పచ్చపచ్చని కొండలు పరవశాన్నంతా పరుచుకుని ఆనంద సాగరంలో మునిగి పోవడం అనకాపల్లి రైలు ప్రయాణంతోనే మొదలయ్యింది .ఒకే అభిరుచి గల మిత్రులతో నాలుగు రోజులు ప్రయాణించడం ఎంత గొప్ప అనుభూతో .అదీ ప్రకృతిలోకి ప్రయాణించడం .అదీ సాహిత్యంతో పాటుగా ప్రయాణించడం ఇంకెంత సాహిత్యానుభూతో కదా! నింగి చందమామలు నేలకు దిగి వచ్చి దేవదూతలతో ప్రయాణం చెయ్యడం మరీ చెప్పరాని పరవశం.
ప్రకృతీ ప్రేమా ఆప్యాయతలు ఆనందాల కలబోతలు,రచనలు,రచయితలు.ఓహ్ ఎంత చక్కటి కమ్మని కాఫీ లాంటి జ్ఞాపకమో! ఆకాశం గొడుగు కింద చేతులు రెండూ రుద్దుకుంటూ పొగలు కక్కే కాఫీని చప్పరిస్తూ వాన చినుకులు భూమిని ముదాడి ,ఆ నీటి బుడగలపై ఇంద్రధనుస్సులు మెరిసి ,పగిలిపోయిన బుడగలతో పాటుగా సప్తవర్ణంలో మెరిసి పోతుంటే ఓహ్! జీవితానికెంతటి గొప్ప భరోసా!
జ్ఞానాన్వేషి అయిన మనిషి ఆత్మావలొకనంలోకి వలస వెళ్ళి రావడం మనసుకెంత ఆరాటమో! స్త్రీలందరూ దేవతల రూపం ధరించి ముందుకు వచ్చి అమృత భాండాలను మా చేతుల్లోకి వొంపి ,గాల్లోకి ఎగిరే ముంగురులను సవరించుకుంటూ నవ్వుల మోముల నిండా మరింత పరిమళమద్దుకుని ,ముందుకు వచ్చి వరాలిస్తున్నట్టుగా సంచరిస్తుంటే మనిషికి నిజంగా ఏమదృష్టం. మా ఆనంద సాగర తీరాల వెంట నడవడానికి బాటల వెంట వంతెనలు వేసిన వీళ్ళకు నమోవాకములు. ప్రకృతి స్వేచ్చగా నర్తిస్తూ మైమరిపిస్తూ ఎంతో మంది గడ్డకట్టిన హృదయాలను సమ్మోహపరిచేందుకు ,మనిషి కరిగి నీరయ్యేందుకు ఎన్ని నదులుగా విచ్చుకుని వగలు పోతుందో! అలాంటి ప్రకృతిలోకి ప్రయాణం కట్టించిన సారధులకు ప్రణామములు
ఆ ప్రకృతిలో మరో ప్రకృతి వింతైన అనుభూతి కలిగించే అజంతా సుందరి.అల్లరిలో కూడా ఎంత అద్భుతమైన లయ వుందొ!ఆమె కొద్దిసేపు బాల్యంలోకి వెళుతుంది.కాసేపటికి ఆరిందాలా మారిపోయి జీవన గీతాలను బోధిస్తుంది.మరి కొద్ది సేపటికి పురి విప్పిన మయూరమే అవుతుంది.మరి కొంచెంగా మాట్లాడితే బుంగ మూతి పెడుతుంది.కాసేపటికే వెన్నెల జలపాతమౌతుంది.వర్షించే మేఘమవుతుంది.పచ్చపచ్చని చీర కట్టే పచ్చని ప్రకృతవుతుంది. జీవించడమంటే ఏమిటో జీవనమెలా వుంటుందో, ఆనందసాగరంలో మునిగి తేలడమంటే ఏమిటో చేతివేళ్ళ కదలికలతోనే తెలియ జేస్తుంది.
