మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే!

chitten rajuనాకు పట్టిన అదృష్టం చాలా మందికి పట్టదు. ఎండుకంటే నేను ఒక రకంగా వికటకవినే! అంటే మా అప్పచెల్లెళ్ళూ –అన్నదమ్ములలో ఎటు నుంచి లెక్క పెట్టినా నాది ఐదో నెంబరే!. అంటే ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క వెరసి నాకంటే నలుగురు  పెద్ద వాళ్ళు, ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళూ వెరసి నాకంటే నలుగురు చిన్న వాళ్ళు. పంచ పాండవులం అయిన మా అన్నదమ్ములలో నేను నకులుణ్ణి.  వీళ్ళలో ఏ ఒక్కరూ లేకుండా ఉండే నా చిన్నతనాన్ని ఊహించలేను. ఆ రోజుల్లో యింకో పదిమంది అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఉంటే బావుండును అనిపించేది. బాగా చిన్నప్పుడు ఆ మాటే మా అమ్మతో ఒక సారి అంటే “నోర్ముయ్” అని తిట్టి “ఆ ఇద్దరికీ బతికే యోగం లేదు రా” అంది. అంటే మా అమ్మ జన్మనిచ్చిన పదకొండు మందిలో ఇద్దరు బాలారిష్టాలు దాటలేక పోయారు. అందులో ఒకడు నాతో పుట్టిన కవల పిల్లాడు. కానీ మా తాత గారూ, బామ్మ గారూ, ఆ మాట కొస్తే, మా అమ్మా, నాన్న గార్ల ఉదార స్వభావం వలన మా బంధువులనీ, వారి పిల్లలనీ మా ఇంట్లోనే ఉంచుకుని చదువు చెప్పించడంతో ఎప్పుడూ ఇంట్లో ఉండే వాళ్లూ వచ్చే పోయే వాళ్ళతో సుమారు వంద మంది జనాభాతో కాకినాడలో మా ఇల్లు కళ, కళ లాడుతూ ఉండేది.  ప్రతీ రోజూ తెల్లారరగట్ట లేచిన మా పొయ్యిలో పిల్లి మధ్యాహ్నం అరగంట కునుకు తీసి మళ్లీ అర్ధరాత్రి దాకా పడుకునేది కాదు. అలాగే ఎంత మంది వంట వాళ్ళు ఉన్నా, పని వాళ్ళు ఉన్నా మా అమ్మ నడుము వంచిన నడుము ఎత్తేది కాదు.

మా అమ్మ పేరు సర్వలక్ష్మి. అది నాకు ఎంతో ఇష్టమైన పేరు. అలాగే మా బామ్మ గారి పేరు మాణిక్యాంబ గారు. అది కూడా నాకు చాలా ఇష్టమైన స్వచ్చమైన తెలుగు పేరు.   మా అమ్మకి తన పదకొండే ఏట మా నాన్న గారితో పెళ్లి అయింది. ఆ రోజులల్లో అది బాల్య వివాహం క్రింద లెక్క కాదు. తరవాత కాపురానికి వచ్చినప్పటి నుంచీ మా బామ్మ గారి హయాంలో ఇంటి నిర్వహణ మా అమ్మ చేపట్టింది. టూకీగా చెప్పాలంటే ప్రతీ రోజూ వంద మందికి అన్నం వార్చే పెద్ద కంచు గుండిగలూ,  అంత మందికీ సరిపడా పులుసు, చారూ  కాచే గంగాళాలూ, కూరా, పచ్చడీ వగైరాలకి గిన్నెలూ, రాచ్చిప్పలూ, పాల గదిలో నిలువెత్తు కుండలో రోజుకి ఇరవై నాలుగు గంటలూ బొగ్గ్గుల మీద వేడిగా కాగుతూ ఉండే ఆవు పాల కుండా, గేదె పాలకి మరొక కుండా, అటక మీద అరవై రకాల ఊరగాయల పింగాణీ జాడీలు, మడి బట్టలు ఆరేసుకునే దండేలు అర డజనూ, వంటింటి వెనకాల ఆడ వారి కోసం  చిన్న నుయ్యి, అక్కడికి వంద గజాల దూరంలో మగ వారి స్నానాల కోసం పెద్ద నుయ్యి, నీళ్ళు తోడుకునే చేదలూ, బకెట్ లూ, ఎవరైనా గ్లాసులో, చెంబులో నూతిలో పారేస్తే  దిగి తెచ్సుకోడానికి రెడీ గా అందుబాటులో ఉండే నిచ్చెనా, ఇంటిల్లిపాదికీ వేన్నీళ్ళు కాచుకునే నీళ్ళ పోయ్యీ, దాని మీద రాగిదో, ఇనపదో తెలియకుండా రెండు అంగుళాల మందం ఉన్న “మసి పూసిన పెద్ద డేగిసా”,  బొగ్గుల బస్తాలూ, కట్టెలూ, వేన్నీళ్ళూ, చన్నీళ్ళూ తొలకరించుకోడానికి  సిమెంటు నీళ్ళ కుండీలూ,  పసుపూ, కుంకుమా, నూనె, రెడీ స్టాకులో పొద్దున్న లేవగానే అందరికీ అందుబాటులో ఉండేలా కచికా, వేప పుల్లలు, బొగ్గు, “కోతి” మార్కు పళ్ళ పొడి, బినాకా టూట్ పేస్ట్, వెదురు బద్దలూ,  లైఫ్ బోయ్, లక్స్ వగైరా సబ్బులూ, కుంకుడు కాయలు, బట్టలు ఉతుక్కునే సబ్బూ, నీలి మందూ, పండగలూ, పబ్బాలూ వస్తే కావలసిన స్పెషల్ వస్తువులు, అర డజను కత్తి పీటలు, చిన్న, పెద్దా కత్తులూ, కొబ్బరి కోరే చేతి యంత్రమూ, పెద్ద, చిన్న, బుల్లి రుబ్బు రోళ్ళూ, కారాలు కొట్టుకోడానికి రాళ్ళూ, రోకళ్ళూ, రెండు మూడు సైజులలో పాతిక పైగా పీటలూ,  అందరికీ విడి, విడి గా వెండి కంచాలూ,  పాతిక పైగా నులక, నవారు, మడత మంచాలూ, పూజ గది సామాగ్రీ  మొదలైన కొన్ని వందల వస్తువులకీ మా అమ్మే “సప్లై చైన్ మరియు మెయింటేనెన్స్  మేనేజర్”. ఈ రోజుల్లో ఆ ఉద్యోగానికి గంటకి మూడు వందల డాలర్లు పెట్టి ఒక SAP ప్రోగ్రామర్ ని పెట్టుకున్నా మా అమ్మ కాలి గోటికి సరిపోరు అని నా అభిప్రాయం. ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి. మీ అమ్మ కూడా మా అమ్మలాంటిదే కదా!

