రాముల వారు.
శ్రీరాముల వారు.
సీతాసమేత రాముల వారు.
వాళ్ల నాన్న ఎవరు ?
దశరథుడు.
దశరథుడి నాన్న ఎవరు ?
అజుడు.
ఈయన నాన్న ఎవరు ?
రఘు మహారాజు.
రఘు మహారాజు ఎక్కడుండేవాడు ?
కోసలపురంలో.
అయోధ్య రాజధాని.
బోల్డంత మంచోడు.
జపతపాలు బాగా చేసినవాడు.
తపస్సులు కూడా చేసినవాడు.
ఓ రోజు సభలో కూర్చోనున్నాడు.
సభ అన్నాక బోల్డంత మంది.
ఆటపాటలు, చర్చలు దేనికవే నడుస్తున్నై.
ఎవరిక్కావలసినవి వాళ్ళు చూసుకుంటున్నారు.
ఇంతలో ఒక వార్తాహరుడు వొచ్చాడు.
చేతులు కట్టుకొని, అయ్యా దణ్ణం అన్నాడు.
ఎవరి దగ్గర ?
రఘు మహారాజు దగ్గర.
ఏవిటి ఆ చేతులు, ఏవిట్రా సంగతీ అన్నాడాయన.
మరేనండి, విదర్భ నుంచి సందేశం వచ్చిందండి అన్నాడు.
ఆ కాలంలో ఈ సందేశాలు అవీ మనుషులే అందించేవాళ్ళు.
మాటలు మనుషుల మధ్య ఉండేవి.
మరల మధ్య కాకుండా.
మరల ద్వారా కాకుండా.
ఎంత అదృష్టవంతులో.
ఏవిటా సందేశం అన్నాడీయన.
పురోహితుల వారు వచ్చారండి, ఆయన చెపుతాడు అన్నాడు వార్తాహరుడు.
పిల్చుకురా ఆయన్నిటు అన్నాడీయన.
ఆ వార్తాహరుడు పరుగున పోయినాడు పిలుచుకొని రావటానికి.
ఇంతలో మంత్రులందరికీ అనుమానాలు.
పురోహితుడు రావటమేవిటి ?
పెళ్ళికేవన్నా వచ్చాడా?
రాజుగారికి ఆల్రెడీ పెళ్లైపోయింది.
మరెందుకు వచ్చాడు?
రాయబారానికి వచ్చాడా?
రాయబారానికి మనమధ్య పెద్ద గొడవలేవీ లేవే, అక్కడక్కడా అరుణాచల్ప్రదేశు, చైనా లాటి చిన్న చిన్న ఆక్యుపేషన్లు తప్ప.
ఆ ఆక్యుపేషన్లు మనమూ చేస్తున్నాం. అవి చెయ్యొద్దని చెప్పడానికి వొచ్చాడా?
ఇలా నానారకాలుగా మాటాడుకుంటున్నారు.
ఇంతలో నుదురు మీద ఈలావున ఓ పెద్ద వీభూతి, మెళ్ళో రుద్రాక్షలు, ధగధగ మెరిసిపోతూ తెల్లగా ఉన్న ఒహాయన వచ్చాడు.
ఆయనే ఆ పురోహితుడు.
నవ్వుతున్నాడాయన.
మంత్రుల మనసు స్థిమిత పడింది.
ఇదేదో మంచి వార్తలానే ఉంది అనుకున్నారు.
గుసగుసలు తగ్గినై.
రాజుగారన్నారు ఆయనకో కుర్చీ ఇవ్వండి అని.
కుర్చీలేవీ ఖాళీ లేవయ్యె.
రాజుగారి నోటి వెంట మాట రావటం, అది కాకపోటమే?
విదర్భుడు అని ఒహ మంత్రిగారు లేచి ఆయన కుర్చీ ఈయంకిచ్చాడు.
రాజుగారు మంత్రిగారికి ఒహ 500 పరగణాలు బహుమానంగా ఇచ్చాడు.
అది చూసి మిగిలిన మంత్రులంతా కుతకుతలాడారు.
సరే ఆ కుతకుతల సంగతి తర్వాత, పురోహితుడు కూర్చున్న తర్వాత ఏమయ్యింది ?
రాజు గారు ఆ పురోహితుణ్ణి పట్టుకొని, అంతా బాగేనా? తమరి రాకకు కారణమేవిటి ? విదర్భలో అంతా బాగున్నారా? మీ ఇంటో అంతా బాగున్నారా ? అని నానారకాల కుశల ప్రశ్నలు వేశాడు.
ఆ కాలంలో కుశల ప్రశ్నలు అవీ చాలా సామన్యం.
మనుషుల్లో మంచి మానవత్వం ఉండేది.
మా సభలో సంభారాలు ఇలాగున్నై, అలాగున్నై అని గొప్పలు గప్పాలు రాజుగారి దగ్గర ఉండేవి కావు.
ఇంటికి వచ్చినవాణ్ణి నెత్తి మీద కూర్చోబెట్టుకొని వాడు సంతొషపడిపొయ్యేదాకా వదిలేవాళ్ళు కాదు.
ఈరోజు ఇంటో ఉన్న అత్తగారికీ, మావగారికే దిక్కులేకుండా పోతుంది. బయటివాళ్ళ సంగతి, బంధువుల సంగతి బెమ్మ దేవుడికెరుక.
సరే అదలా పక్కనబెడితే, రాజుగారు అడగ్గానే పురోహితుడు పులకించిపొయ్యాడు.
పెద్దాయన కాఫీలు, టీలు, ఆల్కహాలు ఖాకుండగా చల్లని కరివేపాకు నిమ్మ మజ్జిగ కూడా ఇప్పించటంతో పురోహితుడు కళ్ళనీళ్ల పర్యంతం కూడా అయిపోయినాడు.
అంతా బానే ఉంది సార్! అన్నాడు ఆ సత్కారాలకు పొంగిపోతూ.
మరి అంతా బాగుంటే మమ్మల్ని చూసిపోటానికి వచ్చారా మీరు అన్నాడీయన నవ్వుతూ.
మజ్జిగిచ్చాక ఈ మాటతో మోతమోగించడంతో పురోహితుడన్నాడు, కాదండి మా రాజుగారి అమ్మాయికి పెళ్ళి చేద్దామనుకుంటున్నారు అని.
అప్పుడు వెలిగింది పెద్దాయనకు, మంత్రులకు వెలక్కపోయినా.
అజుడు ఉన్నాడుగా, ఆ యువరాజు గారికోసం సంబంధం కలుపుకుందామని మాటలు మాట్టాడదామని వచ్చాడాని అనుకున్నాడాయన.
చిరునవ్వు నవ్వాడు అప్పుడు రఘుమహారాజు.
ఏమాటకామాటే చెప్పుకోవాలె. రఘు మహారాజు చాలా అందగాడు.
రాజసంగా ఉన్నాడేమో, ఇంకా వెలిగిపోతున్నాడు.
అందులోనూ నవ్వితే బుగ్గలు సొట్టపడతయ్యిట.
సూర్యుడి వంశం వాళ్ళైనా సొట్టబుగ్గలు కనపడతవి, అంత సూర్యుడి వెలుగులోనూ.
సభంతా వెలిగిపొయ్యింది. సమ్మోహనమైపోయింది ఆ నవ్వుతో.
ఆ చిరునవ్వుతో.
అందరి కళ్ళు ఇటేపు తిరిగినై.
అయినా పురోహితుణ్ణి కొద్దిగా ఉడికిద్దామని, ఏవిటయ్యా పెద్దాయనా, ఆ చిన్న పిల్లతో నాకు పెళ్ళేవిటీ అన్నాడు.
అమ్మమ్మా, ఎంత మాటన్నారు, మీక్కాదండి మీవాడికి అని బయటపడ్డాడు ఆ పురోహితుడు.
అదీ ఇప్పుడు దారిలోకొచ్చావ్. సంగతి పుర్తిగా చెప్పు అన్నాడాయన.
మీకు తెలీందేముందండి, ఈ కాలంలో అందరూ స్వయంవరాలు ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి నేనైతే అబ్బాయికి డైరెక్టుగా ఇచ్చేద్దును. కానీ రాజ్యధర్మం పాటించాలె కదా. కాబట్టి స్వయంవరానికి మీ వాణ్ణి రమ్మని చెప్పడానికి వచ్చాను అన్నాడు పురోహితుడు.
అది విని రఘు మహారాజు ఆనందపడ్డాడు. ఏ భేషజం లేకుండా చక్కగా సంగతి చెప్పినందుకు ఆ పురోహితుడికి ఓ మూడువేల ఆవులు, ముప్ఫై గ్రామాలు ఇచ్చి పంపించేసాడు.
సభలో అంతా ఆనందం. కలకలం. రాజు గారి కొడుకు పెళ్ళి అని.
సాయంత్రం అజుణ్ణి పిలిచాడు పెద్దాయన.
నీకు పెళ్ళి అన్నాడీయన.
అదేంటి, నాకు చెప్పకుండా పెళ్ళేవిటి, నువ్వెవరు అని అడక్కుండా సరే నాన్నగారూ అంటూ సెలవు తీసుకోబోతుంటే అప్పుడన్నాడాయన.
పెళ్ళంటే పెళ్ళి కాదు, ఇప్పటికి స్వయంవరం. అందులో నువ్వు ఆ అమ్మాయి మనసుని గెల్చుకొని కోడలిగా తీసుకొచ్చెయ్ నా ఇంటికి అన్నాడు పెద్దాయన.
పెద్దవాళ్ల మాట శిరస్సున ధరించడమే తెలుసుకానీ, రెబెల్ మనస్తత్త్వాలు లేకపోడంతో అంటా శాంతంగా. ప్రశాంతంగా గడిచిపోయింది.
ఆ రోజొచ్చింది. బయల్దేరాడాయన.
ఎవరు ?
అజుడు. బోల్డు మంది పరివారన్నెంటబెట్టుకొని.
ఎక్కడికి?
విదర్భకు.
రథాలు సాగుతున్నై, పరుగులు తీస్తున్నై గుర్రాలు.
ఇంతలో ఓ పేద్ద అడవి వచ్చింది.
ఆ అడవంతా దట్టంగా ఉన్నది.
అడవిలోంచి వెళుతుంటే బోల్డన్ని జంతువుల అరుపులు.
ఇంతలో హృదయవిదారకమైన కేకలు వినపడ్డై.
చూస్తే ఒక పెద్ద బెబ్బులి, ఒక లేడిని కసుక్కున ఏసేసి తీసుకుపోతోంది.
అది చూశాడు అజుడు.
ఇంతవరకూ చెప్పుకోలేదు కానీ, మనవాడు చాలా గొప్ప వీరుడు.
విల్లు పట్టుకున్నాడంటే ఇహ ఆయన్ని ఓడించటం ఆ బ్రహ్మ తరం కూడా కాదన్నమాటే.
అలాటి వీరుడికి బెబ్బులి ఎదురు పడింది.
ఇహనేం ?
బెబ్బులి కూడా అజుణ్ణి చూసింది.
ఎవర్రా నువ్వు, నా అడవిలోకొచ్చి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తావా అన్నట్టు చూస్తోంది.
దాని కళ్ళు చింతనిప్పుల్లా వున్నవి.
అంత దట్టమైన అడవిలో, దాని కళ్ళు ధగధగా మెరిసిపోతున్నై.
ఇద్దరూ కళ్ళు దించకుండా ఒకళ్ళొంక ఒకళ్ళు చూసుకున్నారు.
ఉన్నట్టుండి భూమి ఆకాశం బద్దలయ్యేట్టు బొబ్బలు పెట్టింది ఆ పులి.
మరి బెబ్బులి కదా.
బొబ్బలు పెట్టాల్సిందే.
మనవాడు ఊరకుంటాడు ?
అసలే యువరాజు.
దబ్బపండులా మెరిసిపోతున్నాడు.
అసలే సింహం నడుం మనవాడిది.
దానికి పచ్చలతో బిగినిచిన పటకా.
దానికొక కత్తి వేళాడుతోంది.
మనవాడు బొబ్బలకు ప్రతిగా సింహనాదం చేశాడు.
ఆ నాదానికి నెత్తినున్న వజ్రపు తురాయి ఊగింది.
అది ఊగిందంటే మూడిందన్నమాటే.
బెబ్బులికి బాణం ఎందుకనుకున్నాడో ఏమో, పక్కనున్న బల్లాన్ని అందుకున్నాడు.
దక్షిణ హస్తంతో అందుకున్నాడు.
ఎంత సుందరంగా అందుకున్నాడో.
ఆయుధాలు పట్టుకోటం కూడా ఒక కళేనండి.
మాడ్రిడ్డు నగరంలో పోతుపోట్లాటల్లో మాటడోరు ఎంత వొడుపుగా దిగేస్తాడు బల్లేన్ని?
జీవహింసే అయినా ఆయుధాన్ని వొడుపుగా ఎలా ప్రయోగించాలె అన్నదానికి అదో గొప్ప ఉదాహరణ.
అది పక్కనబెడితే, మనవాడు అందుకున్న బల్లాన్ని అంతే వొడుపుగా విసిరాడు దాని మీదకు.
ఓస్ ఇలాటి బల్లాలు చాలా చూసా నేనన్నట్టు నిర్లక్ష్యంగా ఒక అడుగు పక్కకేసింది ఆ బెబ్బులి.
బల్లెప్పోటు తప్పిపోయింది.
మనవాడి మొహం ఎర్రబడిపోయింది.
రోషం వచ్చేసింది.
మామూలువాడికి రోషం వస్తే పక్కనబెట్టొచ్చు కానీ వీరుడికి రోషం వస్తే పట్టుకోగలమూ?
గుర్రాణ్ణి లార్డ్ ఆఫ్ ద రింగ్సులో నాజ్గుల్ రాజులు నల్లగుర్రాలను దుంకించినట్టు దుమికించాడు.
పోతే ఈయనది తెల్ల గుర్రం.
అంత గుయ్యారంలోనూ మెరిసిపోతోంది.
అరబ్బీ గుర్రాలని ఇప్పటి వాళ్ళకు తెలుసుకానీ, అసలు ఆ అరబ్బీ గుర్రాలు అనే మాట మన రబ్బు నుంచి వచ్చింది.
రబ్బంటే ఏవిటీ ?
కాంతి. ధగధగలాడిపోయ్యే కాంతి.
ఒగిప్రబ్బు బిగిరబ్బు నగుమబ్బు జిగినుబ్బులను ద్రొబ్బుగ….అంటూ ఒకానొక శాస్త్రంలో ఒకానొక పద్యం కూదా ఉన్నది.
కాంతితో సమానంగా పరుగులుపెడతవి కాబట్టి వాటికి రబ్బులని పేరు ఆ కాలంలో.
అలటి మన రబ్బు గుర్రాలని ఆ అరబ్ వాళ్ళు తీసుకునిపొయ్యి అరబ్బీ గుర్రాలుగా మార్చేసారు.
అది మనవాళ్లకు తెలీక అరబ్బీ గుర్రాలు వాళ్ళవే అనుకుంటున్నారు.
సరే గుర్రాల పుట్టుపూర్వోత్తరాలు అవీ వొదిలేస్తే, మనవాడి గుర్రం దుంకింది.
రౌతు రోషం రత్యానికి తెలియకపోతే ఎట్లా? (రత్యము అంటే గుర్రము నాయనా!)
అందుకని అదీ యజమానంత రోషంగానూ దూకింది.
బెబ్బులి కళ్ళు జిగేల్ జిగేల్ మన్నాయి ఆ తెలుపుకి.
అలా జిగేల్ జిగేల్ మనటంతో గుడ్డిదైపోయింది ఒహ నిముషం.
ఇంతలో మనవాడు ఇంకో బల్లెం అందిపుచ్చుకున్నాడు.
అంత పరుగులోనూ, దుంకులాటల్లోనూ.
అదీ నైపుణ్యం అంటే.
అదీ వీరుడంటే.
అందుకోటమేవిటి, విసరటమేవిటి అన్నీ కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయింది.
ఆ ఒక్క పోటుకు బెబ్బులి బజ్జుండిపోయింది.
బొబ్బలూ లేవు. బెబ్బులీ లేదు.
బెబ్బులి శాస్వతంగా బజ్జుంది కాబట్టి మనవాడు మళ్ళీ ఒక సింహనాదం చేసినాడు.
దాంతో అప్పటిదాకా బెబ్బులికి భయపడి దూరంగా చెట్ల వెనకాల దాక్కుని చూస్తున్నవాళ్ళంతా బయటకొచ్చారు.
జయజయధ్వానాలు చేసారు.
అలా దక్కునేవాళ్ళను ఈరోజుల్లోనూ చూడొచ్చు మనం.
మాట్టాడేవాణ్ణి ఒకణ్ణి ముందుకు తొయ్యటం, చోద్యం చూట్టం, మనకనుకూలంగా వచ్చేసిందనుకుంటే జయజయధ్వానాలు చెయ్యటం.
అదీ లోకం పోకడ.
మనవాడికి ఆ సంగతి తెలుసు కాబట్టి ఆ జయజ్యధ్వానాలు అవీ పట్టించుకోకండా, ఇహ పొద్దు గుంకిపోతోంది, అడవిలోనే గుడారాలేర్పాటు చెయ్యమని ఆర్డరిచ్చి పక్కనే ఉన్న ఏరు దగ్గరికి స్నానానికెళ్ళిపోయాడు.
అప్పుడు గ్యాపకం వచ్చింది మనవాడికి, అది నర్మదా నదీ తీరం అని.
అంటే విదర్భ ఇంకొంత దూరంలోనే ఉన్నదన్నమాట.
స్నానం అవీ చేసి, భోంచేసి సుబ్బరంగా నిద్దరోయి పొద్దున్నే ఫ్రెష్హుగా పోవచ్చులేనని ఆయన నదిలోకి దిగాడు.
నింపాదిగా స్నానం చేస్తున్నాడు.
అప్పుడు జరిగిందయ్యా ఇంకో సంఘటన..
ఒక మదగజం వచ్చింది.
నీళ్ళు తాగాలనో ఏమో.
కానీ మదంలో ఉందిగా, అందుకూ దార్లో ఉన్నవాటన్నిటినీ తొక్కి పారేస్తోంది.
చెరుకుతోటలో పడ్డట్టు నాశనం చేసేస్తోంది.
అది చూసి భటుల్లో కొంతమంది వీరులు పరిగెత్తుకుంటూ వచ్చారు.
ఎవడొస్తే ఏవిటి నాకు అని వాళ్ళను కూడా తొక్కి పారేసింది ఆ మత్తగజం.
దాని కాళ్ళ కింద పడి పచ్చడి పచ్చడీపోయారు చాలా మంది.
ఇది చూసి ఆయన ఒడ్డుకు వచ్చేసాడు.
ఒడ్డున వదిలిన విల్లు, బాణం అందుకున్నాడు.
గజానికి గురిపెట్టాడు.
అంతే ఆశ్చర్యంగా గజం కిందపడిపోయింది.
మత్తొచ్చినట్టే, కిందపడిపొయ్యింది.
పడిపోటమేవిటి, ఆ స్థానంలో తెల్ల పొగలు రావటమేమిటి, ఆ పొగల్లోంచి ఒక దివ్యపురుషుడు రావటమేమిటి, అన్నీ వరసాగ్గా జరిగిపోయినై.
ఎవరు బాబూ నువ్వు, ఆ పొగలేవిటీ, ఏవిటి నీ సంగతి అని అడిగాడు ఈయన.
పొగల్లోంచి వచ్చిన నా పేరు ప్రియంవదుడు సార్! గంధర్వుణ్ణి. ఓ రోజు తాగిన మైకంలో ఒళ్ళు పై తెలీకుండా మతంగ మునిని ఏదేదో మాటలన్నాను. ఆయన నీకు మదమెక్కిందిరా, నువ్వు మదగజమైపో అని శాపమిచ్చాడు. మత్తు దిగిపోయి నేను భోరుమన్నా. అప్పుడు ఆయన, మీరొచ్చి మీ దివ్యమైన విల్లు పట్టుకుని నా మీదకు గురిపెడతారనిన్నీ, అప్పుడు ఆ బాణాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు కాబట్టి అప్పుడే నీకు శాపవిమోచనమని శలవిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరొచ్చారు. విల్లెక్కుపెట్టారు. పొగలొచ్చినై. నేను బయటకొచ్చాను అని అన్నాడు.
సరే ఈ కథంతా బాగుంది కానీ, ఇప్పుడు ఏవిటి చెయ్యాలి నేను అన్నాడీయన.
మీరేం చెయ్యక్ఖరలేదు సార్, నేనే మీకు ఒక అస్త్రం బహూకరిస్తా కానుకగా. ఇదిగో తీస్కోండి అని ఒక అస్త్రం ఇచ్చాడు.
ఆ అస్త్ర విశేషాలు ఏవిటి అని అడిగాడు ఈయన.
అప్పుడన్నాడు ఆ ప్రియంవదుడు.
