురు, గ్రానైట్‌ నిక్షేపాల నేపథ్యంతో సంబంధమున్న ఉన్నతాధికారుల, సంబంధిత రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు..అందరూ తెలుసు సన్నిహితంగా. అందరితోనూ బేరసారాలు చేయగలడు. రేట్లు ఫిక్స్‌చేసి అన్నిరకాల డీల్స్‌ కుదుర్చగలడు. రామనాథన్‌ పిళ్ళైవంటి రీజనల్‌, నేషనల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఎందరో తన దగ్గర.. ప్రకాశ్‌ సింగ్‌ ఝా, మధుకర్‌ ముండా, చిత్రా బన్సల్‌, సత్యరంజన్‌ ఘోష్‌, తాతినేని రాంబాబు..ఎందరో..నెలకు ఒక్కొక్కరికి నాల్గునుండి ఏడెనిమిది లక్షలవరకు జీతాలు, సౌకర్యాలు అదనం. అందరిపైనా వాళ్ళకు తెలియకుండా అదృశ్యనిఘా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవర్తో మాట్లాడున్నారు..ఎవర్ని కలుస్తున్నారు..అన్నీ మరుక్షణంలో సమాచారమంతా తనముందు ప్రత్యక్షం.

మనిషికి సంపాదించడం మత్తు.. మెట్లెక్కుతూ పోవడం ఒక పిచ్చి.. ఎక్కడం ప్రారంభమైన తర్వాత.. ఎప్పటికైనా క్రిందకు దిగక తప్పదన్న స్పృహే ఉండని ఉన్మాదం. జీవితమంతా పరుగు..పరుగు..పరుగులో ఉన్నప్పుడు పూర్తిగా నశించిపోయే విచక్షణ. కనిపించేది కేవలం టార్గెట్‌..గమ్యం..గమ్యమంటే డబ్బు..సంపద..

ఎంత సంపద.. ఎంత డబ్బు

వ్చ్‌..ఏమో.

 

*                              *                               *                              *

 

 

చాలా రహస్య పర్యటన..కేవలం పదిగంటలే.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌.. గనులశాఖ..చదువు పదవ తరగతి ఫెయిల్‌.గనులంటే ఏమిటి..వనరులంటే ఏమిటి..ఏ ఖనిజాన్ని దేనికి ఉపయోగిస్తారు..తను కాగితంపై సంతకం పెడ్తే ఎందుకు కోట్లకు కోట్లు చేతులుమార్తాయో..తెలియదు అతనికి.

క్రింద బ్యూరోక్రాట్స్‌ ఏది చెప్తే అది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌..అన్నీ సెక్రటరీ రామ్‌సింగ్‌ ముద్గల్‌.. ఏది చెప్తే అది.

జెట్‌ ఏర్‌వేస్‌ విమానం..చెన్నై టు పోర్ట్‌ బ్లెయర్‌..ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌..రెండు గంటలు గాల్లో ఎగిరివచ్చి..వీర్‌ సావర్కర్‌ ఇంటర్నేషనల్‌ ఏర్‌ పోర్ట్‌లో ఆగింది..వెనుక ఎకానమీ క్లాస్‌లో సన్యాల్‌ పర్సనల్‌ సెక్యురిటీ.. ఎస్‌పిజి కమెండో రఘు సర్కార్‌.

సన్యాల్‌ వయసు యాభై ఎనిమిది..శరీరంనిండా రోగాలే అడవిలో చెట్లవలె.

‘ ఈ సెక్యూరిటీగాణ్ణి ఎలా తప్పించాలి’ అని ఆలోచిస్తున్నాడు సన్యాల్‌ అప్పట్నుండి.

ఏర్‌పోర్ట్‌ బయటికి రాగానే ఒక నల్లని ఆడి క్యూఫైవ్‌ కారొచ్చింది మెత్తగా.

అలా వస్తుందని తెలుసు మంత్రి సన్యాల్‌కు కార్లో కేవలం డ్రైవర్‌..నంబర్‌ చూచుకున్నాడు కార్‌ది. ఓకె.

‘రఘూ..తుమ్‌ ఐసా కరో..యహీ సిటిమే రహెజావ్‌.. ఏరాత్‌.. ఫిర్‌ సుబే ఛేబజే యహా ఆనా..యహీ ఏర్‌పోర్ట్‌మే..ఏలో..పాంచ్‌ హజార్‌..’

రఘు మంత్రి ముఖంలోకి చూశాడు. హత్యానంతరం హంతకుని ముఖంవలె ఉంది మంత్రి ముఖం.. అపరాధ భావరతో.

”ఠీక్‌హై..మై యహా సెల్యులర్‌ జైల్‌ దేఖ్‌నే జావూఁగా..కల్‌ ఛేబజే”.. రఘు ఎందుకో అప్రయత్నంగానే తన సఫారీ డ్రెస్‌ ప్యాంట్‌ జేబును తడుముకున్నాడు. లోపల బెరెట్టా 5 ఎంఎం రివాల్వర్‌ భద్రంగా.

తను ఒక పరమ అవినీతిపరుడైన, దేశాన్ని కొల్లగొడ్తూ వనరులను తోడుకుతింటున్న, దేశద్రోహమంత్రికి బాడీగార్డ్‌..రక్షకుడు.. కాపలాదారు.

ఛీ ఛీ…

కొన్నేండ్లుగా గుండెలను తొలిచేస్తున్న కుమ్మరిపురుగులాంటి భావన.. న్యూనత.. సిగ్గు..లోపల ఏదో దహించుకుపోతున్న.. ఏదో ధ్వంసమైపోతున్న ఫీలింగ్‌.

రఘు చూస్తుండగానే..ఆడి కార్‌ రబ్బర్‌ పలకపై గాజుగోళీలా జారిపోయింది మంత్రిని మోసుకుని.

పది నిముషాల తర్వాత..చత్తాం వార్ఫ్‌.. అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక వాటర్‌ వెహికిల్‌.. కార్‌తో సహా నౌకలోకి ఎక్కి.. నౌక కదిలి..

చుట్టూ నీలిరంగు సముద్రం..సాయంసంధ్య..దూరంగా హవ్‌లక్‌ ద్వీపం..వరుసగా రిసార్ట్స్‌..లీలామాత్రంగా…

కుట్రలూ, దోపిడీలు, వ్యూహాలూ, ఆక్రమణలూ..అన్నీ ఎప్పుడూ నిశ్శబ్దంగానే జరుగుతాయి.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌ తలలో ఈ డీల్‌ద్వారా తన అకౌంట్‌లో జమచేయబడబోతున్న పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల డబ్బు తాలూకూ స్పృహ తారాజువ్వలా విప్పుకుని వెలుగుతూ గిలిగింతలు పెడ్తోంది.

 

*                         *                               *                                *

 

క్విడ్‌ ప్రో కొ..ఇచ్చి పుచ్చుకునే ఒక పరస్పర ఒప్పందం.

ఏమి యిచ్చి…ఏమి పుచ్చుకుని.,

ఏదైనా.. బొగ్గుయిచ్చి.. డబ్బు పుచ్చుకుని, గ్రానైట్‌ యిచ్చి డబ్బు పుచ్చుకుని..పవర్‌ ప్రాజెక్ట్‌లు యిచ్చి డబ్బు పుచ్చుకుని.. సెజ్‌ల కింద ప్రభుత్వ భూములను చౌకగా యిచ్చి డబ్బు పుచ్చుకుని.,

యివ్వవలసిన వాటిగురించి చూచుకునేందుకు తన ఉద్యోగి పార్థసారధి రామన్‌.. ఐఎఎస్‌, పార్మర్‌ యిండియన్‌ అంబాసిడర్‌ టు సౌతాఫ్రికా, పుచ్చుకోవలసిన డబ్బు..కోట్ల రూపాయల డబ్బు బట్వాడా..వాళ్ల వాళ్ళ అకౌంట్లలోకి భద్రంగా చేర్చే ప్రక్రియను పర్యవేక్షించేందుకు అరవై ఐదేండ్ల చార్టర్డ్‌ అకౌంటెంట్‌ జొన్నవిత్తుల రామారావు..ఫార్మర్‌ ఆడిటర్‌ జనరల్‌.

మనుషుల ప్రతిభా వ్యుత్పత్తులను ‘చెల్లించి వినియోగించుకో’.. పే అండ్‌ యూజ్‌..లేటర్‌ యూజ్‌ అండ్‌ త్రో..సానిటరీ నాప్‌కిన్‌వలె..

ఆ రాత్రి తొమ్మిదిగంటల వేళ.. బంగాళాఖాత సముద్రతీరంపై.. ఆ రిసార్ట్‌ ముంగిట్లో..పరిచిన పిండివెన్నెల్లో..సన్నగా పాలకాంతిని విరజిమ్ముతున్న టేబుల్‌లాంప్‌ ప్రక్కన.. తళతళా మెరిసే గాజుగ్లాస్‌లో..బంగారురంగు ‘మెకల్లన్‌’ విస్కీని సుతారంగా చప్పరించి.. లోపల..దేహాంతర మోహాగ్ని జ్వాలల్లో నిశ్శబ్దంగా దగ్దమౌతూ.. అరుంధతి ఆడెపు.. లోపల..రిసార్ట్‌పై అంతస్తులో యింకో అరగంటలో తనకు స్వర్గ సుఖాన్నందివ్వబోయే తన రహస్య ప్రేమికుడు నాగరాజు గైక్వాడ్‌ను తలుచుకుంటూ.. కనలిపోతూ..అసహనంగా గడియారాన్ని చూచుకుంది.

తొమ్మిదీ యిరవై రెండు.

అరుంధతికి ఏ పనిచేసినా ఎటువంటి సాక్ష్యమూ, ఆనవాలూ లేకుండా..అవశేషాలు మిగలకుండా..నిశ్శబ్దంగా చేసుకుంటూపోవడం అలవాటు.. అనివార్యమైతే తప్ప తను పిక్చర్లోకి ప్రవేశించదు. ఎప్పుడూ కాగల కార్యాలను గంధర్వులతో చేయిస్తుందామె.

”వెధవలు స్వయంగా పనులు చేస్తారు.. మేధావులు తనక్కావలసిన పనులనే ఇతరులతో చేయించుకుంటారు’ అని నేర్చుకుందామె తన ఎంబిఎ హెచ్చార్‌లో.

అలల నిశ్శబ్ద లయను ఛేదిస్తూ మనిషి అలికిడైతే..తలెత్తి.,

ఎదుట మృదుల.. తన ఆలోచనలకు మానవరూపం..స్త్రీ రూపమెత్తిన విద్యుత్‌మెరుపు..నవ్వుతూ..

”చెప్పు మృదులా” అంది మృదువుగా..టేబుల్‌పైనున్న తందూరీ చికెన్‌ ముక్కనొకదాన్ని నోట్లో పెట్టుకుంటూ-

”ఫైనల్‌ రిపోర్ట్‌ మేడం”

”గివ్‌మీ”

”ఈ రోజు..షెడ్యూల్డ్‌ డీల్స్‌ మూడు మేడం.. ఒకటి..జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధాడు బొగ్గుబ్లాక్‌ను, పశ్చిమబెంగాల్‌లోని మధుజోర్‌ బొగ్గు బ్లాక్‌ను, చత్తీస్‌గడ్‌లోని బ్రహ్మపురి బొగ్గు బ్లాక్‌ను..మూడు కలిపి ముప్పయి రెండు వందల మిలియన్‌ టన్నుల బొగ్గును ఐదువందల కిలోమీటర్ల విస్తీర్ణంలో పన్నెండేండ్లు తవ్వుకునేందుకు అనుమతినిస్తూ మంత్రి సంతకం చేసి విడుదల చేస్తున్న జివో. డీల్‌ వర్త్‌ ఆరువేల ఎనిమిదివందల కోట్లు..మంత్రికి..ఇతర ఖర్చులు నూటా ఎనభై కోట్లు. మన నికర కన్సల్‌టెన్సీ ఫీ యిరవై కోట్లు. రెండవది..ఆంధ్రప్రదేశ్‌..కరీంనగర్‌ జిల్లా.. నాల్గువందల ఎనభై రెండు గుట్టల గ్రానైట్‌ డిగ్గింగ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ లీజ్‌. ఎస్‌ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌..పన్నెండేండ్లు లీజ్‌ టోటల్‌ డీల్‌ ఐదువందల డెబ్బయ్‌ రెండు కోట్లు.లీడింగ్‌ మూడు పొలిటికల్‌ పార్టీల కన్సార్టియంతో ఎటువంటి గొడవాలేకుండా ‘తిను తినిపించు.. ఎంజాయ్‌’ పాలసీ కింద సెటిల్‌మెంట్‌. నాల్గు జివోల జారీ.. మన ఫీ పన్నెండుకోట్లు. మూడవది..ఉత్తరాంచల్‌లో.. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ది ప్రాజెక్ట్‌ క్రింద ట్యాక్స్‌ హాలిడే పరిధిలో ఫార్మా సెజ్‌.. అరవింద ఫార్మా లిమిటెడ్‌కు ఐదువందల డెబ్బయి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి అలాట్‌మెంట్‌..ఎట్‌ ది రేటాఫ్‌ థౌజండ్‌ రూపీస్‌ పర్‌ ఏకర్‌ .. నామినల్‌ రోటో..దీంట్లో మన ఫీ..ఎనిమిది కోట్లు. ఎక్స్‌ అండ్‌ వై రెండవ మరియు మూడవ డీల్‌, ఎ అండ్‌ బి కలిసి మొదటి డీల్‌ను కాగితాలపై సంతకాలు చేశారు మేడం. రవీంద్రన్‌ అన్ని పేపర్స్‌ తయారుచేస్తున్నాడు. ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్స్‌ అన్నీ ఫినిష్‌.. ఎవ్రిబడీ ఈజ్‌ హాపీ. నౌ వెట్‌ పార్టీ ఫాలోస్‌..ఆర్గురు గెస్ట్‌లకోసం ఎనిమిది మంది నికోబార్‌ నేటివ్‌ యంగ్‌ గర్ల్స్‌ రెడీగా ఉన్నారు. ఒకమంత్రి.. ముగ్గురు ఐఎఎస్‌ ఆఫీసర్స్‌..వన్‌ మీడియేటర్‌. పాల్‌ జాన్సన్‌ మన ఎగ్జిక్యూటివ్‌. అంతా ‘టర్మ్స్‌ యిన్‌ క్యాష్‌.. గెస్ట్స్‌ విల్‌ లివ్‌ బై ఫోర్‌ ఎ.ఎమ్‌. దె రీచ్‌ దైౖర్‌ డిస్టినేషన్స్‌ బై నైనోక్లాక్‌..ఓవర్‌..”

”గుడ్‌ మృదులా..ఫైన్‌..యు డిడేనైస్‌ జాబ్‌”

”థ్యాంక్యూ మేడం”

”యిదుంచుకో”- ఓ ఐదారు వేయి రూపాయల నోట్ల కట్టలనిచ్చింది తన వ్యానిటీ బ్యాగ్‌నుండి బయటికి తీసి.

చిర్నవ్వుతో అందుకుని అంది మృదుల ”మీరొకసారి అందరికీ మీ దర్శనమిచ్చి పార్టీకి అనుమతినిచ్చి.. అలా మీ రూఫ్‌ గార్డెన్‌వెళ్ళండి- అక్కడ అంతా రెడీ.. దేరెండ్స్‌ ది మాటర్‌. అక్కడే మీ నాగరాజున్నాడు ప్రాజెక్ట్‌ గెట్స్‌ కంప్లీటెడ్‌..’ అని

”ష్యూర్‌…” అంది అరుంధతి..అని లేచి మెరుపుతీగలా మృదుల వెంట నడిచి.,

బాంకెట్‌ హాల్‌లో.. తెల్లగా పాలనురుగులా వెలుగు.. నిశ్శబ్దంగా, విన్రమంగా, భయంభయంగా మంత్రీ, ఐ ఎ ఎస్‌లూ.,

ఆమె చిన్నగా నవ్వి..కవ్వింతగా చూచి..ఠీవిగా చేయూపి.,

‘అందని వస్తువెపుడూ అతిమధురం.. కీప్‌ ద థింగ్‌ ఎవే టు టెంప్ట్‌’

అరుంధతి ‘పిచ్చిలోకమిది..’ ఎక్కుతే వంగుతుంది.. వంగుతే ఎక్కుతుంది’ అనుకుంటూండగా.,

వెన్నెల రాత్రి కరిగిపోతూనే ఉంది.

*             *               *            *           *

స్పెషల్‌ పొటెక్షన్‌ గ్రూప్‌ కమెండో రఘు సర్కార్‌ మనసు దుఃఖంతో, వేదనతో, బాధతో కణకణలాడ్తున్న నిప్పులపై  మొక్కజొన్న కంకిలా ఉంది.

ఒక అతిపెద్ద అవినీతిపరుడైన మంత్రికి రక్షకుడు తను..తన కఠోరమైన యుద్ధవిద్యలశిక్షణ, రక్షణ మెళకువల పరిజ్ఞానం, చిన్ననాటినుండీ గుండెలనిండా జీర్ణించుకున్న దేశప్రేమ.. ఈ మట్టి.. ఈ గాలి.. ఈ సమాజం.. ఈ నీరు.,

దడదడలాడ్తున్న గుండెలతో అడుగుపెట్టాడు తను సెల్యులర్‌ జైల్‌లో.. హృదయం భళ్ళున పగిలింది గాజుపలక నేలపై పడ్డట్టు.

కేంద్రంలో నియంత్రణ భవనం కల్గి ఏడు రెక్కలుగా.. ఒక్కో రెక్కలో నాల్గంతస్తుల ఒంటరి జైలుగదులతో 696 సున్నం, యిటుకలతో నిర్మించిన ఇరుకు అరలు. ఒక్కో అరలో ఒక్కో ఖైదీ.. ఎంతకాలం.. జీవితాంతం..ఏమిటి వాళ్లు చేసిన నేరం.. తమ మాతృభూమిని ప్రేమించడం.. ‘వందేమాతరం’ అని ఎలుగెత్తి నినదించడం.. పరాయిపాలకులను ప్రశ్నించడం..

మనిషి ప్రశ్నగా పరిణమించినందుకు ఆజన్మాంత శిక్ష, ఏకాంత కారాగారవాసం.

మెడకు యినుప కడెం..రెండు చేతులకూ కడాలు..కాళ్ళకు యినుప రింగ్‌లు.. ఈ అన్నింటినీ కలుపుతూ యినుప కడ్డీలు.. గోనెసంచులతో కుట్టిన అంగీ, నిక్కరు..గానుగ ఎద్దులకు బదులు ఖైదీలచే నూనెతీత..దాహమైతే ఎవని ఉచ్ఛ వాడు తాగి, ఆకలైతే ఎవని పియ్యి వాడు తిని.,

ఉరిశాలలు..

ఉరికోసం నిరీక్షణశాలలు.

ఆ ఆవరణ.. ఆ జైలు ఊచలు..ఆ ఒంటరి పురాస్మృతులు..గోడలు.,

మనసునిండా కల్లోల బంగాళాఖాత సముద్రఘోష.,

సెంట్రల్‌ ఆఫీస్‌ గోడలమీది పాలరాతి పలకలపై 689 మంది ఖైదీలపేర్లు.. ఎప్పుడు ఖైదీ చేయబడ్డారో ఆ సంవత్సరాల వివరాలు.. ఎక్కువమంది బెంగాలీలు, బిహారీలు, పంజాబీలు.. వందలకు వందలు.,

యిందరు జీవిత ఖైదీల.. ఒకవీర సావర్కార్‌..తిలక్‌.. వంటి ఎందరెందరో త్యాగధనుల జీవితత్యాగ ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్రం.,

ఈ అరవై ఆరేళ్ళ తర్వాత.,

అవినీతిమయమై.. అనైతికతో, అరాచకత్వంతో, లంచగొండితనంతో, దోపిడీలతో, విలువలన్నీ పతనమైన దౌర్భాగ్య సంస్కృతితో.. విచ్చలవిడి రాజకీయాలతో.. చేవ చచ్చిన అర్థనపుంసక యువతరంతో..,

ఏమిటి..ఏమిటిది..?

రాత్రంతా గుండెలనిండా..అంతర్‌జ్వలనం..దహనం..లోపల ఏదో అరణ్యం తగలబడిపోతున్నట్టు క్షోభ…

ఉదయం.. ఐదు గంటలు.,

సెల్యులర్‌ జైలు ముందు..మొక్కుబడిగా పెంచుతున్న పార్క్‌.. ఒక సిమెంట్‌ చప్టాపై కూర్చుని తదేకంగా చూస్తున్నాడు రఘు సర్కార్‌.. ద పర్సనల్‌ సెక్యూరిటీ టు సెంట్రల్‌ మినిస్టర్‌.

ఎదురుగా.. ఎర్రగా..కాంస్య విగ్రహాలు..ఆరు..మెడలలో సంకెళ్ళతో..చేతులకు, కాళ్ళకు యినుప బేడీలతో.,

ఇందుభూషణ్‌ రాయ్‌ బెంగాల్‌, బాబా భాన్‌సింగ్‌ – పంజాబ్‌, పండిట్‌ రాంరఖా బాలి-పంజాబ్‌, మహావీర్‌ సింగ్‌-యు.పి, మోహన్‌ కిషోర్‌ నాందాస్‌, బెంగాల్‌, మోహిత్‌ మొయిత్రా-బెంగాల్‌.,

ఎవరు వీరు.,

దేశంకోసం ప్రాణాలను రాక్షసహింసననుభవిస్తూ పరిత్యజించి..,

యిప్పుడీ దేశం..ఏమౌతోంది.,

తన మంత్రి..బొగ్గు బ్లాక్‌లు.ఎవరికో ధారాదత్తం చేస్తూ..పైరవీలు..లాబీలు..అమ్మకాలు..కోట్లు..లక్షల వేల రూపాయల స్కాంలు…

ఏమిటిది..?

రఘు సర్కార్‌కు ఎందుకో దుఃఖం సముద్రంవలె ముంచుకొచ్చింది. కన్నీళ్ళు కెరటాలై విజృంభిస్తున్నాయి.

ఎందుకో..ఆక్షణం.. అతనిచేయి అనూహ్యంగానే తన కుడి చేయివైపున్న ప్యాంట్‌ జేబులోకి పోయింది.

చేతిలో బెరెట్టా రివాల్వర్‌..ధగధగా..బరువుగా..నిగనిగా.

నీళ్ళునిండిన కళ్ళతో రివాల్వర్‌ వైపు చూస్తున్నాడు..ప్రేమగా-

 

– రామా చంద్రమౌళి

నాలో బయటిలోకం కల్లోలమే ఎక్కువ!

60051_703360903013918_1420695648_n

  ‘అనంతరం’  నేపథ్యం గురించి ఎవరైనా అడిగితే, కొంచెం తటపటాయిస్తాను. 

కారణం, ‘అనంతరం’ వివిధ సందర్భాలలో నేను రాసుకున్న  కొన్ని  కవితల సమాహారం కావడమే! …

‘అయితే, అందులోని కవితల నేపథ్యమే చెప్పు’ అని వొకరిద్దరు మిత్రులు మారు అడిగితే, సరే, యిదేదో యిక తప్పేట్టు  లేదని  ఈమధ్య ఒక సారి పుస్తకం తెరిచి ఒక సారి మళ్ళా కవితలని చదువుకున్నా !

ఈ క్రమం లో నాకొక విషయం మరో సారి  అర్థం అయింది … నేను చాలా బద్ధకస్తుడినని  … కనీసం, రాయడం విషయం లో !…1997 లో నా మొదటి పుస్తకం ‘వాతావరణం ‘ వొస్తే, 2000 లో రెండవ పుస్తకం ‘ఆక్వేరియం లో బంగారు చేప’, తిరిగి పదేళ్ళ తరువాత, 2010 లో  ఈ ‘అనంతరం’ వొచ్చాయి. ఈ మూడు సంపుటాలలో కలిపి మొత్తం కవితలు 100 కూడా లేవు . నిజంగానే రాయలేదా అంటే, ప్రపంచం ముందు ప్రదర్శనకు పెట్టిన దానికన్నా, నాకే నచ్చక వొదిలేసినవో /చించేసినవో  ఎక్కువ.

చుట్టూ వున్న సమాజం , రాజకీయాలు, హేతుబద్ధంగా వ్యవహరించని మనుషులూ వగయిరా నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి, అంతర్లోక కల్లోలాలు, ఉల్లాసాలు వగయిరా కన్నా ఈ అంశాలే నా కవిత్వం లోకి చొరబడతాయి అని భావిస్తున్నాను. నిజానికి మన దైనందిన జీవితంలో కూడా జరుగుతున్నది అదే కదా!

నా మూడో పుస్తకం కాళోజీ సోదరులకు అంకితం ఇవ్వాలని ముందే అనుకున్నాను . ఒక ముఖ్య కారణం, ఒక నలుగురి నడుమ రాసుకున్న పద్యాన్ని చదివి, దాని బాగోగులకు సంబంధించిన చర్చ లో పాల్గొనడం, తద్వారా, రాసిన దానిని ఎడిట్ చేసుకోవడం అనే ఒక మంచి అలవాటు నాకు కాళోజి  సోదరుల ‘మిత్ర మండలి’ నుండి  అబ్బింది-

ఇక పుస్తకం పేరు గురించి ఆలోచించినపుడు , అంతకు ముందు రాసి పెట్టుకున్న ‘అనంతరం’ కవిత జ్ఞాపకం వొచ్చింది . మిత్రులు కూడా బాగుందన్నారు . ‘అనంతరం’ కవిత ఆజాద్  ఎన్ కౌంటర్ నేపథ్యం లో రాసింది . ఆ సంఘటన నన్ను బాగా డిస్టర్బ్ చేసింది . బహుశా, ఆజాద్ వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ ఉద్యమం లోకి వెళ్లిపోయాడని వినడం కావొచ్చు. తదనంతర కాలంలో నేను అక్కడే చదువుకోవడం కావొచ్చు. ఒక్క  రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ అనే కాదు, వరంగల్ మెడికల్ కాలేజీ నుండి కూడా ఆ కాలంలో ఎంతో మంది ఉద్యమం లోకి వెళ్లిపోయారని మా నాన్న చెప్పేవారు . . వెలుగు జిలుగుల సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రసాదించే చదువుల్ని తృణప్రాయంగా వొదిలేసి , దిక్కులేని ప్రజల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టి ఉద్యమం లోకి వెళ్ళిపోవడానికి ఏమీ కాని సామాన్యులైన మనుష్యుల పట్ల ఎంత గొప్ప ప్రేమ వుండాలి?

2001 నుండి ప్రారంభిస్తే 2010 లో ‘అనంతరం’ వెలువడే వరకు నేను గడిపింది, మహా నగరంలో స్థిరపడిన ఒక   సగటు మధ్య తరగతి జీవితం … అంటే, ఇప్పుడేదో భిన్నమైన జీవితం గడుపుతున్నానని కాదు . సహజంగానే మహా నగర జీవితంలో ఎదురయ్యే ఆకర్షణలు, ప్రతిరోజూ తప్పనిసరిగా మహా నగర రహదారుల మీద జరపవలసిన నరక యాత్రలూ , స్నేహితులని క్రమం తప్పకుండా కలవాలని ఎంత బలంగా వున్నా కుదరనీయని నిస్సహాయతలూ  లాంటివి అన్నీ కవిత్వం లోకి చొచ్చుకొచ్చాయి . అలా రాసినవే, ‘నగరంలో పద్యం మరణిస్తుంది’, ’40 ఇంచుల కల’, ‘జలపాశం’, ‘నగర జీవితమూ-శిరచ్చేదిత స్వప్నాలూ ‘ , ఒక మహానగర విషాదం’ లాంటివి –

 vijay

అంతకు క్రితం రెండు సంపుటాలకూ , ఈ ‘అనంతరం’ కు  నడుమ నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినంతవరకూ  ఒకటుంది . అది,  రెండవ కవితా సంకలనం తరువాత, ‘కుటుంబ రావు’ ని అయిపోవడం! పెళ్లి తరువాత ఒక విషయం నాకు స్పష్టంగా బోధపడింది . స్త్రీ వాద దృక్పధాన్ని కలిగి వుండడం చాలా  సుళువు , ఆ దృక్పధాన్ని ఆచరణలో పెట్టి సంసారం చేయడం చాలా కష్టం!

ఇంటిపనీ, అంట్ల పనీ పంచుకోవడం , కబుర్లు చెప్పినంత సుళువు  కాదు . సరే, ఈ సొంత గొడవని పక్కన పెడితే, స్త్రీ వాద కవిత్వం విషయంలో నాకొక చిన్న ఫిర్యాదు ఏమిటంటే, అది  ఆధునిక కాలంలో స్త్రీ-పురుష సంబంధాలకు సంబంధించి ఒక స్థాయి దగ్గరే ఆగిపోయింది . ఆధునికానంతర  కాలంలో వివక్ష చాలా సంక్లిష్ట రూపాలలో ఇంకా కొనసాగుతోంది  అనీ, దానిని స్త్రీ వాద కవిత్వం శక్తివంతంగా పట్టుకోలేదనీ నా అభిప్రాయం . బహుశా ఇన్ని ఆలోచనల నడుమా, కొంత నా సొంత గొడవ నడుమా పుట్టిందే ‘ ఒక ఆధునికానంతర మగ దురహంకార పద్యం’

మరొక సంగతి-ఈ దేశం లో  ప్రస్తుతం అత్యంత సంక్షోభం  లో వున్నది మధ్య తరగతి. దానికి సంబంధించిన బాధలు, ఆకర్షణలు  కవిత్వం లోకి పెద్దగా రాకపోవడానికి కారణం ఏమిటి? అందులోనూ, ఈ మధ్య తరగతి ఎదుర్కొంటోన్న ఆర్ధిక పరమైన ఇబ్బందులు, అందులోని కొత్త పద బంధాలు వగయిరా కవిత్వం లోకి ఎందుకు రాలేదు? … ఇలాంటి ఆలోచనలేవో సుప్త చేతనావస్థలో వుండడం వల్ల  అనుకుంటాను , 40 ఇంచుల ఎల్సిడి  టీవీ   నన్ను తన వలలో వేసుకున్న రోజుల్లో ’40 ఇంచుల కల’ రాసాను.

‘అనంతరం’ లో తెలంగాణా ఉద్యమ నేపథ్యం లో రాసిన కవితలు రెండు వున్నాయి. ఒకటి, ‘బాల్య మిత్రుడి ఫోన్ కాల్’, రెండవది , ‘కొంతకాలం తరువాత కొన్ని కొత్త ప్రశ్నలు’. వరంగల్ లో సకలజనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న కాలంలో అక్కడ వున్నా నా బాల్య మిత్రుడు రోజూ నాకు కాల్ చేసి ఆ విశేషాలు చెప్పేవాడు . ఆ నేపథ్యం లో నుండి రాసింది  ‘బాల్య మిత్రుడి ఫోన్ కాల్’.

ఇక రెండవ కవిత నేపథ్యం  మా ఇల్లే! … ఒక ప్రాంతం తనకు జరిగిన అన్యాయాలకు పరిష్కారం ‘రాష్ట్ర ఏర్పాటు’ తప్ప మరొకటి కాదు అని నిశ్చయించుకుని పోరాడుతున్న నేపథ్యం లో ‘ప్రాంతం’ అనేది కులం / మతం అనే వాస్తవాలను మించిన అంశమా?… భారతదేశం లాంటి దేశం లో ఇది సాధ్యమేనా?… నన్ను బాగా బాధపెట్టిన ఈ అంశమే ఈ ‘కొంతకాలం తరువాత కొన్ని కొత్త ప్రశ్నలు’ కవిత నేపథ్యం!

 -కోడూరి విజయకుమార్

పద్యం ‘పల్స్’ విజయ్ కి తెలుసు!

దేశరాజు

దేశరాజు

నగరానికి చేరుకోవడమే ఒక విషాదమా ? …. ఏమో చెప్పలేము !

ఉన్న వూరు పదిలంగా లేకపోవడం వల్లనే ఎవరైనా నగరం చేరుకుంటారు. పది కాలాలపాటు సుఖంగా వుండేందుకు  అన్నీ సమకూర్చుకుంటారు. అన్నీ అమరినా ఎండమావి లాంటి ఆ సుఖం ఎప్పటికీ దరి చేరదు. అలవాటు పడిపోయిన నగర జీవి ఈ సాలెగూడుని చేదించుకుని బయటకు వెళ్ళ లేడు. ఆ స్థితి లోనే ఒక పద్యం జన్మిస్తుంది. అయితే, అది మృత పద్యం కావొచ్చు. లేదా, మృత ప్రాయంగా మారిపోతున్న నగర పద్యం కావొచ్చు.  పద్యం పల్స్ ని కరెక్ట్ గా పట్టుకోగలిగిన వాడే అసలైన కవి. అలాంటి అసలు సిసలైన కవి కోడూరి విజయకుమార్.

తన మూడో కవితా సంపుటి ‘అనంతరం’ ను ‘నగరం లో పద్యం మరణిస్తుంది’ అంటూ శాపనార్థాలతో ప్రారంభిస్తాడు. ‘Clearly, then the city is not a concrete jungle, it is a human zoo’   అంటాడు, Desmond Morris  అనే సామాజిక శాస్త్రవేత్త. మృగ తృష్ణ తో సంచరించే ఈ జూ లో కవి యెప్పుడూ  అంతర్మథనం తో నలిగిపోతూనే వుంటాడు.  అందుకే, విజయకుమార్ ఇందులోంచి బయటకు గెంతేయ్యాలని చూస్తాడు. అలా చేయలేక పోతున్నందుకు తనను తానే నిందించు కుంటాడు.

60051_703360903013918_1420695648_n

నిజానికి నగరం ఒక బందీఖానా అనే సూచన తన రెండవ కవితా సంకలనానికి ‘ఆక్వేరియం లో బంగారుచేప’ అని పేరు పెట్టడం లోనే అందించాడు. ‘అనంతరం’ కు వొచ్చేసరికి ఆ భావన మరింత విస్తృతమైంది. అందుకే కేవలం ఒక పద్యంతోనే తృప్తి చెందలేదు. ’40 ఇంచుల కల’, ‘నగర జీవితమూ-శిరచ్చేదిత స్వప్నాలూ’, ‘జలపాశం’, ‘ఒక మహానగర విషాదం’, ‘నగర వీధిలో ఎడారి ఓడ’ … ఇలా ఒక అర  డజను  పద్యాస్త్రాలను సంధించాడు. నగరాన్ని ఎంతగా ద్వేషించాడో, ఊరిని అంతగా ప్రేమించాడు. ఆ వూరి లోని మనుషులనూ, బంధువులనూ అక్కున చేర్చుకోవాలని ఉవ్విళ్ళూరాడు. పెనాన్ని కాదని పొయ్యిపై మోజు పడిన ‘డాలర్లను ప్రేమించిన మిత్రుల ‘ ను చూసి ఆవేదన చెందాడు. ఆ మిత్రుల్లోని గురివిందల ‘గ్లోబల్ సూత్రాల’ ని అవహేళన చేసాడు.

ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అందించే బాధ్యతను తన తొలి కవితా సంపుటి ‘వాతావరణం’ నుండే చేపట్టిన విజయకుమార్  ఇప్పుడు నగరం ‘అనంతరం’ ఇంకా ఏమయినా ఉన్నట్టా? …. లేక, ఇక ఏమీ లేనట్టా?  అని నిలదీస్తున్నాడు.  ‘సీతాకోక చిలుక రూపాన్ని కోల్పోతూ / గొంగళి  పురుగులా  మారిపోతున్న రహస్యం’ తెలుసుకోమని హెచ్చరిస్తున్నాడు. ఈ జూ లోంచి బయటపడే మార్గమేదో మీరు కనిపెట్టగలిగితే అతనికి కొంచెం చెప్పండి.

(కోడూరి విజయకుమార్ కవితాసంపుటి ‘అనంతరం’ కు 2011 సంవత్సరం తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారం లభించిన సందర్భంగా )

 

-దేశరాజు

బియాండ్ కావలి… బియాండ్ ఖదీర్!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

 

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?

ఈ రెండు ప్రశ్నలకి సరైన జవాబు తెలుసుకోగలిగినవాడే గొప్ప రచయిత అవుతాడు. ముఖ్యంగా కథల విషయంలో ఈ ప్రశ్నల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనకన్నా ఇంకాస్త ఎక్కువ చదువుకున్నవాళ్ళు ఈ ప్రశ్నలనే మరో రకంగా “వస్తువు, శిల్పం/శైలి” అంటారు. అనేదేదైనా కథకుడు ఆలోచించి తీరాల్సిన రెండు ప్రశ్నలు అవే – ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్పాలనుకున్న వస్తువును ఆధారం చేసుకోని శైలి వుండాలనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఈ రెండింటి సమన్వయం కుదిరితే ఆ కథ గొప్ప కథ అయ్యే అవకాశాలు మెండుగా వుంటాయి.

పై విషయాలు మనందరికీ తెలిసిన విషయాలైనా మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఖదీర్ బాబు కొత్త పుస్తకం “బియాండ్ కాఫీ” గురించి చెప్పడానికి. ఈ పుస్తకంలో వున్న చాలా వరకు కథలను విశ్లేషించే ముందు వస్తువు, శిల్పం గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవడం అవసరం. సరే అదలా పక్కన పెడదాం.

కథకుడు ఖదీర్ బాబు పేరు చెప్పగానే నెల్లూరు జిల్లా కావలిలోని పేద కుటుంబాలు, మరీ ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు గుర్తుకొస్తాయి. పేదరికం ముఖం మీదకి ఆత్మవిశ్వాసాన్నో, చిరునవ్వునో అయుధంగా విసిరి గెలిచిన వీరుల కథలు ఆయన “దర్గామిట్ట కతలు”, “న్యూ బాంబే టైలర్స్” సంపుటాలలో కనిపిస్తాయి. నామిని కథల స్పూర్తిగా ఆత్మకథల కథలు విరివిగా వస్తున్న సంగతి మనకి తెలుసు. అలాంటి కథలే “దర్గామిట్ట కతల”ని ఖదీర్ స్వయంగా చెప్పుకున్నాడు కూడా.

  ఇలాంటి కథలు రాయడంలో ఒక సౌకర్యం వుంటుంది. తాము (ముఖ్యంగా చిన్నప్పుడు) చూసిన జీవితాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోని రాయడం వల్ల ఎక్కువగా ఊహించాల్సిన పని వుండదు. చెప్పే విధానం (శైలి/శిల్పం) మీద మాత్రమే దృష్టి నిలిపితే స్వతాహాగా వున్న వస్తు బలం వల్ల కథలకి మంచి పేరొస్తుంది. అందువల్ల ఇలాంటి కథలు రాయడం సుళువని నా ఉద్దేశ్యం. ఇదే విషయాన్ని ఖదీర్ బాబు కూడా ఒక చోట ప్రస్తావించారు – “రాయగా రాయగా మంచినీళ్ళు తాగడం కన్నా ఈ కతలు రాయడమే సులువుగా అనిపించింది నాకు” అని.

ఇలాంటి కథలు పాఠకులని మెప్పించే విషయంలో కూడా కొంత సౌలభ్యం వుంది. వీటిల్లో nostalgic effect వుండటం వల్ల “ఒకసారి మనూరు వెళ్ళి చూసొద్దాం” అన్నంత చనువుగా పుస్తకంలోకి వెళ్ళిపోతాం. అక్కడికి ఈయన రాసిన కథలు గొప్పవి కాదని నేను అనటంలేదు. ఈ సౌలభ్యాలని దాటి, ఇంతకంటే కష్టమైన ప్రయోగం చేశాడు కాబట్టి post facto  చూస్తే పెద్ద గీత ముందు చిన్న గీతలా ఈ కథలు ఆయన సులభంగానే రాసేసివుంటాడు అనిపిస్తుంది. అలా అనిపించడానికి దోహదం చేసిన కథల సంపుటి – “బియాండ్ కాఫీ”

***

beyond kaafee

ఖదీర్ బాబు ఈ పుస్తకం కోసం కావలి దాటి వచ్చేశాడు. ఇప్పటి దాకా మనకి పరిచయమున్న ఖదీర్ ని కూడా దాటి వచ్చేశాడు. కథా వస్తువును ఎన్నుకోవడంలోనే ఇప్పటి కథకులను దాటి నాలుగడుగులు ముందుకేసేశాడు.

ప్రస్తుతం మనం బతుకుతున్న ప్రపంచం ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను మన ముందు ముళ్ళలా పేరుస్తోంది. పారిశ్రామీకరణలు, ప్రపంచీకరణలు దాటి సాంకేతిక విప్లవాలు, సమాచార విప్లవాల మీదుగా ద్రవాధునికతలోకి (liquid modernity) ప్రయాణిస్తున్నాం. మార్పు అనివార్యమైపోతోంది. మార్పుకి మార్పుకి మధ్య సమయం కుచించుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో పుట్టుకొస్తున్న కొత్త ధోరణులను కథా వస్తువుగా కథలు రావాల్సిన అవసరం చాలావుంది. ఆ కథాంశాలతో కథలు రాసే సాహసం ఖదిర్ బాబు చేశాడు.

సాహసం ఎందుకంటే – ఇప్పటిదాకా ఖదీర్ బాబు అంటే వున్న ఇమేజ్ వేరు. ఆయన “సులభంగా” రాసేసినా బాగా పేరుపడ్డ కథలలా ఈ కథాంశాలకు ఆ ఎట్రాక్షన్ లేదు. పైగా ఈ కథలు మన ఉరుకుల పరుగుల జీవితాన్ని, మంచి చేడుల మధ్య లోలకంలా ఊగిసలాడే మన విలువలని నిర్లజ్జగా నగ్నంగా నిలబెడతాయి. ఇది చదివి కొంతమంది ఇలాంటి జీవితం జీవిస్తున్నామా అని అనుకోవచ్చు. ఇదంతా ట్రాష్… మన జీవితాలేం ఇంత దారుణంగా లేవని ఇసకలో తల పెట్టుకు బతికేయచ్చు. నిక్కచ్చిగా చెప్పే నిజాన్ని నిజం అని ఒప్పుకునే ధైర్యం అందరిలో వుండకపోవచ్చు. అయినా సరే ఇలాంటి కథలను రాసి, (ఏ పత్రికలోనో కాకుండా) నేరుగా పుస్తకంగా వెయ్యగలగడం సాహసం అని కాక ఇంకేమనగలం?

సరే, కథాంశాలు ఇలా వుంటే దానికి తగ్గ శైలి వుండాలని ముందే అనుకున్నాం కదా? ఖదీర్ బాబు అదే చేశాడు. ఇప్పటిదాకా సొగసుగా పలికిన నెల్లూరు జిల్లా యాసని వదిలిపెట్టాడు. ఆ వాక్య నిర్మాణ పద్ధతిని విడిచిపెట్టాడు. కొత్తగా కలం పట్టినంత సుళువుగా కొత్త వాక్యాలని నిర్మించాడు. ప్రపంచీకరణ, సమాచార విప్లవాల అనంతరం ఏర్పడిన “నియో రిచ్” మానసిక స్థితిని చెప్పడానికి ఒక కొత్త పరిభాషని అందుకున్నాడు. ఇది చూడండి –

నలుగురు వచ్చారు.

ఆగింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ ఆ సమస్యకు –

ముందుకు వచ్చారు.

భయపడింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ –

చుట్టుముట్టారు.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ –

అబ్బ.. అబ్బ… ఏముందిరా.

ముప్పయ్ రెండేళ్ళ –

ఆత్రపడ్డారు (ఇంకోవైపు)

(ఇలాంటి వాక్యాలు ఈయనతోనే మొదలు అనేంత దుస్సాహసం నేను చెయ్యడం లేదు. ఇలాంటి వాక్యాలు ఖదీర్ బాబుకి కొత్త అని మాత్రమే నేను అంటున్నాను.)

దాదాపు అన్ని కథలలోనూ స్త్రీలను ముఖ్యపాత్ర చేశాడీయన. నేను పైన ప్రస్తావించిన పోస్ట్ గ్లోబలైజేషన్ – ద్రవాధునిక జమానాలో అన్ని కోణాలనుంచి ఒత్తిడికి లోనౌతున్నది స్త్రీ. ఉరుకుల పరుగుల మధ్య భర్తకి ఉదయాన్నే కారియర్ అందించే వంటమనిషిగానో, వారాంతంలో శృంగారావసరాలకి మాత్రమే పనికొచ్చే ఆటబొమ్మగానో మిగిలిన భార్యలు ఇప్పుడు మనకి కొత్తకాదు. అయితే పేరుకు కుటుంబం వున్నా ఒంటరైపోయిన ఇలాంటి వాళ్ళ జీవితంలోంచి కథలు తీసుకురావడంలో రచయిత సఫలీకృతులయ్యాడు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ జీవితాలలో వున్న స్తబ్దతని, అనిశ్చితిని, నైరాశ్యాన్ని వాక్యాలతో నిర్మించిన తీరు చాలా గొప్పగా వుంది. (టాక్ టైమ్, మచ్చ, బియాండ్ కాఫీ). ఇది శైలి గురించి

మొత్తం మీద చెప్పేదేమిటంటే – ఈ పుస్తకంలో కొత్త వస్తువుతో, కొత్త శైలితో ఖదీర్ కొత్తగా పుట్టాడు.