మా తల్లిదండ్రులు సర్వలక్ష్మి , రామలింగేశ్వర శర్మ గారు

మా తల్లిదండ్రులు సర్వలక్ష్మి , రామలింగేశ్వర శర్మ గారు

ఈ పై లిస్ట్ ఎందుకు వ్రాశానంటే, వీటిల్లో పసుపూ, కుంకుమ లు మాత్రమే నేను అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వాడ లేదు—ఏదో డ్రామాల్లో ఆడ వేషాలు వేసినప్పుడు తప్ప. కానీ మిగిలిన వాటిల్లో వంట సామాగ్రి తప్ప మిగిలినవన్నీ చిన్నప్పుడు నా రోజు వారీ జీవితంలో భాగమే కాబట్టి, నా చిన్నతనం ఎంత పరమాద్భుతంగా గడిచిందో ఊహించుకో వచ్చును. 1996 లో కాకినాడనీ, నా చిన్నతనాన్నీ “దురదృష్టవశాత్తూ” వదిలేశాక ఆధునిక వంట సామాగ్రి ని వాడే అలవాటు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నా జీవితం ఎలా ఉందో కూడా ఊహించుకో వచ్చును. అప్పుడప్పుడు టీవీ లలో “ఇప్పుడు మీరు క్వార్టర్ సైజ్ సాస్ పాన్ లో రెండు వంకాయ ముక్కలు ముక్కలు వేసి, ఒక చెంచాడు నూనె వేసి…  “ అనే వంటల కార్యక్రమాలు చూస్తూ మా ఆవిడ నోట్స్ రాసుకుంటూ ఉంటే నేను కడుపుబ్బ నవ్వుకుంటూ ఉంటాను. మరుక్షణం మా అమ్మని తల్చుకుని గుడ్లమ్మట నీరు తుడుచుకుంటూ గదిలోకి పారిపోతాను.

మా అమ్మకి ఏదో చిన్న సైజు మడీ, తడీ తప్ప ఎవరినీ బాధించి, సాధించే ఛాందసం ఉండేది కాదు. మా నాన్న గారు పోయిన తరువాత మా పట్టుదల మీద మా అమ్మ అమెరికా వచ్చి లాస్ ఏంజేలేస్ లో మా తమ్ముడి ఇంట్లో ఆరు నెలలు, హ్యూస్టన్ లో మా ఇంట్లో ఆరు నెలలూ ఉంది. వచ్చిన రోజే “ఈ ఫ్రిజ్ లో ఒక అర నాకు కేటాయించండి. అంతే. అందులో నా పాలూ, పళ్ళూ, తినుబండారాలు విడిగా పెట్టుకుంటాను. తక్కిన అరలలో మీరు ఏం అఘోరించినా నాకేం పరవా లేదు. మీ వెధవ అమెరికా అలవాట్లు మీవి. మీ స్నేహితుల ఇళ్ళకి వస్తాను కానీ ఎవరింట్లోనూ భోజనం చెయ్యను. కావాలంటే అందరినీ మనింటికే భోజనాలకి పిలవండి. లింగూ, లిటికూ అంటూ ఇద్దరినీ, ముగ్గురినీ పిలిస్తే నేను వంట చెయ్య లేను. కనీసం పాతిక మందిని అయినా పిలవండి. బజారుకెళ్ళి కాస్త పెద్ద మూకుడూ, గిన్నెలూ పట్టుకు రండి. పట్టుమని పది చెంచాలు కూడా పట్టవు మీకున్న గిన్నెల్లో. ఈ వెధవ దేశం ఇలా ఉంటుంది అని తెలిస్తే ఓ ఓ గుండిగా, ఓ గంగాళమూ తెచ్చుకుందును.” అంది మా అమ్మ. నాకు తెలిసీ వంట చెయ్యడానికి ఏ నాడూ ఏ ఎలెక్త్రికల్  పరికరమూ మా అమ్మ వాడ లేదు. వాడ లేక కాదు. ఇందుతో మా చిన్నప్పటి అమ్మా, నాన్న గార్ల ఫోటో ఒకటీ జతపరిచాను. మా అమ్మ అమెరికా వచ్సినప్పటి ఫోటో ఒకటి,

అమెరికాలో మా అమ్మతో నేనూ, మా తమ్ముడూ

అమెరికాలో మా అమ్మతో నేనూ, మా తమ్ముడూ

మా అమ్మ జ్జాపక శక్తి అమోఘం.  ఒక సారి అమెరికాలో ఒకావిడని చూసీ చూడగానే “నువ్వు ఫలానా కదూ. నీ పెళ్లి ఫలానా తారీకున ఫలానా అబ్బాయితో ఫలానా సత్రంలో ఫలానా పురోహుతుడి గారే కదూ జరిపిస్తా. నేను నీ పెళ్ళికి వచ్చాను లే. ఆ పురోహితుడు మంత్రం తప్పు చదువుతుంటే మీ అమ్మకి చెప్పాను.” అనగానీ ఆవిడ బిత్తర పోయింది. ఈ యావత్ భూ ప్రపంచంలో మా అమ్మ ఎవరినైనా ఎప్పుడైనా కలుసుకుని ఉంటే మా అమ్మ ఎప్పుడూ మర్చిపోయేది కాదు. నాకు తెలిసీ మా అమ్మకి తన 83  సంవత్స’రాల జీవితంలో ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఏ డాక్టర్ నీ చూడవలసిన అవసరం రాలేదు. అన్నింటి కన్నా ఆశ్చర్యం .. శతాధికంగా ఉన్న మా బంధు వర్గంలో ఏ ఒక్కరి చేతా, ఏ నాడూ, ఒక్క “చెడ్డ” మాట అనిపించుకో లేదు. అలనాటి సమాజంలో ఈ రకమైన వ్యక్తిత్వం నమ్మశక్యం శక్యం కాని నిజం.

ఎవరినైనా సరే, ఆత్మీయంగానే తప్ప, ఆదరంగానే తప్ప, అన్యోన్యంగానే తప్ప, మరే విధంగానూ చూడని, చూడ లేని మా అమ్మ 1999  లో ఎవరికీ ఏ విధంగానూ ఇబ్బంది కలిగించకుండా సునాయాస మరణం పొందింది. కబురు తెలియగానే నేనూ, మా తమ్ముడూ పెద్ద కర్మ నాటికి కాకినాడ చేరుకున్నాం.  తన ఆస్తిపాస్తులన్నీ దాచుకున్న ఒక రేకు సూట్ కేస్ ని,  ఆమె కోరిక ప్రకారం అందరి సమక్షం లోనూ తెరిచి చూసాం. నాలుగో తరగతి వరకూ మాత్రమే చదువుకుని ఒక జీవిత కాలం కేవలం కుటుంబం కోసమే తన జీవితాన్ని పణంగా పెట్టి, తన కడుపున  పుట్టిన తొమ్మండుగురు పిల్లలనీ, వారితో సరిసమానంగా వందలాది  బంధువుల్నీ తన ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో, బాధ్యతతో తీర్చిదిద్దిన (నండూరి) వంగూరి సర్వ లక్ష్మి అనే మా అమ్మ పదిలపరుచుకున్న ప్రాపంచిక ఆస్తి కాళిదాసు మాళవికాగ్నిమిత్రం పుస్తకం, తను ఆఖరి రోజులలో కాలక్షేపం కోసం ఆడుకున్న పేక ముక్కలు, దేముడికి రోజు వెలిగించుకునే పత్తి వత్తులూ, అగరొత్తులూ వగైరా మాత్రమే!  మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే! దానికి అంతు లేదు. ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు.

 

సూరప రాజు గారి నుంచి – నా దాకా…..!

chitten raju

ఆరేడేళ్ళ  క్రితం ఒక రోజు సాయంత్రం ఒక తొంభై ఏళ్ళ పెద్దాయన కాకినాడలో మా “వంగూరి హౌస్” అనబడే ఇంటి గుమ్మం ముందు ఆగి, లోపలికి చూసి , కాస్సేపు తారట్లాడి వెళ్ళిపోవడం మా మూడో అన్నయ్య డా. సుబ్రహ్మణ్యం) కిటికీలోంచి చూశాడు.

