– రాణి శివశంకర శర్మ
~
ఆ మహా వ్యాపార దిగ్గజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలని వొక్క దెబ్బతో ఎగరగొట్టేశాడు సిద్ధార్థ. అతనికి అంత శక్తి ఉందని డాక్టర్ కోణార్క్ కు కూడా తెలియదు. డాక్టర్ కోణార్క్ పెద్ద విద్యా వ్యాపారి. కోణార్క్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే సంస్థని స్థాపించి శరవేగంతో దూసుక పోతున్న పెద్దమనిషి.
కోణార్కకు ఎదురుగా ప్రిన్సిపాల్ కూర్చొని ఉన్నాడు. “సిద్ధార్థ మంచి లెక్చరర్ కాదు. అతన్ని తీసెయ్యాలి”, అన్నాడు.
“సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి”, అన్నాడు కోణార్క్. బయటకి వెళ్తుండగా మళ్ళీ పిలిచాడు. “చూడండీ, మంచి లెక్చరర్లు చాలా మందే ఉంటారు. సిద్ధార్థ లాంటి బ్రిలియంట్స్ కొంత మందే ఉంటారు. అతడు మనకు కావలసిన వాడు. తన గురించి ఎక్కడా నెగటివ్ కామెంట్ చేయొద్దు. అలా చేస్తే నీ ఉద్యోగం ఊడుతుంది” హెచ్చరించాడు కోణార్క్.
సిద్ధార్థ అంటే అంత అభిమానం ఎందుకు కోణార్కకీ?
కోణార్క గుంటూరు జిల్లాలోని వొక కుగ్రామంలో భూస్వామిగా వెలుగొందుతున్న రోజుల్లో సిద్ధార్థ తండ్రి కోణార్కకి నమ్మిన బంటుగా వుండేవాడు. దాని వల్లే తను విద్యావ్యాపారంలో అడుగు పెట్టిన వెంటనే సిద్ధార్థకి ఉద్యోగం యిచ్చాడు. సిద్ధార్థ తన తండ్రిలాగే కోణార్కకి ఆంతరంగికునిగా మారిపోయాడు.
గిట్టని వాళ్ళ ప్రోద్భలం వల్ల ఇన్కంటాక్స్ అధికారులు కోణార్కపై దాడి మొదలు పెట్టారు. అప్పుడు సిద్ధార్థ వెంటనే ఎలర్ట్ అయ్యాడు. నల్ల ధనాన్ని కారులో డంప్ చేసి తరలించేసాడు. దాడులు ముగిసాక భద్రంగా తిరిగి అప్పజెప్పాడు.
అంతేకాదు. వొక కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, కాలేజీ ప్రతిష్టని కాపాడాడు. నిరసన తెలుపుతున్న తల్లితండ్రులనీ, బంధువులనీ బుజ్జగించాడు. విద్యార్థి రాసిన ఉత్తరం మాయం చేసాడు.
సహజంగానే డాక్టర్ కోణార్క్ సిద్ధార్థ ప్రతిభని గుర్తించాడు. నిజానికి సిద్ధార్థ చాలా ఙ్ఞానం కలిగిన వాడు. కానీ అతని ప్రతిభ క్లాస్ రూమలకు సంబంధించినది కాదు. పౌరులు తరగతి గదుల్లో తయారవుతారు. సమాజాన్ని శాసించేవాళ్ళు క్లాస్ రూం బయట రూపొందుతారు, అనే రహస్యాన్ని గుర్తించిన ప్రతిభాశాలి సిద్ధార్థ.
అతడు పేరుకే లెక్చరర్. రాష్ట్రమంతా వ్యాపించిన కోణార్క్ విద్యా సంస్థలలో యెటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అక్కడ వాలుతాడు. విషయాన్ని బయటకు పొక్కనీయడు. సమస్యని లోపల్లోపలే ఖతం చేస్తాడు. వొక విద్యార్థినిపై లెక్చరర్లే అత్యాచ్వారం చేసారు. ఆ సంఘటనని బయటకి పొక్కకుండా , చివరకు మీడియాకి కూడా చిక్కకుండా చేయడంలో సిద్ధార్థ చూపిన ప్రతిభకి కోణార్క్ ఆశ్చర్యపోయాడు. అతని భుజాల మీద తడుతూ అన్నాడు, “యు ఆర్ ఇంటిలిజెంట్ దేన్ ఐనిస్టీన్”.
’ఇతనికి ఐనిస్టీన్కీ పోలికా?” అని చెవులు కొరుక్కున్నారు ఉత్తమ పౌరులైన ఉపాధ్యాయులు. అలా పోల్చడానికి కారణం ఉంది. సిద్ధార్థ ప్రతీదీ సాపేక్షకం అంటాడు. విలువలేమీ లేవంటాడు. ప్రతీదీ అనేక కోణాలలోంచీ ఆలోచించాలి అంటాడు. విద్యార్థినిపై అత్యాచారం జరిగినప్పుడు, రెండు చేతులూ కలిసినప్పుడే కదా చప్పట్లూ అని వాదించిన ఘనుడు సిద్ధార్థ. యిప్పుడు అమ్మాయిలు వేసుకునే దుస్తులూ, వాళ్ళ ప్రవర్తన కూడా బాగుండడం లేదన్నాడు.
యిలా అనేక కోణాలని దుమ్ములా రేగగొట్టి సమస్యని చల్లార్చేయ్యడంలో అతడు నిపుణుడు.
అతడు చాలా చదివిన వాడు, చాలా విఙ్ఞానం కలవాడు. మంచి అభిరుచులు కలవాడు కూడా. అది కోణార్కకీ బాగా తెలుసు. వొక సారి కోణార్కకీ జపాన్ దర్శకుడు కురసోవా తీసిన రషోమన సినిమాను చూపించాడు సిద్ధార్థ. ఆ సినిమాలో ఒక హత్యని గురించి నలుగురూ నాలుగు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. వారి వారి నేపథ్యాలని బట్టి అలా వ్యాఖానిస్తారు. వొకరి వ్యాఖానానికీ మరొకరి వ్యాఖ్యానానికీ పొంతన ఉండదు. సినిమా అయ్యాక సిద్ధార్థ అన్నాడు. “కోణాలు విభిన్న కోణాలు అంతే. సత్యం అంటూ ఏమీ లేదు. కనుక మనకు కావలసిన సత్యాన్ని మనం సృష్టించుకోవచ్చు. అవసరమైన లాభసాటియైన సత్యాన్ని మనమే క్రియేట్ చెయ్యచ్చు. అల్లచ్చు”.
“సిద్ధార్థా! ఆ అమ్మాయిపై అత్యాచారం సంగతి ……? ”
“ఊరుకోండి సార్, అది నిన్నే సద్దు మణిగి పోయింది”, అన్నాడు సిద్ధార్థ.
“అసలు ఏమి జరిగింది?”
“అసలు ఏమీ జరగలేదు. వట్టి పుకారుగా తేల్చేసాను. మీరు హాయిగా యింటికి వెళ్ళి ఫేమిలీతో గడపండి. యీ రొచ్చంతా మీకెందుకు”, అన్నాడు సిద్ధార్థ.
నిజమే, కోణార్క చాలా స్వచ్చంగా కనిపిస్తాడు. అతనికి యే చిన్న మచ్చయినా అంటగలదా అన్నంత తెల్లగా, తెల్లని దుస్తుల్లో ధవళ హాసంతో తాపీగా ఉంటాడు. తను కోణార్క సూర్యాలయాన్ని దర్శించి వచ్చిన వెంటనే పుట్టాడట. అందుకే అంత అరుదైన పేరును పెట్టారు. ఆయన ఏం చదివాడో యెవరికీ తెలియదు. ప్రపంచాన్ని చదివాను అని చెప్పుకుంటాడు. ఆయన నడుపుతున్న సంస్ఠలన్నీ యింగ్లీషు మీడియంవే.
సిద్ధార్థ సలహాతో తెలుగు భాషా వుద్ధరణ కోసం వొక సంస్థని స్థాపించాడు. పత్రిక నడుపుతున్నాడు. అవార్డులు యిప్పిస్తున్నాడు. అందువల్ల వొక విశ్వవియాలయం వాళ్ళు ఆయన పేరుకి డాక్టర్ తగిలించారు. సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు. ” చూసారా నా సలహా యెంత మేలు చేసిందో. మనం అన్ని కోణాలలో ఆలోచించాలి”.
“మనం డబ్బు కోసం కొన్ని పనులు చెయ్యాలి. అధికారం కోసం మరికొన్ని. దాంతోపాటూ సమాజసేవ, పేరు, కీర్తి ప్రతిష్టలు అన్నీ అవసరమే కదా? అవి మీ అధికారానికీ, డబ్బుకీ మరింత వన్నె తెస్తాయి. మీ తెల్లని దుస్తుల్లాంటివే అవీ”, అన్నాడు సిద్ధార్థ.