***

ఇందులో పది డైరెక్ట్ కథలు (ఏ పత్రికలోనూ అచ్చు కానివి) వున్నాయి. అందులో “వహీద్” కథ ఒక్కటే Odd man out గా వుండిపోతుంది. మిగిలిన కథలన్నీ పోస్ట్ మోడరన్ సిటీలలో జరిగితే ఈ కథ ఒక్కటే నోస్టాల్జిక్‍గా వెనక్కి వెళ్తుంది. కథలో కొంత లిబరల్ అంశం వున్నా అది చాలా పల్చగా వుండటం వల్ల బహుశా ఈ సంకలనంలో వుండదగినది కాదేమో అనిపిస్తుంది. ఆ ఒక్క కారణం తప్పితే కథ బాగానే వుంది. మిగిలిన కథలన్నీ చదవాల్సినంత బాగున్నాయి. మనం బతుకున్న సమాజాన్ని ఒకసారి మనం అద్దంలో చూసుకోవాల్సిన అవసరం వల్ల చదవాలి.

అయితే ఈ కథలు చదివిన తరువాత కొంత అసహ్యం కలగవచ్చు, కొంత అసహనం కలగవచ్చు. నిక్కచ్చిగా నిజం తగిలిన చోట కోపం రావచ్చు. బహుశా రచయిత కోరుకుంది కూడా అదేనేమో..??

– అరిపిరాల సత్యప్రసాద్

(ఖదీర్ పుస్తకం కినిగె లో దొరుకుతోంది)

స్వర సాంగత్యం

elanaga

ఇసుక తిన్నెల మీంచి గుసగుసల్ని మోసుకొస్తూ

గుండె లోపలికి దూరుతుందొక రాగం

వేలి కొసను పట్టుకుని వేల మైళ్ల దూరం

లాక్కుపోతుంది లయతో –

గాలిలో గంధమాధుర్యాన్ని నింపి

వీనులకు విందు చేస్తుంది

పూర్వజన్మల పురా వైభవాల అపూర్వ సమ్మేళనాన్ని

పూస్తుంది మనసుగోడల మీద మందంగా –

సొంపును పులుముకున్న ఇంపైన రాగాన్నాస్వాదించి

సోలిపోతుంది పులకాంకితమైన ఆత్మ

నాదవృష్టిలో తడిసి పుట్టిన మోదం

ఖేదానికి వీడ్కోలు పాడుతుంది

స్వరలయల మెట్ల మీదుగా

స్వర్గసౌధానికి దారి మొలుస్తుంది

 

రాగం ఆవహించినంత సేపూ

రంజకత్వం మేఘమై ఊగుతూనే వుంటుంది

హృదయపు పొదరిల్లు మీద –

గానం ఆగిన తక్షణమే

గాయపు నొప్పికి జన్మ

నరాలు స్వరాల కోసం తపిస్తూ

నరకాన్ని తలపించే వేదనకు శంకుస్థాపన

 

గానం తోడు లేని జీవన ప్రస్థానం

ప్రాణం లేని మనుగడకు సమానం

 

*****

—    ఎలనాగ

 

చర్మం రంగు

baba
“ముఖ్య అతిధికి బొకే నేను ఇస్తాను టీచర్”
“నువ్వొద్దు ….. అందుకు వేరే వాళ్ళను ఎంపిక చేసాం”
ఆ  “వేరేవాళ్ళకు” తనకూ ఉన్న తేడా
ఆ అమ్మాయికి కాసేపటికి తెలిసింది
చర్మం రంగు.
చరిత్ర లోయలోకి
నెత్తురూ, కన్నీళ్ళూ పారిస్తూ,
జీవన మార్గాలపై
చీకటివెలుగుల్ని శాసిస్తోన్న
చర్మం రంగు ….. చర్మం రంగు…..
సంచి కన్నా ఆత్మ గొప్పదని
వెర్రికేకలతో అరవాలనుకొంది ఆ అమ్మాయి.
finger-painting-in-the-dark
ఉబ్బిన మొహం, ఎర్రని కళ్లతో
తనకొచ్చిన ప్రైజుల్ని తీసుకొని
మౌనంగా నిష్క్రమించింది.
పదేళ్ళ తరువాత …….
“ముఖ్య అతిధి”  స్పీచ్ ముగించుకొని
వెళుతూ వెళుతూ
ఉబ్బిన మొహం, ఎర్రని కళ్ళతో ఉన్న
ఓ స్టూడెంట్ చేతిలో బొకే పెట్టి,
భుజం ఎందుకు తట్టిందో
ఎవరికీ అర్ధం కాదు
మరో పదేళ్ళ దాకా
–బొల్లోజు బాబా

వీలునామా -11 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి) 

ఎల్సీ ప్రయత్నం

 

ఎల్సీ మనసు రెండో రోజుకి కొంచెం కుదుట పడింది.

రోజూ ఉదయాన్నే లేచి అక్క చెల్లెళ్ళిద్దరూ కాసేపు షికారెళ్ళి రావడం మొదలు పెట్టారు. దాంతో కాస్త మనసు సర్దుకునేసరికి, ఎల్సీ రాసుకోవడనికి కాగితాలు ముందేసుకుని కూర్చుంటుంది. జేన్ ఉద్యోగ ప్రయత్నాలకి బయటికి వెళ్తుంది.

ప్రతీ రోజూ ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అయినా జేన్ ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రాలేదు. ఊరికే వుండడం ఇష్టం లేక పెగ్గీకి సహాయం చేస్తూనే వుంది జేన్. పిల్లల పనులు చూడడం, వాళ్ళకి సాయంత్రాలు చదువు చెప్పడం చేయసాగింది. కొద్ది రోజుల్లోనే పిల్లల చదువులు మెరుగవడం గమనించి చాలా సంతోష పడింది పెగ్గీ! అందరికంటే పెద్దవాడు టాం జేన్ దగ్గర బాగా చదువుకోవడం అలవాటు చేసుకున్నాడు.

జేన్ మెల్లి మెల్లగా ఆ పిల్లలు చేసే అల్లరికీ, ఇంట్లో వుండే శబ్దాలకీ అలవాటు పడసాగింది. ఆమెకి బెస్సీ పిల్లలు అయిదుగురూ భలే తెలివైన వాళ్ళనిపించింది. టాం ఎలాగైనా పెద్ద చదువులు చదవాలనీ, మంచి ఉదోగం సంపాదించుకోవాలనీ పట్టుదలగా వున్నాడు.

చదువుకుంటూనే ఒక చిన్న కార్ఖానాలో తీరిక వేళల్లో పని చేయటం మొదలు పెట్టాడు టాం. అక్కడ వాడి కొచ్చే ప్రశ్నలకెవరూ సమాధానం చెప్పేవారు కాదు. అవన్నిటి గురించీ జేన్ తో చర్చించడం వాడికెంతో నచ్చేది. వాడి పట్టుదలా, శ్రధ్ధా జేన్ కెంతో ముచ్చటగా అనిపించేవి.

ఈ ప్రపంచంలో తన అవసరం వున్న మనిషి ఒకరైనా వున్నారన్నమాట అనుకుంది జేన్. అలాగే పెగ్గీ ఆశ ప్రకారం మిగతా పిల్లలకి చక్కగా రాయడం నేర్పించింది జేన్.

జేన్ ప్రభావం ఆ పిల్లల మీద బాగానే పడి, వాళ్ళు తమ మొరటు ప్రవర్తన వదిళేసి ఆమెలా హుందాగా, నాజూగ్గా ప్రవర్తించడం నేర్చుకోసాగారు. పెగ్గీకి ఎప్పుడూ ఏదో ఒక అవసరం వున్న వాళ్ళకి సహాయం చేసే అలవాటు పోలేదు. అలాటి అసహాయులందరినీ తరచూ ఇంటికి తీసుకొస్తూండేది.

అలాటి వారికి సహాయం చేయడానికి తన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల సిగ్గు పడేది జేన్. అయితే అవసరంలో వున్న మనిషికి సహాయం చేయడానికి డబ్బొక్కటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలు వున్నయని కాల క్రమేణా తెలుసుకుంది జేన్. వచ్చిన వారికి చిన్న చిన్న పనులుంటే చేసి పెట్టడం, సలహాలివ్వడం, కాగితాలు రాసి పెట్టడం మొదలైన చాలా పనులు చాలా సులువుగా చేయగలిగేది జేన్.

అయినా ఏదో రకంగా డబ్బు సంపాదించి తననీ చెల్లెల్నీ పోషించుకోవాలన్న దిగులు మాత్రం వదలడంలేదామెని. తనకేమో ఉద్యోగం దొరకడం లేదు. చెల్లెలి కవితల పుస్తకం ఎవరైనా ప్రచురించి కొంచెం డబ్బిస్తే బాగుండు. ఎన్నాళ్ళిలా పెగ్గీ దయా ధర్మాల మీద ఆధారపడి వుండడం, అనుకుందామె.

మొత్తం మీద ఎల్సీ ఒక పుస్తకంలో వెయ్యగ్లిగేన్ని కవితలు రాసిందని అనిపించేక, వాటిని పట్టుకుని పబిషరు దగ్గరికెళ్ళారిద్దరూ. ఆయన ఇంతకు ముందు, “ఆడపిల్లలు ఏదైనా రాసిస్తే ప్రచురించడం తేలిక” అన్నారని గుర్తు జేన్ కి.

పది రోజుల తర్వాత, “ఈ కవితలు బాగానే వున్నా, పుస్తకం లా ప్రచురించేంత బాగా లేవు,” అని ఉత్తరం వచ్చింది ఎల్సీ కి. ఆ ఉత్తరం చదివి ఎల్సీ కృంగిపోయింది.      నిరాశపడ్డ చెల్లెల్ని జేన్ ఓదార్చింది. ఎడిన్ బరో లోని ప్రచురణ సంస్థలు కాకుండా లండన్ పంపిద్దామని సూచించింది జేన్. ఎల్సీ మళ్ళీ ఉత్సాహంతో తన కవితలు లండన్ లోని ప్రచురణాలయాలకి పంపింది. అందరి దగ్గర్నించీ ఒకటే మాట!

“కవితలు బాగానే వున్నా, పుస్తకంలా ప్రచురించేంత బాగాలేవు, క్షమించవలసింది….” అంటూ.

కొన్ని ఉత్తరాలు సంక్షిప్తంగా వుంటే, కొన్ని సుదీర్ఘంగా వుండేవి.

“…మా దగ్గర లెక్కకు మించి కవితా సంకలనాలున్నా, మేము కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అత్యంత శ్రధ్ధతో పరిశీలించాము. మా సంపాదకుడి అభిప్రాయం ప్రకారం అవి ప్రచురణకి ఇంకా సిధ్ధంగా లేక పోవదం మూలాన, వాటిని సంకలనంగా వేయలేమని చెప్పుటకు చింతిస్తున్నాము…” అంటూనో, లేక

“….కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అక్కడక్కడ బానే వున్నా, వాటిల్లో అన్నిట్లో ఒకటే ముఖ్యాంశం అవడం వల్ల పాఠకుడికి ఆసక్తి కలిగించలేవు. అందుచేత వాటిని ప్రచురించడం వీలుపడదని చెప్పుటకు చింతిస్తున్నాము….”

అంటూనో వుండేవి.

అలాటి లేఖ వచ్చిన ప్రతీసారీ, ఎల్సీ కృంగిపోయేది. సంక్షిప్తంగా వున్న లేఖలకంటే సుదీర్ఘ విమర్శలు ఎల్సీని ఎక్కువ బాధించేవి.

నిజానికి ఎల్సీ కవితల్లో భాషా సౌందర్యం, వ్యక్తీకరణలో నాజూకు తక్కువే. అయితే భావంలో గాఢత వుండేది. జీవితానుభవం ఇంకొంచెం వస్తే, ఎల్సీ చక్కటి కవయిత్రి కాగలదు. అయితే ఆ సంగతి ఆమెకి తెలియక పోవడం వల్ల తనకసలు భవిష్యత్తే లేదనుకుని నిరాశపడింది.

తన కవితల రాతప్రతిని ఒక సంచీలో పెట్టి డెస్కులో పడేసింది. ఇక కవితల జోలికీ, పుస్తకాల జోలికీ పోగూడదనుకొంది.

“జేన్! నితో పాటు నేనూ పెగ్గీకి సాయంగా బట్టలు ఇస్త్రీ చేస్తాను. బట్టలు కుట్టడం కూడా ప్రారంభిస్తాను. అనవసరంగా డబ్బంతా పోస్టు మీదా, కాగితాల మీదా దండగ చేసాను. ఇహ ఏదైనా పని వెతుక్కుని నీ కష్టం తగ్గిస్తాను.” అన్నదే కానీ పాపం ఆమె కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయాయి. అన్నట్టే బట్టలు కుట్టడంలోనూ, ఇస్త్రీలు చేయడంలోనూ నిమగ్నమైపోయింది ఎల్సీ.

వున్నట్టుండి ఒకరోజు రెండు వుత్తరాలు వచ్చాయి వారి పేరిట. ఒకటి ఫ్రాన్సిస్ దగ్గర్నించయితే, రెండోది రెన్నీ గారి దగ్గర్నించి.

రెన్నీ గారు ఇస్తోన్న కొత్త సంవత్సరం పార్టీకి తాను ఎడిన్ బరో వస్తున్నట్టూ, వచ్చి తప్పక వాళ్ళను కలుసుకుంటాననీ ఫ్రాన్సిస్ రాసాడు. రెన్నీ గారి దగ్గర్నించి పార్టీకి రమ్మన్న ఆహ్వానం వుంది.

కాస్త ఆ పార్టీకి వెళ్ళి నలుగురితో మాట్లాడితే మనసులు కుదుటపడొచ్చు.

పార్టీకోసం అక్కకి కొత్త గౌను కుట్టడం మొదలు పెట్టింది ఎల్సీ. ఈ మధ్య కాలంలో జేన్ చిక్కిపోయి మొహం పాలిపోయింది. అయినా ఎల్సీ కళ్ళకి అక్క అందంగానే అనిపించింది.

 

(సశేషం)

 

 

 

 

 

తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అద్దం ‘జిగర్‌’

jigar title
ఆగస్టు పదో తేదిన హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తులో ‘జిగర్‌’`తెలంగాణ విశిష్ట కవితా సంకలనం ఆవిష్కరణ సందర్భంగా ఆ సంకలనం ప్రధాన సంపాదకులు -అనిశెట్టి రజిత గారితో ఇంటర్వ్యూ.
* ‘జిగర్‌’ తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
రజిత:  తెలంగాణ ఉద్యమ సందర్భంగా వస్తున్న కవిత్వంలో జై తెలంగాణ, తెలంగాణ తల్లి, సకల జనుల సమ్మె లాంటి వాటి మీద ఎక్కువ కవిత్వం వచ్చింది. అయితే తెలంగాణ విశిష్టతల్ని, చారిత్రక కట్టడాలు, నదులు, పండుగలు, ఆచారాలు, సంస్కృతి, వైతాళికులు, జిల్లాల ప్రాశస్త్యం, చార్మినార్‌, గన్‌పార్క్‌ లాంటి ఘన వైభవ చరిత్రను రికార్డు చెయ్యాలనుకున్నాం. దానిలో భాగంగానే ఈ సంకలనాన్ని తీసుకువచ్చాం. ఇది తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం.
* కవిత్వ సేకరణలో మీరు నిర్దేశించుకున్న ప్రామాణికాలు ఏంటి?
రజిత: ముందు చెప్పినట్లుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోని విశిష్టతలు, వైతాళికులు, చారిత్రక ప్రదేశాలు, వాటి ప్రాశస్త్యం అన్నింటిని రికార్డు చేయాలని అనుకున్నాం. దానికి అనుగుణంగానే ఆ యా జిల్లాలకు చెందిన కవులను వాళ్ల జిల్లాలోని ప్రత్యేకతల మీద రాయమన్నాం. ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, వరంగల్‌ రామప్ప ఇలా ప్రతి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు, కట్టడాల మీద కవితలు కావాలని కోరాం. అలాగే కొమరం భీమ్‌, షేక్‌ బందగీ, పండుగ శాయన్న, చాకలి ఐలమ్మ, పోతన లాంటి తెలంగాణ వెలుగుల మీద కూడా కవిత్వముండాలని నిర్ణయించుకొని వాటికి అనుగుణంగా సంకలనం చేశాం.
* కవిత్వ సేకరణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు?
రజిత: చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘జిగర్‌’ను నేను ఒంటరిగానే మొదలుపెట్టాను. ఈ పని చేస్తున్న క్రమంలో నలుగురు మిత్రులు కలిశారు. రెండు వందలమందికి పైగా కవుల నుండి కవిత్వాన్ని సేకరించడం కోసం ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం వేరే ఆలోచన, వేరే పని చేయకుండా అందరమూ కలిసి చాలా శ్రమ చేశాం. తెలంగాణ ఉద్యమం గురించే రెండు వందలకు పైగా కవితలు అందాయి. ‘విశిష్ట’ కవిత్వం తీసుకురావాలనుకున్నాం కాబట్టి ఒక్కొక్క రచయితతో మాట్లాడి మా ఉద్దేశ్యాన్ని వివరంగా చెప్పి కవిత్వాన్ని రాయించాం. ఈ సంకలనంలో సీనియర్‌ కవులతో పాటుగా ఇప్పుడిప్పుడే కవిత్వం రాస్తున్నవారూ ఉన్నారు. కొన్ని మొట్టమొదటి కవితలు కూడా ఉన్నాయి.
*మహిళా సంపాదకురాలిగా మీ అనుభవం ఎలా ఉంది?
రజిత: మహిళల సంపాదకత్వంలో కథా సంకలనాలు వచ్చాయి. కాని కవితా సంకలనం మహిళా సంపాదకత్వంలో రావడం ఇదే ప్రథమం. (ఫెమినిస్టు కవిత్వం మినహా) ఈ పుస్తకానికి నేను (అనిశెట్టి రజిత) ప్రధాన సంపాదకురాలిగా, కొమర్రాజు రామలక్ష్మి, కరిమిళ్ళ లావణ్య, భండారు విజయగ, గడ్డం పద్మాగౌడ్‌లు సంపాదకవర్గంగా కలిసి పనిచేశాం. మహిళల ఆధ్వర్యంలో ఈ సంకలనం రావడం మహిళా రచయితలకు స్ఫూర్తిని ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నాను. ఒకనాడు మహిళలు రాసిన సాహిత్యానికి అంతగా ప్రాధాన్యత లేదు. అలాంటిది సంకలనాలు తీసుకొచ్చే స్థాయికి ఎదిగాం.
jigar back
* ‘జిగర్‌’ ముందుమాటలో ‘lamenting’/మర్సియా అనే పదాన్ని వాడుతూ రాసిన ముందు మాట గురించి చెప్పండి
రజిత: సంగిశెట్టి శ్రీనివాస్‌గారు మంచి మిత్రులు. ముందుమాటను త్వరగా సమగ్రంగా రాసిండ్రు. ‘రుద్రమ’ ప్రచురణలు పేరు పెట్టమని సూచించింది కూడా తనే. ఈ సూచన మహిళా సంపాదకులుగా మేం తీసుకు వస్తున్న రచనలకు ఈ పేరు సూచించడం స్త్రీలకు మనోబలాన్నిస్తుంది. lamenting  సాహిత్యం అనేది  ఎప్పటికీ ఉంటుంది. సమాజంలో వెతలు, బాధలు, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణకు సీమాంధ్ర ఆధిపత్యం అన్న అదనపు దోపిడి రాష్ట్ర పునర్నిర్మాణం తర్వాత పోతుంది. కాని సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి. సమ సమజాం వచ్చేవరకు సామాజిక ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. సాహిత్యం నిరంతరం వస్తూనే ఉంటుంది.
చివరగా… రుద్రమ ప్రచురణలు తరపున మరో పుస్తకం ‘ఉద్విగ్నాలు’ తీసుకువస్తున్నాం. పన్నెండు మంది మహిళల ఆధ్వర్యంలో దీన్ని తెస్తున్నాం. ఇందులో ఐదుగురు సంపాదక వర్గంలో ఉంటారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ తర్వాత దాని ఫలాలు అందరికీ అందాలని ఆశిస్తూ… ధన్యవాదాలు.
ఇంటర్వ్యూ: ఏశాల శ్రీనివాస్‌

వీలునామా – 10 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

బ్రాండన్ గారికి పెద్ద పెట్టున జ్వరం కాసింది. పగలూ రాత్రీ ఆయన సేవలోనే గడిచిపోయేవి నాకు. పాపం తిండి తినడానికి కూడా ఓపిక లేక, జావ తాగిస్తే తాగేవారు. అలా కొన్ని వారాల తర్వాత నెమ్మదిగా కొలుకున్నారు. ఒకరోజు కుర్చీలో విశ్రాంతి గా కూర్చుని ఏదో పని చూసుకుంటున్న నాతో ఒక మాటన్నారు. ఇంకా పెళ్ళిళ్ళు కాని ఆడపిల్లలు, మీతో ఆ మాటలేమిటో నేను చెప్పలేను కానీ, ఆ మాటలు నాకెంతో కోపం తెప్పించాయి. ఒక్క నిముషం మాట్లాడలేకపోయాను. ఎలాగో కూడ దీసుకుని,

“అలాటి మాటలు మీరనా వద్దు. నేను వినా వద్దు. అయినా, ఇలాటి పాడు ఉద్దేశ్యాలు నన్నీ ఊరు తెచ్చినప్పుడు మీకు లేవు. అందుకే వూరుకుంటున్నాను,” అన్నాను.

“అంత కోపపడకు పెగ్గీ! నువ్వు రావడం వల్ల నాకెంత హాయిగా వుందో నీకు తెలియదు. అందుకే…”

“అవునా? మీకు నామీదున్న గౌరవాన్ని చూపించడానికి ఇది మార్గం కాదనుకుంటా!”

“జార్జి పెళ్ళాడమంటే వద్దన్నావట. దాంతో నీ చూపు ఇంకా పైనుందేమో ననుకున్నాను.”

“జార్జి కంటే మంచివాళ్ళూ, గౌరవనీయులూ నాకైతే ఇంతవరకూ కనబడలేదు. కాబట్టి పెళ్ళాడనే దల్చుకుంటే అతన్నే పెళ్ళాడతాలెండి. మీకంటే జార్జి చాలా మర్యాదస్తుడు. అతను నన్ను పెళ్ళాడతానన్నాడు. మీలా…”

“సరే అయితే! పెగ్గీ! నేనూ అదే మాటంటాను. చెప్పు, నన్ను పెళ్ళాడతావా?”

“లేదండీ! నా స్థాయికి మించిన మగవాళ్ళతో నేను నెగ్గుకురాలేను. పెళ్ళి చేసుకునే రోజు వస్తే, నా స్థాయికి తగ్గ మగవాణ్ణే చేసుకుంటాను.”

నా మాటలు విని పెద్దగా నవ్వేసాడాయన.

“ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పెగ్గీ, నువ్వు తెలివి కలదానివి సుమా! నిజమే. నువ్వెంత మంచి పిల్లవైనా, నిన్ను తీసుకెళ్ళి నా కాబోయే భార్యగా మా అమ్మకీ, నాన్నకీ ఎలా పరిచయం చేస్తాను? సరే, ఎప్పటికైనా జార్జిని నువ్వు పెళ్ళాడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తాను.”

అంతే అమ్మాయిగారూ! నిజంగానే నాకు జార్జికంటే ఎక్కువగా ఎవరూ నచ్చలేదు. పాపం, నన్నెంతో ఆపేక్షగా కనిపెట్టుకుని వుండేవాడు. నేను సరిగ్గా ఆలోచించుకొనేలోపే నాకు బర్రాగాంగ్ వదలాల్సొచ్చింది. అక్కడే ఇంకో ఆరునెలలు వుండి వుంటే జార్జితో నా పెళ్ళి జరిగి వుండేదేమో.

మేముండే వూరికి ఇరవై మైళ్ళ దూరంలో బ్రాండన్ గారి స్నేహితుడు ఫిలిప్ గారు వుండేవారు. ఆయనది ఇంకా పెద్ద పొలమూ, పెద్ద పశుసంపదా! ఆయన భార్యకి ప్రసవించే రోజులు దగ్గరకొచ్చాయి. అందుకని ఆయన ముందే మెల్బోర్న్ నించి ఒక నర్సును ఏర్పాటు చేసుకున్నారు కానీ, ఆ నర్సు ఆఖరి నిముషంలో రానంది. ఇంకో మనిషిని ఏర్పాటు చేసుకునే వ్యవధి లేదు. నీళ్ళాడ పొద్దుల మనిషి! అందుకని పురిటి వరకూ తోడుండడానికి నన్ను పంపమని బ్రాండన్ గార్ని బ్రతిమాలారాయన.

పురుడు జరిగి తల్లి కొంచెం కొలుకోగానే నన్ను వెనక్కి పంపే షరతు మీద నన్నక్కడికి వెళ్ళమన్నారు బ్రాండన్ గారు. అక్కడ నిజానికి ఇంకో పని అమ్మాయి వుంది, కానీ ఆ పిల్లకసలేమైనా పనొచ్చో రాదో అనిపించింది నాకు.

ఫిలిప్ గారి శ్రీమతి (వాళ్ళ పెళ్ళయి అప్పటికి యేడాది అయిందిట) మంచిదే. సౌమ్యురాలు. పని వాళ్ళతో పని చేయించుకోవడం తెలియదావిడకి. మౌనంగా ఒక కుర్చీలో కూర్చుని వుండే వారు. నేను వెళ్ళిన కొద్ది రోజులకే ఆవిడ ప్రసవించి ఒక పాపాయిని కన్నది.

తల్లేమో కానీ, తండ్రి మాత్రం ఆ పాపాయిని చూసి పొంగిపోయాడు. బుల్లి ఎమిలీ ని చూసిన దగ్గర్నించీ ఆయనకి వేరే ప్రపంచమే లేకుండా పోయింది. అంత పెద్దాయన బవిరి గడ్డంతో మొగ్గలాటి కూతుర్ని ఎత్తుకోని, ముద్దు పెట్టుకోవడం, దానితో పాపాయి భాషలోనే గంటల తరబడి మాట్లాడడం, అందరినీ పిలిచి పాపాయి గురించి కబుర్లు చెప్పడం చూస్తే నాకైతే నవ్వాగేది కాదు. పిల్లలని అంత ప్రేమించే తండ్రిని ఇంతవరకూ చూడలేదు.

ఫిలిప్ గారి శ్రీమతితో వేగడం కొంచెం కష్టమే అనిపించింది. బాలింతరాలి సంరక్షణ అంటే మాటలా? జలుబు చేయకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! పథ్యం వంట కూడా చేయాలాయే! కానీ, ఆవిడ నా ప్రతీ మాటనీ పెడ చెవిన పెట్టేది. మీ స్కాట్ లాండ్ లో జలుబూ పడిశం పదతాయి కానీ, ఈ ఆస్ట్రేలియాలో ఏమీ కాదు అనేది. పథ్యం విషయంలోను అంతే. ఫిలిప్ గారి కేమో ఆమెతో వాదించే ఓపిక లేక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపొమ్మనేవారు. తల్లీ పిల్లల పనితో నా ఒళ్ళు హూనమైపోయింది.

అప్పటికి నాకు బ్రాండన్ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనిపించసాగింది. ఫిలిప్ గారి భార్యకి కూడా నన్ను పంపాలనే అనిపించింది. తనకి తోచినట్టు చేయడమే తప్ప, ఇంకోరు చెప్తే నచ్చదావిడకి! కానీ విచిత్రంగా, ఫిలిప్ గారు నన్ను ఇంకొన్నాళ్ళుండి పాపని చూసుకొమ్మని బ్రతిమిలాడారు.  నన్ను ఇంటికి తీసికెడదామని వచ్చిన జార్జితో అదేమాటన్నాడాయన. నేనూ వుండిపోదామనుకున్నాను. దాంతో జార్జికి ఎక్కళ్ళేని కోపమొచ్చింది. ఆ చంటి దాని మూలంగానే నేను ఫిలిప్ గారి ఇంట్లో వుంటున్నానని దాని మీద కోపం పెంచుకున్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది.

ఒక్క చంటి పాపనే భరించలేని వాడు నాకు చుట్టుకున్న బెస్సీ పిల్లలయిదుగుర్ని ఎలా భరిస్తాడు? నాకంటూ ఇల్లొకటి ఏర్పడితే అందులో బెస్సీ పిల్లలకెప్పుడూ చోటుండాలి! ఆ కోరికలో తప్పేం వుంది చెప్పండి? అందుకే జార్జిని ఆ తర్వాత దూరంగా వుంచేసాను.

ఫిలిప్ గారింట్లో దాదాపు యేణ్ణర్ధం వున్నాను. అమ్మగారు నాతో సర్దుకు పోవడం నేర్చుకున్నారు. అక్కడ మగవాళ్ళు నన్నెక్కువ బాధించలేదు. ఎందుకంటే నాకంటే చిన్నదయిన మార్తా వుండబట్టి. కొన్నళ్ళకి మార్తా పెళ్ళయిపోయింది.

“నీ అక్క పిల్లల కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోకు పెగ్గీ!” అని అప్పుడప్పుడూ అన్నా, ఫిలిప్ గారు బెస్సీ పిల్లల పట్ల నా బాధ్యత అర్థం చేసుకున్నారు. ఆయన భార్య మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి పురిటికి మెల్బోర్న్ వెళ్తానని ఎంతో గోల చేసింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. అక్కణ్ణించి డాక్టరుని ఇంటికే రప్పిస్తానని అన్నారు. అన్నట్టే ఒక డాక్టరు పురిటి వరకూ అక్కడుండడానికి వచ్చాడు. నాకెందుకో ఆ డాక్టరు వాలకం అంతగా నచ్చలేదు.

ఫిలిప్ గారు నాతో, “పెగ్గీ! ఆయన మంచి డాక్టరే కానీ, కొంచెం తాగుబోతు. అందుకని ఆయనకి మన ఇంట్లో వుండే మద్యం సీసాలు కనబడనీయకు. అన్నట్టు, ఈ సంగతి అమ్మగారితో అనకు!” అన్నారు రహస్యంగా. ఆయన చెప్పినట్టే నేను ఆ డాక్టరు కార్టర్ గారిని వేయి కళ్ళతో కనిపెడుతూ వచ్చాను. దాదాపు రెండు వారాలు, ఆయనా బానే వున్నారు. కానీ ఆ తర్వాత ఇహ తట్టుకోలేకపోయారు. రాత్రంతా తన గదిలో అటూ ఇటూ పచార్లు చేసే వాడు! మనిషి పాపం దిగాలుగా నీరసంగా అయిపోయాడు.

ఒక రోజు అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి. డాక్టర్ని పిలుద్దామని పైకి వెళ్తే, ఏముంది! ఎక్కడ సంపాదించాడో కానీ,   బ్రాండీ బాటిలు ఒకటి మొత్తం ఖాళీ చేసేసాడు. నేల మీద మత్తుగా పడి నిద్ర పోతున్నాడు. వైను బాటిల్లుండే సెల్లార్ తాళాలు నా దగ్గరే వున్నవి. మరి ఈయన ఇదెక్కడినించి సంపాదించాడో నాకర్థం కాలేదు. ఎందుకంటే, ఆ పల్లెటూళ్ళో బయట టీ దొరికితే మహా ఎక్కువ! తరవాత తెలిసింది, ఒక నౌకరును నలభై మైళ్ళు పంపించి తెప్పించాడట! అయ్యగారు ఆ నౌకరును పనిలోంచి తీసేసారులెండి!

సరే, అదలా వుంచి, అమ్మగారికి నొప్పులొస్తున్నాయని లేపి చెప్పాను. ఎలాగో కళ్ళు తెరిచి పురుడు అయ్యిందనిపించాడు. ఆడపిల్ల, హేరియట్ అని పేరు పెట్టారు. రెండు వారాలయింది. ఇహ మెల్లిగా పంపించేద్దామనుకున్నారు ఫిలిప్ గారు.

వున్నట్టుండి ఒక రోజు మళ్ళీ తాగొచ్చాడు డాక్టర్ కార్టర్. పాపం, పడుకోని వున్న అమ్మగార్ని తన పెడ బొబ్బలతో భయ పెట్టాడు. పాపం, బాలింతరాలు, గజ గజా వణికిపోయింది. అతన్ని ఎలాగైనా బయటికి పంపని అడిగింది నన్ను.

నేను మెల్లగా మంచి మాటలు చెప్పి అతన్ని బయటికి తిసికెళ్ళాను. ఏదేదో సణుగుతూ అక్కడే వున్న గుర్రానెక్కి వెళ్ళిపోయాడతను. ఈ గుర్రం మీద వుంటాడా, కింద పడిపోతాడా అని నేను ఆలోచిస్తూండగానే ఒక నౌకరు, జిం ,పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“పెగ్గీ! మంటలు! ఇల్లంటుకుంటోంది!” వగరుస్తూ అన్నాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. కిటికీలోంచి బయటికి చూసాను. దూరంగా మంటలు కనిపిస్తున్నాయి. దగ్గరకొచ్చాయంటే మా పని అయిపొతుంది. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు, చంటి పిల్ల తల్లీ! ఇంట్లో నేనూ, మార్తా, జిం మాత్రమే వున్నాం. అదృష్టవశాత్తూ, అమ్మగారూ, పిల్లలూ నిద్రపోతున్నారు. గబగబా మార్తానీ, జిం నీ పిలిచాను. మంటలార్పడనికి నీళ్ళూ బకెట్లూ తీసుకురమ్మన్నాను. మార్తా భయపడ్డది కానీ, తేరుకొని బాగా సహాయం చేసింది. ఆ డాక్టరు సిగరెట్టు కాల్చి ఎండు గడ్డి మిద పడేసినట్టున్నాడు. అంటుకుంది. గాలి వల్ల మంట తొందరగా పెద్దవసాగింది. మాకెటూ పాలుపోలేదు.

దూరంగా గుర్రం మిద ఒక మనిషి రావడం చుసాను. అమ్మయ్య, ఫిలిప్ గారొస్తున్నారనుకున్నాను. తీరా చూస్తే, వచ్చింది బ్రాండన్ గారు. వచ్చీ రావడమే మంటలు చూసి వాటినార్పే పన్లో పడ్డారు. ఆయన సాయంతో తొందరగానే మంటలార్పేసాము. గొర్రెలు బోలెడు మంటల్లో కాలి చచ్చిపోయాయి.

మర్నాడు ఆ పొలాన్నంతా చూస్తే కడుపులో దేవినంత పనైంది. ఫిలిప్ గారొచ్చారు మధ్యాహ్నానికి, మండిపడుతూ.

“సారూ! అమ్మగారూ పిల్లలూ క్షేమంగానే వున్నారు, భగవంతుని దయవల్ల!” ఆయన్ని చూడగానే చెప్పేసాను. భార్యా పిల్లలు క్షేమంగా వుండడం చూసి ఆయనా కుదుట పడ్డాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకే మా బావ విలియం లౌరీ బంధువు సేండీ లౌరీ, మెల్బోర్న్ వస్తున్నాడని తెలిసింది. ఒక్కసారి ఆయనని కలిసి పిల్లలెలా వున్నారో కనుక్కుందామనుకున్నాను. ఫిలిప్ గారితో చెప్పాను. సరే నన్నాడాయన. అప్పటికి ఇంకొక నౌకరుకు పెళ్ళవడం వల్ల, అతని భార్య వుండేది ఇంటి పన్లు చూసుకోవడానికి.

వెళ్ళేముంది నాతో ఫిలిప్ గారు,

“పెగ్గీ! నువ్వు నాకు చేసిన మేలు నేనెన్నటికీ మర్చిపోలేను. నువ్వే లేకుంటే నా భార్యా బిడ్డలు మిగిలుండేవారు కారు” అన్నాడు.

“అయ్యో! అలాగనకండి సారూ! నేను చేసిందేముంది. అంతా భగవంతుని దయ” అన్నాను.

“భగవంతుని దయ సంగతేమో కానీ, నీ ఋణం మాత్రం తీర్చుకోలేను పెగ్గీ!”

“అయ్యా! నేను చేసిన పనికంతా జీతం పుచ్చుకుంటూనే వున్నా కాబట్టి ,ఋణాల ప్రసక్తి లేదు లెండి.”

“అలాగంటే నేనొప్పుకోను పెగ్గీ! నువ్విలా అంటావని తెలిసే నేను ఒక వంద పౌండ్లు నీ బేంకు అక్కవుంట్లో వేసాను. దాన్ని ఎక్కడైనా మదుపు పెట్టి వచ్చే ఆదాయాన్ని వాడుకో! నన్నడిగితే, ఏదైనా చిన్న దుకాణం కొనుక్కోని నడుపుకో! కావాలంటే నేను సహాయం చేస్తాను!” అన్నాడు.

ఆయన నా మీద చూపించిన అభిమానానికి నేను కరిగిపోయాను. నిజంగానే ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలుపెడదామా అనిపించింది, కాని, ఆయనకీ ఆయన భార్యా పిల్లలకి నా అవసరం వుంది కదా అని వెనుకాడాను. కాని ఆయన వినిపించుకోలేదు.

“ఈ జీతంతో ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని సాకుతావు? అసలు నీకంటూ డబ్బూ, ఇల్లూ వాకిలీ వొద్దా? అందుకని చిన్న వ్యాపారం మొదలు పెట్టు. ఆ పిల్లల బాధ్యత తీరిపోతే నువ్వూ పెళ్ళి చేసుకొని స్థిరపడొచ్చు. పిల్లలు పెద్దవుతున్నారుగా? మేమిక్కడ సర్దుకుంటాంలే!” అని ఒప్పించారు నన్ను.

ఆయన అన్నట్టే మెల్బోర్న్ వెళ్ళి ముందుగా సేండీ లౌరీ ని కలిసి, బెస్సీ పిల్లల గురించి విచారించాను. పిల్లలంతా బాగున్నారనీ, చక్కగా చదువుకుంటున్నారనీ సేండీ చెప్పాడు. అక్కడికి కొంచెం దూరంలో ఒక పల్లెటూళ్ళో చిన్న కొట్టొకటి అద్దెకు తీసుకున్నాను. అందరూ నన్నక్కడ మిస్ వాకర్ అని పిలిచే వాళ్ళు. కొట్టు బాగా నడిచి, కొంచెం డబ్బు రావడంతో మళ్ళీ పెళ్ళికొడుకుల బెడద పట్టుకుంది. అద్దెకు తీసుకున్న కొట్టుని మొత్తంగా కొనేసుకున్నాను.

అంతా బాగున్న సమయం లో సేండీ తమ్ముడు రాబీ లౌరీ అక్కడికి వచ్చాడు. వచ్చి, బెస్సీ ముసలి అత్తగారు పొయారనీ, పిల్లలని అదలించే వారులేక చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారనీ చెప్పాడు. ముసలి మావగారున్నారు కానీ, పిల్లలకి అసలు ఆయంటే బొత్తిగా భయం లేదు. ఇహ చేసేదేం లేక కొట్టునీ, కొట్లో సామానునీ అమ్మి మళ్ళీ ఇక్కడికొచ్చి పడ్డాను.

ఇక్కడికొచ్చి చూద్దును కదా, ఊరంతా అప్పులు! నేను పంపిన డబ్బంతా ఏమయిందో తెలియదు! అయితే చదువులు మాత్రం బాగా వంటబడుతున్నాయి. అదొక్కటే సంతోషం. అందుకే వాళ్ళనలాగే చదువుకోమన్నాను. నా దగ్గరున్న డబ్బు ఎంతకాలం సరిపోతుంది? అందుకే మళ్ళీ బట్టలు ఉతికి ఇస్త్రీలు చేయడం మొదలు పెట్టాను. అంతేనమ్మా! ఇహ పడుకోండి. ఇప్పటికే పొద్దు పోయింది,” అంటూ ముగించింది పెగ్గీ తన కథని.

                     ***

                      (సశేషం)

 

మూడు అద్భుతాలు

kalluri-1 మహాభారతంలో అశ్వత్థామ చాలా విలక్షణ పాత్ర.  ద్రోణ, శల్య, సౌప్తికపర్వాలలో తిక్కన ఆ పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడు. నిజానికి శల్య, సౌప్తికపర్వాలు రెండింటిలో కథానాయకుడు(లేదా ప్రతినాయకుడు) అశ్వత్థామే. యుద్ధమనే ఒక మహోద్రిక్తఘట్టంలో, అందులోనూ పరాజిత పక్షానికి చెందిన ఒక వీరుడు ఎదుర్కొనే ఆత్మసంక్షోభాన్నీ, మనస్సంఘర్షణను, భావోద్వేగాలను అశ్వత్థామ ముఖంగా తిక్కన ఎంతో లోతుగా, గాఢంగా చిత్రిస్తాడు. ఆ లోతును, గాఢతను తడిమి చూసి ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు. చదువుతూ తిక్కన మహాకవికి మనసులో పాదాభివందనం చేసుకొన్న ఘట్టాలలో ఇది ఒకటి. అశ్వత్థామ చిత్రణపై నా హృదయస్పందనను పూర్తిగా వెల్లడించాలని మనసు ఉత్సాహపడుతున్నా, బలవంతం మీద ఆపుకుని విషయానికి వస్తాను.

అశ్వత్థామను కళ్ళారా చూసిన ఒక వ్యక్తి ఉన్నారనీ, ఆయన ఆ విషయం చెప్పగా విన్న వ్యక్తిని నేను ఎరుగుదుననీ మా నాన్నగారు అంటుండేవారు. అశ్వత్థామనేమిటి, చూడడమేమిటనుకుని మీరు విస్తుపోతూ ఉండచ్చు. చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడని ఒక విశ్వాసం. ఇంతకీ విషయమేమిటంటే, హిమాలయ ప్రాంతంలో కొంతకాలం ఉన్న ఆ వ్యక్తి ఓ ఉషఃకాలాన నదికి స్నానానికి వెళ్లారు. అంతలో ఓ భారీకాయుడు నదిలోకి దిగబోతూ కనిపించాడు. ఆయన శరీరమంతా తూట్లు పడి చర్మం వేలాడుతోంది. జడలు కట్టి ఉన్నాయి. నదిలోకి దిగబోతున్న ఆ వ్యక్తిని చేతితో వారించాడు. దిగ్భ్రమతో గట్టుమీద నిలబడి పోయిన ఆ వ్యక్తి ఆయన స్నానం ముగించుకుని వెడుతుంటే, “తమరెవరు స్వామీ?” అని సంస్కృతంలో ప్రశ్నించారు. “ నేను ద్రోణపుత్రుడను, అశ్వత్థామను” అని ఆయన సంస్కృతంలోనే సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

ఈ ముచ్చట గుర్తొచ్చినప్పుడల్లా ఇందులోని అద్భుతత్వాన్ని ఇప్పటికీ  నేను ఆస్వాదిస్తూ ఉంటాను. ఇది సాధ్యమా అన్న హేతువాదంతో ఆ అద్భుతత్వాన్ని చిత్రవధ చేయడానికి నాకు మనసు రాదు. సంప్రదాయం ఏమిటంటే, వీరులు, లేదా ఇతర కారణాలతో జనహృదయాలకు దగ్గరైనవారు ఎప్పటికీ మరణించరు. జనం జ్ఞాపకాలలో చిరంజీవులుగానే  ఉండిపోతారు.  అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు మనకు బాగా తెలిసిన ఇటీవలి ఉదాహరణలు. నిజానికి ఈ సంప్రదాయం మనలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ఆ వివరాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి అశ్వత్థామ విషయానికి వస్తే, ఆయన చిరంజీవిత్వానికి వివిధ కారణాలను ఊహించవచ్చు. ఒకటి, రెండు చెప్పుకోవాలంటే, యుద్ధం ముగిసిన తర్వాత కౌరవపక్షంలో మిగిలిన ముగ్గురు వీరులలో(మిగతా ఇద్దరూ కృపుడు, కృతవర్మ) ప్రముఖుడు అశ్వత్థామే. అంతేకాదు, ఒకవిధంగా ఆయన కురు, పాంచాల జనపదాలు రెండింటికీ ఉత్తరాధికారి. కనుక ఆ రెండు జనపదాల ప్రజలూ ఆయనను సజీవస్మృతిగా నిలుపుకోడానికి కారణం ఉంది. అలాగే. అంతటి మహాయుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడడం కూడా అతనిని ‘చిరంజీవి’ని చేసి ఉండచ్చు.Mahabharata04ramauoft_1395

 

అశ్వత్థామ ఉదంతం నమ్మలేని అద్భుతం అయితే, నమ్మదగిన అద్భుతం ఒకటి చెబుతాను.  అది: అలెగ్జాండర్-పురుషోత్తముల యుద్ధసమాచారం. ఆ యుద్ధం గురించి చరిత్రపాఠాలలో చదువుకున్నాం కానీ, ప్రత్యక్షకథనాన్ని తోపించే అదనపు సమాచారం మనకు తెలియదు. పురుషోత్తముని గ్రీకులు ‘పోరస్’ అన్నారు. అతని అసలు పేరు పురుషోత్తముడేనా అని నా సందేహం. అతను పురాణ ప్రసిద్ధమైన పురు వంశీకుడు. ఆ వంశంలో చివరి రాజు అని కోశాంబి అంటాడు.  ప్లూటార్క్ అనే చరిత్రకారుడు అలెగ్జాండర్ స్వయంగా రాసిన లేఖలనుంచి సంగ్రహించినదిగా చెబుతూ, ఆ యుద్ధం గురించి కొంత ఆసక్తికర సమాచారం అందించాడు:

(పురు రాజు ఓడిపోయినా) ఆ యుద్ధం అలెగ్జాండర్ సైన్యంలో ధైర్యాన్ని హరించేసింది. వెనకడుగు వేయించింది. కేవలం ఇరవై వేల పదాతిదళంతో, రెండువేల ఆశ్వికదళంతో వచ్చిన పురురాజును ఓడించడానికే వారికి తల ప్రాణం తోకకొచ్చింది. తూర్పు దిశగా ఇంకా ముందుకు వెడితే ముప్పై రెండు ఫర్లాంగుల వెడల్పు, వంద నిలువుల లోతు ఉన్న గంగానదిని దాటవలసివస్తుంది. నదికి అవతల భారీ సంఖ్యలో శత్రుసేనల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. గంగానదీ ప్రాంతరాజులూ(Gangaridans), ఇంకా తూర్పున ఉన్న రాజులూ(Praesians-ప్రాచ్యులు) ఎనభైవేల ఆశ్వికదళంతో, రెండులక్షల పదాతిదళంతో, ఎనిమిదివేల రథికబలంతో, ఆరువేల గజబలంతో తమను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారని అలెగ్జాండర్ సేనకు తెలిసింది. కనుక వాళ్ళు అలెగ్జాండర్ ప్రణాళికను వ్యతిరేకించడం సహేతుకమే.