అయ్యా ఇది సమ్మోహనాస్త్రం.
ఒకసారి ఎక్కుపెట్టి వదిలారంటే ఇందులోంచి సమ్మోహనం అనే గాసొస్తుంది. అందరూ మూర్చలో పడిపోతారు. ఎవరూ లేవను కూడా లేవలేరు చాలా సేపటిదాకా. ఇహ నాకు శలవు అని మాయమైపోయాడు..
వీరుడికి ఇట్లాటివన్నీ ఇస్తాడేమిటి ఈయన అని అజుడు ఆశ్చర్యపోతునే ఉన్నాడు.
ఎందుకా ?
వీరుడన్న వాడికి, ఎదురైనవాడితో స్వంతంగా పోట్టాడాలని ఉంటుంది కానీ ఈ సమ్మోహనాలు, మూర్చలు అవీ ప్రయోగించటానికి ఇష్టం ఉండదు.
అందుకూ.
అయినా సరే ఇచ్చాడు కదాని తీసుకున్నాడు.
అప్పుడు….
ప్రియంవదుడు మాయమైపోయాడు. పొగలు మాయమైపోయినాయ్. గజమూ మాయమైపోయింది.
పొదిలో కొత్త అస్త్రం వచ్చి చేరింది.
వీరుడికి, విలుకాడుకి కొత్త అమ్ము వచ్చి చేరితే ఆనందమే. అది బయటకు చెప్పుకోకపోయినా.
ఆ ఆనందంలో గుడారానికి వెళ్ళిపోయాడు. చక్కగా అందరూ నిద్దరోయారు.
పొద్దున్నయ్యింది. పైగా వసంత ఋతువు.
వసంత ఋతువులో అరుణకిరణాలు ఎంత బాగుంటవో ఆ సమయానికి చూస్తేనే కానీ తెలియదు.
భానుడు బాలుడైపోతాడు. కేరింతల కిరణాలు అలా అలా భూమ్మీదకు వచ్చేస్తుంటే ఎవడి మనసు పులకించదు.
దానికితోడు కోయిలలు. మావిచిగుళ్ళు తింటున్నవి పొద్దున పొద్దున్నే బ్రేక్ఫాష్టుకు.
చిగుళ్ళు తినగానే బోల్డంత శక్తి. బోల్డంత తీపి వగరు కలగలుపు. దాంతో పరవశం. దాంతో ఫాటలు.
ఇవన్నీ చూసి వాయుదేవుడికి ఆనందం. ఆయనా పిల్లవాడిగా మారిపోయి, పిల్లలగాలులు వీస్తూ ఉంటాడు.
ప్రకృతి అంతా శాంతం. ప్రశాంతం.
చుట్టుపక్కల ప్రశాంతంగా ఉన్నప్పుడు మనమూ ప్రశాంతమే, మన మనసూ ప్రశాంతమే.
అలా ఆ ప్రశాంతతలో కాలకృత్యాలు అవీ అయిపోయాక, తిపినీలు అవీ అయ్యాక బయల్దేరారు.
నర్మద దాటగానే విదర్భ.
ఈయన వెంట బోల్డంత పరివారం ఉందని చెప్పుకున్నాంగా.
అంత పరివారం ఎందుకు అని అనుమానం రావొచ్చు.
స్వయంవరాలంటే మాటలా.
అంతమంది ఉండగా ఆడపిల్ల ఒకడి మీదే మనసు పారేసుకుని మెళ్ళో మాల వేస్తే మీసాలు తిప్పుతున్న వేరే కుర్రరాజులకు కాలదూ?
అలా కాలిన కుర్రాళ్ళు యుద్ధాలకు దిగిపోరూ? అందులోనూ వీరులు, యువరాజులు, ఉడుకురక్తాలు.
ఆ ఉడుకురక్తాల వల్ల అవి, చినుకుగా మొదలై గాలివానగా మారిపోయే అవకాశాలు బాగా ఎక్కువ.
అందువల్ల వెంట పెద్ద పరివారం, దానికితోడు సైన్యం ఉన్నదనుకో అన్నీ చక్కబెట్టుకోవచ్చు.
అలా కొన్ని కొన్ని సార్లు ఇలా మాల పట్టమేవిటి, అలా పెళ్ళి అవటమేవిటి – యుద్ధం మొదలు.
పెళ్ళాంతో కాదండోయ్. ఆ పెళ్ళామ్మీద పోట్టాటకొచ్చిన వాళ్ళతో. విరగదియ్యటమే.
సరే పరివారం అంతా దిగారుగా విదర్భలో ? అక్కడంతా పెళ్ళి సందడి.
పెళ్ళి సందడంటే రాఘవేందర్రావు తీసిన ఆ పిచ్చి సినిమా కాదు.
నిజమైన పెళ్ళి సందడి.
ఎట్లా ఉందిట అక్కడ ?
అంత ఎత్తున ప్రాకారాలు.
వాటి మీద దివిటీలు.
పగలు కూడా ధగధగా వెలుగుతున్నయ్యిట.
ఆ ప్రాకారాలకు పాకుతున్న లతలు.
ఆ లతలకు సువాసనొచ్చే చిన్న చిన్నపువ్వులు.
ఆ ప్రాకారాల్లోపల విడిగా వనాలు. వాటికలు.
విశాలమైన వీధులు.
అంత పెద్ద వీధుల్లో ఇంకా పెద్ద పందిళ్ళు.
ఒక్కటేవిటి, అన్నీ కళ్ళు చెదిరిపొయ్యేలా ఉన్నవి.
బోల్డంత మంది జనాలు. చిన్నా పెద్దా ముసలీ ముతక.
విసవిసగా అధికారులు.
పకపకగా ఆడపిల్లలు.
తైతకలుగా నాట్యాలు.
వికవికలుగా చెలికత్తెలు.
ఆటపాటలు. చిందులు. సందోహాలు.
ఇక స్వయమవరం మంటపం.
ఇంద్రుడికున్న వెయ్యి కళ్ళు ఎందుకు పనికొస్తై చూట్టానికి. ?
అంతలా ధగధగ మెరిసిపోతోంది.
మద్దెలలు మోగుతున్నై.
సన్నాయిలు సాగుతున్నై.
అరిటాకులు ఊగుతున్నై.
వాయుదేవుడు సన్నగా ఈలలు వేస్తున్నాడు.
ఇహ స్వయంవర సమయం వొచ్చింది.
అమ్మాయీమణి వారు వచ్చారు.
రా.కు లంతా ఆవిడను చూశారు.
అంతే. కళ్ళల్లో చక్రాలు తిరిగినై.
వశీకరణం జరిగిపొయ్యింది.
రాజకుమారులకు మూర్చలొక్కటే తక్కువ.
మాటలసలే లేవు.
అంతందంగా ఉన్నది ఆ అమ్మాయి.
జగదేక సుందరి.
ఆణిముత్యాలన్నీ పోగుచేసి ఒక కుప్ప చేసి రూపు కల్పిస్తే ఎట్లా ఉంటుందీ ?
అంతందంగా ఉన్నది.
ఇంత అందమైన అమ్మాయి ఎవరి మెళ్ళో మాల వేస్తుందో?
ఎవరిని ఎంచుకుంటుందో?
అందరి గుండెలు గుబగుబలాట్టం మొదలుపెట్టినై.
నాకు దక్కితే బాగుండు, నాకు దక్కితే బాగుండునని ప్రతి రాజకుమారుడు కలలు కంటున్నాడు.
వాళ్ళలా కలల్లో ఉండగానే, ఆ అమ్మాయి దండ తీసుకుని బయలుదేరింది.
అందరి మనసుల్లోనూ ఒకే కోరిక.
“ఈ భువనైకం నన్నే వరించాలి!” అని ఆత్రపడిపోతున్నారు.
అమ్మాయి యువరాణి. కాబోయే రాణి. అప్పట్లో యువరాణులకు చెలులు ఉండేవారు.
చెలులందు నెచ్చెలులు వేరయా అని వేమన తన ఐదువేల పూర్వజన్మల వెనకాల చెప్పాడు.
ఆ ఐదువేల జన్మల కితం, ఆయన, ఆ వేమన పేరేవిటో ఆయనకి తప్ప ఎవరికీ తెలియదని లోకంలో కథ.
సరే వేమన సంగతి పక్కనబెడితే, అలాటి నెచ్చెలి ఒకావిడ.
ఆవిడ పేరు సునంద. యువరాణి వారి దగ్గరున్న నెచ్చెలులులందరిలోనూ సునంద అంటే బాగా ఇష్టం ఆ అమ్మాయికి.
యువరాణి గారి మనస్సు, రహస్యం, ఇష్టం, అయిష్టం అన్నీ తెలిసిన్న చెలి ఈ సునంద.
అలాటి సునంద వెంటరాగా వరమాలను సుకుమారమైన చేతులతో పట్టుకొని ఒక్కొక్క రాజునే చూస్తూ ముందుకు నడుస్తున్నది.
సునంద ఆ ఆమాయి పక్కనే నడుస్తూ ఆ రాజ కుమారుడిను గురించి యువరాణివారికి పరిచయం చేస్తోంది.
పరిచయం అంటే పరిచయం కాదది.
ఏడేడు జనమల తాతముత్తాతల దగ్గరినుంచి వంశ చరిత్ర, ఆ కుమారుడి చరిత్ర ఒక్క మాటలో చెప్పేస్తోంది.
ఒక్కోసారి ఎన్నో మాటలని ఒక్కమాటలో చెప్పొచ్చు. సైగతో చెప్పొచ్చు.
అది అందరికీ సాధ్యం కాదు కానీ నెచ్చెలులకు సాధ్యం.
అది వారికే ప్రత్యేకం.
సునంద చెప్పటం, సైగ చెయ్యటం, యువరాణివారు ఒక్క క్షణం ఆ రాజకుమారుడి ముఖాన్ని కళ్ళు విప్పారించి నిశితంగా చూట్టం.
అసలే చేపల్లాంటి కళ్ళేమో, విప్పారించేప్పటికి ఆ కళ్ళను చూస్తున్న, చూసిన రాకుమారుడికి అమ్మా తమ్ముడు మన్ను తినేను పాట తర్వాత యశోదా దేవి ఆ నోట్లోకి చూసి పడ్డ పరిస్థితిలా అయిపోతోంది.
మనసంతా కకావికలం. సత్వ గుణం అయిపూ అజా లేకుండా పోతోంది. దానిస్థానే తమోగుణం రెచ్చిపోతోంది.
అంత రెచ్చిపోతలోనూ, ఆ అమ్మాయి చూసిన క్షణాన ఆ రాజు ముఖం వెలిగిపోతున్నది
“ చూసింది నన్నే చూసింది. నావంకే చూసింది. నన్నే చూస్తోంది! అంతే! ఇక ఆ మాల నా మెళ్ళో పట్టమే మిగిలింది” అనుకుంటూ అష్ట వొంకరలూ తిరిగిపోతున్నారు. అసలు ఆ అమ్మాయి చూస్తోందన్న ఊహకే వాళ్ళ ముఖాలన్ని పెట్రోమాక్సు బల్బుల్లా వెలిగిపోతున్నై.
ఆ పెట్రోమాక్సు లైటు చూసిన యువరాణికి ఆ లైటు నచ్చకపోవటం వల్ల తల త్రిప్పేసి ముందుకు వెళ్ళి పోతోంది.
ఎంతో ఆశ పెట్టుకున్న రాకుమారుడు నీరసపడిపోతున్నాడు.
మొహం నల్లగా అయిపోతోంది.
అవమానం పాలైనట్టు.
అలా వరుసలోని వారందరిదీ ఇదే పరిస్థితి.
దీన్ని కాళిదాసు వర్ణించాడు, బ్రహ్మాండంగా ఇలా
సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా ల్
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం స స భూమిపాలః
మా చిన్నప్పుడు దివిటీలు ఉండేవి.
ఆ దివిటీలు ఇప్పటివీ అప్పటివీ కావు.
ఎప్పటివో!
రాముడి కన్నా ముందు కాలం నాటివి.
ఆ కాలంలో రాత్రిపుట నడిచేటప్పుడు దివిటీలు తీసుకువెళ్ళేవారు.
ఎప్పుడైనా సరే లైటు పడ్డంతసేపే వెలుగు.
కదా?
అలా ఆ దివిటీ కాంతి బిల్డింగుల మీద పడ్డప్పుడు అవి కాంతివంతాలయ్యేవి. దివిటీని ముందుకు తీసుకువెళ్ళిన తరువాత వెనుకనున్న భవంతులు వెలవెల తెలతెల.
అలా ఆ రాకుమారుల ముఖాలు వెలాతెలా పోతున్నాయని కాళిదాసు ఉవాచించాడు.
సునంద అట్లా రాకుమారి చెయ్యి పట్టుకొని తీసుకొనిపోతోంది ముందుకు, ఒక్కొక్కరిని వర్ణిస్తూ.
అమ్మాయీమణివారు చూట్టం, ముందుకు నడవటం.
రాజుల, రాకుమారుల మొహాలు ఎర్రబట్టం.
ఆ కోపమంతా సునంద మీదకు తిరగటం.
సునంద సరిగ్గా చెప్పలేదేమో నాగురించి, అందుకే ఆ సుందరి అలా వెళ్ళిపోయింది.
సునందకు నేను నచ్చలేదేమో, ఏదో చెడు చెప్పుంటుంది చెవిలో, అందుకే ఆ సుందరి అలా వెళ్ళిపోయింది.
సునంద, సునంద, సునంద అని అందరి మనస్సుల్లో సునంద పేరే.
రాకుమారి అట్లా దాటటం, అందరి మనస్సుల్లో సునంద మీద కోపం పెల్లుబికటం.
ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే ఇదేనేమో.
మంగలం అంటే వేపుడు చట్టి. మాంసం అవీ పెట్టుకుని తినే పెద్ద చిల్లపెంకు ముక్క.
పెంకునొదిలి చట్టి గురించి మాట్టాడుకుందాం కాసేపు.
చట్టి అంటే కుండ.
ఆ కుండకొకపక్క చిల్లెట్టి అందులో మిరపకాయలు పడేసి అగ్గి మీద కుమ్ముతారు.
అలాగే పేలాలు కూడా వేయించుకోవచ్చు.
అసలే ఓటి కుండ. దానికో చిల్లు. పైగా కింద అగ్గి.దాని బాధలో అది.
ఉరుముడు దేవుడు బలం ఉంది కదాని ఉరుము ఉరిమి దాని మీద పడ్డాట్ట.
మిరపకాయలు, పేలాలు కాచుకునే ఓటికుండకు విలువ ఏమి ?
అది కాపోతే ఇంకోటి. అంతేగా!
అలాటి మంగలమ్మీద ఉరుము పడితే ఏమి, బరువు పడితేనేమి.
పోయేది ఉత్త ఓటికుండేగా? అంతకుమించి పోయేదేమీ లేదు.
అద్దానికోసం ఉరుముకున్న బలం అంతా నష్టమయ్యిందని చెప్పటమన్నమాట.
సరే చట్టినొదిలి చిల్లపెంకు దగ్గరకొద్దాం.
దీన్ని గురించి ధూర్జటి కాలంలోనే ప్రస్తావన ఉన్నది.
“ఎంగిలి మంగలంబులగు దొప్పల్ రా గతంబేమి?” అని తిన్నడి కతలో చెప్పిస్తాడు ధూర్జటిగారు.
ధూర్జటంత ఆయనచేత పద్యాల్లో ఇరికించబడే విలువ కూడా వున్నది మంగలానికి.
సరే అదలా పక్కనబెడితే, రాకుమారి మీద కోపం సునంద మీదకు తిరగటం అందరికీ అనుభూతికి వస్తోంది.
మరి ఆవిడ అలా అందరినీ కాదనుకుని వెళ్లిపోతే ఎట్లా ?
దాటిపోయిన ఒక్క రాజకుమారుడి ఛస్, ఎంత అవమానం అనుకుంటో చెయ్యి కత్తి మీదకు వెళ్ళిపోతోంది.
అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెయ్యిస్థంభాల్లా నుంచొన్న రాకుమారులనందరినీ వద్దనుకొని ఇక చివరివాడి దగ్గరకొచ్చింది.
ఆ చివరాయన ఎవరో కాదయ్యా!
మహావీరుడు, నాన్నగారి ఆజ్ఞ మీద నర్మదను దాటి వచ్చేసిన సుందరుడు మన అజుడు.
ఈయన మంటపానికి వచ్చేప్పటికి సొల్లు కార్చుకుంటూ ముందే వచ్చేసి ముందు సీట్లాక్రమించుకున్న రాకుమారులతో నిండిపోటంతో ఈయన సివరాఖరికి నుంచున్నాడు.
ఆయన్ని చూసి ముందు సునందకు కళ్ళు తిరిగినయ్.
సంభాళించుకున్నది. ఆతర్వాత అమ్మాయి గారి చెయ్యి సుతారంగా నొక్కింది.
అంతే అమ్మాయిగారికి అర్థమైపోయింది. నాకు నచ్చిందేదో దీనికి దొరికింది అని తల పైకెత్తింది.
అంతే! సునంద నోటినుంచి మాట కూడ రాకముందే, ఈవిడ చేతిలో మాల మనవాడి మెళ్ళో పడిపోయింది.
“లలాటలేఖానపున:ప్రయాతి” అని ప్రమాణవాక్యం.
దాన్ని అధిగమించేది ఈ భూప్రపంచకంలోనే లేదు.
ఏ శక్తీ దాన్నడ్డగించలేదు.
ఏ శక్తి దాన్నోడించలేదు.
సాక్షాత్ పరమేశ్వర ప్రసాదం.
ఈ లోకానికి ఆ దేవదేవుడు ప్రసాదించిన వరం.
ఆయన ఆ పనికి బ్రహ్మను నియోగించినాడు.
అంత శక్తిమంతం.
అందరి కళ్ళూ అటువైపు తిరిగినాయ్.
కొంత మంది కళ్ళల్లో చింతనిప్పులు.
కొంతమంది కళ్ళల్లో భాష్పపరిపూర్ణలోచనం.
కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యజనకం.
కొంతమంది కళ్ళల్లో విభ్రమం.
అలా నవరసాలు కురిసినాయ్ ఆ సభలో.
ఆ స్వయంవర మంటపంలో.
అజుడిని అంతవరకూ చూడనివారు, నగరప్రజలు ఆయన సౌందర్యానికి ముగ్ధులైపోయినారు.
త్రిలోక మోహినికి జగదేకసుందర వీరుడు దొరికినాడని జేజేలు పలికినారు.
మాల పడటమేమి ? కల్యాణమగుటమేమి ? అన్నీ వరసాగ్గా జరిగిపోయినాయ్.
అమ్మాయీమణివారికి చీరలు, సారెలు, నగలు, మణిమాణిక్యాలు, రతంఖచితాలు, ఏనుగులు, అంబారీలు – అబ్బో ఒకటా రెండా అన్ని ఇచ్చి అజుడి వెంట పంపించారు.
అప్పుడు జరిగిందయ్యా ఒక సంఘటన.
జరిగిన సంఘటనకు కారణం మత్సరం.
మత్సరం అంటే అసూయ.
తనకులేనిది వాడికున్నదేనని అసూయ.
తను చేజిక్కించుకోలేనిది వాడి పరం అయ్యిందేనన్న అసూయ.
పెళ్ళి అయ్యేంతవరకూ మౌనంగా వున్నవారు, అజుడు అమ్మాయిని, భార్యను తోడ్కునిపోతుంటే ప్రయాణం పెటాకులు చేద్దామని నిశ్చయించుకొనినారు.
దానికంతటికీ కారణం మత్సరం.
మానవుడికి బయటి శత్రువుల పీడ ఉన్నా లేకున్నా, అంత:శ్శత్రువుల పీడ తప్పక ఉంటుంది.
వాటికి అరిషడ్వర్గాలని పేరు.
అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు.
మాత్సర్యం అన్నిటికన్నా చివరిది.
అన్నిటికన్నా చివరిదానికి పవరెక్కువ.
అసలు కన్నా కొసరెక్కువ కదా, అలాగన్నమాట.
మాత్సర్యంతో ఉడికిపోయేవాడికి విచక్షణ వుండదు.
మునిపల్లె సుబ్రహ్మణ్య కవిగారు తన ఆధ్యాత్మ రామయణ కీర్తనల్లో చెప్పిస్తారు
పావనులై యీ క్రమ మెఱిగిన మ, ద్భక్తులు మత్సరము జెందుదు
రీ వసుధను భక్తివిహీనులుగ, గర్హితులై దుర్మతులై
కేవలమును శాస్త్రగర్తములబడి, కెరలిభవశతములు, నొందుచు
భావము చెడి సుజ్ఞానదూరులయి, పోవుట నిశ్చయము…..
అలాగే త్యాగరాజులవారు తెర తీయగ రాదాలో ఈ విధంగా అనిపిస్తారు.
తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకట రమణ మత్సరమను (తెర)
పరమ పురుష ధర్మాది మోక్షముల
పార-దోలుచున్నది నా లోని (తెర)
సరే అదలా పక్కనబెట్టి అసూయాగ్రస్తులైన రాజకుమారుల దగ్గరకొద్దాం.
పెటాకులు చేసి అమ్మాయీమణిని తీసుకొని పోవాలని వారి ప్లాను.
అలాటి ప్లానులు ఆ కాలంలో సర్వసాధారణం.
అయితే పెటాకులకు విస్తరాకులకు భయపడే వీరులా మన సైన్యం ?
ఆ సైన్యానికి నాయకుడెవరు ? అజుడు! మహావీరుడు. వీరాధివీరుడు.
చుట్టుముట్తారు. నాదాలు, నినాదాలు అవీ వినపడుతున్నాయ్.
రథాల పరుగుల చప్పుడు.
దుమ్ము రేగిపోతోంది.
ఆకాశమంతా దుమ్ముతో కప్పబడిపొయ్యింది.
ఎర్రగా జేగురు రంగు.
సూర్యుడు అస్తమించే సమయం కావొస్తోంది కూడాను.
ఇదంతా చూసి ఇక సమయం వ్యర్థం ఎందుకు చక్కగా సూర్యుడు పొద్దుగుంకేలోపల అటో ఇటో తేల్చేద్దాం అని రంగంలోకి దిగిపోయాడు మనవాడు.
అలాగ్గా శత్రుసేనల్ని చెండాడేస్తున్నాడు.
విల్లు పట్టుకుంటే తిరుగే లేదని చెప్పుకున్నాంగా!
ఆ విల్లు పట్టుకుని రణరంగంలో నుంచుంటే ఎట్లా వున్నాడయ్యా అంటే వందమంది కోదండధారుల సమానంగా వెయ్యి దిక్కులనుంచి లక్షల బాణాలు విసిరే తేజంతో వున్నాడు.
అయితే అవతలి కలగాపులగ సైన్యం తక్కువదేమీ కాదు.
అజుడి రథాశ్వాలపై నాలుగొందల బాణాలు.
రథసారథిపై ఆరొందల బాణాలు.
ధ్వజం మీద యాభై, అజుడిపై అరవైవందల బాణాలు వేసారు.
వాటినన్నింటినీ ఎడమచేత్తో గాల్లోనే ఖండించి అవతల పారేసాడు మన వాడు.
ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చాడు.
అంతే ఆకాశం ఫెటిల్లుమని పగిలింది.
అమ్ములతో నిండిపోయింది.
వాళ్ళందరి శిరస్సుల మీద, లలాటాల మీద, మెడల మీద, బాహువులమీద, వక్షస్థలాల మీద ఉరుములు పిడుగులు పడ్డట్లుగా బాణాలు కురిపించే సరికి భీతిల్లిపోయి పరుగులు పెట్టారు
అందరూ కకావికలు. పరుగులు. ఉరకలు.
రక్తాలు. గాయాలు. శరీరాలు.
అటూ ఇటూ కేకలు.
రక్షించు రక్షించుమని కేకలు.
వీరుడు ఒకసారి శత్రువు మీద విల్లు ఎత్తాడంటే దించటం సామాన్యం కాదు.
కానీ ఎప్పుడైతే రక్షించండి అని వినపడిందో అప్పుడు విల్లు దించేసాడు.
బాణాల శరపరంపర ఆపేశాడు.
అవతలి సైన్యం కాస్త కోలుకుంది.
ఆహా ! ఇంత వీరుణ్ణి చిరకాలానికి చూసాం అని ఒకడు
ఓహో ఏమా బాహుబలం ఏమా ఆకారం అని ఇంకొకడు
యువరాజుగా ఉన్నప్పుడే చక్రవర్తిలా వున్నాడు, చక్రవర్తయ్యాక ఎట్లా వుంటాడో అని ఒకడు.
ఇన్ని యుద్ధాలు, ఇంతమందితో చేసాం కానీ, ఇంత వీరుణ్ణి ఎక్కడా చూడలేదయ్యోయ్ అని ఒకడు.
ఇలా అవతలి పక్క సైన్యంలో మాటలు వినిపిస్తున్నాయ్.
ఇంతలో ఇదే అదను అనుకొని విశ్రవసుడనేవాడు ఆ వెయ్యిస్థంభాల్లా నుంచొనున్న రాకుమారుల్లో నాలుగొందల స్థంభాలను తీస్కొని ఒక్కుమ్మడిగా మీద పడ్డాడు.
అజుడి చెయ్యి అమ్ములపొదిలోకి వెళ్ళింది.
చేతికి సమ్మోహనాస్త్రం తగిలింది.
దాని సంగతే మరచిపోయినాడు ఆయన.
ఇలాటి ఆపత్సమయంలో ఉపయోగానికొచ్చేందుకే చేతికి తగిలిందిలే అనుకొని దాన్ని సంధించాడు.
అంతే సమ్మోహనం గాసు రావటం, ఆ నాలుగొందల రాకుమారులు, వాళ్ల సైన్యం అంతా మూర్చ పోవటం జరిగిపోయింది.
అంతమంది అలా శలభాల్లా పడిపోవటం చూసి, మిగిలినవారు కూడా కింద పడిపోయారు దణ్ణాలు పెడుతూ
అలా విజయం ఆ వీరుణ్ణి వరించింది
సరే, ఈ పెళ్ళి సంగతులు అవీ రఘు మహారాజుకు చేరిపోయినాయ్
పెళ్ళి సంగతి చెప్పినవారు యుద్ధం సంగతి కూడా చెప్పారు
అందరు తండ్రుల్లా ఆయన, ఆ రఘు మహారాజు ఖంగారు పడలా
అన్నాడు, ఈ పాటి యుద్ధాలు ఇంకో వంద చేసి, గెలిచి ఇంటికొస్తాడు మావాడు అని మీసమ్మెలేసి చెప్పాడు
అంత నమ్మకం పిల్లలంటే ఆ రోజుల్లో
పిల్లలూ ఆ పెద్దల నమ్మకాలను వమ్ము చేయకుండా నూటికి వెయ్యి సాటం ప్రయత్నిచేవారు ఈ జమానా వారిలా కాకుండా
కోడలు వచ్చేసింది ఇంటికి
కనీవినీ ఎరగని రీతిలో ఉత్సవాలు జరిపినాడాయన
సాక్షాత్ మహాలక్ష్మే ఇంటికొచ్చేసింది అన్నంత ఇదిగా జరిగిపోయినాయ్ ఆ ఉత్సవాలు
కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక సమయం వచ్చింది పెద్దాయనకు
ఏం సమయం ?
రిటైరుమెంటు సమయం
అదేనండీ వానప్రస్థ సమయం
చక్కగా తపాలు, జపాలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతానని చెప్పి రాజ్యాన్ని అజుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడాయన
ఈ వానప్రస్థం గురించి భాగవతంలో ఒక మాంచి పద్యం ఉన్నది
దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలం
సత్యపూతాం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్ – 16
(శ్రీమద్భాగవతం 11-18-16)
అలా చక్కగా, సౌఖ్యంగా గడపాలని రూలు
వయసొచ్చాక అంతకన్నా కావలసిందేముంది ?
అందువల్లా ఆయన శేష జీవితం చక్కగా గడిచిపోయింది
ఆ పైన అజుడు ఎన్నో ఏళ్ళు పెద్దాయన బాటలోనే రాజ్యాన్ని పరిపాలిస్తూ గడిపాడు
అరివీర భయంకరుడు దశరథుణ్ణి కన్నాడు
ఆ తర్వాత ఆయన కథ, రాములవారి కథ మనకు తెలిసిందే!
బతికితే అజుడిలా, వీలైతే ఇంకా బ్రహ్మాండంగా రఘు మహారాజులా బతకాలి
ధర్మంగా బతకాలి, వీరత్వంతో బతకాలి, జనరంజకంగా బతకాలి, పరిపాలనాదక్షుడిగా బతకాలి, మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలి
ఇంతకీ అజుడి భార్య పేరేమిటో తెలుసునా ?
ఏ సుకుమారి కోసం ఇంత కథ జరిగిందో తెలుసునా?
ఏ సౌందర్యరాశి కోసం ఈ కథ జరిగిందో తెలుసునా?
ఆవిడే ఇందుమతీదేవి
ఈ కథను కాళిదాసు ఎంతందంగా వర్ణిస్తాడని?
అందుకు కాదు ఆ కథలు, ఆ ఇతిహాసాలు మనలో నిలిచిపోయింది
అవును అందుకే!
*
ఎంతందంగా..భాషమీద ఎంత ప్రేమతో..పట్టుతో రాశారని..
అందుకు కాదూ సారంగలో వేసింది..
బస్సెక్కి చదవడం మొదలెడితే..స్టేజొచిన సంగతే తెలియందే..!!
చాలా బాగా రాసారు ,మొదలుపెట్టక ఆపనివ్వలేదు,మీ నుంచి ఇలాంటి మంచి రచనలు ఎదురుచూస్తుంటాము.
రాజేశ్వరి.
అదీ సంగతి. ఏదైనా ఒక ప్రాచీన భాష నేర్చుకుంటే, అందునా ప్రపంచ భాషల తల్లిని కొంచమైనా తెలుసుకుంటే కదా ఇంత చమత్కారం ఒంట బట్టేది. బాగుంది.
చాలా బాగుందండి. ముఖ్యంగా ..
సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా ల్
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం స స భూమిపాలః
ఈ పద్యం చదువుతుంటే ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఇష్టం గా చదువుకున్న పద్యం. ఇన్నాళ్ళకి మరల ఇలా …
నేను రచయితను కానండి. రచయితనే అయితే, రచయితనే అనుకుంటే ఇంకా చాలా పకడ్బందీగా రాయవలసి వస్తుంది, రాయాలి కూడాను. ఇదంతా నేను మా అమ్మాయికి కథారూపంగానూ, మాటల రూపంగానూ చెప్పుకునేవి. ఆ చెప్పినదాన్నే లిఖిత రూపంలో భద్రపరచుకోడం నా అలవాటు..అంతే అంతకు మించి ఏమీ లేదండి. ఆ లిఖిత రూపం మీకు నచ్చితే మీతో పాటు నాకూ సంతోషమేగా! అందరికీ ధన్యవాదాలు… పైగా రామనవమి రోజుకు అచ్చేసిన అఫ్సరు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ
భవదీయుడు
వంశీ
వావ్ ఎంతందంగా రాశారు.కథనం చదువుతుంటే ఎంతో కోత్తగా వుంది.చివరాఖరి దాకా ఏకబిగిన చదివేశాను.
చాలా చాలా బాగుంది సర్..
రామాయణం కథలంటే ఖోపం. అన్నీ తప్పుడు ధర్మాలని. వీరత్వం కోసం కొట్టుకు చావడాలని. కాని సార్, మీరు కథ చెప్పిన పద్డతి మనోహరంగా వుంది. ఈ ఇతిహాసాలు ఎంత అతి హాసాలయినా, ఇలా మిగలడం… చివరాఖర్న మీరన్నట్టు… వాటిని ఇంత అందంగా చెప్పినందుకే. :-)
సనాతనధర్మం చెప్పిన సారం content పోయి రూపం form మిగిలిందని మీ అభిప్రాయమా హెచ్చార్కె గారూ! సనాతనధర్మంలో రూపం మాత్రమే లేదని, సారం కూడా వుందని మీరసలు ఒప్పుకుంటారా?
హెచ్చార్కె గారు – మీ సొంత అభిప్రాయంతో నాకు విభేదమేమీ లేదు కానీ, రామాయణ సారాన్ని లోతుగా చూడలేని, అర్థం చేసుకోలేని మనదే తప్పుడు ధర్మం అనిపిస్తుంది, నాకైతే!
సరే, దీన్ని సాగదీసే ఉద్దేశం నాకు లేదు కనక, ఎన్నో ఏళ్ళుగా, అంతా చేసి గత యాభై అరవై ఏళ్ళలోనే అనుకోండి – స్వాతంత్రం వచ్చిందన్న సంతొషంలో వాక్స్వాతంత్రాన్ని, రచనాస్వాతంత్రాన్ని కూడా పెంచేసుకుని చాలామంది చాలారకాలుగా మాట్లాడుకునేసారు కనక ఇక్కడికే ముగిస్తాను. దానివల్ల ఆ రామాయణానికి పోయేదేమి లేదు మన తెలివిని, ద్వేషాన్ని, ఏడుపుని, ఇతర నవరసాలని బయటవేసుకోవటం తప్ప. ఏ జాతికైనా, ఏ జాతినైనా మహోన్నతంగా నిలబెట్టేవి ఒకటో రెండో. అలా ఉన్న ఒకటి రెండిటినీ సరిగ్గా చూసుకోలేని మనమూ సరే, మన మాటలు సరే!
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు
భవదీయుడు
వంశీ
శ్రీను గారు నమస్తే ,RK నారాయణ గారు రాసిన మహాభారతం ఇంగ్లీష్ లో చదివాను . చాల గమ్మత్తు గ వుంటుంది .just for fun అంతే.
“కొంతమంది కళ్ళల్లో భాష్పపరిపూర్ణలోచనం.
కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యజనకం”. భాష పరంగా ఇక్కడేదో తేడా కొడుతోంది చూసుకోగలరు ఒక మారు.
పన్లోపని, ఇందుమతి పూర్వజన్మ, అజుడి అనురాగం, ఇవీ చెప్పవలసింది. మంగలం గొడవ వదిలేస్తే బాగుంది మొత్తంమీద.
సందేహ – తేడా కొడుతోందా ? :)
మీ సందేహ నివారణ నా చేతుల్లో లేదు. మొత్తం మీద బాగుంది కాబట్టి సంతోషమే
భవదీయుడు
వంశీ
చాలా బాగా రాశారు. ఎంతో నేర్చుకున్నట్టు అనిపిస్తోంది- పురాణాలు ఎక్కువ తెలియక.
మీరు మరీ కృష్ణవేణి గారు – నాకే అసలు ఏమీ తెలీదండి, నేనే బోల్డు నేర్చుకోవాలి, మీరు నా దగ్గర నుంచి నేర్చుకోమాకండి… :P
ఊరకే అన్నాలెండి
నచ్చినందుకు సంతోషం
భవదీయుడు
వంశీ
వంశీ గారికి
మీరు అప్పుడప్పుడు ఈమాట పేజీల్లో కనిపించే మాగంటి వంశీ గారేనా? మీ శైలిని చూసి పోల్చుకున్నాను. I hope, I am right.
ఒక చిన్న సవరణ:
“సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా ల్” – లోని లకారపు పొల్లు పద్య పాదాంతాన్ని సూచించే నిలువు గీటు కోసం “l” అక్షరం వాడినందుకు వచ్చినట్లున్నది. :)
మీరుదహరించిన త్యాగరాజు గారి “తెర తీయగ రాదా” అనే పాట అంటే నాకు చాలా కోపం. “హరి ధ్యానము సేయు వేళ చిత్తము అంత్యజు వాడకు పోయినట్టున్నది” అనే దారుణమైన ఉపమానం వేసినందుకు. “ఆ కాలం అటువంటిదేమో, ఆనాటి బుద్ధిమంతులకు అది తప్పుగా తోచలేదేమో” అని సర్దుకుపోతాను.
శ్రీనివాస్
శ్రీనివాస్ గారు – అవునండి “నిలువు గీత” అలా తప్పుగా నిలబెట్టేసింది. తెలియచేసినందుకు ధన్యవాదాలు…
ఇంకా ఒకటో రెండో టైపోలు కూడా ఉన్నవి, కానీ ఆల్రెడీ పబ్లిషు అయిపోయింది కాబట్టి, ఇప్పటికిట్లా వదిలెయ్యటమే… :)
భవదీయుడు
వంశీ
మీ రచనను మెచ్చుకునే ముందు చిన్న రిజర్వేషన్ చెబితే అన్ని తిట్లు తిట్టేశారేమి సామీ!
నాదేనా సొంతం, మీది, అంత ఘాటుగా రాసిన మీ అభిప్రాయం… మీ ‘సొంతం’ కాదా? నేను నా సొంత అభిప్రాయం కాక మీ సొంత అభిప్రాయం ఎలా చెప్పను?
ఔను సార్, ఈ అరవయ్యేళ్ల నుంచో అంతకు ముందు నుంచో వాక్ స్వాతంత్ర్యం వచ్చి నాలాంటి వాళ్లం కూడా మాట్లాడుతున్నాం. అది రాక ముందు ఎంచక్కా మీ లాంటి వాళ్లు మాత్రమే మాట్లాడే వారు. మా లాంటి వాళ్ళం మాట్లాడడం, మాటలు నేర్వడం శిక్షార్హమయ్యేది. ఇప్పుడలా కుదరదు. మీరు ఎంత పరుషంగా మాట్లాడినా ఇక మా ఆజాదీని మేం వదులుకోం.
ఐ రిపీట్ సర్, రామాయణ ధర్మమధర్మమే, దాన్ని ఎంత అందమైన మాటల్లో చెప్పినప్పటికిన్నీ.
అయ్యా, హెచ్చార్కె గారు – మీరు దేనికో బాధపడ్డట్టున్నారు, ఆ బాధలో నా కామెంటు సారాన్ని అర్థం చేసుకోనట్టున్నారు కూడాను. పైగా తిట్టు అని జమకట్టేసి, మీ అభిప్రాయంతో నాకు విభేదమేదీ లేదని చెప్పినా కూడా మీలాంటి వాళ్లు మాలాంటి వాళ్లు అంటూ భేదాలు తీసుకొచ్చేసారు కూడాను. :)
సరే కానివ్వండీ … నా కామెంటు తీరిగ్గా మళ్లీ శాంతంగా కూర్చొని చదువుకోండి. అప్పటికి అందులోని “ఎక్కడైనా సరే మంచిని చూడండి, చెడును వదిలెయ్యండి, అది జీవితమైనా పుస్తకమైనా” అన్న చిన్నపాటి ఉద్దేశం కనపడితే మంచిదే. లేదూ ఇంకా అలాగే ఉంటాను అంటే మీ ఇష్టం.
ఎవరి కోసమూ కాలం ఆగదు, ఎవరి కోసమూ రామాయణం అంతర్ధానమైపోదు. ఆ రామాయణం లేకపోతే మనకీ మాటలు కూడా ఉండేవీ కావు. :)
వంశి గారు కామెడీ రచన భావుంది . కాని అంతకు మించి లోతుల్లోకి వెల్లమాకండి,మానవులు మాట్లడం నేర్చు కున్నాక రామాయణం వచ్చింది .లిపి తరువాత రాత వచ్చింది .వ్యాసుడు పుట్టగానే గానే అడవిలో వేస్తె కోతిభాష వస్తుంది మానవ భాష రాదు .రామాయణం రాజదర్మమే , మానవదర్మం కాదు .మీరు రామాయణ ,మహాభారతాలు కామెడీ గా రాసుకోండి .వెవరికి అభ్యతరం లేదు .చర్చ అంటే HRK గారి ముందు నిలవరు.అవతలి వారిని బట్టి మివాదన స్తాయి చూసుకోండి
వంశి గారు కామెడీ రచన భావుంది . కాని అంతకు మించి లోతుల్లోకి వెల్లమాకండి,మానవులు మాట్లడం నేర్చు కున్నాక రామాయణం వచ్చింది .లిపి తరువాత రాత వచ్చింది .వ్యాసుడు పుట్టగానే గానే అడవిలో వేస్తె కోతిభాష వస్తుంది మానవ భాష రాదు .రామాయణం రాజదర్మమే , మానవదర్మం కాదు .మీరు రామాయణ ,మహాభారతాలు కామెడీ గా రాసుకోండి .వెవరికి అభ్యతరం లేదు .చర్చ అంటే HRK గారి ముందు నిలవరు.అవతలి వారిని బట్టి మివాదన స్తాయి చూసుకోండి.
‘…… మన తెలివిని, ద్వేషాన్ని, ఏడుపుని, ఇతర నవరసాలని బయటవేసుకోవటం తప్ప”. ఇదీ మీరు నన్నుద్దేశించి రాసింది. నాది ‘తెలివి, ద్వేషం, ఏడుపు’? దీన్ని తిట్టు అనక ఏమంటారు మీ వూళ్లో?
ఇవాళ మిగిలి వున్నది రామాయణం ఒక్కటే కాదు. వర్ణాశ్రమ ధర్మం, స్త్రీ అసమానత, పితృస్వామిక హైన్యం, రాజ్య విస్తరణ కోసం దొంగ సాకులతో యుద్దాలు మారణ హోమాలు, మారణ హోమాల రొమాంటిసైజేషన్ … ఇంకా చాల మిగిలున్నాయి. మిగిలున్నవన్నీ గొప్పవి కావు. అవి పోవాలనుకోవడం తప్పూ కాదు.