ఆ మర్నాడూ అదే సమయానికి ఆయన వచ్చి, తలుపు తట్టి లోపలికి వచ్చారు. తన పరిచయం చేసుకుని, తాను అసలు వంగూరి ఇంటి పేరుగలవాడే కానీ, అజ్జరపు వారికి దత్తత వెళ్ళినట్టూ, తన చిన్నప్పటి నుంచి తన పూర్వీకుల ఫొటోలు రెండు ఉన్నాయి అని చెప్పి ఆ రెండు ఫొటోలూ మా అన్నయ్య కిచ్చాడు. వంగూరి వారు తణుకు దగ్గర ఉన్న సిధ్ధాంతం గ్రామ కరణాలు అనీ, ఆ ఇంటి పేరుగల వారందరికీ అదే స్వగ్రామం అనీ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మా అన్నయ్య కి ఎవరో పేషేంట్స్ వచ్చారు.

“సారీ, సార్, మనం రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. నేనే వస్తాను” అని అన్నాడు మా అన్నయ్య.  “అలాగే, తప్పకుండా, మన వంశ చరిత్ర గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను” అని ఆయన వెళ్ళిపోయారు. రెండు, మూడు రోజుల తరవాత మా అన్నయ్య వాకబు చేస్తే ఆ పెద్దాయన అంతకు ముందు రోజే చనిపోయారు అని తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులెవరికీ ఆయన చెప్పదల్చుకున్న వివరాలు ఏమీ తెలియవు. ఇందుతో ఆయన మా అన్నయ్య కిచ్చిన ఒక ఫొటో జతపరుస్తున్నాను. అందులో ఎవరు, ఎవరో ఎవరికీ తెలియదు. కానీ, నేను తలపాగా పెట్టుకుని, పంచెకట్టుకుంటే అచ్చు ఆ ఫొటోలో మొదటి వరస కుర్చీలలో ఎడం పక్కనుంచి మూడో పెద్దమనిషిని నేనే అని చాలా మంది భ్రమ పడ్డారు.

అదేం వేళా విశేషమో తెలియదు కానీ 2007 లో మేము మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు హైదరాబాద్ లో నిర్వహించినప్పుడు తణుకు నుంచి ఒకాయన ఫోన్ చేసి పదేళ్ళ వాళ్ళమ్మాయి తెలుగులో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలదని చెప్పి, ఆ మహాసభలలో తనకి అవకాశం ఇమ్మని కోరుతూ ఫోన్ లోనే ఆ అమ్మాయి చేత నాతో మాట్లాడించారు.  ఆ పాప పేరు శృతి. ఆ మహాసభలో తెలుగు భాష గొప్పతనం మీద అద్భుతంగా మాట్లాడి సతీ సమేతంగా బాపు-రమణ లనీ, సినారే లాంటి వారి పెద్దలనీ ఆకట్టుకుంది. నన్ను పిలిచిన ఆయన పేరు వంగూరి కిషోర్. తణుకులో లాయరు. మా ఇంటి పేరే కాబట్టి వారి పూర్వీకులు కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్న సిద్దాంతం గ్రామం అని తెలియగానే ఆయన సహాయంతో నేను, మా పెద్దన్నయ్యా, ఆఖరి చెల్లెలు ఉషారేవతీ, యింకా ఇతర కుటుంబ సభ్యులమూ సిద్దాంతం వెళ్ళాం.

మా పూర్వీకుల స్వగ్రామం చూడడమే కాకుండా కూడా ఆ పెద్దాయన ఇచ్చిన ఫోటోలు, మా దగ్గర ఉన్న మరికొన్ని ఫోటోలూ కూడా పట్టుకెళ్ళి, అక్కడైనా మా ఇంటి పేరు గల వారు ఉంటే, వారి దగ్గర సమాచారం సేకరించి, మా వంశ చరిత్ర తెలుసు కుందామనీ, వీలయితే వ్రాసుకుందామూ అనీ నా కోరిక.  మొత్తానికి సిద్దాంతం వెళ్లి, అక్కడ వంగూరి వెంకట్రామయ్య గారు అనే ఆయన్ని కలుసుకుని ఆయనకీ, మాకూ తెలిసిన వంశ వృక్షం వివరాలనూ పంచుకున్నాం.  నాకు నిరాశ కలిగించిన విషయం అ పెద్దాయన మా అన్నయ్య కి ఇచ్చిన ఫోటో లో ఉన్నవారెవరూ ఆయనకీ తెలియకపోవడం. అన్నట్టు ఆయన కూడా లాయరే!. ఆయన కొడుకూ లాయరే!vanguri2_708400

రెండేళ్ళ క్రితం మా చిన్నన్నయ్య అమెరికా వచ్చినప్పుడు నేనూ, సియాటిల్ లో ఉండే మా రెండో చెల్లెలు అన్నపూర్ణా, లాస్ ఏంజెల్స్ లో ఉండే మా తమ్ముడు హనుమంత రావు ఇంట్లో ఒక వారం రోజులు మా వంశ చరిత్ర సమగ్రంగా రూపొందించే ప్రాజెక్ట్  మీద పని చేశాం. మా వంశ చరిత్ర తో మొదలు పెట్టి నా సొంత డబ్బా కొట్టుకునే స్వార్ధం నాదే అని ఒప్పేసుకుంటున్నాను.  మేము నలుగురం అన్ని వివరాలూ క్రోడీకరించుకుని , అందరిలోకీ నా ఒక్కడికే రచనా వ్యాసంగం మీద ఆసక్తి ఉంది కాబట్టి మా వంశ చరిత్ర కి అక్షర రూపం కలిగించే బాధ్యత నా మీదే పడింది.  వంశ వృక్షం రూపొందించడం, కొన్ని వందల ఫోటోలని ఒక ప్రణాళిక ప్రకారం సమకూర్చడం మా అన్నపూర్ణ కొడుకు..వంశీ (మా మేనల్లుడు) సాంకేతిక సహాయం తో మొదలుపెట్టాము.

కానీ మా అందరి దురదృష్టవశాత్తూ మేము లాస్ ఏంజెలేస్ లో కలుసుకున్న తరువాత నెల తిరగకుండానే అక్కడే తన పెద్ద కొడుకు ఇంట్లో ఉండగా మా చిన్నన్నయ్య హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు. మా తరంలో ఆయన మరణమే మా కుటుంబంలో మొదటిది.  మా చిన్నన్నయ్య పేరు ప్రభాకర మూర్తి రాజు. మా మాతామహుల పేరు. వృత్తి రీత్యా లాయరు. ఆ తరువాత మా పెద్దన్నయ్య గత సంవత్సరం నవంబర్ లో తన 80 వ ఏట కాకినాడలో పోయాడు. ఆయన పేరు సూర్యప్రకాశ రావు. మా పితామహుల గారి పేరు. వ్యవసాయదారుడు. వీరిద్దరూ మా వంశ చరిత్ర మీద చాలా ఆసక్తి ఉన్నవారు. ఇప్పుడు నేను వ్రాస్తున్న ఈ వివరాలు చాలా మటుకు వారిద్దరూ చెప్పినవే. వారికి ఈ వ్యాస పరంపర చూపించే అదృష్టానికి నేను నోచుకోలేదు.