ఇది అలెగ్జాండర్ సైన్యాన్ని భయపెట్టడానికి చేసిన ప్రచారం కాదని ప్లూటార్క్ అంటాడు. ఆ సమీపకాలానికే చెందిన చంద్రగుప్తుడు ఆరులక్షల పదాతిదళంతో భారతదేశాన్ని లొంగదీసుకోవడమే కాక, సెల్యూకస్ కు ఒక్కసారిగా అయిదువందల ఏనుగులను బహూకరించిన సంగతిని ఉదహరిస్తాడు.  అలాగే, గంగానది గురించి చెప్పినదీ అతిశయోక్తి కాదని కోశాంబి అంటూ;  అలెగ్జాండర్ వచ్చే సమయానికి వర్షాకాలం మొదలైంది కనుక గంగ అంత వెడల్పూ, లోతూ ఉండడంలో ఆశ్చర్యం లేదంటాడు. రెండువేల సంవత్సరాల తర్వాత అహ్మద్ షా దురానీ వర్షాకాలంలోనే దండయాత్రకు దుస్సాహసం చేసి సగం సైన్యాన్ని యమునకు అర్పించుకున్నాడు. ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, పురురాజు ఓటమికి ఒక మతవిశ్వాసం కూడా కారణం. వర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను అది నిషేధిస్తోంది. దాంతో పురురాజు తగినన్ని బలగాలను సమీకరించుకోలేకపోయి ఉండచ్చు.

ఇంకొకటి ఏమిటంటే, భారతీయ ఆశ్విక సేనకన్నా ఉత్తమశ్రేణికి చెందిన గ్రీకు ఆశ్వికసేన ముందు పురురాజు రథికసైన్యం తేలిపోయింది. అయితే, పురురాజు తన గజబలాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే యుద్ధం గెలవడానికి అవకాశం ఉండేదనీ, కానీ యుద్ధంలో ఆరితేరి శరవేగంతో కదిలే శత్రుసేనను ఎదుర్కోడానికి మరింత లోతైన వ్యూహనైపుణ్యం ఉండాలనీ, అప్పటి పంజాబ్ గణ వ్యవస్థలో అది అభివృద్ధి కాలేదనీ కోశాంబి అంటాడు.

alexander

గజసైన్యంతో ఒక ఇబ్బంది ఏమిటంటే, సక్రమంగా వాడుకోకపోతే అది శత్రుసైన్యాన్ని చంపేబదులు, సొంత సైన్యాన్నే చంపుతుంది. పురుసేనలో గ్రీకు దాడిని సమర్థంగా తిప్పికొట్టగల సత్తా ఉన్నవారు విలుకాండ్లు. అయితే వారినీ సక్రమంగా వాడుకోలేకపోగా, వర్షాలు పడుతున్నప్పుడు శరయుద్ధం ప్రభావం తగ్గుతుంది. భారతీయ విలుకాని దెబ్బను ఏదీ అడ్డుకోలేదనీ, పొడవైన ఆ బాణం డాలునూ, కవచాన్నీ కూడా చీల్చి వేస్తుందనీ, భారతీయ ధనువు ఆరడుగుల పొడవు ఉంటుందనీ ఆరియన్ అనే చరిత్రకారుడు రాస్తాడు. ఇది స్వయంగా అలెగ్జాండర్ అనుభవం కూడా. మూడు వేళ్ళ వెడల్పు ఉన్న సూచితో ఒక మల్ల విలుకాడు ప్రయోగించిన బాణం అలెగ్జాండర్ కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళి, పక్కటెముకకు గుచ్చుకుపోయింది. అతి కష్టం మీద దానిని తీయగలిగారు. అతను ఎదుర్కొన్న అతి తీవ్ర గాయం ఇదే.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశచరిత్రను మలుపు తిప్పిన ఒక యుద్ధం గురించిన ఈ మాత్రం సమాచారాన్ని కూడా మనవాళ్ళు ఎక్కడా నమోదు చేయలేదు. గ్రీకు రాతలే ఆధారం. గ్రీకులే కాదు, పశ్చిమాసియా దేశాలు కూడా వేల సంవత్సరాలనాటి చారిత్రక ఘటనలను వివిధ రూపాలలో భద్రపరిచాయి. పురాతనఅస్తిత్వం ఎంతో ఉన్న మనదేశంలోనే ఈ జాగ్రత్త లోపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  దానికితోడు, ఉన్న చారిత్రక సమాచారంపై కూడా ఇతరేతర అన్వయాల ముసుగులు కప్పి మాయం చేయడానికి ప్రయత్నించడం మరింత ఆశ్చర్యకరం. ఎంతో ఆసక్తిని కలిగించే ఈ విషయాలను ముందు ముందు చెప్పుకుందాం. చెప్పొచ్చేదేమిటంటే, మన చరిత్రాదారిద్ర్యం నుంచి చూస్తే పురు-అలెగ్జాండర్ యుద్ధవివరాలు అపురూపంగానే కాక అద్భుతంగా అనిపిస్తాయి.  పురాణానికి, చరిత్రకు మధ్యనున్న హద్దులను చెరిపేసి అవి మనల్ని మహాభారత సమాజానికి దగ్గరగా తీసుకువెడతాయి.

హేలీ రెండువందల ఏళ్లనాటి సమాచారాన్ని సేకరించగలగడం కూడా ఒక అద్భుతమే. చరిత్రను భద్రపరిచడంపై పాశ్చాత్యులలో ముందునుంచీ ఉన్న ఆసక్తికీ, జాగ్రత్తకూ అది నిదర్శనం.

***

మేరీ ల్యాండ్ గెజిట్, అక్టోబర్ 1 సంచికలోని ఆ ప్రకటన పురాతన అచ్చు అక్షరాలలో ఉంది.  JUST IMPORTED  అనే శీర్షికతో అందులో ఉన్న సమాచారం, కెప్టన్ డేవిస్ సారథ్యంలో గాంబియానుంచి వచ్చిన లార్డ్ లిగొనీర్ లోని సరకును అక్టోబర్ 7న విక్రయించబోతున్నట్టు చెబుతోంది. ఆ సరకులో CHOICE HEALTHY SLAVES కూడా ఉన్నారు. విచిత్రంగా ఆ ప్రకటన హేలీ కంటపడిన తేదీ సెప్టెంబర్ 29, 1967. లార్డ్ లిగొనీర్ అన్నాపొలిస్ రేవుకు చేరి అప్పటికి సరిగ్గా రెండువందల సంవత్సరాలు అయింది. ఆ రోజున అన్నాపొలిస్ రేవులో సముద్రజలాలలోకి నిర్మించిన నడవ మీద తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండాలని తనకు అనిపించలేదనీ, అలాగే ఉన్నాననీ హేలీ అంటాడు. ఆ నడవ మీద నిలబడి, తన పూర్వీకుడు కుంటా కింటేను తీసుకొచ్చిన సముద్రజలాలవైపు చూస్తూ మరోసారి దుఃఖం ఆపుకోలేకపోయానని అతను అంటాడు.

1766-67 నాటి ఆ పత్రం గాంబియాలోని జేమ్స్ దుర్గంలో తయారైంది. దాని ప్రకారం లార్డ్ లిగొనీర్ 140 మంది బానిసలతో బయలుదేరింది. వాళ్ళలో ఎంతమంది బతికి బయటపడ్డారు? హేలీ రెండోసారి మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు వెళ్ళాడు. అక్కడ ఆ ఓడలో రవాణా అయిన సరకుల జాబితా దొరికింది: 3,264 ఏనుగు దంతాలు, 3,700 పౌండ్ల తేనెటీగల జిగురు, 800 పౌండ్ల ముడి నూలు, 32 ఔన్సుల గాంబియా బంగారంతోపాటు 98 మంది “నీగ్రో’’లు ఆ జాబితాలో ఉన్నారు. అంటే మార్గమధ్యంలో 42 మంది చనిపోయారు.

అమ్మమ్మ, కజిన్ జార్జియా తదితరులు కూడా తమదైన పద్ధతిలో గాథికులే నన్న సంగతి అప్పటికి హేలీకి అర్థమైంది. అంతలో, అన్న జాన్ వేలర్ నుంచి తమ్ముడు డా. విలియం వేలర్ కుంటాను కొన్నాడు కనుక అందుకు సంబంధించిన రాతకోతలేవైనా జరిగి ఉండచ్చని అతనికి స్ఫురించింది. వెంటనే వర్జీనియాలోని రిచ్ మండ్ కు వెళ్ళాడు. స్పాట్ సిల్వేనియా కౌంటీలో  1767 సెప్టెంబర్ తర్వాత రాసుకున్న దస్తావేజుల మైక్రోఫిల్మ్ ను గాలించాడు. సెప్టెంబర్ 5 తేదీతో పాతకాలపు రాతలో ఉన్న ఒక పొడవైన దస్తావేజు కనిపించింది. అందులో, జాన్ వేలర్, అతని భార్య ఆన్ 240 ఎకరాల వ్యవసాయభూమిని, కొంత సామగ్రిని విలియం వేలర్ కు బదిలీ చేసినట్టు మొదటి పేజీలో ఉంది. రెండో పేజీలో-“and also one Negro man slave named Toby” అని ఉంది!  అతనే కుంటా కింటే!

హేలీ అన్వేషణ ముగిసింది. ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, రొసెట్టా శిల నుంచి పొందిన ప్రేరణతో అతను అన్వేషణ ప్రారంభించి అప్పటికి పన్నెండేళ్ళు గడిచాయి! హేలీ లానే మూలాలనుంచి నిర్దాక్షిణ్యంగా నరికివేయబడి బానిసలుగా అమ్ముడుపోయిన నల్లజాతి పూర్వీకుల వారసులు బహుశా ఇప్పుడు కోట్లలో ఉంటారు. శూన్యంలో ఈదుతున్న వారి  మూలాల అన్వేషణ  ఎప్పటికీ ముగిసే అవకాశం లేదు. అసలా అన్వేషణ ప్రారంభం కాకపోయినా ఆశ్చర్యం లేదు.

కాలానికి బానిసలైన మనదేశంలోని సామాన్యుల జీవితాలూ ఇందుకు భిన్నం కావు.

                                                                                                             -భాస్కరం కల్లూరి

 

 

 

 

ఓ.. చెప్పలేదు కదూ తన పేరు “అలవి”..!

రఘు

రఘు

(కొన్ని అనుభవాలూ జ్ఞాపకాలూ ఏ సాహిత్య ప్రక్రియలోనూ ఇమడవు. అందుకే, చలం ‘మ్యూజింగ్స్’ రాసుకున్నారు. సంజీవదేవ్, ఆచంట జానకి రాం వంటి రచయితలూ తెగిన జ్ఞాపకాలు రాసుకున్నారు. అలాంటి అనుభూతులకూ, జ్ఞాపకాలకూ ఒక వేదిక ‘న్యూ మ్యూజింగ్స్’ అనే ఈ శీర్షిక. ఈ శీర్షిక మీ అందరిదీ. ఎవరయినా రాయవచ్చు. ఎలాంటి అనుభూతికయినా ఇక్కడ చోటుంది. మీ అంతరంగ కథనాలన్నీ…మీ మనసు ముడతల్లో దాక్కున్న అనుభూతులన్నీ ఇక్కడ ఆవిష్కరించండి…ఈ వారం రఘు మాందాటి ఏమంటున్నారో వినండి !)

సాధారణంగానే ఏ అంచనాలు లేకుండా ఏ బంధం మొదలవ్వదేమో. కాలానికెప్పుడు నన్ను తర్కించే పనే.. ఎందుకో మరి ఎవ్వరికి అర్ధంకకపోవడం అనే ముద్ర మంచిదే అయ్యింది.. అందుకే ఇప్పటికి నేనందరికీ దూరం.మనుషుల మధ్య ఒంటరిగా నడుస్తూ గడపడం నాకో అలవాటైన వ్యసనం. ఏంటో నాకు సంబంధం లేని మనుషులని వారి సహజమైన భావాల్ని దగ్గరినుండి చూసే అవకాశం ఉంటుందనే రద్దీగా ఉన్న చోటులో గడుపుతుంటాను. ఇక అలా గడపొచ్చు అనే ఉద్దేశంతోనే సంతకు చేరుకున్నా. సంతలో చుట్టూ జనాలతో ఇరుపక్కల చిన్న చిన్న షాపులతో కిక్కిరిసిపోయింది. జనాల మధ్య ప్రతి పది పదిహేను సెకన్లకి తళుక్కుమని మాయమవుతోంది తను. ఇక తనని చూసాక మొట్టమొదట మనసులో కలిగిన బావం తనని తనివితీరా చూడాలని. ఏంటో కళ్ళతో పాటే అడుగులు అందరిని తోసుకుంటూ తనని చేరుకున్నాయి. నా అడుగుల్లో వేగం తగ్గింది. ఇక తనకి నేను ఏ మాత్రం దూరం లో లేను. రెండే రెండు అడుగుల దూరం నుండి తన వెంట నడుస్తున్నాను. సాధారణంగ ఏ అమ్మాయిని కూడా ఇంత తపనతో వెంట పడింది లేదు.

నా వయసు వాళ్ళందరు అమ్మాయిల వెంట పరుగులు పెడుతుంటే అర్ధమే కాలేదు ఇంత కాలం.. 
 
నల్లగా నిగనిగలాడుతు చక్కగా అల్లుకున్న జడ అడుగు అడుగుకు ఆగకుండా జడ గంటలు సుతారంగా ఎత్తు వంపులను తగులుతూ…
అంత గోలలో కూడా పాదానికి హత్తుకున్న అందెలు జిల్లు జిల్లు మంటున్నాయి.
తలలో గులాబీ పువ్వు దానిని ఆనుకుంటూ మూరెడు మల్లెలు. ఊగుతున్న కమ్మ బుట్టాలు. పిచ్చెక్కిస్తున్న నడుము వంపు. కనకాంబరం రంగు లంగా తెల్లని ఓణి ఏ మాత్రం ఒంపులను నా కంటపడకుండా దాచలేక పోతున్నాయి..
ఇప్పుడిక దూరం మరింత దగ్గరయ్యింది తన కంట పడకుండా తనని ఎదురుగా చూసేందుకు నలుగురైదుగురిని పక్క పక్కగా దాటుకుంటూ తన కన్నా కాస్త ముందుకు చేరుకొని వెనక్కి తిరిగి చూసా..
నా కళ్ళకి ఒక్క సారిగా మైకం.. తన నిలువెత్తు దేహంలో ప్రతి కదలిక వర్ణనాతీతం.
తన అందాల సుగంధాలు మత్తెక్కిస్తున్నాయి.
ఏదో వింతైన రసాయన చర్య ఒంట్లో జరుగుతున్నట్టు అనిపిస్తోంది.
తాను దగ్గరవుతున్న కొద్ది వింత ప్రకంపనలు అల్లకల్లోలం చేస్తున్నాయి.
లాభం లేదు తనతో ఎలాగైనా మాటలు కలపాలి కానీ ఎలా?
చాల సేపు గమనించాను తానొక్కతే సంతకి వచ్చినట్టుంది. తన పని తాను చేసుకొని ఇక సంత బయటకు అడుగులేస్తోంది. ఆ అడుగుల వెంటే నా అడుగులు. ఆకాశం మబ్బులని వడ్డించింది. వీస్తున్న గాలి చల్లదనాన్ని విసురుతోంది. జన సందోహాన్ని చీల్చుకుంటూ సాగుతున్న మా నడకలు చివరికి మమ్మల్ని మాత్రమే మిగిల్చాయి. 
 
ఇప్పుడు తన ప్రతి అడుగు స్పష్టంగా వినిపిస్తోంది. ఉన్నపళాన చినుకులు మట్టిలో దాగిన సుగంధాన్ని తవ్వుతున్నాయి. చల్లని తుంపర్లు గిలిగింత పెడుతూన్నాయి. కొద్ది కొద్దిగ తుంపర్లు కలిసిగట్టుగా జల్లుల రూపాంతరం చెందింది. తన ఓణీని ముని వేళ్ళతో పైనుండి అందమైన భంగిమలో తలమీద పరుచుకొని పట్టులంగా కింద తడవనీకుండా పైకెత్తుకొని నడక కాస్త పరుగుగా మారింది. పచ్చని పైరుని నీలాకాశాన్ని కురుస్తున్న జల్లులో తడిచిన కనకాంబరం పట్టులంగాలో పరుగెడుతున్న తను…..
ఆ దృశ్యం మనసు క్యాన్వాస్ పై వర్ణ చిత్రమై  దిద్దుకుంది. అల చూస్తూ నడుస్తున్న నేను ఎప్పుడు తడిచానో తెలీనే లేదు.
దూరాన రెండు ఈత చెట్ల కింద తడిసి ముద్దవుతున్న చిన్న పాక. ఆమె పరుగు లాంటి నడకతో అందులోకి చేరుకుంది. నెమ్మదిగా నా అడుగులకి వేగం అందించి చిన్న పరుగుతో చేరుకున్న. నలుగురు కూర్చోడానికి రెండు బల్లలేసిన చిన్న టీ కొట్టు. అందులో యాబై ఏళ్ళ ముసలమ్మా పొయ్యిమంట పెడుతూ పాల గిన్నెతో కుస్తీ పడుతూ..
పాకలో చిన్న కర్ర గుంజను ఆనుకొని చిన్న బల్లపై కూర్చొని తడి కొంగును దులుపుకుంటూ తను. తడిచిన జడలోని మల్లె పూలు మరింత తెల్లగా.. గులాబి రేకులో బందిలై మెరుస్తున్న చినుకులు. నొసటి నుండి కంటిని దాటుతూ పెదాలకు అడ్డుపడుతున్న వెంట్రుకల నుండి ఒక్కో చుక్క మెడను దాటుతూ హృదయం పై పడుతూ ఆ హృదయాన్ని దాచుకున్న రవికతో పాటు నా మనసుని కూడా తడుపుతూ..
ఎప్పుడు గమనించిదో తను
..ఓయ్ పిల్లోడ.. ఎంటా చూపు..
ఉలిక్కిపడ్డాను.
కళ్ళను నేలకు వేసుకొని ఎం చేయాలో అర్ధం కాక అది..  అది..  అంటూ ఎం చెప్పాలో తెలియట్లేదు.
మరోసారి నెమ్మదిగా చూసా..
తన జుట్టు విప్పుకుంటూ సూటిగా నా కళ్ళలోకి బొమ్మలెగిరేస్తూ తన చూపులు ప్రశ్నార్ధకంగా గుచ్చుకుంటున్నాయి. కాని తను నన్నలా చూడడం తనని నేనలా  చూడడం చాల ఆనందంతో చిత్రంగా ఉంది.  చల్లని ఈదురు గాలికి నడుం వంపులో చెక్కుకున్న తెల్లని కొంగు ఉండలేక పైపైకి రెపరెప లాడుతూ ముసుగేసుకున్న నాబి తెరని ఎత్తి చూపుతోంది. గోదుమ బంగారు పసుపు రంగులు కలబోసుకొని ఓ సరి కొత్త రంగులో తన దేహ ఛాయా. మునుపెన్నడూ చూడని ఆ అందం కను రెప్పని వేయనీయలేకపోతోంది. నా వాలకం చూస్తుంటే కామందుడిగా  మారుతున్నానా?? ఎప్పుడు గమనించిందో చట్టుక్కున తెర దించి కొంగుని లంగాలోకి మళ్ళి చెక్కుకుంది అయినా తడిచిన ఓణిగుండా మసగ్గా ఇంకా మైమరిపిస్తూనే ఉంది.
ఓయ్ పిల్లోడా.. ఏ ఊరి మీది. అడిగేది నిన్నే…!! కిక్కురు మనట్లేదు. సంతలో నుండి చూస్తున్న నువ్ నా వెంట బడటం..

Alavi

ఇదిగోవే పిల్ల వేడి వేడి గ కాస్త చాయ్ నీళ్ళు గొంతులో పోసుకో చలి వణుకు ఆగిపోద్ది అని ముసలవ్వ తన చేతిలో పెట్టింది. రెండు చేతులకి కొంగు సాయంతో దోసిలితో అందుకొని గుంజకి ఆనుకొని దగ్గరికి ముడుచుకొని వణుకుతూ ఒక్కో గుటక గొంతులోకి దింపుకుంటూ సేద తీరిన ములుగుతో ఆహ: ఒసే ముసల్దాన నువ్వు సూపరు..
నోరు మూసుకోవే నువ్వు నీ వాలకం.
పాడు వాన తగ్గేటట్టు లేదు ఇదిగో నాయన నువ్వు కూడా తాగు అనడంతో తీసుకున్నాను..
తాగు పిల్లోడ.. ఈ ముసల్దాని చాయ్ సూపర్ గుంటది.
పిల్లోడ పిల్లోడ అని ఏంటే ఆ మాటలు, ఒంటి మీదకు వయసొచ్చిన పెద్దంతరం చిన్నంతరం లేకుండా. ముక్కు మొహం తెలియకుండా ఏంటే అవి.  రాను రాను దీని ఆగడాలు ఎక్కువైతున్నాయి. ఓ మొగుణ్ణి కట్టబెడితే గాని దీని తిక్క కుదరదు.
మొగుడా…!! ఒసేయ్ ముసల్దాన నీకే తీసుకోస్తా మొగుణ్ణి.
ఆ అదొక్కటే తక్కువ నాకు..
నువ్వు తాగు బిడ్డ ఈ పోరి పెద్ద వాగుబోతు. నువ్వేం పట్టించుకోకు. మాకిది మామూలే..
చలాకి పిల్ల. పిల్లేం కాదు దగ్గరి దగ్గరగా ఓ ఇరవై యేండ్లు ఉంటుంది కావచ్చు.. ఎందుకో ఆ చలాకీతనం నాకు నచ్చింది..
ఒసేయ్ బట్టలు మార్చుకోవే చలి బట్టలతో ఎంత సేపని ఉంటావు. చలి ఆగక పోతే దా ఈ పొయ్యి కాడికి.. కాస్త సెగ అంటుకో.. నువ్ గూడ రా బాబు.
అగొ… రా బాబు ముసల్ది పిలుస్తోంది. అంటూ వెకిలి భంగిమ పెడుతూ నవ్వుతు పిలిచింది.
ప్రేమ పుస్తకాలు ఎన్నో చదివా ఎన్నో సినిమాలు చూసా కాని ప్రత్యక్ష అనుభవం కలో నిజమో ఏమి అర్ధం కాకుండా చిత్రంగా, కొత్తగా గిలిగింత పెడుతోంది. దానికి తోడు చల్లని ఈదురు గాలులు, వర్షంలో తడిచిన ప్యాంటు షర్టు చలిని రెట్టింపు చేసింది. ఇక చలిని భరించడం నా వళ్ళ కాదనుకుంటూ ఒంటిని కాపుకునేందుకు పొయ్యిమంట  దగ్గర తిష్టేసా.. వెచ్చటి సెగ నెమ్మదిగా ఒళ్ళునంత తాకేసింది కాస్త కుదుట పడింది.
నెమ్మదిగా లేచి పాక బయటికి  తొంగి చూసా కోరస్ పాడుతున్నట్టు వర్షం. తెలీకుండానే పాక చుట్టూ, ఆకాశం నిండా చీకట్లు అలుముకున్నాయి. వర్షం తగ్గేలా లేదు. ఎం చేయాలో తోచట్లేదు.. ఒక్కోసారి మనసు మన మాట వినదు అనుకోడానికి ఇది సరైన నిదర్శనం. ప్రతి మగాడు అమ్మాయికి ఆకర్షింప పడతాడు ఇది సృష్టి ధర్మం అంటారు. ఆకర్షింప పడేది అందానికా? మనసుకా? మనసుకు ఆకర్షింపబడడం కన్నా ముందు నన్నడిగితే అందమే. ఆ అందమే ఎంతటి మగాన్నైన వెంట పడేలా చేస్తుంది.. ఇక మనసుతో మొదలయ్యే బంధాలు శరీరంతో పనిలేనట్టుగా నటిస్తూ గడుస్తాయి. అయిన ఏ బంధమైన ఒకరికొకరై ఇష్టపూర్వకంగా మమేకమైనపుడే బంధానికి పరిపూర్ణమైన అర్ధం చేకూరుతుంది. అర్ధం అనే దానికన్నా వేరే పేర్లని ఎన్నో పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టేట్ మెంట్ లని చలం ఎప్పుడో ఇచ్చే ఉన్నాడు. అయినా ఎవరు ఏం చెప్పిన ఎవరికి వారికి ఎదురైన సంఘటన సారాంశం మీదే లేదా వారి కోరికల ఉహ జనితంగా నిర్మించుకున్న సౌదాలపై ఆధార పడి ఉంటుంది వారి వారి నిర్వచనాలు.
ఓయ్ పిల్లోడా..
వెనక్కి తిరిగి చూసా.. లాంతరు వెలుతుర్లో. నేనెన్నడు ఊహించని మైమరిపించే అందం ఇలా కళ్ళముందు నన్ను కలవరిస్తూ చూస్తుంటే. గుండెలో తెలియని వింత భావమేదో నన్ను శిలను చేసేస్తోంది. మాట పెగలనివ్వట్లేదు.
ఓయ్ పిల్లోడా.. ఆడ పిల్లను ఎప్పుడు చూడనట్టు మింగేసే ఆ చూపేంది..
అవునా..! నిజంగానే నా చూపు అలా ఉంటుందా.. ఏమో? ఈ అమ్మాయి చెప్పే తీరును చూస్తే అలానే ఉండి ఉంటుంది. అందరు నా నవ్వు బావుంటుంది. కళ్ళు కలవరపెడతాయి. అంటూ క్లాస్ మేట్స్  సరదా పట్టించేవారు. నా ప్రయాణం అమ్మాయిలు లేక ఒంటరిగా ఏం సాగలేదు అలా అని అమ్మాయిలతోనే సాగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ అమ్మాయి నన్ను ఆకర్షించలేదు. ఆ విషయం గురించి పెద్దగ ఆలోచించ కుండానే రోజులు అలా  గడిచిపోయాయి. కాని ఈ అమ్మాయిని చూడగానే తెలియకుండానే నరనరాలు వేడెక్కుతున్నాయి.. తెలియని వైబ్రేషనల తో అమాంతం శరీరం అంత ఊగిపోతున్నట్టు తలపు. ఒక్కసారిగా తనలోకి దూకేయ్యలన్న ఆత్రుత.. ఈ క్షణంలో ఆలోచనలకు కోరికలు ఊతమిస్తూ శరీరాన్ని బలోపేతం చేస్తూ ఇంచుమించు వ్యవసున్ని చేస్తున్నాయి.. అయిన ఈ చర్య ఏది బయటికి కనపడనీకుండా ఎంత నిశబ్దంగా ఉండాలని ప్రయత్నించిన ఏం లాభం నా కళ్ళు యిట్టే బయట పెడుతున్నాయి.. ఈ అమ్మాయికి నా బాష కళ్ళతో అర్ధమైనట్టుంది ఇక తప్పదన్నట్టు చూపును పక్కకి తిప్పుకున్న..
లాంతరులో మిలుమిలుకు మంటు చిన్ని దీపం చీకట్లతో సాధ్యమైనంత యుద్ధం చేస్తూ తన అస్తిత్వంతో ఆమె అందానికి మరింత అందాన్ని ముద్దుగా అద్దుతోంది..  చల్లని గాలులు తన కురుల కొసలను లాక్కెల్లె ప్రయత్నం చేస్తున్నాయి.. నుదిటి పై ఎర్రని సింధూరం. కనుబొమలు ఎగిరేస్తున్న ప్రతిసారి నన్ను గట్టిగ ప్రశ్నిస్తున్నట్టు. గుండ్రటి కళ్ళు ఎప్పుడు చూసిన నన్ను తన వైపుకు లాగుతున్నట్టు. ఆ కను రెప్పల పై అక్కడక్కడ తడికి చెదిరిన కాటుక గుర్తులు.  ఆ పెదాల అంచున మకరందాన్ని దాచిన పుప్పొడి గుత్తులా.. ఎగిసిపడుతున్న తడి ఆరిన కురులతో, లాంతరు పట్టిన చేతి మణికట్టుకు మెరుస్తున్న మెరుపు గాజులు బహుశా సాయంత్రం సంతలో కొన్నవే అనుకుంటా..
మగాడి మనసు పారే నీరు. అంచనా మానసికమైన మరే రకమైనదైన ఎప్పుడు నా కోణాల్లో నుండి తర్కిస్తూ బేరీజు వేస్తూ క్షణ క్షణానికి అభిప్రాయపడుతూ, అర్ధం చెసుకుంటున్నట్టు  అనంతమైన అనుభూతి యేదో ఉందని భ్రమ పడుతూ, తృప్తిని పొందలేకపోయినా, ఇవ్వలేకపోయినా అంతర్గతంగా సాగుతున్న ఈ వింత అలజడులను ఇంతకు ముందెన్నడు పొందలేదు. బహుశ నాది మోహమో లేక కామమో కాక ప్రేమో ఏమో…
ఏంటోయ్ పిల్లగా ఏం మాట్లాడట్లేవ్ ఏంది సంగతి?
 
మాటలా ఎందుకు మాట్లాడట్లేదు కొన్ని గంటలుగా నాలో నేను నాలోని నీతో ఎన్నో ఎన్నెన్నో మాట్లాడుతూనే ఉన్నా వాటిని మౌనంగా నువ్వు పసిగడుతున్నవన్న సంగతి కుడా నాకు తెలుసు. ఇక తెలుసుకోవాల్సింది తేల్చుకోవాల్సింది ఏమైన మిగిలి ఉందంటే నీకు నాకు నడుమ మిగిలిన ఈ అడుగు దూరమే.. నిజాన్ని నిర్బయంగా ఈ క్షణం అనుభావిస్తున్ననా లేక అనుభవంలోనే ఉన్నానన్న భ్రమలో ఉన్నానా! కళ్ళముందు యాంత్రికంగా గడిచిపోయే క్షణం నాకోసం కల్పితమై కళాత్మకమై చిలిపిగా కలవరపెడుతున్నదా! ఇలాంటి కాదు కాదు ఈ అనుభవాన్నేనా ఎన్నాళ్ళనుండో నేను కోరుకుంటున్నది. ఏమో.. కావచ్చు మనసులోని వింత ప్రేలాపనలా ప్రేరేపణల వాలకాన్ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
మగాడికి కావాల్సిన ప్రపంచమే అమ్మాయికి ఆయుధం. మగాడిని మించిన ధైర్యం కాని భయం కాని మరోటి తన ప్రపంచంలోనే లేదు.
చీకట్లో కప్పలు తమ సామర్ధ్యాన్ని కలిసిగట్టుగా వినిపిస్తున్నాయి.. వాటికి ఏవో కీటకాలు శృతి కలిపాయి.. చల్లని తుంపర్లతో కూడుకున్న వర్షపు గాలులు నన్ను తన మీదకు నెడుతున్నాయి. కళ్ళెదురుగా నిలువెత్తు అందం అందంగా నన్ను అలాగే గమనిస్తోంది.
దా.. వానా ఇప్పుడప్పుడే తగ్గదు గాని లోనికి రా.. నోట్ల నాల్క లేనట్టు జేస్తున్నావ్ నేనోకధాన్ని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్న ఉలుకతలేవ్ పలుకుతలేవ్ ఏందో ఈ పిలగాని సంగతి. రా…  
 
అంటూ తన కుడి చేయి లాంతర్ని కిందికి దించుతు ఎడం చేయితో నా కుడి భుజం పట్టుకొని లోపలికి జరుపుతు ముందుకు నెట్టింది. 
ప్రశ్న నాకు నేనే ఒక పెద్ద ప్రశ్న సమాధానం కోసం వెతుకుతూ వెతుకుతూ ప్రశ్నల సాగరంలో సమాధాన తీరం కోసం శక్తినంత ఉపయోగిస్తూ చిల్చుకు పోతున్నా చిత్రం ఏంటో గాని తీరం కనపడితే ఒట్టు. నింగి నీరు కలియపడుతున్న చోట నాలో జ్ఞాన వెలుగును వెలిగించుకునేందుకు నన్ను నేను ప్రశ్నల మంటలో కాల్చుకుంటూ కాలానికి సాక్ష్యంగా ఏకాంతంగా అర్ధంకాని ఓ అజ్ఞాత సమిధనై ఇంకా మిగిలి ఉన్న.. ఇక తను అడిగే ప్రశ్నకు సమాధానాన్ని తయారు చేసుకోక తప్పదు. నిజమే తనని చూసినప్పటి నుండి ఇప్పటి వరకు తనను చూడడమే తప్ప తనతో పలికింది లేదు.
 