అయ్యా, వంశీ గారు,’ఎక్కడైనా సరే మంచిని చూడండి. చెడును వదిలెయ్యండి. అది జీవితమైనా ఒక కామెంటయినా’. అలా కాదని మీరు ఇంకా అలాగే ఉంటాను అంటే మీ ఇష్టం.
ఈరోజు రామయ తండ్రీ రామయ తండ్రీ అనే భజన పాట చూశాను . దీన్ని అనుకరిస్తూ రాసిన పాట బాపూ గారి సంపూర్ణ రామాయణం లో కనిపిస్తుంది. ఆపాటలో సీతమ్మ తాల్లికి అడవిలో జాగ్రత్తగా ప్రయాణం చెయ్యాలని ప్రేమతో కవి హెచ్చరికలూ చేస్తాడు. కాని సినిమా పాటలో సీత ప్రసక్తి అద్రుస్యమైమ్ది. సీతమ్మ తల్లీ అనే సంబోధన మాయమైంది.పురుష హీరో సంస్కృతీ యిది
రామాయణాలు వేలు.రాసినవీ మౌఖికమైనవీ . సంతాల్ రామాయణంలో లక్ష్మణుడు అగ్ని ప్రవేశం చేస్తాడు. సీతారాములు తన వ్యక్తిత్వాన్ని సందేహించడం వల్ల అలా చేస్తాడు.సంస్కృతంలో వాల్మీకి రాసిందే రామాయణమా/ సంస్కృఉతంలొనూ చాలా రామాయణాలు వున్నాయి. ఆర్ ఎస్ ఎస్ కి చెందిన గోల్వల్కర్కి ఆధ్యాత్మ రామాయణం అంటే చిరాకు. అది అద్విత వేదాంతాన్ని బోధిస్తుంది.విచిత్రం ఏమిటంటే సీతాపహరణమే మాయ అంటుంది. దీన్నుంచి హిందూ జాతీయ వాదాన్ని బోధించడం కష్టం.
సీత కేంద్రంగా రామకథలు వున్నాయి సీతకి గుడులు వున్నాయి. రంగనాయకమ్మ బాపుల పుణ్యమా అని సంస్కృత వాల్మీకి రామాయణమే ప్రసిద్ధిలోకి వచ్చింది.
వంశీ గారి కథనం బాగుంది.కాలిదాస శ్లోకాన్ని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
మరోమాట రామాయణం కుశలవుల గానం అన్న మాట దాని ప్రాచీన మొఊఖిక లక్షణాన్ని బహుళత్వాన్ని తెలియజేస్తోంది. ఎందుకో నాకు ఉదయాన కథా కోవిదాన్ గ్రామ వృద్ధాన్ అనే కాలిదాస మెఘసందేస శ్లోకం గుర్తుకు వస్తోంది
“ఆర్ ఎస్ ఎస్ కి చెందిన గోల్వల్కర్కి ఆధ్యాత్మ రామాయణం అంటే చిరాకు. అది అద్విత వేదాంతాన్ని బోధిస్తుంది.విచిత్రం ఏమిటంటే సీతాపహరణమే మాయ అంటుంది. దీన్నుంచి హిందూ జాతీయ వాదాన్ని బోధించడం కష్టం.”
ఆన్లైన్లో బంచ్ ఆఫ్ థాట్స్ కనబడితే ఆధ్యాత్మ రామాయణం గురించి గోల్వల్కర్ ఏమన్నారో చూద్దామని వెదికాను. ఒకే ఒక్క రెఫరెన్సు తగిలింది. ఎవరో పెద్దాయన “రాముడిని ఆదర్శంగా తీసుకోవటం ఎలా కుదురుతుంది? పారాయణం ప్రయోజనమల్లా మోక్ష సాధనకు అవసరమైన పుణ్యం సంపాదించి పెట్టడమే. ఇంకేం కావాలి?” అని అన్నాడని వెక్కిరింతగా చేసిన ఒక ప్రస్తావన.
ఆధ్యాత్మ రామాయణం నేర్పించే అద్వైతం నుంచి హిందూ జాతీయవాదాన్ని నేర్పలేమని గోల్వల్కర్ చూపిన చిరాకుకి ఏమైనా రెఫరెన్సులు ఇవ్వగలరా?
అన్నట్లు రావణుడు ఎత్తుకెళ్ళీంది మాయాసీతనని రామచరితమానస్లో కూడా ఉన్నది కదా!
త్యాగ రాజు గారి మనస్సు అంత్యజు వాడకు పోయిందని రాస్తే మీకు అభ్యంతరమేమిటి/ మీరు శివుడిలా మన్మధుడిని భస్మం చేసేసేరేమిటి? లేక విక్టోరియన్ ప్యూరిటీయా?
అంత్యజు వాడ అంటే “తక్కువ” కులాల వాళ్ళు ఉండే చోటు అని అర్థం చేసుకున్నందున నాకు కోపం కలిగింది (It is as if, while meditating on Lord hari, mind wandering to the locality of low people అని త్యాగరాజ వైభవం వెబ్సైటులో చూసాను).
పాపం వాళ్ళుండే చోటుకి వెళ్ళటానికి కూడా ఆయనకి అభ్యంతరమా అని బాధ పడ్డాను, అంతే. ఆ మాటకి నానార్థాలో అంతరార్థాలో ఉన్నట్లున్నాయని గమనించలేదు. అంతే!
హెచ్చార్కె గారు – నేను జనరలుగా వాడిన “మన” అనే పదప్రయోగాన్ని మీరు “నా” గా మార్చేసుకుని, పైగా అది తిట్టని , నాకా ఉద్దేశం లేకపోయినా, అంతలా బాధపడిపోతే నేను చెయ్యగలిగిందేమీ లేదు. పైగా ఇతరాలు ఏమిటో నాకు అంటగట్టారు… హహ…చాలా బాగుంది… అసలైనా మీరెవరో ఏమో కూడా నాకు తెలియదు, మిమ్మల్ని కలిసింది లేదు మాట్లాడింది లేదు, మీ గురించి తెలిసింది లేదు, మిమ్మల్ని నేను తిట్టటమేమిటో ? ఆశ్చర్యంగా ఉన్నది… COMPLETELY Agree to disagree sir.
Even these last two lines from me on this topic are for you to not think that I am in agreement with your comment and kept silent. I usually do not waste my time like that. Sometimes it, the silence can come under “ignore” category too. Anyways, have a good day and good week ahead sir. I have lot of other stuff to do and I hope you do too. Thanks.
Oh, btw, if you think, you need an apology, here it is and pls take it from me and be happy. Its just a word that makes so many people so happy. I hope it does make you హ్యాపీ
భవదీయుడు
వంశీ
సర్, మీరు కూడా నాకు తెలీదు. అది ముఖ్యం ఎందుకైందిక్కడ?
ఒకరితో ఒకరు విభేదించడంలో ఏమీ తప్పు లేదు. దానికి సందేహం అక్కర్లేదు. మీ వలె నాకు చాల పని వుందని పలు మార్లు నేను అనను. పని వుంటే చేసుకుంటాను. మీ వాక్యంలో ‘మన’ అనేది జనరల్ మాట కాదు. జనరల్ అయ్యుంటే దానిలో ద్వేషం, ఏడుపు, అతి తెలివి అర్థంలో తెలివి లాంటి మాటలు దొర్లవు. తిట్లంటే బండ బూతులు కానక్కర్లేదు. విషయాన్ని వదిలేసి, ఏడుపు, ద్వేషం వంటి మాటలు దూషణలే అవుతాయి.
రాణి, అంత్యజుడు అనే మాటకు మీరిచ్చిన అర్థం మీకైనా తృప్తి ఇచ్చిందా? త్యాగరాజుకు లేని కుల సామరస్యం మీరెందుకు ఎందుకు అంటగట్టడం? ఆ మాటలో ఉన్నది పుటక సమస్యే అని తెలుసుకోడానికి సంస్కృత పాండిత్యం అవసరమా? మనల్ని మనం కడుక్కోకుండా, సిగ్గు పడాల్సిన దానికి సిగ్గుపడకుండా, దాన్నే సమర్తించుకుంటూ ఎన్నాళ్లు?
.
వంశీ గారు, మీరు చెప్పినడి అక్షరాలా నిజం ‘ఎవరి కోసమూ రామాయణం అంతర్ధానమైపోదు’. వాల్మీకి రామాయణం పూర్తిగా చదివినా, విన్నా – అది అర్ధం చేసుకుని పొందే ఆనందాన్ని, ఆ అనుభూతి ని మాటల్లో చెప్పలేము. ఇలా రామాయణం ని విమర్శించే వారికి, వాదనలు చేసేవారికి మీలాగా ఒక నమస్కారం పెట్టి ఊరుకోవడం ఉత్తమం.
విమర్శకులు ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారో ఈ వేళ్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహితీ శీర్షికలో చక్కగా తెలిపేరు.
‘‘అన్యాయమైన ఆరోపణ‘‘
http://epaper.andhrajyothy.com/781775/Andhra-Pradesh/18.04.2016#page/4/2
‘శూద్రుడి’గా ఒక బ్రాహ్మణ పండితుడి దగ్గిర తనకు చిన్నప్పుడు జరిగిన అవమానాన్నీ, బ్రాహ్మణుల్ని గొప్పజేసే మహాభారతాన్నీ, బీఫ్ వివాదాన్నీ, పార్లమెంటులో స్మృతీ ఇరానీ నటనా చాతుర్యాన్నీ, మహిషాసుర కధనీ, కంచికచెర్ల కోటేశు వుదంతాన్నీ…. అన్ని రకాల దుర్మార్గాల్నీ ఒక చోట కుప్పపోసి, ఆ ‘‘భావ వైపరీత్యానికి’’ ఉదాహరణగా చలం నవలని చూపించి, చలాన్ని ఒక బ్రాహ్మణ వాదిగా, బ్రాహ్మణేతర ద్వేషిగా నిల బెట్టిన హెచ్చార్కేది ‘‘ఒక భావుకుని డైలమా’’ అని ఎలా ఒప్పుకోవాలి? హెచ్చార్కేది న్యాయమైన ‘డైలమా’ ఎప్పుడయ్యేదంటే, ‘బ్రాహ్మణీకం’ నవల మొత్తాన్ని ఆయన పరిగణనలోకి తీసుకుని వుంటే! నవలలో ఒక ముక్కని తీసుకుని, ఆ ముక్కని ఇతర ముక్కలతో ‘కలిపి’ చూసి, ఎక్కడ ఏ వైరుధ్యం వుందో గమనించి, ఆ వైరుధ్యాన్ని పాఠకుల ముందు పెడితే, అది ‘డైలమా’ అయి వుండేది. ఉదాహరణకి, నవల ప్రారంభం నించీ బ్రాహ్మణీకాన్నీ, అందునా సుందరమ్మ వంశంలో వున్న ‘‘పూర్వాచార పరాయణ’’త్వాన్నీ, ‘‘మూఢ నమ్మకాల్నీ’’ ‘‘గర్విస్టుల్నీ’’, ‘‘కర్మ సిద్ధాంతాన్నీ’’, ‘‘పవిత్ర బ్రాహ్మణ కుటుంబాలలో వున్న దౌర్జన్యాల్నీ’’, ‘‘బ్రాహ్మలం అనే గర్వపు పలుకుల్నీ’’, ‘‘వూరు కన్నా, పేరు కన్నా, ఉద్యోగం కన్నా, వంశం కన్నా ముందు కులం సంగతి వెల్లడి చేసే యీ దేశాచారాన్నీ’’ – ఇలా ‘బ్రాహ్మణత్వాన్ని’ నవల ప్రారంభం నించీ, చివరికంటా ‘గేలి’ చేసిన చలం, నవల మొత్తంలో ఒకే ఒక దగ్గిర బ్రాహ్మణత్వాన్ని గొప్పజేసే వ్యాఖ్యానం చేశాడేమిటీ – అని ప్రశ్నించి వుంటే, అది నిజంగానే న్యాయమైన డైలమా అయి వుండేది.
‘‘అన్న ద్వేషం – బ్రహ్మ ద్వేషం’’ వ్యాసానికి సమాధానంగా వచ్చిన వ్యాసం
‘‘డైలమా కాదు అసహనం’’
http://epaper.andhrajyothy.com/761135/Andhra-Pradesh/28.03.2016#page/4/2
‘‘అన్న ద్వేషం – బ్రహ్మ ద్వేషం’’ వ్యాసం
http://epaper.andhrajyothy.com/748254/Andhra-Pradesh/14.03.2016#page/4/2
“జాతిని ఉన్నతంగా నిలబెట్టేవి ఒకటో రెండో”, “ఎవరి కోసమూ రామాయణం అంతర్ధానమైపోదు” అన్న వంశీగారి అభిప్రాయంతో ఎవరికీ ఎలాంటి విభేదమూ ఉండనవసరంలేదు. రామాయణం ఇంతకాలం ప్రచారంలో ఉందంటే, అందులో జాతిని ఉన్నతంగా చూపించేది ఏదో ఉంది కనుకనే. ఎవరు ఎలా విభేదించినా రామాయణం ఇంతకాలం అంతర్ధానమవలేదు కనుక ముందు కూడా కాబోదు.
దీనినే ఇంకోరకంగా చూడండి. రామాయణం ఎందుకు అంతర్ధానమవలేదంటే, దానిని పూజామందిరంలో భద్రంగా ఉంచడంవల్ల కాదు. జనం నాలుకల మీదా; నాటకాలు, సినిమాల వంటి దృశ్యరూపాలలో జనం కళ్ల ముందు ఉంటూ వచ్చింది కనుక! రామాయణం అంతర్ధానం కాబోదన్న భరోసాకు ఇప్పుడు మరింత అవకాశం చిక్కింది. ఎందుకంటే నిన్నటివరకూ ఒకటి రెండు సామాజికవర్గాల పఠన పాఠనాలలోనూ, వ్యాఖ్యాన టీకా టిప్పణులలోనూ ఉంటూ వచ్చిన రామాయణం ఇప్పుడు ఇతర సామాజికవర్గాల పఠన పాఠనాలకూ, టీకా టిప్పణులకూ విస్తరించింది. ఆవిధంగా రామాయణభావుకులు, చింతకుల సంఖ్య పెరిగి దాని చిరస్థాయికి వెనకటి కంటే ఎక్కువ అవకాశం చిక్కింది. ఈ పరిణామాన్ని సంతోషంగా ఆహ్వానించాలి.
ఇప్పుడు రామాయణ పఠనపాఠన వ్యాఖ్యాన టీకా టిప్పణులకు పూనుకున్న అన్య సామాజికవర్గాలు తమ అనుభవాలనుంచి, తమ అవగాహననుంచి, తమ ప్రాపంచిక దృక్పథం నుంచి దానిని వ్యాఖ్యానిస్తాయి. అది ఇంతవరకూ ఉన్న దృక్పథానికీ, వ్యాఖ్యానసంప్రదాయానికీ అనుగుణంగా ఉండాలనేమీ లేదు. ఉండాలనీ ఎవరూ శాసించలేరు. తమ దృక్పథాన్ని, తమ వ్యాఖ్యాన సంప్రదాయాన్ని అంగీకరిస్తేనే రామాయణం అంతర్ధానం కాకుండా ఉంటుందని భావించలేరు. రామాయణ పాఠకులుగా మారిన కొత్త సామాజికవర్గాల సరికొత్త వ్యాఖ్యానాలవల్ల రామాయణం చిరస్థాయికి ఎలాంటి భంగమూ ఉండదు. ఆ వ్యాఖ్యానాల నుంచి రామాయణాన్ని కాపాడే బాధ్యతను ఎవరో ప్రత్యేకంగా తలకెత్తుకొనక్కరలేదు. రామాయణమే తన భద్రతను తను చూసుకోగలదు. అనేకమంది కాచి వడబోసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది రామాయణం విలువ.
రామాయణం జాతిని ఉన్నతంగా నిలబెట్టేదీ, జాతి సంపదా అయినప్పుడు, ఆ జాతిలోకి హెచ్చార్కే వస్తారు, రంగనాయకమ్మా వస్తారు, విశ్వనాథా వస్తారు. తమ తమ అనుభవాలు, అవగాహన, ప్రాపంచిక దృక్పథాల పరిధిలో తాము జాతి సంపదను “సొంతం” చేసుకునే అధికారం అందరికీ ఉంది. జాతి సంపద భద్రతకు అది నిజమైన భరోసా. అంతేతప్ప “నేను ఇక మాట్లాడను, నిశ్శబ్దం వహిస్తాను” అంటూ చర్చకు ఏకపక్షంగా ఫుల్ స్టాపు పెట్టేసి కొత్త వర్గాలనుంచి వచ్చిన రామాయణ పాఠకులను దూరం చేసుకోవడం రామాయణ శాశ్వతత్వానికి హామీ ఇవ్వదు. సంభాషణనుంచే జ్ఞానం వృద్ధి చెందుతుంది కానీ, నిశ్శబ్దం నుంచి కాదు.
ఏదో సరదాగా వ్రాసుకున్నశ్రీరామ నవమి నాడు అచ్చు వేసిన రచన కి మీద ఇంత చర్చ అవసరమంటారా ? ‘సొంత’ అభిప్రాయాలూ చెప్పుకోవడానికి ఎవరి బ్లాగులు వారికున్నాయి ఎవరి ముఖ పుస్తకాలూ వారికున్నాయి కదా. లేదా ఇదే పత్రిక లో ఇంకో వ్యాసం వ్రాయవచ్చు. వాక్ స్వాతంత్ర్యం వేరే మత గ్రంధాల మీద లేదేమో కానీ రామాయణ మహా భారతాల ఒక్క భారతీయుల కే కాదు ప్రపంచం లో ప్రతి ఒక్కరికి ఉంది. కానీ రామాయణం చదివి ఆనందానుభూతిని పొందే వారిని, రామాయణం ఒక అధర్మం అంటూ మాట్లాడి చర్చ చేయడం లేదు అంటూ మాట్లాడటం మాత్రం సమంజసంగా లేదు.
1.శ్రీనివాసుడు! ఆంధ్ర జ్యోతిలో నా వ్యాసానికి తాటికొండ శర్మ గారు రాసిన ప్రతిస్పందనను అప్పుడే చదివాను. అందులో కొత్తగా జవాబివ్వాల్సినవి ఉన్నాయని నేను అనుకోలేదు. సీరియస్ పాఠకులు తిరిగి నా వ్యాసాన్ని చదువుకుంటే సరిపోతుంది.అందుకని, దానికి జవాబివ్వలేదు. ఇప్పుడు బి ఆర్ బాపూజీ రాసిన వ్యాసం చదివాను. నాపై ఆయన అభియోగాలు అన్యాయంగానే గాక సబ్స్టాన్షియల్ గానూ వున్నాయి. అది చూసిన వెంటనే నేను చెలాన్ని తప్పుగా చదివానా అని తిరిగి ఆ కథ మళ్లీ చదివాను. కథను నేను తప్పుగా చదవలేదు. మీరంటున్నట్టు అసమగ్రంగానూ చదవలేదు. మొత్తం కథను అవసరమైన సమ్యక్ దృష్టితోణే చదివాను. నా వ్యాసంలో తప్పుగా రాయనూ లేదు. బాపూజీ యే తప్పుగా చదివారు. నేను రాసే జవాబు న్యాయంగా తిరిగి ఆంధ్ర జ్యోతిలోనే వెలుగు చూడాలి. అది వెలుగు చూసినప్పుడు కూడా ఇలాగే షేర్ చేయడం మీ థర్మమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నా పై విమర్శలను షేర్ చేసి వ్యాఖ్యానించారు కాబట్టి.
2. ఇక, దానికీ ఇక్కడ జరిగే చర్చకు ఏమి సంబంధం? ఇలా వాదాలు చేయడం సరైనదేనంటారా?
3. భాస్కరం గారు దాదాపు మీ వైపు నుంచే, రామాయణ ఔన్నత్యం వైపు నుంచే… ఒక సలహా ఇచ్చారు. వినండి. దానికి నా చేర్పు ఒకింత. ప్లీజ్, చర్చలో ఏమి ప్రశ్న ముందుకొచ్చిందో దాని గురించి మాట్లాడండి. ఈ కథనం మనోహరంగా వుందన్నాను. ఆ విషయంలో మీరు నాతో విభేదిస్తున్నారా? చెప్పండి. రామాయణ ధర్మమధర్మమని అన్నాను. అది ఎలా చెడు థర్మమో కూడా నేను చెప్పాను. కాదు అది సద్ధర్మమని మీరంటారా? అదెలాగో చెప్పండి. ఆ పుస్తకం చాన్నాళ్ల నుంచి వుంది గాబట్టి గొప్పది…. తరహా జవాబు… ప్రశ్న విడిచి సాము.
ఆపైన… నాకు ఎవరి అపాలజీలు అక్కర్లేదు. నిజానికి అదో రకం అబద్డం. నా నుంచి తప్పు లేదనుకుంటే ఎంత గొప్పవారికైన్క అపాలజీ చెప్పను.