నాగరికత నిండిన మనుషులు ప్రకృతిలోకి వలసపోయినప్పుడు ప్రకృతెంత ఆనందపడి పోతుందో! దారంతా ఇలా పచ్చ పచ్చని జ్ఞాపకాలుగా మారిపోయి మేఘాలూ,వర్షమూ,లోయలూ,కొండలూ కలగలిసి పోయి ఒక గొప్పసుందర దృశ్యాన్ని ముందుకు తెచ్చిపంచిపెట్టి విందారగించమంటే మేము మా స్వప్నాల్లోకి జారిపోయి మాయా ప్రపంచంలోకి వలస పోయాము.
శివుని ఝటా ఝూటం నుండి నేరుగా నేలకు జారే గంగమ్మ తల్లిలా జలపాతాలు ఆకాశం నుండి లోయలోకి జారి పొగ మంచులా విడిపోయే నీటి ఆవిరుల మధ్య మేమూ తెల్లటి నీటి వస్త్రాలు కప్పుకుని దేవతా లోకంలో విహరించి వొచ్చాము. ఆ జల ధారల ముందు మేము ఎన్నెన్నో సరిగమలు విన్నాము .ఘడియఘడియకూ రూపం మార్చుకుని గీతమై గుండెలపై వాలిపోయే ఆ వొంపుసొంపుల వయ్యారి మమ్మల్ని మరో లోకంలోకి ప్రయాణం కట్టించింది.ఆమె ముందు ఎన్నోపురా జీవ దృశ్యాలు అవగతమయ్యాయి.ఆదిమ వసంతం కళ్ళ ముందుకు వొచ్చి నిలిచింది.అదొక స్వప్నం. అదో నమ్మలేని నిజం. అదొక వింత అనుభూతి.అదొక ఆనంద పరవశాల పర్ణశాల .గుండె తలుపులు తెరిచి మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవడం.,గుమిగూడిన మనుషుల్తో ప్రేమ బంధం పెన వేసుకోవడం.సహజ సిద్ధ మానవ ఈతి బాధల్ని దూరం చేసుకోవడం. మకిల పట్టిన మనసుకు సాంత్వన చేకూర్చడం.బరువెక్కిన మనసుల్ని తేలిక పర్చుకోవడం.జీవితాల్ని నిండుగా పలవరించాలనుకునే వారంతా కలిసి సంబరం చేసుకోవడం.ఇది నీటి కోలాహలం.జలపాతాల జాతర. నీటి తరగల విశ్వరూపం .
ఆ విశ్వరూపాన్ని దర్శించుకుని నీటి జాడల నుండి మనసుల్ని బలవంతంగా తెంచేసుకుని నీటి వాలుల గుండా ఎత్తైన కొండ సానువుల గుండా గడ్డి బయళ్ళ నుండి భారంగా అడుగు తీసి అడుగేసుకుంటూ బయట పడ్డాము.అక్కడ మళ్ళీ మరో ప్రపంచం.ఆదివాసీ దేవదూతలు మాముందు ప్రత్యక్షమయ్యారు.మొలలకు అడవి అందాలను ధరించి ,తలలకు చంద్రవంకలను అలంకరించి ఢమరుకాలను చేతపట్టుకుని కాలి గజ్జలు ఘల్లుఘల్లు మంటూ అడవుల నుండి, మానవ మూలాల నుండి పూర్వీకుల నుండి బాంధవ్యాలను మూట గట్టుకుని ఆప్యాయంగా మాముందు నిలబడ్డారు
వాళ్ళను చూస్తుంటే పేగు బంధమెక్కడో మెదిలినట్టయింది.బంధుత్వమేదో కలిసినట్టనిపించింది.బాంధవ్యమెక్కడో మెలకువలో కొచ్చింది.సంగీత వాయిద్యాల నిండా అమృతం నింపుకుని వచ్చి మా ముందు ఒలకబోశారు. గొంతుల నిండా అమృత జీరతో మా ముందు ధారగా ప్రవహించారు. అడుగు అడుగులో అడుగేస్తూ తల ఎగరేస్తూ ,ఝనక్ ఝనక్ మని చిందేస్తూ కలిసి నడుస్తూ కదం తొక్కారు.కలిసి మెలిసి ఆడారు.పాడారు.కాలాన్ని ఘనీభవింపజేశారు.మరో లోకానికి మమ్మల్ని లాక్కెళ్ళి పోయారు.సంగీత కెరటమై లేచారు.నిజంగా మనుషుల ఆత్మీయ కరస్పర్శ ఎంత అనుభూతి మయమో కదా !