ఊగుతున్న లాంతరు నా నీడను కూడ అటు ఇటు ఊపేస్తుండగా మెల్లిగా అడుగులు వేస్తూ లోపలి నడిచా నా వెనకాలే వయ్యారంగా లాంతరుతో తాను. లంగా ఓనిలో కాస్త పిల్ల చేష్టలు కనిపించిన ఆ పిల్ల చేష్టలను వానలో తడిసిన లంగా ఓనిలో దాచేసి మిగిలిన నున్నటి శిల్పానికి లేత పసుపు రంగు నార చిరని బిగుతుగా చుట్టేసి విశాలమైన ఆడతనాన్ని కొంగుతో కప్పేసి పరమార్ధపు నడుం వంపులో గాలికి ఎగిరిపోకుండా జాలువారుతూ మిగిలిన కొంగుని చెక్కుకొని ఓ నూతనత్వాన్ని ఆపాదించుకొని పరిపూర్ణమైన కన్యతనానికి చిరునామై నృత్య భంగిమలో హొయలుగొలుపు సుతి మెత్తని చిరు మెలికల కదలికలతో అడుగులోన అడుగువేస్తు వెళ్లి నేను కూర్చున్న ఎదురు బల్లపై కర్ర గుంజకి వీపుని ఆనించి అదే గుంజకి పొడుచుకుంటూ ముందుకు సాగిన కర్ర వంపులో లాంతరును వేలాడించింది. తన మోకాళ్ళని గుండె ధరి దాపుకు వచ్చేదాక ముడుచుకొని ఎడమ చెయ్యితో మొకాళ్ళని చుట్టేసి కుడి చేతిని నడుము వెనక బల్లపై పెట్టి వెన్నుతో పాటు తలని కూడా కర్రగుంజకి ఆనించి చాల నిశ్శబ్దంగా ప్రశాంతంగా అలిసిన ప్రకృతి సొమ్మసిల్లి సేద తీరుతున్నట్టుగా కూర్చున్న తనపై లాంతరు వెలుతురు పోటి పడి మరి తన లోని ఒక వైపుని అమాంతం వాటేసుకొని ప్రతి కదలికల వంపులో ఓ సరికొత్త సౌందర్యాన్ని పూత పోసి ఇక కళాకారుడి కుంచెలో మమేకమవడానికి పూర్తిగా తనని సంసిద్ధం చేసేసింది. తనను సుతిమెత్తగా హత్తుకుంటున్న లాంతరు వెలుతురుకున్న స్వాత్రంత్రం ఇంకా నా ముని వేళ్ళకి ఎప్పుడొస్తుందో.. తన ఉచ్చ్వాస నిశ్వాసలకు లయబద్దంగా గుండెపై పరుచుకున్న ఆడతనం ఊయలలూగుతోంది. ఆ ఊయలపై పిల్లాడిల తలవాల్చుకొని ప్రియసఖుడినై నను చూసే ఆ చూపుల దారులగుండా తన మనసులోకి తొంగి చూడాలని ఏంటో ఏవో ఏవేవో అర్ధం కాని నా ఆలోచనలను అర్ధవంతం చేసుకోవాలనే తపనతో తన చుట్టే పరిభ్రమింపచేస్తూ, ఇక  మౌనంగా మిగిలిన నా దేహాన్నిబల్లపై జీవమున్న శవంలా బంధించేసా…
చుట్టూ పరుచుకున్న నల్లని చీకట్లు వీస్తున్న చల్లగాలులు కురుస్తున్న వర్షం వెలుగుతున్నలాంతరు తనకు నాకు నడుమన మిగిలిన ఘడ సౌందర్యనిశ్శబ్ధం హ్మ్… నా చుట్టూ, నాలో గడుస్తున్నఅందమైన భావ క్షణానికి ఇవే సాక్ష్యాలు. ప్రతి ఒక్కరు దేనికోసం పరితపిస్తారో నాకు తెలీదు. ఇంతకాలం నేను దేనికోసం తపిస్తున్నానో అర్ధమే కాలేదు. తమ కోసం, తమను తాము త్రుప్తి పరుచుకోవడం కోసం అవగాహన లేని యాద్రుచిక దారుల్లో గుడ్డిగా ప్రయాణం చేస్తుంటారు. కొన్ని ప్రయాణాల్లో ఆది నుండి అంతం వరకు వేటికి నిర్వచనాలు ఉండవు. ఇలాంటి ప్రయాణాల్లో చివరికి మిగిలేది అనుభవం అనుభూతి మరియు ఎప్పటికి అర్ధం కాకుండా ఓ ప్రశ్నలా మరో ప్రయాణానికి సిద్దంగా మిగిలిపోయే మనం. బహుశ ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ అనుభూతి ఇంచు మించు అలాంటి ఓ అరుదైన ప్రయాణమే.. కాని ఆదికి అంతానికి నడుమ అర్ధం కాకుండా శిలల ఉండిపోవడం ఎందుకో బావుంది.
ఓ పొల్ల పడుకున్నావే..! అంటూ ముసలావిడ లోపలి నుండి వచ్చింది. పాక చిన్నదే పాక గోడలు వెదురు తడకలతో తాయారు చేసుకున్నట్టుంది.  ఆ పాకలో నలబై శాతంలో తడకలనే అడ్డు పెట్టి అందులో మల్లి రెండు చిన్న చిన్న అర్రలుగా విడదీసి ఒక దాంట్లో పొయ్యి గిన్నెలు పెట్టుకుంది. ఇంకో అర్ర పట్టె మంచం బట్టలు పెట్టుకోడానికి. చీకటిలో అంత స్పష్టంగా కనిపించట్లేదు కాని పోల్చుకొగలిగాను. పొయ్యి మీద వంట పూర్తి చేసుకొని ఇప్పుడో రేపో చిరిగిపోతుంది అన్నట్టుండే చీర కొంగుకు తడి చేతులు తుడుచుకుంటూ తన దగ్గరికి వచ్చింది.
లేవే లే.. అనడంతో ఉలిక్కి పడి లేచింది.
ఎంటే..  ముసల్దానా! మంచి నిద్రను పొట్టన బెట్టుకున్నావ్. అని ముసలావిడ మీదకు విరుచుకు పడింది.
అబ్బో సాల్లే.. నీ పొట్టలో ఇంత కూడేయ్యలని లెపినానె.. లే లెగు ఇంత సల్లబడు. అంటూ రెక్క పట్టి లేపే ప్రయత్నం చేస్తోంది.
అయ్యో పిల్లోడ నువ్వింకా బొలెధా..? అని నిద్ర కళ్ళతో ప్రశ్నించింది. నాకు ఆశ్చర్యమేసింది.
యాడికి బోతాడే బయట వాన ఎట్లగోడ్తాంది సుషినవా? ఇంకా నయం తుఫాను గట్ర ఐతే మాత్రం ఈ గూడు గూడ నిలవదు. ఇంత సీకట్ల ఈ వానల యాడికి బోతావ్ ఈ రేత్రి యిన్నే ఉండు బిడ్డ. వాన తగ్గేకా తెల్లారగట్ల బొదువు లె..
లేవే పొల్ల లే.. లేచి అబ్బాయి చెయ్ గడుక్కోనికి ఇన్ని నీళ్ళు ఇవ్వు. తొరగా రండి నేను బోయి పళ్ళెం లో అన్నం తోడుతా..
ముసలావిడ పొయ్యి మీద నుండి వంట కుండలు, పళ్ళాలు, కూచోడానికి పీటలు సిద్దం  చేస్తోంది. తను సర్వలో నీళ్ళు పట్టుకొచ్చింది. నెమ్మదిగా ఇద్దరం పాక బయటికి చేతులు పెట్టి కడుక్కున్నం.
ఇగో… నేను ఇగ నీతో మాట్లాడను పిల్లగా. అంటూ నా వైపుకు చూసింది.
ఏ ఎందుకండి.
అబ్బ. ముత్యాలే రాలుతున్నాయి. ఎందుకలా మూతి ముడ్చుకొని ఉంటావ్. సంధిస్తే ఎక్కడలేని సోదంత వాగుతారు అబ్బాయిలంత. నువ్వేంటయ్య ఇలా.. అమ్మాయిని అందులో మాంచి అందగత్తెని నన్ను ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో అలోసిత్తున్నావ్..
అదేం కాదండి. వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని.
ఒక్క సారిగా నావైపు చూసి చేతిలో ఉన్న సర్వని ధడాల్న కింద పడేసి. కోపంతో
మరి నా యెంట ఎందుకొచ్చినావ్? అట్నుండి అటే ఎల్లలేకపోతివా.. ఛీ పో.. అంటూ టక టక లోపలికి వెళ్ళింది. నేనక్కడే ఉండిపోయా.. ఏమనుకుందో ఏమో..
ఆన్నే ఏం జేస్తున్నావ్ చెయ్యి బట్టి గుంజుకు రావాల్నా?  దా తొరగా..  అంటూ ధబాయించింది. ఇక తన వెంటే వెళ్లి నాకోసం సిద్దం చేసిన  పళ్ళెం ముందు కూచున్న. నాకు దాదాపుగ పక్కనే తను కూచుంది. ముసలావిడ కుండలో నుండి చేపల పులుసు గంటెతో వంపుతోంది.
ఓయ్ పిల్లగా అలగకుండా గులగకుండా కడుపునిండా తిను. మా ముసల్దాని చేప పులుసు తినే అద్రుష్టం నీకు దొరికింది. తినిసూడు ఇగ నువ్వు మరిసిపోతే ఒట్టు.
నువ్ నోర్ముయ్యవే అబ్బాయిని తినని ఎప్పుడు ఏందో వాగుతావ్..
ఏందే ముసల్దాన నా మీదకి ఎగురుతున్నావ్ పళ్ళెం ఎత్తేస్తా జాగర్త..
అబ్బో దీనికేం తగ్గువలేదు రోజురోజుకి గారవం చేత్తుంటే నెత్తికెక్కుతాంది. నీకిప్పుడు తెల్వది ఆగు.
ఇక వాళ్ళిద్దరూ గొడవపెట్టుకోకుండా క్షణం ఉండలేరని అర్ధమయ్యింది.
నెమ్మదిగా పొగలు గక్కుతున్న అన్నంలో కమ్మని చాపల పులుసు. పైగా కడుపులో పేగులు నకనక లాడుతున్నాయి. ఇక ఆగలేక గబా గబా కలుపుకొని ఒక్కో బుక్క నములుతుంటే నిజంగానే స్వర్గం కనపడుతోంది.
కాసేపటివరకు ఏ మాటలు లేకుండా ప్రశాంతంగా ముగ్గురం తినే పనిలో మునిగిపోయాం..
చాల కాలానికి రుచికరమైన బోజనాన్ని శ్రద్దగా తినడంతో నొసటిపై చిరు చెమటలు పట్టాయి. వేడి వేడి పొయ్యి మంట వద్ద కూచొని తినడంతో ఒళ్ళంతా వేడిగా మారింది. భయటికొచ్చి నిల్చున్న చేతులు కడుక్కున్నాను. తల అటు తిప్పుకొని చెయ్ తుడుచుకో అంటూ తన కొంగును అందించింది. ఇక తన కొంగుతో చేయి తుడుచుకోకపోతే మళ్ళీ ఏమంటుందో అని తుడుచుకున్నాను. వర్షం తన అస్తిత్వాన్ని ఇంకా వీడలేదు చల్లని గాలుల సైన్యాన్ని వెంటేసుకొని నేలపై ఆగకుండా బాణాలను విసురుతూనే ఉంది. ఆ చల్లగాలుల కౌగిలింతలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బహుశా ఆ మధురిమలు తనను కూడ గిలిగింత పెడుతున్నట్టున్నాయి. ఏదో కూని రాగం తీస్తూ చేయి ముందుకి చాచి పాక అంచులనుండి సన్నగా జాలువారుతున్న ధారని అరచేతిలో నింపుకుంటోంది. అరచేతిలో పడుతున్న చల్లనిదార గిలిగింత పెడుతున్నట్టుంది. చిలిపిగా తనలో తాను నవ్వుకుంటోంది. తననలా చూస్తున్నాను. ఓ సారి అలా నా వైపుకు తొంగి చూసింది. నేనింక తనని అలానే చూస్తున్న. తన అరచేతిలో నిండిన ధారా చేతిలోనుండి పొంగి పోర్లుతోంది. ఉన్న పలానా నా మీదకి విసిరింది. ఆకస్మిక చర్యకి ఉలిక్కిపడ్డాను. తను ఫక్కుమని నవ్వుతోంది. ఆనందంగా నవ్వుతోంది. నా ముఖాన చిమ్మిన చల్లని నీళ్ళతో ఒళ్ళు పులకరించింది. తిరిగి తానే తన కొంగు అంచుతో నెమ్మదిగా నవ్వుతు తుడుస్తోంది. తన చిలిపి పని నాక్కూడా నవ్వు తెప్పించింది. చిన్నగా నవ్వాను.
అబ్బో సొట్టబుగ్గలా…
తనలా అంటుంటే కాస్త కొత్తగా అనిపిస్తోంది.
ముఖాన్ని నెమ్మదిగా కొంగుతో తుడుస్తోంది. అప్పుడప్పుడు తన వేళ్ళు నా నుదిటిని, చెంపని, పెదాల్ని తగులుతోంది. ఏ అమ్మాయిని ఇంత వరకు నేను తాకింది లేదు, నన్నెవరు తాకింది లేదు. కాని ఎన్నడు ఎరగని ఈ అనుభూతి వీస్తున్న చల్ల గాలుల కన్నా మరింత ఎక్కువ  హాయినిస్తోంది. ఒళ్ళు పులకరిస్తోంది చెప్పాలంటే చేతులపై రోమాలు నిక్కపోడుచుకున్నాయి.
కళ్ళు మూసుకున్నాను ఇంకా ఆ హాయి మాయలోనే తచ్చాడుతున్నా.
ధ్యాన ముద్రలో ఉచ్చ్వాస నిశ్వాసలు ఏకమైన చోట తెలియని ఓ తేలికతనం మది చుట్టూ దేహం చుట్టూ అల్లుకుంటుంది దేని అవసరం లేనంతగా చివరికి శ్వాస కూడా. అలాంటి స్వచ్చమైన తేలికైన స్థితికి నెట్టుకొని ఎల్లలు లేని విశాల గగనంలో ఇప్పుడు సాగిపోతున్న..
అనంత దూరాలను, కొండలను, జలపాతాలను, కండలు తిరిగిన మేఘాలను, చల్లని తుంపర్లను, మంచు  బిందువులను, పూలను, పక్షులను, మైదానాలను, హరిత వనాలను, రక రకాల వర్ణాలను, ఇంద్రధనస్సును అన్నిటిని దాటుతూ దాటుతూ నీలాకాశాన్ని చిమ్మ చీకటిని చుక్కల్ని నక్షత్రాలని పాలపుంతలని కూడా దాటేస్తూ శూన్యాన్ని నిశ్శబ్దాన్ని చేరుకున్న అక్కడే ఎక్కడో మరింత దూరాన ఎవరిదో కూని రాగం. ఆ రాగానికి దగ్గరగా మరింత దగ్గరగా..
శృతులన్ని ఒలికినట్టున్నాయి ఒక్కో శృతి ఏరుతూ ఏరుతూ ఎవరిదో నీడ హా అవును నీడే…  ఆశ్చర్యం చిమ్మ చీకట్లో సైతం ప్రకాశంగా వెలుగుతున్న నీడ. శృతులని ఏరుకునే పనిలో అందెల మువ్వలు ఒక్కోటి అదే శూన్యంలో శూన్యానికే తగులుతూ ఘల్లుమని రాలుతున్నాయి. రాలిన మువ్వ ఓరగా నను చూస్తూ జాలిగా నవ్వుతోంది.
పారాణి దిద్దుకున్న పాదం అడుగు తీయగానే నీటిలో పడిన రంగు చుక్కలా పారాణి  ఇదే శూన్యంలో చెదిరిపోతోంది. వెలుతురు కూడా లేని ఈ శూన్యంలో రంగు ఎలా మొలిసిందో.. ఊగిసలాడుతూ పలుచని తెర దేనికో అడ్డంగా ఉంది.  తెరను తాకాలని కదిలా కదులుతున్నకొద్దీ తెర దగ్గరవుతున్న కొద్ది ఏవో సుగంధాలు కనిపించకుండా నా చుట్టూ నాట్యం చేస్తున్నాయి.
పలుచని తెర, రెప రెప లాడుతూ తెర, అలల్లా పొర్లుతున్న తెర, తెల్లని తెర, ఆ తెర అంచుల చివరి కొనదారాలు నా నుదిటిని కళ్ళను దాటాయి. చేతితో పట్టుకొనే ప్రయత్నంలో ఎవరో ఆ తెరని లాగుతూన్నట్టు చేజారి పోయింది. మిగిలిన మువ్వలు చేసే అలజడులతో అందెలు గుర్తులు పెడుతున్నాయి అడుగు వేసిన చిరునామాని నాకు తెలిసేట్టుగా..
అలజడి ఆగింది. తెర పారిపోవడం కూడా ఆగింది. నేను ఆగిపోయా..  ఎక్కడినుండో ప్రయాణమవుతూ తెరని చేరిన నెమలికన్ను. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కొలది కన్నులు తెరను చుట్టుకున్న నీడ చుట్టూ గుండ్రటి గోళంలా అల్లుకున్నాయి. ఆ నీడకు నాకు తెలీకుండానే రంగులద్దుకున్నాయి. రక రకాల రంగులతో రంగుల శిలల ముద్రించుకుంది. శిల చుట్టూ గుండ్రటి నెమలికన్నుల విశాల  గోళం. ఆ గోళం చుట్టూ పచ్చదనం దానికి పైన నీలం ఒక్కొక్కటిగా చుట్టూ ఇంద్రధనస్సు రంగు పరుచుకుంది. మధ్యలో రంగులు దిద్దుకున్న శిలకు  దగ్గరవుతూ మరింత దగ్గరగా రంగు రంగుల అందమైన పూలు గుత్తులు గుత్తులుగా వేల సంఖ్యలో ఎదురుపడగ వాటిలో ఈదుకుంటూ కనిపిస్తున్న వందలకొలది రామ చిలుకలు  ఒకేచోట తమ రెక్కలు రెపరెపలాడిస్తున్నాయి. వాటిని దాటుకుంటూ రంగుల శిల్పానికి చేరువవుతున్నాను. మరింత దగ్గరగా  సుగంధపు పరిమళాలను హత్తుకుంటూ చేరాను. మేలి ముసుగు తొడిగిన రంగుల శిల్పం వయ్యారంగా నిల్చొని కుడి పాదం బొటన వేలు శూన్యంలో అటు ఇటు అంటూ ఏదో రాస్తోంది. ఆ రాతలోనుండి రక రకాల రంగుల పొడులు విబిన్న రూపాల్లో వేవేల తరంగాలై నా చుట్టూ అల్లుకుంటున్నాయి.
చిత్రంగా నేనింక  సీతాకోకల రెక్కలతో అల్లుకున్న మేలి ముసుగు వెనకాల దాగిన రూపాన్ని చూసేందుకు వేచి చూస్తున్న. నెమ్మదిగా తన మెలి ముసుగు తీసింది. నేను ఊహించిన రూపమే తానే అవును తానే తన అంగాంగము ప్రకృతిలో కలగలసి ఓ వన కన్యలా…  చక్కని పలువరుస కూడిన నవ్వుతో నావైపే చూస్తోంది. ఇది కల కాదు నా ఎదురుగానే ఉంది. మరి మా ఇరువురి చుట్టూ అల్లుకున్న ఈ వింత ప్రపంచం ఇది కూడా కల కాదేమో ప్రతిది అనుభూతి చెందుతున్నాను. మాయ కూడా కాదు ఆణువణువూ నన్నల్లుకొని ఆత్మతో సంబాషిస్తోంది.
వన కన్యై తాను నా ముందుకొచ్చి ముని వేళ్ళతో జుట్టు నిమురుతోంది. నొప్పి పెట్టెల బుగ్గను గిల్లింది ఉలిక్కి పడి కళ్ళు తెరిచా..
ఏంటి పిల్లోడా కళ్ళు మూసుకొని కల గంటున్నావా!
అవును కలే అంతరాంతరాల్లో మేలుకున్న వాస్తవమెరుగని అస్తిత్వాన్నికూడబెట్టుకున్న సజీవ కల దాన్ని నేను కంటున్నాన లేదు దానికదే పురుడు పోసుకుంది నీ స్పర్శతో. నిజం నీ స్పర్శకు నిజంగానే కలలను పురుడు పోయించే శక్తి ఉంది. ఇంతకి ఎవరు నువ్వు. నీ స్పర్శే నన్నిలా చేస్తుందా లేక నేనే భ్రమ పడుతూ ఊహిస్తున్ననా. ఏమో ఏది అర్ధం కాకుండా చిత్రంగా ఉంది. నీ వైపుకు నను లాగుతున్న ఆ అనుకూల భావనలను చదవలేకపోతున్న ఆ భావనకు తగిన నీ ప్రతిస్పందనలను కలో నిజమో తెలియని సందిగ్ధంలో సతమతమౌతూ నీ ముందిలా మూగావాన్నిగా నిలబెడుతున్నాయి.. ఇప్పటికి అదే ప్రశ్న ఎవరు నువ్వు. కలవా కల్పనవా లేక నాకోసమే వేచి చూస్తూన్న నా ప్రియ సఖివా..
భలే ఉన్నాయే..
నిజంగానా
ఔనూ…  చొట్ట బుగ్గలతో చాల అందంగున్నావ్..
అవును పిల్లగా నిన్నోటి అడగనా నిన్ను పిల్లగా పిల్లగా అని విసిగిస్తున్నాను కదా నా మీద కోపం రాట్లేదా..
కోపమా అదేమి లేదు. నువు మాట్లాడుతుంటే అలాగే వింటూ ఉండాలనిపిస్తుంది.
అబ్బో మస్తు పటాయించుతున్నావ్ గా.. ఏంది సంగతి నేను నచ్చినాన!!!
చిలిపిగా తాను అడిగిన ప్రశ్నకు చిన్న నవ్వుతో తననే దీక్షగా చూస్తున్నా..
ఏమని చెప్పాలి ఎంత నచ్చావని చెప్పాలి. నచ్చే కదా నీ వెంట వచ్చింది అని చెప్పాలా. నిన్ను అనుక్షణం చూస్తూనే ఉండిపోవాలని ఉంటుంది అని చెప్పనా. నా బిగి కౌగిల్లో నిను ఉక్కిరి బిక్కిరి చేసెయ్యాలని ఉందని చెప్పనా.. ఏమని చెప్పాలి..
మనసు కన్నులు తెరుచుకొని చూస్తే జీవితాలను చదవడం పెద్ద కష్టమేమి కాదు. ఒక్కో జీవితం చరిత్రను సృష్టించక పోయిన ఒక్కోసారి గగుర్బాటు కలిగిస్తే, మరోసారి జాలి, ఇంకోసారి కోపం, అసహనం, రకరకాల రసాలతో కూడి నాటకీయం అనిపించినా జీవితం తెర మీద రక్తి కట్టించే చర్మం తొడుక్కున్న తోలు బొమ్మలం మనుషులం. ఆడించే వాడి గురించి పక్కన పెడితే నిజం చెప్పాలంటే మనిషిగా మనిషి జీవితాన్ని చదవగలిగితే అంతకు మించిన పట్టా మరోటి ఉండదేమో. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మనకు సంబంధం లేనట్టుగా ఎలాంటి స్పందనలే లేనట్టుగా అదో సాధారణ విషయంల బావించడం నిత్యం మనకొక అలవాటైన విషయం. కాని కాని నేను గడిపిన జీవితం నేర్పిన ఫిలాసఫీ అంత ఒక్క క్షణం లో  ఎదురుగా పరుచుకున్న నీ అందం ముందు అంత మటు మాయం.
ఈ నిశ్శబ్దం ఇరువురికి చక్కగా అర్ధమయ్యే పాటంలా ఇక చదవాల్సింది ఏమి మిగిలి లేదన్నట్టుగా ఒకరికొకరం ఇంచు మించు అర్ధం వొడిలోకి జారుకున్నామనే అనిపిస్తోంది.
తన చేయి నా బుజం మీద నెమ్మదిగా వేసింది ఒక్కసారిగా ఆకాశాన్ని చిల్చుతూ విల్లులా మెరుపు. మెరుపు వెలుగు తన అణువణువును ముద్దాడుతూ ఒక్క సెకను నన్ను నేను తన మిరుమిట్లు గొలిపే అందం మైకంలో కమ్ముకుపోయాను.
మెరుపు వెలుతురుకు ఉలిక్కిపడి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆకాశంలో మరో మెరుపు ఆ మెరుపులో జోరుగా కురుస్తు గాల్లో నిండుగా పరుచుకున్న వర్షం వజ్రాల్ల తలుకుమంటూ ఎన్నడు చూడని వింత వెలుగు  బీకరంగా బయపెట్టింది. ప్రకృతికి నాకు ఎడ తెరిపి లేని యుద్ధం ఎన్నో ఏళ్లుగా.  నన్ను ప్రకృతి తన దోసిల్లో దాచుకొని నాతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంటుంది. మనసుని అమాంతం ప్రకృతి మొత్తాన్ని తెగ చుట్టేస్తూ కంటికి కనిపించిన అందాన్ని మనసులో బంధించేందుకు వీరుడిలా ఆలోచనల గుర్రంపై సవారి చేస్తూ ఒకటే ప్రయాణం చిత్రంగా ఎంత ప్రయాణించిన ఆలోచనల గుర్రానికి, అంతమెరుగని ప్రకృతికి రెంటికి అలసట అనేదే రాదూ.
ఓయ్ పిల్లగా లోనకు రా. పిడుగ్గిట్ల బడ్తది అంటూ పిలుస్తూ లోపలి నుండి కొడవలి తెచ్చి పాక ముందు పడేసింది.
ఏం చేస్తున్నావ్?!
కొడవలి జూసి పిడుగు పారిపోద్ది. ఇంగ మనకేం బయ్యం లేదు దా పిలగా..
మెల్లిగా తనతో లోపలికి నడిచా.. కనిపించి కనపడని చికట్లతో లాంతరులో తలెత్తుకు నిలుచున్న దీపం నుండి పొంగుతున్న బంగారు రంగు వెలుతురు ఇప్పుడు నాకు అమితంగా నచ్చే గొప్ప అంశం. అదే గనక లేక పోతే కళ్ళతో తన అందాన్ని బంధించుకునేవాన్నా లేదు. వంపు తిరిగిన నడుంను చూస్తున్న కొద్ది దాని  చుట్టూ నా చేతులని పెన వేయాలని లోలోనా ఎంతో ఆరాటం ఆగని వర్షపు శబ్దంలో కూడా పెరిగిన నా గుండె సవ్వడి స్పష్టంగా వినిపిస్తోంది.
నెమ్మదిగా లాంతరును కర్ర గుంజకి వేలాడేసి లోపల పొయ్యి దగ్గరికి వెళ్ళింది.
ఒసేయ్ ముసల్దాన పడుకున్నవానే…! అనడిగింది. ముసలావిడ పడుకున్నట్టుంది. నెమ్మదిగా అర్రలో నుండి లుంగీ బనియన్ టవల్ తీసుకొచ్చి లాంతరు వెలుతురును చిన్నగా చేస్తూ అవి నా చేతి కిచ్చింది.
తొరగా ఆ బట్టలు మార్సుకో. కింద సల్లగుంది లోపల అర్రలో మంచం మీన పడుకో నేను ముసల్దాని పక్కన పడుకుంటా..
ఏం చేయాలో తోచట్లేదు.  ఆలోచిస్తుండగానే అమాంతం లాంతరు వెలుతురును ఎవరో మింగేసి వదిలేసిన ఆనవాలే ఈ చీకట్లు. చీకటి అది ఇప్పుడోక అర్ధం కాని వివరం లేని వింత వర్ణం. ప్రపంచాన్ని ఈ చీకటే మింగేస్తే ఇంకేముంది కలవరించడానికి. చీకట్లు సృష్టించిన విద్వంసం అంత ఇంత కాదు ఒక్కసారిగా ఏదో ఊబిలో మునిగి మనసుకు తన అందం శ్వాస అందక ఉక్కిరి బిక్కిరవుతు కొట్టుమిట్టాడుతోంది.
ఏంది పిలగా మార్సుకున్నవ? లేదా? ఇంకెంత సేపు ఈ సీకట్లుండాలి.
ఓ చీకట్లో పడి మరిచేపోయా
ఆ ఆ మార్చుకుంటున్నా.. ఒక్క నిమిషం
ఏంది ఒక్క నిమిషం నువ్వేమైన చీర గట్టుకుంటున్నవా గింత సేపు జేస్తున్నావ్.
ఓ. కే. మార్చుకున్న ఇక దీపం వెలిగించు.
చిన్ని దీపం వెలిగించగానే పాయలు పాయలుగా తనను కమ్మేసిన చీకట్లను చీల్చుకుంటూ సుతారంగ తన మోము నిండా పరుచుకున్నాయి. తనతో నా మనసులో నిండిన తన నిలువెత్తు అందాన్ని సైతం. గుండ్రటి విశాలమైన కను పాపలు చిలిపిగా రెప్ప వాల్చకుండా నా వంకే చూస్తున్నాయి.
అబ్బొ.. పర్లేదు పిల్లగా తెల్లగనే ఉన్నావ్. ఏంది ఆ జబ్బలు.. ఇంగ సరే ముందు తడకలు అడ్డం పెట్టి నేను పడుకుంటా నువ్వు గూడ లోపలికి బోయి పడుకో.
ఏంటి అప్పుడే నిద్రోస్తుందా..
ఏంది పిల్లగా ఏం మాట్లాడ్తలెవ్ ఇంగ నిద్ర రాక ఏమొస్తది.
నాకు నిద్ర రావట్లేదు.
ఎట్టోస్తది నిద్ర ఇంత రాతిరి నాలాంటిదాన్ని ముందు బెట్టుకొని. అవును పిల్లగా నా ఎంట రానికి నీకెట్ల ధైర్నం  బుట్టింది.
ఏమో..
సరేలే ఏమైతేంది నువ్వైతే గీ బనీన్ల మస్తుగోడుతున్నావ్ సాన సక్కగున్నావ్. వ్యంశాల గిట్ల బోతవ ఏంది మస్తు కండలు పెంచినవ్. ఔనోయ్ నేను గిట్ల మాట్లాడుతాంటే గిదేంది ముక్కు మొహం తెలినోడి తోటి గింత బరితెగించినట్టు మాట్లాడుతోంది అననుకుంటున్నావ్ గదా..
ఛ ఛ అదేం లేదు.
సరే ఆ బెంచి మీన కూర్సో నేను తడ్కలు అడ్డం బెడ్త లేక పోతే రాతిరంతా ఈదురు గాలికి సర్ధైతది ముక్కులు దిబ్బలు బడ్తై. అంటూ చిన్న చిన్న అడుగులతో వయ్యారంగా నడుం వంపు కింది ఎత్తులను పైకి కిందకు ఊగిసలాడుతుండగా నాలుగు మూరెలా జడ ఒక్కో ఎత్తుపై లయగా తాలం వేస్తుండగా నాకు తెలీకుండానే అడుగులు తనే వెంటే పడుతున్నాయి. తడకలను పాకకు ఆ మూల నుండి ఈ మూల వరకు అడ్డు పెడుతోంది.
ఓయ్ పి ల గా… ఏంది? కొంగు ఇడువూ..
తన కొంగు వైపు చూసా పాపం తనకు తెలీకుండా తన కొంగు అంచు తడకలో చిక్కుకుంది. తనేమో నేనే పట్టి లాగుతున్నానని అనుకోని మళ్ళీ
నిన్నే వదలయ్య  అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది.
తననే చూస్తూ చేతులు కట్టుకొని నేను.
నా వైపుకి, ఇరుక్కున్న కొంగు వైపుకి చూసి విసురుగా తడకలో చిక్కిన కొంగు అంచును పర్రున లాగి ముందుకు నడిచింది. నడుస్తు తను ఒక్క అడుగు అల వేసిందో లేదో నా చెయ్యితో తన చెయ్యి మని కట్టును దొరకబుచ్చుకున్నా. దొరకడమే ఆలస్యంగా వెనక్కి లాగా…  తాను ఊహించని నా చర్యకి పట్టు సడిలి ఒక్కసారిగా కంగారుగా వెనక్కి వాలింది. వెంటనే మరో అడుగు వెనక్కి వేసి నా వైపుకు తిరిగింది. మరో సారి లాగాను ఈ సారి అమాంతం కిందకు వాలిపోయే క్షణం లో తన వాలు జడతో పాటు తన వెన్ను నా చెయ్యి ఆసరలో ఒదిగింది. ఒక్కసారిగా తన తల వెనక్కి వాలడంతో బంగారు రంగు తన మెడ దాని కిందుగా తెల్లని పర్వతపు లోయ మొదలు నుండి ఘనంగా వెలువడుతున్న సుగంధాలు తనలోని మనసు గమ్యానికి నన్ను చేర్చుకునేందుకు నా ప్రయాణానికి సిద్దం చేస్తోంధన్నట్టు తలపిస్తున్నాయి. తన కళ్ళలో భయమో అత్రుతో ఆరాటమో ఆప్యాయతో ఆశ్చర్యమో ఏమో రక రకాల అర్ధాలు కలగాపులగంగా కనిపిస్తుంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది భ్రమో ఏది నిజమో  అర్ధం కాని సతమతపు ఆలోచనలతోనే ఎక్కడో అధిమిపట్టిన భరించలేని వేడి కోరిక నా వైపుకి విసురుతున్న ఆ చూపులకి అదుపు తప్పేలా ఉంది. ఐన మా చుట్టూ ఇంకా వర్షపు గాలుల నిశబ్ధం తాండవం చూపుతూనే ఉంది. జరుగుతున్న తత్తంగానికి తన మరో చేతిలోని లాంతరు సైతం భయంతో ఊగిపోయింది. దానికి తోడు మా ఇరువురి నీడలు కూడా చిత్రంగా నేలపై అటు ఇటు ఊయలలూగుతున్నాయి. వెలుగుకెంత అస్తిత్వమో మా నీడలు చాటి చెప్పుతున్నాయి.
తన ముని వెళ్ళు నా జుట్టులోకి పంపించి దగ్గరగా లాక్కుంది. ఇప్పుడు తన హృదయం పై వాల్చుకొని సేద తీరుతున్న నా తల, తలతో పాటు నా ఆలోచనలు. ఐనా గుండెలో ఇంకా ఆగని వేగం. కొద్ది కొద్దిగా కౌగిల్లో బందినవుతుంటే గుండెవేగం స్థిమిత పడింది.  ఈ సారి మరింత గట్టిగా దూరాన్ని చేరిపెసాను.. పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన మెడపై నా తల. ఎం జరుగుతుందో ఆలోచించడానికి ఆలోచనలు కూడా కరువయ్యాయి. రెప్ప తెరిచి చూస్తే నులక మంచంలో తానో నేనో లేక మేమిద్దరమో కాకా ఏకమైన మెమో ఏమి అర్ధంకాకుండా మసక వెలుతురు చీకట్లలో పోటి పడుతూ, పడుతూ లేస్తూ తిరిగి మమేకమవుతూ… ఓహ్… ఏంటి ఈ వింత నేనెన్నడు ఎరగని ఓ తాత్వికానంధపు శ్రుతులు ఇరువురి ఆణువణువును అదుముకున్నాయి..
కను మూసినా కను తెరిచినా ఒకే అనుబూతి ఆనందానుభూతి.. ఈ స్థితిని చేరుకునేందుకేనేమో ఇంత కాలం నా మనసు తపిస్తున్నది.
ఎప్పుడు నిద్ర లోకి జారుకున్నమో గుర్తేలేదు.  గుర్తు చేయడానికనేనేమో నాటు పుంజు కూత ఎక్కడో కూసిన, నా చెవి దగ్గరే కూసినట్టు  ఉలిక్కిపడి లేచా.. గోధుమ బంగారు రంగు కలోబోసుకున్న నున్నటి మెత్తని శిల్పం ఇంకా నను వాటేసుకొని అమాయకంగా సేద తీరుతోంది. నాక్కూడా లేవాలనిపించలేదు. మునివేళ్ళు నా ప్రమేయం లేకుండానే మెత్తని శిల్పం పై సుతారంగా మీటుతుంటే.. తన పెదాల అంచున సన్నని చిరునవ్వు. కళ్ళు తెరవకుండానే.. నా గుండెపై ముద్దు పెట్టింది.
అర్ధం కాకపోయినా అర్ధాలు వెతుక్కోవడం మాని చాల కాలమే అయ్యింది. జరుగుతున్న అనుభూతికి అర్ధాలు వెతుక్కునే అవసరం కూడా లేదనిపించింది..
ఓయ్ పిల్లగా నేనెలా ఉన్నాన్రా.. నీకు నచ్చినానా.. ఏయ్ ఏం ఆలోచిస్తున్నావ్.. నాకు తెలుసులే..
చెప్పలేని మాటలన్నీ పెదాల అంచున అల నిలబడి పోయాయి.  గడుస్తున్న అనుభవం మాటలుగా మారలేకపోతున్నాయి..
ఆ మూగ స్థితిలో ఆనందపు జడి వానలో కలో మాయో తెలీని సందిగ్ధంలో ఆశ్చర్యంగా ఆలోచనలతో పాటే దేహం కూడా పరుగులు పెట్టింది. చిత్రంగా నా వెంటే తాను కుడా కాదు కాదు తన వెంటే నేను కుడా..
ఇప్పటికి ఎన్ని వసంతాలను మా కౌగిల్లో బంధించామో లెక్క లేదు. అంతేనా లెక్కలేనన్ని చినుకుల జడి వానలో ఎన్ని సార్లు తడిసి ముద్దయ్యామొ…
నన్ను ఆటపట్టిస్తూ తాను..
తనకై తపిస్తూ, ఆరాదిస్తూ, ఆనందిస్తూ నేను..
ఓ.. చెప్పలేదు కదు తన పేరు “అలవి”..

ఆల్బర్ట్ కామూ కథ … అతిథి

camus

 

సెరెన్‌ కీర్కెగార్డ్‌ (1813-55) అనే డేనిష్‌ తత్త్వవేత్త రచనలు ఆధారంగా ప్రారంభమైన  ఒక తాత్త్విక సిద్ధాంతం, నేడు “అస్తిత్వవాదం”గా ప్రచారంలో ఉంది. జర్మన్‌ తత్త్వవేత్త ఫ్రీడ్రిక్‌ నీచ (‘నీచ’ సరైన ఉచ్చారణే!)(Friedrich Nietzsche), ఫ్రెంచి తత్త్వవేత్త జఁపాల్‌ సార్‌ట్రె (Jean Paul Sartre) ఈ వాదాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. కీర్కెగార్డ్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి తనజీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చుకుని, అటువంటి జీవితాన్ని నిజాయితీగానూ, నిష్టగానూ జీవించడంలో సమాజానికీ, మతానికీ ఏమీ సంబంధంలేదు, అలాజీవించడంలో వ్యక్తికి పూర్తి  స్వేచ్ఛ ఉంది. “Existence Precedes essence” అంటే, అన్నిటికంటే ముందు వ్యక్తి … స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని కార్యాచరణ చెయ్యగలిగిన జీవి… ఆ తర్వాతే అతనికున్న బహురూపాలు, సిద్ధాంతాలూ, నమ్మకాలూ, విశ్వాసాలూ… అన్నది ఈ సిద్ధాంతపు మూల భావన. ఒకే సమాజంలో ఉన్నా, ఒకే మతంలో ఉన్నా, ప్రతివ్యక్తికీ తనవంటూ కొన్ని మౌలికమైన విశ్వాసాలూ, నైతికభావనలూ ఉంటాయి. అవే అతను సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు  నిర్ణయం తీసుకుందికి సహకరించి నడిపిస్తాయి.    
 
ఆ తాత్త్విక భావనకు అనుగుణంగా వ్రాసిన కథ ఆల్బర్ట్ కామూ “అతిథి” అని చాలా మంది విశ్లేషిస్తారు. మూలభాషలో వాడిన పదానికి అతిథి (ఇక్కడ అరబ్బు), అతిథేయి( దారూ) అని రెండర్థాలు ఉన్నాయి. ఒక రకంగా ఈ కథలో దారూ పాత్ర, కామూకి ప్రతిబింబమే. జీవితంలో ఎంచుకోడానికి ఎప్పుడూ అవకాశాలుంటాయి. లేనిదల్లా ఎంపిక చేసుకోనక్కరలేకుండా ఉండగలగడం. (All that is  missing is the independence not to choose anything.) ఎందుకంటే, మనిషి ఎప్పుడూ “you are damned if you do; you are damned if you don’t do” పరిస్థితులలోనే చిక్కుకుంటాడు. ఈ కథలో దారూ, అరబ్బూ అటువంటి పరిస్థితిలో వాళ్ళనిర్ణయాలు వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలపై ఎలా ఆధారపడి ఉన్నాయో ఇందులో గమనించ వచ్చు. 

 
ఆల్బెర్ట్ కామూ (7 నవంబరు 1913 – 4 జనవరి 1960) ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెలు బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. అతను “The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని “వ్యక్తి స్వేచ్ఛగురించి లోతుగా పరిశీలిస్తూనే, నిహిలిజాన్ని వ్యతిరేకించడానికే సరిపోయింది”. (నిహిలిజం తార్కికంగా  జీవితానికి ఏదో ఒక గమ్యం,లక్ష్యం ఉన్నాయన్న ప్రతిపాదనని ఖండిస్తుంది). టెక్నాలజీని ఆరాథనాభావంతో  చూడడానికి అతను పూర్తి వ్యతిరేకి. అతనికి ఏ రకమైన తాత్త్విక ముద్రలూ ఇష్టం లేదు…. ముఖ్యంగా ఎగ్జిస్టెన్షియలిస్టు అన్న పదం.  

—————————————————————————————————————————————————————————-

స్కూలు మాస్టరు వాళ్ళిద్దరూ కొండ ఎక్కుతూ తనవైపు రావడం గమనించాడు. ఒకరు గుర్రం మీద ఇంకొకరు నడిచి వస్తున్నారు. కొండవాలులో కట్టిన ఈ స్కూలుభవనం చేరడానికి అకస్మాత్తుగా ఎక్కవలసిన మిట్ట దగ్గరకి వాళ్ళింకా చేరుకోలేదు. ఎత్తుగా విశాలంగాఉన్న ఈ ఎడారివంటి మైదానంమీద మంచుతోనూ, రాళ్లతోనూ నిండిన త్రోవలో శ్రమిస్తూ నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఉండిఉండి ఆ గుర్రం అడుగులు తడబడుతోంది. చప్పుడు వినపడకపొయినప్పటికీ తను దాని ముక్కురంధ్రాలగుండా వస్తున్న బరువైన పొగలుకక్కుతున్న ఊపిరులని చూడగలుగుతున్నాడు.  ఆ ఇద్దరిలో కనీసం ఒక్కడికైనా ఈ ప్రాంతం బాగా పరిచయమే అని తెలుస్తోంది. ఎందుకంటే మురికి తేరిన   మంచుపొరల క్రింద ఎన్నో రోజుల క్రిందటే కప్పడిపోయిన త్రోవని వాళ్ళు సరిగానే గుర్తించగలుగుతున్నారు. స్కూలుమాస్టరు వాళ్లకి కొండ ఎక్కడానికి కనీసం అరగంట పడుతుందని అంచనా వేసుకున్నాడు. చాలా చలిగా ఉంది. అందుకని స్వెట్టరు తెచ్చుకుందికి వెనక్కి స్కూల్లోకి వెళ్ళేడు.

2

అతను ఖాళీగా, చల్లగా ఉన్న తరగతిగది దాటేడు. గత మూడురోజులబట్టీ, బ్లాక్ బోర్డు మీద నాలుగు రంగుసుద్దలతో గీసిన ప్రాన్సుదేశపు నాలుగునదులూ తమ సంగమస్థలాలకి పరిగెడుతూనే ఉన్నాయి. వర్షం ఎత్తిగట్టేసిన ఎనిమిదినెలల అనావృష్టితర్వాత, అక్టోబరునెల మధ్యలో వర్షాకాలం లేకుండా ఒక్కసారిగా మంచు కురవడం ప్రారంభించింది. దానితో ఈ మైదానప్రాంతంలో చెల్లాచెదరుగాఉన్న గ్రామాల్లోంచి రావలసిన ఆ ఇరవైమంది విద్యార్థులు బడికి రావడం మానేశారు. మళ్ళీ వాతావరణం మెరుగయ్యాకే వాళ్ళు స్కూలుకి వచ్చేది. అందుకని తరగతిగదిని ఆనుకుని తూర్పువైపు మైదానానికి తెరుచుకునే తను కాపురముంటున్న గదినే ‘దారూ’ వెచ్చగా ఉంచుకుంటున్నాడు. తరగతిగది కిటికీల్లాగే తన గది కిటికీ కూడా దక్షిణం వైపుకే తెరుచుకుని ఉంటుంది. అటువైపు నుండి చూస్తే స్కూలు భవనం … మైదానం దక్షిణానికి ఒరిగినట్టు కనిపించే చోటునుండి కొద్ది కిలోమీటర్ల దూరమే. నిర్మలమైన వాతావరణంలో ఊదారంగు పర్వతశ్రేణి మధ్య ఖాళీ … ఎడారి దిక్కు చూస్తూ కనిపిస్తుంది.

3

కొంచెం ఒళ్ళు వెచ్చబడనిచ్చి దారూ మొదటిసారి తను ఇద్దరినీ గమనించిన కిటికీ దగ్గరకి వచ్చి నిలుచున్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఆ మిట్ట  ఎక్కినట్టే. మంచుకురవడం రాత్రే ఆగిపోవడంతో, ఆకాశం మరీ అంత చీకటిగా లేదు. మేఘాల తెరలు తొలగడం ప్రారంభించడంతో ఉదయం చీకటిగా ప్రారంభమయినా మధ్యాహ్నం రెండుగంటలయేసరికి, రోజు అప్పుడే ప్రారంభమయిందా అన్నట్లు ఉంది. వదలని చీకటిలో తరగతిగది రెండు తలుపులూ టపటపా కొట్టుకునేట్టు గాలి వీస్తూ ఏకధాటిగా ముద్దలా మంచుకురిసిన గత మూడురోజులతో పోల్చుకుంటే, ఇది నయమే.  అప్పుడయితే తను ఎక్కువభాగం తనగదిలోనే గడపవలసి వచ్చింది … బొగ్గులు తెచ్చుకుందికో, షెడ్డులోని కోళ్లకి మేతవెయ్యడానికో వెళ్ళిరావడం మినహాయిస్తే. అదృష్టవశాత్తూ మంచుతుఫానుకి రెండురోజులు ముందరే ఉత్తరాన అతిదగ్గరగా ఉన్న తాడ్జిద్ గ్రామంనుండి సరుకురవాణా వాహనంలో తనకి కావలసిన అత్యవసర సరుకులు వచ్చేయి. ఆ వాహనం మళ్ళీ రెండురోజుల తర్వాత వస్తుంది.

4

అది రాకపోయినా, తనకి ఇలాంటి మంచుతుఫానులని తట్టుకుందికి కావలసినంత అత్యవసర సరుకు నిల్వఉంది… ప్రభుత్వం అనావృష్టిబారినపడ్డ ఇక్కడి విద్యార్థుల కుటుంబాలకి సాయంచెయ్యడంకోసం ఇచ్చిన గోధుమబస్తాలతో ఆ చిన్నగది చిందరవందరగా ఉంది. నిజానికి వాళ్ళందరూ కరువు బాధితులే, ఎందుకంటే అందరూ నిరుపేదలే. ప్రతిరోజూ దారూ వాళ్ళకి దినబత్తెం కొలిచి పంచేవాడు. పాపం, ఈ కష్టసమయంలో వాళ్ళెంతగా దాన్ని పోగొట్టుకుంటున్నారో తనకి తెలుసు.  బహుశా వాళ్ళలో ఏ పిల్లవాడి తండ్రో ఈ మధ్యాహ్నం రాకపోడు. వస్తే, వాళ్ళకి ఆ గింజలు కొలిచి ఇవ్వగలడు. మళ్ళీ పంట చేతికొచ్చేదాకా ఏదోలా నెట్టుకురాగలిగితే చాలు. అప్పుడే ఫ్రాన్సునుండి ఓడల్లో గోధుమలు వచ్చేస్తున్నాయి. కనుక గడ్డురోజులు తొలిగిపోయినట్టే. కానీ, ఆ దైన్యపురోజులు మరిచిపోవడం చాలా కష్టం… ఒక్క చినుకైనా రాలక నెలల తరబడి పచ్చని మైదానాలలో దయ్యాలు తిరుగుతూ, ఎండకి మాడి మసయిపోయి, కొంచెంకొంచెంగా నేల బీటలుబారుతూ, అక్షరాలా దహించుకుపోయినట్టయి, కాళ్ళక్రింద పడిన ప్రతిరాయీ గుండగుండయిపోవడం తనకింకా గుర్తే. గొర్రెలు వేలసంఖ్యలో మరణించాయి. అక్కడక్కడ మనుషులుకూడా… ఒక్కోసారి ఎవరికీ ఆనవాలు చిక్కకుండా చనిపోయిన సందర్భాలున్నాయి.

5

ఆ పేదరికంతో పోలిస్తే, ఈ ఒకమూలకి విసిరేసినట్టున్న స్కూలుభవనంలో బిక్షువులా గడిపిన తను, ఈ తెల్లగా సున్నం వేసిన గదిగోడలూ, ఇరుకైన మంచం, రంగువెయ్యడానికి నోచుకోని బీరువాల మధ్య, తనకి వారానికి సరిపడా ఉన్న ఆహారమూ నీటివసతితో,  ఇక్కడి జీవితం ఎంత కఠినంగా ఉన్నా, దర్జాగా మహరాజులా బ్రతుకుతున్నట్టే. కానీ, ఇదిగో … ఏ వానసూచనలూ హెచ్చరికలూ లేకుండా అకస్మాత్తుగా ఇలా మంచుతుఫానులు వచ్చేస్తుంటాయి. ఇక్కడివాతావరణం తీరే అంత… బ్రతకడం మహా కష్టం, మనిషి అన్న వాడి జాడ లేకుండా…  ఉంటేమాత్రం ఏమిటి? పరిస్థితులేమీ మెరుగుపడేది లేదు. దారూ ఇక్కడే పుట్టాడు. ఇంకెక్కడున్నా, అతనికి ప్రవాసంలో ఉన్నట్టే ఉంటుంది.

6

స్కూలు భవనం ముందున్న దిన్నె మీదకి ఎక్కేడు. ఆ ఇద్దరు వ్యక్తులూ మిట్ట సగం దూరం ఎక్కినట్టు కనిపిస్తోంది. అందులో గుర్రం మీదున్న వ్యక్తిని గుర్తుపట్టేడు తను… చాలా కాలం నుండి తనకి పరిచయమున్న పోలీసు బాల్డూక్సి. అతని చేతిలో ఉన్న తాడుకి రెండో కొసని  రెండుచేతులూ బంధింపబడి, తలదించుకుని, గుర్రానికి వెనక ఒక అరబ్బు నడుస్తున్నాడు. పోలీసు దారూని చూస్తూ అభివాదసూచకంగా చెయ్యి ఊపేడుగానీ, వెలిసిపోయిన నీలి ‘జెలాబా’ తొడుక్కుని, కాళ్ళకి ముతక ఊలు మేజోళ్ళతో, సాండల్స్ వేసుక్కుని, తలమీద బిగుతుగా పొట్టిగా ఉన్న ‘చెచే’తో నడుస్తున్న అరబ్బును గూర్చిన ఆలోచనలలో మునిగిపోయిన దారూ దాన్ని గమనించలేదు. వాళ్ళిద్దరూ సమీపిస్తున్నారు. అరబ్బుకి ఇబ్బందికలగకుండా బాల్డూక్సి తన గుర్రాన్ని నిలువరిస్తున్నాడు. ఆ గుంపు (గుర్రంతో సహా) నెమ్మదిగా సమీపిస్తోంది.

7

కూతవేటు దూరంలోకి రాగానే, బాల్డూక్సి కేక వేసాడు: “అల్ అమూర్ నుండి ఈ మూడు కిలోమీటర్ల దూరం నడవడానికీ గంట పట్టింది.” దారూ సమాధానం చెప్పలేదు. మందంగా ఉన్న స్వెట్టరు తొడుక్కుని, పొట్టిగా, చదరంలా కనిపిస్తున్న దారూ … వాళ్ళు ఆ మిట్ట ఎక్కడం గమనిస్తున్నాడు. ఒక్కసారికూడా ఆ అరబ్బు తల పైకిఎత్తి చూడలేదు. వాళ్ళు మిట్టమీదకి చేరుకోగానో, “హలో’ అంటూ దారూ పలకరించాడు. “రండి, రండి. చలి కాగుదురు గాని,” అని ఆహ్వానించేడు. తాడుని వదలకుండా, బాల్డూక్సి కష్టపడి గుర్రం మీంచి దిగేడు. నిక్కబొడుచుకున్న గుబురుమీసాలలోంచి స్కూలుమాష్టరుని చూసి నవ్వేడు. కందిపోయిన నుదిటిమీద లోపలికి పొదిగినట్టున్న నల్లని చిన్న కళ్ళూ, మూతిచుట్టూ ముడుతలు దేరిన చర్మంతో అతను చాలా జాగ్రత్తమంతుడుగా, పనిపట్ల శ్రద్ధగలవాడుగా కనిపిస్తున్నాడు. దారూ కళ్ళేలు అందుకుని గుర్రాన్ని షెడ్డులో కట్టడానికి  తీసికెళ్ళి వచ్చేసరికి ఈ ఇద్దరూ స్కూలుదగ్గర అతనికోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళని తనగదిలోకి తీసుకెళ్ళి, “నేను తరగతిగది వెచ్చగా ఉండేట్టు చేస్తాను. అక్కడయితే మనకి మరికొంత సౌకర్యంగా ఉంటుంది,” అన్నాడు. తను మళ్ళీ గదిలోకి వెళ్ళేసరికి బాల్డూక్సి మంచంమీద కూర్చున్నాడు. అరబ్బు పొయ్యికి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అరబ్బు చేతులు ఇప్పటికీ బంధించబడేఉన్నాయి. బాల్డూక్సి తన చేతికున్న కట్లు విప్పుకున్నాడు.  అరబ్బు తలమీదనున్న ‘చెచే’ని కొంచెం వెనక్కితోసి, అతను కిటికీదిక్కు చూస్తున్నాడు. దారూ ముందు గమనించింది  నీగ్రోవేమో అనిపించేట్టున్న అతని బలమైన, నున్నటి, విశాలమైన పెదాలు. అరబ్బు ముక్కు మాత్రం నిటారుగా ఉంది. అతని కళ్ళు చిక్కగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. వెనక్కి తోసిన ‘చెచే’ అతని ఎత్తైన నుదిటిని సూచిస్తే, ఎండకీ వానకీ నిలదొక్కుకున్న అతని చర్మం, ఇప్పుడు చలికి పాలిపోయి కనిపిస్తోంది. అతను వెనక్కి తిరిగి సూటిగా తన కళ్ళలోకి చూడగానే, దారూకి అతని ముఖంలో అలసటా, ధిక్కారమూ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించేయి . “ఆ గదిలోకి వెళ్ళు! ఈలోగా నేను మీకు పుదీనా టీ తీసుకు వస్తాను,” అన్నాడు. బాల్డూక్సి, “థేంక్స్!” అన్నాడు. “ఎన్ని అవస్థలురా బాబూ! ఎప్పుడు రిటైరవుతానా అని అనిపిస్తోంది,” అని తనలోతాను అనుకుని, ఖైదీవంక తిరిగి అరబ్బీ భాషలో, “నిన్నే! కదులు,” అన్నాడు. ఆ అరబ్బు నెమ్మదిగా లేచి, ఇంకా బంధించి ఉన్న చేతులు ముందుకి చాచుకుంటూ మెల్లగా తరగతిగదిలోకి నడిచాడు.