నేను బ్రాహ్మణీకం సొంతంగా చదివి ఉన్నాను.చాలా కాలమైంది.కానీ ఇప్పుడు ఈ ప్రస్తావనల వల్ల మళ్ళీ గుర్తు చేసుకోగలిగాను. హెచ్చార్కె గారి అసలు వ్యాసం నేను చదవలేదు, లింకులుగా ఇచ్చిన ప్రతివిమర్శ మాత్రమే చదివినా కధలో ఆ బ్రాహ్మణ స్త్రీకి మహత్యం అంటగట్టినట్టు అప్పుడు చదివేటప్పుడూ అనిపించలేదు,ఇప్పుడు కూడా చలం నాయుడు చెడగొట్టింది ఒక బ్రాహ్మణ స్త్రీని గాబట్టి నాయుడు పాత్రని చంపాడని అంటే ఒప్పుకోవడం కష్టం.
కధలోని విషయం సూటిగా చెప్పాలంటే ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని ఆ కష్టాన్ని గట్టేక్కిస్తానని కబుర్లు చెప్పి మోసం చెయ్యడం ఎట్లా ఉంటుందో బొమ్మకట్టినట్టు అతి దగ్గిర్నుంచి చూపించటం, నాయుడి శూద్రత్వాన్ని ఆ స్త్రీ బ్రాహ్మణత్వాన్ని మాత్రమే పట్టించుకోకుండా మన చుట్టూ చూస్తే ఎక్స్ప్లాయిటేషన్ యొక్క పిక్చర్ ఇదే కదా!చలం చేసిన అసలైన ట్రిక్ మోసం చేసేవాడు తనకి తను ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఎట్లా ఉంటుందో విప్పి చూపించటం!నాయుడు ఒకప్పుడు తను బ్రాహ్మల వల్ల అన్యాయానికి గురై ఆ కులం మీదనే ద్వేషం పెంచుకుని,ఇక్కడ కనబడుతున్నది బ్రాహ్మణస్త్రీ గాబట్టి రేప్/బలాత్కారం/కపటసంభోగం చెయ్యడంలో ఎలాంటి తప్పూ లేదని అనుకోవడమే కధలోని మెలిక!నాయుడి స్థానంలో హిట్లర్ అనే మరొక వ్యక్తిని నిలబేడితే చరిత్రలో అతడు చేసిందీ ఇదే కదా! మొదట యూదుజాతి మీద దుష్ప్రచారం చేసి అలాంటి యూదుల్ని కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ఉంచటం,గ్యాస్ చాంబర్లలఒ చంపడం తప్పు కాదనే జస్టిఫికేషన్ తెచ్చుకున్నాకనే ఆపని అంత ధీమాగా చెయ్యగలిగాడు!
హెచ్చార్కె గారు ఆ కోణాన్ని పట్టించుకుని ఉంటే బాగుండేది,ఎజెండా,ఐడియలాజికల్ న్యారోనెస్ మనస్సులో సుడులు తిరుగుతునవాళ్ళు సాహిత్యవిమర్శ వైపుకి పోకుండా ఉంటే మంచిది!
హరిబాబు గారూ!
‘‘అన్నం ద్వేషం బ్రహ్మ ద్వేషం’’ వ్యాస లంకె, దాని పైన విమర్శ లంకె, ఇంకొక సమాధానం లంకె మూడూ ఇదే వ్యాసంలో ఇచ్చాను వేరు వేరు టపాల్లో. ఎందుకంటే, ఒక టపాలో ఒకటి కంటే ఎక్కువ లంకెని ఇస్తే ఆ టపా ప్రచురింపబడడంలేదు. ఆ మూడు వ్యాసాలూ చదివి మీ అభిప్రాయం సమగ్రంగా ఇదే వ్యాసంలో చెప్పవలసినదిగా మనవి.
నిజమే HRK గారు ,మీరు రాసిన దాన్ని బలపర్చినట్టు ఉంది .అంతకు మించి కొత్తగారాసింది ,ఏమిలేదు
అవును భాస్కర్ గారు ,మరచి పోయిన మరుభూమిని అడుగుజాడ స్మరిస్తుంది ..లాగ ఒక దుర్మార్గం వేల సంవ్చరాల నుండి ఈ ప్రజాస్వామిక యుగం లో కూడా వెంటాడుతూ వుంది అంటే ముస్కరులకి దాని అవసరం వుంది .అది బ్రతికుండి జనాన్ని చంపుకు తింటుంది .
శ్రీనివాసుడు, జనాలు నా వ్యాసం చదవకుండా దాని మీద విమర్శలను మాత్రమే చదివి నా మీద అభిప్రాయాలు ప్రకటించేలా చేసే మీ పన్నాగం ఫలించింది. ఇప్పుడు చేసుకోవచ్చు మీరు దుర్ముఖి ఉగాది పండగ. బహుశా ఇదే అయ్యుంటుంది మీ రామ ధర్మం. ఇప్పుడంటాను నేను, అజాదీ చాహియే బ్రాహ్మణ్ వాద్ సే.
హెచ్చార్కె గారూ!
మీరు మాట్లాడుతున్నది హిందూ ఫాసిస్టుతో కాదు, ఒక స్వేచ్ఛా జిజ్ఞాసితో. (రామధర్మం, దుర్ముఖి ఉగాది, బ్రాహ్మణ్ వాద్ అని మీరు చెప్పినవి నేను చెప్పింది అర్థం చేసుకోవడంలో మీకున్న నిబంధత తాలూకు ఛాయలు మాత్రమే అంటే కండిషనింగ్ మాత్రమే)
*******
ముందుగా ముద్రలు వేసే పన్నాగాలు బహుశా మీవే. నేను మీ మీద ఏ ముద్రలూ వేయలేదు, వేయను.
*********
నేను శూద్రుడిని అని మీరు చెప్పుకున్నా నేను మిమ్మల్ని మనిషిగానే చూస్తాను. ఎందుకంటే కులం, మతం అనే నిబద్ధతలు నాకు లేవు.
**************
మీరు సరిగ్గా చూడలేదేమో, మీ వ్యాసం లంకె నే నేను ముందుగా ఇచ్చాను. ముందుగా మీరు పొరపడ్డారని ఒప్పుకోండి. వరుసగా మూడు టపాల్లో మూడు లంకెలూ ఇచ్చాను. అలా ఎందుకంటే ఒక టపాలో ఒకటి కంటే మించి లంకెను ఇస్తే టపా ప్రచురింపబడదు. మీకు అనుమానముంటే తనిఖీ చేసుకోవచ్చు. ఈ విషయం శ్రీరామ్ గారు ఇంతకుముందే తన టపాలో చెప్పేరు.
************
నేను మీ వ్యాసం, దాని మీద విమర్శ, మరియు చలం గురించిన వ్యాసం మూడు లంకెలు ఇదే వ్యాసంలో ఇచ్చేను, పాఠకులు మూడు చదివి ఏ పరిశీలన విజ్ఞతతో వుందో తెలుసుకోవాలనే నా ప్రయత్నం.
**********************
మీరు బ్రాహ్మణవాదం అనే భూతాన్ని చూపించి నేనన్న సనాతనధర్మాన్ని (జాగ్రత్తగా చదవండి. మీరు బూచిగా చూపుతున్న హిందూ ధర్మాన్ని కాదు, సనాతన ధర్మాన్ని. రెంటికీ తేడాని రాణి శివశంకరశర్మ గారు తన పుస్తకంలో చక్కగా చెప్పేరు) హిందూ ఫాసిజం అనే మాయతో పోల్చకండి.
మీకు నేనెవరో తెలియదు, కేవలం నా వ్యాఖ్యని బట్టి అంచనా వేయకండి. మీకున్న నిబద్ధతను ప్రక్కనబెట్టి స్వేచ్ఛగా సంభాషిస్తానంటే నేను సిద్ధం.
మోహన వంశీ గారూ… మీ వ్యాఖ్యానం అమోఘంగా ఉంది. ఉషశ్రీ గారిని గుర్తుకు తెచ్చింది. అభినవ ఉషశ్రీ అనే బిరుదు పొందుటకు తమరు అర్హులు. మీరు మరిన్ని వ్యాఖ్యానాలు చేయవలసినదిగా కోరుచున్నాను.
“మీరు మాట్లాడుతన్నది హిందూ పాసిష్టుతో కాదు”
ఇంకెవరితో సర్! మీకు చెప్పుకుంటే చాలదు. అవాతలి వారి దృష్టిలో ఎలా తెలుస్తున్నారు అనేది కూడా ముఖ్యమే! “ఇక్కడ బాధితులు లేరు బాధ పెట్టే వాళ్లు లేరు” అన్న మీరు “చంపే వాన్ని నేనే వచ్చేది నేనే” అనే యుద్ధ పిపాసులకంటే వున్నమాట? మేకతోలు కప్పు కున్న పులివేనన్నది మరువద్దు.
శ్రీనివాసుడు గారు, నేనిప్పుడు మాట్లాడుతున్నది స్వేచ్చగానే. మీరూ స్వేచ్చ గానే మాట్లాడంది. నేను శూద్రుడినని చెప్పుకున్నది ఒక ప్రత్యేక సందర్భంలో. బాపూజీ అసందర్భంగా దాన్ని ఉటంకిస్తే మీరు దాన్ని పట్టుకున్నారు. అందుకే ఆయన వ్యాసం మీద నా జవాబు వరకు అగాలని కోరాను. నా మొదటి వ్యాసం శూద్రత్వానికి బ్రాహ్మణత్వానికి మధ్య వున్న వైరుద్యం మీద రాసింది. ఈ విషయంలో ఎవరెవరు న్యాయంగా లేరో ఆ ఇన్స్టన్సెస్ కొన్ని పేర్కొన్నాను, నా వ్యాసంలో. దాన్ని మీరిక్కడ తీసుకు రావలసింది కాదు. తీసుకురావడం ఫాసిస్టు ఎత్తుగడే. బ్రాహ్మడు బ్రాహ్మణేతరుడికి చదువు చెప్పరాదనే ద్రోణ నీతిని పాటించే ఒక బ్రాహ్మాణుడి జీవిత కథ… ఆయన మీద విమర్శ వున్న కథ కాదు… ఆయన్ని పాజిటివ్ గా పేర్కొనే కథను రాసి, అచ్చేసి, కలేకూరి, నేను పల్వురు తన మితృలం అది అన్యాయం అన్నా వినక అమ్మకంలో వుంచిన రాణి శివశంకర శర్మ రాసింది నాకెందుకు ప్రమాణం సోదరా. ఆయనేదో రాశారని నాకు చెప్పడం ఎందుకు? మీరు హిందూ ఫాసిస్టు అనో మరొకటనో బ్రాండ్ చేయ లేదు. ఆ వేడికోలు అనవసరం. నేను శూద్రుడినయినా నన్ను మనిషిగా గౌరవిస్తారా? మంచిదే మీరు బ్రాహ్మాణుదైనా నేను గౌరవిస్తున్నాను కదా, ఒక మనిషిగా. నేనొక రెడ్డిగా చుండూరు రెడ్లతో కలిసి పని చేసినా గౌరవిస్తారేమో మీరు. నేను మిమ్మల్నలా గౌరవిస్తానని మాటివ్వలేను. మిమ్మల్ని మీ మాటాలు, మీ చర్యలు ఆధారంగానే గౌరవమో అగౌరవమో ఇస్తాను.
బాపూజీ స్పందన లోంచి మీరు… చెలం ఆ కథలో బ్రాహ్మణీకాన్ని కూడ గేఌ చేశాడనే మాటల్ని విస్తృతంగా కోట్ చేశారు. చెలం ఈ కథలోనే కాదు, చాల చోట్ల బ్రాహ్మణ కుటుంబాల లోని చాదస్తాల్ని గేఌ చేశారు. అది ఆ కులం బాగు పడ్డానికి పనికొచ్చే మాటలు. పనికొచ్చాయి కూడా. ఇవేవీ ‘బ్రాహ్మణత్వా’న్ని గేఌ చేయడం కాదు. బ్రాహ్మణత్వం అంటే కులాల్లో బ్రాహ్మణులు పవితృలని, బ్రాహ్మణ వ్యతిరేకత ఎంత హేతుబద్దమైనా వినాశకరం అనే విశ్వాసం. బ్రాహ్మణీకం నవలలో…. అన్ని చోట్ల గురించి నేను మాట్లాడడం లేదు, గవళ్ల కులస్టుడైన రామయ్య నాయుడి పాత్రను తెచ్చి చెలం చెప్పిందేమిటి… అనేదే వ్యాసంలో అ భాగం యొక్క కన్సర్న్. అక్కడా చెలం చేసించి బ్రాహ్మణీకపు వుగ్గడింపే.
నా అభిప్రాయాలు వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను. నువ్వు శూద్రుడివైనా తరహా ప్యాట్రనైజేషన్ వద్దు సర్. మీరు బ్రాహ్మలైనా, నేను మిమ్మల్ని మనుషులుగానే చూస్తాననడం బాగోదు.
హెచ్చార్కె గారూ!
అసలు ఇక్కడ మీ వ్యాసాల ప్రసక్తి తీసుకువచ్చింది ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగడానికే.
నేను మాట్లాడేది చలం బ్రాహ్మణీకాన్ని ఉగ్గడించాడా, లేదా అని కాదు. మీ ఆలోచనలని కుల నిబద్ధతనుండి, బ్రాహ్మణ, హిందూ విద్వేషంనుండి బయటపడేస్తేనే సంభాషణ సాధ్యమవుతుందనే విషయమే మాట్లాడుతున్నది.
ద్వేషాన్ని ద్వేషించడం తప్పుకాకపోతే, అలా ద్వేషించిన మీ భావాలను కూడా ద్వేషించడం సహజంగా జరుగుతుంది. ఇది మొత్తం విద్వేషాలు పెరగడానికే దారితీస్తుంది.
నేను చెప్పిన పై వాక్యాన్ని లోతుగా విశ్లేషించి అర్థం చేసుకుంటే మీరు చెప్పే, వాదించే కోణంలోని పరిమితులు మీకు అర్థం అవుతాయి.
ఇక్కడ కావలసింది ద్వేషించడం కాదు, సంభాషించడం. దానికి కావలసింది ఆ కుల, మత చట్రాలని బద్దలు కొట్టడం.
మీరు రెడ్డా, వెలమా, బ్రాహ్మణులా అన్నది నాకనవసరం. ఒక మనిషిగా, మేధావిగా, ఆలోచనాపరుడిగా, యువతను, తోటి సమాజాన్ని విజ్ఞత వైపుకు తీసుకువెళ్ళవలసిన వ్యక్తిగా మీ నుంచి మేం ఆశిస్తున్నది కుల, మత పరిధిలోని విశ్లేషణ కాదు, దానికి మించిన అవగాహన.
రామధర్మం, దుర్ముఖి ఉగాది, బ్రాహ్మణ్ వాద్ ఇవి వేటిని సూచిస్తాయో మీరు వివరిస్తే బాగుంటుంది.
నేను బ్రాహ్మణుడినని మీకెవరు చెప్పేరో తెలుసుకోవచ్చా? మిమ్మల్ని ప్రశ్నించగానే కులాన్ని సూచించే, కుల చట్రంలోనుండి ఆలోచించే మీ అవగాహననే నేను ప్రశ్నించేది.
అసలు బ్రాహ్మణవాదమనే బూచిని చూపి మీరేం సాధించదలుచుకున్నారో నాకర్థంకావడంలేదు.
చాలా సంవత్సరాలుగా మీరు ఇదే కోణంలోనే వాదిస్తున్నారు. మీరు ఎవరితో పోరాడుతున్నారో వారితో చేసేది పోరాటంగా గాక, కుల చట్రంలోనుండి చూడకుండా సంభాషణ జరిపితే మాత్రమే పరివర్తను అనేది ఎదుటివారిలో సాధ్యమవుతుంది.
మీరు శూద్రుడికంటే ముందు మనిషి. ఆ గ్రహింపు నాకుంది గనకనే మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకున్నా నేను మనిషిగా మాత్రమే చూస్తానని చెప్పింది.
లేదూ, నేను ఇలాగా చెబుతాను, ప్రతి విషయాన్నీ బ్రాహ్మణవాదం కోణంలోనుండే చూస్తానంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు.
ఇది తమ వ్యాఖ్య
‘‘భాస్కరం గారు దాదాపు మీ వైపు నుంచే, రామాయణ ఔన్నత్యం వైపు నుంచే… ఒక సలహా ఇచ్చారు. వినండి.‘‘
నిజానికి భాస్కర్ గారు ఇద్దరికీ చెప్పేరు.
‘‘ఈ పరిణామాన్ని సంతోషంగా ఆహ్వానించాలి.ఇప్పుడు రామాయణ పఠనపాఠన వ్యాఖ్యాన టీకా టిప్పణులకు పూనుకున్న అన్య సామాజికవర్గాలు తమ అనుభవాలనుంచి, తమ అవగాహననుంచి, తమ ప్రాపంచిక దృక్పథం నుంచి దానిని వ్యాఖ్యానిస్తాయి. అది ఇంతవరకూ ఉన్న దృక్పథానికీ, వ్యాఖ్యానసంప్రదాయానికీ అనుగుణంగా ఉండాలనేమీ లేదు. ఉండాలనీ ఎవరూ శాసించలేరు. తమ దృక్పథాన్ని, తమ వ్యాఖ్యాన సంప్రదాయాన్ని అంగీకరిస్తేనే రామాయణం అంతర్ధానం కాకుండా ఉంటుందని భావించలేరు. రామాయణ పాఠకులుగా మారిన కొత్త సామాజికవర్గాల సరికొత్త వ్యాఖ్యానాలవల్ల రామాయణం చిరస్థాయికి ఎలాంటి భంగమూ ఉండదు.’’ అని మీకూ, ‘‘రామాయణం జాతిని ఉన్నతంగా నిలబెట్టేదీ, జాతి సంపదా అయినప్పుడు, ఆ జాతిలోకి హెచ్చార్కే వస్తారు, రంగనాయకమ్మా వస్తారు, విశ్వనాథా వస్తారు. తమ తమ అనుభవాలు, అవగాహన, ప్రాపంచిక దృక్పథాల పరిధిలో తాము జాతి సంపదను “సొంతం” చేసుకునే అధికారం అందరికీ ఉంది. జాతి సంపద భద్రతకు అది నిజమైన భరోసా’’ అని వారికీ, ఇద్దరికీ చెప్పేరు.
ఇక్కడ ‘‘జాతి’’ అని భాస్కర్ గారు చెప్పింది ’’భారత జాతి‘‘ అనే నా భావన. ఆ భారత జాతి అనే భావనని ముందు మీరు ఒప్పుకుంటే, ఇతిహాసాలు ఆ జాతి సంపద అని మీరు ఒప్పుకుంటేనే భాస్కర్ గారు చెప్పింది మీకు అర్థమవుతుంది. సంభాషణ అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో మీకు అర్థమవుతుంది. నేను చెప్పేదీ, భాస్కర్ గారు చెప్పేది వేరు కాదని మీకు అర్థమవుతుంది.
********
‘‘రామాయణాన్ని గౌరవించేవారి మనోభావాలు దృష్టిలో పెట్టకుని, అధర్మం అంటూ రచ్చచేయవద్దు‘‘, అని ఒక వ్యాఖ్యాత చెప్పేరు. దాన్ని నిజంగా మనం గౌరవించాలి. ఆ వ్యాఖ్యలో వున్న ఆవేదనని అర్థం చేసుకుంటే మీరింకెప్పుడూ బ్రాహ్మణ అనే పదంగానీ, కుల ప్రసక్తి గానీ తీసుకురారు.
“ భాస్కరం గారు దాదాపు మీ వైపు నుంచే, రామాయణ ఔన్నత్యం వైపు నుంచే… ఒక సలహా ఇచ్చారు. వినండి.” అన్న హెచ్చార్కే గారి వాక్యం చూసిన తర్వాత “రామాయణ ఔన్నత్యం” గురించి, కొత్త సామాజికవర్గాలు రామాయణ పాఠకులు అయ్యారని నేను అనడం గురించి మరికొంత స్పష్టత ఇవ్వవలసిన అవసరం కనిపించింది.
