వాసిరెడ్డి నవీన్ , పాపినేని శివశంకర్ ల సంపాదకత్వంలో ‘కథాసాహితి’ ప్రతి యేటా ప్రచురిస్తోన్నఉత్తమ కథల సమగ్ర సంకలనం ఆవిష్కరణ జనవరి 24 న , హైదరాబాదులో . ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాసిరెడ్డి నవీన్ తో ‘సారంగ’ సంభాషణ.
ఇంటర్వ్యూ : ఎ . కె . ప్రభాకర్
- కథాసాహితి ‘కథ’ కి పాతికేళ్ళు , పాతిక సంకలనాలు. 155 మంది రచయితలు – 336 కథలు – రాయల్ సైజులో 2600 పేజీలు ; 25 సంవత్సరాల కృషి అంతా వొకచోట చూసుకొన్నప్పుడు యెలా ఫీలవుతున్నారు?
సహజంగానే చాలా సంతోషంగా వుంది. పాతికేళ్ళ కృషిని వొకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది. మిగతా భాషల్లో ఏమో గానీ వొక సమాజలో చోటుచేసుకొన్న చలనాన్ని సామాజిక క్రమ పరిణామాన్ని కథలద్వారా చూసుకోగలగడం ఈ సంకలనాల రూపంలో తెలుగులోనే సాధ్యమైందని అనిపిస్తుంది. ఇంతకు ముందు వందేళ్ళ కథా చరిత్రని చూస్తే – ఏ యే కాలాల్లో మంచి కథలు వచ్చాయి , ఎప్పుడు రాలేదు – అందుకు కారణాలేంటి అని వెతుక్కోవలసి వస్తుంది. కానీ పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా మా కథాసాహితి వెలువరించిన సంకలనాల్లోని కథలన్నీ ఒకచోట చేర్చడం ద్వారా ఆ కారణాలు అన్వేషించడానికి తేలికగా వీలవుతుంది. ఉదాహరణకి 1990 నుంచీ 1998 వరకూ ఒక ఎనిమిదేళ్ళ పాటు తెలుగులో మంచి కథలు వచ్చాయి. ఆ తర్వాత క్వాలిటీ కొంచెం తగ్గింది. మళ్ళీ ఇటీవలి కాలంలో మంచి కథ రావడం మొదలైంది. అన్ని కథలూ ఒక దగ్గర చూడడం వల్లే ఇటువంటి స్థూల విభజన వీలవుతోంది. అలాగే అందుకు కారణమైన సామాజిక పరిస్థితుల నేపథ్యాన్ని సూక్ష్మ పరిశీలన ద్వారా అధ్యయనం చేయడం కూడా సులువవుతుంది. ఆ విధంగా యీ సమీకృత బృహత్ సంకలనానికి కథా సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మేం ఆ చరిత్రలో భాగం అవుతున్నందుకు ఆనందంగా వుంది.
- అసలీ వార్షిక సంకలనాలు తీసుకురావాలన్న సంకల్పానికి బీజం యెక్కడ పడింది?
దానికి ముందుగా – అసలు కథల మీద ఆసక్తి ఎలా కలిగిందో చెప్పాలి. ‘ప్రజాసాహితి’ పత్రిక సంపాదకుడిగా వున్నప్పుడు (1980 – 90 మధ్య కాలంలో) ‘నిన్నటి కథ’ పేరున పాత కథల్ని వేస్తుండేవాళ్ళం. అలా ప్రతి నెలా ఒక కథ వెయ్యడానికి చాలా కథలు చదివి – వాటిలో మంచిది అనిపించింది ఎన్నుకునేవాళ్ళం. ఆ క్రమంలో 1910 నుంచీ వచ్చిన అనేక కథలు చదవడం వల్ల కథల పట్ల ఆసక్తి ఏర్పడింది. దాంతో పాటు వాటి వెనకవున్న సామాజిక కారణాలు తెలుకోవడం మరింత ఉత్సాహంగా వుండేది. అప్పుడే తెలంగాణ రైతాంగ పోరాట నేపథ్యంలో వచ్చిన కథల్ని సేకరించాం. అది కథల అధ్యయనానికి ఎంతో ఉత్తేజానిచ్చింది.
ఇక కథా వార్షిక సంకలనాలు రావడం వెనక ఇద్దరు వ్యక్తులదీ ఒక సంస్థదీ ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ సంస్థ HBT(హైదరాబాద్ బుక్ ట్రస్ట్). వ్యక్తులు – చేకూరి రామారావు , హరి పురుషోత్తమరావు (హరి). అప్పుడు ట్రస్టు సభ్యుడు పరుచూరి సుబ్బయ్య పాతికేళ్ళ మంచి కథల సంకలనం తీసుకురావాలని సూచించాడు. ఆ అభిప్రాయాన్ని అప్పటి చైర్మన్ C K నారాయణ రెడ్డి బలపరచి ఆ పని హరిగారికి అప్పచెబుదామని భావించారు. అయితే హరి నా పేరు సూచించారు. దాంతో ‘తెలుగు కథ 1960 – 85’ నా సంపాదకత్వంలో తయారైంది. దాని కోసం కథల సేకరణలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో ప్రధానమైన సమస్య లభ్యత. చాల కథలు పత్రికల్లోనే ఉండిపోవడం , సంకలనాల్లోనో సంపుటుల్లోనో అతి కొద్ది కథలే రావడం వల్ల వచ్చిన ఇబ్బంది అది. పత్రికలు కూడా గ్రంథాలయాల్లో అంత తేలికగా దొరికేవి కావు. అప్పుడు వచ్చిన ఆలోచన – ఎవరైనా ప్రతి సంవత్సరం మంచి కథలతో సంకలనం వేసి వుంటే బాగుండేది కదా అని. HBT సంకలనం పూర్తయ్యే సరికి మూడేళ్ళు పట్టింది. 90ల చివరికి ఆ పుస్తకం పూర్తయి విడుదలైంది. అంతవరకూ జనసాహితి సాంస్కృతిక సమాఖ్యలో ముఖ్య బాధ్యతల్లో వుండేవాణ్ని. వివిధ కారణాలతో 90 లో సంస్థ నుంచి బయిటికి రావడం వల్ల దొరికిన సమయాన్ని యిలా వార్షిక సంకలనాలు తీసుకురావడానికి ఉపయోగించవచ్చు అనిపించింది. అప్పటికే కథలమీద కొంత అవగాహన ఏర్పడింది. జనసాహితి తరపున జరిగిన ఒకటి రెండు వర్క్ షాపుల్లో పాఠాలు చెప్పిన పాపినేని శివశంకర్ తో యీ విషయం ప్రస్తావించాను. అతను సరేననడంతో పని మొదలైంది. పుస్తకం తయారై ‘కథాసాహితి’ ప్రచురణగా బయిటికి వచ్చింది. ఇలా మొదటి సంకలనం ‘కథ 90’ ని 1991 డిసెంబర్ 28న హైదరాబాద్ ద్వారకా హోటల్లో చే రా విడుదల చేశారు. ఈ వార్షిక సంకలనం రెగ్యులర్ గా వస్తుందా అని చాలా మందికి సందేహాలుండేవి. ఆ సందేహం నిర్వాహకులుగా మాకూ వుండేది. కానీ చేయగల్గినంత కాలం చేద్దాం అనే ఆలోచన. కానీ ఆ తర్వాత ఇక వెనక్కి చూడలేదు. పాతికేళ్ళుగా నిరాటంకంగా వస్తూనే వున్నాయి.