మాతృ భాషాదినోత్సవం జరపడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు కోణార్క. అదే సమయంలో సిద్ధార్థని వొక ప్రశ్న అడిగాడు. “విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. నువ్వెలాగో మేనేజ్ చేస్తున్నావు సరే, అసలు వీటిని ఆపలేమా?”
“ఎందుకు ఆపడం?”
“వీటి వల్ల మనకి ఎప్పుటికైనా చెడ్డపేరే కదా? అని ప్రశ్నించాడు కోణార్క.
“బహుశా పేరెంట్స్ కూడా ఇటువంటి వ్యవస్థనే కోరుకుంటూన్నారేమో. యిది మాసోచిజం కావొచ్చు. అంటే తమని తాము స్వయంగా హింసించుకోవడం. ఆధిపత్యాన్ని ఆరాధిస్తారు వీళ్ళు. తెలియని యే తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచే మనుషులు”, అన్నాడు సిద్ధార్థ తాపీగా.
సిద్ధార్థ అన్న మాటే నిజమైంది. ఆత్మహత్యలే కాదు. విద్యాసంస్థలు కూడా మరింత విస్తరించాయి. బలపడ్డాయి. యితర విద్యా సంస్థలు వీటిలో విలీనమై పోయాయి.
సిద్ధార్థలో గొప్ప దార్శనికుడు కనిపించాడు కోణార్కకి. అనేక కోణాలని ఏక కాలంలో దర్శించగల మేధావి సిద్ధార్థ అనుకున్నాడు ఆయన. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. కోణార్కకి ప్రభుత్వంలో మంచి పరపతి. అతని బంధువులు మంత్రులుగా వున్నారు. ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. యీ క్లిష్ట సమయంలో ప్రతిపక్షం నోరు మూయించగల మేధావి కావాలన్నారు. సిద్ధార్థని పంపించాడు కోణార్క.
సిద్ధార్థ ఒకటే మాట అన్నాడు. “రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అనేక కోణాలని లాగండి. వాళ్లకి గల మానసిక వైకల్యాలు, ప్రేమ సమస్యలు, సెక్స్ సమస్యలు, వాళ్ళ బాల్యం, తల్లితండ్రుల కలహాలు, వాళ్ళ పునర్జన్మ, జాతకం… యిలా అన్ని కోణాల గురించీ రకరకాల నిపుణుల చేతా, నిపుణుల్లా ఫోజు యిచ్చే వారి చేతా మీడియాలో చర్చలు చేయించండి. రకరకాల కోణాల్ని దుమ్ము లేపండి. ఆ గందరగోళంలో అసలు కోణాలు కప్పడిపోయేలా చేయండి”. ఆ ప్రాజెక్టుని సిద్ధార్థకే అప్పగించింది ప్రభుత్వం. దాంతో అతని పరపతి వొక్కసారిగా పెరిగిపోయింది.
రైతుల ఆత్మహత్యల వెనుక గల కారణాలను సర్వే చేయించడం మొదలు పెట్టింది ప్రభుత్వం. చాలా చావులకి వ్యక్తిగత సమస్యలే కారణాలుగా తేల్చేసింది. దాంతో ప్రభుత్వానికి నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత తప్పింది. దానికి బదులుగా, తమకు అనుకూలంగా మాట్లాడినందుకు సైకాలజిష్టులకీ, ఆధ్యాత్మిక వేత్తలకీ డబ్బు చెల్లించింది.
ఈలోగా గ్లోబలైజేషన్ యుగం విజృంభించింది. వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎవడి బతుక్కీ, ఎవడి చావుకీ వాడే కారణం అన్న భావన బలపడింది. రైతులు వ్యవసాయాన్ని నమ్ముకోవడం మానేసారు. తమ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకున్నారు. కోణార్క్ విద్యా సంస్థల్నే నమ్ముకున్నారు. రియల్ ఎస్టేట్ని కూడా విశ్వసించారు. లాభపడిన వాళ్ళు లాభపడ్డారు.
యీ పరిస్థితుల్లో కోణార్కని సిద్ధార్థ కలిసాడు. కోణార్క సిద్ధార్థ ముందు ఒక నివేదిక ఉంచాడు. “యిది చూసారా, యీ నెల రోజుల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వొక విద్యార్థి తోటి విద్యార్థిని హత్య చేసాడు. యిప్పుడు ఆత్మహత్యలకి హత్యలు కూడా తోడయ్యాయి మన సంస్థల్లో. మనమేమైనా అమెరికాలో ఉన్నామా? అక్కడ తోచుబడి కాక బోర్డమ్ వల్ల తోటీ విద్యార్థుల్ని తుపాకితో కాల్చి చంపేసిన వార్తలు చదివి విస్తుపోతుంటాం”, కోపంగా అన్నాడు కోణార్క.
“మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం, అంతే” , అన్నాడు కూల్గా సిద్దార్థ.
“ఏమంటున్నావ్ నువ్వు?”, గద్దించాడు కోణార్క.
“నేను అన్నది మీరు సరిగానే విన్నారు. మన విద్యాసంస్థలు తామర తంపరగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచం కూడా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. సెక్సూ, క్రైమూ రంగుల దృశ్యాలుగా ముందుకొస్తున్నాయి. దాంతో పాటూ డబ్బు విలువ, సంపాదన కోసం పరుగు వొక ఐదు సంవత్సరాల కంటే బాగా పెరిగింది. వెలుగు వెనుక నీడ ఉంటుంది. తప్పదు,” అన్నాడు సిద్ధార్థ.
“మరి మనమేమి చేయాలి?”
సమస్యలు ఉంటాయి. ఉండనీండీ. వాటి నుంచీ దృష్టి మరల్చాలి.” అన్నాడు టీవీ ఆన్ చేస్తూ సిద్ధార్థ.
“నిజానికి విద్యార్థులందరినీ ఉద్ధరించడం మన పని కాదు. యికపైన బాగా చదివే విద్యార్థులని ఏరదాం. వాళ్ళని ఒక గ్రూపుగా చేద్దాం. యిలా వర్గీకరిస్తూ పోదాం. బాగా చదివే వాళ్ళకి మంచి లెక్చరర్లని నియమిద్దాం. మంచి జీతాలనిద్దాం. మిగిలిన వాళ్ళకి తక్కువ జీతాల లెక్చరర్లని నియమిద్దాం. కానీ అందరినీ వొకే రకంగా టెన్షన్లో వుంచుదాం.”
“ఈ టెన్షన్కి పిల్లలు చస్తున్నారు”, అన్నాడూ విసుగ్గా కోణార్క.
“చావనీండీ, ఆసంగతి నేను చూసుకుంటాను”, అంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ.
సిద్ధార్థ రావడంలో గానీ పోవడంలో గానీ ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. అదే కోణార్కకి నచ్చింది. అతడు సమస్యలకి భయపడడు. సమస్యలని పరిష్కరించాలని కూడా అనుకోడు. మానవ జాతి ఉన్నంత వరకూ సమస్యలు ఉంటాయి. యింకా పెరుగుతాయి. వాటిని ఎదుర్కోవడం కాదు. సమర్ధంగా మరుగు పరచడమే తెలివి అంటే. అభివృద్ధి అంటే ఇదే అని సిద్ధార్థ ఫిలాసఫి.
ఈ ఫిలాసఫీ కోణార్కకి కూడా ఇష్టమే. నిజానికి అది ఆయన తత్వమే. అసలు అనుచరులెప్పుడూ నాయకుని తత్వాన్ని ఆచరించడంలో దూకుడు ప్రదర్శించాలి. రాజుని మించిన రాజభక్తిని ప్రదర్శించాలి. సరిగ్గా అలాంటి అనుచరుడే దొరికాడు కోణార్కకి.
కోణార్క విద్యా సంస్థలో వొక విద్యార్థి మరో విద్యార్థిని చంపేసాడు. దానికి కారణం గర్ల్ ఫ్రెండ్. ఆమె పుట్టిన రోజుని వొక గొప్ప రెస్టారెంటులో జరపడం కోసం డబ్బు కావలసి వొచ్చి తోటి విద్యార్థిని చంపేసాడు. హంతకుడు చదువులో ఫస్ట్ ర్యాంకర్.
విద్యార్థుల ఆందోళనలు మొదలయ్యాయి. సిద్ధార్థ అన్నాడు.
” యీ విద్యార్థిని కేసుల నుంచీ బయట పడెయ్యాలి. అతడు మన కాలేజీకే మంచి పేరు తెస్తాడు.”
“ఎలా? బయట ఇంత గొడవగావుంటే,” ప్రశ్నించాడు కోణార్క.
