Archives for August 2013

రాలిపోయిన వొక వాక్యం గురించి రెండు మాటలు …!

 

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో....

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో….

ఆగస్టు 30 పొద్దున్న.

వొక కవి చనిపోయిన రోజు మనసెలా  వుంటుంది?

ఇప్పుడు నేను మాత్రం వాన నీళ్ళు భారంగా దేహంలోకి ఇంకుతున్న పొడి నేలలాగా వున్నాను. కొన్ని నల్ల మబ్బులు తిరుగుతున్న బరువయిన గాలిలాగా వున్నాను.

ఆ కవి నాకేమీ బంధువు కాదు. స్నేహితుడూ కాదు. నన్ను రోజూ పలకరించే నా సహోద్యోగి కూడా కాదు. అసలు నాదీ అతనిది వొక భాష కూడా కాదు. వొక దేశం అసలే కాదు.

కాని, వొక కవి! పాతికేళ్ళుగా అక్షరాలా పలకరిస్తున్న కవి. పలవరిస్తున్న కవి – సీమస్ హీని ఇక లేడు! ఇవాళ పొద్దున్న ఆఫీసుకి వెళ్లి కూర్చోగానే ఈ-లేఖలో చిరకాల మిత్రుడు, అమెరికన్ కవి  మాథ్యూ గిన్నెట్ పలకరింత. “విన్నావా? సీమస్ హీని ఇక లేడు! ఇవాళ నువ్వూ నేనూ కలిసి మనిద్దరికీ ఇష్టమైన అతని కవిత ‘The Republic of Conscience’ చదువుకుందామా?”

అప్పటికప్పుడు నాకు చాల ఇష్టమయిన సీమస్ కవిత్వ సంపుటి OPENED GROUND తీసి, ఆ కవితలోంచి వొక్కో కవితా చదువుతున్నప్పుడు కంటి రెప్పలు తడుస్తో పోతున్నాయి.  కొంత దూరం చదివేసరికి అక్షరాలూ అల్లుకుపోయాయి  తడి పొరల కింద. నాకు తెలుసు- ఏడేళ్ళుగా అతని గుండె ఇక పని చేయను అని బలహీనంగా సడి  చేస్తూనే వుంది.

ఇక చదవలేక ఆఫీసులోంచి బయటికి వచ్చి అక్కడే వున్న Turtle pond అనే చిన్న కొలను పక్కన కూర్చొని, అక్కడి నీళ్ళనీ, అందులోని రాళ్ళ మీదికి మెత్తగా పాకుతున్న తాబేళ్లనీ చూస్తూ కూర్చున్నాను. సీమస్ హీని లేడు…అన్న రెండు పదాలు మెదడులోపల మోగుతున్నాయి. శరీరం చాలా అసౌకర్యంగా వుంది. మనసు లోపల్లోపల వెక్కిళ్ళు పెట్టుకుంటోంది.

ఎందుకీ కవి ఇంతగా నాలోపల మిగిలిపోయాడు? డెబ్బై నాలుగేళ్ల అతని దేహ నిష్క్రమణని ఎందుకు వొప్పుకోలేకపోతున్నాను?

కొంత కాలంగా వొక విధమయిన వ్యక్తిగత వైరాగ్యమూ, వైముఖ్యమూ, నా మీద నాకే కోపమూ  లోపల్లోపల పేరుకుపోయి, “ఇంక నేనేమీ రాయను, రాయలేను!” అని మనసూ, చేయీ రాయి చేసుకొని, రాయాల్సిన వాక్యాలన్నీ మనసులోనే భ్రూణ హత్య అయిపోతున్న సమయంలో సీమస్ నా చేత ఈ రెండు మాటలూ  రాయిస్తున్నాడు.

Seamus-Heaney-006

1

సీమస్ హీని నాకు తండ్రి లాంటి వాడు. మా నాన్నగారూ, అతనూ వొకే ఏడాది – అంటే 1939- లోనే పుట్టారు. ఇవాళ పత్రికలో సీమస్ చివరి ఫోటోలో అతని ముగ్గుబుట్టవంటి తలని చూస్తున్నప్పుడు మళ్ళీ నాన్నగారు గుర్తొచ్చారు. బహుశా, ఈ రెండు మరణాల స్మృతి భారం నన్ను మరింత దిగుల్లోకి నెట్టి వుంటుంది. తండ్రిలాంటి స్మృతి…కాని, సీమస్ వాక్యాలు ఎప్పుడూ వొక స్నేహ పరిమళం వీస్తున్నట్టు వుంటాయి.

ఎమ్మే ఇంగ్లీష్  చదువుతున్న సమయంలో నాగార్జున యూనివర్సిటీ కాంపస్ లో మొదటి సారి మా ప్రొఫెసర్ రంగన్ గారు నాకు ఈ ఐర్లాండ్ కవి వాక్యాలు చెప్పారు. అప్పటి నించీ సీమస్ ని వెతికి పట్టుకోవడం నాకొక వ్యాపకంగా మారింది. బెజవాడ గాంధీనగర్ లో ప్రబోధ బుక్ హౌస్ నించి మా ఆస్టిన్ లైబ్రరీ దాకా దొరికిన చోటల్లా సీమస్ కవిత్వం, వచనమూ వొకటికి రెండు సార్లు చదవడం, మననం చేసుకోవడం — ఈ పాతికేళ్ళుగా అతని కవిత్వం చదువుతున్నప్పుడు ఏనాడూ అతని వయసు అడ్డంకి కాలేదు నాకు. అతని భాష అతని దేశమూ పరాయీ అనిపించలేదు. అతని వదల్లేక వదిలిన వూరు నాదే, అతని చనిపోయిన క్రిస్ అన్నయ్య నా అన్నయే! అతను పాఠాలు చెప్పిన ఎలిమెంటరీ స్కూలు కూడా నాదే! అతన్ని మెప్పించిన ఈట్స్, ఇలియట్, థామస్ హార్డీ, టెడ్ హ్యూ నన్నూ మెప్పించారు. చాలా తక్కువ మంది కవులు ఇలా వుంటారు, మనల్ని తమలోకి ఇంకించుకునే వాళ్ళు! తలుపులు బార్లా తెరిచిన మనసుతో వాక్యాల వెంట తోడు తీసుకు వెళ్ళే వాళ్ళు!

భుజమ్మీద చేయి వేసి, ధైర్యం చెప్తూ కాసేపు, నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అనునయిస్తూ కాసేపు, నా కళ్ళలోకి చూస్తూ ‘జీవితాన్ని కాస్త ప్రేమించవూ’ అని బతిమాలుతూ కాసేపు–వొక కవి కేవలం కొన్ని వాక్యాల ఆసరాతో ఇన్ని రకాల role-plays చేయగలడా అని విస్మయానికి లోను చేస్తూ–గత పాతికేళ్ళుగా సీమస్ అక్షరాలా తోడుగా వున్నాడు. ఇవాళ అలాంటిదేదో వొక తోడు తెగిపోయింది. లోపల మిగిలివున్న ఆ ధైర్యపు మాట ఏదో పుటుక్కున  దారం తెగిన దండలాగా రాలిపోయింది. వొక నిస్త్రాణ – శరీరంలో, మెదడులో!

ఆ కొలనులో నీటి గలగలల మధ్య అతను లేనితనంలోంచి అతని మాటల్ని వెతుక్కుంటూ కూర్చున్నాను. ‘కవిత్వం ఏమిటీ’ అన్న నా ప్రశ్నకి లోపల్నించి సీమస్ ఇలా సమాధానమిస్తున్నాడు: “నేను పుట్టిందీ పెరిగిందీ పొలాల మధ్య..పొలం పనుల మధ్య! అదీ నా వాస్తవ ప్రపంచం. ఆ పనుల మధ్య కొంచెం అలసట తీర్చుకోడానికి నేను ఆడుకోడానికి వెళ్ళే వాణ్ని. ఆ ఆటలో నన్ను నేను, నా వాస్తవ ప్రపంచాన్ని మరచిపోయే వాణ్ని. అంటే, ఆటస్థలం నా ఊహా ప్రపంచం. ఆ రెండీటి మధ్య వున్న ప్రపంచమే కవిత్వం నాకు!”

ఇంకా కొంచెం ముందుకు వెళ్లి మాట్లాడుకుంటే, జీవనోపాధి వల్ల తను పుట్టిన వూరికి దూరంగా వెళ్ళిపోవడం సీమస్ ని ఎప్పుడూ బాధించేది. వొక చిన్న వూళ్ళో బడిలో పాఠాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి హార్వర్డ్ దాకా చేరుకున్నాడు సీమస్. ఈ సుదూర ప్రయాణంలో ఎంత ఆనందం వుందో, అంత బాధా వుంది అతనికి!

వొక కవితలో ఆ బాధని ఇలా చెప్పుకున్నాడు:

ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది గాలిపటం.

దాని దారం నీ చేతుల్లో

నీ గుండెని హత్తుకొని ఎలా వుంటుందో చూసావా?

నిజానికి  దారమొక్కటే నీ చేతుల్లో వుంది.

నీ గాలిపటం అందాలన్నీ

ఎక్కడో ఏ శూన్యాన్నో  అలంకరిస్తున్నాయి.

సీమస్ కవిత్వ రహస్యం అంతా ఆ దూరంలోని బాధ చెప్పడమే! ఎక్కడో వొక వూళ్ళో పుడతాం, కొన్నాళ్ళకి ఆ వూరు విడిచి వెళ్ళిపోతాం. వొక్క రోజు కూడా విడిపోతే వుండలేమనట్టుగా తల్లి కొంగు పట్టుకు తిరుగుతాం. ఆ కొంగుని వదిలేసి ఏడు సముద్రాలూ దాటి వెళ్ళిపోతాం. నాన్న భుజాల మీద ఆడుకోలేని రోజులు అర్థరహితంగా అనిపిస్తాయి. చివరికి అలాంటి అర్థరహితమయిన రోజులే జీవితంలో పెరిగిపోతుంటాయి. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి తిరిగిన చెలకలూ, తవ్వి తీసిన చెలమలూ, హోలీ రంగుల కోసం కోసుకొచ్చిన పూలూ, అల్లరి చేస్తూ గడిపిన పండగ రోజులూ ఇవి లేని బతుకు ఏనాడూ వద్దనుకుంటాం.

కాని, అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగానే గతస్మృతులు అయిపోతాయి. ఇప్పటి దూరపు బతుకు వొక్కటే మనకి మిగిలి వుంటుంది. సీమస్ కవిత్వమంతా ఆ ఇంటి పలవరింత, ఆ బంధాల పలకరింత. దూరమయిపోయే దగ్గరితనాల తలపోత. అందుకే, సీమస్ వాక్యాలు చదువుతున్నప్పుడు నా మటుకు నాకు అతని అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంటుంది. నా కాళ్ళని వెనక్కి నడిపించి గతంలోకి తోసుకుంటూ వెళ్ళే బాల్యమిత్రుడు సీమస్.

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ...అతని కవిత్వానికి ఊపిరి

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ…అతని కవిత్వానికి ఊపిరి

2

నాకు తెలిసీ, నాకు వున్న పరిమితమయిన అనుభవంలోంచి చెప్పాల్సి వస్తే,   కవిత్వం రాయడమే కష్టం. కోరి కోరి మనసుని నొప్పించుకోవడం! వొక్కో వాక్యం వొక్కో  రకం  నొప్పి. కాని, రాయకుండా వుండడం ఇంకా నొప్పిగా వుంటుంది. ఆ రాయలేని నొప్పి కన్నా రాస్తూ పడే నొప్పి సహించడం తేలిక. అందుకే, బాధపడుతూనే రాస్తాం. సీమస్ అంటున్నాడు:

I am tired of speculations about the relation of the poet’s work to the workings of the world he inhabits, and finally I disagree that ‘poetry makes nothing happen.’ It can eventually make new feelings, or feelings about feelings happen, and anybody can see that in this country for a long time to come a refinement of feelings will be more urgent that a reframing of policies or of constitutions.

ఎన్ని వాదాలు చేసినా, వివాదాలు పడినా కవిత్వం వొక అనుభూతి. రాయడం వొక అనుభూతి, చదవడం వొక అనుభూతి, నలుగురితోనూ కవిత్వం గురించి మాట్లాడుకోవడం వొక అనుభూతి. ఎవరైనా నాలుగు కవిత్వ వాక్యాలు వాళ్ళ గొంతులోంచి పలుకుతూ వుంటే వినడం వొక అనుభూతి.

అందుకే, సీమస్ ఎప్పుడూ అంటాడు: “The main thing is to write/ for the joy of it … It’s time to swim/ out on your own and fill the element/ with signatures on your own frequency.”

సీమస్ చివరిదాకా ఆ ‘రాయడం’ అనే ప్రక్రియలోని  అనుభూతిని కాపాడుకున్నాడు, అది ఎంత నొప్పెట్టినా సరే!

తెలంగాణ ఒక చిన్న అడుగు

17.08.2013

 మిత్రమా!

మనం విడిపోయి చాలా రోజులయ్యింది కదూ! అట్లాగే ఎవరి దారిలో వాళ్లం  చాలా చాలా దూరం వెళ్లిపోయాం కదూ! నువ్వు అన్నింటిని కదుపుతూ, లీనమౌతూ, అంతర్లీనమౌతూ – ప్రకృతిలా, పాటలా ఒక అజేయమైన, స్థితికి సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నావు…

నేను ఎక్కడ తిరుగుతున్నానో తెలియకుండా! కాని మనం కలిసి పంచుకున్న అపురూపమైన యుద్ధ, భీభత్స, సమ్మోహనమైన, ప్రతి అనుభవం, ప్రతిక్షణం గుర్తుంది. మనం అందరం నిద్రపోతున్న ఒక గాఢమైన రాత్రి… వెలుగు రాసిన గొంతుతో.. అక్టోబరు 17 రష్యా విప్లవానికి ముందటి లెనిన్ మానసిక స్థితి గురించిన నీలం నోట్‌బుక్ గురించి చర్చించుకున్నాం గుర్తుందా?( మిత్రులు ఆర్.కె. పర్స్పెక్టివ్ ప్రచురణలు తనకు ఆ పుస్తకం దొరికిందన్నారు. మళ్లీ చదవాలి.) పాత సమాజం కూలిపోవడం కూడా ఎంత క్లిష్టమైందో చెప్పుకున్నాం కదూ! ఆ తరువాత వెతికి వెతికి ప్రపంచాన్ని కుదిపేసిన “ఆ పది రోజులు” చదువుకున్నాం కదా ?

నేను తెలుగు ప్రాంతానికి దూరంగా ఉన్నాను. అయినా అల్లకల్లోలమౌతున్న ప్రజల మానసిక స్థితుల గురించి తెలుస్తూనే ఉంటుంది. రెండు ప్రపంచ  యుద్ధాలు. పెను మార్పులకు లోనైన ఇక్కడి ముఖ్యంగా యూరప్ సమాజం ఎంత అలజడిని చూసిందో కదా! అందుకే ఇక్కడి మనుషులు, సమాజాలు ఘనీభవించిన ఒంటరితనంతో ఉంటాయేమో? అధికారం రెండు ప్రాంతాల్లో అతలాకుతలమౌతున్నది.

20% లాభం ఉన్నదని తెలిస్తే పెట్టుబడిదారులు తమ మెడ నరుక్కోవడానికి సిద్ధపడుతారట. నాకీ మాట కారల్ మార్క్స్ చెప్పినట్టు కొడవటి కుటుంబరావు రాశారు. అధికారం క్రూరమైంది. అది అంతులేని దాహంతో కూడుకున్నది. ఇప్పుడు అన్ని రకాల తప్పుడు మాటలు  పదే పదే ప్రసార సాధనాల్లో మారు మ్రోగుతున్నాయి. ఇప్పుడు ఇంత చెత్తలో నిజం తెలుసుకోవడం ఎంత కష్టం?

తెలంగాణా ప్రాంతం అరవై సంవత్సరాలుగా యుద్ధరంగంలా ఉన్నది. శ్రీకాకుళం, అదిలాబాదు, కరీంనగరే వచ్చింది. సింగరేణి, మాచెర్ల గుంటూరుకు వెళ్లింది. సృష్టికర్తలైన ప్రజల మధ్య ప్రేమ తప్ప యుద్ధం లేదు. కాని స్వార్ధపరులు తమ దురాశపూరితమైన అధికారదాహాన్ని అందమైన, సున్నితమైన పేర్లతో అందరికీ పూస్తున్నారు. బహుశా ఇది అతి పురాతనమైన ఎత్తుగడ. ప్రతి దోపిడి అందమైన ముసుగులతో ఉంటుంది. ప్రపంచ పోలీసు  ప్రపంచంలో శాంతిని కాపాడడానికి తనకు లొంగని దేశంలో తనే ఉద్యమాలు సృష్టించి ఊచ కోతలు కోస్తాడు. ఈ చిత్రమైన  నాటకానికి ప్రపంచీకరణ అనేక అందమైన పేర్లు కనుక్కొన్నది. అంతా మార్కెట్టు. అధికారం. రెండు ప్రాంతాల ప్రజలకు ఆస్థి తగాదాలు లేవు. తగాదాలల్లా  వాళ్లు కోల్పోయిన సంపదను తిరిగి దక్కించుకోవడమే.

అంతటా అద్భుతమైన పంటభూములు.. చెయ్యిపెడితే పిడికెడు అన్నం దొరికే భూములు ముక్కలుగా కత్తిరించి రియల్ ఎస్టేట్లయ్యాయి. సెజ్‌లయ్యాయి. చెమట చుక్క చిందించనోడు, శ్రమంటే తెలియనోడు. దళారి అవతారమెత్తి లక్షల కోట్లు సంపాదించి అన్నిరకాలుగా కల్లిలి పోయాడు. ఊళ్ళు వల్లకాడులయ్యాయి. వందల గ్రామాలు ఓఫెన్‌ కాస్టులయ్యాయి. నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు వాటిని తిరిగి గెలుచుకోవాలి.

అతిసుందరమైన అడవులు ఆక్రమించి మైనింగు మాఫియా లక్షలకోట్ళు సంపాదించింది. ఒకటేమిటీ సమస్తం ఒక పెను విధ్వంసానికి అటు తెలంగాణా, ఆంధ్రాలో ముంచెత్తింది. చిన్న పెట్టుబడిదారులు గుత్త పెట్టుబడిదారులయ్యారు. అంతటా సంపద కొల్లకొట్టారు. అతి నైపుణ్యంగా సంపద చేతులు మారింది. అడిగిన వాళ్లందరిని తరిమి కొట్టారు. శ్రీకాకుళంలో నైతేనేమి, వెంపెంట, గోదావరిఖని, మందమర్రి ఎక్కడైనా ఏ చిన్న అలికిడైనా వీధులు రక్తసిక్తమౌతాయి. కోర్టులు, జైళ్లు, నోళ్లు తెరుస్తాయి.

ప్రజలంతా తమ సర్వసంపదలు రోజురోజుకు  పోగొట్టుకుని నిరాయుధులుగా వీధుల్లో నిలబడుతున్నారు. తెల్లబట్టలేసుకున్న ప్రతివాడు అక్రమ సంపాదనాపరుడు, సాయుధుడై తిరుగుతున్నాడు. అధికారం ప్రజల సొమ్ముతో సాయుధ గార్డ్సుతో తిరుగుతోంది. సాయుధ గార్డ్సులేని ప్రజానాయకుడే లేడు. ప్రజలు  అధికారం – సంపద ఎంత క్రూరంగా ఎదురు బొదురుగా నిలుచున్నారో? నిత్యం నిరంతరం  వాళ్ల అంతరంగంలో ఊపిరైన  నీకు నేనేం చెప్పాలి ?

తెలంగాణా ఉద్యమం అనేక అనుభవాల సారంగా వచ్చింది. ప్రజల పక్షానా నిలబడ్డ తమ బిడ్డలు అయితే ఎన్‌కౌంటర్ లేకపోతే జైలుపాలో, అడవిపాలో అయిన తర్వాత అనేక అనుభవాల సారంగా వచ్చింది. ఈ ఒత్తిడిని చిత్తడిని పెంచిందెవరు? రాష్ట్ర, దేశ, విదేశ హస్తాలు ఇక్కడిదాకా సాచి లేవా?

దీనికి తెర తీసిందెవరు? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. హైటెక్ ద్వారాలు తెరిచి విద్యాలయాలను వద్యశాలలుగా మార్చారు. విద్యార్థులను యుద్ధవీరులైన విధ్యార్థులను ఆత్మహత్యలు చేసుకునే దయనీయ స్థితి మన విద్యారంగం కల్పించలేదా? రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు? రెండు ప్రాంతాలలో రైతులు ఎంత హీనంగా ఉన్నారు. ధాన్యాగారం క్రాపు హాలిడేస్ ప్రకటించలేదా? అంతటా విస్తరించేదెవరు? రైతులను, వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందెవరు?

మనిషిలోపల చేపల్లోపల కుళ్ళడం మెదడులో మొదట ఆరంభమౌతుందని మహాశ్వేతాదేవి అంటారు. కుళ్లిన మెదళ్ళ వీళ్లు మనుషులను వేటాడుతున్నారు. లూషున్ పిచ్చివాడి డైరీ జ్ఞాపకం వస్తోంది. ఆ కథలో హీరో సమస్త మానవభాష మనుషులను తినడానికే అనే నిర్ధారణకు వస్తాడు. అడవిలోని మూడువందల గ్రామలు పోలవరం ముంపు బలిపీఠం మీదుగా ఆదివాసులు నిలుచున్నారు. నోరువాయిలేని ఆదివాసుల మీద యుద్ధం అంతకంతకు విస్తరిస్తూనే ఉన్నది. ప్రజలు ప్రేమిస్తారు. ఆ ప్రేమ కోసం మనమింకా ప్రతి చోటికి తిరుగుతూనే ఉన్నాం కదా! ఉన్నవ లక్ష్మీనారాయణ, చలం, కొడవటిగంటి, గోపిచందు, గురజాడ, భూషణం, పాణిగ్రాహి, రావిశాస్త్రి, కారా మాస్టారు, శ్రీశ్రీ, చలసాని, రుక్మిణి, సత్యవతి, బండి నారాయణస్వామి, పాణి, కె.వి.రమణారెడ్డి, కేశవరెడ్డి, మధురాంతకం, సురవరం, కాళోజీ, దాశరధి, వట్టికోట, ఆల్వారు, స్టాలిను, గద్దర్, ఉమా మహేశ్వరరావు, వోల్గా, రంగనాయకమ్మ, బోయ జంగయ్య, శశికళ, త్రిపురనేని మధుసూధనరావు, వరవరరావు , హరగోపాల్, బాలగోపాల్, గోరేటి వెంకన్న, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, సుద్దాల, సుంకర, వాసిరెడ్డి, మహిందర్, జాషువా,,,  ఎందరెందరో ప్రజల కోసం రవ్వంత సుఖశాంతికోసం అంతటా కవులు, రచయితలు విస్తరించి లేరా? ఇప్పుడు  కొన్ని వందలమంది రచయితలు కవులు అంతట విస్తరించలేదా?

తెలంగాణా, అంధ్రా తెలంగాణా, రాయలసీమ ప్రజల వ్జయం. దోపిడీదారులు ఏకమౌతున్న దశలో ఒక చిన్న విజయం ఇప్పుడు రెండు ప్రాంతాలల్లో విచ్చిన్నమైన వ్యవసాయం, పెచ్చరిల్లిన అధికార దోఫిడి, చిన్నాభిన్నమైన పరిశ్రమలు, మానవ సంబంధాలు నిర్మిద్దాం. ప్రజలతో కలిసి నిర్మించే దిశగా నువ్వాలిస్తావని నాకు తెలుసు.

భారతదేశంలో క్రూరుడైన, జిత్తులమారి బ్రిటిష్ పరిపాలన దురాశపూరితులైన ఫ్యూడల్ సంబంధాలు అస్తవ్యస్త అభివృద్ధి ప్రాంతాలకు తావిచ్చాయి. వీటన్నింటినీ సరిచేసి పీడిత ప్రజల పక్షాన పోరాటం చేపట్టింది శ్రీకాకుళం నుండి .. నేటి పోరాటం కదా! వనరులను అభివృద్ధి చేసే విధ్వంసాన్ని ఆపి మనుషులను నిర్మించే పోరాటంలో తెలంగాణ ఒక చిన్న అడుగు.

భారతదేశం యుద్ధంలోకి నెట్టబడుతోంది. స్థానిక ప్రజలకు దోపిడీదారులకు, గగ్గోలౌతున్న మన దగ్గరి టక్కరి పెట్టుబడిదారులకు, ప్రజలకు, రెండు ప్రాంతాల ప్రజలు కలిసి పోరాడుదాం. దారి తెన్నూ లేని  నాలోపలివెన్నో నీతో పంచుకోవాలనుకున్నాను. నీకు ఈ విషయాలన్నీ సర్వ సమగ్రంగా తెలుసు. నీకు ఇంత డొంక తిరుగుడుండదు కదా! నువ్వు మాటల కన్నా చేతలు నమ్మినావు కదా !

నీ మిత్రుడు

 

తోపుకాడ (In a Grove)

akira-kurosava_500x330

పరిచయం: రషోమన్ సినిమా గురించి  పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke Akutagawa రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి కథ పేరు రషోమన్. ఈ కథ లోని అంశాన్ని దాదాపు పూర్తిగా వదిలేసి కేవలం సెట్టింగ్ మాత్రమే ఉపయోగించుకున్నారు కురొసావా. ఇక రెండొ కథ ‘In a Grove’. రషోమన్ సినిమా మొత్తం దాదాపుగా ఈ కథ ఆధారంగానే నడుస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం పది పేజీల కథను పూర్తి నిడివి చిత్రంగా మలిచిన కురొసావా ప్రతిభ అపూర్వం. ఇక ’నిజం’ అనే అంశాన్ని ’In a Grove’ లఘు కథలో అకుతగవా ప్రస్తావించిన తీరు అమోఘం. రషోమన్ సినిమాకి ఆధారమైన ’In a Grove’ కథకు తెలుగు అనువాదం ఇది.

******

న్యాయాధికారి ఎదుట కట్టెలుగొట్టువాని దృష్టాంతము

అవునయ్యా! ఆ శవం కనుక్కొంది ఖచ్చితంగా నేనే.

పొద్దుకాల, ఎప్పట్లాగే, కట్టెలు కొట్టుకొద్దామని అడవిలోకి పోయినా. అడివిలోకి కొంచెం దూరం పోంగానే పొదల్లో కనిపించింది సారూ శవం.

ఏడంటారా?

యమషినా రోడ్డుకి వంద గజాల దూరంలో వుందయ్యా ఆ చోటు. ఎదురు మొక్కలు, దేవదారు చెట్లతో నిండిపోయుంటాది ఆ చుట్టూతా.

నేను చూసే పాటికి శవం ఎల్లికల పడుందయ్యా. బులుగు రంగు సిలుకు బట్ట్టలు యేసుకుని వున్నాడా చచ్చిపోయినాయన! గుండెల్ని చీల్చిన కగ్గం గాయం వుండాది శవం పైన. చుట్టూ ఎదురు మొక్కల్నుండి రాలిన ఆకులు రకతం మరకలతో పడుండాయి.

లేదయ్యా నేను చూసేపాటికి రకతం కారటంలేదయ్యా!గాయం ఎండిపోయినాదనుకుంటా.

….ఆ అన్నట్టు మరిచిపోయినా, నేనొచ్చినాననిగూడా లెక్కచేయకుండా ఒక జోరీగ ఆడనే తిరుగుతావుండాది.

కగ్గం గానీ అట్లాంటి ఆయిధాలేమైనా ఆడసూసానా అని అడుగుతున్నారా అయ్యా?

లేదయ్యా.అట్టాంటిదేది లేదు. ఒక తాడు మాత్రం సెట్టుకిందపడివుండాది. ఆ….ఆ తాడు పక్కనే ఒక దువ్వెన కూడా పడివుండాది. అంతే, అయ్యి తప్ప నాకింకేమీ కనబడలే. సూస్తుంటే ఆయన సచ్చిపోయేముందుపెద్ద యుద్ధమే చేసినట్టున్నాడు. ఎందుకంటే అక్కడ గడ్డీ ఆకులు చెల్లాచెదరుగా పడివుండాయి.

గుర్రమా?

లేదయ్యా, ఆ పొదల్లోకి మనుషులు పోవడమే బహుకష్టం. ఇంక గుర్రమెట్టాపోద్ది?

న్యాయాధికారి ఎదుట బౌద్ధసన్యాసి దృష్టాంతము.

సమయమా?

ఖచ్చితంగా మిట్టమధ్యాహ్నం వేళ అయ్యుండవచ్చును. ఆ దురదృష్టవంతుడు సెకియామా నుండి యమషినా వెళ్ళేరోడ్డులో పయనిస్తున్నాడు. గుర్రంపై ఒక యువతిని కూర్చుండబెట్టి ఆయన సెకియామా వైపుగా నడకసాగించడం చూశాను. పరదా కప్పబడివుండడంచే ఆ యువతి మోమునైతే చూడలేకపోతిని గానీ ఆమె ధరించిన బట్టలు మాత్రం ఊదా రంగులో వుండడం గమనించితిని. ఆమె స్వారీ చేస్తున్న గుర్రం మాత్రం అతి సుందర కీసరము తో మేలైన జాతికి చెందినదైనట్టుగా వున్నది.

ఆ యువతి ఒడ్డుపొడుగులా?

నాలుగడుగులు దాటి ఐదంగుళాలుండొచ్చు. బౌద్ధసన్యాసిని కావడంచే ఆమెను అంతగా గమనించియుండలేదు. కానీ, అతను మాత్రం ఒక ఖడ్గం తో పాటు విల్లుబాణాలనూ ధరించివున్నాడు. పొదిలో ఇరవైదాకా బాణాలు కూడా వుండడం నాకు గుర్తుంది.

ఆ వ్యక్తికి ఇటువంటి దుర్గతి పడుతుందని అనుకోలేదు. వేకువవేళ మంచు బిందువులా, తలుక్కున మెరిసి మాయమయ్యే మెరుపులా మానవుని జీవితం కూడా అశాశ్వతమే. ఆతనిపై నా సానుభూతి చూపించుటకు నాకు నోటమాట వచ్చుటయే కష్టముగానున్నది.

*****

images

న్యాయాధికారి ఎదుట పోలీసువాని దృష్టాంతము.

నేను బంధించినవాడా?

వాడు తజొమరు అనబడే ఒక గజదొంగ. నేను బంధించేసమయానికి వాడు గుర్రముపైనుండి కిందపడి అవతగుచి వంతెన వద్ద మూలుగుతూ వున్నాడు.

సమయమా?

పోయిన రాత్రి వేకువజాము అయ్యుండొచ్చు. వీడిని గతంలో కూడా ఒక సారి బంధించే ప్రయత్నం చేసాను. కానీ తప్పించుకున్నాడు. నేను బంధించే సమయానికి బులుగు రంగు బట్టలు ధరించి వున్నాడు. ఇక వీడి దగ్గర వున్న విల్లు బాణాలు మీరు చూసేవున్నారు.

ఈ విల్లు బాణాలు ఆ మరణించిన వ్యక్తివి వలే వున్నాయని మీకూ అనిపించిందా?

అయితే ఖచ్చితంగా హంతకుడు వీడే!

ఇతని దగ్గర దొరికిన – తోలు తో చుట్టబడిన విల్లు, నల్లటి లక్కతో చేయబడిన పొది మరియు డేగ ఈకలతో చేయబడిన పదిహేడు బాణాలు – ఆ మరణించిన వ్యక్తివే అయ్యుంటాయని నా నమ్మకం.

గుర్రం గురించి మీరన్నది నిజమే!

అది జేగురు రంగులో మేలైన కీసరం తో ఉన్నది. పగ్గాలతో కట్టివేయబడని ఆ గుర్రం రాతి వంతెనకు కొంచెం దూరంలోనే గడ్డి మేస్తూ నాకు కనిపించింది. ఆ గుర్రం పై నుండి వీడు కిందపడి నా కంట బడడం తప్పకుండా విధి విధానమే!

ఈ క్యోటో ప్రాంతంలో ఎంతో మంది దొంగలు తిరుగుతున్నారు కానీ ఈ తజొమరు లాగా ఎవరూ మహిళలను వేదనకు గురి చేయటం లేదు. పోయిన ఏడాది పిండోరా పర్వత ప్రాంతంలో వున్న తొరిబె దేవాలయం సందర్శించడానికి వచ్చిన ఒక మహిళ, ఆవిడతో పాటే వున్న ఒక చిన్న పిల్ల హత్యకు గురికాబడ్డారు. ఆ హత్యల వెనుక కూడా తజొమరు హస్తం వుందని భోగట్టా!

మగవాడినే హత్య చేసిన వీడు ఆయన భార్యను ఏం చేసివుంటాడో అర్థం కావటం లేదు. దయచేసి ఆ విషయం గురించి కూడా మీరు విచారణ జరపాలని కొరుకుంటున్నాను.

******

న్యాయాధికారి ఎదుట వృద్ధురాలి దృష్టాంతము.

అవునయ్యా, ఆ శవం నా కూతుర్ని పెళ్ళాడిన వాడిదే.

ఆయన ఈ క్యోటో ప్రాంతానికి చెందిన వాడు కాదు. వకాసా రాజ్యంలోని కొకుఫూ పట్టణంలో సమురాయ్ గా వుండేవాడు. ఆయన పేరు కనాజవా నో టకెహికో,వయసు ఇరవై ఆరు. ఆయన చాలా నెమ్మదస్థుడు, ఇతరులకు కోపం తెప్పించేలా ప్రవర్తించి వుండడని నాకు గట్టి నమ్మకం.

నా కూతురా?

ఆమె పేరు మసాగో, వయసు పంతొమ్మిది. అదో చిలిపి చిచ్చుబుడ్డే కానీ టకెహికోని తప్పితే పరాయి పురుషులతో పరిచయమే లేదామెకి. దానిది చిన్నటి గుండ్రటి మొహం. ఎడమ కన్ను చివర్లో ఒక పుట్టుమచ్చ కూడా వుంటుంది.

నిన్న నా కూతురితో కలిసి వకాసాకి బయల్దేరాడు టకెహికో. ఇంతలోనే వారినిలా దురదృష్టం వెంటాడింది.

నా కూతురు ఏమయిందని అడుగుతున్నారా?

నా అల్లుడు చనిపోయాడని ఒప్పుకోక తప్పకపోయినా నా కూతురు ఎక్కడుందో ఎలా వుందో తలుచుకుంటేనే బాధేస్తుంది. ఆమె ఏమైపోయిందో ఎలానైనా తెలుసుకోండి. ఈ గజదొంగ తజోమరు పేరు తలవడానికే అసహ్యంగా వుంది. నా అల్లుడినే కాదు, కూతురిని కూడా వీడేమైనా…….(ఆపై ఆమెకు మాటలు పెగలక భోరున ఏడ్చేసింది).

******

images1

తజోమరు ఒప్పుకోలు

అతన్ని నేనే చంపాను; కానీ ఆమెను నేను చంపలేదు.

ఆమెక్కడికెళ్ళిందా?

ఏమో నాకు తెలియదు.

అయ్యో, ఒక్క నిమిషం ఆగండి.

నన్నెంత చిత్ర హింసకు గురిచేసినా నాకు తెలియని విషయం గురించి నన్నొప్పించలేరు. అయినా విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి, అంతా ఉన్నదున్నట్టే చెప్పేస్తాను.

నిన్న మధ్యాహ్నం పూట వాళ్లని నేను మొదటి సారి చూసాను. అప్పుడే వీచిన చిరుగాలికి ఆమె మేలిముసుగు కొద్దిగా తప్పుకోవడంతో ఆమె మొహం ఒక క్షణం పాటు నా కంటపడి ఇంతలోనే ముసుగులోకి మాయమయింది. అందుకేనేమో ఆ క్షణంలో నాకామె బోధిసత్వునిలా అనిపించింది. ఆమెతో వున్న ఆ వ్యక్తిని చంపైనా సరే ఆమెను చెరబట్టాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.

ఎందుకా?

మీరనుకుంటున్నట్టు చంపడం అనేది నాకు గొప్ప పరిణామమేమీ కాదు.

ఒక యువతిని చెరబట్టాల్సివచ్చిననప్పుడు ఆమె తో వున్న మగవాడిని ఎలాగూ చంపాల్సిందే. ఇదిగో నాతో పాటు ఎప్పుడూ వుండే ఈ కత్తితోనే నేను హత్యలు చేసేది.

అయినా ప్రజలని చంపేది నెనొక్కడినేనా?

మీరు మీ కత్తులు ఉపయోగించి చంపకపోవచ్చు. మీ అధికారంతో ప్రజల్ని చంపుతారు. మీ డబ్బుతో ప్రజల్ని చంపుతారు. ఒక్కోసారి వారికి మంచి చేస్తున్నామనే సాకుతో వారిని చంపుతారు. నిజమే మీ హత్యల్లో రక్తపాతముండకపోవచ్చు. మీరు చంపిన వాళ్ళు కనబడడానికి బాగానే ఆరోగ్యంగానే వుంటారు కానీ శవాలైపోయాక ఏం లాభం. మనిద్దరిలో పెద్ద హంతకుడు ఎవరో తేల్చడం కష్టమే .(హేళనగా నవ్వుతూ)

కానీ మగవాడిని చంపకుండానే అతని ఆడదాన్ని చెరబట్టగలిగితే బాగానే వుంటుంది. అందుకే అతన్ని చంపకుండానే ఆమెను నా దాన్ని చేసుకుందామనే నేను నిర్ణయించుకున్నాను. కానీ అలా చేయడం యమషినా రోడ్డులో సాధ్యం కాదు. అందుకే ఆ జంటను కొండల్లోకి పయనించేలా ప్రలోభపెట్టదలచాను.

అది చాలా సులభంగా జరిగిపోయింది.

కొండల్లో ఒక తోపు దగ్గర ఖడ్గాలు, దర్పణాలతో కూడిన ఒక నిధి గురించి వాళ్ళకి చెప్పాను. నాతో పాటే వచ్చిన వారికి అతి కొద్ది సొమ్ముకే ఆ నిధిని అమ్ముతానని నమ్మబలికాను.

మరి….మీరే చెప్పండి, ఆశకు హద్దుంటుందా?

నేను చెప్పడం ముగించేలోపే అతను నా మాటలను నమ్మేశాడు. నేను వాళ్ళను కలిసిన అరగంట లోపే గుర్రంపై నాతో పాటే కొండల్లోకి ప్రయాణం సాగించారు.

కాసేపట్లోనే నేను చెప్పిన వెదురు తోపు దగ్గరకు చేరుకున్నాము.

నాతో పాటే వచ్చి ఆ నిధిని చూడమన్నాను. అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి సరే అని ముందుకు కదిలాడు. కానీ ఆ యువతి మాత్రం గుర్రం తో పాటు అక్కడే ఎదురుచూస్తానంది.

అక్కడ పొదలు పొదలుగా ఎదిగిన వెదురు తోపుని చూసి భయపడి ఆమె అలా అనడం సహజమే అనిపించింది.

నిజానికి, అప్పటివరకూ నేను పన్నిన పథకం సజావుగానే సాగింది.

ఆమెనక్కడే వదిలేసి మేమిద్దరం ముందుకు సాగాం. వెదురు పొదలతో కప్పబడిన త్రోవలో కొంచెం సేపు ముందుకు నడిచాక చుట్టూ దేవదారు వృక్షాలతో కూడిన ఒక చదునైన ప్రదేశం చేరుకున్నాము. నా పథకం అమలు పరచడానికి అదే అనువైన ప్రదేశం అని నిర్థారించుకుని, నేను చెప్పిన నిథి ఆ చెట్లకింద పొదల్లో పాతిపెట్టివుందని అబద్ధం చెప్పాను. నా మాట వినగానే నన్ను తోసుకుంటూ ఆక్కడికి పరిగెట్టాడా వ్యక్తి. అతనక్కడికి చేరుకోగానే వెనకమాలుగా అతన్ని బంధించాను. అతను బలిష్టుడు, కత్తి పట్టిన వీరుడూ కావడంతో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నేను చేసిన పనికి అతను డంగైపోయాడు. వెంటనే నేనతన్ని ఒక దేవదారు వృక్షానికి కట్టిపడేసాను.

నా దగ్గర సమయంలో తాడెక్కడిదనా మీ అనుమానం?

దేవుడి దయవల్ల దొంగని కావడంతో ఏ సమయంలో ఏ గోడ దూకాల్సి వస్తుందోనని ఒక తాడు నాదగ్గర ఎప్పుడూ వుంటుంది. అలాగే అరిచి కేకలు పెట్టకుండా అక్కడున్న ఎండుటాకులతో అతని నోరు మూసేశాను.

అతన్నక్కడే వదిలేసి ఆమె వున్న ప్రదేశానికి చేరుకున్నాను. ఆమె భర్త అకస్మాత్తుగా ఏదో రోగాన పడ్డాడని అబద్ధం చెప్పి ఆమెను నాతో రమ్మన్నాను.

ఈ పథకం కూడా పారిందని మరోసారి చెప్పక్కర్లేదనుకుంటా.

ఆ యువతి తన మేలి ముసుగు తొలిగించి నా వెంట నడిచింది.

ఆమె చెయ్యిపట్టి నేను పొదల్లోకి దారితీశాను. కట్టివేయబడ్డ తన భర్తను చూడగానే ఆమె తన వద్ద వున్న బాకుతో నాపై తిరగబడింది. అంతటి తీవ్ర ఆగ్రహం కలిగిన ఆడదాన్ని నేను జీవితంలో చూడలేదు. నేను అప్రమత్తంగా వున్నాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నా డొక్కలో పొడిచివుండేది. నేను తప్పించుకుంటూనే వున్నా, ఆమె మాత్రం నాపై దాడి చేస్తూనే వుంది. ఇంకొకరైతే ఆమె చేతిలో చావడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగి వుండేది.

కానీ నేను తజోమరుని!

నా ఖడ్గం దుయ్యకుండానే ఆమె బాకుని నేలరాల్చాను. ఎంతటి ధైర్యవంతురాలయిన మహిళ అయినా, ఆయుధం లేకపోవడంతో డీలాపడిపోయింది. మొత్తానికి ఆమె భర్తను చంపకుండానే అమె పై నా వాంఛను తీర్చుకొన్నాను.

అవును….అతన్ని చంపకుండానే!

అతన్ని చంపాలనే కోరిక నాకస్సలు లేదు.

దు:ఖసాగరంలో మునిగివున్న ఆమెనక్కడ వదిలి, నేను తోపుదగ్గర్నుంచి పారిపోవాలనుకుంటుండగా, అమె పిచ్చిపట్టిన దానివలే నా చేతులు గట్టిగా పట్టుకుంది. తడబడే మాటలతో తన భర్తో లేదా నేనో ఎవరో ఒకరు చచ్చిపోవాలంది. ఇద్దరి లో ఎవరు బతికుంటారో వాళ్ళకే తను భార్యగా మిగుల్తానని ఒగర్చింది. దాంతో అతన్ని చంపాలనుకునే ఆవేశం నన్నావరించింది. (విషాదంతో కూడిన ఉద్వేగం)

ఇలా చెప్పడం వల్ల, మీకంటే నేనే క్రూరమైన వాడినని మీకనిపించడంలో అనుమానం లేదు.

కానీ ఆ సమయంలో మీరామె కళ్ళు చూసుండాల్సింది.

ముఖ్యంగా ఆ క్షణంలో జ్వలించే ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నా పై పిడుగుపడ్డా సరే, ఆమెను నా భార్యను చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నాను. ’ఎలా అయినా అమెను నా భార్యను చేసుకోవాలి’…….ఆ కోరిక నా మదిని ఆవరించింది.

అది కేవలం కామం అని మీరనుకోవచ్చు. ఆ సమయంలో నాకు కామం తప్ప మరో ఆపేక్ష లేనట్టయితే, అమెనక్కడే తోసేసి పారిపోయేవాడిని. అప్పుడు నా కరవాలానికి రక్తపు మరకలంటి వుండేవి కావు. కానీ ఆ తోపు దగ్గర మసక వెలుతురులో ఆమె మొహం చూసిన క్షణమే, అతన్ని చంపకుండా అక్కడ్నుంచి కదలకూడదని, నిర్ణయించుకున్నాను.

కానీ అన్యాయంగా అతన్ని చంపడానికి నేను పాల్పడలేదు.అతని కట్లు విప్పి నాతో కత్తి దూయమని చెప్పాను.(అప్పుడు నేనక్కడ పడేసినదే దేవదారు చెట్టు కింద దొరికిన తాడు)

కోపంతో మండిపడి అతను తన ఖడ్గాన్ని బయటకి తీశాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా, అలోచనకంటే వేగంగా, నన్ను పొడవడానికొచ్చాడు.

మా ఇద్దరి మధ్య జరిగిన పోరాటం యొక్క పరిణామం మీకు చెప్పక్కర్లేదనుకుంటా!

ఇరవై మూడవ వేటు!

దయచేసి గుర్తుంచుకోండి.

ఈ విషయం నన్నిప్పటికీ నిర్ఘాంతపరుస్తుంది. ఈ భూమ్మీద ఇరవై మూడు సార్లు నా మీద కత్తి దూసిన వారెవ్వరూ లేరు.(హుషారు గా నవ్వుతూ)

అతను నేల రాలాక, రక్తం అంటిన నా ఖడ్గాన్ని నేలకు దించి, ఆమె వైపు తిరిగాను.కానీ ఆమెక్కడ లేకపోవడం చూసి విస్తుపోయాను.ఆమె ఎక్కడికి వెళ్ళిందో అని ఆశ్చర్యపోయాను. అక్కడున్న పొదల్లో ఆమె కోసం వెతికి చూశాను. ఎక్కడైనా అలికిడవుతుందేమోనని నిక్కబొడిచి విన్నాను;చావుబతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి మూలుగులు తప్ప మరే శబ్దమూ వినరాలేదు.

మేము కత్తులు దూసినప్పుడే, సహాయం కూడగట్టడంకోసం ఆమె తోపులోపడి పారిపోయుండొచ్చు.

అలా ఆలోచించగానే అది నా చావు బతుకుల సమస్యగా నిర్ణయించుకుని, అతని ఖడ్గం తో పాటు విల్లు బాణాలూ అపహరించి కొండమార్గం గుండా కిందికి చేరుకున్నాను.

అక్కడే ప్రశాంతంగా గడ్డి మేస్తున్న వారి గుర్రం కనిపించింది.

ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం అనవసర శ్రమ అనుకుంటా!

కానీ నగరంలోకి ప్రవేశించకముందే అతని ఖడ్గాన్ని వదిలించుకున్నాను.

ఇదే నా ఒప్పుకోలు!

నా తలను ఎలాగూ ఇనుప గొలుసుకెక్కిస్తారని తెలిసే చెప్తున్నాను, నన్ను కఠినంగా శిక్షించండి!(అవిధేయమైన దృక్పథం తో)

*****

rashomon3

షిమిజూ దేవాలయాన్ని సందర్శిచవచ్చిన ఒక యువతి ఒప్పుకోలు

నీలం రంగు కిమోనో ధరించిన ఆ వ్యక్తి, నన్ను తన వశం కమ్మని బలవంతం చేస్తూ, అక్కడ కట్టివేయబడిన నా భర్త వైపు చూస్తూ వెకిలిగా నవ్వసాగాడు. నా భర్త ఎంతటి దిగ్భ్రమకు గురైవుంటాడో! బలం పెట్టి కట్లు తెంపుకోడానికి ఎంత యాతనపడ్డా కూడా తాడు ఆయన్ని మరింత బిగువుగా కట్టేసింది. నా గురించి మర్చిపోయి నా భర్త వైపుకు పరిగెట్టాను. లేదా పరిగెడ్దామని ప్రయత్నించాను, కానీ ఆ వ్యక్తి నేనక్కడకు చేరకముందే నన్ను కిందపడేశాడు.సరిగ్గా అప్పుడే నా భర్త కళ్ళల్లో వర్ణించనలివి గాని వెలుగును చూశాను. అది మాటల్లో వ్యక్తీకరించలేనిది….అతని కళ్ళు ఇప్పుడు తలుచుకున్నా నా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ క్షణంలో నా భర్త విసిరిన చూపుతో, ఒక్క మాటయినా మాట్లాడకుండానే, అతని హృదయాన్ని నాముందుంచాడు. ఆయన కళ్ళల్లోని ఆ వెలుగు – అటు కోపమూ కాదు, ఇటు బాధా కాదు – ఒక విచిత్రమైన వెలుగు; రోతతో నిండిన ఒక చూపు! ఆ దొంగ చేసిన ఘాతుకం కంటే నా భర్త చూపు చేసిన విఘాతం తట్టుకోలేక గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయాను.

నాకు మెలుకువ వచ్చేసరికి నీలం రంగు బట్టలు ధరించిన వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నా భర్త మాత్రం ఇంకా దేవాదరు వృక్షానికి కట్టివేయబడివుండడం చూశాను. వెదురు ఆకులను తొలగించుకుంటూ ఎలాగో కష్టపడిలేచి నా భర్త మొహంలోకి చూశాను;కానీ ఆయన కళ్ళల్లో ఇదివరకటి భావమే తొణికిసలాడింది.

అవజ్ఞత నిండిన ఆయన కళ్ళ వెనుక విపరీతమైన ఏవగింపు నిండివుంది.లజ్జ, అంతర్వేదన, కోపం….అప్పుడు నేననుభవించినది ఇప్పుడు వర్ణించలేకపోతున్నాను. తడబడుతున్న అడుగులతో, నా భర్తను చేరుకున్నాను.

టకెజిరో! విషయం ఇంతవరకూ వచ్చాక ఇక నేను నీతో బతకలేను.నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను…కానీ నువ్వు కూడా చనిపోవాలి. నువ్వు నా అధోముఖాన్ని చూశావు. నువ్వున్న పరిస్థితుల్లో నీవు బతికుండడం భరించలేను” అన్నాను.

అంతకంటే మరోమాట మాట్లాడలేకపోయాను. అప్పటికీ ఏవగింపు మరియు జుగుప్స నిండిన కళ్ళతో ఆయన నన్ను చూడసాగాడు. ముక్కలయిన హృదయంతో, ఆయన ఖడ్గం కోసం వెతికాను. అది ఆ దొంగ తీసుకెళ్ళుండవచ్చు. ఆయన ఖడ్గం కానీ, విల్లుబాణాలు కానీ ఆ తోపు పరిసరాల్లో కనిపించలేదు. కానీ అదృష్టం కొద్దీ నా బాకు నా కాళ్ళ దగ్గరే పడివుంది. దానిని తల వద్దకు ఎత్తిపెట్టి “మీ ప్రాణాలు నాకర్పించండి. తక్షణమే నేనూ మీ వెంటనే నడుస్తాను” అన్నాను.

ఈ మాటలు వినగానే ఆయన అతికష్టం మీద పెదవులు కదిపాడు. ఆకులతో కుక్కబడిన ఆయన నోటివెంట వెలువడ్డ మాటలు సరిగ్గా వినబడలేదు కానీ ఆయన మాటలు నాకు వెను వెంటనే అర్థమయ్యాయి.ఏవగింపు నిండిన అతని కళ్ళు “నన్ను చంపెయ్” మన్నట్టుగా చూశాయి. స్పృహలోనూ లేక ఆదమరచీ ఉండని ఒక స్థితిలో, నా బాకును ఊదారంగు కిమోనో ధరించిన ఆయన గుండెల్లో దింపాను.

ఈ సమయంలో నేను తిరిగి స్పృహ కోల్పోయివుండొచ్చు.

తిరిగి నేను కళ్ళు తెరిచే సరికి, తాడుతో బంధింపబడివుండగానే-ఆయన తన చివరి శ్వాస వదిలిపోయాడు. దట్టమయిన దేవదారు మరియు వెదురు ఆకుల సందుల్లోంచి వస్తున్న ఒక సూర్య కిరణం వివర్ణమయినా ఆయన మొహం పై పడి మెరిసింది. పెల్లుబుకుతున్న దు:ఖాన్ని దిగమింగుకుని ఆయన శవాన్ని చుట్టివున్న ఆ తాడు ఊడదీశాను.

ఆ తర్వాత….ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే శక్తి నాలో ఇంకా మిగిలిలేదు.

నాకు చనిపోయే శక్తి కూడా మిగల్లేదని మాత్రం చెప్పగలను. నా దగ్గరున్న బాకుతో గొంతు కోసుకున్నాను, అక్కడే వున్న సరస్సులో దూకాను, ఇంకా చాలా విధాలా ప్రయత్నించాను.నా జీవితం ముగించలేక అప్రతిష్టతో ఇలా జీవితం కొనసాగిస్తున్నాను. (వివిక్తంగా నవ్వుతూ) అత్యంత దయార్ద్ర అవలోకితేశ్వరులు కూడా దయచూపించలేని అప్రాచ్యురాలినై వుంటాను.

నా భర్తను నా చేతులారా చంపాను. ఆ దోపిడి దొంగ చే చెరచబడ్డాను. ఇప్పుడు నేనింకేం చెయ్యగలను? ఇంక నేనేం…నేను….(వెక్కి వెక్కి ఏడవసాగింది.)

*****

సోదిగత్తె ద్వారా హత్యగావించబడ్డ వ్యక్తి చెప్పిన కథనం

నా భార్యను చెరిచిన తర్వాత ఆ దోపిడీదారు అక్కడే కూర్చుని ఆమెతో ఓదార్పు మాటలు మొదలుపెట్టాడు. నేను ఒక్కమాటైనా మాట్లాడలేకపోయాను. నేను దేవదారు వృక్షానికి గట్టిగా కట్టివేయబడి వున్నాను. అప్పటికీ ఆమెకేసి చూస్తూ “ఆ దగాకోరు మాటలు నమ్మొద్దు” అని కనుసైగల ద్వారా తెలియచేసే ప్రయత్నం చేశాను. అలా ఎన్నో సార్లు ఆమెకు ఈ విషయం తెలియచెప్పాలని చూశాను. కానీ అప్రసన్నురాలై వెదురు ఆకులపై కూర్చున్న నా భార్య వంచిన తలయెత్తకుండా, చూపులు ఒడిలోనే కేంద్రీకరించింది. ఆమె వాలకం చూస్తే, అతని మాటలు వింటున్నట్టే అనిపించింది. అసూయతో కలతచెందాను. ఈ లోగా ఆ దగాకోరు తెలివిగా ఆ మాటా ఈ మాటా ప్రస్తావిస్తూ వచ్చాడు. చివరికి ఆ దోపిడిదారు తెగించి “ఒకసారి నీ శీలానికి కలంకం కలిగాక, నీ భర్తతో ఎలాగూ సరిగ్గా మెలగలేవు. అందుకే నా భార్యవు కారాదూ? నేనీ అఘాయిత్యానికి తలపడడానికి కారణం నీమీద నాకున్న ప్రేమే”, అని సిగ్గువిడిచి అడిగేశాడు.

ఆ పాతకుడలా చెప్తుండగా, వివశత్వంతో తలెత్తింది. ఆ క్షణంలో కనిపించినంత అందంగా ఆమె మరెప్పుడూ కనిపించలేదు. నేనక్కడ చెట్టుకు కట్టివేయబడివుండగా అందగత్తె అయిన నా భార్య వాడికేమని సమాధానం చెప్పిందో? నేనిప్పుడు ఈ శూన్యంలో కలిసిపోయుండవచ్చు, కానీ ఇప్పటికీ ఆమె సమాధానం తలచుకుంటే కోపం అసూయలతో నిండా రగిలిపోతుంటాను. “నువ్వెక్కెడికెళ్తే నన్నూ నీ వెంట తీసుకెళ్ళ” మని ఆమె చెప్పింది.

ఆమె పాపం ఇది మాత్రమే కాదు.అది మాత్రమే అయ్యుంటే ఈ చీకటిలో నేనింత బాధింపబడివుండేవాడిని కాదు. ఆ రోజు కలలోలాగా వాడితో చేతిలో చెయ్యేసుకుని తోపు లోనుంచి నడిచివెళ్తూన్న ఆమె మొహం ఒక్కసారిగా వివర్ణమయింది. నా వైపు చూపించి “వాడ్ని చంపు.వాడు బతికున్నంతవరకూ నేను నిన్ని పెళ్ళి చేసుకోలేను” అని అంది. “వాడ్ని చంపు”, అంటూ పిచ్చెక్కిన దాని వలె అరిచింది. ఇప్పటికీ ఆ అరుపులు నా చెవులో మ్రోగి నన్ను అధ:పాతాళానికి చేరుస్తాయి. ఇంతకంటే ఏహ్యమైన మాటలు మరే మానవమాత్రుల నోటి నుంచైనా గతంలో వెలువడివుంటాయా? ఇంతకుమించిన శాపనార్థాలు మరే మానవమాత్రుడైనా వినివుంటాడా? ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి…..(జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) అప్పుడామెన్న మాటలకు ఆ బందిపోటు కూడా వివర్ణుడైనాడు. అతని చేతులు పట్టుకుని “వాడ్ని చంపెయ్” అంటూ ఏడ్చింది. ఆమె వైపు కఠినంగా చూస్తూ అతను కాదనలేదు, అవుననలేదు….ఏం చెప్తాడా అని ఆలోచన కూడా నాలో మొదలవ్వకముందే ఆమెను వెదురు కొమ్మలపైకి నెట్టాడు.(మరో సారి జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) మౌనంగా చేతులు కట్టుకొని అతడు నా వైపు చూసి “మీరయితే ఆమెనేం చేసుండేవారు? చంపడమా వదిలేయడమా? మీరు తలూపండి చాలు. ఆమెను చంపెయ్యనా?” అనడిగాడు. కేవలం ఈ మాటల కోసమే నేనతని నేరాన్ని క్షమించగలను.

నేనేం చెప్పాలో తడబడుతుండగా, ఆమె కెవ్వుమని అరుస్తూ తోపు లోకి పారిపోయింది. ఆమెను ఒడిసి పట్టుకోడానికి ఆ దొంగ ప్రయత్నించాడు కానీ అప్పటికే ఆమె అతని చేజారిపోయింది.

ఆమె పారిపోయాక అతను నా ఖడ్గం తో పాటు నా విల్లు బాణాలు తస్కరించి ఒక్క వేటుతో నన్ను బంధించిన తాడు కట్లు తెంపుతూ, “ఇప్పుడు ఇక నా రాత ఎలా రాసుందో” అని గొణుక్కుంటూ అక్కడ్నుంచి మాయమయ్యాడు. ఆ తర్వాత అక్కడంతా నిశ్శబ్దం. లేదు, ఎవరిదో ఏడుపు వినిపించింది. మిగిలివున్న నా కట్లు విప్పుకుంటూ చెవులు రిక్కించి విన్నాను. ఆ ఏడుపు నాలోనుంచే వస్తుందని గ్రహించాను. (చాలా సేపు మౌనం.)

అలసిపోయిన నా శరీరాన్ని దేవదారు వృక్షపు మొదలు నుంచి లేవదీసాను.నా ఎదురుగా నా భార్య వదిలి వెళ్ళిన ఆమె బాకు మెరుస్తూ కనిపించింది. అది తీసుకొని నా రొమ్ములో పొడుచుకొన్నాను. ఒక రక్తపు ముద్ద నా గొంతులోనుంచి ఎగబాకినా కూడా నాకు నొప్పి తెలియలేదు.కాసేపటికి నా రొమ్ము చల్లబడ్డాక అక్కడ శ్మశాన నిశ్శబ్దం నెలకొంది.  పర్వతాల నడుమ ఉన్న ఈ సమాధి పై ఎగురుతూన్న ఒక చిన్న పక్షి అరుపు కూడా లేక అక్కడ గాఢమైన నిశ్శబ్దం తాండవించింది. కేవలం ఒక ఒంటరి కిరణం దేవదారు వృక్షాలపై మెరుస్తూ కొండలపై చేరింది. క్రమంగా ఆ వెలుగు మాయమవ్వసాగింది; దాంతోపాటే దేవదారు మరియు వెదురు వృక్షాలు నా చూపునుంచి దూరమయ్యాయి. నేనక్కడ పడుకొని వుండగా నిశ్శబ్దం దుప్పటిలా నన్నావరించింది.

ఇంతలో ఎవరో నాపైకి ఎగబ్రాకారు. ఎవరో చూద్దామని ప్రయత్నించాను. కానీ అప్పటికే చీకటి నన్ను చుట్టుముట్టేసింది. ఆ వచ్చిన వారెవరో….ఎవరో కానీ నా రొమ్మున గుచ్చుకొన్న బాకును నెమ్మదిగా అక్కడనుంచి తొలగించారు.అప్పుడు మరోసారి రక్తం నా నోట్లోకి ఎగబాకింది. అప్పుడు నేను శాశ్వతాంధకారంలో మునిగిపోయాను.

-అయిపోయింది-

                                                                                                                అనువాదం: వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి

 

శ్రాద్ధమూ, దాని ఎకనమిక్సూ !

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు: బంధుమిత్ర జనాలు అందరికీ పాండవులు ఉదకకర్మ నిర్వర్తించాక మైలదినాలను గంగాతీరంలో గడపడానికి, అక్కడ ఎత్తుపల్లాలు లేని చోట కుటీరాలు నిర్మింపజేశారు. ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన పెద్దలతో; యుద్ధంలో మృతులైన భరతవీరుల భార్యలతో సహా నెలరోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన మునులందరూ శిష్యులను వెంటబెట్టుకుని ధర్మరాజును చూడడానికి వచ్చారు…

                                                                                  (శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం)

మహాభారతంలోని అనేక ఘట్టాలు, విశేషాలు ప్రచారంలో లేవు. ఎన్నో ఆసక్తికర విషయాలు మరుగున పడిపోయాయి. వాటిలో శ్రాద్ధకర్మ గురించిన ముచ్చట్లు ఒకటి. ‘పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి ఖర్చైపోయిం’ దనే నానుడి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.  కథలోకి వెడితే, ఇది సహజోక్తే తప్ప ఏమాత్రం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.

యుద్ధపర్వాల తర్వాత శాంతిపర్వం  పైన పేర్కొన్న వైశంపాయనుని కథనంతో ప్రారంభమవుతుంది. అది ఒకవిధంగా మృతవీరుల ‘ఆత్మశాంతి’పర్వం కూడా.  భరతవంశీకులు మైల పాటించిన ఆ నెలరోజులూ గంగాతీరం లోని ఆ ప్రాంతం ఒక మినీ హస్తినాపురం అయిపోయిందని పై వివరాలను బట్టి అర్థమవుతుంది. పాండవులు, ధృతరాష్ట్రాది పెద్దలూ, మృతవీరుల కుటుంబాలూ  ఉండడానికి ఎన్ని కుటీరాలు నిర్మింపజేసి ఉంటారో, అందుకు ఎంత శ్రామికశక్తిని వినియోగించి ఉంటారో, వంటలూ-వార్పులూ, ఇతర సేవలూ అందించడానికి ఏ సంఖ్యలో సిబ్బందిని నియమించి ఉంటారో ఊహించుకోవచ్చు. దీనికితోడు, పరామర్శకు  శిష్య, పరివార సమేతంగా వచ్చే మునులు, ఇతర రాజబంధువుల వసతికీ, భోజన, సత్కారాలకూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగే ఉంటాయి. ఇక చనిపోయిన వీరులకు వారి వారి స్థాయిని బట్టి నిర్వహించే పరలోక క్రియలలో సువర్ణదానం, గోదానం, భూదానం వగైరాలు విధిగా ఉండి తీరతాయి. ఇలా లెక్కిస్తే కురుపాండవవీరులు, బంధుమిత్రుల అంత్యక్రియలకు పాండవులు వెచ్చించిన సంపద అనూహ్య ప్రమాణంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

09balikakka_large

ఇదిగాక ధర్మరాజుకు ఇంకో నైతిక బాధ్యత కూడా ఉంది.  కౌరవుల అంత్యక్రియలకు తను లోటు చేశాడనే భావన  పెదతండ్రి ధృతరాష్ట్రునికీ, పెత్తల్లి గాంధారికే కాక; ఇతరులకూ కలగకుండా చూసుకోవాలి.  శ్రాద్ధ దినాలలో ధృతరాష్ట్రుడు భారీగా గోవులను, బంగారాన్ని దానం చేసి తన నూరుగురు కొడుకులకూ ఘనంగా పరలోక క్రియలు నిర్వహించే ఏర్పాటు ధర్మరాజు చేశాడని మహాభారతం చెబుతోంది. పైగా ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేపట్టే సమయానికి ఖజానా ఖాళీ అయిపోయింది.  అశ్వమేధయాగం చేయమని ధర్మరాజుకు వ్యాసుడు సూచించినప్పుడు; నా మీద ఈర్ష్యతో దుర్యోధనుడు అనేకమంది రాజులను, సేనలను కూడగట్టుకునే ప్రయత్నంలో భూమినీ, ఖజానాను ఖర్చుపెట్టేశాడనీ, ఇప్పుడు ధనం లేదనీ ధర్మరాజు అంటాడు. అదలా ఉంచి,  ధర్మరాజు పాలనలో కొన్నేళ్ళు గడచిన తర్వాత,  ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి  వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.  ధర్మరాజును పిలిచి ఆ సంగతి చెబుతూ; ఇప్పటికే నా కుమారులకు అనేకసార్లు శ్రాద్ధం పెట్టావు కనుక, వారి కోసం ఇంకేమీ చేయవద్దని అంటాడు. ధృతరాష్ట్రుడంతటి వాడు అలా మొహమాట పడడానికి కారణం, శ్రాద్ధకర్మలు కోశాగారాన్ని చాలావరకూ హరించివేయడమే.  అయితే, శ్రాద్ధకర్మ విశ్వాసానికే కాక, వైభవానికీ కొండగుర్తుగా మారిన ఆ రోజుల్లో తను వానప్రస్థానికి  వెళ్లబోయేముందు చివరిసారి కొడుకులకు వైభవోపేతంగా శ్రాద్ధం నిర్వహించాలనే కోర్కెను ధృతరాష్ట్రుడు  అణచుకోలేకపోయాడు. ధర్మరాజు ముందు నేరుగా దానిని బయటపెట్టడానికి మొహమాటపడి విదురునితో చెప్పించాడు. విశేషమేమిటంటే, భీముడు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా అర్జునుడు అతణ్ణి మందలించి తన వాటాలోంచి ఆ ఖర్చు భరించడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుని మనసులోనే మెచ్చుకున్నాడని మహాభారతం చెబుతోంది.

మహాభారతంలోని ఈ ‘శ్రాద్ధనామిక్స్’ కోణాన్ని ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అయితే, ప్రపంచమంతటా ఉన్న ఈ అంత్యక్రియల ఆచారం(cult of dead) మిగులు సంపదనే కాక, తెగలకు తెగలనే అంతరింపజేసిందని కోశాంబి అంటాడు. ఉదాహరణకు, మృతసముద్రం సమీపంలోని జోర్డాన్ నదీలోయలో క్రీ.పూ. 3800-3350 మధ్యకాలంలో నివసించిన ఘాసూలియన్లు.  వీరు మృతులను పూడ్చిపెట్టిన చోట రాకాసి గుళ్ళు నిర్మించేవారు. మతపరమైన  సంక్లిష్ట అలంకరణలకు వీరు ప్రసిద్ధులు. బ్రిటన్, ఐబీరియా(స్పెయిన్, పోర్చుగల్, అండోరాలను ఐబీరియా దేశాలంటారు), దక్షిణ భారతదేశాలలో ఇంతకంటే భారీగా రాకాసిగుళ్ళ నిర్మాణం జరిగింది. ‘సామాజిక ప్రగతికి ఏమాత్రం దోహదపడని ఈ పితృకర్మలకు ఉన్న కొద్దిపాటి మిగులునూ ఖర్చు పెట్టేశా’రని కోశాంబి అంటాడు.  ఇటలీకి దక్షిణంగా, లిబియాకు ఉత్తరంగా మధ్యధరా సముద్ర మధ్యంలో మాల్టా దీవులున్నాయి. రాతి యుగం అంతానికి మాల్టా ఒక పవిత్రద్వీపంగా పేరుతెచ్చుకుంది.  ఆ దీవులనుంచి అప్పట్లో భారీ ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉండేది. 1930లలో అక్కడ జరిగిన తవ్వకాలలో ప్రతిచోటా అలంకృత అస్థికలశాలు బయటపడ్డాయి. అంటే, వ్యాపారం తాలూకు మిగులునంతటినీ అంత్యక్రియల సంస్కృతి  హరించివేసిందన్నమాట. ఇదే ప్రక్రియను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మెసపొటేమియా, సింధు నాగరికతలు ఇలాగే అభివృద్ధికి దూరంగా స్తంభించిపోయాయి. ఆహారోత్పాదనకు అవసరమైన మెరుగైన సాధనాలు, పద్ధతులు తమకు అందుబాటులో ఉన్నాసరే,  సింధు నగరాల నిర్మాతలు వాటిని వాడుకోలేకపోయారు. ఇక ఈజిప్టు తన వద్ద ఉన్న భారీ మిగులునంతటినీ, గడియారాలను తయారుచేసేవారు చూపించేటంత సునిశితదృష్టితో(with watch-maker’s accuracy) బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి ఖర్చు పెట్టేసింది. క్రమంగా అంత్యక్రియల సంస్కృతీ, పురోహిత వర్గం దేశం మొత్తాన్ని తినేశాయి.

sraddham

పురా కాలం నుంచి మన కాలంలోకి వద్దాం. ఇంగ్లీష్ లో పేట్రియార్క్(patriarch), పేట్రియార్కీ(patriarchy) అనే మాటలు ఉన్నాయి. పేట్రియార్కీ ని పితృస్వామ్యంగా అనువదించి మనం వాడుకుంటున్నా, పేట్రియార్క్ అనే మాట మన దగ్గర పెద్దగా వినియోగంలో లేదు. అయితే, (ఉమ్మడి)కుటుంబ యజమానిని సూచించే ఆ మాట ఇప్పటికీ ఇంగ్లీష్ లో తరచు వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకు సమానార్థకం మన పురాణ,ఇతిహాసాలలో కనిపిస్తుంది. అది, ‘ప్రజాపతి’. మన కశ్యపుడు, దక్షుడు మొదలైనవారు; యూదుల అబ్రహాం ప్రజాపతులు. దీని గురించి మరిన్ని వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

పేట్రియార్క్ గా చెప్పదగిన ఒక వ్యక్తి మా దగ్గరి బంధువులలో ఒకాయన ఉండేవారు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఆయనకు పదిమంది కొడుకులూ, ముగ్గురు కూతుళ్ళు. వీరు కాక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అక్క కొడుకులిద్దరిని కూడా ఆయనే పెంచి పెద్దజేశారు. కొడుకులకు ఉద్యోగాలు వచ్చి, పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగి వారికి పెళ్లీడు వచ్చిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబవ్యవస్థే కొనసాగుతూ ఉండేది. కొడుకులు వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నాసరే, తండ్రిపట్ల భయభక్తులూ, ఉమ్మడి కుటుంబ సంప్రదాయమూ వారిని నీడలా అంటిపెట్టుకునే ఉండేవి. ఆయన ఇంట్లో తగు మాత్రం పాడి-పంట ఉండేవి. గోసేవ విధిగా జరుగుతూ ఉండేది. కుటుంబ సభ్యులకు అదనంగా వచ్చిపోయే సాధు, సంతులతో; అతిథి అభ్యాగతులతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఆయన ఉదయమే స్నానసంధ్యలూ, పూజాదికాలూ ముగించుకుని చావిడిలో పెద్ద కుర్చీలో గంభీరంగా, సింహంలా కూర్చుని నామ జపం చేసుకుంటే ఉండేవారు. అయినా సరే, ఇంటి వ్యవహారాలు ఏవీ ఆయన కనుసన్నలను దాటిపోయేవి కావు.