- ఇటువంటి వార్షిక సంకలనాలు యింతకు ముందేమైనా వచ్చాయా? మీతోనే మొదలా?
మేం మొదలూ కాదు – చివరా కాదు. 1968 ప్రాంతంలో ఎమెస్కో వాళ్ళు ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులతో కథలు రాయించి ‘విద్యార్థి కథా సాహితి’ పేరు మీద ఒకటి రెండు సంవత్సరాల పాటు సంకలనాలు తెచ్చారు. ఆ ప్రయత్నం ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 90 లో మాతోనే మొదలైంది. అయితే విచిత్రంగా అదే సంవత్సరం ‘కథ’ అనే సంస్థ గీతా హరిహరన్ సంపాదకత్వంలో ‘Katha Prize Stories’ పేరు మీద భారతీయ భాషల్లో ఆ సంవత్సరం వచ్చిన మంచి కథల్ని ఎంపిక చేసి ఇంగ్లీషులోకి అనువదింప జేసి వార్షిక కథా సంకలనాలు వేయడం మొదలుపెట్టారు. అదొక పదేళ్ళు నడిచి ఆగిపోయింది. ఆ తర్వాత మన దగ్గర తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘తెలుగు కథ’ , మధురాంతకం నరేంద్ర – రాసాని సంపాదకత్వంలో ‘కథా వార్షిక’ , కర్ర ఎల్లారెడ్డి సంపాదకత్వంలో ‘తెలంగాణ కథ’ కొద్ది సంవత్సరాల పాటు వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు సామాన్య కిరణ్ ఫౌండేషన్ వారి ‘ప్రాతినిధ్య’ , సింగిడి వారి తెలంగాణ కథ ( రంది , తన్లాట) కొత్తగా మొదలయ్యాయి. ఇవన్నీ తెలుగు కథ వికాసానికి చేసిన/చేస్తున్న దోహదం చాలా విలువైనది. ఇదిలా వుండగా 1915లో ప్రారంభమైన The Best American Short Stories అన్న సంకలనం 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలోనే మా కథ సంకలనాలు 25 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం యాదృచ్ఛికం. ప్రస్తుతానికి ఈ రెండూ తప్ప ఇన్నేళ్ళుగా నిరంతరాయంగా ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్న దాఖలాలు ఎక్కడా నాకు తెలిసి లేవు.
- నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే మంచి కథల ఎంపికలో మీరు పాటించే ప్రమాణాలు – పధ్ధతి యేమిటి?
నిజానికి ఇదొక పెద్ద చర్చ. ఇప్పటికీ చాలా మంది నోళ్ళలో నానుతున్న చర్చ. ఒక రకంగా యే ఎన్నిక అయినా వ్యక్తిగత అభిరుచికి సంబంధించినదే. మనం యెంత objective గా ఎన్నిక చేసినా యెంతో కొంత మేరకి అది subjective కాక పోదు. ఎందుకంటే మన వ్యక్తిగత ఆలోచనలు , సమాజం పట్ల – సాహిత్య ప్రయోజనం పట్ల మనకుండే దృష్టి , మనం విశ్వసించే భావజాలం మన అభిరుచిని నిర్ధారిస్తాయి. అదే కథల ఎంపికలో ప్రతిఫలిస్తుంది. అందువల్ల ఆ మేరకు అది subjective అవుతుంది. తొలి రోజుల సంకలనాల్లో మా కథల ఎన్నిక చూసి – చాలామంది ఇవన్నీ కమ్యూనిస్టు కథలు అన్నారు. సమాజం గురించి మాట్లాడటమే కమ్యూనిజం అయితే అలా అనుకోవడం పట్ల మాకేం అభ్యంతరం లేదని సమాధానం యిచ్చేవాళ్ళం. వాస్తవానికి కథల ఎన్నికలో ప్రధానంగా రెండు విషయాలు దృష్టిలో పెట్టుకునే వాళ్ళం. వస్తువు సామాజిక ప్రయోజనోద్దిష్టమై వుండాలి. శిల్పం కొత్తగానూ చదివించేదిగానూ వుండాలి – ఆ సామాజిక ప్రయోజనాన్నిపాఠకుడికి అర్థవంతంగా అందించేదిగానూ వుండాలి. ఈ లక్ష్యంతో కలిసి నడిచిన సంపాదకులిద్దరం మార్క్సిస్ట్ భావజాల ప్రభావం నుంచి వచ్చిన వాళ్ళం కావడం వల్ల చాలామందికి ఇవి కమ్యూనిస్టు కథలని అనిపించవచ్చు.
తెలుగు కథ ఎప్పుడూ సమాజంతోనే ప్రయాణించింది. దాన్ని మేం విడదీయ దల్చుకోలేదు. ఈ ఆలోచన 90 నుంచీ అలాగే కొనసాగింది. పాతికేళ్ళ తర్వాత నేటికీ కొనసాగుతోంది.
160 పేజీలున్న మొదటి సంకలనంలో 15 కథలున్నాయి. అప్పుడు ఆ 15 కథలు ఎంపిక చేయడానికి పెద్ద పరిశ్రమే చేయాల్సి వచ్చింది. సరిగ్గా 1990లోనే ఆంధ్రజ్యోతి వార పత్రిక ‘ఈ వారం కథ’ పేరుతో వారం వారం ఒక మంచి కథ ప్రచురిస్తూ వచ్చింది. అలా వాళ్ళు ప్రకటించినవే యాభైకి పైగా కథలున్నాయి ఆ సంవత్సరం. ఇతర పత్రికల్లో వచ్చిన కథలు – మొత్తం చూసుకుంటే మంచి కథలు అనిపించినవి వందా నూట యాభై పైగానే లభ్యమయ్యాయి. వాటి నుంచి 15 కథలు వడపోయడం కష్టమే అయ్యింది. పాతికేళ్ళ తర్వాత యిప్పుడు అంత కష్టం అనిపించడం లేదు. దానికి రెండు కారణాలు. ఇరవై అయిదేళ్ళుగా కలిసి పని చేసే క్రమంలో సంపాదకుల మధ్య చక్కటి అవగాహన ఏర్పడడం ఒక కారణం. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే కథల స్థాయి తగ్గడం రెండో కారణం. కాకపొతే ఇటీవలి కాలంలో కొత్త తరం కథలు రాయడం మొదలెట్టాకా కథా రచనలో విలక్షణత పెరిగింది. కానీ యెక్కడో సామాజిక పరిణామాన్ని పట్టుకోవడం యింకా యీ కొత్త రచయితలకి పూర్తిగా అలవడలేదు అనిపిస్తుంది.