డబ్బిచ్చి కొంత మందిని కొనుక్కొచ్చి కౌంటర్ యాజిటేషన్ చేయించాడు సిద్ధార్థ. అవతలి వాళ్ళు చర్చలకి సిద్ధపడ్డారు. నిజానికి ఉద్యమిస్తున్న వాళ్ళని భయభ్రాంతుల్ని చేసారు. గాయపరిచారు. గొడవలు క్రమేపీ చల్లారి పోయాయి. పోలీసులు కూడా డబ్బులు తీసుకొని మిన్నకున్నారు. పేరెంట్స్ కి కూడా కొంత డబ్బు ముట్టజెప్పారు. చనిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు మూసేసారు. హంతక విద్యార్థికి ఫస్ట్ ర్యాక్ వొచ్చింది. టీవీలలో, వొత్తిడిలో కూడా రాణించిన చదువరని అతని పేరూ, విద్యా సంస్థల పేరూ మారు మోగిపోయింది.
“సమస్యలు వుంటాయి. వాటికి అనేక కోణాలు ఉంటాయి. మనకు కావలసిన కోణాన్ని మనం బయటకి లాగి ప్రొజెక్ట్ చెయ్యాలి”, అన్నాడు సిద్ధార్థ మందు తాగుతూ. అభినందనగా భుజం తట్టాడు కోణార్క.
వొక కోణార్క విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది మామూలే. నిజానికి అదొక వార్త కాకుండా పోవును. ఎందుకంటే కోణార్క విద్యా సంస్థలు చాలా బలపడి పోయాయి యెప్పటి కంటే. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలూ యేవీ వార్తలు కాకుండా పోయాయి. అన్ని విద్యా సంస్థల కంటే ర్యాకులు ఎక్కువగా వచ్చేది అక్కడే. ర్యాంకుల స్కోరు టీవీల్లో మారుమోగి పోయేది.
విద్యార్థులకు తిండి సరిగా ఉండదు. సౌకర్యాలు సరిగా ఉండవు. కోళ్ళ ఫారాల్లా ఉంటాయి. అయినా ఆ విద్యా సంస్థలే ముందుకు దూసుక పోతున్నాయి. యింక క్రైము రేటు కూడా ఎక్కువే. ఆత్మహత్యలూ ఎక్కువే.
కానీ ఆ ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. సిద్ధార్థకి కునుకు లేకుండా చేసింది. సిద్ధార్థ కూడా అశక్తుడుగా మారిపోవడం వల్ల డాక్టర్ కోణార్క కుదేలు అయిపోయాడు. అసలు సమస్య ఆత్మహత్య కాదు. ఆత్మహత్యల్ని మేనేజ్ చేయడం చాలా సులభం. కానీ ఆ విద్యార్థి చస్తూ చస్తూ లేఖ రాసి పోయాడు. దాన్ని ఔత్సాహికులైన వార్తాపత్రికల వాళ్ళు ప్రచురించేసారు. కుల వివక్ష వల్లే ఆ విద్యార్థి చనిపోయాడని దేశమంతా మారుమోగిపోయింది. రాజకీయ నాయకులు కూడా దిగి పోయారు. ఇక ఏం చేయాలి?
“సిద్ధార్థ యిప్పుడేం చెయ్యాలి? నీ అనేక కోణాల ఫిలాసఫీ వొట్టిపోయిందేమీ?”అని అడిగాడు కోణార్క.
“లేదు. అదెప్పటికీ పని చేస్తుంది. కొంచెం ఆలస్యం కావొచ్చు అంతే. సైకాలజీ, ఫిలాసఫీ, వాస్తు శాస్త్రం, న్యూమరాలజీ యిలా అన్ని రంగాలలో నిపుణుల చేత టీవీల్లో చర్చలు ఏర్పాటు చేయండి. ఆ విద్యార్థి చనిపోవడానికి కారణాలను రకరకాలుగా వదరమనండి. మన వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పించండి. ప్రస్తుతం ఇంతే. తర్వాత సంగతి ఆలోచిద్దాం”, అన్నాడు సిద్ధార్థ.
సైకాలజిస్టులు, అతడు బాల్యం నుంచీ కుటుంబంలో ఎదుర్కొన్న కష్టాలే చావుకు కారణం అన్నారు. ఆ లేఖలో బాల్యం ప్రసక్తి ఉందన్నారు. ఆధ్యాత్మికవేత్త వొకరు ఆ విద్యార్థి తన లేఖలో దేహం, ఆత్మ వేరు పడి పోయిందని ప్రకటించాడు. కనుక ఆధ్యాత్మిక సమస్యలే కారణమన్నాడు. న్యూమరాలజిస్టు అతనికి పేరులో అక్షరాల సంఖ్య ఆత్మహత్యకు కారణమన్నాడు. జ్యోతీష్యుడు గ్రహబలం సరిగా లేదన్నాడు. బ్రేకులూ, ఎడ్వర్టయిజ్మెంటులూ మధ్య చర్చలు సాగుతున్నాయి. కుల వివక్ష నుండీ దృష్టి మళ్ళించడానికి శాస్త్ర పాండిత్యాలన్నీ భేషుగ్గా ఉపయోగపడుతున్నాయి.
“ప్రపంచం అన్న తరవాత అన్నీ ఉంటాయి. కుల వివక్షో మరో వివక్షో యెలాగూ ఉంటుంది. దాన్ని పెద్ద యిష్యూ కాకుండా యెలా అడుక్కి నెట్టాయలన్నదే మనం ఆలోచించాలి. అదే తెలివి అంటే”, అన్నాడు సిద్ధార్థ.
కానీ తాను స్వారీ చేసే పులి తననే బలి కోరినట్లైంది కోణార్క పరిస్థితి. కోణార్క కూతురునే ప్రేమలో పడేసాడు సిద్ధార్థ. “మీరే సిద్ధార్థ చాలాతెలివైన వాడని మెచ్చుకుంటారు కదా”, అని ఎదురు ప్రశ్న వేసిందా అమ్మాయి.
“యే రకంగా సరి తూగుతాడు మనతో”, అని అడిగాడు కోణార్క. అతనికి ఆస్తులు లేకపోవచ్చు. తెలివి ఉంది. అతని తెలివి వల్లే మన ఆస్తులూ, డబ్బూ ఎదుగుతూ వొచ్చాయి. అతని బుర్ర కన్నా వేరే ఆస్తేం కావాలి?” అని అడిగింది.
“బుర్రలెన్నయినా కొనొచ్చు డబ్బుంటే. కానీ కులాన్ని ఎక్కడ కొంటాం? అతని కులం నీకు తెలుసా?
“కులం అంత ముఖ్యమా?”
“కులమే ఆస్తి”
“నాన్నా, నేను అతన్నే పెళ్ళాడతాను. నిర్ణయించేసుకున్నాను”, అని కుండలు బద్దలు కొట్టింది ఆ అమ్మాయి.
కోణార్క మౌనంగా ఊరుకున్నాడు. సిద్ధార్థ చెప్పినట్లూ సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. యెప్పుడూ ఉంటాయి.
తర్వాతి రోజు సిద్ధార్థ ఉత్సాహంగా కోణార్క ఆఫీసుకొచ్చాడు.
“చాలా ఎదిగి పోయావు నువ్వు. నన్ను మించి పోతున్నావు” , అన్నాడు కోణార్క. సిద్ధార్థ చిరునవ్వు నవ్వాడు. కొద్ది సేపు ముచ్చట్ల తర్వాత బయలు దేరాడు. కోణార్క అన్నాడు, ” నువ్వు చాలా పైకి వెళ్తావు”.
ఆ రోజే సిద్ధార్థ చనిపోయాడు. అది రోడ్డు యాక్సిడెంటా, ఆత్మహత్యా లేక హత్యా? నల్లుగురూ నాలుగు రకాలుగా చెప్పుకున్నారు.కురసోవా సినిమాలాగే రకరకాల కథలు వ్యాపించాయి.
వొక రోజున కోణార్క తన కొడుక్కి హిత బోధ చేసాడు.
“నేను పెద్దవాన్ని అయిపోయాను. వ్యాపారాలన్నీ ఇక నువ్వే చూసుకోవాలి. అన్ని విషయాలనీ అన్ని కోణాలనుంచీ అర్థం చేసుకోవాలి. కానీ మనకు కావలిసిన కోణాన్నే బయట పెట్టాలి. చూడూ తెలుపులో అన్ని రంగులూ ఉంటాయి. అన్ని రంగులనూ తొక్కేసి తెలుపే తెల్లగా రాజ్యం చేస్తుంది. నలుపుని కూడా తెలుపు చేస్తుంది. ఎరుపుని కూడా తెలుపు చేసేస్తుంది. బుర్ర ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బుర్రల్ని అన్నింటినీ కొని ఆధిపత్యం చెలాయించగల వాడు ఒకడే ఉంటాడు. యీ వొక్క రహస్యం గుర్తుంచుకో. యీ వొక్క కోణాన్ని మరచిపోకు”
*
కధ బాగుంది.
సిద్ధార్థలో ఇంకా చాల కోణాలున్నాయి. వాటి గురించి కూడా రెటమత విద్వాంసులు ఈ కథలో చెబితే బాగుండేది.