ఇక, క్లుప్తంగా చెప్పాలంటే మా వంగూరి వారి వంశానికి మూల పురుషుడు సుమారు క్రీ. శ. 1650 ప్రాంతాలకి చెందిన సూరప రాజు గారు అని మా పరోశోధనలో తేలింది. ఆయన కుమారులలో ఒకరి పేరు బాపిరాజు గారు. మరొకరైన చిట్టెన్ రాజు గారి పేరే ఎనిమిది తరాలలో నిలబడి నాకు కూడా అదే పేరు పెట్టారు. ఆ చిట్టెన్ రాజు గారి కుమారులైన నందప్ప, రాజన్న, గోపన్న, మల్లప రాజు గార్లలో (సుమారు క్రీ. శ. 1750) మల్లప రాజు గారి సంతతే మేము.

నాలుగవ తరానికి చెందిన చిట్టెన్ రాజు (సుమారు క్రీ. శ. 1780), ఆయన కుమారులు వెంకట రత్నం, సర్వేశం, శంకరయ్య గార్లు. ఇందులో సర్వేశం గారి ఏకైక కుమారులు మళ్ళీ చిట్టెన్ రాజు గారే (సుమారు క్రీ. శ. 1840). ఆరవ తరానికి చెందిన ఈయన మా ముత్తాత గారు. అప్పటి నుంచీ మా వంశ చరిత్ర బాగానే తెలుస్తోంది. క్రీ. శ. 1820 ప్రాంతాలలో సిద్దాంతం గ్రామంలో విపరీతమైన క్షామం సంభవించింది. 1857  లో గోదావరి ఆనకట్ట కట్టిన తరువాత సర్వేశం గారు యానాం-తాళ్ళ రేవు ప్రాంతాలకి వలస పోయారు.  మా ముత్తాత గారు, ఆయన సోదరులు శంకరయ్య గారూ తాళ్ళ రేవు నుండి రంగూన్ కి ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారు. కానీ ఆ వ్యాపారం ఫలించక, మా ముత్తాత గారు విశాఖ జిల్లా లోని తొండంగి గ్రామానికి నివాసం మార్చి అక్కడ సర్వేయర్ గా పనిచేసే వారు. ఆయన మొదటి భార్య జగదాంబ గారు 1868 లో ఒక మగ పిల్ల వాడిని కానీ పురిట్లోనే చనిపోయారు. మహాత్మా గాంధీ కూడా మా అదే సంవత్సరం పుట్టడం కేవలం యాదృచ్చికం. ఆ పిల్ల వాడి పేరు సూర్య ప్రకాశ రావు గారు. ఆయనే మా తాత గారు.

జగదాంబ గారు పోయిన తరువాత మా ముత్తాత గారు మళ్ళీ వివాహం చేసుకున్నారు. కానీ, ఆ సవితి తల్లి ఆదరంగా చూడని కారణం వలన మా తాత గారు పదేళ్ళ దాకా స్కూల్ కి వెళ్ళకుండా ఆట పాటల తోటే కాలక్షేపం చేసేవారు. అది చూసి “అయ్యో, శుభ్రంగా చదువుకోవలసిన కుర్రాడు పాడయిపోతున్నాడే” అని ఆయన మేనమామ గారైన కుంటముక్కల హనుమయ్య గారు వారి స్వగ్రామం అయిన దొంతమ్మూరు  (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర) తీసుకెళ్ళి, తాము ధనవంతులు కాక పోయినా మా తాత గారిని స్కూల్ లో చేర్పించారు. అంత ఆలస్యంగా స్కూల్ లో చేరినా, మా తాత గారు స్వతహాగా తెలివైన వారు కాబట్టి కష్ట పడి చదువుకుని , మెట్రిక్ మొదటి రేంక్ లో పాసయ్యారు.  అది చూసి పిఠాపురం రాజా వారూ మా తాత గారికి స్కాలర్ షిప్ ఇచ్చి మద్రాసు లో లా డిగ్రీ చదివించారు. చదువుకునే రోజుల్లోనే మా తాత గారికి తాళ్లూరి వారి ఇంట పుట్టిన ఆదిలక్ష్మీ మాణిక్యాంబ గారితో వివాహం జరిగింది. ఎంతో అందంగా ఉండే మా బామ్మ గారికి నల్లగా ఉండే మా తాత గారి తో పెళ్లి చెయ్యడానికి ఎంతో తర్జన భర్జన పడినప్పటికీ, ఆయనది మహర్జాతకం కాబట్టి మా బామ్మ గారి తల్లిదండ్రులు ఒప్పుకున్నారుట.

మద్రాసులో లాయర్ డిగ్రీ పూర్తీ చేసుకుని మా తాత గారు కాకినాడలో సుమారు 1905 ప్రాంతాలలో లీగల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అతి త్వరలోనే మొత్తం తూర్పు గోదావరి జిల్లాకే ఆయన అగ్రగణ్యుడిగా నిలిచారు.

ఆ రోజుల్లో మా తాత గారు కాకినాడ దేవాలయం వీధిలో నివసించే వారు. వారింటి వెనకాలే మా మాతామహులు నండూరి మూర్తి రాజు గారు, మా అమ్మమ్మ ఉండేవారు. అందుచేత పరిచయాలు ఉండేవి.  పెళ్ళి అయి చాలా కాలమే అయినా మా అమ్మమ్మకి అప్పటికి యింకా పిల్లలు లేరు. కానీ, మా బామ్మ గారికి  అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. (సుబ్బలక్ష్మి, వెంకాయమ్మ, హనుమాయమ్మ). మా బామ్మ గారికి నాలుగో సంతానంగా నవంబర్ 30, 1907 నాడు  మా నాన్న గారు పుట్టారు. ఆ సమయంలో మా తాత గారు కోర్ట్ లో ఉన్నారు. కొడుకు పుట్టిన కబురు తెలియగానే, ఒక తోటి లాయర్ “ఏమోయ్ , ప్రకాశ రావూ,  ముగ్గురు ఆడపిల్లల తరువాత కొడుకు పుట్టాడు కదా. ఎలా సెలబ్రేట్ చేస్తావూ ?” అని చాలెంజ్ చేసారుట. “సరే, ఈ రోజునుంచీ బారసాల నాటి దాకా నాకు వచ్చిన డబ్బంతా బారసాల కే ఖర్చు పెడతాను” అన్నారుట మా తాత గారు. ఇక చూసుకోండి…అంతవరకు ఫీజులు ఎగ్గొట్టిన వాళ్లందరూ అర్జంటుగా చెయ్యడంతో మొత్తం ఆ పది రోజుల్లోనూ పదమూడు వేల రూపాయలు రాగా, మా తాత గారు అంతా మా నాన్న గారి బారసాల నాడు వెయ్యి మందికి పైగా అన్నదానం కింద ఖర్చు పెట్టారుట. ఈ రోజుల లెక్కలో బహుశా అది కొన్ని లక్షల రూపాయలు అవుతుందేమో!

మా నాన్న గారి తరువాత మా బామ్మ గారికి మరో ఇద్దరు ఆడపిల్లలు (సూర్య భాస్కరం, రంగనాయకమ్మ) పుట్టారు.  అంటే, మా బామ్మ గారికి, తాత గారికీ మా నాన్న గారు ఒక్కరే కొడుకు. ఐదుగురు కూతుళ్ళు(మా మేనత్తలు). మా ఆఖరి మేనత్త పుట్టినప్పుడు  ఒక చిన్న విచిత్రం జరిగింది.  ఆ రోజుల్లో, ఇప్పటికీ కొంత మంది పాటిస్తున్న ఒక ఆచారం లేదా నమ్మకం ఉండేది. అదేమిటంటే, సంతానం లేని వారు బాలింత రాలి చేత తాంబూలం, కాయం తీసుకుంటే పిల్లలు పుడతారుట. ( మా చిన్నపుడు నాకు ఈ కాయం అంటే ప్రాణం. భలే రుచిగా ఉండేది. మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు పురుడు పోసుకునే వారు కాబట్టి ప్రతీ రోజూ ఈ కాయం దొరికేది).  మా ఆఖరి మేనత్త పుట్టినప్పుడు , మా అమ్మమ్మ (బాపనమ్మ) మా బామ్మ (మాణిక్యాంబ) గారికి తాంబూలమూ, కాయం ఇచ్చారు.