- అంటే వస్తు శిల్పాల విషయికంగా తెలుగు కథలో యీ పాతికేళ్లలో పేర్కొదగ్గ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్తున్నట్లే గదా! ‘కథ’ సంపాదకులుగా మీరు గుర్తించిన మార్పులేమిటి – అవి తెలుగు కథ పురోగమనానికి గానీ విస్తృతికి గానీ తోడ్పడ్డాయా?
అవును మార్పులున్నాయి. ఉంటాయి కూడా. ఎటొచ్చీ ఆ మార్పులు ఎలా వున్నాయన్నదే ప్రశ్న. సమాజంలో సంభవిస్తున్న పరిణామాల్ని కథకులు తమ కథల ద్వారా పాఠకులకి అందించ గల్గుతున్నారా లేదా అన్నది ఒకటి – ఆ అందించే క్రమంలో కథా నిర్మాణంలో నూతన పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయా లేదా అనేది రెండోది. వీటి గురించి ఆలోచించాలంటే తెలుగు సమాజపు 25 ఏళ్ళ రాజకీయ – ఆర్ధిక – సామాజిక – సాంస్కృతిక జీవన పరిస్థితుల గురించి , వాటిలో వచ్చిన మార్పుల గురించి పెద్ద చర్చే చేయాల్సి వుంటుంది. ఒకప్పుడు వామపక్ష భావజాలం శాసించిన ఈ సమాజాన్ని ఇవ్వాళ అస్తిత్వవాద రాజకీయాలు శాసిస్తున్నాయి. ఇది అభివృద్ధా – తిరోగమనమా అనేది సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సిన అంశం. అయితే 1990 నుంచి 95 వరకు వచ్చిన కథల్లో వామపక్ష ఉద్యమ భావజాలం ప్రధానంగా కనపడటానికీ ఆ తర్వాత వచ్చిన కథల్లో స్త్రీవాద మొదలైన అస్తిత్వ వాద భావజాలం కనపడటానికీ వున్న కారణాలని సూక్ష్మ దృష్టితో అన్వేషించాలి. మరీ ఇటీవలి కాలంలో మానసిక సంఘర్షణలు , పురా జ్ఞాపకాలు , వైయక్తిక ధోరణులు , మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల గురించి వున్న కథలే ఎక్కువ వస్తున్నాయి. అంతకు ముందున్న రాజకీయ నిబద్ధత ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం వామపక్ష ఉద్యమాలు ఒకడుగు వెనక్కి వెళ్ళడం కావచ్చు.
90లో వచ్చిన ఒక తండ్రి కథ గానీ ఆ తర్వాత వచ్చిన అతడు , జాడ , పిలక తిరుగుడు పువ్వు వంటి కథలు గానీ యిప్పుడు రావడానికి అవకాశాలు కనిపించడం లేదు.
- గ్రామీణ నేపథ్యం నుంచి కథలు రావడం తగ్గింది కదా!
ఇప్పుడు తెస్తున్న పెద్ద సంకలనానికి ముందుమాట రాస్తూ ఒకటి రెండు అభిప్రాయాలు ఈ విషయం గురించి చెప్పాను. సౌకర్యాల రీత్యా గ్రామాలు పట్టణాలకు బాగా దగ్గరయ్యాయి. మానసిక సంబంధం దృష్ట్యా గ్రామానికీ పట్టాణానికీ మధ్య దూరం పెరిగింది. గ్రామాల్లో వ్యవసాయ సంబంధాల్లో మార్పులొచ్చాయి. ఉత్పత్తి విధానం మారింది. చేతి వృత్తులు దాదాపు కనుమరుగవుతున్నాయి. కనుమరుగవుతున్న ఆ దశని 2000 – 2010 మధ్య వచ్చిన కథా సాహిత్యం బాగానే పట్టుకొంది. అన్నం గుడ్డ , కుట్ర , కొలిమి , పరవ వంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణలు. రైతు జీవన విధ్వంసాన్ని క్షతగాత్ర గానం , నేల తిమ్మిరి , మిత్తవ , బతికి చెడిన దేశం , రంకె , తెల్ల దెయ్యం వంటి కథలు , గ్రామీణ మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల్ని మాయి ముంత , భూమి దు:ఖం వంటి కథలు ప్రతిఫలించాయి.
నాగరికత అభివృద్ధి క్రమంలో ఇవి అనివార్య కారణాలు అని అనిపించవచ్చు ; కానీ అవి వచ్చిన వేగం , పధ్ధతి అందుకు మానసికంగా సిద్ధంగా లేని గ్రామీణ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. దానిలోని అమానవీయకరణ తెలుగు కథలో ప్రతిబింబించింది.
ఆ తర్వాత కథల వస్తు స్వరూప స్వభావాలు మారాయి. వీటన్నిటికీ దూరంగా వ్యక్తిగతమైన మనోవేదన , పరాయీకరణకి గురై అందులో ఇమడలేని తనం , దాన్నుంచీ పుట్టిన అంతస్సంఘర్షణ – ఇవి కథా వస్తువులయ్యాయి. గత రెండు మూడేళ్ళుగా మా వార్షిక సంకలనాలు చూస్తే యీ ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రయోగం ప్రయోజనం కోసం కాకుండా కేవల ప్రయోగం కోసమే చేసినట్లు అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని సమాజంలో యీ ధోరణి యిప్పుడే ప్రవేశించడం అంత ఆరోగ్యకరమైన పరిణామం కాకపోవచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది అదే.
- సామూహిక భావన , ఆచరణ వెనకతట్టు పట్టి వైయక్తిక భావనలూ ప్రయోజనాలూ ముందుకు రావడంలో ప్రపంచీకరణ ప్రభావం యే మేరకు వుంది? అది కథ వస్తు రూపాల్లో యెలా ప్రతిబింబించింది?