శ్రాద్ధకర్మ శాస్త్రోక్తంగా జరపడం పట్ల ఆయనకు ఎంత పట్టింపు అంటే, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆయన గోవును కొని మరీ దానం చేశారు. అంతేకాదు, దానిని ఎట్టి పరిస్థితులలోనూ అమ్మబోనని దానం పుచ్చుకున్న బ్రాహ్మణుని నుంచి హామీ తీసుకునేవారు. అప్పటికీ నమ్మకం కుదరక, గోవు ఉందో లేదో, గోసేవ సక్రమంగా జరుగుతోందో లేదో చూసిరమ్మని కొన్ని రోజులపాటు ఆ బ్రాహ్మణుని ఇంటికి కొడుకుల్ని పంపించి ఆరా తీసేవారు.

అలా ఉండగా, ఆయన అర్థాంగి కాలం చేశారు. ఆరుగురు కొడుకులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉన్నారు. మాసికాలు ఉమ్మడిగా, అందులోనూ నరసాపురంలో పెట్టవలసిందే కనుక సంవత్సరం పొడవునా ప్రతి నెలా కొడుకులు, కోడళ్ళు రైల్లో టికెట్లు రిజర్వు చేసుకుని హైదరాబాద్ నుంచి నరసాపురం బయలుదేరి వెళ్ళేవారు. ఇలా ఏడాది గడిచిచింది. తల్లికి సంవత్సరీకాలు జరిగాయి. విచిత్రంగా ఆ మరునాడే పెద్దాయన కాలం చేశారు. దాంతో ఆరుగురు కొడుకులూ-కోడళ్లూ హైదరాబాద్ నుంచి నరసాపురానికి నెల నెలా వెళ్ళే ఆవృత్తి, మధ్యలో ఎక్కడా విరామం లేకుండా, పునఃప్రారంభమైంది. శ్రాద్ధకర్మలకు ఎటూ వ్యయం భారీగానే జరుగుతుంది. దానికి, రెండేళ్లపాటు జరిగిన ఈ శ్రాద్ధయాత్రా వ్యయం ఏ మేరకు తోడయిందో నన్న ప్రశ్న, దీనిని తలచుకున్నప్పుడల్లా నాలో ఆసక్తిని రేపుతూ ఉంటుంది.

నేను ఆర్థికవేత్తను కాదు. ఒకరి వ్యయం ఇంకొకరికి ఉపాధి అవుతుందనే సాధారణ అవగాహనతో చూసినప్పుడు దీనినంతటినీ దుర్వ్యయం అని చటుక్కున తీర్పు చెప్పే సాహసం చేయలేను. అయితే, ఆ వ్యయం వల్ల కలిగే లాభం  అన్ని వర్గాలకూ సమానంగా పంపిణీ కాకుండా, ఏ ఒక్క వర్గం దగ్గరో పోగుబడితేనే సమస్య. మనిషి ఆర్థికజీవి అంటారు. అంతకంటే ఎక్కువగా విశ్వాసజీవి అనీ; మతంలోనూ, క్రతువులోనే మనిషి పురా కాలం నుంచి ఆధునిక కాలం వరకూ తన అస్తిత్వానికి అర్థం వెతుక్కున్నాడనీ నాకున్న పరిమిత చారిత్రిక జ్ఞానంతో స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చాను. వివాదాస్పదమైన ఈ అంశంలోకి ఇప్పుడు లోతుగా వెళ్ళను కానీ; కోశాంబి అన్నట్టు అంత్యక్రియల సంస్కృతి తూకం తప్పి అభివృద్ధిని అడ్డుకుని దేశాలకు దేశాలనే కబళించి వేసే పరిస్థితికి దారితీయిస్తే తప్పక ఆలోచించవలసిందే.

గొప్పింటి పెళ్లిళ్లలో, ముఖ్యంగా రాజకీయనాయకుల ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లలో ఆడంబర వ్యయం తరచు సంచలనాత్మకంగా వార్తలకు ఎక్కడం చూస్తూ ఉంటాం. ఎందుకో శ్రాద్ధకర్మల వార్తలు ఆ స్థాయిలో వెలుగు చూడడం లేదు. అలాగే శ్రాద్ధానికి చెందిన ఆర్థిక కోణాన్ని కూడా ఎవరూ పరిశీలిస్తున్నట్టు లేదు. ఒకనాటి శ్రాద్ధ కర్మల వైభవప్రదర్శన ఇప్పుడు తగ్గుముఖం పట్టిందా, లేక దీనికి మరో కారణం ఉందా అన్నది తెలియదు. పురా కాలంలో బహుశా పెళ్లి కంటే ఎక్కువగా చావే వైభవోపేతం అనిపిస్తుంది.

–కల్లూరి భాస్కరం

 

వీలునామా – 13వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

 

ఎడిన్ బరోలో బ్రాండన్

“నాతో పాటు డాన్సు చేయడం మీకు బాగుంటుందో లేదో! నేను మీలా ఇంగ్లండు నాజూకు తెలిసిన మనిషిని కాను. ఆస్ట్రేలియాలో తిరిగే మోటు మనిషిని,” బ్రాండన్ ఎల్సీతో వినయంగా అన్నాడు. ఎల్సీ కొంచెం కొత్త మనిషి ముందర కంగారు పడింది. దానికి తోడు అతను ఒడ్డూ పొడవూ బాగా వుండి, ఎండలో వానలో తిరిగినట్టు మొరటుగా వున్నాడు. అతనితో నాట్యం చేయాల్సిన బాధ్యత తప్పినందుకు ఎలీజా రెన్నీ చాలా సంతోషించింది.

“ఆస్ట్రేలియాలో మీరు వుండేది ఎక్కడ?” ఎల్సీ అడిగింది అతన్ని.

“విక్టోరియా. ఇంతకు ముందు దాన్ని పోర్టు ఫిలిప్ అని పిలిచేవారు.”

“మీరక్కడికి వెళ్ళి చాలా కాలమైందా?”

“చాలానే అయింది. ఇక్కడ నా స్నేహితులు నన్ను మరిచిపోయేంత. అలాగని నాకు నా స్నేహితుల మీద కోపమనుకునేరు. అలాటిదేమీ లేదు.”

అతని యాసా, వాడే మాటలూ కొంచెం విభిన్నంగా వున్నాయి. బహుశా అది ఆస్ట్రేలియాలో వాడుక భాష అయివుండొచ్చు అనుకున్నదామె.

“ఎల్సీ! అక్కడ జీవితం బలే మోటుగా వుంటుందిలే. ఇక్కడ మీ అందరి మంచి బట్టలూ, మర్యాదలూ, నవ్వులూ, మాటలూ చూస్తూ వుంటే భలే హాయిగా వుంది. నేనిక్కడికి వచ్చీ చాలా యేళ్ళయిపోయిందేమో, ఇదంతా ఎదో పూర్వ జన్మ ఙ్ఞాపకం లా వుంది.”

ఎల్సీకి అతనెవరో తెలిసిపోయింది. ఆమెకి గమ్మత్తుగా నిపించింది. ఇతని గురించి నాకు చాలా తెలుసు, కానీ ఇతనికి నా గురించే మీ తెలియదు కదా అనుకుంది. అచ్చం పెగ్గీ వివరించినట్టే వున్నాడతను.

“ఇంగ్లండు వచ్చి ఎన్నాళ్ళయింది?” అడిగింది.

“కొద్ది నెలలు.”

“మీ బంధువులంతా ఇంగ్లండులో లేరా? స్కాట్లాండు కెందుకొచ్చారు?”

“ఆస్ట్రేలియాలో వుండే మనవాళ్ళంతా బ్రిటన్ మొత్తం చూడాలని ఆశపడతారు. ఇక్కణ్ణించి వెనక్కెళ్ళింతర్వాత ఉత్త ఇంగ్లండు వెళ్ళొచ్చానంటే చులకనగా చూస్తారు. అందుకే ఈ ట్రిప్పులో స్కాట్లాండు చూద్దామనుకున్నాను. అయితే ఇక్కడ మాకు దూరపు బంధువులు కూడా వున్నారనుకోండి. అదిగో, అక్కడ కూర్చుని వుందే పెద్దావిడ, ఆవిడ నాకు దూరపు చుట్టం. వరసకు పిన్ని అవుతందనుకుంటా. ఆవిడ రెన్నీ వాళ్ళకి కూడ దూరపు బంధువే. మీ స్కాట్ లాండు వాళ్ళకి బంధుత్వాలూ, బంధు ప్రీతీ ఎక్కువేమో కదూ? ఎప్పుడూ విందులూ వినోదాలు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడీ విందు నాకూ బాగుందనుకోండి,” ఎల్సీ కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు.

“హ్మ్మ్… విందుల్లో సంతోషంగా చలాకీగా వుండడం ఇప్పుడు ఫాషన్ కాదండీ! ఇప్పుడు మా దగ్గర మగవాళ్ళంతా ఎప్పుడూ ఏదో మునిగిపోయినట్టు మొహం పెట్టడం ఫాషన్. నాకైతే సంతోషంగా వున్నవాళ్ళే బాగనిపిస్తారు.”  చిరునవ్వుతో బదులిచ్చింది ఎల్సీ.

“అంత సీరియస్ గా మొహాలు పెట్టుకోవడం దేనికో! అసలు నన్నడిగితే ఇంగ్లండు, స్కాట్ లాండు దేశాల్లో వుండగలిగే వాళ్ళు చాలా అదృష్టవంతులన్నట్టే లెక్క. ఎప్పుడూ విందులూ వినోదాలూ, చదువుకోవడం, సాహిత్య చర్చలూ, సంతోషాలూ, అంతా నాజూకు వ్యవహారం. ఎండకి ఎండి, వానకి తడిసే నాలాటి వాడికి కొంచెం అర్థం కాని జీవిత శైలి. కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది కూడ! ఈ సంతోషంలో ఎక్కువ రోజులుండలేను. మళ్ళీ మా వూరికి ప్రయాణం తప్పదు కదా అని.”

అప్పటికి వాళ్ళ నాట్యం ముగిసి ఒక పక్కకొచ్చి నిలబడ్డారు. పక్కనే నిలబడి వుంది జేన్. అతని మాటలు విని,

“మీరనుభవిస్తున్న సంతోషం దేశం వల్లా, విందుల వల్లా వచ్చింది కాదు. మీ మనసులోంచి వచ్చింది. అక్కడ కష్ట పడి పనిచేసారు. ఇక్కడ ఆట విడుపుగా వుంది. అంతే!” అంది.

“ఆస్ట్రేలియానించి ఇక్కడికొచ్చినప్పుడే మాకక్కడ లేనిదేమిటో బాగా అర్థమయ్యేది,” అన్నాడు బ్రాండన్.

“అది పరిస్థితులని బట్టి వుంటుందేమో. నాకైతే బ్రతుకు తెరువు కోసం కొన్నాళ్ళు ఆస్ట్రేలియాలో వుంటే బాగుండనిపిస్తుంది.”

“నాక్కూడా!” అప్పుడే ఫ్రాన్సిస్ తో కలిసి అక్కడికొచ్చిన ఎలీజా రెన్నీ అందుకొంది.

“ఎవరూ అడుగుపెట్టని ప్రదేశం చాలా కొత్తగా, ఉహాతీతంగా వుండొచ్చు కదా? అందులోనూ ఆ బంగారు గనులెలా వుంటాయో చూడాలన్న కుతూహలం కూడా.!”

“ఛండాలంగా వుంటాయి. మీరనే ఆ కొత్తదనమూ, ఉత్సాహమూ మచ్చుకైనా కనబడవు. చెట్లూ చేమలూ లేని ఎడారి ప్రదేశం, ఒంటరితనం, తెగని చాకిరీ, ఏం గొప్పగా వుంటాయి చెప్పండి? విక్టోరియా కెళ్ళగానే ఎప్పుడెప్పుడు ఇక్కణ్ణించి బయటపడదామా అనిపిస్తుంది! బ్రిటన్ అందానికి సాటి వచ్చే ప్రదేశం ఎక్కడా వుండదేమో!” బ్రాండన్ అన్నాడు.

“మన దేశం కంటే మనకింకే దేశమూ నచ్చదనుకోండి!” ఎలీజా ఒప్పుకుంది.

“అయినా బ్రతుకు తెరువు వెతుక్కుంటూ భూమి నలుమూలలా చుట్టి రావడం కూడా అద్భుతంగా వుంటుందేమో! మన ఆంగ్లో- సాక్సన్ జాతి

కున్న శక్తే, ఎలాటి ప్రదేశంలోనైనా నెగ్గుకు రావడం. అందుకే మన వాళ్ళే ఎక్కువ వలస రాజ్యాలు స్థాపించారు.”  జేన్ అభిప్రాయపడింది.

“మీరన్నదీ నిజమే. నన్ను చూడండి. ఆస్ట్రేలియా జీవితానికెంత అలవాటు పడిపోయానో! అది సరే కానీ, మిస్ రెన్నీ, ఈ వచ్చే పాటకి నాతో మీరు నాట్యం చేయగలరా?” బ్రాండన్ మర్యాదగా ఎలీజాని అడిగాడు.

ఎలీజా అయిష్టంగానే ఒప్పుకుని వెళ్ళింది. ఫ్రాన్సిస్ ఎల్సీ పక్కకొచ్చి నిలబడ్డాడు.

అతన్ని చూసి ఎల్సీ మొహమాట పడింది. దానికంటే, తన కవితల గురించి అడుగుతాడేమోనని భయపడింది. తను వచ్చీ రాని కవితలని ప్రచురణకి పంపటం చూసి నవ్వుకున్నాడేమో. అంతకంటే అతను తన ప్రయత్నాలని చూసి పడబోయే జాలిని తల్చుకుని ఇంకా వొణికిపోయింది.

అతనితో ఏమి మాట్లాడకుండా పాటలు వినే నెపంతో, అక్కణ్ణించి వెళ్ళి బాండు మేళం పక్కన నిలబడింది. వాళ్ళకి తన గురించీ, తన కవితల గురించీ తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర భయం లేనట్టనిపించిందామెకి.

దూరం నించి ఆమెని చూసిన ఎలీజా, తనతో పాటు పాటకి అడుగులేస్తున్న బ్రాండన్ తో ఎల్సీ గురించీ, జేన్ గురించీ చెప్పింది.

“నాన్నగారు చెప్పారు. ఇద్దరు అక్కచెల్లెళ్ళూ బాగా చదువుకున్నారట, కానీ మేమందరం చదివినట్టు కాకుండా, కొత్త కొత్త చదువులు చదివారట. విచిత్రంగా అందువల్లే వాళ్ళకి బ్రతుకు తెరువు దొరకడం కష్టమై పోయింది.”

బ్రాండన్ ఏమీ జవాబివ్వకుండా ఎల్సీ వైపు చూస్తూ నిలబడ్డాడు.

“పాపం, ఒంటరిగా నిలబడింది. బ్రాండన్, మనం ఆమె దగ్గర్కికి వెళ్దామా? ఇప్పుడు మనమీ డాన్సు ఆపేస్తే కొంపేమీ మునగదుగా!”

ఎలీజాకి నిజానికి బ్రాండన్ తో కలిసి డాన్సు చేయడం కొంచెం కూడా నచ్చడం లేదు. వాళ్ళు ఎల్సీ దగ్గరకొచ్చేటప్పటికి, అక్కడికి మాల్కం కూడా వచ్చాడు ఎలీజాని చూసి.

“హలో మాల్కం. బాగున్నావా? ఈవిడ ఎల్సీ మెల్విల్. నా కొత్త స్నేహితురాలు. ఎల్సీ, ఇతను మాల్కం, ప్రఖ్యాత రచయిత.”

తనున్న పరిస్థితిలో ఎల్సీకి ప్రఖ్యాత రచయితలని కలిసే ధైర్యం లేదు. ఆమెకి దుఃఖంతో మాట పెకలనట్టయింది ఒక్క క్షణం. ఎలాగో గొంతు పెకలించుకుంది.

“అవునవును, జేన్ చెప్పింది మీ గురించి.”

“ధన్యవాదాలు. జేన్ కూడా వచ్చారా ఈ విందుకు?” చుట్టూ చూస్తూ అడిగాడు మాల్కం.

“అక్కడ ఫ్రాన్సిస్ తో మాట్లాడుతూంది.”

“ఫ్రాన్సిస్ తోనా? ఊమ్మ్.. మేధావులిద్దరూ ఏదో చర్చలో వున్నట్టున్నారు కదూ?” నవ్వాడు మాల్కం.

ఎలీజా ఎల్సీ వైపు తిరిగింది.

“ఎల్సీ! ఫ్రాన్సిస్ మీ ఎస్టేటునీ, గుర్రాలనీ, కుక్కలనీ చాలా శ్రధ్ధగా చూసుకుంటాడు తెలుసా? మీ ఇద్దరి గది చాలా విశాలంగా వుంది కాబట్టి దాన్ని అతిథులకోసం వాడదామని మా అమ్మ అంటే దాదాపు కొట్టినంత పని చేసాడు!”

“జంతువులని ప్రేమగా చూడమని జేన్ అర్థించింది ఫ్రాన్సిస్ ని.”

ఈ సంభాషణ ఎలీజాకి పెద్దగా నచ్చలా. మాల్కం వైపు తిరిగి,

“మాల్కం! నీ కొత్త నవల సంగతేమైంది?” అని అడిగింది.

“రాయటమూ, ప్రింటుకివ్వడమూ కూడ జరిగిపోయాయి.”

గర్వంగా నవ్వాడు మాల్కం.

“ప్రజలకి నచ్చుతుందో నచ్చదో! అయినా నువ్వు రాసిన నవల నచ్చకపోవడమంటూ వుండదులే.”

“మా పబ్లిషరు కథ బానే వున్నా, పాత్రల యాస ఇంకొంచెం గాఢంగా వుంటే బాగుండేదన్నాడు. కూలీ నాలీ జనం యాసలు మనకెలా తెలుస్తాయి చెప్పు? అయినా, ఒక ప్రేమా, ఒక లేచిపోవడమూ, ఒక విడాకులూ, ఒక దెబ్బలాటా, ఒక హత్యా, అన్నీ గుప్పించి రాసి పారేసా!”

“ఓ! నాకు రాత ప్రతి ఒక్కసారి ఇవ్వరాదూ! చదివి ఇచ్చేస్తాను!”

“అసలు నాకు ఈ కథలూ నవలలూ ఎలా రాస్తారో అర్థమే కాదు. ఒక దాని వెంట ఒకటి సంఘటనలు సాగిపోతూ! అంతా చివరికి ఒక పెళ్ళితోనో, మరణంతోనో ఆఖరయ్యేలా! బాబోయ్! తలచుకుంటేనే భయం వేస్తుంది నాకు. కథలే ఇంత కష్టమనిపిస్తే, ఇహ కవితల గురించి చెప్పేదేముంది. ఏమంటారు ఎల్సీ?” బ్రాండన్ అన్నాడు

బ్రాండన్ ప్రశ్నతో ఎల్సీ తడబడిపోయింది.

“అవును. కవితలెలా రాస్తారో నాకూ తెలియదు.” మొహమంతా ఎర్రబడుతూండగా అంది.

“కవితల గురించైతే మీరు, ఇదిగో ఈ రెన్నీ అమ్మాయినే అడగాలి. ఆవిడ చాలా కవితలు రాసారు.” మాల్కం ప్రకటించాడు.

“ఓ మాల్కం! ధూర్తుడా! నా రహస్యాన్నిలా అందరి ముందూ బయటపెడతావా! ఉండు నీ పని చెప్తా!” సంతోషాన్ని దాచుకుంటూ పైకి విసుక్కుంది ఎలీజా రెన్నీ.

“అవునా ఎలీజా? మీరు కవితలు రాస్తారా? ఇహ నాకు మీతో మాట్లాడాలన్నా భయం పట్టుకుంది. ఎల్సీ! నువ్వు కవితలూ కథలూ గట్రా రాయవు కాబట్టి నీ స్నేహమే బాగుంటుంది నాకు.” పరిహాసం చేసాడు బ్రాండన్.

“బ్రాండన్! కవితలు రాయడం అంత కష్టమేమీ కాదు. ఏదో ఒక ఆలోచన రావాలంతే!” ఎలీజా రెన్నీ అంది.

“ఆలోచనా? దేని గురించబ్బా? పెళ్ళా? ప్రేమా? ఆశా? నిరాశా? మృత్యువా? మిరు దేని గురించి రాస్తారు ఎలీజా?” బ్రాండన్ ఆమెనింకా ఊదికిస్తూన్నాడు.

“బ్రాండన్! మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు. అన్నీ ఈ మాల్కం చెప్తున్న అబధ్ధాలు. నిజానికి నేనంత ఎక్కువగా రాసిందీ లేదు.”

“ఆలోచనా? దేని గురించబ్బా? పెళ్ళా? ప్రేమా? ఆశా? నిరాశా? మృత్యువా? మీరు దేని గురించి రాస్తారు ఎలీజా?” బ్రాండన్ ఆమెనింకా ఉడికిస్తూన్నాడు.

“బ్రాండన్! మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు. అన్నీ ఈ మాల్కం చెప్తున్న అబధ్ధాలు. నిజానికి నేనంత ఎక్కువగా రాసిందీ లేదు.”

“అలా కాదు. ఎలీజా, బ్రాండన్ గారికి నువ్వు కవితలతో తయారు చేసిన ఆల్బం చూపించు.” మాల్కం సూచించాడు.

ఎల్సీ కుతూహలంగా, “అవును చూపించండి. నేనూ చూస్తాను. నాకు కవితలు చదవడమంటే చాలా ఇష్టం,” అంది. ఎలీజా రెన్నీ నవ్వు మొహంతో,

“సరే అయితే! లైబ్రరీ గదిలోకి వెళ్దాం రండి. నేనసలు ఆ ఆల్బం ఎవరికీ చూపించను. అది చదివితే బ్రాండన్ గారికి కవితలు రాయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలిసొస్తుందని చూపిస్తున్నా, అంతే!” అంటూ ఎలీజా బయటికి దారితీసింది. ”

ఆల్బం తీసి వారికిస్తూ, “నేను రాసిన కవితలన్నిటి కిందా నా సంతకం, ఎల్లా, అని వుంటుంది.” అని బయటికెళ్ళిపోయింది.

ఎల్సీ, బ్రాండన్ అక్కడే సోఫాలో కుర్చుని ఆల్బం తెరిచారు.  దాన్లో కొన్ని ఎలీజాకి నచ్చిన వేరేవారి కవితలూ, కొన్ని ఆమె సొంతంగా రాసుకున్నా కవితలూ వున్నాయి. ఎల్సీ ఆత్రంగా ఎలీజా కవితలన్నీ గబ గబా చదివేసింది.

“అబ్బో! ఎంత బాగున్నాయో. ఇవన్నీ పత్రికల్లో వచ్చి వుంటాయంటావా? వీటన్నిటినీ ఒక పుస్తకం లా అచ్చేయించుకోలేదెందుకో!” బ్రాండన్ ఆశ్చర్యంగా అన్నాడు.

“ఎందుకంటే, కవితలు పత్రికల్లో ఒకటీ రెండూ ప్రచురించుకోవడం తేలిక. పుస్తకం అచ్చేయించాలంటే చాలా కష్టం.” ఎలీజా అతనికి వివరించింది

“అలాగా? అయినా అచ్చులో పేరు చూసుకోవడం బాగుంటుందేమో కదూ?”

ఏదో అనబోయి ఆగింది ఎల్సీ.  బ్రాండన్ ఇంకా కవితలు చదువుతూనే వున్నాడు.

ఒక కవిత చూపించి నవ్వాడు బ్రాండన్.

“ఇది చూడు. ‘బ్రతుకు ప్రయాణం’ అట. హాయిగా అమ్మా నాన్నలతో సురక్షితంగా జీవితం గడిపే ఎలీజా రెన్నీకి బ్రతుకు ప్రయాణం గురించి ఏం తెలుసు?”

“అవునవును! ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చిన వాళ్ళకే బ్రతుకు ప్రయాణం గురించి మాట్లాడే హక్కు వుంటుంది కాబోలు,” అతన్ని వెక్కిరించింది ఎల్సీ. నవ్వాడు బ్రాండన్.

“అదేం లేదులే. అయినా ఈ కవిత బాగానే వుంది.”

“గ్లాస్గో దాటి వెళ్ళని అమాయకురాలు రాసినా కూడా బాగుందా?”

“ఎలీజా రెన్నీ గ్లాస్గో దాటి వెళ్ళలేదు కాబట్టి ఆమె తెలివి తక్కువదని నేను తీర్మానించలేదు. అంత వెటకారం చెయ్యక్కర్లేదు. అయినా, నిజం చెప్పు. మీరిక్కడ సురక్షితంగా కాలం గడుపుతూ, మాకు  ప్రపంచం తెలుసంటే నమ్మేదెవరు?”

“మీరన్నదీ నిజమే. ఆడవాళ్ళం ఇల్లు దాటి ప్రపంచం చూడం. ఇహ ప్రపంచం గురించి మేం చెప్పేదేముంటుంది? అందుకే మగవాళ్ళకి ఆడవాళ్ళు రాసే పుస్తకాలంటే చులకన కాబోలు!” సాలోచనగా అంది ఎల్సీ.

“మీరు నేనన్నదానికి భలే విపరీతార్థాలు తీస్తున్నారే! నిజానికి నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఎంత తక్కువ అవకాశాలు వున్నా, వాళ్ళు ప్రయత్నం మానరని. ఇహ పుస్తకాల గురించి నా అభిప్రాయలకసలు విలువే లేదు. నేను చదివిందే చాలా తక్కువ కాబట్టి. ఇప్పుడీ కవిత విషయమే తీసుకుందాం. నాకు బాగానే అనిపిస్తుంది. అయితే నిజానికి నాకు ఈ ముందు మూడు మాటలకీ అసలు అర్థమేమిటో కూడా తెలియదు! అయినా నాకు బాగుంది. ఎందుకు బాగుందంటే చెప్పలేను.”

“కవి పాఠకుడి నించి ఆశించేదీ అంతే. ”

“అంతేనా? నేనింకా కవులు ప్రబోధిస్తూ వుంటారనుకున్నానే. ఏమైనా, నాకు ఎక్కువగా చదువుకున్న ఆడవాళ్ళంటే కొంచెం భయం. ఈ మధ్య ఆడ పిల్లలూ, వాళ్ళ తెలివి తేటలూ, శక్తి సామర్థ్యాలు చూస్తూవుంటే నాలాటి వాళ్ళకి వొణుకొస్తూంది! కొంపదీసి నూవ్వూ బోలెడు చదువు చదివేసావా ఏమిటి?”

“అదేం లేదు. నేను చాలా మామూలు అమ్మాయిని.”

“నిజంగానా? అద్భుతంగా పియానో వాయించలేవూ?”

“ఉహూ! అసలు నాకు సంగీతమే రాదు.”

“పోనీ, అందమైన ప్రకృతి దృశ్యాలు గీయడం?”

“అబ్బే…”

“అయితే నువ్వు సైన్సూ, లెక్కల టైపన్న మాట! వాళ్ళంటే ఇంకా భయం నాకు.”

“మా మావయ్య నాకు సైన్సు చెప్పించాలని చాలా ప్రయత్నం చేసారు కానీ, నాకే అబ్బ లేదు.”

“ఇంత మంచి వార్త నేను ఈ జన్మ లో వినలేదు. నీముందు ఏ తప్పులు మాట్లాడతానో అని వణికిపోతూ వుండక్కర్లేదు.”

“మీరు తప్పు మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి సరి దిద్దితే అంత బాధ పడడానికేముంది? మీకది మంచిదేగా?”

“మంచిదే అనుకో! కానీ భలే అవమానంగా వుంటుంది. ఐనా, ఆడవాళ్ళు భలే కష్ట పడి పనిచేస్తారు. గంటలు గంటలు సంగీతం ఎలా సాధన చేస్తారో పాపం.”

“అక్కయ్య ఎప్పుడూ అంటుంది- ఆడవాళ్ళు వాళ్ళకి తేలికగా అబ్బని సంగీతం మీద అంత శ్రమా, సమయం వ్యర్థం చేస్తారూ, అని!”

 

(సశేషం)

 

దేశం నుదిటిపై పచ్చబొట్టు ‘బంజారా నానీలు ‘

 sri
 
       బంజారాలు అనగానే స్మృతి పథంపై మెదిలేవి మోదుగు పూల రంగు దుస్తులు, అద్దాల కాళీ (రవిక ), వెడల్పాటి భుర్యా (ముక్కుపోగు ), చెవులకు బుట్ట లోలాకులు, అలవోకగా వేసుకునే టుక్రీ (మేలి ముసుగు ), కాళ్ళకు బరువైన కడియాలు ధరించి ఇప్ప పువ్వంతటి ముగ్ధత్వంతో తండాలో చలాకీగా తిరిగే అమాయక యువతులు. కట్టెల మోపు ఎత్తుకుని సమీప నగరపు వాడల్లో తిరిగే చెమట పూలు, ఎడ్ల బండ్లు కట్టుకొని ఊరూరా తిరిగి ఉప్పమ్మే దేశదిమ్మరి తనం, ఎన్నో యేండ్ల తరువాత అంగట్లో కలుసుకొని దుఖాన్ని కలబోసుకునే తల్లీ కూతుళ్ళు, మోసం నేర్వని తండాలు, గాసం కోసం అడవంతా గాలించే స్త్రీ, పురుషులు ఇలా ఎన్నో..  ఎన్నెన్నో… ఇవ్వన్నింటినీ రంగరించి నానీలలో పోత పోసి తెలుగు కవిత్వపు వేదిక పై తండా ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేశారు డా. సూర్యాధనంజయ్.
       సాహిత్యం జీవితానికి ఉపనది లాంటిది. నదీ ప్రవాహంలో రాళ్ళు, రప్పలు, ఎత్తులు, పల్లాలు, ఆటంకాలు, వేగం, విశాలత్వం, ఉన్నట్టే ఈ నానీల నిండా బంజారా జీవితాల్లోని అనేక సంఘర్షణలు, మిట్ట పల్లాలు, సంసృతి, తండా బతుకు చిత్రాలు అడవి పూల పరిమళంలా పరచుకుని ఉన్నాయి.
      బంజారాలు, ఎరుకల, సుగాలీలు.. వీళ్ళంతా ప్రధాన స్రవంతికి దూరంగా తమ బతుకేదో తాము బతుకుతూ నిశ్శబ్దంగా ఈ లోకం లోకి వస్తున్నారు, కాల గర్భంలో కల్సి పోతున్నారు. ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ జీవితాలు, 1980 నుండి సాహిత్యంలో చోటు చేసుకుంటున్నా, గిరిజన జాతుల జీవితాలు, వారి అనుభవాలు ఎక్కడా సాహిత్య పుటల్లోకి ఎక్కలేదు. ఎక్కినా అతి తక్కువ. అలాంటి అమలిన, నాగరికత సోకని తండా పైకి ఒక కవిత్వపు కిరణాన్ని ప్రసరింపజేసి, బంజారా సంస్కృతి లోని అనేక రంగుల కాంతి పుంజాన్ని ఆవిష్కరిస్తున్నారు డా. సూర్యధనంజయ్.
      విత్తు తన కడుపులో మహా వృక్షాన్ని దాచుకున్నట్లు ఒక్కో నానీ ఒక్కో గాయాన్ని, శిథిలత్వాన్ని, బతుకు లోతును, తండా శకలాల్ని, జీవితపు పాకుడు రాళ్ళపై పైకెగబాక లేక అంతకంతకూ లోలోతుల్లోకి జారిపోయే తనాన్ని పట్టిచూపుతుంది. ఇటుకపై ఇటుక పేర్చినంత మాత్రాన ఇల్లు కానట్టు నానీ రాయడమంటే పిడికెడు  అక్షరాల్ని కుప్పగా పోయడం కాదు. ఇటుకల్ని కలపడానికి పదార్ధం పూసినట్టు, పదాల్ని  కలపడానికి, ఒక భావాన్ని ఆవిష్కరించడానికి కవిత్వాంశ ఏదో కావాలి. ఆ కవిత్వమనే పదార్థాన్ని కడవ నిండా నింపుకొని నానీల ముఖ ద్వారం గుండా తెలుగు కవిత్వ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన కవయిత్రి డా. సూర్యాధనంజయ్. ఒక్కో వ్యక్తీకరణ పాఠకుడిని కుదుపు కుదిపి, తండా చట్టూ గిర్రున తిప్పి, ఆ తిరుగుడు తనం దేహం నుండి దూరం కాకముందే బతుకు చిత్ర పటంపై నెమ్మదిగా నిలుపుతుంది. అప్పుడు అసలు భావ శకలంలోకో, బతుకు పుటల్లోకో ప్రవేశిస్తాం. కొన్ని నానీలు రోజంతా వెంబడించి కలల్లోకి కూడా దూసుకు వచ్చి కలవరపెడతాయి. స్వప్న ప్రలాపన చేపిస్తాయి. మనసు లోతుల్లో రోజుల తరబడి నానీ నానీ, ‘నానీ’ రూపాన్ని సంతరించుకున్నాయేమో చాలా నానీలు తడి తడిగా మట్టి ముద్రల్ని హృదయపు గోడలపై వేస్తాయి. కొన్ని పద చిత్రాలు కవయిత్రి ప్రతిభకు గీటురాళ్ళుగా నిలిచి అబ్బుర పరుస్తాయి.
                                     పడిలేచే
                                     కెరటాలు వాళ్ళు
                                     వారి జీవితాలు
                                     జయించిన కన్నీళ్లు
  “జయించిన కన్నీళ్లు” అనే పదచిత్రాన్నిబహుశా తెలుగు కవిత్వం ఇప్పటిదాకా చూళ్ళేదేమో . జ్ఞాపకాల బొట్లు, శ్రామిక తపస్సు, కళ్ళల్లో చెలిమల్ని మోయడం, గాయాల గూడు, కడుపమ్ముకోవడం, పచ్చపచ్చని మాటలు, విషాదానికి ఊరే గుణం, శ్రమలోంచి పుట్టిన మయూరం, బానెడు కష్టాలు, వలసల అలజడి వంటి పదచిత్రాలు పఠిత మనసు ముంగిట్లో మేలిమి రత్నాల్లా జలజలా రాలుతాయి. నానీల విలువను కవిత్వపు నిచ్చెన మీదుగా నెల వంకను ముద్దాడేలా చేస్తాయి.
          ప్రపంచీకరణ ఇనుప పాదం పల్లెల మీదా, బతుకుల మీదా మోపిన సందర్భంలో ఆయా ప్రాంతాలు, ఆయా కులాలు, ఆయా జాతులు తమ తమ అస్తిత్వాన్ని పదిలంగా రెండు చేతుల మధ్య కాపాడుకుంటున్నాయి. అందుకు బంజారాలు కూడా అతీతం కాదు. తండా నడి బొడ్డున నిలబడి అక్కడి సంస్కృతిని. జీవితాన్ని, కన్నీళ్లను, గాయాలను, అనుభవించి, కలవరించి, పలవరించి ఒక్కో నానీలో జీవితమంత విశాలత్వాన్ని, గాఢతను 20-25 అక్షరాల్లో సర్దేశారు కవయిత్రి. అందుకే తండా ప్రతీ ముఖం, ప్రతీ కోణం మనకు కనిపిస్తుంది. పుస్తకం నిండా తండా ముచ్చట్లే. ఒక్కటి కూడా ఊహపోహలతో రాసిన నానీ లేదు. ప్రతీ నానీ ఇప్ప పూల అందంతో తొణికిసలాడుతూనే, మట్టి పరిమళాన్ని వెదజల్లుతుంది. అంతే కాదు అక్కడక్కడ బంజారా భాషా పదజాలం కూడా అందంగా ఒదిగి పోతుంది. తీజ్ పండుగ నాటి మొలకల సహజత్వాన్ని చాటుతుంది. కవయిత్రి ఇందులో తన జాతి ఔన్నత్యాన్ని, సొబగుల్ని చెప్తూనే మూఢ ఆచారాల్ని, అమానవీయతను ఎండగడుతుంది.
                                   నోట్లో సారా చుక్కేసి
                                   ఆడ శిశువును చంపేస్తారా?
                                   తండాకు
                                   గుండె లేదా?
  అని ప్రశ్నిస్తుంది. తండా పట్లా. సమాజం పట్ల, సంపూర్ణ బాధ్యతతో రాసిన నానీలు ఇవి. నానీలన్నీ చదివేసిన తరువాత గుప్పెడు నెత్తురు మనసు పొరల్లోకి చిమ్ముకొస్తుంది. అంతరంగాన్నంతా అతలా కుతలం చేస్తుంది. అదే సమయంలో నానీలన్నీ బంజారా డ్రెస్ వేసుకున్న కన్నె పిల్లల్లా మారిపోయి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అందంగా మెలికలు తిరిగే లంబాడ నృత్యాన్ని చేస్తూ సుతి మెత్తని సందడి చేస్తాయి. ఈ నానీలు బంజారా సాహిత్యానికి సరి కొత్త చేర్పు. తండాకు నగరానికి మధ్య ఒక కవిత్వపు వంతెన.
                                   తాండే చ్వారి
                                   పోంటిల్ పక్డన్
                                   అబ్
                                   కాగజ్ శీత్లా కర్లత్!
                                         వెల్దండి శ్రీధర్

కాఫ్కా కథ: పల్లెటూరి డాక్టరు

53544-Franz+kafka+famous+quotes+3ఫ్రాంజ్ కాఫ్కా, జర్మను రచయిత

కాఫ్కా కథ- పల్లెటూరి డాక్టర్

 నేను చాలా చిక్కులోపడ్డాను. నేను అత్యవసరంగా ఒకచోటికి వెళ్ళాల్సి ఉంది. పదిమైళ్ళదూరంలోనున్న గ్రామంలో ఒక రోగి నాకోసం నిరీక్షిస్తున్నాడు. అతనికి నాకూ మధ్యం ఒక తీవ్రమైన మంచుతుఫాను అడ్డంగా వచ్చింది. ఈ పల్లె రోడ్లమీద వెళ్ళడానికి అనువైన పెద్ద చక్రాల తేలికపాటి బండీ ఒకటి నా దగ్గరుంది. నా పరికరాలన్నీ పెట్టుకున్న బ్యాగ్ చేత్తోపట్టుకుని, ఉన్నికోటు వేసుకుని నేను సిద్ధంగా ఉన్నాను; కానీ అసలైంది ఇప్పుడు లేదు…. అదే గుర్రం.

నా గుర్రం నిన్నరాత్రి చచ్చిపోయింది…. ఈ హేమంతపు చలికి  బాగా అలిసిపోయి ఉండడం వల్ల. నా సేవకురాలు పాపం ఊరల్లా పరిగెడుతోంది ఎక్కడైనా గుర్రాన్ని ఎరువుతెచ్చుకుందికి వీలవుతుందేమో ప్రయత్నం చేద్దామని, కానీ నాకు తెలుసు, అది వృధాప్రయత్నం, దొరకదని. అందుకే నేను ఏమీ పాలుపోక నిలుచున్నాను అచేతనంగా, మీదనుండి మంచుకురుస్తూ వేళ్లడం ఇంకా కష్టం చేస్తున్నా. సేవకురాలు గేటుదగ్గర కనిపించింది, ఒంటరిగా. ఆమె చేతిలో లాంతరు ఊగుతున్నాది. అయినా ఇటువంటి వాతావరణంలో ఎవరుమాత్రం గుర్రాన్ని ఎరువు ఇవ్వగలరు ప్రయాణానికి?

నేను మరోసారి వాకిట్లో అటూ ఇటూ పచార్లుచేస్తున్నాను. నాకు మార్గాంతరం కనిపించడం లేదు. మనసువికలమై, బాధతో చాలరోజులబట్టీ వాడకుండా వదిలేసిన పాడుబడ్డ పందులదొడ్డి తలుపుని గట్టిగా ఒక తన్ను తన్నేను చికాగ్గా. దాని మడతబందులమీద అటూ ఇటూ కొట్టుకుంటూ ఒక్కసారిగా తెరుచుకుంది తలుపు. గుర్రాలనుండి వెలువడుతున్న వేడినిట్టూర్పులా ఒక వెచ్చని వాసన గుప్పుమని వచ్చింది. లోపల సాలలో తాడుకి ఊగుతూ లాంతరు మసకమసకగా వెలుగుతోంది. పాకలో ఒదుక్కుని కూచున్న ఒక నీలికళ్ళ మనిషి ముఖం కనిపించింది.

“నేను గుర్రాన్ని బండికి కట్టేదా?” అని చేతులమీద కాళ్లమీదా పాకుకుంటూ వచ్చి అడిగేడు.

నాకు ఏంచెప్పాలో తెలియక వంగిచూసేను పాకలో ఎముందోనని. సేవకురాలు నా పక్కనే నిలుచుంది. “మనింట్లో ఏం వస్తువులు దాచేమో మనకే తెలీదు,” అంది. దానికి ఇద్దరికీ నవ్వొచ్చింది.

“తప్పుకొండి, తప్పుకొండి” అంటూ గుర్రపువాడు ఒక గావుకేక వేశాడు. రెండుగుర్రాలు, కండదేరిన పిక్కలతో, ఒకదాని వెంట ఒకటి తోసుకుంటూ బయటకి వచ్చేయి… కాళ్లు శరీరానికి దగ్గరగా ముడుచుకుని, ఒంటెల్లా తలలు దించుకుని ఆ ఇరుకైన తలుపుసందులోంచి తమ వెనకభాగాన్ని గట్టిగా విదిలించుకుని బయటపడ్డాయి. బయటకి రావడమే తడవు, నిలువుగా నిల్చున్నాయి… పొడవైన కాళ్లతో, నిగనిగ మెరుస్తున్న శరీరాలతో.

“అతనికి సాయం చెయ్యి,” అన్నాను ఆ పిల్లతో.

వెంటనే ఆ పిల్ల బండీ పగ్గాలు గుర్రంవాడికి ఇవ్వడానికి వినయంగా పరిగెత్తింది. కాని ఆ పిల్ల అతని పక్కన చేరగానే అతను ఆమెమీద చేతులువేసి తన ముఖాన్ని ఆమె ముఖానికి ఆనించ బోయాడు. దానితో ఆమె ఒక్కసారిగా కేకవేసుకుంటూ నాపక్కకి చేరింది.

“మూర్ఖుడా,” అని కోపంతో అతని మీద అరిచేను, ‘నీకు కొరడా దెబ్బలు కావాలా?” అంటూ.

కాని నాకు వెంటనే గుర్తొచ్చింది… అతను నా సేవకుడు కాదనీ, ఎవడో పరాయివాడనీ; అత నెక్కడినుంచి వచ్చేడో తెలీదు సరిగదా ఇంకెవ్వరూ సాయంచెయ్యడానికి పూనుకోకపోతే తనకుతానుగా వచ్చి నాకు సహాయం చేస్తున్నాడనీని.

నా మనసులో మాట పసిగట్టినట్టు అతను నా బెదిరింపుని తప్పుగా తీసుకోలేదు. గుర్రాలపని చూస్తూనే నా వైపు తిరిగి, “లోపలికి ఎక్కండి,” అన్నాడు. నిజానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నేను మునుపెన్నడూ అంత చూడముచ్చటైన గుర్రాలతో ప్రయాణం చేసినట్టు గుర్తులేదు. అందుకని సంతోషంగా అందులో కూచున్నాను.

“నేను పగ్గాలు పట్టుకుంటాను నీకు తోవ తెలీదు,” అన్నాను.

“ఆ మాటకొస్తే నేను మీతో రావడం లేదు, నేను రోజాతో ఉంటా,” అన్నాడు.

“నో…” అంటూ ఇంట్లోకి పరిగెత్తింది రోజా రాబోయే ప్రమాదాన్ని సరిగ్గా గుర్తించి. ఆమె తలుపు సరిగ్గా గడియపెడుతుండగా లోపలి గొలుసు చప్పుడు విన్నాను. తలుపు క్లిక్ మని చప్పుడవడం కూడా విన్నాను. తన ఆనవాలు తెలీకుండా ఉండడానికి లైట్లార్పుతూ వసారాలోంచీ, అన్నిగదుల్లోంచీ పరిగెత్తడం కనిపిస్తోంది.

“నువ్వు నాతో వస్తున్నావు,” అని గట్టిగా గద్దించేను గుర్రంవాడిని, “లేకపోతే నా పని ఎంత అవసరమైనదైనా దాని పర్యవసానంతో నిమిత్తంలేకుండా వెళ్ళడం మానుకుంటాను. నా ప్రయాణానికి మూల్యంగా ఆ పిల్లని నీకు ఇవ్వడం నాకు అభిమతం కాదు.” అన్నాను.

రెండుచేతులతో చప్పట్లుకొట్టి గుర్రాలకి సంకేతం ఇచ్చేడు గుర్రంవాడు, “పరిగెత్తండి” అంటూ. ప్రవాహంలో ముక్కలైన కర్రచెక్కలా, బండి ముక్కముక్కలైపోయింది. ఆ గుర్రపువాడి తన్నులకి నా ఇంటితలుపు ఎలా ముక్కచెక్కలవుతోందో వినిపిస్తోంది. తర్వాత నా చెవులు వినిపించకుండా కళ్ళు కనిపించకుండా ఫెళఫెళమని పెద్దశబ్దం అయింది. అంతే నా ఇంద్రియాలేవీ పనిచెయ్యలేదు.

అంతా ఒక్క క్షణం పాటే. ఏదో మా వాకిలి తలుపు తీస్తే ఆ రోగి ఇల్లు ఉన్నట్టు, నేనక్కడ ప్రత్యక్షమయాను. గుర్రాలు ప్రశాంతంగా నిల్చున్నాయి. మంచుకురవడం ఆగిపోయింది. ఎటుచూసినా వెన్నెల. రోగి తల్లిదండ్రులు లోపలనుండి బయటకి పరిగెత్తుకు వచ్చేరు. అతని అప్పచెల్లెలు వాళ్ల వెనకే వచ్చింది. వాళ్ళు నన్ను బండిలోంచి అమాంత ఎత్తినంతపని చేసేరు. వాళ్ళు ఏమిటి గొణుగుతున్నారో నాకు అర్థం కాలేదు.

రోగిగదిలో గుండెనిండా ఊపిరి తీసుకోవడం ఎవరికైనా కష్టం. ఆపడం మరిచిపోయిన వంటపొయ్యి నుండి పొగలు వస్తున్నాయి. నాకు కిటికీతలుపులు తెరవాలనిపించింది, కానీ ముందు రోగి సంగతి చూద్దామనుకున్నాను. జ్వరంలేదు. అలాఅని చల్లగా కాకుండా, అలాఅని వెచ్చగా కాకుండా చిక్కిన శరీరంతో, ఒంటిమీద చొక్కా లేకుండా, కళ్ళు ఎటో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. పరుపుమీంచి తననుతాను లేవదీసుకుని, నా మెడచుట్టూ చేతులువేసి వేలాడుతూ, నా చెవుల్లో గొణుగుతున్నాడు: “డాక్టర్! నన్ను చావనివ్వండి.”

నేను చుట్టూ చూశాను. ఎవరూ విన్నట్టులేదు. తల్లిదండ్రులు ముందుకు ఒంగుని తీర్పుకి ఎదురుచూస్తున్నట్టు మౌనంగా నిల్చున్నారు. అతని సోదరి నా బాగ్ ని ఉంచడానికి ఒక చౌకాలి(స్టూలు)బల్ల తెచ్చింది. బాగ్ తెరిచి కావలసిన పరికరాలకోసం వెదుక్కుంటున్నాను.

ఆ కుర్రాడు మాటిమాటికీ నన్ను తడుముతున్నాడు అతని అభ్యర్థనని గుర్తుచెయ్యడానికి. కొవ్వొత్తి వెలుగులో శ్రావణం తీసి పరీక్షించి మళ్ళీ లోపల పెట్టేశాను. “అవును, అందుకేగదా ఇలాంటి సందర్భాల్లో దైవం అన్నీ సానుకూలం చేసిపెడతాడు. ఉన్న ఒక గుర్రం చచ్చిపోయిందని బాధపడుతుంటే, మరొకటి పంపడమే గాక, రెండోదికూడా జతచేస్తాడు అత్యవసరం కాబట్టి; అంతేకాదు బహుమానంగా గుర్రంతోలేవాడినికూడా తోడు ఇస్తాడు,” అని అన్నాను రోగితో పరుషంగా.

ఎందుకో మొదటిసారి రోజా గుర్తుకొచ్చింది.  ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ పిల్లని ఎలా రక్షించడం? అదుపుచెయ్యలేని గుర్రాలని నా బగ్గీ ముందుంచుకుని, పదిమైళ్ళదూరంలో ఉన్న ఆ పిల్లని ఆ గుర్రపుబండీవాడినుండి ఎలా రక్షించడం?

కళ్ళేలు ఎలాగో విదుల్చుకోగలిగిన గుర్రాలు బయటనుండి కిటికీ తలుపులు తెరుస్తున్నాయి. ఇంట్లోవాళ్ళ ఏడుపులు లక్ష్యపెట్టకుండా గుర్రాలురెండూ తమ తలలు కిటికీలోంచి లోపలకి దూరుస్తూ రోగిని గమనిస్తున్నాయి. ఆ గుర్రాలేవో నన్ను వెనక్కి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నట్టు, “అలా అయితే నే వెనక్కి వెళిపోతాను,” అన్నాను. నేను ఆ గదిలో ఉన్న వేడివల్ల నేనలా మాటాడుతున్నాననుకుంది అతని సోదరి. ఆమె మర్యాదపూర్వకంగా నా ఉన్నికోటు తియ్యబోతే తియ్యనిచ్చాను.

నా కోసం ఒక గ్లాసుడు Rum సిద్ధం చేసి ఉంచారు. ఆ ముసలాయన నా భుజం తట్టేడు; అతని సర్వస్వమూ నాకివ్వడం అతనికి ఆ చనువునిచ్చింది. నేను “వద్ద”న్నట్టు తల అడ్డంగా ఊపాను.  ఆ ముసలాయన  సంకుచితమైన ఆలోచనా పరిథిలో నాకు వంట్లో బాగులేదు… కారణం, నాకు ఇవ్వజూపిన డ్రింకు తాగడానికి తిరస్కరించడమే. తల్లి రోగిమంచంపక్క నిలబడి నన్ను బతిమాలుతోంది. లోచూరుని చూస్తూ గుర్రం ఒకటి గట్టిగా శకిలించింది.

అటు వెళ్లి, రోగిగుండెమీద నా చెవిఆన్చి వినబోతుంటే, నా తడిగడ్డంకింద అతనిగుండె వణుకుతోంది. అది నాకు తెలిసిన విషయమే రూఢిచేసింది: ఆ యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కాకపోతే, అతని నాడి కొంచెం క్రమంతప్పింది, అతని తల్లి గారాబంగా ఇచ్చిన కాఫీ అస్తమానం తాగి తాగి. ఆరోగ్యంగాఉన్న అతన్ని పక్కమీంచి ఒక ఊపు ఊపి తోసెయ్యడమే మంచిది. కానీ నాకెందుకు. నేనేం ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకోలేదు… ఆ కుర్రాడు అలా పడుక్కుంటే అక్కడ పడుక్కోనీ. ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చింది దానికి పూర్తి న్యాయం చేస్తాను; ఎంతగా అంటే, అది వాళ్ళు నాకు చాదస్తం అనుకునేంతగా. జీతం అరకొరగా ఇచ్చినా సరే, నేను ఉదారంగానే ప్రవర్తించి పేదలకి చాతనైనంత సహాయం చేస్తాను. నే నింకా రోజాని సంరక్షించాల్సి ఉంది, తర్వాత కావలస్తే ఈ యువకుడి కోరిక తీర్చొచ్చు; తర్వాత నాకుకూడా చనిపోవాలనిపించవచ్చు.

అంతుపట్టని ఈ చలికాలంలో ఇక్కడ నేనేమి చేస్తున్నట్టు? నా గుర్రమా చనిపోయింది,  గ్రామంలో తమ గుర్రాన్ని నాకు ఎరువిచ్చేవారు ఒక్కరూ కనిపించలేదు. నేను ఆ జట్టుని పందులదొడ్లోంచి బయటకి లాక్కురావలసి వచ్చింది.  అవి అవి గుర్రాలయి ఉండకపోయి పందులయినా, వాటితోనైనా నేను ప్రయాణించవలసి వచ్చేదే. ఆది అంతే. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించేను. వాళ్ళకి అది చాలు. నేనెలా రాగలిగేనన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఒక వేళ తెలిసినా నమ్మరు. సందర్భం వచ్చింది కనక చెబుతున్నాను: ప్రజలతో అవగాహనకి రావడంకంటే మందుచీటీలు రాసుకోవడమే తేలిక.

ఇంతటితో వైద్యుడిగా నా రాకపోకలు ముగియాల్సిందే, కానీ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు అనవసరంగా. నాకిది అలవాటే. నా ఇంటిముందున్న గంట మోగిస్తూ ఈ ప్రాంతం అంతా నన్ను ఇలా వేధిస్తూనే ఉంటుంది. కాకపోతే, ఈ సారి నేను రోజాని విడిచి రావలసి వచ్చింది. ఎంత అందమైన పిల్ల! ఏడాది పొడవునా నా ఇంట్లో ఉంటున్నా నేనెన్నడూ గమనించనే లేదు. ఆమెనలా విడిచిపెట్టి రావడం మరీ బాధగా ఉంది.

ఎలాగోలా నాకు నేను సర్ది చెప్పుకోవాలి; ఈ కుటుంబం వాళ్ళు ఎంతగా అనుకున్నా, తిరిగి ఆమెని నాకు ఇవ్వలేరు కదా!  నేను నా బాగు మూసి ఉన్నికోటుగురించి అడుగుతుంటే, ఆ కుటుంబం అంతా ఎదురుగా నిలబడింది… చేతిలోనున్న గ్లాసుడు rum వాసన చూస్తూ తండ్రీ,… నాదగ్గరనుండి ఇంతకంటే ఏమిటి అభిలషిస్తున్నారో తెలీదు గాని… బహుశా నా సేవకి నిరుత్సాహపడుతూ తన పెదాలుకొరుక్కుంటూ తల్లీ, రక్తసిక్తమైన తువ్వాలుతో రోగికి విసురుతూ సోదరీ. ఇవన్నీ చూస్తుంటే, ఆ యువకుడు అలా ఆరోగ్యంగా  కనిపిస్తున్నప్పటికీ, బహుశా, నిజంగా  అనారోగ్యంగా ఉన్నాడని ఒప్పుకోవాలనిపిస్తోంది.

నే నతని దగ్గరకి వెళ్ళేను. అతను నన్ను చూసి నవ్వేడు… అతనికి నేనేదో జవసత్వాలందించే ఔషధాన్ని తీసుకొచ్చినట్టు… నేను ఇప్పుడు పరీక్షిస్తుంటే, ఆ యువకుడు నిజంగానే అస్వస్థతగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కుడివైపు తుంటిదగ్గర అరిచేయంత మందంలో ఒక పచ్చిగాయం కనిపిస్తోంది… ఎర్రగా, వేర్వేరు ఛాయల్లో… లోతుగా ఉన్నచోట ఎర్రగా, అంచులదగ్గర ముదురురంగులో, లేతరంగులో రక్తపుజీరలు అక్కడక్కడ కనిపిస్తూ. దానిమీద వెలుగు కేంద్రీకరించినపుడు ఒక తవ్వుతూ తవ్వుతూ ఉన్న గనిలా ఉంది. దూరంనుంచి చూస్తుంటే అలా కనిపిస్తోంది కాని దగ్గరనుండి చూస్తుంటే అందులోని ఉపద్రవం స్పష్టంగా తెలుస్తోంది… అది చూస్తూ ‘అమ్మో’ అని అనకుండా ఎవరు ఉండగలరు? అక్కడ క్రిములు… ఒక్కొక్కటీ నా చిటికినవేలంత… తెల్లగా ఉన్నవి రక్తం తాగి తాగి ఎర్రబడి, అటూ ఇటూ దొర్లుతున్నాయి. దీపం వేసినపుడు గాయంలోపల తమపట్టునుండి వేలాడుతూ కనిపిస్తున్నాయి. పాపం కుర్రాడా! నీ గాయం అయితే కనుక్కోగలిగేను గాని నీకు నేను చేయగల సాయం ఏమీ లేదు. నువ్వు ఈ కురుపుతోనే మరణించబోతున్నావు.

ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది… నేను ఏదో ఒకటి చెయ్యడం చూసి. అతని సోదరి వాళ్లమ్మతో ఆ విషయమే చెబుతుంటే, ఆమె అతని తండ్రితో చెబుతోంది, అతను తెరిచిఉన్న తలుపులోంచి, చేతులుజాచుకుని మీగాళ్ళమీదనడుస్తూ తమని తాము నిలువరించుకుంటూ వెన్నెట్లోంచి వస్తున్న అతిథులకి చెబుతున్నాడు. “నన్ను ఎలాగైనా బ్రతికించండి?” అని ఆ కుర్రాడు వెక్కివెక్కి ఏడుస్తూ అస్పష్టంగా గొణుగుతున్నాడు, గాయంలోపల క్రిములు పెట్టే సలుపు కళ్ళుమూసుకుని భరిస్తూ.

మా ప్రాంతంలో ప్రజలతీరే అంత. ఎప్పుడూ వైద్యుడుదగ్గరనుండి అసంభవమైనవి ఆశిస్తుంటారు. వాళ్ళకి పూర్వంఉన్న విశ్వాసం పోయింది. మతాధికారి ఇంటిదగ్గర కూచుని, ఒకదాని వెనక ఒకటిగా తన దుస్తుల్ని పీలికలుగా చించేస్తున్నాడు. అతనిదగ్గరనుండి విశ్వాసాన్ని ఆశించరు. కాని వైద్యుడు దగ్గరకి  వచ్చేసరికి మాత్రం, అతను తన శస్త్రచికిత్సా నైపుణ్యంతో అన్నీ సాధించాలి. సరే, అది వాళ్ళ ఆలోచనా సరళి. నేనేమీ చేస్తానని హామీ ఇవ్వలేదుగదా. వాళ్ళు మతసంబంధమైన పనులకి వినియోగించుకుంటే, నేను దానికీ ఊ కొడతాను. సేవకురాలిని పోగొట్టుకున్న ముసలి పల్లెటూరి వైద్యుడు అంతకంటే ఏమిటి చెయ్యగలడు?

అంతలో ఆ ఊరి పెద్దలూ, కుటుంబసభ్యులూ వచ్చి నా దుస్తుల్ని ఊడదీస్తున్నారు. స్కూలుపిల్లల వాద్యబృందం ఒకటి వాళ్ళ టీచరు అజమాయిషీలో వచ్చి ఇంటి గుమ్మం ముందు నిలబడి పాడుతున్నారు ఇలా:

“అతని దుస్తులు తీసేయండి అతనే రోగం నయం చేస్తాడు,

అలా రోగం నయం చెయ్యకపోతే, అతని రోగం కుదర్చండి

ఎంతైనా వైద్యుడు,  ఎంతైనా వైద్యుడు కదా!”

 

అంతే! అలా అంటూ వాళ్ళు నా దుస్తులు ఊడదీసేరు. నేను నా వేళ్ళు గడ్డంలో పెట్టుకుని, ముఖం ఒక పక్కకితిప్పి అలా మనుషులవంక చూస్తున్నాను. నేను ప్రశాంతంగా, స్పష్టమైన అవగాహనతో అలా నిలుచున్నాను కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేకపోయింది. వాళ్ళు నా తలా, కాళ్లూ పట్టుకుని పక్కమీదకి ఈడ్చుకెళుతున్నారు. రోగిగాయంఉన్నవైపు గోడకి నన్ను నిలబెట్టారు. తర్వాత అందరూ గదిలోంచి బయటకి వెళ్ళి తలుపుగడియపెట్టారు. పాట ఆగిపోయింది. చంద్రుణ్ణి మేఘాలు ముసురుకున్నై. పక్కమీది దుప్పట్లు వెచ్చగా నన్ను కమ్ముకున్నై. కిటికీపక్కన ఆరుబయట గుర్రాల ముఖాలు నీడల్లా కదుల్తున్నాయి.

“నీకు తెలుసా?” ఎవరో నా చెవిలో చెబుతున్నారు, “నీ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. నీ అంత నువ్వు ఇక్కడకి నడుచుకు రాలేదు. ఎక్కడినుండో నిన్నెత్తుకు వచ్చేరు. నాకు సాయంచెయ్యడానికి బదులు, నా మరణశయ్యని ఇంకా ఇరుకు చేస్తున్నావు. ఇప్పుడు నేను చెయ్యగల మంచిపని ఏదైనా ఉందంటే అది నీ కళ్ళు పీకెయ్యడమే.”

“అవమానం. నేనొక వైద్యుణ్ణి. నే నేమిటి చెయ్యాలిప్పుడు? నా మాట నమ్ము. నే నేమీ సుఖపడిపోవడం లేదు,” అన్నాను.

“ఈ సంజాయిషీకి నేను సంతృప్తి పడలా? బహుశా సంతృప్తి పడాలేమో. నే నెప్పుడూ సర్దుకుపోవలసి వస్తోంది. నే నీ లోకంలోకి రావడమే ఈ గాయంతో వచ్చేను. నాకున్న ఆభరణం అదొక్కటే”

“యువమిత్రమా!” నేను చెప్పడం ప్రారంభించేను, “నీకున్న లోపమల్లా నీకంటూ ఒక స్వంత అభిప్రాయం అంటూ లేకపోవడం. నేను దేశమల్లా తిరిగి చాలమంది రోగుల్ని చూసేను. నీ గాయం అంత ప్రమాదకరమైనదేమీ కాదు. అది తుంటికి ఒక పక్కకి రెండుసార్లు గొడ్డలి పడడం వల్ల తగిలిన గాయం. చాలా మందికి అడవిలో గొడ్డలి చప్పుడు వినిపించడం  కష్టం. అది అంతదగ్గరగా గొడ్డలి వచ్చిందంటే, ఎవరైనా ముందు వళ్లు ఇచ్చెస్తారు.”

“నిజంగానా? లేదా నేను జ్వరంగా ఉన్నానని నన్ను మభ్యపెడుతున్నావా?”

“నిజమే. నామాట నమ్మొచ్చు. ఒక వైద్యుడిగా నా వృత్తిమీద ఒట్టువేసి చెబుతున్నా.”

అతను నా మాట నమ్మి మారుమాటాడలేదు.

ఇప్పుడు నేను ఇక్కడినుంచి ఎలాబయటపడాలో ఆలోచించవలసిన సమయం వచ్చింది.  గుర్రాలు నమ్మకంగా ఉండవలసినచోట కదలకుండా ఉన్నాయి. నా దుస్తుల్నీ, ఉన్నికోటునీ, బాగునీ చకచకా ఒకచోట కట్టగట్టేను. బట్టలు వేసుకోడానికిపట్టే సమయంకూడా వృధాచెయ్యదలుచుకోలేదు. ఇంతకుముందు వచ్చిన వేగంతోనే గుర్రాలుగనక దౌడుతీస్తే నేరుగా నేను ఇక్కడనుండి నా పక్కమీదకే గెంతగలుగుతాను.

ఒక గుర్రం కిటికీ పక్కనుండి వెనక్కి తగ్గింది వినయంగా.  నేను ఈ కట్టనంతటినీ బండిలోకి విసిరేసేను. ఉన్నికోటు మరీదూరంపోయి ఒకకొక్కేనికి దాని చెయ్యితగులుకుని వేలాడుతోంది. మంచిదే. నేను గుర్రంమీదకి దూకేను. కళ్ళేలు వదులుగా వేలాడంతో గుర్రాలు రెండూ సరిగా బండికి పూన్చబడలేదు. దాంతో బగ్గీ వెనక ఊగుతోంది. అన్నిటికంటే చివర, మంచులో ఉన్నికోటు ఎగురుతోంది.

గుర్రాలని చూస్తూ “పరిగెత్తండి” చప్పట్లుకొడుతూ గుర్రంబండీవాడిలా అన్నాన్నేను. కానీ అవేమీ పరిగెత్తడం లేదు. ముసలివాళ్లలా మంచులో కాళ్ళీడ్చుకుంటూ నడక ప్రారంభించేం.  చాలసేపు ఆ పిల్లవాళ్ళు పాడిన పాటే అస్పష్టంగా నా వెనక రింగు మంటోంది.

“రోగులారా మీరు నిశ్చింతగా ఉండండి

వైద్యుడుకూడ మీతోనే పక్కమీద పడుకున్నాడు.”

ఈ వేగంతో వెళితే నే నెప్పటికీ ఇల్లుచేరుకునేట్టు కనిపించడం లేదు.  తిరుగులేని నా ప్రాక్టీసు, మందగిస్తుంది. నా వెనకే వైద్యం ప్రారంభించినవాడు నొర్లుకుంటాడు. అయినా ఏం లాభం లేదు. అతడు నన్ను అధిగమించలేడు. చిరాకు తెప్పిస్తున్న ఆ గుర్రపువాడు ఇంట్లో పెద్ద ఉపద్రవం సృష్టిస్తూ ఉండి ఉంటాడు. రోజా అతనికి బలయిపోయి ఉండి ఉంటుంది. ఇక నేను దానిగురించి ఆలోచించను. నగ్నంగా, ఈ వయసులో గడ్డమంచుకి దొరికిపోయి, చాలా సాధారణమైన బండీ, గుర్రాలతో, ముసలాణ్ణి ఒక్కణ్ణీ అలా తోలుకుంటూ పోవలసి వస్తోంది.  నా ఉన్నికోటు బండికి వేలాడుతోంది నాకు అందనంత దూరంలో. ఇంత చురుకైన రోగుల్లో ఒక్క నీచుడూ అయ్యో అనడు. అంతా మోసం! దగా! ఒకసారి రాత్రిపూట తప్పుగా మోగిన గంటకి స్పందిస్తే పరిణామాలిలాగే ఉంటాయి. వాటిని చక్కదిద్దుకోవడం జరగదు … ఎన్నటికీ .

murthy gaaruఅనుసృజన : నౌడూరి మూర్తి

కాంక్రీటు అడవిలో ఒక చెట్టు

arif photo

 ఆరీఫ్ రజా 1983 డిసంబర్ 6,కర్ణాటక లోని రాయచూరు జిల్లా  దేవదుర్గ తాలూక లోని అరికేర లో జన్మించారు.ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉద్యోగం. ‘సైతానన ప్రవాది'( Prophet of Saitan -2006), ‘జంగమ ఫకీరన జోళీగె'( Satchel of the mendicant fakeer-2009),’బెంకిగె తొడిసిద బట్టె'( A raiment for fire- 2012)  సంకలనాలు ప్రకటించారు. ఆరీఫ్ కవితలు  జీవితపు సూక్ష్మ వివరాలతో  బాటు, మానవ సంబంధాల జటిలతను ప్రశ్నిస్తూ,ప్రేమ మరియు ధార్మిక/సామాజిక అంశాల గురించి మాట్లాడతాయి. ఆరీఫ్ 2006 లో ‘ కన్నడ పుస్తక ప్రాధికార అవార్డు’2009 లో ‘బేంద్రే పుస్తక అవార్డు’ మరియు ‘కన్నడ సాహిత్య పరిషత్ అవార్డు’ ప్రతిష్టాత్మకమైన ‘ప్రజావాణి దీపావళీ కావ్య స్పర్ధే’ అవార్డును పొందారు. ఆరీఫ్ కవితలు తెలుగు,తమిళ,తుళు,మలయాళం,పంజాబి,హింది, ఇంగ్లీష్,  స్పానిష్ భాషల్లోకి అనువాదమయ్యాయి. కన్నడ భాషలో 2013 కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహిత.