అప్పుడుమా తాత గారు, బామ్మ గారు (సూర్య ప్రకాశ రావు గారు, మాణిక్యాంబ గారు)మా తాత గారు, బామ్మ గారు (సూర్య ప్రకాశ రావు గారు, మాణిక్యాంబ గారు) మా బామ్మ గారు “మీకు అమ్మాయి పుడితే మా అబ్బాయికిచ్చి చేసుకుంటాము” అన్నారుట. ఆ దేవుడి దయ వలనో, ఆ నమ్మక బలమో తెలియదు కానీ. ఏడాది తిరక్కుండానే , ఆగస్ట్ 11, 1916  నాడు మా అమ్మ పుట్టింది. అప్పటికే మా మూర్తిరాజు తాత గారు కాకినాడ వదిలి జేగురు పాడు వెళ్ళిపోయారు. కానీ, మా అమ్మకి పదకొండో ఏట పెళ్లి సంబంధాలు చూడడం మొ

దలు పెట్టినప్పుడు మా బామ్మ గారి మాటలు గుర్తుకి వచ్చి వంగూరి వారి అబ్బాయి కి పెళ్లి అయిందా, లేదా అని వాకబు చెయ్యడానికి మా అమ్మమ్మ తమ్ముడు (పేరు తెలియ

దు. అద్దంకి సూర్యనారాయణ మూర్తి గారు అని నా ఊహ) కాకినాడ వెళ్ళారు.  మా నాన్న గారు కొవ్వూరు లో ఏదో సంబంధం చూడడానికి వెళ్తూ , వెనక్కి వచ్చే దారిలో జేగురు పాడులో మా అమ్మని చూసి, సంబంధం ఖాయం చేసుకున్నారు. ఆ విధంగా మా అమ్మ నండూరి సర్వలక్ష్మి కే, మా నాన్న గారు వంగూరి వెంకట రామలింగేశ్వర శర్మ గారికీ ఫిబ్రవరి 28, 1926  నాడు వివాహం జరిగింది. 1932  లో మా పెద్దన్నయ్య (సూర్య ప్రకాశ రావు, మా తాత గారి పేరు ) పుట్టుక తో మా తరం మొదలయింది.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలనది ఏమిటంటే, ఎంతో బీదరికం అనుభవించి, కేవలం స్వశక్తితో, లాయర్ వృత్తిలో రాణించి, లక్షల కొద్దీ ఆస్తి సంపాదించి, కొన్ని వందల మందిని చదివించి, శక్తికి మించి తృణప్రాయంగా  దాన ధర్మాలు చేసిన మా తాత గారు సూర్య ప్రకాశ రావు గారు, మా బామ్మ గారు మాణిక్యాంబ గారి పుణ్యం ఫలమే ఈనాడు సుమారు  150 పైగా ఉన్న మా సమిష్టి కుటుంబం అంతా అనుభవిస్తున్నాం.  1951 వ సంవత్సరం డిశంబర్ లో ఒకే రోజున పొద్దుట మా తాత గారూ, సాయంత్రం మా బామ్మ గారు సహజ మరణం పొందారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. వారిద్దరి వర్చస్సూ , ఆప్యాయతా నాకు ఇప్పటికీ, ఎప్పటికీ, కలకాలం గుర్తు ఉంటుంది.  ఇందుతో వారిద్దరి ఫోటో జతపరుస్తున్నాను. జన్మ జన్మలకీ  వారికి నేను ఋణగ్రస్తుడనే.

 

అలా మొదలయింది…

chitten rajuఅప్పుడెప్పుడో. మూడు, నాలుగేళ్ళ క్రితం పట్టక, పట్టక నిద్ర పట్టినప్పుడు నాకు ఓ కల వచ్చింది. అప్పుడప్పుడు కలలు రావడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ…ఫ్రాయడ్ అనే జర్మన్ మహానుభావుడి సిధ్ధాంతం ప్రకారం ఒకే కల పదే, పదే రావడం చాలా జాగ్రత్తగా గమనించదగ్గదే. కొండొకచో భయపడ దగ్గదే.

ఎందుకో తెలియదు కానీ, పూర్వం రోజులలో లాగా  దేవుడు కలలో కనపడి “ఫలానా చోట అమ్మాయి నీ కోసం పూజలు చేస్తోందీ, వెళ్ళి వరించూ”, లేదా “నా మీద ఒక కావ్యం రాసి నాకు అంకితం ఇయ్యి”, లేదా “ఫలానా వ్రతం చేసుకుంటే నీకు మగ పిల్లాడు పుడతాడు” మొదలైన కలల గురించిన కథలు ఈ మధ్య ఎక్కడా వినడం లేదు. ఆ దేవ దేవలతలకి కూడా ఈ నాటి తెలుగు వారి కలలలోకి వెళ్ళడానికి విసుగొచ్చిందేమో అని నా అనుమానం.

నా కేసులో ఈ ఒకే ఒక కల ఎప్పుడూ తెల్లారగట్టే రావడంతో నాకు మరీ బెంగ పట్టుకుంది. దానికి హిందూ సిధ్ధాంతం ప్రకారం రెండు కారణాలు. ఒకటేమో, తెల్లారగట్టే వచ్చే కలలు నిజమౌతాయిట. అంతకంటే అన్యాయం…ఆ కలలో కనక మన జీవితం అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే, ఇంక అంతే సంగతులు…అనగా….మనిషి చచ్చిపోయే ముందు వాడి జీవితం అంతా ఫ్లాష్ బేక్ లో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తెర మీద చూపించినట్టు కనపడితే మనం బాల్చీ తన్నేసే సమయం వచ్చేసిందన మాట. నాకు పదే, పదే వస్తున్న ఆ కలల సారాంశం అదే. నేను కాబట్టి సరిపోయింది కానీ ఈ కలల వ్యవహారానికి మరొకరు ఎవరైనా గుండె ఆగిపోయి టపా కట్టేసే వారు.

నాకు ఇలాంటి కలలూ-వ్యక్తులపై వాటి ప్రభావమూ మొదలైన వాటి మీద ఎక్కువ నమ్మకం లేదు, పైగా నేను చెయ్యవలసిన పనులు చాలానే ఉన్నాయి. కానీ నా జీవితంలో తారసపడిన వ్యక్తులూ, జరిగిన సంఘటనలూ ఆ కలలో కనపడీ కనపడనట్టు నా ఒక్కడికీ కనపడి ఠపీమని మాయమై పోవడం నచ్చ లేదు. అంచేత కోపం వచ్చి, అవన్నీ నేనే రాసి పెట్టుకుంటే, నిద్ర పట్టనప్పుడు చదువుకుని జ్ఞాపకం తెచ్చుకోవచ్చును కదా అనే ఆలోచన వచ్చింది. మన జీవితం గురించి మనమే రాసి పారేసుకుంటే దాన్ని ఆత్మ కథ అంటారుగా, ఇంతోటి నా ఆత్మ కథ నాకు తెలిసిన ఇంకెవరికైనా కావాలా అనే ప్రశ్న నాకు నేనే వేసుకున్నాను. ఇంకెవరికీ అక్కర లేక పోయినా, నాకే అది కావాలి కదా….అసలు జీవితంలో ఏం పొడిచేశాం అని బేరీజు వేసుకోవడంలో తప్పు లేదు కదా అని కూడా అనుకున్నాను.