నిజానికి ప్రపంచీకరణ ప్రభావం సమాజంలో పెనుమార్పులకు కారణమైంది. ముఖ్యంగా తెలుగు సమాజం ప్రపంచీకరణకు ప్రయోగ వేదిక అయ్యింది. ఈ మార్పులు కేవలం ఆర్ధిక విషయాలకే పరిమితం కాలేదు ; ప్రభుత్వ నిర్ణయాల్లోకి , గ్రామీణ జీవితం లోకీ , వ్యాపారాల్లోకీ , విద్యా – ఉద్యోగ రంగాల్లోకీ , నెమ్మదిగా వ్యక్తిగత జీవితాల్లోకీ ప్రవేశించాయి. ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు గ్రామీణ జీవితం ఛిన్నాభిన్నమైంది. పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఒకటొకటిగా మూతబడుతూ వచ్చాయి. అద్భుతమైన పనితనమున్న కార్మికులు పనికి దూరంగా నెట్టివేయబడ్డారు. అది వారికి తట్టుకోలేని స్థితి. ఈ స్థితిని చిత్రించిన కథలు ఈ కాలంలో ఎక్కువగానే వచ్చాయి. ఉదా. విధ్వంస దృశ్యం , టైటానిక్ , జీవన్మృతుడు , అలజడి , మొగుడూ పెళ్ళాల ప్రేమ కత … వంటి కథలు. అలాగని కొత్తగా వచ్చిన ఉద్యోగ జీవితాల్లో భద్రత ఉందా అంటే అదీ లేదు. అభద్రతా భావం కొత్త వేతన జీవులను నిత్యం వెన్నాడుతూనే వుంది. క్రానికల్స్ ఆఫ్ లవ్ , సాలభంజిక వంటి కథలు యీ స్థితికి ప్రతీకలు మాత్రమే. దీన్నుంచీ నెమ్మదిగా కథా వస్తువు వ్యక్తిగత జీవితాలకు పరిమితమయ్యే వైపు ప్రయాణించింది. ఈ క్రమంలో కథా రచనలో శిల్ప పరమైన ప్రయోగాలూ పెరిగాయి. చంద్రుడు గీసిన బొమ్మలు , చిట్టచివరి సున్నా , రామేశ్వరం కాకులు , చిత్రలేఖ వంటి కథల్ని యిందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
- ఒక్క మాట ; యీ పరిణామాల్ని వ్యతిరేకిస్తూ ఏదో వొక రూపంలో యెక్కడో వొక చోట ప్రజా వుద్యమాలు పురివిప్పుకొంటూనే వున్నాయి. వాటి ప్రభావంలో వస్తున్న కథా సాహిత్యాన్ని ప్రధాన స్రవంతిగా చెప్పుకొనే వాళ్ళు యెందుకు పట్టించుకోవడం లేదు?
ప్రజా ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతాల నుంచి ఆ ఉద్యమాల నేపథ్యాన్నీ ఉద్యమ జీవితాన్నీ ప్రతిబింబిస్తూ తక్కువగానైనా మంచి కథలే వస్తున్నాయి. అయితే రకరకాల కారణాలచేత అవి ప్రధాన స్రవంతిలో భాగం కావడం లేదు. పత్రికా మాధ్యమాల నిర్లిప్తత కొంత కారణమైతే , ఆ యా రచయితలు విధించుకొన్న నియమాలు పరిమితులు మరికొంత కారణం కావచ్చు. అవి ప్రధాన స్రవంతిలోకి వచ్చినపుడు తెలుగు కథ వస్తు శిల్పాల రీత్యా విస్తృతినీ వైవిధ్యాన్నీ సాధించి మరింత బలపడుతుందని నా విశ్వాసం.
- మీ యీ పాతికేళ్ళ ప్రయాణంలో – సంపాదకుల మధ్య కథల ఎంపికలో అభిప్రాయభేదాలు వచ్చాయా – వస్తే వాటిని యెలా పరిష్కరించుకొన్నారు?
సంపాదకులం ఇద్దరం ప్రధానంగా ఒకే భావజాలానికి చెందిన వాళ్ళం అయినప్పటికీ వ్యక్తిగత అభిప్రాయాలు అభిరుచుల విషయంలో చాలా తేడాలున్నాయి. దీనివల్ల ప్రతి సంకలనంలోనూ కథల ఎన్నిక విషయంలో తీవ్రమైన చర్చలే జరిగాయి. ఒక్కోసారి అవి తారాస్థాయికి వెళ్ళిన సందర్భాలూ వున్నాయి. అయినా సంపాదకుల ఇద్దరి మధ్య వున్న సంయమన ధోరణి వల్ల యీ బంధం కొనసాగింది. కథల ఎన్నికలో తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదం వచ్చినపుడు మూడో వ్యక్తి దగ్గరకు వెళ్ళేవాళ్ళం. హరి , శివారెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి , పెనుగొండ లక్ష్మీ నారాయణ , ఎ కె ప్రభాకర్ వంటి మిత్రులకు సాహితీవేత్తలకు నిర్ణయాల్ని వదిలేసేవాళ్ళం. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూనే వున్నాం. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత కథ – 2015 నుంచీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభిద్దామనే ఆలోచనలో వున్నాం. మేమిద్దరం ప్రధాన సంపాదకులుగా వుంటూనే యే సంవత్సరానికి ఆ సంవత్సరం మరో ఇద్దరు సంపాదకులకు ఎన్నిక బాధ్యతను అప్పజెప్పాలనుకుంటున్నాం. బహుశా అప్పుడు ఆ మూడో వ్యక్తి పాత్ర మేం పోషించాల్సి రావచ్చు.
- మీరింత కష్టపడి తెచ్చే వార్షిక సంకలనాల్ని పాఠకులు యెలా స్వీకరించారు? కథల ఎంపిక విషయంలో వచ్చిన విమర్శల్ని యెలా యెదుర్కొన్నారు? ఆ విమర్శలు తదనంతర సంకలనాల పై ప్రభావం చూపాయా?
ముందుగా కథ 90 వెలువడినపుడు ‘కథా సాహిత్యానికి మార్కెట్ లేదు , కథా సంకలనాలు అమ్ముడుపోవు’ – అన్నది పుస్తక విక్రేతల ఏకాభిప్రాయం. అది వ్యాపార నవలలు రాజ్యమేలుతోన్న కాలం. విక్రేతలూ , ప్రచురణ కర్తలూ ప్రధానంగా వాటినే అమ్ముకొని నమ్ముకొని ప్రయాణం చేశారు. అప్పటికింకా తమ కథా సంపుటాల్ని ముద్రించుకొనే పరిస్థితి రచయితలకి లేదు. ప్రచురణ కర్తల కోసం ఎదురు చూసేవాళ్ళు. కథ 90 వెలువడ్డ తర్వాత యివన్నీ అపోహలేనని తేలిపోయాయి. మేం వేసిన వెయ్యి కాపీలూ కేవలం అయిదారు నెలల్లోనే అమ్ముడుపోయాయి. పునర్ముద్రించే ఆర్ధిక వనరులు లేక ఆ పని చేయలేదు. ఇది మాకూ ఆశ్చర్యమే. వరసగా రెండు మూడు సంకలనాలు తెచ్చే ఉత్సాహం వచ్చింది. వాటి పట్ల పాఠకులకున్న ఆదరణ చూసి ఇక వీటిని కొనసాగించాల్సిందే అని నిర్ణయించుకొన్నాం. ఈ లోపు రచయితలలో ఉత్సాహం పెరిగింది. కథలు చదివే పాఠకులు పెద్ద సంఖ్యలో వున్నారని వాళ్లకు అర్థమైంది. నెమ్మదిగా రచయితలు సొంతంగా కథా సంపుటులు ప్రచురించుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విశాలాంధ్ర వంటి ప్రచురణ సంస్థలు కథా సంపుటాలనూ సంకలనాలనూ తీసుకురావడం ప్రారంభమైంది. 95 నుంచి ఈ కథా వాతావరణం వెల్లివిరిసింది. నేటికీ అది కొనసాగుతోంది. అందులో కథాసాహితి వార్షికలు భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంటుంది.