1.రామాయణం మొదలైన ప్రాచీన కృతుల ఔన్నత్యం అన్నప్పుడు ఆ ఔన్నత్యాన్ని ఒకే విధంగా నిర్వచించడం కష్టం. చూపును బట్టి, అభిరుచి భేదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఔన్నత్యం అందులో కనిపించవచ్చు. ఉదాహరణకు, రామాయణం ఒక పురుషోత్తముడి గురించి, అన్నదమ్ములు, తండ్రీ-కొడుకులు, భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతోంది కనుకా, కొన్ని విలువల గురించి ధర్మాధర్మాల గురించి చెబుతోంది కనుకా, సంస్కారవంతంగా జీవించడం గురించి చెబుతోంది కనుకా కొందరికి అందులో ఔన్నత్యం కనిపించవచ్చు. ఇక్కడ మళ్ళీ, కుటుంబంలో ఉండవలసిన ఎలాంటి సంబంధాల గురించీ, ఏ విలువల గురించీ, ఏ ధర్మాధర్మాల గురించీ చెబుతోందనే ప్రశ్న తలెత్తవచ్చు కనుక, ఆ ప్రశ్న వేసేవారు రామాయణ ఔన్నత్యానికి వాటిని గీటురాయిగా తీసుకోకపోవచ్చు. వాళ్ళ దృష్టిలో రామాయణ ఔన్నత్యానికి వేరే కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు అందులో వారికి గొప్ప కవిత్వం కనిపించవచ్చు. గొప్ప కథ కనిపించవచ్చు. మరికొందరి దృష్టిలో చిరకాలంగా రామాయణం ఉనికిలో ఉండడం, అది ఇప్పటికీ మన పఠనాసక్తిని సంతృప్తి పరుస్తూ ఉండడం దాని ఔన్నత్యానికి గీటురాయిగా కనిపించవచ్చు. నా విషయానికి వస్తే, దానిని ‘ఔన్నత్యం’ అనచ్చునో లేదో చెప్పలేను కానీ, రామాయణం (మహాభారతం మొదలైన ప్రాచీన కృతులలానే) నాకు మన ప్రాక్చరిత్రలా కనిపిస్తుంది. పురామానవవిజ్ఞాన కోణం నుంచి దానిని చదవడం మీద నాకు ఎక్కువ ఆసక్తి. ఆవిధంగా నాకది ఒక జ్ఞాన/విజ్ఞాన కృతి. సారంగలో ఇంతకుముందు వచ్చిన నా ‘పురా’గమన వ్యాసాలు కొన్నింటిలో ఈ కోణం నుంచి రాసినవి ఉన్నాయి.
2. కొత్త సామాజికవర్గాలు రామాయణ పాఠకులు అయ్యారని నేను అన్నప్పుడు, గీత గీసినట్టు అది ఇప్పుడే జరిగిందని నేను చెబుతున్నట్టు అపార్థానికి అవకాశముంటుందని అనిపించింది. హెచ్చార్కే గారిని కానీ, మరొకరిని కానీ ఈ కొత్త సామాజికవర్గంలో చేర్చడం నా అహాన్నో, లేదా నా ‘సామాజికవర్గ ఆధిక్యత’నో సూచిస్తోందన్న భావన ఆయనకో, ఇతరులకో కలుగుతుందేమోనన్న భయంతో ఈ వివరణ ఇవ్వాలనిపించింది.
నేను ఈ వింగడింపు చేసింది, కేవలం నాకు బాగా తెలిసిన నా సామాజికవర్గ నేపథ్యం నుంచి మాత్రమే. గాలినిండా రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలవంటి ఆర్షవాఙ్మయం,వాటికి సంబంధించిన సాంప్రదాయిక వ్యాఖ్యానాలు, అర్థవివరణలు నిండిన కుటుంబంలో పెరిగిన వాడిగా నా సామాజికవర్గం వాటిని చూసే తీరు గురించి కొంచెం ఎక్కువ తెలిసినవాడిగా; క్రమంగా ఇతర సామాజిక వర్గాల చూపును గమనిస్తూ వచ్చిన వాడిగా రెండు చూపుల మధ్యా తేడాను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కొత్త సామాజికవర్గాలు అన్నాను. దాదాపు అందరికీ తెలిసిన ఒక్క ఉదాహరణతో ముగిస్తాను:
అరణ్యవాసంలో ఉండగా, రాముడు రాక్షససంహారానికి బయలుదేరినప్పుడు, రాక్షసులను ఎందుకు చంపుతారు, వాళ్ళు మీకు ఏం అపకారం చేశారని సీత అడుగుతుంది. రాక్షసుల పీడనుంచి మహర్షులను కాపాడడమే నా రాజధర్మమనీ. దానికంటే నాకు ఏదీ ఎక్కువ కాదనీ, ఆ ధర్మనిర్వహణకు అవసరమైతే నిన్ను కూడా త్యజిస్తాననీ రాముడు అంటాడు. నాకు చిన్నప్పటినుంచీ తెలిసిన సాంప్రదాయిక వివరణ ఈ విషయంలో రాముడి పక్షం వహించడం తప్ప సీత పక్షం వహించే ప్రశ్న లేదు. అదసలు ఊహకే అందని విషయం. కానీ భిన్న సామాజికవర్గం సీతపక్షం వహించింది. ఉదాహరణకు నార్ల వెంకటేశ్వరరావుగారి ‘సీతజోస్యం’. తమ తమ సామాజిక నేపథ్యాలనుంచి, అనుభవాల నుంచీ, అవగాహన నుంచీ, ప్రాపంచిక దృక్పథం నుంచీ చూసినప్పుడు రామాయణ భాష్యం ఎలా మారుతుందో తెలుసుకోడానికి ఇదొక నిదర్శనం. అందుకు గల ఆయా సామాజిక వర్గాల హక్కును, అధికారాన్ని గుర్తించాలన్నదే నా స్పందన సారాంశం. ఇది రామాయణం వంటి ప్రాచీన కృతుల నిరంతర ప్రాసంగికతను స్థాపించే గుణమే తప్ప అవగుణం కాబోదు. ప్రతి తరం తనదైన విజ్ఞానపు వెలుగులో ప్రతి రచననూ కొత్తగా చదువుకుంటుంది. ఆ రచన అస్తిత్వానికి అప్పుడే నిజమైన రక్షణ.
మోహన వంశీ గారూ… ఏకబిగిన చదివించిన మీ ” ఏ సౌందర్యరాశి కోసం ఈ కథ …!” కావ్య గానానికి కైమోడ్పులు. మీ నుండి మరిన్ని ఆశిస్తూ …
( గూగిలించి తెలుసుకున్న శ్లోక అర్ధం )
దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలమ్
సత్యపూతాం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్ – 16
— శ్రీమద్భాగవతం 11 స్కందం, 18 అధ్యాయం 16 శ్లోకం
ఈ అధ్యాయము వానప్రస్థ, సన్న్యాస ధర్మాలను సమీక్షిస్తుంది.
ముందర అడుగుపెట్టాలంటే కంటితో చూసే అడుగుపెట్టాలి
నీరు త్రాగాలంటే వస్త్రమును పెట్టి వడబోసుకుని తాగాలి
సత్యముతో పవిత్రమైన మాటలే మాట్లాడాలి.
మనసుతో నిష్కర్ష చేసి దాన్ని ఆచరించాలి.
సమర్ద్దన వింతగా వుంది ,KB గారు నవీన విశ్వ విద్యాలయాలో పురాణం కవిత్యం లాగా ఏమిటిది .నార్ల సీతా జోస్యం నాటిక త్రిపురనేని శంభుకవధ కి ప్రత్యక సామాజిక నేపద్యం వుంది ,గుర్రాలకు రెక్కలు మొలిసిన వెర్రికాలం వెళ్లి పోయింది .సంస్కృతం అల్ ఇండియా రేడియో లో మాత్రమే బ్రతికుంది .దాని అవసరం ఉన్నట్టేనా ?వాదానికి ముసుగు అవసరం లేదు .రామాయణ ,మహాభారత భాగవతాలు వేదాల యొక్క సారాంశం .వర్ణ వ్యవస్థ ని నిసిగ్గుగా గీత నుండి బ్రహసుత్రా ల వరకు సమర్డ్డ న చేసినవే .వాటిని బిజినెస్ మేన్జేమెంట్ లో ఈవాళ ఉపయోగిస్తే ,కొత్త భాష్యమా ? వాల్మికి రామాయణంలో సీతా వర్ణన చూసారా , తల్లితో సమానమైన ఆమెని అలావర్ణించ వచ్చా ,ఉత్తర రామాయణం దృష్టిలో పెట్టుకొని మీరు చర్చం చవద్దు
ఇప్పుడు “అన్నద్వేషం-బ్రహ్మద్వేషం” వ్యాసం చదివాను.ముఖ్యంగా బ్రాహ్మణీకం గురించిన రెండు పేరాగ్రాఫులూ స్పష్టంగా చదివాను.హెచ్చార్కె గారు పక్షపాతమే చూపించారు విశ్లేషణలో. సుందరమ్మకి వచ్చిన కోపానికి కారణాన్ని చలం ఎస్టాబ్లిష్ చేసిన తీరు కూడా నేను పైన ఇచ్చిన విశ్లేషణనే బలపరుస్తున్నది,గమనించండి! సుందరమ్మకి వచ్చిన తీవ్రమిన కోపానికి ఉన్న మోటివ్ ఆమె కేవలం బ్రాహ్మణస్రీ అవడం వల్ల అని చలం చెప్పాడా?తన అసహాయతని ఉపయోగించుకోవడం కన్నా మరొక బాధ ఉంది.తన కొడుకు ప్రాణం గురించి కదా అంతకి సిద్ధపడింది.ఇప్పుడు ఇతను తాపీగా నేను డాక్టర్ని కాదు అని చెప్తే అక్కడున్నది దళితస్త్రీ అయినా అంత కోపమూ వస్తుంది కదా!
అసలు కధ చదివి చాలా కాలమయినా,హెచ్చార్కె గారి విశ్లేషణ ఆ కధకి అన్యాయమే చేసిందనే నా అభిప్రాయాన్ని మార్చుకునేటందుకు తగిన కారణం కనపడటం లేదు.చలం జస్టిఫికేషన్ గురించి చెప్పటానికే ఆ కధ రాశాడు.జస్టిఫికేషన్ అనే పాయింటుని బలంగా చెప్పడానికి నాయుడికి ఉన్న బ్రాహ్మణ ద్వేషం ఒక ఉపాంగం మాత్రమే!
చలం బ్రాహ్మణుడే కావచ్చు,కానీ బ్రాహ్మణీకం అనే పేరుకి కూడా సుందరమ్మ యొక్క బ్రాహ్మణీకం ఆమే యొక్క పవిత్రతని కాపాడలేకపోయింది అనే వ్యంగ్యసూచన!రచయిత వ్యంగ్యం కోసం వాడుకున మరొక చిన్న మాట “నాయుడు ఆమె కోపంలో దెయ్యాన్నీ మహిషాసుర మర్దిని చూడటం” అనేది.శ్రీశ్రీ విప్లవకవి,కమ్యూనిజానికి సపోర్టుగా నిలబడి జంధ్యాన్ని ఎంపేశాడు.కానీ తన కవిత్వంలో పురాణ కధల,పాత్రల పోలికల్ని తీసుకోలేదా?మెయిన్ పాయింటు మనస్సులో నిశ్చయించుకున్నాక కధకుడు గానీ కవి గానీ వాతావరణాన్ని సృష్టించడానికి పోలికలూ,సన్నివేశ కల్పనలో చేసే చమత్కారాలూ ఎక్కడినుంచయినా తీసుకోవచ్చు,అది రచయిత లందరూ చేస్తున్నదే కదా!
మెయిన్ పాయింటు ముఖ్యం!ఒక్కోసారి శిల్పం రీత్యా అవసరమయితే మెయిన్ పాయింటుకి వ్యతిరేక ధోరణిలో కూడా మెయిన్ పాయింటుని బలంగా ఎక్కించవచ్చు.కవి నిరంకుశుడు.కదకుడు నియంత.ముమ్మాటికీ హెచ్చార్కె గారు బ్రాహ్మణీకం కధని సరిగ్గా అర్ధం చేసుకోలేదనే నాకనిపిస్తున్నది.
స్వస్తి!
ఇంతకీ HRK ఏమన్నారు ,మనోహరంగావుంది అన్నారు .మాండలికంలో కూడా రామయణం అద్భుతంగ వుంటుంది .అంటే చెప్పే విధానం .తోలుబొమ్మలాటలో కూడా హృద్యంగా వుంటుంది .ఈస్తటిక్ సెన్స్ ,దీనికి మనోభావాల సమస్య ఏముంటుంది .నేను RK నారాయణ గారి భారతం ఇంగ్లీష్ లో చదివాను . అందులో ,దుశ్శాసన తో అంటుంది Iam in the Woman s month ….I am clad in single wrap ..go away అంటుంది .వినడు ,english సరిగా అర్దం కాలేదేమో ,అని ఈసారి తేలిక బాషలో iam in my monthly period ..clad in a single piece ..అంటుంది .నాకు గమ్మత్తు గ వుంది .దీన్నిఇంత సీరియస్ మేటర్ చేస్తే ఎట్లా
హెచ్చార్కె
APRIL 18, 2016 AT 9:43 AM
“చెలం ఈ కథలోనే కాదు, చాల చోట్ల బ్రాహ్మణ కుటుంబాల లోని చాదస్తాల్ని గేఌ చేశారు. అది ఆ కులం బాగు పడ్డానికి పనికొచ్చే మాటలు. పనికొచ్చాయి కూడా. ఇవేవీ ‘బ్రాహ్మణత్వా’న్ని గేఌ చేయడం కాదు. బ్రాహ్మణత్వం అంటే కులాల్లో బ్రాహ్మణులు పవితృలని…”
HARIBABU
అంటే చలం బ్రాహ్మణుల్ని “ఇప్పుడు మీరు పాటిస్తున్నది నిజమిన పవిత్రత కాదు,నిజమిన పవిత్రతని అలవాటు చేసుకోండి” అని గేలి చెయ్యడమో గడ్డి పెట్టడం కూడా మీకు నచ్చలేదు,అదీ యే పాయింటు మీద?ఆ విమర్శల్ని పట్టించుకుని సంస్కరించుకున్నదుకు?!
అంటే,మీరు తిట్టడానికి పనికొచ్చేటట్టు బ్రాహ్మల్ని అట్లాగే ఉంచకండా బ్రాహ్మల్ని గేలి చీసి మంచివాళ్ళుగా మార్చెయ్యడం వల్ల చలం కూడా తప్పే చేఅశాదనన్మాట,బాగుంది వరస!
ఒక సంభాషణ:
శ్రీనివాసుడు: ‘అసలు ఇక్కడ మీ వ్యాసాల ప్రసక్తి తీసుకువచ్చింది ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగడానికే….’
నా జవాబు: మీరా వ్యాసాల్ని ఇక్కడికి తీసుకురావడం తప్పు. ఆరోగ్యం కాదు. మోహన గారి పోస్టుతో, ఇక్కడ నేను మాట్లాడిన మాటాలతో వాటికి సంబంధం లేదు. అయినా; మీరు వాటిని తెచ్చి చెప్పిన ‘హితాలు’ విని, దానికి జవాబుగా మిత్రుడు రాణి నాకెందుకు ప్రమాణం కాడో చెప్పాను. కులానికి సంబంధించి ఆయన అబిప్రాయం ఎలా రిట్రోగ్రెసివో చెప్పాను. దానికీ జవాబు చెప్పకుండా మీరు ఆ రాయి మీంచి మరో రాయి మీదికి దూకారు మీరు.
శ్రీనివాసుడు: … ఒక మనిషిగా, మేధావిగా, ఆలోచనాపరుడిగా, యువతను, తోటి సమాజాన్ని విజ్ఞత వైపుకు తీసుకువెళ్ళవలసిన వ్యక్తిగా మీ నుంచి మేం ఆశిస్తున్నది కుల, మత పరిధిలోని విశ్లేషణ కాదు, దానికి మించిన అవగాహన.
నా జవాబు: నా నుంచి మీరు ఆశిస్తున్నదేమిటో తెలుసుకుని అదే ఇవ్వడం కుదరదు. నేను ఏమి ఇచ్చానో అది తీసుకుంటే తీసుకోడం లేదా పారేయడం ఆపై విమర్శించడం మీ హక్కు. విమర్శకు జవాబివ్వడం నా బాధ్యత. తాంభోళాలిచ్చేశాను తన్నుకు చావండి వైఖరి కాదు నాది. అలాంటి వైఖరి వున్న వారు పబ్లిక్ ప్లేస్ లోకి రావొద్దని నా హితవు.
శ్రీనివాసుడు: రామధర్మం, దుర్ముఖి ఉగాది, బ్రాహ్మణ వాద్ ఇవి వేటిని సూచిస్తాయో మీరు వివరిస్తే బాగుంటుంది.
నా జవాబు: రామాయణ ధర్మం ఎందుకు అధర్మమో ఈ పోస్టుకు నా మొదటి వ్యాఖ్యలలోనే రాశాను. మరోసారి చూడండి. దుర్ముఖి ఉగాది అనగా ఈ పోస్టును (వ్యాసన్ని) ఏ సందర్భంగా సారంగ ప్రచురించిందో ఆ పండుగ. బ్రాహ్మణుడు ఈ భూమ్మీది దేవుడు, ఇతరులు అతడి కాళ్లకు మొక్కడం పుణ్యం మొదలైన విశ్వాసాలు నప్పేది బ్రాహ్మణ వాదమని అనవచ్చు. ఇంత కన్న కూడా వివరణ అవసరమే గాని, అది ఇక్కడొక వ్యాఖ్యగా కుదరదు. మరెప్పుడైనా ప్రయత్నిస్తాను.
శ్రీనివాసుడు: నేను బ్రాహ్మణుడినని మీకెవరు చెప్పేరో తెలుసుకోవచ్చా?
నా జవాబు: మీరు బ్రాహ్మణుడు అని నాకు తెలుసని మీకెవరు చెప్పేరో తెలుసుకోవచ్చా?
శ్రీనివాసుడు: మిమ్మల్ని ప్రశ్నించగానే కులాన్ని సూచించే, కుల చట్రంలోనుండి ఆలోచించే మీ అవగాహననే నేను ప్రశ్నించేది.
నా జవ్వబు: కుల చర్చ జరుగుతున్న చోట (నా వ్యాసం మీద చర్చలో) కుల ప్రస్తావన కాకుండా ఇంకే గుల ప్రస్తావనా రాదు. కుల ప్రస్తావన రాని రచనలే నా నుంచి అధికం. నేను ప్రాథమికంగా మార్క్సిస్టుని.
శ్రీనివాసుడు: అసలు బ్రాహ్మణవాదమనే బూచిని చూపి మీరేం సాధించదలుచుకున్నారో నాకర్థంకావడంలేదు.
నా జవాబు: జవాబు సులభం. అసలు బ్రాహ్మణ మహత్యం, బ్రాహ్మణ పూజల నుంచి మీరేం సాధించారో ఆ చెడుగును తీసెయ్యడాన్నే, అలాంటి మానవీయత్నే మేము సాధించాలనుకుంటున్నాం. మనసు వుంటే మీరూ మాతో చెయ్యి కలపండి. పాత హీనత్వమే బాగుందనుకుంటే దాంతోనే చెయ్యి కలపండి. అన్యాయం వున్నంత కాలం దాన్ని ఎదిరించే వాళ్లు వుంటారు. యు కెనాట్ విష్ దెమ్ అవే.
శ్రీనివాసుడు: చాలా సంవత్సరాలుగా మీరు ఇదే కోణంలోనే వాదిస్తున్నారు. మీరు ఎవరితో పోరాడుతున్నారో వారితో చేసేది పోరాటంగా గాక, కుల చట్రంలోనుండి చూడకుండా సంభాషణ జరిపితే మాత్రమే పరివర్తను అనేది ఎదుటివారిలో సాధ్యమవుతుంది.
నా జవాబు:
1. విచిత్రం. నేనెవరో మీకు తెలీదంటారు. చాల సంవత్సరాలుగా నేనేం చేస్తున్ననో తెలుసంటారు.
2. కుల చట్రంలో వున్న వారితో ఆ చట్రానికి బయటి నుంచి మాట్లాడడం కుదరదు. మీకు వచ్చింది ఫ్రెంచి మాత్రమే అయితే నేను మీతో ఫ్రెంచిలోనే మాట్లాడాలి. లేదా మీతో మాట్లాడొద్దు.
శ్రీనివాసుడు: … లేదూ, నేను ఇలాగా చెబుతాను, ప్రతి విషయాన్నీ బ్రాహ్మణవాదం కోణంలోనుండే చూస్తానంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు.
నా జవాబు: మీరు చెప్పగలిగింది ఏమీ లేదని ఇప్పటికే రుజువయ్యింది. ప్రతిదీ బ్రాహ్మణ వాదం కోణం లోంచి చూస్తున్నది నేను కాదు. అలా చూడ్డం ద్వారా వేల ఏండ్లుగా లాభ పడుతున్నదీ నేను కాదు. అది మాట్లాడే/రాసే వారి లాభాన్ని కాదన్నందుకు నా లాంటి వాడికి ఈ మాటల ఈటెల తాకిడి.
మాకూ మాట్లాడ్డం వచ్చు. నేర్చాం.
శ్రీనివాసుడు: ‘….నేను చెప్పేదీ, భాస్కర్ గారు చెప్పేది వేరు కాదని మీకు అర్థమవుతుంది.
