Archives for July 2013

“చదువుకున్న మూర్ఖుడు” – ఇంకెవరూ? ….

నా సాహిత్య” ప్రస్థానంలో” మా అన్నదమ్ములకీ, అప్పచెల్లెళ్ళకీ ఏ మాత్రం ప్రమేయం లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను కానీ అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే, ముందుగానే చెప్పుకునేది నాది పెద్ద “ప్రస్త్హానం” కానే కాదు. ఏదో మామూలు జనతా క్లాసు ప్రయాణమే అయినా ప్రస్థానం లాంటి పెద్ద, పెద్ద మాటలు వాడితే  నా భుజాలు నేనే తట్టుకోడానికి బావుంటుంది కదా అని తంటాలు పడుతున్నాను. ఇక ఎవరయినా ఒక రచయిత అవడానికి వారసత్వం కారణం కానక్కర లేదు. ఆ మాట కొస్తే నాకు తెలిసీ చాలా మంది సాహితీవేత్తలు తమ పిల్లలని . “మా లాగా కథలు, కవిత్వాలు రాసుకుంటూ అవస్థ పడకుండా హాయిగా చదువుకుని ”పైకి” రమ్మని ప్రోత్సహించిన వారే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ “పైకి” రావడం అంటే డబ్బు సంపాదించుకోవడం అని అర్ధం. అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్తల సంతానం చాలా మంది అమెరికాలో పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకో తెలియదు కానీ  వాళ్ళల్లో చాలా మంది గోప్యంగానే ఉంటారు. నా విషయంలో మా బంధువులకి  “రాజా గాడు చదువుకున్నాడు కానీ కథలూ, కమామీషులలో పడిపోయి  పైకి రాలేక పోయాడు” అనేదే చాలా మందికి ఉన్న బాధ. నాకు తెలిసీ  నా ముగ్గురు అన్నయ్యలకీ, తమ్ముడికీ, అక్కకీ, ముగ్గురు చెల్లెళ్మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ లలో ఎవరికీ రచనావ్యాసంగం లేదు.

కానీ మా పెద్దన్నయ్య అందరి లాగా కాదు. కొంతమంది పెద్దన్నయ్యలు నిజంగానే పెద్దన్నయ్యలాగా ఉంటారు. నాకే కాదు….మా చుట్టాల్లో కూడా వరసకి ఏమైనా కానీ, అందరికీ మా పెద్దన్నయ్య పెద్దన్నయ్యే! అందరూ ఉహించినట్టుగానే  అతని పేరు మా తాత గారి పేరే….సూర్య ప్రకాశ రావు. మా కుటుంబంలో ‘కలాపోసన కీ కళాకౌశల్యానికీ కూడా ఆయనే పెద్దాయన. ఉదాహరణకి, మా చిన్నప్పుడు, ముఖ్యంగా మా అక్క పెళ్లి కాక ముందు, ప్రతీ ఏడూ సంక్రాంతి, దసరా మాకే కాక కాకినాడ మొత్తానికే పెద్ద పండుగలు. అందుకు ప్రధాన కారణం, ఆ పెద్దన్నయ్య వారాల తరబడి అతి జాగ్రత్తగా అధ్బుతమైన ఊహాశక్తితో మా అక్క పేరిట ఒక సినిమా సెట్టింగ్ లా నిర్మింఛే బొమ్మల కొలువులే!

rajuఇందుతో జతపరిచిన ఫోటో ఒక్కటే మా దగ్గర ఆ నాటి పండుగ రోజులకి గుర్తుగా మిగిలింది. ఈ ఫోటో అస్పష్టంగా ఉన్నా, అందులో ప్రతీ అంగుళమూ నాకు గుర్తే! చుట్టూ రెండు లెవెల్స్ లో ఆర్చీలు మా అన్నయ్య డిజైన్ చేసేవాడు. అంటే అంగుళం వెడల్పు, మిల్లిమీటర్ మందం ఉండే పొడుగాటి ఇనప బద్దీలని గుండ్రంగా, పలకలగా, త్రికోణాలుగా వంచి బొమ్మల కొలువు మందిరం చుట్టూ జాగ్రత్తగా, పడిపోకుండా పెట్టేవాడు. వాత్తికి సరిగ్గా రంగు రంగుల ఉలిపిరి కాగితాలు, ముచ్చి రేకులూ కత్తిరించి జిగురుతో అతికించి సినిమాలో గుమ్మాలకి తోరణాలలా ధగ ధగ మెరిసేలా అతికించేవాడు. అన్నం ఉడకేసి, గంజి వార్చేసి మెత్తటి ఆ జిగురు తయారు చేసి, సుతిమెత్తగా ఉండే ఆ కాగితాలు ముడుచుకుపోకుండా  జాగ్రత్తగా పులిమి, మా పెద్దన్నయ్య పీట మీదో, నిచ్చెన మీదో నుంచుని రెడీగా ఉన్నప్పుడు అందించే అతి ముఖ్యమైన పని  రాజా-అంజీ లు చేసే వారు. అందులో రాజా అంటే నేను. ఆంజి అంటే  నా తమ్ముడు హనుమంత రావు. మేమిద్దరం ఆ పేర్లతో కావాలా పిల్లలలా పెరిగాం. అమెరికాలో కూడా ఇంకా అలాగే ఉన్నాం. ఇక అసలు బొమ్మలకి ముందు ముఫై, నలభై చతురపు అడుగుల వైశాల్యంలో నేల మీద ఒక పువ్వుల తోటా, పర్వతాలు, జలపాతాలు, మధ్యలో మా అగ్గిపెట్టెలతో తనే తయారు చేసిన మా దొంతమ్మూరు లో  మా తాత గారు పెరిగిన మేడ నమూనా వగైరాలు ఉండేవి. అంతా అయ్యాక  బొమ్మల కొలువు అంతా దేదీప్యమానంగా నూనె దీపాలు,  క్రిస్మస్ లైట్ల తో కళ్ళు జిగేలుమనేట్టు ఉండేది. అంతే కాదు, దీపావళి సమయంలో అయితే, మా స్థలం వీధి గుమ్మం నుంచీ ఇంటి ముందు వరండా దాకా సుమారు రెండు వందల అడుగుల దూరం అటూ, ఇటూ స్తంభాలు పాతి, వాటి మీద దీపాలు పెట్టి మంచి రహదారి ఏర్పాటు చేసే వాడు మా పెద్దన్నయ్య. ఈ వింతలన్నీ చూడడానికి కాకినాడలో అందరే కాక, చుట్టూ పక్కల గ్రామాల నుంచి ఎద్దు బళ్ళు కట్టుకుని వచ్చే వారు.  మా రోడ్డు మీద ఆ నాటి ఎద్దు బళ్ల పార్కింగ్ లా ఇక్కడ అమెరికాలో చేస్తే, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.  మా పెద్దన్నయ్య ఎంత సరదా మనిషి అంటే మా చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఉత్తరం వ్రాసినా “ఒరేయ్ తుమ్మ జిగురూ” అనే సంబోదించే వాడు. ఎందుకంటే మా స్కూలు ప్రాజెక్ట్స్ అన్నింటికీ మా పొలం గట్ల మీద ఉండే తుమ్మ చెట్లకి గాట్లు పెట్టి, జిగురు ఊరాక దాన్ని సీసాలో పెట్టి నాకు తనే పంపించే వాడు. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా, ఏ సాహిత్య సభ లో పాల్గొన్నా,  వీలైనంత వరకూ  అన్ని సభలకీ వచ్చి మొదటి వరస లో ఆనందిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ కూచునే మా పెద్దన్నయ్య గత ఏడాది (అక్టోబర్ , 2012) లో తన 80 వ ఏట సహజ మరణం పొందాడు.

raju1

2001  లో, కాకినాడలో మాలో చాలా మంది పుట్టిన ఇంటి ముందు తీసిన ఈ ఫోటోలో మా అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళు, వారి కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు  వెరసి మా  సన్నిహిత  కుటుంబం.

ఇక మా చిన్నన్నయ్య ప్రభాకర ముర్తిరాజు గారు మద్రాసులో తను ప్రెసిడెన్సీ కాలేజీ లోను, లా కాలేజ్ లోను చదువుకునేటప్పుడు  మరో విధంగా “కలాపోసన” రంగంలో ఒక వెలుగు వెలిగాడు. అప్పటి ప్రపంచ సుందరి టంగుటూరి సూర్య కుమారి నాయిక పాత్ర ధరించిన నౌకా చరిత్ర దృశ్య నాటకానికి సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు రచన, దర్శకత్వం వహిస్తే, మా అన్నయ్య సహకార దర్శకుడిగా వ్యవహరించాడు.  టంగుటూరి సూర్య కుమారి లండన్ వెళ్ళక ముందు మద్రాసులో ఉండే ఆ రోజుల్లో ఆమెకి మా చిన్నన్నయ్య అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే వారు.  పైగా మా ఉరి వారే అయిన నటులు విజయ చందర్,  రామ శర్మ,  ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ (విక్టోరియా హాస్టల్ లో తన సహవాసి)  మొదలైన వారితో సాంగత్యం వలన మా చిన్నన్నయ్య ఆ సంగతులన్నీ అత్యంత రమణీయంగా, స్వతస్సిద్దమైన మాటకారితనంతో మద్రాసు నుంచి  కాకినాడ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటే రాత్రి తెల్ల వార్లూ వినేవాళ్ళం. పైగా కాకినాడ ప్రాంతాల నుండి ఆ రోజులలో ఎంతో అరుదైన విమానం పైలట్ గా శిక్షణ పొందిన వారిలో బహుశా మా చిన్నన్నయ్యే మొదటి వాడు.  నేను ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోకుండా సింగీతం గారిని కలుసుకున్నప్పుడు ఆయన మా చిన్నన్నయ్యనీ, అలనాటి సంగతులనీ గుర్తుకు తెచ్చుకుని  నాతో పంచుకున్నారు. కానీ మా చిన్నన్నయ్య మద్రాసునీ, అక్కడి జీవితాన్నీ వదులుకుని తను కూడా కాకినాడ తిరిగి వచ్చేసి లాయర్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడు. రెండేళ్ళ క్రితం అమెరికాలో ఉన్న తన కొడుకులనీ, నన్ను, మా తమ్ముణ్ణీ చూడడానికి ఇక్కడికి వచ్చి, లాస్ ఏంజేలేస్ లో హఠాత్తుగా గుండె పోటుతో  పోయాడు. మా అమ్మా, నాన్నల తరువాత మా తొమ్మండుగురు సన్నిహిత కుటుంబంలోనూ మా చిన్నన్నయ్యదే మొదటి మరణం.  ఆ తరువాత గత అక్టోబర్,  2012 లో మా పెద్దన్నయ్య కూడా పోయాడు.

ఇందుతో బాటు ముచ్చటగా మా కుటుంబం ఫోటోలు  జతపరుస్తున్నాను. మొదటిది 1955  లో తీసినది. అప్పడు మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి యింకా మా అమ్మ కడుపులోనే ఉంది. ఆ ఫోటోలో నేల మీద ఎడం పక్కన బుద్దిగా కూచున్నది నేనే అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. రెండోది  పన్నెండేళ్ల క్రితం కాలానుగతిని వచ్చిన మార్పులతో….అంటే వయస్సు మీరిన తరువాత … మా అన్నదమ్ములం, అప్పచెల్లెళ్ళమూ ఉన్న తీసిన మరొక ఫోటో.

raju3.png

1955  లో మా ఆస్తాన ఫోటో గ్రాఫర్ అయ్యగారి సూర్య నారాయణ గారు తీసిన మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ  ఫోటో.  .

 

 

మా చిన్నప్పుడు మా అక్క కి సంగీతము, డాన్సు నేర్పించే వారు. “ఆ అదంతా పెళ్లి సంగీతము, డాన్సు” అని అందరు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆలోచిస్తే వాటి ధర్మమా అని నాకు కూడా వాటిల్లో కాస్త ఆసక్తి కలిగింది అనుకుంటాను. మా అక్కకి సంగీతం నేర్పే మేష్టారు భలే తమాషాగా ఉండే వారు. ఒక వేపు ఆ సంగీతం ప్రాక్టీసు జరుగుతూ ఉంటే మరొక పక్క నేను కూడా “మంధర ధారే, మోక్షము రారె..” అనుకుంటూ పాడేసుకునే వాణ్ణీ. అలాగే మా మూడో మేనత్త (దొడ్డమ్మ అనే వాళ్ళం) “ఆకడ, దూకాడ, దూకుడు కృష్ణా రారా..” అనుకుంటూ చాలా పాటలు పాడుకుంటూ ఉండేది.  ఆ పాటకి నాకు ఇప్పటికీ అర్ధం తెలియక పోయినా నా నాటకాల్లో కొన్నింటిలో దాన్ని వాడుకున్నాను. అలాగే  మా అక్క నేర్చుకున్న  పిళ్ళారి గీతాలు , మంధర దారే  వగైరాలు ఇప్పటికీ పాడుకుంటూ నే ఉంటాను…ఏకాంతంగా ఉన్నప్పుడు. నేను పాడుతుండగా ఎవరైనా వింటే కొంప ములిగి పోదూ?

టూకీగా.. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండీ లేనట్టు ఉన్న “కలా పోసన” విత్తనాలు…. నాకు గుర్తున్నంత వరకు… ముందే మనవి చేసినట్టుగా నా చిన్నప్పుడు సాహిత్య పరంగా ఏ విధమైన వారసత్వాలు, ప్రగాఢమైన కుటుంబ వాతావరణమూ లేనే లేవు. అందుకే నేను “ఇలా ఎందుకు తయారయ్యానో”  అని మా వాళ్ళు కొందరు ఆశ్చర్య పడుతూ ఉంటారు.  అంటే మా కుటుంబంలో నేను “చదువుకున్న మూర్ఖుణ్ణి.”

ఎవరీ ‘సామాన్యుడు’? ఎప్పటి వాడు?!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?

                                                          -శ్రీశ్రీ

                                (మహాప్రస్థానం, దేశచరిత్రలు)

ఇవి ప్రసిద్ధ పంక్తులే కానీ, ఇందులో చెప్పిన ‘సామాన్యుడు’ ఎప్పుడు, ఎందుకు, ఎలా అవతరించాడో ఎప్పుడైనా గమనించారా?

మనిషికి ‘నరుడు’ అనే పర్యాయపదం ఉంది. పురాణ, ఇతిహాసాలు దేవ, దానవ, సిద్ధ, సాధ్య, యక్ష, రాక్షస, వానరాల మధ్య నరుని ఇరికించి చెప్పాయి. నేటి అవగాహనతో దేవ దానవాదులను కూడా నరులుగానే గుర్తిస్తే, లేదా ఆ మాటలు నరుని గుణ, స్వభావాలను; లేదా తెగ నామాలను తెలిపేవి అనుకుంటే ఆ జాబితాలో చెప్పిన ‘నరుడు’ ఎవరనే ప్రశ్న వస్తుంది. ఇంకో విచిత్రం చూడండి: మహాభారతం అర్జునుని నరునిగా పేర్కొంటూనే, అతనిని నరుడనే ముని అవతారంగా చెప్పి మహాత్ముణ్ణి చేసింది. నరుని… అంటే మామూలు మనిషిని గుర్తించడంలో మహాభారతానికి ఏదో ఇబ్బంది ఉంది. మహాభారతానికే కాదు, ప్రపంచ పురాణ కథలన్నిటికీ ఆ ఇబ్బంది ఉంది.

కీచకుడు తన వెంటపడి వేధిస్తున్నప్పుడు ద్రౌపది ఏకాంతంగా భీముని కలిసి తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆవేశం పట్టలేక, ఆ జూదరి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నామని ధర్మరాజును తూలనాడుతుంది. అప్పుడు భీముడు ఆమెను మందలించగా తప్పు దిద్దుకుంటూ ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఆ సందర్భంలో “…కేవల మర్త్యుడే ధర్మసుతుడు?”  అంటుంది. ధర్మరాజు మామూలు మనిషి కాదు, మహాత్ముడని చెప్పడం అందులో ఉద్దేశం. ఇలా మహాత్ముడు-మర్త్యుడు అనే విభజన మహాభారతంలో ఇంకా చాలా చోట్ల వస్తుంది.  అజ్ఞాతవాసం గడపడానికి విరాటనగరానికి వెళ్లబోయేముందు, ‘ఇంతటివాడు ఒక మర్త్యుని ఎలా సేవించుకుంటాడు’ అంటూ ధర్మరాజును తలచుకుని అర్జునుడు బాధపడతాడు. ఇంద్రునితో అర్థసింహాసనం అధిష్టించిన అర్జునుడు ఒక మర్త్యుని కొలువు ఎలా చేస్తాడని ధర్మరాజు విచారిస్తాడు. మామూలు మనుషులను సూచిస్తూ మహాభారతం ప్రయోగించిన మరో మాట: ప్రకృతిజనులు. “పుడుతూనే కవచ, కుండలాలతో పుట్టిన కర్ణుడు ఒక ప్రకృతి కాంతకు పుట్టడం ఎలా సాధ్యం?” అని దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు. సారాంశం ఏమిటంటే, మహాభారత కాలానికి మనుషుల్లో సామాన్యులు-అసామాన్యులన్న తేడా వచ్చేసింది.

అటువంటి మహాభారత సమయానికీ, “నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది?” అని ఆధునిక మహాకవి ప్రశ్నించే నాటికీ మధ్య చాలా కాలం ప్రవహించింది. చాలా చరిత్ర గడచింది. విచిత్రం ఏమిటంటే, ప్రజాస్వామ్య రాజకీయాలు తనకు సరికొత్త అసామాన్యతను కల్పించి అందల మెక్కించి ఊరేగిస్తున్నా ‘సామాన్యుడు’ ఇప్పటికీ సామాన్యుడి గానే ఉన్నాడు. వాస్తవంగా అసామాన్యతను చలాయిస్తున్న నాయకుల నోట మంత్రంగా మారాడు. అదలా ఉంచితే, మనదేశంలో ‘సామాన్యుడు’ తన ఉనికిని చాటుకోవడం ఎప్పటినుంచి ప్రారంభమైందో తెలిపే చారిత్రక అంచనాలను ఎవరైనా నమోదు చేశారో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేను కానీ; యూరప్ లో ఆ పరిణామం ఎప్పుడు, ఏ ఘట్టంలో జరిగిందో చరిత్రకారుడు హెచ్.జి. వెల్స్ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్  లో రాశాడు.

A_Short_History_of_the_World_(H.G._Wells)

పదకొండవ శతాబ్ది చివరిలో టర్కులు జెరూసలెంను ఆక్రమించుకుని, క్రైస్తవులందరూ పవిత్రయాత్రాస్థలిగా భావించే  హోలీ సెపుల్చర్ చర్చిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దాంతో టర్కులపై మతయుద్ధానికి  సిద్ధపడవలసిందిగా అప్పటి పోప్ అర్బన్-II పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికి పిలుపు నిచ్చాడు. ఆ యుద్ధాలే క్రూసేడ్ లుగా, శిలువకోసం జరిగిన యుద్ధాలుగా ప్రసిద్ధికెక్కాయి. అప్పుడు పీటర్ అనే ఒక చింకి పాతల సన్యాసి పెద్ద శిలువను మోస్తూ చెప్పులు లేని కాళ్లతో గాడిద మీద జర్మనీ, ఫ్రాన్స్ వీధుల్లో తిరుగుతూ క్రూసేడ్లకు అనుకూలంగా ప్రజలను ఉద్బోధించాడు. అప్పటికి శతాబ్దాలుగా క్రైస్తవ బోధలకు ప్రభావితమవుతున్న యూరప్, క్రూసేడ్ల పిలుపుకు ఎంతో ఉద్విగ్నపూరితంగా స్పందించింది.  క్రైస్తవజనసామాన్యం ఒక ప్రజాశక్తిగా అవతరించి తన ఉనికిని చాటుకోవడం ప్రారంభించారు. ఒక పిలుపును అందుకుని సామాన్యప్రజానీకం అలా ఉవ్వెత్తున విరుచుకుపడడం మానవాళి చరిత్రలోనే కొత్త పరిణామమనీ;  వెనకటి రోమన్ సామ్రాజ్య, భారత, చైనా చరిత్రలలో దీనితో పోల్చదగిన దేదీ కనిపించదనీ వెల్స్ అంటాడు. ఆధునిక ప్రజాస్వామ్య ఆవిర్భావానికి ఇది నాంది అని పూర్తిగా అనలేకపోయినా, ఇందులో కచ్చితంగా ఆధునిక ప్రజాస్వామ్య ఉత్ప్రేరకాలు ఉన్నాయని ఆయన అంటాడు.

అంతకుముందు మనిషి చరిత్రలో వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థకు వెడితే, అందులో సామాన్యుడు, అసామాన్యుడన్న విభజనే లేదు. గణంలోని ప్రతి సభ్యుడూ సామాన్యుడే, లేదా అసామాన్యుడే. గణసభ్యులు కలసికట్టుగా ప్రకృతితో సంఘర్షించినంత కాలం వారిలో తారతమ్యాలు లేవు. మనిషి సాటి మనిషితో సంఘర్షించడం ప్రారంభమయ్యాకే తారతమ్యాలు వచ్చాయి. సామాన్యులు, అసామాన్యులనే విభజన వచ్చింది. గణవ్యవస్థలో  ప్రతి మనిషీ ముఖ్యుడే. ఏ ఒక్కరూ అనామకులు కారు. ప్రతి ఒక్కరి ఉనికీ చరిత్రలో నమోదు అయింది. కుంటా కింటే తన మూలాలనుంచి వేరుపడి తనది కాని నేలపై, తనది కాని భాష మధ్య అనామకంగా బానిస జీవితం గడిపినా; తను పుట్టిన గడ్డపై అతను అనామకుడు కాడు. అతని స్మృతిని  అది తరం నుంచి తరానికి భద్రంగా అందిస్తూనే వచ్చింది. విచిత్రాన్ని మించి,  విషాదం ఏమిటంటే; లిఖితచరిత్ర లేని కాలంలో కూడా ప్రతి మనిషి ఉనికీ నమోదయింది, లిఖితచరిత్ర వచ్చాక మనిషి చరిత్రహీనుడయ్యాడు.  గణంనుంచి జనానికి మారగానే సామాన్యుడి పేరుతో అనామక సముద్రంలో అజ్ఞాతంగా కలసిపోయాడు. తాత ముత్తాత పేరు కూడా తెలియని చారిత్రక అజ్ఞానిగా మిగిలిపోయాడు.

***

తమ పూర్వీకుడు కుంటా కింటేను బానిసగా పట్టుకుని ఓడలో ‘నేప్లిస్’ అనే చోటికి తీసుకొచ్చారని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పగా హేలీ విన్నాడు. మేరీల్యాండ్ లో ఉన్న అన్నాపోలిస్ కు భ్రష్టరూపమే నేప్లిస్. గాంబియానది నుంచి బానిసలతో ఏయే ఓడలు అన్నాపొలిస్ కు ప్రయాణించాయో లండన్ వెళ్ళి శోధించడం ప్రారంభించాడు. “రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో కుంటా కింటే అదృశ్యమయ్యా”డని జఫూరు గాథికుడు ఇచ్చిన సూచనే అతనికి చుక్కాని.  ‘రాజుగారి సైనికులు’ మరెవరో కాదు, 1760లో జేమ్స్ ఐలండ్ లోని బానిస దుర్గానికి రక్షణగా కల్నల్ ఒహేర్స్ నాయకత్వంలో వచ్చినవారేనని తేలింది. ఆ సమాచారంతో హేలీ లండన్ లోని లాయిడ్స్ కు వెళ్ళి, ఇంగ్లీష్ సముద్రయాన పత్రాలను గాలించడం ప్రారంభించాడు. ఆరువారాలు గడిచాయి. ఏడో వారంలో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక వెడల్పాటి పత్రం కనిపించింది. 1766-1767 మధ్యకాలంలో గాంబియా నది నుంచి ప్రయాణించిన 30 ఓడల వివరాలను అది నమోదు చేసింది. అతని చూపు ఓడ నెం. 18 దగ్గర ఆగింది.

1767లో… అంటే ‘రాజుగారి సైనికులు వచ్చిన’ ఏడాది… జూలై 5న లార్డ్ లిగొనీర్ అనే ఆ ఓడ గాంబియా నదిలో బయలుదేరింది. దాని గమ్యస్థానం అన్నాపొలిస్!  కెప్టెన్ పేరు థామస్ ఈ. డేవిస్…

ఎందుకో తెలియదు కానీ, ఆ వివరాలకు తను స్పందించడంలో ఆలస్యం జరిగిందనీ, యాంత్రికంగా ఆ సమాచారాన్ని రాసుకుని, పత్రాలను మూసేసి బయటకు నడిచాననీ హేలీ అంటాడు. వీధి మలుపులో ఉన్న చిన్న టీ షాప్ కు వెళ్ళి టీ తెప్పించుకున్నాడు. టీ చప్పరిస్తుండగా, కుంటా కింటేను తీసుకొచ్చిన ఓడ అదే కావచ్చని అతనికి మెరుపులా స్ఫురించింది. ఆ టీ ఇచ్చిన ఆమెకు ఎంతో రుణపడ్డాననుకున్న హేలీ అప్పటికప్పుడు బయలుదేరి న్యూయార్క్ వెళ్లడానికి నిర్ణయించుకుని, సీటుకోసం పాన్ అమెరికన్ ను సంప్రదించాడు. చివరి సీటు ఉందని అది జవాబిచ్చింది. తను దిగిన హోటల్ కు వెళ్లడానికి కూడా సమయం లేదు. ట్యాక్సీ చేసుకుని నేరుగా హిత్రో ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయాడు. విమానంలో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో తను చూసిన పుస్తకమే అతని కళ్ళముందు కదులుతోంది. అది గోధుమరంగు అట్టతో ఉంది. దానిమీద Shipping in the port of Annapolis అనే నల్లని అక్షరాలు ఉన్నాయి. రచయిత వాఘన్ డబ్ల్యు బ్రౌన్.

న్యూయార్క్ లో దిగీ దిగగానే మరో విమానంలో వాషింగ్టన్ వెళ్లిపోయాడు. ట్యాక్సీ చేసుకుని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు వెళ్ళాడు. పుస్తకం తెప్పించుకున్నాడు. ఆతృతగా పుటలు తిరగేస్తూపోయాడు. తను వెతుకుతున్నది కనిపించింది! లార్డ్ లిగొనీర్  అన్నాపొలిస్ లో 1767,సెప్టెంబర్ 29న కస్టమ్స్ క్లియరెన్స్ పొందింది…హేలీ అక్కడినుంచి బయలుదేరి కారు అద్దెకు తీసుకుని అన్నాపొలిస్ కు వెళ్ళాడు. నేరుగా మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు దారితీశాడు. 1767 అక్టోబర్ మొదటివారంలో ప్రచురితమైన స్థానిక వార్తాపత్రికల సంచికలు కావాలని అడిగాడు. సిబ్బంది మేరీల్యాండ్ గెజిట్  సంచికలున్న మైక్రో ఫిల్మ్ చుట్టలు తీసుకొచ్చి అతని ముందు ఉంచారు. వాటిని మిషన్ లో ఉంచి తిప్పుతుండగా  అక్టోబర్ 1 సంచికలో ఒక ప్రకటన కనిపించింది…

హేలీ అన్వేషణలో చివరి అంకం, తర్వాత…

 

-భాస్కరం కల్లూరి

 

 

 

ఒక స్నేహ దీపం ఆరిపోయింది!

ప్రముఖ కథా రచయిత, గేయ రచయిత, సంగీతజ్ఞుడు గిడుగు రాజేశ్వర రావు గారు (1932-2013) హఠాత్తుగా కన్ను మూయడం ఆయన అభిమానులనందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. చివరి దాకా ఆయన పూర్తి ఆరోగ్యంగా, తాజాగా,ప్రసన్నంగా వున్నారు.  ముఖంలోని చిరునవ్వుగానీ, ఆరోగ్యసూచకమైన వెలుగుగానీ ఏమాత్రం చెదరలేదు.ఆయన దినచర్యలో ఏమీ మార్పు రాలేదు. చదవడం, రాయడం, షికారుకు వెళ్ళడం, సాహిత్యకార్యక్రామాల్లో పాల్గొనడం అన్నీ మామూలుగానే చేసేవారు. యింకా 10 యేడ్లు యేమీ ఢోకా లేదనిపించేవారు, యితరులకు కూడా అలా ఉండాలనే ప్రేరణ కలిగించేవారు. ఒక వారం క్రిందట నేను ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయన వద్దనే ఉన్నాను. అదే నేనాయనతో గడిపిన ఆఖరు రోజు.
ఆ రోజు ఆయన కొంత కాలంగా రాయడం మొదలుపెట్టిన  నవల లోని రెండు అధ్యాయాలు చదవమని నాకిచ్చారు. కొంత ఆత్మకథ కలగలసిన ఆ నవల అంశాలు చదివి  వినిపించాను. దాన్ని గురించి కొంత చర్చించుకున్నాము కూడా.యిక తన కాలాన్నంతా నవలకే కేటాయిస్తున్నట్లు, అహమదాబాదులోని ఒక సంస్థ ఆయనను ఆగస్టునెలలో సత్కరిస్తున్నట్లు, ఆ సంర్భంగా అక్క్కడికి ఎళ్తున్నట్లు చెప్పారు. అంతే కాక నేను అంతకు మునుపు మా సాహితీ మిత్ర మండలిలో చదివిన జైనేంద్ర కుమార్ హిందీ కథ–తాత్వికతతో కూడిన కథ— ’తత్సత్’ బాగా నచ్చినందువల్ల దాన్ని తెలుగు లోకి అనువదించాలనే కోరిక ఆయనకున్నందువల్ల ఆ కథ సాంతం మళ్ళీ వినిపించి అర్థాలు చెప్పాను. ఆయన అర్థాలన్నీ నోట్ చేసుకున్నారు.
మరుసటి రోజు అనువాదం పూర్తి అయిందని చెప్పడానికి ఫోను కూడా చేశారు.అంత దీక్షతో పనిచేసేవారు. ఇంతకు మునుపు  కూడా ఆయన ఈ విధంగానే మా మిత్రమండలిలో నేను చదివిన కొన్ని హిందీ కథలను అనువదించి ప్రచురించారు కూడా. ఉదాహరణకు యశపాల్ కథ ’కర్వా వ్రతం’(కర్వా కా వ్రత్) భీష్మ్ సాహనీ కథ ’సర్దార్నీ’. ఇలాగే మరికొన్ని కథలు కూడా అనువదించాలనే కోరిక ఆయనకు ఉండేది. ఈ అనువాదాల్ల్లో ఆయనకు సహకరించడం నాకు చాలా ఆనందం కలిగించేది. ఈ పనిగా ఆయన వద్దకు వెళ్ళి నప్పుడంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతో గడిపే అవకాశం నాకు లభించేది. కొన్ని సందర్భాల్లో  నేను హిందీ నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలు  ఆయనకు చూపించేవాణ్ణి. ఆయన శ్రద్ధగా చదివి అవసరమైన మార్పులు సూచించేవారు. ఈ విధంగా మా సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఆయన హఠాన్మరణం గురించి తెలియగానే ఈ ప్రసిద్ద్ద శ్లోకం మనసుకు వచ్చింది:
అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం,
దేహాంతే తవ సాయుజ్యం, దేహి మే పార్వతీ పతే
(దేవా! పార్వతీ వల్లభా! బ్రతికినన్నాళ్లు దైన్యములేని జీవితమును, కాలము తీరినపుడు అనాయాస మరణమును, దేహమును  వదలినపిమ్మట నీలో కలియుటను ఈ మూడింటిని నాకు అనుగ్రహింపుము).ఇలాంటి కోరిక తీరిన వ్యక్తిలాగానే ఆయన వెళ్లి పోయారు. స్విచ్ ఆఫ్ చేసినట్లు. తానూ ఆయస పడలేదు, ఇతరులనెవ్వరినే ఆయాస పెట్టలేదు.  సార్థకము, సఫలము అయిన   జీవితం జీవించి, పలువురిని మన్ననలందుకొని   వెళ్లిపోయారు.
     భగవద్గీతలోని కర్మయోగి ఆయన. చివరి క్షణం వరకు క్రియాశీలుడుగానే ఉన్నాడు.  గొప్ప  యోగులు,సాధకులు యోగంద్వారా తనువు చాలిస్తారని అంటారు. రాజేశ్వర రావుగారు కూడా అలానే చేశారనిపిస్తుంది.
    నా ఒకనితోనే కాదు, డిల్లీ లోని మా సాహితీ మిత్రమండలిలోని ప్రతి ఒక్కరికి ఆయన సన్నిహితుడైపోయాడు. గత పది-పడ్రెండేళ్లలో– మధ్యలో కొంత కాలం తప్ప— డిల్లీలో  మా అందరికీ ఆత్మబంధువుగా, పెద్దదిక్కుగా,  ప్రేరక శక్తిగా ఉంటూ వచ్చారు . ఆయన సౌజన్యం మమ్మలనందరినీ కట్టి పడేసేది. అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారు.  శ్రమపడి ఎంతో దూరం నుంచి  మా సమావేశాలకు వచ్చేవారు. వాటిలో తన రచనలు చదివి వినిపించేవారు, యిక్కడి రచయితల రచనల పైన తన అభిప్రాయం వెలిబుచ్చేవారు.
    సంగీతంలో ఆయనకున్న ఆసక్తిని గురించి, అభినివేశాన్ని గురించి, ఆయన చేసిన కృషి గురించి చాలా కాలం దాకా మాకు తెలియదు. తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఉత్తరాది, దక్షిణాది సంగీతాలను, జానపద సాహిత్యాన్ని తనివితీరా ఆస్వాదించిన రాజేశ్వర రావు గారు సందర్భం వచ్చినప్పుడంతా ఆ పాటల చరణాలను  లీనమై పాడేవారు.  హిందీ పెద్దగా రాకపోవడం ఆయన సంగీత సాధనకు అడ్డంకిగా ఉన్నట్లు  నాకు తోచలేదు. యెన్నో పాత హిందీ-తెలుగు పాటలు ఆయన జిహ్వాగ్రం పైన ఉండేవి. ఆయనకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టమా, లెక సాహిత్యమంటేనా అనేది చెప్పడం కష్టమనిపించేది. సంగీతం బాగా తెలిసి ఉండడం ఆయన రాసిన గీతాలకు బాగా తోడ్పడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. రేడియోలో, టీవీలో ప్రసారం పొందిన ఆయన అనేక గేయాలు శ్రోతలకు చిరపరిచితమే. శ్రీమతి రాజేశ్వర రావు గారు, ఆయన కుమార్తె స్నేహలతగారు కూడా సంగీతం బాగా తెలిసినవారే.
    రాజేశ్వర రావు గారు  ప్రధానంగా మానవీయ విలువలను, ఆదర్శ మానవ జీవితాన్ని  చిత్రించిన రచయిత.  మొత్తం ఆయన సాహిత్యంలోని భావాల్లో, ఆలోచనల్లో  యీ విలువల గురించిన చింతే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజుల్ల్లో మనుషుల్లో  సాధారణంగా కనిపించే స్వార్థపరత్వాన్నీ, అవినీతిని, విచ్చలవిడితనాన్ని, విలువలు లేకపోవడాన్నీ చూసి ఆయన తీవ్రమైన ఆవేదన చెందేవాడు. తన జీవితం ద్వారా, సాహిత్యం ద్వారా ఆ విలువలకు బలం చేకూర్చడం  కోసమే ఆయన తాపత్రయపడ్డారు, శ్రమించారు,. తన కల్పనలో ఉన్న గంభీరమైన మానవ జీవితాన్ని. బలమైన నైతిక భావాల్ని, సౌహార్ద్రం నిండిన మానవ సంబధాలను  చిత్రించారు. ఆయనలో కళా దృష్టి కంటే ప్రయోజనపరమైన దృష్టే ఎక్కువగా ఉంటుంది.  అయితే  భావాల్ల్లో తీవ్రత, ఉధృతి  ఉండవు.  సున్నితంగా, మృదువుగా. హితవు చెప్పినట్లుగా చెప్పడం ఆయనకు ఇష్టం.  ఆయన స్వయంగా కూడా సౌజన్యశీలి, మితభాషి, మృదుస్వభావి. ఉదాత్త వ్యక్తిత్వం కలవాడాయన.. తీవ్ర భావాభివ్యక్తి ఆయన ప్రవృత్తికి సరిపడదు. ఆ గుణమే ఆయన సాహిత్యంలో కూడా ప్రతిఫలించి అందులో సారళ్యం, మాధుర్యం చోటు చేసుకున్నాయి..  మానవుని జీవితాన్ని సృష్టి లయతో మేళవించడానికి, సృష్టితో దానికి సామరస్యం స్థాపించడానికి ఆయన తన సాహిత్యం ద్వారా కృషి చేశాడు. చెప్పదలచుకున్నది సూటిగా చెబుతారు. అందువల్లే ఆయన సాహిత్యంలో ఎలాంటి వాద వివాదాలకు చోటు లేకుండా పోయింది.
    ఆయన తత్వమేమిటో ఆయన మాటల్లోనే ఇలా చెప్పుకున్నాడు ” నిరంతరం తిరిగే సృష్టిచక్రానికి కందెన ప్రేమతత్వమే  కానీ పగ, ద్వేషం కాదు. మానవూడు ప్రకృతికి దూరంగా  జరిగిపోతున్నాడని వందేళ్ల క్రితం  డేవీస్  విచారించాడు.  కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే చెప్పలేనంత దూరమే మళ్లిపోతున్నాడు.
    “ఈ సృష్టిని  వినయంతో ఆరాధించి, భావి తరాల  పట్ల శ్రద్ధ వహించడంలో తేనెటీగలు, వానపాములు వంటి అల్పజీవులు చూపిన పాటి దీక్ష, సహజీవన కాంక్ష బుద్ధిజీవులని విర్రవీగే  నరజాతి చూపకపోవడానికి కారణం ఒకటే.  ప్రేమ జీవితానికి అత్యవసరమన్న సత్యాన్ని గుర్తించక పోవడమే. విధ్వంసకారకాలైన పగ, ద్వేషం, జనాన్ని, ముఖ్యంగా యువతని తమవేపుకు లాక్కుంటున్నాయి…..ప్రకృతి దృశ్యాల వెనక అంతర్లీనంగా ఉన్న ప్రేమతత్వం, రానున్న తరాల పట్ల శ్రద్ధ, గమనించినప్పుడు  మానవ హృదయంలో కాసింత పరివర్తన, మృదుత్వం చోటు చేసుకుంటుంది.  విధ్వంసకోన్మాదమే సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక మార్గం అన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుంది– అని నమ్ముతున్నాను. ప్రకృతిని ప్రేమించి ఆరాధించే సాధనకు మించిన భక్తి ఏమతంలోనైనా వేరే ఏముంటుంది? “
    గిడుగు రాజేశ్వర రావు గారు మొత్తం పధ్నాలుగు రచనలు ప్రచురించారు. (1)గిడుగు రాజేశ్వర రావు కథలు (2) రాగవీచికలు (లలిత గేయాలు) ఇది గరికపాటి సాహిత్య పురస్కారం పొందింది (1993) (3) కాళిందిలో వెన్నెల (కథల సంపుటి) (4)పూలతేరు (కథల సంపుటి)  (5) భావ వీచికలు ( ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల్లో ప్రసారమైన లలిత గేయాలు)  (6)మల్లె పందిరి ( ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం వారి ’ముదిగొండ సాహిత్య పురస్కారం-2003 పొందిన బాలల గేయాల సంపుటి) (7) మా ’కంద’ స్పందనలు (కంద పద్య శతకం)  (8) శబ్ద చిత్రాలు (రేడియో నాటికలు)  (9) ఉదాత్త చరితుడు గిడుగు ( రామమూర్తి పంతులు గారి  జీవిత చరిత్ర)  (10) అమూల్యక్షణాలు (కథల సంపుటి) (11) పిల్లలకు పిట్టకథలు  (12)రాజమకుటాలు  (వ్యంగ్య  పద్యరచన) (13) కవన కదంబం (కవితలు) (14) సృష్టిలో మధురిమలు ((సచిత్ర  పద్య రచన)
     రాజేశ్వర రావు గారి కథలు జీవితంలోని అతి సున్నితమైన అంశాలను స్పృశిస్తాయి, ఏ అలంకారాలూ లేకుండా, నిరాడంబరంగా,  నిసర్గ సుందరంగా ఉంటూ తమ లక్ష్య శుద్ధి తో, నిజాయితీతో,  ఆర్ద్రతతో పాఠకుణ్ణి ఆకట్టుకుంటాయి,ఆలొచింపచేస్తాయి. సరళమైన భాష, కథను నడిపించడంలో మంచి నేర్పు, అందులోని సందేశం ఆయన కథల్లోని మరి కొన్ని విశేషతలు.  ఈయన అనేక కథలు  పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి.   వీరి  బాలల గేయాలు, లలిత గేయాలు  ఉదాత్తమైన భావాలతో నిండి, రాగ-తాళయుక్తంగా పాడడానికి అనువుగా ఉంటూ,పాడేవారికి, వినేవారికి, చదివేవారికి. అందరికి రసానుభూతిని కలగజేస్తాయనడంలో సందేహం లేదు.
  ఎంతో శ్రమపడీ సేకరించిన సమాచారంతో   తన తాత గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను పొందుపరచి రాసిన ’ఉదాత్త చరితుడు’ ఒక విశిష్ట రచన . మునుపెన్నడు వెలుగులోకి రాని విశేషాలెన్నో ఇందులో ఉన్నాయి.
   రాజేశ్వర రావు గారి చివరి ప్రచురిత రచన ’సృష్టిలో మధురిమలు’  మరో విశిష్ట రచన. తాను తీసిన ఫోటోల్లోని, సేకరించిన ఫోటోల్లోని  ప్రకృతి  దృశ్యాలకు తగినట్లుగా  తానే రాసిన గీతాలను చేర్చి ప్రచురించిన  పలు రంగుల చిత్రాలతో కూడిన  రచన ఇది.  దాన్ని ఆయన ’సప్తవర్ణ దృశ్యకావ్య ప్రయోగం” అని అన్నారు.  ఈ రచన  రాజేశ్వర రావు గారు  ప్రకృతితో  ఎంత తాదాత్మ్యం చెంది ఉండేవారో,  ఎంత సూక్ష్మ పరిశీలన చేసేవారో స్పష్టంగా తెలుపుతుంది.
 “నిండు దోసిట పట్టిన నీరు కూడ
వేలి సందులలో జారి నేల రాలు,
మధురమైన క్షణాలను మరచి పోక 
భద్రపరచు ప్రయత్నమీ పద్య రచన!”
అని ఆరంభించిన ఈ  రచనలోపశు -పక్షులనుంచి, క్రిమికీటకాలనుంచి, ప్రకృతి నుంచి మానవుడు  తన మనుగడకు, తన ఉన్నతికి  నేర్చుకోవలసిన అనేక పాఠాలను దర్శింపచేసే చిత్రాలు, వాటిని హృద్యంగా వర్ణించిన  గేయాలు ఉన్నాయి.   సారిసారికీ  చూస్తూ, చదువుతూ ఉండడానికి  ప్రక్కనే ఉంచుకోదగ్గ పుస్తకం.
     తన ఆలోచనలను. ఆదర్శాలను, చింతలను వెలిబుచ్చే రెండు కథలు ఆయన ఈ మధ్యనే ప్రచురించారు. ఒకటి వన మహోత్సవం, రెండోది ధర్మసందేహం.
జె. ఎల్. రెడ్డి
Dr. J.L Reddy

గోదారికి కొండమల్లెలు తురిమిన పాటగాడు!

నిన్నటి పాటతో ఇవాళ్టి కవిత: గిడుగుతో కవి కృష్ణుడు

నిన్నటి పాటతో ఇవాళ్టి కవిత: గిడుగుతో కవి కృష్ణుడు

“వేల మైళ్ల ఎత్తులో ఎగిరే పక్షినై.. “అని ఇటీవల ఒక కవిసమ్మేళనంలో ఒక కవి చదువుతున్నప్పడు అదే సమ్మేళనంలో నా ప్రక్కనే కూర్చున్న గిడుగు రాజేశ్వరరావు నవ్వుతూ..” పక్షి అంత ఎత్తుకు ఎగిరితే ఆక్సిజన్ లేక చచ్చిపోతుంది.” అని మెల్లగా నా చేయి నొక్కుతూ చమత్కరించారు. నాకూ నవ్వొచ్చింది కానీ ఇతరులు ఏమి అనుకుంటారో అని ఆపుకున్నాను.

ఆ తర్వాత నేనూ, ఆయనా కవితలు చదివాను. ఆయన నేటి వర్తమాన సమాజంంపై విసుర్లు విసురుతూ కందపద్యాలు చదివారు. చాలా సరళంగా, సులభంగా వచన కవిత్వం చదివినంత హాయిగా ఆయన కందపద్యాలు రాయగ లరు. మళ్లీ కలుసుకుందామని విడిపోయాం కానీ, ఆయన మూడునెలల్లోనే ఆయన నేను కలుసుకోలేనంత దూరం వెళిపోతారని ఊహించలేదు. 

ఎందుకో గిడుగును నేనుచాలా తక్కువ సార్లు కలిసినప్పటికీ కలిసినప్పుడల్లా మాకు ఎన్నో రోజులుగా పరిచయం ఉన్నట్లు అనుభూతి. నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చాలా విషయాలు మాట్లాడేవారు. నాకంటే ఆయన దాదాపు 30 ఏళ్లు పెద్దవారైనా ఆ వయోతారతమ్యం అనేదే లేనట్లు ఆయన సంభాషించేవారు. స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆయన తొలికథ అచ్చయిందని తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పటికి ఆయనకు 14 ఏళ్లు.

గిడుగుకు భౌతికమైన వయోతారతమ్యం మాత్రమే కాదు,మానసికమైన అడ్డుగోడలు కూడా లేవని, ఆయన స్వచ్చమైన నదీ ప్రవాహం లాంటి వారని ఆయనతో గడిపిన కొన్ని క్షణాలు అనిపిస్తుంది. ।మేధస్సును పెంచుకునే ఆరాటంలో మనసును పెంచుకోలేకపోవడమే నేటి మానవుడి బలహీనత… ఏ శిబిరానికో, వివాదానికో అంకితమై ఇతరుల్ని ప్రత్యర్థులుగా చూసే సాహసం అలవడ లేదు..* అని ఆయన ఒక సందర్భంలో చెప్పినప్పటికీ తన కథల్లో మానవ సంబంధాలను చిత్రించేటప్పుడు మనిషి మనిషిగా ఉండాలంటే కొన్ని జీవలక్షణాలు అవసరమన్న అభిప్రాయం ఆయనకు ఉన్నట్లు అర్థమవుతుంది. అది మంచితనం, యుక్తాయుక్త విచక్షణ,సభ్యత, మానవత్వం, సున్నితత్వం, ఒకరినొకరు గౌరవించుకోవడం, నైతిక విలువలు, బలహీనులకు చేయూతనివ్వడం లాంటివి. ఎలాంటి సిద్దాంతాల ప్రస్తావన లేకుండానే ఆయన కథల్లో మనం నిత్యం చూసే మనుషుల జీవితాల్లో ఈ విలువలను చిత్రించారు.
“ఏ ప్రేమ మహిమతో నెల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి యుండు..” అన్నఅద్భుతమైన కవితా వాక్యంతో ఆయన ।కాళిందిలో వెన్నెల* అన్న కథ ముగించి మన రెప్పలు విశాలంగా తెరుచుకునేలా చేస్తారు. పురుషాధిపత్యాన్ని ద్వేషించే కాళింది అనే అమ్మాయిలో ఒక యువకుడు తెచ్చిన మార్పును ఈ కథ చిత్రిస్తుంది. “పతనమైన సామ్రాజ్య శకలాల్లోంచి నిజంగానే సరికొత్త విలువలు ఏరుకుంది లక్ష్మి..” అన్న వాక్యంతో ఆయన మరో కథ ముగుస్తుంది. ఆ కథ సాధారణ కుటుంబ కథ అయినప్పటికీ వ్యవస్థలో మార్పులు కుటుంబంలో ప్రతిఫలిస్తాయనే మౌలిక వాస్తవాన్ని ఆయన ముగింపు ద్వారా తెలిపారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ను సందర్శించేందుకు వెళ్లిన వేలాది మంది ప్రకృతివైపరీత్యాలకు గురైనప్పుడు ఆయన రాసిన ఒక కథ గుర్తుకు వచ్చింది. ।ఇంత చలిలో, అప్పుడప్పుడూ గోరువెచ్చగా వచ్చే ఎండలో ఉండీ ఉడిగిపడే వానజల్లులో ఈ మనుష్యులు ఇన్ని కష్టాలకోర్చి ఏం చూడాలని వెళుతున్నారు? వారిని ఇళ్లలోంచి తరిమి ఈ ప్రస్థానం చేయిస్తున్నదెవరు? సత్యశోధనా, జ్ఞానతృష్ణా ఈ యాత్రకు ఊపిరిపోస్తున్నదా? ఊహకందని విశాల విశ్వాకృతి పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని ప్రకటించుకుని తేలికపడాలని మానవుడు ఒక సంక్షిప్తాకృతిని ప్రతీకగా కల్పించుకుంటున్నాడా? *అని ఆయన ఈ కథలో ఒక పాత్ర ద్వారా ప్రశ్నింపచేశారు. ప్రతిదాన్నీ వ్యతిరేక భావంతో, అనారోగ్య విమర్శనాత్మక ధోరణితో చూసేవారికీ గిడుగు దృష్టికీ ఎంత తేడా? అది మురికి కాల్వ ప్రవాహానికీ, జలపాతానికీ ఉన్న తేడా కాదా?

“రచ యిత ఏ ఇంట పుట్టినా, అతి అతడి చేతులో లేని పని. ఆ ఇంట తనకు వెచ్చగా కప్పిన కంబళిలో పెరిగినా, చింకి దుప్పటిలో పెరిగినా ఆ ఆచ్ఛాదన తొలగించుకుని లోకాన్నీ, సమాజాన్నీ, చరిత్రనూ ఆకళింపు చేసుకోగల విశిష్ట రచయితగా మారగలగాలి. కరకు కాబూలీ వాలాలో మెత్తటి మనసును చూడగలగడానికి టాగోర్ కాబూలీవాలాగా పుట్టాల్సిన అవసరం లేదు..” అని గిడుగు రాజేశ్వరరావు అన్నారంటే ఆయన పిడివాదాలకూ, అస్తిత్వ వాదాలకూ, సిద్దాంత,రాద్దాంతాలకూ ఎంతో దూరంగా ఒక నిర్వికల్ప,నిష్కల్మష స్మితయోగిగా ఎదిగారని అర్థమవుతుంది. లేని వాళ్ల బతుకు గడవని క్షణాలను, ఉన్న వాళ్ల బతకడం రాని దినాలను ఆయన సమానంగాచిత్రించారు.

నిజానికి ఆయనలో గాఢత లేదని కాదు. గాఢత ఉన్నందుకే ఆయన సరళంగా వ్యక్తం చేయగలిగారు. తండ్రి గిడుగురామమూర్తి పంతులు,పెదతండ్రి గిడుగు సీతాపతి,తండ్రిగిడుగు రామదాసు తెలుగు భాషను గ్రాంథిక కౌగిలినుంచి వేరు చేసేందుకు చేసిన కృషి అంతా గిడుగు రచనల్లోనే ప్రతిఫలిస్తుందేమోననిపిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే గిడుగు కుటుంబం జీవితం రాష్ట్ర విభజన తో ముడిపడి ఉన్నది. ఒరిస్సా రాష్ట్రం అయినప్పుడు పర్లాకిమిడి రాజా అందులోనే ఉండాలని నిర్ణయించారు. రాజాను వ్యతిరేకించిన సీతాపతి తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.ఒరిస్సా రాష్ట్రం అయిన రోజే గిడుగు రామమూర్తి కుటుంబం విజయనగరం తరలివచ్చింది. పర్లాకిమిడిలోని టెక్కలిలో హైస్కూలు వరకు చదివిన రాజేశ్వరరావు విజయనగరంలో ఇంటర్ చేశారు. శ్రీశ్రీకి పాశ్చాత్య సాహిత్యాన్నిపరిచయం చేసిన రోణంకి అప్పలస్వామి శిష్యరికం ఆయనకు అబ్బిందంటే రాజేశ్వరరావు ఎలాంటి పరిణతి సాధించాలో అర్థంచేసుకోవచ్చు. 1956 వరకూ మద్రాస్ ఎజి ఆఫీసులో పనిచేసిన రాజేశ్వరరావు రాష్ట్ర విభజన కాగానే ఉద్యోగుల బదిలీలో భాగంగా హైదరాబాద్ ఎజి ఆఫీసుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర విభజనకు తెరతీస్తున్న సమయంలోనే ఆయన మరణించడం యాదృచ్ఛికం కావచ్చు. మద్రాసులో ఉద్యోగం లేనప్పుడు ఆయన అప్పుడు మద్రాసులో ఉన్న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతులకు మేలు ప్రతులు రాస్తూ చిరుద్యోగంచేసేవారట.

గిడుగు రాజేశ్వరరావు తనను తాను ఎప్పుడూ మేధావి అని, ఎవరికో ఏదో బోధించాలనో ఎప్పుడూ అనుకోలేదు. వెన్నెల ఆకాశానికీ, మేఘాలకూ మాత్రమే పరిమితంకాకుండా నేలపై, పసిపాపలచెక్కిళ్లపై, ప్రేమికుల కనురెప్పలపై, పేదల ఆశలపై మెరిసినట్లు ఆయన కథలు, కవితలు, గేయాలూ రాస్తూ జీవించారు. స్కూలుకు వెళ్లే తన కూతురు అడిగినా, పోరాటాలు చేసే కార్మికులు అడిగినా ఆయన వారివారి భావాలకు తగ్గట్లు ర చనలు రాసిస్తూ ఉండిపోయారు. రేడియోకోస లలిత గీతాలు, నాటికలు రాశారు. ఎజి ఆఫీసులో రంజని సాహిత్య సంస్థకు సారథ్యం అందించి బృహత్తర కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆకురాల్చి నిట్టూర్చిన తరువులు, కోరిన రంగుల కొత్త చివురులు, కురిసే జల్లుల పుడమి కమ్మగా కలుకుచు తావిని చిమ్మేకాలాలను అలవోకగా చిత్రిస్తూ పోయారు.

“విరితేనెల గ్రోలి భ్రమర వైణికులే మురియగా, విరబూసిన వేపరెమ్మ వింత తావి కురియగా* అని రాయడం ఆయనకు అలవోకగా అబ్బింది. అదే సమయంలో ఆయనలో ప్రేమికుడు దాగిపోలేదు. ।ఆ కాటుక కళ్లలోని అల్లరి ఇంతింతా? అవిరేపే పెనుతుఫాను ఎదలో ఎంతెంతా? ” అని తనను తాను ప్రశ్నించుకున్నారు.

“ఒడ్డునెక్కి నవ్వుతున్న ఓరకనుల చినదానా, ఉరికిపడే వరదనీటి ఊపేమిటి తెలుసునా? ” అని తన ఊపు గ్రహించమని సంకేతాలందించారు. “మెల్లగ పోనీర బండి అల్లరి పిల్లోడ, కొండగాలి ఎదరగొట్టి గుండె ఝల్లుమంటది, మనసులోని ఊసేదో మాటకందనంటది, మాటరాక పల్లకుంటే ఏటోలా గుంటది.. “అని పిల్లదాని మనసును చిత్రించిన రసహృదయుడు రాజేశ్వరరావు. ఆయన పిల్లలకోసం రాసిన గేయాలు కూడా అసమానం. “ఎప్పటికప్పుడు ఏదో పనిలో తీరిక చిక్కని పెద్దల్లారా, చిట్టెడు ప్రేమనుపంచండి.. ” అని రాశారు. ఆయన కవితలు, గేయాలు చదివితే మన జీవితాలను చుట్టుముట్టిన పట్టణీకరణ కాలుష్యం తొలగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.

ఆయన సంగీత ప్రియుడని కూడాచాలామందికితెలియదు. కాని ఆయన గేయ సంపుటాలకు రావు బాలసరస్వతి, శ్రీరంగం గోపాలరత్నం లాంటివారు ముందుమాటలు రాశారు. అల నాటి ప్రముఖ గాయని, నటి బాలసరస్వతి ఆయన సంగీత జ్ఞానానికి పరవశించిపోయారు. 1936లో ఆమె ఆరేళ్ల ప్రాయంలో బాల కుచేల నాటకంలో నటించి పాడిన పాట కూడా రాజేశ్వరరావుకు నోటికి వచ్చని ఆమే రాశారు.

“శిశిర రుతువులో కూడా చిత్రమైన అందాన్ని చూడగల భావుకుడూ, తాత్వికుడూ రాజేశ్వరరావు” అని, “ఆయన పాటలలో గోదారి సరికొత్త అందాలు సంతరించుకుని కొండమల్లెలు తురుముకుంటూ ఉరుకుతుందని,నిరాశగా ఉన్న ఎలమావి ఉన్నట్లుండి వన్నెలు తొలగి పలకరిస్తుందని” బాలసరస్వతి రాశారంటే రాజేశ్వరరావు గొప్పతనం మనకు అవగతమవుతుంది.

మల్లీశ్వరి, మాయాబజార్, చెంచులక్ష్మి వంటి గొప్ప చిత్రాలకు సంగీత దర్శకత్వంవహించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు సాలూరురాజేశ్వరరావు నుఆయనఎంతో అభిమానించేవారు. ।గాలినై వేణువున క్షణమున్న చాలురా, రాగఝరినై సాగి పొంగిపోతాను* అని రాసిన గిడుగు రాజేశ్వరరావు సాలూరి పాడిన ।ఓహో యాత్రికుడా* పాటను మరిపిస్తూ యాత్రికుడులా సాగిపోయారు.

కృష్ణుడు

అరుణ పూర్ణిమ

“కొండగాలి తిరిగిందీ   గుండె ఊసులాడిందీ      గోదావరి వరద లాగా  కోరిక చెలరేగింది  …ఆ”