అవి వరుసగా……..
******************************************************************
మనం చేసే తప్పుడు సూత్రీకరణల, రాగద్వేషవచోవమనాల తాత్త్విక వ్యాసాల పరంపరలో చదువరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అడిగిన వారిని ఫాసిస్టులని నిందిస్తూ తమలోని అనువంశిక మానసిక వైకల్యాన్ని ప్రతిఫలించి, చివరకి అందరూ కలసి చెడ్డగా దూషిస్తే పారిపోయిన మహా రచయిత యొక్క ప్రతిభ అనే కోణం.
*****************************************************************
అలా పారిపోయి, తన పేరు బ్రాండ్ నేమ్ దెబ్బతినకుండా రకరకాల మారుపేర్లతో వ్యాఖ్యలు చేస్తూ, ఒకే వ్యాసంలో రెండు, మూడు పేర్లతో వ్యాఖ్యలు చేస్తూ తనలోని ’’డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్‘‘ ఇద్దరినీ సంతృప్తిపరచే ఏక దృష్టితో సాగే ఒంటికంటి ఏకాండవాద సైకో థ్రిల్లర్ కోణం.
*********************************************************************
చివరకి, ’’సారంగ‘‘ స్థలకాలాలని కూడా వ్యక్తిగత ద్వేషాన్ని వెదజల్లడానికి ప్రయత్నించే ఫియాత్మకశీలతను కూడా ప్రస్తావించాలి.
*********************************************************************
ఎదుటివారిమీద బురద జల్లడానికి ప్రయత్నిస్తే మొదట జరిగేది ఏమంటే ముందుగా మనం బురదలో కూరుకుపోవడం. మనం బురదని అంటించుకున్నప్పుడే బురదని ఎదుటివారిమీద చల్లగలిగేది.
******************************************************************************
ఎదుటివారిని ఒక వ్రేలు చూపించడానికి ప్రయత్నిస్తే నాలుగు వ్రేళ్ళు మనని చూపిస్తూవుంటాయి.
అలాగాక, ‘‘నేను చూపించే ఒక వ్రేలే వుంటుంది, అదొక్క కోణమే వుంటుంది, మిగతా వ్రేళ్ళు వుండవు, మిగతా కోణాలు వుండవు’’ అని అక్కసుని వెళ్ళగ్రక్కడమే ఫాసిజ ముఖ్య లక్షణం.
(చదువరులకు ఒక గమనిక : ఫాసిజం అనేది ఒక తిట్టు కాదు. ఈ విషయం నొక్కి వక్కాణించింది నేను కాదు, ఈ వ్యాస రచయితే)
వర్తమానానికి నిలువుటద్దంలా ఉంది కథ శర్మగారూ…అభినందనలు. ఈ కథలో చాలా కోణాలే కాదు, చాలా చరిత్ర ఉంది. నా ఉద్దేశంలో వేల సంవత్సరాల భారతదేశపు గతంలోకి కూడా వెళ్లగలిగిన వ్యాప్తి ఈ కథకు ఉంది. చరిత్రతోపాటు అప్పటినుంచీ కొనసాగుతున్న వ్యవస్థ ఉంది. తాత్వికత ఉంది. అందులోంచి స్పష్టంగా పోల్చుకోగలిగిన వ్యక్తుల ముఖాలు ఉన్నాయి. ఈ ఒక్క కథ మీద ఎంతైనా చేయవలసిన వ్యాఖ్యానం ఉంది.
శ్రీనివాసుడుగారూ…వేరే అంశాలకు చెందిన చర్చను ఈ కథా సందర్భంలోకి తీసుకురావడం మీలాంటి విజ్ఞులకు తగదు. ఈ కథను కథ మేరకే చదివి అవసరమనుకుంటే మీ స్పందనను తెలియజేయడం సముచితంగా ఉంటుంది.
భాస్కరం గారూ!
దయచేసి కొద్దిగా ఓపికగా చదవగలరు.
పేరు పెట్టకపోయినా గతంలోని వ్యాసంలో జరిగిన సంభాషణలను యథాతథంగా ఉటంకిస్తూ నామీద వ్రాసిన కథే ఇది.
మీ సందేహ నివృత్తిని చేయవలసిన బాధ్యత నా మీద వుంది.
వేరే అంశాలకు సంబంధించి ఒకానొక వ్యాసంలో జరిగిన సంవాదంలోని వ్యాఖ్యలను వ్యక్తిగత ద్వేషంతో ఈ కథలోకి తీసుకువచ్చిన రచయిత విజ్ఞతను కూడా మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది.
మీలాంటి విజ్ఞులకు జరిగిన విషయాలను గురించి పూర్తిగా తెలుపలేకపోవడం నా పొరబాటే.
********************************************
సారంగలో ప్రచురితమయిన ‘‘రెటమతం ఒక సంభాషణ’’ అనే వ్యాసాన్ని వ్రాసిన ఈ రచయిత మొదటి పేరాలోని మూడవ వాక్యం ‘‘ఇస్లాంకి, భరత ఖండపు సంస్కృతులకి జరిగిన వివాహ ఫలితంగా జన్మించినదే సూఫీయిజం‘‘ అనే తాత్త్విక సూత్రీకరణను నేను, మిగతా చదువరులు ప్రశ్నించినప్పుడు రచయిత స్పందనను మీరు చదవడానికి వీలుగా ఆ వ్యాసం యొక్క లంకెనిస్తున్నాను.
http://saarangabooks.com/retired/2016/03/03/%e0%b0%b0%e0%b1%86%e0%b0%9f%e0%b0%ae%e0%b0%a4%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95-%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%a3/
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
వ్యాస రచయిత అడిగినదానికి సరియైన ఉపపత్తులు చూపకుండా అడిగినవారిని ఫాసిస్టులు, కాషాయ ఉగ్రవాదం అని ఆడిపోసుకుని చదువరులందరూ 200 కామెంట్ల వరకూ సహనం వహించి, చివరకు ఓపిక నశించి దూషిస్తే అప్పుడు ఆగిన వైనం మీకు ఆ వ్యాసం చదివితే తెలుస్తుంది.
నేను ఆ వ్యాస సందర్భంగా అకిరో కురసావా రషోమాన్ ను ఉదహరించాను, నా వ్యాఖ్యలో దోషం వుంటే చెప్పంది. అది తీసుకువచ్చి ఇక్కడ వ్యక్తిగతంగా బురద జల్లడం విజ్ఞతంటారా?
నా వ్యాఖ్యను ఇస్తున్నాను, దయచేసి చూడగలరు.
************************************************************
శ్రీనివాసుడు
March 7, 2016 at 6:21 pm
అనావృతంగా మీరు చూడగలిగితే మత విస్తరణ, అవిశ్వాసుల అంతం అనే ఏకైక లక్ష్యంతో చరిత్రలో జరిగిన మారణహోమాల తాలూకు బీజాలు ఇంకా ఇప్పడు ప్రపంచానికి ముప్పగా ఉగ్రవాదంలో ప్రబలంగా మిగిలేవున్నాయని, కఠోర కట్టుబాట్ల ఇనుప కచ్చడాలలో బంధించి, మనిషిని గిడసబారుసున్న ఈ మతాలన్నీ, అలా గిడసబారి, గిడసబారి, కుచించుకుపోయి, అణువుగా మారి, చివరకి అణ్వస్త్ర విస్ఫోటనంలో మానవజాతిని అంతమొందించే ప్రమాదం ఎంతోదూరంలో లేదని, వ్యవధి కూడా ఎక్కువగా లేదని గ్రహించగలరు. పెరిగిన సాంకేతికను మారణహోమాలకి ఉపయోగించే ’’తాత్త్విక దారుణు‘‘ ల గురించే నా హెచ్చరిక. ప్రస్తుతం వర్తమాన సమాజంలో పెరిగిపోయిన సాంకేతికతతో వచ్చిన భావవాహికలు మనకెంతో వేగంగా, ప్రభావవంతంగా ఆ దారుణ తత్త్వాన్ని ప్రసారం చేసుకోడానికి అవకాశం కలిగించాయి. సామాజిక మాధ్యమాలు, టి.వి. ఇంటర్నెట్, అంతర్జాల భావవాహికలు ఇవన్నీ పైన చెప్పిన భావజాలాన్ని సమర్థవంతంగా యువకుల, పిల్లల మనస్సులోకి ఎక్కిస్తున్నాయి. దాని పలితమే పవిత్రయుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరిన అనేకమంది యువకులను ఎయిర్ పోర్టుల్లో అదుపులోకి తీసుకోవడం, అనేక స్లీపర్ సెల్స్ భారతదేశంలోని ప్రతి పట్టణంలోనూ, నగరంలోనూ ఉన్నాయని బయటపడడంలాంటి సంఘటనలు. జరగబోయే ఘోరవిపత్తులను గ్రహించక, తాత్త్విక చర్చలో కొట్టుకుపోతే శుష్కపాండిత్యమే అవుతుంది తప్ప ఏ విధమైన ప్రాసంగికతా వుండదు.