అయితే యీ క్రమంలో విమర్శలూ రాకపోలేదు. విమర్శలు రెండు రకాలుగా వస్తున్నాయి. ఒకటి – కథల ఎన్నిక పట్ల పాఠకుల అసంతృప్తి , రెండు – రచయితల అసంతృప్తి. రచయితల అసంతృప్తిలో కొంత వ్యక్తిగత ధోరణులు ఉండవచ్చు. కానీ పాఠకుల స్పందనను మేం చాలా సీరియస్ గానే తీసికొన్నాం. కొన్ని సందర్భాల్లో బాధ్యతా యుతమైన , నిర్మాణాత్మకమైన విమర్శలు మా ఎంపికలోని లోపాల్ని ఎత్తిచూపాయి. వాటిని స్వీకరించాం. రచయితల అసంతృప్తి మా మీద వొత్తిడిని పెంచేది. ఒక ప్రాంతానికి , ఒక జెండర్ కి , ఒక వర్గానికి సరైన న్యాయం చేయడం లేదేమోనన్న వొత్తిడి అది. దాన్ని అధిగమించడానికి ఆ యా రచయితల రచనలను మరింత శ్రద్ధగా పరిశీలించేవాళ్ళం. ఇప్పటికీ ఆ స్థితి వుంది.
- తెలంగాణ కథకి మీ సంకలనాల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని బలమైన విమర్శ వుంది. దానికి మీ సమాధానం యేమిటి?
మా ఎన్నిక ప్రధానంగా కథా వస్తువు , కథా శిల్పం చుట్టూ మాత్రమే తిరిగేది. ఆ క్రమంలో కొన్ని ప్రాంతాలకీ కొన్ని వర్గాలకీ ఒక్కోసారి ప్రాతినిధ్యం లభించని మాట నిజమే( ప్రాతినిధ్య ప్రాతిపదికన వేసిన సంకలనాలు కావివని గమనించాలి). తెలుగు నేల మీద ఒక్కో ప్ర్రాంతంలో ఒక్కో సాహిత్య ప్రక్రియ బలంగా వెలువడింది. ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో కవిత , పాట వచ్చినంత ఉధృతంగా ఆంధ్ర ప్రాంతంలో రాలేదు. రాయలసీమలో మరీ తక్కువ. కథ నవల అక్కడ ఎక్కువ. అందుకు అనేక చారిత్రిక కారణాలున్నాయి. ఒక వ్యాసంలో కె శ్రీనివాస్ చెప్పినట్లు తెలంగాణ ప్రాంతంలో చాలా కాలంపాటు తెలుగు భాష మీద వున్న ఆంక్షలు ఒక కారణం. వాటిని కవిత్వం పాట ముందుగా ఛేదించుకొన్నాయి. 80 – 90 ల మధ్యలో తెలంగాణలో రగిలిన ఉద్యమాలు కథకి మంచి ఊపుని తీసుకువచ్చాయి. ఆ క్రమంలో 95 వరకు మేం వేసిన సంకలనాల్లో తెలంగాణ ప్రాంత రచయితలకు మంచి చోటే లభించింది. అంతే కాదు – ఆ కథలు అన్ని ప్రాంతాల ప్రజల్నీ విశేషంగా ఆకట్టుకొన్నాయి. మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యాకా కవిత్వం వచ్చినంత బలంగా కథ రాలేదు. అయినా తెలంగాణా రాష్ట్రోద్యమ నేపథ్యం ఆ ప్రాంతం నుంచి వచ్చిన రచయితల కథల్ని ఎన్నిక చేయడానికి మా పై పెద్ద వొత్తిడినే తీసుకువచ్చింది. వచ్చిన ప్రతి కథనీ క్షుణ్ణంగా అదనపు జాగ్రత్తతో పరిశీలించాం. వచ్చిన ఏ కథా మా దృష్టి నుంచి పోలేదని చెప్పగలం. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ కథలు వెలువడతాయని ఆశించడం అత్యాశ కాదు.
- ఈ క్రమంలోనే సంపాదకుల అర్హతలపైనా , సంపాదకుల కథలు సంకలనంలో వుండటం పైనా ప్రశ్నలు వచ్చాయి. వాటికి మీ స్పందన యేమిటి?
ముందుగా సంపాదకుల కథలు ఉండటం గురించి మాట్లాడుకుందాం. ఇది కొత్త సంప్రదాయం ఏమీ కాదు. తెలుగు వాతావరణంలో కొత్త కావచ్చు గానీ ప్రపంచ సాహిత్యంలో సంపాదకులు కథకులు కూడా అయిన సందర్భాల్లో ఆ రచయితల కథలు సంకలనాల్లో చోటు చేసుకొన్నాయి. కాకపొతే శివ శంకర్ కథల్ని ఎన్నిక చేసినప్పుడు ఆ నిర్ణయం పూర్తిగా నాకో మూడోవ్యక్తికో మాత్రమే పరిమితం.
ఇక అర్హతల గురించి అంటారా – సంపాదకులు కథకులే అయివుండాలన్న నియమం ఏం లేదు. సంపాదకులకు కథ మంచి చెడులను నిర్ణయించే శక్తి ఉందా లేదా అన్నది ముఖ్యం. ఆ పని మంచి పాఠకుడు కూడా చేయగలడు. ఈ వార్షిక సంకలనాలు 25 ఏళ్లుగా పాఠకుల ఆదరణతో కొనసాగుతున్నాయంటే అదే సంపాదకుల అర్హతకు నిదర్శనంగా భావించవచ్చు. మేం ప్రచురించిన ‘ రెండు దశాబ్దాల కథ’ సంకలనం కేవలం సంవత్సర కాలంలోనే రెండు వేల కాపీలు అమ్ముడుపోవడానికీ కారణం అదే.
- అయితే యీ సంకలనాల్లో మీరు మిస్సయ్యాం అనుకొన్న కథలున్నాయా – అందుకు కారణాలేంటి? మంచి కథ అని భావించి వేసి – విమర్శలు యెదురయ్యాకా వేయకుండా వుండాల్సింది అనుకొన్న సందర్భాలున్నాయా?