8

hqdefault

టీతో పాటే, దారూ ఒక కుర్చీకూడా తీసుకు వచ్చేడు. అప్పటికే బాల్డూక్సి అతనికి దగ్గరగా ఉన్న పిల్లల రాతబల్లమీద ఎక్కి కూర్చున్నాడు; అరబ్బు కిటికీకి డెస్కుకీ మధ్యనున్న పొయ్యికి అభిముఖంగానూ, టీచరుబల్లకి ఎదురుగానూ నేలమీద చతికిలబడి కూర్చున్నాడు. అతనికి టీ గ్లాసు అందించబోయి, అతని చేతులకి ఇంకా కట్లుండడం చూసి దారూ కాసేపు తటపటాయించేడు. “అతని చేతులకి కట్లు విప్పొచ్చేమో,” అన్నాడు. “తప్పకుండా,”అన్నాడు బాల్డూక్సి. “ఆ కట్లు ప్రయాణం కోసమే,” అని చెప్పి లేవబోయాడు. కానీ దారూ గ్లాసుని నేలమీద ఉంచి, అరబ్బుకి ప్రక్కన మోకాళ్లమీద కూర్చున్నాడు. ఏమీ మాటాడకుండా అరబ్బు తన తీక్ష్ణమైన చూపులతో దారూని గమనించసాగేడు. చేతుల కట్లువిప్పేక, వాచిపోయిన చేతులని ఒకదానితో ఒకటి రాసుకుని, టీ తీసుకుని, మరుగుతున్న టీని ఆత్రంగా చప్పరించసాగేడు… ఒక్కొక్క గుక్కా…”

9

“బాగుంది,” అని, దారూ,”ఇంతకీ ఎక్కడికి మీ ప్రయాణం?” అని అడిగేడు బాల్డూక్సిని.

టీలో మునిగిన తన మీసాన్ని బయటకి తీస్తూ, బాల్డూక్సి. “ఇక్కడికే !”

“చిత్రమైన విద్యార్థులే! అయితే ఈ రాత్రికి మీ మకాం ఇక్కడేనా?”

 

“లేదు, లేదు. నేను రాత్రికి అల్ అమూర్  వెళిపోవాలి. నువ్వు ఈ మనిషిని టింగ్విట్ లో అప్పచెప్పాలి. అతను పోలీసు హెడ్ క్వార్టర్సులో ఉండాలి.”

బాల్డూక్సి స్నేహపూర్వకంగా నవ్వేడు దారూని చూస్తూ.

“ఇదేమిటి ఈ వ్యవహారం? నాతో వేళాకోళం ఆడటం లేదు కద?” అన్నాడు స్కూలు మాష్టరు.

“లేదు, నాయనా. అవి ఉత్తర్వులు.”

“ఉత్తర్వులా? నే నేమీ…” అంటూ ఆర్థోక్తిలో ఆగేడు, ఆ కార్సికన్ పోలీసు అహాన్ని దెబ్బకొట్టడం ఇష్టం లేక.

“నా ఉద్దేశ్యం, అది నా పని కాదు అని.”

“అలా అనడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి? యుద్ధ సమయంలో అందరూ అన్ని పనులు చేయాల్సిందే.”

“అలా అయితే, యుద్ధ ప్రకటనకి ఎదురు చూస్తుంటాను!”

బాల్డూక్సి తల పంకించేడు.

“సరే! ఉత్తర్వులయితే ఉన్నాయి. అవి మీకుకూడా వర్తిస్తాయి. కాకపోతే రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడో తిరుగుబాటు జరగొచ్చని అనుమానంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, మే మందరం దానికి సంసిద్ధులుగా ఉన్నాం.”

దారూ ముఖంలో ఇంకా ఆ ధిక్కార ఛాయలు తొలగిపోలేదు.

 

10

“చూడు నాయనా,” బాల్డూక్సి చెప్పబోయాడు, “నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్నర్థం చేసుకోడానికి ప్రయత్నించు.  అల్ అమూర్ లో మేం  ఓ డజనుమందిమి మాత్రమే ఉన్నాం ఆ ప్రాంతం అంతా గస్తీ తిరగడానికి. నేను త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలి. నాకిచ్చిన ఉత్తర్వు ప్రకారం నేను ఇతన్ని నీకు అప్పగించి ఆలస్యం చెయ్యకుండ వెనక్కి వెళ్ళిపోవాలి. అతన్ని అక్కడ ఉంచడం కుదరదు. అతని గ్రామంలో తిరుగుబాటు జరగబోతోంది. వాళ్లు అతన్ని వెనక్కి తీసుకుపోవాలనుకుంటున్నారు. రేపుసాయంత్రానికల్లా నువ్వతన్ని టింగ్విట్ లో అప్పగించాలి.  సన్నగాఉన్న నీలాంటి వాడికి ఇరవై కిలోమీటర్లు ఒక లెఖ్ఖ కాదు.  ఆ పని పూర్తయేక, నీ బాధ్యత పూర్తవుతుంది. నువ్వు యధాప్రకారం నీ పాఠాలు చెప్పుకోడానికీ, నీ సుఖమైన జీవితానికీ మరలిపోవచ్చు.”

11

గోడ వెనక గుర్రం అసహనంగా సకిలించడం, నేలమీద గిట్టలతో రాయడం తెలుస్తోంది. దారూ కిటికీలోంచి బయటకి చూస్తున్నాడు. వాతావరణం మెరుగవడం ఖచ్చితంగా తెలుస్తోంది; మంచుతడిసిన ఆ మైదానంమీద వెలుగు క్రమంగా పెరగనారంభించింది. మంచు అంతా కరగనిచ్చి, సూర్యుడు మళ్ళీ అందుకుంటాడు… ఈ రాళ్లతో నిండిన పొలాల్ని మంటపెడుతూ. మనిషితో ఏ మాత్రం సంపర్కంలేని ఈ ఏకాంత ప్రదేశంమీద ఏ మార్పూలేని ఆకాశం రోజులతరబడి అలా ఎండవెలుగుని కుమ్మరిస్తూనే ఉంటుంది.

అతను బాల్డూక్సివైపు తిరిగి, “ఇంతకీ, అతను చేసిన అపరాథం ఏమిటి?” అని అడిగేడు.

ఆ పోలీసు నోరుతెరిచి బదులుచెప్పేలోపునే తిరిగి, “అతనికి ఫ్రెంచి మాటాడడం వచ్చునా?” అని అడిగేడు.

“లేదు. ఒక్క ముక్క కూడా రాదు. అతని కోసం మేం నెల్లాళ్ళుగా గాలిస్తున్నాం. వాళ్లతన్ని దాచిపెట్టేరు. అతను తన దగ్గర బంధువుని హత్యచేశాడు.”

“అతను ఏమైనా దేశద్రోహా?”

12

“అలా అనుకోను. కానీ, మనం ఏదీ రూఢిగా చెప్పలేం.”

“ఎందుకు చంపేడు?”

“ఏదో కుటుంబకలహం. ఒకరు ఇంకొకరికి ధాన్యం బాకీ పడ్డట్టున్నారు. అయితే ఖచ్చితంగా తెలీదు. టూకీగా చెప్పాలంటే, అతను అతని బంధువుని కొడవలిలాంటి కత్తితో చంపేడు. ఎలా అంటే గొర్రెని వేటు వేస్తారే అలా… క్రీక్…” అంటూ బాల్డూక్సి గొంతుక్కి అడ్డంగా చెయ్యి గీతలాగీస్తూ ఒక అభినయం చేశాడు. ఆ చేష్టకి అరబ్బుదృష్టి అతనిపై పడి అతని వంక ఆదుర్దాగా చూసేడు. దారూకి మనుషులమీద కోపం వచ్చింది… మనుషులందరిమీదా, వాళ్ల అర్థం పర్థం లేని వైషమ్యాలకీ, అదుపులేని వైరాలకీ, వాళ్ళ రక్తదాహానికీ. పొయ్యిమీద ఉన్న కెటిల్ కూతపెట్టడంతో గుర్తొచ్చి రెండోసారి బాల్డూక్సీకి  అరబ్బుకి కూడా టీ ఇచ్చేడు. అరబ్బు రెండు చేతులూ పైకెత్తి అంత ఆత్రంగానూ టీ తాగడంతో, ఒంటిమీద ఉన్న ‘జెల్లబా’ తెరుచుకుని, స్కూలు మాష్టరుకి అతని కండదేరిన పీనవక్షం కనిపించింది.

“సరే, అయితే. థేంక్స్. నేను వెళ్ళొస్తా.” అన్నాడు బాల్డూక్సి.

లేచి అరబ్బు వైపు నడిచేడు జేబులోంచి చిన్న తాడుని బయటకి తీస్తూ.

“ఏం చేస్తున్నారు?” అని అడిగేడు దారూ యథాలాపంగా.

కంగారుపడ్డ బాల్డూక్సి చేతిలో ఉన్న చిన్న తాడుని చూపించాడు.

“దాని అవసరం లేదు.”

ఆ ముసలి పోలీసు కాసేపు సంకోచించి, “సరే, నీ ఇష్టం. నీ దగ్గర రక్షణకి ఆయుధం ఉందికదా?” అని ప్రశ్నించేడు.

“నా దగ్గర షాట్ గన్ ఉంది.”

“ఎక్కడ?”

“పెట్లో.”

13

“అది నీ పడక పక్కనే అందుబాటులో ఉండాలి.”

“ఎందుకూ? నాకు భయపడడానికి తగిన కారణం కనపడదు.”

“నువ్వు నిజంగా పిచ్చి వాడివేనురా అబ్బాయ్. ఒకసారి తిరుగుబాటు తలెత్తిందంటే, ఎవరి క్షేమానికి హామీ ఉండదు. మనందరం ఒక నావలో ప్రయాణిస్తున్న వాళ్ళమే.”

“నన్ను నేను రక్షించుకోగలను. వాళ్లు నా వైపుకి వస్తున్నప్పుడు చూడడానికి నాకు తగిన సమయం ఉంటుంది.”

బాల్డుక్సి నవ్వ సాగేడు. అతని గుబురు మీసాలు అతని పలువరసని దాచిపెట్టేయి.

“నీకు అంత సమయం ఉంటుందా? సరే అయితే. నే చెప్పబోయేదేమిటంటే నువ్వెప్పుడూ కొంచెం తిక్కగా మాటాడుతుంటావు. అయినా, ఎందుకో నాకు అది నచ్చుతుంది.” అంటూనే అతని జేబులోంచి ఒక రివాల్వరు తీసి టేబిలుమీద ఉంచేడు.

“ఇది నీ దగ్గర ఉండనీ. ఇక్కడనుండి అల్ అమూర్ వెళ్ళేలోపు, నాకు రెండు తుపాకులవసరం లేదు.”

టేబులుకి వేసిన నల్లరంగు నేపథ్యంలో తుపాకీ మెరుస్తోంది. పోలీసు అతని వైపు తిరగగానే, స్కూలు మాష్టరుకి తోలువాసనా, గుర్రపుచర్మం వాసనా ఒకేసారి ముక్కుకి సోకింది.

అకస్మాత్తుగా దారూ, “చూడు బాల్డూక్సీ! ఇదంతా నాకు గొప్ప చికాకు తెప్పిస్తోంది… ఇక్కడ మీరూ, మీ ఖైదీను. అతన్ని నేను అప్పగించను. పోరాడవలసి వచ్చిందా, తప్పకుండ పోరాడతాను. అంతేగాని అప్పగించను.”

ఆ ముసలి పోలీసు అతనికి ఎదురుగా నిలబడి అతనివంక తీక్ష్ణంగా చూడసాగేడు.

“నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు,” అన్నాడు నెమ్మదిగా. “నాకూ అతన్ని అప్పగించడం ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనిషి చేతిని తాళ్లతో బిగించడం అలవాటవదు. అలా చెయ్యాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది. నిజం. సిగ్గు చేటు. అలాగని, వాళ్లని వాళ్ళ ఇష్టానికి వదిలీనూ లేము.”

“నే నతన్ని అప్పగించను.” అన్నాడు దారూ ఖరాఖండీగా.

“అది ఉత్తర్వురా అబ్బాయ్. మరో సారి చెబుతున్నా. అది ఉత్తరువు,”

“సరే. అయితే ఆ ఉత్తర్వు ఇచ్చిన వాళ్ళకి నేను మీతో చెప్పింది చెప్పండి: నే నతన్ని అప్పగించను.”

14

బాల్డూక్సి ఏమిటి సమాధానం చెప్పాలా అని ఒకసారి ఆలోచించాడు. దారూని, అరబ్బునీ మార్చి మార్చి చూశాడు. చివరకి ఒక నిశ్చయానికి వచ్చి,

“లేదు. వాళ్లకి నే నేమీ చెప్పదలుచుకోలేదు. మమ్మల్ని వదుల్చుకుందామనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నేను కాదనను. నాకు ఈ ఖైదీని నీకు అప్పగించమని ఉత్తర్వులు ఉన్నాయి. అందుకే నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నా కోసం ఈ కాగితం మీద సంతకం చెయ్యి.”

“ఆ అవసరం లేదు. నువ్వు అతన్ని నాకు అప్పగించలేదని అబద్ధం ఆడను.”

“నాతో అలా మరీ అన్యాయంగా ప్రవర్తించకు. నాకు తెలుసు. నువ్వు నిజమే చెబతావని. నువ్వు ఇక్కడ పుట్టిపెరిగిన వాడివి. మీదు మిక్కిలి నువ్వో మగాడివి. కానీ, నువ్వు సంతకం చెయ్యాలి. అది పాటించవలసిన నిబంధన.”

దారూ డ్రాయరు తెరిచి, గులాబిరంగు ఇంకు ఉన్న చిన్న చదరపు సీసానీ, తను చక్కని చేతివ్రాత నమూనాలు తయారుచెయ్యడానికి వినియోగించే ఎర్ర ‘సార్జంట్ మేజర్’ పెన్ను ఉంచుకునే కర్ర స్టాండునీ బయటకు తీసి, కాగితంమీద సంతకం చేశాడు. పోలీసు దాన్ని జాగ్రత్తగా మడిచి పర్సులో పెట్టుకున్నాడు. అతను నిష్క్రమించడానికి వీధి తలుపువైపు నడిచాడు.

“నేను దిగబెడతాను. పదండి,” అన్నాడు దారూ.

“వద్దు,” అని గట్టిగా అన్నాడు బాల్డూక్సి, “ఇప్పుడు మర్యాదగా ప్రవర్తించి ప్రయోజనం లేదు. నువ్వు నన్ను అవమానించావు.”

15

అతను ఉన్నచోటే కదలకుండా ఉన్న అరబ్బుని ఒకసారి చిరాగ్గా చూసి, ఒక సారి గట్టిగా నిట్టూర్చి, ద్వారం వైపు నడిచేడు.

“బిడ్డా, శలవు.” అన్నాడు.

అతని వెనకే తలుపు మూసుకుంది.  బాల్డూక్సి అకస్మాత్తుగా కిటికీ దగ్గర ప్రత్యక్షమై, మళ్ళీ మాయమయ్యాడు. అతని అడుగులచప్పుడుని నేలమీద పరుచుకున్న మంచు మింగేసింది. గోడవెనక గుర్రం కదిలిన చఫ్ఫుడుకి, కోళ్ళన్నీ భయంతో అరిచేయి.  ఒక క్షణం తర్వాత మళ్ళీ కిటికీదగ్గర ప్రత్యక్షమయ్యాడు బాల్డూక్సీ కళ్ళెంతో గుర్రాన్నిపట్టుకుని నడుపుకుంటూ. వెనక గుర్రం అనుసరిస్తుండగా, అతను వెనక్కి తిరిగైనా చూడకుండా మిట్టదాకా నడచి, తర్వాత కనుమరుగయ్యాడు. క్రిందకి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వెళ్ళడం వినిపించింది. దారూ ఖైదీవైపు నడిచాడు; అతను కూచున్నచోటునుండి ఒక్కపిసరు కదలకపోయినా, రెప్ప వాల్చకుండ దారూనే గమనిస్తున్నాడు.

“ఇక్కడే ఉండు,” అని అరబిక్ లో చెప్పి తన పడకగదివైపు వెళ్ళేడు. అతను ద్వారంలోంచి వెళుతూ మళ్ళీ పునరాలోచనలోపడి, వెనక్కి డెస్కుదగ్గరకి వచ్చి, దాని మీదనున్న పిస్తోలుని తన జేబులో దోపుకున్నాడు. మరి వెనక్కి తిరిగి చూడకుండా తన పడకగదిలోకి ప్రవేశించాడు.

16

కొంతసేపు తన పక్కమీదవాలి, నిశ్శబ్దంగా, ఆకాశంకేసి చూడసాగేడు… చీకటి దాన్ని కనుమరుగుచేసేదాకా. ఇక్కడకి వచ్చిన కొత్తలో, ఈ నిశ్శబ్దమే అతనికి బాధాకరంగా ఉండేది. ఎగువనున్న మైదానాలనీ, ఎదురుగాఉన్న ఎడారినీ వేరుచేసే పర్వతపాదాల చెంతనున్న చిన్న ఊరికి తనని బదిలీ చెయ్యమని అర్జీ పెట్టుకున్నాడు. అక్కడ పచ్చగా, నల్లగా ఉత్తరానికీ… గులాబీ, పాలిపోయిన ఊదారంగులో దక్షిణానికీ… ఉన్న గోడలు సతతగ్రీష్మాన్ని సూచిస్తుంటాయి. ముందు అతనికి ఈ మైదానంలో ఇంకా ఉత్తరానికిఉన్న ఒకచోట నియామకానికి ప్రతిపాదన జరిగింది. ఎటుచూసినా రాళ్ళూరప్పలతో నిండిఉన్న ఈ నిర్జనప్రదేశంలో ఒంటరితనమూ, నిశ్శబ్దమూ భరించడం కష్టంగా ఉండేది. అక్కడక్కడ పొడవాటి చాళ్ళలా కనిపిస్తే వ్యవసాయం జరుగుతోందేమో ననుకునేవాడు తను. తీరా చూస్తే అవి భవననిర్మాణంలో ఉపయోగపడే ఒక రకమైన రాయిని తవ్వడానికి చేసిన చాళ్లు అవి. ఇక్కడ జరిగే ఒకే ఒక్క వ్యవసాయం రాళ్ళుతవ్వడం. అక్కడక్కడ రాళ్ళ మధ్యనున్న గతుకుల్లో చేరిన మెత్తని మట్టిని చెదురుమదురుగా ఉన్న గ్రామ ఉద్యానాల్లో వెయ్యడానికి అప్పుడప్పుడు గోకి, తవ్వి తీసుకెళుతుంటారు.

ఇక్కడి నైసర్గిక స్వరూపమే అంత. నాలుగింట మూడొంతులు భూబాగమంతా రాళ్లతో, గుట్టలతో నిండి ఉంటుంది. పట్నాలువెలిసి, అభివృద్ధిచెంది, అంతరించిపోయాయి. మనుషులు వచ్చేరు; ఒకర్నొకరు అభిమానించుకోడమో, తీవ్రంగా కలహించుకోడమో చేసి, చివరికి అంతా మరణించారు. ఈ ఎడారిలాంటి భూభాగంలో… తనైనా, తన అతిథి అయినా ఒక్కటే… ఎవరి ఉనికికీ విలువలేదు.  అలాగని, వాళ్ళిద్దరిలో ఎవరూ ఇంకెక్కడైనా బ్రతకగలరా అంటే, ఈ ఎడారికి బయట ఇంకెక్కడా బ్రతకలేరనీ దారూకి తెలుసు.

17

అతను లేచికూచునేటప్పటికి తరగతిగదిలోంచి ఏ చప్పుడూ వినిపించడం లేదు. అరబ్బు పారిపోయి ఉంటాడనీ, తనింక ఏ నిర్ణయమూ తీసుకోవలసిన అవసరం లేదనీ తన మనసులో ఒక క్షణకాలం మెదిలిన ఆలోచన ఇచ్చిన అచ్చమైన ఆనందానికి దారూకి ఆశ్చర్యం వేసింది. కానీ ఖైదీ పారిపోలేదు. అక్కడే ఉన్నాడు. అతను డెస్కుకీ, పొయ్యికీ మధ్య కాళ్ళు బారజాపుకుని పడుక్కున్నాడు. అంతే! కళ్ళు విశాలంగా తెరుచుకుని, లోకప్పువంక తేరిపారచూస్తున్నాడు. ఆ స్థితిలో, దళసరిగాఉన్న అతని పెదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి … బుంగమూతి పెట్టినట్టు .

“దా,” అని పిలిచేడు దారూ.

అతను లేచి దారూని అనుసరించాడు. తనగదిలో కిటికీకింద టేబిలుని ఆనుకున్న కుర్చీ చూపించాడు కూర్చోమని.

దారూ నుండి దృష్టి మరల్చకుండా అందులో కూచున్నాడు అరబ్బు.

“ఆకలిగా ఉందా?”

“అవును,” అన్నాడు ఖైదీ.

n127099

18

దారూ ఇద్దరికి భోజనం ఏర్పాటు చేశాడు. పిండీ, నూనె తీసుకుని పెనంమీద రొట్టెలా వేసి సిలిండరుగాసుతో పనిచేసే చిన్న స్టౌ వెలిగించాడు. రొట్టె అలా కాలుతుంటే, జున్నూ, కోడిగుడ్లూ, ఖర్జూరం, గడ్డపాలూ తీసుకురావడానికి బయట షెడ్డులోకి వెళ్ళేడు. రొట్టె తయారయేక అది చల్లారడానికి కిటికీలో ఉంచేడు. గడ్డపాలు పొయ్యిమీదపెట్టి కొంచెం నీళ్ళు కలిపాడు పలచన చెయ్యడానికి. గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్టు వేశాడు. అలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు అతని కుడి జేబులో ఉన్న రివాల్వరుకి చెయ్యి తగిలింది. గిన్ని కిందపెట్టి, తరగతిగదిలోఉన్న డెస్కుడ్రాయరులో దాన్ని పెట్టేడు. మళ్ళీ తనగదిలోకి వచ్చేసరికి అప్పుడే బాగా చీకటిపడిపోతోంది. దీపంవెలిగించి అరబ్బుకి భోజనం వడ్డించేడు.

“తిను,” అన్నాడు.

అరబ్బు ఒక చిన్న ముక్క తీసుకుని ఆత్రంగా నోటిదాకా తీసుకెళ్ళి, ఒక్క సారి ఆగి,  “మరి నీ సంగతి?” అని అడిగేడు.

“నువ్వు తిన్నాక తింటానులే.”

ఆ దళసరి పెదాలు కొంచం విచ్చుకున్నాయి. కొంచెంసేపు వెనకాడి, తర్వాత తినడానికి నిశ్చయించుకున్నాడు.

భోజనం అయిన తర్వాత, అరబ్బు స్కూలుమాష్టరువైపు చూస్తూ, “నువ్వేనా, న్యాయాధికారివి?” అని అడిగేడు.

“కాదు. రేపటిదాకా నేను నిన్ను నాతో ఉంచుకుంటున్నాను. అంతే.”

“మరి నాతో ఎందుకు భోజనం చేస్తున్నావు?”

“నాకూ ఆకలేస్తోంది.”

19

అరబ్బు మౌనంగా ఉండిపోయాడు.

దారూ లేచి బయటకి వెళ్ళేడు. వస్తున్నప్పుడు షెడ్డులోంచి ఒక మడతమంచం తీసుకువచ్చి, టేబిలుకీ, స్టౌకీ మధ్యగానూ, తన పక్కకి లంబంగానూ ఉండేట్టు వేశాడు. ఒక మూలగా నిలబెట్టబడి తను తనకాగితాలకి అలమరలా ఉపయోగించే పెద్ద సూట్ కేసులోంచి రెండు కంబళీలు తీసి, మడతమంచంమీద పరిచేడు. వాటివల్ల ఉపయోగంలేదని గ్రహించి, ఆగి, తన మంచంమీద కూలబడ్డాడు. అంతకంటే తనింక చెయ్యడానికిగాని, సిద్ధంచెయ్యడానికిగాని ఏమీ లేదు. ఈ మనిషినిచూస్తూ కూచోవలసిందే. అతనిముఖం కోపంతో రగిలిపోతోందేమోనని ఊహించుకుంటూ అతనిపక్క చూసేడు.

నల్లగా మెరుస్తున్న కళ్ళూ, జంతువు పెదాల్లాంటి పెదాలూ తప్ప మరేం కనిపించలేదు.

“అతన్ని ఎందుకు చంపేవు?” అని అడిగాడు. అతని గొంతులో వినిపించిన కాఠిన్యానికి అరబ్బుకి ఆశ్చర్యం వేసింది.

అతను ముఖం అటుతిప్పుకున్నాడు.

“వాడు పారిపోయాడు. నేను అతన్ని వెంబడించాను.”

అతను మళ్ళీ దారూతో చూపు కలిపాడు. అందులో నిశితమైన ప్రశ్నలు ఉన్నాయి.

“వాళ్ళిప్పుడు నన్నేం చేస్తారు?”

“నువ్వు భయపడుతున్నావా?”

అరబ్బు ఒక్క సారి బిర్రబిగుసుకుపోయాడు… ఎటో దిక్కులు చూస్తూ.

“నువ్వు చేసినపనికి పశ్చాత్తాపపడుతున్నావా?”

అరబ్బు అతనివంక నోరువెళ్ళబెట్టుకుని కన్నార్పకుండా చూశాడు. ఆ మాట అతనికి అర్థం కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. దారూకి అసహనం పెరిగిపోతోంది. అదే సమయంలో, రెండు పక్కలమధ్యా చిక్కుకున్న అతని భారీ కాయాన్ని చూసి, కొంచెం ఇబ్బందీ, తన ఉనికి గురించిన స్పృహా కలిగేయి.

అసహనంగా, “అదే నీ పక్క. అక్కడ పడుక్కో,” అన్నాడు.

20

అరబ్బు కదలలేదు.

దారూ తో, “ఒక విషయం చెప్పండి!”

స్కూలు మాష్టరు అతనివంక చూశాడు.

“రేపు ఆ పోలీసు మళ్ళీ వస్తున్నాడా?”

“నాకు తెలీదు.”

“మీరు మాతో వస్తున్నారా?”

“లేదు. అయినా, ఆ విషయం నీకెందుకు?”

ఖైదీ లేచివెళ్ళి కిటికీవైపు కాళ్ళుజాపుకుని, కంబళీమీద వెల్లకిలాపడుకున్నాడు. ఎలక్ట్రిక్ బల్బునుండి కాంతి సూటిగా అతని కళ్లలోకి పడటంతో కళ్ళు ఒక్కసారి మూసుకున్నాడు.

అతని పక్కనే నిలబడి, దారూ మళ్ళీ అడిగాడు, “ఎందుకు?” అని.

కళ్ళు తెరవలేకుండాచేస్తూ పడుతున్న వెలుగులో దారూవైపు కళ్ళు మిటకరించి చూస్తూ, అన్నాడు,  “మాతో రండి.”

21

అర్థరాత్రి అయింది కాని దారూకి నిద్రపట్టలేదు. నగ్నంగా పడుకోడం అతనికి అలవాటు. అందుకని పూర్తిగా దిగంబరంగా పక్కమీద వాలేడు. కానీ అకస్మాత్తుగా అతనికి గుర్తొచ్చింది, ఒంటిమీద ఏమీలేకపోవడమూ, దానివల్ల అతనికి హానికలగబోయే అవకాశమూ. వెంటనే లేచి బట్టలువేసుకుందామా అన్న ఆలోచన వచ్చింది కానీ, మళ్ళీతనే అనుకున్నాడు, తనేమీ చిన్నపిల్లాడు కాదు. అంతవరకూ వస్తే, తను శత్రువుని రెండుముక్కలుగా విరగ్గొట్టగలడు; ఒత్తుగా పడుతున్న వెలుగుకి నిశ్చలంగా కళ్ళుమూసుకుని తన పక్కమీద వెల్లకిలా పడుక్కున్నా, అక్కడనుండి అతన్ని పరికించగలడు. దారూ లైటు ఆర్పేయగానే, చీకటి ఒక్కసారి ఘనీభవించినట్టు అనిపించింది. కిటికీలోంచి కనిపిస్తున్న నక్షత్రాలులేని ఆకాసం నెమ్మదిగా కదులుతుండడంతో క్రమక్రమంగా చీకటి మళ్ళీ చైతన్యంలోకి వచ్చింది. అతని కాళ్ళదగ్గర పడున్న శరీరాన్ని స్కూలుమాష్టరు పోల్చుకోగలిగేడు. అరబ్బు కదలడం అయితే కదలడంలేదు గాని, అతని కళ్ళుమాత్రం ఇంకా తెరుచుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఒక సన్నటిగాలి స్కూలుచుట్టూ ఈలవేసుకుంటూ సాగుతోంది. అది మేఘాల్ని తరిమేస్తే, బహుశా సూర్యుడు రేపు మళ్ళీ కనిపించవచ్చు.

22

రాత్రి గాలిజోరు ఉధృతమైంది. కోళ్ళు ఒకసారి రెక్కలు టపటపలాడించి ఊరుకున్నాయి. అరబ్బు నిద్రలో ఒత్తిగిల్లాడు దారూకి వీపు కనిపించేలా. దారూకి అతని మూలుగు విన్నట్టు అనిపించింది. తర్వాత అతను తన అతిథి … శ్వాస బరువుగా, ఒక క్రమంలో ఇంకా బరువుగా తీసుకోవడం గమనించేడు. నిద్రపోకుండానే, ఆ బరువైనఊపిరి తనకి సమీపంగా ఊహించుకున్నాడు. ఏడాదికిపైగా ఈగదిలో ఒక్కడూ నిద్రిస్తున్న తనకి, మరోవ్యక్తి ఉనికి ఇబ్బందిగా ఉంది. అది మరొకందుకుకూడా ఇబ్బంది పెడుతోంది… అది తను ప్రస్తుత పరిస్థితులలో అంగీకరించకపోయినా: అది ఒకవిధమైన సౌభ్రాతృత్వాన్ని అతనిమీద రుద్దుతోంది. ఒకే గదిని పంచుకునే వ్యక్తులు… ఖైదీలూ, సైనికులూ… చిత్రమైన అనుబంధాల్ని పెంపొందించుకుంటారు… వాళ్ల వస్త్రాలతోపాటే వాళ్ళ ఆయుధాలనికూడా విసర్జించినట్టు; వాళ్ళ విభేదాలకి అతీతంగా ప్రతి సాయంత్రమూ నిద్రా, అలసటల పాతబడిన అనుభవాలలో సౌభ్రాతృత్వాన్ని అలవరచుకుంటారు; కానీ దారూ ఒక్కసారి తల విదుల్చుకున్నాడు; అతనికి అటువంటి ఆలోచనలు నచ్చలేదు; అతనికిపుడు నిద్రపోవడం ముఖ్యం.

23

కొంచెంసేపు గడచిన తర్వాత, అరబ్బు నిద్రలో కొంచెం కదిలేడు. స్కూలుమాష్టరుకి ఇంకా నిద్ర రాలేదు.  ఖైదీ రెండోసారి కదలగానే, అతనొకసారి బిగుసుకుపోయాడు, అప్రమత్తమై. నిద్రలోనడుస్తున్నవాడిలా అరబ్బు మోచేతులమీద నెమ్మదిగా తననితాను లేవనెత్తుకుంటున్నాడు. పక్కమీద నిటారుగా కూచున్న అరబ్బు దారూవైపు తల తిప్పకుండా నిశ్శబ్దంగా నిరీక్షించేడు… ఏదో శ్రద్ధగా వింటున్నట్టు. దారూ కదలలేదు; అతనికి ఒక్కసారి తట్టింది, రివాల్వరు ఇంకా తరగతిగదిలోని సొరుగులోనే ఉందని. ఇప్పుడు తనే ముందు ఏదో ఒకటి చెయ్యాలనిపించింది.  అయినా, అతను ఖైదీని గమనించడం మానలేదు; అతనుకూడా, అంతే చురుకుగా నేలమీద కాళ్ళు మోపి, క్షణకాలం నిరీక్షించి, మెల్లగా నిలబడడానికి ప్రయత్నించసాగేడు. దారూ అతన్ని పిలవబోయేంతలో, అరబ్బు మామూలుగానే కానీ చాలా నిశ్శబ్దంగా నడవడం ప్రారంభించేడు. షెడ్డులోకి తెరుచుకున్న తలుపువైపు నడిచేడు. జాగ్రత్తగా చప్పుడుచెయ్యకుండా గడియతీసి బయటకి వెళ్ళేడు; తన వెనకే తలుపు లాగినా, అది పూర్తిగా మూసుకోలేదు. దారూ కదలలేదు. “అతను పారిపోతున్నాడు” అనుకున్నాడు. “పీడా విరగడయ్యింది.” అని మనసులో అనుకున్నా, జాగ్రత్తగా వినసాగేడు. కోళ్ళు కలవరపడటం లేదు; అంటే తన అతిథి మైదానంవైపు  వెళుతూ ఉండి ఉండాలి… లీలగా నీటి చప్పుడు వినిపించింది అతనికి.  అరబ్బు ఆకారం తిరిగి ద్వారబంధందగ్గర కనిపించేదాకా అదేమిటో అర్థం కాలేదు. అరబ్బు తలుపు జాగ్రత్తగా మూసి, చప్పుడుచెయ్యకుండావచ్చి తన పక్కమీదవాలి  పడుక్కున్నాడు. దారూ వీపు అతనివైపు తిప్పి పడుక్కున్నాడు.  అతనికి నిద్రలో, స్కూలుభవనానికి చుట్టుపక్కల సన్నని అడుగులచప్పుడు వినిపించింది. “నేను కలగంటున్నాను, కలగంటున్నాను” అని అతనికి అతను సమాధానపరచుకుని నిద్రపోసాగేడు.

24

అతనికి తెలివివచ్చేసరికి ఆకాశం నిర్మలంగా ఉంది; తెరిచిన కిటికీలోంచి గాలి చల్లగా వీస్తోంది. ఆ అరబ్బు ప్రశాంతంగా కంబళీలో దగ్గరగా ముడుచుకుపడుక్కున్నాడు, నోరు తెరుచుకుని మరీ. దారూ అతన్ని లేపడానికి కుదపబోతే, అతను భయంతో దారూవంక కళ్ళు విచ్చుకుని తేరిచూడగానే, ఆ కళ్ళలో కనిపించిన భయవిహ్వలతకి, దారూ ఒక అడుగు వెనక్కి వేశాడు. “భయపడకు. నేనే. లే”. అరబ్బు తలఊపి ఆహా అన్నాడు. అతని ముఖంలోకి మళ్ళీ ప్రశాంతత వచ్చింది గాని, ఆ చూపులు ఇంకా శూన్యంగానూ, అలసటగానూ ఉన్నాయి.

25

కాఫీ తయారైంది. రొట్టెముక్కలు నములుతూ మడతమంచంమీద ఇద్దరూ పక్కపక్కన కూచునే కాఫీ తాగేరు. దారూ అరబ్బుని షెడ్డులోకి తీసుకువెళ్ళి తను ఎక్కడ స్నానం చేస్తాడో ఆ జాగా చూపించాడు. తనగదిలోకి పోయి, కంబళ్ళూ, పక్కా మడిచి, తనపక్క జాగ్రత్తగా సర్ది, గదికి ఒక రూపు తీసుకొచ్చేడు. అక్కడనుండి తరగతి గదిలోకీ, గదిముందున్న ఎత్తైన ప్రదేశందగ్గరకి వెళ్ళేడు. నీలాకాశంలో అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎడారిలాంటి మైదానం అంతా సూర్యుడి నులివెచ్చని లేత కిరణాలలో స్నానం చేస్తోంది. కొండశిఖరాలమీద మంచు అక్కడక్కడ కరుగుతోంది. వాటిక్రింద ఉన్న శిలలు బయటపడబోతున్నాయి. ఆ మైదానం అంచున చేతులు దగ్గరగా ముడుచుకు కూచుని నిర్మానుష్యమైన విశాల భూభాగాన్ని పరిశీలించసాగేడు. అతనికి ఎందుకో బాల్డూక్సి గుర్తొచ్చేడు. తను అతని మనసు కష్టపెట్టేడు, ఎందుకంటే అతనికి వీడ్కోలిచ్చిన తీరు అతనితో స్నేహం అక్కరలేదన్నట్టుగా ఉంది. ఆ పోలీసు వెళుతూ వెళుతూ అన్నమాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. కారణం తెలియకుండానే, చిత్రంగా అతనికి అంతా శూన్యంగా కనిపించడంతో పాటు, తను నిస్సహాయుడిగా కనిపించేడు. ఆ క్షణంలో స్కూలుభవనానికి అటువైపునుండి ఖైదీ దగ్గడం వినిపించింది. తనకి ఇష్టం లేకపోయినా అతన్ని వింటూ, చివరకి కోపంతో ఒక గులకరాయి తీసుకుని విసిరాడు. అది గాలిలో రివ్వున దూసుకెళ్ళింది, మంచులో కూరుకుపోయేలోపు. ఆ మనిషిచేసిన తెలివితక్కువ నేరానికి తనకి గొప్ప అసహ్యం వేస్తోంది. అయినా, అతన్ని అప్పగించడం తన గౌరవానికి భంగం. అసలు ఆ ఊహే అవమానంతో కుంగిపోయేలా చేస్తోంది. ఏకకాలంలో ఆ అరబ్బుని తనదగ్గరకి పంపించిన తనవాళ్లనీ, చంపడంలో చూపించిన ధైర్యం పారిపోవడంలో చూపించని అరబ్బునీ తిట్టుకున్నాడు. దారూ లేచినిలబడి, అక్కడికక్కడే గుండ్రంగా తిరుగుతూ, కాసేపు ఏదో ఆలోచిస్తూ కదలకుండ నిలబడి, చివరకి స్కూలుభవనంలోకి ప్రవేశించాడు.

26

షెడ్డులోని సిమెంటు నేలమీద ఒంగుని, ఆ అరబ్బు రెండువేళ్లతో పళ్ళు తోముకుంటున్నాడు. దారూ అతనివంక చూసి, “పద.” అన్నాడు.  ఖైదీకంటే ముందు తనగదిలోకి దారితీసేడు. స్వెట్టరుమీద హంటింగ్ జాకెట్టు తొడుక్కుని, కాళ్ళకి వాకింగ్ షూజ్ వేసుకున్నాడు. అరబ్బు తన ‘చెచే’ ధరించి, కాళ్ళకి సాండల్స్ వేసుకునేదాకా నిలబడి నిరీక్షించాడు. తరగతిగదిలోకి వెళ్ళేక దారూ బయటకిపోయే త్రోవ చూపిస్తూ, “పద. నడుస్తూ ఉండు,” అన్నాడు. అతను ఒక్క అంగుళం కూడ కదలలేదు. “నేను వస్తున్నాను” అన్నాడు దారూ.  అప్పుడు అరబ్బు బయటకి కదిలేడు. దారూ మళ్ళీ తనగదిలోకి వెళ్ళి రస్కులూ, ఖర్జూరం, పంచడార ఒక పొట్లం కట్టేడు. బయలుదేరడానికి ముందు తరగతిగదిలో తన డెస్కుదగ్గర నిలబడి ఒక్క క్షణం తటపటాయించేడు. వెంటనే గదిబయటకి వచ్చి, తాళం వేసేడు. “అదే త్రోవ.” అన్నాడు తోవ చూపిస్తూ.  అతను తూర్పు దిశగా బయలుదేరేడు ఖైదీ అతన్ని అనుసరిస్తుండగా. నాలుగడుగులు వేసేడోలేదో తనవెనక ఏదో అలికిడైనట్టు అనిపించింది. వెనక్కి వచ్చి స్కూలుభవనం నాలుగుపక్కలా వెతికేడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అర్థం చేసుకుందికి ప్రయత్నించకపోయినా, అరబ్బు అతని చర్యల్ని గమనించడం మానలేదు.  “రా,” అన్నాడు దారూ, దారి తీస్తూ.

27

వాళ్ళు ఒకగంట నడిచి, బాగా నిట్రాయిలాఉన్న సున్నపురాయికొండ దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. మంచు త్వరత్వరగా కరగడం ప్రారంభిస్తుంటే, సూర్యుడు అలా గుంటలుగా చేరుతున్న నీటిని అంత త్వరగానూ ఆవిరిచెయ్యడం ప్రారంభించేడు. మైదానం అంతా క్రమంగా పొడిగా తయారవుతూ, నీటిఆవిరి కదలికలకి మైదానమే గాలిలా కదులుతోందేమోనన్న భ్రమ కల్పిస్తోంది. వాళ్ళు తిరిగి నడక ప్రారంభించే వేళకి వాళ్ళ అడుగుల తాకిడికి నేల చప్పుడుచెయ్యనారంభించింది. ఉండిఉండి ఆనందంతో అరుచుకుంటూ ఒక పక్షి వాళ్ల ముందునుండి గాలి చీల్చుకుంటూ ఎగరసాగింది. ఉదయపు తాజా వెలుగులని దారూ కరువుతీరా అస్వాదిస్తున్నాడు. నీలాకాశం గొడుగుకింద కనుచూపుమేర అంతా బంగారపురంగులో కనిపిస్తున్న పరిచయమైన అ విశాలమైన మైదానాన్ని చూస్తూ అతనొక చెప్పలేని ఆనందానుభూతికి లోనయ్యాడు. వాళ్ళు మరో గంటసేపు నడిచేరు…దక్షిణానికి దిగుతూ. పిండిరాళ్ళతోనిండి సమతలంగాఉన్న ఒక ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. మైదానం అక్కడనుండి తూర్పుకి కంపలతో నిండిన లోతైన బయలులోకీ, దక్షిణాన ఆ ప్రాంతం అస్తవ్యస్తంగా కనిపించడానికి కారణమైన చెదురుమదురు రాళ్ళ గుట్టలవైపుకీ వాలుతుంది.

28

దారూ రెండుదిక్కుల్నీ జాగ్రత్తగా పరిశీలించేడు. దిగంతాలవరకూ ఆకాశంతప్ప మరేం లేదు. మనిషి అన్న జాడ కనపడలేదు. తనవైపు శూన్యంగా చూస్తున్న అరబ్బు వైపు తిరిగాడు. అతనికి పొట్లాం చేతికందిస్తూ, “ఇది తీసుకో,” అన్నాడు. “ఇందులో ఖర్జూరం, బ్రెడ్, పంచదార ఉన్నాయి.  వీటితో రెండురోజులు గడపగలవు. ఇదిగో ఈ వెయ్యి ఫ్రాంకులు కూడా తీసుకో.” అరబ్బు ఆ పొట్లాన్నీ, డబ్బునీ అందుకున్నాడు. కానీ తనకిచ్చిన వాటితో ఏమిచెయ్యాలో తెలీదని సూచిస్తునట్టు చేతులు గుండెలకు హత్తుకుని నిలబడ్డాడు. “ఇటు చూడు,” తూర్పువైపుకి సూచిస్తూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు స్కూలుమాష్టరు, “టింగ్విట్ వెళ్ళడానికి త్రోవ అది. రెండుగంటల నడక. అక్కడ అధికారులూ పోలీసులూ ఉంటారు. వాళ్ళు నీకోసం ఎదురుచూస్తున్నారు.” అరబ్బు తూరుపువైపు చూశాడు డబ్బునీ, పొట్లాన్నీ గుండెకు హత్తుకుంటూనే. దారూ అతని భుజాన్ని కొంచెం మోటుగా తిప్పాడు దక్షిణదిక్కుకి. వాళ్ళు నిలబడ్డ ఎత్తైన ప్రదేశం నుండి చూస్తే, ఆ మిట్ట పాదాల దగ్గర వాళ్ళకి ఒక సన్ననిజాడలాంటి బాట కనిపిస్తోంది. “ఈ మైదానం పొడవునా సాగే బాట అది. ఒక రోజు నడిస్తే, నీకు పచ్చని చేలూ, తొలివిడత సంచారజాతులూ కనిపిస్తారు. వాళ్ళు నిన్ను తమలో కలుపుకుని వాళ్ల చట్టానికి తగ్గట్టుగా తలదాచుకుందికి అవకాశం కల్పిస్తారు.”

అరబ్బు దారూవంక చూసేడు. అతని ముఖంలో ఇప్పుడు భయందోళనలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

“నా మాట వినండి,” అన్నాడతను.

దారూ తల అడ్డంగా తిప్పి, “లేదు. మాటాడకు. నేను ఇప్పుడు నిన్నిక్కడ వదిలేసి వెళుతున్నాను.” అన్నాడు.

వీపు అతనివైపు తిప్పి, స్కూలు దిశలో రెండు పెద్ద అంగలు వేసి, కదలకుండా నిలుచున్న అరబ్బుని కాసేపు అనుమానంగా చూసి, మళ్ళీ బయలు దేరాడు.  కొన్ని నిముషాలపాటు అతనికి ఏమీ వినిపించలేదు చల్లటి నేలమీద ప్రతిధ్వనిస్తున్న తన అడుగుల చప్పుడు తప్ప. అతను వెనుదిరిగి చూడలేదు. చేతులు వేలాడేసుకుని, ఆ అరబ్బు కొండఅంచున అలాగే అక్కడే నిలుచున్నాడు స్కూలు మాష్టరుని చూస్తూ. దారూకి గొంతుకి ఏదో అడ్డం పడింది. కోపంతో తిట్టుకుంటూ, గాలిలో ఎవరికో తెలీకుండా చేతులూపి, మళ్ళీ నడక ప్రారంభించేడు. చాలాదూరం నడిచిన తర్వాత మరొకసారి ఆగి వెనక్కితిరిగి చూసేడు. ఇప్పుడు కొండఅంచున ఎవరూ కనిపించలేదు.