ప్రతి మతం ఏ విధంగా విస్తరించిందో నిర్దుష్టంగా అవగాహన చేసుకుంటే ఇప్పడు రాబోయే కర్కశ తాత్త్విక విపత్తుల నుండి రక్షించుకోగలం. నేను మతాల వాస్తవ సమగ్ర చరిత్రను గురించిన వివరం అడిగింది అందుకే.
పైదంతా నా దృష్టికోణం మాత్రమే. పరమం కాదు. ‘‘రషోమన్’’ అనే ‘‘అకిరో కురసావా’’ చలనచిత్రంలో ఈ దృష్టికోణాల గురించి అద్భుతంగా చూపించారు. ఒక సంఘటనలో భాగంపంచుకున్న ప్రతి ఒక్కరి దృష్టికోణంనుండీ ఆ సంఘటనను చూపించడమే ఆ చలనచిత్రం అంతా. ఆ సంఘటనని చెప్పడంలో ప్రతి ఒక్కరికీ తమదైన స్వార్థం, అవగాహన, అనుభవం వుంటాయి. సత్యం వీటన్నింటి మధ్యా అంతర్లీనంగా పూలదండలో దారంలాగా దాగివుంటుంది. వాటన్నింటినీ సాకల్యంగా వివేచించి సత్యాన్ని తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని.
మనం చదివే, వినే ఏ విషయాన్నయినా చెప్పినవాడి మూలాల గురించో, వాడి తత్త్వాన్ని గురించో, ముందుగా వాడికో ముద్రవేయాలనే దుగ్ధతోనో, నేను బ్రాహ్మణుడిని, మరొకడు శూద్రుడు, మరొకడు శూద్రాతిశూద్రుడు, అనే చట్రంలోనుండి అర్థంచేసుకోకుండా అనావృతంగా వుండడమే ముఖ్యం. అదే నిజమైన సత్యాన్వేషణ అవుతుందేమో!
ఇదంతా నేను విజేతగా నిలవాలనే ఉద్దేశంతోటి చెప్పింది కాదు. కేవలం నా దృష్టికోణం మాత్రమే. ఏ వ్యక్తిని గురించి అయినా, ఏ తత్త్వాన్ని గురించి అయినా ద్వేషం, ప్రేమ రెండూ మనకు అక్కర్లేదు. కేవలం వాటిని వాటిగానే అంగీకరిస్తే చాలు.‘‘
****************************************************************************************
జరిగిన సంవాదంలోని వ్యాఖ్యలను ఇక్కడ ఇరికించి వ్యక్తిగతంలో బురద జల్లాలని ప్రయత్నించడంలోని విజ్ఞతను గమనించండి.
ఆ వ్యాసంలో వ్యాసరచయిత వ్యాఖ్యలను చూడండి.
****************************************
rani siva sankara sarma
March 14, 2016 at 5:34 pm
శ్రీనివాసుడిగారి దృష్టి చాలా విశాలమైనది.
అన్నిటినీ వివిధకోనాలలొ పరిశీలించాలి. పరిశీలిస్తూ వుండాలి అంతే ఆవేశం ఆగ్రహం ఏవొక్క పక్షంపైనా వహించకూడదు
వొక స్త్రీ అత్యాచారానికి గురి అయినప్పుడు ఆ అమ్మాయి గురించే కాదు అత్యాచారం చేసిన వాళ్లని కూడా సమదృష్టితో చూడాలి.అలా చెయ్యడానికి వాళ్ల కారణాలు వాళ్లకి వుంటాయి
దళితులనీ దళితులపై దాడి చేసినవాల్లనీ వొకే ప్రమాణంతొ అంచనా వెయ్యాలి.
అలాగే జాతిహింసలలొ బలమైన జాతి బలహీనమైన జాతి అనేదియేదీ లేదు. హింసింపబడె జాతి , హింసించేజాతీ యేదీ లేదు అన్నిటినీ అన్ని కోనాలనీ అర్థం చేసుకోవాలి
శ్రీలంక బుద్ధిస్టుల వైఖరినీ తమిళులని సమానదృష్టితో అర్థం చేసుకోవాలి.
అమెరికానీ దాని చేతిలో చావు దెబ్బకి గురిఅయిన యిరాక్నీ వొకే గాటకట్టి చూడాలి అవసరమైతే ఆసమస్యని మొత్తంగా షియా సున్నీ అంతర్గత స్థానిక పోరాటం గా భావించాలి అంతే . దానిలోసామ్రాజ్యవాద కోణాన్ని చూడకూడదు.
ఈ అర్థంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదంకూడా మిథ్యే. భారత ఖండ అంతర్గత కుమ్ములాటలే బ్రిటీషు వాళ్లకి అవకాశమిచ్చాయి. అందువల్ల తెల్లదొరలని నిమ్దించేందుకు యేమీ లేదు.
అందువల్ల భగత్ సింగుని వురి తీశారని బ్రిటీషు వాళ్లని నిందించడం తప్పు.
యూదుల బాదలనే కాదు ఆనాటి చారిత్రక పరిస్థితిలలో హిటరు అంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థం chesukovaali
సామ్రాజ్య వాద దేశాలూ పీడిత దేశాలని వాటి హింసనీ వొకెప్రమాణంతో చూడాలి.
పీడితులు పీ డకులూ అనేభాషే తప్పు. యివాళ పీడించబడిన వాడె రేపు పీడకుదుగా మారవచ్చు. కనుక ఎవరి మీద కోపం ప్రేమ అనవసరం.
సమాచారాన్ని సేకరించాలి నిర్లిప్తంగా విశ్లేషించాలి ఏ పక్షమూ వహించకూడదు. ఆవేశం ఆగ్రహం అసలు పనికి రాదు.
లాయరు దృష్టిలో మంచీ చెడూ ఏమీ వుండవు వాదించాలసిన రకరకాల కేసులు వుంటాయి అంతే.
మేధావి కూడా ప్రాక్టీసింగ్ లాయరులా వుండాలి యేపక్షమ్ వహించకూదదు సారంలో బాధితుల పక్షం వహించకూడదు.
యిదీ శ్రీనివాసుడి గారి వివిధ కోనాల ఫిలాసఫీ***
***********************************************************************
‘‘కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు. ‘‘
**************************************************************************************
’’సమాచారం జ్ఞానం కాదు. లింకులు తిని లింకులు విసర్జించడం విజ్ఞత కాదు.‘‘
************************************************************
‘‘సర్వసమగ్రమైన స్వయంసంపూర్నమైన విశ్వాసాల కారణం గా ఏమాత్రం హింసకు తావివ్వని పూర్తిశాంతియుతమైన వంద శాతం సహనశీలమైన హిందూయిజం హిందూఫాసిస్టుల రాజకీయ కల్పన మాత్రమే. అంటే ఈ మతాన్ని ఆచరిస్తున్న వాళ్లు అందరూ రాగద్వేషాలు ఏమాత్రం లేని దేవతలు . యితరులు[ముస్లింలు ] రాక్షసులు అని యీహిందూ ఫాసిస్టుల రాజకీయప్రచారం. బి. శ్రీనివాస్ దృక్పధం యిదే.‘‘
***************************************************************
’’అందువల్ల విశ్వాసలవల్ల హింస అనేది సర్వదేశాల్లొనూ వుంది. మనం దానికి మినహాయింపు కాదు. మనమూ మనుషులమే మరి. అందువల్ల విశాలద్రుక్పధం ముసుగులో వచ్చిన యీభావాలు హిందుఫాసిస్టు భావాలు. వీటి వెనుక ప్రొటెస్టెంటు ఫాసిస్టు భావజాలం దాగివుంది‘‘
**************************************************************
‘‘భారత ఉపఖండంలోని అలోచనా ధారలో వైవిధ్యం లేదని అదంతా వొకే మూసలొ వుం టుం దంటున్నారు శ్రీనివాసుడు గారు. కాలానుగుణంగా వివిధ స్రవంతులని కలుపుకొని విస్త్రుతమయ్యే శక్తి కూదా దానికి లేదంటున్నారు. అంటే అది ఏక శిలాసద్రుశమన్నమాట. యిదే హిందూఫాసిజమంటె.‘‘
*********************************************************
ముద్రలు వెయ్యడానికి చాలా ధైర్యం కావాలి .నిజాయితీ కావాలి. విశ్లేషణల కన్నా వి శే షనాలే వస్తుదర్మాన్ని తెలియజేస్తాయి స్పష్టంగా.
**************************************************
’’బేక్ టు వేదాస్ తరహా ప్రొటె స్టంటు భావజాలంతో నిండిన చర్చ వల్ల చర్చలో వైవిధ్యం నశించింది . శూద్ర అతిశూద్ర తత్వ వేత్తల వద్ద శుష్క పాండిత్య చర్చకి ముగింపు లభించవచ్చు.