రేడియోలో పాట మొదలు కాగానే ఎప్పటి లానే గతం నా కళ్ల ముందుకు వచ్చింది. అక్షరాల్లో వెలువరించలేని  అనుభవాలు గుర్తుకు రాగానే  ఒంట్లో వెచ్చదనం ప్రవహించడం మొదలయ్యింది.
పది  సంవత్సరాలు గడచినా  ఆ అనుభవాల తాలూకు జ్ఞాపకాలు నాలో ఎప్పుడూ తాజాగా  ఉండటం నాకే ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. “పడుచుదనం పరువానికి  తాంబూల మిచ్చింది “
అనివార్యంగా గతంలోకి వెళ్లి పోతున్నాను.
                అమ్మా నాన్నా  లేని ఇల్లు. భరించలేని ఒంటరితనం .బాధ్యతంటే ఏమిటో తెలియని వయస్సు లో ఇంటి  భారం   తన భుజాల మీదికెక్కడం. అనాలోచితంగా రోజులు గడుస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత  ఆలోచనా శక్తి లేని వాణ్ని.ఏమీ తోచక ఎక్కువగా ఆనంద్ వాళ్ళింట్లో గడపటం అలవాటయ్యింది. ఆనంద్ నాకు ఆప్తమిత్రుడు ,క్లాస్ మేట్.అమ్మా నాన్నా  ఒకేసారి యాక్సిడెంట్ లో  పోవడంతో ఆ ఇంటి వాళ్లందరికీ నాపై సానుభూతి కలిగి  ఆ ఇంటి  వాళ్లలో  ఒకడిగా తిరిగే  చనువు పెరిగింది.ఆనంద్ వాళ్ల నాన్నకు  వ్యవసాయం,వ్యాపారం  రాజకీయాల్తో  పరోక్ష సంబంధం. ఇంకా ఎన్నో లావాదేవీలు ఉన్నాయి.ఆయన ఇంట్లో ఉండేది తక్కువ. ఉన్నా ఎప్పుడూ వసారాలో ఎవరో ఒకరితో బిజీ. వార్తాపత్రికలు, వారపత్రికలు  వస్తుంటాయి గనక ఆనంద్ ఉన్నా లేకున్నా ఎక్కడో ఓ చోట కూర్చొని  పత్రికలు    చదవటం అలవాటయ్యింది.
                  “అన్నయ్య లేడు  అర్జెంటుగా బజారు కెళ్లాలి తీసికెళ్తావా-అన్నయ్య సైకిలుంది ఇంట్లో” అంటూ ఆనంద్ చెల్లెలు  అరుణ ప్రాధేయపడింది  ఓరోజు.కొంచెం బెరుకుగానే అనిపించినా  కాదనలేక  సరేనని సైకిలి వెనుక కూర్చోబెట్టుకుని  బజారుకెళ్లాను. సైకిలు తొక్కుతున్నంతసేపూ  అందరూ నన్నే చూస్తున్నట్లుగా ,నేనేదో తప్పు చేస్తున్నానేమోననే  ఫీలింగుతో సతమవుతూంటే, ఇవేమీ పట్టనట్లుగా  వెనుక కూచుని వసపిట్టలాగా వాగుతోంది అరుణ  “ఆ సీరియల్ చదివావా “,”ఈ కథ బావుందికదూ” అంటూ వారపత్రికల్లో వచ్చే సీరియల్స్ గురించీ కథల గురించీ  మాట్లాడుతోంది మా ఇద్దరికీ కామన్ ఇంటరెస్టు అదొక్కటే గనక. ఊc..ఆc… అంటూ నేను మాత్రం పొడిపొడిగానే అడిగిందానికి జవాబిస్తున్నాను.బజార్లో ఏదో కొనుక్కుంది.ఇంటికి తిరిగి వెళ్లే సరికి  ఆనంద్ ఉన్నాడు. ఏమంటాడో అనుకుంటుంటే “ఒరే కామేశ్ !  ఏమీ అనుకోకురా.మా చెల్లాయికి ఎప్పుడు ఏది కావాల్సి వస్తే అప్పుడది వెంటనే తెచ్చుకోవాల్సిందే. నేను వచ్చేలోగానే నిన్ను తీసికెళ్లింది. పద కాసేపలా తిరిగి వద్దాం “అనగానే నాలో గిల్టీ ఫీలింగు మెల్లిగా తగ్గింది. అలా అరుణతో కూడా చనువేర్పడింది. అరుణకు  పదిహేడేళ్లేమో. అప్పుడప్పుడూ ఏదైనా నోట్సు  కాపీ చేసివ్వటం,కాలేజీకి దింపిరావడం, ఆనంద్ కిష్టం లేని సినిమా ఆమెకిష్టమయితే తీసికొని మ్యాట్నీకి వెళ్లటం  చాలా క్యాజువల్ గా జరిగి పోతుండేవి.
                         ఓ రోజు  ఆనంద్ పనిమీద హైదరాబాదు వెళ్లాడు.ఆనంద్ వాళ్ల  అమ్మా నాన్నా  ఏదో పెళ్లికి  వెళ్లారు .నేను వెళ్లే సరికి అరుణ ఒక్కర్తే ఉంది ఇంట్లో.ఎవరూ లేరనగానే  వెళ్లొస్తానని  వెను తిరగబోతుంటే  “అదేంటి  ..పోతావేంటి ..రా.కూర్చో “అని మొహమాట పెట్టింది.సరే అని ఓ పత్రిక తీసుకుని  తిరగేస్తున్నా. ఇంతలో  అరుణ సడెన్ గా  లేచి వంటింట్లోకి వెళ్లి స్వీటు తెచ్చింది.  వాళ్లింట్లో నాకిదేమీ కొత్తగాక పోయినా  తను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ  మర్యాద ఎందుకో  ఎబ్బెట్టుగా అనిపించింది. వద్దని మొహమాట పడ్తూంటే  “ఫర్లేదు ..తీసుకో “అంది .అది చనువో ఆజ్ఞో  తెలీలేదు.తీసుకున్నాను.మంచి నీళ్లందించింది  చాలా దగ్గరగా వచ్చి.కొంచం వెనక్కి వాలి తాగాను.నా కెందుకో  చాలా గిల్టీగా ఉంది.వెళ్దామని లేచాను. అరుణ కూడా లేచి నిలబడి  తటపటాయిస్తూ “కామేశ్.. ఒక సారి  మేడ మీదికి రా ..చిన్న పనుంది” అంది .నాకెందుకో  ఒక్కసారి  ఒళ్లు జలదరించింది.మాట గొంతులో ఆగి పోతుంటే “ఏం పని” అన్నాను. “ఏం లేదు అటక మీద పెట్టె ఒకటి కిందకు దించాలి”అని తనను అనుసరించమని దారి తీసింది. సంకోచిస్తూనే ఆమె వెనుకే ఆమె తీసుకెళ్లిన గదిలోకివెళ్లాను. లోనికి వెళ్లగానే గిరుక్కున వెనుకకు తిరిగి తలుపు మూసేసి  నన్ను  బిగ్గరగా  తన రెండు చేతుల్తో బంధించింది. దడ దడలాడుతున్న  గుండెతో ఉక్కిరిబిక్కిరవుతున్న  నన్ను ఏం చేసిందో ఏమో.”యూ..ఆర్ …..”మైకం లో  ఆమె  ఏదో మాట్లాడుతుంటే  ఇహ లోకం లోకి వచ్చిన  నాకు జరిగినదంతా ఓ  కలలాగా  పొందిన  మధురానుభూతితోపాటు  తప్పు  చేశానన్నఆత్మన్యూనతాభావం  పెనవేసుకుని ఎలా రెస్పాన్సు  ఇవ్వాలో తోచక ” వస్తాను “అని చెప్పి  ఇంట్లో వచ్చి పడ్డాను.
   “ఏరా ఉన్నావా .ఎంతకీ రాక పోయే సరికి ఊళ్లో వున్నావో లేదో తెలుసుకుందామని నేనే వచ్చాను. “అంటూ  మరునాడు  ఆనంద్ వచ్చేసరికి  నాలో ఉన్న  సంకోచం ,బెరుకు అడుగునపడి వాడితోబయటికి నడిచాను.
  ” మా చెల్లాయి పెళ్లి కుదిరిందిరా.నిన్న నాన్న వెళ్లిన పెళ్లిలో  అనుకోకుండా ఓ సంబంధం గురించితెలిసిందట. అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు. వారం రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్లి పోతాడట. వాళ్లు మా బంధువులే.అందుకే చెల్లాయిని  చూడాల్సిన పని కూడా లేకపోవడంతో  అన్ని విషయాలుమాట్లాడివచ్చారు నాన్న.”అన్న ఆనంద్ మాటలు వినగానే అసంకల్పితంగా అడిగాను  “అరుణకిష్టమేనా మరి”  అని.
“ఓ దాని కేం .రాత్రి  ఈ విషయం దానితో చెప్పగానే ఎగిరి గంతేసింది.అప్పుడే అమెరికా వెళ్లినట్టు ఊహల్లో తేలిపోతుంది. హైదరాబాదులో పెళ్లి. అన్ని ఏర్పాట్లు చేసి వచ్చారు నాన్న.”
“అలాగా వెరీ గుడ్ “అన్నానే కానీ నా మనస్సు మాత్రం  నిన్నటి అనుభవాన్నే  నెమరు వేస్తుంది.
       మాటల్లో  ఆనంద్ వాళ్లింటికి చేరాము. ఎదురుగానే అరుణ తారస పడింది. అరుణ ముఖంలో ఆనందం కొట్టవచ్చినట్లుగా  కన్పిస్తుంది. కంగ్రాట్స్  అనగానే థాంక్స్  అంది మెరిసే కళ్లతో మురిసే మనసుతో. కొన్ని భావాలకు  భాష చాలదు. అప్పటి మా ఇద్దరి పరిస్థితి  అంతే.
               “ఇప్పుడే వస్తానురా .మీరు మాట్లాడుతూ ఉండండి “అంటూ ఆనంద్ లోనికెళ్లాడు. అరుణ గొంతు తగ్గించి  “కొన్ని స్వీట్ మెమొరీస్ గా  మనసులో దాచుకోవాలి.బాగా అప్సెట్  అయ్యావు కదూ!చలం సాహిత్యం చదివిన వాడివి. ఆడదాని మనసు అర్థం చేసుకుంటావనుకుంటాను.ఎనీహౌ  వన్సగెయిన్ థాంక్స్. ఇంతకంటే ఏం చెప్పలేను”నువ్వు చాలా ఎదిగి పొయ్యావు  అరుణా , థాంక్స్  నేనే నీకు చెప్పాలి .మనసులో అనుకున్నా.
          ఇంతవరకూ  మీరు విన్న పాట ఉయ్యాల జంపాల చిత్రం కోసం  అంటూ రేడియోలోఅనౌన్స్ మెంట్  వినిపించటంతో  గతం తాలూకు జ్ఞాపకాలకు  బ్రేక్  పడింది.తొలి అనుభవం గుర్తొచ్చినప్పుడల్లా  మలి  అనుభవం గుర్తుకు రావడం జరిగిందంటే  అవి జీవితాంతం జ్ఞాపకాలుగా మిగిలి పోతాయేమో.వారంలోగానే అరుణ పెళ్లి హైదరాబాదులో అంగ రంగ వైభవంగా జరిగింది.ఆనంద్ వాళ్లతో నేనూ  వెళ్లి వచ్చాను.తిరిగి వచ్చేప్పుడు  అరుణ చూసిన చూపులో ” యూ ఆర్ గ్రేట్  కామూ “అన్న భావం  తొణికిసలాడినట్లనిపించి అనిర్వచనీయ భావంతో తల తిప్పుకుని  వచ్చాను.
    తరువాత  ఆనంద్  పై  చదువులకు  సిటీకి  వెళ్లిపోయాడు.వాళ్ల నాన్న పలుకుబడితోనేను మావూళ్లో వున్న ఫ్యాక్టరీలో    చిన్న ఉద్యోగంలో చేరిపోయాను.ఫ్యాక్టరీ ఇంటికి చాలా దూరంలో ఉంది.షిఫ్టు డ్యూటీలు. సైకిలు పై వెళ్ళితే అరగంట పడుతుంది.ఒక్కొక్కప్పుడు  రాత్రి  పది గంటలకు డ్యూటీ నుండి దిగి  మళ్లీ ఉదయం ఆరు గంటలకే  వెళ్లాల్సి
వస్తుంది.అలాంటప్పుడు  కొంచెం ఇబ్బందిగా ఉండేది .
        నేను పని చేసే  డిపార్టుమెంటులోనే పని చేస్తున్న  వెంకటరత్నంతో స్నేహం కుదిరింది.అతని షిఫ్టు లోనే పని నేర్చుకున్నాను.చేరిన కొత్తలో వెంకట రత్నమే  దగ్గరుండి అన్ని మెళుకువలు  నేర్పించాడు.ఆయన చాలా గడబిడ మనిషి. ఎప్పుడు నలుగుర్ని పోగేసుకుని  కబుర్లు చెప్పడం ఆయనకలవాటు.క్యాంటీన్ టైములో పదిమందీ ఆయన చుట్టూ చేరి ఆయన చెప్పే కబుర్లు వింటూ పని లోని టెన్షన్  మరచి పోవడం  మామూలుగా జరిగిపోయ్యేది.ఏ కారణం వల్లనో  అతడు అవివాహితుడిగా మిగిలిపోయాడు. సీనియరు  కాబట్టి స్టాఫ్ కాలనీలో  చాలా రోజుల క్రితమే  ఆయనకు క్వార్టర్  దొరికింది.అదికాలనీ చివర్లో ఉండేది .హోటల్ భోజనం క్వార్టర్లో మకాం.డ్యూటీ లేని వేళల్లో ఆ ఇల్లో  చిన్న పేకాట క్లబ్బు.
              అప్పుడప్పుడూ  రెండో షిఫ్టు చేసి వెంకటరత్నం క్వార్టర్లో పడుకుని మరునాటి ఉదయం లేచి  ఫస్టు షిఫ్టుకి  వెళ్లేవాడిని. అదీ ఆయన సలహా నే. అలా వెంకట రత్నం క్వార్టర్లో  తరచుగా ఉండి పోవటం అలవాటయ్యింది.తరువాత్తరువాత  మా షిఫ్టులు మారినా అక్కడే మకాం వేయటం మాత్రం అలానే కొనసాగుతోంది .    బ్రహ్మచారి కొంప .పైగా  పేకాట క్లబ్బు.ఇల్లంతా సిగరెట్టు పీకలతో ,హోటల్ నుండి తెప్పించుకున్న  ఫలహారప్పొట్లాలతో నిండిపోవటం  ,క్వార్టర్ క్లీన్ చేసుకోవాలంటే బద్దకం ప్లస్ డిగ్నిటీ తోడవ్వటం తో  వెంకటరత్నం ఓ పనిమనిషిని కుదుర్చుకున్నాడు. పున్నమ్మ రోజూ ఉదయం ఐదు గంటలకే వచ్చి,ఇల్లు ఊడ్చి ,మంచినీళ్ళు నింపి టీ కప్పులు,ప్లేట్లూ కడిగి వెళ్లేది.పున్నమ్మకు మహా ఉంటే ఇరవైరెండు ఇరవై మూడేళ్లుంటాయేమో. మనిషి నలుపే అయినా సౌష్టవమైన ఒళ్లు. శుభ్రంగా కూడా వుండేది .క్వార్టర్ల వెనుకగా ఉండే గుడిసెల్లోంచి వచ్చేది. తల్లిదండ్రులు  పందుల పెంపకంతో  జీవనం సాగిస్తుంటే, తను మాత్రం నాలుగిళ్లలో పనీపాటా చేసుకుంటు బతుకుతుంది.తెలిసిన వాళ్లకు  తప్ప  ఫలానా పిల్ల అని అనిపించేది   కాదు.కట్టు బొట్టూ చక్కగా ఉండేది.
     చిన్నతనం లోనే రోగిష్టి బావతో పెళ్లి జరిగి  ఇరవై ఏళ్లకే  వాడు చనిపోవడంతో  మళ్లీ పెళ్లి చేసుకోకుండా  అలాగే ఉంది పోయింది.నిజం చెప్పాలంటే  మా వెంకటరత్నం లాంటి వాళ్లకు పెళ్లి చేసుకోని లోటు  తీరుస్తుందని  తరువాత్తరువాత  అర్థమయ్యింది.
             పున్నమ్మ పాటలు బాగా పాడుతుందని ఓ రోజు ఊడుస్తూ కూని రాగాలు  తీస్తుంటే తెలిసింది. కానీ ఆ పాటలన్నీ  ఎవరో  నేర్పించిన పాటలు. తనుండే కాలనీకి  అర్ధ రాత్రి  అన్నలు వస్తారని వినేవాణ్ని. పున్నమ్మ పాడేవన్నీ ఆ పాటలే .
             దాదాపు  అయిదారు నెలలనుండి  ఆ ఇంట్లో  తరచుగా  ఉంటున్నప్పటికీ  పున్నమ్మపై నాకెలాంటి వూహా కలుగలేదు. అప్పుడప్పుడు  అరుణతో గడపిన  అనుభవం గుర్తొచ్చినా  నాలో ఎలాంటి వికారమూ  కలుగలేదు.ఓసారి  వారం రోజుల సెలవు పై ళ్లాడు.వెళ్తూ వెళ్తూ  క్వార్టర్ కీ నాకిచ్చి వెళ్లాడు.ఎప్పటి లానే  రెండో షిఫ్టు  చేసి వచ్చి పడుకున్నాను క్వార్టర్లో.ఎప్పటిలాగానే  ఉదయం పనికి వచ్చింది పున్నమ్మ.తన పని పూర్తి చేసుకుని వెళ్లి పోకుండా  అలాగే నిల్చుంది.
ఏమిటన్నట్లు చూశాను.
              “ఏం ల్లేదు దొరా. మిమ్ముల్ని  జూత్తంటే నాకు ఇసిత్రంగున్నది. గిన్నోద్దులాయే పనికస్తన్నగద ఒక్కసారి సుత  కన్నెత్తి  జూళ్లేదు నాకెయ్యి .అదే తొవ్వొంటి బోతుంటె   అందరు నన్ను కొరికినట్టు జూత్తరు.గమ్మతనిపిస్తది మిమ్ముల్ని జూత్తె .ఎల్లత్త దొర “అంటూ వెళ్లిపోయింది.ఆమె  మాటలు నావయస్సుని గందరగోళంలో  పడేశాయి.
            రెండు  మూడు రోజుల తర్వాత యధావిధిగా పనికి వచ్చిన పున్నమ్మ”ఏం దొర మొన్న గట్లన్నందుకు  ఆలోచిత్తన్రా .నూట్లకొక్కరు   మీలాంటొల్లు కన్పిస్తరు .అందుకె మీరంటే ఇట్టం.ఎం నేను అందంగా లేనా ”  అంది గడుసుగా.”మిమ్ముల్ని సిగ్గిడ్చి  గిట్లడుగుతున్నదేందని  అనుకుంటున్రా  “ఆడని మనసు  మీకు తెల్వదేమొ దొరా  ”  కొంచేందగ్గరికి వచ్చి  చనువు చూపింది.వయసు నన్ను ఊర్కోనివ్వ లేదు.
                ఆ తర్వాత  ఇక పనిలోకి రాలేదు పున్నమ్మ. ఎందుకో నాకు అర్థం కాలేదు.ఈ లోగా వెంకట రత్నం రావటం అచూకీ తీయటం,పున్నమ్మ ఎటో వెళ్లి పోయిందని తెలియటంతో బహుశా ఉద్యమంలో  చేరి పోయిందేమో ననిపించి  గుండెల్లో  గుబులనిపించినా మెల్లమెల్లగా ఆ సంగతి మరచిపోయాను .
            “ఏమండీ  వంటయింది  వడ్డించమంటారా”అనూరాధ వచ్చి  భోజనానికి లేపింది.లేచి కాళ్లు కడుక్కుని వచ్చి  భోజనం మీద  కూర్చున్నాను.ఇందాకటి  మూడ్  అనూరాధవైపు మళ్లింది.ఆమెతో నా పెళ్లి జరిగిన విషయం గుర్తుకువచ్చింది. తింటూ మళ్లీ ఆలోచనల్లోకూరుకుపోయాను.
                      …………ఉద్యోగంలో స్థిర పడ్డ తరువాత అయిన వాళ్లు నా పెళ్లి గురించి వాకబు చెయ్యడానికి వచ్చారు.దూరపు బంధువులమ్మాయి  అనూరాధను   చూపించారు.నాకు ఏ అభ్యంతరం లేకపోవడంతో మిగతా విషయాలన్నీ వాళ్లే మాట్లాడి మరీ ఆడంబరం లేకుండా మా పెళ్లి జరిపించారు.అనుకూలవతియైన అనూరాధ సాహచర్యంలో కొత్త జీవితం ప్రారంభించాను. చిన్న మోపెడ్ కొనుక్కున్నాను.క్వార్టర్ అలాట్ అయ్యే అవకాశం వున్నా,స్వంత ఇల్లే బాగు చేయిం చుకుని
ఉంటున్నాను.ఆనంద్ హైదరాబాదులో సెటిలయ్యాడు. చూస్తుండగానే పదేళ్లు ఎలా గడిచాయో.
    “ఏవిటండీ ఆ పరధ్యానం.ఏమయ్యిందివ్వాళ మీకు,సరిగ్గా తినటం  లేదు. “
          ఏమని చెప్పాలి ఆమెకు “ఏం లేదు “అన్నాను ముక్తసరిగా.
     ***
ఇలా ఉండగా  ఓ రోజు  మామిత్రుడికి సీరియస్ గా ఉందని తెలిసింది.వాళ్లింటికి వెళ్లే సరికి  అతన్ని వార్ధా హాస్పిటల్ ( సేవాగ్రాం)  కు తీసుకెళ్లుతున్నారు. తోడుగా నేనూ వెళ్లాను.హాస్పిటల్ లో జాయిన్ చేసి వెంట వెళ్లిన వాళ్లకు  వసతి గది వగైరా చూపించి తిరిగి మంచిరాల బయలుదేరాను.ట్రైన్ లో ప్రయాణిస్తూండగా  అర్ధరాత్రి ఓ స్టేషన్ లో గబా గబా నేనున్న కంపార్టుమెంటులోకి  ప్యాంటు షర్టు ధరించి ఒంటినిండా నల్లటి రగ్గు కప్పుకున్న ఓ స్త్రీ చొచ్చుకుంటూ వచ్చింది.అది ప్యాసింజర్ ట్రెయిను  కావడంతో  నేను కూర్చున్న పెట్టెలో  బల్బు వెలుగక చీకటిగా ఉంది .ఆమె నాకెదురు సీట్లో కూర్చుంది. నేను కూర్చున్న చోట ప్రయాణీకులెవరూ లేరు.నిద్ర పట్టీ పట్టని స్థితిలో  కాస్త ఒరిగి పడుకున్న నాకు  హడావుడిగా వచ్చిన ఆమెను చూడగానే అనుమానం కలిగింది.ఏ విప్లవకారిణో అయ్యుంటుందనుకున్నాను.ఈ  లోగా ఆమె కూడా నన్ను పరిశీలించి  చూడటం,  వెంటనే నన్ను పోల్చుకుని  చిన్న స్వరం తో కొంచం కరుకుగానే అయినా  పలకరింపు ధోరణిలో  “ఏం దొరా బాగున్నవ “అంది .వెంటనే పోల్చుకున్నాను .పున్నమ్మ. అవును పున్నమ్మే. మనిషిలో చాలా మార్పు వచ్చింది. దొర అని పిలవటం తప్పనిసరిగా అంటే అదే నాపేరన్నంత సహజంగా  పిలిచింది.ఆశ్చర్యంలోనుండి తేరుకుని కొంచం తటపటాయిస్తూనే  “ఎందుకిలా మారి పోయ్యావు.అని అడిగాను.
         “అదంతా నీకేమీ  చెప్పలేనుగానీ నిన్ను దొరా అని పిలవటం బాగనిపించటం లా. నీ పేరు తెలుసుకోవలసిన అవసరం  అప్పుడు లేకపోవచ్చు గానీ  ఇప్పుడు చెప్పు “
       ఎందుకూ అని అడుగుదామనుకుని ఎందుకో అడుగ లేక “కామేశ్వర్రావు “అన్నాను.
                “ఇదిగో కామేశ్ నువ్వు నాకిష్టమైన మగాడివయ్యా.నేను చాలా చిత్రమైన పరిస్థితుల్లో ఈ ఉద్యమం లో చేరిపోయాను.నా జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశాను. కానీ అనుక్షణం టెన్షన్  అనుభవించే నా జీవితంలో  నువ్వొక  మరపురాని మనిషివయ్యా!ఏ అర్ధరాత్రోనువ్వు గుర్తుకొచ్చి ఊరటకలిగిస్తుంటావు  అంటూ ఏదో అలికిడి విని గబుక్కున  లేచి తూనీగలా నడ్స్తున్న ట్రెయిన్ లో నుండే బయటకు దూకి చీకట్లో కలిసి పోవటం  చూసి అవాక్కయ్యాను. కొద్ది క్షణాల్లో అటూ ఇటూ పరుగెడుతున్న పోలీసుల్ని చూసి భయం కూడా కలిగింది. నిద్రపోతున్నట్లు పడుకున్నాను చేసేదేమీ లేక.
              జీవితంలో కొన్ని సంఘటనలు ఎన్నటికీ  మరచి పోలేనివిగా ఉంటాయి అవి గుర్తొచ్చినప్పుడల్లా కళ్లకు కట్టినట్టు కన్పిస్తాయి.పదేళ్ల క్రిందటి అనుభవాలు కూడా నాలో అలాగే ఉన్నాయి. ఈ రోజు పున్నమ్మ కనిపించగానే నా గతం మళ్లొక్కసారి  కళ్ల ముందుకు వచ్చి నన్ను ఏదో తెలియని  అనుభూతికి  గురి చేసింది.ఎవరికీ చెప్పుకోలేని  ఈ విషయం అలాగే గుండె గూట్లో దాచి పెట్టాను.
***
           ఆ రోజు ఆదివారం  నాకు వీక్లీ ఆఫ్ .అనూ సరుకులు తెమ్మంటే  బజారు వెళ్తున్నాను.మోపెడ్  ఖాతా కొట్టు ముందుంచి  సరుకుల లిస్టు షాపు  యజమాని కిచ్చి ,త్వరగా సరుకులు సిద్ధం చేయమని చెప్పాను. ఈ లోగా దగ్గరలో వున్నా కూరగాయల  మార్కెటుకు వెళ్లి  కూరగాయలు తెద్దామని నడుచుకుంటూ  వెళ్తున్నాను.ఇంతలో ఓ పాతికేళ్ళ యువకుడు సైకిలుపై నాకెదురుగా వస్తూ ,నా దగ్గరగా ఆగి గుస గుసలాడినట్లు  “మీరు  కామేశ్వరరావు కదా! ఇదిగో పూర్ణక్క  ఈ ఉత్తరం మీ కిమ్మంది. “అంటూ చేతిలో పెట్టి  ఆగకుండా  వెళ్లి పోయాడు.
                        ఉత్తరం తెరచి చూస్తే  “డియర్ కామేశ్.ఎల్లుండి మంగళవారం  హైదరాబాదు హోటల్  పింగళ  రూం నంబరు 13లో వచ్చి వుండు. నీ పేరు మీద రూం బుక్ అయి వుంటుంది.నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. భయపడాల్సిన అవసరం లేదు.నీకు ఏ ఇబ్బందీ కలుగదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చి తీరాలి. ఉత్తరం చించి పారెయ్యి. “అది ఆజ్ఞో అభ్యర్థనో అర్థం కాలేదు. ఎందుకో అర్థం కాలేదు.పోవాలా వద్దా అనే సంకట పరిస్థితి.ఏ చిక్కుల్లో  ఇరుక్కుంటానో అన్న సంశయం.కానీ నావిషయం లో  పున్నమ్మ నాకు ఎలాంటి అపాయం కలుగకుండా చూసుకుంటుందన్న నమ్మకం.ఏం చేయాలో తోచలేదు.అన్య మనస్కంగానే కూరగాయలు సరుకులూ  తీసుకుని  ఇంటికి చేరాను. రాత్రంతా హైదరాబాదు వెళ్లాలా వద్దా అని సతమతమయిన నాకు ఉదయమే వచ్చిన టెలిగ్రామ్ చూసే సరికి హైదరాబాదు వెళ్లటం తప్పని సరయింది.  ఆనంద్ వాళ్ల నాన్న పోయాడు. తప్పకుండా వెళ్లాలి.సరే అక్కడికి వెళ్లింతరువాత ఆలోచించుకోవచ్చు అనుకోగానే టెన్షన్  తగ్గింది.
            టెలిగ్రాం  సంగతి అనూరాధకు చెప్పి హైదరాబాదుకు వెళ్లాను.ఆనంద్ వాళ్లింటికి  వెళ్లేసరికిశవాన్ని తీసికెళ్లే ప్రయత్నంలో  ఉన్నారు.ఆనంద్ నూ  అరుణను ఓదార్చి అంత్యక్రియల ఏర్పాట్లలో  పాలు పంచుకున్నాను.వారు నాకు చేసిన సహాయం నా జన్మలో మరువ లేనిది. ఆ రోజు విచార వదనంతో  ఓ మూల  వాళ్లమ్మాయికి జడ వేస్తూ అరుణ కనిపించింది. నన్ను చూడగానే  ఉదాసీనంగానే అయినా కొంచం తేట పడ్డ మనస్సుతో “రా కామేశ్ .చాలా రోజులయింది నిన్ను చూచి.నాన్నకు బాగా లేదని తెలిసి మొన్ననే వచ్చాను.ఆయనకు రావడానికి  వీలు కాలేదు. నేనూ అమ్మాయి వచ్చాం. అమ్మాయిని చూడ లేదుగా  పేరు కామిని అంటూ ఓ సారి నా కళ్ళల్లోకి  చూసింది. ఆ చూపుల్తో ఆమె ఏం చెప్పదలచు కుందో అది నాకు అర్థమైంది.గుండెలో ఏదో చెప్పలేని భావం  గూడు కట్టుకుపోయింది.అప్పుడే జడ వేయటం కూడా పూర్తి కావడం తో  “గో  ..గో టు  అంకుల్ .కామేశ్ అంకుల్” అని నా వైపు చూపింది.కాసేపు ఆ అమ్మాయితో ముచ్చట్లాడి  అరుణతో”ఆనంద్ తో చెప్పి వెళతాను అరుణా ! కొంచం  పనుంది. మళ్లీ కలుస్తాను.”అంటూ లేచాను .బయటకు వచ్చి ఆనంద్ తో చెప్పి  ఆటోలో  హోటల్ కి బయలుదేరాను.
           ఏమవుతే అదవుతుందని పున్నమ్మను కలవాలనే నిర్ణయం తీసుకున్నాను.మొండి ధైర్యంతో హోటల్ కి చేరాను. కౌంటర్లో నా  పేరు చెప్పగానే రూము కి తీసుకెళ్లాడు రూం బాయ్.రూంలోకి వెళ్లి రిలాక్సయ్యాను.
              తెల్లవారి ఉదయం పది గంటలకు వచ్చింది పున్నమ్మ. అప్పటికే నేను లేచి తయారయ్యి  టిఫిన్ పూర్తి చేసుకుని  టీవీ  చూస్తూ  ఆమెకి ఎదురు చూస్తున్నాను.మామూలు చీరకట్టులో డిగ్నిఫైడ్ గెటప్ లో తనో విప్లవకారిణి  అన్న అనుమానం ఎవరికీ కలుగకుండా వుంది.
              వస్తూనే “నాకు నీ మీద ఉన్న నమ్మకం నిజం చేశావు.నువ్వు తప్పక వస్తావనుకున్నాను.థాంక్స్ .నాకెక్కువ టైము  లేదు.అతి కష్టం మీద నిన్నిక్కడ  కలుసుకునే ఏర్పాటు చేశాను.”అంది మెల్లగా  పున్నమ్మ.
           “చూడు కామేశ్ ఓ ముఖ్యమైన  విషయం నీతో చెప్పాలని పిలిపించాను. నా గురించి వివరంగా తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వు. నేను ఇష్టపడే వ్యక్తివి కూడా నువ్వే. నేను ఉద్యమం లో ఎందుకు దిగానో ఏమైపోతానో నీకనవసరం.కానీ నా వ్యక్తిగత  జీవితంలోనువ్వొక ముఖ్య పాత్రధారివి.ఉద్యమ పూర్వ జీవితం లో  నేనెలాంటి దాన్నో నీకు తెలుసు.
పావలాకి సుఖం కొనుక్కోవాలనుకునే చాలామంది నాకు పీడ కలలు.నిజం చెప్పాలంటే  ఎడారి లాంటి నా జీవితం లో  నువ్వో ఒయాసిస్సువి.నీకు తెలియని రహస్యం ఒకటి ఇప్పుడు చెప్పబోతున్నాను.ఎందుకంటే నా జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో  నాకే తెలియదు.ఇన్ని రోజులు దాచిన రహస్యం ఎందుకు చెప్పాలనిపించిందో కూడా నాకు  అర్థం కావడం లేదు.
                           ” ఉద్యమం లోకి చేరాలనే నిర్ణయం తీసుకున్న తర్వాతనే  నాకు నీపై ఆసక్తి కలిగింది.జీవితంలో చివరి సారిగా ఒక మంచి మనిషితో గడపాలనిపించింది. చిన్నతనంలోనే తల్లీదండ్రీ పోయినా  బాధ్యతగా కుటుంబ భారాన్ని స్వీకరించి తమ్ముడూ చెల్లెళ్ళ చదువు సంధ్యలు  పట్టించుకుని ,ఉద్యోగం సంపాదించుకుని  ఆత్మ స్థైర్యంతో  వున్న నీకు దగ్గర కావాలనిపించింది.నిన్ను చూచిన  నాకు  వెగటు  మనుషులతో  వెగటు  ప్రవర్తనలతో  విసిగిన  నాకు  నీ సత్ప్రవర్తన  తెలియ కుండానే  నీ పై ఆకర్షణ కలిగించింది.దాన్ని ప్రేమంటారో ,ఆరాధనంటారో  మీ భాషలో కాని  నేను మాత్రం ఇష్టం  అంటాను. నాలోని స్త్రీత్వం  నీ బిడ్డకు తల్లిని కావాలనుకుంది.మన కలయిక తరువాత వెంటనే  వెళ్లి పోయాను. ఉద్యమంలో చేరిన  కొన్ని నాళ్లకే  నాలో నీ రూపం  పోతపోసుకుంటుందనే విషయం అర్థమైంది.అది ఉద్యమానికి ఆటంకం.అయినా గుర్తు కళ్ల చూసుకోవాలనే ఆరాటం.ఈ విషయం లో మా నాయకుల్ని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.అడవి లోని ఓ మారు మూల పల్లెలో  బిడ్డకు జీవమిచ్చాను. పుట్టిన కొన్ని నాళ్లకే  నా నీడ పడకుండా  ఓ మిషనరీ  లో చేర్పించాను.తనకు తల్లిని నేనని ఆని గాని  తండ్రివి నీవని గానీ తెలియదు.అనాథ బాలికగాసలక్షణంగాచదువుకుంటుంది.వీలయినప్పుడు  తనలో నిన్ను చూసుకుంటూ వస్తున్నాను.
                          చాలా ఉద్వేగానికి గురయింది పున్నమ్మ. తేరుకుని తనే  “ఇదిగో  ఇందులో పాప అడ్రసు ఉంది.నీకు  వీలయితే చూడాలనిపిస్తే  వెళ్లి చూడవచ్చు .నిర్బంధం ఏమీ లేదు . తన బాధ్యతా వహించమని  అడగటం లేదు.ఇంత ఉద్యమం లో  తిరుగుతూ రాటు దేలిన నాకు  ఈ విషయం నీకు చెప్పాలనిపించడమే  ఆశ్చర్యంగా ఉంది.ఇప్పుడు నాకెందుకో తృప్తిగా ఉంది. “అంటూ  ఒక్క నిమిషం కన్రెప్పలు బిగించి తెరచింది.
   అరుణ మయిన కన్నులు ప్రేమ పూర్ణిమను  వెలువరిస్తున్నాయి. ఇక నువ్వెళ్ళు .మళ్లీ కలువక పోవచ్చు. వెళ్లు  త్వరగా.”  అంటూ పక్క రూం లోకి వెళ్లి పోయింది.నిశ్చేష్టుడనై   భారమయిన హృదయంతో బయటకు నడిచాను.
     ”   ఆయుధాలు పట్టి అడవుల్లో తిరిగినా  నీ లోని ఆడ మనసు చెక్కు చెదరలేదంటె  నువ్వు మామూలు స్త్రీవి కాదు పున్నమ్మా! నిష్కల్మషమైన  ప్రేమ తత్వానికి  గొప్ప ఉదాహరణ గా నిలిచావు. “మనస్సు ఒక అద్వితీయ  సంస్పందనకు గురయ్యింది.
       వెంటనే బస్టాండ్  చేరుకుని  బస్సెక్కి తెల్లారే సరికల్లా  ఇంటికి చేరుకున్నాను.
          బాగా పొద్దెక్కిన తరువాత లేచి  ఫ్రెష్ అయ్యి  అనూ తెచ్చిన టీ తాగుతూ పేపరు తిరగెయ్యబోతుంటే  మొదటి పేజీలో నే తాటి కాయలంత అక్షరాలతో  “ఎన్ కౌంటర్   లో మహిళా నాయకురాలు పూర్ణక్క మృతి”  ఫోటోతో సహా చూసే సరికి  టీ గొంతులోకి  దిగలేదు.మనస్సులోనే శ్రద్ధాంజలి ఘటించాను.లేచి నిన్న  పూర్ణిమ ఇచ్చిన అడ్రసు చీటీ  చూశాను.త్వరలో వెళ్లి పాపను చూసి రావాలి.పూర్ణ ఆత్మ శాంతికి  నేను ఘటించ గల శ్రద్ధాంజలి అదొక్కటే.అడ్రసు చీటీలో పాప పేరు అందంగా కనిపించింది.’అరుణ పూర్ణిమ ‘అని  .
  –వాధూలస

‘ తంతే బూరెల బుట్టలో ……’

నోములూ వ్రతాలూ, పెళ్ళిళ్ళూ పేరంటాలు లేకుండా   పొదుగుడు కోడిపెట్టల్లాగా  ఎవరింట్లో వాళ్ళు పడుండే  ఆషాఢ  మాసం అంటే అత్తగారికి అంత అభిమానం లేదు. అలా అని అలక్ష్యమూ లేదు . ” ఆషాఢం ఇంకా ఎన్నాళ్ళుంటుందే  ” అని అక్కరకురాని చుట్టాన్ని తప్పక  భరిస్తున్నట్టూ రోజూ  కేలండర్ చూస్తూనే వుంటారు .  ఎక్కడో మూడు వారాల అవతల వున్న శ్రావణాన్ని  మాత్రం  “అదిగో వచ్చేస్తుంది ….ఇంకెంత ”  అంటూ  అంత మొహం చేసుకుని ఆహ్వానించేస్తూ వుంటారు .

అయినా  దేని దారి దానిదే అన్నట్టూ  ఆషాఢానికి జరగాల్సిన లాంచనాలన్నీ తు. చ తప్పక జరిపిస్తారు .ఆ ప్రకారం  ఆషాఢం  లో తప్పక తినాలని చెప్పే మునగాకు కోసం దొడ్లో మునగ చెట్టుని ఆకు లేకుండా దూసేశాం . నల్లేరు పచ్చడి, బలుసాకు పులుసు ,వాక్కాయ్ -పప్పూ  అంటూ నాలుక పసరెక్కేలా  కంచెలన్నీ మేసేశాం  . రంగు మాయకుండా డిజైను మారకుండా ( ఇంకేవిటీ చందమామ చుక్కలూను )  మళ్ళీ మళ్ళీ చేతులకి గోరింట పూయించేశాం .

తొలేకాశి వెళ్ళేనాటికి   లాంచనాలన్నీ యధావిధిగా పూర్తిచేసి పప్పులో ఉండ్రాళ్ళు కూడా వండుకు తినేసి   , ఈ ఆషాఢం ఇంకెన్నాళ్ళుందో అని  రోజులు   లెక్కపెట్టుకుంటుంటే ….హటాత్తుగా   అత్తగారికి గుర్తొచ్చింది తాటిపండు లాంచనం  ఒకటి . “ఈకాలంలో తాటి బూరెలు వండుకోవటం కూడా ఆచారమేమేనేవ్ . కానీ …,” అంటూ  కామాలో  ఇరుక్కుపోయారు .

అప్పటివరకూ అత్తగారి ఆకుపసరు  ఆచారాలకి నాలుక పీక్కున్న నేను ఈ పండాచారానికి  లొట్టలేసాను. చిన్నప్పుడెప్పుడో తిన్న తాటిరొట్టె, తాటిబూరెలు, అప్పాల రుచులు  గుర్తొచ్చి గుటకలు మింగాను .

“కానీ లేదు అర్ధణా లేదు కానిచ్చేద్దాం ..కానిచ్చేద్దాం” అని  తొందరపడ్డాను .

నా తొందరకాళ్ళకి బంధం వేస్తూ అత్తగారు ”  ఎప్పుడో నాలుగు తరాలకి ముందే మనింట తాటిపండుకి  తిలోదకాలు ఇచ్చేసారట  . ఎవరయినా పెడితే తినచ్చుకానీ  మనింట్లో వండుకోటం ఆనవాయితీలేదు . మనకి  అచ్చిరాదు  అని మా అత్తగారు మాకు మరీ మరీ చెప్పేవారు  అన్నారు . ” ఒకసారెప్పుడో మందపాటోరి ఇంటినుంచీ వచ్చాయి …..నిరుడు పెనుమత్సోరి చిన్నకోడలు వాళ్ళ పుట్టింట్లో  వండి తెచ్చి అందరికీ పంపింది . అలా తినడమే తప్ప మనింట్లో ఎప్పుడూ వండలేదుమరి. అయినా …..ఆనవాయితీ లేని పని అగచాట్ల పాలుచేస్తుందనీ ఎందుకొచ్చిన సంత ఊరుకుంటేపోయేదానికి అని నాలుక చప్పరించేసారు .

అప్పటికే తాటిబురెల మీద మనసుపడిపోయిన నాకు  అత్తగారి మాటలు ఏమాత్రం రుచించలేదు . పైగా అప్పుడెప్పుడో ఆవిడ అత్తగారు చెప్పిన మాట ఈనాటికీ పాటించడం అనేది అసలు  బుర్రకెక్కలేదు . ” ఊరుకుందురూ …మీరు మరీ చెపుతారు . ఒకరికి ఆచారం ఇంకొకరికి అనాచారం ఎలా అవుతుంది . అయినా ‘ పప్పులో ఉప్పెయ్యడానికీ, నిప్పుమీద నీళ్ళొయ్యడానికీ’  కూడా ఆనవాయితీలు చూసుకుంటామా . అలాంటివన్నీ నేను నమ్మనుబాబూ ” అనేసాను తేలిగ్గా  . “అంతేనంటావా !?”   అన్నట్టూ అనుమానంగా చూసేరు  అత్తగారు. అంతేకదామరి ! ఒకరికి మంచి ఇంకొకరికి చెడెందుకవుతుంది . చెట్టునించీ రాలిన పండు ఏ దేశంలో అయినా కిందికే పడుతుంది . ఎండలో నుంచుంటే ఎవరి నెత్తయినా మాడుతుంది . కాలమేదయినా  మబ్బుంలోంచే కదా  వాన పడుతుంది . అంటూ సినిమాల్లో లాయర్ లా  అటూ ఇటూ తిరుగుతూ అడ్డదిడ్డంగా వాదించేసాను  . దాంతో  కన్ ఫ్యూస్ అయిపోయిన అత్తగారు    “అంతేనంటావా ” అంటూ గుడ్లు తేలేసారు  .

అనుమానంలేకుండా అంతేమరి . ఈ ఆచారాలనేవి ఏనాడో ఏర్పడ్డాయి …ఇలా  నచ్చలేదనీ , అచ్చిరాలేదనీ ఎవరికి వారు మధ్యలో  వదిలెయ్యడం ఏం బావుంటుందీ అంటూ ,ఆచారాలు – సాంప్రదాయాలు , బూరెలు- గారెలు, పరమాన్నాలూ- పట్టుకొమ్మలు  అంటూ అప్పటికప్పుడు ఒక ఉపన్యాసం  అల్లి  అత్తగారి మీదికి  విసిరాను

ఎంతోకాలంగా వస్తున్న ఈ  ఆచారాలను   మనం ముందు తరాలకు  ముక్కుపిండయినా సరే నేర్పించి తీరాలన్నాను  . భూమ్మీద తాటి చెట్టనేది ఉన్నంతవరకూ ఆషాఢంలో  తాటిబూరెలు- అప్పాలు ఒండుకు తినడం అనే ఈ ఆనవాయితీని మనం  పాటించి తీరవలసిందే అన్నాను.  అసలా మాటకొస్తే ప్రతీ ఇంటిలోనూ కొబ్బరి మొక్కలు, అరటి పిలకలు నాటినట్టే ఒకటో రెండో  తాడి చెట్లు కూడా పెంచి వాటిని వారసత్వ ఆస్తిగా పిల్లలకు  రాసిచ్చే ఒక కొత్త ఆచారానికి మనమే నాంది పలకితే ఎలా వుంటుందో ఆలోచించండన్నాను .

అసలు సంగతి గ్రహింపుకి రాని అత్తగారు నా ఆరాటానికి  మురిసిపోయి , ఆచారాల మీద నాకు గల మక్కువకు మిక్కిలి సంతసించి  ” సర్లే  నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలీ  .అయినా …..అప్పాలొండటం అదెంతపనీ ” అంటూ చెంగున లేచి కూర్చున్నారు . లేడికి లేచిందే పరుగన్నట్టూ ఉన్నపళంగా బియ్యం నీళ్ళలో పోసేసి , అవతల దొడ్లో ట్రాక్టరుకి దమ్ము చక్రాలు బిగిస్తున్న అబ్బులు ని ఒక్క కేకేసి , ” ఒరేయ్ ఆ పనులు తరవాత …ముందెళ్ళి కట్టవలోంచీ మాంచి తాటిపళ్ళు నాలుగు ఏరుకురా ఫో” అని ఆర్డరేసారు.

ఆకారానికే కాక బుద్ధికీ ‘బండోడు’ అయిన  అబ్బులుగాడు ఓ బండినిండా తాటిపళ్ళు తోలుకొచ్చి వాకిట్లో  ఒంపేసేడు  . పైగా” కొనాలా పెట్టాలా ఉత్తినే వొచ్చినియ్యేకదండీ …మిగిలితే  తంపటేసుకుందారి ” అని అలవాటుగా  అక్కరలేని సలహా ఒకటి ఫ్రీగా పడేసాడు. ముందు ‘ ఇన్నేం  చేసుకుంటావ్ ‘   అని చిరాకు పడ్డా “ ఒండిపెడితే తినేవాళ్ళకి కరువా . మనవాళ్ళందరికీ తలో నాలుగూ పెట్టుకోవచ్చు  ” అని మరిన్ని బియ్యం నీళ్ళలో పోసేసారు అత్తగారు .

ఆ సీనంతా నడుస్తున్నప్పుడే  మొదటి ప్రమాదపు హెచ్చరికగా నా ఎడం కన్ను అదరడం మొదలుపెట్టింది. కానీ బూరెలు తినాలన్న బులబాటంలో  నేను దాన్ని ఖాతరు చెయ్యలేదు . అటకమీదనించీ పెద్దం బెల్లం దిమ్మ తీయించి దాన్ని మెత్తగా తరిగేయాలన్నారు. నీళ్ళు వాడేసి బియ్యం పిండి చేసి  , జల్లించేస్తే సగం పనయిపోయినట్టే అన్నారు. ఆ తరవాత బాగా మాగిన తాటిపళ్ళు  మదాయించి మెత్తగా గొజ్జు తీసుకుంటే ముప్పావువంతు వంటకం     తయారయిపోయినట్టే , ఇంకేవుందీ ఆ పిండీ బెల్లం తాటిపేశం ( గుజ్జు) కలిపి మనకి కావల్సిన బూరెలు, అప్పాలు నూనెలో వేయించి తీసేయడమే అన్నారు.  రోట్లో తలపెడుతున్నాని తెలీని నాకు నోట్లో నీళ్ళూరిపోయాయి .

బూరెలొండే బృహత్తర కార్యక్రమం లో భాగంగా పెందలాడే భోజనం చేసేసి , ఆ కార్యక్రమానికి అవసరమయిన రోలూ రోకలి, జల్లెడా, మూకుడూ వంటి సరంజామా అంతా సిద్ధం చేసేసి కూర్చున్నారు అత్తగారు . సరిగ్గా అదేసమయంలో రెండో ప్రమాద హెచ్చరికగా  చెవుల్లో చిన్నగా సైరన్ మోగింది కానీ  నేను దాన్ని వినిపించుకోలేదు.

”  కరెంటు మిల్లులో వేసిన పిండి తింటే వేడి చేస్తుందట . అయినా అదేవంతపనీ . నాలుగు దెబ్బలు పడితే నలిగి కూచుంటుంది  ”  అంటూ రోకలి నా చేతికిచ్చేసరికి గానీ నాకు బల్బు వెలగలేదు . ఓర్నాయనోయ్ …పిండి పోటెయ్యడమా ఎప్పుడూ కోలాటం  ఆడిన చేతులు కూడా కావే ఇవి ….రోకలి ఎత్తెత్తి దంచాలా ” అని లోపల్లోపల కుమిలిపో తూ   ”  అమ్మో…!నాకు చాతకాదండీ ” అనేసరికి   , “నేర్చుకుంటే సరి  అదేవంత  బ్రహ్మవిద్య! ఊ… కానియ్”  అని,  నేను ‘ ఊహు’  అంటున్నా వినిపించుకోకుండా  అప్పటికే ” ఆహూo…” అంటూ దంచుడు మొదలెట్టేసారు అత్తగారు.

అత్తగారికి ఎదురాడ్డం నేర్చుకోని ఆ రోజుల్లో ఇక చేసేదేముంది . ‘ దంచూ దంచూ…బాగా దంచూ’  అని పాడుకోటం దంచుకోటం తప్ప.

అలవాటులేని ఆచమనం లాగా  సాగుతుంది పని . పడాల్సినచోట తప్ప అంతటా పడుతుంది రోకలి . అంత పొడవున్నరోకలిని   ముందుకీ వెనక్కీ పడిపోకుండా   బేలన్స్ చేయలేక నానా హైరాన పడ్డాను . ఒక చేత్తో గాల్లోకి లేపిన రోకలిని   ఇంకో చేతిలోకి మార్చుకుంటుంటే  చెయ్యి జారి అత్తగారి నెత్తిన పడతానని బెదిరించింది. ‘ హవ్వ పరువు తియ్యకే ‘ అని బ్రతిమాలి బామాలి ఎలాగో దార్లోకి  తెచ్చుకునేసరికి  తలప్రాణం తోక్కొచ్చింది.   కత్తికట్టిన కాలం గురించి తెలుసుకానీ,  రోకలెత్తిన కాలం కూడా ఒకటుంటుందని  అది నాకే ఎదురవుతుందనీ   కలలోనైనా కలగనలేదు.

అదేం చిత్రమో ఎంత దంచినా బియ్యం తరుగుతున్నట్టు అనిపించడంలేదు . విఠలాచార్య సినిమాలోలాగా ‘ డొయ్యి…..’ మని అడుగునించీ   ఊరిపోతున్నాయేమో అని   అనుమానం వచ్చింది. ” హే ప్రభూ ఏవిటి ఈ పరీక్ష !? కాలాన్ని బట్టి     ఇష్టాలు మారుతున్నట్టే కష్టాలూ  మారాలికదా . సతీ సక్కుబాయికీ నాకూ ఒకేటైపు కష్టాలు పెట్టి , చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూడాలని సరదాపడుతున్నావే నీకిది న్యాయమా !? నోటికి కాస్త రుచిగా తినాలని కోరుకోవడమే  పాపమా ? ఆ కోరికని దాచుకోకుండా అత్తగారిముందు ప్రకటించడమే  నేరమా ? ఎందుకు స్వామీ ఈ పిండి పరీక్ష ? అని  అలవాటుగా కలవరిస్తు  ఏ మూలనుంచయినా ఆ దేవదేవుడు డింగ్మంటూ ప్రత్యక్షమయి నా కష్టాన్ని తీర్చకపోతాడా అని దిక్కులు చూసాను.

మా అత్తగారు వాయ వాయకీ ” అబ్బో…భలే దంచేస్తున్నావే ” అంటూ నన్ను భుజం తట్టి ముందుకు తోస్తుంటే నేను నిజమే కాబోలని మురిసిపోయి మరిoత ఎగిరెగిరి దంచడం మొదలుపెట్టాను . అలా ఒక పూటంతా దంచగా దంచగా పని ఒక కొలిక్కివచ్చింది . కానీ అప్పటికి ఒంట్లో ఓపికే కాదు బూరెలు తినాలన్న కోరికా కొడిగట్టిపోయింది . ఆ మాటే అత్తగారితో చెప్పేసాను.

”   నాకు బూరెలు తినాలని లేదు  మొర్రో  ” అని  ఏడుపు మొహం పెట్టుకున్నాను. ” ఓసి పిచ్చిదానా …..అలా ఢీలా పడిపోతే పనులవుతాయా . సగం పని అయ్యేపోయింది . ఇంకెంత  తాటిపళ్ళు గుజ్జుచేసి కలిపేసి ఒండేసుకోవడమే ” అనేసారు ఎంతో తేలిగ్గా . దాంతో నేనూ పారిపోయిన ఉత్సహాన్ని తిరిగితెచ్చుకుని ‘ఓస్  అంతేనటే పిచ్చి మొహమా’  నాకు నేను నచ్చచెప్పుకుని…. నడుం  బిగించి కూర్చున్నాను.    తీరా కూర్చున్నాకా తెలిసింది  అదంత ఆషామాషీ వ్యవహారం కాదనీ. తాటి పళ్ళు గుజ్జుతీయటం అరటి పండు తొక్క తీయటం ఒకటికాదని  .  పండులో ఉండే చిక్కని పీచునుంచీ మెత్తని గొజ్జుని వేరు చేయటానికి  చాలా భుజబలం అవసరమని .

మా అత్తగారు చేతులకి మట్టి అంటకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించే మంత్రిగారిలా  తాటిపండు నుంచి మెత్తని గొజ్జును సేకరించడం ఎలా ? అనేదాన్ని ఎంతో చాకచక్యంగా పైనుంచీ  చక్కని అభినయంతో ప్రదర్శించి చూపించి  , “అదిగో అవతల ఎవరో పిలుస్తున్నారు . నే చూసొస్తాను నువ్వు కానీయ్” అని   చక్కగా  చేతులు దులుపుకు చెక్కేసారు.

నేను మళ్ళీ ‘ అలో లక్ష్మణా ….!’అంటూ నా ప్రారబ్ధానికి మిక్కిలి వగచుచూ పనిలో పడ్డాను . చేతులు విరిగేలా, భుజాలు వాచేలా నాకు చాతనయినంతగా కష్టపడుతూ ‘ ఆచారాలు-  అగచాట్లు  ‘ అనే విషయం మీద మనసులోనే ఒక దీర్ఘ కవిత   రాసేసుకున్నాను ( కంగారుపడకండి ఇప్పుడది వినిపించను ) .

‘ఇదిగో వస్తా ‘ అన్నావిడ ఎంతకీ రారేవిటీ ? పనంతా నా నెత్తిన పడేసి ఎక్కడికి మాయమయిపోయారు ! ఇదేం పద్ధతి ?.అని నేను అలోచిస్తుంటే , ఆకుపచ్చ అంచున్న ఎర్ర చీరలో ఆకుల మధ్య మందారంలా మెరిసిపోతూ ప్రత్యక్షమయ్యారు అత్తగారు . మొహానికి పౌడరు రాసుకుని తల నున్నగా దువ్వుకున్నట్టున్నారు . మెడలో మేచింగు   పగడాల దండ ధరించారు. బూరెలొండటానికి ఇంత ముస్తాబెందుకబ్బా అని ఆశ్చర్యపోతూనే  ‘ ఒకవేళ ఇదీ ఆచారం కాబోలు  బాగానేవుంది !’ అనుకున్నాను .

‘చీర కుచ్చెళ్ళు సర్దుకుంటూ  పని ఏ మాత్రం అయిందీ అని ఆరాగా అడిగి ” అబ్బో…భలే తీసేశావే !” అంటూ  అలవాటయిన  లౌక్యాన్ని తిరిగి ప్రదర్శించారు అత్తగారు  . ఈసారి నేను ఆనందపడలేదు సరికదా ” ఆహా ఏమి  రచనా చమత్కృతి ” అని హాశ్చర్యపడ్డాను.  అత్తగారు కాస్త దూరంగా  ఎత్తుపీటమీద కూర్చుని , నే తీసిన తాటిపండు గొజ్జుకు సరిపడా పిండీ బెల్లం నాతోనే కలిపించి, ” ఇంకేవుందీ అయ్యేపోయింది” అన్న దంపుడు డైలాగుని మళ్ళీ కొట్టి , పొయ్యిమీద నూనె మూకుడు పెట్టించారు .

ఇందాకటి అభినయం తిరిగి కొనసాగిస్తూ ” నూనెలో పిండిని గుండ్రంగా వదిలితే బూరెలు,  పలచగా వేస్తే అప్పాలు అయిపోతాయి  అంతే ” అన్నారు .  మొదటివాయ వేయించి తీసాకా   వినాయకుడికీ, గ్రామదేవతకీ, ఇష్ట దైవాలకీ అంటూ పొయ్యి చుట్టూ నైవేద్యాలు పెట్టించారు ….”  రెండో వాయ , మూడో వాయ కూడా దగ్గిరుండి నాతో వేయించి ” వంద వాయలయినా ఇదే పద్ధతి . ఇలా వేసి అలా తియ్యడమే “  . నువ్వు కానీయ్ …నేనలా శాంత అత్తయ్యగారి ఇంటివరకూ వెళ్ళొస్తాను .  వాళ్ళింట్లో మూణ్ణాళ్ళ క్రితం కోడి పట్టు పెట్టిందట . ఆ మాయదారి పెట్ట ఒక్క గంటన్నా పట్టుమీదలేకుండా షికార్లు పోతుందట. అలా అయితే పిల్లలెలాదిగుతాయ్ . అదేవిటో  వాళ్ళకి కోడి పట్టు అచ్చిరాదు .ఎప్పుడూ  ముచ్చటగా మూడు పిల్లలయినా దిగవు .  పాపం ఏం చేయాలో తోచక నాకు కబురంపింది . అన్నారు . వెళ్ళటానికి తొందరపడుతూ .

“మనకు బాగా అచ్చొచ్చిందని మీరు కానీ పొదుగుతూ కూర్చుంటారా పట్టుమీద “ అనబోయి మర్యాదకాదని మాటలు మింగేసి ఒట్టి క్వశ్చన్ మార్కు మాత్రం మొఖానికి తగిలించి చూసాను . ఆన్సరుగా అత్తగారు  పెంకి పెట్టలని దార్లోకి తెచ్చే మంత్రం ఒకటి ఉందనీ ,  అది కోడి చెవిలో మూడుసార్లు చెప్పి ,  దాన్ని బుట్టచుట్టూ తిప్పి పట్టుమీద వదిలేస్తే నిక్షేపంలా పడుంటుందనీ మేతకి కూడా లేవదనీ  ఉత్సాహంగా  చెపుతుంటే నేను ఆశ్చర్యంలో పడిపోయాను .

నే తేరుకునేలోగా   శాంత అత్తయ్యగారి పనమ్మాయ్ సూర్యావతి వెనకే పెళ్ళినడక నడుచుకుంటూ దొడ్డి గుమ్మం దాటేయబోయిన అత్తగారు  అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టూ  స్పీడుగా వెనక్కి నడిచొచ్చి ” నేనలా వెళ్ళగానే నోట్లో వేసుకుంటావేమో….  వేడిగాతింటే వెర్రెక్కుతుందoటారు జాగ్రత్తేవ్ ….. అసలే ఆనవాయి లేని పనొకటి  “ అనేసి మళ్ళీ ఓసారి  కుచ్చిళ్ళు సర్దుకుని ,పెళ్ళినడక నడుచుకుంటూ వెళ్ళిపోయారు  . నా గుండెల్లో  రాయి పడింది .

ఎప్పుడో కానీ గుమ్మం దాటే అవకాశం రాని అత్తగారు ఇలావెళ్ళి అలా రావటం అన్నాది ఒట్టిమాటే . ఆ వరసలో ఉన్న పది గుమ్మాలయినా ఎక్కి దిగకుండా వెనక్కి మళ్ళరు .  జరుగుతున్నదంతా పెద్ద కుట్రలా అనిపించింది . తన హెచ్చరికలని ఖాతరు చేయని నన్ను నీ చావు నువ్వు చావని వదిలేసి పోయింది నా సిక్త్ సెన్స్ .

నాకు మమ్మీ…..అని గట్టిగా ఏడవాలనిపించింది . కానీ నా ఏడుపు వినిపించేంత దూరంలో మమ్మీ లేదని గుర్తొచ్చింది . నాకు అత్తగారిని నిందించాలో …నా ప్రారబ్ధానికి  చింతించాలో అర్ధం కాలేదు. ఇక చేసేదేవీలేక ”  అయితే అరిసెలపాకం- కాకపోతే కాణిపాకం “ అని ఒక కొత్తసామెత చెప్పుకుని ”   నాముందున్న పెద్ద బేసినుడు పిండినీ  బూరెలు , అప్పాలేకాక  చేగోడీలు, చక్కిడాలు వంటి ఆకారాల్లో మలుస్తూ కొత్త పిండి వంటలకు ప్రాణం పోసే ప్రయత్నం చేసాను .

ఊరినించీ దిగిన రాజుగారు పొయ్యిదగ్గిర మసిపట్టిన  నా ఏబ్రాసి మొహాన్ని  చూసి గతుక్కుమని  నాలుగడుగులు వెనక్కీ  ఒక్కడుగు ముందుకీ వేసి  ”  చందమామ కథల్లో రాక్షసి  బొమ్మలా అలా అయిపోయావు ఏవిటోయ్. ఏ మాంత్రికుడు నిన్ను ఇలా మార్చేసాడు  . చెప్పు  వాడ్ని  తక్షణమే బంధించేస్తాను ”  అన్నారు  మీసాలు  మెలేసి వెటకారంగా నవ్వుతూ .

పూర్వ వృత్తాంతమతా తెలిపి బావురుమన్నాను   . చలించిపోయిన రాజుగారు  ” అకటా!!” అని అదేపనిగా బాధపడి “ఏవయినా సాయం చేద్దామంటే ఇది వంటింటి  వ్యవహారం అయిపోయింది . మగాళ్ళు పొయ్యికి పదడగుల దూరంలో ఉండటం మా ఇంటాచారం .  నేను కొంచెం మాడ్రన్ భావాలు కలవాడిని కాబట్టి ఇలా మూడడుగుల దూరం వరకూ వచ్చేసాను .  అని చుట్టూ పరికించి  , ఎవరూ తనని చూడ్డంలేదని నిర్ధారించుకుని  ,  ఒకడుగు ముందుకేసి  “ఓ నా ముద్దమందారం కావాలంటే   నీకు కష్టం తెలీకుండా  ఉండటానికో కథ చెపుతాను  . అది  వింటే నువ్వు వద్దన్నా నవ్వేస్తావు తెలుసా అన్నారు  ” భుజాలు కుదుపుకుంటూ కితకితల నవ్వొకటి  ఒంపేసి .

‘ ఆకలేస్తే రోకలిమింగు అరగకపోతే తిరగలి మింగు’  అన్నాట్ట వెనకటికొకడు .  ఈ కష్టమేమిటిరా పరమాత్మా అని నేనేడుస్తుంటే … కథలూ కాకరకాయలూ అంటారేం   ! నా వల్ల కాదు పొమ్మన్నాను  .  అయినాసరే అదేం  పట్టనట్టూ  ” దేవీ కష్టములెట్లున్నానూ …. నా కథ విని తీరవలె ” అంటూ అంగడి పాలైన హరిశ్చంద్రుడి పోజులో  చెప్పుకుపోయారు . ఆ కథేవిటంటే ……

అనగనగా ఆయన చిన్నప్ప్పుడు   ‘నచ్చిన పండుగ ‘   వ్యాసం రాసుకురండి అని తెలుగు మాస్టారు చెపితే ,     నాకు నచ్చిన పండుగ మా తాతయ్య తద్దినం అని రాసుకెళ్ళారట . ఆ ఒక్క లైనూ చదివి తరువాతి విషయం చూడకుండానే తెలుగు మాస్టారు ” బుద్ధిలేదటరా ” అని బడిత పూజ చేసేసి అంతటితో వదలక ఆ వ్యాసం ఇంటికి పంపించారు. ఇంట్లో ఉన్న పెద్దలందరూ తలో రెండూ వాయించి , ఆ వ్యాసాన్ని వీధిలోకి వదిలారట. ఇక అంతే ఆ వీధిలో వుండే  ఇరవై ఆరు కొంపల వాళ్ళూ తలో మొట్టికాయ వేస్తే అంత సాహసం చేయలేని ఇతరులు కనపడచోటల్లా కాలర్ పుచ్చుకుని ” తప్పుకదండీ బాబుగారు” అని అక్షింతలు వేసేసారట. పాయసం, గారెలూ వండుకుతింటాం  కాబట్టి  అదీ ఒక పండగే అనుకున్నానని చెప్పినా ఒక్కరూ  నమ్మలేదట.  దాంతో ఆయనకి బాగా కోపం వచ్చేసి , తనని ఇంత అవమానపరిచిన పాయసం -గారెలూ జన్మలో తినకూడదని నిర్ణయించేసుకుని , ఒక కాగితం మీద గారెలు, పాయసం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి , కాశీ వెళుతున్న చిన్న తాతయ్య కి ఇచ్చి వీటిని తనపేరు చెప్పి కాశీలో వదిలేసి రమ్మన్నారట ( వాళ్ళ నానమ్మ గుమ్మడికాయ తినమoటే కాశీలో వదిలేసాను  ఇక తినను అని చెప్పటం  విన్నారట )  .  అది చూసినవాళ్ళంతా ” తెలివి తెల్లారినట్టేవుంది ” అంటూ మళ్ళీ ఒకరౌండువేసి, బలవంతంగా పాయసం గారెలూ నోట్లో కుక్కి వ్రతభంగం కావించారట  .  అక్కడితో వదిలిపెట్టకుండా ఏటా వినాయక చవితికి క్రమం తప్పక కథ చదువుకుని అక్షింతలు జల్లుకున్నట్టూ , ప్రతీ తాతయ్య తద్దినం లోనూ  ఈ అజ్ఞానపు కథని  చెప్పుకుని అబ్బాయి నెత్తిన అక్షింతలు వేయటం ఆచారంగా వస్తుందట .

కథంతా అయ్యాకా “నవ్వవోయ్ “ అంటూ దోసిలి పట్టుకు కూర్చున్నారు  .  అడిగిన వెంటనే నవ్వేస్తే లోకువైపోతావని  “ఇప్పుడు వీలుపడదు  తరవాతెపుడయినా సావకాశంగా వున్నప్పుడు నవ్వుతా “పొమ్మన్నాను .

   ***

” ఇందుకే ఆనవాయితీ లేని పనులు చేయకూడదు అనేది “.

” మా కాలంలో వద్దంటే ఊరుకునేవాళ్ళం.  ఇలాంటి వితండ వాదనలు మేం ఎరగవమ్మా ”

ముందు రోజు పడ్డ శ్రమ ఫలితంగా జొరం తెచ్చుకుని  మూలుగుతూ పడున్న నన్ను చూసిపోటానికొచ్చిన  మా పిన్నత్తగార్లూ , పెద్దత్తగార్లూ, వాళ్ళ కోడళ్ళూ , ఇంకా వరసకి  పిన్నమ్మలూ, కన్నమ్మలూ అంతా చాప చుట్టూ కూర్చుని మధ్యలో పళ్ళెం నిండా ఉన్న బూర్లెలు అప్పాలు తింటూ పై విధంగా చింతిస్తున్నారు .

” ఏవిటో…  అచ్చిరాదని వదిలేశాం వద్దంటే విన్నదికాదు” .  అంటున్నారు అత్తగారు తింటున్నవాళ్ళకి మంచినీళ్ళు అందిస్తూ .

” అనుభవం అయింది కదా ఈసారి వింటుందిలే…..ఇకనైనా ఇలాంటి ఆనవాయితీ లేని పనులు చేయ్యకండి” అని అక్కడ ఉన్న కోడళ్ళందరికీ ఏకమొత్తమ్మీద వార్నింగ్ ఇచ్చేసిన మా పెద్దత్తగారు ” నువ్వేవన్నా వంటకంలో  చేయిపెట్టావా ?” అనడిగారు మా అత్తగారిని .

“అయ్యో…. లేదు అప్పయ్యా నేనసలు వేలుకూడా పెట్టందే … పెద్దావిడ మాటే పదే పదే గుర్తొస్తుంటే ఎందుకన్నా మంచిదని  దూరంగానే వున్నా .  తాటిపండుని చేత్తో తాకనన్నా తాకలేదు”  అన్నారు .

” అలా అయితే నువ్వు ఈ బూరెలు నిక్షేపంగా తినొచ్చు . వండినవాళ్ళు తినడమే మనకి ఆనవాయిలేదు ”  అంటూ అత్తగారికి బూరెల పళ్ళెం  అందించి నాకేసి  అదోలా  చూసేరు మా పెద్దత్తగారు  .  ఆ చూపులో అయ్యిందా నీపని అన్న అర్ధం ద్వనించింది .

మా అత్తగారు నాకేసి జాలిగా చూసి , తోటికోడలి కోసం తప్పక తింటున్నట్టూ  ” ఆ…ఏదో ఆచారం అన్నారని తినడం తప్పిస్తే …….పూర్ణం బూరెల రుచి వీటికెక్కడొస్తుందీ ”  అంటూ బురె తీసి బుగ్గన పెట్టుకున్నారు .

నేను నీరసంగా నిట్టూర్చి ” దాల్ మే కాలా హై , కుచు కుచ్ హోతాహై ” అని  హిందీలో చింతించడం మొదలు పెట్టాను అక్కడున్నవాళ్ళకెవరికీ అర్ధం కాకుండా .

అత్తగారికి తెలిసింది కోడి మంత్రం ఒకటేనా …..అన్న అనుమానం మీక్కూడా వచ్చిందా ! తప్పు లెంపలేసుకోండి . ఇప్పుడు చెప్పండి ’ తంతే బూరెల బుట్టలో పడ్డట్టా …. పడనట్టా  !?’

–దాట్ల లలిత

 

తావి

తాయమ్మ కరుణ

తాయమ్మ కరుణ

 

 

 

 

 

 

anvi with dolly

అలతి అలతి పదాలతో కథలు అల్లే కరుణ అసలు పేరు పద్మ. తాయమ్మ కథ రాసి “తాయమ్మ కరుణ” గా మారారు. తనకు బాగా పేరు తెచ్చిన “తాయమ్మ” కథే ఆమె మొదటి కథ. 1996 లో “మహిళా మార్గం” లో ఈ కథ అచ్చయ్యింది. ఇంతవరకు పాతికకు పైగా కథలు రాసారు. అనేక పురస్కారాలు అందుకున్నారు.

“తాయమ్మ మరికొన్ని కథలు ” పేరుతో ఒక సంపుటి తెచ్చారు. పలు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న కరుణ ప్రస్తుతం హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.—వేంపల్లె షరీఫ్

***

 

 

గట్టిగా ఏడుపు వినిపించడంతో కిట్టు, కల్పన వంటింట్లోంచి పరుగెత్తుకుని వచ్చారు.

‘డాలీ’ని పట్టుకుని ఏడుస్తోంది తావి.

‘‘ఏమైంది బుజ్జమ్మలు’’ అంటూ కిట్టు తావిని ఎత్తుకున్నాడు.

తావి ఎందుకు ఏడుస్తుందో కిట్టుకి వెంటనే అర్థమైంది.

కల్పన ఆందోళనగా… ‘‘ఏమైంది? ఎందుకేడుస్తుంది కిట్టూ’’ అడిగింది.

‘‘ఏం లేదు. ఏం లేదు. నేను తర్వాత చెప్తాలే’’ కల్పనతో అని,

‘‘బుజ్జమ్మలు డాలీకి దెబ్బ తాకిందామ్మా?’’అని ఊరిస్తుంటే… ఇంకా గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది తావి.

తావికి రెండున్నర ఏళ్లు. కిట్టూ కల్పనల ఏకైక కూతురు. తావికి ఏమన్నా అయిందంటే అల్లాడిపోతారు. వాళ్లమ్మ చనిపోయిన సంవత్సరంలోనే పుట్టింది కాబట్టి.. తన తల్లే పుట్టిందని కిట్టు అనుకుంటాడు. దాని బుద్ధులు కూడా తల్లి లాగానే ఉన్నాయని మురిసిపోతాడు. తావి చిన్నదైనా దానికి చిన్నప్పటి నుంచే అన్నీ అర్థమవుతాయంటాడు కిట్టు. ఒకసారి తావి చేతిలోంచి గ్లాసు కిందపడి నీళ్లు పోయాయట. కిట్టువైపు చూసి తప్పు చేసినట్టుగా తల కిందకు వేసుకుని అలాగే నిలబడి పోయిందట. అప్పుడు అది చూసిన చూపు అలాంటి సందర్భంలో తన తల్లి చూసినట్టుగానే చూసిందట. వెంటనే వెళ్లి కూతుర్ని ఎత్తుకుని ముద్దులతో ముంచేశాడట కిట్టు. ఇండియాలో ఉన్న తన అక్క సుమకు ఫోన్‌ చేసి మరీమరీ చెప్పి మురిసిపోతాడు.

బుద్ధులే కాదు.. పోలికలు కూడా తల్లివేనంటాడు. కన్పించిన వాళ్లందరికీ కొత్త పాత తేడా లేకుండా చిరునవ్వు విసిరేస్తుంది.

ఇక కల్పనకైతే కూతురే సర్వస్వం. మొదట కిట్టు ‘‘పిల్లల్నే కనొద్దు. ఎవర్నైనా పెంచుకుందాం’’ అన్నాడు.

ప్రకృతి సహజంగా పిల్లల్ని కనాలని ఉంటుందని, కనకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఏది ఏమైన తనకు పిల్లలు కావాలని తన అభిప్రాయం చెప్పింది. కల్పన అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవిస్తాడు. కల్పన అలా తన అభిప్రాయం చెప్పేసరికి కాదనలేదు.

అలా పుట్టింది తావి వాళ్లకు  పెళ్లైన ఆరేళ్లకు. అప్పటికే కల్పనకు ముప్పై రెండేళ్లు. కిట్టుకి ముప్పైనాలుగు ఏళ్లు.

‘భార్య’ అనే పదానికి వారిద్దరి మధ్య అర్థం లేదు. స్నేహితులుగానే మెలుగుతారు. కల్పన మనసును చూసి చేసుకున్నాడు కిట్టు. కల్పనను చూసిన చాలామంది ‘‘ఈ అమ్మాయి ఎలా నచ్చిందిరా బాబు నీకు’’ అన్నారు. వాళ్లు అనడానికి కారణం.. కిట్టు చాలా బాగుంటాడు. ‘‘మనసుతో చూస్తే నచ్చుతుంది’’ అన్నాడు కిట్టు. అందం అంటే కిట్టు దృష్టిలో మానసికమైంది. శారీరకమైన అందానికి కిట్టు ఎన్నడూ ప్రాముఖ్యత యివ్వలేదు. తామిద్దరూ కలిసి హాయిగా జీవించగలం అనుకున్నాడు. అలాగే చేసుకున్నారు.

కిట్టు, కల్పనలు  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వేర్వేరు కులాలు. కల్పన పుట్టిన తర్వాతనే కలిసి వచ్చిందని కల్పన తల్లిదండ్రులకు ఆమె మీద విపరీతమైన  ప్రేమ. అలాంటిది  ప్రేమించిందని తెలిసి, చస్తామని బెదిరించి వేరే పెళ్లి చేయడానికి తల్లితండ్రీ ఒత్తిడి చేశారు. కల్పన అప్పటికి చప్పుడు చేయకపోయినా కిట్టుకి ఈ విషయం తెలిస్తే… తప్పక వచ్చి తనను తీసుకుపోతాడని నమ్మకం. కానీ ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లాడు. కల్పన గృహనిర్బంధం. వాళ్ల అన్నా, వదినలకు కల్పన బాధ్యత అప్పచెప్పి పోయాడు. వదిన తన చిన్నమ్మ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉంది. సహజంగానే కల్పన గురించి పట్టించుకోలేదు. కిట్టు ఫోన్‌ చేసి కల్పన ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని చెప్పేవాళ్లు. ఎందుకో కిట్టుకి అనుమానం వచ్చి, కల్పనవాళ్ల ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ చేశాడు. కల్పన తండ్రి ఫోన్‌ ఎత్తాడు. తమ  ప్రేమ వ్యవహారం వాళ్లకి తెలిసిందని కిట్టుకి తెలియదు. కల్పన అన్నకు ఫ్రెండ్‌ కాబట్టి అలానే ఫోన్‌ చేశాడు.

‘‘నీ వల్ల నా కూతురి చనిపోతుంది. మొన్న నిద్రమాత్రలు మింగింది. ఇంకోసారి నువ్వు గనక ఫోన్‌ చేశావంటే మర్యాదగా ఉండదు’’ అని నానా మాటలు అన్నాడు కల్పన తండ్రి . కల్పనకు వేరే పెళ్లి చేస్తున్నారని, తను ఆత్మహత్యకు ప్రయత్నించిందని కిట్టుకు అప్పుటికిగానీ తెలియలేదు. వెంటనే జర్మనీ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సినిమా ఫక్కీలో కల్పనను తీసుకెళ్లిపోయాడు. అంతకుముందు ఫ్రెండ్స్‌ ద్వారా లాయర్‌ నోటీసు అన్నీ తయారు చేసిపెట్టుకున్నారు. ఇద్దరూ మేజర్లు కాబట్టి పోలీసులకూ చెప్పి పెట్టి ఉంచారు.

కల్పనతో  ప్రేమలో పడ్డాకనే తను కూడా సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఫ్రెండ్స్‌తో కాలక్షేపమే ఎక్కువగా ఉండేది.

ఒక సంవత్సరంలో కల్పన తల్లిదండ్రులు వచ్చి కలిసిపోయారు. కిట్టుని చూసి ఫిదా అయిపోయారు. ‘‘ముందే అబ్బాయి గురించి ఎందుకు చెప్పలేదే.’’ అని కల్పనవాళ్లమ్మ అన్నది. ఆ తర్వాత రెండేళ్లకు అమెరికా ప్రయాణం. కల్పన తన తల్లి వాళ్లింట్లోనే ఉండపోయింది. సంవత్సరం తర్వాత కల్పన కూడా కిట్టు దగ్గరికి అమెరికా వెళ్లింది.

ఆ తర్వాత మూడేళ్లకు తావి పుట్టింది. తావికి ఏ చిన్నది జరిగిన కల్పన, కిట్టూ భరించలేరు. దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇప్పుడలా ఏడ్చేసరికి కల్పనకు అర్థంకాక విలవిల్లాడుతుంది,  తన కూతురు ఎందుకేడుస్తుందో తెలియక.