తీరా “ఆత్మ కథ” రాసుకుందాం అనే ఆలోచన రాగానే “ఏ ఆత్మ కథా?” అనే ప్రశ్న ముందుకొచ్చింది.

ఎందుకంటే మొదటిదేమో నేనూ అందరిలాగానే నా ప్రమేయం ఏమీ లేకుండానే పుట్టాను, పెరిగాను, పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని, బుద్ధిగా సంసారం చేసుకుంటున్నాను ఎట్సెటరా. మనలో 99 శాతం ఇలాంటి బాపతే. ఎందుకు పుడతారో తెలియదు. పోయాక ఎక్కడికి పోతారో అంతకంటే తెలియదు.

ఇక రెండోదేమో అందరిలో కొందరిలా నేను కూడా కాస్తో, కూస్తో చదువుకున్నాను, ముందు ఉద్యోగమూ, తరువాత వ్యాపారమూ చేసి, కాస్తో, కూస్తో డబ్బు సంపాదించి, అందరిలో కొందరిలో కొందరిలా కాకుండా ఆ డబ్బు నిలబెట్టుకోలేక పోయాను. అలా లాభసాటి వ్యాపారం చేసినా డబ్బు నిలబెట్టుకోలేకపోవడాన్ని “బేపన వ్యాపారం” అంటారుట. దానికి నేనే ఉదాహరణ. ఇక్కడో ఒక జోకు గుర్తుకొస్తోంది. ఎవరో మరొకర్ని “బ్రామ్మడి చేత ఒక మిలియన్ డాలర్ల వ్యాపారం ఎలా చేయించాలీ?” అని అడిగాడుట. “దానికేముందీ, వాడి చేతిలో బాగా నడుస్తున్న పది మిలియన్ల వ్యాపారం పెట్టి నడిపించమంటే నెల తిరక్కుండా దాన్ని ఒక మిలియన్ చేసేస్తాడు” అని చమత్కారం.

మరి మూడో ఆత్మకథేమో…అందరిలో కొందరిలో మరి కొద్ది మందే ఉండే తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టాను, కథలు వ్రాశాను, రాయించాను. వాటిని కథలు అనకూడదనే వాదనలూ విన్నాను. నాటకాలాడాను. ఆడించాను. అయినా రిటైర్ అయిపోకుండా నా సొంత సుత్తితో చాలా మందిని చావగొడుతున్నాను.

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

ఇక, నేను బొంబాయి ఇండియన్ ఇన్సిస్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ  (IIT, Bombay) లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారి ప్రభావంతో ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త ఇ. ఎఫ్. షుమాకర్ గారి “Small is Beautiful” పుస్తకంలో ప్రతిపాదించిన సిధ్ధాంతాలకి అనుగుణంగా కొందరితో కలిసి సంస్థాపించిన “Appropriate Technology Unit” ద్వారా మహారాష్ట్ర లో గ్రామ సమాజ సేవా కార్యక్రమాలతో మొదలు పెట్టి ఈ నాటి వరకూ కాస్తో, కూస్తో సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తున్నాను. బొంబాయిలో ఆ నాటి నా శిష్యులలో ఈ నాటి ప్రముఖులు కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్, InfOsys వారి నందన్ నిలేకానీ, మరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. ఇలాంటి వ్యాపకం మీద మాత్రమే వ్రాస్తే అది నా “నాలుగో ఆత్మ కథ” కిందకి వస్తుంది కదా!

ఇలా అనేక రకాల “ఆత్మ ఘోషలు” నాకు ఉన్నప్పుడు, దేని గురించి వ్రాయాలీ? ఆ ప్రశ్నకి సరి అయిన సమాధానం లేక, గొప్పవాళ్ళలా పెద్ద, పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా నాకు తోచిన అంశాల మీదా, వ్యక్తుల మీదా, సంఘటనల మీదా తోచినది తోచినట్టు వ్రాసుకుందామని అనుకుంటున్నాను. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను ఏనాడూ, ఎప్పుడూ డైరీ రాయలేదు. రోజూ డైరీ వ్రాసుకున్న వాళ్ళే ఆత్మ కథ వ్రాసుకోవాలి అనే రూలూ లేదు. అందుచేత తారీకులూ, పేర్లూ, సంఘటనలూ కేవలం నా బుర్రలో ఉన్న మట్టి పదార్ధం లో అట్టడుగున జ్ఞాపకాల దొంతర్లలో ఎక్కడో దాక్కున్న వాటిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని వ్రాస్తున్నవే కానీ…చరిత్రలో నిక్షేపించే సత్తువ లేనివే!

ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇవి కేవలం నా జ్ఞాపకాలే! నా కోసం నేను వ్రాసుకున్నవే అని స్పష్టంగానే విన్నవిస్తున్నాను. ఆ మాట కొస్తే “అశోకుడు బాటకిరుపక్కలా వృక్షములు నాటించెను” అనేది ఎవరు చూశారు? దాన్ని ఎంత నమ్ముతున్నామో, నా జ్ఞాపక శక్తిని  కూడా అంతే నమ్ముకుంటాను.

చెప్పొద్దూ, నా జీవితంలో మొట్టమొదటి పరీక్ష నేను బాగానే పాస్ అయ్యాను. అంటే, బతికి బయట పడ్డాను అనమాట. ఇదెందుకు చెప్పవలసి వస్తోందంటే, నేను పుట్టినప్పుడు కవల పిల్లలంట. పుట్టగానే కుయ్, కయ్ అనడం కానీ, కాళ్ళూ, చేతులూ తప తపా కొట్టుకోవడం కానీ మా ఇద్ద్దరు నలుసులకీ లేక పోవడంతో మా అమ్మకి మొత్తం పదకొండు పురుళ్ళు పోసిన ఎరకల సత్తెమ్మ మమ్మల్ని బతికించడానికి తనకి తోచిన పధ్ధతులు..అనగా..లాగి లెంపకాయ కొట్టడం, నోట్లో వస పొయ్యడం లాంటి చిట్కాలు ప్రయోగించింది. దాంతో నేను కేరు, కేరు మని ఏడ్చి రాగాలు పెట్టి అందరినీ సంతోషపెట్టినా, నా తోటి వాడు చేతులెత్తేసి దేవుడి దగ్గరకి పారిపోయాడు. “వాడు కూడా బతికి ఉంటే, మా జంట ధాటీకి తట్టుకోలేక ఈ లోకం ఏమైపోవునో కదా!” అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

నేను కాకినాడలో బతికి బయట పడ్డాను అని తెలియగానే అదే రోజు అక్కడ జర్మనీలో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. మరొక ఆరు నెలలలో జపాన్ లో ఆటంబాంబు పేలింది. రెండో ప్రపంచ యుధ్దం ఆగిపోయింది. ఆ ఏడే రేడియో అన్నయ్య, అక్కయ్య, “చిన్న పిల్లల కోసం ఇద్దరు పెద్దలు” అనుకుంటూ “బాల” పత్రిక మద్రాసులో మొదలుపెట్టారు…ఆ “బాల” పత్రికలోనే ఆ యేడే ముళ్ళపూడి గారి మొదటి రచనా, బాపు గారి మొదటి బొమ్మా ప్రచురించబడ్డాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు తెలుగు జాతి అంతటికీ. అప్పుడే పుట్టిన నా మీద కూడా ఆ దేవతల ఆశీర్వచనం పువ్వులు ఒకటో, రెండో, కొన్ని అక్షింతలూ పడే ఉంటాయి. లేక పోతే ఇవాళ ఈ వ్యాసం వ్రాయగలిగే అదృష్టానికి నోచుకోగలుదునా.?