వేద విద్యలెల్ల వేశ్యలవంటివి‘‘
***********************************************************************
’’కులాల మతాల ప్రసక్తి వొద్దనే వాడు విశాల దృక్పధం పేరు తో హిందు ఫాసిజాన్ని వ్యాపింపజేస్తాడు .అతడు హిట్లరు లాంటి శాకాహారి.బ్ర్రాహ్మణుల్ని సంస్క్రుతాన్నె కాదు ఇతరులని కూడా మనుషులా చూడండి. మీపేరు పెట్టుకొన్న శ్రీనివాసుడు ముస్లిం స్త్రీనీ ముస్లిం సంస్కృతినీ ఆదరించాడు. విశాలద్రుక్పధం పేరుతొ హిందూ ఫాసిజాన్ని వ్యాపింపచెయకండి. కొంచెం సంకుచిత మనస్తత్వాన్ని ఏర్పరుచుకొని, శూద్ర ముస్లిం సంస్కృతులని ఆదరించండి. ప్రత్యేకతల్ని స్తానికతలని హతమార్చకండి. .‘‘
**************************************************************************
‘‘కాని హిందూ ఫాసిజం శక్తి ….అది హిందు మహాసముద్రం నదులనీ పిల్లకాలువలనీ మననివ్వదు
కుల అస్తిత్వాలలో నేరమేమీ లేదు. మీలా బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని అందరి నెత్తిమీద రుద్దితేనే ప్రమాదం అస్తిత్వ ప్రత్యేకతలని మీలానిమ్దిమ్చడం అన్ని అస్తిత్వాలకీ అతీతం గా దేవతల్లా సంచరిస్తున్నట్లు ఫోజివ్వడం యిదే బ్ర్రహ్మనీయ హిందూ ఫాసిజం .
గొప్ప అ ధ్య యనం ద్వారా మీరు గొప్ప హిందు ఫాసిస్టు గా మారారు అశుభాకాంక్షలు‘‘
ఇంకా ఆ రచయిత అనేక కువ్యాఖ్యలను, వ్యక్తిగత దూషణలను సారంగ యాజమాన్యం తొలగించింది. మిగతావి కూడా మీరు వ్యాసం చదివితే తెలుస్తుంది.
*********************భాస్కరంగారూ, దయచేసి ‘‘రెటమతం – ఒక సంభాషణ’’ అనే వ్యాసం చదవితే ఈ వ్యాసానికి మూలం దానిలో వున్నదని మీకు తెలియగలదు********************************
మొత్తానికి సిద్ధాంతం నుంచి కధలు తెలుగులో ఇంకా వస్తున్నాయన్నమాట. సంతోషం. అంతే కాకుండా ఈ కధని తెలుగు సినిమా దర్శకులు మంచి కమర్షియల్ సినిమాగా తీయొచ్చు. శర్మ గారు సినిమావాళ్ళకు పనికొచ్చే అద్భుతమైన కధ రాశారు (కూతుర్ని ప్రేమించిన పేదవాడిని/లేక దళితుడిని ధనికుడు పైకి లేపేయడం). ఇటువంటి పరిణితి ఈ మధ్య వారి వ్యాసాల్లో బాగా కనిపిస్తుంది. పాండిత్యం పరిణమిస్తే మేధావి పండనూ వచ్చు లేక ఎండనూ వచ్చు. అది రెండూ లేక అది వికటిస్తూ ఉంది.
సుబ్రమణ్యంగారూ!
కృతజ్ఞతలు. పాండిత్యం పరిణమిస్తే పరిణామం వికటిస్తుందని కుండబ్రద్దలుకొట్టి సినిమా సృజనాత్మకతను బట్టబయలు చేసినందుకు.
భాస్కరం గారూ
కృతజ్ఞతలు . మీబోటి సృజనాత్మకత, పాండిత్యం మేళవించిన వ్యక్తి నాకతపై మాట్లాడడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.
శర్మగారు మంచి కథ రాశారు. జరుగుతున్న విషయాలు బాగా చెప్పారు.
శ్రీనివాసుడు గారూ…
నాకు శర్మగారి కథ ఎందుకు నచ్చిందో నా స్పందనలో చెప్పాను. ఒకవేళ మీ స్పందనకన్నా నా స్పందన ముందు పోస్ట్ అయుంటే మీ వ్యాఖ్యపై స్పందించి ఉండేవాణ్ణి కాదని కచ్చితంగా చెప్పగలను. తీరా మీ వ్యాఖ్య చూసిన తర్వాత కేవలం ఒక మంచి కథను కథగానే చూడాలన్న ఔచిత్యం స్ఫురించి మీ వ్యాఖ్యపై అలా స్పందించాను. మీ వ్యాఖ్యలో ఔచిత్యభంగం ఏమీ లేదని మీరు భావిస్తే ‘అనంగీకారాన్ని అంగీకరిద్దా’ మనే (Let us agree to disagree) నానుడిని నమ్మి ఊరుకుంటాను తప్ప పొడిగించను.
ఇక మీ రెండో స్పందనకు వస్తే, వర్తమాన బీభత్సపు విరాడ్రూపాన్ని తన చిన్న అద్దంలో ప్రతిఫలించిన ఈ కథను కేవలం మీ పట్ల వ్యక్తిగత కార్పణ్యంతోనే రాశారని అనడం నాకు మొదటగా ఆశ్చర్యం కలిగించింది. అలా కూడా జరుగుతుందా అనిపించింది. ఇందులోని నిజానిజాలను చెప్పగలిగింది శర్మగారు మాత్రమే. ఈ విషయంలో నా వ్యక్తిగత విశ్వాసాన్ని నొక్కి చెప్పడం అసందర్భం కాదనుకుంటాను. కథ, కవిత, నవల వంటి సృజన రూపాలనే కాదు; విషయనిష్ఠంగా ఉండవలసిన వ్యాసం వంటి ఇతర ప్రక్రియలను సైతం వ్యక్తిగత దూషణకు ఎవరు వాడుకున్నా అది అధమాభిరుచిని మాత్రమే వెల్లడిస్తుందని నేను నమ్ముతాను. ఈ విషయంలో నాకున్న రెండు అనుభవాలను ఉదహరించాలనిపిస్తోంది. ఒక విశ్వవిద్యాలయం లోని తెలుగు శాఖలో ఆచార్యుడిగా ఉన్న ఒక వ్యక్తికీ, అదే విశ్వవిద్యాలయంలో పనిచేసే మరో ఆచార్యుడికీ మధ్య వ్యక్తిగత వైరం ఉంది. ఈ రెండో ఆచార్యుడికి ఏదో చర్మరుగ్మత ఉంది. మొదటి ఆచార్యుడు వ్యక్తిగత నిందతో పాటు ఆ చర్మరుగ్మతను కూడా ఏత్తి చూపుతూ పద్యాలు రాశారు. రాయడమే కాకుండా ఆ పద్యాలను ప్రచురించారు. వాటిని చూడగానే నాకు కంపరం కలిగింది. కవిత్వం, కథ మొదలైనవి ఎంతో ఉదాత్తంగా వినియోగించవలసిన అపురూపమైన ప్రక్రియలు. వాటిలో వ్యక్తిగత దూషణను రంగరించదమంటే స్వచ్చమైన బంగారంలో ఇనుము కలిపి కల్తీ చేయడమే.
నేనోసారి ఒక తెలిసిన ప్రెస్ కు వెళ్ళి యజమానితో మాట్లాడుతున్నాను. ఈ మధ్య మేము ప్రచురించిన పుస్తకాలు అంటూ అతను ఓ రెండు పుస్తకాలు నా ముందు ఉంచాడు. అందులో ఒకటి, సినిమాలకు కూడా రాసే ఒక కవిగారి కవితా సంపుటి. దాన్ని కాసేపు తిరగేసి, ఆ తర్వాత ప్రెస్ యజమానికి తిరిగి ఇచ్చేశాను. ఆయన ఒకింత ఆశ్చర్యపోతూ ఈ పుస్తకాలు మీకు ఇచ్చాను, తీసుకెళ్ళండి అన్నాడు. “ఈ కవితాసంపుటిని మాత్రం తీసుకెళ్ళను” అని నిష్కర్షగా చెప్పాను. “ఎందుకని?” అని ఈసారి మరింత ఆశ్చర్యపోతూ అడిగాడు. “ఇందులో అంగవైకల్యాన్ని వెక్కిరించే ఒక వెకిలి కవిత ఉంది. అందుకని” అని జవాబు చెప్పాను. దీనికి కొసమెరుపు ఏమిటంటే, వారం రోజుల తర్వాత ఆ కవిగారి నుంచే పోస్టులో ఆ పుస్తకం మా ఇంటికి వచ్చింది. దానిని ఏం చేయాలో వెంటనే తోచలేదు.