తావికి ‘డాలీ’ అనే బొమ్మ ఉంది. తను ఎక్కడకి వెళ్లినా డాలీ వెంట ఉండాల్సిందే. డాలీకి అన్నం తినిపిస్తది, నీళ్లు తాపిస్తది, వాళ్లమ్మ తనకు చేసేవన్నీ తను డాలీకి చేస్తుంది తావి.  చిత్రమేంటంటే వాళ్లింటో ఉయ్యాల లేదు. అయినా కార్టూన్స్‌ చూసి రెండు చైర్లకు కలిపి టవల్‌ను చుట్టూ డాలీని అందులో పడుకోబెడుతుంది తావి. ఎంత ఆశ్చర్యమో కిట్టు, కల్పనలకు. దీనికెలా తెలుసు అని. అంత చిన్న వయసులో చైర్లకు టవల్‌ను చుట్టడం.. దాని తెలివికి మురిసి ముద్దయిపోతారు.

డాలీకంటే కూడా అందంగా ఉండే తావిని ఎక్కడ కి వెళ్లిన అందరూ ముద్దు చేస్తారు. ‘క్యూట్‌ గర్ల్‌’ అంటారు. అయినా  కిట్టు తన అక్కలకు ఫోన్‌ చేసి తన కూతురు అందం గురించి పొగిడించుకుంటాడు. ‘‘నిజంగానే అందంగా ఉంటదాక్కా’’ అంటాడు. ‘‘నిజంగా .. చాలా అందంగా ఉంటది’’ అని చెప్తుంది అక్క సుమ. కిట్టు కుష్‌.. నవ్వుతాడు.

ఇక తావి ఏడిస్తే తట్టుకుంటారా? ..

ఇందాక ఇల్లు సర్దుతూ కిట్టు డాలీని బొమ్మల బుట్టలో విసిరేశాడు. ఇంటి నిండా బొమ్మలన్నీ పర్చి ఆడుకుంది అంతసేపు. ‘‘కిట్టు, ఇల్లంత సర్దవా. నేను వంట మొదలుపెడుతున్నా’’ అని కల్పన వంటింట్లోంచి అంది.

ల్యాప్‌టాప్‌ మీద వర్క్‌ చేస్తున్న కిట్టు సిస్టమ్‌ బంద్‌ చేసి లేచాడు.

ఇళ్లంతా బీభత్సం. గబగబా బొమ్మలన్నీ బుట్టలోకి విసిరేస్తూ డాలీని కూడా విసిరేశాడు. విసిరే ముందు ఒక్క క్షణం అన్పించింది  బుజ్జమ్మలు బాధపడుతుందేమోనని.

అన్నీ సర్దేసి వంటింట్లోకి వెళ్లి అంట్లు కడగడం మొదలుపెట్టాడు. అమెరికాలో ఉన్న ఒక భాగ్యమేమంటే పనిమనుషులు దొరకరు. మనుషులను బద్దకస్తులుగా తయారు చేయరు. దొరికినా .. వాళ్లకు జీతాలు చెల్లించడం కష్టం. అందుకే ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. అందున ఇండియా నుంచి వెళ్లినవాళ్లు సాధ్యమైనంత తక్కువ ఖర్చు చేసుకుని, మిగిలించుకుని దాచుకోవాలనుకుంటారు.

తావి బొమ్మను విసిరేయడం చూసింది. నెమ్మదిగా లేచి వెళ్లి బుట్టలోంచి బొమ్మను తీసుకుంది. అప్పటికే దానికి దు:ఖం ఎగిసివస్తోంది. బొమ్మను చేతిలోకి తీసుకునేసరికి ఇక దానికి ఏడుపు ఆగలేదు. పెద్దగా ఏడుస్తూ బొమ్మను హత్తుకుంది.

కిట్టు ఎంతో సేపు ఊర్కోబెడితే గానీ దానికి దు:ఖం ఆగలేదు. ఈ విషయం కల్పనకు చెప్పాడు తర్వాత.

‘‘దానికి ఆ బొమ్మంటే ఇష్టమని తెలుసుగా కిట్టూ’’ అంది కల్పన,  ఎందుకట్లా విసిరేశావు అన్నట్టుగా.

‘‘విసిరేసేటప్పుడు ఒక్క క్షణం అన్పించింది. బుజ్జమ్మలు ఇంతలా గమనిస్తుందనుకోలేదు.’’

‘‘అయినా  మేడంగార్కి కోపం వస్తే విసిరేస్తది. మనం విసిరేస్తే మాత్రం దు:ఖమే’’ ఇందాక తను అన్నమాటకు కిట్టూ బాధపడతాడేమోనని, దానిని కవర్‌ చేస్తూ మురిపెంగా కూతుర్ని చూస్తూ అంది కల్పన.

కిట్టు, కల్పన కూడా బొమ్మను జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టారు.

***

ఆ రోజు ఆదివారం కిట్టు కూడా ఇంట్లోనే ఉన్నాడు. పొద్దుటి నుంచి ల్యాప్‌ట్యాప్‌ మీంచి దిగలేదు. టిఫిన్‌, భోజనం కల్పన పిలిస్తే లేచి తిని వచ్చి మళ్లీ కూర్చున్నాడు. ఒకోసారి తెల్లవార్లూ పనిలో మునిగిపోయి వుంటాడు కిట్టు. శనివారం కూడా ఎక్కడికీ వెళ్లలేదు. సరే కల్పనకి కూడా బోర్‌గా ఉంటుందని సాయంత్రం లేచాడు. ముగ్గురూ కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అలాగే చికెన్‌ తీసుకొచ్చారు.

చికెన్‌ చేయడంలో కిట్టుది నలభీమ పాకం. చికెన్‌ ఒక్కటనే కాదు. ఏ మాత్రం సమయం చిక్కిన వంటింటి పనిలో పాలుపంచుకుంటాడు.

‘‘ఆఫీసు వర్క్‌ ఇంకా చాలా వుంది. నువ్వు అన్నీ ప్రిపేర్‌ చేసి పిలువు. నేను వండుతా ’’ చెప్పాడు కిట్టు.

కల్పన వంటింట్లో పనులు చేస్తోంది.

కిట్టుకి దగ్గర్లో బొమ్మలతో ఆడుకుంటున్న తావి వాంతి చేసుకుంది. డాలీ మీద, తన గౌను మీదా పడింది. తావిని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకొచ్చారు. తావి చూడకుండా బొమ్మ డ్రెస్సును ఉతికేసి బొమ్మను బకెట్లో నానబెట్టారు.

తావిని పడుకోబెట్టి ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఎప్పుడు లేచిందో లేచింది బొమ్మ లేదనే విషయం కనిపెట్టి ఇల్లంత తిరుగుతూ బాత్రూమ్‌లోకి వెళ్లింది. నీళ్లల్లో బొమ్మను చూసి…

‘‘లాలీ… లాలీ…’’ అంటూ హృదయం ద్రవించేలా ఏడుపు.

పరిగెత్తుకుని వెళ్లిన కిట్టు, కల్పన ‘‘లేదు బుజ్జమ్మలు. డాలీకి స్నానం చేపిస్తున్నాం. దానికేం కాలేదు. నీకు చేపించాం కదా. అలాగే డాలికి కూడా చేపిస్తున్నాం’’ అని తావిని సాటిస్‌ఫై చేసేసరికి తలప్రాణం తోకకొచ్చింది.

ఆ బొమ్మ ఎక్కడైనా మర్చిపోతే దానికి జ్వరం వస్తుందని అలాంటిదే ఇంకో బొమ్మ కొని దాచి పెట్టాలి అనుకున్నారు.

కల్పన, తావి నిద్రపోయారు. కిట్టు పని అయేపోయేసరికి రాత్రి రెండున్నర గంటలు కావస్తోంది. తిన్నది ఎప్పుడో అరిగిపోయింది. ఆకలి అనిపించి, కిచెన్‌లోకి వెళ్లి బ్రెడ్‌ కాల్చుకుని తిన్నాడు. ఏంటో చాలా అలసటగా వుంది. ఏదో వెలితిగా వుంది. ఏంటో తెలియదు. వచ్చి బుజ్జమ్మలు పక్కన పడుకున్నాడు.

సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. హఠాత్తుగా తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మ కూడా ఇలాగే తన, పర భేదం లేకుండా అందరితో  ప్రేమగా వుండేది కదా. అమ్మను అందరూ కల్మషంలేని మనిషి అనేవారు. ముసలితనంలో పిల్లల పలకరింపు కోసం అల్లాడిన అమ్మ. బొమ్మలేకపోతే తన కూతురు ఏమైతుందో అని ఆలోచిస్తున్నాడు తను. ప్రాణంతో వున్న పిల్లలం అమ్మకీ వుండీ లేనివాళ్లమే అయినాం కదా. పిల్లల కోసం ఎంత కష్టపడింది. పిల్లలే తన సర్వస్వం అనుకుంది. తనకుంటూ మిగిల్చుకోవాలనే ధ్యాసలేదు. పిల్లలే తన ఆస్తి అనుకుంది. అమ్మ పిల్లలం. అమ్మకేం చేశాం? అమ్మ నేం చేశాం? కిట్టు కళ్లల్లో ధారలు… అప్రయత్నంగా కూతురిని దగ్గరికి తీసుకున్నాడు కిట్టు.

–తాయమ్మ కరుణ

మనం కలిసి కన్న కలలున్నాయి, అవి జర భద్రం!

మిత్రమా,

చాలా రోజులయ్యింది ఉత్తరం రాసి..

ఈ మాటలు రాస్తున్నప్పుడు కోటానుకోట్ల అక్షరాలు పోటెత్తాయి. ఉద్విగ్నమైన, అమాయకమైన, బహుశా 1861 నుండి 1865 వరకు దక్షిణ ఉత్తర ప్రాంతాలకు జరిగిన భీభత్స అమెరికా అంతర్యుద్ధ భావజాలం, హింస మనం చూసినం కదా! అయినా ఆ యుద్ధం ఆంధ్ర, తెలంగాణా, ఇంకా మన దగ్గర ఇప్పటికీ కొనసాగుతుంది కదా!

అదిగో అక్కడినుండి ప్రవాసిలాగా ఇక్కడికి వచ్చాను. నేనిప్పుడు చుట్టూ ఆవరించిన ఎత్తైన ఓక్ చెట్ల మధ్య ఉన్నాను. మార్మికమైన ధ్వనులేవో విన్పిస్తున్నాయి. పేరు తెలియని పిట్టేదో తన భాషలో మాట్లాడుతోంది. ఎర్ర బుట్టు పిట్ట బద్ధకంగా, లాన్‌లో ఫురుగులేరుకుంటోంది. జులై మాసపు ఎండ పాకుతోంది. వాతావరణం వేడిగా ఉంది. నేనిప్పుడు న్యూయార్కుకు రెండు గంటల కారు ప్రయాణం దూరంలో ఎక్స్‌టన్ ఫిలడెల్ఫియా రాష్ట్రంలో ఉన్నాను. కాలం కత్తి అంచు మీద నడిచినట్టుగా ఉంటుంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు చుట్టుముడతాయి. ఏదీ నిలువదు. ఏదీ కొనసాగదు. నిద్రో, మెలకువో తెలియకుండా విచిత్రమైన ఈ మానసిక స్థితి..

బహుశా ఒక కఠోర సమయంలో మాక్సింగోర్కి 1906లో న్యూయార్కుకు ప్రవాసం వచ్చాడు. అతి కష్టంగా. ఏమి చెయాలో తోచక, తన చుట్టే తిరిగినప్పుడు తను కలెగలిసి మెదిలిన మనుషులంతా, తన సహచరులంతా అతనికి కొత్తగా వింతగా కన్పించారు, విన్పించారు. తాము భాగమైన మొత్తం జీవితం కుదురు ఆరాటం అర్ధమయినట్టె అన్పించింది. ఆ వియోగ సంయోగంలో నుంచే అమ్మ నవల పుట్టింది. ప్రతి మనిషిలో లోపల ముట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే అమ్మ నవల. అట్లాంటిదేదో రూపు కట్టినట్టే ఉంటుంది. నలభై సంవత్సరాల సుదీర్ఘ యుద్ధఘట్టాలేవో సలుపుతాయి. రకరకాలుగా నా జీవితంలో భాగమైన అనేకమంది సహచరులు పోటెత్తుతారు. వాళ్ల అడుగుల సవ్వడి తపన – వాళ్ళు అంతకంతకు చెట్టు తన ఆకును, బెరడును త్యజించి మళ్లీ కొత్త రూపం సంతరించుకున్నట్లుగా స్వంత ఊరు, ప్రాంతం, జీవితం నుండి మనుషుల్లోకి, మహారణ్యాల్లోకి విస్తరించడం తెలుస్తూనే ఉంటుంది. లోలోపలి విధ్వంసాల్ని ఎదుర్కొని నిలబడి మనుషులుగా రూపుదిద్దుకున్నందుకు. ఆ అపురూపమైన, అందమైన మనుషులను, పూర్తిగా విచ్చిన్నమైన మనుషులు వేటాడి సంహరించడం తెలుస్తూనే ఉంటూంది. సమస్త మానవ ప్రవర్తన తెలుస్తుంటుంది. అయినా ముందుకు సాగదు.

గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడెక్కడో చిక్కు దారుల్లో కాటగల్సిపోయినట్టుగా ఉంటుంది. టాల్‌స్టాయ్ రిజరక్షన్ కన్నా ముందుకు జరగాలి. అన్నా కరెనీనా ఒంటరిగా, దిగాలుగా రైల్వేస్టేషన్లో ఆత్మహత్య చేసుకోగూడదు. విధ్వంసంలో పూర్తిగా కూరుకుపోయిన 90% ప్రజలకు విధ్వంసం తెలియదు. దారి తెలియదు. ఆ దారి కనుక్కున్న ప్రపంచం పదే పదే కుప్పకూలింది. అయినా మళ్ళీ మళ్లీ నిర్మించే క్రమంలో నా సహచరులున్నారు. ఎక్కడికో పోతున్నాను. ఈ దేశంలో చాలా తిరిగాను. మనుమడు సాకేత్ సాన్వీల కోసం డిస్నీల్యాండు నాలుగు రోజులు తిరిగాను. అదో పెద్ద ప్రపంచం. బహుశా రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో పిల్లల కోసం నిర్మించిన ఒక అద్భుత కల్పనా ప్రపంచం. రాణులు, అరేబియన్ కథలు, పక్షులు, జంతువులు, అనేక దేశాల ప్రత్యేక కథలను యూనీఫాం వేసి కట్టిన కథలు…s-US-DIVERSITY-large1

అమెరిక అంతట సెలవులు కనుక చాలమంది పిల్లలు, తల్లిదండ్రులు వచ్చారు. అనేక జాతులవారు, మెక్సికన్స్, జూస్, జర్మన్, చైనీస్, ఇండియన్సు, అన్ని రకాల మనుషులను ఒక దగ్గర చూడడం అదొక అనుభవం.

లాస్ఏంజిల్స్ లోని ఇర్విన్‌లోనే గుగీ ఉంటారు. అతన్ని కలుద్దామా వద్దా అని ఊగీసలాడాను. అతను నాకు పూర్తిగా తెలుసు. నేనతనికి తెలియదు. కెన్యాలో తన వూరు, తన భాషను ప్రేమించినందుకు వేటాడబడినవాడు. ఇంకా ఎప్పటికైనా తన దేశం తాను పోతాననే కలలో బతుకుతున్న మనిషి. ఆ మధ్య ఎందరు చెప్పినా వినకుండా వెళ్లి హోటల్ గదిలోనే దుండగుల దాడికి గురై ఆయన సహచరిని అవమానపరిస్తే మళ్లీ అమెరికా వచ్చినవాడు. లోలోపల అతని స్థితి నా స్థితికి భిన్నమైంది కాదు. బహుశా ఈ స్థితి దాటిన తరువాత నేనతనికి తెలిసిన తరువాతనే కలువాలా? పిల్లలను అడగడానికి మొహమాట పడ్డాను. ఇది ఎలాంటి స్థితి అని చెప్పలేను. మన దగ్గర ఎప్పటిలాగే అనేకం పోటెత్తుతున్నాయి. పరిశుభ్రమైన తెల్లబట్టలేసుకున్నవాళ్లు తళతళలాడే సంపదలో ఓలలాడేవాళ్లు. వెగటు, వెలపరం పుట్టించే నాటకాలకు తెరదీస్తారు.

వార్తాపత్రికల నిండా వెంట్రుకవాసి కూడా నిజం కాని నటనలు.. నేనెందుకో ఆ ముఖాలు చూడలేను. సంపదతో, అధికారంతో కుళ్లిన ముఖాలవి. అప్పుడెప్పుడో బహుశా 1985లోనో యేమో కాళీపట్నం మాస్టారు చిన్న కొడుకు యింట్లో భూషణాన్ని చూశాను. అతనేమీ మాట్లాడలేదు. నేనేమీ అడగలేదు. అతనంతా చెప్పనే చెప్పాడు కదా! ఆ యుద్ధ భీభత్స, వీరోచిత గాథలన్నీ నేను చదివినవి, విన్నవే కదా! జీవితాన్ని, మనుషులను ప్రేమించడం నేర్చుకున్నదక్కడే కదా! ఆయన పక్కన కూర్చుంటే ఆ జీవితపు స్పర్శలోపలికి… ఆ తరువాతెప్పుడో విరసం సభలో అప్పలనాయుడు కార్మికుల కోసం ఏదో పత్రిక నడుపుతున్న ప్రసాదును పరిచయం చేశాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను ఏమీ అడగలేదు. అప్పటినుండి మళ్లీ చూడలేదు. కాని నిరంతరం వింటూనే ఉన్నాను.

మనుషులు మంచికో, చెడ్డకో మన జీవితంలోకి వచ్చిన తరువాత వాళ్లు మనం పోయేదాకా మన వెంట నడుస్తారు. మొన్న నెల్లూరులో చంపేశారతన్ని. ప్రసాదు సౌమ్యుడు. ఆయన పొరపాటున కూడా దురుసుమాట మాట్లాడినట్లుగా గాని, ఎవరికన్నా అపకారం చేసినట్టుగా కాని ఇన్ని సంవత్సరాలుగా వినలేదు. కాని అయన మనుషుల అద్భుత కలల గురించి అడుగుతున్నాడనిపించేది.

కథానిలయం కోసం శ్రీకాకుళం వెళ్ళినప్పుడల్లా అక్కడి ఆత్మీయులైన మనుషుల స్పర్శ తెలిసేది. ప్రసాదు కొడుకు మౌనంగా కనిపించేవాడు. ప్రసాదు సహచరి గురించి తెలిసేది. తనకంటూ ఏమీ లేనివాడు. ఎంత అందమైన మనసు అతనిది. ఆకాశంలా తెరిచిన హృదయం.. ఇరుకు ఇరుకు జీవితాల్లో కుట్రలు, కుతంత్రాలలో నిత్యము మునిగిపోయే వాళ్లు పైకి తెల్ల బట్టలతో అలంకరించుకొని కన్పిస్తారు. శ్రీకాకుళమంత అందమైన వాడు. కనుకనే రాక్షసులు, మనుషులు కానివాళ్లు అతన్ని  బతకనియ్యరు.

che

బహుశా స్పార్టకస్‌ను అందుకే… ఘనత వహించినవారు ఇలాంటి సంస్కారం నేర్పుతే వస్తుందంటారు. అదీ తెలంగాణాలొ పుట్టిందంట. అది మనిషితో పాటే పుట్టింది. స్పార్టకస్‌ను, లెనిన్‌ను, చేగువేరాను, మార్క్సును నేను చూడలేదు. కాని వాళ్లందరూ నాతో పాటు కోట్లాది మనుషులతో ఉన్నారు. ఈ జ్ఞాపకం తుడిచెయ్యగలమా? మహద్భుతమైన మనుషుల కలల్లో మెదిలిన ప్రసాద్‌ను తుడిచెయ్యగలమా?

కోట్లాది మానవులు పుట్టారు, చచ్చారు. కాని కాని.. ఈ వెలుగును కాపాడుతున్నదెవరు? ఈ వెలుగును ఊదేస్తున్నదెవరు? అయితే అంతకంతకు క్రూరమృగాల సంచారం పెరుగుతున్న చోట మనుషులు వాళ్ల ఆత్మ, కలలు జాగ్రత్తగా ఉండాలి.. మరింత తేజోవంతంగా ఉండాలి.. ఏమో? ఇదంతా నీకు తెలుస్తుందా?

 

నీ మిత్రుడు

 

మన కథా ప్రయాణం గురించి…ఒక విహంగ వీక్షణం!

సదస్సు

గమనిక: ” తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం ” అనే అంశం పై  ఆగస్ట్ 2,3-2013 న జరగాల్సిన యు. జి. సి. జాతీయ సదస్సు సమైక్యాంధ్ర -తెలంగాణ ఉద్యమాల ఉద్రిక్త వాతావరణం  వలన ఆగష్టు చివరి వారం/సెప్టెంబర్ మొదటి వారానికి  వాయిదా వేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది సరైన తేదీతో సంప్రదిస్తాం.

– వెల్దండి శ్రీధర్

గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని అనేక అస్తిత్వ ఉద్యమాలు కుదిపేస్తున్నాయి. వర్గం. కులం, జెండర్, మతం, భాష, జాతి, ప్రాంతం… ఇలా వివిధ అస్తిత్వాలు ఎన్నో నూతన పార్శ్వాల్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడంతో పాటు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే మార్కెట్, ఒకే ఆలోచనా స్రవంతిలోకి మార్చాలని చాప కింది నీరులా వస్తోన్న ప్రపంచీకరణ సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్న సమూహాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు తమ అస్తిత్వ అన్వేషణలో తమను తాము పునర్నిర్మించుకుంటున్నాయి .

ఈ కోణంలోనే విభిన్న అస్తిత్వ ఉద్యమాలతో పాటే ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం కూడా బలం పుంజుకుంటోంది. అసలు ప్రపంచీకరణకు విరుగుడు స్థానికత లేదా ప్రాంతీయతనే అనే స్పృహతో గత రెండు దశాబ్దాలుగా మానవ సమాజం జీవిస్తోంది. ఈ దృష్టితోనే అనేక దేశాల్లో వివిధ అస్తిత్వ ఉద్యమాలు తలెత్తుతున్నాయి . ఆఫ్రికాలో వివిధ జాతుల అస్తిత్వ పోరాటాలు, శ్రీలంకలో తమిళుల సంఘర్షణ, సోవియట్ యునియన్ విఛ్ఛిత్తి… ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత దేశంలో ఐతే గ్రీన్ హంట్, టైగర్ ప్రాజెక్ట్ లను, సెజ్ ఉద్యమాలను, ప్రాజెక్ట్ కారిడార్లను ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన సంస్కృతిని,  తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను, భాషను, సంస్కృతిని, రాయలసీమలోని రాతి నిక్షేపాలను, గనులను ధ్వంసం చేయడాన్ని, కొల్లగొట్టడాన్ని ఈ దృష్టితోనే చూడాల్సిఉంది. ఈ అన్ని పరిణామాలను గూగీ, మహాశ్వేతాదేవి, అరుందతీ రాయ్ ల నుండి మన తెలుగు కవులు, రచయితల దాకా అనేకులు తమ కవిత్వంలో, కథల్లో చిత్రించారు.

telanga

“ప్రాంతీయ ముద్ర అంటనిదే ఒక కళా రూపానికి జీవం రాదు. జీవితాన్ని చిత్రించదలుచుకున్నప్పుడు, ప్రజల కష్టసుఖాలు నిజాయితీగా వ్యక్తీకరించ దలుచుకున్నప్పుడు ప్రాంతీయతా భావనల ప్రమేయం లేకుండా సాధ్యం కాదు” అంటారు నందిని సిధారెడ్డి. ఒక ప్రాంతం యొక్క దుఃఖ స్పర్శను ఇతరులు ఎప్పటికీ యథార్థంగా చిత్రించలేరు. ఒకని మృత్యువును మరొకడు ఎత్తుకోనట్లే ఒక ప్రాంతం విశిష్టతను మరో ప్రాంతం  ప్రతిబింబించదు. దేనికదే సాటి. ఏ ప్రాంతం ఇంకో ప్రాంతానికి నమూనా కాదు. దేనికదే ప్రత్యేకమైనది. మనిషి ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లు ఒక ప్రాంతం ఆ ప్రాంతీయుల ఆత్మను ఆవిష్కరిస్తుంది.

ఏ లక్షణాలైతే మనిషిని ఇతర జంతువుల నుంచి వేరు చేసి చూపుతాయో అలాగే కొన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, వేష భాషలు, సుఖ దుఃఖాలు ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో వేరు చేసి చూపుతాయి. ఇదే ప్రాంతీయ  అస్తిత్వం. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అస్తిత్వ “సోయి” తో అనేక కథలు వెలువడ్డాయి. మన అనుభవం, జ్ఞానం ఎప్పుడూ సంపూర్ణం కాదు. శకలాలు మాత్రమే. తెలుగు కథా సాహిత్యంలో అనేక ఖాళీలున్నాయి. వీటిని అర్థం చేసుకోవడం, కథా సాహిత్య విస్తృతిని తరచి చూడడం, శిల్ప మెరుగుదలకు జరిగిన దోహదాన్ని, మొత్తంగా తెలుగు కథా సాహిత్యాన్ని పునరాలోచింపజేయడం లేదా ఒక విద్యాత్మిక సమీక్ష (Academic Review) చేయడం ఈ సదస్సు ఉద్దేశం.

తెలుగు కథపై అభిరుచిని, విజ్ఞానాన్ని కల్గించడం, తెలుగు కథ సమగ్ర రూపాన్ని దర్శింప జేయడం, తెలుగు కథలో ప్రాంతీయ అస్తిత్వాన్ని చర్చించడం, తెలుగు కథ శైలీ శిల్పాలలో తొక్కిన కొత్తదన్నాన్ని శోధించడం, తెలుగు కథ కాల పరిణామం లో సంతరించుకొన్న మార్పును అధ్యయనం  చేయడం, తెలుగు కథా ప్రయాణంలో మనం ఎక్కడున్నాం? ఏం  సాధించాం? ఎలా ముందుకు సాగాలి? చర్చించడం, తెలుగు సాహిత్యం పై అస్తిత్వ స్పృహతో వెలువడిన కథ ఏ  మేరకు ప్రభావాన్ని చూపిందో పరిశీలించడం సదస్సు లక్ష్య్యాలు.

sridhar

               వెల్దండి శ్రీధర్,

జాతీయ సదస్సు సంచాలకులు 

 

ప్రాంతీయత వల్ల కథ విశాలమయింది: కేతు

ketu

కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆగస్ట్  2, 3 తేదీలలో “తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు వర్తమాన తెలుగు కథకి సంబంధించి అనేక కీలకమయిన అంశాలను చర్చకు తీసుకురానున్నది. ఈ సదస్సులో ప్రసిద్ధ విమర్శకులు కేతు విశ్వనాథ రెడ్డి గారు కీలకోపన్యాసం చేయబోతున్నారు. ఈ సందర్భంగా కేతుతో ఈ ముఖాముఖి:

q సాహిత్యంలో ఇప్పుడు కథా యుగం నడుస్తోందనే వాదనను మీరెలా సమర్ధిస్తారు?

సాహిత్యంలో యుగ విభజన వ్యక్తుల పరంగా గానీ, ప్రక్రియల పరంగా గానీ  నాకిష్టం లేని మాట. మీ ప్రశ్నలోని అంతరార్థాన్ని బట్టి చూస్తే కవిత్వం కంటే కథా రచనకు ఆదరణ ఎక్కువైనదనుకోవాలి. లేదా కథా రచన పట్ల, కథా పఠనం పట్ల ఆసక్తి పెరిగిందనుకోవాలి. దీనికి కారణం వచన వ్యాప్తి. కవిత్వంలో ఇమడ్చలేని ప్రజల ఆకాంక్షలను, మానవ సంబంధాలను, అనుభవాలను స్వీయానుభావాన్నుంచి, పరిశీలన నుంచి, జ్ఞానం నుంచి చిత్రించాలనే కథా రచయితల ఆర్తి. వచన వ్యాప్తి అంటున్నామంటే మనం మాట్లాడుకునేది వచనం. బోధనలో వచనం. ప్రసార సాధనాల్లో ఎక్కువగా అందిస్తున్నది వచనం. నిర్ణీత ప్రయోజనాల కోసం మనం వాడేది వచనం. ఇంత వచన వ్యాప్తి వున్నప్పుడు సృజనాత్మక రచయితలు కూడా తమ అభివ్యక్తికి వచనాన్ని ఒక వాహికగా ఎంచుకోవడంలో ఆచ్చర్యం లేదు. అట్లని కవిత్వం వెనకబడినట్లు నా ఉద్దేశం కాదు. కవిత్వ సంకలనాలు చాలా వస్తున్నాయి. కవిత్వ వస్తువు మీద, రూపం మీద శ్రద్ధ వున్న మంచి కవులు మనకు లేకపోలేదు. ఐతే కొత్త కొత్త సామాజిక వర్గాల నుంచి, ప్రాంతాల నుంచి, ఉప ప్రాంతాల నుంచి చదువుకున్న వారి సంఖ్య పెరిగింది. వారిలో కొందరు సృజనాత్మక కల్పనా సాహిత్యం మీదా, ముఖ్యంగా కథల మీద మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.

q సాధారణంగా ఏ వాదమైనా లేక ఉద్యమమైనా మొదట కవిత్వంలో విస్తరించి ఆ తరువాత ఇతర ప్రక్రియల్లోకి వ్యాపించే ఒక భూస్వామిక    లక్షణం తెలుగు సాహిత్యంలో ఉంది.  ఈ కోణంలో ప్రాంతీయ  అస్తిత్వ కథలు వస్తున్న విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఇది భూస్వామిక లక్షణం కాదు. కాక పోతే కవిత్వానికి ఉన్నంత చరిత్ర కవిత్వేతర ప్రక్రియలకు లేదు. ఉద్యమాలకు కవులు తక్షణం స్పందిస్తారు. వారి గాఢమైన ఆవేశ బలం కావచ్చు. కవిత్వ నిర్మాణానికి అవసరమయ్యే స్పందనల చిత్రణ శబ్ద చిత్రాల రూపంలోనో, భావ చిత్రాల రూపంలోనో, భావ శబలత రూపంలోనో అది వ్యక్తం అవుతుంది. ఇతర వచన ప్రక్రియలకు ఇది కొంత ఆలస్యంగా విస్తరిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వ కథల విషయంలో కూడా ఇది వాస్తవం. దీనికి కారణం ఈ అస్తిత్వ కథ లాంటివి తక్షణ స్పందనకు వీలైన నిర్మాణాలు కాదు.

q ప్రాదేశిక నిర్దిష్టతతో తెలుగు కథను ఎట్లా చూడాలి?

తెలుగు సాహిత్యకారులు, విమర్శకులు సాధారణంగా మూడు మాటలు వాడుతుంటారు. అవి స్థానీయత, ప్రాదేశికత, ప్రాంతీయత. స్థానీయత కంటే ప్రాదేశికతకు, ప్రాంతీయతకు మరింత విశాలమైన నేపథ్యం వుంటుంది. ప్రాదేశికత, నిర్దిష్టత అంటున్నప్పుడు ప్రధానమైన ఆరేడు లక్షణాలని మనం దృష్టిలో ఉంచుకొవాలి. 1. ప్రదేశం/ప్రాంతం, భౌతిక జీవితం . అంటే భౌగోళిక స్థితిగతులు, పర్యావరణం, జలవనరులు, అటవీ సంపద, వృక్ష సంపద, ఖనిజ, ఇంధన సంపద, నేల తీరులు, వర్షపాతం, పంటలు, కరువు కాటకాలు, వరదలు వీటి మధ్య ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భేదాలు . 2. సామాజిక శ్రేణులు, (మతం, కులం, ఉపకులాలు, తెగలు)సామాజిక విభజన, సామాజిక వైరుధ్యాలు, అసమానతలు, ఆదిపత్య వర్గాల వైఖరులు, ప్రతిఘటనలు, ఉద్యమాలు. 3. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలు. చలనం, అభివృద్ధి, స్వభావం, పరిశ్రమలు, వ్యవసాయం, వృత్తుల సంక్షోభం, చరిత్ర, ఇటీవలి సామాజిక పరిణామాలు. 4. భాష, అధికార భాష, భాషా భేదాలు, మాండలికాలు, ఉపమాండలికాలు, ఆదివాసి భాషలు, అన్యభాషా వ్యవహర్తలు. 5. మహిళా సమస్యలు. 6. సాంస్కృతిక పరమైన అంశాలు, తిండి తిప్పలు, వేష ధారణ, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, పండగలు, కళా సాహిత్య రూపాలు. 7. ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రవాసం వెళ్ళిన వారి అస్తిత్వ సమస్యలు. ఈ అంశాలు ప్రాదేశిక నిర్దిష్టతను ఎత్తి చూపుతాయి. ఈ దృష్టితో తెలుగు కథల్లో ఏ మేరకు ఆ ప్రతిఫలనం జరిగిందో మనం పరిశీలించవచ్చు.

Kethu Viswanatha Reddy

q ప్రాంతీయ అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో కథలు వెలువడడం ముందడుగా? వెనుకడుగా ?

అస్తిత్వం అనే మాటను మనస్తత్వ శాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రజ్ఞులు , తత్వశాస్త్రజ్ఞులు  నిర్వచిస్తున్న క్రమంలో అస్తిత్వం వ్యక్తి జీవ లక్షణం, జన్యు లక్షణం, జన్యుప్రేరితం, గాయపడిన వ్యక్తి స్వభావం, సామాజిక ప్రాంతీయ సాలిడారిటికి సంకేతం అని కూడా భావిస్తున్నారు. అస్తిత్వం అనే మాటకు ఉనికి, గుర్తింపు అనే అర్థాలున్నాయి. “ఐడెంటిటి” అనే  ఇంగ్లీష్ మాటకు సమానార్థకంగా అస్తిత్వం అనే మాటను విరివిగా ఉపయోగి స్తున్నారు. ఉదాహరణకు దళిత అస్తిత్వం, మైనారిటీ అస్తిత్వం, మహిళల అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం. ఒక భౌగోళిక ప్రాంతం లేదా ఉప ప్రాంతంలోని లేదా భాషా ప్రాంతంలోని ప్రత్యేక లక్షణాలను, భావాలను, విశ్వాసాలను ప్రతిఫలించే నిర్దిష్ట లక్షణాలను ప్రాంతీయ అస్తిత్వంగా స్థూలంగా నిర్వచించవచ్చు. ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో వెలువడుతోన్న కథలు వెనుకడుగు మాత్రం కాదు. అవి  సమాజ అవగాహనకు మునుపటికంటే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. ఒక ప్రాంతం ప్రత్యేక లక్షణాలను ఆ ప్రాంతంలోని వివిధ సామాజిక సముదాయాల అవగాహనను పెంచుతుండడం చూస్తూనేవున్నాం. ఉదాహరణకు తెలుగు ప్రాంతంలోని ఆదివాసీల జీవన సమస్యలు, జీవన వాస్తవికత కథల్లో విరివిగా వెలువడడం ఈ రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అలాగే ముస్లిం జీవితాలైనా, దళిత జీవితాలైనా, మహిళల జీవితాలైనా మైనారిటీల జీవితాలైనా.  ఇది మన సమాజ అవగాహనను తప్పక పెంచేదే కదా. అంతేగాక సమాజంలో సమానత్వాన్ని/సమభావాన్ని, సౌభ్రాతృత్వానికి  ఈ కథల్లోని  సంవేదనలు, స్పందనలు. తోడ్పడుతాయి. ఇది మనిషి చేసుకున్న మానవ సంస్కార పరిణామంలో ఒక దశ. ఒక చిన్న ముందడుగు..

q ప్రాంతీయ అస్తిత్వానికి ఎందుకింత గుర్తింపు లభిస్తోంది?

ఇది అస్తిత్వ చలనాల దశ. తెలుగు మాట్లాడే ప్రాంతంలోని ప్రజా సముదాయాల జీవ లక్షణాలను భావాలను ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవి అనుకున్న సామాన్య లక్షణాలను ఒక్కోసారి నిర్దిష్ట లక్షణాలకు కూడా (స్థానీయ  లక్షణాలు ) రచయితలు స్పందిస్తున్న దశ ఇది. పాఠకులు కానీ, విమర్శకులు కానీ వీటిని గురించి ఆలోచించాల్సిన దశ కూడా ఇదే.

q ప్రాంతీయ అస్తిత్వ కథ వెనుక జాతీయ అంతర్జాతీయ కారణాలు లేదా ప్రభావాలు ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అస్తిత్వ సమస్యలున్నాయి. అమెరికా లో నల్ల జాతీ ప్రజలది అస్తిత్వ సమస్య. బంగ్లాదేశ్ ఏర్పడడానికి భాష ఒక అస్తిత్వంగా ఏ రకంగా పని చేసిందో మనకు తెలుసు. లాటిన్ అమెరికన్,ఆఫ్రికా దేశాల్లోని అస్తిత్వ సమస్యలతో కూడా మన కథా రచయితలకు కొంత మందికైనా అంతో ఇంతో అవగాహన లేకపోలేదు. ఇవి పరోక్ష కారణాలు, ప్రభావాలు ఏవైనా మన రచయితలూ మన వాస్తవికత నుండే కథలను రాస్తున్నారు.

q రాయలసీమలో కవిత్వం కంటే కథే బలంగా వస్తోంది దీనికి ప్రాదేశికతే కారణమా?

ప్రాదేశికత కారణం కాదు. అక్కడి జీవితంలో సామాజిక, రాజకీయ ఉద్యమాలు ఒక రకంగా చాలా చాలా తక్కువే. దీనికి తోడు అక్కడ పద్య ప్రియత్వం ఎక్కువ. అంతకు మించి ఆధునిక వచన కవిత్వానికి అవసరమైన వస్తు రూపాలు చాలా తక్కువ మందికే అబ్బాయి. కవిత్వ విషయంలో సంప్రదాయ విచ్చిత్తి జరగవలసినంత జరగలేదు.

q ప్రాంతీయ అస్తిత్వం అనేది కథా శిల్పానికి ఏమైనా మెరుగులు పెట్టిందా?

ఏ కథకైనా వస్తువెంత ముఖ్యమో, శిల్పమూ  అంతే. ప్రాంతీయ అస్తిత్వం అంటున్నప్పుడు మనం అందులో భాష ఉందనే విషయం మరువరాదు. ఈ భాషా శైలుల విషయంలో రచయిత వాడే కథన శైలి,పాత్రల భాషా శైలుల విషయంలో ప్రాంతీయ  అస్తిత్వాన్ని చిత్రిస్తున్న కథకులు మరింత విశాలం చేశారు.తర్వాత  చాలా కొద్ది మందే కావచ్చు మానసిక ఘర్షణను, మానవ చలనాలను చిత్రించడంలో శ్రద్ధ చూపారు.

q కవిత్వంలో ఆధునికానంతరవాదం వస్తున్నప్పుడు ఆ ప్రభావం కథా సాహిత్యం మీద ఏ మేరకుంది?

కవిత్వంలో ఆధునికానంతరవాద పరిశీలన అఫ్సర్ “ఆధునికత- అత్యాదునికత” ( 1992) వ్యాసాలలోనూ, దానికి తిరుపతిరావు ముందు మాటలోనూ  వారు చేసినట్లు గుర్తు. నిజానికి ఈ వాదానికి సంబంధించిన జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని, మూలగ్రంథాల అనువాదాలు గానీ, స్వంత రచనలు గా గానీ వచ్చిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. కన్నడ విమర్శకులు దీన్ని నవ్యోత్తర వాదం అంటున్నారు. ఇటీవలే అస్తిత్వాలను, అస్తిత్వ చరిత్రను చిత్రించే కథలను ఆధునికానంతర ధోరణి కింద చూస్తున్నారు. నేను కూడా మొన్న మొన్నటి దాకా దళితులు, మైనారిటీలు, బహుజనులు, మహిళలు వీరి శకలీకరణ జీవితాల్ని చిత్రించే కథలు ఆధునికానంతరవాదానికి చెందినవనే అనుకున్నాను. ఇది ఒక రకంగా సిద్ధాంత దృష్టి కాదు. రాజకీయ దృష్టి.

ఆధునికానంతరవాదం అంతః సారాన్ని సర్వ విషయ సాపేక్షతను అంతరంగ చలానాలను చిత్రించడానికి ప్రయత్నించిన   వి. చంద్రశేఖర్ రావు, అఫ్సర్,  మధురాంతకం నరేంద్ర లాంటి రచయితలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇటీవలే ఆధునికానంతరవాదం కంటే భిన్నమైన ఆధునికత, ఆధునీకరణ సాక్ష్యంగా నిలిచే అనుక్షణిక నవీన మోహిని ద్రవాధునికత  (లిక్విడ్ మోడ్రనిజం)-పోలిష్ సామాజిక తత్వవేత్త బౌమన్ ను  పాపినేని శివశంకర్ పరిచయం చేశాడు. చలనం, అస్థిరత లక్ష్యంగా సాగే ఈ ద్రవాధునికత కథా రచనలో ఆధునికోత్తరవాదం లాగే అనే ఒక ఆకర్షణీయమైన గుర్తుగానే మిగులుతుందేమో చూడాలి. వీటి విషయంలో చాలా మందితో పాటు నాదీ పరిమితమైన జ్ఞానమే. ఇది విశాలం చేయడానికి ఆధునికానంతరవాదాన్ని ప్రతిఫలించే కథలను ఒక సంకలనంగా తీసుకురావాల్సిన అవసరమెంతైనా ఉంది. అస్తిత్వ వాదాన్ని తెలుగులో సమూహాల గుర్తింపు వాదంగా వాడుతున్నాం. ఎగ్జిస్టెన్షియలిజం కు సమానంగా వాడుతున్నాం.

జీన్ పాల్ సార్త్రే, మార్షల్ ప్రౌస్ట్ వంటి వారు ప్రతిపాదించిన అస్తిత్వ వాదంలో కీలకాంశం మనిషికి ఇచ్చా శక్తి ఉంది. తానూ చేసే పనులకు తానే బాధ్యుడు. ఐతే- అర్థం పర్థం లేని ప్రపంచంలో. ఏమైనా ఈ రకమైన అస్తిత్వవాదానికి ఆధునికానంతరవాదం ఏ  అంశాల్లో విభేదించిందో తెలిస్తే మనకు మంచిది. తెలుగులో సాహిత్య పరిభాష అభివృద్ధికి ఈ ప్రయత్నాలు మరింత దోహదం చేస్తాయి.

q మిగిలిన భారతీయ భాషల కథలతో పోల్చినపుడు తెలుగు కథా స్థానం ఎక్కడుంది? దీన్ని ఎట్లా చూడాలి?

ఆధునిక భారతీయ భాషల కథల్ని మనం ఆంగ్లం ద్వారానో, తెలుగు ద్వారానో చదువుకుంటున్నాం. కానీ పరిశీలించడానికి తగినంత విస్తారంగా ఈ కథా సాహిత్య సామగ్రి లోటు ఉండనే ఉంది. నేను పరిశీలించినంత వరకు తెలుగు కథ  మెచ్చుకోదగిన స్థాయిలోనే ఉంది- అన్ని మంచివనుకునే ముగ్ధత్వం వదిలిపెడితె. ఏది ఏమైనా తెలుగు కథలు విరివిగా ఇంగ్లీష్ లోకి ఇతర ప్రాంతీయ భాషల్లోకి వెళ్తే ఆ సాహిత్యకారులు ఏమనుకుంటారో కూడా మనం పట్టించుకోవాల్సి ఉంది.

 

                                                                                                        ఇంటర్వ్యూ : వెల్దండి శ్రీధర్ 

 

సాయంత్రపు సరిహద్దు

jaya

 

ఉదయమంత ఆశ

జీవితపు దేశాన్ని వెలిగిస్తూనే వుంటుంది
 అక్షరాల కొమ్మలకు
భావాల నీటిని తాగిస్తూ
వొక కల అతకని చోట…
ఒంటరితనం ఏకాంతమవని పూట
కొన్ని సాయంత్రాలు వొస్తాయి..
నన్నిలా వొదిలేస్తూంటాయి
2.
వదిలేస్తున్నాను… వొదిలొస్తున్నానూ..
అంటూనే వెంట చాలా తెచ్చేశాను
గింజల్లో మొలకెత్తని పచ్చదనాన్నీ
పువ్వుల్లో కనిపించని పళ్ళనీ
మట్టిలో ఆవిరవుతున్న నీటిని
నీటిని దాటిన నివురునీ..
వెంటొచ్చాయనుకుంటునే
నన్నొదిలేశాయి చాలా..
వెలుగునంటుకున్న చీకట్లూ
తోడు జోడవుతున్న ఒంటరితనాలూ
నిలదీయాలనుకున్న నెమ్మది నీడల్లో
ఆటలాడుకుంటున్న ప్రశ్నా పతకాలు
3.
వాటేసుకున్న విరాగాలు
జోల పాడతాయి ఏకాంతానికి
రాత్రంతా నిద్ర మేల్కొంటుంది
మెలకువ కలగంటుంది
ఉదయాన్నే ఊపిరి పీల్చిన ఊహలు
గాలిలో గంధంలా
మొదటి మెలకువతో పాటు
ఊపిరితిత్తుల్లోకి జొరబడతాయి..
భుజాన మోస్తున్న జీవితాన్ని
ప్రేమగా సర్దుకుని
మళ్ళీ మొదలెడతా…
సాయంత్రపు సరిహద్దుకు ఓ నడక..
-జయశ్రీ నాయుడు

యువ కవీ!


మా సూచనలు పట్టించుకోకు, మరిచిపో

నువ్వే మొట్టమొదటి కవిత్వం రాస్తున్నట్టు

లేదా నువ్వే ఆఖరి కవివైనట్టు

నీ సొంత పదాలతో మొదలుపెట్టు

 

మా కవిత్వం చదివే ఉంటావు

మా అహంకారాల కొనసాగింపు కావద్దు నీ కవిత

మా వేదనా గాథల తప్పులు సవరించాలి నీ కవిత

 

నేనెవరిని అని ఎవరినీ అడగకు

మీ అమ్మ ఎవరో నీకు తెలుసు

తండ్రి ఎవరో నువ్వే తెలుసుకో

 

సత్యం ఒక తెల్లకాగితం

దానిమీద కాకి సిరాతో రాయి

సత్యం ఒక అంధకారం

దానిమీద ఎండమావి వెలుగుతో రాయి

 

డేగతో కుస్తీ పట్టాలనుకుంటే

డేగ లాగనే పైపైకి ఎగరక తప్పదు

 

నువ్వొక స్త్రీతో ప్రేమలో పడితే

అంతు చూసే మనిషి

ఆమె కాదు, నువ్వే కావాలి

 butterflies

జీవితం మనం అనుకునేదానికన్న తక్కువ సజీవం

కాని ఆ విషయం ఎక్కువ ఆలోచించొద్దు

ఆలోచిస్తే మన ఉద్వేగాలకు జబ్బు చేస్తుంది

 

 

గులాబి పువ్వు వేపు చాలసేపు తేరిపార చూడు

తుపానులో కదలకుండా నిలబడగలుగుతావు

 

నువ్వూ నాలాంటి వాడివే, కాని నా అగాథం సుస్పష్టం

నీ దారుల రహస్యాలు ఎప్పటికీ ముగియనివి

పైకి ఎగుస్తాయి కిందికి జారుతాయి ఎగుస్తాయి జారుతాయి

 

యవ్వనం అంతం కావడమంటే

పరిణతి చెందిన నైపుణ్యమో వివేకమో అని నువ్వనుకోవచ్చు

అవును, సందేహం లేదు, అది వివేకమే

వేడి చల్లారిన అకవితా వివేకం

 

చేతచిక్కిన వెయ్యి పక్షులు కూడ

వృక్షాన్ని అలంకరించే ఒక్క పక్షికి సమానం కావు

 

కష్టకాలంలో పుట్టిన ఒకే ఒక్క కవిత

సమాధి మీద అందమైన పూలగుత్తి

 

ఉదాహరణలు సులభంగా దొరకవు

నీకు నువ్వే తయారు కావాలి

ప్రతిధ్వనుల సరిహద్దులకావల నువు కానిదీ నువ్వే కావాలి

 

పట్టుదలకూ కాలం చెల్లిపోతుంది, కాకపోతే కాస్త ఎక్కువ కాలం

అందుకే ఉత్సాహాన్ని గుండెల నిండా నింపుకో

నీ దారి చేరడానికి దాని వెంటనే నడువు

 

నువ్వే నేను, నేనే నువ్వు అని

నెచ్చెలితో ఎప్పుడూ చెప్పకు

దాన్ని తిరగేసి చెప్పు

మనిద్దరం బంధనాలలోని నిండు మేఘానికి

అతిథులమని చెప్పు

 

ఎప్పుడూ నలిగిన దారిలో నడవకు

నియమాన్ని తప్పడానికి శక్తినంతా ఉపయోగించు

 

ఒకే మాటలో రెండు నక్షత్రాల్ని గుదిగుచ్చకు

ఎగసే పారవశ్యాన్ని సంపూర్ణం చేయడానికి

అతి ముఖ్యమైన దాని పక్కనే కడగొట్టు దాన్నీ పెట్టు

 

మా సూచనలు కచ్చితమైనవని ఎప్పుడూ అనుకోకు

బిడారుల జాడలు మాత్రమే విశ్వసించు

 

కవి గుండెలలో దిగిన తూటా లాంటిది నీతి

అది ఒక భయానక వివేకం

ఆగ్రహం కలిగినప్పుడు ఎద్దులా బలం తెచ్చుకో

ప్రేమించేటప్పుడు బాదం పువ్వులా మృదువైపో

మూసుకున్న గదిలో ఒంటరిగీతంగా ఉన్నప్పుడు

ఏమీ చేయకు, ఏమీ చేయకు

 

ప్రాచీన కవి అనుభవించిన రాత్రిలా సుదీర్ఘమైన రహదారి

మైదానాలూ పర్వతశ్రేణులూ నదులూ లోయలూ

నీ స్వప్నాలకు అనుగుణంగా నడుస్తాయి

నిన్ను వెంటాడేది ఒక మరుమల్లె పువ్వు కావచ్చు

ప్రాణం తీసే ఉరి కంబమూ కావచ్చు.

 

నీ కర్తవ్యాల గురించి నాకు చింతలేదు

నీ గురించి నా విచారమల్లా

తమ బిడ్డల సమాధుల మీద నాట్యాలు చేసేవాళ్ల గురించి

గాయకుల బొడ్డులో దాగిన రహస్య కెమెరాల గురించి

 

నువ్వు ఇతరుల నుంచి దూరమైపోతేనో

నా నుంచి దూరమైపోతేనో

నాకు విచారం కలగదు

నన్ను అనుకరించనిదేదైనా మరింత అందమైనదే

 

ఇకనుంచి, నిర్లక్ష్యపు భవిష్యత్తే నీ ఏకైక రక్షకురాలు

నువు కొవ్వొత్తి కన్నీళ్లలా విషాదంలో కరిగిపోతున్నప్పుడు

నిన్నెవరు చూస్తారనో

నీ ఆశల వెలుగును ఎవరు కొనసాగిస్తారనో ఆలోచించకు

నీ గురించి నువు ఆలోచించవలసిందొకటే

నా వ్యక్తిత్వమంతా ఇంతేనా అని.

 

ఏ కవితైనా ఎప్పుడూ అసంపూర్ణమే

సీతాకోక చిలుకలు మాత్రమే దాన్ని సమగ్రం చేస్తాయి

 

ప్రేమలో సలహాలుండవు, అది అనుభవం

కవిత్వంలో సలహాలుండవు, అది ప్రతిభ

 

చిట్టచివరికి,

చివరిదే గాని తక్కువదేమీ కాదు

నీకు నా వందనం

 

*

 

యువకుడిగా వున్నప్పుడు దార్వీష్

యువకుడిగా వున్నప్పుడు దార్వీష్

మహమూద్ దర్వీష్ (1941-2008) పాలస్తీనా కవి, పత్రికారచయిత, సామాజిక కార్యకర్త, కమ్యూనిస్టు, జాతి విమోచనోద్యమ నేత, ఇజ్రాయిల్ పాలనలో ఖైదీ, ప్రవాసంలో తన జన్మభూమి మీద పరిశోధనా కేంద్రం నడిపిన సంచాలకుడు, పాలస్తీనా ప్రయోజనాలకోసం నాయకుడు యాసర్ అరాఫత్ ను కూడ ధిక్కరించిన స్వతంత్రజీవి, పునర్నిర్మాణవుతున్న సాయుధ పోరాటాన్ని ఆసక్తిగా గమనించిన వ్యాఖ్యాత. పుట్టుకతో పాలస్తీనీయుడై, పాలస్తీనా దుఃఖాన్నే ఎక్కువగా గానం చేసినప్పటికీ, ఒక్క పాలస్తీనియన్లు మాత్రమే కాదు మొత్తం అరబ్ ప్రపంచమే దర్వీష్ ను తమ ఆత్మీయమిత్రుడిగా, మహాకవిగా భావిస్తుంది. దాదాపు ఐదు దశాబ్దాల సాహిత్య జీవితంలో దర్వీష్ కనీసం ఇరవై కవితా సంపుటాలు, పదిహేను ఇతర రచనల సంపుటాలు ప్రచురించాడు. ముప్పైకి పైగా ప్రపంచ భాషలలోకి అనువాదమయ్యాడు. అరబిక్ నుంచి ఇంగ్లిష్ లోకి పాలస్తీనియన్ – అమెరికన్ కవి, వైద్యుడు ఫాదీ జౌదా అనువదించిన ఈ కవిత పొయెట్రీ పత్రికలో 2010 మార్చ్ సంచికలో అచ్చయింది.

పాలస్తీనా కవిత:  మహమూద్ దర్వీష్

అనువాదం: ఎన్. వేణు గోపాల్


 

చిన్నతనం

swamy1

చిన్నప్పుడు

నేనెప్పుడు పాలు తాగిన్నో  తెలియదు!

పోయే  ప్రాణం నిలిపెటందుకు

ఏ చల్లని  తల్లో అందించిన
మొదటి  అమృతధార –
చెంప మీద గరుకు మరక.

ఏ బొమ్మల్తో ఆడుకున్ననో,
ఏ ఏ ఆటల్ని
లోకమెరుకలేని  మురిపెంతో
నేర్చుకున్ననో గుర్తుకు లేదు.

పగిలిన బొమ్మల ముక్కల్ని

కూలిన గోడలకు దారాల్తో  కట్టి
నాకు నేనే మాట్లాడుకున్న,
ఎడతెరిపిలేని సంభాషణలు –
చినిగిన బట్ట పేలికలతోటి  ఆరబెట్టుకున్న

లోలోపలి ఏడ్పు వానలు.

మూసుకున్న పాత అర్ర
తలుపుల వెనుక

నా ఒంటరితనపు దోస్తులు.

ఎవరెవరిని ముద్దు పెట్టుకున్ననో,

ఎవరెవరితో తన్నులాడుకున్ననో –
చిమ్మచీకటి అలవాటు పడ్డకళ్ళకు

ఎప్పటికీ కాని పరిచయాలు.

నాలో నేనే,
అందరికీ వినబడెటట్టు,
వాడచివర తల్లి లేని కుక్కపిల్ల ఏడుపుతో

రాగం కలిపి పాడిన పాట –
చిన్నతనమంతా అలుముకున్న
చెవులు చిట్లిపొయ్యె  నిశ్శబ్దం.

ఈత నేర్చుకున్న పాతబావి

పచ్చటి నీళ్ళలో జరజర పాకిన

నల్లటి నీరు కట్టెలు –
laxman_aelayచుట్టలు చుట్టుకుంటూ

బుజాలమీద నుండి జారిపోయే

పసితనపు భయాలు.

కలలో,    లోలోపలి కలల్లో

రోజూ కనబడే పగిలిన బొమ్మలు,
సుడులు తిరిగే  గొంతు విరిగిన పాటలు –
వెంటాడుతుంది కందిరీగలా కుట్టే

కనికరం లేని ఒంటరి చిన్నతనం!

పెయింటింగ్ : లక్ష్మణ్ ఏలే

ఆ సాయంత్రం గుర్తుందా?

Muralidhar(1)

కార్తీక మాసం కావోసు. ఆకాశం తొందరగా సూరీడ్ని ఆవలకి పంపేసి, రాతిరి రంగుని పులుమేసుకుంది. తుంటరి పిల్ల తెమ్మెరకు చలికాలం కదా అల్లరెక్కువ, రివ్వున చుట్టేసి గిలిగింతలు పెట్టి పోతోంది. ఊరంతా ఏదో తెరపరిచినట్టు మంచు పైనుండి మెల్లగా కురుస్తూ ఉంది. ఏ చెట్టుని, గట్టుని ముట్టుకున్నా చేతికి చల్లాగా తగిలి జిల్లుమంటుంది.

నీ కోసం ఆ వీధి చివర స్ట్రీట్ లైట్ క్రింద ఎంతసేపో మరి అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. వళ్ళంతా చల్లబడి చిన్న వణుకు మొదలయ్యింది. గుమ్మాల ముందు కార్తీక దీపాలు మిణుకు మిణుకు మంటు చెప్పే కబుర్లేవో వింటూ కూర్చున్నా.

ఆ పరాకులో నేనుండగా అల్లంత దూరంలో నువ్వు, వెన్నెల దేశపు వేగులా, ఆనందలోకపు అందాల దేవతలా నువ్వు. బేల కళ్ళతో బిత్తర చూపులు చూస్తూ, చలిగాలికి ముడుచుకుని మెల్లగా నడిచొస్తున్న నువ్వు. గాలికి ఎగురుతున్న ఆ ముంగురులను ఒక చేత్తో చెవుల వెనక్కి నెట్టేస్తూ, ఒక్కో అడుగును కొలుస్తున్నట్టుగా నేల వైపే చూస్తూ లయబద్దంగా నడిచొస్తున్న నువ్వు. నీకు తెలుసా ఆ క్షణం ఒక కొత్త స్వర్గానికి కొత్త ఇంద్రుడ్ని నేను. అంతటి ఐశ్వర్యాన్ని నీ క్రీగంటి చూపు ఒక్క క్షణంలో సృష్టిస్తే, శాశ్వతమైన నీ తోడెంత అపురూపమో కదా.

చీకట్లో ఒంటరి వీధుల వెంబడి నీతో ఆ గమ్యంలేని నడక, గమ్యం ఎంతటి అసంపూర్ణమో నిర్వచించింది. పెదాలను మౌనంతో కట్టిపడేసి, నీ కళ్ళు పలికిన ఊసులు, భాష ఎంత పిచ్చి ఊహో నేర్పించాయి. నా కళ్ళలోకి నువ్వు సూటిగా చూసిన ఆ చూపు నన్నెంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. చూపులు నేలపై పరిచిన ఎంతోసేపటికి కానీ అ కంగారు తగ్గలేదు.

నా తడబాటు గమనించి చెయ్యి అడ్డు పెట్టుకుని నువ్వు నవ్వుకుంటే, ఎంత సిగ్గనిపించిందో. ఆ కదలికలో నీ భుజం నన్ను తాకిన క్షణం, నీ శరీర సుగంధం నను కమ్మేసిన ఆ క్షణం నాలో కలిగిన ప్రకంపనలను ఏమని చెప్పాలి? నేను చెప్పను. అది మోహావేశం మాత్రమే అనుకునే వాళ్ళకి నేను చెప్పనే చెప్పను.

కాస్త కంగారుగా దూరం తొలగి, నన్ను దాటి ముందు నువ్వు నడుస్తుంటే, కనపడనీయక నువు దాచేసిన సిగ్గుని, ఎర్రబడ్డ నీ మోము పైన ఆ అందాల నవ్వుని నా కళ్ళలో దాచేసుకుంటూ నీ వెంట నడిచాను. ఆ అనుభవాలను రికార్డ్ చేస్తున్న జ్ఞాపకాల పుస్తకాన్ని సరిగ్గా అక్కడే మూసేసి, తాడు కట్టేసాను. ఎందుకంటే నువ్వు తిరిగి వెళ్ళిపోవటం జ్ఞాపకాల్లో నిలుపుకోవాల్సిన విషయమేం కాదుగా.

ఆ సాయంత్రం గుర్తుందా?
నువ్వులేని నా వేల సాయంత్రాల్ని వెలిగిస్తున్న ఆ సాయంత్రం నీకింకా గుర్తుందా?

కళింగాంధ్ర వారసుడు

daalappa1

రెండు జీవిత దృశ్యాల మధ్య పోలిక చూడటం కవిత్వమైతే, వైరుధ్యాన్ని చూడటం కథగా రూపొందుతుంది. కొన్నిసార్లు దు:ఖమయంగానూ, కొన్నిసార్లు హాస్యాస్పదంగానూ ఉండే ఈ వైరుధ్యాల్ని చూసి మౌనంగా ఉండటం కష్టం. అనాదికాలం నుంచీ కథనకుతూహలానికి  ప్రేరణ మొదలయ్యేదిక్కణ్ణుంచే..

ఈ జీవిత వైరుధ్యాలు బహుశా కళిగాంధ్రలో మరీ స్పష్టంగా కనబడతాయేమో. లేదా కళింగాంధ్ర దృక్పథంలోనే ఈ వైరుధ్యాల్ని పసిగట్టే స్వభావం అంతర్లీనంగా ఉందో తెలియదు గానీ, అక్కడ పుట్టిన కథలు కంచికి వెళ్లవు. అవి అక్కడే తచ్చాడుతూ ఉంటాయి. కన్యాశుల్కం చూడండి . సమాజాన్ని కాపాడవలసిన పోలీసు కానిస్టేబుల్ లోకంపోకడ అర్థం కాక తెల్లమొహం వేస్తాడు. లోకం దృష్టిలో ఏగాణీ విలువ చెయ్యని అసిరిగాడు అగ్రవర్ణ సమాజపు టక్కుటమారాలన్నీ అపోశన పట్టినట్టు కనిపిస్తాడు. కనకనే లోకంలో అన్ని చోట్లా కథలు పుడుతూనే వుంటాయి గానీ, ఒక చాసో, ఒక రావిశాస్త్రి, ఒక పతంజలి కళింగాంధ్రలో మాత్రమే పుడతారు. ఇదిగో ఇప్పుడీ కథలది కూడా అదే దారి. చింతకింది  శ్రీనివాసరావు చెబుతున్న ఈ కథలు చోడవరానికి నెల్లిమర్లకీ మధ్యలో కళింగాంధ్ర నడ బొడ్డులో జనం చెప్పుకుంటూ వస్తున్న కథలు. ఈ కథలకి కులం, మతం, వర్గం, వర్ణం లేవు. ఇందులో వాస్తు సిద్ధాంతి పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు మొదలుకొని పాయఖానాలు శుభ్రం చేసే పెంటపాలెం దాలప్ప దాకా అందరూ ఉన్నారు. ఈ కథల్లో కనిపించే జీవితం ఎవరో ఒక సోషియాలజీకి తలుపులు తెరుస్తుంది. మేమంతా గురూజీ అని పిల్చుకునే రవీంద్ర కుమారశర్మ, అదిలాబాద్‌లో చేతివృత్తుల వాళ్ల కోసం అహర్నిశలూ తపించే కళాకారుడు, సంస్కర్త. ఒకసారి నాతో ఒక మాట అన్నారు. ‘మన సమాజంలో రెండు రకాల వ్యవస్థలున్నాయి. ఒకటి కలెక్టర్ల వ్యవస్థ. మరొకటి ప్రజలు తమకోసం తాము స్వయంగా ఖాయం చేసుకుని నడిపే వ్యవస్థ. మొదటిది చూడండి . దానికో బడ్జెట్‌ ఉంటుంది. మందీమార్బలం ఉంటారు. అయినా అది ఏ ఒక్క పని కూడా సక్రమంగా చెయ్యలేదు. ఆ వ్యవస్థకెప్పుడూ మీటింగులతోనే సరిపోతుంది. కాని ప్రజలు నడుపుకునే వ్యవస్థ చూడండి . పండుగల్లో, పురస్కారాల్లో కొన్ని లక్షల మంది జమవుతారు. కొన్ని కోట్ల లావాదేవీలు జరుగుతాయి. కాని ప్రజలు ఏ మీటింగులు పెట్టుకుంటారు? ఏం రూల్స్‌ రాసుకుంటారు? అయినా ఆ సంతలూ, జాతరలూ ఎంత బాగా జరుగుతాయో చూడండి అని ఆయనే ఇంకో మాట కూడా అన్నారు. అలాంటి జాతరల్లో కూడా ఒకటీ రెండు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? ప్రజల వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోకుండా కలెక్టర్ల వ్యవస్థ అడ్డుపడటం వల్ల!

dalapppa

ఈ కథల్లో కనిపించే జీవిత దృశ్యాలు మనకు చెప్తున్నదిదే. బస్టాండులో సీట్లు రిజర్వు చేసే  తాతయ్యలు, ఊళ్లో పసిపిల్లలకు పాలుకుడిపే పాలమ్మలూ చూపించిన మానత్వం పాఠశాలల్లో చదివింది కాదు. చట్టసభల్లో చేర్చించి ఆమోదించిందీ కాదు. కాని జీవితానికి పనికివచ్చే చదువుకి, అనుశాసనానికీ వాళ్లదే ఒరవడి  అవుతుంది. జీవిత వైరుధ్యాల్ని పట్టుకోవడం తోటే ఒక మనిషి కథకుడుగా మారినా, అతడి ప్రయాణం అక్కడతో ఆగిపోదు. వైరుధ్యాల్ని దాటిన ఒక సుందర దృశ్యాన్ని మనతో పంచుకోవాలన్న కవి కూడా ప్రతి కథకుడిలోనూ దాగి ఉండదు. దీనికి కూడా గురజాడదే అడుగుజాడ. చాసో ‘మాత ధర్మం’ కథ చూడండి. అది ఒక అపురూప కావ్య గీతిక. రావిశాస్త్రి కథలన్నిటా ఒక ఆకుపచ్చని పార్శ్వం కనిపిస్తూనే ఉంటుంది. కార్నర్‌ సీటు, మామిడి  చెట్టు. ఎన్ని కథలయినా గుర్తు చేసుకోవచ్చు. చింతకింది శ్రీనివాసరావు కథల్లో కూడా ఆ అమాయకమైన కవిత స్వప్నం కనిపిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

 

వాడ్రేవు చినవీరభద్రుడు

ఆలోచన లోపించిన ప్రతిమ కథ “కంకాళం”

2004 డిసెంబర్ “అరుణతార”లో వి.ప్రతిమ “కంకాళం” అనే కథ రాశారు. ఇది వుత్తమకథగా కూడా ఎన్నికైంది.

మహిళలు రాస్తున్న కథలు అత్తగారి పెత్తనాల్తో, నడుము చూసి సొల్లు కార్చే మగాళ్లతో, పురుషాధిక్యత లాంటి బరువైన పదాల్తో నిండిపోతున్న సందర్భంలో, ఒక మహిళ ఆర్ధిక, రాజకీయ విషయాలపై కథ రాయడం అభినందనీయం. పంచరంగుల ముద్రణామోహానికీ, లక్షల పాఠకులనే గ్లామర్‌కి లోనవ్వకుండా ‘అరుణతార’ లాంటి పత్రికని ఎన్నుకోవడం మరింత మంచి విషయం.

కథ “పో” చెప్పినట్టు అనుభూతి, ఐక్యత పద్ధతిలోనే సాగుతుంది. ఇక్కడ అనుభూతి రాఘవయ్య మరణం పట్ల సానుభూతి. రాఘవయ్య మరణాన్ని నాటకీయం చెయ్యలేదు. కథ కలిగించే అనుభూతిని “మామ్” చెప్పిన నాటకీయ అనుభూతి అనలేం. కథ మొత్తం చెప్పి మీ సమయం వృధా చెయ్యకుండా అవసరం అయిన మేరకే చూద్దాం.

కథలో సంఘటన రాఘవయ్య మరణం. రాఘవయ్య రైతు. పదెకరాల రైతు. మరణానికి కారణం ఏమిటన్న ఆలోచన చేస్తే చెరుకు ఫాక్టరీ మూతపడిపోవడం. రాఘవయ్య డబ్బులు రాకపోవడం.. దానికి కథలో చాలా కారణాలు చెప్తారు.

చంద్రశేఖర్ అనే పాత్ర ఫ్యాక్టరీలో ఒక కెమిస్టు, మాటల్లోంచి చూస్తే పాఠకులకి నిజము అనిపిస్తుంది. బ్రెజిల్ అనే దేశంలో పెట్రోల్‌లో పావలా వాటా “ఇథనాల్” కలుపుతారనీ, ఆ ఇథనాల్ చెరుకునుంచి తీస్తారనీ, అందువల్ల చెరుకు రైతులూ, ఫ్యాక్టరీలూ, పర్యావరణం, దేశమూ అన్నీ బావున్నాయనే అనిపిస్తుంది. అదొక ఆదర్శంగా, ఆచరణీయంగా అనిపిస్తుంది. మన దేశం అలా చెయ్యకుండా మేధావుల్ని బయటిదేశాలకి తోలేస్తోందనీ, చంద్రశేఖర్ ఇచ్చిన ఎన్నో విలువైన సూచనల్ని బుట్టదాఖలు చేశారని చదివి ధర్మాగ్రహము వస్తుంది. మనం కూడా బ్రెజిల్ లాగా రైతుల, రాఘవయ్యల మరణాల్ని ఆపుకోవాలనీ, ఫ్యాక్టరీల్నీ, దానిలోని వుద్యోగుల్నీ కాపాడుకోవాలన్న ఆవేశమూ కలుగుతుంది. కథ ముగుస్తుంది. అక్కడ ఆగి మనం కొంచెం ఆలోచిస్తే..