కథ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంలో ఈ సంకలనాల్లో ప్రచురించలేకపోయిన కథలతో ఒక కథా సంకలనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రకటన కూడా ఇచ్చాం. అంటే దానర్థం మేం మిస్ అయిన కథలు ఉన్నాయనే. ఇలా మిస్ కావడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి – తొలి రోజుల్లో కథల లభ్యతలో ఎదుర్కొన్న ఇబ్బంది. మారుమూల ప్రాంతాల నుంచి వెలువడే చిన్నపత్రికల్లో వచ్చిన కథలు మాకు అందుబాటులోకి రానందువల్ల వాటిని చూడలేకపోయాం. ఒక్కోసారి జడ్జిమెంట్ లో జరిగిన లోపాలూ వున్నాయి. అటువంటి లోపాలు పునరావృతం కాకుండా వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఇకపోతే – మేం ప్రచురించిన 339 కథల్లో ( మూడు కథలకు రచయితల అనుమతి లేనందువల్ల ఈ బృహత్ సంకలనంలో 336 కథలే వున్నాయి) కనీసం ఒక పాతిక కథలైనా ఎన్నిక చెయ్యకుంటే బాగుణ్ణు అని యిప్పుడు అనిపిస్తుంది. కథలన్నీ మళ్ళీ మళ్ళీ చదువుతూ వుండగా ఇప్పుడు కలిగే భావన అది. అయితే అవి ఆ యా సంవత్సరాల్లో వచ్చిన కథల్లో మంచివే కదా అని సరిపెట్టుకోవచ్చు. ప్రతి సంకలనంలో వున్న కథలన్నీ పాఠకులందరికీ నచ్చాయని అనుకోలేం. మూడు /నాలుగు కథల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటూనే ఉన్నాయి.అందుకే యీ నచ్చడం నచ్చకపోవడం అనేది సంపాదకులకి యెంత subjective గా వుంటుందో పాఠకులకీ అంతే ఉంటుందని అనుకోవాలి కదా!
- మంచి కథలు మిస్ అవడానికి కారణం మీరు కొన్ని పత్రికలు చూడరనీ వెబ్ పత్రికలు పరిశీలించరనీ ఆరోపణ వుంది….
అది నిజం కాదు. 9౦ లో మొదలు పెట్టినపుడు చక్కటి కథలు ప్రచురిస్తారన్న పేరున్న పత్రికలే గాక అందుబాటులో వున్న పత్రికలన్నీ చూసేవాళ్ళం. వాటిలో అచ్చయిన కథల్ని మాత్రమే తీసుకొన్నాం. అదే 92 నుంచి తొలిసారి సంపుటాల్లో సంకలనాల్లో అచ్చయిన కథలు కూడా స్వీకరించాం( ఉదా. ఏటి పాట – కథా వేదిక ). 2000 సంవత్సరం నుంచే వెబ్ పత్రికల్లో వచ్చిన కథల్ని సైతం చేర్చాం ( కానుగు పూల వాన – తెలుగు కథ డాట్ కాం). కాబట్టి మేమా విషయంలో స్పష్టంగానే వున్నాం. కొందరికి తెలియక పోవడం వల్ల ఇలాంటి అపోహలు ఏర్పడ్డాయి. 2014సంకలనంలో 14 కథల్లో రెండు కథలు వెబ్ పత్రికలో వచ్చినవే.
- పాతిక సంకలనాల్లో మీకు బాగా నచ్చిన సంకలనం యేది?
కథ 95 నాకు బాగా నచ్చిన సంకలనం. అందులో వున్నవి పది కథలే అయినా పది కాలాల పాటు నిలబడిపోయే కథలు కనీసం నాలుగైనా వున్నాయి. వస్తు శిల్పాల రీత్యా ఆ నాలుగు యీ పాతికేళ్లలో వచ్చిన ఉత్తమ కథలని నా అభిప్రాయం.
- కథల్ని సంకలనాల్లోకి తీసుకు వచ్చేటప్పుడు – వాటి ఎంపికలోనే గాక ప్రచురణ విషయంలో యెటువంటి జాగ్రత్తలు పాటిస్తారు? అందుకు యేమైనా మెథడాలజీ రూపొందించుకొన్నారా?
కథ 90 లో చూసినట్లయితే మా పేర్లు సంకలన కర్తలుగా వుంటాయి. 93 నాటికి అది సంపాదకులుగా మారింది. అంటే కథని ఎన్నిక చేయడంతో పాటు వాటిలో కనిపించిన లోపాలను , వాక్య నిర్మాణ దోషాలను , చిన్న చిన్న కథా నిర్మాణ దోషాలను ఆ యా రచయితలకు చెప్పి వారితోనే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఈ పధ్ధతి నిజానికి 91 లోనే మొదలైనా 93 నుంచి మరీ క్షుణ్ణంగా చదివి మార్పులు చేసుకునే వెసులుబాటు వ్యవస్థని రూపొందించుకొన్నాం. అది నేటికీ కొనసాగుతూనే వుంది. అందుకే పత్రికల్లో వచ్చిన కథలకి , అవే కథలు మా సంకలనాల్లో అచ్చైనపుడు – వున్న తేడాలు గమనించవచ్చు. ఇందుకు రచయితలు మాకు పూర్తిగా సహకరించారు. వారు అభ్యంతర పెట్టినపుడు యథాతథంగానే ప్రచురించాం.
ఇది ఇలా వుండగా పుస్తక ప్రచురణ విషయంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నాం .కొన్ని సంవత్సరాలుగా మేం పొందిన అనుభవం నుంచి నిర్దేశించుకున్న ప్రమాణాలు అవి. అందులో ముఖ్యమైనవి – కథల తేదీలు , పత్రిక వివరాలు నమోదు చేయడం , ప్రతి సంవత్సరం అప్పటి వరకూ వచ్చిన రచయితల అకారాది క్రమ సూచీనీ , పుస్తక ఆవిష్కరణ వివరాలను పొందుపరచడం. ప్రచురించే కథ సారాన్ని ఒకటి రెండు వాక్యాల్లో పరిచయం చేయడం కూడా అందులో భాగమే. రచయితల పరిచయాలివ్వడంలో కూడా ఒక పద్ధతిని పాటిస్తున్నాం. రచయితల ఫోటోతో బాటు వారి పుట్టిన తేదీ , అచ్చైన తొలి కథ వివరాలు , కథా సంపుటుల పేర్లు రికార్డు చేస్తున్నాం. 2600 పేజీల ఈ బృహత్ సంకలనంలో కూడా 336 కథలకూ 155 మంది రచయితలకూ అకారాది క్రమ సూచిని పేజి నంబర్లతో సహా పొందుపరిచాం. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి మాకు మేం గా రూపొందిచుకొన్న style manual ప్రకారమే కథల్ని అచ్చు వేస్తున్నాం. అందులో విరామ చిహ్నాలు కామాలూ ఫుల్ స్టాప్ లూ కొటేషన్లూ మొ. విషయాల్లో ఒక పధ్ధతి పాటిస్తున్నాం. తెలుగు పుస్తక ప్రచురణలో ఒక ప్రామాణికమైన పధ్ధతి ఆవిష్కరింపబడాలని మా కోరిక.