*** 

 

నిద్రలో సంచరించే చెట్టు

రాత్రంతా సంచరించి

తన చోటుకొచ్చి నుంచుంది

 

రాత్రంతా కదలక

ఏ జ్ఞానోదయం కొరకు వేచి ఉంది

కొన్ని సార్లు వేర్లని వదలి

 

చెట్టు కనే కలలు 

రెండు రకాలు

పళ్లలా పుట్టి  మధురమవటం

ఆకుల్లా చిగురించి రాలటం

 

ఐనా అత్యవసర పరిస్తితులలో

లోహపు పక్షులు గుడ్లు పెట్టే

పీడకల కన్న చెట్టు

రాత్రంతా ఆకుల్లా కనవరిస్తుంది

దూరాన్నేక్కడో

రంపం శబ్దం వినిపిస్తుంది

నిలబడ్డట్టే చెట్టు వణుకుతుంది

 

మొట్ట మొదట చెట్టూ పూలు కాచినప్పుడు

నంగనాచిలా సిగ్గు పడిందేమో

ఎందుకంటే

గత జన్మలో ఆడపిల్లలా పుట్టినవారు

ఈ జన్మలో చెట్టులా పుడతారట.

 

అడవినుండి తప్పించుకొచ్చిన ఈ చెట్టు

ఈ లోకపు చివరి చెట్టు

పిలుస్తుంది

ఏ పక్షి దగ్గరికి రావట్లేదు

 

అడవి, కొండలు ,నది ,సముద్రం

వర్షం ,గాలి ,ఆకాశం , పక్షుల్ని  పోగొట్టుకుని

ఒంటరిదైన చెట్టు

దుమ్ము పట్టి ఎండిపోతుంది .

జీవితాంతం ఏండలో నిలబడి

 

అప్పుడప్పుడు చెట్టుకి గొడుగు పట్టే

కాంకీట్ అడవిలో

చెట్టు మాట్లాడుతుంది 

ఒక్క చెట్టు బాధని

చెట్టు సృష్టించలేని   మనిషి 

అర్థం చేసుకోలేడు.

 

తన అన్ని పంచేంద్రియాల్ని తెరిచి

పుడమి మీద ఎల్లప్పుడూ 

మెలుకువగా ఉంటుంది

ఒక చెట్టు 

కన్నడ మూలం: ఆరీఫ్ రజా

తెలుగు అనువాదం:  సృజన్

srujan123

జన్మభూమి

1016912_628010210545356_685997217_n

ప్రసాద మూర్తి

 

అమ్మనీ నాన్ననీ చూద్దామని ఊరెళ్ళాను . నేనొచ్చానని ఆనందం వారి కళ్ళల్లో,  తీసుకుపోతాడేమో అని బూచాడిని చూసిన పిల్లల్లా గుబులు వారి గుండెల్లో ఒకేసారి చూశాను. నాన్న తన మోకాలు చూపించి  అటూ ఇటూ ఊగించి ఇప్పుడు బాగుందని కూర్చుని లేచి మరీ నవ్వాడు. అమ్మ తన చేయి చూపించి అతుక్కుపోయింది నానా అంటూ  అటూ ఇటూ తిప్పి నన్ను నమ్మించడానికి తెగతిప్పలుపడింది. ఒంటరిగా ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నారన్న సంతోషం ఎప్పుడూ ఒక విచారాన్ని వెంటబెట్టుకుని నన్నంటిపెట్టుకుని ఉంటుంది. ఆరోగ్యంగానే ఉన్నామన్న ధీమాతో అతిహుషారులో వాళ్ళు అప్పుడప్పుడూ కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటూ ఉంటారు.

అప్పుడే సమస్య అంతా. వాళ్ళు నాతో రారు. నేను వాళ్ళతో ఉండలేను. డబ్బెంత పంపినా..మనుషుల్ని పెట్టినా ఇదో తెగని ఇనపతీగ సమస్య.   నేను అలా వారిని చూస్తూనే ఇల్లంతా కలయతిరిగాను. అమ్మ నా కళ్ళల్లో ఏదో వెదుకుతుంది. నాన్న నా కదలికల్లో ఏదో వెదుకుతాడు. నేను ఇల్లంతా తిరుగుతున్నట్టే వారి చుట్టూ తిరుగుతూ నా ఆరాలేవో నేను తీస్తాను. అమ్మ కళ్ళల్లో నా బాల్యపు ఆకాశాలు కనిపిస్తాయి. నా కళ్ళల్లో అమ్మ తన యవ్వన కాలపు బొమ్మల్ని చూస్తుంది.  

నా కూడా మా ఊరు చూద్దామని నాతో హైద్రాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు రమేష్ లోపలేమనుకుంటున్నాడో కాని అంతా మౌనంగా చూస్తున్నాడు. వాడు ఆర్టిస్ట్. నేను జర్నలిస్టు. ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. సికిందరాబాద్ లో జన్మభూమి ట్రైన్ పట్టుకోని తాడేపల్లిగూడెంలో దిగి మా ఊరు చేరుకునే సరికి సాయంత్రమైంది. ఊరంతా చీకటి. ఊళ్ళో చీకటి మా ఇంట్లో కూడా తిష్ట వేసింది. పరిచయాలయ్యాయి.  ఎప్పుడో కొనిచ్చిన ఛార్జింగ్ లైటు బాగానే పనిచేస్తున్నట్టుంది. అది పట్టుకోని అమ్మ మా కూడా ఒకటే తిరుగుడు. నాన్న హాల్లో కూర్చుని ఒంటరిగా గోడతో ఏదో మాట్లాడుతున్నట్టుగా పోజు పెట్టాడు. రమేష్ ఎప్పడూ ఆట పట్టిస్తూ ఆంధ్రా దొంగా అని ముద్దుగా పిలుస్తుంటాడు. మేమెక్కిన రైలు తెలంగాణా బోర్డర్ దాటగానే సమయం కోసం ఎదురుచూస్తున్న వాడిలా పచ్చని పొలాలను చూసి ఇక ఒకటే లంకించుకున్నాడు. ప్రపంచంలో పచ్చదనమంతా మీ దగ్గరే పెట్టుకున్నారు కదరా దొంగల్లారా అని దారి పొడవునా తెగ తిట్లు. ఇదంతా మమ్మల్ని దోచుకున్నదే కదా అని ఒకటే శాపనార్థాలు. పక్కనున్న ఆంధ్రావాళ్ళు వింటే వాడితో తగాదా పడతారని నా భయం నాది.

కాని అలా ఏమీ జరగలేదు. వాడు నన్నే ఉడికిస్తూ..ఉడికిపోతూ..రైలుబండిలా దారిపొడవునా మోతే మోత. వాడి మాటలు నాకు అలవాటే కదా నేను నవ్వుతూనే ఉన్నాను. ఎప్పుడూ మా ఇంటికి రాలేదని ఒకసారి కొల్లేరు ట్రిప్ వేద్దామని వచ్చాం. మా ఇంటికి రాగానే దారిలో కానిచ్చిన నసుగుడంతా మర్చిపోయాడు. మా అమ్మానాన్న కూడా నేను, నా కూడా వాళ్ళు, మా కూడా రమేష్.. ఇలా అలిసిపోయేదాకా అటూ ఇటూ ఆ మాటలూ ఈ మాటలూ చెప్పుకుంటూ ఇల్లంతా  తిరిగాం. ఇంట్లో ప్రతీగోడ మీదా నా బాల్యం నీడల్ని తడిమి తడిమి మరీ మరీ చూసుకున్నాను. ఏమిటీ తిరుగుడు అనుకున్నాడో ఏమో ఒక్కసారిగా కుర్చీలో కూర్చుని “ అమ్మా కరెంటు ఎప్పుడొస్తుంది” అని అడిగాడు రమేష్.  అమ్మకి ఏం చెప్పాలో తెలియక “ ఏమయ్యో..కరెంటంట ఎప్పుడొస్తాది?” అని నాన్న వైపు మా మిత్రుడి ప్రశ్నను ఫార్వర్డ్ చేసింది అమ్మ.  ఆ..అంటూ సాగదీస్తూ నాన్న ఓ సారి ఫోనందుకో అన్నాడు. ఎందుకో అని అమ్మ నవ్వుతూ అడిగింది. “ఛీఫ్ మినిస్టర్ ని అడిగి చెప్తాను.” నాన్న వేసిన ఈ జోక్ తో చెలికాడు రమేష్ ఒకటే పగలబడి నవ్వాడు. ఏంట్రా సంపదంతా మీ దగ్గరే పెట్టుకుని మీకెందుకిన్ని కష్టాలు? అమాయకంగా అడిగాడు రమేష్. పగటికీ రాత్రికీ తేడా ఏంటో జనానికి తెలియజెప్పాలన్న తాపత్రయంలో మన నాయకులు ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారు.  ఇందులో మాత్రం ప్రాంతీయభేదం లేదురా బాబూ.

అదోలా చూశాడు వాడు. ఇంతలో అమ్మ అందుకుంది. “కరెంటు మాట మర్చిపోయాం నాయనా. అది వచ్చినప్పుడు దాని అవసరం ఉండదు. అవసరం ఉన్నప్పుడు అదుండదు.”

‘దొంగలకు కూడా కష్టాలు తప్పవన్నమాట.’  చెవిలో గొణిగాడు రమేష్. ఇంతలో నాన్న బాత్ రూమ్ లో నీళ్ళు పెట్టాడు. డెభ్భయ్యేళ్ళు వచ్చినా తానింకా మిస్టర్ పెర్ ఫెక్ట్ అని  నిరూపించుకోవడానికి నాన్న ఒకటే ప్రదర్శన పెడతాడు. నేను వచ్చినప్పుడల్లా ఇది తప్పదు. అమ్మ కూడా చెంగుచెంగున తిరుగుతూ క్షణాల్లో వంట చేసి పడేసింది. ఎవరూ లేక ఇల్లు బోసిపోయినా వారు మాత్రం కళకళలాడుతూ  అప్పుడే పెళ్ళయిన కొత్త జంటలా ఉత్సాహంగా కనిపించారు మా వాడికి. నేను కూడా వీళ్ళెప్పటికీ ఇంతే ఆరోగ్యంగా ఉంటే ఎంత బావుండు అని ఆశపడుతూ ఉంటాను. అమ్మానాన్న కళ్ళ చుట్టూ కాళ్ళ చుట్టూ వారి కలల చుట్టూ ఒరుసుకుంటూ ప్రవహించిన నా బాల్యం తలపులు ఇక్కడికొచ్చినప్పుడల్లా నన్ను చుట్టుముడతాయి. వారు కూడా నాతో పాటే వస్తే అమ్మానాన్న పిల్లలై నా చుట్టూ తిరిగితే ఎంత బావుండు అనుకుంటాను. కాని వారికి పోటీ వచ్చేవారు నా చుట్టూ చాలా మందే ఉన్నారన్న స్పృహ నాకంటె వీళ్ళకే ఎక్కువ. అందుకే రారు.

“అదృష్టంరా మీ అమ్మా నాన్నా ఆరోగ్యంగా ఉన్నారు.” రమేష్ నార్మల్ గానే అన్నాడు.

“అంత లేదు. నేనెక్కడ నాతో తీసుకుపోతానో అని వారి హంగామా అంతే. నాకు పంచిచ్చిన రక్తం కంటె నాతో పంచుకున్న రక్తం మీద వారికి నమ్మకం లేదు.”

రాత్రి భోజనాల దగ్గర అమ్మ కొసరి కొసరి వడ్డించింది. అమ్మలంతా ఒకటే. నేను రమేష్ వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు రమేష్ అమ్మ చేసిన హడావుడి..చూపిన ప్రేమ మర్చిపోలేను. అమ్మ ప్రేమ తట్టుకోలేక పోతున్నాడు  రమేష్.  కొంచెం ఇబ్బందిగానే ఉన్నా చాలా త్వరగా వాళ్ళమ్మకీ మా అమ్మకీ తేడా మర్చిపోయి చనువుగానే మెలగడం మొదలుపెట్టాడు. ఆ చనువుతోనే ఏవేవో అడగడం స్టార్ట్ చేశాడు. అమ్మ, నాన్నా అంతే చనువుగా జవాబులు చెప్తున్నారు.

“ మీరు హాయిగా మాతోనే హైద్రాబాద్ లో ఉండొచ్చుగా అమ్మా. ఇక్కడెందుకు ఇంత ఒంటరిగా ఈ లంకంత కొంపలో?” అడగరాని క్వశ్చన్ అడిగేశాడు. అంతే అమ్మా నాన్నా బిగుసుకుపోయారు. మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు.

“అన్నట్టు పెద్దోడు పచ్చడి తీసుకు వెళతాడు. ఆ జాడీ తీసి కింద పెడతారా? ఎక్కడో అటకమీద పెడతారు. ఈయనగారి పచ్చడికోసమే దొంగలొస్తారు కాబోలు!” టాపిక్ డైవర్ట్ చేయడానికి  అమ్మప్రయత్నం.

‘అవును కదా..తీస్తానుండు!’ అని నాన్న అక్కడ నుండి లేచాడు. అమ్మ కూడా ఆయన్ని అనుసరించింది.

వాడికర్థంకాక నా మొహం చూశాడు.   ఏతల్లిదండ్రులూ రారు. ఉన్న ఊరినీ, పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసిన ఇంటినీ వదిలి అస్సలు రారు. పక్కనున్న పుల్లమ్మో ఎల్లమ్మో వారికి కొడుకుల కంటె కూతుళ్ళ కంటె దగ్గరవుతారు. వాళ్ళే సమస్తం చూసుకుంటారు. వాళ్ళు రాలేరు. బలవంతంగా తీసుకు వెళ్ళినా పోలీసులు ఎత్తుకుపోతున్న ఫీలింగ్.  ఒకవేళ మనతోపాటు వచ్చినా జైల్లో ఉన్నట్టు ఇబ్బంది. ఎవరి పనుల్లో వాళ్ళం పోయి, రాత్రి ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారో..కొడుకూ కోడలూ మనవలూ ఎవరూ ఎవరితోనూ కనీసం మాట్లాడుకోవడాల్లేని బిజీబిజీ. ఈ లైఫ్ లేమిటో వారికసలు అర్థం కాదు. వద్దురా బాబూ! మన దగ్గర అన్నీ ఉన్నా ఉండాల్సిందే ఏదో లేదని వాళ్ళకు తెలుసు. రెండు రోజులకే సంచులు సర్దేస్తారు. అలాగని మనం ఊళ్ళకు  వచ్చేసి వారితోనే ఉండిపోవాలనీ కోరుకోరు. సంపాదన లేని బిడ్డలంటే వారికీ కొంచెం నలుగురిలో నగుబాటే మరి. ఇరుగుపొరుగుతో మన గురించి గొప్పులు చెప్పుకోవాలిగా. అంతే! అమ్మా నాన్న మనమూ  చిన్నప్పుడు కలిసి ఏం ఉన్నామో ఏం తిన్నమో.. ఏం గడిపామో అదే మనకు చివరికి మిగిలేది. వీలు కాని జీవితంలోంచి కొంత టైమ్ తీసి వారికోసం వీలుచేసుకుని అప్పుడప్పుడూ వెళ్ళడం మినహా మరో గత్యంతరం లేదు. మనం వెళ్ళినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం మాత్రం ఏ ప్రపంచ భాషలోనూ ఎవడూ వర్ణించి ఉండడు. కానీ ఈ మధ్య నేనొచ్చినప్పుడల్లా స్కూలుకి రాకుండా మారాం చేసే పిల్లల్ని తన  కూడా తీసుకు వెళ్ళడానికి వచ్చే బడిపంతుల్ని చూసినట్టు  నన్ను అనుమానంగా చూస్తారు. ఈ సారి ఏమైనా రమేష్ తో తీవ్ర ప్రయత్నం చేయించైనా సరే  కూడా తీసుకుపోవాలి. అదీ నా ప్లాన్. లేదంటే చెయ్యి విరిగిందనో..జబ్బు చేసిందనో..మాటిమాటికీ ఎవరెవరో ఫోన్లు చేయడం అస్సలు తట్టుకోలేం.

దొడ్లో  ఆరుబయట ఆకాశం కింద మంచాలు వేసుకున్నాం. అమ్మా నాన్న త్వరగానే పడుకుండిపోయారు.

మేం ఏదేదో మాట్లాడుకుంటూ ఆకాశాన్ని చూస్తూ రాత్రిని ఆస్వాదిస్తూ చుక్కల్ని లెక్కపెడుతూ ఎప్పుడో కాని నిద్రలోకి జారుకోలేదు. నగరాల్లో దొరకని అనుభవం కదా. బాల్యంలో పొందిన ఆనందం కదా. ఆ జ్నాపకాలు, ఇప్పటి ఇరుకు బతుకుల చికాకుల అనుభవాలు, ఇద్దరికీ ఒకే గతం కాబట్టి మాటలూ మౌనం కలగలిసిన ముచ్చటైన రాత్రిని బాగానే ఎంజాయ్ చేశాము. నాలుగింటికే నాన్న లేచిపోయాడు. చీపురు పట్టుకుని వాకిలి..ఇల్లూ పరపరా ఊడ్చేశాడు. అమ్మ కూడా లేచి తెల్లారక ముందే స్నానం చేసి పనుల్లో పడింది. వాళ్ళ రొటీన్ అలవాటే కాబట్టి నేనూ లేచి కాసేపు వారి చుట్టూ తిరుగుతూ ఏవేవో కబుర్లు చెప్తూ గడిపాను.

నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అమ్మ నన్ను తెల్లవారు జామునే లేపేది. లాంతరు దగ్గర నేను చదువుకుంటుంటే అమ్మ మజ్జిగ కవ్వం తిప్పేది. ఆ శబ్దం భలే ఉంటుంది. బహుశా ఆ సవ్వడి వినే దొడ్లో మందారం..నంది వర్థనం, గన్నేరు పూలు రేకులు విప్పి నవ్వేవి. ఆ శబ్దం తాకిడికే ఎద్దుల మెడల్లో గంటలు ఘల్లున మోగేవి. పనిపాటలకు పోయే రైతుల కూలీల అరుపులు కేకలు మొదలయ్యేవి. అమ్మ కవ్వం చప్పుడు ఆగిందంటే అక్కడొక వెన్నెల ముద్ద నాకోసం తయారైనట్టే. దానికోసమే త్వరగా మొహం కడుక్కోవడం జరిగేది.  ఇప్పుడు నగరంలో బిజీబిజీ జీవితం..ఇద్దరు పిల్లల అల్లరి..అప్పుడప్పుడూ ఏ తెల్లారుజామునో అమ్మ కవ్వం చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కానీ అమ్మే కనిపించదు.

రమేష్ లేచినట్టున్నాడు. అప్పుడే తెల్లగా తెల్లారి వెలుగులు మా ఇంటి పెరటి గుమ్మం ముందు తచ్చాడుతున్నాయి చుట్టం ఎవరో వచ్చారని చూడ్డానికి వచ్చినట్టు. చిన్న బల్లమీద ఉన్న బిందెలో నీళ్ళు ముంచుకుని తాగబోయాడు రమేష్. అమ్మ ఎక్కడ చూసిందో కాని ఒక్కసారిగా అరిచింది.

‘వద్దు నాయనా!ఆ నీళ్ళు కాదు. ఆగు ఇస్తాను’ అని లోపలికి వెళ్ళి చెంబు నిండా మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆశ్చర్యం రమేష్ మొహం మీద మెరుపులా మెరిసింది.

“ఒక్క చుక్క మంచినీరు దొరకడం లేదురా. పొరుగూరి నుంచి వస్తున్న మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు నువ్వు తాగబోయిన నీళ్ళు కూడా స్థానిక ఎమ్మల్యే గారి పుణ్యమా అని టాంకుతో చేస్తున్న సరఫరా. అవి తాగడానికి పనికి రావని వంటకు వాడుతున్నాం. ఈ సరఫరా కూడా ఈ మధ్యనే మొదలు పెట్టారు. త్వరలో ఎన్నికలొస్తన్నాయ్ కదా. “ అమ్మ వివరణ.

“అరేయ్..వచ్చేప్పుడు పెద్దపెద్ద ట్యాంకులు చూశాం కదా?” రమేష్ ఆశ్చర్యం.

“బోర్డుంది..రోడ్డు లేదన్నట్టు..ట్యాంకులుంటాయి. నీళ్ళే ఉండవు.” నా సవరణ

“అదేంటిరా మా దగ్గర  దొంగిలించిన నీరంతా ఏమైపోయింది? అది  మీ  దాహం తీర్చడం లేదా..? ఆశ్చర్యంగా ఉందే?” నాకు మాత్రమే వినపడే  రమేష్ ప్రశ్న.

“అంత ఆశ్చర్యం వద్దురా.  చుట్టూ నదులు కాల్వలు  నిండుగా ప్రవహిస్తున్నాయి నిజమే. కాని అవి కొందరి ఇళ్ళవైపే పరుగులు తీస్తాయి.  ఇప్పుడిక్కడ బీద బిక్కీ ఇళ్ళల్లో  మాత్రమే కాదు ..మధ్యతరగతి  ఇళ్ళల్లో కూడా   ఎడారి ఇసుక మేటలు  వేసింది. నువ్వు నమ్మలేవులే కాని రా..అలా ఊరవతలకి వెళ్ళొద్దాం పద!”

ఇద్దరం బయటపడ్డాం. మా ఇంటి పక్కనే ఒక చెరువు ఉండేది. ఇది చిన్న చెరువు. మరొకటి పెద్ద చెరువు.  ఇందులో అసలు నీటి చుక్క జాడలే లేవు. గట్టుతో సమానంగా నేలపూడుకుపోయింది. నెర్రలిచ్చిన నేలలా మారింది. పుట్టి పెరిగిన తర్వాత ఇంత వరకు ఈ చెరువు ఇలా ఎండిపోవడం చూడలేదు.  ఒక్క పరుగులో ఇంట్లోకి వెళ్ళి అమ్మ అమ్మా అని కేకలు పెట్టాను. అమ్మ కంగారు పడి వంట గదినుంచి బయటకొచ్చింది.

“అమ్మా చెరువేంటే అలా ఎండిపోయింది?”

“అదా నాయనా..పూడిక తీయిస్తామని ఎండబెట్టారు. తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఏంటో  చెరువెవరిక్కావాలి.. చెరువులో నీళ్ళెవరిక్కావాలి..జనమెవరిక్కావాలి..జనం పడే బాధలెవరిక్కావాలి!” ఇలా గొణుక్కుంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది.

‘త్వరగా వచ్చేయండిరా..వేడివేడిగా దోసెలు వేస్తాను. చల్లారితే తినవుగా.’ అంటూ అరుస్తూ తన పనిలో తాను పడిపోయింది అమ్మ.

మా ఇంటి పక్క చెరువుతో నాకు చాలా జ్నాపకాలే ఉన్నాయి. చెరువు గట్టుమీదున్న రైలుచెట్టు  పైనుంచి అందులోకి దూకే వాళ్ళం. నన్ను తరుముకుంటూ వచ్చే నాన్నమ్మని ఏడిపించడానికి అందులో దూకి తామరాకుల కింద నక్కేవాడిని.  అప్పట్లో చెరువు తాటిచెట్టంత లోతుగా ఉండేది. నేనెక్కడ మునిగిపోతానో అని నానమ్మకు భయం. అందుకే ఆ వేట. నాకదో ఆట.  అంత లోతైన చెరువు ఎందుకు  ఎండిపోయిందో..అందులో  ఉండాల్సిన నీరు మాయమైపోయి మట్టి ఎలా పేరుకు పోయిందో కాని..ఆ పగుళ్ళిచ్చిన చెరువులో నాన్నమ్మ బొమ్మ కదిలినట్టనిపించి త్రుళ్ళిపడ్డాను.  మనుషులకు మట్టిని మాత్రమే మిగిల్చి..నీటిని మాత్రం కొందరి ఇళ్ళల్లో ఉరకేలేసే ఆనంద తరంగాలుగా మార్చుకున్నచిత్రాలు రమేష్ కి తీరుబడిగా ఎప్పుడైనా వివరించి చెప్పాలి.

నా తర్జనభర్జన వాడికి అర్థమైనట్టుంది?

“అరే ఇంతకీ మనలో మన మాట. మీక్కూడా ఈ నీటి కష్టాలేంట్రా?” మళ్ళీ ఉడికించడానికి రమేష్ ప్రయత్నం. చిరునవ్వే నా సమాధానం.

అలా నడుచుకుంటూ మా ఇంటికి అతి సమీపంలో ఆనుకుని ఉన్న పొలాల వైపు  వెళ్ళాం.  ఒకప్పుడు మా ఇంటి చుట్టూ పొలాలే ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు చేపల చెరువులు..రొయ్యల చెరువులు ఎక్కువయ్యాయి. వాటిలోనుంచి విడుదల చేసే మురికి నీరు కాల్వల్లో ప్రవహస్తోంది.  తెలిసిన ఒక మిత్రుడి చెరువు దగ్గరకు రమేష్ ని  తీసుకెళ్ళాను. అందులో చేపల పట్టుబడి జరుగుతోంది. ధాన్యాన్ని గుట్టలుగా వేసినట్టు చేపల్ని రాశులు పోసి ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎక్కించడం వాడికి చూడ ముచ్చటగా అనిపించింది.

02_13_Tribute-Dr-Rao-Painting

అలా ఆ చెరువులు దాటుకుని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్ళాను. రమేష్ సందేహాల శస్త్రాలు సంధించక ముందే వాడికి చెప్పాల్సిన విషయాలు చెప్పాను.

“ ఇక్కడ చుట్టూ చాలా మందికి పొలాలు ఉండేవి. అవి రానురాను కొందరికే సొంతమయ్యాయి. వేల మంది భూములు లేని వారిగా మారిపోతే పదుల సంఖ్యలో పెద్దలు మాత్రమే ఇలా చేపలు..రొయ్యల  గుట్టల మీద నిలబడి మీసాలు మెలేస్తున్నారు. మా చిన్నప్పుడు కొల్లేరు వ్యవసాయం కోసమని ఊళ్ళో కోమటాయన దగ్గర నాన్న చేసిన చిల్లరమల్లర అప్పులకు చెల్లుచీటీగా మా పొలాలు గల్లంతయ్యాయి.  ఇక్కడుండాల్సిన మా పొలాలు  ఏ చెరువులో కలిసిపోయాయో ఇప్పుడు పోల్చుకోలేం. ఊళ్ళో బలిసిన వారు బక్కజనుల  పొలాలను సొంతం చేసుకున్నారు. మా చిన్న తాతకు ఊళ్లో వందెకరాలు ఉండేవట. కానీ ఆయన ముగ్గురు కొడుకులు ఇప్పుడు మూడూళ్లలో ఉన్నారు. ఊళ్లో మాత్రం వారికి సెంటు భూమి మిగల్లేదు.  హైదరాబాదైనా ఆగడాల్లంకైనా సాగుతున్న నీతి ఒక్కటే. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా మార్చేయడం. ఇక్కడే కాదు. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కొల్లేరులో కూడా ఇదే పరిస్థతి. అక్కడకు మనం టిఫిన్ చేసి బయలుదేరదాం. నా చిన్ననాటి చేలాగాడు రాంబాబు వస్తాడు. వాడు మనల్ని కొల్లేరు తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేశాడు. “

ఇలా చెప్తున్నంతలోనే రాంబాబు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

“ఏరా రాంబాబు! ఏంటి సంగతులు. వీడు నా ఆప్త మిత్రుడు రమేష్. ఆంధ్రా దొంగలు ఏం తింటారో ఎలా ఉంటారో కళ్ళారా తిలకిద్దామని వచ్చాడు.” రాంబాబుకి రమేష్ ని పరిచయం చేశాను.

“ఏం కాదులేరా! కూడా ఇంకో దొంగను పెట్టుకుని వచ్చావు. ఎలాగైనా మీ అమ్మానాన్నని తీసుకుపోదామని. అది జరిగే పని కాదులే.” రాంబాబు ముందే నన్ను బెదరగొట్టాడు.

ఇద్దరూ హలో అంటే హలో అనుకున్నారు. రాంబాబు డిగ్రీ మథ్యలోనే చదువుకు స్వస్తిచెప్పి కుటుంబ పోషణార్థం కూలీగా మారిపోయాడు. అన్న అమెరికా వెళ్లిపోయాక ముసలి తల్లిదండ్రులకు అండగా.. ఉన్న ఊరినే నమ్మకుని ఉండిపోయాడు. రాంబాబు సైకిల్ ని కాల్వ పక్కనే నిలబెట్టి మాతో కొంత దూరం నడుచుకుంటూ వచ్చాడు.

ఊరిని ఆనుకుని ఉన్న పొలాల మధ్య మరుగుదొడ్డిలాంటి దారిని దాటుకుని కొంత దూరం నడిస్తే మాదిగ్గూడెం వస్తుంది. ఊళ్ళో చచ్చిన గొడ్ల అస్థిపంజరాలతో కంపుకొట్టే వాతావరణం మధ్య గూడెం జనాలు కాపురాలుండేవారు. మా నాన్న చేసే కొల్లేటి కమతాల్లో గూడెం జనాలు కొందరు పనిచేసేవారు. పనే కాదు. ఆ కమతాల్లో వారికి వాటా కూడా ఉండేది. అలా చిన్నప్పటి నుంచి దావేదు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళబ్బాయే రాంబాబు. వాడిని రాంబాబు అని పిలిచేది నేను ఒక్కడినే. ఊళ్లో జనమంతా వాణ్ణి రామిగా అనో చిన్ని దావేదుగాడనో  పిలుస్తారు.

“ఒరేయ్ రాంబాబు..ఇక్కడ మీ గూడెం ఆనవాళ్ళేమీ కనిపించడం లేదు. ఏంటి సంగతి?”

“ఇక్కడ గూడేన్ని లేపి ఊరవతల కట్టిచ్చిన ఇందిరమ్మ ఇళ్ళల్లో కూర్చోబెట్టారుగా.. తెలియదా..?” అన్నాడు రాంబాబు. ఈ మధ్య చాలాసార్లు వచ్చినా రాంబాబును కలవడం కుదురలేదు. అందుకే ఈ మార్పు తెలుసుకోలేకపోయాను.

వారసత్వంగా వచ్చిన ఇళ్ళూ ఊరవతలే. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళూ ఊరవతలేనా?  కనీసం ఇప్పుడు కట్టిన ఇళ్ళన్నా ఊరి మధ్య కడితే ఎంత బావుండు. నాలో మెదిలిన ప్రశ్న రాంబాబుకు అర్థమైనట్టుంది.  ఒక చిన్న నవ్వు వదిలి ముందుకు కదిలాడు. రాంబాబు వాళ్ళ గుడిసె ఎక్కడ ఉండేదో ఆ దిబ్బను చూపిస్తేనే కాని నాకు జ్నాపకం రాలేదు. ఇక్కడ ఒకప్పుడు ఒక జన సమూహం ఉండేదని.. దీపాలు లేకపోయినా తెల్లవార్లూ పాటలు పద్యాలతో ఆ పల్లె వెలిగిపోయేదని  అప్పుడు గాని గుర్తుకు రాలేదు.

రాంబాబుతో నా స్నేహం ఆ ఊరవతలి బతుకుల పట్ల  నాలో సానుభూతినే కలిగించింది కాని  అసహ్యాన్ని కాదు. ఊరి చుట్టూ ఎంత పచ్చని అందం అల్లుకుందో ఇక్కడి దళితుల బతుకుల లోపలా బయటా  అంత కారుచీకటి  ఆవహించి ఉండేది. ఆ పచ్చదనం ఈ గుడిసెల గుమ్మాల దాకా ఎందుకు పాకలేదని చిన్నప్పుడు ఎంతగానో బాధపడేవాణ్ణి. పెద్దయ్యే కొద్దీ రాంబాబులో కూడా ఈ బాధ అగ్నిపర్వతమై కూర్చుంది. కొంచెం పెద్దయ్యాక మాకిద్దరికీ అర్థమయ్యింది. ఊళ్ళ చుట్టూ ఉన్న ఆకుపచ్చ సౌందర్యం..పంటకాల్వల గలగలలూ..ఊరిని పలకరించి పోయే ఆరు రుతువుల అందాలూ అన్నీ కొందరికే సొంతమైనట్టు నేనూ రాంబాబు సమానంగానే గమనించాం. ఎందుకో కాని తరవాత్తర్వాత రాంబాబు చదువు మానుకుని కూలీల దండుకట్టే దండనాయకుడయ్యాడు. నేను ఉద్యోగం వేటలో ఊరొదిలి పారిపోయాను. ఇలా కలిసినప్పుడు ఆనాటి బాల్యాన్ని..ఈనాటికీ మారని బడుగుబతుకుల చిత్రాన్ని కలబోసుకుంటాం. వాడు ఉద్రేకపడతాడు. నేను ఊకొడతాను. మా ఇద్దరి బాల్యపు ముచ్చట్ల మథ్య ఇక్కడ ఒకప్పుడుండే గూడెం స్వరూపాన్ని రమేష్  అర్థం చేసుకున్నాడు.   మాటలు..జ్నాపకాలు..ఊళ్ళో సాగుతున్న తతంగాలు అన్నీ రాంబాబు చెప్తూ మేం వింటూ అలా కొంతసేపు తిరిగితిరిగి ఇంటికి చేరుకుని టిఫిన్లు ముగించాం. రాంబాబు మా కొల్లేరు యాత్ర ఏర్పాట్లకోసం ఇంటికెళ్ళాడు. మేం రెడీ అయ్యేసరికి ఒక బైక్ తో ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురం బర్రున కొల్లేరు వైపు దారి తీశాం.

కొల్లేరు చేరుకునే సరికి ఎండ బాగానే దంచుతోంది. చిన్నప్పుడు అక్కడన్నీ పొలాలే. వందల ఎకరాలు అక్కడ కమతాలుగా చేసుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలు వ్యవసాయం చేసుకునే వారు. ప్రభుత్వం నుంచి కూడా వారికి అధికారాలు అందేవి. నాన్న వ్యవసాయం చేసే రోజుల్లో ఒక పెద్ద కమతంలో వ్యవసాయం సామూహికంగా సాగేది.  అంతా కలిసి హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ వానల్ని ఎండల్ని తుపానుల్ని చలినీ అనుభవించేవారు. దళితులకు కూడా ఆ కమతాల్లో వాటాలుండేవి. హక్కులుండేవి. అప్పుడప్పుడూ నాన్నతో పాటు నేను కొల్లేరుకి వెళ్ళేవాడిని అంతా వరసలు కలుపుకుని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒకే కుటుంబంలా పనులు చేసుకునే వారు. ఇప్పటిలా రోడ్డు ఉండేది కాదు. ఒకరోజంతా నడుచుకుంటూ కొల్లేరు చేరాల్సిందే. వర్షాలు బాగా పడుతున్నప్పుడో..పనులు పోతాయనో..మాటిమాటికీ తిరగలేకో.. కొన్ని వారాల తరబడి ఒక్కోసారి వచ్చేవారు కాదు. మేం ఇంటి దగ్గర భయపడేవాళ్ళం. అప్పట్లో కొల్లేరంటే ఎటు చూసినా నీరు..వింతవింత పక్షులు.. శూన్యంలోకి ఎగిరే చేపల విన్యాసాలు..అంతా అదో ఆనందలోకం. ఒకే పంట పండించే వారు. వానాకాలం అదంతా అభయారణ్యమే. దాళ్వా పంట మాత్రమే వేసేవారు. ఆకుమళ్ళు కట్టే దగ్గర నుంచి..ఊడ్పులు..కోతలు..పంటనూర్పుళ్ళు..ఇంటికి ధాన్యం బళ్ళల్లో తోలుకు రావడాలు అంతా అదో కోలాహలం. అవే అసలైన పండగలుగా ఊరిని సంబరాల్లోకి నెట్టేవి.  మా ఇంటి పెరట్లో  పెద్ద గాదె ఉండేది. అందులో చాలా ధాన్యం నిల్వ ఉంచేవారు. మిగతాది షావుకార్లకు తోలేవారు. పంట కోతకు ఎదిగినప్పుడు కొల్లేటి పెద్దింట్లమ్మకు వేటలు వేసేవారు. వేటల్ని వేసినప్పుడు అటు గూడెంలోనూ ఇటు ఊళ్ళోనూ పగలూ రాత్రి తేడా తెలియని జాతర మత్తు గమ్మత్తుగా ఆవహించేది.

మా కోసం ముందే ఏర్పాటు చేసిన చిన్న పడవ ఎక్కి వెనక్కి వెనక్కి కుంచించుకుపోతున్న కొల్లేరు సరస్సులో విహారానికి బయలుదేరాం. చుట్టుపక్కల ఊళ్ళను ఉధ్ధరించడానికే పుట్టినట్టు  రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ తమ కబ్జా జమాయించిన పెద్దలు పేదల కమతాలను ఆక్రమించుకున్నారు. కొందరికి తాగించి..కొందరికి భూములకు భూములిస్తామని చెప్పి ఊరించి..లొంగని వారిని కొద్దిపాటి డబ్బుతో కొనేసి..ఎవరి మాటా వినని సీతయ్య లాంటివారిని భయపెట్టి కొల్లేటిలో పేదల భూముల్ని పెద్దలు స్వాధీనం చేసుకున్నారు. కొల్లేటి సరస్సును కొల్లగొట్టి దాన్ని చిన్నచిన్న చేపల చెరువులుగా కత్తిరించి తమ ఖాతాలో వేసుకున్నారు.  మా చిన్నప్పుడు మా నాన్న నిర్వహించిన కమతాలు అలా మాయమైపోయినవే. రాంబాబు వాళ్ళ కుటుంబానికి కూడా కొద్దోగొప్పో భూములుండేవంటే ఈ కొల్లేరులోనే. అవన్నీ ఇప్పుడు పరాధీనమైపోయాయి.

“అంతా సరస్సే అయినప్పుడు మరిన్ని సరస్సులు అవసరమా?” రమేష్ అమాయకంగా అడిగాడు.

వాడికెలా చెప్పాలి. కొల్లేరు ప్రకృతి ప్రసాదించిన సరస్సు. ఈ చెరువులు ప్రకృతిని కొల్లగొడుతున్న సరస్సులు. ఆ సరస్సు మీద వింత వింత పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి కొంతకాలం విడిది చేసి తిరిగి పోయేవి. ఈ చెరువుల మీద పక్షి వాలిందా..దాని గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. ఆ సరస్సుకు ఆకాశం కాపలా. ఈ చెరువులకు తుపాకుల కాపలా.  ఏ ఎరువులూ అవసరం లేకుండా కొల్లేరు సరస్సు నిండు గర్భణిలా నిత్యం రకరకాల జీవరాశుల్ని ప్రసవిస్తూ ఉండేది. ఈ చేపల చెరువుల్లో వాడుతున్న మందులు..ఎరువులు ఆ నాలుగు గట్ల మధ్యనున్న చేపల్ని తప్ప మరే జీవరాశినీ బతికి నీటిబట్ట కట్టనీయవు. ఇవి చేసే వాతావరణ కాలుష్యంతో కొంచెంకొంచెం కుంచించుకుపోతున్న సరస్సు ఏదో ఒకరోజున అమాంతం మనకు కనపడకుండా ఎక్కిడికో పరుగు లంకించుకుంటుంది.

ఇక్కడ ప్రకృతి విధ్యంసమే కాదు..పర్యావరణ వినాశనమే కాదు..బీదాసాదా రైతుల జీవనాధారం కూడా ధ్వంసమైంది. కొల్లేరంటే అందం..ఆనందం..బతుకు పడవ కదా..మరిప్పుడు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కొంప కొల్లేరైందన్న సామెత ఎందుకు వెలిసిందంటే కారణం ఇదేనేమో.

ఊళ్ళో ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉన్న మా నాన్నలాంటి పెద్దరైతులే పేదరైతుల్లా బతుకుబండి లాగుతున్నారు. ఇక రాంబాబులాంటి గూడెం జనాలు గోడు ఎవరు పట్టించుకుంటారు ? నా ధోరణిలో నేనేదో చెప్తున్నాను.

ఏందిరా బాయ్ మీరేదో ఆనందాన్ని అనుభవిస్తున్నారని చూడ్డానికి నేనొస్తే అన్నీ కష్టాలే వల్లిస్తున్నారు? అంటూ రమేష్ ఎగిరి మా పడవలో పడిన చేపను పట్టుకుని ముచ్చటగా ముద్దాడాడు. అప్పటికే  మా పడవ నడపుతున్న మనిషి  చిన్నచిన్న చేపల్ని పట్టుకుని మాకోసం కాల్చి పెట్టడానికి పడవలోనే అన్నీ ఏర్పాట్లు చేసిపెట్టాడు. పేరు రాముడు. మా చిన్నప్పుడు రాముడు కాదు భీముడు అనేవారు. ఇప్పుడు కొల్లేరు చిక్కిపోయినట్టే కొంచెం కొంచెం ఎండిపోయి కండ తీసేసిన కొరమేను ముల్లులా తయారయ్యాడు.  చేపల రుచి..ప్రకృతి రుచి..అనుభవిస్తూ కొల్లేటి అంతరంగంలోని విషాదం చేదును మర్చిపోదామని రమేష్ తో పాటు మేం కూడా ప్రయత్నించాం.

ఏం బాబూ అసలు ఊరికి రావడమే మానేశారు? రాముడు కాల్చిన చేపలతోపాటు కొన్ని ప్రశ్నల్ని కూడా మావైపు పంపడం మొదలుపెట్టాడు. వాణ్ణి కదపకూడదనే అనుకున్నాను. కదిపితే కొల్లేరు డొంక కదిపినట్టే. ఏ డొంకలో ఏ పిట్టలుంటాయో..ఏ పిట్ట ఏం తింటుందో ఎలా తింటుందో..ఎంత ఒడుపుగా దాన్ని పట్టుకోవాలో కతలుకతలుగా చెప్తాడు. ఏ కాలంలో ఏపక్షులు వచ్చేవో..ఎంతకాలం ఉండేవో కల్లాకపటంలేని కొల్లేటి కొంగల భాషలో వర్ణించిపాడతాడు. అంతటితో ఆపడు. ఆపితే రమేష్ కి మంచి వినోదమే దొరికేది . కాని వాడి కథ మొదలుపెడతాడు. ఇప్పటికే రమేష్ కి ఇక్కడి వాతావరణం కంటె దాని వెనక సాగుతున్న దోపిడి కాస్త అసహనానికి కారణమవుతోంది. ఎందుకొచ్చానురా బాబూ అని తలపట్టుకుంటాడేమో అని నా సందేహం. కాని వాడూరుకుంటాడా. కదపనే కదిపాడు రాముడి కొల్లేటి డొంకని.   వాడి యవ్వనంలో కొల్లేరు ఎంత గొప్పగా ఉండేదో..ఇక లంకించుకున్నాడు.

“ నా మాలచ్చిని చూసినా కొల్లేటిని చూసినా నాకు రత్తంలో ఒకటే తియ్యని దురద మొదలయ్యేది బాబయ్యా. ఆ రోజులే ఏరు. వర్షాలు తగ్గి నీరు వెనక్కి తీసినప్పుడు ఇక్కడ ఎగసాయం మా జోరుగా సాగేది. నాక్కూడా ఏడెనిమిది ఎకరాల ఎగసాయం ఉండేది. ఇదిగో ఈళ్ళ నాన్నగారు కమతాలనీ..కలిసి ఎగసాయం చేసుకోవాలనీ మొదలెట్టాక అబ్బో అదో పండగలా సాగేదనుకోండి. ఊళ్ళో జనాలు ఎలాగుండేవారో కాని..ఇక్కడ మాత్రం ఊరూ వాడా తేడా లేకుండా అందరం అల్లదిగో ఆ ఎగురుతున్నాదే చేప పిల్ల. మరలా ఎగిరి గంతులేసే వాళ్ళం. కలిసి వండుకునే వాళ్ళం. కలిసి పండుకునే వాళ్ళం. వారాల పాటు ఇళ్లకు పోకుండా ఇక్కడ మేం ఎగసాయం చేస్తా ఉంటే మా ఆడది  అప్పుడప్పుడూ అనుమానంతో ఇక్కడికి లగెత్తుకొచ్చేది. మాలచ్చి వచ్చిందంటే ఇక నాకు పండగే. అందరూ నన్ను వదిలేసే వారు. దాన్ని తీసుకుని అదిగో ఆ దోనెలున్నాయే అలాంటి తాటి దోనెలో ఇక కొల్లేరులో ఒకటే తిరుగుడు. దూరంగా ఎవరికీ కనిపించకుండా దాన్నెటో తీసుకుపోయేవోణ్ణి. ఇప్పడు నేనిస్తన్నట్టే అది నాకు చేపలు కాల్చి పెట్టేది. నేను పాటలు పాడేవోణ్ణి. నాసామిరంగా నేను పాటలు పాడతా వుంటే ఎగిరే పచ్చులు కూడా అల్లాగిపోయేవనుకోండి. అయ్యా..పిట్టల మాటేం కాని ఆకాసంలో సూరీడు కూడా ఆగిపోయేవాడంటే నమ్ముతారా? “

‘నమ్ముతాం నమ్ముతాం.’  రమేష్ ఊతమిచ్చాడు. ఆ ఊతంతో పాటందుకున్నాడు. మేమంతా ఎక్కడన్నా పక్షులు ఎగురుతూ ఆగి వెనక్కి చూస్తాయేమో అని దిక్కులు చూశాం. పక్షులుంటేగా! ఖాళీ డొంకలు వెక్కిరిస్తున్నాయి.  అటు ఆకాశం వైపు చూశాం. నిజంగానే సూర్యుడు నిదానంగా కదులుతున్నాడు.

‘ఇప్పుడేం చేస్తున్నావ్ రాముడు?’ అడిగాడు రమేష్.

ఏం చేస్తాం బాబయ్యా. ఆ ఎగసాయం లేదు. ఆ బూములు లేవు. ఆ పనీ లేదు ఆ పాటా లేదు. ఉన్న కమతాలన్నీ పెద్దోళ్ళ చేపల చెరువుల్లో ఎక్కడ కలిసిపోయాయో తెలీదు.  కాగితాల మీద ఏలి ముద్రలు ఏయించుకున్నగ్నాపకాలు తప్ప ఇంకేం గుర్తులేదు. ఇదిగో ఇప్పుడు ఆ చెరువుల దగ్గర కాపలా కాసే పనోడిగా బతుకుతున్నాను. తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఈ కుళ్ళు నీరు తాగి నేనైతే సయించుకున్నాను కాని..నా ఆడది మాత్తరం కుంగి కుశించుకుపోయింది. మాయదారి రోగం కానరాలేదు. కానొచ్చినా బాగుచేసుకునే సత్తా వున్నోణ్ణి కాదు. అలాగే అర్థాంతరంగా మాయమైపోయింది మాలచ్చిమి. బిడ్డలకి రెక్కలొచ్చాక ఇక్కడ రెక్కాడినా డొక్కలాడ్డం కష్టమని నగరాలకి వలస పచ్చుల్లా ఎగిరిపోయారు.”

ఉన్నట్టుండి రాముడు..నేను..రాంబాబు ముగ్గురం సైలెంట్ అయిపోయాం. రమేష్ కూడా మాతో పాటు నిశ్శబ్దంగా ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఎగిరే చేపపిల్లల్లో చిన్నప్పటి జ్నాపకాల తుళ్ళింతల దృశ్యాలేవో దోబూచులాడుతూ నన్నుఉడికిస్తున్నాయి. నాన్న పొలాలు పోగొట్టుకున్న తర్వాత చుట్టం చూపుగా కొల్లేరు రావడమే అవుతుంది కదా అన్న బాధ కొంచెం గుండెల్లో మెలిపెట్టింది. రాంబాబు మనసులో ఏం జరుగుతుందో నేనూహించగలను. గతం వర్తమానం కలిసి అతని మనసులో ఒక ద్రావకంలా మరుగుతున్న విషయం అర్థమవుతోంది. ఇక రాముడు ఫ్లాష్ బ్యాక్ లోకి జారిపోయిన సంగతి తెలిసిపోతోంది. రాముడు పాలేరుగా మారడం..రాంబాబు కూలీగా మిగిలిపోవడం..కాస్త కలిగిన  కుటుంబంలో పుట్టినా చివరికి ఊళ్ళో బలవంతులకే ఆస్తులన్నీ ఫలహారంగా సమర్పించుకుని  ఇప్పుడు మేము ఇల్లు తప్ప ఏమీ మిగుల్చుకోలేకపోవడం .. ఈ విషయాలన్నీ రమేష్ కి కూడా అర్థమైనట్టున్నాయి. వాడూ మా నిశ్శబ్దంలో మరింత నిశ్శబ్దంగా ఒదిగిపోయాడు.

అలా కొల్లేటి కొంగలు సంధ్యరంగుల ఆకాశాన్ని తమ రెక్కల మీద ముద్రించుకుని ఒక గుంపుగా మా కళ్ళను తాకుతూ ఎగిరినప్పుడు ఇళ్ళకు తిరుగుముఖం పట్టాం.

ఇంటికి రాగానే నాన్న కనిపించలేదు.

అమ్మా నాన్నేడి?

“ఈ మథ్య గుడి కట్టిస్తున్నారుగా..శివాలయం. పొద్దస్తమానం అక్కడే గడిపేస్తున్నార్రా బాబూ. అన్నట్టు మీ ప్రయాణానికి అన్నీ రాత్రికే సర్దుకోండి నాన్నా. పొద్దుటే లేచి తాడేపల్లి గూడెం వెళ్లాలిగా. ఇలా ఒకరోజు ప్రయాణాలేంటిరా! పోన్లే కనీసం నెలకోసారైనా రా! మేమెలాగూ ఈ రైళ్ళూ బస్సులూ ఎక్కలేం!”

అమ్మ మాటల్లో నాకెందుకో ఏదో కనిపించని ఆరా..అన్వేషణ.. ఇంకేదో ప్రశ్న గుండెల్ని తాకుతున్నాయి. నేను వచ్చిన వాడిని వచ్చినట్టే తిరిగి వెళ్ళి పోతానని..వాళ్ళను నాకూడా తీసుకు వెళ్ళే ప్రయత్నాలేమీ చేయనని అమ్మ ఇంకా కన్ ఫాం కాలేదు. వారికి ఏ మూలో అనుమానం ఉంది. అందునా ఈసారి ఒంటరిగా రాలేదు. హైద్రాబాద్ మిత్రుణ్ని వెంటేసుకుని  సశస్త్రంగా వచ్చాను.

అమ్మా ఈసారి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికే వచ్చాను. మీరు కూడా బట్టలు సర్దుకోండి.

“వచ్చే నెల్లో వస్తాంలే నాన్నా.  నా బ్యాగూ నాన్న బ్యాగూ పక్కింటి పార్వతి తీసుకుంది. ఊరికెళ్ళాలంట. పాపం ఎప్పుడూ మమ్మల్నే కనిపెట్టుకుని ఉంటుంది. దానికేమైనా చెయ్యాలిరా!” అమ్మ జవాబు.

అమ్మ మాటలు నాకెందుకో నమ్మబుద్ది కావడంలేదు. “ అయినా బ్యాగులదేముంది. ఇప్పుడే పోయి రెండు కొత్తవి కొనుక్కొస్తానుండు.”  అమ్మ ఏదో గొణుగుతున్నా వినకుండా బయలుదేరాను. రమేష్ స్నానానికి వెళ్ళాడు.

ఎక్కడికిరా?

నాన్నని తీసుకువస్తా.

అప్పుడే వస్తాడా ఆయనగారు. మీరు ముందు స్నానాలు ముగించండి.

అమ్మ మాటలు వినకుండా త్వరగా గుడి దగ్గరకు బయలుదేరాను. పక్కింటి పార్వతి ఎదురుపడింది. బ్యాగులు తీసుకువెళ్ళి  అమ్మే పార్వతి ఇంట్లో దాచిపెట్టిందట. వచ్చే నవ్వు ఆపుకోడానికి పార్వతి చీరకొంగును సాయం తీసుకుంది.

చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టడానికి నేను కూడా ఇలా ఎన్నిసార్లు పుస్తకాల సంచి అక్కడా ఇక్కడా దాచిపెట్టేవాడినో. ఎక్కడ దాచానో అమ్మకు మాత్రమే తెలుసు. నాన్న వెదికి వెదికి నన్ను ఉతకడానికి రెడీ అయినప్పుడు ‘ పోన్లెండి రేపు వెళతాడులే బడికి’ అని అడ్డం పడేది అమ్మ. చిన్నప్పుడు నేనేసిన ఎత్తులన్నీ ఇప్పుడు నాదగ్గర అమ్మ ప్రదర్శిస్తోందన్నమాట. నవ్వుకుంటూ గుడికి వెళ్ళాను. అక్కడ నాన్న ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి ఏరా పొద్దున్నే వెళ్ళాలన్నారు. త్వరగా తిని రెస్టు తీసుకోండి. ఇదిగో గుడి కడుతున్నాంగా ఇప్పటిదాకా మీటింగే సరిపోయింది. అంతా ఇప్పుడే వెళ్ళారు.

“ఎందుకు నాన్నా! మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళనులే. కనీసం నేను ఉండే ఒక పూటైనా ఇంటిదగ్గర ఉండొచ్చుగా! రాపోదాం”  నాన్న చేయి పట్టుకుని పైకి లేపాను.

“మళ్లీ ఎప్పుడొస్తార్రా? ఈసారి కోడల్ని..పిల్లల్ని తీసుకురావాలి మరి ఆ!”

నేను చిన్నప్పుడు బడికి ఎగనామం పెట్టి పాత శివాలయం దగ్గర గోళీలాడేవాడిని. ఆ విషయం నాన్నకెవరో చెప్పేవారు. దారీపోయేవారెవరో పెద్దమనిషి ఒరే మీ నాన్నొస్తన్నాడని బెదిరిస్తే గుడిదగ్గరే రాత్రి దాకా ఉండిపోయేవాడిని. ఎప్పుడో చీకటి పడ్డాక నాన్న వెదుక్కుంటూ వచ్చేవాడు.

“అమ్మ దొంగా నా దగ్గరే నా చిన్నప్పటి ట్రిక్కులు ప్లే చేస్తున్నావా నాన్నా”  అసలింత అవసరమా?  మనసులోనే అనుకుని నాన్నతో ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి రాగానే స్నానాలు చేసి ఒకసారి రాంబాబు ఉంటున్న ఊరవతల కాలనీకి వెళ్ళాము.

అక్కడ రాంబాబు కాలనీ చూసి మరీ బాధ కలిగింది. చూడ్డానికి దూరంగా ఇళ్ళలానే కనిపిస్తాయి. కాని అవి తలుపులూ కిటికీలూ లేని అగ్గిపెట్టె గుడిసెలంటే తప్పుకాదు. అక్కడ కూడా కాలనీలు ఏర్పడ్డాయి. దళితులు ఒక పక్కకి..వారికి దూరంగా ఇతర కులాల ఇందిరమ్మ ఇళ్ళు మరో మూలకి ఉన్నాయి. అభివృద్ధిని అంకెల్లో చూపించేవారికి ఈ కాలనీలను చూపిస్తే ఏమంటారో మరి.  రాంబాబు నాన్న దావీదుతో కాసేపు మాట్లాడాము. ఆయనా పాత ముచ్చట్ల నడుమ ఊరి గురించి బాధనే నిట్టూర్పుల భాషతో వ్యక్తం చేస్తున్నాడు.

“మీ పెద్దబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్ళారా” అని అడిగాను. సమాధానం రాంబాబు దగ్గర నుండి వచ్చింది.

“అన్నయ్య ఇక్కడకు రాడు. వచ్చినా వీళ్ళని ఇక్కడ నుంచి తరలించడానికే ప్లాన్లు వేస్తాడు. టౌన్ లో ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉండమంటాడు. డబ్బు పంపినా అమ్మానాన్నకి నాతోనే ఉండడం ఇష్టం. అయినా ఈ ఊరిని వదలడానికి ఏమాత్రం వీరికి ఇష్టం లేదు. ఇక్కడేముంది ఒక ఊరి చివరి నుంచి ఇంకో చివరికొచ్చారు. ఎప్పుడైనా ఊళ్ళల్లో చివరి బతుకులేకదా అన్నది అన్నయ్య వాదన. కొడుకుల దగ్గరున్నా మనుమలూ మనవరాళ్ళూ చుట్టూ ఉన్నా ఒంటరితనమే వెంటాడుతుందని అమ్మకీనాన్నకి భయం. పంచిన రక్తంలోనే మమకారాల కంటె పెత్తనాలు ఎక్కువవుతుంటే ఏ బంధాలూ లేకున్నా ఉన్న ఒక్క మట్టి బంధంతోనే హాయిగా గడిపేద్దామని మా పేరెంట్స్ వాదన. వీళ్ళకోసం నేనుంటున్నానో..నాకోసం వీళ్ళుంటున్నారో కాని ఉంటున్నాం. ఊళ్ళోనే ఉంటున్నాం. “  రాంబాబు మాటల్లో, కళ్ళల్లో, మనసులో ఏదో గుబులు కనిపించింది.

ఇక రాంబాబు ఇంటి దగ్గర సెలవు తీసుకుని మా ఇంటికి ముగ్గురం వెళ్ళాం. వేడివేడిగా అమ్మ వడ్డించింది. నాతోపాటు అమ్మనీ నాన్ననీ తీసుకు వెళ్ళే ప్రయత్నంలో మరోమాటు భంగపాటు చవిచూసి గమ్మున ఊరకున్నాను.  రాంబాబు కూడా ఆ రాత్రికి మాతోనే ఉండిపోయాడు. ఊరూ..వాడా..రిజర్వేషన్లు..ఎవరు ఎదిగారు..ఎవరు కుదేలయ్యారు..రాంబాబు ఏదో తన రహస్య రాజకీయ కార్యకలాపాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మర్నాడు ఉదయమే లేచి స్నానాలు చేసి తాడేపల్లిగూడెం బయలుదేరాం. మళ్ళీ తిరిగి జన్మభూమి ట్రైన్ లోనే  ప్రయాణం.

వెళుతూ వెళుతూ రమేష్ నాన్నతో మళ్ళీ  కొంచెం కదిపి చూశాడు.

“ఏంటంకుల్..ఇక్కడేముంది? తాగడానిక్కూడా నీరు లేదు. మాకెలాగూ తెలంగాణా ఇచ్చేస్తున్నారుగా అక్కడికే వచ్చేయండి.”

ఏం సమాధానం వస్తుందో అని ముగ్గురం ఉత్కంఠగా ఎదురు చూశాం.

“లేదు. ఎక్కడికీ రాము.”

నాన్న నుండి వచ్చిన ఈ ఠపీమన్న సమాధానంతో నేనూ రాంబాబు నవ్వుకున్నాం కాని రమేష్ మాత్రం ఆశ్చర్యంగా అలాగే నోరు తెరిచి ఉండిపోయాడు.

“ఏమీలేదురా బాబూ. మీకు తెలంగాణా వస్తేనన్నా కనీసం ఇక్కడ ఊళ్ళు బాగుపడతాయేమో అని మా ఆశ.”

“అధికార బదలాయింపులతో ఊళ్ళు బాగుపడవు అంకుల్. ఆ అధికారం ఎవరి చేతుల్లోకి పోతుందన్నదే పాయింట్. స్వతంత్ర పోరాటం ఎప్పుడూ సమరోత్సాహంగానే ఉంటుంది. స్వాతంత్ర్య ఫలితాలు ఎవరికి దక్కుతాయన్నదే చూసుకోవాలి.”  ఇక రాంబాబు దొరికిందే తడవుగా అందుకున్నాడు. నాన్న కూడా తీరిగ్గా ఉపన్యాసానికి ఉపక్రమించాడు.

అంతా హైదరాబాద్ కే పరుగులు తీశారు తప్ప పుట్టిన ఊళ్ళు..పెరిగిన ఊళ్లు ఎలా ఉన్నాయో ఎంత ధ్వంసమవుతున్నాయో పట్టించుకునే తీరికా ఓపికా ఎవరికీ లేకుండా పోయింది. రాజకీయ నాయకులకు రాజకీయాలు కావాలి. పదవులు కావాలి. పీఠాలు కావాలి. పెట్టుబడిదారులకు వ్యాపారాలు కావాలి. ఏ వూరు ఎలా పోయినా పర్వాలేదు. వారి పెట్టుబడులు పెరగాలి. హైదరాబాదైనా పోతారు..ఆఫ్రికా అయినా పోతారు. వారికి మట్టిబంధాలు..మమతానుబంధాలు ఉండవు. ఉన్నదొక్కటే బంధం అది డబ్బు బంధం. నగరాలేవైనా వారికే ఉంపుడుగత్తెలు.  మనం మన రాష్ట్రంలో ఉన్నా..మన దేశంలో ఉన్నా..ఈ నేల మనది..ఈ గాలి మనది..ఈ నీరు మనది అన్న  ఏదో తెలియని భావంలో ఉప్పొంగిపోతాం. తీరా హక్కులు అనుభవించే సరికి ఎక్కడా నీకు కూర్చోడానికి కూసింత జాగా కూడా దొరకదు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినా డబ్బున్న వాడికి పక్కవేసే నగరంలో నిజానికి నువ్వు అనాథవే. కూలికోసం ఉదయాన్నే నాలుగురోడ్ల కూడలిలో నిలబడే వేలాది జనానికి నగరం ఎప్పటికీ పరాయిదే. వారితో పనిచేయించుకుని వారిని కుక్కలకంటే హీనంగా చూడ్డమే నగర సంస్కృతి వికృత రూపం. అలాంటి నగరం కోసం ఏడవడం కంటె కనీసం ఇప్పటికైనా మన ఊళ్ళను బాగుచేసుకుందాం అన్న స్పహ మా వాళ్ళకి కలిగితే అదే పదినగరాలపెట్టు.”  నాన్న ఉపన్యాస ధోరణికి బ్రేక్ వేస్తూ రాంబాబు అందుకున్నాడు.

“ రమేష్ ! జన్మభూమి అన్నది ఒక ఫీలింగ్ మాత్రమే.  అది సామాన్యులకే కాని పెట్టుబడుల గుండెకోటల్లో అది మొక్కుబడిగానైనా ఉండదు. జన్మభూమి భావనే అందరినీ సమానంగా ఆదుకుంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అన్నార్తులు, అభాగ్యుల శాతమే ఎందుకు ఎక్కువగా ఉంటుంది చెప్పు? కూలికోసం కూటికోసం నిలువ నీడకోసం నువ్వక్కడా మేమిక్కడా పోరాటాలు చేయాల్సిందే. అధికారాలు..హక్కులూ సామాన్యులకు అందని ద్రాక్షల్లా ఉన్నంతకాలం యుద్ధం ఎక్కడైనా ఒకటే. ప్రాంతీయభేదాలు మామూలు మనుషులకే కాని దొంగలకు ఉండవురా బాబూ. యువకులను బలిపెట్టి మీరు సాధించిన ఈ స్వతంత్రం ఈనగాచి నక్కల కుక్కల పాలు కాకుండా కాపాడుకోండి. అందుకోసం ఒక మహాసంగ్రామానికి సిద్ధం కావాలి మరి. ఇక మీ తిప్పలు మీరు పడాలి. మా తిప్పలు మేం పడతాం. అందరి తిప్పలూ ఒకటేఅని వాటంతటికీ పరిష్కారం కూడా ఒకటేఅని..దానికోసం నువ్వూనేనూ వీడూ వాడూ అంతా కలిసే కత్తుల నదిలో ఈదాలని మాత్రం మర్చిపోవద్దు సుమా!”

నాన్న మాటలు, రాంబాబు మాటలు విన్న తర్వాత హైదరాబాద్ విషయంలో  జన్మభూమి ఫీలింగ్ తో బరువెక్కిన నా హృదయం ఇప్పుడు కాలిపోతున్న నుదిటిమీద అమ్మ చేయి పడినంత హాయిగా ఉంది.

పొద్దుటే తిరుగుప్రయాణం. రాంబాబు వాళ్ళ నాన్న దావీదు కూడా వచ్చాడు. మా వీధిలో ఉండే సోమన్న కూడా వచ్చాడు. మా ఊళ్ళో మొదటి డాబా ఇల్లు కట్టిన మొనగాడు అతడే. ఇరవై ఎకరాల ఆసామి. ఇప్పుడు నిలువ నీడ లేదు. ఇద్దరు కొడుకులు హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ల దగ్గర వాచ్ మెన్ లుగా పనిచేస్తున్నారు. నేనెప్పుడొచ్చినా వారి దగ్గర నుంచి వర్తమానం కాని..డబ్బులు కాని ఏమైనా వస్తాయేమో అని నన్ను పలకరిస్తాడు. మేం వెళుతుంటే అమ్మా..నాన్న..దావీదు. సోమన్న అలా శూన్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఊరు వెనక్కి వెళుతుంది మేం ముందుకు కదిలాం. నిర్వాహకులు ఎవరూ లేని అనాథ వృద్ధశరణాలయంలా కనిపించింది నాకు మా ఊరు.

ట్రైన్ ఎక్కించి రాంబాబు వెళ్లిపోయాడు. అన్నీ కోల్పోయినా, ఉన్న ఊరినే జన్మభూమి అని మా అమ్మానాన్నలాంటి వృద్ధులెందరో ఆ మట్టినే అంటిపెట్టుకుని ఉంటున్నారు. రాంబాబు మాత్రం జన్మభూమి ఒకఫీలింగే అంటాడు. హైదరాబాద్ నా జన్మభూమి కాదంటే నా గుండె తట్టుకోలేకుండా ఉంది. రమేష్ మాత్రం నా జన్మభూమి అని ఎంతో ఉప్పొంగిపోతూ రాగాలు తీస్తున్నాడు. అసలు జన్మభూమి విషయంలో నీ అభిప్రాయం ఏంట్రా అని రమేష్ ని అడిగాను. “ అరేయ్ లైట్ తీసుకో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నది జన్మభూమి ట్రైన్ లోనే”  అని పకాలున నవ్వేసాడు.  వాడి మాటలతో తేలికైన మనసు కాసేపు అలా రైలు కిటిలోంచి బయట పచ్చదనం మీదకి మళ్ళింది. ఇంతలో  ఏమనుకున్నాడో రమేష్ “అరేయ్ పాగల్ గా ఏమనుకుంటున్నావో నాకంతా తెలుసు. ఇదిగో చూడు రాష్ట్రం ముక్కలైనా మన స్నేహాన్ని ముక్కలు చేసే శక్తి ఎవరికీ లేదురా బాయ్. మన అసలు జన్మభూమి స్నేహమేరా. దాని  పరిమళం తెలుగు.”

– ప్రసాద మూర్తి

చిత్రం: పెమ్మరాజు వేణుగోపాల రావు

వైవిధ్యమే వర్మ సంతకం!

reppala_vantena

వర్మ ఓ నిశ్శబ్ద సైనికుడు…. అక్షరాన్ని ఓ బుల్లెట్ లా వాడుకునే సైనికుడు.

“రక్తమోడుతున్న మీ అక్షరాలు

కవిత్వాన్ని నిలదీసాయి

మీరిలా ముందుకెళ్ళండి

అక్షరాలవే మీ వెంటవస్తాయి

పరిగెత్తుకుంటూ…”

ఇది నేను వర్మ కవితపై రాసిన మొట్టమొదటి కామెంట్. నా ఆ స్పందనే మమ్మల్ని దగ్గర చేసిందనుకుంటా. అప్ప్పట్నుంచే ఆయన నాకో  మంచి మిత్రుడు.!…కానీ వర్మ నాకో బలహీనత …. వర్మ వాక్యాలు ఓ బలం….

ముఖపుస్తకం లొ పరిచయం ఐన కవిమిత్రుల్లో కుమార్ వర్మ ఓ ప్రముఖ వ్యక్తి. అతనితో, అతని కవితలతో పరిచయం ఐదేళ్లపైమాటే. ఇన్నాళ్ళుగా కుమారవర్మ కవిత్వాన్ని చదువుతూ అతని అక్షరాల్లోంచి మోడేస్టీగా తొంగిచూసే భావనలని పట్టుకోవటం ఓ కవితాత్మక హాబీ. కవి తనురాసే కవితల్లో దొరికిపోతాడంటారు కానీ ఇంతవరకూ వర్మ కవిత్వంలో ఇదమిద్ధంగా ఇదీ “వర్మ” అనే ముద్రలేకుండా రాస్తుండటమే అతని రాతల్ని సిన్సియర్ గా చదవటానికి ముఖ్యకారణం.