ఆధునిక విధ్వంసానికి గురయ్యేవారు, బయటి ప్రపంచపు వెలుతురు చూడనివారు,సూర్యుని వేడికే వొగుడాకులా రెపరెపలాడేవారు ,పుట్టుకంతా కష్టాల కడలే అని భావించేవారు వీళ్ళ చాయల్లో,వీళ్ళ కర స్పర్శతో విప్పారిన హృదయంతో వాళ్ళ రహస్యాలు వింటే చాలు మానవతలోకి రూపాంతరీకరణం చెంది సంబంధ బాంధవ్యాల చెంతకు పరుగెత్తుకు వెళ్ళాల్సిందే
అలా ఆ రాత్రి మత్తు మత్తుగా నిద్దరోయింది.మళ్ళీ ఉదయాన్నే బద్దకంగా వొళ్ళు విరుచుకుంది.. మళ్ళీ పరుగుల పోటీ .ఎక్కిన కొండలు చూసిన గుట్టలు దిగుతూ వానలో తడుస్తూ ,వానలోనే రోడ్డు వారగా విందారగిస్తూ మిత్రుల్తో కరచాలనం చేస్తూ,వీడ్కోలు కబుర్లు చెప్పుకుంటూ తిరుగు ప్రయాణం.కాలు కదిపితే చాలు ఎవరో పిలిచినట్టు పరుగెత్తుకొచ్చే వాన జల్లుల్లో మురిసిపోతూ ముద్దవుతూ ,అడుగడుగునా ఆప్యాయతారాగాలు కురిపించే దేవతల చెంత మేమంతా ఆ నాలుగు రోజులూ… ఎంత కమ్మని స్వప్నమిది.కరిగిపోకుండా,కదిలిపోకుండా వుంటే ఈ కాలం ఎంత బాగుండు అనిపించేలా! ఈ చిత్ర కూటమి ఆద్యంతం అద్భుత లోకంలో విహరించి వొచ్చినట్టు.
ఆ కలల్లో మేమంతా
ఆకుపచ్చని హరిత వనాలయ్యాము
వెన్నెల జలపాతాలయ్యాము
సువాసనల పూలజల్లులమైనాము
అడవి వూహల వెచ్చదనమయ్యాము
ఆనందసాగర చర్చలమయ్యాము
వయ్యారి జలపాతాలమయ్యాము
అడవిపూసే తంగేడుపూవులయ్యాము
అమరులైన అడవిబిడ్డల పాటలయ్యాము
గజ్జకట్టీ అటలాడే ఆటల్లో మేం ఆటలయ్యాము
దారిపొడుగునా అడవికి ఆత్మలమయ్యాము
పిల్లల్లో పిల్లల మయ్యాము
పెద్దల్లో పెద్దల మయ్యాము
ఆత్మీయుల ఆలంబనలమయ్యాము
మానవత్వపు ప్రభోదమయ్యాము
సాహిత్యపు సువాసనలయ్యాము
మర్చిపోలేని స్వప్నలోకమయ్యాము
*
మంచికంటి సార్…..
మల్లొక్కసారి తిరిగొచ్చినట్లు అనిపించింది.
ఓ పక్క ప్రకృతి, మరో పక్క విధ్వంసం, అణచివేత….
ఆ గిరిజనులు కళ్లముందు కదులుతున్నారు.
Thank you chandu.
block your december 25 th to come to ongole