- ఇంత అందంగా ముద్రిస్తూ తక్కువ ధరకి పుస్తకాలను యెలా అందించగలుగుతున్నారు?
కథ 90 ప్రచురించినపుడు దాదాపు 160 పేజీల పుస్తకాన్ని ఆ రోజుల్లో 17 రూపాయిలకే యిచ్చాం. నిజానికి ఆ రోజుల లెక్క ప్రకారం దాని రేటు 30 వుండాలి. ఆ పుస్తకంలో మాకు 3 వేల నష్టం వచ్చింది. అది మేమే భరించాం. ఆ తర్వాత తక్కువ రేటు వల్ల వచ్చే నష్టాన్ని భరించడానికి కొందరు మిత్రులు , కథా ప్రేమికులు ముందుకు వచ్చారు. 1999 నుంచి అమెరికాలోని ‘తానా’ (TANA) ప్రచురణల కమిటీ చైర్ పర్సన్ జంపాల చౌదరి చొరవ వల్ల ఈ సంకలనాల ప్రచురణలో కొంత ఆర్ధిక భారాన్ని మోయడానికి ‘తానా’ పూనుకొంది. అందువల్ల దాదాపు 200 పేజీలుండే ప్రతి పుస్తకాన్నీ ఈ నాటి వరకూ గరిష్టం 65 రూపాయిలకే ఇవ్వగలుగుతున్నాం.
మేం మా సంకలనాల్ని అనేక నగరాల్లో పట్టణాల్లో ఆవిష్కరించడం వల్ల ఆ ప్రాంత పాఠకులకు పుస్తకాల గురించి తెలియడమే గాక అవి అందుబాటులోకి కూడా వచ్చాయి. అందువల్ల పాఠకులు వాటికోసం ఎదురు చూడటం , నెమ్మదిగా వెయ్యి నుంచి రెండున్నర వేల ప్రతుల వరకూ అమ్ముడు పోవడం జరిగింది. మొన్నటికి మొన్న తెనాలిలో కథ 2014 ఆవిష్కరణ జరిగినపుడు ఆ ఒక్క రోజే 450 కాపీలు అమ్ముడుపోవడం ఈ సిరీస్ సాధించిన విజయంగా భావిస్తాను.
‘మనసు ఫౌండేషన్’ వారు కూడా పుస్తకాలను పాఠకులకు తక్కువ ధరకే అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి కేవలం 750రూ. లకే ఈ 2600 పేజీల పెద్ద సంకలనం స్టాండ్స్ లోకి వస్తుంది. దీన్ని కూడా మా పాఠకులు ఆదరిస్తారనే కథాసాహితి నమ్మకం.
- ‘కథాసాహితి’ భవిష్యత్ ప్రణాళికలు యేమిటి?
పైన చెప్పినట్టుగా యీ సంవత్సరం నుంచీ ప్రతి సంకలనానికి సంపాదకుల మార్పు చేయదల్చుకొన్నాం. ఒక్కొక కథా సంకలనం మీదా పాతిక సమగ్ర సమీక్షా వ్యాసాలు రాయించి ఒక పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వుంది. అది ఆ యా కాలాల్లో తెలుగు కథ , తెలుగు సమాజం ప్రయాణం చేసిన తీరు తెన్నుల్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని నమ్మకం. ఇది గాక – గతంలోనే రెండు సార్లు ఎంపిక చేసిన కథల అనువాదాలతో ఆంగ్లంలో పుస్తకం తేవాలని విఫల ప్రయత్నం చేశాం. అది ముందు ముందు సఫలం కావాలని ఆశిస్తున్నాం.
- కథకోసం ప్రత్యేక పత్రిక తేవాలనే ఆలోచన యేమైనా వుందా?
ప్రస్తుతానికైతే లేదు.
- ఈ సంకలనాలు కొత్త కథకులు తయారుకావడానికి స్ఫూర్తినిచ్చాయా?
కొత్త కథకులు తయారు కాక పోవచ్చు గానీ కొత్తగా రాస్తున్న కథా రచయితలకు ఇవి తప్పనిసరిగా తోడ్పడ్డాయి. కొత్త తరం రచయితలు తమ కథలు యీ సంకలనాల్లో రావాలని భావించడం , దానికోసం పాత తరం రచయితలతో పోటీ పడడం ఒక రకంగా మంచి పరిణామమే కదా!
- తెలుగులో ఆధునిక సాహిత్యభాషలో వచ్చిన మార్పుని , వికాసాన్ని పరిశీలించడానికి యీ సంకలనాల అధ్యయనం ఉపయోగపడుతుందని భావిస్తారా?
తెలుగు భాషా వికాసంలో మాండలికాల పాత్ర ప్రముఖమైనది. భిన్న మాండలికాల్లో కథలు రాయడం 80 ల్లో ఊపందుకొని 90 ల నాటికి స్థిరపడింది. అన్ని ప్రాంతాల వాళ్ళూ ఇతర మాండలికాల్లోని కథలు చదవడం అలవాటు చేసుకోవడమే గాక వాటిని ఆస్వాదించడం కూడా జరిగింది. ఈ క్రమంలో 90 నుంచీ మొదలైన మా సంకలనాల పరంపర భిన్న ప్రాంతాల వర్గాల మాండలిక కథలకు వేదికయ్యింది. ఉదా. ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేదా’ కథలో నడిపిన మాండలికం యెంత క్లిష్టమైనదైనా యితర ప్రాంతాల వారికి యే మాత్రం అలవాటు లేనిదైనా ఆ కథని అన్ని ప్రాంతాల వారూ వర్గాల వారూ మళ్ళీ మళ్ళీ చదివినా ఆస్వాదించగలిగారు. అలాగే ఇటీవలి కాలంలో ‘పాంచలమ్మ పాట’ వంటి అచ్చ తెలుగులో వస్తున్న కథలు కూడా భాష విషయంలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ప్రజలో నోళ్ళలో నలిగిణ పదజాలం కథా సాహిత్యంలోకి వచ్చి చేరడం తెలుగు భాషకు అదనపు చేర్పు అవుతుంది. ఈ రంగంలో తెలుగు భాషలో జరిగినంత కృషి ఇతర భాషల్లో జరగలేదనుకొంటున్నాను. ఆ కృషి కి ‘కథాసాహితి’ నెలవయ్యింది. అందుకు సంతోషం .
- ఈ పాతికేళ్లలో కథ సాధించిన విస్తృతి కథా విమర్శలో కనపడుతుందా?