కవిత్వం రాయటంలో వర్మ కున్న నిజాయితీ (సీరియస్ నెస్) ఆ కవితల శీర్షికలబట్టె అర్ధమవుతుంది. చాలా తక్కువమంది మాత్రమె తమ కవితల టైటిల్స్ ని జాగ్రత్తగా ఎంపికచేసుకుంటారు. ఉదహరణగా ఇవి చూడండి : “మృతపెదవులు” , “రాతిబొమ్మల రహస్యం”, “పత్ర రహస్యం”,  “సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు”, “దేహకుంపటి” ఇలా చెప్పుకుంటూ పోతే అతను రాసిన కవితలన్నింటినీ ఉదాహరించాలిక్కడ.

వర్మ కవితల్లో ఓ ప్రత్యేక మార్మికత దోబూచులాడుతుంటుంది. అక్షరాన్ని మార్మికతలో చుట్టి వాటితో కొన్ని వందలపదచిత్రాలతో ఓ దండకూర్చి  మనకి బహుమానంగా ఇస్తారు. ఆ అక్షరాలని వలిచి మళ్ళీ వాటినన్నింటినీ మనం పేనుకుని చదివి ఆకళింపుచేసుకునే పని మాత్రం తప్పదు పాఠకులకి.

వర్మ కవితల్లో శ్రేణి, వస్తు వైవిధ్యం, పోరాటం, ప్రధాన ఆకర్షణలు. సమాజంలోని నీచత్వం, దిగజారుడుతనం, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు ఇవి ప్రధానవస్తువులైనా, హఠాత్తుగా ఓ ప్రేమకవితతో ప్రత్యక్షమయి తన వైవర్మ విధ్యాన్ని వర్మ కవితల్లో ఓ ప్రత్యేక మార్మికత దోబూచులాడుతుంటుంది. అక్షరాన్ని మార్మికతలో చుట్టి వాటితో కొన్ని వందలపదచిత్రాలతో ఓ దండకూర్చి  మనకి బహుమానంగా ఇస్తారు. ఆ అక్షరాలని వలిచి మళ్ళీ వాటినన్నింటినీ మనం పేనుకుని చదివి ఆకళింపుచేసుకునే పని మాత్రం తప్పదు పాఠకులకి. వర్మ కవితల్లో శ్రేణి, వస్తు వైవిధ్యం, పోరాటం, ప్రధాన ఆకర్షణలు. సమాజంలోని నీచత్వం, దిగజారుడుతనం, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు ఇవి ప్రధానవస్తువులైనా, హఠాత్తుగా ఓ ప్రేమకవితతో ప్రత్యక్షమయి కవిత్వంలో  వైవిధ్యాన్నీ, భాషపై తనకున్న అధికారాన్నీ చాలా మోడెస్ట్ గా వ్యక్తపరుకుంటాడు వర్మ.

నాకతని కవితలు ఇష్టమే…కానీ కొన్ని కవితలు నిరుత్సాహపరుస్తాయి. అందులో ఇదొకటి. ఈ శీర్షికకి రాస్తున్నాను కదాని పూర్తిగా నెగటివ్ గా రాయటం నా ఉద్దేశ్యం కాదు కానీ ఈ కవితలో వర్మ ఎందుకిలా తొందరపడ్డాడా అని బాధపడ్డ క్షణం లేకపోలేదు.

 

 

మాటలు

కొన్ని మాటలు

చెవిలో దూరినా మనసులో ఇంకవు

కొన్ని మాటలు

దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు

కొన్ని మాటలు

ముళ్ళులా మారి దేహంతో పాటు మనసును గుచ్చుతాయి

కొన్ని మాటలు

ఆత్మీయంగా పలకరించి జీవం పోస్తాయి

కొన్ని మాటలు

తొలకరి చినుకులా కురిసి చిగురు వేస్తాయి

కొన్ని మాటలు

వెన్నెల చల్లదనాన్ని పంచి ప్రశాంతతనిస్తాయి

కొన్ని మాటలు

రక్తాన్ని మరిగించి కరవాలాన్నందించి యుద్ధోన్ముఖున్ని చేస్తాయి

కొన్ని మాటలు

నిన్ను అంతర్ముఖున్ని చేసి సుషుప్తిలోకి నెట్టి స్వాంతననిస్తాయి

 

కొన్ని మాటలు

రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

కొన్ని మాటలు

అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి…

 

చాలా మంచి కవిత ఇది..మొదటి వాక్యంలో ఉన్న రిపీట్ లేకపోయుండే ఇంకా బావుండెదనే ఫీల్ మాత్రం తప్పదు.

కొన్ని మాటల/వాక్యాల రిపీట్ కవితా శిల్పాన్ని దెబ్బతీయడమేకాకుండా పాఠకుడు కవితనుంచి వెళ్ళిపోయే ప్రమాదమూ ఉంది.

దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు” ఇలాంటి స్టేట్‌‌మెంట్ లాంటి వాక్యాలు రాసే కవి కాదు వర్మ. మరెందుకనో ఈ కవితలొ కొంచెం తొందరపడ్డాడెమో అనిపించింది.

కానీ ఇదిగో ఇలాంటి వాక్యాలకోసం వర్మ రాసిన ప్రతీ కవిత చదువుతూంటాను.

కొన్ని మాటలు

రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

కొన్ని మాటలు

అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి…”

కారణం–వర్మ లోని సీరియస్ నెస్. కవిత్వం కంటే తన భావనలని ప్రజలకు చెప్పాలనె సీరియస్ నేస్…….పోరాటం, ప్రొటెస్టీంగ్–ఇవే వర్మ ఆయుధాలు. ఇవే ఇతన్ని కవిగా నిలబెట్టినవి కూడా…..

వర్మ చాలా పరిణతి చెందిన కవి. అక్షరాలతో మనసు దోచుకుంటూ వాక్యాల్ని మనకొదిలేసి విచారించమటాడు. ఇంత వైవిధ్యం ఉన్న కవిని ఇంతవరకూ నేను చూళ్ళేదంటే నమ్మాలి మీరందరూ. ఏం రాసినా సిన్సియర్ గా రాస్తూ, తన రచనకి న్యాయం చేయాలనుకునె కవి వర్మ…వర్మ నిజంగానే ఓ కవి. All the best Varma in all your future endeavours.

                                                                                                                                                                                                                 – వాసుదేవ్

541392_4595388722851_1575449086_n

“మాలతమ్మా.. మళ్ళీ ఎప్పుడు కలిసేదీ…?”

bhuvanachandra“అర్ధాంతరంగా మృత్యువొచ్చి” ఆ మహానుభావుడ్ని తీసికెళ్లిపోయింది…!” అన్నారు ఒకరు.. మా విశ్వనాధ ఆశ్రమంలో..

నా వయసప్పుడు 8 సంవత్సరాలు .

“అలాగా! ఎక్కడ్నించి వచ్చింది? ఏ బస్సులో వచ్చింది.. ఎవరితో వచ్చింది?” నవ్వుతూ అడిగారు మా స్వామిజీ బోధానందపురి మహరాజ్.

“అదేంటి స్వామి అలా అంటారూ? మృత్యువంటే చావు కదా…”  చిన్నబుచ్చుకున్నాడాయన.

“అదేనయ్యా అంటున్నది. ఆ చావు ఎక్కడ్నించి వచ్చిందని . తెలుసా? తెలీదు కదూ! చావు ఎక్కడి నించీ రాదు. మనిషి పుట్టిన క్షణమే చావు పుట్టింది. మనిషితో పాటే పెరుగుతుంది. మనిషిలో ‘శక్తి’ సన్నగిల్లాక ఆ మృత్యువు అ మనిషిని తనలో ‘కలిపేసుకుంటుంది..’  ఓ విధంగా చెబితే మృత్యువు అలసిన శరీరానికి ‘ముక్తినిస్తుంది..’ అనగా బాధ్యతలనించి ‘విముక్తి కల్పిస్తుంది’ అన్నారు స్వామీజీ.

ఈ మాటలు ఇన్నేళ్లుగా ఆల్‌మోస్టు ప్రతీరోజూ జ్ఞాపకం వస్తూనే వున్నాయి. ఆ మాటల్ని మరిన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటాను – ‘మాలతీ చందూర్’ లాంటి మనసున్న మనుషులు పరమపదించినప్పుడు.

ఒకరు ముందూ, ఒకరు వెనుకా .. తేడా అంతే… అందరం యీ అత్తింటిని వదిలి ‘ఆ’ పుట్టింటికి చేరాల్సిన వాళ్లమే. (లాగా చున్‌రీ మే దాగ్. చుపావూఁ కైసే  పాట గుర్తుందా?)

మృత్యువు ‘ఆడు’కోని జీవి యీ సృష్టిలో ఉంటుందా? అసలు పుడుతుందా? సరే.. ఆ వి షయం పక్కన పెడితే…. “భువనచంద్రగారూ.. మనం ‘పెద్దపీట’లవాళ్ళం. ఇదీ.. నేనెప్పుడు కలిసినా మాలతీ చందూర్ గారు ఆప్యాయంగా నాతో అనే మాట.

ఏలూరు, నూజివీడు ప్రాంతాల వాళ్ళని అప్పటివాళ్ళు ‘పెద్దపీట’లాళ్లు అనేవారు. కారణం భోజనానికి కూర్చునే పీటలు చాలా పెద్దవి చేయించి వాడటమే గాక, ‘అతిథి మర్యాదల్ని’ అద్భుతంగా పాటించేవారు కూడా. మా ఇద్దరి సంభాషణల్లో చోటు చేసుకునే మరో అంశం ‘ఏలూరు’. మా చింతలపూడి ఏలూరికి ముప్పై మైళ్లేగా.. ఇంకా నూజివీడు  చిన్న రసాలతో పెట్టిన ఆవకాయ, మా వూరి దగ్గరున్న ప్రగడవరం పండుమిర్చి, మరియు ఘనత వహించిన ఏలూరి దోమలు.

నాకు వంటావార్పూ రాకపోయినా, నా నాలిక మాత్రం రుచి మరిగిన నాలిక. దాంతో రకరకాల కూరలూ, పచ్చళ్ళూ తయారీ విధానం, ఇంకా మా వేపు మాత్రమే చేసుకునే వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి మెంతిపోపూ మాత్రమే గాక నేతిబీరకాయ పచ్చడి ఘుమఘుమా ఇవన్నీ ఏ సభలోనో, సమావేశంలోనో మేము కలుసుకున్నప్పుడు దొర్లే విషయాలు.

చందూర్‌గారికి ‘తిండి’ యావ పెద్దగా లేదు గనక హాయిగా నవ్వుతూ మా కబుర్లు వినేవారు. ఒకసారి నేను ‘నల్లేరు’ పచ్చడి గురించి చెబితె మాత్రం ఆయన చాలా ఇంట్రెస్టింగ్‌గా విన్నారు. నల్లేరు పచ్చడి గురించి ఆయన అంతకు ముందు వినలేదట.

ఆంధ్రాక్లబ్ (ఆస్కా)లో ఎప్పుడు సభలు జరిగినా ఘంటసాల రత్నకుమార్‌గారు స్వచ్చమైన, అచ్చమైన ఆంధ్రా టిఫిన్లు చేయిస్తారు. ఉల్లిపాయలు దట్టించి, నిమ్మకాయలు పిండిన ఘాటుతోటి పచ్చిమిరపకాయ బజ్జీలు, లేత ‘బంగారు’ రంగులో నుంచి ‘ముదురు’ రంగులోకి అందంగా దిగిన ‘ఆలూ బోండాలు’, ‘స్వర్గం చూడాలా? రా .. నన్ను తిను” అని నోరూరించే చల్ల పునుకులూ, ఎర్రగా వర్రగా ‘మింగెయ్ నన్ను’ అన్నట్లు చూసే అల్లం చెట్నీలు.. వీటన్నింటితోటి ఒకింత చిలిపిదనంతో అందరినీ అలరించే మాలతీ చందూర్‌గారి మధురమైన మాటలూ .. యీ చెన్నై మహానగరంలో నివశించే ఏ తెలుగువాడు మరిచిపోగలడు?

మాలతిగారు  ‘లేని’ సభని ఊహించలేం.  ‘వీడు గొప్పవాడు’, సామాన్యుడు అని చూడకుండా, అందరితోటి హాయిగా కలిసిపోయి, ఆప్యాయతానురాగాల్ని పంచే మాలతిగారు మనని విడిచి ఎక్కడికి పోతారు? శరీరానికేముందీ….. అదెప్పుడైనా మనని విడిలిపోయేదే. కానీ ఆత్మ? పోనీ మనసూ? అంతెందుకూ. ఆవిడ మంచి మాట? మనని విడిచిపోగలదా?

మాలతిగారి గురించి అనుకోగానే మనకి గుర్తొచ్చేది  ప్రమదావనం పాత కెరటాలు. ఇంకా వంటలూ – వార్పులూ. మూడువందలకి పైగా ఆమె చేసిన అనువాద రచనలూ, 25 పైగా చేసిన స్వీయ రచనలు. మాకు అంటే చెన్నైవాళ్లకు వీటన్నిటికన్నా మించి గుర్తొచ్చేవి ఆవిడ నిష్కల్మషమైన నవ్వులూ, ఎవరినీ నొప్పించని ఆమె కామెంట్లూ, సరదాగా, హాయిగా గంగా ప్రవాహంలాగా  ఆవిడ గళం ద్వారా ప్రవహించే  ప్రసంగాలు.

“ఆరోగ్యం ఎలా ఉందమ్మా?” అని అడిగితే పకపకా నవ్వి “ఇదిగో.. ఇలా ఉందయ్యా!” అనేవారు. ఇంకేం!

కష్టాలు ‘చెప్పుకోవడం’, ఇతర్లని విమర్శించడం, తప్పొప్పుల్ని, లోటుపాట్లని ‘వెదకడం’ ఆవిడకి తెలీని విషయాలు.

ఓ మంచి పుస్తకం గురించి మాట్లాడండి.. అంత మంచి ‘శ్రోత’ ప్రపంచంలో దొరకదు.

ఓ సారి మీసాలు బాగా ‘ట్రిమ్’ చేశాను. “ఇదిగో భువనచంద్రా.. నేను లావైనా, నువ్వు మీసాలు తగ్గించినా చూడ్డానికి బాగోదయ్యా! అన్నారు. ఆ తర్వాత ఏనాడూ నేను ‘ట్రిమ్’ చేయ్యలేదు.

చాలా చాలా ఏళ్ళ క్రితం, అంటే ఓ అయిదు దశాబ్దాల  వెనక్కి వెళితే, మాలతీ చందూర్‌గారి ‘ప్రమదావనం’, తెన్నేటి హేమలతగారి ‘ఊహాగానం’, రామలక్ష్మి ఆరుద్రగారి ‘కాలక్షేపం (అంతరంగాలు) పాఠకుల్ని ఉర్రూతలూగించేవి. ముగ్గుర్లో ఎవరు గొప్ప అని కూడా ‘మేం’ వాదించుకునేవాళ్ళం. నా అదృష్టం ఏమోగానీ ఆ మహానుభావురాళ్లు ముగ్గురూ నేను పెద్దయ్యాక పరిచయం కావటం, వారి పాదాలనంటి ఆశీస్సులు నేను పొందటం జరిగింది.

ఇప్పుడే అంటే ఓ పది నిముషాలకి ముందు బలభద్రపాత్రుని రమణిగారితో మాట్లాడుతూ, “రమణిగారూ నలభై ఏళ్ళ క్రితం మాలతీ చందూర్‌గారు వ్రాసిన ‘రెక్కలు – చుక్కలు’ అనే నవల సినిమాకి అద్భుతంగా పనికి వస్తుంది. చక్కని లేడీ ఓరియెంటెడ్ ‘సబ్జెక్ట్’ అన్నాను. ఎందుకంటే యీనాటి సమాజంలో ఆవిడ ‘చూసి, చూపించిన’ పరిస్థితులే ఉన్నాయి.

స్వాతి పత్రికలో ‘పాతకెరటాలు’ ఎన్ని లక్షలమంది పాఠకుల్ని ‘విశ్వ’ పాఠకులుగా మారిచిందో నాకు తెలుసు. స్వాతి ‘మాస’ పత్రిక రాగానే మొదట చదివేది, ఆ శీర్షికకు సంబంధించిన నవలే. అలాగే ‘నన్ను అడగండి’..

ఏమి చెప్పినా, వ్రాసినా, తనదంటూ ఓ విలక్షణ శైలి. తన ‘సాహిత్య సంపద’ని అందరితో పంచుకోవాలనే తపన… ఎవరు ఏది వ్రాసి చూపించినా చెప్పినా, “భలే ఉంది” అంటూ ప్రోత్సహించడం మాలతిగారి జీవలక్షణం. నవ్యలో నేను వ్రాసిన ‘ ‘ఆ ఊరేది’ కథ చదివి, “చివర్లో ఏడిపించావోయ్. నీ సమయాన్నంతా ‘కథ’లకే కేటాయిస్తే ఎంత బాగుంటుందో?” అన్నారు. ఆ స్ఫూర్తితో నేను చాలా కథలు రాసే ‘ధైర్యం’ సమకూర్చుకున్నాను అనటం అతిశయోక్తి కాదు.

ఏ ‘కథ’ చదివినా బాగుంటే ఆవిడతో చెప్పేవాడ్ని. “అదా.. అద్భుతం” అనేవారు. అంటే ఆల్‌రెడీ ఆమె చదివేశారన్నమాట. ” ఓ రోజు మీ ఇంటికొచ్చి నీ లైబ్రరీ చూడాలి..!” అన్నారు. ఆవిడ అన్న ఆ మాట మాత్రం ఇక నా జీవితాంతం ఓ తీరని కలలాగే మిగిలిపోతుంది.

“వివరించడం” అనేది మాలతిగారికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఏలూరులో ఆవిడ ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఆవిడ సెన్సార్ సెంట్రల్ బోర్డు మెంబరుగానూ పని చేశారు. ‘రవ్వలదిద్దులు’ కథ (మొదటిది)ని మా అమ్మగారు గట్టిగా చదువుతుండగా నా చిన్నతనంలో నేను విన్నానని గర్వంగా ఇప్పుడు చెప్పుకోగలను. ఆలోచించు, హృదయనేత్రి, భూమిపుత్రి, శతాబ్ది సూరీడు,  ఇలా 25కి మించి నవలలు రాశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య ఎకాడమీ అవార్డు, భారత భాషా పరిషత్ అవార్డు ఇలా ఎన్నో అవార్డుల్ని అందుకున్నారు.

ఒక్క విషయం విన్నవించుకుంటాను. న్యాయంగా యీ నాలుగు మాటలూ మాలతీ చందూర్‌గారి మృతి సందర్భంగా వ్రాయాల్సినవి . కానీ నా మనసులో ఆ ఆలోచన లేదు. 84 సంవత్సరాలపాటు సంపూర్ణంగా, సంతృప్తిగా జీవించి సాహితీలోకానికి అమూల్య సేవ చేసి, విజ్ఞానపు వెలుగుల్ని లక్షలాది మందికి నెలనెలా పంచుతూ, ఎందరికో ప్రశ్నోత్తరాల ద్వారా బతుకుని దిద్ది బతుకుబాటని చూపిన మాలతీచందూర్‌గారికి మరణం లేదు. ఆఖరికి తన భౌతిక శరీరాన్ని కూడా, ‘వైద్య పరిశోధన’ల నిమిత్తం రాంచంద్ర కళాశాలకు వప్పచెప్పమన్నారంటే, ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో  మనం ఊహించుకోవచ్చు.

“లోకాన్నించి  ఏవీ తీసికెళ్లలేం..” ఇది నిజం. కానీ “లోకానికి ఎంతో ఇవ్వొచ్చు…!” ఇది మాలతీ చందూర్‌గారు ప్రాక్టికల్‌గా రుజువు చేసిన నిజం.

అందుకే మాలతమ్మా.. కన్నీళ్లు కార్చి మీకు వీడ్కోలు పలకాలని లేదు. గుండెనిండా ప్రేమతో మిమ్మల్ని తలుచు కుంటాం. ప్రతీ పాత కెరటాన్ని, మా హృదయ సముద్రంలో మరోసారి కదలాడమని వేడుకుంటాం. కలకాలం హృదయాల్లో జీవించే మీకు ‘కన్నీ’టి వీడ్కోళ్లెందుకు?

మీరు వ్రాసిన పుస్తకాల్ని మళ్లీ మళ్లీ చదవాలి. మీ నవ్వుల్ని మాటల్నీ, మళ్లీ మళ్లీ తలుచుకుని రాబోయే తరానికి మీగురించి చెప్పాల్సిన బాధ్యత మాకు ఎలానూ ఉంది కదా!

ఎటొచ్చీ ఒకటే బాధ. ఇకనించీ ఏ సభకి వెళ్లినా, ఏ సమావేశానికి వెళ్లినా ఖాళీగా ఉండే ముందు వుండే మీ కుర్చీ మా గుండెల్ని పిండెయ్యదూ.. మీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ముంచెయ్యదూ.

అవునూ.. ఇన్ని వేల పేజీలు వ్రాశారు కదా. మీ జ్ఞాపకాలతో గుండెల్లోంచి పొంగి, ‘కళ్ళల్లోంచి కారే కన్నీళ్ల’ని ఎలా ఆపుకోవాలో మాత్రం ఎందుకు వ్రాయలేదు? అలా రాసి గనక వుంటే ఇవ్వాళ ఇన్ని వందల కళ్లు…. ఎందుకులేమ్మా…. పుట్టింటికేగా వెళ్ళావూ…! మేమూ కలుస్తాంలే.. ఏనాడో ఓనాడు… అన్నట్టు.. మరో మంచి ‘వంట’ కనిపెట్టరూ. మేం వచ్చాక టేస్టు చెయ్యడానికి… పోనీ మాకోసం మళ్లీ యీ  లోకంలోనే పుట్టకూడదూ..

 

నమస్సులతో

భువనచంద్ర..

 

(వంటల గురించి వ్రాసింది ఎందుకంటే మాలతిగారిని తలుచుకుంటూ మంచి భోజనాన్నో, టిఫిన్నో ఇష్టమైన వారికి వడ్డిస్తారని ..)

ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌!

ప్రేమ, పరాధీనత, బానిసత్వం ఈ మూడు పైకి వేరు, వేరు, భిన్నమయిన అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడింటి  అంతఃస్సారం ఒకటే!

ప్రేమ పరాధీనతలోకి, పరాధీనత బానిసత్వంలోకి దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే ప్రేమ కు మరో పేరు బానిసత్వం. ఇది అతార్కిక ముగింపు అనిపిస్తుందేమో కానీ కొన్ని కొన్ని విషయాలు చదువుతున్నపుడు  కొంత మంది వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నపుడు ‘‘ఇది నిజమే కదా’’! అని కూడా అనిపిస్తుంది. బానిసత్వంలో ‘‘నేను బానిసను, నాకు స్వేచ్ఛ లేదు, నేను పీడింపబడుతున్నాను’’ అన్న ఎరుక, సంవేదన ఉంటాయి.  ప్రేమలోఅదేమీ వుండదు.  

‘‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే స్వర్గము’’ అనే ఆత్మార్పణ భావన ప్రేమలోవుంటుంది.  ఈ అర్పించుకోవటం అనే ప్రక్రియ, లేదూ తనని తాను త్యాగం  చేసుకోవడం అనే భావన ప్రేమ కల్పించే అనేకానేక మాయాజాలాలలో ఒకటి. సముద్రం తన మెత్తని హస్తాలతో మన అరికాళ్ళకింద గిలిగింతలు పెట్టినట్లుగా అనుభూతిని కలిగించి పూర్తిగా తనలోకి లాగేసుకుని మనలని శూన్యం చేసినట్లుగానే ప్రేమ కూడా ప్రేమలో వున్న వాళ్ళని ఖాళీమనుషులను చేస్తుంది. ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌.

ఒక రాత్రివేళ నిద్రపట్టక తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించిన సామల సదాశివ ‘‘మలయ మారుతాలు’’ వ్యాస సంపుటిలోని ‘‘ఇస్మత్‌ చుగ్తాయ్‌’’ పరిచయ వ్యాసం చదువుతున్నపుడు నాలో కలిగిన భావ సంచయం ఇది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ మాత్రమే కాదు. బేగం అఖ్తర్‌, మన రావు బాలసరస్వతీదేవి లాంటి ఉదహరించదగిన వ్యక్తుల జీవితాలలో ప్రేమ ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలుసుకుంటే ఆసక్తికరంగా వుంటుంది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ ప్రముఖ ఉర్దూ రచయిత్రి. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత. ఇప్పటికీ సమాజం ఆమోదించని, చర్చిండానికి యిష్టపడని ఎన్నో విషయాలను నలభై, యాభై సంవత్సరాల క్రితమే తన రచనల ద్వారా ప్రకటించి, చర్చనీయాంశం చేసి సంచలనం సృష్టించిన రచయిత్రి ఇంకా…..

231856

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కి చెందిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి కలెక్టర్‌. ఆమె పెద్దన్న అజీం బేగ్‌ చొగ్తాయ్‌, ఇస్మత్‌కి ఊహ తెలిసేవరకే పెద్ద రచయిత. ఇస్మత్‌ మనసు రచన వైపు మరలటానికి ఆమె అన్నే కారణం. మధ్య తరగతి ముస్లిం జీవితాలలోని సామాజిక, నైతిక, ఆర్ధిక, చీకటి కోణాలను వెలికి తీస్తూ ఆమె శర పరంపరగా కథలు రాసింది. లైంగిక విషయాలను కూడా ఎక్కడా అసభ్యతకు తావు ఇవ్వకుండా చర్చకు పెట్టింది. ఇస్మత్‌ మీద పెట్టిన కేసులు ఎన్నో… ఒక్కటీ నిలవలేదు.

ఆమెకు, బొంబాయి మహానగర పాఠశాలల విద్యాధికారిగా పని చేస్తున్నపుడు షాహీద్‌ లతీఫ్‌ అనే యువకుడితో పరిచయం అయింది. అతడు కూడా ఒక చిన్న సైజు రచయిత. సినిమాలకు స్క్రిప్టులు రాసేవాడు. ఇస్మత్‌తో పరిచయం అయ్యాక, ఆమె దగ్గర శిష్యరికం చేశాడు. తన రచనలను ఆమె చేత సరిచేయించుకున్నాడు. సలహాలు తీసుకున్నాడు.

ఒకనాడు ఉన్నట్టుండి. సాహీద్‌ లతీఫ్‌, ఇస్మత్‌తో ‘‘మనిద్దరం పెళ్ళిచేసుకుందామా?’’ అని అడిగాడు. ఆమె విస్తుపోయింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. పెద్ద పేరున్న రచయిత్రి. ఖ్యాతినీ, ప్రఖ్యాతినీ సమాన స్థాయిలో మూటకట్టుకున్న ఐకాన్‌.

‘‘మనిద్దరికీ ఎలా కుదురుతుంది’’? అన్నది ఆమె. ‘‘ఎందుకు కుదరదు’’? అన్నాడు అతను. ‘‘నేను నీకు తగిన భార్యను కాను. పురుషాధిక్యతను నేను అస్సలు సహించను. నీకు సేవలు చేయను. నేను మొండిదానిని. అనుకున్న పని చేసేదాకా పట్టు సడలించని దానిని. ఎవరు ఏమి అనుకున్నా నాకు పట్టింపు లేదు. ఇంత ఎందుకు? సంప్రదాయక గృహిణి లక్షణాలు నాలో ఒక్కటీ లేవు. అలాంటి నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు?’’ అన్నదామె.

లతీఫ్‌ పట్టు విడువలేదు. కోపంతో లతీఫ్‌తో మాట్లాడటం మానేసింది ఇస్మత్‌. అయినా అతడు ఆమె దగ్గరకు వెళ్ళడం మానలేదు. ఇస్మత్‌ అన్న అజీంబేగ్‌ ఎందరు, ఎన్ని రకాలుగా చెప్పినా లతీఫ్‌ తన మొండిపట్టు వీడలేదు.

చివరకు వాళ్ళిద్దరి పెళ్ళి జరిగింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. అతడు చిన్న చిన్నస్క్రిప్టులు రాసుకునే మినీ రచయిత. ‘‘గతిలేని వాడికి గెజిటెడ్‌ ఆఫీసరా…? అని అతడి మిత్రులు హేళన చేస్తారని ఉద్యోగానికి రాజీనామా చేసింది. అప్పటికీ ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నా ఆమె, తన కీర్తి ప్రతిష్టలు అతడిని ఆత్మన్యూనతకి గురిచేస్తాయోమోనే ఉద్దేశ్యంతో రచనలు చేయడం మానేసింది. వాళ్ళిద్దరూ వీధిలో నడిచివెళుతున్నపుడు ‘‘ఇద్దరి ఎత్తూ సమానమే’’ అని ఎవరో అన్నారని ‘‘హై హీల్స్‌’’ వేసుకోవడం మానేసింది.

అంతేనా…?

ప్రొడ్యూసర్ల చుట్టూ చక్కర్లు కొట్టి, వెయ్యికీ, రెండు వేలకూ స్క్రిప్టులు రాసే అతడిని నిర్మాతను చేసింది. తను రాసిన నవల ‘‘జిద్ది’’ను సినిమాగా నిర్మించి అతడిని ప్రొడ్యూసర్‌ని చేసింది.

దిలీప్‌ కుమార్‌, కామినీ కౌశల్‌ లాంటి పెద్ద పెద్ద తారలు వాళ్ళ సినిమాలలో నటించారు. సినిమాలు విజయవంతం అయినాయి. సినిమాలకు రాసినా, కథలకీ, స్క్రిప్టులకీ తన పేరు వేసుకోకుండా లతీఫ్‌ పేరునే ప్రకటించేది. ఆ రకంగా అతడిని గొప్ప రచయితను చేసింది.

ఇద్దరమ్మాయిలు కలిగిన తరువాత లతీఫ్‌ మరణించాడు. అతడి అకాల మరణం ఆమెను కుంగదీసింది. కానీ పెరిగిన బాధ్యతలు ఆమెను మళ్ళీ మునుపటి ఇస్మత్‌గా మార్చాయి. తరువాత ఆమె జ్ఞానపీఠ్‌ అవార్డును కూడా పొందింది.

మరణానికి ముందు లతీఫ్‌ తన డైరీలో ఇలా రాసుకున్నాడట. ‘‘నన్ను పెళ్ళిచేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడతావని ఇస్మత్‌ అన్నది. కానీ నాకు తను ఆ అవకాశాన్నే యివ్వలేదు. ఇలాంటి అదృష్టం ఎంత మందికి దొరుకుతుంది?’’

నిజమే. లతీఫ్‌ అదృష్టవంతుడే…

ఇస్మత్‌ కోసం అతడేం చేశాడు. అతడి కోసం ఆమె, ఉద్యోగాన్ని, రచననీ, అన్నింటినీ వదులుకుంది. తను నీడలాగా వెనుక వుండి అతడిని వెలుగులోకి తీసుకుని వచ్చింది. సతీ సావిత్రిని కాను అన్న ఆమె,  సతీ సావిత్రి కంటే తక్కువేమీ కాదు అనిపించుకుంది.

ఇదంతా ప్రేమ కోసమేనా…?

***

LF14_BEGUM2_1296636f

‘‘దీవానా బనానా హైతో బనాదే’’ అనే గజల్‌ ద్వారా ఎంతో మందిని పిచ్చివాళ్ళను చేసిన బేగం అఖ్తర్‌ది మరొక కథ.

అఖ్తర్‌ బాయి ఫైజాబాదీ లక్నోలోమంచి ప్రాక్టీసు గల బారిస్టరు ఇస్తెయాఖ్‌ అబ్బాసీతో  వివాహం జరిగిన తరువాత బేగం అఖ్తర్‌గా మారింది.

సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో పుట్టిన అఖ్తర్‌ బేగం సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుని కొన్నాళ్ళు పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్‌ అతా అహ్మద్‌ ఖాన్‌ దగ్గర, మరి కొన్నాళ్ళు ఉస్తాద్‌ అబ్దల్‌ వహీద్‌ ఖాన్‌ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.

అఖ్తర్‌ బాయిగా గొప్ప పేరునూ, డబ్బునూ సంపాదించుకుంది. బారిస్టర్‌ అబ్బాసీకి భార్య అయిన తరువాత బేగం అఖ్తర్‌గా మారిన తరువాత కొన్ని సామాజిక కట్టుబాట్లకి లొంగిపోవలసివచ్చింది. బురఖా మాటున ఆమె స్వరం మూగవోయింది. అచ్చం మన రావు బాలసరస్వతిదేవి నూజివీడు జమిందారుల అంత:పురంలో మూగవోయినట్లుగా.

ఆమె సాటి గాయని గాయకులు ఎవరయినా ఇంటికి వస్తే ఆమె అసహాయంగా బేల చూపులు చూసేది. ఎవరి పాటలు విన్నా ఆమెకు ఏడుపు వచ్చేది. ఆ నరకం నుండి ఆమెకు బయట పడాలని వుండేది. కానీ భర్త బారిష్టరు అబ్బాసి పట్ల ఆమెకు వున్న ప్రేమ, భర్త గౌరవం కాపాడాలన్న తాపత్రయం ఆమెను బయటకు రానిచ్చేవి కావు.

ఆ రోజుల్లోనే లక్నో రేడియో స్టేషన్‌కు ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌గా వచ్చిన సునీల్‌ బోస్‌కి లక్నో రావడానికి ముందే బేగం అఖ్తర్‌తో పరిచయం ఉంది. ఆవిడ పాడటం మానేయడం పట్ల బాధపడిన సునీల్‌ బోస్‌ ఆమెను ఎలాగయినా పాడిరచాలి అనుకున్నాడు. జస్టిస్‌ మల్హోర్‌ తో కలసి బారిష్టర్‌ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాని లక్నో రేడియో స్టేషన్‌కి తీసుకురాగలిగాడు.

దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత లక్నో రేడియో స్టేషన్‌ ప్రసారం చేసిన బేగం అఖ్తర్‌ గజళ్ళని విని అసంఖ్యాకులయిన ఆమె అభిమానులు ఆనందపడిపోయారు.

అబ్బాసీ కూడా ఆమె పాటను కట్టడిచేయడం అన్యాయమని, అపచారమని అనుకుని ఆమెకు పాడుకునే స్వేచ్ఛను యిచ్చాడు. అప్పటినుండీ ఆవిడ తన స్వర మాధుర్యంతో ఎందరెందరు సంగీత ప్రియులను తన్మయులను చేసిందో!

***

rbs

అలాగే మన రావు బాలసరస్వతిదేవి. నూజివీడు జమిందారును పెళ్లిచేసుకునేటప్పటికీ గొప్ప గాయని. ఎస్‌. రాజేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిరది. నూజివీడు దివాణంలోకి అడుగుపెట్టిన తరువాత ఆవిడ మళ్ళీ బయటి ప్రపంచాన్ని చూడలేదు. స్వరాన్ని సవరించలేదు. రాజ సాంప్రదాయాల కోసం, రాజా వారి మీద వున్న ప్రేమ కోసం, బాల సరస్వతీదేవి స్వరాన్ని త్యాగం చేసింది.

పాట పట్ల ప్రేమ వుండీ, పాటే జీవితం అనుకునీ, పాడగలిగే శక్తివుండీ పాటకు దూరం కావడం అంటే పువ్వునుండి పరమళం దూరం కావడమే. మర్యాద కాదని బాలసరస్వతీదేవి బయటకు చెప్పకపోవచ్చు కానీ, పాటకు దూరమయి ఆవిడ ఎంత నరకాన్ని అనుభవించి వుంటుందో…

రాజావారు దివంగతులయిన తరువాత మళ్ళీ బాలసరస్వతీదేవి పాడటం మొదలుపెట్టారు. కానీ సమయం మించిపోయింది కదా…

ఇస్మత్‌ చుగ్తాయ్‌`

బేగం అఖ్తర్‌`

రావు బాల సరస్వతీదేవి`

వీళ్ళంతా లోకజ్ఞానం లేని మామూలు మనుషులుకారు. కానీ ప్రేమ కోసం కరిగిపోయిన కొవ్వొత్తులు. పెళ్లికి ముందు వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు, పెళ్ళయిన తరువాత వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు. సతీ సావిత్రిని కాను అని మరీ చెప్పిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సతీ సావిత్రిలాగే ప్రవర్తించింది. ఎందుకనీ… లతీఫ్‌ పట్ల ప్రేమకోసం…

హైద్రాబాద్‌ నిజాం రెండవ కుమారుడు ప్రిన్స్‌ మొఖరం జానే ఆత్మాభిమానం కోసం తృణీకరించి వచ్చిన బేగం అఖ్తర్‌ బారిష్టర్‌ అబ్బాసీని పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేక, మౌనంగా వుండి పోయింది ఎందుకని… ప్రేమ కోసం.

నూజివీడు రాజావారు బ్రతికి వున్నంతకాలం రావు బాల సరస్వతీదేవి కోట గుమ్మం దాటి బయటకు రాలేదు ఎందుకని…ప్రేమకోసం

ప్రేమ కోసం వాళ్ళు పరాధీనత లోకి వెళ్లిపోయారు. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ సహజ లక్షణాలని స్వయంగా తృణీకరించారు. పురుషుడికి నీడలాగా మారిపోయారు. అది బానిసత్వమన్న ఎరుక కూడా వాళ్లకు లేదు. అదంతా ప్రేమే అని అనుకున్నారు. నిజంగా అది ప్రేమేనా…?

ప్రేమంటే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి పంచుకోవాలి కదా! ఇద్దరూ ఒకే స్థాయిలో స్పందించాలి కదా! ఒకే శృతిలో ఒకే స్వరంలా కలసిపోవాలి కదా! ఒకే నాణేనికి రెండు వైపుల్లా నిల్చిపోవాలి కదా…

కానీ అలా జరగడం లేదు!

ఈ ఆధిపత్య భావజాలాన్నీ, దీన్ని అంగీకరించడాన్నీ, అంగీకరించినట్లుగా కూడా తెలుసుకోలేని అజ్ఞానాన్ని… దీన్నంతటినీ ప్రేమే…. అందామా!

 -వంశీకృష్ణ 

 

 

Hypothesis

  సరళమైన వాక్యం, లోతైన భావం ఆర్.దమయంతి సొంతం. పుట్టి పెరిగింది బందరులో… స్థిరపడింది హైదరాబాద్ లో. కొన్ని ప్రముఖ వారపత్రికల్లో ఉపసంపాదకురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు అరవైదాక కథలు, వందకు పైగా కవితలు  రాశారు. ఈమె కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి.  “గుండెమీద రాయి” అనే కథకు రంజని అవార్డు అందుకున్నారు.  తన అభిమాన కవి, కథకుడు తిలక్ అని చెబుతారు దమయంతి.

-వేంపల్లె షరీఫ్
     ***
images
 
“ఏమిటీ? స్నేహ   పెళ్లికెళ్తున్నావా?” – ఫోన్లో సూటిగా అడిగింది రాజీ.ఇప్పటికిలా అది  అడగడం ఎన్నో సారో తెలీదు కానీ, అడిగినప్పుడలా మౌనాన్నే ఆశ్ర యించాల్సిన  పరిస్థితి   నాది!స్నేహ – మా ఇద్దరికి స్నేహితురాలే ఐనా, రాజీ తో కంటేనూ, నాతోనే ఎక్కువ స్నేహం గా వుంటుంది.రోజుకో సారైనా ఫోన్ చేసుకోకుండా, మాట్లాడుకోకుండా వుండలేనంత క్లోజ్
ఫ్రెం డ్స్ మి .. మేము.అలాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళ కుండా ఎలా వుంటం?కానీ, రాజీ  – “వొద్దంటోంది”.వెళ్తే కలిగే నష్టాలు, పరిణామాలు చెబుతూ నన్ను భయపెడుతోంది. వెన్ను జలదరించే నిజాలు చెబుతూ..నా చేత వెనకడుగు వేయిస్తోంది.రాజీ! – ఒక మామూలు గృహిణి.   ‘దాని మొహం. దానికేం తెలుసు. పెద్ద లోక జ్ఞానం లేని మనిషి ‘ అని అనుకున్నా ఇన్నాళ్ళు.  కానీ, నా  అంచనాలన్నిట్నీ తారు మారు చేస్తూ, తనెంత గొప్ప  లోక జ్ఞానూ నాకు తెల్సిచ్చేలా మాట్లాడుతోంది.లేక పోతే ఏమిటీ! రోజూ వార్తా విశేషాలు కోసం డేగ కళ్ళేసుకుని చూస్తూ, అన్ని మూలల సమాచారాల్ని ఆంగ్లం లోంచి  తెలుగులోకి తర్జుమా చేసుకుంటూ..,  వార్తా కథనానికి   ఏ విషయం దొరుకుతుందా   అని  నిరంతరం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే నాకు సైతం తట్టని పాయింట్,  దానికెలా తట్టినట్టు?  నా  కళ్ళకి కనబడని  ఆ ప్రమాదపు అంచు రాజీ కి మాత్రమే ఎలా క నిపించినట్టు?  – ఖిన్నురాల్నై పోతున్నా!

అందుకే అంటారు.  చదువుకున్న ప్రతి  వెధవాయికీ, లోకం తీరు తెలీదని, బ్రతకడం రాదనీనూ.

మనిషి వేరు. ఆర్జించే జ్ఞానం వేరు.  మెదడు వేరు. మనసు వేరు. ప్రతిభ వేరు. లౌక్యం వేరు. అన్నీ వేర్వేరు శాఖలే అయినప్పటికీ, వీటన్నిట్నీ  కలిపి మోసే  వృక్ష కాండం మాత్రం ఒకటి కాదు అనిపిస్తుంది.

అంత బాధ లోనూ, నా విశ్లేషణకి  నాకే నవ్వొచ్చింది.

“ఏంటీ, చెప్పవూ?వెళ్తున్నావా?, లేదా?” – విస్సురుగా అడిగింది, మళ్ళీ. ఏం  చెప్పాలో తెలీని దాన్లా అన్నాను. “కాస్త ఆలోచించుకోనీ, రాజీ!,.. చెబుతాను.” అన్నాను నిదానం గా.

అవతల  ఠపీమని ఫోన్ పెట్టేసిన చప్పుడైంది.

రాజీ కోపం నా మీద కాదు. నాకా సంగతి తెలుసు. పూర్తిగా తెలుసు. ఆ మాట కొస్తే దానిదసలు   కోపమే కాదు. ఆవేదనై వుండొచ్చు.

కారణమేమిటంటే…స్నేహ  ఈ పెళ్ళి  చేసుకోవడం రాజీ కి ఇష్టం లేదు.

” నేను ఖాయం గా వెళ్ళడం లేదు. నువ్వూ వెళ్ళకు. ఏం? సరేనా?  ” -ఇందాకటి రాజీ మాటలు  పదే పదే గింగురుమంటున్నాయి చెవిలో.

ఈ క్షణం దాకా,  స్నేహ పెళ్ళికి వెళ్దామనుకున్న నా ప్రయత్నానికి , రాజీ వైల్డ్ వివరణ తో – ‘ఐతే, వొద్దా, వెళ్లొద్దా!” అనే సంశయావస్థలో పడేసాయి.ఇంతకీ  వెళ్ళా లా వద్దా అని  నిర్ధారించుకోడానికి ముందుగా…

నేను – నా    స్నేహ మయిని  మొదట్నించి చదవడానికి సిధ్ధమయ్యాను.

నా ప్రమేయం లేకుండానే…స్నేహ నా ఆలోచనా  తరంగాల మీద నవ్వుతూ ముత్యం  పూసలా  కనిపిస్తోంది.

 

***

మేం ముగ్గురం ప్రాణ స్నేహితులం.

చిన్నపట్నించి కలసి మెలసి చదువుకున్నాం.  ఎక్కడికంటే అక్కడికీ ముగ్గురం గుంపుగా వెళ్ళే వాళ్ళం. మమ్మల్ని చూసి, ముగ్గురమ్మాయిలు అనీ,  ముగ్గురమ్మలనీ, రంభ ఊర్వశీ,  మేనక లనీ ఇలా పెట్టుడు పేర్లెట్టి పిలుచుకునే వాళ్ళు, చూసినవాళ్ళు.

డిగ్రీ వరకు మమ్మల్ని విడదీసిన వాళ్ళే లేరు. నిరంతరం గా సాగి పోయిన స్నేహం…డిగ్రీ కాగానే జీవన దారులు వేరయ్యాయి.

రాజీ కి పెళ్ళి కుదిరింది. అత్తారింటికెళ్ళిపోయింది.

నేను జర్నలిజం లోకి దూకాను. పత్రికాఫీసులో ట్రైనీ గా చేరి!

స్నేహ  – లా చదవడం కోసం.. యు.కె. కెళ్ళి పోయింది.

రాజీ పూర్తిగా గృహిణి పాత్రలో ఐక్యమై  పోయింది. ఇప్పుడు దాని లోకమే వేరు.

నేనైతే, నేనేమో నా పుస్తకాలేమో! న్యూస్ అందిపుచ్చుకోవడం, తెలుగు లోకి తర్జుమా చేస్తూ .. భాషతో తర్జన భజనలు  పడటం,    మరో పక్క  జర్న లిజం  పీజీ డిప్లొమా కోసం  ఈవినింగ్ కాలేజ్ కెళ్ళి, రాత్రికింటికి చేరడం.. ఇలా క్షణం తీరిక లేకుండా గడచిపోయేది.  రోజుకి ఇరవై నాలుగ్గంటలేం సరిపోవనిపించేలా!

స్నేహ రోజూ   నెట్ చాట్ లో కొచ్చేది.  ఈ మెయిల్స్ సరే సరి.   స్కైప్ లో ఎదురైతే, గంటలై పోయేవి. మాటలు, పాటలు, జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకునే  వాళ్ళం.

మా ఇద్దరి అభిరుచులు కామన్ గా వుంటం వల్ల, ఎంత సేపైనా, బోర్ అనేది వుండేది కాదు.

రాజీ కి కూడ స్నేహ  ఫోన్ చేసేది తప్ప, ఇన్ని మాటలు  కుదిరేవి కావు. కారణం, రాజీ కి అత్త గారింట్లో అంత స్వేచ్చ లేక పోవడం వల్ల!

అందు వల్ల, స్నేహ నాతోనే ఎక్కువ గా  మాట్లాడుతూ వుండేది. అలా చనువు పెరిగి, స్నేహం ఇంతకి మరింతైంది.

మా మాటల్లో ఎక్కువగా ప్రపంచ విషయాలు, జరిగే వింతలే వుండేవి. పుస్తకాలు, ప్రజలు,  ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ ఎవరెవరున్నారనే సంగతులే దొర్లేవి.

ఇంతలో..నా డిప్లొమా పూర్తి కావడం, ఉద్యోగం కన్ ఫార్మ్  అవడం, ప్రొఫెషన్ పట్ల మరింత బాధ్యత పెరగడం జరిగింది.

స్నేహ చదువు పూర్తి చేసుకుని, హైదరా బాద్ కొచ్చేసింది. ఓ ప్రముఖ న్యాయ వాది దగ్గర అసిస్టెంట్ గా చేరింది.

వచ్చాక కూడ స్నేహ నన్నే ఎక్కువ గా కలుస్తూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణాలు రెండు.

ఒకటి – అది రోజూ వచ్చే  కోర్ట్ కి దగ్గరలోనే మా పత్రికాఫీసు వుండటం.

రెండు – రాజీ మాటల ధోరణి దానికంత రుచించక పోవడం.

“రాజీ ఏమిటే, అలా మాట్లాడుతుంది!?” అంటున్న స్నేహ మాటలకి నవ్వి వూరుకునే దాన్ని.

తూనీగ ల్లాంటి  ఆడ పిల్లలు పెళ్ళయ్యాక ఇంటి ఈగలౌతారని విన్లేదెమో తను బహుశా!

స్త్రీ ల కి వివాహనంతరం జీవితం అంటే –  భర్తా, ఇల్లూ, పిల్లలు. బస్! ఇక ఆ ప్రంపంచం లోనే తిరగాడుతూ పోతారు.  కాపురం లో ఏ చిన్న  సమస్య వచ్చినా, ‘ ఇంకేముంది, ఇహ జీవితం ఐపోయింది,’ అని అల్లకల్లోలమై పోతుంటారు.  రాజీ కూడా అంతే.

అందుకే, స్త్రీలు నిరంతరం – తమ సంసారాలు చల్ల గా వుండాలని, సాఫీగా సాగాలని నోములు వ్రతాలు  చేస్తారు కాబోలు!

నాకు రాజీ గుర్తుకొచ్చినప్పుడలా, తులసి కోట దగ్గర నిత్య పూజలు చేసే అమ్మే  గుర్తుకొచ్చేది.

స్నేహ బోర్ గా వుందని పిలిస్తే వెళ్ళే దాన్ని. బ్రిటిష్ లైబ్రరీ కెళ్ళి కొత్త బుక్స్ చూడటం, టాంక్ బండ్ కెళ్ళి సాయాంకాలాలు చల్ల గాలి లో నడవడం, ఐ మాక్స్ కెళ్ళి సినిమా చూడటం, అట్నించటే రెస్టారెంట్ కెళ్ళి డిన్నర్లు చేయడం..అలా  గడిచిపోయేది కాలం.

మేమిద్దరం కలిస్తే, గంటలు క్షణాల్లా గడిచేవి.

రాజీ తో మేము కలిసినప్పుడు, స్నేహ – ఏం మాట్లాడాలో తెలీని దాన్లా  కొంత ఖాళీ గా చూస్తూ వుండేది. అప్పుడప్పుడు, చేతి గడి యారం వంక చూసుకోవడాన్ని నేను కనిపెట్టాను.

ఒక వయసొచ్చాక, ఒక వ్యక్తిత్వానికి అలవాటు పడ్డాక కొంతమంది –  అన్ని పర్సనాలిటీలతోనూ కాలాన్ని గడపలేరేమో! – మనమెవరితో నైనా మాట్లాడుతున్నప్పుడు సమయం వృధా అవుతోందేమో అని బాధ పడుతున్నామూ అంటే, ఖచ్చితం గా వాళ్ళు మన హృదయానికి దగ్గర గా లేరనే  అర్ధం.

ఈ సూత్రం స్నేహితులకు  మాత్రమే వర్తించదు.    ఒక్కో సారి తల్లి తండ్రుల మాటలు కూడా చాలా మందికి చాదస్తం గా,  అనిపిస్తాయంటే దీర్ఘం గా ఒక గంట పాటైనా గడపలేరంటే, అబధ్ధం కాదు.

అలా అని… విరోధ భావమేం  వుండదు. కానీ, వాళ్ళ సమక్షం లో దీర్ఘ కాలాన్ని వెచ్చించలేరు. ఇలాంటి పరిస్థితులే కమ్యూనికేషన్ గాప్ కి దారి తీస్తాయి. మనిషికీ మనిషికీ మధ్య ఆంతర్యాలు ఏర్పడి   పోతాయి. ఆంతకంతకీ ఒకరి కొకరు దూరమై పోతుంటారు. కాల క్రమేణా  ఆ ఇద్దరి మధ్య మాటలు కరువౌడానికి ఫెద్ద కారణాలేవీ కనిపించవు.

ఇక్కడ పిటీ ఏమిటంటే, రాజీ కి అర్ధం కాని స్నేహ, నాకర్ధమౌతోంది. అదే నా బాధ.

ఇలా మనుషుల్ని చదివే  సెన్స్ నాకున్నందుకు సంతోషమే కానీ, అప్పుడప్పుడు ఎవరికీ అర్ధం కాని వారు, నాకు మాత్రమే అర్ధమౌడం వల్ల కలిగే కష్టాలు ఇలా ఒక విపరీతానికి దారి  తీస్తుందని  నాకప్పుడు కాదు,… ఆ తర్వాత కానీ తెలియ లేదు.  ఎప్పుడంటే..

ఓ రోజు, హఠాత్తుగా రాజీ ఫోన్ చేసి, చాలా ఆత్రపడిపోతూ  ఓ సమాచారాన్ని అందించింది. ” ఇదిగో, నీ కో మాట చెప్పాలి. రాత్రి రెస్టారెంట్  లో మా ఆయనకి  స్నేహ కనిపించిందిట. ఒక్కత్తే కాదు.  పక్కనే ఎవరో ఒకతనున్నాడుట.  ‘వాళ్లిద్దరి తీరు చూస్తుంటే, స్నేహితుల్లా లేరు. ‘  అని అన్నారాయన.  ఓ సారి కనుక్కో! దాన్ని. అతనెవరూ, ఏమిటీ అని.” అంటూ ఆరిందాలా మాట్లాడింది.

దాని మాటలకి నవ్వొచ్చింది.

ఎంత స్నేహితురాలైతే మాత్రం అడుగుతామా?

నే విని వూరుకున్నా. రాజీ కి చెప్పలేదు కానీ, నేనూ ఓ  సారి చూసాను. ఐస్ క్రీం పార్లర్   కెళ్ళినప్పుడు  కనిపించింది.

అనుకోకుండా ఎదురవడంతో…నన్ను చూసి ఓ క్షణం పాటు తత్తర పడ్డా, ఆ వెనకే ఆనందపడిపోయింది.

మరు క్షణమే  తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేసింది. “ఈయన మోహన్! వీరి కంపెనీ లొనే నేను లీగల్ అడ్వైజర్ గా వున్నా..” అంటూ నవ్వింది. నవ్వుతూనే, మోహన్ వైపు తిరిగి..”నా క్లోజ్ ఫ్రెండ్ దామిని..జర్నలిస్ట్” అంటూ, పరిచయం చేసింది.

అతను నన్ను చూసి కూల్ గా నవ్వి, చేయి కలిపి,  ఆ మరు క్షణం లోనే  సెలవు తీసుకుంటూ.. కారు వైపు  నడిచాడు.

‘వస్తానంటూ ‘ ఆ వెనకే తనూ..  వేగంగా నడుచుకుంటూ, అతనితో కలసి   వెళ్లిపోయింది.

ఈ మధ్య తను పిచ్చ  బిజీ గా వున్నా నని వంకలు చెబుతూ నన్ను  తరచూ కలవలేక పోవడానికి గల కారణం ఏవిటో ఇప్పుడర్ధమై, లోలోనే నవ్వుకున్నా.

స్నేహ ప్రేమలో పడింది. ఖచ్చితం గా పడింది. అంత గట్టిగా ఎలా చెబుతున్నానంటే..

మోహన్ని  పరిచయం చేస్తున్నప్పుడు..ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపు..చెంపల మీద పరుచుకోవడాన్ని, రెప్ప పాటు  వేగం లో అర లిప్త కాలం లో పట్టేసుకున్నా.

ప్రేమ అనేది  హృదయ రహస్యమే. కానీ, అప్పుడప్పుడు కళ్ళ లోంచి తొంగి చూసే సంతోష వెన్నెల తరంగం కాదూ!

అతను కేవలం స్నేహకి  యజమాని మాత్రమే కాదు అన్న సంగతి  తనిట్టే పసి గట్టేసింది.

ఇద్దరిలోనూ తొట్రుపాటు తనాన్ని కూడా కనిపెట్టింది. కాని, ఇగ్నోర్ కొట్టేసింది. ఎందుకంటే..అప్పటికి తనకీ నిజం తెలీదు. కనీసం ఊహించనైనా ఊహించలేదు.

ఆస్థి అంతస్తుల మాటెలా వున్నా, ఇద్దరూ మేడ్ ఫర్ ఈచదర్ లా వున్నారు’ అనుకుని,  తృప్తి పడింది.

స్నేహ తన  ప్రేమ  విషయాన్ని నా దగ్గర దాచిందని కానీ, ఈ  వార్తని   వెంటనే రాజీ కి చేరేయాలని  కానీ తనెప్పుడూ అనుకోలేదు.

ప్రేమ, పెళ్లి అనేవి ఆ వ్యక్తుల స్వవిషయాలు. పూర్తిగా వ్యక్తిగతాలు. వారంతట వారు చెబితే మనం తెలుసుకోవాలి కానీ, ఆరాలు తీసి, ప్రాణాలు తోడేయ కూడదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఐనా, మన పరిధులు మనకున్నప్పుడే, అవతల వారికి మన స్నేహం మీద ప్రేమ, గౌరవం పెరుగుతుంది. కాదు, రెట్టింపౌతుంది.

ఆ సంఘటన తర్వాత, స్నేహ మోహన్ ప్రసక్తి ని ఎక్కడా తీసుకొచ్చేది కాదు.   సస్పెన్స్ భరించ లేక,  ఒకటికి పది సార్లు ముందూ వెనకా ఆలోచించుకుంటూ   అడిగే దాన్ని.  “ మోహన్ కంపెనీ లోనే కంటిన్యూ అవుతున్నావా?” అంటూ.

ఆ పేరు వింటూనే ఉలిక్కిపడేది.  సిగ్గుపడ్డ   చెంపలూ..దొరికిపోయేవి.

జవాబు చెప్పకుండా దాటేసేది.  తనేం విననిదాన్లా..మరో టాపిక్ లోకి తీసుకెళ్ళేది, తెలివిగా.

మనసులోనే నవ్వుకుని ఊరుకున్నా. మరిక రెట్టించలేదు.

ఎప్పుడో ఒక రోజు, చెబుతుందిలే శుభ వార్త అనుకున్నా.

కానీ , ఆమెని ఒక శోక సముద్రం లా చూస్తానని కలలో కూడా అనుకోలేదు.

 

***

ఆ  రోజు సాయంత్రం దాటి, రాత్రౌతోంది. తలమునకలయ్యే   పనిలో.. సిటీ ఎడిషన్ క్లోజింగ్ లో, … చివరి నిమిషపు టెన్షన్ లో వున్నా..ఇంతలో స్నేహ ఫోన్ చేసింది.

“హలో”- అని  అనక ముందే..అవతల్నించి తను అందుకుంటూ..”నువ్వొక్కసారి రావూ?” అంటూ దుఖంతో అడిగింది.

వొణికిపోతున్న  ఆ కంఠాన్ని వింటూనే, కంగారు పడ్డాను. “ఏమీటీ? అంతా ఓకేనా?” అడిగాను.

“లేదు. ఐ యాం నాట్ ఓకే.. నీతో…చాలా చెప్పుకో..వా..లి..ప్లీజ్..” మాట్లాడలేకపోతోంది.

“ఎక్కడున్నావ్?” ఆత్రంగ  అడిగా.

తనెక్కడుందీ చెప్పింది. “ఐదు నిమిషాల్లో వచ్చేస్తా…  నువ్వక్కడే వుండు. డోంట్  వర్రీ..వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం..ఓకే?” అంటూ ఉద్వేగంగా చెప్పాను.

అన్నట్టు గానే, గబగబా, పని పూర్తి చేసుకుని, వేగంగా బయల్దేరి వెళ్ళాను.

లేక్ వ్యూ రెస్టారంట్ కి.

***

 నన్ను చూస్తూనే..చేతుల్లో ముఖం దాచుకుని భోరుమంది స్నేహ.

నాకేం అర్ధం కాలేదు. మౌనం గా, దాని కెదురు గా వున్న కుర్చీ లో కూర్చున్నా.

ఆమె ఎంతటి శోక సాగరమై  వుందంటే, ఆ  ఉధృతి  కి ఆమె  రెండు భుజాలు, వువ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలకు మల్లే కదులుతున్నాయి. మనిషంతా అల్ల కల్లోలమైన సముద్రం   లా విషాదమైపోయుంది.

ఏమని ఓదార్చ గలదు తను?

పరుగుల సం ద్రాన్ని  అడ్డుకునేందుకైతే  ఒడ్డు కావాలి కానీ, విరుచుకు పడుతున్న సునామీ కేమవసరం?

కష్టం లో వుంటే ఓదార్చొచ్చు. ముంపులో లో మునిగిన ఆమేకేం  పని   నా జాలి నిట్టూర్పుల తో !

అందుకే, నిశ్శబ్దం గా దాన్నే చూస్తూ..ఆలోచిస్తూ…గుండె దిటవు చేసుకుంటూ…అసలు కారణమేవిటో  తెల్సుకోవడం కోసం ఎదురుచూస్తూ…వున్నాను.

పది నిమిషాల దీర్ఘ కాలం తర్వాత,  దుఖాన్ని దిగమింగుకుంటూ…నిఠారు గా కూర్చుంది.

కర్చీఫ్ తో కళ్ళు, ముక్కూ తుడుచుకుంటూ..జుట్టు సరి చేసుకుంది.

నలిగిన దుస్తులు, చెదరిన జుట్టు, ఏడ్చి, ఏడ్చీ ఉబ్బిన కళ్ళు, పీక్కు పోయిన చెంపలు..ఇవన్నీ ఆమె మానసిక స్థితిని పట్టిస్తున్నాయి.

“ఏమిట్రా..ఏం జరిగింది?” అనునయం గా అడిగాను.

నా వైపు చూస్తూనే మరో సారి..ఏడ్చేసింది. ఏమైందీ? ఎందుకిలా అమితం గా దుఖిస్తోంది?

పొరబాటు జరిగాక, పశ్చాత్తాపం తో నలిగిపోతున్న మనిషి లా అయితే మాత్రం కనిపించడం లేదు.

ఒక వేళ, మోహన్ తో ప్రేమ వ్యవహారం కానీ, బెడిసి కొట్టిందా? మోస పోయిందా తను?

పెళ్ళి చేసుకుంటానని మాయ పుచ్చి గానీ..

ఊహు.

మోహన్! అలాంటి వాడు కాడని తనకొక గొప్ప నమ్మకం. అతన్ని దగ్గర్నించి చూసింది. అతని ముఖం లో కారెక్టర్ కొట్టుస్తూ కనిపించింది.  ఎంత మంది లో వున్నా, ఆ కూల్ మాన్ ని ఇట్టే గుర్తించేయొచ్చు.   మొదటి రోజు తను చూసినప్పుడు..ఆ  ఒక్క చూపులో నే తెల్సిపోయింది.

అతనలాంటి వాడు కాడు. పెళ్ళికి ముందు అతని వల్ల   మరో రకం గా   మోసపోయేంత చిన పిల్లేం  కాదు స్నేహ.

నిజానికి ఏ ప్రియురాలు, ప్రేమించిన వాడు మోసం చేసినందుకు ఏడ్వదు. తన గొప్ప నమ్మకాన్ని ఖూనీ చేసినందుకు, తనని నిర్జీవిని  చేసినందుకు ఏడుస్తుంది.

స్నేహ ది అలాటి బాధ కాదని తన మనసు చెబుతోంది. గట్టిగా చెబుతోంది.

కానీ, దాని సున్నిత మైన మనసుకి  పెద్ద  ఎదురు దెబ్బే తగిలింది.   బహుశా, ఎప్పటికీ కోలుకోలేనంత..గాయ పడి వుంటుందేమో!

ఇప్పుడు తను తీరిగ్గా ఆ గాయాలను పెకిలించి చూడటం అమానుషత్వమే అవుతుంది.

ఉధృత గాలి వాన లు తర్వాత, విరిగిన కొమ్మలు, చెదరి పడ్డ పక్షి గూళ్ళు వాటంత టవే బయట పడట్టు,  అన్ని విషయాలూ అదే  చెబుతుంది లే. ముందు తను కోలుకోనీ!  అని అనుకున్నా.

మధ్యలో  స్టువార్టొస్తే,   “రెండు పైనాపిల్ జూస్ ”  చెప్పి పంపాను.

తనని ఏదో ఒకటి మాట్లాడించడం కోసం అడిగాను.”అమ్మా నాన్న ఎలా వున్నారు?” అంటూ.

స్నేహ తలూపింది. బాగానే వున్నారన్నట్టు.

ఇంతలో..దూరం నించి..మోహన్ వస్తూ కనిపించాడు.

వడి వడి అడుగులతో..చూపుల్ని టార్చ్ లైట్లు గా చేసుకుని, తన ప్రియమైన వస్తువు ఇక్కడే, ఎక్కడో  వుండాలన్న ట్టు..ఖిన్న వదనుడై,   వెతుక్కుంటూ వస్తున్నాడు.

ఎదురుగా వున్న నన్ను చూడ్డం లేదతను. వెనక నించి స్నేహని గుర్తు పట్టి, త్వర త్వర గా దగ్గరకొచ్చాడు.

“మోహన్ వచ్చారు..” నా మాటలు పూర్తి కాకముందే, స్నేహ వెనక్కి తిరిగి చూడటం..అతను గబగబా ఆమెకి దగ్గరై, ఉద్వేగం గా  ఆమె భుజం మీద   చేయి వేయడం  జరిగిపోయింది. ఆ స్పర్శ లో ఎంత మృదుత్వముందో ఏమో కానీ…

ఆతన్ని చుస్తూనే..తుఫాను కు కొట్టుకుపోతున్న తీవె, ఆలంబన దొరికిన ట్టు, అతన్ని చిన్న పిల్ల లా చుట్టేసుకుంది.  మోహన్ కూడా కదలిపోతూ..చెబుతున్నాడు. “సారీ స్నేహ..ఐ యాం సారీ, అయాం టెర్రిబ్లీ  సారీ..ఇంకో సారి ఇలా జరక్కుండా చూస్తాను. ప్రామిస్. నన్ను నమ్ము..ప్లీజ్..ట్రస్ట్ మి ”   అతను ఓదారుస్తున్నాడో, ఓదార్చుతూనే దుఖిస్తున్నాడో ..తెలీడం లేదు.   మొత్తానికీ ఇద్దరూ ఒకే రకపు వేదనా  సముద్రం లో కొట్టుకుమిట్టాడుతున్నట్టు గ్రహించా!

వాళ్ళిద్దరికీ, చుట్టుపక్కల ఎవరం వున్నదీ తెలీడం లేదు. నా ఉనికి అక్కడ చాలా అనవసరం గా తోచింది.

చీకట్లో కొవ్వొత్తి వెలుగు పెద్దదే కానీ, కరెంట్ వచ్చాక,  దాని ప్రాముఖ్యత వుండనవసరం లేదు.

నేను మెల్లగా, చాలా మెల్ల గా అడుగులేసుకుంటూ..బయట పడ్డాను. వాళ్ళ  కంట పడకుండా వుంటం కోసం..దొరికిన ఆటో ఎక్కి, ఇంటి కొచ్చేశాను.

ఎలా వచ్చానో తెలీదు. ఆ రాత్రం తా, కంటి మీద ఒక్క కునుకుంటే ఒట్టు.

సమస్య మనదైతే, పంచుకోవడం వల్ల తగ్గుతుంది.   స్నేహితురాలి దైతే..ఆలోచించి పరిష్కారాన్నివ్వడం వల్ల కొంత వరకు వీలుంటుంది. కానీ, సమస్యేమిటో తెలీకుండా..ఎమోషన్ సీను చూపించి, కనుక్కో మంటే, తనెలా కనుక్కుంటుందీ!?

అసలు నాకు స్నేహ  ప్రాబ్లం ఏమిటో తెలీకుండా…ఏమని తనని అడగాలి.

అది కాదు ప్రస్తుత నా సమస్య. ఏమీ తెలీకుండానే  దాని గురించి ఎడ తెరిపి లేని ఆలోచన్లతో తెగ సతమతమై   పోతున్నా!

ఏమై వుంటుందా అని , నా జర్నలిస్టిక్ వ్యూహరచనా చాతుర్యాన్నంతా రంగరించి కారణాన్ని దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసా.  ఆ పైన ఆ పరిశోధనలో మునిగి పోయా.

ఊహు. దొరకలేదు.

ఒక్కటి మాత్రం ఖరారు గా  తెలుస్తోంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మామూలు గా కాదు. గాఢం గా!

అవునూ, ఇంతకీ ఇద్దరిదీ ఒకటే కులమా, కాదా? తెలీదు.

పోనీ..మతం? మోహన్ కదా పేరు. నో ప్రాబ్లెం. సేం మతం.

ఆస్థి అంతస్తుల సమస్యేమో! – అదేమన్నా  బీదదా ఏమిటి?

చదువు? -బ్రహ్మాండం గా వుంది.

జ్ఞానం? – దానికి కొలతేముంది?

ధనికుల ఇళ్లల్లో ఆస్థి గొడవలు, వాటికి వివాహ బంధుత్వాల లింకులు వుంటాయి.

నాకు తెలిసిన ఒక వూరి కులం లో  – పెళ్ళిలన్నీ వాళ్ళ వాళ్ళ చుట్టాల లోనే జరిగిపోతాయి. మేన మామలు, మేనమామ కొడుకులు,   మేనత్త కొడుకులు,   లేదా పిన తండ్రి పెదతండ్రి ఆడ పిల్లలు తోడుకోడళ్ళవడాలు..ఇవన్నీ మొత్తానికి అక్కడక్కడే తిరుగుతాయి బంధాలన్నీ ,  కాసుల చుట్టూ రా. ఇదేమిటంటే ఆస్థులు ఎక్కడికీ పోకుండా వుంటం కోసమట.

ఆశ్చర్య మేసేది నాకు. వరుడు విదేశాల్లో వున్నా సరే, సమయానికి రాకున్నా, బే ఫికర్!  వీళ్ళిక్కడ తాంబూలాలు పుచ్చేసుకుని, సంబంధం ఖాయం చేసేసుకుంటారు. పెళ్ళి కి ముందు రోజొస్తే చాలని వరునికి భరోసా ఇస్తారు. అలాగే పెళ్ళిళ్ళై పోతాయి. కాపురాలు జరిగిపోతుంటాయి. పిల్లలు కూడా పుట్టేస్తారు. పెరుగుతారు. వూళ్ళొ పొలాలు   ఆ యేడాదికా యేడు వాళ్ళ పేర్ల మీద  యెకరాల కొద్దీ పెరిగి పోతూ వుంటాయి.