శర్మగారినే కాదు, మిమ్మల్ని కూడా ఇందుకు భిన్నమైన ఉత్తమాభిరుచి కలిగిన వ్యక్తులుగానే నేను భావిస్తున్నాను.
మీ సూఫిజం పై చర్చ గురించి…నేను సూఫిజాన్ని పెద్దగా అధ్యయనం చేయలేదు. నాకు తీరికలేని వేరే రచనావ్యాసంగాలు చాలా ఉన్నాయి కనుక ప్రత్యేకంగా సూఫిజాన్ని అధ్యయనం చేయగలిగినంత సమయం లేదు. మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. ముందెప్పుడూ అధ్యయనం చేయనని కాదు. ముఖ్యంగా నాది చరిత్రదృష్టి. అందులో భాగంగా సూఫిజం గురించి చదవాల్సివస్తే తప్పక చదువుతాను. అప్పుడు కూడా సూఫిజం గురించి నా ఆలోచనలను చరిత్రకోణం నుంచే రాస్తాననుకుంటాను. అయినా భవిష్య ప్రాధాన్యాలను ఇప్పుడే నిర్ణయించడం కష్టం.
చివరిగా…శర్మగారి కథలో ఎవరైనా ఏకీభవించలేని అంశాలు ఉన్నాయని నేను అనుకొను. ఒకవేళ ఉంటే తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది.
స్పందించి మీ వివరణను ఓపిగ్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు భాస్కరం గారూ!
విషయం సూఫీలకు సంబంధించింది కాదు, ఒక స్వీయ ప్రకటిత తాత్త్విక విశ్లేషణను చదువరులు ప్రశ్నించినప్పుడు రచయిత స్పందన గురించి.
ఆ ప్రతిస్పందన రచయిత వ్యక్తిత్వాన్ని, అతడి ఉద్దేశాన్ని సూచించే సందర్భం అది.
ఆ సందర్భంలో రచయిత స్పందించిన తీరు, తరువాతి కాలంలో తన వ్యాఖ్యలలో, రచనలలో తనను ప్రశ్నించినవారిమీద వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుని, సంభాషణలలోని వాక్యాలను, భావాన్ని తనకు తోచినట్లుగా వక్రీకరించి ఈ కథలో వాడుకున్న వైనాన్ని గురించి.
ఆ కోణంలో రెటమతం వ్యాసం చదివితే మీకు విషయం అర్థమయ్యేదేమో!
ఇక, ఈ విషయం గురించి ఇక మీరు చెప్పినట్లుగా నేను కూడా పొడిగించదలచుకోలేదు.
‘‘ అనంగీకారాన్నే అంగీకరిద్దాం’’.
************************************************
మీకు చెప్పేటంత ఇంగితజ్ఞానం కలవాడిని కానుగానీ నాకు తెలిసిన ధర్మమేమంటే,
‘‘చెడుపట్ల ఉదాసీనత వహించడం మనం స్వయంగా చెడుచేయడంకన్నా పెద్ద తప్పు.’’
భాస్కరం గారూ
సాహిత్య ప్రక్రియలని వ్యక్తిగత నిందకి వాడడం నీచమైన పని అనే మీవాదం తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీరు యిచ్చిన ఉదాహరణలు సందర్భోచితమైనవి. వాటిలో రూపాన్ని వెటకారం చేయడం వుంది. ఇలాంటి పనులు మహాకవులు కూడా చేశారు. ఉదాహరణకి శ్రీశ్రీ దాశరధి గారిని ఓరోరీ పొట్టి కవీ అని సంబోధించాడు . ఇలాంటి వ్యక్తినింద సాహిత్యంలో అనౌచిత్యాన్నే సూచిస్తుంది.
కాని నేను యీకతని ఎవరినైనా ఉద్దేసించి రాశాననడం అబద్ధం. మన భావాలని కథ రూపంలో కవిత నాటకం యిలా అనేక రూపాల్లో వ్యక్తం చేస్తాము. వొక చోట కనబడిన భావాలూ చర్చనీయాంశాలూ మరోచోట దొర్లచ్చు. దాన్ని వ్యక్తిగత దూషణ అని ఎలా అంటారు? నేను వ్యక్తం చేసిన భావాలు ఎవరికైనా నచ్చకపోవచ్చు, మరోకరికి నచ్చవచ్చు. అది వేరే సంగతి. యిప్పటికే భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ మీరూ నేనూ కూడా వొక విషయంపై తీవ్ర వాదోపవాదాలకు దిగిన సందర్భం వుంది. అటువంటి అభిప్రాయాలనే మీరు మరోచోట వ్యక్తం చేస్తే నా అభిప్రాయాలకి అవి విరుద్ధంగా వున్నాయి కనుక మీరు నాపై వ్యక్తిగత నిందకి దిగారని ఆరోపించడం విజ్ఞత అవుతుందా? భిన్నాభిప్రాయాలు వ్యక్తం చెయ్యడమే వ్యక్తినిందా? నేను యేదో సినిమా గురించి రెండోసారి ప్రస్తావిస్తే , పూర్వమ్ వ్యక్తం చేసిన అభిప్రాల వంటివే వ్యక్తం చేస్తే వ్యక్తి నింద ఎలా అవుతుంది? మీరు చెప్పిన సంఘటనల్ని నాకతని పోల్చి చూసినా ఈ ఆరోపణ నిరాధారమని తేలిపోతుంది
సమాజాన్ని ఏమాత్రం ప్రతిబింబించకుండా, భావాలని బయిటి వాతావరణం నుంచి గ్రహించకుండా కథని శూన్యంలో సృష్టించడాని నేను దేవుణ్ణి కాదు.
నా అభిప్రాయాన్ని స్వయంగా మంచి కథకులూ విమర్శకులైన మీరైనా గ్రహిస్తారని నా ఆశ.
** అటువంటి అభిప్రాయాలనే మీరు మరోచోట వ్యక్తం చేస్తే నా అభిప్రాయాలకి అవి విరుద్ధంగా వున్నాయి కనుక మీరు నాపై వ్యక్తిగత నిందకి దిగారని ఆరోపించడం విజ్ఞత అవుతుందా? భిన్నాభిప్రాయాలు వ్యక్తం చెయ్యడమే వ్యక్తినిందా? నేను యేదో సినిమా గురించి రెండోసారి ప్రస్తావిస్తే , పూర్వమ్ వ్యక్తం చేసిన అభిప్రాల వంటివే వ్యక్తం చేస్తే వ్యక్తి నింద ఎలా అవుతుంది?**
*********************************************************************
వ్యక్తం చేసింది అభిప్రాయాలు కాదు, అవహేళనలు. ఆ వ్యాసంలో చేసినవన్నీ వ్యక్తిగత నిందలే. సరయినా సారం వుంటే తాము చెప్పినదానికి సరయిన ఉపపత్తులు చూపుతారు. అంతేగానీ, వ్యక్తిగతంగా దాడిచేస్తూ **ఫాసిస్టులు** అని బురద జల్లరు. అలా బురదజల్లిన దూషణలనే ఈ కథలోనూ ఉపయోగించరు.
**************************************************************
’’నేను యేదో సినిమా గురించి రెండోసారి ప్రస్తావిస్తే‘‘ – ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. రెండోసారి ప్రస్తావించిన దానికి ఆధారాలు మనకి ఏమాత్రం నిజాయితీ వున్నా చూపించాలి.
ఆ సినిమాని గురించి ఒకేఒక్కసారి ప్రస్తావన చేసింది నేను. ఆ ప్రస్తావనని ఒక్కడకి పట్టుకొచ్చి ఒక నీచమైన పాత్ర యొక్క తాత్త్వికతగా చెప్పించడం అనేది ‘‘వ్యక్తిగత దూషణకు ఎవరు వాడుకున్నా అది అధమాభిరుచిని మాత్రమే వెల్లడిస్తుందని నేను నమ్ముతాను.‘‘ అనే భాస్కరం గారి మాటలను అనుసరించి నికృష్టమైన అభిరుచిగానే పరిగణించాలి.
****************************************************************
ధైర్యం, నిజాయితీ వుంటే ఆ అధమాభిరుచి వుందని ఒప్పుకుని, రెటమతంలో చేసిన మొదటి తాత్త్విక విశ్లేషణకు ఉపపత్తులు చూపి, చర్చకు ఉపక్రమించాలి. లేకపోతే………………..
******************************************************************
*******సమాజాన్ని ఏమాత్రం ప్రతిబింబించకుండా, భావాలని బయిటి వాతావరణం నుంచి గ్రహించకుండా కథని శూన్యంలో సృష్టించడాని నేను దేవుణ్ణి కాదు.*****
భాస్కరంగారు ఉదాహరణగా చెప్పిన రెండు సంఘటనలలోనూ ఆయా కవులు తమకి కనబడిన సమాజాన్నే తమ కవితలలో ప్రతిబింబించారు, శూన్యంలోనుండి సృష్టించలేదు. కానీ, భాస్కర్ గారు వారు అలా చెప్పిన దాని వెనకవున్న జుగుప్సాకరమైన, హేయమైన మానసిక స్థితిని గ్రహించి వాటిని దూరంగా పెట్టేరు.