బ్రెజిల్‌లో భూమి చాలా సారవంతమైనది. అపారమైన నీటి వనరులూ, అమెజాన్ అడవులతో వుండేది. కేవలం చెరుకు కాదు. కాఫీకి ఎప్పటినుందో ప్రసిద్ధం. సోయా, పాలు, మాంసం ఇలా వ్యవసాయాధారిత పరిశ్రమలే ఆ దేశం వెన్నెముక. అయితే ఆ సౌభాగ్యం ప్రజలకి లేదు. అక్కడ భూమి రైతుల చెతుల్లో లేదు. ఎస్టేట్లుగా వున్నది. పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో వున్నది. బిగ్‌లాండ్ బ్రెజిల్ లాంటి ఎన్నో కంపెనీలు అక్కడి భూమిని ఆక్రమించి వున్నాయి. పల్లెల్లోని భూముల్లో 47 శాతం భూములు ఒకే ఒక్క శాతం హౌస్ హోల్డ్స్(House Holds) చేతుల్లో వున్నాయి. సుమారు కోటీ, ఇరవై లక్షల ఇళ్లకి సెంటు భూమి లేదు. ఎనభై శాతం చిన్న రైతుల చేతుల్లో కేవలం 18శాతం భూమి వున్నది. పెద్ద పెద్ద ఎస్టేట్లలో 166 మిలియన్ హెక్టార్ల భూమి వాడకంలో లేకుందా వున్నది. చెరుకు పండించదగ్గ భూమి 320 మిలియన్ హెక్టార్లుంటే అందులో కేవలం 5శాతం మాత్రమే వుపయోగించబడున్నదని నిపుణులు అంచణా వేస్తున్నారు. కారణం   చట్టాలు. ప్రజల వద్ద పెట్టుబడి లేకపోవడం.

ఈ కారణాల వల్ల అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రజల్లోని అసమానతల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో వున్న దేశం బ్రెజిల్. దేశంలోని ధనికులు, జనాభాలో కేవలం పది  శాతం మంది. దేశ సంవత్సరాదాయంలో 48 శాతం తీసుకొంటున్నారు. అట్టడుగువాళ్లు జనాభాలో 20 శాతం మందికి దేశ సంవత్సరాదాయంలో రెండు శాతం మాత్రమే దక్కుతోంది. రెండున్నర కోట్లమంది దారిద్ర్యపు రేఖకంటే ఎంతో అట్టడుగున బతుకుతూ వుంటే ఐదుకోట్లమంది ఒక్క పూటే తిని బతుకుతున్నారు. చెరుకుతోటల్లో కూలీలు కేవలం రెండు డాలర్ల రోజు కూలీ కోసం 15-16 గంటలు పని చేస్తున్నారు. ఇంత సారవంతమైన భూమిలోణూ పండించేది కేవలం వ్యాపార పంటలే. 1990లో బ్రెజిల్ 1 బిలియన్ డాలర్ల విలువైన ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటే 2002 నాటికి అది 10 బిలియన్ల డాలర్లకు ఎగబాకింది. ప్రపంచంలోనే పంచదార వుత్పత్తిలో మొదటి స్థానంలో వున్న బ్రెజిల్‌లో పంచదార వుత్పత్తి చేసేది సహకార మిల్లులూ కాదు. రైతుసంఘాలూ కాదు. కోసాన్(Cosan loD) అనే కంపెనీ “VHP రకం పంచదారని కనిపెట్టింది. ఆ కంపెనీ 12 మిల్లుల్తో, 30 రిఫైనరీల్తో అతి పెద్ద కంపెనీ.  ఇంకా సావో మార్టినో, ఆక్వార్ గునానీలాంటి ఎన్నో కంపెనీలున్నాయి. ఈ ఫాక్టరీల్లో కూలీలకిచ్చే జీతాలు ఒక్క పూట తిండికి చాలవు.

ఇథనాల్ వుత్పత్తిలో అమెరికా తర్వాతి స్థానంలో వున్న బ్రెజిల్‌లో కొయిమెక్స్ అనేది అతి పెద్ద కంపెనీ. ఈ కంపెనీల టర్నోవర్లూ, లాభాలూ చూస్తే మనకి కళ్లు తిరుగుతాయి. ఈ కంపెనీల పుట్టుకా, పెరుగుదలా క్రమంలో వేలాది రాఘవయ్యలు పోయేరు. కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని బానిసలుగా మార్చి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఈ బానిసత్వాన్ని కనిపెట్టి వదిలించడానికి ఒక రకం పోలీసుశాఖ అక్కడ పని చేస్తోంది. ఎన్నో స్వచ్చంద సంస్థలు పని చేస్తున్నాయి. ఆందోళనలు రేగుతూనే వున్నాయి.

బ్రెజిల్  ఒక నూతన సామ్రాజ్యవాద దేశంగా మారిపోయిందనీ, చైనా, ఇండియాల సరసన చేరిందనీ ఎన్వర్  హోక్సా లాంటి వాళ్ల సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ పుస్తకాలు రాశారు. బ్రిక్(BRIC) సంఘణ కాకతాళీయం కాదు. బొలీవియా, మొజాంబిక్, ఇథోపియా దురాశగా నాశనం చేస్తున్నారని శాస్త్రజ్ఞులూ, ఆలోచనాపరులూ గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడి అంటేనే విధ్వంసం, విద్రోహం. ప్రకృతినీ, మానవ శ్రమనీ నిర్లజ్జగా, క్రూరంగా, దురాశగా దోచుకోకుండా పెట్టుబడి ఎలా పెరుగుతుంది? ఇక్కడ ఆగుదాం.

కథలో రెండో కారణం పంచదారని మనం దిగుమతి చేసుకోవడం. పంచదారని మనం OGL కింద దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వుత్పత్తులు ఒక పరస్పరాంగీకారం లేకపోతే, ఇక్కడ మనకి పంట పోయి అవసరం అయినపుడు అడ్డగోలు ధర పెట్టవలసి రావచ్చు. ప్రపంచంలోనే పంచదార వినియోగంలో మనది మొదటి స్థానం. 1995 – 96 నుంచి 2010 – 11 వరకు పదిహేనేళ్ళ కాలంలో 2004 – 05లో (800MT) 2009 – 10 లో (2500MT) రెండేళ్ళు మాత్రమే మనం దిగుమతి చేసుకున్నాం. ఈ కాలంలో మన  దిగుమతులకంటే ఎగుమతులు చాలా చాలా ఎక్కువ. సరే అంకెలు వదిలేస్తే ఈ డిమాండు ఎవరిది? ఎవరికోసం?ఈ కోరిక, పంచదార దిగుమతి చేసుకోకూడదన్నది.  పంచదార మిల్లుల యజమాన్లది. NFCSF అధ్యక్షుడు కల్లప్ప అవడే పంచదారపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 30 శాతం వరకూ పెంచాలంటున్నాడు. దాని కార్యదర్శి వినయ్ కుమార్ మనం పంచదార  దిగుమతి ఆపాలన్నాడు.

ISMAకి చెందిన అవినాష్ వర్మ పంచదార కంట్రోల్ అంటే లెవీ ఎత్తేయమన్నాడు. పంచదార పరిశ్రమ మనదేశ రాజకీయాల్ని శాసించగలంత శక్తిమంతం. శరద్ పవార్ చిన్నకొండ గుర్తే. మొత్తానికి వీళ్లు లెవీ తీయించేసుకోగలిగారు. దిగుమతి కూడా ఆపేస్తే ఇక ఇంత పెద్ద మార్కెట్లో ధరల ఇష్టారాజ్యం చలాయించవచ్చన్న దురాశ వీళ్లది. తమ కష్టాలకి కారణం కూలీవాడని చూపించి చెరుకు నరికే యంత్రాన్ని పట్టుకొచ్చేరు. ఒక్కొక్కటే కోటి రూపాయలు చేసే మిషన్లు. 2011 -12లో 87 వాడారనీ వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం ఏభై కోట్లు సబ్సిడీ ఇచ్చిందనీ, గతేడాది మొత్తం చెరుకులో 8 శాతం నరికిన యంత్రాలపై ఈసారి 25 శాతం నరకాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ కూలీలు రోడ్డున పడుతున్నారనీ నందా కసబే రాశాడు. నిజమే. కూలీవాళ్లనీ, వుద్యోగస్థుల్నీ తీసి పారెయ్యడానికి ఎంత ఖర్చైనా పెడుతుంది ప్రభుత్వం ఇంతకీ ఫాక్టరీ వాళ్లు రాఘవయ్యకు డబ్బులు ఎందుకివ్వలేదు.? చక్కెర కర్మాగారాలు రైతులకీ, కూలీలకీ ఇవ్వవలసిన డబ్బులు వాయిదా వెయ్యడం, ఎగ్గొట్టడం సర్వసామాన్యం. చెరుకే కాదు. వ్యాపారం మీద ఆధారపడ్డ ఏ వ్యవసాయ వుత్పత్తికైనా అదే పరిస్థితి. వరి కావచ్చు. శనగ కావచ్చు. గోగు కావచ్చు. మొక్కజొన్న కావచ్చు. గ్రామాల్లో షావుకార్లూ, రైస్ మిల్లర్లూ వగైరాలూ ఇలాగే పెరిగారు.

పంటల్లో మిగులు ప్రారంభం అయిననాడే పెట్టుబడికి విత్తనాలు పడతాయన్నది ప్రాధమిక సూత్రం. మిగులున్న రైతులు షావుకార్లకి అరువులిస్తారు. అప్పులిస్తారు. ఆ డబ్బుతో సరుకు కొని, దాచి బాకీలు వాయిదా వేసి, ఎగ్గొట్టి, సరుకు ధర పెరిగినప్పుడు లేదా కృత్రిమంగా పెంచి సరుకు అమ్మి లాభాలు తీస్తారు షావుకార్లు. దీన్నే స్పెక్యులేషన్ అని అంటాం. భారతీయ పారిశ్రామిక పెట్టుబడికి మూలం  ఈ స్పెక్యులేషన్ లాభాలే. బొంబాయి, కలకత్తాల్లోణి మార్వారీ, పార్సీ పెట్టుబడిదార్ల చరిత్ర చదివితే స్పెక్యులేషనూ, నల్లమందు వ్యాపారము, వడ్డీ వ్యాపారమూ వాళ్ల మూలాలని తెలుస్తుంది. జె.డి.బిర్లా చరిత్ర దొరుకుతుంది షాపుల్లో.

ఈ విషయం కథలో స్పష్టంగా చెప్పకుండా పంట తగ్గడం, ధర లేకపోవడం, సరుకు పేరుకు పోవడం, ఎం.డీ మారిపోవడం అని ఏవేవో సంబంధం లేని కారణాలు చూపించడం పెట్టుబడిని వెనకేసుకురావడమే.  అర్ధసత్య, అసత్య ప్రకటనే. ఫ్యాక్టరీ దివాళా తీయడానికి కారణం పర్చేసింగ్ ఆఫీసర్లు, మేనేజరూ చేసిన అవినీతి అని చెప్పడం మరో పెట్టుబడిదారీ వ్యూహం.. అమిత ధనార్జన, అత్యంత లాభాలు మాత్రమే ఏకైక నీతిగా, ఆదర్శంగా బతికే పెట్టుబడి అందరికంటే ఎక్కువగా అవినీతి గురించి మాట్లాడుతుంది. అవినీతి ఫలితాలను చిలువలు వలువలుగా  వర్ణిస్తుంది కానీ వాటికి కారకులుగా గుమస్తాలనీ, కానిస్టేబుల్నీ, అర్ధరూపాయి లంచం అడిగిన బంట్రోతునీ చూపించి లైసెన్సు రాజ్యం పోవాలని కేకలు పెడుతుంది. అమెరికా ఎంతో ఎక్కువగా మానవ హక్కులు గురించి మాట్లాడ్డం చూస్తున్నాం. వరి వేసినప్పుడు బావున్నాయనీ, పెళ్ళిళ్ళు, చదువులు చేసాడనీ, శనగ, చెరకు వేసి చెడిపోయాడని రాయడం నిర్ధిష్టంగా కొంత సరైందేమో కానీ సాధారణంగా పూర్తిగా తప్పు. వరి రైతులు కుదేలైపోవడం కొన్ని వేల రచయితలు కథలు కథలుగా రాశారు. వ్యాపారంలోకి వెళ్లాక ఆహారం అని లేదు. వినిమయాన్ని మించిన మిగులుకి వ్యాపార సూత్రాలు వర్తిస్తాయి.

ఇథనాల్ వుత్పత్తి చేస్తే ఫాక్టరీలు బావుంటాయనీ, రైతులకు డబ్బులిచ్చేస్తాయనీ, కొత్త ఇథనాల్ మిల్లులొస్తాయనీ. గ్రామాలు  జవజవాలడతాయనీ రాయడం కేవలం పెట్టుబడికి పనికొచ్చే ప్రచారమే అవుతుంది. నా అంచనాకి కథలోనే దాఖలాలున్నాయి. కథ ప్రారంభంలోనే కర్మాగారం. గత వైభవాన్నీ, వర్తమాన దైన్యాన్నీ ఎంతో మమకారంతో వల్లిస్తారు. బోర్డులో అక్షరాలు రాలిపోవడాన్ని సహానుభూతితో రాస్తూ ఫాక్టరీ మీద జాలి పుట్టించే ప్రయత్నం చేస్తారు. లక్షా ఎనభై వేల టన్నులు గానుగాడిందనీ,  ప్రభుత్వ అవార్డు పొందిందనీ ఫాక్టరీని కీర్తిస్తారు. వుత్పత్తినీ, వుత్పత్తి సాధనాల్నీ ప్రేమించడం, కీర్తించడం పెట్టుబడిదారీ దృక్పథంలో భాగం. పాడైపోయిన రోడ్లనీ, పెరుగుతున్న పిచ్చి మొక్కల్నీ, పాకుతున్న పాముల్నీ వర్ణించిన రచయిత కూలీల, రైతుకూలీల జీవితాల్లోకి తొంగి చూడకపోవడం దృక్పధంలో భాగమే.

వ్యాపారం  లేకపోతే, దెబ్బతింటే వ్యవసాయం చచ్చిపోతుందని చెప్తూ, ఇథనాల్ వ్యాపారం కూడా చెయ్యాలని చెప్పడం, పరాకాష్టగా శీధిల వ్యాపారం స్థావరంలోనే వ్యవసాయాన్ని (రాఘవయ్యని) చంపడం దృక్పధానికి చెందినదే. అయ్యో! ఫాక్టరీ బావుంటే రాఘవయ్య బతుకునే అన్పించేలా కథ రాయడం పెట్టుబడికి ఎత్తిన హారతే.

రాఘవయ్య పదెకరాల (ధనిక) రైతు కావడం యాదృచ్చికం కాదు. ధనిక రైతులు పెటి బూర్జువా దృక్పధంతోనే వుంటారు. పెట్టుబడి తన విశాల ప్రాంగణంలోకి రైతుల్నీ, పెట్టి బూర్జువాల్ని రానిస్తుందని చెప్పొచ్చు. వారి ప్రయోజనాలు, మనుగడా పరస్పరాశ్రితాలు. కానీ కూలీవాణ్ని, మానవశ్రమని తమ పొలిమేరల్లోకి రానియ్యకుండానే గేటు ముందు సాయుధ రక్షకుల్ని కాపలా వుంచుతుంది. అదో అనివార్య, నిరంతర ఘర్షణ.

ప్రభుత్వం చేతకానిదనీ, సీరియస్‌గా లేదనీ రాయడం కూడ ఆ దృక్పధంలోంచి పుట్టిందే. చేతకాని ప్రభుత్వాలు వుండవు. ప్రభుత్వం అంటేనే రాజ్యం. రాజీ పడలేని వర్గ(దోచేవాళ్లూ, దోచబడేవాళ్లూ) వైరుధ్యాల ఫలితంగానే రాజ్యం వుంటుందని ఎంగెల్స్ తన రచనల్లో ఓపికగా స్పష్టం చేశాడు. వర్గసమాజంలో రాజ్యాన్నీ, ప్రభుత్వ రంగ వ్యాపారాన్నీ (సహకార మిల్లులు) గొప్పగా, మంచివిగా చూడ్డం అంతిమంగా పెట్టుబడిదారీకే లాభం. “వర్గ వైరుధ్యాలను అదుపులో వుంచవలసిన అవసరం నుండి రాజ్యం పుట్టింది. రెండు వర్గాల ఘర్షణలోంచి పుట్టింది కాబట్టి అది అప్పటికి ఆర్ధికంగా శక్తివంతమైన వర్గం యొక్క పరికరంగా వుంటుంది” అని ఎంగెల్స్ రాశాడు. చరిత్ర రోజుకొక్కసారి ఈ వాక్యాన్ని రుజువు చేస్తున్నది. దీన్నిగురించి పాఠకుల్లో స్పృహ కలిగించకుండా, సీడీసీ చైర్మన్ రఘునాధరెడ్డి మంచివాడని రాయడం, చక్కెర ఫాక్టరీ ప్రస్తుతం ఎండీ మారిపోతే అంతా బావుంటుంది అని రాయడం . వాళ్ల దోపిడీ, ఆ దోఫిడీ సూత్రాల పట్ల ఎరుక కలిగించే ప్రయత్నం చెయ్యకుండా, మేనేజరు ఆస్తులు పెరిగిపోవడాన్నీ, వాళ్ల అవినీతిని రాయడం కూడా దృక్పధానికి సంబంధించిన విషయమే. అవినీతి విషయమే. కానీ దోపిడీ ఇంకా పెద్ద, ప్రధాన, అసలు విషయం. దృక్పధం ప్రయోజనాన్నీ, ప్రయోజనం వస్తువునే నిర్ణయిస్తుందన్నట్లు ఈ దృక్పధంలోంచి పుట్టిన కథకి సహజంగానే బ్రెజిల్ ఒక వుదాహరణ, ఆదర్శం అయ్యింది. ఇందాక “పో’ గురించి అన్నాను. “పో” అమెరికన్. అమెరికన్ పుట్టుకే పెట్టుబడిలో జరిగింది. వస్తువు శిల్పాన్ని ఎన్నుకుంటుందంటే అదే. దృక్పధానికీ, వస్తువుకీ, శిల్పానికీ సహజ ఐక్యత కథలో కుదిరింది.

దృక్పధం రచయిత వ్యక్తిగత రుగ్మత కాదు. ఏ వ్యవస్థలోని వ్యక్తులూ ఆ దృక్పధంలోనే వుండడం సహజం. ట్రాట్‌స్కీ అన్నట్లు సమాజ స్వభావం రచయిత వర్గ స్వభావాన్ని నిర్దేశిస్తుంది. కొంచెం అధ్యయనం, కొంచెం పరిశీలన, కొంచెం ఆలోచన రచయితల్ని సరైన మార్గంలో పెడతాయి.

నేను చెప్పినవన్నీ మామూలు విషయాలు. పేపర్లో విషయాలు. నాది ప్రాధమిక జ్ఞానం. నాది వానాకాలం చదువు. కానీ కనీసం ఈ చిన్న విషయాలు సంపాదకులు రచయితతో చర్చించి వుంటే పాఠకులకి ఒక మంచి కథ దొరికి వుండేది.

 

 

 

 

 

వీలునామా – 9 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పెగ్గీ ప్రయాణం

పెగ్గీ తన కథ మొదలు పెట్టింది.

***

అమ్మాయిగారూ! అసలు విషయమేంటంటే నేనూ మా అక్క బెస్సీ ఒకళ్ళంటే ఒకళ్ళం ఎంతో ప్రేమగా వుండేవాళ్ళం. బెస్సీ నాకంటే బాగానే పెద్దది. ఎంత పెద్దదో గుర్తు లేదనుకోండి!  నాకు ఆరేళ్ళ వయసులోనే మా అమ్మ పోయింది. బెస్సీ నన్ను తనే తల్లిలా పెంచింది. ఇప్పుడు మీరు చిన్నమ్మాయిగార్ని చేస్తూన్నంత ముద్దు కాకపోయినా, బెస్సీ నన్నూ ఇలాగే ప్రేమగా చూసేది. సౌమ్యంగా, కొంచెం లావుగా వెండేది బెస్సీ. మా పక్కింటి విలియం లౌరీ హై స్కూలు రోజుల్లోనే బెస్సీ అంటే చాలా ఇష్టం పెంచుకున్నాడు. నాన్నకి మేమిద్దరమూ కాక ముగ్గురు కొడుకులున్నా, మా మీదే ఆధారపడి వుండేవాడు. కొంచెం జబ్బు మనిషి కూడా! మా అన్నదమ్ములు ఎందుకూ కొరగాని వాళ్ళు. బెస్సీ నేను కొంచెం పెద్దయ్యే వరకూ నాన్నని తనే కనిపెట్టుకుని వుంది. నేను ఒక చిన్న వుద్యోగం చూస్కున్నాకే విలియంని పెళ్ళాడింది బెస్సీ! పెళ్ళయినా నాన్న వాళ్ళతోటే వుండేవాడు. దాని పెళ్ళయిన మూడేళ్ళకి నాన్న పోయాడు!

బెస్సీకి చక చకా పిల్లలు పుట్టేసారు! అది అయిదోసారి కడుపుతో వుండగా విలియం జబ్బుపడి పోయాడు. బెస్సీ పాపం కుప్పకూలిపోయింది. ఎలాగో తేరుకుని బయటికి వెళ్ళి పని చేసి కుటుంబాన్ని నడిపేది కానీ, విలియం తోడు లేకుండా ఎక్కువ రోజులు బ్రతకలేక పోయింది. దాని పిల్లలు పాపం అనాథలయ్యారు. నన్ను చిన్నప్పుడు సాకింది బెస్సీ. ఇప్పుడు దాని పిల్లల్ని నేను అనాథల్లా వదిలేస్తానా?

విలియం అమ్మా నాన్నలు ఆ పక్కనే ఇంకో పల్లెటూళ్ళో వుండేవాళ్ళు. వాళ్ళూ మాలాగే పేద వాళ్ళు. అయినా నా దగ్గరికి వచ్చి డబ్బు సాయం చేస్తే పిల్లలని తాము చూసుకోగలమన్నారు. అయిదుగురు పిల్లలని సాకేంత డబ్బు నాకెక్కణ్ణించొస్తుంది?

అప్పుడు నేను గ్రీన్ వెల్స్ లో ఒక పెద్ద ఎస్టేటులో పని చేసేదాన్ని. వంటా వార్పూ, పాలు పితకడం, పాడి పనీ అన్నీ చేసేదాన్ని. ఇంతా చేస్తే నా జీతం ఏడాదికి ఏడు పౌండ్లు. దాంతో ఇంత మందిమి ఎలా బ్రతకడం చెప్పండి? ఇంకా పని ఎక్కువైనా పర్వాలేదు కానీ నా జీతం పెంచమని మా అమ్మగార్ని కాళ్ళా వేళ్ళా పడ్డాను. ఇక ఇంతకంటే పని ఎక్కువ చేయలేనని ఆవిడ కోప్పడ్డారు. అయితే జీతం ఇంకొక్క పౌండు పెంచారనుకోండి. అయినా అదేమూలకి?

ఒక రోజు పెరట్లో వంటకోసం ఒక పక్షికి ఈకలు పీకి శుభ్రం చేస్తున్నాను. కింద పాత పేపర్లు వేసాను మురికి కాకుండా. యథాలాపంగా ఆ పేపర్లో చూద్దును కదా, ఒక ప్రకటన! మెల్బోర్న్ లో పని చేయడానికి ఒప్పుకుంటే ఖర్చులు తామే భరించి తీసికెళ్తామని ఎవరో ఇచ్చారా ప్రకటన.

ఇంటి పనీ, వంట పనీ, పాడి పనీ పశువుల పనీ వంటివి తెలిసిన మనిషి దాదాపు పదహారు నించి ఇరవై ఐదు పౌండ్ల వరకూ సంపాదించుకోవచ్చట. ఒక అడ్రసు ఇచ్చి వచ్చి సంప్రదించమన్నారు. ఆ ప్రకటన చూస్తే ప్రాణం లేచొచ్చినంత పనైంది! తప్పక ఆస్ట్రేలియా వెళ్ళిపోదామని ఆ క్షణం లోనే నిశ్చయించుకున్నాను. ఆ పేపర్లో ఇచ్చిన చిరునామాకి వెళ్ళీ ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాను.”

“ప్రయాణం ఎలా అయింది పెగ్గీ?” కుతూహలంగా అడిగింది జేన్.

“వింత ఏంటంటే అమ్మాయిగారూ, నాకు ఆ ప్రయాణం తాలుకు విషయాలు కొంచెం కూడా ఙ్ఞాపకం లేవు. అయితే అయిదు నెలల ప్రయాణం అన్న మాట మాత్రం గుర్తుంది. ఇప్పుడంత సమయం పట్టదు లెండి. వచ్చేటప్పుడు నాలుగు నెలల్లో వచ్చేసాగా? సరే, ఎలాగో మెల్బోర్న్ చేరుకున్నా. చాలా మురికిగా, ఇరుకుగా అనిపించింది. నేననుమానించినట్టే అంతంత జీతాలేం ఇవ్వలేదు. ముందు పదమూడు పౌండ్లిస్తామన్నారు. నాకు ఏడుపొచ్చినంత పనైంది. ఈ మాత్రానికేనా నేను అయిదునెలలు కష్టపడి దేశం కాని దేశం వచ్చింది, అనిపించింది. ఏజెన్సీ లేబర్ ఆఫిసులో బాగా దెబ్బలాడాను. ఎంత కష్టమైన పనైనా చేస్తాననీ, ఎక్కడికైనా వెళ్తాననీ, డబ్బు మాత్రం ఇంకొంచెం కావాలనీ మొత్తుకున్నాను. అప్పుడే ఆ ఆఫీసులోకి ఒక పెద్దమనిషి వచ్చాడు. ఆయన వాలకమూ మాటా చూస్తే ఇంగ్లండు నించే వచ్చినట్టనిపించింది. ఆఫీసరుతో నా పోట్లాట విని,

“అయితే అందరిలానే నీకూ డబ్బాశ ఎక్కువేనన్నమాట,” అన్నాడు వెటకారంగా.

“అయ్యా! ఇంత దూరం వచ్చిందీ కష్టపడి డబ్బు సంపాదించుకోవడానికేగా,” అన్నాను నేను.

“అవునమ్మా! డబ్బు వచ్చేటప్పుడొస్తుంది. అంతలోకే తొందరపడితే ఎలా? రాగానే ధన రాసులు కావాలా ఏం?” కసిరాడాయాన.

“ఇన్ని మాటలెందుకు సారూ! మీకు పనిమనిషి కావాలంటే చెప్పండి,” నేనూ కోపంగానే అన్నాను.

“పనిమనిషా? మాటవరసకి కావాలే అనుకో! నువ్వు సరిపోతావో లేదో నాకెలా తెలుస్తుంది?”

“మీకెందుకు! అమ్మగారికి నన్నొక్కసారి చూపించండి. నా పని తనాన్ని చూసి ఆవిడే నచ్చుకుంటారు.”

“అలాగా? సరే, ఏమేం పనులు చేయగలవో చెప్పు?”

“ఒకటేమిటండీ, ఏదైనా చేయగలను. వంట పనీ, చాకలి పనీ, పాడి పశువుల పనీ, ఇంటిక్కావాల్సిన సమస్తం చాకిరీ చేయగలను.”

“సరే, నీ వయసెంత? మీ అమ్మగారడిగితే చెప్పాలిగా!”

“ఇరవై అయిదేళ్ళు. ఇంతకు క్రితం అయిదేళ్ళూ, అంతకు ముందు మూడేళ్ళూ వేర్వేరు చోట్ల పనిచేసాను. కావాలంటే వాళ్ళందరి దగ్గర్నించీ ఉత్తరాలు కూడా చూపించగలను. పనికీ, ఒంటరితనానికీ, దేనికీ భయపడను.”

“ఏదో పెద్ద రౌడీలాగున్నావే! కొంచెం డబ్బాశ కూడా ఎక్కువేనా ఏమిటి? ఏడాదికి ముప్పై పౌండ్లిస్తానంటే, ఇక్కడికి వందమైళ్ళ దూరంలో వున్న పల్లెలో పని చేస్తావా?”

“సరే నండి! అలాగే చేస్తాను.” ధైర్యంగా ఒప్పుకున్నాను.

“రేఫణ్ణించే లెక్కకట్టి నీకు జీతం ఇస్తాను. ప్రయాణానికి సిధ్ధం కా.”

“అలాగే సారూ! వంద మైళ్ళంటున్నారు. అక్కణ్ణించి ఇంటికి డబ్బు పంపాలంటే ఎలా?”

“అదంతా నేను చూసుకుంటాలే. జీతం ఎక్కువ కదా అని  సంబరపడకు, బోలెడంత చాకిరీ వుంటుంది., అడవుల్లో ఇల్లు, ఆలోచించుకో మళ్ళీ!”

“ఫర్వాలేదు సారూ! ఆ దేవుడి మీదే భారం వేసాను నేను.”

“సరే అయితే!”

ఆయన అక్కడ వున్న ఏజెన్సీ ఆఫీసరుకు చెప్పి ఒప్పందం రాయించాడు. దాని మీద ఆ పెద్దాయన వాల్టర్ బ్రాండన్, నేనూ సంతకాలు చేసాం. మర్నాడే ప్రయాణమయ్యాం. భలే దారిలెండి అదంతా. ఎగుడు దిగుడుగా, మట్టి దిబ్బలతో! మాతో పాటు నలుగురు మగవాళ్ళూ వచ్చారు. అందులో ఇద్దరు కొంచెం తాగుబోతుల్లాగనిపించారు. నేను వాళ్ళకంటే మొరటుదాన్ని కావడంతో నా జోలికి రాలేదు. దాదాపు రెండు వారాలు బండిలో ప్రయాణం చేసి బ్రాండన్ గారి ఇల్లు చేరాము. అయితే ఈ ప్రయాణం నాకంత విసుగనిపించలేదు! ఎందుకంటే ప్రయాణం రోజులకి కూడ లెక్క కట్టి జీతం తీసుకుంటున్నాగా! అందుకు!”

*****************

మేము బ్రాండన్ గారి వూరు, బర్రాగాంగ్ చేరుకునేసరికి శనివారం చీకటిపడింది.  మాలా కాకుండా అయ్యగారు గుర్రబ్బగ్గీలో ప్రయాణం చేసినందువల్ల మాకంటే చాలా ముందు గానే వూరు చేరుకున్నారు.

“పెగ్గీ! ప్రయాణం బాగా జరిగిందా?నెమ్మదిగా సాగింది కదా? నువ్విలాటి ప్రదేశాల్ని ఎప్పుడూ చూసి వుండవు.” ఆదరంగా అన్నారు అయ్యగారు నేను బండి దిగుతూంటే.

“అవునండీ! చాలా నెమ్మదిగా అనిపించింది.”

“అదేమిటి పెగ్గీ! ప్రయణం అంతా ఎండలో కూర్చున్నావా ఏమిటి? నీ మొహం అంతా నల్లగా కమిలిపోయింది. ఇటు వైపు ఎండలు చాలా ప్రమాదకరం. జగ్రత్తగా వుండాలి.”

“మొహం నల్లగా కమిలిపోతేనేం లెండి. చేతులూ కాళ్ళూ సవ్యంగానే వున్నాయిగా! అన్నట్టు, సారూ, అమ్మగారెక్కడా? వంటగదిలోకెళ్ళి చూడనా?”

“నీకొక విషయం చెప్పాలి పెగ్గీ! అసలీ ఇంట్లో అమ్మగారనే పదార్థమే లేదు!” నవ్వుతూ అన్నారయ్యగారు. ఒక క్షణం కోపం ముంచుకొచ్చింది నాకు. ఇదేమైనా నవ్వులాటా?

“ఏమంటున్నారు మీరు? అమ్మగారు లేకపోవడమేంటి?” కోపంగా అన్నాను.

“ఆగాగు! అమ్మగారి ప్రసక్తి తెచ్చింది నువ్వే! గుర్తు తెచ్చుకో! ఇక్కడ ఇంకో ఆడదిక్కు లేదు కాబట్టి, నువ్వే అమ్మగారూ, పనిమనిషీ కూడా!”

నిజం చెప్తున్నా అమ్మాయిగారు. ఆ దేశం కాని దేశంలో, ఎక్కడో మారుమూల ఆడతోడు లేకుండా, ముక్కూ మొహం  మగవాళ్ళ మధ్య వుండాలని తెలిసేసరికి నాకు గుండె జారిపోయింది. చాలా భయం వేసింది.

“అయ్యగారూ! మీరు చేసిన పని మంచిది కాదండీ!” బాధగా అన్నాను.

“నీకేం భయం లేదు పెగ్గీ! నువ్వడిగినంత జీతం ఇస్తాను. ఇక్కడ మాకు నీ అవసరం చాలా వుంది. ఆడదిక్కు లేక మేమంతా మురికిగా, సరైన తిండీ తిప్పలు లేక పడి వున్నాము. ఇప్పటికిప్పుడు పెళ్ళాడాలంటే మాలాటి వాళ్ళకు పిల్లనెవరిస్తారు చెప్పు? నువ్వేం చిన్న పిల్లవు కాదు. నిన్ను నువ్వు బాగా కాపాడుకోగలవు. మిగతా పనివాళ్ళు నీ జోలికి రాకుండా నేనూ చూస్తూనే వుంటాగా? దయచేసి ఈ ఇల్లూ, వంటిల్లూ ఒక కొలిక్కి తెచ్చి నాకింత తిండి వండి పెట్టు. అంతకంటే ఎక్కువ నిన్నేమీ అడగను! కనీసం వారం రోజులు వుండి చూడు. ఆ తర్వాత కూడ నీకు ఇబ్బందిగా భయంగా వుంటే నిన్ను మళ్ళీ మెల్బోర్న్ పంపించేస్తాను, సరేనా?” కాళ్ళా వేళ్ళా పడ్డాడు అయ్యగారు.

భయం భయంగానే ఒప్పుకున్నాను. వారం రోజులు బ్రాండన్ గార్ని గమనించాను. పాపం, ఆయన మంచాయనే, అని తెలిసి వుండిపోవడనికే సిధ్ధపడ్డాను, నా డబ్బాశ ఏదో రోజు నా కొంప ముంచుతుందని తిట్టుకుంటూనే. నిజంగానే ఆ ఇంటికి ఒక ఆడమనిషి చేయి అవసరమనిపించింది కూడా! ఆ మొరటు వెధవల మధ్య నన్ను నేను వెయ్యి కళ్లతో కాపాడుకోవాల్సి వచ్చిందనుకోండి!

బ్రాండన్ గారు మనిషి సౌమ్యుడే, కానీ ఇంటి పని బొత్తిగా చేతకాదాయనకి. చిరిగిపోయిన బట్టలు కుట్టుకోవాలనీ, టేబిల్ మీడ దుప్పటి లాటిది పరచి వుంచాలనీ కూడ తెలియదు.

అసలా ఇంట్లో వంటిల్లే లేదు! టీ తాగే కప్పులు లేక డబ్బాల్లో పోసుకుని టీ తాగే వాళ్ళు. చెంచాలు, ఫోర్కులు, గంటెలు, తువ్వాళ్ళూ, అసలు సామానే లేదు. అక్కడ నేల మీద మురికి చూస్తే మీరైతే వాంతి చేసుకుంటారు.

పక్కనే వుండడానికి నాకొక చిన్న పాక వేయించారు అయ్యగారు. ఒంటరిగా ఆ పాకలో వుండాలన్న ఆలోచనకే గజగజా వణికి పోయాను. అయితే దేవుడి మీద భారం వేసి నా పని నేను చేయాలనుకున్నాను.

ముందుగా వాళ్ళని పోరి నేల మీద చెక్కలు పరిపించాను. కిటికీలకి గాజు తలుపులు పెట్టించాను. ఒక చిన్న వంట పాక వేయించి అందులోకి సామాన్లు కొనిపించాను. మెల్లి మెల్లిగా ఇల్లంతా శుభ్రంగా చేసి పుష్కలంగా పాలూ, పెరుగూ, వెన్నలతో భోజనం ఏర్పాటు చేసాను. మగవాళ్ళంతా మొరటుతనాలు వదిలేసి మంచి జీవితానికలవాటు పడ్డాడు.

జార్జి పావెల్ అనే అతను ఇంటికి కావాల్సిన సామన్లు కొని ఇచ్చేవాడు. ముందు అతను వంటింట్లో వుండే వెన్నా, మీగడలకోసమో, బిస్కట్ల కోసమో వంటింటి చుట్టూ తిరుగుతున్నాడనుకున్నా. కొది రోజులయ్యేసరికి నాకర్థమయింది, అతను వచ్చేది నాకోసమే నని.

వున్నట్టుండి ఒకరోజు వంటింట్లో నాతో మాటాడుతూ ఏదో సణిగాడు. పిచ్చి వేషాలేస్తే అయ్యగారికి చెప్తానని బెదిరించాను.

“అంత కోపమెందుకు! పెగ్గీ, నేను నిన్నేం అవమానించట్లేదు.

నన్ను పెళ్ళాడతావా అని అడిగాను, అంతే.” అన్నాడు మొహం ఎర్రబడుతూండగా.

“అది అయ్యే పని కాదులే. ఇంత మంచి కాంప్లిమెంటు ఇచ్చినందుకు ధన్యవాదాలు కాని, నాకు పెళ్ళి మీద పెద్దగా ఆసక్తి లేదు,” అన్నాను మర్యాదగానే.

“నిజం చెప్పు పెగ్గీ! నేను నచ్చకపోతే ఆ విషయం నిర్భయంగా చెప్పు, అంతే కానీ, పిచ్చి పిచ్చి వంకలు పెట్టొద్దు!”

“నిజమే చెప్తున్నాను. నీమీద అయిష్టమేమీ లేదు నాకు. పెళ్ళాడే పరిస్థితి కాదు నాది, అంతే!”

“నా మాట విను పెగ్గీ! ఒంటరిగా ఇలాటి చోట మగవాళ్ళ మధ్య, భయం వేయడంలేదూ? అదే నన్ను పెళ్ళాడావనుకో, నిన్ను రక్షించే బాధ్యతంతా నేనే తిసుకుంటాను.”

ఆ తర్వాత ఎన్నో సార్లు అడిగాడు జార్జి నన్ను పెళ్ళి చేసుకుందామని. అదేమాట ఇంట్లో పని చేసే ముగ్గురు పశువుల కాపర్లూ, గుర్రాలు చుసుకునే అబ్బయీ కూడా అడిగారు. అందరికీ లేదనే చెప్పాను. అది నాగొప్పేమీ కాదమ్మాయి గారూ! అలాటి చోటికి ఆడది రావడమే మహా భాగ్యం ఆ రోజుల్లో. ఇక అంద చందాల గురించి ఎవరేడ్చారు?

వింత చూడండి! ఆడవాళ్ళకి విలువ వుండే చోటికి ఖర్చుకి బయపడి వాళ్ళని తీసికెళ్ళరు. ఇక్కడ ఇంత మంది ఆడపిల్లలున్నా పెళ్ళాడేందుకు మగవాళ్ళు లేరు. అక్కణ్ణించి రావడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. కాని పిల్లల కొసం వచ్చా, మళ్ళీ వెళ్ళిపోతాలెండి.

ఎక్కడ దాకా చెప్పాను? ఆ, ఇంట్లో పని వాళ్ళని మెల్లిగా నా చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నాను.

కాని అంతలోనే నా పరిస్థితి మారింది.

       ***

(మిగతాది వచ్చే వారం)

ఛానెల్ 24/7- 16 వ భాగం

sujatha photo

(కిందటి వారం తరువాయి)

 

ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన స్నేహితుడు. ఆయన ఇంకోలా ఎలా వుంటాడు.

బాయ్‌ని పిలిచి దక్షిణామూర్తిగారిని లోపలికి తీసుకు రమ్మన్నాడు. తను గబగబ వచ్చేశాడు. ఆయన అందరినీ పలకరిస్తూ స్టూడియో బయటే నిలబడ్డాడు. ఆయనకొసం తను ఆగలేదు. ఇప్పుడాయన చెప్పేవన్నీ తన మనసు తనకు చెబుతున్న విషయాలు. తన గురించి తనకు తెలిసినవీ, తన విజ్ఞత తనను మనిషిగా  ఉండమని హెచ్చ్చరిస్తున్నవే. ఇప్పుడు దక్షిణామూర్తి వస్తాడు అనుకొన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

***

 

“ఇప్పుడు అడుగుతున్నా మేడం.. మీ పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకున్నారో చెప్పండి..”

“నయనా.. నువ్వు ప్రశ్న సరిగ్గా అడుగు. నేను తిన్నగా చెబుతాను. నీ ఆలోచనలోంచి నన్ను చూస్తున్నావు. నా జీవితంలో డిస్ట్రబెన్స్ లేదు. నేనో మార్గం ఎంచుకొని అటు తిన్నగా నడుస్తూ వచ్చాను. ఒక వ్యాపారి తన వ్యాపారం అభివృద్ధి చేసుకొన్నట్లు నాయర్‌తో విడిపోయేసరికి నేను ఎడిటర్‌గా వున్నానని చెప్పానుగా. ఒక పత్రికా నిర్వహణ నా పర్సనల్ లైఫ్‌కి ఎక్కడా టైం కేటాయించనివ్వలేదు. ప్రపంచంకంటే కొన్ని గంటలు ముందుగా నిద్రలేవలసిన ఒక జర్నలిస్ట్ తనని తాను ఎంతగా అప్‌డేట్ చేసుకోవాలో అంతా చేశాను. ఇతర పత్రికలతో పోటీ, నా పత్రిక నిరంతరం సర్కులేషన్ పెంచుకోవటం కోసం నే పడ్డ తపన, నా కేంప్‌లో నేను కలుసుకొనే మనుష్యులు,నా జీవితానికి కేంద్ర బిందువు నా కెరీర్, నేను ఉమెన్ ఎడిటర్‌ని, టాప్‌మోస్ట్ జర్నలిస్ట్‌ని, ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ని. నా ఎడిటోరియల్స్ గురించి నిరంతరం చదువు విశ్రాంతి లేని నా జీవితంలో నాయర్ ఎక్కడో మాయం అయ్యాడు”

“అంటే  కెరీర్, పర్సనల్ లైఫ్‌కి విలువివ్వదా..?”

“మనం ఒక ప్రవాహంలో వున్నాం. ఉదయం నిద్రలేవటం దగ్గరనుంచి ఆఫీస్ ఫోన్స్, బయటనుంచి కలుసుకోవలసిన వీఇపిలు.  పర్సనల్ లైఫ్‌కి ఒక గీత చెరిగిపోయింది. నాయర్‌తో విడిపోయాక నాకింకో పర్సనల్ జీవితం ఏముంది. పాపాయి చదువుకొంటుంది. బాబాయి కుటుంబంతో వుంది. నాకు ఆమె బాధ్యత లేదు. నేను, నాకోసం చరిత్రలో ఒక పేజీ సంపాదించుకోవాలనుకొన్నాను. అది నా లక్ష్యం.”

“వైఫల్యాలు, నష్టాలు. ఏవీ లేవా…?”

“ఓ గాడ్ నీకింకా అర్ధం కావటం లేదు. నాకోసంగా పిల్లలు లేరు. స్నేహితులు, బంధువులు, విహారయాత్రలు ఏవీ లేవు. తెలుసు కదా. మన పత్రిక పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. చానల్ లాంచ్ చేశాం. పొలిటికల్ ఎడిటర్‌ని. నేనెక్కిన మెట్లు ఏవీ మిగల్లేదు. కానీ నాకోసం వెనక్కి తిరిగి చూస్తె ఈ కెరీర్ వదిలేస్తే నేనేం చేయాలో నాకు తెలియదు. వృత్తి తప్ప నాకేం లేదు.”

“ఇందుకు బాధపడుతున్నారా? ఏమైనా నష్టపోయారా..?”

“బాధపడటం లేదు. నన్నెవరన్నా ఇలా వుండాల్సిందే అని నిర్భంధించారా.. లేదే.. నాకై నేను ఎంచుకొని కోరి వరించిన జీవితం. అటు నష్టపోయానో లేదో అర్ధం కాని జీవితం. నన్ను ఓ మీటింగ్‌లో నా జీవితంలో జరిగిన  యదార్ధ హాస్య సంఘటన, మీరు అందరితో కలిసి నవ్వుకొన్న్న సంఘటన గురించి చెప్పమని అడిగారు. హాస్య సంఘటన అలాంటిదేమీ లేదు. మరపురాని సంఘటనలంటే అవార్దులు తీసుకొనే అవకాశాలు తప్ప ఇంకేం లేదు. దాన్ని నేను నిర్వచించలేక పోతున్నాననుకొంటా..”

“అంటే కుటుంబ జీవితం పాపాయితో గడపటం మిస్ అయ్యారా…?”

“ఏమో,  కుటుంబ జీవితం నాకు ప్రత్యేకంగా అందించిన ప్రత్యేకమైన అనుభవాలు  ఏవీ లేవు. అటు నాన్నగారి సమయబద్ధమైన పొలిటికల్ జీవితం. అందులో ఆయన కుటుంబం కోసం కేటాయించినది ఏదీ లేదు. ఇటు నాయర్ కోరుకొన్న జీవితంలో నేను ఎల్లాగూ లేను. ఆయంతో కలసి ఉన్నంతకాలం ఆయన రాజకీయాలకు చెందిన మనిషే. ఆయనకు పర్సనల్ జీవితం ఉంటే ఆయన సొంత బతుకే. తను గొప్ప వ్యక్తిగా ఎదగటం. మరి ఈ మనుష్యులు నాకు నేర్పింది ఇదేనేమో ”

“కెరీరే లక్ష్యం అయితే ఇంకేముండదా మేడం..”

“ఇంకా అంటే బహుశా లేదేమో.. నీకు ఉద్యోగం లక్ష్యం. ఉదయం లేచి తయారై ఆఫెస్‌కు వస్తావు. సాయంత్రం వరకూ గంటకోసారి న్యూస్‌లో కనిపించాలి. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు. ఐదవుతూనే నువ్వు ఇంకో ప్రీ రికార్డెడ్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని. ప్రోగ్రాం కాన్సెప్ట్‌ని బట్టి ఏం కట్టుకోవాలో, ఏ నగలో, ఏ డ్రస్‌లో ఆలోచిస్తావు. నీకు పాప వుంటే దాన్ని గురించి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఆలోచించగలిగేదానివి”

నయన ఆలోచిస్తుంది.

స్వాతి ఆమెను చూస్తోంది.

“నయనా.. ఎప్పటి సంగతో చెబుతున్నా. మా పాపకి పన్నేండేళ్లు వచ్చాయి. మొదట్లో నేను గమనించలేదు కానీ, ప్రతిరోజూ నేను ఇంటికి వచ్చేవరకు మేలుకొని వుండేది. ఒక్కోసారి ఆఫీస్‌కు వచ్చేది. చాంబర్‌లోకి రాకుండా బయటనే కూర్చునేది. రిపోర్టర్స్ రూంలో కూర్చుని వాళ్లతో మాట్లాడేది. నేను నా పనులయ్యాక కలిసేదాని. ఇద్దరం కలిసి కారెక్కేవాళ్లం. దాన్ని దగ్గరకు తీసుకొన్నా నాకు ఏదో ఫోన్, నేనేదో ఆఫీస్‌లో ఎవరితోనో ఏదో చెప్పాల్సిన అవసరం, థర్డ్ ఎడిషన్‌లోనో, లాస్ట్ ఎడిషన్‌లోనో చేయాల్సిన మార్పులు, లాస్ట్ మినిట్స్‌లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏదో ఒకటి నా మనసంతా. పోనీ ఏ మీటింగ్‌కో కలిసి వెళ్ళేవాళ్లం. ఆ మీటింగ్‌లో నేను మొత్తంగా వుండగలను. కానీ పాపాయి పాత్ర ఎంతవరకూ. మొదటిసారి అందరూ పలకరిస్తారు. ఇంకా దగ్గరివాళ్లయితే దగ్గర కూర్చోమంటారు అంటే. నేను తనని ఎంత ఎంగేజ్ చేయగలను” అంది.

“నెమ్మదిగా తర్వాత మానుకొందనుకొంటా” స్వాతి ఆలోచిస్తూ ఊరుకొంది.

తలెత్తి చినంగా నవ్వింది

“ఆమె పెళ్ళి కోసం ముందుగా వారం రోజులున్నాను. ఇంట్లో పెళ్ళయ్యాక తను అమెరికా వెళ్ళే ఏర్పాట్లలో వుంది. తను వెళ్ళేందుకు రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలల్లో రెండు సార్లు తన కోసం వెళ్ళేను. మొత్తం పాపాయి కోసం నేను సంవత్సరంలో నాలుగైదు రోజులు కేటాయించానేమో. ఇంట్లోనే వున్నా పెద్దగా కలిసి లేము. నా పనుల్లో నేను, పాపాయికి నేనేం ఇచ్చాను. తనను కనటం తప్ప”

“ఇప్పుడు అమ్మలా ఆలోచించారు” నవ్వింది నయన.

“అంటే నయనా. మన సొసైటీలో స్త్రీలకు ప్రత్యేకమైన ఫార్మేట్ వుంది. ఆమె ఎలా వుండాలో ఎవరో ఆలోచించి డిజైన్ చేసి ఇచ్చిన ఫార్మెట్. దాన్ని సొసైటీ ఆమోదించింది. ఆమె ఇలా ప్రేమించాలి. ఇలా పెళ్ళాడాలి పిల్లల్ని కనాలి. కుటుంబానికి ఇలా సేవ చేయాలి. ఆమె మనసులో ఈ స్థాయిలో మెల్టింగ్ పాయింట్ వుండాలి. మరి నేను అలా కాకుండా ఇంకోలా వుంటానంటే అతిగా లేదూ. ఈ స్వేచ్చని ఎవరు ఎలా ఆమోదిస్తారు. ఇటు నాయర్‌ కోసం విచారించకా, అటు పాపాయిని సరిగ్గా తల్లి పాత్రలో వుండి చేరదీయకా, స్వాతిలాగా కెరీరిస్ట్‌గా నిలబడ్డానంటే నాకేం విశేషణాలుంటాయి చెప్పు”

నయన తడబడింది. నిజం మాట్లాడితే ఏం బావుంటుంది. తన ఉద్ధేశ్యంలో తన దృష్టిలో ఈవిడ చాలా స్ట్రిక్ట్. ఎండితో కలిసి ప్లాన్ వేస్తే అవతలవాడు మటాష్, తను ఏదైనా కావాలనుకొంటే ఎలాగైనా సాధిస్తుంది. దయాదాక్షిణ్యాలు లేవు. ఇంకా అబ్బో.. ఎవర్నీ ప్రేమించదు. శిఖండి. ఏం మనిషిరా బాబూ అనేవాళ్ళే ఎక్కువమంది. ఎంతదాకా ఎందుకు. తనకే పదిసార్లు హెచ్చరికలు చేసింది. గ్రూప్‌లు కట్టకూడదంటుంది. అతి చనువు కూడదంటుంది. అనవసరమైన రిలేషన్స్ పెంచుకోవద్దంటుంది. బహుశా కళ్లెత్తి చూస్తే ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుంది. నయననే చూస్తున్న స్వాతి నవ్వింది.

“నేను నీ ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ” అన్నది.

నయన కంగారుగా చూసింది.

“ఇంకేం లేదు మేడం” అన్నది.

“ఇంకేమున్నాయో ఆలోచించుకో. నీకు ఇరవై నిముషాలే టైం” అన్నది కుర్చీలో హాయిగా రిలాక్సయిపోతూ.

***

దక్షిణామూర్తిగారు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు. ఫోన్‌లో మాట్లాడూతున్న ఎస్ఆర్‌నాయుడు లేచి ఆయన్ను కూర్చోమన్నట్టు తన ఎదురుగ్గా వున్న చూపించి మర్యాద చేశాడు. ఆఫీస్ మొత్తం బాంబే నుంచి వచ్చిన ఇంటీరియర్ డెకొరేషన్ ఎక్స్‌పర్ట్ డిజైన్ చేశాడు. చాలా అందమైన ఆఫీస్. దక్షిణామూర్తి తన కాబిన్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నాడా లేదా ఆయన మొహం వంక చూస్తున్నాడు ఎస్ఆర్‌నాయుడు. కూర్చుంటూ పై కండువాతో ముఖం తుడుచుకొంటూ ఎదురుగ్గా రాక్స్‌లో వున్న పుస్తకాల వంక చూస్తున్నాడు.

“భోజనం చేద్దాం దక్షిణామూర్తిగారూ” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

దక్షిణామూర్తి తల వూపాడు.

“ఫ్రెష్ అవుతారా?” అన్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“వస్తూ బాత్‌రూంకు వెళ్ళివచ్చా” అన్నాడాయన.

ఆయన ఖద్దరు షర్ట్, జీన్స్ పాంట్ తమాషాగా వుంటుంది. ఆ కాంబినేషన్ పైన ఖద్దరు తువ్వాలు వంటిది మెడచుట్టూ వేసుకొంటాడు. ఎస్ఆర్‌నాయుడు చాలా స్టయిల్‌గా వుంటాడు. చక్కని మడత నలగని షర్టు నలుపు తెలుపులుగా వున్న ఉంగరాల జుట్టు చక్కగా దువ్వుకొని  ఎప్పుడు పడితే అప్పుడు లైవ్‌లో కనిపించటానికి వీలుగా రెడీగా వుంటాడు.

భోజనం వచ్చింది. ట్రేలో వున్న డిష్‌లన్నీ ఒక్కోటి తీసి చూస్తున్నాడు దక్షిణామూర్తి. నాకు సాంబార్ చాలోయ్ అన్నాడు బాయ్‌తో. బటర్ నాన్, పుల్కా కూడా ఉన్నాయి సార్ అన్నాడు బాయ్. వద్దులేవయ్యా రైస్ తింటాను అన్నాడాయన.

“ఎలా వుంది చానల్” అన్నాడు ఎస్ఆర్‌నాయుడుతో.

“చూస్తున్నారుగా సెకండ్ ప్లేస్‌లో. అటూ ఇటూ ఫస్ట ప్లేస్ కూడా”

“అవును చాలా సెన్సేషనల్ చేసావు” అన్నాడు దక్షిణామూర్తి.

తింటున్నది గొంతులో పడ్డట్టు అయింది. సెన్సేషనల్ అంటే ఈయన వెక్కిరింతా పొగడ్తా.

“మొన్న మీ చైర్మన్‌గారు ఎయిర్‌పోర్టులో కలిశారు.  చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయనకు పవర్ ప్రాజెక్ట్ వచ్చిందంటగా. మీ కృషి చాలా వుందన్నాడు.

తింటున్న భోజనం కమ్మగా లేదనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

చైర్మన్ ఆదికేశవులుకి ఎన్నో బిజినెస్‌లు వున్నాయి. ఎన్నో సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఈ చానల్‌లో ఆయనకూ షేర్స్ ఉన్నాయి. నేనూ స్వాతీ డైరెక్టర్స్ . తెలుసు కదా..”

“ఆయన తమ్ముడు శ్రీరంగనాయకులు నేనూ క్లాస్‌మేట్స్”

ఈసారి దగ్గొచ్చింది ఎస్ఆర్‌నాయుడుకు. ఇది తనకు తెలియదు.

“అయితే పెద్దయ్యాక ఎప్పుడూ రిలేషన్స్‌లో లేము. మొన్నమాటల్లో చెప్పుకొన్నాము. శ్రీరంగనాయకులు మినిష్టర్ అయ్యాక నేను కలుసుకొన్నది లేదు. ఇష్యూ బయటికి వచ్చాక నీతో మాట్లాడాలనుకొన్నా.”

ఎస్ఆర్‌నాయుడుకు ఏం మాట్లాడాలో తోచటం లేదు. ఆదికేశవులు కాలేజ్ సంగతి ఎక్కడా బయటకు రాకుండా తనే చూశాడు. గవర్నమెంట్ లాండ్ అది. లీజ్‌కు తీసుకొన్నారు. పర్మిషన్స్ తెచ్చుకోవచ్చునని బిల్డింగ్స్ కట్టేశారు. ఆ స్థలం లీజుకు ఇచ్చినందుకు అప్పటి కమీషనర్‌ను కోటీశ్వరుణ్ణి చేశాడు ఆదికేశవులు. ఆయన ఆస్తులు సగం తన పేరుపైనే ఉన్నాయి. ఈ చానల్‌లో తను పెట్టిన షేర్లు అతను ఇచ్చినవే. వాళ్ల కోసం తను ఏం చేస్తే సరిపోతుంది..?”

“నువ్వు చాలా రిస్క్ తీసుకొంటున్నావు. నీతో మాట్లాడాలనే వచ్చా. ఓన్లీ ఫ్రెండ్లీగా. నువ్వు స్వాతి కలిసి డెయిలీని ఎన్నో ఎడిషన్లు చేశారు. ఆ పెట్టుబడి ఎక్కడిదో నాకు తెలుసు. ఈ చానల్ పెట్టుబడీ నాకు తెలుసు. స్వాతి నాన్నగారు బతికుంటే ఇదంతా జరిగేది కాదు. ఒకప్పుడు ఆ పత్రికకు ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఉండేది. అవ్వాళ్టి పార్టీ లీడర్స్‌కి పదవులు లేవు. ప్రజాసేవ తప్ప. ఆదికేశవులు దాన్ని టేకోవర్ చేశాడని అందరికీ తెలుసు. బయట నువ్వు చాలా బద్నామ్ అవుతున్నావు”

ఇంత చెబుతూ తాపీగా అన్నం తింటున్న మనిషి వైపు తెల్లబోయి చూస్తున్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“పత్రిక, చానల్ అడ్డంపెట్టి ఎన్నింటికి పర్మిషన్ తెచ్చుకొన్నాడో నువ్వెలా డిల్లీ చుట్టూ తిరుగుతున్నావో నీ తోటివాళ్లు ఎంతలా గమనిస్తున్నారో తెలుసా నీకు”

దక్షిణామూర్తి ఏనాడో పాతికేళ్ల గతంలోంచి లేచొచ్చి కూర్చున్నట్టు వుంది ఎస్ఆర్‌నాయుడుకి.

ఇద్దరూ ఎడిటోరియల్‌లో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసేవాళ్లు. ఎడిటోరియల్ రాయటంలో పోటి, రిపోర్టింగ్‌లో పోటీ. కొత్త కొత్త విషయాలు రాయటంలో పోటీ. ఆరోగ్యకరమైన పోటీలో ఇద్దరూ వెలిగిపోతుండేవాళ్లు.

“నాతో శ్రీరంగనాయకులు చెప్పారు. ఒక్క రూపాయి చేతిలోంచి పెట్టకుండా ఎలా సంపాదించారో ఆదికేశవులు చెప్పుకొచ్చాడు. తను మినిష్టరుగా అడ్డమైన లాబీయింగ్‌లతో ఎన్ని కాంట్రాక్టులు, ఎన్నో పర్మిషన్లు ఇప్పిస్తూ వాళ్లందరిచేత ఈ చానల్‌లో పెట్టుబడులు పెట్టించాడో, మొత్తం చానల్స్‌లో టాప్‌లో ఎలా ఉందో చెప్పాడు నాకు. నువ్వు స్వాతి ఎవరెవరికి కొమ్ము కాస్తున్నారో, ఏం స్టోరీలు చేస్తున్నారో, ఎవరిని ఎలా బెదిరిస్తున్నారో, ఇవన్నీ నీకు వాళ్లు తెలిసే చేస్తున్నావా? ఆదికేశవులు బావున్నాడు. వాళ్ల తమ్ముడూ బావున్నాడు. వాళ్ల ఆస్తులు , పిల్లలు అంతా బావున్నారు. మరి నువ్వెలా వున్నావు? ఇదంతా నీకెందుకు నీ అంత మంచి రైటర్ ఎవరున్నారు? నీ పిల్లలు బుద్ధిమంతులు. చక్కగా చదువుకొన్నారు. నీకు కోట్ల ఆస్తులు లేకపోతే ఏం.. ఎందుకిదంతా. ఆదికేశవుల్ని ఎదిరించాడని. ఆ కల్నల్ పర్సనల్ లైఫ్ చానల్‌లోకి లాగి నవ్వుల పాలు చేశావు. ఆయన ఎవరిని చేరదీస్తే నీకెందుకు. ఎదుటివాళ్ల బెడ్‌రూమ్స్‌లోకి తొంగిచూడాలా నువ్వు”

తినటం ఆపి దక్షిణామూర్తి వైపు చూస్తున్నాడు నాయుడు. ఆయనకు ఊహించని దెబ్బ ఇది. దక్షిణామూర్తిని ఎలా తొక్కేయాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు తను. ఉద్యోగం సద్యోగం లేక దిక్కులేక ఉన్నాడనుకొన్నాదు. ఈయన తనకే పాఠాలు చెబుతున్నాడు.

“నీకు నేను చెప్పటం ఏమిటి అని ఆలోచించాను. నేను పత్రిక వదిలేశాక నీకు తెలుసుగా పుస్తకాల ట్రాన్స్‌లేషన్ పెట్టుకొన్నాను. మానవ చరిత్ర పన్నెండు వాల్యూమ్స్ అయ్యాయి. తెలుగు మాండలికాలు తయారయ్యాయి. పిల్లల పుస్తకాలు చాలా చేసాను. ఒక రకంగా ఇదివరకటి కంటే తీరిక లేకుండా వున్నా. మనం చేయవలసిన పనులు ఎన్నో వున్నాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడిలా.. ఇదంతా ఎందుకు? నాకు తోచింది చెప్పాను. వినటం, వినకపోవటం నీ ఇష్టం.” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు వంక చూసి.

ఎస్ఆర్‌నాయుడుకి నోటమాట రాలేదు. పాతికేళ్ళ గతంలోకి నడిచిపోయి దక్షిణామూర్తితో కలిసి రాత్రివేళ లాంగ్ డ్రైవ్ చేయాలనిపించింది. పత్రిక వృద్ధిలోకి రావటం కోసం కొత్త కొత్త ప్రయోగాల కోసం రాత్రిళ్ళు నిద్రపోక  మేలుకొని చేసిన చర్చలు గుర్తొస్తున్నాయి. ఎక్కడో తమ స్నేహం, జీవిత మాధుర్యం చేజారాయి. తను తుఫానులో కొట్టుకుపోయాడు.

“తినలేను” అన్నాడు నీరసంగా తింటున్న ప్లేటు వదిలేసి.

“తిను తిను.. నేను కంపెనీ ఇస్తా. ఇంకా ఫ్రూట్ సలాడ్ వుంది చూశావా?”అన్నాను దక్షిణామూర్తి కప్పు చేతిలోకి తీసుకొని.

ఎందుకో దక్షిణామూర్తిపైన కోపం రాలేదు. తన హోదా తన చానల్. తన గొప్పతనం ఏవీ గుర్తు రాలేదు. తనను నిలదీసే ధైర్యం ఎవ్వరికుంటుంది. తను ఎవ్వరికైనా సమాధానం చెప్పుకోవాలా అంటే తన మనస్సుకే అనుకొన్నాడు. శాంతిగా అనిపించింది. తీరిగ్గా భోజనానికి ఉపక్రమించాడు. రూం చల్లగా వుంది.

 

దక్షిణామూర్తి తాపీగా ఫ్రూట్ సలాడ్ తింటూనే వున్నాడు. చుట్టూ నిశ్శబ్దం కానీ, రూమ్ నిండా గడ్డకట్టుకుపోయిన మాటలున్నాయి.

***

“లాస్ట్ క్వశ్చన్.. ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారు?”

నవ్వింది స్వతి.

“ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వదిలేయాలి. ఇంకా పదేళ్ల తర్వాత వదిలేస్తే మిగతా జీవితం కోసం ఏదైనా ప్రిపేర్ అయ్యే టైం వుండదు. ఇప్పటికే చాలా లేట్”

“ఇప్పుడేం చేయాలి మీరు”

“ఇప్పటిదాకా చేయకుండా వదిలేసినవి, చేత్తో పట్టుకోవాలి. నయనా నేను వారం రోజుల క్రింతం మన ఓల్డేజ్ హోంకి వెళ్లాను. ఈ మధ్య ఆరునెలలుగా అటువైపు వెళ్లలేదు. నాన్న ఉద్యోగం వదిలేక దాదాపు ఎనిమిదేళ్లు.. ఆయన పోయేదాకా అందులోనే వున్నారు. అఫ్‌కోర్స్ల్ దాన్ని, హోంని ఆయనే డెవలప్ చేశారనుకో.. మంచి పుస్తకాల లైబ్రరీ, కామన్ హాలు.. చక్కటి తోటలు.. ఎంత బావుందో తోట  ఇప్పుడు. ఇవన్నీ ఆయన తను ఉండబోతున్నాననే ఇష్టంతో తనకంటే  పెద్దవాళ్ల కోసం, తన తొటివాళ్ల కోసం ప్రేమగా ప్రతి రాయిని చూశారు. నిజంగా హోం ఆయన కొలీగ్స్‌తో నిండివుంది. ఆ వృద్ధాప్యంలో శరీరం ఆయన స్వాధీనంలోంచి పోతున్న సమయంలో కూడా ఎలాంటి జీవితం గడిపారో తెలుసా? అదో మాటల పూలదోట. ఎంతోమంది మేధావులు, చదువుకొన్నవాళ్లు, రచయితలు, పొలిటిషన్స్ అందరూ వృద్ధులే. ఒక తెలివైన వాతావరణం, బాధని నవ్వుకొనే ధైర్యం, మృత్యువుని ఎదుర్కొనే నిర్లిప్తత. నొప్పిని పంచుకొనె ప్రేమ, ఒకళ్ల కోసం ఒకళ్ళున్నామనే ఓదార్పు.. ఓ గాడ్ ఎలా వుండేదో హోం. నేను నాన్న వున్నంతకాలం దాన్నలా ఫీలవలేదు. ఎంతో నిర్లిప్తంగా అదే నా  ఉద్యోగంలా ఎవరెవరు ఏం కావాలని చెప్తారో అవన్నీ కొనుక్కుని, డాక్టర్ విజిట్స్ అటెండవుతూ అందరి ఆరోగ్యం విచారిస్తూ అదొక పని, అందులో నా ఆనందం, హృదయం పెట్టలేదు. ప్రతివాళ్లు ఏదో ఒకటి ఎలాంటి కోరికలు కోరేవాళ్లూ. పేపర్లు, రంగులు. ఒకాయనకి సంగీతం నేర్చుకోవాలనిపించి సంగీతం మేష్టారు, ఒకాయనకి మంత్రాలకు అర్ధం తెలుసుకోవాలని సంస్కృతం వచ్చినాయన సాయం. ఇలాంటివి. ఎవరేనా ముసలాళ్ళు ఇలాంటి కోరికలు కోరతారా? వీళ్లు స్వీట్ సిక్స్‌టీస్ వాళ్లు, నిత్యయవ్వనంతో ఉండేవాళ్లు. ఇది ఇప్పుడు చెబుతున్నా. కానీ అవ్వాళ అది నాకు అంతులేని చాకిరి. వాళ్లందరూ అడిగినవన్నీ నేను నా ట్రెయినీలు, మేనేజర్లు పోయి కొనుక్కురావటం అందరికీ అందాయా లేదా టిక్ పెట్టుకోవటం అదే తెలుసు. కానీ నేను వారం క్రితం  వెళ్లానా? అక్కడ మా చిన్నప్పుడు మాకు వంట చేసి పెట్టిన మా పెంపుడు తల్లి తొంభై ఏళ్ళ ముసలామె నన్ను చూడాలని కోరింది. ఆవిడకు జ్ఞాపకశక్తి పోయింది. నన్ను, నా భర్తని, నా పాపని  చూడాలని అడుగుతోంది. నాకింకా పాతికేళ్ళే అనుకొంటోంది. తీరిగ్గా కూర్చోబెట్టుకొని నా దగ్గర చివరి రోజులు గడపాలని ఉందన్నది. వంటరిగా వుండలేను, పాపా నీతో వచ్చేస్తా. నీ మొగుడు, పిల్లలు వాళ్లతో వుంటానే. అందరూ వెళ్ళిపోయారమ్మా. ఇంతమందిని పెంచాక అందరూ వెళ్లారే. నన్ను ఇలా వదిలేసి వెళ్లిపోతే ఎలా? నన్ను ఇంటికి తీసుకుపో అంటుంది. అందరినీ పిలు  నేను చూస్తాను అంటోంది. ఎవర్ని పిలవాలి? నాతోపాటు ఒకేచోట  ఒకే వంటగదిలో అన్నాలు తిన్న నా స్నేహితులెక్కడ? ఎవరి తల్లిదండ్రులు వాళ్లని పిల్లల్నీ వాళ్లే పెంచలేదు. ప్రజలకోసం పార్టీ కోసం ఎక్కడెక్కడో వాళ్లు వుంటే మేం ద్రాక్ష గుత్తిలో పండుల్లా ఒక్కళ్ళతో ఒక్కళ్ళు ఉన్నాం. ఇప్పుడు పెద్దయ్యాక ఎప్పుడో, ఎక్కడో ఏ పార్టీలోనో, ఏ ఫ్లయిట్‌లోనో కలుస్తుంటారు. ఏరి నా స్నేహితులు? నా పరివారం? నాకేం కావాలో నేనేం చేయాలో నాకు అర్ధం అయింది. నా పెంపుడు తల్లిని నాతో తేలేను. నేనే అక్కడికి వెళ్లిపోతా. నా పాత స్నేహితులను పిలుచుకొంటా. అందరం కలసి మేమంతా కలసి ఈ వయసులొ ఇంకో ప్రపంచం ఏదయినా నిర్మిస్తామేమో చూడాలి. అందరం కెరీర్ కోసం పరుగులు తీశాం. ఇప్పుడెవరు ఎలా వున్నారో, వాళ్లకు కావలసింది దొరికాక వాళ్ల మనసు నిండుగా వుండలేదా.. ఒక్కళ్ళకొకళ్ళం మళ్లీ ఏం కావాలో తేల్చుకోవాలి. నేను ఒక పెద్ద పరయాణం పెట్టుకొన్నాను” అన్నది స్వతి.