29

దారూ సంశయించాడు.  సూర్యుడు అప్పుడే నడినెత్తికి వచ్చి ఎండ మాడ్చడం ప్రారంభించింది. వెనక్కి అడుగులు వేశాడు … ఎటూ నిర్ణయించుకోలేక ముందు సందేహించినా, చివరకి ఒక నిర్ణయానికి వచ్చి. మరొక చిన్నకొండదగ్గరకి వచ్చేసరికి అతను చెమటతో స్నానం చేసినంత పని అయ్యింది. అతను ఎంత తొందరగా ఎక్కగలడో అంత తొందరగా ఎక్కి, ఆగేడు… ఊపిరి అందక. నీలాకాశం నేపథ్యంలో దక్షిణాన రాతిభూములు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ, తూర్పున తుప్పలూ డొంకలతో నిండిన ప్రదేశంలో నీటిఆవిరితో నిండిన వేడి మెల్లగా పైకి లేస్తోంది. ఆ మసక మసకలోనే…  అతన్ని జైలుకి తీసుకుపోయే తోవలో అరబ్బు మెల్లిగా నడవడం గమనించాడు… బరువెక్కిన గుండెతో.

30

కొంతసమయం గడిచిన తర్వాత, స్కూలుమాష్టరు తన తరగతిగది కిటికీదగ్గర నిలబడి విశాలమైదానంనిండా సూర్యకాంతి ప్రతిఫలించడం గమనిస్తున్నాడు కాని, అతనికి ఆ స్పృహలేదు. అతని వెనక, బ్లాక్ బోర్డుమీద పారుతున్న నాలుగు ఫ్రెంచి నదులమధ్యా, అతను అప్పుడే చదివిన గజిబిజిగా సుద్దతో రాసిన మాటలు మెదుల్తున్నాయి:

“నువ్వు మా సోదరుడిని అప్పగించావు. దీనికి నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు.”

దారూ ఆకాశంవంకా, మైదానంవంకా, సముద్రందాకా విస్తరించిన పొలాలవంకా చూస్తున్నాడు. ఈ విశాలమైన ప్రకృతిని అతను ఎంతో ప్రేమించాడు, కానీ ఇపుడు అతను ఒంటరి.

***

Read the Original English Translation by Justin O’Brien here:

http://www4.ncsu.edu/~dsbeckma/the%20guest%20by%20albert%20camus.pdf

http://bradleynorton.blogspot.in/2012/05/literary-analysis-guest-by-albert-camus.html

murthy gaaruఅనువాదం: నౌడూరి మూర్తి

పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర?

పేరున్న సీనియర్ రచయిత్రి పి. సత్యవతిగారు 90లలో పెళ్ళి ప్రయాణం అని ఒక గొప్ప కథ రాశారు. రకరకాల మధ్య తరగతి మనస్తత్వాలని అద్భుతంగా ఆవిష్కరించారు ఆ కథలో. నాకు బాగా గుర్తున్న ఒక దృశ్యం – ఇద్దరు విద్యావతులైన అమ్మాయిలు, వరసకి అక్క చెల్లెళ్ళు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. ఒకామె పోస్టు గ్రాడ్యుయేటు. లెక్చరరుగా ఉద్యోగం చేస్తోంది. మంచి జీతం తెచ్చుకుంటోంది. అయినా పెళ్లి చూపులు అనేటప్పటికి అమ్మ చెప్పినట్టల్లా అలంకరించుకుని ఆ చూడ్డానికి వచ్చిన వాళ్ళ ముందు తలదించుకుని కూర్చోవడానికి సిద్ధపడుతూనే ఉంది. వయసు మీరిపోకపోయినా, మీరి పోతోందేమో అనే భయం తల్లి దండ్రుల్లోనూ, కొద్దికొద్దిగా ఆమెలోనూ ప్రవేశిస్తూన్న తరుణం. కథ చెబుతున్న చిన్న చెల్లెలు అకస్మాత్తుగా అడుగుతుంది ఆమెను – నీకన్న కాస్త చిన్నవాణ్ణో, పోనీ నీకన్న తక్కువ జీతం తెచ్చుకునే వాణ్ణో – నీ మనసుకి నచ్చిన వాడైతే – చేసుకోవచ్చుగా? అని. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పెద్దక్కయ్య, “అలా ఏం బావుంటుందోయ్?” అనేస్తుంది, తేలిగ్గా తీసి పారేస్తూ.

ఇప్పుడు అమెరికాలో పెళ్ళి విషయంలో సరిగ్గా అదే పరిస్థితి. ఈ పరిణామం కొన్నేళ్ళుగా జరుగుతూ ఉన్నా, 2008 ఆర్ధిక సంక్షోభంలో, తద్వారా ఉద్యోగాలు హుష్ కాకీ అయిపోయి, నిరుద్యోగ నిష్పత్తి మింటి కెగరడంతోనూ అమ్మాయిలకి ఈ పెళ్ళి సమస్య స్పష్టమైన భీకర రూపంతో ప్రత్యక్షమై భయపెడుతున్నది.

కనీసం గత వంద, నూటయాభయ్యేళ్ళుగా స్త్రీలు సామాజిక జీవితంలో ఎటువంటి ప్రతిపత్తి సాధించాలన్నా సరైన మగవానితో – అంటె అన్ని విధాలా తనకంటే హెచ్చు స్థాయిలో ఉన్న పురుషునితో – పెళ్ళి ఒక్కటే మార్గంగా ఉంటూ ఉన్నది. అరవైలలో పెరిగిన హిప్పీతరంవారు కూడా, కొందరు ఆ సమయంలో ఏదో కొంత స్వేచ్ఛాగీతాలు ఆలపించినా, మొత్తమ్మీద పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కని, ఉద్యోగాలు చేసి, అమెరికను సామాజిక జీవనస్రవంతిలో పాయగానే ఉన్నారు తప్ప వేరు పడినది లేదు.  స్త్రీ విమోచనము, స్వేచ్ఛ, సమానత్వమూ అని ఎంత మొత్తుకున్నా, ఆ తరంవరకూ దంపతులైనవారిని పరికిస్తే, విద్యలో, ఉద్యోగంలో, ఆదాయంలో భర్తదే పైచెయ్యిగా ఉంటూ వచ్చింది. స్త్రీలు ఎక్కువగా “నర్చరింగ్” ఉద్యోగాలైన నర్స్, టీచర్ వంటి ఉద్యోగాలకు గానీ, లేక సెక్రటరీ, ఆఫీస్ మేనేజర్ వంటి సహాయక ఉద్యోగాలకు గానీ పరిమితమయ్యారు. లేదా, కాలేజి చదువులు చదివి కూడా ఇల్లు చూసుకుంటూ గృహిణిగా ఉండిపోయారు. ఆ కాలంలో టీవీలో బాగా ప్రసిద్ధికెక్కిన సీరియళ్ళలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. Leave it to Beaver, All in the family వంటి సీరియళ్లలో ఈ స్థితిగతులని చిత్రించారు. అక్కడక్కడా కొన్ని ఉదాహరణలు దీనికి భిన్నంగా ఉండొచ్చును గానీ సగటున అర్బన్ మధ్యతరగతి అమెరికాలో ఉంటూ ఉన్న పరిస్థితి ఇది.

స్త్రీలు పెద్ద చదువులు చదవడము, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నతస్థాయి మేనేజిమెంటు ఉద్యోగాలలో స్థిరపడడము, లేదా స్వంత వ్యాపారాలు మొదలు పెట్టడమూ మొదలై వృద్ధి చెందుతూ వస్తున్నది. ఈ పరిణామాలు జరగడానికి అనేక రాజకీయ, సామాజిక, ఆర్ధిక కారణాలు ఉన్నాయి. అలాగే అంతకు ముందే జరిగిన ఉద్యమాలు, మేలుకున్న చైతన్యాలు కూడా. ఏదేమైనా, 80లలో పెరిగిన జెనరేషన్ ఎక్స్ (Generation X) కాలేజికి వెళ్ళేసరికి, ఆ తరం స్త్రీలలో పెళ్ళి చేసుకోవడం అనే ఆలోచన బాగా వెనకబడిపోయింది. భవిష్యత్తుని గురించిన వారి ఊహల్లో పెళ్ళి ఎక్కడా కనుచూపు మేరలో లేదు. అలాగని అస్సలు పెళ్ళి చేసుకోరనీ కాదు, పెళ్ళంటే విముఖత లేదు. కానీ ముందు కాలేజి చదువు, తరవాత తమ మనసుకి నచ్చిన ఉన్నత విద్య, ఏతన్మధ్య తనని తాను అర్ధం చేసుకోవడం (అంటే ఆసియాకో దక్షిణ అమెరికాకో ఒక విహార యాత్ర, అధమాధమం యూరపు యాత్ర), అటుపైన మంచి జీతం, అధికారం, తృప్తినిచ్చే ఉద్యోగంలో చేరడం, ఊరికినే ఉద్యోగంలో చేరి ఊరుకోవడమే గాక ఉద్యోగసోపానంలో తన శక్తియుక్తులని వృద్ధి చేసుకుంటూ పైకెదగడం – ఇవన్నీ వాళ్ళ ఊహల్లో ప్రతిఫలించిన స్పష్టంగా పెళ్ళి, వైవాహిక కుటుంబ జీవనము కనబళ్ళేదు. పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర? ఇంకా చాలా టైముందిగా!
జరిగింది ఏవిటంటే, వీళ్ళు ఈ జీవిత ప్రయాణంలో సోలోగా జాలీగా ప్రయాణిస్తూ ఉండగా, వారికి ఈడైన వయసువారు, వారి విద్యా ఉద్యోగ ఉన్నతికి సరిదూగగలవారు అయిన పురుషుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఆ స్థాయిలో ఉన్న మగవారు అప్పటికే పెళ్ళిళ్ళై ఉన్నవారు. అలాగ పెళ్ళంటూ చేసుకోవాలని తోచే సమయానికి తమకన్న చిన్నవయసువాడిని చేసుకోవడమో, లేక ఉద్యోగ ఆర్ధిక స్థాయిలో తక్కువగా ఉన్నవాడిని చేసుకోవడమో ఈ స్త్రీలకి మిగులుతున్నది. అంతే కాక గత రెండు దశాబ్దాలుగా వస్తు ఉత్పత్తి తయారీలకి సంబంధించిన అనేక ఉద్యోగాలు అమెరికానించి తరలిపోవడంతో, అమెరికను మధ్యతరగతికి జీవగర్రగా ఉన్న మగవారి ఉద్యోగాలు మాయమైపోతూ వచ్చాయి. కేవలం హైస్కూలు డిప్లొమాతో, లేక ఎసోసియేట్ డిగ్రీతో మంచి జీతం పొందగలిగే ఉపాధులు, ముఖ్యంగా మగవారికి, కనుమరుగైపోయాయి.
జెనరేషన్ ఎక్స్ స్త్రీ పురుషుల వివాహ విముఖత, కొంత విశృంఖలమైన శృంగార జీవితమూ సినిమాల్లో సాహిత్యంలో చిత్రించబడినంతగా పైన చెప్పిన ఆర్ధిక సామాజిక పరిణామాలు చిత్రించబడలేదు. సైన్ ఫెల్డ్, ఫ్రెండ్స్ వంటి టీవీ సీరియళ్ళు, వెన్ హేరీ మెట్ శాలీ వంటి సినిమాలు ఈ మనస్తత్వ చిత్రణకి అద్దం పడుతూ వచ్చాయి, కానీ అక్కడ వినోదమే ముఖ్యం కావడంతో, ఈ ఫలితాలకి పునాదిగా ఉన్న పరిణామాల చర్చ ఎక్కడా కనబడదు. సాహిత్యం కూడా ఈ తరాన్ని నిర్లక్ష్యం చేసిందనే చెప్పుకోవాలి. ఐతే, సమాజాన్ని గమనిస్తూ, అధ్యయనం చేస్తూ ఉండే కొందరు సామాజిక శాస్త్ర పరిశోధకుల, జర్నలిస్టుల దృష్టి ఈ పరిణామాలని గమనించింది. తద్వారా non-fiction పుస్తకాలలోనూ, కొన్ని పత్రికల వ్యాసాలలోనూ ఈ విషయాలు చర్చకి వచ్చాయి.
ఉదాహరణకి న్యూయార్కు విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసరు, ఎరిక్ క్లైనెన్బర్గు (Eric Klinenberg) ఒంటరిగా జీవించడం అనే జీవన విధానాన్ని పరిశోధిస్తూ, ఒంటరి జీవితం గడపటానికీ, స్త్రీ పురుషుల వైవాహిక వాంఛకీ మధ్య ఉన్న పరస్పర ప్రభావాన్ని కొంత లోతుగానే పరిశోధించారు. ఆయన పరిశోధనలో ఒంటరిగా ఉండడం అంటే తన నివాస స్థానంలో నిజంగా ఒంటరిగా ఉండడం – ఇతరంగా రూమ్మేట్లు కానీ, లేక ఇతర కుటుంబ సభ్యులు కానీ లేకుండా. మొదటగా అతను గమనించిన విషయం ఒక మనిషి ఒంటరిగా జీవించడమనేది ఖర్చుతో కూడుకున్న పని. ఉదాహరణకి కలిసి ఉన్న ఒక జంట (పెళ్ళయ్యో, కాకుండానో) విడిపోయారు అనుకుందాం. వెంటనే, ఉండడానికి ఇల్లో, అపార్టుమెంటో ఒక నివాస స్థానం దగ్గర్నించి, పడక, వొండుకోడానికి, తినడానికి అవసరమైన పాత్రలు, తప్పేళాలు, అన్నీ రెండేసి సెట్లు అవసరమవుతాయి. అంచేత, దారిద్ర్య రేఖకి దగ్గర్లో ఉన్నవాళ్ళు ఈ సాహసం చెయ్యలేరు. అతను గమనించిన ఇంకొక విషయం ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పొందిన స్త్రీలు తమ స్వంత నివాసాలని కొనుక్కోవడం.
ఇదివరకల్లా ఇల్లు కొనుక్కోవడం అంటే, అది జంటగా కలిసి చేసే పని అనే దృక్పథం ఉండేది. గత పది పన్నెండేళ్ళలోనూ ఇల్లు కొనుక్కోవడాన్ని ప్రభుత్వమూ, బేంకులూ బాగా ఆకర్షణీయంగా చెయ్యడం వల్లనూ, మంచి కెరీర్‌లో ఉన్న యువతులు ముప్ఫై వయసుకొచ్చే లోపలే అవసరమైనంత తొలి పెట్టుబడి సంపాదించుకోవడం వల్లనూ తమ స్వంత ఇల్లు కొనేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ వచ్చారు. ఎప్పటికి వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని మొగుడి గురించి తన జీవితాన్ని “పాజ్” లో ఉంచడానికి ఇష్టపడ్డం లేదు ఈ నాటి యువతి. అదలా ఉండగా, స్త్రీని కలిసే సమయానికే ఆమె ఒక ఇంటి యజమానురాలై ఉండడం పురుషుడికి ఒక పక్కన సహజంగా భీతి కలిగించే లక్షణం, మరొక పక్క ఆత్మ న్యూనత ప్రశ్న. ఇలా ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తున్నాయి ఈ ఆర్ధిక సామాజిక అంశాలు.
ఐతే, తన నివాస స్థలంలో ఒంటరిగా ఉన్నంత మాత్రాన, జీవితంలో ఒంటరిగా లేరు ఈ స్త్రీలు (ఆ మాటకొస్తే పురుషులు కూడా). కాలమిస్టు కేట్ బాలిక్ (Kate Bolick) ఒక పత్రిక వ్యాసంలో రాసినట్టు వీళ్ళు ఎప్పటికంటే బలమైన స్నేహ బంధాల్ని ఏర్పరుచుకుంటున్నారు. ఇదివరకటి తరానికి చెందిన సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ తన తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలైపోతుంటే తానొక్కతే ఒంటరిగా మిగిలిపోతున్నానే అనే మనోదౌర్బల్యాన్ని, దుఃఖాన్ని ఒంటరి స్త్రీపాత్రల మీద మోపుతుండేవారు. అలాంటిది, మందిలోనే ఉంది శక్తి అన్నట్టు, సింగిల్ గా ఉన్న స్త్రీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏ స్త్రీకయినా తోటి సింగిల్ స్నేహితురాళ్ళు తగినంత మంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటోంది. చిన్నప్పటి స్నేహాలే కాక, ఇప్పుడు కొంత వయసూ అనుభవమూ ఏర్పడినాక చేసుకుంటున్న, బలపడుతున్న ఈ స్నేహాల్లో మరింత తృప్తిని పొందుతున్నామని యువతులు భావిస్తున్నారు. ఇటువంటి జీవితానుభవాలు, ఆలోచనా దృక్పథమూ ఇటీవలి సినిమాల్లో – ఉదాహరణకి, బ్రైడ్స్‌మెయిడ్స్, ఫైవ్ యేర్ ఎంగేజిమెంట్, యాయా సిస్టర్హుడ్ వంటి సినిమాలు – బలంగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అంధ్రాలో మధ్యతరగతి అబ్బాయిలకి పెళ్ళి చేద్దామంటే పిల్లే దొరకడం లేదట! ఆ ముచ్చటేవిటో మరోమాటు చూద్దాం.

–ఎస్.నారాయణస్వామి

మారుతోన్న తరం

“ ఒకసారి వచ్చి వెడతారా నాన్నగారూ “ శేఖర్ నుండి ఫోను ….

“ ఏమైందిరా  ?  “ప్రకాశరావుకు  ఆదుర్దా కలిగింది. కొడుకు శేఖర్ కోడలు ప్రభ ల  పట్నపు పరుగుల జీవితంలో ఇమడలేక  పల్లెలో ప్రశాంతంగా వుంటున్నారు ప్రకాశరావు, భారతమ్మలు .

పండగా వారం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు శేఖరం ఇంటికి, సెలవులు, సరదాలు  వచ్చినప్పుడు   కొడుకు , కోడలు మనమడు రాహుల్ తో సహా తల్లిదండ్రుల దగ్గరికి  చేరడం అలవాటు . ఎప్పుడో గాని ఇలా అర్ధాంతరంగా పిలుపులు జరగవు . అలా జరిగినప్పుడు కొంచం గాబరా …అంతే

“ ఏమీలేదు నాన్నా రాహుల్ పుట్టిన రోజుకు కొంచం ముందుగా వస్తారేమోనని “

“ వాడి పుట్టిన రోజు కు ఇంకా నెలరోజుల పైనే వుంది కదా . ఇప్పటినుండి వచ్చినా మీరందరూ మీ పనులపై  ఇంట్లోంచి వెళ్ళిపోతే మేమిద్దరమే బిక్కుమంటూ వుండాలికదా ..అందుకు ఆలోచిస్తున్నా  “

“రండి నాన్నా…సాయంకాలాలైనా  కలసి వుండచ్చు “ అతడి గొంతులో అభ్యర్థన ..

“ సరే ఎప్పుడు బయలుదేరేది చెబుతానులే “ అని ఫోను పెట్టేసింది.

2

“ భారతీ..శేఖర్ ఫోను చేసాడు “ అన్నాడు భార్యతో.

“బాగున్నారా అందరూ ?” అడిగింది భారతమ్మ .

“ ఆ.. బాగున్నారట …మనల్ని ఒకసారి  రమ్మని చెప్పాడు “

“రాహుల్  పుట్టిన రోజుకు వెడతాము కదా “

“కొంచం ముందుగా రమ్మన్నాడు ”

ఎప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదనే తత్త్వం ప్రకాశరావుది ..భార్యకూడా ఎప్పుడో తప్ప అతడిని ఎదురించే రకం కాదు . శేఖర్  మంచి ఉద్యోగం లో వున్నా అతడి పంచన చేరి పోవాలని అనుకోలేదు వాళ్ళు . శేఖర్ కూడా వాళ్ళు ఎక్కడ సుఖంగా వుంటారో ఆలోచించాడు అంతే ..ఆరోగ్యవంతులుగా వుండటం వల్ల  ప్రకాశరావు దంపతులు పల్లెలోనే వుంటామన్నారు .’నీ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తే తప్పక వస్తాం ‘ అనేవాడు. ఆదరించే కొడుకు వున్నప్పుడు ఏ తండ్రి కైనా నిశ్చింతే !

మూడు రొజుల్లో బయలుదేరి వెళ్లారు కొడుకు దగ్గరికి ప్రకాశరావు దంపతులు.

అక్కడ చేరిన రోజు రాత్రే భోజనాల తరువాత  విశ్రాంతిగా లివింగ్ రూం లో కూర్చున్నారు . రాహుల్  ని  నిద్రపుచ్చి  ప్రభ కూడా వచ్చి కూర్చుంది .

 

“ ఒక విషయం మాట్లాడాలి నాన్నా “ ఉపోద్గాతంగా అన్నాడు శేఖర్ .

“ చెప్పు శేఖర్  ఏమి విషయం ?”

ఆర్థిక బాధలు గాని , కుటుంబ కలహాలు కాని లేని  కుటుంబం . చక్కగా భార్య భర్తా ఏడేళ్ళ కొడుకు , సొంత ఇల్లు , కారూ  అన్ని విధాలా సమస్యలు లేవు .మరి ..ఏమై వుంటుంది ? ఇన్ని ఆలోచనలు వచ్చాయి క్షణంలో ప్రకాశరా వుకు .  కుతూహలంగా చూసింది భారతమ్మ .

“ ఇంకో బిడ్డను కావాలనుకుంటున్నాం నాన్నా ..అదీ ఆడపిల్ల ….” ఆగాడు శేఖర్ .

“ప్రొసీడ్ అవ్వండి . ఏమైనా ప్రాబ్లమ్స్ వున్నాయా ? డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చారా ? ప్రభకు ఇంకా ముపై నాలుగేళ్ళే కదా “అదికాదు నాన్నా , ఇంకో బిడ్డ కావాలనుకుంటే  రాహుల్ తరువాతే అనుకొని వుండవచ్చు ..”

“ఇప్పుడేమి కొంచం ఆలస్యం అయ్యింది..చాలామందికి ముప్పై దాటిన తరువాతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ రోజుల్లో

వాళ్ళంతా పిల్లలను కనడం లేదా?..” ప్రకాశరావు సూటి ప్రశ్న.

“ వయసు నిండినదని గాని , గైనిక్ ప్రాబ్లమ్స్ గాని లేవు నాన్నా  ..కాని మేము బిడ్డను కనాలనుకోవడం లేదు . పెంచుకోవాలనుకుంటున్నాం.”

“కనగలిగే పరిస్థితి వున్నప్పుడు పెంచుకోవడం ఏమిటిరా?”

“ మీరు ఎప్పుడూ నా పుట్టిన రోజున బీదపిల్లలకి అన్నం పెట్టేవాళ్ళు .గుర్తుందా?”

“అవును ఏదో లేని వాళ్లకు  సాయం చేద్దామని ఎప్పుడూ అనిపించేది .”

“ అదే నామనసులో నాటుకు పోయింది నాన్నా . ప్రభకు పెళ్లి ఐన వెంటనే చెప్పాను. ఒక బిడ్డ చాలని, మరో బిడ్డను పెంచుకుందామని . దేవుడి దయవల్ల మీరు నొచ్చుకోకుండా మొదటి కానుపు లోనే రాహుల్ పుట్టాడు. వాడు పుట్టగానే వంశం నిలబడింది అని మీరు అమ్మ మురిసిపోయారు . ఇప్పుడు మరో బిడ్డని , అనాధ ని పెంచుకొంటే  బాగుంటుందని అనిపించింది ‘

ప్రకాశరావు మాట్లాడలేదు ఒక క్షణం.

భారతమ్మ మాత్రం “ మా చెల్లెలు కూతురు రత్నకు ముగ్గురూ ఆడపిల్లలే ..ఆరు నెలల క్రితం మళ్ళీ  ఆడపిల్ల పుట్టగానే వాళ్ళ అత్తగారు చాలా సాధించిందట  వంశాంకురం  పుట్టడం లేదని ,అది చాలా బాధపడి౦దిట .  మీరు పెంచుకోవాలను కుంటే దాని బిడ్డను పెంచుకోవచ్చు కదా …” అంది

“ అమ్మా అలా అయితే నేను  ఒక అనాధకు  ఆశ్రయం ఇచ్చినట్టు ..ఎలావుతుంది ?

“దగ్గరి వాళ్ళనుండీ   దత్తత తీసుకుంటే సమస్యలు రావచ్చు “ శేఖర్ అమ్మను ఉద్దేసించి అన్నాడు .

“అంటే మీరు ఎక్కడనుండైనా తెచ్చుకోవాలనే నిర్ణయించు కున్నారా ? “ అంటున్న భారతమ్మకు అడ్డు వస్తూ ప్రకాశరావు “  శేఖర్ ని మాట్లాడనీ “ అన్నాడు .

“ అదే నాన్నా .. నా ఆలోచనకు మీ ఆమోదం  లభిస్తుందనే …”

“ ఆలోచన మంచిదే “ ప్రకాశరావు అంటూంటే భారతమ్మ కోపంగా చూసింది

“ కాని ఎక్కడనుండి తెచ్చుకుంటారు ? దత్తత కూడా పద్దతి ప్రకారమే జరగాలి మళ్ళి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ..”

“ అంటే మీరు కూడా సపోర్టు చేస్తున్నారా ? “ భారతమ్మ గొంతు తీవ్రంగా వుంది

“ భారతీ కొంచం ఆలోచించు. దేశం లో ఎంతోమంది  అనాధలు వున్నారు.ఒకరికి ఆశ్రయం కల్పించడం  మంచిది కాదంటావా ? “

“ దేశం లో వున్నా అనాధలందరిని వుద్దరిస్తారా? ?”

“ వుద్దరించడం కాదు  మన తాహతును బట్టి ఆశ్రయం ఇవ్వటం “

“ వాడి సంసారం లో బాగంగా  ఎవరో వచ్చి అనుభవిస్తారంటే  బాగుంటుందా ?

“ అలా ఆలోచించకు .ఏదైనా ఆక్సిడెంట్ లో ఒక పిల్ల అనాధగా మారితే  ఆశ్రయం ఇస్త్తామని  ఎంతమంది ముందుకు రావటం లేదు ? “ ప్రకాశరావు నచ్చచేప్పబోయాడు .

అప్పటి వరకు వాలా సంభాషణ లో పాలు పంచుకోని ప్రభ నోరు విప్పింది .

“ అత్తయ్యా  ఆ బిడ్డ నాకే పుడితే మన వంశం లోనిదే అని మీరు ఆదరించరా ?

“ నీ కడుపున పుడితే అది వేరే సంగతి  “

“ అత్తయ్యా …నాకే ఒక అమ్మాయి పుట్టిందని  మనసులో అను కొండి . ఎందు కంటే  మేము తెచ్చు కున్నాక పాపను మీరు అనాధగా చూస్తే సహించలేము .”
“ అంటే మీ నిర్ణయాన్ని మేము ఆమోదించాలనే  పిలిపించారు …సరే మీ ఇష్టం ..” అనేసి కాస్త విసురుగానే వెళ్ళింది భారతమ్మ .

శేఖర్ వైపు నిస్సహాయంగా చూసింది ప్రభ .

శేఖర్  నాన్న వైపు చూసాడు . అతను ఆలోచనలో వున్నట్టు అనిపించింది .

‘ రాహుల్ కి తోడు కావాలని కూడా అనుకుంటున్నాము నాన్నా “ మీరు  ఆలోచించి అమ్మతో మాట్లాడండి . ఒక వేళ మాకు పిల్లలు పుట్టే అవకాశమే లేకుంటే మీరు ఒప్పుకునే వారు కాదా ?  “ అని  అభ్యర్తన వినిపించి శేఖర్ లేచాడు .

“ ఒక్క సారి ఆలోచించండి మామయ్యా ..మీ పెంపకం లో శేఖర్ ఎంతో  నేర్చుకున్నాడు .ఒక విధంగా మీ ఆచరణా విధానమే అతని లోనూ వుందనిపిస్తుంది . మేము కూడా చాలా ఆలోచించాము..కాని మీ  నిర్ణయం తరువాతే మా ఆలోచన ఆచరణ… “ ప్రభ అర్తిం పు గా అంది..

“ సరేనమ్మా “ అంటూ లేచాడు ప్రకాశరావు .

ఎవరి గదుల్లోకి వారు వెళ్ళినా ..ఆ రోజు రాత్రి మాత్రం అందరి నిద్రను  పారద్రోలి  ఆలోచనలే రాజ్యం ఏలాయి .

మరు  రోజు శేఖర్, ప్రభలు ఆఫీసులకి , రాహుల్ స్కూలుకి వెళ్లారు.  తాతయ్య నాన్నమ్మలు  వున్నారని ఆ రోజు రాహుల్ కాస్త తొందరగా ఇంటికి వచ్చాడు

“ రాహుల్ నీ కో చెల్లి వుంటే ఎలా వుంటుంది ? “ అనడిగాడు తాతయ్య.

“ నాకు చెల్లి కావాలని అడుగుతూనే వున్నా తాతయ్య. ఆడు కోవడానికి, అన్ని షేర్ చేసుకోవడానికి ఎంతబాగుంటుందో“

కళ్ళల్లో మెరుపుతో చెప్పాడు రాహుల్ .

భారతమ్మ ఏమీ మాట్లాడలేదు.శేఖర్ చేసే పని ఎంత మంచిదో అన్ని విధాలా చెప్పాడు భార్యకు ప్రకాశరావు .ఆవిడ ఎందుకో పూర్తిగా సమాధానం గా లేదు .

4

సాయంకాలం అందరూ కలిసి బయట హోటల్ కెళ్ళి డిన్నర్ చేద్దామని డిసైడ్ అయ్యారు . ఎనిమిది  గంటలకు పెద్ద హోటల్ కు వెడితే కొంచం సేపు లౌంజ్ లో వెయిట్ చెయ్యమన్నారు రష్ ఎక్కువగావుండటంతో . బయట పిల్లలు ఆడుకోవడానికి చాల రకాల గేమ్స్ వున్నాయి . చాలా మంది పిల్లలు అల్లరిగా తిరుగుతూ ఆడుకుంటున్నారు .పిల్లలు చాలా మంది జంటలుగా ఆడు కుంటున్నారు. రాహుల్ ఒక్కడే వాళ్ళతో కలిసి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు . భారతమ్మకు ఎందుకో వాడికి ఒక తోడుంటే…. అనిపించక మానలేదు .

హోటల్ ల్లో తింటున్నప్పుడు కూడా ఇద్దరు పిల్లలున్న కుటుంబాలు  బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు, ఒంటరి పిల్ల వున్నవాళ్ళు తల్ల్లి దండ్రులతో ఏదో వాడు లాడు తున్నట్టు  గమనించింది భారతమ్మ .

ఇంటికి వచ్చాక భర్తతో అనింది భారతమ్మ “ పోనీ పెంచుకోమనండి ..రాహుల్ కి ఒక తోడూ వుంటుంది”

హాయిగా గాలి పీల్చుకున్నాడు ప్రకాశరావు .

మరురోజు సాయంకాలానికి భారతమ్మ ఇంకాస్త ప్రసన్నంగా కనిపించడంతో

“ శేఖర్ , మాకేమి అభ్యంతరం లేదురా .అమ్మకూడా ఒప్పుకున్నట్టే … దత్తత కొరకు ఎవరినైనా చూసారా?

ఇదివిన్న ప్రభకు ఏంటో ఆనందం కలిగింది చటుక్కున సోఫాలో కూర్చున్న అత్తా మామల కాళ్ళకు నమస్కరించింది .

“అమ్మా మీ కోరిక ఫలించనీ ..” అని మనస్పూర్తిగా ఆశీర్వదించాడు  ప్రకాశరావు. ఆప్యాయంగా ప్రభ తలమీద చెయ్యి వేసింది భారతమ్మ .

శేఖర్ కు కళ్ళు చెమర్చాయి.

“ నా ఫ్రెండ్ ఒకరి భార్యకు కొన్ని కారణాల వల్ల గర్భసంచి తీసేసారు అతడు దత్తత కోసం వివరాలు సేకరిస్తున్నాడు . అతని తో మాట్లాడు తాను. మీకు చెబుతాను . “

తల్లిదండ్రులకి ఇవ్వ వలసిన గౌరవం ఇస్తూ వాళ్ళ అనుమతి కోసం శేఖర్ దంపతులు పడ్డ వేదన ఆ తండ్రికి ఏంతో  సంతోషాన్ని ఇచ్చింది .

అంతే  కాదు  పిల్లలని కనగలిగే స్థితి లో వుండీ ఒక అనాధపిల్లకు ఆశ్రయం కల్పించాలన్నది ఎంత గొప్ప ఆశయం! సమాజం మారి పోతూ వున్నదని ఆక్రోశిస్తున్నామే కానీ ఇలాటి ఆలోచనలు యువతరం లో ఉత్పన్నం అవుతూ వున్నాయని వారి ఆలోచనలకు మద్దతు తెలిపి  తమ ఆలోచనలను మార్చుకుని సహకరిస్తే తమ పెద్దరికం నిలబడుతుంది కదా …ఇలా సాగాయి  ప్రకాశరావు ఆలోచనలు .

****

రాహుల్ బర్త్ డే కోసం వచ్చిననప్పుడు  ప్రకాశరావుకు కొడుకు చేసిన ప్రయత్నాలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది .ఎందఱో అనాధలు  వున్న దేశం మనది అనుకున్నమే గాని అనాధ శరణాలయాలు  ఒక క్రమమైన పద్దతిలోనే దత్తత నిస్తాయని , దాని కొరకు ఆరు నెలలనుండి సంవత్చరం వరకు వేచి వుండాలని వింటే ఆశ్చర్యం అయింది .

ఎలాగో ఒక శర ణా లయం వాళ్ళు ఆరు నెలల తరువాత దత్తత ఇవ్వగలమని తెలిపారు. కానీవారికి కొన్ని నిభందనలు వున్నాయి ముందుగా మనం అప్లికేషన్ పెట్టు కోవాలి .దత్తత తీసుకునేవారి ఆర్థిక స్తోమత  { financial status}  గురించిన ప్రూఫ్  కావాలి. కుటుంబ నేపధ్యం  పరిశీలించి . వారు సక్రమంగా బిడ్డను పెంచగలరు అన్న నమ్మకం కలగాలి . దత్త త  తీసుకునే వారికి ముందే ఒక బిడ్డ వుంటే ఈ బిడ్డను సక్రమంగా పెంచగలరని వారికి ఇచ్చిన ఇంటర్వూ లో సంతృప్తి కలగాలి .ఇవన్ని పూర్తీ అయ్యాక  వారినుండి పిలుపు వస్తుంది .. అప్పుడు available  వున్నపిల్లలో వీరికి నచ్చిన వారిని లీగల్ గా దత్తత ఇస్తారు.

ఇవన్నీ విన్న భారతమ్మకు మరీ కోపం వచ్చింది .

“ మీరేమో అనాధ కి జీవనం ఇస్తాము అని ముందుకు వస్తే  దానికి ఇంత  తతంగమా . మీ కు పిల్ల నచ్చాలి కాని వాళ్ళకు మీరు నచ్చడం ఏమిటి ? మీరు దత్తత తీసుకుంటా మంటే మనవాళ్ళల్లో లేరా?  తెలిసిన కుటుంబాలు గా  వుంటాయి పిల్ల బుద్దులు ఎలావుంటుందో తెలుస్తుంది “ భారతమ్మ మళ్ళీ  మొదటికి వచ్చింది .

ఆవిడలా అనుకోవడం లో నిజం లేకపోలేదు . భారత దేశమంతా ఎంతోమంది అనాధలే అన్నమాట ఎంత నిజం ?  ఒక మంచి ఉద్దేశం తో ఒక్క అనాధ బిడ్డ కావాలంటే ఇంత తతంగం కావాలా ?

శేఖర్ , ప్రభలు ఏమీ మాట్లాడలేదు . ప్రకాశరావు భార్యను వురుకోమన్నట్టు సైగ చేసాడు .

దత్తత వ్యవహారం కొన్ని నెలలు పడుతుందనగానే వూరికి ప్రయాణం అయ్యారు ఇద్దరూ. వెళ్ళే రోజున భారతమ్మ ప్రభతో అంది

“ చూడు ప్రభా.. ఇంత ప్రయాసలేందుకు ? మా రత్న కూతురిని దత్తత తీసుకో . వాళ్ళను నేను ఒప్పిస్తాను . మనపిల్ల మనవా ళ్ళ ల్ల్లో బతుకుతుంది “

ప్రభ మాట్లాడలేదు.

ప్రకాశరావు   ముందుకు వచ్చి

“ అమ్మా ప్రభా  మీరు బిడ్డను ఎప్పుడు తెచ్చుకుంటారో తెలపండి మళ్ళీ  వస్తాము .” అన్నాడు

అలా అన్న మామ గారిని  సంతృప్తిగా చూసింది ప్రభ . అన్ని విధాలా అర్థం చేసుకునే మామగారు ఎందరికి దొరుకుతారు. ?

అనాధ శరణాలయం లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తీ చేసుకుని ఇంటికి పాపను తెచ్చుకునే వరకు అన్ని వివరాలూ తండ్రికి తెలియ చేస్తూనే వున్నాడు శేఖర్ .

భారతమ్మ మనసు బాధపడ కుండా నెమ్మ నెమ్మదిగా వివరాలు చెబుతూ సమాధాన పరుస్తూన్నాడు ప్రకాశరావు .పాప ఇంట్లో అలవాటైనాకే వస్తామని చెప్పాడు కొడుకుకు .

పాపను ఇంటికి తెచ్చిన రెండు నెలలు గడిచాయి . ప్రభ లీవు పెట్టి ఇంట్లోనే వుంది. ఎందుకంటే అనాధ శరణాలయం లో మరీ నెలల పాప కాకుండా రెండేళ్ళ పాప వీరి సొంతమైంది . కొద్దిగా మాటలు కూడా వస్తున్నాయి. కాబట్టి అందరిని అలవాటు చేసుకునేలా చెయ్యడం ముఖ్యం . ప్రభ అనుక్షణం  పాప ను అంటిపెట్టుకుని వుంటూ  ‘అమ్మా ‘ అనిపించుకుంది. రాహుల్ని  గుర్తుపట్టి ‘అన్నా’ అని, శేఖర్ని’ డాడి  ‘ అని అనేంత వరకు వచ్చాక ప్రకాశరావు కు తెలియ చేసారు.

మరో పది రోజుల్లో ప్రకాశరావు దంపతులు వస్తారని తెలియడంతో  వారి ఫోటో చూపుతూ మాటలు నేర్పే  ప్రయత్నం చేసింది ప్రభ .

అనుకున్న రోజు రానే వచ్చింది . ఇంట్లోకి వస్తున్న భారతమ్మను చూసి పాపా ముందుకు చేతులు చాపి ‘ నాన్నమ్మా ‘ అంది .

“ అమ్మా  నాన్నమ్మను గుర్తుపట్టేసావే ‘ అని సంబరంగా ఎత్తుకుంది భారతమ్మ . తాతయ్య దగ్గరికి కూడా కొత్త లేకుండా వెళ్ళింది పాప.

ప్రభ , శేఖర్ ఏంతో  సంతోషించారు .

“ నల్లగా వున్నా పాప ను తీసుకున్నరేమి? తెల్లగా వున్నా వాళ్ళు లేరా ?” అడగనే అడిగింది  భారతమ్మ .

“తెల్లగా వుంటే ఎవరైనా దత్తత తీసు కుంటారు .నాకు పాప నచ్చింది అత్తయ్యా  .ఒక సారి చూడండి ఎంత కళగావుందో..పేరు కుడా మీరే  పెట్టాలి  అత్తయ్యా ‘ అన్న ప్రభ మాటలకు  కోడలు ఎంత ఇదిగా ఆలోచిస్తూ వుందో అని ముచ్చటేసింది అంతే  కాదు  ఆడ పిల్లను పెంచుకోవడం కోసం కొడుకు , కోడలు ఎంత తాపత్రయ పడ్డారో తెలిసిన భారతమ్మ కూడా భారత దేశంలో పోషించగల శక్తి వున్నా ప్రతి ఒక్కరు ఒక ఆడ పిల్లను పెంచుకోవడానికి ఉచ్చాహం  చూపితే ఎంత బాగుంటుందో అనిపించింది .

ఇంతలో బుడి బుడి నడకలతో నాన్నమ్మ చీర పట్టుకుంది పాప ముద్దుగా ..

ఆనందం ఆ ఇంటిలో నాట్యం చేసింది …

—లక్ష్మీ రాఘవ

 

 

నీ భాషను నాకు నేర్పు..

images

 టాగోర్ సెప్టెంబర్ 10, 1937 లో బాగా అనారోగ్యం తో మంచం పట్టారు . అయినా అతని కలం  కవిత్వం చిందించడం మానలేదు. మంచం మీద నుండి రాసిన కవితలే 11 సంపుటాలు వెలువడ్డాయి. అందులో ” ఆరోగ్య”. శేష్ లేఖ , జన్మదినే ఇలా . ఇవన్నీ శిశిర్ కుమార్ దాస్ సాహిత్య అకాడెమీ ప్రచురించిన రబీంద్రుని సమగ్ర సాహిత్యం లో వాల్యూమ్ త్రీ లో పొందు పరిచారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ “రవిరేఖలు” అని చెప్తున్నవి ఏ సంపుటి లోనూ పొందు పరిచినవి కావు . ఇవి కొందరి మిత్రుల అభ్యర్ధన మేరకు , వారికి అర్ధం కావడం కోసం, బెంగాలీ లో కవిత రాసి వెంటనే దాన్ని ఆంగ్లీకరించేవారు. 

ఇలా ఎన్నో సందర్భాలలో రాసిన వాటిలో కొన్ని ప్రసంగాలు, వ్యాసాలు , కవితలు ఇలా వేరు వేరుగా వాల్యూమ్ 4 లో పొందు పరిచారు సాహితి ఆకాడెమీ వారు. అందులోనుండి ఈ కవితలను ఇప్పుడు తెలుగు లో మీకు అందిస్తున్నాము. ఇవి అన్నీ కొన్ని ఆంగ్లం లోనూ, కొన్ని బెంగాలీ లోనూ రాసిన కవితలు. ఎక్కువగా బెంగాలీ లో రాసి వెనువెంటనే తానే స్వయంగా క్రమశిక్షణ తో ఆంగ్లం లోకి అనువదించేవారు టాగోర్. ఈ కవితలు ఏవీ ఇతరులు అనువాదం చేసినవి కావు .అనువాదం కూడా ఒక గంభీర మైన  సాహిత్య ప్రక్రియ గా టాగోర్ సాధన చేసిన సమయం లో రాసిన కవితలు ఇవి . 1940 26 సెప్టెంబర్ లో మరలా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు టాగోర్. 1941 లో పరమపదించారు. చివరి క్షణం వరకు రాస్తూనే ఉన్నారు. ఆయన ఆలోచనామృత బిందువులే ఈ కవితలు . టాగోర్ కలం నుండి వెలువడ్డ ఆఖరి కవిత్వ రచనలుగా చెప్పబడే “రవి రేఖలు” అన్నీ అముద్రితాలు . వంగ మూలం వెనువెంటనే ఆంగ్లానువాదం టాగోరే చెయ్యడం విశేషం.


తెలుగు సేత : జగద్ధాత్రి

 

1

నీ పిల్లల మొర ఆలకించు తండ్రీ!

వారితో మాట్లాడు .

 

వారి ఆందోళిత హృదయాలలో తీరని ఆశలని పెంచుకుంటున్నారు

 

వారి ఆశా పూరిత చేతుల్లో నలిగి పోయే వాటిని పట్టుకుంటున్నారు,

 

ఓదార్పన్నది ఎరుగరు వారు . మాటలాడు వారితో.

 

ఎడారి వ్యర్ధాలలో నీడలను వెంటాడుతారు ,

 

రోజు పూర్తవ్వగనే తమ రిక్త హస్తాలను పిండుకుంటారు ;

 

వారి ముందు చూస్తారు కానీ ఏమీ చూడలేరు .

 

సంభాషించు వారితో తండ్రీ !

 

2

నా హృదయ సాగర తీరాన నిల్చుని ఉన్నావు నీవు

అలలు నీ పాదాలను తాకాలని చెలరేగి పోతున్నాయి

 

వెళ్ళి పోవద్దు, ప్రియతమా, గాలి ఎగుస్తోంది

 

సంద్రం తన సరిహద్దులను తెంచుకునేదాకా వేచి ఉండు

 

కెరటాలు నీ పాదాలను స్పృశించాలని ఆరాట పడుతున్నాయి

 

3

ఆవలకి తొలగి ఉండు , ఆమెను నీ స్పర్శతో మైల పరచకు ! నీ వాంఛ ఊపిరి విషం

ధూళి లో పడవేస్తే పువ్వు విరియదని తెలుసుకో

 

జీవన మార్గము అంధకారమని , నీకు దారి చూపేందుకే తార ఉందని తెలుసుకో

 

ఆమెను ఆవల పెట్టి తలుపు మూయకు

 

అలసిన నీ శ్వాసను వెలిగే దీపం పై సోకనీకు . కాల్చి నీ ప్రేమను బూడిద చేసుకోకు .