*******************************
నేను కూడా రెటమత వ్యాసంలోవున్న రచయిత సంభాషణలను యథాతథంగా ఉపయోగించి, ‘‘అణా కాణీ ఖర్మ’’ అనే మకుటంతో, బయటి వాతావరణంనుండి గ్రహిస్తూ, సమాజాన్ని ప్రతిబింబిస్తూ, శూన్యంలోనుండి గ్రహించకుండా కథలు వ్రాయగలను, కానీ, నన్ను నేను అధమాభిరుచి గలవారి స్థాయికి దిగజార్చుకోవడం ఇష్టంలేకే వ్రాయలేదు.
అవును దీనిలో నేను సమాజం లోని కొన్ని అవలక్షణాలని అవహేళనచేశాను. అందుకు వొక వుదాహరణగా ప్రపంచప్రసిద్ద సినిమాపై వొక పాత్ర అభిప్రాయాలని సృజించాను. పాఠకులికి ఈ వివరణ చాలు.
ఇది పచ్చి బూటకం. ఆ ప్రపంచ ప్రసిద్ధ సినిమా రషోమన్ సినిమాపై ఒక పాత్ర అభిప్రాయం అలా ఎక్కడా లేదు. ఆ సినిమాని ప్రస్తావించింది నేను. నేను చెప్పినదాన్ని వక్రీకరించి, అసలు ఆ సినిమా ఏం చెప్పిందీ అన్నదాని గురించి ప్రాథమిక అవగాహన కూడా లేకుండా వ్రాయడమే అధమాభిరుచి. దీనినే భాస్కరంగారు అసహ్యించుకునేది.
@ శ్రీనివాసుడు గారు,
మీ ఇద్దరికీ ఇంతక్రితమే వ్యక్తిగత పరిచయం ఉన్నట్లు ఉంది.. అలా ఉన్నపుడు ఇంత పెద్ద వ్యాఖ్యలు రాసి చర్చించుకొనేదానికన్నా కలసినపుడు చర్చించుకోంటే బాగుంటుందేమో!
రాణి శివశంకర శర్మ గారు రెట మతం వ్యాసం కంటే ఈ కథ బాగా రాశారు. మనం రెటమత వ్యాసాలను సీరియస్ గా తీసుకోనవసరంలేదు. వ్యాస రచయితలు పాఠకుల ప్రశ్నలకు సంత్రుప్తికర సమాధానం ఇవ్వలేకపోయారు. గమనించ వలసినదేమంటే పాకిస్థాన్ నిర్మాతలలో ఒకరైనా మహమద్ ఇక్బాల్ కూడా ఎంతో విద్వత్ ఉంది.ఆయన సారే జహాసే అచ్చా నే కాదు, శ్రీరాముడు,గాయత్రి దేవి పై కవిత్వం రాశాడని చదివివాను. ఇక్బాల్ పాకిస్థాన్ వారికి గొప్పమేధావి,దార్శనికుడు కావచ్చేమో కాని, మనకు ఒక కవి మాత్రమే.
ఆయన కలకన్న పాకిస్థాన్ నేడు ఏ పరిస్థితిలో ఉందో చూస్తూనే ఉన్నాం.
ఇక రాణి శివశంకర శర్మ గారు తనపాండిత్యం తో, రాజకీయ పరిజ్ణానంతో ఇక్బాల్ వలే గందర గోళానికి గురయ్యారని పిస్తుంది. ఆయన హిందువులపై సూఫిల ప్రభావం గురించి మసిబూసి మారేడు కాయ చేసేకంటే(బ్రాహ్మణీయ హిందు భావజాలనికి పోటిగా సామాన్య ప్రజలు సూఫిని ఆదరించారనిపెట్టుకొని). సూఫిలను సూఫీలుగా గుర్తించటానికి హిందువులకి ఏ అభ్యంతరం ఉండదు. సూఫిలు బ్రాహ్మణీయ హిందు భావజాలనిలయమైన భారతదేశం లోనే, పాక్,బంగ్లాదేశ్ లలొ కంటే సురక్షితంగా ఉన్నారు. రచయితలు ఆ విషయం వెనుకగల కారణం గుర్తించాలి.
అభిప్రాయం తెలియజేసినందుకు రామానుజ రావు గారు, అసురుడు గార్లకి కృతజ్ఞతలు.
రాణి శివశంకర శర్మ గారి ‘అసలు కోణం’ కధ బాగుంది. కల్లూరి భాస్కరం గారు వివరించినట్లు “వర్తమానానికి నిలువుటద్దంలా” ఉంది. ( “సత్యం అంటూ ఏమీ లేదు. మనకు కావలసిన సత్యాన్ని మనం సృష్టించుకోవచ్చు. అవసరమైన లాభసాటియైన సత్యాన్ని మనమే క్రియేట్ చెయ్యచ్చు. అల్లచ్చు” ).
ప్రియమైన శ్రీనివాసుడు గారు, రాణి శివశంకర శర్మ గార్ల ఆవేశకావేషాలతో కూడిన వాదోపవాదాలు సద్దుమణిగి, అవి పాఠకుల అవగాహనా పరిధిని పెంచే దిశగా చెయ్యాలని విజ్ఞప్తి.
రామయ్య గారూ
చిరకాల మిత్రులైన మీకు నాకథ నచ్చడం సంతోషాన్ని కలిగించింది.
కథ చాలా బాగుంది . కథలోని సిద్ధార్థలో తన్ను చూసుకొని అది నా గురించే అని ఎవరైనా బల్ల గుద్ది వాదిస్తే వాదించనీండి . మీరు జవాబో సంజాయిషీనో ఇవ్వాల్సిన అవసరం లేదు శర్మ గారూ ! దేనికి ఎన్ని కోణాలున్నా అసలు కోణం కోణార్క గ్రహించి బోధించినట్టు. పాఠకులు కూడా గ్రహించగలరు.
తన ఫిలాసఫీ తన చావుకే వస్తుంది అని సిద్ధార్థ తెలుసుకొనే వరకూ కోణార్కలు బలుస్తూనే వుంటారు . అసలు విషాదం అదీ.
కోణార్కలు నశించాలి ! కోణార్కలకి ఉపయోగపడే సిద్ధార్థల ‘తాత్త్విక’ గందరగోళాలు నశించాలి.
తాత్త్విక గందరగోళం కన్నా అధమాభిరుచి కల్గిన తాత్త్విక దారిద్ర్యం హీనమైన కోణం. అలాంటి అభిరుచి కలిగిగనవారే సంజాయిషీలు అవసరంలేదని అంటారు. సిద్ధార్థలో మనం నశించాలని కోరుకునే సర్వ కోణాలనీ చూడడమే తాత్త్విక దారిద్ర్యం.
నా బాధ మీరు సరిగా గ్రహించారు ప్రభాకర్ గారూ. ప్రపంచం బాధ కూడా
ఓ మంచి కథ చదివిన తృప్తి కలిగింది. రచయితకు అభినందనలు.
ఈ కథ లోని మంచిని స్వీ కరించే మీలాంటి సహృదయులు అనేకులు ఉండడం ఆనందాన్ని కలిగిస్తోంది
మంచి కథ ఇది .సత్యం సాపేక్షం అన్న మాట ను ఆ మాటకు గల పరిమితులను దాటి పొడగిస్తే అది ఏరకంగా వంచనా క్రీడగా మారుతుందో కథ చెప్పుతున్నది . కుల వివక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి విషయాన్ని మసి బూసి మారేడు కాయ చేసిన సిద్ధార్థుడి చావు అ కులం కారణం గానే కావడం అది హత్యనో ఆత్మ హత్యనో తెలియని స్థితి లోకి నెట్ట బడటం విషాద వైచిత్రి.
తమకు అనుకూలమైన దానినే సత్యం గా అమలు లోకి తేవడం లో ఆధిపత్య శక్తులకు పెద్ద తర్ఫీదు ,మద్దతు ఉంటుదనీ కథ హెచ్చరిస్తున్నది . ఆ రకంగా కథ ఒక భయం గొలిపే యదార్థాన్ని ఆవిష్కరించింది . ఒక విషాదం లో కి సగటు చదువరిని కథ నేత్తగాలిగింది అనే నేను అనుకుంటున్నాను .
కళా ప్రక్రియలను సమకాల సామాజిక యదార్థాన్ని చెప్పేందుకు రచయితలూ ధన్యులు . శివ శంకర శర్మ గారు కవి రచయితా( వ్యాస రచనలతో బాటూ అవీ చేస్తారు ) …. అదీ సంగతి .
వాగీశాన్ గారూ
ధన్యవాదాలు.అసలు కోణాన్ని గ్రహించారు.