నిస్సందేహంగా కనపడదు. నిజానికి తెలుగులో సాహిత్య విమర్శ దాదాపు మృగ్యమై పోయినట్లే లెక్క. అది సమీక్షల వరకే పరిమితమై వుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య లా సాహిత్య విమర్శనీ కథా విమర్శనీ ఒక బాధ్యతలా స్వీకరించిన విమర్శకులు దాదాపుగా లేరు. విమర్శ అంటే అదేదో తిట్టులా మారిందే తప్ప ‘క్రిటికల్ అనాలిసిస్’ అనే విస్తృతమైన అర్థం తెలుగులో లేకుండా పోయింది. అందుకు విమర్శ లేకపోవడం ఒక కారణమైతే విమర్శను సహించలేని తెలుగు రచయితల ధోరణి మరో కారణం. నిజానికి మంచి విమర్శ మంచి కథా వాతావరణానికి దోహదం చేస్తుంది. రచయిత ఎదుగుదలకీ పరిణతికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని విమర్శకులూ రచయితలూ లోతుగా ఆలోచించడం తెలుగు సాహిత్యానికి నేటి తక్షణ అవసరం. కథలో వచ్చిన విస్తృతి విమర్శలో రాలేదని భావించడం తప్పు కాదు.
- 25 సంకలనాలకి సంపాదకులుగా శివశంకర్ , మీరూ రాసిన ముందుమాటలూ , అప్పుడప్పుడూ రాయించిన వ్యాసాలూ, సంకలనాలపై వచ్చిన స్పందనలూ , సమీక్షలూ – తెలుగు కథ ఉన్నతికి గానీ కథా విమర్శ అభివృద్ధికి గానీ సహకరించాయా?
సంపాదకులుగా మేం రాసిన ముందు మాటలు అటుంచితే – వల్లంపాటి వెంకట సుబ్బయ్య , కాత్యాయినీ విద్మహే , రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి , కె శ్రీనివాస్ వంటి వారు రాసిన యితర వ్యాసాలవల్ల కొంత మేరకు ఉపయోగం జరిగినా వాటికి కొనసాగింపుగా మా సంకలనాల బయట జరగాల్సిన చర్చ జరగలేదు. అందువల్ల మేం రాసిన ముందు మాటల్లో మేం లేవనెత్తిన అంశాల మీద ఆశించినంత స్పందన రాలేదు. వీటన్నిటి మీదా అర్థవంతమైన చర్చ జరిగి వుంటే అది తెలుగు కథ ఉన్నతికి ఏదో ఒక రూపంలో దోహదం చేసేది.
ఈ పరిస్థితిని అధిగమించి విమర్శకులు , పత్రికలు కథని పట్టించుకొని కథా ప్రయోజనానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం.
- థాంక్యూ నవీన్ ! ఆదివారం పుస్తకావిష్కరణ సభలో కలుద్దాం.
జయహో … కథాసాహితి … జయహో !
వెయిటింగ్
కథా సాహితీ సంస్థ నిజంగా తెలుగు పాఠకుల అదృష్టం. పాతికేళ్లుగా సంపాదకులు చేస్తున్న కృషి ప్రతి తెలుగు వాడూ అభినందించాల్సిన పని.
తెలుగు భాషలో కథ గురించి నిరంతర చర్చ జరుగుతోందంటే…దానికి కథా సాహితీ సంకలనాలే కారణం.
“కథా” నవీన్ గారూ, అందరి కృషి గురించీ చెప్పారు గానీ, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు కంటే ఎక్కువైన అక్షర సీత గారు, చరిత ప్రింటర్స్ సుబ్బయ్య గార్ల కాంట్రిబ్యూషన్ గురించి పెద్దగా ప్రస్తావించినట్లు లేదు. ఆరోజుల్లో డి. రామలింగం గారి సంపాదకత్వంలో నేషనల్ బుక్ ట్రస్టు వారు తీసుకొచ్చిన ఒకటి రెండు తెలుగు కధా సంకలనాలు కూడా అపురూపమైనవే అని అనిపిస్తున్నది. కధా పుస్తకాలు విదేశాల్లో కాకున్నా కనీసం మద్రాసు, బెంగుళూరు, బొంబాయి, ఖరగ్పూర్, డిల్లీ వగైరా నగరాల్లో ఉన్న దేశీ ప్రవాస కథా ప్రేమికులకి అందటంలో ఉన్న అసౌకర్యమ్ మాట గురించీ కొద్దిగా ఆలోచించగలరు ( ప్రస్తుతించ వలసిన సేవలందిస్తున్న కినిగే, నవోదయ బుక్ హౌస్ కాచీగూడా, AVKF ఫౌండేశన్, లోగిలి, తెలుగు వన్ గ్రంధాలయం లాంటి పెక్కు సంస్థలున్నా). పుస్తకాల మార్కెటింగు, పాఠకుల ఇంటికి చేరవెయ్యగల డిస్ట్రిబ్యూషన్ రంగాలు కూడా ఇంకా ఎంతో అభివృద్ది చెందాలి. దశాబ్దాల తెలుగు కధా సాహితి యజ్ఞములోని పెద్దలందరికీ, ‘తానా’ చైర్ పర్సన్ జంపాల చౌదరి గారు నుండి, ‘మనసు ఫౌండేషన్’ రాయుడు గారు వరకూ ఎందరో మహానుభావులు; అందరికీ వందనములు.
తెలుగు పాఠకుల ఆదరణతో ప్రతిఏటా దశాబ్దకాలం ప్రచురించగలిగినప్పుడు, ఆ తర్వాత తక్కువ రేటు వల్ల వచ్చే నష్టాన్ని భరించడానికి కొందరు మిత్రులు , కథా ప్రేమికులు ముందుకు వచ్చాక , అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు,అసలు కష్టకాలం దాటివచ్చాక హఠాత్తుగా ఈ సంకలనాల ప్రచురణలో కొంత ఆర్ధిక భారాన్ని మోయడానికి ‘తానా’ పూనుకోవటం అందుకు ప్రచురునకర్తలు ‘తందానా’ అనటం ఎందుకో అర్ధం కాలేదు. ఇక్కడ ఎవరినీ తక్కువ చేయటం లేదు. కానీ తానా చేయకలిగిన భారీ సహాయాలు వేరే పెద్ద , గొప్ప పుస్తకాల ప్రచురుణకి వాడుకోవలిసింది. కథకి ఆ అవసరం లేదు. ఆయా సహాయాలు తప్పనిసరిగా కొన్ని పరిమితుల్ని కలుగచేస్తాయి.
-శశాంక
కథాసాహితి పుట్టుకా, వ్యాప్తీ – క్రమమంతా కనిపించింది. నవీన్ గారి పేరే కథా నవీన్ అయిపోయేలా ఆయన కథతో కలిసిపోయారు. ప్రత్యేకించి స్వచ్చమైన తెలుగులో చక్కని ఇంటర్వ్యూ అందించడం బావుంది.
ఇంటర్వ్యూ చాలా వివరణాత్మకంగా బాగుంది. అందించినందుకు సారంగకు అభినందనలు.
బావుంది
అక్షరాల పొదుపులో నిన్ను మించినోడు లేదు సుమీ !
లేటుగా చదివాను..చాలా మంచి ఇంటర్వ్యూ..కొండను అద్దం లో చూపించింది ..సంతోషం..అభినందనలు..