ఈ భాగ్యానికి  ప్రత్యేకించి పెళ్ళిళ్ళెందుకు చేసుకోవడం. ఒక పోలానికి, మరో పొలానికి మనువు  చేస్తే సరిపోదా? రెండు ఇనప్పెట్టెల్ని  గదిలోకి తోస్తే రాలవా? కాసుల గుట్టలు?

అందుకు రెండు శరీరాలే బలి  కావాలంటావా? …నేనూ స్నేహ ఈ కథ చెప్పుకుని,  ఇద్దరం కలసి పకపకా నవ్వుకునే వాళ్ళం.

రాజీ కల్పించుకుని, అనేది. ” మీకన్నీ వేళా కోళాలు గానే వుంటాయిలే! అద్సరే  కానీ,ఇంతకీ   పెళ్ళెప్పుడు చేసుకుంటారిద్దరూ?” అని నిలేసేది.

స్నేహ చురుగ్గా చూసేది రాజీ వైపు. నేను కళ్ళు దించుకునే దాన్ని, మౌనం గా.

” నన్ను చూడండి. మీ తోటి దానే గా! ఇద్దరి పిల్ల ల తల్లి నై పోయాను. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా అయిపోయింది. పెద్దది, అప్పుడే సెకండ్ గ్రేడ్ దాటేసింది. మరి మీ సంగతో? ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు, ఎప్పుడు పిల్లల్ని కంటారు? ముసలోళ్ళై పోయాక నా? ” పెద్ద తరహా లో పెద్దక్కలా అడిగేది.

స్నేహ మాత్రం ఊరుకునేది కాదు. ” నా టెంత్  క్లాస్ లోనే , మా మావయ్య నన్ను చేసుకుంటానన్నాడు. సరే అని ఒప్పుకుని వుంటే, ఈ పాటికి నా కూతురు పెళ్ళీడు కి  వచ్చేసేది. ఏం చేస్తాం. అలా రాసి పెట్టి లేదు. ..హు!” అంటూ నాటకీయం గా నిట్టూర్చేది.

నాకు నవ్వాగేది కాదు.

రాజీ, రోష పడకుండానూ వుండేది కాదు.

ఆమె ఉడుక్కోవడం చూసి – అనేది, స్నేహ. ” దామిని సంగతి నాకు తెలీదు కానీ, రాజీ! నేనంటూ పెళ్ళంటూ చేసుకుంటే..నా ముందు పిలుపు నీకే. ప్రామిస్” అంటూ మాటలతో రాజీని చల్ల బరిచేది-

అనడమే కాదు, తన పెళ్ళి విషయాన్ని ముందుగా రాజీ కే ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాతే, మా ఇంటికొచ్చింది.

ఎప్పుడంటే, ఆ రోజు ఆ సంఘటన జరిగాక,   రెస్టారెంట్ నించి నేను బయట పడి వచ్చేసిన…వారం పది రోజుల తర్వాత..స్నేహ నా ఫ్లాట్ కొచ్చింది.

***

 “లోపలకి రావొచ్చా” మాటలకి వెనక్కి తిరిగి చూద్దును కదా..నవ్వుతూ కనిపించింది స్నేహ.

చేతిలో పని అక్కడ్నే వదిలేసి..ఆనందంగా ఎదురెళ్ళాను.

రెండు చేతులూ జాపింది.

ఎందుకో తెలీని ఉద్వేగం మా ఇద్దరి మనసుల్లో నూ పొంగి ప్రవహిస్తోంది. వెంటనే  ఆత్మీయం గా హృదయానికి హత్తుకుంది.

నన్ను కుర్చీలో కి తోసి, హాండ్ రెస్ట్స్ మీద చేతులుంచి, వయ్యారంగా బొమ్మలా వంగి చెప్పింది. “నేనూ మోహన్ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నామే! రేపే వివాహం. రాజీ కి ఆల్రెడీ ఫోన్ చేసి  చెప్పాను. నిన్ను మాత్రం  పర్సనల్ గా పిలవాలనిపించింది.  తప్పకుండా రావాలి. నువ్వు అస్సలు మిస్సవ్వకూడదు.” చెప్పిందే చెబుతోంది.

బహుశా..అమితమైన ఆనందంతో కావొచ్చు.

“నువ్వన్ని సార్లు చెప్పాలా ఏమిట్లె, కానీ! సంతోషం లో పడి శుభలేఖ ఇవ్వడం మర్చిపోయేవు సుమా!” అన్నాను నవ్వుతూ.

కాని అది నవ్వ లేదు నా మాటలకి. పై పెచ్చు ముఖం లో రంగులు మారాయి. నేనేమైనా పొరబాటు మాట్లాడానా అని ఆలోచించుకునే లోపే తనే చెప్ప సాగింది.

“సారీ దామినీ!

మొన్న జరిగిన సంఘటన తర్వాత నిన్ను కలవలేకపోయాను. కనీసం ఫోన్ కూడా చేయలేని పరిస్థి తిలో వుండిపోయాను. సారీ..!”

“నీ మొహం. అందుకు సారీ ఎందుకు? ప్రేమ వివాహాలకికి ఇంట్లో వొప్పుకోకపోవడం అన్ని చోట్లా జరిగేదే. చివరికి మీ ప్రేమే గెలిచింది సంతోషం. ఇంతకీ ఎవరే,  మీ పెళ్ళికి అంతేసి  ఇనప గోడలా తయారైన వ్యక్తి?  మోహన్  తల్లా? తండ్రా?” అని అడిగాను, నవ్వుతూ.

ఒక్క క్షణం మౌనం తర్వాత మెల్లని స్వరం తో చెప్పింది. “అతని వైఫ్.”

వింటున్న నా చెవుల్లో బాంబ్ పేలిన శబ్దమైంది. కొంత సేపటి దాక, నోరు పెగల్లేదు.

తప్పు చేస్తున్న దానిలా తలొంచుకున్న స్నేహని చూడగానే అర్ధమై పోయింది. తను   అబధ్ధ మాడటం లేదని!

“ఏ..ఏమిటన్నావ్?” మరో సారి నిర్ధారించుకోవడం కోసం..’నువ్ చెబుతోంది నిజమేనా?’ అన్నట్టు చూసా.

జవాబు చెప్పకుండా, తలూపింది ‘ అవునన్నట్టు.’

“నీకేమైనా పిచ్చా? ” అని అడగాలనిపించింది. కాదు అరవాలనిపించింది  తన్నుకొచ్చిన ఆవేశం తో.

కానీఅప్పటికే ఆమె పెదాలు బిగించి ఏడ్చేస్తుంటే…అగ్గి లాంటి నా  కోపం మీద దాని కన్నీళ్ళు పడి చప్పున చల్లారిపోయింది.

గభాల్న దాని భుజం మీద చేయేసాను..ఓదార్పు గా.

నా చేతి మీద చెంపనానించుకొని  వెక్కుతూ చెప్పింది.”దామినీ!  నేనతన్ని ప్రేమించ లేదు.  అతనెప్పుడూ ఐ లవ్యూ అని చెప్పిందీ లేదు.   కానీ, మేము  ఒకరి కోసమొకరం అని మాత్రం తెలుస్తోంది..ఇక్కడ..ఈ గుండె సాక్షి గా మేము విడిచి వుండలేమనిపిస్తోంది..అందుకే..పెళ్ళి చేసుకుంటున్నాం..ఈ పెళ్ళి కూడా నా తృప్తి కోసం…పసుపు బట్టలతో అతని పక్కన నిలబడటం కోసం..అంతే..ఇంకేమీ అడగొద్దు. ప్లీజ్..” అంటూ కర్చీఫ్ తీసుకుని, ముఖం తుడుచుకుంది.

నేను అలాగే చూస్తూ వుండి పోయా. ఏం మాట్లేడందుకు, గొంతు పెగిల్తే గా!

తప్పు చేస్తోంది అన కూడదు. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎవరు చేసిన పని వారికి కరెక్టైనది కాబట్టి.

తప్పు అంటే కేసౌతుంది. నేరారోపణ కిందకొస్తుందిట. కాబట్టి ఈ తరహా పనుల్ని పొరబాటు అనాలి ట. లేదా, బలహీనత అనొచ్చు ట.  మా ఆఫీసులో ఓ సీనియర్ జర్నలిస్ట్ చెబుతుంటే ఔనా అన్నట్టు ముఖం పెట్టి, శ్రధ్ధగా ఆలకిస్తూ వుండిపోయా. నా అమాయకత్వానికి  కామోసు ఆయన పెద్ద గా నవ్వేయడం తో,  ‘ఓహో, సెటైరన్నమాట ‘   అప్పుడు అర్ధమైంది.

అలాగే, ఇప్పుడు స్నేహ చేస్తున్న పని ని  ఏ పేరుతో పిలవాలి.

“ నువ్వు రాకుంటే పెళ్ళే జరగదంటూ.. –  తప్పక రావాలంటూ మరో సారి హెచ్చరిస్తూ.. చెయి నొక్కి వెళ్లిపోయింది.

నాకు అంతా అయోమయం గా అనిపించింది.

ఇంకా అప నమ్మకం గా వుంది. అపస్మారక  స్థితిలో  వుంది మనసు.

స్నేహ వెనక్కొచ్చి, ‘అవాక్కయ్యవా?’ అంటూ , తననొక ఏప్రిల్ ఫూల్ అన్నట్టు చూసి,  గల గలా నవ్వితే  ఎంత బావుణ్ను అని ఆశ గా వుంది. చచ్చేంత ఆశ గా వుంది.

సరిగ్గ మనమిక్కడే పొరబడుతూ వుంటామేమో తెలీదు.  మనం మనుషుల్ని ప్రేమిస్తున్నంత తేలిగ్గ, వారి వ్యక్తిత్వ లోపాలని మన్నించలేకపోవడం వల్లో, ఒప్పుకోవడం రాక వల్లో ..ఇలాంటి  పరిస్థితి కి లోనవుతుంటామేమో!

‘నీ మొహం. అంతెందుకు ఆశిస్తావ్ నువ్వు? అసలైనా నువ్వింత  నిరాశ పడిపోయి, డీలా పడిపోయేంత విషయం ఏముంది ఇందులో?  ఇవన్ని నగరం లో జరుగుతున్న వి కావూ? నీ చుట్టు సమాజాన్ని నువ్ రోజూ చూడ్డం లేదూ?   చిత్రం కాకుంటె,  నువ్వెప్పుడూ అసలిలాటి సంఘటన తాలుకు వార్తలే చదవనట్టు, రాయనట్టు ఇలా కుంగి పోవడం బాలేదమ్మాయి!   అంటూ నన్ను కేకలేస్తూ, ఊరడిస్తోంది..నా లో నాకెవరో తెలీని నా తను.   నన్నూ, నా భారమైన గుండెని తేలిక చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇవేవీ కాదనను. నాకన్నీ తెలుసు. నిజమే. కానీ, అవన్నీ  ఎవరికో జరిగాయి.

కానీ ఈ రోజు నా ఫ్రెండ్ కి జరుగుతోంది. అందుకే దిమ్మ తిరిగినట్టుంది. మెదడంతా బ్లాంకై కూర్చుంది. గదిలో లైట్ వెలుగుతున్నా, ఫ్యూజెగిరిపోయినట్టు చీకటి మయం గా వుంది.

మనతో మమేకమై పోయి మసులుకుంటూ…తమ శరీరాలే రెండు  తప్ప,  ఆత్మలు రెండూ ఒకటే అన్నంత గా కలిసి మెలిసి తిరిగిన స్నేహ..కాదు నా  ఫ్రెండ్ వెనక  ఇలాటి కథ ఒకటుందని హఠాత్తుగా తెలిస్తే మనసంతా కంగాళీ గా వుంటుందో..నాకూ అలానే వుంది. చేదుగా.

మెల్ల మెల్ల గా…ఆ షాక్ నించి బైట పడి, ఆ ఇద్దరి వైపు నించీ, వారి  పరిస్థితుల కోణాల నించీ ఆలోచించడం మొదలు పెట్టాను.

ఎంతైనా పొరబాటు పొరబాటే. అది కాదు నేనాలోచిస్తున్న సంగతి? – ఎవరు మూల్యం ఎక్కువ చెల్లిస్తారా భవిష్యత్తులో అని.

స్నేహ కి ఏం తక్కువనీ, ఇలాటి రిస్క్ తీసుకుంటోంది?

పోనీ మోహన్? స్నేహ కి మించిన అందగత్తెలెందరు లేరనీ? ఎవరు దొరకరనీ? ఐదేళ్ల పరిచయం తర్వాత కూడా..స్నేహ తో తనకు గల బంధాన్ని  శాశ్వతం చేసుకోవాలని వాంఛించడం  అంటే మామూలు మాట కాదు.  అందుకు ఎంత నిజాయితీ కావాలి, పదిమందిలో పెళ్ళికి ఒప్పుకోడానికి!

పోనీ, ఇద్దరిదీ పొరబాటు కానప్పుడు, ఇద్దరూ నడిచే దారి సరైనదే ఐనప్పుడు…స్నేహకి కన్నీళ్ళెందుకొస్తున్నట్టు?

ఈ పెళ్ళి (?) తర్వాత,  వాటి అవసరమొస్తే మిగలనంత గా దుఖిస్తోంది కదు?

ఇదంతా పక్కన పెడదాం. చట్ట రీత్యా వీళ్ళు ఏమౌతారు? వీళ్లు ఇంత పవిత్రం గా అనుకుంటున్న సంబంధాన్ని  ఏ  పేరుతో  పిలవ బడతారు, ఈ సమాజం చేత?

ఒక సినీ నటికి ఇలాటి సమస్యే వస్తే, ఆ ఒత్తిడికి  తట్టుకోలేక, ఒక సీనియర్ నటుని సలహా తీసుకోవడ కోసం వెళ్ళింది.

అంతా విన్నక, ఆయన ఒకే ఒక్క ప్రశ్న వేశాడు ట. ‘నీకు సమాజం కావాలంటే అతన్ని వొదిలేయి. అతనే కావాలంటే, సమాజాన్ని వొదిలేయి. ఇప్పుడు చెప్పు. నీకు ఏది కావాలి?”  అని.

ఆమె  జవాబేం  చెప్పకుండా వెనక్కొచ్చి, తను వివాహానికి సుముఖమే అని చెప్పిందట ప్రియుని తో. ఆ తర్వాత కథ ఇక్కడ అప్రస్తుతం.

అలాగే, స్నేహ కూడా నేమో!

ఇంతకీ పెళ్ళి ఎప్పుడందీ? రేపే కదూ..

ఇంతలో సెల్ మోగింది. రాజీ కాల్ చేస్తోంది. “ఇది విన్నావా?” అవతల్నుంచి వాక్ప్రవాహం మొదలైంది.

“స్నేహ   పెళ్ళైన వాణ్ని చేసుకుంటోందిట..హవ్వ”  బుగ్గలు నొక్కుకోవడం నాకిక్కడికి కనిపిస్తోంది.

“మరి నువ్వేమన్నావ్?” అడిగాను నింపాదిగా.

“ఏమంటాను. తెలిసీ గోతిలోకి దూకుతానంటే ఆపేదెవరనీ! వినం గానే నోట  మాట రాలేదంటే నమ్ము. అవునూ, నీతో చెప్పిందా సంగతంతా?”

‘ఆ, వచ్చి చెప్పింది. పిలిచింది,  వెళ్లింది”

“ఏమిటీ, నీ దగ్గరకొచ్చిందా, పిలవడానికీ? ఎంత  ధైర్యం!?  నాలుగు  చివాట్లు పెట్టలేక పోయావా?

నేనైతే వూరుకునే దాన్ని కాను సుమా!

మా ఆయనకీ విష యం  తెలిస్తే    ఇంకేమైనా వుందా? స్వయంగా  నా పరువుని నేనే  తీసుకుని, గంగలో కలుపుకున్నట్టు అవ్వదూ? అయ్యొ..అయ్యో..ఎంత ఘోరం! ఎంత ఘోరం!”

రాజీ  నా లా గొప్ప షాక్ లో లేదు. అది స్పృహ లో వుండే మాట్లాడుతోందని నాకర్ధమై పోయింది.

ఎప్పుడైతే, వాళ్ళాయన ప్రసక్తి తీసుకొచ్చిందో, ఎప్పుడైతే, స్నేహ పెళ్ళి గురించి వాళ్ళయనకి తెలిస్తే పరువు పోతుందన్నదో నాకప్పుడే అర్ధమై పోయింది రాజీ మానసిక పరిస్థితి.

జస్ట్ ఆర్నెల్ల క్రితం..తన కాపురం నిలబెట్టమంటూ..మొగుణ్ని అవతలి దాని బారినించి అప్పగించమంటూ..పతి భిక్ష పెట్ట మంటూ..స్నేహ సాయం కోరిన రాజీ..ఇవాళ  స్నేహని, స్నేహ చేస్తున్న పని.. భర్తకి తెలిస్తె పరువు పోతుందని నెత్తీ నోరూ బాదుకుంటోం దంటేనే అర్ధమై పోతోంది.  రాజీ ఖచ్చితం గా స్పృహలో వుండే మాట్లాడుతోందని!

ఆడ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే –  మొగుడు బయటెన్ని  వెధవ పన్లు  చేసినా, గడపలోపలకొచ్చి పడితే చాలు.’ అనుకుంటారు. తప్పులన్నీ సర్వం తుంగలో తొక్కేసి, తెగ క్షమించేస్తారు.  ఆ మరు క్షణాన్నే అంతా మరచి పోయి, పైగా అదంతా ఎన్ని జన్మల కిందట జరిగిన సంగతో అన్నట్టు,  తమకేవీ గుర్తుకు రానట్టు ఎంత హాయిగా ప్రేమించేస్తారేం? మొగుళ్ళని!

తనెప్పుడైనా ఫోన్లో అడు గుతూ వుండేది. ” రాజీ, మీ ఆయన కుదురుగా వుంటున్నాడా? ఎందుకైనా మంచిది. ఓ కన్నేసి వుంచు” అని.

అప్పుడేమనేదీ? -“ఛ! మా అయన మరీ అంత చెడ్డవాడేం  కాడే బాబూ!  పాపం! ఖర్మ లో వుండి, ఏదో ఒక సారి గడ్డి తిన్నాడే గానీ, ఇప్పుడు పూర్తిగా  మారిపోయాడు.” అంటూ మురిసిపోయేది.

“అంత గట్టిగా ఎలా చెబుతున్నావ్ ? మారాడని ?” అని రెట్టిస్తే, – “అయ్యో! నిన్ననే గా సింగపూర్ నించి వొస్తూ, రాళ్ళ నక్లెస్ తెచ్చారు నా కోసమనీ! అయినా నువ్వు భలే ప్రశ్నలేస్తా వ్లే” అంటూ గలగలా నవ్వేసేది.

అంటే, భర్త నిజాయితీకి కొలమానాలు నగలా? గిఫ్ట్లా?

కట్టుకున్న వాని అనైతికత ని కప్పిపుచ్చే శక్తి, భార్యలకిచ్చే నగలబహుమతులకుంటుందన్న మాట!

“అబ్బో! పెద్ద చెప్పొ చ్చావ్  లేమ్మా. నీకూ పెళ్ళైతే తెలుస్తుంది లే. అప్పుడడుగుతా నిన్ను. నీ కంటే పదింతలుగా..” అంటూ గొల్లున నవ్వేది.

“ఏమిటీ మాట్లాడవ్?” ఖంగుమన్న దాని గొంతు విని, ఆ లోకం లోంచి  ఈ లోకం లోకొచ్చాను. “ఏమిటన్నావ్?” అంటూ.

“అదే,  దాని పెళ్ళికెళ్తున్నావా అని?”

“వెళ్దా..మ..నే..”

“నోర్మూసుకో. పిచ్చిదాన్లా  వెళ్ళకు. వెళ్ళి, ఫోటోలు గీటోలు దిగావనుకో..ఆ పైన పోలీస్ కేసులూ గట్రా అయ్యా యే అనుకో..కేసు కోర్ట్ వరకెళ్లిందే అనుకో..ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడ్లేడు తెలుసా?

మా ఆయన ఇట్లాంటివే  నాకు చెబుతూ వుంటారు  కాబట్టి నాకివన్నీ తెలిసాయి. లేకపోతే, నేనూ నీలానే వెళ్దామనుకునేదాన్నేమో! నువ్వెళ్ళకు. అసలే పెళ్ళి కావాల్సినదానివి. పోలీస్ స్టేషన్లూ, కొట్లాటల్లో ఇరుక్కోకు. సరేనా? ఏమిటీ, వింటున్నావా? అయినా ఒక మాటే దామినీ! మనలో రెండో పెళ్ళి చెల్లదు. మరో మతం ఐతె వేరే సంగతి…” చెప్పుకు పోతోంది. ఎక్కడా ఆగకుండా.

నేనే వింటం ఆపేశా.

‘మరో’  మతం అనే మాట  దగ్గర ఆగి, వింటం మానేసా.

మరో మతం ఐతే మాత్రం, తను బ్రతికుండంగానే భర్త మరో వివాహం చేసుకుంటుంటే కంట తడి పెట్టని  భార్యంటూ  వుంటుందా, ప్రపంచంలో? స్త్రీలు, స్త్రీ ల హృదయాలు అన్ని చోట్లా ఒక్కటే కాదా? ఇలాటి కష్టం అందరది ఒకటే అయినప్పుడు, ఒకే రకం గా స్పందిచరా? ఒక్క కన్నీటి చుక్కనైనా రాల్చకుండా వుంటాయా, నయనాలు?

ఒక మతచట్టం ఒప్పుకున్నంత తేలికగా,  ఓ మనిషి గుండె ఒప్పుకోవాలి కదా? మతం గురించి కాదు నా వాదన. సమ్మతం  గురించి.

అంతేలే, కొన్ని శాసనాలు మింగుడు పడవు.  మనిషిని చంపితేనే హత్య అంటాయి. హృదయాన్ని చంపడం, ఇక్కడ నేరం కాదు. మనసుని ఖూనీ చేయడం ఏ తప్పులోకీ చేరదు. వాటికెలాటి శిక్షలూ  వుండవు.

ఏమో. నాకేమీ అర్ధం కావడం లేదు.

ఇప్పుడు నా కళ్ళకి మోహన్, స్నేహ లతో బాటు మెల్ల మెల్ల గా…రూపం లేని ఓ ఆకారం కనిపిస్తోంది. ఆమె బహుశా..మోహన్ భార్య అయి  వుంటుందేమో!

అదేమిటీ ఆమెని అలా అంటావ్, భార్య అని? స్నేహ కూడా  కదా? …ఏమో! బహుశా ‘రెండో భార్య’ అని అనొచ్చేమో తెలీదు.

రాజీ  ఇంకా మాట్లాడుతూనే వుంది.

యధాలాపం గా రాజీ ని వింటున్నాను. “ ఏమిటోనే, తెలీడం లేదు ఒకటే కంగారు గా వుంది నాకైతే. లాయరై వుండీ, అన్నీ తెలిసి..ఇలాటి పని ఎలా చేస్తోందంటావే!?”

పిచ్చి కాకపోతే,  లాయర్ కి ప్రేమ గుణం వుండదా?  ప్రేమ కి – చదువు సంధ్యలతో, ప్రొఫెషన్స్ తో పనేముంటుందీ?  స్పందించే గుండె చప్పుళ్ళ ముందు ఏ లాజిక్కూ లూ  పని చేయవన్న సంగతి రాజీ కి తెలీదా! – ఏమో!

” ఇంతకీ చెప్పావు కాదూ?  కొంప తీసి పెళ్ళికి వెళ్తున్నావా ఏవిటీ? ”ఇంకేదో హితవు చెప్పబోతున్న రాజీ మాటల్ని కట్ చేస్తూ  “అవును.  వెళ్తున్నాను..” అంటూ చెప్పి, సెల్ స్విచాఫ్ చేసేశాను. మళ్ళీ మాట్లాడే వీలు లేకుండా. అది కాదు. నేను.

ఆపైన స్నేహ పెళ్లికి  ఖచ్చితం గా వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.

 

***

 

రెండు రోజుల తర్వాత…

ఆ సాయంత్రం,  ఆరు బయట పడక్కుర్చీలో  కూర్చుని, నిర్మలమైన ఆ కాశం లోకి చూసుకుంటూ..అయిపోనీకుండా  ఒక్కో చుక్క గా టీ  రుచిని ఆస్వాదిస్తూ …  కాల ప్రవాహపు క్షణాల  అలల మీద తేలుతూ…

సరిగ్గా అప్పుడు ఫోన్ చేసింది రాజీ.

నిన్నట్నించి ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది.

నేనే బిజీ గా వుండి వెంటనే చేయలేకపోయాను.

మంచి సమయం లోనే చేసిందిలే అనుకుంటూ..”హలో, రాజీ” అంటూ పలకరించాను.

“ఏమిటే? పెళ్ళికెళ్ళావా? ఏమైంది?” సస్పెన్స్ భరించ లేనిదాన్లా అడిగింది.

“హు! అది ఎన్ని పెళ్ళిళ్లకి వెళ్ళదూ? మరెన్ని వివాహాలని మిస్ కొట్టి వుండదనీ.. అందర్నీ ఇలా అడగ గలదా? ఇంత  ఇది గా?

అందుకే బదులిస్తూ..“ అందరి పెళ్ళిళ్ళల్లో ఏమౌతుందో,  స్నేహ పెళ్లి లో నూ అదే అయింది.” అన్నాను చాలా సాధారణం గా.

“ఏమిటీ!సస్పెన్సా? లేకపోతే చెప్పకోడదనుకుంటున్నావా?” కోపం వినిపించింది, దాని కంఠం లో.

నేను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాను. “ఏమౌతుందే, లేకపోతే? ఆ? అంత తెలుసుకోవాలనుకునే దానివి పెళ్ళికి రావొచ్చు కదా?” అన్నాను. ఈ మాటని మాత్రం నేనూ కొంచెం నిష్టూరం గానే  అన్నాను.

నా మాటల్లోని నిగూఢాలేవీ దాని కిప్పుడు వింపించవని తెలుసు.

“అది కాదే, పెళ్ళి లో గొడవలేం కాలేదా? అతని ఫస్ట్ వైఫు…” ? వాక్యం పూర్తి కాకుండానే “వచ్చారు.” అని చెప్పాను

“ఏమిటీ? వచ్చిందా? ఒకర్తే నా?, లేక…”

“ఆవిడ, ఆవిడ తో బాటు మరి కొంత మంది కూడా వచ్చారు.  పది కార్ల నిండా జనం. గుంపులు గుంపులు గా వచ్చారు. ఆవిడ మేనమామ పోలిస్ కమీషనర్ ట, ఆయన, మరో రిటైర్డ్ జడ్జ్,  ఒక  ఎంపీ,  తోడు గా   వచ్చారు.”

“ఏమిటీ? పెళ్ళికే?” అపనమ్మకంగా అడిగింది. బోల్డంతా ఆశ్చర్యపోతూ.

“కాదు. వచ్చింది పెళ్ళికి కాదు. ఆస్తుల మీద అతనికెలాటి హక్కులూ అధికారాలు వుండబోవని సంతకాలు చేయించుకు పోడానికి వచ్చారు.”

“ఎవరితో?”

“అతనితో.”

“అవును మరి. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళవి. వుండొద్దూ?”- రాజీ వోటేసేసింది.

నా కళ్ళ ముందు ఆ దృశ్యం  మరో సారి కదలాడింది.

హఠాత్తుగా కార్లొచ్చి, వరసగా నిలబడటం, గన్ మాన్లు పరుగులు తీస్తుండగా, హడావిడిగా ఆ నాయకుడు రావడం, మందీ మార్బలం తో..ఆ వెనకే ఇంకొందరు  పెద్ద మనుషులు..కుర్చీలు టెబుల్స్ దగ్గర జరగుతున్న చప్పుళ్ళు…అన్నీ కలసి..క్షణాల్లో సినిమా సీనులా  లా మారిపోయింది.

ఆమె మాత్రం కారు దిగలేదు.

అతని ముందు కాగితాలు పరిచారు.  మోహన్  చక చకా సంతకాలు చే సే సాడు.

పది నిమిషాల్లో అందరూ మాయమై పోయారు. తుఫాను వెలిసినట్టైంది.

కానీ, ఆ కొంచెం సేపు మాత్రం తుఫాను ముందటి కటిక నిశ్శబ్దం..గుబులు పుట్టించేసింది అందరి గుండెల్లోనూ!

వాళ్ళు వెళ్ళిపోయాక, వీళ్ళిద్దరూ, ఒకర్నొకరు చూసుకుంటూ మిగిలిపోయారు.

నాకు అర్ధమౌతూనే వున్నాయి, భావాలు. సరిగ్గానే అవగతమౌతున్నాయి.

అద్సరే, మోహన్ భార్య – ఆస్తులు పోకుండా కాగితాలు రాయించుకోవడ మేమిటీ?

మనిషిని కదా రాయించుకోవాలి! అవును.   పాయింటే!

“అంటే? విడాకులు పడేస్తుందంటావా?” అడుగుతోంది రాజీ.

అంత పిచ్చిదా ఆమె? కాక పోవచ్చు.

చట్టం – మనిషిని తప్పు చేయకుండా కాపాడగల్గుతుంది కాని, మనసుల్ని కాదు.

జీవితం లో చేసిన ఒక పొరబాటు కి చట్ట రీత్యా పరిష్కార మార్గం కనుగొనడం కష్టమూ, అసంభవమూ అయినప్పుడు,

సుఖ శాంతుల కోసమని, పొరబాటున పొరబాటుమార్గాన్నెంచుకుని,  ‘పొరబడ లేదు. ఇది సరైనదే’   అని అనుకోవడం వల్ల ..అతనికి న్యాయం జరుగుతుందా? లేక జీవితం లో మళ్ళీ  అతను  చేస్తున్న మరో పొరబాటు అవుతుందా?

ఏమో!

రాజులు సైతం, ప్రేమ కోసం రాజ్యాలు పోగుట్టుకున్నారు.

ఇక మోహన్ ఆస్తులు పోగొట్టుకోవడం అంత బాధాకరమైన విషయం కాదేమో!

లేక పోతే వాళ్ళిద్దరు అంత గొప్ప ఆనందం గా ఎలా కనిపిస్తారు?

ఏమో.

నేనిక ఆలోచించలేను. ఇక్కడితో నా పరిశోధనని ఆపేస్తున్నాను.

ఇదిగో..

***

 

—-ఆర్.దమయంతి

పలక మీద పెన్సిల్‌తో రాసిందేమిటి?

rajireddi-1

 రాజిరెడ్డి అంటే ఫలానా అని ప్రత్యేకంగా ఇవాళ పరిచయం చేయనక్కర లేదు.  తెలుగు లో ఇప్పుడున్న మంచి వచన రచయితల్లొ రాజిరెడ్ది ది ఒక ప్రత్యేక శైలి. రాజిరెడ్ది కొత్త పుస్తకం ” పలక-పెన్సిల్” ని సారంగ పబ్లికేషన్స్  తెలుగు సాహిత్యభిమానులకు సగర్వంగా అందిస్తోంది . ఈ పుస్తకం  ఆగస్ట్ 30 వ తేదీ నుంచి  హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది. ఈ పుస్తకానికి రాజిరెడ్డి రాసుకున్న ముందుమాట ఇది.  

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
అటు వెతికీ ఇటు వెతికీ… అబ్బే ఇది ఉండకూడదనుకొని, ఇది ఉంటే బానే  ఉంటుందనుకొని, ఇందులో ఏముందనుకొని, ఏదో కొంత ఉన్నట్టే ఉందనుకొని…
జర్నలిజంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో సందర్భాన్ని బట్టి రకరకాల ‘వ్యాసాలు’ రాశాను. ఎన్ని రాసినా అన్నీ పుస్తకంగా వేయాల్సిన అవసరం లేదు. కొన్నింటికి ‘టైమ్‌బౌండ్‌్‌’ ఉంటుంది. కొన్నింటికి పుస్తకంలో రావాల్సినంత ‘అర్హత’ ఉండదు. కొన్ని బాగున్నా మ్యాగజైన్‌ ప్రెజెంటేషన్‌లో ఉన్న వీలు ఇందులో ఉండదు. అలా నాకు నేనే వడగట్టుకుని ఈ ఐటెంస్ ను షార్ట్‌ లిస్ట్‌ చేశాను.
ఇంకోలా చెప్పాలంటే, ఏ ఆదివారపు మధ్యాహ్నమో సోమరిగా కూర్చుని, ఫొటో ఆల్బమ్‌ తిరగేస్తుంటే, నిజంగా అప్పుడు మనం బాగుండేవాళ్లం అనిపిస్తుంటుంది చూడండి… అలా నా ‘రాతప్రతులను’ తిరగేస్తుంటే, నిజంగానే నేను అప్పుడు బాగా రాసేవాడిని అనిపించి ముచ్చట గొలిపినవే ఇందులోకి వచ్చాయి.
రాయడం అంటే నాకు వణుకు పుడుతుంది. ఐటెమ్‌ ఎలా వస్తుందోనన్న టెన్షన్‌! బాహ్య ఒత్తిడిలో రాసినవి కొన్ని. అంతర్గత ఒత్తిడి నుంచి రాసినవి కొన్ని. మొదటిది బాధ్యత. రెండోది సహజం.
అయితే ఎంత సహజమైన ప్రక్రియకైెనా కొంత కృత్రిమత్వపు సహకారం అవసరం. అలాగే, ఎంత కృత్రిమంగా మొదలుపెట్టినదానిలోనైనా రాస్తూవుంటే మనకు తెలియకుండానే వచ్చిచేరేది ఉంటుంది, ఇలా రాయబోతున్నామని మనక్కూడా తెలియనిది. అదే అందులోని సహజత్వం.
ఈ ఆర్టికల్స్‌ను నాకు నేనే ముచ్చట పడటానికి ఇవి రెండూ కారణాలు.

…తుపాల్‌…

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
కానీ సమస్యేమిటంటే, ఇవన్నీ ఏమిటి?
మనం ఒకటి రాస్తాం. అది ఏదైనా కావొచ్చు. అది ఒకటి. అంతే. రాశాక, అది కవిత్వం అవుతుందా? కథ అవుతుందా? వ్యాసం అనొచ్చా? లేకపోతే ఇంకేం అనొచ్చు? ఇలా ఉంటుంది మన ఆలోచన. అసలు దాన్ని ఏదో ఒక పరిధిలోకి ఎందుకు ఇమడ్చాలి? అది దానికదే స్వతంత్రం ఎందుకవదు? మన వేళ్లు పట్టుకుని ఇంతదూరం నడిపించిన  పాత ప్రక్రియలను నిరసించడానికి నేను ఇది చెప్పట్లేదు. అంత సాహసం కూడా చేయను. నేను రాసిందానికోసం ఈ మాట అనవలసి వస్తోంది.

…తుపాల్‌…

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
కానీ సమస్యేమిటంటే,
నాకు ఒక పుస్తకం చదువుతుండగానే రివ్యూ ఫామ్‌ అవుతూ ఉంటుంది, అది నేను అదే ఉద్దేశంతో చదువుతుంటే గనక. ఎలా ఎత్తుకోవాలి, ఎలా ముగించాలి, ఏమేం రావాలి… అనేది నాకు ఐడియా వచ్చేస్తూనే ఉంటుంది. అలాగే ఈ పుస్తకం వేద్దామనుకున్నప్పట్నుంచీ ముందుమాట ఇలా రాయాలి, ఇది మెన్షన్‌ చేయాలి, అని రకరకాలుగా ఆలోచించాను. కానీ పుస్తకంలో ఏమేం రావాలి, అన్నది తేల్చుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ముందు అనుకున్న వెర్షన్స్‌ మారిపోయాయి. దీంతో నోట్స్‌ ఏమో ఉంది. ముందుమాటేమో లేదు. అందుకే ఈ తిప్పలు.
రాయకుండా కూడా వదిలేయొచ్చు. కానీ రచయిత నోటితో అదెందుకు రాశాడో, ఏం ఆలోచించాడో తెలుసుకోవడం నాకు బాగుంటుంది. ఏ పుస్తకాన్నయినా నేను ఈ ముందుమాటలు పూర్తిచేశాకే మొదలుపెడతాను. దీనివల్ల కూడా రచయిత రుచి ఏమిటో నాకు తెలుస్తుంది.
కానీ నాకు నిజంగానే రాయడం అంటే వణుకు పుడుతుంది. రాయకుండా  ఉండగలిగే శక్తి  ఉంటే నేను ఇంకా ప్రశాంతంగా బతకగలను. కానీ ఉండలేను. కాబట్టి ప్రశాంతంగా బతకగలిగే అదృష్టం నాకీ జన్మకు లేదు.
జిడ్డు కృష్ణమూర్తి మీదా, జలాలుద్దీన్‌ రూమీ మీదా, స్వామి వివేకానంద గురించీ, రాహుల్‌ సాంకృత్యాయన్‌ గురించీ, ఇంకా, బి అంటే బ్లాగు, భూటాన్‌ జీవనశైలి (చిన్నదేశం పెద్ద సందేశం)… ఇలా కొన్ని ‘నేను’లు, కొన్ని కవర్‌ స్టోరీలు, మరికొన్ని ఇంకేవో రాశాను. మొదట్లో చెప్పి నట్టు నాకు నేనే ముచ్చటపడగలిగే అర్హత ఉంది వీటికి. కానీ ఇవన్నీ నేను పుస్తకంగా వేయాల్సిన అవసరం ఉందా? నా ఉద్దేశం అవి నేను మాత్రమే చెప్పగలిగినవా? ఇదింకా పొగరు వాక్యంలాగా కనబడుతున్నట్టుంది. మరోసారి ‘తుపాల్‌’ను ఆశ్రయించాల్సి వచ్చేట్టే ఉంది.
తుపాల్‌ అనేది మావైపు పిల్లల ఆటల్లో వినిపించే పదం. ఆటలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ మాటంటే ఆ తప్పు తప్పు కాకుండా పోతుంది. చూడండి చిత్రం! ఎంతో గంభీరంగా మొదలుపెడదామనుకున్న ముందుమాట… పుస్తకం టైటిల్‌కు తగ్గట్టే పిల్లవాడు రాసి కొట్టేసినట్టే అయింది.

Palaka-Pencil Cover (2)

 

*

ఓం నమ:శివాయ.
అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
అయితే, ఈ పుస్తకం వేయాలనుకున్నప్పటినుంచి నా మానసిక స్థితి రకరకాలుగా మారుతూ వచ్చింది. చివరకు ‘నా’, ‘నేను’ ఈ కోవలోకి వచ్చేవే పుస్తకంలోకి రావాలనుకున్నాను.
ఇందులో దాదాపు అన్నీ సాక్షి ‘ఫన్‌డే’, ‘ఫ్యామిలీ’ల్లో అచ్చయినాయి. ఒకటి ఈనాడు ‘ఆదివారం అనుబంధం’లోది. ఎటూ డైరీ మాట వచ్చింది కాబట్టి, అది ఇందులో చేర్చితే బాగుంటుందనిపించింది. ఒకట్రెండు నేరుగా పుస్తకం కోసమే రాశాను. వీటన్నింటి రచనాకాలం 2007 నుంచి 2011.
అం­తే, నా మొదటి పుస్తకం ‘మధుపం’లాగా వీటన్నింటినీ జనరలెైజ్‌ చేయగలిగే అంతఃసూత్రం ఒకటి లేదు. కొన్ని నాస్టాల్జియా, కొన్ని స్వీయ ఘర్షణకు సంబంధించినవి, కొన్ని సహజంగానే స్త్రీ సంబంధిత ఫీలింగ్స్‌. అలాగే వీటి పొడవు కూడా ఒకటి అరపేజీకి సరిపోతే, ఇంకోటి నాలుగు పేజీలుంటుంది. ఈ వైరుధ్యాన్నీ, వైవిధ్యాన్నీ ప్రతిఫలించేట్టుగా పుస్తకం పేరు, క్యాప్షన్‌ ఉండాలనుకున్నాను.
పుస్తకం ఆలోచన వచ్చినప్పట్నుంచీ ఎందుకో ‘పలక’ నా మనసులోకి జొర బడిరది, టైటిల్‌ తన మీద ఉండేట్టు చూడమని. బాల్యపు రాతలు ఉండటం వల్ల కాబోలు!
అందుకే, పలక బలపం అనుకున్నా.
కానీ ఇందులో పూర్తిగా బాల్యమే లేదు.
తర్వాత, పలక కలం, పలక పెన్ను… ఇలా కూడా ఆలోచించాను. ఎక్కడో తంతోందని తెలుస్తోందిగానీ ఒకటి ఎందుకో గుర్తేరాలేదు. ఆ మాట తట్టగానే, ఇదే కరెక్ట్‌ టైటిల్‌ అనిపించింది.
పలక పెన్సిల్‌…
దానికీ దీనికీ ఏ సంబంధవూ లేదు, ఒక విధంగా.
ఇంకో విధంగా చూస్తే రెండూ పిల్లవాడికి అపురూపమైన విషయాలు.
ఇంకా పిల్లాడే(పలక), కానీ ఆ పిల్లతనాన్ని దాటి(పెన్సిల్‌) కూడా కొన్ని మాట్లాడు తున్నాడు, అనేది కూడా ఈ టైటిల్‌ ఎన్నుకోవడంలో మరో ఉద్దేశం.
ఇంకా ముఖ్యంగా, సమీర అన్నట్టు, ‘పలక పెన్సిల్‌ అంటే బలపం కదా!’
ఎగ్జామ్‌లో ఆన్సర్‌ తప్పు రాశానని తెలిసినా, దిద్దుకోవడానికి ఇష్టపడనంత విచిత్రమైన అలవాటు నాది. దిద్దితే పేజీ ఖరాబు అవుతుందనిపిస్తుంది. మొట్టమొదటగా  అప్రయత్నంగా ఏది వచ్చిందో, అదే ఫైనల్‌. ఇదీ అంతే. సూట్‌ అయ్యిందో లేదో నాకు తెలియదు.
ఇంకా, మగవాడి డైరీ!
ఒక విధంగా ‘డైరీ’ అనడం కరెక్టు కాదు.
కానీ డైరీ రాతల్లో ఒక క్రమం ఉండదు. ఏదైనా రాసుకోవచ్చు. ఈ ఆర్టికల్స్‌ కూడా ఏదైనా మాట్లాడుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యక్తిగత కోణం ఉండటంవల్లే దీన్ని డైరీ అనగలిగాను. ఇది అంత అర్థవంతమైన పనేమీ కాకపోవచ్చు, అలాగని పూర్తి అర్థరహితం కూడా కాకపోవచ్చు.
మూడో భాగంలోవి మినహా, ఈ ఐటెమ్స్‌ దేనికదే విడిగా రాసిందే అయినా, పుస్తకంలో వాటి క్రమం కోసం ఒక ‘థీమ్‌’ పాటించాను. తొలి అడుగు వేసి, ‘అంమ’ అంటూ మొదటి మాట పలికి, మా ఊరి ముచ్చట్లు చెప్పి,  ప్రేమ గురించి మాట్లాడి, ప్రేమలో పడి, సంసారం, పిల్లల గురించి ఒకట్రెండు మాటలు చెప్పి, ఆ అనుభవంతో కొంత జ్ఞానం సంపాదించి, అటుపై మరణంతో ముగిసేట్టుగా.
ఆర్టికల్‌ చివర్లో మధుపంలో లాగే, నేను వేరే సందర్భాల్లో రాసిన, రాసుకున్న వాక్యాలను ఫుట్‌కోట్‌గా ఇస్తున్నాను. దీనివల్ల ఆ ముచ్చటపడ్డానని చెప్పిన వాటిల్లోని ఒకట్రెండు మాటలైనా పుస్తకంగా రికార్డు చేయగలిగానన్న తృప్తి ఉంటుంది నాకు. అయితే, ఎందులోంచి ఏది తీసుకున్నానో వివరాలు ఇవ్వట్లేదు. బోర్‌. నాకూ మీకూ.
అలాగే, ఇలా ఫుట్‌ కోట్‌ ఇవ్వడం వల్ల ప్రధాన ఐటెమ్‌ ఇచ్చిన భావనను కాసేపు అట్టే నిలుపుకోగలిగే అవకాశం పోతుందని తెలుసు. కానీ రీ`రీడిరగ్‌ (ఆ అర్హత   ఉంటే) లో అది మీరు పొందగలిగే అదనపు వాక్యం అవుతుంది.
త్వరగా మొదలై, ఆలస్యంగా ముగిసిపోయే వేసవికాలపు పగలులాగా (నిజానికి ముందు రాసుకున్న వాక్యం… ఆలస్యంగా మొదలై, , త్వరగా వ­గిసిపోయే శీతాకాలపు రోజులాగా) ఈ పుస్తకం వేయాలన్న ఆలోచన త్వరగా వచ్చింది. పని మాత్రం ఆలస్యంగా పూర్తయ్యింది. ఇదీ మంచిదే అయ్యింది. ‘పదాలు పెదాలు’ ఇందులోకి రాగలిగాయి. నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఒక్కోసారి మంచే చేస్తుందన్నమాట. పదాలు`పెదాలు గురించి ప్రత్యేకంగా రెండు మాటలు. పత్రికలో పనిచేసేవాడిగా అవసరం నిమిత్తం ఏమైనా రాయవలసి రావచ్చు. ఇందులో ఉన్న ప్రతిదీ, నేను ఎంతో ఇష్టంగా రాసినప్పటికీ, అది రాయడానికి ఒక కారణమో, ఏదైనా సందర్భమో ఉంది. అలా కాకుండా ఏ అవసరంతోనూ, ఏ కారణంతోనూ పని లేకుండా, కేవలం రాయడం కోసమే రాసిన ఖండికలు ఈ పదాలు`పెదాలు.
ఏదేమైనా, ఈ పుస్తకానికి సంబంధించి ఈ ‘సాక్షి’ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పడం, నా ఫ్యామిలీని తలుచుకోవడం నా కనీస ధర్మం.
వై.ఎస్.భారతి గారు
సజ్జల రామకృష్ణారెడ్డి గారు
వర్ధెల్లి వ­రళి గారు
ప్రియదర్శిని రావ్‌ు గారు
ఖదీర్‌ గారు
ఇంకా, అన్వర్‌ గారు
నేను నూటారెండు సార్లు రివైజ్డ్‌ అంటూ కాపీ పంపినా విసుక్కోకుండా ముందుమాట రాసిన అఫ్సర్‌ గారు
ఆప్తవాక్య మిత్రుడు భగవంతం
మల్లేష్‌
అనూష
ఇప్పుడు నాతో టీ, లంచ్‌ పంచుకుంటున్న సహచరులు
నా అక్షరం కనబడగానే బైలైన్‌ వెైపు చూడగలిగే ఆత్మీయులు
కనీసం మెయిల్‌ పరిచయమైనా లేకుండానే పుస్తకం రావడానికి కారకులవుతున్న ‘సారంగ’ రాజ్‌ గారు
కేవలం తన చొరవతో ఈ పుస్తకాన్ని సాధ్యం చేస్తున్న కల్పనా రెంటాల గారు
కనీసం పదిసార్లయినా ఫైనల్‌ కరెక్షన్స్‌ చేసిన అక్షర సీత గారు
నాతో కలిసి ‘తా’, ‘దు’ పెరుగుదల చూస్తున్న నర్మద
నా పెరుగుదల కూడా అలాగే చూసివుండిన అమ్మ, బాపు.
చిట్టచివరిగా…
బాధకు స్థాయీ భేదం ఉండదనుకుంటే… ఒక అక్షరదోషం గురించి శ్రీశ్రీ ‘అనంతం’లో పదేపదే బాధపడతాడు. దాని తీవ్రత తొలి పుస్తకం అచ్చువేశాకగానీ అనుభవంలోకి రాలేదు.
సమయం దొరికినప్పుడల్లా మధుపాన్నిమురిపెంగా తిప్పితే ఎన్నిసార్లు తిప్పినా  బాగుందనిపించేది. మన పుస్తకం మనకు బాగుందనిపించడంలో వింతేముంది! రీ ప్రింట్‌ చేసినప్పుడు ఎక్కడైనా మార్చవచ్చు అనుకుంటే పక్కన రాసిపెడుతున్నాను. శ్రీశ్రీలా నాకు అక్షరదోషాలకు బాధపడాల్సిన బాధ తప్పిందనుకున్నా. కానీ ఎలా మిస్‌ అయ్యిందో ఇండెక్సులోనే తప్పు వచ్చింది. బ్యాచిలర్‌కు బదులు బ్యాచిలచ్‌. నేను గమనించినంత వరకూ ఇంకోటి ఫుట్‌కోట్‌లో ఉంది. కెమిస్ట్రీ బదులుగా కెమిస్త్రీ. అలాగే ‘పేర్లుండవు’లో డ, ‘దొరకలేదు’లో ర అక్షరాలు ఎగిరిపోయాయి. దీనివల్ల మరింత జాగ్రత్తగా పుస్తకం ప్రూఫ్‌ చూడాలనే జ్ఞానం రాలేదుగానీ, ఎవరి పుస్తకంలోనైనా ఒకటీ అరా అక్షర దోషాలుంటే క్షమించేసే ధోరణి అలవడింది.
ఇంకొక్క మాట చెప్పి ముగించేస్తాను. మేము ­ సాక్షి ఆఫీసులో వాడే పత్రిక అనే ఓ సాఫ్ట్‌వేర్‌లో 16 సైజులో పెడితే ఏర్పడే అక్షర స్వరూపం నాకు కంటికి ఇంపుగా  ఉండదు. 14 పెట్టినా నాకు నచ్చదు. 15లోనే నాకు హాయి­. ఏమిటి దానికే ఆ పర్టిక్యు లారిటీ? మిగతావారికి ఇలా ఉండకపోవచ్చు. అది నా వ్యక్తిగత సమస్యే అనుకుంటాను.
ఇప్పుడు ఈ పాత ఐటెమ్స్‌ అన్నింటినీ అచ్చు వేయకపోతేనేం? అంటే, ఏమో!   నాకు ‘15’లో కనబడేదేదో మీకు కనిపించొచ్చు, అన్న సంశయలాభంతోనే వీటిని మీ ముందుకు తెస్తున్నాను.
మరీ చిన్న పిల్లాడి మారాం అనుకోనంటే ఇక ఇది చివరివాక్యం.
అసలు ఏ మనిషైనా ఎదుటివాళ్లతో తానేమిటో ఎందుకు వ్యక్తపరుచుకోవాలి?  ఈ ప్రశ్న ఎన్నాళ్లుగానో నన్ను వేధిస్తోంది. నేను సమాధానపడగలిగే జవాబు ఇప్పటికీ దొరకలేదు.
తద్విరుద్ధంగా, ఒక రసాత్మక వాక్యాన్ని నాకోసం ఏ పుస్తకంలోనో అట్టిపెట్టి, నేను వెతుక్కోగలనా లేదా అని తమాషా చూసే రచయితతో, దొరికింది చూసుకో అని నేను చిలిపిగా నవ్విన క్షణం… నా జీవితంలో అత్యంత విలువైన క్షణం.
అలాంటి ఏ ఒక్క క్షణాన్నయినా మీకివ్వగలిగితే ఈ పిల్లాడి మారానికి ఏమైనా అర్థముంటుంది. పుస్తకం వేయాలన్న నిర్ణయం సరైనదైపోతుంది.

—పూడూరి రాజిరెడ్డి

నిదురించే తోటలోకి ఒక సూఫీ కెరటం!

ప్రసిద్ధ మలయాళీ రచయిత రామనున్ని నవల “సూఫీ చెప్పిన కథ” శీర్షికతో ఎల్. ఆర్. స్వామి అనువాదంలో ఈ నెల సారంగ బుక్స్ ప్రచురణగా వెలువడుతుంది. ఈ పుస్తకం  ఆగస్ట్ 30 వ తేదీ నుంచి  హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది. ఈ నవల విడుదల సందర్భంగా కల్పనా రెంటాల ఈ నవలకి రాసిన ముందు మాటని ‘సారంగ’ పాఠకులకు అందిస్తున్నాం. 

 

సూఫీ పరంజ కథ సినిమా నించి ఒక దృశ్యం

సూఫీ పరంజ కథ సినిమా నించి ఒక దృశ్యం

‘సూఫీ పరాంజే కథ’ సినిమాకు అవార్డ్‌ వచ్చినప్పుడు నేను మొదటిసారిగా కె.పి.రామనున్ని  పేరు విన్నాను. సూఫీ సంప్రదాయం, సూఫీ యోగులు, వారి బోధనలు, వారి జీవిత విధానం గురించి అప్పటికే  కొంత తెలిసి ఉన్న నాకు ‘సూఫీ చెప్పిన కథ’ అన్న  పేరు వినగానే ఏవేవో పుర్వస్మతులు మేల్కొన్నాయి.  ఎలాగైనా  ఆ సినిమా చూడాలని, ఆ నవల చదవాలని ఎంతో ప్రయత్నించాను. అమెరికాలో నాకు ఏ మలయాళీ సాహిత్యాభిమాని కనిపించినా  ఈ నవల గురించి అడిగేదాన్ని. అందరూ మంచి నవల అని చెప్పిన వాళ్ళే కానీ ఇంగ్లీష్‌ అనువాదం ఎవరి దగ్గరా దొరకలేదు. ఒక దశలో మలయాళ సాహిత్యం చదవటానికి ఆ భాష నేర్చుకుందామన్న అత్యుత్సాహంలోకి కూడా వెళ్లకపోలేదు. ఏమైతేనేం ఇవేవీ జరగలేదు. తాత్కాలికంగా సూఫీ చెప్పిన కథ కోసం నా అన్వేషణ సగంలో అలా అక్కడ ఆగిపోయింది.

సూఫీ చెప్పిన ఆ కథ ఏమిటో చదవాలని ఒళ్ళంత కళ్ళు చేసుకొని నేను చూసిన ఎదురుచూపులు ఓ రోజు ఫలించాయి. అది కూడా ఓ కలలా జరిగింది. మలయాళ సాహిత్యాన్ని  మూలభాష నుంచి నేరుగా అందమైన తెలుగుభాషలోకి అనువాదం చేసే ప్రముఖ అనువాదకుడు, స్వయంగా కథకుడు ఎల్‌. ఆర్‌. స్వామి. ఆయన ఇటీవల అనువాదం చేసిన ‘పాండవపురం’ నవల తెలుగువారిని మలయాళ సాహిత్యానికి మరింత దగ్గర చేసింది.

ఆ పుస్తకం గురించి పత్రికల్లో చదివి ఎల్‌.ఆర్‌. స్వామిగారికి ఫోన్‌ చేశాను. మాటల సందర్భంలో ఆయన చేసిన అనువాదాలు ఇంకేమైన  ప్రచురణకు సిద్ధంగా వున్నాయా? అని అడిగినప్పుడు ఆయన నోటి నుంచి ‘సూఫీ చెప్పిన కథ’  పేరు విన్నాను. ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లుమంది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఆ పుస్తకాన్ని‘సారంగ పబ్లికేషన్స్‌’  ప్రచురిస్తుందని, వెంటనే ఆ అనువాదం పంపించమని కోరాను. ఎల్‌. ఆర్‌.  స్వామి  చేసిన ‘సూఫీ చెప్పిన కథ’  అనువాదం కంపోజ్‌ అయి నా  దగ్గరకు వచ్చేసరికి  రెండు నెలలు పట్టింది. కానీ ఈలోగా నాకు ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ లైబ్రరీలో రూపా అండ్‌ కో వారు ప్రచురించిన “What the Sufi said” పుస్తకం దొరికింది. ఎన్‌. గోపాలకృష్ణన్‌, ప్రొ. ఈషర్‌ సహాయంతో చేసిన ఆ అనువాదం చదివాక నా  మనసు కుదుటపడ్డది. కానీ ఇంగ్లీష్‌లో కంటే మూలభాష నుంచి నేరుగా వచ్చిన తెలుగు అనువాదం చదవాలని ఎంతగానో ఆరాటపడ్డాను. తెలుగులో ఆ నవల చదువుతున్నప్పుడు ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోయేదాన్ని. ఒక్కో వాక్యంలోనూ ఎంతో గూఢార్థంతో నిండి  ఉన్న కవిత్వం కనిపించింది. రామసున్ని రాసిన  కవిత్వ వచనం చదువుతూ నన్ను నేను మర్చిపోయాను. ఇంగ్లీష్‌ అనువాదం చదివినప్పుడు కథలోనూ, కథనంలోనూ ఎన్నో సందేహాలు. ఏదో అర్థం కాలేదనిపించింది. అది భాషాపరమైన సమస్య కాబోలు అనుకున్నాను. కానీ తెలుగు అనువాదం చదివాక కానీ నవల గొప్పతనం పూర్తిగా అర్థంకాలేదు.

SufiBookFrontCover

2

జీవితం అంటే ఇది అని ఎవరైనా  చెపితే అర్థమయ్యేది కాదు. జీవితాన్ని ఎవరికి వారు జీవించాల్సిందే. అయినా  కొన్ని పుస్తకాలు జీవితమంటే ఏమిటో,  ఎలా జీవిస్తే ఆ జీవితానికి ఓ సార్థకత కలుగుతుందో వివరిస్తాయి. ‘సూఫీ చెప్పిన కథ’ అలాంటి నవల. మొదలుపెట్టిన క్షణం నుంచి నవల ఎక్కడా ఆపకుండా చదివించింది. నవల పూర్తయ్యాక ఎంతో అర్థమయిందన్న అనుభూతితో పాటు,  మరెంతో  అర్థం కావాల్సి ఉందనిపించింది. జీవితం గూఢార్థాన్ని ఒక్కో పొర వొలిచి చూపించిన అనుభూతి పుస్తకం చదువుతున్నంత సేపూ మనకి కలుగుతుంది. సముద్రపుటోడ్డున అమ్మవారు, లేదా ఓ బీవి  వెలిసిందన్న వార్త విని అది చూడటానికి వెళ్ళిన ఒక హిందువు చేయి పట్టుకొని సముద్రతీరం దగ్గరకు తీసుకొని వెళ్ళి సూఫీ చెప్పిన కథ ఇది. ఈ నవల ఇతివృత్తం ఇది అని చెప్పటం కన్నా చదవటం మంచిది. ఇదొక మామూలు నవల కాకుండా ఒక మంచి నవల ఎందుకయిందో తెలియాలంటే నవలను ఎవరికి వారు చదివి తెలుసుకోవాల్సిందే. నవలలో చర్చించిన ముఖ్య అంశాలను రేఖా మాత్రంగా సృశిస్తే నవల గొప్పతనం అర్థం చేసుకోవటం సులువవుతుందన్న ఉద్దేశ్యంతో ఒకటి రెండు విషయాలు మాత్రం ప్రస్తావిస్తాను. తర్కం,  వాస్తవికత ఈ రెండింటి మీద మాత్రమే ఆధారపడితే సత్యాన్వేషణ సాధ్యం కాదు. హృదయంలో  ప్రేమ, కరుణ లాంటి గుణాలున్నప్పుడే సత్యాన్వేషణ సార్ధకమవుతుంది. వాస్తవికతను అర్థంచేసుకునే క్రమంలో హేతువు అన్నది ఎప్పుడూ ద్వితీయాంశమే అవుతుంది అన్నది ప్రధానంగా రామనున్ని ఈ నవలలో చర్చించారు. సృష్టిలోని ప్రతి ఒక్కటి కేవలం తర్కం, వాస్తవికతల మీద మాత్రమే ఆధారపడి  ఉండవని,  ప్రతి ఒక్కదాన్ని ఆ రెండింటితో మాత్రమే ముడి పెట్టి చూడలేమని, అలా చేయటం కూడా ఒక రకమైన మూఢ విశ్వాసమే నంటారు నవలలో రచయిత ఒకచోట.

కే. పి. రామనున్ని

కే. పి. రామనున్ని

*    *   *

స్తీ, పురుష దేహాల మధ్య కేవలం ఆకర్షణ, లైంగిక సంబంధం ఒక అనుబంధాన్ని నిర్వచించలేవు. అంతకుమించిన అనురాగం, ఒక ఆత్నీయానుబంధం లేకపోతే అది కేవలం దేహ సంబంధంగా మాత్రమే మిగిలిపోతుంది. కార్తి, మమ్ముటిల మధ్య ఒక ఆకర్షణ వుంది. ఒక తెగింపుతో కూడిన సాహసం ఇద్దరి మధ్యా వుంది. కార్తీ కోసం ఏమైనా  చేయటానికి సిద్ధపడ్డాడు మమ్ముటి. చివరకు  ఆమె కోసం తన ఇంట్లో అమ్మవారి గుడిని కూడా కట్టించి ఇచ్చాడు. మతం మారిన కార్తికి ఆ మతమార్పిడి  కేవలం ఒక సాంప్రదాయిక తంతుగా మాత్రమే మిగిలింది. ఆమెలో తాను చిన్ననాటి నుంచి వింటూ, చూస్తూ, అనుభవిస్తూ వచ్చిన  అమ్మవారు భగవతి మీద  ప్రేమ లేశమాత్రమైనా  తగ్గలేదు. అమ్మవారు కేవలం రాతి విగ్రహం కాదు, అది రక్తాన్ని స్రవించే ఒక హృదయమున్న  దేవత అని కార్తి స్వానుభవంతో తెలుసుకుంది. తల్లి కరుణాంతరంగాన్ని తన హృదయంలో నిలుపుకుంది. కార్తి మొదటిసారి ఋతుమతి అయినప్పుడు తనలోంచి ఓ వెల్లువలా సాగుతున్న రక్తస్రావాన్ని చేపపిల్లలు ఆనందంతో  తాగుతుంటే మైమర్చిపోయింది. మరో సందర్భంలో అమ్మవారి గదిలోకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా తనలోని  స్త్రీత్వాన్ని అమ్మవారి సమక్షంలో కార్తి అర్థం చేసుకుంది. తనను తాను అమ్మవారిలో చూసుకుంటూ ఇద్దరి మధ్యా ఓ అభేదాన్ని అనుభవించింది.

తన శరీరం ఏమిటో,  అందులో కలిగే స్పందనలు ఏమిటో తెలుసుకున్న  తర్వాత  శారీరక అనుభవం అనేది ఒక పశ్చాత్తాపమో, తప్పో కాదని, అది రెండు ఆత్మల సంయోజనం అని కార్తికి అర్థమయింది. తననొక దేవతలాగా కాకుండా ఒక  స్తీగా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి, నిర్భయంగా, నిర్భీతిగా తన శరీరం లోపలి అణువులను కూడా స్పర్శించగలిగిన మమ్ముటితో అందుకే కార్తి అలా నడిచి వెళ్లిపోగలిగింది. తన మేనమామకు తనమీద  ప్రేమతో పాటు తన శరీరం పట్ల ఉన్న ఒక కాంక్షను కూడా కార్తి గుర్తించగలగింది. అయినా ఆమెకు అతని మీద కోపం లేదు  ప్రేమ తప్ప. అతన్ని తన వక్షాలకు ఓ తల్లిలా అదుముకొని సాంత్వన పరచాలని కోరుకుంది. అందరూ తననొక దేవతగా చూడటాన్ని అర్థం చేసుకొని తనలో ఆ దేవీ తత్త్వమైన కరుణను,  ప్రేమను తనకు తాను దర్శించుకోగలిగింది. అందుకే ఆమె చేయి తాకితే నొప్పులు మాయమైపోయేవి. ఆమె సమక్షంలో అందరికీ ఒక ప్రశాంతత అనుభవమయ్యేది. అయితే అప్పటివరకూ ఆమెను ఒక అందమైన స్తీగా మాత్రమే చూసిన మమ్ముటికి ఈ మార్పు అర్థం కాలేదు. ఆమె సమక్షంలో అతనిలోని పురుషసంబంధమైన కోర్కెలు తిరోగమించాయి. తనకు భౌతికంగా, మానసికంగా మమ్ముటి దూరం అవటాన్ని గమనించింది కార్తి.  అతను మరో చిన్న కుర్రాడితో లైంగిక సంబంధం ఏర్పర్చుకోవటాన్ని కూడా ఆమె తెలుసుకుంది. అమ్మవారు కరుణిస్తే  అనుగ్రహం.  ఆగ్రహిస్తే విధ్వంసం అన్నట్లు తనను మోసం చేసిన పిల్లవాడిని తనే ఒక కాళిక అయి హతమార్చింది. చివరకు సముద్రంలో కలిసిపోయింది కార్తి. జాలర్లకు ప్రాణదానం చేసి వారి దృష్టిలో ఓ అమ్మవారిగా నిలిచింది. మేలేప్పురంతరవాడలో అమ్మవారిగా ఉండాల్సిన కార్తి,  పొన్నని  గ్రామంలోని హిందూ, ముస్లింలిద్దరికీ ఓ అమ్మవారిగా,  ఒక బీవిగా వారి హృదయాల్లో కలకాలం నిలిచిపోయింది.

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

నవల మొత్తంలో కార్తి పాత్ర పాఠకుల మనసులో ఓ ప్రత్యేక స్థానంలో నిలిచిపోతుంది. కార్తి పాత్ర అంత సులువుగా అర్థమయ్యే పాత్ర కాదు. ఆమె మనందరి లాగా ఓ మామూలు వ్యక్తా?  లేక అసాధారణ శక్తులున్నాయా? అనే సందేహం నవల చదువుతున్నంత సేపూ మనల్ని వెన్నాడుతూ ఉంటుంది. అందరూ ఆమెను దైవాంశ సంభూతురాలిగా చూస్తుంటారు. కానీ మమ్ముటికి మాత్రం ఆమె సౌందర్యం తెలిసినట్లుగా ఆమె హృదయం, అందులోని  ప్రేమ అర్థంకావు. కార్తి ప్రవర్తన, కొన్ని సంఘటనల్లో ఆమె ప్రవర్తించిన తీరు, మరీ ముఖ్యంగా అమీర్‌ని ఆమె చంపేయటానికి గల కారణం, అలాగే చివర్లో జాలర్లకు ఆమె ప్రాణదానం చేయటం … ఇలా ఎన్నో విషయాల్లో కార్తి మనకు అర్థంకాని ఓ చిత్తరువుగా మిగిలిపోతుంది. నవల చదువుతుంటే ఎన్నో చిక్కుముడులు విడిపోయిన అనుభూతి, కానీ అంతలోనే మరెన్నో చిక్కు ముడులు కళ్ళ ముందు కనిపిస్తాయి.

నవల పూర్తయ్యాక కూడా  అనేకానేక  సందేహాలు మనల్ని వెంటాడతాయి. కొత్త కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. కొన్ని కొత్త సందేహాలతో కూడిన ఆలోచనలు మనల్ని అస్థిమితపరుస్తాయి.అనేక కొత్త దారుల్లోకి మన ఆలోచనలు ప్రయాణిస్తాయి. ఈ నవలలో రామనున్ని ఎక్కడా కూడా ఏ సందేహాలకు, ఏ సంశయాలకు సమాధానాలు ఇచ్చే పని చేయలేదు. మన మనసుల్లో రేకెత్తే ప్రతి ప్రశ్న వెనుక ఉండే అసంబద్ధతను అలవోకగా, ఎంతో సహజంగా, నేర్పుగా చిత్రించారు. నవల ముగిసిన తర్వాత కూడా మన మనసు స్థిమితపడదు. ఎన్నో చిక్కుముడులు మన ముందు నిలిచి ఉంటాయి. తర్కంతో ఈ నవలను అర్థం చేసుకోవాలనుకోవటం వృధా ప్రయత్నమే అవుతుంది. నవలలోని చాలా సంఘటనల వెనుక ఉన్న  హేతువు మన మామూలు అవగాహనకు అందదు. సులభంగా విడివడలేని ఆ చిక్కుముడులే నవలకు కొత్త అందాన్ని ఇచ్చాయి. విభిన్నమైన కథ, చిక్కనైన కథనం రెండూ కూడా  నవల చదువుతున్నంత  సేపూ పాఠకులను మరో ఊహాత్మక లోకంలో విహరింపచేస్తాయి. వారి మనసులను, ఆలోచనల్ని పదును పెడతాయి. జీవితమనేది రెండు రెళ్ళ నాలుగు అన్నంత సులభమైన లెక్క కాదని మనసుకు పడుతుంది.  ప్రేమ, కరుణ లేని మతవిశ్వాసం మూఢవిశ్వాసంతో సమానమని అర్థమవుతుంది.