ఆ నెలలోనే అంతకు వందల సంవత్సరాల ముందు ఇంగ్లండ్ లో షేక్స్ పియర్ అనే ఆయన పుట్టాడు. నేను పుట్టిన పాతికేళ్ళకి, అదే తారీకున  జెర్రీ సైన్ ఫెల్డ్ అనే అమెరికన్ కమేడియన్ పుట్టాడు. ఇవన్నీ కాస్సేపు గూగుల్ చేసి చదువుకుంటే మంచి ఫీలింగే వచ్చింది. కానీ, సరిగ్గా నేను పుట్టిన నాడే, ఆంటే అదే ఏడూ, అదే తారీకున ఏ ఒక్క తలమాసిన గొప్పవాడూ పుట్ట లేదు….నేనొక్కడినే ఆ “దడిగాడు వానసిరా”. “Your birth may be common, but, death will be history” అనే నానుడి నాకు భలే ఇష్టం.

మా అమ్మ పుట్టిల్లు కాకినాడ-రాజమండ్రిల దగ్గర ఉన్న పాలతోడు గ్రామం అయినా పక్కనే ఉన్న జేగురు పాడు లో మేనమామల ఇంట పుట్టింది. ఇరవై, ముఫై ఏళ్ళ క్రితం అక్కడ గోదావరి బేసిన్ లో “గాస్” ఉన్నట్టు ప్రభుత్వం వారు కనుక్కుని, ఆ తరువాత ప్రెవేటు కంపెనీ వారు రసాయనం ఫేక్టరీలు పెట్టే దాకా ఆ ఊరి పేరు ఎవరికీ తెలీదు. నా చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రం ఆ ఊరు వెళ్ళిన గుర్తు.

కానీ పదేళ్ళ క్రితం పని కట్టుకుని నేనూ, మా పెద్దన్నయ్యా, మూడో అన్నయ్యా,  చెల్లెళ్ళూ కాకినాడ నుంచి ప్రత్యేకంగా నాకు వరసకి మేనల్లుడు అయ్యే అద్దంకి సుబ్బారావు కుదిర్చిన టాటా సుమో లో జేగురు పాడు వెళ్ళాను. వెళ్ళి అనేక కారణాలకి ఆశ్చర్య పోయాను, ఆనందపడ్డాను. ఊళ్ళోకి అడుగుపెట్టగానే, ఎక్కడ చూసినా “గ్రీన్ విలేజ్” “పర్యావరణాన్ని కాపాడండి”. Save Earth” లాంటి బోర్డుల తో అమెరికాని మించి పోయిన అవగాహన, ఆచరణ నాకు ఆ చిన్న పల్లెటూరులో కనిపించాయి. మొత్తం గ్రామం చుట్టుపక్కల అంతా పచ్చటి పొలాలతో సస్యశ్యామలంగా ఉంది. ఉన్న పది రోడ్లూ చాలా చిన్నవి అయినా పూర్తిగా సిమెంట్ రోడ్లతో, అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడ మా అమ్మ పుట్టింటికి వెళ్ళే రోడ్డు మీద మేము వెళ్ళిన కారు పట్టక, ఎక్కడో పార్క్ చేసుకుని నడిచి వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వరసకి చిన్నాన్న అయే చంటి నాన్న, భార్య, కూతురు ఎంతో ఆప్యాయంగా ఆ మండువా ఇంట్లోకి ఆహ్వానించారు.

ఇంటి ముందు రెండు అరుగులూ, గుమ్మం దాటగానే చెట్ల మధ్యన మండువా…అమెరికాలో దాన్ని పెద్ద ఫేషనబుల్ గా Atrium అంటారు…వెనకాల వేపు ఒక వరండా, రెండు గదులు, పక్కనే వంటిల్లు, వెనక గుమ్మంలోంచి మా అమ్మ ఇతర బంధువులైన భాస్కర మూర్తి గారి ఇల్లు….నేను ఐదారేళ్ళప్పుడు చూసిన, ఆడుకున్న ఆ దృశ్యాలన్నీ మళ్ళీ కళ్ళకి కట్టినట్టు కనపడ్డాయి. మా చంటి నాన్న వెనకాల ఒక గదిలోకి అందరినీ తీసుకెళ్ళిన నాతో “ఒరే, అమెరికాయ్. ఇదుగో ఈ గదిలోనే మీ అమ్మ పుట్టింది” అని ఒక గదీ, అందులో ఒక నులక మంచం చూపించాడు. నేను అవాక్కయిపోయాను. అసలు ఇటువంటి సంఘటన నేను ఊహించనే లేదు.

ఎందుకంటే, ఆ గది, బహుశా ఆ మంచమూ మా అమ్మ పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండి ఉంటాయి. మా అమ్మ అక్టోబర్ 8, 1916 రోజున ఆ గదిలో పుట్టింది. అంటే నేను ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ మార్చ్  27, 2013 రోజుకి 97 సంవత్సరాలు అయింది. మా అమ్మ ఏప్రిల్, 1999 లో పోయింది. …అవును…నేను పుట్టిన రోజు నాడే..ఏప్రిల్ నెలలోనే…ఎనభై మూడేళ్ళ వయసులో. అప్పుడు నేను  అమెరికాలో “మహద్భాగ్యం” అనుభవిస్తున్న కారణాన్న పదో రోజుకి కానీ వెళ్ళ లేక పోయాను. కనీసం అటువంటి సమయాలలో దానిని “అమెరికాలో దౌర్భాగ్యం” అనుభవిస్తున్నాను అని అనుకోవాలి.

1916 లో మా అమ్మ పుట్టిన ఆ చిన్న గదిని చూసి నేను అదోలా అయిపోతుంటే….మా చంటి నాన్న…”ఒరేయ్ రాజా…మొన్న దేనికోసమో అటకలో వెతుకుతూ ఉంటే ., ఇదిగో ఈ కాగితాలు కనపడ్దాయి. ఇవి మీ తాత గారి చేతి వ్రాతలో ఉన్న “శ్రీ రామలింగేశ్వర శతకం” వ్రాత ప్రతి. మొత్తం 15 పేజీలు, 108 పద్యాలూ. ఇక్కడే ఇండియాలో ఉంటే చెదలు పట్టేస్తాయి. అమెరికా తీసుకుపో” అని ఆ కాగితాలు నా చేతిలో పెట్టాడు. అవి ముట్టుకుంటే నుసి, నుసిగా అయిపోతున్నాయి. ఎందుకంటే మా తాత గారు అవి వ్రాసిన సంవత్సరం సుమారు 1904 .అంటే ఇప్పటికి నూట తొమ్మిది సంవత్సరాల క్రితం. ఆ శతకంలో మొదటి పేజీ ఇందుతో జతపరుస్తున్నాను. తమ పూర్వీకుల సాహిత్య కృషిని పదిల పరుచుకునే అవకాశమూ, అభిలాషా, దేవుడి అనుగ్రహమూ ఎంత మందికి కలుగుతుందో కదా! ఆ అదృష్టం ఉన్నవారిని ఆ అపురూప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నా విన్నపం. మన సంస్కృతిని కాపాడుకోవడం అంటే అదే!