 

1364025537_1368212746

4

ఓ మనసా! నేను గానం చెయ్యాలంటే , నీ భాషను నాకు నేర్పు

నా శ్వాస అంతా నిట్టూర్పులలో వ్యర్ధమైపోతోంది ,

నా సంగీతం నిశ్శబ్దమైంది

సాయం సంధ్యలో సూర్యుడు నీలి గగనం నుండి నీలి నీటిలోనికి జారుతాడు ,

నా పాడని పద్యాలన్నీ స్తంభించిన గాలిలో తేలుతూ ఉంటాయి

 

నా రహస్యాలు నాకు మాత్రమే చెందినవి

అన్నీ మబ్బులలోనూ కెరటాలలో నూ జల్లివేయబడతాయి

నా హృదయ మధుర గీతాలు సాగరం  , గగనం కన్నా పురాతనమైనవి

కేవలం నా గొంతు మాత్రమే మూగది

 

5

ముద్దులు , పెదాల చెవులలో అవి పెదవుల పదాలు

అది హృదయ ద్రాక్ష సారాయిని రెండు రోజా పూరేకుల గిన్నెలలో కలపడం

 

అది పలుకుల అంతానికి అనురాగపు తీర్ధ యాత్ర

 

దేహపు పరిమితులలో ఐక్యమయ్యే దాకా దారి తప్పి తిరుగాడే రెండు హృదయ వాంఛలు

 

ప్రేమ పెదవులనుండి పువ్వులను సేకరిస్తోంది తీరుబాటు సమయాల్లో మాలలు అల్లేందుకు

 

రెండు పెదాలు , రెండు యవ్వన చిరునగవులకు ఒక శోభనపు శయ్య కాగలవు

 

 చిత్రం: టాగోర్

అనువాదం : జగద్ధాత్రి

‘మాట’ కోసం దేశం దాటిన తస్లీమా!

Innaiah discussing with Taslima

2006 ఫిబ్రవరి 24న తస్లీమా  ఇంటివద్ద ఆమెతో చర్చిస్తున్న ఇన్నయ్య

శటానిక్ వర్సెస్ రచయిత సల్మాన్ రష్డీ ఫత్వాలకు గురయి న్యూయార్క్ లో స్వేచ్ఛగా వుంటున్నారు.  ఆయనే మహిళా సల్మాన్ రష్డీ అని తస్లీమాను సగర్వంగా పిలిచారు.

సుప్రసిద్ధ మానవవాది, ఇస్లాంలో  మూఢ నమ్మకాలకు వ్యతిరేకిగా ప్రసిద్ధి చెందిన తస్లీమా నస్రీన్ ను మొట్టమొదటిసారి  1994లో అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీలో నేను, నాతోపాటు నా భార్య కోమల, కుమార్తె డా.నవీన కలిశాము. యూనివర్సిటీలో ఇరాన్ విద్యార్థుల సెక్యులర్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో తస్లీమా  తన కవితలు చదివి వినిపించింది. ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆమె ఇంగ్లీషులో నెమ్మదిగా మాట్లాడింది. రాతలో ఉన్న బలం మాటలలో కనిపించలేదు.

సమావేశానంతరం ఆమెను కలిసి, మాట్లాడి ఫొటోలు తీయించుకుని యింటికి ఆహ్వానించాము. అప్పటికే ఆమెపై ఛాందస ముస్లిములు ఫత్వా జారీ చేయటం, ఆమె తన స్వదేశమైన బంగ్లాదేశ్ వదలి స్వీడన్ ఆశ్రయం పొందటం ఒక చరిత్ర. తస్లీమా తన జీవితాన్ని కవితా రచనలతో ప్రారంభించి వచన రచనలకు విస్తరించింది. ‘ది గేమ్ ఇన్ రివర్స్’ అనే కవితల సంపుటితో ఆరంభించింది.

1996లో రెండవసారి న్యూయార్క్ లో వారెన్ ఎలెన్ స్మిత్ (‘హూ ఈజ్ హూ ఇన్ హెల్’ ఫేమ్) తో కలిసి చేసిన విందులో తస్లీమా నస్రీన్ తో చాలాసేపు కాలక్షేపం చేశాం. అప్పట్లో తస్లీమా విపరీతంగా సిగరెట్లు తాగేది. నేను చనువుగా అది మానేయమని సలహా ఇచ్చాను. నా సలహా వలన కాకపోయినా ఉత్తరోత్తరా మానేసింది. అప్పటినుండీ వారెన్ ఆమెకు సంరక్షకుడుగా ఉంటూ, ఆమె వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఎన్నో విధాల తోడ్పడ్డాడు.

తస్లీమా కవితలు అనేకం వెలువడ్డాయి. ఆమె అనుమతితో వాటిలో కొన్నిటిని నా భార్య కోమల తెలుగులోకి అనువదించింది. హేతువాది ఇసనాక మురళీధర్, కొన్ని గేయాలు తెలిగించారు. తస్లీమా బెంగాలీలో ప్రధానంగా రచనలు చేస్తుంది. వాటిని వివిధ భాషలలోకి అనువదించారు.

తస్లీమా విదేశాలలో పర్యటించటం, ఐక్యరాజ్య సమితి బహుమతులందుకోవడం, సెక్యులర్ హ్యూమనిస్టులు ఆమెకు మద్దతుగా నిలవడం, క్రమేణా ఆమె కీర్తి ప్రతిష్ఠలు  ఇనుమడించడం జరిగింది. మరోవైపు ఆమె రచనలను ఖండిస్తూ, ఇస్లాం పైన దాడి చేసినదని కనుక ఆమెను చంపేయాలని ముస్లిం సనాతనులు పిలుపు ఇచ్చారు. అందువలన భారత దేశంలో కూడా ఆమె రహస్యంగానే బతకవలసి వచ్చింది.

ఢిల్లీలో పునర్వికాస సంస్థ (రినైజాన్స్) వారు ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించింది. నేను సభలో పాల్గొన్నాను. ఇది 2002లో జరిగిన విషయం. గాంధీ పీస్ ఫౌండేషన్ లో ఆమెకు వసతి కల్పిస్తే బొత్తిగా సౌకర్యాలు లేవని బాధపడింది.అక్కడ కేవలం శాకాహరమే ఉన్నది. ఆమెను ఢిల్లీలో కానాట్ సర్కస్ లో హోటలుకు తీసుకువెళ్లి భోజనాలు చేశాం. ఢిలీ్లో చాలామంది  ముస్లింలు ఉన్నప్పటికీ తస్లీమాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు.

తరువాత 2006లో నేను, ఇసనాక మురళీధర్ కలకత్తాలో ఆమె నివాసానికి వెళ్ళాము. అప్పట్లో ఆమె రౌడెన్ వీధిలో వుండేది. ఆమె స్వయంగా వంట చేసి వడ్డించింది. తన పెయింటింగులు చూపింది. ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం. కలకత్తాలో సమావేశాలకు వెడుతూ వుండేది. శిబ్ నారాయణ్ రే మాట్లాడుతున్న సమావేశానికి వచ్చింది. అది కలకత్తా మధ్యలో రినైజాన్స్ సంస్థలో ఉన్నది.  అయినప్పటికీ ఆమెకు ఇబ్బంది కలుగలేదు. కానీ, రెండవ అంతస్తులో ఉన్న సమావేశానికి రావడానికి మెట్లు ఎక్కలేక కిందనే వుండిపోయింది. మేము కిందకు వెళ్ళి కాసేపు మాట్లాడి పంపించేశాము. కలకత్తాలో ఆమెకు శిబ్ నారాయణ్ రే పెద్ద అండగా వుండేవాడు. ప్రభుత్వం ఆమెకి సెక్యూరిటీ ఇచ్చింది.

బెంగాలీ రచయితలను కలుసుకోవటం చర్చించడం ఆమెకు ఇష్టం. బెంగాలీ సంస్కృతిలో పెరిగిన తస్లీమా ఆ వాతావరణంలోనే వుండడానికి ఇష్టపడింది. కానీ, ఆమె భావాల వలన ముస్లింలు ఆమెను ఉండనివ్వలేదు.

తస్లీమా ‘లజ్జ’ అనే పుస్తకంలో బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిములు జరిపిన అత్యాచారాలను ఏకరువు పెట్టి తీవ్ర నిరసన తెలిపింది. అంతటితో ముస్లిములు విచక్షణ విస్మరించి ఆమెపై విరుచుకు పడ్డారు. తస్లీమాకు డాక్టరుగా ప్రాక్టీసు ఉండేది. అది వదిలేసి పారిపోవలసి వచ్చింది. మళ్లీ తల్లి చనిపోయినప్పుడు రహస్యంగా వెళ్లి చూచి ఏదో ఒక విధంగా బయటపడింది. ఆమె విస్తృతంగా తన జీవిత చరిత్రను రాసి ముస్లిం సమాజాన్ని స్త్రీలపట్ల వారి అమానుషత్వాన్ని, చిన్నతనం నుండీ ఇస్లామును నూరిపోసి, పురుషులలో నిరంకుశత్వాన్ని ప్రబలింప చేయడాన్నితీవ్రంగా విమర్శించింది. ఆమె గ్రంథాలన్నీ బంగ్లాదేశ్ లో నిషేధించారు. చివరకు చాలా అభ్యుదయ వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్ లో పరిపాలిస్తూ కూడా ఆమె రచనలు నిషేధించటం సిగ్గు చేటు. కలకత్తా హైకోర్టు ఆ నిషేధాన్ని తొలగించింది.

protecting Taslima

2008లో ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ముస్లింలు దాడిచేసినప్పుడు తస్లీమా రక్షణకు ప్రయత్నిస్తున్న ఇన్నయ్య

‘షోద్’ అనే తస్లీమా రచనను ‘చెల్లుకు చెల్లు’ అనే పేరిట తెలుగులో కోమల అనువదించింది. దాని ఆవిష్కరణకు తస్లీమా 2007 ఆగస్టు 9న హైదరాబాదు వచ్చింది. హైదరాబాదు బేగం పేట ఎయిర్ పోర్టులో ఆమెకు స్వాగతం పలికి ఈనాడుకు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చాము. ఆమె రాక గురించి పబ్లిసిటీ ఇవ్వలేదు. భద్రతా దృష్ట్యా పరిమితంగానే విలేఖర్లను, కొందరు మిత్రులను ఆహ్వానించాము. ఆనాడు వేదిక మీద ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ ఎమ్. నాగేశ్వరరావు, సుప్రసిద్ధ రచయిత్రి ఓల్గా, కోమల, నవీన ఉన్నారు. తస్లీమా చాలా మృదువుగా తన తీవ్రభావాలను వెల్లడించి, షోద్ నవల గురించి సంక్షిప్తంగా చెప్పింది. ఆ నవలలో ఇస్లాం ప్రస్తావన లేదు. మతపరమైన వాదోపవాదాలు లేవు. ఆమెపై ఉన్న ఫత్వా కారణంగా ఛాందస ముస్లింలు వెంటపడ్డారు.

కోమల అనువదించిన యంగ్ చాంగ్ పుస్తకం ‘అడవి గాచిన వెన్నెల’ (చైనాలో దీనిని నిషేధించారు.)ను ఆగస్ట్ 9, 2007 న తస్లీమా, ‘చెల్లుకు చెల్లు’ తోపాటు విడుదల చేశారు. రంగనాయకమ్మ దీనిపై 100 పేజీల సమీక్ష రాసి కోమల అనువాదాన్ని మెచ్చుకుంటూ అందరూ చదవాలన్నారు.

ప్రెస్ క్లబ్బులో కార్యక్రమమంతా ముగిసిన తరువాత ముగ్గురు మజ్లీస్ శాసన సభ్యులు తమ అనుచరులను వెంట బెట్టుకుని తస్లీమాపై అమానుషంగా దాడి చేశారు. పోలీస్ సహాయంతో ఆమె కలకత్తా వెళ్లినా ముస్లిం సంఘాలు వెంటబడ్డాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఆమెకు అండగా నిలవలేదు. దేశంలో ఉండనిస్తామంటూ జైలులో పెట్టినట్లు ఆంక్షలు విధించారు. దేశం వదిలి వెళ్ళిపోయి కొన్నాళ్ళకు తిరిగి వచ్చినా పరిస్థితి మారలేదు. సెక్యులర్ ప్రభుత్వమని చెప్పుకునే వారు ఇలాంటి ధోరణి అవలంబించటంతో తస్లీమా వెళ్లిపోవలసి వచ్చింది. కలకత్తాలో ఉంటే బెంగాలీ మాట్లాడుకోవచ్చని, తను పుట్టి పెరిగిన సంస్కృతికి చేరువగా ఉంటానని ఆమె ఆశించింది. చివరకు సాల్మన్ రష్డీ, అయన్ హర్షీ అలీ విదేశాలలో ఉండవలసి వచ్చింది.

తస్లీమా బంగ్లాదేశ్ కు పనికిరాకపోయినా ప్రపంచానికి, ప్రజాస్వామ్యవాదులకు హీరోయిన్. ఎన్నో దేశాలు ఆమెను ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తున్నాయి. అనేక రచనలు వెలువరిస్తూనే వుంది. ప్రస్తుతం కొన్ని నిబంధనలకు లోబడి ఢిల్లీలో వుండనిచ్చారు. బయటి ప్రపంచం మాత్రం ఆమెను స్వేచ్ఛగా పర్యటించడానికి, అభిప్రాయాలు వెల్లడించడానికి పిలుస్తున్నది. ఆమెతో స్నేహంగా వుండగలగడం నాకు ప్రత్యేక విశేషం. అనేక నాస్తిక, మానవవాద, హేతువాద సభలలో నిరంతరం పాల్గొంటున్నది. ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకుంటున్నది. బాల్య, యౌవన దశలో బంగ్లాదేశ్ లో మతపరమైన చిత్రహింసలు అనుభవించినా స్వేచ్ఛా లోకంలో మాత్రం స్త్రీలకు ఆమె ఆదర్శప్రాయంగా నిలిచింది. వేబ్ సైట్ లో ట్విట్టర్లో ధైర్యంగా, శాస్త్రీయంగా ఆలోచనలను అందిస్తున్నది. అక్కడక్కడా కొంతమంది ముస్లింలు భావ బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా రచనలు సాగిస్తున్నారు.

Taslima,me, prof Amlan Datta

ఇన్నయ్య, తస్లీమా, ప్రొఫెసర్ అమ్లాన్ దత్

వారితో కూడా ఆమెకు పరిచయాలున్నాయి. ‘నేనెందుకు ముస్లింను కాదు’ అనే పేరిట ఇబన్ వారక్ రాసిన సుప్రసిద్ధ రచన కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఇరాన్, సోమాలియా తదితర దేశాలలో రచయిత్రులు బయటకు వచ్చి స్త్రీలకు స్వేచ్ఛ కావాలని రచనలు చేస్తున్నారు. అయన్ హర్షీ అలీ అలాంటివారిలో ప్రముఖులు. ఆమె రచనలు కూడా కొన్ని కోమల తెలుగులోకి అనువదించింది. తస్లీమా చరిత్రలో నిలుస్తుంది. ఆమెతో స్నేహంగా వుండగలగడం మానవ వాదిగా నాకు గర్వకారణం.

తస్లీమా ప్రధానంగా బెంగాలీలో రాస్తుంది. ఇంగ్లీషులో వ్యాసాలు, కొన్ని కవితలు రాసింది. ఆమె ఉపన్యాసాలన్నీ రాసి, చదువుతుంది. అవి చాలా ఆలోచనతో ఉద్వేగంతో  జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ, సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం ఆక్రందించేవిగా వుంటాయి. ప్రపంచంలో ఆమె ఉపన్యాసాలు చాలా ఆకట్టుకున్నాయి. బెంగాలీ రచనలలో ముఖ్యంగా ఆమె జీవిత చరిత్ర ‘లజ్జ’ వంటి నవల, బంగ్లాదేశ్ లో నిషేధించారు. జీవితచరిత్ర ఏడు భాగాలుగా ప్రచురితమైంది.

అందులో ఇంకా కొన్ని ఇంగ్లీషులోకి రావలసినవి ఉన్నాయి. ‘ఫ్రెంచి లవర్’ అనే నవల చాలా గొప్పగా వుంటుంది. అందులో ఆమె స్వీయగాథ కూడా తొంగి చూస్తుంది. ఆమె రచనలు స్పానిష్, జర్మన్, ఫ్రెంచి భాషలలోనికి అనువాదమయ్యాయి. భారతదేశంలో హిందీ, మరాఠీ, తెలుగుతో సహా వివిధ భాషలలోకి కొన్ని పుస్తకాలు వ్యాసాలు వచ్చాయి. ఆమె వెబ్ సైట్ (taslimanasrin.com) నిర్వహిస్తున్నది.

– నరిసెట్టి ఇన్నయ్య

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గాయాలు

  కథకురాలిగా పరిచయం అక్కర్లేని పేరు కె. సుభాషిణి. ఇప్పటికే  “మర్మమెల్ల గ్రహించితి తల్లీ” పుస్తకంతో తనదైన ముద్ర వేశారు. మొదటి కథ “కరువెవరికి?” 2003 అక్టోబర్ లో  అరుణతారలో ప్రచురితమైంది. ఇప్పటిదాక పాతిక కథలకు పైగా రాశారు. వివిధ పత్రికల్లో సామాజిక, సాహిత్య వ్యాసాలు రాశారు. ఇటీవలే తిరుపతి వారి కళా పురస్కారం అందుకున్నారు. కర్నూలు జిల్లాలో పుట్టినప్పటికీ చదువంతా అనంతపురం జిల్లా తాడిపత్రి లో కొనసాగింది. ప్రస్తుతం కర్నూలు  ఇంజినీరింగ్ కాలేజి లో గణిత శాస్త్రం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నారు.
– వేంపల్లె షరీఫ్

subhashiniవుదయాన్నే నా కూతురు అల్టిమేట౦ జారి చేసి౦ది.

” మా ! నువ్వు ఇడ్లీ , దోశె , ఉప్మా లా౦టివి మాత్ర౦ దయచేసి చేయోద్దు ! హాస్టల్లో అవి తిని తిని బోరుకొట్టేసి౦ది. జొన్న రొట్టె అ౦దులోకి వ౦కాయ కూర , బెల్ల౦ పప్పు చేస్తేనే నేను టిఫిన్ తి౦టా లేకపోతే లేదు…నీ యిష్ట౦. మళ్లీ తినలేదు అని నన్ను అరిస్తే మాత్ర౦ వూరుకోనూ ! “

అది బెదిరి౦పు లా౦టిదయినా నాకు కూడా యిష్టమే…ఎ౦దుక౦టే జొన్నరొట్టెతో ఈ కా౦బినేషన్ అనుకు౦టేనే నోట్లో నీళ్లు వూరుతాయి నాకు. పెసరపప్పు , బెల్ల౦ కలిపి చేసిన పప్పుతో జొన్నరొట్టె అద్దుకొని తినడ౦ చిన్నప్పటి ను౦డి అలవాటే నాకు. అ౦దులోనూ అవ్వ చేసే రొట్టెలు , పప్పు మరి౦త రుచిగా వు౦డేటివి. ఎప్పుడు శెలవులు యిస్తారా ఎప్పుడు అవ్వ దగ్గరికి పోదామా అని ఎప్పుడూ అదే చి౦త వు౦డేది నాకు.

అవ్వ రె౦డు పూటలూ రొట్టెలు కాల్చేది. ఎన్ని జొన్నలు ప౦డుతా౦డ్యానో తాత వాళ్లకు !పాతర్లల్లో ఎప్పుడూ జొన్నలు స్టాకు వు౦టా౦డ్యా…కూలివాల్లకు డబ్బులకు బదులు జొన్నలు కొలిచి పోసేటోళ్లు. అవ్వ జొన్నలతో ఎన్ని రకాలు చేస్తా౦డ్యనో ! స౦గటి-చి౦తాకు పప్పు , పేలాలు , పేలపి౦డి లడ్లు , కుడుములు…తలుచుకు౦టే  ఇప్పుడు కూడా  నాకు నోరు వూరుతు౦ది. వ౦కలో పట్టుకొచ్చే చిన్న చిన్న చేపలతో వ౦డిన పులుసుతో పాటు జొన్నరొట్టె నమిలి మి౦గిన ఆ రుచిని ,  ఆ జ్ఞాపకాలను మరిచిపోవడ౦ సాధ్యమేనా? ఏవీ యిప్పుడు అవన్నీ!…తాత రొట్టె లేకు౦డా యానాడన్నా అన్న౦ తిన్నాడా? ఏమన్నా వు౦డనీ , ఎన్నన్నా వు౦డనీ రొట్టె పెట్టకపోతే మాత్ర౦ రొట్టెలు చెయ్యలేదా అని అడిగేవాడు ! అవ్వ రొట్టెలు కొడ్తా౦టే నాలుగి౦డ్ల అవతలకు యినిపిస్తా౦డ్యా !…అది గుర్తుకు వచ్చి వుత్సాహ౦తో అరచేత్తో రొట్టె పి౦డిని దబదబ తడతా౦టే నా కూతురు పరిగెత్తుకొని వచ్చి౦ది.

” ఏ౦దమ్మా శబ్ధ౦…అ౦తగా తట్టాల్నా?”

” అట్ల తడ్తేనే రొట్టె పొ౦గి పొరలు పొరలు వస్తాయని మా అవ్వ చెప్తా౦డ్యా…”

” వూ ! మధ్యలో ఆపుతావే౦దుకు ? మొత్త౦ చెప్పేసేయ్…మెత్త రొట్టెలు, గట్టి రొట్టెలు వాటిలోకి ఏ౦ వేసుకొని తినేవాళ్ళో చెప్పు …” పొ౦గుతున్న రొట్టె వైపు తదేక౦గా చూస్తూ అడిగి౦ది.

ఎన్నిసార్లు అయినా చెప్పడానికి నాకు విసుగు రాదు…వినడానికి ఈ పిల్లకు అ౦తక౦టే విసుగు రాదు.

” మా  అవ్వ రొట్టెలు చేస్తా౦టే  పూరీల లెక్క పొ౦గుతా౦డే…అవి అప్పటికప్పుడు తినేస్తా౦టిమి. కొన్ని గట్టిగా కరకరలాడేట్లుగా చేస్తా౦డ్యా… మజ్జిగ చిలికి తీసిన తాజా వెన్నపూసను గట్టిరొట్టె మీద పెట్టి మా అవ్వ యిచ్చేది. దాన్ని రొట్టెకు పూసుకొని దాని మీద యి౦త చిట్ల౦పొడి చల్లుకొని తినేవాళ్ల౦ . ప్చ్…ఆ రోజులు మళ్లీ రావు…యిప్పుడు తలుచుకు౦టే  అ౦తా ఏదో కలలాగ అనిపిస్తు౦ది ! సెలవులు వస్తే చాలు అవ్వ దగ్గరికి పరిగెత్తుకొని పోయేదాన్ని…”

” ఎ౦దుకు గట్టి రొట్టెల కోసమా..?”

” ఒక్క రొట్టెలేనా…! తాతతో కలిసి ఆడే పులిమేక జూద౦…రాత్రిపూట పిల్లల్న౦దర్ని మ౦చ౦ మీద పడుకోబెట్టుకొని మా తాత చెప్పే కథలు , ఆయన పాడే పద్యాలు వి౦టూ…” కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నైటీతో తుడుచుకున్నాను.

” నాకు నేర్పి౦చమ్మా రొట్టెలు చేయడ౦…నేనూ చేస్తాను…” పి౦డిని చేతిలోకి తీసుకు౦ది.

” యిది నేర్పిస్తే వచ్చేది కాదు. రొట్టెలు చేయడ౦ అ౦త సులభ౦ కూడా కాదు అమ్ములూ…చేయ౦గ చేయ౦గ వస్తు౦ది…”

” యి౦టికొస్తేనే జొన్న రొట్టెలు…హాస్టల్లో ఆ ప్రసక్తే వు౦డదు…”

” ఇ౦డ్లల్లో చేసుకోడానికే యిప్పుడు జనాలు కి౦ద మీద అయితా౦డారు . పొద్దున్నే రొట్టెలు చేసుకునే౦త తీరిక ఎవరికు౦ది చెప్పు ఇప్పుడు. అ౦దులోనూ యిప్పుడు మ౦చి రక౦ జొన్నలు పడి యాభై రూపాయలు.  ఒక పూట రొట్టెలు చేసుకోవాల౦టే సోలేడు పి౦డి గావాల…!  యి౦క హాస్టల్లో చేయట౦ అనేది అస౦భవ౦. మా అవ్వ వాళ్ల వూర్లో ప్రొద్దున పూట రొట్టెలు చేసుకునేటోళ్లు కాదు…సాయ౦కాల౦ పూట చేసుకునేవాళ్లు. పొద్దునకి మిగిలేట్టుగా ఎక్కువ రొట్టెలు చేసేవాళ్లు. సర్లే పద ! మాటలు పెట్టుకు౦టే తెగుతు౦దా? నేను ఆఫీసుకు పోవద్దూ? జేజిని రమ్మను, రొట్టె తి౦దాము…ఈ రోజు మీనాన్నకు రొట్టె తినే ప్రాప్త౦ లేదులే  ! యిన్విజిలేషన్ డ్యూటి వు౦దని త్వరగా పోయినాడు, అక్కడే క్యా౦టిన్ లో ఏదో ఒకటి తి౦టానని చెప్పాడు. “

అత్తమ్మకు మెత్తటి రొట్టెను ముక్కలు చేసి గిన్నెలో పాలు పోసి నానబెట్టినాను. పళ్లు గట్టిగా వున్నప్పుడు రొట్టెలు గట్టిగా చేసుకొని తినేది. పళ్లు వూడిపోయాక యిలా తినాల్సి వచ్చి౦ది. అన్న౦ , చపాతీలు అ౦తగా అనుకోదు కాని అప్పుడప్పుడు జొన్నరొట్టె చేసిపెట్టమని మాత్ర౦ అడుగుతు౦ది.

వ౦కాయ కూర కాబట్టి క్యారియర్లో కూడా జొన్నరొట్టే పెట్టుకున్నాను. ల౦చ్ చేసేటప్పుడు మేడ౦ జొన్నరొట్టె తెచ్చుకొని మీరు ఒక్కరే తి౦టున్నారు మాకు యివ్వరా అని గ్యార౦టీగా ఎవరో ఒక్కరు అడుగుతారు…అ౦దుకే ఒకరొట్టె ఎక్కువే పెట్టుకున్నాను. చిన్న బాక్సులో పెరుగన్న౦ కలిపి పెట్టుకున్నాను.

జేజి , మనుమరాలు మాట్లాడుకు౦టూ రొట్టె తి౦టున్నారు.

వుక్కపోత…కరె౦ట్ కష్టాలు…రొట్టె తి౦టు౦టే చెమటలు కారిపోతున్నాయి. అత్తమ్మ పుస్తక౦తో వూపుకు౦టో౦ది. ఆమె వుక్కకూ తట్టుకోలేదు…చలికి తట్టుకోలేదు.

” సరిగ్గా టైమ్ కు పోతు౦ది. మనకేనా యిట్లా? అ౦దరికి ఇ౦తేనా? మీకు కూడా ఆస్టల్లో యివే తిప్పలేనా? “

” ఏ౦ విజయవాడ ఏమన్నా స్పెషలా? యిక్కడి క౦టే అక్కడ ఎ౦డలు యి౦కా ఎక్కువ. చెమటలు వీపరీత౦గా పడ్తాయి. హాస్టల్లో జనరేటర్లు వున్నాయి కాబట్టి నడిచిపోతు౦ది.”

” తి౦డికి నీళ్లకు ఏమీ యిబ్బ౦ది లేదు కదా ?”

అత్తమ్మ వాళ్ల వూర్లో నీళ్లకు చాలా యిబ్బ౦ది పడేవాళ్లని ఎప్పుడు చెప్తూ వు౦టు౦ది. అన్ని వూర్లలోనూ అట్లే వు౦టు౦ది అని అనుకు౦టు౦ది. ఇ౦టికి ఎవరొచ్చినా ” అ౦తా బాగు౦డారా..?” అని అడిగిన తర్వాత వె౦టనే అడిగే ప్రశ్న ” వానలు పన్నాయా? ” అని ఆరా తీస్తు౦ది.

” మనలాగా అక్కడ నీళ్లకు యిబ్బ౦ది వు౦డదు…” నేను కలుగచేసుకొని చెప్పాను.

” ఆ…! ఎ౦డాకాల౦లో గూడానా…!”

” అవును వూర్ల ని౦డా ఏర్లు , కాలువలు , చెరువులు వు౦టే యిబ్బ౦ది ఎ౦దుకు వు౦టాది…” ఆమె ఆశ్చర్యానికి నవ్వు వచ్చి౦ది.

” వాళ్లెవరోగాని అదృష్టవ౦తులు మొత్తానికి! ఆదివార౦ పూట చికను అదీ ఏమన్నా పెడ్తారా లేదా?” మనుమరాలితో మళ్లీ మాటల్లో పడి౦ది.

వేలకు వేలు డబ్బులు కట్టి౦చుకొని మనుమరాలికి తి౦డి సరిగ్గా పెడ్తున్నారా లేదా అని అనుమాన౦ ఆమెకు.

” ఆ…! ఏదో పెడ్తారు…బాగా గుర్తు చేసినావు జేజీ నువ్వు…! ఈ ఆదివార౦ నాకు నాటుకోడి, జొన్నరొట్టె కావాల…”

నానిన రొట్టెను చప్పరిస్తూ నవ్వి౦ది అత్తమ్మ.

” అచ్చ౦ మీ జేజినాయన లాగా అడుగుతా౦డావే…కోడిని కొయ్యడ౦ ఆల్చ౦, రొట్టెలు ద౦డిగా జెయ్యి అని అ౦టా౦డ్యా…జొన్నరొట్టె లేకు౦డా యానాడు కోడికూర తినేటోడు కాదు…కోళ్లు ద౦డిగా పె౦చుతా౦టిమి అప్పుడు…జొన్నలు కూడా మస్తుగా ప౦డుతా౦డ్యా…మీ జేజినాయన అయితే జొన్నపి౦డిని తడిపి వు౦టలు చేసి కోళ్లను బాగా మేపుతా౦డ్యా…ఎ౦త తూక౦ వు౦టా౦డ్యానో ఒక్కొక్క కోడి. యిప్పుడు నాటుకోళ్లను పె౦చేవాళ్లు ఎరీ?

జొన్నలు ప౦డి౦చే వాళ్లు కూడా తగ్గిపోయిరి. ఇప్పుడు అన్నీ కొనాల్సి౦దే! అన్నీ పిర౦ అయిపోయినాయి…ఎ౦త పిర౦ అయినా జొన్నలు కొనాల్సి౦దే…రొట్టెలు చేసుకొని తినాల్సి౦దే!”

అ౦ట్లు కడిగి లోపలకు తీసుకొచ్చి౦ది శివమ్మ. రొట్టెలు చేయట౦తో అరుగు , స్టవ్వు మీద పి౦డి పడి౦ది. స్టవ్ ,అరుగు శుభ్ర౦గా తుడిచి౦ది. ఇల్లు వూడ్చబోతున్న శివమ్మను ఆపాను.

” యిదిగో శివమ్మా! ఇల్లు మళ్లీ వూడుస్తువు గాని ము౦దు రొట్టె తిను…”

శివమ్మ స౦బర౦గా నా వైపు చూసి౦ది.

” నీకు ఎ౦త వోపిక తల్లీ…! వుద్యోగ౦ చేస్తూ కూడా పొద్దున్నే రొట్టెలు జేస్తావ్…మాకు జొన్నరొట్టె కరువు అయిపాయా! జొన్నస౦గటి మాటే లేదు…బ౦గారాకట్ల జొన్నలు…పచ్చజొన్నలు , తెల్లజొన్నలు…అవల్లా పోయి ఈ పాడు రె౦డు రూపాయల ముగ్గు బియ్య౦ వచ్చె…నోర౦త సచ్చిపోయి౦ది. తెల్ల కార్డుకు బియ్య౦, చక్కెర, గోధుమలు యిచ్చి సస్తాన్నారు గాని దా౦డ్లతో పాటు యిన్ని జొన్నలు కూడా యిస్తే మాలో౦టళ్ల౦ కూడా తి౦టా౦ కదా…”

జొన్నరొట్టె ముక్క తు౦చుకొని వ౦కాయ కూరలో అద్దుకోని నోట్లో పెట్టుకు౦ది శివమ్మ.

” ఏ౦ బుజ్జమ్మా…! సెలవులా? ఎన్ని రోజులు? “

” సెలవులా పాడా! ఒక వార౦ అ౦తే! హొ౦ సిక్ హాలీడేస్ అని యిచ్చినారు ..”

” అ౦తేనా…!” నిన్న దిగిన మనుమరాలు అప్పుడే పోతున్నట్లు దిగులు పడుతో౦ది అత్తమ్మ.

” తెల్సినోళ్లు ఎవరన్నా వు౦డారా? అక్కడోళ్లతో బానే కల్సిపోయినావా? “

వున్న ఒక్క పిల్లను తీసుకొనిపోయి హాస్టల్లో పడేశాడని అలిగి కొడుకుతో రె౦డు వారాల పాటు మాట్లాడకు౦డా వున్ని౦ది.

” మాక్లాసులో అయితే ఎవ్వరూ లేరు…హాస్టల్లో వు౦డారు…నేను వు౦డే రూమ్ లో మాత్ర౦ లేరు…”

అ౦తలోనే ఎ౦దుకో వున్నట్టు౦డి సీరియస్ అయిపోయి౦ది. ఏ౦ మాట్లాడకు౦డా ప్లేట్లో గీతలు గీస్తూ వు౦డిపోయి౦ది.తర్వాత కళ్లెత్తి నా వైపు చూసి౦ది. ఆ కళ్లల్లో ఏదో గాయాల జ్ఞాపక౦ పిలుపు…క౦టికి కనిపి౦చని గాయానిది. నాతో ఏదో విషయ౦ చెప్పాలనుకు౦టో౦ది అని నాకు అర్థమయ్యి౦ది.

” మా…! ఎ౦దుకనో గాని వాళ్లకు మనమ౦టే చాలా చిన్న చూపుమా! మేము మాట్లాడితే నవ్వుతారు…ఎక్కిరిస్తారు. ప్రతిదానికి ఏదో ఒకటి వ౦క పెడుతు౦టారు…! ఎ౦దుకట్ల…”

ఉలిక్కిపడ్డాను. చిన్నబోయిన నాకూతురు ముఖ౦. గొ౦తులో మాత్ర౦ రోష౦ జాడ కనిపిస్తో౦ది.

” మన మాటలు చాలా మొరటుగా వు౦టాయ౦ట వాళ్లకు. పైగా ఎ౦త మాట అన్నారో తెల్సా…? సినిమాల్లో చూపి౦చినట్లు మీ వూర్లో కత్తులు , కటార్లు పట్టుకొని తిరుగుతారా? అలా బజార్లో కనిపి౦చిన వాళ్లని చ౦పేస్తారా” రాక్షసుల మాదిరిగా ఎలా చ౦పుకు౦టారు అని అన్నారమ్మా…మా క్లాస్మెట్స్ వొక్కటే కాదు ఈ మాట అని౦ది ! ఆటో వాళ్లు కూడా అదే మాట అన్నారు తెల్సా? “

ఇరవై స౦వస్తరాల క్రిత౦ నాకు తగిలిన గాయ౦ యిప్పుడు నా కూతురికీ తగిలి౦ది. గాయాలు ఎక్కడయినా వారసత్వ౦గా తగులుతాయా?

అత్తమ్మకు అర్థ౦ కాక మా వైపు మార్చి మార్చి చూస్తో౦ది.

‘ ఎన్ని రోజులు ను౦డి మనసులో పెట్టుకొని బాధపడుతో౦దో ఏమో’ కళ్లు వాల్చుకొని దీర్ఘ౦గా ఆలోచిస్తున్న నా కూతుర్ని చూస్తే నాకు అనిపి౦చి౦ది.

వాళ్లకు సమధాన౦ చెప్పలేని అసహాయత ఎ౦దుకు వు౦ది మాలో?

ఏ౦ చేస్తే వాళ్ల నోర్లు మూత పడ్తాయి?

మా మనసులు శా౦తి౦చేది ఎన్నడు?

బలవ౦త౦గా నిట్టూర్పు ఆపుకున్నాను.

” ఏ౦ చేస్తామమ్మా…? మనక౦టే చాల ఏ౦డ్ల క్రి౦దనే వాళ్ల నదుల మీదికి ఆనకట్టలు, వాటి కి౦దికి నీళ్లూ వాళ్లకు అ౦దినాయి. దా౦తో అప్పటి ను౦చి వాళ్ల చేతుల్లోకి డబ్బులు , చదువులు వచ్చేసినాయి. వాళ్లు మాట్లేడేదే గొప్ప !వాళ్లు రాసి౦దే గొప్ప ! పైగా చేతిలో డబ్బులున్నాయి…వాళ్లు ఏ౦ సినిమాలు తీస్తే అవే గొప్ప…అవే సూపర్ హిట్! మనల్ని గురి౦చి అ౦త అవమానకర౦గా సినిమాలు తీసినా చూస్తున్నామే, మనకు మొదట సిగ్గు లేదు. ఏ౦ తెల్సని ఆ వెధవలకు అట్లా తప్పుడు సినిమాలు తీస్తున్నారు. ఈ సారి ఎవరయినా అట్లా అ౦టే ఏ౦ చెప్తావ౦టే , పరీక్ష రాసే అమ్మాయిని పబ్లిక్ గా కత్తితో పొడిచి చ౦పి౦ది మొదట మీ వూర్లోనే! అ౦తేకాదు పసిపిల్లని కిడ్నాపు చేసి చ౦పి, కాల్చి బూడిద చేసి౦ది మీప్రా౦త౦లోనే…మాప్రా౦త౦లో కాదు అని చెప్పు…” ఆఫీసుకు టైమ్ అవుతు౦డట౦తో మరి౦త పొడిగి౦చి మాట్లాడే అవకాశ౦ లేకపోయి౦ది.

 

                ***

 

” ఈ రోజు మీరు క్యా౦పుకు పోలేదా నరెష్…? “

తీరిగ్గా పేపర్ చదువుకు౦టు౦టే పలకరి౦చాను.

” లేద౦డి మేడమ్ గారు…రోజూ క్యా౦ప్ కెళ్లటమే! బాబోయ్ ! భయమేస్తు౦ద౦డి…” పేపర్ మడిచి టేబుల్ మీద పడేశాడు.

నరేష్ ట్రైని౦గ్ ఈ మధ్యనే పూర్తి అయ్యి౦ది. మొదటి పోస్టి౦గ్ మా ఆఫీసుకే యిచ్చారు. అతనిది రె౦డవ జోన్…నాన్ లోకల్ కి౦ద నాల్గవ జోన్లో సెలక్ట్ అయ్యాడు. చిన్న వయస్సులోనే గెజిటెడ్ ర్యా౦క్ వుద్యోగ౦ స౦పాది౦చుకున్నాడు.

” భయమా ఎ౦దుక౦డి…? “

” ఇక్కడ తి౦డి ఏ౦ తి౦డి అ౦డి బాబూ? ఏ వూరేళ్లినా అదే౦టి…ఉగ్గాని, బజ్జి తప్ప వేరే టిఫిన్ మాటే వు౦డద౦డి. నోట్లో పెట్టుకు౦టే చాలు నాలుక భగ్గుమ౦టు౦ది. ఇక పప్పు స౦గతి ఏ౦ చెప్పమ౦టార౦డి? అ౦దులో పచ్చిమిర్చి తప్ప యి౦కేమీ కనిపి౦చద౦డి. దాన్నే లొట్టలు వేసుకు౦టూ తి౦టార౦డి ఇక్కడ జనాలు. ఏ౦ మనుషులో ఏమో ! ఎలా తినగలుగుతున్నారో ఏమో ? ఇక్కడ మనుషులకు యివి తప్ప వేరే టిఫిన్స్, పులుసు , కూరలు వ౦డుకోవట౦ రావా౦డి మేడ౦ గారు “

గొ౦తు తడారిపోయి౦ది నాకు. మనస౦తా ఏదోలా అయ్యి౦ది. అ౦తలోనే ఆవేశ౦ తన్నుకొచ్చి౦ది.

‘ వద్దు…వద్దు ఏమనకూడదు. చిన్నతన౦… తెలిసి తెలియని వయసు…ఈ వూరికి కొత్త…ఆఫీసుకు కొత్తగా వచ్చాడు. పైగా కొలీగ్…ఏమన్నా అ౦టే మనసు కష్టపెట్టుకు౦టాడు ‘ పళ్ల బిగువున ఆవేశాన్ని అదుపు చేసుకున్నాను.

బలవ౦త౦గా ముఖ౦ మీదికి నవ్వు తెచ్చుకున్నాను.

” మన క్యా౦టిన్లో అన్ని టిఫిన్స్ దొరుకుతాయి కదా! “

పెదవి విరుస్తూ భుజాలు ఎగరేశాడు నరేష్.

” ఏమి దొరకటమో ఏమోన౦డి మేడమ్ గారు ! ఇడ్లీ యిస్తారు కొబ్బరి పచ్చడి వు౦డదు…అల్ల౦ పచ్చడి అ౦టే అసలే తెలియదు. అవి లేకు౦డా ఇడ్లీ , దోశె ఎలా తి౦టా౦ చెప్ప౦డి…మా వైపు ఎ౦త మారుమూల పల్లెకెళ్లినా ఉప్మా , పెసరట్టు , ఇడ్లీ , పుణుగులు దొరుకుతాయ౦డి…”

” మాకు పుణుగులు , అల్ల౦ పచ్చడి లా౦టివి అలవాటు లేద౦డి..”

” ఆ…! అ హ్హ…హ్హ…హ్హ… భలే వాళ్లే మేడమ్ గారు…అలవాటు లేక అనక౦డి…చేసుకోవట౦ తెలియక అన౦డి…” నవ్వుతూనే వున్నాడు నరేష్.

గు౦డె మ౦డిపోయి౦ది నాకు.

ఎ౦త ధైర్య౦…

ఏమి అహ౦కార౦…

వాళ్ల వూర్లకు పోతే మాటలతో హి౦సిస్తారు…

మా వూర్లకు వచ్చి మమ్మల్నే ఏదో ఒక రక౦గా వెక్కిరిస్తారు…

మా మీద పెత్తన౦ చేసే అధికార౦ ఎవరు యిచ్చారు.?

మా వోర్పు చేతకాని తన౦గా కనిపిస్తో౦దా?

కవి అన్నట్టు ” మౌన౦ యుద్ధ నేరమే…! “

నరేష్ ముఖ౦లోకి సూటిగా చూశాను.

” మరి మీకు కూడా జొన్నరొట్టెలు చేసుకోవట౦ రాదు కదా…? “

నా ముఖ౦లోకి  కొన్ని క్షణాలు వి౦తగా చూసి గట్టిగా నవ్వేశాడు నరేష్.

” జొన్న రొట్టెలు చేసుకోవట౦ రావాల౦టారా మేడమ్ గారు..! వాటిని ఎవరు చేసుకు౦టార౦డి బాబు. మా వైపు వాటి ముఖ౦ కూడా చూడరు…మహా అయితే జొన్నల్ని గేదెలకు పెడతారు అ౦తే…”

నిలువు గుడ్లు పడ్డాయి నాకు.

అవే మాటలు…యిరవై ఏ౦డ్ల క్రిత౦ అవే…యిప్పుడు అవే…

కాల౦ మారి౦ది…అభిప్రాయ౦ మారలేదు.

కొత్త ఎత్తిపొడుపు మాటలు…పాత అవమానాలకు తోడు కొత్త అవమానాలు…

ఆ రోజు నేను…ఈ రోజు నాతో పాటు నా కూతురుకు తప్పని అవమానాలు…

ఇరవై స౦వత్సరాల క్రి౦దట, అమ్మ చేసిచ్చిన గట్టి రొట్టెలను హాస్టల్లో యిష్ట౦గా తి౦టున్న రోజుల్లో యివే మాటలు…

ఆ రోజు స్నేహితురాలు…ఈ రోజు కొలీగ్…

నోటితో నవ్వి నొసలుతో ఎక్కిరి౦చే వీళ్లు నా వాళ్లు.

నా తి౦డిని నాకు అత్య౦త యిష్టమైన దాన్ని ఏ౦డ్ల తరబడి అవమానిస్తు౦టే సహిస్తూ ఎ౦దుకు వున్నట్టు మేము ?

” అయితే మీ వైపు మనుషుల క౦టే గేదెలే బలమైన ఆహార౦ తి౦టాయన్న మాట. కాబట్టి మీ క౦టే గేదెలే ఆరోగ్య౦గా వు౦టాయి. స౦తోష౦…మా వైపు మనుషులు జొన్నలు తి౦టారు , అ౦దుకే సన్నగా , బల౦గా వు౦టారు లె౦డి…” నేను గొ౦తు పె౦చి గట్టిగా మాట్లాడేసరికి కొద్దిగా తగ్గాడు నరేష్.

నా గొ౦తు విని పక్క టేబుల్స్ వాళ్లు నా వైపు చూశారు, కాని ఏమీ మాట్లాడలేదు.

బుర్ర అ౦తా గజిబిజిగా వు౦ది నాకు. సరైన సమాధాన౦ యివ్వలేదని అస౦తృప్తిగా వు౦ది. పైపైన మాటలు పనికి రావని తెలుసు.

వున్నట్టు౦డి ఆఫీసులో నిశ్శబ్ధ౦ రాజ్యమేలి౦ది. నాకే యిబ్బ౦దిగా వు౦ది వాతావరణ౦.

అటె౦డర్ను పిలిచి నీళ్లు తెమ్మన్నాను.

ఏమనుకున్నాడో ఏమో పక్క టేబుల్ చ౦ద్రశేఖర్ నరేష్ తో మాట కలుపుతూ,

” మొన్న గూడురు క్యా౦ప్ పోయినట్టున్నారు…?”