*   *   *

తెలుగు సాహిత్యాభిమానులకు మలయాళ సాహిత్యం అంటే ఒక విధమైన ఆరాధన, అభిమానం. మలయాళ సమాజం, అక్కడ  అందమైన ప్రకృతి, అక్కడ కులవ్యవస్థ, ఎన్నో శతాబ్దాలుగా బలంగా ఉన్న మాతృ స్వామ్య వ్యవస్థ, వీటినన్నింటిని ప్రతిబింబించే అద్భుతమైన సాహిత్యం తెలుగు సాహిత్యాభిమానులకు ప్రాణప్రదాలు. దక్షిణాది భాషల సాహిత్యం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం ఒకదానికొకటి ఎంతో సన్నిహితంగా ఉంటూనే వైవిధ్యంగా కూడా ఉంటాయి. మలయాళ సాహిత్యం అనగానే తెలుగువారికి తగళి శివశంకర్‌పిళ్లై, కమలాదాస్‌, అయ్యప్ప ఫణిక్కర్‌, కురూప్‌, ఎం.టి.వా సుదేవ నాయర్‌, లలితాంబికా అంతర్జనం, వైకవు మహమ్మద్‌ బషీర్‌ వీళ్ళందరూ గుర్తుకు వస్తారు. వీళ్ళ సాహిత్యం గురించి తెలుగు పాఠకులు ఎంతో అభిమానంతో మాట్లాడుకుంటారు. ఇప్పుడు వారి అభిమాన రచయితల కోవలోకి  కె.పి.రామనున్ని కూడా చేరుతున్నారు. ఈ ‘సూఫీ చెప్పిన కథ’ నవలతో రామనున్ని తెలుగు పాఠకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్నో భాషల్లోకి ఈ నవల అనువాదమయ్యాక ఆలస్యంగా ఇప్పుడు తెలుగులోకి కూడా వస్తోంది. ఇంత ఆలస్యంగా తెలుగులోకి రావటం కొంత విచారకరమే అయినా ఇప్పటికైనా  ఎల్‌.ఆర్‌. స్వామి అనువాదం చేయటం వల్ల తెలుగువారికి ఒక కొత్త మలయాళ రచయిత పరిచయం కావటం నిజంగా శుభవార్త.

కల్పనా రెంటాల

12-12-12.

Kalpana profile2

సాతానువాచ

కిరణ్ గాలి

కిరణ్ గాలి

సందేహమెందుకు ?

నిస్సంకోచంగానే స్వార్ధాన్ని ప్రేమించు

స్వార్ధం నిషిద్ధ పదార్ధమేమి కాదు కదా

సంశయిస్తున్నవా?

పసిపిల్లలను చూడు…

ఎంత స్వచ్ఛం గా స్వార్ధంగా సహజంగా

సంతోషంగా వుంటారో

స్వార్ధం శత్రువనే భ్రమలో బ్రతుకుతావెందుకు?

ఎవరు కలిపించారీ అపోహ నీకు?

ఎవడు వినిపించాడీ ఉద్బోధ నీకు?

***

గతాన్ని తరచి చూడు

గాయాలను తడిమి చూడు

ప్రేమ రక్తపు చుక్కంత చిక్కగా వుండదని

తెలుసుకున్నావు కదా

స్వార్ధం అంతకన్నా చిక్కగా వుంటుందని

నేర్చుకున్నావు కదా

తెలుసుకున్న దాన్ని తెలివిగా

ఆచరించక పోతే మూర్ఖత్వం కాదా

స్వార్ధమే ప్రాణి నిజనైజం

ఈ పరమ సత్యాన్ని సమ్మతించు

తక్కిన దంతా అసత్యం, అహేతుకమని గ్రహించు

***

స్వార్ధాన్ని త్యజిస్తావా?

ఎవరి అభినందన, ఆమోదం , అంగీకారాలకై

అర్రులు చాస్తున్నావు?

స్వార్ధం లేని వాడంటే వెన్నుముక లేని వాడు

ఇతరుల సంతోషాల ఎంగిలాకులు ఏరుకొని ఆనందించేవాడు

స్వార్ధమంటే స్వాభిమానం

నీ ఉనికిని నువ్వు గుర్తించడం

నీ ఉన్నతిని నువ్వు గౌరవించడం

***

ballet-de-papa-chrysanth-me-1892

అంతో ఇంతో స్వార్ధం లేనివాడు

ఎంతో కొంత స్వలాభం కోరనివాడు

సమస్త భూమండలంలోనే వుండడు*

సామాన్యుడికి సంపన్నుడికి

మధ్య వ్యత్యాసం సామర్ధ్యంలో కాదు

స్వార్ధం సాంధ్రతలోనే వుంది **

ఎప్పుడైనా వేదికనెక్కిన వాడే కనబడతాడు

మెట్లై తొక్కబడిన వాళ్ళు కాలగర్భంలో ధూళై కలిసిపోవలసిందే

స్వార్ధాన్ని కాదని నువ్వు

ఏమి సాధించలేవు…సగటు తనాన్ని తప్ప

నిస్వార్ధం నిరర్ధక పధార్ధం

దాన్ని తాకినా తలచినా అది

నిన్ను నిలువునా విలువలేని వాడిగా మారుస్తుంది

నీదైనది కూడా నీకు దొరకకుండా పోతుంది

***

జీవితంలో గెలుపు కావాలంటే

స్వార్ధం తో పోరాడడం మాని

స్వార్ధంతో పోరాడడం మొదలు పెట్టు

సర్వకాల సర్వావస్తలందు

స్వార్ధంతోనే సహచరించు

స్వార్ధంతోనే సంభోగించు

కణకణము, నరనరము

స్వార్ధాన్నే శ్వాసించు

సర్వసుఖాలను, సకలైశ్వర్యాలను,

సమస్త గౌరవాది యశస్సులను

సదా పొందగలవు.

ఆమెన్

***

Foot Notes

*ఇందుకలదువానందులేదని సందేహము వలదు

స్వార్ధం సర్వోపధారి

ఎవరందు వెదికిన వారందు వుండును

**”సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్” జీవ పరిణామం

“సక్సెస్ అఫ్ ది సెల్ఫిష్” జీవన పరిణామం

–కిరణ్ గాలి

ఒక నది : రెండు కవితలు

537604_404123966333998_1230470395_n


1.
నది మారలేదు
నది పాటా మారలేదు

అర్ధరాత్రి నిశ్శబ్దంలో
నది ఒడ్డున కూచుంటే
ఆ పాట నీకు స్పష్టంగా..

చీకట్లు చిక్కబడితేనే
కొన్ని కనిపిస్తాయి
కొన్ని వినిపిస్తాయి
మరికొన్ని వికసిస్తాయి!

2.

నదిలోంచి
దోసిలితో నీళ్ళు తీసుకుని
తిరిగి నదికే అర్పిస్తూ
చేతులు జోడిస్తాను

574894_284644554948607_899993610_n

–మూలా సుబ్రహ్మణ్యం

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013)

“750 పదాల” స్మార్ట్ స్టోరీ రాయండి

రూ. 10,000/- విలువైన బహుమతులు గెలుచుకోండి

మిత్రులారా…

మీరు 28 సంవత్సరాల లోపు వారా? అయితే, మీ సృజనాత్మకతని వెల్లువెత్తించండి, మీ కీబోర్డులకి పనిచెప్పండి…. రూ.10,000/– వరకూ గెలుచుకునే చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకోండి!

మీరు చేయాల్సిందల్లా.. కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013)కి 750 పదాల లోపు, ఒక స్మార్ట్ స్టోరీ రాసి submit@kinige.com కి పంపిస్తే చాలు! మీ కథ బహుమతి గెలుచుకునే అవకాశం. వివరాలు దిగువ …

ప్రథమ బహుమతి:

మీ కథ… కినిగె ప్రథమ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.4000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ద్వితీయ బహుమతి

మీ కథ… కినిగె ద్వితీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.2000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

తృతీయ బహుమతి

మీ కథ… కినిగె తృతీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.1000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ప్రోత్సాహక బహుమతులు (6 కథలకు)

మీ కథ… కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్‌లో కన్సోలేషన్ ప్రైజ్‌కి ఎంపికైతే… మీకు రూ.500/- విలువగల ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

మీరు చేయదగినవి!

1. మీకు నచ్చిన ఇతివృత్తాన్ని ఎంచుకోవచ్చు

2. కావాలనుకుంటే కలం పేరు వాడవచ్చు (*కానీ, కినిగె అడిగినప్పుడు, మీ అసలు పేరు, గుర్తింపులను ఋజువులతో సహా చూపవలసి ఉంటుంది)

3. మీరు టెక్స్ట్ పాడ్, నోట్ పాడ్, లేదా ఎం. ఎస్. వర్డ్ డాక్యుమెంట్ లేదా తత్సమాన డాక్యుమెంట్ ఏదైనా ఉపయోగించవచ్చు. తెలుగు అక్షరాలను స్పష్టంగా చూపే ఏ అప్లికేషన్ని అయినా వాడేందుకు సంకోచించనవసరం లేదు.

4. మీ కినిగె స్మార్ట్ స్టోరీకి వన్నె తెచ్చే యోగ్యమైన బొమ్మలను జోడించండి (*కాపీరైట్‌ని గౌరవించడం మరచిపోవద్దు)

మీరు చేయాల్సినవి!

1. మీరు మీ రచనని కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసమే రాయాలి

2. మీ కినిగె స్మార్ట్ స్టోరీని యూనికోడ్‌లో మాత్రమే* టైప్ చేయాలి

3. టైపింగ్ దోషాలు, అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

4. సబ్జెక్ట్ లైన్‍లో “కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం” అని రాయాలి. మీ స్మార్ట్ స్టోరీ (2013) పేరు ప్రస్తావించాలి.

5. మీ పూర్తి పేరు, పోస్టల్ అడ్రస్ (పిన్‌కోడ్‌తో సహా) పంపాలి.

6. మీ కథలను 20 సెప్టెంబర్ 2013లోగా కినిగెకి అందేలా పంపాలి

7. మీ రచనలను submit@kinige.com కి పంపాలి

8. మీ వయసు డిసెంబరు 2013 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి.

మీరు చేయకూడనివి!

1. గతంలో ప్రచురితమైన కథలు పంపకూడదు.

2. ఇతర పోటీలలోగాని లేదా ఇతర ప్రచురణకర్తలు లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణల వద్ద పరిశీలనలో ఉన్న కథలను పంపకూడదు.

3. అనువాద కథలు పంపకూడదు.

4. ఒక వేళ మీ కథకు బహుమతి లభిస్తే, ఆ కథని మీరు ఏ బ్లాగులో గానీ, వెబ్‌జైన్‌లో గాని, ఇతర సోషల్ మీడియా సైట్లలో గాని లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణలలో కనీసం ఒక ఏడాది వరకు ప్రచురించరాదు.

5. ఈ నిబంధనలలో దేనినైనా, అన్నింటినీ లేదా కొన్నింటిని మీ కథ ఉల్లంఘిస్తే, మీరు పోటీకి అనర్హులవుతారు.

6. వెరసి, మీరు కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం సరికొత్త కథ, కినిగెకి మాత్రమే రాయల్సి ఉంటుంది.

మీకు సహాయపడే వనరులు:

మీ రచనలను యూనికోడ్‌లో టైప్ చేసేందుకు

1. lekhini.org

2. సురవర తెలుగు కీబోర్డు suravara.com

3. యూనికోడ్‌లో టైప్ చేసేందుకు మరింత సాయం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక:

పోటీ ఫలితాల విషయంలో కినిగెదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు. ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే, పోటీకి అనర్హులవుతారు.

*ఒకవేళ మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే support@kinige.com కి ఈమెయిల్ చేయాలి

మీ రచనలు కినిగెకి పంపడానికి తుది గడువు 20 సెప్టెంబర్ 2013!

హైదరాబాద్ లో 27న ‘తొండనాడుకతలు’ పరిచయ సభ

 

954820_612525435436475_1241627260_n
ఇరవై తెలుగు కతలు, ఇరవై తమిళ కతలతో తొండనాడు కతలు పుస్తకం రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడు. రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉంది. తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల కతలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

తొండనాడు కతలు పుస్తకం పరిచయ సభ ఈ నెల 27 మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ బంజరాహిల్స్ లోని లామకాన్‌లో జరుగుతుంది. జయధీర్ తిరుమలరావు, సామల రమేష్‌బాబు, వే దగిరి రాంబాబు, ఓట్ర పురుసోత్తం మాట్లాడుతారు. వివరాల కోసం 8142642638, 9346814601 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

తొండనాడుకతలు లో – తమిళ రచయితలు కీ.శే. అణ్ణాదురై, కీ.శే. ము.వరదరాజన్, జయకాంతన్, సార్‌వాగన్, శివశంకరి, బవా చెల్లదురై, వె. శేషాచలం, పారవి, ఎక్బర్డ్ సచ్చిదానందం, డేవిడ్ కనకరాజ్, అళగియ పెరియవన్, జి.మురుగన్, జె.డేనియల్, కాంచి శాంతన్, కవిపిత్తన్, ము.మురుగేశ్, వెణ్ణిల, యాళన్ ఆది, పడుదళం సుకుమారన్, ఇమైయం కథలు ఉన్నాయి. తెలుగులో- కీ.శే. కె.సభా, సి.వేణు, నామిని సుబ్రమణ్యంనాయుడు, కలువకొలను సదానంద, లంకిపల్లె కన్నయ్యనాయుడు, కీ.శే. మధురాంతకం మహేంద్ర, కీ.శే. పులికంటి కృష్ణారెడ్డి, సౌదా, కీ.శే. మధురాంతకం రాజారాం, మధురాంతకం నరేంద్ర, వి.ప్రతిమ, గోపిని కరుణాకర్, విష్ణుప్రియ, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, కె.ఎ.మునిసురేష్‌పిళ్ళె, గూళూరు బాలక్రిష్ణమూర్తి, పసుపులేటి గీత, జిల్లేళ్ళ బాలాజి, స.వెం.రమేశ్, ఓట్ర పురుసోత్తం కథలు ఉన్నాయి.

ఈ పుస్తకం కినిగెలో దొరుకుతుంది.

జ్ఞాపకాలకూ రాజకీయాలున్నాయ్!

ఎ. సునీత

ఎ. సునీత

హిందీ రచయిత కిశోరిలాల్ వ్యాస్ నీలకంఠ రాసిన ‘రజాకార్’ నవల హైదరాబాదు రాజ్యాన్ని భారత దేశంలో కలపటం కోసం జరిగిన పోరాటం, దానిలోని ముఖ్య సంఘటనల చుట్టూ నడుస్తుంది. 

ముఖచిత్రంపై ఉన్మాదిగా కనిపించే ఖాసిం రజ్వి తో సహా అనేక మంది చారిత్రక ప్రముఖుల పాత్రలు, కాల్పనిక పాత్రలతో కలిసి నవలను నడిపిస్తాయి: మంచి వాడు, కానీ బలహీనుడయిన ఉస్మాన్ అలీ ఖాన్; ధీరుడయిన స్వామీజీ; హిందూ ధర్మాన్ని కాపాడటానికి వీరోచితంగా ఆయుధాలు చేపట్టే ఆర్య సమాజ సభ్యులు; భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్ట్ కార్యకర్త శంకర్; క్రూరులయిన ముస్లిం పోలీసు అధికారులు; మత పిచ్చితో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పెట్రేగి పోయి వినాశనానికి పాల్పడిన రజాకార్లు, వీరికి వ్యతిరేకంగా పోరాడి, తమ మగవారికి చేయూతనిచ్చే హిందూ స్త్రీలు; అణగారి నివసించే ముస్లిము స్త్రీలు; మత మార్పిడికి లొంగ కుండా ప్రాణాలు పోగొట్టుకున్న మంచి హరిజనులు; ప్రలోభాలకు లొంగిపోయి రాజాకార్ల తో కలిసిపోయిన చెడు హరిజనులు. షోయబుల్లా ఖాన్, నరసింగ రావు, నెహ్రూ, మున్షి, లాయక్ అలీ కూడా ఈ నవలలో పాత్రలే.

నవల కధనం ఇలా సాగుతుంది. బలహీనుడయిన ఉస్మాన్ అలీ ఖాన్ ఖాసిం రజ్వి కి అధికార పగ్గాలు అప్పగిం చటం అనేక విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. శంకర్ వంటి యువకులు రజాకార్ల అత్యాచారాలను చుస్తూ పెద్దవుతారు. పెద్దయిన తరువాత వీరు వారి ఆగడాలని అడ్డుకోవటానికి ఆర్య సమాజ్, కాంగ్రెసు, కమునిస్ట్ పార్టీలలో రాజకీయ కార్యకర్తలవుతారు. శాంతి యుతంగా నిజాం  పాలనకు వ్యతిరేకంగా ప్రజలని సమీకరిస్తారు. పత్రికల్లో రాస్తారు. కొన్నిసార్లు భరించలేక ఎదురు తిరుగుతారు. నిజాం పోలీసులు ప్రభుత్వ వ్యతిరేకులను చంపటమే కాక, రైతులను, హరిజనులను తమ పశుత్వానికి గురి చేస్తారు. ఇవన్నీ తీవ్ర స్థాయికి చేరుకున్న సందర్భంలో హిందువులను రక్షించటానికి భారత సైనికులు వస్తారు. భారత సైన్యంలో వున్న సిక్కులు, అప్పటికే దేశ విభజన సమయంలో ముస్లిముల చేతుల్లో హింసకి గురయి వున్నారు కాబట్టి ఆ కోపాన్నంతా ఇక్కడి ముస్లిం సైనికులు, పోలీసుల పై తీర్చు కుంటారు. నిజాం ప్రభుత్వం పడిపోయిన తరువాత, కొంత మంది మామూలు హిందువులు ముస్లిం లపై దాడులు చేస్తారు. కానీ ఒక గ్రామంలో ముస్లిము జాగిర్దార్ ని హిందువులు క్షమించి, రక్షణ కల్పించటంతో నవల ముగుస్తుంది.

 

నవల తెలంగాణా ప్రజల జ్ఞాపకాల్లో నిక్షిప్తమయిపోయిన అనేక సంఘటనలను వర్ణిస్తూ వివరిస్తుంది. కమునిస్టు ఉద్యమంలో ముఖ్య సంఘటనలు, వారు ప్రజలని సమీకరించిన విధానం, రజాకార్లతో, నిజాం పోలీసులతో వారి యుద్ధాలు; మామూలు హిందువులపై ముస్లిం పోలీసులు జరిపిన అత్యాచారాలు, వారు వాటిని వ్యతిరేకించిన తీరు; ఆయా పోరాటాల్లో స్త్రీల పాత్రా – కళ్ళకు కట్టేటట్లు వర్ణిస్తారు. ఈ పరిస్థితులు రావటానికి కారణాలు కొంత తానూ, మరి కొంత పాత్రల ద్వారా రచయిత చెప్పిస్తారు.  ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలన మంచిగా ఉండేదనీ, ఆయన తన హిందూ ప్రజల పండగలలో పాల్గొని, వారితో కలిసి పోయే వాడనీ ప్రశంసా పూర్వకంగా వర్ణించిన తరువాత, గాంధీ-జిన్నాల మధ్య భారత దేశ భవిష్య రాజకీయ చిత్రం గురించిన చర్చ పరిస్థితులను మార్చిన నేపధ్యంగా ముందుకు తెస్తారు. దేశ స్వాతంత్ర్య సమరంలో కలవకుండా జిన్నా హిందువులు ముస్లిం ల మధ్య విభేదాలు సృష్టించాడని, ఆ విభేదాలే హైదరాబాదు రాజ్యంలో కూడా పొడచూపాయనీ, వాటికి కారణం మత మౌడ్యం వున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, తన ఇస్లామిక్ భావజాలంతో ముందుకు రావటమే నని అంటారు. హైదరాబాదు రాజ్యంలో తలెత్తిన గందరగోళ పరిస్థితులు మన కళ్ళ ముందు చిత్రీకరిస్తారు. షోయబుల్లా ఖాన్ హత్య, బహదూర్ యార్ జుంగ్ అకాల మరణం ఈ పరిస్థితులలో భాగమే. దేశాన్ని విభజించిన జిన్నాతో సంబంధం పెట్టుకున్న రజ్వి చేపట్టిన చర్యల వల్లే అనేక రకాల ఉద్యమాలు తెలంగాణా ప్రాంతంలో వచ్చాయని; అమాయక ‘హరిజనుల’ను చేర్చుకుని హిందువుల ఆస్తుల మీద, వారి స్త్రీల పైనా దాడులు చేసి, మొత్తం రాజ్యమంతా అల్లకల్లోలం సృష్టించి రజ్వి తెలంగాణా జిన్నా గా అవతరించాడనీ ఈ నవల చెప్తుంది.

 

జరిగిన సంఘటనల చుట్టూ తిరిగే ఈ చారిత్రిక నవల చరిత్రను, తనకిష్టం వచ్చినట్లు తిప్పుకుంటూ వాడుకుంటుంది. శంకర్ రజాకార్ల ఆగడాలు చూస్తూ పెద్దవుతాడు, అంటే, రజాకార్లు దశాబ్దానికి పైగా వున్నారని రచయిత  భావన. హైదరాబాదు రాజ్య చరిత్ర తెలిసిన ఎవరికయినా రజాకార్లు రెండు, మూడు సంవత్సరాలకు మించి లేరని తెలుసు. ఇస్లాం లోకి దళితుల మత మార్పిడులు జరిగింది రజ్వి వున్నప్పుడు కాదు, 1920లలొ, ముఖ్యంగా బహదూర్ యార్ జంగ్ నాయకత్వంలో. అవి బల వంతపు మత మార్పిడులు అనటానికి ఆధారాలు లేవు.  కాంగ్రెసు, ఆర్య సమాజం అందరూ రజాకార్ల కు ప్రతి చర్యగా ఉద్భవించాయని రచయిత చిత్రణ. ఆర్య సమాజం హైదరాబాదు రాజ్యంలో 1890 ల నుండి పని చేసింది. కాంగ్రెసు పార్టీ, నిజాం ప్రభుత్వం వొప్పుకోకపోయినా, 1920 ల మధ్య నుండి ఏదో రూపంలో ఉంటూనే వచ్చింది. గాంధీ హైదరాబాదు రాజ్యానికి మూడు సార్లు వస్తే, ప్రభుత్వాధికారులు వెళ్లి స్వాగతం పలికారు. రచయిత చెప్పినట్లు, పోలీసు చర్య తరువాత హిందువుల, హిందు సైన్యం దాడుల్లో చనిపోయింది పోలీసు అధికార్లు మాత్రమె కాదు, మామూలు,  సాధారణ ముస్లిం లు కూడాను. అయితే, ఈ నవల ఉద్దేశం జరిగింది జరిగినట్లు చెప్పటమో, సంక్లిష్ట సమాజ చిత్రాన్ని పాఠకులకి అందించటమో కాదు. అందరు ద్వేషించగలిగె ఒకే ఒక్క శత్రువుని సృష్టించటం. ఆ శత్రువు ఎవరంటే ‘రజాకార్లు’.

 RAJAKAR- NOVEL FRONT PAGE

వారు గ్రామాల పై చేసిన దాడుల్నీ, వారి క్రూరత్వాన్ని, దయ లేని తనాన్ని, అమానుషత్వాన్ని వివిధ రకాలుగా చిత్రీకరి స్తుంది ఈ నవల. వారు స్త్రీల పట్లే కాదు, ‘హరిజనుల’ పట్ల కూడా క్రూరత్వాన్నిచూపించారనీ, ఎట్లా అంటే, వాళ్లకి గొడ్డు మాంసం తినిపించి, ఇస్లాం లోకి మార్పించి అని అంటుంది! మరి వారి నుండి ‘ప్రజల్ని’ కాపాడగలిగే సత్తా వున్నవాళ్ళెవ్వరు? బ్రాహ్మణులు. నవలలో ముస్లిములు, ‘హరిజన్లు’, బ్రాహ్మణులూ, రెడ్లు తప్ప మరే కులాల వాళ్ళు పెద్దగా కనిపించరు. కనిపించినా వారి వారి కులాల ప్రస్తావన వుండదు. బ్రాహ్మణులు తప్ప అన్ని కులాల వారూ డబ్బు, అధికారం, స్త్రీల వ్యామోహానికి గురవుతూ వుంటారు. బ్రాహ్మణ పాత్రలు ఎప్పుడు ఈ వ్యామోహాలకి గురి కావు. నిజాయితీతో, దైవ భక్తితో, హిందూ మత రక్షణ కోసం ఆయుధాలు పట్టటానికి కూడా సిద్ధంగా వుంటారు. వీరి నాయకత్వంలో పనిచేయటానికి మిగిలిన కులాల వారు  కూడా సిద్ధం గా ఉంటారు, కమ్యునిస్టులు, కాంగ్రెసు వారితో సహా. అంటే, ప్రధానంగా, అప్పుడు జరిగింది, హిందూ ధర్మానికీ, ఇస్లాం మత మౌడ్యానికి (ముస్లిములకు) మధ్య జరిగిన యుద్ధమని చెప్పటం నవల వుద్దేశం: హిందువులు కేవలం ఆత్మ రక్షణ కోసం పోరాడారు తప్ప,  వారికి మత మూడత్వం వుండదు. ఎందుకంటే, రచయిత దృష్టిలో హిందూ మతంలో ఎవరి పాత్ర – కుల వ్యవస్థ రూపంలో – రైతులు, స్త్రీలు, యువకులు, హరిజనులు – వారి కుంటుంది. వారందరూ, ఈ ‘హిందూ సమాజాన్ని’ రజాకార్ల నుండి రక్షించుకునే పోరాటంలో తమ తమ స్థాయిల్లో, రక రకాల పార్టీల ద్వారా ఈ పోరాటంలో పాల్గొన్నారు.

 

నవల మొదట్లో ముస్లిం లలో – రజాకార్లకి, షోయబుల్లా ఖాన్ కి, మంచి వాడయిన నిజాముకు మధ్య – తేడాలు చూపించినా, మధ్యలో కొచ్చేటప్పటికి, ముస్లిమ్ లందర్నీ ఒకే వర్గం గా (ముస్లిం లు కాని వారందరినీ, హిందువులు గా) వర్ణించటం మొదలు పెడుతుంది. అంతే కాదు, నెమ్మదిగా ముస్లిం లందరికి మత పిచ్చి ఉన్నట్లుగా – వారికి సమాజంలో, ప్రభుత్వంలో, రాజకీయాలలో వున్న స్థానానికి సంబంధం లేకుండా –  చిత్రీకరిస్తుంది. తన సృజనాత్మక వాస్తవికత ద్వారా ప్రతి సాధారణ ముస్లిం లో ‘రజాకారు’ దాగి ఉంటాడని చూపిస్తుంది. చివరికి, అమాయక ముస్లిం ల మీద పోలీసు యాక్షన్ తరువాత జరిగిన మారణహోమం కూడా, ముస్లిం లు చేసిన దానికి ‘జరగాల్సిన’ (ఇనెవిటబుల్) ప్రతిచర్యగా చూపిస్తుంది.

 

2005/2007 లలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ లలో  వచ్చిన ఈ నవలా ‘వాస్తవికత’ స్పష్టంగా సమకాలీన హిందుత్వ జాతీయవాద రాజకీయ దృక్కోణంలో హైదరాబాదు రాజ్య ‘విలీన’ చరిత్రను చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ వాస్తవికతలో, నిజాం ప్రభుత్వం లో గ్రామ గ్రామానా పనిచేసిన బ్రాహ్మణ కరణాలు, అధికార్లు, మిగిలిన బ్రాహ్మణ ఉద్యోగుల ప్రస్తావన కి స్తానం వుండదు (వాళ్ళందరూ వుంటే, ఆ రోజుల్ని హిందూ ధర్మమూ, ఇస్లాం మత పిచ్చి కి మధ్య యుద్ధం గా వర్ణించటం అసాధ్యం కద!) ‘హరిజనులు’ గొడ్డు మాంసం తిని తమ మతాన్ని కొల్పోతారనే హెజిమోనిక్ (అ)’సత్యం’ దీనిలోనే అర్ధం చెసుకోగలం. గొడ్డు మాంసం తినే అలవాటు ముస్లిం ల వల్లే వచ్చిందని చెప్పటం వల్ల, దళితులను, ముస్లిం లను వేరు చేయచ్చు. మొత్తానికి దళితులు హిందూ సమాజంలో భాగమే అని చెప్పచ్చు (ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న గొడ్డు మాంస ఉత్సవాలకి హిందుత్వ వాదుల నుండి వస్తున్న వ్యతిరేకత ఈ దృక్పధం నుండే) మరి ‘ప్రతి చర్య’ సిద్ధాంతం 2002 సందర్భంలో నరేంద్ర మోదీ ప్రతిపాదించిందే. వీటన్నిటితో పాటు ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిన సంఘటలని కలిపి రంగరించిన నవలిది.

 

 

అయితే, హైదరాబాదు రాజ్యం గురించి ఇటువంటి ‘చారిత్రకత’ కేవలం హిందూత్వవాద కాల్పనిక (ఎంత వాస్తవికతతో కూడినదయినా) సాహిత్యానికి మాత్రమే పరిమితమయి లేదు. ఈ మధ్యనే (2008లో) గాంధీ భవన్ నుండి ప్రచురించ బడిన కాంగ్రెసు బ్రాండు చరిత్ర (రామారావు గారి హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్ర్య ఉద్యమం) కూడా ఇదే ధోరణిలో, మరిన్ని వివరాలతో, సాక్ష్యాలతో, ఆధారాలతో రాయబడింది. ఇక్కడ కూడా, రామానంద తీర్ధ, సుందరయ్య, నరసింగ రావులు, ఎటువంటి వైరుధ్యాలు లేకుండా, తెలుగు భాష కోసం, మత మార్పిడులకు, దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతూ వుంటారు. ఈ పుస్తకంలో ఒక దశాబ్ద కాల – 1940 ల చరిత్రను, మొత్తం ఆధునిక హైదరాబాదు రాజ్య చరిత్రగా జరిగే ప్రయత్నం జరిగింది. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన కొత్తల్లో రాయబడిన హైదరాబాదు చరిత్ర జాతీయవాద దృక్పథంలో రాయబడితే, క్రమ క్రమంగా దీనికి, వామ పక్ష దృక్పధం తోడయ్యి దొరలకు, రజాకార్లకు, నిజాముకు వ్యతిరేకంగా పోరాడటమే (తెలంగాణా) హైదరాబాదు రాజ్య చరిత్ర గా – విమోచన పోరాట చరిత్ర గా- (జాతీయ వాద విమోచన కావచ్చు, సాయుధ పోరాట విమోచన చరిత్ర కావచ్చు) – చిత్రీకరించటం ఎక్కువయింది. ఇటువంటి చరిత్రీకరణే ఉద్యమాల ద్వారా, సాహిత్యం ద్వారా తెలుగులో ప్రాచుర్యం పొందింది. ముస్లిం లకు (సామాన్య ముస్లిం లు,  కులీన వర్గాలు, మధ్య తరగతి తేడా లేకుండా) జాతీయ వాదులు,  కమ్యూనిస్టులు, నిజాం ప్రభుత్వ ఉద్యోగులు గానో తప్ప – ఈ చరిత్రలో స్థానం లెదు. 1940 లలోనే లక్షల్లో సభ్యులున్న మజ్లిస్ పార్టీకి, ఆ పార్టీ సభ్యులకు రజాకార్లుగా, జిన్నా సమర్ధకులుగా తప్ప స్థానం లెదు. దళితులకు, ముస్లిం లకు మధ్య సంబంధాలు, దళితులకు, నిజాం ప్రభుత్వానికి గల సంబంధాలు కూడా వ్యతిరేకతతోనే కూడుకుని వున్నట్లు, మూస పోసిన ఆలోచనా రీతుల్లోనే చిత్రీకరించ బడ్డాయి, చాలా వరకు.

ప్రస్థుతమున్న ఇటువంటి జాతీయ వాద, విమోచన వాద రీజినల్ చరిత్రను తిరగ రాయటానికి కొన్ని దశాబాలే పట్టొచ్చని సరోజినీ రేగానే వంటి చరిత్రకారులు అభిప్రాయ పడ్డారని కె. శ్రీనివాసు వంటి కొత్త తెలంగాణా చరిత్రకారులు అన్నారు. బొడ్డు వెంకట్, కవిత దాట్ల, గోగు శ్యామల వంటి కొంత మంది ఈ చరిత్రను వేరే ద్రుక్కోణాల్నుండి రాయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, 1990 లలో మొదలయిన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చైతన్యం విస్తరించిన తరువాత ఈ  చరిత్ర, జ్ఞాపకాల లో ఖాళీ – సామాన్య ముస్లిం లకు స్థానం లేకపోవటం – అన్నది స్పష్టంగా కనిపించటం మొదలయింది. ఈ ఖాళీ లోకి, ఇప్పటికే ప్రాచుర్యంలో వున్న చరిత్ర, సాంస్కృతిక స్మృతులు, కళా రూపాల్లో నిబిడీ కృతమయిన నిజాం, రజాకార్ల వ్యతిరేక జ్ఞాపకాలలోని ముస్లిం ల గురించిన కల్పనలు ప్రవేశిస్తున్నాయి. ముస్లింలందరూ అంతర్గతంగా రజాకార్లే అన్న భావన ను, జాతీయ వాద, విమోచన దృక్పధాల చరిత్ర ప్రభావానికి, అది ప్రజల జ్ఞాపకాలో నిక్షిప్తమయిపోయిన విధానానికి సంబంధం లేకుండా అర్ధం చేసుకోలేము. ఈ మధ్యన సంగిశెట్టి శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా, జిలుకర శ్రీనివాస్ వంటి కొంతమంది దళిత, ముస్లిం ఉద్యమకారులు ఇటువంటి చరిత్ర, జ్ఞాపకాల కున్న రాజకీయాలను  ప్రశ్నించారు. కానీ, అంచుల నుండి వేస్తున్న ఈ సవాళ్లు అధికారిక చరిత్రని, ఉద్యమ చరిత్రని, అంత కన్నా ముఖ్యంగా ముస్లిం లు అంటే రజాకార్లు అని సాధారణ ప్రజల్లో వున్నబలమయిన జ్ఞాపకం/అభిప్రాయాన్ని మార్చగలవా అన్నది ప్రశ్నార్ధకమే.

 

ఈ సాధారణ ప్రజల ‘జ్ఞాపకం’ ఎంత బలమయిందో నాకు 2010 లో మా సహాధ్యాయులు మొయీద్, డా.  మొహమ్మద్ తో కలిసి సిద్దిపేటలో హిందువులు ముస్లిముల మధ్య చెలరేగిన కమ్యూనల్ టెన్షన్ గురించి అర్ధం చేసుకోవటానికి వెళ్ళినపుడు తెలిసింది.

తన కూరల దుకాణంపై పక్క ముస్లిం దుకాణాదారులు చేసిన దాడిని వర్ణిస్తూ ఒక కూరలమ్మే బి.సి కులస్తురాలయిన మహిళా దుకాణదారు  ‘మా అమ్మ చెప్తుండే ..వెనకటి సంది తుర్కోల్లు, రజాకార్లు .. మనోల్లని, తెలుగోల్లని.. ఇట్లనే కొట్టిన్రట’ అన్నది.  ఆవిడ అన్న మాటల్ని తేలిగ్గా కొట్టిపడేయ్యచ్చు.  అక్కడున్న హిందుత్వ వాద కార్యకర్తలు ఆవిడకి అవన్నీ నేర్పారని అనుకొవచ్చు. అప్పుడే గొడవయింది కాబట్టి ఆవిడ కోపంతో మాట్లాడింది అనుకోవచ్చు. ఆవిడా, ఆవిడ తో గొడవ పడ్డ దుకాణాదారులు అందరు దాదాపు ఒకే వర్గానికి చెందిన వారు, బహుశా ఒకే కులానికి చెందిన వారయి వుంటారు.  అయినా సరే, ‘తుర్కోల్లు-మనోళ్ళు; రజాకార్లు-తెలుగోళ్ళు’ అన్నతేడా, చదువు రాని కూరలమ్మే ఆమెకి నాలుక మీదే వుందంటే..అది నిజంగానే కుటుంబం, కమ్యూనిటి జ్ఞాపకాలనించి వచ్చిందనుకోవాలా? లేదా ఆవిడ రోజువారి జీవితాన్నించి వచ్చిందనుకోవాలా? గత పదేళ్లుగా రజాకార్ల గురించిన ‘జ్ఞాపకాల’ ను తిరగ తోడిన తెలంగాణా ఉద్యమ చరిత్ర దీనికెంత తోడ్పడింది? తెలంగాణాలో మారుతున్న రాజకీయ సమీకరణల్లో కొత్తగా అధికారంలోకి ప్రవేశిస్తున్న కులాలలో వస్తున్నసాధికారత ఎంత మేరకు తోడ్పడుతోంది?

 

వీటిల్లో ఏ కారణాలు మనకు 2007లో ‘రజాకారు’ నవల రావటాన్ని, 2010లో కూరలమ్మే బి.సి మహిళ తన తోటి ముస్లింలను, ‘రజాకార్ల’ వారసులుగా భావించటాన్ని ఎలా  అర్ధం చేసుకుంటాం?

 – అచ్యుత సునీత

 

వీలునామా-12 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సంభాషణ

ఫ్రాన్సిస్ పార్టీకి వెళ్ళే ముందే జేన్ ని కలవాలని ఆశపడ్డాడు. కానీ, అతను పెగ్గీ ఇల్లు చేరేటప్పటికి అక్కా చెల్లెళ్ళు బయటికెళ్ళారని తెలిసింది. దాంతో నిరాశగా రెన్నీ గారిల్లు చేరుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత జేన్, ఎల్సీ ఇద్దరూ విందుకు హాజరయ్యారు.

అతనికి వాళ్ళిద్దర్నీ చూడగానే చాలా సంతోషం వేసింది. నిజానికి వాళ్ళిద్దరూ పెద్ద అందగత్తెలు కాదు. ఇద్దర్లో కాస్త ఎల్సీ పర్వాలేదనిపిస్తుంది. జేన్ చాలా సాధారణంగా వుంటుంది. ఈ మధ్య తగిలిన ఎదురు దెబ్బలతో ఎల్సీ మొహం కొంచెం పెద్దరికాన్ని సంతరించుకుని బాగుంది. కానీ, ఫ్రాన్సిస్ కి జేన్ వంకే చూడాలనిపిస్తుంది. ఆమె మొహంలో అలసట నిరాశ చూసి అతనికి ఏదో తెలియని బాధ అనిపించింది. కనిపించగానే ఆమె చేతులు పట్టుకుని, అక్కడ మాట్లాడుకుందాం పద, అంటూ ఒక పక్కకి తీసికెళ్ళాడు. ఎల్సీ కూడా వాళ్ళని ఒంటరిగా వదిలేసింది.

రెన్నీ గారి అమ్మాయి వచ్చి ఎల్సీని ఎవరికో పరిచయం చేస్తానని తీసికెళ్ళింది. మామూలుగా వుండే జెన్నీ కంటే కొంచెం చూపులకి నదురుగా వుండే ఎల్సీ కి స్నేహితులని చూపెట్టడం కష్టం కాదు, అనుకున్నారు రెన్నీ కుటుంబ సభ్యులు.

“తరచుగా ఉత్తరాలు రాసుకుంటూనే వున్నాం. ఇంకా కబుర్లేం వుంటాయి ఫ్రాన్సిస్?” చిరునవ్వుతో అంది జేన్.

“ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా, కలుసుకునేటప్పుడు మాట్లాడుకోవడానికి బోలెడంత వుంటుంది. అసలు నీ వుత్తరం చూసినప్పుడల్లా నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి చెప్పు, నీ ఉద్యోగప్రయత్నాలెలా వున్నాయి?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఏమీ లేదు ఫ్రాన్సిస్. ఎల్సీకి ఆ మధ్య వచ్చిన ఉత్తరం చూసి కృంగి పోయింది. ఆ వుత్తరం మరీ మొరటుగా రాసారులే. పాపం దాన్ని చూస్తే జాలేసింది. ఇహ ఆ తర్వాత మొత్తానికే రాయడం మానేసింది.”

“మరి నీ సంగతి?”

“ఏముంది? ఏమీ లేదు. ఎవరైనా ప్రైవేటు చెప్పించుకుంటే బాగుండని ప్రయత్నించాను. అదీ దొరకలేదు. ఇహ బట్టల కొట్లో కుట్టు పని తప్ప ఇంకేదీ దొరికేటట్టు లేదు. ”

“అయ్యో! నీకెలా సాయపడాలో నాకర్థం కూడా కావడం లేదు.”

“అదేం లేదు ఫ్రాన్సిస్. నిజానికి నేనంత బాధల్లో ఏమీ లేను తెలుసా? నిజమే, భవిష్యత్తు తలచుకుంటే భయంగానే వుంది. కానీ, మరీ అంత నిరాశగా కూడా లేను. పెగ్గీ చాలా మంచిది. నన్ను చాలా విధాలా ఆదుకుంటూంది. అన్నిటికంటే నన్ను అభిమానంగా, గౌరవంగా చూస్తుంది. ఇహ పిల్లలయితే చెప్పనే అక్కర్లేదు. అందరికంటే తెలివైన వాడు టాం. చూస్తూ వుండు, వాడు ఎంత పెద్దవుతాడో. ఆడవాళ్ళకిమాకు పైకెదగడానికి అవకాశం వుండదు కాబట్టి,  పైకెదగాలన్న ఆశయం వున్న వాళ్ళని చూస్తే ఎక్కళ్ళేని సంతోషమూ! నాకెటూ అన్నదమ్ములో, భర్త గారో, కొడుకులో లేరు కదా! అందుకే నేను టాం లౌరీ భవిష్యత్తు గురించీ, నీ భవిష్యత్తు గురించీ కలలు కంటూ ఉంటాను.  నా మొహం చూసి నా కష్టాలు ఊహించుకోకు. సాయంత్రం పూట టాం, నాన్సీ లకి పాఠాలు చెప్పేటప్పుడు నన్ను చూడు! అప్పుడు అర్థమవుతుంది నేనెలాగున్నానో. ఇక్కడికొచ్చేసరికి నా పాత జీవితం అంతా ఙ్ఞప్తికొచ్చింది. అంతే!”

“నీ మాటలతో నా మనసు తేలికైంది జేన్. కానీ…”

“ప్రతీ సంఘటనలోనూ మంచీ చెడూ వుంటాయి ఫ్రాన్సిస్. ఈ సంగతి నేను అనుభవం మీద తెలుసుకున్నాను. కొంతమంది అన్ని సుఖాలూ, సౌకర్యాలూ వున్నా,  ఇంకా దేనికోసమో ఏడుస్తున్నట్టుంటారు. ఇంకొంతమంది దుర్భరమైన జీవితం లో కూడా అన్నీ వున్నట్టు ధీమాగా వుంటారు. దేన్నైనా మనం చూసే దృష్టిని బట్టి వుంటుంది. ఆ మధ్య నేనో పేదరాలిని చూసాను. ఆవిడకి లేని కష్టం లేదంటే నమ్ము!  అష్టకష్టాలూ పెట్టే భర్తా, స్వార్థపరులైన పిల్లలూ, పేదరికమూ, అనారోగ్యమూ! ఆమె సంతానంలో ఒక్క కొడుకు మాత్రం మూడు నెలలకోసారి వచ్చి కొంచెం డబ్బిచ్చి వెళ్తాడు. ఆవిడని చూస్తే, ఏ నమ్మకంతో ఆవిడ బ్రతుకీడుస్తుందా అని మనకే అనుమానం వేస్తుంది. కానీ ఆవిడ నవ్వు మొహం చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాన్లో ఒక్క మాట కూడా నమ్మలేవు నువ్వు! ఆవిడని చూసింతర్వాత నన్ను చూసుకుంటే నాకే సిగ్గేసింది. ఇంకా నాకు, ఆరోగ్యమూ, చదువూ, చిన్న వయసూ వున్నాయి. నేనింత నిరాశతో దిగజారిపోవడం ఏమిటి అనిపించింది. అది సరే కానీ, నువ్వు ఫ్రాన్స్, ఇంగ్లండు అంతా చుట్టి రావాలానుకున్నావు. చూసొచ్చావా? ప్రయాణం విశేషాలేమిటి?” కుతూహలంగా అడిగింది జేన్.

“ప్రయాణం బాగా జరిగింది. కొంచెం ఫ్రెంచి మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. అన్నట్టు, మనం ఎస్టేట్లో ఒక ఉత్తరం చదివాం చూడు, ఫ్రెంచి మహిళ, మార్గరెట్! గుర్తుందా? ఆవిడ కూతురు క్లెమెన్స్ ని కలిసాను. ఇప్పుడావిడ శ్రీమతి లీనాయ్.”

“అవునా? ఏలా వుందావిడ?”

“చూడడానికి మామూలుగా వుంది కానీ, మాట్లాడితే భలే బాగుంది. సుతి మెత్తని యాసా, నాజూకూ, డబ్బున్న స్త్రీల హుందాతనమూ! నేనొక్కటి చెప్పనా? మన ఇంగ్లీషు యువతులంత అందంగా వుండరు ఫ్రెంచి అమ్మాయిలు. కానీ, వాళ్ళ సంభాషణా చాతుర్యంతో నెగ్గుకొస్తారు ఎక్కడైనా.”

“ఆవిడని ఎలా కలిసావు?”

“ఫ్రెంచి సొసైటీలో జొరబడడం ఇక్కడికంటే తేలిక. ఒక ఫ్రెంచి హోటల్లో ఒకాయన కనిపించాడు. నాన్నగారికి పాత స్నేహితుడట. నా పేరు చూసి నాన్న గారిని గురించి అడిగాడు. ఆ తర్వాత అతనితో ప్రతీ విందుకీ తీసికెళ్ళాడు. అసలు నాకు మనుషులతో మాట్లాడడమంటేనే సిగ్గూ, మొహమాటం. అలవాటు కూడ లేదాయె. సరే, మొత్తం మీద ఎలాగో నెట్టుకొచ్చాను. ”

“కొత్త వాళ్ళముందు అంత సిగ్గు పడడానికేముంది ఫ్రాన్సిస్? అయినా నీకు బాంకు లో ఎంతో మంది స్నేహితులుండాలిగా?”

“అవుననుకో! కానీ, ఆడవాళ్ళతో మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందే. అందులోనూ, జేన్, ఇల్లూ వాకిలీ, కుటుంబమూ, అమ్మా నాన్నా లేని నాలాటి అనాథకి ఇతర్లతో స్నేహంగా మాట్లాడే అలవాటు ఎలా వుంటుంది చెప్పు? వింత ఏమిటో తెలుసా? అందరూ ఇప్పుడు నా తండ్రెవరో నాకు తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చాలా సంతోషంగా దర్జాగా వున్నాననుకుంటారు. కానీ నాకెందుకో ఇంకా సిగ్గుగా మొహమాటంగానే అనిపిస్తుంది.”

“నేనూ నువ్వు సంతోషించి వుంటావనే అనుకున్నా మరి!”

“నన్ను కన్న తల్లీ తండ్రులు ఒకర్నొకరు ప్రేమించుకోలేదు. మోసం చేసుకున్నారు. నన్ను కన్న తల్లికి నా మీద ప్రేమ లేదు. నా తండ్రికి నా పట్ల బాధ్యత తప్ప మరేమీ లేదు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు లేకపోగా అలవిమాలిన అసహ్యం. నా పరిస్థితి నీకర్థం కాదు. నా వునికే నాకు చాలా అవమానకరంగా తోస్తుంది. ”

“అమ్మా నాన్నల మధ్య వుండే ప్రేమలతోటే మన ఆత్మ గౌరవాలు ముడి పడి వున్నట్టయితే, నా పరిస్థితీ అంతే మరి. మేము పుట్టిన కొన్నేళ్ళకే అమ్మ మనసులో నాన్న పట్ల ప్రేమ చచ్చిపోయింది. ఆయనకైతే స్వార్థం తప్ప ఆమె మీద ప్రేమ ఎన్నడూ లేదు. అందుకే అలాటి ఆలోచనలు మానేద్దాం. అమ్మా నాన్నల మాటెలా వున్నా మనం దేవుని బిడ్డలం. ఆయన ప్రేమ అందరికీ అందుతుంది కాబట్టి దాంతో తృప్తి పడదాం. ఇంతకీ క్లెమెన్స్ తల్లి గురించి నీతో మాట్లాడిందా?”

“మాట్లాడింది. తన తల్లికి నా పేరే వున్న స్నేహితుడు వుండేవాడనీ, ఆ స్నేహితుడు మా నాన్నేననీ తెలిసి చాలా సంతోషించింది. తల్లి చిత్తరువు కూడ చూపించింది.”

“అయితే ఫ్రాన్సులో చాలా సరదాగా గడిచిందన్నమాట.”

“అవును! అందులో ఫ్రెంచి వాళ్ళ మాటలు, అబ్బో! ఏం చెప్పమంటావు. హాస్యమూ, చమత్కారమూ నిండి వుంటాయి. పెద్దగా వాదించుకోరు కానీ, అభిప్రాయాలు బానే ఇచ్చి పుచ్చుకుంటారు. వాళ్ళకి రాజకీయ స్వాతంత్ర్యం లెదని మనమేదో జాలి పడతాం కానీ, నాకైతే వాళ్ళకి భావ స్వాతంత్ర్యం చాలా వుందనిపించింది. అక్కడ చిన్న రైతులు వుంటారు. మన దగ్గరేమో చిన్న రైతులన్నవాళ్ళే కనబడరు. అంతా మోతుబర్లు, మిగతా వాళ్ళు రైతు కూలీలు. ఈ రైతు కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా వుంటుందో తెలుసా? మన దగ్గర కూడా రైతు కూలీలకి చిన్న చిన్న పొలాలిస్తే వ్యవసాయం బాగు పడొచ్చేమో!”

“అదేమిటి ఫ్రాన్సిస్? చిన్న చిన్న పొలాలౌ ఆర్థికంగా మంచి కాదంటారు కదా? మరీ మన బ్రిటన్ లాటి కిక్కిరిసిన దేశంలో పెద్ద పొలాలు సాగు చేయడంలోనే లాభముందేమో! అప్పుడు డబ్బూ, యంత్రాలూ, మానవ వనరులూ ఎక్కువ అవసరం వుండదు కదా?”

“అవును. ఇక్కడంతా అలాగే అనుకుంటాం. ఫ్రాన్సు లో వేరేలా ఆలోచిస్తారు. ఒక భూస్వామి దగ్గర వంద ఎకరాలున్నాయనుకో. దాన్ని యాభై మంది రైతుకూలీలు సాగు చేస్తున్నారనుకో. ఆ పొలానికి తాము స్వంతదార్లం కాదన్న నిరాసక్తత వుంటుంది వాళ్ళలో. అదే వాళ్ళకి తాము తలా రెండెకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పామనుకో. అదే భూమిలో కష్టపడి బంగారం పండిస్తారు. అందుకే అన్నారు-‘ ఏడేళ్ళు పొలానికి కౌలుకిస్తే, తోటలాటి భూమి కూడా బీడు పడిపోతుంది. అదే మనిషికి సొంతానికి ఎడారి లాటి భుమినిచ్చినా, ఏడేళ్లలో దాన్ని నందనవనంలా మార్చగలడూ- అని! అదే ఆలోచన అమలులో పెట్టాలనుకుంటున్నాను.”

“ఏమిటది?”

“మన ఎస్టేటులో గుట్ట వెనకాల ఊరికే స్థలం పడి వుంది చూడు, దాన్ని చిన్న చిన్న భాగాలు చేసి పాలేర్లలో కష్టపడే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నా. పదేళ్ళలో వాళ్ళు దాన్లో మంచి పంట పండించగలిగితే, అది వాళ్ళే వుంచేసుకోగలిగే ఒప్పందం మీద. ఆ మాటకొస్తే నీకసలు రెండు ఆలొచనలు చెప్దామనుకున్నా.”

“బాగుంది. రెండో ఆలోచన ఏమిటి? చెప్పు చెప్పు!”

“ముందుగా పొలంలో పని చేసే పాలేర్లందరికీ చిన్న ఇళ్ళు కట్టిద్దామనుకుంటున్నా. ఎప్పుడైనా ఆ పాలేర్ల ఇళ్ళు చుసావా? దుర్భరంగా వుంటాయి. భూస్వాములూ, రైతులూ మంచి ఇళ్ళు కట్టుకుంటారు కానీ, కొంచెం కూడా ఆ పాలేర్ల సంగతి పట్టించుకోరు. అందుకే ఇంకొంచెం శుభ్రంగా వసతిగా వుండే చిన్న ఇళ్ళు ప్లానులు గీయించి పట్టుకొచ్చాను. తర్వాత చూపిస్తాను.”

“పెగ్గీ అభిప్రాయం కనుక్కుందాం. తను అలాటి ఇళ్ళల్లోనే పెరిగింది కాబట్టి తన అభిప్రాయం నమ్మదగ్గదై ఉండొచ్చు.”

“నిజానికి అలా చిన్న ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి పెద్ద డబ్బు కూడా ఖర్చు కాదు తెలుసా? ఆ మధ్య చామర్స్ గారు నన్ను భవంతిని కొంచెం మార్చమనీ, కొన్ని కొత్త గదులు కట్టించమనీ సలహా ఇచ్చారు. అప్పుడనిపించింది, అదే డబ్బుతో ముఫ్ఫై కూలీలకి చిన్న యిళ్ళు కట్టించొచ్చు కదా అని! దీన్లో ఇంకొక ఆలోచన కూడా వుంది. మన స్కాట్ లాండు నుంచి ఎంత మంది అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారో తెలుసా? మరీ ఆస్ట్రేలియాలో బంగారం కొరకు మన దేశం నుంచి కష్టపడగలిగే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఇంకొంత కాలం సాగితే ఇక్కడ పనికొచ్చేవాళ్ళెవరూ మిగలరేమో. అందుకే కనీసం నా పరిధిలోనేను పని వాళ్ళ పరిస్థితులు మెరుగు చేద్దామని ఆలోచిస్తున్నాను. నన్ను చూసి నాలా ఇంకొందరు చేయొచ్చు కదా? నువ్వేమంటావు?”

“నిన్ను చూసి నలుగురు చేసినా చేయకపోయినా, నీ ఆలోచన చాలా గొప్పది ఫ్రాన్సిస్!” మనస్ఫూర్తిగా అంది జేన్.

“సరే! ఎవరెవరికి ఇళ్ళు ఇవ్వదలచానో, ఎవరెవరికి భూమి ఇవ్వదలచానో పట్టిక రాసి వుంచాను. ఒక్కసారి నువ్వు చూసి నీ అభిప్రాయం చెపితే…”

“చాలా మంచి ఆలోచన ఫ్రాన్సిస్! మావయ్య నిన్ను ఆస్తికంతా హక్కుదారుణ్ణి చేసి మంచి పని చేసాడనిపిస్తుంది.”

ఇంకేదో చెప్పబోయిన జేన్, చాలా పరిచితమైన గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది.

విలియం డాల్జెల్ రెన్నీ దంపతులని పలకరించి, కొంచెం ఇబ్బందిగా వున్న మొహం తో ఎల్సీతో మాట్లాడుతున్నాడు.

“రెన్నీ గారికి విలియం ఎలా తెలుసు?” ఫ్రాన్సిస్ ని అడిగింది జేన్.

“రెన్నీ వాళ్ళు అక్కడ ఎస్టేటు చూడడానికి వచ్చినప్పుడు చుట్టు పక్కల అంతా పరిచయం అయ్యారు. ఒక్క క్షణం జేన్! ఇప్పుడే వస్తాను. రెన్నీ గారి అమ్మాయితో ఒక్క డాన్సు చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ వస్తా!”

ఫ్రాన్సిస్ లేచి ఎలీజా దగ్గరకెళ్ళాడు.  ఎలీజా పక్కన విలియం డాల్జెల్ తో పాటు ఇంకొక అతను కూడా వున్నాడు.

“ మీరిద్దరూ నన్ను క్షమించాలి. ఈ డాన్సు నేను ఫ్రాన్సిస్ హొగార్త్ తో చేస్తానని మాటిచ్చాను. కానీ మీ ఇద్దరితో డాన్సు చేయడానికి అందమైన అమ్మాయిలని వెదికే బాధ్యత నాది. సరేనా, ఇక్కడే వుండండి, ఒక్క క్షణం లో వస్తా! ”

అంటూ వెళ్ళింది ఎలీజా. రెండు నిమిషాల్లో లారా విల్సన్ ని అక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితురాలు లారా విల్సన్. బోలెడంత డబ్బూ, కొంచెం చదువూ వున్నవి కానీ, తెలివితేటలు తక్కువ. ఈ పార్టీకి ప్రత్యేకంగా ముస్తాబయి వచ్చింది. ఆమెతో డాన్సు చేయడానికి విలియం వెళ్ళాడు.

“ఫ్రాన్సిస్! మీ కజిన్ ఎలీసా ఈ కొత్త వ్యక్తితో డాన్సు చేస్తుందంటావా? జేన్ అయితే భలే సీరియస్ గా వుంటుంది. ఆమెని అడిగితే ప్రయోజనం వుండదు. ఎలీసాని ఇతనికి పరిచయం చేస్తా..” గుసగుసగా ఫ్రాన్సిస్ తో చెప్పి ఆ కొత్త వ్యక్తి చేయి పట్టుకొని ఎలీసాని వెతుక్కుంటూ బయల్దేరింది ఎలీజా.

ఆస్ట్రేలియానించి కొద్ది రోజుల క్రితమే వచ్చిన బ్రాండన్ కి  ఎల్సీని పరిచయం చేసింది ఎలీజా రెన్నీ.

(సశేషం)

దృష్టిలోపంతో దారితప్పిన కథలు

beyond kaafee

ఖదీర్‌ వాక్యం డ్రైవింగ్‌ తెలిసినవాడు పద్దతిగా వాహనం నడుపుతున్నట్టు ఉంటుంది అంటాడు పూడూరి రాజిరెడ్డి. గేర్‌ ఎక్కడ మార్చాలో ఖదీర్‌కు బాగా తెలుసు. ఇపుడు బియాండ్‌ కాఫీతో అతను చేసిందదే. ఇంతకుముందే కింద నేల ఉందితో అతను హైజంప్‌ చేశాడు. ఇపుడు ఏకంగా పోల్‌వాల్ట్‌. అందులో ఎంత సఫలీకృతుడయ్యాడనేది తర్వాత చూద్దాం. పాతను వదిలేసుకుని కొత్త ముఖమైతే తొడుక్కున్నాడు. బహుశా దర్గామిట్ట నాటి పాత అభిమానులకు కూడా వదిలేసుకునేందుకు సిద్ధపడ్డాడని అర్థమవుతోంది. రచయితతో పాటు ప్రయాణం చేసే వారి కథ వేరే.
దర్గామిట్ట కథలను చాలామంది ప్రేమించారు. బహుశా నామినిని మించి ప్రేమించారేమో కూడా. ఆ కథల్లోనూ ఆ ప్రేమలోనూ చిన్న ఇబ్బంది ఉంది. పచ్చనాకు సాక్షిగా అయినా, సినబ్బ కథలైనా, మిట్టూరోడి కథలైనా నామిని కథల్లో పెయిన్‌ ఉంటుంది. పైకి తమాస మాటల్లాగే కనిపిస్తాయి. లోపలికి పోయే కొద్దీ అంతులేని దుఖ్ఖం పొంగుకొస్తుంది.  ” మా కన్నెబావ రామభక్తి” గుర్తొచ్చినా, “నా రెక్కలున్నంత కాలం” గుర్తొచ్చినా ఇప్పటికీ లోలోపల మెలిపెడుతుంది.  అవి నీడ కరవైన వారి ఏడుపు పాటలు. నామినిలో ఉన్న సొగసు చాలావరకు ఖదీర్‌ కథల్లో ఉంటుంది కానీ ఈ పెయిన్‌ తక్కువ.  పేదరికాన్ని సెలబ్రేట్‌ చేసినట్టుంటాయి దర్గామిట్ట కథలు. తమకు తెలీని జీవితాన్ని  కులీనులు నోరెళ్లబెట్టి చూసి అరె, భలే రాశాడే అనిపించేట్టు ఉంటాయి. హైదరాబాద్‌లో శిల్పారామం పోయి అక్కడ గుడిసెలు, రోకళ్లు, రోళ్లు, ఎద్దుల బండ్లు చూసి ముచ్చడపడతారే, అలా! కందిపచ్చడి, గుమ్మడిపులుసుతో పాటు ఆ కథలను కూడా ఇష్టపడడంలో ఇబ్బంది ఉండదు.  ఆ జీవితంతో సంబంధంలేని కులీనులకు, దాటి వచ్చిన దారిద్ర్యాన్ని మురిపెంగా మాత్రమే గుర్తుచేసుకునేవారికి ఆ కథలు మంచి వినోదాన్ని కలిగించగలవు. మనల్ని ప్రశ్నించని ఇబ్బంది పెట్టని వినోదం అలాంటివారికి బాగానే ఉంటుంది. నామినిని ఖదీర్‌ను విభజించే ప్రధానమైన రేఖ ఇదే. పాపులర్‌ ఫేమస్‌ రెండూ ఒకేలా కనిపించినంత మాత్రాన తేడా లేదనగలమా!
అయితే దర్గామిట్ట నుంచి చాలా ప్రయాణమే చేశాడు ఖదీర్‌. పెండెం సోడా సెంటర్‌ లాంటి ప్రాపగాండా కథలను దాటుకుని చాలాకాలం క్రితమే కిందనేల ఉంది అని భూమార్గం పట్టాడు. ఈ ప్రయాణం పొడవునా జీవితంలోనూ అధ్యయనంలోనూ కొత్త ఎక్స్‌పోజర్‌ చాలానే వచ్చి ఉండాలి. అదంతా ఇపుడు బియాండ్‌ కాఫీ రూపంలో మన ముందుకొచ్చింది. ఏ లాట్‌ కెన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ కాఫీ అంటుంది కాఫీడే. నువ్వు తీసుకునే పదార్థం కంటే దాని చుట్టూ ఉన్న వాతావరణం ఇతరత్రా నీకు ‘ఉపయోగపడే’ పద్ధతుల గురించి చెపుతుందా స్లోగన్‌. దటీజ్‌ బియాండ్ కాఫీ. మీరు హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దాటాక పైన సింపుల్‌గా కనిపించి లోపల అడుగుపెడితే విస్తుపోయే ప్రపంచాన్ని చూపించే బియాండ్‌ కాఫీ షాప్‌ ఎలాంటిదో ఈ కథలూ అలాంటివే. ఇది మనబోటి వాళ్లకు పరిచయంలేని ప్రపంచం అని రాస్తే ఆత్మవంచన అవుతుంది. ముఖ్యంగా మనం పట్టణజీవులమైతే! మనం చూడదల్చుకోకుండా మొకం తిప్పేసుకుని పోతే తప్ప ఈ జీవితం పట్టణవాసులకు తెలీకుండా పోయే అవకాశం లేదు. మానవజీవితంలో సెక్స్‌ లేమి లేదా దాని యావ సృష్టించగల విలయాన్ని ప్రధానంగా తీసుకుని రాసిన కథలు అనిపిస్తుంది. అందులోనూ స్ర్తీ కేంద్రకంగా రాసిన కథలు. బహుశా కొంతమంది అర్బన్‌ మహిళల వల్నర్‌బిలిటీని కూడా చిత్రించిన కథలు. డబ్బూదస్కానికి లోటు లేని వారి జీవితాల్లో ఇతరత్రా ఉండే సంక్షోభాలు.  “అన్నీ ఉండడం కూడా శిక్షేనే” అనుకునే వారి జీవితాలు. ఏది రాసినా దానికి సంబంధించిన ఆవరణాన్ని, భాషను పట్టుకోవడంలో ఖదీర్‌ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అంతేకాదు. అక్షరాలను దృశ్యాలుగా మార్చగలిగిన శక్తి గలిగిన కొద్దిమంది రచయితల్లో ఖదీర్‌ ఒకడు.
“తీరుబడికి స్ర్తీత్వం తోడైతే ఆ శాపం రెట్టింపై అది ఆ పాత్రనే కాకుండా ఇతరులను కూడా ఎలా పీడిస్తుందో ఖదీర్‌బాబు పసికట్టాడు” అని ముందుమాటలో అంచనావేశారు అన్నపనేని గాంధీగారు. మూలుగుతున్న కోట్లరూపాయలు కొడుకు మగతనాన్ని దొంగిలిస్తే డ్రైవర్‌నో మరొకర్నో ‘తగులుకుని’ ఎవర్నీ పూచికపుల్ల చేయకుండా చులకనగా చూసే కోడలి ‘పొగరు’ను మంత్రతంత్రాలతో అణచివేయాలని చూసే తల్లి తాపత్రయం, భర్త తాగుడుకు బానిసై తనను పట్టించుకోకపోవడమే కాకుండా పదే పదే చికాకులు తెస్తూ ఉంటే ఆ ఫ్రస్ర్టేషన్‌ని మోసుకుంటూ తిరిగే ఒక ఇల్లాలి వేదన, భర్త ఆఫీసుకు అంకితమైపోగా  చిన్నపుడు ప్రతి చిన్నదానికి తనమీదే ఆధారపడే పిల్లలు ఇపుడు నీకేం తెలీదు పోమ్మా అని దులిపేసుకుని పోతుంటే  లోలోపల రగిలి రగిలి వాళ్లనూ వీళ్లనూ ఫోన్‌లో వేపుకు తినే ఇల్లాలు…ఇదిగో ఇలాంటి వారి కథలివి. కోడలు అలా చేయడంలో తప్పేముంది, ఆమెనెందుకు విలన్‌ చేయాలి అనే ప్లేన్‌లోకి వెళ్లి పొలిటికల్లీ కరెక్ట్‌నెస్‌ కొలబద్దతో వీటిని చర్చించకుండా కేవలం రచయిత చెప్పదల్చుకున్న కోణానికే పరిమితమవుదాము.
తొలి మూడు కథలు కథలే. అందులోనూ టాక్‌ టైమ్‌ మంచి కథ. ఆ తర్వాత అవి ఎటోటో వెళ్లిపోయాయి. ‘మచ్చ’ మంచిదే కానీ చివర్లో రచయిత అలవోకగా  విసిరేసిన ఒక వాక్యం కథను దెబ్బతీసింది. భర్త నిర్లక్ష్యానికి తోడు తీరుబడి ఎక్కువైన మహిళ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరో పొరబాటున తగిలినా రచ్చరచ్చ చేసేస్తుంది. చివర్లో ఆమె ఉద్యోగంలో చేరడంతో కథ సుఖాంతమవుతుంది. అంతకుముందు వచ్చే మచ్చలు ఇపుడు రావు. అంత వరకు బాగా ఉంది. కానీ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరైనా నిజంగానే రాసుకున్నా ఇపుడు ఆమెకేమీ అనిపించడం లేదు అని రచయిత ముక్తాయిస్తాడు. సెన్సిబిల్‌ పాఠకులు గాయపడే ఎక్స్‌ప్రెషన్‌.  ఏకాభిప్రాయం తీసుకుందాం. అది కథ అవుతుందా? రచయిత ఏం చెప్పదల్చుకున్నాడు?  వివాహ బంధం బయట కూడా సెక్స్‌ సంబంధాలు నార్మల్‌ అని చెప్పదల్చుకున్నాడా? మగవాడు వల్నర్‌బుల్‌గా ఉండే ఆడవాళ్లని లోబరుచుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు అనేది చెప్పదల్చుకున్నాడా? ఇంకోవైపు కథ కథేనా! పట్టాయ ఉంది. ఏముంది అందులో? ఏఏ వీధిలో ఏఏ రూపాల్లో సెక్స్‌ దొరుకుతుంది అని చెప్పాడు. ఆ కథ చదివిన తర్వాత మనకందేదేమిటి?  “పోయే బోడిముండా అన్నాడు నాయుడు ముద్దుముద్దుగా, తాంకూ తాంకూ అంటూ నవ్విందది” అనే వాక్యాలతో మొదలవుతుంది కధ. నవ్విందది అని రచయిత స్వరంతోనే ఆబ్జెక్టిఫై చేశాక ఇక పాఠకుడు ఏ ఫీల్‌తో కథను కొనసాగిస్తాడు? రచయిత స్వరం మాత్రం రచయితదేనా అని సిద్ధాంతాలను లాగొచ్చు కానీ అవి ఈ కథకు అతకవని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. కథంతా ఆ బండది, ఈ షార్ట్‌స్కర్ట్‌ది అని శరీరాలను ఆబ్జెక్టిఫై చేస్తూ ఒక చీకటి మూడ్‌ని క్రియేట్‌ చేసి మధ్యలో సడన్‌గా “వీళ్లు కూడా అందరు ఆడపిల్లల్లా పుట్టినవాళ్లే ….మన అమ్మల్లాగా అక్కల్లాగా చెల్లెళ్లలాగా ఈ ప్రపంచం నుంచి వేరే ఏమీ ఆశించకపోయినా కాసింత మంచిని ఆశించినవాళ్లే” అని ధర్మోపన్యాసం ఇచ్చినంత మాత్రాన పాఠకుడిలో ఉదాత్తభావం వచ్చేయదు. ఖదీర్‌లో స్కీమింగ్‌ ఎక్కువ. అన్ని సందర్భాల్లో అది ఫలితాలనిస్తుందని ఆశించకూడదు. మధ్యలో అక్కడక్కడా ఒకట్రెండు మానవీయ దినుసులు వేశానులే అని సంతృప్తిపడితే కుదరదు. పదార్థ స్వరూపం మారదు. రచయిత హృదయం ఎక్కడ ఉందో తెలియాలి. ఎక్కడ కోపం రావాలో అక్కడ రావాలి. ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలి. అవి మిస్‌ప్లేస్‌ అయితే కథ దెబ్బతింటుంది. ఇక్కడదే జరిగింది.
పుస్తకానికి టైటిల్‌ బియాండ్ కాఫీ కథ తీసుకుందాం. ప్రతి మగనాబట్ట ఛాతీ మీద పచ్చబొట్టు పొడవాల్సిన నీతి కథ చెప్పిన మరికాసేపటికే ఆ పొందికలోకి ఇమడని డీటైల్స్‌ ఎక్కువైపోయి, చివర్లో క్రైం థ్రిల్లర్‌ అయిపోయి కథ ఎటో పోయింది. తాను కొత్తగా తెలుసుకున్న విషయాలు ఎక్కువగా చెప్పాలన్న  ఆత్రం ఈ కథను దెబ్బతీసిందేమో అనిపిస్తుంది. ఇక  చిన్నపుట్టుమచ్చ లాంటి బొట్టు ఉన్న అమ్మాయి కథ చూద్దాం. కథ నుంచి మనకు అందుతున్నదేమిటి? టీ బండి నడుపుకునే  చిన్న అమ్మాయి ఇలాంటి వ్యవహారాల్లో రాటుతేలి ఉంటుందని ఊహించలేదనే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది. అంతే! వాళ్లు అలా రాటుతేలడానికి కారణమైన పాత్రపై సానుభూతి వచ్చేలా కథ నడిపించాక, పన్నెండేళ్ల పాపని అబ్యూజ్‌ చేసిన మనిషి మీద సానుభూతి కలిగేలా కథ నడిపించాక ఇక ఎలాంటి స్పందన ఆశిస్తాం. ఇలాంటి అంశాలు కథాంశంగా తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు. చెప్పొచ్చు. కానీ పద్ధతి ఏమిటనేది ప్రశ్న. ఖదీర్‌ పుట్టమచ్చ లాంటి బొట్టున్న అమ్మాయి లాగే నామిని మెడకింద గీతలున్న అమ్మాయి గురించి రాస్తారు. గొడ్లకాసుకునే అమ్మాయి గురించి రాస్తారు. ఊర్లో బొడ్డుతెగిన ప్రతి మగోడు ఆ అమ్మాయి మీద పడడం గురించి రాస్తారు. కానీ చదివాక మనలో కలిగే స్పందన వేరే. ఆ పాప బాధ పాఠకుడి బాధగా మారుతుంది.
మన దగ్గర చాలామంది రచయితలు ఏం చెప్పదల్చుకున్నారన్నదానిమీద పెట్టినంత దృష్టి దానికి సాహిత్య రూపం ఇవ్వడం మీద పెట్టరు. ఖదీర్‌ కథ వేరు. ఎలా చెప్పాలన్నదానిమీద అతను విపరీతమైన శ్రద్ధ పెడతాడు. కానీ ఏం చెప్పదల్చుకున్నామనేదానిమీద అంత శ్రధ్ధ ఉన్నదా అనేది సందేహం. కొంచెం బరువైన భాషలో చెప్పుకుంటే దృక్పథాన్ని  సరిచూసుకోవాల్సి ఉన్నదేమో అనిపిస్తుంది.
లైంగిక వాంఛకు సంబంధించిన వివిధ సందర్భాలను వివరించడంలో  నైపుణ్యాన్ని చూపాడు. ఒక కథలో “పురుషుడు స్ర్తీని పట్టుకున్నట్టు అని రాసి ఆ తర్వాత వాళ్లు ఇంటినుంచి బయటపడడానికి మరికొంత సమయం పట్టింది” అంటాడు. ఇంకో కథలో ఆమె కాళ్లు పట్టేది అంటాడు. అతను  నిద్రపోకుండానే మెళకువగానే ఉండి వెళ్లేవాడు, ఇపుడు అదేమీ లేదు” అని చెప్తాడు.  “కాసేపు రెస్ట్‌ తీసుకుని వెళ్దామా మేడమ్‌” అని గడుసుగా చెప్పిస్తాడు. వహీద్‌ అనే కథలో  ఆపా అని అంటూనే “చప్టామీద చేపలు పడేసి, ఊగిఊగి తోముతూ ఉండే ఎగిరిపడే అంచును గుర్తుచేసుకునే చిన్నోడి స్థితిని వర్ణిస్తాడు. ఇలా ప్రతికథలోనూ వొడుపు చూపుతాడు.  ఇటువంటి  కథాంశాలని ఎంచుకోవడం కచ్చితంగా అభినందించాల్సిన విషయం. మానవజీవితంలో చాలాప్రాధాన్యమున్న ఈ విషయాన్ని, మన శారీరక మేధో వికాసాలమీద, మన వ్యక్తిత్వంమీద చాలా రకాలుగా ప్రభావం చూపే ఈ విషయాన్ని అసుంట ఉంచడం సరైంది కాదు. కాకపోతే ఎలా చర్చిస్తున్నామనేదే ప్రశ్న.
తనకు అలవాటైన స్ర్తీ ఎంత ప్రేరేపించినా ఒక సర్దార్జీకి ఒంట్లో వేడిపుట్టకపోవడాన్ని  నేపథ్యంగా తీసుకుని మంటో రాశాడు. దాని పేరు థండా ఘోష్‌. అది చదివితే చల్లగా ఒణికిపోతాం. ఖోల్‌దో అయినా ఇంకోటయినా ఆయన కథలన్నింటా లైంగిక అంశాలే. కానీ అన్నీ మనిషి జంతువుగా మారే క్రమాన్ని బీభత్సంగా చిత్రిస్తాయి. ఎలాంటి స్థితిలో అయినా మనిషితనాన్ని నిలుపుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. ఫెలిని, గొడార్డ్‌ సినిమాల్లోనూ నగ్నదేహాలు కనిపిస్తాయి. కిస్లోవిస్కీ త్రీకలర్స్‌ ట్రయాలజీలో అయితే చెప్పడానికి లేదు. క్యూబా సినిమాల్లోనూ అంతే. కానీ అంతిమంగా అవి మనలో కలిగించే స్పందన వేరే.  ఖదీర్‌ తొలి మూడు కథలను మినహాయిస్తే  మిగిలిన కథలు అలాంటి చైతన్యాన్ని మనలో కలిగించడం లేదు. సున్నితమైన అంశాలను కథలుగా మలిచేపుడు ఎక్కువ జాగ్రత్త అవసరం. ఒడుపు తెలుసుకదా అని తొందరపడితే నోరు కాలుతుంది, చేయి కాలుతుంది. మొదటి కథల్లో మనకు బాధితులెవరో తెలుస్తుంది. వారిపట్ల ఎంతో కొంత ఆర్తి కలుగుతుంది. తాగుబోతు భర్త పట్టించుకోక ఏ ముచ్చటా తీరక విసుగ్గా ఉన్న మహిళ యాక్సిడెంటల్‌గా కలిసిన, తనపై ఆసక్తి కనపరిచిన కుర్రాడితో సెక్స్‌ తర్వాత స్థిమితపడే స్థితిని అర్థం చేసుకోగలము. ఆ మహిళ ఎర్రేటిక్‌ బిహేవియర్‌ని కూడా అర్థం చేసుకోగలం. చివరకు రచయితలకు ఫోన్లు చేసి భయంకరంగా వేధించే స్ర్తీ పైన కూడా కోపం రాదు.  ఆ తర్వాతి కథల్లోనే బ్యాలెన్స్‌ కుదరలేదు. అందులో చర్చించినవి కూడా అవాస్తవాలేం కాదు. కొంతమంది స్ర్తీలకు సంబంధించినవే అయినా అవి వాస్తవాలే. ‘మైనారిటీ’ కథలు రాయకూడదని రూలేం లేదు.  భర్త వేళ్లు కోసేసిన భార్య సంగతి పక్కనబెడితే చాలావరకు ఇందులో ఉన్న పాత్రలన్నీ నిజమైనవే. మనకు కనిపించేవే. కాకపోతే ఊరకే సంచలన వాస్తవాలను వెల్లడించడం దానికదే కథ కాదు కదా! ఆ వాస్తవాలకు సాహిత్య రూపమిచ్చేదేదో ఉంటుంది కదా! అది ఆ కథల్లో లోపించింది. కొన్ని కథల్లో వక్రీకరించింది కూడా. ఇంకో విషయం కూడా చెప్పక తప్పదు.  కొద్దిమందికే పరిమితమైన కథలు రాయడం వరకూ ఇబ్బంది లేకపోయినా సమాజంలో  ఒక సమూహం గురించి ఇంకో సమూహంలో ప్రచారంలో ఉండే స్టీరియోటైప్స్‌ని యథాతథంగా సమర్థిస్తున్నామేమో అనేది కూడా రచయిత ఆలోచించుకోవాలి.
ముందు మాట రాసిన ఇద్దరూ పెద్దమనసుతో రచయితను సానుభూతిగా చూసి ఆశీర్వదించారేమో అనిపిస్తుంది. ముక్తవరం పార్థసారధిగారు “సింగింగ్‌ ఇన్‌ ది పెయిన్‌” అన్నారు. కానీ రచయితతో ఉన్న అనుబంధం వల్ల అతను ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించి ఉంటాడు అని అర్థం చేసుకుని పని గట్టుకుని మళ్లీ మళ్లీ అతని కళ్లలోంచి చదివితే తప్ప అందులో నొప్పి ఉందని అనిపించడం లేదు. కథ దానికదిగా అలాంటి స్పందన కలిగించడం లేదు. తొలి మూడు కథలు మినహాయింపు.
“లోకంలో ఎవరు దేనిమీదైనా కథ రాయొచ్చు. కానీ ఎంత మేరకు సాహిత్యం చేశారనేది మీరు శ్రద్ధగా గమనిస్తారు” అని తనమాటగా ఖదీర్‌ రాశాడు. దీన్నే కొంచెం మార్చి చెప్పుకోవచ్చు. వొడుపు తెలిస్తే లోకంలో ఎవరు దేన్నైనా సాహిత్యం చేయొచ్చు. కానీ మంచి సాహిత్యం చేయడానికి ఒడుపుతో పాటు మరికొన్ని తెలియాలేమో!