vanguri3 (2)

ఈ పై సంఘటన నిజంగానే….Deja Vu All over agian.”. ఎందుకంటే మా అమ్మ చనిపోవడానికి ఐదారేళ్ళ ముందు నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఇంచుమించు సరిగ్గా అవే మాటలు..అంటే “ఒరేయ్ ఇవి ఇండియాలో ఉంటే చెదలు పట్టిపోతాయి. నువ్వు అమెరికా పట్టికెళ్ళి దాచుకో. మన వంశంలో నా పుట్టింటివారైన నండూరి వారి వేపూ, వంగూరి వారైన అత్తారింటి వేపూ ఎన్ని తరాలు చూసినా మొదట మా నాన్న గారు..అంటే మీ తాత గారికీ, ఆ తరువాత నీకూ మాత్రమే రచనా వ్యాసంగం అబ్బింది.” అంటూ కొన్ని అచ్చు పుస్తకాలూ, కొన్ని వ్రాత ప్రతులూ నా చేతిలో పెట్టింది. మా అమ్మమ్మ పేరు బాపనమ్మ. వారికి మా అమ్మ ఒక్కర్తే సంతానం. అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఎవరూ లేరు. మా అమ్మ పేరు సర్వలక్ష్మి. కానీ పుట్టింట్లో అందరూ ’సరప్ప” అనే పిలిచేవారు. ఇప్పుడు మాకు మా అమ్మ వేపు మరీ దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. చంటి నాన్న లాంటి ఉన్న అతికొద్ది మందికీ ఇప్పటికీ నేను సరప్ప కొడుకునే!

క్లుప్తంగా చెప్పాలంటే, మా తాత గారైన నండూరి మూర్తి రాజు గారు కాకినాడ పి.ఆర్. కాలేజీలోనూ, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుంచి 1904 లో బి.యే. పట్టాతీసుకున్నారు. అప్పటి చెన్న పట్నం రాజధానిగా ఉన్న మొత్తం దక్షిణాది రాష్టానికి తెలుగులో ఆయనకి స్వర్ణపతకం లభించింది. తరువాత న్యాయవాదిగా చదువుకుందామనుకున్నా, అయన తండ్రిగారైన సోమరాజు గారు అది “అన్యాయ వ్యాపార వృత్తి” అని అభ్యంతర పెట్టగా నెలకి రెండు రూకల స్వల్ప జీతానికి కాకినాడ  రెవెన్యూ శాఖలో ఉద్యోగానికి కుదురుకున్నారు. తెలుగు భాషాభిమాని, గ్రాంధిక వాది కావడంతో తీరిక సమయంలో శుక్తి మతి, జపాను దేశ చరిత్ర మొదలైన గ్రంధాలు తొలి దశలో రచించారు. వివేకానందుడి ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి గవర్నర్ గరి చేత ఐదు కాసుల బంగారం బహుమానం పొందారు. ఆర్య మత బోధిని, వివేకోదయము మొదలైన పత్రికలలో వ్యాస పరంపర, అనీబిసెంటమ్మ ఇంగ్లీషులో వ్రాసిన రామాయణం ఆంధ్రీకరణ , షేక్స్ పియర్ హేమ్లెట్ నాటకం తెలుగు అనువాదం, 28 పాత్రలతో సావిత్రీ సత్యవంతం నాటకం, 16 పాత్రలతో విమలాప్రభాకరం అనే సాంఘిక నాటకం, వనజాక్షి అనే శృంగార ప్రబంధం, అమల వర్మ ఆనే నవల మొదలైన గ్రంధాలు ఆయన సుమారు పదేళ్ళలో రచించారు. వాటిల్ల్లో కొన్ని ఆయన మరణించిన తరువాత ముద్రించబడ్డాయి. ఆయన పుస్తకాలు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని గ్రంధాలయాల్లో ఇప్పటికీ కనపడతాయి. ఆయన చేతివ్రాతలో ఉన్న రెండు వందల పేజీలూ, ఐదు ముద్రించబడిన పుస్తకాలూ ఇప్పుడు నా దగ్గర హ్యూస్టన్ లో ఉన్నాయి. అందులో నా దగ్గర శిధిలావస్థలో ఉన్న “విమలాప్రభాకరం” నాటకం ముఖపత్రం ఇందుతో జతపరుస్తున్నాను. ఆయన రచనలన్నీ గ్రాంధికాలే!

విమలా ప్రభాకరము

విమలా ప్రభాకరము

మా అమ్మ పుట్టిన తరువాత ఆయనకి ఒక మగపిల్లవాడు ఎంతో ఆరోగ్యంగానే పుట్టాడు. ఆ సమయంలో మా తాత గారికి మన్యం ప్రాంతాలకి బదిలీ అయింది. అక్కడ ఉన్నది నాలుగు నెలలే అయినా ఆయనకీ అక్కడ విషజ్వరం సోకి మళ్ళీ కాకినాడ వచ్చెయ్యగానే ఆరోగ్యవంతుడూ, దృఢకాయుడూ అయిన మూడేళ్ళ కొడుకు హఠాత్తుగా చనిపోయాడు. అది జరిగిన ఇరవై రోజులకి మా తాత గారు జేగురు పాడులో, 1920 లో అకాల మరణం పొందారు. అప్పుడు మా అమ్మ వయసు నాలుగేళ్ళు మాత్రమే. అందు చేత ఆయన ఎలా ఉంటారో మా అమ్మకి గుర్తు లేదు.

మా తాత గారు పోయినప్పటినుంచి మా అమ్మమ్మ మాతోనే ఉండి 1970 దశకంలో నేను బొంబాయిలో ఉండేటప్పుడు మరణించింది. మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు, ఇంకా మా ఇంట్లోనే పెరిగిన యాభైకు  పైగా పిల్లలందరికీ ఆవిడే అమ్మమ్మ. మా మూర్తి రాజు తాత గారిది ఒకే ఒక్క ఫొటో మాత్రం మా ఇంట్లో ఉండేది. అది కూడా నిజానికి ఫొటో కాదు. తాశీల్దారు గా ఆయన పెయింటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టిన porttrait కి తీయించిన ఫొటో. దానిని ఇందుతో జతపరుస్తున్నాను. మా వంశంలో ఇంకెవరికీ లేని, రాని రచనావ్యాసంగం అబ్బిన ఆయనకీ  నాకూ భౌతికంగా పోలికలు నిజంగా ఆశ్చర్యకరమే!

మరొక యాదృచ్చికమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…..మా నాన్న గారి పేరు రామలింగేశ్వర శర్మ గారు. మా తాత గారు “శ్రీ రామలింగేశ్వర శతకం” రచింఛేటప్పటికి మా నాన్న గారు పుట్ట లేదు. కానీ కాకినాడలో మా అమ్మగారి నండూరి వారికుటుంబం, మా వంగూరి కుటుంబమూ దేవాలయం వీధిలో ఉండేవారు. ఆ విధంగా ఆ రెండు కుటుంబాలకీ స్వల్ప పరిచయం.

మా అమ్మ నాలుగో తరగతి వరకూ చదువుకుంది. తెలుగు పుస్తకాలు చదవడం, ఉత్తరాలు వ్రాయడం వచ్చును. మా అమ్మమ్మకి సంతకం పెట్టడం వచ్చును. ఇదీ మా తాత గారి దగ్గరనుంచి నాకు కాస్తో, కూస్తో వచ్చిన ఆస్తి “సాహిత్య జెన్యు సంక్రమణం”.