మాటల్లో నయన ఎప్పుడో లేచి వచ్చింది. స్వాతి వడిలో తల పెట్టుకొంది. ఆమె చుట్టూ అంతులేని ఎదారి ఉన్నట్లు. ఆమెకు అంతులేని దాహంగా వున్నట్లు, ఆమెకు రెండూ చేతుల నిండా ప్రేమను ఎత్తి ఇవ్వాలన్నట్లు అనిపించింది నయనకు.

స్వాతికి అర్ధం అయింది. నయన జుట్టు సవరిస్తూ..

“కదా నయన.. నాకు చాలా కావాలి. ఎంతో ప్రేమ కావాలి. చాలా పొసెసివ్‌గా ఉండలానిపిస్తోంది నయనా. నా ప్రయాణం కరక్టేనా?” అంది స్వాతి.

“హండ్రెడ్ పర్సంట్ మేడం. మీకోసం ఉద్యానవనాలున్నాయి మేడం. ఎందరమో మీ ఫాన్స్ మీలాగా ఉండాలనుకొన్నాం. మీరే మా అందరి రోల్ మోడల్. మీరంటే మాకెంతో ఇష్టం” అన్నది నయన.

 

***

 

స్వాతి, నయన.. ఎండి చాంబర్‌లోకి వచ్చారు. ఎస్.ఆర్.నాయుడు దీక్షగా ప్రివ్యూ చూస్తున్నాడు. సాయంత్రం టెలికాస్ట్ కాబోతున్న ప్రోగ్రామ్ కం ప్రోమో. శ్రీధర్ నిలబడి చూస్తున్నాడు. హేమమాలిని డాన్స్ బైట్ అప్పటివరకూ చూస్తున్నాడు. కళ్లు మూసుకొని శివార్చనతో వున్న అమె శివుడి గొంతు విని భుజాలు ఒక్కసారి విదిల్చి కళ్లు తెరిచింది. చాలా అందంగా వుంది ఆ బైట్. ఇంకో ప్రఖ్యాత కూచిపూడి నర్తకి స్క్రీన్ పైకి వచ్చారు. ప్రోమో కోసం ఇంట్లో షూట్ చేసినట్లున్నారు. ఆవిడ పాదం కదలికలో ఏదో బరువు తెలుస్తోంది. విశ్వవిఖ్యాత కళకారిణి ఆమె. వయసు దాటాక వచ్చిన చిన్న వణుకు అది పాదాల్లో కూడా తెలుస్తోంది.

“శ్రీధర్ ఈ బైట్ తీసేయ్. ఆవిడ డాన్స్ ప్రోగ్రామ్స్ మాస్టర్ క్యాసెట్స్ మన దగ్గర ఎన్నో వున్నాయి కదా. దాన్లోంచి ఒక చిన్న డాన్స్ తీసుకో. ఆవిడ ఇలా డాన్స్ చేయలేకపోవటం చూపించటం నాకు బాగాలేదు.” అన్నాడు.

“టైం తీసుకొంటుందా?” అన్నాడు మళ్లీ.

“లేదు సర్. ఫైవ్ మినిట్స్ పని. ఇంకా ట్రిమ్మింగ్ చేస్తూనే వున్నారు” అన్నాడు శ్రీధర్.

“ఇప్పుడు ప్రోమో ఇచ్చేద్దాం. తొమ్మిది గంటలకు ప్రోగ్రాం మొదలయ్యే లోపల ప్రతి పది నిమిషాలకు ప్రోమో రన్ చేద్దాం” అన్నాడు మళ్లీ.

తల వూపాడు ఎస్.ఆర్.నాయుడు. ఆయన కళ్లన్నీ హేమమాలిని పైనే వున్నాయి. తన వయసె. ఎంత సిస్టమాటిక్‌గా ఎంత అందంగా ఎలా వుంది ఆమె నృత్యం. కళని ఆరాధిస్తే వచ్చే అవుట్‌పుట్ అది. జీవితం మొత్తంగా నృత్యమే. తనూ జీవితం మొత్తం చేసింది జర్నలిజమే. జర్నలిజమే అంటే విపరీతమైన కాంక్ష. తన ఆలోచన రక్తంలో ఆ కోరిక కలగలసి పోతే ఈ అక్షరాలన్నీ కౌగలించుకోవాలని ఎంత ఆశ. ఆ ఆశకు ఇవ్వాళ్తి రూపం. ఒకప్పుడు తన మనసులో మోగిన పదాలు ఎలాంటివి.. ఎవ్వరివి.. తనలా  ఉండటం కరక్టేనా?

సమ్మెకట్టిన కూలీలు

సమ్మెకట్టిన కూలీ భార్యల బిడ్డల ఆకలి చీకటి చిచ్చుల

హాహాకారం! ఆర్తారావం

ఒక లక్ష నక్షత్రాల మాటలు

ఒక కోటి జలపాతాల పాటలు.

ఇలాంటి అపురూపమైన పదాలు తన మనసుని మోహపరిచేవి. నిద్ర రాకుండా చేసేవి. ఇవే తన జీవితాన్ని వెలిగించాయి. ఈ వృత్తి లేకుండా తను లేదు. ఇవ్వాళ ఆయన మనసు అల్లకల్లోలంగా వుంది.

“ఏంటి సర్ ఆలోచిస్తున్నారు” అన్నది నయన.

ఆయన కళ్లెత్తి చూశాడు. ఎదురుగ్గా స్వాతి. పక్కనే నిలబడింది నయన.

“నువ్వు వెళ్లిపోవాలా స్వాతి?” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

నయన మొహం వికసించింది.

“అదే సర్.. అదే సర్..” అన్నది గొంతులో ఇంకో మాట పెగలక.

స్వాతి ఆయన వైపు నిదానంగా చూసింది.

“ఎన్నాళ్లు పని చేసినా ఇంతే కదా. ఎప్పుడో ఒకప్పుడు సెలవిక అనాలి కదా” అన్నది.

“ఒన్ మినిట్ సర్.. శైలేంద్ర కాల్ చేస్తున్నారు. రికార్డింగ్ ఒకటి మిగిలి వుంది సర్. రవళిగారు వెయిటింగ్..” అంటూనే ఫోన్ తీసి శైలేంద్రగారూ వస్తున్నా అంటూ డోర్ తీసుకొని వెళ్లిపోయింది నయన.

“నా పైన కూడా కోపం వచ్చింది కదూ స్వాతి” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“మీపైన అని ప్రత్యేకం ఎందుకు. నేను చెయనిది మీరు చేశారా? మనం తప్పించుకోగలిగమా, ఈ ప్రవాహానికి ఎదురీదటం ఎవరివల్ల అవుతుంది” అంది నిర్లిప్తంగ అస్వతి.

“ఎదురీడటం స్వార్ధం అయితే ఉండిపోతావా?” అన్నాడాయన.

స్వాతి ఏదో అనబోయింది.

ఫోన్ మోగింది. స్పీకర్ ఆన్ చేసాడు ఎస్.ఆర్.నాయుడు.

“సర్ వైజాగ్ నుంచి రిపోర్టర్ రాజు సర్” అంది పి.ఏ.

“ఏమయ్యా” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“స్కూప్ సర్” అన్నాడు రాజు.

స్వాతి నవ్వింది.

“ఏమిటి?”

“సర్ ప్లీజ్ మీరు మరో విధంగా భావించకపోతే చెబుతాను. ఇది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి సర్” సందేహిస్తున్నాడు రాజు.

ఆయన మొహంలో నవ్వు మాయం అయింది.

“ఏమయింది రాజూ?”

సర్. ఆదికేశవులుగారి రియల్ ఎస్టేట్ కంపెనీ సీఇఓతో పాటు ఇద్దరు బిజినెస్ మేనేజర్స్ ఇక్కడ గెస్ట్ హౌస్ రెయిడ్‌లో దొరికారు సర్” అన్నాడు.

“వాట్” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు ఉలిక్కిపడి.

“సిఇఒ దొరకటం ఏమిటయ్యా . ఆర్ యూ ష్యూర్?”

“సర్ ప్లీజ్. ఒక్క నిముషం ముందే సర్.. ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్నవే సర్. కాకపోతే ఇవ్వాళ్టి రెయిడ్‌లో పట్టుకొన్నారు. ఆయన రిసార్ట్స్‌లో రాత్రి ఏజంట్ల మీట్ జరిగింది సర్. చాల మంది రియల్ ఎస్టెట్ వాళ్లంతా ఇంతే సర్. కొందరు మార్కెటింగ్ మేనేజర్స్ అసిస్టెంట్లుగా అమ్మాయిలు ఉంటారు సర్. కస్టమర్స్‌తో అమ్మాయిలే డీల్ చేస్తారు కదా. లోకేషన్‌కి తీసుకుపోవటం ఆ తర్వాత చాలా వ్యవహారాలు జరుగుతాయి. కస్టమర్స్‌ని ఎట్రాక్ట్ చేయటానికి…” రాజు చెపుతూనే వున్నాడు.

ఎస్.ఆర్.నాయుడుకి చెమటలు పట్టాయి.

తలెత్తి స్వాతి వైపు చూశాడు.

ఆమె  చిరునవ్వు నవ్వింది.

ఒక్కనిముషం తటపటాయించాడు ఎస్.ఆర్.నాయుడు.

“ఫ్లాష్ న్యూస్ ఇచ్చేద్దాం” అన్నాడు స్వాతితో.

“ఆదికేశవులుగారి మెయిన్ బిజినెస్సే ఇది. ఆయన ఒకేసారి ఇద్దరి గొంతు పట్టుకొంటాడు” అన్నది నవ్వుతూ స్వాతి.

“రాజు అంతటా ఇదే జరుగుతుందా?” అన్నాడు ఆసక్తిగా రాజుతో.

“సర్. ఇది ఆస్తులు కొనిపించటం సర్. మంచి యాడ్స్ చూస్తున్నారు కదా సరి. ఒక్కో వెంచర్ ఓపెనింగ్‌కి ఎన్ని లక్షలు ఖర్చుపెడతారు పబ్లిసిటీకి. ఇందులో బంపర్ డ్రాలు, కిలో బంగారాలు, కార్లు ఎలా వస్తున్నాయి సర్. ఇవన్నీ రిసార్ట్స్‌లో జరిగే మెయిన్ బిజినెస్‌లు ఏమిటి సర్. మీరు ఎరగని విషయాలేమీ లేవు సర్. నాచేత చెప్పిస్తున్నారు సర్ మీరు. మనం స్టార్ హోటల్లో రైడింగ్స్ గురించి ఇచ్చినప్పుడు..” రాజు పాత పురాణాలు మొదలుపెట్టాడు.

“సరే.. నువ్వు శ్రీధర్‌తో మాట్లాడు. ఫ్లాష్ ఇచ్చేద్దాం” అన్నాడు.

“సార్..” అన్నాడు అవతలనుంచి రాజు, అతని గొంతులో ఆశ్చర్యం కళ్లకు కట్టినట్టు వినిపిస్తోంది.

టీవీలో పెద్ద స్క్రీన్‌పైన ప్రోమో వస్తోంది. తొమ్మిదిగంటలకు  ఫుల్ ఫుల్ మూన్.. భూమికి దగ్గరలో చంద్రుడు.

ఎస్.ఆర్.నాయుడు చిరరగ్గా ఫోన్ చేశాడు.

“శ్రీధర్ ఫుల్ ఫుల్ మూన్ ఏంటోయ్.. చక్కని తెలుగు పదమే లేదా.. నాన్సెన్స్…”

స్వాతి నవ్వింది.

“తెలుగులోనే మాట్లాడండి” అన్నది.

ఏ భాషలో మాట్లాడినా రేపు మనిద్దరం ఈ చానల్‌లో వుంటామా…” లేకపోతే ఆదికేశవులు డ్రాప్ అవుతాడా…” భుజాలు ఎగరేసింది స్వాతి.

“నేనయితె హోమ్ కే” అన్నది నవ్వుతూ..

***

 

శ్రీకాంత్ అద్దాల్లోంచి క్రిందకు చూస్తున్నాడు. స్ట్రీట్ చివరదాకా వరసగా వేసిన చెట్లనుంచి పసుపు పచ్చని పూలు ఒక్కటొక్కటీ రాలుతున్నాయి. అద్దాల్లోంచి చూస్తుంటే రోడ్డంటా పసుపు పచ్చని తివాసీలా ఉన్నది. అప్పుడే వచ్చిన ఉత్తరం జేబులోంచి తీశాడు. ఇంతకు ముందు చదివిందే. అక్షరం అక్షరానికి గుండె కొట్టుకుంటూనే వుంది.

శ్రీకాంత్ నువ్వంటే నాకెంతో గౌరవం. నీవంటే నమ్మకం. నాకే కాదు ఈ ప్రపంచంలో అందరికీ నమ్మకం. అవ్వాళ నేనొచ్చినప్పుడు మీరు ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. క్రేన్ కెమేరాపైన కూర్చున్నతను మిమ్మల్నెందుకో పైకి వచ్చి ఆ లోకేషన్‌లో ఏదో అబ్జర్వ్ చేయమంటునారు. అతను కిందకు దిగాడు. నువ్వు క్రేన్ పైన ఎక్కావు. క్రేన్ మిమ్మల్ని పైకి తీసుకుపోయింది. చుట్టూ నిలబడ్డ అందరిలో మీ పట్ల ఎంతో ఆరాధన. ఆ రోజు స్ట్రీట్ ప్లే రికార్డ్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అసమానతలు పోవాలనీ, ప్రపంచం శాంతినే కోరుకుంటుందని, అసలు పిల్లలు ఎపుడూ ఎలాంటి యుద్ధాలని చివరకు అమ్మానాన్న పోట్లాడుకోవటం కూడా వాళ్ల మనసుని గాయపరుస్తుందనే అర్ధం వచ్చేలా మీరు యాంకర్‌కి బిట్ బిట్ ఇంట్రడక్షన్ చెబుతున్నారు. కెమేరా ముందుకు ఒక్కో అడుగు వేస్తూ యాంకర్ డైలాగ్ చెబుతోంది. అప్పుడు మీ మొహం చూశాను.  ఏముందా మొహంలో? .. జుట్టు చెదిరిపోయి గడ్డం పెరిగి అతి మామూలు పాంటూ షర్ట్. కానీ మీ మొహంలో నాకు కనిపించింది ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రేమించే కరుణ, మనుష్యులంటే ఇష్టం, దయ, చుట్టూ వున్న వాస్తవాల్ని అర్ధం చేసుకొనే తెలివి. అందరూ శాంతిగా వుండాలంటే నేను సాయం చేస్తానన్న ఆతృత. ఇదంతా చూశాక మీలో .. ఓకే.. మా నాన్న అర్ధం చేసుకొన్నారు. కానీ మా అమ్మకి, అన్నయ్యకి ఎంతో ఆశ్చర్యం. మీ ఉద్యోగంతో నేనేం సుఖపడతాను అంటారు. నాన్న నాకోసం ఎంతో గొప్ప చదువుకొన్న సంబంధం చూశారు. నేను యు.ఎస్‌లో స్థిర పడవచ్చు. కానీ డియర్ శ్రీకాంత్ . మీతో జీవితంలో నాకు శాంతి ఉంటుంది. మీ తెలివితేటలు నాకు సొంతంగా కావాలి. జీవితంలో దేన్నయినా ఇతరులకోసం తృణప్రాయంగా త్యాగం చేయగల మీ మనస్సు, సాహచర్యం నాకు కావాలి. ఎదుటి మనిషి గౌరవం కోసం మీ తాపత్రయం, ఎవరు నొచ్చుకొన్నా మీకొచ్చే కోపం ఇదంతా నాకు ఎంతో ఇష్టం. చాలా త్వరలో నాన్న మీ దగ్గరకు వస్తారు. ఈ సమ్మర్లోనే మన పెళ్లి. పెళ్ళీకి కూడా  ప్రోగ్రామ్స్ అడ్డం వస్తున్నాయంటే మాత్రం నేనూరుకోను.

శ్రీకాంత్ నవ్వుమొహంతో లెటర్ జేబులో పెట్టుకొన్నాడు.

“ఏమిటి అంటోంది” అంటూ వచ్చాడు శ్రీధర్.

“ఏముంది సమ్మర్‌లో పెళ్ళి.. మనం అంటే మేడంకు గ్లామర్..”

శ్రీధర్ నవ్వాడు.

” ఆ గ్లామర్.. పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఏ పూటా వేళకి ఇంటికి రాకుండా ఏ నిముషం మన చేతిలో లేకుండా, పండగా, సరదాలు, పెళ్ళి  పేరంటం దేనికైనా సరే ఉద్యోగం చైనా గోడలా అడ్డంగా నిలబడుతుందని తెలియక పిచ్చిది సరదా పడుతోంది.ఔ

“మా దేవత చూడరాదూ. ఆవిడకి నాతో పోట్లాడటానికి ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్‌లు దొరుకుతాయి. చాలా కొత్త తిట్లు నేర్చుకొంది. ఒకే ఒక్క కోరికరా బాబూ వేళకి ఇంటికి రమ్మని. ఆ ఒక్కటీ అడగొద్దంటాను.”

“పెళ్లయితే మనం బుక్కయిపోతామా” అన్నాడు భయంగా శ్రీకాంత్.

“ఇంకో రకంగా నరుక్కొద్దాం బ్రదర్.. ప్రెస్.. ఈ ఐదక్షరాలకే ఈ దేశంలో కాస్త గ్లామరుందా? పోలీసులు ఆపరా, సినిమా టిక్కెట్లు, దేవుడి దర్శనాలు, గెస్ట్‌హౌస్ బుకింగ్‌లు, అడపాదడపా నమస్కారాలు, సెలబ్రిటీల ఫంక్షన్లు, ఫుల్ జోష్ భయ్యా.. నువ్వేం గాబరా అవకు. నే మంత్రం చెబుతాగా?” అన్నాడు శ్రీధర్.

“శ్రీధర్‌గారూ ఎక్కడున్నారు. వైజాగ్ రాజు ఫ్లాష్ ఇస్తున్నాడు ఇటు రండి సర్..” పిసీఅర్ నుంచి ఫోన్‌లో మొత్తుకొన్నాడు కంప్యూటర్ ఆపరేటర్.

“నిజంగా చావొచ్చినా ఆ యముణ్ణి ఫైవ్ మినిట్స్ ఆగమనాలిరా మగడా.. వస్తున్నా..” క్రిందకు పరుగెత్తాడు శ్రీధర్.

జేబులోంచి మళ్లీ ఉత్తరం తీసి పట్టుకొన్నాడు శ్రీకాంత్.

డియర్ శ్రీకాంత్…

 

 

– సమాప్తం –

పాడని పాట

kurma

మేరి భీగి భీగిసి , పల్కోన్ పే రెహ్గయీ

జైసే మేరే సప్నే బిఖర్ కె

కిశోర్ కుమార్ పాడుతున్నాడు గొప్పగా, ముక్కలైపోయిన సుందర స్వప్నం గురించి. శోకంలో తడిసిన హృదయం కారుస్తున్న కన్నీళ్లు అతడి గొంతులోంచి పాటలా అనువాదం అవుతున్నాయి.

 జలే మన్ తెరాభీ, కిసీ కె మిలాన్ కొ

అనామికా, తు భీ తర్సే

తుఝే బిన్ జానే, బిన్ పెహ్ చానే

మైనే హృదయ్ సే లాగాయా

 గుర్తుచేస్తున్నాడు, తననెట్లా ప్రేమించిందీ. ఎంత గొప్పగా ఊహించుకున్నదీ.

కానీ నేను వింటున్నది అది కాదు. కిశోర్ కుమార్ గొంతులో పలికిస్తున్న వేదనని పలికించడానికి హీరో తంటాలు పడుతున్నాడు. నేను చూస్తున్నది అదికాదు. ఆయన పాటకి విలవిలా కొట్టుకుంటున్న కథానాయికని చూస్తున్నాను. బాణం గుండెల్ని నిలువునా చీలిస్తే అమాంతం విరుచుకు పడిపోయిన లేడిలా వుంది ఆమె. తప్పు చేసిన దానిలాగానో, అపరాధభావం కుంగదేస్తుంటే నోట మాట రానిదైన లాగానో ఆమె అతడిని తప్పించుకో చూస్తోంది.

కానీ, అతడు వెంట పడుతున్నాడు. దొరికింది ఇక నలుగురిలో, ముక్కలు ముక్కలు చేద్దామన్నట్టు వున్నాయతడి చూపులు. గుర్తు చేసి మరీ కొడుతున్నాడు. లేడి ఇంకా ప్రాణాలతోనే వుండగా చర్మాన్ని కొంచెం చీరి, కొంచెం వుప్పు కారం వేసి చూస్తున్నట్టు చూస్తున్నాడు.

నాకు హిందీ పూర్తిగా రాదు. కానీ కిశోర్ కుమార్ మీద అభిమానం తో ఈ పాటని వందల సార్లు చూసివుంటాను. నాకు తెలిసిన పదాల అర్ధాలతో కిశోర్ పాటకి అర్ధాన్ని వెతుక్కున్నాను. భాషది ఏముంది. కిశోర్ శోకాన్ని, వేదనని పలికిస్తుంటే ఇక ఆ భాష రాకపోతే ఏం? కవి హృదయాన్ని మాత్రమే కాదు, పాత్ర హృదయాన్ని పూర్తిగా ఆవాహన చేసుకుని కిశోర్ పాడుతున్నాడు.

 

పర్ మేరే ప్యార్ కె బద్లేమే తూనే

ముఝ్కో యే దీన్ దిఖ్ లాయా

 

కానీ, నా ప్రేమకు బదులుగా నువ్వేమిచ్చేవు. ఎడబాటు. నరకం, అని సాధిస్తున్నాడు. ఇక తప్పించుకోలేవు నువ్వు. ఇంతమందిలో, ఈ వేడుకలో నువ్వు నాకు అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తావు, అంటున్నట్టు నిలదీస్తున్నాడు.

 

ఆడదానితో స్నేహం నిప్పుతో సావాసం లాటిది

ఈ విషయాన్ని నేను ఎందుకు అర్ధం చేసుకోలేకపోయాను?

నాకేమైంది అసలు. ఒక విశ్వాస ఘాతుకురాలితో

ఎందుకు పడ్డాను ప్రేమలో……

అంటూ, ఆమెను చూపుల, పదాల పిడిబాకులతో గుచ్చుతూ వున్నాడు. ఆమె పారిపోలేక, కాళ్ళు పాతాళంలో పాతుకుపోయినట్టయి ఒక పల్చటి పరదా వెనుక దాగుంటుంది. ఛిద్రమైన గుండెని బయటికి కనిపించనీయకుండా అన్నట్టు కొంగుని భుజాలమీద నుంచి తీసి వడిసి పట్టుకుంది. కత్తులవాన నుంచి, శాపాల వెల్లువనుంచి ఆ పరదా కాపాడలేదని తనకి తెలుసు. కానీ, ఈ పెను వరదలోంచి ఆ చిన్న గడ్డిపోచ కాపాడక పోదా అని కావచ్చు. లేకపోతే, కొంచెం కనికరించి కొన్ని శూలాల్ని వదలకుండా వుంటాడని, కొన్ని ఆరోపణల్ని చేయకుండా వదిలేస్తాడని ఆమె ఆశ.

కానీ, ఆ కథానాయకుడికి జాలి లేదు. మనిషి లాగా కనిపించడం లేదు. ఆ గడ్డిపోచని కూడా కసితో లాగేసి, కొరికి నమిలేసి ఇలా అంటున్నాడు, ఆమెను హేళన చేస్తూ.

….తేరీ బేవాఫాయిపే, హసే జగ్ సారా

గలిగలీ గుజరే జీధార్సే

జలే మన్ తేరా

(నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని చూసి లోకం నవ్వుతోంది

ఇక, నువ్వెళ్లే చోటల్లా అది వింటావు

నీ హృదయం కూడా మండుతుంది, అవి విని)

తన ప్రేమకు ప్రతిగా ప్రేమనందించనందుకు నిందిస్తున్నాడు. శాపనార్ధాలు పెడుతున్నాడు. ఇక ఈ శిలువ వేసుకుని ఇక నీ జీవితమంతా తిరగాల్సిందేనని, లోకం తీర్పు కూడా ఇదేనని ప్రకటించేస్తున్నాడు. నేలదిగిన చూపుల్తో ఆమె ఏమైనా చెప్తామనుకుంటున్నట్టు చూస్తోంది. బెరుకు కళ్ళతో భయాన్నో, అశక్తతనో ప్రకటిస్తూ వుంటుంది. అసహాయారాల్నని అందామనుకుంటుంది. (లేదా, నాకు అలా అర్ధమయ్యింది.)

తన నిర్ణయం వెనుక ఏదైనా కారణం వుంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు అతడు. వున్న ఆయుధాలన్నీ గుక్కతిప్పుకోకుండా వదులుతున్నాడు. గురితప్పకుండా, కళ్లలోకి చూసి పాడుతున్నాడు.

నేరారోపణా తానే చేసి, విచారణా తనేచేసి, తీర్పూ తానే ప్రకటించి, శిక్షనూ తానే అమలుపరుస్తున్నాడు. పాట అయిపోయింది. పాట’ అయితే అయిపోయింది కానీ, ఆ పాట దెబ్బకి ఆమె అపరాధభావంతోనో లేకపోతే అవమాన భారంతోనో చితికిపోయింది. ఆమె బహుశా ఆమె వున్నచోటనే కుంగి పోయివుంటుంది. బహుశా ఎన్నటికీ చెప్పలేని వేదనను కంటి రెప్పలవెనుక దాచుకుని వున్నది. ఆ మానసిక పరిస్థితిని ఆ నటి గొప్పగా అనువదించి చూపిస్తోంది.

పాట ముగియగానే చప్పట్లు కొట్టారంతా, అన్నిటికీ తమ మద్దతు వుందన్నట్టుగా — నీ బాధ సబబైంది, తన విశ్వాసఘాతుకం నిజమే, నీ తీర్పూ సహేతుకమే అన్నట్టు.

ఇప్పటికి ఈ పాటని వందల సార్లు విని వుంటాను. లేదా చూసి వుంటాను. మిగతా అన్ని పాటల్లాగా కేవలం కిశోర్ కుమార్ కోసమేనా? కాదేమో.

***

     అకారణంగా నేను కాదన్నపుడు, కనీసం మాట్లాడడానికి నిరాకరించినపుడు, లేదా సమయం లేదన్నపుడు  తను కూడా అప్పుడు ఇలాగే మదనపడి వుంటుందా? వేటగాడి దెబ్బకు దొరికిపోయిన లేడిలాగా తల్లడిల్లిపోయి వుంటుందా? ఏదో వత్తిడితోనే తప్ప, నీకు ద్రోహం తలపెట్టే వుద్దేశం లేదని చెప్దామనుకుంటుందా? ఆరోపణా నేనే చేసి, విచారణా నేనే చేసి, తీర్పు నేనే ఇచ్చేసి వుంటానా?

ఇది జరిగిన ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఏళ్ళు గడుస్తాయి జీవితంలో భారంగానూ, సులభంగానూ. కానీ ఆ తోవల వెంబడి గుచ్చుకున్న ముళ్ళు కొన్ని సలుపుతూ వుంటాయి ఎన్నటికీ. ఆ తలపుల బరువు మౌనంగా మోస్తూనే వుండాలి ఎవరైనా. మోసేవాళ్ళకి తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు.

ఇక ఎవరి తోవలు వాళ్ళు చూసుకున్నాక, తన సంగతి చెప్పాను విష్ణుకి. “అసలు ఈ విషయం తేల్చకముందే చూశావా ఎలా చేసిందో,” అని. సాధ్యమైనంత సానుభూతిని సంపాదించుకునే ప్రయత్నం నాకు స్పష్టం కనిపిస్తూనే వుంది. కానీ విష్ణు కొట్టిపడేసింది.

“అమ్మాయిల పరిస్థితి నీకెపుడు అర్ధం కావాలి? ఎన్ని వత్తిళ్ళు ఎంతలా పనిచేస్తాయో నీకేం తెలుస్తుంది. నువ్వే అంటున్నావు కదా కొద్దిపాటి పరిచయమేనని. నీకు చెప్పే అవతలి వాళ్ళతో మాట్లాడి వుండాల్సిందని ఎందుకు అనుకున్నావు” అన్నది, నాకు అసలు benefit of doubt అస్సలే ఇవ్వకుండా.

“అసలు సంభాషణే పూర్తిగా మొదలు కాలేదంటున్నావు. ఎలా అనుకున్నావు నువ్వు తను నీకు అన్నీ చెప్పే చేయాలని,” అని అంది.

ఆ మాటలతో గూబగుయ్యి మన్నట్టయింది. కూడబెట్టుకున్న self-pity కుప్పకూలిపోయింది రెండు క్షణాల్లో. ఆ రోజు విష్ణు అంత కటువుగా చెప్పి వుండకపోతే ఆ self-pity బరువుకింద ఏనాడో అణిగిపోయి వుండేవాడిని. ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడే, తన వైపు నుంచి.

ఇప్పుడు ఇలా ఇన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అనిపిస్తుంది, ఎంత తక్కువగా ఆలోచించానా అపుడు, అని.

***

   బహుశా అప్పటినుంచే ఈ పాటలోని హీరో వంకర సంభాషణలు చికాకు పెట్టడం మొదలుపెట్టాయి నాకు. ఆ రోత  మాటలు నేనే అన్నట్టు, నేనే నిలదీసి కుంగదీసినట్టు అనిపించేది. ఇక ఆరోజంతా సోంపకుండా అయిపోయేది.

ఈ పాటలో కధానాయికలాగా, మౌనంగా ఎవరికీ అర్ధం కాని, వినబడని పాట ఏదో తను పాడి వుంటుందా? నేను వినడానికి నిరాకరించి వుంటానా? ఇక, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వినబడని పాటేదో వెంటాడుతోంది. బహుశా, వెంటాడుతుందేమో ఎన్నటికీ — మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా తనని కలిసి ఒక కరచాలనం చేసి కడిగేసుకునేవరకూ. లేదా కళ్ళతోనే చెప్పుకునే వరకూ.

(ఎన్ ఆర్ అనుభవం విని)

–కూర్మనాథ్

 

 

 

 

 

అగ్నిని జయించిన….వాళ్లు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చతురంబోధిపరీత భూవలయమున్ సద్వీప సారణ్య స

క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచున్

గ్రతువుల్ నూరొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా

హితుడై యా నహుషుండు దా బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్

                                                            -నన్నయ

                (శ్రీమదాంధ్రమహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం) 

( నాలుగు సముద్రాలూ చుట్టుకున్న భూమండలాన్ని ద్వీప, అరణ్య, భూభాగాలతో సహా తన గొప్పదైన భుజశక్తితో పాలిస్తూ నూరు యాగాలు చేసి, తన కీర్తి దిగంతాలకు వ్యాపించగా శత్రువులందరినీ జయించిన ఆ నహుషుడు ఇంద్రపదవిని పొందాడు)

 అక్కథకుడు శౌనకాది మహామునులకు చెప్పాడు…అటువంటి నహుషునికి ప్రియంవద అనే ఆమె వల్ల యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువులనే ఆరుగురు కొడుకులు కలిగారు. వారిలో యయాతి రాజై అనేక యాగాలు చేశాడు. శుక్రుని పుత్రిక అయిన దేవయాని వల్ల అతనికి యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ట వల్ల దృహ్యుడు, అనుడు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. శుక్రుని శాపంతో వృద్ధాప్యభారం మీదపడగా కొడుకుల నందరినీ పిలిచి అన్నాడు…

***

“—and so-and-so took as a wife so-and-so, and begat…and begat…and  begat…”

ఆ వృద్ధ గాథికుని కథనం వింటున్న హెలీకి బైబిల్ శైలి గుర్తొచ్చింది. కుంటా కింటే ముస్లిం మతస్థుడు. అతని నుంచి ఏడో తరానికి చెందిన హేలీ దగ్గరికి వచ్చేసరికి  ఒంటి రంగు, కారు నలుపు నుంచి గోధుమవర్ణానికి మారిపోవడమే కాదు, మతమూ మారిపోయింది. హెలీకి బైబిల్ ఒక్కటే తెలుసు. మహాభారతంతో అతనికి పరిచయం ఉండుంటే  గాథికుని కథనం మహాభారత శైలిలా ఉందని కూడా అనుకుని ఉండేవాడు. అంతేకాదు, మౌఖిక సంప్రదాయానికి చెందిన ప్రపంచ పురాణ కథకులందరూ తమ వీరపురుషుల గాథలనూ, వంశచరిత్రలనూ, కుల పురాణాలనూ ఈ శైలిలోనే చెప్పుకుని ఉండచ్చన్న సంగతి అతనికి స్ఫురించి ఉండేది.

గాథికుడు కింటే వంశ వివరాలు చెప్పుకుంటూ వెడుతున్నాడు. నాటి ముఖ్యమైన కొన్ని ఘటనల ద్వారా సంవత్సరాలను, తేదీలను సూచిస్తున్నాడు. ఉదాహరణకు, అప్పుడు “భారీగా వరదలు వచ్చాయి”… “అతను ఓ దున్నపోతును వధించాడు”…

గాథికుడు చెప్పిన కింటే వంశ వివరాలను సంగ్రహీకరిస్తే…

కింటే వంశం ఓల్డ్ మాలి అనే దేశంలో మొదలైంది. వారు వృత్తిరీత్యా కమ్మరులు. “అగ్నిని జయించినవాళ్లు”. కింటే తెగలోని ఆడవాళ్లు కుమ్మరిపనీ, నేతపనీ చేసేవారు. కింటే వంశంలోని ఒక శాఖ మారెటేనియా అనే మరో దేశానికి తరలిపోయింది. అక్కడినుంచి ఆ వంశస్థులలో ఒకడైన కైరాబా కుంటా కింటే అనే ముస్లిం గాంబియాకు వలసపోయాడు. మొదట పకాలి ఎన్డిగ్ అనే గ్రామంలో కొద్ది కాలం ఉండి  ఆ తర్వాత జఫరాంగ్ అనే ఊరికి, అక్కడినుంచి జఫూరుకు మారాడు. అక్కడ సిరేంగ్ అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి జానే, సలౌమ్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఆ తర్వాత అయిసా అనే అమ్మాయిని రెండో భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒమొరో అనే కొడుకు పుట్టాడు.

తర్వాత కొంత కాలానికి కైరాబా పెద్ద కొడుకులిద్దరూ ‘కింటా కుండా జానేయా’ అనే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడికి  వెళ్ళిపోయారు. ఒమొరో జఫూరులోనే ఉండిపోయాడు. తనకు “ముప్పై వర్షాలు” వచ్చిన తర్వాత బిట్టా కెబ్బా అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కెబ్బా వల్ల అతనికి ఉజ్జాయింపుగా 1750-1760 మధ్య కాలంలో నలుగురు కొడుకులు పుట్టారు: కుంటా, లామిన్, సువాడు, మాది…

అప్పటికి వృద్ధ గాథికుడు తన కథనం మొదలుపెట్టి రెండుగంటలయింది. తను పేర్కొన్న వ్యక్తుల గురించి మధ్య మధ్య వివరాలు అందిస్తూ కథనం కొనసాగిస్తున్నాడు. అలాగే, ఒమొరో నలుగురు కొడుకుల గురించిన వివరాలను చెప్పడం ప్రారంభించాడు. దుబాషీ వాటిని అనువదిస్తున్నాడు-

“రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో”… “ఆ నలుగురు కొడుకుల్లోనూ పెద్దకొడుకు కుంటా కలప నరికి తెచ్చుకోడానికి ఊళ్ళోంచి అడవికి వెళ్ళాడు…అతను మళ్ళీ కనిపించలేదు…” గాథికుడు చెప్పుకుంటూ పోతున్నాడు.

తను చెక్కిన శిలలా కూర్చుండిపోయాననీ, తనలో రక్తం గడ్డకట్టుకుపోయినట్టు అనిపించిందనీ హేలీ అంటాడు. తన జీవితమంతా ఈ మారుమూల ఆఫ్రికన్ గ్రామంలో గడిపిన ఈ పెద్దమనిషి; టెన్నెస్సీ లోని తమ హెన్నింగ్ ఇంటి వసారాలో తను అమ్మమ్మ నోట చిన్నప్పుడు విన్న సంగతులే చెబుతున్నాడు! ఆ అప్రతిభస్థితిలోనే ఎలాగో బ్యాగు లోంచి ఒక నోటుబుక్కు తీశాడు. దాని మొదటి పేజీలలో అమ్మమ్మ చెప్పిన కథ ఉంది. దానిని ఒక దుబాషీకి చూపించాడు. ఆశ్చర్యచకితుడైన ఆ దుబాషీ వెంటనే గాథికుని దగ్గరకు వెళ్ళి ఆ నోటుబుక్కులోని పేజీలను చూపిస్తూ గబగబా ఏదో చెప్పాడు. గాథికుడు ఆందోళన చెందాడు. వెంటనే లేచి నిలబడి దుబాషీ చేతిలోని నోటుబుక్కు చూపిస్తూ జనానికి ఏదో వివరించాడు. దాంతో వాళ్ళు కూడా ఆందోళన చెందారు. ఎవరూ ఎలాంటి ఆదేశామూ ఇవ్వకుండానే అంతా తక్షణమే హేలీ చుట్టూ మానవవలయంలా ఏర్పడ్డారు. వ్యతిరేక దిశలో కదులుతూ; ఒకసారి మంద్రస్వరంలో, ఇంకోసారి ఉచ్చస్వరంలో ఏదో వల్లిస్తూ; మధ్య మధ్య మోకాళ్ళను పైకెత్తుతూ; ఎర్రని ధూళి పైకిలేచేలా ఒత్తి ఒత్తి అడుగులేస్తూ ప్రదక్షిణం చేయసాగారు…

అంతలో ఒక మహిళ ఆ వలయంలోంచి బయటకు వచ్చి, నగ్న పాదాలతో నేలను తన్నుకుంటూ హెలీవైపు బాణంలా దూసుకువెళ్లింది. తన వీపున వేలాడదీసుకున్న జోలెలోంచి పసిబిడ్డను తీసి దాదాపు మొరటుగా అతని చేతుల్లో ఉంచి “తీసుకో” అన్నట్టు చూసింది. హేలీ ఆ బిడ్డను హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె బిడ్డను తీసేసుకుంది. మ్రాన్పడి చూస్తున్న హేలీ చేతుల్లో అలా ఓ డజను మంది మహిళలు తమ పసిబిడ్డల్ని ఉంచారు. వాళ్లందరినీ అతడు హత్తుకున్నాడు. వారు అలా ఎందుకు చేశారో అతనికి ఒక ఏడాది తర్వాత కానీ తెలియలేదు. అటువంటి విషయాలలో నిపుణుడైన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెరోమ్ బ్రూనర్ తో మాట్లాడినప్పుడు, “నీకు తెలియకుండానే మానవాళికి చెందిన అతి పురాతనమైన ఒక తంతులో నువ్వు పాల్గొన్నావు. దానిని ‘చేతులు వేయడం’ అంటారు.  “ఈ మా శరీరం ద్వారా మేము నువ్వే, నువ్వు మేమే” నని వారు నీకు చెబుతున్నారు” అని ఆయన  హెలీతో అన్నాడు.

తర్వాత మగవాళ్ళు హేలీని వెదురు కర్రలతో, పూరితో నిర్మించిన మసీదులోకి తీసుకెళ్లారు. అతనిని మధ్యలో ఉంచుకుని అరబిక్ లో నమాజు చేశారు. వాళ్లతోపాటు మోకాళ్ళ మీద కూర్చుని నమాజులో పాల్గొన్న హేలీ, తన మూలాలు ఏమిటో తెలిసినా, వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదనుకున్నాడు. వారి ప్రార్థన సారాంశాన్ని ఆ తర్వాత దుబాషీ అనువదించి చెప్పాడు: ఎప్పుడో తాము పోగొట్టుకున్న వ్యక్తిని తిరిగి తమకు అప్పగించినందుకు అల్లాకు వారు కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు.

kinta

తిరుగు ప్రయాణమైన హేలీ ఈసారి రోడ్డు మార్గంలో బయలుదేరాడు. జఫూరు కంటె పెద్దదైన ఓ గ్రామానికి చేరుకునేసరికి ఆ ఊళ్ళో జనం, ఆడా మగా, చిన్నా పెద్దతో సహా అంతా రోడ్డు మీదికి చేరుకుంటూ కనిపించారు. తను అక్కడికి రావడానికి ముందే జఫూరులో ఏం జరిగిందో వారికి తెలిసిపోయింది. వారు అతన్ని చూసి చేతులు ఊపుతున్నారు. “మీస్టర్ కింటే! మీస్టర్ కింటే!” అంటూ ఒక్క గొంతుతో కేకలు పెడుతున్నారు. వారి ముఖాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి. ఆ సమయంలో నా చీలమండల దగ్గరినుంచి దుఃఖం అలలు అలలుగా ప్రారంభమై క్రమంగా పైకి తన్నుకుంటూ వచ్చిందనీ, చేతులతో ముఖం కప్పుకుని బాల్యం తర్వాత మొదటిసారిగా భోరున ఏడవడం ప్రారంభించాననీ హేలీ అంటాడు.

హేలీ న్యూయార్క్ చేరుకునేసరికి కొన్ని టెలిఫోన్ వర్తమానాలు అతనికోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో ఒకటి కన్సాస్ సిటీ నుంచి వచ్చింది. ఎనభై మూడేళ్ళ కజిన్ జార్జియా కన్నుమూసినట్టు అది చెబుతోంది. హేలీ టైమ్ జోన్ సవరించుకుని చూసుకుంటే సరిగ్గా తను జఫూరులో అడుగుపెట్టిన క్షణాలలోనే ఆమె చనిపోయినట్టు అర్థమైంది. అమ్మమ్మతో తమ ఇంటి వసారాలో ముచ్చట్లు పంచుకున్న చివరి మనిషిగా ఆమె, తనను ఆఫ్రికాకు పంపించే బాధ్యత నెరవేర్చి, ‘పైనుంచి చల్లగా చూసే’ పెద్దలలో కలసిపోయిందని హేలీ అనుకున్నాడు.

***

హేలీకి మహాభారతంతో పరిచయం ఉండుంటే, జఫూరు గాథికుని కథనం బైబిల్ శైలినే కాక మహాభారత శైలిని కూడా గుర్తుచేసేదని పైన చెప్పుకున్నాం. అంతేకాదు, మన ఇతిహాస, పురాణ కథలు అతనికి తెలిసుంటే, శైలినే కాక ఒకేవిధమైన అభివ్యక్తిని, పదాలను, పదచిత్రాలను కూడా ఒకనాటి ప్రపంచ గాథికులు పంచుకున్నారని అతడు గ్రహించి ఉండేవాడు. కుంటా కింటే తండ్రి ఒమొరో తనకు ముప్పై ‘వర్షాలు’ (హేలీ  thirty rains అన్నాడు) వచ్చాక పెళ్లిచేసుకున్నాడు. మనం కూడా సంవత్సరాలను ‘వర్షాలు’ అంటాం. వసంతాలతో సంవత్సరాలను చెప్పుకున్నట్టే వర్షాలతో చెప్పుకోవడం వ్యవసాయ సంస్కృతి ప్రపంచానికి అందించిన వారసత్వం.  అలాగే, కింటే వంశీకులు ‘అగ్నిని జయించారు’ అని వినగానే మన పురాణ కథనాల తీరు ఒక్కసారిగా  తళుక్కుమంటుంది. అరణి మథించి నిప్పు చేయడంలో నేర్పరులైన అంగిరులను కూడా మన పురాణాలు అగ్నిని జయించిన వారుగానే పేర్కొంటాయి. మన అగస్త్యుడు ‘సముద్ర జలాలను తాగేస్తాడు’. పై పద్యంలోని నహుషుడు క్షత్రియవీరుడు కనుక నిర్జితాహితుడు- అంటే శత్రువులను జయించినవాడు. కింటే వంశీకులు కమ్మరులు కనుక ‘అగ్నిని జయించిన’వాళ్ళు!

హేలీ అన్వేషణ అంతటితో పూర్తి కాలేదు. అనంతర కథ తర్వాత…

 

 

అగరుపొగల వెచ్చలి

 

గుండెపొదిలోని శీతాంశుశరాలని చూసి జ్ఞాపకాల పక్షులు బెదురుతూ వచ్చి ఓ వరసలో కూర్చున్నప్పుడు-   చీలిన చంద్రబింబాల్లాంటి తన అక్షరాల అరచేతుల్లోని మబ్బు పింజలతో వాటికి నుదురు తుడుస్తాడు కవి.

అన్నిటికన్నా భాషే ఎక్కువగా బాధించిందని అశ్రురహిత దుఃఖంతో లోలోకాలుగా ఊగిపోతుంటాడు. “నీతో ప్రత్యేకంగా మాట్లాడటం నీకే కాదు నాకు కూడా శిక్షే, ఐనా నాలో ఎవరు ఆమెకు దాసోహమయ్యారో తేల్చుకోవాలి, గులాబియానంలో వెళ్ళిపోతున్న హేమంతానికి పుప్పొడి దప్పిక తీర్చిమరీ పంపాలి” అంటూ కొలనుకీ, ఏరుకీ నచ్చజెప్పి, జలజలా అవి దారికడ్డు తప్పుకున్నాక “రెప్పలకింద దాచుకున్న రెండు పావురాల్నుండీ ఇక రహదారులేవీ తప్పించుకోలేవు, అందుకేగా ఒక్క కళ్ల కోసం ఈ సమస్త దేహాన్నీ మోస్తూ తిరుగుతున్నది.” అనుకుంటూ వివశత్వాన్ని నిభాయించుకుంటాడు.

పసునూరు  శ్రీధర్ గారిలోని కవి “కొలనులోకి చేతులు జొనపకు పొద్దున్నే/అద్దం ముక్కలు గుచ్చుకుంటాయి” అని ఎవరో చెప్పగా విని మరో దారి లేక తన చుట్టూరా గాలిని వృత్తంగా తెగ్గోసి ఇక స్పృశించడానికేం లేదు అంతా స్పర్శాలోలత్వమే అనే నమ్మకం కుదిరాక, గిరులమీంచి దూకే భీకర ప్రవాహంలా కాక మోహపు పెదాల్ని తడిపే నాలుగైదు వానచినుకులుగా కవిత్వాన్ని చిలకరిస్తారు. ఆ వానలో కురిసిన అనేకవచనాల్లోని ఒక కవిత్వపు చినుకుని ఇక్కడ కొనగోటితో మీటుకుందాం!

 

మాయాదర్పణం

కన్రెమ్మల మీద వాలి

వడ్రంగిపిట్ట కోనేట్లో నీటిని చిలకరిస్తూ ఉంటుంది

ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి

వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి-

చీకటి కొమ్మకు వేలాడిన

దేహపంజరంలోకి

పొగవెన్నెలలా చొరబడిన పక్షి

తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు!

వాక్య సర్ప పరిష్వంగంలో

చేతులు రెండూ వెనక్కి చుట్టుకుపోతాయి

రాత్రిని రెండు ముక్కలు చేసిన

దుప్పటి కిందే విశ్వమంత రాత్రి-

బయట చిన్ని శకలమొక్కటే

కాలిన కాగితంలా మబ్బుల మీంచి

దొర్లుతూ పోతుందనుకుంటా!

రావిచెట్టు గాలొక్కతే తురాయి శిరస్సును

జోకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది-

ఒక తులాదండ భారంతో

భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది

మాయాదర్పణమై కోనేరు

మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!

వెలుగురేకలు వెదజల్లబడిందాకా

స్వీయబంధనంలో పక్షి

తలమునకలవుతూనే ఉంటుంది-

***

 

వర్షధారకీ కోనేటి అలకీ మధ్య చినుకుల కప్పగంతులు, పిట్ట ముక్కుకీ చెట్టు బెరడుకీ మధ్య పుట్టే టకటక శబ్దం, గులకరాయి కదలికకీ నీటి నిద్రకీ మధ్య కలల్లాగా వలయాలు- మాయేనా?

దృశ్యాలపై మెత్తగా మూత పెట్టే పూరెమ్మల్లాంటి కనురెప్పలూ, చిప్పిల్లిన తుంపరని పైన చల్లుకునీ తడవని తామరాకులు, ఆకుకదలికల సడిలో రాలిపడే పక్షి ఈకలూ- దర్పణాలా?

ఆలోచనలు ఒక మూలం దగ్గర మొదలై వేటికవి సుడులుగా తిరిగి, కన్నీళ్ళూ వేదనా ఒక ఘటనలోంచి ఊరి బయటపడక లోలోపల ఆర్తితో లుంగలు చుట్టుకుంటూ “ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి.” లాంతరు చిమ్నీ లోపలివైపు మంచు ఆవిరి తుడిచి ఒత్తి అంటించిన కాసేపటికి మెల్లగా వెలుతురూ, సెగ పరచుకునే వ్యవధిలో చల్లటి స్తబ్ధత కరిగిపోయి, చేతన మిణుకుమనే రెక్కలను పంజరపు గదినిండా చాపుకుని వ్యాపించి “తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు”.

 sridhar

పెగలని పదాలు లోలోపల ఒకదానికొకటి అల్లుకుని చిక్కుపడిపోగా, తెమిలిన వాక్యాలు, అనేసిన మాటలు, చెప్పేసిన పంక్తులు బయటికొచ్చెయ్యడం వల్ల పరిపూర్ణమయిన బలంతో వక్తను పెడరెక్కలు విరిచి కట్టి పెనవేస్తాయి.  చేతుల ప్రమేయం లేక, చేతలుడిగి  మాట్లాడ్దం తప్ప మరేం చెయ్యలేని నిస్సహాయత ఆ బంధనం పొడుగునా పామై జలదరింపజేస్తుంది. ఆ స్థితినే కాబోలు “వాక్య సర్ప పరిష్వంగం” గా భావించి అప్రమత్తుడవుతాడు కవి.

రాత్రివేళ లోకంలోని చీకటంతా దుప్పటి కిందా, కళ్ల వెనకా చిక్కనై మిగిలిపోయిన ఏ కాస్త ముక్కో పల్చగా గది బయటి వెన్నెలకింద గాఢత కోల్పోయి లేతరంగుగా “కాలిన కాగితంలా మబ్బుల మీంచి” తేలుతూ ఉన్న సమయం. ఊరంతా సద్దుమణిగి జోగుతున్నప్పుడు కాపలాగా ఒక్క రావిచెట్టు ఆకుచప్పుళ్ల అడుగులతో పహారా కాస్తూ  నిద్రపట్టని ఏ ఒంటరి పిట్ట తలనో గాలి వేళ్లతో మెత్తగా నిమురుతుంది.

త్రాసులో పైకి లేచిన వైపుని విశ్వాన్ని ఆవరించుకున్న శూన్యానికి వదిలేసి, బరువెక్కిన వైపు మాత్రం తనవంతుగా తీసుకున్న భూమి కుంగిపోకుండా తులాదండ న్యాయం కోసం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ అద్దంలా ప్రతిబింబాల్ని చూపే కోనేటికి నీడల్ని మోసి విసుగొచ్చిందేమో!  ఒక మాయగా, అనూహ్యంగా తానొక నీటిబొట్టుగా మారిపోయి ఒడ్డుపై నడుస్తున్న మనిషి కంటిపాపల్లో దాక్కుంటుంది. అలాంటప్పుడు “మాయాదర్పణమై కోనేరు మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!” అని ఊహించడం ఒట్టి ప్రేలాపన కాదు.

“చీకటి కొమ్మకు వేలాడిన దేహపంజరంలోకి పొగవెన్నెలలా చొరబడిన పక్షి” తిరిగి తెల్లవారు ఝామున వెలుతురు కిరణాలుగా, రెమ్మలుగా, గింజలుగా అన్ని దిక్కుల నుండీ వెదజల్లబడటం చూసి తన రెక్కల దుప్పటిలో చుట్టేసుకున్న దేహాన్ని బంధవిముక్తం చేసి బయటికి ఎగరవేస్తుంది.

1swatikumari-226x300—బండ్లమూడి స్వాతికుమారి

*

 

 

ప్రళయం

pralayam_illustration

అనిల్ ఎస్. రాయల్  పుట్టిందీ, పెరిగిందీ పల్నాడులో. పై చదువులు విజయవాడలో. ఆ పై చదువులు మద్రాసు లయోలాలో. పరిశోధన చేసింది గణిత శాస్త్రంలో. పనిచేస్తుంది కంప్యూటర్ రంగంలో. పద్నాలుగేళ్లుగా ప్రవాసం. సిలికాన్ లోయలో నివాసం. చిత్రలేఖనం చిన్నప్పట్నుండీ ఉన్న సరదా. కథా లేఖనం కొత్త సరదా. ‘ప్రళయం’ అతని ఏడో కథ.–వేంపల్లె షరీఫ్

ప్రళయం

 

* * 1 * *

 

“ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము”

ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా, పైనా నోళ్లు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెడుతున్న రెండు నాగుపాముల ఆకారాలు. వాటి కళ్ల స్థానంలో పొదిగిన జాతిరాళ్లు పై కప్పుకి వేలాడుతున్న గుడ్డి దీపం వెలుగులో మెరుస్తున్నాయి. ఆ పడగల కింద భారీ పరిమాణంలో ఉందో తుప్పు పట్టిన ఇనుప తాళం.

అది శ్రీ చండీ అమ్మవారి ఆలయం. వెయ్యేళ్ల పురాతనమైనది. ఏడాది క్రితం దాకా ఇది స్థానికంగానే ప్రసిద్ధం. ఆ కాస్త పేరు కూడా సమీపంలో ఉన్న శివకోట రాకెట్ సెంటర్ సైంటిస్టుల పుణ్యాన వచ్చిందే. అక్కడ నుండి ప్రయోగించబోయే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలు అమ్మవారి ముందుపెట్టి ప్రత్యేకంగా అర్చన చేయించటం ఆనవాయితీ. ఈ మధ్య భారతదేశం ప్రయోగించిన తొలి వ్యోమనౌక కూడా ఇక్కడ దిష్టి తీయించుకున్నాకే పైకెగిరింది. శాస్త్రవేత్తలు సొంత శక్తియుక్తుల కన్నా శక్తిస్వరూపిణి మహిమల్నే నమ్ముకోవటం వింతే. నాకలాంటి మూఢనమ్మకాలేం లేవు. ఒకే ఒక గాఢ నమ్మకం మాత్రం ఉంది: డబ్బు. భూమ్మీద దేవుడి అవసరం లేని వాళ్లున్నారు కానీ డబ్బవసరం లేని వాళ్లు లేరు. కాబట్టి నేను దైవానికన్నా ధనాన్నే ఎక్కువ నమ్ముతాను.

మొత్తానికి ఆ వెర్రి సైంటిస్టుల దయవల్ల చుట్టుపక్కల గ్రామాల్లో పేరుబడటమే తప్ప చండీ అమ్మవారి గురించి దేశంలో మరెవరికీ తెలీదు. అలాంటిది పోయినేడు అమ్మవారి పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. ఆలయం అడుగునున్న నేలమాళిగల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడటం దానిక్కారణం. భూమికి యాభై అడుగుల లోతున ఉన్న నేలమాళిగల్లో శతాబ్దాలుగా పోగుపడి ఉన్న బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాలని లెక్కించటానికి ప్రభుత్వాధికారులకి నాలుగు నెలలు పట్టింది. నేలమాళిగలో మొత్తం ఆరు గదులుండగా, ఐదు గదుల సంపద వెలికి తీశాక – ఆరోగది తెరిస్తే అరిష్టమని గుడి ధర్మకర్తలు దావా వెయ్యటాన, అది తేలేవరకూ దాన్ని తెరవొద్దని కోర్టు ఆదేశించటాన, ఆరో గది తలుపులింకా మూతబడే ఉన్నాయి. ఆ గది ముందే ఉన్నా నేనిప్పుడు.

ఇంత సంపదున్న ప్రాంతానికి ఉన్న భద్రతల్లా ఇద్దరు సెంట్రీలు, నేలమాళిగ లోపలకి వెళ్లే ఇనప గేటుకి రెండు పెద్ద తాళాలు, కోర్టు తీర్పు వెలువడేదాకా గేటు తెరవొద్దన్న ఆదేశాలు. అమ్మవారి సొమ్ముని ఆమే కాపాడుకుంటుందన్న ధీమానేమో, కనీసం లోపల అలారం సిస్టం కూడా లేదు. నాలాంటి దొంగకి ఇందులోకి చొరబడటం నీళ్లు తాగినంత సులువు. తవ్వకాలు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టు కూలీ అవతారమెత్తి నేలమాళిగలో ఎక్కడేముందో క్షుణ్నంగా తెలుసుకుని మరీ ఈ పధకం రూపొందించాను. తెల్లవారుఝామున మూడింటికి సెంట్రీలు డ్యూటీ మారే సమయంలో నేలమాళిగలోకి చొరబడి, ఆరో గది తలుపు బద్దలు కొట్టి, లోపలనుండి అందినంత బంగారాన్ని మూటగట్టుకోవటం; ఈ లోగా పైన తెల్లారిపోతుంది కాబట్టి మళ్లీ చీకటి పడేదాకా అందులోనే కాలక్షేపం చేసి తిరిగి తెల్లవారుఝామున మూడుగంటలకి బయటికి జారుకోవటం; ఆలయం గోడ పక్కన పొదల్లో దాచిన మోటార్‌సైకిల్ మీద ఉడాయించటం …. అదీ ప్లాన్. పధకం పక్కాగా ఉంది. అందులో సగం చక్కగా పూర్తయింది.

తలుపు మీదున్న వాక్యం మరోసారి చదివి నవ్వుకుంటూ నాతో తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ తెరిచి అందులోని వస్తువుల్ని నేలమీద పరిచాను: రెండు బిరియానీ పొట్లాలు, నాలుగు మంచినీటి సీసాలు, ఒక టార్చ్ లైట్, చిన్న రంపం, అర డజను హ్యాక్ సా బ్లేడులు.

రంపం అందుకుని తాళం కొయ్యటం మొదలుపెట్టాను. గంటన్నర గడిచి, మూడు బ్లేళ్లు విరిగి, వళ్లు చెమటతో తడిసి ముద్దయ్యాక ఊడొచ్చిందది. రంపం కింద పడేసి గాఢంగా ఊపిరి పీల్చుకుని తలుపు బలంగా నెట్టాను. కిర్రుమనే శబ్దంతో తెరుచుకుందది.

ఎదురుగా, ఐదొందలేళ్లుగా మానవమాత్రుడు అడుగు పెట్టని గది.

టార్చ్ లైట్ వెలిగించి లోపలకు వేశాను. చాలా పెద్ద గదిలాగుందది. సొరంగంలా పొడుగ్గా ఉంది.

గుమ్మం దాటుకుని ఎడమ కాలు లోపల పెడుతుండగా …. టప్ మనే శబ్దంతో పైనున్న గుడ్డి బల్బ్ పేలిపోయింది. టార్చ్ వెలుగు తప్ప అంతా చీకటి.

“అపశకునమా?”. ఛత్. దొంగలకు చీకటి వరం. ఇది శుభశకునమయ్యుండాలి.

టార్చ్ లైట్ సాయంతో వెదకటం ప్రారంభించాను. బంగారం రాశులు ఏ మూల దాగున్నాయో?

పెద్దగా కష్టపడే పనిలేకుండా పావుగంటలోనే బోధపడింది. ఖాళీ గది వెక్కిరించింది. రాశుల్లేవు, రప్పల్లేవు. బంగారం మూటల్లేవు. నా ముఖంలో నెత్తుటి చుక్కలేదు. చిల్లర దొంగతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నేను ఈ చివరి చోరీతో దొంగ బతుక్కి గోరీ కట్టి కొత్త జన్మెత్తొచ్చన్న ఆశలు ఆవిరయ్యాయి. కసిగా కాలితో నేలపై తంతుండగా టార్చ్ వెలుగులో ఓ మూల తళుక్కుమందది. వెంటనే వెళ్లి చూశాను.

ఇందాక వెదికినప్పుడు కనబడలేదు. ఎక్కడినుండో ఊడిపడ్డట్లు ఉందది. అమ్మవారి బుల్లి విగ్రహం. పదంగుళాల ఎత్తున పోతపోసిన పసిడి. అధమం కిలోన్నర బరువన్నా ఉంటుంది. పాతిక లక్షలకి తక్కువుండదు. పోనీలే, ఇంత కష్టపడ్డందుకు ఇదన్నా దక్కింది.

ఉదయం ఆరున్నరయింది. రాత్రంతా నిద్రలేకపోవటంతో కళ్లు మండుతున్నాయి. బయటపడటానికి ఇంకా ఇరవై గంటల పైన నిరీక్షించాలి. అప్పటిదాకా చేసేదేమీ లేదు కాబట్టి కాసేపు వళ్లు వాలిస్తే పోతుంది.

 

 

* * 2 * *

నేలమాళిగనుండి బయటపడే సమయం దగ్గర పడింది. లేచి అడుగులో అడుగేసుకుంటూ గేటు దగ్గరికొచ్చాను. బయటంతా చీకటి. ఎక్కడినుండో వస్తున్న వెలుగులో పరిసరాలు మసకగా కనబడుతున్నాయి. ఆ వెలుగులో గంతులేస్తున్న నీడలు అది విద్యుద్దీపాల కాంతి కాదని తెలియజెపుతున్నాయి. శీతాకాలం కదా. సెంట్రీలు చలి మంటలేస్తున్నారేమో.

గేటు తాళాలు తెరిచి బయటికొచ్చి శబ్దం కాకుండా తాళాలేశాను. చోరీ సంగతి ఎంత ఆలస్యంగా బయటపడితే తప్పించుకోవటం అంత తేలిక. గేటు తెరిచిపెట్టి పారిపోకుండా తిరిగి తాళాలేయటం అందుకే.

ఆలయం ఆవరణలో ఓ మూల విసిరేసినట్లున్న చిన్న మంటపంలోకి తెరుచుకుంటుందా గేటు. మంటపాన్ని ఆనుకునే ఆలయ ప్రాకారం ఉంది. చీకటి మాటున ప్రాకారం అవతలకి దూకి అక్కడ పార్క్ చేసున్న మోటార్‌సైకిల్ సాయంతో జారుకోవాలి.

పిల్లిలా గోడవైపు నడుస్తుండగా వచ్చిందా అనుమానం. ఏదో తేడా. ఆగిపోయి చెవులు రిక్కించాను. ఏమీ వినపడలేదు. ఏవో పురుగులు చేస్తున్న సొద. కీచురాళ్లేమో. అది తీసేస్తే రాత్రి పూట సాధారణంగా ఉండే నిశ్శబ్దం. తేడా అది కాదు. ఏమిటది?

జుత్తు కాలుతున్న వాసన. చర్మం కాలుతున్న వాసన కూడా. వాతావరణమంతా ఆవరించినట్లు, అన్ని దిక్కుల నుండీ దుర్వాసన.

మనసు కీడు శంకించింది. అక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం. కానీ దాన్ని మించిన అపాయమేదో రానుందని మొరపెడుతున్న మనసు. సెంట్రీ గదివైపు చూశాను.

అక్కడ రెండు ఆకారాలు నేలమీద పడున్నాయి – నిశ్చలంగా.

“ఏం జరిగింది?”, కుతూహలం పురివిప్పింది. నా ప్రమేయం లేకుండానే అడుగులు అటుపడ్డాయి.

నిమిషం తర్వాత ….

నేను స్థాణువునై ఆ శవాల ముందు నిలబడి ఉన్నాను. వళ్లంతా బొబ్బలతో పడి ఉన్నాయా శరీరాలు. వాటి మీదున్న దుస్తులు వాళ్లు సెక్యూరిటీ గార్డ్స్ అని చెబుతున్నాయి. ఆ శవాల పైన రొదచేస్తున్న కీటకాలు, పురుగుల సమూహం. తట్టుకోలేని దుర్గంధం.

“ఎవరి పని?”. ఆలోచించే సమయం లేదు. ముందిక్కడినుండి పారిపోవాలి. లేకపోతే దొంగతనానికి తోడు హత్యానేరం నా మీద పడుతుంది. వళ్లంతా చెమటలు పట్టాయి. భయంతో కాదు, ఉక్కతో. ఆ సమయంలో అంత ఉక్కపోత అసాధారణం. అయితే నేను దాన్ని పట్టించుకునే స్థితిలో లేను. వెనుదిరిగి ప్రాకారం వైపు పరిగెత్తబోతుండగా నా దృష్టి సెంట్రీ గది అవతల వంద మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన మంటపమ్మీద పడింది.

అప్రయత్నంగా నా గొంతునుండో గావుకేక వెలువడింది.

అక్కడ … పదుల సంఖ్యలో శవాలు. పారిపోయే ప్రయత్నం మానేసి అటు పరుగు పెట్టాను.

అక్కడికి చేరుకునేసరికి నా పై ప్రాణం పైనే పోయింది. ఎటు చూస్తే అటు నిర్జీవ దేహాలు. పెద్దలు, పిల్లలు, పూజారులు, స్త్రీలు, కుక్కలు, కాకులు, పిట్టలు …. గుట్టలు గుట్టలుగా శవాలు. సలసల కాగుతున్న నూనె కుమ్మరించినట్లు, ఆ శరీరాల నిండా బొబ్బలు. ఉడికీ ఉడకని మాంసం ముద్దల్లా, రక్తమోడుతూ. హృదయవిదారకమైన దృశ్యమది. చూడగానే కడుపులో తిప్పింది. నిన్న తిన్నదంతా వాంతయింది. అక్కడుండలేక దూరంగా పరిగెత్తాను. బ్యాక్‌ప్యాక్‌లోంచి నీళ్ల సీసా తీసి ముఖం కడుక్కుని, ఓ గుక్క నీళ్లు తాగి సీసా లోపల పెట్టేయబోతుండగా అందులో ఉన్న అమ్మవారి విగ్రహం చేతికి తగిలింది. దాన్ని తీసి ప్యాంట్ జేబులో దోపుకున్నాను.

కొంచెం స్థిమిత పడ్డాక చుట్టూ పరికిస్తే ఓ చివరన పార్కింగ్ లాట్‌లో అగ్నికి ఆహుతైన మోటారు వాహనాలు కనబడ్డాయి. వాటికి కాస్త అవతలో లారీ ఇంకా తగలబడుతూ ఉంది.

బాంబు దాడేమన్నా జరిగిందా?

అలా ఐతే గుడి కూడా ధ్వంసమై ఉండాలి కదా. పైగా పక్షులు కూడా రాలిపడున్నాయి. కాబట్టి ఇది బాంబు దాడి కాదు.

ఎవరన్నా చూసేలోపే ఇక్కడ నుండి వెళ్లిపోవటం మంచిది. బయట పార్క్ చేసున్న మోటర్ సైకిల్ వైపు నడవటం ప్రారంభించాను, జేబులో విగ్రహాన్ని తడిమి చూసుకుంటూ.

* * 3 * *

నా కళ్లనుండి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఈ ఘోరకలి నమ్మటానికి మనసు నిరాకరిస్తుంది.