జి ఎస్‌ రామ్మోహన్‌

ప్రపంచాన్ని చదివించిన ఆమె..!

Malathi-candoor-Banner

చాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న!

వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు వేసుకుంటూ వస్తారు?

 చెప్పడం కష్టమే!

కాని, మన చదువు అనుభవాలను నెమరేసుకుంటూ ఓ పది నిమిషాలు సాలోచనగా కూర్చున్నప్పుడు వొక్కో రచయితా వొక్కో రచనా వొక్కో మజిలీలా కనిపిస్తాయి. కొన్ని మజిలీలు మనల్ని విస్మయంలో పడేస్తే, ఇంకా కొన్ని మజిలీలు ప్రశ్నలవుతాయి. ఇంకా కొన్ని జవాబులవుతాయి. మాలతి చందూర్ ఏదీ కాదు! అసలు ఆమె రచనలు నేనెప్పుడూ సీరియస్ గా చదవలేదు. ఆమెని నేను సీరియస్ రచయిత్రిగా ఎప్పుడయినా తీసుకున్నానో లేదో తెలీదు. దానికి బలమయిన కారణం వొక్కటే: అసలు సాహిత్యాన్ని వొక సీరియస్ వ్యాపకంగా తీసుకోని కాలం నించీ నేను ఆమె రచనలు చదువుతూ ఉండడమే!

కాని, ఆశ్చర్యం ఏమిటంటే, జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె రచనలు ఎదో వొకటి చదువుతూనే వున్నా. వొక రచయితని ఇన్ని దశల్లో ఇన్ని వయసుల్లో చదువుతూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

2

నేను మిడిల్ స్కూల్ లో – అంటే ఆరో తరగతి-  చదువుతున్న రోజుల్లో మా అమ్మ గారు రంగనాయకమ్మగారికి వీరాభిమాని. రంగనాయకమ్మ రచనలన్నీ ఆమె మళ్ళీ మళ్ళీ చదివేది. ‘ఆ పుస్తకంలో ఏముంది రెండో సారి చదవడానికి ?’ అని నేను అడిగినప్పుడల్లా నాకు అర్థమయ్యే భాషలో కథలాంటిది ఎదో చెప్పేది. కాని, వాటి మీద నాకు ఆసక్తి వుండేది కాదు. నాకు నాటికల పిచ్చి వుండడం వల్ల కేవలం నాటికల పుస్తకాలే చదివే వాణ్ని ఆ రోజుల్లో!  అవి చదవడానికి బాగుండేవి. పైగా, ఆ డైలాగులు కొట్టుకుంటూ తిరిగే వాణ్ని.

ఇంకో వేపు మా అమ్మగారు మంచి వంటలు చేసేది కాబట్టి, ఎక్కువ సమయం నేనూ అమ్మా వంట గదిలో గడిపే వాళ్ళం. అలా వంటల మీద ఆసక్తి పెంచుకుంటున్న రోజుల్లో ఉన్నట్టుండి వొక రోజు మా ఇంట్లో-వంట గదిలో-   ‘వంటలు- పిండివంటలు’ పుస్తకం ప్రత్యక్షమయింది. మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా ఆసక్తిగా చదివిన తొలి పుస్తకాల్లో ఇదీ వొకటి అని ఖాయంగా చెప్పగలను. ఈ పుస్తకం ఎంత ఉపయోగంలో పెట్టానంటే, ఏడాది తిరిగే సరికి నూనె, కూరలూ, పసుపు మరకలతో ఈ పుస్తకం ఇక చదవడానికి వీల్లేకుండా పోయింది. నాన్నగారు బెజవాడ వెళ్తున్నప్పుడు పనిమాలా చెప్పే వాణ్ని “ మాలతి చందూర్ పుస్తకం ఇంకో కాపీ తీసుకు వస్తారా?” అని!

అలా ప్రతి ఏడాది ‘వంటలు-పిండి వంటలు’ పుస్తకం కొత్త ఎడిషన్ మా ఇంట్లో చేరేది. అది చదవడం వల్ల నాకు జరిగిన లాభం ఏమిటంటే, రెండు వందల పేజీల పుస్తకం ఏదన్నా అలవోకగా ధీమాగా  చదివేయడం! అది ‘చందమామ’ చదివే అనుభవం కన్నా భిన్నమయింది నాకు – మెల్లిగా నా చేతులు మా అమ్మగారి పుస్తకాల మీదకి మళ్ళాయి. నాటికలే కాకుండా, కథలూ నవలలూ చదవడం మొదలెట్టాను. అవి చదవడం మొదలెట్టాక మాలతి చందూర్ ‘వంటలు- పిండివంటలు’నా పుస్తక  ప్రపంచంలోంచి నిష్క్రమించింది.

ఏడో తరగతిలో మేం పట్నం- అంటే ఖమ్మం- చేరాం. కాన్వెంటు చదువు నాకు పెద్ద కల్చర్ షాక్. మిగతా పిల్లలు వాళ్ళ ఇంగ్లీషు పలుకులు వింటున్నప్పుడల్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్! అసలు నాకేమీ తెలియదు, ఎలాగయినా సరే ఈ లోకాన్ని ఉన్నపళాన అర్థం చేసేసుకోవాలి అని ఆబ. తెల్లారేసరికి మంచి ఇంగ్లీషు మాట్లాడేయాలి, క్లాస్ మేట్ల మైండ్ బ్లాంక్ అయిపోవాలి అని తీర్మానించుకున్న రోజుల్లో  కనిపించిన ఇంగ్లీషు పుస్తకమల్లా చదివేయడం! పిచ్చి పట్టినట్టు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకాన్ని మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేయడం…శంకరనారాయణ నిఘంటువులో రోజూ కొన్ని పేజీలు  బట్టీ కొట్టడం!

నా అవస్థలు చూసి నాకే అవస్థగా వుండేది. అప్పుడు దొరికింది స్వాతి మాసపత్రిక! అందులో మాలతి గారి కెరటాల్లోకి దూకేసాను. మొదటి సారి చదివిన ఇంగ్లీష్ నవల ‘ of human bondage.’ ఆ నవల చదవడానికి ముందు మాలతి గారి వ్యాసం చదివి, అందులో events అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని, ఆ పాత్రల పేర్లు కాగితం మీద తెలుగులో రాసుకొని, ఇంగ్లీషు నవల చదవడం! ఇదీ సాధన! అలా మాలతి గారి సపోర్టుతో  ప్రతి నెలా వొక ఇంగ్లీషు నవల చదవడం, ఆ నవల గురించి ఇంగ్లీషులో సమ్మరీ రాసుకొని, కొన్ని సార్లు మాలతి గారి కెరటాల వ్యాసాన్ని నా బ్రోకెన్ ఇంగ్లీషు  అనువాదం చేసుకోవడం ….అలా, ఏడాది తిరిగే సరికి మాలతి గారు నా చేత పన్నెండు నవలలు చదివించారు. డికెన్స్, థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్, వర్జీనియా వూల్ఫ్….ఇలా నా బుర్ర నిండా ఇంగ్లీషు పేర్లు!

ఈ క్రమంలో మాలతి గారు నాకు నేర్పిన పాఠం: జ్ఞానానికి భాష అడ్డంకి కాదు- అని! ఆమె ఎంత కష్టమయిన నవల అయినా సరే, అతి తేలికయిన భాషలో చెప్పేస్తుంటే, అంత లావు లావు నవలలు కూడా ‘వీజీ’ అయిపోయేవి. పైగా, ఆ పిచ్చి అవేశాల ఉద్వేగాల టీనేజ్ లో ఆ చిన్ని వ్యాసాల  గడ్డిపోచ పట్టుకొని ఎంత పొగరుమోత్తనంతో ఎంత గోదారి ఈదానో!

 

4

ఆ తరవాత మాలతి చందూర్ సొంత రచనలు ఏం చదివానో పెద్దగా గుర్తుండని స్థితి కూడా వొకటి వచ్చేసింది. పైగా, ఆమె ‘ప్రశ్నలూ జవాబుల’ శీర్షిక ఆవిడ పట్ల నా గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది కూడా!  ఇంత చదువుకొని ఈవిడ ఎందుకిలా మరీ నాసిగా రాస్తారా అనుకునే రోజులు కూడా వచ్చేసాయి. సొంతంగా రాయడం ఎంత కష్టమో కదా అని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితి! ఆవిడే పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం అంతా చదివాక, ఆవిడ సొంత రచనలు మరీ అన్యాయంగా అనిపించడం మొదలయింది. చూస్తూ చూస్తూ ఉండగానే, నా చదువు పటంలోంచి  మాలతిగారు నిష్క్రమించేసారు.

కాని, ఆమె ‘కెరటాలే’ తోడు లేకపోతే, నాకు ఈ మాత్రం ఇంగ్లీషు వచ్చేది కాదు. ప్రపంచ సాహిత్యం చదవాలన్న తపన నాలో పుట్టేది కాదు. కాని, నా ముందు పరచుకున్న ప్రపంచంలో మాలతి గారిని ఎక్కడ locate చేసుకోవాలో ఇప్పటికీ నాకు తెలియదు.

afsar— అఫ్సర్

 

 

 

 

సూడో రియాల్టీస్

aparna“చెత్తా… ” అనే అరుపు, తర్వాత కాలింగ్ బెల్ మోత.

బద్ధకంగా నిద్రలేచి టైం చూశా. ఏడైంది. ‘లేటైందే’ అనుకుంటూ లేచి  తలుపు తీసాను. “చెత్తున్నదామ్మా?” చేత్తో పెద్ద చెత్తబుట్టను పట్టుకుని అడిగింది. ఉండమని లొపలికొస్తున్నాను.  బెడ్ రూమ్ లోనుంచి ప్రకాష్ లేచి వచ్చాడు.
“చెత్తనేనిస్తాలే, నువ్వెళ్ళి టీ పెట్టు” అని డస్ట్ బిన్ తెచ్చాడు.
” సాయి రాలేదా?” ప్రకాష్ చెత్త తీసుకోవడానికి వచ్చినమనిషిని అడగడం వినిపిస్తోంది.  వంటింట్లోకి దారితీసాను.
” సాయి కి యాక్సిడెంట్ అయ్యిందంట” డస్ట్ బిన్ లోపలికితెస్తూ  ప్రకాష్ చెప్పాడు.
“ఔనా, ఎలా… ?!!”
“ఏమో, బండి మీద నుంచి పడ్డాడు అంది . ఎలా పడ్డాడో ” ఆలోచిస్తూ అన్నాడు.నిన్న  పనమ్మాయి రాక వంటింట్లొని  అంట్లతొ కుస్తీ పడుతూ అంతకన్నా ఎక్కువ అడగలేదు నేను.
సాయి మా ఇళ్ళల్లో చెత్త తీసుకెళ్ళే అతను. కానీ అంతకు మించిన పరిచయం మా మధ్య లేదు. ఎప్పుడూ మా అపార్ట్ మెంట్ లోనో, లేక చుట్టూ పక్కల అపార్ట్ మెంట్స్లోనో చెత్త తీసుకెళ్తూ  కనిపిస్తుంటాడు. ఎప్పడైనా అతని బదులు అతని భార్యో, చెల్లెలో వస్తారు. కూడా వారి పిల్లలు.
అప్పుడప్పుడూ పనమ్మాయి రాకపోతేనే ఐఎస్ డి  కాల్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అయ్యేంత విషయంలా ఉండే నాకు సాయి జీవితం ఒక వెక్కిరింపులా  ఉంటుంది. నేనీ ధోరణిలో మాట్లాడితే ప్రకాష్ కి చిరాకు. “ఎందుకలా సుపర్ఫిషియల్గా మాట్లాడతావు?’ అని విసుక్కుంటాడు. చిన్నప్పట్నించీ చదివిన సాహిత్యం, పెరిగిన వాతావరణం వల్ల పేదవారు అలా ఉండటానికి డబ్బున్నవారి బాధ్యత చాలా  ఉందని నా నమ్మకం. కాని నా ఆత్మావలోకనం వల్ల సాయి కి పెద్దగా ఒరిగిందేం  ఉంది? అప్పుడప్పుడు పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం, పండుగ  ఈనంలు మినహా నా వల్ల అతనికి ఏమి లాభం లెదు. నాకే ఎప్పుడైనా మొలకెత్తే ఈ అనవసరపు  అపరాధపు భావన నుండి కొంత తెరిపి.
***
“డబ్బులేమన్నా  ఇచ్చావా ?” బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అడిగా.
“ఆ.. రెండు వందలిచ్చాను.”
“రెండు వందలేనా,  ఏం సరిపోతాయి? డబ్బులేని వారికి అనారోగ్యానికి మించిన కష్టం లేదు తెలుసా?”
“ఎంతివ్వను? మొత్తం ఇవ్వలేముగా.. ఐనా ఎంతయ్యిందో ఎలా తెలుస్తుంది?అడిగితే  చూద్దాం. “
అడగరని తెలుసు మాకు. “……  మొన్న సూపర్ బజార్ కి వెళ్తుంటే చుసాను. రోడ్డు పక్కన కూర్చుని అన్నం తింటున్నాడు. పక్కనే చెత్త బండి. తనతోనే తన బావమరిది అనుకుంటా. ఎవరో అన్నం ఇచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ కనీసం తిండి తినడానికి అనువైన చోటు కూడా లేదు. చాలా బాధనిపించింది.”
“ఎందుకెప్పుడూ ఇలాంటి విషయాలు చెప్తావ్?  నీకేం తెలుసు, రోడ్డుపక్కన కూర్చుని తినడానికి అతనికంతగా బాధలేకపోతే? అతను చెత్త తీసుకెళ్తాడు. ఎవరూ ఇంట్లో పిలిచి భోజనం పెట్టరు. డిస్క్రిమినేషన్ కాదు, సానిటరీ రీజన్స్. అసలు ముందు, నువ్వు పెడతావా?
“………. “
“ఊర్లలో అయితే ఇంటి బయట వరండానో, అరుగో, పెరడో ఉంటుంది.  అపార్ట్ మెంట్ లో ఎలా అవుతుంది?  ఒకవేళ వాళ్ళను పిలిచినా  ఎంత కంఫర్టబుల్ గా తినగలడు ? దాని బదులు రోడ్డే బావుందనుకున్నాడేమో..”
మన కోసం పనిచేసే ఒక మనిషి ‘డిగ్నిటి’ అనే పదం అర్థమయ్యే మార్గం తెలియక రోడ్డు పక్కన రాజీ పడి తింటేనే కంఫరటేబుల్ గా ఫీల్ అయి తింటుంటే  ఏమనుకోవాలి? నిట్టూర్చాను.
నా సుడో అభ్యుదయవాదం, ప్రకాష్ కన్వినియంట్ వాదం అర్థమయ్యాయి నాకు.
 చాలా కాలం క్రిందటి విషయం  గుర్తు వచ్చింది.
***
అప్పటికి రెండు వారాలబట్టీ ఊర్లోలేము. ముఖ్యమైన బంధువులు చాల కాలం తర్వాత ఇంటికొస్తున్నారు. ప్రకాష్ కూడా నాతో పాటే లీవ్ పెట్టి ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. కానీ నా క్లీనింగూ, ప్రకాష్ సౌందర్యాభిలాషా సరిపోవు. ఎవరన్నా బాత్రూములు కడగటానికి దొరుకుతారేమోనని  సాయినడిగా. “మా బావమరిది ఉండమ్మా, బాత్రూంకి వంద  అడగతడు”, అన్నాడు. పంపించమన్నాను.
అన్నట్లుగానే పదకొండింటికి వచ్చాడు అతని బావమరిది.  ఒక కవరు పట్టుకొచ్చాడు. ముందు షర్టు విప్పేసి,మడిచి బాత్రూం బయట తలుపు పక్కగా పెట్టాడు.  పాంటు మడిచి కవర్లోంచి ఆసిడ్ బాటిలు, కొద్దిగా కొబ్బరి పీచూ, ఐదు రూపాయల సర్ఫ్ పాకెట్టు తీసాడు. చెప్పులు వేసుకోమని చెప్పాలనిపించింది కాని చెప్పలేదు. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏమన్నా ఖరీదైన వస్తువులున్నాయేమోనని  చెక్ చెసి వంట గదిలోకొచ్చి,టీ పెట్టా.  ప్రకాష్ నా దగ్గరికి వచ్చివచ్చినతనికి తినడానికి కూడా ఏమన్నా పెట్టిమన్నాడు.
కొద్దిగా టిఫిను, టీ పట్టుకెళ్ళి పిలిచాను. పనిలో ఉండి వినిపించలేదనుకుంటాను. బాత్రూంలోకి చూస్తే అతను పీచుతో కమ్మోడ్లో చెయ్యిపెట్టి కడుగుతున్నాడు. అతను నన్ను చూసి, చేతిలో పని ఆపి, చేతులు కడుక్కుని టీ , టిఫిను అందుకున్నాడు.
వంటగదిలోకి వెళ్లాను గానీ ఎంత ఆపుకున్నా సొంత ఎద్దేవాను తట్టుకోవడం కష్టం అయింది.  చిన్నప్పుడు మా అమ్మ స్నేహితురాలి పుట్టింటికి వెళ్తే, అక్కడ టాయిలెట్ సౌకర్యం లేక ఇంటివెనుక దొడ్డిని వాడేవారు. రొజూ ఒకావిడ దొడ్డి వెనుక తలుపు తీసుకువచ్చి  శుభ్రం చేసి వెళ్తూ ఉండేది. పెద్దయ్యాక ఆలోచిస్తే ఆ పని చేయించుకోవడం ఎంతో హీనంగా అనిపించింది . కానీ ఇప్పుడు అపార్ట్ మెంట్ కల్చర్  వచ్చాక మాత్రం ఏమి తగ్గింది?
పిండాకూడు దళితోద్యమాలూ, పనికిమాలిన సాహిత్యం. ఊరికే  ఉండనివ్వట్లేదు. విసురుగా బాత్రూం వైపు చూశాను.
అతను తిని కడిగి బాత్రూంకి కాస్త ఎడంగా పెట్టిన, కప్పు, ప్లేటు. పక్కనే మడిచిన షర్టు.
ప్రకాష్ బెడ్ రూమ్ సర్దడం పూర్తయినట్లుంది. నెమ్మదిగా  దగ్గరికి వచ్చి, ” బ్రష్షు వాడొచ్చుకదా? ఎందుకు?’ గుసగుసగా అడిగాడు.
“చేత్తో రుద్దితే బాగా పోతుందనేమో”. అభావంగా  అన్నాను. “ఎవరైనా అలా చెయ్యమన్నారేమో ….” కలుక్కుమంది.
ఇంకో గంట తర్వాత రెండో బాత్రూం కూడా కడిగి, ” అయిపోయిందమ్మ..” అన్నాడు. చేతిలో ఇంకా మడిచిన షర్ట్. వళ్ళంతా తడి. నీరు, చెమట కలిసిపొయాయి.
బాత్రూములు చూసి వచ్చాను. అందులో నేను హర్పిక్ తో తోమినా  రాని  తెల్లని మెరుపు.  కొద్దిగా ఆసిడ్, సర్ఫ్, కొబ్బరి పీచుతో హ్యాండ్డన్ క్లీనింగ్! ఒక్కో బాత్రూం కీ వంద.  రెండు బాత్రూములకీ  రెండు వందలు.  ఇంకో వంద ఎక్కువ ఇచ్చాను.
ఈ బాధ, ఒక వందతోనో, నాలుగు చాక్లేట్లతోనో తీరేటట్లు అనిపించడం లేదు నాకు. డబ్బులు తీసుకుని గుమ్మం దాటుతున్నాడు. క్షమించమని ఎలా అడగాలి?
“చెప్పులు వేసుకుని కడగొచ్చుగా కాళ్ళు పాడవ్వవా?
” అలవాటైపోయిందమ్మ.” నవ్వాడు “మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే  చెప్పండి.”
లోపలికొచ్చి మళ్ళీ పని మొదలు పెట్టా ..”వెళ్ళిపోయాడా?” ప్రకాష్ అడిగాడు.
తలూపాను. “ఛీ, ఇంకో సారి బాత్రూంలు వేరే వాళ్లతో కడిగించొద్దు. ఐనా  ఎవరి బాత్రూములు వాళ్ళే కడుక్కోవాలి.”  ఏమి మాట్లాడలేదు నేను.
***
మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ప్రస్తుతానికొచ్చి తలుపు తీశా. పనమ్మాయి.  ” ఏంటి  లేటు. నిన్న కూడా రాలేదు ” గయ్యిమన్నాను.
“ఔమా, రాలె. జరా పెయ్యిలో బాలె.” చీపురు తీసుకుని ఊడ్చటం  మొదలుపెట్టింది . ” గా సాయిని నిన్న దొంగతనం జేస్తుంటె జూషి తన్నిన్రు. “
“ఎక్కడా?”
“అగొ , ఆ అపార్ట్ మెంట్ల  షాదీ అవుతున్నది గదా.. అక్కడ ఒక సిలిండరు, స్టవ్వు ఎత్కవోతుంటే జూషిన్రు . వర్షమొస్తన్నదని ఎక్కనివక్కన్నే వదిలేసిన్రు. ఇగనెవ్వరూ లేరని  ఎత్కవొనికి జూషిన్రు.”
” నిజంగా తీసుకెళ్తుంటే చూసారా…?!!”
” జూషిన్రమ్మా. చెత్త బండిలో  బెడతంటే   సూషి ఒర్లిన్రు. అందరూ  గాల్చి  పరేషాన్ జేసి కొట్టిన్రు. రెండు నెల్లయెన్క  బీ ఇట్లనే చోరి చేస్తే తన్నిన్రు. ” మేటర్ అఫ్ ఫాక్ట్ లా చెప్పుకుపోతోంది.
” అందుకేనా వాళ్ళావిడ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది?” ప్రకాష్ ఆశ్చర్య పో తూ  అడిగాడు. ” లే, యాక్సిడెంట్ గాలే, తన్నిన్రు.”
***
కొన్ని రోజుల తరువాత మళ్ళీ సాయి రావడం మొదలు పెట్టాడు. అతని మొహంలో  భావాలను చదవాలని కష్టపడ్డాను గానీ చదవలెకపోయాను. తిరుగుబాటో, లొంగుబాటో, నిర్లక్ష్యమో ఏదోకటి  కనిపిస్తే  స్థిమితంగా ఉండేదేమో  నాకు.
ఒక నెల గడిచింది. నాలో ఆవేశం చల్లబడింది.  ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. మొదట్లో ఉన్న ఆవేశం తగ్గినట్లే బాత్రూం ల పై శ్రద్ధ కూడా తగ్గింది.  బాత్రూంలు శుభ్రం గా అనిపించట్లేదు నాకు. ఐనా  నేను పిలవక పోయినంత మాత్రాన అతను తన పనిని  మానేస్తాడా? అతనికి కుడా డబ్బులు రావొద్దా?  నేను కుడా అంత  హీనంగా చూసేమనిషినేమీ కాను. సమర్దించుకుని సాయిని బాత్రూం లు కడిగేవారుంటే పంపమని అడిగాను.  
“ఇప్పుడెవరు దొరకట్లేదమ్మ ..బాత్రూములు లు కడిగే పని చెయ్యమిగ అంటున్రు .” కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
ఏమనాలో తెలియక అతనివైపే చూస్తున్నా.” నేను మా బామ్మర్ది ఇద్దరం గీ పని ఇడిషివెట్టి రేపటిసంది మెకానిక్ బంకు లో  పనికి వోతున్నం.” చెత్తడబ్బా పట్టుకుని మెట్లుదిగుతూ చెప్పాడు వెనక్కి తిరగకుడా చెప్పాడు. నా సంఘర్షణా, సమర్ధింపూ మధ్య సమస్య దానికదే పరిష్కారమైపోయి ఎక్కడో దాక్కున్న ఇబ్బంది తేలికైపోయిందా?
లోపలికోచి తలుపేస్తున్నా, వద్దన్నా పెదవులమీద నవ్వు పూస్తూనే ఉంది.
నడుము తిప్పుతూ,  కూనిరాగాలు తీస్తూ  చీపురు పట్టుకుని బాత్రూం  లోపలికెళ్తున్న నన్ను ప్రకాష్ అయోమయంగా  చూస్తున్నాడు.
—-అపర్ణ తోట

కల తెగిపోతే…అల ఆగిపోతే..అది సాహిర్ పాట!

sahir11

“కహా హైన్? కహా హైన్? ముహాఫిజ్ ఖుదీకే….జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హైన్?”

“తూ హిందు బనేగా న ముస్సల్మాన్ బనేగా..ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!”

“దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హోగయా ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!”

ఇవి సాహిర్ లుధియాన్వి కలంలోంచి ఆవేదన తో మిళితమైన ఆవేశంతో తన్నుకు వచ్చిన కొన్ని కవిత్వపు తునకలు. మనలో నిస్తేజంగా పడిఉన్న అంతరంగాన్ని కొట్టి లేపే కొన్ని పదునైన పదశరాలు. తెలుగు వారికి పెద్దగా పరిచితమైన పేరు కాదు కనక సాహిర్ గారి గురించి క్లుప్తంగా చెప్పుకొని ముందుకు సాగుదాం. అబ్దుల్ హాయి గా లుధియానా (పంజాబ్) లో 1921 లో ఒక జమీందారి వంశంలో జన్మించిన సాహిర్, తన చిన్నతనంలోనే తల్లి తండ్రులు విడిపోయి, తన తల్లితో పెరగడం వల్ల, కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. లాహోర్ లో కొద్ది కాలం ఒక పత్రిక నడిపి, అతని రాతల కారణంగా అరెస్టు వారెంట్ జారీ అవ్వటంతో, బొంబాయి చేరుకొన్నాడు. తరవాత ముఫ్ఫై సంవత్సరాల పాటు, ఏడు వందల పై చిలుకు సినిమా పాటలు, ఉర్దూ కవితా సంపుటాలు వ్రాసుకుంటూ, హిందీ సినిమా పాటలకి ఉచ్ఛస్థాయి కవిత్వస్థానం కలగజేస్తూ, సాటి లేని కవిగా తన పేరుని ఎవ్వరూ చెరపలేని విధంగా ముద్రించుకొని  1980లో మనలోకం వదిలేశారు.

నిజానికి సాహిర్ లుధియాన్వి వ్రాసిన పాటలు చిన్నపడినుంచి వింటూ పెరిగినా, ఒక కవిగా ఆయన పట్ల ఆసక్తి,  ఆయన శైలి పట్ల అభిమానం పెరగటం మాత్రం కొద్ది కాలం క్రితం జరిగిన విశేషమే!  షుమారు ఒక పదిహేనేళ్ళ క్రితం నేనూ, మా ఆవిడ కలిసి చికాగో నుంచి కాలిఫోర్నియాకి వెకేషన్ మీద వెళ్ళినప్పుడు రూట్ 1 లో  శాన్ఫ్రాన్సిస్కో  నుంచి లాస్ ఏంజిలీస్ వరకూ డ్రైవ్ చేసుకెల్దామని డిసైడ్ అయ్యాం. ఈ రోడ్డు పసిఫిక్ కోస్టంబడి ఒక వైపు ఎత్తైన కొండలతో, మరొక వైపు అందమైన సముద్రపు అలల మధ్యన సాగుతూ, అమెరికా లోని టాప్ త్రీ సీనిక్ డ్రైవుల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. నా మిత్రుడు దారిలో వినటానికని “The Genius of Sahir Ludhianvi” అని ఒక సి.డి ఇచ్చాడు.

“జాయే తో జాయే కహా..”, “వో సుబహ కభీ తో ఆయేగీ”, “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హైన్?”, “ప్యార్ పర్ బస్ తో నహీ హై మేరా లేకిన్ ఫిర్ భీ”, “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో…ఔర్ మర్దోంనె ఉసె బాజార్ దియా!” అంటూ ఒకదాని తరువాత మరొక “ఏడుపుగొట్టు పాటలు” కారంతా వ్యాపించాయి. ఒక పక్కనేమో కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, అటూ ఇటూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నందుకు నాకు సన్నగా మందలింపు, మధ్యలో ఈ పాటలు! వాల్యూం తక్కువ చేసి, మా ఫ్రెండుని తిట్టుకుంటూ కొంత దూరం ప్రయాణం చేశాం.  ఇంతకు ముందు ఎప్పుడూ వినని గొంతుతో ఒక పాట మొదలయ్యింది.

“తు ముఝే భూల్ భి జావో తో యే హక్ హై తుమకో…మేరీ బాత్ ఔర్ హై మైనే తో ముహౌబ్బత్ కీ హై!” విన్నది నిజమా కాదా అని నిర్ధారించుకోటానికి వాల్యూం పెంచాను. అనుమానం లేదు, విన్నది కరక్టే! ప్రతిపదానువాదంలో (కవితానువాదం చేసే సాహసం చెయ్యలేను) ఇది, “నన్ను మర్చిపోటానికి నీకు హక్కుంది…నా విషయం వేరు, నేను ప్రేమించాను కదా(నిన్ను)!” ఆ లాజిక్ చాలా ఆసక్తి కరంగా అనిపించింది.

http://www.youtube.com/watch?v=dJAIEEwHTqU

“మేరె దిల్ కి మేరె జస్బాత్ కి కీమత్ క్యా హై (నా హృదయానికీ, భావావేశానికీ, విలువేముంది?)
ఉల్ఝి ఉల్ఝి సి ఖయాలత్ కి కీమత్ క్యా హై (నా క్లిష్ఠమైన ఆలోచనలకి విలువేముంది?)
మైనే క్యోం ప్యార్ కియా..తుమ్ నే న క్యోం ప్యార్ కియా (నేనెందుకు ప్రేమించాను..నువ్వెందుకు ప్రేమించలేదు?)
ఇన్ పరేషాన్ సవాలాత్ కి కీమత్ క్యా హైన్? (ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు విలువేముంది?)
….
మై తుమ్హారీ హు..యాహి మేరె లియే క్యా కమ్ హై? (నేను నీదానాను…ఇది చాలదా నాకు?)

తుమ్ మేరే హో కే రహో..యే మేరి కిస్మత్ న సహి” (నువ్వు నావాడుగా ఉండటం…నా తలరాతలో లేనప్పటికీ)

ఈ పాట ప్రేయసీ ప్రియుల మధ్య ఒక సంభాషణ లాగా సాగుతుంది. ఒక రోమాన్స్ డ్యూయెట్ లో ఇంత వింత లాజిక్ కనిపించటం మొదటిసారి అవ్వటం వల్లనేమో, ఆ తరవాత వచ్చే ప్రతి పాట లిరిక్స్ నూ చెవులు రిక్కించి వినటం ప్రారంభించాం. ఆ పైన రూట్ 1 సౌందర్యం కూడా మా ధ్యానాన్ని ఆ పాటల పైనుంచి మరల్చలేకపోయింధి. వెకేషన్ అయిపోయిన తరువాత సాహిర్ పైన రిసెర్చ్ చేసి ఆయన పాటలన్నీ జాగర్తగా పరిశీలించటం ప్రారంభించాను. ఒక సముద్రం లోకి దూకాననిపించింది, అదీ ఈత రాకుండా! ఆయన పాటలలో ఉర్దూ పదాలు చాలా విరివిగా దొర్లుతాయి. ఎదో సందర్భానుసారం అర్థం అయినట్లనిపించినా, ఆ భాషలో పట్టు లేకపోవటం వల్ల, శబ్దసౌందర్యాన్ని ఆస్వాదించటమే ఎక్కువగా ఉండేది. ఆన్లైన్ ఉర్దూ నిఘంటువుల పుణ్యమా అని తరవాత రోజుల్లో ఆ బాధ తొలగిపోయింది. కవి ఎవరో తెలియకపోయినా, ఇంతకు ముందు నాకు నచ్చిన, నా నోట్లో నానుతూ ఉన్న అనేక పాత హిందీ పాటలు కూడా ఆయన కలాన్నే చీల్చుకు పుట్టాయన్నవి కూడా నాకా సమయం లోనే తెలిసింది.

ఆయన పాటలు వింటున్నప్పుడు చాలా సార్లు నాకు, జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీ, ఆయనలోని రొమాంటిక్ ఇంటెన్సిటీ, ఆయన సొంత కథ, భావాలనే, ఆయన పాటలలో ప్రతిబింబించేవాడనిపించేది, అది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసుండకపోయినా.

సాహిర్ స్వయంగా చిన్నతనంలో ఎన్నో కష్టాలని అనుభవించి ఒక గొప్ప కవిగా పేరునేర్పర్చుకున్న నేపథ్యంలో “హమ్ దోనోం” సినిమాలోని పాట ఇది.

“మై జిందగీ కా సాథ్ నిభాతా చలాగయా.. (నేను జీవితానితో వెన్నంటి సాగుతున్నా)

హర్ ఫిక్ర్కో ధువే మే ఉడాతా చాలాగయా.. (అన్ని దిగుళ్ళనూ పొగలాగా ఊదేసుకుంటూ సాగుతున్నా)

బర్బాదియోంకా శోక్ మనానా ఫిజూల్ థా… ( వినాశనాల (ఓటముల) గురించి విచారం వ్యర్థం)

బర్బాదియోంకా జష్న్ మనాతా చాలా గయా.. (వాటినే పండగ చేసుకొని సాగుతున్నా)

గమ్ ఔర్ ఖుషీ మె ఫర్క్ న మెహసూస్ హో జహా.. (దుఖానికీ సుఖానికీ మధ్య వ్యత్యాసం ఎక్కడైతే ఉండదో)
మై దిల్ కో అస్ మకామ్ పె లాతా చాలా గయా..” (ఆ స్థానానికి నా హృదయాన్ని తీసుకెళ్తూ సాగుతున్నాను)

http://www.youtube.com/watch?v=IzC0_XVE3Vk

గురుదత్ సినిమా ప్యాసా గురించి, దానిలోని పాటల గురించి, కొన్ని Ph.D వ్యాసాలు వ్రాయచ్చు. హీరో ఒక గుర్తింపు లేని కవి. అతడు చనిపోయాడనుకున్న తరవాత, అతడి కవితలు వెలుగులోకొచ్చి, గొప్ప కవిగా గుర్తింపబడతాడు. “నేను బ్రతికేఉన్నాను” అని ఎంత మొత్తుకున్నా వినకుండా పిచ్చోడికింద జమకట్టిన సమాజాన్ని, ఆ కవి  వెలివేసి వెళ్ళిపోవటంతో కథ ముగుస్తుంది. ఒక ఫలించని ప్రేమ కథ, మంచి మనసున్న ఒక వేశ్యతో మరో ప్రేమ కథ, సబ్ ప్లాట్స్ గా ఉంటాయి. ఒక కవికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? సాహిర్ ఈ సినిమా పాటల్లో తమ విశ్వరూపాన్ని ఆవిష్కరించారు. ఎంతగా అంటే, ఆ సినిమా పాటలకి చక్కని బాణీలు కట్టిన యస్.డి.బర్మన్ కి కూడా లభించనంత గుర్తింపు సాహిర్ సాహెబ్ కు దక్కేంతలా.

సాహిర్ తన నిజజీవితంలో కూడా రెండు సార్లు విఫలప్రేమాబాధితుడై ఆజన్మ బ్రహ్మచారి గానే మిగిలిపోయాడు. తన భవిష్యత్తుని ముందుగానే గుర్తించి ఈ పాట వ్రాశారా?
“జానే వో కైసే లోగ్ థే జిన్కే ప్యార్ కో ప్యార్ మిలా..” పాట నుంచి.
“బిఛడ్ గయా హర్ సాథీ దేకర్ పల్ దో పల్ కా సాథ్.. (అందరూ దూరమయ్యారు ఒకటి రెండు క్షణాల సాహచర్యం తరవాత)

కిస్కో ఫుర్సత్ హై జొ థామే దీవానోంకా హాథ్.. (ఎవరికి ఓపిక ఒక పిచ్చివాడి చెయ్యి పట్టుకోవటానికి)

హమ్కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా..”(చివరికి నా నీడకు కూడా నేనంటే అలసటొచ్చింది)

http://www.youtube.com/watch?v=cmWZHQAKMEk

 

సాహిర్ షాయారీలో స్త్రీల పట్ల, సమాజంలో వారి అణచివేతపట్ల కూడా తీవ్రమైన ఆవేదన కనపడుతుంది. ఆయన దానిని వ్యక్తపరచటంలో ఎక్కడా “రొమాంటిసైజ్” చెయ్యకుండా సూటిగా శులాల్లాంటి మాటల ప్రయోగంతో శ్రోతలను కలవరపెట్టేవారు. ఆ మాటల తీవ్రత ఒక్కోసారి మనని ఎంత బాధ పెడుతుందంటే, అసలు ఆ పాటే వినటం ఆపేద్దాం అనేంత! 1958 లో విడుదలైన “సాధనా” చిత్రం లోని “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో .. మర్దోంనే ఉసే బాజార్ దియా” అనే పాట లోని కొన్ని వాక్యాలు ఇవి.

“జిన్ హోటోన్ నె ఇన్కో ప్యార్ కియా..ఉన్ హోటోన్ కా వ్యాపార్ కియా (ఏ పెదవులైతే ప్రేమనందించాయో, వాటితోనే వ్యాపారం చేసాడు (మగవాడు))

జిస్ కోఖ్ మె ఉస్కా జిస్మ్ ఢలా..ఉస్ కోఖ్ కా కారోబార్ కియా (ఏ గర్భంలో అయితే జన్మించాడో…దానితోనే వ్యాపారం చేశాడు) ……

యే వో బద్కిస్మత్ మా హైన్ జో…బేటోంకి సేజ్ పే లేటీ హై” (ఈమె ఎంత దురదృష్టవంతురాలు అంటే….తన బిడ్డల పరుపుల మీద పడుకుని ఉంది)

http://www.youtube.com/watch?v=dRnHoAI2Pm4

యాభై, అరవై దశాకాలలోనే, సమాజంలో పేరుకుపోతున్న ధనదాహానికీ, నీతిమాలినతనానికీ, అణచివేతకూ, కులమత వివక్షకూ అద్దం పట్టేలా ఎన్నో పాటలు సాహిర్ కలంనుంచి పెల్లుబికాయి.

ప్యాసా లోని “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?” కవిత (పాట) బహుళ ప్రాచుర్యం పొందింది.

“జలాదో ఇసే ఫూంక్ డాలో యే దునియా..జలాదో జలాదో జలాదో..

మేరే సామ్నేసే హటాలో యే దునియా

తుమ్హారీ హై తుమ్హీ సంభాలో యే దునియా”

“సమాజాన్ని తగల పెట్టెయ్యండి,  నా ముందరి నుంచి తీసెయ్యండి, మీదైన సమాజాన్ని మీరే ఉంచుకోండి” అన్న వీరావేశం ఈ పాటలో చూపిస్తే, అదే సమాజం పై ఆవేదన వ్యక్తపరుస్తూనే, ఒక మంచి ఉదయం మనకు రాబోతోంది అన్న ఆశాభావం “వో సుబహ కభీ తో ఆయేగీ…” అన్న పాటలో మనకి కనబడుతుంది.

“మానా కే అభీ తేరే మేరే అర్మానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (సరే, మన ఆశలకెలాంటి విలువా లేదు)

మిట్టీ క భీ హై కుచ్ మోల్ మగర్, ఇన్సానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (మట్టికైనా  కొంత విలువుంది కానీ, మనుషులకు ఏ మాత్రం లేదు)

ఇన్సానోంకీ ఇజ్జత్ జబ్ ఝూటే సిక్కోం మె న తోలీ జాయేగీ (ఏ రోజైతే మనుషుల ఆత్మగౌరవాన్ని డబ్బులతో తూయరో)

వో సుబహ కభీ తో ఆయేగీ” (ఆ ఉదయం ఎపుడో వస్తుంది)

http://www.youtube.com/watch?v=hQYQUo5X6F0

ముస్లిం కుటుంబంలో పుట్టిన సాహిర్, ఒక నాస్తికుడు. ఆ నాస్తికత్వం ఆయన కొన్ని పాటలలో కనపడుతూనే ఉంటుంది. 1954 లో “నాస్తిక్” అనే సినిమాకి కవి ప్రదీప్ “దేఖ్ తేరే ఇన్సాన్ కి హాలత్ క్యా హోగయి భగవాన్..కిత్నా బదల్ గయా ఇన్సాన్” (దేవుడా, చూడు మానవుడి పరిస్థితి – ఎంత మారిపోయాడో మానవుడు) అనే పాట వ్రాసి తానే పాడారు. దానికి జవాబుగా సాహిర్ 1955 లో “రైల్వే ప్లాట్ఫారం” అనే సినిమాకి పాట రాస్తూ ఇలా జవాబు ఇచ్చారు. “దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హో గయి ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!” (ఓ మనిషీ చూడు దేవుడెలా మారిపోయాడో!) ఈ పాటలో దైవదూషణ కంటే కూడా, సమాజంలో అవినీతిపరుల ఇంటే లక్ష్మీదేవి ఇంకా ఎక్కువ కొలువుంటోందన్న వాపోతే ఎక్కువగా కనపడుతుంది. ఈ రెండు పాటల బాణీ కూడా ఒకటే!

భగవాన్, ఇన్సాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=1_5LLtxAB4I

ఇన్సాన్, భగవాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=geBkwLHtJA8

అలాంటి నాస్తికుడైన సాహిర్ హిందీలో కలకాలం గుర్తుండి పోయే భజన్ కూడా వ్రాసారంటే అది వెంటనే నమ్మబుద్ది కాదు. “హమ్ దోనోం” సినిమాలో, లతాజీ అత్యంత మృదుమధురంగా పాడిన “అల్లా తేరో నామ్..ఈశ్వర్ తేరో నామ్” మరి ఈయన కలంనుండి వచ్చినదే!

సాహిర్ మతం మానవత్వం. ప్రేమే అతని దైవం. ఈ భావం స్ఫురించేటట్లు వ్రాసిన పాటలనేకం. కొన్ని పాటలు టైంలెస్. “తూ హిందూ బనేగా న ముసల్మాన్ బనేగా…ఇన్సాన్ కి ఔలాద్ తు ఇన్సాన్ బనేగా!” ఈ పాట ఎన్నో తరాల అంతరాత్మలను తొలుస్తూనే వస్తోంది. ఈ పాటలో ఒక వ్యక్తి ఒక అనాథ బాలుడిని సాకుతూ, నువ్వు హిందువువీ అవ్వవూ లేక ముస్లిమ్ వీ అవ్వవూ, ఒక మనిషికి పుట్టావు కనక, తప్పక ఒక మనిషివే అవుతావు అని ముచ్చట పడుతూ ఉంటాడు. యష్ చోప్రా దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన “ధూల్ కా ఫూల్” సినిమా లోని పాట ఇది.

“అఛ్ఛా హై అభీ తక్ తేరా కుఛ్ నామ్ నహీ హై (మంచిదయ్యింది, నీకు ఇంకా నామకరణం కాలేదు)

తుమ్కో కిసీ మజహబ్ సే కోయీ కామ్ నహీ హై (నీకు ఏ మతంతోను ఇక పని లేదు)

జిస్ ఇల్మ్ నే ఇన్సానోంకో తక్సీమ్ కియా హై (ఏ జ్ఞానము అయితే మనుషులను విభజించిందో)

ఉస్ ఇల్మ్ కా తుమ్ పర్ కోయీ ఇల్జామ్ నహీ హై” (ఆ జ్ఞానము యొక్క అపవాదు నీ మీద లేదు)

http://www.youtube.com/watch?v=jqcyUkUFzrc

 

సాహిర్ లుధియాన్వి కి మరికొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ కంపెనీల నించి రాయల్టీలు రాబట్టిన మొట్టమొదటి గేయరచయిత ఈయన! అలాగే అప్పట్లో చాలా మందికి కొరుకుడు పడని భావాలూ, ప్రవర్తన కూడా ఆయన సొంతం. లతా మంగేష్కర్ ఒక తిరుగులేని గాయనిగా రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఆమెకు సంగీత దర్శకుడి తరువాత, అత్యంత ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు. గేయరచయితకు ఆమెతో పోలిస్తే తక్కువగా ఇచ్చేవారు. అలాంటిది, సాహిర్ మటుకు, లత కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనిదే పాట రాయనని ఘోషణ చెయ్యటంతో, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడింది వారిద్దరి మధ్య. అందుకేనోమో, ఆషా భోంస్లే నే సాహిర్ పాటలు అందరి గాయనీ గాయకుల కంటే ఎక్కువ పాడారు. అయినా సరే ఆయనతోనే ఆయన జీవితాంతం పాటలు వ్రాయించుకున్న దర్శక దిగ్గజాలు ఉన్నారు. దాదాపు ముఫ్ఫై సంవత్సరాల పాటు వీరి సినిమాలన్నిటికీ, సాహిర్ ఒక్కరే గేయరచయిత. వారెవరో కాదు, బి.ఆర్.చోప్రా, యష్ చోప్రా సోదర ద్వయం.

వీరి సినిమాల్లో పాటలన్నీ బహుళ ప్రాచుర్యం పొందినవే. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ సూపర్ హిట్ పాటలు! వీళ్ళు వేర్వేరు సంగీత దర్శకులను, గాయనీ గాయకులను వాడుకున్నారు కానీ, గేయ రచయితను మాత్రం మార్చలేదు. అదీ సాహిర్ గొప్పతనం!

సాహిర్ కవిత్వంలోని ఉర్దూ పదాల వాడుక గురించి ముందర చెప్పుకున్నాం. 1964లో విడుదలైన “చిత్రలేఖ” అనే సినిమా నేపథ్యం చంద్రగుప్త మౌర్య కాలం నాటిది. ఉర్దూ పదాలకు ఆస్కారం లేదు. నిజానికి శైలేంద్ర, ప్రదీప్ లాంటి గేయరచయితలు ఇటువంటి సంస్కృత భాషా ప్రాధాన్యం కావాల్సిన పాటలకి పెట్టింది పేరు. సంగీత దర్శకుడు రోషన్ మటుకు సాహిర్ మాత్రమే రాయాలని పట్టుబట్టారుట. అది ఒక సవాలు గా తీసుకొని, తన ప్రకృతికి విరుద్ధంగా సాహిర్ ఎంతో కష్టపడి వ్రాసిన పాట ఇది. ఈ పాట ఒక మూడేళ్ళ క్రితం ఔట్లుక్ వారు జరిపిన పోల్ లో, అత్యంత ఉత్తమమైన పాటగా గుర్తించబడటం కూడా ఒక విశేషమే. ఈ పాటకు మాత్రం సాహిర్ తో సమానమైన ప్రశంశ పాట పాడిన రఫీకీ, బాణీ కట్టిన రోషన్ కీ చెందాల్సిందే!

“మన్ రే తు కాహే న ధీర్ ధరే? (ఓ మనసా ఎందుకు సంయమం వహించలేకపోతున్నావు?)

వో నిర్మోహీ, మోహ న జానే.. జిన్కా మోహ కరే! (ఎవరినైతే నువ్వు మోహించావో…వారు మోహం తెలియని నిర్మోహి)

ఉత్నాహీ ఉప్కార్ సమఝ్ కోయీ..జిత్నా సాథ్ నిభాయే (అంత వరకూ చేసింది ఉపకారమనుకో..ఎంతవరకైతే నీ తోడు నిలిచారో)

జనమ్ మరణ్ కా మేల్ హై సప్నా, యే సప్నా బిస్రా దే (జనన మరణ చక్రం ఒక స్వప్నం..ఈ స్వప్నాని వదలివేయి)

కోయీ న సంగ్ మరే…” (ఎవ్వరూ చావులో నీ తోడు రారు)

http://www.youtube.com/watch?v=uA2FhgF6VY4

రోహన్, సాహిర్ కాంబినేషన్ లో వచ్చిన తాజ్మహల్ సినిమా లోని పాటలు కుడా అజరామరం. “జో వాదా కియా వో నిభానాపడేగా, రోకే జమానా చాహే, రోకే ఖుదాయీ తుమ్కో ఆనా పడేగా” పాట ఈ సినిమాలోదే.

గుమ్రాహ్ చిత్రం లోని “చలో ఎక్ బార్ ఫిర్ సే..అజ్నబీ బాన్ జాయే హమ్ దోనోం”, సాహిర్ వ్రాసిన టాప్ 10 పాటలలో ఒకటిగా నిలచిపోయే పాట. ముఖ్యంగా దానిలోని ఆఖరి చరణం ఆవేదనకీ మరెంతో ఆలోచనకీ గురిచెయ్యక మానదు. విడిపోయిన ప్రేయసీ ప్రియులు మళ్ళీ ఎదురుపడిన నేపథ్యంలో “పద మళ్ళీ ఒక సారి అపరిచుతులుగా మారిపోదాం  మనిద్దరం” అంటూ సాగే ఈ పాట లోని ఆఖరి చరణం ఇది.

“తార్రుఫ్ రోగ్ హో జాయే..తొ ఉస్కో భూల్నా బెహతర్ (ఎప్పుడైతే ఒక పరిచయం, రుగ్మతగా మారుతుందో, దాన్ని మరువటమే మంచిది)

తాల్లుక్ బోఝ్ బన్ జాయే..తొ ఉస్కో తోడ్నా అఛ్ఛా (ఎప్పుడైతే ఒక సంబంధం, బరువు లాగా అనిపిస్తుందో, దాన్ని తెంచుకోవటమే మంచిది)

వో అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా న హో మున్కిన్ (ఎప్పుడైతే ఒక కథని దాని యొక్కసరైన ముగింపుకి చేర్చలేకపోతామో)

ఉసే ఎక్ ఖూబ్సూరత్ మోడ్ దేకర్ ఛోడనా అఛ్ఛా” (దానికి ఒక అందమైన మలుపునిచ్చి వదిలేసి ముందుకు సాగటమే మంచిది)

http://www.youtube.com/watch?v=y8GnY2eddzM

సాహిర్ అన్నీ ఇలాంటి గంభీరమైన పాటలూ, వేదాంతం లేక ఘాటైన రోమాన్స్ పాటలు మాత్రమే వ్రాశారేమో అనుకునేరు! అనేక సరదా డ్యూయెట్లు, మరెన్నో హాస్య పాటలూ కూడా రచించారు. అన్నిటి గురించీ చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే అయిపోతుంది కనక, నాకు నచ్చిన పాటలన్నీ క్లుప్తంగా ప్రస్తావిస్తా. ఆసక్తి కలవారు వీటిలోని పద, భావ చమత్కారాలను నింపాదిగా తరవాత చదువుకొని సాహిర్ కవిత్వాన్ని మరింత ఆస్వాదించచ్చు.

“మాంగ్ కే సాథ్ తుమ్హారా .. మైనే మాంగ్ లియా సంసార్”  (నయా దౌర్)

“ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ..కువారియోం కా దిల్ ధడ్కే” (నయా దౌర్)

“సర్ జొ తేరా చక్రాయే…యా దిల్ డూబా జాయే” (ప్యాసా)

“తేరా ముజ్హ్సే హై పెహ్లే కా నాతా కోయీ…జానే తూ యా జానే నా” (ఆ గలే లగ్ జా)

“మేరే దిల్ మె ఆజ్ క్యా హై..తు కహే తో మై బతాదూ” (దాగ్)

“గాపుచీ గాపుచీ గమ్ గమ్…కిషీకి కిషీకి కమ్ కమ్” (త్రిశూల్)

“యూ తో హమ్నే లాఖ్ హసీ దేఖే హై..తుమ్సా నహి దేఖా” (తుమ్సా నహి దేఖా)

“ఏ మేరె జోహ్రజబీ తుఝే మాలూమ్ నహీ” (వక్త్)

1976 లో యశ్ చోప్రా నిర్మించిన కభీ కభీ లో ప్యాసా తరవాత మళ్ళీ హీరో ఒక కవి, ఒక భగ్న ప్రేమికుడు. అందులోని హీరో పాత్ర సాహిర్ లుధియాన్వి ప్రేరణతోనే రూపుదిద్దుకున్నదేమో అన్న అనుమానం రాక తప్పదు. హిందీ పాటలతో పరిచయం ఉండి ఈ సినిమా టైటిల్ సాంగ్ తెలియని వారు ఉన్నారంటే నమ్మలేని విషయం; అంత ప్రాచుర్యం పొందింది ఆ పాట! సాధారణంగా తన రచనా శక్తి పట్ల అపరిమితమైన నమ్మకం ఉన్న సాహిర్ ఎదో “ఇంట్రాస్పెక్టివ్ మూడ్” లో జారిపోయి ఈ కవిత వ్రాసినట్లున్నారు. ఈ కవిత నాకు ఎంత నచ్చినా, దీనిలో ఆయన చెప్పిన విషయం, ఆయన పట్ల నాకున్న అవధుల్లేని అభిమానం వల్ల అనుకుంటా,  నా జీవితకాలంలో జరగదేమోనని అనిపిస్తూ ఉంటుంది! నా కాలమ్ ముగింపు కి ఇంత కంటే ఉచితమైన పాట కూడా ఇంకొకటిలేదేమో!

“కల ఔర్ ఆయేంగే నగ్మోంకే ఖిల్తీ కలియా చున్నేవాలే  (రేపు మరిన్ని కవితాపుష్పాలు వస్తాయి, ఏరుకోటానికి)

ముజ్హ్సే బెహ్తార్ కెహ్నే వాలే..తుమ్సే బెహ్తార్ సున్నేవాలే (నా కన్నా బాగా చెప్పకలిగే కవులొస్తారు..మీ కంటే మంచి శ్రోతలోస్తారు)

కల్ కోయీ ముజ్హ్కో యాద్ కరే..క్యోం కోయీ ముజ్హ్కో యాద్ కరే (రేపు నన్ను ఎవరైనా గుర్తుకుతెచ్చుకుంటారు.. అసలు నన్నెందుకు గుర్తుకుతెచ్చుకోవాలి?)

మస్రూఫ్ జమానా మేరె లియే..క్యోం వక్త్ అప్నా బర్బాద్ కరే? (ఈ తీరుబడి లేని ప్రపంచం…నా కోసం ఎందుకు తమ సమయం వ్యర్థం చేసుకోవాలి?)

మై పల్ దో పల్ కా షాయర్ హూ.. పల్ దో పల్ మేరీ కహానీ హై!” (నేను ఒకటి రెండు క్షణాల కవిని..ఒకటి రెండు క్షణాలదే నా కథ!)

http://www.youtube.com/watch?v=bI10wgbeXgc

Siva_3–   యాజి

 

 

 

 

శబ్దాల చుట్టూ రూపు కట్టిన అనుభవం “దూప”

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

సృజనావసరం (creative necessity) అనేదాన్ని ప్రేరేపించే అంశాలు రెండున్నాయి.1.సమాజం 2.స్వీయ జీవితం.మొదటిది నిబద్ద సృజనకి రెండవది తాత్విక కళాసృజనకి సంబందించినదని ఉరామరికగా చెప్పుకోవచ్చు.దానికి కారణం ఈరెంటి మూలంగా జరిగే సంఘర్షణ.ఇందులో సృజనకి ఉపయోగించే పరికరాల్లోనూ వైరుధ్యాలున్నాయి.వీటిని స్థూలంగా సంప్రదాయికాలు,ఆధునికాలు,వైయక్తికాలు అని విభజించవచ్చు.సంప్రదాయానికి శాస్త్రీయత,ఆధునికానికి దార్శనికత,వైయ్యక్తికంలో ఈరెంటినీ మేళవించి ఒక కొత్తదనాన్ని సాధన చేయటం కనిపిస్తుంది.ఈ శతాబ్దిఉత్తరార్థంలో సృజన సంబంధ అంశాలమీద “మనోఙ్ఞానిక భూమిక” ఒకటిచేరివ్యక్తి అంతశ్చేతనలో ఉండేఅనేకాంశాలని ఊతంగాచేసుకుని అభివ్యక్తిని పదును పెట్టింది.అభివ్యక్తి ధర్మాలు,ప్రవర్తనల గురించి  జరగాల్సిన చర్చలు,విశ్లేషణల విషయంలో విమర్శ కవిత్వం కన్నా వెనుకబడి పోయిందని అందరూ చెప్పుకునేదే.ఈమధ్యలో పదాలకుండే అర్థపరమైన ఉనికిని కొంత ప్రత్యేక దృష్టితో(బహుశః ఉపయోగార్థంతో సాహిత్యావసరాలు తీరక)అర్థపరంగా వైశాల్యాన్ని పెంచిన సంధర్భాలున్నాయి.ఈ విషయంలో భాషా శాస్త్ర పరిధిలో కొంత చర్చ తెలుగులో కనిపిస్తుంది కాని,సాహిత్య ముఖంగా అనుమానమే.అంగ్లంలో ఈ పనిని ఐ.ఏ.రిచర్డ్స్ చేసారు.తన మిత్రుడు c.k.ogdanతో కలిసి 1923 కాలంలో “The meaning of the meaning”అనే పుస్తకాన్ని రాసారు.శబ్దాలచుట్టూ రూపుకట్టిన అనుభవ సత్యాలుంటాయి.కవిత్వంలో కనిపించే ఇలాంటి శక్తిని ఎఫ్.ఆర్.లీవిస్ “The explanatory creative use of words upon experience” అన్నాడు.రవి వీరెల్లి తన అనుభవాన్ని వ్యక్తం చేయడానికి పదాలను మరమ్మత్తు చేసుకుని వాటి వైశాల్యాన్ని పెంచి ఉపయోగిస్తున్నారు.”దూప” సంపుటిలో కనిపించే ఆవృత్తి,దూపలాంటి అనేక పదాలు అలాంటివే.రవి వీరెల్లి కవిత్వంలో కొన్ని అంశాలను గమనించవచ్చు.
1.భౌతికతకి ఆంతరికతకి మధ్యన కనిపించే సంఘర్షణ.ఇందులో అనేక సార్లు ఒకే ప్రారంభాన్ని ఒకే ముగింపుని అనుభవిస్తారు.ఇలా రెంటిలోకి ప్రయాణిస్తారు.
2.తాననుభవించే వర్తమానంతోపాటు తనకు దూరంగా ఉండే వర్తమానాన్ని,దానికి మూలంగా ఉండే గతాన్ని అంతే సారవంతంగా అనుభవిస్తారు.
3.ఆధునికతని పులుముకుని వచ్చిన ప్రాంతీయ పదజాలం(preventialism),అర్థ పరంగా వైశాల్యాన్ని పెంచుకున్న పదాలు.వాటిలోంచి వెలువడే కళాధార్మికత-ఇవన్ని ప్రత్యేకంగా కనిపిస్తాయి.”ఊహు!ఆకారంలేని పదాలు/పద్యానికి పనికిరావు”-(ఏం రాస్తాం-42పే.)
“ప్రాణ స్థానం లోతుల్నించి/పదాలు తోడి మనో ఫలకం పై చిలుకరిస్తూ/నీకు నువ్వే మేలుకొల్పు పాడుకో”-(పైదే)ఈ అసంతృప్తినించే పదాల కొత్త జీవాన్ని అన్వేషిస్తారు.ఇందుకోసం రవి పొందే అనుభవాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి.ఎడ్వర్డ్ బుల్లో Physical Distence(భౌతికాంతరత)ను ప్రతిపాదించాడు.రసానుభూతిలో ఉన్నప్పుడు ఉపయోగంతో పెద్దగా సంబంధం ఉండదు.వర్షంలో తడుస్తూ దానివల్ల కలిగే బాధనుమరిచి దాన్ననుభవించడమే రసమయస్థితి.ఈ స్థితిలో రవి తనకు కావల్సినదాన్ని వెదుక్కుంటారు.295408_3506269936822_51199068_n“కళ్లు పగిలి/ఎప్పుడు భళ్లున తెల్లరిందో/కొత్త రెక్కలతో అస్తిత్వపు మూలాలు వెదుక్కుంటూ/తిరిగి విశ్వాంతరాల్లోకి నేను”-(ఆవృత్తి-18పే)
“ఓరోజు చెట్టుకు నిప్పంటుకుంది/ఆ అగ్నికీలల గర్భంలో దాగిన/గూడును వెదుక్కుంటూ/తిరిగి వెళుతున్న ఆత్మని చూస్తూ/బూడిదై/నేను”-(విముక్తి-13పే.)