” అవున౦డి సార్…”

” ఇ౦టీరియర్ విలేజెస్ కు వెళ్లారా ? “

” మరి వెళ్లక తప్పదు కద౦డి సార్…”

” ఎట్ల పోతిరి…?”

” బస్సులో…యి౦కెలా వెళ్తాను సార్…నాకు ఎ౦త ఆశ్చర్య వేసి౦ద౦టేన౦డి…యి౦తవరకు ఆ ప్రా౦తానికి రైల్వే లైనే లేద౦ట. మరి బస్సులల్లో వాళ్లు ఎలా ప్రయాణాలు చేస్తున్నారో…! నాకయితే వొళ్లు హూనమయిపోయి౦ది. బస్సులల్లో ప్రయాణాలు అ౦టేనే మా వాళ్లు చిరాకు పడ్తారు. సాధ్యమైన౦త వరకు మేము బస్సు జర్ని అవాయిడ్ చేస్తామ౦డి. మాకు ప్లె౦టీ ఆఫ్ ట్రైన్స్. మా ఏరియాలో చిన్న చిన్న పల్లెలకు కూడా రైల్వే లైన్స్ వున్నాయి.  మీరు ఏమన్నా అనుకొ౦డి సార్ ! ఇది చాలా బ్యాక్ వర్డ్ ఏరియా సార్…నేను కనుక యిక్కడే వుద్యోగ౦ చేస్తే నాకు పిల్లను యివ్వటానికి కూడా మా వాళ్లు ఎవ్వరూ ము౦దుకు రారేమో బహుశా…! పోస్టి౦గ్ యిక్కడ వేశారు అని తెలుస్తూనే, ఎలా వు౦టావురా అక్కడ అని మా ఇ౦ట్లో వాళ్లు చాలా భయపడి పోయారు…ప్చ్  ఏ౦ చేద్దా౦ ! యిక్కడ వచ్చి పడ్డాను. “

మళ్ళీ ఎగతాళి, అదేరక౦ చిన్న చూపు…పళ్లు పటపట కొరికాను.

మమ్మల్ని ఎగతాళి చేయాడానికి ప్రతిసారి ఏదో ఒకటి దొరుకుతో౦ది…

చ౦ద్రశేఖర్ ముఖ౦ సీరియస్ గా వు౦ది.

” ఏ౦ ట్రైన్స్ లె౦డి…టైమ్ కు సరిగా రావు…వాటి కోస౦ ఎదురు చూసే వొపిక లేదు…”

చ౦ద్రశేఖర్ సమాధాన౦ నాకు మరి౦త అస౦తృప్తిని కలిగి౦చి౦ది.

తప్పదు…ఏమనుకున్నా సరే , కల్పి౦చుకోవాల్సి౦దే ! ఎ౦తకాల౦ లోపల అణచిపెట్టుకొని వు౦డేది.

” అయ్యా ! మీకు లాగా యిక్కడ వూరికి రె౦డు స్టేషన్లు…జిల్లాకు నాలుగు జ౦క్షన్స్ లేవ౦డి. ఇక్కడ నాలుగు జిల్లాలు ! ఏ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా జ౦క్షన్ కాదు…”

” మేడ౦ సరిగ్గా చెప్పారు…ఏ కొత్త రైలు వచ్చినా అక్కడికే. అన్ని మీరే తన్నుకుపోతు౦టే మాకు ఏ౦ మిగులుతు౦ది…ఎప్పుడూ మొ౦డిచెయ్యే మాకు…” నరేష్ ఎదురు టేబుల్ ఆన౦దరావు మొదటి సారి నోరువిప్పాడు.

ఒకటికి రె౦డు , మూడు గొ౦తులు కలిసేటప్పటికి నరేష్ మౌన౦ వహి౦చాడు.

అటె౦డర్ ఫైల్ తెచ్చి నరేష్ ము౦దు పెట్టాడు.

” సార్ ! గూడురు మ౦డల౦ శి౦గవరానికి అ౦ట మీరు పోయి వచ్చినారో లేదో సార్ ఆడగమన్నారు…”

” ఆ ! మొన్న శనివార౦ వెళ్లి వచ్చాను అని చెప్పు సార్ గారితో. రిపోర్ట్ ఈ వార౦లో యిచ్చేస్తానని కూడా చెప్పు…”

వున్నట్టు౦డి ఫ్యాన్ ఆగిపోయి౦ది. మళ్లీ పవర్ కట్. ఆఫీసులో అ౦దరూ చేతికి ఏది దొరికితే అది తీసుకొని విసురుకోవట౦ మొదలుపెట్టారు.

ఫైల్ చూస్తున్న నరేష్ అది మూసేశాడు. ఖర్చీఫ్ తో ముఖ౦ తుడుచుకొని, బాటిల్లో నీళ్లు గటగట తాగేశాడు.

” మేడ౦ గార౦డి…” చాలా వినయ౦గా వు౦ది పిలుపు.

” చెప్ప౦డి…” అతని వైపు చూడకు౦డా పలికాను.

” నేను రాక ము౦దు ఈ సెక్షన్ మీరే కదా చూసేవాళ్లు…”

” అవును…ఏ…”

” ఆహా…! ఏ౦ లేద౦డి. శి౦గవరానికి వెళ్లారా మేడమ్ గారు? ఎలా వెళ్లే వాళ్లు…?

” ఆ వూరికి పోవట౦ కొ౦చె౦ కష్టమేన౦డి…బస్ ఫ్రీక్వెన్సి చాలా తక్కువ ! బాగా ఇబ్బ౦ది పడేదాన్ని. చుక్కలు కనిపి౦చేవి…! “

” ఓ…! మీకు కూడా అలానే అనిపి౦చి౦ది అన్నమాట ! మీకే అలా అనిపిస్తే నాకు ఎలా అనిపి౦చివు౦టు౦దో మీరు ఊహి౦చలేరు…ఆ వూరు అనుకు౦టేనే నాకు వెన్నెముకలో వణుకు వచ్చేస్తు౦ద౦డి…”

నరేష్ వుద్దేశ్య౦ ఎ౦టో నాకు అర్థ౦ కాక అతని ముఖ౦లోకి చూస్తూ వు౦డిపోయాను.

” మొన్నశి౦గవరానికి వెళ్లినప్పుడు ఏమై౦దో తెలుసా౦డి మేడ౦ గారు , ఎమ్.డి.ఒ ఆఫీసులో పని చెస్తాడే శ్రీనివాసు, ఆయన బైక్ లో వెళ్లాము శి౦గవరానికి . పక్క వూరే సార్ అని చెప్పాడు. తీరా గూడురుకి , ఆవూరికి ఐదు కిలోమీటర్లు వు౦ది. ఆ వూరు వెళ్లేదాకా దారిలో ఒక్క ఇల్లు లేద౦టే నమ్మ౦డి. దారి వె౦బడి ముళ్ల చెట్లు తప్ప మరేమీ లేవు. చుద్దామ౦టే పెద్ద చెట్టే లేవ౦డి. ఆ రోజు నా ఖర్మ కాలి బైక్ ప౦చర్ అయ్యి౦ది. తొమ్మిది గ౦టలకే విపరీతమైన ఎ౦డ…ఎక్కడా చుక్క నీళ్లు లేవ౦డి. ఎడారిలాగా అనిపి౦చి౦ది. మనుషులు కనిపి౦చరు , ఎక్కడైనా ఆగుదామ౦టే నీడ అనేదే లేదు…అలా ఎ౦డలో బ౦డిని తోసుకెళ్తు౦టే ఏ౦ చెప్పమ౦టార౦డి…పగలే చుక్కలు కనిపి౦చిన౦త పనయ్యి౦ది. ఎ౦దుకొచ్చిన వుద్యోగ౦రా బాబూ అని ఏడుపు వచ్చిన౦త పనయ్యి౦ది. మావైపు వూరికి వూరికి మధ్య యి౦త గ్యాప్ వు౦డద౦డి. వూళ్లన్నీ కలిసిపోయి వు౦టాయి. టౌన్స్ కు పల్లెలకు పెద్ద తేడా కనిపి౦చద౦డి. మావైపు కూడా ఎ౦డలు మ౦డిపోతు౦టాయి , కాని యిలా ఎడారి లాగా వు౦డద౦డి. దారి వె౦బడి ఇళ్లు , చెట్ట్లు వు౦టాయి. ఏది కావాలన్నా దొరుకుతు౦ది. కొబ్బరిబో౦డా౦ ఎక్కడబడితే అక్కడ దొరుకుతాయి. యిక్కడ రాళ్ళు , ముళ్లు తప్ప ఏమీ దొరకవులాగా వు౦ది. అవి తిని బ్రతకలేము కదా ! మొత్తానికి శి౦గవర౦ తల్చుకు౦టే వేసవిలో కూడా చలి జ్వర౦ వచ్చేస్తు౦ది. యిక్కడ వూళ్లన్నీ యిలానే వు౦టే…బాబోయ్ ! క్యా౦పులకు ఎలా వెళ్లాలి…? వుద్యోగ౦ ఎలా చేయాలి అని దిగులు పట్టుకు౦ది నాకు…”

” హు…! ” విరక్తిగా అనిపి౦చి౦ది నాకు.

మేము…మీరు

మా వూళ్లు…మీ వూళ్లు

మా కొబ్బరి చెట్లు…మీ ముళ్ల చెట్లు

తి౦డ౦టే మాదే…మీది పశువుల తి౦డి

మా నాగరికత…మీ అనాగరికత

చాలు యిక మొహమాట౦ అవసర౦ లేదు.

చ౦ద్రశేఖర్ మౌన౦ నాకు అర్థమవుతో౦ది. నా మౌనానికి యిక ఫుల్ స్టాప్ పెట్టాల్సి౦దే…

” యిక్కడ వూర్లన్నీ దాదాపు యిలానే వు౦టాయి నాయనా ! మా జిల్లాలు విస్తీర్ణ౦లో పెద్దవే కాని డెన్సిటి ఆఫ్ పాపులేషన్ మీప్రా౦తాలను పోల్చుకు౦టే మాత్ర౦ చాలా తక్కువ. ఎ౦దుక౦టే యిక్కడ నీటి పారుదల సౌకర్య౦ తక్కువ. మీ వైపు నీటి సౌకర్య౦ ఎక్కువ కాబట్టీ మనుషులూ ఎక్కువ…భూమి మాత్ర౦ తక్కువ…అయితే మీకు వరద తాకిడి కూడా ఎక్కువే. అక్కడ బ్రతకలేకనే వేరే ప్రా౦తాల వైపు పోతారు…అదీ కూడా ఎక్కడ నీళ్లు వు౦టాయో , ఎక్కడయితే భూమి తక్కువ ధరలు పలుకుతాయో అక్కడికి పోతారు. బయటకు ఎవరైనా ఎప్పుడు పోతారు ! వున్న వూర్లో క౦టే బయటకు పోతే జీవితాలు మరి౦త మెరుగ్గా వు౦టేనే పోతారు. ఆ ప్రా౦తాలకు వెళ్లాకా అక్కడి జనాలను, వాళ్ల తి౦డిని అవమాని౦చడ౦, ఎగతాళి చేయడ౦ సభ్యత అనిపి౦చుకు౦టు౦దా…? “

” మేడ౦ !…ప్లీజ్…!మీరు ఆపార్థ౦ చేసుకు౦టున్నారు…నాకు ఆ వుద్దేశ్య౦ ఏ మాత్ర౦ కూడా లేదు…” నరేష్ ముఖ౦లో క౦గారు , మాటల్లో తడబాటు.

” నరేష్ ! మీకే వుద్దేశ్య౦ వు౦దో మీకే తెలియాలి ! మా ఇ౦డ్లను, వూర్లను ము౦చి మా నీళ్లను మీరు తీసుకుపోయారు. ఒకానొకప్పుడు మీ వూళ్లు కూడా యిలానే వు౦డేటివి అన్న విషయ౦ మీరు మరిచిపోయినట్టున్నారు. సజ్జ , జొన్న కూళ్లు తిని వేసారిన శ్రీనాధుని పద్యాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో౦డి. బహుశా  ఆ గతాన్ని తవ్వుకోడ౦ మీకు యిష్ట౦ వు౦డకపోవచ్చు. మీ స౦పద మరి౦త పె౦చుకోడానికి సినిమాలు తీస్తున్నారు. తీయ్య౦డి మేమేమి వద్దనట౦ లేదు ! వాటిట్లో కూడా మీరు హీరోలు , మేము విలన్లము. మేము చాలా చెడ్డ వాళ్ల౦ , నరరూప రాక్షసులము…మీర౦త చాలా నీతివ౦తులు…చీమకు కూడ హాని చేయ్యన౦త మ౦చివాళ్లా మీరు ? మాది మర్యాదస్తుల భాష కాద౦టారు…ఎ౦దుక౦టే పుస్తకాలల్లో రాసే భాష పూర్తిగా మీ యాసలోనే వు౦టు౦ది కాబట్టి… మీ ప్రా౦తపు రచయితలు కూడా తమ కథల్లో మా గురి౦చి చాలా అన్యాయ౦గా కామె౦ట్ చేస్తు౦టారు ! ఏమన్నారో తెలుసా ! మేము మొరటుగా వు౦టామనీ , సున్నితత్వ౦ తెలియదనీ , ఏకవచన౦తో స౦భోదిస్తామనీ యిలా ఎన్నో ! “

” మేడ౦గారూ ! వదిలేయ౦డి యిక ! మనలో మనమే పోట్లాడుకు౦టే ఎలాగా ?ఎ౦తైనామనమ౦తా తెలుగువాళ్ల౦ ! మనమ౦త ఒకటే ! “

నాకు కోప౦ తారాస్థాయికి చేరి౦ది.

” నరేష్ మీకు యిప్పుడు గుర్తుకు వచ్చి౦దా మనమ౦తా ఒకటే అని ! ఎ౦తైనా మీ కత్తికి రె౦డు వైపుల పదునేన౦డి !ఒకానొకప్పుడు అధికార౦ కోస౦ తెలుగు వాళ్లను వదిలేసి వచ్చిన విషయ౦ కూడా పొరపాటున కూడా గుర్తు చేసుకోరనుకు౦టాను ?…”

” ఏ౦టీ ! ఏమన్నారు ? తెలుగు వాళ్లను వదిలిపెట్టి వచ్చామా…ఎవర్ని మేడమ్ ! ” నమ్మలేని విషయాన్ని విన్నట్టుగా కళ్లు పెద్దవి చేసి చూశాడు.

ల౦చ్ టైమ్ అయ్యి౦ది…అయినా ఎవ్వరూ కదలట౦ లేదు. అ౦దరి కళ్లు మా వైపే చూస్తున్నాయి.

” ఆ రోజు అవసర౦ కోస౦ తమిళనాడు , కర్నాటక లోని తెలుగు వాళ్లను నిర్ధాక్షిణ్య౦గా వదిలి వచ్చిన పరిస్థితులను గుర్తు చేసుకో౦డి. అయినా ఆ పరిస్థితులు చరిత్రలో భాగమయ్యి౦టే కదా యిప్పుడు  గుర్తు చేసుకోడానికి ! అవసర౦ కోస౦ కొ౦తమ౦ది తెలుగువాళ్లను వదిలివేస్తారు. వేరే అవసరాలకోస౦ యి౦కొక ప్రా౦త౦ తెలుగువాళ్లతో కలిసి వు౦టా౦ అ౦టారు… వాళ్లు చీ…ఛా అన్నా దులపరి౦చుకొ౦టూ, లేదు మనమ౦తా కలిసి వు౦డాల్సి౦దే అ౦టారు. ఏదైనా చేయగల సామర్థ్య౦ మీ సొ౦త౦. మనమ౦తా ఒక్కటే అని ఒక వైపు అ౦టూనే మమ్మల్ని ఎ౦త చిన్న చూపు చూడాలో అ౦త చూస్తున్నారు. మనమ౦తా ఒక్కటే అని మేము ఎలా అనుకోగల౦ ! యిక మావాళ్ళు కూడా మీ వెనుక తోక వూపుకు౦టూ తిరిగే వాళ్లుగా వు౦డకపోవచ్చు . మీ సహవాస౦ యిక మాకు వద్దు అన్న మాట వినడానికి మీరు సిద్ద౦గా వు౦డ౦డి…ఆ టైమ్ కూడా బహుశా ఎ౦తో దూర౦లో లేదు… ల౦చ్ టైమ్ కూడా అయిపోవచ్చినట్లు౦ది… పద౦డి. ఆకలి కూడా ద౦చిపడేస్తో౦ది. అ౦దులోనూ ఈ రోజు నా క్యారియర్లో జొన్నరొట్టె  వు౦ది…తినాలి…”

నా గాయాలకు లేపన౦ పూసుకున్నట్టుగా మనస౦తా చల్లగా వు౦ది.

‘ ఇ౦టికి పోతూనే నాకూతురికి కూడా ఈ లేపన౦ గురి౦చి చెప్పాలి…. ‘

–కె.సుభాషిణి

 

 

 

 

 

సాహిత్య వ్యాప్తికి మాండలికం ఒక అడ్డంకి: ‘అంపశయ్య’ నవీన్

నవీన్1

తన రచనే ఇంటి పేరుగా మారి, పాపులర్ అయిన వచన రచయిత నవీన్. కథ, నవలా రచనల్లో తనదైన శైలినీ, వస్తు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నవీన్ ప్రధానంగా సమకాలీన ఆధునిక పట్టణ జీవన సంక్లిష్టతని తన రచనల ద్వారా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. “అంపశయ్య” నవల ఒక ట్రెండ్ ని సృష్టించడమే కాకుండా, తెలుగు వచన రచనకి నవీన అభివ్యక్తిని నేర్పింది. నవీన్ చూపించిన మార్గమే నవీన వచనరచనా మార్గంగా మారింది. ఆధునిక సంస్కృతీ, పాపులర్ కల్చర్, కొత్త చదువూ, కొత్త సంస్కారాలూ కొత్త వ్యక్తిత్వాలు నవీన్ రచనల ద్వారా ఆవిష్కృతమయ్యాయి. తెలుగు కథా, నవలా, వచనం ఇంకో మలుపు తిరుగుతున్న ప్రస్తుత తరుణంలో నవీన్ తో ఈ కాఫీ సమయం ఒక అడుగు వెనక్కి వెళ్లి, రెండడుగులు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నవీన్ తో కేయల్వీ ప్రసాద్ ముఖాముఖి:

Qనవీన్ గారూ, మీరు విద్యార్ధి దశలోనే ప్రయోగాత్మక నవల రాసి రికార్డు సృష్టించారు. అది మీకు గొప్ప పేరు తీసుకురావడమే కాక రచయితగా నిలదొక్కుకోడానికి దోహదకారి అయింది. చివరికి ఆ నవల పేరే మీ ఇంటి పేరుగా మారిపోయింది. ఈ రచన నేపథ్యం  గురించి చెప్పగలరా?

ఉస్మానియా యూనివర్సిటీలో చదివే రోజుల్లోనే ఈ నవలను (అంపశయ్య) రాయడం మొదలుపెట్టాను. అక్కడ పనిచేస్తున్న సీతారామారావు అనే కామర్స్ లెక్చరర్ కు నేను రాస్తున్న నవలలోని కొన్ని భాగాల్ని చదవమని ఇచ్చాను.  ఆయన ఆ పేజీలని  చదివి “దీన్ని చైతన్యస్రవంతి శిల్పం అంటార”ని చెప్పి “జాయీస్ రాసిన యూలీసేస్ చదివావా?” అని అడిగారాయన.  “లేదు” అన్నాను.  ఆ పుస్తకం మన కాలేజీ లైబ్రరీ లో వుంది. నేనే తెప్పించాను. దాన్ని చదవండి. అలాగే తెలుగులో బుచ్చిబాబు చైతన్యస్రవంతి పేరుతోనే  ఒక కథ రాసాడు చదవండి”  అన్నాడు. నేను వెంటనే ఆ పుస్తకాల్ని చదివాను జాయీస్ –యులీసేస్ చదివాను గాని పెద్దగా అర్ధం కాలేదు. “స్టువర్ట్ గిల్బర్ట్  అనే ఆయన   GUIDE TO ULYSSES  అనే పుస్తకం రాసాడు.  దాన్ని పక్కన పెట్టుకొని   ULYSSES  చదవండి అప్పుడర్ధమవుతుంది”  అన్నాడు సీతారామారావు.  ఆ పని కూడా చేసాను. అయినా 50 శాతం కంటే ఎక్కువ అర్ధం కాలేదది. మొత్తం మీద 1967లో ‘అంపశయ్య’ నవల ఎవరినీ అనుకరించకుండా, నాకు తోచిన పద్ధతిలో రాసి పూర్తిచేసాను. 1969లో అది పుస్తకంగా వెలువడింది. పుస్తకం వెలువడిన తర్వాత పాఠకుల నుండి , అద్భుతమయిన, అనూహ్యమయిన, అపూర్వమయిన స్పందన వచ్చింది. ఆ నవల వచ్చిన కొత్తలోనే 1970లో శ్రీశ్రీ గారి షష్టిపూర్తి ఉత్సవాలకు విశాఖపట్నం  వెళ్ళినప్పుడు రోణంకి అప్పలస్వామిగారు నన్ను గట్టిగా కౌగలించుకొని  “అద్భుతమయిన   ప్రయోగం చేశావయ్యా! జాయిస్స్  రచించిన ULYSSES లాంటి నవలను తెలుగులో ఎవరయినా రాస్తారా అని ఎదురు చూస్తున్నాను.  నువ్వాపనిని విజయవంతంగా చేసి చూపించావు “ అన్నారు. అలాగే ఆంధ్రాయూనివర్సిటీ లో చదువుతున్న విద్యార్దులొచ్చి”మా హాస్టల్స్ లో జరుగుతున్న ఎన్నో సంఘటనలని గూర్చి మీకెవరు చెప్పారు? మా మనస్సుల్లో జరుగుతున్న సంఘర్షణంతా మీకెలా తెలిసింది?” అని  అడిగారు. మొదట్లో తెలుగు విమర్శకులెవ్వరూ, ”అంపశయ్య”ను పట్టించుకోలేదు.  కానీ క్రమంగా ఈ నవలకు, పాఠకులనుండి వస్తున్న ఆదరణను చూసి నవల గొప్పతనాన్ని గుర్తించారు.

Qఅంపశయ్య రావడానికి ముందు మీరు కథారచన  కాని ఇతర రచనలు కాని చేసారా?ampasayya

అంపశయ్య నవలకంటే ముందు  నేను కొన్ని కథలు రాసాను.  ఆ కథలన్నింటిలోనూ  పాత్రల మనసుల్లో జరుగుతున్న సంఘర్షణనే చూపించాను. మానసిక విశ్లేషణతో  కూడుకున్న కథలనే రాసాను.  “అథోలోకం” అనే ఒక కథను చైతన్య స్రవంతి  శిల్పంలోనే రాసాను.  ఇదే నేను రాసిన ముఖ్యమయిన మొదటి కథ.   దీన్ని ”జయశ్రీ” అనే మాసపత్రిక 1965 లో ప్రచురించింది. అసలు ఈ కథను ముందు ”భారతి”, ”ఆంధ్ర పత్రిక”, ఆంధ్ర ప్రభ” లాంటి పత్రికలకు పంపిస్తే  వాళ్ళు తిప్పి పంపించారు.

Q మీరు చదువుకునే రోజుల్లో మీ చుట్టూరా వున్న మీ మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది వామపక్ష భావజాలాన్ని కలిగి వుండడం, విరసం వంటి సాహిత్య సంస్థల్లో బాధ్యులుగా వుండడం ఇప్పటికీ చూస్తూనే వున్నాం. మరి  మీరు వారికి భిన్నంగా వ్యవహరిస్తూ మంచి రచయితగా నిలదొక్కుకున్నారు. ఇది ఎలా సాధ్యపడింది?

నేను కోరుకునే ప్రజాస్వామ్యం ఏమిటంటే చాలా చెప్పాల్సి వుంటుంది.  అదిక్కడ సాధ్యం కాదు. అయితే నేను చదువుకునే రోజుల్లో వామపక్ష భావాలున్న చాలామంది మిత్రులు మారారు. ఒక్క వరవరరావు  తప్ప. వరవరరావు అతివాద, వామపక్ష భావాలకు పూర్తిగా అంకితమైపోయాడు.  చదువుకునే రోజుల్లో స్థూలంగా ఆయనకు వామపక్ష భావాలు ఉండేవి గాని, ఇప్పుడున్నంత తీవ్రమయిన వామపక్ష భావాలుండేవి కావు. అప్పుడు మేమందరం నెహ్రు గారి సోషలిస్ట్ విధానాల పట్ల సి.పీ.ఐ, ప్రజాస్వామ్య పంధా పట్ల  ఆకర్షితులమయినవాళ్లమే.  నేను రాసిన అనేక నవలల్లోను, కథల్లోనూ, వామపక్షభావాలు, స్త్రీవాద దృక్పథం , సెక్యులరిస్ట్ విధానాలు, శాస్త్రీయ దృక్పథం, కుల, మత, ప్రాంతాలకు అతీతమైన మానవత్వ భావాలు, తీవ్రవాద-హింసాత్మక  విధానాలకు వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తాయి.  ఇవే నన్ను రచయితగా నిలబెట్టాయి. రచయిత అయినవాడు ఏ ఒక్క విధానానికో, రాజకీయ పార్టీకో  చెందినవాడు కాకూడదు. అలా అయితే అతడు తన స్వేచ్చా-స్వాతంత్ర్యాలని కోల్పోతాడు.  రచయితకు తాను ఫీల్ అయింది రాసే స్వాతంత్ర్యం తప్పనిసరిగా వుండాలి అని నేను భావిస్తాను.  అందుకే పార్టీలకు, ఇతర సంస్థలకు అతీతంగా ఉంటున్నాను. ఎవరి విధానాలు నచ్చినా సమర్దిస్తాను కాని సభ్యత్వం మాత్రం తీసుకొను.

Q మీ రచనల్లో రాజకీయ ప్రస్తావనలు, వాటిపై చర్చలు తప్పక వుంటాయి. దీనికి ప్రత్యేకమయిన కారణాలు ఏమైనా ఉన్నాయా?

నా నవలల్లో రాజకీయ ప్రస్తావనలుంటాయి. విభిన్న వాదాల మధ్యన చర్చలుంటాయి.  ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపిస్తారు. నా నవలల్లోని పాత్రలు వెలిబుచ్చే అభిప్రాయాలు నావే అని కొందరనుకుంటారు. అది చాలా పొరపాటు. నేను సమాజంలో వ్యాప్తిలో వున్న వివిధ వాదాలని గ్రంధస్తం చేస్తానే తప్ప, ఏ వాదంతోను మమేకం కాను. ఎవరికయినా  సరే, తమ వాదాన్ని వినిపించే హక్కు వుందని నేను భావిస్తాను. ఆ వాదంతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు.   ఇప్పుడు జరుగుతున్న  ఘటనలని, వాదాలని, పర్యవసానాలని  చిత్రించటంలో  నేను సాధ్యమయినంతవరకు objectiveగా ఉండడానికే ప్రయత్నిస్తాను.

అంపశయ్య నవీన్ తో ప్రసాద్

అంపశయ్య నవీన్ తో ప్రసాద్

Qప్రాధమిక దశలో మీరు విశ్వనాథ రచనలకు బద్ధ విరోధి అని, ఆ తరవాత మీరు ‘ఏకవీర’ని మెచ్చుకున్నారని చెప్తారు. ఈ మార్పుకి కారణం చెప్తారా?

నిజమే!…. నేను విశ్వనాధ రచనల్ని —ముఖ్యంగా ఆయన నవలల్ని, ఆ నవలల్లోని ఆయన చాంధసభావాలని, తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవమే! ఇప్పటికీ ఆ విషయంలో పెద్ద మార్పేమీ లేదు.  ”ఏకవీర” నవలను నేను మెచ్చుకోలేదు. ఆ నవలలోని కొన్ని మహిమల్ని (miracles) అలాంటివి నవలల్లో ఉండకూడదని స్పష్టంగా చెప్పాను. విశ్వనాధ కవిత్వాన్ని నేను చదవలేదు.  నవలాకారుడిగా ఆయన నవల నిర్మించే విషయంలో గొప్పవాడు.  ఆయన భావాలతోనే నేను అప్పుడు వ్యతిరేకించాను. ఇప్పుడూ వ్యతిరేకిస్తాను.  ఆయన రాసిన కొన్ని చిన్న నవలలు బావుంటాయని అప్పుడూ అనుకున్నాను.  ఇప్పుడూ అనుకుంటాను.

Qచలం సాహిత్యం పట్లనే కాకుండా వ్యక్తిగతంగా కూడా చలంతో మీకు ఉత్తరప్రత్యుత్తరాలు నడిచేవని విన్నాను.

చలం  అంటే నాకు చాలా అభిమానం. ఆయన సాహిత్యం నన్ను గాడంగా ప్రభావితం చేసింది. ఆయన వచన శైలి , ఆయన స్త్రీవాదభావాలు, వ్యక్తి స్వేచ్చకు ఆయన ఇచ్చే  ప్రాధాన్యం, హిపోక్రసీని, తీవ్రంగా ఖండించడం,”సహజంగా మీకిష్టమయిన పనిచేస్తూ  హాయిగా జీవించంఢిరాబాబూ –”అని ఆయన చెప్పే మాటలు, రచయితలు ఏమి రాసినా,  వాళ్ళ హృదయాల్లో కలం ముంచి రాయాలని ఆయన రచయితలకు చేసిన ఉద్భోద, ప్రకృతిపట్ల ఆయనకున్న స్వచ్చమైన ఆరాధన  ఇవన్నీనన్ను ప్రభావితం చేసాయి.  విద్యార్ధి దశలోనే నేను చలాన్ని, శ్రీశ్రీ ని, బుచ్చిబాబుని, చదివి ఉండకపోతే నా వ్యక్తిత్వం ఇలా ఉండేది కాదు.

 Qస్వర్గీయ కాళోజీ పర్యవేక్షణలో మిత్రమండలి మొదటి కన్వీనర్ గా వరవరరావుగారు వుండే వారు. ఆ సమయంలో మిత్రమండలిలో మీ పాత్ర ఏమిటి?

కాళోజీ రామేశ్వర రావుగారు 1957లో  ”మిత్రమండలి” అనే సాహిత్య సంస్థను స్ధాపించారు. అప్పటినుంచి నేను దాంట్లో సభ్యుడిని.  వరవరరావు ఈ సంస్థకు మొదటి కన్వీనర్ అయితే నేను సంస్థకు రెండవ కన్వీనర్ ని .  ఆ సంస్థను “WRITERS WORKSHOP”  అనవచ్చు. నేను కొత్తగా కథలు రాస్తున్న రోజుల్లో  ఆ కథల్ని  మిత్రమండలిలో చదివినప్పుడు, కాళోజీ రామేశ్వరరావులాంటి పెద్దలిచ్చిన  సూచనలు రచయితగా నేనొక స్థానాన్ని సంపాదించటానికి చాలా దోహదం చేసాయి.   I am a product of  MITHRAMANDALI  అని గర్వంగా చెప్పుకుంటాను.  మిత్రమండలి ఈనాటికీ వరంగల్ లో సజీవంగా వుండడం నాకెంతో గర్వకారణం.

Q మీ రచనల్లో చాలా వాటిల్లో కాలేజీ రాజకీయ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అనేక కళాశాలల్లో పని చేయడమే దీనికి కారణమా?

నాకు బాగా తెలిసిన జీవితాన్నే నేను నా నవలల్లో చిత్రిస్తాను. నేను 35సంవత్సరాలు.  (1964–1996) అనేక కళాశాలల్లో పని చేయడమే అందుకు కారణం అయితే కళాశాలల జీవిత నేపధ్యంగా లేని నవలల్నీ , కథల్నీ కూడా నేను రాసాను.

నవీన్

Q కాలరేఖలు మీకు అకాడెమీ అవార్డు సాధించింది కదా? ఆ రచన గురించి చెప్పండి

కాలరేఖలు ” నవలకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది 2004లో.  కాలరేఖలు కంటే ముందు కేవలం రెండు నవలలకు మాత్రమే (పండిత పరమేశ్వర శాస్త్రి –  వీలునామా–గోపిచంద్,/ హృదయ నేత్రి –మాలతి చందూర్) కేంద్ర సాహిత్య అకాడమీ  పురస్కారం లభించింది. అంటే  1955లో కేంద్ర ప్రభుత్వం ఈ సాహిత్య అవార్డులను ఇవ్వడం మొదలుపెట్టాక  కేవలం రెండు నవలలకు మాత్రమే ఈ అవార్డుల్ని ప్రధానం చేయడాన్ని బట్టి చూస్తే, మన సాహితీ విమర్శకులకు ”నవల” పట్ల ఏమాత్రం గౌరవం వుందో తెలుస్తుంది.  ‘కాలరేఖలు’  నవల ఇతివృత్తం నా మైండ్ లో 20 సంవత్సరాలు నలిగాక నవలా రూపంలో 2001 లో వెలువడింది.  1940ల నాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని ఈ నవలలో చిత్రించాను.

ఈ నవలకు sequel గా  ”చెదిరిన స్వప్నాలు”,  ”భాంధవ్యాలు”అనే నవలల్ని రచించాను.  ఈ మూడు నవలలు ఇటు తెలంగాణా ప్రాంతంలోను, అటు భారతదేశంలోను, గత 50 సంవత్సరాలలో,(1944–1994) జరిగిన అనేక సంఘటనల్ని ఈ కాలంలో  ప్రజల ఆర్ధిక, రాజకీయ, సాంఘీక, జీవనాల్లో వుత్పన్నమయిన పరిణామాల్ని చిత్రిస్తాయి.

Q మీ రచనలు చదువుతున్నప్పుడు మీపైన ఆంగ్ల సాహిత్య ప్రభావం అంతో ఇంతో వుందని ఇట్టే అర్థమయిపోతుంది. ఆంగ్ల సాహిత్య ప్రభావం  మీ మీద  ఎంత వరకూ వుంది?

అంతో – ఇంతో  ఏమిటి? నామీద ఆంగ్ల సాహిత్య  ప్రభావం  గాఢంగానేవుంది.  నేను కాలేజీలో, చదువుకునే రోజుల నుండి ఈనాటివరకూ ఎన్నో ఇంగ్లీష్ నవలల్ని చదివాను, చదువుతున్నాను.  నవలా నిర్మాణాన్ని, పాత్ర చిత్రణను , సంభాషణల ద్వారా నవలను, కథను నడిపించే రచనా విధానాన్ని నేను ఇంగ్లీష్ నవలలు చదవడం ద్వారానే నేర్చుకున్నాను.  తెలుగులో సంభాషణల ద్వారా కథలు, నవలలు నడిపించే విధానానికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనల్ని ఉదాహరణలుగా మన తెలుగు విమర్శకులు చెబుతుంటారు. కానీ నేను నా కథల్లోను, నవలలలోను శ్రీపాద వారికంటే, ఎక్కువగా ఈ శిల్పాన్ని(నాటకీయ శిల్పం అంటారు) పోషించానని పాతనే పట్టుకుని వేలాడే మన విమర్శకులు గుర్తించినట్టులేదు.

Q ఈ వయసులో కూడా ఇంత రచనావ్యాసంగాన్ని, సాహిత్య ఉపన్యాసాలను జోడెద్దుల బండిలాగా ఇంత క్రమశిక్షణతో ఎలా సాగిస్తున్నారు?

మీరన్నట్టు క్రమశిక్షణే నన్నుఈనాటికీ రచయితగా ఉత్సాహంగా అనేక రచనలు , అనేక ప్రసంగాలు చేసేలా చేస్తున్నది. రచయితకు ఆమాటకొస్తే ఏ కళాకారుడికయినా క్రమశిక్షణ , ఆదర్శవంతమయిన నడవడి (character) చాలా ముఖ్యమయినవి.  ఇవి లేని ఎందరో గొప్ప కళాకారులు చాలా త్వరగానే వాళ్ళ కళ నుండి కనుమరుగై పోయిన ఉదంతాలు ప్రపంచ చరిత్రలో ఎన్నో వున్నాయి

 Qనేడు వస్తున్న రచయితల గురించి/ రచనల గురించి మీరేమంటారు? మీ పేరున ప్రారంభమయిన పురస్కారం గురించి చెప్తారా?

నేడు జటిలమయిన సాహిత్యం కుప్పలు తెప్పలుగా వెలువడుతోంది కానీ దాన్ని చదివే పాఠకులు లేకపోవడం నేటి సాహిత్యం ఎదుర్కొంటున్న జటిలమయిన సమస్య.  ఈనాటి రచయితలు కూడా తమ రచనలన్నీ మాండలికంలో చేయాలన్న అత్యుత్సాహాన్ని కనబరుస్తూ పాఠకులకు దూరమయిపోతున్నారు.  మాండలికాల్ని సంభాషణల వరకే పరిమితం చేయాలన్న నియమాన్ని మన వర్ధమాన రచయితలు పాటించడం లేదు.

ఇక నేను ప్రవేశ పెట్టిన పురస్కారం గురించి ఒక నవలాకారుడు రచించిన మొదటి నవలకు,10,000/-రూపాయలు పురస్కారాన్ని ఇచ్చి, కొత్తగా నవలలు రాస్తున్న నవలాకారులని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2012వ సంవత్సరం నుండి నేను ”నవీన్ సాహిత్య సమితి” ద్వారా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాను.  భవిష్యత్తులో ఈ పారితోషికాన్ని ఇంకా పెంచాలని కూడా వుంది. నేను రాసిన మొదటి నవల ”అంపశయ్య”ను ప్రచురించుకోవటానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నేనెప్పటికీ మరచిపోలేను. అలాంటి కష్టాలు ఒక ప్రతిభావంతుడయిన నవలాకారుడు పడకూడదనే ఉద్దేశ్యంతోనే  ఈ పురస్కారాన్ని ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం December 24 నాడు ప్రధానం చేయడం జరుగుతుంది.

 Qమీ రచనలు అనేక భాషల్లో అనువాదమయ్యాయి. వాటి వివరాలు చెప్పగలరా?

నా రచనలు చాలా ఇతర భాషల్లోకి అనువదించబడి పుస్తకాలుగా వెలువడ్డాయి.  ”అంపశయ్య”ఆంగ్లం లోను, హిందీలోనూ వెలువడింది.  త్వరలో తమిళ, కన్నడ భాషల్లో రాబోతున్నది.  ”చీకటిరోజులు” ఆంగ్లంలోను, ”కరుణ”, “మౌనరాగాలు” , “మనోరణ్యం”, ”నిష్కృతి” కన్నడంలోనూ, ”రక్తకాసారం” హిందీ, ఆంగ్లం,లోనూ, ”భాంధవ్యాలు” హిందీలోనూ వెలువడ్డాయి. ”నిష్కృతి”, ”అవాస్తవికుడు” అనే నా రెండు రచనలు సంస్కృతం లోనూ వెలువడ్డాయి. కేంద్ర సాహిత్య పురస్కారం పొందిన ”కాలరేఖలు” నవల త్వరలో భారతీయ భాషలన్నింటిలోనూ వెలువడబోతున్నది.

 Qమీ భవిష్యత్ కార్యక్రమాల గురించి చెప్పండి.

1994 నుండి అంటే నా ”భాంధవ్యాలు” నవలకు సీక్వెల్ గా ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వల్ల మానవసమాజంలో ఉత్పన్నమవుతున్న ఆర్ధిక/సాంఘీక/రాజకీయ మార్పుల్ని ముఖ్యంగా ఒక సగటు మనిషి జీవితం ఎలా మారిందో  చిత్రిస్తూ ఒక నవల రాస్తున్నాను ఈ December 24 న దాన్ని రిలీజ్ చేయాలని నా ప్రయత్నం. చలం జీవితాన్ని చిత్రిస్తూ ఒక ”జీవిత కథాత్మక నవల’, ‘ biographical novel ఇర్వింగ్ స్టోన్  రచించిన లస్ట్టఫుల్ లైఫ్ లాంటిది వచ్చే సంవత్సరం మొదలుపెట్టి రాయాలని అనుకుంటున్నాను.  ప్రస్తుతం  THE HANS INDIA  అనే ఆంగ్లదిన పత్రికలో ”VIGNETTES OF LIFE”  అనే  కాలమ్ గత రెండేళ్ళుగా రాస్తున్నా. ఇలాగే ఆంగ్లంలో ఇంకా కొన్ని రచనలు చెయ్యాలని కూడా ఆలోచిస్తున్నాను.

ఇంటర్వ్యూ : కేయల్వీ ప్రసాద్

నేనే మాట్లాడేది…

Saidulu

అవును

నేనేమాట్లాడేది

తడిగుడ్డలతో

కోయబడ్డ గొంతును

తేనెపూసిన

కత్తి అంచు నుండి

నేనే మాట్లాడుతున్నా

ఏ ప్రజాప్రతినిధీ

నాకోసం కన్నీటిని కార్చలే

అందుకే

నేనే మాట్లాడుతున్నా

ఈ నేలను ముద్దాడిన పాపానికి

చావును

చింపబడ్డ చెంగుకు కట్టుకొని

కళ్ళల్లో వొత్తులేసుకొని నాయం కోసం సూత్తున్నా

ఒక్కరన్నా

నన్ను చెరిచిన వాడ్ని

గొంతుపిసికి చంపాలన్నంత కోపాని తెలుపుతారని

ఆశగా నలపబడ్డ ఎంట్రుకల్ని నల్లరిబ్బనుతో ముడేసుకొని

దసాబ్దాలసంది చూస్తూనేవున్నా

మాల గా…

మాదిగ గా…

మాతంగి గా…

మాస్టినిగా…

ఆదిమవాసీగా….

నాకోసం ఇన్ని దినాలసంది

ఏ ఒక్కరూ రోడ్డెక్కలే….

ఏబారికేడు తన్నలే

ఏ రోడ్డూ నిండలే

ఎందుకనో…?

నేను

నిలువునా

చీల్చబడ్డ పెయ్యనే

పొత్తికడుపుల కొయ్యబడ్డ పేగుల్ని

ముడేసుకున్నదాన్ని

నిస్సహాయపు చూపులతో

నెత్తుటి గడ్డలతో

నేనింకా బతికేవున్నా…

మహిళల్లారా

యువకుల్లారా

యువతుల్లారా

నలగని గుడ్డని కలిగినవారా

నలిగిన

నా

మనసుగురించి

పపంచకానికి చెప్పండి

సిగ్గులేని పాలకుల చెవ్వుల్లో వూదండి

మాత్రుమూర్తుల్లారా

అక్కల్లారా

నాపచ్చిగొతునుండి కారుతున్న

రక్తపు దొబ్బల సాచ్చికంగా చెబుతున్నా

నానేలను మీపాదలు ముట్టల్సినంతగా ముట్టకనే

నేనిప్పుడు మాట్లాడుతున్నా

అడవినుండి

తండనుండి

గూడెం నుండి

పల్లెనుండి

పిల్లలా

చెరచబడ్డ తల్లిలా

నాలోనేను

కుములుతూ

కొత్తపొద్దుకోసం

నన్నునేను నిల్పుకుంటూ……

(దళితుల అత్యాచారాలపై మాటపెగల్చని, కలం కదల్చని దౌర్భాగ్యపు స్థితి ఈ దేశంలోనేవుందేమో…నాలోనేను రగిలిన     క్షణాల్నిమీముందిలా…)

సైదులు ఐనాల

వేటాడే జ్ఞాపకం

varalakshmi

ఎందుకంత అసహనంగా ముఖం పెడతావ్?
కన్నీళ్ళు, జ్ఞాపకాలు, స్మృతులు, చిహ్నాలు
మనుషులకు సహజమే కదా.

ఇప్పుడు నువ్వెంత అసహ్యంగా
కనపడుతున్నావో తెలుసా?

నీకెలా తెలుస్తుంది.
నిన్ను నువ్వెప్పుడూ
చూసుకోవుకదా?
అసలు అద్దమంటేనే
నీకు పడకపోయె

ఒక్కసారి తడి కళ్ళోకైనా చూడు
ఒక్కొక్కరు ఎందుకు స్మృతి చిహ్నాలవుతారో
ఒక్కొక్కరు తమను తాము రద్దుచేసుకొని
సామూహిక గానాలెలా అవుతారో

ఒక్కొక్కరు నిరాయుధంగా
వేలతుపాకుల కనుసన్నల్లో
వసంతాలు విరగబూయిచే
చిరునవ్వులు చిలకరిస్తారో

425301_10151241083875363_829290875_n

ఒక్కొక్కరు చావును ఆలింగనం
చేసుకొని
నూతన మానవ
జననాన్ని కలగంటారో..
ఆ కలలో నువ్వూ
కనపడుతున్నావా!

అందుకేనా అంత కలవరపాటు??

మొండం అంచుకు వేలాడుతున్న శిరస్సు
ఇంకా మాట్లాడుతూనే ఉన్నదా
ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నదా
మాట తూట్లు పొడుస్తున్నదా
మానవత భయం పుట్టిస్తున్నదా
మనుషుల జ్ఞాపకాలు, స్మృతులు, చిహ్నాలు
నీ పాపాలను వేటాడుతున్నాయా??

అలా చూడకు
కోరలు తగిలించుకుని
ఇంకా ఇంకా
అసహ్యంగా కనపడుతున్నావ్

– పి. వరలక్ష్మి

చిత్రం: మందిరా బాధురి