సెల్ ఫోన్ ఉదయం పదిన్నరైనట్లు చూపిస్తుంది. ఆ ఫోన్ అందుకు తప్ప మరెందుకూ పనికి రాదని అర్ధమై చాలాసేపయింది. ఎక్కడా సిగ్నల్స్ లేవు. ఆఖరికి సెల్‌ఫోన్ టవర్ల పక్కన కూడా. కరెంట్ కూడా లేదు.

నగరం నడిబొడ్డునున్న క్లాక్ టవర్ సెంటర్లో నిలబడున్నా నేను. అదో నాలుగు రోడ్ల కూడలి. రహదారుల్లో ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా తగలబడిపోయాయి. వాటి లోపలా, బయటా, రోడ్ల మీదా, పక్కనున్న షాపుల్లో కిటకిటలాడుతూ నిర్జీవదేహాలు. కనుచూపుమేరలో మరో ప్రాణి సడి లేదు. వళ్లు కాలిపోయి, బొబ్బలెక్కి, కమిలిపోయి … మనుషులు, మృగాలు, పక్షులు, కీటకాలు. కళ్లకు కనబడినమేరా కళేబరాలు. మధ్యలో నేను – ఒంటరిగా.

అనాధగా పెరిగిన నాకు ఒంటరితనం కొత్తకాదు. అది నన్నెప్పుడూ భయపెట్టలేదు. కానీ ఇది …. ఇది భయాన్ని సైతం బెదరగొట్టే భీభత్సకాండ.

అమ్మవారి ఆలయం నుండి ఇక్కడిదాకా అదే పరిస్థితి. కాలిపోయిన వాహనాలు, తగలబడుతున్న భవనాలు, మండిపోతున్న ఎండుచేలు, చెల్లాచెదురుగా శవాలు. పొదల మాటున దాచిన నా మోటార్ బైక్ కూడా తగలబడిపోయుంది. దారిలో ఓ శవం నుండి తస్కరించిన డొక్కు సైకిల్ తొక్కుకుంటూ నగరానికి రావటానికి మూడు గంటలు పట్టింది. రెండు టైర్లూ పాడైపోయిన సైకిలది. వేరే దారి లేకపోవటంతో అదే నా వాహనమయింది. నగరానికొచ్చే దారి పొడుగునా యుద్ధరంగాన్ని తలపించే వాతావరణం. కాదు, కాదు .. యుద్ధం కూడా ఇంత భయంకరంగా ఉండదేమో.

నేనా నేలమాళిగలో ఉన్నప్పుడు ఏదో జరిగింది.

శత్రుదేశం దాడి చేసిందా? ఆటం బాంబులేమన్నా ప్రయోగించిందా?

కాకపోవచ్చు. సమీపంలో అణుబాంబు పేలితే భూకంపం లాటిది రావాలి. అలాంటివేవీ నేను గమనించలేదు.

ఇంతకీ … ఇంత దారుణం జరిగి ఇరవై నాలుగ్గంటలయ్యాకా ఇక్కడ మీడియా వాలిపోలేదెందుకు? ప్రభుత్వం సహాయానికి సైన్యాన్ని దించలేదెందుకు?

అప్పుడొచ్చిందా అనుమానం. క్షణాల్లోనే అది పెనుభూతంగా మారి నన్ను ఆపాదమస్తకం వణికించేసింది.

ఈ మారణకాండ ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదేమో. దేశం యావత్తూ తుడిచిపెట్టుకుపోయిందేమో. బయటి నుండి కూడా సహాయం రాలేదంటే, అంతకన్నా కారణమేముండాలి?

అంటే …. నేనొక్కడినే బతికున్నానా?

ఆ ఊహకి – వెన్నులో మొదలైన జలదరింపు లిప్తలో వళ్లంతా పాకింది. ఉన్నచోటే కూలబడిపోయాను. ఆ వత్తిడికి జేబులో ఉన్న విగ్రహం గుచ్చుకుంటుంటే నా మస్తిష్కంలో ఓ మెరుపు మెరిసింది. “నేనే దీనికంతటికీ కారణమా?”.

తర్కానికి తాళం పడ్డ వేళది. గుట్టలుగా పడున్న శవాలన్నీ ఒక్కపెట్టున లేచి నన్ను చుట్టుముట్టినట్టూ, ఈ శాపం నా పాపమేనని నిందిస్తున్నట్టూ అనిపించింది. “ఆరోగదిలో అడుగుపెట్టి అమ్మవారికి ఆగ్రహం కలిగించానా? మూఢనమ్మకమంటూ కొట్టిపడేసిన విషయమే నిజమయిందా?”.

నాలో తొలిసారిగా పాపభీతి. ఇది నేనెన్నడూ ఎరగని అనుభూతి. “నో, నో. హేతుబద్ధంగా ఆలోచించు. దానికీ దీనికీ సంబంధమేమిటి?” అని నాకు నేనే నచ్చజెప్పుకుంటూ బ్యాక్‌ప్యాక్ లోంచి నీళ్ల సీసా అందుకుని ఓ గుక్క గొంతులో వంపుకున్నాను. అదే చివరి సీసా. ఎక్కడా మంచినీళ్ల జాడలేదు. మళ్లీ నీళ్లు దొరికేదాకా ఈ మిగిలిందొక్కటీ జాగ్రత్తగా వాడుకోవాలి. చూస్తుంటే విధ్వంసమంతా ఉపరితలమ్మీదనే జరిగినట్లుంది. నేలమాళిగలో ఉన్న నాకు ఏమీ కాకపోవటం దానికి సాక్ష్యం. భూమ్మీద నీరంతా ఆవిరైపోయినట్లుంది. నేల పొరల్లో నీరే నాకిప్పుడు గతి. బోరింగ్ పంప్ లాంటిదెక్కడన్నా కనిపిస్తే నీళ్లు తోడుకోవచ్చు. కానీ నగరాల్లో బోరింగులు ఎప్పుడో మాయమైపోయాయి. పల్లెల్లో ఏమన్నా మిగిలున్నాయేమో. తూర్పు దిక్కున పల్లెటూర్లున్నాయి. అటువైపు వెళితే? ఒకవేళ అక్కడ బోరింగ్స్ లేకపోయినా, ఇంకా ముందుకెళితే సముద్రం ఉంది. ఇసుక మేటలుండే సముద్ర తీరాల్లో కురిసిన వాన నీరు ఇసుక పైపొరల్లో నిలవుంటుంది. అక్కడ పైపైన తవ్వితే మంచినీరు ఊరుతుంది.

అప్పుడే మరో ఆలోచన స్ఫురించింది. “పరిసర ప్రాంతాల్లో నాలాగే అదృష్టవశాత్తూ విపత్తు తప్పించుకున్నవాళ్లుంటే? వాళ్లూ నీళ్ల కోసం వెదుక్కుంటూ సముద్రం దిక్కుగా సాగితే?”

ఆలస్యం చేయకుండా పైకి లేచాను. ఇరవై కిలోమీటర్ల లోపే ఉంది సముద్రం. సైకిల్ మీద నాలుగైదు గంటల్లో వెళ్లిపోవచ్చు.

ఎండ మందగించింది. తూర్పునుండి ముసురేస్తుంది. వర్షం మొదలయేలోపే తీరానికి చేరాలనుకుంటూ వాహనం అధిరోహించాను.

 

* * 4 * *

సముద్ర తీరం చేరటానికి అనుకున్నదానికన్నా ఆలస్యమయింది. సగం దూరం వెళ్లేటప్పటికే కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం మూడున్నరకే చీకటి పడిపోయింది. యుద్ధభేరీ మోగించినట్లు ఉరుములు, చెవులు బద్దలయ్యే శబ్దంతో పిడుగులు. మార్గమంతా మృత్యువు వికటాట్టహాసాలే. మెరుపుల వెలుగులో దారి వెదుక్కుంటూ, దార్లో పడున్న శరీరాలని జాగ్రత్తగా దాటుకుంటూ ముందుకు సాగటానికి నాకు శక్తెక్కడినుండొచ్చిందో! ఎలాగోలా తీరానికి చేరితే నాలాంటి వాళ్లెవరన్నా కనబడకపోతారా అన్న ఆశ బలాన్నిచ్చిందేమో. సీసాలో మిగిలిన నీళ్లు మధ్యలోనే ఖర్చైపోయాయి. తీరా, తీరానికొచ్చాక నా ఆశ అడియాసయింది. తీరమంతా మనుషులు, పక్షులు, చేపల పార్ధివ దేహాలే. సముద్రపు అలలకి కొట్టుకొస్తూ, తిరిగి లోపలికెళుతూ. లెక్కించటం మొదలుపెడితే సంఖ్య వేలల్లోనే తేలేట్టుంది. వీళ్లు కూడా వళ్లంతా బొబ్బలతో రాలిపోయిన వాళ్లే.

అక్కడికొచ్చేటప్పటికి సాయంత్రం ఆరయింది. ఉరుముల ఉద్ధృతి రెట్టింపయింది. నీటి చెలమ తవ్వుదామనుకుంటుండగానే వాన మొదలయింది. సముద్రం ఉగ్రరూపం దాల్చినట్లు అలలు విరుచుకు పడటం మొదలు పెట్టాయి. తోడుగా హోరుగాలి. దాని ధాటికి సైకిల్ ఎగిరిపోయింది. కొన్ని దేహాలు ఎగురుకుంటూ నా పక్కగా దూసుకుపోతున్నాయి. ఒకట్రెండు – పక్షులవో లేక చేపలవో – ఎగిరొచ్చి నాకు తగిలాయి. చుట్టూ చూస్తే దూరంగా ఓ బోర్లించిన పుట్టి కనబడింది. గాలికి ఎదురీదుతూ దాన్ని చేరుకుని, కాసేపు తిప్పలు పడి కొంచెం పైకెత్తి దాని కింద దూరి ప్రాణాలు అరచేత పెట్టుకుని క్షణాలు లెక్కబెట్టసాగాను.

క్షణాలు నిమిషాలు, నిమిషాలు గంటలయ్యాయి. ఎన్ని గంటలయ్యాయో తెలుసుకోటానికీ లేకుండా సెల్ ఫోన్ వర్షానికి తడిసి మాడిపోయింది. గాలివాన అంతకంతకీ తీవ్రరూపం దాలుస్తుంది. పుట్టి ఏ క్షణంలోనైనా ఎగిరిపోయేలా ఉంది. అదే జరిగితే దానితో పాటు నేనూ గాలికెగిరిపోవటం తధ్యం. పుట్టి ఎగిరిపోకూడదని కోరుకుంటూ ప్రాణాలు చేతబట్టుకుని కూర్చున్నాను. అవసరం ఎవరినైనా అడుక్కునే స్థాయికి దిగజారుస్తుంది. కోరుకున్నవి దర్జాగా కాజేయటమే తప్ప అడిగే అలవాటు లేని నాకు, ఆ అవసరం మొదటిసారిగా వచ్చిపడింది. ఎప్పుడూ దేవుడిని ఏదీ అడగని నేను మొదటిసారిగా అడిగాను, నన్ను కాపాడమని. చేతులు జోడించి మరీ ప్రార్ధించాను. తీతువు కూతలు గుండెలదరగొట్టేవేళ హేతువు తోకముడిచి పారిపోతుందేమో.

ప్రార్ధన పూర్తవకముందే ఓ పెద్ద అల, సముద్రం చెయ్యి సాచినట్లు, వేగంగా దూసుకొచ్చి లిప్తలో నన్నూ పుట్టినీ గిరాటేసింది. నా నుదురు విసురుగా పుట్టికి తగిలింది. తల దిమ్మెక్కిపోయింది. కాసేపేం జరుగుతుందో అర్ధం కాలేదు. తేరుకునేసరికి అల నన్ను సముద్రంలోకి గుంజేసింది. ఉప్పునీరు నోట్లోకీ, ముక్కులోకీ పోయి ఉక్కిరిబిక్కిరవుతూ లోపలికి కొట్టుకుపోయాను. తలకి పెద్ద గాయమే ఐనట్లుంది. విపరీతమైన నొప్పి. కెరటం కాస్త తెరిపివ్వగానే పళ్ల బిగువున నొప్పి భరిస్తూ ఒడ్డుకేసి ఈదటం మొదలుపెట్టాను. అంతలోనే మరో అల నన్ను బలంగా వెనక్కి విసిరికొట్టింది. లేని ఓపిక తెచ్చుకుంటూ ఈత మళ్లీ మొదలుబెట్టబోయాను. అప్పుడే, పక్కనే తేలుతూ ఇందాకటి పుట్టి కనబడింది. వెంటనే ఎక్కేశాను.

ఈ గొడవలో నా బ్యాక్‌ప్యాక్ తప్పిపోయింది. ఓ పక్క దాహం, మరో పక్క ఆకలి. ఇంకోపక్క వణికిస్తున్న చలి. అలలు, ఉరుములు, ఈదరగాలి చేస్తున్న శబ్దాలు కలసికట్టుగా చెవులు పగలగొడుతున్నాయి. పైనుండి కుండపోతగా కురుస్తున్న వర్షం, నాలుగు దిక్కులనుండీ ఎడాపెడా కొడుతున్న కెరటాల మధ్యలో నానిపోతున్న నేను. కన్ను పొడుచుకున్నా కనబడని చిమ్మచీకటి. మెరుపులు మెరిసినప్పుడు మాత్రం సముద్రుడి ఉగ్రరూపం కళ్లముందు ప్రత్యక్షమై వళ్లు జలదరింపజేస్తుంది. ఆ మెరుపుల సాక్షిగా తీరానికి సుదూరంగా వెళ్లిపోయానన్న సంగతి అవగతమయింది. తల తడుముకుంటే చేతికి రక్తం అంటింది. బాగానే పోయినట్లుంది. తొడుక్కున్న చొక్కాలో కొంతభాగం చింపి అక్కడ బిగించి కట్టాను.

ప్రకృతి శక్తుల ముందు మనిషి అల్పత్వం గురించి నాకింకా అనుమానాలేవైనా మిగిలుంటే ఆ తర్వాత కాసేపట్లోనే అవి పూర్తిగా పటాపంచలయ్యాయి. చుట్టూ జరుగుతున్న విలయతాండవం నా కళ్లబడకుండా చీకట్లు కాపాడాయి. అంతెత్తున విసిరేస్తున్న అలల మధ్య పుట్టి తిరగబడకుండా ఉండటం అద్భుతమే. దాని లోపల నాలుగు చోట్ల బలమైన మోకులు కట్టున్నాయి. ఆ మోకులతో నన్ను నేను పుట్టికి కట్టేసుకుని, అలల ధాటికి దాన్నుండి దూరంగా విసిరేయబడకుండా కాపాడుకున్నాను. అలా ఎంత సేపు గడిచిందో తెలీదు. క్రమంగా నన్ను ఆకలి, అలసట ఆక్రమించుకున్నాయి. నీరసం కమ్ముకుంది. అలాగే నిద్రలోకి జారుకున్నాను.

 

* * 5 * *

 

కళ్లు తెరిచేసరికి …. చుట్టూ పండగ వాతావరణం.

ఆశ్చర్యం! నేనున్నది పుట్టిలో కాదు. అది నడిసముద్రమూ కాదు. శ్రీ చండీ అమ్మవారి ఆలయం. మంటపంలో ఓ మూల పడుకుని ఉన్నాను. ఆలయం నిండా భక్తజన సందోహం. తిరునాళ్లేదో జరుగుతున్నంత కోలాహలంగా ఉందక్కడ.

“ఏమిటీ హడావిడి?”, హారతీ గట్రా సరంజామాతో అటుగా వెళుతున్న పూజారిని ఆపి ప్రశ్నించాను.

“ఇంకా తెలీదా నాయనా? ఆరో గదిలో బంగారు బొమ్మ రూపంలో అమ్మవారు వెలిశారు”, ఆయన వింతగా చూస్తూ చెప్పాడు.

“ఆరో గదా? అదెప్పుడు తెరిచారు! తెరిస్తే అరిష్టమని కోర్టునుండి స్టే తెచ్చారుగా”, తెలీనట్టు అడిగాను.

“ఎవడో దొంగవెధవ నాయనా. రాత్రి నేలమాళిగలో చొరబడి గది తలుపులు తెరిచాడు త్రాష్టుడు. వాడి శ్రాద్ధం పెట్ట. తెల్లారి సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూస్తే అమ్మవారి విగ్రహం కనబడింది. అపచారం ఉపశమించటానికి శాంతి జరిపిస్తున్నాం” అంటూ పూజారి హడావిడిగా ముందుకు సాగిపోయాడు.

అంటే, ఇందాకటిదాకా జరిగిందంతా నిజం కాదా!?! ఆరో గది తలుపు తెరిచాక, అందులో ఏమీ దొరక్కపోవటంతో బయటికొచ్చి మంటపంలో పడుకుని నిద్రపోయానా? ఆ మొద్దునిద్రలో ప్రపంచం నాశనమైపోయినట్లు కలగన్నానా?

హమ్మయ్య. గుండె తేట పడింది. ఎంత భయంకరమైన పీడకల! నిజంలా భ్రమ పెట్టిన కల.

అయినా, ఏమీ దొరక్కపోతే గప్‌చుప్‌న జారుకోకుండా మంటపంలో పడుకుని నిద్రపోవటమేంటి? ఇంకా ఎక్కువ సేపిక్కడే ఉండటం మంచిది కాదు. వెంటనే వెళ్లిపోవాలి. మోటార్ సైకిల్ తాళాలు ఎక్కడ పెట్టానో?

ప్యాంట్ జేబులు వెదుక్కున్నాను. కుడివైపు జేబులో ఎత్తుగా తగిలిందది. బయటికి తీశాను.

అమ్మవారి విగ్రహం! పదంగుళాల ఎత్తున బంగారు రంగులో మెరిసిపోతూ. ఇది నా దగ్గరుంటే మరి ఆ గదిలో వాళ్లకి కనిపించిందేమిటి?

సాలోచనగా చూస్తుండగానే అమ్మవారి బొమ్మ కదిలింది. ఆమె చెయ్యి అలా అలా పెరిగి పెద్దదై వచ్చి నా చెంపని బలంగా తాకింది. అదే సమయంలో ఆమె గొంతు ఉరిమింది.

“మూర్ఖ మానవాధమా. అనుభవించు”.

 

* * 6 * *

 

చెవిలో ఉరిమిన శబ్దానికి ఒక్కుదుటన మెలకువొచ్చింది. సమీపంలో పిడుగు పడినట్లుంది. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. సముద్రమింకా అల్లకల్లోలంగానే ఉంది. నా పుట్టి చిగురుటాకులా వణికిపోతూనే ఉంది. నుదుటి గాయం నొప్పి తట్టుకోనీకుండా ఉంది. తోడుగా తలనొప్పి మొదలయింది. జ్వరం కూడా వచ్చినట్లుంది. వళ్లంతా వేడి సెగలు. జ్వరానికి, చలికీ వణికిపోతూ నేనలాగే పుట్టిలో పడి ఉన్నాను.

ఇదేంటి … ఇంకా పుట్టిలో! మళ్లీ అదే కలా? లేక ఇదే నిజమా? ఇది నిజమైతే ఇందాకటిది అందమైన కలా?

ఏడుపొచ్చింది. కోపమూ వచ్చింది, అమ్మవారి మీద. “అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా?”. దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు. గొంతు పిడచగట్టుకుపోతుంటే వర్షం నీరు దోసిళ్లతో పట్టుకు తాగాను. దప్పిక తీరింది. ఆకలి అలాగే ఉంది. సమయం ఎంతయిందో తెలుసుకోటానికి సెల్‌ఫోన్ కూడా లేదు. పూర్వకాలంలో గడియారాలతో పనిలేకుండానే గంటెంతయిందో చెప్పగలిగేవాళ్లంట. ఆ విద్యేదో నేర్చుకుంటే ప్రస్తుతం పనికొచ్చుండేది. అయినా నా పిచ్చిగానీ, ఇప్పుడు టైమెంతయిందో తెలుసుకుని చేసేదేముంది?

బుర్రనిండా తలాతోకాలేని ఆలోచనలు. తల పగిలిపోతుంది. కళ్లు వాలిపోసాగాయి. అదృష్టవశాత్తూ మళ్లీ మగత కమ్ముకుంది. అది నన్ను నిద్రలోకో, మత్తులోకో …. మొత్తానికి  ఈ నరకం నుండి దూరంగా తీసుకుపోయింది. ఆ పరిస్థితిలో ఎంతసేపున్నానో, తిరిగి మెలకువ వచ్చేసరికి సూర్యుడు నడినెత్తినున్నాడు. వర్షం ఆగిపోయింది. పైన మబ్బుతునక లేదు. సముద్రం ప్రశాంతంగా ఉంది. దాని మీద నా పుట్టి తేలియాడుతుంది. కనుచూపు మేరలో భూమి లేదు. నలువైపులా నీళ్లు. పైన నీలాకాశం. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. సూర్యకిరణాలు సూదుల్లా గుచ్చుతున్నాయి. గొంతెండిపోతుంది. సముద్రపు నీరు దోసిళ్లతో చేదుకు తాగాలన్న కోరిక బలవంతంగా నిగ్రహించుకున్నాను. ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగటమంటే చావుని ఆహ్వానించటమే.

నడిసంద్రంలో నేను. జతగా జ్వరం, ఆకలి, నిస్సత్తువ. తల మీది గాయం సలుపుడు. వంట్లో వేడికి తోడు పైనుండి మండించేస్తున్న ఎండ. తట్టుకోలేనంత ఉక్కపోత. దాని దెబ్బకి కాసేపట్లోనే కళ్లు తిరగటం మొదలయింది. వడదెబ్బ తగిలిందా? మరోసారి మగతలోకి జారిపోయాను.

* * 7 * *

ఎవరో పట్టి కుదుపుతున్న భావనకి మెలకువచ్చింది. నేల మీద వెల్లకిలా పడుకుని ఉన్నాను. జ్వరం, వణుకు తగ్గలేదింకా. మత్తుతో కళ్లింకా వాలిపోతున్నాయి. కష్టంగా వాటిని తెరిచి చూస్తే, నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న అపరిచితులు. దృష్టి ఇంకా మసకగానే ఉండటంతో వాళ్ల ఆకారాలు స్పష్టంగా కనబడలేదు. మొల చుట్టూ ఈకల్లాంటివేవో కట్టుకున్న తుమ్మ మొద్దుల్లాంటి శరీరాలు. ఐదారుగురు ఉంటారేమో. చుట్టూ దడి కట్టినట్లు నిలబడి ఉన్నారు.

వాళ్ల చేతుల్లో ఏంటవి … శూలాలు!

నేనెక్కడున్నాను? ఇది కూడా కలేనా? ఈ విచిత్రాకారులెవరు యమకింకరుల్లా ….

యమకింకరులు!

అర్ధమైంది. నేను చచ్చిపోయాను. నన్ను నరకానికి పట్టుకుపోటానికొచ్చిన యమదూతలు వీళ్లంతా. ఒక్కడి కోసం ఇంతమందా?

కింకరుల్లో ఒకడు ముందుకొంగి నా తల మీద చెయ్యేశాడు. సరిగా గాయమైన చోట. నొప్పి. భరించలేని నొప్పి.

ఇంకా నొప్పేంటి? చచ్చిపోయాకా వదలదా!

కింకరుడి చెయ్యి నెట్టేసే ప్రయత్నంలో తల పక్కకి తిప్పాను. అప్పుడే, తక్కిన కింకరుల్లో కలకలం చెలరేగింది. గజిబిజి భాషలో గందరగోళంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కష్టమ్మీద కళ్లు పూర్తిగా తెరిచి చూశాను. వాళ్లలో ఒకడు కుడివైపుకి చేత్తో చూపిస్తూ ఏదో అరుస్తున్నాడు. నేనూ అటు చూశాను.

సుదూరంగా, ఆకాశంలో మండుతూ దూసుకొస్తున్న అగ్నిగోళం. క్షణక్షణానికీ దాని పరిమాణం పెరిగిపోతుంది. సూటిగా మేమున్న దిశలోనే వస్తుందది.

కళ్లు పెద్దవి చేసి చూడటానికి విశ్వప్రయత్నం చేశాను. అయినా వివరం తెలీకుండా బూజరగానే కనిపిస్తుందది. అంతలో కింకరుల్లో ఒకడు నా కాళ్లు, మరొకడు భుజాలు పట్టుకుని పైకి లేపారు. మిగతావాళ్లు ముందు పరిగెడుతుండగా నన్ను మోసుకుంటూ వాళ్లని అనుసరించారు. అందరి దృష్టీ అగ్నిగోళమ్మీదనే ఉంది. వేగంగా దగ్గరకొచ్చేస్తుందది.

కాసేపట్లో వాళ్లు నన్నో గుహలాంటి దాన్లోకి తీసుకుపోయారు. నేలమీద పడుకోబెట్టి బయటికి చూస్తూ పెద్దగా మాట్లాడుకోసాగారు.

నా చూపింకా మసకగానే ఉంది. అరుణవర్ణంలో ఆకాశం. దాన్ని చీల్చుకొస్తున్న అగ్నిగోళం. వస్తూ వస్తూ అది హఠాత్తుగా పక్షిలా మారిపోయింది. నాకు స్పష్టంగా కనిపించటం లేదు, కానీ అది బూడిద రంగు పక్షి కావచ్చు. ఆగాగు .. పక్షి కాదు … విమానం. అవును విమానమే. దాని పరిమాణం అంతకంతకీ పెరుగుతుంది.

ఎంతమందైనా పట్టేందుకు అనుగుణంగా పరిమాణం పెంచుకునే గుణం పుష్పక విమానానికొక్కదానికే ఉందని విన్నాను. ఇది .. అదేనా?

ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగానే విమానం వచ్చి రన్‌వే లాంటిదాని మీద దిగింది.

పుష్పక విమానానికీ రన్‌వే అవసరమా? వెర్రిగా నవ్వాలనిపించింది. నవ్వాలో వద్దో తేల్చుకునేలోపే విమానం ఇందాక నేను పడి ఉన్న ప్రాంతంలో వచ్చి ఆగింది. కాసేపట్లో అందులోనుండి నాలుగైదు ఆకారాలు బయటికొచ్చి మాకేసి నడవసాగాయి. ధవళవస్త్రాల్లో మెరిసిపోతున్నాయా ఆకారాలు.

ఎవరు వాళ్లు? నన్నీ కింకరుల బారినుండి కాపాడి స్వర్గానికి తీసుకెళ్లటానికొచ్చిన దేవదూతలా?

నాకంతా పిచ్చిపిచ్చిగా ఉంది. ముందు పుట్టిలో, తర్వాత గుళ్లో, మళ్లీ పుట్టిలో, ఇప్పుడిక్కడెక్కడో. అసలు నేనెక్కడున్నాను? తలకి తగిలిన దెబ్బకి వెర్రి కానీ ఎక్కలేదు కదా? నేను కలగంటున్నానా, ఏదో పిచ్చిలోకంలో ఉన్నానా, లేక చచ్చిపోయానా? సుడితిరుగుతున్న ఆలోచనలకి తోడుగా తల తిరగటం మొదలుపెట్టింది. మళ్లీ మత్తు కమ్ముతుంది. నో .. నో…. మత్తులో మునిగితే మరెక్కడ తే..ల…తా….నో…

* * 8 * *

హమ్మయ్య. మేలుకున్నాను. ఈ సారెక్కడున్నాను?

కళ్లు తెరిచి చూశాను. పైనెక్కడో కప్పు కనబడింది. పెద్ద గుహ అంతర్భాగంలా ఉంది. నేనింకా కింద పడుకునే ఉన్నాను, కానీ నేల మీద కాదు. మెత్తటి దేనిమీదో. గాయం పెద్దగా బాధించటం లేదు. వళ్లు కూడా తేలిగ్గా ఉంది. జ్వరం తగ్గిపోయినట్లుంది. లేచి కూర్చోబోయాను.

“మెల్లిగా. మీరింకా పూర్తిగా కోలుకోలేదు”. పక్కనుండి మృదువుగా వినబడిందా గొంతు. తల తిప్పి చూశాను. ఓ ధవళవస్త్రధారి, నా పక్కనే చిన్న బండరాయిమీద కూర్చుని ఉన్నాడు.

“ఎవరు నీవు? దేవదూతవా?”, నా గొంతు పీలగా ధ్వనించింది.

“లేదు. వ్యోమగామిని”

“నేనెక్కడున్నాను?”, సర్దుకుని కూర్చుంటూ ప్రశ్నించాను.

“ఆదిమాన్ ఐలాండ్స్‌లో ఉన్నారు. మీరున్న పుట్టి ఈ ద్వీపానికి కొట్టుకొస్తే ఇక్కడి ఆదివాసీలు కాపాడారు. నాలుగురోజులుగా కళ్లు తెరవనీయనంత జ్వరం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు”

“ఆదిమాన్ ఐలాండ్స్, ఆదివాసీలు! మరి వ్యోమగాములకేం పనిక్కడ?”. హేతువు మళ్లీ నా దరిచేరింది. వళ్లు స్వాధీనంలోకొచ్చేసరికి బుర్ర కూడా పాదరసంలా పనిచేయసాగింది.

“ఈ ద్వీపంలో భారతీయ వ్యోమనౌకలు దిగటానికి అనువుగా రన్‌వే ఉంది”, అతను బదులిచ్చాడు.

అదీ సంగతి. నేను చూసిన అగ్నిగోళం అదన్నమాట! అవి వ్యోమనౌక భూవాతావరణంలో ప్రవేశించినప్పుడు రాపిడికి పుట్టే మంటలన్న మాట.

“మీరు బతికి బయట పడటం ఓ అద్భుతం”, నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ మళ్లీ అతనే అన్నాడు.

“నిజమే. సముద్రంలో మునిగిపోకుండా ఇక్కడికి కొట్టుకు రావటం అద్భుతమే. అంతకు ముందు జరిగిన మారణహోమాన్ని తప్పించుకోటం మాత్రం నా అదృష్టం”

“ఎలా తప్పించుకున్నారు?”, అతను ఆసక్తిగా అడిగాడు.

చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించి చివరికి నోరు విప్పాను. నా కారణంగానే అదంతా జరిగిందేమోనన్న న్యూనతాభావం ఇంకా ఏ మూలో ఉండటం వల్లనేమో, నా ఘనకార్యం ఎవరికన్నా చెబితే కానీ మనశ్శాంతి ఉండదనిపించింది. నేను నేలమాళిగలో ప్రవేశించటం దగ్గర్నుండి మొత్తం పూసగుచ్చినట్లు అతనికి వివరించాక మనసు తేలికపడింది.

“అయితే అసలేం జరిగిందో మీకు తెలీదంటారు”, మొత్తం విన్నాక అతను సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.

“ఊఁహు. మీకు తెలుసా?”

“తెలుసు. సూర్యుడి క్రోధాగ్నిలో మానవులు మాడి మసైపోయారు”.

“వాట్?”, అయోమయంగా చూశాను.

“వివరంగా చెబుతాను వినండి”. అతను గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పటం మొదలు పెట్టాడు. “వారం కిందట జరిగిందది. ఆ రోజు సూర్యుడినుండి విడుదలయ్యే శక్తి హఠాత్తుగా పదులరెట్లు పెరిగిపోయింది. సౌరశక్తిలో హెచ్చుతగ్గులుండటం సాధారణమైన విషయమే కానీ, ఈ సారది ఎవరూ ఊహించనంత ఎక్కువ స్థాయిలో విడుదలయింది. చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరిగిన దాఖలా లేకపోవటాన, జరగబోయేది ముందే ఊహించి మనుషుల్ని ఆప్రమత్తం చేసేందుకు అవసరమైన గణాంకాలు లేక మన అబ్సర్వేటరీలేవీ దీన్ని పసిగట్టలేకపోయాయి. హెచ్చరిక లేకుండా వచ్చిపడ్డ ఉత్పాతమది. దాని దెబ్బకి ముందుగా ఉపగ్రహాలు, వాటి మీద ఆధారపడ్డ సమాచార వ్యవస్థలు నాశనమయ్యాయి. భూవాతావరణం కొన్ని గంటల్లోనే అసాధారణ స్థాయిలో వేడెక్కింది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు పేలిపోయాయి. కరెంట్ లేక, ఏసీలు పని చేయక జనం శలభాల్లా మాడిపోయారు. మండే స్వభావం ఉన్నవన్నీ మండిపోయాయి. నీటి చెలమలు ఆవిరైపోయాయి. సముద్రాల ఉపరితలమ్మీద నీరు మరిగిపోయింది. అక్కడుండే మత్స్య జాతి కళ్లు తేలేసింది. ఈ విలయం ఇరవై గంటల పైగా కొనసాగింది. భూమ్మీద అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ లోగా, సముద్రాల మీది నీటి ఆవిరి పైకెళ్లి చల్లబడి కనీవినీ ఎరగని స్థాయిలో తుఫాన్లు కురిపించింది. ప్రపంచమంతటా కోస్తా ప్రాంతాలని వరదలు ముంచెత్తాయి ….”

అతని వాక్ప్రవాహానికి అడ్డొస్తూ ప్రశ్నించాను, “ఇదంతా మీకెలా తెలుసు?”

“ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనుండి ఈ ఘోరాన్ని ప్రత్యక్షంగా చూశాం మేము.  మూడు రోజుల తర్వాత కింద పరిస్థితులు కుదుటపడ్డాయనిపించగానే హుటాహుటిన తిరిగొచ్చాము. మా రీ-ఎంట్రీలో సహకరించటానికి కిందెవరూ మిగిల్లేరు. అయినా సాహసించి వచ్చేశాం”

“ఈ ఉత్పాతం వల్ల స్పేష్ స్టేషన్‌కి ప్రమాదమేం రాలేదా?”

“భూమ్మీదకన్నా రోదసిలో సూర్యకిరణాల ధాటి ఎక్కువ. కాబట్టి స్పేష్ స్టేషన్ ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది”

“బాగానే ఉంది. మరి, భూమ్మీద మిగతా అందరూ మాడిపోయినా ఈ ఆదివాసీలు క్షేమంగానే ఉన్నారేం?”

“ఆదివాసీలు కావటం వల్లనే వాళ్లు బతికిపోయారు. ప్రకృతితో మమేకమై ఉండటం వాళ్లని కాపాడింది. మనలాంటి నాగరీకులం ఎప్పుడైతే యంత్రాల మీద మితిమీరి ఆధారపడటం నేర్చుకున్నామో, అప్పుడే మనం ప్రకృతి భాష మర్చిపోయాం. ఫలితం? ఇదిగో …. ఇది. మనం రూపొందించుకున్న ఏ సాధనమూ ఈ ప్రమాదాన్ని ముందస్తుగా ఊహించి హెచ్చరించలేకపోయింది. టెక్నాలజీ దన్నుతో ప్రకృతిమీద పై చేయి సాధించానని విర్రవీగిన ఆధునిక సమాజం, తాను నమ్ముకున్న సాంకేతిక వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా కుప్పకూలిననాడు జరిగేదేమిటో అంచనా వేయలేకపోయింది. మనకి భిన్నంగా, ఈ ఆదివాసీలు చుట్టూ ఉన్న ప్రకృతితో నిత్యం సంభాషిస్తారు. అది చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈనాడు అదే వాళ్లని కాపాడింది”

“ఎలా?”

“ఇలాంటి ఉత్పాతాలని ముందుగా పసిగట్టగలిగే శక్తి పశుపక్ష్యాదులకుంది. ఈ విలయం మొదలవటానికి కొన్ని గంటల ముందే ఈ ద్వీపంలో ఉన్న జంతువులన్నీ ఎత్తైన ప్రాంతాలకేసి పరుగులు తీశాయి. అది గమనించి, ఏదో పెనువిపత్తు ముంచుకు రానుందని భావించి వీళ్లు కూడా కొండలపైకెళ్లి అక్కడున్న గుహల్లో దాక్కున్నారు. ఎక్కువ ఎత్తుకి వెళ్లే కొద్దీ వాతావరణంలో వేడి తగ్గుతుందని తెలిసిందే కదా. అదనంగా గుహాంతర్భాగాల్లో ఉండే సహజమైన చల్లదనం తోడై వాళ్లని కాపాడింది”

“అయితే నాగరీకులెవరూ బతికి బట్టకట్టలేదంటారా?”

“అందరూ పోయారనలేం. చల్లటి ధృవాల వద్ద, ఎత్తైన కొండప్రాంతాల్లో ఉండేవాళ్లు కొందరైనా తప్పించుకునే అవకాశం ఉంది. మీలా అదృష్టవశాత్తూ బతికిపోయినోళ్లు కూడా కొందరుండొచ్చు. కానీ వీళ్ల శాతం చాలా తక్కువ. మొత్తమ్మీద, ఆధునిక నాగరికతనేది అంతరించినట్లే. కానీ అంతమాత్రాన అంతా ఐపోయినట్లు కాదు. భూమాత చరిత్రలో మానవుడు లిఖించాల్సిన అధ్యాయాలు మరికొన్ని మిగిలే ఉన్నాయి. ఆ పని కొనసాగించే మహత్తర బాధ్యత ప్రపంచవ్యాప్తంగా మిగిలున్న ఇలాంటి ఆదివాసీలదే”

గుహ ద్వారం వద్ద ఏదో శబ్దమవటంతో సంభాషణాపి అటు చూశామిద్దరమూ. కొందరు ఆదివాసీలు నిలబడున్నారక్కడ. వాళ్లలో ఒకడు లోపలికొచ్చాడు. నేరుగా నా వద్దకొచ్చి నా చేతిలో ఏదో పెట్టాడు.

చండీ అమ్మవారి బంగారపు బొమ్మ. నా జేబులో ఉండాల్సింది.

దాన్ని తిరిగిచ్చేస్తూ ఉంచుకోమన్నట్లు సైగ చేశాను. నన్ను కాపాడినందుకు అంతకన్నా ఎలా కృతజ్ఞత తెలియజేయాలో తోచలేదు.

ఆదివాసీ తల అడ్డంగా ఊపి చాలాసేపు ఏదో గొణిగాడు. ఆస్ట్రోనాట్‌కేసి చూశాను. “ఏమంటున్నాడు?”

అతను నవ్వి చెప్పాడు.

“వాళ్లకు దానితో అవసరం లేదంటున్నాడు”

 ***

Story & Illustration: అనిల్ ఎస్. రాయల్

 

భద్రలోకపు అడ్డుగోడలు కూల్చేసిన గొరుసు!

ఒక కొత్త కథను చదవడమంటే, ఒక కొత్త వ్యక్తితో పరిచయం చేసుకోవడమే అంటారు కొడవటిగంటి కుటుంబరావుగారు ఒకచోట. ఒక మనిషిని చూసీ చూడగానే మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది సానుకూలమయినా కావచ్చు, ప్రతికూలమయినా కావచ్చు. కానీ ఆ మనిషిలో మన పరిచయం పెరుగుతున్న కొద్దీ అతని పట్ల మన అభిప్రాయాలు మారడమో, మరింత బలపడటమో జరుగుతుంది. నిజానికి ఒక మనిషిని అర్థం చేసుకోవడం అనేది ఒక లిప్తలో పూర్తయ్యే క్రియ కాదు. అది జీవితకాలం కొనసాగవలసిన ప్రక్రియ.

ఇలాంటి జీవిత కాలపు ప్రయత్నం కొన్ని కథల విషయంలో కూడా కొనసాగాలి. ఎందుకంటే ఆ కథలు చదివిన ప్రతిసారీ కొత్త అర్థాన్ని ఇస్తాయి. కొత్త కొత్త విషయాలను అవగతం చేస్తాయి. బాహ్య అంతర్లోకాల రహస్యాలను కొత్తకొత్తగా విప్పుతాయి. అందుకే అలాంటి కథలను మళ్లీ మళ్లీ చదవాలి.

ఈ సంవత్సర కాలంలో నేను మళ్లీ మళ్లీ చదివిన కథలు మూడు. ఒకటి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ‘నల్లజర్ల రోడ్డు’, రెండు తల్లావజ్ఝల ‘వడ్ల చిలకలు’, మూడు గొరుసు జగదీశ్వర రెడ్డి ‘చీడ’. ఈ మూడు కథలకి రూపంలో, సారంలో, శైలిలో, శిల్పంలో ఎలాంటి సారూప్యములూ లేవు. వేటికవే ప్రత్యేకమయినవి.

gajaeetaraalu

‘వలసపక్షులు’ కథతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న కథకుడు గొరుసు జగదీశ్వర రెడ్డి. అతడి పాత కథల సంపుటి ‘గజ ఈతరాలు’ కొత్తగా చదవడం ఒక తాజా అనుభవం. ఆంధ్రదేశానికి ఆ మూలన ఉన్న విశాఖపట్నం, ఈ మూలన ఉన్న మహబూబ్‌నగర్‌, ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ ప్రాంత జీవితంలోని చీకటి కోణాలని, ఆ చీకటి కోణాలు ఏర్పడటానికి ఉన్న సామాజిక ఆర్థిక కారణాలను, వాటి కార్యకారణ సంబంధాలను, సునిశిత దృష్టితో, సున్నితంగా వెలికి తీసిన కథా సంపుటి ఇది.

”జీవితం కొందరి పట్ల పరమ దయా పూరితంగా ఉంటుంది. మరికొందరి పట్ల కర్కశంగా ఉంటుంది. దాని ఆగ్రహమూ, అనుగ్రహమూ అకారణమే” అంటారు బుచ్చిబాబు ఒకచోట. ”వలస పక్షులు’ కథ చదువుతున్నంతసేపూ నాకు ఎందుకో కానీ ఈ మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఈ కథలో విశాఖ మాండలికాన్ని, మహబూబ్‌నగర్‌ పలుకుబడిని ప్రతిభావంతంగా ఉపయోగించాడు జగదీశ్వరరెడ్డి.

‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అన్న రాజకీయ నినాదం కొంతమందికి రాజకీయంగా పునర్జన్మ. మరికొంతమందికి అందలాలను ప్రసాదించింది. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయిన కొన్ని గ్రామాలు, అంతకు రెట్టింపు ప్రాణాలు ఇవాళ చరిత్రలో ఎక్కడా కానరావు. వాళ్ల పట్ల చూపించవలసిన కనీస గౌరవం కూడా సమాజం చూపదు. కాంట్రాక్టర్ల దోపిడీకి, దౌర్జన్యానికి బలైపోయిన రాములమ్మ కొడుకు. మరొక పేద తల్లి సహాయంతో పెరిగి పెద్దవాడై, అదే స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ముప్పై ఏళ్ల క్రితం కాంట్రాక్టర్ల రూపంలో మొదలైన దోపిడే, ఔట్‌సోర్సింగ్‌ రూపంలో మళ్లీ కొత్తగా ఎలా రూపు మార్చుకున్నదో తెలిశాక, తన గత జీవితాన్ని సకారణంగా పునశ్చరణ చేసుకోవడం ఇందులో ఇతివృత్తం.

డబ్బుకి ఉన్న విలువకి తప్పిస్తే మరే విలువకీ కట్టుబడని ఆధునిక సమాజపు నగ్న స్వరూపాన్ని ఉత్తమ పురుషలో చెప్పిన కథ మనలను మంత్రముగ్థులని చేస్తుంది. రాములమ్మ మాటలు చదువుతున్నప్పుడు ఎంత నిరాశ నిస్పృహ కలుగుతాయో, ముత్యాలమ్మ మాటలు వింటుంటే జీవితం పట్ల అంత ప్రేమ, భరోసా కలుగుతాయి. జీవిత రథపు చక్రాల కింద పడి తనువు చాలించినది ఒకరయితే, దాన్ని సుదర్శన చక్రంలా వినియోగించుకుని కష్టాలను కడతేర్చినవారు మరొకరు. నిజానికి ఈ రెండు కేవలం పాత్రలు మాత్రమే కాదు, మనిషి మనసులో గారడి చేసే రెండు మార్మిక శక్తులు. ఒక దుఃఖం, ఒక సుఖం. ఈ రెండింటి మధ్యా దోబూచులాడటమే జీవితం అని ఈ కథ చెపుతుంది.

16(1)

అమెరికా సబ్‌ప్రైమ్‌ సంక్షోభానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయినట్లుగానే, ఎక్కడో ఒక చిన్న దురాశ, దురూహ, ఏ మాత్రం సంబంధం లేని ఎందరి జీవితాలనో దుర్మరణం పాలు చెయ్యడం ఒక వైచిత్రి. సునామీ వచ్చి వెళ్లాక కన్పించే విధ్వంసక దృశ్యాలు సునామీ వచ్చిందని బాధితులకు తెలియచెప్పినట్లుగానే, జీవితాలు సమూలంగా మారిపోయాక, జీవ విషం చేదు ఫలం అని అర్థం కావడమూ అంత విషాదం.

ఈ సంపుటిలో ‘చీడ’ కథ చదివాక గుండె బరువెక్కుతుంది. ఆల్విన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవితం ఒక ‘సంతోష చంద్రశాల’ అనుకుంటూ భద్ర జీవనం గడిపే ఒక కుటుంబం, ఆ ఆర్థిక ఆసరా తమ ప్రమేయం లేకుండా చెయ్యిజారి పోతుందో, ఎలాంటి ఉత్పాతానికి గురి అవుతుందో సున్నితంగా చెప్పిన కథ ఇది.

ఉద్యోగం కోల్పోయి హఠాత్తుగా వీధిలో పడిన తరువాత కట్టవలసిన అప్పులు, నెరవేర్చవలసిన బాధ్యతలు కొండలా భయపెడుతుంటే, మామూలుగా స్థిర చిత్తులు అనుకునే పెద్ద పెద్ద వాళ్ళే సంయమనం కోల్పోయి జీవితాన్ని దుఃఖభాజనం చేసుకుంటుంటే, పసిపిల్లల సంగతి చెప్పేదేముంది?

మనుషుల మధ్యన ప్రేమ డబ్బుకొద్దీ పరిపుష్టమవుతుందా? మనుషుల మధ్యన సంబంధాలను కలుపుతూ, విడదీసి, విడదీస్తూ కలిపే ఊహా మేఘం ‘డబ్బు’ పాత్రను జీవితాలలో శూన్య స్థాయిని తీసుకుని రాలేమా? డబ్బు లేకపోతే మనుషుల మధ్య ప్రేమ మరీ అంత బలహీనంగా ఉండాలా? లాంటి ప్రశ్నలు ‘చీడ’ కథ చదువుతుంటే కలుగుతాయి.

ఈ కథలో అరవింద్‌, సుజాత ఇద్దరూ చదువుకున్న వారే! జీవన గమనం పట్ల అవగాహన ఉన్నవారే. వారే జీవితంలో వచ్చిన పెనుమార్పుకు తల్లడిల్లి చిగురుటాకుల్లా కంపించి పోతే, చిన్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది.

ఉద్యోగం ఉన్నప్పుడు అప్పుచేసి మరీ కట్టుకున్న ఇల్లు – పడకగది కిటికీని అల్లుకున్న ‘రేరాణి’, కాంపౌండ్‌ ముందున్న సంపెంగను ప్రధాన పాత్రలుగా చేసి చిట్టితల్లి అంతరంగ ఆవిష్కరణను, లలిత లలితంగా చేసిన కథ, చివరలో చిట్టితల్లి కోరికను తెలుసుకుని పాఠకుడు కళ్ల నీళ్ల పర్యంతం అవుతాడు.

ప్రపంచీకరణ విధానాలనే లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ విధానాలని ప్రపంచీకరణ విధ్వంసం గురించి తెలిసిన వాళ్లు ముద్దుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ప్రపంచీకరణకు మకర ముఖమే కానీ, మానవీయ ముఖం లేదని, లాటిన్‌ అమెరికా, అర్జెంటీనా అనుభవాలు చెప్పకనే చెపుతున్నాయి. అయినా వాటిపట్ల మక్కువ పెంచుకున్న రాజకీయ ఆర్థిక అధికారులకు, చిట్టితల్లి జీవితంలో ఎదురయిన సంక్షోభం గురించి ఎప్పటికయినా అర్థం అవుతుందా?

తల్లిదండ్రుల మధ్య సరైన సంబంధాలు లేకపోతే పిల్లలు ప్రేమరాహిత్యానికి గురి అవుతారు. ప్రేమరాహిత్యంలో పెరిగిన పిల్లలు ఎలాంటి భవిష్యత్‌ సమాజానికి సృష్టికర్తలు అవుతారు? ఈ ప్రశ్నను బలంగా వినిపించిన కథ ‘చీడ’.

పిల్లల ప్రపంచంలో లేనిదేమిటో ఎవరికయినా తెలుసా? కోపం, ద్వేషం, అసూయ. మరి పిల్లల ప్రపంచాన్ని వెలిగించేదేమిటి? ప్రేమ. పిల్లల లోకంలో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. మనం పిల్లలకి ఎంత ప్రేమను యిస్తే వాళ్లు మనకు రెట్టింపు ప్రేమను యిస్తారు. ఒక మనిషిని ద్వేషించడానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చు. అందులో పట్టుదల అనే రీజన్‌ కూడా ఉండవచ్చు కానీ ప్రేమించలేకపోవడానికి ఏ కారణమూ ఉండదు. జీవితంలో అసలయిన విషాదం ప్రేమించలేకపోవడమే.

ఈ విషయాన్ని బలంగా చెపుతుంది ‘వాచ్‌మాన్‌’ కథ? ‘గూర్ఖా’ పేరుతో ఎండ్లూరి సుధాకర్‌ ఒక మంచి కవిత రాశారు. అది ఎంతో మంది ప్రశంసలు పొందింది. ఆ తరువాత ఆ స్థాయిలో అనుభూతిని యిచ్చిన కథ ‘వాచ్‌మాన్‌.’ తమ అపార్ట్‌మెంట్‌కు అనునిత్యం కాపలా కాస్తూ, తమకు తలలో నాలుకలా ఉంటూ, తమ పనులన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిపెట్టే వాచ్‌మాన్‌ అకస్మాత్తుగా చనిపోతే, అతని చివరి  సంస్కారం గురించి కులం, మతం, సంప్రదాయం అంటూ సాకులు వెతికిన పెద్దల చిన్న బుద్ధులను, వాళ్ల పిల్లలే అసహ్యించుకుని, తమ స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి మనసులకు మాలిన్యం అంటదని చెప్పిన కథే యిది.

పుత్రుడి గురించి చెప్పేటప్పుడు మన వేదాలు ‘అంగా అంగాత్‌ సంభ వసి’ అని ‘ఆత్మా వై పుత్ర నామాసి’ అని వ్యాఖ్యానించాయి. తల్లిదండ్రుల ప్రతి అంగంలో నుండి పిల్లల అవయవాలు రూపుదిద్దుకుంటాయని భావం. అలాంటప్పుడు పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమను ఏ ప్రేమమాపకంతో కొలవగలం. లోకంలో చెడ్డ కొడుకులు, చెడ్డ భర్తలు ఉండవచ్చు కానీ, చెడ్డ తల్లి మాత్రం ఉండదని అంటారు. ఈ మాటలకి, ప్రత్యక్ష ప్రతీకలుగా రెండు కథలు నిలుస్తాయి.

Gorusu(1)

ఒకటి ‘వాల్తేరత్త’, రెండు ‘గజ ఈతరాలు’.

చెడు వ్యసనాలకి బానిసయిన భర్తతో లాభం లేదనుకొని కొడుకు ఉన్నత భవిష్యత్తు కోసం తనకు తెలిసిన వడ్డీల వ్యాపారం చేస్తూ జీవితాన్ని కరిగించుకున్న వరాలమ్మ, కొడుకుకి సర్కారీ నౌకరు రావాలని జీవితాంతం కష్టపడి, ఆ ఉద్యోగం సంపాదించాక, తదనంతర పరిణామాల నేపథ్యంలో కొడుకుకి భారం కాకూడదనుకున్న పూర్ణమ్మ, రెండు ప్రత్యేక పౌనః పున్యాలలో తల్లి ప్రేమను విశదీకరిస్తారు.

”నానెంత వడ్డీ యాపారం సేసినా నానూ మడిసి జలమే ఎత్తాను. ఆడపుట్టకే పుట్టి పాలిచ్చే పెంచాను. నా పేగు తీపి వొవులికి అరదమవుతాది బాబూ! నా సిమ్మాసెలం ఒచ్చేత్తాడొచ్చేత్తాడని నా మనసంతాది బాబూ! ఆడెక్కడున్నాడో కానీ… ఆడి పేగోసన అప్పుడప్పుడూ నా ముక్కుకి తగలతాది బాబూ” అంటుంది వాల్తేరత్తలో వరాలమ్మ.

సింహాచలం ఆమెను దగా చేసి వెళ్లిపోయాడు. అయినా వాడెప్పుడో వస్తాడని ఆమె ఎదురుచూపు, పేగు కదలిన చప్పుడు వినడం ఏ చర్మ చక్షువుకు సాధ్యపడుతుంది.

కొడుకు పెద్దవాడయ్యాడు. తన రెక్కల కష్టం కొడుకు గవర్నమెంటు ఉద్యోగస్తుడు కావాలన్న తన కోరికను తీర్చింది. చివరి క్షణాలు కొడుకు దగ్గర ఆనందంగా గడుస్తున్నాయి కూడా. కానీ పులిమీద పుట్రలాగా కంపెనీ మూతపడింది. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా పనిచేసే కంపెనీ ప్రయివేట్‌ పరం అయింది. లిబరలైజేషన్‌, ప్రవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ కాస్తా లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌గా మారి కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేశాయి. దానికితోడు తనకు వచ్చిన జబ్బుకి కావలసిన మందులు కొడుకుకు అదనపు భారం కాకూడదు అనుకున్నది.

”ఊర్లందరికీ ఈత నేర్పి, ఈదరాకుండా రెండు కాళ్లకు బండరాళ్లను కట్టుకున్నది…. బలిమిసావు సచ్చె కొడుకా…” ఈద గలిగి ఉండీ బలవంతంగా ప్రాణం తీసుకోవడం వెనక ఉన్న విషాదం ఏ ప్రపంచ బ్యాంకు ప్రాయోజిత ప్రపంచీకరణ కథ సారథులకు అందుతుంది?

వాల్లేరత్తలో వరాలమ్మ, గజ ఈతరాలులో పూర్ణమ్మ. వీళ్ళిద్దరి ప్రేమ ఏ నిర్వచనానికి అందుతుంది? తమ కొడుకులు సుఖంగా ఉంటే తాము సుఖంగా ఉన్నట్లే అన్న వాళ్ల తాత్వికత, అందుకోసం తమ జీవితాలని త్యాగం చెయ్యడం ‘అంగారంగాత్‌ సంభ వైసి’ అన్న వాక్యానికి నిలువెత్తు దర్పణంలాగా లేదూ? ‘ఆత్మా వై పుత్ర నామసి’ అంటే ఇదే కదా!

ఇలా ఈ సంపుటిలోని ప్రతి కథ గురించీ వివరంగా రాయొచ్చు. మొత్తంగా ఈ కథలు-

1. ప్రపంచీకరణ మధ్య తరగతి జీవితాలలో సృష్టించిన విధ్వంసాన్ని దృశ్యమానం చేస్తాయి. డబ్బు లేనప్పుడు కూడా మనుషుల మధ్య ప్రేమానుబంధాలు ఉంటాయి కానీ… అవి గుర్తించలేనంత బలహీనంగా ఉంటాయి అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తాయి.

2. జీవితం ఏ నిర్వచనాలకీ లొంగదని, నాటకీయత లేదా ఐరనీ దాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయని చెప్పకనే చెపుతాయి.

3. అపార్ట్‌మెంట్‌ పిల్లల రూపంలో జీవితం పట్ల ప్రేమనీ, బ్రతుకు భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగిస్తాయి.

4. సున్నితత్వం లోపల ఉంటే గోరంత వెలుగే కొండంత దీపమై దారి చూపిస్తుందని అనుభవంలోకి తెస్తాయి. ఒక సందిగ్ధ కాలంలో రాష్ట్రంలోని రెండు విభిన్న ప్రాంతాల, ప్రజల అంతరంగ కల్లోలాన్ని సున్నితంగా స్థానిక స్పహతో అక్షరబద్ధం చేసిన కథలు ఇవి.

  – వంశీకృష్ణ

———————————————————————————————–

చీడ

-గొరుసు జగదీశ్వర్ రెడ్డి

 

 

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ళ క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురు బొంగు అవసరం మీకు. అదే నా చిట్టి తల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం.

నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కలకలలాడేది. నాతోపాటు ఎన్నోరకాల పూలమొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి.

ఇంటి ముందు నుండి ఎవరు వెళ్ళినా, మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిముషంపాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్ళేవారు. విషాదమేమంటే అలా ఆస్వాదించిన వాళ్ళే రెండేళ్ళుగా ఏదో కాలిన వాసన వేస్తున్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకొని గబగబ వెళ్ళిపోతున్నారు.

ఇప్పుడు నన్నల్లుకున్న మాధవీలత, కిటికీ దగ్గరున్న రేరాణి, నా మొదలు దగ్గరున్న డిసెంబరం పొద, రెండు మూడు రకాల తెగులుపట్టిన పండ్ల చెట్లు తప్పించి… తోటంతా బోసిపోయింది.

*

గాలికి అటూ, ఇటూ ఊగుతున్న నేను గేటు చప్పుడుకి అటుకేసి చూసేను. లోపల్నుండి వేసిన గడియని అందుకోవాలని మునివేళ్ళపై నిల్చుని తీసే ప్రయత్నంలో ఉంది చిట్టితల్లి.

భుజాలపై వేలాడే పది కేజీల పైనే బరువున్న పుస్తకాల సంచీని, చేతిలోని కేరేజ్‌ బుట్టనీ దభీమని వరండా అరుగుపైన విసిరేసింది.

ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడే పడున్న షూ జతల్లో తాళం చెవికోసం వెతికింది. దొరికినట్టు లేదు. గబగబ గేటుదాకా వచ్చి అన్నయ్య కోసం కాబోలు అటూ, ఇటూ చూసింది. వాడి అలికిడి ఎక్కడా ఉన్నట్లు లేదు.

విసురుగా వెనక్కి వచ్చి వరండా మెట్లపైన కూర్చొని, మోకాళ్ళ మధ్యకి తలను వాల్చేసి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.

అరగంట ముందే వచ్చిన శ్రావణ్‌ స్కూల్‌ బేగ్‌ని ఇంట్లో పడేసి, బేట్‌ పట్టుకొని క్రికెట్‌ ఆటకోసం పరిగెట్టడం చూసేను. ఇంటికి ఎవరు తాళం వేసినా చెవిని తలుపు పక్కనున్న చెప్పుల అరలోని ఏదో ఒక షూలో రహస్యంగా దాచి వెళ్ళడం అలవాటు.

చిట్టితల్లి కన్నా శ్రావణ్‌ మూడుళ్ళు పెద్ద.

చిట్టితల్లి ఆరున్నొక్కరాగానికి నా గుండె కరిగిపోతోంది.

ఎంత మారిపోయిందీ పిల్ల! స్కూలు నుండి రావడంతోనే మమ్మల్ని పలకరించి, ముద్దాడి కబుర్లు చెప్పిగానీ వరండా మెట్లెక్కేది కాదు. అలాంటిది, మా ఉనికే తెలీనట్లు ప్రవర్తిస్తోంది. ఎప్పుడూ గలగల మాట్లాడ్తూ, కిలకిల నవ్వుతూ గెంతులేసే మా చిట్టితల్లేనా! ఏదో గాలిసోకినట్లు రోజురోజుకీ ఎలా క్షీణించిపోతోందీ…

నే వచ్చేసరికి చిట్టితల్లి మూడేళ్ళ పిల్ల. తేనె కళ్ళు, గులాబీ బుగ్గలు, బీరపువ్వులా పసుపు ఛాయతో బొద్దుగా ఉండి, గునగున నడిచేది.

ఇప్పుడు చిట్టితల్లికి పదో ఏడు.

ఛాయ తగ్గి, సన్నబడి, ఒంటరితనంతో దిగులుగా ఉంటోంది.

ఆ ఏడుపు నాకు రంపపుకోతలా ఉంది. నా తల్లిని పట్టించుకునే వాళ్ళేరీ? ఏం చేయాలో పాలుపోవడం లేదు.

”అయ్యో, అలా ఏడవకమ్మా, నా బంగారుతల్లివి కదూ, ఇలారా, నే తొడిగిన మొగ్గలు చూడు. రేపు పూస్తాగా, నే పూచేది నీ కోసమేరా…”   బతిమాలుతూ పిలవాలని పించింది.

ఎదురింటావిడ వచ్చి పిల్చింది. అన్నయ్య వచ్చేదాకా వాళ్ళింట్లోనే ఉండమంది.

”ఆకలేస్తోంది మమ్మీ, డాడీ రాత్రి ఎప్పుడొస్తారో తెలీదు. అన్నయ్య ‘కీ’ తీసుకెళ్ళాడు. బోల్డంత హోంవర్క్‌ చేసుకోవాలి” ఆమె మాటకి వెక్కిళ్ళ మధ్యే ఆగి ఆగి సమాధానం ఇస్తోంది.

మెల్లగా తన కాళ్ళకున్న షూ విప్పి, ఆపైన మేజోళ్ళు తీసి వాటిలోనే ఉంచి పక్కకు గిరాటేసింది.

కళ్ళు తుడుచుకుంటూ లేచి నిల్చుంది.

మళ్ళీ ఒకసారి గేటువైపు నడిచింది. కాస్సేపు అక్కడే ఉండి, వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి, ఆ తర్వాత నా దగ్గరగా వచ్చి నిల్చుంది.

”నన్ను మర్చిపోయావు కదూ” నా మాట అర్థమయినట్టు జవాబుగా తన రెండు చేతుల్తో నన్ను చుడ్తూ తన గుండెలకేసి హత్తుకుంది. ఆ స్పర్శకు ఒళ్ళంతా పులకరించింది. ఒక్కసారిగా ఏడ్చేశాను. ఇద్దరం ఆత్మీయంగా గొప్ప అనుభూతితో చాలాసేపు మౌనంగా ఉన్నాం. ముందుగా నేనే తెప్పరిల్లి-

”చూడు నా తోటి మొక్కలన్నీ ఎలా ఎండిపోతున్నాయో! చిగుళ్ళు ఎలా వాడిపోతున్నాయో! మా గురించి ఎవరూ పట్టించుకోరు. చివరకు నీవు కూడానూ, నీ చేతుల్తో నీళ్ళు పోసి ఎంత కాలమయిందీ, నేనింకా ఎవరికోసం బతుకుతున్నానో తెలీదూ? చేమంతులూ, విరజాజీ, పారిజాతం.. వాటిలాగే చివరకు నేనూ నీకు దూరం అవుతాను. అదిగో మీ కిటికీ దగ్గరున్న రేరాణి ఎలా కొన ఊపిరితో ఉందో!  నీవు స్కూల్లో నుండి రాగానే నీకు పండ్లను అందించే జామకు తెగులుపట్టి ఎన్నాళ్ళయ్యిందో…” నా ఆత్మఘోషను నా చిట్టితల్లికి ఎలా చెప్పను?

చిట్టితల్లి వంక పరిశీలనగా చూసేను. కళ్ళల్లో తెలియని భయం, ఎండుతున్న పెదాలు దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, మొద్దుబారుతున్న శరీరం.

”చర్మం చూడు, ఎలా పగిలిపోయి ఉందో, వెన్న రాయమని మమ్మీతో చెప్పమ్మా” నా మనసు చదివినట్టు పగిలిన చర్మంకేసి దిగులుగా చూసుకుంది.

తన ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళేరీ!

మెల్లగా నిల్చొని, మళ్ళీ వరండా మెట్లపైన కూర్చోడానికి వెళ్ళింది.

చూస్తుండగానే ఆవలిస్తూ, అలాగే వెనక్కి వాలి ఒరిగి కళ్ళు మూసుకుని పడుకొంది. ధనుర్మాసపు చలికి వణుకుతున్నట్లు ముడుచుకుపోతోంది చిట్టితల్లి. చెల్లాచెదురైన చెప్పులు, బాగ్‌లోంచి వీడిన పుస్తకాలు, కేరేజీ ఎంగిలి గిన్నెలు – మధ్యలో నా చిన్నారి, అయ్యయ్యో! దోమలు స్వైరవిహారం చేస్తూ, రక్తం పీల్చేస్తున్నాయి కదా… దోమల్ని పారదోలమని గాలిని బతిమాలుకున్నాను.

శ్రావణ్‌ త్వరగా వస్తే బావుణ్ణు.

రాత్రి అయినట్లు తెలుస్తోంది. వీధిలోని ట్యూబ్‌లైట్‌ కాంతి ఇంటి గోడపైన పడుతోంది. ఆడుకొంటోన్న పిల్లల్ని ‘ఇక ఆటలు చాలించి, చదివి చావండి’ అంటూ తల్లుల గర్జనలు విన్పిస్తున్నాయి. అడపాదడపా ఏవో వాహనాలు వెళ్తున్న శబ్దం.

తూర్పున చంద్రోదయం అయినట్లు నాకు కొద్దిదూరంలో ఉన్న మామిడి చెట్టు ఆకుల్లోంచి వెన్నెల చిట్టితల్లి మొహంపైన ఊగుతోంది.

ఎంత సందడిగా ఉండే ఇల్లు… ఎట్లా మారిపోయింది!

మళ్ళీ ఆ రోజులు వస్తాయా?

*

నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు… అంతా కొత్తగా, దిగులుగా ఉండేది. కానీ మేము పూచే పూలలాంటి చిట్టితల్లి ఈ ఇంట్లో ఉందని తెలిసి సంతోషం వేసింది. నాతోపాటే గులాబీ, పారిజాతం వచ్చాయి.

మేం వచ్చేసరికి మామిడి, జామ, సపోట, దానిమ్మ ఆరునెలల వయసువి, తొలకరిలో వచ్చాం. తీరా కార్తీకానికి మల్లి, చేమంతి, రేరాణి, నూరు వరహాలు వచ్చాయి.

అరవింద్‌, సుజాత ఇద్దరూ గునపంతో గుంతలు తవ్వడం, మమ్మల్ని నాటడం, శ్రావణ్‌, చిట్టితల్లి బకెట్లతో నీళ్ళు తెచ్చి, చిట్టిచిట్టి చేతులతో మాకు పోయడం… ఎంత సుకుమారంగా పెంచారనీ మమ్మల్ని.

మా గురించి అందరూ శ్రద్ద తీసుకునేవాళ్ళే. మేం పూచే పువ్వుల్ని ఫొటోలు తీసి, ‘ఎంత అందంగా వచ్చాయో’ అంటూ ఇంటికి వచ్చిన మిత్రులకు చూపిస్తూ పొంగిపోయే అరవింద్‌ ఇంత నిర్దయగా ఎలా మారిపోయాడు!

అరవింద్‌ ఉద్యోగం చేస్తున్న కంపెనీ సొసైటీ తరపు నుండి కొత్తగా కట్టుకున్న ఇల్లు. ఎల్‌.ఐ.సి లోనుతో ఆ కాలనీలో దాదాపు వెయ్యి ఇండ్లదాకా కట్టారు. ఎవరెవరి స్తోమతని బట్టి వాళ్ళు ఇంటిని రకరకాలుగా తీర్చిదిద్దుకుంటున్నారట.

నన్ను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు గమనించాను. వీధులకు అటు ఇటుగా పూచి ఉన్న తురాయిలూ, దిరిసెనలూ కాలనీకి ఎంత అందంగా ఉన్నాయో!

నేను వచ్చేసరికి ప్రహరీగోడ పూర్తి కావస్తోంది. మేం రాకముందే పది ట్రాక్టర్ల ఎర్రమట్టిని, రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువుని పోయించి చదును చేయించాట్ట. అరవింద్‌కి మొక్కలంటే ప్రాణం. తలపాగా చుట్టి అచ్చం రైతులా పార, గునపం, కత్తెర్లతో పెరట్లోకి వచ్చేవాడు. మాకు కుదుర్లు కడుతూ, గొప్పులు తవ్వుతూ, అడ్డుగా పెరిగే మమ్మల్ని అందంగా కట్‌ చేస్తుండగా లోపల్నుండి కాఫీ కప్పుతో వచ్చేది సుజాత. తనూ పనిలో పాలు పంచుకోబోయేది.

”గార్డెన్‌ వర్కంతా నాదే, కిచెన్‌ వరకే నీ పరిధి” అంటూ సుజాతని పని చేయనిచ్చే వాడు కాదు. కాస్సేపు ఇద్దరూ సరదాగా ఒకర్నొకరు గిల్లికజ్జాలు పెట్టుకునేవారు. పెరట్లో వాళ్ళిద్దరూ అలా చిలకా గోరింకల్లా తిరుగుతూంటే తోటంతా కళకళలాడేది. అంతలో స్కూల్‌ నుండి శ్రావణ్‌, చిట్టితల్లి వచ్చేసి మాకు నీళ్ళు పోయడానికి తయారయ్యేవాళ్ళు.

ఒక్కోసారి పైపుని కొళాయికి తగిలించి, మాకు స్నానం చేయించేది చిట్టితల్లి… మేం ఆ నీటి వేగానికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి, ఉక్కిరిబిక్కిరై అటూ, ఇటూ ఊగుతుంటే కిలకిలమంటూ పడీపడీ నవ్వేది.