నా జవాబు: భాస్కరం గారు చెప్పింది ఇదీ అని శ్రీనివాసుడు ఏం చెప్పారో చూడండి. తదనంతరం భాస్కరం గారి వ్యాఖ్యనూ చదవండి. ఈ విషయంలో నేను చేర్చాల్సింది ఏమీ లేదు.
శ్రీనివాసుడు: ‘‘రామాయణాన్ని గౌరవించేవారి మనోభావాలు దృష్టిలో పెట్టకుని… … మీరింకెప్పుడూ బ్రాహ్మణ అనే పదంగానీ, కుల ప్రసక్తి గానీ తీసుకురారు.
నా జవాబు: 1. ఈ చర్చలో కులం ప్రస్తావన తెచ్చింది నేను కాదు. మీరే మరొక చోటి నుంచి నా వ్యాసాన్ని, దాని మీది విమర్శలను ఇక్కడికి ఎత్తి పోసింది కూడా నేను కాదు, మీరే.
2. ఆ ప్రస్తావన నేను ఇక్కడ తేలేదు గాని, ఎక్కడా తేనని చెప్పను. భారతం నిండా గో బ్రాహ్మణ పూజ ప్రసక్తి, కర్ణుడు శూద్రుడు కనుక విల్లు పోటీ లోకి రావొద్దని, శంభుకుడు శూద్రుడు కనుక తపస్సు చేయరాదని అడుగడుగునా మా మనోబావాల్ని దెబ్బ తీసిన వారిని ముందుగా దండించండి. ఆపైనా మా జోలికి రండి. అంత వరకు; ఎవరు ‘మనోభావాల’ వూసెత్తినా మిడిల్ ఫింగరే.
ఇక ఈ చర్చ లోనికి రాను. నాకున్న పనుల వల్ల. చివర ఒక మాట. జ్యోతి లో నా వ్యాసం, దానికి వచ్చిన రెండు స్పందనలపై ఇక్కడైనా ఎక్కడైనా ఎవరేమి అన్నా జవాబివ్వను. జవాబేదో ముందుగా జ్యోతిలోనే ఇవ్వాల్సి వుంది. ఎలాగూ రచ్చకె క్కాయని, ఆ వ్యాసాల్ని నా ఫేస్ బుక్ పేజిలో కూడా పోస్ట్ చేశాను. ఎవరి వ్యాఖ్యలు వారు చెయ్యొచ్చు. ఇక్కడ మోహన వంశీ గారికి ఇబ్బంది లేకుండా నా పేజీని మీ మైదానం చేసుకోవాలని ఆహ్వానం.
నేను మళ్ళీ చెబుతున్నాను. మీరు ద్వేషాన్ని ద్వేషిస్తే మీ ద్వేషానికి ఫలితం ద్వేషమే అవుతుంది. దానివల్ల విద్వేషాలు, వైషమ్యాలు పెరుగుతాయి.
((కుల చట్రంలో వున్న వారితో ఆ చట్రానికి బయటి నుంచి మాట్లాడడం కుదరదు. మీకు వచ్చింది ఫ్రెంచి మాత్రమే అయితే నేను మీతో ఫ్రెంచిలోనే మాట్లాడాలి. లేదా మీతో మాట్లాడొద్దు.))
మీరిక్కడ చేసే ప్రతి వ్యాఖ్యలోని ద్వేషం ఆ కులంవారికే గ్రుచ్చుకుంటుంది. వారు ఆ చట్రంలోకి రావడానికి ముందు వారు మనుష్యులే. కేవలం ఆ కులచట్రం మాత్రమే వారిలో వుంటుందనుకోవడం పొరపాటు. ఆ కులచట్రంలోని ఆధిపత్య, దోపిడీ ధోరణి ఆ కులం వారందరికీ అంటగట్టడం, ఇలా మాట్లాడితేనే ఆ కులం వారికి అర్థమవుతుందనుకోవడం సరికాదని నా భావన.
((రామాయణం కథలంటే ఖోపం. అన్నీ తప్పుడు ధర్మాలని. వీరత్వం కోసం కొట్టుకు చావడాలని. కాని సార్, మీరు కథ చెప్పిన పద్డతి మనోహరంగా వుంది. ఈ ఇతిహాసాలు ఎంత అతి హాసాలయినా, ఇలా మిగలడం… చివరాఖర్న మీరన్నట్టు… వాటిని ఇంత అందంగా చెప్పినందుకే. :-))
((ఐ రిపీట్ సర్, రామాయణ ధర్మమధర్మమే, దాన్ని ఎంత అందమైన మాటల్లో చెప్పినప్పటికిన్నీ.))
తమరు చేసిన ఈ వ్యాఖ్య చదివి నాకు అర్థమయినదేమంటే, రచయిత చెప్పదలచుకున్న విషయం అధర్మమని, అయినా దాన్ని మనోహరంగా చెప్పేరని, అంత అధర్మమయినా అందంగా చెబితే మిగులుతుందనీ మీరు చెప్పేరని. అలా అధర్మ ప్రచారం కోసమే ఈ వ్యాసం వ్రాసేరన్నది మీ అభిప్రాయమని అర్థమయింది.
((ప్రతిదీ బ్రాహ్మణ వాదం కోణం లోంచి చూస్తున్నది నేను కాదు. అలా చూడ్డం ద్వారా వేల ఏండ్లుగా లాభ పడుతున్నదీ నేను కాదు. అది మాట్లాడే/రాసే వారి లాభాన్ని కాదన్నందుకు నా లాంటి వాడికి ఈ మాటల ఈటెల తాకిడి.))
ఈ కథకు సంబంధించి మీరు చేసిన మొదటి వ్యాఖ్యకు ప్రాతిపదిక తమరి ఈ వ్యాఖ్యే అయివుంటుంది.
ఆ విధంగా, ఈ కథలో బ్రాహ్మణవాదాన్ని సూచించి, రచయిత లాభపడ్డాడని చెప్పడం మీ ఉద్దేశమని నాకు అర్థమయ్యే, మీ ఉద్దేశం మిగతావారికి అర్థం కావాలని మీరు వ్రాసిన వ్యాసాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అంతకంటే ముఖ్యమైన కారణమేమంటే, మీ కథలోని మొదటి వాక్యం ‘‘ఆరోగ్యకరమైన చర్చ జరగొచ్చని ఆశ కూడా వుంది.’’
మీరు ఆశించిన విధంగా ఆంధ్రజ్యోతిలో చర్చ జరుగుతుందేమోనని ఎదురు చూసేను. కానీ, శివకుమారశర్మ వ్రాసిన వ్యాసానికి మీరు జవాబివ్వలేదు.
((ఆంధ్ర జ్యోతిలో నా వ్యాసానికి తాటికొండ శర్మ గారు రాసిన ప్రతిస్పందనను అప్పుడే చదివాను. అందులో కొత్తగా జవాబివ్వాల్సినవి ఉన్నాయని నేను అనుకోలేదు. సీరియస్ పాఠకులు తిరిగి నా వ్యాసాన్ని చదువుకుంటే సరిపోతుంది. అందుకని, దానికి జవాబివ్వలేదు. నేను రాసే జవాబు న్యాయంగా తిరిగి ఆంధ్ర జ్యోతిలోనే వెలుగు చూడాలి. అది వెలుగు చూసినప్పుడు కూడా ఇలాగే షేర్ చేయడం మీ థర్మమవుతుంది.))
కానీ, సారంగంలో ప్రచురితమైనంత విస్తృతంగా, అందరికీ అందుబాటులో చర్చ జరగడం ఆంధ్రజ్యోతిలో అసాధ్యం. అందుకే చర్చ జరిగినట్లూ వుంటుంది, మీ భావాలు మీకు సరియైనవే కాబట్టి అవి అందరికీ తెలుస్తాయన్న ఉద్దేశంతోనే ఆ వ్యాసాలను ఉదహరించాను. మీరు ఆంధ్రజ్యోతిలో వ్రాసే జవాబును అది అచ్చయిన కొన్ని గంటల్లోనే నేను సారంగలో షేర్ చేస్తానని మాట ఇస్తున్నాను.
అయితే, నేను జవాబు వ్రాసేవరకూ ఎదురు చూడవచ్చు కదా అని మీరు అడగవచ్చు. దానికి సమాధానం ఇవ్వదలచుకున్నారో, లేదో, అందులో జవాబివ్వవలసినవి ఉన్నాయని మీరు అనుకుంటున్నారో, లేదో నాకెలా తెలుస్తుంది? అందుకే, ఇక్కడ అయినా జవాబు లభిస్తుందేమోనని ఉదహరించాను. అలాగాక మీరు ఆంధ్రజ్యోతిలో వ్రాసేవరకూ ఎదురుచూడాలని శాసిస్తే ఇకపైన అలాగే చేస్తాను.
రఘువంశంలోనుండి తీసుకుని అందంగా చెప్పిన ఒక చిన్న కథకు ప్రాణం, నేపథ్యం తప్పుడు ధర్మమేనని మీ మొదటి వ్యాఖ్యలోనే చెప్పడం నాకు చాలా అసమంజసంగా తోచింది. రామాయణపు లోటుపాట్లు, హైన్యాలు చెప్పదలచుకుంటే ఇంకో వ్యాసంలో మీరు చెప్పండి. అంతేగానీ, మీ దృష్టిలోకూడా మనోహరమైన రూపం ఉన్న కథకి, చెప్పిన కథకుడికి మీరు ఉదహరించే బ్రాహ్మణవాద భావజాలం అంటగట్టడం అనేది నాకు సరియైనదిగా తోచలేదు. అసలు అలాంటి వ్యాఖ్య కూడా నాకు చాలా అన్యాయంగా తోచింది.
**************
((నా నుంచి మీరు ఆశిస్తున్నదేమిటో తెలుసుకుని అదే ఇవ్వడం కుదరదు. నేను ఏమి ఇచ్చానో అది తీసుకుంటే తీసుకోడం లేదా పారేయడం ఆపై విమర్శించడం మీ హక్కు. విమర్శకు జవాబివ్వడం నా బాధ్యత ))
నేను మీ దగ్గరనుండి ఆశిస్తున్నాననే చెప్పేనుగాని నేను ఆశిస్తున్నదే మీరు మాట్లాడాలని శాసించలేదే. ఎదుటి వ్యక్తి నుండి అలా ఆశించడంకూడా తప్పే అయితే చెప్పండి. తీసుకోవడం, పారేయడం మాత్రమే వుంటే సంభాషణ సాగదు కదా?
**************
((బ్రాహ్మణుడు ఈ భూమ్మీది దేవుడు, ఇతరులు అతడి కాళ్లకు మొక్కడం పుణ్యం మొదలైన విశ్వాసాలు నప్పేది బ్రాహ్మణ వాదమని అనవచ్చు.))
మీరు చెబుతున్న ఈ వాదాన్ని ఆచరించేవారు ఇప్పుడీనాడు దేశంలో ఎంతమంది ఉన్నారు సార్?
నిజంగా వున్నారని మీరు భావిస్తే ఈ దేశంలోని బ్రాహ్మణులందరూ ఎప్పుడో దేవతలయిపోయేవారు. వాళ్ళ కులాన్ని ఎత్తి చూపుతూ దేవతలు కాదు కదా, మనుష్యులుగా కూడా వారిని చూడడం జరగడంలేదు.
బ్రాహ్మణ అనే కులంలోని వారందరూ బ్రాహ్మణవాదులయిపోతారా? మన ప్రాచీన, వర్తమాన భారతీయ తాత్త్వికత అంతా బ్రాహ్మణవాదమేనా? ఈనాడున్న ఇంత దౌర్భాగ్యస్థితికి బ్రాహ్మణవాదం, బ్రాహ్మణులు, హిందూ ధార్మిక గ్రంథాలు మాత్రమే ఈ వివక్షకు, వైషమ్యాలకు సంపూర్ణ కారణమా?
‘‘అవును, అదే’’ అన్నదే మీ సమాధానమయితే ఇక నేను మీతో సంభాషణనుండి విరమిస్తాను.
**************
((శ్రీనివాసుడు: నేను బ్రాహ్మణుడినని మీకెవరు చెప్పేరో తెలుసుకోవచ్చా?
నా జవాబు: మీరు బ్రాహ్మణుడు అని నాకు తెలుసని మీకెవరు చెప్పేరో తెలుసుకోవచ్చా?))
మీరు ఇంతకు ముందు చేసిన ఈ వ్యాఖ్య మీకు గుర్తులేదేమో, గుర్తు చేస్తున్నాను.
హెచ్చార్కె
April 18, 2016 at 9:43 am
((నేను శూద్రుడినయినా నన్ను మనిషిగా గౌరవిస్తారా? మంచిదే మీరు బ్రాహ్మాణుదైనా నేను గౌరవిస్తున్నాను కదా, ఒక మనిషిగా.))
**************
మీ ఇంకొక వ్యాఖ్య
((కుల చట్రంలో వున్న వారితో ఆ చట్రానికి బయటి నుంచి మాట్లాడడం కుదరదు. మీకు వచ్చింది ఫ్రెంచి మాత్రమే అయితే నేను మీతో ఫ్రెంచిలోనే మాట్లాడాలి. లేదా మీతో మాట్లాడొద్దు.))
వారిని ఆ చట్రంనుంచి బయటకు తీసుకురావాలంటే దాన్ని బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టాలంటే బయటనుండే చేయాలి. మన లోపల ఆ భావజాలం కూడా ఇరికించుకుని మాట్లాడక్కరలేదు.
**************
((ఈ చర్చలో కులం ప్రస్తావన తెచ్చింది నేను కాదు. మీరే మరొక చోటి నుంచి నా వ్యాసాన్ని, దాని మీది విమర్శలను ఇక్కడికి ఎత్తి పోసింది కూడా నేను కాదు, మీరే.))
ఈ క్రింది మీ వ్యాఖ్యలో అంతర్లీనంగా కులం తప్పితే ఏముందో చెప్పగలరా?
((ఔను సార్, ఈ అరవయ్యేళ్ల నుంచో అంతకు ముందు నుంచో వాక్ స్వాతంత్ర్యం వచ్చి నాలాంటి వాళ్లం కూడా మాట్లాడుతున్నాం. అది రాక ముందు ఎంచక్కా మీ లాంటి వాళ్లు మాత్రమే మాట్లాడే వారు. మా లాంటివాళ్ళం మాట్లాడడం, మాటలు నేర్వడం శిక్షార్హమయ్యేది. ఇప్పుడలా కుదరదు. మీరు ఎంత పరుషంగా మాట్లాడినా ఇక మా ఆజాదీని మేం వదులుకోం.))
స్నేహితుడా! శ్రీనివాసుడా!నిజమా? ‘ద్వేషాన్ని ద్వేషిస్తే ద్వేషానికి ఫలితం ద్వేషమే అవుతుం’దంటారా? కాదని అభావం అభావం ప్రతి కీలక మలుపు దగ్గరా జరుగుతుందని నాకు నచ్చిన గతి తర్కం. యెస్. ఇప్పటికి అనంగీకారానికే మన అంగీకారం. చివరగా. నా వ్యాఖ్యలోని ఆ మాటల వెనుకనున్న ఒక నా పద్యాన్ని పంచుకోవాలని వుంది. ఇబ్బంది పెడుతుంటే మన్నించాలి.
//ద్వేషాన్ని ద్వేషించడమే నేటి ప్రేమ//
పిడుగు పాటు నాపడానికి
అర్జునుడూ లేడు
ఫల్గుణుడూ లేడు
నేడు నరునికొకే పేరు, బీభత్సుడు
రెప్పల మధ్య సూర్య చంద్రులను బిగించి
సమస్త లోకాల్ని వడకట్టినా
మలినం కానిది ఒక క్షణమైనా రాలదు
సుబ్బరంగా మడతలు పడి
ట్రంకుపెట్టెలో దాక్కోడానికి
నువ్వేమైనా జరీ చీరెవా?
ఊపిరాడకపోతే కుళ్లిపోయే శరీరానివి
ఇంకా ఎందుకీ గుంజాటన
దయ్యాలకు జవాబు చెప్పే యాతన
శవాన్ని చెట్టు దగ్గరే తగెలెయ్
పురాణాల్ని పుక్కిట్లోంచి ఉమ్మెయ్
దూకెయ్
ఎండలోకి వెన్నెట్లోకి
రక్తంతో దాహం తీర్చే రాళ్లవాన లోకి
పోతే పో పోయిందేముంది
బతికి బయట పడ్డావా
అనుభవాలు గానం చెయ్
వెదురు వనాలు డిస్టర్బ్ కాకుండా
లోకానికి వేణువులుండవు
త్యాగాల చాళ్లు పోస్తే గాని
సేద్యం చేయడానికి లేదు
హెడ్ క్వార్టర్స్ ను బొంబార్ద్ చేస్తే గాని
కొత్త మాట మాటాడ్డానికి లేదు
క్షతగాత్రుడు కాని వాడు
రణతంత్రం నేర్వలేడు
అలవాటు పడి వుంటావ్ జాగ్రత
ఏ దేవుడికీ ఆత్మను అమ్మకు
చర్యను తప్ప దేన్నీ నమ్మకు
మచ్చుకొక్క గాయం చూపలేని
వాడి గేయాలకు తల ఊపకు
దూకెయ్ నీకై నీవే
బీభత్స రస ప్రధాన నాటకం లోకి
ద్వేషాన్ని ద్వేషించే మమకారం లోకి
(‘అబద్ధం’ 1987- 92)
హెచ్చార్కె గారూ!
మీకిచ్చిన మాట ప్రకారం ‘‘అన్నం ద్వేషం- బ్రహ్మద్వేషం’’ వ్యాసంపై వచ్చని అభిప్రాయాలకు సమాధానంగా మీరు ఆంధ్రజ్యోతిలో నేడు వ్రాసిన వ్యానం ‘‘ అయ్యయ్యో, అవి చలం మాటలే!’’ యొక్క లంకెను పాఠకుల సౌకర్యార్థం ఇస్తున్నాను.
http://epaper.andhrajyothy.com/832281/Andhra-Pradesh/06.06.2016#page/4/2
ఇక, ఈ వ్యాసంలో చిట్టచివర మీరు ద్వేషాన్ని గుచ్చిన వివరణ ‘‘ విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ తప్పుకాదు, లెజిటమేట్ ( సహేతుక, లేదా, ధర్మ (అనువాదం సరిపోతుందేమో చూడండి) ఘర్షణను ద్వేషం అనడం తప్పు.’’ అనే మీ వివరణకు నా ప్రత్యుతరమేమంటే, ద్వేషానికి హేతుబద్ధత అనేది వైయుక్తికంగా మాత్రమే మిగిలినంతవరకూ దాన్ని ‘‘ధర్మము’’ అని అనలేం. ఎందుకంటే, అభావం ప్రతి కీలకమలుపులో అభావం చెందే క్రమంలో వచ్చే ఫలితంలో వాటిలోని సానుకూల అంశాలు నిలచేవుంటాయి. వైయుక్తికమైన అనుభవాలలో కేవలం ద్వేషం మాత్రమే నిలచి, వారి అవగాహనాక్రమంలో అలా కొనసాగుతూవుంటుంది.
**లెజిటమేట్ ( సహేతుక, లేదా, ధర్మ (అనువాదం సరిపోతుందేమో చూడండి) ఘర్షణను ద్వేషం అనడం తప్పు.’’ అనే మీ వివరణకు నా ప్రత్యుతరమేమంటే, ద్వేషానికి హేతుబద్ధత అనేది వైయుక్తికంగా మాత్రమే మిగిలినంతవరకూ దాన్ని ‘‘ధర్మము’’ అని అనలేం. **
ధర్మం సార్వత్రికైతే ఎందుకు అనలేమో ఈ దేశభక్త పరాయణుడు ఎందుకు చెప్పలేడో! అసలు ద్రష్టి లోపం మీ కంట్లో పెట్టు కొని ఇతరుల కళ్ళలో లోపం ఉంది అంటే అది గడుచు తనం కాక మరేమవుతుంది. ధర్మం సార్వత్రికమైతే ఈ కులాలెంటి? ఈ మతాలేమిటి? ఈ వర్గాలేమిటి? అవన్నీ ఉమ్డకూడదు కదా? సర్వో జన సుఖినో భవంతు గా ఉండాలి గా ? ద్వేషమంతా పుక్కిట పట్టు కొని మీకు ద్వేషం తగదు అనటం ఏ పాటి ధర్మం? ద్వేషాన్ని ద్వేషించటం లో ప్రేమను ప్రేమించటం లో ఎటు వంటి సంకోచం ఉండకూడదు . హేట్సప్ ఎహ్ అర్ కే !
అయ్యా వంశీ గారూ …
చదివాను … అంతే వంశీకరణం జరిగిపొయ్యింది.
అద్భుతం మీ వ్యాఖ్యానం !!!