నిర్దిష్టంగా రవి అనుభవిస్తున్నదిదే.గమనించాల్సిన మరో అంశం అభివ్యక్తిలో నున్న సౌందర్యారాధన.ఈ సౌందర్యం కోసం మళ్లీ మళ్లీ ఆలోచనలు చేస్తారు.సంజీవదేవ్ సౌందర్య వివేచనలో రససిద్దిని గురించి ఉటంకించారు.ప్రకృతివస్తువులోని భౌతికాన్ని,తాత్వికాన్ని కాకుండా భౌతిక కాంతిలో మెరిసే తాత్విక ధారని అనుభవించడం “రస సిద్ది”.ఇది తాత్విక స్థాయికంటే సౌందర్యాత్మకమయింది.భౌతికాంతరతలోని రసదృష్టిని రవి ఈదృష్టితోనే అనుభవిస్తారు.అందువల్లే రవిలో కొన్ని సార్లు సంఘర్షణ,మరికొన్ని సార్లు సౌందర్యం కనిపిస్తాయి.సంఘర్షణని చిత్రిస్తున్నప్పుడు కర్మ,ఆవృత్తి,నశ్వరం,ఆత్మ లాంటి ఒక అర్థ క్షేత్రానికి చెందిన పదాలవల్ల కొన్ని వాక్యాలు వేదాంతాన్ని పులుముకున్నాయి.

“నువ్వు చేస్తున్న కర్మల్లో/కోల్పోయిన నాఉనికిని శోధిస్తూ/
గుండే తడారిపోయి/తపిస్తున్న అస్తిత్వాన్ని”-(నాలో నేను-14పే.)

ఈకవిత్వంలో చాలాసార్లు ఉదయపు వర్ణనలున్నాయి.తన దృష్టికి దగ్గరగా ఉండటం వల్లేమో వీటి సంఖ్య ఎక్కువ.ఇందులోనూ సౌందర్యం ఎక్కువ కనిపించినా తత్వదృష్టే ప్రధానమైనది.

“వెలుగు చోరబడని/చర్మపు గోడలలోపల చిక్కుపడ్డ/ఓ చీకటి మూటను విప్పుతూ/ఒంటరిగా నేను”-(శోధన-17పే.)

“పడమటి కొండల్లో కోసిన/వెలుగుపంటే/తూర్పు కల్లంలో పైకెత్తి తూర్పాలపడుతూ/సూర్యుడు”-(నేను ఉదయం-30పే.)

“పక్క పొర్లించి పొర్లించి/అప్పుడే నిద్ర లేచిన పుడమికి/
తూర్పుకొళాయి వెలుగు నీళ్లతో/శ్రద్ధగా లాలపోస్తుంది”-(కాలం చివర-32పే.)

“తూరుపు తల్లి రెక్కల కింద/విదిగిన వోవెలుగు పిల్ల/
తల చిట్లిస్తూ/అరమూసిన కళ్లలో అప్పుడే నిద్ర లేసినట్టుంది”-(కాలంకింది గూడు-38పే.)

“దివికి భువికి మధ్య దూరన్నికొలుస్తూ/ఓ వెలుగు కిరణం
విచ్చుకుంటుంది/ఓ చీకటి ముద్ద ముదుచుకుంటుంది”-(కొలమానం-61పే.)

చీకటికొసలు వొడిసిపట్టి/కొలన్లో వుతికి/నేలపై అక్కడక్కద ఆరేస్తూ వెయ్యి/వెలుగు చేతులు”-(ఖాలీతనం-63పే.)

“కొండ రాళ్లను పెల్క్లగించుకుని/వొళ్లంతా మండుతున్న ఎర్రటి గాయాల కళ్లతో/పొద్దు పొడుస్తావు”-(ఇగవటు సూరన్న-67పే.)

“నేలంతా సీసం పోసినట్లు/వెలుగు ఫెళ్లున పగులుతుంది”_(ఇక్కడ- 69పే)

అన్ని వాక్యాల్లోనూ వెలుగు పట్ల ఓ సంఘర్షణ కనిపిస్తుంది.”చిక్కుపడటం,తూర్పాలపట్టదం,పొర్లించడం,తల్ అచిట్లించడం,ముడుచుకోవడం,వొడిసిపట్టడం,పెల్లగించడం.ఫెళ్లున పగలడం”లో ఇది వ్యక్తమౌతూ వుంటుంది.భౌతికంగా తెర మాటున తచ్చాడుతూ ఏదో ఆత్మిక సంపదని వెలిగక్కుతారు.రవి వీరెల్లి భాషలో రెండు భాషారూపాలున్నాయి.ఒకటి చాలాతక్కువగ కనిపించే వేదాంత పరిభాష.రెండవది జీవత్వం సంచలించే తెలంగాణా భాష.పరకాయించి,కల్లం,చూరు,మండి,ఓనగాయలు,మోడువారటం,పెయ్యి,పైలంగా,అలపటదాపట,సవారి కచ్చురాలు లాంటివి మరికొన్ని ఎత్తి రాయొచ్చు.

 

రవివీరెల్లి కవిత్వం వెనుక నిర్దిష్టమైన సాధన కనిపిస్తుంది.కవిత్వం కోసం కుదుర్చుకున్న చూపు,పట్టుకున్న పరికరాలే రవి వీరెల్లిని ప్రత్యేకంగాచూపుతాయి.

“దేవదాసు” ఇంకో ప్రేమ కథ కాదు!

మరునాడు పొద్దుటే ఆ వీరజనులు తమ తమ లోకాలకు వెళ్లడానికి గంగానదిలోకి ప్రవేశించారు. అప్పుడు వ్యాసుడు తను కూడా గంగలో మునిగి, తమ భర్తను అనుసరించి వెళ్లదలచుకున్నవారు గంగలోకి దిగండని వీరుల భార్యలతో అన్నాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ధర్మరాజుల అనుమతి తీసుకుని వారు గంగలో మునిగారు. మనుష్యదేహం వదిలేసి, దివ్యదేహం ధరించి, దివ్యాలంకారాలతో భర్తను కలుసుకున్నారు. ఈ విశేషాన్ని చూసిన జనం ఆశ్చర్యానందాలు చెందారు.

                                                           -(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆశ్రమవాసపర్వం, ద్వితీయాశ్వాసం)

కురుక్షేత్ర యుద్ధానంతరం ఒకరోజు, చనిపోయిన వీరులను వ్యాసుడు తన మహిమతో భూలోకానికి రప్పించాడు. వారు తమ భార్యలతో, బంధుమిత్రులతో రోజంతా ఆనందంగా గడిపిన తర్వాత తమ లోకాలకు తిరిగి వెళ్లడానికి గంగలో మునిగారు. మీరు కూడా భర్తతో వెళ్లదలచుకుంటే గంగలోకి దిగండని వీరుల భార్యలతో వ్యాసుడు అన్నాడు. వారు అలాగే చేశారు. దీనిని సహగమనం అనాలో, అనకూడదో మీ ఊహకే వదిలేస్తాను. అక్కడినుంచి బయలుదేరి మన కాలానికి వద్దాం.

***

శరత్ సాహిత్యం నేను ఎక్కువగా చదవలేదు. ఏవో కొన్ని నవలలు, అది కూడా చిన్నతనంలో చదివాను. చదవాలనే కోరిక మాత్రం ఉండేది. కానీ వృత్తిపరమైన కారణాల వల్ల తగిన తీరిక దొరకలేదు. క్రమంగా నా అధ్యయన ఆసక్తులు మారడం వల్ల కూడా ఆ వైపు దృష్టి పెట్టలేకపోయాను. రేపటి సంగతి చెప్పలేను.

అయితే, శరత్ నవల ఆధారంగా తీసిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. ఇన్నేళ్లలో ఆ సినిమా మీద సమీక్షలూ, స్పందనలూ చాలానే వచ్చి ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఒక సన్నివేశాన్ని మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అదే నా ఆలోచనలను నీడలా వెంటాడుతూ ఉంటుంది. అది నాలో విషాద విభ్రమాలు కలగలసిన ఒక విచిత్రానుభూతిని నింపుతూ ఉంటుంది. నిజానికి ఆ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, దర్శకుడుగా గొప్ప పేరున్న వ్యక్తి కాదు. కానీ ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా పండించినందుకు  ఆయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి ఆయువుపట్టు. శరత్ హృదయమంతా అందులోనే నిక్షిప్తమైనట్టు అనిపిస్తుంది. సినిమా చివరిలో వచ్చే ఈ సన్నివేశమే నా అంచనాలో పతాకసన్నివేశం.

ఇదీ ఆ సన్నివేశం…దేవదాసు తన అంతిమ క్షణాలలో పార్వతి అత్తవారి ఊరు చేరుకుంటాడు. బండివాడు అతనిని పార్వతి ఇంటి అరుగు మీదికి చేరుస్తాడు. ఈ సంగతి తెలిసిన పార్వతి అతణ్ణి కలుసుకోడానికి మేడ మీదినుంచి పరుగు పరుగున కిందికి బయలుదేరుతుంది. అప్పుడు “తలుపులు మూసేయండి” అనే గావుకేక వినిపిస్తుంది. అది ఆమె జమీందారు మొగుడి గొంతు. భళ్ళున తలుపులు మూసుకుంటాయి. అప్రమత్తుడైన పార్వతి సవతి కొడుకు “వద్దు, వద్దమ్మా” అని బతిమాలుతూ ఆమెకు మెట్టు మెట్టునా అడ్డుపడతాడు. వినిపించుకోని పార్వతి మెట్లు దిగే తొందరలో దొర్లిపడి తలకు గాయమై ప్రాణాలు కోల్పోతుంది. అదే సమయంలో, వీధి అరుగుమీద పడున్న దేవదాసు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి.

410757

జ్ఞాపకం మీద ఆధారపడి ఈ సన్నివేశం గురించి రాశాను. కొన్ని వివరాలు, వాస్తవాలు తప్పిపోయి ఉండచ్చు. అయితే, పార్వతి దేవదాసును కలసుకోడానికి పరుగు పెట్టడం, భర్త “తలుపులు మూసేయండి” అని గావుకేక పెట్టడం, సవతి కొడుకు బతిమాలుతూ అడ్డుపడడం-ఇవే ఈ సన్నివేశంలో కీలకాలు. ఇద్దరు ప్రేమికులూ ఒకే క్షణంలో కన్నుమూసే ఈ ఘట్టంలో సినిమా అనూహ్యమైన ఉరవడిని, నాటకీయతను తెచ్చుకుని; ఉధృతంగా దూకే జలపాతం మధ్యలోనే స్తంభించిపోయినట్టుగా ఒక్కసారిగా ముగిసిపోతుంది.

ఈ మొత్తం సన్నివేశం ప్రతీకాత్మకం. దీని వెనుక పందొమ్మిదీ, అంతకు ముందు శతాబ్దాలకు చెందిన కరడుగట్టిన బెంగాల్ సాంప్రదాయిక సమాజపు అభివ్యక్తి మొత్తం ఉంది. ముసలి భర్త పార్వతి పట్ల దయ, సౌజన్యం ఉన్నవాడే. కానీ “తలుపులు మూసేయండి” అనే అతని గావుకేకలో నాటి కులీన సమాజపు కర్కశత్వం చెవులు హోరెత్తేలా ప్రతిధ్వనిస్తుంది. “తలుపులు మూసేయండి” అనే ఆ పెనుకేకలో, ఇంటి గౌరవ మర్యాదలనే గుండెలమీది కుంపటిని మౌనంగా, పంటిబిగువున మోయడం తప్ప స్త్రీకి మరో జీవితం లేదన్న చండశాసనం ఉంది.

సవతి కొడుకు కూడా పార్వతి పై భక్తి, మర్యాద, గౌరవం ఉన్నవాడే. కానీ తండ్రి కులీన వ్యవస్థా కాఠిన్యానికి కూడా అతను వారసుడు. కనుక సవతి తల్లిని సగౌరవంగానే కట్టడి చేయక తప్పదు.

ఈనాటికీ దేవదాసు సినిమాపై స్పందనలు, వ్యాసాలు కంటబడినప్పుడల్లా ఈ సన్నివేశ ప్రాముఖ్యం గురించి ఎవరైనా రాసారా అని ఆశగా వెతుకుతూ ఉంటాను. నాకైతే ఒక్కరూ కనిపించలేదు. నా కంటబడనివీ ఉండచ్చని ఒప్పుకుంటున్నాను.

దేవదాసు ఒక మామూలు ప్రేమకథ కాదు. సినిమా వంటశాలలో వండి వార్చే రొటీను ప్రేమకథ అసలే కాదు. దేవదాసు ఒకనాటి సమాజపు విషాదాంత భీభత్స చరిత్ర. అందులోనూ ఆ సమాజాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించిన చరిత్ర. నలుపు-తెలుపులు ఆ కథలో విడదీయలేని పాత్రలు. నలుపు-తెలుపుల నేపథ్యంలోనే ఆ సినిమా చూడాలి. ఒక చరిత్రకారుడి చూపుతోనూ చూడాలి. అప్పుడే ఆ సినిమాకు న్యాయం జరుగుతుంది. ఆమధ్య రంగుల్లో అట్టహాసంగా దేవదాసు సినిమాను పునర్నిర్మించినప్పుడు ఆ అఘాయిత్యాన్నీ, అపచారాన్నీ, నీచాభిరుచినీ ఎవరైనా ప్రశ్నించారో లేదో తెలియదు. టీవీలో ఆ సినిమా ప్రసారమవుతున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున కంటబడితే టీవీ కట్టేసి బ్లాక్ అండ్ వైట్ దేవదాసు దర్శనానుభూతిని కాపాడుకోవడం నేను అదృష్టంగా భావిస్తాను.

ఇప్పుడిక అసలు విషయానికి వస్తాను. ఈ వ్యాసపరంపరలో కోశాంబి తదితరులతోపాటు తరచు ప్రస్తావనకు రాబోతున్న పురామానవ చరిత్రకారులలో రాంభట్ల కృష్ణమూర్తి ఒకరు. నిజానికి రాంభట్లవారిని with a bang ప్రవేశపెట్టాలని నేను కొన్ని రోజులుగా ప్రణాళిక వేసుకుంటున్నాను. కానీ నా ప్రణాళిక తలకిందులై ఇప్పుడే ప్రవేశపెట్టాల్సి వస్తోంది. అప్పుడప్పుడు, మనం ఒకటి తలిస్తే మన కలం (ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్ అనాలి కాబోలు)ఇంకొకటి తలుస్తుంది.

రాంభట్లవారిని తరచు కలసుకుని గంటల తరబడి ఆయన చెప్పే విషయాలు వినే మహదవకాశం నాకు కలిగింది. ఆ వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, అనేక విశేషాలతోపాటు ఒకనాటి బెంగాల్ కులీన సమాజం గురించీ, శరత్ సాహిత్యం గురించీ, శరత్ సాహిత్యం  తెలుగులోకి తర్జుమా అయిన నేపథ్యం గురించీ ఎన్నో ఆసక్తికర వివరాలు ఆయన చెబుతుండేవారు. నాకు తెలిసినంతవరకు వాటిని ఆయన కాగితం మీద పెట్టినట్టు లేదు.  కాగితం మీద పెట్టే ఆయన సమాచారానికి కొంత మండించే స్వభావం ఉంది. బెంగాల్ కులీన సమాజం గురించి తను చెప్పేవి కూడా అటువంటివేననుకుని వాటిని నోటికే పరిమితం చేసుకున్నారేమో తెలియదు. నా విషయానికి వస్తే, ముందు చూపు లోపించడం వల్ల ఆయన చెప్పిన అనేక విషయాలను నేను కూడా భద్రపరచలేకపోయాను. అందుకు ఇప్పుడు విచారిస్తున్నాను.

నాకు గుర్తున్నంతవరకు ఆయన చెప్పినవి క్రోడీకరిస్తే… నాటి బెంగాల్ సమాజంలో కొన్ని కులీన కుటుంబాలు ఉండేవి. ప్రతి ఆడపిల్ల తండ్రీ కూతురిని కులీనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తహ తహ లాడేవాడు.  ఎక్కడో దూరంగా ఉండే ఆ కులీన వరుడికి అప్పటికే ఎన్నో పెళ్లిళ్లు అయుంటాయి. అయినా అభ్యంతరం లేదు. అతను అప్పటికే కాటికి కాళ్ళు చాచే వయసులో ఉంటాడు. అయినా అభ్యంతరం లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, అతడు సాధారణంగా పెళ్లి మంటపానికి వచ్చి స్వయంగా తాళి కట్టడు. అయినా అభ్యంతరం లేదు. ఆడపిల్ల తండ్రి వరుని కలుసుకుని పెళ్ళికి అనుమతి తెచ్చుకుంటాడు. వరుని పరోక్షంలో పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి తర్వాత ఒక్కసారైనా అల్లుడు అత్తింటికి రాకపోతే ఎలా? ముఖ్యంగా శోభనానికైనా రావాలి కదా?! కనుక, అల్లుడు తన ‘ప్రతినిధి’గా ఒక యువకునికి తగినంత ‘కిరాయి’ ఇచ్చి పంపిస్తాడు. ఆ యువకుడు ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అల్లుడి పాత్ర పోషిస్తూ మూడు రోజులు గడిపి వెళ్ళిపోతాడు.

ఒక్కోసారి కథ మరోలా కూడా పరిణమిస్తుంది. ఆ అమ్మాయి కిరాయి అల్లుడినే భర్తగా భావించి అతనిపై మనసు పడుతుంది. ఆ యువకుడి నుంచి  అనుకూల స్పందన వస్తే ఇద్దరూ కూడబలుక్కుని వెళ్లిపోతారు. అయితే, ఎక్కడికి వెళ్ళినా సమాజం వేటకుక్క లా తరుముతూనే ఉంటుంది కనుక వారు బతికి బట్ట కట్టడం కష్టం. దాంతో ఇద్దరూ మతం మారిపోతారు.

దీనికితోడు, ఒక ముస్లిం మతస్తుని చేయి పొరపాటున తగిలినా చాలు, ఆ స్త్రీని నాటి సమాజం వెలి వేసేది. దాంతో ఆమె మతం మారి మనుగడను కాపాడుకోవడం అనివార్యం అయ్యేది. బెంగాల్ లో ముస్లిం జనాభా పెరగడానికి ఇటువంటివన్నీ దోహదం అయ్యాయని రాంభట్ల అనేవారు. దరిమిలా నాటి ఆంగ్లేయ పాలకులు బెంగాల్ విభజన ఆలోచన చేయడం, తూర్పు బెంగాల్ ఏర్పడడం, ఆ తర్వాత అదే బంగ్లాదేశ్ గా అవతరించడం చరిత్ర. మతవిశ్వాసం, లేదా ఛాందసం చరిత్రను తిప్పిన మలుపుకు ఇదొక ఉదాహరణ.

ఒళ్ళు జలదరింపజేసే మరిన్ని దారుణాలు రాంభట్ల వారి కథనంలో దొర్లుతూ ఉండేవి. బెంగాల్ సమాజంలో  వితంతువుల సంఖ్య విపరీతంగా ఉండేది. వారి పోషణ తలకు మించిన భారమయ్యేది. యాత్ర పేరుతో వారిని కాశీకి తీసుకెళ్ళేవారు. పడవ ఎక్కించి గంగ నడిమధ్యకు తీసుకెళ్లి నీళ్ళలోకి తోసేసేవారు! గంగమ్మ తల్లి అలా వితంతువులను తన ఒళ్లోకి తీసుకుని శాశ్వతంగా నిద్రపుచ్చే ప్రక్రియ మహాభారతకాలం నాటికే ఉందనుకుంటే, అది ఇటీవలి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉందనుకోవాలి.  కాశీ, బృందావనాలు నేటికీ ఎందరో వితంతువులకు అంతిమగమ్యాలు కావడం తెలిసినదే.

saratchandra

బెంగాల్ సమాజంలో ఇలా అన్నివిధాలా అన్యాయమైపోయి దిక్కుమాలిన జీవితం గడిపే స్త్రీలో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా సాహిత్యసృష్టి చేసినవాడు శరత్. రాంభట్ల ప్రకారం, తెలుగునాట కూడా, మోతాదు తేడాలో అటువంటి పరిస్థితులే ఉండేవి. శరత్ సాహిత్యం తెలుగులోకి తర్జుమా అవడానికి అదీ నేపథ్యం. ఆ కృషికి ప్రధానంగా ఇద్దరు దంపతులు కంకణ కట్టుకున్నారు. వారు: బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవి. “మో”గా మనందరికీ తెలిసిన కవి వేగుంట మోహన ప్రసాద్, నేను విన్నంతవరకు, వీరి అల్లుడు. నా చిన్నప్పుడు విజయవాడలో విజయా టాకీస్ పక్క సందులోంచి సత్యనారాయణపురం వెడుతుంటే వంతెనకు ఇవతల కుడి పక్కన ఒక గేటుకు “దేశి కవితా ప్రచురణలు” అనే బోర్డ్ వేలాడుతూ ఉండేది. అదే బొందలపాటివారి నివాసం అనుకుంటాను.

మోసపోయో, మరో విధంగానో కాలుజారిన ఆడపిల్లలు ఆ రోజుల్లో కాలువలో పడి ఆత్మహత్య చేసుకునేవారు. వారిని కాపాడే కర్తవ్యాన్ని ఆ రోజుల్లో ఒక ప్రముఖ రచయిత కొంతకాలం మీద వేసుకున్నాడు. ఆయన గుడిపాటి వెంకటచలం. విజయవాడలో ఉన్న రోజుల్లో ఆయన మరికొందరితో కలసి రాత్రిళ్ళు కళ్ళు కాగడాలు చేసుకుని కాలువ గట్టున మకాం పెట్టేవాడు. అంతా కలసి ఆడపిల్లల్ని ఆఘాయిత్యం నుంచి ఒడ్డెక్కించేవాళ్లు. చలంగారి వదిన డా. రంగనాయకమ్మగారు వారిని తన దగ్గర ఉంచుకుని వైద్యసేవలు అందించేవారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో విజయవాడ ప్రముఖుని పేరు కూడా రాంభట్ల వారు చెబుతుండేవారు. దురదృష్టవశాత్తూ ఆ పేరు నేను మరచిపోయాను.

 

యెమ్టీ ఫెలో

sasisri

తెలుగునాట నిబద్ద కథారచయితల్లో శశిశ్రీ ముఖ్యులు. కడప జిల్లాకు చెందిన శశిశ్రీ 1976 నుంచి కథా రచనే కాకుండా కవిత్వం, సాహిత్య  విమర్శ వ్యాసాలు, ఆకాశవాణి నాటికలు రచిస్తున్నారు.  శశిశ్రీ అసలు పేరు షేక్ బెఫారి రహమతుల్లా. ఈయన 1973 ప్రాంతంలోనే “మనో రంజని” లిఖిత మాస పత్రిక నడిపి ఆనాటి యువతరం లో స్పూర్తిని రగిలించారు. 1995 నుంచి  “సాహిత్య నేత్రం” పత్రికని తన ప్రధాన సంపాదకత్వంలో నిర్వహిస్తున్నారు.  ప్రతిష్టాత్మక “యునిసెఫ్ అవార్డు” తో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. “దహేజ్” , “రాతిలో తేమ” వీరి కథా సంపుటాలు. దాదాపు 16 పుస్తకాలను రచించారు.  ప్రస్తుతం కడపలో  సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.–వేంపల్లె షరీఫ్

***

నెల నెలా వేల రూపాయిలందించే గంగిగోవులాంటి అసిస్టెంటు ప్రొఫెసర్‌ ఉద్యోగం వదులుకోవాలనుకున్నాడు ఆనందం.

ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే రాజీనామా చేయాల్సి వస్తుందని అతను యెంత మాత్రం ఊహించలేదు. అలా విడిచి పెట్టాల్సి వస్తుందంటే ఆ అసిస్టెంటు ప్రొఫెసర్‌ పోస్టుకు అప్లికేషన్‌నే పెట్టేవాడు కాదు. పోటీ ఉందని తెలిసినప్పుడే జిల్లా మంత్రితో గట్టిగా సిఫార్సు చేయించే వాడుకాదు.

సిఫార్సులకేం కొదువ-పోటీలో ముఖ్యమంత్రి పేషీ నించే వైస్‌ఛాన్సలర్‌కు ఫోన్‌ చేయించాడు. ఆ నాటి పరిస్థితి అదైనప్పుడు ఆ ఉద్యోగం ఖచ్చితంగా తనకే దక్కాలని ఆరాటపడినాడు ఆనందం. అప్పుడు వైస్‌ఛాన్స్‌లర్‌ శిష్యుడు వీరయ్యను కలుసుకొని యిచ్చుకోవాల్సింది యిచ్చుకుంటే పోస్టు వస్తుందని యెవరో చెప్పారు. చివరికి ఆ వీరయ్యను పట్టుకుని- పది ‘ల’కారాలు సమర్పించుకున్నాడు ఆనందం.

ముప్పయ్‌ యేళ్ళ పాడికోసం ఆ మాత్రం పెట్టుబడి పెట్టడం తప్పేకాదని వీరయ్య ఆనందానికి చెప్పినాడు. దీనితో తాను సార్థకనామ ధేయుడ్ని అయ్యానని సంతోషించాడు.

ఉద్యోగంలో చేరగానే యుజిసి స్కేళ్ళు పెరిగాయి. కలిసి వచ్చే అదృష్టం అంటే యిదేననుకున్నాడు. నెల నెలా వేలకు వేలు సంవత్సరానికి… ఓ మంచి సంపాదనే!!  ఆ ఊహే ఆనంద్‌కు తన స్థాయి యెంత యెదిగిపోతుందో అర్థమై మురిసిపోయాడు.

యూనివర్శిటీ కాంపస్‌లో లక్షకు ఒకటి వచ్చే నానో కార్లు చూసి – తానూ ఒకటి తీసుకోవాలనుకున్నాడు. నలుగురితో పాటు నారాయణ అయిపోతే యెట్టా? ప్రత్యేకత ఉండాలి కదా అనుకున్నాడు. అప్పుడే తన ఆలోచనల్లో ప్రత్యేకత అనేది ఒకటి చోటు చేసుకుంటోందని గ్రహించాడు. ఫలితంగా ఆరులక్షల కారు కొని – కాంపస్‌లో పార్క్‌ చేసినాడు. నలుగురి కంట్లో తాను యేమిటో తన ప్రత్యేకత యేమిటో ఫస్ట్‌ ఎంట్రీలోనే నిరూపించుకున్నాడు ఆనందం.

కానీ, ఇవన్నీ ఉద్యోగం వచ్చిన కొత్తలో ఆనందంలోని ఆలోచనలు. ఇప్పుడు ఈరోజు అంతే భిన్నంగా ఆలోచించసాగాడు.

తన రాజీనామా రిజిస్ట్రార్‌కు ఇచ్చి,  వైస్‌ఛాన్స్‌లర్‌ దృష్టికి తీసుకెళ్ళి రిలీవ్‌ చేయమన్నాడు. రిజిస్ట్రార్‌ గోపాలయ్య దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఆలోచించుకుని వారం రోజుల తరువాత చెప్పమన్నాడు. అమెరికాలో జరిగే సెమినార్‌ నుంచి వీసీ రావడానికి వారం గడువుందని – అందాక ఓపికతో నిలకడగా ఆలోచించి చివరి నిర్ణయం తెల్పమన్నాడు.

ఆనందం మాత్రం తాను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని తదుపరి చర్యలు తీసుకుని రిలీవ్‌ చేస్తే అదే సాయం అవుతుందని చెప్పి – మరో ఆస్కారం రిజిస్ట్రార్‌కు యివ్వకుండా ఆయన చాంబర్‌లోంచి బయటికొచ్చాడు.

వెయ్యి యెకరాలలో ఆకాశం అంటే భవనాలు… రకరకాల పేర్లతో యేర్పాటైన ఆకుపచ్చని ల్యాండ్‌ స్కేప్‌లు… చెట్లూ… ఆర్చీలు… డా. రాజశేఖర్‌రెడ్డి, అన్నమయ్య, వేమన, అంబేద్కర్‌, సివిరామన్‌ విగ్రహాలు… చూస్తూ తన కారులో క్యాంపస్‌ బయటికి వస్తున్న ఆనందం – యెందుకో బొటానికల్‌ గార్డెన్‌వైపు కారును మలుపు తిప్పాడు.  అక్కడైతే ఆ రాక్‌పాండ్‌ దగ్గర, తెలుగుతల్లి విగ్రహం దగ్గర వున్న చిన్నపాండ్‌లో హాయిగా అటు ఇటూ ఈదుతున్న రంగురంగుల చేపల్ని చూస్తూ కొంత ఉపశమనం పొందాలనుకున్నాడు ఆనందం. అక్కడ రోజుకు అరగంట సేపైనా గడపడం ఆనందంకు ఇష్టమైన అలవాటే. ఆ అరగంట అక్కడ గడిపితే చాలు – యెంతో ఉల్లాసం, ఉత్సాహం శరీరం అంతా నిండి తాను ఎన్‌రిచ్‌ అయినట్లు, రీచార్జ్‌ అయినట్లు అనుభూతించేవాడు.

ఇప్పుడు మాత్రం అందుకోసం కాదు- ఎవరూ రాని అక్కడ – ఎవరూ గమనించని అక్కడ తనివితీరా గట్టిగా యేడ్చేయాలని వచ్చాడు ఆనందం. నలుగురి ముందు యేడ్చడం నాగరికతకాదు. ఒంటరిగా స్వేచ్ఛగా – తృప్తి మీర-మనసులోని కల్మషమంతా కన్నీటి రూపంలో బయటపడిపోయేదాక యేడ్వాలనే వచ్చాడు ఆనందం.

కారుదిగి, రంగు రంగుల చిన్ని చేపలున్న ఆ చిన్న కొలను దగ్గర- కదలకుండ ఒకదానికి యింగొకటి అంటిపెట్టుకొని వున్న ఆ గుండ్రాళ్ళ పైన కూర్చోడానికి వేసిన కాంక్రీటు దిమ్మెమీద కూర్చున్నాడు ఆనందం.

రంగురంగుల చేపలు – కళ్ళు – నోళ్ళు తెరిచి ఆనందాన్ని చూశాయి. యేదో అర్థమై గబుక్కున దూరంగా పోతున్నాయి. మళ్ళీ మెల్లిగా వస్తున్నాయ్‌. ఎవరో ఆ కొలనులో బొరుగులు (మర్మరాలు), పప్పులు చల్లినారు.  అవి నీటిపై తేలుతున్నాయ్‌. చేపలు మూతులు సాచి చటుక్కున నోట పట్టుకుని సర్రున వెళ్తున్నాయి. మళ్ళీ వస్తున్నాయి. నోట పట్టుకుని సర్రున పోతూనే వున్నాయ్‌.

చేపలపై నుంచి దృష్టి పైకి మరల్చినాడు ఆనందం. అందమైన గ్రీకు యువతి తన చంకలోని కడవలోంచి నీరు ఆ కొలనులోకి వొంపుతోంది. కడవలోంచి కొలనులోకి నీరు నెమ్మదిగా పడేట్లు యేర్పాటుచేశారు. నీళ్ళు కడవతో వొంపుతున్న ఆ గ్రీకు యువతి తన నీలికళ్ళతో ప్రశాంతంగా పలకరించినట్లు అనుభూతించాడు- ఆనందం.

ఆనందానికి బాధతో కాదు- పశ్చాతాపంతోను ప్రాయశ్చిత్యంతోను రెండుకండ్లలో రెండు ధారలు ఉబికి చెంపలపై నుంచి జారాయి. మీసాలు పై నించి పైపెదవినించి మెల్లిగా నోటిలోకి వెళ్తున్నాయ్‌. కన్నీటి రుచి – ఉప్పగా నాలుకకు తగిలింది. తన కన్నీరు అందరి కన్నీటి మాదిరే ఉప్పగా ఉండటం ఆశ్చర్యమేసింది. ఆశ్చర్యం యెందుకంటే తాను చేసిన పనికి తన కన్నీరు చేదుగా వుండాల్సింది కదా అనుకున్నాడు. చేదుగా ఉండి ఉంటే కొంత తృప్తిగా ఉండేది. ఆ ఆలోచన నోరు అర్థం చేసుకున్నదానిలా వుంది. నోరంతా చేదుగా తోచింది  ఆనందానికి. నోరు చేదెక్కడం అంటే ఇదేనేమో అనుకున్నాడు.

తాను ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం కోసం యింతగా దిగజారాల్సి వుండకూడదేమో! ఒక వేశ్య దగ్గరికి ఎవడు పోతాడో వాడు ఒక్కడే చెడిపోతాడు.  కానీ తను!? తన దగ్గర చదువుకునే ముప్పయ్‌ మంది పిల్లలు చెడిపోతారు. ఈ లెక్కా తప్పే!! ఎందుకంటే ఎంతలేదన్నా తను ముప్పయ్‌ యేళ్ళు కదా సర్వీసు చేయాల్సింది? ఆ ముప్పయ్‌ యేళ్ళలో యెందరెందరు చెడిపోతారో… ఎందరెందరి భవిష్యత్తులు నాశనమైపోతాయో?

ఒక్క వేస్టు ఫెలోని… ఒక ఎమ్టీ ఫెలోని అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌గా తీసుకుంటే ముప్పయ్‌ యేళ్ళ సుదర్ఘీకాలం యూనివర్శిటీ చెడిపోవడమేకదా. ముప్పయ్‌ యేళ్ళ పాటు ఒక ”నీచ్‌ కమీనే కుత్తే”ను భరించడమే కదా అనుకున్నాడు ఆనందం.

అసలు ఈ ఆలోచన తనకు ముందుగా ఎందుకు రాలేదని కుమిలిపోయాడు. ఎంతసేపు తన భవిష్యత్తు గురించే ఆలోచించినాడే కానీ, తను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులో చేరిన తరువాత యెందరెందరి  భవిష్యత్తు తన  చేతిలో వుంటుందనే విషయం యెందుకు ఆలోచించలేదని పొరలి పొరలి దుఃఖం ముంచుకొచ్చింది ఆనంద్‌కు.

ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే తనవల్ల జరిగే తప్పు ఏమిటో తనకు తెలిసిరావడం కూడా ఒక వరమే! అదృష్టమే!! కాదు కాదు తన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కొద్ది ప్రాయశ్చిత్యం చేసుకునే అవకాశం దొరికిందనుకున్నాడు ఆనంద్‌ చెంపలపై కన్నీటిని చేతులతోనే తుడుచుకుంటూ.

జేబులోంచి రుమాలు తీసుకొని కళ్ళు  వత్తుకోవచ్చు కానీ, ఆ కన్నీరు… ఆ కన్నీటిలో కరిగి వెలకివస్తున్న, చేసిన తప్పు తాలూకూ సూక్ష్మ అణువులు సరాసరి చేతులకు తాకనీ అనుకున్నాడు. ఈ చేతులు ఇక మీదట జీవితకాలం మళ్ళీ ఆ తప్పు చేయవు? కదా అనుకున్నాడు.

ఈ చేతుల్తోనే కదా టెన్తు నుండి పీజీ వరకు పీజీ నుండి పిహెచ్‌డి వరకు మొత్తం  అడ్డుదారుల్లో సంపాదించాను. ఈ చేతుల్తోనే కదా డబ్బులు యిచ్చి చదువు కొనుక్కున్నాను. ఈ చేతుల్తోనే కదా ఆ వీరయ్య ద్వారా పది లకారాలు లంచం ఇచ్చాను. ఈ చేతుల్తోనే కదా యెవరికి సిఫార్సు చేయాల్నో స్లిప్పులురాసి మంత్రికి, మంత్రి పిఎకు ఇచ్చాను. ఈ చేతుల్తోనే  కదా ఫోన్‌ నెంబరు నొక్కి మొబయిల్‌ ఫోన్‌ని మంత్రికి ఇచ్చాను. ఈ చేతుల్తోనే కదా మంత్రికి దండాలు పెట్టాను. ఈ చేతుల్తోనే కదా సిఫార్సు లెటరు మోసుకెళ్ళి – మద్రాసులో మకాంలో ఉండిన ఈ వీసీ కిచ్చాను. అని అనుకొనే కొద్ది ఆనందంకు కన్నీరు వస్తూనే ఉంది. ఎంతెంతగా కన్నీరు బయటికొస్తుంటే అంతగా మనసు తేలిక అవుతున్నట్లు అనుభూతిస్తున్నాడు ఆనందం.

మెదడుపొరల్లోంచి ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకోసం తాను చేసిన తప్పులన్నీ ఒకటొకటి వెలికి వస్తుంటే కళ్ళు వెలికి వూసేస్తున్నాయ్‌ – అనుకున్నాడు ఆనందం.

ఆరోజు ఇంటర్‌వ్యూకి వచ్చిన వాళ్ళలో భార్గవ అని ఒక క్యాండెటు వచ్చాడు. ఇంటర్‌వ్యూ జరిగే గది  లోపలికి పోకముందు తాను అతని పక్కనే కూర్చున్నాడు. అప్పుడు చూశాడు. ఆ భార్గవ ప్రొఫైల్‌ ఎంత గొప్పగా ఉండింది!

నృత్యంలో, నటనలో, సంగీతంలో జాతీయస్థాయిలో యిచ్చిన ప్రదర్శనల ఫొటోలు తను చూశాడు. దేశ ప్రధాని చేతుల మీదుగా తీసుకున్న మెమొంటోలు, కేంద్ర మంత్రులు చూస్తుండగా చేసిన నృత్యభంగిమల ఫొటోలు – జాతీయస్థాయి గుర్తింపు వున్న సంస్థలు యిచ్చిన సర్టిఫికెట్లు- లలిత కళల్లో వృత్తి శిక్షణ తీసుకొన్న సర్టిఫికెట్లు ఇలా యెన్నో ఈ చేతులు మార్చి మార్చి చూశాడు. ఈ కళ్ళు విచ్చుకుని విచ్చుకుని చూశాయి. ఆరోజు ఇంటర్‌వ్యూకు భార్గవనే తనకంటే ముందులోనికి పిలిచిన సంగతి కూడా ఆనందంకు గుర్తుకొచ్చింది.

ఇంటర్‌వ్యూనించి బయటికొచ్చాక – ఇంటర్‌వ్యూ యెలా ఫేస్‌ చేశారని తను అడిగింది కూడా గుర్తుకొచ్చింది. ఇంటర్‌వ్యూ చేసిన ఎక్స్‌పర్ట్స్‌ తన డెమో చూసి సంతృప్తి వ్యక్తం చేశారని భార్గవ చెప్పిందీ గుర్తుకొచ్చింది ఆనందంకు.

కానీ ఆ భార్గవకు ఆ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు రాలేదు. నాన్‌ లోకల్‌ అనే ఒక నెపాన్ని చూపి తీసుకోలేదనే విషయమూ గుర్తుకొచ్చింది ఆనందంకు.

ఆ ఒక్క నాన్‌లోకల్‌ అనే ఎర్ర ముద్ర భార్గవపై పడకపోయివుంటే – తనకు ఈ పోస్టు ఎందుకొస్తుందనే విషయం కూడా గుర్తుకొచ్చి కన్నీరు వచ్చింది ఆనందంకు.

గుండెలోతుల్లో ప్రక్షాళన ఊట పుట్టింది ఆనందంకు. ఎక్కడో గుండె చివర దాగివున్న మానవత్వం చెమ్మ పొర వూడదీసుకున్నట్లుంది.

ఇన్ని తప్పులుచేసి – తీరా ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు – ఈ రోజు ఆ ఘటన చోటుచేసుకుని వుండకపోయి వుంటే ఇంత పెద్ద నిర్ణయం  తీసుకొని వుండడు ఆనందం.

ఉదయం యెప్పటిలా క్లాసుకు వెళ్ళాడు ఆనందం.

లలితసంగీతం క్లాసు అది.

సంగీతం పుట్టుక, దాని నేపథ్యం అనే అంశం మీద విద్యార్థులకు చెప్పాల్సి వుంది. సంగీతం గురించి ఉద్యోగం రాక ముందు ఆనందంకు ఏమీ తెలియదు. ఉద్యోగ అవసరార్ధం – ఏ రోజు పాఠం ఆ రోజు ముందు పుస్తకం చూసి నోట్సు రాసుకుని వచ్చి చెప్తున్నాడు.

నిన్నరాత్రి రాసుకున్న నోట్సు కాగితం తీసి ఒకసారి చూసి టేబుల్ మీద పెట్టి దానిపై మొబయిల్ ఫోన్ పెట్టాడు. చాక్‌పీసు తీసుకొని బ్లాకుబోర్డు మీద ‘సంగీతం పుట్టుక కథ’ అని రాశాడు. దాని కింద సప్తస్వరాలైన ‘సరిగమపదనిస’ రాశాడు.

“సంగీతం గురించి తనకు తెలిసింది చెప్పసాగాడు. చెప్తూ… చెప్తూ .. సంగీతంలోని సప్తస్వరాలు యేడింటిని ఔడవ రాగాలు అంటారు. మోహన హంసధ్వని రాగాలులోనే తొలుత వేదపఠనం జరిగేది” అని చెప్తుంటే కిషోర్ అనే విధ్యార్ధి “సార్” అని  అడ్డుతగిలాడు.

తన వాగ్ధాటికి అడ్డువచ్చిన కిషోర్‌ని తీక్షణంగా చూసి “ఏమిటి ఈ అవాంతరం” అన్నాడు నాటక ఫక్కీలో ఆనందం.

“అవాంతరం కాదు సార్ అనుమానం” అన్నాడూ చాలా వినయంగా కిషోర్.

“ఇప్పుడే తీర్చుకోవాల్సిన అనుమానమా? లెక్చర్ ఆఖర్న తీర్చుకోవాల్సిందా?” కాస్త అసహనంగా అన్నాడు.

“మీరు మరోలా భావించకుంటే ఇప్పుడే తీరుస్తే మంచిది సార్!” అన్నాడు విద్యార్థి కిషోర్ చాలా వినయంగా.

“సరే చెప్పు. నీ అనుమానం పెనుభూతం కాకముందే” అన్నాడు చాలా స్థిరంగా.. క్షణంలో తీర్చి నోరు మూయించేస్తానన్న ధోరణిలో.

“సప్తస్వరాలను ఔడవ రాగాలు అనరని నా అనుమానం. మరొకటి వేదపఠనం మోహన, హంసధ్వని రాగాలలో తొలుత జరిగేది కాదేమోనని సార్” అన్నాడు కిషోర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం ముఖంలో మారుతున్న కవళికలను గమనిస్తూ.

ఆ రెండు అనుమానాలు ఆ విద్యార్థికి కాదు కానీ ఆనందంకు రెండు భూతాలుగా యెదురుగా నిలిచినట్లు తోచింది. కొంచెం అహం దెబ్బతిన్నట్లూ అనిపించింది.

“అంటే! నేను చెప్పింది రాంగ్ అనేనా నీ అభిప్రాయం?” అంతకంటే తన దగ్గరేం జవాబు లేకపోయేసరికి వచ్చిన మాటలు అవి.

“మీరు రాంగ్ అని కాదు సార్. ఎక్కడో పొరపాటు జరిగి వుంటుందని అనుకుంటున్నాను” కిషోర్ వినయంగానే ఆనందం చేసిన తప్పును గుర్తించమని తెలిపాడు.

“అలానా! అయితే నీవే ఈ డయాస్ పైకి వచ్చి రైట్ ఏదో చెప్పు మరి” అనేశాడు అహం దెబ్బతిన్న స్వరంతో ఆనందం

“అదికాదు సార్..” అని కిషోర్ సర్ది చెప్పబోయాడు.

“నన్ను కన్విన్స్ చేయక్కర్లేదు. ముందు నీవు ఇక్కడికి వచ్చి రైట్ యేదో చెప్పు. కమాన్.” అని డయాస్ దిగి స్టూడెంట్స్ కూర్చునే డెస్క్‌లో కూర్చున్నాడు ఆనందం.

క్లాస్‌లో అనుకోకుండా చోటు చేసుకున్న ఆ దృశ్యం విద్యార్థులకు కొంచెం చేదుగా అన్పించినా విషయం ఆసక్తిగా గమనించసాగారు.

కిషోర్  తనకు తప్పదన్నట్లు డయాస్ పైకి వెళ్లాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం వైపు తనతోటి విద్యార్థుల వైపు చూశాడు.

విద్యార్థుల మొహాల్లో ఉత్కంఠ. ఆనందం మొహంలో ఓ నిర్లక్ష్య,  అసహన భావం కమ్ముకుని కనిపించింది.

“టైం వేస్ట్ చేయకు. కమాన్ చెప్పు. అవసరం అనుకుంటే బ్లాక్ బోర్డు కూడా యూజ్ చేయి” అన్నాడు ఆనందం. కిషోర్‌ని కంగారుకు గురిచేస్తూ.

కడుపులోంచి తన్నుకొస్తున్న కంగారు , తను రైట్, ప్రొఫెసర్ రాంగ్ అని తేలిపోయాక తననేం చేస్తాడోననే భయం తటపటాయించేట్లు చేసింది కిషోర్‌కు. ఇంతదాకా వచ్చేశాక, యిక వెనుకడుగు వేసినా తీరని అవమానమే యెదురు అవుతుంది. తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం చేస్తున్న టీచింగ్ పూర్తి అసంబద్ధమని నిరూపించడమే మంచిదనిపించింది కిషోర్‌కు. కాకపోటే ఆనందం గౌరవానికి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే సరి అంది మనసు. మనసు తల్లి అంటారు . తల్లి బిడ్డకు యెప్పుడు తప్పుడు బోధ చేయదనుకున్నాక కిషోర్ మనసులో ఒక స్థిర ప్రశాంతత ప్రకాశమానంగా వెలిగింది.

బోర్డుపై చాక్‌పీస్‌తో ‘సంగీతం పుట్టుక్’ అని రాశాడు. పైనించి కిందికి ఒకటీ నుండి యేడు అంకెలు రాసి ఆ ప్రతి అంకె పక్కన స్వరం స్వరం అని రాశాడు. ఆ తరువాత షడ్జస్వరం అని రాశాడు.

ఆ తరువాత ‘సరిగమ పదనిస’ అనే అక్షరాలను విడివిడిగా పైనించి కిందికి ఒకో అక్షరం రాసి –  ‘స’ పక్కన 240, ‘రీ పక్కన 270, ‘గ’ పక్కన 300, ‘మ’ పక్కన 320, ‘ప’ పక్కన 360, ‘ద’ పక్కన 405 చివరి ‘స’ పక్కన 480 అని చాక్‌పీస్‌తో రాశాడు.

ఆ తరువాత ‘ఔడవరాగాలు – 5’ అని రాసి, ప్రాచీన రాగాలు మోహన, హంసధ్వని అని రాశాడు కిషోర్.

ఈ మాత్రం చాలు అనుకుని, గొంతు సవరించుకొని ఇలా చెప్పుకుని పోసాగాడు.

“మనిషి సంగీతాన్ని ప్రకృతి నించే నేర్చుకున్నాడు. పక్షులు, పశువులు, జంతువులు, మృగాలు, సెలయేర్లు, గాలి, నీరు, ఇలా ప్రకృతి నించి జనించే సహజ శబ్ద సుందరాలను మనిషి విని వుద్దీపన చెందాడు. ప్రకృతి శబ్ద స్వరాలనే ధ్వని శాస్త్రమని మేధావులైన సంగీత శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తొలుత మనిషి కనుకొన్న స్వరానికి షడ్జస్వరమని పేరు పెట్టుకున్నాడు. ఆ స్వరానికి మనసును రంజింపచేసే స్వభావం వుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ షడ్జస్వరం వుందే.. 240 ప్రకంపనలు కలిగి వుంటుంది. అంటే ఒక సెకను కాలంలో 240 ప్రకంపనలు సృష్టించే షడ్జస్వరం అయ్యిందన్నమాట.

ఈ ఒకే ఒక్క స్వర ఆధారంగానే ఒకే స్వరంలో ఆలపించే సంగీతం ప్రచారంలోకి వచ్చింది. మీకు తెలుసా.. అసలు వేద పఠనం తొలుత ఏక స్వరం గాయన పద్ధతిలోనే వుండేది. సంగీత పట్ల మనుష్యుడు ఆసక్తి తద్వారా సంశోధన చేస్తూ ద్విస్వర, త్రిస్వర గాన పద్ధతిని మనిషి సాధించుకున్నాడు.

సామవేదం కాలం నాటికి ఉదాత్త, అనుదాత్త స్వరాలతో సోయగానం అయ్యింది. మరి కొంతకాలం మనిషి చేసిన అన్వేషణ ఫలితంగా అయిదు స్వరాలు అయ్యాయి. ఆ అయిదు స్వరాలనే ‘ఔడవ రాగాలు’ అంటారు”-అని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆనందంవైపు – తన తోటి విద్యార్థుల వైపు చూశాడు కిషోర్‌.

విద్యార్థులతోపాటు ఆనందం కూడా ఆశ్చర్య చకితుడైపోయాడు. ముందువున్న అహం, అసహనం, దర్పం అతనిలో పటాపంచలై పోయాయి.

”ఎసెస్‌. కమాన్‌ గో అహెడ్‌” అని ప్రోత్సహించాడు ఆనందం.

ఈ అయిదు ఔడవ రాగాలలో మోహన, హంసధ్వని రాగాలున్నాయి. ఇవి ప్రాచీన రాగాలు.

ఈ అయిదింటితో తృప్తి చెందని మనుష్యుడు మరో రెండుస్వరాలను కూడా కనుగొన్నాడు. అప్పుడుయేర్పడినవే సప్తస్వరాలు – ‘సరిగమపదనిసలు’  ఈ ప్రతి స్వరం ఇక్కడ నేను రాసిన ప్రకారం ప్రకంపనలు కలిగి వుంటాయి. అంటే ముందే చెప్పినట్లు సెకనుకాలంలో ఆయా స్వరానికి ఆయా ప్రకంపనలు వుంటాయి. ఉదాహరణకు సరిగమపదనిసలోని ‘ద’ స్వరానికి 405 ప్రకంపనలుంటాయన్నమాట. ఇదీ నేను చెప్పదల్చింది. ఈ విషయాలు అన్నీకూడా ఆనందం సార్‌కు తెలియవని కాదు.నాకు తెలిసినవి ఇలా మీముందు చెప్పించడానికే  యిలా చేశారు. అంతే కదా సార్‌” అని డయాస్‌ దిగాడు కిషోర్‌.

ప్రతిభావంతుడైన కిషోర్‌లాంటి విద్యార్థికి తనవంటి ‘యెమ్టీ ఫెలో’ లెక్చరర్‌ కావడం ఘోరం అనిపించింది ఆనందంకు. మరోరకంగా చూస్తే అటువంటి సరుకు వున్న విద్యార్థికి తాను గురువు కావడం గర్వంగా అన్పించింది ఆనందంకు.

కిషోర్‌ డయాస్‌ దిగి – తన డెస్కులో కూర్చున్నాక కాసేపు నోటమాట రాలేదు ఆనందంకు. తేరుకుని లేచి, డయాస్‌ మీది కెళ్ళి క్లాప్స్‌ కొట్టి నిజంగానే హృదయపూర్వకంగా అభినందించాడు. ఇలాటి విద్యార్థులు రాష్ట్రంలోని ప్రతి యూనివర్శిటీల్లో పదేసి మంది వుంటే చాలు అని- గొప్ప భవిష్యత్తు వుందని మెచ్చుకున్నాడు ఆనందం.

క్లాసు అయిపోయిందనే అలారం బెల్లు మోగగానే బయటికొచ్చిన ఆనందం దగ్గరికి కిషోర్‌ పరుగున వచ్చాడు.

ఆనందంను అనుసరిస్తూ – ”సార్‌. నేను క్లాస్‌లో ఓవర్‌ ఆక్షన్‌ చేసినాను సార్‌. మనసులో ఏం పెట్టుకోకండి. మళ్ళీ అలా యెప్పుడు ప్రవర్తించను సార్‌” అని వేడుకోలుగా చెప్పుకొన్నాడు కిషోర్‌. ప్రొఫెసర్లు మనసులో పెట్టుకుని యెలా తొక్కేస్తారో అనే విషయం పూర్వ విద్యార్థుల అనుభవాలు కిషోర్‌కు తెలిసి వుండటంతో – జరిగింది యేదో జరిగింది తొలి తప్పుగా  నన్ను క్షమించి వదిలేయ్‌మన్న ధోరణి చూపాడు కిషోర్‌.

”కాదు కిషోర్‌! నీవు క్లాసు తీసుకోక ముందు నిజంగానే నా ఆలోచనలు వేరేగా వుండేవి. కానీ, నీ ఇన్‌డెప్త్‌ నాలెడ్జ్‌ విన్నాక నా మనసులో నీవు యెంతో యెత్తుకు యెదిగిపోయావ్‌.  ఎస్‌. ఇట్స్‌ ట్రూ. మనసారా నిన్ను అభినందిస్తున్నాను ” అన్నాడు ఆనందం హృదయపూర్వకంగా స్పందిస్తూ.

”చాలా థ్యాంక్స్‌ సార్‌. నిజంగా చాలా కంగారుపడిపోయాను. ఇకమీద చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను సార్‌. నాకు ఈ ఫైన్‌ ఆర్ట్స్‌ పీజీ చాలా అవసరంసార్‌.” తన పరిస్థితిని కొద్దిగా వ్యక్తం చేస్తూ చెప్పాడు కిషోర్‌. ”పీజీ నీకు రావడమే కాదు – గోల్డ్‌ మెడల్‌ కూడా కొట్తావ్‌. ఆఁ ఇంతకు ఎవరి అబ్బాయివి నీవు, నేటివ్‌ ప్లేస్‌ ఏది నీది” కిషోర్‌ వ్యక్తిగతం తెలుసుకోవాలనుకున్న ఆసక్తితో అడిగాడు ఆనందం.

”మాది బళ్ళారి జిల్లా సార్‌. మా చిన్నాన మీకు తెలిసే ఉంటారు – భార్గవ అని ఫైన్‌ ఆర్ట్స్‌లోను ఫర్‌ఫార్మింగు ఆర్ట్స్‌లోను మంచి పేరు తెచుకున్నాడు. ఇండియన్‌ కల్చర్‌ ఫెస్టివల్‌లో ప్రయిమ్‌ మినిష్టర్‌తో అవార్డు తీసుకున్నాడు” అని యింకా యేదో చెప్పబోయాడు కిషోర్‌ -కానీ ఆనందం యేదో గుర్తుకొచ్చిన వాడల్లా అడిగాడు అతని మాటలకు అడ్డువస్తూ- ”అంటే! ఆర్నెల్ల క్రితం ఈ యూనివర్శిటీ ఇంటర్‌వ్యూకి వచ్చి వుండిన భార్గవ కాదు కదా!?” ప్రశ్నించాడు ఆనందం.

”అవున్సార్‌! ఆయనే!! మీకు తెలుసా?  ఇప్పుడు హైదరాబాదులో స్వంత ఇన్సిటిట్యూట్‌ నడుపుకుంటున్నాడు” అన్నాడు కిషోర్‌.

”తెల్సు తెల్సు! హైదరాబాద్‌లో ఇన్సిటిట్యూట్‌ రన్‌ చేస్తున్నారా! రైట్‌!! సరే నీవెళ్ళు” సంభాషణ కొనసాగించడం ఇష్టంలేక కిషోర్ ని పంపేశాడు ఆనందం.

జరిగిన ఈ ఘటనంతా గుర్తుకొచ్చింది ఆనందంకు. తన బోటివారు ప్రస్తుత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అసలు అర్హుడు కాడన్న విషయం ధృడం చేసుకున్నాడు. బొటానికల్ గార్డెన్‌లో ఎవరూ చూడని ఆ ప్రాంతంలో మనసు తేలిక అయ్యేవరకూ, కన్నీరు అంతా అయిపోయేంతవరకు అనుభూతితో ఏడ్చేసి తన కారు వున్న చోటికి బయల్దేరాడు.

ఇంతలో ఫోన్ రింగైంది. డిస్‌ప్లేలో వీరయ్య పేరు కనిపించింది. ‘హలో’ అన్నాడు ఆనందం. అవతల వీరయ్య  యేదేదో చెబుతున్నాడూ. సర్ది చెప్తున్నాడు. ఇక కాదు కూడదంటే ఇచ్చిన డబ్బులు వాపసు ఇవ్వడం కష్టమేనన్నాడు.

ఆ మాటకు ఆనందంకు ఒక విషాదపు నవ్వు వచ్చింది. అతనికీ చెప్పేశాడు. రాజీనామా వెనక్కు తీసుకోనని.. తనవల్ల యేలాటి లిటిగేషన్స్ కల్పించబోనని కూడా చెప్పేశాడు.

ఆ రాత్రి ఆనందంకు మొద్దునిద్ర హాయిగా పట్టింది.

మరుసటిరోజు ఆలస్యంగా నిద్రలేచి పేపర్ తిరగేస్తున్నాడు ఆనందం. తన క్లవర్ స్టూడెంట్ కిషోర్ తన మనసులో ఎంత కల్లోలం సృష్టించాడో కదా అనుకున్నాడు. ప్రాయశ్చితంగా తాను రాజీనామా చెయకపోయినా తన మనసు కలలో మాత్రం ఆ పని చేసిందనుకున్నాడు.

అంతలోనే ఇంటి పనిమనిషి వచ్చి బయట ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉన్నారని చెప్పడు. ఎవరై వుంటారో అనుకుంటూనే రమ్మనమని చెప్పేసాడు.

వచ్చింది ఎవరో కాదు తన స్టూడెంట్ కిషోర్, వాళ్ల చిన్నాన్న భార్గవ ఏదో ఇన్విటేషన్ చేత పట్టుకొచ్చారు. ఆత్మీయంగా లోనికి ఆహ్వానించాడు ఆనందం.

 

–  శశిశ్రీ

 

ఒక తరానికంతా ఆమె కౌన్సిలర్!

మాలతీ చందూర్ ౩౦ వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమయిన అర్థంలోనయినా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం. వ్యక్తికీ, వ్యక్తి కోరికలకూ, ఆకాంక్షలకూ ప్రాధాన్యత పెరగటం, స్త్రీపురుషులిద్దరికీ వ్యక్తులుగా గౌరవం, హుందాతనం దొరకాలనే భావాలు  ఏర్పడటం, స్వేచ్చ, స్వతంత్రతల గురించి, హక్కుల గురించి స్పృహ కలగటం, మానవుల బాధలు కేవలం వారి నుదుటి రాతలు, కర్మలే కాదనీ, ఆ బాధలను కొన్ని ప్రక్రియల ద్వారా తొలగించుకునే అవకాశాలున్నాయనే గ్రహింపు, హేతుబద్ధతకు విలువనివ్వటం, విశాలార్థంలో మానవులంతా సమానమనే భావన, ఈ భావనలకు అడ్డు వచ్చే సంప్రదాయాలను, ఆచారాలను నిరసించటం, ధిక్కరించటం వీటన్నిటినీ స్థూలంగా ఆధునికతగా చెప్పుకోవచ్చు.

5666_062

1947 వ సంవత్సరం, అంటే భారతదేశం స్వతంత్రమయ్యే నాటికి ఏలూరులో స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మాలతి 50 లలో మద్రాసు వచ్చారు. అప్పటి నుంచీ ఆమె సాహిత్య జీవితం ఆరంభమయింది. అప్పుడు మద్రాసు తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలకు కేంద్రం గా వుంది. ఆకాశవాణి అక్కడే వుంది. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, పటాభి, బాపు, ముళ్ళపూడి వెంకట రమణ, భమిడిపాటి మొదలయిన రచయితలంతా అక్కడే వున్నారు. ఇంకో వేపు స్త్రీల పరిస్తితి గురించి, అభివృద్ధి గురించి దేశమంతా ఆలోచిస్తున్న కాలం.

మాలతి మంచి పాఠకురాలు. పుస్తక పఠనం ఆమెకు వ్యసనం. ఆ వ్యసనం ఎంత తారాస్థాయిలో ఆమెకు వంట బట్టిందంటే మొత్తం తెలుగు వారందరికీ ఆ వ్యసనాన్ని అంటించాలని ప్రయత్నిచిందావిడ.  తాగండి, తాగండి, ఈ సాహిత్యామృతాన్ని. అనేక జీవితానుభవాలను పిండి, ఫర్మంట్ చేసి వడగట్టిన జీవనామృతం ఇది. ఒక్క సారి తాగితే ఒదిలిపెట్టరు –అంటూ ఆ రుచిని పరిచయం చెయ్యటానికి మాలతి నడుం కట్టుకున్నది. ఆ ప్రపంచ సాహిత్య పఠనం ఆమెలోని రచయిత్రికి తొలి పాఠాలు నేర్పింది.

50 లలో దేశం స్వతంత్రమయ్యాక కొత్త తరంలో ఎన్నో ఆశలూ, ఆధునికతకు ఎన్నో నిర్వచనాలూ, జీవితాలను మార్చుకోవాలని, తీర్చి దిద్దుకోవాలని తపనలూ, నగరాలలో కొత్త పరిసరాలలో వచ్చే వైరుధ్యాలను పరిష్కరించుకోవటమెట్లా, తమని తాము కొత్త పద్ధతులలో సంస్కరించుకోవటమెట్లా అని సతమతమయ్యే యువతరానికి ఒక మంచి సలహాదారు, కౌన్సిలరు, తమకు దూరంగా ఉంటూ తమ జీవితాల్లో కొద్దిగా తొంగిచూచి మంచి మాట చెప్పే పెద్దదిక్కు కావలసి వచ్చింది. సమష్టి కుటుంబాల్లో పెద్దల మాటలూ సలహాలూ క్రమంగా పోతున్నాయి. సమస్యలు, సందేహాలు పెరుగుతున్నాయి. ఎవరితోనయినా పంచుకోకపోతే అవి వాళ్ళని నిలవనీవు. ఆ స్థితిలో ‘ప్రమదావనం’ శీర్షిక అందుకే అంత విజయవంతమయింది. మాలతి చందూర్ కి అంత కీర్తి వచ్చింది. సినిమా తారలకు సమానమయిన గ్లామర్ ఆవిడ సంపాదించటానికి ఆ శీర్షిక కారణమయింది.

ఓల్గా

నిక్కచ్చి మనిషి మాలతి చందూర్!

Gowri

గౌరీ కృపానందన్

మాలతి చందూర్  అంటేనే తెలుగు వారికి “వంటలు పిండి వంటలు”  పుస్తకం గుర్తుకు వస్తుంది. అప్పట్లో వంటల గురించి పుస్తకం తెలుగులో రావడం, సులభమైన శైలిలో అందరికీ అర్థం అయ్యే విధంగా ఉండటం అందరినీ చాలా ఆకర్షించింది.

ఈ పుస్తకం యొక్క తొలి ఎడిషన్ కాపీ నా దగ్గర ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను.

85865329_45a5e50811

మాలతి చందూర్ గారి ప్రమదావనం అప్పట్లో ఆంధ్రప్రభలో నలబై ఏళ్ళు నిర్విరామంగా వచ్చింది. ఎటువంటి సమస్యలకైనా, అది ప్రపంచ చరిత్ర గురించి కానీయండి, అప్పలమ్మ ఇంట్లో వచ్చిన సమస్య అయినా కానీయండి ఆమె చెప్పే విషయాలు, సూచించే పరిష్కారాలు మిగిలిన వాళ్లకి కూడా మార్గదర్శకంగా ఉంటాయి.

1955లో ‘ప్రమదావనం’ లో ఆమె ఇచ్చిన జవాబులు నా డైరీలో వ్రాసుకుని పెట్టుకున్నాను.

“ఎంత మహోజ్వలమైన ప్రేమ అయినా ఆరు నెలలు దాటే సరికి వెచ్చాల ఖర్చు అడుగుతుంది.”

“ముసలి అత్తగార్లను వృద్ధాశ్రమానికి తరిమేసే కోడళ్ళు, ముందు ముందు తమకీ ఆ గతి పట్టడానికి ఆస్కారం ఉందని గ్రహించాలి.”

ఎవరూ లేని వాళ్లకి వృద్ధాశ్రమం ఆసరాగా ఉండడం సబబు. కానీ కన్నవాళ్ళు ఉన్నా చూసుకునే దిక్కులేక జీవితపు చరమ దశను ఆశ్రమంలో గడపాల్సి రావడం నిజంగా దుర్భరం.

ఆమెతో నా పరిచయం దాదాపు పదేళ్ళ క్రితం జరిగింది. తమిళ సినిమా డైరక్టర్ శ్రీ  ముక్తా శ్రీనివాసన్  గారికి విశ్వనాధ సత్యనారాయణగారి గురించి, ఆయన రచనల గురించి వివరాలు సేకరించి తమిళంలో తనకి ఇవ్వమని అడిగిన సందర్భంలో(రేడియోలో ఇతర భాషా రచయితలు పరిచయం చేసే ఒక కార్యక్రమం కోసం) మాలతి చందూర్ గారిని వారి ఇంటికి వెళ్లి కలిసాను. చిన్న వయస్సులో ప్రమదావనంలో ప్రశ్నలు – జవాబులు శీర్షిక ద్వారా పరిచయమైన ప్రఖ్యాత రచయిత్రిని నేరుగా కలుసుకున్నప్పుడు ఎంత ఉద్వేగం చెందానో మాటల్లో చెప్పలేను. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియచేసే మనిషి.

తెలుగు నుంచి తమిళంలోకి, తమిళంనుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నానని నన్ను నేను పరిచయం చేసుకున్నప్పుడు నా రచనల గురించి అడిగి తెలుసుకున్నారు.

మాటల మధ్యలో ఆమె రచయితకీ పాఠకులకీ మధ్య కొంచం అంతరం ఉంటేనే బాగా ఉంటుంది అని అంటూ వివరణ ఇచ్చారు. రచనలు చదివిన  పాఠకుడు రచయిత గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటాడు. వాళ్ళు గానీ రచయితతో ఎక్కువగా  పరిచయం పెంచుకుంటే, వాళ్ళు ఊహించుకున్నంత గొప్పగా ఆ రచయిత ఉండక పోతే చాలా నిరాశ చెందుతారు. రచయితలు దివినుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకీ కొన్ని బలహీనతలు, అంతో ఇంతో స్వార్థం ఉండొచ్చు. ఆ పార్శ్వం పాఠకులకి తెలియకుండా ఉండడమే మంచిది అని ఆవిడ అన్నప్పుడు నిజమే కదా అనిపించింది.

ఒక సారి చెన్నైలో రచయిత్రి డి.కామేశ్వరి గారి చెల్లెలి ఇంట్లో కామేశ్వరి, మాలతి చందూర్, ఆమె సహోదరి శ్రీమతి శారద  వాళ్ళందరితో నేను, అందరూ కలిసి చిన్నపాటి విందు భోజనం, సాహిత్య చర్చ జరిగిన ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచి పోలేను. ఆరోజు శారద గారు నా మొహమాటం చూసి “సిగ్గు లేకుండా తినండి” అని జోక్ చేస్తూ సిగ్గు పడకుండా తినండి అని చెప్పడమే తన ఉద్దేశ్యం అయినా తిండి ముందు సిగ్గు పడితే పని జరగదు కదా అని వ్యాఖ్యానించారు.

భర్త చందూర్ తో మాలతి గారు

భర్త చందూర్ తో మాలతి గారు

“హృదయనేత్రి” అన్న నవలకి మాలతి చందూర్ గారికి సాహిత్య అకాడమి ఆవార్డు వచ్చింది. ఈ నవలను శ్రీమతి శాంతాదత్ గారు “IDHAYA VIZHIKAL” అన్న పేరుతో తమిళంలో అనువదించారు.

భూమిపుత్రి, మనసులోని మనసు, శిశిర వసంతం, కలల వెలుగు, ఆలోచించు, రెక్కలు ముక్కలు ఇలా వాసిలో ఆమె చేసిన రచనలు కొన్ని మాత్రమే అయినా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలను బేలగా కాకుండా ఆత్మ గౌరవంతో సమస్యలను ఎదుర్కునే విధంగా చిత్రీకరిస్తారు.

ఎన్నోఆంగ్ల నవలలను కధా మంజరి అన్న పేరిట పరిచయం చేసారు. తమిళ రచయిత D.జయకాంతన్ గారి నవలను “కొన్ని సమయాలల్లో కొంత మంది మనుషులు”, N. పార్థసారధి గారి నవలను “సమాజం కోరల్లో”, శివశంకరి గారి నవలను “ఓ మనిషి కధ “ అన్న పేరిట తెలుగు పాఠకులకి అందించారు.

ఆమె రచనల్లో నాకు చాలా నచ్చిన నవల “శతాబ్ది సూరీడు.” దాన్ని తమిళంలో అనువదించడానికి ఆమె అనుమతి తీసుకున్నాను గాని ఇంకా మొదలు పెట్టలేదు. ఆమెకి నివాళిగా వెంటనే ఆ నవలను తమిళంలో తేవాలని, తమిళ పాఠకులకి ఆమెను పరిచయం చేయాలని నా కోరిక.

రచనా వ్యాసంగంలోరాణించి, అందరి మన్ననలనూ పొంది, తన రచనల ద్వారా సమాజానికి మంచి మార్గం చూపించిన మాలతి చందూర్ గారు చిరస్మరణీయులు.

గౌరీ కృపానందన్