నేను వచ్చిన ఏడాదికే పెరడంతా పచ్చగా మెరిసిపోయింది.

రాత్రనక, పగలనక మేం పూచే పూలవంక మురిపెంగా చూస్తూ, పండుటాకుల్ని  ఏరిపారేస్తూ కబుర్లు చెప్పేది చిట్టితల్లి. ‘పురుగూ, పుట్రా ఉంటాయి. పెరట్లోకి వెళ్ళొద్ద’ని మందలించే సుజాత మాటల్ని అంతగా పట్టించుకునేది కాదు.

సాయంకాలం నీరెండలో అరవింద్‌ చిట్టితల్లితో కలిసి ఆడుకుంటున్నప్పుడు… ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగిరే కొంగల్ని చూపిస్తూ, అవి ఎక్కడికి వెళ్తున్నాయనీ, చీకటి రాత్రుళ్ళలో తళతళ మెరిసే నక్షత్రాల్ని చూపిస్తూ అవి ఎందుకలా మెరుస్తున్నాయని లక్ష ప్రశ్నలు వేసేది.

ధృవుడు, గొరుకొయ్యలు, పిల్లలకోడి, మంచంకోళ్ళు… ఒక్కో నక్షత్రం చూపించి, వాటి గురించి చెబుతూ ఉండేవాడు. సప్తరుషి మండలంలోని అరుంధతీ నక్షత్రాన్ని చూపించి ఆమె కథ గురించి చెప్పాడు.

”అది మా స్కూల్‌ మేడమ్‌ పేరు కదా, ఆ స్టారుకు అరుంధతి అని పేరు ఎవరు పెట్టారు?” అంటూ ప్రశ్నించేది.

స్కూల్‌కి వెళ్ళే ముందు వాళ్ల క్లాస్‌ టీచర్ల కోసం ఎక్కువగా గులాబీలు కోసుకెళ్ళేది. నేనప్పటికి ఇంకా మొగ్గలు తొడగలేదు.

ఒకరోజు స్కూల్‌ నుండి రాగానే, డ్రస్‌ తీసి, గౌను వేసుకొని, టవల్‌ని చుట్టుకొని కుడివైపు పైటేసుకుంది. లోపల్నుండి కుర్చీ ఒకటి తెచ్చి మా మధ్యలో వేసింది. గేటు బయటకి వెళ్ళి రోడ్డు పక్కనున్న కానుగ కొమ్మ విరిచి బెత్తంలా తయారుచేసింది.

నిశ్శబ్దంగా చిట్టితల్లి చేష్టలని గమనిస్తున్నాం. గాలి కుదుపులకు మేమంతా ఒక్కసారిగా అటూ, ఇటూ ఊగేసరికి ”సైలెన్స్‌, సైలెన్స్‌” అంటూ చేతిలోని బెత్తాన్ని ఊపింది. అచ్చంగా వాళ్ళ టీచర్‌ మల్లే, తెచ్చిపెట్టుకున్న గంభీరంతో. ‘నేలకు జానెడుంది. పొట్టి బుడెంకాయ టీచరమ్మ మాకొద్దు.’ చిట్టితల్లి బెత్తం దెబ్బకు తమ రెమ్మలు గాల్లోకి ఎగిరాయన్న కోపంతో చిందులు తొక్కాయి దవనం, మరువం.

”ష్‌… తప్పర్రా. ఇదంతా ఉత్తుత్తినేరా” ఇద్దర్నీ బుజ్జగించాను.

”ఆఁ, ఎవరెవరు హోంవర్క్‌ చేయలేదో చేతులెత్తండి”

”హోంవర్క్‌ అంటే” నావైపు వంగి అడగబోయింది మందారం.

”ష్‌… సైలెన్స్‌”

”ఇదిగో పారిజాతం, నిన్న ఇచ్చిన లెక్కల హోంవర్క్‌ చేసావా?”

”చేమంతీ, నీ సైన్స్‌ హోంవర్క్‌ ఏదీ?”

”మందారం నీకసలు బుద్ధిలేదు. ఆ బొండుమల్లితో మాటలేమిటీ”

”డిసెంబరం నిన్నటి ఇంగ్లీషు గ్రామర్‌ కంప్లీట్‌ చేసావా?” తన చేతిలోని బెత్తంతో సన్నగా చరిచేది.

కాస్త నెప్పిగానే ఉన్నా చిట్టితల్లి ఆరిందాతనానికి ముచ్చటేసేది. అది మొదలు రోజూ స్కూల్‌ నుండి రాగానే మాకందరికీ పాఠాల్తోపాటే రయిమ్స్‌ పాడించడం, డాన్స్‌లు చేయించడం… ప్రతిరోజూ చిట్టితల్లితో ఆటల్లో పండగే.

పెరట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్న బంతులు, లిల్లీలు మా ఆటలు గమనిస్తూ గాలికి లయగా తమ సన్నని నడుములు వయ్యారంగా ఊపుతూ ఆనందంగా డాన్స్‌లు చేసేవి.

శ్రావణ్‌ ఒక్కోసారి గేటు బార్లా తీసి వెళ్ళేవాడు. వీధిలోని పిల్లలంతా బిలబిలమంటూ వచ్చేసేవారు. గడుగ్గాయిలు. తిన్నగా ఉంటారా! మమ్మల్ని నలిపి, గిల్లి చిగుళ్ళు తుంచి నానా రభస. ఇంతలో సుజాత వచ్చి అరిస్తే మమ్మల్ని వదిలి పరిగెత్తేవాళ్ళు.

నా గుబుర్లలో ఓ బంగారు పిచిక నారతో గూడు అల్లటం నేను మరవలేదు. ఆవగింజంత మెదడైనా ఉందో లేదో గాని, దాని తెలివేం తెలివనీ! రెండు ఆకుల్ని కలుపుతూ తెల్లని జిగురు పామింది. ఆ ఆకుల మధ్యనుండే నారను తాడులా పేనుతూ, చిన్న వెలక్కాయంత సైజులో గూడు అల్లి రెండు గుడ్లు పెట్టింది. అవి పిల్లలు అయ్యాక చూడాలి నా అవస్థ. ‘కిచకిచకిచకిచ’ క్షణం నిద్రపోనిచ్చేవి కాదు కదా! అప్పుడు నా ఎత్తు మూడు అడుగులే. చిట్టితల్లికి నేను బాగా అందేదాన్ని.

చిట్టితల్లి తడతడవకీ రావడం, నా గుబుర్లు విడదీసి, పిచిక పిల్లల్ని మురిపంగా చూస్తూ ముద్దాడటం… తొండలు, పిల్లులూ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడేదాన్నో. గూడు మూడో కంటికి తెలీకుండా కొమ్మల్తో కప్పేసేదాన్ని.

రాత్రుళ్ళు మాపైన రాలిన మంచు బిందువుల్ని ముక్కుల్తో పొడిచి నీరు తాగేవి. అప్పుడు మాత్రం భలే కితకితలుగా ఉండేది.

మా పూలలోని మకరందం తాగి తాగి మత్తెక్కిన సీతాకోకచిలుకలు, తుమ్మెదలు కదల్లేక కదల్లేక గాల్లో పల్టీలు కొడ్తూ ఎగిరేవి. మా పూలపుప్పొడి రజన తాపడంతో వాటి శరీరాలు ధగధగ మెరుస్తూ కాంతులీనేవి.

ఒకరోజు హఠాత్తుగా పిల్లల్ని తీసుకొని బంగారుపిచుక ఎగిరిపోయింది. చిట్టితల్లి పిచికలు కావాలని పేచీ పెట్టింది.

”వాటికి రెక్కలొచ్చాయి కదా. ఎన్నాళ్ళని తల్లి తెచ్చి పెడుతుంది. తిండి ఎలా సంపాదించాలో నేర్పించడానికి పిల్లల్ని తీసుకెళ్ళింది. మళ్ళీ వచ్చేస్తాయిగా” అంటూ అరవింద్‌ ఊరడించాడు. కానీ ఎన్నాళ్ళయినా పిచికలు రానేలేదు.

తెలతెలవారుతుండగా జాంపళ్ళు కోసం వచ్చే చిలుకల్ని చూపించాడు చిట్టితల్లికి. వాటిని చూస్తూ నెమ్మదిగా బంగారు పిచికల్ని మరిచింది. తూనీగల గాజురెక్కల రెపరెపల్ని చూస్తూ మురిసిపోయేది చిట్టితల్లి.

మేం ఎందరం ఉన్నా మేడ మీదకి పాకించిన రాధామనోహరాలంటే చాలా ఇష్టం తనకి. పొడవైన కాడల్తో, ఎరుపు, తెలుపు రంగుల్లో గుత్తులుగా పూసే ఆ పూలని అందుకోవాలని ప్రయత్నించేది. గాలికి రాలిన వాటి కాడల్తో జడలల్లేది.

ఉడతలు మా పొదల్లో దాగుడుమూతలాడుతూ చిట్టితల్లి రాగానే మామిడిచెట్టు ఎక్కేసేవి. ఇంటికి నైరుతివైపు అరటి చెట్లు ఉండేవి. అవి గెలలు తొడిగినప్పుడు, అరటిపూలలోని తేనె కోసం గబ్బిలాలు గుంపుగా వచ్చేవి. వాటిని చూస్తూనే చిట్టితల్లి హడలిపోయి, ఇంట్లోకి పారిపోయి దాక్కునేది.

‘అరటిపూలల్లో అమృతం దాచుకున్నట్లు మాయదారి గబ్బిలాలు, దిక్కుమాలిన గబ్బిలాలు, చిట్టితల్లిని జడిపిస్తున్నాయి కదా.’ కాయలు పెరిగి, పూత రాలేకొద్దీ…రావడం తగ్గించేశాయి.

చిట్టితల్లిని నేనెంత ప్రేమించేదాన్నో- అంతకన్నా ఎక్కువగా ప్రాణం వదిలేది మేమంటే… ఆరోజు సుజాత, అరవింద్‌ పిల్లల్తో కలిసి తోటలో  దాగుడుమూతలు ఆడుతున్నారు. ఈసారి సుజాత వంతు వచ్చింది. కళ్ళకు గంతలు కట్టారు. సుజాత దొంగ అనగానే అరవింద్‌ కేరింతలు కొట్టాడు. సరదాగా గిల్లి ఏడిపించవచ్చని. వాళ్ళిద్దరి సరాగాలు చూస్తే మాకెంతో ముచ్చటేసింది. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమని… అరవింద్‌, పిల్లలిద్దరూ దొరక్కుండా చప్పట్లు చరస్తూ పరుగులు తీస్తున్నారు. అంతలో పక్కనే ఉన్న డిసెంబరంపై కాలు వేసింది సుజాత. అది గమనించిన చిట్టితల్లి –

”మమ్మీ, నా డిసెంబరాన్ని తొక్కేశావు. చూడు ఎలా విరిగిపోయిందో” గట్టిగా అరుస్తూ పైకి లేపింది.

”సారీ డిసెంబరం” కళ్ళకు గంతలు విప్పుతూ అంది సుజాత.

తల్లి వైపు కోపంగా చూస్తూ శ్రావణ్‌తో గుడ్డ తెప్పించి, తడిపి, విరిగిన కొమ్మ వద్ద కట్టు కట్టింది. చిట్టితల్లి ప్రేమకు మేమంతా కరిగిపోయాం.

ఇంట్లోని విషయాలు, అరవింద్‌, సుజాతల మధ్య జరిగే సంభాషణలు ఎక్కువగా రేరాణి ద్వారా తెలిసిపోయేవి. రేరాణి వాళ్ళ పడగ్గదిని ఆనుకునే ఉండేది కదా… చెవులు రిక్కరించి మరీ విని, గాలితో కబుర్లు పంపేది.

చిట్టితల్లి రోజూ వాళ్ళ మమ్మీ డాడీలపైన చేతులు వేసి, అరవింద్‌తో కథలు చెప్పించుకొని గానీ పడుకోదట. ఏరోజు ఏ కథ చెప్తాడో రేరాణి మళ్ళీ ఆ కథ నాకు విన్పించేది.

నా చిట్టితల్లి పుట్టినరోజు వచ్చిందంటే ఎంత సందడనీ, ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేలకు దిగివచ్చినట్లు మమ్మల్ని చిన్నచిన్న లైటు బల్బులతో అలంకరించి అరవింద్‌ ఎంత హడావుడి చేసేవాడో! మా మధ్య రౌండు టేబుల్‌ వేసి, అందమైన ముఖమల్‌ గుడ్డ కప్పి, ఆ పైన పెద్ద కేక్‌ కట్‌ చేయించేవాడు.

వీధిలోని పిల్లలు, కంపెనీలో కొలీగ్స్‌ అంతా వచ్చేవారు. వాళ్ళు తెచ్చిన బహుమతుల్ని ఎంతో మురిపెంగా మాకు చూపించేది చిట్టితల్లి.

చూస్తుండగానే నేను ఇంట్లోకి వచ్చి రెండేళ్ళు దాటింది. నేను చిట్టితల్లికి అందనంతగా ఎదుగుతున్నాను. మాధవీలతను నా కొమ్మలకు పాకించారు.

మామిడి, దానిమ్మలు అప్పుడప్పుడే పిందెలు వేస్తున్నాయి.

ఈమధ్య అరవింద్‌ డ్యూటీ అవగానే ఇంటికి రావడంలేదు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఏ పన్నెండుకో వస్తున్నాడు.

మనిషి చాలా అసహనంతో ఉన్నట్లు అనిపించింది. పిల్లలిద్దరూ పడుకున్న తర్వాత అరవింద్‌, సుజాత మాకు దగ్గర్లోనే కుర్చీలు వేసుకొని చాలా రాత్రి వరకు మాట్లాడుకునే వాళ్లు. అవన్నీ కంపెనీకి, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు.

పసుపు కనకాంబరం హఠాత్తుగా ఎండిపోయి చనిపోయిందో రోజు. ఏం జరిగిందో తెలీలేదు. మా రెమ్మలు విరిగితేనే తల్లడిల్లే అరవింద్‌ కనకాంబరం గురించి పట్టించు కోలేదు. చిట్టితల్లి మాత్రం ఏడ్చింది.

ఆవేళ రాత్రి ఎనిమిది గంటలప్పుడు అరవిందుతో పాటే కంపెనీలో పనిచేసే కొందరు మిత్రులు వచ్చారు. వాళ్ళంతా మామిడిచెట్టు కిందున్న పచ్చికలో కూర్చున్నారు. వరండా లోని ట్యూబ్‌లైట్‌ కింద చిట్టితల్లి హోంవర్క్‌ చేసుకుంటోంది. లోపల్నుండి అందరికీ ఏ నిమ్మకాయరసమో తెచ్చినట్టుంది సుజాత.

”అరవింద్‌ రేపు నీవు డైరెక్ట్‌గా మన యూనియన్‌ లీడర్‌ని తీసుకొని సెక్రటేరియట్‌ దగ్గరికి వచ్చేయ్‌. మేం కంపెనీ దగ్గర్నుండే ర్యాలీ తీస్తాం. చూద్దాం. అన్ని యూనియన్‌ వాళ్ళూ ఒక్కటయితేనే గానీ లాభం లేదు. ఆ మధ్య ప్రైవేట్‌కి అప్పగిద్దాం అనుకున్నారా, కానీ నిన్న జరిగిన యూనియన్‌, మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌లో ఏకంగా లాకౌట్‌ చేసే ఉద్దేశ్యం ఉందట గవర్నమెంట్‌కి…” వాళ్ల మాటల్లో చిట్టితల్లి వచ్చింది.

మధ్యలోకి ఎందుకొచ్చావని చిరాకుతో కసిరేడు అరవింద్‌. చిన్నబుచ్చుకున్న చిట్టితల్లి నా వద్దకు వచ్చి నిల్చుంది.

రాత్రి ఏ ఒంటిగంట వరకో వాళ్ళ చర్చలు సాగినట్లున్నాయి. ఆకాశంలో గొరుకొయ్యలు నడినెత్తికి వస్తుండగా నిద్రలోకి జారుకున్నాను.

ఆ తర్వాత చాలా రోజులు ర్యాలీలనీ, ధర్నాలనీ తిరిగేడు అరవింద్‌. వాటిల్లో తిరుగుతున్నప్పుడు పోలీసుల లాఠాఛార్జీలో దెబ్బలు తగిలి, రెండ్రోజులు హాస్పిటల్‌లో ఉండి వచ్చాడు.

సుజాత కూడా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటోంది. శ్రావణ్‌ ఎక్కువగా క్రికెట్‌ పిచ్చితో బయటే ఉండేవాడు. పాపం! చిట్టితల్లి ఒక్కర్తీ దిగులుగా బిక్కచచ్చినట్లు మా మధ్య తిరిగేది.

క్రమేపి ఇంట్లోని వాతావరణంలో ఏదో మార్పు చోటు చేసుకుంది. మరికొంత కాలం ఇలాగే మందకొడిలా సాగింది.

ఏమయ్యిందో తెలీదు. ఈ మధ్య చాలా రోజుల్నుండి అరవింద్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాడా… మాకు గొప్పులు తవ్వడం, ఎరువులు వేయడం… కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోవట్లేదు.

ఈ మధ్య సుజాత ఏదో కాస్మోటిక్స్‌ ఏజన్సీ తీసుకొని మెంబరయ్యింది. సుజాతకు చేదోడుగా ఉంటుందని అప్పుడప్పుడు పిల్లలకు వంటచేసి, హోంవర్కులు చేయించేవాడు అరవింద్‌. అదీ కొంతకాలమే. ఇంటి పనులు తనవల్ల కావట్లేదని చేతులెత్తేసేవాడు.

మరో ఆర్నెల్లలో అరవింద్‌కు ప్రైవేట్‌లో చిన్న ఉద్యోగం దొరికింది. ఇక అప్పట్నుండీ మొదలయ్యాయి చిట్టితల్లికి కష్టాలు.

సాయంకాలం స్కూలు నుండి వచ్చేసరికి ఇంటికి తాళం ఉండేది. మొదట్లో ఎదురింట్లో వాళ్ళకి తాళం చెవి ఇచ్చేవారు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఒక్కతే ఉండేది. శ్రావణ్‌కు ఎప్పుడూ ఆటపిచ్చే.

పెరట్లో నేల బీడుపడిపోతోంది. మా మొదళ్ళు నేలలో బిగుసుకుపోయాయి. గాలి అందదు, నీళ్ళు పోసే దిక్కులేదు.

చిట్టితల్లి కూడా ఏదో పోగొట్టుకొన్నదానిలా మా అవసరాల్ని మరిచిపోసాగింది. చూస్తూ చూస్తూ ఉండగానే మందారం, చేమంతులు, విరజాజీ, పారిజాతం… ఒక్కొక్కటీ నన్నొదిలేసి వెళ్ళిపోతున్నాయి.

అయ్యో! ఇవన్నీ చూసేందుకే ఇంకా ఉన్నానా… నేనూ వెళ్ళిపోతే నా చిట్టితల్లిని ఊరడించే వాళ్ళెవరూ!

ఏదో విధంగా తేమని పీల్చుకుంటూ జీవిస్తున్నాను.

అప్పుడప్పుడు సుజాత రాత్రి పది దాటేక వచ్చేది. వాళ్ళ ఆఫీసు మేనేజరు ఒక్కోసారి కారులో డ్రాప్‌ చేసి వెళ్ళేవాడు.

అరవింద్‌ మొదట్లో కొంత భరించినా, రానురానూ సుజాతని క్షమించలేకపోయేవాడు. ఇద్దరి మధ్యా రభస మొదలయ్యేది. సుజాతని సాయంత్రం ఆరులోపుగా ఆఫీసు వదిలి రమ్మనేవాడు.

”నేను చేసేది ఏజన్సీ కంపెనీ. చాలామంది ఏజంట్లని కుదర్చాలి. ఎక్కడెక్కడికో తిరగాల్సి ఉంటుంది. రాత్రి చాలా పొద్దుపోతే మా బాస్‌ మనింటిదాకా డ్రాప్‌ చేయడం తప్పా… నీ ఇన్ఫీరియారిటీ వల్ల నీకంతా తప్పుగా తోస్తుంది.”

సుజాత చాలా ఎత్తిపొడుపుగా జవాబు ఇచ్చేది. ఆ మాటలకి అరవింద్‌లో అహం దెబ్బతినేది.

కోపంతో ఊగిపోయేవాడు. చేతికందిన వస్తువు బద్దలయిపోవడం ఆ సమయంలో అతి మామూలయిపోయింది.

అరవింద్‌కు ఇప్పుడు తెలుస్తోంది ఇంటిపనుల్లోని నరకం.

పాపం సుజాత! ఎంత కష్టపడేది! తెల్లవారింది మొదలు… మేం రాత్రంతా రాల్చిన పండుటాకుల్ని ఊడ్చి ఎత్తడం, గదులన్నీ చిమ్మటం, కల్లాపీ, ముగ్గులు, ఉదయం టిఫిన్లు, ముగ్గురికీ కేరేజీలు కట్టడం, గిన్నెలు తోమటం, బట్టలుతకడం, పిల్లలకు స్నానాలు, స్కూల్లో దిగబెట్టడాలు… మళ్ళీ సాయంకాలం టిఫిన్లు, హోంవర్కు చేయించడం, రాత్రి వంట, పడుకునేవరకు వంచిన నడుం ఎత్తకుండా ఎంత పనిచేసేది!

సుజాత ఎంత పనిచేసినా అలిసినట్లు అనిపించేది కాదు. ఇంటి పనంటే తనకెంతో ఇష్టంలా చేసేది.

తనిప్పుడు తీసుకున్న ఏజన్సీకి సంబంధించి కాస్మోటిక్స్‌ని అమ్మటం, వాటి తాలూకు పాలసీల కోసం తిరిగి తిరిగి వాడిన తోటకూర కాడల్లే రావడం… మళ్ళీ బండెడు చాకిరీ గుర్తుకు రాగానే సన్నని వణుకు ప్రారంభమయ్యేది ఆమెలో.

ఇద్దరి మధ్యా అప్పుడు మొదలయ్యేది సన్నని సెగ. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారిన తీరల్లే… పిల్లల ముందే మాటా మాటా అనుకుంటూ తమ వివేకాన్ని పూర్తిగా కోల్పేయేవారు.

అరవింద్‌ అమ్మ, నాన్నలు వచ్చారొకసారి. ఇద్దరూ ముసలివాళ్ళు. కాస్త జబ్బులో ఉన్నట్టనిపించింది. చిట్టితల్లికి కాస్త ఊరటగా ఉంటుందనుకున్నాను. తాత, నాన్నమ్మలతో బాగానే కలిసిపోయి కబుర్లు చెబుతోంది.

వాళ్ళ నాన్నమ్మని తోటంతా తిప్పుతూ మమ్మల్ని పేరుపేరునా పరిచయం చేసింది.

”నాన్నమ్మా, ఈ నీలిగోరింట పువ్వుల్లాంటి జూకాలు చేయిస్తావా?”

”అలాగే తల్లీ”

”నాన్నమ్మా. మా క్లాస్‌లో అర్చిత తన బర్త్‌డేకి మొగలిపూల జడ వేసుకొచ్చింది. మనం కూడా మొగలిచెట్లు వేసుకుందామా?”

”మొగలిచెట్లు ఇంట్లో పెంచుకోరాదమ్మా, పాములొస్తాయి”

”అమ్మో! నాకు పాములంటే భయంగా”

”నాన్నమ్మా! చంద్రకాంతల్ని అల్లి నా సిగచుట్టూ ముడివేస్తావా, మా జానకి టీచర్‌ అలాగే పెట్టుకొని వస్తుంది”

”చంద్రకాంతలేఁ ఖర్మ తల్లీ, మన తోటంతా కనకాంబరాలు, డిసెంబరాలు ఉంటేనూ, ఎంచక్కా వాటిని అల్లిపెడ్తానేఁ”

చిట్టితల్లి కోసం మామిడిచెట్టుకు కొబ్బరితాళ్ళతో ఊయల కట్టేడు తాతయ్య. తాళ్ళు గుచ్చుకోకుండా పాత దుప్పటి మడతపెట్టి వేసింది నాన్నమ్మ.

చిట్టితల్లిని ఊయలలో ఊపడం తనకొచ్చిన పాటలు పాడి కథలు చెప్పడం నాన్నమ్మ పని.

చిట్టితల్లికి మంచి స్నేహితులే దొరికారు కాలక్షేపానికి. మళ్ళీ కొద్దికొద్దిగా చిట్టితల్లి ముఖంలో కళ రావడం చూస్తుంటే తృప్తిగా ఉంది.

అప్పుడప్పుడు డ్యూటీకి సెలవు పెట్టి వాళ్ళను హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాడు అరవింద్‌.

ఆరోజు బెడ్‌రూమ్‌లో తెల్లవార్లూ లైట్‌ వెలుగుతూనే ఉంది. అరవింద్‌ సుజాతల మధ్య ఏదో వాగ్వివాదం నడుస్తోందని అనిపించింది. రేరాణితో విషయం తెలుసుకొని బాధపడ్డాను.

”మీ అమ్మానాన్నలు ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నారల్లే ఉంది. ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో మీకు తెలీదా! మరో గది కట్టాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. మీకు వి.ఆర్‌.ఎస్‌. కింద వచ్చిన లక్షా ఈ ఆరునెలల్లో ఎలా మాయం అయ్యాయో తెలీదు. ఇప్పుడు మీరు డ్యూటీకి లీవులు పెట్టి వీళ్ళను హాస్పిటల్‌ చుట్టూ తిప్పితే జీతం ఎంత తగ్గుతుందో ఆలోచించారా”

”నేను సరదాగా తీసుకెళుతున్నానా, నిన్ను తీసుకెళ్ళమని చెప్పలేదే”

”ఎంతకూ మీ ధోరణి మీదేనా. హాస్పిటల్‌ ఫీజులు, మందుల ఖర్చు ఎంతవుతుందో తెలీదా”

”వాళ్ళకు వచ్చే పెన్షన్‌లోంచే ఖర్చు పెడుతున్నాను. నీవు సంపాదించేది అడిగితే అప్పుడు అడుగు.”

”వాళ్ళ ఫించనీ ఎంతనీ, రెండురోజులు హాస్పిటల్‌ ఫీజు, మందులకే సరి. రోజు రోజుకూ ధరలు ఎలా మండిపోతున్నాయని ఇద్దరం ఉద్యోగం చేస్తున్నామన్నమాటే గాని, రాబడి ఎంత తక్కువగా వస్తుందో తెలియదా? ఇద్దరు మనుషుల భోజనం కనీసం రెండువేలయినా నెలకు అదనపు ఖర్చు. మనకు జరుగుబాటుగా ఉంటే ఇలా అంటానా. పైగా ఇద్దరూ అనారోగ్యంతో ఉన్నారు. వీళ్ళను కనిపెట్టుకుని ఇంట్లో ఎవరుంటారు? నిన్ను ఒక్కడ్నే కన్నారా? మీ అన్నయ్య ఉన్నారు కదా… అక్కడికి వెళ్ళమనండి.”

”నీకసలు మతుండే మాట్లాడుతున్నావా”

తెల్లవార్లూ ఇద్దరి మధ్యా చాలా రభస జరిగిందని చెప్పింది.

”నాన్నమ్మ, తాత అచ్చంగా ఇక్కడే ఉండిపోతారంట తెలుసా” ఎంతో సంతోషంతో చిట్టితల్లి వాళ్ళ స్నేహితులతో చెప్పడం విన్నాను. కానీ… ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవకుండానే ఆ ముసలి దంపతులిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ, తమ సామానుతో వెళ్ళి పోవడం చూసిన నేను ”అయ్యో ఎందుకెళ్తున్నారమ్మా. నా చిట్టితల్లి కోసం ఇక్కడే ఉండిపోకూడదు” బాధతో తల్లడిల్లాను.

వాళ్ళు వెళ్ళిన రోజు అరవింద్‌, సుజాతల మధ్య చిన్న యుద్దమే జరిగింది. వాళ్ళ వాదులాటల్లో పిల్లలిద్దరూ చెరో మూలకీ నక్కి బెదిరిపోయి చూస్తారట.

ఇప్పుడు చిట్టితల్లి మళ్ళీ ఒంటరిదయిపోయింది.

కథలూ, కబుర్లూ చెప్పేవారు ఎవరూ లేరు. మంచానికి ఆ చివర్నొకరు, ఈ చివర్నొకరు పడుకోవడంతో వారిద్దరి మధ్యలో పడుకునే చిట్టితల్లికి చేతులు వేద్దామనుకుంటే ఎవరూ అందటంలేదు. పలకరిస్తే కసురుతున్నారు. ఒక్కోసారి చేయి చేసుకుంటున్నారు. ఆ దృశ్యం చూళ్ళేకపోతున్నానని దుఃఖిస్తూ గాలితో చెప్పి పంపింది రేరాణి.

ఓసారి మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లల్ని గొడ్డును బాదినట్లు బాదింది సుజాత. ఆవేళ ఎంత కన్నీరు మున్నీరయ్యానో… ఏం మనుషులు! లోపలి అసహనాల్ని పిల్లల మీదా చూపించడం.

పిల్లలు రోజూ సాయంత్రం స్కూల్‌ నుండి రాగానే వారికిష్టమైన టిఫిన్‌ చేసిపెట్టి తరువాత వరండాలో కూర్చోబెట్టి చదువు గురించి శ్రద్ధతో కనీసం గంటకు పైగా సమయాన్ని కేటాయించేది సుజాత.

మరిప్పుడు- అసలు వారి చదువుల్లో తలదూర్చక ఎన్నాళ్ళయిందీ?

అరవిందు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ పట్టించుకోవడం చూడనేలేదు! మార్కులు తక్కువ వచ్చాయని వాతలొచ్చేలా చితకబాదితే వచ్చేది చదువా! ముందే పిల్లలిద్దరూ వాళ్ళకే తెలియని ఒంటరితనంతో విలవిల్లాడిపోతున్నారని వీళ్ళకి ఏ భాషలో చెప్పేది?

ఆవేళ సుజాతపైన నిజంగానే కోపం వచ్చింది నాకు.

చిట్టితల్లిని ఊరడిద్దాం అని ఎంతగా ప్రాణం కొట్టుమిట్టాడిందో… కానీ చిట్టితల్లి సుజాత భయానికి ఇంట్లోంచి కదల్లేదు, పుస్తకాన్ని వదల్లేదు.

అప్పుడప్పుడు సుజాత ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. అరవింద్‌ పడుకున్న తర్వాత ఒక్కర్తీ మేల్కొని నిద్రపోతున్న పిల్లల్ని స్పృశిస్తూ మౌనంగా కన్నీరు పెట్టేది. ఆమెలో ఏదో చెప్పుకోలేని అలజడి కనిపించేది.

పిల్లల్ని కొట్టినరోజు రాత్రి ఆరుబయటకు వచ్చి మామధ్య కూర్చుని వినీవినబడనట్లుగా దుఃఖిస్తూ తన తలరాతని తిట్టుకుంటూ తనలో తాను గొణుక్కోవడం చూసి, ఆమెపై ఆ క్షణంలో చాలా జాలి కలిగింది.

స్కూల్‌ నుండి వచ్చిన పిల్లలకు సేమియా పాయసం మొదలుకొని, మెత్తని పకోడీల వరకు వాళ్ళ కిష్టమైన పిండివంటలు చేసిపెట్టేది. తోటలోని పండ్లేకాక, బయట నుండి తెచ్చినవీ తినిపిస్తూ, పోషక విలువలతో పిల్లల్ని పెంచాలని పరితపించే సుజాత .తనిప్పుడు పిల్లలకి ఏమీ పెట్టలేకపోతున్నానని బాధపడేది చాలసార్లు.

తన జీతంలోంచి చిట్స్‌ వేస్తానంటోంది సుజాత. ”ఇద్దరి జీతం ఇంటిఖర్చులకే సరిపోతే మరి భవిష్యత్‌లో పిల్లలకు కూడబెట్టేదెప్పుడూ కాలేజి చదువులప్పుడు డొనేషన్స్‌ కట్టేదేలా?”

”వాటర్‌, కరెంట్‌, టెలిఫోన్‌ బిల్‌, స్కూల్‌ ఫీజ్‌..వీటితో నాకు సంబంధం లేదు. అవన్నీ నీ జీతంలోంచే…” అరవింద్‌.

”ఇంటికి ఎల్‌.ఐ.సి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోతే వడ్డీ పెరిగిపోతుంది ముందుగా అది కట్టాకే మిగతా ఖర్చులు” సుజాత.

ఒకటి, ఒకటీ…మాటా మాటా.. పంతాలు, వాదనలు, తర్కాలు… అలకలు, అరుపులు… ఇద్దరి మధ్య అన్యోన్యత అంతరించి అనురాగం సన్నగిల్లి, అవగాహనా రాహిత్యం బలపడుతోంది. ఒక్కరోజా, రెండ్రోజులా… ఇదేమి సంసారం? ఇంకా ఎంత కాలమో? మధ్యలో బిక్కచచ్చే చిట్టితల్లి బాధ చూడలేకున్నాను…ఎడమొహం పెడ మొహాలతో ఉంటే నా సౌరభాన్ని ఆస్వాదించేదెవరూ? నాకు తేమ అందటం లేదు. జీవ పదార్థం నాలోనూ ఎండిపోతుంది…రేరాణి ఏడుస్తూ మొరపెట్టుకుంది.

మామిడి, జామ మిగతావి అందనంత ఎత్తుకు వెళ్ళాయి.

జామకు పట్టిన తెల్లదోమ గాల్లో చెల్లాచెదురై చిరాకు తెప్పిస్తోంది.

నాకు తెలిసీ వాళ్ళిద్దరి మధ్య మాటలు ఆగిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. కొన్ని విషయాల్లో పిల్లలు మధ్యవర్తులు. మొదట్లో పిల్లలకు  కొత్తగా ఉండేది. ”మీ ఇద్దరికీ మాటలువచ్చు కదా, మధ్యలో మేమెందుకు” ఒకసారి శ్రావణ్‌ అనుమానం ప్రకటించాడు. తర్వాత్తర్వాత పిల్లలకు వాళ్ళమధ్య దూరం కొలవడం అలవాటైపోయింది.

చూస్తుండగానే టెలిఫోన్‌ కనెక్షన్‌ కట్‌ అయిపోయింది. ఫ్రిజ్‌ ఉన్నా వాడకంలో లేదు. కార్టూన్‌ సినిమాలు చూస్తూ సరదాపడే పిల్లలు కేబుల్‌ కనెక్షన్‌ తీయించేస్తున్నప్పుడు ఎంత విలవిల్లాడారనీ.

ఎంతో ఆదర్శంగా ప్రేమించి పెళ్ళీ చేసుకున్న జంటనీ, పైగా కులాంతరమనీ ఇంటికి వచ్చిన మిత్రులు అప్పుడప్పుడు పొగడ్డం విన్పించేది. నాకు ఈ ప్రేమలకు, ఆదర్శాలకు లొంగని అతీతమైన శక్తి ఏదో పట్టి పీడిస్తోందని అనుమానం.

ఇప్పుడు ఇంటికి ఎవరూ రావడంలేదు. అరవింద్‌ అమ్మానాన్నలు ఇప్పుడెక్కడున్నారో ఎలా ఉన్నారో వాళ్ళ వివరాలేవీ తెలియవు. ఒకవేళ అరవింద్‌ కు తెలిసినా వాళ్ళ ప్రసక్తి ఇంట్లో పిల్లల ముందు కూడా తేవడం లేదు.

మళ్ళీ ఈ మధ్య ఏవో అసహనాలు రేగుతున్నాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టనంతగా దూరం అవుతున్నారనిపించింది. వాళ్ళ మాటల్లో విడిపోవడాలు, విడాకులు, ఒకర్ని మరొకరు దగా చేసారని దెప్పుకోవడాలు.. రేరాణి పంపే పిడుగుల్లాంటి వార్తలు నాలో ఫిరంగులు పేలుస్తున్నాయి. మనసంతా అతలాకుతలం అయిపోతుంది.

దేశాల మధ్యే కాదు యుధ్ధాలు సంసారాలలోను జరుగుతాయనిపించింది. ప్రాణాలు కోల్పోయేదెప్పుడూ అమాయక జీవులే. ఈ ఇంట్లో జరిగిన యుద్ధంలో అన్నీ అలా అంతరించిపోగా దిక్కుతోచని స్థితిలో క్షతగాత్రులమై మిగిలిఉన్నాము. మాతోపాటు శ్రావణ్‌, చిట్టితల్లీనూ…

ఎక్కడో సింహాచలంలో పుట్టి ఇలా వీళ్ళమధ్యకు రావడం ఏమిటి? చిట్టితల్లి మా అందరికీ నేస్తం కావటం నవ్వుల పువ్వులతో కళకళలాడిన సంసారం రానురాను ఏదో గ్రహణం పట్టినట్లు క్షీణించిపోతుంది.

ఈ క్రమం ఇలా సాగాల్సిందేనా! తడారిపోతున్న జీవ పదార్థంతో కన్నీరు కూడా రాల్చలేని పరిస్థితి నాది.

*

గేటు చప్పుడవుతోంది. శ్రావణ్‌ వచ్చినట్టున్నాడు. వరండాలో పడుకున్న చిట్టితల్లిని బేట్‌తో పొడుస్తూ నిద్రలేపాడు.  నిద్రమత్తులో ఊగుతూ లోపలికి వెళ్ళింది.

రాత్రి ఎనిమిది దాటే వుంటుంది. అరవింద్‌, సుజాతలు ఇంకా రాలేదు. ”చిట్టితల్లి అప్పుడే ఆకలని ఏడ్చింది. నిద్రలో ఆకలి మర్చిందేమో.., సన్నని బాధ సుళ్ళు తిరుగుతూనే వుంది. చిట్టితల్లి ఆలోచనల్లోనే చిన్నగా కునుకుపట్టింది.

ఎల్‌.ఐ.సి లోను కట్టడం చేతగావట్లేదని చేతులెత్తేసాడు. అరవింద్‌. ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఎవరో ఇల్లు చూసేందుకు వచ్చారు. మొక్కలన్నీ  నరికేసి అపార్ట్‌మెంట్‌ కట్టాలని ఆలోచనట.

ఆ మాట వినగానే నాతోపాటు మిగతా చెట్లన్నీ గజగజ వణికిపోయాయి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు నన్ను వదల్లేక చిట్టితల్లీ  ఒకటే ఏడుపు. సుజాత చిట్టితల్లి చేయి పుచ్చుకొని బరబర ఈడ్చుకుపోతుంది.

చిట్టితల్లి రోదన రంపపుకోతలా విన్పిస్తోంది. గుండె తరుక్కుపోతుంది. చిట్టితల్లిని వదిలేసి నేను బతకగలనా?

ఎక్కడో బాంబులు పేలినట్లు నేల అదురుకు ఒక్కసారిగా కంపిస్తూ కళ్ళు తెరిచాను

పీడకల… ఒళ్ళంతా చెమటలు.

ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి…. వస్తువులేవో ఎగిరిపడుతున్న శబ్దాలు.

రాత్రి పన్నెండు దాటిందేమో

ఉండుండి అరవింద్‌, సుజాతలు అరుపులు, పిల్లల ఏడుపులు విన్పిస్తున్నాయి.

ఇంటికి ఏ శని పట్టిందో తెలీదు. లేకపోతే అర్థరాత్రివేళ…. ఇదేం ప్రళయం!

పెద్దగా ఏడుస్తూ, ఇంట్లోంచి దూసుకువచ్చింది చిట్టితల్లి.

ఏం జరిగిందో అడిగేలోగా వచ్చి నన్ను చుట్టేసింది.

గౌను మడతల్లో దాచిన వస్తువేదో నా మొదలు దగ్గరున్న డిసెంబరం కొమ్మల్ని పాయలుగా తీసి గుబుర్లలో  దాచింది.

వెక్కివెక్కి ఏడుస్తున్న పిల్లను ఎలా ఊరడించను?

”ఏం జరిగిందమ్మా’ అంటూ రేరాణిని అడిగాను.

రేరాణి చెప్పింది విని అవాక్కయిపోయాను. వీరి మధ్య శతృత్వం చాపకింద నీరులా పాకుతోందని తెలుసుకాని, పరాకాష్టకి చేరిందని ఇప్పుడే తెలిసింది. ఒకరికొకరు ప్రేమగా ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకున్న కానుకల్ని, కలిసి తీయించుకున్న ఫొటోల్ని చింపేస్తూ, కాల్చేస్తున్నారట.

ఇద్దరికీ పిచ్చిగానీ పట్టలేదు కదా!

వాళ్ళ ప్రవర్తన గుర్తొచ్చినప్పుడల్లా వణికిపోతూ వెక్కిళ్ళతో బెక్కుతూనే ఉంది. చిట్టితల్లి.

ఒకప్పుడు తమ పిల్లలతోపాటే మమ్మల్ని, వెన్నెలనీ అపారంగా ప్రేమించిన వీళ్ళ మధ్య అంతర్యుద్ధం ఎలా మొదలయిందని మూలాలు వెతకసాగేను.

తెగులు పట్టిందని చెట్టు మొదలు నరుక్కుంటారా!

మూలం ఏదైనా కానీ…

మీ ఇద్దరి మధ్యా పిల్లలు నలిగిపోతున్నారనీ, మీరు పంచే ప్రేమ కోసం పరితపిస్తున్నారనీ మీ వల్ల పూరేకుల్లాంటి బాల్యం పసివాడుతోందని… ఎలా గొంతెత్తి చెప్పను?

భగవాన్‌! దిక్కులు పిక్కటిల్లేలా నా బాధను అరిచి చెప్పడానికి నా స్వరాన్ని పలికించు.

దుఃఖంతో గొంతు పూడుకుపోయింది నాకు.

చాలాసేపు తరువాత సుజాత వచ్చింది. నన్ను కావలించుకున్న చిట్టితల్లిని నా నుండి విడదీసి, ఇంట్లోకి తీసుకెళ్ళింది.

అప్పుడు గుర్తొచ్చి చూసేను. డిసెంబరం గుబుర్లలో చిట్టితల్లి దాచిందేమిటని? వెన్నెలకాంతిలో కన్పించింది. మూడెళ్ళ క్రితం మా అందరి మధ్య తీయించుకున్న ఫొటో అది.

మమ్మీ డాడీల భుజాలపై కూర్చొని వాళ్ళ మెడచుట్టూ చేతులు బిగించి, నవ్వులు చిందిస్తూ శ్రావణ్‌, చిట్టితల్లి.

చిట్టితల్లి కోరుకుంటున్నదేమిటో అర్థమై గుండె బరువెక్కింది.

 

                   ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

26 సెప్టెంబరు 2003

 

కథా నేపథ్యం

1992-93 ప్రాంతంలో ఆల్విన్‌ కంపెనీలో పనిచేసే కార్మికుల కోసం ఓ గూడంటూ ఉండాలనే ఆలోచన వచ్చింది అప్పటి మా యూనియన్‌ ప్రెసిడెంట్‌ శ్రీ దయాకర్‌ రెడ్డి గారికి. వారు దీన్ని బలోపేతం చేసి, కూకట్‌పల్లికి దగ్గరలో స్థలాల్ని వెతికి, అంతవరకూ మేం దాచుకున్న పి.ఎఫ్‌.తో ప్లాట్స్‌ అలాట్‌ చేశారు. తర్వాత ఎల్‌.ఐ.సి.లోన్‌తో మాకు ఇండ్లను కట్టించి ఇచ్చారు. 1994లో ఆ ఇండ్లలోకి వచ్చాం. ఇంటికి కాంపౌండ్‌ కట్టుకుని, రకరకాల మొక్కల్ని నాటుకున్నాం.

మా పాప రోహిత ఎప్పుడూ చెట్ల మధ్యనే ఉండేది. వాటితో మమేకమయ్యేది. వాటితో మనసువిప్పి మాట్లాడేది. ఇక మా బాబు తేజ. వాడి ఆటల ప్రపంచం వాడిదే. సొంత ఇల్లు, చక్కని సంసారం … మనిషికి ఇంతకంటే ఏం కావాలీ?

హైదరాబాద్‌లో మాకంటూ సొంత ఇల్లుంది అని సంతోషించేంతలో ఆల్విన్‌ మూత పడింది. అప్పుడు మొదలయ్యాయి కష్టాలు.

సాఫీగా సాగుతున్న జీవితాలకు అదొక పెద్ద కుదుపు. ఉద్యోగాల వేటలో ఊరిమీద పడ్డాం. అంతవరకు ఆర్థిక సూత్రంపై నిలబడ్డ పచ్చటి సంసారాలు తలకిందులు కాసాగాయి.

విధి వక్రించింది. అన్నిటికీ మూలం డబ్బే అయ్యింది. నాతో పాటు తను కూడా చిన్న ఉద్యోగం చూసుకుంది. ఇద్దరం ఏ రాత్రికో ఇల్లు చేరేవాళ్లం.  సాయంత్రం స్కూల్‌ నుండి అలసిపోయి వచ్చిన పిల్లలు ఈసురోమని ఒంటరిగా ఉండేవాళ్ళు.

అంతవరకు చెట్ల ఆలనా పాలన చూసిన వాళ్ళం, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా మొక్కల్ని హత్య చేసినవాళ్ళం అయ్యాం.

పని ఒత్తిడి, చాలీచాలని జీతాలు, తప్పనిసరిగా కట్టాల్సిన ఎల్‌ ఐ సి ఇన్‌స్టాల్‌మెంట్‌, పెరిగే ఖర్చులు వెరసి మా ఇద్దరిలో చిరాకు, అసహనం, అవగాహనారాహిత్యం పెరగసాగాయి. ఒకపక్క పిల్లల్ని సరిగా చూళ్ళేకపోతున్నామనేది తెలుస్తూనే ఉంది.

తల్లిదండ్రుల మధ్య సరయిన సంబంధాలు లేకపోతే పిల్లలను లాలించలేరు, ప్రేమించ లేరు. వీరిద్దరి కోపాగ్నిలో ఆ పసికూనలు సమిధలవుతారు. వారి అందమైన బాల్యంపై అదొక వేటు.

ప్రశాంతమైన కొలనులోకి ఎవరో రాయి విసిరి అల్లకల్లోలం సృష్టించినట్టయింది. మా జీవితాల్లో కొట్టొచ్చినట్టు కన్పించే ఈ మార్పుకు కారణం మా కంపెనీ మూసివేతా? అందుకు పరోక్షంగా దోహదపడిన ప్రపంచీకరణా?

ఈ నేపథ్యంలో రాసిన కథే చీడ.

సంపెంగ చెట్టు, కథని చెప్పినట్టుగా రాయాలనుకున్నాను. ఐతే ఆ చెట్టుకి ఇంట్లోని విషయాలు, జరిగే సంఘటనలు తెలియవు. అంచేత కిటికీ దగ్గరున్న నైట్‌క్వీన్‌తో గాలి ద్వారా సంభాషణని జరిపించి కథనం నడిపించాల్సి వచ్చింది.

-గొరుసు జగదీశ్వర రెడ్డి

*

 

 

 

‘ మరో వైపు’ చూద్దామా !

Fall-Leaves

మరో వైపు’ చూపిస్తున్న వంశీకృష్ణ…వచ్చే వారం నుంచి..!

ఇటీవల వచ్చిన ఒక తెలుగు సినిమా లో  ‘చూడు ఒక వైపే చూడు’ అంటూ నందమూరి బాల కృష్ణ తన శత్రువును కండిషన్ చేస్తాడు. ఇవ్వాళ మన తెలుగు సమాజం కూడా అలాగే కండిషన్  అయింది. తన సహజమైన లక్షణాలనీ కోల్పోయి ఒక మూసలో కూరుకు పొతున్నది. సాహిత్యము, సంగీతము ఇతరేతర సృజన  రంగాలన్నీ ఇందుకు మినహాయింపు కాకపోవడము ఒక విషాదం. సామాజిక వర్గాలు,మతాలూ, ప్రాంతాలు, పేరున ఈ కండిషనింగ్ కొనసాగుతూ వస్తున్నది.

ప్రతి అంశానికి సెకండ్, థర్డ్, డైమన్షన్ ఉంటుందనే విషయాలను కూడా మనం కన్వీనియంట్ గా మరచి పోయాము. ఒక కథ చదివినప్పుడో, ఒక కవితను అనుభూతించినప్పుడో మనఃస్పూర్తి గా మెచ్చుకోవడానికి కూడా రకరకాల న్యూనతలు మనలని అడ్డుకుంటున్నాయి. ఈ విష వలయం నుండి మనం ఎంత త్వరగా బయట పడితే మన సామాజిక ఆరోగ్యానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా మన సాహిత్యానికి!

ఈ నేపధ్యం లోనే ‘సారంగ’ సాహిత్య వార పత్రిక లో ‘మరోవైపు‘ శీర్షిక మొదలవుతున్నది. ఈ కాలం లో సాహిత్యం, సినిమా, ప్రభావశీలురు ఐన వ్యక్తుల, సంస్థల ప్రతిభాన్విత సంఘటనలని వాటి వాటి నియమిత అర్ధం లో కాకుండా రెండో వైపు చూసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఒక కధ చదివినప్పుడు అది కలిగించే వాచ్యార్ధాన్ని మాత్రమె కాకుండా మరో అంతర్గత అర్ధాన్ని అంటే లో నారసి చూసే ప్రయత్నం అన్న మాట.
సాహిత్య పత్రికలలో / సాహిత్య పుటలలో ఒక సృజనని సమీక్షించేటప్పుడు సృజన కారుడి వైయక్తిక అంశాలను, బలహీనతలను పక్కన పెట్టి, లేక పట్టించుకోకుండానూ, కేవలం రచన కు మాత్రమే పరిమితమై దాని సారాన్ని, సారాంశాన్ని మాత్రమే  పట్టించుకునే పద్ధతి ఇది. నిజానికి ఇది కొత్త విధానమేమీ కాదు. . పూర్తిగా పాతదే. మళ్లీ కొత్త గా మొదలు పెట్టడం అన్న మాట! అలా అని కళ కోసం కళ అనే పూర్తి సాంప్రదాయక వ్యవహారం కూడా కాదు.  సాహిత్య రాజకీయాలను, సాహిత్య చొరబాట్లను వదిలి స్వచ్చ శుభ్ర సాహిత్య అనుభూతిని పొందటం కోసం  చేసే ప్రయత్నం ఇది.

వంశీకృష్ణ

గురువు, స్నేహితుడు, నాయకుడు గంటి ప్రసాదం

venu and ganti prasad

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్ మధ్యలో, కుడి వైపున గంటిప్రసాద్

 

ఒక ఎండాకాలపు ముసిముసి వేకువ ఔరంగాబాద్ స్టేషన్ లోకి రైలు ప్రవేశిస్తుండగా దిగడానికి తలుపు దగ్గరికి వచ్చి ప్లాట్ ఫారం మీద నిలబడిన వ్యక్తిని చూడగానే నేను వస్తున్నది ఆయనకోసమే అని పోల్చుకున్నాను. అప్పటికి ఆయన పేరు చాలసార్లే విని ఉన్నాను గాని ఆయనను చూడలేదు. పూర్తిగా ఆయన పోలికలతోనే ఉన్న  తమ్ముడిని విశాఖపట్నంలో ఎన్నోసార్లు కలిశాను గనుక ఆయనను గుర్తు పట్టడం కష్టం కాలేదు. అయినా మా కలయిక సంకేతస్థలం రైల్వే స్టేషన్ లో కాదు గనుక నా మానాన నేను రైలు దిగి గేటు దాటి ఓ వంద గజాలు నడిచి చాయ్ కొట్టు దగ్గర ఆగాను. ఆయన నా వెనుకే వచ్చి చెయ్యి కలిపారు. అది మొదలు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది మామూలుగా నిజమో కాదో తెలియదు గాని ఆయనతో నాకు కుదిరిన ప్రేమానురాగాలు మొదలయినది మాత్రం ఆ క్షణాన్నే. ఆయనతో మొదటి ముఖ పరిచయమే తొలిచూపు వలపు లాగ మొదలయింది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన నా జీవితంలోకి ప్రవేశించి ఎనిమిది సంవత్సరాలు మాత్రమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణసమానమైన ఆత్మీయ మైత్రి అది. యావజ్జీవిత సాన్నిహిత్యం అనిపించేంత గాఢమైన సంబంధం అది. పరస్పరం ఎంత విమర్శించుకున్నా, ఎంత గట్టిగా అరచుకున్నా, ఎన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినా మరుక్షణం అదంతా మరచిపోయి అల్లుకున్న స్నేహం అది. ఒకరిపట్ల ఒకరికి సంపూర్ణమైన నమ్మకం, గౌరవం, చనువు ఉన్న సమస్థాయి సంబంధం అది. పన్నెండు సంవత్సరాల వయసు తేడా ఉన్నదని ఏ ఒక్కక్షణమూ అనిపించని స్నేహాదరం అది. ఆయన పట్ల నాకు అపారమైన గౌరవమూ ప్రేమా ఉండేవి. ఆయనకు నాపట్ల చెప్పలేనంత వాత్సల్యమూ అభిమానమూ ఉండేవి.

ఆయన గంటి ప్రసాదం.

అలా ఔరంగాబాద్ స్టేషన్ ముందు కలుసుకున్న మేం అప్పటికే ఆయన దిగిన లాడ్జికి వెళ్లి అది ఖాళీ చేసి, ఆయన వెంట ఉన్న సహచరుడు సురేందర్ తో సహా మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ గది లోకి మారాం. ఆ తర్వాత ఓ గంటా గంటన్నరలో చెంచయ్యగారు, పాణి, రవి వచ్చేశారు. కాని అప్పటికే ఆయనా నేనూ లోకం మీది విషయాలన్నీ మాట్లాడేసుకుంటున్నాం. ఇక అందరమూ చేరాక మొదలుపెట్టిన సమావేశం మధ్య మధ్య భోజనాలు, చాయలు, కొన్ని గంటల నిద్ర మినహాయిస్తే మర్నాడు సాయంత్రం దాకా నిర్విరామంగా సాగింది. ప్రసాదం గారి పట్ల గౌరవం ఇనుమడించడానికి ఆ సుదీర్ఘ సమావేశం మరొక మెట్టు. సాహిత్యం, సాహిత్య విమర్శ, రాజకీయాలు, పార్టీ చరిత్ర, విరసం చరిత్ర, వ్యక్తులు, వ్యక్తుల సామర్థ్యాలు, బలహీనతలు, వ్యక్తుల పట్ల అంచనాలు, భవిష్యత్తు కార్యక్రమాలు, సాంకేతిక అంశాలు, బహిరంతర రహస్యాలు… ఎన్నెన్నో. కొన్ని వందల అంశాలు చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్క అంశం లోనూ ఆయన సంధించిన ప్రశ్నలు, ప్రతిపాదనలు, అభిప్రాయాలు, చర్చలు, వ్యాఖ్యానాలు, వివరణలు, విశ్లేషణలు, ముక్తాయింపులు ఆయన విశ్వరూపాన్ని చూపాయి. ఆయన నోటి నుంచి వెలువడిన పరిహాసాలు, చరిత్ర నుంచి అనుభవాలు ఎంతో బరువైన సందర్భాన్ని కూడ ఆహ్లాదకరంగా తేలికపరచాయి. ఆయన మాటలన్నిటితో ఏకీభవించానని కాదు, అబ్బురపడినవీ ఉన్నాయి, తీవ్రంగా విభేదించినవీ ఉన్నాయి. కాని ఒక విప్లవోద్యమ నాయకత్వానికి ఎటువంటి సమయస్ఫూర్తి, అవగాహన, సంయమనం, విశాల దృక్పథం ఉంటాయో నాకు మరొకసారి చూపిన అనుభవమది. ఆ విశిష్టత నానాటికీ విస్తరిస్తున్న, పరిణతి చెందుతున్న విప్లవోద్యమ ఫలితం అని ఎంతగా అనవచ్చునో, ఆ విశిష్టతను వ్యక్తీకరిస్తున్న ప్రత్యేక వ్యక్తిలోని నిత్య చలనశీల, ప్రవాహ, విస్తరణ స్వభావానికి సూచిక అని కూడ అంతగా అనవచ్చు.

నిజానికి ఆ రెండు రోజులు జరిగిన సంభాషణంతా నోట్స్ రాసుకున్నాను, ఆయన మాటల్లో ఎక్కువభాగం ఆ నోట్స్ లో ఉండి ఉంటాయి. కాని రెండో రోజు రాత్రి భోజనానికి లేవడానికి ఇంకో అరగంట ఉందనగా ఆ గది మీద దాడి చేసిన ఎస్ ఐ బి తోడేళ్ల గుంపు మా వస్తువులన్నిటితో పాటు ఆ నోట్స్ కూడ ఎత్తుకుపోయింది. దాడి చేసిన వాళ్లెవరో మేం గుర్తించే లోపుగానే ఒక్కొక్కరి మీద పడి మొట్టమొదట చేసిన పని కళ్లకు గంతలు కట్టడం. చేతులు వెనక్కి విరిచి కట్టడం. ఆ తర్వాత మూడు రోజులు అక్రమ నిర్బంధంలో పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకకపోయినా ఒకరికొకరం తోడుగా ఉన్నాం. చిన్న చిన్న మాటలతోనే, స్పర్శతోనే ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. ఆ నిర్బంధాన్నీ, ప్రశ్నల దాడినీ ఎదుర్కున్నాం.

ఆ తర్వాత నిజామాబాద్ డిఐజి కార్యాలయంలో మమ్మల్ని పత్రికల వారి ముందు ప్రవేశపెట్టి అక్కడ్నించి నిజామాబాద్ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కూ, మర్నాడు బోధన్ కోర్టుకూ, అక్కడ్నించి ఆ సాయంత్రానికి నిజామాబాద్ ఖిలా జైలుకూ తీసుకుపోయిన ప్రయాణమంతా ప్రసాదం గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రసాదం గారినీ, నన్నూ పోలీసు కస్టడీకి తీసుకుపోయారు. అప్పటికే డికె బసు కేసు తీర్పులో పోలీసు కస్టడీలో ఖైదీకి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఉండే హక్కు ఉందనీ, పక్కన న్యాయవాదిని ఉంచుకునే హక్కు ఉందనీ విని ఉన్నాం గనుక మళ్లీ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి దాదాపు డజను మంది అధికారులు ఏ ప్రశ్న అడిగినా మేం చెప్పం అని మొండికేశాం. వ్యక్తిగత వివరాలు పేరూ ఊరూ చదువూ ఉద్యోగమూ కుటుంబసభ్యుల పేర్లూ తప్ప మరేదీ చెప్పబోమన్నాం. ఆ తతంగంలో కడప నుంచి వచ్చిన ఒక సిఐ మామీద విపరీతంగా కోపం తెచ్చుకుని, పక్కన న్యాయవాదులు ఉండడంతో ఏమీ చేయలేక పళ్లు పటపట కొరకడం, చూపులతోనే మమ్మల్ని ఎన్ కౌంటర్ చేయడానికి ప్రయత్నించడం ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడ కళ్ల ముందు ఆడుతోంది. మూడు రోజుల కోసం తీసుకున్నవాళ్లు అలా ఒకటిన్నర రోజు గడవగానే నన్ను వెనక్కి పంపేశారు. ప్రసాదం గారిని ఏమైనా చేస్తారా అని భయం. న్యాయవాదులకు కూడ చెప్పకుండా ఆయనను హైదరాబాదుకు తరలించారు. బహుశా నిజామాబాదుకు రాలేని అధికారులు హైదరాబాదులో ఆయనను ప్రశ్నించారు. కళ్లకు గంతలవల్ల వాళ్లెవరో ఆయన పోల్చుకోలేక పోయారు గాని పైస్థాయి వాళ్లెవరో అయి ఉంటారని అన్నారు.

నాలుగో రోజు ఆయనను మళ్లీ నిజామాబాదు జైలుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత మాకు బెయిల్ దొరికి విడుదలయ్యే వరకూ రెండువారాలకు పైగా రోజుకు ఇరవైనాలుగు గంటలూ మేం పంచుకోని విషయం లేదు. చర్చించుకోని అంశం లేదు. కేవలం మాటల్లోనే కాదు, మౌనంలోనూ, రోజువారీ శారీరక, మానసిక కార్యకలాపాలన్నిటిలోనూ ఒకరేమిటో మరొకరికి పూర్తిగా తెలిసివచ్చిన అద్భుతమైన, అనివార్యమైన, నిర్బంధశిబిర సాన్నిహిత్యం అది. బహుశా ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల ప్రగాఢ సంబంధానికి మూలం ఆ రెండు వారాలలో ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన నమ్మకమూ అంచనాలే కావచ్చు. ఆ తర్వాత ఆ కేసు వాయిదాల కోసం ఇరవై ముప్పై సార్లు నిజామాబాదుకు కలిసిచేసిన ప్రయాణాలు, చివరికి సాక్షుల విచారణ, వాదనల సమయంలో నిజామాబాదులో వారం రోజులు కలిసి గడపడం, ఈ మధ్యలో మా ఇంట్లోనూ, రాష్ట్రంలో ఎన్నో చోట్ల సభల సందర్భంగానూ వందలాది గంటల సంభాషణలు అరుణారుణ స్మృతులు. హైదరాబాదు వచ్చిన ప్రతిసారీ పది నిమిషాల కోసమైనా సరే, ఒక రోజో, రెండు రోజులో గడపడానికైనా సరే నా దగ్గరికి వచ్చేవారు. వనజతోనూ, అమ్మతోనూ, విభాతతోనూ కూడ సన్నిహితంగా ఉండేవారు. రావడానికి అసలే కుదరకపోతే ఫోన్ చేసి, ‘ఈ సారి కుదరడం లేదు, మళ్లీ వస్తాను’ అనేవారు.

చాల లోతయిన, సైద్ధాంతికమైన, నిబద్ధమైన, మానవీయమైన దృక్పథం, స్పష్టత ఉంటూనే ఆయనలో చాల ఆశ్చర్యకరమైన అమాయకత్వమూ పసితనమూ కూడ ఉండేవి. ఒక్క క్షణం కింద తత్వవేత్తలా, నాలుగు దశాబ్దాల ఆచరణతో తలపండిన అనుభవజ్ఞుడిగా మాట్లాడిన ఆయనేనా అనిపించేంత అమాయకంగా, స్వచ్చంగా, పసితనంతో ప్రవర్తించేవారు. తనకు తెలియని విషయం తెలియదని ఒప్పుకోవడంలో, అమాయకంగా అడగడంలో ఆయనకు ఎప్పుడూ భేషజం ఉండేది కాదు. మేం జైల్లో ఉన్నప్పుడు వనజ నాకు అదనంగా చొక్కాలు తెచ్చింది. అవి చర్మాస్ లో దొరికే మామూలు నూలు చొక్కాలు. కాని వాటి రంగులు ఆయనను చాల ఆకర్షించాయి. నిజామాబాద్ జైల్లో జాలీ ములాఖాత్ లోనే ‘వనజా నాకు అటువంటి షర్ట్ కావాలి’ అని చిన్న పిల్లవాడిలా అడిగారు. జైల్లో అది వేసుకుని చాల సంతోషించారు. విడుదలై వచ్చాక కూడ మళ్లీ అటువంటిది కొనిపించుకున్నారు. అలాగే జైలులో ఉన్నప్పుడూ, బైటికి వచ్చాక కూడా నశ్యం పొడి కోసం ఆయన ప్రయత్నాలూ, చిరాకూ, అది సమయానికి అందకపోతే చిన్నపిల్లవాడిలా మంకూ ఆయనలోని స్వచ్ఛతకూ, నిష్కల్మషత్వానికీ అద్దం పట్టేవి.

ఇక ఆయనలోని అమాయకత్వానికీ, చిన్నపిల్లవాడి మనస్తత్వానికీ చెప్పుకోవలసిన చిహ్నం తెలుగు పజిల్స్ నింపడం మీద ఆయనకు ఉండిన పిచ్చి. నాదగ్గరికి చాల పత్రికలు వస్తాయి గనుక ఆయనకు పండగలా ఉండేది.  వచ్చినప్పుడల్లా పాత పత్రికలన్నీ వెతికి ముందేసుకుని ఆ పజిల్స్ నింపడంలో మునిగిపోయేవారు. ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే వినకుండా, లేదా పరధ్యానంగా వింటూ పజిల్స్ లో మునిగిపోతున్నారని కోప్పడేవాణ్ని. సారూ, ఇంకెప్పుడూ కోప్పడను, ఒక్కసారి వచ్చిపోరూ….

అట్లాగే, ఆయనకు రచన చేయాలని చాల కోరిక ఉండేది. పనుల్లో ప్రయాణాల్లో తీరిక దొరకక ఎక్కువ రాయలేక పోయారు గాని రాస్తే చాల బాగా రాసేవారు. చంచల్ గూడ జైల్లో ఉండగా తెలంగాణ మీద ఒక వ్యాసం రాసి ఇచ్చారు. ఆరు సంవత్సరాల కింద వీక్షణంలో అచ్చయిన ఆ వ్యాసం ఇప్పటికీ చాల తాజాగా, గొప్ప విశ్లేషణతో ఉంది. నిజంగా తెలంగాణ ఉద్యమం మీద ఆయన అవగాహన చాల సరయినది. ఇటీవల కిషన్ జీ హత్య తర్వాత రాజ్యం జరిపిన దుష్ప్రచారం మీద అరుణతారలో ఒక మంచి వ్యాసం రాశారు. ఈ రెండు మూడు వ్యాసాలు, అమరుల బంధుమిత్రుల సంఘం చరిత్ర, ప్రణాళిక మినహాయిస్తే మిగిలిన రచనలు ఎక్కువగా కరపత్రాలే. కాని రాసిన ప్రతి కరపత్రమూ చూపెట్టి, కూచుని చదివించి, బాగుందా అని చిన్న పిల్లవాడిలా, కొత్త రచయితలా అడిగేవారు. అలాంటప్పుడు, ఆయన చదవాల్సిన కొత్త పుస్తకాలు, వ్యాసాలు ఎన్నెన్ని ఉన్నాయో చెప్పి పనులు కొన్ని తగ్గించుకుని అయినా చదవమని కోప్పడేవాణ్ని. చదువు మానేశారని విమర్శించేవాణ్ని. కాని ఆయన అసలు చదవడం లేదని కొన్నిసార్లు అనిపించేది గాని, ఆశ్చర్యకరంగా ఆయన చాల విషయాల్లో చాల అప్ టు డేట్ గా, తాజా వివరాలతో ఉండేవారు. ఒక పత్రిక వెలువడిన రోజు సాయంత్రం జరిగిన సభలోనే ఆ పత్రిక సంపాదకీయాన్ని ఉటంకిస్తూ విశ్లేషించడం చూసినప్పుడు ఆయన అవసరమని అనుకున్నవి వెంటనే చదువుతారని అనిపించేది.

అలాగే నేను ‘చౌరస్తాలో తెలంగాణ ఇంకెన్నాళ్లు’ అని వీక్షణం నవంబర్ 2012 సంచికలో ఒక వ్యాసం రాస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉన్న అన్ని శక్తుల బలాబలాలను గురించి చర్చించినప్పుడు, ఒక వారంలోపే ప్రసాదం గారు కలిశారు. ‘అందరి గురించీ విమర్శలు ఉన్నాయి మావోయిస్టు పార్టీ గురించి, దాని ప్రభావంలోని తెలంగాణ సంస్థల గురించి విమర్శ లేదేమిటి’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ మాటలు మరొక పేరుతో ఉత్తరంగా వేయనా’ అని అడిగితే సరేనన్నారు. ఒకరకంగా ఆయన విప్లవ నిర్మాణంలో చాల కీలక స్థానాలలో ఉండి కూడ అక్కడి సమస్యల గురించి బైటివాళ్లు ఎలా ఆలోచిస్తారో అలా ఏమాత్రం స్వీయాత్మకత లేకుండా వస్తుగతంగా ఆలోచించేవారు. మరొకవైపు బహిరంగంగా మాత్రం తనకు విభేదం ఉండిన అంశాలను కూడ సంపూర్ణంగా సమర్థించే ఉక్కు క్రమశిక్షణతో ఉండేవారు.

చివరి రోజుల్లో ఆయన పదే పదే చర్చించిన అంశం ఒకటి ఆయనలోని చదువరిని, సిద్ధాంతకర్తను నాకు పట్టి ఇచ్చింది. ‘ఎందుకు ఇటీవలి కాలంలో పాలిమికల్ (సైద్ధాంతిక వాదవివాదాల) రచనలు మనకు తగ్గిపోతున్నాయి? మార్క్స్ ఎంగెల్స్ లు తమ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినది పాలిమిక్స్ తోనే. మన పార్టీ చరిత్రలో ప్రధానమైన పాత్ర పాలిమిక్స్ దే. విరసం కూడ తొలిరోజుల్లో పాలిమిక్స్ ద్వారానే తన అవగాహనలను స్థిరపరచింది, ప్రచారం చేసింది. ఎందుకు ఇప్పుడు ఎవరు ఏమి రాసినా, ఎన్ని తప్పులు రాసినా మీరందరూ పట్టించుకోకుండా ఉండిపోతున్నారు? ఎందుకు పాలిమిక్స్ రాయడంలేదు?’ అని ఆయన చాల తీవ్రంగా ప్రశ్నించేవారు. అలా అడిగి అడిగి ఎవరూ పూనుకోవడం లేదనే అసహనంతోనేమో ఆయనే పాలిమికల్ వ్యాసాలు రాయడానికి పూనుకున్నారు.