అబద్ధం-20016
హెచ్చార్కె గారూ
నేను మిమ్మల్ని పెద రెడ్డిగా భావించి , నా లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తక ప్రచురణకి అనుమతి కోరానని మీరుతిరస్కరించారని, అయినా నేను ప్రాణాలకు తెగించి ఆపుస్తక ప్రచురణకి ఒడి గట్టానని మీ వాదన. నిజానికి కలేకురితో నాస్నేహమ్ ఎక్కువ. మీతో నాపరిచయం చాలా తక్కువ. మీతో నాపుస్తకం గురించి సంభాష నే జరగలేదు.
అలాగే నేను నాపుస్తకాని ప్రచురణకి యిచ్చివేసాను. నేను ప్రచురించలేదు అమ్మకానికి పెట్టలేదు. పైగా అప్రచురనకర్తలు అడిగితె కొంత ధనం కుడా యిచ్చాను.[సౌదా అరుణ]
మీ అబద్ధాన్ని నిజం చేసుకొనేందుకు చనిపోయిన దళిత మిత్రున్ని కూడా అరువు తెచ్చుకొన్నారు. దీన్ని ఎటువంటి ఆదిపత్యమనాలి ?
నన్ను నిన్న వరకు చెడ తిట్టిన శ్రీనివాసుడు గారికి నేను గుర్తుకు రావడమేమిటో
రాణి శివశంకర శర్మ! ఏంటో మనకీ కష్టం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడంతా మీరు ముందుకు రావడమో, మిమ్మల్ని ఎవరో ముందుకు తోయడమో జరిగినప్పుడంతా… నేను ఆ ప్రశ్న వేస్తూనే వున్నాను. ఎవరూ జవాబివ్వరు. ఇలా తిడతారంతే. ఫలానా కారణంగా మీరు నాకు ప్రమాణం కారన్నాను. ఆ కారణాన్ని ఆ పుస్తకం అచ్చయిన మొదటి రోజుల్లోనే నేను మీకు చెప్పాను. పుస్తకం అచ్చేయడానికి నా పర్మిషన్ ఏమిటి శర్మ గారు! దానికి నా రెడ్డితనమెందుకు?
CHANDOLU CHANDRASEKHAR
APRIL 19, 2016 AT 5:17 AM
point1:రామాయణ ,మహాభారత భాగవతాలు వేదాల యొక్క సారాంశం .వర్ణ వ్యవస్థ ని నిసిగ్గుగా గీత నుండి బ్రహసుత్రా ల వరకు సమర్డ్డ న చేసినవే .వాటిని బిజినెస్ మేన్జేమెంట్ లో ఈవాళ ఉపయోగిస్తే ,కొత్త భాష్యమా ?
point2:వాల్మికి రామాయణంలో సీతా వర్ణన చూసారా , తల్లితో సమానమైన ఆమెని అలావర్ణించ వచ్చా
HARIBABU
point1:
కులవ్యవస్థ యొక్క చరిత్ర అధికారికంగా తెలిసి అంటున్నదేనా ఈ మాట!కులవ్యవస్థని బ్రాహ్మణులే కారణమనేటందుకు చారైత్రక పరమైన సాక్ష్యాధారాలు చూపించగలరా?
నిజం దానికి విరుద్ధంగా ఉందని చెప్పటానికి నాకు తెలిసిన ఒక బలమైన సాక్ష్యం ఉంది.అది మీరు వ్యతిరేకించే హిందూ పురాణాలైన రామాయణ భారతాల నుంచి కాదు,”HIstorical Buddha” నుంచి తీసుకుంటున్నాను.ఇది ప్రముఖ ఇండాలజిస్టు ఒకరు బౌద్ధమతానుయాయులు బుద్ధుడి చుట్టూ అల్లుకున్న మహిమల్ని కూడా పక్కకి తోసి పూర్తిగ అప్పటి భారత దేశపు రాజకీయ సామాజిక చట్రం మొత్త్తాన్ని వివరంగా వర్ణించి ఆ తర్వాతనే బుద్ధుడు చేసినదేమిటి,చెయ్యలేనిదేమిటి అని చర్హించిన గ్రంధం.అందులో స్పష్టంగా ఒక మాట చెప్పాడు.”మనుషులు కులాన్ని మార్చుకోవటం,ఒక కులం నుంచి మరొక కులానికి మారడం కూడా ఉండేది” అని!కులవ్యవస్థ పైనుంచి బ్రాహ్మణులు బలవంతంగా రుద్దిన ఏకాండశిలారూపమే అయితే ఇది జరగడం సంబహ్వమేనా?
దళితులకి ఏ విధమైన మొహమాటం లేకుండా దళితులు రాజ్యాధికారం చేపట్టడం చూడాలనేది తన ఆశ అని స్పష్టంగా చెప్పాడు.తను చేస్తున్నదంతా అదుకోసమే అని నసుగుడూ పిసుకుడూ లేకుండా పదే పదే చెప్పాడు కూడాను.అయితే దానికి వేసిన ప్లానులో దళితులకి రెండు విషయాలు చెప్పాడు.మొదటిదైన రిజర్వేషన్ అనెది కేవలం తమ భవిష్యత్తును నిర్ణయించే విద్యాసంస్తల్లో,చట్టసభల్లో ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండటం కోసం ఒక వెసులుబాటు.రెండవది ఆ వెసులుబాటును తమ తమ వ్యక్తీగత వైభవాల కోసం నిచ్చెనమెట్టులా వాడుకుని వదిలెయ్యకుండా తమ కులంలోని మిగిలినవారిని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నించహ్టం.ఇందులో మీకు సఫ్తేఏ ఉంది కాబట్టి మొదటిదాన్ని మాత్రమే తీసుకుని రిస్క్ ంది గాబట్టి రెండోదాన్ని వొదిలెయ్యటం కూడా మొన్నటి బ్రాహ్మణులు గెత ద్వారా ఇవ్వాళ్తి స్వార్దపరులైన దళితులతో చెయించిన దుర్మార్గం అవుతుందా?
point2:
సాహిత్యానికి కూడా ఎజెండాని అప్లై చెయ్యటం ఇఉదులో స్పష్టంగా తెలుస్తుంది!ఆ ధర్మం నచ్చలేదు అంటున్నారు,తల్లిలాంటి దాన్ని వాల్మీకి పచ్చిగా వర్ణించడం గురించి బాధపడిపోతునారు!శ్యమలా దందకంలో కాలీదాసు కూడా వర్ణిస్తాడు,సుప్రభాతంలో ఉన్నవాటినె ఎకొందరు తప్పు పడుతున్నారు.కన్యాశుల్కంలో గురజాడ “ఆడముండల్తోనా ఆలోచన..”,”అన్నా!ఎంత దొబ్బిందీ….” లాంటి మాటలు వాడాడు.వాటి కర్తృత్వం ఎవరిది?పాత్రల చేత అనిపించిన మాటలకి రచయిత అనిపించాడు గాబట్టి రచయిత తన దురద కొద్దీ ఆ మాటల్ని వాడాదని అనగలరా మీరు?సీతని హనుమంతుడు చూసీంప్పుడూ రావణుడు చూసినప్పుడూ ముఖంలో గానీ దుస్తుల్లో గానీ ఏఅమీ తేడా లేకుండా ఒక్కలాగే ఉంది.కానీ ఒకడు మాతృభావనతో నమస్కరించాదు,ఇంకొకడు పరస్త్రీ అని తెలిసి కూడా,పీన తనపట్ల విముఖంగా ఉందని తెలిసి కూడా కోరికతో జ్వలించిపోయాడు?!సాహిత్యం అంటె మొదట రమ్యత ఉండాలి,మంచితో పాటు చెడుని కూడా చూపించాలి.ఇంకా గట్టిగా చెప్పాలంటే చెడునే ఆకర్షణీయంగా చెప్పాలి,కావ్యం చదవడం పూర్తయ్యాక పాఠకులు చెడుని వదిలి మంచిని తీసుకునే విధంగా తమ కావ్యాల్ని తీర్చిదిద్దటం కవితాప్రపంచంలో సహజమే,కావాలంటె ఇక్కడ కల్లూరి భాస్కరం గారు చెబుతున్న గ్రెకు పురాణాలలో కనిపించేది కూడా అదే!
P.S:హేతుబద్ధంగా బతికితే సుఖపడతామని,హేతువిరుద్ధంగా బతికితే కష్టాల పాలవుతామని అందరికీ తెలుసు,కానీ పనిగట్టుకుని హేతువిరుద్ధంగా ఆలోచిస్తూ మాకు సుఖాలు రావడం లేదనేవారిని మీరు గానీ నేను గానీ ఉద్ధరించగలమా?
హరి గారు , నేను కులవ్యవస్త కి బ్రాహ్మణ నుడు సింగల్ వర్డ్ నేను ఉపయోగించ లేదు .ఇంకొకటి దళితవాదాన్ని నేను సమర్ద్దన చేయను .రాజ రామ్ మోహనరాయ్ ,ఈశ్వర చంద్ విద్యాసాగర్ ,గురజాడ ,శ్రీశ్రీ వీళ్ళు జాతస్య బ్రాహ్మలు కావొచ్చు .వారి తాత్విక ద్రుష్టి ఏమిటి ?లుబ్ద అవధానులు లాంటి చాందాసుడు , కుహానాసంస్కర నవాది,గీరిశమ్ .పాత్రలు వాడిన మాటలు గురజాడ కి ఆపాదించా వద్దు .శ్రీశ్రీ అంటారా ,మహోన్నత గిరిశిఖరం ,వైదిక ,బౌద్ద శాస్తాల చర్చ తరువాత .ఇక్కడ మనం కులాల చర్చ చేసే సమయం లో మన పుట్టుకకు ఆపాదించు కోవద్దు .చిన్న ఊదహ రణ, వాల్మ్కి హిరణ్య గర్భ నుండి బ్రాహ్మణుడు అయ్యాడు కాని జాతస్య బోయ .ఒక బంగారు పాత్ర లో ఎ కులం వాడినైన కాసేపు వుంచి బయటికి తెస్తే బ్రహ్మ్నత్యం వస్తుంది .విశ్వనాధ ని, విమర్శించి ,శ్రీశ్రీ ని సమర్ద్దన చేస్తున అంటే వ్యవస్థ లోపాన్ని చెపుతున్నాను .మన వాదాలు సంఘర్షి కోవాలి మనం కాదు .సీత వర్ణ న విషయం లో మిసమాధానం సరి కాదు . ఏకులం వ్యవస్తను నిర్ములించదు, నిర్మ్ంచదు. కులం వ్యవస్థ కాదు ,వ్యవస్థ లో భాగం .భారతీయత మతం కాదు ,చార్వాక ,లోకాయత భారతీయ లోభాగం .కాకపొతే నాటి పాలక వర్గాలకి దేవుడు ,మతం అవసరం .దేవుడు,మతం ఆత్మవాదం రామాయణ ,భారత ,భాగవతం లో వున్నై .కాబట్టి,వాటి అవసరం నాటి నుండి నేటి పాలకుల కి వుంది .పేదవాడికి ,బాగా డబ్బు వున్నా వాడికి మతం ఆచారం పెద్దగ అక్కరలేదు .మద్య తరగతి వారికి దేవుడు ,మతం ,ఆచారం పుణ్యం పురుషార్దం కావాలి.
CHANDOLU CHANDRASEKHAR
APRIL 21, 2016 AT 5:54 AM
point1:లుబ్ద అవధానులు లాంటి చాందాసుడు , కుహానాసంస్కర నవాది,గీరిశమ్ .పాత్రలు వాడిన మాటలు గురజాడ కి ఆపాదించా వద్దు .
point2:వాల్మ్కి హిరణ్య గర్భ నుండి బ్రాహ్మణుడు అయ్యాడు కాని జాతస్య బోయ .ఒక బంగారు పాత్ర లో ఎ కులం వాడినైన కాసేపు వుంచి బయటికి తెస్తే బ్రహ్మ్నత్యం వస్తుంది .
point3:సీత వర్ణ న విషయం లో మిసమాధానం సరి కాదు
HARIBABU
answer1:మహానుభావా,నేను అంటగట్టటం లేదు,వీటికి కర్తృత్వం గురజాదకి అంటగట్టవద్దంటున్న మీరు వాల్మీకికి కామప్రకోపపు కర్తృత్వం అపాదిస్తున్నారు,ఆ పాయింటు మీకు ఓధపడలేదన్నమాట!రెండూ సాహిత్య రూపాలే కదా!ఓక్దాన్ని విశేషంగా ఆదరించటం,అందులోని పాత్రలకి గుడికట్టి పూజించటం లాంటివి తీసేస్తే రెండూ ఒకటే కదా!గురజాడకి ఉన్న స్వేచ్చ వాల్మీకికి ఉందకూడదా అన్ నా పాయింటు.
*
point2:మీ సమస్య యేంటి?జాతస్య బోయ అయినవాడు బ్రాహ్మణులు కూడా నమస్కరించే విధంగా ఎదిగాడు కదా!బ్రాహ్మణుడు అని వ్యక్తిని ఉదహరించటం లేదు అంటున్నరు,నేను కూడా వ్యక్తుల్ని ఉదహరించ లేదే!శాతవాహనులు కూడా తొలీదశలో కింది కులాల నంచే వచ్చారని రూడిగ తెలుస్తున్నది.కానీ “యేక బ్రాహ్మణ” బిరుదూ బ్రాహ్మణత్వమూ ఆర్జించుకున్నదే కదా!బ్రాహ్మణత్వం అనేది ఒక స్థానం,ఏ కులంవాడినైనా ఒక బంగారు పాత్రలో పొస్తే బ్రాహ్మణుడు అవుతాడు అంటున్నారే ఆ బంగారు పాత్ర పేరు ఏమిటి?మీకు ఏది లోపంగా కనిపిస్తున్నది – స్పష్టత లేదు,కొంచెం విశదెకరించండి.
*
point3: నా విశ్లేషణలో ఉన్న అసంబద్ధత ఏమిటి?గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి తనై వుంచుకున్న రామప్పంతులు ఇంట్లో లేనప్పుడు వూళ్ళో ఉనన్ మగాళ్లని పిలిచి పేకాట ఆడటం లాంటివి ఎందుకు చూపించినట్టు?”లొట్టిపిట్టలు” అనే మాటకి పడీ పడీ నవ్విన విశృంఖలత దేన్ని సూచిస్తుంది?కొందరు కల్లుపాక దృశ్యాలు లేకపోయినా కధకి లోటు ఉందదు,ఇవన్నీ మసాలా దృశ్యాలు అంటూన్నారు.మరి అవన్నీ తీసెయ్యగలమా?గురజాడ ఒక కధ చెప్పాలి అనుకున్నప్పుడు రమ్యత కోసం,కాలక్షేపం కోసం ట్రిక్స్ ప్రయోగించాడు.వాల్మీకి కూడా అంతే!
*
రామాయణంలో వాల్మీకి సీతని అలా వర్ణించడానికి చాలా లెక్క ఉంది.”మాలిని 22″ సినిమాలో నిత్యా మీనన్ బదులు పీటీ ఉష లాంటి ఫిగర్ని పెట్టి ఉంటే రాంగు క్యాస్టింగు కింద డైరెక్తర్ ముక్కచివాట్లు తిని ఉండేవాడు! విలన్ అన్నిసార్లు రేప్ చెయ్యడు,చేసినా మనకి విలన్ మీద జాలివేస్తూ క్యామెడీ సినిమా అయి ఉండేది:-)సినిమా అట్టర్ ఫ్లాపు అయ్యి ఉండేది.రామాయణంలో సీత అందం కూడా అంతే.”సీతే జగత్సుందరీ!” అని వూరికే చెప్పి వూరుకోలేదు.రాముడు శివధనుస్సు విరవటానికి ముందు సీతకోసం చాలా యుద్ధాలు జరిగినాయి!మీరు సినిమాల్లో చూసినట్టు ఒక హాలూ,జరీ బుటేదారీ అల్లికల డ్రస్సుల్లో రాజులూ కనక సింహాసనాలూ లాంటి హడావిడితో అంతా ఒకే సీనులో జరిగిపోలేదు సీతా స్వయంవరం.శివధనుస్సుని ఒక బహిరంగ స్థలంలో పెట్టి చాటింపు వేశాడు.ఎవరయినా ఎప్పుదయినా వచ్చి అ చాలెంజిని టేకప్ చెయ్యవచ్చు.అది ఎత్తలేకపోతేనేం సీత లాంటి అందగత్తెని వదులుకుంటామా అని విదేహ మీదకి సైన్యసమేతంగా యుద్ధాలకే వచ్చారు.దణ్ణం పెట్టి తప్పుకోవాలనిపించే చప్పచప్పటి అందం కాదు సీతది,మగాళ్లని పిచ్చెక్కించే అందమే!సీత అట్లా లేకపోతే రావణాసురుడు అంతగా పిచ్చెక్కిపోడు గదా!
*
కధ చదివిన మగ పాఠకుల మీదకి వాల్మీకి ఒక చాలెంజి విస్రుతున్నాడు!ఫర్ సప్పోజ్,మిల్కీ వైట్ తమన్నా రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నదట!పెళ్ళి చేసుకున్న సంవత్సరంలోనే భర్త వ్యాపారంలో ఆస్తినంతా పోగొట్టుకుని ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మీ ఇంటిపక్కనే కాపరం పెట్టిందనుకోండి.సంవత్సరం లోపే ముసలిదైపోదు,అదే అందం.మీరు బాగా డబ్బున్నవాళ్ళు – అనుకోండి!మీరేం చేస్తారు?నిన్నటి దాకా బట్టలిప్పి చూపించింది గాబట్టి తప్పు లేదనుకుని ఆ బుక్కా పకీరు వెధవతో ఏం సుఖపడతావు నా దగ్గిరకి రా అని పరపోజ్ చేస్తారా? ఆమె ఒప్పుకోకపోయినా కిడ్నాప్ చేసి మీ కోరిక తీర్చుకుంటారా!
*
వాల్మీకి సీతని అలా వర్ణించహ్డం వెనక ఉన్న లెక్క ది.అందులో తిక్క ఎంతమాత్రమూ లేదు:-)
సాహితి గారు, చాల థాంక్యూ. శ్రీనివాసుడు గారు, సాహితి గారు ఇచ్చిన జవాబు చాలు మీ ప్రశ్నకు. లెజిటిమేట్ అంటే సహేతుకం, ధర్మం అనే కాకుండా లీగల్ రైట్ అని కూడా. ఆ ఆర్తచ్చాయలు రావాలనే ఇంగ్లీషు మాట దొర్లింది. మోహన్ వంశీ గారు, మీ స్పేస్ని ఇలా వుపయోగించక తప్పలేదు.
ధన్యవాదాలు హెచ్చార్కె గారూ!
తెలుసుకోవడం ఆగిపోయిన చోట, నిత్య జిజ్ఞాసువుగా వుండలేని చోట మనం ఏం చెప్పినా రాజకీయకోణంలోనే చూడడం సహజం. అలాంటి చోట్ల నేను సంభాషించను.
మీరేదైనా తెలుసుకోవాల్సింది ఉన్నదని అనుకుంటే, దొంగపేర్లు పెట్టుకుని, క్షుద్ర రాజకీయ ప్రయోజనంతో వ్రాసే రెటమత విద్వాంసుల ప్రస్తావన తేకుండా నేరుగా నాతోనే సంభాషించగలరు. నేను అలా అనుకుంటున్నాను కాబట్టే మీతో సంభాషించడానికి ఉపక్రమించాను.
మీ విలువైన కాలాన్ని, మోహన్ వంశీగారి స్థలాన్ని ఈ చర్చకు ఉపయోగించించడానికి అవకాశమిచ్చినందుకు మీ ఇరువురికీ కృతజ్ఞతలు.
కేవలం భాషా పటిమతో మీరు చర్చకు రాకండి! బావ పటిమ కావాలి.
ఉదా : నండూరి రామ్ మోహన్ గారు తన విశ్వదర్శనం లో అనేక మందితత్వవేత్తలను పరిచయం చేసారు. ఆ కంటెంట్ అలా దిఖచేస్తె చర్చ కాదు. దాన్న అవగాహన చేసుకోవడానికి ఒక దృక్పథం ఉండాలి. ఆ దృక్పధం తో విష్లేషణ చేసుకొని స్పందిస్తే చర్చకు అఙదం
కేవలం రాగద్వేషాలతో రాజకీయ దృష్టితో మీరు చర్చకు రాకండి. కంటెంట్ను వక్రీకరించి, అజ్ఞానంతో, రాజకీయ స్వార్థంతో మన పైత్యాన్ని ప్రదర్శించేకన్నా కంటెంట్ని అలాగే పాఠకులకు సమర్పిస్తే వాళ్ళే నిజానిజాలు నిగ్గు తేలుస్తారు. రెటమతంలో నేను చేసింది అదే.
రెటమతంలో సూత్రీకరించిన సూఫీ ఉనికికి ఆధారాలు చూపిస్తే చర్చ ప్రారంభమవుతుంది, దానికి అర్థం వుంటుంది.