చదవడానికి సమయం దొరకకపోయినా గొప్ప ఆచరణ జ్ఞానం వల్ల ఆయన సాధారణంగా సరైన వైఖరే తీసుకునేవారు. చర్చలలో చాల కచ్చితమైన, నిర్దిష్టమైన, నిర్దుష్టమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆయనకు అలవాటైన భాష కొంత పాతదిగా, సాగదీసినట్టుగా అనిపించేది గాని సారంలో ఆయన విశ్లేషణ మాత్రం పూర్తిగా సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా, సరిగ్గా ఉండేది.

మార్చ్ చివరి వారంలో లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్ విజయవాడలో భారత ఉత్పత్తి విధానం మీద సదస్సు పెట్టినప్పుడు మొదట ప్రసాదం గారికీ నాకూ చిన్న ఘర్షణ జరిగింది. అర్ధభూస్వామ్య, అర్ధవలస సూత్రీకరణను పూర్తిగా నమ్ముతూ ఆచరిస్తూ ఉన్న పార్టీ ప్రతినిధిగా ఆయన దానికి తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుందని, ఆయనను పిలవమని నిర్వాహకులకు సూచించాను. కాని కుదురుతుందో లేదో అని ఆయన వారితో అన్నారని తెలిసి నేను ఫోన్ చేశాను. ‘నువ్వున్నావు గదా, నేనెందుకూ, చాల పనులున్నాయి’ అన్నారు. ‘నేనేమీ మీ ప్రతినిధిగా వెళ్లడం లేదు. నేను అర్ధభూస్వామ్య అర్ధవలస సూత్రీకరణను నమ్మే ఒక రాజకీయార్థశాస్త్ర విద్యార్థిగా వెళుతున్నాను. అయినా నేను మీకు అస్పృశ్యుడిని కదా. అక్కడ ఆ సూత్రీకరణను సమర్థించుకోవలసిన బాధ్యత పూర్తిగా మీదే’ అని కటువుగా అన్నాను. నిజానికి మరెవరి మీద కోపమో ఆయన మీద తీర్చుకున్నాను గాని ఆయన నన్నెప్పుడూ ఒక్క క్షణం కూడ అస్పృశ్యుడిలా భావించలేదు. నేనలా మాట్లాడాక వచ్చి ఒక పూటంతా ఉండి, ఆ విషయానికి సంబంధించిన రెండు పుస్తకాలు జిరాక్స్ చేయించుకుని వెళ్లారు. బెజవాడలో కనబడగానే, ‘ఇదిగో వచ్చాను’ అని చిన్నపిల్లవాడిలా చెప్పారు. మొదటి రోజు సాయంత్రం చర్చలో జోక్యం చేసుకుని చాల బాగా మాట్లాడారు. క్లుప్తంగానైనా చాల సూటిగా, స్పష్టంగా ఇటువంటి చర్చల పరమ లక్ష్యం ఏమై ఉండాలో చెప్పారు.

నాలుగైదు నెలల కింద నక్సలైట్ ఉద్యమం మీద ఎవరో పోలీసు ఆఫీసర్ రాసిన పుస్తకం ఒకటి తెప్పించి పెట్టమన్నారు. నేనది తెప్పించి మరుసటిసారి వచ్చినప్పుడు ఇస్తే, నీదగ్గరే ఉండనీ, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటానులే అన్నారు. రెండుమూడు నెలల కింద విశాఖ నుంచో, కోమర్తి నుంచో ఫోన్ చేసి కొలంబియా విప్లవోద్యమ సంస్థ ఫార్క్ (కొలంబియా విప్లవ సాయుధ సైన్యం) మీద, టర్కీ పికెకె (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ) మీద, లాటిన్ అమెరికా ప్రజా ఉద్యమాల మీద సమాచారం కావాలని, తీసిపెట్టమని అడిగారు. అవి పోగేస్తుండగానే తీసుకోలేని చోటికి వెళ్లిపోయారు.

ఆయనలోని ఈ గుణాలూ ప్రత్యేకతలూ విశిష్టతలూ, ఆయనతో ఆత్మీయ మైత్రీ, ఆయన ఆదరాభిమానాలూ అన్నీ నా ఒక్కడి అనుభవమే ఎంత మాత్రమూ కాదు. ఆయన గురించి సరిగ్గా ఇలాగే భావించేవాళ్లు రాష్ట్రంలో కొన్ని వందల మంది ఉండి ఉంటారు. బహుశా ఆయనతో నేను అనుభవించినంత ఆత్మీయతనూ, అంత కన్న ఎక్కువ ఆత్మీయతనూ కూడ అనుభవించిన వారు నాకు తెలిసే డజన్ల కొద్దీ ఉన్నారు. ‘ఆయన నాకు దగ్గరి వారు, నా హృదయంలోని మనిషి. అత్యంత ఆప్తుడు. ఆయన దగ్గర నాకు రహస్యాలేమీ లేవు. నన్ను ఆయన పూర్తిగా తన విశ్వాసంలోకి తీసుకున్నారు’ అని ప్రతి ఒక్కరూ అనుకున్న వ్యక్తి గంటి ప్రసాదం. ఒక మనిషి జీవితంలో అంతకన్న కావలసింది లేదు. ఒక మనిషిని మనీషిగా మార్చేది అదే. గంటి ప్రసాదం అనే మనిషి మార్క్సిజంలో విశ్వాసం వల్ల, నాలుగు దశాబ్దాలకు పైబడిన విప్లవోద్యమ ఆచరణ వల్ల మనీషిగా మారారు. అటువంటి మనీషుల అవసరం మరింతగా పెరుగుతున్న సమయాన రాజ్య దుర్మార్గం ఆయనను మననుంచి దూరం చేసింది. ‘ఆ బుల్లెట్లు నన్ను చంపగలవేమో గాని, నా ఆశయాన్ని కాదు’ అని ఆయన తన వీలునామా లాగ చెప్పిన మాటలే ఆయన మిత్రులందరికీ మిగిలిన ఆశ్వాసం.

–          ఎన్ వేణుగోపాల్

జూలై 13, 2013

మండుటెండలో మోదుగుపువ్వు

అతనొక మోదుగుపువ్వు

మండుటెండలో వసంతాగమన వీచిక

భవిష్యత్ వర్షహర్షానందాల మానవ సూచిక

అతని మునివేలు కొసన ఎప్పుడూ ఒక కంటి తడి

ఎవరెవరి కన్నీళ్లు తుడిచివచ్చాడో

తన కన్నీళ్ల చెలియలికట్టనే ఎన్నిసార్లు కట్టుకున్నాడో

 

వాలిన గరికపోచల చివర్ల అతని ప్రోత్సాహాశ్రు బిందువే

రాలిన తురాయి పూల కనుకొలకుల అతని అనునయ స్పర్శే

కూలిన నిర్మాణాల చెంపల చారికల మీద అతని సాంత్వన బాసలే

ఆగిన దారుల మూలమలుపుల్లో నెత్తుటి మరకలపై అతని గురుతులే

 

అందరూ దూరం కొట్టిన అస్పృశ్యులను ఆలింగనం చేసుకున్నదతడే

కంటిపాప కరువైన తల్లి శోకానికి తల వాల్చే భుజం అందించినదతడే

సహచరుల్ని కోల్పోయిన బంధుమిత్రులకు బాసటగా నిల్చినదతడే

బిడ్డను పోగొట్టుకున్న ఊరికి ఓదార్పు మాటల లేపనాలు పూసినదతడే

ముఖాలు చూసుకోని గడ్డి పరకలను కలిపి

మదగజాలను లొంగదీసే తాళ్లు పేనినదతడే

రాజ్య దుర్మార్గం మీద పెదాల చివరినుంచి నిప్పుకణికలు విసిరినదతడే

ఎప్పుడాగిపోతుందో తెలియని గుండెను అదిమి పట్టుకుని

వేల మైళ్ల దూరాల్ని వందల అవరోధాల్ని అవలీలగా దాటినదతడే

అరెస్టులనూ అనారోగ్యాన్నీ దాడులనూ దుర్భాషలనూ

తోసిరాజని జీవిత చదరంగాన్ని గళ్ల నుడికట్టులా ఆడినదతడే

 

దైవ ప్రసాదం కాదు, జన హృదయ ప్రసాదం, ప్రజా పోరాట ప్రసారం

 

–          వి. కవిత, జూలై 14, 2013

ఛానెల్ 24/7 -15 వ భాగం

sujatha photo

  (కిందటి వారం తరువాయి)

ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన స్నేహితుడు. ఆయన ఇంకోలా ఎలా వుంటాడు.

బాయ్‌ని పిలిచి దక్షిణామూర్తిగారిని లోపలికి తీసుకు రమ్మన్నాడు. తను గబగబ వచ్చేశాడు. ఆయన అందరినీ పలకరిస్తూ స్టూడియో బయటే నిలబడ్డాడు. ఆయనకొసం తను ఆగలేదు. ఇప్పుడాయన చెప్పేవన్నీ తన మనసు తనకు చెబుతున్న విషయాలు. తన గురించి తనకు తెలిసినవీ, తన విజ్ఞత తనను మనిషిగా  ఉండమని హెచ్చ్చరిస్తున్నవే. ఇప్పుడు దక్షిణామూర్తి వస్తాడు అనుకొన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

***

“ఇప్పుడు అడుగుతున్నా మేడం.. మీ పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకున్నారో చెప్పండి..”

“నయనా.. నువ్వు ప్రశ్న సరిగ్గా అడుగు. నేను తిన్నగా చెబుతాను. నీ ఆలోచనలోంచి నన్ను చూస్తున్నావు. నా జీవితంలో డిస్ట్రబెన్స్ లేదు. నేనో మార్గం ఎంచుకొని అటు తిన్నగా నడుస్తూ వచ్చాను. ఒక వ్యాపారి తన వ్యాపారం అభివృద్ధి చేసుకొన్నట్లు నాయర్‌తో విడిపోయేసరికి నేను ఎడిటర్‌గా వున్నానని చెప్పానుగా. ఒక పత్రికా నిర్వహణ నా పర్సనల్ లైఫ్‌కి ఎక్కడా టైం కేటాయించనివ్వలేదు. ప్రపంచంకంటే కొన్ని గంటలు ముందుగా నిద్రలేవలసిన ఒక జర్నలిస్ట్ తనని తాను ఎంతగా అప్‌డేట్ చేసుకోవాలో అంతా చేశాను. ఇతర పత్రికలతో పోటీ, నా పత్రిక నిరంతరం సర్కులేషన్ పెంచుకోవటం కోసం నే పడ్డ తపన, నా కేంప్‌లో నేను కలుసుకొనే మనుష్యులు,నా జీవితానికి కేంద్ర బిందువు నా కెరీర్, నేను ఉమెన్ ఎడిటర్‌ని, టాప్‌మోస్ట్ జర్నలిస్ట్‌ని, ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ని. నా ఎడిటోరియల్స్ గురించి నిరంతరం చదువు విశ్రాంతి లేని నా జీవితంలో నాయర్ ఎక్కడో మాయం అయ్యాడు”

“అంటే  కెరీర్, పర్సనల్ లైఫ్‌కి విలువివ్వదా..?”

“మనం ఒక ప్రవాహంలో వున్నాం. ఉదయం నిద్రలేవటం దగ్గరనుంచి ఆఫీస్ ఫోన్స్, బయటనుంచి కలుసుకోవలసిన వీఇపిలు.  పర్సనల్ లైఫ్‌కి ఒక గీత చెరిగిపోయింది. నాయర్‌తో విడిపోయాక నాకింకో పర్సనల్ జీవితం ఏముంది. పాపాయి చదువుకొంటుంది. బాబాయి కుటుంబంతో వుంది. నాకు ఆమె బాధ్యత లేదు. నేను, నాకోసం చరిత్రలో ఒక పేజీ సంపాదించుకోవాలనుకొన్నాను. అది నా లక్ష్యం.”

“వైఫల్యాలు, నష్టాలు. ఏవీ లేవా…?”

“ఓ గాడ్ నీకింకా అర్ధం కావటం లేదు. నాకోసంగా పిల్లలు లేరు. స్నేహితులు, బంధువులు, విహారయాత్రలు ఏవీ లేవు. తెలుసు కదా. మన పత్రిక పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. చానల్ లాంచ్ చేశాం. పొలిటికల్ ఎడిటర్‌ని. నేనెక్కిన మెట్లు ఏవీ మిగల్లేదు. కానీ నాకోసం వెనక్కి తిరిగి చూస్తె ఈ కెరీర్ వదిలేస్తే నేనేం చేయాలో నాకు తెలియదు. వృత్తి తప్ప నాకేం లేదు.”

“ఇందుకు బాధపడుతున్నారా? ఏమైనా నష్టపోయారా..?”

“బాధపడటం లేదు. నన్నెవరన్నా ఇలా వుండాల్సిందే అని నిర్భంధించారా.. లేదే.. నాకై నేను ఎంచుకొని కోరి వరించిన జీవితం. అటు నష్టపోయానో లేదో అర్ధం కాని జీవితం. నన్ను ఓ మీటింగ్‌లో నా జీవితంలో జరిగిన  యదార్ధ హాస్య సంఘటన, మీరు అందరితో కలిసి నవ్వుకొన్న్న సంఘటన గురించి చెప్పమని అడిగారు. హాస్య సంఘటన అలాంటిదేమీ లేదు. మరపురాని సంఘటనలంటే అవార్దులు తీసుకొనే అవకాశాలు తప్ప ఇంకేం లేదు. దాన్ని నేను నిర్వచించలేక పోతున్నాననుకొంటా..”

“అంటే కుటుంబ జీవితం పాపాయితో గడపటం మిస్ అయ్యారా…?”

“ఏమో,  కుటుంబ జీవితం నాకు ప్రత్యేకంగా అందించిన ప్రత్యేకమైన అనుభవాలు  ఏవీ లేవు. అటు నాన్నగారి సమయబద్ధమైన పొలిటికల్ జీవితం. అందులో ఆయన కుటుంబం కోసం కేటాయించినది ఏదీ లేదు. ఇటు నాయర్ కోరుకొన్న జీవితంలో నేను ఎల్లాగూ లేను. ఆయంతో కలసి ఉన్నంతకాలం ఆయన రాజకీయాలకు చెందిన మనిషే. ఆయనకు పర్సనల్ జీవితం ఉంటే ఆయన సొంత బతుకే. తను గొప్ప వ్యక్తిగా ఎదగటం. మరి ఈ మనుష్యులు నాకు నేర్పింది ఇదేనేమో ”

“కెరీరే లక్ష్యం అయితే ఇంకేముండదా మేడం..”

“ఇంకా అంటే బహుశా లేదేమో.. నీకు ఉద్యోగం లక్ష్యం. ఉదయం లేచి తయారై ఆఫెస్‌కు వస్తావు. సాయంత్రం వరకూ గంటకోసారి న్యూస్‌లో కనిపించాలి. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు. ఐదవుతూనే నువ్వు ఇంకో ప్రీ రికార్డెడ్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని. ప్రోగ్రాం కాన్సెప్ట్‌ని బట్టి ఏం కట్టుకోవాలో, ఏ నగలో, ఏ డ్రస్‌లో ఆలోచిస్తావు. నీకు పాప వుంటే దాన్ని గురించి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఆలోచించగలిగేదానివి”

నయన ఆలోచిస్తుంది.

స్వాతి ఆమెను చూస్తోంది.

“నయనా.. ఎప్పటి సంగతో చెబుతున్నా. మా పాపకి పన్నేండేళ్లు వచ్చాయి. మొదట్లో నేను గమనించలేదు కానీ, ప్రతిరోజూ నేను ఇంటికి వచ్చేవరకు మేలుకొని వుండేది. ఒక్కోసారి ఆఫీస్‌కు వచ్చేది. చాంబర్‌లోకి రాకుండా బయటనే కూర్చునేది. రిపోర్టర్స్ రూంలో కూర్చుని వాళ్లతో మాట్లాడేది. నేను నా పనులయ్యాక కలిసేదాని. ఇద్దరం కలిసి కారెక్కేవాళ్లం. దాన్ని దగ్గరకు తీసుకొన్నా నాకు ఏదో ఫోన్, నేనేదో ఆఫీస్‌లో ఎవరితోనో ఏదో చెప్పాల్సిన అవసరం, థర్డ్ ఎడిషన్‌లోనో, లాస్ట్ ఎడిషన్‌లోనో చేయాల్సిన మార్పులు, లాస్ట్ మినిట్స్‌లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏదో ఒకటి నా మనసంతా. పోనీ ఏ మీటింగ్‌కో కలిసి వెళ్ళేవాళ్లం. ఆ మీటింగ్‌లో నేను మొత్తంగా వుండగలను. కానీ పాపాయి పాత్ర ఎంతవరకూ. మొదటిసారి అందరూ పలకరిస్తారు. ఇంకా దగ్గరివాళ్లయితే దగ్గర కూర్చోమంటారు అంటే. నేను తనని ఎంత ఎంగేజ్ చేయగలను” అంది.

“నెమ్మదిగా తర్వాత మానుకొందనుకొంటా” స్వాతి ఆలోచిస్తూ ఊరుకొంది.

తలెత్తి చినంగా నవ్వింది

“ఆమె పెళ్ళి కోసం ముందుగా వారం రోజులున్నాను. ఇంట్లో పెళ్ళయ్యాక తను అమెరికా వెళ్ళే ఏర్పాట్లలో వుంది. తను వెళ్ళేందుకు రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలల్లో రెండు సార్లు తన కోసం వెళ్ళేను. మొత్తం పాపాయి కోసం నేను సంవత్సరంలో నాలుగైదు రోజులు కేటాయించానేమో. ఇంట్లోనే వున్నా పెద్దగా కలిసి లేము. నా పనుల్లో నేను, పాపాయికి నేనేం ఇచ్చాను. తనను కనటం తప్ప”

“ఇప్పుడు అమ్మలా ఆలోచించారు” నవ్వింది నయన.

“అంటే నయనా. మన సొసైటీలో స్త్రీలకు ప్రత్యేకమైన ఫార్మేట్ వుంది. ఆమె ఎలా వుండాలో ఎవరో ఆలోచించి డిజైన్ చేసి ఇచ్చిన ఫార్మెట్. దాన్ని సొసైటీ ఆమోదించింది. ఆమె ఇలా ప్రేమించాలి. ఇలా పెళ్ళాడాలి పిల్లల్ని కనాలి. కుటుంబానికి ఇలా సేవ చేయాలి. ఆమె మనసులో ఈ స్థాయిలో మెల్టింగ్ పాయింట్ వుండాలి. మరి నేను అలా కాకుండా ఇంకోలా వుంటానంటే అతిగా లేదూ. ఈ స్వేచ్చని ఎవరు ఎలా ఆమోదిస్తారు. ఇటు నాయర్‌ కోసం విచారించకా, అటు పాపాయిని సరిగ్గా తల్లి పాత్రలో వుండి చేరదీయకా, స్వాతిలాగా కెరీరిస్ట్‌గా నిలబడ్డానంటే నాకేం విశేషణాలుంటాయి చెప్పు”

నయన తడబడింది. నిజం మాట్లాడితే ఏం బావుంటుంది. తన ఉద్ధేశ్యంలో తన దృష్టిలో ఈవిడ చాలా స్ట్రిక్ట్. ఎండితో కలిసి ప్లాన్ వేస్తే అవతలవాడు మటాష్, తను ఏదైనా కావాలనుకొంటే ఎలాగైనా సాధిస్తుంది. దయాదాక్షిణ్యాలు లేవు. ఇంకా అబ్బో.. ఎవర్నీ ప్రేమించదు. శిఖండి. ఏం మనిషిరా బాబూ అనేవాళ్ళే ఎక్కువమంది. ఎంతదాకా ఎందుకు. తనకే పదిసార్లు హెచ్చరికలు చేసింది. గ్రూప్‌లు కట్టకూడదంటుంది. అతి చనువు కూడదంటుంది. అనవసరమైన రిలేషన్స్ పెంచుకోవద్దంటుంది. బహుశా కళ్లెత్తి చూస్తే ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుంది. నయననే చూస్తున్న స్వాతి నవ్వింది.

“నేను నీ ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ” అన్నది.

నయన కంగారుగా చూసింది.

“ఇంకేం లేదు మేడం” అన్నది.

“ఇంకేమున్నాయో ఆలోచించుకో. నీకు ఇరవై నిముషాలే టైం” అన్నది కుర్చీలో హాయిగా రిలాక్సయిపోతూ.

 

***

 

దక్షిణామూర్తిగారు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు. ఫోన్‌లో మాట్లాడూతున్న ఎస్ఆర్‌నాయుడు లేచి ఆయన్ను కూర్చోమన్నట్టు తన ఎదురుగ్గా వున్న చూపించి మర్యాద చేశాడు. ఆఫీస్ మొత్తం బాంబే నుంచి వచ్చిన ఇంటీరియర్ డెకొరేషన్ ఎక్స్‌పర్ట్ డిజైన్ చేశాడు. చాలా అందమైన ఆఫీస్. దక్షిణామూర్తి తన కాబిన్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నాడా లేదా ఆయన మొహం వంక చూస్తున్నాడు ఎస్ఆర్‌నాయుడు. కూర్చుంటూ పై కండువాతో ముఖం తుడుచుకొంటూ ఎదురుగ్గా రాక్స్‌లో వున్న పుస్తకాల వంక చూస్తున్నాడు.

“భోజనం చేద్దాం దక్షిణామూర్తిగారూ” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

దక్షిణామూర్తి తల వూపాడు.

“ఫ్రెష్ అవుతారా?” అన్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“వస్తూ బాత్‌రూంకు వెళ్ళివచ్చా” అన్నాడాయన.

ఆయన ఖద్దరు షర్ట్, జీన్స్ పాంట్ తమాషాగా వుంటుంది. ఆ కాంబినేషన్ పైన ఖద్దరు తువ్వాలు వంటిది మెడచుట్టూ వేసుకొంటాడు. ఎస్ఆర్‌నాయుడు చాలా స్టయిల్‌గా వుంటాడు. చక్కని మడత నలగని షర్టు నలుపు తెలుపులుగా వున్న ఉంగరాల జుట్టు చక్కగా దువ్వుకొని  ఎప్పుడు పడితే అప్పుడు లైవ్‌లో కనిపించటానికి వీలుగా రెడీగా వుంటాడు.

భోజనం వచ్చింది. ట్రేలో వున్న డిష్‌లన్నీ ఒక్కోటి తీసి చూస్తున్నాడు దక్షిణామూర్తి. నాకు సాంబార్ చాలోయ్ అన్నాడు బాయ్‌తో. బటర్ నాన్, పుల్కా కూడా ఉన్నాయి సార్ అన్నాడు బాయ్. వద్దులేవయ్యా రైస్ తింటాను అన్నాడాయన.

“ఎలా వుంది చానల్” అన్నాడు ఎస్ఆర్‌నాయుడుతో.

“చూస్తున్నారుగా సెకండ్ ప్లేస్‌లో. అటూ ఇటూ ఫస్ట ప్లేస్ కూడా”

“అవును చాలా సెన్సేషనల్ చేసావు” అన్నాడు దక్షిణామూర్తి.

తింటున్నది గొంతులో పడ్డట్టు అయింది. సెన్సేషనల్ అంటే ఈయన వెక్కిరింతా పొగడ్తా.

“మొన్న మీ చైర్మన్‌గారు ఎయిర్‌పోర్టులో కలిశారు.  చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయనకు పవర్ ప్రాజెక్ట్ వచ్చిందంటగా. మీ కృషి చాలా వుందన్నాడు.

తింటున్న భోజనం కమ్మగా లేదనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

చైర్మన్ ఆదికేశవులుకి ఎన్నో బిజినెస్‌లు వున్నాయి. ఎన్నో సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఈ చానల్‌లో ఆయనకూ షేర్స్ ఉన్నాయి. నేనూ స్వాతీ డైరెక్టర్స్ . తెలుసు కదా..”

“ఆయన తమ్ముడు శ్రీరంగనాయకులు నేనూ క్లాస్‌మేట్స్”

ఈసారి దగ్గొచ్చింది ఎస్ఆర్‌నాయుడుకు. ఇది తనకు తెలియదు.

“అయితే పెద్దయ్యాక ఎప్పుడూ రిలేషన్స్‌లో లేము. మొన్నమాటల్లో చెప్పుకొన్నాము. శ్రీరంగనాయకులు మినిష్టర్ అయ్యాక నేను కలుసుకొన్నది లేదు. ఇష్యూ బయటికి వచ్చాక నీతో మాట్లాడాలనుకొన్నా.”

ఎస్ఆర్‌నాయుడుకు ఏం మాట్లాడాలో తోచటం లేదు. ఆదికేశవులు కాలేజ్ సంగతి ఎక్కడా బయటకు రాకుండా తనే చూశాడు. గవర్నమెంట్ లాండ్ అది. లీజ్‌కు తీసుకొన్నారు. పర్మిషన్స్ తెచ్చుకోవచ్చునని బిల్డింగ్స్ కట్టేశారు. ఆ స్థలం లీజుకు ఇచ్చినందుకు అప్పటి కమీషనర్‌ను కోటీశ్వరుణ్ణి చేశాడు ఆదికేశవులు. ఆయన ఆస్తులు సగం తన పేరుపైనే ఉన్నాయి. ఈ చానల్‌లో తను పెట్టిన షేర్లు అతను ఇచ్చినవే. వాళ్ల కోసం తను ఏం చేస్తే సరిపోతుంది..?”

“నువ్వు చాలా రిస్క్ తీసుకొంటున్నావు. నీతో మాట్లాడాలనే వచ్చా. ఓన్లీ ఫ్రెండ్లీగా. నువ్వు స్వాతి కలిసి డెయిలీని ఎన్నో ఎడిషన్లు చేశారు. ఆ పెట్టుబడి ఎక్కడిదో నాకు తెలుసు. ఈ చానల్ పెట్టుబడీ నాకు తెలుసు. స్వాతి నాన్నగారు బతికుంటే ఇదంతా జరిగేది కాదు. ఒకప్పుడు ఆ పత్రికకు ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఉండేది. అవ్వాళ్టి పార్టీ లీడర్స్‌కి పదవులు లేవు. ప్రజాసేవ తప్ప. ఆదికేశవులు దాన్ని టేకోవర్ చేశాడని అందరికీ తెలుసు. బయట నువ్వు చాలా బద్నామ్ అవుతున్నావు”

ఇంత చెబుతూ తాపీగా అన్నం తింటున్న మనిషి వైపు తెల్లబోయి చూస్తున్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“పత్రిక, చానల్ అడ్డంపెట్టి ఎన్నింటికి పర్మిషన్ తెచ్చుకొన్నాడో నువ్వెలా డిల్లీ చుట్టూ తిరుగుతున్నావో నీ తోటివాళ్లు ఎంతలా గమనిస్తున్నారో తెలుసా నీకు”

దక్షిణామూర్తి ఏనాడో పాతికేళ్ల గతంలోంచి లేచొచ్చి కూర్చున్నట్టు వుంది ఎస్ఆర్‌నాయుడుకి.

ఇద్దరూ ఎడిటోరియల్‌లో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసేవాళ్లు. ఎడిటోరియల్ రాయటంలో పోటి, రిపోర్టింగ్‌లో పోటీ. కొత్త కొత్త విషయాలు రాయటంలో పోటీ. ఆరోగ్యకరమైన పోటీలో ఇద్దరూ వెలిగిపోతుండేవాళ్లు.

“నాతో శ్రీరంగనాయకులు చెప్పారు. ఒక్క రూపాయి చేతిలోంచి పెట్టకుండా ఎలా సంపాదించారో ఆదికేశవులు చెప్పుకొచ్చాడు. తను మినిష్టరుగా అడ్డమైన లాబీయింగ్‌లతో ఎన్ని కాంట్రాక్టులు, ఎన్నో పర్మిషన్లు ఇప్పిస్తూ వాళ్లందరిచేత ఈ చానల్‌లో పెట్టుబడులు పెట్టించాడో, మొత్తం చానల్స్‌లో టాప్‌లో ఎలా ఉందో చెప్పాడు నాకు. నువ్వు స్వాతి ఎవరెవరికి కొమ్ము కాస్తున్నారో, ఏం స్టోరీలు చేస్తున్నారో, ఎవరిని ఎలా బెదిరిస్తున్నారో, ఇవన్నీ నీకు వాళ్లు తెలిసే చేస్తున్నావా? ఆదికేశవులు బావున్నాడు. వాళ్ల తమ్ముడూ బావున్నాడు. వాళ్ల ఆస్తులు , పిల్లలు అంతా బావున్నారు. మరి నువ్వెలా వున్నావు? ఇదంతా నీకెందుకు నీ అంత మంచి రైటర్ ఎవరున్నారు? నీ పిల్లలు బుద్ధిమంతులు. చక్కగా చదువుకొన్నారు. నీకు కోట్ల ఆస్తులు లేకపోతే ఏం.. ఎందుకిదంతా. ఆదికేశవుల్ని ఎదిరించాడని. ఆ కల్నల్ పర్సనల్ లైఫ్ చానల్‌లోకి లాగి నవ్వుల పాలు చేశావు. ఆయన ఎవరిని చేరదీస్తే నీకెందుకు. ఎదుటివాళ్ల బెడ్‌రూమ్స్‌లోకి తొంగిచూడాలా నువ్వు”

తినటం ఆపి దక్షిణామూర్తి వైపు చూస్తున్నాడు నాయుడు. ఆయనకు ఊహించని దెబ్బ ఇది. దక్షిణామూర్తిని ఎలా తొక్కేయాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు తను. ఉద్యోగం సద్యోగం లేక దిక్కులేక ఉన్నాడనుకొన్నాదు. ఈయన తనకే పాఠాలు చెబుతున్నాడు.

“నీకు నేను చెప్పటం ఏమిటి అని ఆలోచించాను. నేను పత్రిక వదిలేశాక నీకు తెలుసుగా పుస్తకాల ట్రాన్స్‌లేషన్ పెట్టుకొన్నాను. మానవ చరిత్ర పన్నెండు వాల్యూమ్స్ అయ్యాయి. తెలుగు మాండలికాలు తయారయ్యాయి. పిల్లల పుస్తకాలు చాలా చేసాను. ఒక రకంగా ఇదివరకటి కంటే తీరిక లేకుండా వున్నా. మనం చేయవలసిన పనులు ఎన్నో వున్నాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడిలా.. ఇదంతా ఎందుకు? నాకు తోచింది చెప్పాను. వినటం, వినకపోవటం నీ ఇష్టం.” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు వంక చూసి.

ఎస్ఆర్‌నాయుడుకి నోటమాట రాలేదు. పాతికేళ్ళ గతంలోకి నడిచిపోయి దక్షిణామూర్తితో కలిసి రాత్రివేళ లాంగ్ డ్రైవ్ చేయాలనిపించింది. పత్రిక వృద్ధిలోకి రావటం కోసం కొత్త కొత్త ప్రయోగాల కోసం రాత్రిళ్ళు నిద్రపోక  మేలుకొని చేసిన చర్చలు గుర్తొస్తున్నాయి. ఎక్కడో తమ స్నేహం, జీవిత మాధుర్యం చేజారాయి. తను తుఫానులో కొట్టుకుపోయాడు.

“తినలేను” అన్నాడు నీరసంగా తింటున్న ప్లేటు వదిలేసి.

“తిను తిను.. నేను కంపెనీ ఇస్తా. ఇంకా ఫ్రూట్ సలాడ్ వుంది చూశవా?”అన్నాను దక్షిణామూర్తి కప్పు చేతిలోకి తీసుకొని.

ఎందుకో దక్షిణామూర్తిపైన కోపం రాలేదు. తన హోదా తన చానల్. తన గొప్పతనం ఏవీ గుర్తు రాలేదు. తనను నిలదీసే ధైర్యం ఎవ్వరికుంటుంది. తను ఎవ్వరికైనా సమాధానం చెప్పుకోవాలా అంటే తన మనస్సుకే అనుకొన్నాడు. శాంతిగా అనిపించింది. తీరిగ్గా భోజనానికి ఉపక్రమించాడు. రూం చల్లగా వుంది.

 

 

వీలునామా – 8 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

                     పడి లేచే కడలి తరంగం

 ఎస్టేటు చేరుకుని అందులో కొంచెం కుదురుకున్న ఫ్రాన్సిస్ హొగార్త్ ఆ ఎస్టేటు ధరా, తనకి లభించిన సంపదా చూసుకొని ఆశ్చర్య పోయాడు. బేంకులో వున్న నగదూ, షేర్లూ, ఇంకా అక్కడక్కడా మదుపు పెట్టిన డబ్బూ, అంతా కలిసి జేన్ అనుకొన్నట్టు దాదాపు నలభై వేల పౌండ్ల పైనే వున్నట్టుంది. ఎస్టేటు లో కొంచెం భూమిని సాగు చేయించినట్టున్నాడు పెద్దాయన.

ముందు ఎల్సీ ఆ వూరి జనం ఫ్రాన్సిస్ ని ఆదరిస్తారా అని అనుమానపడింది కానీ, ఆ భయం అర్థం లేనిది. ఆ వూళ్ళో ఇదే అంతస్థుకి చెందిన కుటుంబాలలో దాదాపు ఇరవై మంది పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లలుంటే, నలుగురు పెళ్ళీడుకొచ్చిన యువకులున్నారు, విలియం డాల్జెల్ తో సహా. అలాటప్పుడు, యుక్త వయసుల్లో వున్న ఇద్దరమ్మాయిలు ఊరు వదిలి, చక్కగా చదువుకుని పెళ్ళి కాని ఒక మగవాడొస్తూంటే ఊళ్ళోని సంపన్న కుటుంబాలు అతన్ని ఎందుకు నిరాదరిస్తాయి?  సహజంగానే అతని కొరకు విందులూ, వినోదాలూ ఏర్పాటు చేయబడ్డాయి. తమ తమ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి తండ్రులూ, తల్లులూ ఎంత దూరమైనా వెళ్తారూ, ఆత్మ గౌరవాన్ని ఎంతైనా చంపుకుంటారు.  బ్రిటిష్ సంఘంలో ఎంత విషాదకరమైన పరిస్థితి! ఒక వర్గాన్ని ఆకాశానికెత్తేస్తూ, ఇంకో సగాన్ని పాతాళానికి నొక్కేస్తూ…

ఇహ స్కాట్లాండ్ లో ఒక మారుమూల పల్లెటూళ్ళొ అంతకంటే మెరుగైన పరిస్థితి ఎలా వుంటుంది? అప్పటికే పల్లెటూళ్లలో మధ్య తరగతి, సంపన్న కుటుంబాలనుంచి యువకులు అవకాశాలు వెతుక్కుంటూ, కాలనీల్లోకి, భారతదేశానికో, అమెరికాకో, ఆస్ట్రేలియాకో వెళ్ళిపోతున్నారు. అంత దూరం కాకుంటే కనీసం పట్టణాలకైనా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో పడి వుండడం తప్ప చేసేదేం వుంది? చదువూ లేక, వృత్తీ వ్యాపారాలూ లేక, కేవలం ఎవరో ఒకరు వచ్చి కన్నె చెర విడిపించాలని ఎదురు చూడాల్సి రావడం ఎంత దుర్భరం!

కాలనీల్లోంచి తిరిగొచ్చిన యువకుల కంటికి సహజంగా తమతోటి కలిసి ఆడుకుని పెరిగి పెద్దయిన యువతులకంటే, చిన్న వయసులో వున్న బాలికలే ఎక్కువ నచ్చుతారు. పాపం, చదువూ, జీవనాధారమూ, పెళ్ళీ లేక ఒక తరం యువతులంతా అమ్మా-నాన్నల పంచనో, అన్న దమ్ముల పంచనో పడి వుండాల్సొస్తుంది.

ఇంత దుర్భరమైన పరిస్థితిలో, ముఫ్పై అయిదేళ్ళ బ్రహ్మచారీ, చదువు సంధ్యలున్నవాడూ, ఆస్తి పరుడూ తమ మధ్యకొస్తే ఆడపిల్లల తలి దండ్రుల ఆశలు ఆకాశాన్నంటటంలో ఆశ్చర్యమేముంది? అతన్ని విందులకూ, వినోదాలకూ ఆహ్వానిస్తూ కుప్పతెప్పలుగా ఉత్తరాలొచ్చి పడ్డాయి.

అయితే ఈ పరుగు పందెంలో అందరికన్నా ముందు పరుగు ప్రారంభించింది మాత్రం రెన్నీ దంపతులే. తన కింద, తన సంస్థలోనే పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఉన్నట్టుండి గొప్ప ఆస్తిపరుడు కాగానే, రెన్నీ ఆ అవకాశాన్ని వొదల దల్చుకోలేదు. తన కూతురు ఎలిజాకి ఇంతకన్న మంచి వరుణ్ణి తాను తేలేడు. అందుకే ఒకసారి తన ఎస్టేటు చూడడానికి రమ్మని ఫ్రాన్సిస్ ఆహ్వానించిందే తాడవు, రెన్నీ దంపతులు కూతురితో సహా వస్తామని మాటిచ్చారు.

నిజానికి శ్రీమతి రెన్నీ ఫ్రాన్సిస్ ని వూళ్ళో వుండే సంపన్న కుటుంబాలు ఎగరేసుకు పోతారేమోనని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఫ్రాన్సిస్ సహజంగా ముభావి. పైగా యేళ్ళ తరబడి ఒంటరితనానికి అలవాటు పడ్డవాడు. అందుకే వూళ్ళో కుటుంబాలతో పెద్దగా మనసిచ్చి కలవలేకపోయాడు. అతనికెందుకో వూళ్ళో వాళ్ళు అంత నచ్చలేదు కూడా. అన్నిటికంటే వూరి వాళ్ళు జేన్, ఎల్సీల పట్ల చూపించిన నిరాదరణ అతన్ని ఎంతో నొప్పించింది. ఆ నిరాదరణ ఆ అక్క-చెల్లెళ్ళ పట్ల కాదనీ, తన తండ్రి పట్ల అనీ అతను గుర్తించలేకపోయాడు.

చాలా మామూలు మనుషులుండే ఆ వూళ్ళో, పెద్దాయన హొగార్త్ భావాలూ, మతపరమైన నమ్మకాలూ, కొంచెం విభిన్నంగా అనిపించేవు. దాంతో వూరి వారికి అతనంటే కొంచెం అనుమానం అసహనం కూడా వుండేవి. అతని పెంపకంలో పెరిగిన అమ్మాయిలవడం చేత, ఆ అనుమానమూ, అసహనమూ, జేన్, ఎల్సీల పైకి కూడా తిరిగాయి. దానికి తోడు వేరే ఆడదిక్కులేని ఇల్లు. వాళ్ళిద్దర్నీ ఆయన మగపిల్లల్లా పెంచాడందులో. అయేసరికి వూరి వారికీ హొగార్త్ గారి కుటుంబానికి పెద్ద సఖ్యతేమీ వుండేది కాదు.

అదెలాగున్నా, పెద్దాయన ఆడపిల్లలకి చిల్లి గవ్వ ఇవ్వకుండా వీధిలో నిలబెట్టాడని తెలిసినప్పుడు మాత్రం, వూరి వాళ్ళు చాలా బాధ పడ్డారు. వాళ్లకొరకు చందాలు పోగు చేయలనుకున్నారు కూడా. చిన్న చిన్న సహాయలు చేయాలనుకున్నారు. అయితే జేన్, ఎల్సీలిద్దరూ ఎవరి దయా దాక్షిణ్యాల మిదా ఆధారపడదల్చుకోలేదు. అందుకే వూరొదిలి పట్నంలో బ్రతుకు తెరువు వెతుక్కుంటున్నారనీ, చాకలి మనిషి, పెగ్గీ ఇంట్లో అద్దెకుంటున్నరనీ తెలిసి వూళ్ళొ వాళ్ళు బాధ పడ్డారు.

పెగ్గీ చాలా యేళ్ళు స్కాట్ లాండు వదిలి ఆస్ట్రేలియాలో వుండడం వల్ల, ఆమె ఆలోచనలో కొంచెం వైశాల్యం వచ్చింది. అందుకే వూరి వాళ్ళలా, హొగార్త్ నమ్మకాలకీ, ఆచార వ్యవహారాలకీ ఆడపిల్లలని తప్పు పట్టలేదు. వూళ్ళో వున్నప్పుడు కూడా వాళ్ళ బట్టలు వుతికి ఇస్త్రీ చేస్తూ, వాళ్ళతో చనువుగా, స్నేహంగా వుండేది పెగ్గీ.   జేన్, ఎల్సీలు ఇల్లొదిలి వెళ్ళేటప్పుడు పెగ్గీలాగే, ఇంట్లోని నౌకర్లూ, చాకర్లూ అందరూ ఎంతో బాధ పడ్డారు.

 

  ***

  ఎడిన్ బరోలోని ఆ వీధిలో ఆ చిన్న ఇల్లు దొరకడం అదృష్టమే, అనుకుంది పెగ్గీ. చిన్నదైనా ఇల్లు శుభ్రంగా వుంది. గాలీ వెల్తురూ ధారాళంగా వచ్చే గదిని అక్క-చెల్లెళ్ళిద్దరికీ అద్దెకిచ్చింది. పెగ్గీ చెల్లెలి మావగారు థామస్ లారీ కి కూడా, ఇల్లూ, ఇంట్లోంచి బయటికి చూసే కిటికీ భలే నచ్చాయి. పెగ్గీ చెల్లి పిల్లలయిదుగురికీ ఇల్లు బ్రహ్మాండంగా నచ్చేసింది.

జేన్, ఎల్సీలు మాత్రం, దిగజారిపోయిన పరిస్థితులూ, అంత చిన్న ఇంట్లో సర్దుకోవడమూ తలచుకుని భయపడ్డారు. ఎంత శుభ్రంగా వున్నా, ఆ ఇంట్లోంచి వాళ్ళకలవాటు లేని లేమి అడుగడుగునా తొంగిచూస్తోంది.

అయినా, వాళ్ళిద్దరూ పెగ్గీ కుటుంబంతో వీలైనంతగా సర్దుకుపోవాలనే నిశ్చయించుకున్నారు. అందుకే, ఆ రాత్రి భోజనం వాళ్ళు పెగ్గీ కుటుంబంతో పాటు కలిసే చేసారు, పెగ్గీ ఎంత వారించినా. ఆ గందరగోళానికి వాళ్ళకసలు భోజనమే సయించలేదు. ఏదో తిన్నామనిపించి తమ గదికి వెళ్ళి కూర్చున్నారు. వున్నట్టుండి బావురుమంది ఎల్సీ.

“జేన్! నాకిక్కడేం బాగోలేదు. చాలా భయమేస్తుంది. పేదరికం గురించి కవితలు రాయడమూ, చదవడమూ వేరు, నిజాంగా పేదరికాన్ని అనుభవించడం వేరు. పేదరికంలో అందముందని ఎందుకు రాస్తారు, జేన్?”

“నువ్వవన్నీ ఆలోచించకు ఎల్సీ! నిజానికి నాకు మన వూళ్ళో వున్న కుటుంబాలూ, వాళ్ళ కృత్రిమ మర్యాదలూ, కపటనాటకాలకంటే పెగ్గీ కుటుంబమే ఎంతగానో నచ్చింది. మనకీ పరిస్థితి నచ్చినా నచ్చకపోయినా, మనం సర్దుకు పోక తప్పఫు! అర్థమయిందా?”

“అబ్బ! ఆ పెద్ద తాతగారు ఎందుకలా దగ్గుతాడు జేన్? ఆయన దగ్గరొచ్చే ఆ ముక్కు పొడుం వాసన! టీ కప్పులోంచి సాసర్లో పోసుకుని తాగుతారు వీళ్ళు, చూసావా? ఛీ!”

“ఎల్సీ! నిజం చెప్పు, అవన్నీ అంత ముఖ్యమైన విషయాలా? వాళ్ళలాగా ఏ పరిస్థితికైనా యెదురీదే శక్తి లేనందుకు మనం సిగ్గుపడాల్సిన మాట!  ఏదో పెద్ద చదివేసుకున్నాం అన్న అహంకారం తప్ప మన దగ్గరేముంది, ఆలోచించు!”

“ఏమోలే! ఇవాళ రాత్రైతే నేనొక్క మాట కూడా రాయలేను. మనసంతా చికాగ్గా వుంది. ఈ వూరూ, ఈ మురికీ, ఈ ఇల్లూ…”

“అదేం లేదు ఎల్సీ! బయట ఎడిన్ బరో చాలా అందంగా వుంటుంది తెల్సా! రేపు నిన్ను బయటికి తీసికెళ్తా! ఇద్దరమూ అలా నాలుగు వీథులూ నడిచొద్దాం, సరేనా?”

“సరే! రేపణ్ణించి మళ్ళీ రాయడం మొదలు పెడతా! ఇవాళ్తికి వొదిలేస్తా!”

“అవును! నీకెప్పుడు మనసులో హాయిగా అనిపిస్తే అప్పుడే రాసుకో. ఇప్పుడిక పడుకో!”

తలుపు దగ్గర చప్పుడైంది. పెగ్గీ గుమ్మంలోంచి మొహం లోపలికి పెట్టి,

“అమ్మాయిగారూ! అంతా బాగుందా? ఇంకా ఏమైనా కావాలా?” అని అడిగింది.

“లేదు పెగ్గీ! ఏమీ వొద్దు, కానీ నువ్వొచ్చి కాసేపు కూర్చోరాదూ?” జేన్ ఆహ్వానించింది.

పెగ్గీ లోపలికొచ్చి కూర్చొంది.

ఎల్సీ గబగబా తన కగితాల కట్ట సంచీలోకి తోసేసింది. అవన్నీ ఎల్సీ ఎవరికో రాస్తున్న ప్రేమలేఖలనుకుంది పెగ్గీ!

“చిన్న అమ్మాయిగారు ఏదో ఉత్తరాలు రాసుకుంటున్నట్టున్నారు. నేనొచ్చి పాడు చేసానా?”

“వుత్తరాలు కాదు పెగ్గీ! ఎల్సీ ఒక పుస్తకం రాస్తోంది!”

“పుస్తకమే? వామ్మో! నాకు అసలు సరిగ్గా చదవడమే రాయడం రాదమ్మాయిగారూ! మీరా పుస్తకాలెలా రాస్తారో గానీ! అయితే, దానికేమైనా డబ్బొస్తుందాండీ?”

“చూద్దాం! వస్తుందో రాదో!”

“అంతే లెండీ! చదువున్న మారాజులు! నాకు పెన్ను పట్టుకుంటే అక్షరం ముక్క రాదు! ఆస్ట్రేలియాలో వున్నప్పుడు ఇంటికి ఉత్తరాలు రాసే దిక్కులేకపోయింది. ఎవరినైనా అడగడానికి సిగ్గు పడిపోయాను. ఏదో కూడబలుక్కోని నా ఇష్టం వొచ్చినట్టు రెండు మాటలు రాసి పడేసేదాన్ని లెండి. అందుకే, నాలా అవస్థలు పడొద్దని ఈ పిల్లలందరికీ చదువు చెప్పిస్తున్నాను.”

“పెగ్గీ! నువ్వు నీ ఆస్ట్రేలియా జీవితం గురించి చెప్పాలి మాకు. నాకైతే భలే కుతూహలంగా వుంది!”

“ఎందుకు లెండి అమ్మాయి గారు! మీరవన్నీ మళ్ళీ ఏ పుస్తకంలోనో రాస్తే అంతా నన్ను చూసి నవ్వుతారు!” అనుమానంగా అంది పెగ్గీ!

నవ్వింది ఎల్సీ!

“లేదు పెగ్గీ నువ్వు చెప్పే సంగతులు నేనెప్పుడూ పుస్తకాల్లో రాయను సరేనా?”

ఆమె కాగితాల్లోకి తొంగి చూసింది పెగ్గీ.

“అమ్మాయి గారూ! మీర్రాసే లైనులు ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వున్నాయండి! అంటే మీరు రాసేది కవితలే కదండీ?”

“అవును పెగ్గీ ! అవి కవితలే!”

“ఇహ అయితే నా గురించి చెప్తా లెండి. కథలైతే భయం కానీ, కవితలైతే భయం ఎందుకు?”

“అవునూ, నువ్వు ఆస్ట్రేలియానుంచి ఒంటరిగా వచ్చావెందుకు? అందరూ నువ్వు పెళ్ళి చేసుకుని జంటగా వస్తావనుకున్నారు.”జేన్ కుతూహలంగా అడిగింది.

“అవునండీ! పెళ్ళాడడానికి అవకాశాలు కూడా వచ్చాయండి. కానీ, నేను పెళ్ళాడి నా దారి చూసుకుంటే, ఈ చిన్న పిల్లల గతి ఏమిటి చెప్పండి? ఒకరిద్దరైతే ఈ పిల్లల బాధ్యత కూడా తీసుకుంటామన్నారు కానీ, నాకెందుకో నమ్మకం లేక పోయింది!”

“ఈ పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళు పెగ్గీ! అప్పుడు మళ్ళీ ఎవరైనా నచ్చితే పెళ్ళి చేసుకో.” సలహా ఇచ్చింది ఎల్సీ.

“లేదు లేమ్మా! నాకు చాలా నచ్చిన మనిషికి మెల్బోర్న్ లో పెళ్ళయిపోయింది. అతను మాత్రం ఎన్నాళ్ళని ఆగతాడు చెప్పండి? నాకు తెల్సుసు చిన్నమ్మాయి గారూ, మీరేమనుకుంటున్నారో! పెగ్గీ లాటి దాన్ని కూడా ఇష్టపడే మగవాళ్ళుంటారా, అనేకదా? అయితే ఆస్ట్రేలియా లాటి చోట అంద చందాలకంటే కష్టపడే మనస్తత్వానికే ఎక్కువ విలువ. అందుకే నాలాటి దాన్ని కూడా చేశుకోవడానికి ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ముందుకొచ్చారు. ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి నా కథ చెప్తా వినండి.”

పెగ్గీ సర్దుకుని నేల మీద చతికిలబడింది. ఎల్సీ అక్క దగ్గరికి జరిగి, ఆమె వొళ్ళో తల పెట్టుకుంది. జేన్ చెల్లెలి జుట్టులోంచి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ, పెగ్గీ కథ వినడానికి సిద్ధమైంది.

  ***

(సశేషం )

 

లోలోపలే…

sree
ఏం తెలుసు?
గది లోపల? మది లోపల?
నువ్వు-నేను నిజం
మిగతా అంతా మిథ్య
ఏం చెబుతావు?
కథలో?
అక్షరాలు కూడదీసుకొని రాసే
కవిత్వంలో?
దుఃఖదాయకమైన జీవితంలోని
కొంచెం వేదన- కొంచెం వర్ణన
గాయపడ్డ కలం ఇది
ఎందుకు శోధిస్తావు?
వెర్రిగా రహస్యాలను..
హృదయాంతరాల
నేలమాళిగల్లో ఛేదించలేని చిక్కుముడులు
రహస్య పావురాలన్నీ ఎగిరిపోయాకా..
ఎదనిండా ఖాళీ.. భర్తీ చేయలేని శూన్యం..
ప్రశాంతతను ఎవరు భగ్నం చేస్తారు?
తరచి తరచి వెతికి వెతికి
తొంగిచూస్తావెందుకు?
ఎవరెవరి లోపలికో..??
నీలో నీవు చూడగల లోతెంత?
నిన్ను నువ్వు వెతుక్కుంటూ
స్ఫురింపజేసే పోలికలెన్ని?
నిధి కోసమైనా..
నీలో నిన్ను దర్శించే
మణి కోసమైనా
స్వీయ అన్వేషణ
జరగాల్సింది లోలోపలే
అంతరంగమే మహాబోధి
దాని చెంతనే
ఆత్మకు జ్ఞానోదయం
చీకటని దాటివచ్చే
తొలి అడుగులకు చిరుదీపం
ఆత్మజానం.. అంతర్ముఖ దర్శనం
‘తమసోమ జ్యోతిర్గమయా’

నగ్నపాదాల కన్నీళ్లదే రంగు?

sudhakar

1

పాదాలను చూశావా
ముఖ్యంగా పసిపిల్లల పాదాలను
అలల్లా
అలల్లా కదులుతున్న లేత ఆకుల్లా
ముట్టుకుంటే రక్తం చిందేట్టు..

2

మరి వాళ్ళ పాదాలెందుకు పగుళ్ళు దేరి
నగ్నంగా
తీరని కలల్ని మోసుకు తిరుగుతూ

ఆకలి రథాన్నెక్కి
సరిహద్దులు దాటి సంచరిస్తున్న ఆ పాదాలను-
ఖండిత శిరస్సులుగా వేళాడుతున్న
ఆ నగ్నపాదాలను-
నువ్వు ఏ లేపనం పూసి ఓదార్చగలవు!

ఆ స్త్రీల పాదాలను చూశావా
సముద్రాల దుఃఖాన్ని తెరలు తెరలుగా
వెంటేసుకుని..
నిశబ్దాన్ని మోస్తున్న నల్లని ఆకాశంలా…

ఎడారి పొడితనాన్ని
నిబ్బరంగా ముద్దాడిన నిన్నటి ‘వజ్రపు పాదాలే’నా అవి!

ఇప్పుడిలా చతికిలబడుతూ
కాసింత దయనూ,జాలినీ కోరుకుంటూ..

మన తల్లుల పాదాలూ ఇంతే కదూ
చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకోరాదూ..

mandira1

3

పిడికెడు కూడు దొరకని ఈ దేశంలో
పరాయివాళ్లెవరో..
సొంతవాళ్లెవరో..
కడుపు నిండిన కుబేరుడే
దేశానికి తలగా వ్యవహరిస్తున్నప్పుడు-
ఆకలి కన్నీళ్ల విలువెంత?
కన్నీటి కెరటాల ముందు
జ్వలించే నేత్రాల్లా నిలబడి
ధైర్యాన్ని పిడికిళ్లలోకి ఎత్తుకుంటున్న వాళ్లెంతమంది?

ఆకలే ఈ దేశాన్ని పీడిస్తున్న
అతి పెద్దజబ్బు..

4

అందుకే..
స్పృశించు
పాదాలను స్పృశించు
సంచార మనుషుల హృదయక్షేత్రాల్లాంటి
తడి జ్ఞాపకాల్లాంటి
పాదముద్రల మీద
నీ తలనాన్చి
అనంతకాల సంవేదనను ఆలకించు

కనిపించే ప్రతీ నగ్నపాదానికి ఉయ్యాల కట్టి
ఊపిరితో జోలపాడు..
లేదూ-
పాదాలకు పోరాటాన్ని నేర్పుతానంటావా..?

(painting: Mandira Bhaduri)

మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన ‘మల్లెల తీరం’!

చలం రచించిన ‘సావిత్రి’ లో సావిత్రి, సత్యవంతుడిని చూసి “మనస్సులు ఎప్పుడో కలిసాయి, మరణం ఒక్కటే మిగిలివుంది” అని అంటుంది. ఈ మాటల స్ఫూర్తితోనేismail“మల్లెలతీరంలో సిరిమల్లెపూవు” అనే సినిమా తీసాను అని ఒక ఇంటర్వ్యూలో అంటాడు ఈ చిత్ర దర్శకుడు జి.వి.రామరాజు.  చాలా కాలం నుంచీ ఫేస్ బుక్ లో ఈ సినిమా గురించి కొంతమంది నోట వింటూ వస్తున్నాను. దాదాపు అందరూ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ సినిమా అంత బాగుందా అనుకొనేవాణ్ణి. ఈ మధ్యన డాలస్ వెళ్లినప్పుడు పనికట్టుకొని మరీ చూసి వచ్చానీ చిత్రాన్ని. మొదట ఈ సినిమా పేరు “మల్లెలతీరం” మాత్రమే, కానీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా వచ్చాక పేరు మార్పుకు గురైంది. అలా అన్నా ఈ సినిమా పేరు కొద్దిగా ప్రజల నోళ్లలో నాని, సినిమా చూసేందుకు వస్తారని చిత్ర యూనిట్ ఊహ కాబోలు. కానీ నా వరకైతే ఈ సినిమా టైటిల్ “మల్లెలతీరమే” బాగుంది.
ఇక సినిమా కథ విషయానికి  వస్తే, “ఓ అందమైన అమ్మాయి, అంతకన్నా అందమైన మనస్సున్న అబ్బాయి, డబ్బే ప్రాధాన్యం అనుకొనే ఆ అమ్మాయి భర్త వీరి ముగ్గురి నడుమ జరిగిన కథే ఈ చిత్ర కథ.” ప్రతి అమ్మాయికి ఉన్నట్లే కలల రాకుమారుడు ఈ అమ్మాయికీ ఉన్నాడు. కానీ ప్రతీ కల నిజం కాదు. జీవితం ఎన్నెన్నో సర్దుబాట్లు నేర్పుతుంది. కానీ అందగాడు, తెలివైన వాడు, డబ్బు బాగా సంపాదించేవాడు అయిన భర్త దొరికితే ఏ ఆడపిల్లయినా సంతోషంతో పొంగిపోతుంది. ఇది మన సమాజం గిరిగీసి పెట్టుకొన్న నియమాల్లో ఒకటి. మరి ఇవన్నీ ఉన్నా తనకు కావాల్సినది లేని పెళ్లిలో ఆ అమ్మాయి ఎలా సర్దుకుపోవాలి? లేదా తన వ్యక్తిగత స్వేచ్చకు ప్రాధాన్యం ఇవ్వాలా? ఇలాంటి ప్రశ్నలకు జవాబివ్వాలనే ప్రయత్నమే ఈ సినిమా. అలా అని ఇదే సరైన సమాధానం అని ఎవరూ అనుకోక్కర్లేదు. కథ కన్నా కథనం, అంతకన్నా తాత్విక దృష్టి కలిగిన సంభాషణలు, మృదువైన సంగీతం, అందులో పాలు నీళ్లులా కలసిపోయిన సాహిత్యం, వీటన్నిటినీ ఓ దృశ్యకావ్యంలా తీసిన ఛాయాగ్రహణం…ఈ సినిమాని ఓ కళాఖండంగా నిలబెట్టాయి.
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తే చాలా నిదానంగా, ఏ మాత్రం వినోదం లేకుండా, ట్విస్టులు-బ్యాంగులు-ఐటం సాంగులు లేని చప్పిడి కూడులా అనిపించవచ్చు. కొద్దో గొప్పో ఈ తరహా సినిమాలు ఇష్టపడే  ప్రేక్షకులు కూడా కథనం సాగదీసినట్లు ఉందని కొన్ని కొన్ని సన్నివేశాల్లో అనుకొనే ప్రమాదమూ ఉంది. కానీ నావరకు ఈ సినిమాలో నన్ను కట్టిపడేసిన అంశాల్లో మొదటిది అమ్మాయి అందం కన్నా, తన ఆహార్యం. తను కట్టుకొన్న చీరలు, ఆ-కట్టుకొన్న విధానం, పొందిగ్గా ఉన్న జడ, సింపుల్గా ఓ జత గాజులూ, మెడలో ఓ నల్లపూసల గొలుసూ అంతకన్నా ముఖాన తాండవించే అందమైన నవ్వు, సమ్మోహనపరిచే మార్దవమైన మాటలు…ఏ కృష్ణశాస్త్రి పుస్తకంలో నుంచో నడచివచ్చిన కావ్యకన్యకలా ఉంది శ్రీదివ్య.
భర్తగా నటించిన జార్జి తన పాత్రకు తగ్గట్టు నటించాడు. లేనితనంలో అనుభవించిన కష్టాల వల్లో, మనకు తెలియని (ఈ సినిమా కథానాయిక పరంగానే సాగుతుంది) అనుభవాల వల్లో తనకు సంబంధించి రెండే ముఖ్య విషయాలు 1.నేను 2. డబ్బు. తను బాగుండాలి, సాధ్యమైనంత డబ్బు సంపాదించాలి. కట్టుకొన్న భార్య ఈ ఈక్వేషన్లో లేకపోవడం తనకు మైనస్సో, ప్లస్సో తేలీనంత బిజీలో జీవితం గడుపుతుంటాడు. అతన్ని ఇచ్చి పెళ్ళి చేసిన అమ్మాయి తండ్రి దృష్టిలోనూ, సమాజం దృష్టిలోనూ అతను ఆదర్శ భర్తే కానీ కాపురం చేయాల్సిన భార్య దృష్టిలో కాదు.
ఇక ఓ పాటల రచయితగా, భావుకత్వం నిండిన ఓ యువకుడిగా క్రాంతి చాలా చక్కగా నటించాడు. కానీ తను ఎక్కువ సేపు ఆ అమ్మాయి ఏం చెప్పితే దానికి తలూపే వ్యక్తిగానే ఈ సినిమాలో కనబడతాడు. (ఇది కథలో నాకు నచ్చని అతికొద్ది విషయాల్లో ఒకటి. మనలోమన మాట, అమ్మాయి ఏం చెబితే దానికి తలూపే అబ్బాయి ఉంటే ఏ అమ్మాయికి మాత్రం నచ్చడేంటీ;-)  ఈ అబ్బాయి ఆ అమ్మాయి స్నేహితురాలింట పరిచయమౌతాడు. ఆ స్నేహం ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకొనే దాకా వస్తుంది. సినిమా మొత్తం మీద ఇద్దరు ఎన్ని సార్లు ఒంటరిగా కలుసుకొన్నా ఎవరి హద్దుల్లో వారుంటారు.
ఇద్దరి భావాలు ఒక్కటే అవడంతో పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం, నచ్చిన పాటలు పాడుకోవడం, ఒకరి విషయాలు మరొకరితో పంచుకోవడం ఇలా సాగిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు స్నేహం నుంచీ ప్రేమగా మారిందో ఇద్దరికీ తెలియకుండానే అందులో మునిగిపోతారు. ఇందులో అమ్మాయి ఓసారి తన స్నేహితురాలితో అంటుంది “నేను ఏ అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా ఓ పాటుంటుంది, కానీ తనని చూసినప్పుడల్లా ప్రపంచమే పాటగా అనిపిస్తుంది.” మళ్లీ ఒకసారి ఆ అబ్బాయితో అంటుంది,”నిన్ను కలసినప్పుడు నాకు ఏ పాటా గుర్తుకు రాలేదు” అని. “అలా ఏం?” అని ఆ అబ్బాయి అడిగితే “నేనే నువ్వైనప్పుడు నాకు పాటెలా గుర్తొస్తుంది” అని అంటుంది. ఇలా వారిద్దరి మధ్య ప్రేమను అద్వైతంలా చిత్రీకరిస్తాడు దర్శకుడు.
ఇంట్లో భర్తతో సంసారబంధం లేకపోగా, (నీకు నచ్చకపోతే నిన్ను తాకనైనా తాకను అనే మంచి విలన్(?) ఆమె భర్త) ఫారిన్ ట్రిప్పులు, కొత్త వ్యాపారావకాశాలతో వీరిద్దరి మధ్య ఉన్న అగాధం మరింత పెరుగుతుంది. అది ఆమె విడాకులు కోరేవరకు వెళుతుంది. అప్పుడు ఆ భర్త తీసుకొనే నిర్ణయం ఏంటి? ఆమె ఆ నిర్ణయానికి ఒప్పుకొందా? వారిద్దరి ప్రేమ ఎలా ముగిసింది? ఇవన్నీ తెలియాలంటే మిగతా కథ మీరు తెరపై చూడాలి.
mallela
ఇందులోని కొన్ని ఆలోచింపచేసే మాటలు:
‘నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైనది ఏదీ లేదు. ఆ మనసుని వెతుక్కుంటూ వెళ్తే ఎన్నో తీరాలు కనిపిస్తాయి. వాటిల్లో మల్లెల తీరం ఒకటి” (హీరోయిన్‌తో క్రాంతి)
‘ప్రేమ, మనసు, ఆకాశం -వీటిని నచ్చిన విధంగా వర్ణించుకోవచ్చు కానీ, హద్దులు గీయలేం’(హీరోయిన్‌తో క్రాంతి)
‘సంపాదించు…కానీ లైఫ్‌ను బిజినెస్‌చేయకు’ (భర్తతో కథానాయిక)
‘భార్యగా అవడం వేరు. భార్యగా బతకడం వేరు’’ (కథానాయిక)
‘కోపం కూడా ఒక ఫీలింగే.. నాకు తన మీద అది కూడా లేదు’’ (భర్త గురించి నాయిక)
‘మానవ సంబంధాలు గ్యారంటీలతో రావు, మనమే పోషించుకోవాలి’’ (హీరోయిన్‌తో క్రాంతి)
ఇక పాటల వరకూ ఎంతో ఆహ్లాదమైన సంగీతం, సున్నితమైన సాహిత్యం బంగారానికి తావి అబ్బినట్లు అమిరాయి.
1. నీ నీడనా.. ఇలా నడవనా…
2. మబ్బులు కురిసే..మొగ్గలు విరిసే…
3. అలా చందమామనై..ఇలా చేతికందనా…
4. మాటకందని పాటలా మనమిద్దరూ కలిశాముగా…
5. పిల్లగాలుల పల్లకిలో..మల్లె వధువై నీలో చేరి…
మొత్తానికి ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగినా, ఈ సినిమా కథ కొని ప్రశ్నలను మిగిలిస్తుంది. ఒక సమీక్షకుడన్నట్లు -“పురుషుడు ఏ స్వేచ్ఛనైతే తన హక్కుగా భావిస్తాడో, ఆ స్వేచ్ఛను స్త్రీకి ఇస్తే చాలు. అంతకు మించి స్త్రీ ఏమీ ఆశించదు’ అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. ఆ అంశాన్ని తన ఈ తొలి చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నారు దర్శకుడు రామరాజు.”- కానీ ఇదే కథ కొద్దిగా మార్చి భర్త భావుకుడిగా, భార్య ఇవన్నీ పట్టించుకోని ప్రాక్టికల్ మనిషిగా ఉంటే, ఆ భర్తకే తన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే అమ్మాయి పరిచయమైతే …???
mallela teeram(1)
అలాగే ఈ సినిమాపై ఎన్ని సమీక్షలు వచ్చినా, కొన్ని అర్థవంతమైన ప్రశ్నలు మితృడు, ఛాయాగ్రాహకుడు అయిన ‘చక్రధరరావు’ లేవనెత్తారు-
“ప్రేమించే మనిషి దొరికేవరకూ పెళ్ళి చేసుకోవద్దా? 
లేక పెళ్ళి చేసుకొని బతికేస్తూ ప్రేమించేమనిషి తారసపడితే పెళ్ళిని వదిలిపోవాలా?? 
లేక పెళ్లిలో ఉంటూనే ప్రేమని కొనసాగించాలా? 
ప్రేమించిన మనిషిని తప్పక పెళ్ళి చేసుకొని తీరాలా ?? 
అసలు ఫలాన వ్యక్తి తప్ప ప్రపంచంలో నాకేమీ వద్దు అనే మానసికస్థాయి అదే సినిమాలో చెప్పిన అద్వైత స్థితి మనుషులకెప్పుడయినా కలుగుతుందా ?
అది కలగాలంటే ఎలా ప్రాక్టీసు చేయాలి ? 
పోనీ ఫలానా వ్యక్తిని ప్రేమించామే అనుకో.. వాళ్ళూ మనని ప్రేమించాలిగా ?
లేకుంటే అలా రెసొనెన్స్ కలిగేవరకూ వెతుక్కుంటూ పోవాలా , ఈ లోపు పుణ్యకాలం గడిస్తే ?? 
ఒకసారి ఆ ‘అద్వైత స్థితి’ కలిగితే అది ఎల్ల కాలం అలాగే ఉంటుందా ! అంటే ఒకసారి ఒకరి మీద ప్రేమ కలిగాక అది ఎప్పుడూ అలాగే ఉంటుందా వాళ్ల తదుపరి ప్రవర్తన వల్ల తరుగుదల/ఎదుగుదల ఉండదా ? ఉంటుందా?”
వీటికి సమాధానాలు ఎవరికి వారే వెతుక్కోవాలి!

కొసమెరుపు:

 

ఈ సినిమాలో సాహిత్యం, సంగీతం, భావుకతతో పాటు ఎక్కువైంది ఇంకొకటుంది…అది కెఫైన్…ఇద్దరి మధ్య మాటలు, పాటలుతో పాటు కాఫీ కూడా వరదలై పొంగుతుంది.
ఈ సినిమా ముందూ వెనకా:
 శ్రీదివ్య,డా.క్రాంతి, జార్జి, రావు రమేశ్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: పవన్‌కుమార్, ఛాయాగ్రహణం: బాలరెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సహ నిర్మాత: సూర్యనారాయణ ఆకుండి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.వి. రామరాజు.